-
ఉత్పత్తికి సిద్ధమైన మరో భారీ ఫార్మా యూనిట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో భారీ ఫార్మా సంస్థ ఉత్పత్తికి సిద్ధమైంది. చైనా నుంచి ఫార్మా దిగుమతులను తగ్గించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ) స్కీం కింద లిఫియస్ పేరుతో అరబిందో గ్రూపు పెన్సులిన్ జి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పెన్సులిన్ తయారీలో కీలక ముడిపదార్థంగా పెన్సులిన్ జి వినియోగిస్తారు. కాకినాడ సమీపంలోని తొండంగి వద్ద 250 ఎకరాల్లో సుమారు రూ.2,205 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ శరవేగంగా నిర్మాణాన్ని పూర్తి చేసుకొని, ఉత్పత్తి ప్రారంభానికి సిద్ధమైంది. ఈ కర్మాగారంలో ఏటా 15,000 టన్నుల పెన్సులిన్ జి యూనిట్, 2,000 టన్నుల సామర్ధ్యంతో 7–ఏసీఏ యూనిట్ను అరబిందో గ్రూపు ఏర్పాటు చేసింది. ఈ యూనిట్లో 3,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఈ ప్లాంట్ వాణిజ్య ఉత్పత్తికి సిద్ధమవడంతో లిఫియస్ ఉద్యోగ నియామకాలు చేపట్టింది. బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్ (బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ) కోర్సులు పూర్తి చేసిన వారిని వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నట్లు లిఫియస్ ప్రకటించింది. ఈ నెల 22న హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టు వద్ద ఉన్న మనోహర్ హోటల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఫెర్మిటేషన్స్లో ప్రొడక్షన్, మైక్రోబయోలజీ రంగాల్లో నియామకాలకు తాజాగా కోర్సు పూర్తి చేసిన వారి (ఫ్రెషర్స్) దగ్గర నుంచి 10 ఏళ్ల అనుభవం ఉన్నవారికి అవకాశం కల్పిస్తోంది. వాటర్ ట్రీట్మెంట్ అసిస్టెంట్ పోస్టులకు కనీసం రెండేళ్ల అనుభవం నుంచి పదేళ్ల వారికి అవకాశం కల్పిస్తోంది. మరో రెండు ఫార్మా యూనిట్లు లిఫియస్కు సమీపంలోనే పీఎల్ఐ స్కీం కింద మరో రెండు ఫార్మా యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. అరబిందో గ్రూపు క్యూలే పేరుతో సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడితో 159 ఎకరాల్లో ఎరిత్రోమైసిన్ థియోసేనేట్ యూనిట్ని ఏర్పాటు చేస్తోంది. దీని ఉత్పత్తి సామర్థ్యం 1,600 టన్నులు. దీనికి సమీపంలోనే దివీస్ సంస్థ ఓ ఫార్మా యూనిట్ ఏర్పాటు చేస్తోంది. దీని పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూడు యూనిట్లతో కాకినాడ మేజర్ ఫార్మా హబ్గా ఎదగనుంది. -
అదిరిపోయే దివాలీ గిఫ్ట్: సంబరాల్లో కంపెనీ ఉద్యోగులు
హర్యానాలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ తన ఉద్యోగులకు రానున్న దీపావళికి కార్లను బహుమతిగా ఇచ్చింది. తన ఆఫీస్ హెల్పర్తో సహా 12 మంది ఉద్యోగులకు సరికొత్త టాటా పంచ్ కార్లను గిఫ్ట్గా అందించింది కంపెనీ. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అయింది. అంతేకాదు తన ఉద్యోగులే తనకు సెలబ్రిటీలు అని పేర్కొనడం విశేషంగా నిలిచింది. హర్యానా, పంచకులలోని ఫార్మాస్యూటికల్ కంపెనీ మిట్స్కార్ట్ ఛైర్మన్ కార్లను కానుకగా ఇచ్చారు. అంతేకాదు తమ సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. ఛైర్మన్ ఎంకె భాటియా. వారి అంకితభావం, కృషి తనను ముగ్ధుడ్ని చేసిందనీ, అందుకే వారికి ప్రత్యేక బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కంపెనీ ఎన్నో ఒడిదుడుకులను చవి చూసింది అయినా ఉద్యోగులు తమతోనే ఉండి కంపెనీ ఎదుగుదలకు సహకరించారని పేర్కొన్నారు. వాళ్లే తమ స్టార్స్ అంటూ భాటియా సంతోషం వ్యక్తం చేశారు. దీంతో అటు ఉద్యోగుల సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. కారు తాళాలను ఉద్యోగులిస్తున్న వీడియోను లింక్డ్ఇన్ పోస్ట్ చేశారు. కంపెనీ పట్ల వారి నిబద్ధతకు, విశ్వాసానికి గుర్తుగా నెల రోజుల క్రితమే కార్లు అంద జేశానని, అంతేకానీ దీపావళి సందర్బంగా ప్లాన్ చేసింది కాదంటూ వివరించారు. ఈ సమయంలో వార్తలు రావడం యాదృచ్చిక మన్నారు. అలాగే సమీప భవిష్యత్తులో మరో 38 మందికి కూడా ఈ గిప్ట్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు మిట్స్కార్ట్ యాజమాన్యం తెలిపింది. ఇదిలా ఉంటే కలలో కూడా ఊహించని కార్లను బహుమతిగా అందుకోవడం పట్ల ఉద్యోగులు ఆశ్చర్యానికి లోనయ్యారు.. వారిలో కొందరికి డ్రైవింగ్ కూడా తెలియదట. టాటా పంచ్ టాటా మోటార్స్కు చెందిన టాటా పంచ్ 2021 లో లాంచ్ అయింది. టాటా పంచ్ అనేది ఎంట్రీ-లెవల్ మైక్రో SUV. ఈ వెహికల్ ప్రారంభ ధర సుమారు రూ. 6లక్షలు -
AP: సాగర తీరంలో ఐటీ వెలుగులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఐటీ సేవల హబ్గా మారేందుకు విశాఖపట్నానికి అన్ని అవకాశాలు, సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. విశాఖలో ఇన్ఫోసిస్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాలు పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. టైర్ 1 సిటీగా విశాఖ రూపాంతరం చెందేందుకు ఇన్ఫోసిస్ రాక దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు 20 వేల మంది నేవీ ఉద్యోగులతో తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంగా ఉన్న విశాఖ ఎడ్యుకేషన్ హబ్గా కూడా నిలిచిందని గుర్తు చేశారు. ఇక్కడ ఇప్పటికే రెండు పోర్టులున్నాయని త్వరలోనే మూడో పోర్టు సమీపంలోని శ్రీకాకుళంలో రానుందని తెలిపారు. మరో రెండేళ్లల్లో పూర్తిస్థాయి అంతర్జాతీయ పౌర విమానాశ్రయం కూడా సిద్ధం కానుందని చెప్పారు. పరిశ్రమలకు ఏ సహాయం కావాలన్నా ఒక్క ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటామని పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు. సోమవారం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటన సందర్భంగా విశాఖలో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ను సీఎం జగన్ ప్రారంభించారు. ఫార్మా కంపెనీల నాలుగు యూనిట్లకు ప్రారంభోత్సవాలు, రెండు యూనిట్లకు శంకుస్థాపనలు నిర్వహించారు. మొత్తం రూ.1,646 కోట్ల విలువైన ఐటీ కార్యాలయాలు, ఫార్మా యూనిట్ల ఏర్పాటుతో 3,450 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. విశాఖలో సముద్ర తీరం శుభ్రత కోసం జీవీఎంసీ సిద్ధం చేసిన ఆరు బీచ్ క్లీనింగ్ యంత్రాలను కూడా ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో సీఎం జగన్ ఏమన్నారంటే.. విశాఖకు విశేష సామర్థ్యం.. విశాఖ నగరానికి విశేషమైన సామర్ధ్యం ఉంది. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై తరహాలో విశాఖపట్నం కూడా ఐటీ హబ్గా మారబోతోంది. ఆ స్ధాయిలో ఈ నగరానికి సహకారాన్ని అందిస్తున్నాం. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ తరహా మెట్రో నగరం ఆంధ్రప్రదేశ్లో లేదు. ఐటీ, ఐటీ సేవలకు సంబంధించిన పరిశ్రమలు గతంలో విశాఖలో ఏర్పాటు కాలేదు. వాస్తవానికి ఆ కంపెనీల ఏర్పాటుకు కావాల్సిన అన్ని అర్హతలు, సామర్ధ్యం నగరానికి ఉన్నప్పటికీ అవన్నీ అప్పటి రాజధాని హైదరాబాద్లోనే ఏర్పాటయ్యాయి. ఏపీలో విశాఖ అతిపెద్ద నగరం. టైర్ 1 సిటీగా ఎదగడానికి కావాల్సిన అన్ని అర్హతలు, సామర్ధ్యం ఈ నగరానికి ఉన్నాయి. ప్రథమశ్రేణి నగరంగా ఎదగడానికి అవసరమైన తోడ్పాటును ఇన్ఫోసిస్ అందించగలదని నేను బలంగా నమ్ముతున్నా. దాదాపు 3.28 లక్షల మంది ఉద్యోగులు, 18.5 బిలియన్ డాలర్ల రెవెన్యూ సామర్ధ్యం కలిగిన ఇన్ఫోసిస్తో పాటు టీసీఎస్, విప్రో లాంటి సంస్ధలు నగర ఐటీ స్వరూపాన్ని, ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చి వేస్తాయి. విశాఖకు ఇప్పుడు ఇన్ఫోసిస్ వచ్చింది. రానున్న రోజుల్లో మిగిలిన ఐటీ కంపెనీలు కూడా ఆ జాబితాలో చేరనున్నాయి. విశాఖలో ఆదానీ డేటాసెంటర్ కూడా రాబోతుంది. సబ్మెరైన్ ఇంటర్నెట్ కేబుల్ మనకు ప్రత్యేకంగా సింగపూర్ నుంచి వస్తుంది. రాబోయే రెండేళ్లలో డేటా సెంటర్ రానుంది. క్లౌడింగ్తో పాటు ఐటీ రంగంలో చాలా మార్పులు రానున్నాయి. ఇవన్నీ సాకారం కానున్నాయి. నీలాంజన్, నీలాద్రిప్రసాద్, సురేష్, రఘు లాంటి ఐటీ నిపుణులతో మాట్లాడిన తర్వాత వీరంతా విశాఖ ఐటీలో కచ్చితంగా ఒకరోజు అద్భుతాలు సృష్టిస్తారని బలంగా విశ్వసిస్తున్నా. నాకు ఆ నమ్మకం ఉంది. ఇవాళ 1,000 మందితో ఇక్కడ ప్రారంభమైన ఇన్ఫోసిస్ రానున్న రోజుల్లో మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, ఇన్ఫోసిస్తో కలసి ఐటీ రంగంలో విశాఖ బహుముఖ ప్రగతిని సాధిస్తుందన్న విశ్వాసం నాకుంది. రానున్న రోజుల్లో విశాఖలో పెట్టుబడులకు అనేక మంది ముందుకొచ్చే అవకాశాలున్నాయి. అందుకు అనుగుణంగా పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఇప్పటికే ఎడ్యుకేషన్ హబ్ విశాఖలో ఇప్పటికే అత్యంత ప్రతిష్టాత్మక సంస్ధలు ఏర్పాటయ్యాయి. 14 ఇంజనీరింగ్ కాలేజీలు, 8 యూనివర్సిటీలు, 4 మెడికల్ కాలేజీలు, 12 డిగ్రీ కాలేజీలతో విశాఖ ఎడ్యుకేషన్ హబ్గా ఉంది. ఇక్కడి నుంచి ఏటా దాదాపు 12 వేల నుంచి 15 వేల మంది ఇంజనీర్లు డిగ్రీ పూర్తి చేసుకుని వస్తున్నారు. వీటితో పాటు ఐఐఎం, నేషనల్ లా యూనివర్సిటీ లాంటి అత్యంత ప్రతిష్టాత్మక సంస్ధలు కూడా విశాఖలో ఉన్నాయి. ఇదీ విశాఖ సామర్ధ్యం. ఇక్కడే ఐవోసీతోపాటు తూర్పు నౌకా దళం ప్రధాన కేంద్రం కూడా ఉంది. విశాఖ, గంగవరం లాంటి రెండు బలమైన పోర్టులు కూడా ఉన్నాయి. వీటితో పాటు శ్రీకాకుళంలో మూడో పోర్టు వస్తోంది. మధురవాడ ఐటీ హిల్స్లో ఇన్ఫోసిస్ గన్నవరం నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ తొలుత మధురవాడ ఐటీ హిల్స్లో రూ.35 కోట్లతో ఏర్పాటైన ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ని ప్రారంభించారు. సంస్థ ప్రాంగణమంతా పరిశీలించారు. అనంతరం గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) సముద్రతీర ప్రాంత శుభ్రత కోసం రూ.15 కోట్లతో ఏర్పాటు చేసిన 6 బీచ్ క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించారు. క్లీనింగ్ యంత్రాలపైకి ఎక్కి అవి ఎలా పనిచేస్తాయన్న వివరాలను ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఆ తరువాత పరవాడ చేరుకుని రూ.500 కోట్లతో ఫార్మాసిటీలో 19.34 ఎకరాల్లో ఏర్పాటైన అరబిందో ఫార్మా అనుబంధ సంస్థ యూజియా స్టెరిలైజ్ యూనిట్ను ప్రారంభించారు. ఈ సంస్థ ఏటా 420 మిలియన్ సామర్థ్యం కలిగిన జనరల్ ఇంజెక్టబుల్స్ను తయారు చేయనుంది. అనంతరం అచ్యుతాపురంలో లారస్ సంస్థ రూ.440 కోట్లతో నిర్మించిన ఫార్ములేషన్ బ్లాక్ను, రూ.191 కోట్లతో ఏర్పాటైన యూనిట్–2ను సీఎం ప్రారంభించారు. లారస్ రూ.240 కోట్లతో 450 మందికి ఉపాధి కల్పించేలా నిర్మించనున్న యూనిట్–3తో పాటు మరో రూ.240 కోట్లతో ఇదే సంస్థ పరవాడ వద్ద నిర్మించనున్న యూనిట్–7కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఫార్మా ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా పరిపాలన రాజధానిగా శరవేగంగా ముస్తాబవుతున్న విశాఖకు అక్టోబర్కే తరలి వెళ్లాల్సి ఉన్నా కార్యాలయాలు ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోవడం, విస్తృత భద్రతా కారణాల దృష్ట్యా అధికారుల సూచనల మేరకు డిసెంబర్లో వెళ్లే అవకాశం ఉందని సీఎం సమావేశంలో చెప్పారు. ఈ కార్యక్రమాల్లో ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నీలాంజన్ రాయ్, వైస్ ప్రెసిడెంట్ నీలాద్రి ప్రసాద్ మిశ్రా, లారస్ సీఈవో సత్యనారాయణతో పాటు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ఆదిమూలపు సురేష్, విడదల రజని, మేయర్ హరివెంకటకుమారి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డా.సత్యవతి, గొడ్డేటి మాధవి, ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, కలెక్టర్ డా.మల్లికార్జున, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 40 శాతం మహిళా ఉద్యోగులే 1981లో ఏర్పాటైన ఇన్ఫోసిస్ భవిష్యత్తు డిజిటల్ సేవలు, కన్సల్టింగ్లో ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా ఉంది. 56 దేశాలలో 274 చోట్ల సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ డీలర్స్ ఆటోమేటెడ్ కొటేషన్స్ (నాస్డాక్) జాబితాలో భారత తొలి ఐటీ కంపెనీగా ఇన్ఫోసిస్ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 71.01 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇన్ఫోసిస్లో ప్రపంచవ్యాప్తంగా 3,50,000 మంది ఉద్యోగులు పని చేస్తుండగా వీరిలో 40 శాతం మంది మహిళా ఉద్యోగులే కావడం గమనార్హం. 2023లో ప్రపంచంలో అత్యంత నైతికత (ఎథికల్) సంస్థలలో ఒకటిగా ఇన్ఫోసిస్ గుర్తింపు పొందింది. టైమ్ మ్యాగజైన్ టాప్ 100 ప్రపంచ అత్యుత్తమ సంస్థలు 2023 జాబితాలో ఉన్న ఏకైక భారతీయ సంస్థగా ఇన్ఫోసిస్ నిలిచింది. గ్లోబల్ టాప్ ఎంప్లాయర్ 2023 సర్టిఫికేషన్ను సొంతం చేసుకుంది. అలల ప్రేరణతో కార్యాలయం టాలెంట్ స్ట్రాటజీలో భాగంగా ప్రతిభా కేంద్రాలకు దగ్గరగా డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఇన్ఫోసిస్ నిర్దేశించుకుంది. మంగళూరు, మైసూర్, త్రివేండ్రం, నాగ్పూర్, ఇండోర్, జైపూర్, హుబ్లీ, చండీగఢ్, భువనేశ్వర్, కోయంబత్తూర్ లాంటి టైర్ 2 నగరాల్లో డెలివరీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. తాజాగా విశాఖలో సేవలను ప్రారంభించింది. మధురవాడలోని ఐటీ హిల్ నం.2లో ఉన్న సిగ్నిటివ్ టవర్స్లో లీజుకు తీసుకున్న బిల్డ్ అప్ స్థలంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. విశాఖకు సహజ అందాలను తీసుకొచ్చిన సముద్రపు అలల ప్రేరణతో కార్యాలయంలోని ఇంటీరియర్ డిజైన్ రూపొందించారు. జావా, జే2ఈఈ, శాప్, డేటాసైన్స్, డేటా అనలటిక్స్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎనర్జీ – యుటిలిటీ, రిటైల్ సహా బహుళ పరిశ్రమలకు ప్రపంచవ్యాప్తంగా క్లెయింట్స్ సేవలను ఈ కేంద్రం నుంచి అందిస్తారు. ఇక్కడ పనిచేసే ఉద్యోగులలో సింహభాగం విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం పరిసర ప్రాంతాలకు చెందినవారే ఉన్నారు. కాగా మరింత మంది నియామకం కోసం విశాఖలోని వివిధ కళాశాలలతో ఇన్ఫోసిస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇన్ఫోసిస్ రాక విశాఖలో ఐటీ పరిశ్రమ వృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. ఇప్పటికే ఉన్న బీపీవో/కేపీవో పరిశ్రమలతో పాటు కోర్ ఐటీ కంపెనీలతో కలసి ఎమర్జింగ్ టెక్నాలజీ హబ్గా విశాఖ అడుగులు వేసేందుకు దోహదం చేయనుంది. -
కంపెనీలు తేవడం ఆషామాషీ కాదు
