pesticides
-
నేలమ్మకు కొత్త శక్తి.. చీడపీడల విముక్తి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మన ఆహారం ఆరోగ్యానికి మేలు చేసేదిగా ఉండాలంటే ఆహార ఉత్పత్తులు పండే నేల కూడా ఆరోగ్యంగా ఉండాలి. రసాయన ఎరువులు, పురుగుమందులు వాడిన నేలల్లో పండే పంటలు ఆరోగ్యానికి హాని చేస్తాయి. అలాంటిది ఆరోగ్యానికి మేలు చేసే, అధిక దిగుబడులనిచ్చే ఆధునిక వంగడాల అభివృద్ధికి మెట్ట ప్రాంత పంటల అంతర్జాతీయ పరిశోధన కేంద్రం (ఇక్రిసాట్) కొత్త దారిలో పరిశోధనలు చేస్తోంది. ఇందుకోసం పునరుత్పాదక వ్యవసాయ విధానాన్ని అవలంబిస్తోంది. ఈ దిశగా ముందడుగు సైతం వేసింది. భారత్తోపాటు వివిధ దేశాల్లో ఎక్కువగా సాగయ్యే వేరుశనగ, కంది, సజ్జ, పొద్దుతిరుగుడు, శనగ వంటి మెట్ట పంటల్లో మెరుగైన వంగడాల కోసం ఈ విధానంలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఏడాదంతా ఏదో పంట.. ఈ పునరుత్పత్తి వ్యవసాయం పద్ధతిలో.. ఒకే కమతంలో పక్కపక్కనే వివిధ రకాల పంటలు వి త్తుకుంటారు. ఒక్కో పంట ఒక్కో దశలో ఉంటుంది. ఏడాదంతా వాటి అనుకూల కాలానికి తగ్గట్లుగా ఈ పంటలు వేసుకుంటున్నారు. ఒక పంట కొతకొచ్చే దశలో మరో పంట కాయ దశలో ఉంటుంది. ఇంకో పంట పూత దశకు వస్తుంది. రెండు బ్లాకుల్లో సాగు.. ఇక్రిసాట్లో మొత్తం నాలుగు రకాల నేలలు ఉండగా అందులో ఎర్ర, నల్లరేగడి నేలల్లోని రెండు బ్లాకుల్లో పునరుత్పత్తి వ్యవసాయ విధానంపై పరిశోదనలు సాగుతున్నాయి. ఎర్ర నేలతో కూడిన బ్లాకులో వేరుశనగ, పొద్దుతిరుగుడు, సజ్జ, కంది పంటలను ఒకే కమతంలో సాగు చేస్తున్నారు. నల్లరేగడి నేలతో కూడిన మరో బ్లాక్లో శనగ, పొద్దుతిరుగుడు, సజ్జ, కంది పంటలు వేశారు. ఇవీ ప్రయోజనాలు.. రీజనరేటివ్ అగ్రికల్చర్ విధానంలో అనేక ప్రయోజనాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. సాగవుతున్న పంటల్లో దేనికైనా చీడపీడలు ఆశిస్తే ఆ ప్రభావం పక్కనే ఉన్న మరో పంటకు వ్యాపించేందుకు వీలుండదు. ఆ పంటకే పరిమితమవుతుంది. అదే ఒకే పంట పూర్తి విస్తీర్ణం వేస్తే చీడపీడలు పూర్తి విస్తీర్ణంలో పంటలను ఆశించే ప్రమాదం ఉంటుంది. దీన్ని ఈ విధానం ద్వారా అధిగమించేలా పరిశోధనల ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే ఆరోగ్యవంతమైన బ్యాక్టీరియా, పంటలకు ఉపయోగకరమైన ఫంగస్ను నాశనం కాకుండా కాపాడుకోవచ్చు. హానికరమైన రసాయనాలు, కలుపు మందులు, పురుగు మందులపై ఆధార పడాల్సిన అవసరం ఉండదు. ఆరోగ్యకరమైన నేలపై పర్యావరణానికి అనుకూలమైన రీతిలో ఈ వ్యవసాయం ఉంటుంది. విలువైన ప్రకృతి వనరులు క్షీణించకుండా, వనరులు మరింత బలోపేతం అయ్యేందుకు ఈ విధానం దోహదపడుతుంది.సాధారణంగా ఏటా అధిక మోతాదుల్లో ఎరువుల వాడకం వల్ల నేల స్వభా వాన్ని కోల్పోతూ ఉంటుంది. కానీ పునరుత్పాదక వ్యవసాయ విధానం ద్వారా నేల పునరుజ్జీవం చెందుతుంది. డీగ్రేడ్ అయిన నేల రీస్టోర్ అవుతుందని రీసెర్చ్ స్కాలర్ కల్పన పేర్కొన్నారు. -
ఎడాపెడా పురుగుమందుల స్ప్రే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పురుగుమందుల వాడకం మితిమీరుతున్నట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) వెల్లడించాయి. దీంతో రైతులను తీవ్రమైన శ్వాసకోశ, చర్మ వ్యాధులు పట్టిపీడిస్తున్నాయని పేర్కొంది. వరి, పత్తి పండించే రైతులే ఎక్కువగా పురుగు మందులు వాడుతున్నారని తేలింది. ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ సంస్థలు నిర్వహించిన ‘దేశంలో ముఖ్యంగా తెలంగాణలో పురుగుల మందు వాడకం–రైతుల ఆరోగ్యంపై ప్రభావం–నివేదిక’అనే అధ్యయనంలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. 18–70 ఏళ్ల మధ్య వారిపై సర్వే చేశారు. అందులో కనీసం ఒక సంవత్సరం పాటు పురుగుమందులు పిచికారీ చేసిన వారున్నారు.వయస్సు, లింగం, ఎత్తు, బరువు, రక్తంలో గ్లూకోజ్ స్థాయి, విద్యాస్థాయి, ప్రధానవృత్తి, వారు అనుసరించే వ్యవసాయ పద్ధతులు, పురుగుమందుల వాడకం, విస్తీర్ణం, ఖర్చులు, కూలీల పనులు, çపురుగు మందుల వినియోగానికి గల కారణాలు తదితర సమాచారం సేకరించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రక్తం, మూత్ర నమూనాలను సేకరించారు. పురుగు మందులను ఎక్కువగా వాడటం వల్ల కొందరు కేన్సర్, అల్జీమర్స్ వంటి పెద్ద వ్యాధులకు కూడా గురువుతున్నారని పేర్కొంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన లెక్కల ప్రకారం 28 రకాల పురుగు మందుల్లో 11 రకాల మందులు అత్యంత ప్రమాదకరమైనవిగా వర్గీకరించింది. రైతుల నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాల ద్వారా వారిలో పురుగు మందుల అవశేషాలు కనుగొన్నట్టు ఆ నివేదిక తెలిపింది. నిషేధిత రసాయనాలు కూడా విరివిగా ఉపయోగిస్తున్నారని తేలి్చంది. యాదాద్రి–భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని గ్రామాల్లో క్రాస్ సెక్షనల్ సర్వే జరిగింది. అధ్యయన నివేదికలోని ముఖ్యాంశాలు ⇒ వాణిజ్య పంటల్లో మితిమీరిన పురుగు మందుల వినియోగం వల్ల అనేక నష్టాలు వాటిల్లుతున్నాయి. అవగాహన లేకపోవడంతో తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతున్నారు. ⇒ రైతులు పురుగుమందులను కలపడానికి ఒట్టి చేతులను ఉపయోగించడం వల్ల కూడా నష్టం జరుగుతోంది. ⇒ పురుగు మందుల మితిమీరిన వాడకం వల్ల ఊపిరి ఆడక పోవడం, ఛాతీనొప్పి, గుండె కొట్టుకునే వేగం పెరగడం, వాంతులు, తిమ్మిరి, కండరాల బలహీనత, తలనొప్పి, తల తిరగడం, బ్యాలెన్స్ సమస్యలు తలెత్తుతున్నాయి. ⇒ ఆదాయాన్ని పెంచుకోవాలన్న ఉద్దేశంతో వాణిజ్య పంట లు పండించే రైతులు పురుగు మందులను మితిమీరి వా డారు. నిషేధిత రసాయనాలను కూడా వినియోగించారు. ⇒ అవగాహన ఉన్న రైతులు మాత్రం 36 శాతం తక్కువగా పురుగు మందులను వినియోగించినట్టు తేలింది. ఈ రైతులు మెరుగైన విత్తన రకాలు, సేంద్రియ పురుగు మందులు వాడుతున్నారని తేలింది. ⇒ పురుగు మందులకు గురికావడం వల్ల రైతుల్లో జీర్ణాశయ సమస్యల నుంచి నాడీ సంబంధిత లక్షణాలు, శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తున్నాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వంటివి చుట్టుముడుతున్నాయి. పిల్లలు కూడా పురుగు మందులకు గురవుతున్నారు. ⇒ సేంద్రియ పురుగు మందులు వాడటం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. -
గుళికల ప్యాకెట్ను తెచ్చిన కోతి.. టీ పొడి అనుకుని..
రాజానగరం: ఓ కోతి చేసిన పనికి వృద్ధ దంపతులు కన్నుమూశారు. రాజానగరం మండలంలోని పల్లకడియం గ్రామానికి చెందిన వెలుచూరి గోవిందు (75), అప్పాయమ్మ (70) దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కుమారుడు తన పిల్లల చదువు కోసం కుటుంబంతో సహా రాజమహేంద్రవరంలో ఉంటున్నారు. ముగ్గురు కుమార్తెలకు వివాహాలు చేశారు. గోవిందు, అప్పాయమ్మ మాత్రమే తమ ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం గోవిందు, అప్పాయమ్మల ఇంటి నుంచి ఒక టీ పొడి ప్యాకెట్ను కోతి ఎత్తుకుపోయింది. మరుసటి రోజు శుక్రవారం ఉదయం వేరొక ఇంటి నుంచి పంటలకు ఉపయోగించే విష గుళికల మందు ప్యాకెట్ను తీసుకువచ్చి వీరి ఇంటి పెరటిలో పడేసింది. కళ్లు సరిగా కనిపించని అప్పాయమ్మ పెరటిలో పడి ఉన్న ప్యాకెట్ను తన ఇంటి నుంచి కోతి తీసుకువెళ్లిందేనని భావించి దానితో టీ పెట్టింది. ఆ టీని తన భర్తకు ఇచ్చి, తాను కూడా తాగింది. కొద్దిసేపటికే వారిద్దరూ నోటి నుంచి నరుగులు కక్కుతూ పడిపోయారు. ఇరుగు పొరుగువారు చూసి హుటాహుటిన రాజమహేంద్రవరం ఆస్పత్రికి తీసుకువెళ్లగా, అప్పటికే మరణించారు. ఈ మేరకు రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు శనివారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ప్రిస్కిప్షన్ లేకుండానే పురుగుమందులు!
గ్లైపోసేట్ కలుపు మందును బీజీ–3 పత్తి పంటలో కలుపు నివారణకు ఉపయోగిస్తారు. వాస్తవానికి బీజీ–3 పత్తి విత్తనంపై నిషేధముంది. కానీ అనేకమంది రైతులు దీనిని సాగు చేయడంతో పాటు గ్లైపోసేట్ను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఎరువులు, పురుగు మందు దుకాణాల్లో అందుబాటులో ఉండటంతో అవగాహన లేకుండానే రైతులు దాన్ని కొంటున్నారు. కొందరు రైతులు వరిలో పెరిగే కలుపు నివారణకు కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. గతంలో ఒక రైతు అలాగే వరిలో కలుపు నివారణకు ఉపయోగిస్తే పంట మొత్తం మాడిపోయింది.సాక్షి, హైదరాబాద్: మనం ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు డాక్టర్ ప్రిస్కిప్షన్ (మందుల చిట్టీ) ఆధారంగానే మందులు వాడుతుంటాం. కానీ వ్యవసాయం చేసే రైతులు పంటలకు వచి్చన చీడపీడలను వదిలించేందుకు తమ ఇష్టారాజ్యంగా పురుగు మందులు వాడేస్తున్నారు. దీంతో పంటలు విషతుల్యమవుతున్నాయి. మోతాదుకు మించి వాడటంతో ఆయా పంటలు వినియోగిస్తున్న మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. మరోవైపు పంటల్ని కొత్త కొత్త చీడపీడలు ఆశిస్తున్నాయి.వ్యవసాయాధికారులు ప్రిస్క్రిప్షన్ రాసిస్తేనే రైతులకు దుకాణాదారులు పురుగు మందులు విక్రయించాలనే నిబంధన రాష్ట్రంలో బేఖాతర్ అవుతోంది. దీంతో రాష్ట్రంలో విచ్చలవిడిగా పురుగు మందుల విక్రయాలు జరుగుతున్నాయి. వ్యవసాయాధికారుల పర్యవేక్షణ లోపంతో పరిస్థితి ఇష్టారాజ్యంగా మారింది. భారీగా సాగు..పురుగుమందుల వినియోగం తెలంగాణలో వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, పప్పు ధాన్యాల పంటలు ఎక్కువగా సాగవుతుంటాయి. వానాకాలంలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.29 కోట్ల ఎకరాలు. అందులో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.48 లక్షల ఎకరాలు కాగా, వరి సాధారణ సాగు విసీర్తం 57.18 లక్షల ఎకరాలు. ఇక పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 8.52 లక్షల ఎకరాలు, మొక్కజొన్న సాధారణ సాగు విసీర్ణం 6.09 లక్షల ఎకరాలు, సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.29 లక్షల ఎకరాలుగా ఉంది.లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగు చేస్తున్న రైతాంగం..వాటిని కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున ఎరువులు, పురుగు మందులు వినియోగిస్తున్నారు. ఒక్క వానాకాలం సీజన్కే అన్ని రకాల ఎరువులూ కలిపి 24.40 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని నిర్ధారించారు. అందులో యూరియానే 10.40 లక్షల మెట్రిక్ టన్నులు ఉండటం గమనార్హం. వీటికితోడు భారీగా పురుగుమందుల వినియోగంతో పంటలు విషతుల్యమవుతున్నాయి. ఎకరానికి 360 కిలోల పురుగు మందుల వినియోగం! నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ తాజా అధ్యయన నివేదిక ‘భారత వ్యవసాయ పరిస్థితి’ప్రకారం పంజాబ్, హరియాణ తర్వాత తెలంగాణలోనే అత్యధికంగా పురుగు మందులు వినియోగిస్తున్నారు. అంటే పురుగుమందుల వాడకంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నమాట. పంజాబ్లో రైతులు ఎకరానికి 500 కిలోలు, హరియాణలో 440 కిలోలు పురుగు మందులు వినియోగిస్తుండగా, తెలంగాణలో 360 కిలోల పురుగు మందులు ఉపయోగిస్తున్నారని నివేదిక తెలిపింది. ఆరు జిల్లాల్లో ఎక్కువ గతంలో వ్యవసాయ శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో క్రిమి సంహారక రసాయనాల వినియోగం అత్యధికంగా ఉంది. వరి, పత్తి, కంది పంటలకు ఎక్కువగా క్రిమి సంహారక రసాయనాలు వినియోగిస్తున్నట్లు తేలింది. రైతులు దుకాణాదారుల వద్దకు వెళ్లడం.. వారు ఏది ఎంత వాడమంటే అంత వాడుతున్న పరిస్థితి నెలకొంది. వాస్తవానికి భూసార పరీక్షలు నిర్వహించి, వ్యవసాయాధికారుల సూచనలకు అనుగుణంగా ఎరువులు, పురుగుమందుల వాడకం ఉండాలి. నిజానికి పంటలను చీడపీడలు పట్టిపీడిస్తుంటే వ్యవసాయశాఖ అధికారులు వాటిని పరిశీలించి ఏ మందులు వాడాలో సూచిస్తూ మందుల చిట్టీ (ప్రిస్కిప్షన్) రాయాలి. కానీ అవేవీ జరగడంలేదు.ఆరోగ్యంపై ప్రభావం రసాయన పురుగుమందులను విచ్చలవిడిగా వినియోగించిన పంటలు మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. గ్లైపోసేట్ను ఎక్కువగా ఉపయోగిస్తే క్యాన్సర్ సోకే ప్రమాదముంది. ఆ మందు చల్లినచోట చుట్టుపక్కల పంటలపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. పశువులు, పక్షులపై ప్రభావం చూపి జీవవైవిధ్యానికి నష్టం వాటిల్లుతుంది. ఇతరత్రా మందులు వాడిన పంటలు తినడం వల్ల కూడా దీర్ఘకాలంలో అనారోగ్యానికి గురయ్యేందుకు అవకాశం ఉంటుంది.అయినా ఏళ్లుగా మూసపద్ధతి సాగుకు అలవాటు పడిన రైతులు మోతాదుకు మించి ఎరువులు, పురుగు మందులు వాడుతున్నారని, మోతాదుకు మించి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడటం వల్ల తెగుళ్లు నశించకపోగా ఏటా కొత్తవి పుట్టుకొస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి భూమిని, వాతావరణాన్ని కలుíÙతం చేయడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులపైనా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వారు పేర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో రైతులు ప్రాణాలు కూడా కోల్పోతున్నారని తెలిపారు. -
గడ్డినే కాదు, జీవులనూ చంపుతుంది!
ఒక ఉత్పత్తి గురించి అనేక దేశాలు గోస పడుతున్నాయి. అయినా దాని మీద శాశ్వత నిషేధం విధించడం లేదు. కలుపు సంహారక సమ్మేళనం గ్లైఫోసేట్ (గడ్డి మందు) వల్ల పర్యావరణం మీద, వ్యవసాయ కార్మికుల మీద, గ్రామీణ ప్రజల ఆరోగ్యం మీద దుష్ప్రభావాలు పెరుగుతున్నాయి. నేరుగా క్యాన్సర్ కలుగజేసే దీన్ని ఆహార పంటల క్షేత్రాలలో వినియోగించడం చాలా ప్రమాదకరం. దీన్ని పిచికారీ చేసిన పంట వ్యర్థాలను తిని గొర్రెలు, మేకలు, ఇతర పశువులు కూడా చనిపోయాయి. అయినా దీన్ని వినియోగం ఆపడం, ఉత్పత్తిని నిలిపివేయడం, అడ్డుకోవడం సవాలుతో కూడుకున్నదని స్పష్టమవుతోంది. వివిధ దేశాల రాజకీయ సంకల్పం పెద్ద కంపెనీల గణనీయమైన లాబీయింగ్ శక్తి ముందు దిగదుడుపే అని అర్థమవుతోంది.2015లో గ్లైలఫోసేట్ నిషేధాన్ని ఆమోదించి, అమలుచేసిన మొట్టమొదటి దేశం శ్రీలంక. కానీ ఈ నిషేధాన్ని 2018లో పాక్షికంగా మార్చవలసి వచ్చింది. 2022లో పూర్తిగా ఉపసంహరించబడింది. 2014లో ఒక స్థానిక శాస్త్రవేత్త గ్లైలఫోసేట్ వలన ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్’ వస్తున్నదని పరిశోధించి చెప్పిన దరిమిలా శ్రీలంక నాయకత్వం దీని మీద దృష్టి పెట్టింది. 2015లో ఎన్నికైన మైత్రిపాల సిరిసేన ప్రభుత్వం ఈ నిషేధాన్ని ఆమోదించింది. ఈ నిషేధం అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బౌద్ధ సన్యాసి రథనా థెరో మద్దతు కొరకు ఇచ్చిన వాగ్దానం. కానీ తర్వాత నిషేధంలో వెనక్కి తగ్గడం, తరువాత పూర్తిగా ఎత్తి వేయడం జరిగింది. ఈ లాబీయింగ్ వెనుక అమెరికా ప్రభుత్వం, బేయర్ కంపెనీ (అప్పట్లో మోన్శాంటో) ఉన్నదని అందరికీ తెలుసు. డిసెంబర్ 2023లో, నెలల తరబడి తర్జనభర్జనల తర్వాత, ఐరోపా కూటమి దేశాలలో కొన్ని నిషేధించాలని కోరినా, దీని లైసెన్స్ను పునరుద్ధరించాలని యూరోపియన్ కమిషన్ నిర్ణయించింది. మరో పదేళ్లపాటు వినియోగాన్ని ఆమోదించింది. ఆస్ట్రియా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, బెల్జియం, లక్సెంబర్గ్, జర్మనీ వంటి కొన్ని యూరప్ దేశాలు కొన్ని ప్రాంతాల్లో, ఇళ్లల్లో దీని వాడకంపై పాక్షిక నిషేధాలనో, పరిమితులనో విధిస్తున్నాయి.గ్లైఫోసేట్ ఒక రసాయన ఉత్పత్తి. ఇదివరకు మోన్శాంటో, తరువాత దానిని కొన్న బేయర్ కంపెనీ అంతర్జాతీయ గుత్తాధిపత్య కంపెనీ. చాలా శక్తిమంతమైన ఐరోపా కూటమి కూడా ఈ కంపెనీ ఒత్తిడికి తలొగ్గి జీవరాశికి, మానవాళికి ప్రమాదకరంగా పరిణమించిన గ్లైఫో సేట్ వాడకం ఆపలేకపోయింది. సాంకేతిక, మార్కెట్, నియంత్రణ వ్యవస్థల మధ్య ఏర్పడిన ఒక సంక్లిష్టమైన పరస్పర అవగాహన వల్ల ఆధునిక వ్యవసాయంలో గ్లైఫోసేట్కు ప్రోత్సాహం లభించిందని ఒక ఆధ్యయనం చెబుతున్నది. ఇందులో 4 కీలక విషయాలు ఇమిడి ఉన్నాయి. (1) జన్యుమార్పు పంటల మీద ఉపయోగం కోసం గ్లైఫో సేట్ వినియోగం; (2) కొత్త వ్యవసాయ వినియోగాలను ప్రోత్సహించడం ద్వార ప్రపంచవ్యాప్త సాధారణ గ్లైఫోసేట్ మార్కెట్ పెరుగుదల; (3) గ్లైఫోసేట్ వాడకంతో మిళితం చేసే డిజిటల్ వ్యవసాయం, జీనోమ్ ఎడిటింగ్ వంటి కొత్త సాంకేతిక ప్రోత్సాహం; (4) కార్పొరేట్ మార్కెట్ శక్తి పెరుగుదల వల్ల వ్యవసాయ పరిశోధన కార్యక్రమాల్లో ప్రభుత్వ పెట్టుబడి తగ్గి హెర్బిసైడ్ రహిత కలుపు నియంత్రణ మీద పరిశోధనలు ఆగిపోవడం.మన దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో ప్రభుత్వాలు ఆ మధ్య వరుసగా ఒక మూడు సంవత్సరాలు దీనిమీద 60 రోజులు పాటు నిషేధం ప్రకటించాయి. ఈ తాత్కాలిక నిషేధం ఉద్దేశ్యం చట్టవిరుద్ధమైన, హెర్బిసైడ్–తట్టుకునే బీటీ పత్తి విత్తనాలను ఉపయోగించకుండా అరికట్టడానికి అని చెప్పారు. ఈ తాత్కాలిక నిషేధం కూడా కాగితాలకే పరిమితం అయ్యింది. ఆ పరిమిత నిషేధ కాలంలో కూడా బహిరంగంగానే అమ్మకాలు జరిగాయి. పురుగు మందుల నియంత్రణ చట్టం, 1968 ప్రకారం రాష్ట్రాలు విష రసాయనాలను 60 రోజుల వరకు మాత్రమే నిషేధించవచ్చు. కేంద్ర ప్రభు త్వానికి మాత్రమే శాశ్వతంగా నిషేధించే అధికారం ఉంది. వివిధ రాష్ట్రాలు కోరినా కేంద్రం నిషేధం గురించి స్పందించడం లేదు. కేరళ, సిక్కిం రాష్ట్రాలు మాత్రం కొన్ని అధికరణలను ఉపయోగించి శాశ్వత నిషేధం విధించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కేంద్రానికి రాసి మిన్నకున్నాయి. ఇతర విషయాలలో అధ్యయనాలకు బృందాలను పంపే రాష్ట్రాలు మరి కేరళ, సిక్కిం ఎట్లా సాధించాయో తెలుసు కునే ప్రయత్నం చేయలేదు.2019–21 మధ్య స్వదేశీ జాగరణ్ మంచ్ అవగాహన కార్య క్రమాలు చేపట్టి, గ్లైఫోసేట్ను పూర్తిగా నిషేధించాలని కోరుతూ రెండు లక్షల మంది సంతకాలతో కూడిన మెమోరాండంను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రికి సమర్పించింది. స్వదేశీ జాగరణ్ మంచ్ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ. అనేక విషయాలలో ఆర్ఎస్ఎస్ అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆరోపణ ఎదురుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, గ్లైఫోసేట్ మీద మాత్రం ఆ సంస్థ కోరిన నిషేధం విధించలేకపోతున్నది. రాజకీయ ఒత్తిడులలో ఉండే అధికార క్రమం ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నది. అక్టోబర్ 2020లో, పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా మరియు పాన్ ఆసియా పసిఫిక్ సంయుక్తంగా ‘స్టేట్ ఆఫ్ గ్లైఫోసేట్ యూజ్ ఇన్ ఇండియా’ నివేదికను విడుదల చేశాయి. దీని వాడకం విచ్చలవిడిగా ఉందని నివేదించాయి. దీని వల్ల పర్యావరణం మీద, వ్యవసాయ కార్మికుల మీద, గ్రామీణ ప్రజల ఆరోగ్యం మీద దుష్ప్ర భావాలు పెరుగుతున్నాయని పేర్కొంది. నేరుగా క్యాన్సర్ కలుగజేసే దీన్ని ఆహార పంటల క్షేత్రాలలో వినియోగించడం ప్రమాదకరం.ప్రజల నుంచి, సంస్థల నుంచి వచ్చిన ఒత్తిడుల నేపథ్యంలో నిషేధించకుండా కేంద్ర ప్రభుత్వం 2020లో కొన్ని ఆంక్షలు ప్రకటించింది. దీని ప్రకారం పెస్ట్ కంట్రోల్ ఆపరేటర్ల ద్వారా తప్ప ఏ వ్యక్తి కూడా దీన్ని పిచికారీ చేయరాదు. అంటే సాధారణ రైతులు ఉప యోగించరాదు. కేవలం రసాయన పిచికారి చేసే సంస్థల ద్వారానే ఉపయోగించాలని కొత్త నిబంధన తెచ్చింది. తదుపరి కంపెనీ నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి ఈ ఆంక్షలను సవరించారు. శిక్షణ పొందిన వారు ఎవరైనా ఉపయోగించవచ్చు అని చెప్పారు. ఆ శిక్షణ ఇవ్వడానికి ఒక కేంద్ర పరిశోధన సంస్థకు అప్పజెప్పితే వారు కొన్ని ఆన్లైన్ తరగతులు నిర్వహించి ఒక సర్టిఫికెట్ ఇస్తున్నారు.రైతులలో పూర్తి అవగాహన లేకపోవడం, పురుగుమందు / విత్తన కంపెనీల మార్కెట్ మాయాజాలం, కొరవడిన ప్రభుత్వ నియంత్రణ వంటి కారణాల వల్ల, రైతులు దీన్ని వాడుతున్నారు. రైతులు తాము కొన్నవి గ్లైఫోసేట్ తట్టుకునే విత్తనాలు అనుకుని, కాయ కాసిన తరుణంలో, గడ్డిని తొలగించటానికి దీన్ని వాడటం వల్ల, మొత్తం పంట మాడిపోయి నష్టపోయిన ఉదంతాలు ఉన్నాయి. దీని వాడకం మీద ఆంక్షలు ఉండడంతో, ప్రభుత్వం నుంచి పరిహారం కోరే అవకాశం కూడా లేకుండా పోయింది. గ్లైఫోసేట్ పిచికారీ చేసిన గడ్డి అని తెలియక దాన్ని నోట్లో పెట్టుకున్న ఒక అమ్మాయి చనిపోయింది. అనేక విధాలుగా గ్రామాలలో అమాయకులు ఈ విష రసాయనాల బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు. పంట ఎండపెట్టడానికి ఓపిక లేని రైతులు పంట కోతకోచ్చే సమయానికి దీన్ని వాడు తున్నారు. దాని వల్ల మొక్క మాడుతుంది, చచ్చిపోతుంది. అట్లాంటి పంట వ్యర్థాలు విషపూరితం అవుతాయి. దీన్ని పిచికారీ చేసిన పంట వ్యర్థాల్నితిని గొర్రెలు, మేకలు, ఇతర పశువులు కూడా చనిపోయాయి.క్యాన్సర్ ప్రమాదాల గురించి వినియోగదారులను హెచ్చరించడంలో కంపెనీ విఫలమైందని పేర్కొంటూ మో¯Œ శాంటో (ఇప్పుడు బేయర్ యాజమాన్యంలో ఉంది)తో సహా గ్లైఫోసేట్తో సంబంధం ఉన్న రౌండప్ తయారీదారులపై అమెరికాలో వేలకొద్దీ కోర్టు వ్యాజ్యాలు దాఖలైనాయి. 2019 నాటికి ఇవి 42,700. ఇతర దేశంలో గ్లైఫోసేట్ మీద ఈగ వాలితే అమెరికా ప్రభుత్వం వాలిపోతుంది. అదే అమెరికాలో వేల కొద్ది వ్యాజ్యాలను ఆ కంపెనీ ఎదుర్కుంటున్నది.మానవాళికి, జీవకోటికి ప్రమాదకరంగా పరిణమించిన ఈ వ్యాపార వస్తువును నిషేధించలేని పాలనా వ్యవస్థలను, అందులోని లోపాలను అధ్యయనం చేయాలి. ఒక వ్యాపార వస్తువుని నియంత్రించలేని దేశాధినేతల బలహీనతలు ఇక్కడే తేలిపోతున్నవి. ప్రజా రోగ్యాన్ని దెబ్బ తీస్తూ, పర్యావరణానికి దీర్ఘకాల హాని చేసే రసాయనాల నియంత్రణ మీద ఒక వైపు అంతర్జాతీయ చర్చలు జరుగు తుంటే మన దేశంలో మాత్రం ఏ చర్యా లేదు. ఇది మారాలి. ఈ పరిస్థితి మారాలంటే మన రాజకీయం మారాలి. డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
Fact Check: రైతుకు కాదు.. రామోజీకే విపత్తు
సాక్షి, అమరావతి: వాతావరణ ప్రభావంతో ఏదైనా పంటకు తెగులు సోకినా.. పురుగు వచ్చినా దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే కారణం అన్నట్టుగా ఉంది ఈనాడు రామోజీరావు రాతలు చదువుతుంటే. సర్టిౖఫై చేసిన సాగు ఉత్పాదకాలను ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో రైతుల ముంగిట అందిస్తూ అన్నదాతలకు అన్నివిధాలుగా అండగా నిలుస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా నిత్యం రోత రాతలు రాస్తూ రామోజీ పైశాచికానందం పొందుతున్నారు. నకిలీ సాగు ఉత్పాదకాల బారినపడి రాష్ట్రంలో ఏ ఒక్క రైతు నష్టపోకూడదన్న సంకల్పంతో.. పంపిణీ చేసే ముందు వాటి నాణ్యతను పరీక్షించాలన్న లక్ష్యంతో నియోజకవర్గ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ను తీసుకొచ్చింది. ఈ ల్యాబ్ల్లో పరీక్షించిన తర్వాతే మార్కెట్లోకి తీసుకొచ్చేలా ఏర్పాటు చేసింది. ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన ఉత్పాదకాలను మాత్రమే గ్రామస్థాయిలో రైతులకు పంపిణీ చేస్తోంది. ఈ కారణంగానే నాలుగున్నరేళ్లలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వల్ల తాము పంట నష్టపోయామని ఒక్కరంటే ఒక్క రైతు కూడా ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. ఇవేమీ పట్టని ఈనాడు వాస్తవాలకు ముసుగేసి.. ‘విత్తనం నుంచే విపత్తు’ అంటూ అడ్డగోలుగా అబద్ధాలతో కథనాన్ని అచ్చేసింది. ఈ కథనంలో పేర్కొన్న అంశాలపై వాస్తవాలు ఇవీ.. ఏటా 50 వేల శాంపిల్స్ పరీక్షిస్తున్నా ఏడుపే రాష్ట్రంలో ఏటా సగటున 1.25 లక్షల లాట్స్ విత్తనాలు, 2.80 లక్షల బ్యాచ్ల పురుగు మందులు, 20 వేల బ్యాచ్ల ఎరువులు మార్కెట్కు వస్తుంటాయి. గతంలో వీటి నాణ్యతను పరీక్షించేందుకు రాష్ట్రస్థాయిలో 11 లే»ొరేటరీలు మాత్రమే అందుబాటులో ఉండేవి. పెస్టిసైడ్స్ కోసం 5, ఎరువులు, విత్తన పరీక్షల కోసం 3 చొప్పున ఉండేవి. మార్కెట్లోకి వచ్చే ఎరువుల్లో 25–30 శాతం, విత్తనాల్లో 3–4 శాతం, పురుగు మందుల్లో ఒక శాతానికి మించి శాంపిళ్లను పరీక్షించే వారుకాదు. దీంతో మార్కెట్లో నకిలీలు రాజ్యమేలేవి. ఫలితంగా ఏటా రూ.వేల కోట్ల విలువైన పెట్టుబడిని రైతులు నష్టపోయేవారు. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలనే లక్ష్యంతోనే రూ.213 కోట్లతో దేశంలో మరెక్కడా లేనివిధంగా జిల్లా స్థాయిలో 10, నియోజకవర్గ స్థాయిలో 127 ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ను జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయిలో మరో 20 ల్యాబ్స్ నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ ల్యాబ్లలో చట్టపరంగా సేకరించిన నమూనాలతో పాటు రైతువారీ వ్యాపార సంబంధమైన విత్తనాలు, ఎరువుల నమూనాలు పరీక్షిస్తున్నారు. గతంలో ఏటా అన్నిరకాల శాంపిల్స్ కలిపి 10 వేలు పరీక్షించడమే కష్టంగా ఉండేది. కానీ.. నేడు అగ్రి ల్యాబ్స్ రాకతో ఏటా సగటున 50వేల శాంపిల్స్ను పరీక్షిస్తున్నారు. ఫలితంగా ఎక్కడా నకిలీ విత్తనం, ఎరువు, పురుగు మందుల బారినపడి నష్టపోయామన్న మాటే విన్పించలేదు. ఆర్బీకేల ద్వారా పురుగుల మందుల విక్రయం 2020–21 నుంచి 2021–22 వరకు ఆర్బీకేల ద్వారా రూ.14.01 కోట్ల విలువ చేసే 1,36,443 లీటర్ల పురుగు మందులను 1,50,822 మంది రైతులకు ప్రభుత్వం అందించింది. 2023–24లో రైతులకు అవసరమైన, నాణ్యత పరీక్షించబడిన పురుగు మందులను ఆర్బీకేల ద్వారా రైతులకు సరఫరా చేసేందుకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ అవసరమైన చర్యలు తీసుకుంది. సీజన్లో మందులు దొరకవనే భయంతో రైతులు విత్తనం వేసేప్పుడే అధిక సంఖ్యలో తీసుకుని నిల్వ చేసుకుంటుంటారు. కాగా.. పురుగుల మందుల వినియోగం పెరగడానికి పలు కారణాలు దోహదం చేస్తుంటాయి. 2022–23 సీజన్లో అధిక వర్షపాతం వలన గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలలో రైతులు పప్పుధాన్యాల పంటల నుండి వాణిజ్య పంటలైన మొక్కజొన్న, పత్తి, మిరప పంటల వైపు మళ్లారు. రాయలసీమ జిల్లాలలో నూనె గింజల పంటల నుండి పండ్ల తోటలు, పత్తి పంటల సాగు వైపు మొగ్గు చూపారు. మిరపలో వచ్చిన నల్లతామర, పత్తి, మొక్కజొన్నలలో పురుగులు, తెగుళ్ల ఉ«ధృతికి అడ్డుకట్ట వేసేందుకు గతం కంటే కాస్త ఎక్కువగానే పురుగు మందులను వినియోగించారు. అయితే.. ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు తగిన మోతాదులో మాత్రమే వినియోగించాలని ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేస్తూనే ఉన్నారు. దిగుబడులకు ఢోకా లేదు ఆహార ధాన్యాల ఉత్పత్తి 2014–19 మధ్యలో సగటున 153.95 లక్షల టన్నులుగా నమోదైతే.. 2019–23 మధ్య 165.40 లక్షల టన్నులుగా నమోదైంది. అంటే 11.45 లక్షల టన్నుల మేర పెరిగింది. ఇక ఉద్యాన పంటల విషయానికి వస్తే టీడీపీ హయాంలో 2018–19లో 17.40 లక్షల హెక్టార్లలో సాగవగా, 305 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. కాగా ప్రస్తుతం 18.03 లక్షల హెక్టార్లకు విస్తరించగా.. 368.83 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి. అంటే ఏకంగా 63 లక్షల టన్నులకు పైగా ఉద్యాన పంటల దిగుబడులు పెరిగాయి. నిజంగా నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రాజ్యమేలితేæ ఈ స్థాయిలో దిగుబడులు పెరుగుతాయా అన్నది ఒక్కసారి రామోజీ ఆలోచన చేయాలి. ఏటా విస్తృత తనిఖీలు.. నాణ్యత లోపిస్తే క్రిమినల్ కేసులు రాష్ట్రవ్యాప్తంగా ఏటా పురుగు మందులు, ఎరువుల దుకాణాలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది నిర్వహించిన తనిఖీల్లో పురుగు మందుల చట్టం 1968 నిబంధనల ప్రకారం సక్రమంగా లేని రూ.5.21 కోట్ల విలువైన 37,998 లీటర్ల పురుగు మందుల అమ్మకాలను నిలిపివేశారు. రూ.కోటి విలువైన 17,073 లీటర్ల పురుగు మందులను స్వా«దీనం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఇంకోవైపు ర్యాండమ్ తనిఖీల్లో భాగంగా ఈ ఏడాది 10,500 పురుగుల మందుల నమూనాలు సేకరించి ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ ద్వారా పరీక్షించాలని లక్ష్యంగా నిర్దేశించారు. డిసెంబర్ నాటికి 8,159 నమూనాలు సేకరించి పరీక్షించగా, కేవలం 55 నమూనాలు మాత్రమే నాసిరకంగా ఉన్నట్టుగా గుర్తించి సంబంధిత కంపెనీలు, డీలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తయారీదారుల అభ్యర్థన మేరకు 19 నమూనాల పునర్విశ్లేషణ కోసం పంపించారు. మిగిలిన నాసిరకం పురుగు మందుల ఉత్పత్తిదారులపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. æనాణ్యత నిర్ధారణ నిమిత్తం నమూనాలను సేకరించి సంబంధిత పరీక్షా కేంద్రాలకు పంపించటం జరిగింది. ఈ విధంగా అగ్రిల్యాబ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 23,714 పురుగులమందుల నమూనాలను పరీక్షించగా, 175 శాంపిల్స్ నాసిరకంగా ఉన్నట్టుగా గుర్తించారు. తయారీదారులు, సరఫరాదారుల అభ్యర్థన మేరకు 82 నమూనాలను కోర్టు ద్వారా పునర్విశ్లేషణ కోసం పంపించారు. ఇప్పటికే 31 నాసిరకం ఉత్పత్తిదారులపై చట్టపరమైన చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మిగిలిన 73 నాసిరకమైన నమూనాలకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. పురుగు మందుల చట్టం నియమ నిబంధనల మేరకు కాల పరిమితికి లోబడి నాసిరకం పురుగుల మందుల ఉత్పత్తిదారులపై తగిన చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే కేవలం 5 వేల నమూనాలు మాత్రమే తీశారంటూ ఈనాడు అర్థరహితమైన ఆరోపణలు చేసింది. -
‘నకిలీ విత్తు’ చిత్తు!
