Union Budget 2023-24
-
కేంద్రం పన్నుపోటు.. ఇన్సూరెన్స్ కంపెనీల అంచనాలు తలకిందులు
న్యూఢిల్లీ: అధిక ప్రీమియం కలిగిన జీవిత బీమా ఉత్పత్తులకు ఏమంత డిమాండ్ కనిపించలేదు. ఏప్రిల్ 1 నుంచి తీసుకునే జీవిత బీమా పాలసీల వార్షిక ప్రీమియం రూ.5,00,000కు మించి ఉంటే పన్ను చెల్లించాలంటూ నిబంధనలను బడ్జెట్లో ప్రకటించడం తెలిసిందే. కాకపోతే మార్చి 31 వరకు కొనుగోలు చేసే పాలసీలకు ఈ నిబంధన వర్తించదు. దీంతో అధిక ప్రీమియం ప్లాన్లను మార్చి ఆఖరులోపు కంపెనీలు పెద్ద ఎత్తున విక్రయిస్తాయని నిపుణులు భావించారు. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. అనుకున్న విధంగా వీటి విక్రయాలు ఏమీ పెరగలేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. రూ.5,00,000కు పైగా ప్రీమియం చెల్లించే ప్లాన్లకు సంబంధించి గడువు తీరిన తర్వాత అందే మొత్తం కూడా పన్ను పరిధిలోకి వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో భాగంగా ప్రకటించారు. అధిక పన్ను పరిధిలోని వారు ఈ ప్లాన్లను తీసుకోవడం ద్వారా ఆ మేరకు పన్ను ప్రయోజనం పొందే అవకాశం సెక్షన్ 10(10డి) కింద ఉంది. బడ్జెట్లో ప్రకటన తర్వాత చాలా బ్రోకరేజీ సంస్థలు అధిక ప్రీమియంతో కూడిన నాన్ పార్టిసిపేటరీ గ్యారంటీడ్ ఉత్పత్తులకు ఫిబ్రవరి, మార్చిలో అనూహ్య డిమాండ్ ఉంటుందనే అంచనాను వ్యక్తం చేశాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ అవకాశం లేనందున చాలా మంది ముందుకు వస్తారని భావించాయి. సాధారణ అమ్మకాలే.. ఫిబ్రవరి నెలలో అధిక ప్రీమియం బీమా ఉత్పత్తుల అమ్మకాలు పెద్దగా పెరగలేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మార్చిలో పెద్ద ఎత్తున అమ్ముడుపోవచ్చని బీమా కంపెనీలు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నాయి. -
మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీం: 7.5 శాతం వడ్డీరేటు, ఎలా అప్లై చేయాలి?
సాక్షి, ముంబై: 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్', మహిళా సాధికారత,భాగంగా ప్రకటించిన 2023-24 కేంద్ర బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మహిళా పెట్టుబడిదారుల కోసం కొత్త చిన్న పొదుపు పథకాన్ని ప్రకటించారు. ఆ పథకమే మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీం.కేవలం ఆడపిల్లలు, మహిళలు మాత్రమే ఇందులో పెట్టుబడి పెట్టేలా పోస్టాఫీసుల్లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2025 ఏప్రిల్ వరకూ స్థిర వడ్డీరేటును అందిస్తుంది. (షాకింగ్ న్యూస్: యాపిల్ ఉద్యోగుల గుండెల్లో గుబులు) మహిళల పెట్టుబడిలో భాగస్వామ్యాన్ని పెంచడానికి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి చిన్న పొదుపు పథకం కింద కేంద్రం మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ను అందిస్తోంది. ఇందులో మహిళలకు తక్కువ సమయంలో ఎక్కువ రాబడి రానుంది. మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 2 సంవత్సరాలలో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్పై 7.5 శాతం వడ్డీ అందిస్తోంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ ప్రయోజనాలు: మహిళలకు, బాలికలకు మాత్రమే ఖాతా తెరిచే అవకాశం. ఒక్క ఖాతా మాత్రమే తెరవవచ్చు. మహిళలు లేదా బాలికల రూ.1000 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ రెండేళ్ల కాలపరిమితి పథకం ఆకర్షణీయమైనయు స్థిరమైన వడ్డీని 7.5 శాతం వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన ఖాతాకు వడ్డీ బదిలీ ఉదా: రెండేళ్ల కాలానికి రెండు లక్షలు డిపాజిట్ చేస్తే.. 7.5 శాతం వడ్డీ ప్రకారం రెండు లక్షలకు రెండేళ్లకు రూ.30వేలు వడ్డీ రూపంలో అందుతుందన్నమాట. ఎలా నమోదు చేయాలి స్థానిక బ్యాంక్ లేదా పోస్టాఫీసు నుండి మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన ఫారమ్ తీసుకోవాలి దరఖాస్తులో ఆధార్ కార్డ్ ,పాన్ కార్డ్ , నామినీ లాంటి వివరాలను నమోదు చేయాలి అవసరమైన డాక్యుమెంటేషన్తో దరఖాస్తు ఫారమ్ను సమర్పించండి నగదు లేదా చెక్ రూపంలో సంబంధిత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి ఈ ప్రక్రియ పూర్తైన తరువాత పప్రూఫ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికెట్ మీ చేతికి వస్తుంది డిపాజిట్ చేసిన తేదీ నుండి రెండేళ్లు పూర్తయిన తర్వాత డిపాజిట్ మెచ్యూర్ అవుతుంది ఒక సంవత్సరం గడువు ముగిసిన తర్వాత కానీ మెచ్యూరిటీకి ముందు, బ్యాలెన్స్లో గరిష్టంగా 40 శాతం వరకు ఒకసారి విత్డ్రా చేసుకోవవచ్చు. చిన్న పొదుపు వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా పోస్టాఫీసుల ద్వారా, గ్రామీణ ప్రాంతాలలోని బాలికలు, మహిళా రైతులు, కళాకారులు, సీనియర్ సిటిజన్లు, ఫ్యాక్టరీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న వ్యాపారులకు చిన్న మెత్తంలో పెట్టుబడితో మంచి రాబడిని పొందుతారని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. (ఇదీ చదవండి: స్టార్ బ్యాటర్ కోహ్లీ అరుదైన ఘనత: గిఫ్ట్గా అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్) -
టాప్ గేర్లో మౌలికాభివృద్ధి
న్యూఢిల్లీ: ఆర్థికవ్యవస్థకు చోదక శక్తి అయిన మౌలిక వసతుల అభివృద్ధిని శరవేగంగా కొనసాగించాలని ప్రధాని మోదీ అభిలషించారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టాక కొనసాగిస్తున్న వెబినార్ పరంపరలో శనివారం మోదీ ‘ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్: ఇంప్రూవింగ్ లాజిస్టిక్ ఎఫీషియెన్సీ విత్ పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్’ అనే అంశంపై వర్చువల్గా మాట్లాడారు. ‘ దేశ ఆర్థికరంగ ప్రగతికి పటిష్ట మౌలిక వసతులే చోదక శక్తి. మౌలికాభివృద్ధి టాప్గేర్లో కొనసాగితేనే 2047 సంవత్సరంకల్లా భారత్ సంపన్న దేశంగా అవతరించగలదు’ అని ఈ రంగం కోసం కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలను ఆయన ప్రస్తావించారు. ‘ 2013–14 బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే ఈసారి ఈ రంగం అభివృద్ధికి ఐదు రెట్లు ఎక్కువగా నిధులు కేటాయించాం. భవిష్యత్తులో రూ.110 లక్షల కోట్ల నిధులు కేటాయిస్తాం. ఈ రంగంలోని ప్రతీ భాగస్వామ్య పక్షం కొత్త బాధ్యతలు, కొత్త సానుకూలతలు, దృఢ నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణమిది. రోడ్లు, రైల్వేలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాల్లో అధునాతన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. దీంతో వ్యాపార అవకాశాలు ఊపందుకుంటాయి. రవాణా ఖర్చు దిగొస్తుంది. ఈ దేశమైనా వృద్ధిలోకి రావాలంటే మౌలికవసతుల కల్పన చాలా కీలకం. ఈ రంగంపై అవగాహన ఉన్నవారికి ఇది బాగా తెలుసు’ అంటూ పలు భారతీయ నగరాల విజయాలను ఆయన ప్రస్తావించారు. రెట్టింపు స్థాయిలో రహదారుల నిర్మాణం ‘2014తో చూస్తే ఇప్పుడు సగటున ఏడాదికి నిర్మిస్తున్న జాతీయ రహదారుల పొడవు రెట్టింపైంది. 600 రూట్ల కిలోమీటర్లలో ఉన్న రైల్వే విద్యుదీకరణ ఇప్పడు 4,000 రూట్ల కిలోమీటర్లకు అందుబాటులోకి వచ్చింది. 74 ఎయిర్పోర్టులుంటే ఇప్పడు 150కి పెరిగాయి. నైపుణ్యాభివృద్ధి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఆర్థిక నైపుణ్యాలు, ఎంటర్ప్రెన్యూర్షిప్ మరింతగా పెరగాలి’’ అని మోదీ సూచించారు. ప్రగతి పథంలో భారత్ బిల్గేట్స్ ప్రశంసల వర్షం ఆరోగ్యం, అభివృద్ధి, వాతావరణం తదితర రంగాల్లో భారత్ సాధించిన ప్రగతిని కుబేరుడు, భూరి దాత బిల్ గేట్స్ పొగిడారు. భారత ప్రభుత్వం నూతన ఆవిష్కరణల కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులను కేటాయిస్తే భవిష్యత్తులో భారత్ మరింతగా సర్వతోముఖా భివృద్ధిని సాధించగలదని ఆయన అభిలషించారు. ‘సురక్షిత, ప్రభావవంతమైన, అందుబాటు ధరలో వందలకోట్ల వ్యాక్సిన్ డోస్లు తయారుచేసే సత్తాను భారత్ సాధించడం గొప్పవిషయం. కోవిడ్ విపత్తు కాలంలో కోవిడ్ టీకాలను అందించి ప్రపంచవ్యాప్తంగా లక్షల జీవితాలను భారత్ కాపాడగలిగింది. పలు రకాల వ్యాధుల బారిన పడకుండా ఇతర వ్యాక్సిన్లనూ సరఫరాచేసింది. ‘శుక్రవారమే ప్రధాని మోదీని కలిశాను. సుస్థిర జగతి కోసం ఆయన చేస్తున్న కృషి కనిపిస్తోంది. సృజనాత్మకతో నిండిన భారత్లో పర్యటించడం ఎంతో ప్రేరణ కల్గిస్తోంది’ అని బిల్గేట్స్ ట్వీట్చేశారు. ‘కోవిడ్ సంక్షోభ కాలంలో 30 కోట్ల మందికి భారత్ అత్యవసర డిజిటల్ చెల్లింపులు చేసింది. సమ్మిళిత ఆర్థికవ్యవస్థకు పెద్దపీట వేసింది. 16 కేంద్ర ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ గతి శక్తి కార్యక్రమం ద్వారా రైల్వే, జాతీయరహదారులు వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షిస్తూ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలతో క్రియాశీలకంగా పనిచేయించడం డిజిటల్ టెక్నాలజీ వల్లే సాధ్యమైంది. కో–విన్, ఆధార్ సహా పలు కీలక ఆవిష్కరణలతో సాధించిన పురోగతిని ప్రపంచానికి చాటే అద్భుత అవకాశం భారత్కు జీ20 సారథ్య రూపంలో వచ్చింది. తృణధాన్యాలపై అవగాహన కోసం తీసుకుంటున్న చొరవ, చిరుధాన్యాల ఆహారం అమోఘం’’ అని గేట్స్ అన్నారు. -
కొత్త శిఖరాలకు మన పర్యాటకం
న్యూఢిల్లీ: విభిన్నంగా ఆలోచించడం, దీర్ఘకాలిక దార్శనికత(విజన్) మన పర్యాటక రంగాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ రంగం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని వ్యాఖ్యానించారు. మన దేశంలోని మారుమూల గ్రామాలు సైతం ఇప్పుడు పర్యాటక పటంలో కొత్తగా చోటు సంపాదించుకుంటున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ‘మిషన్ మోడ్లో పర్యాటకాభివృద్ధి’ పేరిట శుక్రవారం నిర్వహించిన వెబినార్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత భాషల్లో, ఐక్యరాజ్యసమితి గుర్తించిన భాషల్లో మన పర్యాటక ప్రాంతాల సమాచారాన్ని అందించేలా అప్లికేషన్లు(యాప్లు) తయారు చేయాలని సూచించారు. టూరిస్ట్ సైట్ల వద్ద బహుళ భాషల్లో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. కలిసి పనిచేస్తే అనుకున్నది సాధ్యమే ‘నూతన పని సంస్కృతి’తో మన దేశం ముందుకు సాగుతోందని నరేంద్ర మోదీ వివరించారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్కు ప్రజల నుంచి మంచి ప్రశంసలు దక్కాయని అన్నారు. బడ్జెట్ అనంతరం వెబినార్లు నిర్వహించడం గతంలో ఎప్పుడూ జరగలేదని గుర్తుచేశారు. ఆ ప్రక్రియకు ఈ ఏడాదే శ్రీకారం చుట్టామని చెప్పారు. బడ్జెట్కు ముందు, బడ్జెట్ తర్వాత కూడా ప్రజలందరినీ ఇందులో భాగస్వాములను చేస్తున్నామని, వారితో కలిసి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. వెబినార్లలో ప్రజల నుంచి ఎన్నో సలహాలు సూచనలు అందుతున్నాయని తెలిపారు. అందరం చేతులు కలిపి పనిచేస్తే అనుకున్న ఫలితాలు సాధించడం కష్టమేమీ కాదని సూచించారు. మన పర్యాటకాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలంటే దీర్ఘకాలిక ప్రణాళికతో పని చేయాలన్నారు. కోస్టల్ టూరిజం, బీచ్ టూరిజం, మాంగ్రూవ్ టూరిజం, హిమాలయన్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, వైల్డ్లైఫ్ టూరిజం, ఎకో–టూరిజం, హెరిటేజ్ టూరిజం, ఆధ్యాత్మిక టూరిజం, వెడ్డింగ్ డెస్టినేషన్స్, స్పోర్ట్స్ టూరిజం అభివృద్ధికి మన దేశంలో ఎన్నెన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. యాత్రలతో దేశ ఐక్యత బలోపేతం మతపరమైన చరిత్రాత్మక ప్రాంతాలు, కట్టడాలకు సరికొత్త హంగులు అద్ది, పర్యాటకులకు అమితంగా ఆకర్షించవచ్చని ప్రధానమంత్రి వెల్లడించారు. వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్ను బ్రహ్మాండంగా తీర్చిదిద్దామని అన్నారు. గతంలో ఏడాదికి 80 లక్షల మంది పర్యాటకులు వారణాసికి వచ్చేవారని, గత ఏడాది 7 కోట్ల మందికిపైగా వచ్చారని తెలిపారు. పునర్నిర్మాణానికి ముందు కేదార్నాథ్కు ఏటా 5 లక్షల మంది వచ్చారని, ఇప్పుడు 15 లక్షల మంది సందర్శిస్తున్నారని పేర్కొన్నారు. టూరిజం అనేది సంపన్నులకు మాత్రమేనన్న అభిప్రాయం కొందరిలో ఉందని, అది సరైంది కాదని మోదీ చెప్పారు. మన దేశంలో యాత్రలు చేయడం సంప్రదాయంగా కొనసాగుతోందన్నారు. చార్ధామ్ యాత్ర, ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర, 51 శక్తిపీఠాల యాత్రను ప్రధాని ప్రస్తావించారు. లోటుపాట్లు సవరించుకోవాలి విదేశీ యాత్రికులు భారత్కు క్యూ కడుతున్నారని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. వారు మన దేశంలో సగటున 1,700 డాలర్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. అమెరికాలో విదేశీ యాత్రికుల సగటు వ్యయం 2,500 డాలర్లుగా, ఆస్ట్రేలియాలో 5,000 డాలర్లుగా ఉందన్నారు. అధికంగా ఖర్చు చేయడానికి సిద్ధపడే విదేశీయులకు మన దేశంలోని వసతులను పరిచయం చేయాలన్నారు. భారత్ అనగానే గుర్తొచ్చేలా కనీసం 50 పర్యాటక ప్రాంతాలను అద్భుతంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ రంగంలో లోటుపాట్లను సరిదిద్దుకోవాలని చెప్పారు. -
చక్కని ప్రణాళిక, మెరుగైన నగరాలు
న్యూఢిల్లీ: చక్కని ప్రణాళికతో నిర్మితమైన నగరాలే దేశ భవితను నిర్దేశిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏళ్లలో అలాంటి కనీసం 75 నగరాలను నిర్మించుకున్నా ప్రపంచ వేదికపై భారత్ ఎప్పుడో గొప్ప స్థాయికి చేరి ఉండేదన్నారు. కేంద్ర బడ్జెట్పై చర్చా పరంపరలో భాగంగా బుధవారం ‘పట్టణ ప్రణాళిక, అభివృద్ధి, పారిశుధ్యం’పై వెబినార్లో ఆయన మాట్లాడారు. దేశం శరవేగంగా పట్టణీకరణ చెందుతున్న నేపథ్యంలో భవిష్యత్తుపై దృష్టిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యమని నొక్కిచెప్పారు. ‘‘రాబోయే పాతికేళ్లలో దేశ ప్రగతి పట్టణ ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. ‘‘మన నగరాలు వ్యర్థ, నీటి ఎద్దడి రహితంగా, అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఉండటం చాలా ముఖ్యం. చక్కని ప్రణాళిక అందుకు కీలకం. కొత్త నగరాల అభివృద్ధి, ఉన్నవాటి ఆధునికీకరణ కూడా పట్టణాభివృద్ధిలో కీలకమే. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాల్లో పట్టణ ప్రణాళిక వ్యవస్థ బలోపేతం, ప్రైవేట్ రంగంలో నైపుణ్యాన్ని అందుకు సమర్థంగా వినియోగించుకోవడం, పట్టణ ప్రణాళికను అత్యున్నతంగా తీర్చిదిద్దే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్మాణానికి ఏం చేయాలో దృష్టి పెట్టాలి. ఎందుకంటే ప్రణాళిక సరిగా లేకున్నా, దాని అమలులో విఫలమైనా పెను సమస్యలకు దారి తీయడం ఖాయం’’ అని సూచించారు. పట్టణాభివృద్ధికి ఈ బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. టైర్–2, టైర్–3 నగరాల ప్రణాళిక, అభివృద్ధిలో పెట్టుబడులు పెరగాల్సిన అవసరముందన్నారు. -
వివాద్ సే విశ్వాస్ను ఆకర్షణీయంగా మార్చాలి
న్యూఢిల్లీ: బడ్జెట్లో భాగంగా ప్రకటించిన ‘వివాద్ సే విశ్వాస్’ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్పులు చేయాలని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈలు) ప్రభుత్వాన్ని కోరాయి. రీయింబర్స్మెంట్, వడ్డీ రేట్ల పరంగా ఆకర్షణీయంగా మార్చాలని ఎంఎస్ఎంఈలు కోరినట్టు ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. అంతేకాదు, బలమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఆన్లైన్లో ఉండాలని డిమాండ్ చేశాయి. బడ్జెట్ అనంతరం డీపీఐఐటీ ఏర్పాటు చేసిన వెబినార్లో భాగంగా ఈ అంశాలను ఎంఎస్ఎంఈలు లేవనెత్తాయి. టెక్నాలజీ వినియోగంతో వ్యాపార సులభతర నిర్వహణ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. 2023–24 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎంఎస్ఎంఈలకు వివాద్సే విశ్వాస్ పథకాన్ని ప్రకటించారు. -
బడ్జెట్ ప్రకటనలపై ప్రధాని మోదీ వెబినార్లు
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో భాగంగా ప్రకటించిన పలు నిర్ణయాలపై భాగస్వాములతో ప్రధాని వెబినార్లు నిర్వహించనున్నారు. గురువారం గ్రీన్ గ్రోత్ పై తొలి వెబినార్ జరగనుంది. ఇందులో వ్యవసాయం, కోపరేటివ్ రంగాల భాగస్వాములతో ప్రధాని మాట్లాడనున్నారు. బడ్జెట్ తర్వాత ప్రధాని 12 వెబినార్లను నిర్వహించనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ నెల 23 నుంచి మార్చి 11 వరకు ఇవి జరుగుతాయని తెలిపింది. మౌలిక సదుపాయాలు, ఆర్థిక సేవల రంగం, ఆరోగ్యం, వైద్య పరిశోధనలు, మహిళా సాధికారత, ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ (పీఎం వికాస్) అంశాలపై ఈ వెబినార్లు నిర్వహించనున్నట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది. పలు మంత్రిత్వ శాఖలు, విభాగాలు వీటి నిర్వహణ బాధ్యతలు చూడనున్నాయి. బడ్జెట్లో ప్రకటించిన సప్షర్తి ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. బడ్జెట్ ప్రకటనలను సమర్థవంతంగా అమలు చేసేందుకు, భాగస్వాములు అందరి మధ్య సమన్వయం, ఏకతాటిపైకి తీసుకురావడంలో భాగంగా ఈ వెబినార్ల నిర్వహణకు ప్రధాని ఆమోదం తెలిపినట్టు ఆర్థిక శాఖ తెలిపింది. -
ధరల స్పీడ్ను నిలువరిస్తున్నాం..
జైపూర్: ద్రవ్యోల్బణం నియంత్రణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, ఈ అంశంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం అన్నారు. ఉదాహరణకు, దేశీయ ఉత్పత్తిని పెంచే దిశలో పప్పుధాన్యాలు పండించడానికి ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోందని తెలిపారు. అలాగే స్థానిక లభ్యతను మెరుగుపరచడానికి కొన్ని పప్పుధాన్యాలపై దిగుమతి సుంకాన్ని కూడా తగ్గించినట్లు పేర్కొన్నారు. వివిధ వర్గాలతో 2023 బడ్జెట్ తదుపరి చర్చాగోష్టి నిర్వహించడానికి ఇక్కడికి వచ్చిన ఆర్థిక మంత్రి విలేకరులతో ఇంకా ఏమన్నారంటే.. ‘‘గత మూడేళ్లుగా వంట నూనెల దిగుమతిపై దాదాపు పన్ను విధించడంలేదు. దీని కారణంగా పామ్ క్రూడ్, పామ్ రిఫైన్డ్ ఆయిల్ అందుబాటులో విఘాతం కలగడం లేదు. వంట నూనెల సరఫరా సులభతరం కావడంతోపాటు, డిమాండ్ను దేశం తేలిగ్గా ఎదుర్కొనగలుగుతోంది. ధరల స్పీడ్ ఇదీ... టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2023 జనవరిలో 4.73 శాతంగా (2022 ఇదే నెలతో ధరతో పోల్చి) నమోదయ్యింది. గడచిన రెండు సంవత్సరాల్లో ఇంత తక్కువ స్థాయి టోకు ధరల స్పీడ్ నమోదుకావడం ఇదే తొలిసారి. సూచీలో మెజారిటీ వెయిటేజ్ కలిగిన తయారీ, ఇంధనం, విద్యుత్ ధరలు తగ్గినా, ఫుడ్ ఆర్టికల్స్ బాస్కెట్ మాత్రం పెరిగింది. టోకు ధరల సూచీ వరుసగా ఎనిమది నెలల నుంచి తగ్గుతూ వస్తుండడం సానుకూల అంశమైనా, ఆహార ధరల తీవ్రతపై జాగరూకత వహించాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరించారు. 10 నెలల అప్ట్రెండ్ తర్వాత నవంబర్, డిసెంబర్లో ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం లోపు ఉన్న వినియోగ ధలర సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో మళ్లీ 6.52 శాతం పైబడిన విషయాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తున్నారు. ఈ సూచీలో ఒక్క ఫుడ్ బాస్కెట్ ధరల స్పీడ్ 5.94 శాతంగా ఉంది. ఆర్బీఐ ద్రవ్య, పరపతి విధానాలకు ముఖ్యంగా రెపోపై నిర్ణయానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపది క అయిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4% గా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు), మే 4న మొదటిసారి 0.40% పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అర శాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. ఈ నెల మొదట్లో వరుసగా ఆరవసారి పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగినట్లయ్యింది. దీనితో రెపో మొత్తంగా 6.5 శాతానికి చేరింది. జనవరి రిటైల్ ధరల స్పీడ్ నేపథ్యంలో ఏప్రిల్లో జరిగే పాలసీ సమీక్షలో మరో పావు శాతం రెపో ఖాయమన్న విశ్లేషణలు ఉన్నాయి. రాష్ట్రాలకు ఎన్పీఎస్ నిధులు బదిలీ చేయలేం కాగా, నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) కోసం డిపాజిట్ అయిన నిధులను ప్రస్తుత చట్టాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు బదలాయించలేమని అటు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో పాటు, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి వివేక్ జోషి కూడా స్పష్టం చేశారు. ‘‘ఏదైనా రాష్ట్రం ఎన్పీఎస్ కోసం డిపాజిట్ చేసిన నిధులను వారికి తిరిగి ఇవ్వవచ్చని ఆశించినట్లయితే అది అసాధ్యం’’ అని వారు స్పష్టం చేశారు. అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ఇటీవల భారీ పతనాన్ని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఉటంకిస్తూ, జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్పిఎస్) పెట్టుబడి పెట్టే షేర్ మార్కెట్ దయాదాక్షిణ్యాలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను వదిలివేయలేని పేర్కొన్నారు. ఎన్పీఎస్లో డిపాజిట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నిధులను రాష్ట్రాలకు కూడా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)కు నిధులను బదిలీ చేయకపోతే రాష్ట్రం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని కూడా ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ మంత్రి, ఆ శాఖ సీనియర్ అధికారి నుంచి వచ్చిన ప్రకటనలకు ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, పాత పెన్షన్ స్కీమ్కు తిరిగి వెళ్లడానికి కొన్ని రాష్ట్రాలు నిర్ణయించడం, ఇతర రాష్ట్రాల్లో ఈ డిమాండ్ పుంజుకోవడం మంచి పరిణామం కాదని ఆర్థిక కార్యదర్శి జోషి ఈ సందర్భంఆ స్పష్టం చేశారు. ‘‘కొత్త పెన్షన్ పథకంలోని డబ్బు ఉద్యోగులకు సంబంధించినది. ఇది ఉద్యోగి– ఎన్పీఎస్ ట్రస్ట్కు మధ్య ఒప్పందం. ఉద్యోగి మెచ్యూరిటీకి ముందు లేదా పదవీ విరమణ వయస్సు రాకముందే నిష్క్రమిస్తే, అప్పుడు అనుసరించాల్సిన విధానాలపై పలు నియమ నిబంధనలు అమల్లో ఉన్నాయి’’ అని ఆయన ఈ సందర్బంగా పేర్కొన్నారు. -
‘అదానీ’పై అదే దుమారం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ తొలి విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ముగిశాయి. రెండో విడత సమావేశాలు మార్చి 13న ప్రారంభం కానున్నాయి. అదానీ వ్యవహారంపై సోమవారం కూడా రాజ్యసభలో విపక్ష ఆందోళనలు కొనసాగాయి. సభ ప్రారంభానికి ముందే 14 విపక్ష పార్టీలు సమావేశమై దీనిపై చర్చించాయి. కాంగ్రెస్ సహా డీఎంకే, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, జేడీయూ తదితర పార్టీల నేతలు హాజరయ్యారు. జేపీసీ గానీ సుప్రీం న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ కమిటీకి డిమాండ్ చేయాలని నిర్ణయించాయి. అనంతరం బీఆర్ఎస్ సహా పలు విపక్ష పార్టీల ఎంపీలు సభలో వాయిదా తీర్మానాలిచ్చారు. సభ ప్రారంభమైన వెంటనే ఈ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. జేపీసీకి డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించాయి. దీనిపై ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ అభ్యంతరం తెలిపారు. జేపీసీ వేయాలని నినాదాలు చేస్తున్న 8 మంది సభ్యుల పేర్లను సైతం చదివి వినిపించారు. అయితే, వారిపై ఎలాంటి చర్యలను ప్రకటించలేదు. సభను నడిపేందుకు ఇది మార్గం కాదని, ఇప్పటికే చాలా సమయం వృథా అయిందని, సభ్యులు సహకరించాలని కోరారు. విపక్ష ఎంపీలు ఆందోళన విరమించకపోవడంతో సభను 11.50 గంటలకు వాయిదా వేశారు. సభ ఆరంభం అయ్యాక సైతం విపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో చివరికి మార్చి 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అదానీ గ్రూప్లో అవకతవకలు జరిగాయంటూ హిండెన్బర్గ్ సంస్థ ఇచ్చిన నివేదికపై ప్రతిపక్షాల ఆందోళనలతోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి భాగమంతా గడిచిన విషయం తెలిసిందే. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం, ఆ తర్వాత బడ్జెట్, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, సాధారణ బడ్జెట్పై చర్చ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం మినహా ఇతర కార్యకలాపాలేవీ జరగలేదు. -
బడ్జెట్లు మనుషుల కోసం కాదా?
కేంద్ర బడ్జెట్లో పరిశ్రమలు, పనిముట్లు, యంత్రాలు, కార్లు, ఇతర ప్రాణంలేని వస్తువుల ప్రస్తావనే అత్యధికం. ఈ ‘అమృత్ కాల్’ బడ్జెట్లో అమృతం ఉంది. అది మనుషులను బతికించేందుకు కాదు. మనుషులను నిరుపయోగంగా మార్చేసే సాంకేతిక విప్లవానికీ, ఆధునికీకరణ యంత్రాలకూ. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒకరోజు ముందు పార్లమెంటులో ఉంచే ఎకనామిక్ సర్వే ఉద్దేశ్యం మంచిదే. 2014–15 వరకు ‘సోషల్ సెక్టార్’ పేరుతో ఒక చాప్టర్ ఉండేది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, పిల్లలు, వారి సమస్యలు... పాత విధనాల సమీక్ష, కొత్త పథకాల రూపకల్పన ఆలోచనలు సంక్షిప్తంగా నైనా ఉండేవి. 2015–16 నుంచి ప్రకటిస్తున్న ఎకనామిక్ సర్వేలలో ఈ ‘సోషల్ సెక్టార్’ అధ్యాయం గల్లంతయ్యింది. ‘‘గత సంవత్సరం వందేళ్ళ భారత్’ పేరుతో ప్రవేశపెట్టిన బడ్జెట్ పునాదుల మీద ఆధారపడి ఈ ఏడాది బడ్జెట్ రూపొందింది. అభివృద్ధి ఫలాలను అన్ని ప్రాంతాలు, అందరు పౌరులకు ప్రత్యేకించి యువత, మహిళలు, రైతులు, వెనుకబడిన వర్గాలు, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు అందిస్తూ సంపన్న సమ్మిళిత పురోగతిని సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.’’ ఫిబ్రవరి ఒకటవ తేదీన పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ అన్న మాటలివి. ఇవి మాటలే. బడ్జెట్ ప్రసంగం మొదటి పేరాలోని పలుకులివి. మిగతా ప్రసంగంలో ఎక్కడా ఆ మాటలకు సంబంధించిన ప్రస్తావనా లేదు; నిధుల కేటాయింపు అంతకన్నా లేదు. బడ్జెట్ ప్రసంగంలో ఎక్కువ భాగం పరిశ్రమలు, పనిముట్లు, యంత్రాలు, కార్లు, ఇతర ప్రాణంలేని వస్తు వుల ప్రస్తావనే అత్యధికం. ‘అమృత్ కాల్’ బడ్జెట్ అని పేరుపెట్టుకున్న ఈ బడ్జెట్లో అమృతం చాలా ఉంది. అయితే అది మనుషులను బతికించేందుకు కాదు. మనుషులను నిరుపయోగంగా మార్చేసే సాంకేతిక విప్లవానికీ, ఆధునికీకరణ యంత్రాలకూ. అంటే ప్రాణంలేని వస్తువులకు నిరుపయోగ, నిష్ఫలామృతం. ప్రభుత్వాలుగానీ, సంస్థలుగానీ, ఏదైనా బడ్జెట్ తయారు చేసు కునేటప్పుడు ఇప్పటి వరకూ ఉన్న పరిస్థితులను అంచనా వేసుకొని, భవిష్యత్ బాగుకోసం పథకాలు రాసుకుంటారు. మనవాళ్ళు కూడా గతంలో ఆ సాంప్రదాయాన్ని పాటించారు. దానికే ‘ఎకనామిక్ సర్వే’ అని పేరుపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒకరోజు ముందు దీనిని పార్లమెంటు ముందుంచుతారు. ఎకనామిక్ సర్వే ఉద్దేశ్యం మంచిదే. అయితే 2014 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న సర్వే ఫార్మాట్ వేరు. ఆ తర్వాత దాని దారే వేరు. 2014–15 వరకు ‘సోషల్ సెక్టార్’ పేరుతో ఒక చాప్టర్ ఉండేది. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, పిల్లలు, వారి సమస్యలు... ప్రగతి, పాత విధనాల సమీక్ష, కొత్త పథ కాల రూపకల్పన ఆలోచనలు సంక్షిప్తంగానైనా ఉండేవి. ఆశ్చర్యమేమి టంటే, 2015–16 నుంచి భారత ప్రభుత్వం ప్రకటిస్తున్న ఎకనామిక్ సర్వేలలో ఈ ‘సోషల్ సెక్టార్’ అధ్యాయం గల్లంతయ్యింది. దీనిని చాలా మంది ఆర్థిక వేత్తలు, బడ్జెట్ విశ్లేషకులు, ప్రతిపక్షాల పెద్దలతో సహా ఎవ్వరూ పట్టించుకున్నట్టు లేదు. అందరూ ఏదో లోకంలో ఉన్నారు. ‘అమృత్ కాల్’లో తేలియాడుతున్నారు. ఇది కేవలం అధ్యాయం గల్లంతు కావడం కాదు, ఆలోచనా సరళిలో లోపం. అందుకే ఈ బడ్జెట్లో గానీ, 2022 ఎకనామిక్ సర్వేలో గానీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, మహిళలు, పిల్లలు కూడా దూరమయ్యారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం, సమాజ స్థితిగతులు పట్టినట్టు కనిపించదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ దృష్టి కోణం భిన్నమైనది. సైద్ధాంతికంగానే వీళ్ళు ఈ దేశంలో కులమనే ఒక వ్యవస్థ ఉన్నట్టుగానీ, దానివల్ల ఏర్పడిన, కొనసాగుతున్న అసమానతలు, వివక్ష, అణచివేత ఉన్నట్టుగానీ భావించరు. అందరూ హిందువులే అనే భావన వారికి. అందుకే ఎస్సీ, బీసీల ఉనికి, వారి గురించిన ప్రత్యేక సామాజిక స్థితిగతులు వాళ్ల ఎన్నికల ప్రణాళికల్లో, బడ్జెట్లో అంతగా ప్రస్తావనకు రావు. గత ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఈ వర్గాల కోసం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టిన దాఖలా లేదు. ప్రస్తుతం ఉన్న పథకాలను చాలా వాటిని నిర్వీర్యపరిచే పనికి కూడా పూనుకున్నారు. కేంద్రంలో ఎస్సీలు, బీసీలు, అనాథలు, దివ్యాంగుల కోసం కలిపి ఇప్పటికే ఒక మంత్రిత్వ శాఖ ఉన్నది. చాలామంది ప్రస్తుతం ఉన్న సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖను ఎస్సీల కోసమే ననుకుంటున్నారు. అది నిజం కాదు. అది ఎస్సీ, బీసీలకు కూడా. ఈ రెండు వర్గాలు కలిస్తే దాదాపు 65 శాతానికిపైగా ఉన్న సంగతిని కూడా ప్రభుత్వాలు మరచిపోయాయి. ఎస్సీ, బీసీలు కూడా మరిచి పోయారు. ఎస్సీ, బీసీలు కలిసి ఉన్న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కోసం ఇప్పటి వరకు బడ్జెట్లో కేటాయించిన నిధులను చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. 2015–16లో మొత్తం బడ్జెట్ 16 లక్షల 63 వేల కోట్లు కాగా, అందులో ఈ మంత్రిత్వ శాఖకు కేటాయించింది కేవలం 5,380 కోట్లు. అంటే ఇది 0.32 శాతం మాత్రమే. అదేవిధంగా 2016–17లో 17 లక్షల 90 వేల కోట్ల మొత్తం బడ్జెట్లో కేటాయించింది 5,752 కోట్లు మాత్రమే. ఇది కూడా 0.32 శాతం దాటలేదు. అట్లా 2017–18లో 0.33 శాతం, 2018–19లో 0.31 శాతం. అదేవిధంగా 2020–21లో 35 లక్షల 90æవేల కోట్ల బడ్జెట్లో ఈ మంత్రిత్వ శాఖకు కేటాయించింది కేవలం 8,065 కోట్లు. ఇది 0.23 శాతం. ప్రతి సంవత్సరం పెరగాల్సింది. కానీ దారుణంగా పడిపోయింది. ప్రతి ఏడాది ఆ మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపులు పెరుగుతున్నట్టు కనిపిస్తున్నది. కానీ దేశ బడ్జెట్ పెరుగుదలలో దానిశాతం పెరుగుతున్న దాఖలా లేదు. రాజ్యాంగం అందించిన హక్కు ప్రకారం ప్రారంభించిన– ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేకంగా కేటాయించిన నిధుల వినియోగం కూడా దారుణంగా ఉంది. గతంలో దీనిని ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్గా పిలిచే వాళ్ళు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లానింగ్ కమిషన్ను తొలగించి, దాని స్థానంలో నీతి ఆయోగ్ను ఏర్పరిచారు. బడ్జెట్లో కూడా ప్లాన్, నాన్ ప్లాన్ పేర్లను తొలగించి రెవెన్యూ, క్యాపిటల్ అనే పదాలను మాత్రమే కొనసాగిస్తున్నారు. ప్లాన్, నాన్ ప్లాన్ లేనందువల్ల ఎస్సీ, ఎస్టీల కోసం ప్లాన్ నిధుల నుంచి కేటాయించాల్సిన వాటిని ఎస్సీ కాంపోనెంట్గా, ఎస్టీ కాంపో నెంట్గా పిలుస్తున్నారు. అయితే జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి నిధులను కేటాయించాలి. వాటి వివరాలను చూస్తే కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దళిత, ఆదివాసీ వ్యతిరేకత అర్థం కాగలదు. గత ఎనిమిదేళ్ళలో ఎస్సీ కాంపోనెంట్ కింది కేటాయించిన నిధులు సగానికి పైగా దారి మళ్ళినట్టు వారి లెక్కల్లోనే కనిపిస్తున్నది. ఇప్పటికే సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలు, సామాజిక వివక్షలు ఎక్కువగా ఎస్సీ, ఎస్టీలను బాధిస్తున్నాయి. పేదరికం, ఆరోగ్యం, విద్య విషయంలో మిగతా సమాజానికీ ఎస్సీ, ఎస్టీలకూ మధ్య అగా«థం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకీ కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, యాంత్రీకరణ, ఆధునికీకరణ విధా నాలు ఈ వర్గాలను మొత్తంగానే సమాజ ప్రగతి నుంచి దూరం నెడు తున్నాయి. ఈ బడ్జెట్లో కొత్తదేమీ లేదుకానీ, కోట్లాది మంది యువతకు నైపుణ్యాల శిక్షణ ఇస్తామని ప్రకటించారు. ఈ నైపుణ్యాల శిక్షణ గురించిన గత అనుభవాలు అంత మంచి ఫలితాలను ఇచ్చినట్టు లేవు. సాంకేతిక, వృత్తిపరమైన నైపుణ్యాలతో కూడిన విద్యలు ప్రైవేట్ రంగంలో ఉంటాయి. ఇందులోకి ఎస్సీ, ఎస్టీ యువత వెళ్ళలేరు. ఎందుకంటే, అందులో రిజర్వేషన్లు లేవు. అందుకే బడ్జెట్లో భారత దేశ సమాజం కనిపించాలి. దేశంలో ఉన్న అసమానతలను తొలగించడానికి పూనుకోవాలి. కానీ ఆ ప్రయ త్నాలను ప్రభుత్వం చేస్తున్నట్టు కనిపించడం లేదు. నా ఉద్దేశ్యంలో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం ప్రత్యేకమైన పథకాలను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా లేదు. మొదట్లో చెప్పినట్లు దీనిని వాళ్లు అసలు సమస్యగానే చూడడం లేదు. ఇప్పుడు తమను తాము తరచి చూసుకోవాల్సింది ఆయా వర్గాలే. ప్రభుత్వాలు తమను పట్టించుకోకపోతే, ప్రజలు ఎందుకు ప్రభుత్వా లను పట్టించుకోవాలి? ఇదే ఇప్పుడు అందరూ ప్రశ్నించుకోవాల్సిన కీలకమైన సందర్భం. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
కోరమ్ లేక వాయిదా
న్యూఢిల్లీ: సభలో కోరమ్ లేకపోవడంతో లోక్సభ బుధవారం సాయంత్రం మరుసటి రోజుకు వాయిదా పడింది. కేంద్ర బడ్జెట్పై డీఎంకే సభ్యుడు టీఆర్ బాలు మాట్లాడిన తర్వాత సభలో కోరమ్ లేదన్న విషయాన్ని అదే పార్టీ ఎంపీ దయానిధి మారన్ లేవనెత్తారు. దీనిపై స్పీకర్ ఓంబిర్లా స్పందించారు. కోరమ్ బెల్లు మోగించాలని సిబ్బందికి సూచించారు. తగిన సంఖ్యలో సభ్యులను సమీకరించడంలో ప్రభుత్వ ఫ్లోర్ మేనేజర్లు విఫలమయ్యారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. కోరమ్ అంటే? లోక్సభలోని మొత్తం సభ్యుల్లో కనీసం 10 శాతం మంది ఉంటేనే సభను నిర్వహించాలి. అంటే కనిష్టంగా 55 మంది సభ్యులు సభలో ఉండాలి. దీన్నే కోరమ్ అంటారు. -
ఏనాడో గాడితప్పిన కేంద్ర బడ్జెట్లు!
2023 సంవత్సర కేంద్ర బడ్జెట్ తీరుతెన్నుల్ని పరిశీలిస్తే– ‘అన్నం మెతుకునీ/ ఆగర్భ శ్రీమంతుణ్ణీ వేరు చేస్తే/ శ్రమ విలువేదో తేలిపోదూ?’ అని కవి అలిశెట్టి ప్రభాకర్ అంటించిన చురక జ్ఞాపకం వచ్చింది. దేశ ప్రజాబాహుళ్యం స్థితిగతుల్ని పాలకులు పరిశీలించకపోబట్టే శ్రమ విలువను 75 ఏళ్లుగా గణించలేకపోయారు. ప్రణాళికలకూ, ఆచరణలో అమలు చేయని అతిశయోక్తులకూ మాత్రం తక్కువేమీ లేదు! భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దేశీయ ప్రైవేటు సంస్థల పరం చేసి, లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ‘శంకరగిరి మాన్యాలు’ పట్టించడానికి అన్ని రకాలా సిద్ధమయింది పాలకవర్గం! ఇదే అదునుగా గాంధీజీ పేరిట ప్రారంభించిన ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని’ కాస్తా నీరు కార్చడానికి పాలకులు నడుం కట్టారు. దేశ తొలి ప్రధానమంత్రి పదవిలోకి రాక ముందు, దేశానికి స్వాతంత్య్రమనేది ఏ పరిస్థితుల్లో ‘నామమాత్రపు స్వాతంత్య్రం కూడా కాదో’ ఇలా స్పష్టం చేశారు: ‘‘ప్రత్యేక హక్కులనూ, స్వార్థ ప్రయోజనాలనూ అనుభవిస్తున్న ఏ ప్రత్యేక సంపన్న వర్గమూ తమ హక్కుల్ని తాముగా వదులుకున్నట్టు చరిత్రకు దాఖలాల్లేవు. సాంఘిక మార్పులు రావా లంటే ఒత్తిడి, లేదా బల ప్రయోగం అవసరం. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించడమంటే అర్థం, ఈ స్వార్థ ప్రయోజనాలకు భరతవాక్యం పలకడమనే. విదేశీ ప్రభుత్వ పాలన తొలగి దాని స్థానంలో స్వదేశీ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఈ స్వార్థ ప్రయోజనాలను ముట్టకుండా అలాగే అట్టిపెడితే ఇక అది నామమాత్రపు స్వాతంత్య్రం కూడా కాదు’’. ఇంతకన్నా మరో గొప్ప సత్యాన్ని 1992లో సుప్రసిద్ధ అమెరికన్ పత్రిక ‘టైమ్’ ప్రకటించింది: ‘‘కమ్యూనిజం పతనం కావొచ్చు. కానీ క్యాపిటలిజమూ, ప్రజాస్వామ్యమూ శాశ్వతంగానూ, ప్రపంచ వ్యాప్తంగానూ జయప్రదం కాగలగవన్న గ్యారంటీ ఏమీ లేదు’’! ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం నాటికి పెరిగి పెద్ద మహమ్మారి రూపం దాల్చిన అమెరికా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ‘చిట్కా వైద్యాల’తో ఉపశమింప జేసుకోవడమే గానీ ఆ సంక్షోభ లక్షణాలు ఈ రోజుకీ సమసిపోలేదు. కనుకనే అమెరికా ఆశీర్వాదాలతోనే నెలకొన్న ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలలో అత్యున్నత స్థాయి అధికారిగా, సలహాదారుగా ఈ సంస్థలను విశ్వసించి రంగంలోకి దిగి ఎలాంటి దారుణానుభవం చూడవలసి వచ్చిందో వివరించారు డేవిసన్ బుధూ. ఇప్పటికీ అమెరికా, ప్రపంచబ్యాంకు సంస్థలను నమ్ముతున్న భారత నాయకులు డేవిసన్ బుధూ అనుభవాల నుంచి గుణపాఠం తీసుకోలేక పోతున్నారు. చివరికి ఆంగ్లో – అమెరికన్ సంస్థలే భారత ఆర్థిక వ్యవస్థను పాలకులు నిర్వహిస్తున్న తీరుపై వ్యంగ్యాస్త్రాలు వదులు తున్నా ‘మనసూ, చర్మం’ మందబారిపోయి దులిపేసుకునే దశలో ఉన్నారు. ఆసియా, ఆఫ్రికాలలో తన దారుణానుభవాలను డేవిసన్ ఇలా గుండె బరువుతో ప్రపంచం కళ్లముందుంచారు (బుధూ 1988లో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అప్పటి మేనేజింగ్ డైరెక్టర్ మైకేల్ కామ్డెసెస్కు రాసిన సుదీర్ఘ రాజీనామా): ‘‘మీరు లాటిన్ అమెరికా, కరేబియన్, ఆఫ్రికా దేశాల ప్రభుత్వాలకూ, ప్రజలకూ అందించమని నా చేతికి అందించిన వరల్డ్ బ్యాంక్ – ఐ.ఎం.ఎఫ్ సంస్కరణల ఔష ధాన్నీ, రకరకాల చిట్కాలనూ (బ్యాగ్ ఆఫ్ ట్రిక్స్) సంవత్సరాల తర బడిగా అందజేస్తూనే వచ్చాను. కానీ ఏళ్ల తరబడిగా ఈ దేశాల్లో గడించిన అనుభవం దృష్ట్యా నా పదవికి రాజీనామా చేస్తున్నాను. ఎందు కంటే, ఆకలితో అలమటిస్తున్న కోటానుకోట్ల సామాన్య ప్రజల రక్తంతో నా చేతులు రక్తసిక్తమయ్యాయి. మలినమై పోయిన ఈ నా చేతుల్ని కడుక్కోవడానికి నేను తీసు కున్న మంచి నిర్ణయమే ఈ రాజీ నామా. అయ్యా! కామ్డెసెస్ గారూ! ఈ దేశాల్లో మనం చేస్తున్న పనుల వల్ల పేదల రక్తం నదులై పారుతోంది. ఒక్కోసారి నాలో నేననుకుంటాను – ఐఎంఎఫ్ బ్యాంకుల తరఫున మీ పేరిట, మీకు ముందు పని చేసిన అధిపతుల పేరిట లేదా మీ అధికార ముద్రల చాటున నేను చేయ వలసి వచ్చిన పాపాలను కడిగేసుకోవడానికి మొత్తం ప్రపంచంలో దొరికే సబ్బులు కూడా ఏ మూలకూ చాలవని.’’ (ఎనఫ్ ఈజ్ ఎనఫ్: 1988). కాగా, కడిగి పారేసిన ఆ ‘సబ్బుల్ని’ ఇండియాలో మొదటగా పీవీ నరసింహారావు హయాంలో అందుకుంటే, వాటిని ఆంధ్రప్రదేశ్లో వాడి ప్రజలకు ‘టోపీ’ పెట్టడానికి ప్రయత్నించినవాడు ప్రపంచ బ్యాంక్ ‘పెంపుడు బిడ్డ’ చంద్రబాబు! ఇక భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దేశీయ ప్రైవేటు సంస్థల పరం చేసి, లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ‘శంకరగిరి మాన్యాలు’ పట్టించడానికి అన్ని రకాలా సిద్ధమయింది బీజేపీ పాలకవర్గం! ఇదే అదునుగా గాంధీజీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని’ నీరు కార్చడానికి పాలకులు నడుం కట్టారు. ఆ పథకం కింద కేటాయింపులన్నీ దారి మళ్లుతున్నాయి. పైగా 2023 బడ్జెట్ ఏడాది కాలపరిమితికి మించకపోయినా, దేశ స్వాతంత్య్రం వందేళ్లు పూర్తి చేసుకునే సమయానికి అంటే 2047 నాటి ‘లక్ష్యాల దిశగా ఈ బడ్జెట్ ఉంద’ని స్వయంగా ప్రధానమంత్రి ‘కోత’ కోయడాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. ఇండియా లాంటి వర్ధమాన దేశాలలోని కారుచౌక కూలీరేట్ల ఫలితంగా విదేశీ కంపెనీలు పోటీ మీద ఇండియాలో ప్రవేశించి, ఉద్యోగుల్ని తొలగించడం ఆనవాయితీగా మారింది. ఈ పరిస్థితిని అదుపు చేయకపోగా ఆ విధానాలనే ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు ఎసరు పెట్టడంలో పాలకులు అనుసరిస్తూ, ప్రైవేటు వారికి ‘ఆదర్శం’గా నిలుస్తున్నారు. దీన్ని ఎవరో కాదు, స్వయానా ‘అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్’ డైరెక్టర్ సి.ఫ్రెడ్ బెర్గ్స్టెన్ ఎదురు తన్నిన ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్ బ్యాక్లాష్) అని వర్ణించాల్సి వచ్చింది. ‘వ్యవస్థాగతమైన సర్దుబాట్లు అంటే, ‘ఖర్చులు తగ్గించుకుని ఉద్యోగాల నుంచి పౌరుల్ని తొలగించేయడమేనని బెర్గ్స్టెన్ స్పష్టం చేశాడు. స్విస్ బ్యాంకులు, తదితర విదేశీ బ్యాంకుల్లోకి దొంగ చాటుగా ప్రవేశించిన డబ్బును తిరిగి దేశంలోకి తెచ్చి దేశ ప్రజలకు కుటుంబం ఒక్కింటికి రూ. 15 లక్షల చొప్పున పంచుతామన్న పాల కులు ఆచరణలో మొండి చేయి చూపించడం మరపురాని అనుభవంగా మిగిలి పోయింది. ‘కోవిడ్’ వల్ల ప్రజా బాహుళ్యానికి కల్గిన నష్టం కన్నా దాని పేరిట జరిగిన మిలాఖత్ వ్యాపార లావాదేవీల వల్ల ప్రజ లకు వాటిల్లిన నష్టం ఎక్కువ. పోతన భాగవత కథల్లో ‘రహూగణుడ’నే ఒక అహంకారి ఉంటాడు. అతడెక్కిన పల్లకీ ఈ దేహమే. కానీ, దాన్ని మోసే బోయీలు ‘ఓంకారాన్ని’ వల్లిస్తూ నడుస్తారు, అలసట తెలియకుండా ఉండటం కోసం. పల్లకీలో కూర్చున్నవాడి ప్రయాణం మాత్రం సుఖంగానే సాగుతుంది. నేడు మన దేశ ప్రజల్ని పాలకులు పల్లకీ బోయీలుగా మార్చారు. నేటి దేశ వ్యవసాయ సంక్షోభానికి పాలకుల విధానాలు ఎలా దోహదం చేస్తున్నాయో ఆంత్రోపాలజిస్ట్ గ్లెన్ డేవిస్స్టోన్ వెల్లడించాడు: ‘‘పాలకులు వ్యవసాయం పేరిట వెచ్చిస్తున్న డబ్బంతా రైతాంగ శ్రేయస్సుకు కాదు, వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చుతున్న పారిశ్రామిక వేత్తల శ్రేయస్సు కోసం’’.క్రీ.పూ. 2100 సంవత్సరంలోనే సుమేరియా ఏలికలు ఆర్థిక వ్యవస్థను ప్రజాపరం చేసి ఎలా ప్రజా బాహుళ్యాన్ని కరువు కాటకాలు లేకుండా కాపాడుతూ వచ్చిందీ చరిత్ర నమోదు చేసింది. బాబిలో నియా, ఈజిప్టులలో సహితం రాచరిక పాలనల్లోనూ ప్రజలు సుఖంగా జీవించారన్న చరిత్ర దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పటికీ భారత ప్రజలకు మసకబారని ఉషోదయాన్ని 75 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత కూడా పాలకులు ప్రసాదించగల స్థితిలో లేకపోవడం విషాదకరం. కరెన్సీ సంక్షోభం వల్లనే దేశ పరిస్థితులు ఒడుదొడుకుల్లో పడ్డా యని పాలకులు చెప్పే మాటలు విని సుప్రసిద్ధ వ్యంగ్య చిత్రకారుడు ఆర్.కె. లక్ష్మణ్ గతంలో ఓ కార్టూన్ వేశాడు. ఆ కార్టూన్లో ఉన్న పేద లంతా పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ‘ఇది మనం పుట్టినప్పటి నుంచీ నోరు మూసుకుని అనుభవిస్తున్నదే కదరా’ అనుకుంటారు. ఆ తంతే 75 ఏళ్ల స్వతంత్ర భారతంలోనూ కొనసాగుతూండటం సిగ్గుచేటు. abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు -
టైర్–2, 3 నగరాలకు ప్రాధాన్యత
సాక్షి, అమరావతి: ‘దేశంలోని టైర్ 2, టైర్ 3 నగరాలకు రూ. 10 వేల కోట్లు కేటాయింపు’.. బుధవారం కేంద్రం పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఇది. దేశంలోని నగరాలను మహా నగరాలు, మెట్రో నగరాలు, మెగా సిటీలు, చిన్న సిటీలు అంటూ రకరకాలుగా పిలుస్తుంటాం. వీటిలో ఈ టైర్ 1, 2, 3.. ఇలా విభజన ఏమిటి?.. ఇదీ ఇప్పుడు జరుగుతున్న ఆసక్తికర చర్చ. అదేమిటో మనమూ ఓసారి చూద్దాం.. దేశంలో మహా నగరాలు, నగరాలు, పట్టణాలు చాలా ఉన్నాయి. వీటిలో ఏవి టైర్ 1, ఏవి టైర్ 2, టైర్ 3? వీటిని ఎలా విభజన చేస్తారన్న విషయంపై ఇప్పుడు అందరికీ ఆసక్తి నెలకొంది. ఈ ‘టైర్’ విధానం మొదట రియల్ ఎస్టేట్ రంగంలో 2007లో మొదలైంది. పది లక్షలు మించిన జనాభా ఉన్న నగరాలను టైర్ 1 గా, 5 లక్షల నుంచి 10 లక్షల మధ్య జనాభా ఉన్న సిటీలను టైర్ 2 సిటీలుగా, అంతకంటే తక్కువ జనాభా ఉన్న వాటిని టైర్ 3 గా పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ సైతం 5 వేల నుంచి లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణాలు, నగరాలను ఆరు విభాగాలు (టైర్)గా ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో టైర్ 1 విభాగంలో 8 నగరాలు ఉన్నాయి. టైర్ 2 విభాగంలో 104 నగరాలు చేరాయి. మిగిలినవి టైర్ 3 కేటగిరీలో ఉన్నాయి. టైర్ 2, 3 నగరాల అభివృద్ధిపై దృష్టి కరోనా సమయంలో అనుసరించిన వర్క్ ఫ్రం హోం విధానంలోని ప్రయోజనాలను పరిశ్రమలు గ్రహించాయి. టైర్ 1 సిటీలుకంటే తమ పెట్టుబడులకు టైర్ 2 సిటీలు మేలని, వీటిలో జీవన వ్యయం తక్కువగా ఉండడంతోపాటు వర్క్–లైఫ్ మధ్య సమతుల్యత మెరుగ్గా ఉన్నట్టు గుర్తించాయి. పైగా, అనువైన ధరల్లో అద్దె ఇళ్లు లభ్యమవడం, ఖర్చులు కూడా బడ్జెట్లో ఉండటంతో ఈ సిటీలపై ఆసక్తి చూపుతున్నాయి. దాంతో టైర్ 2 సిటీల్లో మౌలిక వసతులు కల్పించడం ద్వారా మరిన్ని పెట్టుబడులు ఆకర్షించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. రాష్ట్రంలోని టైర్ 2 సిటీలైన విశాఖపట్నం, నెల్లూరులో పలు సాఫ్ట్వేర్ కంపెనీలు, అంతర్జాతీయ పరిశ్రమలు సైతం తమ వ్యాపారాలకు కేంద్రంగా ఎంచుకున్నాయి. టైర్ 2, 3 నగరాల్లో ప్రాధాన్యత రంగాలను ప్రోత్సహించేందుకు రూ.10 వేల కోట్లతో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (యూఐడీఎఫ్) ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ప్రకటించారు. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉండే ఈ ఫండ్ను పట్టణ మౌలిక సదుపాయాల కోసం స్థానిక పట్టణ సంస్థలు ఉపయోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రకారం రాష్ట్రాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రేడ్ 2 మున్సిపాలిటీలకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. టైర్ 1 నగరాలివీ.. అధిక జనాభా, ఆధునిక వసతులతో ఉన్నవి టైర్ 1 (జెడ్ కేటగిరీ) విభాగంలోకి వస్తాయి. వీటిని మెట్రోపాలిటన్ నగరాలుగా పిలుస్తారు. భారతదేశంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, అహ్మదాబాద్, పూణే టైర్ 1 విభాగంలో ఉన్నాయి. ఈ నగరాల్లో అధిక జనసాంధ్రతతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయాలు, పరిశ్రమలు, టాప్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, విద్య, పరిశోధన సంస్థలు ఉంటాయి. ఈ నగరాల్లో జీవన వ్యయమూ అధికంగా ఉంటుంది. వీటిని బాగా అభివృద్ధి చెందిన నగరాలుగా చెప్పవచ్చు. టైర్ 2 సిటీలు భారతదేశంలో 104 నగరాలు టైర్ 2 విభాగంలో ఉన్నాయి. ఇవి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు. అయితే, టైర్ 1, టైర్ 2 నగరాల మధ్య పెద్దగా తేడా లేదని అర్బన్ ప్లానర్లు, ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఈ నగరాల్లో జీవన శైలి, అభివృద్ధి వేగంగా జరుగుతుందని, జీవన వ్యయం మాత్రం టైర్ 1 సిటీలతో పోలిస్తే తక్కువగా ఉంటుందని అంచనా. పెట్టుబడులకు, అంతర్జాతీయ వ్యాపార సంస్థలకు ఈ నగరాలు అనువైనవిగా ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. మన రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, రాజమండ్రి, నెల్లూరు, కర్నూలు టైర్ 2 సిటీలుగా ఉన్నాయి. టైర్ 3 నగరాలు అంటే.. టైర్ 2 ఉన్నవి తప్ప మిగిలిన నగరాలు, పట్టణాలను టైర్ 3 విభాగంలో చేర్చారు. ఒకవిధంగా చెప్పాలంటే గ్రేడ్ 2, 3 మున్సిపాలిటీలు వీటి పరిధిలోకి వస్తాయి. ఈ పట్టణాల్లో వసతులను మెరుగుపచడం ద్వారా పెట్టుబడులు ఆకర్షించవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. -
కారుణ్య బడ్జెట్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2023–24 బడ్జెట్ సకల జనుల బడ్జెట్గా ప్రశంసలందుకుంది. ఆర్థిక ఉత్పాతాలకు లోనయ్యే ఆదివాసీ బృందాలు, మహిళలు, యువత కోసం అనేక చర్య లను ప్రతిపాదించింది. కళాకారులకూ, హస్తకళాకారులకూ నిపుణతలు నేర్పించే పీఎం – వికాస్ వంటి పలు పథకాలను పేర్కొని తీరాలి. ఇవి 2047 నాటికి వికాస్ భారత్ లక్ష్యసాధనకు పునాది వేస్తాయి. 2023–24 కేంద్ర బడ్జెట్ దాని ఆదర్శాలకు సంబంధించి సాహసో పేతమైనదే, కానీ దాని గణన విధానంలో సాంప్రదాయికమైనది. దాని వ్యూహాల్లో ఆశావహమైనది, అయినప్పటికీ అది వాస్తవంలో బలమైన పునాదిని కలిగిఉంది. ఇది ప్రపంచ సూక్ష్మ ఆర్థిక ముఖ చిత్రం చుట్టూ ఉన్న అనిశ్చితత్వాలను విజయవంతంగా సంగ్రహించింది. భారత ఆర్థిక వ్యవస్థ అమృత్ కాల్ వైపు గమనం సాగిస్తున్నందున దానికి అవసరమైన దృఢత్వాన్ని పెంపొందించి, వృద్ధిని వేగవంతం చేయడానికి రోడ్ మ్యాప్ని అందించింది. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ (ప్రతి ఒక్కరితో, అందరి అభి వృద్ధి కోసం) అనే పంక్తులను అనుసరించిన ఈ బడ్జెట్ సకల జనుల బడ్జెట్గా ప్రశంసలందుకుంది. సమాజంలోని అన్ని వర్గా లకూ ఇది ఏదో ఒక అవకాశాన్ని ప్రతిపాదించింది. బడ్జెట్ అనే ఈ డాక్యుమెంట్ 2047లో భారత్ ఆకాంక్షిస్తున్న తరహా సమాజం గురించి ప్రధాని మోదీ ఇచ్చిన స్పష్టమైన దార్శనికతను వ్యక్తపరు స్తోంది. ఇండియా ఎట్ 100 (వందేళ్ల భారత్) సమగ్రత, సంపద్వంతం అనే స్తంభాలపై నిలబడుతుంది. అప్పుడు అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకు ప్రత్యేకించి మన యువత, మహిళలు, రైతులు, ఓబీసీలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలతో పాటు దేశంలోని పౌరులందరికీ చెందుతాయి. సమీకృత అభివృద్ధి, చివరి మైలురాయిని కూడా చేరుకోవడం అనే రెండు తొలి ప్రాధాన్యాల ద్వారా ఈ దార్శనికత ప్రతిఫలిస్తుంది. ఆర్థిక ఉత్పాతాలకు సులభంగా లోనయ్యే దుర్బలమైన ఆదివాసీ బృందాలు, మహిళలు, యువత కోసం; సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా వ్యాపారసంస్థల సాధికారత కోసం తాజా బడ్జెట్ చర్య లను ప్రతిపాదించింది. సాంకేతికతను, ఆర్థికాన్ని సమ్మిళితం చేయడం ద్వారా వ్యక్తులకు, స్థానిక పరిశ్రమలకు సాధికారత కల్పించడంపై తాజా బడ్జెట్ గట్టిగా దృష్టి పెట్టింది. మన యువతకు సాధికారత కల్పిస్తూ, అమృత్ పీఢీ (బంగారు తరం) తన శక్తిసామర్థ్యాలను వెలికితీయడంలో సహాయం చేసేందుకు తగిన విధానాలను అది రూపొందించింది. యువతకు, మహిళలకు, హస్తకళాకారులకు, స్వయం సహాయక బృందాలకు విస్తృతంగా ఉద్యోగాల కల్పన కోసం తగిన నైపుణ్యాల ప్రాధాన్యతపై అది దృష్టి పెట్టింది. సాంప్రదాయిక కళాకారులకు, హస్తకళా కారులకు నిపుణతలు నేర్పించడం కోసం ప్రధాన మంత్రి విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్ (పీఎమ్–వికాస్) వంటి పథకాలను ప్రత్యేకంగా పేర్కొ నాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని యువ పారిశ్రామికవేత్తల ద్వారా వ్యవసాయాధారిత అగ్రిస్టార్టప్లను ప్రోత్స హించడానికి అగ్రికల్చర్ ఆక్సిలేటర్ ఫండ్ కల్పన, ‘దేఖో అప్నా దేశ్ ఇనిషి యేటివ్’ కింద పర్యాటక రంగం కోసం ప్రత్యేక నైపుణ్యాలు, పారిశ్రామిక తత్వాన్ని పెంపొందించడానికీ బడ్జెట్ ప్రాధాన్యం ఇచ్చింది. 2023–24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 ద్వారా, అమృత్ పీఢీ కార్యక్రమం ద్వారా యువశక్తికి, ఆధునిక నైపుణ్య అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ పథకం కోడింగ్, కృత్రిమ మేధ, రోబోటిక్స్ వంటి అంశాల్లో యువతకు నైపుణ్యాలను కల్పిస్తుంది. అంతేకాకుండా నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ ద్వారా ఉపకార వేతనాలు కూడా అందిస్తోంది. ఇలా రూపొందిన నిపుణ కార్మిక శక్తి నుండి పర్యాటక రంగం ప్రయోజనం పొందుతుంది. ఇక యువ పారిశ్రామికవేత్తలయితే ఒక జిల్లా, ఒక ఉత్పత్తి కార్యక్రమం ద్వారా ప్రతిపాదిత ‘యూనిటీ మాల్స్’ గుండా మార్కెటింగ్ మద్దతు కూడా పొందుతారు. బాహ్య ఎదురుగాలులను తట్టుకునేందుకుగాను బడ్జెట్ ఆశిస్తున్న శక్తి గుణకాల్లో ఇవి ఓ భాగం. అనిశ్చితమైన బాహ్య వాతావరణం ద్వారా ఎదురయ్యే సవాళ్లను బడ్జెట్ గుర్తించడమే కాదు, వృద్ధి పెంపుదలలో దేశీయ చోదకశక్తులు ఎంత కీలకమో ఎత్తి చూపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎదురుగాలులు వీస్తున్నప్పటికీ భారత్ ఆర్థిక ప్రమా దాల నుంచి బయటపడటమే కాకుండా, 2023లో 7 శాతం, 2024 ఆర్థిక సంవత్సరంలో 6.6 లేదా 6.8 శాతం వృద్ధి రేటు అంచనాను నిలబెట్టుకునేలా ఆర్థిక వ్యవస్థను నడిపించింది. అంతర్జాతీయ ఉపద్రవాల నేపథ్యంలో కూడా, ఇప్పటికీ దృఢంగా ఉంటూ, దూసుకెళుతున్న దేశీయ చోదక శక్తుల ద్వారా ఆర్థిక వృద్ధి సాగుతోంది. కోవిడ్ అనంతర కాలంలో ప్రైవేట్ విని యోగం పెరగడం కూడా దీనికి తోడయింది. బహుముఖంగా సాగిన వ్యాక్సినేషన్ ప్రక్రియ వల్ల కాంట్రాక్ట్ ఇన్సెంటివ్ సర్వీసు లపై వ్యక్తులు ఖర్చుపెట్టడం సాధ్యమైంది. ఇళ్లకు వెళ్లిపోయిన వలస కార్మికులు నగరాలకు తిరిగి రావడం, అధిక స్థాయిలో మూలధన వ్యయం (33 శాతం పెరుగుదలతో 10 లక్షల కోట్లకు పెరిగింది) పెరగడం, కార్పొరేట్ల ఆదాయ, వ్యయ సమాచార నివేదికలు బలపడటం వంటివి వీటిలో కొన్ని. దీనికి అనుగుణంగా వ్యవసాయం, టూరిజం, మౌలిక వ్యవస్థాపన వంటి వాణిజ్యేతర రంగాలపై బడ్జెట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. పైగా పర్యా వరణం, గ్రీన్ ఎకానమీ వంటి క్రాస్ కటింగ్ థీమ్లు (ప్రధాన లక్ష్యంపై గురి తప్పకుండానే అనుబంధ అంశా లపై దృష్టి పెట్టడం) కూడా బడ్జెట్ లోకి వచ్చాయి. ప్రభుత్వ విధాన రోడ్ మ్యాప్లో సుస్థిరాభివృద్ధికి కేంద్ర స్థానం. అదేవిధంగా ‘పంచామృత్’ (అయిదు ప్రతి జ్ఞలు), ‘మిషన్ లైఫ్’ (పర్యావరణ అనుకూల జీవన శైలి), నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, (రూ.19,700 కోట్ల బడ్జెట్ కేటాయింపులు), కాలం చెల్లిన వాహనాల తొలగింపు విధానం, చెత్త నుంచి సంపదను సృష్టించే 500 వందలకు పైగా నూతన ప్లాంట్లను నెలకొల్పే గోవర్ధన్ స్కీమ్ (10,000 కోట్ల బడ్జెట్ కేటాయింపులు), తీరప్రాంత నివాసాల రక్షణ కోసం మడ అడవుల పెంపకం, ప్రత్యక్ష ఆదాయ పథకం వంటి వాటి గురించి 2023–24 బడ్జెట్లో నొక్కి చెప్పడమైనది. సొంత చొరవ, కార్యకలాపాల ద్వారా నీతి ఆయోగ్ లక్ష్యాల సాధన కోసం ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ గణనీయ స్థాయిలో మార్గదర్శకత్వాన్ని అందజేస్తుంది. స్టేట్ సపోర్ట్ మిషన్ ద్వారా నీతి ఆయోగ్ మరింత నిర్మాణాత్మక, సంస్థాగత పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వాలతో తాను వ్యవహరించే తీరును మరింత మెరుగుపర్చుకోవడాన్ని కొనసాగిస్తుంది. మరోవైపున నీతి ఆయోగ్ నేతృత్వంలోని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ (ఆకాంక్ష జిల్లాలు) ప్రోగ్రామ్ విజయం గురించి, ఇటీవలే ప్రారంభించిన ఆస్పి రేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్లలోని సామర్థ్యం గురించి కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నొక్కి చెప్పారు. ఈ పరివర్తనా కార్య క్రమం ద్వారా నీతి ఆయోగ్ దేశవ్యాప్తంగా 500 బ్లాక్ల లోని(సమితులలోని) పౌరుల జీవన నాణ్యతను పెంపొందించడానికి పాలనను మెరుగుపర్చ డంపై కూడా దృష్టి పెడుతుంది. ఇవి, మరికొన్ని కార్యకలాపాలు... 2047 నాటికి వికాస్ భారత్ (అభివృద్ధి చెందిన భారత్) లక్ష్యసాధన వైపుగా... మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలతో సహకా రాత్మక చర్యకు పునాది వేస్తాయి. సుమన్ బెరీ వ్యాసకర్త నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ -
సీతమ్మా.. దయ ఏదమ్మా!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు అరకొర కేటాయింపులతో కేంద్ర బడ్జెట్ ఉసూరుమనిపించింది. ప్రధానంగా పలు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు దండిగా నిధులు వస్తాయనే ఆశలపై నీళ్లు చల్లింది. కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారమే పార్లమెంటులో ప్రవేశపెట్టినా.. రైల్వే కేటాయింపులపై శుక్రవారం రాత్రికి కానీ స్పష్టత రాలేదు. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పలు కీలక డిమాండ్లకు ఈ బడ్జెట్లో మోక్షం లభించలేదు. కొన్నింటిని అరకొర కేటాయింపులతో సరిపెట్టారు. కీలకమైన కోటిపల్లి – నర్సాపురం రైల్వే లైను నిర్మాణానికి ఈ బడ్జెట్లో రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే ఈ ప్రాజెక్టుకు ఈ బడ్జెట్లో కనీసం నాలుగైదు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తారని ఆశ పడ్డారు. 22 ఏళ్ల క్రితం రూ.645 కోట్లతో మొదలైన ఈ రైల్వే లైన్ అంచనా వ్యయం ప్రస్తుతం రూ.2,892 కోట్లకు పెరిగింది. దీనికి తగినట్టుగా కేటాయింపులు లేవని కోనసీమ వాసులు పెదవి విరుస్తున్నారు. కేటాయింపులు ఎక్కువగా ఉంటాయని, 57 కిలోమీటర్ల రైల్వే లైను కోసం గౌతమి, వశిష్ట, వైనతేయ గోదావరి పాయలపై నిర్మాణంలో ఉన్న మూడు వంతెనల పనులు వేగం అందుకుంటాయని అందరూ ఆశించారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం కేటాయించిన రూ.100 కోట్లు ఏ మూలకు వస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఆశించిన స్థాయిలో కేటాయింపులు చేస్తే వైనతేయపై బోడసకుర్రు – పాశర్లపూడి మధ్య మందకొడిగా జరుగుతున్న తొమ్మిది పిల్లర్ల పనులు ఊపందుకునేవని అంటున్నారు. పెండింగ్లో ఉన్న 528 ఎకరాల భూసేకరణకు కూడా ఈ కేటాయింపులు సరిపోవనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వాసులను దశాబ్దాలుగా ఊరిస్తున్న కాకినాడ – పిఠాపురం మెయిన్ లైన్ ఊసే బడ్జెట్లో లేకుండా పోయింది. ఈ రైల్వే లైను కోసం నాలుగు దశాబ్దాలుగా అలుపెరగని ప్రయత్నం చేస్తున్నా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కనికరించ లేదు. కాకినాడ మెయిన్ లైన్ నిర్మాణానికి రూ.40 కోట్లతో 22 ఏళ్ల క్రితమే గ్రీన్ సిగ్నల్ లభించింది. కాకినాడ పోర్టు ద్వారా దక్షిణ మధ్య రైల్వేకు భారీ ఆదాయం వస్తున్నా మెయిన్ లైన్ నిర్మాణం అంశాన్ని బడ్జెట్లో ప్రస్తావించకుండా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారని పలువురు అంటున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజలు రాములోరి సన్నిధికి వెళ్లేందుకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొవ్వూరు – భద్రాచలం రైల్వే లైనుకు కేవలం రూ.20 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులిపేసుకున్నారు. 151 కిలోమీటర్ల నిడివి కలిగిన ఈ ప్రాజెక్టును 2012–13లో రూ.1,445 కోట్లతో ఆమోదించారు. అనంతరం అంచనాలు రూ.2,154.83 కోట్లకు చేరాయి. దీనికి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించకపోవడంపై ఈ ప్రాంత వాసులు కేంద్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్త రైళ్లకు హాల్టులు సహా పలు ప్రాజెక్టులపై ఈ బడ్జెట్లో ఎటువంటి స్పష్టతా కనిపించలేదు. -
సాక్షి కార్టూన్ 03-02-2023
-
Union Budget 2023-24: కొత్త పన్ను విధానం ఆకర్షణీయం
న్యూఢిల్లీ: నూతన పన్ను విధానం 2023–24 బడ్జెట్తో ఆకర్షణీయంగా మారినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. ఎక్కువ మంది ఇన్వెస్టర్లకు ఇది ప్రయోజనకరమని, తక్కువ పన్ను రేటును వారు ఆస్వాదిస్తారని చెప్పారు. బడ్జెట్ అనంతరం ఓ వార్తా సంస్థతో గుప్తా మాట్లాడారు. తగ్గింపులు, మినహాయింపులను క్రమంగా దూరం చేయడం కోసమే నూతన పన్ను విధానంలో (మినహాయింపుల్లేని) కొత్త శ్లాబులు, రేట్లు ప్రకటించడానికి కారణంగా పేర్కొన్నారు. దీని ద్వారా వ్యక్తులు, సంస్థలపై పన్ను రేట్లు తగ్గించాలన్న దీర్ఘకాలిక డిమాండ్ను చేరుకోవడం సాధ్యపడుతుందన్నారు. ‘‘నూతన పన్ను విధానాన్ని రెండేళ్ల క్రితం (2020–21 బడ్జెట్లో) ప్రతిపాదించాం. అయినప్పటికీ తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడం లేదు. ఇప్పుడు ప్రభుత్వం శ్లాబులను మార్చింది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు రేట్లు, శ్లాబులు ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతాయి’’అని చెప్పారు. కార్పొరేట్ విభాగంలో పన్ను చెల్లింపుదారులకు ఇదే మాదిరి చర్యలను కొంత కాలం క్రితం ప్రకటించగా, వారికి ప్రయోజనకరంగా మారినట్టు గుప్తా తెలిపారు. నూతన పన్ను విధానంతో లబ్ధి పొందని వర్గాలు చాలా తక్కువన్నారు. దీనిలో స్టాండర్డ్ డిడక్షన్ కల్పించినందున, అది పాత విధానంలోని ప్రయోజనాలకు ఏ మాత్రం తీసిపోదన్నారు. పన్ను చెల్లింపు దారుల ఇష్టమే.. నూతన పన్ను విధానం డిఫాల్ట్ (ప్రమేయం లేని)గా ఉంటున్నందున, పాత పన్ను విధానంలో ఉన్నవారిపై ప్రభావం పడుతుందా? అన్న ప్రశ్నకు.. ఏ విధానం అయినా ఎంపిక చేసుకుని రిటర్నులు దాఖలు చేసే స్వేచ్ఛ పన్ను చెల్లింపుదారులకు ఉంటుందని నితిన్గుప్తా చెప్పారు. కావాలంటే పాత పన్ను విధానానికి కూడా మారిపోవచ్చన్నారు. ‘‘డిఫాల్ట్ అంటే ఫైలింగ్ పోర్టల్ స్క్రీన్పై ముందు కనిపిస్తుంది. కానీ, అక్కడ ఏ పన్ను విధానం అనే ఆప్షన్ ఉంటుంది. కావాల్సిన విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు’’అని గుప్తా వివరించారు. ఏ వర్గం పన్ను చెల్లింపుదారులను కూడా నిరుత్సాహపరచబోమన్నారు. నూతన పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు పన్ను చెల్లించే అవకాశం లేకుండా రిబేట్ కల్పించడం తెలిసిందే. దీనికి అదనంగా రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం కూడా ప్రకటించారు. పాత విధానంలో అయితే రూ.5 లక్షలకు మించిన ఆదాయంపై 20% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే వివిధ సెక్షన్ల కింద తగిన సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంతిమంగా కొత్త విధానమే తక్కువ పన్ను రేట్లతో, మినహాయింపుల్లేని, సులభతర పన్నుల విధానానికి (నూతన పన్ను విధానం) మళ్లడమే ప్రభుత్వ ధ్యేయమని కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ విభాగం కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తెలిపారు. రెవెన్యూ శాఖ నిర్వహించిన విశ్లేషణ ప్రకారం ఏటా రూ.15 లక్షలు ఆర్జించే వ్యక్తి పాత పన్ను విధానంలో రూ.3.75 లక్షల వరకు క్లెయిమ్లు పొందొచ్చని.. కానీ, తక్కువ పన్ను రేట్లతో దీనికి ప్రత్యామ్నాయ పన్నుల విధానాన్ని ప్రతిపాదించినట్టు చెప్పారు. నూతన పన్ను విధానం తప్పనిసరి చేయడానికి ఎలాంటి గడువు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. -
వామ్మో..రికార్డు స్థాయికి బంగారం ధర, కారణాలేంటో తెలుసా?