సాక్షి, హైదరాబాద్ / శామీర్పేట / మర్కూక్ (గజ్వేల్): రాష్ట్రానికి కొత్త కంపెనీలు తీసుకురావడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా తెలంగాణకు అనేక దేశ, విదేశీ కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయంటే, దానివెనుక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, మంత్రులు పడే శ్రమ చాలా ఎక్కువని ఆయన అన్నారు. హైదరాబాద్లోని జినోమ్ వ్యాలీలో గురువారం ఫార్మా కంపెనీ భారత్ సిరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ కర్మాగారానికి శంకుస్థాపన చేసిన మంత్రి మాట్లాడుతూ జీవశాస్త్ర రంగ అభివృద్ధికి, ప్రోత్సాహానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్న ఫలితమే కొత్త కొత్త కంపెనీల రాక అని చెప్పారు. పది ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటవుతున్న బీఎస్వీ కర్మాగారం ద్వారా మహిళల ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే ఉత్పత్తులు తయారు కానుండటం హర్షణీయమైన అంశమన్నారు. జినోమ్ వ్యాలీలో అంచనాలకు మించి వృద్ధి చెందుతోందని, ఈ నేపథ్యంలో దీనిని మరింత విస్తరించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఇప్పటికే 130 ఎకరాల భూమి అదనంగా సేకరించగా, 250 ఎకరాలతో మలిదశ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ ఉపాధ్యక్షుడు ఈవీ నరసింహారెడ్డి, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈఓ శక్తి నాగప్పన్, బీఎస్వీ ఎండీ, సీఈఓ సంజీవ్ నవన్గుల్ పాల్గొన్నారు. యూరోఫిన్స్ కేంద్రం ప్రారంభం బెల్జియం కేంద్రంగా పనిచేస్తున్న యూరోఫిన్స్ బయో ఫార్మా సర్విసెస్ హైదరాబాద్లోని జినోమ్ వ్యాలీలో తన కేంద్రాన్ని గురువారం ప్రారంభించింది.వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులతో సిద్ధమైన ఈ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అంతర్జాతీయ స్థాయి ఫార్మా కంపెనీలకు బయో అనలిటికల్ సర్విసెస్, ఫార్ములేషన్ డెవలప్మెంట్, సేఫ్టీ టాక్సికాలజీ, డిస్కవరీ కెమిస్ట్రీ అండ్ డిస్కవరీ బయాలజీ వంటి సేవలు అందించే యూరోఫిన్స్ కేంద్రం 15 ఎకరాల్లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యూరోఫిన్స్ కేంద్రం ద్వారా రానున్న కాలంలో రెండు వేల మందికిపైగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా 33 శాతం వ్యాక్సిన్లు హైదరాబాద్ జినోమ్ వ్యాలీలోనే తయారు అవుతున్నాయని, ప్రపంచానికి వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ మారిందని ఎక్కడికెళ్లినా ధైర్యంగా చెబుతానన్నారు. ఇక్కడ ఏడాదికి 900 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయని, వచ్చే ఏడాది నుంచి 1400 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతాయని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో యూరోఫిన్స్ రీజనల్ డైరెక్టర్ నీరజ్ గార్గ్, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. -
మాన్యుఫాక్చరింగ్ హబ్గా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలకు వేదికగా విశాఖపట్నం మారుతోంది. మాన్యుఫాక్చరింగ్, ఫార్మా, ఐటీ, కార్గో... ఇలా భిన్నమైన రంగాలకు సంబంధించిన పరిశ్రమలు ఒక్కొక్కటిగా విశాఖకు విస్తరిస్తున్నాయి. తాజాగా విశాఖపట్నం స్పెషల్ ఎకనమిక్ జోన్ (వీసెజ్)లో మరో మూడు మాన్యుఫాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. రూ.500 కోట్లకు పైగా పెట్టుబడులతో రెండు బయో డీజిల్ కంపెనీలు, ఒక ఫార్మా కంపెనీ ఏడాదిలోపు ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా 1,200 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరోవైపు తొలి త్రైమాసికంలో గతేడాదితో పోలిస్తే ఉత్పత్తుల ఎగుమతుల్లో 34 శాతం వృద్ధి కనబరిచిన వీసెజ్... అర్ధ సంవత్సరానికి 50 శాతం వృద్ధి నమోదు దిశగా ముందుకు సాగుతోంది. యూఎస్, కెనడాకు ఎగుమతులే లక్ష్యంగా... ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన మూడు యూనిట్లు విశాఖ సెజ్లోనే ఏర్పాటు కానున్నాయి. ఇందులో బయోడీజిల్ తయారీ సంస్థ అద్వైత్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్, బయోకాన్ లిమిటెడ్, ఫార్మాసూ్యటికల్ ఉత్పత్తుల తయారీ సంస్థ గ్రాన్యూల్స్ సీజెడ్ఆర్వో సంస్థలు ఉన్నాయి. ఈ కంపెనీలు ఏడాదిలోపు తమ కార్యకలాపాలు ప్రారంభించాలని వీసెజ్ నిబంధన విధించింది. అయితే... ఈ సంస్థలన్నీ ఆరు నుంచి పది నెలల్లోపే ఉత్పత్తుల తయారీని మొదలు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని వీసెజ్ అధికారులు చెబుతున్నారు. ఈ మూడు కంపెనీలు ప్రధానంగా కెనడా, యూఎస్కు ఎగుమతులే లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. రికార్డు స్థాయిలో ఎగుమతులు ఏపీ, తెలంగాణకు వస్తున్న పరిశ్రమలు వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టాం. దువ్వాడ వీసెజ్ పరిధిలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సెజ్లు, యూనిట్ల ద్వారా రికార్డు స్థాయి ఎగుమతులు సాధించాం. 2023–24 మొదటి త్రైమాసికంలో రూ.50,195 కోట్ల విలువైన వస్తువులు, సేవలను ఎగుమతి చేశాం. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 34 శాతం వృద్ధి రేటు సాధించాం. వివిధ వస్తువులను ఉత్పత్తి చేయడం ద్వారా రూ.35,992 కోట్లు, సేవారంగం ఎగుమతుల్లోనూ 36 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు గణాంకాలను పరిశీలిస్తే రూ.1,04,961 కోట్ల పెట్టుబడులు వీసెజ్ ద్వారా రాగా... మొత్తం 6,61,579 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. – ఎం.శ్రీనివాస్, వీసెజ్జోనల్ డెవలప్మెంట్ కమిషనర్ -
ఫార్మసీ బిజినెస్లోకి అంబానీ: మందులు అమ్మనున్న రిలయన్స్!
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని భారీ వ్యాపార సమ్మేళనం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Reliance Industries Limited) వివిధ రంగాలకు విస్తరిస్తోంది. పెద్ద పెద్ద అంతర్జాతీయ బ్రాండ్లను భారత్కు తీసుకొస్తోంది. వాటితో భాగస్వామ్యం చేసుకుని విభిన్న వ్యాపారాల్లోకి అడుగు పెడుతోంది. ఈసారి యూకేకి చెందిన వాల్గ్రీన్స్ బూట్స్ అలయన్స్ (Walgreens Boots Alliance Inc) అనే భారీ ఫార్మాస్యూటికల్ కంపెనీతో ఒప్పందాన్ని చేసుకుంటోంది. భారీ మొత్తంలోనే ఆఫర్ వాల్గ్రీన్స్ బూట్స్ అలయన్స్ అనేది యునైటెడ్ కింగ్డమ్ కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న మల్టీ బిలియన్ డాలర్ల కంపెనీ. దీన్ని కొనుగోలు చేసి మెడికల్ స్టోర్లు, ఫార్మా వ్యాపారాన్ని భారతదేశానికి తీసుకురావడానికి ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎత్తుగడలు వేస్తోంది. ఈ మేరకు వాల్గ్రీన్స్ బూట్స్ అలయన్స్తో ఒప్పందం కుదుర్చుకుని దానికి సంబంధించిన అంతర్జాతీయ మెడిస్టోర్లను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇందు కోసం యూకే కంపెనీకి అంబానీ భారీ మొత్తంలోనే ఆఫర్ చేసినట్లు తెలిసిందని బ్లూమ్బెర్గ్ కథనం పేర్కొంది. కన్సార్టియం ఏర్పాటు ఔట్లుక్, ఎకనామిక్ టైమ్స్ నివేదికల ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్రిటన్, యూఎస్లో ఉన్న ప్రముఖ ఫార్మాస్యూటికల్ చైన్ స్టోర్లను కొనుగోలు చేయడానికి యూఎస్ ఆధారిత ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ ఐఎన్సీ సంస్థతో ఒక కన్సార్టియంను ఏర్పాటు చేస్తోంది. ఫార్మా బ్రాండ్ స్టోర్లను కొనుగోలు చేయడానికి వాల్గ్రీన్స్తో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్న రిలయన్స్ ఇందు కోసం భారీ మొత్తాన్ని ముట్టజెప్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వాల్గ్రీన్స్ కంపెనీ విలువ సుమారు 6.5 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే ఇది భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 53,600 కోట్లు. కష్టాల్లో ఉన్న వాల్గ్రీన్స్ ఫార్మాస్యూటికల్ వ్యాపారాన్ని ఆన్లైన్ మార్కెట్లకు విస్తరించినప్పటి నుంచి వాల్గ్రీన్స్ కష్టాల్లో ఉంది. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఒప్పందం కుదిరితే, ఈ కంపెనీ తమ సంస్థలో స్వల్ప వాటాను మాత్రమే కలిగి ఉంటుంది. మెజారిటీ రిలయన్స్ నియంత్రణలో ఉంటుంది. రిలయన్స్-వాల్గ్రీన్స్ ఒప్పందం విజయవంతమైతే, ముఖేష్ అంబానీ ఈ యూకే కంపెనీని భారతదేశంలో కంపెనీని పరిచయం చేసి ఆన్లైన్ డ్రగ్ స్టోర్ల ద్వారా లాభాలను పెంచుతారని భావిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ రంగంలో ఉన్న టాటా 1ఎంజీ, అపోలో ఫార్మసీ వంటి వాటికి గట్టి పోటీ తప్పదు. కాగా గత సంవత్సరంలోనే ముఖేష్ అంబానీ యూకే కంపెనీ ఈ ఆఫర్ చేశారు. దీనిపై వాల్గ్రీన్స్ బూట్స్ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: IPL 2023: ఫ్రీగా చూపించినా.. వేల కోట్లు సంపాదించారు! -
అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. ఏడుగురికి గాయాలు
సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్లో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. సాహితీ ఫార్మా కంపెనీలో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడగా.. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులకు కింగ్జార్జ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కంపెనీలోని రెండు రియాక్టర్లు పేలడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటల్ని అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు. ఘటనపై అనకాపల్లి ఎస్పీ మురళీ కృష్ణ మాట్లాడుతూ.. సాహితీ ఫార్మా కంపెనీలోప్రమాదం జరిగిందన్నారు. సమాచారం రాగానే తమ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు. కంపెనీలో 35 మంది కార్మికులు విధుల్లో ఉండగా.. 28 మంది బయటకు వచ్చేశారని పేర్కొన్నారు. ఏడుగురికి తీవ్ర గాయలవ్వగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మరో రెండు గంటల్లో మంటలు అదుపులోకి వస్తాయని పేర్కొన్నారు. విషమంగానే పరిస్థితి సాహితీ ఫార్మా కంపెనీలో గాయపడిన వారందరి పరిస్థితి విషమంగా ఉందని కింగ్జార్జ్ ఆసుపత్రి సూపరిండెంట్ శివానంద తెలిపారు. మొత్తం ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. వారందరికీ దాదాపుగా 60 నుంచి 70 శాతం వరకు శరీరం కాలిపోయిందని చెప్పారు. మొదట ముగ్గురిని ఆసుపత్రికి తీసుకొచ్చారని తరువాత కిమ్స్ ఐకాన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మిగతా నలుగురిని కూడా అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ఇక్కడికి షిఫ్ట్ చేశారని తెలిపారు. క్షతగాత్రులను బర్నింగ్ వార్డుకు షిఫ్ట్ చేసి మెరుగైన వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. కొన్ని గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమన్నారు. గాయపడిన వారి వివరాలు.. ఒడిశా భువనేశ్వర్కు చెందిన రమేష్ (45),రాంబిల్లి మండలం జనగాలపాలేనికి చెందిన సత్తిబాబు (35), రాంబిల్లి మండలం అప్పారాయుడుపాలెం వాసి నూకి నాయుడు (40), విజయనగరానికి చెందిన తిరుపతికి(40)తీవ్రగాయాలు అయ్యాయి. నక్కపల్లి మండలం రెబ్బాకకు చెందిన రాజుబాబు, నక్కపల్లికి చెందిన అప్పారావు (43), అనకాపల్లి జిల్లా కొండకొప్పాకకు చెందిన పిల్లా సంతోష్ కుమార్, గాయపడ్డారు. -
తెలుగు రాష్ట్రాల్లో రిచెస్ట్ ఉమన్! ఎవరీ మహిమా?
హైదరాబాద్కు చెందిన మహిమా దాట్ల, ఆమె కుటుంబం రూ.8,700 కోట్ల సంపదతో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంపన్నులుగా అవతరించారు. ఇంతకీ ఎవరీమె? వారి కుటుంబం చేస్తున్న వ్యాపారం ఏంటి? ఏ సంస్థకు వారు అధినేతలు? వంటి విషయాలు తెలుసుకుందాం... ఇదీ చదవండి: Prerna Jhunjhunwala: రూ. 330 కోట్ల యాప్.. ఈమె స్టార్టప్ పిల్లల కోసమే.. స్ఫూర్తిదాయకమైన యువ వ్యాపారవేత్త మహిమా దాట్ల ఐఐఎఫ్ఎల్ (IIFL) వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లో దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అత్యంత సంపన్న మహిళగా అవతరించారు. మహిమా దాట్ల, ఆమె కుటుంబ నికర విలువ రూ. 8,700 కోట్లుగా అంచనా. ఏపీ, తెలంగాణలోని సంపన్నుల జాబితాలో ఆమె 10వ స్థానంలో నిలిచారు. ఐఐఎఫ్ఎల్ 2021 వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్లో ఆమె నెట్వర్త్ రూ. 7,700 కోట్లు ఉండగా 2022లో ఆమె సంపద విలువ రూ. 1,000 కోట్లు పెరిగింది. ఫార్మా రంగంలో తిరుగులేని నాయకత్వం హైదరాబాద్కు చెందిన ఫార్మా దిగ్గజం బయోలాజికల్-ఈ లిమిటెడ్ (Biological E Ltd)కి మహిమా దాట్ల ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్. వారి కుటుంబంలో మూడవ తరం వ్యాపారవేత్త. వ్యాక్సిన్ వ్యాపారంలో ఆమె తనదైన ముద్రను చూపించారు. కరోనా మహమ్మారి సమయంలో Corbevax కోవిడ్-19 వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడం ద్వారా మహిమా నాయకత్వంలోని బయోలాజికల్-ఈ సంస్థ అప్పట్లో వార్తలో నిలిచింది. ఆమె కుటుంబం 1948లో ఫార్మా వ్యాపారాన్ని స్థాపించింది. హెపారిన్ ఔషధాన్ని భారతదేశానికి తీసుకువచ్చింది వీరి సంస్థే. అయితే లండన్లో వెబ్స్టర్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ చేసిన మహిమా కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇదీ చదవండి: Ameera Shah: కూతురొచ్చింది! చిన్న ల్యాబ్ను రూ.వేల కోట్ల సంస్థగా మార్చింది.. తండ్రి మరణంతో.. 2013లో ఆమె తండ్రి విజయ్ కుమార్ దాట్ల మరణించడంతో ఆమె కంపెనీ పగ్గాలు చేపట్టారు. మహిమా దాట్ల ఆధ్వర్యంలో బయోలాజికల్-ఈ తన వ్యాక్సిన్లను 100 కంటే ఎక్కువ దేశాలకు సరఫరా చేస్తోంది. గత దశాబ్దంలో 200 కోట్లకు పైగా డోస్లను అందించింది. దీని పోర్ట్ఫోలియోలో మీజిల్స్, టెటానస్, రుబెల్లా వంటి వ్యాధుల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రీక్వాలిఫైడ్ వ్యాక్సిన్లు ఏడు ఉన్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా టెటానస్ వ్యాక్సిన్ల తయారీలో అతిపెద్ద సంస్థ. ఇలాంటి స్పూర్తివంతమైన పారిశ్రామిక వేత్తల విజయగాథలు, ఆసక్తికరమైన కథనాల కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
కండోమ్స్ బిజినెస్: 50లక్షలనుంచి రూ. 43వేల కోట్లతో దడ పుట్టించిన బ్రదర్స్
ప్రముఖ కండోమ్ బ్రాండ్ మేన్కైండ్ ఫార్మా ఏప్రిల్ 25న ఐపీఓకు రానుంది. దేశీయంగా మేన్ఫోర్స్ కండోమ్లు, ప్రెగా న్యూస్ ప్రెగ్నెన్సీ డిటెక్షన్ కిట్ల విక్రయాలతో పాపులర్ బ్రాండ్గా పేరొందింది. మెడికల్ సేల్స్మెన్స్గా మొదలై రూ.43,264 కోట్ల విలువైన సంస్థగా తీర్చిదిద్దిన జునేజా సోదరుల సక్సెస్ స్టోరీ.. ఢిల్లీకి చెందిన డ్రగ్ కంపెనీ, కండోమ్ మేకర్ మేన్కైండ్ ఫార్మా రూ. 4,326 కోట్ల పబ్లిక్ ఆఫర్ని ఏప్రిల్ 25న ప్రారంభించి, ఏప్రిల్ 27న ముగించడానికి సిద్ధంగా ఉంది. అనిశ్చిత ఆర్థికపరిస్థితుల మధ్య 2023లో ఎక్స్ఛేంజీలో లిస్ట్ అయిన ఏడో ఐపీఓ ఇది. మెడికల్ సేల్స్మెన్లా ప్రయాణం మొదలుపెట్టి రూ. 43,264 కోట్లకు చేర్చారు రమేష్ జునేజా, రాజీవ్ జునేజా. జునేజా సోదరులుగా పేరొందిన వీరు ఒంటరిగానే మొదలు పెట్టారు. పట్టుదలతో, మొక్కవోని దీక్షతో కంపెనీని అద్భుత స్థాయికి తీసుకొచ్చారు. ముఖ్యంగా 90వ దశకంలో బాలీవుడ్ స్టార్లతో ఆకర్షణీయమైన ప్రకటనలతో మధ్య తరగతిని ఆకర్షించడంలో జునేజా సోదరుల మేనేజ్మెంట్ స్కిల్స్, కార్పొరేట్ వ్యూహం నిదర్శనంగా నిలిచింది. అతితక్కువ సమయంలోనే విక్రయాల్లో దూసుకు పోతూ దిగ్గజాలకు దడ పుట్టించారు. ఛైర్మన్ రమేష్ సీ జునేజా 1974లో కీఫార్మా అనే కంపెనీకి మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేశారు. ఆ తరువాత ఫార్మా దిగ్గజం లుపిన్లో ఎనిమిదేళ్లు పనిచేశారు. 