Realty
-
ఫోర్త్ సిటీ.. దక్షిణ హైదరాబాద్కి రియల్ బూమ్!
నీరు ఎత్తు నుంచి పల్లం వైపునకు పారినట్లే.. రియల్ ఎస్టేట్ అవకాశాలు, అభివృద్ధి కూడా మౌలిక వసతులు మెరుగ్గా ఉన్న ప్రాంతం వైపే విస్తరిన్నాయి. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్తో మొదలైన స్థిరాస్తి అభివృద్ధి ఐటీ హబ్ రాకతో గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమ ప్రాంతాల వైపు పరుగులు పెట్టింది. కొత్త ప్రాంతంలో అభివృద్ధి విస్తరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ హైదరాబాద్ వైపు దృష్టిసారించింది. విద్య, వైద్యంతో పాటు ఏఐ సిటీ, ఎలక్ట్రానిక్స్, లైఫ్సైన్స్, ఎంటర్టైన్మెంట్ జోన్లతో కూడిన నాల్గో నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనుంది. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో నిర్మితం కానున్న ఈ కొత్త నగరంతో స్థిరాస్తి అవకాశాలు పశ్చిమం నుంచి దక్షిణ హైదరాబాద్ వైపు మళ్లనుంది. – సాక్షి, సిటీబ్యూరోమన దేశంలో నోయిడా, గ్రేటర్ నోయిడా, దక్షిణ కొరియాలో ఇంచియాన్ ఫ్రీ ఎకనామిక్ జోన్ సక్సెస్లను స్ఫూర్తిగా తీసుకొని.. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో నాలుగో నగరం ‘ఫ్యూచర్ సిటీ’ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. నగరం సమీపంలోని మీర్ఖాన్పేట, బేగరికంచె, ముచ్చర్ల గ్రామాల పరిధుల్లో 814 చదరపు కిలో మీటర్లు, 2,01,318 ఎకరాల విస్తీర్ణంలో ఫోర్త్ సిటీ విస్తరించి ఉంటుంది. కడ్తాల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం, మంచాల్, యాచారం, ఆమన్గల్ 7 మండలాల్లోని 56 గ్రామాలు ఫోర్త్ సిటీ పరిధిలోకి వస్తాయి. ఈ నగరం సాకారమైతే 30–35 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 60–70 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఈ విస్తరణ ప్రణాళిక హైదరాబాద్ రియల్ రంగానికి ఊతంగా నిలవనుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ హైవేలలో స్థిరాస్తి పెట్టుబడి అవకాశాలు మరింత మెరుగవుతాయి. నివాస, వాణిజ్య, పారిశ్రామిక స్థలాలకు డిమాండ్ ఏర్పడనుంది. ప్రాపర్టీ విలువలు గణనీయంగా పెరుగుతాయి. నెట్జీరో సిటీగా నిర్మితం కానున్న ఈ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, పర్యవేక్షణ నిమిత్తం ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఫ్యూచర్ సిటీ స్వరూపమిదీఎలక్ట్రానిక్స్ అండ్ సాధారణ పరిశ్రమలు: 4,774 ఎకరాలు లైఫ్ సైన్స్ హబ్: 4,207 ఎకరాలు నివాస, మిశ్రమ భవనాలు: 1,317 ఎకరాలు నివాస భవనాల జోన్: 1,013 ఎకరాలు స్పోర్ట్స్ హబ్: 761 ఎకరాలు ఎడ్యుకేషనల్ అండ్ వర్సిటీ జోన్: 454 ఎకరాలు ఎంటర్టైన్మెంట్: 470 ఎకరాలు హెల్త్ సిటీ: 370 ఎకరాలు ఫర్నీచర్ పార్క్: 309 ఎకరాలు ఏఐ సిటీ: 297 ఎకరాలునెట్జీరో సిటీగా.. చుట్టూ పచ్చదనం, విశాలమైన రహదారులు, ప్రణాళికబద్ధంగా నివాస ప్రాంతాలు, వాణిజ్య క్లస్టర్లు, ఐటీ కంపెనీలు, బహుళ జాతి సంస్థలు ఒక చోట వీటన్నింటికీ దూరంగా పరిశ్రమలు, ఇలా పర్యావరణహితంగా కాలుష్యరహితంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నారు. నెట్జీరో సిటీగా ఏర్పాటుకానున్న ఈ నగరానికి సంబంధించి ప్రభుత్వం వేర్వేరు ప్రణాళికలను తయారు చేసింది. వచ్చే యాభైఏళ్లలో అక్కడ మారనున్న పరిస్థితులను అనువుగా భవిష్యత్ ప్రణాళికలను రూపొందించారు.వ్యర్థాల నిర్వహణ.. పర్యావరణాన్ని కాపాడేందుకు నెట్జీరో సిటీలో 33 శాతం గ్రీనరీ ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. చెట్లు, వాణిజ్య పంటలు, రహదారుల వెంట నీడనిచ్చే వృక్షాలు ఉంటాయి. వీటి ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కంటే ఇక్కడ 2–3 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇళ్లు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలు, ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేకమైన వ్యవస్థను రూపకల్పన చేస్తున్నారు. వ్యర్థ జలాలను శుద్ధీకరించి మళ్లీ వినియోగించేందుకు వీలుగా మారుస్తారు. దీంతో పాటు పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాల నిర్వహణకు ఇంధనం, విద్యుత్ వినియోగాన్ని తగ్గించి సౌర విద్యుత్ వాడేలా చూస్తారు. పరిశ్రమలు, ఐటీ సంస్థలు, నివాసాలు నిర్మించేటప్పుడు జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కాలుష్యరహిత వస్తువులను వినియోగించేలా చూస్తారు.ఎలక్ట్రానిక్స్, లైఫ్సైన్స్కు ప్రాధాన్యం..ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్, లైఫ్సైన్స్ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ రెండు రంగాలకే ఏకంగా 64 శాతం భూమిని కేటాయించారు. ఎలక్ట్రానిక్స్, సాధారణ పరిశ్రమలకు 4,774 ఎకరాలు, లైఫ్సైన్స్ హబ్కు 4,207 ఎకరాలను కేటాయించారు. కొంగరకలాన్లో యాపిల్ ఫోన్ విడిభాగాలను తయారు చేస్తున్న ఫాక్స్కాన్ సంస్థ ఎలక్ట్రానిక్స్ జోన్లో తన శాఖలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. లైఫ్సైన్ జోన్లో ప్రాణాధార మందుల తయారీ, పరిశోధన సంస్థలకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించనుంది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ ఫార్మా సంస్థలు వాటి విస్తరణ ప్రాజెక్ట్లను ఇక్కడ ప్రారంభించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.రోడ్డు, రైలు, విమానం.. అన్నీ.. » ఫ్యూచర్ సిటీకి రోడ్డు, రైలు, విమాన మార్గాలతో అనుసంధానించేలా అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులను కల్పించనున్నారు. » ఫ్యూచర్ సిటీకి హైదరాబాద్ నుంచి సులభంగా చేరుకునేందుకు విమానాశ్రయం నుంచి ఔటర్ రింగ్ రోడ్కు, అలాగే ఔటర్ నుంచి ప్రతిపాదిత ప్రాంతాలు బేగరికంచె, మీర్ఖాన్పేట్, ముచ్చర్ల వరకూ 330 అడుగుల వెడల్పు రహదారులు, ఇతర అంతర్గత రహదారులను నిర్మించనున్నారు. » రావిర్యాల ఓఆర్ఆర్ నుంచి మీర్ఖాన్పేట మీదుగా ముచ్చర్ల, ఆమన్గల్ మండలంలోని ఆకుతోటపల్లె వద్ద రీజినల్ రింగ్ రోడ్ను కలుపుతూ 40 కిలోమీటర్ల రహదారిని నిర్మించనున్నారు. » దీంతో పాటు రాజేంద్రనగర్లో రానున్న కొత్త హైకోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలు మార్గాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. -
రియల్ఎస్టేట్ ఏజెంట్లకు కేంద్రమంత్రి సూచన
భారత రియల్ ఎస్టేట్ రంగ వృద్ధికి వీలుగా.. కార్యకలాపాల్లో విశ్వాసం, పారదర్శకత ఉండేలా చూడాలని ఈ రంగానికి చెందిన ఏజెంట్లకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ సూచించారు. 2030 నాటికి రియల్ ఎస్టేట్ మార్కెట్ రూ.85 లక్షల కోట్లకు చేరుకోనుందన్న అంచనాను ప్రకటించారు.నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ ఇండియా (నార్–ఇండియా) వార్షిక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. అంతర్జాతీయంగా అత్యుత్తమ ప్రమాణాలను, కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలని పరిశ్రమను కోరారు. నార్–ఇండియాలో 50వేల మంది ఏజెంట్లు సభ్యులుగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగం వృద్ధిలో ఏజెంట్ల పాత్రను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.డెవలపర్లు, వినియోగదారుల మధ్య వీరు కీలక వారధిగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఏజెంట్ల సూచలను ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు. 2016లో రెరాను తీసుకురావడాన్ని అద్భుత సంస్కరణగా పేర్కొన్నారు. డెవలపర్లు, కొనుగోలుదారుల మధ్య వివాదాల నివారణకు దీన్ని తీసుకొచ్చారు.అలాగే, రియల్ ఎస్టేట్లోకి నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడం, వ్యాపార సులభతర నిర్వహణకు తీసుకున్న చర్యలను ప్రస్తావించారు. 2047 నాటికి దేశ జనాభాలో సగం మంది పట్టణాల్లోనే నివసించనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఇది 35 శాతంగా ఉంది. -
హైదరాబాద్లోనూ గ్రీన్ బిల్డింగ్స్..
సాక్షి, సిటీబ్యూరో: పర్యావరణ అనుకూలమైన హరిత భవనాలకు ఆదరణ పెరుగుతోంది. అపార్ట్మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలే కాదు ప్రభుత్వం నిర్మించిన సచివాలయం, పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, జిల్లా కలెక్టరేట్లు, ఇతరత్రా ఆఫీసు భవనాలు సైతం పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మిస్తుండటమే ఇందుకు ఉదాహరణ.. స్వచ్ఛమైన గాలి, వెలుతురు రావడంతో పాటు సహజ వనరులను వినియోగించుకోవడం, విద్యుత్, నీటి పొదుపు, సౌరశక్తి వినియోగం, గృహోపకరణాలు సైతం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) అనుగుణంగా ఉండటమే హరిత భవనాల ప్రత్యేకత. గ్రీన్ బిల్డింగ్స్లో 60 శాతం వరకు నీటి వృథాను అరికట్టవచ్చు. నిత్యావసరాలకు వినియోగించే నీరు బయటకు పంపకుండా వాటిని రీసైకిల్ చేసి తిరిగి మొక్కలు, బాత్రూమ్ అవసరాలకు వాడుకోవచ్చు. ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి వర్షపు నీటిని నిల్వ చేస్తారు. సాధారణ భవనాలతో పోలిస్తే గ్రీన్ బిల్డింగ్స్లో నిర్మాణ వ్యయం 8–10 శాతం అధికంగా ఉంటుంది. కానీ.. ఈ భవనాలలో నీరు, విద్యుత్ పొదుపు అవుతున్న కారణంగా ఇంటి నిర్మాణం కోసం అదనంగా వెచ్చించిన వ్యయం 2–3 ఏళ్లలో తిరిగి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంటి నిర్మాణ సమయంలోనే రీసైకిల్ మెటీరియల్స్ను ఉపయోగించడం గ్రీన్ బిల్డింగ్స్ మరొక ప్రత్యేకత. పర్యావరణానికి హాని చేయని ఉత్పత్తులనే నిర్మాణంలో వాడుతుంటారు. ఇటుకల నుంచి టైల్స్ వరకు గ్రీన్ ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో 720కి పైగా గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్ట్లు ఐజీబీసీ వద్ద రిజిస్టర్ అయ్యాయి. దేశవ్యాప్తంగా 11 వేల నిర్మాణాలు ఉన్నాయని ఐజీబీసీ ప్రతినిధులు చెబుతున్నారు. -
ఇళ్లకు జీఎస్టీ.. ఎవరు కట్టాలి?
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది. మెరుగైన మౌలిక వసతులు, పారిశ్రామిక ప్రగతి కారణంగా కొత్త ప్రాంతాలలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. మరోవైపు ప్రధాన నగరంలో స్థలం కొరత కారణంగా గృహ నిర్మాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత ఇళ్లను కూల్చివేసి వాటి స్థానంలో కొత్తవి నిర్మించడం మినహా నిర్మాణదారులకు ప్రత్యామ్నాయం లేదు.ఖైరతాబాద్, అబిడ్స్, బేగంపేట, సనత్నగర్, ఈఎస్ఐ, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇండిపెండెంట్ హౌస్లు, నాలుగైదు అంతస్తుల అపార్ట్మెంట్లను కూల్చేసి ఆ స్థలంలో హైరైజ్ భవనాలను నిర్మిస్తున్నారు. ఇందుకోసం భూయజమానులు, ఫ్లాట్ ఓనర్లతో బిల్డర్లు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటారు. ఖాళీ స్థలాలను అభివృద్ధికి తీసుకుంటే 50 నుంచి 40 శాతం, ప్రాంతాన్ని బట్టి 60 శాతం ఫ్లాట్లను భూయజమానికి ఇస్తామని ఒప్పందం చేసుకుంటారు. మిగిలిన వాటినే డెవలపర్ అమ్ముకుంటాడు.కూల్చి కట్టినా, ఖాళీ ప్రదేశంలో కొత్త భవనాలు కట్టినా పూర్తయిన ఇళ్లకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చెల్లించాల్సి ఉంటుంది. భూయజమాని వాటా కింద వచ్చిన జీఎస్టీ ఎవరు చెల్లించాలనే అంశంపై ల్యాండ్ ఓనర్లకు, బిల్డర్లు మధ్య వాగ్వాదం నెలకొంటుంది. డెవలపర్ చెల్లించాలని భూయజమాని, ల్యాండ్ ఓనరే కట్టాలని బిల్డర్ల మధ్య సందిగ్ధం నెలకొంది.భవనం కట్టడంతో స్థలం విలువ పెరిగిందని, దీంతో 5 శాతం జీఎస్టీ చెల్లించాలని ప్రభుత్వం బిల్డర్కు నోటీసులు పంపిస్తుంది. వాస్తవానికి కొత్తవైనా, పాతవైనా భవనానికి జీఎస్టీ చెల్లించాల్సిన బాధ్యత బిల్డర్దే. కాకపోతే భూయజమాని, కస్టమర్ల నుంచి బిల్డర్ జీఎస్టీ వసూలు చేసి కట్టాల్సింది డెవలపరే. -
హైదరాబాద్ రియల్ఎస్టేట్.. రైజింగ్!
కొత్త ప్రభుత్వం, ప్రతికూల ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్ల భారం, హైడ్రా దూకుడు కారణాలేవైనా ఏడాదిన్నర కాలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒడిదొడుకుల్లో ఉంది. ఈ ఏడాది ఆరంభం నుంచి మార్కెట్ క్రమంగా పుంజుకుంటోంది. ప్రభుత్వ స్థిరమైన విధానాలు, కార్యాచరణ, స్థిరపడిన ధరలు తదితర కారణాలతో జనవరి నుంచి నగర స్థిరాస్తి రంగం కోలుకుంటోంది. –సాక్షి, సిటీబ్యూరోగత నెలలో గ్రేటర్లో రూ.3,925 కోట్లు విలువ చేసే 5,900 యూనిట్లు రిజిస్ట్రేషన్ కాగా.. జనవరిలో రూ.3,293 కోట్ల విలువైన 5,464 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. నెల రోజుల్లో విలువల్లో 13 శాతం, యూనిట్ల రిజిస్ట్రేషన్లలో 10 శాతం వృద్ధి నమోదైందని నైట్ఫ్రాంక్ ఇండియా అధ్యయనం వెల్లడించింది. నగరవాసులు లగ్జరీ ప్రాపర్టీల కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. విశాలమైన ఇళ్ల కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకాడట్లేదు. గతేడాది ఫిబ్రవరిలో రూ.50 లక్షలలోపు ధర ఉన్న గృహాలు 59 శాతం విక్రయించగా.. గత నెలకొచ్చేసరికి వీటి వాటా 56 శాతానికి తగ్గింది.ఇదీ చదవండి: చారిత్రక ‘లక్ష్మీ నివాస్’ బంగ్లా అమ్మకం..వీటి స్థానంలో రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ ప్రాపర్టీల వాటా గతేడాది ఫ్రిబవరిలో 15 శాతంగా ఉండగా.. ఇప్పుడది ఏకంగా 18 శాతానికి పెరిగింది. అలాగే 2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైన ఇళ్ల వాటా 2024 ఫిబ్రవరిలో 13 శాతంగా ఉండగా.. గత నెలలో 17 శాతానికి పెరిగింది. 1,000–2,000 చ.అ. మధ్య ఉన్న ప్రాపర్టీల వాటా 71 శాతం నుంచి 67 శాతానికి తగ్గింది. -
శంషాబాద్ రియల్ఎస్టేట్ ప్రాజెక్ట్లో ఏక్యూఐ
హైదరాబాద్: బయోఫిలిక్, సస్టెయినబుల్ రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా ఉన్న స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్లోని తమ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లో ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) మానిటరింగ్ స్టేషన్ను ప్రారంభించింది. ఈ ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ అక్కడి కమ్యూనిటీ ప్రయోజనం కోసం గాలి నాణ్యతను పర్యవేక్షించడమే కాకుండా పర్యావరణ సుస్థిరత గురించి అవగాహన పెంచడానికి కూడా దోహదం చేస్తుంది.ఈ కార్యక్రమంలో రిపబ్లిక్ ఆఫ్ స్లోవేనియా రాయబారి మతేజా వోడెబ్ ఘోష్, ఎకనామిక్ కౌన్సెలర్ టీ పిరిహ్, జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ వింగ్ అడిషనల్ కమిషనర్ వీవీఎల్ సుభద్రాదేవి, కేంద్ర ప్రభుత్వ మాజీ అదనపు కార్యదర్శి అశోక్ పావడియా వంటి ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రిబ్బన్ కత్తిరించి మొక్కలు నాటారు. అనంతరం ప్రాజెక్ట్ విస్తృత ప్రభావాలను వివరించారు.ఈ సందర్భంగా రిపబ్లిక్ ఆఫ్ స్లోవేనియా రాయబారి మతేజా వోడెబ్ ఘోష్ మాట్లాడుతూ.. సుస్థిర చర్యల ప్రపంచ ప్రాముఖ్యతను తెలియజేశారు. "గాలి నాణ్యతను మెరుగుపరచడానికి, పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించడానికి అన్ని సంస్థలు, ప్రభుత్వాలు, ఎన్జీఓలు, కార్పొరేట్లు, వ్యాపార సంస్థలు - సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.స్టోన్క్రాఫ్ట్ గ్రూప్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ కీర్తి చిలుకూరి మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ అభివృద్ధి అంటే కేవలం భౌతికంగా నివాస ప్రాంతాలను సృష్టించడం కాదని, సుస్థిర సమాజాలను నిర్మించడమని తాము నమ్ముతున్నామన్నారు. పర్యావరణ బాధ్యతను పెంపొందించే దిశగా తాము తీసుకుంటున్న అనేక చర్యల్లో శంషాబాద్ లోని ఏక్యూఐ మానిటరింగ్ స్టేషన్ ఒకటి అన్నారు. -
రియల్ ఎస్టేట్ను వదిలేస్తున్న వారెన్ బఫెట్!
ప్రముఖ ఇన్వెస్టర్, బెర్క్షైర్ హతావే చైర్మన్ వారెన్ బఫెట్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. అమెరికాలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థల్లో ఒకటైన హోమ్ సర్వీసెస్ ఆఫ్ అమెరికాను విక్రయించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. పెరుగుతున్న తనఖా రేట్లు, క్షీణిస్తున్న అమ్మకాలు, ఆర్థిక అస్థిరతతో ప్రాపర్టీ మార్కెట్ సతమతమవుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇది దేనికి సంకేతం?ఎందుకు వదులుకుంటున్నట్టు?బలమైన కారణం ఉంటే తప్ప బఫెట్ వ్యాపారాలను అమ్మేసుకోడు. మరి ఇప్పుడెందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వదులుకుంటున్నాడు? మార్కెట్ విస్తరణకు పేరొందిన రియల్ ఎస్టేట్ దిగ్గజం కంపాస్ కు హోమ్ సర్వీసెస్ ఆఫ్ అమెరికాను విక్రయించేందుకు బెర్క్ షైర్ హాత్వే చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బెర్క్ షైర్ హాత్వే హోమ్ సర్వీసెస్, రియల్ లివింగ్ వంటి బ్రాండ్ల ద్వారా పనిచేస్తున్న హోమ్ సర్వీసెస్ కు 5,400 మంది ఉద్యోగులు, 820 బ్రోకరేజీ కార్యాలయాలతో విస్తృతమైన నెట్ వర్క్ ఉంది.వ్యాపారాన్ని విక్రయించాల్సిన అవసరం కంపెనీ ఎదుర్కొంటున్న ఆర్థిక ఎదురుదెబ్బల నుంచి కూటా ఉద్భవించి ఉండవచ్చు. 2024లో హోమ్ సర్వీసెస్ ఆఫ్ అమెరికా 107 మిలియన్ డాలర్ల నష్టాన్ని ప్రకటించింది. రియల్ ఎస్టేట్ కమిషన్ దావాకు సంబంధించిన 250 మిలియన్ డాలర్ల సెటిల్మెంట్ దీని వెనుక ముఖ్యమైన కారణం. మార్కెట్ పరిస్థితులు బిగుసుకుపోవడం, లాభదాయకత కుంచించుకుపోవడంతో బఫెట్ వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గే అవకాశమూ ఉంది.పతనం అంచున అమెరికా హౌసింగ్ మార్కెట్?అమెరికా రియల్ ఎస్టేట్ మార్కెట్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపుతో ఆకాశాన్నంటుతున్న తనఖా రేట్లు గృహ అమ్మకాలను గణనీయంగా మందగించేలా చేశాయి. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ ప్రకారం, 2023 లో ప్రస్తుత గృహాల అమ్మకాలు దాదాపు 30 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ నుంచి బఫెట్ వైదొలగడం దీర్ఘకాలిక ప్రతికూలతలను ఆయన అంచనా వేస్తున్నట్లు సంకేతాలు ఇస్తున్నాయి. -
ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లే కావాలి!
ఇంటి డిజైన్ల విషయంలో టేస్ట్ ఎప్పటికప్పుడు మారుతున్నట్లే.. ఇంటీరియర్లోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి. గతంలో చిన్న ఇల్లు ఉండాలనే ఆశలతో ఉన్నవారు కరోనా తర్వాతి నుంచి విశాలంగా ఉండే ఇళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆలస్యమైనా సరే.. కాస్త స్పేస్ ఎక్కువ ఉన్న ఇళ్లనే కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. - సాక్షి, సిటీబ్యూరోనగరం మధ్యలో ఇరుకు ఇళ్లలో ఉండేకంటే శివారు ప్రాంతాలు, పచ్చదనం ఉండే ప్రాంతాలను ఇష్టపడుతున్నారు. అపార్ట్మెంట్లలో అయితే డబుల్, ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లను కొనుగోలు చేస్తున్నారని హౌసింగ్.కామ్ ఇండియన్ రెసిడెన్షియల్ ఇండెక్స్ ఫర్ ఆన్లైన్ సెర్చ్(ఐఆర్ఐఎస్) తెలిపింది. 15 శాతం వృద్ధిగతంలో ప్రాపర్టీ కొనాలంటే ధర, వసతులు ప్రధాన అంశాలుగా ఉండేవి. కరోనా తర్వాతి నుంచి వైద్య సదుపాయాలకు ఎంత దూరంలో ఉంది? భద్రత ఎంత? అనే అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వైద్య సదుపాయాలు, భద్రత, ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉన్న ప్రాజెక్ట్లకు డిమాండ్ పెరిగింది. త్రీ బీహెచ్కే, ఆపై పడక గదుల గృహాలలో అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే 2024లో 15 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది పెద్ద సైజు ప్లాట్లలో 42 శాతం పెరుగుదల కనిపించింది. -
ఇల్లు, ఆఫీసులే కాదు.. గోడౌన్లూ కష్టమే..!
గృహాలు, కార్యాలయ స్థలాలకే కాదు.. గిడ్డంగులకూ హైదరాబాద్ నగరంలో ఆదరణ పెరుగుతోంది. నగరంలో గతేడాది 35 లక్షల చ.అ. వేర్హౌస్ స్పేస్ల లావాదేవీలు జరిగాయి. మరో 1.64 కోట్ల చ.అ. స్థలాలకు డిమాండ్ ఉందని, ఇది 2024లో వార్షిక లావాదేవీలతో పోలిస్తే దాదాపు ఐదు రెట్లు అదనమని నైట్ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. గ్రేటర్లో శంషాబాద్, మేడ్చల్, పటాన్చెరు క్లస్టర్లు వేర్హౌస్లకు కేంద్ర బిందువులుగా ఉన్నాయి. గ్రేటర్లో గిడ్డంగుల అద్దె నెలకు చ.అ.కు రూ.20.7గా ఉంది. ఏడాది కాలంలో అద్దెలు ఒక శాతం మేర పెరిగాయి. అత్యధికంగా గ్రేడ్–ఏ వేర్హౌస్ అద్దెలు పటాన్చెరు పారిశ్రామిక క్లస్టర్లో రూ.24–28గా ఉంది. – సాక్షి, సిటీబ్యూరోగతేడాది లావాదేవీల్లో అత్యధికంగా 34 శాతం తయారీ రంగంలోనే జరిగాయి. పునరుత్పాదక, సస్టెయినబుల్ ఎనర్జీ, ఆటోమోటివ్, ఆటో అనుబంధ పరిశ్రమలు డిమాండ్కు చోదకశక్తిగా నిలిచాయి. మేకిన్ ఇండియా, ప్రొడెక్షన్ లింక్డ్ ఇన్వెంటివ్ (పీఎల్ఐ) వంటి ప్రభుత్వ పథకాలు, ప్రోత్సాహకాలతో తయారీ, లాజిస్టిక్ హబ్గా హైదరాబాద్ ఆకర్షణగా నిలిచాయి. ఆ తర్వాత 33 శాతం రిటైల్ విభాగంలో లావాదేవీలు జరిగాయి. ఈ–కామర్స్, ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ విభాగాలు రిటైల్ డిమాండ్కు ప్రధాన కారణాలు.శంషాబాద్ హాట్ ఫేవరేట్.. గతేడాది గిడ్డంగుల లావాదేవీలు అత్యధికంగా శంషాబాద్ క్లస్టర్లో జరిగాయి. బెంగళూరు–హైదరాబాద్ హైవేకు అనుసంధానమై ఉండటం ఈ క్లస్టర్ అడ్వాంటేజ్. ఈ క్లస్టర్లో శంషాబాద్, శ్రీశైలం హైవే, బొంగ్లూరు, కొత్తూరు, షాద్నగర్ గిడ్డంగులకు ప్రధాన ప్రాంతాలు. విత్తన ప్రాసెసింగ్ యూనిట్, థర్డ్ పార్టీ లాజిస్టిక్ కంపెనీలు(3పీఎల్), ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ వంటి పారిశ్రామిక రంగం ఈ క్టస్లర్ డిమాండ్ను ప్రధాన కారణాలు. గతేడాది గ్రేటర్లో జరిగిన గిడ్డంగుల లావాదేవీల్లో ఈ క్లస్టర్ వాటా 47 శాతం. ఈ క్లస్టర్లో వేర్హౌస్ స్థలాలు ఎకరానికి రూ.4–6 కోట్ల మధ్య ఉండగా.. అద్దె చ.అ.కు రూ.18–25 ఉంది.మేడ్చల్, పటాన్చెరుల్లో.. మేడ్చల్, పటాన్చెరు క్లస్టర్లలోనూ వేర్హౌస్లకు డిమాండ్ ఉంది. మేడ్చల్ క్లస్టర్లో మేడ్చల్, దేవరయాంజాల్, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, శామీర్పేట ప్రాంతాలు హాట్ ఫేవరేట్గా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు ఎకరం రూ.3–5 కోట్లు ఉండగా.. అద్దెలు చ.అ.కు రూ.18–24 మధ్య ఉన్నాయి. పటాన్చెరు క్లస్టర్లో పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతం, రుద్రారం, పాశమైలారం, ఏదులనాగులపల్లి, సుల్తాన్పూర్ ప్రాంతాలు హాట్ ఫేవరేట్. ఇక్కడ స్థలాల ధరలు రూ.4–7 కోట్ల మధ్య పలుకుతుండగా అద్దె చ.అ.కు రూ.18–28 మధ్య ఉన్నాయి.డిమాండ్ ఎందుకంటే? వ్యూహాత్మక స్థానం, అద్భుతమైన కనెక్టివిటీ, పెరుగుతున్న పారిశ్రామిక కార్యకలాపాలు, లాజిస్టిక్స్కు హైదరాబాద్ కేంద్ర బిందువుగా అభివృద్ధి చెందింది. వీటికి తోడు మెరుగైన రోడ్లు, రైలు, విమాన నెట్వర్క్లతో సమర్థవంతమైన రవాణా వ్యవస్థ కలిగి ఉంది. దీంతో ఫార్మాసూటికల్స్, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, పునరుత్పాదక ఇంధనం వంటి పరిశ్రమల ద్వారా నగరంలో గిడ్డంగులకు ఆదరణ పెరుగుతుంది. వీటికి తోడు స్థానిక ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలు, మెరుగైన మౌలిక సదుపాయాలతో గిడ్డంగుల విభాగంలో డిమాండ్కు మరో కారణం. -
ఇంటి కొనుగోలు.. ‘ఆమె’కు నచ్చితేనే..
సాధారణంగా మహిళలు వంట గది విశాలంగా ఉండాలని కోరుకుంటారు. కానీ, నేటి అవసరాలు, అభిరుచులు మారుతుండటంతో ఆధునిక వసతులనూ కోరుకుంటున్నారు. జిమ్, మెడిటేషన్ వంటి సౌకర్యాలతో పాటు వాకింగ్, జాగింగ్ ట్రాక్స్, గ్రీనరీ స్పేస్, పిల్లల కోసం పార్క్, స్పోర్ట్స్ వంటి వసతులను ఎంచుకుంటున్నారని ఆర్క్ గ్రూప్ సీఈఓ మేఘన గుమ్మి తెలిపారు. గృహిణి, ఉద్యోగిని ఎవరైనా సరే ఇంటిని, కుటుంబ సభ్యుల బాగోగులను చూసుకునేది మహిళే. దీంతో ఇంట్లో ఏ గదికి ఎంత స్పేస్ అవసరమో నిర్ణయించగలదు. వాస్తవానికి పురుషుల కంటే మహిళలకే దృశ్యీకరణ (విజువలైజేషన్) శక్తి ఎక్కువగా ఉంటుంది. తాను ఉండబోయే కిచెన్, బెడ్ రూమ్, బాల్కనీ ఇంట్లోని ప్రతీది ఏ విధంగా ఉండబోతుందో ఊహించగలదు. –సాక్షి, సిటీబ్యూరోఐదారేళ్ల క్రితం వరకూ రియల్ ఎస్టేట్ రంగంలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండేది. అయితే స్థిరాస్తి రంగంలో వృత్తి నైపుణ్యం, ఆదాయ వనరులు పెరగడం, వర్క్ కల్చర్ మారడంతో క్రమంగా ఈ విభాగంలో మహిళలు ప్రవేశిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్, మార్కెటింగ్, సేల్స్ విభాగంలోనే కాదు సైట్ల మీద కూడా మహిళలు పనిచేసే స్థాయికి ఎదిగారు. దీంతో రియల్టీ సెక్టార్ అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగంగా అభివృద్ధి చెందుతుంది. ఐటీ, ఫార్మా వంటి రంగాల్లో మాదిరిగా రియల్టీ సెగ్మెంట్లోనూ వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.ఆమెకు నచ్చితేనే.. ఇల్లు కొందామని నిర్ణయించుకున్నాక.. ప్రాంతం, ధర, ప్రాజెక్ట్, వసతులు ఏవైనా సరే భర్తకు నచ్చినా సరే అంతిమంగా నిర్ణయించాల్సింది, ఓకే చేయాల్సిందీ ఇల్లాలే. ఆమెకు నచ్చకుండే ఇంటి కొనుగోలు చేయరు. సొంతింటి ఎంపికలో మహిళల పవర్ అదీ. అపార్ట్మెంట్లతో పోలిస్తే విల్లాలలో ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండటంతో నేటి యంగ్ ఉమెన్స్ విల్లాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు నిర్ణయాధికారం, కొనుగోలు శక్తి పెరగడంతోనూ ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడింది.ఇన్ఫ్రాకు నీడ రియల్టీ.. మనల్ని అంటిపెట్టుకొని నీడ ఎలాగైతే ఫాలో అవుతుందో.. ఇన్ఫ్రాకు రియల్ ఎస్టేట్ కూడా అంతే. మౌలిక వసతులు అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలోనే రియల్ పరుగులు పెడుతుంది. భూముల ధరలు పెరగడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం సౌత్ హైదరాబాద్ వైపు ఫోకస్ పెట్టింది. కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం వంటి పశ్చిమ ప్రాంతాలు ఇప్పటికే కిక్కిరిసిపోయాయి. ఇక్కడ సామాన్యులు కొనే పరిస్థితి లేదు. సౌత్లో ఇన్ఫ్రా డెవలప్మెంట్తో కొత్తూరు, షాద్నగర్, ఆదిభట్ల, ముచ్చర్ల వంటి దక్షిణ ప్రాంతాలు బాగా డెవలప్ అవుతాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాలలో ధరలు తక్కువగా ఉన్నాయి కాబట్టి సామాన్య, మధ్యతరగతి ఈ టైమ్లో కొనుగోలు చేయడం ఉత్తమం. ఏ నగరమైనా సమాంతరంగా అభివృద్ధి చెందాలి. కానీ, మౌలిక వసతుల కల్పనలో హెచ్చు తగ్గులు కారణంగా అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. దీంతో హైదరాబాద్లో వెస్ట్, సౌత్ జోన్లో భూముల ధరలు బాగా పెరిగాయి. మూసీ సుందరీకరణ, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ.. హైదరాబాద్ స్థిరాస్తి రంగాన్ని నెక్ట్స్ లెవల్కు తీసుకెళ్లడం ఖాయం. ఈ బృహత్తర ప్రాజెక్ట్లతో రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ పుంజుకోవడం ఖాయం. -
ఇంటి ఓనర్ మహిళ అయితే ఎన్ని ప్రయోజనాలో..
ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలంటారు పెద్దలు. కానీ, ఇల్లే ఇల్లాలి పేరు మీద ఉండాలంటారు నిపుణులు! రెండూ నిజమే. మొదటి దాని గురించి చర్చ అవసరం లేకపోయినా.. రెండో దాని గురించి మాత్రం అవసరమే. ఎందుకంటే ఇంటి ఓనర్ లేదా కో–ఓనర్ మహిళ అయితే ఎన్నో ప్రయోజనాలున్నాయి గనక! గృహ రుణం నుంచి మొదలు పెడితే వడ్డీ రాయితీ, ఆదాయ పన్ను మినహాయింపు, స్టాంప్ డ్యూటీ తగ్గింపు.. ఇలా ఎనెన్నో ప్రయోజనాలున్నాయి. అందుకే తెలివైన గృహ కొనుగోలుదారుడు ఇంటిని భార్య, తల్లి లేకపోతే అక్క, చెల్లి మొత్తమ్మీద మహిళ పేరు మీద కొనుగోలు చేస్తారని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరోస్టాంప్ డ్యూటీలో తగ్గింపు.. పలు రాష్ట్రాలు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల సమయంలో మహిళలకు స్టాంప్ డ్యూటీ రాయితీని అందిస్తున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహిళలకు 1 శాతం రాయితీ ఉండేది. ప్రస్తుతం లేదు. ఢిల్లీలో ప్రాపర్టీ కొనుగోలుదారులకు మగవారికైతే ప్రాపర్టీ విలువలో 6 శాతం స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తుండగా.. మహిళ ఓనరైతే 4 శాతం చెల్లించాల్సి ఉంటుంది. జమ్మూ అండ్ కశ్మీర్లో అయితే మహిళ ప్రాపర్టీ కొనుగోలుదారులకు స్టాంప్ డ్యూటీనే లేదు. ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ మహిళా ఓనర్లకు స్టాంప్ డ్యూటీ మినహాయింపులు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే పట్టణ, గ్రామీణ ప్రాంతాల వర్గీకరణ ఆధారంగా కూడా స్టాంప్ డ్యూటీలో మినహాయింపు ఉంది.ఐటీప్రయోజనాలు..గృహ యజమాని లేదా సహ–యజమాని మహిళ అయితే ఆదాయ పన్ను మినహాయింపులు కూడా ఉన్నాయి. భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఇద్దరు వేర్వేరుగా అసలు, వడ్డీలపై ఐటీ తగ్గింపులను క్లయిమ్ చేసుకునే వీలుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం సహ దరఖాస్తుదారు ప్రిన్సిపల్ అమౌంట్పై ఏడాదికి రూ.1.5 లక్షల వరకు, చెల్లించిన వడ్డీపై రూ.2 లక్షల వరకు ప్రయోజనాన్ని పొందవచ్చు. అలాగే సెక్షన్ 80ఈఈ కింద ఇతర క్లెయిమ్లతో పాటు తొలిసారి గృహ యజమానురాలు మహిళ అయితే ప్రిన్సిపల్ అమౌంట్ మీద రూ.50 వేలు తగ్గింపు కూడా అందుతుంది. అద్దె ఆదాయంపై కూడా.. మహిళలు ఆస్తిని విక్రయించేటప్పుడు క్యాపిటల్ గెయిన్ మినహాయింపులను కూడా పొందవచ్చు. అంతేకాకుండా ప్రాపర్టీని మహిళలు అద్దెకు ఇస్తే.. ఆమె రెండు రకాల తగ్గింపులకు క్లయిమ్ చేసుకోవచ్చు. అద్దెకు ఇచ్చిన ప్రాపర్టీపై ఏదైనా లోన్పై చెల్లించే వడ్డీపై పన్ను తగ్గింపుతో పాటు రెంటల్ ఆదాయంపై 30 శాతం స్టాండర్డ్ డిడెక్షన్ లభిస్తుంది. అయితే పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయాలంటే మహిళలకు ఆదాయ వనరులు ఉండాల్సిందే. గృహ రుణ వడ్డీ రేట్ల తగ్గింపు..బ్యాంక్లు, ఆర్థిక సంస్థలు మహిళలను విశ్వసనీయ రుణ గ్రహీతలుగా పరిగణిస్తుంటాయి. అందుకే స్థిరాస్తి రంగంలో మహిళా పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రుణ కార్యక్రమాలను, స్కీమ్లను అందుబాటులోకి తీసుకొస్తుంటాయి. తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తున్నాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ వంటి బ్యాంకులలో పురుష రుణ గ్రహీతలతో పోలిస్తే మహిళలకు హోమ్ లోన్ వడ్డీ రేట్లు 0.5 నుంచి 1 శాతం తక్కువగా ఉంటాయి.ఈ శాతం తక్కువగా కనిపిస్తున్నప్పటికీ దీర్ఘకాలంలో డబ్బు, ఈఐఎంను ఆదా చేస్తుంది. ప్రధాన్మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద లో ఇన్కం గ్రూప్(ఎల్ఐజీ) కేటగిరీ కింద మహిళలకు రూ.6 లక్షల రుణానికి 6.5 శాతం వడ్డీ రాయితీతో.. రూ.2.67 లక్షల వరకు సబ్సిడీని పొందవచ్చు. ఇన్కం సోర్స్ లేని మహిళలకు బ్యాంక్లు రుణాలను అందించవు.వారసులకు బదిలీ సులువు..మహిళ పేరిట ప్రాపర్టీ ఉంటే అది ఆమె ఎస్టేట్లో భాగమవుతుంది. ఎటువంటి చట్టపరమైన చిక్కులు లేకుండా ఆమె వారసులకు సులభంగా బదిలీ అవుతుంది. అయితే విడాకుల సమయంలో సేల్డీడ్ ఆధారంగా ఆస్తి కేటాయింపులు ఉంటాయి. ఏదైనా చట్టపరమైన వివాదాలు తలెత్తితే ఆస్తి మహిళ పేరు మీద ఉన్నప్పటికీ భర్త ఉమ్మడిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. -
రియల్టీ ప్లాట్ఫామ్లో ధోని పెట్టుబడులు
ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఫ్యామిలీ ఆఫీసు నుంచి వ్యూహాత్మక పెట్టుబడులు అందుకున్నట్లు రియల్టీ సర్వీసుల ప్లాట్ఫామ్ ఎస్ఐఎల్ఏ(సిలా) తాజాగా పేర్కొంది. అయితే ఏమేరకు పెట్టుబడి పెట్టారో మాత్రం వివరాలు వెల్లడించలేదు. 2010లో రుషభ్, సాహిల్ వోరా ఏర్పాటు చేసిన సిలా దేశవ్యాప్తంగా రియల్టీ అడ్వయిజరీ సర్వీసులు అందిస్తోంది. సంస్థలో నార్వెస్ట్ వెంచర్ పార్ట్నర్స్కు సైతం పెట్టుబడులున్నాయి. దేశీయంగా 20 కోట్ల చదరపు అడుగుల రియల్టీ ఆస్తులను నిర్వహిస్తున్న కంపెనీలో 25,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.ఇదీ చదవండి: నెలకు రూ.82,000 వేతనం.. ఇంటి ఖర్చులు భారం..కెప్టెన్కూల్గా పేరున్న మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటికే వివిధ పరిశ్రమల్లో అనేక వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టారు. ఆయన ఇన్వెస్ట్ చేసిన కొన్ని కంపెనీల జాబితా కింది విధంగా ఉంది.బ్లూస్మార్ట్ మొబిలిటీ: గురుగ్రామ్కు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ ఆధారిత కంపెనీ టెక్నాలజీ సర్వీసులు అందిస్తూ స్థిరమైన రవాణాపై దృష్టి సారించింది.గరుడ ఏరోస్పేస్: వ్యవసాయం, రక్షణ, పారిశ్రామిక డ్రోన్లలో ప్రత్యేకత కలిగిన చెన్నైకి చెందిన డ్రోన్ టెక్నాలజీ సంస్థ.ఈమోటోరాడ్: ఎకో ఫ్రెండ్లీ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ను ప్రోత్సహించే ఎలక్ట్రిక్ సైకిల్ స్టార్టప్.హోమ్ లేన్: బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైన్ అండ్ హోమ్ డెకోర్ కంపెనీ.ఖాతాబుక్: డిజిటల్ పేమెంట్స్, బుక్ కీపింగ్ కోసం ఏర్పాటు చేసిన ఫిన్టెక్ ప్లాట్ఫామ్.కార్స్24: పాత కార్లను కొనడానికి, విక్రయించడానికి ఆన్లైన్ సేవలందించే ప్లాట్ఫామ్.షాకా హ్యారీ: ముంబైకి చెందిన మొక్కల ఆధారిత ఆహార సంస్థ.7ఇంక్ బ్రూస్: ఫుడ్ అండ్ బెవరేజ్ బ్రాండ్.తగ్డా రహో: ఫిట్నెస్ అండ్ వెల్నెస్ బ్రాండ్.రిగి: సోషల్, కంటెంట్ మానిటైజేషన్ ప్లాట్ఫామ్. -
కో-వర్కింగ్కు డిమాండ్..
సాక్షి, సిటీబ్యూరో: కరోనా తర్వాతి నుంచి కో-వర్కింగ్ స్పేస్కు డిమాండ్ పెరిగింది. స్టార్టప్స్తో పాటు ప్రధాన కంపెనీలు కూడా ఫ్లెక్సిబుల్ వర్క్ ప్లేస్ల నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. దీంతో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ప్రతి ఏటా కో–వర్కింగ్ స్పేస్ లావాదేవీల వాటా 20 శాతానికి పైగా ఉంటుంది.కో–వర్కింగ్ స్పేస్ డిమాండ్కు ప్రధాన కారణం సిటీ సెంటర్లు లేదా ప్రధాన ఉపాధి కేంద్రాలలో మాత్రమే కాకుండా నగర వ్యాప్తంగా విస్తరించి ఉండటమే.. అభివృద్ధి చెందుతున్న కొత్త ఏరియాలు, శివారు ప్రాంతాలు, గృహ సముదాయాలకు చేరువలో ఈ సెంటర్లు ఉంటున్నాయి. అలాగే ప్రధాన మెట్రో నగరాలలో షాపింగ్ మాల్స్, హోటళ్లలోనూ ఫ్లెక్సిబుల్ స్పేస్లు అందుబాటులోకి వచ్చాయి.దీంతో చాలా కంపెనీలు ఉద్యోగుల గృహాలకు చేరువలో ఉండే కో–వర్కింగ్ స్పేస్లను తీసుకొని కార్యకలాపాలు సాగిస్తున్నాయని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. అలాగే ఫ్లెకిబుల్ ఆఫీస్ స్పేస్ అద్దె కూడా సాధారణ ఆఫీసు స్పేస్ రెంట్స్కు సమానంగా ఉండటం, రెగ్యులర్ ఆఫీసు స్పేస్కు ఉండే 3–4 ఏళ్ల లాకిన్ పీరియడ్తో పోలిస్తే కో–వర్కింగ్ స్పేస్కు కాల పరిమితి ఉండకపోవటం వంటివి కూడా కంపెనీల ఆకర్షణకు కారణాలని ఆయన పేర్కొన్నారు. -
రూ.3 లక్షలకే రెండు గుంటలు.. తొందరపడితే..
‘హైదరాబాద్ నుంచి 140 కి.మీ. దూరంలో ఉన్న నారాయణ్ఖేడ్లో ఓ నిర్మాణ సంస్థ ఫామ్ల్యాండ్ వెంచర్ను అభివృద్ధి చేస్తున్నామని ప్రచారం చేస్తుంది. రెండు గుంటలు (242 గజాలు)కు రూ.3 లక్షలు చెల్లిస్తే.. ప్రతినెలా రూ.15 వేల అద్దె చొప్పున 20 నెలల్లో తర్వాత మొదట్లో కట్టిన రూ.3 లక్షలతో సహా మొత్తం రూ.6 లక్షలు కొనుగోలుదారుడికి చెల్లిస్తోంది. అలాగే 4 గుంటల స్థలానికి రూ.6 లక్షలు చెల్లిస్తే.. ప్రతినెలా రూ.30 వేల చొప్పున 20 నెలల తర్వాత రూ.12 లక్షలు, అలాగే 8 గుంటలకు రూ.12 లక్షలు కడితే.. నెలకు రూ.24 వేల చొప్పున 20 నెలల్లో రూ.24 లక్షలు రిటర్న్ చేస్తుంది.’ ఇలా అపార్ట్మెంట్లకు ప్రతినెలా అద్దె చెల్లించినట్లుగానే ఓపెన్ ప్లాట్లకు, ఫామ్ల్యాండ్లకు కూడా రెంట్ చెల్లిస్తామని కొత్త తరహా మోసాలకు తెరలేపారు పలువురు బిల్డర్లు. – సాక్షి, సిటీబ్యూరోఇప్పటికే గృహ నిర్మాణంలో ప్రీలాంచ్ విక్రయాల పేరిట జరిగిన దందాలో మోసపోయిన కొనుగోలుదారులు పోలీసు స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే.. కొత్తగా బై బ్యాక్, రెంటల్ ఇన్కం, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వంటి సరికొత్త ఆఫర్ల పేరిట అమాయకులను నట్టేట ముంచేస్తున్నారు.ఫామ్ప్లాట్లు, ఖాళీ స్థలాలను అక్రమ మార్గంలో విక్రయిస్తూ సామాన్యులను నిలువునా ముంచేస్తున్నారు. ఏడాదిలో అద్దెతో సహా కట్టిన సొమ్మును వాపస్ ఇస్తామని నమ్మించి మోసం చేస్తున్నారు. ఒకవేళ ఏడాది తర్వాత మార్కెట్ ఒడిదుడుకులలో ఉన్నా లేక కంపెనీ బోర్డు తిప్పేసినా నష్టపోయేది కొనుగోలుదారుడే. ఎందుకంటే ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం గజానికి రూ.5 వేలు కూడా పలకని ప్రాంతంలో రూ.10 వేలకు పైగానే ధరతో విక్రయించి.. ముందస్తుగానే బిల్డర్లు సొమ్ము వసూలు చేసేస్తున్నారు. కరోనా కాలంలో పుట్టుకొచ్చిన ఏవీ ఇన్ఫ్రాకాన్, జయగ్రూప్, ఫార్చ్యూన్ 99 వంటి పలు కొత్త నిర్మాణ సంస్థలు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నాయి. డీటీసీపీ, హెచ్ఎండీఏ నుంచి ఎలాంటి నిర్మాణ అనుమతులు, రెరాలో నమోదు చేయకుండానే వెంచర్లను విక్రయిస్తున్నారు. సదాశివపేట, నారాయణ్ఖేడ్, నందివనపర్తి, చేవెళ్ల, జనగాం, బచ్చన్నపేట, చౌటుప్పల్, యాదాద్రి వంటి ప్రధాన నగరం నుంచి వందకుపైగా కి.మీ. దూరంలో ఉన్న శివారు ప్రాంతాల్లో ఈ తరహా ప్రాజెక్ట్లు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. రహదారులు, విద్యుత్, మురుగునీటి వ్యవస్థ వంటి కనీస మౌలిక వసతులు కూడా సరిగా లేని ప్రాంతాలలో వందలాది ఎకరాలలో ప్రాజెక్ట్లు చేస్తున్నామని మాయమాటలు చెబుతున్నారు.నమ్మకస్తులే మధ్యవర్తులుగా.. గ్రామాలు, శివారు ప్రాంతాలలో టీచర్లు, ఎల్ఐసీ ఏజెంట్లు, రిటైర్డ్ ఉద్యోగులను రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా నియమించుకుంటున్నారు. గ్రాఫిక్స్ హంగులను అద్ది రంగురంగుల బ్రోచర్లను ముద్రించి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. ప్రతినెలా స్టార్ హోటళ్లలో మధ్యవర్తులతో సమావేశం నిర్వహించి, ఎక్కువ విక్రయాలు చేసిన ఏజెంట్లకు విదేశీ టూర్లు, కార్లు, బంగారం వంటివి బహుమతులుగా అందజేస్తున్నారు.ఇదీ చదవండి: లగ్జరీ రియల్ ఎస్టేట్.. మంచి లాభాలకు ఇదే రూట్! -
లగ్జరీ రియల్ ఎస్టేట్.. మంచి లాభాలకు ఇదే రూట్!
సాక్షి, సిటీబ్యూరో: అస్థిరత, వేగంగా మారుతున్న మార్కెట్ యుగంలో పెట్టుబడులకు ఆశించిన లాభాలు రావాలంటే వ్యూహాత్మక, వైవిధ్యభరిత ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. పెట్టుబడి సాధనాలలో రియల్ ఎస్టేట్ దీర్ఘకాలిక సంపద సృష్టి సాధనంగా మారింది. ఇందులోనూ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆకర్షణీయమైన పెట్టుబడి మార్గం.వైవిధ్యభరితమైన పెట్టుబడులతో రిస్క్ తక్కువగా ఉండటమే కాకుండా స్థిరమైన, నిరంతర లాభాలను అందుకోవచ్చు. పన్ను ప్రయోజనాలతో పాటు దీర్ఘకాల మూలధన లాభాలు అందుతాయి. సాంప్రదాయ పెట్టుబడి పోర్ట్ఫోలియోలో మార్కెట్ హెచ్చుతగ్గులు పెట్టుబడిదారులను అనిశ్చితిలోకి నెట్టేసే భయాందోళనలు కలిగిస్తుంది. ఇలాంటి ప్రతికూల సమయంలో లగ్జరీ రియల్టీ పెట్టుబడులు తక్కువ అస్థిరత, స్థిరమైన, సమతుల్య పెట్టుబడి విధానంతో మార్కెట్ గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడవచ్చు.మార్కెట్ సెంటిమెంట్పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. అద్దె ఆదాయం, నిరంతర నగదు ప్రవాహం ఉంటుంది. నివాస, వాణిజ్య, రిటైల్ ఇలా ప్రాపర్టీ రకాలు, ప్రాంతాలను బట్టి ఆదాయ వృద్ధిలో ప్రయోజనాలను అందుకోవచ్చు. పెట్టుబడులకు భద్రతతో పాటు దీర్ఘకాలిక రాబడులు ఉంటాయి. ద్రవ్యోల్బణం కాలక్రమేణా పెట్టుబడుల విలువలను తగ్గిస్తుంది.కానీ, స్థిరాస్తి రంగంలో పెట్టుబడులపై చాలా కాలంగా ద్రవ్యోల్బణ ఒత్తిడి లేదు. వినియోగదారుల ధరలు పెరిగే కొద్దీ స్థిరాస్తి విలువ కూడా పెరుగుతుంది. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాలను అందుకోవచ్చు. 2021లో 200 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ 2030 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ అంచనా వేసింది. -
హైదరాబాద్లో ‘గ్లోబల్’ జోష్
గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్(GCC)లకు ఇండియా ప్రధాన కేంద్రంగా మారింది. అంతర్జాతీయ బహుళ జాతి సంస్థలు ఇక్కడ జీసీసీ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నాయి. గతేడాది దేశంలోని 7 ప్రధాన నగరాల్లో 2.83 కోట్ల చ.అ. జీసీసీ ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయని అనరాక్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోరెండేళ్లలో ఏకంగా 5.28 కోట్ల చదరపు అడుగుల డీల్స్ పూర్తయ్యాయి. జీసీసీ లావాదేవీల్లో ఐటీ హబ్లైన బెంగళూరు, హైదరాబాద్లు పోటీపడుతున్నాయని పేర్కొంది. 1.2 కోట్ల చదరపు అడుగులతో బెంగళూరు టాప్లో ఉండగా హైదరాబాద్లో 48.6 లక్షల చదరపు అడుగుల మేర జీసీసీ ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి.జీసీసీ అంటే? అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలకు పొరుగు, ప్రాసెస్ సేవలను అందించేందుకు నైపుణ్యంతో పాటు చవకగా మానవ వనరులు లభించే ఇతర దేశాల్లో ఏర్పాటు చేసుకునే ఉప కార్యాలయాలనే గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ)లుగా పేర్కొంటారు.మూడో స్థానంలో హైదరాబాద్దేశంలోని బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగానికి చెందిన జీసీసీలలో దాదాపు 35% లేదా 42 బెంగళూరులో ఉండగా 16 జీసీసీలతో హైదరాబాద్.. ఢిల్లీ ఎన్సీఆర్ (22) తర్వాత మూడవ స్థానంలో ఉంది. అయితే నైపుణ్యాలు కలిగిన 19% మంది యాక్టివ్ ఉద్యోగార్థులతో రెండవ స్థానంలో ఉందని కెరీర్నెట్ తెలిపింది. -
వేసవి వచ్చేస్తోంది.. ఇంటి సీలింగ్ ఎలా ఉండాలంటే..
వేసవి కాలం వచ్చేస్తోంది.. బయటే కాదు ఇంట్లో ఉన్నా ఎండ వేడి తగులుతుంది. అసలు ఇంటి పైకప్పు ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది ఇంట్లో వేడి. సాధారణ సీలింగ్ ఉన్న ఇంట్లో అయితే ఈ వేడిమి తీవ్రత మరింత ఎక్కువే. దీనికి పరిష్కారం చూపించి.. మండు వేసవిలో ఇంటిని చల్లగా మార్చేస్తుంది ‘ఫాల్స్ సీలింగ్’! ఫాల్స్ సీలింగ్ ప్రధాన ఉద్దేశం.. గదిలో ఆహ్లాద వాతావరణం ఏర్పర్చడమే. అలసిన మనసు, శరీరానికి సాంత్వన చేకూర్చడమే. ఫాల్స్ సీలింగ్తో ఇంట్లోని వాతావరణాన్ని అందంగా, ఆహ్లాదంగా మార్చుకోవటమే కాకుండా సాధారణ ఇంటి పైకప్పును డైమండ్, చతురస్రం, గోళాకారం వంటి విభిన్న ఆకృతుల్లో అందంగా కూడా తీర్చిదిద్దుకోవచ్చు.– సాక్షి, సిటీబ్యూరో» ఫాల్స్ సీలింగ్ రంగుల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వారేమంటారంటే.. » గోడ రంగుతో పోల్చుకుంటే సీలింగ్కు వేసే వర్ణం తేలికగా ఉండాలి. అప్పుడు పైకప్పు తక్కువ ఎత్తులో ఉందనిపిస్తూ, విశాలంగా ఉన్న భావనను కలిగిస్తుంది. ముదురు షేడ్లను ఎంచుకుంటే పైకప్పు ఎత్తులో ఉందన్న అభిప్రాయాన్ని కలిగిస్తుంది. » మిగతా గదులతో పోల్చుకుంటే పడక గది సీలింగ్నే ఎక్కువసేపు చూస్తాం కాబట్టి వర్ణాల్లో సాదాసీదావి కాకుండా నేటి పోకడలకు అద్దంపట్టేవి ఎంచుకోవాలి. మధ్యస్తం, డార్క్, బ్రౌన్ వర్ణాలు పడకగదికి చక్కగా నప్పుతాయి. ఎందుకంటే ఈ వర్ణాలు ఉత్సాహపరిచే విధంగా, స్వభావానికి అనుకూలంగా ఉంటాయి మరి. » తాజాదనం ఉట్టిపడుతున్న లుక్ రావాలంటే మోనోక్రోమాటిక్ థీమ్ను ఎంచుకోవాలి. రెండు, మూడు వర్ణాలు కలిసినవి ఎంచుకుంటే మాత్రం అది పడకగది గోడలకు వేసిన రంగు కంటే తేలికగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీ సీలింగ్ ప్రశాంత భావనను కలగజేస్తుంది. » గోడల రంగుకు, సీలింగ్కు ఒకే రకమైనవి కాకుండా.. వేర్వేరు వర్ణాల్ని కూడా వేసుకోవచ్చు. దగ్గర దగ్గర రంగులు కాకుండా, చూడగానే తేడా ఇట్టే కన్పించే వర్ణాలను ఎంపిక చేసుకోవటం మేలు. దృశ్య వ్యక్తీకరణ ప్రదేశంగా సీలింగ్ను వినియోగించుకోండి. ఆహ్లాదభరితమైన ఆకాశం, లేదంటే గదితో కలిసిపోయేలా ఆకట్టుకునే ఆకారాలు, వర్ణాలతో నాటకీయత కన్పించేలా అలంకరించుకోవచ్చు. జాగ్రత్తలివే.. » ఫాల్స్ సీలింగ్ ఎంపికలో ధర కంటే నాణ్యతకే ప్రాధాన్యమివ్వాలి. » ఫ్లోర్ నుంచి పైకప్పు మధ్య కనీసం 12 అడుగుల ఎత్తు అయినా ఉండాలి. » ఏమరుపాటుగా ఉంటే ఫాల్స్ సీలింగ్తో పాటు ఎయిర్ కండిషన్ మెషిన్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. » ఉడెన్ ఫాల్స్ సీలింగ్లో అయితే ఎలుకలతో పాటు చెదలు, పురుగులు చేరే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. » దుమ్ము, ధూళి చేరకుండా అప్పుడప్పుడు శుభ్రం చేయాలి. -
రియల్టీలో ఆసక్తి.. లగ్జరీ ప్రాపర్టీల కొనుగోళ్లకు మొగ్గు
దేశీయ స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్ఎన్ఐ)లు ఆసక్తిగా ఉన్నారు. ఫలితంగా లగ్జరీ, అల్ట్రా ప్రీమియం ప్రాపర్టీలకు డిమాండ్ పెరిగింది. 65 శాతం మంది హెచ్ఎన్ఐ, యూహెచ్ఎన్ఐలు రూ.4–10 కోట్లు ధర ఉన్న లగ్జరీ ప్రాపర్టీ కొనుగోలుకు మొగ్గు చూపుతుండగా.. 13 శాతం మంది రూ.25 కోట్లకు పైన ధర ఉన్న స్థిరాస్తులపై ఆసక్తిగా ఉన్నారని ఇండియా సోత్బైస్ ఇంటర్నేషనల్ రియల్టీ(ఐఎస్ఐఆర్) వార్షిక సర్వే వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరో కరోనాతో స్థిరాస్తి రంగానికి జరిగిన ప్రధాన మేలు.. సొంతింటి అవసరం తెలిసి రావడమే.. మరీ ముఖ్యంగా గృహ విభాగంలో యువతరం భాగస్వామ్యం పెరగడం. 74 శాతం సంపన్న కొనుగోలుదారులు ద్రవ్యోల్బణాన్ని నిరోధించేందుకు రియల్ ఎస్టేట్ ఒక ప్రధాన ఆస్తిగా పరిగణిస్తారు.61 శాతం మంది హెచ్ఎన్ఐ, యూహెచ్ఎన్ఐలు 2024–25లో లగ్జరీ ప్రాపర్టీలను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. 34 శాతం మంది హైరైజ్ అపార్ట్మెంట్లు కొనుగోలుకు ఆసక్తిగా ఉండగా.. 30 శాతం మంది ఫామ్హౌస్లు, హాలిడే హోమ్స్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే 23 శాతం మంది వాణిజ్య సముదాయాలలో పెట్టుబడులకు, 15 శాతం మంది స్థలాలపై ఆసక్తిగా ఉన్నారు.గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 34 శాతం మంది హెచ్ఎన్ఐ, యూహెచ్ఎన్ఐలు విలాసవంతమైన ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. ఇప్పటికీ చాలామంది కొనుగోలుదారులు లగ్జరీ గృహాల కోసం శోధిస్తున్నారు. వచ్చే రెండు మూడేళ్లు దేశీయ రియల్టీ రంగం సరికొత్త రికార్డులను చేరుకుంటుందని విశ్వసిస్తున్నారు. 16 నెలలుగా లగ్జరీ గృహాల ధరలు పెరిగాయి. 2015 గరిష్ట ధరలతో పోలిస్తే స్వల్ప పెరుగుదలేనని తెలిపారు. విశాలవంతమైన గృహాలు, గ్రీనరీ ఎక్కువగా ఉండే ప్రాపర్టీలకే లగ్జరీ కొనుగోలుదారులు మొగ్గు చూపిస్తున్నారు. సంపన్న భారతీయుల ప్రాపర్టీ ఎంపికలో తొలి ప్రాధాన్యత మెరుగైన ఫిజికల్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలకే..ఈ నగరాలే హాట్స్పాట్స్.. సంపన్న కొనుగోలుదారులు ప్రాపర్టీ కొనుగోళ్లకు ప్రధాన కారణం మెరుగైన జీవన శైలి. మూలధన వృద్ధి, భవిష్యత్తు తరాలకు ఆస్తి వంటివి ఆ తర్వాతి అంశాలు. ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, గోవా, బెంగళూరు నగరాలలో గృహాల కొనుగోళ్లకు హెచ్ఎన్ఐ, యూహెచ్ఎన్ఐలు ఆసక్తిగా ఉన్నారు. 11 శాతం మంది సంపన్నులు విదేశాలలో ప్రాపర్టీలకు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా భయాలు తగ్గుముఖం పట్టడంతో విలాసవంతమైన భారతీయులు న్యూయార్క్, మయామి, లండన్, దుబాయ్, లిస్బన్ దేశాలలో లగ్జరీ అపార్ట్మెంట్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. -
హైదరాబాద్లో ఇంటి అద్దెలు పైపైకి!
తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం అధిక సంఖ్యలో హైదరాబాద్ నగరానికి వలస వస్తుండటంతో ఇక్కడ ఇంటి అద్దెలు (house rent) పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం హైదరాబాద్లో ఇంటి అద్దెలు భారీగా పెరిగాయి. - సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్లోని దాదాపు అన్ని కార్యాలయాలు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work from home) విధానాన్ని ఎత్తివేయడంతో అంతా నగరానికి చేరుకున్నారు. దీంతో ప్రధానంగా మెరుగైన ప్రయాణ సాధనాలు, పని కేంద్రాలకు చేరువలో ఉన్న అద్దె ఇళ్లకు డిమాండ్ ఉందని మ్యాజిక్బ్రిక్స్.కామ్ తెలిపింది.ప్రాపర్టీల విలువ పెరగడంతో గృహ యజమానులు అద్దెల కంటే లాభదాయకమైన ఆస్తుల విక్రయాల కోసం అన్వేషిస్తున్నారు. దీంతో సప్లై తగ్గడంతో అద్దె గృహాలకు డిమాండ్తో పాటు అద్దెలు కూడా పెరిగాయి.ఇదీ చదివారా? హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. రిజిస్ట్రేషన్లు రయ్.. రయ్..ఈ ఏడాది హైదరాబాద్లో అద్దె గృహాలకు డిమాండ్ 22 శాతం మేర పెరిగింది. సరఫరా 2.1 శాతం క్షీణించగా.. సగటు రెంట్లు 4.5 శాతం మేర పెరిగాయి. అద్దెల మార్కెట్లో డిమాండ్, సప్లై వాటా 50, 39 శాతంగా ఉన్నాయి.గచ్చిబౌలి, కొండాపూర్లో అత్యధికంగా అద్దెలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కార్యాలయాలు, ఉపాధి కేంద్రాలకు సమీపంలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)తో మెరుగైన కనెక్టివిటీ కారణం. 55 శాతం మంది అద్దెదారులు రూ.10 వేలు నుంచి రూ.20 వేలు నెలవారీ అద్దెలకు కోసం వెతుకుతున్నారు. 1000 చదరపు అడుగుల నుంచి 1,500 చ.అ. విస్తీర్ణంలో ఉన్న గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. -
కో-వర్కింగ్ సెంటర్ల జోరు.. హైదరాబాద్లో 26,000 సీట్లు
కో-వర్కింగ్ సెంటర్ ఆపరేటర్లు ఎనిమిది ప్రధాన నగరాల్లో గత ఏడాది రికార్డు స్థాయిలో 2.24 లక్షల సీట్లను అద్దెకు తీసుకున్నారు. 2023తో పోలిస్తే 43.6 శాతం వృద్ధి నమోదైంది. కార్పొరేట్ సంస్థల నుండి మేనేజ్డ్ ఆఫీస్ స్పేస్కు డిమాండ్ పెరగడం ఇందుకు కారణమని రియల్టీ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది.ఈ నివేదిక ప్రకారం.. 2023లో బెంగళూరు, ఢిల్లీ–ఎన్సీఆర్, పుణే, కోల్కత, ముంబై, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్లలో మొత్తం 1.56 లక్షల డెస్క్లను కో–వర్కింగ్ లేదా ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ ఆపరేటర్లు కార్పొరేట్ సంస్థలకు అందించాయి. గత ఏడాది ఆపరేటర్లు బెంగళూరులో 64,000, పుణే 38,000, ఢిల్లీ ఎన్సీఆర్ 38,000, ముంబై 28,000, హైదరాబాద్ 26,000, చెన్నైలో 25,000 సీట్లను అద్దెకు ఇచ్చాయి. కోల్కత, అహ్మదాబాద్ కేవలం చెరో 1,900 సీట్లకే పరిమితం అయ్యాయి. బలమైన వృద్ధి నమోదు.. ఆఫీస్ స్పేస్ ఆపరేటర్లు తమ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడానికి రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ప్రాపర్టీ యజమానుల నుండి అద్దెకు ఆఫీసు స్థలాన్ని తీసుకుని.. మౌలిక సదుపాయాలతో కార్పొరేట్స్, నిపుణులు, వ్యక్తులకు వర్క్స్పేస్ను అందిస్తాయి. ‘సంప్రదాయ కార్యాలయాల ఏర్పాటుతోపాటు మేనేజ్డ్ వర్క్స్పేస్ను అంతర్జాతీయ సంస్థలు లీజుకు తీసుకుంటున్నాయి.దీంతో ఫ్లెక్సిబుల్ వర్క్స్పేస్కు డిమాండ్ ప్రస్తుత సంవత్సరంతోపాటు రాబోయే కాలంలో బలమైన వృద్ధి నమోదు చేయనుంది. దీంతో మేనేజ్డ్ స్పేస్ ఆపరేటర్ల ద్వారా ప్రధాన నగరాల్లోని గ్రేడ్ ఏ/ఏ+ ఆస్తులను మరింతగా పెంచుతుంది’ అని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఫ్లెక్స్ విభాగం హెడ్ రమిత అరోరా తెలిపారు. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. రిజిస్ట్రేషన్లు రయ్.. రయ్..