సాక్షి, ముంబై: బంగారం ధర మరోసారి రికార్డు హైకి చేరింది.యూనియన్ బడ్జెట్లో దిగుమతి సుంకం పెంపునకు తోడు యూఎస్ ఫెడ్ నిర్ణయం కూడా బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తోంది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర పెంపు, ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యల నేపథ్యంలో అంతర్జాతీయంగా పసిడి ధరలు రివ్వున దూసుకెళ్లి గురువారం తాజా రికార్డులను తాకాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో గోల్డ్ ధర రూ. 58,826 వద్ద ట్రేడవుతోంది. బుధవారం నాటి ఫెడ్ సమావేశంలో వడ్డీ రేట్లను 25 బీపీఎస్ పాయింట్ల మేర పెంచింది. ఫలితంగా అమెరికా కరెన్సీ డాలర్ 9 నెలల కనిష్టస్థాయికి దిగజారింది. దీని ఫలితమే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల ర్యాలీకి కారణమని బులియన్ పండితులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో, స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 1,951.79 డాలర్ల స్థాయి కి పెరిగింది, ఏప్రిల్ 2022 నుండి ఇదు అత్యధిక స్థాయి. దేశీయంగా హైదరాబాద్ మార్కెట్లో 600 రూపాయలు ఎగిసిన 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 53, 600 గాను, 8 గ్రాముల బంగారం ధర రూ. 42,880 గాను ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 650 పెరిగి రూ. 58,470 గా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర రూ. 58,470గా, 8 గ్రాముల బంగారం ధర రూ. 46,776 గాను, బడ్జెట్ 2023లో బంగారం, ప్లాటినం డోర్, బార్లతో సమానంగా సిల్వర్ డోర్, బార్లు,వస్తువులపై సుంకాన్ని పెంచాలని ప్రతిపాదించింది. వెండిపై దిగుమతి సుంకం, 7.5 నుంచి 10 శాతానికి పెంపు, అలాగే 5 శాతం వ్యవసాయం, మౌలిక సదుపాయాల సెస్తో పాటు, మొత్తంగా 15శాతం నికర సుంకాన్ని వసూలు చేయనున్నారు. అలాగే దిగుమతి చేసుకున్న బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాలు, వస్తువులపై దిగుమతి సుంకం 20శాతం 25 శాతానికి పెరిగింది. -
కేంద్ర బడ్జెట్: చదివింపులు 1.12 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ఈసారి విద్యా రంగానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.1,12,898.97 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు విద్యాశాఖకు ఇవే అత్యధిక కేటాయింపులు కావడం గమనార్హం. పాఠశాల విద్యకు రూ.68,804.85 కోట్లు కేటాయించగా ఉన్నత విద్యకు రూ.44,094.62 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో విద్యా రంగానికి రూ.1,04,277.72 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాలు ఉన్నత విద్యకు రూ.40,828.35 కోట్లు, పాఠశాల విద్యకు రూ.59,052.78 కోట్లుగా ఉన్నాయి. మేక్ ఏఐ ఇన్ ఇండియా, మేక్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా కలను సాకారం చేసే లక్ష్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి మూడు సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ కేంద్రాలు అత్యున్నత విద్యాసంస్థల్లో ఏర్పాటు కానున్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, రవాణా రంగాల్లో మెరుగైన సేవలు అందించేలా ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో వంద ల్యాబ్లు ఏర్పాటవుతాయి. నేషనల్ డిజిటల్ లైబ్రరీని నెలకొల్పి నాణ్యమైన పుస్తకాలను అందుబాటులోకి తెస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జాతీయ నూతన విద్యావిధానాన్ని (ఎన్ఈపీ 2020) చిత్తశుద్ధితో అమలు చేసే లక్ష్యంతో కేంద్ర పరిధిలోని అత్యుత్తమ విద్యాసంస్థలు, యూనివర్సిటీలకు ఈసారి రూ.4,235.74 కోట్లు అదనంగా కేటాయించనున్నారు. గత బడ్జెట్తో పోలిస్తే ఈసారి 12.8 శాతం నిధులు అదనంగా కేటాయించారు. యూజీసీకి గ్రాంట్లను రూ.459 కోట్లు పెంచారు. సెంట్రల్ యూనివర్సిటీలకు 17.66 శాతం, డీమ్డ్ యూనివర్సిటీలకు 27 శాతం గ్రాంట్లు పెరిగాయి. గతేడాది బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఐఐటీలకు 14 శాతం, ఎన్ఐటీలకు 10.5 శాతం పెరిగాయి. మెరుగ్గా ఉపాధ్యాయ శిక్షణ వినూత్నంగా పెడగాగి అంశాలు, కరిక్యులమ్లో మార్పులు, నిరంతర నైపుణ్యాల అభివృద్ధి తదితరాలతో ‘డైట్’కేంద్రాలను సరికొత్తగా ఆవిష్కరించి టీచర్ శిక్షణను మరింత మెరుగ్గా తీర్చిదిద్దనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 38,800 ఉపాధ్యాయ, సహాయ సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. రానున్న మూడేళ్లలో 740 ఏకలవ్య స్కూళ్లలో 3.5 లక్షల మంది ఆదివాసీ విద్యార్థులకు మెరుగైన బోధన అందించేలా నియామకాలు చేపట్టనున్నారు. ఏకలవ్య రెసిడెన్సియల్ స్కూళ్లకు బడ్జెట్లో రూ.5,943 కోట్లు కేటాయించారు. వజ్రాల తయారీ రీసెర్చ్కు గ్రాంట్ ల్యాబ్ల్లో వజ్రాల తయారీ (ఎల్జీడీ) టెక్నాలజీకి ఉన్న విస్తృత ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని దేశీయంగా ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఓ ఐఐటీకి ఐదేళ్ల పాటు రీసెర్చ్ గ్రాంట్ అందచేస్తామని ప్రకటించారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 విద్యా రంగంలో డిజిటల్ విధానాలను ప్రోత్సహిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు పెద్దపీట వేయటాన్ని ఎడ్టెక్ సంస్థలు స్వాగతిస్తున్నాయి. డిజిటల్ విప్లవం దిశగా దీన్ని కీలక చర్యగా అభివర్ణిస్తున్నాయి. డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు ఎడ్టెక్ రంగానికి సరికొత్త ఊపునిస్తుందని జడ్ఏఎంటీ సంస్థ వ్యవస్థాపకుడు ఆరుల్ మాలవీయ పేర్కొన్నారు. విద్యారంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యతకు బడ్జెట్లో గుర్తింపు లభించిందని చెప్పారు. ఎడ్టెక్ కంపెనీలు, స్టార్టప్లు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యేందుకు తాజా చర్యలు దోహదం చేస్తాయన్నారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకునేందుకు మానవ వనరులపై నిధులు వెచ్చించాల్సిన అవసరాన్ని బడ్జెట్ చాటి చెప్పిందని కూ ఇండియా, కీ బ్రిడ్జి గ్లోబల్ ఎడ్యుకేషన్ సహ వ్యవస్థాపకుడు అమోద్ దని చెప్పారు. నిత్య జీవితంలో భాగంగా మారిపోయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలను పెంపొందించే దిశగా సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లు కృషి చేస్తాయని ఫిజిక్స్వాలా కో ఫౌండర్ ప్రతీక్ మహేశ్వరి పేర్కొన్నారు. మహిళా, శిశు సంక్షేమమే ధ్యేయం న్యూఢిల్లీ: కీలకమైన మహిళా, శిశు సంక్షేమ శాఖకు తాజా బడ్జెట్లో కేంద్రం రూ.25,448.75 కోట్లు కేటాయించింది. గత ఏడాది కంటే ఇది రూ.267 కోట్లు అధికం కావడం విశేషం. మహిళా, శిశు సంక్షేమమే ధ్యేయంగా కేటాయింపులను పెంచినట్లు తెలుస్తోంది. 2022–23లో ఈ శాఖకు రూ.25,172.28 కోట్లు కేటాయించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో మహిళల కోసం ముఖ్యమైన ప్రకటన చేశారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్’ను ప్రతిపాదించారు. దీనికింద పొదుపు చేసిన మొత్తంపై రెండేళ్ల కాలానికి రూ.7.5 శాతం వడ్డీరేటు చెల్లిస్తారు. మహిళ లేదా ఆడ శిశువు పేరిట డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.2 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. పాక్షికంగా ఉపసంహరించుకొనే వెసులుబాటు ఉంటుంది. ఇదొక చిన్న తరహా పొదుపు పథకం. మహిళ ఆర్థిక సాధికారత కోసం ‘దీన్దయాళ్ అంత్యోదయ యోజన–నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్’కింద గ్రామీణ మహిళలతో 81 లక్షల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఒక్కో సంఘంలో వేలాది మంది మహిళలు ఉంటారని తెలిపారు. ఉత్పాదక సంస్థల ద్వారా ఆర్థిక సాధికారత సాధించడమే ఈ సంఘాల లక్ష్యమని వివరించారు. మహిళా రైతులకు రూ.54,000 కోట్ల లబ్ధి పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి కింద చిన్న, సన్నకారు రైతులకు రూ.2.25 లక్షల కోట్లు బదిలీ చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ వివరించారు. ఇందులో 3 కోట్ల మంది మహిళా రైతులు రూ.54,000 కోట్ల మేర లబ్ధి పొందుతారని తెలియజేశారు. మహిళా, శిశు సంక్షేమ శాఖకు బడ్జెట్లో రూ.25,448.75 కోట్లు కేటాయించగా, ఇందులో సాక్షం అంగన్వాడీ, పోషణ్ 2.0 పథకాలకు రూ.20,554.31 కోట్లు, మిషన్ వాత్సల్యకు రూ.1,472 కోట్లు, మిషన్ శక్తికి రూ.3,143 కోట్లు కేటాయించారు. అలాగే సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ(సీఏఆర్ఏ), నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఛైల్డ్ రైట్స్(ఎన్సీపీసీఆర్), నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ తదితర స్వయం ప్రతిపత్తి కలిగిన విభాగాలకు రూ.168 కోట్లు కేటాయించారు. గత ఏడాది కంటే ఇది రూ.4 కోట్లు అధికం. పెట్టుబడి పరిమితి రెట్టింపు సీనియర్ సిటిజెన్ సేవింగ్ పథకం(ఎస్సీఎస్ఎస్)లో గరిష్టంగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉండగా, ఈ పరిమితిని రూ.30 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అలాగే పోస్టల్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ సింగిల్ అకౌంట్లో ఇకపై గరిష్టంగా రూ.9 లక్షలు (ప్రస్తుతం రూ.4.5 లక్షలు) పెట్టుబడి పెట్టొచ్చని అన్నారు. జాయింట్ అకౌంట్లో గరిష్టంగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చని సూచించారు. ఇవి పెట్టుబడికి ఎలాంటి రిస్క్ లేకుండా వడ్డీ అందించే పథకాలు. -
సోషల్ మీడియాను ముంచెత్తిన బడ్జెట్ మీమ్స్
2023–24 బడ్జెట్పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పోస్టు చేసిన మీమ్స్ అందరినీ నవ్వుల్లో ముంచెత్తాయి. ముఖ్యంగా మిడిల్ క్లాస్, వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితి, సిగరెట్లపై వా రు చేసిన మీమ్స్ ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్గా ని లిచాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ న్ బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టే ముందే మొదలైన మీమ్స్ హడావుడి... మధ్యతరగతికి ఆదాయపరిమితి పెంపు ప్రతిపాదనతో పతాక స్థాయికి చేరాయి. అలాగే సిగరెట్లపై 16% పన్ను పెంపు ప్రతిపాదనతో నిరాశ చెందిన పొగరాయుళ్లు పెట్టి న మీమ్స్ కూడా ట్రెండ్ అయ్యాయి. అయితే ఐటీ పరిమితి పెంపు కొత్త పన్ను విధానానికి వర్తిస్తుందని నిర్మల ప్రకటించడంపై చాలా మంది నెటిజన్లను అయోమయానికి గురిచేసింది. ఈ పన్ను విధానంపై కొందరు హర్షం వ్యక్తం చేస్తూ మీమ్స్ పెట్టగా మరికొందరు మాత్రం తమకు ఏమీ అర్థం కాలేదన్న సంకేతాన్ని మీమ్స్ రూపంలో పోస్టు చేశారు. -
బడ్జెట్లో మధ్యతరగతి కుటుంబానికి ఒరిగిందిదే..!
కేంద్ర బడ్జెట్ మీద గంపెడాశలు పెట్టుకున్న ఓ సగటు మధ్య తరగతి కుటుంబానికి దక్కింది చాలా తక్కువే. ఒకట్రెండు హామీలు తప్పితే మిగతావన్నీ చేదుగుళికలే. ‘‘నేనూ మధ్యతరగతి వ్యక్తినే. ఈ వర్గం ప్రజలపై ఉండే ఒత్తిళ్లు నాకూ తెలుసు. వాటిని అర్థం చేసుకోగలను’’ అని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలతో బడ్జెట్లో మిడిల్ క్లాస్ మెలోడీస్ విని పిస్తాయని అందరూ అనుకున్నారు. తీరా చూస్తే ఆదాయ పన్ను మినహాయింపు, కాసింత సేవింగ్స్, కూసింత ఎంటర్టైన్మెంట్ తప్ప మిగిలిన వాటిల్లో నిరాశే మిగిలింది. – సాక్షి, నేషనల్ డెస్క్ ఉద్యోగి కరోనా తర్వాత బతుకు భారమైపోయింది. ఆదాయాన్ని మించిపోయేలా ఖర్చులు తడిసిమోపెడయ్యాయి. సగటు వేతన జీవి ఆదాయ పన్ను పరిమితివైపే ఆశగా చూశాడు. ఈ విషయంలో కాస్తో కూస్తో ఊరట కలిగింది. ఏడాదికి రూ.7 లక్షలు అంటే నెలకి రూ.60 వేల సంపాదన ఉన్నవారు ఆదాయ పన్ను కట్టాల్సిన పని లేదు. ఈ కొత్త బడ్జెట్ ద్వారా వారికి నెలకి రూ.2800 వరకు మిగులుతుంది. పెరిగిపోతున్న ధరాభారానికి అదేమంత పెద్ద మొత్తం కాదని అందరూ పెదవి విరుస్తున్నారు. ఒక కుటుంబం కొనుగోలు శక్తిని మరింత పెంచకుండా దేశ ఆర్థిక వృద్ధి రేటుపై మోయలేని లక్ష్యాలు పెట్టుకొని ఏం ప్రయోజనమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సీనియర్ సిటిజన్ సీనియర్ సిటిజన్లకి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. సీనియర్ సిటిజన్ల సేవింగ్స్ స్కీమ్ పరిమితిని ఒకేసారి రెట్టింపు చేస్తూ నిర్ణయం ప్రకటించారు. సీనియర్ సిటిజన్లు తమ పేరు మీద ఇన్నాళ్లూ రూ.15 లక్షల డిపాజిట్లు చేసుకోవచ్చు. ఇప్పుడు దానిని రూ.30 లక్షలకు పెంచారు. కరోనా సమయంలో రైలు ప్రయాణంలో సీనియర్ సిటిజన్లకి 50శాతం కన్సెషన్ ఉండేది. దానిని ఎత్తేస్తారని ఆశగా ఎదురు చూసిన వారికి నిరాశే ఎదురైంది. నిర్మలక్క ఆ ఊసు కూడా ఎత్తలేదు. సొంతిల్లు సొంతిల్లు అనేది మధ్య తరగతికి కల. ఏదున్నా లేకున్నా తలదాచుకోవడానికి ఒక గూడు ఉండాలని అనుకుంటారు. ఈ మధ్య కాలంలో ఆర్బీఐ రెపో రేట్లు సవరించిన ప్రతీసారి గృహ రుణాల వడ్డీ రేటు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ సారి బడ్జెట్లో వడ్డీ రేట్లు తగ్గింపు వంటి వాటిపై ఏమైనా ప్రకటనలుంటాయేమోనని, ఆదాయ పన్ను మినహాయింపులో గృహ రుణాలు తీసుకున్న వారి పరిమితిని పెంచుతారని ఆశపడ్డారు. కానీ ఆర్థిక మంత్రి ఆ ఊసే ఎత్తలేదు. అయితే నిరుపేదల కోసం నిర్మించే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకానికి 66% నిధుల్ని పెంచుతూ మొత్తంగా 79 వేల కోట్లు కేటాయించారు. మహిళ ఆదాయాన్ని పొదుపుగా వాడుకుంటూ ఇల్లు నడిపే మహిళల కోసం ప్రకటించిన మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఒక వరం. బ్యాంకుల్లో వడ్డీ రేట్లు నానాటికీ తీసికట్టుగా మారిపోతున్న నేపథ్యంలో మహిళలకి 7.5% స్థిర వడ్డీరేటుని కల్పిస్తారు. ఈ సర్టిఫికెట్ కింద రెండు లక్షల వరకు డిపాజిట్ చేసే అవకాశం ఉంది. ఆర్థిక కష్టాలు వస్తే బంగారం ఆదుకుంటుందన్న నమ్మకం బడ్జెట్లో గల్లంతైంది. గోల్డ్ బార్స్ దిగుమతి సుంకాన్ని 12.5 శాతానికి పెంచడంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. బడ్జెట్ ప్రసంగం పూర్తయిన వెంటనే 10 గ్రాముల బంగారం రూ. 58 వేలకి చేరుకోవడం మహిళలకి షాక్ తగిలినట్టైంది. విద్యార్థి కోవిడ్–19 చదువుల్ని చావు దెబ్బ తీసింది. బడిముఖం చూడకుండా ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లలో పాఠాలు విన్న పిల్లలు చదువుల్లో కొన్నేళ్లు వెనకబడిపోయారు. 2012 నాటి స్థాయికి చదువులు పడిపోయాయని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఈ సారి బడ్జెట్లో ఎన్నడూ లేని విధంగా రూ.1.12 లక్షల కోట్లు కేటాయించారు. పాఠశాల విద్యకి 8 శాతం నిధులు పెరిగినా పిల్లల్ని బడి బాట పట్టించే చర్యలు శూన్యం. నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తాననడం కంటితుడుపు చర్యగా మారింది. నిరుద్యోగి ఇది లే ఆఫ్ల కాలం. పని సగంలో ఉండగా మీ సేవలు ఇంక చాలు అంటూ పింక్ స్లిప్ చేతికిచ్చి ఇంటికి పంపేస్తున్నారు. దీంతో నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కల్పనకి అవసరమైన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సారి బడ్జెట్ సప్తరుషుల్లో ఒకటిగా యువశక్తికి పెద్ద పీట వేసింది. యువతలో నైపుణ్యం పెంచడానికి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) 4.0 ప్రారంభించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, 3డీ ప్రింటింగ్, డ్రోన్లు వంటి వాటిలో శిక్షణ ఇస్తుంది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 38,800 ఉపాధ్యాయులను నియమించనుంది. టూరిజం రంగంలో ఉద్యోగాల కోసం యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేపడతామని చెప్పినా ఎన్ని కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న దానిపై స్పష్టత లేదు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇవాళ రేపు ఎవరింట్లో చూసినా ఎవరి తీరాన వారు మొబైల్ ఫోన్లలో తలదూర్చేస్తున్నారు. వాట్సాప్లోనే పలకరింపు, ముచ్చట్లు కలబోసుకుంటున్నారు. వినోదమైనా, విజ్ఞానమైనా అంతా మన అరచేతిలోనే. ఇప్పుడు ఆ మొబైల్ ధరలైతే తగ్గనున్నాయి. టీవీలు, మొబైల్ ఫోన్లలో వాడే విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించడంతో టీవీ, మొబైల్ రేట్లు తగ్గుతాయి. ఇవి తగ్గుతాయి బానే ఉంది కానీ, వినోదం కోసం బయట సినిమాకి వెళ్లారంటే ఇక్కడ మిగిలింది కాస్త అక్కడ ఖర్చైపోతుంది. మొత్తంగా లెవలైపోతుంది. హళ్లికీ హళ్లి సున్నాకి సున్నా. ఫ్యామిలీ పార్టీల్లో బ్రాడెండ్ దుస్తులు వేసుకోవాలన్నా మధ్యతరగతికి ఇప్పుడు అది భారమైపోయింది. -
‘ఇంటి’పై ఎల్టీసీజీ పరిమితి రూ.10 కోట్లే
ఇల్లు లేదా ఇతర క్యాపిటల్ అసెట్స్ కొనుగోలు చేసి విక్రయించగా వచ్చే దీర్ఘకాల మూలధన లాభాలపై (ఎల్టీసీజీ) పన్ను మినహాయింపునకు ఆర్థిక మంత్రి సీతారామన్ పరిమితి తీసుకొచ్చారు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54, 54ఎఫ్ కింద గరిష్టంగా 10 కోట్ల మొత్తానికే పన్ను మినహాయింపు పరిమితం చేశారు. అంటే ఒక ఇల్లు లేదా ఇతర క్యాపిటల్ పెట్టుబడులను విక్రయించినప్పుడు వచ్చే దీర్ఘకాల మూలధన లాభాన్ని, మరో ఇంటిని కొనుగోలు చేయడం ద్వారా పన్ను లేకుండా చేసుకోవచ్చు. కాకపోతే ఈ మూలధన లాభం రూ.10కోట్లకు మించి ఉంటే ఆ మొత్తంపై ఇక మీదట పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మరీ ఖరీదైన ఆస్తుల కొనుగోలుపై పన్ను మినహాయింపులు తగ్గించేందుకే ఇలా చేశారు. పన్నుల్లో రాయితీలు, మినహాయింపులను మరింత మెరుగ్గా మార్చే లక్ష్యంతో రూ.10 కోట్లకు పరిమితం చేసినట్టు మంత్రి చెప్పారు. ఇందులో సెక్షన్ 54 అన్నది ఒక ఇంటిని అమ్మగా వచ్చే దీర్ఘకాల మూలధన లాభాన్ని తీసుకెళ్లి మరో ఇంటి కొనుగోలు చేయడం ద్వారా మినహాయింపునకు సంబంధించినది. చదవండి: డిజిటల్ సీతారామం.. సూపర్ హిట్! -
ఆయిల్ కంపెనీలకు ఉపశమనం.. రూ.30,000 కోట్లు కేటాయింపు
ప్రభుత్వరంగ చమురు విక్రయ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. 10 నెలలుగా పెట్రోల్, డీజిల్ విక్రయ ధరలను సవరించకుండా నష్టపోయిన బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐవోసీ కోసం రూ.30,000 కోట్లను ఆర్థిక మంత్రి కేటాయించారు. అంతర్జాతీయంగా ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ, 2021 ఏప్రిల్ 6 నుంచి ఈ సంస్థలు ధరలను సవరించకుండా విక్రయిస్తున్నాయి. బ్యారెల్ చమురు ధర 116 డాలర్లకు వెళ్లిన సమయంలో వాటికి ఎక్కువ నష్టం వచ్చింది. ఆ తర్వాత చమురు ధరలు తగ్గడంతో పెట్రోల్పై లాభం వస్తుండగా, డీజిల్పై ఇప్పటికీ నష్టపోతున్నాయి. 2022–23లో ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి ఈ మూడు ఉమ్మడిగా రూ.21,200 కోట్ల నష్టాలను ప్రకటించడం గమనార్హం. పైగా వీటికి రెండేళ్లుగా ఎల్పీజీ సబ్సిడీ చెల్లింపులు కూడా చేయలేదు. దీంతో రూ.50,000 కోట్లను ఇవ్వాలని అవి కోరగా, ప్రభుత్వం రూ.30,000 కోట్లను కేటాయించింది. చదవండి: ఆ కార్ల కొనుగోలుదారులకు షాక్.. పెరగనున్న ధరలు! -
డిజిటల్ సీతారామం.. సూపర్ హిట్!
‘ఈ జగమంతా రామమయం’ అన్నాడు ఆనాటి రామదాసు! ఈ నాటి నిర్మలా సీతారామమ్మ బడ్జెట్ పాట కూడా ఇదే. కాకపోతే.. జగము స్థానంలో భారత్ అని.. రాముడికి బదులు డిజిటల్ అని మార్చుకోవాలి! కేంద్ర ప్రభుత్వం ఏళ్ల క్రితం మొదలుపెట్టిన డిజిటలీకరణకు ఈ ఏడాది బడ్జెట్లోనూ మంచి మద్దతు లభించింది. దేశ పురోగతికి కృత్రిమ మేధను వాడుకోవడం మొదలు.. రైతన్న సమస్యలన్నింటికీ ఒక్క చోటే పరిష్కారాలు దక్కేలా చేయడం వరకూ పలు ప్రతిష్టాత్మక డిజిటల్ కార్యక్రమాలకు ఈ ఏడాది బడ్జెట్లో శ్రీకారం చుట్టారు. ఒక్కొక్కటి వివరంగా చూద్దాం.. వ్యవసాయానికి డిజిటల్ ప్లాట్ఫామ్ ఈ ఏడాది బడ్జెట్లో ‘వ్యవసాయం’కోసం డిజిటల్ రూపంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. నాణ్యమైన ఇన్పుట్స్ (విత్తనాలు, ఎరువులు తదితరాలు) రైతులకు లభించేందుకు మాత్రమే కాకుండా... పండిన పంటకు జరిగే నష్టాలను నివారించేందుకు అవకాశాలు మెరుగు అవుతాయి. తగిన సమాచారం అందుబాటులో లేని కారణంగా రుణాలిచ్చేందుకు తటపటాయించే బ్యాంకులు కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ ఆధారంగా రైతులకు అవసరమైనంత స్థాయిలో రుణా లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. పంటల ఆరోగ్యంపై, ఇన్పుట్ల ఖర్చు, నేల సారం, ధరలు, ఉత్పత్తుల నాణ్యత వంటి అనేక అంశాల సమాచారం ఈ ప్లాట్ఫామ్ ద్వారా బ్యాంకర్లకు అందుతుందని అంచనా. వీటి ద్వారా రైతుల రుణ అర్హతలనూ నిర్ణయించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. జన్ధన్ ఖాతాలు, డిజిటల్ పేమెంట్ల కారణంగా ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు నేరుగా నగదు రూపంలోనే సాయం అందిస్తున్న విషయం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. రైతులకు ఉపయోగపడే అనేక ప్లాట్ఫామ్లు ఇప్పటికే కొన్ని కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతున్నాయి. ఐటీసీ ‘ఈ–చౌపాల్’ ‘దేహాత్’, ‘ఆర్య’, ‘రేష మండి’, ‘అనిమాల్.ఇన్’, ‘ఆక్వా–కనెక్ట్’’ వంటివి మరికొన్ని కూడా ఉన్నాయి. కేంద్రం వీటిలోని మేలి అంశాల మేళవింపుగా కొత్త ప్లాట్ఫామ్ను రూపొందించవచ్చు. డిజిటల్ లైబ్రరీ పుస్తకం హస్తభూషణమన్న పాత పాటకు పాతరేసి.. పుస్తకాలను ఇప్పుడు డిజిటల్ రూపంలో అందించేందుకు ప్రయత్నం మొదలైంది. జాతీయ స్థాయిలో అన్ని భాషల్లో, ప్రాంతాల్లో స్థాయిల్లోనూ యువతీ యువకులకు, బాలబాలికలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన పుస్తకాలను ఈ డిజిటల్ లైబ్రరీ ద్వారా అందించనున్నారు. కోవిడ్ కారణంగా చదువుల్లో డిజిటల్ టెక్నాలజీ అవసరం పెరిగిపోయిన నేపథ్యంలో ఈ లైబ్రరీ ఏర్పాటు కానుండటం విశేషం. స్మార్ట్ ఫోన్లు మొదలుకొని, డెస్్కటాప్ల వరకూ అన్నింటి ద్వారా ఈ లైబ్రరీ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో రాష్ట్రాల్లో పంచాయితీల స్థాయి లో భౌతిక గ్రంథాలయాల ఏర్పాటునూ ప్రోత్సహిస్తామని వాటిల్లోనే డిజిటల్ లైబ్రరీ కూడా అందుబాటులో ఉండేలా చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ‘‘ఆర్థిక అంశాల్లో అక్షరాస్యత కల్పించేందుకు, పుస్తక పఠనాన్ని అలవాటు చేసేందుకు ఈ ల్రైబరీలు ఉపయోగపడతాయి.’’అని సీతారామన్ తెలిపారు. అక్షరాస్యత కార్యక్రమాలను కూడా స్వచ్ఛంద సంస్థల సాయంతో ఈ డిజిటల్ లైబ్రరీ ప్రాజెక్టుకు అనుసంధానిస్తామన్నారు. దేశం కోసం.. దేశంలోనే.. కృత్రిమ మేధ కృత్రిమ మేధ వినియోగాన్ని మరింత విస్తృతం చేసేందుకు దేశంలో మూడు అత్యున్నత నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలు మూడింటిలో వీటి ఏర్పాటు జరుగుతంది. వ్యవసాయం, ఆరోగ్యం, సస్టెయినబుల్ సిటీస్ రంగాల్లో పరిశోధనలు తద్వారా ఆయా రంగాల్లోని సమస్యలకు అత్యాధునిక టెక్నాలజీ పరిష్కారాలు కనుక్కునేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడతాయి. ఇందుకు పరిశ్రమ వర్గాలు తమవంతు తోడ్పాటునందిస్తాయి. ‘‘కృత్రిమ మేధ రంగంలో మానవ వనరులను అభివృద్ధి చేసేందుకు, దేశంలో సమర్థమైన కృత్రిమ మేధ వ్యవస్థ ఒకటి ఏర్పాటయ్యేందుకు’ఈ మూడు కేంద్రాలు ఉపకరిస్తాయి’’అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ కేంద్రాల ఏర్పాటు వల్ల విద్యార్థులు మరింత ఎక్కువ మంది కృత్రిమ మేధ కోర్సులకు మొగ్గు చూపుతారని, దేశ అభివృద్ధికి మేలు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. గూగూల్కు చెందిన ‘ఇండియ రీసెర్చ్ ల్యాబ్ కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ల సాయంతో ఆరోగ్య రంగాన్ని మెరుగు పరిచేందుకు ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా.. ప్రజా ఆరోగ్య రంగం, వన్యప్రాణి సంరక్షణ, వ్యాధుల నివారణ వంటి అనేక అంశాల్లో కృత్రిమ మేధను వాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 5జీ కోసం వంద ల్యాబ్లు.. డిజిటల్ ఇండియా పథకంలో భాగంగా కేంద్రం గత ఏడాది దేశంలో 5జీ సర్వీసులను మొదలుపెట్టింది. వేగవంతమైన నెట్వర్క్తోపాటు అనేక ఇతర లాభాలు తెచ్చిపెట్టగల ఈ 5జీ టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకునేందుకు దేశంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో వంద ల్యాబ్ లు ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి తాజాగా ప్రకటించారు. స్మార్ట్ క్లాస్రూమ్లు, ప్రిసిషన్ ఫారి్మంగ్, తెలివైన రవాణా వ్యవస్థలతోపాటు ఆరోగ్య రంగంలో ఉపయోగపడే అప్లికేషన్లను తయారు చేయడం వీటి లక్ష్యం. బ్యాంకులు, వివిధ నియంత్రణ సంస్థలు, ఇతర వ్యాపార వర్గాలు కూడా ఈ ల్యాబ్ కార్యకలాపాల ద్వారా లాభపడే అవకాశం ఉంది. దేశంలో ప్రస్తుతం సుమారు 225 ప్రాంతాల్లో ఈ 5జీ టెక్నాలజీ అందుబాటులో ఉంది. 5జీ టెక్నాలజీలపై పరిశోధనలకు గాను ఈ ఏడాది రూ. 5.56 కోట్లు కేటాయించారు. గత ఏడాది ఈ కేటాయింపులు రూ.7.74 కోట్లు. టెలి కమ్యూనికేషన్స్, 5జీ టెక్నాలజీల్లో గత ఏడాది డిమాండ్ 33.7 శాతం వరకూ పెరిగింది. 2022–23లోనే ఈ రంగాల్లో 1.3 లక్షల ఉద్యోగాలకు డిమాండ్ ఉండగా.. ఏటికేడాదీ ఇది పెరుగుతోంది. 5జీ రంగంలో కొత్తగా ఏర్పాటయ్యే ల్యాబ్ల వల్ల యూనివర్సిటీల్లో పరిశోధనలు మరింత ఊపందుకుంటాయి. మరిన్ని ఉద్యోగావకాశాలను సృష్టించనున్నాయి. నైపుణ్యాల వృద్ధికి భారీ ఊతం రేపటి తరం కొత్త టెక్నాలజీల్లో దేశ యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఈ ఏడాది బడ్టెట్లో ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఇందులో భాగంగా వివిధ రకాల నైపుణ్యాలను అందించనున్నారు. కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ ఇవ్వడంతోపాటు, శిక్షణ పొందిన వారిని, కంపెనీలను ఒకచోటకు చేర్చడమూ ఈ ప్లాట్ఫామ్ ద్వారా జరుగుతాయి. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలకూ ప్రాధాన్యం లభించనుంది. నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్లో భాగంగా రానున్న మూడేళ్లలో 47 లక్షల మంది యువతకు నేరుగా ఆన్లైన్ పద్ధతిలో స్టైఫండ్ అందించనున్నారు. అంతేకాకుండా.. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0లో భాగంగా కోడింగ్, కృత్రిమ మేధ, మెకట్రానిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, త్రీడీ ప్రింటింగ్ డ్రోన్స్ ఇతర సాఫ్ట్ స్కిల్స్ను అందిస్తారు. అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు దేశం మొత్తమ్మీద 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ కేంద్రాల ఏర్పాటు జరుగుతుంది. స్కిల్ ఇండియా కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 1.0 పేరుతో 2015లో మొదలైన విషయం తెలిసిందే. దాదాపు 20 కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు స్కిల్ ఇండియాలో భాగంగా పలు నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నాయి. అవసరమైన సందర్భాల్లో వాటిని మరింత ఆధునికీకరించడం కూడా చేస్తున్నాయి. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 2.0 2017లో, మూడో దఫా 2021లోనూ మొదలయ్యాయి. నేషనల్ డేటా గవర్నెన్స్ పాలసీ ఆర్థిక రంగ సంస్థలకు భారీగా ఉపయోగపడేలా కేంద్రం ఈ ఏడాది నేషనల్ డేటా గవర్నెన్స్ విధానం ఒకదాన్ని తీసుకు రానుంది. ఈ విధానం వల్ల స్టార్టప్ కంపెనీల్లో మరింత అధిక సంఖ్యలో సృజనాత్మక ఆవిష్కరణలు జరుగుతాయని, విద్యా సంస్థల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఇప్పటివరకూ అందుబాటులో లేని సమాచారం డేటా గవర్నెన్స్ పాలసీ కారణంగా నిర్దిష్ట సంస్థలకు అందుబాటులోకి వస్తుందని, వివిధ సంస్థలు ‘నో యువర్ కస్టమర్’లేదా కేవైసీ కోసం ఎక్కువ ప్రయాస పడాల్సిన అవసరం లేకుండా పోతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కేవైసీలో భాగంగా అందరూ ఆధార్ వంటి వివరాలు మాత్రమే అడుగుతున్నారు. కొత్త విధానం అమల్లోకి వస్తే కంపెనీలు, బ్యాంకులు తమకు ఎదురయ్యే రిస్క్ ఆధారంగా ఇతర డాక్యుమెంట్లను కూడా కోరవచ్చు లేదా డిజిలాకర్ నుంచి తీసుకోవచ్చు. వ్యక్తులు డిజిలాకర్లో ఉంచుకున్న డాక్యుమెంట్లను కూడా అవసరాలకు తగ్గట్టుగా కొన్ని నియంత్రణ, ఆర్థిక సంస్థలకు అందుబాటులోకి తేనున్నారు. డిజిలాకర్లో ప్రస్తుతం మనం పలు రకాల డాక్యుమెంట్లను స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. ఆధార్, పర్మనెంట్ అకౌంట్ నెంబరు (పాన్)లతోపాటు డ్రైవింగ్ లైసెన్స్, విద్యార్హతల డాక్యుమెంట్లను ఇక్కడ నిక్షిప్తం చేసుకోవచ్చు. ఇప్పటివరకూ వీటిని చూడగలిగే అవకాశం కొన్ని సంస్థలకు మాత్రమే ఉండగా.. కొత్త డేటా గవర్నెన్స్ పాలసీ కారణంగా మరిన్ని ఎక్కువ సంస్థలు అవసరాన్ని బట్టి చూడగలిగే అవకాశం ఏర్పడుతుంది. డిజిటల్ కేటాయింపుల తగ్గింపు? ఈ ఏడాది బడ్జెట్లో డిజిటల్ ఇండియా కార్యక్రమాలకు మొత్తం రూ.4,785 కోట్లు కేటాయించారు. అయితే ఇది గత ఏడాది కేటాయింపుతో పోలిస్తే 37 శాతం తక్కువ. గత ఏడాది మొత్తం రూ.7603.5 కోట్ల కేటాయింపులు డిజిటల్ ఇండియా కార్యక్రమానికి జరిగింది. ముందుగా రూ.10,676 కోట్ల కేటాయింపులు జరిగినా సవరణల తరువాత ఈ మొత్తం తగ్గింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ డిజిటల్ ఇండియా కార్యకలాపాలను చేపడుతుందన్న విషయం తెలిసిందే. ప్రతి పౌరుడికి హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకు రావడం, జీవితాంతం పనిచేసే ఐడెంటిటీ (ఆధార్, యూపీఐ, పాన్ వంటివి) అందించడం ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగం. అలాగే.. ప్రభుత్వ సేవలను డిజిటల్ టెక్నాలజీల సాయంతో అందివ్వడం, అన్ని భాషల్లోనూ ఈ టెక్నాలజీ ఫలాలు అందుబాటులో ఉండేలా చేయడం కూడా ఇందులో భాగంగానే చేస్తున్నారు. మౌలికం.. పెట్టుబడితో.. దేశ అభివృద్ధి వేగం పుంజుకునేలా భారీగా పెట్టుబడులు పెడతామని.. రోడ్లు, రైల్వే, విమాన, నౌకా రవాణా తదితర మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిపెడతామని నిర్మల తెలిపారు. బడ్జెట్లో మూలధన పెట్టుబడులకు కేటాయింపులను 10 లక్షల కోట్లకు (గతం కంటే 33% అదనం) పెంచుతున్నామని, ఇది దేశ జీడీపీలో 3.3% శాతానికి సమానమని పేర్కొన్నారు. -
ఆ కార్ల కొనుగోలుదారులకు షాక్.. పెరగనున్న ధరలు!
న్యూఢిల్లీ: విదేశాల్లో పూర్తిగా తయారై (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్/సీబీయూ) భారత్లోకి దిగుమతి అయ్యే ఎలక్ట్రిక్ కార్లు సహా అన్ని రకాల కార్లపై కస్టమ్స్ డ్యూటీ పెంచారు. విదేశాల్లో పూర్తిగా తయారైన వాటిని ‘సీబీయూ’లుగా చెబుతారు. 40,000 డాలర్ల కంటే తక్కువ ధర (ఇన్వాయిస్ వ్యాల్యూ) ఉన్నవి లేదంటే ఇంజిన్ సామర్థ్యం 3,000 సీసీ కంటే తక్కువ ఉన్న పెట్రోల్ కార్లు, 2,500 సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న డీజిల్ ఇంజిన్ కార్లపై కస్టమ్స్ డ్యూటీని 60% నుంచి 70%కి పెంచారు. ఎలక్ట్రిక్ కార్లు 40,000 డాలర్లకు పైన ధర ఉంటే వాటిపై కస్టమ్స్ డ్యూటీని 60% నుంచి 70%కి పెంచారు. సెమీ నాక్డ్ డౌన్ (ఎస్కేడీ/పాక్షికంగా తయారైన) కార్లపై (ఎలక్ట్రిక్ సహా) కస్టమ్స్ డ్యూటీని 30% నుంచి 35%కి పెంచారు. ప్రస్తుతం విదేశాల్లో తయారై దిగుమతి అయ్యే కార్లు 40,000 డాలర్లు లేదా ఇంజిన్ సామర్థ్యం 3,000 సీసీ కంటే ఎక్కువ ఉన్న పెట్రోల్ కార్లు, 2,500 సీసీ మించిన∙డీజిల్ కార్లపై 100% కస్టమ్స్ డ్యూటీ ఉంది. 2 శాతం వరకు పెరగనున్న ధరలు ప్రభుత్వం కస్టమ్స్ సుంకం పెంపు ప్రతిపాదనలతో కార్ల ధరలు 2 శాతం వరకు పెరుగుతాయని లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన బీఎండబ్ల్యూ, మెర్సెడెజ్ బెంజ్, లెక్సస్ ప్రకటించాయి. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ప్రభుత్వం సవరించడంతో, ఎస్ క్లాస్ మేబ్యాచ్, జీఎల్బీ, ఈక్యూబీ ధరలపై ప్రభావం పడుతుందని మెర్సెడెజ్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. భారత్లోనే ఎక్కువ తయారీ చేస్తున్నందున 95 శాతం మోడళ్ల ధరలపై ప్రభావం ఉండదని చెప్పారు. చదవండి: Union Budget 2023-24 బీమా కంపెనీలకు షాక్, రూ. 5 లక్షలు దాటితే! -
Union Budget 2023-24: ఎంఎస్ఎంఈలకు చేయూత..
న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) చేయూతనిచ్చే దిశగా రుణ హామీ పథకాన్ని కేంద్రం మరింత మెరుగ్గా తీర్చిదిద్దింది. ఇందుకోసం రూ. 9,000 కోట్లు కేటాయించింది. 2023 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. అదనంగా రూ. 2 లక్షల కోట్ల తనఖా లేని రుణాలకు ఈ స్కీము ఉపయోగపడగలదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అలాగే రుణ వ్యయం కూడా 1 శాతం మేర తగ్గుతుందని పేర్కొన్నారు. కోవిడ్ కష్టకాలంలో కాంట్రాక్టులను పూర్తి చేయలేని ఎంఎస్ఎంఈలకు ఊరటనిచ్చే నిర్ణయం కూడా తీసుకున్నారు. అవి జమ చేసిన లేదా సమర్పించిన పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీని జప్తు చేసుకుని ఉంటే.. అందులో 95 శాతం మొత్తాన్ని ప్రభుత్వం, ప్రభుత్వ ఏజెన్సీలు వాపసు చేస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలను ఆర్థిక వ్యవస్థ వృద్ధి చోదకాలుగా ఆమె అభివర్ణించారు. ఎంఎస్ఎంఈలు, బడా వ్యాపార సంస్థలు, చారిటబుల్ ట్రస్టుల కోసం డిజిలాకర్ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పత్రాలను ఆన్లైన్లో భద్రపర్చుకునేందుకు, అవసరమైనప్పుడు బ్యాంకులు, నియంత్రణ సంస్థలు మొదలైన వాటితో షేర్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని మంత్రి చెప్పారు. ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ ఉపశమనం.. ఎంఎస్ఎంఈలు ప్రస్తుతం కల్పిస్తున్న ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ విషయంలో మరింత వెసులుబాటు లభించింది. వృత్తి నిపుణులు అయితే వార్షిక ఆదాయం రూ.50 లక్షల్లోపు, ఎంఎస్ఎంఈలు అయితే వార్షిక టర్నోవర్ రూ.2 కోట్ల వరకు ఉంటే ఆదాయపన్ను చట్టం కింద ప్రిజంప్టివ్ ఇనక్మ్ (ఊహించతగిన ఆదాయం) పథకానికి అర్హులు. తాజా ప్రతిపాదన ప్రకారం సంస్థలు తమ వార్షిక టర్నోవర్ లేదా స్థూల చెల్లింపుల స్వీకరణల్లో నగదు రూపంలో స్వీకరించే మొత్తం 5 శాతంలోపు ఉంటే ప్రిజంప్టివ్ స్కీమ్ కింద మరింత ప్రయోజనం పొందొచ్చు. అంటే తమ వార్షిక టర్నోవర్లో 5 శాతం లోపు నగదు స్వీకరించే సంస్థలు వార్షిక టర్నోవర్ రూ.3 కోట్ల వరకు ఉన్నా, వృత్తి నిపుణుల ఆదాయం రూ.75 లక్షల వరకు ఉన్నా ప్రయోజనానికి అర్హులు. ఎంఎస్ఎంఈలకు సకాలంలో చెల్లింపులు జరిపేందుకు వీలుగా.. వాస్తవంగా ఆ చెల్లింపులు చేసినప్పుడే అందుకు అయ్యే వ్యయాలను మినహాయించుకునే విధంగా నిబంధనలు మార్చారు. ప్రిజంప్టివ్ స్కీమ్ నిబంధనల కింద చిన్న వ్యాపార సంస్థలు తమ టర్నోవర్లో 8 శాతం కింద (నాన్ డిజిటల్ రిసీప్ట్స్) లాభంగాను, డిజిటల్ లావాదేవీల రూపంలో స్వీకరించినట్టయితే టర్నోవర్లో 6 శాతాన్ని లాభం కింద చూపించి పన్ను చెల్లిస్తే సరిపోతుంది. -
నూతన, పునరుత్పాదక ఇంధన శాఖకు రూ.37,828.15 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖకు బడ్జెట్లో ప్రభుత్వం రూ.37,828.15 కోట్లు కేటాయించింది. గత ఏడాది బడ్జెట్లో సవరించిన అంచనా(రూ.27,547.47 కోట్లు)తో పోలిస్తే ఇది 37 శాతం అధికం. ఈ శాఖ ఆధ్వర్యంలోని రెండు సంస్థలకు బడ్జెట్లో కేంద్రం భారీ కేటాయింపులు చేసింది. తాజా బడ్జెట్లో ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఐఆర్ఈడీఏ)కి రూ.35,777.35 కోట్లు కేటాయించారు. అలాగే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఈసీఐ)కి రూ.2,050.80 కోట్లు కేటాయించారు. ఇంధన రంగంలో కొత్త ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందజేయడానికి ఐఆర్ఈడీఏ 1987లో ఏర్పాటయ్యింది. నేషనల్ సోలార్ మిషన్(ఎన్ఎస్ఎం) అమలు, ఈ రంగంలో లక్ష్యాల సాధన కోసం ఎస్ఈసీఐని 2011లో నెలకొల్పారు. -
అప్పటిదాకా స్టార్టప్లకు పన్ను మినహాయింపులు
న్యూఢిల్లీ: అంకురసంస్థలకు కేంద్రం మరోసారి ప్రోత్సాహకాలు ప్రకటించింది. కొత్తగా ఏర్పాటయ్యే అంకురసంస్థలకు పన్ను మినహాయింపులు ఇవ్వనున్నట్లు మంత్రి నిర్మల చెప్పారు. 2024 మార్చి నెలలోపు స్థాపించబడిన స్టార్టప్ సంస్థలకు పన్ను మినహాయింపులు కొనసాగుతాయని ఆమె స్పష్టంచేశారు. ‘నష్టాలను తదుపరి ఆర్థిక సంవత్సరానికి ఫార్వార్డ్ చేసే వెసులుబాటును ప్రస్తుతమున్న ఏడేళ్ల నుంచి పదేళ్లకు పెంచుతున్నాం. 2023 మార్చి 31 నుంచి 2024 మార్చి 31వ తేదీదాకా ఆదాయ పన్ను మినహాయింపులు పొందవచ్చు. 2016–17 ఆర్థికసంవత్సర అంచనాలకు ముందు చెరకు రైతులకు ఇచ్చేసిన చెల్లింపులను చక్కెర సహకార సంఘాలు క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం’అని మంత్రి చెప్పారు. దీంతో చక్కెర సహకార సంఘాలకు రూ.10,000 కోట్లమేర లబ్ధిచేకూరనుంది. ‘కొత్త కోపరేటివ్లకూ 15 శాతం పన్ను లబ్ధి దక్కుతుంది. ల్యాబ్లలో తయారయ్యే డైమండ్ల కోసం వినియోగించే ముడి సరకుపై కస్టమ్ సుంకాలను సైతం తగ్గించే యోచనలో ఉన్నాం. ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాల్లోని ఒక్కో సభ్యుడు తీసుకునే రుణం/ డిపాజిట్ చేసే మొత్తానికి రూ.2,00,000ను గరిష్ట పరిమితిగా విధించాలని భావిస్తున్నాం’అని మంత్రి తెలిపారు. -
అమృత్కాల్ అంటే..
న్యూఢిల్లీ: అమృత్కాల్లో ప్రవేశపెట్టబడిన తొలి బడ్జెట్ ఇదేనంటూ బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ‘ గత బడ్జెట్ వేసిన పునాదులపై నిర్మించబడిన బడ్జెట్ ఇది. పాతికేళ్లలో వందో స్వాతంత్ర దినోత్సవం జరుపుకోనున్న భారత్కు బ్లూప్రింట్ ఈ పద్దు’ అని ఆమె వ్యాఖ్యానించారు. బడ్జెట్ ప్రసంగంలో విత్తమంత్రి పలు మార్లు ప్రస్తావించిన ‘అమృత్కాల్’పై చర్చ మొదలైంది. అమృత్కాల్ ప్రత్యేకత ఏంటి అనేది ఓసారి పరిశీలిస్తే.. ఢిల్లీలో 2021వ సంవత్సరంలో 75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ తొలిసారిగా ‘అమృత్కాల్’ అనే భావనను తెరమీదకు తెచ్చారు. ‘దేశం 75 స్వేచ్ఛా స్వాతంత్ర వసంతాలు పూర్తిచేసుకుంది. మరో 25 సంవత్సరాల్లో దేశం శత వసంతాలు పూర్తిచేసుకోబోతోంది. అంటే 2021వ ఏడాది నుంచి వచ్చే 25 సంవత్సరాలు దేశానికి అమృతకాలంతో సమానం. ఈ 25 సంవత్సరాల్లోనే భారత్ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించి ‘అభివృద్ధి చెందుతున్న దేశం’ నుంచి ‘అభివృద్ధి చెందిన దేశం’గా అవతరించాలి. ఇందుకు అనుగుణంగా పల్లెలు, పట్టణాలకు మధ్య ఉన్న అభివృద్ధి అంతరాలను చెరిపేయాలి. నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని దేశంలో డిజిటలైజేషన్ పాత్ర పెంచి ప్రజాజీవితంలో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించుకోవాలి. ప్రతీ గ్రామానికి రోడ్డు సౌకర్యం ఉండాలి. ప్రతీ కుటుంబానికి బ్యాంక్ ఖాతా, గ్యాస్ కనెక్షన్, అర్హుడైన పౌరులకు ఆరోగ్య బీమా ఉండాలి. అందరి సమష్టి కృషి, అంకితభావం, త్యాగాల ఫలితంగానే ఇదంతా సాధ్యం. వందల ఏళ్లు బానిసత్వాన్ని చవిచూసిన భారతీయ సమాజం.. కోల్పోయిన వైభవాన్ని తిరిగి సాధించేందుకు మనకు మనం నిర్దేశించుకున్న పాతికేళ్ల లక్ష్యమిది’ అని ఆనాడు ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అమృత్కాల్ అనే పదం మన వేదాల్లో ప్రస్తావించబడింది. కష్టాల కడలిని దాటి విజయతీరాలకు చేరుకునే కాలం. కొత్త పని మొదలుపెట్టేందుకు అత్యంత శుభసూచకమైన సమయంగా అమృత్కాల్ను భావిస్తారు. -
కోతలు.. కొత్త పథకాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో వ్యవసాయ రంగంపై శీత కన్ను వేసింది. గతంలో కంటే గణనీయ స్థాయిలో నిధులకు కోత పెట్టింది. ప్రధాన పథకాలన్నింటికీ కేటాయింపులను తగ్గించి వేసింది. ఇదే సమయంలో దేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని, తృణధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. మత్స్య రంగానికి మాత్రం కాస్త నిధులు ఇచ్చింది. భారీగా తగ్గిన కేటాయింపులు 202223 బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు కలిపి రూ. 1,51,521 కోట్లను కేటాయించగా.. తాజా బడ్జెట్లో 5% తక్కువగా రూ. 1,44,214 కోట్లకు మాత్రమే ప్రతిపాదించారు.మొత్తంగా బడ్జెట్లో నిధుల కేటాయింపు శాతాన్ని చూస్తే.. వ్యవసాయం, అనుబంధ రంగాలకు గత ఏడాది 3.84% ఇవ్వగా, ఈసారి 3.20 శాతానికి తగ్గి పోయింది. ఫసల్ బీమా యోజన, పీఎం కిసాన్, కృషి వికాస్ యోజన పథకాలకు కేటాయింపులు భారీగా తగ్గిపోయాయి. ఇక పంటలకు గిట్టుబాటు ధర లభించేందుకు తోడ్పడేలా అమల్లోకి తెచ్చిన ‘మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్’కు, పంటలకు మద్దతు ధర లభించేందుకు తెచ్చిన ‘పీఎం–ఆశ’ పథకాలను కేంద్రం పక్కన పెట్టేసింది. వ్యవసాయానికి రుణ సాయం.. దేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు, తక్కువ వడ్డీతో మరిన్ని రుణాలు అందేలా చర్యలు చేపడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. గత ఏడాది (రూ.18 లక్షల కోట్లు) కన్నా 11 శాతం అధికంగా ఈసారి రూ.20 లక్షల కోట్ల మేర పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. బ్యాంకులు పంట రుణాలకు 9 శాతం వడ్డీ వసూలు చేస్తాయని.. కేంద్రం అందులో 2 శాతాన్ని భరిస్తుండటంతో రైతులకు ఏడు శాతం వడ్డీకే రుణాలు అందుతున్నాయని చెప్పారు. రైతులకు ప్రయోజనకరంగా ఉండేందుకు ఎలాంటి తనఖా లేకుండా ఇచ్చే రుణాలను రూ.1.6 లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ► ఎక్కువ పొడవు పింజ ఉండే పత్తి ఉత్పత్తిని మరింతగా పెంచేందుకు క్లస్టర్ ఆధారిత విధానాన్ని అనుసరిస్తామని నిర్మల తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ విధానం)తో విత్తనాల నుంచి మార్కెటింగ్ వరకు వ్యాల్యూ చైన్ను ఏర్పాటు చేస్తామన్నారు. మత్స్య రంగానికి ఊపు కోసం.. ► దేశంలో చేపల ఉత్పత్తి, రవాణాను మెరుగుపర్చేందుకు ‘ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన’ కింద రూ.6,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. ఇతర సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ క్రమంలో రొయ్యల దాణా దిగుమతిపై కస్టమ్స్ పన్నును తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం.. ► దేశంలో సహజ, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతున్నట్టు నిర్మల ప్రకటించారు. ఇందుకోసం వచ్చే మూడేళ్లపాటు దేశవ్యాప్తంగా కోటి మంది రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. పంటలకు అవసరమైన సూక్ష్మ పోషకాలు (ఎరువులు), పురుగు మందులను పంపిణీ చేసేందుకు 10వేల ‘బయో–ఇన్పుట్ రీసోర్స్ సెంటర్’లతో నెట్వర్క్ను ఏర్పాటు చేస్తామన్నారు. ► పశు, వ్యవసాయ వ్యర్థాలను సద్వినియోగం చేసుకునేందుకు ‘గోబర్ధన్ (గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో–ఆగ్రో రీసోర్సెస్ ధన్)’ పథకం కింద రూ.10 వేల కోట్లతో కొత్తగా 500 ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సహజవాయువును విక్రయించే అన్ని సంస్థలు తప్పనిసరిగా 5శాతం బయో కంప్రెస్డ్ బయోగ్యాస్ను అందులో చేర్చాలని నిర్ణయించినట్టు తెలిపారు. భూమిని కాపాడేందుకు ‘పీఎం–ప్రణామ్’! ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగం, పురుగు మందుల వాడకాన్ని నియంత్రించడమే లక్ష్యంగా ‘ప్రధాన మంత్రి ప్రోగ్రామ్ ఫర్ రీస్టోరేషన్, అవేర్నెస్, నరిష్మెంట్ అండ్ అమెలియరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్ (పీఎం–ప్రణామ్)’ పథకాన్ని చేపడుతున్నట్టు నిర్మల తెలిపారు. ఈ దిశగా చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. ► ఉద్యాన పంటల కోసం.. తెగుళ్లు సోకని, నాణ్యమైన మొక్కలను అందుబాటులో ఉంచేందుకు రూ.2,200 కోట్లతో ‘ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్’ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ► గ్రామీణ ప్రాంతాల్లో యువ పారిశ్రామికవేత్తలు ‘అగ్రి స్టార్టప్స్’ను నెలకొల్పేలా ప్రోత్సహించేందుకు ‘అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్ (ఏఏఎఫ్)’ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ► వ్యవసాయ రంగంలో రైతు ఆధారిత, సమ్మిళిత పరిష్కారాల కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ► ‘మిష్తి’ పథకం కింద దేశవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో మడ అడవులను పెంచనున్నట్టు తెలిపారు. ‘శ్రీ అన్న’తో తృణధాన్యాల హబ్గా.. దేశాన్ని తృణధాన్యాల హబ్గా మార్చేందుకు ‘శ్రీ అన్న’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. హైదరాబాద్లోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్’ను దీనికి వేదికగా ఎంచుకున్నట్టు తెలిపారు. ఇది తృణధాన్యాల ఉత్పత్తి, పరిశోధన, సాంకేతిక అంశాల్లో అత్యుత్తమ విధానాలను అంతర్జాతీయ స్థాయిలో పంచుకునేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా పనిచేస్తుందని వివరించారు. తృణధాన్యాల వినియోగంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని.. ఎందరో చిన్న రైతులు వీటిని పండించి ప్రజల ఆరోగ్యానికి తోడ్పడుతున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఐఐఎంఆర్ ఏంటి? దేశంలో తృణధాన్యాల దిగుబడి పెంచడం, కొత్త వంగడాల రూపకల్పన కోసం హైదరాబాద్లో ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (ఐఐఎంఆర్)’ను ఏర్పాటు చేశారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) పరిధిలో ఇది పనిచేస్తుంది. జొన్నలు, సజ్జలు, రాగులు, సామలు వంటి తృణధాన్యాల పంటలపై ఇక్కడ పరిశోధనలు చేస్తారు. ఐఐఎంఆర్ దేశ విదేశాలకు చెందిన తృణధాన్యాల సంస్థలతో కలిసి పనిచేస్తుంది కూడా. పల్లెకు నిధులు కట్! గ్రామీణాభివృద్ధికి తగ్గిన కేటాయింపులు ఉపాధి హామీపై చిన్నచూపు ఇళ్లు, తాగునీటికి మాత్రం ఊరట.. మౌలిక రంగాన్ని పరుగులు పెట్టిస్తామంటూ భారీగా పెట్టుబడి నిధులను కేటాయించిన మోదీ సర్కారు.. గ్రామీణాభివృద్ధి విషయంలో ఈసారి కాస్త చిన్నచూపు చూసింది. ప్రధానమైన కేంద్ర ప్రాయోజిత పథకాలకు (ఫ్లాగ్షిప్) నిధుల కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయింపులు (సవరించిన అంచనా) రూ. 1,81,121 కోట్లు కాగా, 2023–24 బడ్జెట్లో కేటాయింపులను 13 శాతం మేర తగ్గించి రూ.1,57,545 కోట్లకు పరిమితం చేసింది. ప్రధానంగా ఉపాధి హామీ పథకంలో భారీగా కోత పెట్టడం గమనార్హం. ఉపాధి ‘హామీ’కి కోత... గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎంజీఎన్ఆర్ఈజీఏ) కేటాయింపుల్లో భారీగా కోత పడింది. 2022–23లో కేటాయింపుల సవరించిన అంచనా రూ.89,400 కోట్లతో పోలిస్తే 32 శాతం మేర తగ్గించేశారు. కాగా, 2022 జూలై–నవంబర్ కాలంలో ఈ స్కీమ్ కింద పనులు చేసేందుకు ముందుకొచ్చిన కార్మికుల సంఖ్య కోవిడ్ ముందస్తు స్థాయిలకు చేరినట్లు తాజా ఆర్థిక సర్వే పేర్కొనడం గమనార్హం. గ్రామీణ రోడ్లు.. జోరు తగ్గింది (పీఎంజీఎస్వై) గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలను మరింత మెరు గుపరిచేందుకు రోడ్ల నిర్మాణం కోసం కేంద్రం నిధులు వెచ్చి స్తోంది. అయితే, తాజా బడ్జెట్లో ఈ ఫ్లాగ్షిప్ స్కీమ్కు కేటాయింపులను మాత్రం పెంచలేదు. 2023–24లో 38,000 కిలోమీటర్ల మేర పక్కా రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటికి ఓకే... (పీఎంఏవై) గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి పెద్దపీట వేసేలా తాజా బడ్జెట్లో కొంత మెరుగ్గానే కేటాయింపులు జరిపారు. ప్రధానంగా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఫండ్ తరహాలోనే పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఫండ్ను నెలకొల్పుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ప్రకటించారు. ఏటా రూ.10,000 కోట్లను ఈ ఫండ్కు ఖర్చు చేస్తామని, దీన్ని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నిర్వహిస్తుందని ప్రకటించారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో బలహీన వర్గాలకు 2023–24లో 57.33 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. పట్టణ ప్రాంతాల్లో దాదాపు 20 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం. స్వచ్ఛ భారత్ మిషన్... దేశంలో బహిరంగ మలమూత్ర విసర్జన (ఓడీఎఫ్)ను పూర్తిగా తుడిచిపెట్టడానికి 2014లో ఆరంభమైన ఈ స్వచ్ఛ భారత్ పథకం (ఎస్బీఎం) కిందికి ఘన వర్ధాల (చెత్త నిర్మూలన), జల వ్యర్థాల నిర్వహణను కూడా తీసుకొచ్చారు. ఈ పథకానికి మాత్రం తాజా బడ్జెట్లో కేటాయింపులు పెంచారు. కాగా, పట్టణ ప్రాంతాల్లో 2023–24లో 13,500 కమ్యూనిటీ/పబ్లిక్ టాయిలెట్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే, 3 లక్షల గ్రామాలను ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగు నీరు నిర్వహణ కిందికి తీసుకురావాలనేది కేంద్రం లక్ష్యం. తాగునీటికి నిధుల పెంపు... స్వచ్ఛమైన తాగునీటిని అందరికీ అందించేందుకు 2019–20లో జల్ జీవన్ మిషన్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ను ప్రకటించారు. దీనిలో భాగంగా 2023–24లో 4 కోట్ల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించింది. ఇందుకు తాజా బడ్జెట్లో నిధుల కేటాయింపులను పెంచారు. భారత్ నెట్... భారత్ నెట్ కింద దేశంలోని పల్లెలన్నింటికీ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ను ఏర్పాటు చేయాలనేది కేంద్రం లక్ష్యం. దీనిలో భాగంగా 2023–24లో 17,000 గ్రామ పంచాయితీలను కొత్తగా హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ద్వారా అనుసంధానించనున్నారు. అలాగే 78,750 కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ను వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5,50,000 ఫైబర్–టు–హోమ్ కనెక్షన్లు కూడా ఇవ్వాలనేది లక్ష్యం. రహదారులపై ప్రగతి పయనం ఎన్హెచ్ఏఐకు 2022–23 బడ్జెట్లో కేంద్రం రూ.1.42 లక్షల కోట్లు కేటాయించగా, 2023–24 బడ్జెట్లో రూ.1.62 లక్షల కోట్లు కేటాయించింది. ఈసారి కేటాయింపులను రూ.20,000 కోట్లు(13.90 శాతం) పెంచింది. జాతీయ రహదారుల రంగానికి 2022–23లో రూ.1.99 లక్షల కోట్లు కేటాయించగా, దీన్ని తర్వాత రూ.2.17 లక్షల కోట్లుగా సవరించింది. తాజా బడ్జెట్లో ఈ రంగానికి రూ.2.70 లక్షల కోట్లు కేటాయించడం గమనార్హం. -
పొదుపు కాదు ఖర్చు చేసుకో!