1994లో తను స్థాపించిన కంపెనీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 1995లో తన సోదరుడు రాజీవ్ జునేజాతో కలిసి మేన్కైండ్ని ప్రారంభించారు. ఇందుకు వారి ప్రారంభ పెట్టుబడి రూ.50 లక్షలు మాత్రమే. 25మంది వైద్య ప్రతినిధులతో సంస్థను ప్రారంభించారు. ఇపుడు దేశవ్యాప్తంగా 25 తయారీ కేంద్రాలతో, 600 మందికిపైగా శాస్త్రవేత్తల బృందంతో పనిచేస్తోంది. అతిపెద్ద నెట్వర్క్తో నాలుగు యూనిట్లలో పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను నడుపుతోంది. 2022లో ఫోర్బ్స్ డేటా ప్రకారం 34500 కోట్ల రూపాయల నికర విలువ జునేజా సోదరుల సొంతం. మేన్ కైండ్ ఫార్మా మార్కెట్ క్యాప్ రూ.43,264 కోట్లు. దేశీయ విక్రయాల పరంగా ఇది భారతదేశంలో నాలుగో అతిపెద్ద కంపెనీ. గత సంవత్సరం, డిసెంబర్ 2022 నాటికి, దాని ఏకీకృత లాభం రూ.996.4 కోట్లు. తొలి తొమ్మిది నెలల ఆదాయం రూ.6697 కోట్లు. మ్యాన్ఫోర్స్ కండోమ్ బ్రాండ్ రూ. 462 కోట్లకు పైగా దేశీయ విక్రయాలతో ఈ విభాగంలో మార్కెట్ లీడర్గా ఉందని పేర్కొంది. ప్రెగా న్యూస్ ప్రెగ్నెన్సీ కిట్ల విక్రయం రూ. 184.40 కోట్లు. ముఖ్యంగా కంపెనీ నెట్వర్క్ విస్తరణకు, విజయానికి కారణం కంపెనీ సీఈవోగా రాజీవ్ జునేజా. రమేష్ జునేజా సైన్స్ గ్రాడ్యుయేట్ కాగా, రాజీవ్ కాలేజీ డ్రాప్ అవుట్. అలాగే జునేజా సోదరుల మేనల్లుడు అర్జున్, ప్రొడక్షన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పర్యవేక్షిస్తుండగా. మరో మేనల్లుడు శీతల్ అరోరా, గైనకాలజీ, డెర్మటాలజీ డ్రగ్స్ మార్కెటింగ్ విభాగం లైఫ్స్టార్ను బాధ్యతలను చూస్తుండటం విశేషం.కంపెనీ వివిధ తీవ్రమైన, దీర్ఘకాలిక చికిత్సలకు సంబంధించి పలు ఫార్మ ఫార్ములేషన్స్తోపాటు, అనేక వినియోగదారు ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఐపీఓ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ద్వారా 40,058,844 ఈక్విటీ షేర్లను బీఎస్ఈ, ఎన్ఎస్సీ రెండింటిలోనూ జాబితా చేయాలని ప్రతిపాదించింది. ప్రమోటర్లలో సహ వ్యవస్థాపకులు రమేష్ జునేజా , రాజీవ్ జునేజా, సీఈవో శీతల్ అరోరా, కెయిర్న్హిల్ CIPEF, కెయిర్న్హిల్ CGPE, బీజ్ లిమిటెడ్ ,లింక్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఉన్నారు. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.1,026 1,080గా నిర్ణయించారు. కంపెనీ షేర్లు మే 3న ఇన్వెస్టర్లకు కేటాయించిన తరువాత మే 8న స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టవుతాయి. Autism is a development disorder where children have problems with social communication and interaction, restricted or repetitive behaviors or interests. Let's learn more about Autism and bridge the gap created by social stigma. #AutismAwarenessDay #MankindPharma #ServingLife pic.twitter.com/5WPKIqvIUi — Mankind Pharma (@Pharma_Mankind) April 2, 2023 -
జీడిమెట్ల ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం
-
జీడిమెట్ల ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్.. ఇద్దరు మృతి
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రియాక్టర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను రవీందర్ రెడ్డి, కుమార్లుగా గుర్తించారు. -
తెలంగాణ ప్రభుత్వంతో బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్ ఫార్మా కంపెనీ ఒప్పందం
-
సంగారెడ్డి: ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం.. కార్మికులకు గాయాలు!
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలోని గడ్డిపోతారం పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లీ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కార్మికులు, స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వివరాల ప్రకారం.. గడ్డిపోతారం ఇండస్ట్రీయల్ ప్రాంతంలో ఉన్న లీ ఫార్మా కంపెనీలో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. కంపెనీలో రియాక్టర్ల వద్ద మంటలు చెలరేగాయి. దీంతో, పరిశ్రమలో ఉన్న కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు గాయాలు కావడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మంటలు ఎగిసిపడటంతో అదుపు చేసేందుకు స్థానికులు, కార్మికులు ప్రయత్నాలు చేస్తున్నారు. -
వివాదాస్పద మైడెన్కు భారీ షాక్:అక్టోబరు 14 వరకు గడువు
సాక్షి,ముంబై: వివాదాస్పద దేశీయ ఫార్మ కంపెనీ మైడెన్ ఫార్మాకు మరో భారీ షాక్ తగిలింది. కంపెనీ ఉత్పత్తి చేసే దగ్గు మందులు ప్రమాణాలకు అనుగుణంగా లేవంటూ హరియాణా ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సోనెపట్లోని దాని తయారీ ప్లాంట్లో తనిఖీల అనంతరం హరియాణా స్టేట్ డ్రగ్స్ కంట్రోలర్, లైసెన్సింగ్ అథారిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్తో సంయుక్త తనిఖీ తర్వాత హర్యానా డ్రగ్ అధికారులు మైడెన్ ఫార్మాస్యూటికల్స్కు ఈ నోటీసులిచ్చింది. సంస్థ డైథలిన్ గ్లైకాల్, ఇథిలీన్ ప్రొపైలిన్ గ్లైకాల్ నాణ్యత పరీక్షను నిర్వహించలేదని, సంబంధిత పత్రాలు కూడా సక్రమంగా లేవంటూ ఫార్మా కంపెనీ అక్టోబర్ 14 లోగా నోటీసుకు సమాధానం ఇవ్వాలి, లేని పక్షంలో దానిపై చర్య తీసుకుంటామని అక్టోబరు 7న జారీ చేసిన నోటీసుల్లో తెలిపింది. (చిన్నారులను మింగేసిన దగ్గు మందు: సంచలన విషయాలు) డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్, హర్యానా, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940 రూల్స్, 1945 రూల్ 85(2) ప్రకారం న్యూ ఢిల్లీలోని మైడెన్ ఫార్మాకు నోటీసులిచ్చింది. తమ తనిఖీల్లో అనేక ఉల్లంఘనలను గుర్తించిన నేపథ్యంలో కంపెనీ తయారీ లైసెన్స్ను ఎందుకు సస్పెండ్ చేయకూడదో తెలపాలని కోరుతూ నోటీసు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు తన నివేదికను సమర్పించిన రాష్ట్ర ఎఫ్డీఏ షోకాజ్ నోటీసు అందిన 7 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని మైడెన్ ఫార్మాను ఆదేశించింది. రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ కమ్ లైసెన్సింగ్ అథారిటీ, హరియాణా ఎఫ్డీఏ మన్మోహన్ తనేజా తెలిపారు.ప్రొపైలిన్ గ్లైకాల్ (బ్యాచ్ నంబర్ E009844) తయారీ తేదీ సెప్టెంబర్ 2021, గడువు తేదీ సెప్టెంబరు 2023ని ప్రోమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్మలిన్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ల తయారీలో ఉపయోగించినట్టు కనుగొంది. అలాగే నవంబర్ 2024 నాటికి, ఉత్పత్తి షెల్ఫ్-లైఫ్ ముడి పదార్థం కంటే ఎక్కువ అని తేలింది. కాగా ఇటీవల గాంబియాలో 66 మంది చిన్నారుల మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మైడెన్ దగ్గు సిరప్లపై హెచ్చరికలు జారీ చేసింది. మైడెన్ ఫార్మా ఉత్పత్తులు ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్మలిన్ బేబీ కాఫ్ సిరప్, మాకోఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ సిరప్స్లోని నాణ్యత లేని, కలుషితమైన పదార్థాలే పిల్లల మరణాలకు కారణమని పేర్కొన్న సంగతి తెలిసిందే. (ఫ్లిప్కార్ట్ బిగ్ దివాలీ సేల్: ఐఫోన్13పై కళ్లు చెదిరే ఆఫర్) -
మ్యాన్కైండ్ ఫార్మా: అతిపెద్ద ఐపీవో బాట