హైదరాబాద్లో ఖరీదైన ఇళ్ల అమ్మకాలు నిరంతరం పెరుగుతున్నాయి. మొత్తం ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల సంఖ్య స్థిరంగా ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ అయిన ఇళ్ల మొత్తం విలువ గత సంవత్సరంతో పోలిస్తే 5 శాతం పెరిగింది. అయితే అధిక సరఫరా కారణంగా అపార్ట్మెంట్ అమ్మకాల్లో మాత్రం మార్కెట్ ఫ్లాట్ వృద్ధిని నమోదు చేసింది. మొత్తం 5,444 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ మేరకు రియల్ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఓ నివేదిక విడుదల చేసింది.హైదరాబాద్ నివాస మార్కెట్ ప్రధానంగా హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి అనే నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉంది. ప్రాథమిక, ద్వితీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ల నుండి కూడా లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. "రిజిస్ట్రేషన్లలో రూ. 50 లక్షల లోపు ప్రాపర్టీలు ఆధిపత్యం చెలాయించాయి. కానీ ప్రీమియమైజేషన్ వైపు బలమైన మార్పు కనిపించింది. 2025 జనవరిలో రూ. 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్ల ధర 12% పెరిగింది. ఇది అధిక విలువ కలిగిన ప్రాపర్టీలకు పెరుగుతున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది" అని నైట్ ఫ్రాంక్ పేర్కొంది.హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ అయిన ప్రాపర్టీలలో ఎక్కువ భాగం 1,000 నుండి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్నవే. రిజిస్ట్రేషన్లన్నింటిలో వీటి వాటా 69%. 2024 జనవరిలో రిజిస్ట్రేషన్ అయిన 13%తో పోలిస్తే 2000 చదరపు అడుగుల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న యూనిట్లు మొత్తం రిజిస్ట్రేషన్లలో 14% వాటా కలిగి ఉన్నాయని నైట్ ఫ్రాంక్ వివరించింది.మేడ్చల్-మల్కాజ్గిరి టాప్నైట్ ఫ్రాంక్ ప్రకారం.. జిల్లా స్థాయిలో చూస్తే 45% ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లతో మేడ్చల్-మల్కాజ్గిరి అగ్ర స్థానంలో ఉండగా 41% రిజిస్ట్రేషన్లతో రంగారెడ్డి జిల్లా ఆ తర్వాత స్థానంలో ఉంది. హైదరాబాద్ జిల్లా మొత్తం రిజిస్ట్రేషన్లలో మిగిలిన 14% వాటాను అందించింది. అమ్ముడుపోయిన నివాస ఆస్తుల సగటు ధర 2025 జనవరిలో 3% పెరుగుదలను చూసింది. జిల్లాలలో మేడ్చల్-మల్కాజ్గిరి అత్యధికంగా 11% పెరుగుదలను చూసిందని రిజిస్ట్రేషన్ డేటా చెబుతోంది.గృహ కొనుగోలుదారులు పెద్ద పరిమాణంలో, ఉన్నతమైన సౌకర్యాలను అందించే ఖరీదైన ఆస్తులను కూడా కొనుగోలు చేశారు. 2025 జనవరిలో జరిగిన మొదటి ఐదు డీల్స్లో 3,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ, రూ. 5.5 కోట్ల కంటే పైబడి విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ లావాదేవీలలో మూడు పశ్చిమ హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ కాగా, రెండు రిజిస్ట్రేషన్లు సెంట్రల్ హైదరాబాద్లో జరిగాయి. -
హైదరాబాద్లో టూరిస్ట్ ఇళ్లు.. సకల వసతులు
సాక్షి, సిటీబ్యూరో: వేసవి సెలవుల్లో సేద తీరడానికి పలు కుటుంబాలు పర్యాటక ప్రదేశాలకు వెళ్తుంటాయి. కానీ, అక్కడి వసతి ఎలా? హోటళ్లలో ఉండాలంటే.. కాస్త ఖర్చు ఎక్కువే. నచ్చిన వంట వండుకోలేం. సరైన ఆతిథ్యాన్ని స్వీకరించలేం. వాళ్లు పెట్టినవాటిలో నుంచి ఎంపిక చేసుకొని తినాలి. దీనికి పరిష్కారం చూపించేవే పర్యాటక విడిదులు. స్టార్ హోటళ్లను తలదన్నేలా ఆధునిక వసతులు అందించడమే ఈ టూరిస్ట్ ఇళ్ల ప్రత్యేకత.ఇళ్లు.. హోం స్టేలుగా! భాగ్యనగరం అంటేనే చక్కని ఆతిథ్యానికి చిరునామా. అందుకే విదేశీ పర్యాటకులు ఇక్కడి ఆత్మీయత, ఆతిథ్యానికి ముగ్ధులవుతుంటారు. ఈ ఆనందాన్ని ద్విగుణీకృతం చేసేందుకు పర్యాటక శాఖ హోం స్టే పథకం ప్రవేశపెట్టింది. ఇదే తరహాలో పలు ప్రైవేట్ సంస్థలూ సేవలందిస్తున్నాయి. నగరంలోని గృహ యజమానులు తమ ఇళ్లను అద్దెకు ఇచ్చే బదులుగా ఇలా హోంస్టే సంస్థలతో ఒప్పందం చేసుకుంటున్నారు. ఆకట్టుకునేలా గృహాలను తీర్చిదిద్ది, అన్ని సౌకర్యాలు కల్పించి, పర్యాటకులకు తాత్కాలికంగా కిరాయికి ఇస్తున్నారు.అన్ని రకాల వసతులు.. ఎయిర్ బీఎన్బీ, వీఆర్బో, బుకింగ్.కామ్, మేక్ మై ట్రిప్, ట్రావెల్ స్టేషన్, హోమ్ టుగో వంటి సంస్థలు హోం స్టే సేవలను అందిస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాలతోపాటు పర్యాటక ప్రాంతాలు, బీచ్లు, తీర్థయాత్రలు అన్నిచోట్లా టూరిస్ట్ ఇళ్లు అందుబాటులో ఉన్నాయి. కిచెన్, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి అన్ని రకాల వసతులు ఈ హోం స్టేలలో ఉంటాయి. సౌకర్యాలను బట్టి అద్దె ఒక రాత్రికి రూ.5 వేల నుంచి ఉంటాయి.ఆయా పర్యాటక ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న హోం స్టేల వివరాలను సంస్థలు తమ వెబ్సైట్లలో పొందుపరుస్తున్నాయి. వారికి అనువైన వసతిని వెతుక్కోవచ్చు. ఇందులోనే ధరలను కూడా నిర్ణయిస్తారు. వండి వడ్డించే భోజనం వివరాలు కూడా ఉంటాయి. విమానాశ్రయం నుంచి నేరుగా బస చేసే ఇంటికి వచ్చి ఆతిథ్యాన్ని అందుకోవచ్చు. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొత్త రికార్డు..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం కొత్త రికార్డులను సృష్టిస్తోంది. కోకాపేట, మోకిల పరిధిలో రికార్డుస్థాయిలో భూములు అమ్ముడుపోగా.. తాజాగా లగ్జరీ గృహాల ధరల వృద్ధిలో మరో మైలురాయిని చేరుకుంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో విలాసవంతమైన ఇళ్ల ధరలు 42 శాతం మేర పెరిగాయి. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే ఈ ప్రీమియం యూనిట్ల రేట్లు గత ఐదేళ్లలో హైదరాబాద్లో రికార్డు స్థాయిలో పెరిగాయని అనరాక్ గ్రూప్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. నివేదికలోని పలు కీలకాంశాలివే..హైదరాబాద్లో 2018లో విలాసవంతమైన ఇళ్ల ధరలు చదరపు అడుగుకు రూ.7,450గా ఉండగా.. 2024 నాటికి ఏకంగా రూ.10,580కి పెరిగాయి. ఇదే సమయంలో బెంగళూరు, ముంబై నగరాల్లో లగ్జరీ ఇళ్ల ధరలు 27 శాతం మేర పెరిగాయి. కోవిడ్ అనంతరం లగ్జరీ గృహాల సరఫరా, డిమాండ్ పెరగడమే ఈ వృద్ధికి కారణమని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరి తెలిపారు. 2018లో బెంగళూరులో ప్రీమియం ఇళ్ల ధరలు చ.అ.కు రూ.10,210గా ఉండగా.. ఇప్పుడది రూ.12,970కి పెరిగింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో రూ.23,119 నుంచి రూ.29,260కి చేరింది.దేశంలోని సగటు..2018 నుంచి 2024 నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సరసమైన గృహాల విలువలు సగటున 15 శాతం మేర పెరిగితే.. విలాసవంతమైన గృహాల విలువ 24 శాతం వృద్ధి నమోదైంది. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల ధరలు చ.అ.కు సగటున 2018లో 12,400గా ఉండగా.. 2024 నాటికి 15,350కి పెరిగాయి.అందుబాటు గృహాల్లో 15 శాతం.. ఏడు ప్రధాన నగరాల్లో రూ.40 లక్షలలోపు ధర ఉండే సరసమైన గృహాల విలువలు 15 శాతం మేర పెరిగాయి. 2018లో సగటు ధర చ.అ.కు రూ.3,750గా ఉండగా.. ఇప్పుడది రూ.4,310కి పెరిగింది. అఫర్డబుల్ కేటగిరీలో ఎన్సీఆర్లో అత్యధికంగా 19 శాతం మేర ధరలు పెరిగాయి. ఈ విభాగపు ధరల వృద్ధిలో హైదరాబాద్ది రెండో స్థానం. ఐదేళ్లలో మన నగరంలో 16 శాతం మేర ధరలు పెరిగాయి. అందుబాటు గృహాల ప్రారంభ ధర చ.అ.కు రూ.4 వేలుగా ఉంది. ఐదేళ్ల కాలంలో టాప్–7 నగరాల్లో రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర మధ్య ధర ఉండే మధ్య తరగతి విభాగంలోని ఇళ్ల విలువల్లో 18 శాతం మేర వృద్ధి చెందాయి. 2018లో సగటు ధర చ.అ.కు రూ. 6,050లుగా ఉండగా.. ఇప్పుడది రూ.7,120కి పెరిగింది. ఈ విభాగంలోనూ అత్యధికంగా 23 శాతం ధరల వృద్ధి హైదరాబాద్లోనే నమోదైంది. మన నగరంలో మిడ్సైజ్ గృహాల ప్రారంభ ధర చ.అ.కు రూ.5,780గా ఉంది. -
ఇల్లు ఎప్పుడు కొనాలి?
మార్కెట్ పడిపోతున్నప్పుడు కొనడం, పెరుగుతున్నప్పుడు అమ్మటమే లాభసాటి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ చేసే పని! ఇదే సూత్రం రియల్ ఎస్టేట్కూ వర్తిస్తుంది. ప్రతికూల సమయంలో కొనుగోలు చేస్తే రేటు కలిసి వస్తుంది. మార్కెట్ బాగున్నప్పుడు విక్రయిస్తే రాబడి రెండింతలవుతుంది. హోమ్ బయ్యర్ నుంచి ఇన్వెస్టర్గా ఎదగాలంటే చేయాల్సిందిదే. స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు మాదిరిగానే స్థిరాస్తి రంగానికి కూడా కండీషన్స్ అప్లయి అనేది ఉంటుంది. ప్రాంతం ఎంపిక మొదలు డెవలపర్ ట్రాక్ రికార్డ్, ఆర్థిక పరిస్థితి, ప్రాంతం అభివృద్ధి అవకాశాలు, ప్రాజెక్ట్లోని వసతులు వరకు అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని కొనుగోలు చేయాలి. అప్పుడే పెట్టుబడికి తగిన ప్రతిఫలాలను అందుకోవడం సాధ్యం. –సాక్షి, సిటీబ్యూరోఅభివృద్ధిని ముందుగానే అంచనా వేయాలి.. ప్రాంతం అభివృద్ధిని ముందుగా అంచనా వేయగలిగితే దాని ప్రతిఫలాలను వంద శాతం ఆస్వాదించవచ్చు. మెరుగైన మౌలిక వసతులు, భద్రత, కనెక్టివిటీ, నిత్యావసరాలు, అందుబాటు ధర వంటి వాటిని సమీక్షించుకొని ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆయా అంశాల్లో బాచుపల్లి, దుండిగల్, మల్లంపేట, బౌరంపేట ప్రాంతాలు హాట్ డెస్టినేషన్. ఎందుకంటే.. 200 అడుగుల రోడ్లు, ఫ్లై ఓవర్, స్కైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పైగా ఓఆర్ఆర్ దుండిగల్ ఎగ్జిట్ మాత్రమే కాకుండా మల్లంపేట వద్ద మరో ఎగ్జిట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటితో ఇతర జిల్లా కేంద్రాలు, పలు ప్రాంతాలతో కనెక్టివిటీ పెరిగింది. కనెక్టివిటీ ఇబ్బందుల కారణంగా గతంలో ఆఫీసుకు దగ్గరలో ఉండే ప్రాజెక్ట్లలో కొనుగోలు చేసేందుకే కస్టమర్లు మొగ్గు చూపేవాళ్లు. కానీ, ఇప్పుడు మెట్రో రైలు, ఫ్లైఓవర్లు, స్కైవేలు, ఓఆర్ఆర్, లింక్ రోడ్లు వంటి వాటితో కనెక్టివిటీ మెరుగైంది. దీంతో ప్రధాన నగరంలోని బడ్జెట్తోనే 5–6 కి.మీ. దూరమైనా సరే పెద్ద సైజు అపార్ట్మెంట్ లేదా విల్లా కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.భూమి ధర మేరకే నిర్ణయం... శివారు ప్రాంతాల్లో భూముల క్రయవిక్రయాలు నిలిచిపోయాయంటే దానర్థం రేట్లు పడిపోయాయని కాదు. గత 3–4 ఏళ్లుగా స్థలాల ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రస్తుతం స్థిరంగా నిలిచిపోయాయి. భూమి ధరను బట్టే ఓపెన్ ప్లాట్, అపార్ట్మెంట్, విల్లా వంటి ప్రాజెక్ట్ చేయాలని బిల్డర్లు నిర్ణయించుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త డెవలపర్ ల్యాండ్ కొని, ప్రాజెక్ట్ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ ఉన్నా గతంలో స్థల సమీకరణ చేసిన డెవలపర్లు నిర్మించే ప్రాజెక్ట్లతో పోలిస్తే ధరలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు బాచుపల్లిలో రెండేళ్ల క్రితం ఎకరం రూ.12–13 కోట్లకు కొనుగోలు చేసిన ప్రణీత్ గ్రూప్ అపార్ట్మెంట్ను నిర్మిస్తోంది. చదరపు అడుగుకు రూ.5,500 చొప్పున విక్రయిస్తోంది. ఇప్పుడిదే ప్రాంతంలో ఎకరం రూ.20 కోట్లు–25 కోట్లుగా ఉంది. ఇలాంటి చోట కొత్త బిల్డర్ నిర్మించే ప్రాజెక్ట్లో ధర చదరపు అడుగుకు రూ.7 వేలు ఉంటే తప్ప గిట్టుబాటుకాని పరిస్థితి. దీంతో ధర తక్కువగా ఉన్న చోట కొనుగోలు చేయడమే కస్టమర్లకు లాభం. పైగా తుది దశకు చేరుకున్న పాత ప్రాజెక్ట్ల్లో కొనుగోలు చేస్తే గృహ ప్రవేశం చేసేయొచ్చు.రేపటి అవసరాన్ని గుర్తించి కొనాలి.. ప్రతికూల సమయంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనడమే ఉత్తమమని చాలామంది సలహా ఇస్తుంటారు. కానీ, ఒడిదుడుకుల మార్కెట్లో అమ్మకాలు లేకుండా నిర్మాణాన్ని పూర్తి చేసే సామర్థ్యం ఉందా అని ఆలోచించాలి. అందుకే ప్రతికూలంలోనూ బిల్డర్ ట్రాక్ రికార్డ్, ఆర్థిక సామర్థ్యం, గతంలో డెలివరీ చేసిన ప్రాజెక్ట్లు వంటి అంశాలను చూసి రెండేళ్లలో పూర్తయ్యే ప్రాజెక్ట్లో కొనుగోలు చేసినా నష్టం ఏమీ ఉండదు. పైగా రెడీ టు ఆక్యుపైతో పోలిస్తే వీటిల్లో ధర తక్కువగా ఉంటుంది. విస్తీర్ణం, ఇతరత్రా అంశాలపై బిల్డర్తో బేరసారాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. భవిష్యత్తు అవసరాన్ని గుర్తించి వినియోగదారులు గృహాలను కొనుగోలు చేయాలి. చాలామంది ప్రస్తుతం సంపాదించే ఆదాయానికి పరిమితమై నిర్ణయం తీసుకుంటారు. కానీ, రేపటి రోజున ఆదాయ సామర్థ్యం పెరగొచ్చు. పెద్ద ఇళ్లు అవసరం ఏర్పడొచ్చు. అందుకే ఈ రోజు 2 బీహెచ్కే కొనేచోట 2–3 ఏళ్లలో డెలివరీ చేసే ప్రాజెక్ట్లో 2.5 బీహెచ్కే కొనుగోలు చేయడం ఉత్తమం. పైగా నిర్మాణంలో ఉంటుంది కాబట్టి 2 బీహెచ్కే ధరకే వస్తుంది. -
క్విప్ కింగ్ రియల్ ఎస్టేట్..
క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్విప్) మార్గంలో ఇన్వెస్టర్లకు ఈక్విటీ షేర్లను విక్రయించడం ద్వారా రియల్ ఎస్టేట్ డెవలపర్లు గతేడాది రూ. 22,320 కోట్లు సమీకరించాయి. 2024లో అన్ని రంగాలు కలిసి 99 క్విప్ ఇష్యూల ద్వారా మొత్తం రూ. 1,41,482 కోట్లు సమకూర్చుకున్నాయి. ఇందులో రియల్ ఎస్టేట్ రంగం అగ్రస్థానంలో నిల్చింది. 8 డెవలపర్లు, 1 రీట్ (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్) కలిసి రూ. 22,320 కోట్లు సమీకరించాయి.క్విప్ ద్వారా వచ్చిన మొత్తం నిధుల్లో ఇది 16 శాతం. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మార్కెట్లలో హెచ్చుతగ్గులు నెలకొన్నప్పటికీ క్యాపిటల్ మార్కెట్లు పటిష్టంగానే ఉన్నాయని, కంపెనీలు భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి చెప్పారు.రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి అవకాశాలపై సంస్థాగత ఇన్వెస్టర్లు అత్యంత బుల్లిష్గా ఉన్నట్లు వివరించారు. వివిధ రంగాలు 2020లో ఆల్టైం గరిష్ట స్థాయిలో క్విప్ మార్గంలో రూ. 80,816 కోట్లు సమీకరించాయి. 2024 గణాంకాలు దాని కన్నా 75 శాతం అధికం కావడం గమనార్హం. 2025లో క్విప్ ఫండింగ్ మిశ్రమంగా ఉండొచ్చని పురి తెలిపారు.నివేదిక ప్రకారం .. గోద్రెజ్ ప్రాపర్టీస్ రూ. 6,000 కోట్లు, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ రూ. 5,000 కోట్లు, బ్రూక్ఫీల్డ్ ఇండియా రీట్ రూ. 3,500 కోట్లు, మ్యాక్రోటెక్ డెవలపర్స్ రూ. 3,300 కోట్లు, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ రూ. 1,500 కోట్లు సమీకరించాయి. -
ఇవన్నీ ఉంటేనే ఇల్లు కొంటాం..
నివాస సముదాయాల్లో అన్ని వసతులు ఉండాల్సిందే.. ఆ విషయంలో మాత్రం అస్సలు తగ్గేదే లే అంటున్నారు కొనుగోలుదారులు.. గతంలో కమ్యూనిటీలలో జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి నాలుగైదు వసతులు ఉంటే సరిపోయేది. కానీ.. ప్రస్తుతం భవిష్యత్తు అవసరాలతో పాటు అభిరుచులకు తగ్గట్టుగా వసతులు ఉండాల్సిందే. ఇంటి నుంచి పని కోసం కో–వర్కింగ్ స్పేస్, ఆన్లైన్ క్లాస్ల కోసం డిజిటల్ క్లాస్ రూమ్ నుంచి మొదలుపెడితే.. టెర్రస్, క్లబ్హౌస్పై సౌర విద్యుత్ ఏర్పాట్లు, ఔట్డోర్ జిమ్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్, హోమ్ థియేటర్, ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు, పెట్పార్క్, గోల్ఫ్కోర్స్ వరకూ అన్ని ఆధునిక వసతులు కావాలని గృహ కొనుగోలుదారులు భావిస్తున్నారు. –సాక్షి, సిటీబ్యూరోపెట్ పార్క్, స్పా..జంతు ప్రేమికుల కోసం కూడా డెవలపర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నివాస సముదాయాల్లో వసతుల జాబితాలో పెట్ పార్కులు కూడా చేరిపోయాయి. గేటెడ్ కమ్యూనిటీలలో కొనుగోలుదారులు పెంచుకునే పెంపుడు జంతువుల కోసం పెట్పార్క్, క్లబ్హౌస్లో పెట్ స్పాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు పెంపుడు జంతువుల ఆహార ఉత్పత్తులు, శిక్షకులు, వ్యాయామ ఉపకరణాలు వంటివి ఆయా ప్రాజెక్ట్లలో అందుబాటులో ఉంటాయి.సోలార్, హోమ్ గార్డెనింగ్ సొంతిల్లు కొనుగోలు చేసే క్రమంలో గేటెడ్ కమ్యూనిటీలో కామన్ ఏరియాలు ఎంత వరకు ఉన్నాయో అడిగి మరీ తెలుసుకుంటున్నారు. గతంలో కామన్ ఎలివేటర్, కామన్ కారిడార్, గ్యారేజ్, స్టేర్కేస్ ఉండేవి ఇప్పుడు వాటిని ప్రైవేట్ కావాలని అడుగుతున్నారు. ఇంట్లో సొంత అవసరాల కోసం కమ్యూనిటీ గార్డెన్ను ఏర్పాటు చేస్తున్నారు. చిన్నపాటి స్థలంలో ఆకు కూరలు, కూరగాయలు పండించుకునేలా వర్టికల్ గార్డెనింగ్, బాల్కనీలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వారాంతాల్లో కమ్యూనిటీ వాసులతో ఆహ్లాదంగా గడిపేందుకు ఔట్డోర్ కిచెన్, డైనింగ్ ఏరియా ఏర్పాటు చేస్తున్నారు. టెర్రస్, క్లబ్హౌస్పై సౌర విద్యుత్ ఏర్పాటు చేస్తున్నారు. వీధి దీపాలు, ఇతరత్రా అవసరాల కోసం ఈ విద్యుత్నే వినియోగిస్తున్నారు. దీంతో నివాసిత సంఘానికి కరెంట్ బిల్లు భారం తగ్గుతుంది.ఈవీ చార్జింగ్ స్టేషన్లుపెట్రోల్, డీజిల్ వంటి వాహనాలతో పర్యావరణం కాలుష్యం అవుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. వాహన కొనుగోళ్లపై రాయితీలు అందిస్తుండటంతో పాటు చార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. డెవలపర్లు కూడా నివాస, వాణిజ్య సముదాయాల నిర్మాణంలో ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. నగరానికి చెందిన మైహోమ్, రాజపుష్ప, ప్రణీత్ గ్రూప్, పౌలోమి ఎస్టేట్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వసతులను కల్పిస్తున్నారు.వసతులు ఇలా..నివాస సముదాయంలో ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు, ప్రతి పార్కింగ్ ప్లేస్ వద్ద చార్జింగ్ పెట్టుకునేందుకు వీలుగా పాయింట్లను ఇస్తున్నారు. జంతు ప్రేమికుల కోసం నివాస సముదాయంలోనే పెట్పార్క్, క్లబ్హౌస్లో పెట్ స్పాలను ఏర్పాటు చేస్తున్నారు. పెంపుడు జంతువుల ఆహార ఉత్పత్తులు, శిక్షకులు, వ్యాయామ ఉపకరణాలు వంటివి ఆయా ప్రాజెక్ట్లలో అందుబాటులో ఉంటాయి.రిచ్మ్యాన్ గేమ్గా పిలిచే గోల్ఫ్ కూడా వసతుల జాబితాలో చేరిపోయింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో జిమ్ చేయాలని అందరూ భావిస్తున్నారు. దీంతో ఇండోర్ జిమ్లు కాస్త ఔట్డోర్లో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఓజోనైజ్డ్ మెడిటేషన్ హాల్, ఉష్ణోగ్రత నియంత్రణ స్విమ్మింగ్ పూల్స్ వచ్చేశాయి.వైద్య అవసరాల కోసం మినీ ఆస్పత్రి, మెడికల్ షాపు, అంబులెన్స్, పారా మెడికల్ సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.గతంలో మాదిరిగా సినిమాలకు వెళ్లే పరిస్థితి లేకపోవటంతో నివాస సముదాయంలోనే మల్టీప్లెక్స్ అనుభూతి కలిగేలా స్క్రీన్లు, సౌండ్ సిస్టమ్స్ను డెవలపర్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా డిజిటల్ క్లాస్ రూమ్స్ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. -
హైదరాబాద్లో షాపింగ్ మాల్స్.. రిటైల్ స్పేస్కు గిరాకీ
గతేడాది హైదరాబాద్ స్థిరాస్తి రంగానికి (Real estate) బాగానే కలిసొచ్చింది. నివాస, వాణిజ్య, కార్యాలయ విభాగాలతో పాటు రిటైల్ రంగం కూడా మెరుగైన పనితీరునే కనబర్చింది. షాపింగ్ మాల్స్లో రిటైల్ స్పేస్ క్రమంగా పెరుగుతోంది. గతేడాది నగరంలో 18 లక్షల రిటైల్ స్పేస్ లావాదేవీలు జరిగాయని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోబంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, కోకాపేట వంటి సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్(సీబీడీ) ప్రాంతాల్లో 2 లక్షల చ.అ.లావాదేవీలు జరిగాయని తెలిపింది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలో కొత్తగా 59.48 లక్షల చ.అ.విస్తీర్ణంలో 11 షాపింగ్ మాల్స్ అందుబాటులోకి వచ్చాయి.సిటీలో మూడు మాల్స్ గతేడాది అత్యధికంగా హైదరాబాద్లో మూడు మాల్స్ అందుబాటులోకి వచ్చాయి. పుణె, చెన్నైలో రెండేసి, ముంబై, ఢిల్లీ, ఎన్సీఆర్, బెంగళూరు, అహ్మదాబాద్లో ఒక్కోటి చొప్పున అందుబాటులోకి వచ్చాయి. కోల్కత్తాలో ఒక్క మాల్ కార్యరూపంలోకి రాలేదు. 2023లో 15 లక్షల చ.అ.షాపింగ్ మాల్ స్పేస్ మార్కెట్లోకి రాగా.. ఈ ఏడాది నిర్మాణంలో ఉన్న మరో 20 లక్షల చ.అ. స్థలం అందుబాటులోకి రానుంది.నల్లగండ్ల, నానక్రాంగూడ, కొంపల్లి వంటి ప్రాంతాలలో కొత్త మాల్స్ నిర్మాణంలో ఉన్నాయి. నల్లగండ్లలో అపర్ణా సంస్థ 7 లక్షల చ.అ. విస్తీర్ణంలో మాల్ అండ్ మల్టీప్లెక్స్ను నిర్మిస్తోంది. కూకట్పల్లి 16.60 లక్షల చ.అ. లేక్షోర్ మాల్స్ శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటున్నాయి.5–25 శాతం పెరిగిన అద్దెలు నగరంలో ఫ్యాషన్, హైపర్ మార్కెట్, ఫుడ్ అండ్ బేవరేజ్ వంటి విభాగాల పనితీరు బాగుండటంతో రిటైల్ స్పేస్కు గిరాకీ పెరిగింది. ప్రధానంగా కొంపల్లి, కోకాపేట, ఏఎస్రావ్ నగర్, నల్లగండ్ల, వనస్థలిపురం, కొండాపూర్, మణికొండ వంటి ప్రాంతాల్లో ఎక్కువ కార్యకలాపాలు జరిగాయి. అమీర్పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొంపల్లి, కొత్తపేట, మాదాపూర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో అద్దెలు పెరిగాయి. గత కొన్ని త్రైమాసికాలలో ఆయా ప్రాంతాలలో అద్దెలు 5–25 శాతం మేర వృద్ధి చెందాయి. -
హైదరాబాద్లో ఇళ్లకు డిమాండ్..
దేశీయ రియల్ ఎస్టేట్ రంగం వృద్ధిలో హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాలు కీలకంగా మారాయి. ఈ ఏడాది గృహ విక్రయాలు ఈ మూడు నగరాల్లోనే అధిక స్థాయిలో జరిగాయి. తక్కువ వడ్డీ రేట్లు, స్థిరమైన ప్రాపర్టీ ధరలే ఇందుకు కారణమని హౌసింగ్. కామ్ ఇండియన్ రెసిడెన్షియల్ ఇండెక్స్ ఫర్ ఆన్లైన్ సెర్చ్ (ఐఆర్ఐఎస్) అంచనా వేసింది. రియల్టీ స్టేక్ హోల్డర్లు, ప్రభుత్వం, బ్యాంక్లు, ప్రాపర్టీ ఇన్వెస్టర్లు అందరూ టర్న్ ఎరౌంట్ మార్కెట్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపింది. అది గతేడాది సానుకూల దృక్పథంతో మొదలైందని తెలిపింది. గతేడాది వృద్ధే ఈ ఏడాది కూడా కొనసాగుతోంది. – సాక్షి, సిటీబ్యూరో ప్రధాన నగరంలో ఇరుకు ఇళ్ల మధ్య ఉండటం బదులు శివారు ప్రాంతాలు, హరిత భవనాలు, విస్తీర్ణం ఎక్కువగా ఉండే ఫ్లాట్లు, విల్లాలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ద్వితీయ శ్రేణి పట్టణాలలోని ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడింది. గతంలో సూరత్, జైపూర్, పాట్నా, మోహాలీ, లక్నో, కోయంబత్తూరు వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలు ఆన్లైన్లో ప్రాపర్టీల సెర్చ్లో గణనీయమైన వృద్ధి నమోదు చేశాయని తెలిపింది. ఆయా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో గృహ కొనుగోళ్లకు ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొంది. నోయిడాలోని నోయిడా ఎక్స్టెన్షన్, ముంబైలోని మీరా రోడ్ ఈస్ట్, అంధేరి వెస్ట్, బోరివలీ వెస్ట్, బెంగళూరులోని వైట్ఫీల్డ్ ప్రాంతాలు ఈ ఏడాది దేశీయ నివాస సముదాయ మార్కెట్ను లీడ్ చేస్తాయని తెలిపింది.మారిన అభిరుచులు.. ఆన్లైన్లో రూ.2 కోట్లకు పైబడిన ప్రాపర్టీల శోధన ఒకట్నిర శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. గతంలో ప్రాపర్టీ కొనాలంటే ధర, వసతులు ప్రధాన అంశాలుగా ఉండేవి. ప్రస్తుతం గృహ కొనుగోలుదారుల ఎంపికలో మార్పులొచ్చాయని హౌసింగ్.కామ్ కన్జ్యూమర్ సెంటిమెంట్ ఔట్లుక్ తెలిపింది. 3 బీహెచ్కే, ఆపై పడక గదుల గృహాల్లో 2023తో పోలిస్తే 2024లో 15 శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. అదే సమయంలో గతేడాది పెద్ద సైజు ప్లాట్లలో 42 శాతం పెరుగుదల కనిపించిందని తెలిపింది.అద్దెలకు గిరాకీ.. ప్రాజెక్ట్ల ఆలస్యం, దివాళా డెవలపర్లు వంటి ప్రతికూల వాతావరణంలోనూ నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లో ప్రాపర్టీ కోసం సెర్చ్ గణనీయంగా పెరిగింది. నోయిడా ఎక్స్టెన్షన్ ప్రాంతం ఆన్లైన్ ప్రాపర్టీ సెర్చింగ్లో ప్రథమ స్థానంలో నిలిచింది. ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ఈ రీజియన్లో పలు మౌలిక సదుపాయల ప్రాజెక్ట్లను ప్రకటించడం, ధరలు అందుబాటులో ఉండటం వంటివి ఈ రీజియన్లో ప్రాపర్టీల వృద్ధికి కారణమని తెలిపింది. ఐటీ, ఫార్మా కంపెనీలు ఉద్యోగ నియామకాలను పెంచడంతో ముంబై, బెంగళూరు, ఢిల్లీ మార్కెట్లలో అద్దెలకు గిరాకీ పెరిగిందని పేర్కొంది. -
హైదరాబాద్లో ఇల్లు కొంటున్నారా..?
సొంతిల్లు ప్రతి ఒక్కరి జీవిత కల. పైసా పైసా కూడబెట్టి, గృహ రుణంతో సొంతింటి కలను నెరవేర్చుకుంటారు. గృహ కొనుగోలు (Buying House)నిర్ణయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా, నిర్లక్ష్యం వహించినా కష్టార్జితమంతా వృథా అవుతుంది. మరీ ముఖ్యంగా తొలిసారి గృహ కొనుగోలుదారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రాపర్టీని (Property) కొనుగోలు చేయడం అంటే కేవలం ఆర్థికపరమైన నిర్ణయం మాత్రమే కాదు.. జీవనశైలి ఎంపిక. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే అందబాటు ధరలు, అభివృద్ధి అవకాశాలు, దీర్ఘకాలిక పెట్టుబడికి సరైనది హైదరాబాద్. నగరంలో గృహ కొనుగోలుదారులు ఈ పంచ సూత్రాలు పాటిస్తే సొంతింటిని దక్కించుకోవచ్చు. – సాక్షి, సిటీబ్యూరోబంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోకాపేట ప్రాంతాలు విలాసవంతమైన జీవనం, పెట్టుబడుల వృద్ధిలో అగ్రస్థానంలో ఉన్నాయి. వృద్ధి సమతుల్యత, అందుబాటు ధరల కోసమైతే నార్సింగి, కొల్లూరు, రాజేంద్రనగర్, తెల్లాపూర్ వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను ఎంపిక చేసుకోవచ్చు. ఆయా ప్రాంతాలు ఆధునిక మౌలిక సదుపాయాలు, ఐటీ కారిడార్లకు సమీపంలో ఉండటంతో నివాసం ఉండేందుకు, పెట్టుబడులకు రెండింటికీ అనువైన ప్రాంతాలు.లగ్జరీ ప్రాపర్టీల కొనుగోలుదారులు ఇంటి ధరను మాత్రమే కాదు రిజిస్ట్రేషన్ ఫీజులు, ప్రీమియం వసతులు, హైఎండ్ ఇంటీరియర్ కూడా పరిగణలోకి తీసుకోవాలి. విలాసవంతమైన జీవితాన్ని విలువైనదిగా చేసే నిర్వహణ చార్జీలు కూడా ఉంటాయని గమనించాలి.విలాసవంతమైన ఇల్లు, దాని నిర్మాణ శైలి గురించి తెలుసుకోవాలి. లగ్జరీ ప్రాపర్టీల అనుభూతిని పొందాలంటే డెవలపర్ కీలకపాత్ర పోషిస్తారు. వారి ఉన్నత నైపుణ్యం, సకాలంలో డెలివరీ, వినూత్నమైన డిజైన్లు, ఎలివేషన్లకు ప్రసిద్ధి చెందిన బిల్డర్ ప్రాజెక్ట్లను ఎంచుకోవడం ఉత్తమం. నిర్మాణంలో నాణ్యత, ప్రత్యేకతలు అందించే రెరా ఆమోదిత ప్రాజెక్ట్లకు ప్రాధాన్యత ఇవ్వాలి.ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో స్టేషన్లు, రాబోయే మౌలిక సదుపాయాల ప్రాంతాలలో స్థలాలు, గృహాలను కొనుగోలు చేస్తే తక్కువ కాలంలో విలువ రెట్టింపు అవుతుంది. ప్రైవసీ, ప్రశాంతతను కోరుకునే వారికీ ఈ ప్రాంతాలే బెటర్. రవాణా సదుపాయాలు, కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలైతే రాకపోకలు సౌలభ్యంగా ఉంటుంది.ఎంపిక చేసిన ప్రాపర్టీకి సంబంధించి న్యాయ నిపుణులు, ప్రొఫెషనల్స్ సలహాలు తీసుకోవాలి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ వంటి ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు గురించి ఆరా తీయాలి. -
బడ్జెట్ 2025-26: రియల్ ఎస్టేట్కు బూస్ట్!
దేశంలో రియల్ఎస్టేట్ రంగానికి వైభవం తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది.మధ్యతరగతి గృహ కొనుగోలుదారులకు స్థోమతను పెంచేలా రూ. 12 లక్షలు.. స్టాండర్డ్ డిడక్షన్లతో కలుపుకొంటే రూ.12.75 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇది ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతుందని, హౌసింగ్ డిమాండ్, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులను పెంచుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు."కొత్త పన్ను నిర్మాణం మధ్యతరగతి పన్నులను గణనీయంగా తగ్గిస్తుంది. వారి చేతుల్లో ఎక్కువ డబ్బు ఉండేలా చేస్తుంది. గృహ వినియోగం, పొదుపు, పెట్టుబడిని పెంచుతుంది" అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. రియల్ ఎస్టేట్కు తాజా బడ్జెట్లో ఎలాంటి నిర్ణయాలు ప్రకటించారో ఇప్పుడు చూద్దాం..నిలిచిపోయిన ప్రాజెక్టుల్లో లక్ష ఇళ్లను పూర్తి చేసేందుకు స్వామి (SWAMIH ) ఫండ్-2ను ప్రభుత్వం ప్రకటించింది. 2025 బడ్జెట్లో అదనంగా లక్ష ఇళ్ల నిర్మాణం కోసం కొత్త స్వామి ఫండ్ 2కి రూ.15,000 కోట్ల కేటాయింపును ప్రకటిచింది. దీంతో చాలా కాలంగా ఆలస్యమవుతున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లలో ఇళ్లు కొనుగోలుచేసిన వేలాది మందికి ఉపశమనం కలగనుంది.స్వామి స్కీమ్ కింద ప్రస్తుతం ఉన్న 50,000 నివాస యూనిట్లు పూర్తికావడం, మరో 40,000 పైప్లైన్లో ఉండటం సంక్షోభాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వ గట్టి ప్రయత్నాన్ని తెలియజేస్తోందని నిపుణులు చెబుతున్నారు.అద్దె ఆదాయంపై వార్షిక టీడీఎస్ పరిమితిని ప్రస్తుత రూ. 2.4 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అద్దెపై వార్షిక టీడీఎస్ పరిమితిని రూ.2.40 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంచడం వలన చిన్న పన్ను చెల్లింపుదారులు, భూస్వాములు కూడా గణనీయంగా ప్రయోజనం పొందుతారని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు.ఇన్వెస్టర్లు ఇప్పుడు కేవలం ఒకటి కాకుండా రెండు స్వీయ-ఆక్రమిత ఆస్తులకు నిల్ వాల్యుయేషన్ను క్లెయిమ్ చేయవచ్చు. ఇది రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ పెట్టుబడికి అనుకూలమైన చర్య.పట్టణ మౌలిక సదుపాయాలను పెంచేందుకు ప్రభుత్వం రూ.1 లక్ష కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్ను ఏర్పాటు చేస్తుంది. అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు వల్ల మౌలిక సదుపాయాలు పెరుగుతాయని, రియల్ ఎస్టేట్ సామర్థ్యం పుంజుకుంటుందని, నగరాలు ప్రధాన వృద్ధి కేంద్రాలుగా మారుతాయని నిపుణులు తెలిపారు.ప్రపంచ వ్యాపార కేంద్రంగా భారతదేశ స్థానాన్ని బలోపేతం చేస్తూ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCC)ను ఆకర్షించడానికి, ప్రోత్సహించడానికి రాష్ట్రాలకు సహాయపడే జాతీయ మార్గదర్శక ఫ్రేమ్వర్క్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. పెరుగుతున్న దేశ ఆర్థిక ప్రభావం దృష్ట్యా ఈ చర్య బెంగళూరు, ముంబై, హైదరాబాద్, పూణె, చెన్నై వంటి ప్రధాన మెట్రోలతో పాటు టైర్-II, టైర్-III నగరాల్లో ఆఫీస్ స్పేస్ డిమాండ్ను పెంచుతుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025-26 ముఖ్యాంశాలు -
ఏఐతో రియల్ ఎస్టేట్ సేవలు..
దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ (real estate) రంగంలో సుమారు 5 లక్షల మంది ఉంటే, అందులో కేవలం 15 శాతం మంది మాత్రమే సాంకేతికతను, ఆన్లైన్ టూల్స్ను వినియోగిస్తున్నారని ఇటీవల పలు సర్వేలు వెల్లడించాయి. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యవస్థ అనేది దళారులపై ఆధారపడి ముందుకుసాగుతోంది. - సాక్షి, సిటీబ్యూరోఇందులో 80 నుంచి 85 శాతం వరకూ దళారులు మాన్యువల్ ప్రక్రియలపై ఆధారపడుతున్నారని రియల్ రంగ అధ్యయనాలు తెలిపాయి. ఈ తరుణంలో హైదరాబాద్ వంటి మహానగరాల్లో బ్రోకర్లు, గృహ కొనుగోలుదారులు, వ్యాపారులు ప్రధాన ఆస్తి పోర్టల్ను వినియోగించడం ఉత్తమమని మ్యాజిక్ బ్రిక్స్ సీఈఓ సుధీర్ పాయ్ తెలిపారు. దేశవ్యాప్త నెట్వర్క్తో.. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన సాంకేతిక మౌలిక సదుపాయాలు, విస్తారమైన అమ్మకాల నెట్వర్క్తో, కన్సల్టెంట్లకు సీఆర్ఎమ్ పరిష్కారంగా ‘రీడ్ ప్రో’ (READPRO)ను ఆవిష్కరించామని సుధీర్ తెలిపారు. కృత్రిమ మేధ ఆధారిత సీఆర్ఎమ్ వేదికగా ఈ ‘రీడ్ ప్రో’ రెండు వందలకు పైగా నగరాల్లో 95 వేల యాక్టివ్ బ్రోకర్ లైసెన్స్లను సాధించింది. రియల్–టైమ్ సేల్స్ ట్రాకింగ్, లీడ్ ఇంటిగ్రేషన్, పెర్ఫార్మెన్స్ అనలిటిక్స్ వంటి ఫీచర్లతో ఈ రీడ్ ప్రో డేటా, లీడ్ మేనేజ్మెంట్, లైవ్ టీమ్ అప్డేట్లు, రియల్–టైమ్ పెర్ఫార్మెన్స్ ట్రాకింగ్, పెర్ఫార్మెన్స్ డాష్బోర్డ్లు, కంపాస్ వంటి అధునాతన సాధనాల ద్వారా లీడ్ జనరేషన్లో 200% పెరుగుదలకు సహాయపడిందన్నారు.రెండు కోట్ల కస్టమర్లకు.. ఈ ఆస్తి పోర్టల్లో వెరిఫైడ్ లీడ్స్, సైట్ సందర్శనలతో పాటు.. రెండు కోట్లకు పైగా కస్టమర్లు, 15 లక్షల జాబితాలతో మ్యాజిక్ బ్రిక్స్ రియల్ ఎస్టేట్ పరిశ్రమకు నాయకత్వం వహిస్తోంది. గృహ కొనుగోలు దారులు, దళారుల సామర్థ్యాలను, అవకాశాలను మెరుగు పరచడంలో ‘రీడ్ ప్రో’ వంటి సేవలు అత్యవసరమని రీడ్ ప్రో వ్యవస్థాపకుడు అక్షయ్ సేథ్ పేర్కొన్నారు. -
అభిషేక్ బచ్చన్కు ఎస్బీఐ నుంచి భారీ ఆదాయం
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తనయుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు, నిర్మాతగా ప్రసిద్ధి చెందారు. గురు, ధూమ్, దోస్తానా, హ్యాపీ న్యూ ఇయర్, బంటీ ఔర్ బబ్లీ వంటి చిత్రాలలో తన నటనతో గుర్తింపు పొందారు. అభిషేక్ నటనతో పాటు వ్యాపార రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. క్రీడలలోనూ చురుకుగా పాల్గొనే ఆయనకు వివిధ క్రీడా జట్లలో వాటాలు ఉన్నాయి.ఎస్బీఐ నుంచి నెలకు రూ.18లక్షలుదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అభిషేక్ బచ్చన్కు ప్రతి నెలా రూ. 18 లక్షలు చెల్లిస్తుందని మీకు తెలుసా? అభిషేక్ బచ్చన్, విశ్వ సుందరి, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ను పెళ్లాడిన విషయం తెలిసిందే. ఈ దంపతులకు ఆరాధ్య బచ్చన్ అనే ఒక కుమార్తె ఉంది.రూ.280 కోట్ల నెట్వర్త్ ఉన్న అభిషేక్ బచ్చన్ తమ విలాసవంతమైన జుహు బంగ్లా, అమ్ము, వాట్స్ భవనాల్లోని గ్రౌండ్ ఫ్లోర్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో లాభదాయకమైన లీజు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఎస్బీఐ ఈ స్థలాన్ని 15 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది. ఇది బచ్చన్ కుటుంబానికి గణనీయమైన అద్దె ఆదాయాన్ని అందిస్తుంది.రియల్ ఎస్టేట్ ఒప్పందాలను బయటపెట్టే జాప్కీ (Zapkey.com) అనే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. బచ్చన్ కుటుంబం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య 15 సంవత్సరాల లీజు ఒప్పందం కుదిరింది. అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం బ్యాంకు నుంచి నెలవారీ అద్దె రూ.18.9 లక్షలు తీసుకుంటున్నారు. ఈ అద్దె కాలానుగుణంగా పెరుగుదలకు సంబంధించిన క్లాజులు కూడా లీజులో పత్రాల్లో ఉన్నాయి. అద్దె ఐదేళ్ల తర్వాత రూ. 23.6 లక్షలకు, పదేళ్ల తర్వాత రూ. 29.5 లక్షలకు పెరుగుతుంది. నివేదికల ప్రకారం.. బచ్చన్ కుటుంబ నివాసమైన ‘జల్సా’కు సమీపంలో ఉన్న భవనంలో 3,150 చదరపు అడుగుల స్థలాన్నే ఎస్బీఐ లీజుకు తీసుకుంది. -
లగ్జరీ ఇళ్లల్లో కొత్త ట్రెండ్..
ఆధునికత, విలాసవంతమైన జీవనశైలికి యువ గృహ కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. లగ్జరీ కాదు.. అంతకుమించి కోరుకుంటున్నారు. దీంతో 4 వేల నుంచి 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. ఇవి విశాలంగా ఉంటున్నాయే తప్ప సేవలపరంగా యువ కస్టమర్లలో అసంతృప్తి ఉంది. వీరిని సంతృప్తి పరిచేలా యువ డెవలపర్లు బ్రాండెడ్ హౌసింగ్లను నిర్మిస్తున్నారు. అగ్రశ్రేణి ఆతిథ్య సంస్థలతో కలిసి బ్రాండెడ్ రెసిడెన్సీ ప్రాజెక్ట్లను చేపడుతున్నారు. ఇప్పటివరకు ముంబై, బెంగళూరు, గుర్గావ్ వంటి నగరాలకే పరిమితమైన ఈ తరహా ప్రాజెక్ట్లు హైదరాబాద్లోనూ నిర్మితమవుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోమారియట్, తాజ్, లీలా, ఇంటర్కాంటినెంటల్ వంటి అగ్రశ్రేణి ఆతిథ్య సంస్థలతో కలిసి విలాసవంతమైన అపార్ట్మెంట్లను నిర్మించడమే ఈ రెసిడెన్సీల ప్రత్యేకత. డిజైనింగ్, ఆర్కిటెక్చర్, ఎలివేషన్స్, విస్తీర్ణం, వసతులు, సేవలు.. అన్నీ టాప్ క్లాస్గా ఉంటాయి. బ్రాండెడ్ రెసిడెన్సీ అంటే కేవలం ప్రాపర్టీని కొనుగోలు చేయడం కాదు.. అంతర్జాతీయ జీవనశైలి అనుభూతిని పొందడం.బ్రాండెడ్ రెసిడెన్సీలు అంటే? స్టార్ హోటల్ సేవలు, అపార్ట్మెంట్ కలిపి ఉండే మిశ్రమ వినియోగ ప్రాజెక్ట్లనే బ్రాండెడ్ రెసిడెన్సీలు అంటారు. ఇందులో లేఔట్ స్థలంలో నివాసాల కోసం ప్రత్యేకంగా ఒక టవర్ ఉంటుంది. పక్కనే మరో టవర్లో హోటల్ ఉంటుంది. నివాసితులకు సేవలన్నీ ఆతిథ్య సంస్థలే అందిస్తాయి. కొన్ని ప్రాజెక్ట్లలో దిగువ అంతస్తుల్లో హోటల్, ఎగువ అంతస్తులో నివాస యూనిట్లు ఉంటాయి. నివాసితులకు ప్రత్యేక యాప్ ఉంటుంది. దాంట్లో నుంచి హోటల్లోని ఫుడ్, స్పా, సెలూన్ వంటి ఆర్డర్ చేయవచ్చు. వాళ్లే అపార్ట్మెంట్కు వచ్చి సర్వీస్ చేస్తారు. బ్రాండెడ్ గృహాల నిర్వహణ మొత్తం ఆతిథ్య సంస్థల ఆపరేటర్లే చూసుకుంటారు. హెచ్ఎన్ఐ, ప్రవాసులు కస్టమర్లు.. కొనుగోలుదారులకు అంతర్జాతీయ జీవనశైలి, డెవలపర్లకు అధిక రాబడి అందించే ప్రీమియం బ్రాండెడ్ గృహాలకు ఆదరణ పెరిగింది. ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్లు బ్రాండెడ్ రెసిడెన్సీల విభాగంలోకి ఎంట్రీ ఇచ్చాయి. దీంతో హెచ్ఎన్ఐలు(హై నెట్వర్త్ ఇండివిడ్యు వల్స్), ప్రవాసులు, బిజినెస్ టైకూన్లు, సినీ, క్రీడా సెలబ్రిటీలు డిజైనర్ హోమ్స్కు ఆసక్తి చూపిస్తున్నారు. బ్రాండెడ్ రెసిడెన్సీ కస్టమర్లు రెండు, లేదా మూడో గృహ కొనుగోలుదారులై ఉంటారు. దీంతో వీరికి ఆధునిక వసతులే అధిక ప్రాధాన్యత. ఎవరెక్కువ, వినూత్న, విలాసవంతమైన వసతులు అందిస్తారో అందులో కొనుగోలు చేస్తారు.ఎక్కడ వస్తున్నాయంటే.. దేశంలోని విలాసవంతమైన మార్కెట్లో హైదరాబాద్ వాటా 10 శాతంగా ఉంది. మన దేశంలో బ్రాండెడ్ హౌసెస్ 2,900 యూనిట్లు ఉండగా.. గ్లోబల్ మార్కెట్లో 3 శాతం వాటాగా నమోదైంది. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు ఉన్న ప్రాంతాల్లోనే ఈ తరహా ప్రాజెక్ట్లకు డిమాండ్ ఉంటుంది. కోకాపేట, నియోపొలిస్, హైటెక్సిటీ, రాయదుర్గం, నానక్రాంగూడ, పుప్పాలగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రీమియం ప్రాంతాల్లో ఈ తరహా నిర్మాణాలు వస్తున్నాయి. శ్రీఆదిత్య హోమ్స్, బ్రిగేడ్ వంటి పలు నిర్మాణ సంస్థలు బ్రాండెడ్ రెసిడెన్సీలను నిర్మిస్తున్నాయి. వీటి ధరలు రూ.6–8 కోట్ల నుంచి ప్రారంభమవుతాయి.ప్రైవసీ, భద్రత.. కరోనా తర్వాత విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు పెరుగుతూ ఉన్నాయి. మిగతా విభాగంలోని ఇళ్లపై ప్రభావం పడినా.. అత్యంత లగ్జరీ ఆవాసాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఐటీ, ఫార్మా, తయారీ రంగంతో పాటు కాస్మోపాలిటన్ కల్చర్తో నగరంలో లగ్జరీకి మించి జీవనశైలి కోరుకుంటున్నారు. సెవెన్ స్టార్ హోటల్లో మాదిరి గ్రాండ్ లాంజ్, డబుల్ హైట్ బాల్కనీ, హోమ్ ఆటోమేషన్, స్కై వ్యూ, స్పా, స్కై లాంజ్, మినీ థియేటర్, రూఫ్టాప్ డైనింగ్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, ప్రైవసీ, భద్రత అన్ని ఉంటాయి.ఎక్కువ గ్రీనరీ, ఓపెన్ స్పేస్.. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ డిజైన్, పర్యావరణహితంగా ఉండేలా అంతర్జాతీయ డిజైనర్లతో తోడ్పాటు అందిస్తారు. ఈ ప్రాజెక్ట్లలో విశాలమైన బాల్కనీ, గ్రీనరీ, ఓపెన్ స్పేస్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీంతో సాధారణ గృహాలతో పోలిస్తే రెసిడెన్సీలలో 5–7 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయి. వేర్వేరుగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ద్వారాలు, ప్రతి అపార్ట్మెంట్కు ప్రత్యేక మార్గం ఉంటుంది. అపార్ట్మెంట్ ఫేసింగ్ ఎదురెదురుగా ఉండదు. దీంతో పూర్తిగా ప్రైవసీ ఉంటుంది. ఒకేరకమైన అభిరుచులు, జీవన శైలి కోరుకునే నివాసితులు ఒకే గేటెడ్ కమ్యూనిటీలో ఉండటంతో వీరి మధ్య సామాజిక సంబంధాలు బలపడతాయి. -
రియల్ ఎస్టేట్ సంస్థలు.. అదిరే లాభాలు!
రియల్ ఎస్టేట్ సంస్థ మాక్రోటెక్ డెవలపర్స్ (Macrotech Developers)ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో రూ.944 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. ఇళ్లకు డిమాండ్ పెరగడం ఇందుకు ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది. గతేడాది ఇదే క్యూ3లో ఆర్జించిన రూ. 503 కోట్లతో పోలిస్తే ఇది 88 శాతం అధికంగా ఉంది. మొత్తం ఆదాయం రూ.2,958 కోట్ల నుంచి రూ.4,146 కోట్లకు చేరింది.‘‘డిసెంబర్ క్వార్టర్లో మొత్తం రూ.4,510 కోట్ల ముందస్తు విక్రయాలు జరిగాయి. ప్రీ–సేల్స్ రూ.4వేల కోట్ల పైగా జరగడం ఇది వరుసగా నాలుగో త్రైమాసికం. ఎన్నడూ లేని విధంగా ఈ క్యూ3లో మొత్తం రూ.4,290 కోట్ల వసూళ్లు జరిగాయి’’ అని కంపెనీ ఎండీ–సీఈవో అభిషేక్ లోధా తెలిపారు.– 2024–25 ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో నికరలాభం రూ.883 కోట్ల నుంచి రూ.1,842 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ.6,385 కోట్ల నుంచి రూ.9,749 కోట్లకు చేరింది. ఇదే కాలంలో ముందస్తు విక్రయాలు 25% వృద్ది చెంది రూ.12,820 కోట్లు జరిగాయి. మైండ్స్పేస్ రీట్ లాభం అప్రియల్టీ రంగ సంస్థ మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ (Mindspace REIT) ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. నికర నిర్వహణ ఆదాయం(ఎన్వోఐ) 8 శాతం పుంజుకుని రూ. 522 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 473 కోట్లు మాత్రమే ఆర్జించింది.యూనిట్ హోల్డర్లకు ఒక్కో యూనిట్కు రూ. 5.32 చొప్పున పంపిణీ చేయనున్నట్లు కంపెనీ తెలియజేసింది. తద్వారా రూ. 315.5 కోట్లు వెచ్చించనుంది. దీనిలో ఒక్కో యూనిట్కు రూ. 3.2 చొప్పున డివిడెండ్ కలసి ఉంది. ఇందుకు రూ. 190 కోట్లు చెల్లించనుంది. ఈ కాలంలో 1.7 మిలియన్ చదరపు అడుగులను లీజ్ కిచ్చినట్లు కంపెనీ సీఈవో రమేష్ నాయిర్ పేర్కొన్నారు.కాగా.. సస్టెయిన్ ప్రాపర్టీస్లో 100 శాతం వాటా కొనుగోలుకి ఆఫర్ ఇచ్చినట్లు మైండ్స్పేస్ రీట్ వెల్లడించింది. హైదరాబాద్ రాయ్దుర్గ్లోని కామర్జోన్ ఐటీ పార్క్లో 1.8 మిలియన్ చదరపు అడుగులను సస్టెయిన్ కలిగి ఉన్నట్లు తెలియజేసింది. బీఎస్ఈలో మైండ్స్పేస్ రీట్ షేరు 0.6 శాతం క్షీణించి రూ. 375 వద్ద ముగిసింది. -
షారుఖ్ ఖాన్కి రూ.9 కోట్లు వెనక్కి..
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్కి (Sharukh Khan) మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి ఇస్తోంది. సముద్రానికి ఎదురుగా ఉన్న తన బంగ్లా 'మన్నత్' (Mannat) లీజును యాజమాన్యంగా మార్చుకునేందుకు అధికంగా చెల్లించిన రూ.9 కోట్లను మహారాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వనుంది.2019లో షారుఖ్ ఖాన్, ఆయన భార్య గౌరీ ఖాన్ బాంద్రాలోని పురాతన ఆస్తిని 'క్లాస్ 1 పూర్తి యాజమాన్యం'గా మార్చారని, దాని కోసం కొంత ప్రీమియం ప్రభుత్వానికి చెల్లించారని రెసిడెంట్ సబర్బన్ కలెక్టర్ సతీష్ బాగల్ తెలిపారు. ప్రీమియం లెక్కింపులో ట్యాబులేషన్ లోపాన్ని గుర్తించిన తర్వాత, షారుఖ్ ఖాన్ దంపతులు ఇటీవల మంజూరైన రీఫండ్ కోసం రెవెన్యూ అథారిటీకి దరఖాస్తు చేసుకున్నారని ఆయన వివరించారు.మన్నత్ భవనం లీజ్ కన్వర్షన్ కోసం షారుఖ్ ఖాన్ దంపతులు మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ. 25 కోట్లకు పైగా ప్రీమియం చెల్లించినట్లు మీడియా కథనాలు వచ్చాయి. అయితే ఇది ఎంత వరకూ వాస్తవం అన్నది అధికారులు ధ్రువీకరించలేదు.ఇంద్ర భవనమే!బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నివసించే రూ. 200 కోట్ల విలువైన బంగ్లా మన్నత్ ఇంద్ర భవనాన్ని తలపిస్తుంది. ఈ భవనాన్ని చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా వస్తుంటారు. ఈ ఇంటి ఇంటీరియర్ డిజైనింగ్ అంతా గౌరీ ఖాన్ (Gouri Khan) స్వయంగా చేయించారు.ఈ బంగ్లాను షారుఖ్ ఖాన్ 2001లో కొనుగోలు చేశారు. ఆ తర్వాత దానికి మన్నత్ అని పేరు పెట్టారు. గౌరీ ఖాన్ తన భర్త షారుఖ్ కోసం ఇంట్లో ప్రత్యేకంగా ఓ కార్నర్ ని తయారు చేయించారు. అక్కడ షారుఖ్ ఖాన్ కి వచ్చిన అవార్డులన్నింటినీ ప్రత్యేకంగా అలంకరించారు. మన్నత్ చాలా విశాలంగా ఉంటుంది. ఇంట్లో భారీ లగ్జరీ హోమ్ థియేటర్ ఉంది. ఆరు అంతస్తుల ఈ ఇంట్లో లిఫ్ట్ వ్యవస్థ కూడా ఉంది. అంతేకాదు, ఇంటి మెట్లను చెక్కతో తయారు చేయగా, ఇంటి అలంకరణ కోసం చెక్కతో పాటు వివిధ దేశాల నుంచి ప్రత్యేకమైన ఇంటీరియర్ ని ఉపయోగించారు.మన్నత్ గురించి మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ బంగ్లాను మొదట సల్మాన్ ఖాన్ కొనాలనుకున్నారట. కానీ సల్మాన్ తండ్రి సలీం ఇంత పెద్ద బంగ్లా మనకు అవసరం లేదని చెప్పడంతో ఆయన ఆ ఆలోచనను విరమించుకున్నారు. -
హైదరాబాద్లో ఇళ్ల విక్రయాలు డీలా..
హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు (Housing sales) 2024లో నెమ్మదించాయి. 2023తో పోలిస్తే 25 శాతం తక్కువగా, 61,722 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2023లో విక్రయాలు 82,350 యూనిట్లుగా ఉండడం గమనార్హం. అంతేకాదు, దేశవ్యాప్తంగా తొమ్మిది నగరాల్లోనూ 2024లో ఇళ్ల అమ్మకాలు 9% మేర క్షీణించాయి. 4.71 లక్షల యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి.2023లో ఈ తొమ్మిది నగరాల్లో అమ్మకాలు 5,14,820 యూనిట్లుగా ఉన్నాయి. ఈ మేరకు ప్రాప్ ఈక్విటీ (PropEquity) సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. డిమాండ్తోపాటు, తాజా సరఫరా తగ్గడం ఇందుకు కారణాలుగా పేర్కొంది. తొమ్మిది నగరాల్లో కొత్త ఇళ్ల సరఫరా (విక్రయానికి అందుబాటులోకి రావడం) 15 శాతం తగ్గి 4,11,022 యూనిట్లుగా ఉంది.పట్టణాల వారీగా విక్రయాలు.. బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు 2024లో 9 % క్షీణించి 60,506 యూనిట్లుగా నమోదు.చెన్నైలో 11% తక్కువగా 19,212 యూనిట్లు అమ్ముడయ్యాయి. కోల్కతాలో అమ్మకాలు 2023తో పోల్చితే కేవ లం 1% తగ్గి 19,212 యూనిట్లకు పరిమితం.ముంబైలో అమ్మకాలు 6% క్షీణించాయి. 50,140 యూనిట్ల విక్రయాలు జరిగాయి.నవీ ముంబైలో మాత్రం విక్రయాలు 16 శాతం పెరిగి 33,870 యూనిట్లుగా ఉన్నాయి.పుణెలో ఇళ్ల విక్రయాలు 13 శాతం తగ్గి 92,643 యూనిట్లుగా ఉన్నాయి. థానేలో 5% తక్కువగా 90,288 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.ఢిల్లీ ఎన్సీఆర్లో గతేడాది ఇళ్ల అమ్మకాలు 5% వృద్ధితో 43,923 యూనిట్లుగా నమోదయ్యాయి.“2024లో హౌసింగ్ సప్లై,సేల్స్ తగ్గడానికి అధిక బేస్ ఎఫెక్ట్ కారణం. 2023లో ఇది అత్యంత గరిష్టానికి చేరింది. గణాంకాలను విశ్లేషణ ప్రకారం సేల్స్ పడిపోయినప్పటికీ, 2024లో సరఫరా-స్వీకరణ నిష్పత్తి 2023లో ఉన్నట్టుగానే ఉంది. ఇది రియల్ ఎస్టేట్ రంగం ప్రాథమికాలు బలంగా, ఆరోగ్యంగా ఉన్నాయని సూచిస్తున్నాయి” అని ప్రాప్ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజా అన్నారు. -
దక్షిణ హైదరాబాద్కు 'రియల్' అభివృద్ధి!