సాక్షి, అమరావతి: ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడానికి పొదుపు కంటే ఖర్చులను ప్రోత్సహించే విధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పొదుపు చేసే వారికంటే ఖర్చు చేసే వారికే పన్ను ప్రయోజనాలను కల్పిస్తూ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో పలు నిర్ణయాలు తీసుకున్నారు. సెక్షన్ 80సీ, గృహ రుణంపై వడ్డీ చెల్లింపులు, హెచ్ఆర్ఏ వంటి పన్ను మినహాయింపులు కోరని వారికి కనీస ఆదాయ పరిమితి పెంచడంతో పాటు ట్యాక్స్ రిబేట్ పరిమితిని పెంచారు. ఎటువంటి పన్ను మినహాయింపులు కోరకుండా మొత్తం ఆదాయంపై పన్ను చెల్లించే నూతన పన్నుల విధానంలో బేసిక్ లిమిట్ను రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. పాత పన్నుల విధానంలో బేసిక్ లిమిట్లో ఎటువంటి మార్పులు చేయలేదు. అదేవిధంగా నూతన పన్నుల విధానంలో సెక్షన్ 87ఏ కింద ఎటువంటి పన్ను చెల్లించాల్సినక్కర్లేని ట్యాక్స్ రిబేట్ పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24) నుంచి రూ.7 లక్షల వార్షిక ఆదాయం వరకు ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. పాత పన్నుల విధానంలో ఈ రిబేట్ను రూ.5 లక్షలకే పరిమితం చేశారు. ఎటువంటి పన్ను మినహాయింపులు కోరని వారికి తక్కువ పన్ను రేట్లతో ఆరు శ్లాబులతో కొత్త పన్నుల విధానాన్ని 2020–21లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. మూడేళ్లు అయినప్పటికీ ఇప్పటికీ చాలామంది పన్ను చెల్లింపుదారులు పాత పన్నుల విధానాన్నే ఎంచుకోవడంతో వీరిని కొత్త పన్నుల విధానంలోకి మా ర్చడానికి ఆర్థిక మంత్రి ఈ నిర్ణ యాలు తీసుకున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆరు ట్యాక్స్ శ్లాబులను కొత్త పన్నుల విధానంలో ఐదుకు పరిమితం చేయడమే కాకుండా వీరికి రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్ను వర్తింపచేస్తున్ననట్లు తెలిపారు. ఫ్యామిలీ పెన్షన్ తీసు కునే వారికి ఈ స్టాండర్డ్ డిడక్షన్ రూ. 15,000గా నిర్ణయించారు. ఈ స్టాండర్డ్ డిడక్షన్ పరిగణనలోకి తీసుకుంటే రూ. 7.5 లక్షల ఆదాయం వరకూ ఎలాంటి పన్ను ఉండదు. అలాగే ఫ్యామిలీ పెన్షన్ తీసుకొనేవారికి రూ.7.15 లక్షల ఆదాయం వరకూ పన్ను ఉండదు. డిఫాల్ట్గా కొత్త పన్నుల విధానం ఇప్పటివరకు రెండు పన్నుల విధానాల్లో దేన్నీ ఎంచుకోకపోతే డిఫాల్ట్గా పాత పన్నుల విధానాన్ని పరిగణనలోకి తీసుకునేవారు. కానీ, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త పన్నుల విధానాన్ని డిఫాల్ట్ విధానంగా పరిగణించనున్నట్లు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. అయినప్పటికీ పాత పన్నుల విధానంలో రిటర్న్లు దాఖలు చేసేవారికి పన్ను మినహాయింపు ప్రయోజనాలు వర్తిస్తాయని తెలిపారు. ఆర్థిక మంత్రి తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల కొత్త పన్ను చెల్లింపుదారుల్లో రూ.7 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి రూ.33,800 వరకు ప్రయోజన కలగనుండగా, రూ.10 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి రూ.23,400, రూ.15 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి రూ.49,400 వరకు ప్రయోజనం చేకూరుతుందని ట్యాక్స్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనల వల్ల రూ.15.5 లక్షల ఆదాయం దాటిన వారికి కనీసం రూ.52,500 వరకు ప్రయోజనం దక్కనున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆదాయపు పన్ను చట్టంలోని మినహాయింపుల ప్రయోజనాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోగలితే రూ.9.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారి వరకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. అధిక ఆదాయం ఉన్నవారిపై కరుణ రూ.కోట్లలో ఆదాయం ఆర్జిస్తున్న వారిపై మోదీ ప్రభుత్వం కరుణ చూపించింది. రూ.2 కోట్ల వార్షికాదాయం దాటిన వారిపై విధించే సర్చార్జీని 37 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల రూ.5.5 కోట్ల వార్షికాదాయం ఉన్న వారికి రూ.20 లక్షల వరకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటివరకు అధికాదాయం ఉన్న వారిపై ప్రపంచంలోనే అత్యధికంగా 42.7 శాతం పన్నురేటు ఉండేదని, సర్చార్జీ తగ్గించడం వల్ల ఈ రేటు 39 శాతానికి పరిమితమైనట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. అదేవిధంగా ఎర్న్డ్ లీవులను నగదుగా మార్చుకుంటే పన్ను మినహాయింపు పరిమితిని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రసుత్తం ఉన్న లీవ్ ఎన్క్యాష్మెంట్పై రూ.3 లక్షలుగా ఉన్న ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. రూ.5 లక్షలకు పైబడి చెల్లించే అధిక మొత్తం ఉండే బీమా పాలసీలకు వర్తించే పన్ను మినహాయింపులను రద్దు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయం నుంచి యూనిట్ లింక్డ్ (యులిప్) పాలసీలను మినహాయించారు. -
పోలవరాన్ని వెంటాడుతున్న చంద్రబాబు పాపాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్చూచిలా నిలిచే పోలవరం జాతీయ ప్రాజెక్టును ఇప్పటికీ చంద్రబాబు పాపాలు వెంటాడుతున్నాయి. బుధవారం కేంద్రం ప్రవేశపెట్టిన 2023–24 బడ్జెట్లోనూ పోలవరానికి కేంద్రం నిధులను కేటాయించకపోవడానికి బాబు చేసిన పాపాలే కారణమని అధికారవర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బడ్జెట్లో సరిపడా నిధులను కేటాయిస్తే సత్వరమే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. నీటి పారుదల ప్రాజెక్టులకు ఈ బడ్జెట్లో రూ.20,118.69 కోట్లను కేంద్రం కేటాయించింది. ఇందులో భారీ నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.6,280.08 కోట్లు కేటాయించింది. కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిన కేంద్రం.. ఆ ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లు కేటాయించింది. కెన్–బెట్వా అనుసంధానం తొలి దశ పనులకు 2022–23 బడ్జెట్లో రూ.1400 కోట్లు కేటాయించిన కేంద్రం... 2023–24 బడ్జెట్లో రూ.3,500 కోట్లు కేటాయించింది. కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు 2016లో నిర్మాణ బాధ్యతలు తీసుకోకుంటే అప్పర్ భద్ర తరహాలోనే పోలవరానికి భారీ ఎత్తున కేంద్రం నిధులు కేటాయించేదని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆదిలోనే పోలవరాన్ని నిర్వీర్యం చేసిన బాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2014 మే 28న కేంద్రం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ని ఏర్పాటు చేసింది. పీపీఏతో ఒప్పందం చేసుకుంటే ప్రాజెక్టు పనులు చేపడతామని అప్పటి టీడీపీ సర్కారుకు సూచించింది. పోలవరానికి 2014–15 బడ్జెట్లో రూ.250 కోట్లు, 2015–16 బడ్జెట్లో రూ.600 కోట్లు కేటాయించింది. పీపీఏతో ఒప్పందం చేసుకోకుండా చంద్రబాబు సర్కారు కాలయాపన చేస్తుండటంతో 2016–17 బడ్జెట్లో కేవలం రూ.వంద కోట్లే కేటాయించింది. పీపీఏతో ఒప్పందం చేసుకోకుండా దాటవేస్తూ వచ్చిన నాటి సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలని కేంద్రాన్ని కోరారు. ఈ క్రమంలో పార్లమెంట్ ద్వారా రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేందుకు సిద్ధమయ్యారు. దాంతో 2016 సెప్టెంబరు 7 అర్ధరాత్రి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఈ క్రమంలో కేంద్రం పెట్టిన షరతులకూ బాబు తలొగ్గారు. దాంతో 2017–18 నుంచి బడ్జెట్లో పోలవరానికి కేంద్రం నిధులు కేటాయించడం లేదు. -
హోదా ప్రస్తావనేదీ?
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన జరిగి దాదాపు పదేళ్లవుతున్నా, ఈ బడ్జెట్లోనూ ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని వైఎస్సార్సీపీ ఎంపీలు ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి సంబంధించినంత వరకు నిరాశ ఎదురైందన్నారు. బుధవారం పార్లమెంటులో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. పార్టీ లోక్సభాపక్ష నేత మిథున్రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఇటీవల విశాఖపట్నం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విభజన హామీలను ప్రస్తావించారని గుర్తుచేశారు. ‘‘పోలవరం నిధుల ఊసూ లేదు.ప్రత్యేక హోదా ప్రస్తావనా లేదు. వెనుకబడిన జిల్లాలకు కేటాయించే నిధుల్లోనూ ప్రగతి లేదు. రైల్వే కారిడార్, స్టీల్ ప్లాంట్కు చేస్తామన్న సాయాన్నీ ప్రస్తావించలేదు. వీటన్నిటిపైనా కేంద్రాన్ని నిలదీస్తాం. బడ్జెట్పై జరిగే చర్చలో కూడా లేవనెత్తుతాం. నర్సింగ్ కాలేజీలు, ఏకలవ్య పాఠశాలలు తదితర అంశాల్లో ఆంధ్రప్రదేశ్కు గరిష్ట ప్రయోజనం రాబట్టడానికి ప్రయత్నిస్తాం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పలుసార్లు కేంద్రానికి స్వయంగా విజ్ఞప్తులు చేసినప్పటికీ పోలవరం నిధుల ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడం బాధాకరం. ఉచిత బియ్యం, పీఎంఏవై ఇళ్ల కేటాయింపులు పెంచడం వల్ల రాష్ట్రానికి మంచి జరిగే అవకాశం ఉంది’ అని మిథున్రెడ్డి తెలిపారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం ఏ రంగానికి ఎంత బడ్జెట్ సమకూరుస్తుందో ఇంకా స్పష్టత రావాల్సి ఉందని ఎంపీ మోపిదేవి వెంకట రమణ చెప్పారు. ప్రత్యేక హోదా సాధన అనేది వైఎస్సార్సీపీ ప్రధాన అజెండా అని, దీని కోసం చివరి వరకు పోరాడతామని అన్నారు. స్వార్థపూరిత విధానాలతో ఆనాడు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును తాకట్టుపెట్టారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, కేంద్రం సహకారం పొందే విషయంలో నిర్లక్ష్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా రంగానికి సంబంధించి ధరల స్థిరీకరణ, ఎగుమతికి ఫ్రీ ట్రేడింగ్ విషయంలో కేంద్రం ఇంకా చొరవ చూపాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక వికాసానికి అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడుల సమీకరణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నారని, మార్చిలో విశాఖలో జరిగే ఈ భారీ సదస్సుకి కేంద్రం నుంచి సంపూర్ణ సహకారాన్ని కోరుతున్నామని చెప్పారు. ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రత్యేకంగా ఏమీ లేవని ఎంపీ మార్గాని భరత్రామ్ చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్టంలో కొత్తగా 18 వైద్య కళాశాలలు తీసుకురావాలని చూస్తుంటే కేంద్రం మూడింటికే నిధులిస్తామని చెప్పిందన్నారు. అన్ని కాలేజీలకు నిధులివ్వాలని కోరుతున్నామన్నారు. రైల్వే పరంగా విశాఖపట్నం–విజయవాడకు మూడో లైను ఇవ్వాల్సి ఉందన్నారు. కొవ్వూరు–భద్రాచలం లైను ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉందని, ఈ లైను వల్ల హైదరాబాద్, సికింద్రాబాద్లకు 70 కి.మీ దూరం తగ్గి ప్రయాణికులకు భారం తగ్గుతుందన్నారు. విశాఖపట్నం – చెన్నై, చెన్నై – బెంగళూరు, బెంగళూరు – హైదరాబాద్ కారిడార్లకు నిధులిస్తే 80 జిల్లాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఇండియ¯న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ను హైదరాబాద్కు ఇచ్చారని, రాష్ట్రానికి ఏదో ఒకటి ఇచ్చి ఉంటే బాగుండేదని అన్నారు. రామాయపట్నం పోర్టుకు కూడా నిధులివ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు యూటర్న్ తీసుకోకుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేదన్నారు. మచిలీపట్నంలో వైద్య కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాల మంజూరు చేయడం సంతోషకరమని ఎంపీ బాలశౌరి చెప్పారు. మీడియా సమావేశంలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, పోచ బ్రహ్మానందరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎన్.రెడ్డెప్ప, తలారి రంగయ్య, బెల్లాన చంద్రశేఖర్, ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, నందిగం సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘అమృత’ ప్రగతికి... సప్తరుషి మంత్రం
న్యూఢిల్లీ: వేతన జీవుల కోసం వ్యక్తిగత ఆదాయ పన్ను రిబేటు పరిమితి పెంపు. మధ్య తరగతి, మహిళలు, పెన్షనర్ల కోసం పలు ప్రోత్సాహకాలు. మూలధన వ్యయంతో పాటు వృద్ధికి దోహదపడే రంగాలకు కేటాయింపుల్లో భారీ పెంపు. కీలకమైన వ్యవసాయానికి తగ్గింపు. ఆరోగ్య, విద్యా రంగాలకు అంతంతమాత్రం. రోడ్లు, మౌలిక తదితర రంగాలకు ఊపు. స్థూలంగా ఇవీ ‘అమృత్కాల్’బడ్జెట్ విశేషాలు. ద్రవ్యోల్బణం, మాంద్యం వంటి సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన ఆవశ్యకతకు, లోక్సభ ఎన్నికల వేళ ఓటరును సంతృప్తి పరచాల్సిన అనివార్యతకు మధ్య సమ తూకం సాధించేందుకు విత్త మంత్రి శాయశక్తులా ప్రయత్నించారు. అదే సమయంలో వీలున్నంత వరకూ ‘వృద్ధి బాట’నే సాగారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి 45.03 లక్షల కోట్ల రూపాయలతో కేంద్ర బడ్జెట్ను నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. గత బడ్జెట్లో వేసిన పునాదులపై ముందుకు సాగుతూ ‘వందేళ్ల భారత్’బ్లూప్రింట్లో నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు తోడ్పడేలా పద్దును రూపొందించినట్టు వెల్లడించారు. రానున్న పాతికేళ్ల అమృత కాలంలో ఆశించిన ప్రగతి లక్ష్యాల సాధనకు మంత్రి సప్తర్షి మంత్రం జపించారు. సమ్మిళితాభివృద్ధి, ప్రతి ఒక్కరికీ పథకాల ఫలాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, సామర్థ్యాల వెలికితీత, హరిత వృద్ధి, యువ శక్తి, ఆర్థిక రంగం... ఇలా వృద్ధి ఏడు విభాగాలుగా అభివృద్ధి బ్లూ ప్రింట్ను ఆవిష్కరించారు. భారత్ను ప్రపంచ ఆర్థిక రంగంపై ‘తళుకులీనుతున్న తార’గా అభివర్ణించారు. ‘‘మన ఆర్థిక వ్యవస్థ పురోగమన దిశలో ఉంది. వృద్ధి బాటన అది శరవేగంగా పరుగులు తీస్తున్న వైనాన్ని ప్రపంచమంతా అబ్బురపాటుతో వీక్షిస్తోంది’’అంటూ భరోసా ఇచ్చారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యాన్ని అతి త్వరలో సాధిస్తామని ధీమా వెలిబుచ్చారు. తొమ్మిదేళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలు తదితరాలను ఒక్కొక్కటిగా వివరిస్తూ వచ్చారు. తలసరి ఆదాయం రెట్టింపై ప్రజలు సగర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నారని చెప్పారు. ‘అందరికీ తోడు, అందరి అభివృద్ధి’లక్ష్యంతో సాగుతున్నామన్నారు. వ చ్చేది ఎన్నికల సంవత్సరం కావడంతో మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్. 2024లో ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టి ఎన్నికలకు వెళ్లనుంది. డిజిటల్ బాటన వడివడిగా... సుపరిపాలనే దేశ ప్రగతికి మూలమంత్రమన్న విత్త మంత్రి, పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం ద్వారా సామాన్యుడి సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నామన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఉటంకించారు. తొమ్మిదేళ్ల ప్రభుత్వ కృషి ఫలితంగా ప్రభుత్వ రంగంలో ప్రపంచ స్థాయి డిజిటల్ వ్యవస్థ సాకారమైందని చెప్పారు. ఆధార్, కొవిన్, యూపీఐ, డిజి లాకర్స్ తదితరాలన్నీ ఇందుకు నిదర్శనమేనన్నారు. కృత్రిమ మేధలో లోతైన పరిశోధనల నిమిత్తం మూడు అత్యున్నత విద్యా సంస్థల్లో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ తేనున్నట్టు చెప్పారు. 5జీ సేవలను మరింత విస్తరిస్తామన్నారు. అదే సమయంలో పేదలు, దిగువ తరగతి సంక్షేమానికీ పెద్ద పీట వేశామని చెప్పారు. ‘‘కరోనా వేళ దేశంలో ఎవరూ ఆకలి బాధ పడకుండా చూడగలిగాం. 80 శాతం మంది పేదలకు ఆహార ధాన్యాలందించాం. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద రూ.2 లక్షల కోట్లతో పేదలకు ఉచితంగా తిండి గింజలు సరఫరా చేశాం. వంద కోట్ల పై చిలుకు మందికి వ్యాక్సిన్లిచ్చాం. వాటిని పంపి ఎన్నో ప్రపంచ దేశాలను ఆదుకున్నాం’’అన్నారు. పెద్ద దేశాల్లో మనమే టాప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును ఏకంగా 7 శాతంగా మంత్రి అంచనా వేశారు. ‘‘పెద్ద దేశాలన్నింట్లోనూ ఇదే అత్యధికం. అంతర్జాతీయంగా తీవ్ర మాంద్యం, కరోనా కల్లోలం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటి గడ్డు సమస్యలను తట్టుకుంటూ ఇంతటి ఘనత సాధించనుండటం గొప్ప ఘనత’’అని చెప్పారు. ప్రస్తుతం 6.4గా ఉన్న ద్రవ్య లోటును 2023–24లో 5.9 శాతానికి పరిమితం చేయడమే లక్ష్యమన్నారు. ఐటీ పరిమితి 7 లక్షలకు... కొత్త పన్ను విధానంలో వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచడం ద్వారా పన్ను చెల్లింపుదా రులు పాత విధానం నుంచి మారేలా ప్రోత్సహించేందుకు మంత్రి ప్రయతి్నంచారు. గరిష్ట ఆదాయ పన్ను రేటును 42.7 శాతం నుంచి 39 శాతానికి, సర్చార్జిని 37 నుంచి 27 శాతానికి తగ్గించారు. సీనియర్ సిటిజన్లకు కూడా గరిష్ట పొదుపు పరిమితిని రెట్టింపు చేస్తూ రూ.30 లక్షలకు పెంచారు. మొబైల్ ఫోన్ విడి భాగాలు, టీవీలు తదితరాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు ద్వారా మధ్య, దిగువ తరగతికి ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు. అయితే వెండి ప్రియం కానుండటం మహిళలకు దుర్వార్తే. మౌలికంపై మరింత దృష్టి... మౌలిక సదుపాయాలు తదితరాలపై ఈసారి మరింత దృష్టి పెడుతున్నట్టు నిర్మల పేర్కొన్నారు. ఆర్థికంగా వెనకబడ్డ పట్టణ ప్రాంతాల వారికి గూడు కలి్పంచే పీఎం ఆవాస్ యోజనకు కేటాయింపులను రూ.79 వేల కోట్లకు (ఏకంగా 66 శాతం) పెంచారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల కోసం పట్టణ మౌలికాభివృద్ధి నిధిని ప్రకటించారు. ఇక దేశానికి జీవనాడి అయిన రైల్వేలకు ఇప్పటిదాకా అత్యధికంగా రూ.2.4 లక్షల కోట్ల కేటాయింపులు చేశారు. ఇక పోర్టులు, పరిశ్రమలకు అనుసంధానాన్ని మరింత మెరుగు పరిచేందుకు ఉద్దేశించిన ఏకంగా రూ.77 వేల కోట్లతో కీలక రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టును ప్రకటించారు. ఇందులో రూ.15 వేల కోట్లను ప్రైవేట్ రంగం నుంచి సేకరించనున్నారు. హరిత నినాదం కాలుష్యకారక శిలాజ ఇంధనాల నుంచి క్రమంగా పూర్తిస్థాయిలో కాలుష్యరహిత స్వచ్ఛ ఇంధనానికి మారే లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.35 వేల కోట్లు కేటాయించారు. బయో వ్యర్థాలను ఇంధనంగా మార్చడం ద్వారా సంపద సృష్టికి గోబర్ధన్ పథకం కింద ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. సాగు, భవనాలు, పరికరాలు తదితరాలన్నింటినీ హరితమయం చేయడానికి ప్రాధాన్యమిస్తామన్నారు. పీఎం కిసాన్ పథకానికి రూ.2.2 లక్షల కోట్లు కేటాయించారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ.20 లక్షల కోట్లుగా నిర్దేశించుకున్నారు. పశుగణాభివృద్ధి, మత్స్య విభాగాలపై ఫోకస్ పెంచారు. ప్రధాని బాగా ప్రోత్సహిస్తున్న చిరుధాన్యాలకు మరింత ప్రాచుర్యం కల్పిస్తామన్నారు. ఇక త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకకు ఎగువ భద్ర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లు కేటాయించారు. మహిళలకు మరింత సాధికారత మహిళా సాధికారత దిశగా మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. 81 లక్షల పై చిలుకు స్వయం సహాయ బృందాలను స్టార్టప్ల తరహాలో తీర్చిదిద్దడం ద్వారా నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తున్నట్టు ప్రకటించారు. పర్యాటక రంగానికి ఇతోధికంగా ప్రోత్సాహకాలిస్తామన్నారు. మధ్య తరగతి దర్శనీయ ప్రాంతాల్లో పర్యటించేందుకు పథకం ప్రకటించారు. జి–20 సారథ్యం.. గొప్ప అవకాశం ‘‘జి–20 సదస్సుకు ఈ ఏడాది భారత్ సారథ్యం వహించనుండటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన పాత్రను మరింత బలోపేతం చేసుకునేందుకు గొప్ప అవకాశం. వసుధైక కుటుంబకం (ప్రపంచమంతా ఒకే కుటుంబం) నినాదంతో ఈ దిశగా ముందుకెళ్తున్నాం’’అని నిర్మల తెలిపారు. బడ్జెట్ సైడ్లైట్స్... ఈసారి 87 నిమిషాలే... బడ్జెట్ ప్రసంగాన్ని విత్త మంత్రి ఈసారి 8,000 పై చిలుకు పదాల్లో, కేవలం 87 నిమిషాల్లోనే ముగించారు. 2020 బడ్జెట్ సమరి్పంచినప్పుడు ఆమె ఏకంగా 162 నిమిషాలు మాట్లాడటం విశేషం! బడ్జెట్ ప్రసంగాల్లో అతి సుదీర్ఘమైనదిగా అది చరిత్రకెక్కింది కూడా. ఆ తర్వాత క్రమంగా నిడివి తగ్గతూ వస్తోంది. నిర్మల 2021లో 110 నిమిషాలు, 2022లో 92 నిమిషాలు ప్రసంగించారు. కరోనా నేపథ్యంలో 2021లో తొలి పేపర్లెస్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆమెదే. క్షమాపణలతో నవ్వులు పూయించి... ►కాలం చెల్లిన పాత వాహనాలను పక్కన పెట్టే పథకానికి నిధులు ప్రకటించే క్రమంలో ఆర్థిక మంత్రి కాస్త తడబడి ‘ఓల్డ్ పొలిటికల్ వెహికిల్స్’అనడంతో సభ్యులంతా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. నిర్మల వెంటనే సర్దుకుంటూ ‘ఓల్డ్ పొల్యూటింగ్ వెహికిల్స్. సరేనా? అయాం సారీ’అనడంతో అంతా ఒక్కసారిగా నవ్వేశారు. ►అధికార సభ్యుల స్వాగతం నడుమ లోక్సభలోకి ప్రవేశించిన నిర్మల, ఎరుపు రంగు బహీ ఖాతా నుంచి బయటికి తీసిన ట్యాబ్లెట్ పీసీ సాయంతో పద్దును ప్రవేశపెట్టారు. ఆమె కూతురు, బంధువులు స్పీకర్ గ్యాలరీ నుంచి వీక్షించారు. ►కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రసంగం ముగిశాక ప్రధాని ఆమె దగ్గరికి వెళ్లి అభినందించారు. మంత్రివర్గ సభ్యులతో పాటు కొందరు విపక్ష సభ్యులు కూడా ఆమెను చుట్టుముట్టారు. ►ఆమె ప్రసంగం పొడవునా అధికార సభ్యులు బల్లలు చరుస్తూ హర్షధ్వానాలు చేశారు. ముఖ్యంగా ఐటీ రాయితీలు ప్రకటిస్తుండగా మోదీ, మోదీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. చిరుధాన్యాల ప్రస్తావన రాగానే ప్రధాని మోదీ బల్లపై చరుస్తూ హర్షం వెలిబుచ్చారు. అప్పుడప్పుడూ విపక్ష సభ్యులు నిరసనలు తెలిపారు. ►బడ్జెట్ ప్రసంగం మొదలైన కాసేపటికి సభలోకి అడుగు పెట్టిన రాహుల్గాం«దీని కాంగ్రెస్ సభ్యులు ‘జోడో జోడో. భారత్ జోడో’అని నినదిస్తూ స్వాగతించారు. అప్పుడప్పుడూ ‘అదానీ, అదానీ’నినాదాలూ విన్పించాయి. ►మామూలుగా నినాదాలు, నిరసనలతో హోరెత్తించే తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు ప్రసంగాన్ని నిశ్శబ్దంగా వింటూ కని్పంచారు. ఆర్థిక వృద్ధి అవసరాలు, ప్రజాకాంక్షల మధ్య చక్కని సమతౌల్యం కుదిరిన బడ్జెట్ ఇది. పెట్టుబడి వ్యయ పద్దు తొలిసారి రూ.10 లక్షల కోట్లను తాకింది. ఇక వ్యక్తిగత ఆదాయ పన్ను వ్యవస్థలోనూ మధ్యతరగతికి లబ్ధి చేకూర్చేలా మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త ఆ దాయ పన్ను వ్యవస్థను మరింత ఆకర్షణీయం చేయడం దీని ఉద్దేశం. మహిళా సాధికారతకూ మరింత పెద్దపీట వేశాం. కస్టమ్స్ సుంకాలనూ హేతుబద్దీకరించే ప్రయత్నం చేశాం. -
సాక్షి కార్టూన్ 02-02-2023
-
కేంద్రపన్నుల్లో పెరిగిన తెలంగాణ వాటా
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రపన్నుల్లో రాష్ట్రవాటా పెరిగింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్రపన్నుల్లో భాగంగా 2023–24లో తెలంగాణకు రూ. 21,470.98 (2.102 శాతం) కోట్లు రానున్నాయి. అందులో కార్పొరేషన్ పన్ను రూ.6,872.08 కోట్లు, ఆదాయపు పన్ను రూ.6,685.61 కోట్లు, సంపద పన్ను రూ.–0.18 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ రూ.6,942.66 కోట్లు, కస్టమ్స్ రూ.681.10 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ రూ.285.26 కోట్లు, సరీ్వస్ ట్యాక్స్ రూ.4.31 కోట్లను కేంద్రం కేటాయించింది. కాగా, గత బడ్జెట్లో కేంద్రపన్నుల రూ పంలో తెలంగాణకు రూ.17,165.98 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. గతేడాదితో పోలిస్తే రాష్ట్రానికి రానున్న పన్నుల వాటా రూ.4,305 కోట్లు అధికం. రాష్ట్ర సంస్థలకు కేటాయింపులు ఇవే... ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో హైదరాబాద్ ఐఐటీకి రూ.300 కోట్లు, సింగరేణి కాలరీస్కు రూ.1,650 కోట్లు, హైదరాబాద్సహా దేశంలోని 7 నైపర్ సంస్థలకు కలిపి రూ.550 కోట్లు, హైదరాబాద్లోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ సంస్థకు రూ.392.79 కోట్లు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్కు రూ.115 కోట్లు, ఇన్కాయిస్కు రూ.27 కోట్లు, హైదరాబాద్సహా మరో మూడు ప్రాంతాల్లో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ హిందీ సంస్థకు రూ.39.77 కోట్లు, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డుకు రూ.19 కోట్లు, స్వాతంత్య్ర సమరయోధుల(పెన్షన్లు)కు రూ.653.08 కోట్లు, తెలంగాణ, ఏపీల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలకు కలిపి రూ.37.67 కోట్లు, హైదరాబాద్సహా 12 నగరాల్లో ఉన్న సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(సీ–డాక్)కు రూ. 270 కోట్లు, హైదరాబాద్ జాతీయ పోలీసు అకాడమీసహా పోలీసు విద్య, ట్రైనింగ్, పరిశోధనలకు మొత్తం రూ.442.17 కోట్లు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీ సంస్థకు రూ.30.50 కోట్లు, మణుగూరుసహా కోట(రాజస్తాన్)లోని భారజల ప్లాంట్లకు రూ.1,473.43 కోట్లు, బీబీనగర్, మంగళగిరిసహా దేశంలో 22 కొత్త ఎయిమ్స్ నిర్మాణానికి రూ.6,835 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. -
Union Budget 2023: మురిసి ‘పడిన’ మార్కెట్!
బడ్జెట్లో వృద్ధి మంత్రంతో తారాజువ్వలా దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు... అంతలోనే చప్పున చల్లారిపోయాయి. మౌలిక రంగానికి భారీగా కేటాయింపులను పెంచుతూ.. మధ్యతరగతి వర్గాలకు ఐటీ ఊరటనిచ్చిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ను అంతా స్వాగతించారు. కానీ, ఊహించని పరిణామాలతో మార్కెట్ లాభాలన్నీ ఆవిరైపోయాయి. అదానీ షేర్లు బేర్ గుప్పిట్లో చిక్కుకోవడంతో మార్కెట్ రోలర్ కోస్టర్ను తలపించింది. ముంబై: వృద్ధి ప్రోత్సాహక బడ్జెట్ లాభాలను నిలుపుకోవడంలో స్టాక్ మార్కెట్ విఫలమైంది. కేంద్రమంత్రి ప్రసంగం ఆసాంతం భారీ లాభాలను ఆర్జించిన సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయి మిశ్రమంగా ముగిశాయి. ట్రేడింగ్లో 1,958 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ చివరికి 158 పాయింట్లు లాభంతో 59,708 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 619 పాయింట్ల రేంజ్లో ట్రేడైంది. ఆఖరికి 46 పాయింట్ల నష్టంతో 17,616 వద్ద నిలిచింది. ద్వితీయార్థంలో నెలకొన్న అమ్మకాల సునామీలో ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు మాత్రమే స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ప్రభుత్వరంగ బ్యాంక్స్, మెటల్ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఒకశాతం చొప్పున నష్టపోయాయి. ప్రథమార్థంలో భారీ లాభాలు బడ్జెట్పై ఆశలతో ఉదయం సూచీలు ఉత్సాహంగా మొదలయ్యాయి. సెన్సెక్స్ 451 పాయింట్ల లాభంతో 60001 వద్ద, నిఫ్టీ 17,812 పాయింట్ల వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు, మూలధన వ్యయం భారీ పెంపు, ఎల్టీసీజీ పన్ను జోలికెళ్లకపోవడంతో ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ఫలితంగా ప్రథమార్థంలో సెన్సెక్స్ 1,223 పాయింట్లు ఎగసి 60,773 వద్ద, నిఫ్టీ 310 పాయింట్లు దూసుకెళ్లి 17,662 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి. మిడ్సెషన్ నుంచి లాభాల స్వీకరణ కేంద్ర మంత్రి ప్రసంగం ఆసాంతం అనూహ్యమైన ర్యాలీ చేసిన సూచీలు చివరి వరకు ఆ జోరును నిలుపుకోలేకపోయాయి. ట్రేడింగ్ ద్వితీయార్థంలో అదానీ గ్రూప్ షేర్లలో అనూహ్య అమ్మకాలు తలెత్తాయి. ఫెడ్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడి నేపథ్యంలో అప్రమత్తత చోటు చేసుకుంది. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(60,773) నుంచి 1,958 పాయింట్లు పతనమై 58,817 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ గరిష్టం(17,972)నుంచి 619 పాయింట్లు క్షీణించి 17,353 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగొచ్చింది. అదానీ గ్రూప్ షేర్లు విలవిల... అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక వెల్లడి నేపథ్యంలో క్రెడిట్ సూయిజ్ షాక్ ఇచ్చింది. అదానీ కంపెనీల రుణాల బాండ్లను స్వీకరించడం నిలిపివేసింది. దీంతో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో అదానీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఈ గ్రూప్నకు చెందిన పది కంపెనీల షేర్లు నష్టాలతో ముగిశాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ 26%, అదానీ పోర్ట్స్ 18%, అదానీ టోటల్ గ్యాస్ 10%, అంబుజా సిమెంట్స్ 17%, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 6% క్షీణించాయి. అదానీ పవర్, అదానీ విల్మార్, ఎన్డీటీవీ షేర్లు 5% లోయర్ సర్క్యూట్ తాకాయి. బుధవారం ఒక్కరోజే ఈ గ్రూప్ రూ.2 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ను కోల్పోయింది. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► వార్షిక ప్రీమియం రూ.5 లక్షలకుపైన జీవిత బీమా పాలసీలపై పన్ను విధింపుతో బీమా కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎల్ఐసీ 4%, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 7%, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ 6%, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ షేర్లు తొమ్మిది శాతం చొప్పున నష్టపోయాయి. ► మౌలిక వసతులకు పెద్దపీట వేస్తూ రూ.10 లక్షల కోట్ల నిధుల కేటాయింపు మౌలిక సదుపాయాల కంపెనీ షేర్లకు కలిసొచ్చింది. ఈ రంగానికి చెందిన సైమన్స్ 4%, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్, హెచ్జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ 3%, ఎల్అండ్టీ 1.50%, అశోక బిల్డ్కాన్ 1.21% చొప్పున లాభపడ్డాయి. ► సిగరెట్లపై 16 శాతం పన్ను పెంపుతో గోడ్ఫ్రే ఫిలిప్స్, ఎన్టీసీ ఇండస్ట్రీస్, వీటీఎస్ ఇండస్ట్రీస్ షేర్లు 6%, 3.50%, మూడుశాతం నష్టపోయాయి. మరోవైపు గోల్డెన్ టొబాకో 4.58%, ఐటీసీ 2.50% చొప్పున లాభపడ్డాయి. ► బడ్జెట్లో నిధులు కేటాయించడంతో రియల్టీ, రైల్వే రంగ షేర్లు ప్రథమార్థంలో భారీగా ర్యాలీ చేశాయి. అయితే మార్కెట్ పతనంలో భాగంగా ఈ రంగాల షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. రియల్టీ రంగ షేర్లు నాలుగు శాతం, రైల్వే షేర్లు తొమ్మిది శాతం చొప్పున నష్టపోయాయి. ► ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి తాజా బడ్జెట్లో రూ.79 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో సిమెంట్ రంగ షేర్లు బలపడ్డాయి. ఇండియా సిమెంట్స్, రామ్కో సిమెంట్స్, శ్రీరాం సిమెంట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్ షేర్లు 4–1% చొప్పున లాభపడ్డాయి. స్టాక్ మార్కెట్పై ప్రతికూల ప్రభావాన్ని చూపే అంశాలేవీ బడ్జెట్పై లేవు. వినియోగ ప్రాధాన్యత, మూలధన వ్యయం పెంపుతో తొలి దశలో ఆశావాదంతో ట్రేడయ్యాయి. బుల్స్ మెచ్చిన బడ్జెట్ ఇది. అయితే అదానీ గ్రూప్ సంక్షోభం, ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ నిర్ణయాల వెల్లడికి అప్రమత్తత సెంటిమెంట్ను పూర్తిగా దెబ్బతీశాయి. – ఎస్ రంగనాథన్, ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ -
Harish Rao: తెలంగాణకు మొండిచేయి
సాక్షి, హైదరాబాద్: అందమైన మాటల మాటున నిధుల కేటాయింపులో డొల్లతనాన్ని కప్పిపుచ్చుతూ అన్ని రంగాలను గాలికి వదిలేసి దేశ రైతాంగాన్ని, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను నిరుత్సాహపరిచే విధంగా పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. తెలంగాణకు ఈ బడ్జెట్ మరోమారు అన్యాయం చేసిందని, రాష్ట్రానికి మొండిచేయి చూపెట్టిందని ఒక ప్రకటనలో విమర్శించారు. ఇది రైతు, పేదల వ్యతిరేక బడ్జెట్ అని, ఇదో భ్రమల బడ్జెట్ అని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్పై హరీశ్ స్పందన ఈ విధంగా ఉంది. రైల్ కోచ్ ఫ్యాక్టరీ గురించి ఒక్కమాటలేదు.. ‘తెలంగాణకు మరోమారు అన్యాయం చేశారు. తొమ్మిదేళ్లుగా అడుగుతున్న రైల్ కోచ్ ఫ్యాక్టరీ గురించి ఒక్కమాట లేదు. గిరిజన యూనివర్సిటీకి ఇచి్చన నిధులు అంతంత మాత్రమే. ఒక్క విభజన హామీని కూడా అమలు చేయలేదు. సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదు. జీఎస్టీ రాయితీలు, ప్రత్యేక ప్రోత్సాహకాలు లేవు. తెలంగాణకు ఒక్క కొత్త పారిశ్రామికవాడ కూడా లేదు. గ్రామీణ ఉపాధి హామీ నిధుల్లో కోత పెట్టారు. ఎరువుల సబ్సిడీలు తగ్గించారు. ఆర్థిక సంఘాల సిఫారసులను అమలు చేస్తామని చెప్పలేదు. సింగరేణి కారి్మకులకిచ్చిన పన్ను మినహాయింపులు కూడా ఆశాజనకంగా లేవు. ఉద్యోగులను భ్రమల్లో పెట్టారు. సెస్సులభారం తగ్గించలేదు. పన్నులభారం నుంచి ప్రజలకు ఉపశమనం లేదు. గత బడ్జెట్లో రూ.89,400 కోట్లు ఉపాధి హామీకి పెట్టిన కేంద్రం ఈసారి ఆ బడ్జెట్ను రూ.60 వేల కోట్లకు తగ్గించింది. గతేడాది బడ్జెట్లో 33 శాతం తగ్గించి ఉపాధి హామీ కూలీల ఉసురు తీసుకునే చర్యలకు ఉపక్రమించింది. ఆహారభద్రత నిధుల్లో భారీగా కోత పెట్టారు. గతేడాది 2.87 లక్షల కోట్లు కేటాయించి ఈసారి 1.97 లక్షల కోట్లకు తగ్గించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు 157 మెడికల్ కళాశాలలు మంజూరు చేస్తే అందులో తెలంగాణకు ఒక్కటి కూడా లేదు. గతంలో మెడికల్ కాలేజీలు ఇచి్చన ప్రాంతాలకే ఇప్పుడు నర్సింగ్ కాలేజీలు ఇస్తున్నట్టు ప్రకటించి మరోమారు తీవ్ర అన్యాయం చేసింది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన రూ.1,350 కోట్లు ఇవ్వలేదు. రూ.5,300 కోట్లు కేటాయించి కర్ణాటక పట్ల పక్షపాతం కర్ణాటకలో ఎన్నికలున్నాయన్న కారణంతో ఆ రాష్ట్రానికి రూ.5,300 కోట్లు కేటాయించి కేంద్ర పాలకులు పక్షపాత వైఖరి చూపారు. ఎరువుల సబ్సిడీ నిధులను రూ.2.25 లక్షల కోట్ల నుంచి రూ.1.75 లక్షల కోట్లకు తగ్గించారు. గతేడాదితో పోలిస్తే 20 శాతం కోత పెట్టారు. పత్తి మద్దతుధరకు కేవలం రూ.లక్ష రూపాయలు కేటాయించి తీవ్ర నష్టం చేశారు. రాష్రీ్టయ కృషి వికాస్ యోజన కింద గత బడ్జెట్లో రూ.5,020 కోట్లు చూపెట్టి ఈసారి రూ.3,097 కోట్లకు కుదించారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే 0.5 శాతం ఎఫ్ఆర్బీఎం అమలు చేస్తామని షరతు పెట్టారు. దీనివల్ల రాష్ట్రానికి రావాల్సిన రూ.6 వేల కోట్ల నష్టం జరుగుతుంది. 15వ ఆర్థిక సంఘం సిఫారసు ప్రకారం ఇవ్వాల్సిన నిధుల్లో కోత పెట్టి గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు తీవ్ర అన్యాయం చేశారు. అప్పులను మూలధన వ్యయం కోసం కాకుండా, అప్పులో 48.7 శాతాన్ని రోజువారీ ఖర్చుల కోసం ప్రతిపాదించడం ఆర్థిక వ్యవస్థకే చేటుతెస్తుంది. రెవెన్యూ లోటు పెంపు ఎఫ్ఆర్బీఎం చట్టానికి విరుద్ధం. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా కింద కేవలం 30.4 శాతం మత్రమే ఇస్తున్నారు. కానీ 41 శాతం ఇవ్వాలి. పన్నుల్లో వాటా పెంచామని కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్రాలవాటాను పెంచి, కేంద్ర కేటాయింపులను కుదించడంవల్ల రాష్ట్ర ప్రభుత్వం రెండు రకాలుగా నష్టపోతుంది. అన్ని రంగాలనూ గాలికొదిలారు. రైతాంగాన్ని, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను నిరుత్సాహపరిచేలా పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉంది. ఇది రైతు, పేదల వ్యతిరేక బడ్జెట్. తెలంగాణకు మరోమారు అన్యాయం చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన రూ.1,350 కోట్లు ఇవ్వలేదు. గతం కంటే 22 శాతం తగ్గుదల కేంద్రంలో రైతువ్యతిరేక ప్రభుత్వం నడుస్తోంది. ఈసారి కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి గతేడాది కంటే 22 శాతం కేటాయింపులు తగ్గించారు. గత బడ్జెట్లో రూ.2.25 లక్షల కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.1.75 లక్షల కోట్లకు కుదించారు. మెల్లగా కేంద్రం ఎరువుల సబ్సిడీకి మంగళం పాడుతోంది. రైతులను ప్రత్యామ్నాయ ఎరువుల వైపు మళ్లించే పీఎం ప్రణామ్ పథకానికి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. – రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి -
తెలంగాణ ఆశలు అడియాసలు
నిధులివ్వలేదు.. గ్యారెంటీ లేదు.. ప్రాజెక్టుల ఊసు లేదు.. ఏ గ్రాంటు కిందా కేటాయింపులు లేవు.. రెండు మూడు రాష్ట్రాలతో కలిపి కొన్ని అంశాల్లో డబ్బులిస్తామని చెప్పడానికే కేంద్ర బడ్జెట్ పరిమితమైంది. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల్లో వాటాను పెంచకపోవడం వల్ల రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో మళ్లీ కోత పడనుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీనికితోడు సెస్సులు, సర్చార్జీలు తగ్గించుకోవాలని, లేదంటే వాటిలోనూ వాటా ఇవ్వాలని తెలంగాణ కోరినా కేంద్రం కనికరించలేదు. మొత్తానికి తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ బుధవారం లోక్సభలో ప్రకటించిన బడ్జెట్లో తెలంగాణకు ఉత్తచేయి చూపారని బీజేపీయేతర పార్టీల నేతలు అంటున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ వాదనలు పట్టించుకోలేదు... ఆర్థిక సంఘం సిఫారసు చేసే నిధులకు గ్యారంటీ ఇవ్వలేదు... ఫార్మాసిటీ, డిఫెన్స్ కారిడార్, నిమ్స్ ఏర్పాటు, జాతీయస్థాయి చేనేత పరిశోధన కేంద్రం లాంటి ప్రాజెక్టులకు నిధులడిగినా కేంద్ర ప్రభుత్వం కనికరం చూపలేదు. ఒక్క సాగునీటి ప్రాజెక్టుకూ నిధులివ్వలేదు. అలాగే, ఏ ప్రాజెక్టు, ఏ పథకం, ఏ గ్రాంటు కింద కూడా తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు చూపలేదు. నలుగురిలో నారాయణ అన్న చందంగా రెండు, మూడు చోట్ల ఇతర రాష్ట్రాలతో కలిపి డబ్బులిస్తామని చెప్పడానికి మాత్రమే కేంద్రం పరిమితమైంది. స్థూలంగా చెప్పాలంటే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న హామీలను పట్టించుకోకుండా, రాష్ట్ర మంత్రులు చేసిన అభ్యర్థనలను వినకుండానే తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ 2023–24 బడ్జెట్ను బుధవారం లోక్సభలో ప్రకటించారు. విభజన హామీలైన రైల్కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కార్మాగారం లాంటి ప్రాజెక్టుల ఊసెత్తకుండానే... కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధుల పెంపు, రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లు లాంటి ఊరట కలిగించే అంశాలేవీ లేకుండానే ఈ ఏడాది కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడం గమనార్హం. వాదనలు, అభ్యర్థనలు పట్టించుకోలేదు... అభివృద్ధి చెందుతున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలను అన్ని రాష్ట్రాల గాటన కట్టవద్దని, పురోగమన రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలివ్వాలన్న రాష్ట్ర వాదనను కేంద్రం ఈసారి కూడా పరిగణనలోకి తీసుకోలేదని ఆర్థికశాఖ వర్గాలు చెప్పాయి. ఎఫ్ఆర్బీఎం పరిమితుల కారణంగా అప్పుల్లో కోత, 2021–26 వరకు 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసులు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, పౌష్టికాహార పంపిణీ కోసం ఆర్థిక సంఘం ఇవ్వాలన్న నిధులు... ఇలా రూ.లక్ష కోట్లకు పైగా నష్టం జరిగిందని తెలంగాణ చెబుతున్నా.. కేంద్రం వీటిలో ఏ ఒక్క విషయంలోనూ ఉపశమనం కలిగించలేదు. త్వరలోనే ఎన్నికలున్న కర్ణాటకకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పేరుతో రూ.5వేల కోట్లు కేటాయించిన కేంద్రం తెలంగాణకు గత మూడేళ్ల నుంచి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద ఇవ్వాల్సిన రూ.1,350 కోట్లు ఎందుకు ఇవ్వలేదనే విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు గతంలో ప్రతిపాదించిన 157 మెడికల్ కళాశాలల్లో ఒక్కటి కూడా రాష్ట్రానికి ఇవ్వకపోవడం, ఇప్పుడు ఆ మెడికల్ కళాశాలలిచ్చిన చోటనే నర్సింగ్ కళాశాలలు మంజూరు చేయడంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందనే వాదన వినిపిస్తోంది. వ్యవసాయ రంగంతోపాటు ఉపాధి హామీ పథకానికి కూడా నిధులు తగ్గించడంతో రాష్ట్రంలోని గ్రామీణ పేదలు, వ్యవసాయ కూలీలు, సన్న, చిన్నకారు రైతాంగానికి ప్రత్యక్ష నష్టం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రావాల్సిన నిధుల్లో కోత కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) నిధుల్లో వాటాను పెంచకపోవడం వల్ల రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో మళ్లీ కోత పడనుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీనికితోడు సెస్సులు, సర్చార్జీలు తగ్గించుకోవాలని, లేదంటే వాటిలోనూ వాటా ఇవ్వాలని తెలంగాణ కోరినా కేంద్రం కనికరించకపోవడం గమనార్హం. ఇక, ఎఫ్ఆర్బీఎం పరిమితుల మేరకు రుణాలపై ఆంక్షల విషయంలోనూ కేంద్రం అదే వైఖరి చూపింది. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే జీఎస్డీపీలో అదనంగా 0.5 శాతం రుణాలకు అంగీకరిస్తామన్న నిబంధనను కొనసాగించడంతో మరోమారు రూ.6వేల కోట్ల అప్పులకు కోత పడుతుందని ఆర్థిక శాఖ అంటోంది. రుణ పరిమితులపై ఆంక్షలు కొనసాగించడం, గ్రాంట్లు ప్రత్యేకంగా కేటాయించకపోవడం, అప్పుల్లో కోతల నిబంధనలను యథాతథంగా ఉంచడంతో ఈసారి కూడా నిధులకు కటకట తప్పదని చెబుతోంది. స్పష్టత లేని ప్రతిపాదనలు గుడ్డిలో మెల్లలా 50 ఏళ్ల కాలపరిమితిలో చెల్లించే విధంగా రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల కింద రూ.13.7 లక్షల కోట్లు కేంద్రం కేటాయించినా, అందులో మన రాష్ట్రానికి ఎంత వస్తుంది... ఏ ప్రాతిపదికన ఆ నిధులిస్తారన్న దాంట్లో స్పష్టత లేదు. గతంతో పోలిస్తే ఈ రుణపరపతిని భారీగానే పెంచినా రాష్ట్రానికి ఇచ్చే సమయానికి ఆంక్షలు విధిస్తే నష్టపోతామని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇక, కేటాయింపులను చూస్తే ములుగు వర్సిటీతోపాటు ఏపీలోని మరో వర్సిటీకి కలిపి రూ.37 కోట్లు బడ్జెట్లో చూపెట్టారు. అదేవిధంగా దేశంలోని మూడు భారజల కేంద్రాలకు చూపెట్టిన రూ.1,473 కోట్లలోనే మణుగూరు భార జల కేంద్రానికి నిధులు రావాల్సి ఉంటుంది. మొత్తమ్మీద ఈసారి కూడా కేంద్ర బడ్జెట్ రాష్ట్రం ఆశించిన విధంగా లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తెలంగాణకు అన్ని రాష్ట్రాలతో కలిపి చేసిన కేటాయింపులే తప్ప ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేదని, బకాయిలు వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదని అంటున్నారు. బడ్జెట్ నిరుత్సాహపరిచింది.. కేంద్ర బడ్జెట్ తెలంగాణను నిరుత్సాహపరిచింది. ఈ బడ్జెట్ పేదల వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల బడ్జెట్. ఆర్థిక మంత్రి ప్రసంగంలో తెలంగాణకు ప్రత్యేక ప్రకటనలు ఏమీ లేవు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు హామీలను విస్మరించారు. పునరి్వభజన చట్టంలో ఇచి్చన హామీల గురించి కూడా ప్రస్తావన లేదు. హైదరాబాద్లో మిల్లెట్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నట్లు గతంలోనూ అనేక ఉత్తుత్తి హామీలు ఇచ్చారు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరగడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బాధ్యత ఉంది. తెలంగాణకు అవసరమైన నిధులు రాబట్టేలా బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో కేసీఆర్ విఫలమయ్యారు. – ఉత్తమ్కుమార్రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ ఉక్కు ఫ్యాక్టరీ ఊసేలేదు... కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగా ఉంది. తెలంగాణ ప్రజలకు ఉపయోగం లేకుండా రూపొందించారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం ఊసేలేదు. విభజన చట్టాన్ని ఆమోదించి పదేళ్లు అవుతున్నా ఇప్పటిదాకా బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. – కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ ఎంపీ జుమ్లా బాజీ బడ్జెట్... బడ్జెట్ పూర్తిగా జుమ్లా బాజీ. ప్రసంగానికి, వాస్తవ కేటాయింపులకు పొంతన లేదు. తెలంగాణకు సంబంధించి మాట రాలేదు. ఏ స్కీములోనూ తెలంగాణ కనిపించలేదు. రాష్ట్రాలకు 50 ఏళ్లపాటు వడ్డీ లేని రుణాలు కొత్తేమీ కాదు. బడ్జెట్లో తెలంగాణను మర్చిపోయారు. – కె.కేశవరావు, బీఆర్ఎస్ ఎంపీ రైతు, పేద ప్రజలకు వ్యతిరేకం.. ఇది రైతు, పేదల, గ్రామీణ ప్రజల వ్యతిరేక బడ్జెట్. డిజిటల్ వ్యవసాయం అంటే అభివృద్ధి జరిగిపోదు. గత 9 ఏళ్లలో ఎన్ని డ్యాములు కట్టారు? ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు తెచ్చారు?ఎంత మందికి విద్యుత్తు ఉచితంగా ఇచ్చారు? వీటికి సమాధానం చెప్పాలి. ఇది భారతదేశ బడ్జెట్. కేవలం కర్ణాటక రాష్ట్రానికి మాత్రమే బడ్జెట్ కాదు. రైల్వే ప్రాజెక్టుల్లో తెలంగాణకు మాత్రం పూర్తి అన్యాయం చేశారు. – నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ ఎంపీ ఎరువులకు నిధులకోత అన్యాయం.. దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. చాలా ఏళ్లుగా బీఆర్ఎస్ ఈ విషయాన్ని చెబుతోంది. బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి ఈ విషయాన్ని గణాంకాల ద్వారా అంగీకరించారు. గత బడ్జెట్తో పోలిస్తే ఎరువులకు నిధుల కోత ఎక్కువగా ఉంది. వ్యవసాయంపై కేంద్ర ప్రభుత్వానికి సరైన ఆలోచన లేదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకున్నారు. – కె.ఆర్.సురేశ్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ -
ఏపీ స్ఫూర్తితో కర్షకులకు దీప్తి
సాక్షి, అమరావతి: ప్రకృతి వ్యవసాయానికి అండగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా కనీసం కోటి మంది రైతులను ప్రకృతి సాగు బాట పట్టించే లక్ష్యంతో కేంద్రం అడుగులేస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం బడ్జెట్ ప్రసంగంలో ప్రకటన చేశారు. వ్యవసాయ రంగం బలోపేతానికిæ ఏపీ బాటలోనే జాతీయ స్థాయిలో చర్యలు చేపట్టబోతున్నట్టు పరోక్షంగా ప్రకటించారు. ప్రకృతి వ్యవసాయంలో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో 7.54 లక్షల ఎకరాల్లో 7.05 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో కనీసం 15 లక్షల మంది రైతులను ప్రకృతి సాగు వైపు మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పలు రాష్ట్రాలతోపాటు లాటిన్ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా దేశాలు సైతం ఏపీ బాటలో అడుగులేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు పెద్దఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి ప్రకటించారు. చిరు ధాన్యాల కోసం ‘శ్రీఅన్న’ వరికి ప్రత్యామ్నాయంగా చిరు ధాన్యాల సాగును ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం మిల్లెట్ పాలసీని తీసుకురాగా.. ఇదే లక్ష్యంతో ‘శ్రీఅన్న’ పథకాన్ని ప్రకటించిన కేంద్రం చిరు ధాన్యాలపై పరిశోధనలు, ఉత్తమ యాజమాన్య పద్ధతులకు సహకారం ఇవ్వనున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రాథమిక సహకార సంఘాల (పీఏసీఎస్ల)ను మల్టీపర్పస్ ఫెసిలిటేషన్ సెంటర్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. ఆర్బీకేలకు అనుబంధంగా రూ.2,718 కోట్లతో గోదాములు, డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ నిర్మిస్తోంది. ఇదే బాటలో కేంద్రం కూడా జాతీయ స్థాయిలో పీఏసీఎస్లను మల్టీపర్పస్ ఫెసిలిటేషన్ సెంటర్లుగా తీర్చిదిద్దేందుకు రూ.2,516 కోట్లు కేటాయించింది. ఏపీ బాటలోనే పీఏసీఎస్లను పూర్తి స్థాయిలో కంప్యూటరైజేషన్ చేస్తున్నట్టు ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో ప్రతి పంచాయతీలోనూ ఎంపీసీఎస్ల ఏర్పాటుతో పాటు ప్రైమరీ ఫిషరీస్, డెయిరీ కో–ఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ‘సహకార్ సే సమృద్ధి’ పథకాన్ని ప్రకటించింది. పీఎం మత్స్య సమృద్ధి యోజన పథకం కింద దేశీయ మార్కెట్లకు చేయూతనివ్వాలని సంకల్పించింది. ఇప్పటికే రాష్ట్రంలో 26 ఆక్వాహబ్లు, 14 వేల ఫిష్ ఆంధ్రా అవుట్లెట్స్తో పాటు పెద్ద ఎత్తున ఫిష్ వెండర్స్, ఫిష్ కార్ట్స్ ఏర్పాటు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మార్కెట్ను విస్తృత పర్చేందుకు పెద్దఎత్తున ఆర్థిక చేయూత ఇచ్చేందుకు రూ.6 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్రమంత్రి ప్రకటించారు. ఈ ఏడాది వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.20 లక్షల కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించినట్టు కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు. రాష్ట్రంలో ఏటా సగటున రూ.2 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇస్తుండగా.. కేంద్రం నిర్ణయంతో ఈ ఏడాది కనీసం రూ.2.50 లక్షల కోట్లను రుణాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి తగ్గనున్న మేత ధరలు మత్స్య ఉత్పత్తులు, ఎగుమతుల్లో ఏపీ నంబర్–1 స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు పెరగడంతో ఆ ప్రభావం మేత ధరలపై పడి ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఒత్తిడి కారణంగా కంపెనీలు మూడుసార్లు ïఫీడ్ ధరలు తగ్గించాయి. ఇటీవల తలెత్తిన ఆక్వా సంక్షోభ సమయంలో ముడి సరుకులపై విధించే దిగుమతి సుంకం తగ్గించాలని కేంద్రానికి లేఖలు రాయడంతోపాటు ప్రభుత్వపరంగా ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితంగా ఆక్వా ఫీడ్ తయారీలో ఉపయోగించే ఫిష్ మీల్, క్రిల్ మీల్, మినరల్ అండ్ విటమిన్ ప్రీమిక్స్లపై విధించే దిగుమతి సుంకం 15 శాతం నుంచి 5 శాతానికి కేంద్రం తగ్గించింది. అంతేకాకుండా ఫిష్ లిపిడ్ ఆయిల్పై దిగుమతి సుంకాన్ని 30 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. దీంతో ఆక్వా ఫీడ్పై టన్నుకు కనీసం రూ.5 వేలకు పైగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. -
Union Budget 2023-24: కార్పొరేట్ల బడ్జెట్
ఇదే కాదు... కొన్నేళ్ళుగా బడ్జెట్ల స్వరూపాలను చూస్తే ఇవి బడుగులకు బాసటగా ఉంటున్నాయా? కార్పొరేట్లకు కొమ్ముగాస్తు న్నాయా అనే సందేహా లొస్తున్నాయి. ప్రజల భవి ష్యత్, మానవ ప్రమా ణాలు, జీవన అవసరాలు నెరవేరని బడ్జెట్ దేశాన్ని సంక్షోభంలోకి నెడుతుందనేది నిర్వివాదాంశం. సంపద సృష్టే లక్ష్యంగా దేశ బడ్జెట్ను ప్రవేశపెడితే దుష్ఫలితాలు తప్పవు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఈ వాదా నికి ఏమాత్రం తీసిపోదు. ఆదాయానికి అనుగు ణంగా పన్నులు వేయాల్సిందే. దాని ద్వారా వచ్చిన ఆదాయంతోనే ప్రజా సంక్షేమం సాధ్యం. ఇది జర గాలంటే సంపాదించే వర్గం నుంచే ఆదాయాన్ని రాబట్టాలి. కానీ నూతన ఆర్థిక విధానాల తర్వాత బడ్జెట్ల స్వరూపమే మారుతోంది. అవి కార్పొరేట్ రంగానికి ఊతమిచ్చేలా ఉంటున్నాయి. ప్రత్యక్ష, పరోక్ష పన్నులను పరిశీలిస్తే 70 శాతం సంపదను గుప్పిట్లో పెట్టుకునే పది శాతం ఆదాయ వర్గాల నుంచి పన్ను రాబట్టడం లేదు. ఆదాయం తక్కువగా ఉండే 90 శాతం ప్రజలే పన్నుల భారాన్ని మోస్తున్నారు. రూ. 6 కోట్ల సంపద దాటినా 30 శాతమే పన్ను వేయడం ఏమిటి? ఇదే ప్రభుత్వాలు అనుసరిస్తున్న లాజిక్. ప్రత్యక్ష పన్నుల పేరుతో 90 శాతం తక్కువ సంపద ఉన్నవారి నుంచి పీడిస్తున్నారు. దేశ ద్రవ్యోల్బణం 3 శాతం దాటకూడదు. కానీ 6 శాతం ద్రవ్యోల్బణం ఉన్నట్టు కేంద్రం చెబుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయడంలో ఏమాత్రం వెనకాడని ప్రభుత్వం, వాటి పరిరక్షణకు ఎక్కడా కేటాయింపులు చేయక పోవడం దుర్మార్గమే. జనాభాలో 60 శాతంగా ఉన్న రైతుల ఆదాయం కేవలం 11 శాతమే. అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అనేక రకాలుగా ఆందోళనలకు దిగుతున్నారు. ఈ రంగాన్ని కేంద్ర బడ్జెట్ విస్మరించడం దారుణం. డిజిటల్ టెక్నాలజీ తెస్తామనీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెస్తామనే భరోసాలు రైతన్న కళ్ల నీళ్లు తుడుస్తాయా? విద్యారంగంపై చేసే ఖర్చును పెట్టుబడిగానే చూడాలి. ఈ రంగంపై పెట్టుబడులు పెట్టబట్టే జపాన్, కొరియా వంటి దేశాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. కానీ మన బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు తగ్గించారు. కోవిడ్ మనకు ఎన్నో అనుభవాలు నేర్పింది. వైద్య రంగాన్ని అతలాకుతలం చేసింది. అయినా పేదవాడి ప్రాణాలకు భరోసా ఇచ్చే రీతిలో కేటా యింపులు కన్పించడం లేదు. ప్రైవేట్ కాలేజీలు నర్సింగ్ కోర్సులు పెట్టుకునేందుకు ముందుకు రావడం లేదు. లాభాలు తక్కువగా వస్తున్నాయని వెనకడుగు వేస్తున్నాయి. కాబట్టే నర్సింగ్ కాలేజీ లకు నిధులు కేటాయించారు. కానీ అందరికీ వైద్యం అందించేందుకు తీసుకున్న చర్యలేమిటో, కేటాయించిన నిధులెంతో ప్రభుత్వం చెప్పలేదు. విద్య, వైద్యాన్ని విస్మరిస్తే పురోగతి ఎలా సాధ్య మవుతుంది? ఏదేమైనా ఈ బడ్జెట్ పేదలకు ఏ మాత్రం ప్రయోజనం చేసేది కాదు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగానే ఉంది. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు తిలోదకాలిచ్చిన నేపథ్యం తాజా బడ్జెట్ కూర్పులో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రభావం మున్ముందు అనేక దుష్ఫలితాలకు దారి తీస్తుంది. జి. హరగోపాల్ వ్యాసకర్త సామాజిక, ఆర్థిక విశ్లేషకులు -
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ మోడల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ విద్యారంగంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ పథకాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023–24 బడ్జెట్లో ప్రతిబింబించాయి. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, డిజిటల్ లైబ్రరీలు, పీఎం శ్రీ స్కూళ్ల ఏర్పాటుసహా మరికొన్ని కార్యక్రమాలకు రాష్ట్రంలో ఇప్పటికే విజయవంతంగా అమలవుతున్న కార్యక్రమాలు స్ఫూర్తిగా మారాయి. ‘టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా’ కార్యక్రమాన్ని కేంద్రం ఈ బడ్జెట్లో పొందుç³రిచింది. తద్వారా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇంజనీరింగ్ విద్యాసంస్థలు అకడమిక్ ఎక్సలెన్స్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడం, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడంపై సమష్టిగా దృష్టి సారిస్తాయి. అయితే, రాష్ట్రంలో ఉన్నత విద్యామండలి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా ప్రణాళిక బోర్డు ద్వారా ఇప్పటికే ఇలాంటి కార్యక్రమాలు అమలు చేస్తోంది. రాష్ట్ర వర్సిటీలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎం వంటి సంస్థలన్నీ కలిపి పరస్పర సహకారం అందించుకుంటూ ముందుకు వెళ్లేలా దీన్ని అమలు చేస్తున్నారు. డిజిటల్ లైబ్రరీలు, నైపుణ్యాభివృద్ధికి చర్యలు ప్రతి పంచాయతీలో డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేసి యువతకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. రాష్ట్రంలో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుపై ప్రభుత్వం ఇంతకుముందే దృష్టి సారించింది. దీంతోపాటు ఉన్నత విద్యామండలి ద్వారా లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్ఎంఎస్)ను ఏర్పాటు చేయించి విద్యార్థులకు పలు సబ్జెక్టు అంశాలను అందుబాటులోకి తెచ్చింది. కాగా, నైపుణ్యాభివృద్ధి కోసం ‘స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ల’ ఏర్పాటుకు కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదించింది. రాష్ట్రం ప్రభుత్వం ఇప్పటికే ఇలాంటి ఏర్పాట్లు చేసింది. ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు చదువులు పూర్తయ్యే నాటికే పూర్తి నైపుణ్యాలు కలిగి ఉండేలా తీర్చిదిద్దడంతో పాటు బయటకు వచ్చిన తరువాత కూడా అప్స్కిల్లింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 30 స్కిల్ హబ్లు, 26 స్కిల్ కాలేజీలు, రెండు స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయిస్తోంది. నాడు–నేడు తరహాలో.. దేశంలో కొత్తగా భారతీయ భాషా యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయించింది. స్థానిక భాషల్లో ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులను అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో కేంద్రం ఈ వర్సిటీని ఏర్పాటు చేస్తోంది. కాగా, పాఠశాల విద్యకు సంబంధించి కేంద్రం జాతీయ స్థాయిలో 14,500 స్కూళ్లలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఈ బడ్జెట్లో రూ.4,000 కోట్లను కేటాయించింది. రాష్ట్రంలో నాడు–నేడు పథకం కింద అన్ని విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఏకంగా రూ.16 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. -
అమృత కాలంలో ఇదేనా వ్యవసాయం?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే రూపొందించినట్లున్నా... వ్యవసాయానికి మాత్రం అన్యాయం జరిగింది. ఒకపక్క 2022–23 ఆర్థిక సర్వే వ్యవసాయ రంగానికి ‘ఒక కొత్త దారి’ అవసరం అని పేర్కొన్నా... బడ్జెట్లో మాత్రం పాత కేటాయింపుల కన్నా తక్కువ నిధులు కేటాయించడం గమనార్హం. ఈ రంగానికి 2022–23లో రూ. 1.24 లక్షల కోట్లు కేటాయించగా... 2023–24కు గానూ రూ. 1.15 లక్షల కోట్లకు కేటాయింపులు తగ్గించారు. రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. రైతు సగటు ఆదాయం దారుణంగా రూ.7 వేలకు మిం^è డం లేదు. కానీ వ్యవసాయ అభివృద్ధి బాగా ఉందనీ, ఆహార ఉత్పత్తి పెరుగు తోందనీ ప్రకటించిన ప్రభుత్వం... రైతుల ఆదాయం గురించీ, దానిని రెట్టింపు చేసే లక్ష్యం గురించీ ప్రస్తావించలేదు. భారత వ్యవసాయం మంచి పనితీరును కనబరిచిందనీ, అయితే భూతాపం పెరుగుతున్న నేపథ్యంలో ప్రకృతిలో సంభవిస్తున్న వాతావరణ ప్రతికూల ప్రభావాలూ, పెరుగుతున్న పంట ఖర్చులూ వంటి కొన్ని సవాళ్ల నేపథ్యంలో ఈ రంగానికి ‘ఒక కొత్త దారి’ అవసరమనీ జనవరి 31న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2022–23 ఆర్థిక సర్వే తెలిపింది. ఇదే ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం 2020–21లో వ్యవసాయంలో ప్రైవేటు పెట్టుబడులు 9.3 శాతానికి పెరిగాయి. వ్యవసాయ రంగానికి సంస్థాగత రుణాలు 2021–22లో రూ. 18.6 లక్షల కోట్లకు పెరిగాయి. భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్థిరమైన పెరుగుదల వల్ల 2021–22 లో 315.7 మిలియన్ టన్నులకు ఉత్పత్తి చేరింది. 2021–22 నాలుగో ముందస్తు అంచనాల ప్రకారం ఆహార ధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తి ఏటేటా పెరుగుతోంది. పప్పుధాన్యాల ఉత్పత్తి కూడా గత ఐదేళ్లలో సగటున 23.8 మిలియన్ టన్నుల కంటే ఎక్కువగా ఉంది. మారుతున్న వాతావరణం... వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం చూపు తోందని చెప్పిన నివేదిక ఆహార ఉత్పత్తి పెరిగిందనీ చెబుతోంది. కానీ రైతుల పరిస్థితి మీద అంచనా మాత్రం వేయలేదు. రైతుల ఆత్మహత్యలు పెరుగు తున్నాయి. రైతు సగటు ఆదాయం చాలా దారుణంగా రూ.7 వేలు మించని వైనం ప్రస్తావించలేదు. వ్యవసాయానికి ఒక కొత్త దారి అవసరమని ఆర్థిక సర్వే చెప్పినా, బడ్జెట్లో ఆ దిశగా ఆలోచన చేయలేదు. వ్యవసాయానికి కేటాయింపులను తగ్గించారు. 2022–23లో రూ. 1,24,000 కోట్లుగా ఉన్న వ్యవసాయ కేటాయింపులు 2023– 24కి వచ్చేటప్పటికి రూ. 1,15,531.79 కోట్లకు తగ్గించారు. పశుగణాభివృద్ధికీ, మత్స్య రంగానికీ కలిపి రూ. 6,576.62 కోట్లు కేటాయించారు. పోయిన సంవత్సరం ఈ రంగాలకు ఇచ్చింది రూ. 5,956.70 కోట్లు. వ్యవసాయ పరిశో ధనలకు రూ. 9,504 కోట్లు కేటాయించారు. గతేడాది ఇచ్చింది రూ. 8,513.62 కోట్లు. మొత్తం మీద వ్యవసాయ రంగానికి గతేడాది కన్నా రూ. 8,468.21 కోట్లు – దాదాపు 7 శాతం తగ్గించారన్నమాట. వ్యవసాయ శాఖ ఆఫీసు ఖర్చులు 167 శాతం పెంచిన ప్రభుత్వం, ప్రధాన మంత్రి పంటల బీమా పథకానికి 13 శాతం కోత విధించింది. ఈసారి ఇచ్చింది కేవలం రూ. 13,625 కోట్లు మాత్రమే. ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, నకిలీ విత్తనాల బారిన పడి, రైతులకు పంట నష్టం పెరుగుతుంటే ఆదుకునే ఒకే ఒక్క బీమా పథకాన్ని ఇంకా విస్తృతం చేయాల్సి ఉండగా తగ్గించడం శోచనీయం. ప్రధాన మంత్రి రైతులకు అందిస్తున్న రూ. 2 వేల నగదు సహాయం వల్ల రైతులకు నగదు సమస్య తీరిందనీ, ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు వారి రోజువారీ వినియోగం, విద్య, ఆరోగ్యం ఇతర యాదృచ్ఛిక ఖర్చులను తీర్చడానికి సహాయపడిందనీ సర్వే తెలిపింది. ఏడాదికి కేవలం రూ. 2 వేలతో రైతుల సమస్య తీర్చిన ఈ గొప్ప పథకానికి బడ్జెట్లో కేటాయింపులు మాత్రం పెరగలేదు. పైగా తగ్గాయి. మొత్తంగా రూ. 8 వేల కోట్లు తగ్గించారు. పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, చేపల పెంపకంపై దృష్టి సారించి వచ్చే ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 11 శాతం (రూ. 20 లక్షల కోట్ల) పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణ లక్ష్యం రూ. 18 లక్షల కోట్లు. ఇది లక్ష్యం మాత్రమే. రైతులకు బ్యాంకుల నుంచి, సంస్థాగత రుణాలు పలు కారణాల వల్ల అందడం లేదు. ప్రతి ఏటా ప్రకటించే రుణాల లక్ష్యం ఏ మేరకు సఫలం అయ్యిందీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పదు. రూ. 2,200 కోట్ల వ్యయంతో అధిక విలువ కలిగిన ఉద్యాన పంటలకు వ్యాధి రహిత, నాణ్యమైన మొక్కల లభ్యతను పెంచడానికి ప్రభుత్వం ‘ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్’ను ప్రారంభిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఈ కొత్త పథకానికి ప్రత్యేక కేటాయింపులు మాత్రం లేవు. కృషి ఉన్నతి కార్యక్రమంలో భాగంగా ఖర్చు పెట్టవచ్చు. మత్స్యకారులూ, చేపల వ్యాపారులూ... సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల కార్యకలాపాలను మరింత సులభతరం చేయడానికీ, మత్స్య ఉత్పత్తుల సరఫరా సామర్థ్యాలను మెరుగుపరచడానికీ, మార్కెట్ విస్తరించడానికీ ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ కొత్త ఉప పథకాన్ని రూ. 6,000 కోట్ల పెట్టుబడితో ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో చెప్పారు. కాని మత్స్య శాఖ కేటాయింపులు మొత్తం రూ. 2,250 కోట్లు దాటలేదు. ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ పథకానికి ఇచ్చిన కేటాయింపు కేవలం రూ. 2,025 కోట్లు మాత్రమే. తరువాత పెంచుతారా అనే విషయంలో స్పష్టత లేదు. వ్యవసాయ రుణాలపై ఉండే 9 శాతం వడ్డీకి, 2 శాతం వడ్డీ సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం ఈ బడ్జెట్లో కేటాయించింది రూ. 23 వేల కోట్లు. పోయిన ఏడాది సవరణ ద్వారా ఈ పథకానికి ఇచ్చింది రూ. 22 వేల కోట్లు – పెంచింది కేవలం 4.5 శాతం మాత్రమే. ఈ పథకం ద్వారా ఎంత మంది రైతులు లబ్ధి పొందు తున్నారు? బ్యాంకు రుణాలు తీసుకున్న ప్రతి రైతుకూ ఈ వడ్డీ రాయితీ అందడం లేదు. వడ్డీ రాయితీ నేరుగా రైతులకు కాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు రుణదాతలు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు తమ నిధుల వినియోగంపై వడ్డీ రాయితీ... ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకుల రీఫైనాన్సింగ్ కోసం నాబార్డ్కు ఇస్తారు. ఇదివరకు, 3 శాతం వడ్డీ రాయితీ కేంద్ర ప్రభుత్వం ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక 3 శాతం ఇచ్చేది. ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఇవ్వడం లేదు. రైతు మీద వడ్డీ భారం 7 నుంచి 9 వరకు ఉంటుందని మనకు అర్థమవుతోంది. స్పష్టంగా రైతులకు ఉపయోగపడే విధంగా ఈ పథకాన్ని రూపకల్పన చేయ లేదు. రుణ వ్యవస్థలో చిన్న, సన్నకారు రైతుల సంఖ్యను పెంచడానికీ, పూచీకత్తు లేని వ్యవసాయ రుణాల పరిమితిని రూ. 1 లక్ష నుండి రూ. 1.6 లక్షలకు పెంచాలనీ రిజర్వ్ బ్యాంకు నిర్ణయించిందనే ప్రకటన చూశాం. దీనికీ బడ్జెట్ కేటాయింపులకూ సంబంధం లేదు. వ్యవసాయ అభివృద్ధి బాగా ఉందనీ, ఆహార ఉత్పత్తి పెరుగుతోందనీ ప్రకటించిన ప్రభుత్వం... రైతుల ఆదాయం గురించీ, దానిని రెట్టింపు చేసే లక్ష్యం గురించీ, ఈ మధ్య కాలంలో రైతులు ఎదుర్కుంటున్న ఆర్థిక నష్టాల గురించీ అటు ఆర్థిక సర్వేలో, ఇటు కేంద్ర బడ్జెట్లోనూ ఎటువంటి ప్రస్తావనా చేయకపోవడం, వారి సమస్య పరిష్కారానికి తగిన విధంగా స్పందించక పోవడం వ్యవసాయ ఆధారిత సమాజంలో పెను విషాదం. డా. దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు -
'అమృత కాల' బడ్జెట్ కాదు.. 'మిత్ర కాల' బడ్జెట్.. రాహుల్ సెటైర్లు..
న్యూఢిల్లీ: కేంద్రం బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాని మోదీ చెబుతున్నట్లు ఇది అమృత కాల బడ్జెట్ కాదు.. మిత్ర కాల బడ్జెట్ అని రాహుల్ సెటైర్లు వేశారు. ఇది కేవలం సంపన్నులకు మాత్రమే మేలు చేసే బడ్జెట్ అని ధ్వజమెత్తారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. కేంద్ర బడ్జెట్లో ఉద్యోగాలు సృష్టించాలన్న విజన్, ధరల పెరుగుదలను నియంత్రించాలనే వ్యూహం, దేశంలో అసమానతలను తగ్గించాలే ఉద్దేశం లేదని రాహుల్ ధ్వజమెత్తారు. దేశంలోని ఒక్క శాతం సంపన్నుల చేతిలో 40శాతం సంపద ఉందని, 50 శాతం పేదలు 64 శాతం జీఎస్టీ చెల్లిస్తున్నారని, 42 శాతం మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారని.. అయినా మోదీ వీటిని అసలు పట్టించుకోరని రాహుల్ ఫైర్ అయ్యారు. భారత్ భవిష్యత్తును నిర్మించే రోడ్మ్యాప్ ప్రభుత్వం వద్ద లేదని ఈ బడ్జెట్ రుజువు చేస్తోందన్నారు. ‘Mitr Kaal’ Budget has: NO vision to create Jobs NO plan to tackle Mehngai NO intent to stem Inequality 1% richest own 40% wealth, 50% poorest pay 64% of GST, 42% youth are unemployed- yet, PM doesn’t Care! This Budget proves Govt has NO roadmap to build India’s future. — Rahul Gandhi (@RahulGandhi) February 1, 2023 చదవండి: వారి ఆకాంక్షలను బడ్జెట్ నెరవేర్చింది.. విపక్షాల స్పందన ఇదే! -
Union Budget 2023-24: బడ్జెట్లో 'ఉపాధి హామీ'కి భారీ కోత.. నాలుగేళ్లలో..
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీపీ).. కోవిడ్ సంక్షోభ సమయంలో ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు వచ్చిన కోట్లాది మంది వలస కూలీలకు ఉపాధి కల్పించి ఆదుకుంది. ఈ బృహత్తర పథకానికి కేంద్ర ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో కేటాంపులను భారీగా తగ్గించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం రూ.60వేల కోట్లను మాత్రమే ఈ పథకానికి కేటాయించారు. గతేడాది సవరించిన అంచనా కేటాయింపు రూ.89,400 కోట్లలో ఏకంగా 32 శాతం తగ్గించింది. 2022-23 బడ్జెట్లో కూడా మోదీ సర్కార్ 25 శాతం మేర కోత విధించింది. రూ.98 వేల కోట్లు అంచనా కాగా రూ.73వేల కోట్లే కేటాయించింది. ఈ ఏడాది జనవరి 6 నాటికి దేశవ్యాప్తంగా 5.6 కోట్ల కుటుంబాలు ఈ పథకం కింద ఉపాధి పొందగా 225.8కోట్ల వ్యక్తి పనిదినాలు నమోదయ్యాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జనవరి 24 నాటికి 6.49 కోట్ల కుటుంబాలు ఈ పథకం కింద ఉపాధి కోరగా 6.48 కోట్ల కుటుంబాలకు ప్రభుత్వం ఉపాధి కల్పించింది. 5.7 కోట్ల కుటుంబాలు ఉపాధి హామీ పనులను ఉపయోగించుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక కూలీలు వలసలు వెళ్లకూడదన్న ఉద్దేశంతో 2005లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ పథకానికి నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏటా కేటాయింపులు తగ్గిస్తూ వస్తోంది. గత నాలుగు బడ్జెట్లలో కేటాయింపులు ఇలా.. మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి ప్రాధాన్యం ఎలా తగ్గిస్తోందో గత నాలుగు బడ్జెట్లలో ఈ పథకానికి చేసిన కేటాయింపులను చూస్తే అర్థమవుతుంది. 2020-21 బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి రూ.61,500 కోట్లు కేటాయించిన బీజేపీ సర్కారు 2021-22, 2022-23 బడ్జెట్లలో రూ.70 వేల కోట్ల చొప్పున కేటాయించింది. ఇక తాజాగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ పథకానికి కేటాయించింది కేవలం రూ.60వేల కోట్లు. గత నాలుగు బడ్జెట్లలో ఇదే అత్యల్ప కేటాయింపు కావడం గమనార్హం. చదవండి: బడ్జెట్లో రక్షణ శాఖకు కేటాయింపులు పెంపు.. ఎన్ని కోట్లంటే..? -
Budget 2023-24: కొత్త ఇన్కం టాక్స్పై చిక్కు ప్రశ్నలు, సమాధానాలు
2023-24 బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఇన్కంటాక్స్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రూ.7 లక్షల వరకు పన్ను లేదన్న ప్రకటన ఎంత వరకు మేలు చేస్తుందన్న దానిపై రకరకాల అంచనాలు వేస్తున్నారు నిపుణులు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినదాని ప్రకారం.. 7లక్షల ఆదాయం వరకు ఎలాంటి ట్యాక్స్ లేదు, ఆదాయం రూ.7లక్షలు దాటితే మాత్రం 5 శ్లాబుల్లో పన్ను ఉంటుంది. 0-3 లక్షల వరకు నిల్ 3 - 6 లక్షల వరకు 5% పన్ను 6 - 9 లక్షల వరకు 10% పన్ను 9 -12 లక్షల వరకు 15% పన్ను 12- 15 లక్షల వరకు 20% పన్ను రూ.15 లక్షల ఆదాయం దాటితే 30% పన్ను ఇన్కంటాక్స్లో పాత, కొత్త రెండు టారిఫ్/రెజిమే ఆప్షన్లు ఉంటాయా? ప్రస్తుతం ఆదాయపుపన్నులో రెండు ఆప్షన్లు ఉన్నాయి. పాత పద్ధతిలో టాక్స్ అసెస్మెంట్ చేసుకోవచ్చు లేదా కొత్త పద్ధతిని ఎంచుకోవచ్చు. ఎవరికి దేని వల్ల మేలు జరిగితే దాన్ని ఇప్పటివరకు ఎంచుకున్నారు. బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించిన కొత్త శ్లాబు విధానం వల్ల అందరికీ డిఫాల్ట్గా కొత్త విధానం అమల్లోకి వస్తుంది. అయితే కావాలనుకునే వాళ్లు పాత శ్లాబు సిస్టమ్ను కూడా ఎంచుకోవచ్చు. పాత శ్లాబు సిస్టమ్ ఎవరికి మంచిది? కొత్త పద్ధతిలో రూ.7 లక్షల వరకు టాక్స్ మినహాయింపు ఉన్నా.. ఇప్పటికీ కొందరికి పాత పద్ధతి మంచిదంటున్నారు నిపుణులు. సెక్షన్ 80సి కింద లక్షన్నర రుపాయలు ఇన్వెస్ట్ చేసేవారు, NPS కింద 50 వేల రుపాయలు పెట్టుబడి పెట్టిన వారు, హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చుల కింద రూ.25వేలతో బీమా తీసుకున్నవారు, సేవింగ్స్ కింద రూ.4.25 లక్షలు చూపించే వారికి ఇప్పటికీ పాత శ్లాబు సిస్టమే బెటరంటున్నారు. దీని వల్ల రూ.6.75 లక్షల ఆదాయం వరకు ఎలాంటి టాక్స్ కట్టనవసరం లేదంటున్నారు. 7 లక్షలు అన్న పరిమితిని ఎలా చూడవచ్చు? కొత్త శ్లాబు పద్ధతిలో 7 లక్షల పరిమితి ఓ ఛాలెంజింగ్ విషయమే. ఉదాహారణకు మీ ఆదాయం రూ.7లక్షల వరకు ఉంటే మీరు లాభపడ్డట్టే. అయితే మీ ఆదాయం అనుకోకుండా రూ.7లక్షల పది వేలు అయిందనుకోండి. మీరు పన్నుల కింద రూ.26వేలు, దాంతో పాటు సర్ఛార్జీ, సెస్ కట్టాల్సి ఉంటుంది. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే ఏది ఎంచుకోవాలి? ఇప్పటి నుంచి పాత శ్లాబు ఎంచుకుంటే ఏడాదికి 15 లక్షల ఆదాయం పొందుతున్న వారు రూ.82,500 పన్నుగా చెల్లించాలి. కొత్త శ్లాబు ఎంచుకుంటే అదే 15లక్షల ఆదాయానికి రూ.1,50,000 పన్నుగా చెల్లించాల్సి వస్తుంది. దీన్ని బట్టి మధ్యతరగతి వేతన జీవులకు మాత్రమే కొత్త బడ్జెట్లో మేలు జరిగినట్టుగా భావించాలంటున్నారు ఆర్థిక నిపుణులు. -
అన్నదాతలకు వరాలు: భారీ రుణాలు, కొత్త స్కీములు, కీలక ప్రకటనలు
న్యూఢిల్లీ: 2023-24 వార్షిక బడ్జెట్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయానికి భారీ ప్రోత్సాహాకాలు ప్రకటించారు. అమృత కాలంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్గా అభివర్ణించిన ఈ బడ్జెట్లో దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోన్న వ్యవసాయ రంగానికి, రైతులకు కొన్ని శుభవార్తలు చెప్పారు ఆర్థికమంత్రి. అలాగే భారత దేశాన్ని చిరుధాన్యాల (మిల్లెట్ క్యాపిటల్) కేంద్రంగా మారుస్తామని ప్రకటించడం గమనార్హం. ముఖ్యంగా రైతులకు అందించే రుణ లక్ష్యాన్ని గత ఏడాది బడ్జెట్తో పోలిస్తే 11 శాతానికి పైగా పెంచారు. వ్యవసాయం కోసం డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు, రుణ సదుపాయం, మార్కెటింగ్ సదుపాయం వ్యవసాయ స్టార్ట్ప్స్కు చేయూత, ప్రత్యేక నిధి ఏర్పాటు లాంటి చర్యలతోపాటు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. అలాగే చిరుధాన్యాల ప్రోత్సాహానికి శ్రీఅన్న పథకం, మత్స్య శాఖలోని వివిధ వర్గాల ప్రోత్సాహాకానికి పెట్టుబడులు, ఇతర కేటాయింపులను కూడా ప్రకటించారు. రూ.18 లక్షల కోట్లనుంచి రూ.20 లక్షల కోట్లకు పెంపు వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ.20 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. గత ఏడాది వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.18 లక్షల కోట్లుగా ఉండగా ప్రస్తుతం 11 శాతం మేర పెంచినట్లు ఆమె ప్రకటించారు. వచ్చే ఆర్థిక ఏడాదికి సంబంధించి డైరీ, పశు పోషణ, మత్స్య సాగు వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. అలాగే సేంద్రీయ వ్యవసాయానికి ఊతమిచ్చేలా కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. అగ్రికల్చర్ స్టార్టప్లకు బడ్జెట్లో వరాలు ప్రకటించారు ప్రస్తుతం రైతులు వాడుతోన్న రసాయన, ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు రాష్ట్రాలకు కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటించింది. పీఎం ప్రణామ్ కింద పది వేల బయో ఇన్పుట్ రీసోర్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. అలాగే కనీసం కోటి మంది సేంద్రీయ సాగు చేసేలా ప్రోత్సహిస్తారు. ♦రూ.6వేల కోట్లతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంట్లో భాగంగా MSME పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తారు. మత్స్య సాగు రైతులను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో కొత్త సబ్ స్కీమ్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి. మత్స్యకారులు, చేపలు అమ్ముకునేవారితో పాటు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి, మార్కెట్ విస్తరణకోసం ఈ నిధులను వినియోగించనున్నారు. ♦ యువ పారిశ్రామికేత్తల ద్వారా అగ్రి స్టార్టప్లను ప్రోత్సహించేందుకు అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్ను ఏర్పాటు చేస్తామన్నారు. అగ్రికల్చర్ యాక్సిలేటర్ ఫండ్ కింద అగ్రి స్టార్టప్లకు ప్రోత్సహాన్ని అందిస్తారు. రైతులకు మేలు చేసే ఏ సృజనాత్మకతనైనా ప్రోత్సహిస్తారు. కొత్త టెక్నాలజీ అన్నదాతలకు అందుబాటులోకి తెస్తారు. ♦ అన్ని అగ్రీ సొసైటీల వివరాలను డిజిటలైజ్ చేస్తారు. దీని వల్ల రైతుల వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉంటాయి. భవిష్యత్తులో రైతులకు చేసే ఎలాంటి ప్రయోజనమైనా దీని ద్వారా జరగనుంది. ♦ రైతులు తమ ఉత్పత్తుల నిల్వ కోసం మరిన్ని గిడ్డంగులు నిర్మించేందుకు చర్యలు ♦ పత్తి సాగు మెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు. పత్తి కోసం ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయం ♦ చిరుధాన్యాల పంటలకు సహకార కోసం శ్రీ అన్న పథకం. రాగులు, జొన్నలు, సజ్జలు తదితర పంటలకు ప్రోత్సాహం ♦ మిలెట్స్ ప్రోగ్రామ్ ద్వారా ప్రజలకు పోషకాహారం అందేలా చేయడమే కాదు.. ఆహార భద్రతకూ భరోసా ఇస్తున్నామని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి. హైదరాబాద్లోని మిలెట్ ఇన్స్టిట్యూట్ను సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా ప్రభుత్వం మద్దతు ఇస్తుందన్నారు. త్వరలోనే భారత్ తృణ ధాన్యాలకు గ్లోబల్ హబ్గా మారుతుందన్నారు నిర్మలా సీతారామన్. ♦ హార్టికల్చర్ రంగాన్ని ప్రోత్సహించేందుకు కీలక ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి సుమారు రూ.2,200 కోట్లతో ఆత్మ నిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. ♦ కర్ణాటకలోని కరువు ప్రాంతాలకు రూ.5,300 కోట్ల సాయాన్ని ప్రకటించారు. దీని వల్ల ఆ ప్రాంతంలోని రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది -
Union Budget 2023-2024: క్రీడారంగాన్ని కరుణించిన నిర్మలమ్మ
Union Budget: 2023-2024 కేంద్ర బడ్జెట్లో క్రీడారంగానికి పెద్దపీట లభించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ (ఫిబ్రవరి 1) లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో క్రీడారంగానికి గతేడాదితో పోలిస్తే కేటాయింపులు ఓ మోస్తరుగా పెరిగాయి. 2022-23 బడ్జెట్లో క్రీడా రంగానికి రూ. 3062 కోట్ల మేర కేటాయింపులు జరగ్గా.. ఈ ఏడాది అది రూ. 3397 కోట్లకు (రూ. 334.72 కోట్ల పెరుగుదల) పెరిగింది. Sports Budget: Rs 3397.32 crore allocated to Sports in Union Budget 2023-2024 (⬆️ Rs 334.72 crore) Sports Budget Allocation 2023-24: ➡️ Khelo India: Rs 1045 Cr ➡️ SAI: 785.52 Cr ➡️ National Sports Feds: 325 Cr ➡️ NSS: 325 Cr ➡️ National Sports Development Fund: Rs 15 Cr — India_AllSports (@India_AllSports) February 1, 2023 గత ఐదేళ్ల కాలంలో కేంద్ర బడ్జెట్ను పరిశీలిస్తే.. దాదాపు ప్రతి ఏటా ఓ మోస్తరుగా నిధులు పెరుగుతూ వచ్చాయి. ఈ ఏడాది ఆసియా క్రీడలు, వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్ ఉన్న నేపథ్యంలో బడ్జెట్లో క్రీడా రంగానికి ప్రాధాన్యత పెరిగింది. బడ్జెట్ చరిత్రలో క్రీడారంగానికి ఈ స్థాయిలో నిధులు మంజూరు కావడం ఇదే మొదటిసారి. గతేడాది మంజూరైన రూ. 3062 కోట్లే ఇప్పటివరకు రికార్డుగా ఉండింది. తాజా బడ్జెట్లో నిర్మలమ్మ క్రీడలను కరుణించడంతో ఆ రికార్డు బద్ధలైంది. Sports Budget for the last 5 years: 2018-19 - ₹2197 crore 2019-20 - ₹2776 crore 2020-21 - ₹2826 crore 2021-22 - ₹2596 crore 2022-23 - ₹3062 crore This year’s budget allocation 𝟮𝟬𝟮𝟯-𝟮𝟰 - ₹𝟯𝟯𝟵𝟳 𝗰𝗿𝗼𝗿𝗲📈 — Enakshi Rajvanshi (@enakshi_r) February 1, 2023 స్పోర్ట్స్ బడ్జెట్లో ఎవరికి ఎంత..? ఖేలో ఇండియా: రూ. 1045 కోట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్): రూ. 785.52 కోట్లు నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్: రూ. 325 కోట్లు నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎన్ఎస్): రూ. 325 కోట్లు నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్: రూ. 15 కోట్లు -
ఇన్సూరెన్స్ కంపెనీలకు షాకిచ్చిన నిర్మలాజీ, రూ. 5 లక్షలు దాటితే బాదుడే!
సాక్షి,ముంబై: యూనియన్ బడ్జెట్లో వేతన జీవులకు, పన్ను చెల్లింపు దారులకు ఊరట కల్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన బీమా కంపెనీలకు మాత్రం భారీ షాక్ఇచ్చింది. ఆదాయంపై పన్ను మినహాయింపులను పరిమితం చేయాలని ప్రతిపాదించారు. దీంతో బీమా కంపెనీలకు డిమాండ్ తగ్గపోతుందనే ఆందోళన ఇన్వెస్టర్లను అమ్మకాలవైపు మళ్లించింది. దీంతో బుధవారం నాటి మార్కెట్లో బీమా కంపెనీల షేర్లు భారీగా పతనమైనాయి. సాంప్రదాయ బీమా ప్లాన్లపై పన్ను బాదుడుకు సీతారామన్ ప్రతిపాదించారు.పాలసీల మొత్తం ప్రీమియం ఏడాదికి 5 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉంటే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1, 2023న లేదా ఆ తర్వాత జారీ చేసే జీవిత బీమా పాలసీల మెచ్యూరిటీపై (ULIPలు మినహాయించి) మొత్తం రాబడిపై పన్ను విధించాలని పేర్కొన్నారు. ప్రీమియం మొత్తం రూ. 5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, మొత్తం ప్రీమియం ఉన్న పాలసీల నుండి మాత్రమే ఆదాయం పొందాలని ప్రతిపాదించారు. దీని ప్రకారం అంటే రూ. 5 లక్షలవరకు, 31 మార్చి, 2023 వరకు జారీ చేయబడిన బీమా పాలసీలను కూడా ప్రభావితం చేయదు. అలాగే బీమా చేయబడిన వ్యక్తి మరణించినప్పుడు పొందే మొత్తానికి అందించే పన్ను మినహాయింపులో ఎలాంటి మార్పు ఉండదు. కొత్త ప్రతిపాదన యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లపై పన్నును ప్రభావితం చేయదు. ఈ ప్రకటన ఫలితంగా హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కో, లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్ కార్ప్, మ్యాక్స్ ఫైనాన్షియల్ 4.5 -11శాతం మధ్య నష్టపోయాయి. అయితే, ఇది అధిక విలువ కలిగిన సాంప్రదాయ బీమాలను కొనుగోలు చేయడానికి వ్యక్తుల ఆసక్తిని తగ్గించి, ఇది టర్మ్ ప్లాన్లు, రిస్క్ కవర్లపై దృష్టిని పెరగడమే మంచి పరిణామమే అయినప్పటికీ పూర్తిగా పెట్టుబడి ఆధారిత యూనిట్ లింక్ ఇన్సూరెన్స్ల వైపు గణనీయమైన మార్పుకు దారితీస్తే ఆందోళనకరమని సెక్యూర్నౌ ఇన్సూరెన్స్ బ్రోకర్ సహ వ్యవస్థాపకుడు కపిల్ మెహతా చెప్పారు. అంటే, ఎండోమెంట్ ప్లాన్లు, మనీ బ్యాక్ ప్లాన్లు వంటి సాంప్రదాయ బీమా ప్లాన్లపై పాలసీదారుల ఇంట్రస్ట్ తగ్గిపోతుందన్నారు. అంతిమంగా ఇది బీమా కంపెనీలకు నష్టమని భావిస్తున్నారు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వారి ఆకాంక్షలను బడ్జెట్ నెరవేర్చింది.. విపక్షాల స్పందన ఇదే!
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2023-24పై విపక్షాలు పెదవి విరిచాయి. ఈ బడ్జెట్ వల్ల పేదలు, సామాన్యులు నిరుద్యోగులకు ఒరిగేదేమీ లేదని మండిపడ్డాయి. ఇది అంబానీ, అదానీ, గుజరాత్కు మాత్రమే లాభం చేకూర్చేలా ఉందని ధ్వజమెత్తాయి. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలోనే ఉంచుకునే బీజేపీ అవకాశవాద బడ్జెట్ను ప్రవేశపెట్టిందని మండిపడ్డాయి. వాళ్ల కోసమే: కాంగ్రెస్ కాంగ్రెస్ ఎంపీ కే సురేశ్ ఈ బడ్జెట్ను 'ప్రో కార్పొరేట్గా' అభివర్ణించారు. అంబానీ, అదానీ, గుజరాత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కేంద్రం బడ్జెట్ను రూపొందించిందని ఆరోపించారు. అదానీ ఆకాంక్షలను ఇది నెరవేర్చిందని ధ్వజమెత్తారు. కానీ సామాన్యుడిని మాత్రం కేంద్రం అసలు పట్టించుకోలేదని విమర్శించారు. బడ్జెట్లో కొన్ని అంశాలు బాగానే ఉన్నాయని .. కానీ గ్రామీణ పేదలు, ఉపాధి హామీ పథకం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంచి కీలక అంశాల ప్రస్తావనే లేదని కాంగ్రెస్ నేత శశిథరూర్ అన్నారు. ప్రజా వ్యతిరేకం: మమత ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని టీఎంసీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. 2024 లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే దీన్ని రూపొందించారని విమర్శించారు. ఆదాయపన్ను శ్లాబులు మార్చడం వల్ల ఎవరికీ మేలు జరగదని అన్నారు. దేశంలో కీలక సమస్యగా మారిన నిరుద్యోగం గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదని దుయ్యబట్టారు. పేదలు మరింత పేదలుగా, ధనికులు మాత్రం మరింత సంపన్నులుగా మారేలా బడ్జెట్ ఉందని ఫైర్ అయ్యారు. సమాజంలో ఒక వర్గానికి మాత్రమే ఇది ప్రయోజనం చేకూర్చేలా ఉందన్నారు. సవతి ప్రేమ: కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా బడ్జెట్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది 1.75 లక్షల కోట్లు ఇన్కం ట్యాక్స్ కట్టిన ఢిల్లీ నగరానికి బడ్జెట్లో కేవలం రూ.325 కోట్లు మాత్రమే కేటాయించడం బాధాకరమన్నారు. కేంద్రం మరోసారి ఢిల్లీపై సవతి ప్రేమను చూపించి తీరని అన్యాయం చేస్తోందన్నారు. అలాగే ధరల పెరగుదల, నిరుద్యోగం వంటి కీలక అంశాల గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదని విమర్శించారు. ఈ బడ్జెట్తో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని కేజ్రీవాల్ అన్నారు. విద్య కోసం బడ్జెట్ కేటాయింపులు 2.64 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించడం దురదృష్టకరమన్నారు. అలాగే ఆరోగ్య రంగానికి కేటాయింపులు 2.2 శాతం నుంచి 1.98 శాతానికి తగ్గించడం హానికరం అన్నారు. ఆశ లేదు నిరాశే: అఖిలేష్ కేంద్ర బడ్జెట్పై గంపెడాశలు పెట్టుకున్న ప్రజలకు నిరాశే మిగిలిందని సమాజ్వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. 10 ఏళ్లుగా బడ్జెట్ ప్రవేశపెడుతున్న బీజేపీ ఈసారి కూడా ప్రజలకు ఏమీ ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ బడ్జెట్తో దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఇంకా పెరుగుతుందని అన్నారు. రైతులు, కార్మికులు, యువత, మహిళలుకు ఆశకు బదులు నిరాశే మిగిలిందన్నారు. కేవలం కొందరు ధనికులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా బడ్జెట్ ఉందన్నారు. ఎప్పటిలాగే చేశారు: మాయావతి ఎప్పటిలాగే ఈసారి కూడా దేశంలోని 100 కోట్ల మంది పేదల ఆశలపై నీళ్లు జల్లేలా బడ్జెట్ ఉందని బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. బడ్జెట్ రూపొందించే ముందు దేశంలో 130 కోట్ల మంది పేదలు, కార్మికులు, అణగారిన వర్గాలు, రైతులు ఉన్నారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. వీరంతా అమృత కాలం కోసం ఎదురుచూస్తున్నారని, కానీ ఈసారి కూడా నిరాశే ఎదురైందన్నారు. కాస్త భిన్నం: మెహబూబా ముఫ్తీ గత 8-9 ఏళ్లతో పోల్చితే ఈసారి బడ్జెట్ కాస్త భిన్నంగా ఉందని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. పన్నులు పెంచారని, సంక్షేమ పథకాలు, సబ్సీడీలకు కేటాయింపులు లేవని అన్నారు. ధనవంతులు, బడా వ్యాపారవేత్తల కోసమే ప్రజల నుంచి పన్ను వసూలు చేస్తున్నారని విమర్శించారు. చదవండి: బడ్జెట్లో రక్షణ శాఖకు కేటాయింపులు పెంపు.. ఎన్ని కోట్లంటే..? -
లాభాలన్నీ పాయే: అదానీ, ఇన్సూరెన్స్ షేర్ల షాక్!
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాలనుంచి వెనక్కి తగ్గాయి. ఆరంభంలోనే 500 పాయింట్లకు పైగా లాభ పడ్డాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా 1200 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ చివరలో లాభాలను కోల్పోయింది. బడ్జెట్ ప్రసంగం తర్వాత మిశ్రమంగా ముగిసాయి. సెన్సెక్స్ 158 పాయింట్ల లాభాలకు పరిమితమై 59,708వద్ద, నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 17616 వద్ద స్థిరపడింది. యూనియన్ బడ్జెట్లో బీమా ఆదాయంపై పన్ను మినహాయింపులను పరిమితం చేయాలని ప్రతిపాదించడంతో బీమా కంపెనీల పతనమైనాయి అలాగే అదానీ గ్రూప్ షేర్ల భారీ నష్టాలు కూడా మార్కెట్ను ప్రభావితం చేసింది. హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కో, లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్ కార్ప్ ,మ్యాక్స్ ఫైనాన్షియల్ 4.5శాతం నుండి 11శాతం మధ్య పతనాన్ని నమోదు చేసింది. ఏప్రిల్ 1, 2023న లేదా ఆ తర్వాత జారీ చేయబడిన జీవిత బీమా పాలసీల మెచ్యూరిటీపై (యూనిట్ లింక్డ్ పాలసీలు మినహాయించి) మొత్తం రాబడిపై పన్ను విధించాలని సీతారామన్ ప్రతిపాదించారు. దీని ప్రకారం పాలసీల మొత్తం ప్రీమియం సంవత్సరానికి 500,000 రూపాయల కంటే ఎక్కువగా ఉంటే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదానీ ఎంటర్ప్రైజెస్ 26 శాతం, అదానీ పోర్ట్స్ 17శాతం కుప్పకూలాయి. మరోవైపు ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బ్రిటానియా టాప్ గెయినర్లుగా ఉన్నాయి. -
Union Budget: తెలుగు రాష్ట్రాల్లోని సంస్థలకు కేటాయింపులు ఇవే..
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్-2023ను పార్లమెంట్లో బుధవారం ప్రవేశపెట్టారు. అయితే, విభజన చట్టం హామీల విషయంలో కేంద్రం నిరాశ కలిగించింది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం, రైల్వే కారిడార్ గురించి కూడా ప్రస్తావన లేకపోవడంతో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. కాగా, బడ్జెట్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు సంస్థలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి. ►తెలుగురాష్ట్రాల్లోని గిరిజన వర్సిటీలకు రూ.37 కోట్లు ►ఏపీ సెంట్రల్ యూనివర్శిటీకి రూ.47 కోట్లు ►ఏపీ పెట్రోలియం వర్శిటీకి రూ.168 కోట్లు ►విశాఖ స్టీల్ ప్లాంట్కు రూ.683 కోట్లు ►సింగరేణికి రూ.1650 కోట్లు ►ఐఐటీ హైదరాబాద్కు ఈఏపీ కింద రూ.300 కోట్లు కేటాయింపు ►మంగళగిరి, బీబీనగర్ సహా దేశంలోని 22 ఎయిమ్స్ ఆసుపత్రులకు రూ.6,835 కోట్లు ►సాలర్ జంగ్ సహా అన్ని మ్యూజియాలకు రూ.357 కోట్లు ►మణుగూరు, కోట భారజల కర్మాగాలకు రూ.1,473 కోట్లు ►కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా రూ.41,338 కోట్లు ►కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా రూ.21,470 కోట్లు చదవండి: వేతన జీవులకు ఊరట, శ్లాబుల్లో మార్పులు ఆదాయ పన్ను విషయానికొస్తే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వేతన జీవులకు ఊరట కల్పించారు. పన్ను పరిమితిని రూ.5 లక్షలనుంచి 7 లక్షలకు పెంచారు. అలాగే ఉద్యోగుల పన్ను శ్లాబులను ప్రస్తుతం 6 నుంచి 5 కు తగ్గించారు. అయితే ఆదాయం రూ.7 లక్షలు దాటితే మాత్రం పన్ను రూ.3 లక్షల నుంచే మొదలవుతుంది. -
Union Budget: కేంద్ర బడ్జెట్పై వైఎస్సార్సీపీ ఎంపీలు ఏమన్నారంటే?
సాక్షి, న్యూఢిల్లీ: విభజన చట్టం హామీల విషయంలో నిరాశ కలిగించిందని వైఎస్సార్సీపీ ఎంపీలు అన్నారు. కేంద్ర బడ్జెట్పై ఢిల్లీలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మిథున్రెడ్డి స్పందిస్తూ, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయింపు లేకపోవడం నిరాశ కలిగిందన్నారు. రైల్వే కారిడార్ గురించి కూడా ప్రస్తావవించలేదన్నారు. విభజన హామీలపై పార్లమెంటులో లేవనెత్తుతామన్నారు. నిధులు కేటాయింపు ఏదీ: మోపిదేవి ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ, ‘‘పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని ప్రధాని మోదీని అనేక సార్లు సీఎం కోరారు. చంద్రబాబు స్వార్థంతో పోలవరం తాకట్టు పెట్టారు. ఫిషరీస్ సెక్టార్ను సీఎం అభివృద్ధి చేస్తున్నారు. ఆక్వా విషయంలో కేంద్రం ఇంకా ప్రోత్సాహకాలు ఇవ్వాలి. 6 లక్షల మందికి సీఎం జగన్ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇళ్ల నిర్మాణం పూర్తికి నిధులు కేటాయింపులు చేయాలి’’ అని మోపిదేవి కోరారు. చదవండి: కేంద్ర బడ్జెట్పై ఏపీ ఆర్థిక మంత్రి స్పందన నిరాశ కలిగించింది: మార్గాని భరత్ ‘‘ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి. వీటి నిర్మాణానికి నిధులు విడుదల చేయాలి. పోలవరం నిధులు మెన్షన్ చేయలేదు. ఈ బడ్జెట్ నుంచి ఏపీకి ఎక్కువ నిధులు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తామని’’ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. -
Union Budget 2023-24: రక్షణశాఖకు ఎన్ని కోట్లంటే..?
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో ఈ ఏడాది రక్షణ రంగానికి ప్రాధాన్యం లభించింది. మొత్తం రూ.5.94 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాది కంటే రూ. 69 వేల కోట్లు ఎక్కువ. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెడుతూ రక్షణ రంగ కేటాయింపుల్లో రూ. 1.62 లక్షల కోట్లు మూల ధన వ్యయమని తెలిపారు. ఈ మొత్తాన్ని కొత్త ఆయుధాలు, విమానాలు, యుద్ధనౌకలు, ఇతర మిలటరీ పరికరాల కొనుగోళ్లకు మాత్రమే ఉపయోగిస్తారన్నమాట. 2022–23 మూలధన కేటాయింపులు రూ.1.52 లక్ష కోట్లు మాత్రమే. అంచనాల సవరణ తరువాత ఇది రూ.1.50 లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది రక్షణ రంగ కేటాయింపుల్లో రూ.2.70 లక్షల కోట్లు ఆదాయ వ్యయం అంటే సిబ్బంది జీతభత్యాలు, ఇతర నిర్వహణ ఖర్చుల కోసం ఖర్చు పెట్టనున్నారు. గత ఏడాది ఈ ఖర్చుల కోసం ముందుగా 2.39 లక్షల కోట్లు కేటాయించారు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (సివిల్) మూలధన వ్యయం రూ.8774 కోట్లు. ఫించన్ల కోసం విడిగా రూ.1.38 లక్షల కోట్లు కేటాయిపులు జరిగాయి. దీంతో రక్షణ శాఖ ఆదాయ వ్యయం మొత్తమ్మీద రూ.4.22 లక్షల కోట్లకు చేరింది. భద్రతకు పెద్దపీట దేశంలో అంతర్గత భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా స్పష్టం చేసింది. బడ్జెట్లో కేంద్ర హోంశాఖకు ఏకంగా రూ.1,96,034.94 కోట్లు కేటాƇుుంచడమే ఇందుకు నిదర్శనం. గత ఏడాది బడ్జెట్లో ఈ కేటాయింపులు రూ.1,85,776.55 కోట్లు. ఈసారి కేటాయింపులను రూ.10,258.39 కోట్లు పెంచినట్లు స్పష్టమవుతోంది. మొత్తం కేటాయింపుల్లో సింహభాగం కేంద్ర సాయుధ పోలీసు దళాలు, నిఘాసమాచారం సేకరణ కోసం ఖర్చు చేయనున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పోలీసు దళాల ఆధునీకరణ కోసం పెద్ద ఎత్తున వెచ్చించబోతున్నారు. మహిళా భద్రత పథకాలకు రూ.1,100 కోట్లు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు దళాలకు గత ఏడాది రూ.1,19,070 కోట్లు కేటాయించగా ఈసారి రూ.1,27,756 కోట్లు కేటాయించారు. ఇందులో సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్(సీఆర్పీఎఫ్)కు 2022–23లో రూ.31,495 కోట్లు కేటాయించగా, తాజా బడ్జెట్లో రూ.31,772 కోట్లు కేటాయించారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్), కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్), సశస్త్ర సీమాబల్(ఎస్ఎస్బీ), ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ), అస్సాం రైఫిల్స్ తదితర దళాలకు కేటాయింపులను పెంచారు. నేషనల్ సెక్యూరిటీ గార్డు(ఎన్ఎస్జీ), ఇంటెలిజెన్స్ బ్యూరో, ప్రత్యేక భద్రతా విభాగం(ఎస్పీజీ)కి గణనీయమైన కేటాయింపులు లభించాయి. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.3,545.03 కోట్లు, పోలీసు మౌలిక సదుపాయాల కోసం రూ.3,636.66 కోట్లు, పోలీసు దళాల ఆధునీకరణ కోసం రూ.3,750 కోట్లు కేటాయించారు. భద్రతకు సంబంధించిన ఖర్చుల కోసం రూ.2,780.88 కోట్లు, జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన పనులకు రూ.1,564.65 కోట్లు, మహిళా భద్రత పథకాలకు రూ.1,100 కోట్లు, ఫోరెన్సిక్ సదుపాయాల ఆధునీకరణకు రూ.700 కోట్లు, సరిహద్దుల్లో చెక్పోస్టుల నిర్వహణకు రూ.350.61 కోట్లు,సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు దళాల ఆధునికీకరణ ప్రణాళిక–4 కోసం రూ.202.27 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అంతరిక్షానికి 12,544కోట్లు అంతరిక్ష రంగానికి బడ్జెట్లో రూ.12,544 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపులు గత ఏడాది ఇచ్చిన రూ.13,700 కంటే 8 శాతం తక్కువ కావడం గమనార్హం. వచ్చే ఏడాది చంద్రుడు, చుట్టూ ఉన్న గ్రహాల అధ్యయనం కోసం మానవసహిత గగన్యాన్ను నిర్వహించేందుకు అంతరిక్ష విభాగం ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ఇచ్చిన కేటాయింపుల్లో అధికభాగం రూ.11,669.41 కోట్లను గగన్యాన్, శాటిలైట్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఇస్తారు. థియరిటికల్ ఫిజిక్స్తోపాటు వివిధ అంశాలపై పరిశోధనలు నిర్వహించే అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి రూ.408.69 కోట్లు కేటాయించారు. ఈ విభాగానికి గత ఏడాది రూ.411.11 కోట్లు ఇచ్చారు. ప్రైవేట్ రంగాన్ని పర్యవేక్షించేందుకు కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేసిన సింగిల్విండో విభాగమైన ఇన్–స్పేస్కు గత ఏడాది రూ.21 కోట్లు ఇవ్వగా, తాజా బడ్జెట్లో రూ.95 కోట్లను కేటాయించా రు. వచ్చే ఏడాది చంద్రయాన్ మిషన్ చేపడుతున్న ఇస్రో.. సూర్యుడు, శుక్రు డు, అంగారక గ్రహాలపైనా పరిశోధనలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. న్యూక్లియర్ ఎనర్జీకి బూస్ట్ అణు ఇంధన ఉత్పత్తి కెపాసిటీని పెంచేందుకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించారు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్)కు గత బడ్జెట్లో కన్నా రూ. 2,859 కోట్లు ఈ బడ్జెట్లో అధికంగా ఇచ్చారు. న్యూక్లియర్ ఎనర్జీకి బూస్ట్ నిచ్చేందుకు ఎన్పీసీఐఎల్ రూ. 9,410 కోట్లు ఈ బడ్జెట్ ద్వారా అందుకోనుంది. అంతర్గత, బహిర్గత వనరుల ద్వారా ఎన్పీసీఐఎల్ రూ. 12,863 కోట్లు సమకూర్చుకోనుంది. అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్కు రూ. 25,078.49 కోట్లు కేటాయించారు. దేశంలో 6,780 మెగావాట్ల సామర్థ్యంతో న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్లు ఉన్నాయి. 2031 నాటికి ఈ సామర్థ్యాన్ని 15,700 మెగావాట్లకు పెంచే లక్ష్యంతో మరో 21 పవర్ జనరేషన్ యూనిట్లను స్థాపించనున్నారు. . చదవండి: Union Budget 2023-24: పెరిగేవి, తగ్గేవి ఇవే! -
ఆర్థిక మంత్రి పదే పదే ప్రస్తావించిన 'అమృత్ కాల్' అంటే ఏంటి?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటుకు సమర్పించారు. ప్రధానంగా ఇందులో వేతన జీవులకు ఊరట కల్పిస్తూ ఆదాయపన్ను పరిమితిని పెంచారు. మైనారిటీల సాధికారత, మహిళా సాధికారత, అందరికీ తగిన అవకాశాల కల్పనపై దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంపై దృష్టిపెట్టినట్లు తెలిపారు. అలాగా సప్తరుషి పేరుతో ఏడు ప్రాధాన్యత అంశాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. నిర్మలా సీతారామన్ పదే పదే ప్రస్తావించిన 'అమృత్ కాల్' అంటే ఏమిటి? అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్ అని ఆమె ప్రకటించడం విశేషంగా నిలిచింది. 'అమృత్ కాల్' అనే పదాన్ని తొలిసారిగా 2021లో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని (పీఎం) నరేంద్ర మోదీ ఉపయోగించారు. రాబోయే 25 సంవత్సరాల కోసం భారతదేశం కోసం కొత్త రోడ్మ్యాప్ను ఆవిష్కరించేటప్పుడు ప్రధాని మోదీ ఈ పదాన్ని ఉపయోగించారు. ఆ సమయంలో, అమృత్ కాల్ ఉద్దేశ్యం భారతదేశ పౌరుల జీవితాలను మెరుగుపరచడం. గ్రామాలు, నగరాల మధ్య అభివృద్ధిలో విభజనను తగ్గించడం అని ప్రధాని మోదీ అన్నారు. ప్రజల జీవితాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించడం మరియు సరికొత్త సాంకేతికతను స్వాగతించడం కూడా దీని లక్ష్యం అని ప్రకటించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నిర్మలా సీతారామన్ ధరించిన చీర.. ఎవరు బహుమతి ఇచ్చారంటే?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2023ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అయితే బడ్జెట్తో పాటు ఆమె ధరించిన చీరపై కూడా అందరి దృష్టి పడింది. ఎందుకంటే 2019లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి, ఈ ఆర్థిక మంత్రి ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్ను సమర్పిస్తున్నప్పుడల్లా ప్రత్యేకంగా తయారు చేసిన చేనేత చీరలతో దర్శమిస్తున్నారు. ఈ ఏడాది చేతితో నేసిన ఇక్కత్ సిల్క్ ఎర్ర చీరను ధరించి ఆమె పార్లమెంట్కు హాజరయ్యారు. ఇది భారతీయ సాంప్రదాయ వస్త్రాల పట్ల ఆమెకున్న ప్రేమను వ్యక్తపరుస్తోంది. చేనేత వస్త్రాలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్ 2023 సమావేశానికి నిర్మలా సీతారామన్ చేతితో నేసిన నవలగుండ ఎంబ్రాయిడరీ ఎరుపు రంగు ఇక్కత్ సిల్క్ చీరను ఎంచుకున్నారు. కర్ణాటకలోని ధార్వాడ్కు చెందిన ఈ చీరను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఇకపోతే నిర్మలమ్మ దగ్గర చీరల కలెక్షన్లు ఎక్కువే! ఆమెకు చేనేత చీరలంటే ఎక్కువ ఇష్టం. అంతేకాకుండా బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ప్రత్యేక చీరతో దర్శమమిస్తారు. అదే క్రమంలో నలుపును దూరం పెడుతుంటారు. -
భారత్ అభివృద్ధికి బలమైన పునాదులు వేసే బడ్జెట్: మోదీ
న్యూఢిల్లీ: కేంద్రబడ్జెట్ 2023-24పై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఇది దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు రూపొందించిన బడ్జెట్ అని ప్రశంసించారు. 'అమృత కాలంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు బలమైన పునాదులు వేస్తుంది. పేదలు, మధ్యతరగతి, రైతుల కలలు సాకారం చేసే బడ్జెట్ ఇది' అని మోదీ చెప్పారు. దేశం కోసం సంప్రదాయబద్ధంగా తమ చేతులతో శ్రమిస్తున్న 'విశ్వకర్మ'లే ఈ దేశ సృష్టికర్తలని మోదీ వ్యాఖ్యానించారు. చరిత్రలో తొలిసారి కళాకారులకు శిక్షణ, మద్దతు కోసం ఓ పథకానికి బడ్జెట్లో కేటాయింపులు జరిపినట్లు పేర్కొన్నారు. అలాగే దేశంలో మౌలిక సదుపాయాల కోసం రూ.10 లక్షల కోట్లు కేటాయించడం వేగవంతమైన అభివృద్ధికి దోహదం చేస్తుందని మోదీ అన్నారు. మహిళల సాధికారత కోసం ప్రత్యేక పొదుపు పథకాన్ని తీసుకురానున్నట్లు చెప్పారు. చదవండి: బడ్జెట్ చరిత్రలో.. తొలిసారిగా వాళ్ల కోసం ప్యాకేజీ -
నిర్మలా సీతారామన్ మరో రికార్డు, ఎక్కువగా వాడిన పదాలు ఏంటో తెలుసా?
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 బడ్జెట్ను ఫిబ్రవరి 1న ప్రెజెంటేషన్ సందర్భంగా ఆమె మరో రికార్డు క్రియేట్ చేశారు. వరుసగా ఐదోసారి కేంద్ర బడ్జెట్ను సమర్పించిన ఆమె ఈ సారి బడ్జెట్ను కేవలం 87 నిమిషాల్లో (గంటా 27 నిమిషాల్లో) ముగించారు. తద్వారా అతి తక్కువ సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డును క్రియేట్ చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం 2023-24 బడ్జెట్ను దాదాపు 16236 పదాలతో అతి చిన్న బడ్జెట్ ప్రసంగం చేశారు. సాధారణంగా కనీసం 2 గంటల పాటు జరిగే బడ్జెట్ ప్రసంగాలలో ఇది అతి చిన్నది. భారతదేశ చరిత్రలో అతి ఎక్కువ ,తక్కువ బడ్జెట్ ప్రసంగాలు ►ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020 బడ్జెట్ ప్రసంగంలో 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించారు. ఇది బడ్జెట్ ప్రసంగాల చరిత్రలో సుదీర్ఘమైనది. వ్యవధి పరంగా సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డును సీతారామన్ సొంతం చేసుకున్నారు. ► భారత తొలి (పూర్తి) మహిళా ఆర్థిక మంత్రి సీతారామన్, 2019లో తన తొలి బడ్జెట్ ప్రసంగంలో, 2 గంటల 17 నిమిషాలు మాట్లాడారు. ఇంకా రెండు పేజీలు మిగిలి ఉన్నప్పటికీ, అస్వస్థతకు గురై తన ప్రసంగాన్ని కుదించుకుని ప్రసంగంలో మిగిలిన భాగాన్ని చదివినట్లుగా పరిగణించాలని ఆమె స్పీకర్ను కోరారు. ►ఆ తరువాత ఫిబ్రవరి 1, 2020న 2020-21 కేంద్ర బడ్జెట్ను సమర్పిస్తూ 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించి తన రికార్డును తానే బద్దలు కొట్టారు. 2021లో ఆమె గంటా 50 నిమిషాల పాటు ప్రసంగించారు. ►ఇక మాజీ ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ తన 2003 బడ్జెట్ ప్రసంగంలో 2 గంటల 13 నిమిషాల పాటు ప్రసంగించారు. ►మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన 2014 బడ్జెట్ ప్రసంగంలో 2 గంటల 10 నిమిషాల పాటు ప్రసంగించారు. ► పదాల గణన పరంగా, 1991లో మన్మోహన్ సింగ్ సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేశారు. ప్రసంగంలో 18,650 పదాలు ఉన్నాయి. కాగా రానున్న ఎ న్నికలు, మోదీ సర్కార్కు చివరి బడ్జెట్ కావడంతో పన్ను చెల్లింపు దారులకు భారీ ఊరట కల్పించారు. అలాగే వేతన జీవుల ఆదాయ పన్నుల ట్యాక్స్ శ్లాబ్స్లో మార్పులు తీసుకొచ్చారు. పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రసంగంలో పన్ను, అభివృద్ధి, రాష్ట్రాలు, ఆదాయం , ఆర్థిక పదాలు ఎక్కువగా ఉపయోగించగా. పన్ను అనే పదాన్ని ఎక్కువగా 51 సార్లు, అభివృద్ధి 28 సార్లు, రాష్ట్రాలు 27 సార్లు, ఆదాయం 26 సార్లు, ఫైనాన్స్ అనే పదాన్ని 25 సార్లు ఉపయోగించారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు అయిన నేపథ్యంలో అన్ని వర్గాల అభివృద్ధికి దోహదపడే అమృత్కాల్ బడ్జెట్ అనే పదాన్ని కూడా ఎక్కువగానే ప్రస్తావించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కేంద్ర బడ్జెట్పై ఏపీ ఆర్థిక మంత్రి స్పందన
సాక్షి, విజయవాడ: ఆదాయపు పన్ను శ్లాబ్ రేట్లు ఊరటనిచ్చాయని ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. కేంద్ర బడ్జెట్పై బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కొన్ని కేటాయింపులు సంతృప్తినిచ్చాయన్నారు. చదవండి: Union Budget 2023: పెరిగేవి, తగ్గేవి ఇవే! ‘‘ఆర్థిక లోటు తగ్గడం మంచి పరిణామం. కొన్ని సెక్టార్లలో తక్కువ కేటాయింపులు చేశారు. ఎరువులు, యూరియా, బియ్యం, గోధుమలు సబ్సిడీకి కేటాయింపులు తగ్గాయి. వ్యవసాయానికి కేటాయింపులు తగ్గించి, రోడ్లు, రైల్వేలకు పెంచారు. 7 రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్ని రూపొందించారు. అయితే రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించలేదు’’ అని మంత్రి పేర్కొన్నారు. ‘‘రాష్ట్రాలతో నిర్వహించిన ప్రీ బడ్జెట్ సమావేశాల్లో మన సూచనలను పరిగణలోకి తీసుకున్నారు. పంప్ స్టోరేజ్ విధానాన్ని అమలు చేయాలని కోరాం. ఏపీ రోల్ మోడల్గా ఈ రంగంలో ఉంది. దీనిపై పాలసీ తేవాలని కోరామని, దానిని ప్రకటించారు. ఈ బడ్జెట్లో మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు అనువుగా కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. నర్సింగ్ కాలేజీలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఎయిర్ పోర్టులు, పోర్టులు నిర్మాణానికి ఉపయోగపడుతుంది. గృహ నిర్మాణం, ఏకలవ్య స్కూళ్ల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. వ్యక్తిగత పన్ను రాయితీలు కొన్ని ప్రకటించడాన్ని హర్షిస్తున్నామని’’ మంత్రి బుగ్గన అన్నారు. -
కేంద్ర బడ్జెట్ 2023: ఆ వాహనాలకు చెక్.. ఇకనైనా మేల్కోవాల్సిందే!
దేశప్రజలు కోటి ఆశలతో ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రసంగంలో ఆమె స్క్రాపేజ్ వెహికల్ పాలసీపై నొక్కి చెప్పారు. పాత వాహనాల రద్దుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయిస్తుందని తెలిపారు. కేంద్రం క్లీన్-ఎనర్జీ వాహనాలు అమ్మకాలను పెంచే ప్రయత్నంలో భాగంగా 15 సంవత్సరాల కంటే పాత వాహనాలను దశలవారీగా తొలగించాలని లక్ష్యం పెట్టుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యంలోని తొమ్మిది లక్షల వాహనాలను రద్దు చేసే ప్రణాళికలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో వాహనాల తుక్కు కోసం ఈ బడ్జెట్లో మరిన్ని నిధులు కేటాయించారు. గతంలో భారత ప్రభుత్వం ‘వెహికల్ స్క్రాప్ పాలసీ’ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విధానంలో దేశంలోని 15 ఏళ్ల నాటి వాహనాలను చెత్తకుప్పలకు పంపనుంది. ఈ పాలసీ ఏప్రిల్ 1 2023 నుంచి అమలులోకి రానుంది. వీటితో పాటు ప్రస్తుతం ఏ వాహనాలను స్క్రాప్ పాలసీ కిందకి వస్తుందనేని ప్రభుత్వం తన నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఇక స్క్రాప్ కోసం పంపిన వాహనాలు రీసైకిల్ చేస్తారు. దీని నుండి మెటల్, రబ్బరు, గాజు మొదలైన అనేక వస్తువులు లభిస్తాయి. వీటిని వాహనాల తయారీలో మళ్లీ వాడుకలోకి వస్తుంది. -
మార్కెట్కు బడ్జెట్ బూస్ట్, కానీ ఈ షేర్లు మాత్రం ఢమాల్!
సాక్షి,ముంబై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అమృతకాల బడ్జెట్ స్టాక్మార్కెట్కు ఉత్సాహాన్నిచ్చింది. ఫలితంగా ఆరంభంలోనే 500 పాయింట్లు ఎగిసిన సూచీలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. దాదాపు 1200 పాయింట్లు ఎగిసాయి. టాక్స్ షాక్ తగిలిన రంగాలు తప్ప అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 1112 పాయింట్ల లాభంతో 60661 వద్ద, నిఫ్టీ 266 పాయింట్ల లాభంతో17928 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ అండ్ టి, హెచ్డిఎఫ్సి ట్విన్స్ లాంటివి టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిగరెట్లపై పన్నులు పెంచుతున్నట్లు ప్రకటించడంతో గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా, ఐటీసీ లిమిటెడ్తో సహా సిగరెట్ కంపెనీల షేర్లు బుధవారం 5 శాతం కుప్పకూలాయి. గాడ్ఫ్రే ఫిలిప్స్ 5శాతం, గోల్డెన్ టొబాకో 4 శాతం, అయితే 6 శాతం నష్టపోయిన ఐటీసీ షేర్లు తేరుకొన్నాయి. ఇంకా ఎన్టిసి ఇండస్ట్రీస్ 1.4 శాతం, విఎస్టి ఇండస్ట్రీస్ 0.35 శాతం నష్టాలతో కొనాసగుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 11 శాతం (YoY) కంటే ఎక్కువ పెంచాలని ప్రతిపాదించారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 18 లక్షల కోట్ల నుండి రూ.20 లక్షల కోట్లకు పెంచాలనే ప్రతిపాదన దాదాపు 11 శాతం ఎక్కువ అని, గోద్రెజ్ ఆగ్రోవెట్, బ్రిటానియా, టాటా కన్స్యూమర్స్ షేర్ స్టాక్లకు జోష్నిస్తుందని స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం. -
Union Budget 2023: పెరిగేవి, తగ్గేవి ఇవే!
ఎప్పుడెప్పుడా అని దేశమంతా ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్ను మోదీ ప్రభుత్వం ఆవిష్కరించింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ 2023-24ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇందులో పలు కీలక ప్రకటనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకారం పలు వస్తువుల ధరలు పెరగనున్నాయి. అలాగే మరికొన్నింటి ధరలు తగ్గనున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం! పెరుగనున్నవి... బ్రాండెడ్ దుస్తులు సిగరెట్లు బంగారం, వెండి వాహనాల టైర్ల ధరలు విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరుపై కస్టం డ్యూటీ పెంపు తగ్గనున్నవి ఎలక్ట్రిక్ వాహనాల ధరలు టీవీలు, మొబైల్ కిచెన్ చిమ్ని ధరలు తగ్గనున్నాయి టీవీ ప్యానెళ్లపై కస్టమ్ డ్యూటీ 2.5 శాతానికి తగ్గింపు లిథియం బ్యాటరీలపై కస్టమ్ డ్యూటీనీఇ21 శాతం నుంచి 13 శాతానికి తగ్గింపు -
బడ్జెట్లో టంగ్ స్లిప్ అయిన నిర్మలమ్మ..ఓహ్ !సారీ అంటూ...