న్యూఢిల్లీ: హెల్త్కేర్ రంగ కంపెనీ మ్యాన్కైండ్ ఫార్మా తాజాగా పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ 4 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. ప్రమోటర్లు సహా ప్రస్తుత ఇన్వెస్టర్లు, వాటాదారులు షేర్లను ఆఫర్ చేయనున్నారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఐపీవో ద్వారా రూ. 5,500 కోట్లవరకూ సమీకరించే యోచనలో ఉంది. (Akasa Air: వారానికి 250కి పైగా ప్లయిట్స్) కంపెనీ వివిధ విభాగాలలో ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ల తయారీ, అభివృద్ధి, మార్కెటింగ్లను చేపడుతోంది. కన్జూమర్ హెల్త్కేర్ ప్రొడక్టులను సైతం రూపొందిస్తోంది. ప్రమోటర్లు రమేష్, రాజీవ్ జునేజాతోపాటు షీతల్ అరోరా కోటి షేర్లకుపైగా షేర్లను విక్రయించనుండగా.. ఇన్వెస్టర్ సంస్థ కెయిర్న్హిల్ సీఐపీఈఎఫ్ 1.74 కోట్ల షేర్లు, కెయిర్న్హిల్ సీజీపీఈ దాదాపు కోటి షేర్లు చొప్పున ఆఫర్ చేయనున్నాయి. ఇదీ చదవండి: లాభాలు కావాలంటే...సారథ్య బాధ్యతల్లో మహిళలు పెరగాలి కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్కానున్నాయి. కాగా.. ఈ ఏడాది మొదట్లో మెక్లాయిడ్స్ ఫార్మా రూ. 5,000 కోట్ల సమీకరణకు ప్రాథమిక పత్రాలను సెబీకి దాఖలు చేసింది. అయితే కంపెనీ విలువ విషయంలో పునరాలోచన చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. హెల్త్కేర్ విభాగం(2020 నవంబర్)లో గ్లాండ్ ఫార్మా రూ. 6,480 కోట్లు సమీకరించడం ద్వారా భారీ ఐపీవోకు తెరతీసిన సంగతి తెలిసిందే. -
ఫార్మా మహిళల భద్రతకు ‘షీ షటిల్స్’
గచ్చిబౌలి: ఫార్మా కంపెనీల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల భద్రత కోసం షీ షటిల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సోమవారం లాల్గాడి మలక్పేట్లోని జినోమ్ వ్యాలీ, ఫార్మా లైఫ్ సైన్సెస్ నుంచి అల్వాల్ వరకు ఎస్సీఎస్సీ అందుబాటులోకి తీసుకొచ్చిన 3వ షీ షటిల్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతతో నడిచే భద్రత వ్యవస్థలో మహిళా ఉద్యోగులు ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం అల్వాల్ నుంచి లాల్గడీ మలక్పేట్, తుర్కపల్లి నుంచి జనోమ్ వ్యాలీ వరకు నడుస్తుందన్నారు. ఎస్సీఎస్సీ కార్యదర్శి కృష్ణ ఏదుల మాట్లాడుతూ... ఐటీ, ఫార్మా కంపెనీల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల కోసం ఇప్పటి వరకు 12 షీ షటిల్స్ను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: పరీక్షల హాజరుకు మాస్కు తప్పనిసరి) -
‘ఫెమ్ టెక్’ గమ్యస్థానం.. హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం 50 బిలియన్ డాలర్ల పరిశ్రమగా ఉన్న ఫార్మా, లైఫ్సైన్సెస్ రంగాన్ని 2030 నాటికి రెట్టింపు చేసి వంద బిలియన్ డాలర్లకు చేర్చడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీ రామారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులతో జీనోమ్ వ్యాలీ.. భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫార్మా, లైఫ్సైన్సెస్ రంగాల్లో పవర్హౌస్గా మారుతోందన్నారు. దీంతో ప్రపంచంలోని ప్రముఖ పరిశోధన, అభివృద్ధి సంస్థలు హైదరాబాద్కు పెట్టు బడులతో వస్తున్నాయని చెప్పారు. స్విట్జ ర్లాండ్ కేంద్రంగా పనిచేసే ఫెర్రింగ్ ఫార్మా హైదరాబాద్ టీఎస్ఐఐసీ బయోటెక్ పార్క్ లో ఏర్పాటుచేసిన కొత్త సమీకృత పరిశోధన, అభివృద్ధి, తయారీ యూనిట్ను కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ.. ఇటీవలి తన అమెరికా పర్యటనలో వివిధ రంగాల్లో రూ.7,500 కోట్ల పెట్టుబడులు సాధించగా, అందులో సగం లైఫ్సైన్సెస్, ఫార్మా రంగాలకు చెందినవే ఉన్నాయన్నారు. మహిళల ఆరోగ్య రక్షణ రంగంలో పరిశోధన, తయారీ పరిశ్రమలకు (ఫెమ్ టెక్) హైదరాబాద్ అంతర్జాతీయ గమ్యస్థానంగా మారుతోందన్నారు. పుణేకు చెందిన భారత్ సీరమ్ వాక్సిన్ కంపెనీ త్వర లో రూ.200 కోట్ల పెట్టుబడితో ఇంజెక్టబుల్, వాక్సిన్ మాన్యుఫ్యాక్చరింగ్ను ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. ఈ సంస్థ మహిళల ఆరోగ్య రక్షణ ఉత్పత్తులతో పాటు రేబిస్ వ్యాక్సిన్ తదితరాలను ఉత్పత్తి చేస్తుందన్నారు. 30 మిలియన్ యూరో(సుమారు రూ. 245కోట్లు)ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఫెర్రింగ్ ఫార్మాస్యూటికల్స్ గర్భధారణ మొదలు ప్రసవం వరకు అవసరమైన ఔష ధాలు, చికిత్స విధానాలను అభివృద్ధి చేస్తుం దని చెప్పారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, ఫార్మా, హెల్త్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్, ఫెర్రింగ్ ఫార్మా ఉపాధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోసెట్టె, ఎండీ అనింద్య ఘోష్ పాల్గొన్నారు. ఆవిష్కరణలో ముందంజ.. ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ దూసుకుపోతోందని.. డిజైన్ థింకింగ్, ఆవిష్కరణలు, పరిజ్ఞానంలో కొత్త తీరాలను తాకుతోందని కేటీఆర్ అన్నారు. అడ్మినిస్ట్రేటవ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో తెలంగాణ ‘వాష్ ఇన్నోవేషన్ హబ్’(డబ్ల్యూఐహెచ్)ను ఏర్పాటు చేసిందన్నారు. వాష్ ఇన్నోవేషన్ హబ్ లోగోను మంత్రి సోమవారం ఆవిష్కరించారు. వాష్ ఇన్నోవేషన్ హబ్ నిర్వహించే ఐNఓఃగిఅ ఏ 3.0 వార్షిక ఉత్సవంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల 5, 6 తేదీల్లో జరిగే ఈ ఉత్సవంలో ఔత్సాహిక ఆవి ష్కకర్తలు పాల్గొనాలని కేటీఆర్ పిలుపు నిచ్చారు. స్టార్టప్లు, రాష్ట్ర ప్రభుత్వం, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వా మ్యంతో వాష్ ఇన్నోవేషన్ హబ్ పని చేస్తుం దన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నిర్దేశిం చుకున్న ప్రమాణాలను చేరుకునేందుకు ప్రభుత్వం వాటర్, శానిటేషన్, హైజీన్ (వాష్)కు ప్రాధాన్యతనిస్తుందని వెల్లడించారు. -
ట్రామాడోల్.. తరలింపులో గోల్మాల్
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ తరలింపులో ఫార్మా కంపెనీ బండారం బయటపడింది. పేరు లూసెంట్. అనుమతులు లేకుండా పాకిస్తాన్కు ట్రామాడోల్ డ్రగ్ను ఎగుమతి చేస్తున్న లూపెంట్ ఫార్మా కంపెనీ ఎండీతోపాటు మరో నలుగురిని బెంగుళూర్ రీజియన్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డికి చెందిన లూసెంట్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ట్రామాడోల్ను ఉత్పత్తి చేసి డెన్మార్క్, జర్మనీ, మలేషి యాకు ఎగుమతి చేసేందుకు అనుమతి కలిగి ఉంది. కానీ, ఆ దేశాలకు తరలించిన ట్రామాడోల్ను అక్కడి నుంచి పాకిస్తాన్కు చేరవేస్తున్నట్టు ఎన్ సీబీ అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా బెంగళూర్ ఎన్సీబీ అధికారులు కేసు నమోదు చేసి.. సంగారెడ్డికి చెందిన ఫార్మా కంపెనీలపై రెండురోజుల క్రితం దాడులు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించారు. గత ఏడాది ఈ ఫార్మా సంస్థ 25 వేల కిలోల ట్రామాడోల్ను జర్మనీ, డెన్మార్క్, మలేషియా ద్వారా పాకిస్తాన్కు చేరవేసినట్టు కనుగొన్నారు. ట్రామాడోల్ తయారీకి అనుమతి పొందిన అసిటిక్ అన్హైడ్రైడ్ డ్రగ్ లెక్కల్లో 3.5 కిలోల తేడా గుర్తించినట్టు ఎన్సీబీ అధికార వర్గాలు వెల్లడించాయి. దుష్పరిణామాలు ఇవీ..: ట్రామాడోల్ అనేది పెయిన్ కిల్లర్. దీనిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మూర్చ, స్పృహ తప్పి పడిపోయే ప్రమాదం ఉందని.. మెదడుతో పాటు హృదయం పై దుష్పరిణామాలు పడుతాయని ఎన్సీబీ అధికారులు చెప్పారు. హెరాయిన్ లాంటి ప్రమాదరకరమైన డ్రగ్స్ తయారీకి ఈ ఎసిటిక్ అన్హైడ్రైడ్ కీలక ముడిసరుకని ఎన్సీబీ ఆందోళన వ్యక్తం చేసింది. గతంలోనూ ఇదే తరహా.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మూసేసిన, తక్కువ స్థాయిలో డ్రగ్స్ను ఉత్పత్తి చేసే ఫార్మా కంపెనీలు ఇలాంటి దందాలకు పాల్పడుతున్నట్టు ముంబై, బెంగళూర్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో విభాగాలు స్పష్టం చేశాయి. గత అక్టోబర్, నవంబర్లో గోవాలో హైదరాబాద్కు చెందిన వ్యక్తి డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డాడు. ఇదివరకు పిల్లో కవర్లలో భారీస్థాయి డ్రగ్స్ రవాణా చేస్తూ ముంబై ఎయిర్పోర్టు సమీపంలో డ్రగ్స్ పట్టుబడటం సంచలనం రేపింది. నిఘా సంస్థలు, ఫార్మా విభాగపు దర్యాప్తు సంస్థల నిర్లక్ష్యం వల్లే ప్రమాదకరమైన డ్రగ్స్ అనుమతి లేకుండా పాకిస్తాన్కు తరలుతున్నాయని వాదనలున్నాయి. -