ఇతని పేరు బుద్ధా సన్యాసిరావు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం. ఈయన 5 ఎకరాల్లో సొంత విత్తనంతో సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. మొలక శాతం ఎంతుందో తెలుసుకునేందుకు ఆర్బీకే ద్వారా కోరుకొండ ల్యాబ్కు శాంపిల్ పంపి ఉచితంగా పరీక్ష చేయించారు. మొలక శాతం చాలా తక్కువగా ఉందని గుర్తించడంతో వాటిని పక్కన పెట్టి, డెల్టా సీడ్స్ కంపెనీ నుంచి బీపీటీ 5204 విత్తనాన్ని కొని మరోసారి పరీక్షించుకుంటే మొలక శాతం బాగా వచ్చింది. అదే విత్తనాలు నారుమడి పోసుకొని సాగు చేశాడు. నిజంగా మొలక శాతం లేని సొంత విత్తనంతో సాగు చేసి ఉంటే ఎకరాకు విత్తనానికి రూ.1,000, నారుమడి, దమ్ముకు రూ.500, బాటలు తీసి ఎరువులు, పురుగు మందులకు మరో రూ.200 చొప్పున 5 ఎకరాలకు రూ.8,500కు పైగా నష్టం వచ్చేది. పంటపై పెరిగే పురుగులు, చీడపీడల నియంత్రణకు ఎకరాకు రూ.600 నుంచి రూ.800 వరకు అదనపు పెట్టుబడి పెట్టాల్సి వచ్చేది. మొక్కలు ఎదగడానికి పట్టే 25 రోజుల విలువైన కాలమే కాకుండా, ఎకరాకు 4–6 బస్తాల దిగుబడి కోల్పోవాల్సి వచ్చేది. ‘ఆ విత్తనం ఉపయోగించకపోవడం వల్ల పెట్టుబడి కోల్పోకుండా జాగ్రత్త పడడమే కాదు.. మొలక శాతం ఎక్కువగా ఉన్న బీపీటీ 5204 రకం విత్తనంతో సాగు వల్ల ఆశించిన దిగుబడులను సాధించగలిగాను. కొత్తగా ఏర్పాటు చేసిన అగ్రిల్యాబ్ వల్ల నా పంట కాపాడుకోగలిగాను’ అని ఈ రైతు ఆనందంగా చెబుతున్నాడు. పంపాన వరప్రసాదరావు, తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్ నుంచి సాక్షి ప్రతినిధి : తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కొరుకొండ గ్రామం. ప్రసిద్ధి చెందిన లక్ష్మీనరసింహస్వామి వారు కొలువైన ఈ గ్రామంలో ఓ వైపు పంట పొలాలు.. మరో వైపు ఆయిల్ పామ్, మామిడి, జీడిమామిడి తోటలు. గ్రామంలో కొత్తగా నిరి్మంచిన సచివాలయం, ఆర్బీకే కేంద్రాలున్నాయి. గ్రామం మధ్య కాపవరం రోడ్డులో ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో అత్యంత అధునాతనంగా నిరి్మంచిన భవనం ఉంది. అదే వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్. ఈ ల్యాబ్కు అనుబంధంగా పసు వ్యాధి నిర్ధారణ ల్యాబ్ కూడా ఉంది. ల్యాబ్ పరిధిలో 16,691 హెక్టార్ల విస్తీర్ణం ఉండగా, 14,162 మంది రైతులున్నారు. వీరిలో 70 శాతం మంది కౌలుదారులే. ల్యాబ్లో అడుగు పెట్టగానే ఎటు చూసినా అత్యాధునిక పరికరాలే. విత్తన, ఎరువుల శాంపిల్స్ను పరీక్షించే సీడ్ బ్లోవర్, మైక్రోస్కోప్, ప్యూరిటీ బోర్డు, డిస్టిలేషన్ యూనిట్, బోర్నర్, గోనెట్ డివైడర్, సీడ్ జెర్మినేటర్, హాట్ ఎయిర్ ఓవెన్, మప్లే పర్నేస్, హాట్ప్లేట్, సెక్షన్ పంప్, డేస్కికేటర్ ఇలా ఒకటి కాదు.. రెండు కాదు పదుల సంఖ్యలో పరికరాలు ఉన్నాయి. రైతులు తెచ్చిన శాంపిల్స్ పరీక్షించడంలో ల్యాబ్ ఇన్చార్జి, వ్యవసాయాధికారి దేవరపల్లి రామతులసితో పాటు ల్యాబ్ సిబ్బంది తలమునకలైఉన్నారు. అదే సమయంలో శాంపిల్స్ పట్టుకొని కొంతమంది, ఇచ్చిన శాంపిల్స్ ఫలితాల కోసం మరికొంత మంది రైతులు ల్యాబ్కు రావడం మొదలైంది. ల్యాబ్ ఏమిటో? ఎవరి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిందో మీకు తెలుసా? అని ఆరా తీయగా, అక్కడకు వచ్చిన రైతులే కాదు.. గ్రామంలోని పలువురు రైతులు కూడా ల్యాబ్ ఏర్పాటుతో మాకు ఎంతో మేలు జరుగుతోందని ఆనందంగా చెప్పారు. ‘గతంలో ఏదైనా పరీక్షించుకోవాలంటే పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వెళ్లాల్సి వచ్చేది. అంత దూరం వెళ్లేందుకు ఆరి్థక భారం కావడంతో డీలర్లు ఇచ్చిన విత్తనాలను కనీసం పరీక్ష కూడా చేయించుకోకుండానే విత్తుకునే వాళ్లం. మొలక వస్తే అదృష్టం.. లేకుంటే మా దురదృష్టం.. అన్నట్టుగా ఉండేది మా పరిస్థితి. ఇప్పుడు మా నియోజకవర్గంలోనే ఈ ల్యాబ్ రావడంతో విత్తనాలు, ఎరువులు తనిఖీ చేయించుకోగలుగుతున్నాం’ అని తెలిపారు. విత్తనం మంచిదైతే.. పంట బాగుంటుంది. పంట బాగుంటే దిగుబడిపై దిగులుండదు. ఆశించిన దిగుబడులు సాధించాలంటే మేలి రకం విత్తనం కావాలి. అన్నదాతలు నకిలీ విత్తనాలతో మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన వైఎస్సార్ అగ్రి ల్యాబ్స్ అద్భుత పనితీరుతో రైతులకు భరోసా కల్పిస్తున్నాయి. ఏటా రూ.వేల కోట్ల పెట్టుబడి మట్టిపాలు కాకుండా ముందుగానే పరీక్షించి హెచ్చరిస్తున్నాయి. పైసా ఖర్చు లేకుండా ఇన్పుట్స్ను ముందుగానే పరీక్షించుకోవడం ద్వారా నాసిరకం, నకిలీల బారిన పడకుండా ధైర్యంగా సాగు చేసుకోగలుగుతున్నారు. సొంతంగా తయారు చేసుకున్నవైనా, మార్కెట్లో కొనుగోలు చేసినవైనా నేరుగా ల్యాబ్కు వెళ్లి విత్తన నాణ్యతను ఉచితంగా పరీక్షించుకుని, ఫలితాల ఆధారంగా ధైర్యంగా సాగు చేసుకోగలుగు తున్నామని పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రైతులు నష్టపోకుండా అగ్రి ల్యాబ్లు అండగా నిలుస్తున్నాయి. గతంలో నకిలీలదే రాజ్యం రాష్ట్రంలో ఏటా వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు కోసం 1.25 లక్షల లాట్స్ విత్తనాలు, 2.80 లక్షల బ్యాచ్ల పురుగు మందులు, 20 వేల బ్యాచ్ల ఎరువులు మార్కెట్కు వస్తుంటాయి. గతంలో వీటి నాణ్యతను పరీక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో 11 ల్యాబరేటరీలు మాత్రమే అందుబాటులో ఉండేవి. పెస్టిసైడ్స్ కోసం 5, ఎరువులు, విత్తన పరీక్షల కోసం 3 చొప్పున ఉండేవి. మార్కెట్లోకి వచ్చే ఎరువుల్లో 30 శాతం, విత్తనాల్లో 3–4 శాతం, పురుగు మందుల్లో ఒక శాతానికి మించి శాంపిళ్లను పరీక్షించే సామర్ధ్యం వీటికి ఉండేదికాదు. దీంతో మార్కెట్లో నకిలీలు రాజ్యమేలేవి. ఏటా వీటి బారిన పడి రైతన్నలు ఆర్థికంగా వేల కోట్ల రూపాయల పెట్టుబడి నష్టపోయేవారు. నాణ్యమైన సాగు ఉత్పాదకాలను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో మరెక్కడా లేని విధంగా నియోజకవర్గ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ను ఏర్పాటు చేయడంతో రైతుల్లో నమ్మకం, భరోసా కలిగింది. దేశంలోనే నంబర్వన్ రాష్ట్రంగా ఏపీ ఇప్పటిదాకా తమిళనాడులో అత్యధికంగా 33 అగ్రీ ల్యాబ్స్ ఉండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి ఫలితంగా నియోజకవర్గ స్థాయిలో ల్యాబ్స్ ఏర్పాటుతో ఏపీని దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలిపారు. ఒక్కొక్కటి రూ.6.25 కోట్లతో జిల్లా స్థాయిలో 10 ల్యాబ్స్, ఒక్కొక్కటి రూ.82 లక్షల నుంచి 90 లక్షల అంచనాతో నియోజకవర్గ స్థాయిలో 147 ల్యాబ్స్, రూ.75 లక్షలతో నాలుగు (విశాఖ, తిరుపతి, అమరావతి, తాడేపల్లిగూడెం) రీజనల్ కోడింగ్ సెంటర్స్, రూ.8.50 కోట్ల అంచనా వ్యయంతో గుంటూరులో డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీతో రాష్ట్ర స్థాయి ల్యాబ్ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. కాగా 2021 జూలై 8న రైతు దినోత్సవం రోజున 70 కేంద్రాలు, ఆ తర్వాత మరో 5 కేంద్రాలను ప్రారంభించగా, ఈ ఏడాది జూలై 8న మరో 52 ల్యాబ్ల సేవలు అందుబాటులోకి వచ్చాయి. మరో 20 ల్యాబ్స్ నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికి అనుబంధంగా 154 ఇంటిగ్రేటెడ్ వెటర్నరీ, 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్ను ఏర్పాటు చేశారు. పరీక్షలన్నీ ఉచితమే ల్యాబ్లలో విత్తన మొలక శాతం పరీక్ష నివేదికను వారం రోజుల్లోపు ఇస్తున్నారు. పురుగు మందులు, ఎరువుల నాణ్యత నిర్థారణ రిపోర్టును 2–3 రోజుల్లోనే అందజేస్తున్నారు. రైతులు కాకుండా వ్యాపారులు, డీలర్లు, తయారీదారులు, ఇతరులు నాణ్యత ప్రమాణాల పరీక్ష నివేదిక కోసం ఎరువుల రకాన్ని బట్టి రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు, పురుగు మందులకు సంబంధించి రూ.3,500, విత్తనాల నివేదిక కోసం రూ.200 చొప్పున చెల్లించాలి. అదే రైతులకైతే పూర్తిగా ఉచితం. ప్రభుత్వమే ఈ వ్యయాన్ని భరించి రైతన్నకు తోడుగా నిలుస్తోంది. ఏటా 50 వేల శాంపిళ్ల చొప్పున ఇప్పటి వరకు 1,03,215 శాంపిళ్లను పరీక్షించారు. వీటిలో 11 వేల శాంపిళ్లు ఆర్బీకేల ద్వారా రైతులు పంపినవే. వీటిలో 1,884 నమూనాలు నాణ్యత లేనివిగా గుర్తించి వాటి తయారీ, అమ్మకం దారులపై చట్టపరంగా చర్యలకు ఆదేశించారు. అత్యాధునిక పరికరాలు నమూనాల పరీక్ష కోసం ప్రత్యేకంగా ఆటోమేటెడ్ క్వాలిటీ కంట్రోల్ యాప్ (ఇన్సైట్) అభివృద్ధి చేశారు. ఫలితాలను ట్యాంపర్ చేసేందుకు వీల్లేని రీతిలో ప్రతి లేబరేటరీలో ఆటోమేషన్ ఏర్పాటు చేశారు. టెస్టింగ్ చేసిన ప్రతి ఒక్కటి రికార్డు కావడంతో పాటు ఫలితాలు ఆటోమేటిక్గా సిస్టమ్లో నమోదవుతున్నాయి. ల్యాబ్లో ఏబ్యాచ్ శాంపిల్ను ఏ సమయంలో పరీక్షించారో ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా నమోదు అవుతోంది. షాపులో బ్యాచ్ నంబర్ చెక్ చేస్తే చాలు.. నాణ్యత సరి్టఫికెట్ ఉందో లేదో తెలిసిపోతుంది. ఇచ్చిన శాంపిల్స్కు టెస్టింగ్ జరిగిందో లేదో కూడా ట్రాక్ చేసుకోవచ్చు. జిల్లా ల్యాబ్లో గ్రో అవుట్ టెస్టింగ్ ఫెసిలిటీ కల్పించారు. ఇక్కడ మొక్కల జనటిక్ ఫ్యూరిటీ టెస్టింగ్ చేస్తున్నారు. రైతులు తెచ్చే నమూనాలకు ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదు. ప్రతి ల్యాబ్ లో ఒక అఫీషియల్ అనలిస్టు, ఇద్దరు జూనియర్ అనలిస్టులను ఏర్పాటు చేశారు. వీరికి అత్యాధునిక శిక్షణ ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ను సమీప ఆర్బీకేలతో అనుసంధానించారు. ఇన్పుట్స్ పరీక్షించుకునేలా రైతులను ప్రోత్సహించేలా ఆర్బీకేల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రీ ల్యాబ్ల ద్వారా ఏటా 50 వేలకు పైగా ఇప్పటి వరకు 1,03,215 విత్తన శాంపిళ్లను పరీక్షించారు. వీటిలో 11 వేల శాంపిళ్లు ఆర్బీకేల ద్వారా రైతులు పంపినవే. ఇందులో 1,884 నమూనాలు నాణ్యత లేనివిగా గుర్తించి వాటి తయారీ, అమ్మకందారులపై చట్టపరంగా చర్యలకు ఆదేశించారు. తద్వారా ఆయా రైతులు నష్టపోకుండా ముందస్తుగానే అడ్డుకున్నారు. రైతులకు సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు నష్టాలపాలవ్వకుండా చూశారు. అత్యుత్తమ ల్యాబ్గా కోరుకొండ నియోజకవర్గ స్థాయి ల్యాబ్లలో కోరుకొండ ల్యాబ్ నంబర్ వన్గా నిలిచింది. ల్యాబ్ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ర్యాంకింగ్ ఇస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు కృషి ఫలితంగా ఆర్బీకేల ద్వారా రైతులకు అవగాహన కల్పించడంతో కోరుకొండ ల్యాబ్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ ల్యాబ్లో ఇప్పటి వరకు 1038 శాంపిల్స్ పరీక్షించారు. వీటిలో యాక్ట్ శాంపిల్స్లో 74 విత్తన, 26 ఎరువు శాంపిల్స్, ఆర్బీకే శాంపిల్స్లో 16 విత్తన, 35 ఎరువులు, రైతు శాంపిల్స్లో 716 విత్తన, 75 ఎరువులు, ట్రేడ్ శాంపిల్స్లో 66 విత్తన, 25 ఎరువు శాంపిల్స్ పరీక్షించారు. రైతు శాంపిల్స్లో 21 నమూనాలు నాణ్యతలేనివని గుర్తించారు. తద్వారా ఆయా రైతులు నష్టపోకుండా కాపాడగలిగారు. ల్యాబ్లలో పరీక్షలు ఇలా జిల్లా ల్యాబ్స్లో బీటీ, హెచ్టీ పత్తి జన్యు పరీక్షలు, తేమ, మొలక శాతం, విత్తన శక్తి బాహ్య స్వచ్ఛత తదితర అధునాతన విత్తన పరీక్షలతో పాటు ఎరువుల్లో నత్రజని, భాస్వరం, పొటాష్, సూక్ష్మ పోషకాలైన జింక్, ఇనుము, బోరాన్, కాల్షియం, మేగ్నీషియం వంటి పోషకాల నాణ్యత పరీక్షలు, పురుగు మందుల్లో క్రియాశీల పదార్థాలను పరీక్షిస్తున్నారు. నియోజకవర్గ స్థాయి ల్యాబ్స్లో విత్తనాల్లో మొలక శాతం, బాహ్య స్వచ్ఛత, ఎరువుల్లో నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాల నాణ్యతను పరీక్షిస్తున్నారు. పురుగుల మందుల నమూనాలను జిల్లా ల్యాబ్స్కు పంపిస్తున్నారు. 4 కేటగిరిల్లో శాంపిల్స్ పరీక్ష.. యాక్ట్ శాంపిల్స్ : ఇవి ప్రతి మండల వ్యవసాయాధికారి మండలంలోని డీలర్ల దగ్గర, వారికి సందేహాస్పదంగా అనిపించిన శాంపిల్స్ను తీసి పంపిస్తారు. వీటిని ఆర్సీసీ కోడింగ్ వ్యవస్థ ద్వారా వివిధ ల్యాబ్స్లకు పంపి పరీక్షిస్తారు. ఆర్బీకే శాంపిల్స్ : ఆర్బీకే ద్వారా సరఫరా చేసే ఎరువులు, విత్తన శాంపిల్స్ ఫార్మర్ శాంపిల్స్ : రైతులు సొంతంగా, నేరుగా తెచ్చుకునే శాంపిల్స్ డీలర్ శాంపిల్స్: డీలర్లు నేరుగా పంపే శాంపిల్స్ డీలర్లలో భయం నేను 10 ఎకరాల్లో ఇటీవల కొత్తగా వచ్చిన వరి వంగడం ఎంటీయూ 1318 సాగు చేయాలనుకున్నా. కొత్త రకం కదా.. మొలక శాతం ఏలా ఉంటుందోననే ఆందోళనతో కోరుకొండ ల్యాబ్కు తీసుకొచ్చి పరీక్ష చేయించాను. మంచి ఫలితం వచ్చింది. నేను నారుమడి పోసి సాగు చేస్తున్నా. ఇప్పుడు ఈ ల్యాబ్ల వల్ల గతంలో మాదిరిగా డీలర్లు ఏది పడితే వాటిని మాకు అంటగట్టే ప్రయత్నం చేయడం లేదు. ల్యాబ్ల ఏర్పాటుతో ఇన్పుట్స్ క్వాలిటీపై రైతుల్లో మంచి అవగాహన వచ్చింది. సీఎం జగన్కు కృతజ్ఞతలు. – చిల్పారాశెట్టి అప్పలరాజు, శ్రీరంగపట్నం, కోరుకొండ మండలం, తూర్పుగోదావరి నాణ్యత ప్రమాణాలపై దృష్టి జిల్లా, నియోజకవర్గ స్థాయి ల్యాబ్ సేవలు దాదాపు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. వీటిలో అత్యాధునిక ఎక్యూప్మెంట్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం. ల్యాబ్లలో నాణ్యతా ప్రమాణాలను మరింత మెరుగు పర్చేందుకు నాలుగు జోన్లుగా విభజించాం. విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తిరుపతి, పల్నాడు జిల్లా వ్యవసాయాధికారులను ఈ జోన్లకు కస్టోడియన్ అధికారులుగా నియమించాం. వీరి సేవలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. – చేవూరు హరికిరణ్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ -
కెమికల్ కిల్లింగ్స్!
వివిధ రసాయనాలు, పురుగుమందులు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని... ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 లక్షల మంది రసాయనాల కారణంగా మృతిచెందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తెలిపింది. ఈ మేరకు ప్రజారోగ్యంపై రసాయనాల ప్రభావం పేరుతో తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. అంతర్జాతీయంగా జరిగే అన్ని రకాల మరణాల్లో 3.6 శాతం కెమికల్స్ ద్వారానే జరుగుతున్నాయని నివేదిక వివరించింది. ముఖ్యంగా భారత్లో పురుగుమందుల వల్లే ఏడాదికి 70 వేల ఆత్మహత్యలు జరుగుతుండటం ఆందోళనకరమని పేర్కొంది. – సాక్షి, హైదరాబాద్హృద్రోగాలే అధికం హృద్రోగాలే అధికం డబ్ల్యూహెచ్వో నివేదిక ప్రకారం... కెమికల్స్ వల్ల వచ్చే జబ్బుల్లో అత్యధికంగా 40% గుండె జబ్బులే ఉంటున్నాయి. అలాగే 20% దీర్ఘకాలిక ఊపిరితిత్తుల జబ్బులు, 15% కేన్సర్లు ఉంటున్నాయి. ఏటా లక్ష మంది పురుషుల్లో కెమికల్స్ వల్ల 35 మరణాలు సంభవిస్తుండగా అందులో 32 జబ్బులు దీర్ఘకాలిక జబ్బుల వల్లే జరుగుతున్నాయి. మహిళల్లో లక్షకు 17మంది కెమికల్స్ కారణంగా చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల్లో 20% కెమికల్స్ ద్వారా, రైతు ఆత్మహత్యల్లో 30% కెమికల్స్ ద్వారా, 1.4% నిద్రమాత్రల వంటి మందులు వేసుకోవడమే కారణం. ఏయే రసాయనాల వల్ల ఎటువంటి జబ్బులు..? ఆర్సెనిక్, ఆస్బెస్టాస్, బెంజిన్, బెరీలియం, క్యాడ్మియం తదితర రసాయనాలు 2.9 శాతం కేన్సర్లకు కారణమవుతున్నాయి. ఆర్సెనిక్ భూగర్భ జలాల నుంచి వస్తుండగా బొగ్గు గనుల్లో పనిచేసే వారిలో ఆస్బెస్టాస్ చేరుతోంది. ధూమపానం, వాహన కాలుష్యం ద్వారా బెంజిన్ శరీరంలోకి ప్రవేశిస్తోంది. మురికినీరు లేదా కలుషిత జలాల్లో ఉండే చేపలు తినడం, అలాంటి నీటితో సాగు చేసే ఆలుగడ్డ, వరి, పొగాకు ద్వారా క్యాడ్మియం ఒంట్లోకి చేరుతోంది. సీసం వాడకాన్ని తగ్గించాలి... ప్రపంచవ్యాప్తంగా భారత్ సహా 41 శాతం దేశాలు సీసంపై చాలావరకు నియంత్రణ విధించాయి. అయినా పెయింటింగ్స్, వాహన ఇంధనాలు, నీరు, ఫుడ్ ప్యాకేజీలు, చిన్నారుల ఆట బొమ్మల్లో దాని వాడకం ఇంకా కొనసాగుతోంది. ఇది తీవ్ర అనారోగ్యానికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా వస్తువుల్లో సీసం వాడకాన్ని నివారించాలి. అన్ని రకాల రసాయనాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 లక్షల మంది చనిపోతున్నారంటే 16 సెకన్లకు ఒకరు మరణిస్తున్నారన్నమాట. – డాక్టర్ కిరణ్ మాదల,సైంటిఫిక్ కమిటీ కన్వీనర్, ఐఎంఏ, తెలంగాణ సీసంతో ఆరోగ్యానికి హాని.. కెమికల్స్ వల్ల హానిలో సగ భాగం సీసం అనే లోహం ద్వారానే జరుగుతోంది. సీసాన్ని పెయింటింగ్స్, ప్లంబింగ్ పనులతోపాటు స్మోకింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మైనింగ్, ఐరన్, ఉక్కు తయారీ, ఆయిల్ రిఫైనింగ్లో, పెట్రోల్, విమాన ఇంధనాలు, కాస్మెటిక్స్, సంప్రదాయ మందులు, నగల తయారీ, సిరామిక్స్, ఎల్రక్టానిక్ వస్తువులు, వాటర్ పైప్లలో సీసం ఉంటోంది. కలర్ కోటింగ్తో కూడిన ఆహారాలు తినడం వల్ల గుండె జబ్బుల్లో 4.6 శాతం, కిడ్నీ జబ్బుల్లో 3 శాతం సీసం ద్వారా వస్తున్నాయి. చిన్నారుల్లో మూడో వంతు బుద్ధిమాంద్యం సీసం ద్వారా ఏర్పడుతోంది. పిల్లల్లో ఎక్కువగా పెయింటింగ్స్ ద్వారా సీసం వారిలో చేరుతుండగా ఐదేళ్లలోపు పిల్లల్లో సీసం కలిగించే దుష్ప్రభావం ఐదు రెట్లు ఎక్కువగా ఉంటోంది. సీసం కలిసిన వస్తువుల వాడకం వల్ల గర్భిణుల్లో ముందస్తు ప్రసవాలు లేదా అబార్షన్లు జరుగుతున్నాయి. -
ప్రకృతి సాగుకు ప్రాధాన్యం
రైతుల్ని నూరు శాతం ప్రకృతి సాగుబాట పట్టించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తొలి దశలో జిల్లాకు ఒక మండలాన్ని ప్రకృతి సాగులో ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మండలాల్లో రసాయన ఎరువులు, పురుగు మందులు వినియోగించే సన్న, చిన్నకారు రైతులను సంఘటితం చేసి వారికి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా సాగుచేస్తే కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తారు. కావాల్సిన ఇన్పుట్స్ తయారీలో రైతులకు శిక్షణ కూడా ఇవ్వడంతోపాటు సాగులో మెళకువలు నేర్పుతూ అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తారు. దశలవారీగా మండలంలో ప్రతి ఒక్కరూ ప్రకృతి సాగు చేపట్టేలా చర్యలు తీసుకుంటారు. మార్కెటింగ్, హెల్త్ అండ్ న్యూట్రిషన్, సైన్స్, పరివర్తన, యాజమాన్యం, సర్టీఫికేషన్, స్థానిక విలువ జోడింపు, వ్యవస్థాగత పరిశ్రమలు ఇలా అన్ని విభాగాలలో ఆ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతారు. ఆదర్శ మండలాల్లో పౌష్టికాహారం అవసరమయ్యే వారందరికీ నూటికి నూరు శాతం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ప్రతి గ్రామంలో ప్రకృతి ఉత్పత్తులను అందుబాటులో ఉంచడం ద్వారా పౌష్టికాహార లోపంతో బాధపడే వారి ఆహారంలో వాటిని భాగమయ్యేలా చూస్తారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అధ్యయనం చేస్తారు. మార్కెటింగ్ శాఖ ద్వారా రైతులు పండించిన ప్రకృతి ఉత్పత్తులను స్థానికంగా అమ్ముకునేలా చర్యలు తీసుకుంటారు. తొలుత గ్రామస్తులకు మంచి ఆహార ఉత్పత్తులు అందించేలా ప్రోత్సహిస్తారు. – సాక్షి, అమరావతి జిల్లాకో మండలం చొప్పున ఎంపిక 100% ప్రకృతి సాగుతో ఆదర్శ మండలంగా అభివృద్ధిఏడాది పొడవునా ఆదాయంవచ్చేలా పంటల ప్రణాళిక పాయింట్ పర్సన్లుగా సెర్ప్ఏపీఎంలు, సీసీలు రైతులే విక్రయించుకునేలా.. దళారుల పాత్ర లేకుండా రైతులే స్వయంగా పంట ఉత్పత్తులను రాష్ట్ర, జాతీయస్థాయి మార్కెట్లలో నేరుగా విక్రయించుకునేలా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తారు. వివిధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రైతులు పంట ఉత్పత్తుల్ని విక్రయించుకుని అదనపు ఆదాయం పొందేలా చూస్తారు. ఇటీవల కాలంలో అనంతపురం జిల్లాలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసే పలువురు రైతులు ఏడాది పొడవునా పంటల సాగు ద్వారా ప్రతినెలా క్రమం తప్పకుండా ఆదాయం వచ్చేలా ఏటీఎం (ఎనీ టైం మనీ) తరహా మోడల్ను అభివృద్ధి చేశారు. ఇదే మోడల్ను రాష్ట్రమంతా విస్తరించే దిశగా చర్యలు చేపట్టారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు బాధ్యతలు ఇందుకు సంబంధించిన కీలక బాధ్యతలను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)కు ప్రభుత్వం అప్పగించింది. సెర్ప్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ (ఏపీఎం), కమ్యూనిటీ కో–ఆర్డినేటర్ సీసీలు ఈ ప్రాజెక్టులో పాయింట్ పర్సన్గా వ్యవహరిస్తారు. వీరి సమన్వయంతో రైతు సాధికార సంస్థ సిబ్బంది ఎంపిక చేసిన మండలాల్లో సన్న, చిన్నకారు రైతులను గుర్తించి వారిని ప్రకృతి సాగు వైపు మళ్లించేందుకు అవసరమైన చేయూత ఇస్తారు. పాయింట్ పర్సన్స్గా ఎంపికైన ఏపీఎం, సీసీలకు రాష్ట్ర స్థాయిలో రెండ్రోజుల శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంపికైన మండలాలివీ.. ఈ ప్రాజెక్ట్ కోసం పాతపట్నం (శ్రీకాకుళం), జీఎల్ పురం (పార్వతీపురం మన్యం), వేపాడ (విజయనగరం), పద్మనాభం (విశాఖపట్నం), చీడికాడ (అనకాపల్లి), పాడేరు (అల్లూరి), ప్రత్తిపాడు (కాకినాడ), ఐ.పోలవరం (కోనసీమ), గోకవరం (తూర్పు గోదావరి), పాలకొల్లు (పశ్చిమ గోదావరి), జీలుగుమిల్లి (ఏలూరు), బాపులపాడు (కృష్ణా), రెడ్డిగూడెం (ఎన్టీఆర్ ), కొల్లిపర (గుంటూరు), బెల్లంకొండ (పల్నాడు), మార్టూరు (బాపట్ల), కొత్తపట్నం (ప్రకాశం), దగదర్తి (నెల్లూరు), రామచంద్రపురం (తిరుపతి), శాంతిపురం (చిత్తూరు), చిన్నమందెం (అన్నమయ్య), పెండ్లిమర్రి (వైఎస్సార్), మడకశిర (శ్రీ సత్యసాయి), రాప్తాడు (అనంతపురం), ఓర్వకల్లు (కర్నూలు), ప్యాపిలి (నంద్యాల) మండలాలను ఎంపిక చేశారు. ప్రకృతి సాగులో ఆదర్శం జిల్లాకో మండలాన్ని ఎంపిక చేసి ప్రకృతి సాగులో ఆదర్శంగా తీర్చిదిద్దేలా కార్యాచరణ సిద్ధం చేశాం. సెర్ప్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టబోతున్నాం. తొలుత సిబ్బందికి, ఆ తర్వాత రైతులకు శిక్షణ ఇస్తాం. సాగులో అవసరమైన చేయూత అందిస్తాం. – బీవీ రామారావు, సీఈవో, రైతు సాధికార సంస్థ -
పుడమి తల్లికి తూట్లు!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : పుడమి తల్లి నిస్సారంగా మారిపోతోంది. చాలాకాలంగా నత్రజని, భాస్వరం, పొటాషియం తదితర రసాయన ఎరువులకు తోడు పురుగు మందులు వాడకం విపరీతంగా పెరిగిపోయింది. పంటల దిగుబడిని పెంచుకోవడానికి, క్రిమిసంహారానికి మోతాదుకు మించి వాడుతున్న రసా యన ఎరువులు, మందుల కారణంగా సారవంతమైన నేల కాస్తా గుల్ల అవుతోంది. రసాయన ఎరువుల వాడకం పుడమి కాలుష్యంతో పాటు, వాయు, నీటి కాలుష్యానికి కూడా దోహదపడుతోంది. ఒక టన్ను రసా యన ఎరువులను వినియోగిస్తే.. అందులో కేవలం మూడున్నర క్వింటాళ్ల రసాయన ఎరువులను మాత్రమే పంటలు స్వీకరిస్తాయని, మిగిలిందంతా పుడమిలోకి ఇంకిపోవడం, వర్షాలు పడినప్పుడు చెరువులు, నదులు, వాగులు, ఇతర నీటి వనరుల్లోకి వెళ్లిపోవడం జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని దేశాలతో పోల్చిచూస్తే..మన దేశంలో వీటి విని యోగం తక్కువగా ఉన్నా.. ప్రస్తుతం వాడుతున్న ఈ రసాయన ఎరువుల వల్ల పర్యావరణంపైనా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఆర్గానిక్తో మేలు.. ♦ దిగుబడి పెంచుకోవడానికి వినియోగించే ఎరువుల్లో ఆర్గానిక్, ఇనార్గానిక్ అనే రెండు రకాలు ఉన్నాయి. ఆర్గానిక్ ఎరువులు ప్రకృతి సిద్ధమైనవి. పంట వ్యర్థాలు, మొక్కలు, జంతువుల వ్యర్థాలు, మునిసిపల్ వ్యర్థాల నుంచి వచ్చే ఎరువులను ఆర్గానిక్ ఎరువులుగా పరిగణిస్తారు. ఆర్గానిక్ ఎరువుల వాడకం వల్ల భూసారం పెరగడంతో పాటు, వాన పాములు, సూక్ష్మజీవుల పునరుత్పత్తికి దోహద పడుతుంది. ఇక రసాయనాలను వినియోగించి తయారు చేసేవే ఇనార్గానిక్ ఎరువులు. పంటల ఎదుగుదలకు నత్రజని ఉపయోగపడుతుంది. ఫాస్ఫేట్ మొక్కలకు ముఖ్యమైన పోషక విలువలను అందిస్తుంది. వీటితో పాటు పొటాషియం భూమిలో నీటి సామర్థ్యాన్ని, భూ సాంద్రతను పెంచుతాయనే వాదన ఉన్నా.. ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిలోని ఆమ్లాలు చర్మంపైన, శ్వాసపైనా ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. సేంద్రీయ సేద్యం పెరుగుతున్నా దేశంలో సేంద్రీయ సేద్యం పెరుగుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించే గణాంకాలు చెబు తున్నా.. రసాయన ఎరువుల వాడకం కూడా విపరీతంగా పెరిగిపోవడం ఆందోళన కలి గించే అంశం. మన దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలు రసాయన ఎరువుల వాడకంలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ ఎరువులు భూమిలో ఉండే సూక్ష్మక్రిములను చంపే యడంతో భూమి తన సారాన్ని కోల్పోతోందని నిపుణులు చెబుతున్నారు. పంటల దిగు బడి కోసం శాస్త్రీయ ఎరువులు వినియోగించకుండా కేవలం రసాయన ఎరువులు, పురుగుమందులు వాడటం వల్ల భూసారం తగ్గి, తదనంతర కాలంలో పంటల దిగుబడులు గణనీయంగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దశాబ్ద కాలంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం దాదాపు 50% మేరకు పెరిగినట్లు అగ్రికల్చర్ ఇన్పుట్ సర్వే వెల్లడిస్తోంది. చైనాలో హెక్టార్కు 13.06 కిలోలు చైనా ఒక హెక్టార్కు 13.06 కిలోల పురుగు మందులు వాడుతుంటే, జపాన్ 11.85 కిలోలు, బ్రెజిల్ 4.57 కిలోలు వినియోగిస్తున్నాయి. లాటిన్ అమెరికా దేశా ల్లోనూ ఇలాంటి మోతాదుల్లోనే వినియోగిస్తున్నారని సమాచారం. మన దేశంలో అత్యధికంగా పంజాబ్లో ప్రతి హెక్టార్కు 0.74 కిలోలు వినియోగిస్తున్నారు. పంజాబ్, హరియాణాలు పంటల దిగుబడి కోసం అత్యధికంగా రసాయన ఎరువులు వినియోగి స్తున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. హరియాణాలో 0.62 కిలోలు, మహారాష్ట్రలో 0.57 కిలోలు, కేరళలో 0.41 కిలోలు, ఉత్తరప్రదేశ్లో 0.39 కిలోలు, తమిళనాడులో 0.33 కిలోల రసాయన ఎరువులు వాడుతున్నారు. జాతీయ సగటు 0.29 కిలోలుగా ఉంది. జాతీయ సగటు కంటే తెలుగు రాష్ట్రాల్లో వినియోగం తక్కువగా ఉన్నట్లు ఆ గణాంకాలు పేర్కొంటున్నాయి. యూరియానే అత్యధికం.. ఎరువుల్లో యూరియా వినియోగం ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. రైతులు అవసరానికి మించి యూరియా వాడుతున్నారని, ఒక బస్తా యూరియా వేయాల్సిన చోట పంట ఎదుగుదల, దిగుబడి కోసం రెండు మూడు బస్తాలు వినియోగిస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల కంటే దీని ధర తక్కువగా ఉండడం, కేంద్ర ప్రభుత్వం సైతం యూరియాపై ఎక్కువ సబ్సిడీ ఇవ్వడం వల్ల రైతులు ఎక్కువగా యూరియా వినియోగిస్తున్నట్లు అధికారవర్గాల సమాచారం. యూరియాపై కేంద్రం దాదాపు 75 శాతం మేరకు సబ్సిడీ అందిస్తుంటే.. డీఏపీ లాంటి ఎరువులపై 35 శాతం మాత్రమే ఇస్తోంది. భూసార పరీక్షల ఆధారంగా వాడాల్సి ఉన్నా.. భూసార పరీక్షల నిర్వహణ ద్వారా ఏయే భూములకు ఎలాంటి పోషకాలు కావాలి, అవి ఏయే రసాయన ఎరువుల్లో ఉంటాయో తెలుసుకుని, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు వాడాల్సి ఉన్నా.. రైతులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. తమకు తెలిసిన ఎరువులను యథేచ్ఛగా వాడుతున్నారు. తద్వారా ఒక్కోసారి ఆశించిన స్థాయిలో దిగుబడి రాక తీవ్రంగా నష్టపోతున్నారు. పత్తి, వరి, గోధుమ, చెరకు పంటలకు ఎక్కువగా పురుగుల మందులు వాడుతున్నారు. పంజాబ్లో కేన్సర్, కిడ్నీ సంబంధిత సమస్యలు రసాయన ఎరువుల అధిక వినియోగంతో ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో నష్టాలు పెరుగుతున్నాయి. ప్రత్యక్షంగా చూస్తే.. నత్రజని కాలుష్యం పెరగడం వల్ల ఆహార ఉత్పత్తుల ద్వారా కేన్సర్, కిడ్నీ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. పంజాబ్లో ఈ సమస్య తీవ్రస్థాయికి చేరింది. కొంతకాలం ఎరువుల వినియోగం తర్వాత భూమి లోపల ఉండే బ్యాక్టీరియా చచ్చిపోయి, కార్బన్, మినరల్స్ వంటివి పోయి ఈ రసాయనాలే డామినేట్ చేస్తాయి. మొక్కకు సహజ సిద్ధమైన బలం చేకూరకుండా నేరుగా రసాయనాలే ప్రభావితం చేస్తాయి. పంటల వైవిధ్యం కూడా దెబ్బతింటుంది. రెండు, మూడు పంటలు వచ్చే ఉమ్మడి నల్లగొండ పరిధిలోని మిర్యాలగూడ, తదితర ప్రాంతాల్లో వరి పొలాల్లో విపరీతంగా యూరియా ఇతర రసాయనాల వినియోగం కారణంగా నేల మొత్తం రసాయనాలే నిండిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమస్యను అధిగమించాలంటే రసాయనేతర ఎరువులైన ఆవు, ఇతర జంతువుల పేడ, గృహాల నుంచి వచ్చే చెత్తతో తయారుచేసిన ఎరువుల వినియోగం పెంచాలి. – డా. దొంతి నర్సింహారెడ్డి, వ్యవసాయరంగ నిపుణులు, పాలసీ అనలిస్ట్ రసాయన, సేంద్రీయ కాంబినేషన్ మంచిది రసాయన ఎరువుల అధిక వాడకం వల్ల భూమి తన నిజ స్వరూపం, సారాన్ని కోల్పోతుంది. భూమిలో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ కూడా చనిపోతాయి. ఎరు వులు వాడితే మొక్కల్లో నీటి నిల్వశాతం కూడా తగ్గు తుంది. వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. మొక్క కు రసాయన ఎరువు, సేంద్రీయ ఎరువులు కాంబినేషన్గా అందించాలి. ఉదాహరణకు మొత్తం పది బస్తాల ఎరువులు వినియోగిస్తామను కుంటే.. అందులో ఆరు బస్తాలు రసాయన ఎరువులు, 4 బస్తాల సేంద్రీయ ఎరువులు ఉండేలా చూడాలి. దీనితో సమతుల్యత ఉంటుంది. పురుగుల మందుల వల్ల బీపీ, షుగర్, కిడ్నీ పేషంట్లు పెరుగుతున్నారు. – కె.రాములు ఎండీ, ఆగ్రోస్ లిమిటెడ్ సబ్సిడీలు తగ్గించుకునేందుకే.. కేంద్ర ప్రభుత్వం పీఎం ప్రణామ్లో భాగంగా ఎరువుల వినియోగం తగ్గించడం ద్వారా రైతులకిచ్చే సబ్సిడీలు కూడా తగ్గిస్తోంది. శ్రీలంక తరహాలో సేంద్రీయ వ్యవసాయం ప్రోత్సహించాలని చూస్తోంది. సేంద్రీయ, రసాయన ఎరువులు కలగలిపి ఉపయోగించడం ద్వారా సేంద్రీయ వ్యవసాయం చేయాలి. కానీ ఒక్క సేంద్రీయ లేదా రసాయన ఎరువుల వాడకంతో పంటలు పండవు. చైనా, అమెరికాతో పోల్చితే భారత్లో తక్కువగానే ఎరువులు వాడుతున్నారు నిజమే. అయితే చైనాలో హెక్టార్కు 80 క్వింటాళ్లు, అమెరికాలో 60 క్వింటాళ్లు పండిస్తున్నారు. కానీ మన దేశంలో 25 క్వింటాళ్లే దిగుబడి వస్తోంది. 1991లో మనం ఎగుమతులు చేసే దశ నుంచి, ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తులు సహా, పాలు, పాల ఆధారిత ఉత్పత్తులు, మాంసం, నూనెలు, పప్పుధాన్యాలు, పంచదార వంటివి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ దిగుమతులకు డంపింగ్ కేంద్రంగా మారింది. భారత్లో ఉత్పత్తులను దెబ్బతీసి దిగుమతులపై ఆధారపడేలా చేసే ధనిక దేశాల ప్రయత్నాలకు కేంద్రం లొంగిపోతోందనడానికి ఇదో ఉదాహరణ. – సారంపల్లి మల్లారెడ్డి, రైతుసంఘం నేత, వ్యవసాయ నిపుణులు -
పాలీహౌస్ల కోసం రోబోటిక్ స్ప్రేయర్
సాక్షి, అమరావతి: ఎరువులు, పురుగు మందుల పిచికారీకి సాంకేతిక పరిజ్ఞానం జోడించడమే లక్ష్యంగా వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ అనుబంధ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు రోబోటిక్ స్ప్రేయర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని సాయంతో పాలీహౌస్, గ్రీన్ హౌస్లలో ద్రవ రూప ఎరువులు, పురుగు మందులను మానవ రహితంగా పిచికారీ చేయొచ్చు. పంటల వారీగా శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకే నానో యూరియా, పురుగు మందులను ఈ పరికరం పిచికారీ చేస్తుంది. దీనిద్వారా 20 శాతం యూరియా, పురుగుల మందుల వినియోగం తగ్గడంతోపాటు పెట్టుబడి ఖర్చులు 25 శాతం వరకు ఆదా అవుతాయని క్షేత్రస్థాయి అధ్యయనంలో గుర్తించారు. దిగుబడుల్లో నాణ్యత పెరగడంతోపాటు పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాల ప్రభావం ఉండదని కూడా తేల్చారు. ప్రత్యేకతలివీ.. ♦ ఈ పరికరం రిమోట్ కంట్రోల్తో కిలోమీటర్ మేర పనిచేస్తుంది. ♦ ముందుగా కావాల్సిన రసాయన ఎరువు లేదా పురుగు మందులను తొట్టిలో వేసుకుని మెషిన్ ఆన్ చేసి రిసీవర్, ట్రాన్స్మీటర్ను కనెక్ట్ చేసుకోవాలి. ♦ రిమోట్ ద్వారా కమాండ్ సిగ్నల్స్ను అందిస్తే ఇది పని చేసుకుంటూ పోటుంది. రిమోట్ ద్వారా మెషిన్ దిశను మార్చుకోవచ్చు. ♦ కంట్రోలర్ బటన్ ద్వారా మెషిన్ వేగం, స్ప్రేయర్ పీడనం మార్చుకోవచ్చు. ♦ మొక్క ఎత్తును బట్టి నాజిల్స్ను మాన్యువల్గా సర్దుబాటు చేసుకోవచ్చు. ♦ పురుగు మందులను ఏకరీతిన సరైన పరిమాణంతో ఆకుల మీద పడేలా చేయటం దీని ప్రత్యేకత. ♦ తక్కువ మోతాదులో వినియోగించడం వల్ల పురుగు మందుల వృథాతో పాటు భూగర్భ జలాలు కలుషితం కాకుండా అడ్డుకోవచ్చు. ♦ 10–20 లీటర్ల లిక్విడ్ యూరియా, పురుగుల మందులను మోసుకెళ్తూ నిమిషానికి 6 లీటర్లను పిచికారీ చేయగల సామర్థ్యం ఈ పరికరానికి ఉంది. కృత్రిమ మేధస్సుతో.. కృత్రిమ మేధస్సుతో పనిచేసే పరికరాలు, మొబైల్ అప్లికేషన్స్, సెన్సార్లు, డ్రోన్స్, ఆటోమేటిక్ యంత్ర పరికరాలు, వివిధ సాఫ్ట్వేర్స్ రూపకల్పన కోసం ఆదికవి నన్నయ, జేఎన్టీయూకే, ఎన్ఐటీలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఇందులో భాగంగా ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ప్రోటోటైప్ రోబోటిక్ స్ప్రేయర్ను అభివృద్ధి చేశారు. ఇందులో మార్పుచేసి మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. ఇమేజ్ ప్రాసెసింగ్ ద్వారా మొక్కల వ్యాధులు, తెగుళ్లను గుర్తించడంపైనా పరిశోధనలు జరుగుతున్నాయి. – డాక్టర్ తోలేటి జానకిరామ్, వీసీ, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ -
సాగులో మితి మీరుతున్న పురుగు మందులు
సాగులో మితి మీరుతున్న పురుగు మందులు -
ఆగని ‘మాస్టర్ప్లాన్’ మంటలు
జగిత్యాల రూరల్: జగిత్యాల జిల్లాకేంద్రంలో మాస్టర్ప్లాన్ – 2041 మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. పట్టణ సమీప గ్రామాల్లోని తమ వ్యవసాయభూములను రిక్రి యేషన్, ఇండస్ట్రియల్, సెమీ పబ్లిక్జోన్లలో చే ర్చుతూ ముసాయిదా మాస్టర్ప్లాన్ ప్రకటించారని రైతులు భగ్గుమంటున్నారు. వారంరోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం కూడా రైతులు పెద్దఎత్తున తరలివచ్చి జగిత్యాల నలువైపులా రహదారులను దిగ్బంధించారు. రోడ్లపైన వంటావార్పు నిర్వ హించారు. తాము పండించిన మక్కకంకులను విక్రయిస్తూ, ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేస్తూ నిరసన తెలిపారు. హుస్నాబాద్ శివారులోని జగిత్యాల–నిజామాబాద్ ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కొందరు మహిళారైతులు పురుగుమందు డబ్బాలు వెంట తెచ్చుకున్నారు. మాస్టర్ప్లాన్ నుంచి తమ భూములను తొలగించకుంటే ఆత్మహత్య చేసుకుంటామంటూ అధికారులను హెచ్చరిస్తూ. మందు తాగేందుకు యత్నించగా, అక్కడే ఉన్న పోలీసులు పురుగుమందు డబ్బాలను లాక్కున్నా రు. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత అన్నిచోట్ల ధర్నాలను ఉపసంహరించుకున్నారు. -
పురుగుమందుల వాడకంపై టార్గెట్లు వద్దు
మాంట్రియల్: ప్రపంచవ్యాప్తంగా పంట సాగులో పురుగుమందుల వాడకాన్ని తగ్గించే క్రమంలో లక్ష్యాలు విధించడం సరికాదని భారత్ పేర్కొంది. పెస్టిసైడ్స్ వాడకంపై విచక్షణను ఆయా దేశాలకే వదిలివేయాలని సూచించింది. వ్యవసాయరంగానికి సబ్సిడీలు ఇవ్వడాన్ని సమర్థించింది. జీవ వైవిధ్యంపై కెనడాలోని మాంట్రియెల్లో జరుగుతున్న 15వ కాన్ఫరెన్స్ ఆన్ పార్టీస్(కాప్15) ఉన్నత స్థాయి సదస్సులో శుక్రవారం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడారు. పురుగుమందుల వాడకం తగ్గింపు విషయంలో ప్రపంచ దేశాలపై సంఖ్యాత్మక లక్ష్యాలను విధించడం తగదన్నారు. ఆ అంశాన్ని ఆయా దేశాలకే వదిలివేయాలని అభిప్రాయపడ్డారు. 2030 నాటికి పంటలపై పురుగు మందుల వాడకాన్ని మూడింట రెండొంతులకు తగ్గించాలన్న గ్లోబల్ బయో డైవర్సిటీ ఫ్రేమ్వర్క్ లక్ష్యంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ జనాభాలో 17% భారత్లోనే ఉండగా, కేవలం 2.4% భూభాగం, 4% నీటి వనరులు మాత్రమే ఉన్నాయన్నారు. అయినప్పటికీ, జీవవైవిధ్యాన్ని పరిరక్షించే ప్రయత్నంలో ముందుకు సాగుతున్నామన్నారు. ఎరువులు, పురుగుమందులు సహా వ్యవసాయ రంగంపై భారత ప్రభుత్వం ఏటా 2.2 లక్షల కోట్లను సబ్సిడీగా ఇస్తున్నట్లు ఒక అంచనా. కాప్15 సదస్సుకు 196 దేశాల నుంచి 20 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. -
పురుగు మందుల అవశేషాలకు చెక్
సాక్షి, అమరావతి: తాగునీటిలో ఉండే పురుగు మందుల అవశేషాలను గుర్తించే అత్యాధునిక నీటి పరీక్షల ల్యాబొరేటరీలు రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నాయి. క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు కారణమయ్యే లెడ్, మెర్క్యురీ, క్రోమియం వంటి లోహాలు తాగునీటిలో సూక్ష్మస్థాయిలో ఉన్నా ఈ అత్యాధునిక ల్యాబ్లు పసిగట్టేస్తాయి. గ్రామీణ ప్రజలు తాగునీటికి ఉపయోగించే బోరు బావులతోపాటు ప్రభుత్వ రక్షిత మంచినీటి పథకాల్లోని నీటి నమూనాలను గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) ఆధ్వర్యంలో ఏటా రెండుసార్లు సేకరించి, నీటి నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఇందుకు గాను రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలో మొత్తం 112 నీటి పరీక్షా కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, పాలకొల్లుతోపాటు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, రాజమండ్రిలోని నీటి పరీక్షా కేంద్రాలను ఒక్కొక్కటీ రూ.6 కోట్లతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆధునికీకరించింది. వీటిలో వినియోగించే అత్యాధునిక యంత్ర సామగ్రిని అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది. ల్యాబ్ల నిర్వహణ సైతం అమెరికన్ సంస్థ ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది. 4 ల్యాబ్ల ఏర్పాటు పూర్తయి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డి తెలిపారు. మరో 4 ల్యాబ్ల ఆధునికీకరణకు ప్రతిపాదన జోన్ల వారీగా రాష్ట్రంలో మరో నాలుగు నీటి పరీక్షల ల్యాబ్లను కూడా ఈ తరహాలోనే ఆధునికీకరించేలా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు సంబంధించి విశాఖలో, రాయలసీమ నాలుగు జిల్లాలకు సంబంధించి కడపలో, విజయవాడలో ఒకటి, ప్రకాశం జిల్లాలో మరొకటి ఈ తరహా అత్యాధునిక ల్యాబ్ల ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏలూరు ఘటన తర్వాత సీఎం ఆదేశాల మేరకు సుమారు ఏడాది క్రితం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రాంతంలో అంతుచిక్కని సమస్యతో ఒకే రోజున పెద్ద సంఖ్యలో ప్రజలు అనారోగ్యం బారినపడ్డారు. పురుగు మందుల అవశేషాలతో కూడిన నీటిని తాగడం వల్లే ఆ సమస్య ఉత్పన్నమై ఉండొచ్చని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో వ్యవసాయ రంగంలో పురుగు మందుల వాడకం పెరగడం వల్ల నీటి కాలుష్యానికి ఎక్కువగా అవకాశం ఉందన్న అంశాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అయితే, తాగునీటిలో దాగి ఉండే పురుగుమందుల అవశేషాలను, మెర్క్యురీ వంటి ప్రమాదకర సూక్ష్మస్థాయి మెటల్స్ను గుర్తించడానికి నీటి పరీక్ష కేంద్రాలు ఇప్పటివరకు రాష్ట్రంలో అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యాధునిక నీటి పరీక్షల ల్యాబ్ల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు మొదటగా నాలుగు ల్యాబ్లను ఆధునికీకరించారు. -
నమ్మిన చేలోనే ‘రుణం’ తీరిపోయె..
టేకుమట్ల: ఎన్నో ఆశలతో వేసిన మిర్చి పంటకు తెగులు సోకింది. తెచ్చిన అప్పులు మీద పడటంతో ఓ రైతు ఆ చేనులోనే పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల మండలం సుబ్బక్కపల్లిలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దూరి రవీందర్రావు (52) అనే రైతు గత ఏడాది తనకున్న రెండున్నరెకరాల భూమితోపాటు, మరో రెండెకరాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. దిగుబడులు రాకపోవడంతో రూ.8 లక్షల మేర అప్పు అలానే ఉండిపోయింది. ఈ సంవత్సరం తనకున్న రెండున్నరెకరాల్లో మిర్చి సాగు చేయగా కొన్ని రోజులుగా కుచ్చు తెగులు, తామర పురుగుతో పంట మొత్తం ఎదుగుదల లోపించింది. ఈ పంట కోసం లక్షల్లో పెట్టుబడి పెట్టినా ఫలితం లేకపోగా, మరిన్ని అప్పులు పెరగడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి మిర్చి చేనులోకి వెళ్లి పురుగు మందు తాగాడు. తాను చనిపోతున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే కుటుంబ సభ్యులు చేను వద్దకు చేరుకుని పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్ఐ వినయ్కుమార్ పంచనామా చేసి మృతదేహాన్ని చిట్యాల మార్చురీకి పంపించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: కేవలం వారాల వ్యవధిలోనే శర వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి: సీడీసీ హెచ్చరిక -
మిర్చి పంటకు ‘తామర పురుగు’ముప్పు అందుకే! ఈ జాగ్రత్తలు తీసుకుంటే..
Pesticides For Thamara Purugu Damage In Chilli Cultivation: మిరప పంట రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 4.5 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. రసాయనిక వ్యవసాయంలో ఏకపంటగా సాగవుతున్న ఈ పంటకు సాధారణంగా చీడపీడల బెడద ఎక్కువే. పురుగుమందులను విస్తృతంగా పిచికారీ చేస్తున్నప్పటికీ భూతాపోన్నతి కారణంగా కొత్తరకం చీడపీడలూ కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ‘మిరప పంటలో పూలను ఆశించే తామర పురుగులు’ మొట్ట మొదటి సారిగా గత ఏడాది జనవరి – ఫిబ్రవరిలో గుంటూరు జిల్లాలో కనిపించాయి. ఈ ఏడాది రెండు, మూడు నెలలు ముందే గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు తదితర జిల్లాల్లో విజృంభించాయి. వేలాది ఎకరాల్లో మిర్చి పంట పైముడతతో నాశనం అవుతున్నాయి. భారీగా పెట్టుబడులు పెట్టిన రైతుల ఆశలు నిలువునా నేల రాలిపోతున్నాయి. కొందరు మిర్చి తోటలు పీకేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల మిర్చి తోటల్లో, దేశవాళీ మిరప రకాలు సాగు చేస్తున్న పొలాల్లో పరిస్థితి ఉన్నంతలో మెరుగ్గా ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం నిపుణులు, ప్రకృతి వ్యవసాయ నిపుణులతో ‘సాక్షి సాగుబడి’ ముచ్చటించింది. ఇవి కొత్త రకం తామర పురుగులు! ►గత సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొట్ట మొదటిసారిగా గుంటూరు జిల్లాలో మిరప పంట పండించే రైతులు పూతను ఆశించే తామర పురుగులను గమనించారు. ఈ సంవత్సరం ముందుగా మిరప పంట వేసిన పొలాల్లో ఈ పురుగులను గమనించాం. పూతను ఎక్కువ సంఖ్యలో ఈ పురుగులు ఆశించి పూత రాలిపోయి, కాయగా మారకపోవడం వలన తీవ్రంగా నష్టపోతామని రైతులు తీవ్ర ఆందోళనలో వున్నారు. ►సాధారణంగా మిరప పంటలో తామర పురుగులు అన్ని దశల్లోనూ ఆశిస్తుంటాయి. తద్వారా ఆకులు అంచుల వెంబడి పైకి ముడుచుకోవడం వలన ‘పై ముడత’ అని అంటారు. ఈ పురుగును నివారించుకోవడానికి రైతు స్పైనోసాడ్ (ట్రేసర్), ఫిప్రోనిల్ (రీజెంట్), డయాఫెన్ థయురాన్ (పెగాసస్), ఇంటర్ ప్రిడ్, ఎసిటామిప్రిడ్, క్లోరోఫెన్ పిల్ లాంటి మందులను వారం రోజుల వ్యవధిలో ఒకసారి లేదా రెండు సార్లు పిచికారీ చేయడం ద్వారా నివారించడం జరుగుతుంది. కానీ, ఈ కొత్త రకం తామర పురుగులు వాటికి భిన్నంగా ముదురు నలుపు రంగులో వుండి.. ఎలాంటి పురుగు మందులకు లొంగకుండా.. విపరీతంగా పూతను ఆశించి నష్టపరుస్తుండటం వలన రైతులు ఒత్తిడికి లోనవుతున్నారు. చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. రైతులు తక్షణం తీసుకోవలసిన జాగ్రత్తలు: ►రైతులు ఆందోళనతో విపరీతంగా మందులు కొట్టడం వలన ఈ తామర పురుగులో గుడ్లుపెట్టే సామర్థ్యం ఎక్కువైనట్లు గమనించాం. కాబట్టి, సింథటిక్ పైరిత్రాయిడ్ మందులను, స్పైనోసాడ్, ప్రొఫెనోఫాస్, ఇమిడాక్లోప్రిడ్ లాంటి మందులు ఎక్కువ సార్లు పిచికారీ చేయకుండా వుండాలి. ►రైతులు సామూహికంగా ఎక్కువ సంఖ్యలో జిగురు పూసిన నీలిరంగు, పసుపురంగు అట్టలను పొలంలో పెట్టుకోవడం ద్వారా వీటి తల్లిపురుగులను నివారించుకునే అవకాశముంది. ►ఇవి మనం వాడే అన్ని రకాల పురుగుమందులను తట్టుకునే సామర్థ్యం కలిగి వున్నందున.. పురుగు మందుల ద్వారా వీటిని నివారించడం కష్టం. ►ప్రస్తుతం మనకు అందుబాటులో వున్న పురుగు మందుల ద్వారా పిల్ల పురుగులను సులువుగా నివారించవచ్చు. కానీ, తల్లి పురుగులను నివారించడం చాలా కష్టం. ►తల్లి పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించడం కోసం వేప సంబంధిత పురుగు మందులను పిచికారీ చేసుకోవాలి. దీనికి గాను వేప నూనె 10,000 పి.పి.యం సేకరించాలి. లీటరు నీటికి 3 మి.లీ. మరియు 0.5 గ్రా. సర్ఫ్ గాని ట్రైటాన్ – 100 గాని కలిపి పిచికారీ చేసుకోవాలి. ►బవేరియా బస్సియానా, లికానిసిలియం లికాని అనే జీవ శీలింద్ర నాశినిలను వాడుకోవచ్చు (5 గ్రా./ లీటరు నీటికి కలిపి దీనితో పాటు ట్రైటాన్ 100 0.5 గ్రా.ను కూడా కలపాలి). ►అందుబాటులో వున్న పురుగు మందులు: ఎసిటామిప్రిడ్ (ప్రైడ్) 40 గ్రా. నుండి 50 గ్రా./ఎకరానికి లేదా సైయాంట్రనిలిప్రోల్ (బెనీవియా) 240 మి.లి./ఎకరానికి లేదా ఫిప్రోనిల్ 80 ఔ+40 గ్రా. నుండి 50 గ్రా./ఎకరానికి లేదా పోలిస్ (40% ఇమిడాక్లోప్రిడ్ + ఫిప్రోనిల్ 40% ఔ+ 40 గ్రా. నుండి 50 గ్రా./ఎకరానికి) మార్చి మార్చి నాలుగు రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ►మిరప రైతులు పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి అవసరం మేరకే వాడుకోవలసిన అవసరం చాలా వుంది. లేదంటే ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందనటంలో సందేహం లేదు. ►పొలంలో అక్కడక్కడా ప్రొద్దుతిరుగుడు మొక్కలను అకర్షక పంటగా వేసుకోవాలి. ►విత్తనం, మొక్కలను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించేటప్పుడు జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా వుంది. ఈ పరిస్థితులను ఎదుర్కోవటానికి పరిశోధనలు పురోగతిలో వున్నాయి. – డా. ఆర్.వి.ఎస్.కె. రెడ్డి, పరిశోధనా సంచాలకులు, డా.వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం, ప.గో. జిల్లా dir-research@drysrhu.edu.in చదవండి: యాహూ! వందకు 89 మార్కులు.. 104 ఏళ్ల బామ్మ సంతోషం!! -
Drone: ఎకరాకు 6 నిమిషాల్లో మందుల పిచికారీ
మామూలుగా పంట చేనుకు రైతులు ఎరువులు, క్రిమిసంహారక మందులు చల్లుతారు. అయితే దీనికి అధిక సమయం తీసుకోవడమే గాక, కూలీలకు డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఈ ఇబ్బందులను అధిగమించడానికి రైతులు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవాలని జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి సూచించారు. డ్రోన్తో ఎకరాకు కేవలం రూ.550 తోనే 6 నిమిషాల్లో మందుల పిచికారీ పూర్తవుతుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపంలో రంగధాంపల్లిలో ఉన్న తన పొలంలో డ్రోన్తో మందును పిచికారీ చేయించారు. జిల్లా రైతులంతా ఈ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట -
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రేమికుల మృతి
సాక్షి, నల్లగొండ: రెండేళ్లుగా ప్రేమించుకున్న ప్రేమికులు విడిపోయి ఉండలేక మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది. ట్రైనీ ఎస్ఐ శోభన్బాబు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొం డ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలం తెట్టెకుంటకు చెందిన మట్టిపల్లి దుర్గయ్య, సాలమ్మ దంపతులకు నలుగురు సంతానం. అందులో మొదటివాడు మట్టిపల్లి కొండలు (22) హాలియాలోని ఓ వస్త్ర దుకాణంలో పని చేసేవాడు. అదే గ్రామానికి చెందిన ఉగ్గిరి నాగయ్య, సైదమ్మ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తె ఉగ్గిరి సంధ్య(20) ఇంటర్మీడియెట్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. కొండలు, సంధ్య రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సంధ్యకు పీఏ పల్లి మండలం ఘనపురం గ్రామానికి చెందిన మేనత్త కుమారుడితో ఈ నెల 22న నిశ్చితార్థం కాగా. వచ్చేనెల 11న పెళ్లి జరగాల్సి ఉంది. ఉరివేసుకుందామని భావించి.. 22వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో సంధ్య.. కొండలు ఇంటికి వచ్చింది. ఇద్దరూ కలిసి నూడుల్స్ తిన్నారు. ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుని ఇంట్లో ఉరివేసుకునేందుకు ఫ్యాన్కు చీర కట్టారు. ఫ్యాన్ సరిగ్గా లేదని తెలుసుకుని ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగారు. కాసేపటి తర్వాత సంధ్య వాళ్ల ఇంటికి వెళ్లి వాంతులు చేసుకోవడాన్ని వాళ్ల నాన్నమ్మ గమనించి పురుగుల మందు తాగినట్లు తెలుసుకుంది. కొండలు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికులు ఇద్దరినీ హాలియాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నల్లగొండ ఆస్పత్రికి తరలించారు. కొండలును కుటుంబ సభ్యులు నాగార్జునసాగర్ కమలా నెహ్రూ ఆస్పత్రికి తీసుకొచ్చారు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో కొండలు మృతి చెందాడు. కొద్దిసేపటికే నల్లగొండ ఆస్పత్రిలో సంధ్య కూడా మృతి చెందింది. ఇద్దరి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కొడుకు బాధ నుంచి తేరుకోకముందే.. సంధ్య సోదరుడు వెంకటేశ్వర్లు ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందా డు. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేక పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ దంపతులకు కూతురూ దూరమై మరింత కడుపుకోతను మిగిల్చింది. ‘ఏడాదిలోనే ఇద్దరు బిడ్డలను పోగొట్టుకున్న నాదేమి రాత రా దేవుడా’అంటూ ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు అక్కడివారిని కంటతడి పెట్టించింది. చదవండి: డ్రైవర్ నిర్లక్ష్యంతో ఏకంగా కుటుంబమే.. -
ప్రకృతి సాగులో పరిశోధనలు
సాక్షి, అమరావతి: పురుగు మందులు, రసాయనాలతో సేద్యం కారణంగా ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. పురుగు మందులు, రసాయనాల వాడకాన్ని తగ్గించి, ప్రకృతి సేద్యంతో ప్రజలకు మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం రాష్ట్రంలో ఉద్యమ రూపంలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తోంది. సామూహిక ప్రకృతి వ్యవసాయ నిర్వహణ ప్రాజెక్టు (ఏపీ కమ్యూనిటీ మేనేజ్మెంట్ నేచురల్ ఫామింగ్ – ఏపీసీఎన్ఎఫ్) కింద ఇప్పటికే రాష్ట్రంలో 3,730 పంచాయతీల్లో 4.78 లక్షల మంది రైతులు 5.06 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యాన్ని చేపట్టారు. ప్రకృతి సాగుపై లోతైన పరిశోధనలు, పంటల సర్టిఫికేషన్కు వైఎస్సార్ జిల్లా పులివెందులలో అంతర్జాతీయ స్థాయి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తోంది. జర్మనీ ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేస్తోన్న ఈ కేంద్రం కోసం సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు సిద్దమవుతోంది. 2031 నాటికి ప్రకృతి సేద్యంలో 60 లక్షల మంది రైతులు రాష్ట్రంలో ప్రకృతి సాగు కోసం జర్మన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థిక చేయూతనిస్తోంది. 2031 నాటికి కనీసం 60 లక్షల మంది రైతులను ప్రకృతి సేద్యం వైపు మళ్లించడమే లక్ష్యంగా ఏపీసీఎన్ఎఫ్–కేఎఫ్డబ్ల్యూ (జర్మన్ బ్యాంకు) ప్రాజెక్టు కింద జర్మన్ ప్రభుత్వం రూ.785.90 కోట్లు (90 మిలియన్ యూరోలు) గ్రాంట్తో కూడిన ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. గతేడాది ఏప్రిల్లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు 719 పంచాయతీల్లో ఐదేళ్ల (2020–25) పాటు అమలవుతుంది. తాజాగా విస్తృత స్థాయి పరిశోధనల కోసం ఇండో–జర్మన్ గ్లోబల్ సెంటర్ ఫర్ అగ్రోకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ సెంటర్ (ఐజీజీసీఏఆర్ఎల్) ఏర్పాటుకు జర్మనీ ముందుకొచ్చింది. ఇందుకోసం రూ.174 కోట్లు (20 మిలియన్ యూరోలు) గ్రాంట్ ఇస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ‘ప్రకృతి సాగు’పై పరిశోధనలకు ఏర్పాటవుతోన్న తొలి పరిశోధన కేంద్రం ఇదే. ఈ ప్రతిష్టాత్మక పరిశోధన కేంద్రానికి 60 ఎకరాల భూమితోపాటు భవనాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. అంతర్జాతీయ స్థాయిలో కేఎఫ్డబ్ల్యూ, వరల్డ్ ఆగ్రో ఫారెస్ట్రీ సెంటర్ (ఐసీఆర్ఏఎఫ్), ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ), అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (సీఐఆర్ ఏడీ), జీఐజెడ్లు భాగస్వాములవు తుండగా, కేంద్ర వ్యవసాయ శాఖతో పాటు నీతి ఆయోగ్, భారత వ్యవసాయ పరిశోధనా కేంద్రం (ఐసీఏఆర్), రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర వ్యవసాయశాఖతో పాటు రైతుసాధికార సంస్థ, వ్యవసాయ వర్సిటీలు భాగస్వాములు కాబోతున్నాయి. పరిశోధన కేంద్రం లక్ష్యాలు.. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, ప్రజలకు ఆరోగ్య భద్రతను కల్పిస్తూ గ్రామీణ జీవనోపాధిని మెరుగుపర్చడమే లక్ష్యంగా అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా ఇక్కడ శాస్త్రీయ పరిశోధనలు జరుగుతాయి. వాటి ఫలితాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి రైతులు, వినియోగదారులకు ఉపయోగపడేలా వ్యవసాయ శాస్త్ర నైపుణ్యాలను, పరిజ్ఞానాన్ని పెంపొందిస్తారు. రానున్న ఐదేళ్లలో ఏపీతోపాటు దేశంలోని మరో ఐదు రాష్ట్రాల్లో ప్రకృతి సాగును ప్రోత్సహించి, కనీసం 10 వేల మంది రైతులను శాస్త్రవేత్తలుగా మారుస్తారు. వెయ్యిమంది సాంకేతిక నిపుణులను తయారు చేయడం, లక్ష మందిని సర్టిఫైడ్ చాంపియన్ అభ్యాసకులుగా తీర్చిదిద్దడం ఈ కేంద్రం లక్ష్యాలు. పరిశోధనలను ఏప్రిల్లో ప్రారంభిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రపంచ దేశాలకు దిక్సూచిలా పరిశోధన కేంద్రం మన రాష్ట్రంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సేద్యానికి ఆర్థిక చేయూతనిస్తోన్న జర్మనీ ప్రభుత్వం ఇక్కడ అంతర్జాతీయ స్థాయి పరిశోధన, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. నవంబర్ నెలాఖరుకల్లా జర్మనీ ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తుందని భావిస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు 2021–27 వరకు ఈ జర్మనీ సహకారమందిస్తుంది. ఇక్కడ జరిగే పరిశోధనలు ప్రకృతి సాగులో దేశానికే కాదు ప్రపంచ దేశాలకు కూడా దిక్సూచీగా మారనున్నాయి. – టి.విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఏపీ రైతు సాధికార సంస్థ -
ఆర్గానిక్ సాగుతో శ్రీలంక కొత్త చరిత్ర
రసాయనిక ఎరువులు, పురుగుమందుల దిగుమతులను నిషేధించడం ద్వారా శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే పర్యావరణ హితమైన ఆహారోత్పత్తులు, ఆర్గానిక్ సాగుపై విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. రసాయనిక ఎరువులను, పెస్టిసైడ్స్ని నిషేధించిన మొట్టమొదటి దేశం శ్రీలంక. తమ ప్రయోజనాలకు గండి పడుతోందన్న విషయం గ్రహించిన అంతర్జాతీయ వాణిజ్య వ్యవసాయ సంస్థలు... ఆర్గానిక్ ఉత్పత్తుల వల్లే శ్రీలంకలో ఆహార సంక్షోభం ఏర్పడిందంటూ ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ అంతర్జాతీయంగా ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో శ్రీలంక తప్పకుండా లబ్ధి పొందుతుంది. తన పంటలకు ఆర్గానిక్ ట్యాగ్ ద్వారా ప్రపంచ మార్కెట్లో శ్రీలంక ప్రభంజనం సృష్టించగలదు. రసాయనిక ఎరువులు, పురుగుమందులను సంపూర్ణంగా నిషేధిస్తూ ఆర్గానిక్ ఆహారోత్పత్తుల వైపు అడుగు వేస్తూ శ్రీలంక తీసుకున్న విప్లవాత్మక నిర్ణయానికి వ్యతిరేకంగా ఊహించినట్లే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్గానిక్ పంటలపై అవే వాదనలు, అవే మానసిక భయాలు, ప్రపంచాన్ని తిరోగమనం పాలుచేసిన నకిలీ సైద్ధాంతిక ఆలోచనలు! ప్రపంచ వ్యవసాయ వాణిజ్య దిగ్గజాల సాధికారిక సమతుల్యతను ఎవరైనా విచ్ఛిన్నపరుస్తున్నారని పసిగడితే చాలు.. పదేపదే వారికి వ్యతిరేకంగా నిరసనలు, వ్యతిరేకతల రొద మిన్నుముట్టడం మనకు తెలిసిందే. ఆరోగ్యకరమైన, మరింత నిలకడైన, న్యాయబద్ధమైన ఆహార వ్యవస్థల వైపు వెళ్లవలసిన అవసరాన్ని ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవస్థల సదస్సు ఇంకా గుర్తించకముందే, కొన్ని నెలల క్రితం శ్రీలంక సాహసోపేతమైన చర్యకు శ్రీకారం చుట్టింది. రసాయనిక ఎరువులు, పురుగుమందుల దిగుమతులను నిషేధించడం ద్వారా వ్యవసాయ పర్యావరణ పరివర్తన అనే భావనను ఎంతోముందుగా ఆచరణలోకి తెచ్చింది. మే 6న దేశాధ్యక్షుడి అధికార ప్రకటన ద్వారా ఆర్గానిక్ ఆహార ఉత్పత్తుల వైపు తొలి అడుగు వేసిన దేశంగా శ్రీలంక చరిత్రకెక్కింది. అంతకుముందు పామ్ ఆయిల్ దిగుమతులపై నిషేధం విధించి, ఇప్పటికే సాగు చేస్తున్న పామాయిల్ తోటలను దశలవారీగా తొలగించాలని ఆదేశాలు జారీచేసి ఆరోగ్యకరమైన, స్థిరమైన భవిష్యత్తు వైపు గొప్ప నిబద్ధతను ప్రదర్శించింది. సెప్టెంబర్ 22న న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే మాట్లాడుతూ, శ్రీలంక జాతీయ విధాన చట్రంలో స్వావలంబన ఒక మైలురాయిగా అభివర్ణించారు. నేల ఫలదీకరణ, జీవ వైవిధ్యం, జల మార్గాలు, ఆరోగ్యం వంటివాటిపై ప్రభావం కారణంగా తమ ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రారంభంలోనే రసాయనిక ఎరువులు, పురుగుమందుల ఉపయోగాన్ని నిషేధించిందని పేర్కొన్నారు. శ్రీలంక భారీ స్థాయిలో విదేశీ రుణ ఊబిలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ప్రభుత్వ రాబడిలో 80 శాతం విదేశీ అప్పులు తీర్చడానికే వెచ్చించాల్సి వస్తోంది. అదే సమయంలో స్వదేశంలో తీవ్రమైన ఆహార పదార్థాల కొరతను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆర్గానిక్ వ్యవసాయం చేబడితే ఆహార పదార్థాల ఉత్పత్తి తగ్గిపోయి ఆహార సంక్షోభం ఏర్పడక తప్పదంటూ నడుస్తున్న విష ప్రచారానికి వ్యతిరేకంగా శ్రీలంక అధ్యక్షుడు తన నిర్ణయానికి గట్టిగా కట్టుబడి ఉన్నారు. 1980లలో ఇండోనేషియా అధ్యక్షులు సుహార్తో ఒక్క కలం పోటుతో, వరి సాగుకు ఉపయోగిస్తున్న 57 రసాయనిక పురుగుమందులపై నిషేధం విధించినప్పుడు కొద్ది రోజులలోపే ఆయనపై పెట్టిన తీవ్ర ఒత్తిడి ఈ సందర్భంగా నాకు మళ్లీ గుర్తుకొచ్చింది. నిజానికి మే నెల ప్రారంభంలోనే శ్రీలంకలో రసాయనిక ఎరువులు, పురుగు మందులపై నిషేధం అమలులోకి వచ్చింది. అప్పటినుంచి ఒక పంట సీజన్ మాత్రమే పూర్తయింది. ఆ సీజన్లో వరినాట్లు మేలో మొదలై ఆగస్టులో పంటకోతలు పూర్తయ్యాయి. అయితే పంట ఇంకా మార్కెట్లోకి రాకముందే శ్రీలంకలో పంట దిగుబడులు తగ్గిపోయాయనే భయాందోళనలను వ్యాపింపజేయడానికి రసాయనిక ఎరువులు, పురుగుమందుల లాబీ పూనుకుంది. సాధారణంగా రసాయనిక ఎరువులను ఉపయోగించడం నిలిపివేశాక రెండు లేక మూడో సంవత్సరం వరకు మాత్రమే పంట దిగుబడులు కాస్త తగ్గుముఖం పట్టి నెమ్మదిగా మళ్లీ పెరగటాన్ని మనం చూస్తాం. రసాయన ఎరువులు, పురుగుమందులతో సాగే వ్యవసాయం కారణంగా సంభవించే దుష్ఫలితాలు సమాజం తప్పనిసరిగా చెల్లించవలసిన మూల్యంగా భావిస్తుంటారు. మరోమాటలో చెప్పాలంటే ఉత్తర శ్రీలంకలో వరి అధికంగా పండే ప్రాంతంలో, గ్రామీణ పేదల్లో మూత్ర పిండాలు భారీ స్థాయిలో విఫలం కావడానికి రసాయనిక ఎరువులు, పురుగుమందులను మోతాదుకు మించి వాడటమేనని ఎక్కువమంది నమ్ముతున్నారు. కానీ మూత్రపిండాల వైఫల్యానికి, రసాయనిక ఎరువుల వాడకానికి మధ్య ఉన్న లింకును పలువురు నిపుణులు పరిగణనలోకి తీసుకోవడం లేదు. శ్రీలంకలో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి కారణంగా 20 వేలకంటే ఎక్కువమంది చనిపోయారనీ, గత 20 ఏళ్లుగా 4 లక్షలమంది వ్యాధిగ్రస్తులయ్యారనీ ‘ది ఇండిపెండెంట్’ నివేదిక చెబుతోంది. దేశంలో రెండో అతిపెద్ద ఎగుమతి సరుకైన తేయాకు విషయాన్ని పరిశీలిస్తే, అనవసరమైన పుకార్లు, భయాలను వ్యాప్తి చేశారు. నిజానికి తేయాకు దిగుబడులు శ్రీలంకలో చాలా తక్కువగానే ఉన్నాయి. కానీ గత దశాబ్దికాలంలో తేయాకు పంట దిగుబడి నిరంతరం తగ్గుముఖం పడుతూనే వస్తోంది. చాలా ప్రాంతాల్లో ఎకరాకు 350 నుంచి 400 కేజీలకు తేయాకు పంట పడిపోగా, కొన్ని సందర్భాల్లో ఎకరాకు 150 కేజీల తేయాకు పంట మాత్రమే సాధ్యమయింది. దేశంలో తేయాకు పంట దిగుబడులు తగ్గడానికి ప్రధాన కారణాల్లో నేల కోత ఒకటి. ఈ నేపథ్యంలో పూర్తిగా ఆర్గానిక్ సాగుకు మళ్లితే దాని ప్రయోజనం రాబోయే సంవత్సరాల్లో మాత్రమే కనిపిస్తుంది. వ్యవసాయ పర్యావరణానికి కట్టుబడటం ద్వారా శ్రీలంక నేల ఆరోగ్యాన్ని పరిరక్షించగలదు, తద్వారా తేయాకు తోటలను పునరుజ్జీవింప చేయగలదు. తన పంటలకు ఆర్గానిక్ ట్యాగ్ ద్వారా ప్రపంచ మార్కెట్లో శ్రీలంక ప్రభంజనం సృష్టించగలదు. అంతర్జాతీయంగా ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆర్గానిక్ సాగు చేపడుతున్న మొదటి దేశంగా శ్రీలంక తప్పకుండా లబ్ధి పొందే స్థానంలో ఉంటుంది. అయితే ఈ పరివర్తనకు మార్గదర్శకం చేయడానికి శ్రీలంక సరైన చర్యలు చేపట్టవలసి ఉంది. ప్రస్తుతం శ్రీలంక ముందున్న సవాల్ ఏమిటంటే, తన పరిశోధన, అభివృద్ధి, పంటల పట్ల వైఖరిని సరికొత్తగా రూపొందించుకోవడమే. ఇందుకోసం విద్యాపరమైన కరిక్యులమ్ని మార్చడం ద్వారా జాతీయ వ్యవసాయ పరిశోధనా కార్యక్రమాలకు కొత్త రూపం ఇవ్వాల్సి ఉంది. వ్యవసాయ పరిశోధన కూడా కమ్యూనిటీ జ్ఞానాన్ని, ఆయా సామాజిక బృందాల సృజనాత్మక ఆవిష్కరణలను నిర్ధారించి, పరిరక్షించడంపై దృష్టి సారించాల్సి ఉంది. ప్రత్యేకించి పర్యావరణ మార్పులోని సంక్లిష్టతలను పరిష్కరించడం, సాంప్రదాయిక పంటల రకాలను, లభ్యమవుతున్న సుసంపన్నమైన వైవిధ్యతలను పరిరక్షించగలిగితే అది మొత్తం వ్యవసాయానికి గట్టి స్థిరత్వాన్ని తెచ్చిపెడుతుంది. మరీ ముఖ్యంగా ఆర్గానిక్ సాగు ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయాల్సి ఉంది. బలవంతంగా ఆర్గానిక్ వ్యవసాయం వైపు మళ్లాలని రైతులను బలవంతపెడితే దీర్ఘకాలంలో అది పెద్దగా పనిచేయదు. వ్యవసాయ పర్యావరణం, ఆర్గానిక్, సహజ, జీవవైవిధ్యతతో కూడిన వ్యవసాయ వ్యవస్థలు ప్రపంచం మొత్తానికి ఆహారాన్ని అందించగలవా అని చాలామందికి సందేహాలు పుట్టుకొస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ అత్యున్నత స్థాయి నిపుణుల ప్యానెల్ 2019లో వెలువరించిన ఒక నివేదిక వీటికి పరిష్కార మార్గాలను సూచించింది. వ్యవసాయ పర్యావరణ హితంతో కూడిన సాగు వ్యవస్థలు తీసుకొచ్చే ఆర్థిక ప్రయోజనాలను గురించి ఈ ప్యానెల్ సవివరంగా పేర్కొంది. ప్రత్యేకించి రఫేల్ డి అన్నోల్పో 2017లో చేసిన ఒక విశ్లేషణ ప్రకారం 61 శాతం కేసుల్లో ఆర్గానిక్ వ్యవసాయ దిగుబడులు పెరిగినట్లు, 20 కేసుల్లో మాత్రమే ఈ దిగుబడులు తగ్గుముఖం పట్టినట్లు తేటతెల్లమైంది. కాగా 66 శాతం కేసుల్లో ఆర్గానిక్ సాగు లాభదాయకత పెరిగిందని కూడా తెలిపింది. కాబట్టి ఆర్గానిక్ సాగు చేపట్టడానికి కావలిసింది సాహసం మాత్రమే. దేన్నయినా నమ్మినప్పుడు మాత్రమే దాని ప్రయోజనాలు సిద్ధిస్తాయి. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ఆర్గానిక్ సాగు పట్ల నిబద్ధత కలిగి ఉండటం అనేది అంతర్జాతీయంగానే వ్యవసాయ భవిష్యత్తుకు తలుపులు తెరిచే అవకాశం ఉంది. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహారం, వ్యవసాయరంగ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
హానికరమైన 27 క్రిమీ సంహారక మందులు నిషేధం
న్యూఢిల్లీ: మనుషులు, జంతువులకు హానికరంగా పరిగణిస్తున్న 27 క్రిమి సంహారక మందుల తయారీ, వినియోగంపై నిషేధం విధించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబు ఇచ్చారు. డాక్టర్ అనుపమ్ వర్మ నేతృత్వంలోని నిపుణుల సంఘం 66 కీటక నాశక మందులు కలిగించే దుష్ప్రభావాలను సమీక్షించిన అనంతరం 12 క్రిమి సంహారక మందులను పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. మరో 6 క్రిమిసంహారక మందులను క్రమంగా వినియోగం నుంచి తొలగించిందని మంత్రి తోమర్ తెలిపారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 46 క్రిమిసంహారక మందులను నిషేధించడమో లేదా వినియోగం నుంచి తొలగించడమే చేసిందని వివరించారు. 4 క్రిమిసంహారక మందుల ఫార్ములేషన్స్ను దిగుమతి, తయారీ, విక్రయాల నుంచి నిషేధించామని, నిషేధించిన 5 క్రిమిసంహారక మందులను కేవలం ఎగుమతి చేయడానికి తయారీకి అనుమతించినట్లు గుర్తుచేశారు. మరో 8 క్రిమిసంహారక మందుల తయారీకి అనుమతించిన రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు మంత్రి వెల్లడించారు. డీడీటీని మాత్రం ప్రజారోగ్య కార్యక్రమాల కోసం వినియోగించేందుకు అనుమతిస్తున్నట్లు మంత్రి నరేంద్రసింగ్ స్పష్టం చేశారు. తెలిపారు. క్రిమిసంహారక మందులు విషతుల్యమే అయినప్పటికీ నిర్దేశించిన రీతిలో వాటి వినియోగంతో పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. క్రిమిసంహారక మందుల భద్రత, సామర్ధ్యం వంటి అంశాలపై నిరంతరం జరిగే అధ్యయనాలు, నివేదికలు, సమాచారం ఆధారంగా నిపుణులు తరచు సమీక్షలు నిర్వహించి ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంటాయని మంత్రి చెప్పారు. -
రైతులకు వెన్నుదన్నుగా అగ్రిల్యాబ్లు
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం కేంద్రంగా నిర్వహిస్తున్న ఎరువులు, విత్తన, పురుగుమందుల పరీక్షా కేంద్రాలు రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తూ నాలుగు దశాబ్దాలుగా విశేష సేవలందిస్తున్నాయి. అధునాతన పరిజ్ఞానంతో పరీక్ష ఫలితాలను సకాలంలో రైతులకు అందిస్తూ నాణ్యమైన ఉత్పత్తులను పండించేందుకు ఎంతో దోహపడుతున్నాయి. ఇక్కడి సెంట్రల్ ల్యాబ్ ద్వారా నియోజకవర్గాల్లో అగ్రిల్యాబ్ సిబ్బందికి సైతం నైపుణ్యంలో శిక్షణ అందిస్తూ రైతు సేవలో తరిస్తున్నాయి. తాడేపల్లిగూడెం: భూమాతను నమ్ముకుని హలం పట్టి పొలం దున్ని స్వేదం చిందించి పుడమితల్లి ధాన్యపు రాశులతో, పంటలతో విరాజిల్లడానికి కృషి చేసే రైతులకు విత్తనం నుంచి సాంకేతిక పరిజ్ఞానం వరకు అందించడానికి రైతు భరోసా కేంద్రాలు దివిటీలుగా మారాయి. ఆర్బీకేలు, అగ్రిల్యాబ్లు వ్యవసాయంలో వినూత్న మార్పులకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుడుతుండటంతో వ్యవసాయం పండుగగా మారింది. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా తాడేపల్లిగూడెంలో ఎరువులు, పురుగుమందులు, విత్తన పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలోని నియోజకవర్గాలలో ఏర్పాటు చేసే అగ్రిల్యాబ్లలో పనిచేసే సిబ్బందికి నైపుణ్య శిక్షణ, సాంకేతిక మార్గదర్శనం సైతం గూడెంలోని సెంట్రల్ ల్యాబ్ ద్వారా అందుతోంది. ఈ ల్యాబ్ల ద్వారా అందుతున్న సేవలు ఇలా ఉన్నాయి. ఆరు జిల్లాలకు విత్తన పరీక్షలు ధాన్యం, కూరగాయలు, అపరాల వంగడాలలో మొలకశాతాన్ని విశ్లేషించి ఫలితాలను రైతులకు అందజేయడానికి తాడేపల్లిగూడెంలో 1972లో విత్తన పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వరి, మొక్కజొన్న, వేరుశనగ, కూరగాయలు, అపరాలు, పొద్దుతిరుగుడు వంటి విత్తనాలలో మొలకశాతాన్ని విశ్లేషించి నాణ్యతను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ ద్వారా కర్నూలు, ప్రకాశం, కడప, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రైతులకు సేవలందిస్తున్నారు. వ్యవసాయాధికారులు, ఏడీఏల ద్వారా వంగడాల శాంపిల్స్ ఇక్కడకు వస్తాయి. వాటిలో మొలకశాతాలను వివిధ దశల్లో పరీక్షల ద్వారా నిర్థారించి ఫలితాలను 30 రోజుల వ్యవధిలో పంపిస్తారు. శీతలీకరణ పద్ధతుల్లో విత్తనాలను భద్రపర్చి తర్వాత మొలకశాతాలను పరిశీలిస్తారు. రాష్ట్రంలోని మూడింటిలో ఒకటి 1979 ఫిబ్రవరి 17న ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ ద్వారా ఎరువుల పరీక్ష కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఇటువంటి కేంద్రాలు మొత్తం మూడు ఉండగా, ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయగా, మిగిలినవి అనంతపురం, బాపట్లలో ఉన్నాయి. వీటిని లీగల్ ల్యాబ్స్ అని కూడా అంటారు. అగ్రిల్యాబ్లలో పనిచేసే సిబ్బందికి, సాంకేతికపరమైన శిక్షణ ఈ ల్యాబ్ ద్వారా ఇచ్చారు. ఎరువులలో కల్తీ, నాణ్యత పరిశీలనకు నమూనాలను ఇక్కడకు పంపిస్తారు. గుంటూరులో కోడింగ్ సెంటర్కు ఈ నమూనాలు చేరితే, అక్కడి నుంచి ఇక్కడి పరీక్ష కేంద్రానికి పంపిస్తున్నారు. గతంలో 60 రోజుల్లో ఫలితాలను వెల్లడించాల్సి ఉండగా, ప్రస్తుతం అధునాతన పరీక్ష యంత్రాలు అందుబాటులోకి రావడంతో 2018 నుంచి 15 రోజుల్లోనే ఫలితాలను తేల్చేస్తున్నారు. ఫరీదాబాద్లోని సెంట్రల్ ఫెర్టిలైజర్ క్వాలిటీ కంట్రోల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ పొందిన నిపుణులు ఈ ల్యాబ్లో సేవలందిస్తున్నారు. ప్రమాణాలకు తగ్గట్టుగా పురుగుమందు పరీక్షలు 1984 మే రెండో తేదీన ఇక్కడ పురుగుమందుల పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇవి దేశవ్యాప్తంగా 68 ఉండగా, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏడు ల్యాబ్లుండగా, రాష్ట్ర విభజనలో రెండు వరంగల్, రాజేంద్రనగర్ ల్యాబ్లు తెలంగాణలోకి వెళ్లాయి. మిగిలిన ఐదు ల్యాబ్లు రాష్ట్రానికి దక్కాయి. వాటిలో ఒకటి తాడేపల్లిగూడెం ల్యాబ్ కాగా, గుంటూరు అనంతపురం, కర్నూలు, విశాఖపట్టణాలలో ల్యాబ్లు ఉన్నాయి. పురుగుమందుల్లో మూల పదార్థం స్థాయి ప్రమాణాల పరిమితికి అనుకూలంగా ఉందో లేదా అనేది ఈ పరీక్ష కేంద్రాల్లో నిర్ధారిస్తారు. గుంటూరులో ఉన్న కోడింగ్ సెంటర్కు తిరిగి ఫలితాలను పంపిస్తారు. పురుగుమందుల్లో క్రియాశీల పదార్థా శాతాన్ని పరీక్షిస్తారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా నమూనాలు ఉన్నాయో లేవో పరిశీలిస్తారు. సిబ్బందికి శిక్షణ ఇచ్చాం జిల్లాలో ఏర్పాటుచేసే అగ్రిల్యాబ్ లలో పనిచేసే సిబ్బందికి సాంకేతికపరమైన శిక్షణ ఇచ్చాం. సెంట్రల్ యాక్టు ద్వారా ఏర్పాటైన ఈ ల్యాబ్లో పరిశోధనా పద్ధతులు, ఇతర విషయాలపై ఉన్నతాధికారుల ఆదేశాలతో వచ్చిన వారికి పరిపూర్ణమైన శిక్షణ ఇచ్చాం. – జె.శశిబిందు, ఏడీఏ, ఎరువుల పరిశోధన, సెంట్రల్ ల్యాబ్, తాడేపల్లిగూడెం -
పెండలం ఆకులతో పురుగుమందులు
కర్ర పెండలం దుంపల్లో చాలా పోషకాలుంటాయని మనకు తెలుసు. అయితే, కర్రపెండలం మొక్కల ఆకులతో చక్కని సేంద్రియ పురుగు మందులను తయారు చేయవచ్చని డా. సి. ఎ. జయప్రకాశ్ నిరూపించడంతోపాటు పేటెంటు సైతం పొందారు. కేరళలోని శ్రేకరియంలో గల కేంద్రీయ దుంప పంటల పరిశోధనా సంస్థ (సిటిసిఆర్ఐ) లో ఆయన ప్రధాన శాస్త్రవేత్తగా విశేష పరిశోధనలు చేస్తున్నారు. కర్రపెండలం ఆకులను తిన్న పశువులు చనిపోతాయి. వీటిలో వుండే శ్యానోజన్ అనే రసాయన సమ్మేళనం విషతుల్యమైనది కావటమే ఇందుకు కారణం. ఇది గ్రహించిన డా. జయప్రకాశ్ 13 ఏళ్ల క్రితం పరిశోధనలు ప్రారంభించారు. విశేష కృషి చేసి విజయం సాధించారు. శ్యానోజన్ సమ్మేళనాన్ని ఆకుల్లో నుంచి వెలికితీయడం కోసం తొలుత ఒక యంత్రాన్ని కనుగొన్నారు. ఇందుకోసం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సాయం తీసుకున్నారు. అనేక ఏళ్లు పరిశోధన చేసి ఎట్టకేలకు నన్మ, మెన్మ, శ్రేయ అనే మూడు రకాల సేంద్రియ పురుగుమందులను తయారు చేశారు. ఒక కిలో కర్రపెండలం ఆకులతో ప్రత్యేక యంత్రం ద్వారా 8 లీటర్ల సేంద్రియ పురుగుమందు తయారు చేయవచ్చని డా. జయప్రకాశ్ తెలిపారు. నన్మ, మెన్మ, శ్రేయ సేంద్రియ పురుగుమందులు ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు తీవ్రనష్టం కలిగిస్తున్న పురుగులను అరికడతాయి. అరటిలో సూడోస్టెమ్ వీవిల్, కొబ్బరిలో రెడ్పామ్ వీవిల్తో పాటు అనేక పండ్ల / కలప పంటల్లో కనిపించే కాండం తొలిచే పురుగులను ఈ సేంద్రియ పురుగుమందులు సమర్థవంతంగా అరికడతాయని డా. జయప్రకాశ్ ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. డీఆర్డీవో తోడ్పాటుతో ఈ పురుగుమందును వాయువు రూపంలోకి మార్చుతున్నారు. ఆహార గోదాముల్లో కనిపించే పురుగులను సమర్థవంతంగా ఈ వాయు రూపంలోని సేంద్రియ పురుగుమందు అరికడుతుందట. లైసెన్స్ ఫీజు చెల్లించే ప్రభుత్వ/ప్రైవేటు సంస్థలకు ఈ పురుగుమందుల తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని సిటిసిఆర్ఐ సంచాలకులు డాక్టర్ షీల ప్రకటించారు. కర్రపెండలం ఆకుల రసం తో లీటరు పురుగుమందు తయారు చేయడానికి కేవలం రూ. 20 మాత్రమే ఖర్చవుతుందట. ఈ పురుగుమందులు ఆకులతో తయారు చేసినవి కావటం వల్ల రసాయన పురుగుమందులకు మల్లే పురుగులు వీటికి ఎప్పటికీ అలవాటుపడిపోవు. ప్రభుత్వ సంస్థలు ఇటువంటి చక్కని సేంద్రియ పురుగుమందులను స్వయంగా తయారు చేయించి రైతులకు సరసమైన ధరకు అందిస్తే ఎంతో మేలు జరుగుతుంది. వివరాలకు.. సిటిసిఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్త డా. జయప్రకాశ్ను ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు: prakashcaj@gmail.com డా. సి.ఎ.జయప్రకాశ్ -
ఎన్ఎఫ్ఎల్లో వాటా విక్రయం
న్యూఢిల్లీ: ఎరువుల రంగ పీఎస్యూ సంస్థ నేషనల్ ఫెర్టిలైజర్స్(ఎన్ఎఫ్ఎల్)లో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా 20 శాతం వాటాను అమ్మేందుకు సిద్ధపడుతోంది. దీనిలో భాగంగా ఓఎఫ్ఎస్ను నిర్వహించేందుకు మర్చంట్ బ్యాంకర్లను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల సంస్థలు మార్చి 2లోగా బిడ్స్ను దాఖలు చేయవలసి ఉంటుందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వాహక శాఖ(దీపమ్) తాజాగా పేర్కొంది. ఇందుకు నోటిఫికేషన్ను విడుదల చేసింది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం చూస్తే ఎన్ఎఫ్ఎల్లో 20 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 400 కోట్లు సమకూర్చుకునే వీలుంది. ఐపీఓకు ఇండియా పెస్టిసైడ్స్ నిధుల సమీకరణకు మరో సంస్థ సిద్ధమైంది. ఆగ్రో కెమికల్ టెక్నాలజీస్ కంపెనీ ఇండియా పెస్టిసైడ్స్ ఐపీఓ ద్వారా రూ.800 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు కోసం సెబీకి బుధవారం ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ.100 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను విడుదల చేయనుంది. అలాగే ఆఫర్ ఫర్ సేల్ ద్వారా కంపెనీ ప్రధాన ప్రమోటర్ అగర్వాల్తో పాటు ఇతర ప్రమోటర్లు రూ.700 కోట్ల షేర్లను విక్రయించునున్నట్లు కంపెనీ తెలిపింది. -
తూచ్... తూచ్: ట్రంప్
వాషింగ్టన్: కోవిడ్ –19 రోగులకు వ్యాధి నయం కావాలంటే క్రిమిసంహారక మందులు శరీరంలోకి ఎక్కించడమే మెరుగైన వైద్యమంటూ అసంబద్ధ వ్యాఖ్యలు చేసి, విమర్శలపాలైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన వ్యాఖ్యలు వ్యంగ్యోక్తులు మాత్రమేనంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. కరోనా వైరస్ను నాశనం చేయడానికి క్రిమిసంహారక రసాయనాలు రోగుల శరీరంలోకి ఎక్కించాలనీ, అలాగే అతినీలలోహిత కిరణాలను సైతం రోగుల్లోకి చొప్పించాలని వైద్యులకు సూచిస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. ట్రంప్ సొంత పార్టీనుంచి సైతం తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. -
విషాదం : ఆ సీసా గురించి మామకు తెలియక పోవడంతో..
సాక్షి, కాటారం/భూపాలపల్లి: కూతురు భర్త పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని అంత్యక్రియలకు హాజరైన మామ కార్యక్రమాలు ముగిశాక మద్యం తాగుదామని భావించాడు. అయితే పొరపాటున అల్లుడు పురుగు మందు కలుపుకొని తాగిన మద్యం సీసాలోని మందే తాగడంతో ఆయన కూడా కన్నుమూయడం ఆ కుటుంబంలో మరింత విషాదాన్ని నింపింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. జిల్లాలోని మల్హర్ మండలం పెద్దతూండ్లకు చెందిన పోలు రవి(45) చిన్న కుమార్తెను కాటారానికి చెందిన మద్ది నాగరాజు మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. అయితే, నాగరాజు అప్పుల బాధతో మద్యంలో పురుగు మందు కలుపుకుని ఈనెల 6న తాగాడు. చికిత్స పొందుతూ 7న మృతి చెందాడు. దీంతో రవి దంపతులు నాగరాజు అంత్యక్రియల కోసం కాటారానికి వచ్చారు. శుక్రవారం రాత్రి అంత్యక్రియలు ముగి శాక మద్యం బాటిల్ను తెచ్చుకుందామని వైన్స్కు వెళ్లే క్రమంలో నాగరాజు బెడ్రూంలో మద్యం సీసా కనిపించింది. అది సాధారణ మద్యమే అనుకున్న రవి తాగాడు. కానీ అదే సీసాలో నాగరాజు పురుగు మందు కలిపి తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియదు. దీంతో ఆ మందు తాగగానే రవి సైతం అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. కాగా, రవి, నాగరాజు మృతితో కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. -
చలికాలంలో ఇంటిపంటల రక్షణ ఇలా..!
శీతాకాలం చలి వాతావరణంలో ఉష్ణోగ్రత తక్కువగా, గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చే పురుగులు, వైరస్ తెగుళ్ల వ్యాప్తికి ఇది అనువైన కాలం. కుండీల్లో, పెరట్లో ఆకుకూరలు, టమాటా, చిక్కుడు, వంగ, మిరప, బీర, ఆనప తదితర పంటలు చీడపీడల బారిన పడకుండా చూసుకోవడానికి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. చీడపీడలు రానీయని టీకాలన్నమాట. జనవరి ఆఖరులో చలి తగ్గేవరకు వీటిని పాటించాలి. ► జీవామృతంను 1:10 పాళ్లలో నీటిలో కలిపి ప్రతి 10–15 రోజులకోసారి క్రమం తప్పకుండా పిచికారీ చేస్తుంటే పంటలు ఆరోగ్యంగా పెరుగుతాయి. చీడపీడలను తట్టుకునే శక్తి పెరుగుతుంది. ► ఆచ్ఛాదన (మల్చింగ్): కుండీలు, మడుల్లో కూరగాయ మొక్కలు/చెట్ల చుట్టూ గడ్డీ గాదంతో ఐదారు అంగుళాల మందాన ఆచ్ఛాదనగా వేస్తే మంచిది. ► ఇంటిపంటల్లో పెద్ద పురుగులు కనిపిస్తే వాటిని చేతితో ఏరేయడం ఉత్తమం. శీతాకాలంలో పంటలనాశించే కొన్ని పురుగులు: టమాటా, వంగ, ఆకుకూరలతోపాటు మందారం, చామంతి, గులాబీ వంటి పంటలపై పిండినల్లి(మీలీ బగ్), తామర పురుగు(త్రిప్స్) తరచూ కనిపిస్తుంటాయి. వీటితోపాటు పేనుబంక, దీపపు పురుగులు, తెల్లదోమ, ఎర్రనల్లి కూడా ఆశిస్తుంటాయి. పిండినల్లి: పిండినల్లి మొక్కలను ఆశించి రసం పీల్చుతుంటుంది. అందువల్ల మొక్క పెరుగుదల నిలిచిపోతుంది. ఇది సోకినప్పుడు పళ్లు తోముకునే బ్రష్ను ముంచి తుడిచేస్తే పోతుంది. కలబంద రసం లేదా వేపనూనె లేదా సబ్బు నీళ్లలో బ్రష్ను ముంచి తుడిచేయాలి. పేనుబంక: దీన్నే మసిపేను అని కూడా అంటారు. కంటికి కనిపించనంత చిన్న పేన్లు బంకవంటి తీపి పదార్థాన్ని విసర్జిస్తుంటాయి. ఈ తీపి కోసం చీమలు చేరతాయి. మొక్కల మీద చీమలు పారాడుతూ ఉంటే పేనుబంక లేదా పిండినల్లి సోకిందన్నమాటే. పచ్చదోమ: ఆకుపచ్చగా ఉండే చిన్న దోమలు ఆకుల నుంచి రసం పీల్చుతుంటాయి. పచ్చదోమ ఆకుల చివర్ల నుంచి పని మొదలు పెడతాయి. కాబట్టి ఇది సోకిన ఆకులు కొసల నుంచి లోపలి వరకు ఎండిపోతూ ఉంటాయి. బీర, ఆనప వంటి పెద్ద ఆకులుండే పంటలను పచ్చదోమ ఎక్కువగా ఆశిస్తూ దిగుబడిని తగ్గించేస్తాయి. తామర ‡పురుగు: తామర పురుగు సోకిన మిరప ఆకులకు పైముడత వస్తుంది. మిరప కాయలు వంకర్లు తిరుగుతాయి. వాటిపై చారలు ఏర్పడతాయి. దీన్ని గజ్జి తెగులు, తామర తెగులు అని కూడా అంటారు. బూడిద తెగులు: చల్లని వాతావరణంలో శిలీంద్రం వేగంగా వ్యాపించడం వల్ల బూడది తెగులు వస్తుంది. ఇది సోకిన పంటల ఆకులపై తెల్లని పొడి కనిపిస్తుంది. మిరప, వంగ, టమాటా, ఆకుకూరలపై ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. రసంపీల్చే పురుగులు: ముందుజాగ్రత్త పిచికారీలు రసం పీల్చే పురుగులు పంటల జోలికి రాకుండా ముందుగానే జాగ్రత్తపడడం ఉత్తమం. వేపాకు రసం లేదా వావిలి ఆకుల కషాయం లేదా వేప నూనె లేదా వేపపిండి కషాయంను (వీటిలో ఏదైనా ఒక దాన్ని గానీ లేదా ఒక దాని తర్వాత మరొక దాన్ని మార్చి మార్చి గానీ) ప్రతి 7–10 రోజులకోసారి పిచికారీ చేయాలి. వేపాకు రసం: పావు కిలో వేపాకులు రుబ్బి + 5 లీటర్ల నీటిలో కలిపి అదే రోజు పంటలపై చల్లాలి(10 కిలోల వేపాకులు రుబ్బి 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరంలో పంటలకు చల్లవచ్చు). వావిలి ఆకుల కషాయం: 2 లీటర్ల నీటిలో 350 గ్రాముల వావిలి ఆకులు వేసి 2 లేదా 3 పొంగులు వచ్చే వరకు మరిగించి.. చల్లార్చిన తర్వాత ఆ కషాయంలో 10 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేయాలి(5 కిలోల వావిలి ఆకుల కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపితే ఎకరానికి సరిపోతుంది). వేప నూనె: మార్కెట్లో దొరుకుతుంది. సీసాపై ముద్రించిన సాంద్రతకు తగిన మోతాదులో పిచికారీ చేయాలి. వేపకాయల పిండి రసం: 10 లీటర్ల నీటిలో అర కేజీ వేపకాయల పిండి(వేపగింజల పిండి 300 గ్రాములు చాలు)ని పల్చటి గుడ్డలో మూటగట్టి.. 4 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత మూటను నీటిలో నుంచి తీసి పిండాలి. ఇలా అనేకసార్లు ముంచుతూ తీస్తూ పిండాలి. అదే రోజు పిచికారీ చేయాలి లేదా రోజ్ క్యాన్ ద్వారా మొక్కలపై చల్లవచ్చు. ఈ కషాయాలు, రసాలను పిచికారీ చేసేముందు 10 లీటర్లకు 5 గ్రాముల(100 లీటర్లకు 200 గ్రాముల) సబ్బుపొడి లేదా కుంకుడు రసాన్ని కలపాలి. నూనె పూసిన ఎరలు: నూనె పూసిన ఎరలు(స్టిక్కీ ట్రాప్స్) వేలాడదీస్తే పురుగులను ఆకర్షించి నశింపజేస్తాయి. తామర పురుగులను ఆకర్షించడానికి తెలుపు, తెల్లదోమలను నీలం, పచ్చదోమలను పసుపుపచ్చ ఎరలను వాడాలి. టమాటా, వంగ, మిర్చి వంటి ప్రతి 20 కూరగాయ మొక్కలకు ఒక్కో రకం ఎరలను రెండేసి చొప్పున వేలాడదీయాలి. ఎరలను మార్కెట్లో కొనొచ్చు. లేదా ఆయా రంగుల డబ్బాలు లేదా ప్లాస్టిక్ షీట్లు ఉంటే వాటికి నూనె లేదా గ్రీజు రాసి వేలాడదీయవచ్చు. రసంపీల్చే పురుగుల తీవ్రత ఎక్కువగా ఉంటే? రసంపీల్చే పురుగులు ఇప్పటికే మొక్కలకు తీవ్రస్థాయిలో ఆశించి ఉంటే పైన పేర్కొన్న పిచికారీలు కొనసాగిస్తూనే.. తెల్లటి షేడ్నెట్ను మొక్కలపై గ్రీన్హౌస్ మాదిరిగా రక్షణగా ఏర్పాటు చేయాలి. ఇనుప తీగతో డోమ్ ఆకారం చేసి దానిపై తెల్లని షేడ్నెట్ చుట్టేస్తే సరి.? సేంద్రియ ఇంటిపంటల సాగుపై సికింద్రాబాద్ తార్నాక (రోడ్డు నంబర్ ఒకటి, బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర)లోని సుస్థిర వ్యవసాయ కేంద్రం కార్యాలయంలో కనీసం 10 మంది కోరితే వారాంతంలో శిక్షణ ఇస్తున్నారు. పుస్తకాలు, విత్తనాలు, వర్మీకంపోస్టు లభిస్తాయి. వివరాలకు.. డా. గడ్డం రాజశేఖర్ – 83329 45368 ∙సిఎస్ఎ కార్యాలయంపై టెర్రస్ గార్డెన్లో డా. రాజశేఖర్ ∙ఎల్లో స్టిక్కీ ట్రాప్ -
తినే పదార్థం అనుకుని పురుగు మందు తాగి..
హుస్నాబాద్ రూరల్: పంటలకు వాడే పురుగు మందు ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంది. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లి పంచాయతీ పరిధిలోని పిట్టలగూడెంలో బుధవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న తుమ్మల భాస్కర్ (12), కాలీయ రవీందర్ (11) అనే విద్యార్థులు సాయంత్రం పాఠశాల వదిలేసిన తర్వాత ఇంటికి వస్తున్న సమయంలో సమీపంలో ఉన్న పత్తి చేనుకు వెళ్లారు. వారికి అక్కడ కవర్లో కట్టిన పురుగు మందు బాటిల్స్ కనిపించాయి. వాటిలో ఉన్నది తినే పదార్థం అనుకొని పిల్లలిద్దరూ బాటిళ్లలో ఉన్న ద్రవం తాగి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చిన చిన్నారులు కళ్లు తిరిగిపడి పోవడంతో కుటుంబ సభ్యులు ఇద్దరినీ చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఒకరు మరణించగా మరొకరికి విషమంగా ఉందని వైద్యులు సిద్దిపేటకు పంపించారు. సిద్దిపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరో విద్యార్థి కూడా మరణించాడు. ఇద్దరు పిల్లలు మరణించడంతో పిట్టలగూడెంలో విషాదం నెలకొంది. అన్నా చెల్లెళ్ల కొడుకులు ఇద్దరూ ఒకేసారి మృతి చెందడంతో రెండు కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగిపోయాయి. -
నకిలీ..మకిలీ..!
సాక్షి, మిర్యాలగూడ : నకిలీ పురుగు మందుల వ్యాపారానికి మిర్యాలగూడ పట్టణం అడ్డాగా మారింది. వేల రూపాయలు వెచ్చించి పురుగు మందులు కొనుగోలు చేస్తున్న రైతులు తెగుళ్లు తగ్గకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. ఎరువుల ధరలు విపరీతంగా పెరగడంతో అప్పులు చేసి సాగు చేస్తున్న రైతులను నకిలీ పురుగు మందులు మరింత అఘాతంలోకి నెడుతున్నాయి. నాణ్యమైన మందులు కాకుండా ఎక్కువ శాతం లాభాలు వచ్చే వాటిని ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు రైతులకు మాయమాటలు చెప్పి విక్రయిస్తున్నారు. అంతే కాకుండా వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు రైతులకు తెగుళ్లపై అవగాన కల్పించి ఏ మందులు పిచికారీ చేయాలో తెలియజేయడం లేదు. దీంతో రైతులు ఫర్టిలైజర్ దుకాణ యజమాని చెప్పిన మందులను తీసుకెళ్లడంతో తెగుళ్లు అలాగే ఉంటున్నాయి. చివరికి రైతు జేబులు మాత్రం ఖాళీ అవుతున్నాయి. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టులో పరిధిలో వరి పంటలతో పాటు పత్తి సాగు చేస్తున్నారు. రైతులు ఎక్కువగా చీడ పీడలు ఆశిస్తే నేరుగా పురుగుమందుల దుకాణానికి వెళ్లి వారు చెప్పిన మందునే కొనుగోలు చేస్తున్నారు. వరి, పత్తి పంటలకు ప్రధానంగా వేరుకుళ్లు, ఆకుమచ్చ, ఆకు ముడత, తెల్లమచ్చ, తెల్లదోమ, లద్దెపురుగు, రసం పీల్చే పురుగు, ఎండు తెగుళ్లు సోకుతాయి. కానీ నకిలీ మందుల కారణంగా చీడపీడలు తగ్గకపోవడంతో రైతులు ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తోంది. బయో ఉత్పత్తులకు అడ్డాగా.. బయో కెమికల్స్ పేరుతో రైతులను మరింత మోసానికి గురి చేస్తున్నారు. బయో కెమికల్స్ను ఎక్కువగా పండ్ల తోటలకు ఎంతో ఉపయోగకరమని ఇటీవల ప్రచారం జోరుగా సాగింది. దీంతో వాటిని రైతులు విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. రైతుల ఆలోచనలను ఆసరాగా చేసుకున్న కొంత మంది నకిలీ బయోకెమికల్స్ను తయారు చేసి విక్రయిస్తున్నారు. గత ఏడాది మిర్యాలగూడలో 5.89 లక్షల విలువైన నకిలీ బయో ఉత్పత్తులను విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. నకిలీ పురుగుమందులు, బయో ఉత్పత్తుల్లో నకిలీ మందులు తయారు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు. కంపెనీ పేర్లతోనే మోసం వరి, పత్తి పంటలకు సోకే తెగుళ్ల నివారణకు ఎక్కువగా మోనోఎస్ఫేట్, ఫ్రైడ్, కాన్ఫిడార్, ట్రైజోపాస్, ప్రోగ్నోఫాన్, క్లోరిఫైరీఫాస్, ఫోరేట్ గుళికలు, ఫోర్జీ, త్రిజీ గుళికలు, పాస్పామిడాన్లు ఉపయోగిస్తారు. ఆయా కంపెనీల పేర్లతోనే రైతులు గుర్తించలేని విధంగా తయారు చేసి నకిలీ మందులను అంటగడుతున్నారు. ఫ్రైడ్ కంపెనీకి చెందిన ‘ఫేమ్’ అకుముడత నివారణ మందును అదే పేరుతో నకిలీది దిలావర్పూర్ గ్రామానికి చందిన రైతు రాజశేఖర్రెడ్డికి ఇటీవల విక్రయించారు. నకిలీ మందును విక్రయించినట్లుగా గుర్తించి రైతు, ఆ కంపెనీ ప్రతినిధులతో కలిసి వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో నకిలీ మందుల విక్రయం వెలుగులోకి వచ్చింది. బ్యాచ్ నంబర్లు లేకుండా ఇష్టానుసారంగా మందులు విక్రయిస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నకిలీ పురుగు మందులు విక్రయిస్తే చర్యలు నకిలీ పురుగు మందులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. ఇటీవల నకిలీ పురుగు మందులు విక్రయించినట్లుగా ఫిర్యాదు వచ్చింది. మిర్యాలగూడ పట్టణంలో పురుగు మందుల దుకాణాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాం. నకిలీ మందులు విక్రయిస్తున్నట్లుగా మా దృష్టికి వస్తే తనిఖీలు నిర్వహించి ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్, ఏఓ, మిర్యాలగూడ -
దస్తగిరి కుటుంబానికి దిక్కెవరు?
పంటల సాగుకు చేసిన అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబం దుర్భరమైన జీవితం గడుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకోవడంతో మృతుడి భార్య, నలుగురు పిల్లలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కర్నూలు జిల్లా సి.బెళగల్ మండల పరిధిలోని కంబదహాల్ గ్రామానికి చెందిన దస్తగిరి(40) అప్పుల బాధతో పొలంలో పురుగుల మందు తాగి 2016 సెప్టెంబర్ 12న మృతి చెందారు. ముగ్గురు కూతుళ్లను, ఒక కుమారిడిని పోషించుకునేందుకు అతని భార్య దానమ్మ తీవ్ర అవస్థలు పడుతున్నారు. దస్తగిరికి రెండెకరాల పొలముంది. దీనికి తోడు మరో ఐదెకరాలను ఎకరా రూ. 30 వేలకు కౌలుకు తీసుకుని 2014, 2015, 2016 సంవత్సరాలలో వ్యవసాయం చేశాడు. ఏడెకరాలలో పత్తి పంట సాగు చేశారు. పంటల సాగుకు ఏడాదికి రూ. లక్ష అప్పు చేసి పెట్టుబడి పెట్టారు. వచ్చిన అరకొర దిగుబడులతో రైతు దస్తగిరి కొంతమేర అప్పులు తీర్చుతూ వచ్చాడు. అయితే పంటల సాగు, ఇంటి నిర్మాణంకు, ఇద్దరు కూతుళ్ల వివాహానికి ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ. 3 లక్షలు అప్పు చేశాడు. అదేవిధంగా సి.బెళగల్ని బంగారు అంగళ్ళ దగ్గర రెండవ కూతురు లుదియాకు చెందిన రెండు తులాల బంగారాన్ని తాకట్టుపెట్టి రూ. 46 వేలు అప్పు తీసుకున్నాడు. తెలిసిన వారి దగ్గర, బంధువుల దగ్గర, గ్రామస్తుల దగ్గర పంటలకు, కుటుంబ పోషణకు దస్తగిరి రూ. 6 లక్షల వరకు అప్పులు చేశాడు. చేసిన అప్పలు ఎలా చెల్లించాలోనని మధనపడేవాడని భార్య దానమ్మ, కుమార్తెలు తెలిపారు. దానమ్మ కూలి పనులు చేసుకుంటూ నలుగురు పిల్లలను చదివించుకుంటూ జీవనం సాగిస్తోంది. కుమారుడు దీవనరాజు కోడుమూరులోని ఎస్సీ వసతి గృహంలో వదిలారు). అయితే రైతు చనిపోయి రెండేళ్లు పూర్తయినా కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. ప్రభుత్వం తమను కరుణించి పరిహారం అందజేసి తన కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితురాలు దానమ్మ కోరుతోంది. – బి.గోవిందు, సాక్షి రిపోర్టర్, సి.బెళగల్, కర్నూలు జిల్లా -
క్షామ నామ సంవత్సరం
వాని ఱెక్కల కష్టంబు లేనినాడు,సస్యరమ పండి పులకింప సంశయించు వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు భోజనము బెట్టు, వాడికి భుక్తిలేదు! – గుర్రం జాషువా సాక్షి, అమరావతి: 2018... రాష్ట్రంలో అన్నదాతల పాలిట క్షామ నామ సంవత్సరం. వ్యవసాయ రంగంలో ఈ ఏడాదంతా తిరోగమనమే తప్ప పురోగమనం జాడ లేదు. అన్నదాతకు అశ్రువులే మిగిలాయి. ప్రభుత్వ తప్పుడు విధానాలు, అతివృష్టి, అనావృష్టి, ప్రకృతి విపత్తులు, పెరిగిపోయిన పెట్టుబడులు, దక్కని గిట్టుబాటు ధరలు, పెట్రేగిపోతున్న దళారీ వ్యవస్థ, వారికే వత్తాసు పలికే అధికార వర్గం... వెరసి రైతన్నలు దారుణంగా మోసపోయారు. అన్నదాతల ఆత్మహత్యలతోనే 2018 మొదలైంది. రెయిన్ గన్లతో పంటలను కాపాడే, కరువులను జయించే, సముద్రాలను నియంత్రించగలిగే చంద్రబాబు పాలనలో రైతుల బలవన్మరణాల పరంపరకు అడ్డుకట్ట పడడం లేదు. మట్టి నుంచి మాణిక్యాలను పండించే రైతు నోట్లో ఈ ఏడాదీ మట్టే పడింది. 2018లో పండించిన ఆహార, ఉద్యాన పంటలకు కనీస మద్దతు ధరలు దక్కలేదు. ప్రధాన పంటలైన వరి, మొక్కజొన్న, మినుము, పెసర, శనగ, వేరుశనగ, పత్తి, చెరకు, పొగాకు.. దేనికీ ధర లేకుండా పోయింది. ఉద్యాన పంటలైన టమోటా మొదలు మామిడికి కూడా గిట్టుబాటు ధరలు రాలేదు. రాష్ట్రంలో అత్యధికంగా పండించే వరికి క్వింటాల్కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.1,750 కాగా, రైతుకు దక్కింది రూ.1100 నుంచి రూ.1350 మాత్రమే కావడం గమనార్హం. ఇక మిగిలిన పంటల పరిస్థితి చెప్పనక్కర్లేదు. లక్షలాది క్వింటాళ్ల శనగలు కొనేవారు లేక గిడ్డంగుల్లో పేరుకుపోయాయి. తెల్లజొన్నలు కొనే దిక్కులేకుండా పోయింది. రాయలసీమలో వేరుశనగ సాగుచేసిన రైతులు కరువు వల్ల పంటను కోల్పోయి రూ.4,650 కోట్లు నష్టపోయారు. కరవును జయించిందెక్కడ? జూన్ నుంచి మొదలై సెప్టెంబర్తో ముగిసిన ఖరీఫ్ సీజన్లో 18 శాతం, రబీలో ఇప్పటిదాకా 58 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఖరీఫ్లో సాగు విస్తీర్ణం 4 లక్షల హెక్టార్లు తగ్గింది. రబీలో సాగు విస్తీర్ణం 10 లక్షల హెక్టార్లు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 670 మండలాలు ఉండగా, ఇందులో 480 మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నాయి. ప్రభుత్వం కేవలం 347 మండలాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించి చేతులు దులుపుకుంది. వరుణుడి కరుణ లేక, పంటలు పండక, సొంత ఊళ్లలో బతికే దారి కనిపించక రైతులు, వ్యవసాయ కూలీలు వలసబాట పడుతున్నారు. ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు తరలి పోతున్నారు. పశువులను పోషించలేక కబేళాలకు తరలిస్తున్నారు. అయినా కరువును జయించామని, 2018 ఖరీఫ్లో రెయిన్గన్లతో 25,795 హెక్టార్లలో పంటలను కాపాడామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుండడం గమనార్హం. నకిలీ విత్తనాలు.. చుట్టుముట్టిన తెగుళ్లు వ్యవసాయ శాఖ వైఫల్యాలు రైతుల పాలిట శాపంగా మారాయి. నకిలీ విత్తనాలు, పురుగు మందులు, చుట్టుముట్టిన తెగుళ్లు, అధికారుల నిర్లక్ష్యం, ధాన్యం సేకరణలో వైఫల్యంతో రైతులు ఈసారి తీవ్రంగా నష్టపోయారు. మెగాసీడ్ పార్క్ అంటూ ప్రభుత్వం హడావిడి చేసినా ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ధరల స్థిరీకరణ నిధి ఉంటే.. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ప్రకటించినట్టుగా రూ.5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఉంటే రైతులకు ఈ ఏడాది కొంతలో కొంతైనా ఊరట లభించేది. మొక్కజొన్న, జొన్న రైతులకు, చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడికి, ఆగస్టులో వచ్చిన అకాల వర్షాలకు నష్టపోయిన వరికి ప్రభుత్వం ఇస్తామన్న సాయం ఇంతవరకూ అందలేదు. రైతులు ఈ ఏడాది పంటల సాగు కోసం రూ.19,000 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు అంచనా. కరువు, తుపాన్ల వల్ల ఈ పెట్టుబడులు కూడా చేతికి రాలేదు. ఆగని ఆత్మహత్యలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో సగటున ఏడాదికి 79 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాస్తవానికి ఈ సంఖ్య ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది. ఈ ఏడాది ఇప్పటికి 163 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. రుణమాఫీ జరగక, బ్యాంకుల నుంచి రుణాలు అందక, వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకోవడంతోపాటు పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం ఊసే లేకుండా పోయింది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది చిన్న, సన్నకారు, కౌలు రైతులే. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం అల్లంవారిపాలెం గ్రామానికి చెందిన కొండవీటి బ్రహ్మయ్య అనే రైతు తాను ఎలా నష్టపోయిందీ సవివరంగా ముఖ్యమంత్రికి లేఖ రాసి, కలెక్టర్ కార్యాలయానికి వచ్చి పురుగుమందు తాగి తనువు చాలించడం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలు, పాల డెయిరీలు వరుసగా మూతపడుతున్నాయి. బకాయిల కోసం రైతులు పోరుబాట పట్టినా ప్రభుత్వం చలించడం లేదు. యూనివర్సిటీలలోని పరిశోధనా ఫలితాలు క్షేత్రస్థాయికి చేరడం లేదు. తెగుళ్లు చుట్టుముట్టినా శాస్త్రవేత్తల బృందాలు పొలాలకు వెళ్లడం లేదు. మొక్కజొన్నకు కత్తెర తెగులు ఆశించడంతో రైతులు రాత్రికి రాత్రి పంటను ధ్వంసం చేశారు. శోకం మిగిల్చిన తుపాన్లు రాష్ట్ర రైతాంగం ఈ ఏడాది మూడు తుపాన్లు– తిత్లీ, గజ, పెథాయ్.. రెండుసార్లు అకాల వర్షాలను చవిచూసింది. ఉత్తరాంధ్రను తిత్లీ, పెథాయ్ వణికిస్తే.. కోస్తాను గజ, పెథాయ్ తుపాన్లు గడగడలాడించాయి. మే, ఆగస్టులలో కురిసిన అకాల వర్షాలు ఉద్యాన పంటల్ని దెబ్బతీశాయి. ఖరీఫ్కు ముందు కురిసిన వర్షాలు ఆ తర్వాత ముఖం చాటేయడంతో పంటలు ఎండిపోయాయి. రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ, పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటల్ని రైతులు పొలాల్లోనే వదిలేశారు. అపరాలు చేతికి అందకుండానే పోయాయి. గోదావరి, కృష్ణా డెల్టాలో వరిని తుపాన్లు నష్టపరిచాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పంటల్ని తిత్లీ తుపాను తీవ్రంగా ముంచేసింది. జీడి పంట, జీడి పరిశ్రమ కోలుకోలేని విధంగా నష్టపోయాయి. ఆదుకోని రుణమాఫీ తాము అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామని చంద్రబాబు గత ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. బాబు అధికారంలోకి వచ్చే నాటికి రైతుల రుణాలు రూ.87,612 కోట్లు ఉండగా, చంద్రబాబు రుణమాఫీ కోసం కేవలం రూ.24,500 కోట్లు ఇస్తామంటున్నారు. అంటే ఆ సొమ్ము రుణాలపై వడ్డీలకు కూడా సరిపోదు. ఈ ఏడాది ఇవ్వాల్సిన మూడో విడత డబ్బులు ఇంకా రైతులకు అందలేదు. సర్కారు విధానాల వల్ల బ్యాంకుల నుంచి రైతులకు అప్పులు పుట్టడం లేదు. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలంటూ రైతులకు బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయి. సంఘటితమవుతున్న రైతులు వాతావరణ మార్పులతో రైతులు ఈ ఏడాది 27 శాతం ఆదాయం కోల్పోనున్నట్టు ఆర్థిక సర్వే చెబుతోంది. ఉత్పత్తి వ్యయంపై 50 శాతాన్ని కలిపి ఇవ్వాల్సిన కనీస మద్దతు ధర ఇవ్వలేదు. శాశ్వత రుణ విముక్తి లేదు. పెట్టుబడి సాయం లేదు. బీమా సొమ్ము చేతికి రాలేదు. ప్రకృతి కనికరించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా పెల్లుబికినట్టే రాష్ట్రంలోనూ రైతులు సంఘటితం అయ్యే ప్రయత్నం ఈ ఏడాది జరిగింది. రాజధాని ప్రాంత రైతులకు న్యాయం కోసం ధర్నాలు చేశారు. తుందుర్రు ఆక్వా పార్క్కు వ్యతిరేకంగా ఉద్యమించారు. ప్రభుత్వ భూ సమీకరణ విధానాన్ని వ్యతిరేకించారు. గిట్టుబాటు ధరలు ఇచ్చే వరకు విశ్రమించబోమని తేల్చిచెప్పారు. అంతా బాగుందట! సంక్షోభంలో చిక్కుకుని రైతన్నలు అష్టకష్టాలు పడుతుండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ రంగంపై శ్వేతపత్రం విడుదల చేస్తూ వ్యవసాయ రంగంలో ప్రగతి అద్భుతంగా ఉందని సెలవిచ్చారు. అధిక ఆదాయం కోసమే వలసలు వెళుతున్నారని అనడం కొసమెరుపు. మరి అంతా బాగుంటే ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేసిన రోజే కర్నూలు జిల్లాలో ఓ యువరైతు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నట్టు. -
పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య
విజయనగరం, పార్వతీపురం: పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పార్వతీపురంలో చోటు చేసుకుంది. వైకేఎం కాలనీలో నివాసం ఉంటున్న డప్పుకోట రాజారావు, సరోజనమ్మల కుమారుడు డప్పుకోట రవికుమర్ (27) ఆదివారం రాత్రి 3.30 గంటల సమయంలో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడ్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగానే రవికుమార్ మృతి చెందాడు. అవుట్ పోస్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై మృతుడు రవికుమార్ తండ్రి రాజారావు మాట్లాడుతూ, తన కుమారుడు కడుపునొప్పితో కొద్ది రోజులుగా బాధపడుతున్నాడని చెప్పారు. ఆది వారం రాత్రి నొప్పి ఎక్కువ కావడంతో భరించలేక పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ఫిర్యాదులు పేర్కొన్నారు. మృతుడి జేబులో లేఖ... మృతుడు రవికుమార్ జేబులో సూసైడ్ నోట్ లభించింది. అందులో కల్యాణి అనే మహిళ, ఆమె తండ్రితో పాటు భర్త తన చావుకు కారణమని రాసి ఉంది. గరుగుబిల్లి మండలం పెద్దూరు.. జియ్యమ్మవలస మండలానికి చెందిన కొందరు తనను చంపాలనుకుంటున్నారని వారి ఫోన్ నంబర్లుతో సహాలేఖ రాసి జేబులో పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే మృతుడి జేబులో లేఖ ఉన్నప్పటికీ.. పోలీసులు మృతుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం విశేషం. -
‘లాబ్’తో నారు.. లాభాల జోరు!
ఈ అభ్యుదయ రైతు పేరు గుదేటి సుబ్బారెడ్డి (43). గుంటూరు జిల్లా చుండూరులో మూడేళ్ల క్రితం అరెకరం పాలీహౌస్ నిర్మించి బంతి నారు పెంచి కర్ణాటకకు ఎగుమతి చేస్తున్నారు. 18–24 రోజులు పెంచి.. ఏడాదికి 10 బ్యాచ్ల బంతి నారును బెంగళూరు తదితర ప్రాంతాలకు పంపుతున్నారు. గతంలో రసాయనిక ఎరువులు వాడే వారు. న్యూలైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివశంకర్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా(లాబ్)ను పరిచయం చేసిన తర్వాత మెరుగైన ఫలితాలు పొందుతున్నాడు.అర లీటరు లాబ్ ద్రావణాన్ని వంద లీటర్ల నీటిలో కలిపి టన్ను కొబ్బరిపొట్టుపై చల్లుతారు. పాలీహౌస్లోని ట్రేలలో కొబ్బరిపొట్టును నింపి బంతి విత్తనం వేస్తారు. 15 రోజుల మొక్కలకు చీడపీడలు సోకకుండా.. లీటరు నీటికి 3 ఎం.ఎల్. కానుగ నూనెను కలిపి ఒకసారి పిచికారీ చేస్తారు. ఏడాదికి 50 లక్షల బంతి మొక్కలను ఎగుమతి చేస్తున్నానని.. మొక్క రూ.2.50 చొప్పున అమ్ముతున్నానని సుబ్బారెడ్డి తెలిపారు. రసాయనిక ఎరువులు వాడినప్పటì తో పోల్చితే.. లాబ్ వాడకం వల్ల మొక్కలు ఆరోగ్యంగా, పచ్చగా పెరుగుతున్నాయి. రెండు రోజులు ముందుగానే మొక్కలు సిద్ధమవుతున్నాయి. త్వరగా మెత్తబడకుండా తాజాగా ఉంటున్నాయని, ఖర్చు కూడా పది శాతం తగ్గిందని సుబ్బారెడ్డి(99632 93921) సంతోషంగా చెప్పారు. పాలీహౌస్ పక్కనే ఎకరంన్నర నిమ్మ తోటలో కూడా లాబ్ ద్రావణాన్ని వాడుతున్నారు. నిమ్మకాయల నాణ్యత పెరిగిందని ‘సాక్షి సాగుబడి’తో ఆయన చెప్పారు. గోంగూర మొక్కలు.. గోంగూరను విత్తనం వేసి పెంచాల్సిన అవసరం లేదు. పీకిన గోంగూర మొక్కలనే మార్కెట్లో కొంటారు కదా? ఆకులను కోసుకున్న తరువాత, ఆ మొక్కలను ఇలా తిరిగి పెరట్లోనో, కుండీల్లోనో, మిద్దె తోటల్లోనో నాటుకోవచ్చు. అవసరానుగుణంగా నీరు చల్లాలి. మళ్లీ వేరూనుకొని చిగురిస్తాయి. కొంతకాలానికి తిరిగి ఆకును ఇస్తాయి. – తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దె తోట నిపుణులు -
అరికెలు... ఆరుద్ర కార్తెలోనే విత్తాలి!
సిరిధాన్యాలు(అరికలు, అండుకొర్రలు, కొర్రలు, సామలు, ఊదలు) తింటే ఎంతటి జబ్బులనైనా పారదోలి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించేవన్న చైతన్యం వ్యాపిస్తున్న కొద్దీ.. వీటి సాగుపై రైతులు, ముఖ్యంగా మెట్ట పొలాలున్న రైతులు దృష్టిసారిస్తున్నారు. విత్తనం నేలలో తేమ ఉన్నప్పుడు వేయాలి. మొలిస్తే చాలు బెట్టను కూడా తట్టుకొని చక్కని దిగుబడినివ్వగలిగే మెట్ట రైతుల మిత్ర పంటలివి. వీటి సాగులో కష్టం, ఖర్చూ రెండూ తక్కువే. ఎట్టిపరిస్థితుల్లోనూ రైతుకు రూపాయి కూడా నష్టం రాకుండా చూసే గ్యారంటీ పంటలు సిరిధాన్యాలు. ఈ 5 రకాలలో అరికలు ఒక్కటే ఆరు నెలల పంట. మిగతావి 3 నెలల్లోపు పంటలే. కాబట్టి, అరికలను వర్షాకాలం ప్రారంభంలోనే విత్తుకోవాలి. ఒకట్రెండు వర్షాలు పడి వాతావరణం చల్లబడిన తర్వాత ఆరుద్ర కార్తె(జూన్ ఆఖరు)లో అరికలు విత్తుకుంటే నిశ్చింతగా ఎకరానికి ఎటువంటి భూమిలోనైనా 8 క్వింటాళ్లు పండుతాయని కడప జిల్లా వేంపల్లెకు చెందిన రైతు శాస్త్రవేత్త విజయకుమార్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. అరికలతోపాటు అంతర పంటలను విత్తుకునే విధానాన్ని ఆయన వివరించారు. సిరిధాన్యాల సాగుకు భూమిని మే నెలలోనే చదును చేసుకోవాలి. ముంగారి (తొలి) చినుకులకు తొలి దుక్కి చేయాలి. తర్వాత వర్షాలకు కలుపు గింజలు మొలుస్తాయి. ఆ తర్వాత రెండో దుక్కి చేసుకుంటే మున్ముందు కలుపు సమస్య అంతగా ఉండదు. పశువుల ఎరువు వేయాలి. అవకాశం ఉంటే గొర్రెలు/పశువుల మంద కట్టుకోవాలి. పంటలు ఏవైనా తూర్పు– పడమర సాళ్లుగా విత్తుకుంటే చీడపీడల బెడద తప్పుతుంది. అరికలు 6 నెలల దీర్ఘకాలిక పంట. అరిక పంటను వర్షాధారంగానే సాగు చేయాలి. నీటి తడి పెడితే దిగుబడి తగ్గుతుంది. ఆరుద్ర కార్తెలోనే విత్తుకుంటే చలి రావడానికి ముందే పొట్ట దశ దాటిపోతుంది.. అరిక పొట్ట మీద ఉన్నప్పుడు చలి తగిలితే కాటుక తెగులు వస్తుంది.ఎకరానికి 3 కిలోల విత్తనం కావాలి. అరికలు 6 సాళ్లు విత్తిన తర్వాత ఒక సాలు కంది విత్తాలి. మళ్లీ 6 సాళ్లు అరకలు విత్తిన తర్వాత మరో సాలులో 5 రకాల(ఆముదాలు, అలసందలు/బొబ్బర్లు, అనుములు, గోగులు, సీతమ్మ జొన్నలు) విత్తనాలు కలిపి విత్తాలి. అంటే.. 6 సాళ్లు అరికలు – ఒకసాలు కందులు– 6 సాళ్లు అరికలు– ఒక సాలు 5 రకాల విత్తనాలు– మళ్లీ 6 సాళ్లు అరికలు... ఇలా మంచి పదునులో విత్తుకోవాలి. కొన్ని రకాలు కలిపి విత్తడం వల్ల ఏకదళ, ద్విదళ పంటలు పొలం నిండా ఉంటాయి. పంటల జీవివైవిధ్యం వల్ల చీడపీడలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాదు.. షుగర్ను, ఊబకాయాన్ని తగ్గించే ఆరోగ్యకరమైన, ఎంతో రుచికరమైన అరికలతోపాటు తినడానికి పప్పులు కూడా అందివస్తాయి. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తే అరికల ధాన్యం ఎకరానికి ఎట్లా కాదన్నా 7–8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. క్వింటా రూ. 3 వేలనుకున్నా రూ. 24 వేలు వస్తాయి. మిగతావి కూడా కలుపుకుంటే.. ఎకరానికి రూ. 40 వేలకు తగ్గకుండా రైతులకు ఆదాయం వస్తుందని సిరిధాన్యాల సాగులో అనుభవం ఉన్న విజయకుమార్ చెబుతున్నారు. మెట్ట పొలాలను రెండు సార్లు దున్ని విత్తనాలు చల్లి.. ఒకటి రెండు సార్లు పైపాటు/అంతర సేద్యం చేస్తే చాలు. అరికలు మొలిచిన చోట గడ్డి కూడా మొలవదు. ఒక్కసారి మొలిస్తే చాలు వర్షం సరిగ్గా కురిసినా లేకపోయినా మొండిగా పెరిగే పంట అరిక. ఎకరానికి ట్రాక్టర్ అరిక గడ్డి వస్తుంది. గడ్డి అమ్ముకుంటే సాగుకు అయిన ఖర్చు కన్నా ఎక్కువే ఆదాయం వస్తుంది. రైతుకు నష్టం రానే రాదు. ఎత్తు పల్లాల భూమిలో వర్షాలకు మట్టి కొట్టుకుపోకుండా అరిక పంట బాగా ఉపయోగపడుతుందని విజయకుమార్ వివరించారు. ఆయనను 79814 07549 నంబరులో సంప్రదించవచ్చు. ఏపీ రైతులు ఉ. 5–9 గం. మధ్య, కర్ణాటక రైతులు మ. 1–3 గం. మధ్య, తెలంగాణ రైతులు సా. 6–9 గం. మధ్య ఫోన్ చేయవచ్చు. -
పురుగు మందులకు బలవుతున్న రైతులు
సాక్షి, న్యూఢిల్లీ : పంటలకు పురుగు మందులు కొట్టే క్రమంలో ఏటా దేశంలో ఎంతో మంది రైతులు బలైపోతున్నారు. 2017 సంవత్సరంలోనే మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రంలో 50 మంది రైతులు ఈ మందుల ప్రభావంతో మరణించారు. వారిలో ఎక్కువ మంది మనోక్రోటోఫస్ మందులను ఉపయోగించినవారే. వాటిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యంత ప్రమాదకారిగా గుర్తించిన ఫాస్ఫరస్ ఉంటుంది. ఈ మందును ఇప్పటికే ఎన్నో దేశాలు నిషేధించాయి. ప్రపంచంలో పలు దేశాలు నిషేధించిన పురుగు మందుల్లో ఇప్పటికీ భారత్లో రైతులు కనీసం 99 మందులను వాడుతున్నారు. పంటలకు పట్టిన చీడ పీడలను నాశనం చేసేందుకు భారత్లో రైతులు ఉపయోగిస్తున్న 260 మాలిక్యూల్ రకాల పురుగు మందుల్లో 99 మందులను పలు దేశాలు ఎప్పుడో నిషేధించాయి. వీటిని మన రైతులు ఇప్పటికీ వాడుతుండడమే కాకుండా లైసెన్స్లేని నకిలీ మందులను కూడా వాడుతున్నారు. ఈ కారణంగా రైతులు ఎక్కువగా మృత్యువాతకు గురవుతున్నారు. 1968 నాటి ఇన్సెక్టిసైడ్స్ యాక్ట్ కిందనే భారత ప్రభుత్వం పురుగు మందులను ఇప్పటికీ నియంత్రిస్తోంది. ఆధునిక కాలానికి అవసరమైన విధంగా చట్టాన్నిగానీ, విధానాలనుగానీ మార్చుకోలేదు. దేశంలో వ్యవసాయమేమో రాష్ట్రానికి సంబంధించిన అంశం. పురుగు మందులేమో కేంద్రానికి సంబంధించిన విషయం. అయినప్పటికీ ఇరు ప్రభుత్వాలు సమన్వయంతో రైతుల బలిని అరికట్టవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ‘ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్’ విధానం అన్నది ఒకటి ఉంది. దాని ప్రకారం ఎప్పటికప్పుడు రైతులను పురుగు మందుల విషయంలో, ఇతర వ్యవసాయ పద్ధతుల విషయంలో చైతన్యపరచాలి. అందుకోసం రైతులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలి. ఇందుకోసం వ్యవసాయ శాఖ, అధికారులు, సిబ్బంది ఉన్నప్పటికీ రైతులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న దాఖలాలు కనిపించవు. సిబ్బంది కొరత కారణమైని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కూడా చెబుతోంది. ఉద్యాగాలిస్తామంటూ అధికారంలోకి వచ్చినప్పుడు ఖాళీలను భర్తీ చేసుకోవచ్చుగదా! పెస్ట్ మేనేజ్మెంట్ విధానం ప్రకారం తప్పనిసరి అయినప్పుడు మాత్రమే పురుగు మందులను వాడాలి. పురుగులను నివారించేందుకు సాధ్యమైనంత వరకు సహజ పద్ధతులను పాటించాలి. వర్మీ కంపోజ్, వేప నూనెలు వాడడం, నున్నటి రబ్బరు గొట్టాల ద్వారా చేనుకు పట్టిన పురుగులు పడిపోయేలా చేయడం సహజమైన పద్ధతులు. సహజమైన పద్ధతులన్నీ విఫలమైన సందర్భాల్లో ప్రభుత్వం చూపించిన మోతాదుల్లోనే రసాయనిక మందులను వాడాలి. ప్రభుత్వం విధానం ప్రకారం ఎరువులు అమ్మే వ్యాపారులు కూడా వాటిని ఎలా వాడాలో రైతులకు విడమర్చి చెప్పాలి. కేవలం లాభాపేక్ష కలిగిన ఎరువుల వ్యాపారులు అలా చేయరు. వారి వద్ద శిక్షణ కలిగిన సిబ్బంది కూడా ఉండరు. ఎరువుల షాపుల్లో వ్యవసాయ బీఎస్సీ చదివిన వారిని ప్రమోటర్లుగా పెట్టుకోవాలని, వారు విధిగా రైతులకు సూచనలు ఇవ్వాలంటే గతేడాది కేంద్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని తెచ్చింది. ఎక్కడా ఆ చట్టం అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. లాభాపేక్షలేని ప్రభుత్వమే రైతుల సంరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలి. పటిష్ట చట్టాలను పట్టుకురావాలి. -
వాటిలో పురుగుమందుల అవశేషాలు
పండ్లు కూరగాయలు ఆరోగ్యానికి మంచివే. అవి సహజ సిద్ధంగా పండించినవైతే అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, పురుగుమందులు వాడి పండించే వాటిలో కొన్ని పండ్లు, కూరగాయలు అత్యధిక మోతాదులో పురుగు మందుల అవశేషాలతో మార్కెట్లోకి వచ్చిపడుతున్నాయి. ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశంతో అమాయకంగా వాటిని తిన్నారంటే లేనిపోని వ్యాధుల బారిన పడే పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉండే వాటిలో స్ట్రాబెర్రీ, పాలకూర చెర్రీ, యాపిల్, ద్రాక్షలు, బంగాళదుంపలు, టొమాటోలు వంటివి ముందు వరుసలో నిలుస్తున్నాయని, వీటిలో దాదాపు 98 శాతం దిగుబడుల్లో పురుగు మందుల అవశేషాలు బయటపడ్డాయని అమెరికా వ్యవసాయ శాఖ పరిధిలోని ఎన్విరాన్మెంటల్ వర్కింగ్ గ్రూప్ ఇటీవల నిర్వహించిన పరిశీలనలో వెల్లడైంది. అయితే, ఉల్లిపాయలు, క్యాబేజీ, బొప్పాయి, మామిడి, వంకాయలు, కాలిఫ్లవర్, బ్రకోలి వంటి వాటిలో పురుగు మందుల అవశేషాలు నామమాత్రమేనని, ఇవి చాలావరకు సురక్షితంగానే ఉంటున్నాయని ఆ అధ్యయనంలో తేలింది. -
బహుళజాతి సంస్థల కోసమే ఆ బిల్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విదేశీ కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకే ‘పురుగు మందుల నిర్వహణ బిల్లు’ రూపుదిద్దుకుంటోందని పెస్టిసైడ్స్ మాన్యుఫ్యాక్చరర్స్, ఫార్ములేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. దీంతో భారతీయ కంపెనీలకు అండగా ఉన్న ఇన్సెక్టిసైడ్స్ యాక్ట్–1968 నిర్వీర్యం కానుందని అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రదీప్ దవే చెప్పారు. ‘భారత్లో పురుగు మందులు విక్రయించాలంటే సెంట్రల్ ఇన్సెక్టిసైడ్స్ బోర్డు వద్ద ఉత్పాదన నమోదు తప్పనిసరి. రిజిస్ట్రేషన్ లేకుండానే 2007 నుంచి భారత్లో పలు విదేశీ కంపెనీలు 127 ఉత్పత్తులను నేరుగా విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం వీటి వ్యాపారం ఏటా రూ.7,000 కోట్లకు వచ్చి చేరింది. వీటి నాణ్యతను పరీక్షించడం లేదు. వీటి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. ఫార్ములేషన్స్ వారిచేతుల్లో.. సుమారు 100 మాలిక్యూల్స్ను ఎమ్మెన్సీలు తమ చేతుల్లో పెట్టుకుని ఇక్కడి మార్కెట్ను శాసిస్తున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా స్మాల్, మీడియం పెస్టిసైడ్స్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజమహేందర్ రెడ్డి తెలిపారు. కంపెనీలు ఈ ఉత్పత్తులను 10 రెట్ల అధిక ధరలకు అమ్ముతున్నాయని, దీంతో రైతులపై భారం పడుతోందని చెప్పారు. దేశీయ కంపెనీలు చవక ధరల్లో ఉత్పత్తులను తయారు చేస్తున్నాయని గుర్తుచేశారు. ఎమ్మెన్సీల చేతుల్లో ఉన్న ఫార్ములేషన్స్ను భారతీయ కంపెనీలు తయారు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఇన్సెక్టిసైడ్స్ యాక్టులో ఉన్న సెక్షన్ 9(4) నిబంధనను కొనసాగించాలని ఫైటోకెమ్ ఎండీ వై.నాయుడమ్మ డిమాండ్ చేశారు. -
కేన్సర్ పంట!
అన్నదాతలు కోటి ఆశలతో పంట పెడతారు. ఆరుగాలం అష్టకష్టాలూ పడి పంట పండిస్తారు. చీడపీడల నుంచి రక్షణకు పురుగు విషాలు పిచికారీ చేస్తారు. కాలంతోపాటు పురుగుల్లోనూ మార్పొచ్చింది..వాటిని మట్టుబెట్టడానికి ఒకటికి పదిసార్లు ‘సిస్టమిక్’ విషాలు చల్లుతున్నారు. కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక పోతోంది. పురుగు విషాలు పచ్చని పల్లెల గాలిని, నీటిని, భూమిని విష కాసారాల్లా మార్చేస్తున్నాయి. రైతులు పంటల మీద చల్లుతున్న విషరసాయనాలు కేన్సరై వారినే కాటేస్తున్నాయి.. చిత్తూరు జిల్లా ఈడిగపల్లె పంచాయతీ గ్రామాల్లో కేన్సర్ మహమ్మారి కరాళనృత్యం చేస్తున్నది. గత ఏడాదిలోనే 15 మంది చనిపోయారు. చెన్నై, బెంగళూరు ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో కేన్సర్ రోగులు చికిత్స పొందుతున్నారు. ఈ భయానక పరిస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. ఈడిగపల్లె పంచాయతీ చిత్తూరు–మదనపల్లె హైవేలో ఉంది. అక్కడి భూములు సారవంతమైనవే. గత ముప్పయ్యేళ్లుగా టమాటా, కాలీఫ్లవర్, క్యాబేజి, వరి తదితర పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఈడిగపల్లె పంచాయతీలోని చిలకావారిపల్లె, ఆవులోళ్లపల్లె, నేతిగుట్లపల్లె, యర్రగుంట్లపల్లె తదితర గ్రామాల్లో కేన్సర్ మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. గత ఏడాది కాలంలోనే రైతు కుటుంబాలకు చెందిన సుమారు 15 మంది మహిళలు, పురుషులు కేన్సర్ కారణంగా చనిపోయారు. పదుల సంఖ్యలో బెంగళూరు, మద్రాసు, హైదరాబాదు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. 80–90 ఏళ్లు వరకు ఆరోగ్యవంతులుగా జీవించిన పల్లెవాసులు నేడు 50–60 ఏళ్లలోపే క్యాన్సర్ బారిన పడి నేలరాలుతున్నారని కొందరు గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ప్రమాదకరంగా పురుగుమందుల పిచికారీ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలకు నాలుగైదు రెట్లు ఎక్కువగా పురుగుమందులు పిచికారీ చేయడం వరకూ వెళ్లింది. అంతకన్నా ప్రమాదకరమైన సంగతేమిటంటే.. పురుగుమందులు పిచికారీ చేసే టప్పుడు ఒక్కరు కూడా ముఖానికి గుడ్డ కూడా అడ్డం కట్టుకున్నట్లు కనపడలేదు. ఈ గ్రామాల్లో రైతులు సాధారణంగా 4–7 రోజుల వ్యవధిలో ఒక సారి పురుగుమందు పిచికారీ చేయిస్తుంటారు. మొత్తం పంట కాలంలో 15–20 సార్లు పిచికారీ చేస్తున్నట్లు అంచనా. టమాటాలు ఎర్రగా నిగనిగలాడుతూ కనిపించడానికి కూడా ప్రత్యేక మందులు పిచికారీ చేస్తున్నట్లు ఒక రైతు చెప్పారు. టమాటా ధర బాగా తక్కువగా ఉన్నప్పుడు రసాయనిక పురుగుమందుల పిచికారీ కూడా బాగా తక్కువగా కొడతారని ఒక రైతు తెలిపారు. కొందరు రైతులు స్ప్రింక్లర్ల ద్వారా కూడా పురుగుమందులు పిచికారీ చేస్తున్నారు. పిచికారీ చేసినప్పుడు ఒంటిపై పడకుండా జాగ్రత్తపడే పరిస్థితి కూడా లేదు. చీడపీడలను సహజ పద్ధతుల్లో అదుపులో ఉంచడానికి దోహదపడే అంతర పంటలు, ఎర పంటలు, సరిహద్దు పంటలు వేయడం, ఎర అట్టలు ఏర్పాటు చేయడం వంటి పద్ధతులు అక్కడ అసలు కనపడలేదు. ఇలా.. పురుగుమందులను ప్రమాదకరంగా వాడటంతోపాటు.. అధిక రసాయనిక అవశేషాలతో కూడిన కూరగాయలనే వారూ తింటున్నారు. ఎకరానికి 20 బస్తాలకు పైగా ఎరువులు.. కర్ర ఊతం లేకుండా టమాటా సాగు చేసే రైతులు కూడా ఎకరానికి రూ. 60 వేలు ఖర్చు పెట్టి.. 10 వేల నుంచి 15 వేల కిలోల వరకు దిగుబడి తీస్తున్నారు. స్టేకింగ్(కర్ర ఊతం) పద్ధతిలో ఏకపంటగా, మల్చింగ్ షీట్ వేసి, డ్రిప్తో టమాటా సాగు చేస్తున్నారు. అధికోత్పత్తి సాధించే లక్ష్యంతో ఎకరానికి 20 నుంచి 50 బస్తాల(బస్తా 50 కిలోలు) వరకు రసాయనిక ఎరువులు వేస్తున్నట్లు తెలిసింది. ఎకరానికి 25 వేల కిలోల నుంచి 30 వేల కిలోల వరకు దిగుబడి సాధిస్తున్నారు. ఎరువులు, పురుగుమందులతో కలుపుకొని ఎకరానికి రూ. 2 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. పిచికారీ చేసే రసాయనాలలో కేవలం 8 శాతం మాత్రమే పంటకు ఉపయోగపడుతుందని అంచనా. మిగిలిన 92 శాతం పురుగుమందు గాలిలో, నీటిలో, భూమిలో కలిసి మనం తినే ఆహారం, పీల్చే గాలిలో ప్రకృతిలో కలిసిపోయి.. ముఖ్యంగా స్థానిక గ్రామీణ ప్రజల వినాశనానికే దారి తీస్తున్నది. ఈ ప్రాంతంలో 30 ఏళ్ల క్రితం రెండు, మూడు పంటలు కలిపి మిశ్రమ సేద్యం చేసేవారు. 15 ఏళ్ల నుంచి అయితే టమాటా లేదా కాళీఫ్లవర్ వంటి ఏదో ఒకే పంటను మాత్రమే సాగు చేస్తున్నారు. అప్పటి నుంచి ‘సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్’ విచ్చలవిడిగా చల్లుతున్నారని మదనపల్లెకు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు ఎం.సి.వి. ప్రసాద్ ‘సాక్షి’తో చెప్పారు. బూడిద, పుల్లటి మజ్జిగ, గోమూత్రంతో కషాయాలు వాడుతుంటే చీడపీడల సమస్య ఉండటం లేదన్నారు. తాము సూచించిన దానికన్నా ఐదు రెట్లు ఎక్కువగా పురుగుమందులు పిచికారీ చేస్తున్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.నీటిని, గాలిని, భూమిని విషపూరితం చేసి, మనుషులు, పశువుల ఆరోగ్యానికి ముప్పు తెచ్చే రసాయనిక వ్యవసాయానికి స్వస్తి చెప్పి.. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేపట్టడమే ఈ సమస్యకు పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. రైతులు మొదట తాము తినే పంటలనైనా సేంద్రియ పద్ధతుల్లో పండించుకోవడంపై దృష్టిపెట్టడం అత్యవసరమని సూచిస్తున్నారు. మా ఇంట్లో ముగ్గురికి కేన్సర్ వచ్చింది.. మా ఇంటిలో అమ్మ, చిన్నాన్న, పెద్దనాన్న ముగ్గురూ కేన్సర్ వ్యాధికి గురయ్యారు. అమ్మ 7 నెలల క్రితం చనిపోయింది. చిన్నాన్న, పెద్దనాన్న చికిత్స తర్వాత కోలుకున్నారు. మా చుట్టుపక్కల గ్రామాలలో చాలా మంది క్యాన్సర్ వ్యాధితో మరణించారు. టమాటా, కాళీఫ్లవర్, వరి తదితర పంటలు పదెకరాల్లో సాగు చేస్తున్నాను. రసాయనిక ఎరువులు ఎకరానికి 10–15 బస్తాల వరకు వేస్తాం. పురుగుమందులు దండిగానే చల్లుతున్నాం. ఈ పంటలనే మేము కూడా తింటున్నాం. పంటలు పండించడం మాత్రమే మాకు తెలుసు. దీని వల్ల ప్రాణాలు తీసే వ్యాధులు వస్తాయన్న విషయం తెలియదు. రామకృష్ణారెడ్డి (కిట్టు), చిలకావారిపల్లె, చిత్తూరు జిల్లా పురుగుమందులు తప్పనిసరి.. మా పంచాయతీలో ఏ పంటకైనా తప్పక రసాయనిక పురుగుమందులు స్ప్రే చేయాల్సిందే. టమాటా, కాళీఫ్లవర్ పంటకు 15 రోజులకు ఒకసారి, వర్షాకాలంలో పది రోజులకోసారి తప్పకుండా చేస్తుంటాం. చీడపీడలు నివారించేందుకు ఇంతకంటే వేరే మార్గం లేదని ఇక్కడి రైతుల అభిప్రాయం. సేంద్రియ వ్యవసాయం గురించి ఇక్కడెవరికీ తెలియదు. బాలకృష్ణారెడ్డి, ఈడిగపల్లె, చిత్తూరు జిల్లా 5 రెట్లు ఎక్కువగా పురుగుమందులు.. వ్యవసాయంలో పరిమితి కన్నా ఎక్కువగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడటంతో దుష్పరిణామాలు తప్పవు. ఒకవేళ ఎరువులు మోతాదుకు మించితే భూమిలో కరిగిపోతాయి. పురుగు మందులు అలా కాదు. గాలిలో, నీటిలో కలవడం, కూరగాయలపై వాటి అవశేషాలు అలాగే ఉంటాయి. అందువల్ల హానికలుగుతుంది. రైతులు రేపు, ఎల్లుండి మార్కెట్కు తరలించే కూరగాయలపై సైతం పురుగుల మందులు పిచికారీ చేయడం మంచిది కాదు. కేవలం పురుగులు, చీడపీడీలు ఆశించినపుడు తప్ప అదేపనిగా ఐదు రెట్లు ఎక్కువగా పంటలకు క్రిమిసంహారక మందులు వాడుతున్నారు. పంట తెగుళ్లు, చీడపీడలు ఆశిస్తుందేమోనని ముందుజాగ్రత్తగా పురుగుల మందులను విపరీతంగా స్ప్రే చేయడంతోనే అనర్థాలు సంభవిస్తున్నాయి. – సుధాకర్, వ్యవసాయ విస్తరణాధికారి, పుంగనూరు పురుగుమందుల వల్ల కేన్సర్లు.. ఈడిగపల్లె పరిసర ప్రాంతాల్లో మోతాదుకు మించి క్రిమిసంహారక మందులు, ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా, అవగాహన రాహిత్యంతో పురుగుల మందులు స్ప్రే చేస్తున్నారు. దీనివల్ల స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. గాలి ద్వారా పీల్చడం వల్ల గొంతు కేన్సర్ రావచ్చు. ఆడవారికి బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. రైతులు, పొలం పనులపై వెళ్లే రైతు కూలీలు వక్కలతో పాటుగా దుగ్గు, గుట్కా వాడటం క్యాన్సర్కు కారకం కావచ్చు. – డా. పవన్కుమార్, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, ముడిపాపనపల్లె – సురమాల వంశీధర్, సాక్షి, మదనపల్లి -
ఆత్మహత్య చేసుకుంటానంటేనే స్పందిస్తారా?
సాక్షి, అమరావతి బ్యూరో/కారంపూడి: ఆత్మహత్య చేసుకుంటానంటేనే స్పందిస్తారా? అంటూ అధికారులపై యువ రైతు చింతకాయల రాజేంద్రకుమార్(రాజా) మండిపడ్డాడు. పాసు పుస్తకాల కోసం 11 నెలలుగా తిరిగినా పట్టించుకోలేదని, సర్వేయర్ వద్దకు వెళితే కాగితాలు విసిరేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 11 నెలలు తిరిగినా ఎందుకు పట్టించుకోలేదని అధికారులను నిలదీశాడు. ‘కలెక్టర్ ముందే ఆత్మహత్య చేసుకుంటా’ అంటూ శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో అధికారులు ఉరుకులు పరుగులు తీశారు. జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాలతో గురజాల ఆర్డీవో మురళి, ల్యాండ్స్ సర్వే ఏడీ కెజియా కుమారితో పాటు అధికారుల బృందం శనివారం ఉదయం గుంటూరు జిల్లా కారంపూడి మండలం లక్ష్మీపురానికి చేరుకుంది. న్యాయం చేస్తామంటూ ఆర్డీవో మురళి బాధితునితో ఫోన్లో మాట్లాడారు. ఇంతకాలం ఎందుకు పట్టించుకోలేదని ఈ సందర్భంగా ఆయన్ని రాజా నిలదీశాడు. ఆర్డీవో స్పందిస్తూ.. న్యాయం చేసేందుకే వచ్చామని, సమస్యను పరిష్కరిస్తామని సర్దిచెప్పినట్టు తెలిసింది. నాదో కన్నీటి గాథ: అధికారులు వస్తున్నారన్న సమాచారంతో.. రాజా పురుగు మందుల డబ్బాలు తీసుకుని పొలంలోకి వెళ్లి బైఠాయించాడు. అక్కడకు వెళ్లిన విలేకరులకు రాజా తన కన్నీటి గాథను వివరించాడు. తన తండ్రి వెంకటేశ్వర్లు సాగు కోసం అప్పులు చేసి.. వాటిని తీర్చలేక 2010లో ఆత్మహత్య చేసుకోవడంతో తాను చదువు మానేసి వ్యవసాయంలోకి దిగినట్టు తెలిపాడు. ఇద్దరం అన్నదమ్ములమని, తమకు ఎకరం పొలం ఉందని వివరించాడు. ఖరీఫ్లో 22 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేయగా.. వర్షాలకు ఉరకేసి పంట చేతికి రాలేదని వాపోయాడు. రూ.11 లక్షల దాకా అప్పులయ్యాయని వివరించాడు. అప్పులిచ్చిన వారిని ఇబ్బంది పెట్టకూడదని, తన పొలానికి సంబంధించిన పాసు పుస్తకాల కోసం అధికారుల చుట్టూ 11 నెలలుగా తిరిగినా ఫలితం లేకపోయిందన్నారు. టీడీపీ వాడిననే పేరే కానీ, తనను నాయకులెవరూ పట్టించుకోలేదని వాపోయాడు. చివరకు వీడియో మెసేజ్ పెట్టినట్టు చెప్పాడు. విచారణకు ఆదేశించాం: వీడియో మెసేజ్ మా దృష్టికి వచ్చిన వెంటనే గురజాల ఆర్డీవో మురళి నేతృత్వంలో విచారణకు ఆదేశించామని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. రెవెన్యూ అధికారుల తప్పు ఉన్నట్లు తేలితే, సంబంధితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆర్డీవో మురళి మాట్లాడుతూ.. గత ఏడాది మే నెలలోనే సర్వే చేశామని, భూ విస్తీర్ణంలో తేడా రావడంతోనే జాప్యం జరిగిందన్నారు. ఎకరం పొలంలో 0.07 సెంట్లు బాటలో పోవడంతో సమస్య తలెత్తిందని చెప్పారు. అర్ధరాత్రి వరకు రైతు ఇంటివద్ద వేచి వున్న అధికారులు.. రాజాకు పాసుపుస్తకం ఇవ్వడానికి అధికారులు శనివారం రాత్రి 12 గంటల వరకు లక్ష్మీపురంలోనే వేచి వున్నారు. పాసు పుస్తకం తీసుకోవాలంటూ గ్రామ సర్పంచ్ ద్వారా ఫోన్ చేయించినప్పటికీ రాజా ఇంటికి రాలేదు. అతను వస్తే కౌన్సెలింగ్ ఇచ్చి పాసు పుస్తకం ఇవ్వాలనే యోచనలో అధికారులు ఉండగా.. వెళితే తననేదైనా చేస్తారనే భయంతో బాధిత రైతు ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి పాసుపుస్తకం ఇవ్వాల్సింది అతని తల్లికి అయినప్పటికీ.. రాజాకు కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా ఆత్మహత్య యత్నాన్ని మాన్పించాలనేది అధికారుల భావనగా ఉంది. అయితే ఎంతసేపు వేచి చూసినా రాజా రాకపోవడంతో.. చేసేది లేక చివరకు రాజా తల్లికి పాసుపుస్తకం ఇచ్చి అధికారులు వెనుతిరిగారు. -
గ(క)ల్తీ.. ఎరువులు
నందిమల్ల్లగడ్డ గ్రామానికి చెందిన రైతు లక్ష్మణ్ రెండు మళ్లలో వంకాయ తోట సాగుచేశాడు. 15 రోజుల క్రితం వనపర్తిలోని ప్రియాంక ఎరువుల దుకాణంలో కొనుగోలు చేసిన ఎరువును పంటకు వేశాడు. తడి ఆరకుండా నీళ్లు పెడుతున్నా ఎరువు కరగడం లేదు. అందులో సున్నపురాళ్లు, గులకరాళ్లు ఉన్నట్లు బాధిత రైతు గుర్తించి లబోదిబోమన్నాడు. ఇలా చాలామంది రైతులను నకిలీ ఎరువులు నిలువునా ముంచాయి. సాక్షి, వనపర్తి : జిల్లాలోని వీపనగండ్ల మండలంలో ఓ వ్యాపారి నుంచి రైతులు వరి విత్తనాలను కొనుగోలుచేసి నాటితే నారుకు బదులు మొత్తం తుంగనే మొలిచింది. దీనిని తుంగ దశలోనే గుర్తించడంతో కోట్ల రూపాయల పంటనష్టం నుంచి రైతులు బయటపడగలిగారు. ఇదే కోవలో వనపర్తి మండలంలోనూ నకిలీ ఎరువులను విక్రయించడంతో అన్నదాతలు పూర్తిగా నష్టపోయారు. ఇలా కల్తీ ఎరువులు రైతులను నిలువునా ముంచుతున్నాయి. అక్రమ సంపాదన రుచిమరిగిన వ్యాపారు లు వాటిని యథేచ్ఛగా అంటగడుతున్నారు. నకిలీ ఎరువు లు, విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని సీఎం కేసీఆర్ హెచ్చరించినా క్షేత్రస్థాయిలో మార్పు కనిపించడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు ముందు నుంచే ప్రభుత్వం అక్రమ వ్యాపారులపై పీడీ యాక్ట్ కేసులు నమోదుచేసి కఠినచర్యలు తీసుకునేలా ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ అమలుకాలేదు. ‘నకిలీ’ దుకాణం వనపర్తి పట్టణంలో కేశవులు అనే వ్యాపారి ప్రియాంక ఫర్టిలైజర్స్ పేరుతో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తున్నాడు. ఈ దుకాణంలో వనపర్తి మండలంలోని నందిమళ్ల గడ్డకు చెందిన కొందరు రైతులు చాలారోజులుగా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేస్తున్నారు. తెలిసిన వ్యాపారి కావడంతో పెద్దగా నిరక్షరాస్యులైన రైతులు ఏటా వ్యాపారి చెప్పిన ఎరువులనే తీసుకెళ్లేవారు. గత ఖరీఫ్లో విత్తనాలు, ఎరువులనే కొనుగోలుచేసినా పెద్దగా పంట దిగుబడి రాలేదు. ప్రస్తుతం ఈ ప్రాంతంలోని చాలా మంది రైతులు వేరుశనగ, వరి, వంకాయ, చిక్కుడు, టమాట పంటలను సాగుచేశారు. రెండు నెలల క్రితం పంటలు సాగుచేసే సమయంలో వ్యాపారి కేశవులు వద్ద మందు 20–20రకం అడుగు మందును సుమారు 20మంది రైతులు కొనుగోలుచేశారు. సదరు వ్యాపారి జిల్లాలోని చాలామంది రైతులకు ఇలాంటి విత్తనాలు, ఎరువులనే విక్రయించినట్లు తెలిసింది. వెలుగులోకి వచ్చింది ఇలా.. చేనులో ఎదుగుదల లోపించడంతో ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకోక రైతులు మరోసారి మరోసారి అడుగు మందు చల్లారు. అయినా పంటలో మార్పు లేకపోవడంతో మోసపోయామని గ్రహించిన రైతులు వ్యవసాయశాఖ అధికారులు, పోలీసులను ఆశ్రయించారు. రైతులు రెండు రోజులు క్రితం నాణ్యత లేని ఎరువులను విక్రయించిన వ్యాపారి దుకాణం ఎదుట ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న వ్యవసాయశాఖ అధికారులు, పోలీసులు దుకాణాన్ని తనిఖీ చేయగా విస్తుగొలిపే వాస్తవాలు బయటపడ్డాయి. ఎలాంటి అనుమతి లేకుండా గ్రీన్గోల్డ్ అనే కంపెనీకి చెందిన 20–20 అడుగు మందు, 3–15, 20–20–0 ఎరువులు బస్తాల కొద్దీ పట్టుబడ్డాయి. వీటి శాంపిళ్లను సేకరించిన అధికారులు నివేదిక కోసం ఎరువుల ప్రయోగశాలకు పంపించారు. రిపోర్టు వస్తే సదరు ఎరువుల వ్యాపారిపై కేసు నమోదుచేస్తామని అధికారులు స్పష్టంచేశారు. ఈ –పాస్ వచ్చినా అదేతీరు.. ప్రభుత్వం జనవరి 1వ తేదీ నుంచి ఈ పాస్ యంత్రాల ద్వారానే ఎరువులు విక్రయించాలని నిబంధనలు కఠినతరం చేసింది. ఇందుకు సంబంధించి కలెక్టర్ శ్వేతామహంతి, వ్యవసాయ శాఖ అధికారులు వరసుగా డీలర్ల దుకాణాల వద్దకు వెళ్లి పరిశీలిస్తున్నారు. అయినా ప్రియాం క ఫర్టిలైజర్ దుకాణం నిర్వాహకుడు ఎరువుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయలేదు. అతని వద్ద ఎన్ని కంపెనీలకు చెందిన ఎరువులు ఉన్నా యో కూడా లెక్కచెప్పడం లేదు. రిపోర్టు రాగానే చర్యలు రైతుల ఫిర్యాదు మేరకు నష్టపోయిన పంటలను పరిశీలించాం. రైతులకు అమ్మిన ఎరువుల శాంపిళ్లను ల్యాబ్కు పంపించాం. ప్రియాంక ఫర్టిలైజర్ దుకాణాన్ని తాత్కాలికంగా మూసివేశాం. రెండు రోజుల్లో తెరిపించి మొత్తం లెక్కగట్టి 6 ఏ సెక్షన్ కింద కేసునమోదు చేసి జేసీ కోర్టులో హాజరుపరుస్తాం. నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అమ్మితే కఠినచర్యలు తీసుకుంటాం. – సుజాత, వ్యవసాయశాఖ అధికారి, వనపర్తి జిల్లా -
పురుగు మందుల టెర్రర్!
గుండం రామచంద్రారెడ్డి/సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇటీవల ఎప్లాస్టిక్ ఎనీమియా కేసులు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. రకరకాల వైరస్లు, బ్యాక్టీరియాల వల్ల అరుదుగా మాత్రమే ఎప్లాస్టిక్ ఎనీమియా కేసులు నమోదవుతున్నా గత మూడు నాలుగేళ్లుగా మాత్రం ఈ తరహా కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. పురుగు మందులతోపాటు ఆహార ఉత్పత్తుల్లో పేరుకుపోయిన అవశేషాలు ఈ వ్యాధికి ప్రధాన కారకాలుగా వైద్యులు తేల్చి చెబుతున్నారు. ఈ మందులను పిచికారి చేసిన 60శాతం మందిలో వీటి ప్రభావం చూపిస్తుండగా, మరో 30 శాతం మందికి వీటి అవశేషాలున్న ఆహార పదార్ధాలు తీసుకోవడంవల్ల వ్యాధి సోకుతున్నట్లు నిపుణుల అధ్యయనంలో తేలింది. రాష్ట్రంలో ఏటా ఈ తరహా కేసులు 3ృ4 వేలకు పైనే నమోదవుతున్నట్టు.. మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నట్లు అంచనా. అయితే, దీనిపై ప్రత్యేకంగా ఎక్కడా రిజిస్ట్రీ (రికార్డులు)లు లేవు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి తదితర బోధనాసుపత్రుల్లోని పాథాలజీ విభాగాల్లోనే ఈ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఎక్కువగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో నమోదవుతున్నట్టు తెలుస్తోంది. పాతికేళ్లలోపు యువతీ యువకులు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతుండడంపై వైద్యులూ విస్మయం వ్యక్తంచేస్తున్నారు. తీవ్ర ఆందోళన కలిగిస్తున్న ఈ పరిణామంపై అటు అధికారులు, ఇటు ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరాన్ని ఈ వ్యాధి గుర్తుచేస్తోంది. రక్తకణాలు, ప్లేట్లెట్లకు విఘాతం తెల్ల, ఎర్ర రక్తకణాలు, ప్లేట్లెట్లు శరీరానికి వ్యాధి నిరోధక శక్తినిస్తుంటాయి. ఇంతటి శక్తివంతమైన ఈ రక్షణ వ్యవస్థపై ఇప్పుడు పురుగు మందుల రూపంలో దాడి జరుగుతుండడంతో శరీర రక్షణ గోడ బీటలువారుతోంది. ఎముకల్లోని మూలుగ (స్టెమ్ సెల్స్)పై నేరుగా దాడిచేస్తున్న ఈ వ్యాధివల్ల ఎర్ర, తెల్ల రక్తకణాలు, ప్లేట్లెట్ల ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలుగుతోంది. రకరకాల రక్తసంబంధిత సమస్యలతో బాధితులను పీల్చిపిప్పి చేస్తోంది. ఇది ఓ రకంగా రక్తహీనత వ్యాధి కావడంతో బాధితులు నిత్యం రక్తం, ప్లేట్లెట్లు ఎక్కించుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు.. శరీరానికి రక్షణ గోడలా ఉండే మూలుగలోని మూలకణాలపై ఇప్పటివరకూ వైరస్లు, బాక్టీరియాలే దాడి చేసేవి. ఇప్పుడు కొత్తగా పురుగు మందుల ప్రభావం ఎక్కువవుతోంది. దీనివల్ల సోకుతున్న ‘ఎప్లాస్టిక్ ఎనీమియా’ను బోన్మారో ఫెయిలూర్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తున్నారు. క్రిమిసంహారక మందుల్లో ఇవే ప్రధానం ఎముకలోని మూలుగ మీద అత్యంత ప్రభావం చూపిస్తున్న క్రిమిసంహారక మందుల్లోని ప్రధానమైనవి... ఆర్గానో ఫాస్పేట్, కార్బొమేట్స్, ఆర్గానో క్లోరిన్, పారాక్వాట్ వంటివి. ఎంతో శక్తి వంతమైన రసాయనాలు కలిసి ఉన్న ఈ క్రిమిసంహారకాలను పిచ్చికారి చేసే సమయంలో నేరుగా పీల్చినప్పుడు లేదా ఆహార పదార్థాల్లో పేరుకుపోయిన అవశేషాలను తీసుకున్నప్పుడు దీని ప్రభావం నేరుగా ఎముకల్లోని మూలుగపై చూపిస్తోంది. మరోవైపు.. ఎరాస్టీన్ బార్ వైరస్, హెపటైటిస్ృఎ, హెపటైటిస్ృబి, హెపటైటిస్ృసి, పార్వో వైరస్లు కూడా ఎప్లాస్టిక్ ఎనీమియా వ్యాధికి కారణమవుతున్నాయి. ఈ వైరస్ల దాడి ముందే ఊహించలేమని వైద్యులు చెబుతున్నారు. రకరకాల జబ్బులకు మనం వాడే మందులు కూడా ఒక్కోసారి ఇలాంటి భయంకరమైన వ్యాధులకు కారణమవుతున్నాయి. ఫినైటాయిన్, కార్బమొజపైన్, కార్బమొజోల్, నాన్ స్టెరాయిడ్స్ ఇన్ఫ్లమేషన్ స్టెరాయిడ్ డ్రగ్స్, యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ వంటివి కూడా శరీరంలోని ఇమ్యూనిటీ (వ్యాధినిరోధక శక్తి)పై ప్రతికూలంగా పనిచేసి రక్తహీనత జబ్బులకు కారణమవుతున్నట్టు తేల్చారు. వ్యాధి లక్షణాలు.. - ఈ వ్యాధి సోకిన బాధితుల ముఖం పాలిపోయినట్టు ఉంటుంది. - చిగుళ్ల నుంచి రక్తం కారుతుంది. - తెల్లరక్త కణాలు తగ్గే కొద్దీ తీవ్రంగా జ్వరం వస్తూంటుంది. - ప్లేట్లెట్లు తగ్గడం కారణంగా ముక్కు నుంచిగానీ, నోటి నుంచి గానీ రక్తం వస్తుంది. - శరీరమంతా ఎర్రని మచ్చలు వస్తాయి. - వ్యాధి తీవ్రత పెరిగేకొద్దీ ఎలాంటి పనిచేయడానికీ ఆసక్తి ఉండదు. - శరీరమంతా నిస్సత్తువ ఆవహిస్తుంది. - ప్రధానంగా ఆయాసం ఎక్కువగా ఉంటుంది. వ్యాధివల్ల ఏం జరుగుతుందంటే.. - ఎప్లాస్టిక్ ఎనీమియా వల్ల ప్రధానంగా శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పడిపోతుంది. - తెల్లరక్త కణాలు తీవ్రంగా పడిపోతాయి. - ప్లేట్లెట్స్ వందల్లోకి చేరుతాయి. దీనివల్ల మనిషి రోజురోజుకు నీరసపడిపోతాడు. - సాధారణంగా ఆరోగ్యవంతుడికి హిమోగ్లోబిన్ 14 ఉండాలి. కానీ, ఈ వ్యాధి బాధితుడికి రెండుకి పడిపోతుంది. - ప్లేట్లెట్లు సాధారణంగా 1.50 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉండాలి. అలాంటిది వెయ్యికి కూడా పడిపోతాయి. దీనంతటికీ కారణం.. మూలుగులో తెల్లరక్త కణాలు, ఎర్రరక్త కణాలు, ప్లేట్లెట్లు ఉత్పత్తి కాకపోవడమే. ఎలా నిర్ధారిస్తారంటే.. - ఎప్లాస్టిక్ ఎనీమియా బాధితులకు ప్రధానంగా సీబీసీ (కంప్లీట్ బ్లడ్ కౌంట్) పరీక్ష చేసి ఎర్రరక్త కణాలు, తెల్లరక్త కణాలు, ప్లేట్లెట్ల సంఖ్యను అంచనా వేస్తారు - రెటిక్యులో సైట్ కౌంట్ అనే ప్రధానమైన పరీక్ష చేస్తారు - ఫ్యామిలీ హిస్టరీని పరిశీలించి జన్యుపరంగా ఏమైనా వచ్చిందా అని చూస్తారు - కాలేయం పరీక్ష విధిగా నిర్వహిస్తారు - విటమిన్ బి1, బి12, థైరాయిడ్ పరీక్షల ద్వారా.. - బోన్మారో బయాప్సీ (మూలుగలోని ఒక భాగాన్ని) ద్వారా.. ఇవన్నీ చేశాకే ఎప్లాస్టిక్ ఎనీమియా వ్యాధిని నిర్ధారిస్తారు. మూడు రకాలుగా చికిత్స ఈ వ్యాధిగ్రస్తులు పూర్తిస్థాయిలో కోలుకోవాలంటే బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్ ఓ మార్గమని వైద్యులు చెబుతున్నారు. అంటే ఉన్న మూలకణాల (మూలుగ)ను పూర్తిగా తొలగించి కొత్త మూలకణాలను ఎక్కించడం. దీనికి కనీసం రూ.30లక్షలు పైగా ఖర్చవుతుంది. రెండో రకం చికిత్సలో.. గుర్రం నుంచి సేకరించిన కణాలను శుద్ధిచేసి వ్యాధిగ్రస్తుడికి ఎక్కించడం. ఒక కిలో బరువుకు 40 మిల్లీ గ్రాముల సీరం ఎక్కించాలి. అంటే మనిషి బరువు 60 కేజీలు అనుకుంటే 2400మి.గ్రా హార్స్ సీరం ఎక్కించాలి. ఇందుకు సుమారు రూ.7 లక్షలు అవుతుంది. ఈ విధానంలో రోగి 70 శాతం మేరకే కోలుకునే అవకాశం ఉంటుంది. ఇక మూడో విధానంలో.. వ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే మందులతోనే నయం చేయవచ్చు. ఇది దీర్ఘకాలిక ప్రక్రియ. సుమారు రెండేళ్లపాటు మందులు వాడాల్సి ఉంటుంది. ఈ విధానంలో ప్లేట్లెట్ల సంఖ్య పడిపోకుండా ఉండే అవకాశం ఉంది. కాగా, ఆరోగ్యశ్రీ జాబితాలో ఈ వ్యాధి లేనందున చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రీయింబర్స్మెంట్కు దరఖాస్తు చేసుకున్నా డబ్బులు ఇవ్వడంలేదు. కనీసం జాబితాలోనైనా చేరిస్తే కొంతవరకు వైద్యం దక్కుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గుంటూరు జిల్లాలోనే అత్యధికం రాష్ట్రంలో క్రిమిసంహార మందుల వాడకం గతంతో పోలిస్తే కొంత తగ్గినా వాటి ప్రభావం ప్రజల జీవితాలపై తీవ్రంగానే ఉంది. రాష్ట్రంలో పురుగు మందుల వాడకం గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా ఉంది. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 2,800 టన్నుల పురుగు మందులు వాడితే.. ఈ ఒక్క జిల్లాలోనే 1100 టన్నుల పురుగు మందులను ఉపయోగించడం గమనార్హం. ఎక్కువగా మిరప, పత్తి పైర్లకు ఉపయోగిస్తున్నారు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై కాస్త అవగాహన కలిగిన నేపథ్యంలో క్రిమిసంహారక మందుల వాడకం కొంత తగ్గినా ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపలేనంతగా తగ్గలేదని నిపుణుల అభిప్రాయం. ఇటీవల ఈ కేసులు బాగా పెరిగాయి ఎప్లాస్టిక్ ఎనీమియా వ్యాధి వైరస్, బాక్టీరియాలతో పాటు ఎక్కువగా రసాయన పురుగు మందుల అవశేషాల కారణంగా వస్తున్నట్టు మా పరిశీలనలో తెలుస్తోంది. జబ్బు యుక్త వయసు వారికి వస్తుండటం బాధాకరం. ఈ జబ్బుతో ప్రధానంగా ప్లేట్లెట్లు గణనీయంగా పడిపోతాయి. వీటిని ఒక్కసారి ఎక్కించాలంటే రూ.10 వేలు ఖర్చు అవుతుంది. అలా తరచూ ఎక్కించడం వ్యయంతో కూడుకున్నది. ఈ జబ్బును గుర్తించడానికి బోన్మారో బయాప్సీ, జెనెటిక్స్ క్రోమోజోమ్, థైరాయిడ్, బి12, ఐరన్ డెఫిషియన్సీ తదితర పరీక్షలు చేసి నిర్ధారిస్తాం. ఆయాసం, నీరసం, తలనొప్పి, తరచూ రక్తస్రావం వంటి లక్షణాలుంటాయి. తొలి దశలో గుర్తిస్తే మందులతో జీవితకాలాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువగా గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి బాధితులు వస్తున్నారు. దీన్నిబట్టి పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉపయోగించే ప్రాంతాల వారు అని ప్రాథమికంగా గుర్తించాం. - డా.రవికిరణ్ బొబ్బా, హిమటాలజిస్ట్ (రక్తవ్యాధుల నిపుణులు) రవి అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి, విజయవాడ. -
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ..
చందంపేట (దేవరకొండ) : కులం పేరుతో దూషించాడని మనస్తానికి గురైన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం నేరెడుగొమ్ము మండల కేంద్రం లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన శీల తిరుపతయ్య(40) గ్రామ సమీపంలో తనకున్న ఎకరన్నర భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. గత నెల 22న తన పొలం బావి పక్కనే రైతు సంగెం సత్యనారాయణ బోరు వేశాడు. దీంతో తన బావి ఎండిపోతుందని స్థానిక తహసీల్దార్కు తిరుపతయ్య ఫిర్యాదు చేశాడు. దీంతో రెవెన్యూ అధికారులు బోరును సీజ్ చేశారు. కాగా ఆదివారం మధ్యాహ్నం తిరుపతయ్య తన పొలం పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. ఈ క్రమంలోనే తన బోరును సీజ్ చేయించాడని తిరుపతయ్యపై కక్ష పెంచుకున్న సంగెం సత్యనారాయణ, కుమారులు యాదయ్య, వెంకన్న తిరుపతయ్యపై దాడి చేశారు. స్థాని కులు గమనించి అడ్డుకొని పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుదామని ఇరువురికి నచ్చజెప్పి పంపించారు. తిరిగి అదేరోజు రాత్రి తిరుపతయ్య ఇంటిపై సత్యనారాయణ కుటుంబ సభ్యులపై దాడి చేసి కులం పేరుతో దూషించారు. దీంతో మనస్తాపానికి గురైన తిరుపతయ్య ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో అందరూ నిద్రించిన సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలోనే మతిచెందాడు. తిరుపతయ్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఏరియాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్కుమార్ తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ.. తిరుపతయ్య మతి చెందిన విషయం తెలుసుకున్న మిర్యాలగూడ డీఎస్పీ రాంగోపాల్రావు ఘటన స్థలానికి చేరుకుని మతుని బంధువులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో మతదేహాన్ని పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నేరెగుడుగొమ్ము మండల కేంద్రంలో పోలీసుల పికెట్ ఏర్పాటు చేయించారు. -
ఒంటరి యువతిని ఇంట్లో బంధించి..
సాక్షి, యాదాద్రి : యాదాద్రి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిని ఇంట్లో బంధించి పురుగుల మందు తాగించడంతో ఆమె మృతిచెందింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం జై కేసారంలో ఓ ఇంట్లోకి కొందరు గుర్తుతెలియని దుండగులు చొరబడ్డారు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిని బంధించారు. అంతటితో ఆగని ఆ దుండగులు యువతికి బలవంతంగా పురుగుల మందు తాగించి అక్కడినుంచి పరారైనట్లు సమాచారం. ఇది గమనించిన స్థానికులు యువతిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ఆమె మృతిచెందినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎరువులు ప్రియం
అన్నదాతపై భారం మోపేందుకు రంగం సిద్ధం - వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలు - పన్ను తగ్గించాలని కోరుతున్న రైతు సంఘాలు - పాత నిల్వల్ని పాత రేటుకే ఇవ్వాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రైతులపై ఎరువుల భారం మోపేందుకు రంగం సిద్ధమైంది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నేపథ్యంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచే అన్ని రకాల ఎరువుల ధరలు పెరగనున్నాయి. ఇప్పటివరకు పన్నులు లేకుండా విక్రయిస్తున్న కొన్ని రకాల సూక్ష్మ పోషకాల ఎరువుల ధరలకు కూడా రెక్కలు రానున్నాయి. పెరిగిన ధరలు వచ్చేనెల ఒకటి నుంచి అమలవుతాయి. ఈ మేరకు ఎరువుల డీలర్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. మరోవైపు పాత నిల్వల్ని పాత రేటుకే పంపిణీ చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నెలాఖరులోగా కొనుగోలు చేసే వాటికే పాత ధరలు ఉంటాయని కంపెనీలు చెబుతున్నాయి. ఇప్పటికే కనీస మద్దతు ధర లేక కొట్టుమిట్టాడుతున్న రైతులను ఎరువుల ధరల పెంపు మరిన్ని నష్టాల్లోకి నెట్టేయనుంది. ఇక యూరియా బస్తా రూ.315 కేంద్ర ప్రభుత్వం అత్యధిక సబ్సిడీతో ఇచ్చే 50 కిలోల యూరియా బస్తాపై గరిష్టంగా రు.17.68 పెరగనుంది. ప్రస్తుతం యూరియా బస్తా రూ.298 ఉండగా జూలై ఒకటి నుంచి అది రూ.315.68 కానుంది. ఇప్పటి వరకు పన్నులు లేకుండా ఎరువుల్ని విక్రయించిన తమిళనాడు, పంజాబ్, హరియాణా, గుజరాత్ సైతం ఇకపై ఈ ధరకే విక్రయించాల్సి ఉంటుంది. డై అమోనియం పాస్పేట్ (డీఏపీ), కాంప్లెక్స్ ఎరువుల ధరలు కూడా పెరుగుతాయి. ప్రస్తుతం డీఏపీ బస్తా రూ.1,086.50 ఉండగా ఇకపై రూ.62 పెరిగి రూ.1,149 కానుందని కంపెనీలు చెబుతున్నాయి. డీలర్లు మాత్రం రు.76 పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఎరువుల ధరల ఉత్పత్తి వ్యయం ఆయా కంపెనీల సామర్థ్యం, స్థాపనను అనుసరించి ఉంటుంది. ఇఫ్కో, క్రిబ్కో వంటి కంపెనీల ధరలు కాస్త తక్కువగా, మద్రాస్ ఫెర్టిలైజర్స్ వంటి వాటి ధరలు కొంత ఎక్కువగా ఉంటాయి. తెలంగాణలో వానాకాలానికి 8 లక్షల మెట్రిక్ టన్నులు, యాసంగికి రూ. 5.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. అలాగే వ్యవసాయ సీజన్కు 2.5 లక్షల డీఏపీని సరఫరా చేయాలని లక్ష్యంగా ప్రకటించింది. ఈ లెక్కన పెరిగే ధరలతో రైతులపై రూ.82.27 కోట్ల అదనపు భారం పడనుంది. పురుగు మందులపై 18 శాతం పన్ను దుక్కుల్లో వేసే జింక్, మెగ్నీషియం, ఇతరత్రా సూక్ష్మపోషకాలు, బయో ఫెర్టిలైజర్ల ధరలు సగటున 5.7 శాతం పెరగనున్నాయి. క్రిమిసంహారక మందులపై ఏకంగా 18 శాతం పెరుగుతాయని అంచనా. ఎరువులు, పురుగు మందులు, సూక్ష్మపోషకాలు అన్నింటి ధరలు పెరగడంతో రాష్ట్రంలో రైతులపై దాదాపు రూ.200 కోట్ల అదనపు భారం పడనుందని అంచనా వేస్తున్నారు. ఎరువులపై విధించే 12 శాతం పన్నుల్లో కేంద్రానికి 5, రాష్ట్రానికి 7 శాతం వస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నోరెత్తడం లేదని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. చెప్పులపై 12 శాతం పన్ను విధించినందుకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంతో పోరాడి తగ్గించుకున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కనీసం కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాసి ఎరువులపై పన్ను తగ్గించేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నిస్తున్నారు. -
విత్తనాలు, పురుగు మందులూ ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: ఎరువులనే కాకుండా మహారాష్ట్రలో ఇస్తున్నట్టుగా విత్తనాలు, పురుగు మందులు కూడా రైతులకు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వరుస కరువు, ప్రకృతి వైపరీత్యాలు, రుణ సమస్యలు, మార్కెటింగ్ సమస్యలు వంటివి ఎన్నో రైతులకు ఇబ్బంది కలిగిస్తున్నాయన్నారు. రైతులకు ఎరువులను మాత్రమే కాకుండా ఉపాధిహామీ కూలీలను రైతులకు అటాచ్ చేస్తే కూలీల సమస్య నుండి రైతులకు ఉపశమనం కలుగుతుందన్నారు. అసెంబ్లీలో ఎంతసేపు అయినా చర్చించుకుందామని చెబుతూనే హడావుడిగా, ఆదరా బాదరాగా అసెంబ్లీని వాయిదావేశారని అన్నారు. మిర్చికి గిట్టుబాటు ధరలేక, కొనేవారు లేక రైతులు విలవిల్లాడుతున్నారని అన్నారు. దీనిపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని చిన్నారెడ్డి ప్రశ్నించారు. -
కౌలురైతు ఆత్మహత్య
దొర్నిపాడు: మండల కేంద్రమైన దొర్నిపాడులో శుక్రవారం తెల్లవారుజామున బత్తులనాగన్న (45) అనే కౌలురైతు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దొర్నిపాడు ఏఎస్ఐ బాలచంద్రుడు చెప్పిన వివరాల మేరకు.. బత్తులనాగన్న ఈ ఏడాది తనకున్న 2 ఎకరాల సొంతపొలంతోపాటు 4ఎకరాలు కౌలుకుతీసుకుని పత్తిపంట సాగుచేశాడు. పెట్టుబడుల కోసం రూ.లక్ష రూపాయల వరకు అప్పులు చేశాడు. గతంలో పంట పండించేందుకు చేసిన అప్పులు, ప్రస్తుతం చేసిన అప్పులు ఎక్కువ కావడంతో శుక్రవారం తెల్లవారుజామున పొలం వద్దకు వెళ్లి క్రిమిసంహారక మందు తాగి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. చుట్టుపక్కల రైతులు గమనించి చికిత్స కోసం.. నంద్యాలకు తరలిస్తుండగా మృతి చెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
వేధింపులు తాళలేక..
ఆస్పరి: వేధింపులకు తాళలేక ఆస్పరికి చెందిన శివమ్మ (32) అనే మహిళ పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ వెంకటరమణ తెలిపారు. బిణిగేరికి చెందిన శివమ్మకు, ఆస్పరికి చెందిన శాంతప్పతో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 8 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. శివమ్మను భర్త శాంతప్ప, అత్త నారాయణమ్మ సూటిపోటి మాటలతో వేధించేవారు. పొలం పనులు చేయడం రాదని, రెండో పెళ్లి చేసుకుంటానని భర్త శాంతప్ప బెదరిస్తుండటంతో శివమ్మ మానసికంగా కుంగిపోయింది. గురువారం రాత్రి ఇంట్లో పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి అపస్మారక స్థితికి చేరుకుంది. బంధువులు గమనించి ఆమెను చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె మృతి చెందింది. శివమ్మ తండ్రి వెంకటరాముడు ఫిర్యాదు మేరకు.. ఆమె భర్త, అత్తపై కేసు నమోదు చేశామని ఎస్ఐ వెంకటరమణ తెలిపారు. -
రూ.48 లక్షలు విలువ చేసే నకిలీ మందులు సీజ్
-
న కిలీ ‘బయో’
– పురుగు మందుల తయారీ కేంద్రంపై ‘విజిలెన్స్’ దాడులు – రూ.48 లక్షలు విలువ చేసే నకిలీ మందులు సీజ్ కర్నూలు: కర్నూలు శివారులోని కారై్బడ్ ఫ్యాక్టరీకి ఎదురుగా ఆర్టీసీ కాలనీలో ఉన్న నకిలీ పురుగు మందుల తయారీ కేంద్రంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన భాస్కర్సింగ్ ఆర్టీసీ కాలనీలో ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని బయో ఫెస్టిసైడ్స్ ముసుగులో నకిలీ పురుగు మందులను తయారు చేస్తున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంటు ప్రాంతీయ అధికారి శివకోటి బాబురావు, సీఐ జగన్మోçßæన్రెడ్డి, ఎస్ఐ సుబ్బరాయుడు, వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు మునిస్వామి, ఈశ్వర్ తదితరులతో కూడిన బందం బుధవారం దాడులు నిర్వహించింది. సుమారు రూ.48 లక్షలు విలువ చేసే నకిలీ మందులతో పాటు తయారీ కేంద్రం, కల్లూరులోని గోడౌన్ను సీజ్ చేశారు. ఏజెంట్ల ద్వారా వ్యాపారం: ఏఎస్ఎన్ ఆగ్రో ప్రొడక్ట్స్, అనిల్ అగ్రో ప్రొడక్ట్స్, విట్రో అగ్రో కెమికల్స్ కంపెనీల పేరుతో తయారు చేసిన నకిలీ పురుగు మందులను ఏజెంట్ల ద్వారా జిల్లాలోని రైతాంగానికి అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నాడు. అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్లోని ప్రధాన కంపెనీల పేర్లతో పురుగుల మందును తయారు చేసి జిల్లా అంతటా సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెలుగు చూసింది. తయారీ దారుడిపై క్రిమినల్ కేసు నమోదు: ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన భాస్కర్ సింగ్ కర్నూలులో నివాసం ఏర్పాటు చేసుకుని బయో ఉత్పత్తుల పేరుతో నకిలీ మందుల వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం అందింది. దాడులు నిర్వహించి అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి, తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంటు ప్రాంతీయ అధికారి శివకోటి బాబురావు తెలిపారు. రైతులు గుర్తింపు పొందిన సంస్థలు తయారు చేసిన పురుగు మందులు మాత్రమే వాడాలని విజ్ఞప్తి చేశారు. మందులు కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా బిల్లులు తీసుకోవాలని సూచించారు. -
పురుగు మందులతో తస్మాత్ జాగ్రత్త!
తిరుమలగిరి : సేంద్రియ పద్ధతులతో పంటలు పండించే రోజులు పోయాయి. ప్రస్తుతం ప్రతి పంటకు క్రిమిసంహారక మందులను పిచికారీ చేయడం సర్వసాధారణమైంది. చీడపీడలు సేంద్రియ మందులకు సైతం లొంగని పరిస్థితి ప్రస్తుతం ఏర్పడటంతో రసాయన మందులు అధిక మోతాదులో పిచికారీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ప్రధానంగా పత్తి, వరి, పెసర తదితర పంటలకు తెగులు ఆశించడంతో రైతులు రసాయన మందులు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో క్రిమిసంహారక మందులను ఎలా పిచికారీ చేయాలి.. రైతుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మండల వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు ఇస్తున్న పలు సూచనలు ఆయన మాటల్లోనే.. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. 1. పురుగుమందుల డబ్బాలను వినియోగించడానికి ముందు డబ్బాపై ఉన్నలేబుళ్లు, వివరాల పత్రాలను జాగ్రత్తగా చదవాలి. 2. క్రిమి సంహారక మందులు నీటిలో కలిపేటప్పుడు చేతితో కాకుండా చిన్నపాటి కట్టెతో కలపాలి. 3. దుస్తులపై గాని, కిందగాని పడనీయకుండా ఇతర సాధనాలను ఉపయోగించి పిచికారీ చేసే డబ్బాలో పోసుకోవాలి. 4. పిచికారీ సమయంలో శరీరానికి పూర్తి రక్షణ కల్పించే దుస్తులు ధరించాలి. ముక్కులకు మాస్కులు, చేతులకు తొడుగులు, కళ్లకు అద్దాలు, కాళ్లకు నిండుగా బూట్లు ధరించిన తరువాతనే పిచికారీ చేయాలి. 5. గాలి వీచే దశలోనే మందులను పిచికారీ చేయాలి. 6. గాలికి ఎదురుగా పిచికారీ చేయడం ప్రాణాంతకం. 7. డబ్బాలకు గల నాజిళ్లు శుభ్ర పరచడానికి నోటితో గాలిని ఊదవొద్దు. 8. ఆహార పదార్థాలతో పాటు పురుగు మందులను తీసుకెళ్లకూడదు. 9. ప్రధానంగా పురుగు మందుల డబ్బాను పిల్లలకు అందకుండా ఎల్తైన ప్రదేశాల్లో భద్రపర్చుకోవాలి. 10. పురుగు మందులను పిచికారీ చేసేటప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవద్దు. 11. బీడీ, సిగరెట్లు తాగవద్దు. 12. పిచికారీ సమయంలో మందు ఒంటిపై గాని, దుస్తులపై పడగానే వెంటనే శుభ్రం చేసుకోవాలి. 13. పిచికారీ చేసిన తరువాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. 14. కాలి మందుల డబ్బాలను ధ్వంసం చేయడం, కాల్చి వేయడం లేదా గొయ్యి తవ్వి పాతిపెట్టాలి. 15. మందు చల్లిన పొలం వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. 16. ప్రమాదవశాత్తు విష ప్రమాదానికి లోనయితే వెంటనే వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స చేయించుకోవాలి. 17. ఏ పురుగు మందులను వాడారో ఆ కరపత్రాన్ని వైద్యులకు చూపించినట్లయితే వైద్యం చేయడం సులభమవుతుంది. -
ఖరీఫ్లో చీడపీడల నివారణకు పిచికారి
కంగ్టి:ఖరీఫ్ పంటలైన పెసర, మినుము, సోయా పంటలకు చీడపీడల బెడద ఎక్కువ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో గత ఇరవై రోజులుగా వర్షాలు లేకపోగా ఎండలకు పంటలు వాడిపోతుండడంతో పూత రాలే పరిస్థితి నెలకొంది. మధ్యాహ్న సమయంలో పెసర, మినుము, సోయా, మొక్కజొన్న, పత్తి పంటలు వాడుముఖం పడుతున్నాయి. దీనికి తోడు పంటలపై చీడపీడలు ఆశించడంతో రసాయన క్రిమిసంహారకాలు పిచికారి చేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. రసాయన క్రిమిసంహారకాలు పిచికారి చేయడంతో భూమిలో తేమలేక పూత రాలుతోందని కొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చీడపీడల బెడదతో పెట్టుబడి వ్యయం అదనంగా పడుతోంది. పంటల ప్రారంభంలో వర్షాలు సంతృప్తికరంగా కురిసినా పూత, కాత దశలో వర్షాభావం వల్ల పంటలు నష్టపోయే పరిస్థితి నెలకొందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
సస్యరక్షణకు సమయమిదే..
సోయాబీన్కు తెల్లదోమ బెడద ఆందోళన అవసరం లేదు వ్యవసాయ జిల్లా ఉపసంచాలకులు మాధవి శ్రీలత జగదేవ్పూర్: రైతులు పంటల సస్యరక్షణ చర్యలు చేపట్టాలని, ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని జిల్లా వ్యవసాయ సంచాలకులు మాధవిశ్రీలత అన్నారు. గురువారం సాయంత్రం సీఎం దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో సాగవుతున్న సోయాబీన్ పంటలను జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్తో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు గ్రామాల్లో సోయాబీన్ సంటలు బాగానే ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. సోయాబీన్ పంటలను సాగు చేసిన రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం పంటలు ఆర్థిక వయో పరిమితి దశలో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం వర్షాలు లేనందున్న పంటలకు తెల్లదోమ సోకే అవకాశం ఉందని, దోమ నివారణకు రైతులు తగిన పురుగుల మందులను కొట్టాలన్నారు. లార్వీన్, అవైట్, రీమాన్లాంటి మందులను పంటలకు పిచికారీ చేయాలని సూచించారు. వర్షం కురిసిన వెంటనే పంటలకు పోటాషియం వేయాలన్నారు. కార్యక్రమంలో వీడీసీ గౌరవ అధ్యక్షులు బాల్రాజు, ఏఓ నాగరాజు, ఏఈఓ దామోదర్, గ్రామ రైతులు సత్తయ్య, ప్రభాకర్రెడ్డి, వెంకట్రెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
రుణంపై రణం !