లోక్సభలో 2023-24 బడ్జెట్ ప్రసంగం చేస్తూ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికరమైన పొరపాటు చేశారు. ఆమె అనుకోకుండా టంగ్ స్లిప్ అయ్యి అన్న మాటతో అక్కడ ఒక్కసారిగా లోక్సభలో నవ్వులు విరబూశాయి. వెహికల్ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడుతూ ఆమే ఓల్డ్ పొల్యూషన్ వెహికల్స్ బదులుగా ఓల్డ్ పాలిటిక్స్ అన్నారు. దీంతో అక్కడ అర్థమే మారిపోయిందంటే పాత రాజకీయాలను తొలగించటం అన్నట్లు అర్థం వచ్చింది. దీంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సభ్యుల ముఖాలు నవ్వులతో వెలిగిపోయాయి. అయితే ప్రతి పక్షాల సభ్యుల ముఖాలు ఎలాంలి భావాన్ని వ్యక్తం చేయాలేదు. ఐదే ఈ తప్పిదాన్ని నిర్మలమ్మ వెంటనే గమనించి చిరునవ్వుతో..ఓహ్ సారీ అంటూ సరైన వివరణ ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణ విధానంలో భాగంగా పాత కాలుష్య వాహనాలను మార్చడం అని పలుమార్లు తప్పిదాన్ని సరిచేస్తూ చెప్పారు. అంతేగాదు పాత కాలుష్య వాహనాలను మార్చడం మన ఆర్థిక వ్యవవస్థను పచ్చగా మార్చడంలో ముఖ్యమైన భాగం అని నిర్మలమ్మ చెప్పారు. అలాగే బడ్జెట్ 2021-22లో పేర్కొన్న వెహికల్ స్క్రాపింగ్ పాలసీని కొనసాగించడంలో రాష్ల్రాలకు కూడా మద్దతు ఉంటుందని నిర్మలా సీతారామన్ అన్నారు. (చదవండి: పీఎం విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్: బడ్జెట్ చరిత్రలో.. తొలిసారిగా వాళ్ల కోసం ప్యాకేజీ) -
వారికి గుడ్ న్యూస్ 38 వేల ఉద్యోగాలు, గిరిజనులకు ప్రత్యేక మిషన్
న్యూఢిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గుడ్న్యూస్ అందించారు. బడ్జెట్లో ఏడు అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు వెల్లడించిన నిర్మలా సీతారామన్ విద్యకు తమ బడ్జెట్లో ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం 38,800 మంది ఉపాధ్యాయులను నియమించనున్నట్టు తెలిపారు. ఏకలవ్య స్కూళ్లకు టీచర్లు, సపోర్ట్ స్టాఫ్ను రిక్రూట్ చేయనున్నారు. రానున్న మూడేళ్లలో ఈ స్కూళ్లకు 38, 800 వేల మంది టీచర్లను,ఇత సహాయక సిబ్బందిని రిక్రూట్ చేయనున్నట్లు మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో సుమారు 3.5 లక్షల మంది గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. 2014 నుంచి ఏర్పాటైన 157 మెడికల్ కాలేజీలతో పాటు కొత్తగా 157 నర్సింగ్ కాలేజీలను కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే గిరిజనుల పీవీటీజీ మిషన్ను ఏర్పాటు చేయనున్నట్టు లోక్సభలో వెల్లడించారు. గిరిజనుల సామాజిక-ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి పీఎంపీ బీటీజీ డెవలప్మెంట్ మిషన్ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రానున్న 3 సంవత్సరాలలో ఈ పథకం అమలుకు రూ. 15,000 కోట్లు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఆమె వెల్లడించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Budget 2023: రైతులకు తీపి కబురు.. అందుకోసం రూ.20 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023-24లో వ్యవసాయంలో ఆధునికీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. రైతులకు రూ.20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. రైతుల కోసం కిసాన్ సమ్మాన్ నిధిని మరింత పెంచుతాన్నామన్నారు. కరువు ప్రాంత రైతులకు 5 వేల 300 కోట్లు కేటాయించారు. వీటితో పాటు వ్యవసాయంతో పాటు డెయిరీ, మత్స్యశాఖలను కూడా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మత్స్య కారుల అభివృద్ధి కోసం ఈ ఏడాది భారీగా నిధులు కేటాయించారు. అందులో భాగంగా పీఎం మత్స్య సంపద యోజనకు అదనంగా రూ.6వేల కోట్లు కేటాయించారు. అలాగే రైతుల ఉత్పత్తుల నిల్వ కోసం గిడ్డంగుల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
Union Budget 2023-24: వేతన జీవులకు ఊరట, శ్లాబుల్లో మార్పులు
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వేతన జీవులకు ఊరట కల్పించారు. ఆదాయపన్ను పరిమితిని రూ.5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచారు. అలాగే ఉద్యోగుల పన్ను శ్లాబులను ప్రస్తుతం 6 నుంచి 5 కు తగ్గించారు. అయితే ఆదాయం రూ.7 లక్షలు దాటితే మాత్రం పన్ను రూ.3 లక్షల నుంచే మొదలవుతుంది. ట్యాక్స్ స్లాబ్స్ 6 నుంచి 5 కి తగ్గింపు 0-3 లక్షల వరకు పన్నులేదు రూ. 3 - 6 లక్షల వరకు 5% పన్ను రూ. 6 - 9 లక్షల వరకు 10% పన్ను రూ. 9 -12 లక్షల వరకు 15% పన్ను రూ. 12- 15 లక్షల వరకు 20% పన్ను రూ.15 లక్షలు ఆదాయం దాటితే 30% పన్ను దీని ప్రకారం ఆదాయం రూ. 7లక్షలు దాటితే 3 లక్షల ఆదాయంనుంచి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.9 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి చెల్లించాల్సిన పన్ను రూ.45వేలు, రూ.15లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి చెల్లించాల్సిన పన్ను రూ.లక్షా 5వేలుగా ట్యాక్స్ ఉండనుంది. అలాగే ఆదాయపు పన్ను రిటర్న్ల సగటు ప్రాసెసింగ్ సమయాన్ని 93 రోజుల నుంచి 16 రోజులకు తగ్గించారు. సీనియర్ సిటిజన్లకు ఊరట కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ సీనియర్ సిటిజన్లకు ఊరట ప్రకటించారు. సీనియర్ సిటిజన్ల డిపాజిట్ గరిష్ఠ పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు. అలాగే సేవింగ్ అకౌంట్ పరిమితిని రూ.4.5 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచారు. ఇక ఇప్పటివరకు ఉన్న 80సి కింద మినహాయింపులు చూపించుకోవాలంటే పాత పన్ను పద్ధతిని ఎంచుకోవాలి. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Union Budget 2023: బడ్జెట్ చరిత్రలో.. తొలిసారిగా వాళ్ల కోసం ప్యాకేజీ
సాక్షి, ఢిల్లీ: దేశ బడ్జెట్లో మొట్టమొదటిసారిగా ఓ కొత్త ప్యాకేజీని ప్రవేశపెట్టింది కేంద్రం. పీఎం విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్ పేరుతో ఆ ప్యాకేజీని తీసుకురాబోతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ప్రకటించారు. అమృత కాల బడ్జెట్లో భాగంగా.. పీఎం విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్ను తీసుకొస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సంప్రదాయ కళాకారులు, హస్తకళాకారులను ఉద్దేశించి ఈ ప్యాకేజీ తీసుకురాబోతున్నట్లు ఆమె వెల్లడించారు. ఎంఎస్ఎంసీ(సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ) వాల్యూ చెయిన్తో అనుసంధానం చేయడం ద్వారా.. వాళ్ల ఉత్పత్తుల నాణ్యత మెరుగు పర్చడం, క్షేత్రస్థాయిలో అవి వెళ్లే పరిస్థితి మెరుగుపరచడం సాధ్యమవుతుందని, ఆ ఉద్దేశంతోనే ఈ ప్యాకేజీ తీసుకురాబోతున్నట్లు ఆమె ప్రకటించారు. అయితే ఆ ప్యాకేజీ ఏమేర ఉండబోనుందనేది అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. PM Vishwa Karma Kaushal Samman For the first time package of assistance for traditional artisans and craftspeople has been conceptualized, which will enable them to improve the quality, scale, and reach of their products, integrating with the MSME value chain#AmritKaalBudget pic.twitter.com/u2m4k6wAls — PIB India (@PIB_India) February 1, 2023 -
యూనియన్బడ్జెట్23: రైల్వేలకు భారీ కేటాయింపులు
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023-24లో రైల్వేలకు భారీ కేటాయింపులను చేస్తున్నట్టు ప్రకటించారు. రైల్వేల కోసం రూ. 2.4 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఇది దాదాపు పదేళ్లలో అత్యధికం, గత సంవత్సరం బడ్జెట్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ అని ఆమె ఈ సందర్భంగా చెప్పనారు. అంతేకాదు నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి రావడానికి ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ దేశాన్ని పరిపాలించిన సంవత్సరంతో పోల్చుతే ఇది 2013-14లో చేసిన వ్యయం కంటే దాదాపు తొమ్మిది రెట్లు ఎక్కువ అంటూ ఆర్థికమంత్రి నొక్కిచెప్పారు. క్రిటికల్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ల కోసం ఆమె రూ. 75,000 కోట్లను కూడా ప్రకటించింది, ఇది రైల్వేలకు కూడా ప్రత్యేకంగా దాని సరుకు రవాణా వ్యాపారంలో సహాయపడే అవకాశం ఉందన్నారు. -
బడ్జెట్ 2023: ఇళ్ల కొనుగోలుదారులకు శుభవార్త.. ఆ పథకానికి భారీగా నిధులు పెంపు!
న్యూఢిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెడుతున్నారు. ఈ బడ్జెట్లో సొంతింట కలను సాకారం చేసుకోవాలనుకున్న వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. పీఎం ఆవాస్ యోజన పథకానికి ( PMAY) ఈ సారి బడ్జెట్లో నిధులు భారీగా పెంచింది. గత బడ్జెట్లో పీఎం ఆవాస్ యోజనకు 48 వేల కోట్ల రూపాయలు కేటాయించగా.. ఈ ఏడాది ఆ మొత్తాన్ని 66 శాతం పెంచి రూ.79వేల కోట్లు కేటాయించారు. ఇప్పటికే వడ్డీ రేట్లు పెరిగి సామాన్యుల ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ పెంపు నేపథ్యంలో గృహ కొనుగోలుదారులకు ఇది ఊరట కల్పించే అంశం. పీఎంఏవై కేటాయింపుల పెంపు గృహ రుణాలకు డిమాండ్ను పెంచడమే కాకుండా, సిమెంట్ రంగానికి కూడా సానుకూలాంశమని చెప్పచ్చు. దేశ ప్రజలకు పక్కా ఇళ్లను అందించాలనే లక్ష్యంతో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 2015లో ప్రధన మంత్రి ఆవాస యోజన ని ప్రారంభించింది. మధ్య ఆదాయం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (EWS), తక్కువ-ఆదాయ సమూహాలు (LIG) వారికి సహాయం చేసేందుకు ఈ పథకం ప్రారంభించారు. -
Union Budget: కర్ణాటకకు కేంద్ర బడ్జెట్లో పెద్ద పీట
సాక్షి, ఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రం కర్ణాటకకు పెద్ద పీట వేసింది కేంద్రం. బడ్జెట్-2023లో వరాలు జల్లు కురిపించింది. కర్ణాటకలోని కరువు ప్రభావిత ప్రాంతాలకు రూ.5,300 కోట్ల కేటాయింపులు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రకటించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. ఇవాళ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రసంగించారు. భద్ర ఎగువ తీర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్ల గ్రాంట్లు ఇస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది ప్రాజెక్టును మరింత బలోపేతం చేస్తుందని, చిత్రదుర్గతో సహా మధ్య కర్ణాటకలోని అనేక వర్షాధార వ్యవసాయ జిల్లాలకు వరం అవుతుందని, పైగా.. ప్రాజెక్టును త్వరగా, సమర్ధవంతంగా పూర్తి చేసేందుకు వీలవుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ ఏడాది కర్ణాటక సహా తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాలకు ఇప్పటికే ఎన్నికలు ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో మరోసారి అధికారం దక్కించుకోవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే.. రాష్ట్రంలో పలు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహిస్తోంది. దీనికి కొనసాగింపుగా కేంద్ర బడ్జెట్లో భారీగా నిధులు వస్తాయని అంచనా వేయగా.. అందుకు తగ్గట్టుగానే వరాలు కురుస్తున్నాయి. -
అమృత కాల బడ్జెట్ 23: సీతారామన్ ‘సప్తఋషులు’..అవేంటంటే!
న్యూఢిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెడుతున్నారు. ఈ బడ్జెట్లో ఏడు అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అమృత కాల్ బడ్జెట్లో అవి ఒకదానికొకటి సమన్వయంతో సప్త ఋషులుగా మార్గ నిర్దేశనం చేస్తాయని చెప్పారు. ఈ ప్రాధాన్యతలు దేశాన్ని 'అమృత్ కాల్' వైపు మళ్లిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఇవి తమ ప్రభుత్వానికి ఫ్రేమ్వర్క్గా సీతారామన్ అభివర్ణించారు. సీతారామన్ ఏడు ప్రాధాన్యతలు: సమ్మిళిత అభివృద్ధి రీచింగ్ లాస్ట్ మౌలిక సదుపాయాలు ,పెట్టుబడి పొటెన్షియల్ గ్రోత్ గ్రీన్ గ్రోత్ యువశక్తి ఆర్థిక విభాగం అలాగే పీవీటీజీ గిరిజనుల కోసం ప్రత్యేక పథకాన్ని నిర్మలా సీతారామన్ ప్రకటించారు పరిశుధ్దమైన నీరు, ఇండ్లు, రోడ్,టెలికాం వసతుల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం 15 వేల కోట్లు కేటాయించారు. ఈ మిషన్, వచ్చే మూడేళ్లలో వారి సంకక్షేమం కోసం కృషి చేయనున్నట్టు ఆర్థిక మంతత్రి పార్లమెంటులో వెల్లడించారు. అలాగే ఏకలవ్య మోడల్ స్కూళ్లను ప్రకటించారు. ఇందుకోసం భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలను చేపడుతున్నట్టు ప్రకటించారు. మహిళలు, రైతుల, యువత, వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు అందుకోసం ప్రత్యక అవకాశాలను కల్పిస్తున్నట్టు తెలిపారు. పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించేలా సంస్కరణలు చేపడుతున్నట్టు ప్రకటించారు. వ్యవసాయానికి పెద్దపీటవేయడంతోపాటు, యువ రైతులను ప్రోత్సహించేందుకు అగ్రి స్టార్టప్ లకు ప్రత్యేక నిధి ఏర్పాటును ప్రకటించారు. వ్యవసాయ రంగంలో సవాళ్లను ఎదుర్కొనేలా ప్రణాళిక అని చెప్పారు. 63 వేల వ్యవసాయ పరపతి సంఘాల డిజిటలైజేషన్ చేస్తామని, ఇందుకోసం రూ. 2 వేల కోట్లు కేటాయింపును ప్రకటించారు. -
కేంద్ర బడ్జెట్ 2023: గుడ్ న్యూస్.. మహిళల కోసం మరిన్ని పథకాలు
ప్రపంచ ఆర్థిక దృక్పథం నిరాశాజనకంగా ఉన్నప్పటికీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో కేంద్ర బడ్జెట్ 2023-24ను సమర్పించారు. ఆనంతరం ఆమె ప్రసంగిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థ సరైన మార్గంలో ఉందని, ఉజ్వల భవిష్యత్తు వైపు పయనిస్తోందన్నారు. 2014 నుంచి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పౌరులందరికీ మెరుగైన జీవన ప్రమాణాలతో పాటు గౌరవప్రదమైన జీవితాన్ని అందించాయన్నారు. మహిళల కోసం ప్రత్యేకం పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం వల్ల సమగ్ర అభివృద్ధిపై శ్రద్ద పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ బడ్జెట్లో రైతులు, యువత, మహిళలు ,వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. మహిళా సాధికారత దిశగా కృషి చేస్తున్నామన్న నిర్మలమ్మ వారి కోసం మరిన్ని పథకాలు ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పారు. స్వయం సహాయక బృందాల ద్వారా గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతను పెంచడం బడ్జెట్లోని ముఖ్యమైన వాటిలో ఒకటి అని చెప్పారు. యువతకు ఉపాధి లభించేలా ఉద్యోగాల వృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇక వ్యవసాయంలో ఆధునీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అనే కొత్త పథకాన్ని బడ్జెట్లో కేంద్రం ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ ఫిక్సిడ్ డిపాజిట్ పథకంలో ఖాతాదారులు చేసే డిపాజిట్పై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్టంగా రూ.2 లక్షలు వరకు ఈ పథకంలో డిపాజిట్ చేయవచ్చు. పాక్షిక మినహాయింపులకు అవకాశం ఉంటుంది. -
Union Budget 2023: ‘ఇది పేద, మధ్యతరగతి ప్రజలకు అనుకూలమైన బడ్జెట్’
పార్లమెంట్లో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023-24 ను ప్రవేశపెట్టారు. లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి ముందు పార్లమెంటరీ వ్యవహారాల ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్ 2023-24 "ఇది ఉత్తమ బడ్జెట్. ఇది పేద, మధ్యతరగతి అనుకూల బడ్జెట్." అని అభిప్రాయపడ్డారు. ఈ బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు సామాన్యులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని అన్నారు. మరో వైపు పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ 2023-24 ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తమ ప్రభుత్వ హయాంలో సాధించిన ప్రగతిని.. ఈ దఫా వార్షిక బడ్జెట్ పలు రంగాలకు కేటాయింపులు తదితర అంశాలపై ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని వినిపిస్తున్నారు. -
అమృతకాల బడ్జెట్: అంతర్జాతీయ సవాళ్ల మధ్య ధీటుగా భారత్
న్యూఢిల్లీ: యూనియన్ బడ్జెట్ 2023-24 ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న సందర్భంగా కీలక విషయాలను ప్రకటించారు. ఇది అమృత కాల బడ్జెట్ అనీ,దీనికి గత బడ్జెట్ లోనే గట్టి పునాది పడిందని ఆమె అన్నారు. అంతర్జాతీయ సవాళ్ల మధ్య మన దేశం తలయెత్తుకొని సగర్వంగా నిల బడిందనీ, సమిష్టి ప్రగతి దిశగా దేశం పయనిస్తుందని నిర్మలా భరోసా ఇచ్చారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ సరైన మార్గంలో ఉందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశ జీడీపీ వృద్ధి రేటు అత్యంత వేగంగా ఉందన్నారు. వృద్ధి రేటును 7శాతంగా అంచనావేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా పేదలు, యువత, మహిళలు, రైతులు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఈ బడ్జెట్ ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. అంత్యోదయ వర్గాల వారికి సంత్సరం పాటు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం జనవరి 2023 నుంచి ఉచిత ధాన్యాల పంపిణీ స్కీంను ప్రశేపెడుతున్నాం. దీని య్యే మొత్తం ఖర్చును 2 లక్షల కోట్లు కేంద్రం భరిస్తుంది. కోవిడ్ , యుద్ధం లాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా గ్లోబల్గా నెలకొన్న మాంద్యం పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థంగా దృఢంగా నిలబడింది. కోవిడ్ అడ్డుకోవడంలో చాలా వేగంగా పనిచేశాం. 102 కోట్ల మందికి వ్యాక్సన్స్ అందించాం వ్యాక్సినేషన్ డ్రైవ్ శరవేగంగా చేపట్టామని ఆమె చెప్పారు. -
ప్రతీ సెక్షన్నూ కవర్ చేశాం, ప్రజలకు మోదీ ఎపుడూ అండగా ఉంటారు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్ది క్షణాల్లో కేంద్ర బడ్జెట్ను సమర్పించనున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ బడ్జెట్ 2023కి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి యూనియన్ బడ్జెట్ 2023లో 'ప్రతీ విభాగం' చేర్చామని తెలిపారు. సమాజంలోని ప్రతి వర్గాల అంచనాలను అందుకోబోతున్నాం. మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ దేశ ప్రజలకు అనుకూలంగా పని చేస్తుందంటూ పేర్కొన్నారు. మరోవైపు రానున్న బడ్జెట్పై కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు ఆర్థిక సర్వే అంనాలు మరింత ఆశా జనకంగా ఉండటంతో మరింత ఆసక్తి నెలకొంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా అయిదోసారి పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్న సంగతి తెలిసిందే. -
Union Budget 2023: ప్రత్యేక సందర్భాల్లో నిర్మలమ్మ ధరించే చీర వెనుక ఇంత కథ ఉందా!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఈరోజు (ఫిబ్రవరి 1న) కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతోంది. దేశమంతా ఆమె ప్రసంగం, కేటాయింపులు, ఊరటనిచ్చే అంశాలు వంటి వాటితో ఈ బడ్జెట్లో ఏముందనే ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. వీటితో మరో అంశం కూడా ఉందండోయ్. ఆమె ఏ రంగు చీరతో 2023-24 బడ్జెట్ను సమర్పిస్తుందా అని అందరి దృష్టి దానిపైనే ఉంది. దీని వెనుక ఆసక్తికరమైన అంశాలను తెలుసుకుందాం బడ్జెట్తో పాటు దానిపై కూడా ప్రత్యేక దృష్టి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చీరల సేకరణను కలిగి ఉన్నారు.నిర్మలమ్మకు చేనేత చీరలంటే ఇష్టం ఎక్కువ. జనవరి 26న, నార్త్ బ్లాక్లో జరిగిన ప్రీ-బడ్జెట్ హల్వా వేడుకలో ఆమె ఆకుపచ్చ, పసుపు కంజీవరం చీరలో కనిపించింది. నిర్మలమ్మ ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక చీరల ధరించి దర్శమమిస్తారు. అదీ కూడా ఆ రంగులు తరచుగా దేశంలోని కరెన్సీ నోట్లకి సరిపోతుంటాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో రూ.10 నుంచి రూ.2,000 నోట్లకు సరిపడే చీరలో కనిపించింది. ఈ ఏడాది బడ్జెట్ 2023 కోసం ఆమె ప్రకాశవంతమైన ఎరుపు రంగును ఎంచుకున్నారు. దీనిబట్టి ప్రజలు ఈ సారి సానుకూల బడ్జెట్ ఆశించవచ్చిన తెలుస్తోంది. గతంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక సందర్భాలలో ధరించిన చీరలెంటో చూద్దాం.. ►అమరవీరుల దినోత్సవం సందర్భంగా రూ.10 నోటు రంగుతో సరిపోయే మణిపురి చీర ధరించింది. ►పశ్చిమ బెంగాల్లో జరిగిన ఒక కార్యక్రమంలో 20 రూపాయల నోటు రంగులో పచ్చని మంగళగిరి చీర.. ►సౌత్ సిల్క్ చీరలో రూ. 2000 నోటు రంగు సరిపోతుంది ►రూ.100 నోటు రంగులో లిలక్ సంబల్పురి చీర ►మన్మోహన్ సింగ్ను కలిసే ముందు రూ.200 నోటు రంగు చీర ►అమెరికాలో జరిగిన ప్రపంచ బ్యాంకు సమావేశంలో 500 నోటు కలర్ చీర ►విలేకరుల సమావేశంలో ధరించిన జమ్దానీ చీర రూ.50 నోటుతో సరిపోతుంది. ప్రత్యేక సందర్భాలలో ఆర్థిక మంత్రి ఎరుపు రంగును ఎంచుకుంటారు, నలుపును దూరంగా పెడుతుంటారు. చదవండి: Union Budget 2023: బడ్జెట్ ప్రసంగంపై యువతకు ఎందుకంత ఆసక్తి? ఈ విషయాలు తెలుసా? -
బడ్జెట్ పద్దుతో మంత్రి నిర్మలమ్మ బృందం (ఫొటోలు)
-
ముందే ముగియనున్న బడ్జెట్ తొలి దఫా సమావేశాలు!
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల తొలి దఫా బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి 13కు బదులు 10వ తేదీనే ముగించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను పలు పార్టీలు కోరాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ధృవీకరించారు. ‘‘లోక్సభ సభా కార్యకలాపాల సలహా కమిటీ(బీఏసీ.. బిజినెస్ అడ్వైజరీ కమిటీ) భేటీలో స్పీకర్ వద్ద వారీ విషయాన్ని ప్రస్తావించారు. వారి డిమాండ్ను దృష్టిలో పెట్టుకుంటానని స్పీకర్ హామీ ఇచ్చారు’’ అని చెప్పారు. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు రెండు దఫాలుగా జరగనుంది. తొలి సెషన్ ఫిబ్రవరి 13వ తేదీతో ముగియనుంది. అయితే 11-12 తేదీలు వారాంతం కావడంతో ఎంపీలు ఈ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక షెడ్యూల్ ప్రకారం.. రెండో దఫా సమావేశాలు మార్చి 13వ తేదీన మొదలై.. ఏప్రిల్ 6వ తేదీతో సమావేశాలు ముగుస్తాయి. -
ప్రీ బడ్జెట్ ర్యాలీ, ఈ జోష్ నిలబడేనా?
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 512 పాయింట్లు ఎగియగా నిఫ్టీ 140 పాయింట్లు లాభంతో కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. తద్వారా సెన్సెక్స్ 60 వేలకు, నిఫ్టీ 17800 పాయింట్ల మార్క్ను అధిగమించాయి. బడ్జెట్పై ఆశలు, అంచనాలతో ఇన్వెస్టర్లు ఆశాజనంగా ఉన్నారు. దీంతో సూచీలు ఉ త్సాహంగా ఉన్నాయి. బడ్జెట్ ప్రకటన తరువాత ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి. దివీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంకు , బబ్రిటానియా, హిందాల్కో, టాటా స్టీల్ బాగా లాభపడుతుండగా అదానీ ఎంటర్ ప్రైజెస్, సన్ ఫార్మ, అదానీ పోర్ట్స్, ఎం అండ్ ఎం నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో 14 పైసలు ఎగిసి 81.80 వద్ద ఉంది. -
బడ్జెట్ ప్రసంగంపై యువతకు ఎందుకంత ఆసక్తి? మీరేం అనుకుంటున్నారు?
‘బడ్జెట్ అంటే అంకెల వరుస కాదు. అంతకంటే ఎక్కువ. మన జీవితంతో ముడిపడి ఉన్న విషయం’ ‘బడ్జెట్ నవ్విస్తూనే ఏడిపిస్తుంది. ఏడిపిస్తూనే నవ్విస్తుంది’ ... ఇలాంటి మాటలెన్నో బడ్జెట్కు ముందు, బడ్జెట్కు తరువాత వినిపిస్తూనే ఉంటాయి. యువతరం ఈ మాటలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలియదుగానీ ‘బడ్జెట్ ప్రసంగం’ వినడానికి మాత్రం తగిన ఆసక్తి ప్రదర్శిస్తోంది. సివిల్స్ కలలు కనే వారి నుంచి స్టార్టప్కు శ్రీకారం చుట్టాలనుకునే వారి వరకు, క్రిప్టో కరెన్సీపై ఆసక్తి చూపుతున్న వారి నుంచి లాంగ్–టర్మ్ సేవింగ్ కల్చర్లో భాగం అవుతున్న వారి వరకు యువతరంలో చాలామంది బడ్జెట్ తీరుతెన్నులు, విషయాలు, విశేషాలను తెలుసుకోవడానికి, తమదైన శైలిలో ఆసక్తి ప్రదర్శిస్తున్నారు... కాలేజీలో చదువుతున్నవారు, మొన్న మొన్ననే కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు, ఉద్యోగం ఊసు ఎత్తకుండా స్టార్టప్ కలలు కనే యంగ్స్టర్స్కు బడ్జెట్ ప్రసంగం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏమిటి? రెవెన్యూ బడ్జెట్ అంటే ఏమిటి? అసలు బడ్జెట్ అంటే ఏమిటి?’... రెండు సంవత్సరాల క్రితం బెంగళూరుకు చెందిన నిహారికకు తెలిసి ఉండకపోవచ్చు, తెలుసుకోవాలనే ఆసక్తి ఉండకపోవచ్చు... కాని ఇప్పుడు పరిస్థితి వేరు. తానేమీ ఆర్థికశాస్త్ర విద్యార్థి కాకపోయినా బడ్జెట్ గురించి రకరకాల కోణాలలో తెలుసుకోవడం అనేది ఆమె ప్రధాన ఆసక్తిగా మారింది. దీనికి కారణం భవిష్యత్లో సివిల్స్ పరీక్ష రాయాలనుకోవడం. ‘అన్ని విషయాలలో అవగాహన ఉంటేనే సివిల్స్లో సక్సెస్ అవుతాం. ఇష్టమైన సబ్జెక్ట్కు పరిమితమైతే కల కలగానే మిగిలిపోతుంది’ అంటుంది నిహారిక. యంగ్పీపుల్ బడ్జెట్ ప్రసంగం వినడానికి ఆసక్తి చూపడానికి గల కారణాలలో సివిల్స్లాంటి పరీక్షలు మాత్రమే కాదు ‘ఏ రంగాలలో ఉపాధి అవకాశాలు ఉన్నాయి’ అని తెలుసుకోవడం కూడా ఒకటి. గత సంవత్సరం బడ్జెట్లో పద్నాలుగు పరిశ్రమలలో లక్షలాది ఉద్యోగ అవకాశాల గురించి ప్రస్తావించారు. ‘ఈ సంవత్సరం పరిస్థితి ఏమిటి?’ అనే ఆసక్తి సహజంగానే ఉంటుంది. ఆ ఆసక్తే వారిని బడ్జెట్పై ఆసక్తి కలిగేలా చేస్తుంది. కంపెనీల లే ఆఫ్లతో ఉద్యోగం కోల్పోయిన వారు ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నారు. ‘మళ్లీ ఉద్యోగం వెదుక్కోవడం ఎందుకు? మనమే ఒక స్టార్టప్ స్టార్ట్ చేసి సక్సెస్ కావచ్చు కదా’ అనుకునేవారు యువతరంలో చాలామందే ఉన్నారు. ‘ఉద్యోగం చేయడం కంటే ఉద్యోగాలు సృష్టించండి’ అని ప్రభుత్వం చెబుతున్న మాటను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. స్టార్టప్ మొదలుపెట్టాలనుకునేవారికి బడ్జెట్ గురించి తెలుసుకోవడం అనేది ముఖ్యం అయిపోయింది. అంకుర పరిశ్రమలకు పన్ను రాయితీ, ప్రోత్సాహకాలు... మొదలైనవి తెలుసుకోవడానికి బడ్జెట్ ప్రసంగం వినడం అనివార్యం అయింది. హైబ్రిడ్ వర్కింగ్ మోడల్ (ఆఫీస్, ఇంటి నుంచి రెండు విధాలుగా పనిచేసే అవకాశం ఉన్నవారు) ‘మా గురించి ఏమైనా ప్రస్తావన ఉందా!’ అన్నట్లుగా బడ్జెట్పై ఒక కన్ను వేస్తున్నారు. దీర్ఘకాలిక దృష్టితో పొదుపు చేయడం అనేది దేశ ఆర్థికవృద్ధికి మాత్రమే కాదు, పొదుపు చేసే వారి మంచి భవిష్యత్కు కూడా కారణం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని లాంగ్–టర్మ్ సేవింగ్ కల్చర్ను యువతలో పెంపొందించడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. వాటి గురించి తెలుసుకోవాలంటే బడ్జెట్ ప్రసంగం వినాల్సిందే. సాంకేతిక నైపుణ్యవంతులైన యువతరం రకరకాల ఆర్థిక వనరులను, సాధనాలను వెలికి తీయడంలో ముందుంటుంది. ఈ క్రమంలో సహజంగానే వారి దృష్టి క్రిప్టో కరెన్సీపై ఉంది. క్రిప్టో కరెన్సీకి సంబంధించి పన్నులు, నియంత్రణ అంశాలు... మొదలైనవి తెలుసుకోవడానికి బడ్జెట్ ప్రసంగం వింటున్నారు. తమ ప్రయోజనాలకు సంబంధించి బడ్జెట్పై ఆసక్తి ఒక కోణం అయితే, సామాజిక కోణం అనేది రెండోది. ఇందుకు ఉదాహరణ దిల్లీకి చెందిన హిమవర్ష. డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థి అయిన హిమవర్షకు విద్యారంగం అనేది ఆసక్తికరమైన సబ్జెక్ట్. ‘జాతీయ విద్యావిధానం విద్యారంగానికి తగినంత బడ్జెట్ కేటాయించమని చెబుతుంది. అయితే అవసరమైనదానిలో సగం బడ్జెట్ను మాత్రమే కేటాయిస్తున్నారు. మన దేశంలో విద్యారంగం అనేది వేగంగా వృద్ధి చెందుతున్న రంగం. ఈ బడ్జెట్లోనైనా సరిపడా నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నాను’ అంటుంది హిమవర్ష. ఆమె ప్రస్తావిస్తున్న మరో అంశం... డిజిటల్ యూనివర్శిటీ. ‘డిజిటల్ యూనివర్శిటీ అనేది మన విద్యానాణ్యతను ప్రపంచస్థాయి ప్రమాణాలతో పెంచడానికి ఉపయోగపడుతుంది. గత సంవత్సరం బడ్జెట్లో డిజిటల్ యూనివర్శిటీ గురించి ప్రకటించారు. దీనికి సంబంధించి ఆశాజనకమైన విషయాలు ఈ బడ్జెట్లో ప్రస్తావిస్తారని ఆశిస్తున్నాను. ఏఆర్, వీఆర్, రోబోటిక్స్కు ప్రత్యేక కేటాయింపు ఉండాలి. డిజిటల్ ఎడ్యుకేషన్ సెక్టార్కు ప్రోత్సాహకాలు ఇవ్వాలి’ అంటుంది హిమవర్ష. ‘బడ్జెట్’ అనే బడిపై యువతరం ఆసక్తి ప్రదర్శించడమే కాదు ఓనమాలు నేర్చుకొని, విషయ విశ్లేషణ చేస్తూ జ్ఞానపరిధిని పెంచుకొంటుంది. మంచిదే కదా! స్టార్టప్ మొదలుపెట్టాలనుకునేవారికి బడ్జెట్ గురించి తెలుసుకోవడం అనేది ముఖ్యం అయిపోయింది. అంకుర పరిశ్రమలకు పన్ను రాయితీ, ప్రోత్సాహకాలు... మొదలైనవి తెలుసుకోవడానికి బడ్జెట్ ప్రసంగం వినడం అనివార్యం అయింది. -
బడ్జెట్ రైలు ఆగేనా!
రాజంపేట: పార్లమెంట్లో నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఏటా ప్రవేశపెడుతున్న బడ్జెట్లో ఉమ్మడి వైఎస్సార్ జిల్లా పరిధిలో రైల్వేలకు అనుకున్న స్థాయిలో నిధులు కేటాయించడం లేదు. గత బడ్జెట్లో కేవలం పాత ప్రాజెక్టులకే నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో ఆదాయపరంగా ముందంజలో ఉన్నా రైళ్ల కేటాయింపులోగానీ, పొడిగింపుల్లో కానీ తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఈ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టులు కడప–బెంగళూరుల మధ్య కొత్త ప్రాజెక్టుకు 2008–09లో ప్రణాళికలు తయారు చేసి రూ.2706 కోట్లు కేటాయిస్తూ పనులు ప్రారంభించారు. మొత్తం 255 కి.మీల పొడవు కల్గిన ఈ మార్గంలో ఇప్పటివరకు కేవలం 21 కి.మీలు కడప–పెండ్లిమర్రి మార్గం మాత్రమే పూర్తయింది. గత బడ్టెట్లో రూ.289 కోట్లు కేటాయించారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పట్టుబట్టి దక్కించుకున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే కడప, అనంతపురం జిల్లా వాసులకు బెంగళూరు నగరం మరింత దగ్గరవుతుంది. కలగానే బాలాజీ డివిజన్ ప్రతిపాదన డివిజన్ కేంద్రంగా తిరుపతిని చేస్తే కాట్పాడి నుంచి గుంతకల్, నెల్లూరులో గూడూరు , వైఎస్సార్, అన్నమయ్య జిల్లా పరిధిలో 700 కిలోమీటర్ల దూరం వస్తుంది. 400 కిలోమీటర్ల పరిధి ఉంటే డివిజన్గా ప్రకటించవచ్చని రైల్వే నిపుణులు అంటున్నారు. బాలాజీ డివిజన్ ఏర్పాటైతే అనుకూలంగా ఉంటుందని నివేదికలు ఉన్నాయి. ఇందులో తిరుపతి–గూడూరు (92.96కి.మీ), తిరుపతి–కాట్పాడి (104.39కి.మీ), పాకాల–మదనపల్లె (83కి.మీ), రేణిగుంట–కడప (125 కి.మీ)లైను కలిపే అంశాన్ని గతంలోనే రైల్వే అధికారులు పరిశీలించారు. బడ్జెట్లో ఆమోదం..సర్వేకే పరిమితం ∙కడప–గుంతకల్లు–బళ్లారి ∙కంభం–ప్రొద్దుటూరు ∙భాకరాపేట–గిద్దలూరు ∙ముద్దనూరు–ముదిగుబ్బ నందలూరు రైల్వేకు ఏదీ పూర్వవైభవం నందలూరు రైల్వేకు పూర్వవైభవం కోసం ఐకేపీఎస్ ఆధ్వర్యంలో యూపీఏ పాలన హయాంలో చేపట్టిన ఉద్యమం దేశరాజధాని ఢిల్లీకి చేరుకుంది. అప్పటి రైల్వేమంత్రి లాలూప్రసాద్ కూడా రాజ్యసభలో నందలూరులో రైల్వే ప్రత్యామ్నాయ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆ« తర్వాత ఈ ప్రతిపాదనలు అటకెక్కాయి. మాట తప్పిన బీజేపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నందలూరు రైల్వే పూర్వవైభవం కోసం కృషిచేస్తామన్న బీజెపీ అగ్రనేతలు ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ఈ సమస్యను విస్మరించారు. పరిశ్రమ కాదు..ఉన్న రన్నింగ్ స్టాఫ్ క్రూసెంటర్ను, వివిధ రైళ్లకు ఉన్న స్టాపింగ్స్ను కూడా ఎత్తివేసే క్రమంలో రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. స్టాపింగ్స్కు ఎర్నింగ్ అడ్డంకి.. పలురైళ్ల స్టాపింగ్స్కు ఎర్నింగ్స్ను అడ్డంకిగా చూపుతున్నారు. ప్రజాసేవను దూరంపెట్టేసింది. కేవలం లాభార్జన పరంగా ముందుకువెళ్లడంతో పలురైళ్లు జిల్లా వాసులకు దూరమయ్యాయి. కమలాపురం, రాజంపేట, నందలూరు, రైల్వేకోడూరుతో పాటు కొన్ని నియోజకవర్గ కేంద్రాలలో కూడా కొన్ని రైళ్ల స్టాపింగ్కు ఎర్నింగ్ అడ్డంకిగా చూపుతున్నారు. పుణ్యక్షేత్రాల స్టేషన్లపై శీతకన్ను జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రాల రైల్వేస్టేషన్లపై రైల్వేశాఖ శీతకన్ను వేసింది. రాష్ట్ర విభజన తర్వాత పుణ్యక్షేత్రంగా రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన ఒంటిమిట్ట రైల్వేస్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాపింగ్స్ లేదు. అలాగే మరో పుణ్యక్షేత్రమైన నందలూరు(సౌమ్యనాథాలయం) స్టేషన్లో కూడా తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రల రాజధానుల నుంచి నడిచే ఎక్స్ప్రెస్రైళ్లకు స్టాపింగ్స్ లేవు. ఈ పుణ్యక్షేత్రాలకు దూరప్రాంతాల నుంచి వచ్చే రైలు ప్రయాణికులకు సౌకర్యం కల్పించడంలో రైల్వేశాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. కనీసం బుధవారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లోనైనా ఉమ్మడి వైఎస్సార్ జిల్లాకు రైల్వే పరంగా కొద్దివరకైనా న్యాయం జరుగుతుందో లేక మళ్లీ మొండి చేయి చూపుతారో వేచి చూడాల్సిందే. కన్నెత్తిచూడని కొత్తరైళ్లు.. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాను కలుపుతూ నెల్లూరుకు డైలీ డెమో రైలును తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు. విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రాపూరు, ఓబులవారిపల్లె, రాజంపేట, నందలూరు మీదుగా కడప వరకు ఎక్స్ప్రెస్ రైలును తీసుకువస్తే అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. పెన్నా ఎక్స్ప్రెస్ పేరుతో హిందుపూరం నుంచి వయా ధర్మవరం, అనంతపురం గుత్తి, డోన్, నంద్యాల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కడప, నందలూరు, రాజంపేట, ఓబులవారిపల్లె మీదుగా నెల్లూరు వరకు రైలును తీసుకొస్తే సీమలోని కడప, అనంతపురం, నెల్లూరు జిల్లా మధ్య రాకపోకలకు సులభమవుతుంది. ∙నంద్యాల–కడప మధ్య నడిచే డెమో ఎక్స్ప్రెస్రైలును రేణిగుంట వరకు పొడిగింపు నిర్ణయం తీసుకున్నా ఇంతవరకు అమలుకాలేదు. ∙ముంబయి–చెన్నై రైలు మార్గంలో రాత్రి వేళలో నడిచే నైన్ మెయిల్, టెన్ మెయిల్ రైళ్లు ఇప్పుడు లేకుండా చేశారు. పగటిపూట మాత్రమే అడపాదడపా రైళ్లు నడుస్తున్నాయి.. ∙మచిలీపట్నం–తిరుపతి మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలును కడప వరకు పొడిగించే ప్రతిపాదన కార్యరూపందాల్చేలా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. జిల్లాలు: వైఎస్సార్, అన్నమయ్య ప్రధానరైల్వేకేంద్రం: నందలూరు ప్రధానస్టేషన్లు: కడప, ఎర్రగుంట్ల, ఓబులవారిపల్లె ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలమీదుగా నడిచే రైళ్లు: 30 (డౌన్, అప్) గూడ్స్రైళ్లు: 40 స్టేషన్లు: 25 కార్మికులు: 4000 కిలోమీటర్లు: 180 -
పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్.. ముగిసిన తొలిరోజు సెషన్..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలిరోజు సెషన్ ముగిసింది. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గల దేశంగా అవతరించే దిశగా భారత్ ముందుకు సాగుతోందని బడ్జెట్ అనంతరం మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్ అన్నారు. దేశంలోని అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని అమృతకాలంలో తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. కేంద్ర బడ్జెట్లో శాఖల వారీగా కేటాయింపులు రక్షణశాఖ - రూ.5.94 లక్షల కోట్లు రోడ్డు, హైవేలు - రూ.2.70 లక్షల కోట్లు రైల్వే శాఖ - రూ.2.41 లక్షల కోట్లు పౌరసరఫరాల శాఖ - రూ.2.06 లక్షల కోట్లు గ్రామీణాభివృద్ధి శాఖ - రూ.1.6 లక్షల కోట్లు వ్యవసాయ శాఖ - రూ.1.25 లక్షల కోట్లు రూపాయి రాక.. ►2023-24 మొత్తం బడ్జెట్ రూ.45.03 లక్షల కోట్లు ►మొత్తం టాక్స్ల రూపేణా వచ్చే ఆదాయం రూ.33.61 లక్షల కోట్లు ►కేంద్ర ఆదాయంలో రాష్ట్ర పన్నుల వాటా రూ10.22 లక్షల కోట్లు ►ఇన్కం టాక్స్ రూపేణా వచ్చేది రూ.9.01 లక్షల కోట్లు ►GST ద్వారా కేంద్రానికి వచ్చే ఆదాయం రూ.9.57లక్షల కోట్లు రూపాయి పోక.. ►ప్రణాళికేతర వ్యయం రూ.25.59 లక్షల కోట్లు ►వివిధ పథకాల కోసం ప్రణాళిక ద్వారా చేసే వ్యయం రూ.19.44లక్షల కోట్లు ►వివిధ రంగాల్లో కేంద్ర పథకాల కోసం రూ.14.68 లక్షల కోట్లు ►పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటా రూ.5.13లక్షల కోట్లు వేతన జీవులకు ఊరట ►ప్రస్తుతమున్న 6 శ్లాబులను 5 శ్లాబులకు తగ్గింపు ►ఆదాయం రూ.7లక్షలు దాటితే 5 శ్లాబుల్లో పన్ను ►0-3 లక్షల వరకు నిల్ ► 3 - 6 లక్షల వరకు 5% పన్ను ►6 - 9 లక్షల వరకు 10% పన్ను ►9 -12 లక్షల వరకు 15% పన్ను ►12- 15 లక్షల వరకు 20% పన్ను ►రూ.15 లక్షలు ఆదాయం దాటితే 30% పన్ను ►రూ.9లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి చెల్లించాల్సిన పన్ను రూ.45వేలు ►రూ.15లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి చెల్లించాల్సిన పన్ను రూ.లక్షా 5వేలు ►2030 నాటికి 5 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ ఉత్పత్తి ►దేఖో అప్నా దేశ్ పేరుతో పర్యాటక అభివృద్ధి ►ఎంఎస్ఎంఈల రుణాల వడ్డీ రేటు ఒక శాతం తగ్గింపు ►బ్యాంకింగ్ సేవలు మరింత సులభతరం.. చట్ట సవరణకు అనుమతి ►మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీమ్ కింద 2లక్షల సేవింగ్స్పై 7% వడ్డీ ►సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ పరిమితి రూ.15లక్షల నుంచి 30లక్షలకు పెంపు ►సేవింగ్ అకౌంట్ పరిమితి రూ.4.5లక్షల నుంచి 9లక్షలకు పెంపు ►ఈ ఏడాదికి సవరించిన ద్రవ్యలోటు 6.4 శాతం ►వచ్చే ఏడాది ద్రవ్యలోటు 5.9% ఉండే విధంగా చర్యలు ►2026 నాటికి ద్రవ్యలోటు 5శాతం దిగువకు తీసుకురావాలని లక్ష్యం ►గతేడాది 31 కోట్ల ఫోన్లు భారత్లో తయారయ్యాయి.. ►భారత్లో తయారైన ఫోన్ల విలువ రూ.2.75లక్షల కోట్లు ►లిథియం బ్యాటరీలపై కస్టమ్ డ్యూటీ 21% నుంచి 13% తగ్గింపు ►తగ్గనున్న టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు ►టీవీ ప్యానల్స్పై కస్టమ్ డ్యూటీ 2.5 శాతం తగ్గింపు: నిర్మల ►రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే వడ్డీ రహిత రుణ సదుపాయం మరో ఏడాది పాటు పొడిగింపు ►మరిన్ని ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీ, దేశవ్యాప్తంగా చిన్న పట్టణాల్లో 50 కొత్త ఎయిర్పోర్టులు, హెలీ ప్యాడ్లు ► నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కోసం రూ.19,700 కోట్లు ►ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం రూ.38వేల కోట్లు ►లడఖ్లో 13 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం రూ.20,700 కోట్లు ►గోబర్ధన్ స్కీమ్ కింద 200 బయోగ్యాస్ ప్లాంట్లు ►సేంద్రీయ వ్యవసాయం వైపు కోటి మంది రైతులు ►తీర ప్రాంత రవాణాకు ప్రాధాన్యత ►మిస్టీ పథకం ద్వారా మడఅడవుల అభివృద్ధి ►వాహనాల తుక్కు కోసం మరిన్ని నిధుల కేటాయింపు.. ►యువత నైపుణ్యాభివృద్ధి కోసం ప్రధానమంత్రి కౌశల్ యోజన 4.0 ►రైల్వేలకు రూ.2.40లక్షల కోట్లు కేటాయింపు ►50 ఎయిర్పోర్ట్లు, పోర్టుల పునరుద్ధరణ ►ట్రాన్స్పోర్ట్ రంగానికి ప్రాధాన్యత ►నగరాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.10వేల కోట్ల అర్బన్ ఇన్ఫ్రా ఫండ్ ►ఏడాదికి అర్బన్ ఇన్ఫ్రా ఫండ్ రూ.10వేల కోట్లు ►మేక్ ఎ వర్క్ మిషన్ ప్రారంభం ►ఈ-కోర్టు ప్రాజెక్టు విస్తరణ కోసం మూడో విడత రూ. 7 వేల కోట్లు ►5 జీ సర్వీసుల కోసం 100 ల్యాబ్ల ఏర్పాటు ►2070 నాటికి కార్బన రహిత భారత్ లక్ష్యం ►త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకకు పెద్ద పీట ►కర్ణాటకలోని కరువు ప్రాంతాల అభివృద్ధికి రూ.5300 కోట్ల కేంద్ర సాయం ►రాష్ట్రాలకు వడ్డీ లేని రుణం కోసం రూ.13.7లక్షల కోట్లు ►పేద ఖైదీలు బెయిల్ పొందేందుకు ఆర్ధిక సాయం ►మూడు కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్లు ►సివిల్ సర్వెంట్లకు నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు.. ►నేషనల్ డేటా గవర్నెన్స్ పాలసీ ద్వారా కేవైసీ విధానం మరింత సులభతరం ►వ్యక్తిగత గుర్తింపు కోసం ఆధార్, పాన్కార్డ్, డిజీలాక్ ఏడు ప్రాధాన్య అంశాలతో బడ్జెట్ ►సమ్మిళిత అభివృద్ధి ►చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు ►భారీగా పెట్టుబడులు, మెరుగైన మౌలిక సదుపాయాలు ►దేశ ప్రజల సామర్థ్యానికి పెద్ద పీట ►పర్యావరణ అనుకూల అభివృద్ధి ►యువ శక్తి ►పటిష్టమైన ఆర్థిక రంగం ► మిల్లెట్లతో ఆరోగ్య జీవితం.. శతాబ్దాల నుంచి భారతీయుల ఆహారమైన మిల్లెట్లకు పెద్దపీట. ప్రపంచ స్థాయిలో మిల్లెట్ హబ్గా భారత్ను రూపొందించడమే లక్ష్యంగా.. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ ఏర్పాటు. ► ఆరోగ్యమే మహాభాగ్యం.. వ్యవసాయానికి పెద్దపీట, యువ రైతులను ప్రోత్సహించేందుకు అగ్రి స్టార్టప్ లకు ప్రత్యేక నిధి ► 102 కోట్ల మందికి 220 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ ► భారత ఆర్థిక వ్యవస్థ సరైన మార్గంలోనే పయనిస్తోంది. ఉజ్వల భవిష్యత్తు దిశగా ముందుకెళ్తోంది. దేశ ఆర్థిక వృద్ధి రేటు 7 శాతంగా అంచనా వేస్తున్నామని మంత్రి నిర్మల ప్రకటించారు. ► పార్లమెంట్లో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023-24 ను ప్రవేశపెట్టారు. తమ ప్రభుత్వ హయాంలో సాధించిన ప్రగతిని.. ఈ దఫా వార్షిక బడ్జెట్ పలు రంగాలకు కేటాయింపులు తదితర అంశాలపై ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని వినిపిస్తున్నారు. ►75 ఏళ్ల స్వతంత్ర భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపరుస్తున్న వేగుచుక్క ఈ బడ్జెట్ ►కష్ట కాలంలో మేం తెచ్చిన ఆర్థిక విధానాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి ►ప్రపంచంలో మనది ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థ ►ప్రపంచ వేదికపై భారత్ పాత్ర బలోపేతానికి జీ20 సమావేశాలు దోహదపడతాయి ►ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల కంటే మనదేశ వృద్ధిరేటు ఎక్కువ ►ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాల సంఖ్య రెట్టింపై రూ. 27 కోట్లకు చేరింది. ►11.7 కోట్ల గృహాలకు కొత్తగా టాయిలెట్లు నిర్మించాం ►భారత తలసరి ఆదాయం రూ. 2.97 లక్షలు ►2024 వరకు ఉచిత ఆహార పంపిణీ పథకం కొనసాగింపు ►మా ప్రాధాన్యత అంశాలు యువతకు ప్రాధాన్యత, అభివృద్ధి-ఉద్యోగాల కల్పన, సుస్థిరత మా లక్ష్యం ►మహిళల ఆర్థిక స్వావలంబన మా ప్రాధాన్యత అంశం ►రాష్ట్రాల భాగస్వామ్యంతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాం ►వృత్తి కళాకారులకు మరింత చేయూత ►11.4 కోట్ల మంది రైతులకు 2.2 లక్షల కోట్ల రూపాయలు అందించాం ►గ్రీన్ ఎనర్జీ మా ప్రభుత్వ ప్రాధాన్యత ►జమ్మూ కశ్మీర్, లడఖ్, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ►యువత కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీలు ►క్లీన్ప్లాంట్ కార్యక్రమానికి రూ. 2వేల కోట్లు ►చిరు ధాన్యాల పంటలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ►ఉద్యానవన పంటలకు ఆర్థిక చేయూత ►చిన్న, మధ్య తరహా రైతులకు సహకార సంఘాల ద్వారా రుణాలు ►ఫిషరీస్ కోసం ప్రత్యేక నిధి ►సప్తరిషి పేరుతో 7 రంగాలకు ప్రాధాన్యనిస్తూ బడ్జెట్ ►2047 నాటికి రక్తహీనత రూపుమాపడం కోసం ప్రత్యేక ప్రణాళిక ►50 ఏళ్ల పాటు రాష్ట్రాలకు ఇచ్చే వడ్డీలేని రుణాలు కొనసాగింపు ►రైల్వేలకు రూ. 2.40 లక్షల కోట్లు కేటాయింపు ►మూలధన వ్యయం 33% పెంపు రూ. 10లక్షల కోట్లు ►ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన ►మత్స్యశాఖకు రూ. 6 వేల కోట్ల నిధులు ►18 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను ఏర్పాటు చేస్తాం ►చిన్నారుల కోసం నాణ్యమైన పాఠ్యాంశాలు, ఉత్తమ పుస్తకాలతో కూడిన డిజిటల్ లైబ్రరీ ►ఫార్మా రంగంలో పరిశోధనల కోసం కొత్త కార్యక్రమం ►దేశవ్యాప్తంగా సహకార సంఘాల వివరాలతో నేషనల్ కో ఆపరేటివ్ డాటాబేస్ ►సేంద్రీయ సాగుకు పెద్దపీట, కోటి మంది రైతులు సేంద్రీయ వ్యవసాయం చేసేలా మార్గదర్శకాలు ►ప్రధాని ఆవాస్ యోజన కింద రూ.79వేల కోట్లతో దేశవ్యాప్తంగా బడుగులకు ఇళ్ల నిర్మాణం ►ఉపాధ్యాయులకు శిక్షణ కోసం ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో కొత్త సంస్థ ►740 ఏకలవ్య స్కూల్స్ ఏర్పాటు, 3.50లక్షల మంది విద్యార్ధులకు బోధన ►ఏకలవ్య స్కూల్స్లో 38,800 టీచర్ల నియామకం ►2023-24 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ►ప్రారంభమైన పార్లమెంట్ ► కాసేపట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్-2023ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో.. బడ్జెట్ ద్వారా భారీగా ఊరట ఉండొచ్చని గంపెడాశలు పెట్టుకున్నారు జనం. ► బడ్జెట్ 2023కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ► బడ్జెట్ 2023-24.. బడ్జెట్కు ఆమోదం దృష్ట్యా కేంద్ర కేబినెట్ సమావేశం నేపథ్యంలో పార్లమెంట్కు చేరుకున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా తదితరులు ► పార్లమెంట్కు చేరుకున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ►రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ►పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రపతిని కలిసిన ఆర్థికమంత్రి ► కాసేపట్లో పార్టమెంట్కు ఆర్థికమంత్రి కేంద్ర పద్దుపై కోటి ఆశలతో జనం.. ► కేంద్ర బడ్జెట్ 2023-24.. వచ్చే సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికలు ఉండడం. అప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్ లేదు. కాబట్టి.. గత ఐదేళ్లుగా ఊరట దక్కని వర్గాలు.. ఈసారి బడ్జెట్పై అంచనాలు పెంచుకున్నాయి. అయితే.. ప్రపంచ ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి.. ఆ ప్రభావం మన దేశ పద్దుపైనా ఉండొచ్చని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ► కేంద్ర బడ్జెట్ 2023-24.. ఉదయం 11 గంటల ప్రాంతంలో పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. పేపర్ లెస్ బడ్జెట్ కాబట్టి.. ఎక్కువ టైమ్ పట్టదు. మధ్యాహ్నం ఒంటిగంట లోపే బడ్జెట్ ప్రసంగం ముగిసే అవకాశాలు ఉన్నాయి. ► కేంద్ర బడ్జెట్ 2023-24.. ప్రధాని అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ భేటీలోనే కేంద్ర బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ► కేంద్ర బడ్జెట్ 2023-24.. రాష్ట్రపతితో భేటీ ముగిసిన తర్వాత పార్లమెంట్కు చేరుకుంటారు ఆర్థిక మంత్రి నిర్మల. ► కేంద్ర బడ్జెట్ 2023-24.. ముందుగా రాష్ట్రపతి భవన్కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రపతికి బడ్జెట్ సమాచారం ఇస్తారు. ► పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్-2023ను ప్రవేశపెట్టనున్నారు. ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది ఐదవసారి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కేంద్ర బడ్జెట్ 2023: నిర్మలమ్మ ప్రధానంగా ఫోకస్ పెట్టే అంశాలు ఇవేనా!
Union Budget 2023: ఎట్టకేలకు దేశ ప్రజలు ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్ 2023ను ప్రవేశపెట్టాల్సిన సమయం రానే వచ్చింది. ఈ రోజు (ఫిబ్రవరి 1 ) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోటి ఆశలతో ఎదురుచూస్తున్న బడ్జెట్ను పార్లమెంట్లో ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది జనాకర్షన బడ్జెట్ ఉంటుందని భావిస్తున్నారు. ఇక కేటాయింపులు విషయానికొస్తే.. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆకట్టుకునేలా ఉంటాయని తెలుస్తోంది. వీటితో పాటు సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసే అవకాశమూ ఉంది. కోవిడ్ తర్వాత నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ప్రజలు ఖర్చు కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. అయితే ఆదాయపు పన్ను స్లాబు విషయంలో గత 9 ఏళ్లుగా మార్పులు లేకుండా అలానే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వేతన జీవులను నిర్మలమ్మా కరుణిస్తుందనే అంటున్నారు. కాకపోతే ఈసారి కూడా భారీ వెసులుబాటు ఉండకపోవచ్చు కానీ.. కొద్దో గొప్పో మార్పులు ఉండే అవకాశం ఉందని వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం కనీస మినహాయింపు పరిమితిని రూ.5లక్షలకు పెంచాలన్నా ఉద్యోగుల నుంచి డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మధ్యతరగతిని ఆకట్టుకోవటానికి.. ముఖ్యంగా తయారీ మౌలిక సదుపాయల రంగాల్లో భారీగా ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యమిచ్చే అవకాశాలున్నాయి. ఇటీవల కొలువుల కోతలు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ క్రమంలో పట్టణ ఉపాధి కల్పన పథకానికి శ్రీకారం చుట్టే ప్రతిపాదనలు ఉన్నాయంటూన్నారు. వీటితో పాటుగా గృహరుణాలు. ఆరోగ్య ఖర్చులపై పన్నుల్లో కాసింత వెసలుబాటు కల్పించే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆరోగ్య సంరక్షణ, విద్య, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు అధిక నిధులు కేటాయించాల్సిన అవశ్యకత కనిపిస్తోంది. రైల్వే శాఖకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. రైతులకు పెట్టుబడి సాయం పెంపు ఉండచ్చని తెలుస్తోంది. ఇక బంగారం దిగుమతులపై పన్ను తగ్గించడంతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులపై దిగుమతి సుంకం పెంచే అవకాశం కనిపిస్తోంది. -
సవాల్ మీద సవాల్.. ఆ వర్గాలకు వరాలు ఏ స్థాయిలో..?
ఊరటలు, ఊరడింపులు, ఉపశమనాల కోసం ఉద్యోగులు మొదలుకుని ఆర్థిక నిపుణులు, పరిశ్రమ వర్గాల దాకా అందరూ ఏటా ఎదురు చూసే తరుణం మరోసారి రానే వచ్చింది. కరోనా కల్లోలం నుంచి బయటపడాం అనుకునేలోపే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రూపంలో మరో పిడుగు నెత్తినపడింది. ఆ వెంటే ఉద్యోగాల కోత.. తరుముకొస్తున్న ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని ఊపిరి సలపకుండా చేశాయి. ఈ తరుణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి నెలకొంది. ఒకవైపు ప్రపంచం సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు భారత్ బడ్జెట్కు సిద్ధమైంది. సాధారణంగా బడ్జెట్ అనగానే ప్రతి రంగం కొన్ని ప్రయోజనాలను ఆశించటం సహజం. కానీ, ఈసారి పేద, మధ్యతరగతి ఆశలపైనే ప్రధాన దృష్టి నెలకొంది. ఎందుకంటే.. ప్రపంచవ్యాప్త ఆర్థిక, సామాజిక పరిణామాల ప్రభావం భారత మధ్యతరగతిపైనా పడింది. అందుకే ఈసారి బడ్జెట్లో ఈ వర్గాలకు కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇందుకు మరో కారణం లేకపోలేదు.. తరుముకొస్తున్న ఎన్నికలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కేంద్ర సర్కార్కు సార్వత్రిక ఎన్నికలు 2024 కంటే ముందు ప్రవేశపెట్టబోయే పూర్తిస్థాయి చివరి బడ్జెట్ ఇది. సాధారణంగా పేద,మధ్య తరగతి వర్గాలే ఓటు బ్యాంక్లో కీలకంగా వ్యవహరిస్తుంటాయి. ఈ తరుణంలో ఆర్థిక క్రమశిక్షణ వైపు మొగ్గితే.. ప్రజాకర్షణపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే బడ్జెట్ విషయంలో కేంద్రం జాగ్రత్తగా కసరత్తులు చేసినట్లు స్పష్టమవుతోంది. పెరుగుతున్న ధరలతో కుటుంబాల పొదుపు తగ్గుతున్న నేపథ్యంలో.. ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులను వేతన జీవులు ఆశిస్తున్నారు. కనీస మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలన్న డిమాండు బలంగా వినిపిస్తోంది. ఏటా ఈ పన్నుల విషయంలో నిరాశే మిగులుతోంది. ఈసారైనా స్వల్ప ఊరటైనా దక్కుతుందా? అనేది చూడాలి. అయితే.. ఎన్నికల వేళ పేద, మధ్య తరగతి వర్గాలకు పలు తాయిలాలూ ఉంటాయంటున్నారు. ఆదాయ పన్ను శ్లాబులను తగ్గించకపోయినా ఉద్యోగులకు ఎంతో కొంత ఊరటనిచ్చేలా 80సి పన్ను మినహాయింపుల పెంపు వంటి చర్యలుండవచ్చని చెబుతున్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు వంటివాటిపై పలు వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. ద్రవ్యోల్బణ ప్రభావం ఆదాయ పన్ను ఊరటపై ఎప్పట్లాగే వేతన జీవులు మరోసారి ఆశలు పెట్టుకోగా, భయపెడుతున్న ద్రవ్యల్బోణం కట్టడికి తీసుకోబోయే చర్యలపై ఆర్థిక నిపుణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేశంలో.. రూ.5-10 లక్షల మధ్య వార్షికాదాయ ఉన్న వర్గంపై ద్రవ్యోల్బణ భారం భారీగా ఉంది. ఎలాంటి రాయితీలకు నోచుకోని ఈ వర్గం.. ఈసారి కేంద్ర బడ్జెట్పైనే ఆశలు పెట్టుకుంది. తగ్గుతున్న ఆదాయం, పెరుగుతున్న జీవన వ్యయాలు, ఉద్యోగాల్లో కోతలు.. తదితరాల నుంచి తమకు ఊరటనిచ్చే ప్రకటనలేమైనా చేస్తుందేమోనని వీరంతా ఆశిస్తున్నారు. వచ్చే ఏడాది కీలకమైన లోక్సభ ఎన్నికలున్నందున ప్రజలపై మరీ భారం మోపలేని పరిస్థితి. పైపెచ్చు ఎన్నో కొన్ని తాయిలాలు ప్రకటించాల్సిన అనివార్యత. వీటన్నింటినీ సంతృప్తి పరుస్తూనే.. దేశ ఆర్థిక రంగాన్ని పరుగులు తీయించడమనే ప్రధానాంశంతో ఆర్థిక పద్దుకు రూపమివ్వడంలో నిర్మలా సీతారామన్ ఏ మేరకు నెగ్గుకొచ్చారో చూడాలి. -
స్టాక్ మార్కెట్: బడ్జెట్ ముందు అప్రమత్తత
ముంబై: ఒడిదుడుకుల ట్రేడింగ్లో స్టాక్ మంగళవారం సూచీలు స్వల్ప లాభాలతో గటెక్కాయి. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ లోక్సభలో 2022–23 ఆర్థిక సర్వే సమర్పణ, నేడు(బుధవారం)బడ్జెట్, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల నిర్ణయం వెల్లడి తదితర కీలక పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వహించారు. ట్రేడింగ్లో 683 పాయింట్ల పరిధిలో సెన్సెక్స్ 49 పాయింట్లు పెరిగి 59,550 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 198 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఆఖరికి 13 పాయింట్ల లాభంతో 17,662 వద్ద నిలిచింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఐటీ, ఫార్మా, అయిల్అండ్గ్యాస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విస్తృత స్థాయి మార్కెట్లో చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్ నెలకొంది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు వరుసగా 1.50%, రెండుశాతానికి పైగా పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.5,440 కోట్ల షేర్లను విక్రయించగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.4,506 కోట్ల షేర్లను కొన్నారు. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ వెల్లడి(నేడు) ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఖాతా లోటు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక సర్వే తెలపడంతో రూపాయి 41 పైసలు క్షీణించి 81.93 స్థాయి వద్ద స్థిరపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► జనవరి అమ్మక గణాంకాల వెల్లడి(నేడు)కి ముందు ఆటో కంపెనీల షేర్లు రాణించాయి. అశోక్ లేలాండ్, ఎంఅండ్ఎం, భాష్, మదర్శన్, ఐషర్ మోటార్స్ షేర్లు 3.50% నుంచి మూడుశాతం దూసుకెళ్లాయి. హీరోమోటోకార్ప్, ఎంఆర్ఎఫ్, టాటా మోటార్స్ షేర్లు రెండుశాతం పెరిగాయి. భారత్ ఫోర్జ్, మారుతీ సుజుకీ, టీవీఎస్ మోటార్స్ షేర్లు ఒకశాతం లాభపడ్డాయి. ► క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా యాజమాన్య బలహీన అంచనా వ్యాఖ్యలతో టెక్ మహీంద్రా అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో రెండుశాతం నష్టపోయి రూ.1,015 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో నాలుగుశాతం క్షీణించి రూ.996 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. -
ఆర్థిక సర్వే 2023: ఈ దశాబ్ధం భారత్దే
న్యూఢిల్లీ: ఆర్థిక సర్వే 2023ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన మంగళవారం సభ ముందుంచారు. ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ సూచనల మేరకు కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల విభాగం దీన్ని రూపొందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)తో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2023–24) జీడీపీ వృద్ధి కొంత నిదానించే అవకాశాల్లేకపోలేదని అంచనా వేసింది. అయినా కానీ, 6–6.8 శాతం మధ్య నమోదు కావచ్చని పేర్కొంది. సాధారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు, చేపట్టాల్సిన చర్యలు, భవిష్యత్ అంచనాలను ఆర్థిక సర్వే తేటతెల్లం చేస్తుంది. ‘‘2020 నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మూడు షాక్లు తగిలాయి. కరోనా రాకతో ప్రపంచ ఉత్పత్తికి బ్రేక్ పడింది. తర్వాత రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా కమోడిటీ ధరలను పెంచేసింది. ఫలితంగా ద్రవ్యోల్బణం ఎగిసింది. దీనికి కట్టడి వేసేందుకు ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు కీలక వడ్డీ రేట్ల పెంపును చేపట్టాయి. యూఎస్ ఫెడ్ రేట్లను భారీగా పెంచడంతో పెట్టుబడులు అమెరికా మార్కెట్కు తరలేలా చేసింది. దీంతో ఎన్నో కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడింది. ఫలితంగా మన దేశ కరెంటు ఖాతా లోటు విస్తరించింది. నికర దిగుమతి దేశమైన భారత్ వంటి వాటిపై ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు దారితీసింది. అయినప్పటికీ 2021–22లో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకుంది. అమెరికా కేంద్ర బ్యాంకు ఇక ముందూ రేట్లను పెంచే అవకాశాల నేపథ్యంలో రూపాయిపై ఒత్తిడి కొనసాగుతుంది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు గరిష్ట స్థాయిలోనే ఉన్నందున పెరిగిన కరెంటు ఖాతా లోటు (క్యాడ్) అదే స్థాయిలో కొనసాగొచ్చు’’ అని సర్వే వివరించింది. జీడీపీకి ఢోకా లేదు.. దేశ జీడీపీ 2022–23లో 7 శాతం మేర ఉండొచ్చు. 2022–23లో నమోదైన 8.7 శాతం కంటే తక్కువ. 2023–24 ఆర్థిక సంవత్సరానికి 6–6.8 శాతం మధ్య ఉండొచ్చు. అంతర్జాతీయంగా ఆర్థిక, భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావం దీనిపై ఉంటుంది. కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంది. రానున్న ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అన్నది బలమైన డిమాండ్, మూలధన పెట్టుబడులు పుంజుకోవడంపై ఆధారపడి ఉంటుంది. ప్రైవేటు మూలధన నూతన చక్రం స్పష్టంగా కనిపిస్తోంది. కొనుగోలు శక్తి పరంగా భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మారకం రేటు పరంగా ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థ. ప్రైవేటు వినియోగం పెరగడం, మూలధన పెట్టుబడులు అధికంగా ఉండడం, కార్పొరేట్ల బ్యాలన్స్ షీట్లు బలంగా మారడం, చిన్న వ్యాపార సంస్థలకు రుణ లభ్యత, వృద్ధికి మద్దతునిచ్చే అంశాలు. 2022–23 మొదటి ఎనిమిది నెలల్లో కేంద్ర సర్కారు మూలధన వ్యయాలు 63.4 శాతం పెరిగాయి. వృద్ధికి ఇది కూడా మద్దతునిచ్చే అంశం. దేశ ఆర్థిక వ్యవస్థ 2025–26 లేదా 2026–27 నాటికి 5 ట్రిలియన్ డాలర్లకు (రూ.410 లక్షల కోట్లు), 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్లకు (రూ.574 లక్షల కోట్లు) చేరుకోవచ్చు. దీని ప్రకారం ఆర్థిక వృద్ధి విషయంలో ఈ దశాబ్దం భారత్దేనని ఆర్థిక సర్వే తేల్చిచెప్పింది. ద్రవ్యోల్బణం/రూపాయి ద్రవ్యోల్బణం రేటు 2022 ఏప్రిల్లో 7.8 శాతానికి పెరిగింది. ఆర్బీఐ గరిష్ట పరిమితి 6 శాతానికంటే ఎక్కువ. అయినప్పటికీ ప్రపంచంలో అతి తక్కువ ద్రవ్యోల్బణం దేశాల్లో భారత్ ఒకటి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ ద్రవ్యోల్బణ అంచనా 6.8 శాతం అన్నది గరిష్ట పరిమితి కంటే ఎక్కువ. కానీ వడ్డీ రేట్లు పెరుగుదల అన్నది ప్రైవేటు వినియోగాన్ని దెబ్బతీసేంత స్థాయిలో లేదు. ఎగుమతులు: 2021–22లో దేశ ఎగుమతులు 422 బిలియన్ డాలర్ల ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరినప్పటికీ.. తదనంతర పరిస్థితులు ఎగుమతుల వృద్ధికి అవరోధం కలిగిస్తున్నాయి. ఎగుమతి దేశాలను విస్తరించుకోవడం, స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల ద్వారా ఈ బలహీనతను అధిగమించొచ్చు. ► భారత్ ఇప్పటికే ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. మార్చి నాటికి 3.5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుంది. ► భారత్కు చెందిన స్టార్టప్లకు సులభతర పన్నుల విధానం, ప్రక్రియలు అవసరం. ► పీఎం గతిశక్తి (మౌలిక సదుపాయలు విస్తరణకు ఉద్దేశించినది), నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ, పీఎల్ఐ ప్రోత్సాహకాలు ఆర్థిక వృద్ధిని బలోపేతం చేస్తాయి. అంతర్జాతీయంగా జీడీపీలో రవాణా వ్యయాలు 8 శాతంగా ఉంటే, మనదేశంలో 14–18 శాతం మధ్య ఉన్నాయి. ► దేశ ఫార్మాస్యూటికల్ మార్కెట్ 2030 నాటికి 130 బిలియన్ డాలర్లకు విస్తరిస్తుంది. 2021 నాటికి 41 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2024 నాటికి 65 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. కరోనా సంవత్సరం 2020–21లో ఈ రంగం 24 శాతం వృద్ధిని చూసింది. ► షిప్పింగ్ కార్పొరేష్, ఎన్ఎండీసీ స్టీల్, బీఈఎంఎల్, హెచ్ఎల్ఎల్ లైఫ్కేర్, కాంకర్, వైజాగ్ స్టీల్, ఐడీబీఐ బ్యాంక్ ప్రస్తుతం ప్రైవేటీకరణ దశలో ఉన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చాలా వరకు వీటి ప్రైవేటీకరణ పూర్తవుతుంది. ► ఫిజికల్, డిజిటల్ సదుపాయాల సమన్వయం భారత భవిష్యత్ను నిర్ణయించనుంది. కొత్త సేవలకు డిజిటల్ మాధ్యమం విస్తరించినందున తగిన నియంత్రణలు అవసరం. ఆధార్, యూపీఐ తదితర విజయవంతమైన విధానాలను సర్వే ప్రస్తావించింది. ► 5జీ మొబైల్ సేవల విస్తరణతో నూతన ఆర్థిక అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. స్టార్టప్లు, మరిన్ని వ్యాపార ఆవిష్కరణలు ఊపందుకుంటాయి. ► భారత ఆర్థికాభివృద్ధి, ఇంధన భద్రతకు గ్రీన్ హైడ్రోజన్ కీలకంగా మారనుంది. సమగ్ర రూపం భారత వృద్ధి పథం, భారత్ పట్ల ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆశావాదం, మౌలిక రంగంపై దృష్టి, సాగులో వృద్ధి, పరిశ్రమలు, భవిష్యత్ రంగాలపై దృష్టిని ఆర్థిక సర్వే సమగ్రంగా తెలియజేసింది. – ప్రధాని మోదీ కరెన్సీ, చమురుపైనే.. 2025–26 లేదా 2026–27 నాటికి 5 ట్రిలియన్ డాలర్లకు మన ఆర్థిక వ్యవస్థ చేరుకోవచ్చు. 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. కరెన్సీ మారకం రేట్లపైనే ఈ లక్ష్యాలను చేరుకోవడం ఆధారపడి ఉంటుంది. చమురు ధరలపై అంచనాలు ఇవ్వడం కష్టం. ఆర్బీఐ చెప్పినట్టు బ్యారెల్ 100 డాలర్లకు దిగువన ఉంటే, సర్వేలో పేర్కొన్న వృద్ధి గణాంకాలను చేరుకోవడం సాధ్యపడుతుంది. చమురు 100 డాలర్లకు దిగువన ఉన్నంత కాలం మన వృద్ధి లక్ష్యాలకు విఘాతం కలగదు. – అనంత నాగేశ్వరన్, ముఖ్య ఆర్థిక సలహాదారు ఉపాధి కల్పన.. ఓకే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడం, నిర్మాణ రంగ కార్యకలాపాలు పెరగడం ఉపాధి అవకాశాలను పెంచినట్టు ఆర్థిక సర్వే పేర్కొంది. కరోనా సమయంలో లాక్డౌన్లతో పట్టణాల నుంచి వలసపోయిన కార్మికులు తిరిగి వచ్చేలా చేశాయి. మహ్మాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో నేరుగా ఉపాధి అవకాశాల కల్పన జరుగుతోంది. పీఎం కిసాన్, పీఎం గరీబ్ కల్యాణ్ యోజన దేశంలో ఆహార భద్రతకు తోడ్పడుతున్నాయి. పట్టణాల్లో నిరుద్యోగం 7.2 శాతానికి తగ్గింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) రుణాల వృద్ధి 2022 జనవరి–నవంబర్ మధ్య 30.6% ఉంది. దీనికి అత్యవసర రుణ హామీ పథకం తోడ్పడింది. దేశంలో 6 కోట్లకు పైగా ఎంఎస్ఎంఈలు ఉండగా, 12 కోట్ల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఈవీ విక్రయాలు@ కోటి.. 2030 నాటికి ఏటా 1 కోటి విద్యుత్ వాహనాలు అమ్ముడవుతాయని ఎకనమిక్ సర్వే తెలిపింది. దీనితో ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 కోట్ల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగగలదని పేర్కొంది. 2022–2030 మధ్య ఈవీల మార్కెట్ వార్షికంగా 49 శాతం వృద్ధి చెందగలదని వివరించింది. పరిశ్రమ వర్గాల ప్రకారం 2022లో సుమారు 10 లక్షల విద్యుత్ వాహనాలు అమ్ముడయ్యాయి. వాహన విక్రయాలపరంగా డిసెంబర్లో జపాన్, జర్మనీలను అధిగమించి భారత్ మూడో స్థానానికి చేరింది. ఆరోగ్యం.. మెరుగు ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల వల్ల ప్రతీ వ్యక్తి ఆరోగ్యం కోసం తన పాకెట్ నుంచి చేసే ఖర్చు 2013–14లో 64.2 శాతంగా ఉంటే, 2018–19 నాటికి 48.2 శాతానికి తగ్గింది. శిశు మరణాల రేటు కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2023 జనవరి 6 నాటికి 220 కోట్ల కరోనా టీకా డోస్లు ప్రజలకు ఇవ్వడం పూర్తయింది. 2023 జనవరి 4 నాటికి ఆయుష్మాన్ భారత్ పథకం కింద 22 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. వ్యవసాయం.. సవాళ్లు సాగు రంగం మెరుగైన పనితీరు చూపిస్తున్నప్పటికీ.. వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొంటోంది. అలాగే, పెరిగిపోతున్న సాగు వ్యయాలు కూడా సవాలుగా మారాయి. సాగులో యంత్రాల వినియోగం తక్కువగా ఉండడం, తక్కువ ఉత్పాదకత సవాళ్లుగా ఉన్నాయి. కనుక ఈ రంగంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గడిచిన ఆరు సంవత్సరాలుగా సాగు రంగం వార్షికంగా 4.6 శాతం చొప్పున వృద్ధి సాధించింది. కానీ, 2020–21లో 3.3 శాతం, 2021–22లో 3 శాతమే వృద్ధి చెందింది. ప్రపంచ తయారీ కేంద్రంగా.. ప్రపంచ తయారీ కేంద్రంగా మారేందుకు భారత్ ముందు ప్రత్యేక అవకాశం ఉంది. కరోనా అనంతరం ఎదురైన సవాళ్ల నేపథ్యంలో విదేశీ కంపెనీలు తమ తయారీ, సరఫరా వ్యవస్థలను బలంగా మార్చుకోవాలని కోరుకుంటున్నాయి. ప్రస్తుతం దేశ జీడీపీలో తయారీ వాటా 15–16%గా ఉంటే, రానున్న సంవత్సరాల్లో 25%కి చేరుకుంటుంది. భారత్లో తయారీ 2.0 కోసం 27 రంగాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే పీఎల్ఐ పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటికి 14 రంగాలకు పీఎల్ఐ పథకాలను ప్రకటించారు. -
కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై గంపెడు ఆశలతో ఎదురుచూపు
సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన గాయాలతోపాటు కోవిడ్ మహమ్మారి విసిరిన సంక్షోభంతో రాష్ట్రం ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్లో అయినా ఆంధ్రప్రదేశ్పై కేంద్రం కరుణ చూపుతుందని రాష్ట్ర ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకుంది. కోవిడ్తో రాష్ట్రం భారీగా ఆదాయం కోల్పోయింది. మరోవైపు ఉమ్మడి ఏపీ విభజన జరిగిన నాటి నుంచి రాష్ట్రం రెవెన్యూ లోటులోనే ఉంటోంది. ఈ నేపథ్యంలోనైనా బుధవారం కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపులో తగు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న జాతీయ సంస్థలకు జాతీయ గ్రాంట్ల రూపంలో ఈసారైనా బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయిస్తుందని ఆశిస్తోంది. రాష్ట్ర విభజన జరిగిన 2014–15 ఆర్థిక ఏడాదిలో ఏర్పడ్డ రెవెన్యూ లోటు భర్తీకి ఈసారి బడ్జెట్లోనైనా పూర్తి స్థాయిలో కేంద్రం నిధులు కేటాయించాలని కోరుతోంది. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు అవుతున్నా విభజన జరిగిన ఆర్థిక ఏడాదిలో ఏర్పడిన రెవెన్యూ లోటును ఇంకా పూర్తి స్థాయిలో భర్తీచేయకపోవడం సరికాదని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ప్రధాని మోదీని కలిసిన సందర్భంగా రెవెన్యూ లోటు భర్తీకి నిధుల మంజూరు చేయాలని కోరారని చెబుతున్నాయి. ఈ క్రమంలో ఈసారి బడ్జెట్లోనైనా ఫలితం ఉంటుందని ఆశిస్తున్నట్లు వెల్లడించాయి. ప్రత్యేక అభివృద్ధి సాయంపై ఆశలు.. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి సాయం కింద బడ్జెట్లో రూ.24,350 కోట్లు నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. అలాగే విశాఖకు మెట్రో రైలు మంజూరు చేయడంతోపాటు తగినన్ని నిధులు ఇవ్వాలని విన్నవించింది. ఇందుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను కూడా సమర్పించింది. ఈ నేపథ్యంలో ఈ బడ్టెట్లో మెట్రో రైలు ప్రకటనతో పాటు కేంద్రం నిధులు కేటాయిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. అదేవిధంగా రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేసినందున జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మిగిలిన 12 జిల్లాలకు వైద్య కళాశాలలకు నిధులు కేటాయించాలని కోరుతోంది. అలాగే రాజధాని వికేంద్రీకరణతో ఆ కార్యకలాపాలకు కూడా నిధులను ఆశిస్తోంది. ఇక పోలవరం ప్రాజెక్టుకు పెండింగ్ నిధులను ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తోంది. అదేవిధంగా ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని కోరుతోంది. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద పదేళ్ల పాటు జీఎస్టీ రీయింబర్స్మెంట్, ఆదాయపన్ను మినహాయింపు, 100 శాతం ఇన్సూరెన్స్ ప్రీమియం రీయింబర్స్మెంట్లను కేంద్ర బడ్జెట్లో ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. -
కేంద్రం కనికరమెంత?