జైడస్ చేతికి న్యులిబ్రీ ఔషధం
న్యూఢిల్లీ: యూఎస్ కంపెనీ బ్రిడ్జ్బయో ఫార్మా నుంచి ఫాస్డోనొప్టె రిన్(న్యులిబ్రీ) ఔషధాన్ని కొనుగోలు చేసేందుకు అనుబంధ సంస్థ ద్వారా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు హెల్త్కేర్ దిగ్గజం జైడస్ లైఫ్సైన్సెస్ తాజాగా పేర్కొంది. సెంటిల్ థెరప్యూటిక్స్ ఇంక్ నుంచి ఈ ఇంజక్షన్ ఔషధ బ్రాండును సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు అసెట్ పర్చేజ్ అగ్రిమెంట్పై సంతకాలు చేసినట్లు వెల్లడించింది. ఎంవోసీడీ టైప్-ఏ వ్యాధిగ్రస్తుల చికిత్సకు వినియోగించగల ఈ ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతులున్నట్లు పేర్కొంది. శిశువుల్లో అత్యంత అరుదుగా కనిపించే జెనెటిక్ సంబంధ ఈ వ్యాధి మరణాలకు దారితీయవచ్చని కంపెనీ వివరించింది. ఒప్పందంలో భాగంగా ప్రస్తుతం యూఎస్లో న్యులిబ్రీ ఔషధ అభివృద్ధి, కమర్షియలైజేషన్ బాధ్యతలతోపాటు.. అంతర్జాతీయంగానూ అభివృద్ధి, తయారీ, మార్కెటింగ్ను సైతం సెంటిల్ చేపడుతుందని జైడస్ వివరించింది. (చదవండి: మదుపరులకు శుభవార్త.. ఎల్ఐసీ ఐపీఓకు సెబీ ఆమోదం..!) -
హైగ్రో కెమికల్స్ రూ.1.93 కోట్ల ఎఫ్డీల జప్తు
సాక్షి, హైదరాబాద్: ఫార్మా కంపెనీ పేరుతో మత్తు పదార్థాల తయారీ కోసం నిబంధనలకు విరుద్ధంగా ముడిసరుకును సరఫరా చేసిన హైగ్రో కెమికల్స్ ఫార్మాటెక్ కంపెనీకి చెందిన రూ.1.93 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)ను ఈడీ శుక్రవారం జప్తు చేసింది. మెదక్ జిల్లా బొల్లారంలో ఉన్న ఈ కంపెనీ డెక్స్ట్రో ప్రొపాక్సీపిన్ హైడ్రోక్లోరైడ్ అనే ముడిసరుకును ఢిల్లీకి చెందిన జేకే ఫార్మాకు అక్రమంగా నార్కోటిక్ డ్రగ్స్ తయారీకి తరలించినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ గతేడాది కేసు నమోదుచేసింది. ఈ కేసు ఆధారంగా మనీల్యాండరింగ్ లింకులో దర్యాప్తు చేసిన ఈడీ.. కంపెనీ అకౌంట్లోకి వచ్చిన రూ.1.93 కోట్లను గుర్తించింది. ఈ డబ్బును సంబంధిత కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్ చేయగా, ఆ డిపాజిట్ను జప్తు చేసినట్లు తెలిపింది. ఈ ముడిసరుకును కేజీ రూ.3 వేల చొప్పున జేకే ఫార్మాకు అక్రమ పద్ధతిలో అమ్మడంతో పాటు 26 ఎయిర్ వే బిల్లులను లెక్కల్లో చూపించలేదని ఈడీ స్పష్టంచేసింది. -
‘ఫ్లో కెమిస్ట్రీ’తో వినూత్న ఆవిష్కరణలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫార్మా, లైఫ్సైన్సెస్ రంగాల పురోగతిని కొనసాగించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. దీనికోసం ఫార్మా దిగ్గజాలతో కలిసి ఫ్లో కెమిస్ట్రీలో కొత్తగా సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్(సీఓఈ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రం స్థాపన వల్ల ఫార్మారంగంలో బహుళ ప్రయోజనాలతో కూడిన ఆవిష్కరణలు ఊపందుకుంటాయి. ఔషధ రంగ పరిశోధన, అభివృద్ధిలో ఫ్లో కెమిస్ట్రీ సాంకేతికతను చొప్పించడం ద్వారా ఔషధాల తయారీలో కీలకమైన ముడి రసాయనాల (ఆక్టివ్ ఫార్మా ఇంగ్రిడియెంట్స్)ను నిరంతరం తయారు చేసే అవకాశం ఏర్పడుతుంది. సీఓఈ ఏర్పాటుకు ముందుకొచ్చిన కన్సార్టియంతో ప్రభుత్వం గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సమక్షంలో జరిగిన ఈ ఒప్పందంపై జీవీ ప్రసాద్ (డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్), డాక్టర్ సత్యనారాయణ చావా (లారస్ ల్యాబ్స్), శక్తి నాగప్పన్ (లైఫ్ సైన్సెస్ డైరెక్టర్)తోపాటు డాక్టర్ శ్రీనివాస్ ఓరుగంటి (డాక్టర్ రెడ్డీస్ లైఫ్సైన్సెస్ ఇనిస్టిట్యూట్) సంతకాలు చేశారు. హైదరాబాద్లోని డాక్టర్ రెడ్డీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్సైన్సెస్ ఆవరణలో ఏర్పాటయ్యే ఈ కేంద్రానికి డాక్డర్ రెడ్డీస్ ల్యాబ్స్, లారస్ ల్యాబ్స్ నుంచి నిధులు, ఇతర సహకారం లభిస్తుంది. సీఓఈలో జరిగే పరిశోధనలకు పేరొందిన శాస్త్రవేత్తలు మార్గదర్శనం చేస్తారు. ఫ్లో కెమిస్ట్రీలో నైపుణ్యం, నిరంతర ఉత్పత్తి ద్వారా లబ్ధిపొందేందుకు ఈ కన్సార్టియంలో మరిన్ని పరిశ్రమలు చేరి లబ్ధిపొందేలా ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఉత్పత్తిలో ఆధునిక పద్ధతులు: కేటీఆర్ పరిశోధన, అభివృద్ధి మొదలుకుని ఉత్పత్తిలో ఆధునిక పద్ధతులు అవలంబించడంతోపాటు కాలుష్యరహిత, సుస్థిర విధానాల వైపు దేశీయ ఔషధ తయారీ రంగం మళ్లేందుకు ‘ఫ్లో కెమిస్ట్రీ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్’పేరిట ఏర్పాటయ్యే హబ్ దోహదపడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఓఈ ఏర్పాటులో డాక్టర్ రెడ్డీస్, లారస్ ల్యాబ్స్ ఎనలేని సహకారం అందించాయని కితాబునిచ్చారు. లైఫ్సైన్సెస్ రంగంలో తెలంగాణకు ఉన్న ప్రాధాన్యతను కాపాడుకుంటూనే మరింత పురోగతి సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ఫ్లో కెమిస్ట్రీ సీఓఈ ఏర్పాటు మైలురాయి వంటిదని, రాష్ట్రంలో ఈ రంగాన్ని 2030 నాటికి వంద బిలియన్ డాలర్ల పరిశ్రమగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని లైఫ్ సైన్సెస్ విభాగం డైరక్టర్ శక్తి నాగప్పన్ అన్నారు. సీఓఈలో తమకు భాగస్వామ్యం కల్పించడం పట్ల రెడ్డీస్ ల్యాబ్స్ కో చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్, లారస్ ల్యాబ్స్ సీఈఓ డాక్టర్ సత్యనారాయణ చావా హర్షం వ్యక్తం చేశారు. -
Jhonson & Jhonson: ఇంతకాలం కలిసి మెలిసి.. ఇకపై వేర్వేరుగా
ఫార్మా, మెడికల్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఇకపై రెండుగా విడిపోతుంది. ఇంత కాలం జాన్సన్ అండ్ జాన్సన్ కిందనే ఔషధాలు, వైద్య పరికరాలు, ఉత్పత్తులను అందిస్తోంది. ఇకపై ఔషధాలు, మెడికల్ ఉత్పత్తులను వేర్వేరు విభాగాలుగా చేయాలని నిర్ణయించింది. తమ గ్రూపు ద్వారా అందుతున సేవలను విడగొట్టడం ద్వారా మరింత నాణ్యమైన సేవలు వేగంగా అందుతాయనే నమ్మకం ఉందని జాన్సన్ అండ్ జాన్సన్ పేర్కొంది. గ్రూపును రెండుగా విడగొట్టే ప్రక్రియ పద్దెనిమిది నెలల నుంచి రెండేళ్లలోపు పూర్తి చేస్తామని తెలిపింది. అన్ని వివరాలు పూర్తిగా సమీక్షించి తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు గ్రూపు సీఈవో అలెక్స్ గోర్కి వెల్లడించారు. జాన్సన్ అండ్ జాన్సన్కి ప్రపంచ వ్యాప్తంగా 1.36 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా పెద్ద కంపెనీలను రెండుగా విడగొడుతున్న సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ, తోషిబాలు ఇటీవల తమ గొడుకు కింద అందున్న సేవలు, ఉత్పత్తులను రెండుగా విడగొడుతున్నట్టు ప్రకటించాయి. వాటి విభజన ప్రక్రియ పూర్తి కాకముందే అదే తరహా ప్రకటన జాన్సన్ అండ్ జాన్సన్ నుంచి వెలువడింది. -
పంట పొలాల మధ్య ఫార్మా వద్దు..