నీళ్లు ఎత్తు నుంచి పల్లెం వైపునకు ప్రవహించినట్లే.. రోడ్లు, విద్యుత్, రవాణా వంటి మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్న చోటుకే అభివృద్ధి విస్తరిస్తుంది. ఐటీ ఆఫీస్ స్పేస్, నివాస, వాణిజ్య సముదాయాలతో కిక్కిరిసిపోయిన పశ్చిమ హైదరాబాద్ అభివృద్ధి (Real estate Development) క్రమంగా దక్షిణ హైదరాబాద్ (South Hyderabad) మార్గంలో శరవేగంగా విస్తరిస్తోంది. విమానాశ్రయంతో పాటు ఔటర్ మీదుగా వెస్ట్తో సౌత్ అనుసంధానమై ఉండటం ఈ ప్రాంతం మెయిన్ అడ్వాంటేజ్. దీనికి తోడు ప్రభుత్వం కూడా ఏఐ, ఫ్యూచర్ సిటీలను దక్షిణ హైదరాబాద్లోనే అభివృద్ధి చేయనుంది. పుష్కలంగా భూముల లభ్యత, అందుబాటు ధర, మెరుగైన రవాణా, మౌలిక వసతులు ఉండటంతో దక్షిణ ప్రాంతంలో రియల్ మార్కెట్ అభివృద్ధి చెందే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని శ్రీఆదిత్య హోమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదిత్యరెడ్డి అన్నారు. ‘సాక్షి రియల్టీ’ ఇంటర్వ్యూలోని మరిన్ని అంశాలివీ.. – సాక్షి, సిటీబ్యూరోనగరం నాలుగు వైపులా అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రధాన నగరంలో మూసీ సుందరీకరణ, శివార్లలో ఫ్యూచర్ సిటీ, మెట్రో రెండో దశ విస్తరణ వంటి బృహత్తర ప్రాజెక్ట్లకు శ్రీకారం చుట్టింది. ఆయా ప్రాజెక్ట్లతో గృహ కొనుగోలుదారుల భావోద్వేగాలు మారుతాయి. జనసాంద్రత, రద్దీ ప్రాంతాల్లో ఉండే బదులు ప్రశాంతత కోసం దూరప్రాంతాలను ఎంచుకుంటారు. ఇదే సమయంలో మెట్రో విస్తరణతో కనెక్టివిటీ పెరగడంతో పాటు ఆయా మార్గాలలో రియల్ ఎస్టేట్ అవకాశాలు ఏర్పడతాయి. ఉదాహరణకు ఓల్డ్సిటీ, చాంద్రయాణగుట్ట మీదుగా శంషాబాద్కు మెట్రో అనుసంధానంతో ఆయా ప్రాంతాల్లో కూడా గేటెడ్ కమ్యూనిటీలు జోరుగా వస్తాయి. దీంతో బడ్జెట్ హోమ్స్తో సామాన్యుడి సొంతింటి కల మరింత చేరువవుతుంది.ట్రిపుల్ ఆర్తో ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్ అభివృద్ధి దశను మార్చేసిన ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల 30 కి.మీ. దూరంలో రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ ఆర్)ను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఔటర్ లోపల ప్రాంతం ఇప్పటికే రద్దీ అయిపోయింది. ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్కు, ట్రిపుల్ ఆర్ నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఇలా వేర్వేరు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలు, మాస్టర్ ప్లాన్లను చేపట్టాలి. ట్రిపుల్ ఆర్తో నగరంతోనే కాదు రాష్ట్రంలోని ఇతర జిల్లాలూ అనుసంధానమై ఉంటాయి. కనెక్టివిటీ పెరిగి రవాణా మెరుగవుతుంది. దీంతో ప్రధాన నగరంపై ఒత్తిడి తగ్గడంతో పాటు శివారు, పట్టణ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ట్రిపుల్ ఆర్ ప్రాంతాల్లో కేవలం నివాస, వాణిజ్య సముదాయాలే కాదు గిడ్డంగులు, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.సిటీ వ్యూతో బాల్కనీ కల్చర్.. లగ్జరీ హౌసింగ్ అంటే కనిష్టంగా 2,500 చ.అ. విస్తీర్ణం ఉండాలి. అయితే విస్తీర్ణం మాత్రమే లగ్జరీని నిర్వచించలేదు. బెంగళూరు, ముంబైలలో 3 వేల చ.అ. ఫ్లాట్లనే ఉబర్ లగ్జరీ అపార్ట్మెంట్గా పరిగణిస్తారు. కానీ, మన దగ్గర 6, 8, 10 వేల చ.అ.ల్లో కూడా అపార్ట్మెంట్లు కూడా నిర్మిస్తున్నారు. అయినా కూడా ఇతర మెట్రోలతో పోలిస్తే మన దగ్గరే ధరలు తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు.. హైదరాబాద్లో 5–10 వేల చ.అ. ఫ్లాట్ రూ.6–12 కోట్లలో ఉంటే.. బెంగళూరు, ముంబై నగరాల్లో 3 వేల చ.అ. ఫ్లాటే రూ.12 కోట్లు ఉంటుంది. పుష్కలమైన స్థలం, వాస్తు, కాస్మోపాలిటన్ కల్చర్, ఆహ్లాదకరమైన వాతావరణం, జీవనశైలి బాగుండటం వల్లే హైదరాబాద్లో లగ్జరీ ప్రాజెక్ట్లు వస్తున్నాయి. మన నగరంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి విశాలమైన, డబుల్ హైట్ బాల్కనీలను వాడుతుంటారు. అదే ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో వాతావరణం పొల్యూషన్ కాబట్టి బాల్కనీలు అంతగా ఇష్టపడరు.ఇంటి అవసరం పెరిగింది గతంలో ఇండిపెండెంట్ హౌస్లు ఎక్కువగా ఉండేవి. అందుకే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అబిడ్స్ వంటి పాత నగరంలో ఈ తరహా ఇళ్లే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలు, లగ్జరీ కమ్యూనిటీ లివింగ్ల ప్రాధాన్యం పెరిగింది. దీంతో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట వంటి ఖరీదైన ప్రాంతాల్లో నివాసానికి ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా తర్వాత ఇంటి ప్రాముఖ్యత, అవసరం తెలిసొచ్చింది. వర్క్ ఫ్రం హోమ్తో 50–60 శాతం సమయం ఇంట్లోనే గడపాల్సిన పరిస్థితి. ఇప్పుడున్న పిల్లలు సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్నారు. బయటకు వెళ్లి ఆడుకోవాలంటే ట్రాఫిక్ ఇబ్బందులు, భద్రత ఉండదు. అదే గేటెడ్ కమ్యూనిటీల్లో ఇబ్బందులు ఉండవు. కమ్యూనిటీ లివింగ్లలో గృహిణులు, పిల్లలకు రక్షణ ఉండటంతో పాటు ఒకే తరహా అభిరుచులు ఉన్నవాళ్లు ఒకే కమ్యూనిటీలో ఉంటారు. అలాగే ఒకే ప్రాంతంలో అన్ని వసతులు అందుబాటులో ఉంటాయి. దీంతో టెన్షన్ ఉండదు. చోరీలు, ప్రమాదాల వంటి భయం ఉండదు. సీసీటీవీ కెమెరాలు, 24/7 సెక్యూరిటీ సిబ్బందితో భద్రత ఉంటుంది. నిరంతరం నిర్వహణతో కమ్యూనిటీ పరిశుభ్రంగా, హైజీన్గా ఉంటుంది. థర్డ్ పార్టీ మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా వంద శాతం పవర్ బ్యాకప్, నిరంతరం నీటి సరఫరా ఉంటుంది. -
రియల్ ఎస్టేట్: ఫ్లాటా.. ప్లాటా.. ఏది బెటర్?
ఓపెన్ ప్లాట్ (Open plot), అపార్ట్మెంట్, కమర్షియల్ స్పేస్, రిటైల్.. ఇలా రియల్ ఎస్టేట్ (Real estate) పెట్టుబడులకు సాధనాలు అనేకం. కానీ, ఓపెన్ ప్లాట్లలో ఇన్వెస్ట్మెంట్స్తోనే అధిక రాబడి వస్తుందని హౌసింగ్.కామ్ సర్వే తెలిపింది. 2015 నుంచి దేశంలోని 8 ప్రధాన నగరాలలో ప్రతి సంవత్సరం స్థలాల ధరలలో 7 శాతం వృద్ధి నమోదవుతుంటే.. అపార్ట్మెంట్లలో మాత్రం 2 శాతమే పెరుగుదల కనిపిస్తోందని పేర్కొంది. హైదరాబాద్ (Hyderabad), చెన్నై, బెంగళూరు నగరాల్లోని నివాస ప్లాట్లకే ఎక్కువ డిమాండ్ ఉందని వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోపెద్ద నగరాలలో స్థలాల కొరత ఎక్కువగా ఉండటం, విపరీతమైన పోటీ నేపథ్యంలో ఉన్న కొద్ది స్థలాల ధరలు ఎక్కువగా ఉన్నాయని హౌసింగ్.కామ్ గ్రూప్ సీఈఓ ధ్రువ్ అగర్వాలా తెలిపారు. అందుకే ప్రధాన నగరాలలో పరిమిత స్థాయిలోని స్థలాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఓపెన్ ప్లాట్లకు, ఇండిపెండెంగ్ గృహాలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో పెద్ద నగరాల్లోని శివారు ప్రాంతాలలో బడా డెవలపర్లు ఓపెన్ ప్లాట్ వెంచర్లు, వ్యక్తిగత గృహాల ప్రాజెక్ట్లను చేపడుతున్నారని, దీంతో డిమాండ్ పునఃప్రారంభమైందని చెప్పారు.కరోనాతో పెరిగిన డిమాండ్.. ఢిల్లీ–ఎన్సీఆర్, పుణే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కత్తా, అహ్మదాబాద్ ఎనిమిది ప్రధాన నగరాల్లో సాధారణంగా కొనుగోలుదారులు ఓపెన్ ప్లాట్ల కంటే ఫ్లాట్లు కొనుగోలు చేయడానికే ఇష్టపడతారు. ఎందుకంటే భద్రతతో పాటు పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్, క్లబ్హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ వంటి కామన్ వసతులు ఉంటాయని అపార్ట్మెంట్ కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. కానీ, కరోనా నేపథ్యంలో కామన్ వసతులు వినియోగం, అపార్ట్మెంట్లలో ఎక్కువ జనాభా వంటివి శ్రేయస్కరం కాదనే అభిప్రాయం ఏర్పడింది. దీంతో సొంతంగా స్థలం కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకోవడమో లేక వ్యక్తిగత గృహాలను కొనుగోలు చేసేందుకే కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు.13–21 శాతం పెరిగిన ధరలు..హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో పాటూ గుర్గావ్లోని కొన్ని ప్రధాన ప్రాంతాలలోని నివాస స్థలాలకు డిమాండ్ పెరుగుతుందని హౌసింగ్.కామ్ రీసెర్చ్ హెడ్ అంకితా సూద్ తెలిపారు. 2018 నుంచి ఆయా నగరాలలోని ఓపెన్ ప్లాట్లలో రెండంకెల వృద్ధి నమోదవుతుందని పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాలలో ఈ నగరాల్లో భూముల ధరలు 13–21 శాతం మేర పెరిగాయని చెప్పారు. ఇదే నగరాల్లోని అపార్ట్మెంట్ల ధరలలో మాత్రం 2–6 శాతం మేర వృద్ధి ఉందని తెలిపారు. కరోనా నేపథ్యంలో కొనుగోలుదారుల అభిరుచుల్లో వచ్చిన మార్పులు, పాలసీలతో రాబోయే త్రైమాసికంలో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు.ఇదీ చదవండి: జూబ్లీహిల్స్లో బంగ్లా.. రూ.40 కోట్లు!హైదరాబాద్లో ప్లాట్లకే డిమాండ్ ఎక్కువఇతర దక్షిణాది నగరాలతో పోలిస్తే హైదరాబాద్లోని ఓపెన్ ప్లాట్లకే డిమాండ్ ఎక్కువ గా ఉంది. 2018–24 మధ్య కాలంలో నగరంలోని స్థలాలలో గరిష్టంగా 21 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదవుతుంది. శంకర్పల్లి, పటాన్చెరు, తుక్కుగూడ, మహేశ్వరం, షాద్నగర్ ప్రాంతాల్లోని స్థలాలకు డిమాండ్, ధరల పెరుగుదల ఎక్కువగా ఉందని తెలిపింది. కాగా.. చెన్నైలో ప్లాట్లలో వార్షిక వృద్ధి రేటు 18 శాతం, బెంగళూరులో 13 శాతం ఉంది. చెన్నైలో అంబత్తూరు, అవడి, ఒరిగడం, శ్రీపెరంబుదూర్, తైయూర్ ప్రాంతాలలో, బెంగళూరులో నీలమంగళ, దేవనహళ్లి, చిక్కబల్లాపూర్, హోస్కేట్, కొంబల్గోడు ప్రాంతాల్లోని ప్లాట్లకు ఆదరణ ఎక్కువగా ఉంది.2018–24 మధ్య ఢిల్లీ–ఎన్సీఆర్లో ప్లాట్ల వార్షిక వృద్ధి రేటు 15 శాతంగా ఉంది. సోహ్నా, గుర్గావ్లో భూముల ధరలు ఏటా 6 శాతం పెరుగుతున్నాయి. సెక్టార్ 99, ద్వారకా ఎక్స్ప్రెస్వే, సెక్టార్ 95ఏ, సెక్టార్ 70ఏ, సెక్టార్ 63లలోని నివాస స్థలాలలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. -
రియల్టీలో మహిళలకు ఉపాధి ఎక్కడ?
రియల్ ఎస్టేట్ రంగంలో ఉపాధి పరంగా మహిళలకు తగినన్ని అవకాశాలు దక్కడం లేదని రియల్టీ(Realty) సంస్థ మ్యాక్స్ ఎస్టేట్స్, ఇన్ టాండెమ్ గ్లోబల్ కన్సల్టెంగ్తో కలసి నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. భారత రియల్ ఎస్టేట్ పరిశ్రమ 7.1 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుంటే, అందులో మహిళలు 70 లక్షలుగానే (10 శాతం) ఉన్నట్టు తెలిపింది. ఈ రంగంలో సమానత్వం సాధనకు ఎంతో సమయం పడుతుందని పేర్కొంది.‘భారత రియల్ ఎస్టేట్(Real Estate) రంగం కూడలి వద్ద ఉంది. అసాధారణ వృద్ధికి సిద్దంగానే ఉన్నా, సవాళ్ల కారణంగా పూర్తి సామర్థ్యాలను చూడలేకుంది. భారత జనాభాలో మహిళలు 48.5 శాతంగా ఉంటే, ఇందులో కేవలం 1.2 శాతం మందికే రియల్ ఎస్టేట్ రంగంలో ఉపాధి లభిస్తోంది’అని ఈ నివేదిక వెల్లడించింది. ఒకవైపు మహిళలకు తగినంత ప్రాతినిధ్యం లేకపోగా, మరోవైపు వారికి వేతన చెల్లింపుల్లో అసమానత్వం ఈ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లలో ఒకటిగా పేర్కొంది.‘ఉపాధి కల్పనలో రియల్ ఎస్టేట్ రంగానికి గణనీయమైన పాత్ర ఉంది. అయినప్పటికీ మహిళలకు సమాన అవకాశాల కల్పన పరంగా ఎంతో దిగువన ఉంది. లింగ అసమానతను పరిష్కరించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలను, ఉత్పాదకతను, ఆవిష్కరణలను, లాభదాయకతను గణనీయంగా పెంచొచ్చు’ అని ఈ నివేదిక సూచించింది. బ్లూకాలర్, వైట్ కాలర్ మహిళా కార్మికుల సాధికారత పెంచేందుకు నైపుణ్య శిక్షణ అందించాలని పేర్కొంది. మరింత మంది మహిళలకు భాగస్వామ్యం కలి్పంచడం వల్ల ఈ రంగం ముఖచిత్రం మారిపోతుందని ఇన్టాండెమ్ గ్లోబల్ కన్సల్టెంగ్ ఎండీ శర్మిష్ట ఘోష్ అభిప్రాయపడ్డారు. -
హైదరాబాద్లో పెరిగిన రిజిస్ట్రేషన్లు.. ఏ ప్రాంతంలో ఎక్కువంటే..
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2024లో గణనీయమైన వృద్ధిని కనబరిచింది. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు ఏడాది ప్రాతిపదికన 7 శాతం పెరిగాయి. ఈమేరకు నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక విడుదల చేసింది. నగరంలో 2023లో 71,912 ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు జరగ్గా, 2024లో 76,613 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. నమోదైన మొత్తం ఆస్తుల విలువ కూడా 23 శాతం పెరిగి రూ.47,173 కోట్లకు చేరింది.ప్రీమియం ప్రాపర్టీస్హైదరాబాద్ ప్రాపర్టీ మార్కెట్లో రూ.1 కోటి, అంతకంటే ఎక్కువ విలువ చేసే గృహాల రిజిస్ట్రేషన్లు పెరిగాయి. 2023లో అంతకుముందు ఏడాది కంటే 10 శాతం పెరగ్గా, ఇప్పుడు రిజిస్ట్రేషన్లలో 14 శాతం వృద్ధి నమోదైంది. వినియోగదారులు ప్రీమియం ప్రాపర్టీల వైపు మళ్లడం గృహ కొనుగోలుదారుల ఆకాంక్షలను, నగరవాసుల ఆర్థిక మూలాలను ప్రతిబింబిస్తుంది.జిల్లాల వారీగా..రియల్టీ వ్యాపారం సీటీ పరిసరాల్లో పెరుగుతున్న నేపథ్యంలో మొత్తం రిజిస్ట్రేషన్లలో 83 శాతం మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే ఎక్కువగా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు జరిగాయి. మేడ్చల్-మల్కాజ్గిరిలోనే 42 శాతం, రంగారెడ్డిలో 41 శాతం రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. మిగిలిన 17% వాటా హైదరాబాద్ జిల్లా నుంచి ఉంది.ప్రాపర్టీ పరిమాణాల వారీగా..ప్రాపర్టీ పరిమాణాల పరంగా చూస్తే 1,000 నుంచి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న వాటిని గృహాల నిర్మాణానికి వినియోగించారు. మొత్తం రిజిస్ట్రేషన్లలో వీటి వాటా 69%గా ఉంది. 2000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన ఆస్తులు 2023లో 11 శాతం ఉండగా, 2024లో 14 శాతానికి పెరిగాయి. 2024 డిసెంబరులో లావాదేవీల సగటు ధర 6% పెరిగింది.ఇదీ చదవండి: రూ.1,275 లక్షల కోట్లకు ప్రపంచ కుబేరుల సంపదనైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ మాట్లాడుతూ.. లగ్జరీ జీవనానికి అలవాటు పడుతున్న నేపథ్యంలో ప్రీమియం గృహాలపై ఆసక్తి పెరుగుతుందన్నారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అధునాతన ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా డెవలపర్లు వినియోగదారుల డిమాండ్కు వేగంగా స్పందిస్తున్నారని చెప్పారు. -
విశాలమైన ఇళ్ల కొనుగోలు.. టైర్–2 జోరు
కరోనా నేపథ్యంలో మొదలైన వర్క్ ఫ్రం హోమ్ (Work form Home) నేటికీ కొనసాగుతుండటంతో ‘టైర్–2’ (tier 2 cities) ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడింది. ప్రధాన నగరంలో ఇరుకు ఇళ్ల మధ్య ఉండటం బదులు శివారు ప్రాంతాలకు, హరిత భవనాలు, విస్తీర్ణం ఎక్కువగా ఉండే గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపు తున్నారు. -సాక్షి, సిటీబ్యూరోకరోనా రెండో దశ ఉధృతి నేపథ్యంలో సూరత్, జైపూర్, పాట్నా, మోహాలీ, లక్నో, కోయంబత్తూరు వంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఆన్లైన్లో ప్రాపర్టీల శోధన గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయని హౌసింగ్.కామ్ ఇండియన్ రెసిడెన్షియల్ ఇండెక్స్ ఫర్ ఆన్లైన్ సెర్చ్(ఐఆర్ఐఎస్) తెలిపింది. ఆయా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో గృహ కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొంది. నోయిడాలోని నోయిడా ఎక్స్టెన్షన్, ముంబై లోని మీరా రోడ్ ఈస్ట్, అంధేరి వెస్ట్, బోరివలీ వెస్ట్, బెంగళూరులోని వైట్ఫీల్డ్ ప్రాంతాలు ఈ ఏడాది దేశీయ నివాస సముదాయ మార్కెట్ను లీడ్ చేస్తాయని తెలిపింది.మారిన అభిరుచులు.. ఆన్లైన్లో రూ.2 కోట్లకు పైబడిన ప్రాపర్టీల శోధన ఒకటిన్నర శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. గతంలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలంటే ధర, వసతులు ప్రధాన అంశాలుగా ఉండేవి. కరోనా తర్వాత నుంచి గృహ కొనుగోలుదారుల ఎంపికలో మార్పులొచ్చాయి. వైద్య సదుపాయాలకు ఎంత దూరంలో ఉంది? భద్రత ఎంత? అనే వాటికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది.గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వైద్య సదుపాయాలు, భద్రత, ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉన్న ప్రాజెక్ట్లకు డిమాండ్ ఉంటుందని హౌసింగ్.కామ్ గ్రూప్ సీఈఓ ధ్రువ్ అగర్వాలా తెలిపారు. 3 బీహెచ్కే, ఆపై పడక గదుల గృహాల్లో అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే 2021లో 15 శాతం వృద్ధి నమోదయ్యిందని పేర్కొన్నారు. అదే సమయంలో గతేడాది పెద్ద సైజు ప్లాట్లలో 42 శాతం పెరుగుదల కనిపించింది.అద్దెలకు గిరాకీ.. ప్రాజెక్ట్ల ఆలస్యం, దివాలా డెవలపర్లు వంటి ప్రతికూల వాతావరణంలోనూ నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లో ప్రాపర్టీ శోధనలు గణనీయమైన స్థాయిలో పెరిగింది. నోయిడా ఎక్స్టెన్షన్ ప్రాంతం ఆన్లైన్ ప్రాపర్టీ సెర్చింగ్లో ప్రథమ స్థానంలో నిలిచింది. కేంద్రం, ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాలు ఈ రీజియన్లో పలు మౌలిక సదుపాయ ప్రాజెక్ట్లను ప్రకటించడం, ధరలు అందుబాటులో ఉండటం వంటివి ఈ రీజియన్లో ప్రాపర్టీల వృద్ధికి కారణమని తెలిపింది.ఐటీ, ఫార్మా కంపెనీలు ఉద్యోగ నియామకాలను పెంచడంతో ముంబై, బెంగళూరు, ఢిల్లీ మార్కెట్లలో అద్దెలకు గిరాకీ పెరిగిందని పేర్కొంది. ఈ ఏడాది దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధికి మరీ ముఖ్యంగా నివాస సముదాయ మార్కెట్లో ముంబై, బెంగళూరు, హైదరాబాద్ అత్యంత కీలకంగా కానున్నాయని అంచనా వేసింది. -
జూబ్లీహిల్స్లో బంగ్లా.. రూ.40 కోట్లు!
సాక్షి, సిటీబ్యూరో: కరోనా తర్వాత నుంచి లగ్జరీ గృహాలకు (luxury homes) ఆదరణ పెరిగింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో రూ.80 కోట్ల ఖరీదైన రెండు బంగ్లాలు, ఒక్కోటి రూ.40 కోట్ల చొప్పున అమ్ముడుపోయాయి. గతేడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో రూ.40 కోట్లకు పైగా విలువైన 59 అల్ట్రా లగ్జరీ గృహాల విక్రయాలు జరిగాయని అనరాక్ గ్రూప్ నివేదిక వెల్లడించింది. వీటి విలువ రూ.4,754 కోట్లు. వీటిలో 53 అపార్ట్మెంట్లు కాగా.. 6 బంగ్లాలు ఉన్నాయి.2023లో సుమారు రూ.4,063 కోట్ల విలువైన 58 లగ్జరీ గృహాలు విక్రయించారు. మొత్తం అమ్మక విలువలో వార్షిక పెరుగుదల 17 శాతంగా ఉంది. 2024లో అమ్ముడైన అల్ట్రా లగ్జరీ గృహాలలో రూ.100 కోట్ల విలువైన యూనిట్లు 17 ఉన్నాయి. వీటి విలువ రూ.2,344 కోట్లు. గతేడాది 88 శాతం వాటాతో అత్యధికంగా ముంబైలో 52 అల్ట్రా లగ్జరీ యూనిట్లు సేల్ అయ్యాయి. ఢిల్లీ–ఎన్సీఆర్లో మూడు, బెంగళూరు, హైదరాబాద్లో రెండేసి గృహాలు అమ్ముడయ్యాయి.హెచ్ఎన్ఐ, ప్రవాసుల డిమాండ్ గత రెండేళ్లలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 130 అల్ట్రా లగ్జరీ గృహాలు విక్రయమ్యాయి. వీటి విలువ రూ.9,987 కోట్లు. 2022లో రూ.1,170 కోట్ల విలువైన 13 యూనిట్లు అమ్ముడుపోయాయి. వీటిలో 10 అపార్ట్మెంట్లు కాగా మూడు బంగ్లాలు ఉన్నాయి. 2023లో రూ.4,063 కోట్ల విలువైన 58 యూనిట్లు అమ్ముడయ్యాయి.హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), ప్రవాసులు వ్యక్తిగత వినియోగం, పెట్టుబడుల కోసం అల్ట్రా లగ్జరీ గృహాలను కొనుగోలు చేస్తున్నారు. ఇన్పుట్ వ్యయం పెరుగుదల, బలమైన కొనుగోలుదారుల డిమాండ్ కారణంగా మెట్రో నగరాలలో ఈ తరహా ఇళ్ల పెరుగుతున్నాయి. దీంతో గ్రేడ్–ఏ డెవలపర్లు అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్ల నిర్మాణాలకు మొగ్గు చూపుతున్నారు. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. ఆల్ టైమ్ హై!
హైదరాబాద్ (Hyderabad) రియల్ ఎస్టేట్ (real estate) ఆల్ టైం హై స్థాయికి చేరుకుంది. గతేడాది నగరంలో రికార్డు స్థాయిలో గృహ విక్రయాలు, ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, వడ్డీ రేట్ల పెంపు, హైడ్రా దూకుడు ఇవేవీ భాగ్యనగరంలో స్థిరాస్తి రంగాన్ని కదిలించలేకపోయాయి. కొత్త ప్రభుత్వ విధానాలతో కొద్ది కాలం అస్థిరత ఏర్పడినా.. మార్కెట్ తిరిగి శరవేగంగా పుంజుకుంది. దీంతో హైదరాబాద్ రియల్టీలో పూర్వ వైభవం సంతరించుకుంది. నగరంలో గతేడాది 32,974 యూనిట్లు విక్రయించగా.. 1.56 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయని నైట్ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోఆర్థికవృద్ధి, మెరుగైన మౌలిక సదుపాయాలు, కొనుగోలుదారుల అభిరుచిలో మార్పుల కారణంగా హైదరాబాద్లో గృహ విక్రయాలు పెరిగాయి. గతేడాది నగరంలో 12 శాతం వృద్ధి రేటుతో 36,974 ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. ప్రస్తుతం సిటీలో అపార్ట్మెంట్ల సగటు ధర చ.అ.కు రూ.5,974. ఏడాదిలో అపార్ట్మెంట్ల ధరలు 8 శాతం మేర పెరిగాయి. గతేడాది సిటీలో 44,013 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే 6 శాతం తగ్గాయి. హైడ్రా దూకుడు వ్యవహారంతో కొత్త గృహాల ప్రారంభానికి డెవలపర్లు ఆచితూచి వ్యవహరించడంతో లాంచింగ్స్లో క్షీణత నమోదయ్యింది. పశ్చిమ హైదరాబాదే.. హైటెక్ సిటీ, కోకాపేట, రాయదుర్గం, కూకట్పల్లి, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ హైదరాబాదే కస్టమర్ల చాయిస్గా ఉంది. ఎల్బీనగర్, కొంపల్లి ప్రాంతాల్లో ధరల పెరుగుదల అధికంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో వరుసగా 11, 10 శాతం మేర రేట్లు పెరిగాయి. ఆ తర్వాత బంజారాహిల్స్లో 8 శాతం, కోకాపేటలో 8 శాతం, మణికొండలో 6, నాచారం, సైనిక్పురిలో 5 శాతం మేర ధరలు పెరిగాయి. ప్రస్తుతం నగరంలో అత్యధికంగా చ.అ.ధరలు బంజారాహిల్స్లో రూ.14,400–16,020 మధ్య ఉండగా.. జూబ్లీహిల్స్లో 13,400–14,034, కోకాపేటలో 10,045–12,500, మణికొండలో రూ.8,500–9,220 మధ్య ధరలు ఉన్నాయి.ఆఫీస్ అ‘ధర’హో.. 2024లో హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ లావాదేవీలు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. గతేడాది కొత్తగా 1.03 కోట్ల చ.అ.ఆఫీస్ స్పేస్ పూర్తి కాగా.. 1.56 కోట్ల చ.అ. స్పేస్ లావాదేవీలు జరిగాయి. కార్యాలయాల స్థలం లీజు, కొనుగోళ్లలో గ్లోబల్ కెపబులిటీ సెంటర్స్(జీసీసీ) ఆధిపత్యాన్ని కొనసాగించాయి. గతేడాది జరిగిన ఆఫీసు స్పేస్ లావాదేవీల్లో జీసీసీ వాటా 49 శాతంగా ఉంది. 51 లక్షల చ.అ.ఆఫీస్ స్పేస్ను బహుళ జాతి కంపెనీలు జీసీసీ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. దేశీయ వ్యాపార సంస్థలు 24 లక్షల చ.అ.లు, ఫ్లెక్సీబుల్ ఆఫీసు స్పేస్ 18 లక్షల చ.అ.లు, 12 లక్షల చ.అడుగుల స్థలంలో థర్డ్ పార్టీ ఐటీ సంస్థల లావాదేవీలు ఉన్నాయి. నగరంలో ఆఫీస్ స్పేస్ ధర చ.అ.కు సగటున రూ.70గా ఉంది. ఏడాది కాలంలో ధరలు 7 శాతం మేర పెరిగాయి.దేశవ్యాప్తంగా ఇలా.. గతేడాది దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 3,72,936 యూనిట్లు లాచింగ్ కాగా.. 3,50,612 ఇళ్లు అమ్ముడుపోయాయి. అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే లాంచింగ్స్లో 6 శాతం, విక్రయాల్లో 7 శాతం వృద్ధి నమోదైంది. దేశంలో ఇంకా 4,95,839 యూనిట్ల ఇన్వెంటరీ ఉంది. వీటి విక్రయానికి 5.8 నెలల సమయం పడుతుంది. ఇక, గతేడాది 7.19 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరగ్గా.. 5.03 కోట్ల చ.అ. స్థలం కొత్తగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం 8 నగరాల్లో మొత్తం 97.3 కోట్ల చ.అ.ఆఫీస్ స్పేస్ స్టాక్ ఉంది. -
మొదట కొనేది ఇల్లే.. ఆ తర్వాతే పెళ్లి, ఫ్యూచర్
చదువు పూర్తయ్యిందా.. మంచి ఉద్యోగం, తర్వాత పెళ్లి, పిల్లలు, రిటైర్మెంట్ నాటికి ఓ సొంతిల్లు.. మన నాన్నల ఆలోచనలివే కదూ! కానీ, ప్రస్తుత తరం ఆలోచనలు, అభిరుచులూ మారాయి. చదువు కొనసాగుతుండగానే ఉద్యోగావకాశాలు నడిచొస్తున్నాయి. దీంతో యువత ముందుగా స్థిరమైన నివాసానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ తర్వాతే పెళ్లి, విదేశీ ప్రయాణాలు, ఫ్యూచర్ ఇతరత్రా వాటి కోసం ప్లానింగ్ చేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోవిరివిగా రుణాల లభ్యత, బహుళ ఆదాయ మార్గాలు, మంచి ప్యాకేజీతో స్థిరమైన ఉద్యోగ అవకాశాలు ఉండటంతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు యువత ఆసక్తి చూపిస్తోంది. 2018లో గృహ కొనుగోలుదారుల్లో మిలీనియల్స్ (25–35 ఏళ్ల వయస్సు గలవారు) వాటా 28 శాతంగా ఉండగా.. గతేడాదికి 37 శాతానికి పెరిగింది. 2030 నాటికి 60 శాతానికి చేరుతుందని జేఎల్ఎల్ ఇండియా అంచనా వేసింది.ఇటీవల కాలంలో దేశీయ స్థిరాస్తి రంగంలో సరికొత్త మార్పులు వచ్చాయి. గతంలో రిటైర్డ్, సీనియర్ సిటీజన్స్, సంపన్న వర్గాల గృహ కొనుగోళ్లు, పెట్టుబడులు ఉండేవి. కానీ, కొన్నేళ్లుగా మిలీనియల్స్, జెన్–జెడ్ కస్టమర్ల వాటా పెరిగింది. జీవితం ప్రారంభ దశలోనే దీర్ఘకాలిక పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. తొలి కారు, డిజైనర్ హ్యాండ్ బ్యాగ్లాగే ప్రాపర్టీకి నేటి యువత ప్రాధాన్యత ఇస్తోంది. అందుబాటులో టెక్నాలజీ.. మ్యాజిక్బ్రిక్స్.కామ్, హౌసింగ్.కామ్, 99 ఎకర్స్ వంటి రియల్ ఎస్టేట్ యాప్స్ యువ కొనుగోలుదారుల ప్రాపర్టీ శోధనను మరింత సులువు చేశాయి. గతంలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలంటే భౌతికంగా వెళ్లి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించడం, పరిసర ప్రాంతాల వాకబు వంటివి పెద్ద ప్రయాస ఉండేది. కానీ, నేటి యువతరానికి అంత టైం లేదు. దుస్తులు, ఫుడ్ ఆర్డర్ చేసినంత సులువుగా ప్రాపర్టీ కొనుగోళ్లు జరిగిపోవాలని కోరుకుంటున్నారు. వీరి అభిరుచికి తగ్గట్టు ప్రాపర్టీ సమీక్ష, రేటింగ్ యాప్స్, త్రీడీ వ్యూ, వర్చువల్ టూర్ వంటి సాంకేతికత పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాయి. గృహ రుణాలకు పోటీ.. యువ గృహ కొనుగోలుదారులకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సైతం పోటీపడి హోమ్లోన్స్ అందిస్తున్నాయి. రుణాల మంజూరులో వేగం, తక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. క్రౌడ్ ఫండింగ్, ప్రాపర్టీ షేరింగ్ వంటి పాక్షిక యాజమాన్య ప్లాట్ఫామ్లు పరిమిత మూలధనంతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. దీంతో భారీ ముందస్తు చెల్లింపులు అవసరం లేకుండానే నేటి యువ కస్టమర్లు లక్ష కంటే తక్కువ ప్రారంభ పెట్టుబడితో యువ ఇన్వెస్టర్లు ఖరీదైన, విలాసవంతమైన ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు. ఐటీ హబ్లలో యువ పెట్టుబడులు.. బెంగళూరు, హైదరాబాద్ వంటి ఐటీ హబ్లలో యువ ఐటీ ఉద్యోగులు రియల్ ఎస్టేట్ మార్కెట్లో గణనీయమైన ప్రభావం చూపుతున్నారు. రూ.80 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర కలిగిన 2 బీహెచ్కే అపార్ట్మెంట్ల కొనుగోళ్లలో వీరి ప్రాధాన్యత అధికంగా ఉంది. కరోనాతో అలవాటైన వర్క్ ఫ్రం హోమ్తో యువ ఉద్యోగులకు నిత్యం ఆఫీస్కు వెళ్లాలనే టెన్షన్ లేదు. దీంతో ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో ఇళ్లు ఉండాలనుకోవడం లేదు.ఇదీ చదవండి: హైదరాబాద్లో లక్ష ఇళ్లు @సేల్!మెరుగైన రవాణా సౌకర్యాలు ఉంటే సిటీకి కాస్త దూరమైనా సరే ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ప్రధాన ప్రాంతంలో కొనుగోలు చేసే ధరతోనే శివార్లలో పెద్ద సైజు ఇళ్లు, వసతులను పొందవచ్చనేది వారి అభిప్రాయం. అయితే గ్రీనరీతో పాటు విద్యుత్, నీటి వినియోగాన్ని ఆదా చేసే ప్రాజెక్ట్లు, సౌర ఫలకాలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి పర్యావరణ అనుకూల ఫీచర్లు ఉండే ఇళ్లను కోరుకుంటున్నారు.పెరిగిన పట్టణ గృహ యజమానులు.. కరోనాతో అలవాటైన వర్క్ ఫ్రం హోమ్ విధానంతో యువ ఉద్యోగులు ఆఫీసులో కూర్చొని పనిచేసే అవసరం లేదు. వారు ఇప్పుడు తమ పనికి కాకుండా జీవనశైలికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో వారికి నచ్చిన ప్రాంతంలో నివసించే స్వేచ్ఛ కోరుకుంటున్నారు. వేగవంతమైన పట్టణీకరణ, సాంకేతిక ఆవిష్కరణలు, వినియోగదారుల అభిరుచులతో గృహ కొనుగోలుదారుల్లో మార్పులు వచ్చాయి.ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు కీలకమైన వృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. 2020లో పట్టణ గృహ యజమానుల రేటు 65 శాతంగా ఉండగా.. 2025 నాటికి 72 శాతానికి పెరుగుతుందని జేఎల్ఎల్ అంచనా వేసింది. సరసమైన గృహ రుణాలు, నివాస సముదాయంలో యువ కొనుగోలుదారుల ప్రాధాన్యతే ఈ వృద్ధికి ప్రధాన కారణాలు. -
హైదరాబాద్లో లక్ష ఇళ్లు @సేల్!
డిమాండ్కు మించి సరఫరా జరుగుతుండటంతో హైదరాబాద్లో (hyderabad) అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లు(ఇన్వెంటరీ) (residential real estate inventory) పెరిగిపోతున్నాయి. దేశంలోని ఏడు ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే ముంబై తర్వాత హైదరాబాద్లోనే అత్యధిక ఇన్వెంటరీ ఉంది. - సాక్షి, సిటీబ్యూరోఇక, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలతో పోలిస్తే మన దగ్గరే ఎక్కువ. గతేడాది నాటికి గ్రేటర్లో 1,01,091 ఇళ్ల ఇన్వెంటరీ (వీటిలో నిర్మాణంలో ఉన్నవి, పూర్తయినవి కలిపి) ఉంది. వీటి విక్రయానికి కనిష్టంగా 19 నెలల కాలం పడుతుంది. గత రెండేళ్లలో నగరంలో గృహాల సరఫరా పెరగడమే ఇన్వెంటరీ పెరుగుదలకు ప్రధాన కారణం.దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఏడాది తొలి తొమ్మిది నెలల కాలంలో మొత్తం 5,64,416 యూనిట్ల ఇన్వెంటరీ మిగిలి ఉందని, వీటి విక్రయానికి కనిష్టంగా 14 నెలల కాలం పడుతుందని అనరాక్ గ్రూప్ నివేదిక వెల్లడించింది.ఇదీ చదవండి: మెట్రో వెంట.. రియల్ ఎస్టేట్ బూమ్!2024లో కొత్త ఇళ్ల సరఫరా అంతకు ముందు ఏడాదితో పోలిస్తే తగ్గిందని అనరాక్ నివేదిక పేర్కొంది. ఎన్నికల నేపథ్యంలో అప్రూవల్స్లో జాప్యం కారణంగా హౌసింగ్ సప్లయి తగ్గిపోయినట్లు చెప్పినట్లు చొప్పుకొచ్చింది.2025 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ప్రధాన నగరాల్లో దాదాపు 253 మిలియన్ చ.అ.మేర కొత్త ఇళ్ల సరఫరాను ప్రారంభించే ప్రణాళికలను టాప్ 11 లిస్టెడ్ డెవలపర్లు ఏడాది ప్రారంభంలో ప్రకటించారని అనరాక్ గుర్తు చేసింది. అయితే సార్వత్రిక, రాష్ట్రాల ఎన్నికల కారణంగా వీటిలో కేవలం 23% లేదా 57 మిలియన్ చ.అ.ల మేర ప్రాజెక్ట్లు మాత్రమే ఏడాది ప్రథమార్థంలో ప్రారంభమయ్యాయి. -
మెట్రో వెంట.. సొంతింటి ప్రయాణం!
హైదరాబాద్ స్థిరాస్తి రంగాన్ని నెక్ట్స్ లెవల్కు తీసుకెళ్లింది మెట్రో, ఔటర్ ప్రాజెక్ట్లే.. మెట్రో రైలుతో ప్రధాన నగరంలో, ఓఆర్ఆర్తో శివారు ప్రాంతాలతో కనెక్టివిటీ పెరిగింది. దీంతో నగరంలో రియల్ బూమ్ ఏర్పడింది. తాజాగా ప్రభుత్వం రెండో దశలో ఔటర్ రింగ్ రోడ్డు వరకూ మెట్రో విస్తరించాలని నిర్ణయించింది. దీంతో మెట్రో మార్గంలో చుట్టూ 10 కి.మీ. వరకూ స్థిరాస్తి అవకాశాలు మెరుగవుతాయి. ఇదే సమయంలో మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లను అనుసంధానిస్తే నగరం నలువైపులా ప్రయాణం సులువవుతుంది. బడ్జెట్ గృహాల లభ్యత పెరిగి, ఐటీ ఉద్యోగ వర్గాల సొంతింటి కల సాకారమవుతుందని జనప్రియ అప్స్కేల్ ఎండీ క్రాంతి కిరణ్రెడ్డి అన్నారు. – సాక్షి, సిటీబ్యూరోప్రజల దైనందిన జీవితంలో ప్రజారవాణా అత్యంత కీలకం. దీంతో ప్రభుత్వం మెట్రోని పొడిగించాలని నిర్ణయించింది. వచ్చే 5–10 ఏళ్లలో దశలవారీగా మెట్రో 2.0 అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రియల్టీ మరింత దూరం విస్తరిస్తోంది. సాధారణంగా ప్రజలు మెరుగైన రవాణా సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లోనే ఉండేందుకు ఇష్టపడతారు.ఐటీ కేంద్రాల చుట్టుపక్కల ఇళ్ల ధరలు రూ.కోటి దాటిపోయాయి. ఐటీ ఉద్యోగ వర్గాలకు అందనంత ఎత్తుకు ఎగబాకాయి. మెట్రోతో శివార్లకు రవాణా సౌకర్యం రావడంతో ఐటీ కారిడార్లో పనిచేసే ఉద్యోగులు ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో వీరంతా తమ బడ్జెట్లో నివాసాలు దొరికే తూర్పు హైదరాబాద్లో కొనుగోలు చేశారు.విదేశాల్లో ప్రైవేట్కే స్టేషన్ల బాధ్యత.. సింగపూర్, న్యూయార్క్ వంటి దేశాల్లో మాదిరిగా నగరంలోనూ భూగర్భ మెట్రో ఉంటే మేలు. విదేశాలలో భూగర్భ మెట్రో స్టేషన్ నిర్మాణ వ్యయాన్ని స్థానికంగా హోటల్స్, మాల్స్ వంటి వాణిజ్య సముదాయాలకే అప్పగిస్తారు. స్టేషన్ నుంచి వచ్చిపోయే ప్రయాణికులకు ఆయా వాణిజ్య సముదాయాలకు యాక్సెస్ ఉంటుంది. దీంతో యజమానులకు బిజినెస్ అవుతుంది. ప్రతిఫలంగా స్టేషన్ నిర్మాణ వ్యయాన్ని వాణిజ్య యజమానులే భరిస్తారు. దీంతో అటు ప్రభుత్వం, ఇటు యజమానికి ఇద్దరికీ లాభమే.ఇదీ చదవండి: వెస్ట్ హైదరాబాద్.. వామ్మో ఎంత ఎత్తో..చిత్తడి, వదులుగా ఉండే నేలలో భూగర్భ మెట్రో కష్టమవుతుంది. కానీ, మనది రాతి భూభాగం. భూగర్భ మెట్రో లైన్ కోసం సొరంగం తవ్వడం కష్టమవుతుందేమో.. కానీ ఒకసారి తవ్వాక నియంత్రణ సులువు. రోడ్డు మార్గం ఎలా ఉంటుందో మెట్రో లైన్ కూడా అలాగే వేయాల్సి ఉంటుంది. పైగా వంకర్లు ఉండే మార్గంలో ఎక్కువ బోగీలతో మెట్రోను నడపడం కుదరదు. కానీ, భూగర్భ మెట్రోను ఏ నుంచి బీ పాయింట్కు సరళ రేఖ మాదిరిగా వేయవచ్చు. దీంతో మెట్రో రైలు వేగం పెరగడంతో పాటు ఎక్కువ బోగీలతో మెట్రో నడపొచ్చు.భవిష్యత్తు ఈ ప్రాంతాలదే.. ఇప్పటి వరకు ఐటీ, ఫార్మా రంగాల బహుళ జాతి సంస్థలే నగరానికి ప్రాధాన్యం ఇచ్చాయి. కానీ, కొన్నేళ్లుగా తయారీ రంగంలో కూడా మల్టీనేషనల్ కంపెనీలు విస్తరిస్తున్నాయి. ఫాక్స్కాన్, టాటా ఎయిరోస్పేస్ వంటి సంస్థలు ఆదిభట్ల, శంషాబాద్ ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఐటీ అంతా వెస్ట్లోనే ఉంది కాబట్టి ఈ ప్రాంతాలకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. కానీ, ఇప్పటికే ఆయా ప్రాంతాలలో నివాస, వాణిజ్య భవనాలతో కిక్కిరిసిపోవడంతో ఈ అభివృద్ధి చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తుంది. కొంగరకలాన్, ఆదిభట్ల, శంషాబాద్, కొల్లూరు, శామీర్పేట వంటి ప్రాంతాల్లో మార్కెట్ ఊపందుకుంటుంది.హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు.. ఐటీలోనే కాదు రియల్ ఎస్టేట్లోనూ హైదరాబాద్, బెంగళూరు పోటీ పడుతున్నాయి. రెండు నగరాలకు ఉన్న తేడా.. రోడ్ల వెడల్పు. బెంగళూరులో ఎయిర్పోర్టు రోడ్డు తప్ప అన్నీ దాదాపు 60 ఫీట్ల రోడ్లే.. కానీ, మన దగ్గర 100, 140 ఫీట్ల రోడ్లు కూడా ఉన్నాయి. నగరంలో అంత పెద్ద రోడ్లు ఎలా వచ్చాయి? రోడ్డు వెడల్పుగా ఉంటే అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ) ఉంటుందని యజమానులు రోడ్ల కోసం భూములు ఇచ్చారు.ఇదీ చదవండి: హైదరాబాద్లో అక్కడ.. కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!దీంతో భారీ టౌన్షిప్లు, స్కై స్క్రాపర్లు వస్తున్నాయి. తాజాగా హైరైజ్ ప్రాజెక్ట్లతో ట్రాఫిక్ పెరుగుతోందని ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు పెట్టాలనే ప్రతిపాదనకు బదులుగా రోడ్లను ఇంకా వెడల్పు చేయడం ఉత్తమం. హైదరాబాద్ రియల్టీకి వరమైన జీవో–86 వల్లే దేశ, విదేశీ పెట్టుబడులు వచ్చాయి. అలాంటి సమర్థవంతమైన జీవోపై ఆంక్షలు పెట్టాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. -
ఫైనాన్స్ కంపెనీ అడ్వైజరీ బోర్డు ఛైర్మన్గా జస్టిస్ శ్రీకృష్ణ
డేటా షేరింగ్ ప్లాట్ఫాం ఈక్వల్, అలాగే ఆ సంస్థ పెట్టుబడులున్న అకౌంట్ అగ్రిగేటర్ వన్మనీ ఏర్పాటు చేసిన అడ్వైజరీ బోర్డు ఛైర్మన్గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ(Justice B.N. Srikrishna) నియమితులయ్యారు. న్యాయశాస్త్ర, ఆర్థిక(Finance), టెక్నాలజీ తదితర రంగాలకు చెందిన నిపుణులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఆర్బీఐ మాజీ గవర్నర్లు జగదీష్ కపూర్, రాకేష్ మోహన్ .. యూఐడీఏఐ మాజీ చైర్మన్ జె సత్యనారాయణ వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు.డేటా షేరింగ్కి సంబంధించి భద్రత, నైతికతకు ప్రాధాన్యమిస్తూ అత్యున్నత ప్రమాణాలు పాటించడంలో ఇరు కంపెనీలకు ఈ బోర్డు మార్గనిర్దేశం చేస్తుంది. వ్యక్తుల హక్కులు, ఆకాంక్షలు, ఆర్థిక వృద్ధి తదితర అంశాల్లో సమతౌల్యత పాటించేందుకు ఉపయోగపడే సొల్యూషన్స్ను రూపొందించడంపై దృష్టి పెట్టనున్నట్లు జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ తెలిపారు. రుణాలు, ఉద్యోగాలు(Jobs), ఆరోగ్య సంరక్షణ సేవలను మరింత మందికి అందుబాటులోకి తేవడానికి కట్టుబడి ఉన్నామని ఈక్వల్ వ్యవస్థాపకుడు కేశవ్ రెడ్డి తెలిపారు. సమ్మిళిత ఆర్థిక వృద్ధి సాధన దిశగా కృషి చేస్తున్నట్లు వన్మనీ వ్యవస్థాపకుడు కృష్ణ ప్రసాద్ చెప్పారు.ఇదీ చదవండి: రేడియో వ్యాపారం మూసివేతబ్రిగేడ్ గ్రూప్ కొత్త ప్రాజెక్ట్రియల్టీ సంస్థ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్లో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కోకాపేటలో బ్రిగేడ్ గేట్వే పేరుతో 10 ఎకరాల విస్తీర్ణంలో హౌసింగ్, కమర్షియల్ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేయనుంది. ఇందుకు రూ.4,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. 45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రానున్న ఈ ప్రాజెక్టులో లగ్జరీ గృహాలను 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. హైదరాబాద్, బెంగళూరు, మైసూరు, చెన్నై, కొచ్చిలో కంపెనీ పలు ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది. -
ఆఫీసు స్థలాలకు డిమాండ్.. ఆల్టైమ్ హై!
దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో 2024లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ (office space) నూతన గరిష్టాలకు చేరింది. మొత్తం 719 లక్షల చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) పరిమాణంలో లీజు లావాదేవీలు నమోదయ్యాయి. 2023లో స్థూల లీజింగ్తో పోల్చి చూసినప్పుడు 21 శాతం అధికం కాగా, కరోనా విపత్తుకు ముందు ఏడాది 2019 గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 19 శాతం వృద్ధి కనిపించింది. ఈ వివరాలను రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ఫ్రాంక్ ఇండియా (Knight Frank) విడుదల చేసింది. కరోనా కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో ఆఫీస్ స్పేస్ మార్కెట్ కుదేలవగా ఆ తర్వాత నుంచి ఏటా పుంజుకుంటూ వస్తోంది. నగరాల వారీ లీజింగ్బెంగళూరులో స్థూల ఆఫీస్ లీజింగ్ ముందటి సంవత్సరంతో పోల్చితే 2024లో 45 శాతం వృద్ధితో 181 లక్షల ఎస్ఎఫ్టీకి చేరింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో 25% వృద్ధితో స్థూల లీజింగ్ 127 లక్షల ఎస్ఎఫ్టీగా నమోదైంది.హైదరాబాద్లో డిమాండ్ 17 శాతం పెరిగి 103 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది.ముంబై మార్కెట్లోనూ 40 శాతం వృద్ధి నమోదైంది. 104 లక్షల చదరపు అడుగుల లీజింగ్ లావాదేవీలు జరిగాయి. పుణెలో 19 శాతం పెరిగి 80 లక్షల చదరపు అడుగులకు చేరింది. అహ్మదాబాద్లో 64 శాతం వృద్ధితో 30 లక్షల ఎస్ఎఫ్టీ స్థూల లీజింగ్ లావాదేవీలు నమోదయ్యాయి. చెన్నై మార్కెట్లో 25 శాతం క్షీణించి 81 లక్షల ఎస్ఎఫ్టీకి పరిమితమైంది. కోల్కతాలో స్థూల ఆఫీస్ స్పేస్ లీజింగ్ స్వల్పంగా 14 లక్షల చదరపు అడుగులకు తగ్గింది.సానుకూలతలు ఎన్నో.. ఆఫీస్ స్పేస్ లీజింగ్ నూతన గరిష్టాలకు చేరడం వెనుక దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండడం, బలమైన దేశీ వినియోగం, అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత్ ప్రాతినిధ్యం తదితర అంశాలను కారణాలుగా నైట్ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. ఆఫీస్ స్పేస్కు అసాధారణ డిమాండ్ ఉండడం దేశ, విదేశీ సంస్థల్లో వ్యాపార విశ్వాసానికి నిదర్శనంగా పేర్కొంది. జీసీసీలు, ఐటీఈఎస్, బీఎఫ్ఎస్ఐ రంగాలు ఈ డిమాండ్కు దన్నుగా నిలుస్తున్నట్టు తెలిపింది. -
ఇంటి విలువను పెంచే ల్యాండ్ స్కేపింగ్
గతంలో ప్రతి చిన్న అవసరానికి బయటకు వెళ్లేవారు. ఇంట్లో గడిపే సమయం తక్కువగా ఉండేది. కానీ, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక అంతా ఆన్లైన్ మీదే ఆధారపడుతున్నారు. దీంతో ఇంట్లో గడిపే నాణ్యమైన సమయం పెరిగింది. ఇల్లు, పరిసర ప్రాంతాలు స్వచ్ఛమైన గాలి, వెలుతురు, ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చదనం ఉండాలని కోరుకుంటున్నారు. ఈనేపథ్యంలో నివాస సముదాయాల్లో (Residential) ల్యాండ్ స్కేపింగ్కు (landscaping) ఆదరణ పెరిగింది. - సాక్షి, సిటీబ్యూరోవేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న భవన నిర్మాణ సముదాయాలతో హైదరాబాద్ (hyderabad) అర్బన్ జంగిల్గా మారిపోతోంది. దీంతో నివాసితులకు పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం అనుభూతి కలిగించాలంటే ల్యాండ్ స్కేపింగ్ అనివార్యమైపోయింది. కనుచూపు మేర పచ్చదనం, అది కూడా సేఫ్టీ, సెక్యూరిటీ ఉండే గేటెడ్ కమ్యూనిటీలోనే ఉండాలని నేటి గృహ కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. పురుగుమందులు, రసాయనాలతో గాలి, నేల కాలుష్యం అవుతోంది. దీంతో సేంద్రీయ, సస్టెయినబుల్ గార్డెనింగ్కు ఆదరణ పెరుగుతోంది. వాక్ వే, టెర్రస్లలో.. సువాసన, ఆకర్షణీయమైన పూల మొక్కలు, చెట్లు, గడ్డితో నివాస సముదాయంలో వాక్, రన్ వే, డెక్లు, టెర్రస్ వంటి ప్రాంతాల్లో ల్యాండ్ స్కేపింగ్లను చేపడుతున్నారు. విశ్రాంతి తీసుకోవడానికి, సమావేశాల కోసం వినూత్న లైట్లతో ప్రత్యేకమైన థీమ్లతో అందంగా అలంకరిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన ల్యాండ్ స్కేపింగ్తో బార్బిక్యూ వంటి ఔట్డోర్ ఈవెంట్లు, పార్టీలను చేసుకునేందుకు ఆహ్లాదకరమైన వేదికగా ఉంటుంది.ఇదీ చదవండి: వెస్ట్ హైదరాబాద్.. వామ్మో ఎంత ఎత్తో..విద్యుత్ బిల్లు ఆదా.. గ్లోబల్ ల్యాండ్ స్కేపింగ్ సర్వీస్ మార్కెట్ 2024లో 330.8 బిలియన్ డాలర్లుగా ఉందని, 2024 నుంచి 2030 నాటికి 6.7 శాతం వృద్ధి రేటు ఉంటుందని పరిశ్రమ వర్గాల అంచనా. వేసవి వచ్చిదంటే చాలు భానుడి ప్రతాపం 43 డిగ్రీలు దాటుతోంది. ఎండ, ఉక్కపోతతో ఇంట్లో ఉండలేని పరిస్థితి. ఏసీ, కూలర్లు ఉన్నా కృత్రిమమే. దీంతో ల్యాండ్ స్కేపింగ్ ప్రాజెక్ట్లకు డిమాండ్ పెరిగింది. ల్యాండ్ స్కేపింగ్ ప్రాజెక్ట్లలో ఉష్ణోగ్రతలు 2–3 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. సాధారణ ఇళ్లతో పోలిస్తే ల్యాండ్ స్కేపింగ్ గృహాల్లో విద్యుత్ బిల్లు రూ.700 నుంచి రూ.వెయ్యి వరకు ఆదా అవుతుంది.ఇంటి విలువ 20 శాతం వృద్ధి.. ల్యాండ్ స్కేపింగ్తో ఇల్లు, పరిసర ప్రాంతాల రూపరేఖలు మారిపోతాయి. సహజ సౌందర్యం, ఆకర్షణీయంగా ఉంటుంది. అందమైన ల్యాండ్ స్కేపింగ్తో ఇంటి విలువ దాదాపు 20 శాతం వరకు పెరుగుతుంది. నిరంతరం గ్రీనరీ చూస్తుండటంతో మనిషిలో ఒత్తిడి తగ్గడంతో పాటు సృజనాత్మకత పెరుగుతుంది. ల్యాండ్ స్కేపింగ్తో పరిసర ప్రాంతాల్లో గాలి కాలుష్యం తగ్గుతుంది. అలాగే గడ్డి, పొదలతో కూడిన ల్యాండ్ స్కేపింగ్ మట్టిని బలంగా ఉండేలా చేస్తుంది. దీంతో వరదలు, వర్షం వంటి వాటితో భూమి కోతలను నివారిస్తుంది. అంతేకాకుండా సీతాకోకచిలుకలు, చిన్న పక్షలు వంటి స్థానికంగా జీవవైవిధ్యానికి ల్యాండ్ స్కేపింగ్ ఆసరాగా నిలుస్తుంది.క్లబ్ హౌస్లో కో–వర్కింగ్ ప్లేస్.. కరోనా తర్వాతి నుంచి వర్క్ ఫ్రం హోమ్ విధానం అలవాటయ్యింది. ఉద్యోగుల ఆసక్తి, నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటం, మెరుగైన ఉత్పాదకత కారణంగా ఇప్పటికీ కొన్ని బహుళ జాతి కంపెనీలు ఇంటి నుంచి పని విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇంట్లో ప్రత్యేకంగా కొంత స్పేస్ ఆఫీస్ కోసం వినియోగిస్తే ఒప్పుకోవడం లేదు. ఇంట్లో పిల్లల అల్లరి, పెద్దల అవసరాలు, బంధువులు వస్తే హడావుడి తదితర కారణాలతో ఇంట్లోనే ఆఫీస్ స్పేస్ ఇస్తే ఇష్టపడటం లేదు.ఇదీ చదవండి: హైదరాబాద్లో అక్కడ.. కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!క్లబ్హౌస్లో ప్రత్యేకంగా కో–వర్కింగ్ స్పేస్ ఇస్తున్నారు. హై నెట్వర్క్ స్పీడ్తో వైఫై సేవలను అందిస్తున్నారు. కూర్చునేందుకు వీలుగా మంచి కుర్చీలు, ఇతరత్రా ఏర్పాట్లను చేస్తున్నారు. దీంతో ఆయా నివాస సముదాయంలో వర్క్ ఫ్రం హోమ్ చేసుకునే నివాసితులందరూ ఒకే చోట పనిచేసుకునే వీలు కలుగుతుంది. దీంతో ఇంట్లో ఎలాంటి అంతరాయం కలగదు. పైగా అత్యవసర సమయంలో వెంటనే ఇంటికి చేరుకోవచ్చు. -
వెస్ట్ హైదరాబాద్.. వామ్మో ఎంత ఎత్తో..
హైదరాబాద్ నగరంలో హైరైజ్ నిర్మాణాలు (High rise apartments)ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో పాతిక ఫ్లోర్ల భవనం అంటే.. వామ్మో అనుకునే పరిస్థితి. కానీ, ఇప్పుడు 50 అంతస్తులపైనే నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. స్కై స్క్రాపర్లలో (skyscrapers) నివాసం అనేది స్టేటస్ సింబల్గా మారిపోవడంతో ప్రవాసులు, ఎంటర్ప్రెన్యూర్లు, బ్యూరోక్రాట్ల అభిరుచి మేరకు డెవలపర్లు పోటాపోటీగా ఆకాశహర్మ్యాలను నిర్మిస్తున్నారు.దీంతో పశ్చిమ హైదరాబాద్లో (hyderabad) తలెత్తి చూస్తే తప్ప అపార్ట్మెంట్ కనిపించని పరిస్థితి! దేశంలో హైరైజ్ ప్రాజెక్ట్లకు పెట్టింది పేరు ముంబై. ఇక్కడ భూమి లభ్యత తక్కువ కాబట్టి వర్టికల్ నిర్మాణాలు సహజమే. కానీ, హైదరాబాద్లో భూమి లభ్యత ఉన్నప్పటికీ అధిక ధరల కారణంగా డెవలపర్లు హైరైజ్ ప్రాజెక్ట్లను చేయక తప్పని పరిస్థితి. మరోవైపు అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులున్న ప్రాంతంలో నివాసం ఉండేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తుండటంతో ఎత్తయిన గృహ సముదాయాలు వెలుస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోవెస్ట్లోనే ఎక్కువ.. షేక్పేట, రాయదుర్గం, మదీనాగూడ, ఖాజాగూడ, పుప్పాలగూడ, గండిపేట, కోకాపేట, గచ్చిబౌలి, నానక్రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లోనే ఎక్కువగా హైరైజ్ ప్రాజెక్ట్లు నిర్మాణంలో ఉన్నాయి. ప్రవాసులు, హెచ్ఎన్ఐలు సెకండ్ డెస్టినేషన్గా హైదరాబాద్లో లగ్జరీ అపార్ట్మెంట్ ఉండాలని కోరుకుంటున్నారు. అధిక అద్దెలు, ఆస్తుల విలువల పెంపు కారణంగా పెట్టుబడిదారులు ఇలాంటి ప్రాజెక్ట్లను ఎంచుకుంటున్నారు. దీంతో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులున్న పశ్చిమ హైదరాబాద్లోనే ఆకాశహర్మ్యాలు ఎక్కువగా వస్తున్నాయి. భవనం ఎత్తు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం పెరుగుతుంది కాబట్టి హైరైజ్ ప్రాజెక్ట్లలో అపార్ట్మెంట్ల ధరలు ప్రీమియంగానే ఉంటాయి.బాల్కనీలోంచి సిటీ వ్యూ.. ప్రస్తుతం నగరంలో 200 మీటర్ల ఎత్తు అంటే 50 నుంచి 59 అంతస్తుల హైరైజ్ ప్రాజెక్ట్లు నిర్మాణంలో ఉన్నాయి. ప్రవాసులు, హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్, ఎంటర్ప్రెన్యూర్లు, ఐటీ, ఫార్మా రంగాల్లోని ఉన్నతోద్యోగులు ఎక్కువగా ఆకాశహర్మ్యాలలో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. హైరైజ్ ప్రాజెక్ట్ల ఎంపికకు మరో ప్రధాన కారణం సిటీ వ్యూ.. 200 మీటర్ల ఎత్తులోని ఫ్లాట్లోంచి చూస్తే సిటీ మొత్తం కనిపిస్తుంది. ఉదయం, సాయంత్రం సమయాల్లోని నగరంలోని పరిసరాలను ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా హైఎండ్ కుటుంబాలు, అభిరుచులు కలిగిన నివాసితులు ఒకే చోట ఉండటంతో వారి మధ్య సామాజిక బంధం మరింత బలపడుతుంది. జీవన నాణ్యత మెరుగవుతుంది.స్వచ్ఛమైన గాలి, వెలుతురుఅత్యంత ఎత్తులో ఫ్లాట్ ఉంటుంది కాబట్టి వాహనాల ధ్వని, వాయు కాలుష్య సమస్యలూ ఉండవు. ఏకాంతం కోరుకునేవారికి అనువైన గృహాలివే. పైగా ఇంట్లోకి ధారాళమైన గాలి, వెలుతురు, సూర్యరశ్మి వస్తాయి. ఈ ప్రాజెక్ట్లకు చేరువలోనే అంతర్జాతీయ విద్యా, వైద్య సంస్థలు, వినోద కేంద్రాలు, నిత్యావసరాలు అన్నీ లభ్యమవుతాయి. ఇంట్లో ఉన్నంత సేపు కుటుంబ, వృత్తి, కెరీర్ వంటి వ్యాపకాలపై ఫోకస్ చేయవచ్చు. వీటిల్లో క్లబ్ హౌస్తో పాటు వాకింగ్, జాగింగ్ ట్రాక్లు, స్విమ్మింగ్ పూల్, జిమ్, డే కేర్ సెంటర్, మెడిటేషన్ హాల్స్, వెయిటింగ్ రూమ్స్ వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి. సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి.మరింత మౌలిక వసతులు కల్పించాలి పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు గృహాలను అందించాలంటే హైరైజ్ నిర్మాణాలే సరైనవి. కాకపోతే ప్రజల జీవన నాణ్యత మెరుగు పరిచేందుకు అవసరమైన రహదారులు, నీటి సరఫరా, మురుగు నీటి వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలి. – ప్రశాంత్రావు, డైరెక్టర్, పౌలోమీ ఎస్టేట్స్ -
కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!
ఐటీ రంగంలో దాదాపు 80 శాతం వరకు హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. అక్కడకు సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో నివాసం ఉండాలంటే.. కోకాపేట ప్రాంతం చూసుకుంటే అక్కడ చదరపు అడుగు ధర దాదాపు రూ.12–14 వేల వరకు ఉంటోంది. మిగిలిన ప్రాంతాలన్నీ ఇప్పటికే బాగా రద్దీగా ఉంటున్నాయి. దాంతో ఇప్పుడు చాలామంది బాలానగర్ వైపు చూస్తున్నారు. - సాక్షి, సిటీబ్యూరోఒకప్పుడు బాలానగర్ అంటే పారిశ్రామికవాడ అని, భూగర్భ జలాలు కలుషితం అయ్యాయని, గాలి కూడా కాలుష్యంతో ఉంటుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి అభిప్రాయాలు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నవి.. కేవలం నైఫర్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ), సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు మాత్రమే.ఒకప్పుడు ఇక్కడ ఉండే ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ (ఐడీపీఎల్) వంటి కంపెనీలు కొన్ని వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించినా, అది చాలాకాలం క్రితమే మూతపడింది. పైపెచ్చు, ఈ కంపెనీకి చెందిన 100 ఎకరాల భూముల్లో పచ్చదనం విస్తరించింది. ఇంతకుముందు బాలానగర్ దాటి చింతల్, గుండ్లపోచంపల్లి ప్రాంతాల వరకు గేటెడ్ కమ్యూనిటీలు విస్తరించాయి గానీ, బాలానగర్లో ఇంతకుముందు రాలేదు.లగ్జరీ నిర్మాణాలు షురూ.. ఇప్పుడిప్పుడే బాలానగర్ వైపు కూడా లగ్జరీ నిర్మాణాలు మొదలవుతున్నాయి. కోకాపేటతో సహా ఇతర ప్రాంతాల్లో లభించే సదుపాయాలన్నీ ఇక్కడ కూడా లభిస్తున్నాయి. కానీ, కోకాపేటలో చదరపు అడుగు దాదాపు రూ.12–14 వేలు ఉండగా, ఇక్కడ దాదాపు రూ.6 నుంచి రూ.7 వేలకే లభ్యమవుతున్నాయి. అంటే ఇంచుమించు కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.హైటెక్ సిటీకి బాలానగర్ ప్రాంతం కూడా దాదాపు 12–13 కిలో మీటర్ల దూరంలోనే ఉంది. అయితే, ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు వంటి మౌలిక సదుపాయాలు రావడంతో అర గంటలోపే బాలానగర్ నుంచి హైటెక్ సిటీకి చేరుకోవచ్చు. పైగా ఈ ప్రాంతంలో మంచి పెద్ద పెద్ద స్కూళ్లు, ఇంజినీరింగ్ కాలేజీలు కూడా ఇక్కడ ఉండటంతో పిల్లల చదువుల గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. మాల్స్, మల్టీప్లెక్సులు కూడా ఉండటంతో వినోదం, విహారానికి కూడా మంచి అవకాశాలున్నాయి.బాలానగర్ వైపు.. మాదాపూర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో లగ్జరీ ఫ్లాట్లు కావాలంటే ఎంత లేదన్నా కనీసం రూ.6 నుంచి రూ.7 కోట్లకుపైగా పెట్టాలి. అదే బాలానగర్లో లగ్జరీ ఫ్లాటు అంటే దాదాపు 2 వేల చ.అ. విస్తీర్ణం ఉండే ఫ్లాటు అన్ని సౌకర్యాలతో కలిపి కూడా సుమారు రూ.కోటిన్నర– రెండు కోట్లలోపే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైటెక్ సిటీకి సమీపంలో ఇంత తక్కువ ధరలో, అన్ని సదుపాయాలు ఉన్న ప్రాంతంలో దొరకడం దాదాపు ఇంకెక్కడా లేదు. కాబట్టి, ఐటీ జనాలు క్రమంగా ఇప్పుడు బాలానగర్ వైపు చూస్తున్నారు. గతంలో వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసినా, చివరకు హైదరాబాద్ వచ్చి స్థిరపడాలని అనుకుంటున్నవారు కూడా బాలానగర్ ప్రాంతం వైపు మొగ్గు చూపుతున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఇల్లు.. ఇదే కొత్త ట్రెండు!
సొంతిల్లు ప్రతి ఒక్కరి స్వప్నం.. దానికి తగ్గట్టుగానే ఇంటిని (homes) అభిరుచికి తగ్గట్లు నిర్మించుకోవడంతో పాటు సరికొత్త ఇంటీరియర్ (interior) ఏర్పాటు చేసుకుంటున్నారు. విల్లా, ఫ్లాట్, ఇండిపెండెంట్ హౌజ్ ఇలా ఏదైనా సరే.. కొత్తదనం కొట్టొచ్చినట్లు కనిపించేలా తీర్చిదిద్దుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు నగరవాసులు. ఇంట్లోకి అడుగు పెట్టగానే వావ్ అనిపించేలా హాల్, మోడ్రన్ కిచెన్, బెడ్రూమ్స్తో పాటు బాల్కనీని (balcony) ముస్తాబు చేసుకుంటున్నారు. కాఫీ కప్పుతో అలా బాల్కనీలోకి వెళ్తే మనసుకు హాయినిచ్చేలా మలుచుకుంటున్నారు. చాలామంది గ్రీనరీ ఫీల్ కోసం ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ లాన్ ఏర్పాటు చేసుకొని అందమైన మొక్కలతో అలంకరిస్తున్నారు. బాల్కనీ, పెంట్హౌస్ సైజును దృష్టిలో ఉంచుకొని కొన్ని సంస్థలు ప్రత్యేక డిజైన్లతో మైమరపిస్తున్నాయి.కరోనా కాలం తర్వాత నగరవాసులు ఎన్నో నూతన ఒరవడుల వైపు ఆసక్తి కనబరిచారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు (software employees) ఇలాంటి వాటికి అధికంగా మొగ్గుచూపారు. దీనికి ఓ కారణం ఉంది.. లాక్డౌన్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ (work from home) కారణంగా అధిక సంఖ్యలో ఉద్యోగులు ఇళ్లలో ఉండటం, వర్క్ స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం ఇంట్లో ఇంటీరియర్తో పాటు బాల్కనీ ఆహ్లాదకరంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వర్క్ మధ్యలో ఫ్యామిలీతో అలా బాల్కనీ, పెంట్హౌస్లో కూర్చొని సరదాగా కాసేపు గడిపి మళ్లీ పని చేసుకుంటున్నారు. నగరంలో వేగంగా విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ (real estate) వ్యాపారంతో సమానంగా ఇంటీరియర్, పలు థీమ్స్తో కొన్ని సంస్థలు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు ఒకలా.. ఇప్పటి నుంచి మరోలా అనే విధంగా ముస్తాబు చేస్తున్నాయి. అపార్ట్మెంట్స్ బాల్కనీ.. అపార్ట్మెంట్ బాల్కనీ కొద్ది స్పేస్ అయినా వాటిని మరింత సుందరీకరణకు మొగ్గు చూపుతున్నారు. కొందరు వారికి నచ్చిన థీమ్స్తో డిజైన్ చేయించుకుంటారు. థీమ్ నేమ్స్, లైటింగ్ కొటేషన్స్, సేఫ్టీ కోసం ఇన్విజిబుల్ గ్రిల్స్, వాల్ ఆర్ట్ను ఎంచుకుంటున్నారు. వర్క్ఫ్రమ్ హోమ్ ఉన్న వారు బాల్కానీని ఆఫీస్ థీమ్స్తో పాటు పలు విభిన్న థీమ్స్తో సిటీ వ్యూ చూస్తూ డిజైన్స్ కోరుకుంటున్నారు. పిల్లలకు స్టడీస్ ఇంట్రెస్ట్ రావడానికి సరికొత్త డిజైన్స్ ఎంచుకుంటున్నారు. గ్రీనరీతో పాటు ఉన్న స్పేస్లో మొక్కలు, రెండు మూడు రకాల కూరగాయలు పెంచుతున్నారు. త్రీ బెడ్రూమ్స్లో ఒక బెడ్రూమ్లో కొత్త థీమ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. విల్లాస్ కల్చర్ పెరిగింది. పెంట్హౌస్లో ఉన్న స్పేస్కి చాలా ఖర్చు పెడుతున్నారు. సిటీ వ్యూ కనబడేలా అవుట్ డోర్ స్విమ్మింగ్ పూల్, జెకూజీ, బార్ కౌంటర్, హోమ్ థియేటర్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.ఫ్యూచర్లో బాల్కనీ స్పేస్ పెరుగుతుంది విల్లాస్, అపార్ట్మెంట్స్లో ఇంటీరియర్కి ఎంతో ఖర్చు చేస్తున్నారు. అందులో భాగంగానే బాల్కనీని చేరుస్తున్నారు. ఫ్యూచర్లో బాల్కనీ స్పేస్ రెట్టింపు అవుతుంది. గ్రీనరీ, ఇంట్లోనే వెజిటబుల్స్ పెంచుకొనేలా ఉన్న స్పేస్తో కాకుండా కొత్త స్పేస్ ఇచ్చే ఆలోచన అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీలో వస్తోంది. వచ్చిన అతిథులు బాల్కనీ, పెంట్హౌస్ చూసి వావ్ అనేలా ఉండాలని కోరుకుంటున్నారు. వారు బాల్కనీ, పెంట్హౌస్లనే ఇష్టపడేలా డిజైన్ చేసుకుంటున్నారు. వర్క్ఫ్రమ్ హోమ్ ఉన్న వారు ఆఫీస్ థీమ్స్తో పాటు పలు విభిన్న థీమ్స్తో సిటీ వ్యూ ఉండేలా డిజైన్స్ కోరుకుంటున్నారు. పిల్లలకు స్టడీస్ పట్ల ఇంట్రెస్ట్ రావడానికి వారికి నచ్చినట్లు డిజైన్ చేస్తున్నారు. గ్రీనరీతో పాటు ఉన్న స్పేస్లో మొక్కలు, రెండు మూడు రకాల కూరగాయలు పెంచుతున్నారు. – హేమలత రామా, స్వర్గ బాల్కనీ మేకోవర్స్, సీఈఓ -
ప్రాపర్టీ ఎంపికలో పిల్లలూ కీలకమే..
‘మా వాడికేం తెలుసు, వాడింకా చిన్నపిల్లోడే..’ ‘పెద్దవాళ్ల నిర్ణయాల్లో చిన్నోడివి తలదూర్చటం ఎందుకు..?’ ‘నీకింకా నిర్ణయం తీసుకునేంత వయస్సు రాలేదులే..’..పిల్లల విషయంలో మన పెద్దల అభిప్రాయాలివీ. కానీ, నేటి జనరేషన్ పేరెంట్స్ ఇలాంటి మాటలకు టాటా చెప్పేశారు. ఎందుకంటే ఇప్పుడు ప్రాపర్టీ(Property) ఎంపికలో పిల్లలే అంతిమ నిర్ణేతలయ్యారు. పిల్లల అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా ఉన్న ప్రాజెక్ట్లకే తల్లిదండ్రులు జై కొడుతున్నారు. దీంతో ప్రాజెక్ట్ ఎలివేషన్ నుంచి వసతుల వరకూ పిల్లలను ఆకట్టుకునే ప్రత్యేక థీమ్లు, క్లబ్హౌస్లతో నిర్మాణ సంస్థలు ప్రాజెక్ట్లను చేపడుతున్నాయి. ఇల్లంటే నాలుగు గోడలు కాదు.. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరి అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా ఉండాలి. అందుకే మూస ధోరణిలో నిర్మించే ప్రాజెక్ట్(Project)లను కొనుగోలుదారులు ఆదరించడం లేదు. ఇది వరకు అంతగా పట్టించుకోని చిన్నారుల అవసరాలే ఇప్పుడు గృహ కొనుగోలు నిర్ణయాలను చాలా వరకు ప్రభావితం చేస్తున్నాయి. విదేశీ తరహాలో నిర్మాణం, ఆధునిక వసతులు ఉండే ప్రాజెక్ట్లలో కొనుగోళ్లకే మొగ్గు చూపిస్తున్నారు. అవును.. సొంతిల్లు కొంటున్నామంటే ఇప్పుడు పిల్లల అభిరుచులు, అవసరాలు తీరడం కూడా ముఖ్యమే. – సాక్షి, సిటీబ్యూరోపెద్దలు వృత్తి, ఉద్యోగ రీత్యా అధిక సమయం బయటే గడుపుతారు. వాస్తవానికి ఇంట్లో ఎక్కువ సమయం గడిపేది చిన్నారులే. పాఠశాల సమయం మినహా మిగతా సమయం ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో, పరిసరాల్లో వీరి అవసరాలు తీరే వసతులు ఏ మేరకు ఉంటున్నాయనేది కీలకం. సౌకర్యాలంటే ప్రత్యేకంగా వారికంటూ ఒక గది, అందులో నచ్చేట్లుగా ఉండే రంగులు, ఇంటీరియర్(interior) మాత్రమే కాదన్నది నేటితరం పిల్లల భావన. బయట పరిసరాలు వీరిని ఎక్కువ ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి కేవలం బాల్యం వరకే కాదు పెరిగి పెద్దయ్యే వరకూ చుట్టుపక్కల తగిన వసతులు ఉండేలా చూడటం పెద్దల బాధ్యత. కొత్తగా పెళ్లయిన దంపతులు సైతం ఇల్లు కొనేటప్పుడు పిల్లల గురించి పరిగణలోకి తీసుకోవడం మర్చిపోవద్దు.కిడ్స్ థీమ్లతో ప్రాజెక్ట్లు..నివాస సముదాయంలోని క్లబ్హౌస్లు కమ్యూనిటీ లివింగ్ను ప్రోత్సహించడంతో పాటు పిల్లలకు మంచి అలవాట్లు పెంపొందేందుకు సహాయపడతాయి. దీంతో నిర్మాణ సంస్థలు డిస్నీ, హ్యారీపోర్టర్ వంటి కిడ్స్ థీమ్(Kids Theme)లతో కూడిన ప్రాజెక్ట్లను నిర్మిస్తున్నాయి. వీటిల్లో చిన్న పిల్లలు ఆడుకునే క్రమంలో కిందపడిపోయినా గాయాలు కాకుండా మృదువైన ఆట పరికరాలు, ఇంటరాక్టివ్ అండ్ ఎడ్యుకేషనల్ టాయ్స్ ప్లే ఏరియాలు, ఆర్ట్, డ్యాన్స్ ఇతరత్రా హాబీల శిక్షణ తరగతుల కోసం యాక్టివిటీ జోన్లు, చిట్టడవి, శాండ్ పిట్స్, ట్రీ బెంచ్, మినీ సాకర్ ఫీల్డ్, యాంపీ థియేటర్ వంటి ఇతరత్రా వసతుల జోన్లను కల్పిస్తున్నారు.మంచి కమ్యూనిటీ, ప్లేగ్రౌండ్ఒకవైపు విశాలమైన ఆట స్థలాలు, వినూత్నమైన ఎలివేషన్లతో పిల్లలను ఆకట్టుకుంటే.. మరోవైపు ప్రాజెక్ట్లోనే క్రచ్, ప్లేగ్రౌండ్, మంచి కమ్యూనిటీ వంటి వాటితో తల్లిదండ్రులనూ కట్టిపడేస్తున్నారు బిల్డర్లు. అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆస్పత్రికి వెళ్లేందుకు ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, వర్షం కురుస్తున్నప్పుడు ఇంటి నుంచి కిలో మీటర్ల దూరం ఉండే స్కూల్కు పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు ఏమాత్రం ఇష్టపడట్లేదు. అందుకే అపార్ట్మెంట్ కొనుగోలు చేసేముందు పిల్లల అవసరాలు, ఆరోగ్యాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రాజెక్ట్లోనే స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి వసతులే కాదు, ఇందులోనే కమ్యూనిటీ మంచి సర్కిల్, ప్లేగ్రౌండ్ వంటివి ఉంటేనే కొనేందుకు ముందుకొస్తున్నారు. పార్కులు, థియేటర్లు, మాల్స్, రెస్టారెంట్లు ఉన్నాయో లేవో కూడా కొనుగోలుదారులు చూస్తున్నారని నిర్మాణదారులు అంటున్నారు. ధరలపై ప్రభావం..వసతులన్నీ ఉంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెంది ఉంటుంది. సహజంగానే దీని ప్రభావం ధరలపై ఉంటుంది. పేరున్న పాఠశాలలు, ఆస్పత్రులు, ప్రజా రవాణా, మాల్స్ ఉన్నట్లయితే ఎక్కువ మంది ఆ చుట్టుపక్కల నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతుంటారు. దీంతో కొత్త నిర్మాణాలకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. ఇవన్నీ చూపెట్టి ఆయా ప్రాంతంలో ఉన్న ధరల కంటే ఎక్కవ ధరకు విక్రయించేవారు ఉంటారు. నాణ్యమైన నిర్మాణం, గడువులోగా పూర్తి చేసే నిర్మాణదారులనే అంతిమంగా ఎంపిక చేసుకోవాలి.అభిరుచుల కోసం క్లబ్హౌస్లు..ప్రస్తుతం మార్కెట్లో చాలా ప్రాజెక్ట్లు పిల్లల వసతులపై దృష్టిపెడుతున్నాయి. వారు ఆటలాడుకునేందుకు ప్రత్యేకంగా స్థలం కేటాయిస్తున్నాయి. తక్కువ లోతులో ఈత కొలనులు నిర్మిస్తున్నాయి. పెద్దలకే కాదు పిల్లల కోసం వేర్వేరు ప్లే కోర్టులను తమ ప్రాజెక్ట్లో చేరుస్తున్నాయి. తక్కువ స్థలంలో నిర్మాణాలు చేపడుతూ ఖాళీ స్థలం ఎక్కువ ఉండేలా పచ్చదనానికి పెద్దపీట వేస్తున్నాయి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రత్యేకంగా ట్యూషన్లు చెప్పిస్తుంటారు. ఈ దృష్ట్యా కొన్ని నిర్మాణ సంస్థలు అపార్ట్మెంట్లలోనే ట్యూషన్ గదులను నిర్మిస్తున్నాయి. వ్యాపకాలు, అభిరుచులకు పదును పెట్టేలా చిన్నారుల కోసం ప్రత్యేకంగా క్లబ్హౌస్లను నిర్మించడం నేటి పోకడ. ఉద్యోగాలకు వెళ్లిన తల్లిదండ్రుల కంటే పిల్లలు పాఠశాల నుంచి ముందుగానే ఇంటికి చేరుకుంటారు. అమ్మానాన్న వచ్చే వరకు వీరు క్లబ్ హౌస్లో ఇతర నైపుణ్యాలను పెంపొందించుకునే కార్యక్రమాల్లో పాల్గొనే సదుపాయం కల్పిస్తున్నాయి.నేటి పేరెంట్స్ నిర్ణయంలో మార్పులుమెట్రో నగరాల్లో భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయక తప్పని పరిస్థితి. దీంతో పిల్లలకు సమయం కేటాయించలేని పరిస్థితి. అందుకే కనీసం నివాసం ఉండే ప్రాజెక్ట్లోనైనా పిల్లల అవసరాలు, అభిరుచులను తీర్చేవిధంగా ఉండాలని భావిస్తున్నారు. చిన్నారులకు భద్రమైన, ఆధునిక వసతులను అందించే ప్రాజెక్ట్లను కోరుకుంటున్నారు.– వంశీకృష్ణ, డైరెక్టర్, ప్రైమార్క్ డెవలపర్స్ -
హైదరాబాద్లో ఆఫీస్ లీజింగ్ కళకళ
హైదరాబాద్ (Hyderabad) మార్కెట్లో కార్యాలయ స్థలాలకు (office space) బలమైన డిమాండ్ కొనసాగుతోంది. ప్రస్తుత ఏడాది మొత్తం మీద గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 56 శాతం పెరిగి 12.5 మిలియన్ చదరపు అడుగులు (ఎస్ఎఫ్టీ)గా ఉన్నట్టు కొలియర్స్ ఇండియా (Colliers) నివేదిక వెల్లడించింది. క్రితం ఏడాది లీజు పరిమాణం 8 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉన్నట్టు పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఈ ఏడాది 14 శాతం పెరిగి 66.4 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉన్నట్టు కొలియర్స్ నివేదిక తెలిపింది. క్రితం ఏడాది ఇవే పట్టణాల్లో స్థూల కార్యాలయ స్థలాల లీజింగ్ 58.2 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉంది. పట్టణాల వారీగా.. » బెంగళూరులో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 21.7 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. క్రితం ఏడాది 15.6 మిలియన్ ఎస్ఎఫ్టీ లీజుతో పోల్చితే 39 శాతం పెరిగింది. » ముంబైలోనూ 43 శాతం వృద్ధితో 10 మిలియన్ ఎస్ఎఫ్టీగా నమోదైంది. » పుణెలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ క్రితం ఏడాదితో పోల్చి చూస్తే 4 శాతం పెరిగి 5.7 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. » చెన్నైలో స్థూల లీజింగ్ 35 శాతం క్షీణతతో 6.8 మిలియన్ ఎస్ఎఫ్టీకి పరిమితమైంది. 2023లో ఇదే పట్టణంలో లీజింగ్ 10.5 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉంది. » ఢిల్లీ ఎన్సీఆర్లోనూ 16 శాతం తక్కువగా 9.7 మిలియన్ ఎస్ఎఫ్టీ లీజు నమోదైంది.2025లోనూ గరిష్ట స్థాయిలోనే.. టెక్నాలజీ, ఇంజనీరింగ్, తయారీ కంపెనీలతోపాటు ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీల నుంచి ఆఫీస్ స్థలాలకు ఈ ఏడాది డిమాండ్ ఎక్కువగా ఉన్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. 2025లోనూ ఆఫీస్ స్పేస్ లీజింగ్ గరిష్ట స్థాయిలోనే కొనసాగొచ్చొని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సర్వీసెస్ విభాగం ఎండీ అర్పిత్ మెహరోత్రా అంచనా వేశారు. వచ్చే కొన్నేళ్ల పాటు లీజింగ్ 60 మిలియన్ ఎస్ఎఫ్టీకి మించి కొనసాగడం సాధారణ అంశంగా మారుతుందన్నారు. గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీలు) నుంచి స్థిరమైన డిమాండ్ కొనసాగడం పెద్ద పరిమాణంలో ఆఫీస్ స్థలాల లీజింగ్కు మద్దతుగా నిలుస్తున్నట్టు బెంగళూరు కేంద్రంగా పనిచేసే సుమధుర గ్రూప్ సీఎండీ మధుసూదన్ పేర్కొన్నారు. లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్ వసతులకూ డిమాండ్ దేశవ్యాప్తంగా టాప్–8 నగరాల్లో లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్ (ఎల్అండ్ఐ) వసతుల లీజింగ్ ప్రస్తుత ఏడాది మొత్తం మీద 50–53 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉండొచ్చని కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ తెలిపింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా, పుణె, అహ్మదాబాద్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) పరిధిలో గతేడాది లాజిస్టిక్స్ అండ్ ఇండస్ట్రియల్ వసతుల లీజింగ్ 53.57 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉన్నట్టు పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్ వరకు లీజింగ్ ఈ నగరాల్లో 41 మిలియన్ ఎస్ఎఫ్టీని అధిగమించినట్టు తెలిపింది.‘‘ప్రభుత్వం 2020లో ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) ప్రకటించిన నాటి నుంచి ఇండస్ట్రియల్ స్థలాల లీజింగ్లో మెరుగైన వృద్ధి నమోదవుతోంది. దీనికితోడు రిటైల్, ఈ–కామర్స్ సైతం బలంగా అవతరించడం డిమాండ్కు మద్దతుగా నిలిచింది’’అని ఈ నివేదిక వెల్లడించింది. బలమైన పారిశ్రామిక కార్యకలాపాలకు తోడు వినియోగ దోరణి విస్తృతం కావడంతో 2025లో లీజింగ్ బలంగా కొనసాగొచ్చని అంచనా వేసింది. చైనా ప్లస్ వన్ విధానంతో భారత్ సైతం ప్రయోజనం పొందుతుండడం ఈ రంగాల్లో డిమాండ్కు కలిసొస్తున్నట్టు వివరించింది. -
హైదరాబాద్లో ఇల్లు.. రూ.కోటి అయినా కొనేద్దాం!
కరోనా తర్వాత నుంచి విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో హైదరాబాద్లో గృహాల ధరలు పెరిగిపోయాయి. 2024 తొలి అర్ధ ఆర్థిక సంవత్సరం(హెచ్1)లో నగరంలో ఇళ్ల సగటు ధర రూ.84 లక్షలుగా ఉండగా.. 2025 హెచ్1 నాటికి రూ.1.15 కోట్లకు పెరిగింది. ఏడాది కాలంలో 37 శాతం ధరలు వృద్ధి చెందాయని అనరాక్ తాజా నివేదిక వెల్లడించింది. అలాగే నగరంలో 2024 హెచ్1లో రూ.25,059 కోట్లు విలువ చేసే 29,940 యూనిట్లు అమ్ముడుపోగా.. 2025 హెచ్1 నాటికి 27,820 ఇళ్లు విక్రయించారు. వీటి విలువ రూ.31,993 కోట్లు. - సాక్షి, సిటీబ్యూరోదేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో విక్రయాలు, లాంచింగ్స్ రికార్డు స్థాయిలో జరిగాయి. 2024 హెచ్1 గృహాల ధర సగటున రూ.కోటిగా ఉండగా.. 2025 హెచ్1 నాటికి 23 శాతం పెరిగి, ఏకంగా రూ.1.25 కోట్లకు చేరింది. ఇక, 2024 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో టాప్–7 సిటీస్లో రూ.2,79,309 కోట్లు విలువ చేసే 2,27,400 యూనిట్లు అమ్ముడుపోగా.. 2025 హెచ్1 నాటికి రూ.2,35,800 కోట్ల విలువైన 2,35,200 విక్రయమయ్యాయి. యూనిట్ల అమ్మకాల్లో 3 శాతం క్షీణత ఉన్నప్పటికీ.. సేల్స్ వ్యాల్యూ మాత్రం 18 శాతం పెరిగింది.ఇదీ చదవండి: హైదరాబాద్ రియల్ఎస్టేట్లో కొత్త మైక్రో మార్కెట్..ముంబైలో స్థిరంగా ధరలు.. ఆసక్తికరంగా ఏడాది కాలంలో ముంబై(ఎంఎంఆర్)లో యూనిట్ల ధరలు పెరగలేదు. 2024 హెచ్1లో ధర సగటున రూ.1.45 కోట్లుగా ఉండగా.. 2025 హెచ్1లోనూ అదే ధర ఉంది. ఇక, అత్యధికంగా ఢిల్లీ–ఎన్సీఆర్లో ఇళ్ల ధరలు పెరిగాయి. 2024 హెచ్1లో ఇక్కడ ధర సగటు రూ.93 లక్షలు కాగా.. 2025 హెచ్1 నాటికి రూ.1.45 కోట్లకు పెరిగాయి. ఆ తర్వాత బెంగళూరులో గతంలో రూ.84 లక్షలు ఉండగా.. ఇప్పుడు రూ.1.21 కోట్లు, చెన్నైలో రూ.72 లక్షల నుంచి రూ.95 లక్షలకు, పుణేలో రూ.66 లక్షల నుంచి రూ.85 లక్షలకు, అలాగే 2024 హెచ్1లో కోల్కత్తాలో యూనిట్ ధర సగటు రూ.53 లక్షలుగా పలకగా.. 2025 హెచ్1 నాటికి రూ.61 లక్షలకు పెరిగింది. -
రికార్డు స్థాయిలో ఆఫీస్ లీజింగ్
న్యూఢిల్లీ: కార్యాలయ వసతుల(ఆఫీస్ స్పేస్) మార్కెట్ ఈ ఏడాది మంచి జోరును కొనసాగించింది. గతేడాదితో పోల్చితే సుమారు 14 శాతం అధికంగా 85 మిలియన్ చదరపు అడుగుల మేర (ఎస్ఎఫ్టీ) స్థూల లీజింగ్ ఈ ఏడాది ఎనిమిది ప్రధాన నగరాల్లో నమోదవుతుందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ తన అంచనాలు వెల్లడించింది. 2023లో ఇవే నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 74.6 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉండడం గమనార్హం.‘‘ఎనిమిది ప్రధాన నగరాల్లో 2022 నుంచి ఆఫీస్ స్పేస్ స్థూల లీజింగ్ ఏటా 70 మిలియన్ ఎస్ఎఫ్టీపైనే ఉంటూ వస్తోంది’’అని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వివరించింది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 66.7 మిలియన్ ఎస్ఎఫ్టీ స్థూల లీజింగ్ లావాదేవీలు జరిగినట్టు ప్రకటించింది. స్థూల ఆఫీస్ స్పేస్ లీజింగ్ 2018లో 49.1 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2019లో 67.7 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2020లో 46.6 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2021లో 50.4 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2022లో 72 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2023లో 74.6 మిలియన్ ఎస్ఎఫ్టీ చొప్పున నమోదైనట్టు ఈ నివేదిక వెల్లడించింది. ఈ రంగాల్లో డిమాండ్ అధికం.. ముఖ్యంగా ఐటీ–బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (ఐటీ–బీపీఎం), బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (బీఎఫ్ఎస్ఐ), ఇంజనీరింగ్, తయారీ రంగాలతోపాటు, ఫ్లెక్స్ ఆపరేటర్ స్పేస్ విభాగాలు ఈ వృద్ధిని నడిపిస్తున్నట్టు కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. ఈ రంగాలు మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు తెలిపింది. ‘‘2024 భారత ఆఫీస్ రంగానికి రికార్డుగా నిలిచిపోతుంది. స్థూల లీజింగ్ ఈ ఏడాది 85 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకోవచ్చు.ఇందులో నికర వినియోగం 45 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉండొచ్చు. భారత వాణిజ్య రియల్ ఎస్టేట్లో అత్యధిక గరిష్ట స్థాయి ఇది’’అని కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ తెలిపింది. మొత్తం ఆఫీస్ లీజింగ్లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ) 30 శాతం వాటా ఆక్రమిస్తాయని పేర్కొంది. డిమాండ్ పెరగంతో ప్రముఖ ప్రాంతాల్లో కార్యాలయ వసతుల అద్దెల పెరుగుదలపై ఒత్తిడి నెలకొన్నట్టు తెలిపింది. ‘‘2025లో అధిక శాతం నూతన వసతుల సరఫరా ప్రముఖ ప్రాంతాల చుట్టూనే ఉండనుంది. స్థిరమైన సరఫరాతో అద్దెల పెరుగుదల మోస్తరు స్థాయిలో ఉండనుంది. దీంతో కిరాయిదారుల అనుకూల సెంటిమెంట్ కొంత కాలం పాటు కొనసాగనుంది’’అని వివరించింది. -
వెలుగులోకి రాని వేల కోట్ల వ్యాపారాధిపతి.. ఎవరీ బిలియనీర్?
విలాసవంతమైన జీవనశైలితో తరచూ వార్తల్లోకి వచ్చే వ్యాపారవేత్తలు భారత్లో అనేక మంది ఉన్నారు. అయితే సంబంధిత వ్యాపార రంగాలలో ప్రముఖంగా ఉన్నప్పటికీ లో ప్రొఫైల్లో ఉండడానికి ప్రయత్నించేవారూ కొందరు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరే రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్ (Vikas Oberoi). బాలీవుడ్ నటిని వివాహం చేసుకున్నప్పటికీ, ప్రజల దృష్టికి దూరంగా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నారు.ఎవరీ వికాస్ ఒబెరాయ్?వికాస్ ఒబెరాయ్.. ఒబెరాయ్ రియాల్టీకి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్. దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఆయన తండ్రి రణవీర్ ఒబెరాయ్ ఈ రియల్-ఎస్టేట్ కంపెనీని స్థాపించారు. ఇది వికాస్ నాయకత్వంలో దేశంలోని అగ్రశ్రేణి రియల్-ఎస్టేట్ సంస్థలలో ఒకటిగా ఎదిగింది. ఆతిథ్యం, రిటైల్, కార్పొరేట్ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్తో సహా విభిన్న రంగాలలోకి ప్రవేశించింది.ముంబైలో హై-ఎండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్లు, వాణిజ్య స్థలాలనెన్నో అభివృద్ధి చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రధాన పేరుగా మారింది. ఒబెరాయ్ రియాల్టీకి అధిపతి మాత్రమే కాకుండా వికాస్ ఒబెరాయ్ ముంబైలోని ఫైవ్ స్టార్ వెస్టిన్ హోటల్ను కూడా కలిగి ఉన్నారు. ప్రస్తుతం నగరంలోని మొదటి రిట్జ్-కార్ల్టన్ హోటల్తోపాటు విలాసవంతమైన నివాస సముదాయాన్ని నిర్మిస్తున్నారు.వికాస్ ఒబెరాయ్ నేపథ్యంముంబైలో పుట్టి పెరిగిన వికాస్ ఒబెరాయ్ నగరంలోని జై హింద్ కళాశాలలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. తరువాత ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఓనర్/ప్రెసిడెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ను పూర్తి చేశారు. విజయవంతమైన వ్యాపారవేత్తగానే కాకుండా, వివేక్ శిక్షణ పొందిన పైలట్ కూడా. ఆయనకు పైలట్ లైసెన్స్ కూడా ఉంది.ప్రముఖ బాలివుడ్ నటి గాయత్రీ జోషిని వికాస్ ఒబెరాయ్ వివాహం చేసుకున్నారు. మోడల్ నుండి నటిగా మారిన ఆమె షారుఖ్ ఖాన్ నటించిన స్వదేశ్ చిత్రంలో గీత పాత్రను పోషించారు. 2005లో పెళ్లి చేసుకున్న ఈ జంట అప్పటి నుండి అందరి దృష్టికి దూరంగా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నారు. వీరికి విహాన్ ఒబెరాయ్, యువన్ ఒబెరాయ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. గతేడాది అక్టోబర్లో వీరు ఇటలీలోని సార్డినియాలో విహారయాత్ర చేస్తుండగా కారు ప్రమాదంలో చిక్కుకుని అదృష్టవశాత్తూ క్షేమంగా బయటపడ్డారు.చదవండి: అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ జీతం ఇంతేనా?వికాస్ ఒబెరాయ్ నెట్వర్త్ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం.. దేశంలోని అత్యంత ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలలో ఒకరైన వికాస్ ఒబెరాయ్ నెట్వర్త్ 6.5 బిలియన్ డాలర్లు (రూ. 45,000 కోట్లు). -
హైదరాబాద్లో బోటింగ్ విల్లాలు..
పొద్దున లేవగానే గలగలా పారే నీటి సవ్వడి.. వీకెండ్ వస్తే కుటుంబంతో కలిసి హ్యాపీగా పడవలో షికారు.. వీటి కోసం ఎక్కడో టూరిస్ట్ ప్లేస్కు వెళ్లాల్సిందేనని అనుకోకండి. నగర స్థిరాస్తి రంగంలోనే తొలిసారిగా ప్రణీత్ గ్రూప్ నివాస సముదాయంలోనే బోటింగ్ సదుపాయాన్ని కల్పిస్తోంది. -సాక్షి, సిటీబ్యూరోగాగిళ్లపూర్లో నిర్మిస్తున్న గ్రూవ్ పార్క్ లగ్జరీ విల్లా గేటెడ్ కమ్యూనిటీలో బోటింగ్ వసతిని అందుబాటులోకి తీసుకురానుంది. ఈమేరకు ప్రాజెక్ట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కంపెనీ డైరెక్టర్ నరేంద్ర కుమార్ కామరాజు తెలిపారు. ప్రాజెక్ట్కు మధ్యలో చెరువు ఉండటంతో నివాసితులకు వినూత్నంగా బోటింగ్ సేవలను అందించాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: హైదరాబాద్ రియల్ఎస్టేట్లో కొత్త మైక్రో మార్కెట్..70 ఎకరాల్లో 884 ట్రిపులెక్స్ విల్లాలను నిర్మిస్తున్నామని, ఇప్పటికే 50 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయని ఆయన చెప్పారు. 167 నుంచి 350 గజాల్లో వేర్వేరు విస్తీర్ణాలలో స్పానిష్ ఆర్కిటెక్చర్ విల్లాలు ఉన్నాయని, ప్రారంభ ధర రూ.1.70 కోట్లుగా నిర్ణయించామని పేర్కొన్నారు. -
ఇంటికి టైల్.. యమస్టైల్!
ఇళ్లు నిర్మించుకోవడం ఒక ఎత్తయితే.. టైల్స్ ఎంపిక మరో ఎత్తు.. ఏ మాత్రం తేడా వచ్చినా ఇంటి అందం పూర్తిగా దెబ్బతింటుంది. అయితే ఎంత పెద్ద ఇల్లు కట్టినా ఆకర్షణీయంగా కనిపించడంలో కీలక పాత్ర పోషించేది నేలపై పరిచే టైల్స్. వాటి డిజైన్ ఎంపిక విషయంలో దాదాపు ఒక యుద్ధం చేసినంత కసరత్తు చేస్తారనడంలో అతిశయోక్తి లేదు. అందుకే చాలా కంపెనీలు కస్టమర్ల అభిరుచులు, ట్రెండ్కు తగ్గట్టు తయారు చేస్తున్నాయి. ప్రతి ఏటా కస్టమర్ల అభిరుచుల్లో చాలా తేడా కనిపిస్తోందని పలు కంపెనీలు చెబుతున్నాయి. రంగులు, డిజైన్లు, ఆకారాల విషయంలో ప్రజలు ఎంతో జాగ్రత్త వహిస్తున్నారని పేర్కొంటున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోప్రకృతి నుంచి స్ఫూర్తి టైల్స్ డిజైన్ రూపొందించే విషయంలో ప్రతి అంశం నుంచి స్ఫూర్తి పొందుతుంటారని తయారీదారులు చెబుతున్నారు. ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కోలా ఉంటుందని, ప్రకృతికి సంబంధించి చెట్లు, పూలు, ఆకులను మనసులో ఉంచుకుని తయారు చేస్తుంటామని పేర్కొంటున్నారు. ఇక, వివిధ రకాల ఆకారాలు కూడా ముఖ్యమని, రంగులు, విభిన్న కాన్సెప్టులతో మార్బుల్, స్టోన్స్తో రూపొందిస్తుంటామని చెబుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో సుస్థిరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తున్నారు.రూ.35 నుంచి ప్రారంభం.. టైల్స్లో కూడా ఒక్కో డిజైన్, ఒక్కో ఆకారాన్ని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంది. ప్రతి చదరపు అడుగు టైల్కు రూ.35 నుంచి రూ.500 వరకు కూడా ఉంది. సెరామిక్ టైల్స్కు కాస్త తక్కువ ధర ఉంటుంది. విట్రిఫైడ్, మార్బుల్ టైల్స్, గ్రానైట్ టైల్స్, వుడ్ లుక్ టైల్స్, సిమెంట్ టైల్స్ వంటి రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మార్బుల్ టైల్స్కు కాస్త ధర ఎక్కువ ఉంటుందని అందరికీ తెలిసిందే. ఎక్కువగా సెరామిక్ టైల్స్కు కస్టమర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ తర్వాత విట్రిఫైడ్ టైల్స్కు, ఆ తర్వాత వేరే రకం టైల్స్ను వాడుతున్నారు. ఏటా భారీస్థాయిలో వృద్ధి.. టైల్స్ రంగం ఏటా భారీ స్థాయిలో వృద్ధి నమోదు చేస్తోంది. ఏటా 11.96 శాతం పెరుగుదల కనిపిస్తోందని కెన్ పరిశోధనలు తేల్చాయి. 2023లో టైల్స్ మార్కెట్ ఏకంగా 8,543.9 మిలియన్ డాలర్లు నమోదు చేయగా, 2030 నాటికి ఈ మార్కెట్ విలువ ఏకంగా 13,265.2 మిలియన్ డాలర్లకు ఎగబాకుతుందని అంచనా వేస్తున్నారు. 2024 నుంచి 2030 మధ్య ఈ రంగం ఏకంగా 6.5 శాతం వృద్ధి నమోదు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దినుసుల స్ఫూర్తిగా.. దేశంలోని మసాలా దినుసులను స్ఫూర్తిగా తీసుకుని టైల్స్ డిజైన్ రూపొందిస్తుంటాను. భారతీయత ఉట్టిపడేలా, ఇక్కడి ప్రకృతి రమణీయతను టైల్స్ డిజైన్స్లో ఉండేలా చూసుకుంటాను. అనేక దేశాల్లో ఇలాంటి డిజైన్స్కు యమ గిరాకీ ఉంది. ప్రజల అభిరుచికి తగ్గట్టు టైల్స్ డిజైన్స్ రూపొందించేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటాను. – మారియా కాస్టిలో, రీజెన్సీ టైల్స్ చీఫ్ డిజైనర్ -
హైదరాబాద్ రియల్ఎస్టేట్లో కొత్త మైక్రో మార్కెట్
బోనమెత్తిన భక్తుల కోర్కెలు తీర్చే గ్రామదేవతగా పూజించే గండిమైసమ్మ.. అందుబాటు ధరల్లోనే సామాన్య, మధ్యతరగతి సొంతింటి కలనూ తీరుస్తోంది. అర్ధగంట ప్రయాణ వ్యవధిలోనే ఐటీ కారిడార్కు చేరుకునే వీలు, శంషాబాద్ విమానాశ్రయంతో పాటు ఇతర జిల్లా కేంద్రాలకు చేరుకునేందుకు ఔటర్ రింగ్ రోడ్డుతో కనెక్టివిటీ.. సమీప దూరంలోనే అంతర్జాతీయ విద్యా, వైద్య సంస్థలు, వినోద, ఉపాధి కేంద్రాలు.. అన్నింటికీ మించి అందుబాటులోనే గృహాల ధరలు ఉండటంతో బహదూర్పల్లి, గండిమైసమ్మ ప్రాంతాలకు డిమాండ్ ఏర్పడింది. –సాక్షి, సిటీబ్యూరోనీరు ఎత్తు నుంచి పల్లెం వైపు ప్రవహించినట్టే.. అభివృద్ధి కూడా మెరుగైన మౌలిక వసతులు ఉన్న ప్రాంతాల వైపే విస్తరిస్తుంది. ఇందుకు సరైన ఉదాహరణ బహదూర్పల్లి, గండిమైసమ్మ ప్రాంతాలు. ఐటీ కారిడార్కు చేరువలో ఉండటంతో మియాపూర్, బాచుపల్లి ప్రాంతాల్లో అభివృద్ధి చెందాయి. దీంతో ఇక్కడ పెద్ద ఎత్తున నివాస, వాణిజ్య సముదాయాలు వెలిశాయి. ఇప్పుడా డెవలప్మెంట్ బాచుపల్లికి కొనసాగింపుగా.. బహదూర్పల్లి, గండిమైసమ్మ మార్గంలో విస్తరించింది. అన్నింటికీ మించి చౌక ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను గండిమైసమ్మ తీరుస్తోంది.వెస్ట్, నార్త్ జోన్లతో కనెక్టివిటీ.. మెరుగైన రోడ్లు, రవాణా సదుపాయాలతో వెస్ట్, నార్త్ హైదరాబాద్ ప్రాంతాలకు సులువుగా చేరుకునే వీలు ఉండటం బహదూర్పల్లి, గండిమైసమ్మ ఏరియాల ప్రత్యేకత. ఇక్కడి నుంచి అరగంటలో బాచుపల్లి మార్గంలో ప్రగతినగర్ మీదుగా జేఎన్టీయూకి, అక్కడి నుంచి హైటెక్సిటీకి వెళ్లొచ్చు. ఇప్పటికే మియాపూర్–బాచుపల్లి ఆరులైన్ల రహదారి మార్గం నిర్మాణంలో ఉంది. ఇది పూర్తయితే ప్రయాణ సమయం మరింత తగ్గుతుంది. అలాగే 1.5 కి.మీ. దూరంలోని దుండిగల్ ఔటర్ ఎగ్జిట్–5 ఎక్కితే శంషాబాద్ విమానాశ్రయానికి ఈజీగా చేరుకోవచ్చు.ఉపాధి అవకాశాలు మెండుగానే.. ఉపాధిపరంగా ఐటీ కారిడార్కు సులువుగా చేరుకోవడంతో పాటు స్థానికంగా పలు ఫార్మా కంపెనీల పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఇక్కడే ఉన్నాయి. కండ్లకోయ, బహదూర్పల్లి ఐటీ పార్క్లు ఉండటంతో ఉపాధి అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి. సమీపంలోని గౌడవెల్లిలో 600 ఎకరాల్లో అర్బన్ ఫారెస్ట్, దూలపల్లిలో ఫారెస్ట్ అకాడమీలు ఉండటంతో చుట్టూ పచ్చదనంతో ప్రశాంత వాతావరణం, కాలుష్య రహిత గృహాలు ఉండటం ఈ ప్రాంతాల ప్రత్యేకత. గండిమైసమ్మ చుట్టు పక్కల పదుల సంఖ్యలో ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలున్నాయి. మల్లారెడ్డి, టెక్ మహీంద్రా విశ్వవిద్యాలయాలు చుట్టుపక్కలే ఉన్నాయి. వైద్య కళాశాలతో పాటు నారాయణ హృదయాలయ, మల్లారెడ్డి, జీవీకే ఆస్పత్రులు చేరువలోనే ఉన్నాయి.అందుబాటు ధరల్లోనే ఇళ్లు..హైదరాబాద్ రియల్టీలో కొత్త మైక్రో మార్కెట్గా వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఇక్కడ పెద్ద ఎత్తున గృహ నిర్మాణం జరుగుతోంది. బహదూర్పల్లి, గండిమైసమ్మ, బాసుర్గడి, గౌడవెల్లి, అయోధ్యక్రాస్ రోడ్స్ వంటి ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్ట్లో నిర్మాణంలో ఉన్నాయి. ప్రైమార్క్, రూబ్రిక్ కన్స్ట్రక్షన్స్, వాసవి, ప్రణీత్ గ్రూప్, అపర్ణా వంటి సంస్థలు పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాలల్లో ధర చదరపు అడుగుకు రూ.5,500 వేలుగా చెబుతున్నారు. ప్రాజెక్ట్లలోని వసతులు, విస్తీర్ణాలను బట్టి ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి.ఇదీ చదవండి: హైదరాబాద్ 2.o.. అభివృద్ధి ఖాయం!నార్త్ వేవ్లో సెంచరీ క్రాస్.. నిర్మాణ రంగంలో దశాబ్ధన్నర కాలం అనుభవంలో ఇప్పటివరకు 18 లక్షల చ.అ.ల్లో 30కు పైగా ప్రాజెక్ట్లను పూర్తి చేశాం. తాజాగా బహదూర్పల్లిలో 13.5 ఎకరాల్లో నార్త్వేవ్ గేటెడ్ కమ్యూనిటీని నిర్మిస్తున్నాం. 14 బ్లాక్లు, ఒక్కోటి 9 అంతస్తుల్లో మొత్తం 1,026 యూనిట్లు ఉంటాయి. నార్త్ వేవ్ ప్రాజెక్ట్ను కిడ్స్ సెంట్రిక్ జోన్గా తీర్చిదిద్దుతున్నాం. ఇందులో పిల్లలకు, పెద్దలకు ప్రత్యేకంగా ప్లే ఏరియా, పెట్ జోన్, ఔట్డోర్ ఫిట్నెస్ స్టేషన్, యోగా, స్విమ్మింగ్ పూల్, జిమ్, క్రికెట్ పిచ్, బీబీక్యూ పార్టీ లాన్, మినీ గోల్ప్, రాక్ క్లయింబింగ్, ప్లే స్కూల్.. ఇలా వందకు పైగా ఆధునిక వసతులను కల్పిస్తున్నాం. – సాయికృష్ణ బొర్రా, డైరెక్టర్, ప్రైమార్క్ డెవలపర్స్మాడ్యులర్ కిచెన్ ఫ్రీ.. గండిమైసమ్మ– మేడ్చల్ మార్గంలోని అయోధ్య క్రాస్రోడ్స్లో 5.2 ఎకరాల్లో శ్రీవెన్ త్రిపుర ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నాం. 3 టవర్లలో 638 యూనిట్లుంటాయి. న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి ఫ్లాట్కు మాడ్యులర్ కిచెన్ను ఉచితంగా అందిస్తున్నాం. అలాగే ఈ ఏడాది డిసెంబర్ 31లోపు ఫ్లాట్ కొనుగోలు చేసేవారికి లోయర్ ఫ్లాట్, ఈస్ట్, కార్నర్ ఫ్లాట్లపై ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. అలాగే 12 నెలల పాటు నిర్వహణ ఉచితం. ఆఫర్లతో కస్టమర్లకు సుమారు రూ.5–6 లక్షలు ఆదా అవుతుంది. 50 వేల చదరపు అడుగుల క్లబ్ హౌస్లో స్విమ్మింగ్ పూల్, జిమ్, టెన్నిస్ కోర్ట్, సూపర్ మార్కెట్, బాంక్వెట్ హాల్ వంటి అన్ని రకాల వసతులు ఉంటాయి. 299 యూనిట్లతో కూడిన టవర్–1ను దసరా నాటికి కస్టమర్లకు హ్యాండోవర్ చేస్తాం. నిర్మాణంలో ఉన్న మిగిలిన రెండు టవర్లను 2027 మార్చి వరకు పూర్తి చేస్తాం. – ఎండీ కృష్ణరావు, రూబ్రిక్ కన్స్ట్రక్షన్ -
హైదరాబాద్ 2.o.. అభివృద్ధి ఖాయం!
‘మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ బృహత్తర ప్రాజెక్ట్లతో హైదరాబాద్ అభివృద్ధి ఖాయం. ఏ నగరంలోనైనా సరే ప్రభుత్వం, డెవలపర్లు సంయుక్తంగా ప్రజా కేంద్రీకృత విధానాలతో నగరానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సృష్టిస్తారు. రోడ్లు, విద్యుత్, డ్రైనేజ్, నీరు వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లను ప్రభుత్వం కల్పిస్తే.. కాలనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలపర్లు చేపడతారు’ అని తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్(టీడీఏ) ప్రెసిడెంట్ జీవీ రావు అన్నారు. – సాక్షి, సిటీబ్యూరోసబర్బన్ పాలసీ అవసరం.. విద్యా, ఉద్యోగం, ఆరోగ్యం, వినోదం ఇలా ప్రతీ అవసరం కోసం ప్రజలు ప్రధాన నగరానికి రావాల్సిన, ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఏటా 3 లక్షల మంది నగరానికి వలస వస్తున్నారు. శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయకపోతే కోర్ సిటీలో జన సాంద్రత పెరిగి, బెంగళూరు, ఢిల్లీ మాదిరిగా రద్దీ, కాలుష్య నగరంగా మారే ప్రమాదం ఉంది. అందుకే శివారు ప్రాంతాలు మెరుగైన మౌలిక వసతులతో అభివృద్ధి చెందేందుకు సబర్బన్ పాలసీ అవసరం. మెట్రో విస్తరణతో ప్రధాన నగరం, శివారు ప్రాంతాలు అనుసంధానం కావడంతో పాటు శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. శరవేగమైన పట్టణీకరణ కారణంగా మౌలిక సదుపాయాల కల్పన తప్పనిసరి. అందుకే హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.10 వేల కోట్ల బడ్జెట్ను కేటాయించింది. ఇందులో ఈ ఏడాది రూ.5 వేల కోట్ల నిధులతో నాలాల పునరుద్ధరణ పూర్తి చేయాలి.ఆదాయంలో 25–30 శాతం వాటా.. ప్రస్తుతం గ్రేటర్లో 1.1 కోట్ల జనాభా ఉంది. మెరుగైన మౌలిక వసతులతో దేశంలోనే నివాసితయోగ్యమైన నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. వ్యవసాయం తర్వాత రెండో అత్యధిక ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే పరిశ్రమ రియల్ ఎస్టేట్ రంగం. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, జీఎస్టీ, నిర్మాణ అనుమతుల రుసుము, ఇంపాక్ట్ ఫీజు, ఆదాయ పన్ను ఇలా స్థిరాస్తి రంగం నుంచి ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం సమకూరుతుంది. రాష్ట్ర ఆదాయంలో 25–30 శాతం వాటా స్థిరాస్తి రంగానిదే.‘యూజర్ పే’తో గ్రోత్ కారిడార్లో రోడ్లు.. ఓఆర్ఆర్ నిర్మాణ సమయంలోనే గ్రోత్ కారిడార్కు రెండు వైపులా రహదారులను ప్లాన్ చేశారు. కానీ.. ఇప్పటికీ వేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఆయా రోడ్లను ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా మార్చుకోవచ్చు. ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీతో హెచ్ఎండీఏ ఒప్పందం చేసుకొని, రైతుల నుంచి భూములను సేకరించి రహదారులను నిర్మించాలి. ఇందుకైన వ్యయాన్ని ఈ రోడ్లను వినియోగించుకునే డెవలపర్ల నుంచి వసూలు చేస్తారు. ఉదాహరణకు టోల్ మాదిరిగా ఏ నుంచి బీ రోడ్డు నిర్మాణానికి అయిన వ్యయాన్ని బిల్డర్లు ‘యూజర్ పే’ రూపంలో చెల్లిస్తారు. దీంతో ప్రభుత్వంపై వ్యయ భారం తగ్గడంతో పాటు మెరుగైన రోడ్లతో ఆయా ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. ఈ రోడ్లలో కొన్ని రీజినల్ రింగ్ రోడ్ అనుసంధానించబడి రేడియల్ రోడ్లుగా అభివృద్ధి చెందుతాయి.వాక్ టు వర్క్తో.. ఫోర్త్ సిటీ.. తెలంగాణ ప్రభుత్వం 50 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీ నిర్మాణాన్ని తలపెట్టింది. అయితే.. ఈ పట్టణం ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి ప్లాన్ చేయాలి. వాక్ టు వర్క్ కాన్సెప్ట్లతో కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యా, వైద్య, క్రీడా మౌలిక సదుపాయాల కల్పనతో ఫోర్త్ సిటీ స్వయం సమృద్ధి చెందుతుంది. ఈ మోడల్ను హైదరాబాద్లోని మిగతా మూడు వైపులకూ విస్తరించాలి.నివాస, వాణిజ్య స్థిరాస్తికి డిమాండ్.. హైడ్రా దూకుడుతో కొంత కాలంగా స్థిరాస్తి రంగం మందగమనాన్ని ఎదుర్కొంది. అయితే నిర్మాణ అనుమతులు ఉన్న ప్రాజెక్ట్ల జోలికి వెళ్లమని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రస్తుతం మార్కెట్లో నిలకడ వాతావరణం నెలకొంది. దీంతో కొత్త కస్టమర్ల నుంచి ఎంక్వైరీలు పెరిగాయి. ఐటీ, ఫార్మా పరిశ్రమలకు కేరాఫ్ హైదరాబాద్. ఆయా రంగాల్లో 1.50 లక్షల కొత్త ఉద్యోగాలతో రాబోయే కాలంలో నివాస, వాణిజ్య స్థిరాస్తి రంగానికి డిమాండ్ తప్పకుండా ఉంటుంది. ఉప్పల్ నుంచి నారాపల్లి, పరేడ్ గ్రౌండ్ నుంచి శామీర్పేట, పరేడ్ గ్రౌండ్ నుంచి కొంపల్లి ఫ్లై ఓవర్లను ప్రభుత్వం నిర్మించనుంది. ఈ మూడు మార్గాలతో పాటు ఆదిభట్ల నుంచి లేమూరు మార్గంలో నివాస కార్యకలాపాలు పెరగనున్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతికి అందుబాటులో ధరల్లో ఇళ్లు లభ్యమవుతాయి. -
అపార్ట్మెంట్ ఖరీదు అబ్బో.. దేశంలోనే ఖరీదైన డీల్!
దేశంలోనే ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏది అంటే ముంబై అని చెబుతారు. కానీ ఖరీదైన ప్రాపర్టీ డీల్స్లో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం ముంబైని మించిపోతోంది. గుర్గావ్లోని డీఎల్ఎఫ్ కామెలియాస్లోని ఓ అపార్ట్మెంట్ ఇటీవల రూ. 190 కోట్లకు అమ్ముడుపోయింది. ఇది ఎన్సీఆర్లో అత్యంత ఖరీదైన హై-రైజ్ కండోమినియం అపార్ట్మెంట్ డీల్గా నిలిచింది. చదరపు అడుగుల ధర (కార్పెట్ ఏరియా) పరంగా దేశంలోనే అతిపెద్దది.ఇండెక్స్ట్యాప్కు లభించిన పత్రాల ప్రకారం.. ఇన్ఫో ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్ ప్రయివేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుతో దాని డైరెక్టర్ రిషి పార్థీ ఈ 16,290 చదరపు అడుగుల పెంట్హౌస్ని కొనుగోలు చేశారు. ఈ డీల్ డిసెంబర్ 2న నమోదైంది. ఇందుకోసం కంపెనీ రూ.13 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించింది. అయితే ఈ డీల్పై డీఎల్ఎఫ్ స్పందించలేదు.దేశంలోనే అతిపెద్దది“చదరపు అడుగుల ప్రకారం చూస్తే ఒక హై రైజ్ అపార్ట్మెంట్కు రూ. 190 కోట్ల ధర దేశంలోనే అత్యధికం. ఇది ముంబైని మించిపోయింది. సూపర్ ఏరియాను పరిగణనలోకి తీసుకుంటే చదరపు అడుగుకు రూ. 1.18 లక్షలు, కార్పెట్ ఏరియా పరంగా అయితేరూ. 1.82 లక్షలు. ఢిల్లీ ఎన్సీఆర్లో ప్రాపర్టీ ధరలు సూపర్ ఏరియా ప్రాతిపదికన ఉండగా, ముంబైలో కార్పెట్ ఏరియాలో ఉంటాయి. కాబట్టి ఈ గుర్గావ్ ఒప్పందం కార్పెట్ ఏరియా పరంగా ముంబై ధర కంటే చాలా అధికం’’ అని రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రొపెక్విటీ ఫౌండర్-సీఈవో సమీర్ జసుజా పేర్కొన్నారు.ఇదీ చదవండి: అద్దెను ఈఎంఐగా చెల్లిస్తే చాలు.. ఇల్లు సొంతం!ముంబైలోని టానియెస్ట్ ఏరియాల్లో కార్పెట్ ఏరియా ధరలు రూ. 1,62,700 వరకు ఉన్నాయి. ఈ కామెలియాస్ డీల్కు ముందు జరిగిన అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ డీల్లలో ముంబైలోని లోధా మలబార్లో జరిగిన డీల్ ఒకటి. ఇక్కడ ఓ కంపెనీ గత ఏడాది చదరపు అడుగుకు (కార్పెట్ ఏరియా) రూ. 1,36,000 చొప్పున రూ. 263 కోట్లకు మూడు అపార్ట్మెంట్లను కొనుగోలు చేసింది. -
రూ.అర కోటి లోపు ఇల్లు కావాలి..
భూముల ధరలు పెరగడం, నిర్మాణ సామగ్రి ధరలు, కార్మికుల వేతనాల భారం.. వంటి రకరకాల కారణాలతో సామాన్యులకు హైదరాబాద్లో సొంతిల్లు అనేది అందనంత దూరంలో ఉంటోంది. 2–3 ఏళ్ల క్రితం వరకు కూడా దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లోనే గృహాలు అందుబాటు ధరల్లో ఉండేవి. కానీ, హైరైజ్ అపార్ట్మెంట్లు, ఆధునిక వసతుల కల్పనతో కూడిన లగ్జరీ హోమ్స్ నిర్మాణంలో బిల్డర్లు పోటీపడుతుండటంతో కోట్లు వెచ్చిస్తే గానీ సొంతింటి కల సాకారం కానీ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సామాన్యుల సొంతింటి కల నెరవేరడానికి దగ్గరి దారిని చూపించే ప్రాంతాలపై ‘సాక్షి రియల్టీ’ప్రత్యేక కథనం... –సాక్షి, సిటీబ్యూరోరెండు బెడ్రూమ్స్, కిచెన్, హాల్, టాయిలెట్స్తో 700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే బడ్జెట్ హోమ్స్కు ఇప్పటికీ ఆదరణ ఉంది. చిన్న వ్యాపారులు, సూపర్వైజర్లు, డ్రైవర్లు, మధ్యస్థాయి ఉద్యోగులు వంటి సామాన్య, మధ్యతరగతి వర్గాలు సొంతింటి కలను బడ్జెట్ హోమ్స్తో తీర్చుకుంటారు. అద్దెకు ఉండే బదులు అదే అద్దెసొమ్మును నెలవారీ వాయిదా(ఈఐఎం) రూపంలో చెల్లిస్తే సొంతిల్లు సొంతమవుతుందనేది వారి ఆలోచనగా ఉంటుంది. దీంతో రూ.50 లక్షలలోపు ధర ఉండే గృహాలకు డిమాండ్ బాగా పెరిగింది. ఏ ప్రాంతాల్లో కొనొచ్చంటే... మాదాపూర్, నార్సింగి, నానక్రాంగూడ, కోకాపేట వంటి పశ్చిమ హైదరాబాద్ మినహా మిగిలిన మూడు జోన్లలో ఇప్పటికీ సామాన్యులకు రూ.50 లక్షలలోపు ధర ఉండే అఫర్డబుల్ గృహాలు దొరుకుతున్నాయి. ఇబ్రహీంపట్నం, నాగార్జునసాగర్ రోడ్, హయత్నగర్, పోచారం, ఘట్కేసర్, కీసర, శామీర్పేట వంటి ప్రాంతాల్లో బడ్జెట్ హోమ్స్ కొనుగోలు చేయవచ్చు. ఔటర్ లోపల ఉండే నివాస ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో ఎంపిక చేసుకోవడం ఉత్తమం. వీటిల్లో క్లబ్ హౌస్, వాకింగ్ ట్రాక్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా వంటివి ఉండేలా చూసుకోవాలి. దీంతో ఇల్లు చిన్నగా అనిపించినా, చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.పీఎంఏవైను సవరించాలి.. లాభం ఉందంటే అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్లను చేపట్టేందుకు డెవలపర్లు కూడా ముందుకొస్తారు. అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్లకు ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు అందించాలి. దీంతో డెవలపర్లలో విశ్వాసం పెరుగుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకం నిబంధనలను సవరించాలి. అన్ని రాష్ట్రాలకు ఒకే విధమైన నిబంధనల వర్తింపు సరికాదు. ఎందుకంటే... 700 చదరపు అడుగుల ఫ్లాట్ అంటే ముంబైలో లగ్జరీ అపార్ట్మెంట్. దానిని హైదరాబాద్లో బడ్జెట్ హోమ్గా పరిగణిస్తుంటారు. అందుకే పీఎంఏవై స్కీమ్ ప్రయోజనాలను గృహ కొనుగోలుదారుల ఆదాయాన్ని బట్టి కాకుండా అపార్ట్మెంట్ విస్తీర్ణాన్ని బట్టి వర్తింపజేయాలి. దీంతో ఎక్కువ మంది ఈ పథకానికి అర్హత పొందుతారు. కొనే ముందు వీటిని పరిశీలించాలి.. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ వంటి విభాగాల నుంచి నిర్మాణ అనుమతులతోపాటు రెరా రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాజెక్ట్లలోనే కొనుగోలు చేయాలి. ప్రమోటర్లు, బిల్డర్ల పాత చరిత్ర చూడాలి. ప్రాజెక్ట్లను పూర్తి చేసే ఆర్థిక శక్తి నిర్మాణ సంస్థకు ఉందా లేదో పరిశీలించాలి. రోడ్డు, విద్యుత్, మంచినీటి సరఫరా వంటి కనీస మౌలిక వసతులు ఉన్న ప్రాంతాల్లో కొనుగోలు చేయడం ఉత్తమం. బడ్జెట్ హోమ్స్ ప్రాజెక్ట్లకు సమీపంలో విద్యాసంస్థలు, ఉపాధి అవకాశాలు ఉన్న ప్రాంతాలను ఎంచుకోవడం మంచిది.వేగంగా అనుమతులివ్వాలిబడ్జెట్ హోమ్స్తో రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. సొంతింటి కోసం ప్రభుత్వం ఆదాయపడాల్సిన అవసరం, ధనిక, పేద తరగతి మధ్య వ్యత్యాసం తగ్గుతాయి. ఈ తరహా నిర్మాణాలకు అనుమతులు త్వరితగతిన జారీ చేయాలి. ఈ ఇళ్ల రిజిస్ట్రేషన్లలో స్టాంప్ డ్యూటీని తగ్గించాలి. బ్యాంక్లు కూడా బడ్జెట్ గృహ కొనుగోలుదారులను ప్రోత్సహించేలా వడ్డీరేట్ల తగ్గింపు, రుణ నిబంధనల సడలింపులతో ప్రత్యేక పథ కాన్ని తీసుకురావాలి. – జక్కా వెంకట్రెడ్డి, ఏవీ కన్స్ట్రక్షన్స్ -
ఇంటి డెసిషన్.. ఇంత ఫాస్టా?
ఇల్లు కొనే ముందు సవాలక్ష ఎంక్వైరీలు, చర్చలు, లాభనష్టాల బేరీజులు... ఇలా చాంతాడంత లిస్టే ఉంటుంది. కానీ, నేటి యువతరం గృహ కొనుగోలు నిర్ణయాన్ని చిటికేసినంత ఈజీగా తీసేసుకుంటున్నారు. నాణ్యత, ప్రాంతం, వసతులు నచ్చితే చాలు ధర గురించి ఆలోచించకుండా ముందుకెళ్లిపోతున్నారు. మూడేళ్ల క్రితం వరకు ఇంటి కొనుగోలు నిర్ణయానికి 33 రోజుల సమయం పడితే.. ఈ ఆర్థిక సంవత్సరం అర్ధ వార్షికం(హెచ్1) నాటికి కేవలం 26 రోజుల్లోనే డెసిషన్ తీసుకుంటున్నారు. - సాక్షి, సిటీబ్యూరో మనదేశంలో అత్యంత ప్రాధాన్య పెట్టుబడి స్థిరాస్తి రంగమే. ప్రాపర్టీ అన్వేషకులు కొనుగోలుదారులుగా మారేందుకు పట్టే సమయంపై ప్రాపర్టీ కన్సల్టెన్సీ అనరాక్ అధ్యయనం చేసి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 2019, 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ కొనుగోలు సమయం కేవలం 25 రోజులుగా ఉంది. 2021 కోవిడ్ మహమ్మారి సమయంలో గరిష్టంగా 33 రోజుల సమయం పట్టింది.వేగానికి కారణమిదే... ఆర్థికంగా సన్నద్ధమయ్యాకే ప్రాపర్టీలను కొనేందుకు ముందుకొస్తున్నారు. కొన్నేళ్లుగా మార్కెట్లో బ్రాండెడ్ డెవలపర్ల నుంచి గృహాల విక్రయాలు పెరిగాయి. నిర్మాణంలో నాణ్యత, గడువులోగా పూర్తి చేస్తారనే విశ్వాసం ఆయా సంస్థలపై ఉండటంతో కొనుగోలుదారులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.రూ.3 కోట్లయినా చిటికెలో నిర్ణయం.. సాధారణంగా గృహ కొనుగోలులో ధరకే అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ, యువ కస్టమర్లు ధర గురించి పట్టించుకోవట్లేదు. రూ.3 కోట్ల ధర ఉన్న అల్ట్రా లగ్జరీ గృహాల ఎంపికకు అతి తక్కువగా, కేవలం 15 రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటున్నారు. రూ.1–3 కోట్ల ధర ఉన్న ఇళ్లకు 27 రోజులు, రూ.50 లక్షల నుంచి రూ.కోటి రేటు ఉన్న యూనిట్ల కొనుగోలుకు ఏకంగా 30 రోజులు సమయం తీసుకుంటున్నారు.డిమాండ్తో వేగంగా నిర్ణయం కోవిడ్ తర్వాతి నుంచి విశాలైన గృహాలు, హైఎండ్ ప్రాజెక్ట్లకు డిమాండ్ పెరిగింది. ఈ విభాగంలో ఇళ్లు వేగంగా అమ్ముడవుతున్న కారణంగా కస్టమర్లు కొనుగోలు నిర్ణయాన్ని వేగంగా తీసుకుంటున్నారు. – ప్రశాంత్రావు, డైరెక్టర్, పౌలోమీ ఎస్టేట్స్ -
ఇక్కడ ఇళ్ల ధరలకు రెక్కలు..
దేశవ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో (టైర్–2) ఇళ్ల ధరలు ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో గణనీయంగా పెరిగాయి. 23 ప్రముఖ పట్టణాల్లో సగటున 65 శాతం ఎగిసినట్టు ప్రాప్ ఈక్విటీ సంస్థ వెల్లడించింది. అదే విధంగా ఐదు నగరాల్లో ధరలు తగ్గాయి.ముఖ్యంగా దక్షిణాదిన గుంటూరు పట్టణంలో 51 శాతం మేర ధరల్లో పెరుగుదల కనిపించింది. ఆ తర్వాత విశాఖపట్టణంలో 29 శాతం, విజయవాడలో 21 శాతం చొప్పున పెరిగాయి. దక్షిణాదిలోనే మంగళూరులో 41 శాతం, కోయింబత్తూర్లో 11 శాతం, గోవాలో 6 శాతం, కోచిలో 2 శాతం చొప్పున వృద్ధి చెందాయి. త్రివేండ్రంలో మాత్రం 4 శాతం, మైసూర్లో 14 శాతం చొప్పున ధరలు తగ్గాయి. జైపూర్ టాప్.. టైర్–2 పట్టణాల్లో దేశంలోనే అత్యధికంగా జైపూర్లో 65 శాతం మేర ధరలు పెరిగినట్టు ప్రాప్ ఈక్విటీ నివేదిక తెలిపింది. జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టుల్లో చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ) ధర రూ.6,979కు చేరింది. క్రితం సంవత్సరం ఇదే కాలంలో రూ.4,240గా ఉండడం గమనార్హం. ఉత్తరాదిన ఆగ్రా.. ఉత్తరాదిన ఆగ్రాలో ఇళ్ల ధరలు 59 శాతం పెరిగాయి. ఆ తర్వాత చండీగఢ్లో 34 శాతం, బివాండిలో 25 శాతం, ఇండోర్లో 20 శాతం, డెహ్రాడూన్లో 14 శాతం, లుధియానాలో 11 శాతం, లక్నోలో ఒక శాతం చొప్పున ధరల్లో వృద్ధి కనిపించింది. భోపాల్లో 5 శాతం, మోహాలిలో 8 శాతం, సోనేపట్లో 26 శాతం చొప్పున ధరలు పతనమయ్యాయి.పశ్చిమాన గాంధీనగర్ పశ్చిమభారత్లో గాంధీనగర్లో అత్యధికంగా 19 శాతం మేర ఇళ్ల ధరలు ఎగిశాయి. ఆ తర్వాత సూరత్లో 14 శాతం, నాగ్పూర్లో 12 శాతం, వడోదరలో 10 శాతం, నాసిక్లో 4 శాతం, అహ్మదాబాద్లో 4 శాతం చొప్పున ధరలు పెరిగాయి. తూర్పున భువనేశ్వర్లో 15 శాతం, రాయ్పూర్లో 14 శాతం చొప్పున ఇళ్ల ధరల్లో వృద్ధి కనిపించింది.బలంగా డిమాండ్.. ‘‘టైర్–2 నగరాల్లో డెవలపర్లు, కార్పొరేట్లు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లు, ఇన్వెస్టర్ల సమూహం నుంచి ఇళ్లకు ఆసక్తి పెరిగింది. ఈ నగరాల్లో భూమి చౌకగా లభించడం, మౌలిక ససతులతో పెద్ద ఎత్తున అనుసంధానత, బలమైన డిమాండ్ వెరసి ప్రీమియం, లగ్జరీ ఇళ్ల సరఫరా మెరుగుపడింది’’అని ప్రాప్ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజా తెలిపారు. -
హైదరాబాద్లో ఇళ్ల ధరల పెరుగుదల
దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగారల్లో ఇళ్ల ధరలు జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో 11 శాతం మేర పెరిగాయి. ఇందులో అత్యధికంగా ఢిల్లీ ఎన్సీఆర్లో 32 శాతం మేర ధరలు ఎగిసిపడగా, హైదరాబాద్లో 3 శాతం పెరిగాయి. ఈ వివరాలను రియల్టర్ల మండలి క్రెడాయ్, కొలియర్స్, లైసెస్ ఫొరాస్ సంస్థల సంయుక్త నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో రియల్టీ మార్కెట్లో బలమైన డిమాండ్ నమోదైంది. ఇళ్ల సగటు ధరలు వరుసగా 15వ త్రైమాసికంలోనూ వృద్ధి బాటలో నడిచాయి. ఎనిమిది నగరాల్లో ఇళ్ల సగటు ధరలు 11 శాతం వృద్ధితో చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ) ధర రూ.11,000కు చేరినట్టు ఈ నివేదిక వెల్లడించింది. పట్టణాల వారీగా..జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో అత్యధికంగా 32 శాతం మేర ఇళ్ల ధరల్లో వృద్ధి కనిపించింది. ఎస్ఎఫ్టీ ధర రూ.11,438కి చేరింది.ఢిల్లీ తర్వాత అత్యధికంగా బెంగళూరులో ఇళ్ల ధరలు సగటున 24 శాతం పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.11,743గా నమోదైంది. హైదరాబాద్లో ఇళ్ల ధరలు సగటున 3 శాతం పెరిగాయి. ఎస్ఎఫ్టీ రూ.11,351కి చేరింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.11,040గా ఉంది. పుణెలో ఎస్ఎఫ్టీ ధర 10 శాతం పెరిగి రూ.9,890కు చేరింది.ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో 4 శాతం పెరిగి ఎస్ఎఫ్టీ రూ.20,438గా ఉంది. కోల్కతాలోనూ 3 శాతం పెరుగుదల నమోదైంది. చదరపు అడుగు ధర రూ.11,351కి చేరింది. చెన్నై మార్కెట్లో చదరపు అడుగు ధర రూ.7,889గా నమోదైంది. మెట్రోల్లో అతి తక్కువ పెరుగుదల ఇక్కడే. అహ్మదాబాద్లో 16 శాతం వృద్ధితో ఎస్ఎఫ్టీ రూ.7,640కు చేరింది.సానుకూల సెంటిమెంట్..ఇళ్ల ధరల పెరుగుదల గృహ కొనుగోలుదారుల్లో నెలకొన్న సానుకూల సెంటిమెంట్, సానుకూల వాతావరణానికి నిదర్శనమని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ పేర్కొన్నారు. విక్రయాలు, ధరల పెరుగుదల కొనసాగడం అందుబాటు ధరలు, డిమాండ్ను తెలియజేస్తున్నట్ట లైసస్ ఫొరాస్ ఎండీ పంకజ్ కపూర్ వ్యాఖ్యానించారు. కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణలు క్రమంగా తగ్గుతున్నప్పటికీ లగ్జరీ ఇళ్ల విభాగం ఆధిపత్యం కొనసాగుతోందని చెప్పారు. ఎంఎంఆర్, పుణె, హైదరాబాద్ మార్కెట్లు విక్రయాలు, సరఫరాల్లో మార్పులేని స్థితికి చేరాయని.. ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నై, టైర్–2 పట్టణాల్లో సరఫరా తగ్గిందని తెలిపారు. ధరలు పెరుగుతున్నప్పటికీ.. ద్రవ్య విధానాన్ని ఆర్బీఐ సరళీకరించడం, రెపో రేటు తగ్గింపు అంచనాలతో గృహ కొనుగోలుదారులకు సమీప కాలంలో ఉపశమనం లభిస్తుందని కొలియర్స్ ఇండియా సీఈవో బాదల్ యాగ్నిక్ అభిప్రాయపడ్డారు.పెట్టుబడుల తీరు..రియల్టీ తర్వాత ఐటీ/ఐటీఈఎస్ రంగంలోకి అత్యధికంగా రూ.27,815 కోట్లు ఏఐఎఫ్ల ద్వారా వచ్చాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్లో రూ.25,782 కోట్లు, ఎన్బీఎఫ్సీల్లోకి రూ.21,503 కోట్లు, బ్యాంకుల్లోకి రూ.18,242 కోట్లు, ఫార్మాలోకి రూ.17,272 కోట్లు, ఎఫ్ఎంసీజీలోకి రూ.11,680 కోట్లు, రిటైల్లోకి రూ.11,379 కోట్లు, పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలోకి రూ.10,672 కోట్లు, ఇతర రంగాల్లోకి రూ.2,29,571 కోట్లు వచ్చాయని ఈ నివేదిక వెల్లడించింది. దశాబ్ద గరిష్టానికి ఏఐఎఫ్ పెట్టుబడులు చేరాయని, మొత్తం ఏఐఎఫ్ ఫండ్స్ సంఖ్యలోనూ వృద్ధి నెలకొన్నట్టు తెలిపింది. ‘ఏఐఎఫ్ పెట్టుబడుల్లో కేటగిరీ 2 ఏఐఎఫ్ల పాత్ర కీలకంగా ఉంది. రియల్ ఎస్టేట్ ఫండ్స్, ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్వోఎఫ్) ఇందులో భాగంగా ఉన్నాయి’ అని పురి తెలిపారు. గడిచిన ఐదేళ్ల కాలంలో మొత్తం ఏఐఎఫ్ పెట్టుబడుల్లో కేటగిరీ–2 నుంచే 80 శాతం మేర ఉన్నట్టు అనరాక్ నివేదిక తెలిపంది. రియల్ ఎస్టేట్లో ఏఐఎఫ్ పెట్టుబడులు అధికంగా ఉండడం వెనుక ఈ రంగంలో భద్రత, రక్షణ ఎక్కువగా ఉండడమే కారణమని గోల్డెన్ గ్రోత్ ఫండ్ సీఈవో అంకుర్ జైన్ తెలిపారు.రియల్టీలోకి భారీగా ఏఐఎఫ్ పెట్టుబడులురియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులు (ఏఐఎఫ్) పెద్ద ఎత్తున వస్తున్నాయి. దేశ రియల్ ఎస్టేట్ పరిశ్రమలో ఏఐఎఫ్ పెట్టుబడులు రూ.75,000 కోట్లకు చేరినట్టు రియల్టీ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. ఏఐఎఫ్ మొత్తం పెట్టుబడుల్లో 17 శాతం రియల్ ఎస్టేట్ రంగంలోకే వచ్చినట్లు వెల్లడించింది. గడిచిన 10 ఏళ్లలో భారత్లో ఏఐఎఫ్లలో భారీ వృద్ధి కనిపించినట్టు పేర్కొంది. మిగిలిన రంగాలతో పోల్చి చూసినప్పుడు ఏఐఎఫ్ పెట్టుబడులకు రియల్టీ ఆకర్షణీయ ఎంపికగా ఉన్నట్టు వివరించింది.ఇదీ చదవండి: చమురుపై విండ్ఫాల్ ట్యాక్స్ ఎత్తివేతరియల్ఎస్టేట్లో రూ.75,468 కోట్లు‘సెబీ తాజా డేటా ప్రకారం.. 2024–25 సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ2) వరకు రూ.4,49,384 కోట్ల ఏఐఎఫ్ పెట్టుబడుల్లో రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చినవి రూ.75,468 కోట్లు (17 శాతం)గా ఉన్నాయి’ అని అనరాక్ నివేదిక వెల్లడించింది. రియల్ ఎస్టేట్ తర్వాత ఐటీ/ఐటీఈఎస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎన్బీఎఫ్సీలు, బ్యాంక్లు, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, రిటైల్, రెన్యువబుల్ ఎనర్జీ, ఇతర రంగాలు ఏఐఎఫ్లతో ప్రయోజనం పొందినట్టు తెలిపింది. ‘ఏఐఎఫ్ ద్వారా రియల్ ఎస్టేట్లోకి వచ్చిన పెట్టుబడులు 2024 మార్చి నాటికి రూ.68,540 కోట్లుగా ఉంటే, 2024–25 సెప్టెంబర్ త్రైమాసికం నాటికి రూ.75,468 కోట్లకు పెరిగాయి. కేవలం ఆరు నెలల్లోనే 10 శాతం మేర పెట్టుబడుల్లో వృద్ధి కనిపించింది’ అని అనరాక్ ఛైర్మన్ అనుజ్పురి వెల్లడించారు. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు మళ్లీ పూర్వ వైభవం
మూసీ సుందరీకరణ, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ.. హైదరాబాద్ స్థిరాస్తి రంగాన్ని నెక్ట్స్ లెవల్కు తీసుకెళ్లడం ఖాయం. ఈ బృహత్తర ప్రాజెక్ట్లు వచ్చే ఏడాదిలో ప్రారంభమవుతాయి. దీంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య(క్రెడాయ్) జాతీయ కార్యదర్శి గుమ్మి రాంరెడ్డి అన్నారు. ‘సాక్షి రియల్టీ’తో ఆయన ఇంటర్వ్యూ విశేషాలివీ.. –సాక్షి, సిటీబ్యూరోప్రభుత్వ ఆస్తులు, జలాశయాల రక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా అవసరమే. కానీ, దాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చిన తీరే గందరగోళాన్ని సృష్టించింది. హైడ్రా ప్రభావం ప్రాజెక్ట్లపై కంటే కస్టమర్ల సెంటిమెంట్పై ఎక్కువ ప్రభావం చూపించింది. రియల్టీ మార్కెట్ సైకిల్ వ్యవస్థ. వరుస ఎన్నికలు, కొత్త ప్రభుత్వ విధానాల అమలులో జాప్యం, అధిక సరఫరా కారణంగా 2024లో రియల్టీ మార్కెట్ స్తబ్దుగానే ఉంది. కానీ, ఇప్పుడు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది.ఇప్పటికే మూసీలోని అక్రమ నిర్మాణాలు, నిర్వాసితులకు పరిహారం తదితర అంశాలపై హైకోర్టు నుంచి అడ్డంకులు కూడా తొలగాయి. దీంతో మూసీ పునరుజ్జీవానికి ప్రభుత్వం ముందడుగులు వేస్తోంది. రెండోదశ మెట్రో విస్తరణ పనులను జనవరి నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణం, 14 వేల ఎకరాల్లోని ఫ్యూచర్ సిటీలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆయా ప్రాజెక్ట్లతో నగరం మరింత అభివృద్ధి చెందడంతోపాటు కొత్త మార్గాలు, ప్రాంతాల్లో రియల్ అవకాశాలు మెరుగవుతాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి.లుక్ ఆల్ డైరెక్షన్స్.. ఏ నగరమైనా సమాంతరంగా అభివృద్ధి చెందాలి. కానీ, మౌలిక వసతుల కల్పనలో హెచ్చుతగ్గుల కారణంగా అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. దీంతో హైదరాబాద్లో వెస్ట్, సౌత్ జోన్లో భూముల ధరలు బాగా పెరిగాయి. అందుబాటు ధర లేదు. సామాన్యుడు ఇల్లు కొనే పరిస్థితి లేదు. అందుకే పాలసీల్లో కొన్ని మార్పులు తేవాలి. ఔటర్ గ్రోత్ కారిడార్ను అభివృద్ధి చేస్తే ప్రతి ఒక్కరికీ సొంతింటి కల సాకారమవుతుంది. అక్కడ భూముల ధరలు తక్కువగా ఉన్నాయి. గత ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీని తీసుకొచ్చింది. కానీ, కార్యరూపం దాల్చలేదు. ఈ ప్రభుత్వం లుక్ ఆల్ డైరెక్షన్ అమలు చేయాలి. రింగ్రోడ్డు చుట్టూ మొత్తం గ్రిడ్ రోడ్లు వేస్తే అక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగి సామాన్యుడికి సొంతింటి కలను సాకారం చేసుకునే అవకాశాలు మెరుగవుతాయి.పెట్టుబడులకు సౌత్ బెటర్.. కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం వంటి పశ్చిమ ప్రాంతాల్లో స్థలాల ధరలు ఆకాశంలో ఉన్నాయి. ఇక్కడ సామాన్యులు కొనే పరిస్థితి లేదు. రేవంత్ ప్రభుత్వం కొత్త విధానాలు, అభివృద్ధి పనులతో వచ్చే ఏడాది కొత్తూరు, షాద్నగర్, ఆదిభట్ల, ముచ్చర్ల వంటి దక్షిణ ప్రాంతాలు బాగా అభివృద్ధి అవుతాయి. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ధరలు తక్కువగా ఉన్నందున సామాన్య, మధ్యతరగతి వారు స్థలాలు కొనుగోలు చేయడం ఉత్తమం. వెస్ట్ జోన్లో అపార్ట్మెంట్ కొనే ధరకే చ.అ.కు రూ.7–9 వేలకే సౌత్లో విల్లా వస్తుంది. అంతేకాకుండా ఓఆర్ఆర్తో ప్రధాన నగరం నుంచి 30–40 నిమిషాల ప్రయాణ వ్యవధిలోనే సౌత్కు చేరుకోవచ్చు. -
హైదరాబాద్లో రిటైల్ స్పేస్కు ఫుల్ డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: షాపింగ్ మాల్స్, ప్రముఖ హై స్ట్రీట్లలో రిటైల్ స్థలం లీజుకు ఇవ్వడం 2024 జనవరి–సెప్టెంబర్ మధ్య ఎనిమిది ప్రధాన నగరాల్లో దాదాపు 5 శాతం పెరిగిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. ఈ కాలంలో టాప్–8 నగరాల్లోని గ్రేడ్–ఏ మాల్స్, ప్రధాన హై స్ట్రీట్లలో లీజుకు తీసుకున్న రిటైల్ స్థలం 5.53 మిలియన్ చదరపు అడుగులు. గతేడాది ఇదే కాలంలో 5.29 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం నమోదైంది.ఈ నగరాల జాబితాలో ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్ ఉన్నాయి. హై స్ట్రీట్లలో రిటైల్ స్థలాన్ని లీజుకు ఇవ్వడం గతేడాదితో పోలిస్తే 3.44 మిలియన్ చదరపు అడుగుల నుండి 3.82 మిలియన్ చదరపు అడుగులకు దూసుకెళ్లింది. మరోవైపు షాపింగ్ మాల్స్లో రిటైల్ స్థలం 1.85 మిలియన్ చదరపు అడుగుల నుండి 1.72 మిలియన్ చదరపు అడుగులకు వచ్చి చేరింది.హైదరాబాద్లోని ప్రముఖ హై–స్ట్రీట్ కేంద్రాలు రిటైల్ స్థలానికి బలమైన డిమాండ్ను నమోదు చేశాయి. ఈ నగరంలో వివిధ బ్రాండ్లు 2024 జనవరి–సెప్టెంబర్ కాలంలో 1.72 మిలియన్ చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకున్నాయి. గతేడాది ఇదే కాలంలో ఇది 1.60 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఈ వృద్ధి రిటైల్ రంగం బలంగా పుంజుకోవడం, నూతన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. కరోనా మహమ్మారి తదనంతరం అభివృద్ధి చెందుతున్న వినియోగదారు ప్రవర్తనతో, ఆకర్షణీయ, అనుభవపూర్వక స్థలాలకు స్పష్టమైన డిమాండ్ ఉందని నివేదిక వివరించింది.ప్రీమియం రిటైల్ స్థలాలకు డిమాండ్..ప్రధాన నగరాల్లో మాల్ లీజింగ్ కార్యకలాపాలు స్థిరంగా పెరగడం రిటైల్ రంగం యొక్క బలమైన పునరుద్ధరణ, విస్తరణను నొక్కి చెబుతోందని లులు మాల్స్ తెలిపింది. ఈ సానుకూల ధోరణి రిటైల్ భాగస్వాముల కోసం అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తూ వినియోగదారుల ప్రాధాన్యతలను అభివృద్ధి చేసే ప్రపంచ–స్థాయి రిటైల్ అనుభవాలను సృష్టించే తమ కంపెనీ దృష్టికి అనుగుణంగా ఉంటుందని వివరించింది.మాల్స్, ప్రధాన వీధుల్లో బలమైన లీజింగ్ కారణంగా భారత రిటైల్ రియల్ ఎస్టేట్ వృద్ధి చెక్కుచెదరకుండా ఉందని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ క్యాపిటల్ మార్కెట్స్ ఎండీ, రిటైల్–ఇండియా హెడ్ సౌరభ్ షట్డాల్ తెలిపారు. విచక్షణతో కూడిన వ్యయాలు పెరగడం, వినియోగదారుల ప్రాధాన్యత.. వెరశి ప్రీమియం రిటైల్ స్థలాలకు డిమాండ్ను పెంచుతున్నాయని ఆయన తెలిపారు. ‘భారత్ మరింత ఎక్కువ లావాదేవీల పరిమణాలను చవిచూడాలంటే ప్రధాన నగరాల్లో నాణ్యమైన రిటైల్ స్పేస్ల అభివృద్ధిని వేగవంతం చేయాలి. ఎందుకంటే ఇది తమ వ్యాపారాలను విస్తరించాలని చూస్తున్న ప్రపంచ రిటైలర్లకు అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది’ అని అన్నారు. -
హైదరాబాద్లో ఫ్లాట్ కొంటున్నారా..? ధరలు.. ఏ ఏరియాలో ఎంత?
సాక్షి, సిటీబ్యూరో: స్టీల్, సిమెంట్ తదితర నిర్మాణ సామగ్రి రేట్లు పెరుగుతుండటంతో అపార్ట్మెంట్ల ధరలు సైతం పెరుగుతున్నాయి. సోమాజిగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి సెలబ్రిటీలు, ఉన్నత వర్గాలు ఉండే ప్రాంతాల్లో ఫ్లాట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు, గృహాల సరఫరా తక్కువగా ఉంటుంది.కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ హైదరాబాద్లో అంతర్జాతీయ మౌలిక వసతులు, హైరైజ్ ప్రాజెక్ట్లతో ఫ్లాట్ల ధరలు ఎక్కువ పలుకుతున్నాయి. కరోనా తర్వాత విశాలమైన అపార్ట్మెంట్లు, హైరైజ్ ప్రాజెక్ట్లకు డిమాండ్ పెరిగింది. దీంతో బిల్డర్లు హైరైజ్ ప్రాజెక్ట్లలో స్విమ్మింగ్ పూల్, జిమ్, వాకింగ్, జాగింగ్ ట్రాక్స్ వంటి ఆధునిక వసతులను కల్పిస్తున్నారు.కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ, నానక్రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో లగ్జరీ ప్రాజెక్టులు వస్తున్నాయి. వీటి పరిధిలో చ.అ.కు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పైగానే ధరలు ఉంటున్నాయి. నగరంలో అపార్ట్మెంట్ చదరపు అడుగు నిర్మాణానికి రూ.2,500 ఖర్చవుతోంది. భవనం ఎత్తును బట్టి నిర్మాణ వ్యయం పెరుగుతూంటుంది.నోట్: అపార్ట్మెంట్ విస్తీర్ణం, వసతులు, ప్రాంతాన్ని బట్టి ధర మారుతుంది. -
ఇల్లు కట్టుకోవాలా..? ఇదిగో ఈజీగా పర్మిషన్!
సాక్షి, సిటీబ్యూరో: మధ్యతరగతి వర్గాలు సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలనుకున్నా.. నిర్మాణ సంస్థలు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలన్నా.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నుంచి అనుమతులు తీసుకోవడం తప్పనిసరి. భవన నిర్మాణాలకే కాకుండా నిర్మాణం పూర్తయిన ఇళ్లు, అపార్ట్మెంట్లలో నివాసానికి సైతం హెచ్ఎండీఏ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు(ఓసీ) తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.అన్ని రకాల డాక్యుమెంట్లు, ఆధారాలు ఉంటే దరఖాస్తుదారులు ప్రత్యేకంగా హెచ్ఎండీఏ అధికారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. టీజీబీపాస్ ద్వారా దరఖాస్తు చేసుకొని నిర్ణీత వ్యవధిలో ప్రొసీడింగ్స్ పొందవచ్చు. కొత్తగా అపార్ట్మెంట్ కానీ, బిల్డింగ్లు కానీ నిర్మించేందుకు చాలామంది సకాలంలో సరైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయకపోవడం వల్లనే ఇబ్బందులకు గురవుతున్నారని అధికారులు చెబుతున్నారు.ఇదీ చదవండి: రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ల్లో.. పెట్ పార్క్అన్ని విధాలుగా నిర్మాణ యోగ్యత ఉన్నట్లు తేలితే వారం, పది రోజుల్లోనే ప్రొసీడింగ్స్ లభిస్తాయని హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ‘కొద్ది రోజులుగా హెచ్ఎండీఏ ఫైళ్లకు కదలిక వచ్చింది. లేఅవుట్లు, అపార్ట్మెంట్లకు ఇచ్చే అనుమతుల్లో వేగం పెరిగింది. సమస్యలు ఉన్న స్థలాల్లో మాత్రమే ప్రతిష్టంభన నెలకొంటోందని’ అన్నారు. ఈ క్రమంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే సమయంలోనే అన్ని డాక్యుమెంట్లను సరి చూసుకోవాలని చెప్పారు.మీ స్థలం జాడ తెలుసుకోండి.. » హెచ్ఎండీఏ పరిధిలో సుమారు 3,350కి పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటికి సమీపంలో ఉండే నిర్మాణ స్థలాలు బఫర్ జోన్లలో ఉన్నా, ఎఫ్టీఎస్ పరిధిలో ఉన్నా అనుమతులు లభించవు. ఇందుకోసం హెచ్ఎండీఏ వెబ్సైట్లోని చెరువుల మ్యాపులను పరిశీలించి నిర్ధారణ చేసుకొనే అవకాశం ఉంది.» టీజీబీపాస్లో దరఖాస్తు చేసుకొనే సమయంలోనే రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల నుంచి అనుమతులు పొంది ఉండటం తప్పనిసరి. ప్రభుత్వం కొత్తగా హైడ్రాను ఏర్పాటు చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తనిఖీలు చేసి ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాతే హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం దరఖాస్తులను స్వీకరించే విధంగా మార్పు చేశారు.» ఇప్పుడు ఈ అనుమతుల ప్రక్రియ రెండు అంచెలుగా మారింది. మొదట నీటి పారుదల, రెవెన్యూ అధికారులు పరిశీలించి నివేదికలు ఇచ్చిన అనంతరం ప్లానింగ్ అధికారి పరిశీలనలోకి వెళ్తుంది. అక్కడ ఏమైనా సందేహాలు ఉంటే సదరు ఫైల్ను వెనక్కి పంపించే అవకాశం ఉంది. అన్నీ క్లీయర్గా ఉంటే ప్లానింగ్ డైరెక్టర్ పరిశీలిస్తారు. అనంతరం హెచ్ఎండీఏ కమిషనర్ ఆమోదంతో నిర్మాణానికి అనుమతి పత్రాలు (ప్రొసీడింగ్స్) లభిస్తాయి.డాక్యుమెంట్లు ఇవీ..» సాధారణంగా నిర్మాణ సంస్థలు సొంతంగా కానీ లేదా కన్సల్టెంట్ సంస్థల ద్వారా కానీ టీజీబీపాస్ ద్వారా దరఖాస్తులను అప్లోడ్ చేస్తున్నాయి. సొంత ఇళ్లు నిర్మించుకొనే మధ్యతరగతి వర్గాలు సైతం ఆర్కిటెక్చర్లు, కన్సల్టెంట్ల సహాయం తీసుకుంటారు. అన్ని అంశాల పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నవాళ్లు స్వయంగా తమ దరఖాస్తులను అప్లోడ్ చేసుకోవచ్చు. ఏ విధంగా దరఖాస్తు చేసినప్పటికీ అవసరమైన డాక్యుమెంట్లు మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే.» భూమి డాక్యుమెంట్లు, లింక్డాక్యుమెంట్లు, పాస్బుక్, టైటిల్ డీడ్, ఎమ్మార్వో ప్రొసీడింగ్స్, భూమికి సంబంధించిన పహణీలు, కాస్రాపహణీ, రెవెన్యూ స్కెచ్, 13 ఏళ్ల ఈసీ పత్రాలను అప్లోడ్ చేయాలి.» మార్కెట్ వాల్యూ, నాలా చార్జీలు, ఎన్ఓసీలు, సైట్ ఫొటోలు, జియో కోఆర్టినేట్స్, సైట్ సర్వే బౌండరీలు తదితర పత్రాలన్నీ ఉంటే సకాలంలో అనుమతులు పొందవచ్చు.» భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను కూడా అధికారులు పరిశీలిస్తారు. ఇందుకోసం భూమి స్వభావాన్ని ధ్రువీకరించే సర్టిఫికెట్, నీటి నాణ్యత ధ్రువీకరణ, డిజైన్లు, ఫైర్, పర్యావరణ తదితర సంస్థల అనుమతులు, బిల్డింగ్ రిస్క్ ఇన్సూరెన్స్ వంటివి ఉండాలి. -
హైదరాబాద్లో ఆఫీస్ స్థలాలకు గిరాకీ
హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ సరికొత్త శిఖరాలను తాకింది. దేశంలో కార్యాలయాల స్థలాల లావాదేవీల్లో మూడో స్థానంలో, సరఫరాలో రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది తొమ్మిది నెలల కాలంలో గ్రేటర్లో 87 లక్షల చదరపు అడుగులు(చ.అ.) ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరగ్గా.. కొత్తగా 85 లక్షల చ.అ. స్థలం సరఫరా అయ్యింది. ఏటేటా ఆఫీస్ స్పేస్ రంగంలో 34 శాతం వృద్ధి నమోదవుతోందని సావిల్స్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ వంటి పని విధానాలకు స్వస్తి పలికి ఆఫీస్ యాజమాన్యాలు ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పిస్తున్నాయి. దీంతో మెట్రో నగరాల్లో ఆఫీస్ స్థలాలకు డిమాండ్ ఊపందుకుంది. – సాక్షి, సిటీబ్యూరోఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, తయారీ రంగ సంస్థలు కొత్త యూనిట్ల ఏర్పాటు, ఉన్న వాటి విస్తరణకు ప్రణాళికలు చేస్తున్నాయి. దీంతో ప్రధాన ప్రాంతాలతో పాటు రవాణా సదుపాయాలున్న శివారు ప్రాంతాల్లోని ఆఫీస్ స్పేస్లకు డిమాండ్ ఏర్పడింది. ఇక ఈ ఏడాది మూడో త్రైమాసికంలో నగరంలో 58 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్ సరఫరా జరిగింది. వార్షిక ప్రాతిపదికన 8 శాతం పెరుగుదల నమోదైంది. 2024 మూడో త్రైమాసికంలో (జులై–సెప్టెంబర్)లోనే 30 లక్షల చ.అ. లావాదేవీలు జరిగాయి. ఎక్కువగా 25 వేల నుంచి లక్షలోపు చ.అ. మధ్యస్థాయి ఆఫీస్ స్పేస్ ఒప్పందాలు ఎక్కువగా జరిగాయి. 54 శాతం వాటాతో ఈ విభాగంలో 16 లక్షల చ.అ. లావాదేవీలు పూర్తయ్యాయి.బెంగళూరు–హైదరాబాద్ పోటాపోటీ.. కార్యాలయాల స్థలాల విభాగంలో ఐటీ హబ్లుగా పేరొందిన హైదరాబాద్, బెంగళూరు పోటీపడుతున్నాయి. అత్యధికంగా గ్రేడ్–ఏ ఆఫీసు స్పేస్ అందుబాటులో ఉన్న నగరాల్లో హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. గ్రేటర్లో ఇప్పటి వరకు గ్రేటర్లో 12.57 కోట్ల చ.అ. గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉంది. అత్యధికంగా బెంగళూరులో 23.15 కోట్ల చ.అ., ఢిల్లీ–ఎన్సీఆర్లో 14.46 కోట్ల చ.అ. స్థలం అందుబాటులో ఉంది. ఇక, ముంబైలో 12.14, చెన్నైలో 9.13, పుణేలో 6.82 కోట్ల చ.అ. స్థలం ఉంది.దేశంలో 7 కోట్ల చ.అ. దాటనున్న ఆఫీస్ స్పేస్.. దేశంలో ఆఫీస్ స్పేస్ మార్కెట్ రికార్డ్లను బ్రేక్ చేసింది. దేశంలోని ఆరు మెట్రో నగరాల్లో 2024 జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో 5.51 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ లావాదేవీలు పూర్తికాగా.. ఈ ఏడాది చివరి నాటికి 7 కోట్ల చ.అ.లను అధిగమిస్తుందని, ఆఫీస్ స్పేస్ సప్లయ్ 6.2 కోట్ల చ.అ.లకు చేరుతుందని సావిల్స్ ఇండియా అంచనా వేసింది. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ స్టాక్ 81 కోట్ల చ.అ. చేరుకుంటుంది. ఏటేటా ఆఫీస్ స్పేస్ రంగంలో 30 శాతం వృద్ధి రేటు నమోదవుతుంది. కార్యాలయాల స్థలాలకు డిమాండ్ ఉన్నప్పటికీ.. నిర్మాణం పూర్తి చేసు కొని, మార్కెట్లో అందుబాటులోకి ఆఫీస్ స్పేస్ మాత్రం మందగమనంలో సాగుతోంది. ఈ ఏడాది 9 నెలల్లో కొత్తగా 3.26 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ మార్కెట్లోకి వచ్చింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 12 శాతం తగ్గుదల. ఆఫీస్ స్పేస్ వేకన్సీ ఎక్కువగా ఉండటంతో ధరలు 15.5 శాతం మేర తగ్గాయి. -
హైదరాబాద్లో ప్రాపర్టీ కొంటున్నారా?
సాక్షి, సిటీబ్యూరో: రాజధాని చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్) హద్దుగా జలవనరులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) పేరు చెబితే ఇప్పుడు అందరూ ఉలిక్కిపడుతున్నారు. ఈ ప్రత్యేక విభాగం ఆపరేషన్స్ నేపథ్యంలో స్థిరాస్తి క్రయవిక్రయాలకు సంబంధించి సామాన్యుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని విభాగాలతో పాటు కొందరు వ్యక్తులూ రెచ్చిపోతున్నారు. ఓ పక్క నోటీసులు, మరోపక్క బెదిరింపులతో తమ ‘పని’ పూర్తి చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ అంశాలను ‘సాక్షి’.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దృష్టికి తీసుకువెళ్లింది. వివరాలు ఆయన మాటల్లోనే.. అక్రమ నిర్మాణం అయినప్పటికీ ఇప్పటికే ప్రజలు నివసిస్తుంటే ఆ జనావాసాల జోలికి హైడ్రా వెళ్లదు. జలవనరుల పరిరక్షణలో భాగంగా కొత్తగా నిర్మిస్తున్న వాటిపైనే చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం సామాన్యుడికి అండగా నిలవాలనే స్పష్టం చేస్తోంది. ఎవరైనా ప్లాట్, ఫ్లాట్ ఖరీదు చేసుకునే ముందు దానికి సంబంధించిన వివరాలు సరిచూసుకోండి. నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం కుంట, చెరువు కనిపించకపోయినప్పటికీ ఒకప్పుడు అక్కడ ఉండొచ్చు. ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం అక్కడ జలవనరు ఉన్నట్లు రికార్డు ఉంటుంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న పట్టాభూములు సైతం కేవలం వ్యవసాయం చేసుకోవడానికి ఉద్దేశించినవి. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు, ఈ భూములు క్రయవిక్రయాలు చేయకూడదు.రాజధానిలోని భూములకు సంబంధించిన సమగ్ర వివరాలు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కి (ఎన్ఆర్ఎస్సీ) ఆధీనంలోని భువన్, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ధరణి వెబ్సైట్లలో, జలవనరులకు సంబంధించిన వివరాలు హెచ్ఎండీఏ లేక్స్ వెబ్సైట్స్లో ఉంటాయి. వీటితో పాటు రెవెన్యూ రికార్డులను సైతం సరిచూసుకున్న తర్వాతే క్రయవిక్రయాల విషయంలో ముందుకు వెళ్లాలి. రాజధానిలో ఎక్కడైనా స్థిరాస్తి కొనుగోలు చేసేప్పుడు మరికొన్ని అంశాలనూ సరిచూసుకోండి. ఆ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా? అవి ఇవ్వాల్సిన విభాగాలే ఇచ్చినవి సక్రమ అనుమతులేనా? ఆ అనుమతుల్ని రద్దు చేయడం వంటివి జరిగాయా? కోర్టు వివాదాలు ఉన్నాయా? అనేవి చూసుకోండి. కొన్ని నిర్మాణాలకు హెచ్ఎండీఏకు బదులు పంచాయితీ సెక్రటరీ, ఆర్ఐలు అనుమతులు మంజూరు చేసిన ఉదంతాలు ఉన్నాయి. లేఅవుట్లలో ఉన్న కామన్ ఏరియాలు, పార్కులు, రహదారులు సైతం కాలక్రమంలో ఆక్రమణలకు గురవుతున్నాయి. కేవలం రికార్డుల్లో మాత్రమే ఇవి ఉంటూ.. వాస్తవంలో కనుమరుగు అవుతున్నాయి. ఈ విషయాన్ని హైడ్రా సీరియస్గా తీసుకుంటోంది. ఇలా ఆక్రమణలకు గురైన వాటినీ పునరుద్ధరిస్తుంది. వీటిని పరిరక్షించడం కోసం నిర్దిష్ట విధానాన్ని రూపొందించింది. -
థీమ్..హోమ్! ఇళ్ల నిర్మాణంలో సరికొత్త ట్రెండ్
సాక్షి, సిటీబ్యూరో: మార్పు అనివార్యం.. జీవనశైలిలోనైనా, నిర్మాణ శైలిలోనైనా.. కాలానుగుణంగా అభిరుచులను, అవసరాలను తీర్చే వాటికి ఎవరైనా జై కొడతారు. వినూత్న నిర్మాణ శైలి, విలాసవంతం, ఆధునికత నగర గృహ నిర్మాణ రంగంలో ఇప్పుడిదే ట్రెండ్ కొనసాగుతోంది. లగ్జరీ వసతులు, ఇంటీరియర్ మాత్రమే కాదు డిజైనింగ్, ఆర్కిటెక్చర్ నుంచే ప్రత్యేకత కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే థీమ్ బేస్డ్ హోమ్స్ ట్రెండ్గా మారిపోయాయి.థీమ్ ఆధారిత నిర్మాణాలు కొత్తదేమీ కాదు. పురాతన కాలంలో రాజ భవనాలు, రాజ ప్రాసాదాలు, కోటలు, గోపురాలను దైవం, వాస్తు, శిల్పం వంటి ఇతివృత్తంగా ఆయా నిర్మాణాలు ఉండేవి. వాటికే డెవలపర్లు ఆధునికతను జోడించి గృహ సముదాయాల స్థాయికి తీసుకొచ్చేశారు. సాధారణంగా థీమ్ బేస్డ్ రిసార్ట్లు, హోటళ్లు, పార్క్లు ఉంటాయి. కానీ, ఇప్పుడు మెట్రో నగరాల్లో లగ్జరీ అపార్ట్మెంట్లు, విల్లాలు, క్లబ్ హౌస్లను ఈ తరహాలో నిర్మిస్తున్నారు.థీమ్ బేస్డ్ అంటే? స్పోర్ట్స్, డిస్నీ, హెల్త్ అండ్ వెల్నెస్, గోల్ఫ్, ఈజిప్టియన్, అరబిక్, స్పానిష్, రోమన్ వంటి ఏదైనా ఇతివృతం ఆధారంగా నిర్మించే నివాస సముదాయాలనే థీమ్ బేస్డ్ హోమ్స్ అంటారు. ఒకే రకమైన అభిరుచులు, ఆసక్తులు ఉన్న నివాసితులు ఒకే గృహ సముదాయంలో ఉండటమే వీటి ప్రత్యేకత. దీంతో నివాసితుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. అద్భుతమైన శిల్పా లు, విశాలమైన ద్వారాలు, కిటికీలు, అందమైన మంటపాలు, గ్రాండ్ గ్యాలరీ, ఆహ్లాదకరమైన పచ్చదనంతో ఉంటాయి.అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే.. కొనుగోలుదారుల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా థీమ్ ఆధారిత గృహాలను నిర్మించేందుకు డెవలపర్లు ముందుకు వస్తున్నారు. అపార్ట్మెంట్లు, విల్లాలు, క్లబ్ హౌస్లను కూడా థీమ్ ఆధారంగానే నిర్మిస్తున్నారు. పౌలోమి ఎస్టేట్స్, సుచిరిండియా, రాంకీ, గిరిధారి హోమ్స్ వంటి పలు నిర్మాణ సంస్థలు ఈ తరహా ప్రాజెక్ట్లను నిర్మిస్తున్నాయి. కోకాపేట, తెల్లాపూర్, నల్లగండ్ల, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొల్లూరు, మాదాపూర్ వంటి అన్ని రకాల మౌలిక వసతులతో అభివృద్ధి చెందిన ప్రాంతాలలో ఎక్కువగా నిర్మిస్తున్నారు.మౌలిక వసతులూ మెరుగ్గానే.. గృహ కొనుగోలుదారుల అభిరుచులు మారిపోయాయి. స్విమ్మింగ్ పూల్, జిమ్, పార్క్, క్లబ్ హౌస్ వంటి సౌకర్యాలను విలాసవంతమైన వసతులుగా పరిగణించడం లేదు. అంతకుమించి ఆధునికతను కావాలంటున్నారు. ఒక వసతుల విషయంలోనే కాదు ప్రాజెక్ట్ డిజైనింగ్, ఆర్కిటెక్చర్ అన్నింట్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని భావిస్తున్నారు. ప్రత్యేకత లేదో ప్రాజెక్ట్ను ఎంపిక చేయడం లేదు. మెరుగైన మౌలిక వసతులు, అన్ని రకాల రవాణా సదుపాయాలు, విస్తీర్ణమైన స్థలం ఉన్న ప్రాంతాల థీమ్ బేస్డ్ ప్రాజెక్ట్ల నిర్మాణానికి సరైనవి.థీమ్ బేస్ట్ ప్రాజెక్ట్లను ఆర్కిటెక్చర్, కల్చర్, లైఫ్ స్టయిల్ మూడు రకాలుగా వర్గీకరిస్తారు.1. ఆర్కిటెక్చర్: ఈ భవన నిర్మాణాల శైలి వినూత్నంగా ఉంటాయి. ఈ తరహా నిర్మాణ శైలిని ప్రపంచ దేశాల్లోని చరిత్రలో వివిధ కాల వ్యవధుల్లో వచ్చిన నిర్మాణాలను ప్రేరణగా తీసుకొని ఆర్కిటెక్చర్ డిజైనింగ్ను రూపొందిస్తారు. ఈ తరహా భవన నిర్మాణాలు సమగ్రత్తను నిర్ధారించడంతో పాటు ఫ్యాషన్ సింబల్గా మారాయి. ఉదాహరణ: ఇండో సార్సెనిక్, గోతిక్ అండ్ విక్టోరియన్, మొగల్స్, ఈజిప్టియన్, అరబిక్, స్పానిష్, రోమన్, మొరాకన్ ఆర్కిటెక్చర్ నిర్మాణాలు.2. కల్చర్: ప్రపంచంలోని వివిధ సంస్కృతులను ప్రతిబింబించేలా ఈ నివాస సముదాయాలు ఉంటాయి. ఉదాహరణకు: డెన్మార్క్, నార్వే, స్వీడన్ వంటి స్కాండినేవియన్ దేశాల్లో గృహాల డిజైన్లు ప్రకృతిని పెంపొందించేలా, జపనీయుల హోమ్స్ మినిమలిస్టిక్ డిజైన్లను అవలంభిస్తుంటారు. భారతీయులు చైతన్యపరిచే గృహాలను ఇష్టపడుతుంటారు.3. లైఫ్ స్టయిల్: కొనుగోలుదారుల జీవనశైలి, అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా నిర్మించే కస్టమైజ్డ్ గృహాలివీ. ఈ ప్రాజెక్ట్లలో గ్రీనరీకి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ధారాళమైన గాలి, వెలుతురుతో ఇట్టే ఆకట్టుకుంటాయి.ఉదాహరణకు: స్పోర్ట్స్ టౌన్షిప్లు, డిస్నీ, చిల్డ్రన్ సెంట్రిక్ హోమ్స్, హెల్త్ అండ్ వెల్నెస్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు వంటివి. -
అద్దె అర లక్ష! హైదరాబాద్లో హడలెత్తిస్తున్న హౌస్ రెంట్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో అద్దెలు హడలెత్తిస్తున్నాయి. మూడు నెలల్లో కిరాయిలు 1–4 శాతం మేర పెరిగాయి. ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో, ఆఫీసులకు దగ్గరగా ఉన్న చోట, అలాగే మెట్రో కనెక్టివిటీ, ఇతర రవాణా సదుపాయాలు మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లో నెలవారీ అద్దెలు ఎక్కువగా వృద్ధి చెందుతున్నాయని అనరాక్ అధ్యయనంలో వెల్లడైంది.ప్రస్తుతం హైదరాబాద్లో 1000-1,300 చదరపు అడుగుల 2 బీహెచ్కే ఫ్లాట్ ధరలను పరిశీలిస్తే.. కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, జూబ్లీహిల్స్, కొండాపూర్ వంటి ప్రాంతాలలో నెలవారీ అద్దె అర లక్ష రూపాయలకు పైగానే ఉంటోంది. -
రియల్ ఎస్టేట్లో ఈక్విటీ పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలో దేశంలో ప్రస్తుత సంవత్సరం ఈక్విటీ పెట్టుబడులు 49 శాతం పెరిగి 11 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని పరిశ్రమల సమాఖ్య సీఐఐ, రియల్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ నివేదిక తెలిపింది. ఆస్తులకు బలమైన డిమాండ్ ఈ స్థాయి జోరుకు కారణమని వివరించింది.‘2023లో ఈక్విటీ పెట్టుబడులు ఈ రంగంలో 7.4 బిలియన్ డాలర్లు. ఈక్విటీ మూలధన ప్రవాహం 2024 జనవరి–సెప్టెంబర్ మధ్య 8.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 46 శాతం వృద్ధిని నమోదు చేసింది. రియల్ ఎస్టేట్ రంగంలో 2024లో మొత్తం ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ మొదటిసారిగా 10 బిలియన్ డాలర్లను అధిగమించి కొత్త రికార్డును నమోదు చేయబోతున్నాయి. నిర్మాణం పూర్తి అయిన ఆఫీస్ అసెట్స్లో పెట్టుబడుల పునరుద్ధరణ, రెసిడెన్షియల్ విభాగంలో స్థలాల కోసం బలమైన డిమాండ్తో ప్రస్తుత సంవత్సరం మొత్తం ఈక్విటీ పెట్టుబడులు 10–11 బిలియన్ డాలర్ల శ్రేణిలో ఉంటాయి.2024 జనవరి–సెప్టెంబర్ మధ్య పరిశ్రమ అందుకున్న నిధుల్లో విదేశీ ఇన్వెస్టర్ల వాటా 3.1 బిలియన్ డాలర్లు ఉంది. ఇందులో ఉత్తర అమెరికా, సింగపూర్ ఇన్వెస్టర్లు 85 శాతం సమకూర్చారు. సెబీ యొక్క ఎస్ఎం–ఆర్ఈఐటీ ఫ్రేమ్వర్క్తో ద్వితీయ శ్రేణి నగరాల్లో అధిక నాణ్యత గల చిన్న స్థాయి ఆస్తులు కూడా వ్యూహా త్మక మూలధన విస్తరణకు కొత్త మార్గాలను అందజేస్తాయి’ అని నివేదిక వివరించింది. -
సెలబ్రిటీలు కూడా కొనలేకపోతున్న ఇల్లు ఇది!
సాధారణంగా వ్యాపార ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలు ఖరీదైన ఇళ్లు కొంటూ వార్తల్లో నిలుస్తుంటారు. కానీ ముంబైలోని ఒక పెంట్హౌస్ వార్తల్లో నిలిచింది. రూ.120 కోట్లకు అమ్మకానికి పెట్టిన ఈ ఇంటికి ‘అర్హులైన’ కొనుగోలుదారు దొరకడం లేదు. చాలా మంది సెలబ్రిటీలు రూ.కోట్లు పెట్టి కొనడానికి ముందుకు వచ్చినా ఓనర్ వారికి అమ్మడం లేదు.వన్ అవిఘ్నా పార్క్ 60వ అంతస్తులో ఉన్న విశాలమైన 16,000 చదరపు అడుగుల ఈ పెంట్ హౌస్ గ్లాస్-వాల్డ్ ఎలివేటర్, రూఫ్టాప్ పూల్, జిమ్, ఆరు బెడ్రూమ్లు, ఎనిమిది వాహనాల వరకు పార్కింగ్ వంటి అనేక విలాసవంతమైన ఫీచర్లను అందిస్తుంది. అద్భుతమైన ఆఫర్లు ఉన్నప్పటికీ, యజమాని కఠినమైన ఎంపిక ప్రమాణాల కారణంగా కొనుగోలుదారు దొరకడం లేదు.డబ్బుకు మించి..బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. ఈ ఇంటి అమ్మకం లక్ష్యం కేవలం డబ్బు మాత్రమే కాదని పెంట్ హౌస్ యజమాని, భవనాన్ని అభివృద్ధి చేసిన రియల్ ఎస్టేట్ కంపెనీకి అధిపతి కూడా అయిన నిశాంత్ అగర్వాల్ చెబుతున్నారు. “ఈ ఇంటిని కేవలం డబ్బుతో కొనలేరు. కొనుగోలుదారు సరైన వ్యక్తి అని మేము నిర్ధారించుకోవాలి" అని అగర్వాల్ వివరించారు.సేల్ను పర్యవేక్షించేందుకు, ప్రముఖ రియల్ ఎస్టేట్ బ్రోకర్ రవి కేవల్రమణితో సహా ఉన్నత స్థాయి బృందం ఏర్పాటు చేశారు. కొనుగోలుదారుల ఆర్థిక స్థితి, సమాజంలో ప్రతిష్టతోపాటు వారి నేపథ్యాన్ని సమగ్రంగా తనిఖీ చేస్తారు. ఇందు కోసం కొనుగోలుదారుల ఆఫీస్లను సైతం సందర్శించాలని ఏజెంట్లకు సూచనలు ఉండటం గమనార్హం.స్క్రీనింగ్లో ఫెయిల్బాలీవుడ్ సెలబ్రిటీలు సహా డజన్ల కొద్దీ ప్రముఖులు పెంట్ హౌస్ కొనుగోలుపై ఆసక్తి చూపినప్పటికీ, యజమాని నిర్ణయించిన కఠినమైన అర్హతలను ఎవరూ అందుకోలేకపోతున్నారు. పరిశ్రమలోని కొన్ని పెద్ద స్టార్స్ కూడా స్క్రీనింగ్ ప్రక్రియలో అర్హత సాధించలేదని కేవల్రమణి తెలిపారు. "మేము పొరుగువారితో బాగా కలిసిపోయే కుటుంబాన్ని కోరుకుంటున్నాము. వినయంతోపాటు తమ సంపదను చాటుకోని గుణం ఉన్నవారు కావాలి" అని ఆయన చెప్పారు.ఒకవేళ తాము కోరుకుంటున్న సరైన కొనుగోలుదారు రాకపోతే నెలకు రూ.40 లక్షలకు ఈ పెంట్హౌస్ను అద్దెకు ఇవ్వాలని యాజమాన్యం యోచిస్తోంది. అయితే అద్దెకు వచ్చేవారికి కూడా అదే కఠినమైన పరిశీలన ప్రక్రియ వర్తిస్తుంది. View this post on Instagram A post shared by Ravi Kewalramani (@rk.ravikewalramani) -
కోకాపేటలో 55 అంతస్తుల అబ్బురం!
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి ధరల పెరుగుదలలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన కోకాపేటలో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ పౌలోమి గ్రూప్ విలాసవంతమైన ఆకాశహర్మ్యాన్ని నిర్మిస్తోంది. గోల్డెన్ మైల్ లేఔట్లో, ఔటర్ రింగ్ రోడ్ ఎదురుగా 55 అంతస్తుల్లో పలాజో స్కై స్క్రాపర్ ప్రాజెక్ట్ను నిర్మిస్తోంది.ప్రస్తుతం ఐదవ అంతస్తు నిర్మాణ పనులు పూర్తయ్యాయని, దీపావళి సందర్భంగా ఆరో ఫ్లోర్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని కంపెనీ డైరెక్టర్ ప్రశాంత్ రావు తెలిపారు. పలాజో ప్రాజెక్ట్కు ఆసియా పసిఫిక్ ప్రాపర్టీ నుంచి దేశంలోనే బెస్ట్ రెసిడెన్షియల్ హైరైజ్ ఆర్కిటెక్చర్ అవార్డును సొంతం చేసుకుందని పేర్కొన్నారు. 2.3 ఎకరాల్లోని ఈ ప్రాజెక్ట్లో 141 అపార్ట్మెంట్లు ఉంటాయని, 6,225 చ.అ. నుంచి 8,100 చ.అ. మధ్య ఉంటాయని చెప్పారు.ఇదీ చదవండి: పెర్రీ చనిపోయిన ఇల్లు.. రూ.71 కోట్లకు కొన్న భారతీయ మహిళ2026 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ నివాసితులకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రతికూల మార్కెట్ పరిస్థితులు ఉన్నప్పటికీ పలాజో ప్రాజెక్ట్కు కొనుగోలుదారుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని వివరించారు. ప్రముఖ సంస్థల సీఎక్స్ఓలు, వ్యాపారవేత్తలు, వైద్యులు, ఎంటర్ప్రెన్యూర్లు కస్టమర్లుగా ఉన్నారని తెలిపారు.52వ ఫ్లోర్లో ఇన్ఫినిటీ పూల్.. 70 అడుగుల ఎత్తు గల గ్రాండ్ ఎంట్రన్స్ లాబీ, డబుల్ హైట్ బాల్కనీ, 52వ అంతస్తులో ఇన్ఫినిటీ పూల్.. ఇవీ పలాజో ప్రాజెక్ట్ వసతుల్లో ప్రత్యేకమైనవి. దీంతో నివాసితులకు సెవెన్ స్టార్ హోటల్ అనుభూతి కలుగుతుంది. ఆకాశమంత ఎత్తులో పూల్ ఉండటంతో కనుచూపు మేర వరకూ సిటీ వ్యూను ఎంజాయ్ చేస్తూ స్విమ్ చేయడం అద్భుతమైన అనుభూతిని పొందొచ్చు. 75 వేల చ.అ.ల్లోని క్లబ్హౌస్లో స్పా, ప్రైవేట్ డైనింగ్ రూమ్, ఫిట్నెస్ సెంటర్, ఫ్యామిలీ ఈవెంట్స్ కోసం బాంక్వెట్ హాల్, బాస్కెట్బాల్, స్క్వాష్, బ్యాడ్మింటన్ కోర్టులు వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి. -
లగ్జరీ ప్రాపర్టీలకు డిమాండ్.. డీఎల్ఎఫ్ లాభం డబుల్
న్యూఢిల్లీ: లగ్జరీ ప్రాపర్టీలకు డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో సెప్టెంబర్ త్రైమాసికంలో రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ. 1,381 కోట్లకు చేరింది. గత క్యూ2లో ఇది రూ. 622 కోట్లు.సమీక్షాకాలంలో మొత్తం ఆదాయం 48 శాతం పెరిగి రూ. 1,476 కోట్ల నుంచి రూ. 2,181 కోట్లకు చేరింది. ప్రథమార్ధంలో నికర లాభం రూ. 1,150 కోట్ల నుంచి రూ. 2,027 కోట్లకు ఎగిసింది. మొత్తం ఆదాయం రూ. 2,998 కోట్ల నుంచి రూ. 3,910 కోట్లకు చేరింది.మార్కెట్ క్యాపిటలైజేషన్లో డీఎల్ఎఫ్ దేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ.ఇది ప్రాథమికంగా రెసిడెన్షియల్ ప్రాపర్టీల అభివృద్ధి, విక్రయాలతోపాటు కమర్షియల్, రిటైల్ ప్రాపర్టీల అభివృద్ధి, లీజింగ్ వ్యాపారంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
ల్యాండ్ డీల్స్ జోరు.. టాప్లో హైదరాబాద్
న్యూఢిల్లీ: భారత రియల్ ఎస్టేట్ రంగంలో భూముల క్రయవిక్రయాలు ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్లో భారీగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ ప్రకారం.. 100 కంటే ఎక్కువ భూ ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల్లో భాగంగా సుమారు 1,700 ఎకరాలు చేతులు మారాయి. గతేడాది ఇదే కాలంలో 60 డీల్స్కుగాను 1,200 ఎకరాలు చేతులు మారాయి.డీల్స్ సంఖ్య పరంగా ఈ ఏడాది 65 శాతం వృద్ధి నమోదైంది. ల్యాండ్ డీల్స్లో ఆరు ప్రధాన భారతీయ నగరాలు ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పుణే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ ఏడాది జరిగిన ల్యాండ్ డీల్స్లో రెసిడెన్షియల్ 61 శాతం, ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ 13 శాతం, ఆఫీస్ విభాగం 8 శాతం నమోదయ్యాయి. విభిన్న రకాల ఆస్తులకు సంబంధించి పెరిగిన భూ ఒప్పంద కార్యకలాపాలు బలమైన పెట్టుబడిదారుల సెంటిమెంట్ను, భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ అభివృద్ధి చెందుతున్న తీరుతెన్నులను ప్రతిబింబిస్తున్నట్లు సీబీఆర్ఈ తెలియజేసింది.ఇదీ చదవండి: ఆఫీస్ స్పేస్కు భలే గిరాకీ.. భారీగా పెరిగిన లీజింగ్‘‘రెసిడెన్షియల్, ఆఫీస్, డేటా సెంటర్ల వంటి అభివృద్ధి చెందుతున్న విభాగాలలో బలమైన వృద్ధిని చూస్తున్నాం. భారత రియల్ ఎస్టేట్ రంగం యొక్క దీర్ఘకాలిక అవకాశాలపై పెట్టుబడిదారులు మరింత నమ్మకంగా ఉన్నారనడానికి ఇది నిదర్శనం. ఈ ఆశావాదం భారత్ను రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు వ్యూహాత్మక మార్కెట్గా నిలుపుతోంది. వివిధ మార్కెట్లలో బలమైన డిమాండ్, అనుకూల ఆర్థిక పరిస్థితులతో కలిపి వృద్ధికి అనుకూల వాతావరణాన్ని సృష్టించింది. మార్కెట్ స్థిరత్వం, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను నొక్కి చెప్పే వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా ఈ ఊపు కొనసాగుతుందని ఆశిస్తున్నాం’’ అని సీబీఆర్ఈ వివరించింది. -
హైదరాబాద్లో తగ్గిన ఇళ్ల విక్రయాలు: తొమ్మిది నెలల్లో..
హైదరాబాద్లో 2024 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య రూ. 36,461 కోట్ల విలువైన గృహ విక్రయాలు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ రీసెర్చ్ తన నివేదికలు వెల్లడించింది. ఈ సేల్స్ అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 34 శాతం పెరుగుదలను నమోదు చేసినట్లు సమాచారం. ఇళ్ల రిజిస్ట్రేషన్ల సంఖ్య (59,386) కూడా గణనీయంగా పెరిగింది.నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం.. సెప్టెంబర్ 2023లో రిజిస్ట్రేషన్ల సంఖ్య 6,304 యూనిట్లు (రూ. 3,459 కోట్లు). 2024 సెప్టెంబర్లో ఈ అమ్మకాలు కేవలం 4,903 యూనిట్లు (రూ.2,820 కోట్లు) మాత్రమే. దీన్ని బట్టి చూస్తే ఇళ్ల అమ్మకాలు ఈ సెప్టెంబర్లో 22 శాతం తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది.హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో ఇళ్ల విక్రయాలు జరిగినట్లు సమాచారం. హైదరాబాద్లో రూ. 50 లక్షల కంటే తక్కువ ధర కలిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది మొదటి 9 నెలల్లో రూ. 1 కోటి, అంతకంటే ఎక్కువ ధర కలిగిన గృహాల విక్రయాలు 9 శాతం నుంచి 14 శాతానికి చేరాయి.సెప్టెంబర్ 2024లో హైదరాబాద్లో రిజిస్టర్ అయిన ఆస్తులలో ఎక్కువ భాగం 1,000 నుంచి 2,000 చదరపు అడుగుల పరిధిలో కేంద్రీకృతమై ఉన్నాయి. 2000 అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన ఆస్తుల సేల్స్ కూడా ఆశాజనంగానే ఉన్నాయి.జిల్లా స్థాయిలో, మేడ్చల్-మల్కాజ్గిరి మార్కెట్లో 42 శాతం ఆస్తి రిజిస్ట్రేషన్లు జరిగాయి. సెప్టెంబర్ 2023లో ఈ రిజిస్ట్రేషన్స్ 45 శాతం కావడం గమనార్హం. మొత్తం రిజిస్ట్రేషన్లో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు వరుసగా 39 శాతం, 19 శాతం వాటా కలిగి ఉన్నాయి. రెసిడెన్షియల్ ప్రాపర్టీల సగటు ధర సెప్టెంబర్ 2024లో 3 శాతం పెరిగింది. మేడ్చల్-మల్కాజ్గిరిలో అత్యధికంగా 7 శాతం పెరుగుదల జరిగింది. రంగారెడ్డి, సంగారెడ్డిలు వరుసగా 3 శాతం, 2 శాతం పెరుగుదల జరిగింది. -
కళ్లు చెదిరే ఈ భవనం కొనగలరా?
అమెరికన్ వ్యాపారవేత్త డార్విన్ డీసన్కు చెందిన లా జోల్లా ఎస్టేట్ 'ది శాండ్కాజిల్' రికార్డ్ ధరకు అమ్మకానికి వచ్చింది. 108 మిలియన్ డాలర్లు (సుమారు రూ.907 కోట్లు)కు లిస్టయింది. ఇది శాన్ డియాగో కౌంటీ రియల్ ఎస్టేట్కు రికార్డ్-బ్రేకింగ్ ధర.లిస్టింగ్లో పెట్టిన ధరకు అమ్ముడుపోతే ఈ సంవత్సరం ప్రారంభంలో డెల్ మార్ ఓషన్ ఫ్రంట్ ప్రాపర్టీని కొనుగోలు చేసిన బిలియనీర్ ఎగాన్ డర్బన్ పేరిట ఉన్న 44 మిలియన్ డాలర్ల ప్రస్తుత రికార్డును ఇది అధిగమిస్తుంది. అఫ్లియేటెడ్ కంప్యూటర్ సర్వీసెస్ (తర్వాత జిరాక్స్ సంస్థకు విక్రయించారు) స్థాపకుడు డార్విన్ డీసన్ 2009లో ఈ ఎస్టేట్ను, దాని పక్కనున్న స్థలాన్ని 26 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. తర్వాత దాని నిర్మాణం కోసం 60 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు.దాదాపు 13,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఎస్టేట్ ప్రైవేట్ ఎలివేటెడ్ బీచ్ను కలిగి ఉంది. అలనాటి ఐరోపా శైలిలో బంగారు పరదాలు, పాలరాతి ఫ్లోర్లు, ఆకృతులతో ఇంటీరియర్ను తీర్చిదిద్దారు. హాలీవుడ్ ప్రముఖులు, రాజ కుటుంబాల ఇళ్లకు డిజైన్ చేసిన ప్రఖ్యాత డిజైనర్ తిమోతీ కొరిగాన్ ఈ భవనానికి ఇంటీరియర్లను రూపొందించారు.ఇందులోని ఫర్నిచర్ ఫ్రెంచ్ సొగసుతో ఆకట్టుకుంటుంది. 16 మంది కూర్చునేందుకు వీలుగా రాజసమైన డైనింగ్ రూం, నాటికల్ నేపథ్యంతో తీర్చిదిద్దిన బార్ ఇందులో ఉన్నాయి. ఇక భవనం లోగిలిలో ఒక పూల్, ఫిట్నెస్ సెంటర్, చైనా స్లేట్ రూఫ్ టైల్స్తో కూడిన బీచ్ ఫ్రంట్ బోట్హౌస్ ఉన్నాయి. అగస్టా నేషనల్ గోల్ఫ్ క్లబ్ సిగ్నేచర్ వైట్ షేడ్ లాంటి లుక్ కోసం 40 వేల డాలర్లతో దిగుమతి చేసుకున్న ఇసుక ఈ భవనానికి వినిగియోగించారు. ఇంత విలాసవంతంగా భవనం నిర్మించుకున్నప్పటికీ దీన్ని పెద్దగా ఉపయోగించలేదని డీసన్ చెబుతున్నారు. -
ముంబై ‘రియల్’ కింగ్లు! సింహ భాగం వీరిదే..
దేశంలోనే అత్యంత ఖరీదైన నగరమేది అంటే ముంబై అని టక్కున చెప్పేస్తారు. దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ఈ నగరంలో భూమి కొరత ఎక్కువగా ఉండటమే ధరలు ఆ స్థాయిలో ఉండటానికి కారణమని చెబుతారు. ఇంత ఖరీదైన నగరంలో స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ (SRA) నిర్వహించిన ఒక సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.మహారాష్ట్రలోని మురికివాడల పునరాభివృద్ధి ప్రాజెక్టులను నియంత్రించే స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ 2015 సర్వే ప్రకారం.. ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్ లక్ష ఎకరాలకుపైగా విస్తీర్ణంలో విస్తరించింది. ఇందులో నివాసయోగ్యమైన భూమి భాగం సుమారు 34 వేల ఎకరాలు.ఇందులో దాదాపు 20 శాతం భూమి తొమ్మిది మంది ల్యాండ్లార్డ్ల చేతిలోనే ఉంది. వీరిలో ప్రయివేటు సంస్థలు, వ్యాపార కుటుంబాలు, ట్రస్టులు ఉన్నాయి.అతిపెద్ద ల్యాండ్లార్డ్ గోద్రెజ్స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ సర్వే ప్రకారం.. ముంబైలోని విఖ్రోలి ప్రాంతంలో గోద్రెజ్ కుటుంబానికి 3,400 ఎకరాలకు పైగా భూమి ఉంది. విఖ్రోలిలోని ఈస్ట్రన్ ఎక్స్ప్రెస్ హైవే పక్కనే ఈ భూమి ఉంది. అయితే ఈ భూమిపై కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితులతో కూడిన భూమి విలువను పరిగణనలోకి తీసుకుంటే, అది దాదాపు రూ.30,000 కోట్లు ఉండవచ్చు. పరిమితులను లేకుండా అయితే రూ.50,000 కోట్లకు పైగా ఉంటుందని రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్లు చెబుతున్నారు.గ్రోద్రెజ్ తర్వాత ఎఫ్ఈ దిన్షా ట్రస్ట్ రెండవ స్థానంలో ఉంది. మలాడ్, పరిసర ప్రాంతాల్లో ఇది దాదాపు 683 ఎకరాల భూమిని కలిగి ఉంది. ఎఫ్ఈ దిన్షా ఒక పార్సీ న్యాయవాది, ఫైనాన్సర్. 1936లో మరణించారు. ఈ భూమిని క్రమంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ వస్తోంది. ఇక మూడవ స్థానంలో ప్రతాప్సింగ్ వల్లభదాస్ సూర్జీ కుటుంబం ఉంది. ఈ కుటుంబానికి ముంబైలోని భాండూప్, దాని పరిసరాల్లో సుమారు 647 ఎకరాల భూమి ఉంది.నాల్గవ స్థానంలో ఉన్న జీజీబోయ్ అర్దేషిర్ ట్రస్ట్కు ముంబైలోని చెంబూర్లో 508 ఎకరాల భూమి ఉంది. ఆ తర్వాత ఏహెచ్ వాడియా ట్రస్ట్కు కుర్లాలో 361 ఎకరాలు ఉంది. ఇందులో చాలామటుకు ఆక్రమణకు గురైంది. సర్వే ప్రకారం ముంబైలోని వివిధ ప్రాంతాల్లో బైరామ్జీ జీజీబోయ్ ట్రస్ట్ 269 ఎకరాల భూమిని కలిగి ఉంది. ఇవే కాకుండా, సర్ ముహమ్మద్ యూసుఫ్ ఖోట్ ట్రస్ట్, వీకే లాల్ కుటుంబం వంటి ఇతర ప్రైవేట్ భూస్వాములకు కూడా ముంబైలోని కంజుర్మార్గ్, కండివాలి ప్రాంతంలో భారీగా భూములు ఉన్నాయి. -
క్యూ3లో 25 రియల్ ఎస్టేట్ డీల్స్..
దేశీ రియల్టీ రంగంలో ఈ కేలండర్ సంవత్సరం(2024) మూడో త్రైమాసికంలో 25 డీల్స్ జరిగినట్లు కన్సల్టింగ్ సంస్థ గ్రాంట్ థార్న్టన్ భారత్ నివేదిక పేర్కొంది. వీటి విలువ 1.4 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 11,760 కోట్లు)గా తెలియజేసింది. ప్రధానంగా డెవలపర్స్ చేపట్టిన అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్)దే వీటిలో ప్రధాన వాటాగా వెల్లడించింది. ‘రియల్టీ, రీట్స్ డీల్ ట్రాకర్– ఎంఅండ్ఏ, పీఈ డీల్ ఇన్సైట్స్’ పేరుతో విడుదల చేసిన నివేదిక వివరాలు చూద్దాం..కొత్త రికార్డ్ రియల్టీ రంగ జోరును కొనసాగిస్తూ ఈ ఏడాది జులై–సెపె్టంబర్(క్యూ3)లో ఏకంగా 25 డీల్స్ నమోదయ్యాయి. పరిమాణంరీత్యా ఇది సరికొత్త రికార్డుకాగా.. విలువ(రూ. 11,760 కోట్లు)రీత్యా 2023 ఏడాది క్యూ2 తదుపరి గరిష్ట విలువగా నమోదైంది. ప్రధానంగా క్విప్ జారీ పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. వీటికి రెసిడెన్షియల్, వాణిజ్య విభాగాలలో పీఈ నిధులు జత కలిశాయి. అంతేకాకుండా రియల్టీ టెక్నాలజీ కంపెనీలలోనూ ఒప్పందాలు కలిసొచ్చాయి. డీల్స్ తీరిలా క్యూ2లో నమోదైన మొత్తం డీల్స్లో 5.1 కోట్ల డాలర్ల విలువైన 8 ఒప్పందాలు కొనుగోళ్లు, విలీనం(ఎంఅండ్ఏ) విభాగంలో జరిగాయి. ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) విభాగంలో 40.1 కోట్ల విలువైన 12 డీల్స్ నమోదయ్యాయి. అయితే ఏప్రిల్–జూన్(క్యూ2)లో లభించిన 1.4 బిలియన్ డాలర్లతో పోలిస్తే భారీగా క్షీణించాయి. కాగా.. క్యూ3లో 4.9 కోట్ల డాలర్ల విలువైన ఒక ఐపీవోసహా 94 కోట్ల డాలర్ల విలువైన క్విప్లు జారీ అయ్యాయి. ఇందుకు క్యాపిటల్ మార్కెట్లు బలపడటం సహకరించింది. క్విప్లో 94 కోట్ల డాలర్ల విలువైన 4 డీల్స్ జరిగాయి. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ 60.2 కోట్ల డాలర్ల డీల్ దీనిలో కలసి ఉంది. ఇవి క్యూ2తో పోలిస్తే ఆరు రెట్లు అధికం. -
ఆఫీస్ స్పేస్ మార్కెట్లో హైదరాబాద్ జోరు
న్యూఢిల్లీ: కార్యాలయ వసతులకు (ఆఫీస్ స్పేస్) డిమాండ్ బలంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఆరు ప్రముఖ పట్టణాల్లో జూలై–సెప్టెంబర్ మధ్య 17.3 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) స్థూల లీజింగ్ నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ పరిమాణం 13.2 మిలియన్ ఎస్ఎఫ్టీ కంటే 31 శాతం పెరిగినట్టు కొలియర్స్ ఇండియా విడుదల చేసిన డేటా స్పష్టం చేసింది. బెంగళూరు, హైదరాబాద్ మార్కెట్లలోనే సగం మేర లీజింగ్ నమోదు కావడం గమనార్హం. పట్టణాల వారీగా లీజింగ్ » హైదరాబాద్ మార్కెట్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ సెపె్టంబర్ క్వార్టర్లో 16 శాతం పెరిగి రూ.2.9 మిలియన్ ఎస్ఎఫ్టీగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో స్థూల లీజింగ్ 2.5 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉంది. » బెంగళూరులో 6.3 మిలియన్ ఎస్ఎఫ్టీ లీజింగ్ జరిగింది. ఒక త్రైమాసికం వారీగా అత్యధిక లీజింగ్ ఇదే కావడం గమనించొచ్చు. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ 3.4 మిలియన్ ఎస్ఎఫ్టీతో పోలి్చతే 85 శాతం పెరిగింది. » పుణెలో స్థూల ఆఫీస్ స్పేస్ లీజింగ్ 2.6 మిలియన్ ఎ స్ఎఫ్టీగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఒ క మిలియన్ ఎస్ఎఫ్టీ లీజింగ్ నమోదైంది. » ముంబైలో 1.7 మిలియన్, చెన్నైలో 1.4 మిలియన్ ఎస్ఎఫ్టీ చొప్పున స్థూల లీజింగ్ జరిగింది. » ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఆఫీస్ లీజింగ్ క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 25%పెరిగి 2.4 మిలి యన్ ఎస్ఎఫ్టీకి చేరుకుంది. స్థూల లీజింగ్లో రెన్యువల్స్, ఆసక్తి వ్యక్తీకరణ లావాదేవీలను కలపలేదు. టెక్నాలజీ రంగం నుంచి డిమాండ్ జూలై –సెపె్టంబర్ కాలంలో నమోదైన స్థూల లీజింగ్లో 25 శాతం మేర టెక్నాలజీ రంగం నుంచే ఉన్నట్టు కొలియర్స్ ఇండియా డేటా తెలియజేసింది. ఆ తర్వాత బీఎఫ్ఎస్ఐ కంపెనీలు, ఫ్లెక్స్ స్పేస్ ఆపరేట్ల నుంచి లీజ్ ఒప్పందాలు అధికంగా జరిగాయి. ‘‘గడిచిన 2–3 ఏళ్లలో వివిధ రంగాలు, విభిన్న మార్కెట్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. లీజింగ్ మార్కెట్ ఏటేటా కొత్త గరిష్టాలకు చేరుకుంటోంది. 2024లోనూ అధిక డిమాండ్, సరఫరా కనిపిస్తోంది’’అని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సరీ్వసెస్ ఎండీ అర్పితా మల్హోత్రా తెలిపారు.హైదరాబాద్, బెంగళూరు, ముంబై మార్కెట్లలో ఈ ఏడాది మొదటి మూడు త్రైమాసికాల్లో (జనవరి–సెప్టెంబర్) ఆఫీస్ స్పేస్ డిమాండ్ 2023 మొత్తం డిమాండ్ను అధిగమించినట్టు చెప్పారు. సెపె్టంబర్ క్వార్టర్లో లీజు లావాదేవీల్లో రూ.లక్ష ఎస్ఎఫ్టీకి మించినవే 65 శాతంగా ఉన్నట్టు తెలిపారు. -
ఇల్లు పూర్తయినా.. ఈ అనుభవం మీకూ ఎదురైందా?
తన సొంతింటికి సంబంధించిన చేదు అనుభవాన్ని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పంచుకున్నారు. తన ఇంటి నిర్మాణం పూర్తయినా ప్రాజెక్ట్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అందుకోని కారణంగా సొంతిట్లోకి ప్రవేశించలేకపోయానని పేర్కొన్నారు.సిడ్నీలో జరిగిన క్రెడాయ్-నాట్కాన్ ఈవెంట్లో పీయూష్ గోయల్ మాట్లాడారు. "2012 చివరి నాటికి నా ఇల్లు సిద్ధమైనప్పటికీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేని కారణంగా దాదాపు ఐదారు సంవత్సరాల వరకు ఆ ఇంట్లోకి ప్రవేశించలేకపోయాను" అన్నారు. కేంద్రమంత్రికి ఎదురైన ఈ అనుభవాన్ని చాలా మంది గృహ కొనుగోలుదారులు ఎదుర్కొనే ఉంటారు. ఈ అనిశ్చితి దేశ రియల్ ఎస్టేట్ రంగంలో ఒకప్పుడు సర్వసాధారణంగా ఉండేది. డెవలపర్ల తప్పుల కారణంగా కొనుగోలుదారులు ఇబ్బందులు పడేవారు.అప్పట్లో ఇళ్ల కొనుగోలుదారులు పడే ఇబ్బందులు అలా ఉండేవని, అయితే 2016లో రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) చట్టం (రెరా) ప్రవేశపెట్టడంతో పరిస్థితి గణనీయంగా మారిపోయిందని పీయూష్ గోయల్ వివరించారు. ఇది అవసరమైన పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకువచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. -
హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలకు ఏమైంది?
న్యూఢిల్లీ: హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు జూలై–సెప్టెంబర్ మధ్య కాలంలో 11 శాతం మేర క్షీణించాయి. మొత్తం 1.07 లక్షల యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో విక్రయాలు 1,20,290 యూనిట్లుగా ఉన్నాయి. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ ఓ నివేదిక రూపంలో విడుదల చేసింది.కొత్త ఆవిష్కరణలు తక్కువగా ఉండడం, అదే సమయంలో ఇళ్ల ధరలు సగటున 23 శాతం పెరగడం అమ్మకాల క్షీణతకు కారణాలుగా పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్లో అమ్మకాలు ఏకంగా 22 శాతం తగ్గి 12,735 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 16,375 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. పట్టణాల వారీగా.. » పుణెలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 17 శాతం తక్కువగా 19,050 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. » ఢిల్లీ ఎన్సీఆర్లో అమ్మకాలు 15,570 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాల కంటే 2% తక్కువ. » బెంగళూరులో ఇళ్ల విక్రయాలు 8 శాతం క్షీణించి 15,025 యూనిట్లుగా ఉన్నాయి. » కోల్కతా పట్టణంలో 25 తక్కువగా 3,980 యూనిట్ల విక్రయాలు జరిగాయి. » చెన్నైలో 4,510 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 4,945 యూనిట్ల కంటే 9% తగ్గాయి. హైదరాబాద్లో ధరల పెరుగుదల అధికం ఏడు ప్రముఖ పట్టణాల్లో హైదరాబాద్లోనే ఇళ్ల ధరల పెరుగుదల అధికంగా 32 శాతం మేర నమోదైంది. ‘‘నిర్మాణంలోకి వినియోగించే ఉత్పత్తుల ధరలు పెరగడం, అమ్మకాల్లోనూ గణనీయమైన వృద్ధితో.. ఏడు ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు మొత్తం మీద 23 శాతం మేర పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.6,800 నుంచి రూ.8,390కు పెరిగింది’’అని అనరాక్ నివేదిక తెలిపింది. పండుగల కాలంలో డిమాండ్ ‘‘అన్ని ప్రముఖ పట్టణాల్లోనూ ఇళ్ల అమ్మకాలు క్షీణించాయి. టాప్–7 పట్టణాల్లో నూతన ఇళ్ల యూనిట్ల సరఫరా జూలై–సెపె్టంబర్ మధ్య 19 శాతం తగ్గి 93,750 యూనిట్లుగానే ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో 1,16,220 కొత్త యూనిట్ల సరఫరా నమోదైంది. ఆవిష్కరణల కంటే విక్రయాలు ఎక్కువగా ఉండడం.. డిమాండ్–సరఫరా సమీకరణం బలంగా ఉండడాన్ని సూచిస్తోంది’’అని అనరాక్ చైర్మన్ అనుజ్పురి తెలిపారు. అధిక ధరలకు తోడు, వర్షాకాలం కావడం విక్రయాలు తగ్గడం వెనుక ఉన్న అంశాలుగా పేర్కొన్నారు. -
ఖరీదైన అపార్ట్మెంట్ కొన్న దీపికా పదుకొణె కంపెనీ
బాలివుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెకు చెందిన సంస్థ కేఏ ఎంటర్ప్రైజెస్ లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేసింది. ముంబైలోని బాంద్రా వెస్ట్ ప్రాంతంలో రూ.17.8 కోట్లకు 1845 చదరపు అడుగుల అపార్ట్మెంట్ను కొనుగోలు చేసినట్లు తెలిసింది.ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల సమాచారాన్ని సేకరించే జాప్కీ సంస్థకు లభించిన పత్రాలు ఈ కొనుగోలు వివరాలను వెల్లడించాయి. ఈ సేల్ డీల్ సెప్టెంబర్ 12న నమోదైంది. ఎనార్మ్ నాగ్పాల్ రియాల్టీ సంస్థ విక్రేత కాగా దీపికా పదుకొణె కంపెనీ కేఏ ఎంటర్ప్రైజెస్ కొనుగోలుదారుగా పత్రాలు చూపించాయి.పికా పదుకొణె కంపెనీ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన సాగర్ రేషమ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీని ఎనార్మ్ నాగ్పాల్ రియాల్టీ సంస్థ అభివృద్ధి చేసింది. ఇందులో 4బీహెచ్కే, 5 బీహెచ్కే అపార్ట్మెంట్లు ఉన్నాయి. కంపెనీ కొనుగోలు చేసిన ఫ్లాట్ 15వ అంతస్తులో ఉంది. బిల్ట్-అప్ ఏరియా రేటు చదరపు అడుగుకు రూ. 96,400. ఈ డీల్కు స్టాంప్ డ్యూటీ దాదాపు రూ. 1.07 కోట్లు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ. 30,000 చెల్లించినట్లు తెలుస్తోంది.బాలివుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ ఇటీవలే తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. కాగా ఈ దంపతులు కొనుగోలు చేసిన మరొక ప్రాపర్టీ షారూఖ్ ఖాన్ రాజభవనం మన్నత్కు సమీపంలోని బాంద్రా బ్యాండ్స్టాండ్లో సముద్రానికి ఎదురుగా ఉన్న క్వాడ్రప్లెక్స్. దీని విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఈ జంట 2021లో అలీబాగ్లో రూ. 22 కోట్ల విలువైన బంగ్లాను కూడా కొనుగోలు చేశారు. -
పేమెంట్ ఆలస్యమైతే ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నారా?
కొత్త అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటున్నారా..ఇంకా నిర్మాణం పూర్తవ్వకముందే బుక్ చేసుకుంటున్నారా..అయితే మీకు ఈ విషయం తెలియాల్సిందే. ఒప్పందం ప్రకారమే నిర్మాణం పూర్తవుతుందని బిల్డర్ హామీ ఇస్తాడు. ఒకవేళ ఇచ్చిన హామీ ప్రకారం ఇంటి తాళాలు ఇవ్వకపోతే, జాప్యం జరిగిన సమయానికి అదనంగా 6 శాతం వడ్డీతో సహా డబ్బు చెల్లిస్తానని చెబుతుంటాడు. అయితే అనుకున్న సమయానికి మీరే ఫ్లాట్ ధర చెల్లించడంలో ఆలస్యం చేస్తే మాత్రం సుమారు 18 శాతం వడ్డీ కట్టాలని ఒప్పందం చేసుకుంటాడు.రియల్ ఎస్టేట్ రిగ్యులేటరీ అథారిటీ(రెరా) చట్టంలోని క్లాజ్ 31 ప్రకారం..ముందే చేసుకున్న ఒప్పందం ఆధారంగా నిర్మాణం పూర్తి చేయడంలో బిల్డర్లు విఫలమైతే వినియోగదారులకు ఏమేరకు వడ్డీ చెల్లిస్తారో అదే మొత్తం వినియోగదారుల చెల్లింపులకు వర్తిస్తుంది. పైన తెలిపిన విధంగా చూస్తే, అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తి చేయకపోతే 6 శాతం వడ్డీతో డబ్బు చెల్లిస్తానని బిల్డర్ చెబుతాడు. ఒకవేళ ఫ్లాట్ కొనుగోలుదారుడు కూడా ఏదైనా అనివార్య కారణాల వల్ల చెల్లింపులు జాప్యం చేస్తే అదే వడ్డీని లెక్కగట్టి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. రెరా చట్టం ప్రకారం ఎక్కువ వడ్డీ చెల్లించకూడదు.ఇదీ చదవండి: భారీ పెట్టుబడులకు చర్చలు -
ఏడు నెలల్లో 46 వేల ఇళ్లు రిజిస్ట్రేషన్..ఎక్కడంటే..
హైదరాబాద్లో రియల్ఎస్టేట్ వ్యాపారం దూసుకుపోతోంది. ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా ఇన్వెస్టర్లు రియల్టీలో పెట్టుబడులను మాత్రం ఆపడంలేదు. 2024లో జులై నెలాఖరు వరకు హైదరాబాద్లో రిజిస్టర్ అయిన గృహాల సంఖ్య ఏకంగా 46,000గా ఉంది. ఇది గతేడాదితో పోలిస్తే రెవెన్యూ పరంగా 40 శాతం వృద్ధి చెందినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.అంతర్జాతీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రపంచవ్యాప్తంగా అధికమవుతున్న భౌగోళిక అనిశ్చితుల వల్ల ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు అంత సురక్షితం కాదని కొందరు ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దాంతో ఎక్కువ ఒడిదొడుకులకు లోనుకాని, స్థిరంగా పెరిగే రియల్టీ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. అందులోనూ వేగంగా వృద్ధి చెందుతున్న హైదరాబాద్ వంటి నగరాలవైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో స్థానికంగా రియల్టీ రంగం జోరందుకుంది.నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదికల ప్రకారం.. భాగ్యనగరంలో 2024 జనవరి నుంచి జులై చివరి నాటికి ఏకంగా 46,368 గృహాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 17 శాతం పెరిగాయి. రెవెన్యూలో మాత్రం 40 శాతం వృద్ధి కనిపించింది. జులై నెలలోనే రూ.4,266 కోట్ల ఇళ్లు నమోదయ్యాయి. ఇది గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 48 శాతం వృద్ధి చెందింది. గృహాల సంఖ్యాపరంగా 7,124 ఇళ్లతో 28 శాతం వృద్ధి కనబరిచింది.20245 జులైలో రూ. 50 లక్షల ధర కేటగిరిలో రిజిస్టర్ అయిన ఆస్తులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విక్రయాల రిజిస్ట్రేషన్ల వాటా జూలై 2023లో 69 శాతంగా ఉండేది. అదే 2024 జూలై నాటికి అమ్మకాలు 61 శాతానికి తగ్గింది. రూ. కోటి, అంతకంటే ఎక్కువ ఎక్కువ ధర కలిగిన ఆస్తుల విక్రయాల రిజిస్ట్రేషన్ల వాటా గణనీయంగా పెరిగి 13కి పెరిగింది. -
హైదరాబాద్లో అలాంటి ఇళ్లకు పెరిగిన డిమాండ్!
హైదరాబాద్ నగరంలో రూ.1 కోటి నుంచి 2 కోట్ల మధ్య ధర కలిగిన ఇళ్లకు డిమాండ్ బాగా పెరిగింది. నగరంలోని రెసిడెన్షియల్ అమ్మకాలు, లాంచ్లలో దాదాపు సగం వాటాను ఈ హై-ఎండ్ హౌసింగ్ సెగ్మెంట్ కలిగి ఉందని సీబీఆర్ఈ, క్రెడాయ్ తెలంగాణ సంయుక్త నివేదిక పేర్కొంది.నివేదిక ప్రకారం.. 2021 వరకు 30% వాటాను కలిగి ఉన్న రూ.1-2 కోట్ల విభాగంలో అమ్మకాలు 2022 నుంచి 50 కంటే ఎక్కువ శాతానికి పెరిగాయి. ఇదిలా ఉంటే ఈ కేటగిరీలో లాంచ్లు 2022 నుంచి 55-65% వాటాను కలిగి ఉన్నాయి. ఇవి కోవిడ్ మహమ్మారికి ముందు ప్రతి సంవత్సరం 20% కంటే తక్కువగా ఉండేవి.ఇదే క్రమంలో ప్రీమియం ( రూ. 2-4 కోట్లు), లగ్జరీ (రూ. 4 కోట్లకు పైగా) విభాగాలు గతంలో 2021 వరకు మొత్తం లాంచ్లలో 5% కంటే తక్కువగా ఉండగా 2023, 2024 ప్రథమార్థంలో నగరం మొత్తం లాంచ్లలో 20% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి.మరోవైపు యాదృచ్ఛికంగా 2021 వరకు 50% వాటా ఉన్న మిడ్-సెగ్మెంట్ ( రూ.45 లక్షల నుంచి రూ.1 కోటి) అమ్మకాలు 2024 ప్రథమార్థంలో 25% కంటే తక్కువకు పడిపోయాయి. తత్ఫలితంగా ఈ సెగ్మెంట్లో లాంచ్ల వాటా కూడా పడిపోయింది. కోవిడ్కు ముందు కాలంలో దాదాపు 60-70%తో పోలిస్తే దాదాపు 25%కి క్షీణించిందని నివేదిక పేర్కొంది. -
దుబాయ్లో కొత్త పెళ్లికొడుకు ఇల్లు ఎలా ఉందో చూశారా?
ఆసియా అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ల వివాహం ముంబైలో అంత్యంత వైభవంగా జరిగింది. ప్రపంచంలోని నలుమూలల నుంచి వ్యాపార దిగ్గజాలు, రాజకీయ సినీ ప్రముఖులు తరలిరాగా ప్రపంచం అబ్బురపడేలా అంగరంగ వైభవంగా వేడుకలు సాగాయి.విస్తారమైన వ్యాపార సామ్రాజ్యానికి పేరుగాంచిన అంబానీ కుటుంబానికి చెందిన చిన్న వారసుడు అనంత్ అంబానీ వివాహం నేపథ్యంలో వారి వద్ద ఉన్న అత్యంత ఖరీదైన వస్తువులు, విలాసవంతమైన కార్లు, ఆస్తుల గురించి చర్చ జరుగుతోంది. అయితే పెళ్లికి ముందే అనంత్ అంబానీకి ముఖేష్ అంబానీ దుబాయ్లో ఓ లగ్జరీ విల్లాను కొనుగోలు చేసి గిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలుసా..? ఆ విలాసవంతమైన ఇంటి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..అనంత్ అంబానీకి దుబాయ్లోని పామ్ జుమేరాలో సముద్రతీరంలో అత్యంత ఖరీదైన, విశాలమైన విల్లా ఉంది. ముఖేష్ అంబానీ 2022లో దీన్ని సుమారు రూ.640 కోట్లు పెట్టి కొనుగోలు చేసి అనంత్ అంబానీకి బహుమతిగా ఇచ్చారు. ఇందులో పది బెడ్రూమ్లు, ప్రైవేట్ స్పా, 70 మీటర్ల పొడవైన ప్రైవేట్ బీచ్ ఉన్నాయి. ఇది దుబాయ్లోని అత్యంత విలాసవంతమైన నివాసాలలో ఒకటిగా ఉంది. -
ప్రాపర్టీ షోల పండుగ!
సాక్షి, హైదరాబాద్: కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్) హైదరాబాద్ చరిత్రలోనే తొలిసారిగా ఒకే నెలలో మూడు ప్రాపర్టీ షోలను నిర్వహించనుంది. క్రెడాయబిలిటీ నేపథ్యంలో ఆగస్టు నెలలో వేర్వేరు తేదీల్లో, వేర్వేరు ప్రాంతాల్లో స్థిరాస్తి ప్రదర్శనలు జరగనున్నాయి. హైదరాబాద్ అభివృద్ధి, అవకాశాలను గృహ కొనుగోలుదారులకు వివరించడంతో పాటు వారి నిర్దిష్ట అవసరాలు, ప్రాంతాల ప్రాధాన్యతలు, బడ్జెట్కు అనుగుణంగా ప్రాపర్టీల ఎంపికకు వీలుంటుంది. క్రెడాయ్ సభ్యులు, రెరాలో నమోదైన ప్రాజెక్ట్లు మాత్రమే ప్రదర్శనలో ఉంటాయి కాబట్టి పారదర్శకత, విశ్వసనీయత ఉంటుంది. మూడు ప్రాపర్టీ షోలలో కలిపి సుమారు 200 నిర్మాణ సంస్థలు, 600–700 ప్రాజెక్ట్లు ప్రదర్శించనున్నాయి. ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలు అన్ని రకాల నివాస సముదాయాలు షోలో ఉంటాయి. ఈమేరకు శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ వి. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మెరుగైన మౌలిక సదుపాయాలు, అనుకూలమైన వ్యాపార వాతావరణం, పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి సారించిన స్థిరమైన పాలన, ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రతిభావంతులైన శ్రామికశక్తిని కలిగిన ప్రపంచ నగరంగా హైదరాబాద్ నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులకు అపార వ్యాపార అవకాశాలున్నాయని తెలిపారు. జనరల్ సెక్రటరీ బీ జగన్నాథరావు మాట్లాడుతూ.. స్థిరాస్తి పెట్టుబడులకు మాత్రమే కాకుండా హైదరాబాద్ సురక్షితమైన పని వాతావరణం, కాస్మోపాలిటన్ సిటీగా గుర్తింపు పొందిందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ ఉన్నాయని గుర్తు చేశారు. నూతన అధ్యక్షుడిగా ఎన్ జైదీప్ రెడ్డి.. క్రెడాయ్ హైదరాబాద్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఎన్ జైదీప్ రెడ్డి మాట్లాడుతూ.. క్రమబద్ధమైన, స్థిరమైన వృద్ధిని కలిగిన హైదరాబాద్ మెరుగైన జీవన నాణ్యతను, ఆర్ధిక స్థిరత్వాన్ని, సప్టెయినబులిటీతో ఉందని తెలిపారు. ప్రస్తుతం నగరంలో 884 ఐజీబీసీ గుర్తింపు పొందిన ప్రాజెక్ట్లు ఉండగా.. వీటిలో ఎక్కువ భాగం క్రెడాయ్ సభ్యుల ప్రాజెక్టులేనని గుర్తు చేశారు. ప్రాపర్టీ షోలో ప్రదర్శించే అన్ని ప్రాజెక్ట్లు గ్రీన్ లివింగ్ను దృష్టిలో ఉంచుకుని నిర్మితమైనవేని చెప్పారు.ప్రాపర్టీ షోలు ఎప్పుడంటే..» ఆగస్టు 2 – 4న మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో » ఆగస్టు 9 – 11న కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్స్లో » ఆగస్టు 23 – 25న నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఖాళీ స్థలంలో ఎగ్జిబిషన్ సెంటర్లోమూడు షోలు ఎందుకంటే...» ప్రస్తుతం గృహ కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిలో ఉండటంతో హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్ స్తబ్ధుగా ఉంది. ఇలాంటి తరుణంలో నగర రియల్టీ మార్కెట్ అభివృద్ధి, అవకాశాలను నగరవాసులకు తెలియజేయాలి.» హైదరాబాద్లో 70 శాతం అఫర్డబుల్ హౌసింగ్ మార్కెట్టే. అయా ప్రాపర్టీల వివరాలతో పాటు ఏ ఏ ప్రాంతాల్లో ఎంత రేటు ఉందో తెలిసిపోతుంది. ఎప్పటిలాగే ఒకే ప్రాంతంలో ప్రాపర్టీ షో నిర్వహిస్తే కేవలం లగ్జరీ, ఎగువ మధ్యతరగతి ప్రాపర్టీలే ప్రదర్శనలో ఉంటాయి. అందుకే ప్రాంతాల వారీగా ప్రాపర్టీ షో నిర్వహిస్తే ఆయా ప్రాంతాల్లోని అన్ని తరగతుల గృహాలు ప్రదర్శనలో ఉంటాయి.» క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోకు విశ్వసనీయత ఉంది. ఇలాంటి వేదిక మీదుగా స్థిరాస్తి రంగం, నగరాభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, ప్రతిపాదనలను ప్రజలకు చేరవేసే వీలుంటుంది. -
రేమండ్ నుంచి రియల్టీ విడదీత
న్యూఢిల్లీ: రియల్టీ బిజినెస్ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీయనున్నట్లు టెక్స్టైల్స్ దిగ్గజం రేమండ్ లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఇందుకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసినట్లు తెలియజేసింది. రేమండ్ రియల్టీ పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్ను ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. దీంతో వాటాదారులకు మరింత విలువ చేకూరనున్నట్లు తెలియజేసింది. తద్వారా భారీ వృద్ధికి వీలున్న దేశీ ప్రాపర్టీ మార్కెట్లో మరింత పురోగతిని సాధించవచ్చని తెలియజేసింది. విడదీత పథకంలో భాగంగా వాటాదారులకు 1:1 ప్రాతిపదికన షేర్లను జారీ చేయనుంది. అంటే రేమండ్ లిమిటెడ్ వాటాదారులకు ప్రతీ షేరుకి 1 రేమండ్ రియల్టీ షేరుని కేటాయించనుంది. వాటాదారులు, రుణదాతలు, ఎన్సీఎల్టీ తదితర నియంత్రణ సంస్థల అనుమతుల తదుపరి రేమండ్ రియల్టీ లిమిటెడ్కు తెరతీయనున్నట్లు రేమండ్ వివరించింది. 24 శాతం వాటారేమండ్ లిమిటెడ్ మొత్తం ఆదాయంలో రియల్టీ బిజినెస్ 24 శాతం వాటాను ఆక్రమిస్తోంది. 2023–24లో విడిగా 43 శాతం వృద్ధితో రూ. 1,593 కోట్ల టర్నోవర్ సాధించింది. విడదీతలో భాగంగా రేమండ్ లిమిటెడ్ వాటాదారులకు రేమండ్ రియల్టీ 6,65,73,731 ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో రేమండ్ రియల్టీ లిస్ట్కానుంది. అనుబంధ సంస్థలుసహా కంపెనీ నిర్వహిస్తున్న రియల్టీ బిజినెస్ను పునర్వ్యవస్థీకరించే బాటలో తాజా పథకానికి తెరతీసినట్లు రేమండ్ లిమిటెడ్ వెల్లడించింది. విడదీత ద్వారా రియలీ్టలో భారీ వృద్ధి అవకాశాలను అందుకోవడం, కొత్త ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడం, వ్యూహాత్మక భాగస్వాములను చేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేసింది. మొత్తం రియల్టీ బిజినెస్ను ఒకే కంపెనీ నిర్వహణలోకి తీసుకురానున్నట్లు తెలియజేసింది. గతేడాది రియల్టీ విభాగం రూ. 370 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించింది. రియల్టీ తీరిలా రేమండ్ రియల్టీ థానేలో 100 ఎకరాల భూమిని కలిగి ఉంది. 40 ఎకరాలు అభివృద్ధి దశలో ఉంది. ఇక్కడ రూ. 9,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. రూ. 16,000 కోట్లకుపైగా అదనపు ఆదాయానికి వీలుంది. వెరసి థానే ల్యాండ్ బ్యాంక్ ద్వారా రూ. 25,000 కోట్ల ఆదాయానికి అవకాశముంది. ఇటీవల అసెట్లైట్ పద్ధతిలో ముంబై, బాంద్రాలో భాగస్వామ్య అభివృద్ధి(జేడీఏ) ప్రాజెక్టుకు తెరతీసింది. అంతేకాకుండా మహీమ్, సియోన్, బాంద్రాలలో మరో మూడు జేడీఏలకు సంతకాలు చేసింది. ఈ నాలుగు ప్రాజెక్టుల ద్వారా రూ. 7,000 కోట్ల టర్నోవర్కు వీలుంది.విడదీత వార్తల నేపథ్యంలో రేమండ్ షేరు బీఎస్ఈలో 0.7 శాతం నీరసించి రూ. 2,942 వద్ద ముగిసింది. -
‘రియల్’ రికార్డ్!! ఒక్క రోజులోనే 2,000 ఇళ్లు సేల్..
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ గోద్రెజ్ ప్రాపర్టీస్ ఇళ్ల అమ్మకాలలో రికార్డ్ సృష్టించింది. బెంగళూరులో ప్రాజెక్ట్ ప్రారంభించిన మొదటి రోజే 2,000 పైగా ఇళ్లను విక్రయించింది. దీంతో గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ షేర్లు రికార్డు లాభాలను అందుకున్నాయి.ఈ రియల్ ఎస్టేట్ డెవలపర్ బెంగళూరులోని వైట్ఫీల్డ్-బుడిగెరె క్రాస్లోని గోద్రేజ్ వుడ్స్కేప్స్లో రూ. 3,150 కోట్ల విలువైన ఇళ్లను విక్రయించినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ తెలిపింది. గోద్రెజ్ వుడ్స్కేప్స్ అనేది విలువ, అమ్మకాల వాల్యూమ్ల పరంగా తమ "అత్యంత విజయవంతమైన" లాంచ్ అని గోద్రెజ్ ప్రాపర్టీస్ ఫైలింగ్ తెలిపింది. గత నాలుగు త్రైమాసికాలలో ప్రారంభంలోనే రూ. 2,000 కోట్లకు పైగా అమ్మకాలను నమోదు చేసిన కంపెనీ ఆరో ప్రాజెక్ట్ ఇది.బెంగళూరులో గోద్రెజ్ వుడ్స్కేప్స్ విజయంతో విక్రయాలలో ఈ రియల్ ఎస్టేట్ డెవలపర్ గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే ఈ త్రైమాసికంలో 500% పైగా వృద్ధిని సాధించింది. సుమారు రూ. 3,000 కోట్ల ఆదాయ అంచనాతో పుణె, బెంగళూరులో ల్యాండ్ పార్సెల్లను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నట్లు కంపెనీ చేసిన ప్రకటన తర్వాత సోమవారం గోద్రెజ్ ప్రాపర్టీస్ స్టాక్స్ కొత్త గరిష్టాలకు ఎగిశాయి. 3.23% లాభాన్ని నమోదు చేశాయి. -
‘హౌస్’ఫుల్ డిమాండ్!! రూ. 2,700 కోట్ల అపార్ట్మెంట్లు విక్రయం
గురుగ్రామ్లో కొత్తగా ప్రారంభించిన హౌసింగ్ ప్రాజెక్టులో రూ.2,700 కోట్లకు పైగా విలువైన ప్రీమియం అపార్ట్మెంట్లను విక్రయించినట్లు రియల్టీ సంస్థ సిగ్నేచర్ గ్లోబల్ తెలిపింది. గురుగ్రామ్లోని సెక్టార్ 71లో 'టైటానియం ఎస్పీఆర్' పేరుతో ఈ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు సిగ్నేచర్ గ్లోబల్ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది.విక్రయించాల్సిన అపార్ట్మెంట్ల కంటే రెట్టింపు సంఖ్యలో ఆసక్తి వ్యక్తమవడంతో ఈ ప్రాజెక్టుకు విశేష స్పందన లభించిందని కంపెనీ తెలిపింది. ఆసక్తి వ్యక్తీకరణ నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న కేటాయింపు ప్రక్రియ ద్వారా రూ.2,700 కోట్లకు పైగా అమ్మకాలు జరిగినట్లు చెప్పింది. కేటాయింపుల ప్రక్రియ ఖరారైన తర్వాత మొత్తం అమ్మకాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు.సిగ్నేచర్ గ్లోబల్ ఈ కొత్త ప్రాజెక్టులో ఎన్ని హౌసింగ్ యూనిట్లను ప్రారంభించింది, వాటిలో ఇప్పటివరకు ఎన్ని విక్రయించింది వెల్లడించలేదు. ప్రీమియం ఫ్లాట్లను ఏ రేట్లకు విక్రయించిందో కూడా బహిరంగపరచలేదు. కంపెనీ ఈ ప్రాజెక్టును రెండు దశల్లో అభివృద్ధి చేస్తుందని, మొదటిది 2.1 మిలియన్ చదరపు అడుగులు, రెండవది 1.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కలిగి ఉందని ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్టుకు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తోందని సిగ్నేచర్ గ్లోబల్ చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ తెలిపారు. -
హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ తన జోరు కొనసాగిస్తోంది. జూన్ త్రైమాసికంలో బలమైన పనితీరు చూపించింది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. జూన్ క్వార్టర్లో హైదరాబాద్ మార్కెట్లో 15,085 ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్ముడుపోయిన ఇళ్లు 13,565 యూనిట్లతో పోల్చి చూస్తే 11 శాతం వృద్ధి కనిపించింది. కానీ, ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికం అమ్మకాలు 19,660 యూనిట్లతో పోల్చి చూసినప్పుడు 23 శాతం క్షీణత నెలకొంది. ఇక దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లోనూ ఇదే ధోరణి కనిపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ కాలంలో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చినప్పుడు 5 శాతం పెరిగి 1,20,340 యూనిట్లుగా ఉన్నాయి. కానీ, ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో విక్రయాలు 1,30,170 యూనిట్లతో పోల్చిచూస్తే 8 శాతం తగ్గాయి. ‘‘క్రితం త్రైమాసికంలో అధిక విక్రయాల బేస్ ఏర్పడినప్పడు తర్వాతి త్రైమాసికంలో అమ్మకాలు తగ్గడం సాధారణమే. అంతేకాదు ఈ స్థాయిలో విక్రయాలు తగ్గడానికి గడిచిన ఏడాది కాలంలో గణనీయంగా పెరిగిపోయిన ప్రాపర్టీ ధరల ప్రభావం కూడా కారణమే. దీంతో కొంత మంది ఇన్వెస్టర్లను వెనక్కి తగ్గేలా చేసింది’’ అని అనరాక్ చైర్మన్ అనుజ్పురి తెలిపారు. వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు హైదరాబాద్, పుణె, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ఇళ్ల అమ్మకాలు పెరగ్గా, చెన్నై, కోల్కతాలో తగ్గాయి. మార్చి త్రైమాసికంతో పోల్చిచూస్తే ఒక్క ఢిల్లీ ఎన్సీఆర్లోనే అమ్మకాలు అధికంగా నమోదయ్యాయి.పట్టణాల వారీగా.. » ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో జూన్ త్రైమాసికంలో 16,550 యూనిట్ల ఇళ్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు ఒక శాతం పెరగ్గా, మార్చి త్రైమాసికం నుంచి ఆరు శాతం వృద్ధి చెందాయి. » ఎంఎంఆర్లో 9 శాతం వృద్ధితో 41,540 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. » బెంగళూరులో 16,360 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరిగాయి. క్రితం ఏడాది జూన్ త్రైమాసికంతో పోల్చి చూస్తే 9 శాతం అధికంగా నమోదయ్యాయి. » పుణె మార్కెట్లోనూ 2 శాతం వృద్ధితో ఇళ్ల అమ్మకాలు 21,145 యూనిట్లుగా ఉన్నాయి. » చెన్నైలో 5,020 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది జూన్ త్రైమాసికం గణాంకాలతో పోల్చి చూస్తే 9 శాతం తక్కువ. » కోల్కతాలో 20 క్షీణతతో ఇళ్ల అమ్మకాలు 4,640 యూనిట్లకు పరిమితమయ్యాయి.ఆల్టైమ్ గరిష్టానికి డిమాండ్ ఇళ్లకు డిమాండ్ అసాధారణ స్థాయిలో ఉన్నట్టు డీఎల్ఎఫ్ హోమ్స్ జాయింట్ ఎండీ, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆకాశ్ ఓహ్రి తెలిపారు. ముఖ్యంగా కరోనా తర్వాత గడిచిన రెండేళ్లలో డిమాండ్ ఆల్టైమ్ గరిష్టానికి చేరినట్టు చెప్పారు. ‘‘ఇంటి యాజమాన్యం విషయంలో ప్రజల ఆలోచనా ధోరణిలో వచ్చిన నిర్మాణాత్మక మార్పు ఇది. ఒక స్థలాన్ని కలిగి ఉండడం పట్ల విలువ ఇంతకముందెన్నడూ లేని స్థాయికి చేరింది. ఇల్లు వినియోగానికే కాకుండా, ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనంగా అవతరించింది. ముఖ్యంగా లగ్జరీ ఇళ్లపై రాబడులు పెట్టుబడుల డిమాండ్ను పెంచింది’’అని ఆకాశ్ ఓహ్రి వివరించారు. -
రియల్ ఎస్టేట్లో భారీగా డబ్బులు పెట్టిన సెలబ్రిటీలు వీళ్లే..
సినిమాలలో అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ సెలబ్రిటీలు భారీ మొత్తంలో సంపాదిస్తారు. వీరిలో చాలా మంది మంచి వ్యాపారవేత్తలు కూడా. తమ నట జీవితంతో పాటు సమాంతర వ్యాపారాలను ప్రారంభించడం మనం చూశాం. కొందరు రెస్టారెంట్లు, ఫ్యాషన్ బ్రాండ్లు లేదా విలాసవంతమైన పబ్బులు, క్లబ్బులు నడుపుతుండగా మరికొందరు రియల్ ఎస్టేట్లో భారీగా డబ్బులు పెడుతున్నారు. ఇలా ఇటీవల రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టిన కొందరు సెలబ్రిటీల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..అమితాబ్ బచ్చన్బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇటీవల ముంబైలోని వీర్ సావర్కర్ సిగ్నేచర్ బిల్డింగ్ లో మూడు ఆఫీస్ స్పేస్ లను రూ.60 కోట్లకు కొనుగోలు చేశారు. కమర్షియల్ రియల్ ఎస్టేట్ అనలిటిక్స్ సైట్ FloorTap.com కు లభించిన డాక్యుమెంట్ల ప్రకారం.. ఈ కార్యాలయ స్థలాలు ముంబైలోని అంధేరి వెస్ట్ పరిసరాల్లో, వీర దేశాయ్ రోడ్ సమీపంలో ఉన్నాయి.మొత్తం 8,429 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు కార్యాలయ భవనాలను రూ.59.58 కోట్లకు బిగ్ బీ కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ లావాదేవీకి అమితాబ్ బచ్చన్ రూ.3.57 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించడంతో 2024 జూన్ 20న సేల్ డీడ్ ఖరారైంది. వ్యాపార ప్రాంగణం మూడు పార్కింగ్ స్థలాలతో వచ్చినట్లు డాక్యుమెంట్లు సూచిస్తున్నాయి. వీర్ సావర్కర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కమర్షియల్ ప్రాపర్టీ అమ్మకందారుగా గుర్తించారు.గత ఏడాది ఆగస్టులో అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేసిన భవనంలో ఇప్పటికే నాలుగు ఆఫీస్ సూట్లు ఉన్నాయి. 2023 డిసెంబర్లో ముంబైలోని ఓషివారా ప్రాంతంలో సుమారు 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న నాలుగు వాణిజ్య స్థలాలను రూ.2.07 కోట్లకు లీజుకు తీసుకుని రూ.1.03 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చేశారు.ఇతర సెలబ్రిటీలు కూడా ఇదే భవనంలో పెట్టుబడులు పెట్టారు. తాజా అప్డేట్ ప్రకారం.. బిగ్ బీకి ఇప్పుడు సిగ్నేచర్ బిల్డింగ్ 7 ఆఫీస్ స్పేస్లు ఉన్నాయి. ఆయన ఒక్కరే కాదు, సిగ్నేచర్ బిల్డింగ్ ఇతర సెలబ్రిటీలకు కూడా హాట్ స్పాట్. సీనియర్ బచ్చన్ తో పాటు మనోజ్ బాజ్పాయ్, కాజోల్, అజయ్ దేవగణ్, కార్తీక్ ఆర్యన్, సారా అలీఖాన్ వంటి సెలబ్రిటీలకు కూడా ఈ భవనంలో కమర్షియల్ యూనిట్లు ఉన్నాయి.అజయ్ దేవగణ్, కాజోల్ఈ భవనంలో 194 చదరపు మీటర్ల కమర్షియల్ యూనిట్ను కాజోల్ గత ఏడాది ఆగస్టులో రూ .7.64 కోట్లకు కొనుగోలు చేశారు. సిగ్నేచర్ బిల్డింగ్ లోని 16, 17 అంతస్తుల్లో ఉన్న ఐదు కమర్షియల్ ప్రాపర్టీలను అజయ్ దేవగణ్ రూ.45.9 కోట్లకు కొనుగోలు చేశారు. ఇందుకోసం ఆయన రూ.2.70 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు హిందుస్థాన్ టైమ్స్ తెలిపింది.అభిషేక్ బచ్చన్కొన్ని వారాల క్రితం అభిషేక్ బచ్చన్ బోరివాలిలో ఉన్న ఒబెరాయ్ రియల్టీ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఒబెరాయ్ స్కై సిటీలో ఆరు కొత్త రెసిడెన్షియల్ ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. 57వ అంతస్తులో మొత్తం 4,894 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్మెంట్లను రూ.15.42 కోట్లు చెల్లించి కొనుగోలు చేసినట్లు హిందుస్థాన్ టైమ్స్ కథనం పేర్కొంది.మనోజ్ బాజ్పాయ్మనోజ్ బాజ్పాయ్, ఆయన భార్య షబానా రజా గత ఏడాది అక్టోబర్లో సిగ్నేచర్ బిల్డింగ్లోని నాలుగు యూనిట్లలో రూ.31 కోట్లు పెట్టుబడి పెట్టారు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారం ఒక్కో యూనిట్ ధర రూ.7.77 కోట్లు కాగా, యూనిట్ కు రూ.46.62 లక్షల స్టాంప్ డ్యూటీ ఉంది.కార్తిక్ ఆర్యన్, సారా అలీఖాన్కార్తీక్ ఆర్యన్, సారా అలీఖాన్లు సిగ్నేచర్ బిల్డింగ్లో 2,099 చదరపు అడుగుల యూనిట్ను కలిగి ఉన్నారు. సారా అలీఖాన్, అమృతా సింగ్ 2023 జూలైలో రూ.9 కోట్లకు ఫ్లాట్ను కొనుగోలు చేయగా, కార్తీక్ ఆర్యన్ 2023 సెప్టెంబర్లో రూ.10 కోట్లకు అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. ఐశ్వర్య ప్రాపర్టీ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ రెండు ప్రాపర్టీల అమ్మకానికి వెసులుబాటు కల్పించింది. -
ప్రత్యామ్నాయాలపై రియల్టీ ఇన్వెస్టర్ల దృష్టి
ప్రధాన నగరాల్లో స్థిరాస్తి ధరలు భారీగా పెరగడంతో రియల్ఎస్టేట్ పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయాల కోసం ఇతర పట్టణాలపై ఆసక్తి చూపుతున్నారని ప్రాపర్టీ రీసెర్చ్ సంస్థ కొలియర్స్ ఇండియా ఒక నివేదికలో తెలిపింది. ముంబై, దిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ప్రాపర్టీ ధరలు పెరగడంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న 17 నగరాలను ప్రతిపాదించింది.రిపోర్ట్లోని వివరాల ప్రకారం..దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు(రూ.83 లక్షల కోట్లు), 2050 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల(రూ.410 లక్షల కోట్లు)కు చేరుతుందని అంచనా. 2050 నాటికి దేశంలో ఎనిమిది మెగాసిటీలు ఏర్పడుతాయి. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ (ఎన్ఐపీ), పీఎం గతిశక్తి ప్రాజెక్టులు టైర్ 1 నగరాల్లో కీలకమార్పులు తీసుకొస్తాయి. మెరుగైన కనెక్టివిటీ, తయారీ కార్యకలాపాల వృద్ధి ఊపందుకుంటుంది. ఉద్యోగులు హైబ్రిడ్ వర్క్ మోడల్స్ వైపు మారడంతో చిన్న నగరాల్లో ఆఫీస్ స్పేస్కు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే వృద్ధి చెందిన దిల్లీ, ముంబయి, బెంగళూరులో ప్రాపర్టీ ధరలు భారీగా పెరిగాయి. దాంతో రియల్టీ పెట్టుబడిదారులు ఇతర నగరాలపై దృష్టి పెడుతున్నారు. అందులో ప్రధానంగా ఉత్తరాన అమృత్సర్, అయోధ్య, జైపుర్, కాన్పూర్, లఖ్నపూ, వారణాసి; తూర్పున పట్నా, పూరీ; పశ్చిమాన ద్వారక, నాగ్పుర్, షిర్డీ, సూరత్; దక్షిణాన కోయంబత్తూర్, కొచ్చి, తిరుపతి, విశాఖపట్నం, ఇందోర్ నగరాలున్నాయి. ఈ నగరాల్లో కార్యాలయాలు, గిడ్డంగులు, టూరిజం..వంటి వాటికి ప్రాధాన్యత పెరుగుతోంది.ఇదీ చదవండి: యాపిల్ ఉత్పత్తుల్లో మెటా ఏఐ.. క్లారిటీ ఇచ్చిన దిగ్గజ సంస్థఈ సందర్భంగా కొలియర్స్ ఇండియా సీఈఓ, బాదల్ యాగ్నిక్ మాట్లాడుతూ..‘టైర్1, టైర్ 2 నగరాల్లో పనిప్రదేశాలకు డిమాండ్ పెరుగుతోంది. మౌలిక సదుపాయాలు మెరుగవుతున్నాయి. పర్యాటకం (ముఖ్యంగా ఆధ్యాత్మిక పర్యాటకం), ఇంటర్నెట్ వ్యాప్తి అధికమవుతోంది. కోయంబత్తూర్, ఇందోర్, కొచ్చి శాటిలైట్ ఆఫీస్ మార్కెట్లుగా ఎదుగుతున్నాయి. జైపుర్, కాన్పూర్, లఖ్నవూ, నాగ్పుర్, పట్నా, సూరత్లు డిజిటలైజేషన్కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అమృత్సర్, అయోధ్య, ద్వారక, పూరీ, షిర్డీ, తిరుపతి, వారణాసి వంటి నగరాలు ఆధ్యాత్మిక పర్యాటకంలో వృద్ధి చెందుతున్నాయి’ అన్నారు. -
రియల్ ఎస్టేట్ రికార్డ్.. రూ.1,754 కోట్ల ఇల్లు అమ్మకం
ఓక్లే అనే ఐవేర్ కంపెనీ వ్యవస్థాపకుడు జేమ్స్ జన్నార్డ్ ఇటీవల తన మాలిబు ప్రాపర్టీని 210 మిలియన్ డాలర్లకు (రూ.1,754 కోట్లు) విక్రయించి కాలిఫోర్నియాలో అత్యంత ఖరీదైన ఇంటి అమ్మకంలో కొత్త రికార్డు నెలకొల్పారు. రియల్ ఎస్టేట్కు ప్రత్యేకమైన మాలిబు ప్రాంతంలో.. డెలావేర్ ఆధారిత లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ ద్వారా ఈ విక్రయం జరిగింది. అయితే కొనుగోలుదారు ఎవరన్నది వెల్లడి కాలేదు.లాస్ ఏంజలెస్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. జానార్డ్ 2012లో బిలియనీర్ ఇన్వెస్టర్ హోవార్డ్ మార్క్స్ నుంచి 75 మిలియన్ డాలర్లకు ఈ ఓషన్ ఫ్రంట్ ఎస్టేట్ ను కొనుగోలు చేశారు. అంతకుముందు మార్క్స్ దీన్ని హెర్బాలైఫ్ సహ వ్యవస్థాపకుడు మార్క్ హ్యూస్ నుంచి 2002లో 31 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు.ఇంటి ప్రత్యేకతలు ఇవే..15,000 చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణం కలిగిన ఈ ప్రాపర్టీ ఎల్ పెస్కాడోర్ స్టేట్ బీచ్ కు ఆనుకుని ఉంది. దీనికి సొంత ప్రైవేట్ 300 అడుగుల స్ట్రెచ్ ఓషన్ ఫ్రంటేజ్ ఉంది. ప్రధాన నివాసంలో ఎనిమిది పడక గదులు, 14 బాత్ రూమ్ లు ఉన్నాయి. దీనికి అనుబంధంగా జిమ్, రెండు ప్రత్యేక గెస్ట్ హౌస్ లు ఉన్నాయి.ఈ అమ్మకంతో, మాలిబు ఇప్పుడు కాలిఫోర్నియా చరిత్రలో మూడు అత్యధిక గృహాల అమ్మకాలను కలిగి ఉంది. ప్రస్తుత అమ్మకపు ధర గత సంవత్సరం జే-జెడ్, బియోన్స్ వారి మాలిబు కాంపౌండ్ పై సాధించిన 200 మిలియన్ డాలర్ల మార్కును అధిగమించింది. 2021లో మాలిబు ప్యారడైజ్ కోవ్లో విస్తారమైన ఎస్టేట్ను 177 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ ఆండ్రీసెన్ కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించారు. -
సీపీఐ పుష్.. మార్కెట్ రికార్డ్స్
ముంబై: గత నెలలో సీపీఐ ఆర్బీఐ లక్ష్యం 6 శాతానికంటే తక్కువగా 4.75 శాతానికి దిగిరావడంతో వడ్డీ రేట్లు తగ్గవచ్చన్న అంచనాలు బలపడ్డాయి. దీంతో ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇచ్చారు. ఫలితంగా రోజంతా మార్కెట్లు లాభాల మధ్యే కదిలాయి. వెరసి సెన్సెక్స్ 204 పాయింట్లు ఎగసి 76,811 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 539 పాయింట్లు జంప్చేసింది. ఇక నిఫ్టీ 76 పాయింట్లు పుంజుకుని 23,399 వద్ద స్థిరపడింది. తొలుత 158 పాయింట్లు ఎగసి 23,481ను తాకింది. ఇవి సరికొత్త రికార్డులుకావడం విశేషం! కాగా.. తాజా సమీక్షలో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల యథాతథ కొనసాగింపునకే కట్టుబడింది. ద్రవ్యోల్బ ణం తక్కువగానే నమోదవుతున్నప్పటికీ ఈ ఏడాది వడ్డీ రేట్లలో ఒకసారి మాత్రమే కోత విధించవచ్చని పేర్కొనడం గమనార్హం! రియల్టీ అప్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా రియలీ్ట, క న్జూమర్ డ్యురబుల్స్, ఐటీ 2.2–1% మధ్య బలపడగా.. మీడియా, ఎఫ్ఎంసీజీ 1% స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో శ్రీరామ్ ఫైనాన్స్ 5% జంప్చేయగా.. ఎంఅండ్ఎం, హెచ్డీఎఫ్సీ లైఫ్, దివీస్, టైటన్, ఎల్టీఐఎం, ఇండస్ఇండ్, టెక్ఎం, టీసీఎస్, విప్రో, అ్రల్టాటెక్ 3–1 మధ్య లాభపడ్డాయి. అయితే హెచ్యూఎల్, యాక్సిస్, పవర్గ్రిడ్, బ్రిటానియా, టాటా కన్జూమర్, ఎయిర్టెల్, ఐసీఐసీఐ 1.6–1% మధ్య క్షీణించాయి. మార్కెట్ క్యాప్ @ 431.67 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్(విలువ) మరోసారి కొత్త రికార్డును లిఖించింది. గత రెండు రోజుల్లో రూ. 4.72 లక్షల కోట్లు జమకావడంతో రూ. 431.67 లక్షల కోట్లను(5.17 ట్రిలియన్ డాలర్లు) అధిగమించింది. వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను సాధించాయి. ఇంట్రాడేసహా ముగింపులోనూ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 77,145 పాయింట్లను అధిగమించగా.. నిఫ్టీ 23,481కు చేరింది. రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) తగ్గడంతో ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపునకు మొగ్గు చూపవచ్చన్న అంచనాలు మార్కెట్లకు జోష్నిచ్చాయి. -
మార్కెట్ అల్లకల్లోలం
లోక్సభ తాజా ఫలితాలలో ఎన్డీఏ 300 సీట్లకంటే తక్కువకు పరిమితం కానున్నట్లు స్పష్టమవడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఆందోళన చెందారు. మార్కెట్ ఆరంభం నుంచే అమ్మకాలకు దిగారు. దీంతో సెన్సెక్స్ 6,234 పాయింట్లు, నిఫ్టీ 1,982 పాయింట్ల చొప్పున కుప్పకూలాయి. చివరికి కొంత కోలుకుని 4,390 పాయింట్ల నష్టంతో 72,079 వద్ద సెన్సెక్స్ నిలిచింది. 1,379 పాయింట్లకు నిఫ్టీ నీళ్లొదులుకుని 21,885 వద్ద ముగిసింది.ఇది రెండు నెలల కనిష్టంకాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్ 70,234కు పడిపోయింది. వెరసి ఎగ్జిట్ పోల్స్ కారణంగా సోమవారం ఇన్వెస్టర్లకు అందిన 3 శాతం లాభాలు ఒక్క రోజు తిరగకుండానే ఆవిరయ్యాయి. అంతేకాకుండా రికార్డ్ గరిష్టాలు 76,469, 23,264 పాయింట్ల స్థాయిల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ గత నాలుగేళ్లలోలేని విధంగా భారీగా పతనమయ్యాయి! ఇంతక్రితం కోవిడ్–19 మహమ్మారి కట్టడికి కేంద్రం లాక్డౌన్ ప్రకటించడంతో దేశీ స్టాక్ మార్కెట్లు 2020 మార్చి 23న ఇంతకంటే అధికంగా 13 % కుప్పకూలిన సంగతి తెలిసిందే!! పీఎస్యూ షేర్లు ఫట్ మోడీ ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో ప్రభుత్వ రంగ కౌంటర్లు తీవ్రంగా నష్టపోయాయి. ప్రధానంగా ఆర్ఈసీ 24 శాతం, పీఎఫ్సీ 22%, బీఈఎంఎల్, కంకార్, బీఈఎల్, బీహెచ్ఈఎల్ 19%, హెచ్ఏఎల్ 17%, ఓఎన్జీసీ, మజ్గావ్ డాక్ 16%, రైల్టెల్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా 14%, ఆర్వీఎన్ఎల్ 13%, ఐఆర్సీటీసీ, పవర్గ్రిడ్, బీపీసీఎల్ 12% చొప్పున దిగజారాయి. ఇక పీఎస్యూ బ్యాంక్స్లో యూనియన్ బ్యాంక్, బీవోబీ, పీఎన్బీ, కెనరా బ్యాంక్, ఎస్బీఐ 18–13% మధ్య కుప్పకూలాయి. దీంతో పీఎస్ఈ ఇండెక్స్ 16%పైగా క్షీణించింది. ఎన్ఎస్ఈలో బ్యాంకెక్స్ 2022 ఫిబ్రవరి తదుపరి అత్యధికంగా 8% పతనమైంది. ఎదురీదిన ఎఫ్ఎంసీజీ.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో అన్ని రంగాలూ దెబ్బతిన్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, మెటల్, చమురు, రియలీ్ట, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్ 15–6 శాతం మధ్య పతనమయ్యాయి. ఎఫ్ఎంసీజీ మాత్రం 1 శాతం బలపడింది. ప్రభుత్వేతర దిగ్గజాలలో ఎల్అండ్టీ, శ్రీరామ్ ఫైనాన్స్,టాటా స్టీల్, ఇండస్ఇండ్, హిందాల్కో, ఐసీఐసీఐ, జేఎస్డబ్ల్యూ, భారతీ, యాక్సిస్ 16–7 శాతం మధ్య క్షీణించాయి. అయితే హెచ్యూఎల్, బ్రిటానియా, నెస్లే, హీరో మోటో, టాటా కన్జూమర్ 6–2 % మధ్య జంప్ చేశాయి.అదానీ గ్రూప్ బేర్.. అదానీ గ్రూప్ కౌంటర్లు భారీగా పతనమై ముందురోజు ఆర్జించిన లాభాలను పోగొట్టుకోవడంతోపాటు మరింత నష్టపోయాయి. అదానీ పోర్ట్స్ 21 శాతం, ఎనర్జీ సొల్యూషన్స్ 20 శాతం దిగజారగా.. గ్రీన్ ఎనర్జీ, ఎంటర్ప్రైజెస్, టోటల్ గ్యాస్, ఎన్డీటీవీ 19 శాతం, అదానీ పవర్, అంబుజా సిమెంట్స్ 17 శాతం చొప్పున పతనమయ్యాయి. ఏసీసీ 15 శాతం, అదానీ విల్మర్ 10 శాతం పడ్డాయి. అత్యధిక శాతం షేర్లు కొనేవాళ్లులేక లోయర్ సర్క్యూట్లను తాకాయి. ఫలితంగా గ్రూప్లోని 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువకు ఒక్క రోజులో రూ. 3.64 లక్షల కోట్లమేర కోతపడింది. రూ. 15.78 లక్షల కోట్లకు పరిమితమైంది. -
నెలకు రూ.4 కోట్లు అద్దె చెల్లించనున్న గూగుల్
బెంగళూరులో ఇటీవల లీజుకు తీసుకున్న ఆఫీస్ స్థలానికి గూగుల్ ఏకంగా నెలకు రూ.4కోట్లు అద్దె చెల్లించనుంది.మీడియా సంస్థల కథనం ప్రకారం..బెంగళూరు వైట్ఫీల్డ్లోని అలెంబిక్ సిటీలో 6,49,000 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని గూగుల్ ఇటీవల లీజుకు తీసుకుంది. చదరపు అడుగుకు రూ.62 నెలవారీ అద్దె రేటుతో కార్యాలయాన్ని మూడేళ్ల లాక్ ఇన్ పీరియడ్తో ఒప్పందం చేసుకుంది. దాంతో మొత్తం ఆఫీస్ స్థలానికి రూ.4,02,38,000 నెలవారీ అద్దె చెల్లించాల్సి ఉంది.గూగుల్ కనెక్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల హైదరాబాద్లో 6లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజును పునరుద్ధరించింది. 2020 నుంచి భారత్లో గూగుల్ ఆఫీస్ స్పేస్ పోర్ట్ఫోలియోను 3.5 మిలియన్ చదరపు అడుగుల మేర పెంచింది. దాంతో మొత్తం దేశంలోని ఐదు నగరాల్లో 9.3 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్స్పేస్ను కలిగి ఉంది.ఇదీ చదవండి: టెకీలకు శుభవార్త.. ‘ఉద్యోగులను తొలగించం’గూగుల్ తన ఉత్పత్తులను భారత్లో తయారు చేయాలని భావిస్తోంది. దాంతో స్థానికంగా మరింత విస్తరిస్తోంది. తమిళనాడులోని ఫాక్స్కాన్ ఫెసిలిటీలో స్మార్ట్ఫోన్లను తయారు చేయాలని, ఇతర రాష్ట్రాల్లో డ్రోన్ తయారీని ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. గతేడాది జరిగిన గూగుల్ ఫర్ ఇండియా కాన్ఫరెన్స్లో ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసింది. -
హైదరాబాద్లో లగ్జరీ ప్రాపర్టీలు కొన్న నీలిమా దివి..
హైదరాబాద్ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంపన్నుల పెట్టుబడులు కొనసాగుతున్నాయి. దేశంలో ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఒకటైన దివీస్ లేబొరేటరీస్ వ్యవస్థాపకుడు మురళి దివి కుమార్తె నీలిమా ప్రసాద్ దివి ఇటీవల హైదరాబాద్లో రూ .80 కోట్లకు రెండు లగ్జరీ ప్రాపర్టీలను కొనుగోలు చేశారు.జూబ్లీహిల్స్ పరిసరాల్లో ఆమె కొన్న మొదటి ప్రాపర్టీ 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 200 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాని కలిగి ఉంది. ఈ ప్రాపర్టీని ఆమె రూ.40 కోట్లకు కొనుగోలు చేశారు. జాప్కీ షేర్ చేసిన సేల్ డీడ్ డాక్యుమెంట్ల ప్రకారం.. 12,000 చదరపు అడుగుల రెండో ప్రాపర్టీని కూడా అంతే మొత్తానికి నీలిమా దివి కొనుగోలు చేశారు.సంపన్నులకు పేరుగాంచిన జూబ్లీహిల్స్ ప్రాంతంలో చదరపు అడుగుకు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు ప్రాపర్టీ ధరలు ఉంటుంన్నాయి. వాణిజ్య పరంగా, రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు హైదరాబాద్ దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. ఇటీవలి సంవత్సరాలలో హైదరాబాద్ హై-ఎండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్పై వ్యాపార ప్రముఖులు, నటులు, పరిశ్రమ ప్రమోటర్లతో సహా సూపర్-రిచ్ వ్యక్తులు గణనీయమైన ఆసక్తిని చూపుతున్నారు. -
అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
రియల్ ఎస్టేట్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చైనా.. పరిస్థితిని గట్టెక్కించడానికి కీలక ఆలోచన చేస్తోంది. దేశంలోని స్థానిక ప్రభుత్వాలతో కలిసి లక్షల కొద్దీ అమ్ముడుపోని ఇళ్లను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోందని బ్లూమ్బర్గ్ నివేదించింది.ప్రాథమిక ప్రణాళికపై స్టేట్ కౌన్సిల్ పలు ప్రావిన్సులు, ప్రభుత్వ సంస్థల నుంచి అభిప్రాయాన్ని కోరుతోంది. రాష్ట్ర నిధుల సహాయంతో అదనపు హౌసింగ్ ఇన్వెంటరీని క్లియర్ చేయడానికి చైనా ఇప్పటికే అనేక పైలట్ ప్రోగ్రామ్లతో ప్రయోగాలు చేసింది. అమ్ముడుపోని ఇళ్లను ప్రభుత్వాలు కొనుగోలు చేసే తాజా ప్రణాళికను అతిపెద్ద ప్రయత్నంగా భావిస్తున్నారు.ప్రణాళికలో భాగంగా కష్టాల్లో ఉన్న డెవలపర్ల నుంచి అమ్ముడుపోని ఇళ్లను అమ్మించేందుకు ప్రభుత్వ సంస్థలు సహాయం చేస్తాయి. బ్యాంకుల రుణాల ద్వారా భారీ తగ్గింపులతో ఆ ఇళ్లను కొనుగోలుదారులకు అందిస్తాయి. ప్రణాళిక, దాని సాధ్యాసాధ్యాల వివరాలను అధికారులు ఇంకా చర్చిస్తున్నారు. చైనా ప్రభుత్వ పెద్దలు ఈ నిర్ణయంపై ముందుకు వెళ్లాలనుకుంటే అది ఖరారు కావడానికి కొన్ని నెలలు పట్టవచ్చని తెలుస్తోంది. అయితే దీనిపై చైనా గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ అధికారికంగా స్పందించలేదు.ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో చైనాలో గృహాల విక్రయాలు దాదాపు 47 శాతం క్షీణించాయి. అమ్ముడుపోని ఇళ్ల జాబితా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో ఈ రంగంలోని దాదాపు అర కోటి మంది నిరుద్యోగం బారినపడే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. రియల్ ఎస్టేట్ సంక్షోభాన్ని తగ్గించడానికి కొత్త విధానాలను అన్వేషిస్తామని ఏప్రిల్ 30న పాలక కమ్యూనిస్ట్ పార్టీ హామీ ఇచ్చిన తర్వాత పెట్టుబడిదారులు ప్రభుత్వ తదుపరి కదలికల కోసం ఎదురుచూస్తున్నారు. -
రియల్ ఎస్టేట్ క్వీన్కు మరణశిక్ష.. ఈమె చేసిన నేరం ఏంటంటే..
వియత్నాం రియల్ ఎస్టేట్ క్వీన్కు ఆ దేశ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. దేశంలోనే అతిపెద్ద ఆర్థిక మోసం కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త ట్రూంగ్ మై లాన్కు దక్షిణ వియత్నాంలోని హో చి మిన్ న్యాయస్థానం గురువారం మరణశిక్ష విధించిందని ఆ దేశ అధికార మీడియా థాన్ నీన్ తెలిపింది. ఇవీ అభియోగాలు వాన్ థిన్ ఫాట్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ అధినేత్రి అయిన 67 ఏళ్ల ట్రూంగ్ మై లాన్ 12.5 బిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి. ఇది ఆ దేశ 2022 జీడీపీలో దాదాపు 3 శాతం. 2012 నుండి 2022 మధ్యకాలంలో ఆమె సైగాన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంక్ను అక్రమంగా నియంత్రించి డొల్ల కంపెనీలు, ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇవ్వడం ద్వారా ఈ నిధులను కొల్లగొట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. వియత్నాంలో అవినీతి నిరోధక డ్రైవ్లో భాగంగా 2022 అక్టోబరులో లాన్ను అరెస్టు చేశారు. ఇది ఆ దేశంలో అత్యంత హై ప్రొఫైల్ అరెస్ట్లలో ఒకటిగా నిలిచింది. బ్లేజింగ్ ఫర్నేస్ పేరుతో ఎగిసిన ఈ అవినీతి వ్యతిరేక ప్రచార ఉద్యమం వియత్నాం రాజకీయాలలో సంచలనం సృష్టించింది. దీంతో అప్పటి వియత్నాం ప్రెసిడింట్ వో వాన్ థుంగ్ రాజీనామా చేశారు. లాన్ అరెస్ట్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. విలాసవంతమైన నివాస భవనాలు, కార్యాలయాలు, హోటళ్లు, షాపింగ్ సెంటర్లు వంటి ప్రాజెక్ట్లతో వీటీపీ కంపెనీ వియత్నాంలోని అత్యంత ధనిక రియల్ ఎస్టేట్ సంస్థలలో ఒకటి. వియత్నాంలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతింది. 2023లో 1,300 ప్రాపర్టీ సంస్థలు మార్కెట్ నుండి ఉపసంహరించుకున్నాయని అంచనా. డెవలపర్లు కొనుగోలుదారులను ఆకర్షించడానికి డిస్కౌంట్లు, బంగారాన్ని బహుమతులుగా అందిస్తున్నారు. స్థానిక మీడియా ప్రకారం.. హో చి మిన్ నగరంలో షాప్హౌస్ల అద్దె మూడవ వంతు తగ్గినప్పటికీ, సిటీ సెంటర్లో చాలా వరకూ ఖాళీగానే ఉన్నాయి. -
హైదరాబాద్లో దూసుకెళ్తున్న రియల్టీ రంగం
దేశవ్యాప్తంగా ఆఫీస్ స్థలాలకు డిమాండ్ పెరుగుతోంది. కొవిడ్ భయాలు తొలగి క్రమంగా దాదాపు చాలా కంపెనీలు వర్క్ఫ్రంహోం కల్చర్కు స్వస్తి పలుకుతాన్నాయి. ఉద్యోగులను కార్యాలయాల నుంచే పనిచేయాలని కోరుతున్నాయి. దాంతో దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు కొత్తగా కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండటంతో ఆఫీస్ స్థలాలు హాట్కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ జనవరి-మార్చి మధ్యకాలంలో ఆరు మెట్రో నగరాల్లో ఆఫీస్ స్థలాల లీజులో 35 శాతం వృద్ధి నమోదైందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొల్లియర్స్ ఇండియా తాజాగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా టాప్-6 నగరాలైన బెంగళూరు, దిల్లీ-ఎన్సీఆర్, ముంబై, చెన్నై, హైదరాబాద్, పుణెలో సమీప భవిష్యత్తులో 13.6 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకునే అవకాశాలున్నాయని పేర్కొంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఇది 10.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. హైదరాబాద్తోపాటు ముంబై, బెంగళూరు, దిల్లీ-ఎన్సీఆర్లలో ఆఫీస్ స్థలాల లీజు పెరగగా, చెన్నైలో తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్లో అత్యధికంగా 2.9 మిలియన్ చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకున్నారని నివేదిక వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే రెండు రెట్లు పెరిగినట్లు వెల్లడించింది. వచ్చే త్రైమాసికానికిగాను ఇప్పటికే కార్పొరేట్ సంస్థలు తమ లీజుకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకున్నాయని తెలిపింది. నివేదికలోని కొన్ని ప్రధానాంశాలు ముంబైలో ఆఫీస్ స్థలం డిమాండ్ 90 శాతం ఎగబాకి 1 మిలియన్ చదరపు అడుగుల నుంచి 1.9 మిలియన్ చదరపు అడుగులకు చేరుకోనుంది. బెంగళూరులో కార్యాలయాల స్థలం 25 శాతం పెరిగి 4 మిలియన్ చదరపు అడుగులకు చేరుకోనుంది. గతేడాది ఇది 3.2 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. దిల్లీ-ఎన్సీఆర్లో 2.5 మిలియన్ చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకునే అవకాశం ఉంది. క్రితం ఏడాది కంటే ఇది 14 శాతం అధికం. చెన్నైలో ఆఫీస్ స్పేస్ డిమాండ్ 6 శాతం తగ్గి 1.6 మిలియన్ చదరపు అడుగుల నుంచి 1.5 మిలియన్ చదరపు అడుగులకు తగ్గింది. ఇదీ చదవండి: భారత్లో భారీ నిక్షేపాలు.. తేలిగ్గా, దృఢంగా మార్చే ధాతువు -
హైదరాబాద్లో 3 పడకల ఇళ్లకే గిరాకీ.. ఏ ధరకు కొంటున్నారో తెలుసా..
మానవుల జీవనప్రమాణాలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అవసరాలకు తగ్గట్టు నివసించేందుకు ఇళ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొన్నేళ్ల నుంచి రెండు పడక గదుల ఇల్లు ఉంటే చాలు అనుకునేవారు. దాంతో నిర్మాణ సంస్థలూ వాటినే పెద్ద మొత్తంలో నిర్మించేవి. ఇప్పుడు మాత్రం ధర అధికమైనా సరే మూడు పడక గదుల ఇల్లు, విశాలమైన వరండా లాంటివి ఉండే ఇళ్లనే కొనుగోలుదారులు ఇష్టపడుతున్నారు. ఇళ్ల కొనుగోలు తీరుపై 2023 జులై-డిసెంబరు మధ్య ఫిక్కీ-అనరాక్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇళ్ల కొనుగోలుదారుల్లో సగానికి పైగా 3 బీహెచ్కే (మూడు పడక గదులు, హాలు, వంటగది) ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేయాలనే ఆలోచనతో ఉన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీలలో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. 2బీహెచ్కే ఇళ్ల కొనుగోలుకు 38% మంది మొగ్గు చూపించారు. ఏడాది క్రితం 3బీహెచ్కే ఇల్లు/ఫ్లాట్ కొనుగోలుకు 42% మందే ఆసక్తి చూపించడం గమనార్హం. ఇళ్ల ధరలు ఆకాశాన్నంటే ముంబయిలో మాత్రం 44% మంది కొనుగోలుదారులు ఇప్పటికీ 2బీహెచ్కే వైపే చూస్తున్నారు. చాలా ప్రాంతాల్లో 1బీహెచ్కే ఇళ్లపై ఆసక్తి తగ్గినా, ముంబయి, పుణెలో వీటికి గిరాకీ ఉందని తెలిసింది. పెరిగిన సగటు విస్తీర్ణం పెద్ద ఇళ్లకు గిరాకీ పెరుగుతుండటంతో, వాటి నిర్మాణాలూ అధికంగానే ఉంటున్నాయని అనరాక్ గ్రూప్ ఛైర్మన్ అనుజ్ పురి తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే సగటు ఫ్లాటు విస్తీర్ణం 11% పెరిగిందన్నారు. 2022లో సగటు ఫ్లాటు విస్తీర్ణం 1,175 చదరపు అడుగులు ఉండగా, 2023లో 1,300 అడుగులకు చేరుకుందన్నారు. ఇదీ చదవండి: ఎన్నికల ఎఫెక్ట్.. హెలికాప్టర్లకు పెరిగిన డిమాండ్.. భారీగా అమ్మకాలు.. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2022తో పోలిస్తే గత ఏడాది ఇళ్ల విక్రయాల్లో 31% వృద్ధి కనిపించింది. మొత్తం 4.77 లక్షల ఇళ్లు 2023లో అమ్ముడయ్యాయి. కొత్తగా 4.46 లక్షల ఇళ్లు/ఫ్లాట్ల నిర్మాణాన్ని డెవలపర్లు ప్రారంభించారు. ఇళ్ల కొనుగోలుదారులు ఎక్కువగా రూ.45-90 లక్షల ఇల్లు/ఫ్లాట్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. మరికొందరు రూ.90లక్షల నుంచి రూ.1.5 కోట్ల విలువైన ఇళ్లను కొనాలనే ఆసక్తితో ఉన్నారని సర్వే వెల్లడించింది. -
2024లో హైదరాబాద్లో పూర్తికానున్న ఇళ్లు ఎన్నంటే..
రియల్ఎస్టేట్ రంగం రోజురోజుకు ఎంతలా వృద్ధి చెందుతోందో తెలియనిది కాదు. దానికితోడు మారుతున్న జీవనప్రమాణాలకు అనుగుణంగా సొంతంగా ఇళ్లు కట్టుకోవాలనుకునేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏటా ఇళ్ల నిర్మాణం అధికమవుతోంది. 2023లో ఏమేరకు ఇంటి నిర్మాణాలు పూర్తి చేశారో.. 2024లో ఈ ట్రెండ్ ఎలా ఉండబోతుందో అనరాక్ రిసెర్చ్ బృందంం నివేదిక విడుదల చేసింది. దేశంలో కిందటేడాది ప్రముఖ ఏడు నగరాల్లో 4.35 లక్షల ఇళ్లను అభివృద్ధి చేసినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ కంపెనీ అనరాక్ నివేదికలో పేర్కొంది. పూర్తయిన ఇళ్లలో అంతకుముందు ఏడాదితో పోలిస్తే 8 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. 2022లో 4.02 లక్షల యూనిట్లు పూర్తయ్యాయి. ఫస్ట్ సేల్ ట్రాన్సాక్షన్ల డేటా ఆధారంగా ఈ రిపోర్ట్ను అనరాక్ తయారు చేసినట్లు తెలిసింది. ఈ నివేదిక ప్రకారం.. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో కిందటేడాది 1,43,500 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. అంతకుముందు ఏడాదిలో పూర్తయిన 1,26,720 ఇళ్లతో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువ. దిల్లీ-ఎన్సీఆర్లో పూర్తయిన ఇళ్లు 86,300 యూనిట్ల నుంచి 32 శాతం పెరిగి 1,14,280 యూనిట్లకు చేరింది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై మూడు సిటీల్లో కలిపి కిందటేడాది 87,190 ఇళ్లు పూర్తయ్యాయి. 2022లో ఈ సంఖ్య 81,580గా నమోదైంది. పుణెలో కిందటేడాది పూర్తయిన ఇళ్లు 84,200 యూనిట్లకు పెరిగింది. ఏడాది ప్రాతిపదికన 23 శాతం వృద్ధి నమోదు చేసింది. కోల్కతాలో 25,075 ఇళ్లు కిందటేడాది పూర్తయ్యాయి. ఇదీ చదవండి: కదిలే ఇళ్లు.. సకల సౌకర్యాలు! టాప్ ఏడు నగరాల్లో 2024లో పూర్తి చేయడానికి సుమారు 5.31 లక్షల యూనిట్లు సిద్ధంగా ఉన్నాయని నివేదికలో తేలింది. ఈఏడాది ఎంఎంఆర్లో 1.61లక్షల యూనిట్లు పూర్తి కావాల్సి ఉండగా దిల్లీ-ఎన్సీఆర్లో 1.44లక్షల యూనిట్లు, పుణెలో 97,000 యూనిట్లు, హైదరాబాద్లో దాదాపు 34,770 యూనిట్లు, కోల్కతాలో 25,220 యూనిట్లు, చెన్నైలో 17,580 యూనిట్లు పూర్తవుతాయని నివేదిక పేర్కొంది. -
మెప్పించని ఆర్బీఐ పాలసీ
ముంబై: ఆర్బీఐ నుంచి కీలక వడ్డీ రేట్ల తగ్గింపుపై స్పష్టత కొరవడంతో రేట్ల ఆధారిత రంగాలైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఆటో, రియలీ్ట, కమోడిటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బలహీన డిసెంబర్ క్వార్టర్ ఫలితాల నమోదుతో ఎఫ్ఎంసీజీ షేర్లూ డీలా పడ్డాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 724 పాయింట్లు నష్టపోయి 71,428 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 213 పాయింట్లు పతనమై 21,718 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో ఉదయం సూచీలు లాభాలతో మొదలయ్యాయి. ఆర్బీఐ పాలసీ ప్రకటన వెల్లడి ఐటీ, ఇంధన షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఒక దశలో సెన్సెక్స్ 921 పాయింట్లు పతనమై 71,231 వద్ద, నిఫ్టీ 266 పాయింట్లు క్షీణించి 21,665 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. వడ్డీ రేట్ల ప్రభావిత షేర్లు డీలా ఆర్బీఐ నుంచి వడ్డీ రేట్ల తగ్గింపుపై స్పష్టత రాకపోవడంతో బ్యాంకింగ్, ఆటో, రియల్టీ షేర్లు నష్టాలు చివచూశాయి. బ్యాంకింగ్ రంగ షేర్లు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 4%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 3.50%, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ 3%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ 2% చొప్పున నష్టపోయాయి. ఆటో రంగ షేర్లూ నష్టాల బాటపట్టాయి. ఐషర్ మోటార్స్ 3%, అపోలో టైర్స్ 2.50%, మారుతీ, ఎంఅండ్ఎం, సంవర్ధన మదర్సన్ షేర్లు 2%, టీవీఎస్, అశోక్ లేలాండ్, టాటా మోటార్స్ షేర్లు 1%, ఎంఆర్ఎఫ్ 0.10% చొప్పున నష్టపోయాయి. బీఎస్ఈ ఆటో ఇండెక్స్ 1% పతనమైంది. అలాగే రియల్టీ రంగ షేర్లైన గోద్రేజ్ ప్రాపర్టీస్ 3.50%, శోభ, లోథా 3%, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 1% మేర నష్టపోయాయి. నిబంధనల అతిక్రమణ కారణంగానే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ అధికారులు తెలపడంతో పేటీఎం షేరు 10% పతనమై రూ.447 వద్ద లోయర్ సర్క్యూట్ తాకింది. -
హైదరాబాద్లో రెంట్లు ఎంత పెరిగాయో తెలుసా..
హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. రోజు రోజుకు రెంట్లు పెంచేస్తుండడంతో అద్దెకట్టేవారికి ఆర్థికభారం పెరుగుతోంది. ప్రస్తుతం చాలా కంపెనీలు Work from Home వర్క్ ఫ్రం హోం తొలగించి ఉద్యోగస్థులను ఆఫీసులకు రమ్మంటున్నాయి. దాంతో అద్దె ఇళ్లకు గిరాకీ పెరుగుతోంది. అదే అదనుగా ఇంటి యజమానులు రెంట్ పెంచుతున్నారు. కొవిడ్ పూర్వం అద్దెలకు ప్రస్తుతం ఉన్న అద్దెలకు భారీ వ్యత్యాసం ఉంది. 2019తో పోలిస్తే ఇంటి రెంట్లు ఎంత పెరిగాయనేదానిపై ప్రముఖ రియల్టీ సంస్థ హౌసింగ్.కామ్ కీలక నివేదిక విడుదల చేసింది. ఆ విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికలోని వివరాల ప్రకారం.. 2019 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు దాదాపు 25-30 శాతం మేర పెరిగాయి. అలాగే రెసిడెన్షియల్ ప్రాపర్టీల రెంట్లు 15-20 శాతం మేర అధిమయ్యాయి. అద్దెలు పెరిగిన క్రమంలో రెంటల్ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల కనిపించినట్లు నివేదిక పేర్కొంది. అయితే, ప్రపంచ వ్యాప్తంగా న్యూయార్క్, లండన్, దుబాయ్, సింగపూర్ వంటి గ్లోబల్ రియల్ ఎస్టేట్ మార్కెట్లతో పోలిస్తే దేశంలో చాలానే గ్యాప్ ఉన్నట్లు తెలిపింది. దేశంలోని టాప్ నగరాల్లో ప్రాపర్టీల ధరలు 2019 ధరలతో పోలిస్తే ప్రస్తుతం 15 నుంచి 20 శాతం మేర పెరిగినట్లు హౌసింగ్.కామ్ నివేదిక వెల్లడించింది. ప్రాపర్టీలు, అద్దె ఇళ్ల కోసం ఆన్లైన్లో సర్చ్ చేస్తున్న వారి సంఖ్య సైతం భారీగానే పెరిగినట్లు తెలిపింది. కొనుగోలు ఇండెక్స్తో పోలిస్తే ఐఆర్ఐఎస్ ఇండెక్స్ 23 పాయింట్లు అధికంగా ఉందని పేర్కొంది. ఇదీ చదవండి: ఓవెన్ సైకిళ్లు వచ్చేశాయ్.. ఓ లుక్కేయండి.. 'కరోనా మహమ్మారి తర్వాత హౌసింగ్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రాపర్టీల కొనుగోలు, అద్దెల డిమాండ్ అధికమైంది. దాదాపు దశాబ్ద కాలం పాటు స్తబ్దుగా కొనసాగిన హౌసింగ్ మార్కెట్ ధరల పెరుగుదల గత రెండేళ్లలో మాత్రం గణనీయంగా పెరిగింది. నగరాలను బట్టి ఈ ధరల పెరుగుదల ఆధారపడి ఉంటుంది. అయితే ప్రధాన నగరాల్లోని ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రాపర్టీల ధరలు భారీగా పెరిగాయి.' అని హౌసింగ్.కామ్ సీఈఓ ధ్రువ్ అగర్వాల్ తెలిపారు. -
కోట్ల రూపాయలు కావాలా..? స్థలం ఎక్కడ కొనాలంటే..
రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టిన వారు మంచి రాబడులు అందుకుంటున్నారు. దశాబ్దకాలంలో సగటున ఏటా 10 శాతం చొప్పున ఇంటి విలువలు పెరిగాయి. 2013లో రూ.50 లక్షలు విలువ చేసే ఇల్లు కొంటే దాని ధర ఇప్పుడు రూ.కోటిపైనే పలుకుతోంది. బాగా వృద్ధి ఉన్న ప్రాంతాల్లో ఇంతకు రెండుమూడు రెట్లు పెరిగిన సందర్భాలున్నాయి. వచ్చే దశాబ్దంలోనూ రియల్ ఎస్టేట్లో వృద్ధి కొనసాగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మార్కెట్ కొన్నాళ్ల పాటు స్తబ్ధుగా ఉండటం, ఆ తర్వాత ఒక్కసారిగా పెరగడం హైదరాబాద్లో పలుమార్లు జరిగింది. పెద్ద నోట్ల రద్దు, కొవిడ్ అనంతరం ఎక్కువ మంది ఇలాంటి పరిస్థితిని గమనించే ఉంటారు. దీర్ఘకాలానికి పెట్టుబడి పెట్టిన వారు లాభపడ్డారు. మంచి రాబడులు అందుకున్నారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు ముగిసి, లోక్సభ ఎన్నికలు రాబోతుండడంతో మార్కెట్లో కొంత స్తబ్ధత కన్పిస్తోంది. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో రానున్న రోజుల్లో మార్కెట్ మళ్లీ పెరగడం ఖాయమని నిర్మాణదారులు అంటున్నారు. కాబట్టి ఇంటి కల నెరవేర్చుకునేవారు, పెట్టుబడి కోణంలో రెండో ఇల్లు కొనేవారికి ఇప్పుడు అనుకూల సమయం అంటున్నారు. అయితే ఎలాంటి ప్రదేశంలో ఇల్లు, స్థలం కొనాలో నిపుణులు కొన్ని అంశాలను సూచిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి సంస్థలు పెద్ద ఎత్తున వస్తున్న ప్రాంతాలకు చేరువగా ఉన్న ప్రాంతాలను పరిశీలించవచ్చు. ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలి. వంద అడుగుల రహదారులను చేపట్టగానే ఆ ప్రాంతంలో స్థిరాస్తుల ధరలు ఒక్కసారిగా పెరగడం గమనించే ఉంటారు. మూసీపై వంతెనలతో ఆ ప్రాంత రూపురేఖలు మారిపోయిన ఉదాహరణలు కళ్లముందే ఉన్నాయి. కొత్తగా కొన్నిచోట్ల ప్రభుత్వం మూసీపై వంతెనలను కట్టబోతుంది. వీటిలో ఇప్పటివరకు లేని చోట ఎక్కడ కడుతున్నారో దృష్టి పెట్టాలి. మెట్రోరైలును సిటీలో పలు ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలు ఉన్నాయి. ఎక్కడ తొలుత విస్తరిస్తున్నారో గమనించాలి. ఇలాంటి చోట్ల తక్కువ సమయంలో ఎక్కువ పెరుగుదల ఉంటుంది. ఇదీ చదవండి: భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే టెక్నాలజీ ఇదే.. కానీ.. ఇవేవి లేకున్నా కూడా సహజంగా వృద్ధి చెందే ప్రాంతాలు ఉంటాయి. ఇక్కడ నిలకడగా ధరల వృద్ధి, అభివృద్ధి ఉంటుంది. మీరు శివార్లలో ఉంటున్నట్లయితే అక్కడి నుంచి పది కి.మీ. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలపై ఒక నజర్ వేయండి. స్థిరాస్తి సంస్థల ప్రకటనలు గమనించండి.. స్థలాలు, ఫ్లాట్లు, విల్లాల ప్రాజెక్టులు ఎటువైపు వస్తున్నాయో అవగాహన పెంచుకోండి. ప్రత్యక్షంగా చూసిన తర్వాత నిర్ణయానికి రండి. -
నివాసానికి ఒకటి.. అద్దెకు మరొకటి..!
ఉండటానికి సొంతిల్లు ఉన్నా స్థిరమైన అద్దె ఆదాయం కోసం మరో ఇల్లు కొనాలని చాలామంది ఆలోచిస్తున్నారు. గతంలో బెంగళూరు నగరంలో ఈ ధోరణి ఎక్కువగా ఉండేది. ఇప్పుడు హైదరాబాద్లోనూ పెరిగింది. హైటెక్సిటీ వంటి కొన్ని ప్రాంతాల్లో కమర్షియల్ భవనాల స్థాయిలో గృహాలకు అద్దెలు వస్తుండటంతో రెండో ఇల్లు వైపు మొగ్గుచూపుతున్నారు. నగరంలో వివిధ కారణాలతో కొద్దినెలలుగా రియల్ ఎస్టేట్ మార్కెట్ నెమ్మదించింది. గృహ రుణ వడ్డీరేట్లు పెరగడం, మార్కెట్లో నగదు లభ్యత లేకపోవడం, ప్రవాస భారతీయుల పెట్టుబడులు తగ్గడం, ఎన్నికల సంవత్సరం, మార్కెట్లో సరఫరా పెరగడం వంటి కారణాలతో రియల్ఎస్టేట్ రంగం స్తబ్దుగా ఉంది. ఇలాంటి దశలోనూ అద్దె ఆవాసాలకు మాత్రం డిమాండ్ కొనసాగుతూనే ఉందని ఈ రంగంలోని సంస్థలు చెబుతున్నాయి. ఐటీ కారిడార్గా ఉన్న మాదాపూర్లో రెండు పడక గదుల ఇంటి అద్దె సగటు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంది. కమ్యూనిటీ, అక్కడి సౌకర్యాలను బట్టి రూ.2లక్షల వరకు కూడా అద్దెలు ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో సగటున రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్య రెంట్లు ఉన్నాయి. స్థలానికి ప్రత్యామ్నాయంగా.. సొంతిల్లు ఉంటే భవిష్యత్తులో మంచి పెట్టుబడిగా భావించి గతంలో స్థలాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు, విల్లాల సంస్కృతి మొదలయ్యాక వీటిలో అద్దెలు బాగా వస్తుండటంతో స్థలానికి ప్రత్యామ్నాయంగా రెండో ఇల్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆదాయ పన్ను ప్రయోజనాలు సైతం ఉండటంతో పన్ను భారం తగ్గించుకునేందుకు కొనేవారు ఉన్నారు. నెలనెలా ఆదాయం కోసం కూడా వీటిలో పెట్టుబడులు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా వేర్వేరు నగరాల్లో చూస్తే అద్దెల రాబడి తక్కువలో తక్కువ 2.35 శాతం నుంచి గరిష్ఠంగా 4.03 శాతం వరకు ఉంటోంది. ఇల్లు కొనేందుకు పెట్టుబడి పెట్టిన మొత్తం, వార్షికంగా వచ్చిన అద్దెను పరిగణనలోకి తీసుకుని రాబడి లెక్కిస్తున్నారు. అంటే ఉదాహరణకు రూ.10 లక్షలతో ఇల్లు కొంటే వార్షికంగా 4 శాతం రూ.40 వేలు అద్దె వస్తుందని లెక్కకడుతున్నారు. దీనికి అదనంగా ఇంటి విలువ పెరగడం కలిసొచ్చే అంశం. ఇదీ చదవండి: చలిలో విద్యుత్ వాహనాలు.. ఇవి పాటించాల్సిందే.. ఎప్పటి నుంచో ఉన్నదే.. అద్దె రాబడి కోసం వ్యక్తిగత ఇళ్లల్లో ప్రత్యేకంగా పోర్షన్లు నిర్మించడం సిటీలో ఎప్పటినుంచో ఉన్నదే. ఇందుకోసం జీ+2, 3, 4 అంతస్తులు నిర్మిస్తున్నారు. ఒక అంతస్తులో పూర్తిగా యజమానులు ఉంటూ.. మిగతా అంతస్తుల్లో ఒక పడక, రెండు పడక గదులను అద్దెకిస్తూ ఆదాయం పొందుతున్నారు. అద్దెల మీద వచ్చే సొమ్ముతోనే జీవనం సాగిస్తున్న వారు సిటీలో ఎందరో ఉన్నారు. అపార్ట్మెంట్స్లో ఫ్లాట్లను అద్దె రాబడి కోసం ఇటీవల ఎక్కువ మంది కొంటున్నారు. -
రామ జన్మభూమిలో రియల్ ఎస్టేట్ బూమ్.. భారీగా పెరిగిన భూముల ధరలు
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిరం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. జనవరి 22వ తేదీన రామ మందిరం ప్రారంభోత్సవం కన్నుల పండువలా జరగనుంది. రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచే అందరి దృష్టి అయోధ్యపై పడింది. సర్వత్రా ఆసక్తి రామ మందిర నిర్మాణం కారణంగా అయోధ్య నగరంలో రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. ఉత్తరప్రదేశ్లోని ఇతర ప్రధాన నగరాలతో పోల్చితే అయోధ్య రియల్ ఎస్టేట్ మార్కెట్ గణనీయంగా పెరుగుతోంది. భూముల ధరలు నాలుగు రెట్లు పెరిగాయి. ఈ ధరలు మరింత పెరుగుతాయని ప్రాపర్టీ మార్కెట్ నిపుణుల అభిప్రాయపడుతున్నారు. స్థానికులే కాకుండా బయటివారు కూడా ఇక్కడ భూములు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తాజ్, రాడిసన్ వంటి ప్రముఖ హోటల్ చైన్లు ఈ ప్రాంతంలో భూమి కొనేందుకు ఆసక్తిని కనబరిచాయి. శివార్లలోనూ భూముల ధరలకు రెక్కలు అయోధ్యలోని రామ మందిరం ప్రాంతంలోనే కాకుండా శివార్లలోనూ భూముల ధరలు గణనీయంగా పెరిగాయి. ఫైజాబాద్ రోడ్ ప్రాంతంలో 2019లో చదరపు అడుగుకు రూ. 400–700 ఉంటే 2023 అక్టోబర్ నాటికి రూ. 1,500–3,000కి భూమి ధరలు పెరిగాయి. ఇక అయోధ్య నగరంలో భూమి సగటు ధరలు 2019లో చదరపు అడుగుకు రూ. 1,000–2,000 ఉండగా ప్రస్తుతం రూ. 4,000–6,000లకు పెరిగినట్లు అనరాక్ అధ్యయనాన్ని ఉటంకిస్తూ ‘మనీకంట్రోల్’ పేర్కొంది. అభినందన్ లోధా హౌస్ ఈ జనవరిలోనే అయోధ్యలో 25 ఎకరాల రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. అలాగే రాడిసన్, తాజ్ వంటి ప్రముఖ హోటల్ చైన్లు కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నాయి. ఆధ్యాత్మికగా కేంద్రంగా అయోధ్య రామ మందిరం ప్రారంభమయ్యాక అయోధ్య దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మికగా కేంద్రంగా, పుణ్యక్షేత్రంగా ఆవిర్భంచబోతోంది. దేశ నలుమూలల నుంచి భక్తులు, యాత్రికుల తాకిడి అధికంగా ఉండబోతోంది. ఇందుకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మెరుగైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్య నగరంతోపాటు చుట్టపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ప్రాధాన్యం పెరిగింది. ఇన్వెస్టర్లు ఇప్పుడు అయోధ్య నగరాన్ని రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు అత్యంత లాభదాయకమైన గమ్యస్థానంగా చూస్తున్నారు. -
ఖరీదైన భవనం కొనుగోలు చేసిన సీఈఓ.. ధర ఎంతంటే..?
భారత్కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా లండన్లో ఓ విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. దాదాపు రూ.1,446 కోట్లు వెచ్చించి ఆ భవనాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒప్పందం ఖరారైనట్లు కంపెనీ వర్గాలు ధ్రువీకరించాయని కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి. భారత్లో విస్తృతంగా పంపిణీ చేసిన కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ను సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన విషయం తెలిసిందే. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. లండన్లోని హైడ్ పార్క్ ప్రాంతంలో ఉన్న అబెర్కాన్వే హౌస్ను పూనావాలా కొనుగోలు చేశారు. ఈ భవనం 1920 నాటిది. దీని విస్తీర్ణం 25 వేల చదరపు అడుగులు. పోలండ్కు చెందిన దివంగత వ్యాపారవేత్త జాన్ కుల్జిక్ కుమార్తె డొమినికా కుల్జిక్ నుంచి అదర్ పూనావాలా దీన్ని కొనుగోలు చేసినట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన యూకే అనుబంధ సంస్థ సీరం లైఫ్ సైన్సెస్ ఈ భవనాన్ని సొంతం చేసుకోనున్నట్లు సమాచారం. లండన్లో ఈ ఏడాది అత్యంత ఖరీదైన ఇంటి కొనుగోలుగా ఇది నిలవనున్నట్లు సమాచారం. లండన్లో ఇది రెండో అత్యంత ఖరీదైన ఇల్లుగా రికార్డుల్లో ఉండనుందని పలువురు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు తెలిపారు. అయితే తాజా కొనుగోలుతో పూనావాలా కుటుంబం లండన్కు మకాం మార్చే అవకాశాలేమీ లేవని సీరం లైఫ్ సైన్సెస్కు చెందిన ఓ కీలక పదవిలోని వ్యక్తి తెలిపారు. ప్రస్తుతానికి కంపెనీ కార్యకలాపాలకు ఇది కేంద్రంగా ఉంటుందని చెప్పారు. అంతర్జాతీయ వ్యాపార విస్తరణకు ఈ భవనాన్ని గెస్ట్హౌజ్గా వినియోగించుకోనున్నట్లు వివరించారు. ఇదీ చదవండి: ‘పురుషుల కంటే మహిళలే బెటర్..!’ లండన్లో ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన భవనంగా 2-8ఏ రట్లాండ్ గేట్ నిలిచింది. సౌదీ మాజీ యువరాజు సుల్తాన్ బిన్ అబ్దులాఅజిజ్కు చెందిన ఎస్టేట్ దీన్ని 2020 జనవరిలో 210 మిలియన్ పౌండ్లు(రూ.2100 కోట్లు)కు కొనుగోలు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, దీని వాస్తవ కొనుగోలుదారుడు చైనాకు చెందిన స్థిరాస్తి సంస్థ ఎవర్గ్రాండ్ వ్యవస్థాపకుడు ‘హుయ్ కా యాన్’గా గుర్తించినట్లు గత ఏడాది ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది పునావాలా కొనుగోలు చేసిన భవనం కాకుండా రెండో ఖరీదైన భవనం కొనుగోలుగా హనోవర్లాడ్జ్ (రూ.1180 కోట్లు) నిలిచింది. -
రూ.10 లక్షల కోట్లతో మౌలిక సదుపాయాల వృద్ధి.. ఎక్కడంటే..
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో దక్షిణాసియాలో అతిపెద్ద నిర్మాణ పరికరాల ప్రదర్శన ‘ఎక్స్కాన్-2023’ను బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో డిసెంబర్ 12 నుంచి 16 వరకు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. నైపుణ్యాభివృద్ధికి పెట్టుబడులు పెట్టి పారిశ్రామిక వృద్ధిని సాధించాలని మంత్రి అన్నారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా వాహనాల నుంచి వచ్చే కార్బన్ను తగ్గించి కార్బన్ న్యూట్రల్ దేశం కోసం కృషిచేయాలని కోరారు. దాంతోపాటు ఉద్యోగాల కల్పన జరుగుతోందని చెప్పారు. ‘బిల్డింగ్ ఇండియా టుమారో’ పేరిట అయిదు రోజులపాటు జరగనున్న ప్రదర్శనలో వివిధ దేశాలకు చెందిన 1200 మంది ప్రదర్శనకారులు హాజరయ్యారు. రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారతీయ నిర్మాణ సామగ్రి తయారీదారుల సంఘం ఈ ఈవెంట్లో భాగస్వాములుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లతో దేశంలో నిర్మాణ రంగంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనుంది. దాదాపు రూ.10 వేల కోట్లను విశాఖకు కేటాయించనుంది. మౌలిక సదుపాయాలు, ఆర్థిక పురోగతి, పోటీతత్వానికి అనుకూలమైన వాతావరణాన్ని ఈ పెట్టుబడులు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన వినూత్న పరికరాలకు ఈ ప్రదర్శన వేదికగా నిలుస్తుంది. నిర్మాణ సామగ్రి పరిశ్రమ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 26% వృద్ధి సాధించింది. ఎక్స్కాన్ 2023లో భాగంగా హైడ్రోజన్, డీజిల్ ఇంజిన్లను సైతం ప్రదర్శించారు. ఇదీ చదవండి: ఐదు రోజుల్లో రూ.20 వేలకోట్ల సంపాదన..! -
పెట్టుబడుల వరద.. ‘సీనియర్ సిటిజన్’ ఇళ్లకు గిరాకీ
వృద్ధుల నివాస విభాగంలో పెట్టుబడులకు భారీ అవకాశాలున్నట్టు జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. వృద్ధ జనాభా దేశ జనాభాలో 2050 నాటికి 20 శాతానికి చేరుకుటుందన్న అంచనాలను ప్రస్తావించింది. ప్రస్తుతం భారత్లో వృద్ధుల జనాభా (60 ఏళ్లుపైన ఉన్నవారు) 10 కోట్లుగా ఉందని, వీరికి సంబంధించి నివాస విభాగంలో ప్రాజెక్టుల అభివృద్ధి, పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని వెల్లడించింది. చిన్న కుటుంబాలు పెరుగుతుండడం, ఉద్యోగాల కోసం పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్సాల్సి వస్తుండడం.. పెద్దలకు ప్రత్యేక నివాసాల అవసరాన్ని పెంచుతున్నట్టు పేర్కొంది. 2050 నాటికి పెద్దలపై ఆధారపడిన పిల్లల సంఖ్యకు సమాంతరంగా, పిల్లలపై ఆధారపడే తల్లిదండ్రులూ ఉంటారని చెప్పింది. పెరిగే వృద్ధ జనాభాకు ప్రత్యేకమైన సంరక్షణ అవసరమవుతుందని వివరించింది. సాధారణ నివాసాలతో పోలిస్తే వృద్ధులకు సంబంధించి ఇళ్ల ధరలు 10–15 శాతం మేర భారత్లో అధికంగా ఉన్నట్టు పేర్కొంది. -
Viral video: ఖరీదైన అపార్ట్మెంట్ల కోసం ఎగబడిన కస్టమర్లు.. 8 గంటలు క్యూలో నిలబడి మరీ!
పైన ఫొటోలో మీరు చూస్తున్న జనం ఏవో ఉచిత పథకాల వచ్చినవారు కాదు. సుమారు రూ.2 కోట్ల విలువైన అపార్ట్మెంట్లు కొనేందుకు వచ్చారు. నమ్మలేకపోతున్నారా? ఖరీదైన అపార్ట్మెంట్లను లోపలికి వెళ్లి చూసేందుకు ఇలా ఎనిమిది గంటలపాటు క్యూలో నిలబడి మరీ నిరీక్షించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్గా మారింది. దేశంలోని కొన్ని ప్రముఖ నగరాల్లో రియల్ ఎస్టేట్ ధరలు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఖరీదైన ఇళ్లకు డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. అధిక నాణ్యమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడే చాలా మంది ఖరీదైన అపార్ట్మెంట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల పుణేలో రూ. 1.5 కోట్ల నుంచి రూ. 2 కోట్ల విలువైన అపార్ట్మెంట్లను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. లోపలి వెళ్లి అపార్ట్మెంట్లలో సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఎనిమిది గంటల పాటు క్యూలో నిల్చున్నారు. ప్రధాన నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాకాడ్ ప్రాంతంలో పొడవైన లైన్లు కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియోను ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేయగా వైరల్గా మారింది. దీనిపై యూజర్ల నుంచి మిశ్రమ కామెంట్స్ వచ్చాయి. చాలా మంది ఇది నమ్మశక్యంగా లేదన్నారు. అంత ఖరీదైన అపార్ట్మెంట్లను కొనేవారు అలా క్యూలో నిలబడరని ఓ యూజర్ కామెంట్ చేశారు. కొంతమంది కిరాయి వ్యక్తులతో బిల్డర్ చేసిన మార్కెటింగ్ వ్యూహం కావచ్చని మరో యూజర్ అనుమానం వ్యక్తం చేశారు. Guys, will you stand in a queue for 8 hours if you are spending 1.5cr-2cr to buy an apartment???? pic.twitter.com/4OtNw9DtmE — Ekant | ek 🐜 (@Ayeits_Ekant) October 23, 2023 -
అట్టహాసంగా నరెడ్కో ప్రాపర్టీ షో
సాక్షి, హైదరాబాద్: నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) తెలంగాణ 13వ ప్రాపర్టీ షో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ టీ భానుప్రసాద్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ విప్లవాత్మక విధానాలతో ఐటీ రంగంతో పాటు ఫార్మా, ఏవియేషన్, ఆటోమొబైల్ వంటి అన్ని రంగాలలో జోరుగా పెట్టుబడులు వస్తున్నాయని, దీంతో ఆయా రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. బహుళ జాతి కంపెనీలకు హైదరాబాద్ పెట్టుబడుల కేంద్రంగా మారిందని చెప్పారు. ఐటీ ఉద్యోగ అవకాశాలు పెరిగాయని, దీంతో గృహ విభాగంలో డిమాండ్ ఏర్పడిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో హైదరాబాద్తోపాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలలో కూడా స్థిరాస్తి రంగం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. జిల్లాలో పట్టణీకరణ పెరగడంతో చాలా మంది కొనుగోలుదారులు ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. (డ్రీమ్ హౌస్ కొనేముందు...వీటి కోసమే వెదుకుతున్నారట!) నరెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ బీ సునీల్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. మెరుగైన మౌలిక వసతులు, కనెక్టివిటీతో ప్రధాన నగరంతో పాటు శివారు ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతుందని చెప్పారు. స్థిరాస్తిలో పెట్టుబడులకు ఇదే సరైన సమయమన్నారు. జనరల్ సెక్రటరీ విజయసాయి మేక మాట్లాడుతూ.. నరెడ్కో తెలంగాణ కేవలం స్థిరాస్తి రంగానికి మాత్రమే పరిమితం కాలేదని, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలలోనూ భాగస్వామ్యం అవుతున్నామని చెప్పారు. రెరా సర్టిఫికెట్ పొందిన ప్రాజెక్ట్లు,లావాదేవీలలో పారదర్శకత ఉండే ప్రాజెక్ట్లనుమాత్రమే ప్రాపర్టీలో ఉన్నాయని, కొనుగోలుదారులు ధైర్యంగా నిర్ణయం తీసుకోవచ్చని సూచించారు. (రూ. 2.18 లక్షల కోట్లు: విదేశీ ఇన్వెస్టర్లు తెగ కొనేస్తున్నారు) నేడు, రేపు కూడా.. మూడు రోజుల ఈ ప్రాపర్టీ షో శని, ఆదివారం కూడా ఉంటుంది. ప్రవేశం ఉచితం. ఈ ప్రదర్శనలో వందకు పైగా డెవలపర్లు, ఆరి్ధక సంస్థలు ఈ ప్రదర్శనలో తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. సుమారు నగరంలో నలుమూలలో నిర్మాణంలో ఉన్న, పూర్తయిన 300లకు పైగా ప్రాజెక్ట్లు ప్రదర్శనలో ఉన్నాయి. ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు, ఫామ్ ల్యాండ్స్ ఇలా అన్ని రకాల ప్రాపరీ్టలు అందుబాటులో ఉన్నాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, కొటక్ హోమ్ లోన్స్ వంటి బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు కూడా ప్రదర్శనలో స్టాళ్లను ఏర్పాటు చేశాయి. -
జీఎస్టీ ఎవరు కట్టాలి? బిల్డరా? ఓనరా?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో గృహాలకు డిమాండ్ పెరుగుతుంది. మెరుగైన మౌలిక వసతులు, పారిశ్రామిక ప్రగతి కారణంగా కొత్త ప్రాంతాలలో అభివృద్ధి పరుగులు పెడుతుంది. మరోవైపు ప్రధాన నగరంలో స్థలం కొరత కారణంగా గృహ నిర్మాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత ఇళ్లను కూలి్చవేసి వాటి స్థానంలో కొత్తవి నిర్మించడం మినహా నిర్మాణదారులకు ప్రత్యామ్నాయం లేదు. ఖైరతాబాద్, అబిడ్స్, బేగంపేట, సనత్నగర్, ఈఎస్ఐ, బంజారాహిల్స్ వంటి ప్రాంతాలలో ఇలాంటి రీ-డెవలప్మెంట్ ప్రాజెక్ట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇండిపెండెంట్ హౌస్లు, నాలుగైదు అంతస్తుల అపార్ట్మెంట్లను కూల్చేసి ఆ స్థలంలో హైరైజ్ భవనాలను నిర్మిస్తున్నారు. ఇందుకోసం భూ యజమానులు, ఫ్లాట్ ఓనర్లతో బిల్డర్లు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటారు. ఖాళీ స్థలాలను అభివృద్ధికి తీసుకుంటే 50 నుంచి 40 శాతం, ప్రాంతాన్ని బట్టి 60 శాతం ఫ్లాట్లను భూ యజమానికి ఇస్తామని ఒప్పందం చేసుకుంటారు. మిగిలిన వాటినే డెవలపర్ అమ్ముకుంటాడు. (డ్రీమ్ హౌస్ కొనేముందు...వీటి కోసమే వెదుకుతున్నారట!) కూల్చి కట్టినా, ఖాళీ ప్రదేశంలో కొత్త భవనాలు కట్టినా పూర్తయిన ఇళ్లకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చెల్లించాల్సి ఉంటుంది. భూ యజమాని వాటా కింద వచ్చిన జీఎస్టీ ఎవరు చెల్లించాలనే అంశంపై ల్యాండ్ ఓనర్లకు, బిలర్లకు మధ్య వాగ్వాదం నెలకొంటుంది. డెవలపరే చెల్లించాలని భూ యజమాని, ల్యాండ్ ఓనరే కట్టాలని బిల్డర్ల మధ్య సందిగ్ధం నెలకొంది. భవనం కట్టడంతో స్థలం విలువ పెరిగిందని, దీంతో 5 శాతం జీఎస్టీ చెల్లించాలని ప్రభుత్వం బిల్డర్కు నోటీసులు పంపిస్తుంది. వాస్తవానికి కొత్తవైనా, పాతవైనా భవనానికి జీఎస్టీ చెల్లించాల్సిన బాధ్యత బిల్డర్దే. కాకపోతే భూ యజమాని, కస్టమర్ల నుంచి బిల్డర్ జీఎస్టీ వసూలు చేసి కట్టాల్సింది డెవలపరే. (రూ. 2.18 లక్షల కోట్లు: విదేశీ ఇన్వెస్టర్లు తెగ కొనేస్తున్నారు) -
డ్రీమ్ హౌస్ కొనేముందు...వీటి కోసమే వెదుకుతున్నారట!
సాక్షి, హైదరాబాద్: గృహ కొనుగోలుదారుల అభిరుచులు మారుతున్నాయి. గతంలో ధర ప్రాధాన్యంగా గృహ కొనుగోలు నిర్ణయం తీసుకునే కస్టమర్లు.. ఆ తర్వాత వసతులను పరిగణనలోకి తీసుకున్నారు. కానీ, కరోనా తర్వాతి నుంచి ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో ఇంటి ఎంపికలోనూ ఇదే ధోరణి అవలంబిస్తున్నారు. ధర, సౌకర్యాలే కాదు ఇంటికి చేరువలో ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయి? ఆఫీసులు, వినోద కేంద్రాలు ఎంత దూరంలో ఉన్నాయనే అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని గృహాలను ఎంపిక చేస్తున్నారు. కొనుగోలు ప్రాధమ్యాలివే.. ♦ ఇల్లు విశాలంగా ఉండటమే కాదు కమ్యూనిటీలో సకల సౌకర్యాలు ఉండాలనేది నేటి గృహ కొనుగోలుదారుల మాట. పిల్లల కోసం క్రీడా సదుపాయాలు, పెద్దలకు క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి సదుపాయాలు ఉండాలని భావిస్తున్నారు. ఎక్కువ ఖాళీ స్థలం వదిలి, పచ్చదనం ఇష్టపడుతున్నారు. ♦ చిన్న కుటుంబాల నేపథ్యంలో పిల్లల ఆల నాపాలనా చూసే డే కేర్ సౌకర్యాలు ఉండా లని గృహ కొనుగోలుదారులు చూస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ కార్యాలయాలకు వెళితే పిల్లలను చూసుకోవడం కష్టం అవుతుంది. వర్క్ ఫ్రం హోమ్ ఉన్నా పిల్లలపై శ్రద్ధ పెట్టలే ని పరిస్థితి. కాబట్టి కమ్యూనిటీలో డే కేర్ సదుపాయాలు ఉండాలని కోరుకుంటున్నారు. ♦ ఇల్లు కొనేటప్పుడు ఆఫీసుకు ఎంత దూరంలో ఉందనేది కస్టమర్ల ప్రా«ధమ్యాలలో ఒకటి. నగరంలో ట్రాఫిక్లోనే అధిక సమయం వృథా అవుతుంది కాబట్టి దూరం, సమయం అనేది ప్రధానంగా మారాయి. ప్రజా రవాణా సౌక ర్యాలు ఎలా ఉన్నాయనేది పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటున్నారు. ♦ వీకెండ్ వస్తే కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా గడిపేందుకు షాపింగ్ మాల్స్, థియేటర్లు ఎంత దూరంలో ఉన్నాయనేవి కూడా కొనుగోలు ఎంపికలో భాగమైపోయాయి. -
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలంలో 5 శాతం పెరిగాయి. 8,325 యూనిట్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్ముడుపోయిన ఇళ్ల యూనిట్లు 7,900గా ఉన్నాయి. ఇళ్ల ధరలు సైతం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 11 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికం (జూలై–సెప్టెంబర్)లో ఇళ్ల విక్రయాలు 12 శాతం పెరిగి 82,612 యూనిట్లుగా ఉన్నాయి. త్రైమాసిక అమ్మకాలు ఆరేళ్ల గరిష్ట స్థాయికి చేరినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ఇళ్లకు బలమైన డిమాండ్ ఉన్నట్టు పేర్కొంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఎనిమిది పట్టణాల్లో అమ్ముడుపోయిన ఇళ్ల యూనిట్లు 73,691 యూనిట్లుగానే ఉన్నాయి. పట్టణాల వారీగా అమ్మకాలు ముంబైలో ఇళ్ల అమ్మకాలు సెప్టెంబర్ త్రైమాసికంలో 4 శాతం పెరిగాయి. 22,308 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 13,981 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని విక్రయాలతో పోలిస్తే 27 శాతం వృద్ధి నమోదైంది. బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు 13,619 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 13,013 యూనిట్లతో పోలిస్తే 4 శాతానికి పైగా పెరిగాయి. పుణె మార్కెట్లో 20 శాతం వృద్ధితో 13,079 ఇళ్లు అమ్ముడయ్యాయి. చెన్నై మార్కెట్లో 5 శాతం వృద్ధితో 3,870 ఇళ్ల యూనిట్లు అమ్ముడుపోయాయి. కోల్కతాలో అమ్మకాలు 3,772 యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 1,843 యూనిట్లుగా ఉన్నాయి. అహ్మదాబాద్లో 6 శాతం అధికంగా 4,108 ఇళ్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. ధరల్లోనూ పెరుగుదల డిమాండ్కు అనుగుణంగా వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చి చూసినప్పుడు సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల ధరల పెరిగినట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా తన నివేదికలో తెలిపింది. ఎనిమిది ప్రధాన పట్టణాల్లో అత్యధికంగా హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల ధరలు 11% పెరిగాయి. కోల్కతాలో 7%, బెంగళూరు, ముంబై మార్కెట్లలో 6% చొప్పున, పుణెలో 5%, అహ్మదాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్లో 4%, చెన్నై మార్కెట్లో 3% చొప్పున ధరలు పెరిగాయి. ‘‘డెవలపర్లు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తుండడంతో ఇళ్ల నిల్వలు (అమ్ముడుపోని) గణనీయంగా పెరిగాయి. ఇళ్ల అమ్మకాలు బహుళ సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరాయి. మొత్తం మీద మార్కెట్లో ఆరోగ్యకర పరిస్థితి నెలకొంది’’అని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. -
అపార్ట్మెంట్ బదులు భూములు కొంటే 10 రెట్ల లాభం! ఎలాగో తెలుసా?
పెట్టుబడి మార్గంగా అపార్ట్మెంట్ కొంటున్నారా? అయితే సిద్ధంగా ఉన్న అపార్ట్మెంట్ కంటే భూమిపై పెట్టుబడి పెట్టడం వల్ల 10 రెట్లు ఎక్కువ రాబడిని ఇస్తుందని కొలియర్స్ (Colliers)అడ్వైజరీ సర్వీసెస్ ప్రచురించిన నివేదిక తెలిపింది. అద్దె రూపంలో రాబడి అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో భూములు కొని అద్దెకు ఇవ్వడం ద్వారా అపార్ట్మెంట్ల కంటే 10 రెట్లు అధిక రాబడి పొందవచ్చని కొలియర్స్ నివేదిక పేర్కొంది. సిటీ సెంటర్కు సమీపంలో ఉండటం, రాబోయే మౌలిక సదుపాయాలు, సామాజిక సౌకర్యాలు, పర్యాటక ఆకర్షణలు, ఆర్థిక స్థోమత వంటివి దేశ వ్యాప్తంగా ప్రాపర్టీ అప్రిషియేషన్కు కీలకమైన చోదకాలుగా ఉన్నాయని ‘టాప్ ఇన్వెస్ట్మెంట్ కారిడార్స్ ఇన్ ఇండియా’ పేరుతో రూపొందించిన ఈ నివేదిక వివరించింది. రియల్ ఎస్టేట్ రంగంలో ట్రాక్షన్ కొనసాగుతోందని, దీనికి తోడు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో వేగం పెరిగిందని, భారతదేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లోని మైక్రో-మార్కెట్లు కీలక పెట్టుబడి కారిడార్లుగా అభివృద్ధి చెందుతున్నాయని వివరించింది. పెరుగుతున్న రియల్ ఎస్టేట్ కారిడార్లు వ్యవసాయేతర భూమి లభ్యత అత్యధికంగా ఉండటంతో పాటు కీలకమైన మౌలిక సదుపాయాల రాక వంటి అంశాల ఆధారంగా మహారాష్ట్రలోని వసాయి విరార్, భివండి, నేరల్-మాథెరన్ వంటి ప్రాంతాలు కీలకమైన హాట్స్పాట్లుగా ఉన్నట్లు కొలియర్స్ నివేదిక గుర్తించింది. హైదరాబాద్లోనూ.. కీలకమైన పెట్టుబడి ప్రాంతాలలో ఒకటిగా పరిగణించే మహారాష్ట్రలోని నెరల్-మాథెరన్ మైక్రో-మార్కెట్లో హాలిడే హోమ్లకు సగటు వార్షిక అద్దె రాబడి 15 శాతం ఉంటుందని, రాబోయే 10 సంవత్సరాలలో భూమి పెట్టుబడులపై ఐదు రెట్లు రాబడిని పొందగలదని అంచనా వేసినట్లు నివేదిక పేర్కొంది. గుజరాత్లోని పర్యాటక, పారిశ్రామిక కేంద్రం - సనంద్ నల్ సరోవర్ కారిడార్, చెన్నైలోని ECR, హైదరాబాద్లోని మేడ్చల్, కోల్కతాలోని న్యూ టౌన్, రాజర్హట్లు కూడా పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు చెప్పింది. పుష్కలమైన భూమి లభ్యత, పర్యాటకరంగంలో పెరిగిన ట్రాక్షన్, మౌలిక సదుపాయాలను పెంచడం వంటి కారణాలతో ఈ కారిడార్లు పెట్టుబడుల గమ్యస్థానాలుగా అభివృద్ధి చెందుతున్నాయని నివేదిక పేర్కొంది. ఈ ప్రాంతాలలో 2.5 నుంచి 4 శాతం సగటు వార్షిక అద్దె రాబడి మధ్య, భూమిపై 6 నుంచి 8 శాతం వార్షిక ధర పెరుగుదల ఉంటుందని వివరించింది. -
ఆఫీసు స్పేస్ అధరహో.. తాజా నివేదిక
సాక్షి,హైదరాబాద్: ఈ ఏడాది దేశంలోని ఆరు ప్రధాన నగరాలలో 4-4.5 కోట్ల చ.అ. కార్యాలయ స్థల లావాదేవీలు జరుగుతాయని కొలియర్స్ నివేదిక అంచనా వేసింది. స్థిరమైన ఆర్థికక దృక్పథంతో పాటు అమెరికా, యూకే, యూరప్ దేశాలకు ప్రధాన వ్యాపార వనరు ఇండియా కావటంతో ఇక్కడి ఆఫీసు స్పేస్పై సానుకూల ప్రభావం ఉంటుందని తెలిపింది. మరోవైపు రెపో రేట్లు స్థిరమైన దశలోకి చేరుకున్నప్పటికీ జీఎస్టీ వసూళ్లు, తయారీ, సేవా రంగాలు, ఈక్విటీ మార్కెట్ల వేగంతో ఈ వృద్ధి అవకాశాలున్నాయని కొలియర్స్ ఆఫీసు సర్వీసెస్ ఎండీ పీష్ జైన్ అన్నారు. ♦ ఆరు నగరాలలో ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1)లో 1.01 కోట్ల చ.అ. స్థూల ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. రెండో త్రైమాసికం (క్యూ2) నాటికి 46 శాతం వృద్ధి రేటుతో 1.46 కోట్ల చ.అ. లీజు కార్యకలాపాలు జరిగాయి. ఈ ఏడాది క్యూ1లోని ఆఫీసు స్పేస్ లావాదేవీలలో టెక్నాలజీ రంగం వాటా 24 శాతంగా ఉండగా.. 18 శాతం ఫ్లెక్సిబుల్ స్పేస్, 17 శాతం ఇంజనీరింగ్ మరియు తయారీ రంగం వాటాలున్నాయి. క్యూ2 నాటికి టెక్నాలజీ, బీఎఫ్ఎస్ఐ రంగాలు 5శాతం వృద్ధిని సాధించాయి. ఇంజనీరింగ్, తయారీ రంగాలు క్యూ1తో పోలిస్తే రెండు రెట్లు పెరిగాయి. కీలక రంగాలలో ఆరోగ్యకరమైన వృద్ధి, లీజుదారులకు విశ్వాసం పెరగడం వంటి కారణంగా ఈ వృద్ధి కొనసాగే అవకాశం ఉంది. (వర్క్ ఫ్రం హోం: అటు ఎక్కువ పని, ఇటు హ్యాపీలైఫ్ అంటున్న ఐటీ దిగ్గజం) నగరంలో 40-60 లక్షల చ.అడుగులు హైదరాబాద్లో క్యూ1లో13 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరగగా.. క్యూ2 నాటికి 19 శాతం వృద్ధి రేటుతో 15 లక్షల చ.అ.లకు పెరిగింది. ఈ ఏడాది ముగింపు నాటికి సుమారు 40–60 లక్షల చ.అ. లీజు కార్యకలాపాలు జరుగుతాయని కొలియర్స్ అంచనా వేసింది. వివిధ విభాగాలలో డిమాండ్, వ్యాపార సెంటిమెంటే ఈ వృద్ధికి కారణమని పేర్కొంది. -
ఇక ఇల్లు కొనడం కష్టమేనా? పోల్లో నిపుణుల అంచనాలు!
దేశంలో రానున్న రోజుల్లో మధ్య తరగతి వర్గాలు ఇల్లు కొనడం కష్టంగా మారొచ్చు. రాయిటర్స్ ప్రాపర్టీ అనలిస్ట్స్ పోల్ (Reuters poll of property analysts) ప్రకారం.. భారత్లో ఇల్లు కొనడం మరింత ఖరీదైన వ్యవహారంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసే వారి స్థోమత క్షీణిస్తుంది. ఆగస్టు 14 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన ఈ పోల్లో పాల్గొన్న ప్రాపర్టీ అనలిస్టులు ఇళ్ల ధరలు ఈ ఏడాది, వచ్చే సంవత్సరంలో సగటున 7 శాతం పెరుగుతాయని అంచనా వేశారు. గత జూన్ నెలలో నిర్వహించిన పోల్లో ఈ సంవత్సరం 6 శాతం, వచ్చే ఏడాది 5.5 శాతం పెరుగుతాయని అంచనా వేయగా ఈసారి ఆ అంచనాలు పెరిగాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఇళ్ల ధరలు ఏకంగా 50 శాతం పెరిగాయి. ఆ తర్వాత ఇళ్ల ధరలు తగ్గుముఖం పడతాయని లేదా స్తబ్దుగా అయినా ఉంటాయని వేసిన అంచనాలన్నీ తలకిందులయ్యాయి. అయితే భారత్లో మాత్రం గత మూడు సంవత్సరాలలో విపరీతమైన ప్రాపర్టీ కొనుగోళ్లు జరగలేదు. వార్షికంగా సగటున 2-3 శాతం మాత్రమే ఇళ్ల ధరలు పెరుగుతూ వచ్చాయి. దీంతో రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. మొదటిసారి ఇల్లు కొనేవారిపై ప్రభావం అనేక అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగానే భారత్ కూడా హౌసింగ్ సప్లయిలో సవాళ్లు ఎదుర్కొంటోంది. మరీ ముఖ్యంగా తక్కువ ధర ఇళ్ల విషయంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దేశంలో ఇళ్ల డిమాండ్ ఎప్పుడూ సమస్య కానప్పటికీ సప్లయి లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పోల్లో అడిగిన ఓ అనుబంధ ప్రశ్నకు స్పందిస్తూ మెజారిటీ మంది మొదటిసారిగా ఇల్లు కొనుగోలు చేసే వారి స్థోమత రాబోయే సంవత్సరంలో మరింత దిగజారుతుందని పేర్కొన్నారు. పెరగనున్న ఇంటి అద్దెలు ఇళ్ల ధరల పెరుగుదల కారణంగా కొనుగోలు స్థోమత తగ్గి చాలా మంది అద్దె ఇళ్లను ఆశ్రయించే అవకాశం ఉంది. దీంతో ఇళ్ల అద్దెలు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు. ఒక ప్రత్యేక ప్రశ్నకు స్పందిస్తూ పోల్లో పాల్గొన్నవారంతా ఇళ్ల అద్దెలు పెరుగుతాయని అంగీకరించారు. ఉద్యోగులు కార్యాలయాలకు తిరిగి వస్తున్న నేపథ్యంలో డిమాండ్ పెరుగుదల కారణంగా ఇళ్ల అద్దెల్లో గణనీయమైన పెరుగుదలను అంచనా వేశారు. -
రిటైల్ లీజింగ్ 15 శాతం అధికం
ముంబై: మెగా పట్టణాల్లో రిటైల్ స్థలాల లీజు పరిమాణం ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 15 శాతం పెరిగినట్టు రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ తెలిపింది. హోమ్వేర్, డిపార్ట్మెంట్ స్టోర్లు, కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్, ఫ్యాషన్ అండ్ అప్పారెల్ రిటైలర్ల నుంచి లీజింగ్కు డిమాండ్ ఉన్నట్టు పేర్కొంది. ముంబైలో 14.6 శాతం మేర రిటైల్ లీజింగ్ పెరిగింది. మొత్తం లీజు పరిమాణం 0.21 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో రిటైల్ లీజు పరిమాణం ముంబైలో 0.18 మిలియన్ చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. మొత్తం తాజా లీజు పరిమాణంలో హోమ్వేర్, డిపార్ట్మెంట్ స్టోర్ల వాటా 20 శాతంగా ఉంది. ఆ తర్వాత కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్, ఫ్యాషన్ అండ్ అప్పారెల్ వాటా 17 శాతం మేర నమోదైంది. టాప్ డీల్స్లో ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్లో 20,800 ఎస్ఎఫ్టీ స్థలాన్ని కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ సంస్థ లీజుకు తీసుకోవడం ఒకటి. అలాగే, కస్తూరి రీజియస్లో 13,500 ఎస్ఎఫ్టీని పాంటలూన్ లీజుకు తీసుకోగా, విశ్వరూప్ ఐటీ పార్క్లో 10,800 ఎస్ఎఫ్టీని క్రోమా తీసుకుంది. దేశవ్యాప్తంగా 24 శాతం అప్ దేశవ్యాప్తంగా ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో రిటైల్ లీజు పరిమాణం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 24 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం 2.9 మిలియన్ ఎస్ఎఫ్టీని సంస్థలు లీజుకు తీసుకున్నాయి. 2022 ద్వితీయ ఆరు నెలల కాలంలో 15 శాతం వృద్ధితో పోల్చి చూసినప్పుడు గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలో లీజు పరిమాణంలో బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, అహ్మదాబాద్ పట్టణాల వాటాయే 65 శాతంగా ఉంది. రానున్న కాలంలోనూ రిటైల్ లీజింగ్ మంచి వృద్ధిని చూస్తుందని సీబీఆర్ఈ చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజిన్ తెలిపారు. మాల్ సరఫరాకు తోడు, పండుగల సీజన్లో వినియోగ డిమాండ్ ఇందుకు మద్దతుగా నిలుస్తుందన్నారు. 2023 మొత్తం మీద రిటైల్ లీజు పరిమాణం 5.5–6 మిలియన్ చదరపు అడుగులుగా ఉంటుందని సీబీఆర్ఈ ఎండీ రామ్ చంద్నాని పేర్కొన్నారు. 2019లో 6.8 మిలియన్ చదరపు అడుగుల లీజు అనంతరం ఇదే అధికమన్నారు. -
రియల్ ఎస్టేట్ దిగ్గజం రామ్కీ దూకుడు: ఈసారి రూ. 2 వేల కోట్ల బుకింగ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రియల్ ఎస్టేట్ దిగ్గజం రామ్కీ ఎస్టేట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) రూ. 2,000 కోట్ల విలువ చేసే బుకింగ్స్ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది ఇది సుమారు రూ. 1,200 కోట్లుగా ఉంది. అలాగే వేర్హౌసింగ్ విభాగంలోకి కూడా ప్రవేశించడంపై సంస్థ దృష్టి పెడుతోంది. బుధవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో రామ్కీ ఎస్టేట్స్ ఎండీ ఎం నంద కిషోర్ ఈ విషయాలు తెలిపారు. సంస్థ ఇప్పటివరకు రూ. 3,500 కోట్ల పైచిలుకు విలువ చేసే 27 ప్రాజెక్టులను పూర్తి చేయగా, 15 మిలియన్ చ.అ. విస్తీర్ణంతో దాదాపు రూ. 10,000 కోట్ల విలువ చేసే 15 ప్రాజెక్టుల పనులు ప్రస్తుతం కొనసాగుతున్నట్లు వివరించారు. (మారుతి మరో సూపర్ కారు వచ్చేసింది..ధర, ఫీచర్ల వివరాలు) కొత్తగా మరో రూ. 3,600 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులపై కసరత్తు జరుగుతోందని పేర్కొన్నారు. మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ‘కమ్యూనిటీ లివింగ్’ కాన్సెప్ట్కు పెద్దపీట వేస్తూ ప్రాజెక్టులను రూపొందిస్తున్నట్లు వివరించారు. మరోవైపు, వచ్చే 3-4 ఏళ్లలో వేర్హౌసింగ్ విభాగంలోకి కూడా ప్రవేశించనున్నట్లు నంద కిషోర్ చెప్పారు. తొలుత 15 మిలియన్ చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయ న్నారు. వడ్డీరేట్ల హెచ్చుతగ్గుల ప్రభావంతో సంబంధం లేకుండా నివాస గృహాలకు డిమాండ్ ఎప్పు డూ ఉంటుందని తెలిపారు. సంస్థ దగ్గర దాదాపు రూ.6,500 కోట్ల విలువ చేసే 1,000 ఎకరాల స్థలం ఉన్నట్లు డైరెక్టర్ తారక రాజేశ్ దాసరి చెప్పారు. (కృతి సనన్ న్యూ అవతార్: థ్రిల్లింగ్ గేమ్తో ఎంట్రీ ఇచ్చేసింది!) రామ్కీవర్స్ ఆవిష్కరణ..: ప్రాపర్టీ కొనుగోళ్లకు సంబంధించి కస్టమర్లు ఎంపిక చేసుకునే ప్రక్రియ ను సులభతరం చేసేలా రామ్కీ ఎస్టేట్స్ అత్యాధునిక టెక్నాలజీని తీసుకొచ్చింది. ‘రామ్కీవర్స్’ను ఆవిష్కరించింది. దీనితో ప్రాజెక్టును చూసేందుకు, వివరాలు తెలుసుకునేందుకు కస్టమర్లు ప్రత్యేకంగా రావాల్సిన అవసరం లేకుండా, సౌకర్యంగా ఇంటి దగ్గర్నుంచే వర్చువల్ టూర్ చేయొచ్చని .. సేల్స్ సిబ్బందితో కూడా మాట్లాడవచ్చని సంస్థ వైస్ ప్రెసిడెంట్ శరత్ బాబు తెలిపారు. -
హైదరాబాద్లో రూఫ్ అండ్ ఫ్లోర్ ప్రాపర్టీ షో
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ రియల్టీ వెబ్పోర్టల్ రూఫ్అండ్ఫ్లోర్.కామ్ ప్రాపర్టీ షోతో నగరవాసుల ముందుకొచ్చింది. హైటెక్సిటీలోని మేదాన్ ఎక్స్పో సెంటర్లో జూన్ 24, 25 తేదీల్లో నిర్వహించనుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రదర్శన అందుబాటులో ఉంటుంది. ప్రవేశం ఉచితం. ఈ ప్రాపర్టీ షో ద్వారా గృహ కొనుగోలుదారులను, డెవలపర్లను అనుసంధానించే సరైన వేదికని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. అపర్ణ కన్స్ట్రక్షన్స్, వాసవి గ్రూప్, శేత్రా ఫామ్స్, సెన్సేషన్ ఇన్ఫ్రాకాన్, జీ స్క్వేర్, రిధిరా లైఫ్ స్పేసెస్, ఎన్సీసీ అర్బన్, శిల్పా ఇన్ఫ్రా, జీకే బిల్డర్స్, ప్రణీత్ గ్రూప్, శాంతా శ్రీరాం, వజ్ర, గోల్డెన్కీ ప్రైమ్ ప్రాపర్టీస్తో పాటు కెనరా బ్యాంక్ ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. -
రూ. 13 కోట్ల ఆస్తులను కొనుగోలు చేసిన సుహానా ఖాన్
సాక్షి,ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన మహారాష్ట్రలోని అలీబాగ్లో భారీ విలువైన ప్రాపర్టీలను కొనుగోలు చేసింది. అరంగేట్రంలో రూ. 12.91 కోట్లతో ఆస్తులను కొనుగోలు చేయడం విశేషంగా నిలిచింది. సుహానా ఖాన్ తన తొలి సంపాదనతో ఈ ఆస్తులను కొన్నట్టు సమాచారం. మూడు ఇళ్లతోపాటు, ఒక ప్లాట్ను కొనుగోలు చేసినట్టు మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది అంతేకాదు రిజిస్ట్రేషన్ లో సుహానా పేరును రైతుగా నమోదు చేశారట. సుహానా అమ్మమ్మ సవితా ఛిబ్బర్, ఆమె సోదరి నమితా చిబ్బర్ డైరెక్టర్లుగా ఉన్న డెజా వు ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆస్తిని జూన్ 1న రిజిస్ట్రేషన్ చేసినట్లు హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది. (అపుడు కరోడ్పతి షో సెన్సేషన్: మరి ఇపుడు) భూమి విస్తీర్ణం 1.5 ఎకరాలు, 2,218 చదరపు అడుగుల్లోఉన్న ఇళ్లు ఉన్నాయి. దీనికోసం 77.46 స్టాంప్ డ్యూటీ చెల్లించారు. పఠాన్తో భారీ హిట్ కొట్టిన షారూఖ్ ఖాన్కు ఇప్పటికే అలీబాగ్ లో సీ ఫేస్డ్ లగ్జరీ బంగ్లా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు సునైనా కొనుగోలు చేసిన అలీబాగ్ లో దీపికా పదుకొనే-రణ్వీర్ సింగ్, అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ, పారిశ్రామికవేత్త గౌతమ్ సింఘానియాకు ఇళ్లు కూడా ఉన్నాయి. (టీసీఎస్లో భారీ కుంభకోణం: రూ.100 కోట్ల కమిషన్లు మింగేశారు!) కాగా జోయా అక్తర్ దర్శకత్వంలో ది ఆర్చీస్ అనే మూవీలో సుహానా తొలిసారిగా నటిస్తోంది. ది ఆర్చీస్ అనేది 1960ల నాటి భారతదేశంలోని లైవ్-యాక్షన్ మ్యూజికల్ సెట్. ఈ సినిమాలో బోనీ కపూర్ కుమార్తె ఖుషీ కపూర్ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా కూడా నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్తో అదరగొట్టిన ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక సుహానా ఖాన్ స్టడీ విషయానికి వస్తే యూకేలోని సస్సెక్స్లోని ఆర్డింగ్లీ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్, 2022లో న్యూయార్క్ యూనివర్శిటీ టిస్చ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి నటనలో పట్టా పొందడం గమనార్హం. You’ve seen the gang in the comics, in books, and even in Riverdale — but this time around, you’ll see them closer to home! Set in the 60's, The Archies builds a world that’s both familiar and new. Here's your first look #TUDUM! pic.twitter.com/uxpS1A3JeX — Netflix India (@NetflixIndia) June 17, 2023 -
ఇంద్ర భవనం! బ్రిట్నీ స్పియర్స్ భారీ నష్టానికి అమ్మేసిన ఇల్లు ఇదే..
పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ లాస్ ఏంజిల్స్లోని విలాసవంతమైన బంగళాను ఏడాది కూడా కాకుండానే భారీ నష్టానికి అమ్మేసింది. ఈ ఇంటిని చూస్తే ఇంద్ర భవనం అంటే ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. లాస్ ఏంజిల్స్ నగరంలోని కాలాబాసాస్ ఎన్క్లేవ్లో ఉన్న బ్రిట్నీ స్పియర్స్ నివాసం కొన్ని నెలల క్రితం 10.1 మిలియన్ డాలర్లకు చేతులు మారింది. ఏడాది క్రితం ఆమె దాన్ని 11.8 మిలియన్ డాలర్లకు కొనుక్కున్నారు. 2022 జూన్లో ఈ ఇంటిని కొనుగోలు చేసింది బ్రిట్నీ స్పియర్స్ భర్త సామ్ అస్గారితో కలిసి కొన్నాళ్లపాటు ఇక్కడే ఉండేది. అయితే ఇది అందరికీ తెలిసిపోయి తమ ఏకాంతానికి అనుకూలంగా లేకపోవడంతో వారు దీన్ని వదిలి వేరే ఇంటికి మారిపోయారు. 2008లో నిర్మించిన ఈ భవనంలో ఆరు బెడ్రూమ్లు, తొమ్మిది స్నానపు గదులు 11,600 చదరపు అడుగుల సింగిల్-లెవల్ లివింగ్ స్పేస్లో విస్తరించి ఉన్నాయి. వంపు హాలులు, కాఫర్డ్ సీలింగ్లు, చెక్కతో చేసిన యాక్సెంట్లు ఇంటి అంతటా ఉన్నాయి. విలాసవంతమైన గౌర్మెట్ కిచెన్, లెదర్ రిక్లైనింగ్ సీట్లు కలిగిన హోమ్ థియేటర్, వాక్-ఇన్ సేఫ్, గేమ్ రూమ్, పెట్ వాష్ బేసిన్ వంటివి చూస్తే కళ్లు చెదరకతప్పదు. వీటితోపాటు వాటర్ ఫౌంటైన్లు, మొజాయిక్ టైల్డ్ పూల్, హాట్ టబ్, వాటర్ ఫాల్స్, బార్బెక్యూ పెవిలియన్, గెస్ట్ హౌస్ వంటివి కూడా ఉన్నాయి. -
హరిత భవనాలు: దేశంలోనే తొలిసారిగా గ్రీన్ ప్రాపర్టీ షో!
సాక్షి, హైదరాబాద్: హరిత భవనాలలో ప్రపంచంలోనే ఇండియా మూడో స్థానంలో నిలిచింది. గత రెండు దశాబ్దాల కాలంలో దేశంలో 1,027 కోట్ల చ.అ. విస్తీర్ణంలో 11 వేలకు పైగా ప్రాజెక్ట్లు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) గుర్తింపు పొందాయి. తెలంగాణలో 112 కోట్ల చ.అ.లలో 700లకు పైగా ప్రాజెక్ట్లు ఐజీబీసీ ధ్రువీకరణ దక్కించుకున్నాయి. ఈక్రమంలో దేశంలోనే తొలిసారిగా హరిత భవనాల స్థిరాస్తి ప్రదర్శనను నిర్వహించాలని ఐజీబీసీ నిర్ణయించింది. జూలై 28-30 తేదీలలో మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో గ్రీన్ ప్రాపర్టీ షోను నిర్వహించనుంది. ఈమేరకు మంత్రులు కేటీ రామారావు, టీ హరీశ్రావులు ప్రాపర్టీ షో బ్రోచర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ వీసీ అండ్ ఎండీ ఈవీ నరసింహారెడ్డి పాల్గొన్నారు. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు) ఈ సందర్భంగా ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్, సీఐఐ తెలంగాణ చైర్మన్ సీ శేఖర్రెడ్డి మాట్లాడుతూ.. గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులకు హరిత భవనాల ప్రాముఖ్యత, పర్యావరణ బాధ్యత, ఆవశ్యకతలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రాపర్టీ షోకు శ్రీకారం చుట్టామని తెలిపారు. నిర్వహణ వ్యయం, విద్యుత్, నీటి బిల్లుల తగ్గింపులతో పాటు ఆరోగ్యకరమైన జీవన విధానం వంటి వాటిపై అవగాహన పెరుగుతుందన్నారు. 75కి పైగా ఐజీబీసీ సర్టిఫైడ్, ప్రీ-సర్టిఫైడ్ నివాస, వాణిజ్య సముదాయ ప్రాజెక్ట్లతోపాటు హరిత నిర్మాణ ఉత్పత్తులు, సాంకేతికత, సేవల సంస్థలు కూడా ఈ ప్రాపర్టీ షోలో పాలుపంచుకోనున్నారని వివరించారు. -
ఈ ఇల్లు చాలా ప్రత్యేకం: అమ్మకానికి బ్రిడ్జ్ హౌస్.. ధర ఎన్ని కోట్లో తెలుసా?
మీరు ఇప్పటివరకూ ఇన్నో రకాల ఇళ్లు చూసి ఉంటారు. ఖరీదైన భవంతుల గురించి విని ఉంటారు. కొండలపై రూ.కోట్లు పెట్టి కట్టిన , విలాసవంతమైన నివాసాల గురించి చదివి ఉంటారు. కానీ ఓ కాలువ బ్రిడ్జిపై నిర్మించిన ఈ ప్రత్యేకమైన ఇంటి గురించి తెలుసా? యునైటెడ్ స్టేట్స్లోని లాస్ ఏంజెల్స్లోని అల్హంబ్రా వాష్ కాలువకు అడ్డంగా బ్రిడ్జ్పై నిర్మించిన ఇల్లు తాజాగా అమ్మకానికి వచ్చింది. దీని విలువ దాదాపు రూ. 2 కోట్లు. ఒక పడకగది, ఒక బాత్రూమ్ ఉన్న ఈ ప్రత్యేకమైన ఇంటిని కంపాస్ రియల్ ఎస్టేట్ పోర్టల్ వెబ్సైట్లో విక్రయానికి ఉంచారు. 450 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని కొనుక్కునే వారు అందమైన రూఫ్ టాప్ డాబాను ఆనందించవచ్చని, రిటైల్ దుకాణాలు, ఎల్ఏ ఫిట్నెస్, 99 రాంచ్, మెయిన్ స్ట్రీట్లో మంచి ఫుడ్స్టాల్స్కు సమీపంలో ఉండవచ్చని, ఇది నిజంగా గొప్ప ఆస్తి అని ఇంటిని అమ్మకానికి ఉంచిన పోర్టల్ పేర్కొంది. Welcome to the L.A. Troll Apartment. You can live under a bridge for only $250,000 https://t.co/6crQ2gvOls pic.twitter.com/l5M7Yjpbjk — Mighty AP (@themightyap) June 6, 2023 లాస్ ఏంజిల్స్ టైమ్స్ కథనం ప్రకారం.. ఆహ్లాదకరమైన కాలువ నీటి ప్రవాహానికి ఎదురుగా, రోడ్డు వంతెన పక్కన ఈ ఇల్లు ఉంటుంది. ఇంటి డాబా మీదకు వెళ్తే సుందరమైన పరిసరాలను వీక్షించవచ్చు. ఈ ఇల్లు ఒకప్పటి తన హైస్కూల్ స్నేహితుని తల్లిదండ్రులకు చెందినదని దీన్ని అమ్మకానికి ఉంచిన కంపాస్ ఏజెంట్ డౌగ్ లీ చెప్పారు. ఇదీ చదవండి: Oldest Real Estate Agent: 74 ఏళ్ల వయసులో రియల్ఎస్టేట్ ఏజెంట్! పరీక్ష రాసి మరీ.. -
రియల్ ఎస్టేట్ జోరు.. 5.6 లక్షల ఇళ్ల నిర్మాణం!
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇళ్ల నిర్మాణం వేగాన్ని అందుకోనుంది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఈ ఏడాది 5,57,900 ఇళ్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ వెల్లడించింది. 2022లో 4,02,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని డెవలపర్లు నిర్ణయించినట్టు పేర్కొంది. అయితే, ఈ లక్ష్యాన్ని సాధించారా అన్నది తెలియజేయలేదు. నిర్మాణం పూర్తి చేసి డెలివరీ ఇవ్వాల్సిన ఇళ్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు అనరాక్ తెలిపింది. రియల్ ఎస్టేట్ రంగ నియంత్రణ విభాగం ‘రెరా’, నిర్మాణ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, ఇళ్ల అమ్మకాల రూపంలో పెరిగిన నగదు ప్రవాహం, ఆర్థిక సంస్థల నుంచి నిధుల మద్దతు.. ఇవన్నీ ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేందుకు సానుకూలించే అంశాలుగా పేర్కొంది. డెవలపర్లు ఇళ్ల నిర్మాణంలో జాప్యం లేకుండా ప్రయత్నిస్తున్నారని, ఆలస్యం కావడం వల్ల నిర్మాణ వ్యయాల భారం పెరుగుతుందని వివరించింది. ‘‘షెడ్యూల్ ప్రకారం 2023లో టాప్–7 పట్టణాల్లో 5.6 లక్షల ఇళ్లను నిర్మాణం పూర్తి చేసి కొనుగోలుదారులకు స్వాధీనం చేయాల్సి (డెలివరీ) ఉంది. క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 39 శాతం అధికం’’అని అనరాక్ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్ తెలిపారు. హైదరాబాద్లో.. షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ మార్కెట్లో డెవలపర్లు 23,800 ఇళ్లను ఈ ఏడాది నిర్మించి కొనుగోలుదారులకు ఇవ్వాల్సి ఉంది. క్రితం ఏడాది ఇలా షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాల్సి యూనిట్ల సంఖ్య 11,700గా ఉంది. ఢిల్లీ–ఎన్సీఆర్లో ఎక్కువ ఇళ్లను నిర్మించి ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాత ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ ఉంది. ఢిల్లీ–ఎన్సీఆర్లో 1,70,100 ఇళ్లను ఈ ఏడాది డెలివరీ చేయాల్సి ఉంది. ముంబై ఎంఎంఆర్లో 1,31,400 యూనిట్లను పూర్తి చేసి ఇవ్వాలి. ఇదీ చదవండి: తొందరొద్దు బాసూ.. ఆలోచించి కొను హౌసు! -
తొందరొద్దు బాసూ.. ఆలోచించి కొను హౌసు!
సంతలో కూరగాయలు కొనేటప్పుడు పుచ్చులేమైనా ఉన్నాయా అని గమనిస్తాం. దుస్తులు షాపింగ్ చేసేముందు ట్రయల్ చేశాకే కొంటాం. బైక్, కారు కొనాలంటే మైలేజ్, వేగం, ధర వంటి అన్ని విషయాలు తెలుసుకున్నాకే తీసుకుంటాం. ..పదులు, వందలు, వేల రూపాయల ధర ఉండే వీటినే ఒకటి రెండు సార్లు ఆరా తీశాకే కొనుగోలు చేస్తాం. మరి, అలాంటిది జీవితంలో అత్యంత కీలకమైన గృహ కొనుగోలు విషయంలో తొందరెందుకు? ధరలు పెరుగుతున్నాయనో, ఆఫర్ మళ్లీ రాదనో, డిమాండ్ ఉందని తర్వాత బిల్డర్ రేటు ఎక్కువ చెబుతాడనో కంగారు పడొద్దు. సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం స్థిరాస్తి రంగం ఎన్నికల మూడ్లో ఉంది. దీంతో గత నాలుగు నెలలుగా ప్రాపర్టీ విక్రయాలు 40–50 శాతం మేర తగ్గాయి. డిసెంబర్ వరకూ మార్కెట్ స్తబ్దుగానే కొనసాగుతుంది. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే జనవరి తర్వాత నగర స్థిరాస్తి రంగం పరుగులు పెట్టడం ఖాయం. లేకపోతే కొత్త ప్రభుత్వం ఏర్పడి స్థిరపడే 4–5 నెలల వరకు స్తబ్ధ్దత కొనసాగుతుంది. ఆ తర్వాత పుంజుకుంటుంది. నగరంలో గత 3–4 ఏళ్లుగా భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎన్నికల తర్వాత ప్రస్తుతం ఉన్న రేట్లతో పోలిస్తే కొనుగోలుదారులు జనవరి నుంచి 20–30 శాతం అధిక ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: ప్రాపర్టీ కొంటున్నారా? ఈ జాగ్రత్తలు లేకుంటే రిస్కే! ఔటర్ నుంచి 2 కి.మీ.లోపు.. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) కనెక్టివిటీ కారణంగా నగరం నలువైపులా ప్రయాణం సులువైపోయింది. దీంతో కొనుగోలుదారులు ఓఆర్ఆర్ నుంచి 2 కి.మీ. పరిధిలో ప్రాపరీ్టలు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పైగా చ.అ.కు రూ.5–6 వేల మధ్య దొరకుతున్నాయి. వసతుల విషయంలో బిల్డర్లు రాజీపడటం లేదు. వెస్ట్తో పోలిస్తే 30–35 శాతం తక్కువ ధరకు ప్రాపర్టీలు దొరుకుతాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్లో విల్లాలు దొరుకుతాయి. అప్రిసియేషన్ కూడా వేగంగా ఉంటుంది. నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్, గండిమైసమ్మ, దుండిగల్, అన్నోజిగూడ, కొంపల్లి, బహదూర్పల్లి వంటి ప్రాంతాలలో ప్రాపర్టీలకు డిమాండ్ ఉంది. పశ్చిమ హైదరాబాద్లో చ.అ. 8–10 వేల మధ్య ఉన్నాయి. వసతులు, పన్నులు కలిపితే 2 బీహెచ్కే ఫ్లాట్ ఎంతలేదన్నా రూ.1.20 నుంచి రూ.1.50 కోట్ల మధ్య చెబుతున్నారు. ఇక 3 బీహెచ్కే అయితే రూ.3 కోట్ల పైమాటే. పైగా వెస్ట్ హైదరాబాద్ జనావాసాలు, కార్యాలయాలతో కిక్కిరిసిపోయింది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! మీరే ఉత్తమ కస్టమర్ ఎన్నికల వాతావరణం నెలకొనడంతో కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో బిల్డర్లు ధర విషయంలో రాజీ పడతారు. ఉత్తమ కస్టమర్ ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకునేందుకు ఎన్నికల సమయంలోనే కొనుగోలు నిర్ణయం తీసుకుంటారు. – నరేంద్ర కుమార్, ఎండీ, ప్రణీత్ గ్రూప్ ఇదీ చదవండి: రూ.వెయ్యి కోట్ల ఇల్లు.. వందేళ్ల చరిత్ర! -
రూ.2,500 కోట్ల భవంతి! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది ఇదే..
ఫొటోలో కనిపిస్తున్న ఈ భవంతి విలువ తెలిస్తే ఆశ్చర్యపోతారు. ‘ది హోల్మ్’ అని పిలిచే దీని ప్రస్తుత ధర రూ. 2,500 కోట్లు పలికి, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవంతిగా నిలిచింది. (వెంట వచ్చే రిఫ్రిజిరేటర్.. మొబైల్ ఫోన్లోనే కంట్రోలింగ్) లండన్లో 1818లో జార్జియన్ ప్రాపర్టీ డెవలపర్ జేమ్స్ బర్టన్ అనే వ్యక్తి దీనిని నిర్మించాడు. ముందు బర్టన్ వంశస్థులే ఇందులో నివాసం ఉండేవారు. కొద్ది రోజులు బర్టన్ కళశాలగా మార్చారు. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితుల కారణంగా 1980లో ప్రైవేటు నివాసంగా మార్చారు. ఇక అప్పటి నుంచి అనేక సార్లు, అనేకమంది దీనిని మార్కెట్లో అమ్మకానికి ఉంచారు. ప్రతిసారి అనుకున్నదాని కంటే ఎక్కువ ధర పలుకుతూనే ఉంది. (నేను ‘మోనార్క్’ని... సెల్ఫ్డ్రైవింగ్ ట్రాక్టర్) గత సంవత్సరం సౌదీ రాజకుటుంబ సభ్యుల్లో ఒకరు దీనిని రూ.1500 కోట్లకు కొనుగోలు చేశారు. వారే ఇప్పుడు రూ.2,500 కోట్ల ధరకు అమ్మకానికి ఉంచారు. ఈ వేలం ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రారంభం కానుంది. చూడాలి ఈసారి హోల్మ్ను దక్కించుకునే ఆ యజమాని ఎవరో! -
రూ.వెయ్యి కోట్ల ఇల్లు.. వందేళ్ల చరిత్ర!
రూ.వెయ్యి కోట్ల విలువైన ఇల్లు ఇది.. కానీ ఇందులో ఎవరూ నివాసం ఉండటం లేదు. అత్యంత చారిత్రక నేపథ్యం ఈ ఇంటికి ఉంది. వందేళ్ల క్రితం రూ.2 లక్షల ఖర్చు పెట్టి ఈ ఇంటిని నిర్మించారు. 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటి విలువ ఇప్పుడు రూ.వెయ్యి కోట్లకుపైనే ఉంటుంది. ముంబైలోని మలబార్ హిల్.. అత్యంత ఖరీదైన ప్రాంతం. దేశంలోని కొన్ని సంపన్న కుటుంబాలకు నిలయం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆ ప్రాంతంలోనే అక్కడ నివసిస్తున్నారు. గోద్రేజ్ కుటుంబం వంటి బిలియనీర్లు కూడా అక్కడ ఉంటున్నారు. కానీ అదే స్థాయిలో వివాదాలు, విశేషాలు ఉన్న ఓ ఇల్లు అక్కడ ఉంది. అదే ‘సౌత్ కోర్ట్’. పాకిస్థాన్కు జాతిపితగా పిలిచే మహమ్మద్ అలీ జిన్నా దీన్ని నిర్మించారు. ఇదీ చదవండి: పనేమీ లేకుండా రూ.కోటిన్నర జీతమిచ్చారు! ఇల్లు అచ్చిరాలేదు.. వందేళ్ల క్రితం మలబార్ హిల్లో ఈ బంగ్లాను జిన్నా కొనుగోలు చేశారు. అప్పట్లో ఈ మలబార్ హిల్ ముంబై (అప్పటి బొంబాయి) ప్రముఖులకు గోటూ జోన్గా ఉండేది. జిన్నా ఇల్లు అతని పార్సీ స్నేహితుడైన సర్ దిన్షా పెటిట్ ఇంటికి దగ్గరగా ఉండేది. ఆ సమయంలో సర్ దిన్షా పెటిట్ నగరంలోనే అత్యంత సంపన్నుడు. ఆయనకు రూట్టీ అనే కుమార్తె ఉండేది. 18 ఏళ్ల వయసున్న ఆమెను జిన్నా 42 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు. దీంతో పెటిట్ కుటుంబంతో విభేదాలు చలరేగాయి. కొన్ని రోజులపాటు ఆ ఇంట్లో ఉన్న జిన్నా దంపతులు తర్వాత విడిచిపెట్టి వెళ్లిపోయారు. విలాసవంతమైన తాజ్ మహల్ హోటల్లో నివాసమున్న రూట్టీ ఏడాది తరువాత మరణించింది. జిన్నా కూడా లండన్ వెళ్లిపోయారు. ఇదీ చదవండి: ఫ్లిప్కార్ట్ బిగ్బిలియన్ డేస్ సేల్ సృష్టికర్త.. మింత్రాకు సీఈవో.. ఈ సూపర్ ఉమన్! జిన్నా భారతదేశానికి తిరిగివచ్చాక కొన్నేళ్లపాటు ఆ ఇంట్లో ఉన్నారు. రాజకీయ సమావేశాల కోసం ఆ ఇల్లు సరిపోవడం లేదంటూ 1936లో రూ.2 లక్షలు ఖర్చు పెట్టి పెద్ద భవనం నిర్మించారు. 1940లలో మహాత్మా గాంధీ, జిన్నా మధ్య కీలక సమావేశాలకు ఈ ఇంట్లోనే జరిగాయి. దేశ విభజన సమీపిస్తున్న నేపథ్యంలో జిన్నా ఈ ఇంటిని అమ్మేందుకు అప్పట్లో ప్రయత్నించినట్లు చెబుతారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొన్ని దశాబ్దాలపాటు ఆ ఇంటిని బ్రిటిష్ హైకమిషన్కు అద్దెకు ఇచ్చారు. అప్పటి నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఈ ఖరీదైన ఇల్లు నిరుపయోగంగా ఉంది. 2021లో బీజేపీ నాయకుడు మంగళ్ ప్రభాత్ లోధా ఈ జిన్నా హౌస్ను కళా సాంస్కృతిక కేంద్రంగా మార్చడానికి ముందుకు వచ్చారు. ఇదీ చదవండి: లక్ష టవర్లు.. 5జీ నెట్వర్క్లో రిలయన్స్ జియో దూకుడు! -
లగ్జరీ ఫ్లాట్లకు ఇంత డిమాండా? మూడు రోజుల్లో రూ. 8 వేల కోట్లతో కొనేశారు!
న్యూఢిల్లీ: లగ్జరీ అపార్టుమెంట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.దేశీయ అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్ఎఫ్ దూసుకుపోతోంది. తాజాగా మూడు రోజుల్లో రూ. 8వేల కోట్లకుపైగా విలువైన లగ్జరీ ఫ్లాట్లను విక్రయించింది. లాంచింగ్ ముందే వీటిని విక్రయించడం విశేషం. (రిలయన్స్ అధినేత అంబానీ కళ్లు చెదిరే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్) ప్రీ-ఫార్మల్ లాంచ్ సేల్స్లో భాగంగా గురుగ్రామ్లోని సెక్టార్ 63లో గోల్ఫ్ కోర్స్ ఎక్స్టెన్షన్ వద్ద నిర్మించిన ‘ది అర్బర్’ డీఎల్ఎఫ్ ప్రాజెక్ట్ ఈ ఫీట్ సాధించింది. లాంచింగ్కు మూడు రోజుల ముందుగానే పూర్తి సేల్స్ను నమోదు చేసింది. 25 ఎకరాల్లో నిర్మించిన ఈ ప్రాజెక్ట్లో ఐదు టవర్లు, 38/39 అంతస్తులున్నాయి. ఇందులో 4 BHK 1137 ఫ్లాట్స్ ఉన్నాయి. వీటి ధరలు యూనిట్కు రూ. 7 కోట్ల నుండి ప్రారంభం. (‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా!) తమ ప్రాజెక్ట్కు అద్భతమైన స్పందన లభించిందనీ, డీఎల్ఎఫ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆకాష్ ఓహ్రి సంతోషం ప్రకటించారు. లగ్జరీ గృహాలు, జీవనశైలి సౌకర్యాలకు పెరుగుతున్న ఆదరణకు ఇది సంకేతమన్నారు. 75 ఏళ్లుగా కస్టమర్ల ఆకాంక్షలకనుగుణంగా శ్రద్ధ, నిబద్ధతతో అందిస్తున్న సేవలు, కొనుగోలుదారుల విశ్వాసం నేపథ్యంలో ప్రాజెక్ట్ కోసం అధిక స్పందన లభిస్తోందన్నారు. ముఖ్యంగా, 95 శాతం మంది కొనుగోలు దారులు తమ తుది వినియోగం కోసం కొనుగోలు చేశారన్నారు.గురుగ్రామ్లో అర్బర్ నిస్సందేహంగా తమకొక మైలురాయి లాంటిదన్నారు. -
దేశంలోనే ఖరీదైన పెంట్ హౌస్ కొనుగోలు
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో చైర్మన్ నీరజ్ బజాజ్ ముంబైలో అత్యంత ఖరీదైన మలబార్ హిల్ ప్రాంతంలో, సముద్ర తీరంలోని ఓ పెంట్ హౌస్ (ట్రిప్లెక్స్)ను రూ.252.50 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. గృహాల సెర్చింగ్ పోర్టల్ ఇండెక్స్ట్యాప్ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ప్రముఖ రియల్టీ డెవలపర్ లోధా గ్రూపు నుంచి నీరజ్ బజాజ్ ఈ అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. మార్చి 13న ఈ లావాదేవీ జరిగింది. రూ.15.15 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్టు సమాచారం. మలబార్ ప్యాలసెస్ ప్రాజెక్ట్లోని 29, 30, 31 అంతస్తులను నీరజ్ బజాజ్ ఇంత భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకున్నారు. 18,008 చదరపు అడుగుల విస్తీర్ణం (కార్పెట్ ఏరియా 12,624 చదరపు అడుగులు) పరిధిలో మూడు అంతస్తులుగా ఉంటుంది. ఎనిమిది కారు పార్కింగ్ స్లాట్లు కూడా ఉన్నాయి. గత నెలలో వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బీకే గోయెంకా రూ.230 కోట్లతో ముంబైలోని వర్లిలో అపార్ట్మెంట్ కొనుగోలు చేయడం తెలిసిందే. అలాగే డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ సైతం పలు ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. -
ఆ నగరాల్లో చుక్కలనంటిన రియల్ ఎస్టేట్ ధరలు! రూ. 8 కోట్లకు ఎంత వస్తుందంటే..
దేశంలోని మూడు మెట్రోపాలిటన్ నగరాలు ముంబై, ఢిల్లీ, బెంగళూరులలో రియల్ ఎస్టేట్ ధరలు చుక్కలనంటాయి. వాటి ప్రైమ్ ప్రాపర్టీ మార్కెట్ 2022లో ధరల పెరుగుదలను నమోదు చేసింది. ఈ మూడు నగరాలు నైట్ ఫ్రాంక్ ప్రైమ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ ఇండెక్స్ (పీఐఆర్ఐ 100)లో ఉన్నత స్థానాలకు చేరుకున్నాయి. ఒక మిలియన్ డాలర్లు (రూ.8,24,43,400)కు ఏయే నగరాల్లో ఎంత స్థలం కొనుగోలు చేయొచ్చో నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ గణాంకాలను విడుదల చేసింది. (ఇదీ చదవండి: టయోటా కార్లపై తగ్గని మోజు.. భారీగా పెరిగిన అమ్మకాలు!) నైట్ ఫ్రాంక్ డేటా ప్రకారం.. అమెరికన్ డాలర్ల పరంగా ముంబై ప్రపంచంలో 18వ అత్యంత ఖరీదైన ప్రైమ్ రెసిడెన్షియల్ మార్కెట్. ఈ నగరం ప్రైమ్ ప్రాపర్టీ మార్కెట్ 6.4 శాతం ధరల పెరుగుదలను నమోదు చేసింది. 2021లో 92వ స్థానంతో పోలిస్తే 2022 పీఐఆర్ఐ 100 సూచీలో 37వ స్థానానికి చేరుకుంది. ముంబైలో ఒక మిలియన్ డాలర్లతో 113 చదరపు మీటర్ల వరకు కొనుగోలు చేయవచ్చు. 2023లో కూడా ముంబై ప్రైమ్ ప్రాపర్టీ మార్కెట్ విలువు 3 శాతం మేర పెరగనుంది. ఇక ఢిల్లీలో ప్రైమ్ ప్రాపర్టీ మార్కెట్ 1.2 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 2021లో 93వ ర్యాంక్తో ఉండగా 2022లో 77వ ర్యాంక్కు చేరుకుంది. ఇక్కడ ఒక మిలియన్ డాలర్లతో 226 చదరపు మీటర్ల స్థలాన్ని కొనుగోలు చేయవచ్చు. (ఇదీ చదవండి: సిమ్కార్డులతో పనిలేదు.. కొత్తగా ‘ఐ-సిమ్’ టెక్నాలజీ!) బెంగళూరు ప్రైమ్ ప్రాపర్టీ మార్కెట్ విలువ 3 శాతం పెరిగింది. 2021లో 91వ ర్యాంక్తో పోల్చితే 2022లో ఇండెక్స్లో 63వ స్థానానికి చేరింది. ఈ నగరంలో ఒక మిలియన్ డాలర్లతో 385 చదరపు మీటర్లను కొనుగోలు చేయవచ్చు. నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ మాట్లాడుతూ.. ‘భారత రెసిడెన్షియల్ మార్కెట్లు గత అనేక త్రైమాసికాలుగా డిమాండ్లో వృద్ధిని కనబరుస్తూ విలువలు పెరిగాయి. దేశంలోని ప్రైమ్ రెసిడెన్షియల్ మార్కెట్ హై-ఎండ్ ప్రాపర్టీల అమ్మకాల ఊపును పెంచింది’ అని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని ఇతర మార్కెట్ల విలువలు క్షీణిస్తున్నప్పటికీ, టోక్యో తర్వాత ఏపీఏసీ మార్కెట్లలో 6.4 శాతం పెరుగుదలతో ముంబై రెండవ స్థానంలో ఉందన్నారు. (ఇదీ చదవండి: ట్విటర్కు పోటీగా బ్లూస్కై.. సరికొత్త ఫీచర్లు!) -
ఇళ్లు కొనేందుకు ఎగబడ్డారు.. ఒక్కోటి రూ.7 కోట్లు!
ఇళ్లు ఉచితంగా ఇస్తే జనం ఎగబడటం చూశాం. కానీ ఒక్కో ఇల్లు రూ.7 కోట్లు పెట్టి మరీ కొనేందుకు ఎగబడ్డారు. ఎంతలా అంటే మూడు రోజుల్లో ఏకంగా 1,137 ఇళ్లు అమ్మడుపోయాయి. దీనికి సంబంధించి ఇళ్లు కొనేందుకు వచ్చిన జనం అంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ ఆర్బర్ పేరుతో గురుగ్రామ్లో ఓ కొత్త ప్రాజెక్ట్ చేపట్టింది. ఈ లగ్జరీ ప్రాజెక్ట్లో ఫ్లాట్లను అమ్మకానికి ప్రకటించగా కంపెనీ కార్యాలయానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారంటూ జనం కిక్కిరిసి ఉన్న ఓ ఫొటోను వీకెండ్ఇన్వెస్టింగ్ అనే సంస్థ అధినేత అలోక్ జైన్ ట్విటర్లో షేర్ చేశారు. (నెలకు రూ.4 లక్షలు: రెండేళ...కష్టపడితే, కోటి...కానీ..!) Just checked with a DLF broker...says entire project of 1137 flats at 7 cr a piece has been sold out in 3 days 🤐 Mind gone numb 😲 https://t.co/UpvNnsH0H3 — Alok Jain ⚡ (@WeekendInvestng) February 21, 2023 డీఎల్ఎఫ్ కొత్త ప్రాజెక్ట్లో ఒక్కో ఫ్లాట్ ధర రూ.7 కోట్లని, మొత్తం 1,137 ఫ్లాట్లు మూడు రోజుల్లోనే అమ్ముడుపోయాయని తనకు డీఎల్ఎఫ్ బ్రోకర్ ఒకరు తెలియజేసినట్లు అలోక్ జైన్ పేర్కొన్నారు. దీనికి పలువురు ట్విటర్ యూజర్లు పలు విధాలుగా స్పందించారు. ఇది ఇన్వెస్టర్లు, బ్రోకర్ల మాయాజాలం అని, అన్నీ వాళ్లే కొనుక్కొని ఉంటారని కామెంట్లు పెట్టారు. అయితే దీన్ని డీఎల్ఎఫ్ సంస్థ ధ్రువీకరించాల్సి ఉంది. (ఇదీ చదవండి: UIDAI Factcheck: ఆధార్ జిరాక్స్లు ఇవ్వకూడదా?) -
రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్: టాప్-5లో హైదరాబాద్ ఉందా?
న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఐదు అత్యుత్తమ పనితీరు చూపించిన నివాసిత ప్రాపర్టీ మార్కెట్లలో ముంబై, బెంగళూరు చోటు సంపాదించాయి. వార్షికంగా నివాస ధరల వృద్ధి ఈ రెండు పట్టణాల్లోనూ 7 శాతం మేర ఉంది. ‘ఆసియా పసిఫిక్ రెసిడెన్షియల్ రివ్యూ ఇండెక్స్’ వివరాలను నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసింది. 2022 ద్వితీయ ఆరు నెలల కాలంలో వార్షిక ధరల వృద్ధి పరంగా టాప్-5లో బెంగళూరు, ముంబై ఉన్నట్టు నైట్ ఫ్రాంక్ తెలిపింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మొత్తం 23 పట్టణాలకు గాను 14 పట్టణాల్లో వార్షికంగా ధరలు పెరిగాయి. ఈ జాబితాలో వార్షికంగా 24 శాతం ధరల వృద్ధితో మెట్రో మనీలా మొదటి స్థానంలో నిలిచింది. 9.3 శాతం ధరల వృద్ధితో సింగపూర్, 9 శాతం వృద్ధితో టోక్యో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ముంబై, బెంగళూరు నాలుగో స్థానంలో నిలిచాయి. ఇక ఢిల్లీలో ఇళ్ల ధరలు 6.8 శాతం పెరగ్గా, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో టాప్–10లో చోటు సంపాదించుకుంది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ మార్కెట్లలో వచ్చే 12 నెలల్లో ఇళ్ల ధరలు మోస్తరుగా ఉండొచ్చని నైట్ ఫ్రాంక్ అంచనా వేస్తోంది. బెంగళూరులో ఇళ్ల ధరలు 3–5 శాతం మధ్య, ముంబై, ఢిల్లీలో 3–4 శాతం మధ్య పెరగొచ్చని పేర్కొంది. (ఇదీ చదవండి: పెంట్ హౌస్ రూ.240 కోట్లా.. ఎక్కడో తెలుసా?) -
పెంట్ హౌస్ రూ.240 కోట్లా.. ఎక్కడో తెలుసా?
మీరు చదుతున్నది నిజమే. ముంబైలోని ఓ అపార్ట్మెంట్లోని పెంట్ హౌస్ రూ.240 కోట్లకు అమ్మడుపోయింది. ఈ అపార్ట్మెంట్ ముంబై నగరంలోని వోర్లీ ప్రాంతంలో ఉంది. వెల్సన్ గ్రూప్ చైర్మన్ బీకే గోయెంకా ఇంత భారీ మొత్తం చెల్లించి దీన్ని సొంతం చేసుకున్నారు. ఖరీదైన ఈ ట్విన్ టవర్స్ పేరు ‘360వెస్ట్’. ఇందులో 63, 64, 65 అంతస్థుల్లో ఈ పెంట్హౌస్ ఉంది. దీని విస్తీర్ణం 30వేల చదరపు అడుగులు. నగరంలో అత్యంత విలాసవంతమైన ‘360వెస్ట్’ అపార్ట్మెంట్లో ట్రిపులెక్స్ పెంట్ హౌస్ భారీ ధరకు అమ్ముడుపోయి అత్యంత భారీ అమ్మకాల్లో ఒకటిగా నిలిచింది. ఈ భారీ డీల్ బుధవారం జరిగింది. ఇందులో నివసించేందుకు పారిశ్రామికవేత్త ఈ ఖరీదైన ట్రిపులెక్స్ పెంట్ హౌస్ను కొనుగోలు చేశారు. అయితే పక్కగా ఉన్న మరో పెంట్ హౌస్ను బిల్డర్ వికాస్ ఒబెరాయ్ రూ.24 కోట్లకు కొనుగోలు చేయడం గమనార్హం. కాగా గత వారంలోనే ఒబెరాయ్ రియల్టీ సంస్థ.. ఈ విలాసమంతమైన ‘360వెస్ట్’ భవన సముదాయాన్ని రూ.4వేల కోట్లకు కొనుగోలు చేసినట్లు బీఎస్ఈ, ఎన్ఎస్సీల్లో నమోదు చేసుకుంది. ఇందులో 63 అపార్ట్మెంటులు ఉన్నాయి. ల్యాండ్ ఏరియా 5.25 లక్షల చదరపు అడుగులు. సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న సముదాయం రెండు భవంతులుగా ఉంటుంది. ఇందులో ఒకటి రెసిడెన్సియల్ ప్రాజెక్ట్ కాగా మరొకటి రిట్జ్-కార్ల్టన్ హోటల్. (ఇదీ చదవండి: ఓలా కొత్త స్కూటర్లు వచ్చేశాయి.. ధర ఎంతో తెలుసా?) -
గృహ విక్రయాలు: పశ్చిమ, ఉత్తరాదిలోనే జోరు!
సాక్షి, సిటీబ్యూరో: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఐటీ ఆధారిత కంపెనీలు కేంద్రీకృతమైన ప్రాంతాలలో గృహాలకు డిమాండ్ ఏమాత్రం తగ్గట్లేదు. ఫలితంగా హైదరాబాద్లో పశ్చిమ, ఉత్తరాది ప్రాంతాలలో ఇళ్ల కొనుగోళ్లు, సరఫరా పెరుగుతున్నాయి. ఈ ఏడాది జులై-సెప్టెంబర్ (క్యూ3)లో నగరంలో 11,650 గృహాలు విక్రయం కాగా.. ఇందులో ఈ రెండు జోన్ల వాటానే 92 శాతంగా ఉంది. అలాగే 15,500 యూనిట్లు లాంచింగ్ కాగా.. వెస్ట్, నార్త్ జోన్ల వాటా 91 శాతంగా ఉందని అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఈ ఏడాది మూడో త్రైమాసికంలో విక్రయమైన గృహాలలో భాగ్యనగరం వాటా 13 శాతంగా ఉంది. క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఇది 4 శాతం వృద్ధి. వార్షిక ప్రాతిపదికన ఇళ్ల అమ్మకాలలో హైదరాబాద్లో రికార్డ్ స్థాయిలో 73 శాతం వృద్ధి నమోదయింది. జోన్ల వారీగా చూస్తే.. క్యూ3లో నగరంలో అమ్ముడైన ఇళ్లలో అత్యధికం వెస్ట్ జోన్లోనే జరిగాయి. గచ్చిబౌలి, కొండాపూర్, తెల్లాపూర్, మణికొండ, కూకట్పల్లి, కోకాపేట, పటాన్చెరు వంటి ప్రాంతాలు ఉండే ఈ జోన్ వాటా 49 శాతంగా ఉంది. మియాపూర్, బాచుపల్లి, నిజాంపేట, యాప్రాల్, షామీర్పేట వంటి ప్రాంతాలు ఉండే నార్త్ జోన్ 43 శాతం అమ్మకాల వాటా కలిగి ఉంది. అయితే క్రితం త్రైమాసికంతో పోలిస్తే మాత్రం ఈ రెండు జోన్లలో విక్రయాలు 1 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. ఇదే సమయంలో తూర్పు, సెంట్రల్ జోన్లలో విక్రయాలు 1 శాతం మేర పెరిగాయి. క్యూ3లోని హైదరాబాద్లోని గృహ విక్రయాలలో హబ్సిగూడ, నాచారం, ఉప్పల్, ఘట్కేసర్, ఎల్బీనగర్, వనస్థలిపురం వంటి ఈస్ట్ జోన్ వాటా 3 శాతం, అమీర్పేట, పంజగుట్ట, సోమాజిగూడ, హిమాయత్నగర్ వంటి ప్రాంతాలు ఉండే సెంట్రల్ జోన్ వాటా 1 శాతం, శంషాబాద్, ఆదిభట్ల, మహేశ్వరం, షాద్నగర్, రాజేంద్రనగర్ వంటి సౌత్ జోన్ 3శాతం వాటాతో ఉన్నాయి. నగరానిది 17 శాతం వాటా.. గృహ ప్రారంభాలలోనూ హైదరాబాద్ హవా కొనసాగింది. క్యూ3లో ఏడు ప్రధాన నగరాలలోని లాంచింగ్స్లో 17 శాతం వాటాతో నగరం రెండో స్థానంలో నిలిచింది. అయితే ఈ ఏడాది క్యూ2తో పోలిస్తే మాత్రం నగరంలో లాంచింగ్స్ 2 శాతం తగ్గాయి. వార్షిక ప్రాతిపదికన మాత్రం 6 శాతం వృద్ధిలో ఉంది. నివాస ప్రారంభాలలోనూ పశ్చిమ జోన్దే జోరు. క్యూ3లో హైదరాబాద్లో జరిగిన లాంచింగ్స్లో ఈ జోన్ వాటా 53 శాతం. అయితే క్రితం త్రైమాసికంతో పోలిస్తే మాత్రం 2 శాతం క్షీణత. అలాగే క్యూ2తో పోలిస్తే నార్త్ జోన్లో లాంచింగ్స్ 6 శాతం వృద్ధి రేటుతో 32 శాతం నుంచి 38 శాతానికి పెరిగాయి. సౌత్ జోన్ 5 శాతం, ఈస్ట్ జోన్ 4 శాతం వాటాను కలిగి ఉన్నాయి. కొత్తగా ప్రారంభమైన గృహాలలే లగ్జరీవే అత్యధికం. క్యూ3లో ప్రారంభమైన ఇళ్లలో 54 శాతం ఈ తరహా నివాసాలే. 30 శాతం వాటా మధ్యస్థాయి గృహాలున్నాయి. అఫర్డబుల్ ఇళ్లు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. క్యూ2లో లాంచింగ్స్లో అందుబాటు గృహాల వాటా 3 శాతం కాగా.. క్యూ3 నాటికి 1 శాతానికే పరిమితమయ్యాయి. -
కీస్టోన్ రియల్టర్స్ ఐపీవో ఓకే
న్యూఢిల్లీ: రుస్తోంజీ బ్రాండుతో రియల్టీ ఆస్తులను విక్రయించే కీస్టోన్ రియల్టర్స్ పబ్లిక్ ఇష్యూకి ఓమాదిరి స్పందన లభించింది. ఇష్యూ చివరి రోజు బుధవారానికల్లా 2 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం కంపెనీ 86,47,858 షేర్లను ఆఫర్ చేయగా.. 1,73,72,367 షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులు(క్విబ్) నుంచి 3.84 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 3.03 రెట్లు అధిక బిడ్స్ దాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో మాత్రం 53 శాతమే సబ్స్క్రిప్షన్ నమోదైంది. షేరుకి రూ. 514–541 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 635 కోట్లు సమకూర్చుకుంది. ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 190 కోట్లు అందుకున్న విషయం విదితమే. దాదా పు రూ. 342 కోట్ల రుణ చెల్లింపులు, భవిష్యత్ రియల్టీ ప్రాజెక్టులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు నిధులను వినియోగించనుంది. 1995లో ఏర్పాటైన కంపెనీ 32 ప్రాజెక్టులను పూర్తి చేయగా.. ప్రస్తుతం 12 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో మరో 19 ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు కంపెనీ తెలియజేసింది. -
హైదరాబాద్లో గృహ విక్రయాలు జూమ్, ఏకంగా 130 శాతం జంప్
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్లో గృహ విక్రయాలతో పాటు వాటి విలువలు కూడా పెరుగు తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో మొదటి ఏడు నగరాల్లో విక్రయించిన రెసిడెన్షియల్ హౌసింగ్ యూనిట్లు గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. ఆసక్తికరంగా, ఈ కాలంలో హైదరాబాద్ మొత్తం గృహాల విక్రయ విలువలలో 130 శాతం జంప్ చేశాయి. ఈ ఆర్ధిక సంవత్సరం తొలి అర్ధ సంవత్సరం (హెచ్1)లో నగరంలో రూ.15,958 కోట్ల విలువ చేసే 22,840 ఇళ్లు అమ్ముడుపోయాయి. అదే 2022 ఫైనాన్షియల్ ఇయర్ హెచ్1లో రూ.6,926 కోట్ల విలువైన 9,980 యూనిట్లు విక్రయమయ్యాయి. ఏడాదిలో 130 శాతం వృద్ధి రేటు నమోదైందని అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 2023 హెచ్1లో రూ.1.56 లక్షల కోట్ల విలువ చేసే 1,73,155 యూనిట్లు సేలయ్యాయి. 2022 హెచ్1లో 87,375 యూనిట్లు సేలయ్యాయి. వీటి విలువ రూ.71,295 కోట్లు. అంటే ఏడాదిలో 119 శాతం వృద్ధి రేటు. ఇదీ చదవండి: యాపిల్ గుడ్న్యూస్: ఇండియాలో నాలుగురెట్లు పెరగనున్న ఉద్యోగాలు! అత్యధికంగా ముంబైలో రూ.74,835 కోట్లు విలువ చేసే ఇళ్లు అమ్ముడుపోయాయి. ఆ తర్వాత ఎన్సీఆర్లో రూ.24,374 కోట్లు, బెంగళూరులో రూ.17,651 కోట్లు విలువ చేసే గృహాలు విక్రయమయ్యాయి. గృహ విలువల వృద్ధి అత్యధికంగా ఎన్సీఆర్లో నమోదయింది. 2022 ఆర్ధిక సంవత్సరం హెచ్1లో ఎన్సీఆర్లో రూ.8,896 కోట్లు విలువ చేసే ఇళ్లు విక్రయం కాగా.. 2023 హెచ్1 నాటికి 175 శాతం వృద్ధి రేటుతో రూ.24,374 కోట్లకు చేరింది -
రియల్టీ వృద్ధి: ద్రవ్యోల్బణం ప్రభావం ఎంత?
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ (రియల్టీ) రంగంలో వచ్చే ఆరు నెలల కాలానికి వృద్ధి పట్ల డెవలపర్లు, ఇన్వెస్టర్లు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లు ఆశావహ అంచనాలతో ఉన్నాయి. అంతర్జాతీయంగా మాంద్యం భయాలు, మోర్ట్గేజ్ రేట్లు పెరుగుల ప్రభావం ఉన్నా కానీ, వృద్ధి పట్ల సానుకూల సెంటిమెంట్ నెలకొంది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్, రియల్ ఎస్టేట్ డెవలపర్ల మండలి నరెడ్కో సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన ‘రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ క్యూ3, 2022’ నివేదికలో వెల్లడించాయి. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్లో సెంటిమెంట్ స్కోరు 62 ఉంటే, జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది 61కి తగ్గింది. ఈ స్కోరు 50కి పైన ఉంటా ఆశావహంగాను, 50 స్థాయిలో ఉంటే తటస్థం, అంతకు దిగువన ఉంటే నిరాశావాదంగా పరిగణిస్తారు. (Elon Musk ట్విటర్ డీల్ డన్: మస్క్ తొలి రియాక్షన్) స్వల్ప క్షీణత ‘‘అంతర్జాతీయంగా ప్రతికూల వాతావరణం, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో సెంటిమెంట్ స్కోరు అతి స్వల్పంగా తగ్గింది. రియల్ ఎస్టేట్ రంగం, భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడంతో ఈ రంగంలో ఇప్పటికీ సెంటిమెంట్ సానుకూలంగా ఉంది’’అని నైట్ ఫ్రాంక్ తెలిపింది. వచ్చే ఆరు నెలల కాలానికి భాగస్వామల అంచనాల ఆధారంగా నిర్ణయించే భవిష్యత్ సెంటిమెంట్ స్కోరు ఏప్రిల్-జూన్ క్వార్టర్లో 62 ఉంటే, సెప్టెంబర్ త్రైమాసికంలో 57కు తగ్గింది. ‘‘ద్రవ్యోల్బణం అధికంగానే ఉంది. దీనికితోడు మానిటరీ పాలసీ చర్యలు కఠినతరం అవుతున్నాయి. దీంతో వచ్చే ఆరు నెలల కాలానికి సంబంధించిన సెంటిమెంట్ స్కోరుపై ప్రభావం పడింది’’అని నైట్ ఫ్రాంక్ వివరించింది. (ఇన్వెస్టర్లకు రాబడులు: ఎల్ఐసీకి కేంద్రం సూచనలు) అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ప్రతికూలతల ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపై ఇంకా పూర్తి స్థాయిలో ప్రతిఫలించలేదని రియల్ ఎస్టేట్ భాగస్వాములు భావిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. దీంతో ప్రస్తుత, భవిష్యత్తు అంచనాల విషయంలో కొంత అప్రమత్త ధోరణితో ఉన్నట్టు పేర్కొంది. రెపో రేట్ల పెంపు తర్వాత ఇళ్ల అందుబాటుపైనా ప్రభావం పడినట్టు తెలిపింది. ‘‘రియల్ ఎస్టేట్లో ఇళ్ల అమ్మకాలు గత కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ అనిశ్చితులు, ద్రవ్యోల్బణం నెలకొన్నప్పటికీ ఈ రంగం బలమైన పనితీరు చూపిస్తోంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కొనుగోలుదారులు రియల్టీలో పెట్టుబడులు కొనసాగిస్తారు’’అని నరెడ్కో ప్రెసిడెంట్ రాజన్ బండేల్కర్ వివరించారు. -
లగ్జరీ విల్లాలకు ఊపు: ఎన్ఆర్ఐ, బడాబాబులే తోపు
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి తర్వాత విల్లాలకు ఊపొచ్చింది. సామాన్య, మధ్యతరగతితో పోలిస్తే కరోనా మహమ్మారి లగ్జరీ గృహ కొనుగోలుదారుల మీద పెద్దగా ప్రభావం చూపించలేదు. ఫలితంగా ఈ విభాగం గృహ విక్రయాలలో వృద్ధి నమోదవుతుంది. ఎక్స్ఛేంజ్ రేటు తక్కువగా ఉండటం మూలంగా ప్రవాసులు, హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ) లగ్జరీ గృహాల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు డెవలపర్లు అందించే డిస్కౌంట్లు, ఆఫర్లు కూడా ఆయా వర్గాల కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ♦ ఈ ఏడాది తొలి ఆర్ధ సంవత్సరంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 1.84 లక్షల గృహాలు విక్రయం కాగా.. ఇందులో 14 శాతం అంటే 25,680 ఇళ్లు లగ్జరీ గృహాలే అమ్ముడుపోయాయని అనరాక్ గ్రూప్ సర్వే వెల్లడించింది. అదే కరోనా కంటే ముందు 2019 ఏడాది మొత్తం చూస్తే.. 2.61 లక్షల యూనిట్లు విక్రయం కాగా.. కేవలం 3 శాతం అంటే 17,740 యూనిట్లు మాత్రమే లగ్జరీ గృహాలున్నాయని పేర్కొంది. లాంచింగ్లోనూ లగ్జరే.. డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా ఉంటుందన్న సూత్రం ప్రకారమే.. డెవలపర్లు కూడా ప్రాజెక్ట్ లాంచింగ్లలో లగ్జరీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. 2019లో 28,960 విలాసవంతమైన ఇళ్లు ప్రారంభం కాగా.. ఈ ఏడాది తొలి ఆర్ధ సంవత్సరం నాటికే ఏకంగా 28 వేల లగ్జరీ గృహాలను లాంచింగ్ చేశారు. పశ్చిమంలో హవా.. హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో పశ్చిమాది ప్రాంతాలదే హవా కొనసాగుతోంది. గత మూడు త్రైమాసికాల నుంఇచ కొత్త ప్రాజెక్ట్స్ లాంచింగ్స్ పశ్చిమ హైదరాబాద్లో 57 శాతం జరిగాయి. ఉత్తరాదిలో 18 శాతం, తూర్పులో 15 శాతం, సెంట్రల్లో 8 శాతం, సౌత్ హైదరాబాద్లో 2 శాతం లాంచింగ్స్ జరిగాయి. వెస్ట్ హైదరాబాద్లో తెల్లాపూర్, బాచుపల్లి, సౌత్లో అత్తాపూర్లు రియల్టీ హాట్స్పాట్స్గా మారాయి. ఓపెన్ ప్లాట్లలో పెట్టుబడులు పెట్టే బదులు సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు చాలా మంది కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. వృద్ధి కారణాలివే.. 2019 నుంచి 2022 హెచ్1తో పోలిస్తే రూ.1.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ గృహాల విక్రయాలలో రెండింతల వృద్ధి నమోదయింది. 2022 హెచ్1లో అత్యధిక లగ్జరీ గృహాలు అమ్ముడుపోయింది ముంబైలోనే. ఇక్కడ 13,670 యూనిట్లు సేలయ్యాయి. ఆ తర్వాతి ఎన్సీఆర్లో 4,160 ఇళ్లు అమ్ముడుపోయాయి. 2019లో ఈ రెండు నగరాలలో 11,890 విలాసవంతమైన ఇళ్లు అమ్ముడుపోగా.. ఈ ఏడాది తొలి ఆర్ధ సంవత్సరంలోనే 17,830 యూనిట్లు విక్రయమయ్యాయి. 2019 నుంచి 2022 హెచ్ 1తో పోలిస్తే ముంబైలో లగ్జరీ గృహాల అమ్మకాలు 13 శాతం 25 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో ఎన్సీఆర్లో 4 శాతం నుంచి 12 శాతానికి వృద్ధి చెందాయి. -
మహీంద్రా లైఫ్స్పేస్ @ బిలియన్ డాలర్ల మార్కెట్
న్యూఢిల్లీ: తమ గ్రూప్లో భాగమైన రియల్టీ సంస్థ మహీంద్రా లైఫ్స్పేస్ మార్కెట్ విలువ 1 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటిందని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. తద్వారా నల్లధనం లావాదేవీలు లేకుండా రియల్టీలో మనుగడ కష్టమన్న విమర్శకుల అంచనాలను తిప్పికొట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. రియల్ ఎస్టేట్ రంగంలో తమ గ్రూప్ ఎంట్రీ సమర్ధనీయమేనని రుజువు చేసిందని పేర్కొన్నారు. శుక్రవారం బీఎస్ఈలో మహీంద్రా లైఫ్స్పేస్ డెవలపర్స్ షేరు ఒక దశలో 2 శాతం పెరిగి రూ. 519.75 స్థాయికి చేరింది. దీంతో మార్కెట్ క్యాప్ రూ. 8,032.51 కోట్లకు పెరిగింది. ఈ నేపథ్యంలోనే తమ గ్రూప్లో మరో యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల విలువ చేసే సంస్థ) వచ్చి చేరిందని ఆనంద్ మహీంద్రా మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ట్వీట్ చేశారు. ‘1980లలో మహీంద్రా యుజీన్తో రియల్టీ రంగంలోకి ప్రవేశించినప్పుడు.. బ్లాక్ మనీ లేకుండా రాణించడం కష్టమని విమర్శకులు అనడం నాకింకా గుర్తు. వారు చెప్పినది తప్పు అని నిరూపించాలని మేము నిర్ణయించుకున్నాం. దీన్ని సాధించిన అరుణ్ నందా, అరవింద్లకు కృతజ్ఞతలు‘ అని మహీంద్రా పేర్కొన్నారు. అరుణ్ నందా ఇటీవలే మహీంద్రా లైఫ్స్పేస్ డెవలపర్స్ చైర్పర్సన్గా రిటైరు కాగా, అరవింద్ సుబ్రమణియన్ ఎండీ, సీఈవోగా ఉన్నారు. 1994లో ఏర్పాటైన మహీంద్రా లైఫ్స్పేస్కు ఏడు నగరాల్లో 32.14 మిలియన్ చ.అ.ల ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో కొన్ని పూర్తి కాగా, మరికొన్ని కొత్తవి ఉన్నాయి. -
ఫ్రెషర్లకు గుడ్ లక్: ఐటీలో లక్ష జాబ్స్,అంతేనా...ఇంకా చాలా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్రెషర్ల నియామకానికి కంపెనీలు సై అంటున్నాయి. టీమ్లీజ్ ఎడ్టెక్ కెరీర్ ఔట్లుక్ నివేదిక ప్రకారం.. 2022 జూలై–డిసెంబర్లో ఫ్రెషర్లను చేర్చుకునేందుకు 59 శాతం కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఈ ఏడాది జనవరి–జూన్తో పోలిస్తే ఇది 12 శాతం అధికం కావడం విశేషం. ఐటీలో 65 శాతం, ఈ-కామర్స్ 48, టెలికమ్యూనికేషన్స్లో 47 శాతం సంస్థలు ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఐటీలో లక్ష మంది ఫ్రెషర్ల నియామకాలు ఉండే అవకాశం ఉంది. ప్రారంభ స్థాయి ఉద్యోగాలు, ఫ్రెషర్స్ నియామకాల చుట్టూ ఉన్న సెంటిమెంట్ భారతదేశంలో గణనీయంగా మెరుగుపడుతోంది. ఎక్కువ కంపెనీలు ఫ్రెషర్స్ను పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా దేశంలోని యువత ఉపాధి సామర్థ్యం విలువతో కూడిన మార్పుకు గురైందనడానికి ఈ ధోరణి నిదర్శనం. ఒక ఏడాదిలోనే ఫ్రెషర్స్ హైరింగ్ సెంటిమెంట్ 42 శాతం పెరిగింది. రాబోయే సంవత్సరాల్లో కూడా ఇది వేగంగా అధికం అవుతుంది. 14 ప్రాంతాల్లోని 18 రంగాలకు చెందిన 865 కంపెనీల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికవెల్లడైంది. -
హ్యాపీ గృహాలు! ఎటుచూసినా హ్యాపీనెస్సే
సాక్షి, హైదరాబాద్: ఆఫీసులో పని ఒత్తిడి నుంచి బయటికి రాగానే ట్రాఫిక్ జాంలు, రణగొణధ్వనులు.. వీటన్నింటి నుంచి తప్పించుకొని కాసేపు సేదతీరాలంటే సొంతిల్లు ఆహ్లాదకరంగా ఉండాల్సిందే. చుట్టూ పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, నీటి పరవళ్ల సప్పుళ్లు, ఎటు చూసినా మెదడును ఉత్తేజ పరిచే చిహ్నాలు, బొమ్మలు, కొటేషన్స్, మధుర జ్ఞాపకాలను పదిల పరుచుకునే మెమొరీ బ్యాంక్.. ఆహా ఊహించుకుంటే ఎంతో బాగుంది కదూ! ఎస్.. అచ్చం ఇలాంటి ప్రాజెక్ట్కే శ్రీకారం చుట్టింది గిరిధారి హోమ్స్. థీమ్ ప్రాజెక్ట్లకు కేరాఫ్ అడ్రస్ అయిన గిరిధారి మరో వినూత్న ప్రాజెక్ట్ను నిర్మిస్తోంది. మనిషి ఆనందంగా ఉండాలంటే ఆదాయం, పెట్టుబడులు మాత్రమే రెట్టింపయితే చాలదు.. వారి సంతోషాలూ డబులవ్వాలి. అంటే ఉండే పరిసరాలు ఆరోగ్యకరంగా, ఆహ్లాదకరంగా ఉండాలి. ఇదే థీమ్గా హ్యాపీనెస్ హబ్ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టామని గిరిధారి హోమ్స్ ఎండీ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. విదేశాల్లో ప్రాచుర్యం పొందిన హ్యాపీనెస్ కాన్సెప్ట్తో కిస్మత్పూర్లో ఐదున్నర ఎకరాలలో ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నాం. జీ+5 అంతస్తులలో మొత్తం 567 ఫ్లాట్లుంటాయి. ప్రారంభ ధర రూ.60 లక్షలు. 1,033 చ.అ. నుంచి 1,601 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. 2025 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవుతుంది. ఎటుచూసినా హ్యాపీనెస్సే: హ్యాపీనెస్ హబ్లో ఎటు చూసినా ఆనందాన్ని సూచించే సంకేతాలు, మనస్సును ఆహ్లాదపరిచే ప్రకృతి, పక్షుల కిలకిలారావాలు ప్రతిదీ సంతోషాన్ని రెట్టింపు చేసేలా ఉంటాయి. ఈ ప్రాజెక్ట్కు 200 మీటర్ల దూరంలో ఈసా రివర్ ఉంటుంది. హ్యాపీ బాడీ, మైండ్, సోల్, హార్ట్ అనే సరికొత్త కాన్సెప్ట్తో 20 వేల చ.అ.లలో క్లబ్హౌస్ ఉంటుంది. రెండు బ్యాడ్మింటన్ కోర్టులకు ఉత్సాహ, ఉల్లాస అని నామకరణం చేశారు. ఇలా నలభైకి పైగా పేర్లు, హ్యాపీనెస్ను ప్రేరేపించే చిహ్నాలను ఎంచుకున్నారు. స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్ గేమ్స్, 2 కి.మీ. జాగింగ్, వాకింగ్ ట్రాక్ వంటి అన్ని రకాల వసతులుంటాయి. ప్రధాన్మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం కూడా ఈ ప్రాజెక్ట్కు వర్తిస్తుంది. దీంతో రూ.2.5 లక్షల వరకు వడ్డీ రాయితీ పొందవచ్చు. లో రైజ్ అపార్ట్మెంట్ కారణంగా కొనుగోలుదారులకు అవిభాస్య స్థలం (యూడీఎస్) ఎక్కువ వస్తుంది. ప్రతి వెయ్యి చ.అ.కు 40 గజాల స్థలం వస్తుంది. మెమొరీ బ్యాంక్: ఈ ప్రాజెక్ట్లో నివాసితులకు వినూత్న అనుభూతిని కలిగించేందుకు తొలిసారిగా మెమొరీ బ్యాంక్ను ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో ప్రతి ఒక్క కొనుగోలుదారులకు ఒక లాకర్ను ఇస్తారు. ఇందులో వారి మధుర జ్ఞాపకాలను భద్రపరుచుకోవచ్చు. కొన్నేళ్ల తర్వాత వాటిని చూసుకుంటే అప్పటి మధుర క్షణాలు కళ్లముందు సాక్షాత్కారమవుతాయి. ఇప్పటివరకు గిరిధారి హోమ్స్ కిస్మత్పూర్లో 2 వేల గృహాలను పూర్తి చేసి, కొనుగోలుదారులకు అందించింది. వచ్చే 12 నెలల్లో మరో 30 లక్షల చ.అ.లలో ప్రాజెక్ట్లను ప్రారంభించనుంది. -
హైదరాబాద్లో నిర్మాణం మధ్యలో ఆగిపోయిన ఇళ్లెన్నో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటి అనుకోని విపత్తులు స్థిరాస్తి రంగానికి పాఠాలు నేర్పించాయి. గతంలో ఒకరిని మించి మరొకరు పోటీపడి కొత్త ప్రాజెక్ట్లను ఆరంభించే నగర డెవలపర్లు... కరోనా తర్వాతి నుంచి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఆడంబరంగా లాంచింగ్స్ చేసి విక్రయాల్లేక బొక్కాబోర్లా పడే బదులు.. చేతిలో ఉన్న ప్రాజెక్ట్లను పూర్తి చేసి నష్టాలు రాకుండా బయటపడితే చాలనే అభిప్రాయానికి వచ్చేశారు. దీంతో కరోనా తర్వాతి నుంచి ఇన్నాళ్లు ఆగిపోయిన, ఆలస్యంగా సాగుతున్న గృహ నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఫలితంగా గత ఐదు నెలల్లో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 36,830 గృహనిర్మాణ పనులు పూర్తయ్యాయని అనరాక్ నివేదిక వెల్లడించింది. 5.17 లక్షల యూనిట్లు గతేడాది డిసెంబర్ చివరి నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో రూ.4.84 లక్షల కోట్ల విలువ చేసే 5.17 లక్షల యూనిట్లు వివిధ దశలో నిర్మాణ పనులు నిలిచిపోయి ఉండగా.. ఈ ఏడాది మే నెలాఖరు నాటికి 4.79 లక్షలకు క్షీణించాయి. వీటి విలువ రూ.4,48 లక్షల కోట్లు. - రెండో స్థానంలో నిలిచిన ముంబైలో గత ఐదు నెలల్లో 5,300 యూనిట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం రూ.1,91807 కోట్ల విలువ చేసే 1,34,170 యూనిట్లు ఆగిపోయి ఉన్నాయి. - బెంగళూరులో 3,960 యూనిట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం రూ.28,072 కోట్ల విలువైన 26,030 గృహా నిర్మాణ పనులు నిలిచిపోయి ఉన్నాయి. - చెన్నైలో 5,190 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా.. ప్రస్తుతం రూ.3,731 కోట్ల విలువైన 8,870 యూనిట్లు ఆగిపోయి ఉన్నాయి. - పుణేలో 3,850 నిర్మాణాలు పూర్తి కాగా.. ప్రస్తుతం రూ.27,533 కోట్ల విలువ చేసే 44,250 యూనిట్లు నిలిచి ఉన్నాయి. - ఈ ఏడాది జనవరి నుంచి మే నెలాఖరు వరకు హైదరాబాద్లో 1,710 గృహ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం నగరంలో 11,400 నిర్మాణాలు వివిధ దశల్లో ఆగిపోయి ఉన్నాయి. వీటి విలువ రూ. 11,310 కోట్లుగా ఉంది. గతేడాది డిసెంబరు చివరినాటికి నగరంలోరూ.12,995 కోట్ల విలువ చేసే 13,160 నిర్మాణాలు ఆగిపోయి ఉన్నాయి. - ఈ ఏడాది నుంచి జనవరి నుంచి మే వరకు కోల్కతాలో 1,580 గృహ నిర్మాణాలు పూర్తి కాగా.. ప్రస్తుతం రూ.11,847 కోట్ల విలువ చేసే 23,540 గృహాలు ఆగిపోయి ఉన్నాయి. వేగం ఎందుకంటే? గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల కొనుగోళ్లకే కొనుగోలుదారులు ఆసక్తి చూపించడం కూడా నిర్మాణ పనుల వేగవంతానికి ప్రధాన కారణమని అనరాక్ గ్రూప్ సీనియర్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు. అలాగే గత కొంత కాలంగా సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం కూడా పనులు వేగవంతానికి మరొక కారణమని చెప్పారాయన. దీంతో పాటు ఆగిపోయి ఉన్న గృహ నిర్మాణాలను పూర్తి చేసేందుకు స్పెషల్ విండో ఫర్ అఫర్డబుల్ అండ్ మిడ్ ఇన్కం హౌసింగ్ (ఎస్డబ్ల్యూఏఎంఐహెచ్), నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్బీసీసీ) ప్రత్యేక నిధులను కేటాయించడం కూడా పనులు వేగవంతానికి కారణాలుగా వివరించారు. చదవండి: హైదరాబాద్లో ఏరియాల వారీగా ప్లాట్ల రేట్లు ఎలా ఉన్నాయంటే?