సాక్షి, అమరావతి: విభజన చట్టం ప్రకారం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చుక్కానిలా నిలిచే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత మొత్తం కేంద్రానిదే. ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తెచ్చి, వంద శాతం వ్యయాన్ని భరించి సత్వరమే ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేయాలి. ఇందుకోసం 2014లోనే కేంద్రం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ని ఏర్పాటు చేసింది. పీపీఏతో ఒప్పందం చేసుకోవాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది. అయితే, అప్పటి సీఎం చంద్రబాబు.. కమీషన్ల కోసం ఆ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు. ప్రత్యేక హోదాను కూడా వదులుకోవడానికి కూడా అంగీకరించారు. దీంతో కేంద్రం పోలవరం నిర్మాణ బాధ్యత నుంచి తప్పుకొంది. 2016 సెప్టెంబరు 7న అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. బడ్జెట్లో కేటాయింపుల ద్వారా కాకుండా ఎల్టీఐఎఫ్(దీర్ఘకాలిక నీటి పారుదల నిధి) రూపంలో నాబార్డు రుణం ద్వారా నిధులను తిరిగి చెల్లిస్తామని (రీయింబర్స్ చేస్తామని) మెలిక పెట్టింది. దీనికీ చంద్రబాబు అంగీకరించారు. ఈమేరకు 2016 డిసెంబర్ 26న సంతకం చేశారు. దాంతో బడ్జెట్లో నిధుల కేటాయింపు హక్కును రాష్ట్రం కోల్పోయింది. 2017–18 నుంచి బడ్జెట్లో కేంద్రం నిధుల కేటాయింపులు నిలిపివేసింది. పోలవరం మినహా ఏఐబీపీ (సత్వర సాగునీటి ప్రయోజన పథకం) కింద చేపట్టిన 99 ప్రాజెక్టులు పూర్తవడంతో 2022–23లో ఎల్టీఐఎఫ్ను కేంద్రం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఈసారైనా బడ్జెట్లో కేంద్రం నిధులు కేటాయించి, సకాలంలో ప్రాజెక్టు పూర్తికి సంపూర్ణ సహకారం అందిస్తామంటూ విభజన చట్టంలో ఇచ్చిన హామీకి కట్టుబడుతుందా? లేదా? అన్నది ఫిబ్రవరి 1న వెల్లడికానుంది. రీయింబర్స్ ప్రక్రియలో తీవ్ర జాప్యం ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినప్పటి నుంచి నిర్మాణానికి అయిన ఖర్చును కేంద్రం నాబార్డు రుణాలతోనే రీయింబర్స్ చేస్తోంది. ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇది నిధుల కొరతకు దారితీసి, ప్రాజెక్టు పనులపై ప్రభావం చూపుతోంది. 2021–22లో బడ్జెట్లో కేటాయించకపోయినప్పటికీ, భారీ, మధ్య తరహా ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల్లో మిగులు ఉండటంతో రూ.320 కోట్లను బడ్జెట్ ద్వారా పోలవరానికి కేంద్రం విడుదల చేసింది. 2022–23 బడ్జెట్లోనూ పోలవరానికి నిధులను కేటాయించలేదు. కేంద్రం బడ్జెట్ ద్వారా సరిపడా నిధులు కేటాయించి, సకాలంలో రీయింబర్స్ చేస్తే– పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. -
రాష్ట్రపతికి మేము వ్యతిరేకం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని బహిష్కరించాం తప్ప రాష్ట్రపతికి తాము వ్యతిరేకం కాదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు స్పష్టం చేశారు. అందుకే పార్లమెంటులో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపామన్నారు. గత ఎనిమిదేళ్లలో కేంద్రం ప్రజలకు ఏమీ చేయలేదని... ఎన్డీయే ప్రభుత్వం చేస్తున్న తప్పులను నిలదీయకపోతే ఎలా? అని ప్రశ్నించారు. దేశంలో ప్రజల సొమ్మును బడా వ్యాపారవేత్తలకు కట్టబెట్టేలా పాలన సాగుతోందని... అందుకే గౌతమ్ అదానీ పేరుతో కేంద్రం అదానీ చట్టాన్ని తేవాలని కేకే ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని ఆమ్ ఆద్మీ పారీ్టతో కలిసి బహిష్కరించిన అనంతరం విజయ్చౌక్లో బీఆర్ఎస్ ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, వెంకటేశ్ నేత, సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, సురేశ్రెడ్డి, కవిత, దామోదర్రావు, శ్రీనివాస్రెడ్డి, దయాకర్, రాములు, పార్థసారథి రెడ్డి, లింగయ్య యాదవ్లతో కలిసి కేకే, నామా నాగేశ్వరరావులు మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగం ప్రస్తావన ఏదీ?: కేకే రాష్ట్రపతి తన ప్రసంగంలో సామాజిక, గిరిజన, మహిళల అంశాలపై గొప్పగా పేర్కొన్నా అవన్నీ ఎక్కడా అమలులో లేవని కె. కేశవరావు విమర్శించారు. దేశంలో నిరుద్యోగం తీవ్రంగా ఉన్నా రాష్ట్రపతి ప్రసంగంలో కనీసం ఆ మాటే లేదని, విద్య, ఆరోగ్యం ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్రం వీటన్నింటిపై దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణలో గవర్నర్ కారణంగా బడ్జెట్ ఆమోదం కోసం కోర్టుల దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహారంతో ఆప్ ప్రభుత్వం పడుతున్న ఇబ్బందులను చూస్తున్నామన్నారు. అలాగే కేరళ, తమిళనాడు సహా అనేక రాష్ట్రాల్లో గవర్నర్ల ద్వారా జరుగుతున్న పరిణామాలు దేశంలో అందరూ గమనిస్తున్నారని తెలిపారు. వీటన్నింటిపై ఇప్పటికైనా కేంద్రం దృష్టి సారించాలనే ఉద్దేశంతోనే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలన్న నిర్ణయం తీసుకున్నామని కేకే తెలిపారు. రాష్ట్ర అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తాం: నామా రాష్ట్రపతి ప్రసంగంలో మహిళల గురించి ప్రస్తావించినా మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ప్రస్తావించలేదని ఎంపీ నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. అలాగే పలుమార్లు అంబేడ్కర్ పేరును తలుచుకున్నా కొత్త పార్లమెంటు భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలన్న తమ డిమాండ్కు సంబంధించి ఎలాంటి ప్రస్తావన చేయలేదని విమర్శించారు. వీటితోపాటు రైతు సమస్యలు, దేశవ్యాప్తంగా రైతుబంధు అమలు, పంటలకు కనీస మద్దతు ధర, రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్లను ప్రస్తావించలేదని విమర్శించారు. దేశంలో ఇంటింటికీ సురక్షిత మంచినీరు ఇచ్చామని కేంద్రం రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పుకుందని... అయితే తెలంగాణలో ఇంటింటికీ ఎప్పుడో ప్రక్రియను పూర్తి చేశామన్నారు. తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్న కేంద్ర ప్రభుత్వం... రాష్ట్రాభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటోందని నామా ప్రశ్నించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తామని నామా స్పష్టం చేశారు. -
Telangana: మనకొచ్చేది ఎంత?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉంటాయోననే దానిపై తెలంగాణ ప్రభుత్వ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కేంద్ర పన్నుల్లో వాటా తగ్గుదల, ఎఫ్ఆర్బీఎం పరిమితి, అమల్లోకి రాని నీతి ఆయోగ్, ఆర్థిక సంఘాల సిఫారసుల విషయంలో కేంద్రం ఏం చేస్తుందన్న దానిపై చర్చ జరుగుతోంది. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదాతోపాటు రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు వంటి రాష్ట్ర విభజన హామీల విషయంలో కేంద్రం ఈ ఏడాదైనా సానుకూలంగా స్పందిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. అప్పులపై పరిమితులు, గ్రాంట్ల బకాయిలు, పన్నుల్లో వాటాల తగ్గింపు, సిఫారసులు అమలుకాని కారణంగా రాష్ట్రానికి ఇప్పటివరకు దాదాపు రూ.లక్ష కోట్లకుపైగా నష్టం జరిగిందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. వివిధ అంచనాల్లో ఆర్థికశాఖ.. మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు ఎలా ఉంటుందోనని ఆర్థిక శాఖ అధికారులు లెక్కలు వేసుకుంటున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు చేయకపోవడమే కాకుండా అప్పులు తెచ్చుకునే పరిమితుల కారణంగా రాష్ట్ర బడ్జెట్లో రూ.15వేల కోట్లకుపైగా లోటు వచి్చందని.. ప్రత్యేక గ్రాంట్లు కూడా ఇవ్వకపోవడంతో ఈ ఏడాది దాదాపు రూ.30వేల కోట్ల వరకు నష్టపోయామని ఆ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ‘కార్పొరేషన్లకు పూచీకత్తు ఇచ్చి తీసుకునే రుణాలను రాష్ట్ర ప్రభుత్వ అప్పుల కింద ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి తీసుకురాకుండా వెసులుబాటు కల్పి స్తుందా? పన్నుల్లో వాటా కింద రాష్ట్రాలకు ఎంత ప్రతిపాదిస్తుంది? కేంద్ర ప్రాయోజిత పథకాల విషయంలో నిర్మలా సీతారామన్ పెద్ద మనసు చూపుతారా? ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణం, ఉపాధి హామీ, వెనుకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపు, మహిళాశిశు సంక్షేమ పద్దులను పెంచడం ద్వారా పరోక్షంగానైనా రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతనిస్తారా’అన్న కేంద్ర బడ్జెట్లో తేలిపోనుందని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మేరకు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు, ఇతర నష్టాలు ►పన్నుల్లో వాటా తగ్గింపు కారణంగా రెవెన్యూ నష్టం: రూ.33,712 కోట్లు ►నీతి ఆయోగ్ మిషన్ భగీరథ సిఫారసులు: రూ.19,205 కోట్లు ►నీతి ఆయోగ్ మిషన్ కాకతీయ సిఫారసులు: రూ.5 వేల కోట్లు ►ఏపీ నుంచి ఇప్పించాల్సిన విద్యుత్ బకాయిలు: రూ.17,828 కోట్లు ►ఎఫ్ఆర్బీఎం పరిమితుల కారణంగా 2022–23లో అప్పుల నష్టం: రూ.15,303 కోట్లు ►ఆంక్షలు అమలు చేయలేదంటూ జీఎస్డీపీలో 5 శాతం రుణ పరిమితితో నష్టం: రూ.6,104 కోట్లు ►15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన గ్రాంట్లు: రూ.5,374 కోట్లు ►వెనుకబడిన జిల్లాలకు నిధుల బకాయిలు: రూ.1,350 కోట్లు ►14వ ఆర్థిక సంఘం సిఫారసుల బకాయిలు: రూ.817 కోట్లు ►15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన ప్రత్యేక నిధులు: రూ.723 కోట్లు ►ఏపీకి పొరపాటుగా బదిలీ అయిన సీసీఎస్ పథకాల నిధులు: రూ.495 కోట్లు ►2020–21లో పౌష్టికాహార పంపిణీ కోసం ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన నిధులు: రూ.171 కోట్లు -
ఇక బడ్జెట్లో ఏది పెరిగినా మనమీద ప్రభావం పడకుండా అన్నీ కొనుక్కొచ్చేశా!
ఇక బడ్జెట్లో ఏది పెరిగినా మనమీద ప్రభావం పడకుండా అన్నీ కొనుక్కొచ్చేశా! -
కేంద్ర బడ్జెట్: పంపకంలో ప్రజలకు వాటా దక్కేనా?
నేడు దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో 2023–24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశ పెట్టబోతున్నారు. దేశంలో నెలకొని ఉన్న దశాబ్దాల రికార్డు స్థాయి నిరుద్యోగం, పెరిగిపోతోన్న కటిక పేదల సంఖ్య, నింగినంటుతోన్న ధరలు, పడిపోతోన్న దేశీయ ఆర్థిక వృద్ధిరేటు వంటి సమస్యల వలన నేడు ప్రజల దృష్టి, ఈ సమస్యల పరిష్కారం కోసం బడ్జెట్ ఏమైనా చేయగలదా అనే దానిపై కేంద్రీకరించి ఉంది. ఏ బడ్జెట్ అయినా ఒక్కసారిగా, ఆ ఒక్క ఆర్థిక సంవత్సర కాలంలోనే సమస్యలన్నింటినీ పరిష్కరించేయలేదు. కానీ, అందుబాటులో ఉన్న వనరుల మేరకు ఆ దిశగా సాధ్యమైనంత మేరకు ప్రయత్నం చేయటం వీలయ్యేదే! ఆ పని తాజా బడ్జెట్ చేస్తుందా? ఒక దేశం తాలూకూ బడ్జెట్ను, ఆ దేశంలోని సంపదను సృష్టించే ఉద్యోగులు, కార్మికులు, రైతాంగం తదితర సామాన్య జనానికి మేలు చేసే విధంగానూ రూపొందించొచ్చు; ధనవంతులు, కార్పొరేట్లు లేదా ఆ దేశంలో పెట్టుబడులు పెట్టే విదేశీ మదుపుదారుల ప్రయోజనాల కోసమూ రూపొందించవచ్చు. మన దేశీయ బడ్జెట్లు ఇప్పటివరకూ ఏ తరహాలో రూపొందాయి? దీనికి జవాబు సరళం. గతంలో మన బడ్జెట్లు, ప్రభుత్వ విధానాలు అందుబాటులో ఉన్న సంపదలో అత్యధిక వాటా దానిని సృష్టించిన ప్రజలకు పంపిణీ చేసి ఉంటే, నేడు మన దేశంలో ‘కె’ (ఆంగ్లాక్షరం కె ఆకృతిలో; ధనవంతులు పైకి, పేదలు కిందికి) తరహా తీవ్ర ఆర్థిక అసమానతల పరిస్థితి ఉండేది కాదు. ఆర్థిక అసమానతలు తీవ్ర స్థాయిలో ఉన్నా మన దేశం పై స్థానంలో ఉండడం గమనార్హం. ఆర్థిక సంస్కరణల క్రమంలో సంపద సృష్టి జరిగింది. కానీ, ఆ సంపద సృష్టికర్తలకు చేతిలో మొబైల్ ఫోన్ మినహా దక్కిందేమీ లేదు. ఈ సంస్కరణలు తెచ్చిన ప్రైవేటీకరణ విధానాలు కనీస అవసరాలైన విద్య, వైద్యాలను ఖరీదైనవిగా మార్చేశాయి. మొత్తంగా బడ్జెట్ల క్రమంలో లబ్ధి పొందింది – ఒక వైపున అంతర్జాతీయ (కొంతమేరకు దేశీయ) ఫైనాన్స్ పెట్టుబడిదారులు, మరోవైపున కార్పొరేట్ సంస్థలు మాత్రమే. ఈ రెండు తరహాల వారికీ మేలు చేసేందుకే – ప్రతీ బడ్జెట్లోనూ ద్రవ్యలోటును తగ్గించటం... అలాగే కార్పొరేట్లకు అనేకానేక రాయితీల వంటివి నిండుగా ఉంటాయి. ద్రవ్యలోటును ఆర్థిక వ్యవహారాలకు కేంద్ర బిందువుగా చేయటం ఎందుకోసం? సుమారుగా నాలుగు దశాబ్దాల క్రితం, అంటే 1980ల ముందర – ఈ ద్రవ్యలోటు అంశానికి అటు బడ్జెట్లలోనూ, ఇటు ఆర్థిక వ్యవహారాలలోనూ ప్రాధాన్యత లేదు. నాడు ప్రపంచంలోని మార్కెట్ ఆర్థిక వ్యవస్థలు అన్నింటిలోనూ – ‘కీన్స్’ సిద్ధాంతాల ప్రాతిపదికన నడిచిన సంక్షేమ రాజ్యానిదే పెద్దపేట. నాడు ప్రభుత్వాల ప్రధాన బాధ్యత– దేశంలోని ప్రజల బాగోగులు కోరి... అలాగే కార్పొ రేట్ల మనుగడకు కూడా అనుకూలమైన విధంగా – జన సామాన్యం తాలూకూ కొనుగోలు శక్తిని... అంటే మార్కెట్లో సరుకులు, సేవలకు డిమాండును కాపాడటం. ఈ పరిస్థితి 1980ల అనంతరం మారి పోయింది. సరుకులు, సేవలను ఉత్పత్తి చేసి లాభాలను పొందే కార్పొరేట్ సంస్థల ప్రాధాన్యత తగ్గి... గతంలో ఈ కార్పొరేట్ సంస్థల స్థాపనకూ, లేదా వాటి కార్యకలాపాల నిర్వహణకూ పెట్టుబడులను సరఫరా చేసే ఫైనాన్స్ పెట్టుబడులది పై చేయి అయ్యింది. అప్పటి వరకూ పారిశ్రామిక వ్యవస్థకు కేవలం వెన్నుదన్నుగా మాత్రమే ఉన్న ఫైనాన్స్ పెట్టుబడులు పూర్తిస్థాయిలో స్వతంత్రంగానూ... మరో మాటలో చెప్పాలంటే, ఉత్పాదక, పారిశ్రామిక పెట్టుబడుల కంటే శక్తి మంతంగానూ తయారయ్యాయి. ఈ క్రమంలోనే – షేర్ మార్కెట్లు, ఫైనాన్స్ వ్యాపారాలు (ప్రస్తుతం ‘వెంచర్ క్యాపిటల్’ అని పిలిచే వాటితో సహా), రియల్ ఎస్టేట్ వంటి స్పెక్యులేటివ్ పెట్టుబడులది పై చేయి అయ్యింది. ఈ తరహా పెట్టుబడుల అవసరాల కోసంముందుకు వచ్చిందే ‘ద్రవ్యలోటు’ ఉండరాదు అనే సూత్రీకరణ. దీనిలో భాగంగానే ప్రపంచంలోని దరిదాపు అన్ని దేశాల కేంద్ర బ్యాంకులకు ద్రవ్యోల్బణాన్ని ఒక నిర్దిష్ట స్థాయిలో అదుపులో ఉంచటం గురుతర బాధ్యత అయింది. ద్రవ్యలోటు అధికంగా ఉండటమంటే, ప్రభుత్వం తాలూకూ ఖర్చులు దాని ఆదాయం కంటే అధికంగా ఉండటం అని. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటే ఆ అదనపు ఖర్చుకు అవసరమైన డబ్బును ప్రభుత్వం ముద్రించవలసి రావచ్చు లేదా అప్పుగా తెచ్చుకోవాల్సి రావచ్చు. దీని వలన వాస్తవ ఆర్థిక వ్యవస్థలో డబ్బు చలామణీ పెరిగి– ద్రవ్యోల్బణం పెరుగుతుందనేది లెక్క. ద్రవ్యో ల్బణం పెరగటమంటే... అనివార్యంగా ఆ దేశం తాలూకూ కరెన్సీ విలువ తగ్గుదలే. ఈ కరెన్సీ విలువ తగ్గుదల ఆ దేశీయ షేర్ మార్కెట్లలో లేదా ఇతరత్రా స్పెక్యులేటివ్ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టినవారి లాభాల తాలూకు నికర విలువ తగ్గుదలకు దారితీస్తుంది. కాబట్టి ఈ ఫైనాన్స్ పెట్టుబడిదారులు – మన కరెన్సీ విలువ తగ్గ రాదని కోరుకుంటారు. ఇది వారి లాభాలను కాపాడుకోవటం కోసం. దీని కోసం వారు మన ప్రభుత్వం ప్రజల అవసరార్థం వ్యయాలను పెంచుకోవడాన్ని అంగీకరించలేరు. కాబట్టి ఈ ద్రవ్యలోటు సిద్ధాంతకర్తలు – వివిధ దేశాల ప్రభుత్వాలు పొదుపు చర్యలను పాటించాలనీ, సాధ్యమైనంతగా ప్రజలకు లభించే సంక్షేమ పథకాలపై కోతలు పెట్టాలనీ కోరుకుంటారు. ఆర్థిక సంస్కరణలు ఆరంభమైన తర్వాత మన పాలకులు కూడా ఈ ద్రవ్యలోటును లక్ష్మణరేఖగా ఆమోదించుకొని, దానికి లోబడే తమ ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిరుద్యోగం, పేదరికం పెరగటం వంటి ఎన్ని సమస్యలు ఉన్నా మన ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ఉపాధి కల్పనా కార్యక్రమాలపై పెట్టే ఖర్చులను ఇంకా తగ్గిస్తూనే పోతోంది. దీనిలో భాగంగానే నేడు ఆర్థిక మాంద్యం లేదా మందగమన పరిస్థితులు ఉన్నా – ప్రభుత్వం మాత్రం బడ్జెట్లో తన ఆర్థిక లోటు లక్ష్యాన్ని ప్రస్తుతం ఉన్న 6.4 శాతం నుంచి 2024 ఆర్థిక సంవత్సరం చివరికి 5.9 శాతానికి తగ్గించటంగా చేసుకుందనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎరువుల సబ్సి డీలపై వేటు, ఆహార సబ్సిడీల కుదింపు వంటివి ఉండనున్నాయి. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ సబ్సిడీలకు పాలకులు ఇప్పటికే మంగళ హారతి పాడేశారు. ఇక తరువాతిది కార్పొరేట్ పెట్టుబడిదారులకు రాయితీలు ఇవ్వటం. ఇది గత 8 సంవత్సరాల బీజేపీ హయాంలో మరింత నిర్మొహమాటంగా వేగం పుంజుకుంది. 2019లో కార్పొరేట్ ట్యాక్సును భారీగా 10 శాతం మేర తగ్గించేశారు. దీని వలన ప్రభు త్వానికి సాలీనా 1.45 లక్షల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. అలాగే, కార్మిక సంస్కరణల పేరిట – ఉద్యోగులు, కార్మికులు, గిగ్ వర్కర్ల వంటివారిని పిండి పిప్పిచేసి తమ లాభాలను పెంచుకొనేందుకు కార్పొరేట్లకు మరిన్ని దారులను తెరుస్తున్నారు. ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ పేరిట – ఉత్పత్తిని తగిన మేరకు పెంచిన కార్పొరేట్లకు రాయితీల పేరు చెప్పి లక్షల కోట్ల రూపాయలను ధారాదత్తం చేస్తున్నారు. ఇంత చేసినా వాస్తవంలో ఈ కార్పొరేట్ల నుంచి – ఇటు కొత్త పెట్టుబడుల రూపంలో గానీ, అటు అదనపు ఉపాధి కల్పన రూపంలో గానీ ఫలితం ఏమీ దక్కడం లేదు. వాస్తవ ఆర్థిక వ్యవస్థలో ప్రజల చేతిలో డబ్బు లేదనీ లేదా వారికి కొనుగోలు శక్తి లేదనే విషయాన్ని విస్మరిస్తూ... బడ్జెట్ తర్వాత బడ్జెట్ను మూస తరహాలో వేస్తూనే పోతోంది ప్రభుత్వం. హరిత ఇంధనానికి ప్రోత్సాహం, మౌలిక వనరులకు ఊతం వంటి పేర్లేవి చెప్పినా... అదంతా అంతిమంగా కార్పొరేట్లకు రాయితీలు, కానుకలుగా మాత్రమే ఉండిపోగలదు. స్థూలంగా కాకులను కొట్టి గద్దలకు వేసే సరళిలో సాగుతోన్న ప్రభుత్వ విధానాలు రానున్న ఎన్నికల నేపథ్యంలో కాస్తంత కరుకుదనాన్ని తగ్గించుకున్నా – అవి పెద్దగా మారి ప్రజానుకూలంగా సంపదను పంపిణీ చేసే సాహసానికి దిగలేవు. సంవత్సరానికి ఒక రోజు ముందుకు వచ్చే ఈ బడ్జెట్ రోజునైనా లేకుంటే మిగతా 364 రోజులైనా జరుగుతోంది ఒకటే... అది జనం మీద భారాలు... కార్పొరేట్లు, ధనవంతులకు నజరానాలు! కాదూ కూడదంటే ఈ దేశంలోని కూలీ జనం కులీనులూ లేదా పన్ను చెల్లింపుదారుల పైసలను ‘ఉచితాలుగా’ దిగమింగేస్తున్నారంటూ ఎదురుదాడులు! ధనికుల, ధనస్వామ్య ఆరాధనలో... వినిమయ సమాజపు వస్తు వ్యామోహంలో పడి వాస్తవాలను చూడలేని దుఃస్థితిలో జన సామాన్యం కొనసాగినంత కాలం ఈ దగాకూ, దాని మనుగడకూ ఢోకా లేదు. డి. పాపారావు వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు మొబైల్: 98661 79615 -
బడ్జెట్ 23: పొగరాయుళ్లకు ఝలక్, భారీగా పెరగనున్న ధరలు!
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2023ని రేపు (ఫిబ్రవరి 1న) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో సమర్పించనున్నారు. మంగళవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక సర్వేను కూడా ఆర్థికమంత్రి ప్రవేశపెట్టారు. రానున్న ఎన్నికలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కార్కు ఇదే చివరి బడ్జెట్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. రాబోయే ఆర్థిక సంవత్సరానికి మార్గం సుగమం చేసే అనేక కొత్త పన్ను సంస్కరణలు ,రాయితీలను కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది. దీంతోపాటు పొగాకు, దాని ఉత్పత్తి ధరలు పెరిగే అవకాశం ఉందని సమాచారం. దేశవ్యాప్తంగా అలాగే సిగరెట్లపై ప్రత్యేక పన్నును శాతాన్ని పెంచ నున్నారనీ , ఇది ధరలలో పెరుగుదలకు దారి తీస్తుందని భావిస్తున్నారు. బడ్జెట్ 2023లో పెట్రోల్, డీజిల్ ధరలు,యూపీఐ, డిజిటల్ రూపాయికి సంబంధించిన ఇన్సెంటివ్లు ,తదితర పన్ను సంబంధిత స్కీమ్లపై ఎక్కువగా అంచనాలు భారీగానే ఉన్నాయి. వీటన్నిటితో పాటు పొగాకు, పొగాకు ఉత్పత్తులపై పన్నుపెరగుతుందనేది ఒక అంచనా. ముఖ్యంగా దాదాపు గత రెండేళ్లుగా సిగరెట్ ధరలు, పొగాకు ఉత్పత్తులపై పన్ను లేదు. ఈ నేపథ్యంలో ఈ సారి సిగరెట్ ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా. అయితే పొగాకుపై విధించే పన్ను, దాని ధరల నియంత్రణను జీఎస్టీ కౌన్సిల్ చూసుకుంటుంది. అయితే,ఈ సంవత్సరం బడ్జెట్ 2023లో కేంద్ర ప్రభుత్వం సిగరెట్లపై జాతీయ విపత్తు ఆకస్మిక సుంకం (ఎన్సీసీడీ) పెంచే అవకాశం ఉంది. సిగరెట్లపై విధించే మొత్తం పన్నులో వాటా 10 శాతం. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం దానిని పెంచే అవకాశం ఉంది. సిగరెట్లపై ఎన్సీసీడీ సాధారణంగా ఐటీసీ లాంటి తయారీ కంపెనీలు చెల్లిస్తాయి. ఒకవేళ ఎన్సీసీడీ భారీ పెంపు వైపు కేంద్రం మొగ్గు చూపితే, అనివార్యంగా ఆ భారాన్ని ఆయా కంపెనీలు వినియోగదారులపైనే మోపుతాయి. -
‘అవినీతిపై కేంద్రం నిరంతరం పోరాడుతోంది’
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రపతిగా తన తొలి ప్రసంగాన్ని ద్రౌపది ముర్ము.. పార్లమెంట్ సభ్యుల సాక్షిగా దేశానికి వినిపించారు. ఈ క్రమంలో దేశం అన్నిరంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందన్న ఆమె.. కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. మహిళా సాధికారతకు ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకారాలు అందిస్తోంది. ఇప్పుడున్నది ధైర్యవంతమైన, నిర్ణయాత్మకమైన ప్రభుత్వం. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటోంది. అందుకే తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు నమ్మకం పెరిగింది. వన్ నేషన్ వన్ రేషన్ మంచి కార్యక్రమం. భారత్ అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించాలి. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆయుష్మాన్ భారత్ పెద్ద భరోసా. పేదల ఉపాధి కోసం ప్రభుత్వం పని చేస్తోంది. మూడు కోట్ల మంది పేదలకు కేంద్రం ఇళ్లు నిర్మించి ఇచ్చింది. మూడేళ్లలో 11 కోట్ల మందికి ఇంటింటికీ మంచినీరు అందించింది. దేశ ప్రజలకు కోవిడ్ నుంచి విముక్తి కల్పించింది ప్రభుత్వం. నిరుపేద కోవిడ్ బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. అన్ని విధాలుగా కోవిడ్ కష్టకాలంలో పేద ప్రజలకు సహాయం చేసింది. ఆదివాసీల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి.. వాళ్ల అభివృద్ధికి పాటుపడుతోంది. ఓబీసీల సంక్షేమం కోసం కీలక ముందడుగు వేసింది. గిరిజన నేతలకు మంచి గుర్తింపు లభిస్తోంది. బాగా వెనుకబడిన గ్రామాలను కేంద్రం అభివృద్ధిలోకి తీసుకొచ్చింది. భేటీ బచావ్-భేటీ పడావ్ నినాదం ఫలితాన్నిచ్చింది. దేశంలో తొలిసారిగా మహిళల సంఖ్య పెరిగింది. పీఎం ఆవాస్ యోజన పథకం సత్ఫలితాలు ఇచ్చింది. బాలికల డ్రాప్ అవుట్స్ తగ్గాయి. అంతరిక్ష ప్రయోగాలతో భారత్ అత్యద్భుత ప్రగతి సాధించింది. అంతరిక్ష పరిశోధనల్లో భారత్ అతిపెద్ద శక్తిగా ఎదుగుతోంది. ప్రపంచ ఫార్మా హబ్గా భారత్ ఎదుగుతోందని కొనియాడారామె. ప్రస్తుతం దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. పొరుగు దేశాల సరిహద్దుల్లోనూ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. దేశంలో అవినీతిపై ప్రభుత్వం నిరంతరం పోరాడుతోందని తన ప్రసంగంలో కేంద్రంపై ప్రశంసలు గుప్పించారామె. -
బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న కేంద్రం.. భారత్పై ఐఎంఎఫ్ ప్రశంసల వర్షం!
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి’ (imf) భారత వృద్ధిరేటుకు సంబంధించి కీలక అంచనాలను వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ప్రస్తుతం ఉన్న భారత ఆర్థిక వృద్ది రేటు 6.8 నుంచి 6.1 శాతానికి పడిపోతుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. కానీ తిరిగి పుంజుకుంటుందనే అంచనాల్ని ఉదహరిస్తూ ఓ నివేదికను విడుదల చేసింది. గ్లోబల్ వృద్ధి రేటు ఐఎంఎఫ్ అప్డేట్ చేసిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అవుట్లుక్ను విడుదల చేసింది. ఆ అవుట్ లుక్లో 2022 గ్లోబల్ వృద్ధి రేటు 3.4 ఉండగా 2023లో 2.9 శాతానికి తగ్గి 2024లో 3.1శాతానికి పెరుగుతున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ది రేటుపై ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్, రీసెర్చ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ పియరీ ఒలివర్ గౌరించాస్ మీడియా సమావేశంలో మాట్లాడారు. 6.8శాతంతో వృద్ది రేటు అక్టోబర్ అవుట్ లుక్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. కానీ మార్చి తర్వాత ఇండియన్ ఎకానమీ 6.1 శాతానికి దిగజారుతుందనే అంచనా వేసినట్లు తెలిపారు. అందుకు దేశంలోనే పరిస్థితులేనని అన్నారు. పురోగతి సాధ్యమే 2022లో భారత వృద్ది రేటు 6.8 శాతం ఉండగా.. 2023లో 6.1 శాతం తగ్గింది. అయితే దేశీయంగా స్థిరమైన డిమాండ్ కొనసాగనుందనే అంచనాలతో పురోగతి సాధిస్తూ 2024లో 6.8 శాతానికి చేరుకోనుంది. ఆసియా దేశాల్లో ఆసియా దేశాల్లో అభివృద్ది నిలకడగా కొనసాగుతున్న తరుణంలో ఐఎంఎఫ్ ఆర్ధిక వృద్ది రేటును పెంచింది. 2023లో వృద్ది రేటు 5.2శాతం ఉండగా 2024లో 5.5శాతానికి పెంచింది. 2022లో ఊహించిన దానికంటే లోతైన మందగమనం తర్వాత ఆసియా దేశమైన చైనా ఆర్థిక వ్యవస్థకు 4.3 శాతానికి తగ్గించింది ఐఎంఎఫ్. చైనా అభివృద్దిలో అడ్డంకులు 2022 నాల్గవ త్రైమాసికంలో చైనా జీడీపీ మందగించింది. వెరసీ 40 ఏళ్ల చరిత్రలో ప్రపంచ సగటు కంటే తక్కువగా ఉండటం చైనాకు ఇది మొదటిసారి. వ్యాపారంలో శక్తి సామర్ధ్యాలు తగ్గిపోవడం, క్షీణిత, నెమ్మదించిన నిర్మాణాత్మక సంస్కరణల కారణంగా 2022 క్యూ4లో 3.0 శాతంగా ఉన్న వృద్ది రేటును 0.2శాతానికి తగ్గించింది. అది అలాగే మరో రెండేళ్లు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఇక అదే వృద్ది రేటు 2023లో 5.2 శాతం వరకు పెరగొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. అభివృద్ధిలో ఆటుపోట్లు ఎదుర్కొనే అవకాశం ఉందనే అంచనాలతో 2024 కంటే ముందే వృద్ది రేటు 4శాతం తగ్గొచ్చంటూ సూత్రప్రాయంగా వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థలో భారత్ది తిరుగులేని స్థానం మీడియా ప్రతినిధులు సంధించిన ఓ ప్రశ్నకు సమాధానంగా గౌరించాస్ ఓ బ్లాగ్ పోస్ట్లో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ది ప్రకాశవంతమైన స్థానమని అన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటా భారత్, చైనాదేనని వెల్లడించారు. అదే అమెరికా, యూరోప్రాంతం కలిసి కేవలం 10 శాతం మాత్రమే ప్రపంచ ఆర్థిక వృద్ధికి దోహదం చేయనున్నట్లు పేర్కొన్నారు. -
Budget Session 2023: ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు లైవ్ అప్డేట్స్ ► ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ► ఈ బడ్జెట్ సమావేశాల్లో చైనాతో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, సరిహద్దు వివాదాల సమస్యలను లేవనెత్తుతాం.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన నాయకుడిని (రాహుల్గాంధీ) అభినందించడానికి బదులు, వారు (కేంద్రం) తిట్టడమే పనిగా పెట్టుకున్నారు: కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గే ► ఈ ఏడాది జీ20 సదస్సు అధ్యక్ష పదవిని భారత్ చేపట్టింది. G20లోని అన్ని సభ్య దేశాలతో పాటు, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం ఇప్పుడు మన దేశం ముందున్న లక్ష్యం: పార్లమెంటులో రాష్ట్రపతి ముర్ము ► మహిళా సాధికారతకు ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకారాలు అందిస్తోంది. ఇప్పుడున్న ధైర్యవంతమైన, నిర్ణయాత్మకమైన ప్రభుత్వం. అందుకే తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు నమ్మకం పెరిగింది: రాష్ట్రపతి ముర్ము ► రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం: రాష్ట్రపతి దేశ ప్రగతిలో యువశక్తి, నారీశక్తి భాగస్వామ్యం కావాలి. పేదరికం లేని భారత్ నిర్మాణం జరగాలి. రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం. ఆత్మనిర్భర్ భారత్ను నిర్మించుకుందాం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు. ► పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సోమవారం ఉదయం పదకొండు గంటల సమయంలో రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. తన ప్రసంగంతో పార్లమెంట్ సెషన్స్ను ప్రారంభించారు. ప్రపంచమంతా మన బడ్జెట్ కోసం చూస్తోంది: ప్రధాని మోదీ ► గతంలో కొత్తగా ఎవరైనా ఎంపీ ఎన్నికైతే.. మంచి వాతావరణంలో వాళ్లను మాట్లాడేందుకు అనుమతించి.. వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడం ఒక ఆనవాయితీగా వస్తోంది. కానీ, ఇప్పుడు రాష్ట్రపతి అలా ప్రసంగించబోతున్నారు. ఇది గిరిజనులకు ఎంతో గర్వకారణమైన రోజు అని ప్రధాని మోదీ తెలిపారు. అలాగే.. మన ఆర్థిక మంత్రి కూడా మహిళే ఉన్నారని, ఈ సారి బడ్జెట్కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోందని ప్రధాని తెలిపారు. ప్రతీ పౌరుడిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన జరిగిందన్న ప్రధాని.. అంచనాలను అందుకునే యత్నిస్తామని తెలిపారు. ► పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు దేశ ప్రధాని నరేంద్ర మోదీ మీడియా ద్వారా మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచమంతా భారత్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కోసం ఎదురు చూస్తోందని, ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితి అందుకు కారణమని ఆయన అన్నారు. ► బీఆర్ఎస్, ఆప్ ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించగా.. కొందరు కాంగ్రెస్ ఎంపీలు భారత్ జోడో యాత్ర ముగింపులో పాల్గొని శ్రీనగర్లో మంచు కారణంగా చిక్కుకుని హాజరు కాలేకపోయారు. -
బడ్జెట్లో నిర్మలమ్మ వరాలు కురిపించేనా!
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మోదీ 2.0 ప్రభుత్వ చివరి పూర్తి బడ్జెట్ను బుధవారం పార్లమెంటులో సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. ధరల పెరుగుదలతో కొట్టుమిట్టాడుతున్న సామాన్య ప్రజసహా అన్ని వర్గాల డిమాండ్లను ఆమె తీరుస్తారన్న అంచనాలు అధికంగా ఉన్నాయి. ప్రకటించబోయే బడ్జెట్ అనేక లక్ష్యాల సాధనకు ఒక కసరత్తు కాబోతున్నట్లు అంచనా ఉంది. ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం కట్టడి, పన్నుయేతర చర్యల ద్వారా మరిన్ని వనరులను సేకరించడం, అవసరమైన రంగాలకు ప్రోత్సాహకాలు వంటివి బడ్జెట్లో ఆశిస్తున్న ప్రధానాంశాలు. వేతన జీవులు, చిన్న వ్యాపారవేత్తలకు పన్ను రాయితీల ప్రకటన కూడా ఉంటుందని అంచనా. రియల్టీ రంగం ప్రోత్సాహానికి కూడా చర్యలు ఉంటాయని భావిస్తున్నారు. -
కేంద్ర బడ్జెట్ 2023-24: హైదరాబాద్ను కరుణించేనా?
►కోరింది రూ.4వేల కోట్లు.. వచ్చేదెన్ని కోట్లో? ►బడ్జెట్లో బల్దియాకు కేటాయింపులు ఎన్నో? ►ఇటీవల కేంద్రానికి లేఖ రాసిన మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ పనులకు కోరిన నిధుల వివరాలు ♦ఎస్ఎన్డీపీకి గతంలో అడిగినప్పటికీ రూ. 240 కోట్లు ఇవ్వలేదని, కనీసం ఈసారైనా వాటిని ఈ బడ్జెట్లో కేటాయించాలి. హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగు పరిచేందుకు స్వచ్ఛ భారత్ మిషన్ నిధులు రూ. 400 కోట్లు కేటాయించాలి. ♦ఎస్సార్డీపీ రెండో దశకుకు మొత్తం రూ.14000 కోట్లు ఖర్చు కానుండగా, అందులో పదిశాతం రూ.1400 కోట్లు కావాలి. ఎలివేటెడ్ కారిడార్లు, స్కైవేలకు ఖర్చు కానున్న రూ.9000 కోట్లలో పదిశాతం రూ.900 కోట్లు. ♦నగరంలో చేపట్టిన లింక్రోడ్లతో ఎన్నో ప్రయోజనాలు కలిగాలియి. ఇంకా ఎన్నో లింక్రోడ్ల ప్రతిపాదనలున్నాయి. కొత్తగా 104 లింక్ రోడ్లకు రూ.2400 కోట్లు వ్యయం కానుండగా అందులో మూడోవంతు నిధులు రూ.800 కోట్లు ఇవ్వాలి. మూడోవిడత బాండ్లకు రావాల్సిన ప్రోత్సాహకాలు, ఇతరత్రా వెరసీ దాదాపు రూ. 4వేల కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంది. ►పిట్లైన్లు లేక రైళ్ల రాకపోకల్లో జాప్యం ►లింగంపల్లిలో ఉంటే మరిన్ని రైళ్లకు హాలి్టంగ్ ►సికింద్రాబాద్పై పెరిగిన భారీ ఒత్తిడి ►చర్లపల్లి టెర్మినల్ విస్తరణకు ఇంకొంత కాలం బడ్జెట్పై ఆశలు.. ప్రతి బడ్జెట్ ఒక ప్రహసనంగానే మారుతోంది. పాత ప్రాజెక్టులకు కొద్దిపాటి నిధులు కేటాయించడం మినహా ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదు. దీంతో ఒక్కో ప్రాజెక్టు ఏళ్లకేళ్లుగా నత్తనడకన సాగుతోంది. చర్లపల్లి టర్మినల్ విస్తరణే అందుకు నిదర్శనం. నాలుగేళ్లుగా పనులు కొనసాగుతున్నా ఇప్పటికీ కొలిక్కి రాకపోవడం గమనార్హం. సారీ.. నో హాల్టింగ్ సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రతి రోజు సుమారు 200 రైళ్లు వివిధ ప్రాంతాలకు బయలుదేరుతాయి. రైళ్ల నిర్వహణ, ప్రాథమిక మరమ్మతులు తదితర పనుల కోసం పిట్లైన్లపై కొంతకాలంగా ఒత్తిడి పెరిగింది. దీంతో స్టేషన్కు చేరుకున్న రైళ్లను మరికొంత దూరం అంటే వికారాబాద్ వరకు తీసుకెళ్లి అక్కడ నిర్వహణ అనంతరం తిరిగి సికింద్రాబాద్కు తీసుకొస్తున్నారు. దీంతో రైళ్ల రాకపోకల్లో జాప్యం నెలకొంటోంది. దీన్ని నివారించేందుకు సికింద్రాబాద్కు దగ్గరలో ఉన్న లింగంపల్లి స్టేషన్లో పిట్లైన్ల ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. దీనివల్ల సికింద్రాబాద్పైన ఒత్తిడి తగ్గడమే కాకుండా లింగంపల్లి నుంచి రైళ్లు నేరుగా బయలుదేరేందుకు అవకాశం ఉంటుంది. కానీ పిట్లైన్ల ప్రతిపాదన అమలుకు నోచుకోకపోవడంతో ప్రస్తుతం లింగంపల్లి నుంచి కేవలం 5 రైళ్లు బయలుదేరుతున్నాయి. పిట్లైన్లు ఉంటే మరిన్ని రైళ్లు అక్కడి నుంచి నడిచే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ఈ దిశగా చర్యలు చేపట్టాల్సి ఉంది. రెండు లైన్లు ఉన్నా చాలు.. ప్రస్తుతం లింగంపల్లి స్టేషన్ నుంచి గౌతమి, కోకనాడ, నర్సాపూర్, విజయవాడ ఇంటర్సిటీ, నారాయణాద్రి రైళ్లు మాత్రమే నేరుగా బయలుదేరుతున్నాయి. మిగతా రైళ్లన్నీ సికింద్రాబాద్ నుంచే నడుస్తున్నాయి. లింగంపల్లిలో 4 ప్లాట్ఫాంలు అందుబాటులో ఉన్నాయి. ఎంఎంటీఎస్ రైళ్లకు రెండు లైన్లు మినహాయిస్తే మరో రెండింటిలో దూరప్రాంతాల రైళ్లకు హాలి్టంగ్ కలి్పస్తున్నారు. పడమర వైపు నగరం అనూహ్యంగా విస్తరించడంతో లింగంపల్లి, బీహెచ్ఈఎల్, పటాన్చెరు, హైటెక్ సిటీ తదితర ప్రాంతాలకు చెందిన ప్ర యాణికులు లింగంపల్లి నుంచి నేరుగా బయలుదేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో గౌత మి, కోకనాడ వంటి రైళ్లకు డిమాండ్ నెలకొంది. నర్సాపూర్, ఇంటర్సిటీ రైళ్లకు సైతం లింగంపల్లి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రయాణికుల నుంచిఅనూహ్యమైన ఆదరణ ఉంది. ప్రయాణికుల డిమాండ్ మేరకు మరిన్ని రైళ్లను నడిపేందుకు అవకాశం ఉన్నప్పటికీ రైళ్ల నిర్వహణకు పిట్లైన్లు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. కనీసం 2 పిట్లైన్లను ఏర్పాటు చేసినా మరి కొన్ని రైళ్లను ఇక్కడి నుంచి నడిపేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ముంబై వైపు వెళ్లే రైళ్లను లింగంపల్లి నుంచి నడపవచ్చని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. కొనసాగుతున్న చర్లపల్లి టెర్మినల్ పనులు.. గ్రేటర్లోని మూడు ప్రధాన రైల్వేస్టేషన్లు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడలపై రైళ్ల ఒత్తిడి పెరిగింది. దీంతో నాలుగో టర్మినల్గా చర్లపల్లి స్టేషన్ విస్తరణ చేపట్టారు. నాలుగేళ్ల క్రితమే పనులు ప్రారంభించినప్పటికీ స్థలం కొరత కారణంగా జాప్యం నెలకొంది. చివరకు దక్షిణమధ్య రైల్వేకు అందుబాటులో ఉన్న స్థలంలోనే టరి్మనల్ విస్తరణ చేపట్టారు. ఈ టరి్మనల్ అందుబాటులోకి వస్తే మొదటి దశలో కనీసం 10 రైళ్లను ఇక్కడి నుంచి నడిపేందుకు అవకాశం ఉంటుంది. దశలవారీగా 50 రైళ్లను చర్లపల్లి నుంచి నడిపేందుకు ప్రణాళికలను రూపొందించారు. ఈ ఏడాది జూన్ నాటికి టరి్మనల్ను వినియోగంలోకి తేవాలని భావిస్తున్నారు. కానీ మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. లింగంపల్లిలో పిట్లైన్లను ఏర్పాటు చేస్తే తూర్పు వైపున చర్లపల్లి తరహాలో పడమటి వైపున లింగంపల్లిలో హాల్టింగ్ సదుపాయాలు పెరుగుతాయి. -
ఆర్ధిక సర్వే అంటే ఏమిటి? తొలి సర్వే ఎప్పుడు ప్రవేశ పెట్టారో తెలుసా?
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి ఉదయం 11గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందస్తు బడ్జెట్ పత్రాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఆర్ధిక సర్వే అంటే ఈ సందర్భంగా బడ్జెట్ను సమర్పించే ముందు గత సంవత్సరంలో సాధించిన ఆర్థిక అభివృద్ధి,రాబోయే సంవత్సరానికి సూచనలు, సవాళ్లు, పరిష్కారాలను ప్రస్తావిస్తూ కేంద్ర ఆర్ధిక శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక సర్వేగా (ఎకానమీ సర్వే) పిలువబడే ఒక పత్రాన్ని పార్లమెంటులో సమర్పిస్తారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల శాఖ ఆర్థిక విభాగం రూపొందించిన ఆర్థిక సర్వే ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ పర్యవేక్షణలో రూపొందించారు. తొలి సర్వే ఎప్పుడు ప్రవేశ పెట్టారో తెలుసా 1950-51లో మొదటి ఆర్థిక సర్వేని ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఎకానమీ సర్వే నివేదిక విడుదల చేయడం ఆనవాయితీగా మారింది. 1964 వరకు కేంద్ర బడ్జెట్తో కలిపి దీనిని ప్రవేశపెట్టేవారు. ఆ తర్వాత బడ్జెట్ నుంచి దీనిని విడదీశారు. రెండు విడతల్లో నేటి నుంచి జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోని తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి ఉదయం 11గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. రేపు పార్లమెంట్లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. ఇక బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 6 వరకు రెండు విడతల్లో జరగనున్నాయి. తొలి విడుత బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ఫిబ్రవరి 13 వరకు... రెండో విడుత మార్చి 13 నుంచి ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్నాయి. ఇలా మొత్తం కలిపి 27 రోజులు పాటు జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఊరట కల్పించేలా కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనని దేశ ప్రజలు ఎంతో ఉత్కంటతతో ఎదురు చూస్తున్నారు. చదవండి👉 నిర్మలమ్మా.. 9 ఏళ్లు అయ్యింది, ఈ సారైనా పెంపు ఉంటుందా? -
ఫిబ్రవరి 2న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: వాడీవేడీ చర్చలకు వేదికగా నిలిచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రారంభోపన్యాసం చేయనున్నారు. రాష్ట్రపతిగా ఉభయసభలనుద్దేశిస్తూ ఆమె చేస్తున్న తొలి ప్రసంగం ఇది. ఆ తర్వాత సామాజిక, ఆర్థిక సర్వే నివేదికను పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బుధవారం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 2023–24 బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. రాజ్యసభ, లోక్సభలో దీనిపై ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లోనే నిర్వహిస్తామని లోక్సభ స్పీకర్ బిర్లా గతంలో ప్రకటించారు. ఈసారి సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి. తొలి విడత ఫిబ్రవరి 14 వరకు, ఆ తర్వాతి విడత మార్చి 12న మొదలై ఏప్రిల్ ఆరో తేదీన పూర్తికానుంది. ప్రధాన సమస్యలపై నిలదీత! 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు మోదీ ప్రభుత్వం ఓ వైపు సన్నాహాలు చేస్తుండగా, మరోవైపు కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు కత్తులు నూరుతున్నాయి. పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, తాజా ఆర్థిక పరిస్థితి, సన్నగిల్లిన కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, పెరిగిన చైనా సరిహద్దు వివాదం, బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల్లో గవర్నర్ల జోక్యం, గౌతమ్ అదానీ షేర్లపై హిండెన్బర్గ్ సంచలనాత్మక నివేదిక, జాతీయస్థాయి కుల గణన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని కడిగి పారేయాలని విపక్షాలు నిర్ణయించాయి. రాష్ట్రపతి ప్రసంగాన్ని కొన్ని పార్టీలు ‘బాయ్కాట్’ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గవర్నర్ వ్యవస్థపై బీఆర్ఎస్ సహా డీఎంకే, టీఎంసీ గట్టిగా పోరాడాలని నిర్ణయించుకోగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలపై సీపీఐ, సీపీఎం ప్రభుత్వాన్ని నిలదీయనున్నాయి. చైనా సరిహద్దు వివాదాలు, రూపాయి పతనం, బడా కార్పొరేట్ కంపెనీల దోపిడీపై కాంగ్రెస్ పార్టీ మోదీ సర్కార్ను ఇరకాటంలో పెట్టేలా వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఈసారి బడ్జెట్ సెషన్ మొత్తం 27 సిట్టింగ్లలో ఉండనుంది. ఈ సారి సమావేశాల్లో 36 బిల్లులు పార్లమెంట్ ముందుకు రానున్నాయి. అఖిలపక్ష భేటీకి కాంగ్రెస్ డుమ్మా మంగళవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రక్షణ మంత్రి రాజ్నా«థ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ, మంత్రులు పీయూశ్ గోయల్, అర్జున్ రామ్ మేఘవాల్, మురళీధరన్ ఆధ్వర్యంలో జరిగిన భేటీకి ఆర్జేడీ, జేడీయూ, బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, డీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్, టీఎంసీ, శివసేన, బీజేడీ తదితర 27 పార్టీల తరఫున 37 మంది నేతలు హాజరయ్యారు. సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రభుత్వానికి విపక్షాలు సహకరించాలని మంత్రులు కోరారు. దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలతో పాటు రాష్ట్రాల పరిధిలో పెండింగ్లో ఉన్న అంశాలపై చర్చించాల్సిందేనని విపక్షాల నేతలు డిమాండ్చేశారు. ఈ భేటీకి కాంగ్రెస్ దూరంగా ఉంది. ఆ పార్టీ లోక్సభ, రాజ్యసభా పక్ష నేతలు అధిర్ రంజన్ చౌదరీ, మల్లికార్జున ఖర్గే కశ్మీర్లో భారత్ జోడో యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు వెళ్లడంతో భేటీకి హాజరు కాలేదు. మంగళవారం కాంగ్రెస్ పక్షనేతలు తనను కలసి తమ అభిప్రాయాలు పంచుకుంటారని మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. తృణధాన్యాలతో వంటకాలు పార్లమెంట్ క్యాంటీన్లో ఈసారి తృణధాన్యాలతో చేసిన వంటకాలు ఎంపీలకు కొత్త రుచులను అందివ్వనున్నాయి. రాగులు, జొన్నలు, సజ్జలు, అరికెలు, సామలు ఇలా పలు రకాల చిరుధాన్యాలతో వండిన ఆహార పదార్థాలు ఎంపీలు, సిబ్బంది, సందర్శకులకు క్యాంటీన్లో అందుబాటులో ఉంచుతారు. -
ఆశల పట్టాలపై రైల్వే ప్రాజెక్టులు
సాక్షి, అమరావతి: కేంద్రప్రభుత్వ బడ్జెట్ రైలు ఈసారైనా రాష్ట్రంలో ఆగుతుందా.. దీర్ఘకాలిక రైల్వే ప్రాజెక్టులను గమ్యస్థానానికి చేరుస్తుందా.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2023–24కు గాను కేంద్ర బడ్జెట్ను లోక్సభలో బుధవారం ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్లో అంతర్భాగంగానే రైల్వే బడ్జెట్ను కూడా ఆమె సమర్పిస్తారు. దీంతో ఈసారైనా రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు తగిన ప్రాధాన్యం లభిస్తుందా లేదా అన్న ఆసక్తి నెలకొంది. రైల్వే ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్కు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈమేరకు కేంద్ర రైల్వేశాఖకు స్పష్టమైన ప్రతిపాదనలు పంపింది. దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న నాలుగు ప్రధాన ప్రాజెక్టులతోపాటు ప్రత్యేక ఫ్రైట్ కారిడార్, ఆర్వోబీల నిర్మాణాన్ని ఆమోదించాలని కోరింది. ప్రధానంగా భూసేకరణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి నిర్మాణ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్ర పునర్విభజన చట్టం హామీలను గుర్తుచేస్తూ విశాఖపట్నం రైల్వేజోన్ ఆచరణలోకి వచ్చేలా చూడాలని కోరింది. ఆ చట్టం ప్రకారం కొత్తగా రెండులైన్లకు పచ్చజెండా ఊపాలని ప్రతిపాదించింది. ఈ నాలుగు.. ఇంకెన్నేళ్లు? రాష్ట్రంలో 4 ప్రధాన ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ప్రస్తావించింది. అహేతుక రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో భూసేకరణ వ్యయాన్ని భరిస్తామని, ఆ నాలుగు ప్రాజెక్టులను పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే చేపట్టాలని ప్రతిపాదించింది. ఆ ప్రాజెక్టులు.. ► కడప–బెంగళూరు రైల్వేలైన్ను రూ.3,038 కోట్ల అంచనా వ్యయంతో 268 కిలోమీటర్ల మేర నిర్మించాలని 2008–09 బడ్జెట్లో ఆమోదించారు. నాలుగుదశల ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు మొదటిదశ కింద కడప–పెండ్లమర్రి లైన్లో కేవలం రూ.350 కోట్ల పనులు చేశారు. 1,531 ఎకరాలను భూమిని సేకరించి ఇస్తామని, ప్రాజెక్టు వ్యయాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ► నడికుడి–శ్రీకాకుళహస్తి రైల్వేలైన్ పనులు 20 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీని అందించడంతోపాటు ఆ ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధికి దోహదపడేందుకు ఈ ప్రాజెక్టును 2009లో ఆమోదించారు. రూ.2,400 కోట్లతో ఆమోదించిన ఈ ప్రాజెక్టు వ్యయం సవరించిన అంచనాల మేరకు రూ.4,500 కోట్లకు చేరుకుంది. ఇప్పటివరకు 1,300 కోట్ల మేర పనులు చేశారు. భూసేకరణ ప్రక్రియను తాము త్వరగా పూర్తిచేస్తామని, మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్రమే భరించి త్వరలో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ► రాయదుర్గం–తుముకూరు ప్రాజెక్టును రూ.3,404 కోట్లతో ఆమోదించారు. ఇప్పటివరకు రూ.520 కోట్ల పనులే చేశారు. మిగిలిన నిధులను కూడా కేంద్రమే కేటాయించి ప్రాజెక్టును పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ► కీలకమైన కొవ్వూరు–నరసాపురం లైన్ వ్యయాన్ని కేంద్రమే భరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మొత్తం రూ.2,125 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు వరకు రూ.300 కోట్ల పనులు మాత్రమే కేంద్ర రైల్వేశాఖ పూర్తిచేసింది. మిగిలిన పనులను కూడా త్వరగా పూర్తిచేయాలని, అందుకు భూసేకరణను దాదాపు పూర్తిచేశామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రెండు కొత్త లైన్లకు ప్రతిపాదన రాష్టపునర్విభజన చట్టం ప్రకారం రెండు రైల్వేలైన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కొవ్వూరు–భద్రాచలం కొత్త రైల్వేలైన్కు రూ.709 కోట్ల అంచనా వ్యయంతో ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించారు. ఆ రైల్వేలైన్కు ఆమోదం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కొండపల్లి–కొత్తగూడెం మధ్య కొత్త రైల్వేలైన్ వేయాలని ప్రతిపాదించింది. అందుకోసం సర్వే నిర్వహించి డీపీఆర్ రూపొందించేందుకు చర్యలు చేపట్టాలని కోరింది. 28 ఆర్వోబీలు నిర్మించాలి రాష్ట్రంలో లెవల్ క్రాసింగ్ల వద్ద ప్రమాదాలను నివారించేందుకు రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ)ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. అందుకోసం 54 ఆర్వోబీల నిర్మాణాన్ని గతంలోనే ప్రతిపాదించింది. వాటిలో 26 ఆర్వోబీలను రైల్వేశాఖ ఇప్పటికే ఆమోదించింది. మిగిలిన 28 ఆర్వోబీలను కూడా ఆమోదించి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. డోన్లో లోకోషెడ్ ఏర్పాటుచేయాలి కర్నూలు జిల్లా డోన్ కేంద్రంగా రైల్వే కోచ్ల సెకండరీ మెయింటనెన్స్ లోకోషెడ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అందుకోసం 100 ఎకరాలు కేటాయిస్తామని తెలిపింది. తద్వారా రాయలసీమ ప్రాంతంలో రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేయవచ్చన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. కొత్త రైళ్లు కావాలి రాష్ట్రానికి కొత్త రైళ్లు కేటాయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. విశాఖపట్నం–బెంగళూరు, తిరుపతి–వారణాసి సూపర్ఫాస్ట్ రైళ్లు ప్రవేశపెట్టాలని కోరింది. విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగాఢిల్లీకి రాజధాని ఎక్స్ప్రెస్ వేయాల్సి ఉంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ను పట్టాలు ఎక్కించాలి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఈ ఏడాది అయినా ఆచరణరూపం దాలుస్తుందా అని రాష్ట్ర ప్రజలు ఆశగా, ఆసక్తిగా చూస్తున్నారు. విభజన చట్టం ప్రకారం విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించి డీపీఆర్ను రూపొందించింది కూడా. 900 ఎకరాల రైల్వే భూములను గుర్తించి అందులో 150 ఎకరాల్లో ప్రధాన కార్యాలయం నిర్మించాలని నిర్ణయించారు. రైల్వే జోన్ ప్రధాన కార్యాలయంలో వివిధ హోదాల్లో 170 మంది గెజిటెడ్ అధికారులు, 1,200 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను కేటాయించాలని నిర్ణయించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒత్తిడితో జోనల్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి రూ.170 కోట్లు కేటాయించింది. అన్నీ ఉన్నా సరే.. విశాఖపట్నం రైల్వే జోన్ ఇంకా ఆపరేషన్లోకి రాలేదు. వాల్తేర్ డివిజన్ను కొనసాగిస్తూ విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ను పట్టాలెక్కించాల్సిన అవసరం ఉంది. ఈ బడ్జెట్లో అయినా రైల్వే జోన్ ఆపరేషన్లోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. సీమ, ఉత్తరాంధ్ర మధ్య ప్రత్యేక ఫ్రైట్ కారిడార్ రాయలసీమను ఉత్తరాంధ్రతో అనుసంధానిస్తూ ప్రత్యేక ఫ్రైట్ కారిడార్ను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కర్నూలు నుంచి విశాఖపట్నం వరకు ఈ ప్రత్యేక కారిడార్తో వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల కార్గో రవాణా ఊపందుకుంటుందని తెలిపింది. తద్వారా ఛత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లతో రాయలసీమకు నేరుగా రైల్వే కనెక్టివిటీ పెరుగుతుందన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. -
కేంద్ర బడ్జెట్పై గంపెడు ఆశలు..పేద, మధ్యతరగతి ప్రజలు ఏం కోరుకుంటున్నారు!