నర్సాపూర్ రూరల్: పచ్చని పంట పొలాల మధ్య ఫార్మా చిచ్చు వద్దంటూ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట మహిళలు ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి కాళ్లు మొక్కి మొర పెట్టుకున్నారు. గ్రామస్తుల కోరిక మేరకు ఎమ్మెల్యే, ఇన్చార్జి ఆర్డీఓ సాయిరాం గ్రామాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఫార్మా కంపెనీ వద్దంటూ ముక్తకంఠంతో చెప్పారు. వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న తమ నోట్లో మట్టి కొట్టొద్దని కోరారు. ఈ కంపెనీలతో చుట్టూ పంట పొలాలు, గ్రామాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ భూములను ఫార్మా కంపెనీ యాజమాన్యం తప్పుడు సర్వే చేయించి లాక్కున్నదని కొందరు దళితులు వారి దృష్టికి తీసుకొచ్చారు. ఫార్మా కంపెనీ నిర్మాణాన్ని ఆపేయిస్తానని హామీ ఇవ్వాలని గ్రామస్తులు పట్టుబట్టడంతో మంత్రి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే నచ్చజెప్పారు. -
బరువు తగ్గించే ఔషధానికి ఆమోదం.. షాపులకు క్యూ కట్టిన జనాలు
వాషింగ్టన్: అదేంటో వరుసగా రెండు రోజులు బాగా తింటే లావవుతాం.. ఇక వరుసగా నెలరోజులు వ్యాయామం చేస్తే తప్ప పెరిగిన బరువు తగ్గించుకోలేం. ఇక ప్రతి రోజు వ్యాయామం చేయడం అందరికి వీలు కాదు. కుదిరినా బద్దకం వల్ల దాని గురించి పెద్దగా పట్టించుకోం. అందుకే మార్కెట్లో వ్యాయమంతో పని లేకుండా బరువు తగ్గించే ట్రిక్కులకు, మందులకు డిమాండ్ అధికం. కానీ వీటి వల్ల దుష్పరిణామాలు తలెత్తుతాయని హెచ్చరిస్తుంటారు నిపుణులు. ఈ క్రమంలో అమెరికాలో తొలిసారి బరువు తగ్గించే ఔషధానికి అనుమతి లభించింది. దాంతో ఆ మెడిసిన్ కోసం అమెరికా వాసులు మెడికల్ షాపులకు పరుగు తీస్తున్నారు. ఆ వివరాలు.. బరువు తగ్గించేందుకుగాను నోవో నోర్డిస్క్ అనే ఫార్మ కంపెనీ తయారు చేసిన ‘వీగోవీ’ అనే ఔషధానికి ఇప్పుడు అమెరికాలో భారీ ఆదరణ లభిస్తోంది. అయితే, గిరాకీకి తగ్గట్లుగా సరఫరా చేయలేకపోతున్నారు. ఈ మెడిసిన్ వినియోగానికి జూన్లో అనుమతులు లభించాయి. బరువు తగ్గించే ఓ మెడిసిన్కి అనుమతి లభించడం ఇదే తొలిసారి. గతంలో బరువు తగ్గించే మందులు అనేకం వచ్చినప్పటికీ.. వాటికి నియంత్రణ సంస్థల నుంచి అనుమతి లభించలేదు. ఇక ఆయా మందులు వల్ల తీవ్ర దుష్ప్రభావాలు ఉండేవి. పైగా అవి మంచి ఫలితాన్నిచ్చిన దాఖలాలు కూడా లేవు. ఈ క్రమంలో తాజాగా వీగోవీకి ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో జనాలు దాని కోసం ఎగబడుతున్నారు. (చదవండి: ఎఫ్బీ అకౌంట్ డిలీట్ చేసింది.. భారీగా బరువు తగ్గింది) ఎలా వాడాలి అంటే.. వీగోవీ అనేది ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాల్సిన ఓ మెడిసిన్. వారానికి ఒక డోసు చొప్పున తీసుకోవాలి. ఆకలిని నియంత్రించి తద్వారా బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. దాదాపు 15 శాతం వరకు బరువు తగ్గే అవకాశం ఉందని కంపెనీ తెలుపుతోంది. ఈ ఔషధానికి విపరీతమైన డిమాండ్ ఉండడంతో డెన్మార్క్కు చెందిన నోవో నోర్డిస్క్ కంపెనీకి ఆదాయం సైతం భారీగా పెరిగింది. ఎలా పనిచేస్తుందంటే.. ఈ మెడిసిన్ జీఎల్పీ-1 అనే హార్మోన్ను అనుకరించడం ద్వారా పనిచేస్తుంది. ఇది మెదడులోని ఆకలిని, ఆహారం తీసుకోవడం నియంత్రించే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఇక దీనివల్ల దుష్ప్రభావాలు లేవా అంటే ఉన్నాయి. ఈ మెడిసిన్ తీసుకున్న వారిలో వాంతులు, యాసిడ్ రీఫ్లక్స్ వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నట్లు సమాచారం. (చదవండి: ఇమ్యూనిటీ ఫస్ట్...పిండి వంటలు నెక్ట్స్) కోవిడ్ వల్ల పెరిగిన డిమాండ్.. ఈ మెడిసిన్కు ఇంత భారీగా డిమాండ్ పెరగడానికి కోవిడ్ కూడా ఓ కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అధికబరువుతో బాధపడుతున్న వారికి కరోనా సోకే ముప్పు ఎక్కువగా ఉందని అధ్యయనాలు తేల్చడంతో.. అందరికీ బరువు తగ్గడంపై ధ్యాస పెరిగిందని నోవో నోర్డిస్క్ ఫార్మ కంపెనీ సీఈఓ లార్స్ జోర్గెన్సన్ తెలిపారు. వచ్చే ఏడాది ఆరంభం నాటికి డిమాండ్కు సరిపడా స్థాయిలో వీగోవీని ఉత్పత్తి చేస్తామన్నారు. (చదవండి: ఏం చేసినా బరువు తగ్గడం లేదా.. తప్పు మీది కాదు బ్యాక్టీరియాది) -
#trending: బీరువాలో ఇలాంటి దృశ్యం చూశారా..?!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని పలు కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ ఫార్మ కంపెనీలో జరిపిన సోదాలో ఐటీ అధికారులు 142.87కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కంపెనీకి సంబంధించి మొత్తం 16 బ్యాంకు లాకర్లతో పాటు.. ఇప్పటి వరకు లెక్కల్లో చూపని 550 కోట్ల రూపాయల ఆదాయం గుర్తించినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. ఈ దాడులకు సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకు ఆ ఫోటోలో ఏం ఉందంటే బీరువా. బట్టలు పెట్టుకునే బీరువా ఫోటో వైరల్ కావడం ఏంటంటే.. మనలాంటి సామాన్యులు బీరువాలో బట్టలు పెడతారు.. కానీ సదరు ఫార్మా కంపెనీ బీరువాను డబ్బు కట్టలతో నింపింది. ఎక్కడా కొంచెం కూడా ఖాళీ లేకుండా డబ్బు కట్టలను బీరువా నిండ పేర్చింది. (చదవండి: Hyderabad: ప్రముఖ ఫార్మా కంపెనీలో సోదాలు.. రూ.142 కోట్లు సీజ్) ఈ ఫోటో చూసిన నెటిజనులు వార్నీ మా బీరువాలో బట్టలు సర్దిని తరువాత కూడా చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది.. ఇదేందిరా నాయనా ఇన్ని డబ్బు కట్టలు.. అబ్బ ఒక్క కట్ట నాకు దొరికితే లైఫ్ సెటిల్ అవుతుంది.. నోట్ల రద్దు ఫలించలేదు.. నోట్ల రంగు ఆకారం మారింది అంతే.. అరే 2000 రూపాయల నోట్లు వాడి ఉంటే.. 75 శాతం జాగా మిగిలేది.. మరిన్ని డబ్బులు దాచుకోవడానికి అవకాశం ఉండేది అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజనులు. చదవండి: శశికళకు మరో భారీ షాక్: రూ.వంద కోట్ల ఆస్తులు సీజ్
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
చెత్త అంపైరింగ్.. డుప్లెసిస్ది క్లియర్గా నాటౌట్! వీడియో
చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..!
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement