general elcetions
-
బంగ్లాదేశ్: మైనర్లకూ ఓటుహక్కు.. యూనస్ సర్కారు నిర్ణయం
ఢాకా: బంగ్లాదేశ్లో ఒకవైపు రాజకీయ అస్థిరత, మరోవైపు మైనారిటీలపై హింస కొనసాగుతోంది. ఇంతలోనే తాత్కాలిక ప్రభుత్వ అధ్యక్షుడు మహ్మద్ యూనస్ తీసుకున్న ఒక నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.18 ఏళ్ల లోపు వారు కూడా..మైనర్లకు కూడా ఓటు హక్కు కల్పించాలని బంగ్లాదేశ్ ఎన్నికల సంఘానికి మహ్మద్ యూనస్ సిఫారసు చేశారు. ఇది ఆమోదం పొందినట్లయితే బంగ్లాదేశ్లోని మైనర్లు అంటే 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు కూడా ఓటు వేయడానికి అర్హులవుతారు. అయితే తాత్కాలిక అధ్యక్షుడు చేసిన ఈ సిఫారసుపై పలు విమర్శలు చెలరేగుతున్నాయి. దీనిపై స్పందించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)ఓటుహక్కు వయసును 17 ఏళ్లకు తగ్గించడం వలన ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెరుగుతుందని, పర్యవసానంగా ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.వ్యతిరేకించిన బీఎన్పీ2024 ఆగస్టులో షేక్ హసీనా నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం పతనానంతరం తాత్కాలిక ప్రభుత్వానికి అధిపతిగా యూనస్ నియమితులయ్యారు. ఆయన తాజాగా బంగ్లాదేశ్లో ఓటింగ్ వయసును 17 ఏళ్లకు తగ్గించాలని ఎన్నికల సంఘానికి సిఫారసు చేసినట్లు ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది. యూనస్ ఒక వీడియో సందేశంలో యువత వారి భవిష్యత్తుకు సంబంధించిన అభిప్రాయాన్ని తెలియజేసేందుకు కనీస ఓటింగ్ వయసును 17 ఏళ్లకు తగ్గించాలని భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. అయితే అధ్యక్షుని నిర్ణయాన్ని బీఎన్పీ తీవ్రంగా వ్యతిరేకించింది.కొత్త ఓటరు జాబితా కోసం..ఢాకాలోని జాతీయ ప్రెస్క్లబ్లో జరిగిన చర్చాకార్యక్రమంలో బీఎన్పీ జనరల్ సెక్రటరీ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ మాట్లాడుతూ ఓటింగ్ వయసును 17 ఏళ్లకు తగ్గించాలన్న దేశ అధ్యక్షుని సూచనల మేరకు కొత్త ఓటరు జాబితాను సిద్ధం చేయాల్సి వస్తుందన్నారు. దీనివలన మరింత సమయం వృధా అవుతుందని, ఎన్నికల ప్రక్రియలో మరింత జాప్యం జరుగుతుందని అన్నారు. తాత్కాలిక ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎన్నికల ప్రక్రియను జాప్యం చేసేందుకు ప్రయత్నిస్తోందన్న అభిప్రాయం ప్రజల్లో ఎప్పటినుంచో ఉందని అలంగీర్ పేర్కొన్నారు. దేశ తాత్కాలిక అధ్యక్షుడు ఇతర పార్టీలను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ ఆరోపించారు.రాజకీయ పార్టీలతో చర్చ జరగాలిదేశ అధ్యక్షుడు ఓటింగ్కు 17 ఏళ్ల వయసు తగినదని చెప్పినప్పుడు ఎన్నికల కమిషన్ దానికి కట్టుబడి ఉండాల్సివస్తుంది. అలాకాకుండా దీనిపై నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్కే వదిలేసి ఉంటే బాగుండేది. అప్పుడు సరైన నిర్ణయం వెలువడేది. ప్రస్తుతం దేశంలో ఓటు వేసేందుకు కనీస వయస్సు 18 ఏళ్లుగా ఉంది. దానిని 17కు తగ్గించాలనుకున్నప్పుడు ఎన్నికల కమిషన్కు ప్రతిపాదిస్తే సరిపోయేది. అప్పుడు మిగిలిన రాజకీయ పార్టీలతో చర్చ జరిగేదని ఆలంగీర్ అన్నారు. కాగా బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షడు యూనస్ డిసెంబర్ 16న ‘విజయ్ దివస్’ ప్రసంగంలో 2025 చివరి నుంచి 2026 ప్రథమార్థం మధ్య ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయిని అన్నారు. ఓటరు జాబితాను సవరించాక ఎన్నికలు జరగనున్నాయని అన్నారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: చిన్న పొరపాట్లు.. పెను ప్రమాదాలు -
Lok Sabha Elections: ఆరో విడత ఎన్నికల షెడ్యూల్ రిలీజ్
సాక్షి, ఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆరో విడతలో తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఆరో విడతలో 57 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆరో షెడ్యూల్లో ఆరు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి.కాగా, సోమవారం ఉదయం ఆరో విడతలో లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఆరో విడతలో బీహార్, హర్యానా, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఆరో విడతలో 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. కాగా, మే ఆరో తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరుగనుంది. మే 25వ తేదీన పోలింగ్ జరుగుతుంది. జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. Election Commission issues notice for the Sixth phase of Lok Sabha elections.Elections will be held in 57 Lok Sabha seats in 6 states and 1 Union Territory. pic.twitter.com/3ASMsonYUb— Sunny Raj ( Modi ka Parivar ) (@sunnyrajbjp) April 29, 2024 -
‘‘రష్యా ఎన్నికలు ఒక బూటకం.. చనిపోయేదాకా పుతిన్దే పవర్’’
లండన్: రష్యా అధ్యక్షుడు పుతిన్ చనిపోయే వరకు పవర్లోనే ఉంటాడని, ప్రస్తుతం జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలు కింది నుంచి మీది దాకా ఒక భూటకం అని యాంటీ కరప్షన్ యాక్టివిస్ట్, రష్యా నుంచి బహిష్కరణకు గురైన ఇన్వెస్టర్ బిల్ బ్రౌడర్ వ్యాఖ్యానించారు. అధ్యక్షఎన్నికల వేళ బ్రౌడర్ వ్యాఖ్యలు హాట్టాపిక్గా మారాయి. ‘దేశ ప్రజలకు జైలు, చావు తప్ప పుతిన్ ఇచ్చేది ఏమీ లేదు. ఇది ఒక గొప్ప లీడర్ లక్షణం కాదు. పుతిన్ ప్రజలను ఇంకా అణచివేస్తే తిరుగుబాటు తప్పదు. ప్రజలు డిసైడైతే పుతిన్కు రొమేనియా కమ్యూనిస్టు లీడర్ నికోలే సెస్క్యూకు పట్టిన గతే పడుతుంది’అని బిల్ బ్రౌడర్ హెచ్చరించారు. హెమిటేజ్ క్యాపిటల్ అనే కంపెనీ ద్వారా రష్యాలో 1990 నుంచి 2000 సంవత్సరం వరకు భారీగా పెట్టుబడులు పెట్టిన బిల్ బ్రౌడర్ను అవినీతి ఆరోపణలపై 2005లో దేశం నుంచి బహిష్కరించారు. కాగా, తొలుత రష్యా గూఢచర్య సంస్థ కేజీబీ ఏజెంట్గా పనిచేసిన పుతిన్ 1999 నుంచి రష్యాలో అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లోనూ పుతిన్ గెలుపు ఖాయమేనన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో మరో ఆరేళ్లపాటు పుతిన్ అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. మార్చి 15న ప్రారంభమైన రష్యా ఎన్నికలు 17 దాకా మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఇదీ చదవండి.. కెనడాలో భారత సంతతి ఫ్యామిలీ అనుమానాస్పద మృతి -
కేరళలో రష్యా ఎన్నికల పోలింగ్!!
తిరువనంతపురం: రష్యా ఎన్నికలు శుక్రవారం(మార్చ్ 15) ఉదయం ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఎన్నికల పోలింగ్ భారత్లోని కేరళ రాజధాని తిరువనంతపురంలో కూడా జరుగుతుండడం విశేషం. కేరళలో నివసిస్తున్న రష్యా పౌరులు తిరువనంతపురంలోని రష్యా కాన్సులేట్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ తరహాలో ఇక్కడ నివసిస్తున్న రష్యన్ల కోసం పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం ఇది మూడోసారని రష్యా కాన్సులేట్ డైరెక్టర్ రతీష్ నాయర్ తెలిపారు. పోలింగ్ విషయంలో తమకు సహకరిస్తున్న రష్యన్లకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. టూరిస్టులుగా లేదా నివాసం ఉండేందుకు భారత్ వచ్చిన రష్యన్లకు దేశ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని రష్యా పౌరురాలు ఉలియా తెలిపారు. రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మార్చ్ 17వరకు మూడు రోజుల పాటు జరగనుంది. ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్తో పోటీపడేందుకు ముగ్గురు అభ్యర్థులకు రష్యా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్(సీఈసీ)అనుమతిచ్చింది. ఈ ముగ్గురు ఉక్రెయిన్తో రష్యా యుద్ధాన్ని సమర్ధించిన వారే కావడం గమనార్హం. ఈ ఎన్నికల్లో పుతిన్ గెలుపు దాదాపు ఖాయమేనన్న అంచనాలున్నాయి. ఇదీ చదవండి.. మొదలైన రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ -
Delhi: కేంద్ర కేబినెట్ చివరి భేటీ నేడు
సాక్షి,ఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ భేటీ ఆదివారం(మార్చ్ 3) జరగనుంది. పార్లమెంట్ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ విడుదలవనుండడంతో ఈ ప్రభుత్వంలో ఇదే చివరి కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ వీడ్కోలు పలకనున్నారు. వారికి ప్రధాని వీడ్కోలు పార్టీ ఇవ్వనున్నారు. మూడవసారి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అమలు చేయాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై ఈ సమావేశంలో ప్రధాని మంత్రులతో చర్చించే అవకాశాలున్నాయి. ఢిల్లీలోని చాణక్యపురి డిప్లమాటిక్ ఎనక్లేవ్లోని సుష్మా స్వరాజ్ భవన్లో తుది కేబినెట్ భేటీ జరగనుంది. ఈ నెలలోనే లోక్సభ సాధారణ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ) షెడ్యూల్ విడుదల చేయనుంది. ఇదీ చదవండి.. వచ్చే వారంలో కాంగ్రెస్ కీలక భేటీలు -
Pak: పాకిస్థాన్లో సంకీర్ణం.. ఆయనే ప్రధాని !
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు తమతో కలిసి వచ్చే పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ), ముత్తహిదా ఖ్వామీ మూమెంట్(ఎమ్క్యూఎమ్)పార్టీలకు అధ్యక్ష, నేషనల్ అసెంబ్లీ స్పీకర్ పదవులతో పాటు పలు మంత్రి పదవులిచ్చేందుకు నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్(పీఎంల్-ఎన్)అంగీకరించినట్లు తెలిసింది. ఈ మేరకు ఆదివారం పీపీపీ, ఎంక్యూఎం పార్టీ నేతలతో నవాజ్ షరీఫ్ జరిపిన చర్చలు విజయవంతమైనట్లు సమాచారం. ప్రధాని పదవిని మాత్రం పీఎంఎల్(ఎన్) తీసుకోనుంది. ఇమ్రాన్ఖాన్కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ)ను తప్ప మిగిలిన పార్టీలన్నింటినీ ప్రభుత్వ ఏర్పాటుకు నవాజ్షరీఫ్ ఆహ్వానించారు. ఈసారి మిలిటరీ కూడా నవాజ్ షరీఫ్కే మద్దతు పలుకుతోందని సమాచారం. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో పీఎంఎల్ ఎన్కు 76 సీట్లు రాగా బిలావల్ బుట్టో నేతృత్వంలోని పీపీపీకి 54 సీట్లు,ఎంక్యూఎం పార్టీకి 17 సీట్లు వచ్చాయి. ఇక ఇమమ్రాన్ఖాన్కు చెందిన పీటిఐ పార్టీకి అత్యధికంగా 97 సీట్లు రావడం గమనార్హం. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ ఏ పార్టీకి రాకపోవడంతో సంకీర్ణం అనివార్యమైంది. ఇదీ చదవండి.. జర్నలిస్టుపై ఇజ్రాయెల్ ఆర్మీ సంచలన ప్రకటన -
పదిహేడవ లోక్సభ.. ప్రధాని మోదీ లాస్ట్ స్పీచ్ ఇదే..
న్యూఢిల్లీ: తమ పాలనలో దేశ ప్రజల్లో విశ్వాసం పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు 17వ లోక్సభ చివరిరోజు సమావేశాల్లో అయోధ్య రామమందిర తీర్మానంపై ప్రధాని మాట్లాడారు. గత ఐదేళ్లలో అద్భుతమైన మార్పులు ఆవిష్కరణలు తీసుకువచ్చామని చెప్పారు. దేశాన్ని తామెప్పుడూ వెనకడుగు వేయనివ్వలేదన్నారు. 17వ లోక్సభను దేశం తప్పకుండా ఆశీర్వదిస్తుందన్నారు. ‘ఎన్నో ఏళ్ల కల అయిన కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించుకున్నాం. మార్గదర్శకంగా సెంగోల్ను స్థాపించుకున్నాం. కరోనా లాంటి విపత్కర పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం. జీ20 సమావేశాన్ని నిర్వహించడం వల్ల భారత్ ప్రతిష్ట పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్పు కనిపిస్తోంది. పేపర్లెస్ పార్లమెంట్, డిజిటలైజేషన్ సభ్యులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పార్లమెంట్కు హాజరయ్యే సభ్యుల సంఖ్య పెరిగింది. ఈ ఐదేళ్లలో పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాం. రీ ఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం. మార్పు దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. గత పదేళ్లలో దేశంలో ఉత్పాదకత పెరిగింది. ఈ టర్ములో పార్లమెంట్ సమావేశాల్లో చేసిన అనేక సంస్కరణలు గేమ్ చేంజర్లుగా మారాయి. ఉగ్రవాద నిర్మూళనకు తీసుకున్న చర్యల వల్ల కాశ్మీర్లో శాంతి పెరిగింది. ఆర్టికల్ 370 తొలగింపుతో రాజ్యాంగ నిర్మాతల ఆత్మకు శాంతి చేకూరింది. మహిళల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు నారీశక్తి వందన్ చట్టం తెచ్చాం. ట్రిపుల్ తలాక్ను నిషేధించి ముస్లిం మహిళల హక్కులను కాపాడాం. మేం చేసిన పనులు చూసి ముస్లిం ఆడబిడ్డలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మరో పాతికేళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుంది. వికసిత్ భారత్ ఫలాలు మన భావితరాలకు అందుతాయి. రాబోయే 25 ఏళ్లు భారత్కు ఎంతో కీలకం. ప్రశ్న ప్రతాల లీకేజీ యువత పాలిట శాపంగా మారింది. యువతకు అన్యాయం జరగకుండా గొప్ప నిర్ణయం తీసుకున్నాం. పేపర్ లీకేజీకి పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడేలా చట్టం తెచ్చాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చట్టాలను 17వ లోక్ సభ ఆమోదించింది. డిజిటల్ డేటా ప్రొటెక్షన్ చట్టం భావితరాలకు ఎంతో ఉపయోగపడుతుంది. అంతరిక్ష రంగంలో మనదేశ సత్తా చాటాం. ఆర్థిక సంస్కరణల ప్రక్రియలో ఎంపీలంతా పాలుపంచుకున్నారు’ అని ప్రధాని మోదీ తెలిపారు. ఇదీ చదవండి.. ఇండియా కూటమికి కేజ్రీవాల్ షాక్ -
సైన్యం పడగ నీడన... పాక్లో ఎన్నికలకు వేళాయె
అది 2018. పాకిస్తాన్లో సాధారణ ఎన్నికల సమయం. సైన్యం ఆగ్రహానికి గురై అవినీతి కేసుల్లో దోషిగా తేలడంతో నవాజ్ షరీఫ్ అప్పటికి ఏడాది క్రితమే ప్రధాని పదవి పోగొట్టుకున్నారు. జైల్లో మగ్గుతున్నందున ఎన్నికల్లో పోటీకీ దూరమయ్యారు. క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ఖాన్ సైన్యం ఆశీస్సులతో ఎన్నికల్లో నెగ్గి ఏకంగా ప్రధాని పీఠమెక్కారు. ఆరేళ్లు గడిచి పాక్ మళ్లీ సాధారణ ఎన్నికల ముంగిట నిలిచేనాటికి ఈ ఇద్దరు మాజీ ప్రధానుల విషయంలో ఓడలు బళ్లు, బళ్లు ఓడలూ అయ్యాయి. సైన్యం కన్నెర్రతో ఇమ్రాన్ పదవి పోగొట్టుకోవడమే గాక అవినీతి కేసుల్లో జైలుపాలయ్యారు. శిక్షల మీద శిక్షలు అనుభవిస్తూ ఎన్నికలకు దూరమయ్యారు. పార్టీకి కనీసం ఎన్నికల గుర్తు కూడా దక్కని దుస్థితి నెలకొంది! చికిత్స పేరుతో ఆరేళ్ల కింద లండన్ చేరి బతుకు జీవుడా అంటూ ప్రవాసంలో కాలం వెళ్లదీసిన నవాజ్ మళ్లీ సైన్యం దన్నుతో దర్జాగా స్వదేశాగమనం చేశారు. సైన్యం స్క్రిప్టులో భాగంగా అవినీతి కేసులన్నీ కొట్టుకుపోయి నాలుగోసారి ప్రధాని అయ్యేందుకు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. ఇలా దశాబ్దాలుగా పాక్లో నేతల భాగ్యరేఖలను ఇష్టానికి నిర్దేశిస్తూ వస్తున్న సైన్యం కనుసన్నల్లో ఎప్పట్లాగే మరో ఎన్నికల తంతుకు సర్వం సిద్ధమవుతోంది... ఏ పౌర ప్రభుత్వమూ పూర్తి పదవీకాలం మనుగడ సాగించని చరిత్ర పాక్ సొంతం. చాలాకాలం పాటు ప్రత్యక్షంగా, మిగతా సమయంలో పరోక్షంగా సైనిక నియంతృత్వపు పడగ నీడలోనే ఆ దేశంలో పాలన సాగుతూ వస్తోంది. అలాంటి దేశంలో సైనిక పాలన ఊసు లేకుండా వరుసగా మూడోసారి సాధారణ ఎన్నికలు జరగబోతుండటం విశేషం! ఇలా జరగడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి. 342 మంది సభ్యుల జాతీయ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న పోలింగ్కు సర్వం సిద్ధమవుతోంది. ఎప్పటి మాదిరే ఈసారి కూడా ఏయే పార్టీలు పోటీ చేయాలో, వాటి తరఫున ఎక్కణ్నుంచి ఎవరు బరిలో ఉండాలో కూడా సైన్యమే నిర్దేశిస్తూ వస్తోంది. దేశ ఆర్థికంగా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలి, నిత్యావసరాలతో పాటు అన్ని ధరలూ ఆకాశాన్నంటుతూ ప్రజల బతుకే దుర్భరంగా మారిన వేళ జరుగుతున్న ఎన్నికలివి. అక్కడ ఏ ఎన్నికలూ వివాదరహితంగా జరగలేదు. కానీ ఈసారి మాత్రం అవి పరాకాష్టకు చేరాయి. నిజానికి గత నవంబర్లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సింది. జనగణనను కారణంగా చూపి ఫిబ్రవరి దాకా వాయిదా వేశారు. నవాజ్ స్వీయ ప్రవాసం నుంచి తిరిగొచ్చి కాలూచేయీ కూడదీసుకుని బరిలో దిగేందుకు వీలుగానే ఇలా చేశారన్న ఆరోపణలున్నాయి. ఏదెలా ఉన్నా కనీసం ఈసారన్న కాస్త సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నది సగటు పాక్ పౌరుల ఆశ. అమెరికాతో పాటు అంతర్జాతీయ సంస్థల నుంచి అవసరమైన ఆర్థిక సాయం రాబట్టి అవ్యవస్థను చక్కదిద్దడంతో పాటు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్న భారత్తో సంబంధాలను మెరుగు పరుచుకోవాలన్నది వారి ఆకాంక్ష. కానీ సర్వం సైన్యం కనుసన్నల్లో సాగుతున్న తీరును బట్టి చూస్తే ఈసారీ అది అత్యాశే అయ్యేలా కనిపిస్తోంది. నవాజ్ షరీఫ్ పాక్ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పని చేసిన రికార్డు 74 ఏళ్ల నవాజ్ సొంతం. భారత్తో సత్సంబంధాలకు ప్రాధాన్యమిచ్చే నేతగానూ పేరుంది. దేశంలోకెల్లా అత్యంత ధనవంతుడని కూడా చెబుతారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) సారథిగా మూడోసారి ప్రధానిగా ఉండగా 2017లో పనామా పేపర్స్, లండన్ అపార్ట్మెంట్స్ వంటి నానారకాల కేసుల్లో ఇరుక్కున్నారు. పదవి పోగొట్టుకుని జైలుపాలై ప్రాణ భయంతో లండన్ పారిపోయారు. అనంతరం పగ్గాలు చేపట్టిన ఇమ్రాన్కూ నాలుగేళ్లలోపే అదే గతి పట్టింది. 2022లో నవాజ్ సోదరుడు షహబాజ్ షరీఫ్ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవడంతో నవాజ్కు మంచి రోజులు తిరిగొచ్చాయి. గత అక్టోబర్లో ఆయన తిరిగొచ్చి పీఎంఎల్ (ఎన్) పగ్గాలు చేపట్టడం, సైన్యంతో పాటు న్యాయ వ్యవస్థ దన్నూ తోడై ఆయనపై అవినీతి కేసులు, శిక్షలూ ఒక్కొక్కటిగా రద్దవడం చకచకా జరిగిపోయాయి. అడ్డంకులన్నీ తొలిగి ఎన్నికల బరిలో నిలిచిన నవాజ్ నాలుగోసారి ప్రధాని కావడం ఖాయమేనంటున్నారు. ఇమ్రాన్ఖాన్ అనితరసాధ్యమైన క్రికెట్ నైపుణ్యంతో పాక్ ప్రజలను ఉర్రూతలూగించి నేషనల్ హీరోగా వెలుగు వెలిగిన 71 ఇమ్రాన్ రాజకీయ పిచ్పై మాత్రం నిలదొక్కుకోలేక చతికిలపడ్డారు. అవినీతిని రూపుమాపి, కుటుంబ రాజకీయాలకు చెక్ పెట్టి సర్వం చక్కదిద్దుతానంటూ మార్పు నినాదంతో 2018లో ప్రధాని అయ్యారాయన. కానీ ఇమ్రాన్ హయాంలో ఆర్థికంగానే గాక అన్ని రంగాల్లోనూ దేశం కుప్పకూలింది. హింసతో, అశాంతితో పాక్ అట్టుడికిపోయింది. ఆయనకు ఆదరణా అడుగంటింది. నిజానికి సైన్యం చేతిలో పావుగానే ఇమ్రాన్ రాజకీయ ప్రవేశం జరిగిందంటారు. అలాంటి సైన్యానికే ఎదురు తిరగడంతో ఇమ్రాన్ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. ఎంత ప్రయతి్నంచినా పదవిని కాపాడుకోలేకపోయారు. పైగా జైలు శిక్ష వల్ల తాను పోటీ చేసే అవకాశం లేదు. ఆయన పార్టీ తరఫున కొందరు ధైర్యం చేసి ఇండిపెండెంట్లుగా బరిలో దిగుతున్నా చాలామంది జైలుపాలయ్యారు. పలువురు ఫిరాయించగా మిగిలిన వారు అజ్ఞతంలోకి వెళ్లిపోయారు. ఈ సమస్యలు చాలవన్నట్టు పీటీఐ ఎన్నికల గుర్తు బ్యాట్పైనా ఎన్నికల సంఘం వేటు వేసింది. దాంతో లక్షలాది మంది నిరక్షరాస్య ఓటర్లు బ్యాలెట్ పత్రాలపై ఇమ్రాన్ పార్టీని గుర్తించను కూడా లేరంటున్నారు. బిలావల్ భుట్టో 35 ఏళ్ల బిలావల్ భుట్టో జర్దారీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్. దారుణ హత్యకు గురైన మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో, పాక్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కుమారుడు. షహబాజ్ షరీఫ్ సర్కారులో విదేశాంగ మంత్రిగా తన పనితీరుతో స్వదేశంలో విమర్శలపాలు, భారత్లో నవ్వులపాలయ్యారు. గత ఎన్నికల్లో పీపీపీ మూడో స్థానంలో నిలిచింది. ఈసారి అన్నీ కలిసొస్తే బహుశా కింగ్మేకర్ అవ్వొచ్చంటున్నారు. పాక్ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులుంటారు. 266 మందిని నేరుగా ఉన్నుకుంటారు. 70 సీట్లను మహిళలు, మతపరమైన మైనారిటీలకు; ఆరింటిని గిరిజన ప్రాంతాల వారికి రిజర్వు చేశారు. ఈ స్థానాలను పార్టీలకు గెలుచుకున్న స్థానాలను బట్టి నైష్పత్తిక ప్రాతిపదికన కేటాయిస్తారు. సాక్షి, నేషనల్ డెస్క్ -
Ayodhya : ఎన్నికల్లో లబ్ధికే రామ్ మందిర వేడుక : కాంగ్రెస్
న్యూఢిల్లీ: అయోధ్యలో జరగబోయే రామ మందిర ప్రారంభ వేడుక ఫక్తు రాజకీయ కార్యక్రమమని కాంగ్రెస్ విమర్శించింది. ఇంకా నిర్మాణం పూర్తికాని గుడిని కేవలం రాజకీయ లబ్ధి కోసం రాబోయే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టకుని బీజేపీ ప్రారంభిస్తోందని మండిపడింది. ఈ మేరకు ఢిల్లీలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నేతలు సుప్రియా ష్రినేట్, పవన్ ఖేరా మీడియాతో మాట్లాడారు. జ్యోతిర్ మఠం చీఫ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి కూడా రామ మందిర వేడుకకు రావడం లేదని ప్రకటించిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. గుడిలో రాముని విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్టించలేదని అందుకే శంకరాచార్య వేడుకకు రానని ప్రకటించారని ఖేరా చెప్పారు. పూర్తిగా నిర్మాణం జరగని గుడిలో రామునికి ప్రాణ ప్రతిష్ట ఎలా జరుపుతారని నలుగురు శంకరాచార్యలు ఇప్పటికే ప్రశ్నించారన్నారు. రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగిన అనంతరం కాంగ్రెస్ నేతలు ప్రత్యేకంగా ఒక రోజు రామ మందిరాన్ని సందర్శిస్తారని ఖేరా తెలిపారు. ‘దేవునితో ఒక వ్యక్తి ఆడే రాజకీయ డ్రామాను మేం అంగీకరించం’అని ఖేరా స్పష్టం చేశారు. కాగా,ఈ నెల 22న అయోధ్యలో జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్ట వేడుకకు దూరంగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్టకు హాజరవకపోవడం కాంగ్రెస్ మూర్ఖత్వానికి నిదర్శనం బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇదీచదవండి.. నాసిక్లో మోదీ ఆధ్యాత్మిక పర్యటన.. భక్తులతో కలిసి రాం భజన -
పెట్రో ధరలు తగ్గించే యోచనలో కేంద్రం!
న్యూఢిల్లీ: అధిక పెట్రో ధరల నుంచి ప్రజానీకానికి కాస్తంత ఉపశమనం కల్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రాష్ట్రాల్లో గెలుపుతో జోరు మీదున్న బీజేపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించే ఉద్దేశంతో ప్రజలకు పెట్రో ధరల భారం తగ్గించనుందని జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు రూ.6–10 తగ్గించాలని మోదీ సర్కార్ భావిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ధరల తగ్గింపునకు సంబంధించిన ప్రతిపాదనలను పెట్రోలియం శాఖ అధికారులు ప్రధాని మోదీ ఆమోదం కోసం పంపించారని వార్తలొచ్చాయి. అయితే ఈ ధరల సవరణపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. చాలా నెలలుగా ప్రభుత్వరంగ రిటైల్ చమురు కంపెనీలు పెట్రో ధరలను తగ్గించలేదు, పెంచలేదు. గత ఆర్థికసంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో రిటైల్ కంపెనీలు ఆ ధరల భారాన్ని ప్రజలపై పడేశాయి. దీంతో అప్పుడు ధరలు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినా ఆమేరకు రిటైల్ అమ్మకం ధరలను సంస్థలు తగ్గించలేదు. దాంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హెచ్పీసీఎల్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి ఆరు నెలల్లో ఏకంగా రూ.58,198 కోట్ల ఆదాయాన్ని మూటగట్టుకున్నాయి. చివరిసారిగా 2022 మే 22వ తేదీన కేంద్రం పెట్రోల్, డీజిల్పై కేంద్ర ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.8 , లీటర్ డీజిల్ ధర రూ.6 తగ్గింది. కొద్ది నెలలుగా కీలక రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరలను పెంచలేదని, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మరింత తగ్గించనున్నారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. -
2024 LS polls: సగానికిపైగా ఓట్లు మనకే పడాలి
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ పార్టీ పదాదికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి మరిన్ని ఓట్లను ఒడిసిపట్టాలని పార్టీ సీనియర్ నేతలకు సూచించారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్టీ జాతీయ పథాధికారుల సమావేశం ఇందుకు వేదికైంది. రెండురోజులపాటు సాగిన ఈ సమావేశం శనివారం ముగిసింది. నేషనల్ ఆఫీస్ బేరర్స్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్చార్జ్లు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఇతర సంస్థాగత విభాగాల సారథులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమావేశంలో చర్చకొచి్చన ఇతరత్రా అంశాలను విశ్వసనీయ వర్గాలు శనివారం వెల్లడించాయి. ‘‘త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల సమరంలో సగానికిపైగా ఓట్లు బీజేపీకే దఖలుపడాల్సిందే. పోలింగ్లో పార్టీ ఓటు షేర్ కనీసం 10 శాతమైనా పెరగాల్సిందే. 2019లో బీజేపీ 37శాతానికిపైగా ఓటు షేరు సాధించింది. ఎన్డీఏ కూటమి దాదాపు 45 శాతం ఓటుషేరు సాధించింది. 2014 నుంచి చూస్తే కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 50 శాతం ఓట్లు ఒక్క బీజేపీకే పడ్డాయి. దృఢ కార్యదీక్షతో ఎన్నికల క్షేత్రంలో అవిశ్రాంతంగా పనిచేయండి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 303 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. అయితే ఈసారి లోక్సభ ఎన్నికల్లో అంతకుమించిన చోట్ల మన పార్టీ విజయభేరీ మోగించాలి. ఆ బాధ్యత మీదే. జనం మెచి్చన సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చొచ్చుకుపొండి. తప్పుడు ఆరోపణలతో విష ప్రచారం చేసే విపక్ష పారీ్టల ఆటకట్టించండి. అందుకోసం కేంద్ర ప్రభుత్వం పూర్తిచేసిన ప్రాజెక్టులు, పనులు, వాస్తవ గణాంకాలతో ప్రజలకు నిజానిజాలకు తెలియజెప్పండి’’ అని బీజేపీ నేతలకు మోదీ సూచించారు. నాలుగు ‘కులాలను’ కలుపుకొని పొండి ‘దేశంలో నాలుగే కులాలున్నాయి. మహిళలు, యువత, రైతులు, పేదలు. ప్రచారంలో భాగంగా ఈ నాలుగు కులాలను కలిసి వారి కష్టాలకు పరిష్కారం కనుగొనేందుకు ప్రయతి్నంచండి. అద్భుత ఫలితాలు, ప్రజాదరణ పొందిన కేంద్ర ప్రభుత్వ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లండి’ అని మోదీ సూచించారు. కేంద్రంలో బీజేపీ హయాంలో అమలవుతున్న కేంద్ర పథకాలు, వాటి లబ్ధిదారుల విజయగాథలను తెల్సుకుంటూ, ప్రజల్లో పథకాల అవగాహన పెంచుతూ ముందుకు సాగుతున్న ‘ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ను మరింతగా విజయవంతంగా చేయడంపైనా సమావేశంలో నేతలు చర్చించారు. ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు, త్వరలో జరగబోయే అటల్ బిహారీ వాజ్పేయీ జయంతి వేడుకలను మరింత బాగా నిర్వహించడం, తదితరాలూ సమావేశంలో చర్చకొచ్చాయి. మూడు రాష్ట్రాల ఎన్నికల్లో నమోదైన విజయం.. సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో విజయానికి శుభసూచకమని నేతలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారని వార్తలొచ్చాయి. బూత్ కమిటీలను పటిష్టవంతంచేస్తేనే ఎక్కువ మంది ఓటర్లను మనం చేరుకోగలమని నేతలు చెప్పినట్లు వార్తలొచ్చాయి. ‘‘మూడు రాష్ట్రాల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాం. ఇక సార్వత్రిక సమరంలోనూ హ్యాట్రిక్ కొట్టబోతున్నాం’’ అని నేతల ముందు మోదీ విశ్వాసం వ్యక్తంచేశారని తెలుస్తోంది. ‘‘మన ప్రదర్శన చూసి విపక్షాలు కంగుతినాలి’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారట. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో పార్టీ ఘన విజయంపై ఆ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు పార్టీని పొగుడుతూ ప్రసంగించారు. వచ్చే నెలలో అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారం¿ోత్సవం సార్వత్రిక ఎన్నికల్లో పారీ్టకి బాగా కలిసొస్తుందని నేతలు ఆశాభావం వ్యక్తంచేశారు. -
Five States Assembly Elections 2023: బీజేపీ తీన్మార్
ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్స్ పోరులో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు కీలక రాష్ట్రాలను సొంతం చేసుకుంది. మధ్యప్రదేశ్లో భారీ విజయంతో అధికారాన్ని నిలుపుకోగా రాజస్థాన్, ఛత్తీస్గఢ్లను కాంగ్రెస్ నుంచి చేజిక్కించుకుంది. తద్వారా ఉత్తరాది హిందీ బెల్టులో తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకుంది. కీలకమైన 2024 లోక్సభ ఎన్నికల ముంగిట్లో లభించిన ఈ సానుకూల ఫలితాలతో బీజేపీలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. మూడు రాష్ట్రాల్లోనూ ఘోరమైన ఓటమి మూటగట్టుకుని కాంగ్రెస్ చతికిలపడింది. తెలంగాణలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు తెర దించుతూ విజయం సాధించడం ఒక్కటే ఈ ఎన్నికల్లో దానికి ఊరట. మధ్యప్రదేశ్లో 230 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 164 సీట్లతో ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ 65 స్థానాలతో సరిపెట్టుకుంది. రాజస్తాన్లో పోలింగ్ జరిగిన 199 స్థానాల్లో బీజేపీ 115 చోట్ల గెలిచింది. కాంగ్రెస్కు 69 సీట్లు దక్కాయి. 90 స్థానాలున్న ఛత్తీస్గఢ్లో బీజేపీ 54 సీట్లు సాధించగా కాంగ్రెస్కు 35 దక్కాయి. ఇక తెలంగాణలో 119 సీట్లకు కాంగ్రెస్ 64 చోట్ల నెగ్గి మెజారిటీ సాధించగా అధికార బీఆర్ఎస్ 39 సీట్లకు పరిమితమైంది. ఐదో రాష్ట్రమైన మిజోరంలో సోమవారం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడనున్నాయి. ప్రధానంగా స్థానిక పార్టీలైన ఎంఎన్ఎఫ్, జెడ్పీఎం మధ్యే పోరు సాగిందన్న అంచనాల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలకు అక్కడ పెద్దగా ఆశలేమీ లేవు. ఆద్యంతమూ ఆధిక్యమే... ఫలితాల వెల్లడిలో తెలంగాణ మినహా మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ హవాయే సాగింది. ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచే మధ్యప్రదేశ్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్లింది. రాజస్తాన్, ఛత్తీస్గఢ్ల్లో తొలుత కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తున్నట్టు కని్పంచినా కాసేపటికే పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారుతూ వచ్చింది. కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని చాలామంది భావించిన ఛత్తీస్గఢ్లో కూడా స్పష్టమైన ఆధిక్యం కని్పస్తుండటం పార్టీలో జోష్ నింపింది. దాంతో ఒకవైపు లెక్కింపు కొనసాగుతుండగానే బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. జై శ్రీరాం, మోదీ నాయకత్వం వరి్ధల్లాలి అంటూ నేతలు, కార్యకర్తలు హోరెత్తించారు. మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రధాన కార్యాలయాల వద్ద బాణాసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. ఏ రాష్ట్రంలోనూ సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం బీజేపీకి కలిసొచ్చింది. ఈ నిర్ణయం ద్వారా మధ్యప్రదేశ్లో శివరాజ్సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకత ప్రభావం నుంచి తప్పించుకోవడంతో పాటు రాజస్తాన్లో నేతల మధ్య కుమ్ములాటలకు కూడా పార్టీ చెక్ పెట్టిందని చెబుతున్నారు. మోదీ కేంద్రంగా సాగించిన ప్రచారం ఫలించింది. అంతిమంగా బీజేపీ మీద ప్రజల విశ్వాసానికి ఈ ఫలితాలు అద్దం పట్టాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొనగా, కాంగ్రెస్ మత, విభజన రాజకీయాలను వారు తిరస్కరించారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. నిరుత్సాహంలో కాంగ్రెస్ గత మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించిన ఊపులో ఉన్న కాంగ్రెస్లో తాజా ఫలితాలు నిరుత్సాహం నింపాయి. ఇది తాత్కాలిక వెనుకంజేనని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రజా తీర్పును శిరసావహిస్తున్నామని ఆ పార్టీ అగ్ర నేత రాహుల్గాంధీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో కలిపి 84 లోక్సభ స్థానాలున్నాయి. తాజా విజయాలతో ఉత్తర, పశి్చమ భారతంలో అత్యధిక రాష్ట్రాలు బీజేపీ అధికారంలోకి వెళ్లాయి. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఘనవిజయానికి ఆ ప్రాంతాల్లో మెరుగైన ప్రదర్శనే ప్రధాన కారణంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో ఆశించినన్ని సీట్లు నెగ్గకపోవడం బీజేపీకి నిరాశ కలిగించగా అక్కడ తొలిసారిగా అధికారం చేపట్టనుండటం కాంగ్రెస్కు ఊరటనిచ్చే అంశం. రాజస్తాన్ బీజేపీదే 115 అసెంబ్లీ స్థానాల్లో విజయం 69 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ జైపూర్: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సొంతం చేసుకుంది. రాష్ట్రంలో మొత్తం 200 శాసనసభ స్థానాలకు గాను 199 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. బీజేపీ ఏకంగా 115 స్థానాల్లో జెండా ఎగురవేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజార్టీని సాధించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోవడం గత మూడు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుంది. ఈ ఆనవాయితీని కాంగ్రెస్ బద్దలు కొట్టలేకపోయింది. ఈసారి ఎన్నికల్లో 69 సీట్లకు పరిమితమైంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆ పార్టీని గెలిపించలేకపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీ అగ్రనేతలు దూకుడుగా సాగించిన ప్రచారం ముందు కాంగ్రెస్ చేతులెత్తేసింది. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామంటూ ముఖ్యమంత్రి గెహ్లోత్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ పరాజయాన్ని ఊహించలేదని పేర్కొన్నారు. తమ ప్రణాళికలు, పథకాలను ప్రజల వద్దకు చేర్చడంలో కొన్ని లోపాలు చోటుచేసుకున్నాయని అంగీకరించారు. సీఎం గెహ్లోత్ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కల్రాజ్ మిశ్రాకు సమరి్పంచారు. రాజస్తాన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొన్నా చిన్నాచితక పారీ్టలు సైతం ప్రభావం చాటాయి. భారత ఆదివాసీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, రా్రïÙ్టయ లోక్తాంత్రిక్ పార్టీ, రా్రïÙ్టయ లోక్దళ్ కొన్ని సీట్లు గెలుచుకున్నాయి. పలువురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. పలువురు కాంగ్రెస్ మంత్రులు ఓడిపోయారు. అసెంబ్లీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత సి.పి.జోïÙకి సైతం పరాజయం తప్పలేదు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ జోద్పూర్ జిల్లాలోని సర్దార్పురా నుంచి వరుసగా ఆరోసారి విజయం సాధించడం విశేషం. గత ఎన్నికల్లో ఆయనకు 45,597 ఓట్ల ఆధిక్యం లభించగా, ఈసారి 26,396కు తగ్గింది. మధ్యప్రదేశ్లో మళ్లీ కాషాయమే 163 స్థానాలు బీజేపీ కైవసం 66 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ భోపాల్: మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయ బావుటా ఎగురవేసింది. మొత్తం 230 స్థానాలకు గాను ఏకంగా 163 స్థానాలను సొంతం చేసుకుంది. మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. ఈసారి బీజేపీని ఎలాగైనా గద్దె దించాలన్న అధికార కాంగ్రెస్ వ్యూహాలు ఫలించలేదు. ఆ పార్టీ కేవలం 66 సీట్లకే పరిమితమైంది. బీజేపీ గెలుపు నేపథ్యంలో రాజధాని భోపాల్లోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సంబరాలు హోరెత్తాయి. కాంగ్రెస్ కార్యాలయం బోసిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా వల్లే విజయం సాధ్యమైందని బీజేపీ నాయకులు చెప్పగా పరాజయానికి కారణాలను సమీక్షించుకుంటున్నామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. బుద్నీ అసెంబ్లీ స్థానంలో సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ ఏకంగా లక్షకు పై చిలుకు ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఈసారి బీజేపీ మధ్యప్రదేశ్తో పాటు ఏ రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి అభ్యరి్థని ముందుగా ప్రకటించకపోవడం తెలిసిందే. అయినా పార్టీ ఘనవిజయం నేపథ్యంలో శివరాజ్ ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావిస్తున్నారు. అయితే బీజేపీ ఇంతటి ఘనవిజయం సాధించినా ఏకంగా 12 మంది మంత్రులు ఓటమి పాలవడం విశేషం! అయితే అసెంబ్లీ బరిలో దిగిన కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ పటేల్, బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ వర్గీయ మాత్రం విజయం సాధించారు. 2013 ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో బీజేపీకి 165 స్థానాలొచ్చాయి. కాంగ్రెస్ 58 సీట్లకు పరిమితమైంది. బీజేపీకి 44.88 శాతం, కాంగ్రెస్కు 36.38 శాతం ఓట్లు లభించాయి. ఇక 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 40.89 శాతం ఓట్లతో 114 స్థానాలు సాధించింది. బీజేపీ 41.02 శాతం ఓట్లు సాధించినా 109 సీట్లే నెగ్గింది. బీఎస్పీ, స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టింది. కమల్నాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. 15 నెలలకే కాంగ్రెస్ అగ్ర నేత జ్యోతిరాదిత్య తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలోకి ఫిరాయించారు. దాంతో కమల్నాథ్ సర్కారు కుప్పకూలింది. శివరాజ్ సీఎంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఛత్తీస్గఢ్లో విరబూసిన కమలం 54 సీట్లతో బీజేపీ విజయహాసం 35 స్థానాలతో కాంగ్రెస్ ఓటమి రాయ్పూర్: ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం భారతీయ జనతా పార్టీని వరించింది. మొత్తం 90 శాసనసభ స్థానాలకు గాను బీజేపీ 54 స్థానాలు దక్కించుకుంది. అధికార కాంగ్రెస్కు 35 స్థానాలే లభించాయి. 2018 ఎన్నికల్లో ఓడిపోయిన కమలం పార్టీ ఐదేళ్ల తర్వాత మళ్లీ అధికార పీఠం సొంతం చేసుకుంది. ‘మోదీ కీ గ్యారంటీ–2023’ పేరిట బీజేపీ ఇచి్చన హామీలను ప్రజలు విశ్వసించినట్లు కనిపిస్తోంది. క్వింటాల్ రూ.3,100 చొప్పున ధరకు ఎకరాకు 21 క్వింటాళ్ల చొప్పున ధాన్యం కొనుగోలు, మహతారీ వందన్ యోజన కింద వివాహమైన మహిళలకు ఏటా రూ.12,000 చొప్పున ఆర్థిక సాయం వంటి హామీలు ప్రజలను ఆకర్శించాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత కూడా బీజేపీ గెలుపునకు తోడ్పడింది. కాగ్రెస్లో నెలకొన్న అంతర్గత విభేదాలు ఆ పారీ్టకి ప్రతికూలంగా మారాయి. స్వయానా సీఎం బఘెల్, డిప్యూటీ సీఎం సింగ్దేవ్ మధ్య స్పర్థలుండటం కూడా బాగా చేటు చేసింది. 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెర దించి 2018లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈసారి చతికిలపడింది. సీఎం బఘెల్ తన సొంత నియోజకవర్గం పటన్లో నెగ్గినా రాష్ట్రంలో మాత్రం పార్టీని గెలిపించుకోలేకపోయారు. డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్దేవ్ కూడా ఓటమి చవిచూశారు! అంబికాపూర్ అసెంబ్లీ స్థానంలో సమీప బీజేపీ ప్రత్యర్థి రాజేశ్ అగర్వాల్ చేతిలో కేవలం 94 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మహదేవ్ బెట్టింగ్ యాప్ నుంచి సీఎం బఘెల్ ముడుపులు స్వీకరించారంటూ పోలింగ్ సమీపించిన వేళ వచి్చన ఆరోపణలు కూడా కాంగ్రెస్కు బాగా నష్టం చేసినట్టు కనబడుతోంది. మరోవైపు బీజేపీ ఈసారి వ్యూహాత్మకంగా సీఎం అభ్యరి్థని ప్రకటించకుండానే ఎన్నికల్లో పోటీకి దిగింది. అయినా ప్రధాని మోదీకి ఉన్న జనాదరణ, ఆయన పేరుతో ఇచి్చన హామీల ఆసరాతో పార్టీ విజయ తీరాలకు చేరింది. -
పాకిస్థాన్కు ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు
అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్థాన్కు ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. దేశంలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభాన్ని సరిదిద్దడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సైనిక, రాజకీయ, వాణిజ్యంలో నాయకుల స్వార్ధప్రయోజనాలు పక్కకు పెట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వరల్డ్ బ్యాంకు పాక్ ప్రతినిధి నజీ బాన్హాస్సిన్ అన్నారు. పాకిస్థాన్ ప్రస్తుతం సంక్షోభం అంచున ఉంది. 40 శాతం జనాభా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న విద్యుత్ ధరలు, తగినన్ని వనరులు లేకపోవడం సహా అనేక ఆర్ధిక కష్టాలను పాక్ ఎదుర్కొంటోంది. పిల్లల విద్యా ప్రమాణాలు, చిన్నారుల మరణాలు వంటి సూచికలు.. పాక్ పేదరికం తారా స్థాయికి చేరిందని చెబుతున్నాయని నజీ బాన్హాస్సిన్ తెలిపారు. 2000 నుంచి 2020 మధ్య కాలంలో పాకిస్థాన్ సగటు వాస్తవ తలసరి వృద్ధి రేటు కేవలం 1.7 శాతం మాత్రమే. ఇది దక్షిణాఫ్రికా దేశాల సగటు తలసరి వృద్ధి రేటులో సగం కంటే తక్కువగా ఉందని నజీ వెల్లడించారు. పాక్ మానవాభివృద్ధి సూచికలోనూ దక్షిణాసియాలో చిట్టచివరన ఉంది. విదేశీ నిల్వలు అడుగంటాయి. వాతావరణ మార్పులు ఆ దేశానికి శాపంగా మారుతున్నాయి. పాక్లో వచ్చే జనవరిలో జాతీయ స్థాయిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో ఆర్ధిక పరిస్థితులు బాగులేని కారణంగా ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది. ఆర్ధిక వ్యవస్థను సరిచేసుకోవాల్సిన సమయమని సూచించింది. నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం ఉచిత హామీలకు పోకూడదని పేర్కొంది. ఆర్ధిక రంగాన్ని గాడిన పెట్టడానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని కోరింది. వృధా ఖర్చులను తగ్గించుకోవాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. ప్రజా సేవలు, మౌలిక సదుపాయాల్లో పరిమితమైన ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: పీఓకేను ఖాళీ చేయండి: భారత్ అల్టిమేటమ్ -
మహారాష్ట్ర నుంచి లోక్సభకు కేసీఆర్?
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ను జాతీయ స్థాయిలో బలోపేతం చేసేందుకు ఇది దోహదపడుతుందని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. కాగా మహారాష్ట్రలోని నాందేడ్ లేదా ఔరంగాబాద్ లోక్సభ స్థానం నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. నాలుగు దశాబ్దాలుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్న కేసీఆర్ గతంలో తెలంగాణలోని మూడు వేర్వేరు లోక్సభ నియోజక వర్గాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2004, 2006, 2008లో కరీంనగర్ నుంచి. 2009లో మహబూబ్నగర్ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర అవతరణ నేపథ్యంలో 2014లో మెదక్ నుంచి లోక్సభకు ఎన్నికైన కేసీఆర్, సీఎం పదవిని చేపట్టడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. జాతీయ రాజకీయాల్లో బలం చాటే వ్యూహం జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీల నేతృత్వంలోని కూటములకు సమదూరం పాటిస్తున్న కేసీఆర్ లోక్సభలో ఒంటరి పోరుకు సన్నద్ధమవుతున్నారు. మహారాష్ట్రలోని అన్ని లోక్సభ స్థానాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలోకి దింపేలా ఆయన వ్యూహ రచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మహారాష్ట్రలో 48 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా, ఇప్పటికే 27 నియోజకవర్గాల పరిధిలో గ్రామ స్థాయి వరకు తొమ్మిదేసి పార్టీ కమిటీలు ఏర్పాటయ్యాయి. మహారాష్ట్రలోని 15 జిల్లాల పరిధిలో పార్టీ కార్యకలాపాలు వేగం పుంజుకున్నట్లు మహారాష్ట్ర బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాగా మహారాష్ట్ర నుంచి లోక్సభ బరిలోకి దిగడం ద్వారా జాతీయ రాజకీయాల్లో తన బలాన్ని చాటేలా కేసీఆర్ వ్యూహం సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ఈ ఏడాది చివర్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి దక్షిణాది నుంచి తొలి హ్యాట్రిక్ సీఎంగా నిలిచేందుకే కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు. -
Karnataka election results 2023: కలసి ఉంటే కలదు సుఖం
రాహుల్ జోడో యాత్ర నింపిన ఉత్సాహంతో, మల్లికార్జున ఖర్గే మంత్రాంగంతో ఉప్పు, నిప్పుగా ఉండే దిగ్గజ నేతలు సిద్ధూ, డీకే ఒక్కటయ్యారు. పోస్టర్ల నుంచి ప్రచారం వరకు ఒకే మాట ఒకే బాటగా నడిచారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. మత రాజకీయాలను సమష్టిగా ఎదుర్కొన్నారు. ఫలితంగా కర్ణాటకలో కాంగ్రెస్ అందరికీ కొత్తగా కనిపించింది. అనూహ్య విజయంతో లోక్సభ ఎన్నికలకు కావల్సిన ఆత్మవిశ్వాసాన్ని నింపుకుంది. అవినీతిపై ప్రచారం రాష్ట్రంలో బసవరాజ్ బొమ్మై సర్కార్పై వచ్చిన అవినీతి ఆరోపణల్ని కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. పేటీఎంను గుర్తుకు తెచ్చేలా ‘‘పేసీఎం’’ అంటూ బొమ్మై ముఖం, క్యూఆర్ కోడ్తో పోస్టర్లు వేయడం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. 40% కమీషన్ సర్కార్ అంటూ ప్రచారాన్ని గ్రామ గ్రామల్లోకి తీసుకువెళ్లారు. గ్రామీణాభివృద్ధి మంత్రి కె.ఎస్. ఈశ్వరప్ప పబ్లిక్ వర్క్స్ ప్రాజెక్టులో 40% కమీషన్ను డిమాండ్ చేశారన్న ఆరోపణలతో ఈ ప్రచారం ఊపందుకుంది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్ష కుమారుడు 40 లక్షలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం వంటివన్నీ కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుంది. సిద్దూ, డీకే కాంబినేషన్ కాంగ్రెస్ పార్టీకి మరే రాష్ట్రంలో లేని విధంగా బలమైన నాయకులు కర్ణాటకలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ జోడు గుర్రాలుగా మారి గెలుపు రథాన్ని పరుగులు పెట్టించారు. ఇద్దరి మధ్యనున్న విభేదాలను పక్కన పెట్టి కలసికట్టుగా పని చేశారు. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ప్రజాధ్వని యాత్ర నిర్వహించారు. ఎన్నికల వ్యూహాల దగ్గర్నుంచి పార్టీ మేనిఫెస్టో వరకు, టిక్కెట్ల పంపిణీ నుంచి బూత్ మేనేజ్మెంట్ వరకు సంయుక్తంగా వ్యూహాలు రచించారు. పార్టీలో దిగ్గజ నాయకులిద్దరూ ఒక్కటి కావడంతో నాయకులంతా చేతులు కలపడం రావడం కాంగ్రెస్కు కలిసొచ్చింది. ఖర్గే అనుభవం ఏ పార్టీకైనా అనుభవజ్ఞలైన పెద్దలే కొండంత అండ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే 80ఏళ్ల వయసులో తన సొంత రాష్ట్రంలో ఎన్నికల్ని అత్యంత ప్రతిష్మాత్మకంగా తీసుకున్నారు. పార్టీలో అత్యంత శక్తిమంతమైన నాయకులైన సిద్దరామయ్య, శివకుమార్లను ఏకతాటిపైకి తీసుకురావడంతో ఖర్గే సగం విజయం సాధించారు. టిక్కెట్ల పంపిణీపై ముందస్తుగా కసరత్తు చేసి 124 మందితో తొలి జాబితా విడుదల చేయడం, గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తూ నియోజకవర్గాల్లో అసమ్మతి గళాలు లేకుండా చూశారు. అటు అధిష్టానానికి, ఇటు స్థానిక నాయకత్వానికి వారధిగా ఉంటూ నెల రోజులుగా రాష్ట్రంలోనే మకాం వేసి పార్టీని గెలుపు తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. సానుభూతే ఆయుధం బీజేపీ జాతీయ నాయకత్వం చేసిన కక్షపూరిత రాజకీయాలు కూడా వికటించాయి. ప్రభుత్వంపై ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా పట్టించుకోని వారు కాంగ్రెస్ నాయకులపై సీబీఐ, ఈడీ కేసులు పెట్టి వేధించడం ప్రజల్లో సానుభూతిని పెంచింది. పరువు నష్టం కేసులో రాహుల్ దోషిగా తేలి ఎంపీగా అనర్హత వేటునెదుర్కోవడం, పీసీసీ అధ్యక్షుడు శివకుమార్పై సీబీఐ కేసులు పెట్టి తీహార్ జైల్లో పెట్టడం వంటివి కాంగ్రెస్కు అనుకూలంగా మారాయి. శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుంచి లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించడమే దీనికి తార్కాణం. లింగాయత్ ఓట్లు కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి బలమైన మద్దతుదారులైన లింగాయత్ ఓటు బ్యాంకుని కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా చీల్చింది. బి.ఎస్. యడీయూరప్పని సీఎంగా తప్పించడంతో ఆ వర్గాన్ని పార్టీ నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఎన్నికలకు కాస్త ముందు మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సావాదిలు కాంగ్రెస్ గూటికి చేరడం కలిసొచ్చింది. పీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ స్వయంగా లింగాయత్ మఠాలన్నీ సందర్శించి తాము అధికారంలోకి వస్తే వారి డిమాండ్లన్నీ తీరుస్తామన్న హామీలు ఇవ్వడంతో ఈ సారి లింగాయత్ ఓటర్లు కాంగ్రెస్వైపు మళ్లారు. ‘సార్వత్రిక’ విజయానికి తొలి మెట్టు ‘‘కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుకు తొలి మెట్టు. ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలు. రాహుల్ గాంధీ ప్రధాని అవ్వొచ్చేమో. బీజేపీయేతర పార్టీలు ఇక త్వరగా ఏకతాటి మీదకు వస్తాయని భావిస్తున్నా. బీజేపీ మత రాజకీయాలను ఓడించిన ప్రజలకు జేజేలు’’ – కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య లోకల్ వోకల్ కాంగ్రెస్ పార్టీ ఈ సారి స్థానిక సమస్యలపైనే అత్యధికంగా దృష్టి సారించింది. జాతీయ స్థాయిలో ప్రభావం చూపించే అంశాల జోలికి వెళ్లలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్పై ఆధారపడి బీజేపీ ఎన్నికలకి వెళ్లడాన్ని పదే పదే ప్రశ్నించింది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ ఇది రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలే తప్ప ప్రధాని మోదీ గురించి ఎన్నికలు కాదంటూ ప్రతీ సభలోనూ గళమెత్తారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా స్థానికంగా పవర్ఫుల్ నాయకులనే ముందుంచి ప్రచారాన్ని నిర్వహించింది. ఇక రాహుల్ గాంధీ కూడా ప్రజలతో మమేకమైపోతూ స్థానిక అంశాలపైనే వారితో ముచ్చటించారు. ఫలితంగా పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా హస్తం గుర్తుకే ఓట్లు గుద్దేశారు. గ్యారంటీ కార్డుకి కురిసిన ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఈసారి ఎన్నికల్లో ఓట్లు కురిపించాయి. అయిదు హామీలతో కాంగ్రెస్ విడుదల చేసిన గ్యారంటీ కార్డులో గృహజ్యోతి (గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్), గృహలక్ష్మి (ఇంటి మహిళా యజమానికి నెలకి రూ.2 వేలు ఆర్థిక సాయం), అన్న భాగ్య (నిరుపేద కుటుంబాలకు నెలకి 10 కేజీల ఉచిత బియ్యం) యువనిధి (నిరుద్యోగ యువతకి రెండేళ్లు ఆర్థిక సాయం) శక్తి (ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం) హామీలు ప్రజల్ని విశేషంగా ఆకర్షించి కాంగ్రెస్కు అధికారాన్ని కట్టబెట్టాయి. మైనార్టీల అండదండ.. పోలింగ్కు కొద్ది రోజులు ముందు బజరంగ్ దళ్ను నిషేధిస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ చేర్చడం ఆ పార్టీకి నష్టం చేకూరుస్తుందని అందరూ భావించారు. కానీ మైనార్టీ ఓట్ల ఏకీకరణ జరిగి కాంగ్రెస్కు కలిసివచ్చింది. ఓల్డ్ మైసూరుతో పాటు అన్ని ప్రాంతాల్లోనూ ముస్లిం ఓటర్లు గంపగుత్తగా కాంగ్రెస్కు ఓటు వేశారు. హిజాబ్, హలాల్, ఆజాన్ వివాదాలతో ముస్లిం ఓటర్లందరూ ఏకమయ్యారు. ఓల్డ్ మైసూరులో కాంగ్రెస్, జేడీ(ఎస్) మధ్య ముస్లిం ఓట్లు చీలిపోయేవి. కానీ ఈ సారి అన్ని ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ వెంటే మైనార్టీలు నడిచారు. జోడో యాత్ర జోష్.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కూడా పార్టీ విజయానికి దోహదపడింది. కర్ణాటకలో అత్యధికంగా 24 రోజులు నడిచిన రాహుల్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఎనిమిది జిల్లాల్లో 500 కి.మీ. మొత్తం 20 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా రాహుల్ నడిచారు. 2018 ఎన్నికల్లో ఈ 20 సీట్లలో అయిదు స్థానాలనే గెలుచుకున్న కాంగ్రెస్ ఈ సారి 15 స్థానాల్లో విజయభేరి మోగించింది. -
విపక్షాల ఐక్యతే ముఖ్యం
ముంబై: వచ్చే లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలను ఐక్యం చేసే ప్రయత్నాలను బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్రతరం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్తో కలిసి శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్లను గురువారం వేర్వేరుగా కలుసుకున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడానికి తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ దేశ ప్రయోజనాల కోసం ఏమీ చేయడం లేదని ఆరోపించారు. అందుకే పార్టీ ప్రయోజనాలతో పాటుగా దేశ ప్రయోజనాలను కూడా కాపాడడానికి కృషి చెయ్యాలని ఇరువురు నేతలకు చెప్పినట్టుగా వెల్లడించారు. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలు ముందు దేశ ప్రయోజనాలను కాపాడాలన్న ఏకైక లక్ష్యం ఉందని నితీశ్ అన్నారు. అందరూ కలసికట్టుగా పోరాడితే బీజేపీపై విజయం సాధించవచ్చునని చెప్పారు. ప్రతిపక్షాల ఐక్యత కోసం త్వరలోనే బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటితో సమావేశం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. -
2024 సెమీఫైనల్స్: 2023లో ఎన్నికలు జరిగే కీలక రాష్ట్రాలివే..
2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కానీ, అంతకు ఏడాది ముందే దేశంలో కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు 2024 లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్గా పేర్కొంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2023లో మొత్తం 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఈ ఎన్నికలు అధికారంలోని బీజేపీతో పాటు విపక్ష కాంగ్రెస్కు కీలకం కానున్నాయి. ► ఈశాన్య రాష్ట్రాలు: 2023 ఫిబ్రవరి-మార్చి నెలల మధ్య మూడు ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత నవంబర్లో మిజోరాంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్రిపురలో ఐపీఎఫ్టీతో కలిసి అధికారంలో ఉంది బీజేపీ. అలాగే నాగాలాండ్, మేఘాలయాల్లో అధికార కూటమిలో భాగస్వామిగా ఉంది. మిజోరాంలో ప్రధానంగా కాంగ్రెస్, అధికార మిజో నేషనల్ ఫ్రంట్ మధ్యే పోటీ ఉంటుంది. ప్రధానంగా త్రిపుర ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తొలిసారి 2018లో అధికారంలోకి వచ్చిన బీజేపీకి ప్రస్తుతం వ్యతిరేకత మింగుడుపడటం లేదు. ► కర్ణాటక: దక్షిణభారతంలో బీజేపీకి గట్టి పట్టున్న రాష్ట్రం కర్ణాటక. 2023లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్, జనతా దళ్(సెక్యులర్)ల మధ్యే పోటీ ఉంటుంది. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావాలని భావిస్తోంది. మరోవైపు.. పార్టీలో తిరుగుబాటు నేతలను బుజ్జగించి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది. ► తెలంగాణ: దేశంలో కొత్త ఏర్పాడిన రాష్ట్రం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు 2023లో జరగనున్నాయి. దేశ రాజకీయాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ఇటీవలే భారత రాష్ట్ర సమితిగా అవతరించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్కు ఎంతో కీలకంగా మారాయి. మరోవైపు.. బీజేపీ, కాంగ్రెస్లు అధికార మార్పిడి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. దక్షిణాదిలో పట్టు సాధించేందుకు తెలంగాణలో తమ బలం చూపించుకోవలాని బీజేపీ భావిస్తోంది. ► మధ్యప్రదేశ్: 2023 నవంబర్-డిసెంబర్ మధ్య మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉండనున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యే ఇక్కడ ప్రధాన పోటీ ఉండనుంది. కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటుతో సీఎంగా కమల్నాథ్ దిగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత బీజేపీ అధికారం చేపట్టింది. దేశంలో రెండే అతిపెద్ద రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో విజయం సాధించటం ద్వారా 2024 లోక్సభ ఎన్నికలపై పట్టు సాధించాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. ► ఛత్తీస్గఢ్-రాజస్థాన్: 2024 ఎన్నికలకు ముందు ఈ రెండు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు.. రాజస్థాన్లో సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య వర్గ పోరు ప్రధనా ఆకర్శనగా నిలుస్తోంది. అలాగే, రాష్ట్రాల్లో అధికార మార్పిడి సంప్రదాయం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇదీ చదవండి: నీకే కాదు.. నీ తండ్రికి కూడా ఎవరూ భయపడటం లేదు: ఫడ్నవీస్ -
2024 సార్వత్రిక ఎన్నికలు.. ప్రధాని అభ్యర్థిపై అమిత్ షా కీలక ప్రకటన
పట్నా: 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా ఎవరుంటారని చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీనే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఉంటారని స్పష్టం చేశారు. ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లనున్నట్లు వెల్లడించారు. అంతేకాదు బీజేపీ-జేడీయూ పొత్తు కొసాగుతుందని అమిత్ షా పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని వివరించారు. బిహార్ రాజధాని పట్నాలో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ మోర్చాల ఉమ్మడి జాతీయ కార్యవర్గ సమావేశాలకు అమిత్షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివారం ముగింపు కార్యక్రమంలో ప్రసంగించి ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో ప్రధాని మోదీ రిటైర్ అవుతారని, ఆయన స్థానంలో బీజేపీ కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొస్తుందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు రెండేళ్ల ముందే అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. మోదీనే తమ అభ్యర్థి అని కార్యకర్తలకు స్పష్టం చేశారు. కశ్మీరీలు తయారు చేసిన త్రివర్ణ పతాకాలను ఈ కార్యక్రమంలో అందరికీ పంచారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీరీల ఆలోచనలు మారాయని తెలిపిందుకే వారు తయారు చేసిన జెండాలు పంపిణీ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను పురస్కరించుకుని దేశం నలుమూలలా జాతీయ జెండాలను ఎగురవేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు. ఆగస్టు 13-15వరకు మూడు రోజులపాటు ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని సూచించారు. చదవండి: బీజేపీ చర్య సిగ్గుచేటు.. -
కశ్మీర్లో త్వరలో ఎన్నికలు..?
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో త్వరలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు రాజకీయ ప్రక్రియను ప్రారంభించడానికి, కశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధణకు వివిధ పార్టీలతో చర్చించాలని కేంద్రం భావిస్తున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు ఆదివారం ఎన్డీటీవీతో చెప్పాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. జమ్మూ కశ్మీర్కి ప్రత్యేక హోదా పునరుద్ధరించాలన్న డిమాండ్తో ఏర్పాటైన 7 పార్టీల గుప్కర్ కూటమి (పీఏజీడీ) కేంద్రంతో చర్చలకు అంగీకరించింది. మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్.. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన చర్చలకు మాత్రమే హాజరవుతామని స్పష్టం చేసింది. 2018 జూన్లో మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీతో బీజేపీ తెగదెంపులు చేసుకున్నాక కశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించింది. తర్వాత ఆగస్టు, 2019లో జమ్మూ కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తూ... 370 ఆర్టికల్ రద్దు చేసింది. వాస్తవానికి 2019 లోక్సభ ఎన్నికలతో పాటు కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరిపి ఉండవలసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఎన్నికల సంఘం ఆ సాహసం చేయలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం కశ్మీర్ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తూ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. గత ఏడాది ఆగస్టులో ఏర్పాటైన గుప్కర్ కూటమి స్థానిక ఎన్నికల్లో 100కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. కానీ, 6 నెలలుగా అంతర్గత విభేదాలతో చురుగ్గా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు. ఆ కూటమి చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఇటీవల పీడీపీ చీఫ్తో మంతనాలు జరిపారు. ఆ తర్వాత జుమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించి ఎన్నికలపై కేంద్రంతో చర్చల్లో పాల్గొంటామన్నారు. అమెరికా ఒత్తిడి పని చేస్తోందా? కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావించడం వెనుక అమెరికా ఒత్తిడి ఉందని సమాచారం. కశ్మీర్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడాన్నే బైడెన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆ దేశ ఉన్నతాధికారి ఒకరు ఇటీవల వ్యాఖ్యానించడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. -
ఎన్నికలు @ కోవిడ్
న్యూఢిల్లీ: ఎన్నికల ఇంటింటి ప్రచారంలో ఐదుగురే పాల్గొనాలి..పోలింగ్ బూత్లలో థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేయాలి..ఈవీఎం బటన్ నొక్కే ముందు ఓటర్లు గ్లవ్స్ ధరించాలి..కోవిడ్–19 నేపథ్యంలో ఎన్నికల కమిషన్(ఈసీ) తాజాగా విడుదల చేసిన ఎన్నికల మార్గదర్శకాల్లో ఇవి కొన్ని..! కేంద్రం విడుదల చేసిన కోవిడ్–19 కంటైయిన్మెంట్ మార్గదర్శకాలకు లోబడి ఎన్నికల బహిరంగ సభలు, సమావేశాలను రాజకీయ పార్టీలు నిర్వహించుకోవాల్సి ఉంటుందని ఈసీ తెలిపింది. కోవిడ్–19 సమయంలో జరిగే సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని వివరించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు నామినేషన్లను ఆన్లైన్లో దాఖలు చేయవచ్చు. డిపాజిట్లను కూడా ఆన్లైన్లో చెల్లించవచ్చు. ఎన్నికల ప్రక్రియ సమయంలో కూడా మాస్కులు, శానిటైజర్లు, థర్మల్ స్కానర్లు, పీపీఈ కిట్ల వాడకం వంటి ప్రామాణిక రక్షణ చర్యలను కొనసాగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కంటైన్మెంట్ జోన్లలో నివాసం ఉండే ఓటర్ల కోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలను జారీ చేస్తామని ఈసీ తెలిపింది. ఒకవైపు, కరోనా మహమ్మారి ముప్పు మరింత తీవ్రం కానుందని ఆందోళనలు వ్యక్తమవుతుండగా, ఈసీ నిబంధనలకు లోబడి మొట్టమొదటి ఎన్నికలు బిహార్ అసెంబ్లీకి జరిగే అవకాశాలున్నాయి. అయితే, బిహార్ ఎన్నికలపై ఈసీ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈసీ జారీ చేసిన విస్తృత మార్గదర్శకాలివీ.. ► నామినేషన్ దాఖలు, పత్రాల పరిశీలన, గుర్తుల కేటాయింపు వంటివి సజావుగా సాగేందుకు భౌతిక దూరం నిబంధనల ప్రకారం రిటర్నింగ్ అధికారి చాంబర్ ఉండాలి. అభ్యర్ధులకు రిటర్నింగ్ అధికారి ముందుగానే సమయం కేటాయించాలి. ► నామినేషన్ వేసేందుకు ఎన్నికల అధికారి వద్దకు వెళ్లే అభ్యర్ధి వెంట ఇద్దరు వ్యక్తులు, రెండు వాహనాలు మాత్రమే ఉండాలి. ► ఇంటింటి ప్రచా రం సమయంలో భద్రతా సిబ్బంది మినహాయించి అభ్యర్థి సహా ఐదుగురే పాల్గొ నాలి. రోడ్షోల్లో పాల్గొ నే వాహన కాన్వాయ్లో భద్రతా సిబ్బందిని మిన హాయిస్తే ఐదు వాహనాలే ఉండాలి. ► కోవిడ్–19 మార్గదర్శకాలకు లోబడి బహిరంగ సమావేశాలు, సభలు ఏర్పాటు చేసుకోవాలి. ► జిల్లా ఎన్నికల అధికారి ముందుగా అనుమతించిన చోటే బహిరంగ సభలు జరపాల్సి ఉంటుంది. సభలకు హాజరయ్యే వారు భౌతిక దూరం వంటివి పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ► ఎన్నికల సభలకు హాజరయ్యే వారి సంఖ్య రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎస్డీఎంఏ) పేర్కొన్న పరిమితికి లోబడి ఉండేలా చూడటం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా ఎస్పీ బాధ్యత. ► పోలింగ్కు కనీసం ఒక రోజు ముందు పోలింగ్ స్టేషన్లను తప్పనిసరిగా పూర్తిస్థాయిలో శానిటైజ్ చేయాలి. ► అన్ని పోలింగ్ స్టేషన్ల ప్రవేశద్వారం వద్ద థర్మల్స్కానర్లు ఏర్పాటు చేయాలి. ఎన్నికల సిబ్బంది కానీ పారామెడికల్ సిబ్బంది కానీ పోలింగ్ స్టేషన్ ప్రవేశ ద్వారం వద్దే ఓటర్లకు థర్మల్ స్కానింగ్ చేపట్టాలి. ► ఓటర్లందరికీ శరీర ఉష్ణోగ్రతలు గమనించాలి. అనుమానాస్పదంగా ఉంటే రెండు పర్యాయాలు ఉష్ణోగ్రతలు తీసుకోవాలి. ఆరోగ్యశాఖ జారీ చేసిన సురక్షిత స్థాయికి మించి కనిపిస్తే వారికి పోలింగ్ ముగిసే చివరి గంటలో ఓటేసేందుకు అవకాశం ఇస్తారు. ► కోవిడ్–19 సోకి క్వారంటైన్లో గడుపుతున్న వారికి కూడా పోలింగ్ ముగిసే ఆఖరి గంటలో అవకాశం కల్పిస్తారు. ► పోలింగ్ బూత్లో ఓటర్లు ఈవీఎం బటన్ నొక్కేముందు వారికి డిస్పోజబుల్ గ్లవ్స్ అందజేస్తారు. ► పోలింగ్ స్టేషన్లో ప్రస్తుతం ఉన్న 1,500 మంది ఓటర్లకు బదులు.. వెయ్యి మందికి మించి ఉండరాదు. ► ఎన్నికల ప్రక్రియ సమయంలో కోవిడ్–19 సంబంధిత ఏర్పాట్లు, నివారణ చర్యలు వంటివి పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో నోడల్ అధికారులు ఉంటారు. ఎన్నికల అధికారుల శిక్షణ కూడా ఆన్లైన్లోనే జరిపే అవకాశం ఉంది. ► ఎన్నికల సిబ్బందిలో కోవిడ్–19 లక్షణాలున్న వారిని గుర్తించి, వారికి బదులుగా మరొకరిని నియమించే ప్రక్రియను రిటర్నింగ్ అధికారులు చూసుకుంటారు. ► ఓట్ల లెక్కింపు కేంద్రానికి తీసుకువచ్చే ముందు ఈవీఎంలు, వీవీప్యాట్లను శానిటైజ్ చేయాలి. -
చీకటి ‘‘చంద్రుని’’ పగటికల
సాక్షి, అమరావతి: ‘కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, ఆంధ్రరాష్ట్రే.. ఒకానొక సుముహూర్తాన సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పటి వరకూ అధికార పీఠానికి దూరంగా ఉన్న చంద్రకాంతుడు వెంటనే ఎన్నికలబరిలో దిగాడు. ఏనాడూ స్వయంప్రకాశంలేని ఈ చంద్రుడు, అరువు బలాన్ని తెచ్చుకున్నాడు, అలవి గాని వాగ్దానాలతో అమాయకులను నమ్మించాడు. చావు తప్పి కన్నులొట్టపోయిన చందాన బొటాబొటీ, అత్తెసరు మార్కులో అధికారపీఠం దక్కించుకున్నాడు. అంతే..సీన్ మారిపోయింది. ‘భువికి తానే అధినాథుడనని’, అంతా తన ప్రయోజకత్వమేనని విర్రవీగాడు. ఇచ్చిన హామీలను అటకెక్కించాడు. ఆ హామీల జ్ఞాపకాలను కూడా వెబ్సైట్ నుంచి తొలగించాడు. ప్రత్యర్థులను అణచడానికి రెండు ఆయుధాలను చేత ధరించాడు. ఒకటి–అవినీతితో కట్టిన మూటలు, మరొకటి తప్పుడు కేసుల బనాయింపు. పుత్రరత్నం తండ్రికి అన్నిటా బాసటగా నిలిచాడు. అన్ని వర్గాలూ బాధలలో మునిగిపోయాయి. ‘ఏ దేవుజూచి నేడలుగునో, ఏ దిగ్భాగము మీద దాడి చనునో, ఏ ప్రాణులం జంపునో..’ అన్నట్టుచ విర్రవీగిన హిరణ్యకశిపుడు ప్రజలకు గుర్తుకు వచ్చాడు. ఇంకా ఈ అసురుడిని చూస్తే, నరకాసురుడు, రావణాసురుడు కూడా గుర్తుకు వచ్చారు. ఆ రాక్షసులు మాత్రం ‘మాకు వారసుడు వచ్చాడోచ్’ అని ఆనందించారు. అయిదేళ్ల చీకటి పాలన అనంతరం మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. సొంత బాకా పత్రికలు, ఛానళ్ళు ఎంత గట్టిగా బాకాలు ఊదినా, చంద్రుడిని ఏదో భయం ఆవరించింది. విపక్షనేత సభలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. ఆ నేత ప్రసంగాలకు కేరింతలు కొడుతున్నారు. ఆయనలో ఒక ఆత్మీయుడిని చూస్తున్నారు. జాతీయ ఛానళ్ళ సర్వే ఫలితాలు చూస్తే, చంద్రుని కంటికి నిద్ర కరువవుతోంది. ఇక లాభం లేదని వెంటనే పురోహితుడి దగ్గరకు పరుగుతీశాడు.. ‘పంతులూ! నేను తిరిగి సింహాసనం ఎక్కేటట్టు దీవించు. మంత్రాలు గట్టిగా చదువు’ అని ఆదేశించాడు. ‘యతో ధర్మస్తతో జయః’ అని దీవించనా అయ్యా!’ అన్నాడు పురోహితుడు. ‘ఆ దీవెనకు అర్థం ఏమి’టని ఎవరినీ నమ్మని చంద్రుడు అడిగాడు. ‘అయ్యా! రాబోయే కురుపాండవ సంగ్రామంలో తనను దీవించమని సుయోధనుడు కోరినప్పుడు, తల్లి గాంధారి పలికిన పలుకులు ఇవి’ అన్నాడు పురోహితుడు. ‘ఈ పదాలకు అర్థం ఏమిటి?’ చంద్రుడు గద్దించాడు. ‘ఎక్కడ ధర్మం ఉంటుందో, అక్కడే విజయం ఉంటుందని దీని అర్థమయ్యా!’ వివరించాడు పురోహితుడు. ‘వద్దు, అలాంటి దీవెనలు అసలే వద్దు’ అన్నాడు చంద్రుడు తత్తరపడుతూ, చెమట తుడుచుకుంటూ. ‘అయ్యా, అవినీతిపరులు శంకరగిరిమాన్యాలుచంద పట్టాలని సంకల్పం చెప్పి పూజలు ప్రారంభించనా?’ అన్నాడు పురోహితుడు. మళ్ళీ చంద్రుడు కంగారు పడ్డాడు. ‘అసలే వద్దు, ఇంకోటి చెప్పు..’ అన్నాడు చంద్రుడు. ‘అయ్యా! హత్యారాజకీయాలు చేసేవారు, నిత్యం అసత్యప్రచారాలు చేసేవారు నశించిపోవాలని సంకల్పం చెప్పనా?’ అన్నాడు పురోహితుడు. ‘అలాంటివేమీ వద్దు, నేను సింహాసనం ఎక్కాలని మాత్రమే సంకల్పం చెప్పు’ అన్నాడు చంద్రుడు. ‘సర్వాంతర్యామి భగవంతుని కన్నులు కప్పలేము కదా? పగటి కలలు నెరవేరతాయా?’ అంటూ సన్నగా గొణుక్కున్నాడు పురోహితుడు. ‘ఉదాత్తమైన సంకల్పాలను ఈషణ్మాత్రం సహించలేకపోతున్న ఈ పగటి చంద్రుడి కలను ఎందుకు నెరవేర్చాలో ఆ దేవుడే నిర్ణయించుకోవాలి’ అంటూ నిట్టూర్చాడు. – వారణాసి సుబ్రహ్మణ్యం -
2019.. వెరీ కాస్ట్లీ ఎలక్షన్స్!
వాషింగ్టన్: రాబోయే సార్వత్రిక ఎన్నికలు భారతదేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైనవి కాబోతున్నాయని అమెరికాకు చెందిన నిపుణుడు అంచనా వేశారు. ప్రజాస్వామ్య దేశాల్లో ఇప్పటి దాకా జరిగిన అత్యంత ఖరీదైన ఎన్నికలుగా కూడా ఇవి నిలిచే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ‘2016లో అమెరికా అధ్యక్ష, కాంగ్రెస్ ఎన్నికలకు అయిన వ్యయం 6.5 బిలియన్ డాలర్లు(రూ.46,166 కోట్లు). భారత్లో 2014 లోక్సభ ఎన్నికల ఖర్చు సుమారు 5 బిలియన్ డాలర్లు(రూ.35,512 కోట్లు). ఈసారి వ్యయం దానికి రెట్టింపు(రూ.71,025 కోట్లు) అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో భారత ఎన్నికలే ప్రపంచంలో అత్యంత ఖరీదైనవిగా నిలవబోతున్నాయి’ అని మిలాన్ వైష్ణవ్ అనే రాజకీయ నిపుణుడు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆయన వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న కార్నెజీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ దక్షిణాసియా డైరెక్టర్, ఫెలోగా పనిచేస్తున్నారు. ఈసారి బీజేపీ, ఇతర విపక్షాల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో ఖర్చుకు రాజకీయ పక్షాలు ఏమాత్రం వెనకాడబోవని మిలాన్ చెప్పారు. భారత్లో రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే విధానంలో పారదర్శకత లేకపోవడం పెద్ద లోపమని పేర్కొన్నారు. దీని వల్ల ఏ పార్టీ ఎక్కడి నుంచి ఎంత మొత్తాన్ని సేకరిస్తోందో తెలుసుకోవడం కష్టమవుతోందని తెలిపారు. తాము ఫండింగ్ చేసిన పార్టీ అధికారంలోకి రాకపోతే వేధింపులు తప్పవన్న భయంతో చాలా మంది విరాళాలను బహిర్గతం చేయడంలేదని అన్నారు. తాజాగా అమల్లోకి వచ్చిన ఎన్నికల బాండ్ల విధానం వల్ల పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదని తెలిపారు. -
కాంగ్రెస్ వ్యూహం : 250 స్ధానాల్లోనే పోటీ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ రెండో సారి అధికార పగ్గాలు చేపట్టకుండా చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు ప్రాతినిథ్యం పెరిగేలా వీలైనన్ని తక్కువ స్ధానాల్లోనే పోటీకి పరిమితమవాలని ఆ పార్టీ యోచిస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కనిష్టస్ధాయిలో కేవలం 250 స్ధానాల్లోనే పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాషాయ కూటమిని అధికార పీఠం నుంచి తప్పించేందుకు భావసారూప్యం కలిగిన పార్టీలతో మహాకూటమి ఏర్పాటుకు చొరవ తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు బీజేపీయేతర పార్టీలకు ఎక్కువ స్ధానాలు సర్ధుబాటు చేసేలా తాను తక్కువ సీట్లకే పరిమితం కావాలని యోచిస్తున్నట్టు సమాచారం. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇతర పార్టీలతో సీట్ల సర్దుబాటుపై రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ బ్లూప్రింట్ రూపకల్పనలో నిమగ్నమైంది. లోక్సభ ఎన్నికల్లో గెలుపునకు రోడ్మ్యాప్ను ఖరారు చేసేందుకు ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీకి ఈ బాధ్యతలను పార్టీ అప్పగించింది. ఈ కమిటీ జిల్లా, రాష్ట్ర కమిటీలతో సంప్రదింపులు జరిపి ఆయా రాష్ట్రాల్లో పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లను హైకమాండ్ దృష్టికి తీసుకువెళతారు. అనంతరం కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలుంటాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నివేదికలను పరిశీలించిన అనంతరం సీట్ల సర్ధుబాటుపై, ఎన్ని స్ధానాల్లో బరిలో దిగాలనే అంశంపై పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఓ నిర్ణయం తీసుకుంటారు. ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఢీ కొనేందుకు ఏర్పాటైన మహాకూటమిలో చేరే ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ ప్రాతినిథ్యం కల్పిస్తూ పార్టీ 250 కన్నా తక్కువ స్ధానాల్లో పోటీకి పరిమితం కావాలని పలువురు పార్టీ నేతలు సూచిస్తుండటం గమనార్హం. -
ఎందుకు ఓడిపోయాం?
ఎన్నికల్లో పరాజయానికి కారణాలపై రేపు ఏపీ పీసీసీ సమీక్ష రాష్ట్ర స్థాయి సమావేశానికి విజయవాడలో ఏర్పాట్లు విజయవాడ: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి కారణాలపై సమీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీ పీసీసీ) సిద్ధమైంది. ఇందుకోసం ఈ నెల 17న విజయవాడలో రామవరప్పాడు చౌరస్తాలోని పరిణయ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సమావేశం నిర్వహించనుంది. ఈ రాష్ట్ర స్థాయి సమావేశానికి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఏపీ పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి రుద్రరాజు పద్మరాజు, మాజీ మంత్రి శైలజానాథ్, పార్టీ ప్రధాన కార్యదర్శి టీజే సుధాకర్లను పార్టీ నియమించింది. 13 జిల్లాల్లోనూ నియోజకవర్గాల వారీగా ఓటమికి కారణాలపై ఈ సమావేశంలో సమీక్షించడంతో పాటు పార్టీ పునరుత్తేజానికి అవసరమైన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికనూ నేతలు రూపొందించనున్నారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూలేని విధంగా కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై దృష్టి సారించి పునరుత్తేజానికి చర్యలు తీసుకోవాలన్న ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాలతో విజయవాడలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించాలని వారం కిందటే నేతలు నిర్ణయించారు. ఈ సమావేశానికి ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సహా 13 జిల్లాల నుంచి డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, ఏపీ పీసీసీ కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు హాజరుకానున్నారని రుద్రరాజు పద్మరాజు తెలిపారు. -
అంతర్మథనంలో హస్తం
పరాజయూనికి కారణాల అన్వేషణలో కాంగ్రెస్ రాహుల్ సలహాదారులపై సీనియర్ల గుర్రు సోనియూ, రాహుల్ల రాజీనామాలపై ఊహాగానాలు.. తోసిపుచ్చిన షకీల్ అహ్మద్ న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయూనికి కారణాలను అన్వేషించే పనిలో కాంగ్రెస్ నిమగ్నమైంది. సోమవారం కీలక వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) జరగనుండగా.. అంతకుముందే నేతలు కొందరు కత్తులు దూస్తున్నారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాజకీయ పరిస్థితిపై చర్చించేందుకు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి (సీడబ్ల్యూసీ) సమావేశ మవుతుండగా.. రాహుల్ నాయకత్వం, పార్టీ ఎన్నికల వ్యూహం, మన్మోహన్ నేతృత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నారుు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ కీలక సలహాదారులు కొందరిపై సీనియర్ నేతలు తమ ప్రైవేటు సంభాషణల్లో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరైతే టికెట్ల పంపిణీ చేసిన తీరును బహిరంగంగానే తప్పుబడుతున్నారు. జైరాం రమేశ్, మోహన్గోపాల్, మధుసూదన్ మిస్త్రీ, మోహన్ ప్రకాశ్, అజయ్ మాకెన్ తదితరులు విమర్శల దాడికి గురవుతున్నవారిలో ఉన్నారు. రాహుల్తో పాటు పార్టీ అధ్యక్షురాలు సోనియూగాంధీ కూడా సీడ బ్ల్యూసీ భేటీలో రాజీనామాల సమర్పణకు సిద్ధమైనట్టుగా శనివారం మీడియూలో ఊహాగానాలు సాగారుు. అరుుతే ఉన్నతస్థారుు పార్టీవర్గాలు ఈ ఊహాగానాలను తోసిపుచ్చారుు. ‘అంతా ఒట్టిదే. ముందుకు వెళ్లే మార్గం ఇది కాదు. అది పరిష్కారం కూడా కాదు..’ అని పార్టీ అగ్రనాయకత్వానికి సన్నిహితంగా మెలిగే వర్గాలు వ్యాఖ్యానించారుు. అవన్నీ ఊహాజనిత వార్తలేనని పార్టీ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ చెప్పారు. ఊహాజనిత వార్తలపై తాను ఊహాగానాలు చేయదలుచుకోవడం లేదని కాంగ్రెస్ ప్రతినిధి కూడా అరుున అహ్మద్ అన్నారు. ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయూనికి బాధ్యత వహిస్తున్నామని చెప్పిన సోనియూ, రాహుల్.. ఇది కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పుగా అంగీకరించారు. ఈ విషయంలో మేము ఆలోచించాల్సింది ఎంతో ఉందని అని వారన్నారు. అరుుతే పార్టీ టికెట్టు కేటారుుంచిన తర్వాత కూడా కొందరు అభ్యర్థులు కాంగ్రెస్ విడిచిపోవడం విచారకరమని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు అనిల్శాస్త్రి పేర్కొన్నారు. టికెట్లిచ్చిన తీరుపై తీవ్ర సమీక్ష జరపాల్సిన ఆవశ్యకతను ఇది స్పష్టం చేస్తోందని అన్నారు. అప్పుడే పార్టీలో చేరినవారికి పళ్లెంలో పెట్టి టికెట్లు ఇవ్వడం జరగదని రాహుల్ అంతకుముందు చెప్పినా.. పలువురి విషయంలో అలాగే జరిగిందని, అందువల్ల రాహుల్ అభిప్రాయూనికి విరుద్ధంగా వ్యవహరించిన వారే ప్రస్తుత పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని శాస్త్రి చెప్పారు. పలువురు కేంద్ర మంత్రులు సైతం ఓటమిపాలు కావడం.. మంత్రులు, పార్టీ కార్యకర్తలకు మధ్య పూర్తిగా సంబంధాలు లేవనే విషయం స్పష్టం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు చెప్పారు. రాహుల్ పనితీరుపై ఒకపక్క పార్టీలో గొణుగుళ్లు ఉన్నప్పటికీ.. గాంధీ కుటుంబ ప్రభావం క్షీణిస్తోందనే వాదనను ఆ నేత తోసిపుచ్చారు. గాంధీ కుటుంబం లేకపోతే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుందో మనం చూశామని ఆయన అన్నారు. మరోవైపు బలమైన ప్రాంతీయ నేతలు లేకపోవడానికి కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ చేతిలో మట్టి కరవడాన్ని ఒక నేత గుర్తు చేశారు. కాంగ్రెస్ ఘోర పరాజయూనికి కారణాలను పేర్కొంటూ ఒకటీ రెండురోజుల్లో తాను రాహుల్కు లేఖ రాయనున్నట్టు అనిల్ శాస్త్రి తెలిపారు. రాహుల్కు కమల్నాథ్ మద్దతు రాహుల్కు సీనియర్ కాంగ్రెస్ నేత కమల్నాథ్ దన్నుగా నిలిచారు. రాహుల్ రాజీనామా చేయూల్సిన అవసరం ఎంత మాత్రం లేదని స్పష్టం చేశారు. అరుుతే పార్టీ సమీక్షించుకోవాలని, ఇంటిని ఓ క్రమంలో పెట్టాలని వ్యాఖ్యానించారు. ‘రాహుల్ గత ఎనిమిది నెలల నుంచే ముఖ్యమైన స్థానంలో ఉన్నారు. ప్రభుత్వ పనితీరులో గానీ, అది సాధించిన విజయూల్లో కానీ ఆయన పాత్ర ఏమీ లేనట్టుగా మాట్లాడుతున్నారు! ఏమి తర్కమిది?’ అని కమల్నాథ్ ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా పార్టీయే నియమించింది. పార్టీ ఒక్కటే ఆయన్ను తొలగించగలదు కానీ.. అది ఆ విధంగా చేయూలనుకోవడం లేదు..’ అని ఆయన అన్నారు. -
అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ ఫలితాలే: వెంకయ్య
హైదరాబాద్: సీమాంధ్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ గట్టిగానే ఉందని, అది కాద నలేని వాస్తవమని అన్నారు. అయినప్పటికీ టీడీపీ- బీజేపీ కూటమి తప్పక విజయం సాధిస్తుందని చెప్పారు. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో కూటమికి స్థానిక ఎన్నికల్లో వచ్చిన దానికన్నా మెరుగైన ఫలితాలు వస్తాయని బుధవారం విలేకరులకు తెలిపారు. సాధారణ ఎన్నికల ఫలితాల తరువాత ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, తెలంగాణలో హంగ్ వస్తుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఎన్డీయేకు 300 వరకు సీట్లు వస్తాయన్నారు. కేంద్రంలో బీజేపీ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి దేశహితం కోరి ఏ రాజకీయ పార్టీ అయినా మద్దతు ఇవ్వడానికి ముందుకొస్తే తీసుకోవడానికి తమకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. కాగా, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల సరళిపై నరేంద్ర మోడీ ఆరా తీశారు. బుధవారం వెంకయ్య నాయుడుకు ఫోను చేసి తాజా పరిణామాలపై చర్చించారు. -
15 కోట్లకు అమ్ముడుపోయారు!