జిల్లాలో మిర్చి విత్తనాల కొరతపై అధికార, ప్రతిపక్ష సభ్యులు ధ్వజమెత్తారు. రైతులకు విత్తనాలు అందడం లేదంటూ వ్యవసాయాధికారులను నిలదీశారు. గుంటూరులోని జిల్లా పరిషత్ కార్యాలయం సమావేశం హాలులో శుక్రవారం జెడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం వాడీవేడిగా జరిగింది. సాక్షి, అమరావతి / గుంటూరు వెస్ట్ : జెడ్పీ సమావేశంలో మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని రైతులకు జాతీయ, సొసైటీ బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధ్వజమెత్తారు. నూతక్కి గ్రామంలో ఎరువులు అందక రైతులు నానా అగచాట్లు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో వ్యవసాయానికి సహకరించాలని సభను కోరారు. దీనిపై తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ కలగజేసుకుని ల్యాండ్పూలింగ్లో ఉన్న భూములకు రుణాలు ఏ విధంగా అందుతాయని ఎద్దేవా చేయడంతో ఆర్కే తీవ్రంగా స్పందించారు. వ్యవసాయానికి సహకరించాలని కోరుతున్నామని, జిల్లా సంయుక్త కలెక్టర్ కూడా వ్యవసాయానికి ఆటంకం కలిగించబోమని తమకు లేఖను కూడా పంపించారని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం ఇష్టం లేని మీరు ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నారని శ్రావణ్కుమార్ విమర్శించారు. దీనిపై ఆర్కే తాము రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని, ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణాన్ని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తాము రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం అయితే ప్రభుత్వం ల్యాండ్పూలింగ్లో భూములు తీసుకునేది కాదని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో అంతరించిపోతున్న వ్యవసాయాన్ని కాపాడాలనేదే తమ ప్రయత్నమని ఆర్కే పునరుద్ఘాటించారు. సభను పక్కదోవపట్టించేందుకు శ్రావణ్కుమార్ చేసిన ప్రయత్నాలను ఆర్కే సమర్థంగా తిప్పికొట్టారు. విత్తనాలేవీ... జిల్లాలో మిర్చి విత్తనాల కొరతపై పిడుగురాళ్ల జెడ్పీటీసీ వీరభద్రుని రామిరెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుడు డీవీడీ కృపాదాసును నిలదీశారు. మీ అలసత్వం వల్ల రైతులు ఇబ్బందిపడుతున్నారని మండిపడ్డారు. ఈ దశలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జోక్యం చేసుకుని విత్తనాలు, ఎరువుల కొరత లేదని చెప్పే ప్రయత్నం చేశారు. విత్తనాలు ఉండి మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నామో చెప్పండి అంటూ ఎమ్మెల్యే మంత్రిని సూటిగా ప్రశ్నించారు. అధికారులు సక్రమంగా పనిచేయడం లేదంటూ చురకలు అంటించారు. ఇప్పటివరకు మట్టినమూనాలు ఇవ్వలేదని, ఇంకా రుణవిముక్తి పత్రాలు అందలేదని, యాంత్రీకరణ పరికరాలు సక్రమంగా అందజేయడం లేదంటూ పలువురు సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. కృష్ణా పశ్చిమ డెల్టాలో సాగునీరు ఎప్పుడు విడుదల చేస్తారో తెలపాలని నిజాంపట్నం జెడ్పీటీసీ ప్రసాదం వాసుదేవ కోరారు. హైలెవెల్ కెనాల్ ద్వారా 27 వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదని, ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయాలని దుగ్గిరాల జెడ్పీటీసీ యేళ్ల జయలక్ష్మి కోరారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండటం లేదంటూ .. గ్రామాల్లో వైద్యసిబ్బంది అందుబాటులో ఉండటం లేదని వినుకొండ ఎమ్మేల్యే జీవీ ఆంజనేయులు సభ దృష్టికి తీసుకువచ్చారు. వినుకొండ పీహెచ్సీలో ఇన్చార్జి వైద్యుడు బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ, సక్రమంగా విధులు చేయడం లే దన్నారు. అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని, వెంటనే బదిలీ చేయాలని కోరారు. బిల్లుల జాప్యంపై.. ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల బిల్లులు అందడం లేదంటూ ఆర్డబ్ల్యుఎస్, డ్వామా అధికారులపై ఎంఎల్ఏలు నక్కా ఆనందబాబు, జీవీ ఆంజనేయులుతోపాటు పలువురు సభ్యులు ధ్వజమెత్తారు. కేజీబీవీలు, కంప్యూటర్ ఆపరేటర్లకు నాలుగు నెలలుగా బిల్లులు చెల్లించడం లేదని, అదనపు తరగతులు నిర్మించినా బిల్లులు చెల్లించడంలేదని ఎమ్మెల్సీలు బొడ్డు నాగేశ్వరరావు, ఏఎస్ రామకృష్ణ పేర్కొన్నారు. కోరం లేదంటూ.. తొలుత చైర్పర్సన్ సమావేశాన్ని ప్రారంభించబోగా కోరం లేదంటూ వైఎస్సార్ సీపీ సభ్యులు దేవళ్ల రేవతి, యేళ్ల జయలక్ష్మి, రామిరెడ్డి అడ్డుకున్నారు. కోరం లేకుండానే సమావేశం ఎలా జరుపుతారని ప్రశ్నించారు. జెడ్పీ ఇన్చార్జి సీఈఓ సోమేపల్లి వెంకటసుబ్బయ్య జోక్యం చేసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇంతలో కొంతమంది సభ్యులు రావడం కోరం సరిపోవడంతో సమావేశాన్ని ప్రారంభించారు. చినకాకానిలో స్థలంపై... ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలో 59/2 సర్వే నెంబర్లో 55 సెంట్ల భూమిని పెట్రోలు బంకుకు లీజుకు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. నేషనల్ హైవేకి పక్కన ఆస్థలం ఉందని, ఎకరా రూ.10 కోట్లు నుంచి రూ.12 కోట్లు వరకు పలుకుతుందన్నారు. దీని ప్రకారం రూ.6 కోట్ల నుంచి 7 కోట్ల విలువైన స్థలాన్ని పెట్రోలు బంకుకు కేటాయించడం తగదన్నారు. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ భవనాలు కట్టుకోవడానికి ఈ స్థలాన్ని వినియోగించు కోవచ్చన్నారు. లేదా జెడ్పీ భూమిగానే ఉంచాలని కోరారు. జెడ్పీలో ప్రవేశపెట్టిన అజెండా 315 తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. -
మెతుకు పండితే.. బతుకు పండగే
పుడమి గొంతులో పురుగు మందు పోస్తున్నారు. మొలకెత్తింది విషబీజమని తెలియక మురిసిపోతున్నారు. రుచిలేని దిగుబడి అద్భుతమని భ్రమిస్తున్నారు. నష్టపోయిన రోజు.. అదే పురుగు మందుతో ఊపిరి తీసుకుంటున్నారు. వీటన్నిటికీ ఒకటే పరిష్కారం.. పెట్టుబడి లేని వ్యవసాయం. బడుగు రైతు సైతం దిగుబడి సాధించాలి. ఆరోగ్యకరమైన పంటలతో ఆనందం అనుభవించాలి.. అదే లక్ష్యంగా ప్రకృతి వ్యవసాయం ఊపందుకుంటోంది. జీవామృతాలతో చేనుకు జీవం పోస్తోంది. అన్నదాత బతుకులో ఆశలు కురిపిస్తోంది. అద్భుతమైన పంటలతో జగతికి ఆదర్శంగా నిలవాలని తపిస్తోంది. బొబ్బిలి నియోజకవర్గంలోని మెట్టవలస క్లస్టర్లో వ్యవసాయశాఖ సాగిస్తున్న పకృతి వ్యవసాయ ప్రస్థానం విజయవంతంగా సాగిపోతోంది. ♦ ఊపందుకున్న ప్రకృతి వ్యవసాయం ♦ మెట్టవలస క్లస్టర్లో ప్రయోగాత్మకంగా అమలు ♦ వరి, వేరుశనగ, చెరకు,కూరగాయ పంటల సాగు ♦ ఆసక్తి చూపుతున్న వందలాది రైతులు బొబ్బిలి రూరల్: హరిత విప్లవం రైతుల పాలిట శాపంగా పరిణమించింది. బహుళ జాతి సంస్థల నుంచి పొటాష్ దిగుమతి చేసుకోవలసి వచ్చింది. యూరియా, నత్రజనితో మొదలైన సాగు దుష్పరిణామాలనిస్తోంది. రసాయనాల అవశేషం పంట గింజలను విషతుల్యం చేస్తోంది. జన్యులోపాలున్న పిల్లలకు.. వ్యాధుల విజృంభణకు కారణమవుతోంది. రైతుల జీవితాలను చిది మేస్తోంది. అప్పులపాలై రోడ్డు న పడేస్తోంది. ఇవన్నీ ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణుడు సుభాష్పాలేకర్ను కదిలించాయి. పెట్టుబడి లేని వ్యవసాయానికి రూపకల్పన చేయించాయి. ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ఆవి ష్కరించాయి. రుచికరమైన పోషక విలువలున్న ఆహారధాన్యాల ఉత్పత్తికి కారణమవుతున్నా యి. అన్నదాత కన్నీళ్లు తుడుస్తున్నాయి. పంటకు గిట్టుబాటుకు తెచ్చి పెడుతున్నాయి. ప్రకృతి వ్యవసాయాన్ని గుర్తించిన వ్యవసాయ శాఖ బొబ్బిలి మండలం మెట్టవలసను ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా సాగు చేయిస్తోంది. ప్రస్తుతం మెట్టవలస, గొర్లె సీతారాంపురం 100 మంది కూరగాయ రైతులు ఈ ఏడాది ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టారు. కాశిందొరవలస, నారాయణప్పవలస గ్రామాల్లో 30 మంది 100 ఎకరాల వరకు వరి, చెరకు పండిస్తున్నారు. ఈ ప్రభావంతో గోపాలరాయుడుపేట, నారసింహుని పేట, మల్లంపేటలో వేరుశనగ, చెరకు, వరి సాగు చేస్తున్నారు. అంతా సహజసిద్ధమే రసాయన ఎరువులు వాడకుండా సహజసిద్ధంగా లభించే ఆవుమూత్రం, ఆవుపేడ, పప్పుల పిండి, వివిధ రకాల ఆకులు, పుట్టమన్ను, బెల్లం తదితర పదార్థాలతో పండించడమే ప్రకృతి వ్యవసాయం. ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలకు మంచి డిమాండ్ ఉంటోంది. ఈ విధానంలో విత్తనశుద్ధి నుంచి పంటలకు కావలసిన పోషకపదార్థాలు, పురుగు మందుల నివారణకు రైతులే సొంతంగా మందులు తయారుచేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాలలో వీటిని ఇటీవల అందుబాటులో ఉంచారు. మెట్టవలసలో ఘన జీవామృతం, ద్రవజీవామృతం, నీమాస్త్రం తయారు చేస్తున్నారు. వెలుగు ఆధ్వర్యంలో వాండ్రాసి లక్ష్మి వీటిని తయారు చేసి విక్రయిస్తోంది. విత్తనశుద్ధికి బీజామృతం కావలసిన పదార్ధాలు: ఇరవై లీటర్ల నీరు, 5కిలోల ఆవుపేడ, 5 లీటర్ల ఆవు మూత్రం, సున్నం 50 గ్రాములు, గుప్పెడు పుట్టమన్ను. తయారీ విధానం: ఆవుపేడను 20 లీటర్ల నీటిలో మూటతో వేలాడదీసి, ఆవుమూత్రం, సున్నం కలిపి 12 గంటల పాటు ఉంచాలి. దీనిలో పుట్టమన్ను వేసి రోజుకు 2సార్లు కర్రతో కలిపి 3 రోజులుంచితే బీజామృతం తయారవుతుంది. వాడే విధానం.. ఉపయోగాలు: ఈ మిశ్రమాన్ని విత్తడానికి సిద్ధంగా ఉన్న విత్తనాలపై చల్లి, నీడలో ఆరబెట్టి నాటాలి. విత్తనాల నుంచి సంక్రమించే వ్యాధులను నివారిస్తుంది. అరటి పిలకలు, చెరుకు కణుపులు, వరి, ఉల్లి, మిరప, టమాటా, వంగ మొదలైన నారును బీజామృతంలో ముంచి నాటాలి. ‘ఘన’ మైన దిగుబడికి ‘జీవామృతం’ కావలసిన పదార్ధాలు: దేశవాళీ ఆవు పేడ 10 కిలోలు, ఆవు మూత్రం 10 లీటర్లు, బెల్లం 2 కిలోలు, పప్పుదినుసుల పిండి 2 కిలోలు, గుప్పెడు పుట్టమన్ను తయారీ విధానం: అన్ని పదార్ధాలతో ఆవు మూత్రాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఓ పాత్రలో బాగా మగ్గబెట్టి 7రోజులు ఉంచాలి. రోజూ తీసి కలపాలి. ఎండబెట్టి పొడిచేసి 6 నెలలు నిల్వ ఉంచుకోవచ్చు. ఉపయోగాలు: దీనిని ఆఖరి దుక్కులో వేస్తే పంటలకు ఎంతో మేలు కలుగుతుంది. పంటలకు కావలసిన అన్ని రకాల సూక్ష్మ, స్థూల పోషకాలకు ఉపయోగపడుతుంది. ద్రవ జీవామృతం కావలసిన పదార్ధాలు: నీరు 200 లీటర్లు, దేశవాళీ ఆవుపేడ 10 కిలోలు, ఆవుమూత్రం 10 లీటర్లు, బెల్లం 2కిలోలు లేదా 4 లీటర్ల చెరుకు రసం, పప్పు దినుసుల పిండి 2 కిలోలు, గుప్పెడు పుట్టమన్ను. తయారీ విధానం: పెద్ద డ్రమ్ములో 200 లీటర్ల నీటిని పోసిపైన చెప్పిన అన్నిటినీ పోసి బాగా కర్రతో కలపాలి. ఈ ద్రావణాన్ని 4 నుంచి 7రోజులు పులియబెట్టి రోజూ 3, 4సార్లు కర్రతో కలపాలి. వారం తరువాత ద్రవజీవామృతం తయారవుతుంది. ఉపయోగాలు: పంట నీటికాల్వలో 200 లీటర్ల జీవామృతం డ్రమ్మును ఉంచి నల్లా బిగించాలి. నీరు పారుతున్నప్పుడు నల్లా వదిలితే నీటితో పాటు ద్రవజీవామృతం పొలంలోకి వెళ్తుంది. ఎకరానికి 200 లీటర్ల జీవామృతం వాడాలి. ద్రవజీవామృతాన్ని బావిలో కూడా కలపవచ్చు. డ్రిప్ ద్వారా కూడా వేయవచ్చు. వందల లీటర్ల జీవామృతాన్ని నెలరోజుల వ్యవధిలో 3,4సార్లు చల్లుకోవాలి. అమృతజలం కావలసిన పదార్దాలు: పది లీటర్ల ఆవుమూత్రం, 20 కేజీల ఆవుపేడ, 15 కేజీల వేపపిండి, 400 గ్రాముల నువ్వుల నూనె, 2 కేజీల బెల్లం, 2 కేజీల పప్పు దినుసుల పిండి, 200 లీటర్ల నీరు తయారీ విధానం: 200 లీటర్ల నీటిలో ఈ పదార్ధాలను వేసి 3రోజుల పాటు మురగనివ్వాలి. సన్నని గుడ్డతో వడబోసి మొక్కలకు సాగునీటి ద్వారా అందించాలి. ఉపయోగం: మొక్కలకు నత్రజని, భాస్వరం, పొటాష్ అందుతుంది. దశపర్ణి కషాయం కావలసిన పదార్దాలు: 200 లీటర్ల నీరు, దేశవాళీ ఆవుపేడ 2 కేజీలు, ఆవుమూత్రం 10 లీటర్లు, పసుపుపొడి 200 గ్రాములు, శొంఠిపొడి 200 గ్రాములు లేదా అల్లం పొడి 500 గ్రాములు, పొగాకు కేజీ, పచ్చిమిరపకాయల పేస్టు కేజీ లేదా కారం కేజీ, వెల్లుల్లి పేస్టు 100 గ్రాములు, బంతిపూలు ఆకులు, కాండంతో సహా 2 కేజీలు తీసుకోవాలి. కావలసిన 10 రకాల ఆకులు: వేపాకు 2కేజీలు, గానుగ ఆకు 2 కేజీలు, ఉమ్మెత్త ఆకులు 2 కేజీలు, జిల్లేడు ఆకులు 2కేజీలు, సీతాఫలం ఆకులు 2 కేజీలు, మునగ ఆకులు 2 కేజీలు, ఆముదం ఆకులు 2 కేజీలు, అత్తాకోడలు(బేలి లేదా లేంటినా) ఆకులు 2 కేజీలు, వావిలి ఆకులు 2 కేజీలు, తులసి లేదా అడవి తులసి ఆకులు అరకేజీ తీసుకోవాలి. తయారీ విధానం: ముందుగా పదార్ధాలు, పేస్టు, ఆవుమూత్రం, పేడను డ్రమ్ములో కలిపి వేయాలి. పదిరకాల ఆకులను మెత్తగా దంచి వాటిని డ్రమ్ములో కలిపి రోజూ 3సార్లు గడియారం ముళ్లు తిరిగే దిశలో 3నిమిషాల పాటు తిప్పాలి. ఇలా 40 రోజులు నిల్వ ఉంచి రోజూ తిప్పాలి. 41వ రోజున తీస్తే మంచి కషాయం తయారవుతుంది. దీన్ని పలుచని గుడ్డతో వడకట్టి 6 నుంచి 10 లీటర్ల కషాయాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరాకు వేయాలి. ఈ కషాయం 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఉపయోగాలు: వరిపై రసం పీల్చేపురుగు నివారిస్తుంది. మామిడిలో బూడిద తెగులు నివారిస్తుంది. కీటక నాశని నీమాస్త్రం కావలసిన పదార్ధాలు: నీరు 200 లీటర్లు, ఆవుపేడ 2 కిలోలు, ఆవుమూత్రం 10 లీటర్లు, వేపాకులు, రెమ్మలు,చిగుర్లు 10 కిలోలు తయారీ విధానం: పది కిలోల వేపను బాగా రుబ్బి, 200 లీటర్ల నీటిని తీసుకుని డ్రమ్లో బాగా కలపాలి. పది లీటర్ల ఆవుమూత్రం కలిపి, ఇందులో 2 కిలోల ఆవుపేడను కర్రతో బాగా తిప్పి కలపాలి. 48 గంటల వరకు మూసి ఉంచి రోజూ 3సార్లు కలపాలి. తరువాత పలుచని గుడ్డతో వడగడితే నీమాస్త్రం తయారవుతుంది. ఉపయోగాలు: నీమాస్త్రాన్ని పంటపొలాల్లో చల్లితే అన్నిరకాల పురుగుల గుడ్లను చంపుతుంది. తెగుళ్ల నివారణకు దోహదపడుతుంది. పంట విత్తిన 20, 45, 60 రోజులకోమారు చల్లాలి. రైతులకు వరం ప్రకృతి వ్యవసాయం రైతులకు వరం. బొబ్బిలి క్లస్టర్లో ప్రయోగాత్మకంగా వాడుతున్నాం. వీలైనంత ఎక్కువ మంది రైతులతో ప్రకృతి సేద్యం చేయిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయంపై అందరికీ అవగాహన పెంపొందించాలి. - ఎం.శ్యామసుందరరావు, ఏవో, బొబ్బిలి ప్రకృతి వ్యవసాయంతో లాభాలు ప్రకృతి వ్యవసాయంలో వరి, చెరుకు పండిస్తున్నాను. పంట దిగుబడి బాగుంది. పంటకు ధర బాగానే వస్తోంది. ఎలాంటి రసాయనాలు లేని పంటలు పండించాననే సంతృప్తి కలుగుతోంది. నాలుగెకరాల్లో వరివేసి ఘనజీవామృతం వేసి పంటలు పండిస్తున్నాను. - బలగ సింహాచలమ్మ, మల్లమ్మపేట ఎంతో లాభదాయకం సేంద్రియ వ్యవసాయం బాగుంది. దశపర్ణి కషాయంతో చెరుకు, వరి పంటలు పండిస్తున్నాను. ప్రస్తుతం చెరో 4 ఎకరాల్లో వరి, చెరుకు వేశాను. వేరుశనగ పంట పండిస్తున్నాను. రాబోయే రోజుల్లో మరింత విస్తరించి ప్రకృతి వ్యవసాయం చేస్తాను. ఈ వ్యవసాయం లాభదాయకం - కర్రి శ్రీనివాసరావు, గోపాలరాయుడు పేట -
ఈ మందులు ఉపయోగించకండి..
- నిషేదిత పురుగు మందుల జాబితా ప్రకటించిన వ్యవసాయ అధికారులు అనంతపురం పంటలకు ఉపయోగించే పురుగల మందుల్లో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు అనంతరపురం వ్యవసాయ సస్యరక్షణ విభాగం తేల్చింది. ప్రయోగశాలలో పరీక్షల అనంతరం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పురుగుల మందులను నిషేధించిన జాబితాలో చేర్చింది. ఈ మేరకు తాజా జాబితాను వ్యవసాయశాఖ సస్యరక్షణా విభాగం సహాయ సంచాలకులు (ఏడీఏ-పీపీ) కె.మల్లికార్జున ప్రకటించారు. పంటలకు పురుగుల మందులు కొనుగోలు చేసేప్పుడు.. మందు పేరు, తయారు చేసిన కంపెనీ, బ్యాచ్ నెంబర్లు గమనించి.. నిషేదిత జాబితాలో ఉన్న పెస్టిసైడ్ ను పంటలకు ఉపయోగించవద్దని సూచించారు. నిషేధిత జాబితాలో ఉన్న పురుగు మందులు ఇవే.. ----------------------------------------------------------------------------------------- పురుగుమందు పేరు బ్యాచ్నెంబరు తయారీ కంపెనీ --------------------------------------------------------------------------------------- మోనోక్రోటోపాస్ 36% ఎస్ఎల్ 001 సనోవా ఫార్మ కెమికల్ అజాదిరాక్టిన్ 0.03% ఈసీ 115 టి. స్టేన్స్ అండ్ కంపెనీ అజాదిరాక్టిన్ 1% 121 టి. స్టేన్స్ అండ్ కంపెనీ అసిఫేట్ 75% ఎస్పీ పి14010801 కోరమాండల్ ఇంటర్నేషనల్ అజాదిరాక్టిన్ 0.03% ఈసీ 138 టి. స్టేన్స్ అండ్ కంపెనీ థయామెతాక్సామ్ 25% డబ్ల్యూజి యూఎస్ఆర్0048 విప్కో బయోటెక్ మోనోక్రోటోపాస్ 36% ఎస్ఎల్ ఆర్15032513 కోరమాండల్ ఇటర్నేషనల్ మోనోక్రోటోపాస్ 36% ఎస్ఎల్ ఆర్14111513 కోరమాండల్ ఇటర్నేషనల్ క్వినాల్ఫాస్ 25% ఈసీ ఆర్14122701 కోరమాండల్ ఇటర్నేషనల్ అసిఫేట్ 75% ఎస్పి పి14102501 కోరమాండల్ ఇటర్నేషనల్ పొపినోఫాస్ 40% ఈసి + సైపర్ మెత్రిన్ 4% ఈసీ ఆర్/పి1/001 ఎస్డీఎస్ రామ్సైడ్స్ క్రాప్ సైన్స్ థయోమెతాక్సామ్ 25% డబ్ల్యూజి జె-5/915 కిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ లాంబ్డాసైహలోత్రిన్ 5.0% ఈసీ కెఎల్5ఎఫ్02 కేపీఆర్ ఫర్టిలైజర్స్ ఫోరేట్ 10% 04 పెస్ట్కెమ్ అండ్ అలైడ్ ఇండ్రస్ట్రీ అజాదిరాక్టిన్ 0.15% ఈసీ 1503-11 ఈఐడి ప్యారీ ఇమిడాక్లోప్రిడ్ 17.8% ఎస్ఎల్ ఎం813/0712 మోడరన్ పేపర్స్, జమ్మూ టైజోఫాస్ 40% ఈసీ 15 ఎస్యంఎస్ హెచ్ఓఓ 5 కాప్ కెమికల్స్ ఇండియా పొఫినోఫాస్ 50% ఈసీ కెఏటి/కెఆర్ 059 ఆగ్రో లైఫ్ సైన్స్ కార్పొరేషన్ పొఫినోఫాస్ 50% ఈసీ ఎస్బిఎస్4ఎల్060 బయో-స్టాడ్ట్ ఇండియా అసిఫేట్ 75% ఎస్పి 2014ఓవిడబ్ల్యూ94 పి.ఐ.ఇండస్ట్రీస్, గుజరాత్ లాంబ్డాసైహలోత్రిన్ 4.9% సీఎస్ ఎస్ఎల్ఎఫ్ఎస్ఆర్-182 జయశ్రీ రస్యన్ ఉద్యోగ్ అసిటామిప్రిడ్ 20% ఎస్పి 15కెవి135 కేయం ఆర్గానిక్ ప్రాడక్ట్స్ -
కాల్మనీకి మరొకరి బలి
పురుగు మందు తాగి చిరువ్యాపారి ఆత్మహత్య గుంటూరు (పట్నంబజారు): కాల్మనీ కోరలకు మరో జీవితం బలైపోయింది. తీసుకున్న సొమ్ముకు నాలుగింతలు అధికంగా చెల్లించినా, వేధింపులు ఆగకపోవడంతో ఆఖరికి ఆత్మహత్యే శరణ్యమనుకున్నాడు. పట్టాభిపురం పోలీసులు, మృతుడి కుమారుడు నాగరాజకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు నగరానికి చెందిన మద్ది శ్రీరామమూర్తి(62)కి చిన్న బడ్డీ కొట్టు జీవనాధారం.అతను ఏడాదిన్నర కిందట శ్యామల అనే మహిళ వద్ద రూ. లక్ష అప్పుగా తీసుకున్నాడు. రోజుకి రూ.వెయ్యి వడ్డీ కడుతున్నాడు. ఆమెతోపాటు మరో మహిళ నాగలక్ష్మి వద్ద కూడా రూ.1.30లక్షలు తీసుకోగా అధిక వడ్డీలు వేసి ఆయన పాడిన రూ. 2 లక్షల చీటీ డబ్బులు తీసుకుని ఇంకా రూ. 30 వేలు ఇవ్వాలని వే ధింపులకు దిగుతున్నారని బంధువులు తెలిపారు. వేధింపులు అధికమవడంతో శ్రీరామమూర్తి శుక్రవారం సాయంత్రం దుకాణంలోనే పురుగు మందు తాగాడు. స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శ్రీరామమూర్తి సూసైడ్ నోట్ శనివారం వెలుగులోకి తీసుకురావడంతో విషయం బయటకు పొక్కింది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శ్రీరామమూర్తి మృతి కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పట్టాభిపురం ఎస్హెచ్వో శేషగిరిరావు చెప్పారు. -
మంచినీరు అనుకుని పురుగుమందు తాగిన చిన్నారి
రెంటచింతల (గుంటూరు) : మంచినీరు అనుకుని ఓ చిన్నారి పురుగు మందు తాగి మృత్యువాతపడింది. గుంటూరు జిల్లా రెంటచింతల మండలం పసర్లపాడులో సోమవారం ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కర్మన్నాయక్, రోజా బాయి దంపతులది వ్యవసాయ కుటుంబం. సోమవారం సాయంత్రం పొలానికి వెళ్తూ తమ చిన్నారి సంధ్య(ఏడాదిన్నర)ను వెంట తీసుకెళ్లారు. పొలం గట్టున చిన్నారిని నిద్రపుచ్చిన ఆ దంపతులు పురుగు మందు పిచికారీ చేయటంలో నిమగ్నమయ్యారు. కొద్దిసేపటి తర్వాత మెలకువ వచ్చిన చిన్నారి... దాహం వేయటంలో పక్కనే ఉన్న పురుగు మందును మంచినీళ్లుగా భావించి తాగింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగానే సంధ్య చనిపోయింది. చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
ప్రకృతే ఆయన ప్రాణం!
♦ భూమిని దున్నకుండా రసాయనిక రహిత సాగు ♦ అధిక దిగుబడులు సాధించిన ప్రకృతి ప్రేమికుడు భూమిని దున్నకుండా, ఎరువులు వేయకుండా, క్రిమిసంహారకాలు పిచికారీ చేయకుండా వ్యవసాయం చేయడమనేది నేటి ఆధునిక ప్రపంచంలో కలలో సైతం ఊహించలేనిది. గుజరాత్కు చెందిన భాస్కర సావే దానిని ఆచరణలో పెట్టి అందరినీ అబ్బురపరిచారు. ప్రకృతి ఒడిలో సహజీవనం చేసి ప్రకృతి వ్యవసాయానికి గాంధీజీగా పేరొందిన భాస్కర సావే ఇటీవలే మరణించారు. అడవులను ఎవరు పెంచారు? అక్కడ భూమిని ఎవరు దున్నారు? విత్తనాలు ఎవరు వేశారు? ఎరువులు, నీరు ఎవరు అందించారు? ఇవేమీ జరగకపోయినా అటవీ సంపద మనకు మధురమైన ఫలాలను అందిస్తోంది కదా! అదెలా సాధ్యం? ప్రకృతే వాటిని సమకూరుస్తోందనేవారు సావే. మరి మనం మాత్రం రసాయనిక ఎరువులు వేయకుండా, క్రిమిసంహారకాలను పిచికారీ చేయకుండా ఎందుకు వ్యవసాయం చేయకూడదన్నది ఆయన ప్రశ్న. తాను నమ్మిన సిద్ధాంతాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించి చూపిన సావే ప్రకృతి వ్యవసాయానికి గాంధీజీగా పేరుగాంచారు. 1960 నుంచి తుది శ్వాస విడిచేంత వరకు ఆయనది అదే బాట.అదే మాట. భాస్కర సావే గతనెల 24న మరణించారు. అది నిజంగా కల్పవృక్షమే! గుజరాత్లోని సావే వ్యవసాయ క్షేత్రం ‘కల్పవృక్ష’లోకి అడుగు పెడితే చాలు... అన్నీ అద్భుతాలే. ఆయనెప్పుడూ తన భూమిని దున్నలేదు. ఎరువులు వేయలేదు. రసాయనాలు పిచికారీ చేయలేదు. దేశంలోనే అత్యధిక దిగుబడి ఇస్తున్న కొబ్బరి చెట్లు కల్పవృక్షలో కన్పిస్తాయి. కొన్ని చెట్లు ఏడాదికి 400 కాయలను అందిస్తాయి. దిగుబడి సగటున 350 కాయలకు తగ్గదు. 45 సంవత్సరాల నాటి సపోటా మొక్కలు ఇప్పటికీ మధుర ఫలాలను అందిస్తూనే ఉన్నాయి. ఏడాదికి ఒక్కో చెట్టుకు 300 పండ్లు కాస్తున్నాయి. సావే వ్యవసాయ క్షేత్రంలో అరటి, బొప్పాయి, మామిడి, తాటి, దానిమ్మ, నిమ్మ, వేప...ఒకటేమిటి అన్ని రకాల చెట్లు కన్పిస్తాయి. రెండెకరాల విస్తీర్ణంలో వరి పంట వేశారు. పప్పు ధాన్యాలు, గోధుమలు, కూరగాయల పంటలకు సైతం నెలవుగా ఉంటోంది ‘కల్పవృక్ష’. సహజసిద్ధంగా, ప్రకృతి ప్రసాదంగా లభిస్తున్న ఈ పంటల ఉత్పత్తులు అతిథులకు మరువలేని ఆతిథ్యానిస్తుంటాయి. ఇవన్నీ మిత్ర జీవులే ప్రకృతి మాత ఒడిలోని అనేక జీవులు మనకు స్నేహితులేనని సావే చెప్పేవారు. చీమ, వానపాము, బాక్టీరియా వంటి జీవులు అన్నదాతలకు ఎంతో మేలు చేస్తాయి. పంట చేలో ఇవి పుష్కలంగా ఉంటే చాలు... ఆ రైతు సంపన్నుడే అని అనేవారు సావే. ఈ జీవులన్నీ భూసారాన్ని పెంచుతూ రైతుకు మంచి దిగుబడులు అందిస్తున్నాయి. వీటిలో చాలా వరకు రసాయనిక క్రిమిసంహారక మందుల బారినపడి చనిపోతున్నాయి. ట్రాక్టర్ల కింద నలిగిపోతున్నాయి. ఫలితం... నేల నిస్సారమై చీడపీడల దాడికి సులభంగా లోనవుతోంది. కలుపు మొక్కలు కూడా... కలుపు మొక్కలను శత్రువులుగా రైతులు భావిస్తుంటారు. నిజానికి అవి కూడా అన్నదాతకు మేలు చేసేవే. కలుపు మొక్కలు భూమి కోతను నివారిస్తాయి. నేలలో తేమను నిలుపుతాయి. పూత దశకు చేరకముందే కలుపు మొక్కలను భూమిలో తొక్కేస్తే నేలకు బలం చేకూరుతుంది. వాటిని రసాయనిక మందులతో నిర్మూలించే బదులు లోతు దుక్కులు చేస్తే సరి. భూసారం పెరుగుతుంటే కలుపు బెడద దానంతట అదే తగ్గిపోతుంది. భూసారం తక్కువగా ఉంటే పంట మొక్కల సాంద్రతను పెంచితే కలుపు సమస్య ఉండదు. భూమిపై నివసించే ప్రాణులన్నింటికీ జీవించే హక్కు ఉంది. ప్రకృతిలో లభించేవన్నీ ఉపయోగపడేవే. వ్యవసాయం వ్యాపారం కాకూడదు. పంట ఉత్పత్తులను కొంతమేరకే వినియోగించుకోవాలి. భూసారం పెంచడానికి కొద్దిగా కృషి చేస్తే సమస్యలనేవే ఉండవనేవారు భాస్కర సావే. - సాక్షి, సాగుబడి డెస్క్ -
ఆరుగురు రైతులకు పునర్జన్మ
సాక్షి, హైదరాబాద్: పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఆరుగురు నిరుపేద రైతు, రైతు కూలీలకు ఉస్మానియా వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. రోజుల తరబడి వెంటిలేటర్లపై ఉండటంతో శ్వాసనాళం కుంచించుకుపోయి ఊపిరి తీసుకోలేకపోతున్న వారికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. మృత్యు ద్వారం వరకు వెళ్లి తిరిగిన వచ్చిన వీరు కోలుకోవడంతో బుధవారం డిశ్చార్జి చేశారు. ‘హెల్పింగ్ హ్యాండ్’ సౌజన్యంతో ఉస్మానియా కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగాధిపతి జి.శ్రీనివాస్, ఈఎన్టీ విభాగాధిపతి రంగనాథ్స్వామి, అనెస్థీషియా విభాగాధిపతి సి.జి.రఘురామ్ల నేతృత్వంలోని వైద్య బృందం నిర్వహించిన ఈ అరుదైన శస్త్రచికిత్స వివరాలివి... అప్పుల బాధతో... అప్పుల బాధకు తట్టుకోలేక నిజామాబాద్ జిల్లా అమృతాపూర్ రైతు బి.సంతోష్(28), మెదక్ జిల్లా నాచారం కౌలు రైతు పి.నర్సింహా(28), మహబూబ్నగర్కు చెందిన రైతు కూలీ ఎస్.కృష్ణ(24), రంగారెడ్డి జిల్లా చేవెళ్ల రైతు కూలీ జి.లలిత(28), ఖమ్మం జిల్లా రైతు కుటుంబానికి చెందిన విద్యార్థి వీరన్న(20), మహబూబ్నగర్కు చెందిన రైతు ఎ.నారాయణ(30) ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. వ్యవసాయం కోసం కొందరు... కుటుంబ పోషణకు మరికొందరు అప్పులు చేసి, అవి తీరే మార్గం లేక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. చికిత్స కోసం బంధువులు వీరిని ఉస్మానియాకు తీసుకువచ్చారు. చికిత్సలో భాగంగా వైద్యులు బాధితులను 15 నుంచి 25 రోజులపాటు వెంటిలేటర్పై ఉంచాల్సి వచ్చింది. ఇన్ని రోజులు వెంటిలేటర్పై ఉండటం వల్ల ఒత్తిడికి లోనై, ఇన్ఫెక్షన్ వచ్చింది. దీంతో శ్వాసనాళాలు పూర్తిగా కుంచించుకుపోయాయి. వారికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. మాట పడిపోయింది. వైద్య పరిభాషలో దీన్ని ‘ట్రాకియల్ స్టెనోసిస్’గా పిలుస్తారు. దీనికి చికిత్స ఎంతో క్లిష్టమే కాకుండా ఖరీదు కూడా. ఆరోగ్యశ్రీ పథకంలో వీటికి అనుమతి లేదు. ఈ క్రమంలో ‘హెల్పింగ్ హ్యాండ్’ స్వచ్ఛంద సంస్థతో పాటు ‘ఇన్సైట్ ఔట్రిచ్ ప్రైవేట్ లిమిటెడ్’ వైద్య ఖర్చులు భరించేందుకు ముందుకు వచ్చాయి. ఉదయం 9 నుంచి రాత్రి 10 వరకు... డాక్టర్ జి.శ్రీనివాస్ నేతృత్వంలో వైద్య బృందం సెప్టెంబర్ 23న శస్త్రచికిత్స నిర్వహించింది. ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు శ్రమించిన వైద్యులు... గొంతుకు చిన్న రంధ్రం చేసి శ్వాస నాళంలో ‘డ్యూరాన్ స్టంట్’ను విజయవంతంగా అమర్చారు. బాధితులకు తిరిగి ఊపిరులూదారు. ఒక్కో స్టంట్కు రూ.80 వేలు ఖర్చయిందని వైద్యుల బృందం చెప్పింది. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్, ఇన్సైట్ ఔట్రిచ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు వీటిని సమకూర్చినట్లు ఉస్మానియా సూపరింటిండెంట్ సి.జి.రఘురామ్ తెలిపారు. కాగా, వీరితో పాటు కుటుంబ సమస్యలతో మనస్థాపం చెంది పురుగుల మందు సేవించిన సావిత్రి (32; కడప జిల్లా జమ్మలమడుగు)కి కూడా శస్త్రచికిత్స చేసినట్లు చెప్పారు. -
రైతు ఆత్మహత్య
అప్పుల బాధతో పురుగుల మందు తాగిన రైతు చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం అర్నకొండ గ్రామంలో పిల్లల మర్రి జగన్ (43) అప్పుల భారంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఇది గమనించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను శనివారం ఉదయం మరణించాడు. అయితే రెండేళ్లుగా దిగుబడి సరిగా లేక పోవడంతో చేసిన అప్పులు తీర్చే దారిలేక ఆత్మహత్యకు ప్రయత్నించాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పత్తిరైతు ఆత్మహత్య
అప్పుల భారం మరో అన్నదాతను బలితీసుకుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఏపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన కొండ యాదయ్య(50) తనకున్న ఏడెకరాల భూమిలో పత్తిపంట సాగు చేశాడు.. పెట్టుబడి కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో వాటిని తీర్చే దారి కానరాక శుక్రవారం రాత్రి చేనులోనే పురుగులమందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
అప్పుల బాధతో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా రాజాపేట మండలం నెమిల గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కొత్త ఉప్పల్ రెడ్డి(48) తనకున్న మూడెకరాలతో పాటు మరో ఆరెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తిపంట సాగు చేస్తున్నాడు. గతేడాది కూడా సరైన దిగుబడి రాకపోవడంతో.. అప్పులు భారీగా పెరిగిపోయాయి. శుక్రవారం పత్తింపంటకు మందుకొట్టాడు.. అదే సమయంలో ఎండిన పంటను చూసిన రైతు మనోవేదనకు గురై పంట చేనులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రైతు ఆత్మహత్య
అప్పు చేసి పొలంలో వేయించిన బోర్లలో నీరు పడకపోవటం ఆ రైతును కుంగదీసింది. దీంతో తీవ్ర ఆవేదనతో పురుగు మందుతాగి తనువు చాలించాడు. మెదక్ రామాయంపేట మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని ఆర్.వెంకటాపూర్ గ్రామానికి చెందిన వెంకుగారి శ్రీనివాసరెడ్డి(50)కి రెండెకరాల పొలం ఉంది. నీటి వసతి కోసం పొలంలో గత మూడేళ్లలో రెండు బోర్లు వేయించాడు. అవి ఫెయిలయ్యాయి. పంటలు సరిగా పండకపోవటంతో అప్పులు రూ.5 లక్షల దాకా పెరిగిపోయాయి. పొలం బీడుగా మారింది. ఈ నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురైన శ్రీనివాసరెడ్డి గురువారం ఉదయం ఇంట్లోనే క్రిమి సంహారక మందు తాగి, తనువు చాలించాడు. ఆయనకు భార్య మంజుల, కుమార్తె, వృద్ధురాలైన తల్లి ఉన్నారు. -
పొలాల్లో గుర్తు తెలియని మృతదేహం
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రప్రోలు గ్రామ సమీపంలోని పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తి(65) మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహం పక్కన మోనోక్రోటోఫాస్ పురుగు మందు డబ్బా పడి ఉంది. అతని జేబులో ఈనెల 21వ తేదీనాటి హాలియా - మిర్యాలగూడ ఆర్టీసీ బస్సు టికెట్ ఉంది. సంఘటన స్థలాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య
ఖమ్మం(అశ్వాపురం): అశ్వాపురం మండలం ఆనందపురం గ్రామంలో ఆదివారం పురుగుల మందు తాగి దాసరి మధు(28) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి మృతికి కుటంబకలహాలే కారణమని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.9 కోట్ల పురుగుల మందులు పట్టివేత
కర్నూలు : అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన రూ. 9 కోట్ల విలువైన పురుగుల మందులను వ్యవసాయశాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రం శివారులోని కార్బైడ్ ఫ్యాక్టరీలో పురుగుల మందులను అక్రమంగా నిల్వ చేసి వాటిని కల్తీ చేసి అమ్ముతున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి వాటిని సీజ్ చేశారు. ఈ దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు కూడా పాల్గొన్నారు. -
ప్రాణాలైనా ఇస్తాం..భూములు వదలం
భూసేకరణ నోటిఫికేషన్ను నిరసిస్తూ పురుగు మందు డబ్బాలతో ప్రదర్శన పోతేపల్లి(కోనేరుసెంటర్) : భూసేకరణ నోటిఫికేషన్తో బందరు మండల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పలంగా వేలాది ఎకరాలు పోర్టు పేరుతో లాక్కుంటారో చూస్తామంటూ అటు ప్రభుత్వానికి, ఇటు పాలకులకు సవాళ్లు విసురుతున్నారు. భూములు అప్పగించే పరిస్థితే వస్తే ప్రాణాలైనా వదిలేస్తాం కాని నేల తల్లిని మాత్రం వదుకోమంటూ కరాఖండిగా చెబుతున్నారు. మహిళలైతే పురుగు మందులు తాగి ఆత్మహత్యలకైనా సిద్ధపడతామని చెబుతున్నారు. భూసేకరణ నోటిఫికేషన్ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ బుధవారం బందరు మండలంలోని పోతేపల్లి, పెదకరగ్రహారం గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. గ్రామంలోని పంచాయతీ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టారు. పోతేపల్లిలోని మహిళలు పురుగు మందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు. పోర్టు పేరుతో ప్రభుత్వం మా భూములు లాక్కుంటే ఇవే పురుగు మందులు తాగి మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటూమంటూ హెచ్చరించారు. గ్రామంలో సుమారు 400 మంది గ్రామస్తులు గ్రామంలోని రామాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులు మాట్లాడుతూ గతంలో 3 వేల ఎకరాల్లో బందరు పోర్టు నిర్మించవచ్చని ఇదే నాయకులు చెప్పి అధికారంలోకి వచ్చాక పోర్టు నిర్మాణానికి పది రెట్లు అదనంగా భూములు కావాలంటూ నోటిఫికేషన్ జారీ చేయడం తగదన్నారు. ఒకపుడు 3 వేల ఎకరాలు చాలన్న టీడీపీ నాయకులు ఇపుడు 30 వేల ఎకరాలు రైతుల నుంచి లాక్కుని ఎవరెవరు ఎంతెంత పంచుకుంటారో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ జారీతో ఇప్పటికే అనేక మంది రైతులు దిగులుతో మంచం పట్టినట్లు చెప్పారు. తక్షణమే భూసేకరణ నోటిఫికేషన్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోతేపల్లి ఎంపీటీసీ సభ్యుడు పిప్పళ్ల నాగబాబు, మాజీ సర్పంచ్ కాటం మధుసూదనరావు, శ్రీపతి చంద్రం, సర్పంచ్లు మేకా లవకుమార్(నాని), చిలకలపూడి పీఏసీఎస్ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ గాజుల నాగరాజు, పెద్ద ఎత్తున రైతులు, మహిళలు పాల్గొన్నారు. పెదకరగ్రహారంలో సర్పంచ్ శొంఠి కల్యాణి, ఫరీద్ బాబా దర్గా కమిటీ కార్యదర్శి శొంఠి ఫరీద్, చలమలశెట్టి ఏడుకొండలు, గురుజు పోతురాజు, కట్టా బైరాగి, సత్తినేడి నాగరాజు, అబ్దుల్హ్రీం, రైతులు పాల్గొన్నారు. అన్యాయం జరిగితే పదవీ త్యాగం చేస్తా - ఎంపీ కొనకళ్ల నారాయణ మచిలీపట్నం(కోనేరుసెంటర్) : భూసేకరణకు సంబంధించి రైతులకు అన్యాయం జరిగితే తన పదవిని సైతం వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని చెప్పారు. బుధవారం ఎంపీ కొనకళ్ల తన కార్యాలయంలో టీడీపీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ భూసేకరణకు సంబంధించి బాధిత రైతులతో చర్చలు, సంప్రదింపులు జరిపిన తరువాతే భూములు తీసుకుంటారన్నారు. బందరు ప్రాంత అభివృద్ది పోర్టుతోనే ముడిపడిఉందనే విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. రైతులకు ఇంటికో ఉద్యోగంతో పాటు భూములకు కౌలు కూడా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, మునిసిపల్ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు తలారి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
కూల్డ్రింక్ అనుకుని..
యలమంచిలి : రోజూలాగే సాయంత్రం పాఠశాల నుంచి ఉత్సాహంగా ఇంటికి వచ్చిన ఐదో తరగతి బాలిక కూల్డ్రింక్ అనుకుని పొరబాటు పురుగు మందు తాగడంతో మృత్యువాత పడింది. రాంబిల్లి మండలం దిమిలి గ్రామంలో సోమవారం సాయంత్రం చోటు జరిగిన ఈ సంఘటన వివరాలిలావున్నాయి. దిమిలి గ్రామానికి చెందిన మామిడి శ్రీహరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. చిన్నకుమార్తె మామిడి నాగభవాని (10) స్థానికంప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. వ్యవసాయ ఆధారిత కుటుంబం కావడంతో వ్యవసాయ పనుల నిమిత్తం శ్రీహరి, అతని భార్య పొలం పనులకు వెళ్లారు. సోమవారం ఉదయం స్కూల్కు వెళ్లిన భవాని సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. ఆకలి తీర్చుకునేందుకు కూల్డ్రింక్ అనుకుని పురుగుమందును పొరబాటున తాగింది. కొద్దిసేపటికే బాలిక నురగలు కక్కుతూ స్పృహ కోల్పోయింది. వెంటనే స్థానికులు తండ్రికి సమాచారం అందించారు. ఆమెను హుటాహుటిన స్థానిక 30 పడకల ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆలస్యం కావడంతో బాలిక పరిస్థితి పూర్తిగా విషమించింది. ఆమెను పరీక్షించిన వైద్యులు, సిబ్బంది లాభంలేదని మెరుగైన చికిత్స కోసం విశాఖకు తీసుకెళ్లాల్సిందిగా చెప్పడంతో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను తండ్రి భుజాలపై వేసుకుని ఆస్పత్రి నుంచి బయటకు వచ్చేసరికి బాలిక మృతి చెందింది. తండ్రి శ్రీహరి కన్నీరుమున్నీరుగా విలపించడం కంట తడిపెట్టించింది. బరువెక్కిన హృదయంతో బాలిక మృతదేహాన్ని తండ్రి ఇంటికి తీసుకెళ్లడంతో బాలిక తల్లి, సోదరి, సోదరుడితో పాటు బంధువులు తీవ్రంగా రోదించారు. -
రుణభారంతో రైతు బలవన్మరణం
వర్గల్(మెదక్): అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెదక్ జిల్లా వర్గల్ మండలం పాతూరుకు చెందిన చెట్టి నాగరాజు (27) తన ఎకరంలో సాగు చేసుకుంటూనే కూలీ పనులకు వెళుతుంటాడు. గతంలో సాగు నీటి కోసం దాదాపు రూ.లక్ష అప్పు తెచ్చి మూడు బోర్లు తవ్వించినప్పటికీ ఫలితం దక్కలేదు. తాజాగా వర్షాధారంగా ఎకరం విస్తీర్ణంలో రూ.6,500 వేలు అప్పు తెచ్చి పత్తి పంట వేశాడు. వర్షాభావం అలుముకోవడంతో అది సరిగా ఎదగలేదు. అప్పు ఇలా పెరిగిపోతుండగా.. మరోవైపు గర్భిణి అయిన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు నాలుగు రోజులుగా అప్పు కోసం చేసిన ప్రయత్నమూ ఫలించలేదు. శుక్రవారం భార్యను ఆసుపత్రిలో చేర్పించాలని వైద్యులు చెప్పడంతో గురువారం డబ్బు కోసం ప్రయత్నించినా దొరకలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. రాత్రి 9 గంటలకు ఇంటికొచ్చిన నాగరాజు అన్నం తినకుండానే పొలానికి నీరు పెట్టి వస్తా అని తల్లికి చెప్పి అదే రాత్రి పొలంలోనే పురుగు మందు తాగి విగత జీవిగా మారాడు. -
విషాహారం తిని 860 గొర్రెలు మృత్యువాత
కోయిలకుంట్ల (కర్నూలు) : అనంతపురం జిల్లా సింగనమల మండలం నుంచి మేత కోసం వలస వచ్చిన గొర్రెల కాపరులకు తీవ్ర నష్టం సంభవించింది. విషాహారం తిని వందల సంఖ్యలో మూగజీవాలు చనిపోయాయి. శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలంలోని పొలాల్లో తిరుగుతున్న సుమారు 5వేల గొర్రెల్లో కొన్ని పురుగుల మందు చల్లిన జొన్న కర్రలను తిన్నాయి. విష ప్రభావంతో దాదాపు 860 గొర్రెలు చనిపోయాయి. దీంతో అప్రమత్తమైన కాపరులు మిగతా వాటిని ఆ ప్రాంతం నుంచి మరోచోటికి తోలుకెళ్లారు. -
అన్నదాతను వెంటాడిన అప్పులు
సాగునీటి వేటలో ఐదు బోర్లు తవ్వించగగా.. అన్నీ ఫెయిలయ్యాయి. పంట పెట్టుబడుల కోసం చేసిన అప్పులు కుప్పలుగా పెరిగాయి. సొంత, కౌలు పొలాల్లో సాగు చేసిన పంటల్లో ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. ఈ క్రమంలో అప్పులు తీర్చే మార్గం లేక పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి తన వారితో బంధం తెంచుకుని కుటుంబానికి అంతులేని శోకాన్ని మిగిల్చాడో అన్నదాత. - వర్గల్ - పురుగు మందు తాగి బలవన్మరణం - ఇప్పలగూడలో విషాదం - వీధినపడ్డ కుటుంబం మండలంలోని ఇప్పలగూడ గ్రామానికి చెందిన సొక్కుల వెంకట్రెడ్డి (36) తనకున్న రెండెకరాలోపు భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఈ భూమిలో పంటల సాగు కోసం సుమారు ఐదు బోర్లు వేయించాడు. ఒక బోరులో కొద్దిపాటి నీరు మినహా మిగతావన్ని విఫలమయ్యాయి. దీంతో అప్పులే మిగిలాయి. మరోవైపు నీళ్లు లేక సాగు మొక్కుబడిగా మారింది. గత ఖరీఫ్లో పొరుగు రైతుకు చెందిన 6 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని దాదాపు రూ. 90 వేలు పెట్టుబడితో పత్తిని సాగు చేశాడు. ప్రతికూల పరిస్థితుల కారణంగా అందులో పది క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. వ్యవసాయం కలిసిరాకపోవడంతో మొత్తం రూ. 4 లక్షలకు పైబడి అప్పులయ్యాయి. ఈ క్రమంలో అప్పులు తీర్చే మార్గం లేక మానసిక వేదనకు గురైన ఆ రైతు ఆత్మహత్యే శరణ్యంగా భావించాడు. దీంతో ఈ నెల 10న ఉదయం 6 గంటలకు తన ఇంటి వెనక వైపు పురుగుల మందు తాగి పడిపోయాడు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు గజ్వేల్ ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్సలు చేయించి అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా.. అక్కడ వైద్యసేవలు సరిగా అందడం లేదని, డబ్బులు సమకూర్చుకుని మెరుగైన చికిత్స జరిపించాలనే ఆలోచనతో సోమవారం సాయంత్రం రైతు వెంకట్రెడ్డిని స్వగ్రామానికి తీసుకువచ్చారు. అదేరోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో రైతు వెంకట్రెడ్డి మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, సాయి కిరణ్ (పదో తరగతి), హన్మంతరెడ్డి (ఐదో తరగతి)లు ఉన్నారు. తెల్లారితే మంచి దవాఖానకు తీసుకపోదామనుకున్నం. ఇంతల్నే పాణం పోయిందని మృతుడి భార్య లక్ష్మి బోరుమని విలపించింది. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు గౌరారం స్టేషన్ హౌస్ ఆఫీసర్ దేవీదాస్ తెలిపారు. -
సేంద్రియ వ్యవసాయంపై అపోహలెందుకు?
రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పంటలు సాగు చేసే వ్యవసాయ పద్ధతులనేకం ఉన్నాయి. ఈ పద్ధతులను అవలంబిస్తున్న వ్యక్తులు, సంస్థల మధ్య వ్యవసాయంలో రసాయనాల అవసరం లేదనటం వంటి కొన్ని అంశాలపై ఏకీభావం ఉన్నప్పటికీ.. మరికొన్ని విభేదాలు కనిపిస్తున్నాయి. పరస్పర అపనమ్మకాలను, అపోహలను పక్కన పెట్టి.. అనుభవాలను కలిసి పంచుకుంటే సేంద్రియ వ్యవసాయం దిశగా వేగంగా మార్పు వస్తుందంటున్నారు డాక్టర్ జీ వీ రామాంజనేయులు. హరిత విప్లవంతో సమస్యలు ఎదుర్కొన్న తర్వాత, భారత దేశం ఇప్పుడు వ్యవసాయంలో మరో కొత్త విప్లవానికి తయారవుతోంది. దేశవ్యాప్తంగా అనేక మంది రైతులు, సంస్థలు ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతుల వైపు అడుగులు వేస్తున్నారు. ఆధునిక(రసాయనిక) వ్యవసాయ పద్ధతుల్లోని నష్టాలు, పర్యావరణానికి కలుగుతున్న ముప్పు, ఆరోగ్యానికి కలుగుతున్న హానిని గుర్తెరిగి, సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. దీనికి తోడు ఆహార పదార్థాల్లో ఆధునిక రసాయనాల అవశేషాల పట్ల వినియోగదారుల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత సేంద్రియ వ్యవసాయ పద్ధతులకు ప్రాముఖ్యత కలిగిస్తోంది. అయితే, సేంద్రియ వ్యవసాయం చేయటానికి అవసరమైన వనరులున్నాయా? అని ఒక వైపు, సేంద్రియ వ్యవసాయం రసాయనిక వ్యవసాయం కంటే ప్రమాదకరం? అని ఇంకొక వైపు ప్రచారాలు సాగటంతో అటు రైతుల్లోను, ఇటు వినియోగదారుల్లోను కొన్ని అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి. సేంద్రియ వనరులున్నాయా? సేంద్రియ పద్ధతుల్లో పేడని కేవలం నత్రజని, భాస్వరం, పొటాష్ అందించే రసాయన పదార్థంగా చూడకుండా, గాలి నుంచీ నత్రజని మొదలైన వాయువులను నైట్రేట్ల రూపంలో స్థిరీకరించే సూక్ష్మజీవులను అందించే వనరుగా చూస్తాం. ఈ సూక్ష్మజీవులు పశువుల కడుపులో వుంటూ అవి తినే ఆకులూ, కొమ్మలను జీర్ణం చేసుకోవటంలో సహాయం చేస్తాయి. వీటిని వాడినప్పుడు భూమిలో కూడా అటువంటి పనే చేస్తాయి. దానికి తోడు భూమిలో వుండి.. వాడుకోదగిన రూపంలో లేని భాస్వరం లాంటి పోషకాలను అందుబాటులోకి తెస్తాయి. అయినా కేవలం నత్రజని, భాస్వరం, పొటాష్ల గురించి ఆలోచించినా, దేశంలో పంట వ్యర్థాలు, పశువుల పేడ రూపంలో చాలానే దొరుకుతాయి. అయితే వీటిని సేకరించటంలో సమస్యలు, ఖర్చులు, శ్రమ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం రసాయనిక ఎరువుల మీద పెడుతున్న 60 వేల కోట్ల సబ్సిడీ (2014లో అది 70 వేల కోట్లు వున్నది. అప్పటి నుంచి భారాన్ని రైతుల మీదకు మార్చారు)లో కొంత భాగాన్ని రైతులకు నేరుగా సబ్సిడీల రూపంలో అందించవచ్చు. దేశీ ఆవు లేకపోతే సేంద్రియ వ్యవసాయం చేయలేమా? దేశీ ఆవు పేడ మాత్రమే వాడాలనే మాట మనకు తరచూ వినిపిస్తూ ఉంది. మిగతా జీవాలు వున్నా వాటి పేడ ఉపయోగపడదేమో అని చాలా మంది రైతులు సేంద్రియ వ్యవసాయానికి మారటానికి భయపడుతున్నారు. నిజానికి ఆవు అయినా, గేదె అయినా.. గడ్డి, పచ్చిరొట్టల మీద ఎక్కువగా ఆధారపడినవైతే వాటి పేడని రైతులు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. అయితే, కష్టమైన వాతావరణంలో కూడా దేశీ ఆవు తట్టుకుంటుంది కాబట్టి, కొత్తగా పశువులు కొనుక్కునే వాళ్లు దేశీ ఆవును కొనుక్కుంటే మంచిది. మార్కెట్లో దొరికే బయో ఫెర్టిలైజర్లన్నిటిలో ఉన్న సూక్ష్మజీవులు పశువుల పేడలో ఉన్నవే. వర్మీ కంపోస్ట్ ప్రమాదకరమా? వర్మీ కంపోస్ట్ (వానపాముల ఎరువు) భూమిలో భారలోహాలను పెంచుతుంది, అసలు వీటి కోసం వాడే విదేశీ వానపాములు అత్యంత ప్రమాదకరం అనే అభిప్రాయం ఉంది. ఇది పూర్తిగా అపోహే. వానపాములలో భూమిపైన పాకేవి, భూమి లోపలికి తొలుచుకు వెళ్లేవి అని.. ప్రధానంగా రెండు రకాలుంటాయి. భూమిలోకి తొలుచుకు వెళ్లే వానపాములను వాడితే కంపోస్ట్ గుంతలో నుంచి భూమిలోకి వెళ్లిపోతాయి కాబట్టి.. నేలపైన పాకే వాటిని వాడతారు. మన దేశంలో సుమారు మూడు వందల రకాల వానపాములు ఉన్నాయి. అందులో కొన్ని పైన పాకేవి, ఇంకొన్ని భూమిలోకి తొలుచుకు వెళ్లేవి. ఈ వానపాములు భార లోహాలను పెంచుతాయి అన్నది కూడా పెద్ద అపోహే. పంట వ్యర్థాలలో అప్పటికే ఉన్న భార లోహాలే కంపోస్ట్లోకి వస్తాయే గానీ.. వానపాములు కొత్తగా భార లోహాలను తయారు చేయవు. పంట వ్యర్థాలు కంపోస్ట్గా మారే క్రమంలో మొత్తం పరిమాణం బాగా తగ్గుతుంది. కాబట్టి భార లోహాల మోతాదు కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది. అంటే.. కంపోస్టు చేయకుండా ఆచ్ఛాదన(మల్చింగ్) చేసినా లేక భూమిలో కలిపి దున్నినా ఇదే జరుగుతుంది. సేంద్రియ వ్యవసాయంలో అసలు సమస్యలే లేవా? సేంద్రియ వ్యవసాయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు.. నాణ్యతా ప్రమాణాలు పాటించటంపై సేంద్రియ సర్టిఫికేషన్ ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. ఈ పద్ధతిలో కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అయితే, ప్రత్యామ్నాయంగా పీజీఎస్ లాంటి వాటి ద్వారా సర్టిఫికేషన్ పొందవచ్చు. కాబట్టి, అపోహలను పక్కన పెట్టి పరిస్థితులకు అనుగుణంగా, స్థానికంగా దొరికే వనరులతో చేపట్టే సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లే దిశగా రైతులు ప్రయత్నం చేయవచ్చు. అలాగే పరస్పర అపనమ్మకాలను పక్కన పెట్టి, వివిధ జీవావరణ వ్యవసాయ (ఎకలాజికల్ ఫార్మింగ్) పద్ధతులను ప్రోత్సహిస్తున్న సంస్థలు/వ్యక్తులు తమ అనుభవాలను కలిసి పంచుకుంటే.. అందరి విజ్ఞానం పెంపొందుతుంది. ఇటువంటి మార్పును వెతుకుతున్న రైతులతో పాటు ప్రభుత్వం కూడా తోడ్పాటును అందించగలిగితే.. సేంద్రియ వ్యవసాయం దిశగా త్వరితగతిన మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. -
పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య
ఇద్దరు చిన్నారులూ మృతి గద్వాల: కుటుంబ కలహాలతో ఓ తండ్రి ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, మరో చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడింది. వివరాలు.. మహబూబ్నగర్ జిల్లా గద్వా లకు చెందిన కుర్మన్న(35), రాజ్యమ్మ బిందెల వ్యాపారం చేస్తున్నారు. వీరి సంతానం కుర్మక్క(9), నాని, ఇందు(5). భార్యప్రవర్తనపై అనుమానంతో కుర్మన్న తరచూ ఆమెతో గొడవపడేవాడు. దీంతో మూడురోజుల క్రితం భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. మనస్తాపానికి గురైన కుర్మన్న శనివారం రాత్రి కూల్డ్రింక్లో పురుగు మందు కలిపి పిల్లలకు తాగించి తానూ సేవించాడు. పరిస్థితి విషమించడంతో తండ్రితో పాటు కుర్మక్క, ఇందు మృతి చెందారు. నాని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
గూడూరులో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
వరంగల్: ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ జిల్లాలోని గూడూరులో సోమవారం చోటుచేసుకుంది. సెంకేషి సత్యనారాయణ అనే కానిస్టేబుల్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు సత్యనారాయణ గూడూరులో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. సత్యనారాయణ ఆత్మహత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని బంధువులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
మా అమ్మ అస్పత్రిలో ఉందంట
తల్లి మృతి విషయం తెలియని చిన్నారి సంగం: లోకం తెలియని ఆ చిన్నారి మాటలు చూపరులకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. తల్లి మృతి చెంది గంటలు దాటినా మా అమ్మ ఆస్పత్రిలో ఉందంటున్న ఆ బుజ్జాయి మాటలు అందరి హృదయాన్ని కలచివేస్తున్నాయి. రాళ్లచెలిక దళితవాడకు చెందిన రంతులయ్య, మస్తానమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు. రంతులయ్య బేల్దారి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అనారోగ్యానికి గురై అప్పులపాలయ్యాడు. ఈ క్రమంలో మస్తానమ్మ మానసికంగా బాధపడుతుండేది. మూడు రోజుల క్రితం ఆయన పులివెందులకు వెళ్లిన సమయంలో ఆమె పురుగుమందు తాగడంతో పాటు బిడ్డలతో కూడా తాగించే ప్రయత్నం చేసింది. చిన్నకుమార్తె దివ్య కొంచెం తాగగా, పెద్దకుమార్తె శశికళ నిరాకరించింది. ఇద్దరిని నెల్లూరుకు సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మస్తానమ్మ శనివారం రాత్రి మృతిచెందిన సంగతి తెలిసిందే. దివ్య చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో విచారణ నిమిత్తం వారి పెద్దకుమార్తె శశికళను ఆదివారం సంగం పోలీసుస్టేషన్కు పోలీసులు పిలిపించారు. నాయనమ్మతో కలిసి వచ్చిన ఆ చిన్నారి మాటలు అందరినీ కలచివేశాయి. -
చెరువులు తవ్వితే చేనంతా వెలుగే
ఎకరానికి 40 ట్రాక్టర్లు లేదా 200 టన్నుల చెరువు మట్టిని వేయడం ద్వారా 3 సంవత్సరాల వరకు రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి 100 శాతం అధికోత్పత్తిని సాధించవచ్చు. ఆహార ధాన్యాలు, వాణిజ్య పంటల ఉత్పత్తిలో పురుగు మందుల అవశేషాలను లేకుండా చేయవచ్చు. పట్టణీకరణ సవాళ్లను ఎదుర్కోవచ్చు. పుష్కర కాలం సాగిన పోరా టం తరువాత ఏర్ప డిన తెలం గాణ రాష్ట్ర సాగు, తాగు నీటి అవసరాలను తీర్చడానికి ప్రభు త్వం దృష్టి కేంద్రీకరించింది. 3.6 కోట్ల తెలంగాణ ప్రజల ఆహార, వ్యవసాయ అవసరా లను తీర్చడానికి సమస్త శక్తులు కేంద్రీకరించి రాష్ట్రంలో చెరువుల మీద సర్వే చేయిం చింది. 45,300 చిన్న నీటి వనరులు, చెరువులు, కుంటలు ఉన్నట్టు లెక్కతేలింది. ఈ నేపథ్యంలో దక్షిణ భారతంలో ముఖ్యంగా తెలంగాణలోని చెరు వుల, కుంటల పూడికతీత, దాని వినియోగం అం శం మీద పరిశోధన చేయడానికి మిచిగన్ విశ్వ విద్యాలయం (అమెరికా) ముగ్గురు విద్యార్థులు, ఫ్రీడమ్ సంస్థ ఈ ఆగస్ట్లో నల్లగొండ జిల్లాలోని 33 గ్రామాలను సందర్శించారు. ఈ అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడైనాయి. చెరువులలో పూడిక తీసిన గ్రామాలకు చెందిన 700 మంది రైతులను వారు కలుసుకున్నారు. స్థాని కులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి పంట ఉత్పత్తి పెరుగుదల, భూగర్భ నీటిమట్టం పెరుగుదల, రసాయనిక, పురుగు మందుల వాడకం తగ్గుదల వంటి అంశాలు ఈ ప్రక్రియలో ప్రధానంగా ఉన్నట్టు విద్యార్థులు గమనించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన మెట్ట భూముల పరిశోధన సంస్థ పూడిక మట్టిని పరిశోధించింది. రాష్ట్ర వ్యవసాయ, అటవీ, పంచాయతీరాజ్, నీటి పారుదల శాఖల మంత్రు లకు, ఇతర అధికారులకు కూడా ఈ పరిశోధనల గురించి విద్యార్థులు తెలియజేశారు. 1,500 కిలోల తలసరి కర్బన ఉద్గారాలతో, ప్రపంచ సగటుకు భారతదేశం దిగువనే ఉన్నం దున, చెరువుల పూడిక ద్వారా రసాయనిక ఎరు వులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించు కోవచ్చు. అలాగే భూగర్భ జలమట్టాన్ని పెంచి, బోర్ బావులకు ఇస్తున్న సబ్సిడీ విద్యుత్ విని యోగాన్ని తగ్గించుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి పూడికతీత ఖర్చులో సుమారు 30 శాతానికి పైగా కార్బన్స్ క్రెడిట్స్ రూపేణా పారిశ్రామిక దేశాల నుంచి తిరిగి రాబట్టుకోవచ్చని మిచిగాన్ విద్యా ర్థులు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావుకు వివరించారు. దహగామ ఆదిత్య (స్టూడెంట్ గవర్న మెంట్ అధ్యక్షుడు), జాన్ మానెట్, లియాన్ ఎన్ పెరా బృందం పూడిక తీతతో కలిగే ప్రయోజనాలను వర్గీకరించి చెప్పారు. అం దులో ముఖ్యమైనవి- ఎకరానికి 40 ట్రాక్టర్లు లేదా 200 టన్నుల చెరువు మట్టిని వేయడం ద్వారా 3 సంవత్సరాల వరకు రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి 100 శాతం అధికోత్పత్తిని సాధించవచ్చు. ఆహార ధాన్యాలు, వాణిజ్య పంటల ఉత్పత్తిలో పురుగు మందుల అవశేషాలను లేకుండా చేయవచ్చు. పట్టణీకరణ సవాళ్లను ఎదుర్కోవచ్చు. అధికోత్పత్తితో ప్రతి ఎకరా సాగు భూమికి అదనం గా 60 మానవ పనిదినాలను పెంచవచ్చు. తక్కు వైన స్థూల, మధ్య సూక్ష్మ పోషకాలను సమృద్ధిగా సాగు భూమికి అందజేసి ఎరువులు, పురుగు మం దుల వినియోగంలో 80 శాతం విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చు. తెలంగాణలోని 10 జిల్లాల్లోని 45,300 చెరువు లలో ఉన్న పూడిక మట్టిని తొలగించినట్లయితే అదనపు భూసేకరణ ఖర్చులు, చట్టపరమైన పేచీలు, జాప్యాలు లేకుండానే మూడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు సమానమైన నీటిని అదనంగా పొం దవచ్చు. ఉపరితల అదనపు నీటి పారుదల అవకాశాన్ని, ఇప్పుడున్న దానికి రెండింతలకు పెం చవచ్చు. అదనపు భూగర్భ జల మొత్తాన్ని పెం చవచ్చు. మునుగోడు మండలంలోని మెల్మకన్నె గ్రామంలో మూడు సంవత్సరాలలో తీసిన 50 వేల ట్రాక్టర్ల పూడిక మట్టిని 1,200 ఎకరాల సాగు భూమిలో వేసుకున్నారు. ఈ కాలంలో దాదాపు 3 కోట్ల రూపాయల అదనపు ఫలసాయాన్ని వారు పొందారు. పర్యవసానంగా 140 అడుగుల తోతున ఉన్న భూగర్భ జలాలు 30 అడుగుల పైకి ఉబికి వచ్చాయి. విద్యుత్ వినియోగం మీద ఒత్తిడిని బాగా తగ్గింది. రెండవ పంట గగనమై ఊహించడానికి అవకాశం లేని పరిస్థితులలో పంటలకు సమృద్ధిగా సాగు నీరు లభించింది. దహగామ ఆదిత్య బృందం చేసిన విశ్లేషణలో ఒకే ఒక్కసారి యంత్రాలతో, ట్రాక్టర్లతో పూడిక తీసిన అనంతరం గ్రామీణ ఉపాధి హామీ పథకం సాలీనా సగటున ఇవ్వగలిగిన 42 పని దినాలకంటే రెట్టింపుగా 100 శాతం గ్రామీణ ఉపాధి అవకాశాలు మానవ పనిదినాలు పెరిగినట్లు, అదే పెట్టుబడి మొత్తానికి సమకూరినట్లుగాను వెల్లడైంది. 100 రోజుల ఉపాధిహామీ పథకానికి కేటాయించిన బడ్జె ట్ ఒక్కరికి 10 వేల రూపాయలు. లభ్యమైన దేశీయ సగటు పనిదినాలు ఒకరికి 42 మాత్రమే. తర్వాత ఉపాధి హామీ అవసరం లేకుండానే అధిక ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. ఎరువుల, పురుగు మం దుల వాడకంలో ఆదాను భూగర్భ నీటి మట్టంలో పెరుగుదలను, విద్యుత్ వినియోగంలో తగ్గింపును, ఫ్లోరోసిన్ నివారణను ఏకకాలంలో సాధించగలదు. నిర్లక్ష్యానికి గురైన రైతుల ఆత్మ హత్యలను నివారిం చి, విలువైన రైతుల ప్రాణాలను కాపాడగలదు. (వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి నాయకుడు) -
చీడపీడల నివారణకు వేపాకు రసం ఉత్తమం
* పావు కిలో వేపాకులు రుబ్బి.. 5 లీ. నీరు కలిపి చల్లాలి * నందివర్థనం పూలతో తామర పురుగులకు చెక్ * జీవామృతం వాడితే పంటలకు ఎండు తెగులు రాదు ఇంటి పంట: మహానగరం నడిబొడ్డున అపార్ట్మెంట్లో నివాసం అయినా.. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పండించే సహజాహారంపై ఆసక్తి ఉంటే చాలు ఉన్నంతలో ఇంటిపంటలను సాగు చేయవచ్చని రుజువు చేస్తున్నారు డాక్టర్ గడ్డం రాజశేఖర్. సికింద్రాబాద్ అడిక్మెట్లోని అనురాధ అపార్ట్మెంట్ మొదటి అంతస్థులోని సొంత ఫ్లాట్లో డా. రాజశేఖర్ కుటుంబం నివాసం ఉంటున్నది. పార్కింగ్ ప్లేస్ పక్కన ఖాళీ స్థలాన్ని బాగు చేసి ఇంటిపంటల సాగు ప్రారంభించారు. నేలలో కొంచెం పశువుల ఎరువు వేసి వంగ, టమాటా, మిరప మొక్కలు నాటారు. చెక్కలతో ఏర్పాటు చేసిన మడిలో ఎర్ర తోటకూర, ఇతర ఆకుకూరలు సాగు చేస్తున్నారు. కొన్ని కుండీల్లో మెంతికూర, పాలకూర, కొత్తిమీర, మునగ సాగు చేస్తున్నారు. వంటింటి వ్యర్థాలను మొక్కల మొదళ్ల వద్ద మల్చింగ్గా వేస్తున్నారు. తన తల్లి శాంతకు ఈ మొక్కలే కాలక్షేపమని రాజశేఖర్ తెలిపారు. రసాయన రహిత సుస్థిర వ్యవసాయంలో అనుభవం ఉన్న శాస్త్రవేత్త కావడం వల్ల రాజశేఖర్(83329 45368) కిచెన్ గార్డెన్ కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. ఇవీ ఆయన చెప్పిన విశేషాలు.. * వేప నూనె కన్నా తాజా వేపాకుల రసం చీడపీడల నివారణకు సమర్థవంతంగా ఉపయోగపడుతోంది. పావు కిలో పచ్చి వేపాకులు తీసుకొని మిక్సీలో/రోటిలో వేసి రుబ్బి.. 5 లీటర్ల నీటిని కలిపి.. మొక్కలపై చల్లుతున్నాం. * వర్మీకంపోస్టు వేసిన కుండీల్లో మెంతికూర వేస్తే.. ఎండు తెగులుతో 20% మొక్కలు చనిపోయాయి. వర్మీకంపోస్టు వాడకుండా ఎర్రమట్టిలో మెంతులు చల్లి జీవామృతం వాడిన కుండీలో ఈ సమస్య లేదు. విత్తనం వెంట వచ్చే ఎండు తెగులు తాలూకు శిలీంద్రాన్ని జీవామృతంలో ఉండే మేలుచేసే సూక్ష్మజీవులు హతమార్చాయన్నమాట. జీవామృతం గ్రోత్ ప్రమోటర్, శిలీంద్రనాశిని కూడా. * నేల మీద వంగ మొక్కలకు జీవామృతం వాడినప్పుడు 6 అంగుళాల పొడవున పెరిగిన వంకాయలు, జీవామృతం వాడడం మానేస్తే 3 అంగుళాలే పెరిగాయి. * వంగ, టమాటా, మిరప, కొత్తిమీర, ఆకుకూరలకు తామరపురుగు సోకుతూ ఉంటుంది. దీన్ని అరికట్టడానికి జిగురుపూసిన తెల్ల ఎరలు వాడుతున్నాను. లేదా తెల్లటి పూలు పూసే మొక్కలు పెంచాలి. నందివర్థనం పూలు పూసినంతకాలం తామర పురుగులు వాటిపైనే ఉన్నాయి. పూలు లేనప్పుడు మిరప, వంగ మొక్కలను ఆశించడం గమనించాను. పెంకు పురుగులు ఆశిస్తే పసుపు ఎరలు వాడాలి. కుండీల్లో మునగాకు సాగు! * పెరట్లో మునగ చెట్టు ఉంటే విటమిన్లు, టానిక్కులు కొనాల్సిన అవసరం రాదంటారు. మునగను కుండీల్లో ఆకు కోసం, కాయల కోసం కూడా పెంచవచ్చు. విత్తనం వేస్తే ఆరు నెలలు, నెల మొక్క నాటితే 5 నెలల తర్వాత నుంచి మునగాకు కోసుకొని కూరల్లో వాడుకోవచ్చు. ఎండబెట్టి పొడి చేసి.. రోజూ కొంచెం కూరల్లో వేసుకోవచ్చు. ఆకు కోసం పెంచితే.. 4 అడుగుల ఎత్తులో పైచిగురును తుంచేయాలి. పక్కకొమ్మలు పెరిగి ఎక్కువ ఆకు వస్తుంది. కాయలకోసం పెంచితే.. 5 అడుగులు ఎదిగిన తర్వాత పై చిగురును కత్తిరించాలి. * మునగ చెట్టు పెరట్లో ఉండకూడదన్న సెంటిమెంటు కొందరిలో ఉంది. బొంత(గొంగళి)పురుగు వల్లే ఇది వచ్చి ఉంటుంది. బొంత పురుగు రాకుండా చేయడానికి ఓ చిట్కా ఉంది. మొక్క 6 నెలలు పెరిగిన తర్వాత.. కింది నుంచి 2 అడుగుల ఎత్తు వరకు పాలిథిన్ పేపర్ను చుట్టి.. దానిపై నూనెను పూస్తే బొంత పురుగు చెట్టెక్కలేదు. బొంతపురుగులు మొక్క మొదట్లో మట్టిలో ఉండే గుడ్ల నుంచి పుట్టుకొస్తాయి. ఆ గుడ్లను తవ్వితీసి నాశనం చేస్తే సమస్యే ఉండదు. * కమలాల్లో కంటే 7 రెట్లు ఎక్కువ విటమిన్ సి, క్యారెట్లలో కంటే 4 రెట్లు ఎక్కువ విటమిన్ ఏ, పాలల్లో కంటే 4 రెట్లు ఎక్కువ క్యాల్షియం, అరటిపండ్లలో కంటే 3 రెట్లు ఎక్కువ పొటాషియం, పెరుగులో కంటే 2 రెట్లు ఎక్కువ మాంసకృత్తులు మునగాకులో ఉన్నాయి. * మునగాకును పప్పులో, సాంబారులో వేయొచ్చు. వేపుడు చేయొచ్చు. మునగ కాయల్లో కన్నా ఆకుల్లో పోషకాలు ఎక్కువ. మునగ పువ్వును చట్నీ చేయొచ్చు. * మునగాకు పొడి చేసేదిలా: లేత మునగాకును కడిగి, నీడలో ఆరబెట్టాలి. గలగలలాడేలా ఆరిన మునగాకును పొడి చెయ్యాలి. పొయ్యి మీద నుంచి దించిన తరువాత కూరలు, చారు వంటి వాటిల్లో వేసి కలపాలి. -
ఆరుగురు పిల్లలకు విషమిచ్చిన తల్లి
-
ఆరుగురు పిల్లలకు విషమిచ్చిన తల్లి
తానూ తాగి ఆత్మహత్యాయత్నం మహబూబ్నగర్ క్రైం: ఓ తల్లి తన ఆరుగురు పిల్లలకు పురుగుల మందు తాగించి, తానూ ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన ఆదివారం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం రాజాపూర్లో జరిగింది. స్థానికులు, బాధితుల కథనం మేరకు.. ఖాసీం, ఖాజాబేగం దంపతులకు ఆరుగురు సంతానం. కొద్దిరోజులుగా కుటుంబ కలహాలు చోటుచేసుకుంటున్నాయి. మనస్తాపానికి గురైన ఖాజాబేగం తన ఆరుగురు పిల్లలు మైమూదా, అభిదా, సబా, షాహీన్, మస్తాన్, నవాజ్లకు ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగించింది. కొద్దిసేపటి తరువాత తాను కూడా తాగింది. ఇది గమనించిన స్థానికులు చికిత్సకోసం మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో చిన్నారులు మస్తాన్(2), నవాజ్(7) ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.