సాక్షి, హైదరాబాద్: మరో రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్పై అన్ని వర్గాలు గంపెడు ఆశలు పెట్టుకున్నాయి. ఎన్నికలకు ముందటి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో ఏమైనా ఊరట లభిస్తుందేమోనని భావిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేని పరిస్థితి ఉందని.. పన్నులు, ధరల నుంచి ఉపశమనం ఉండాలని పేద, మధ్యతరగతి వర్గాలు కోరుతున్నాయి. ఆదాయ పన్ను మినహాయింపు పెరుగుతుందా అని వేతన జీవులు.. పలు రకాల పన్నుల నుంచి ఉపశమనం ఏదైనా ఉంటుందా అని చిన్నా, పెద్దా వ్యాపారులు ఉత్కంఠగా చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో సామాన్యులపై భారం, వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకొని నిధుల కేటాయింపులు, పన్నుల విధింపు ఉంటే బాగుంటుందని అంతా ఆశిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో పలువర్గాల వారి నుంచి ‘సాక్షి’ అభిప్రాయాలను సేకరించింది. ఆ వివరాలు.. పన్నుల భారం తగ్గించాలి సామాన్యులపై పన్నుల భారం తగ్గించేలా కేంద్ర బడ్జెట్ ఉండాలి. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని, నా భార్య గృహిణి. మా వృత్తిలో వేతనాలు పెరిగినా.. అంతే స్థాయిలో పన్నుల భారం తప్పడం లేదు. నిత్యావసరాల ధరలు చూస్తే చుక్కల్లోకి చేరుతున్నాయి. కోట్లలో బ్యాంకులను ముంచేస్తున్న వారికి మాఫీలు చేస్తున్న ప్రభుత్వం.. మాలాగా నిజాయితీగా పన్నులు చెల్లించే వారిపై భారాన్ని ఎందుకు తగ్గించకూడదు? – ఉదయ, నాగేందర్రెడ్డి, సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబ ఖర్చు పెరిగింది.. రోజువారీ సాధారణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. కోవిడ్ ముందు మా కుటుంబ నెలవారీ ఖర్చు రూ.18 వేలు ఉండేది. ఇప్పుడది రూ.28 వేలకు పెరిగింది. ఆదాయంమాత్రం ఆ మేరకు పెరగలేదు. ప్రతిదాని ధర పెరిగి.. సామాన్యుల జీవనం అతలాకుతలం అవుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను గుర్తించి ఆ దిశగా ధరలు తగ్గేలా చూడాలి. – కావలి నర్సింహ,ప్రైవేటు ఉద్యోగి, పరిగి ఆదాయ పన్ను మినహాయింపు రూ.5 లక్షలకు పెంచాలి ఉద్యోగులపై ఆదాయ పన్ను భారం తగ్గించాలి. మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలి. ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ను రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచాలి. స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, పలు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అన్ని వర్గాలకు తప్పనిసరి అయ్యాయి. అలాంటి వాటి ధరలు తగ్గేలా చూడాలి. పెట్రోల్, డీజిల్ల ధరలు తగ్గేలా జీఎస్టీ పరిధిలోకి తేవాలి. – శ్రీవిందు, శ్రీనివాసరావు, ప్రైవేటు ఉద్యోగి మందుల ధరలు తగ్గాలి వృద్ధాప్యంలో మందుల ఖర్చే ఎక్కువ. రిటైర్ అయినప్పటి నుంచీ పెన్షన్లో సగం మందుల కోసమే ఖర్చు చేస్తున్నాను. కామన్గా వాడే మందుల ధరలు తగ్గిస్తే పెన్షనర్లకు మేలు చేసినట్టు అవుతుంది. – పి.మోహన్రావు, రిటైర్డ్ ఉద్యోగి మెరుగైన విద్య, వైద్యం అందాలి దేశంలో ఉద్యోగుల పిల్లలతోపాటు ప్రతి ఒక్కరికి మెరుగైన విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత. ఆ దిశగా బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలి. యూనివర్సిటీలు, గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది. టెక్నాలజీ రంగంలో ఇతర దేశాలతో పోటీ పడేలా నిధులు ఇవ్వాలి. – ఏవీ సుధాకర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఇబ్రహీంపట్నం స్టార్టప్లకు ఊతమిచ్చేలా ప్రోత్సాహకాలు ఉండాలి ఆర్థిక మాంద్యం భయపెడుతోంది. పెద్ద పెద్ద కంపెనీలు లేఆఫ్లు అంటున్నాయి. సమర్థత ఉన్న ఐటీ నిపుణులు స్టార్టప్లు పెట్టుకునేందుకు ఊతం ఇవ్వాలి. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఉండాలి. – ఆదిత్య కొండూరు, ఐటీ ఉద్యోగి చిరు వ్యాపారులకు రాయితీలు ఇవ్వాలి పెద్దపెద్ద మాల్స్ వచ్చాక చిరు వ్యాపారులు బతికే అవకాశం లేకుండా పోయింది. బడ్జెట్ వచ్చినప్పుడల్లా మా గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా పన్నుల భారం పడుతూనే ఉంది. మాల్స్లో ఒకదానిపై తగ్గించినా, మరోదానిపై రాబడతారు. ఎక్కువ వ్యాపారం ఉంటుంది కాబట్టి కలిసి వస్తుంది. కానీ చిరు వ్యాపారాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. మా లాంటి వారికి ఊరటనిచ్చేలా రాయితీలు ప్రకటిస్తే బాగుంటుంది. – కాకి వీరభద్రం, చిరు వ్యాపారి డీజిల్ ధర అతలాకుతలం చేస్తోంది భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు రవాణా రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గత ఏడాది కాలంలో తెలంగాణలో 19 మంది లారీ యజమానులు ఆత్మహత్య చేసుకున్నారు. డీజిల్ ధర లీటరుకు రూ.50–60 ఉన్నప్పుడు ఖరారు చేసిన చార్జీలనే వ్యాపారులు ఇప్పటికీ అమలు చేస్తున్నారు. ఇందులో డీజిల్కే ఎక్కువగా ఖర్చవుతోంది. బీమా చార్జీలు రెండింతలు అయ్యాయి. రవాణా వాహనాల యజమానులు బ్యాంకు కిస్తీలు కట్టలేని దుస్థితిలో ఉన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం డీజిల్ ధరలను తగ్గించి తీపి అందించాలి. – మంచిరెడ్డి రాజేందర్రెడ్డి, తెలంగాణ లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బతుకు భారం కాకుండా చూడాలి పెట్రోల్ ధరలు పెరిగినప్పుడల్లా ఇంట్లో వాడే నిత్యావసరాలకు కోత పెట్టుకునే పరిస్థితి ఉంది. సరదాగా ఎక్కడికైనా వెళ్తే జీఎస్టీ పేరుతో పిండేస్తున్నారు. ఇంటి బడ్జెట్ రెండేళ్లలోనే డబుల్ అయింది. ప్రతీ దానిపైనా పన్నులేస్తే బతికేదెట్లా? చిన్న ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు ఉండేలా బడ్జెట్ ఉండాలి. జీఎస్టీ నుంచి పేద వర్గాలు ఉపయోగించే వస్తువులను తొలగించాలి. – కె.రూపాదేవి, గృహిణి -
చైనా సరిహద్దు ఉద్రిక్తత: ఈ సారి కూడా రక్షణ రంగానికి ప్రాధాన్యత?
న్యూఢిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధఙంచిన కేంద్ర బడ్జెట్ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. అటు రానున్న ఎన్నికలు, ఇటు మోదీ సర్కార్కు చివరి వార్షిక బడ్జెట్ కానున్న నేపథ్యంలో రక్షణ రంగంతో పాటు పలు రంగాలు ఈ బడ్జెట్పై ఆశలు పెట్టుకున్నాయి. భారత సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గత బడ్జెట్లలో రక్షణ వ్యయానికి ప్రాధాన్యతనిచ్చింది. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)వద్ద చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య బడ్జెట్ 2023 రక్షణ రంగ కేటాయింపులు 10-15 శాతం పెరగవచ్చని అంచనా. 10-15 శాతం పెరగనున్న కేటాయింపులు ఈ బడ్జెట్లో రక్షణ వ్యయం 10-15 శాతం పెరుగుతుందని రక్షణ రంగం అంచనా వేసింది. రక్షణ రంగంలో, ముఖ్యంగా దేశీయ ఉత్పత్తికి సంబంధించి, పరికరాలు, ఆర్ అండ్ డికి సంబంధించిన ఆర్డర్లు వంటి వాటిని అంచనా వేస్తుంది. అదే సమయంలో, ప్రభుత్వ దేశీయ కంపెనీలు తయారీని పెంచడానికి మరింత ప్రోత్సాహాన్ని అందించవచ్చు. 25 శాతం వృద్ధిని, రక్షణ బడ్జెట్ రూ. 6.6 లక్షల కోట్ల వరకు పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎంఎస్ఎంఈలపై దృష్టి దీంతోపాటు, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) మంత్రిత్వ శాఖ కూడా బడ్జెట్లో దృష్టి సారించనుంది. రక్షణ రంగంలో ఎంఎస్ఎంఈ భాగస్వామ్యం మరింత పెరగాలని భావిస్తోంది. పరిశోధన అభివృద్ధి కోసం ప్రకటించిన ప్రోత్సాహకాలు లేదా విధానాలతో పాటు, కొత్త పరికరాల సేకరణకు కూడా బడ్జెట్లో కేటాయించిన మొత్తంలో పెంపును నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా రక్షణ మంత్రిత్వ శాఖకు గతేడాది రూ.5.25 లక్షల కోట్ల మొత్తం బడ్జెట్ను కేటాయించారు. అలాగే రక్షణ రంగంలో పరిశోధనలకు 25 శాతం పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఏడాది రూ.2.33 లక్షల కోట్లు కేటాయించగా, రక్షణ మంత్రిత్వ శాఖకు రూ.2.39 లక్షల కోట్లు కేటాయించారు. రక్షణ శాఖ పెన్షన్ బడ్జెట్ రూ.1.19 లక్షల కోట్లుగా ఉంది. 'మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్' లో భాగంగా దేశీయ పరిశ్రమలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో దేశీయ స్థాయిలో సామర్థ్య విస్తరణకు రక్షణ రంగం పెద్దపీట వేసింది. -
Union Budget 2023: నిర్మలమ్మా.. 9 ఏళ్లు అయ్యింది, ఈ సారైనా పెంపు ఉంటుందా?
ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని ఫిబ్రవరి నెలలో పార్లమెంట్లో ప్రవేశపెడుతోంది. అయితే గత కొన్నేళ్లుగా మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం కలిగించే పన్ను ఆంశం మాత్రం మోదీ సర్కార్ దాటేస్తూ వస్తోంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయే ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో ఈ సారైన ఈ వర్గం ప్రజలు ఆశించిన రాయితులు, పరమితుల, కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు. అప్పుడేప్పుడు పెంచిన పరిమితి.. ఇప్పటి వరకు ఆ ఊసే లేదు ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. రూ.2.5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికి ఎలాంటి ఆదాయపన్ను ఉండదు. ఈ రూల్.. 2014–2015 సంవత్సరానికి ఆదాయపన్ను బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూ.2 లక్షలుగా ఉన్న పరిమితిని రూ.2.5 లక్షలు చేశారు. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఇది రూ.3 లక్షలుగా, రూ.80 ఏళ్లు నిండిన వారికి రూ.5 లక్షలకు పెంచారు. తొమ్మిదేళ్లు గడుస్తున్న ఈ బేసిక్ పరిమితిలో ఏ మార్పులు లేకుండా ఇలానే కొనసాగుతోంది. అయితే రూ.2.51–5 లక్షల వరకు ఆదాయం ఉన్నా పన్ను చెల్లించే అవసరం లేకుండా తర్వాతి కాలంలో రాయితీ కల్పించినప్పటికీ, బేసిక్ పరిమితిలో మార్పులు చేయలేదు. ఈ ఏడాది బడ్జెట్ 2023లోనైనా ఈ పరిమితి పెంపును కోరుకుంటున్నారు మధ్య తరగతి ప్రజలు. బేసిక్ పరిమితి పెంచాలి.. ఎందుకంటే! గణనీయంగా పెరిగిపోయిన జీవన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని రూ.5–6 లక్షలు చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది. ఈ కానుక ఉంటుందనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. లేదంటే రూ.50వేలుగా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ను పెంచుతారేమో చూడాలి. అలాగే, సెక్షన్ 80సీ కింద వివిధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను లేకుండా ఉపశమనం పొందొచ్చు. దీన్ని కూడా రూ.2–3 లక్షలకు పెంచాలనే డిమాండ్లు నెలకొన్నాయి. అలాగే, గరిష్ట పన్ను రేటు 30 శాతం అమలుకి ఆదాయపన్ను పరిమితిని పెంచాలన్న డిమాండ్ బలంగా ఉంది. ప్రస్తుతం వార్షికాదాయం రూ.10లక్షలకు మించితే పాత పన్ను విధానంలో 30 శాతం రేటు అమలు చేస్తున్నారు. రూ.20 లక్షల వరకు ఆదాయం ఉండే వారికి 20 శాతం మించి పన్ను ఉండరాదన్నది నిపుణుల సూచనగా ఉంది. పన్ను భారం తగ్గించడం వల్ల మధ్య తరగతి, వేతన జీవులకు ఖర్చు చేసే ఆదాయం మరింత మిగులుతుంది. ఇది వినియోగంలోకి మారి, డిమాండ్కు ఊతం ఇస్తుందన్న విశ్లేషణ వినిపిస్తోంది. పన్నుల భారం తగ్గించడం ఒక కోణం అయితే, సామాన్యులు, మధ్యతరగతి వాసులపై కొత్తగా ఏ రూపంలోనూ పన్నుల భారం మోపకుండా ఉండడం కీలకం కానుంది. మరోవైపు ధరల భారం ఎక్కువ మందిని భయపెడుతోంది. కనుక కూరగాయలు, వంట నూనెలు, చమురు ధరల కట్టడికి తీసుకునే చర్యలకూ ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. -
రానున్న బడ్జెట్ సెషన్లో అదానీ గ్రూప్ vs హిండెన్బర్గ్ సునామీ?
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ vs హిండెన్బర్గ్ రీసెర్చ్ వివాదం సెగ రానున్న బడ్జెట్ సెషన్ను భారీగానే తాగనుంది. ప్రతి పక్షాల విమర్శలు, ఆరోపణలు, డిమాండ్ల నేపథ్యంలో ఫిబ్రవరి 1న ప్రారంభమయ్యే 2023 బడ్జెట్ సమావేశాల్లో ప్రకంపనలు రేగే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా హిండెన్బర్గ్ రిపోర్ట్పై అదానీ గ్రూప్ ఇటీవల చేసిన ప్రకటన రాజకీయ దుమారాన్ని రేపింది. 413 పేజీలతో అదానీ గ్రూపు ఇచ్చిన వివరణమరింత ఆజ్యం పోసింది. అమెరికన్ షార్ట్సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదికలో చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా తప్పులతడకలని అదానీ గ్రూప్ వ్యాఖ్యానించింది. ఇది ఏదో ఒక కంపెనీపై ఊరికే చేసిన దాడి కాదని.. లాభనష్టాలు అన్నింటినీ బేరీజు వేసుకుని భారత్పైనా .. భారతీయ సంస్థల స్వతంత్రత, సమగ్రత, నాణ్యతపైనా .. భారత వృద్ధి గాధ, ఆకాంక్షలపైనా చేసిన దాడి అని అభివర్ణించింది. దీంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అదానీ ఎపుడు ఇండియాగా మారిపోయారని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ నేత వైసతీష్ రెడ్డి ప్రశ్నించారు. ఈ వివాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎందుకు పెదవి విప్పడం లేదంటూ ముఖ్యంగా కాంగ్రెస్, శివసేన నాయకులు విమర్శలు గుప్పించారు. దీంతో ఈ వివాదం పార్లమెంటులో రాబోయే బడ్జెట్ సమావేశాలపై ప్రభావం చూపవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ అదానీ ఎప్పుడు భారతదేశంగా మారిందని ప్రశ్నించారు. అలాగే అదానీ ఎక్కువ పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీ షేర్లు (రెండు రోజుల్లో రూ.22,442 కోట్లు)కుప్పకూలడంపై ఆందోళన వ్యక్తం చేశారు. క్రోనీస్ కోసం 29 కోట్ల పాలసీదారులతో దేశ "లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్"!ను మోడీ ప్రభుత్వం లూట్ ఇన్వెస్ట్మెంట్గా మార్చేసిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. (అదానీ గ్రూప్ దేశ భవిష్యత్తును వెనక్కి లాగుతోంది:అదానీకి హిండెన్బర్గ్ కౌంటర్) శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది కూడా అదానీ గ్రూప్ అంటే ఇండియా, ఇండియా అంటూ అదానీ గ్రూప్ అంటూ సెటైర్లు వేశారు. అమెరికాలోని ఒక చిన్న సంస్థ బహిర్గతం చేసేదాకా ఆర్థిక మంత్రి ఇంతకాలం ఏమి చేస్తున్నారు? సెబీ ఎక్కడ ఉంది? కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎక్కడ ఉంది? 2022లో మార్కెట్ క్యాపిటలైజేషన్ వృద్ధిలో దాదాపు 80 శాతం వాటాను ఒక గ్రూపు కలిగి ఉంది అంటూ కాంగ్రెస్ నాయకుడు సంజయ్ ఝా విమర్శించారు. కాగా ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2023ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి బడ్జెట్. మరి ఈ వివాదంపై పార్లమెంట్ సమావేశాల్లో రాజకీయ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. -
బడ్జెట్లో సంక్షేమ మార్గం పడతారా? భారత్కు ఈ ఘనత ఎలా సాధ్యపడింది?
కేంద్రం ప్రతియేటా ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్ కారణంగా ప్రభావితం అయ్యే వర్గాల ప్రజలలో బడ్జెట్ ముందు సహజంగానే కొంత ఉత్కంఠ నెలకొంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్లో పెద్ద ఎత్తున సంక్షేమ పథ కాలు ఉండొచ్చునన్న అంచనాలు ఉన్నాయి. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అనే నినాదాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గత 8 ఏళ్లుగా వల్లె వేస్తున్నారు. అంటే – దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం కలగజేయడం, వారి జీవన ప్రమాణాలు పెంచడం తమ లక్ష్యం అని చెప్పుకొంటూ వస్తున్నారు. పేదలకు గృహనిర్మాణం, పారిశుద్ధ్యం మెరుగుదల, పేద కుటుంబాలన్నింటికీ గ్యాస్ సిలిండర్ల సరఫరా, నగదు బదిలీ పథకాలు, రైతాంగానికి పెట్టుబడి సాయం (పీఎం కిసాన్), వృద్ధాప్య పెన్షన్లు, ఆయుష్మాన్ భారత్, పేదలకు ఉచిత రేషన్ తదితర పథకాలన్నీ తమ సంక్షేమ విధానానికి చిహ్నంగా బీజేపీ అభివర్ణించుకొంటున్నది. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాల్ని అంది స్తున్నప్పుడు ‘సబ్ కా వికాస్’ ఆచరణలోకి రావాలి కదా! దేశ జనాభాలో 1 శాతం మంది ధనికుల చేతుల్లో 40 శాతం దేశ సంపద చిక్కుకుని ఉందనీ; 50 శాతం జనాభా అంటే... 65 నుంచి 70 కోట్ల మంది ప్రజల చేతుల్లో కేవలం 3 శాతం సంపద మాత్రమే ఉన్నదనీ తాజా గణాంకాలు వెల్లడించాయి. మరోపక్క ఈ 8 ఏళ్లల్లో బ్యాంకుల 14.38 లక్షల కోట్ల రూపాయల మొండి బకాయిలను రద్దు చేశారు. అయినప్పటికీ ఇంకా బ్యాంకుల నిరర్థక ఆస్తుల గ్రాస్ రేటు 6.5 శాతంగా ఉంది. పెట్రో ధరల పెరుగుదల చరిత్రలో లేనంతగా ఈ 8 ఏళ్లల్లో పెరిగింది. డీజిల్పై 512 శాతం, పెట్రోల్పై 194 శాతం, గ్యాస్ సిలిండర్లపై 185 శాతం భారం మోపారు. అన్ని వస్తువులపై గరిష్ఠంగా వేస్తున్న జీఎస్టీ, గృహనిర్మాణ వస్తువుల ధరల పెరుగుదల... తదితర భారాలతో పోల్చితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం ఎందుకూ కొరగాకుండా ఉంది. ఉద్యోగాల సృష్టి చేయలేని ఆర్థికాభివృద్ధి వల్ల ఎటువంటి లాభం లేదని గత కొన్నేళ్ల అనుభవాలు తెలియ జేస్తున్నాయి. ఉపాధి, ఉద్యోగాలు లేకుండా ఉన్న యువత సంఖ్య 21.8 కోట్లుగా ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తు న్నాయి. దేశంలో ఇంకా అనేక ప్రాంతాలకు రైలు రవాణా విస్తరించాల్సి ఉండగా, దేశంలోని ఎగువ మధ్యతరగతి వారి కోసం ‘వందే భారత్’ రైళ్లను ప్రవేశపెట్టారు. రైల్వే ట్రాక్ల సామర్థ్యం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ, వాటిని పూర్తి స్థాయిలో పటిష్ఠపర్చకుండా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందే భారత్ రైళ్లను ఒక్కొక్కటి రూ. 120 కోట్ల వ్యయంతో దశల వారీగా మొత్తం 475 ప్రారంభించాలని సంకల్పించడం ఆశ్చర్యం కలిగించకమానదు. 2014లో అధికారంలోనికి వచ్చిన బీజేపీ ఈ 8 ఏళ్లలో సంక్షేమబాట నుంచి క్రమంగా వైదొలుగుతూ వస్తోంది. 2016లో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొన్న రెండు ప్రధాన నిర్ణయాలు దేశ ఆర్థికరంగాన్ని అతలా కుతలం చేశాయి. మొదటిది పెద్లనోట్ల రద్దు; రెండోది జీఎస్టీ అమలు. వ్యవసాయ రంగ ముఖచిత్రాన్ని మార్చి వేస్తామని చెప్పి కార్యాచరణ చేపట్టకపోవడంతో రైతులు రెట్టింపు నష్టాల్లో కూరుకుపోయారు. ప్రస్తుతం దేశంలో అనేక రాష్ట్రాలలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారు. దానివల్ల ఆహార ధాన్యాల నిల్వలు పడిపోతు న్నాయి. గోదాముల్లో ఇప్పుడు కేవలం 4.92 కోట్ల మెట్రిక్ టన్నుల గోధుమలు, బియ్యం మాత్రమే నిల్వ ఉన్నట్లు భారత ఆహార సంస్థ తెలియజేసింది. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యరంగంపై కొంతమేర అనివార్యంగా వ్యయాన్ని పెంచింది. టీకాల కొనుగోలు, ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా పెంపుదల వంటి మౌలిక సదుపాయాలపై గణనీయంగా ఖర్చు చేసింది. అయినప్పటికీ, ఆ మొత్తం.. దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో 2 శాతానికి మించలేదు. ఇక, విద్యారంగాన్ని పరిశీలిస్తే, 2012–13లో యూపీఏ ప్రభుత్వం జీడీపీలో 3.36 శాతం నిధుల్ని కేటాయించగా, ఎన్డీఏ వచ్చిన ఈ 8 ఏళ్లల్లో విద్యారంగంపై చేస్తున్న వ్యయంలో నామమాత్రపు పెరుగుదల మాత్రమే ఉంది. నూతన విద్యా విధానాన్ని ఘనంగా ప్రకటించినప్పటికీ అందుకు అనుగుణంగా కేటాయింపులు పెంచలేదు. మధ్యాహ్న భోజన పథకానికి (ప్రధాన మంత్రి పోషణ్) వెచ్చిస్తున్న నిధుల్లో గత 7 ఏళ్లుగా ఎలాంటి పెరుగుదలా లేదు. కీలకమైన విద్యారంగంలో కేటాయింపులు పెంచకుండా దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్లగలరు? ఎంతో కీలకమైన పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్ డీ) రంగంలో ఇతర దేశాలు 3 శాతం మేర కేటాయింపులు చేస్తుంటే భారత్ కేటాయింపులు గత దశాబ్ద కాలంగా 1 శాతం మించడం లేదు. 2008, 2009 సంవత్సరాలలో భారత్ అత్యధిక స్థాయిలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల్ని, 2.5 శాతం జీడీపీ మేర ఆకర్షించింది. కానీ, ఆ మొత్తం క్రమంగా తగ్గిపోతూ 2021 నాటికి 1.4 శాతానికి చేరింది. నిరుద్యోగిత పెరుగుదల వల్ల ప్రజల పొదుపు గణనీయంగా పడిపోయింది. క్యాపిటల్ ఫార్మేషన్లో కీలకమైన పొదుపు మొత్తాలు సన్నగిల్లడంతో... కేంద్ర ప్రభుత్వం అధిక వడ్డీ రేట్లకు వివిధ మార్గాల ద్వారా అప్పులు తెచ్చుకొంటోంది. ఈ 8 ఏళ్లల్లో కేంద్రం కొత్తగా చేసిన అప్పులు రూ. 91 లక్షల కోట్లు దాటాయి. అయితే, బ్రిటన్ను పక్కకు తోసి భారత్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇదెలా సాధ్యపడింది? ఇందులో కేంద్ర ప్రభుత్వం చొరవను సమీక్షించినట్లయితే, గత 20 సంవత్సరాలలో, ఇతర దేశాలకంటే భారత్ ఐటీ రంగంలో వడివడిగా ముందుకుసాగింది. ఐటీ ఆధారిత సేవలు, ఉత్పత్తుల రంగంలో భారత్ అగ్రగామిగా ఉంది. ఈ రంగం అభివృద్ధికి కేంద్రం చేసింది నామ మాత్రమే. సేవల రంగంలో కూడా మిగతా అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత్ అగ్రస్థానంలో ఉంది. (క్లిక్ చేయండి: సీతమ్మ వాకిట్లో... మధ్యతరగతి) క్లుప్తంగా చెప్పాలంటే, దేశ ఆర్థికాభివృద్ధికి ఐటీ, సేవల రంగాలు మాత్రమే గణనీయంగా దోహదం చేస్తున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టు బడులు ఎక్కువగా ఐటీ, సేవల రంగాల్లోనే వస్తున్నాయి. ఇతర కీలక రంగాలలో ఎఫ్డీఐలను ఆకర్షించాల్సిన అవసరం ఉంది. ఉత్పత్తిరంగంలో వృద్ధి ఆశాజనకంగా లేదు. దేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ రంగం పట్ల ఇంతకు ముందు మాదిరిగానే చిన్నచూపు చూస్తున్నారు. ‘మేకిన్ ఇండియా’ ఎందుకు చతికిల పడిందో ఆత్మావలోకనం చేసుకోవాలి. దేశంలో 15 కోట్ల మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ ఎంఇ) ఊతం కల్పించాలి. విద్య, ఆరోగ్య రంగాలపై ప్రభుత్వ వ్యయం ఇంకా పెరగాలి. ఆహార ఉత్పత్తుల దిగుమతులపై ఆంక్షలు విధించి దేశీయ రైతాంగాన్ని మరింత ప్రోత్సహించాలి. నూతన వార్షిక బడ్జెట్లోనైనా ప్రధాని దేశంలో 60 కోట్లు పైబడి ఉన్న పేద, మధ్య తరగతి వర్గాలపై కనికరం చూపిస్తారా? - సి. రామచంద్రయ్య శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్. -
గత ఎన్నికల ముందు బడ్జెట్లో అత్యధిక కేటాయింపులు ఆ రంగాలకే.. మరి ఈ సారి?
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బడ్జెట్ సమావేశానికి ఇక రెండు రోజులే ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2023ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది బడ్జెట్పై కోట్ల ప్రజలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ప్రవేశపెడుతున్న చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే. ప్రస్తుతం రాబోవు బడ్జెట్పై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే 2019 ఎన్నికల ముందు నాటి ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్లో ఎలా ఉంటుందో ఈ తరుణంలో ఒకసారి పరిశీలిస్తే ఈ బడ్జెట్పై కాస్త క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పటి బడ్జెట్ ఎలా ఉందంటే.. గత 9 ఏళ్లుగా మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం తిరగు లేకుండా పాలిస్తున్న సంగతి తెలిసిందే. మరోసారి ప్రజామోదం కోసం ఈ బడ్జెట్ను కేంద్రం ఒక అవకాశంగా భావిస్తుందా..? లేక మొదటి నుంచి సంస్కరణల హితమేనన్న తమ విధానానికి కట్టుబడి ఉంటుందా? అన్నది తెలియాలంటే ఫిబ్రవరి 1 వరకు వేచి చూడాల్సిందే. 2019 ఎన్నికల ముందు నాటి పూర్తి స్థాయి బడ్జెట్ను ఒకసారి గమనించినట్టయితే.. హెల్త్కేర్, పారిశుద్ధ్యం, విద్యా రంగాలకు అంతకుముందు మూడు సంవత్సరాల్లో లేనంతగా కేటాయింపులు పెంచారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని అరుణ్ జైట్లీ ప్రకటించారు. విద్య, సామాజిక భద్రత, ఆరోగ్యం కోసం రూ.1.38 లక్షల కోట్లు కేటాయించారు. ఆదాయపన్నుపై హెల్త్, ఎడ్యుకేషన్ సెస్ను 3 శాతం నుంచి 4 శాతానికి పెంచారు. ‘‘భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది. అతిపెద్ద యువ జనాభా కలిగి ఉన్న భారత్ తన హామీలను అమల్లో పెట్టాల్సిన అవసరం ఉంది’’అని నాడు అరుణ్జైట్లీ 2018–19 బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. చదవండి: నమ్మలేకపోతున్నా.. ఇంటర్వ్యూ చేస్తుండగానే ఉద్యోగం ఊడింది -
అఖిలపక్ష భేటీ.. బడ్జెట్ సమావేశాలు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇవాళ(సోమవారం) అఖిలపక్ష సమావేశం నిర్వహించింది కేంద్రం. బడ్జెట్ సమావేశాల దృష్ట్యా సజావుగా సభలు సాగేందుకు సహకరించాలని ఈ సందర్భంగా విపక్షాలను కోరింది. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందు.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టబోయే చివరి బడ్జెట్ ఇదేకానుంది. అందుకే విపక్షాలు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. దాదాపు అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు ఈ భేటీకి హాజరైనట్లు తెలుస్తోంది కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ సమావేశానికి నేతృత్వం వహించారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, వి.మురళీధరన్ సైతం హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. మంగళవారం పార్లమెంట్ సమావేశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో మొదలుకానున్నాయి. ప్రసంగం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. ఇక బుధవారం పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెడతారు. -
మధ్య తరగతికి చేరువ కండి
మధ్య తరగతికి మరింత చేరువ కావాలని కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వారికి లబ్ధి చేకూర్చిన పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి మరింత వివరంగా తెలియజేయాలన్నారు. ఆదివారం ఇక్కడ మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. బుధవారం సమర్పించబోయే కేంద్ర బడ్జెట్ గురించి చర్చ జరిగింది. ప్రభుత్వ పథకాలు పేద, అణగారిన వర్గాలకు ఎనలేని లబ్ధి చేకూర్చడంతో పాటు మధ్యతరగతి ప్రజల జీవితాన్ని ఎంతో సుఖమయం చేశాయని మోదీ అన్నారు. ఈ విషయాలన్నింటినీ వారికి అర్థమయ్యేలా చెప్పాల్సిందిగా మంత్రులకు దిశానిర్దేశం చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... స్వాతంత్య్ర అమృతోత్సవ వేళ బ్రిటిష్ వలస పాలనకు సంబంధించిన చిహ్నాలన్నింటినీ ఒక్కొక్కటిగా తప్పిస్తూ ముందుకు సాగుతున్నట్టు ప్రధాని చెప్పారు. భేటీలో మూడు అంశాలపై మంత్రులకు ప్రజెంటేషన్లు ఇచ్చారు. మోదీ ప్రభుత్వ ఎనిమిదేళ్ల పాలనలో సామాజిక, ఆర్థిక రంగాలకు సంబంధించిన పనితీరుపై కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ గౌబా సవివరంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆరోగ్య, విద్యా రంగాల్లో సాధించిన ప్రగతిని కూడా వివరించారు. చిన్న, మధ్య తరహా నగరాల్లోనూ ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్ల స్థాపన తదితరాలను ఉటంకించారు. విద్యా వ్యవస్థలో అన్ని స్థాయిల్లోనూ విద్యార్థుల చేరిక, కొనసాగింపు శాతం బాగా పెరిగాయని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మానవ వనరులతో పాటు అన్నిరకాల వసతులనూ మెరుగు పరిచామన్నారు. ఇక కేంద్రం ప్రారంభించిన పలు ప్రాజెక్టుల వివరాలపై పరిశ్రమలు, అంతర్గత వర్తక శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ మంత్రులకు మరో ప్రజెంటేషన్ ఇచ్చారు. మోదీ ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు మాధ్యమాలను మరింత మెరుగ్గా ఎలా వాడుకోవచ్చో సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తన ప్రజెంటేషన్లో వివరించారు. -
రియల్ ఎస్టేట్ రంగంపై కేంద్రం వరాలు కురిపిస్తుందా?
త్వరలో కేంద్రం ప్రవేశ పెట్టే బడ్జెట్పై దేశ ఆర్ధిక ప్రగతికి దోహదం చేసే రంగాల్లో ఒకటిగా నిలుస్తోన్న స్థిరాస్థి (రియల్ ఎస్టేట్) రంగం గంపెడాశలు పెట్టుకుంది. కరోనా తగ్గడంతో 2022లో ఇళ్ల విక్రయాలు 50 శాతానికి పైగా పెరిగాయి. రానున్న రోజుల్లో అదే జోరు కొనసాగాలంటే బడ్జెట్లో స్థిరాస్థి రంగానికి కేంద్రం ఊతం ఇవ్వాలని ఆ రంగం కోరుతోంది. దేశ ప్రజలందరికి అందరికి ఇళ్లు ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద 2022 మార్చి 31 నాటికి మొత్తం 2 కోట్ల మంది లబ్ధి దారులు ఆమోదయోగ్యమైన ధరలో సొంతింటి కలను సాకారం చేసుకునేలా కొన్ని రాయితీల్ని ప్రకటించింది. ఇందులో భాగంగా 2019లో జీఎస్టీ కౌన్సిల్ మండలి సొంతింటిపై విధించే ట్యాక్స్ను తగ్గించింది. గతంలో ఎవరైనా ఇల్లు కొనుగోలు చేస్తే ఆ ఇంటిపై 8శాతం పన్ను చెల్లించాల్సి ఉండగా.. దానిని కాస్త ఒక శాతానికి కుదించింది. ఆయా కేటగిరీలకు చెందిన ఇళ్ల గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ 12శాతం నుంచి 5శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో సామాన్యులు ఇళ్ల కొనుగోలు చేసేందుకు మక్కువ చూపే వారు. ఇళ్ల ధరల పరిమితిని రూ.75లక్షలకు పెంచాలి ప్రస్తుతం రూ.45లక్షలు అంతకంటే తక్కువ ధరలో ఉన్న ఇళ్లను అందుబాటు ధరలో ఉన్న ఇళ్ల కేటగిరీ కింద పరిగణిస్తున్నారు. వీరికి కొన్ని ప్రయోజనాల్ని ప్రత్యేకంగా కల్పిస్తున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో ఉన్న ఇళ్ల ధరల్ని పరిగణలోకి తీసుకొని రూ45లక్షల పరిమితిని రూ.75లక్షలకు పెంచాలని స్థిరాస్థి వర్గాలు కోరుతున్నాయి. గడువు 5ఏళ్లకు పెంచాలి ప్రస్తుతం ఉన్న ఇంటిని అమ్మగా వచ్చిన లాభాల్ని ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ - 54 ప్రకారం.. కొత్త ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణానికి వినియోగించుకోవచ్చు. ఆ డబ్బుతో నిర్మాణంలో ఉన్న ఇంటిని కూడా కొనొచ్చు. కానీ దాని నిర్మాణం 3ఏళ్ల లోపు పూర్తయితేనే పన్ను మినహాయింపు వర్తిస్తుంది. వివిధ కారణాల వల్ల ఇళ్ల నిర్మాణంలో ఆలస్యం జరుగుతున్నందున ఈ గడువును 5ఏళ్లకు పెంచాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. జీఎస్టీ తగ్గించాలి ఇళ్ల నిర్మాణానికి వాడే స్టీల్పై 18శాతం, సిమెంట్పై 28 శాతం జీఎస్టీ కొనసాగుతుంది. కాబట్టి నిర్మాణ వ్యయాలు పెరిగి ఆ భారాన్ని కొనుగోలు దారులపై మోపాల్సి వస్తుందని స్థిరాస్థి వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా ప్రజలు ఇళ్లను కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదని వాపోతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాణంలో ఉపయోగించే వస్తువులపై జీఎస్టీని తగ్గించాలని కోరుతున్నాయి. -
Union Budget 2023: బడ్జెట్ చరిత్రలో ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా!
జనవరి చివరి వారం వచ్చేసింది. దీంతో దేశవ్యాప్తంగా బడ్జెట్ పేరు మారుమోగుతోంది. ఇందులో కేంద్రం అందించే కేటాయింపులు, పలు రంగాలను ప్రభావితం చేసే నిర్ణయాలు, పన్ను తగ్గింపు లేదా పెంపు చర్యలపై, సంక్షేమ పథకాలు, అభివృద్ధి చర్యలుపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుందో అని సామాన్య ప్రజల నుంచి కార్పొరేట్ సంస్ధలు ఈ బడ్జెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న వార్షికబడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ తరుణంలో బడ్జెట్కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలపై ఓ లుక్కేద్దాం! ►10: మొరార్జీ దేశాయ్ సమర్పించిన కేంద్ర బడ్జెట్ల సంఖ్య, ఇప్పటి వరకు తిరుగులేని రికార్డు. దేశాయ్ జవహర్లాల్ నెహ్రూ (1958-1963), ఇందిరా గాంధీ (1967-1969) హయాంలో భారతదేశ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1996-1998, 2004-2008, 2012-2014 మధ్య తొమ్మిది బడ్జెట్లతో పి.చిదంబరం రెండవ స్థానంలో ఉండగా, ఎనిమిది బడ్జెట్లను సమర్పించిన ప్రణబ్ ముఖర్జీ (1982-1984, 2008-2012) జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. ►మూడు: సాధారణ ఆర్థిక మంత్రి లేకపోవడంతో ప్రధానులు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ముగ్గురూ నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందినవారు. టిటి కృష్ణమాచారి రాజీనామా తర్వాత జవహర్లాల్ నెహ్రూ 1958 బడ్జెట్ను సమర్పించారు. బ్యాంక్ జాతీయీకరణకు వ్యతిరేకంగా తన ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసిన తర్వాత ఇందిరా గాంధీ 1970 బడ్జెట్ను సమర్పించారు. రాజీవ్ గాంధీ 1987లో VP సింగ్ను రక్షణ మంత్రిత్వ శాఖకు బదిలీ చేసిన తర్వాత బడ్జెట్ను సమర్పించారు, ఆ పోర్ట్ఫోలియోను తాత్కాలికంగా తన వద్ద ఉంచుకున్నారు. ►800: 1977లో హెచ్ఎం పటేల్ బడ్జెట్ ప్రసంగంలోని పదాల సంఖ్య. ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఆర్థిక మంత్రి చేసిన అతి చిన్న ప్రసంగం అంటే ఇదే. ►18,700: డాక్టర్ మన్మోహన్ సింగ్ 1991 బడ్జెట్లోని పదాల సంఖ్య - అత్యధిక పదాలు కలిగిన బడ్జెట్ ఇది. ఇప్పటికీ ఆ రికార్డ్ అలానే ఉంది. దేశంలో ఆర్థిక సరళీకరణకు నాంది పలికినందున 1991 బడ్జెట్ చరిత్రలో అత్యధికంగా కోట్ చేయడంతో పాటు విశ్లేషించబడిన బడ్జెట్ ఇది. ►162: 2020 బడ్జెట్ను సమర్పిస్తున్నప్పుడు సీతారామన్ మాట్లాడిన మొత్తం నిమిషాల సంఖ్య. ఈ బడ్జెట్ ప్రసంగం ద్వారా గతంలో తను నమోదు చేసిన రికార్డ్ను ఆమె అధిగమించింది. 2019లో 137 నిమిషాల మాట్లాడి సుదీర్ఘంగా ప్రసంగించి రికార్డ్ నమోదు చేసింది. సీతారామన్ కంటే ముందు, 135 పాటు మాట్లాడిన జస్వంత్ సింగ్ (నిడివి పరంగా) అత్యధిక ప్రసంగం చేసిన రికార్డును కలిగి ఉన్నారు. ►1999: కేంద్ర బడ్జెట్ సమయం సాయంత్రం 5 గంటల నుండి ఉదయం 11 గంటలకు మార్చిన సంవత్సరం. ►2017: రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్తో విలీనమైన సంవత్సరం. ఫిబ్రవరి మొదటి రోజున కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం ప్రారంభమైంది. మరోవైపు ఏప్రిల్ 1 నుంచి బడ్జెట్ను అమలు చేసేందుకు ప్రభుత్వానికి మరింత సమయం కల్పించేందుకు ఈ తేదీ మార్పు ఉపయోగపడుతోంది. ►3,94,49,09,00,00,000: భారత ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయాలని ప్రతిపాదించిన మొత్తం. సింపుల్గా చెప్పాలంటే, ఇది ₹ 39.44 లక్షల కోట్లు. ఇది 2021-22 సవరించిన అంచనా కంటే 4.6 శాతం పెరిగింది. ►13.3: 2022 బడ్జెట్లో రక్షణ మంత్రిత్వ శాఖకు కేటాయించిన మొత్తం 13.3 శాతం. రక్షణ పెన్షన్ల కోసం ₹ 1.19 లక్షల కోట్లతో సహా ₹ 5.25 లక్షల కోట్ల బడ్జెట్ను మంత్రిత్వ శాఖకు కేటాయించారు. ►10,40,00,00,00,000: మొత్తం విద్యా బడ్జెట్ 2022-23లో మొదటిసారిగా ₹ 1-లక్ష కోట్లు దాటింది. గత ఏడాది విద్యకు కేటాయింపులు ₹ 1.04 లక్షల కోట్లు. ఇది 2021-22 సవరించిన అంచనాల కంటే 18.5 శాతం ఎక్కువ. చదవండి: బడ్జెట్: ఆర్థికమంత్రులు,ప్రధానులు,రాష్ట్రపతులు, ఈ విషయాలను గమనించారా? -
ముచ్చటగా మూడోసారి పేపర్లెస్ బడ్జెట్: ఎపుడు, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 1 కేంద్ర వార్షిక బడ్జెట్ పార్లమెంట్ ముందుకు రాబోతోంది. దీంతో కేటాయింపులు, మినహాయింపులు, ఎలాంటి ఉపశమనం లభించనుందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అందులోనూ రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రజాకర్షక పథకాలపై బీజేపీ సర్కార్ మొగ్గు చూపుతుందనే అంచనాలు, ఊహాగానాలు జోరుగా ఉన్నాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్తో మురిపిస్తారా, ఆశలపై నీళ్లు జల్లుతారా అనే ఉత్కంఠకు అతి త్వరలోనే తెరపడబోతోంది. (బడ్జెట్: ఆర్థికమంత్రులు,ప్రధానులు,రాష్ట్రపతులు, ఈ విషయాలను గమనించారా?) అత్యధిక బడ్జెట్ ప్రసంగం ఇచ్చిన రికార్డును సొంతం చేసుకున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడో సారి పేపర్లెస్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. కోవిడ్-19 మహమ్మారి, లాక్డౌన్ తర్వాత, 2021 నుంచి కాగిత రహితంగా డిజిటల్ రూపంలో ఈ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశ పెడుతున్నారు. మేడిన్ఇండియా ట్యాబ్లెట్ ద్వారా పార్లమెంట్లో ప్రవేశపెడతారు ఆర్థికమంత్రి. (Union Budget 2023 ప్రత్యక్ష, పరోక్ష పన్నులు: యూఎస్ఐఎస్పీఎఫ్ కీలక సూచనలు) కేంద్ర బడ్జెట్ 2023-24 బడ్జెట్ పేపర్లెస్గానే ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. బడ్జెట్ సమాచారం సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా ప్రత్యేక యాప్ తీసుకొచ్చినట్టు గతంలోనే కేంద్రం ప్రకటించింది. అయితే ఆర్థిక మంత్రి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 'యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్' పీడీఎఫ్ ఫార్మాట్ ద్వారా విడుదల చేస్తారు. దీని ద్వారా బడ్జెట్ పత్రాలను పూర్తిగా యాక్సెస్ చేసుకోవచ్చు. అప్లికేషన్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రూపొందించిన ఈ యాప్ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫామ్లలో రెండింటిలోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. బడ్జెట్ ప్రసంగం, వార్షిక ఫైనాన్షియల్ స్టేట్ మెంట్, డిమాండ్ ఫర్ గ్రాంట్స్, ఫైనాన్స్ బిల్లులు సహా మొత్తం కేంద్ర బడ్జెట్ డాక్యుమెంట్లను ఈ యాప్లో చూడొచ్చు. యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఆండ్రాయిడ్ ఫోన్లు యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యూనియన్ బడ్జెట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఐఓఎస్ ఫోన్లు యూజర్లు యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఈ బడ్జెట్ యాప్ను అధికారిక యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లయితే గూగుల్ ప్లే స్టోర్ యాప్లో యూనియన్ బడ్జెట్ అని సెర్చ్ చేయాలి. బ్లూ లోగోతో ఉండే అధికారిక యూనియన్ బడ్జెట్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఐఓఎస్ యూజర్లయితే ముందుగా యాపిల్ యాప్ స్టోర్ను ఓపెన్ చేసి, యూనియన్ బడ్జెట్ పేరుతో సెర్చ్ చేయాలి. అనంతరం అధికారిక యాప్ డౌన్లోడ్పై క్లిక్ చేసుకుంటే చాలు. దీంతో ఫోన్లోనే పూర్తిగా బడ్జెట్ వివరాలను యాక్సెస్ చేసుకోవచ్చు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Union Budget 2023: స్టాక్ మార్కెట్పై బడ్జెట్ ప్రభావం ఎలా ఉంటుంది!
బడ్జెట్.. బడ్జెట్.. బడ్జెట్.. ప్రతి ఏటా జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి 1 వరకు దేశవ్యాప్తంగా ఈ పేరు వినిపిస్తుంటుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ కోసం సాధారణ ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, స్టాక్ మార్కెట్ పెట్టుబడిదార్ల వరకు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తుంటారు. ఆశించిన మేరకు బడ్జెట్ ఉంటే ఆనందాలు వెలువెత్తడం లేదంటే నెట్టింట మీమ్స్తో రచ్చ చేయడం ఇటీవల చూస్తూనే ఉన్నాం. మోదీ సర్కార్ ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే, 2024లో సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో రాబోవు బడ్జెట్పై ప్రతి రంగంలో, ప్రతి వర్గంలో ఎన్నెన్నో అంచనాలు కనిపిస్తున్నాయి. ఇక స్టాక్ మార్కెట్పై బడ్జెట్ ప్రభావం ఎలా ఉండబోతోందని తెలుసుకుందాం! స్టాక్ మార్కెట్పై ప్రభావం గత కొన్ని సంవత్సరాల పరిస్థితులను పరిశీలిస్తే సాధారణ బడ్జెట్కు ముందు స్టాక్ మార్కెట్లలో నీరసమైన వాతావరణం కనిపిస్తుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం వాటి కదిలికలు మొదలవుతున్నాయి. బడ్జెట్ పూర్తిగా ద్రవ్యానికి సంబంధించిన అంశం. కాబట్టి దీని ప్రభావం మిగతా వాటిపై కచ్చితంగా ఉంటుంది. స్టాక్మార్కెట్పై బడ్జెట్ ప్రభావం ఎలాంటిదనే విషయం మాత్రం ఆర్థికమంత్రి మీద ఆధారపడి ఉంటుంది. వివిధ రంగాలకు కేటాయించిన మొత్తం ఆధారంగా ఈ ప్రభావాన్ని నిర్ణయించవచ్చు.ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా అభివృద్ధికి పెద్ద పీట వేస్తే ఆ సానుకూల నిర్ణయాలతో స్టాక్ మార్కెట్లు పుంజుకుంటాయి. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టే వారంలో సూచీల్లో ఒడుదొడుకులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. చదవండి: ఆ సూపర్ లగ్జరీ కార్ల క్రేజ్.. అబ్బో రికార్డు సేల్స్తో దూసుకుపోతోంది! -
బడ్జెట్: ఆర్థికమంత్రులు,ప్రధానులు,రాష్ట్రపతులు, ఈ విషయాలను గమనించారా?
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న వార్షికబడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా ప్రతీ ఏడాది ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. స్వాతంత్య్రానికి 1860 ఏప్రిల్ నెలలో తొలిసారి భారత బడ్జెట్ ను జేమ్స్ విల్సన్ ప్రవేశ పెట్టారు. అప్పుడు విల్సన్ ఇండియన్ కౌన్సిల్కు ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. స్వాతంత్య్రానంతరం తొలి బడ్జెట్ ఘనత ఆర్కే షణ్ముగం దక్కించుకున్నారు. 1947 నవంబర్లో ఆయన తొలి దేశీయ ఆర్థిక మంత్రి కావడం గమనార్హం. 1947 ఆగస్టు 15 నుంచి 1948 మార్చి 31 వరకు ఈ బడ్జెట్ కొనసాగింది. ఆ తర్వాత మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. (Union Budget-2023పై కోటి ఆశలు: వెండి, బంగారం ధరలపై గుడ్న్యూస్!) పుట్టిన రోజునాడే బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆర్థికమంత్రి నుంచి ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మొరార్జీ దేశాయి ఎక్కువసార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 10సార్లు ఆయన బడ్జెట్ ప్రవేశ పెట్టడం గమనార్హం.అంతేకాదు 1964,1968 సంవత్సరాల్లో (ఫిబ్రవరి, 29 ) రెండుసార్లు ఆయన పుట్టినరోజునాడే బడ్జెట్ను తీసుకురావడం విశేషం. బ్లాక్ బడ్జెట్ మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం బ్లాక్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రూ.550 కోట్ల లోటు కారణంగా 1973-74 కాలంలో తీసుకొచ్చిన బడ్జెట్ బ్లాక్ బడ్జెట్గా నిలిచింది. (ముచ్చటగా మూడోసారి పేపర్లెస్ బడ్జెట్: ఎపుడు, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?) ఆర్థికమంత్రిగా, ఆతర్వాత రాష్ట్రపతిగా: ప్రణబ్ ముఖర్జీ, ఆర్ వెంకట్రామన్లు ఆర్థికమంత్రులుగా ఉన్నప్పుడు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆ తరువాతికాలంలో వీరిద్దరూ రాష్ట్రపతులుగా దేశానికి సేవలందించారు. అలాగే రెండు రకాల క్లిష్ట సమయాల్లో రెండు ప్రభుత్వ హయాంలలో యశ్వంత్ సిన్హా ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టడం మరో విశషం. పోఖ్రాన్ రెండో పేలుళ్ల అనంతరం 1999లో, కార్గిల్ యుద్ధం అనంతరం 2000లో, గుజరాత్లో భూకంపం అనంతరం 2001లో, ఫారెక్స్ సంక్షోభ సమయం 1991లో యశంత్ సిన్హా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న 1970-71 సమయంలో ఆమె బడ్జెట్ ను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు. రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్ 1924లో రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్ నుంచి విడదీశారు. రెండు బడ్జెట్లు విడివిడిగా పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు. కానీ ఆ తరువాత 92 ఏళ్ల సంప్రదాయానికి స్వస్తి పలికి , 2017 నుంచి ప్రస్తుతం దాకా రెండు బడ్జెట్లను కలిపి మోడీ సర్కార్ తీసుకొస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన ముగ్గురు ప్రధానులు ప్రధానులుగా ముగ్గురు అందులోనూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు ప్రధానమంత్రులుగా బడ్జెట్ను తీసుకురావడం విశేషం. పేపర్ లెస్ బడ్జెట్ కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేపర్ లెస్ బడ్జెట్ను పరిచయం చేశారు. కోవిడ్-19 మహమ్మారి, లాక్డౌన్ కాలంలో 2021నుంచి కాగిత రహిత డిజిటల్ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. ఆర్థిక మంత్రి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 'యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్' ద్వారా విడుదల చేస్తారు. దీని ద్వారా బడ్జెట్ పత్రాలను పూర్తిగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫామ్లలో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. బడ్జెట్ ప్రసంగం, వార్షిక ఫైనాన్షియల్ స్టేట్ మెంట్, డిమాండ్ ఫర్ గ్రాంట్స్, ఫైనాన్స్ బిల్లులు సహా మొత్తం కేంద్ర బడ్జెట్ డాక్యుమెంట్లను ఈ యాప్లో చూడొచ్చు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చివరి బడ్జెట్పై భారీ అంచనాలే ఉన్నాయి. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ప్రత్యక్ష, పరోక్ష పన్నులు: సీతారామన్కు యూఎస్ఐఎస్పీఎఫ్ కీలక సూచనలు
న్యూఢిల్లీ:మరికొన్ని రోజుల్లో 2023-24 వార్షిక బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రడీ అవుతున్నారు. ఈ సందర్భంగా అమెరికాలోని ఇండియా సెంట్రిక్ టాప్ పరిశ్రమ బృందం ఆర్థికమంత్రికి కీలక విజ్ఞప్తి చేసింది. భారత దేశంలోని ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానాన్ని సరళీకృతం చేయాలని, హేతు బద్ధీకరించాలని భారతదేశం-కేంద్రీకృత అమెరికా వ్యూహాత్మక, వ్యాపార సలహా బృందం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరింది. ఇది ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచి, భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను తెచ్చి పెడుతుందని తెలిపాయి. విదేశీ కంపెనీల కార్పొరేట్ పన్ను రేట్లను హేతుబద్ధం చేయండి అంటూ యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్టనర్షిప్ ఫోరమ్ (USISPF) ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ సమర్పణలకు ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖకు కోరింది. మూలధన లాభం పన్ను సంస్కరణలను సరళీకృతం చేయాలని, వివిధ సాధనాల హోల్డింగ్ కాలాలు, రేట్లను సమన్వయం చేయాలని కోరింది. గ్లోబల్ టాక్స్ డీల్కు భారత నిబద్ధతను పునరుద్ఘాటించడంతోపాటు, సెక్యూరిటీలలో పెట్టుబడి నుండి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ (FPI) వరకు రాయితీ పన్ను విధానాన్ని విస్తరించాలని కేంద్ర ఆర్థిక మంత్రికి సూచించింది. అంతేకాదు హెల్త్ లాంటి నిర్దిష్ట సెక్టార్లలో పునరుత్పాదక శక్తి, ఆర్ అండ్ డీ పెట్టుబడులపై పన్ను రాయితీలను కూడా కోరింది.(Union Budget 2023 ఆ పథకాలకు పెద్ద పీట, వారికి బిగ్ బూస్ట్) స్థిరమైన, ఊహాజనిత పన్ను పర్యావరణం కోసం వాదించడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానం సరళీకరణ, వ్యాపారం ఖర్చులను హేతుబద్ధీకరించడం, పన్ను రేట్లు , సుంకాలను హేతుబద్ధీకరించడం వంటివి ఉన్నాయి. చమురు మరియు సహజ వాయువు కంపెనీలకు అందించిన కస్టమ్స్ సుంకం మినహాయింపులపై వివరణ కోరింది. దీంతోపాటు ఎక్స్-రే యంత్రాల కోసం కస్టమ్స్ సుంకం రేట్లను 10 శాతం నుండి 7.5 శాతానికి తగ్గించడం, నిర్దేశిత పరిశోధన ద్వారా దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై కస్టమ్స్ సుంకం మినహాయింపును అందించాలని తెలిపింది. ఉత్పత్తి ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని పోషకాహార ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ పెంపును ఉపసంహరించుకోవాలని కూడా అభిప్రాయపడింది. భారతదేశంలో శాస్త్రీయంగా రూపొందించే పోషకాహారం లభ్యతను ప్రోత్సహించాలని ఆర్థిక మంత్రిని కోరింది. కస్టమ్స్ టారిఫ్లు సుంకాలు మరియు కస్టమ్స్ సిఫారసుకు సంబంధించి టెలికాం ఉత్పత్తులపై కస్టమ్స్ టారిఫ్ చట్టంలోని అస్పష్టతలను పరిష్కరించాలని తెలిపింది. అలాగే CAROTAR , ఫేస్లెస్ ఎసెస్మెంట్ వంటి వాణిజ్య సులభతర పథకాలను బలోపేతం చేయాలని అధునాతన జీవ ఇంధన ప్రాజెక్టులకు రాయితీ కస్టమ్స్ సుంకం పొడిగింపును యూఎస్ఐఎస్పీఎఫ్ కోరింది. (Union Budget-2023పై కోటి ఆశలు: వెండి, బంగారం ధరలపై గుడ్న్యూస్!) -
రానున్న బడ్జెట్లో ఆ పథకాలకు పెద్ద పీట, వారికి బిగ్ బూస్ట్
న్యూఢిల్లీ: రానున్న కేంద్ర బడ్జెట్లో సీనియర్ సిటిజన్ సేవింగ్, ఇతర స్మాల్ సేవింగ్ పథకాలకు ఊరట లభించనుందా అంటే అవుననే సంకతాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రానున్న ఎన్నికలు, బీజేపీ నేతృత్వంలోని మోదీ సర్కార్కు ఈ దఫా చివరి బడ్జెట్ నేపథ్యంలో చిన్న పెట్టుబడిదారులకు భారీ ఉపశమనం లభించనుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. సుకన్య సమృద్ధి యోజన, ఇతర చిన్న పొదుపు పథకాలు పెద్ద ప్రోత్సాహాన్ని అందించే అవకాశం ఉందనే ఊహాగానాలున్నాయి. ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ బడ్జెట్ 2023లో ఆర్థిక లోటును పూరించుకునేందుకు ప్రభుత్వం చిన్న పొదుపు పథకాలపై ఆధారపడే అవకాశం ఉందని, వాటి నుండి దాదాపు రూ. 5 లక్షల కోట్లు సేకరించవచ్చని అంచనా. సుకన్య సమృద్ధి యోజన వంటి చిన్న పొదుపు పథకం 2023-24 కోసం రాబోయే కేంద్ర బడ్జెట్లో ఊపందుకోవచ్చని ఎస్బీఐ రీసెర్చ్ ఒక నివేదికలో పేర్కొంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) వంటి చిన్న పొదుపు పథకాలకు ఈ బడ్జెట్లో ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం లభించే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం ఈ పథకం 7.6 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ప్రభుత్వం ఇటీవల చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను పెంచినా ఇందులో ఎస్ఎస్వైని చేర్చకపోవడం గమనార్హం. సుకన్య సమృద్ధి యోజన చిన్న పొదుపు పథకాలలో సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) ఒకటి. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015 సంవత్సరంలో ప్రారంభించింది. 10 సంవత్సరాల లోపు ఆడబిడ్డ ఉన్న తల్లిదండ్రులు ఈ పథకంలో చేరడానికి అర్హులు. ఈ పథకంలో కేవలం రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. అలాగే ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సీ ప్రకారం మొత్తం రూ. 1.5 లక్షల పెట్టుబడిపై పన్ను మినహాయింపు లభిస్తుంది. ఏదైనా అధీకృత బ్యాంకు లేదా పోస్టాఫీసులో సుకన్య సమృద్ధి ఖాతాను తెరవవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన చిన్న మొత్తాల పొదుపు పథకం. 60 యేళ్లకు మించిన ప్రతి ఒక్కరూ ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే ముందస్తు పదవీ విరమణ చేసిన 55 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వారు కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం దీనిపై 8 శాతం వరకు వడ్డీ రేటు అందిస్తోంది. అలాగే ఈ స్కీంలో ఆదాయపు పన్ను సెక్షన్ 80 సీ కింద పెట్టుబడిపై రూ .1.50 లక్షల వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వెండి, బంగారం ధరలపై గుడ్న్యూస్: బడ్జెట్పై కోటి ఆశలు!
న్యూఢిల్లీ: 2023-24 కేంద్రం బడ్జెట్కు సంబంధించిన కేటాయింపులు, మినహాయింపులు, కోతలపై సామాన్య ప్రజానీకం నుంచి కార్పొరేట్ దాకా చాలా ఆశలు, ఊహాగానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టన్నారు.ఈ సందర్భంగా కేంద్రానికి ఇదే చివరి బడ్జెట్ కావడంతో మరిన్ని ప్రజాకర్షక పథకాలు ఉంటాయనే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా పసిడి ధర, బంగారు ఆభరణాల ధర తగ్గుముఖం పడుతుందా? దిగుమతి సుంకంపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది చర్చనీయాంశమైంది. ముఖ్యంగా పండుగల సీజన్లో రిటైల్ అమ్మకాలను దెబ్బతీస్తూ బంగారం ధరలు రికార్డు స్థాయిలకు పెరుగుతున్న తరుణంలో, రాబోయే కేంద్ర బడ్జెట్ 2023-24లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తారని భారతీయ ఆభరణాల విభాగం భావిస్తోంది. ప్రస్తుతం, బంగారంపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం 12.5 శాతం, వ్యవసాయ మౌలిక సదుపాయాల సెస్గా అదనంగా 2.5శాతంగా ఉంది. గత బడ్జెట్లో కరెంటు ఖాతా లోటును తగ్గించేందుకు ఈ సుంకాన్ని పెంచారు. ఫలితంగా బంగారం దిగుమతులు 2021లో 1,068 టన్నుల నుంచి 2022లో 706 టన్నులకు తగ్గిపోయాయి. సుంకం పెంపు వల్ల భారత్లోకి బంగారం అక్రమ రవాణా పెరిగిందనీ, ఇది ఏడాదికి 200 టన్నులు అని అంచనా వేశామని వాస్తవానికి బంగారం రిటైల్ అమ్మకాలను ఇది ప్రభావితం చేస్తోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. బంగారం, వెండి ,ప్లాటినంపై దిగుమతి సుంకాన్ని 4 శాతంక తగ్గించాలని జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (GJEPC) డిమాండ్ చేస్తోంది. ఈ దిగుమతి సుంకం ఎగుమతిదారుల నుండి మూలధనాన్ని హరించివేస్తోందని భావిస్తోంది. కౌన్సిల్ చైర్మన్ విపుల్ షా ప్రకారం. దిగుమతి సుంకం తగ్గింపు ఆరోగ్యకరమైన ,మరియు పారదర్శక పరిశ్రమను కలిగి ఉండటానికి సహాయడుతుందనీ, అలాగే ఎగుమతిదారుల వర్కింగ్ క్యాపిటల్ అడ్డంకిని తగ్గించడంలో సహాయపడుతుంది. స్థానిక ఉత్పత్తి పెంపుపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో కొన్ని వస్తువులు ఖరీదైనవి, మరికొన్ని చౌకగా మారనున్నట్లు తెలుస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సమర్పించే బడ్జెట్లో, ప్రభుత్వం మొత్తం దృష్టి దేశంలో ఉత్పత్తిని పెంచడం, అనవసరమైన వస్తువుల దిగుమతిని తగ్గించడంపైనే ఉంటుంది. తద్వారా దేశంలోని వాణిజ్య నిల్వలను సరిచేయవచ్చు. కరెంట్ ఖాతా లోటును తగ్గించవచ్చు. దీనికి తోడు దేశీయ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం అనేక రంగాలకు పీఎల్ఐ పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో బంగారం చౌకగా ఉండే అవకాశం ఉందని, తద్వారా ఆభరణాల ఎగుమతులు పెరుగుతాయని తెలుస్తోంది. రత్నాలు, ఆభరణాల రంగానికి సంబంధించి బంగారంతో పాటు మరికొన్ని వస్తువులపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సూచించింది. తద్వారా దేశం నుండి ఆభరణాలు, ఇతర ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతాయి. గతేడాది బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. దీంతో పసిడి ధరల సెగ కాస్త తగ్గుముఖం పట్టి..ప్రజల చేతుల్లో పుత్తడి మరింత మెరిసే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆర్థిక మంత్రిగా పని చేసినప్పటికీ బడ్జెట్ ప్రవేశపెట్టలేదు.. ఎందుకో తెలుసా!
కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరంలో బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ 2023-24ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఆమె వరుసగా ఐదోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టనుండడం విశేషమనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు దేశ చరిత్రలో బడ్జెట్లకు సంబంధించిన కీలకమైన విషయాల గురించి తెలుసుకుందాం! బడ్జెట్ అనే పేరు వినగానే గుర్తుకువచ్చే ఆర్థిక మంత్రులలో మొరార్జీ దేశాయ్ పేరు తప్పకుండా ఉంటుంది. రికార్డు స్థాయిలో ఏకంగా పదిసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రత్యేకత ఆయన సొంతం. కొన్నేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ రికార్డ్ చెక్కు చెదరకుండా ఆయన పేరునే కొనసాగుతోంది. మరోవైపు ఆర్థిక మంత్రిగా పని చేసి ఒక్కసారి కూడా బడ్జెట్ను సమర్పించని సందర్భాలు కూడా ఉన్నాయంటే నమ్మడమే కష్టమే. కానీ ఈ జాబితాలో ఇద్దరు ఉన్నారు. హెచ్ఎన్ బహుగుణ కాగా మరొకరు కేసీ నియోగి. వీరిద్దరూ ఆర్థిక మంత్రిత్వ శాఖను కలిగి ఉన్నప్పటికీ, ఏ కేంద్ర బడ్జెట్ను సమర్పించలేదు. వీరివురూ చాలా తక్కువ వ్యవధిలో పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. వీరు మంత్రులుగా పని చేసిన సమయంలో వారికి బడ్జెట్ సమర్పించే అవకాశం లేదు. నియోగి 1950లో స్వతంత్ర భారతదేశానికి రెండవ ఆర్థిక మంత్రిగా నియమితులై, కేవలం 35 రోజులు మాత్రమే ఆ పదవిలో ఉన్నారు. ఇక బహుగుణ, 1979-80 మధ్య ఐదున్నర నెలల పాటు పదవిలో ఉన్నారు. ఆయనకు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం రాలేదు. దీంతో వీరిద్దరూ ఆర్థిక మంత్రిగా పని చేసి కూడా కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టలేకపోయారు. చదవండి: జియో బంపర్ ఆఫర్.. ఈ ప్లాన్తో 23 రోజుల వ్యాలిడిటీ, 75జీబీ డేటా.. ఫ్రీ, ఫ్రీ! -
Union Budget 2023: సీతమ్మ వాకిట్లో... మధ్యతరగతి
బడ్జెట్ ఏమి తెస్తుందో లేదో తెలియదు కానీ, ప్రతిసారీ కావల్సినన్ని చెణుకులు, మీమ్స్ మాత్రం తెస్తోంది. .... మధ్యతరగతి ఇళ్లలో తండ్రి, కొడుకుల మధ్య తరచూ వినబడే సంభాషణట ఇది వినండి... ‘కొనడం ఎన్ని రోజులు పోస్టుపోన్ చేస్తావ్ నాన్నా, ఈ ఫోన్ చూడు.’ – ... దీనికి ఏమైందిరా? ‘నాన్నా... ఎన్ని సార్లు అడుగుతావ్? రోజుకు 50 సార్లు హ్యాంగ్ అవుతోంది, మాట్లాడుతూంటేనే కట్ అవుతోంది.’ – ...అవును, కానీ మంచి ఫోనురా... ‘మంచిదే కానీ, పాతదయిపోయింది. కొత్తది కొనాల్సిందే...’ – .. సరే, చూద్దాం... ఆ తర్వాత రోజు.. ‘ఫోన్ సంగతి ఏమైంది నాన్నా...’ – సరే ఫస్ట్కు చూద్దాం... ఓ నెల తర్వాత.. ‘..ఫొటోస్, ఫైల్స్ మిస్సవుతున్నాయి నాన్నా..’ – ..ఏదీ చూద్దాం.. ‘..చూడడానికి ఏముంది.. అన్నీ పోయాయి.. కొత్తఫోన్ కొను నాన్నా. – ..అలాగే చూద్దాం.. మధ్యతరగతి జీవితాల్లో చూద్దాం... అంటే వారాలు నెలలు సంవత్సరాలు.. అన్నమాట! కొడుకు తండ్రిౖ వైపు ఆశగా చూస్తూనే ఉంటాడు.. ఏదో ఒకరోజు కొనివ్వకపోతాడా...అని. విచిత్రం ఏమిటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా అంతే.. ఈసారైనా బడ్టెట్లో ఏదైనా ఉండకపోతుందా అని ఇలా.. కొడుకుకు దొరికిన సమాధానమే కనిపిస్తుంది.. నెక్స్ట్ బడ్జెట్లో చూద్దాం.. అని. అందుకే ప్రతి బడ్జెట్లో శాలరీ శ్లాబ్లు.. తాయిలాలు ఏముంటాయో చూద్దాం అని ఆశపడడం, ఊసూరుమనడం.. నెక్స్ట్ బడ్జెట్ మీద ఆశలు పెట్టుకోవడం.. ఇదీ వరుస సరే చూద్దాం.. ఈ బడ్జెట్లో ఎలా ఉంటదో. వంటింట్లో కూడా జీఎస్టీతో తిరగమోత పెట్టి, రేట్ల ఘాటు నషాళానికి అంటించిన ఆర్థిక మంత్రి సీతారామన్ మొన్నీమధ్య మాట్లాడుతూ– ..‘ నేను కూడా మధ్యతరగతి నుంచే వచ్చాను, వారి ఒత్తిళ్లు, బాధలు నాకు తెలుసు .. ’ అని చెప్పడంతో ఇప్పటిదాకా పడ్డ వాతలు, పెరిగిన గ్యాస్, పెట్రోల్, నిత్యావసరాలు..అన్నీ మరచిపోయి మధ్యతరగతి బడ్జెట్వైపు ఆశగా చూస్తోంది. ‘గాలి పీల్చుకోనిస్తున్నాం, నీళ్లు తాగనిస్తున్నాం, తిండి తిననిస్తున్నాం.. ఇది చాలదా, ఇంకేం కావాలి..’ –పోయిన బడ్జెట్ మధ్యతరగతికి ఏమిచ్చింది.. అంటే ఓ నెటిజన్ సరదా కామెంట్. కానీ, ఓ నెటిజన్ సీరియస్ కామెంట్ చూడండి.. ‘‘సమాజాన్ని స్టేబుల్గా ఉంచేదే మధ్యతరగతి. బిజినెస్ క్లాస్కు సేవలతో, కింది తరగతికి తన పన్నులతో సపోర్ట్ చేసేదే.. మిడిల్క్లాస్. గత న లభై ఏళ్లుగా మిడిల్ క్లాస్ పెరుగుతోంది. పన్నులు చెల్లించేవారు పెరుగుతున్నారు. కాగా, పెట్రోల్, కరెంట్, కూరగాయలు, నిత్యావసరాలు.. ఇలా పెరిగిన ప్రతి రేటు మధ్యతరగతి జీవితాన్ని ఎక్కడ ఉన్నవాడిని అక్కడేవుండేట్లు చేస్తోంది. బడ్జెట్లో సరైన సపోర్ట్ లేకుంటే సమాజం, ప్రభుత్వం కూడా నష్టపోతుంది...’ దీనికి సపోర్ట్గా మరో నెటిజన్ పొలిటికల్ అనాలసిస్ ఇదీ.. ‘‘సాధారణంగా పాలిటిక్స్కు, ఓటింగ్కు దూరంగా ఉండే మిడిల్ క్లాస్ మోదీకి దగ్గరవుతున్నారు. వీరు మోదీ ర్యాలీలకు, సభలకు హాజరవడం చూస్తున్నాం. అలా కాకపోయినా, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం, మోదీ చెబుతున్న నేషనలిజాన్ని నెత్తికెత్తుకుంటూ ఆయనకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. చాలా మంది మధ్యతరగతి ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక చింతన మోదీ టీమ్ నడిపిస్తోన్న హిందుత్వాన్ని బలోపేతంచేస్తున్నాయి... దీనికితోడు మోదీ తరచుగా చెప్పే ఆధునికత్వాన్ని కూడా మధ్యతరగతే ముందుకు తీసుకెళ్తోంది... వీరి సపోర్ట్ లేకుండా మోదీ విజన్ సాధ్యం కాదు.. గతంలో కంటే మిడిల్ క్లాస్ పాపులేషన్ బాగా పెరుగుతోంది. ఇది మోదీకి అనుకూలమైన విషయమే. ఈ సెక్షన్ను విస్మరించడం మోదీ గవర్నమెంట్కు అంత మంచిది కాదు.. ఈ విషయం ఆర్థిక మంత్రికీ తెలిసే ఉండాలి..’’ విద్య, వైద్యం, దైనందిన జీవితంలో పెరిగిన రేట్లు.. ప్రతిదీ మధ్యతరగతి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తదో.. ఆర్థికంగా ఎలా ఎదగకుండా చేస్తదో చెబుతూ వీటన్నింటినీ బడ్జెట్ పరిశీలించాలంటూ తన సొంత అనుభవాన్ని ఓ నెటిజన్ ఇలా పంచుకున్నారు.. ‘‘మా నాన్న ఫ్రెండ్ ఓ స్టాక్ బ్రోకర్. ఇరవై ఏళ్ల క్రితం ఆయనిచ్చిన సలహాతో మంచి షేర్లలో పెట్టుబడి పెట్టాడు. ఇప్పటికి వాటి ధర 200 రెట్లు పెరిగింది.. మేం నిజానికి లక్షాధికారులం కావాలి.. కానీ కాలేదు. కారణం చూడండి.. కొన్న రెండు సంవత్సరాలకు రెసిషన్ వచ్చింది.. నాన్న ఉద్యోగం పోయింది. 20 శాతం షేర్లు అమ్మితే ఇల్లు గడిచింది. ఆ తర్వాత ఏదో చిన్న ఉద్యోగం సంపాదించాడనుకోండి. కానీ, మరో 20 శాతం మా తాత హార్ట్ సర్జరీ కోసం అమ్ముకున్నాం. మరికొన్ని షేర్లు నాకు, తమ్ముడి చదువులకు హరించుకుపోయాయి. కొద్ది రోజులకు మరికొన్ని అక్క పెళ్లికి హారతి.. ఇలా ఒక్కో సమస్య షేర్లను తినేసింది. నాకేం అర్థమయ్యిందంటే సమాజంలో ఏం తేడా చేసినా.. అంటే మాంద్యం వచ్చినా, ఉద్యోగాలు పోయినా, ట్యాక్సులు పెరిగినా, మెడికల్ బిల్లులు పెరిగినా, చదువుల ఖర్చు పెరిగినా, రెగ్యులర్గా ఉండే కరెంట్, పాలు, నిత్యావసరాలు, గ్యాస్, పెట్రోల్.. ఇవన్నీ నిరంతర మధ్యతరగతిని ఎదగకుండా జాగ్రత్త కాపలా కాస్తుంటాయి.. పై చదువులు బాగా చదివినట్లే ఉంటుంది, శాలరీ పెరిగినట్లే ఉంటుంది.. లైఫ్లో రిస్క్, సమస్యలు మాత్రం అలాగే ఉంటాయి.. వీటన్నింటినీ బడ్జెట్ పరిగణనలోకి తీసుకోవాలి...’ ఇదీ ఉద్యోగుల పరిస్థితి బడ్జెట్ ప్రసంగంలో ఆదాయ పన్ను మినహాయింపు ప్రకటనపై ఉద్యోగులు ఇలా ఎదురు చూస్తున్నారంటూ చెణుకులు సరే చూద్దాం.. ఈసారి బడ్జెట్ ఎప్పటిలాగే మీమ్స్, జోక్స్ మిగులుస్తుందా.. కాసిన్ని ఆశలు మిగులుస్తుందా.. -
నిర్మలమ్మకు 2023–24 వార్షిక బడ్జెట్ వినతులు
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2023–24 వార్షిక బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో పలు విశ్లేషణా సంస్థలు, ఆర్థికవేత్తలు పలు సూచనలు, నివేదికలు, సిఫారసులు కేంద్రానికి సమర్పిస్తున్నారు. వీటిలో కొన్నింటిని పరిశీలిస్తే... ఐదేళ్లు కస్టమ్స్ సుంకాలను మార్చవదు: జీటీఆర్ఐ దేశీయ తయారీని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కనీసం ఐదేళ్లపాటు కస్టమ్స్ సుంకాలలో ఎలాంటి మార్పులు చేయరాదని ఆర్థిక విశ్లేషణా సంస్థ– జీటీఆర్ఐ (గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్) తన ప్రీ–బడ్జెట్ సిఫార్సుల్లో పేర్కొంది. ఈ విధానం దేశీయ తయారీ పరిశ్రమ పురోభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొంది. విధాన స్థిరత్వాన్ని ఇది సూచిస్తుందని కూడా విశ్లేషించింది. సిఫారసుల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. కంపోనెంట్స్పై దిగుమతి సుంకాన్ని కొనసాగించాలి. గందరగోళాన్ని నివారించడానికి, వ్యాజ్య పరిస్థితులను తగ్గించడానికి కస్టమ్స్ సుంకం స్లాబ్లను ప్రస్తుత 25 నుండి 5కి తగ్గించాలి. పలు విధాలుగా ఉన్న అధిక స్లాబ్లు ఒకే విధమైన వస్తువులకు వేర్వేరు సుంకాల విధింపునకు దారితీస్తుంది. ఇది వర్గీకరణ వివాదాలకు, ఖరీదైన వ్యాజ్యాలకు దారితీస్తుంది. ఇది పత్రాల ఆటోమేటెడ్ ప్రాసెసింగ్ను కూడా ఇది కష్టతరం చేస్తుంది. డ్యూటీ స్లాబ్ల సంఖ్య తగ్గింపు వ్యవస్థ పారదర్శకతను తక్షణమే మెరుగుపరుస్తుంది. వర్గీకరణ వివాదాలను తగ్గిస్తుంది.డాక్యుమెంట్ల మెషీన్ ప్రాసెసింగ్ను వేగవంతం చేస్తుంది. ఇక సుంకాలను త్వరగా వాపసు చేయడం, పోస్ట్, కొరియర్ ద్వారా ఎగుమతుల విధాన ఆవిష్కరణ వంటి చర్యల ద్వారా ఎగుమతుల పెంపునకు చర్యలు తీసుకోవాలి. మాజీ ఇండియన్ ట్రేడ్ సర్వీస్ అధికారి అజయ్ శ్రీవాస్తవ జీటీఆర్ఐ సహ వ్యవస్థాపకులు. గత ఏడాదే ఆయన పదవీ విరమణ చేశారు. వాణిజ్య విధాన రూపకల్పన, డబ్ల్యూటీఓ (ప్రపంచ వాణిజ్య సంస్థ), స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన సమస్యలలో ఆయనకు అపార అనుభవం ఉంది. ఫోన్ విడిభాగాలపై సుంకాల భారం తగ్గించాలి సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ మొబైల్ ఫోన్ విడిభాగాలు, ఉపకరణాలు, సబ్ అసెంబ్లీలపై సుంకాలను క్రమబద్ధీకరించాలని ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. బడ్జెట్లో ఈ మేరకు ప్రతిపాదనలకు చోటివ్వాలని వినతిపత్రం ఇచ్చింది. అధిక రేటు గల ఫోన్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించాలని కూడా విజ్ఞప్తి చేసింది. బడ్జెట్ నుంచి తాము ఏమి కోరుకుంటున్నామో ఆర్థిక మంత్రికి పరిశ్రమ తెలియజేసింది. 20 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీని ఒక్కో ఫోన్పై గరిష్టంగా రూ.4,000కే పరిమితం చేయాలని కోరింది. ఉపకరణాలు, విడిభాగాలపై అధిక సుంకం దేశీ తయారీని (మేడ్ ఇన్ ఇండియా) పెంచాలనే ప్రభుత్వ లక్ష్యానికి విఘాతమంటూ ఆందోళన వ్యక్తం చేసింది. 2.75 శాతం టారిఫ్, ఇతర చిన్న సుంకాల వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు కానీ, నిజమైన తయారీదారులకు ప్రతిబంధకమని పేర్కొంది. మెకనిక్స్పై డ్యూటీ చాలా అధికంగా ఉందని, మెకనిక్స్ తయారీలో వాడే అన్ని విడిభాగాలపై సుంకాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. సిగరెట్ అక్రమ రవాణాను అరికట్టాలి : ఎఫ్ఏఐఎఫ్ఏ ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.13,000 కోట్ల ఆదాయం నష్టం వాటిల్లుతున్న సిగరెట్ అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని రైతు సంఘం ఎఫ్ఏఐఎఫ్ఏ (ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్మర్ అసోసియేషన్) ప్రభుత్వాన్ని అ భ్యర్థించింది. అక్రమ రవాణా ప్రక్రియలో భాగంగా నేరాలు కూడా పెరుగుతున్నట్లు ప్రీ బడ్జెట్ మెమోరాండంలో పేర్కొంది. సిగరెట్ స్మగ్లింగ్ను అరికట్టడానికి పన్నులను తగ్గించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటకల్లో వాణిజ్య పంటల సాగులో ఉన్న లక్షల మంది రైతులు, వ్యవసాయ కార్మికులకు అసోసియేషన్ ప్రాతినిధ్యం వహిస్తోంది. అక్రమ రవాణాను అరికట్టడానికి పసిడిపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుత 18.45 శాతం నుంచి 12 శాతానికి తగ్గిస్తున్నారన్న వార్తలను అసోసియేషన్ ప్రస్తావిస్తూ, ఇదే రకమైన చర్యలు సిగరెట్ పరిశ్రమకు సంబంధించి ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఫోన్ల స్మగ్లింగ్ నిరోధానికీ చర్యలు తీసుకుంటున్న విషయాన్ని గుర్తుచేస్తూ, ఫోన్ అక్రమ రవాణా వల్ల కేంద్ర ఖజానాకు రూ.2,859 కోట్ల నష్టం వాటిల్లుతుండగా, సిగరెట్ అక్రమ రవాణా విషయంలో ఈ మొత్తం రూ.13,331 కోట్లు ఉందని అసోసియేషన్ ప్రెసిడెంట్ జావారీ గౌడ పేర్కొన్నారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వార్షిక నివేదిక ప్రకారం, 2021–22లో రూ. 93 కోట్ల విలువైన 11 కోట్ల సిగరెట్ స్టిక్లను స్వాధీనం చేసుకున్నారు. పీఎల్ఐ పథక విస్తరణ!: వివిధ వర్గాల అంచనా రాబోయే బడ్జెట్లో బొమ్మలు, సైకిళ్లు, తోలు, పాదరక్షల ఉత్పత్తికి ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలను పొడిగించే అవకాశం ఉందని పలు వర్గాలు భావిస్తున్నాయి. అధిక ఉపాధి రంగాల పురోగతికి ఉద్దేశించి ఉత్పత్తి అనుబంధ ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని విస్తరించాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్న విషయాన్ని ఆ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. ఆటోమొబైల్స్, ఆటో కాంపోనెంట్స్, వైట్ గూడ్స్, ఫార్మా, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, హై ఎఫిషియెన్సీ సోలార్ పీవీ మాడ్యూల్స్, అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్తో సహా 14 రంగాల కోసం ప్రభుత్వం దాదాపు రూ. 2 లక్షల కోట్లతో ఈ పథకాన్ని రూపొందించింది. అంతర్జాతీయంగా తయారీ రంగం పోటీ పడగలగడం పీఐఎల్ ప్రధాన లక్ష్యం కావడం గమనార్హం. లాజిస్టిక్స్ పురోగతి: ఆపరేటర్ల విజ్ఞప్తి రాబోయే కేంద్ర బడ్జెట్ లాజిస్టిక్స్ రంగంలో స్థిరమైన వృద్ధికి రోడ్మ్యాప్ను రూపొందించడమే కాకుండా స్థిరమైన విధానాలను అనుసరించాలని ఆపరేటర్లు విజ్ఞప్తి చేశారు. ఫెడెక్స్ ఎక్స్ప్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఆపరేషన్స్ (మిడిల్ ఈస్ట్ ఇండియన్ సబ్కాంటినెంట్ అండ్ ఆఫ్రి కా– ఎంఈఐఎస్ఏ) కమీ విశ్వనాథన్ ఒక ప్రకటన చేస్తూ, అన్ని అంతర్జాతీయ రవాణా సేవలకు వస్తు, సేవల పన్నును తొలగించాలని సిఫారసు చేశారు. అంతర్జాతీయ జీఎస్టీ, వీఏటీ చట్టాలలో అంతర్జాతీయ సరుకు రవాణా సేవలు చాలా వరకు ’జీరో–రేట్’లో ఉన్నాయని అన్నారు. ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ) ఇన్ఫ్రాస్ట్రక్చర్ పటిష్టతకు కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటించాలని మహీంద్రా లాజిస్టిక్స్ సీఎఫ్ఓ యోగేష్ పటేల్ కోరారు. ఆర్అండ్డీ వ్యయాలపై పన్ను మినహాయింపు: క్రాప్లైఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డీ) కోసం చేసే వ్యయాలపై వచ్చే బడ్జెట్లో ప్రభుత్వం పన్ను మినహాయింపులు ఇవ్వాలని 16 వ్యవసాయ రసాయన కంపెనీల పరిశ్రమల సంస్థ– క్రాప్లైఫ్ ఇండియా డిమాండ్ చేసింది. టెక్నికల్ రా మెటీరియల్, ఫార్ములేషన్స్ రెండింటికీ 10 శాతం ఏకరీతి ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆగ్రోకెమికల్ కంపెనీల ఆర్ అండ్ డీ వ్యయాలపై ప్రభుత్వం 200 శాతం వెయిటెడ్ డిడక్షన్ను అందించాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నట్లు క్రాప్లైఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ దుర్గేశ్ చంద్ర పేర్కొన్నారు. వ్యవసాయ సంస్కరణలు చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన పేర్కొంటూ, బడ్జెట్లో ఈ మేరకు చర్యలు ఉండాలని కోరారు. ఉపాధి కల్పనపై దృష్టి: హెచ్ఆర్ ఇండస్ట్రీ సిఫార్సు మానవ వనరుల (హెచ్ఆర్) పరిశ్రమ రాబోయే బడ్జెట్లో వివిధ చర్యలను అంచనా వేస్తోంది. ఇది ఉద్యోగులకు, ఉపాధి కల్పనకు ప్రయోజనకరంగా ఉంటుందని, దేశంలోని నైపుణ్యం సవాళ్లను పరిష్కరిస్తుందని అంచనా వేస్తోంది. కార్మిక చట్ట సంస్కరణలు, అధికారిక ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టడం, స్టాఫింగ్ పరిశ్రమకు పారిశ్రామిక హోదా, యువతకు నైపుణ్యం కల్పించే కార్యక్రమాలను పెంచడం వంటి అంశాలపై బడ్జెట్ దృష్టి పెడుతుందని భావిస్తున్నట్లు ప్రముఖ హెచ్ఆర్ సేవల సంస్థ రాండ్స్టాడ్ ఇండియా తెలిపింది. పీఎల్ఐ స్కీమ్, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ మొదలైన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు ఊతాన్ని అందిస్తున్నప్పటికీ, ఉపాధి కల్పన దేశంలో ఇంకా సవాల్గా మిగిలిపోయిందని రాండ్స్టాడ్ ఇండియా ఎండీ సీఈఓ పీఎస్ విశ్వనాథ్ పేర్కొన్నారు. -
రైల్వే బడ్జెట్ 2023: వందే భారత్ రైళ్లు, కేటాయింపులు, సామాన్యుడికి ఊరట!?
న్యూఢిల్లీ: 2023-24 సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సర్వం సిద్ధం చేసుకున్నారు. కీలకమైన హల్వా వేడుక ముగిసింది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలు, వేతన జీవులతో పాటు ఆర్థిక నిపుణులు,పెట్టుబడిదారులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే రైల్వేకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఇదే బడ్జెట్లో చేయనున్నారు. ముఖ్యంగా త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ , మిజోరం మినహా రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఈశాన్య రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోడీ సర్కార్ రైల్వే కేటాయింపులపై మరింత ఉత్కంఠ నెలకొంది. రైల్వే బడ్జెట్ ఒకపుడు విడిగా 2017 వరకు కూడా రైల్వే బడ్జెట్ను కేంద్ర బడ్జెట్తో కాకుండా విడిగా ప్రవేశపెట్టేవారు. 1924లో తొలిసారిగా రైల్వే బడ్జెట్ను అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.దేశంలో రైల్వే వ్యవస్థలను అభివృద్ధి చేయడం కోసం నాటి బ్రిటిష్ పాలకులు రైల్వేకు ఎక్కువ నిధులు కేటాయించేది అప్పటి ప్రభుత్వం. ఇది సరకు రవాణాకు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. ఆ తరువాతి కాలంలో ఏర్పాటైన రైల్వే వ్యవస్థ జాతీయంపై 1920లో 10 మంది సభ్యుల సర్ విలియం అక్వర్త్ కమిటీ రైల్వే వ్యవస్థను సంఘటితం చేయాలని సూచించింది. అందుకోసం ప్రత్యేకంగా రైల్వేకు నిధులు కేటాయించాలని బ్రిటిష్ పాలకులకు సిఫార్సు చేసింది, దీనికి ఆమోదం లభించడంతో 1924 నుంచి రైల్వే బడ్జెట్ని ప్రభుత్వం విడిగా ప్రవేశపెడుతోంది. దాదాపు 93 ఏళ్ల పాటు రైల్వే బడ్జెట్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టే సాంప్రదాయం కొనసాగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం మొదటి టర్మ్లో రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్తో కలిపింది 2017లో తొలిసారిగా వార్షిక బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్ను ప్రకటించారు. అయితే తాజా బడ్జెట్లో కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్లు, కొత్త రైల్వే ఛార్జీలు,కేటాయింపులపై తదితర విషయాలపై భారీ ఆసక్తి నింపుతోంది. ఈ ఏడాది బడ్జెట్లో వందే భారత్ రైళ్లు, బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న మూడేళ్లలో 400 సెమీ హైస్పీడ్, నెక్స్ట్ జనరేషన్ వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టే ప్రణాళికను రూపొందించినట్లు గత బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తాజా సమాచారం మేరకు కేంద్రం ఈసారి రైల్వే బడ్జెట్ ను పెంచబోతోంది. అలాగేప్రీ బడ్జెట్ మీటింగ్ రైల్వే బోర్డు తమకు 25 నుంచి 30 శాతం వరకూ బడ్జెట్ కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేసింది. ఈక్రమంలో రైల్వేలకు కేటాయింపులు ప్రస్తుత సంవత్సరంలో రూ. 1.4 లక్షల కోట్లుగా ఉండగా అది 2023-2024 ఆర్థిక సంవత్సరానికి 30 శాతం పెంచి రూ. 1.9 లక్షల కోట్లు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2.45 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండీచర్తో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం మూలధన వ్యయం రూ. 3 ట్రిలియన్లకు అంటే 20 శాతానికి పైగా పెరుగుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ బడ్జెట్లో నూతన రైల్వే లైన్లను ప్రతిపాదనతోపాటు, ఆయా రాష్ట్రాల్లో రైల్వే వ్యవస్థలను మెరుగు పరిచేందుకుప్రాధాన్యత ఇవ్వనుంది. అంచనాలు 2023 బడ్జెట్ కేటాయింపుల్లో వేగవంతమైన రైళ్లకు అనుగుణంగా ట్రాక్స్ అప్గగ్రేడేషన్పై దృష్టి సారించాలని రైల్వే నిపుణులు చెబుతున్నారు. అధికంగా నిధులు, ముఖ్యంగా కొత్త లైన్ల నిర్మాణం, లైన్ల గేజ్లు మార్పు, ఎలక్ట్రిఫికేషన్ చేయడం, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తేవడం లాంటివాటిపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ►డిసెంబర్ 2023 నాటికి బ్రాడ్ గేజ్ రైల్వేల 100 శాతం విద్యుదీకరణ పూర్తి. ►మెట్రో రైల్వే వ్యవస్థను టైర్-2 నగరాలు , టైర్-1 నగరాల వెలుపలి ప్రాంతాలలో అభివృద్ధి ►తద్వారా భారతీయ రైల్వేలు 2030 నాటికి ప్రపంచంలోనే తొలి100 శాతం గ్రీన్ రైల్వే సర్వీస్గా అవిష్కారం ► హైపర్లూప్ టెక్నాలజీని అవలంబిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చు. ► దీనితో పాటు సామాన్యులకు ఊరటనిచ్చేలా ప్రాథమిక సౌకర్యాలపై భారీ ప్రకటన రానుందని అంచనా. ►వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు 4000 కి.మీ పొడవు లైన్ వేయడం ఉద్దేశ్యం ►రాబోయే రైల్వే బడ్జెట్లో 7,000 కి.మీ బ్రాడ్ గేజ్ లైన్ విద్యుదీకరణప్రకటన ► రైల్వే విజన్ 2024 ప్రాజెక్ట్ కింద, కొత్త ప్రత్యేక ఫ్రైట్ కారిడార్లు హై-స్పీడ్ ప్యాసింజర్ కారిడార్లను పరిచయం చేయడంతో పాటు, రద్దీ మార్గాల్లో మల్టీట్రాకింగ్ , సిగ్నలింగ్ అప్గ్రేడ్స్ లక్క్ష్యం. ► కోవిడ్ సమయంలో తొలగించిన రైల్వేలో సీనియర్ సిటిజన్ల కుల్పిస్తున్న 50 శాతం రాయితీని పునరుద్ధించాలని కూడా పలువురు కోరుతున్నారు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కేంద్రం శుభవార్త.. బడ్జెట్లో కీలక నిర్ణయం, రైతులకు ఇస్తున్న సాయం పెంచనుందా!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది బడ్జెట్ ప్రత్యేకత సంతరించుకుంది. 2024లో సార్వత్రిక ఎన్నికల జరగనున్న నేపథ్యంలో మోదీ సర్కార్ ప్రవేశపెట్టే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే. దీంతో ఈ బడ్జెట్లో అన్ని వర్గాలు ఆశించినే మేరకు వరాల జల్లు కురిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్లో ముఖ్యంగా రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కీలక ప్రకటనలు ఉండవచ్చని సమాచారం. వేలాది మంది రైతులు ఎదురుచూస్తున్న 13వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను త్వరలో విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పథకంలో భాగంగా, భూమిని కలిగి ఉన్న అన్ని రైతు కుటుంబాలకు మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ. 6,000 అందిస్తోంది కేంద్రం. దీనికి సంబంధించి ఈ పథక లబ్ధిదారులైన రైతులకు కేంద్రం శుభవార్త చెప్పనున్నట్లు సమాచారం. నివేదిక ప్రకారం ఈ బడ్జెట్లో రైతులకు అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం వాయిదా మొత్తాన్ని పెంచే అవకాశం ఉంది. గతంలో ఈ పథకం కింద ఏడాదికి రూ.6వేలు నగదుని 3 వాయిదాలో కేంద్రం రైతు బ్యాంకు ఖాతాలో జమ చేసేది. తాజాగా ఆ మొత్తాన్ని రూ.8వేలకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా రైతులకు ఇచ్చే మొత్తాన్ని రూ.2వేలు చొప్పున 4 విడతలుగా విభజించనుంది. ఈ బడ్జెట్ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. చదవండి: Union Budget 2023: కేవలం 800 పదాల్లో బడ్జెట్ను ముగించిన ఆర్థిక మంత్రి.. ఎవరో తెలుసా! -
Union Budget 2023: కేవలం 800 పదాల్లో బడ్జెట్ను ముగించిన ఆర్థిక మంత్రి.. ఎవరో తెలుసా!
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. బీజేపీకి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కానుంది. దీంతో ఈ సారి బడ్జెట్కు ప్రత్యేకత సంతరించుకుంది. దేశ బడ్జెట్ చరిత్రలో సుదీర్ఘ ప్రసంగాలు చేసిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ క్రమంలో బడ్జెట్ విషయంలో చోటు చేసుకున్న కొన్ని ఆసక్తికర విషయాలపై ఓ లుక్కేద్దాం! ►1977లో అప్పటి ఆర్థికమంత్రి హీరాభాయ్ ములిజిభాయ్ పటేల్ కేవలం 800 పదాలతో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ►బడ్జెట్లో వినియోగించే పదాలను ప్రామాణికంగా తీసుకుంటే.. సుదీర్ఘమైన పద్దును మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రసంగించారు. పీవీ నరసింహా రావు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన.. 18,650 పదాలతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ►అత్యధిక బడ్జెట్ ప్రసంగాలు చేసిన వారిలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. 1962-69లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన మొత్తం 10సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇప్పటికీ ఈ రికార్డ్ చెక్క చెదరకుండా అలానే ఉంది. ►బ్రిటీష్ కాలం నుంచి ఫిబ్రవరి చివరి రోజున బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఆనవాయతీ. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఫిబ్రవరి 1కి మారింది. కొత్త తేదీలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి ఆర్థికమంత్రిగా అరుణ్ జైట్లీ నిలిచారు. ►జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ మాత్రమే బడ్జెట్ను సమర్పించిన ఏకైక ప్రధానులు. ►1999 వరకు, కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి చివరి పనిదినం సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టడం ఆనవాయితీ. మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఉదయం 11 గంటలకు మార్చారు. ►ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాన్ని చేశారు. 2020 కేంద్ర బడ్జెట్ను సమర్పిస్తూ ఆమె 2.42 గంటలపాటు ప్రసంగించారు. ఇదే ఇంతవరకు ఎక్కువ సమయం ప్రసంగించిన బడ్జెట్గా రికార్డ్ నమోదు చేసింది. ►కేంద్ర బడ్జెట్ 1950లో లీక్ అయింది. అప్పటి వరకు రాష్ట్రపతి భవన్లో బడ్జెట్ ముద్రణ జరుగుతుండగా, ఈ లీక్ తర్వాత, దానిని న్యూఢిల్లీలోని మింటో రోడ్లోని ప్రెస్కి మార్చాల్సి వచ్చింది. ► ఫిబ్రవరి 1, 2021న, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొదటి పేపర్లెస్ బడ్జెట్ను సమర్పించారు. చదవండి: బడ్జెట్ 2023: కేంద్రం ఫోకస్ పెట్టనున్న కీలక అంశాలు ఇవేనా! -
Budget Halwa: హల్వానే కాదు ప్రతుల ముద్రణ వెనుక అంత కథ ఉందా?
యూనియన్ బడ్జెట్ దరిమిలా.. మరో ముఖ్యమైన బడ్జెట్ హల్వా. బడ్జెట్ తయారీలో చివరి ఘట్టంగా దీనిని పేర్కొంటారు. బడ్జెట్ తయారీలో పని చేసే ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు, సిబ్బంది కోసం హల్వా సిద్ధం చేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. అయితే కాస్త గ్యాప్తో జరిగిన కార్యక్రమం కూడా ముగిసింది. ఏడాది గ్యాప్ తీసుకుని.. బడ్జెట్ హల్వా మళ్లీ మన ముందుకు వచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కడాయిలో వండిన హల్వా సీల్ను తెరిచి.. అందరికీ పంచి ఈ ఆనవాయితీని కొనసాగించారు. గురువారం నార్త్ బ్లాక్లో జరిగింది ఈ కార్యక్రమం. సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వారం, పదిరోజుల ముందు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. కాకతాళీయంగా ఈసారి గణతంత్ర దినోత్సవం నాడే ఇది జరగడం గమనార్హం. కిందటి ఏడాది కరోనా కారణంగా హల్వాకు బదులకు స్వీట్లను పంచారు. బడ్జెట్ హల్వా కార్యక్రమం.. ఆర్థిక మంత్రి సమక్షంలో జరుగుతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ఆర్థిక శాఖ సహాయ మంత్రులు పంకజ్ చౌదరి, భగవత్ కరాద్, ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్, ఆర్థిక వ్యవహరాల కార్యదర్శి అజయ్ సేథ్, రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా.. ఇతరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన వరుసగా ఐదవసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. గత రెండు బడ్జెట్లా మాదిరే ఈ ఏడాది కూడా పేపర్లెస్గా బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారామె. హల్వా వేడుక.. అనేది బడ్జెట్లో ఓ ముఖ్యమైన ఘట్టం. బడ్జెట్ రూపొందించిన అధికారులకు, సిబ్బంది సేవలకు గుర్తింపుగా.. తీపిని అందించడం ద్వారా ఈ వేడుకను ప్రతీ ఏటా నిర్వర్తించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, కిందటి ఏడాది మాత్రం బదులుగా స్వీట్లు పంచారు. బడ్జెట్ తయారీ అంతా ఫైనల్ బడ్జెట్ డాక్యుమెంట్ బయటకు వచ్చేదాకా అంతా గోప్యంగానే ఉంటుంది. బడ్జెట్ రూపొందించే అధికారులు, సిబ్బంది అంతా వందమంది దాకా ‘లాక్ ఇన్ పీరియడ్’లో ఉండిపోతారు. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా(కుటుంబ సభ్యులతో సహా) ఉండిపోతారు. లోక్సభలో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాతే వాళ్లు బయటకు వచ్చేది. ఒక రకంగా చూసుకుంటే.. ఇది క్వారంటైన్ లాంటిదే!. గతంలో లాక్ఇన్ పీరియడ్ రెండు వారాలు ఉండేది. తర్వాత పదిరోజులు అయ్యింది. ఇప్పుడు బడ్జెట్ అనేది డిజిటల్ ఫార్మట్కు మారడంతో.. ఐదు రోజులకు కుదించారు. 1950లో బడ్జెట్ ప్రతులను రాష్ట్రపతి భవన్లో ముద్రించారు. అయితే ఆ సమయంలో బడ్జెట్ డాక్యుమెంట్లు లీక్ అయ్యాయి. దీంతో పెనుకలకలమే రేగింది. ఆపై ఢిల్లీ మింట్ రోడ్లోని ప్రింట్ ప్రెస్కు మారింది. ఆపై 1980 నుంచి నార్త్బ్లాక్ బేస్మెంట్లో బడ్జెట్ ప్రెస్ను ఇందుకోసం శాశ్వతంగా వినియోగిస్తున్నారు. నార్త్ బ్లాక్ బేస్మెంట్లో 1980-2020 మధ్య కాలంలో బడ్జెట్ ప్రతులను ముద్రించేవాళ్లు. ఆ తర్వాత బడ్జెట్ డిజిటల్ కావడం, మొబైల్ యాప్ లేదంటే వెబ్సైట్ ద్వారా ప్రతులను పంచడంతో.. కేవలం కొన్ని డాక్యుమెంట్ల ముద్రణ మాత్రమే ఉంటోంది. యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ www.indiabudget.gov.in, యూనియన్ బడ్జెట్ యాప్లో అందుబాటులో ఉంటుంది. -
Union Budget 2023: అరుదైన ఘనత నిర్మలా సీతారామన్ సొంతం.. అదో రేర్ రికార్డ్!
ప్రతి ఏటా వార్షిక బడ్జెట్ను ఫిబ్రవరి 1న కేంద్రప్రభుత్వం (Central Government) ప్రవేశపెడుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ఈ వార్షిక బడ్జెట్ను తయారు చేస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. అయితే ఈ బడ్జెట్కి సంబంధించి నిర్మలా సీతారామన్ ఓ అరుదైన ఘనత సాధించారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం! తొలి మహిళగా రికార్డ్.. ఆమె సొంతం కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను గత నాలుగేళ్లుగా ప్రవేశపెడుతున్నారు. ఆమెకు వరుసగా ఇది ఐదో బడ్జెట్. ఇంతవరకు నాలుగు బడ్జెట్లను ప్రవేశపెట్టిన మహిళ ఆర్థిక మంత్రి ఎవ్వరూ లేరు. గతంలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళగా ఇందిరాగాంధీ చరిత్ర సృష్టించారు. కాగా ఈ రికార్డు కొన్నేళ్లు చెక్కు చెదరకుండా అలానే ఉండిపోయింది. అంతేకాకుండా భారత తొలి మహిళా ఆర్థిక మంత్రి ఇందిరనే. 1969లో మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా రాజీనామా చేయడంతో ప్రధాన మంత్రిగా ఉంటూ ఇందిరాగాంధీ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇంధిరా గాంధీ తర్వాత రెండో మహిళా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ఎక్కువ సార్లు(నాలుగు సార్లు) బడ్జెట్ను ప్రవేశపెట్టి ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. -
6 నెలల నుంచి మొదలు, బాబోయ్ బడ్జెట్ తయారీ వెనుక ఇంత కథ నడుస్తుందా!
కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతుంది. అయితే ఈ బడ్జెట్ తయారీ అంత సులువు కాదు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆరు నెలల ముందు నుంచే ఈ పనులు ప్రారంభమవుతాయి. ఎన్నో ప్రక్రియలు దశలు దాటి చివరికి పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈ క్రమంలో బడ్జెట్ అంటే ఏమిటి, ఎలా తయారు చేస్తారు? దీని వెనుక జరిగే పూర్తి వివరాలను తెలుసుకుందాం. నీతి ఆయోగ్, ఇతర సంబంధిత మంత్రిత్వ శాఖలతో సంప్రదించి ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనిని తయారు చేస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ (DEA) బడ్జెట్ విభాగం బడ్జెట్ను రూపొందించడానికి నోడల్ బాడీగా వ్యవహరిస్తుంది. బడ్జెట్ తయారీ ప్రక్రియ ఆగస్టు-సెప్టెంబర్లో ప్రారంభమవుతుంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు అంటే ఏప్రిల్ 1న పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాల్సి ఉంటుంది. 1) అన్ని మంత్రిత్వ శాఖలకు సర్క్యులర్ల జారీ ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్వయంప్రతిపత్తి గల సంస్థలకు వచ్చే ఏడాది అంచనాలను సిద్ధం చేయాలని కోరుతూ ఒక సర్క్యులర్ జారీ చేస్తుంది. ఈ సర్క్యులర్లో మంత్రిత్వ శాఖలు తమ డిమాండ్లను సమర్పించడానికి అవసరమైన మార్గదర్శకాలను కలిగి ఉంటాయి. మంత్రిత్వ శాఖలు తమ అంచనాలను అందించడమే కాకుండా, గత సంవత్సరంలో తమ ఆదాయాలు, ఖర్చుల వివరాలను కూడా అందిస్తాయి. 2) అందుకున్న ప్రతిపాదనలపై సంప్రదింపులు అభ్యర్థనలు స్వీకరించిన తర్వాత, దానిని ప్రభుత్వ ఉన్నతాధికారులు పరిశీలిస్తారు. మంత్రిత్వ శాఖలు, వ్యయ శాఖ మధ్య విస్తృతమైన సంప్రదింపులు జరుగుతాయి. ఆపై ఆమోదం పొందిన తర్వాత, డేటా ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపుతారు 3) ఆదాయాల కేటాయింపు ఆర్థిక మంత్రిత్వ శాఖ, అన్ని సిఫార్సులను పరిశీలించిన తర్వాత, వివిధ శాఖలకు వారి భవిష్యత్తు ఖర్చుల కోసం ఆదాయాన్ని కేటాయిస్తుంది. నిధుల కేటాయింపుపై ఏదైన సమస్య తలెత్తితే, ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రివర్గం లేదా ప్రధానమంత్రిని సంప్రదిస్తుంది. మరోవైపు.. వ్యవసాయ నిపుణులు, చిన్న తరహా పరిశ్రమల ప్రొప్రైటర్స్, విదేశీ సంస్థాగత మదురులతోనూ ఆర్థిక వ్యవహారాల విభాగం చర్చలు చేపడుతుంది. 4) ప్రీ-బడ్జెట్ సమావేశాలు అందిన ప్రతిపాదనలు డిమాండ్ల గురించి తెలుసుకోవడానికి ఆర్థిక మంత్రి వివిధ శాఖల నిపుణులతో ప్రీ-బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తారు. ఇందులో రాష్ట్ర ప్రతినిధులు, బ్యాంకర్లు, వ్యవసాయదారులు, ఆర్థికవేత్తలు, ట్రేడ్ యూనియన్లు ఉంటారు. బడ్జెట్కు ముందు సంప్రదింపులు పూర్తయిన తర్వాత, ఆర్థిక మంత్రి అన్ని డిమాండ్లపై తుది పిలుపునిస్తారు. ఖరారు చేసే ముందు ప్రధానితో కూడా చర్చిస్తారు. 5) బడ్జెట్ ప్రతుల ప్రింటింగ్.. ప్రతి సంవత్సరం, బడ్జెట్ను సమర్పించడానికి కొన్ని రోజుల ముందు హల్వా వేడుకను నిర్వహించే వార్షిక సంప్రదాయాన్ని ప్రభుత్వం అనుసరిస్తుంది. ఈ వేడుక బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఆచారంలో భాగంగా, 'హల్వా'ను పెద్ద 'కడాయ్' లో తయారు చేస్తారు. ఈ స్వీటును ఆర్థిక మంత్రిత్వ శాఖలోని మొత్తం సిబ్బందికి వడ్డిస్తారు. ఈ ఈవెంట్కు ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే..బడ్జెట్ రూపకల్పనతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న పెద్ద సంఖ్యలో అధికారులు, సహాయక సిబ్బందికి ఈ వంటకాన్ని వడ్డిస్తారు. బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు వారందరు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా పని చేస్తారు. 6)బడ్జెట్ సమర్పణ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం బడ్జెట్ తయారీకి చివరి దశ. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఆ తర్వాత ప్రభుత్వం చేపట్టబోయే కీలక ప్రాజెక్టులపై సుదీర్ఘ ప్రసంగంతో పాటు హాల్లోని సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. ఆ తరువాత బడ్జెట్ను ఉభయ సభల ముందు ఉంచుతారు. పార్లమెంట్లో బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు. చదవండి: బడ్జెట్ 2023: కేంద్రం ఫోకస్ పెట్టనున్న కీలక అంశాలు ఇవేనా! -
బడ్జెట్ 2023: కేంద్రం ఫోకస్ పెట్టనున్న కీలక అంశాలు ఇవేనా!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2023-24ను సమర్పించనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ సారి బడ్జెట్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించడంతో పాటు పన్ను ప్రయోజనాల రూపంలో ప్రజలకు కొంత ఉపశమనాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం తన కేటాయింపులను ప్రణాళికాబద్దంగా ఖర్చు చేయనుంది, ద్రవ్య లోటు, ద్రవ్యోల్బణాన్ని ఎలా నియంత్రిస్తుంది అనే దానిపై అందరి దృష్టి ఉంది. ఈ సారి బడ్జెట్లో ఈ ప్రతిపాదనలు ఉండొచ్చని అటు ప్రజలతో పాటు నిపుణులు భావిస్తున్నారు. అవేంటో ఓ లుక్కేద్దాం! పన్ను స్లాబ్ ప్రస్తుత పన్ను స్లాబ్లో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ₹ 2.5 లక్షల ప్రాథమిక మినహాయింపు పరిమితి ఉంది. దీని అర్థం ఈ పరిమితి కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేయవలసిన అవసరం లేదు. అయితే ఈ నిబంధనలో గత ఏడేళ్లగా ఎటువంటి మార్పులు చేయలేదు. దీంతో రాబోయే బడ్జెట్లో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని కేంద్రం ₹ 5 లక్షలకు పెంచే అవకాశం ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారు. ప్రామాణిక తగ్గింపు(స్టాండర్డ్ డిడక్షన్) ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్ను ₹ 50,000 నుంచి ₹ 1 లక్ష వరకు రెట్టింపు చేసే అవకాశం ఉందని పన్ను చెల్లింపుదారులు భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెరుగుతున్న జీవన వ్యయం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కోసం ప్రామాణిక మినహాయింపు పరిమితిని రెట్టింపు చేయాలని వాదన కూడా ఉంది. ఆర్థిక లోటు తగ్గింపు భారత్ తన ఆర్థిక లోటు లక్ష్యాన్ని 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించుకోవచ్చని గోల్డ్మన్ సాక్స్ గ్రూప్ తెలిపింది. ఆండ్రూ టిల్టన్, శాంతాను సేన్గుప్తాతో సహా గోల్డ్మ్యాన్ ఆర్థికవేత్తలు భారతదేశం తన లోటును 5.9కి ఉంచుతుందని ఒక నివేదికలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మూలధన వ్యయాన్ని కొనసాగిస్తూ సంక్షేమ వ్యయాన్ని పెంచడంతో పాటు గ్రామీణ ఉపాధి, గృహనిర్మాణంపై దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. మౌలిక సదుపాయాలు, సామాజిక పథకాల వ్యయం ఈ ఏడాది బడ్జెట్లో మౌలిక సదుపాయాలపై ఖర్చు కూడా పెంచే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే రానున్న కాలంలో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బడ్జెట్ ఇదే కావడంతో ప్రభుత్వం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సామాజిక రంగ సంక్షేమ పథకాలకు మరిన్ని నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: అప్పట్లో రియల్ ఎస్టేట్ కింగ్.. ఇప్పుడేమో లక్షల కోట్ల ఆస్తిని కోల్పోయి -
ఆశల పల్లకిలో వేతన జీవులు..పన్నుపోటు తగ్గుతుందా? లేదా?
పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సరిగ్గా వారం రోజులే ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. అతిపెద్ద ఆదాయ వనరుల్లో ఒకటైన వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఈ బడ్జెట్పై భారీగా అంచనాలు పెంచుకున్నారు. ఓవైపు ద్రవ్యలోటు లక్ష్యాలు, మరోవైపు అంచనాలు.. ఈ రెండింటినీ కేంద్రం ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అన్నది ఆసక్తి కలిగిస్తోంది. పన్ను స్లాబ్ రేట్ల సవరణ 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల స్లాబ్ రేట్లలో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మాత్రం స్వల్ప రేట్లతో కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చింది. పన్ను చెల్లింపుదారుల అత్యధిక పన్ను రేటును 30 శాతం నుండి 25 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. రూ. 20 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. అయితే.. రూ.10-12.5 లక్షల నుంచి రూ.10-20 లక్షలకు, 20 శాతం పన్ను రేటు పరిధిలోకి వచ్చే స్లాబ్ని విస్తరించడంతో పాటు దీనికి అనుబంధంగా ఉండాలని ఆశిస్తున్నారు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు. అలాగే, గడువు తేదీ తర్వాత దాఖలు చేసిన రిటర్న్స్కు ఈ విధానాన్ని పొడిగించాలని కోరుతున్నారు. పన్ను మినహాయింపు పరిమితులు మరింత మెరుగైన పన్ను మినహాయింపు పరిమితుల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు పన్నుచెల్లింపుదారులు. ఆర్థిక సంస్థల ద్వారా మంజూరైన రుణాలకు సెక్షన్ 80ఈఈబీ కింద మినహాయింపు ఉంది. అయితే.. 2019 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31 వరకు తీసుకున్న రుణాలకు మాత్రమే అది వర్తిస్తోంది. ఈ కాలపరిమితిని 2025 మార్చి 31 వరకు పొడిగించాలంటున్నారు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు. పీఎఫ్ కంట్రిబ్యూషన్ మినహాయింపు 2020 బడ్జెట్ ప్రకారం.. ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్లో యాజమాన్య వాటా రూ. 7.5 లక్షలు దాటితే పన్ను వర్తిస్తుంది. అలాగే పీఎఫ్ నిధుల ఉపసంహరణపై కూడా పన్ను విధించబడుతోంది. అయితే.. ఈ పన్నులో మినహాయింపు కోరుతున్నారు పన్ను చెల్లింపుదారులు. ఇక ఇప్పటికే కంట్రిబ్యూషన్ సంవత్సరంలో పన్ను చెల్లించి ఉంటే, సేకరించబడిన పీఎఫ్/ఎన్పీఎస్/ఎస్ఏఎఫ్ బ్యాలెన్స్లో ఏదైనా భాగానికి డబుల్ టాక్సేషన్ను తొలగించే విధానంపై స్పష్టత ఉండాలంటున్నారు ఆర్థిక నిపుణులు. భవిష్యత్తులో తలెత్తే అనవసర వ్యాజ్యాల నుంచి పన్ను చెల్లింపుదారులను ఇది కాపాడుతుందని భావిస్తున్నారు. టాక్స్ రిటర్న్స్ సవరణ కోసం కాలపరిమితి అసలు రిటర్న్స్ దాఖలు చేసేందుకు జూలై 31 చివరి గడువు కాగా.. సవరించిన రిటర్న్స్ దాఖలు చేసేందుకు గడువు తేదీ డిసెంబర్ 31. అయితే.. తక్కువ వ్యవధి ఉండటంతో లోపాలు సరిచేసుకునేందుకు తగినంత అవకాశం లభించడం లేదంటున్నారు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు. సవరించిన పన్ను రిటర్న్స్ ఫైలింగ్ కోసం గడువు తేదీని అసెస్మెంట్ సంవత్సరం ముగింపు నుంచి ఒక ఏడాదికి పునరుద్ధరిస్తే సవరింపులకు తగిన సమయం లభిస్తుందని అంటున్నారు. -
South Central Railway: వందే భారత్ సరే... ఇంటర్సిటీ ఏదీ?
సాక్షి, హైదరాబాద్: సుమారు పన్నెండేళ్ల క్రితం ప్రారంభించిన ఎంఎంటీఎస్ రెండో దశ ఇప్పటికీ పూర్తి కాలేదు, లింగంపల్లి నుంచి బీహెచ్ఈఎల్ వరకు ఆరు కిలోమీటర్ల మేర అదనపు సదుపాయం అందుబాటులోకి వచ్చినా రైళ్లు పట్టాలెక్కలేదు. ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో ఠంచన్గా కేంద్ర బడ్జెట్ మాత్రం వచ్చిపోతూనే ఉంది. కానీ జంటనగరాల్లోని ప్రాజెక్టులకు మాత్రం రెడ్ సిగ్నలే పడడం గమనార్హం. రైల్వేస్టేషన్లలో మౌలిక సదుపాయాల ప్రైవేటీకరణలో భాగంగా స్టేషన్ల ఆధునికీకరణ వంటి కొన్ని లాభదాయకమైన ప్రాజెక్టులు మినహాయించి లక్షలాది మంది ప్రయాణికలు ఆధారపడిన కొత్త రైళ్లు, లైన్ల విస్తరణకు మాత్రం నిధులు లభించడం లేదు. మరో వారం పది రోజుల్లో కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ప్రతి సంవత్సరం పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ప్రజల అవసరాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసే ఎంపీల సమావేశం కూడా ఈసారి ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో ప్రవేశపెట్టనున్న కేంద్రబడ్జెట్లో హైదరాబాద్ ప్రజల రైల్వే ప్రయాణ అవసరాలు ఏ మేరకు ప్రతిబింబిస్తాయనే సందేహంగా మారింది. మరోవైపు గతంలో ప్రారంభించిన పనులు నిధుల కొరత కారణంగా నిలిచిపోయాయి. ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తే తప్ప పనులు ముందుకు సాగే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి, రైల్వే శాఖకు మధ్య ఏర్పడిన పీటముడి కారణంగా మరికొన్ని ప్రాజెక్టులు ఆగిపోయాయి. వందే భారత్ సరే...ఇంటర్సిటీ ఏదీ... సికింద్రాబాద్ నుంచి కాజీపేట్, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, డోర్నకల్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు సాధారణ ప్యాసింజర్ రైళ్లు, ఎక్స్ప్రెస్ రైళ్లలో రూ.100 నుంచి రూ.150 వరకు చార్జీ ఉంటుంది. కొత్తగా వచ్చిన వందేభారత్లో ప్రయాణం చేయాలంటే వరంగల్ వరకు కనీసం రూ.450 చెల్లించాలి. సికింద్రాబాద్ నుంచి నేరుగా విశాఖకు వెళ్లే ప్రయాణికులకు కూడా చార్జీలు భారమే అయినా సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకొంటే భారత్ ప్రయోజనకరమే. నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి 200 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాలకు రైళ్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. గతంలో ప్యాసింజర్లుగా నడిచిన రైళ్లను ఎక్స్ప్రెస్లుగా పేరు మార్చి చార్జీలు పెంచారు. అదే సమయంలో హాల్టింగ్ స్టేషన్లను తగ్గించారు. దీంతో ఉద్యోగ, ఉపాధి అవసరాల కోసం నగరానికి రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంటర్సిటీ రైళ్లను పెంచాలనే ప్రతిపాదన ఆచరణకు నోచడం లేదు. వందేభారత్ కంటే సామాన్యులకు ఎంతో ముఖ్యమైన ఇంటర్సిటీ, ప్యాసింజర్ రైళ్లను ఈ బడ్జెట్లోనైనా ప్రవేశపెట్టాలని ప్రయాణికుల సంక్షేమ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. రెండో దశకు పన్నెండేళ్లు .... రాజధాని, శతాబ్ది వంటి సూపర్ఫాస్ట్ రైళ్ల కంటే నగరంలో లోకల్ రైళ్లకు ప్రాధాన్యతనివ్వాలని అప్పట్లో కేంద్రం భావించింది, ఈ మేరకు ఎంఎంటీఎస్ రైళ్లను ప్రవేశపెట్టింది. మొదటిదశలో పట్టాలెక్కిన రైళ్లు తప్ప కొత్తగా ఒక్క రైలు కూడా అందుబాటులోకి రాలేదు.పైగా గతంలో రోజుకు 121 సర్వీసులు నడిస్తే ఇప్పుడు వాటిని 78కి తగ్గించారు. ఎంఎంటీఎస్ స్టేషన్ల ఆధునికీకరణ ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. తాజాగా భారత్ అమృత్ స్టేషన్స్ పథకం కింద హైటెక్ సిటీ, హఫీజ్పేట్, లింగంపల్లి స్టేషన్లను గుర్తించారు. మిగతా 23 స్టేషన్లలో కనీస సదుపాయాలైన తాగునీరు, మరుగుదొడ్లు వంటివి కూడా తగినన్ని లేకపోవడం గమనార్హం. సుమారు 12 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఎంఎంటీఎస్ రెండో దశ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఔటర్రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న పలు స్టేషన్లతో అనుసంధానమయ్యే రెండో దశ వల్ల రవాణా సదుపాయాలు బాగా విస్తరించే అవకాశం ఉంది. ఆరు మార్గాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటి వరకు మూడు లైన్లు మాత్రం పూర్తయ్యాయి. ఈ మార్గాల్లో నడిపేందుకు రైళ్లు లేక నిరుపయోగంగా ఉన్నాయి. నగరంలో నాలుగో టర్మినల్గా భావించే చర్లపల్లి స్టేషన్ అభివృద్ధి ఇప్పటి వరకు పూర్తి కాలేదు. పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇది వినియోగంలోకి వస్తే సికింద్రాబాద్పైన ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుతం ఈ ఒక్క స్టేషన్ నుంచే రోజుకు 200 రైళ్లు నడుస్తున్నాయి. పుణ్యక్షేత్రాలకు రైళ్లు లేవు.. నగరం నుంచి యాదాద్రికి వెళ్లేందుకు ప్రతిపాదించిన ఎంఎంటీఎస్కు ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాయగిరి స్టేషన్ అభివృద్ధికి మాత్రం రైల్వేశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ ప్రాజెక్టు అటకెక్కింది. లక్షలాది మంది భక్తులు సందర్శించే యాదాద్రికి ఎంఎంటీఎస్ లేకుండా కేవలం స్టేషన్ను అభివృద్ధి చేస్తే అది అలంకారప్రాయమే కానుంది. -
భారత్ భారీ రుణ సేకరణ..! రాయిటర్స్ పోల్లో కీలక అంశాలు!
ఢిల్లీ: ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. అంతేకాదు.. ఈ ఏడాది 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో.. సెంట్రల్ బడ్జెట్ ఎలా ఉండబోతోంది అన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఎన్నికల ఏడాది కావడంతో.. దేశ ఆర్థిక వృద్ధితో పాటు మౌలిక వసతుల కల్పన, ఆర్థిక క్రమశిక్షణపై దృష్టిసారించిన మోదీ ప్రభుత్వం.. ఈ బడ్జెట్ లో వీటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. కరోనా సమయంలో మందగించిన ఆర్థిక వృద్ధిని గాడిలో పెట్టడంతో పాటు.. ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలను నియంత్రించడం, పేదల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రాబోయే ఆర్థిక సంవత్సరంలో 198 బిలియన్ డాలర్ల రుణాలు సేకరించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైనట్లు రాయిటర్స్ ఆర్థికవేత్తల పోల్ సర్వే వెల్లడిస్తోంది. పన్ను రాబడిలో పతనం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థికవృద్ధి మందగించడం వల్ల సమీప కాలంలో రుణ సామర్థ్యాన్ని పరిమితం చేయాలన్న యోచనలో కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 14.2 ట్రిలియన్ రూపాయులుగా ఉన్న స్థూల రుణ పరిమితి ఈసారి 16 ట్రిలియన్ రూపాయలకు చేరనున్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేశారు. కాగా.. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన 2014లో దేశ స్థూల రుణం 5.92 ట్రిలియన్ రూపాయలుగా ఉంది. మరోవైపు.. 2023-24 ఆర్థిక సంవత్సర జీడీపీలో బడ్జెట్ లోటును 6 శాతానికి తగ్గించగలదని రాయిటర్స్ కు చెందిన మరో ఆర్థికవేత్తల పోలింగ్ నివేదిక వెల్లడించింది. ఇది ఇప్పటికీ 1970ల నుంచి చూసిన సగటు 4% నుండి 5% కంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. 2025-26 నాటికి 4.5 శాతానికి చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వ పెట్టుబడి వ్యయం రికార్డు స్థాయిలో 8.85 ట్రిలియన్ రూపాయలకు చేరుతుందని, ఇది జీడీపీలో 2.95 శాతమని రాయిటర్స్ పోల్ నివేదిక చెబుతోంది. అయితే.. ప్రపంచ తయారీ రంగంలో చైనాను అధిగమించి భారత్ అగ్రగామిగా నిలవాలంటే.. మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయించాలని సూచించింది. -
Budget 2023: PLI పథకం విస్తరణ దిశగా అడుగులు
ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న చివరి బడ్జెట్ ఇది. దీంతో.. బడ్జెట్ అంచనాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా తయారీ రంగానికి కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి..? అన్న చర్చ జరుగుతోంది. తయారీ రంగం అభివృద్ధి పథంలో వేగంగా అడుగులు వేసేలా.. భారీ కేటాయింపులు ఉండొచ్చనే అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు. దీర్ఘకాలిక అభివృద్ధి, ఉద్యోగ,ఉపాధి అవకాశాల కల్పనలో తయారీ రంగానిది కీలక పాత్ర. PLI పథకాన్ని మరింత విస్తరించి, దీని పరిధిలోకి మరిన్ని సెక్టార్లను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. 14 రంగాలకు రూ. 1.97 లక్షల కోట్లతో ఈ పథకం రూపొందించబడింది. ప్రస్తుతం PLI స్కీమ్ లో ఆటోమొబైల్స్, దాన్ని అనుబంధ వస్తువులు, గృహోపకరణాలు, టెక్స్ టైల్స్, ఆహార పదార్థాలు, సోలార్ పీవీ మాడ్యూల్స్, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్స్, స్టీల్ తదితర ఉత్పత్తుల పరిశ్రమలు ఉన్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్ లో బొమ్మలు, సైకిళ్లు, లెదర్, ఫుట్వేర్ తయారీ పరిశ్రమలను కూడా PLI స్కీమ్ పరిధిలోకి తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం. దేశ ఆర్థిక వ్యవస్థకు PLI పథకం ఎంతో ముఖ్యమైనది. ప్రాదేశీయ తయారీని ప్రపంచవ్యాప్తంగా పోటీగా మార్చడంతో పాటు తయారీరంగంలో గ్లోబల్ ఛాంపియన్లను సృష్టించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. 2022 సెప్టెంబర్ నాటికి PLI పథకం ద్వారా భారీ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో రూ.4,784 కోట్లను ఆకర్షించింది. రూ. 2,03,952 కోట్ల విలువైన ఉత్పత్తిని సాధించింది. రూ.80,769 కోట్ల ఎగుమతులు జరిగాయి. PLI పథకంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యం గణనీయమైనది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. 2022 డిసెంబర్ 16 నాటికి 13 పథకాలకు అనుమతులు లభించగా.. వీటిలో 100కు పైగా MSMEలకు లబ్ది చేకూరింది. -
Union Budget 2023-24: హెల్మెట్లపై జీఎస్టీని తొలగించాలి
పార్లమెంట్ (రెండు భాగాల) బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాబోయే కేంద్ర బడ్జెట్లో హెల్మెట్లపై విధించిన వస్తు సేవల పన్ను (జీఎస్టీని) తొలగించాలని ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ (ఐఆర్ఎఫ్) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బడ్జెట్లో నిర్ణయం ఉండాలని కోరుతూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు ఒక లేఖ రాసినట్లు ఐఆర్ఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. సురక్షితమైన రహదారుల కోసం ఐఆర్ఎఫ్ కృషి చేస్తోంది. ప్రస్తుతం హెల్మెట్లపై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. ప్రపంచవ్యాప్తంగా సంభవించే రోడ్డు ప్రమాద మరణాలలో భారత్ 11 శాతం వాటా కలిగి ఉందని ఐఆర్ఎఫ్ ఎమెరిటస్ ప్రెసిడెంట్ కేకే కపిల ఈ సందర్భంగా పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారుల విషయంలో ఇది దాదాపు 31.4 శాతంగా ఉందన్నారు. -
Budget 2023: ఆరోగ్య రంగానికి బడ్జెట్ పెంచండి..!
దేశవ్యాప్తంగా ఆరోగ్య సౌకర్యాలు, మౌలిక సదుపాయాల అవసరం పెరుగుతున్నందున ఆరోగ్యరంగానికి 2023–24 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులు పెంచాలని ఈ రంగంలో నిపుణులు సూచిస్తున్నారు. వారి అభిప్రాయాను ఒక్కసారి పరిశీలిస్తే... న్యూఢిల్లీ కేటాయింపులు 40 శాతం పెరగాలి వరుసగా, 2021–22 – 2022–23 ఆర్థిక సంవత్సరాలను చూస్తే, ఆరోగ్య రంగం కోసం బడ్జెట్ కేటాయింపులు సుమారు 16.5 శాతం పెరిగాయి. రానున్న బడ్జెట్లో ఆరోగ్య రంగానికి నిధులు 30–40 శాతం పెరగాలి. ఆరోగ్యం పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిండానికి ప్రయత్నం జరగాలి. పాఠశాల పాఠ్యాంశాల్లో ఆరోగ్యవంతమైన జీవన ప్రాముఖ్యతను తప్పనిసరిగా చేర్చాలి. మధుమేహం, ఇతర జీవనశైలి వ్యాధులపై స్థానిక సంస్థలు, చాంబర్లు, సంఘాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రభుత్వం తప్పనిసరిగా పంచాయతీ స్థాయిలో ప్రాథమిక క్లినిక్లను ఏర్పాటు చేయాలి. అవి సక్రమంగా పనిచేసేలా కూడా చూసుకోవాలి. టెలిమెడిసిన్ను సులభతరం చేయడానికి వీలుగా ఆయా క్లినిక్లను డిజిటలీకరించాలి. – సాకేత్ దాల్మియా, పీహెచ్డీసీసీఐ ప్రెసిడెంట్ రోగనిర్ధారణ వేగంగా జరగాలి ప్రస్తుత పరిస్థితుల్లో త్వరిత, ఖచ్చిత, వేగవంతమైన రోగనిర్ధారణ అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన డిమాండ్. సమర్థవంతమైన ఆరోగ్య నిర్వహణ, అంటువ్యాధుల వ్యాప్తిని నియంత్రణ, రోగికి వేగవంతంగా కోలుకోవడం వంటి కీలక సానుకూలతకు దోహదపడే అంశం ఇది. ఈ దిశలో దేశంలో బహుళ–వ్యాధుల నిర్ధారణ ప్లాట్ఫారమ్లు అలాగే తక్కువ ధరలో సేవలు లభించే డయాగ్నోస్టిక్స్, వెల్నెస్ ప్రమోషన్ సెంటర్లు అవసరం. ఈ అంశాలపై రానున్న బడ్జెట్ దృష్టి సారించాలి. వెల్నెస్ పరీక్షలు, ఆయుష్ చికిత్సలను ఆరోగ్య బీమాలో కవర్ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం పాలసీ ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేయాలి. పరిశోధనలకు ప్రోత్సాహం, ఇందుకు తగిన నిధుల కల్పన అవసరం. దీనివల్ల ఆరోగ్య సంరక్షణ వ్యయాలు ప్రతి వ్యక్తికి సంవత్సరానికి దాదాపు రూ. 1,000 వరకూ తగ్గుతాయి. – అజయ్ పొద్దార్, సైనర్జీ ఎన్విరానిక్స్ చైర్మన్, ఎండీ ఆరోగ్య బీమాపై దృష్టి అవసరం భారత్లో హెల్త్కేర్పై తలసరి బీమా వ్యయం ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది. దేశంలో 75 శాతం మందికిపైగా ప్రజలకు ఆరోగ్య బీమానే లేదు. ఈ సమస్యను ఎదుర్కొనడంపై రానున్న బడ్జెట్ దృష్టి పెట్టాలి. – సిద్ధార్థ ఘోష్, ఎన్ఎంఐఎంఎస్ హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ గత రెండేళ్లలో ఇలా.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2023–24 వార్షిక బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె బడ్జెట్ రూపకల్పనపై వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించడం జరిగింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు వార్షిక బడ్జెట్ కేటాయింపులు రూ.73,932 కోట్లు. 2022–23లో ఈ కేటాయింపులు దాదాపు 16.5 శాతం పెరిగి రూ.86,200 కోట్లకు చేరాయి. మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీలో) ఆరోగ్య రంగానికి కేటాయింపులు దాదాపు ఒక శాతంగా ఉండడం గమనార్హం. -
సామాజిక భద్రత, మెటర్నీటీ బెనిఫిట్స్పై ఆర్థిక వేత్తల కీలక లేఖ
న్యూఢిల్లీ: సామాజిక భద్రతా పథకాల ఆవిష్కరణలపై 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో దృష్టిసారించాలని ఆర్థికవేత్తలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు 51 మంది ప్రముఖ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు ఒక లేఖ రాశారు. సామాజిక భద్రతా పెన్షన్లను పెంచాలని, ప్రసూతి ప్రయో జనాలకు తగిన కేటాయింపులను ఈ లేఖలో డిమాండ్ చేశారు. ఈ లేఖపై సంతకం చేసినవారిలో జీన్ డ్రేజ్ (గౌరవ ప్రొఫెసర్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్), ప్రణబ్ బర్ధన్ (ఎమిరిటస్ ఆఫ్ ఎకనామిక్స్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీ), ఆర్ నాగరాజ్ (ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్, ఐజీఐడీఆర్, ముంబై), రీతికా ఖేరా (ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్, ఐఐటీ, ఢిల్లీ), సుఖదేయో థోరట్ (ప్రొ ఫెసర్ ఎమెరిటస్, జేఎన్యూ)తదితరులు ఉన్నారు. జైట్లీకీ రాశాం... ‘‘ఇది 20 డిసెంబర్ 2017 అలాగే 21 డిసెంబర్ 2018 (గత ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని ఉద్దేశించి) నాటి మా లేఖలకు కొనసాగింపు. ఇక్కడ మేము తదుపరి కేంద్ర బడ్జెట్ కోసం రెండు ప్రాధాన్యతలను మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాము. సామాజిక భద్రతా పెన్షన్ల పెంపుదల అలాగే ప్రసూతి ప్రయోజనాల కోసం తగిన కేటాయింపు’’ అని వారు ఈ లేఖలో పేర్కొన్నారు. ‘‘రెండు ప్రతిపాదనలు గత సందర్భాల్లో విస్మరించినందున, మేము మళ్లీ అదే సిఫార్సులతో తదుపరి బడ్జెట్కు చాలా ముందుగానే ఈ లేఖను మీకు రాస్తున్నాము’’ అని కూడా వారు లేఖలో పేర్కొన్నారు. జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం (ఎన్ఓఏపీఎస్) కింద వృద్ధాప్య పింఛన్లకు (దాదాపు 2.1 కోట్ల మంది పెన్షనర్లకు) కేంద్ర ప్రభుత్వం అందించే సహకారం 2006 నుండి నెలకు కేవలం రూ.200గానే ఉందని లేఖలో వారు పేర్కొన్నారు. దీనిని తక్షణం రూ.500కు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఇదే జరిగితే ఈ పథకం కింద అదనంగా రూ.7,560 కోట్ల కేటాయింపులు జరపాల్సి ఉంటుంది. వితంతు పెన్షన్ రూ.300 నుంచి రూ.500కు పెంచాలని కూడా లేఖలో విజ్ఞప్తి చేశారు. దీనికి రూ.1,560 కోట్ల కేటాయింపులు జరపాల్సి వస్తుందని తెలిపారు. మెటర్నటీ ప్రయోజనాల పెంపునకు రూ.8,000 కేటాయింపులు అవసరమన్నారు. 2023 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి పార్లమెంటులో 2023-24 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్న సంగతి విదితమే.