సీపీఎం నేత తమ్మినేనిపై సీపీఐ నారాయణ తీవ్ర ఆరోపణలు హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో సీపీఎం వ్యవహరించిన తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ నిప్పులు చెరిగారు. సీపీఐని ఓడించడమే లక్ష్యంగా ధన ప్రభావానికి తలొగ్గి అనైతిక, అవకాశవాద రాజకీయాలకు సీపీఎం పాల్పడిందని తీవ్రంగా ఆరోపించారు.ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో తాను పోటీ చేస్తున్నట్టు సీపీఎంకు ముందే చెప్పి మద్దతు కోరినప్పటికీ తాము కూడా పోటీ చేస్తున్నట్టు చెప్పి.. ఆ తరువాత వైఎస్సార్సీపీ అభ్యర్ధి పి.శ్రీనివాసరెడ్డికి అనుకూలంగా సీపీఎం పోటీ నుంచి విరమించుకుందని విమర్శించారు. ఖమ్మంలో సీపీఐ అభ్యర్థి నారాయణను ఓడించేందుకు వైఎస్సార్సీపీ అభ్యర్థి నుంచి సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం రూ. 15 కోట్లు తీసుకున్నాడని స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారన్నారు. నారాయణ బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నామని, అందుకు పార్టీ జాతీయ నాయకత్వం నుంచి కూడా అనుమతి తీసుకున్నామన్నారు. తమతో సర్దుబాట్లకు రమ్మని సీపీఎంను కూడా ఆహ్వానించామని, అందుకు సీపీఎం తిరస్కరిస్తూ కాంగ్రెస్తో పొత్తును సాకుగా చూపిందని నారాయణ గుర్తుచేశారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నందుకు తమను కాదన్న సీపీఎం.. తెలంగాణలో సమైక్యవాద పార్టీ వైఎస్సార్సీపీతో పొత్తు ఎలా పెట్టుకుంటుందని ప్రశ్నించారు. -
హంగ్ వస్తే ఎలా..?
న్యాయ, రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాలు తెలుసుకున్న రాష్ట్రపతి న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఏ కూటమికి పూర్తి మెజారిటీ రాకుండా హంగ్ ఏర్పడితే అనుసరించాల్సిన విధివిధానాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యాయ, రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాలను సేకరించారు. ఈ మేరకు కిందటివారమే ప్రముఖ న్యాయ నిపుణులు ఫాలీ నారీమన్, సోలీ సొరాబ్జీ, సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు. లోక్సభలోని మొత్తం 543 ఎంపీ స్థానాల్లో ఏ పార్టీ/కూటమి అయినా 272 సీట్లు నెగ్గితే రాష్ట్రపతి పాత్ర నామమాత్రంగానే ఉంటుంది. మెజారిటీ సాధించిన పక్షాన్ని ప్రభుత్వ ఏర్పాటుకు స్వాగతిస్తారు. అయితే హంగ్ ఏర్పడితే రాష్ట్రపతి పాత్ర కీలకం. శుక్రవారమే ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. మరోవైపు ఫలితాల తర్వాత రాష్ట్రపతి భవన్కు రాజకీయ నేతలు, పాత్రికేయుల తాకిడి పెరగనుండడంతో సిబ్బంది ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్లో శనివారం యూపీఏ-2 సర్కారుకు వీడ్కోలు ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి. -
బీజేపీయే అతిపెద్ద పార్టీ: ఎన్సీపీ
న్యూఢిల్లీ/కోల్కతా: సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం భారీ మెజారిటీని కైవసం చేసుకుని అతిపెద్దగా అవతరించే అవకాశం బీజేపీకి ఉందని యూపీఏ మిత్రపక్షం ఎన్సీపీ నొక్కిచెప్పింది. అదేసమయంలో దేశంలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని తెలిపింది. ‘రాబోయే ఐదేళ్లకు దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది’ అని ఎన్సీపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఎగ్జిట్ పోల్ లేదా ఒపీనియన్ పోల్ ఫలితాల సరళిని గమనిస్తే బీజేపీయే శక్తిమంతమైన పార్టీగా అవతరించనున్న విషయం సుస్పష్టంగా తెలుస్తోందని, ప్రజాభీష్టాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశానికి సుస్థిర ప్రభుత్వ అవసరం ఎంతో ఉందని చెప్పారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ బీజేపీకి లేదా ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయేకు అవసరమైన పక్షంలో ఎన్సీపీ మద్దతిస్తుందా? అన్న ప్రశ్నకు అలాంటి ఉద్దేశమేదీ లేదని, ప్రస్తుతం తాము యూపీఏలో భాగస్వాములుగా ఉన్నామని, రానున్న రోజుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామన్నారు. -
మోడీ వారసుడి ఎంపికపై కసరత్తు?
గాంధీనగర్లో ఎమ్మెల్యేలు,నేతలతో మోడీ భేటీ అహ్మదాబాద్లో బీజేపీ రాష్ట్ర కోర్ గ్రూప్ సమావేశం గుజరాత్ తదుపరి సీఎంపై చర్చించేందుకే ఈ భేటీలంటూ కథనాలు అహ్మదాబాద్: సార్వత్రిక ఎన్నికల ఘట్టం ముగిసింది. ఇక ఫలితాలు వెలువడటమే మిగిలి ఉంది. ఈలోగా ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికే అధికారం ఖాయమని చెప్పడంతో గుజరాత్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయంపై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. గుజరాత్ సీఎం నరేంద్రమోడీ బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక మోడీ ప్రధానిగా ఢిల్లీ వెళ్లడం ఖాయమని, గుజరాత్లో ఆయన వారసుడిగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై కసరత్తు ప్రారంభించినట్టు కథనాలు వెలువడ్డాయి. గుజరాత్ బీజేపీ చీఫ్ ఆర్.సి.ఫల్దు అధ్యక్షతన పార్టీ కోర్ గ్రూప్ మంగళవారమిక్కడ సమావేశం కావడం ఈ కథనాలకు మరింత బలం పెంచింది. అనంతరం గాంధీనగర్లో బీజేపీ శాసనసభాపక్షం, పార్టీ రాష్ట్ర అగ్రనేతలతో నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. దీంతో సీఎం వారసుడి ఎంపికపై చర్చించేందుకే వీరు భేటీ అయ్యారనే ఊహాగానాలు మరింతగా ఎక్కువయ్యాయి. అయితే వీటిని పార్టీ వర్గాలు తోసిపుచ్చాయి. ఇవి సాధారణంగా జరిగే సమావేశాలేనని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ రుపానీ చెప్పారు. గుజరాత్ తదుపరి సీఎం ఎవరనే అంశంపై మే 16న లోక్సభ ఫలితాలు వెల్లడైన తర్వాతే చర్చిస్తామని స్పష్టంచేశారు. దీనిపై కేంద్ర పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. కాగా, గుజరాత్లో మోడీ వారసుడిగా ఇప్పటికే పలు పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో మోడీ సన్నిహితుడు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమిత్షా, గుజరాత్ మహిళా మంత్రి ఆనంది బెన్ పటేల్, మంత్రులు నితిన్ పటేల్, సౌరభ్ పటేల్లతోపాటు పార్టీ రాష్ట్ర నేత భింకు దల్సానియాలు ఉన్నారు. నితిన్ పటేల్, దల్సానియాలు తాము గుజరాత్ సీఎం పదవి చేపట్టడానికి సన్నద్ధంగా ఉన్నామని ఇప్పటికే ప్రకటించారు. హస్తినలో బీజేపీ నేతలు బిజీబిజీ.. న్యూఢిల్లీ: పోలింగ్ ముగిసి, ఎగ్జిట్ పోల్ సర్వేలు వెలువడిన నేపథ్యంలో మంగళవారం బీజేపీ నేతలు భేటీలతో బిజీబిజీగా గడిపారు. ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ ఎన్డీఏకే అధికారం అని చెప్పడంతో వాటి పై చర్చించుకున్నారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ.. పార్టీ అగ్రనేత అద్వానీని కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మరోవైపు జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తమకు ఎవరు మద్దతిచ్చినా స్వాగతిస్తామని బీజేపీ నేత అమిత్ షా తెలిపారు. కలసిమెలసి పనిచేస్తాం: ఒబామా వాషింగ్టన్:భారత్లో రాబోయే ప్రభుత్వంతో కలసిమెలసి పనిచేయడానికి తాము ఎదురుచూస్తున్నామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. రాబోయే కాలాన్ని రెండు దేశాలకు మరింత ప్రయోజనం చేకూర్చేలా వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. లోక్సభ ఎన్నికలు దిగ్విజయంగా ముగిసిన తరుణాన్ని పురస్కరించుకుని ఒబామా భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. -
మూడో కూటమి సహా దేనికీ మద్దతివ్వం
ఆప్ స్పష్టీకరణ వారణాసి: సార్వత్రిక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి వచ్చే ఫలితాలు ఏవిధంగా ఉన్నప్పటికీ తృతీయ కూటమి సహా ఏ కూటమికీ మద్దతిచ్చేది లేదని ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సాయంత్రం స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అయితే, దీనికి ముందు ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆపార్టీ సీనియర్ నేత గోపాల్ రాయ్ మాత్రం.. బీజేపీని అధికార పీఠం నుంచి నిలువరించే క్రమంలో తమ పార్టీ తృతీయ కూటమికి మద్దతిస్తుందన్నారు. అయితే, అంశాల వారీగానే ఈ మద్దతు ఉంటుందని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పోటీకి దిగినప్పటికీ ఢిల్లీ, హర్యానా, పంజాబ్లలో ఆప్ మంచి ఫలితాలు రాబడుతుందన్నారు. ఎన్నికల్లో 10 సీట్లు వచ్చినా 30 సీట్లొచ్చినా వ్యవస్థీకృత మార్పులు చేపట్టేదిశగా ప్రభుత్వంపై తాము ఒత్తిడి తెస్తామన్నారు. కాగా, రాయ్ వ్యాఖ్యలను కేజ్రీవాల్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఆప్ ఏ ఒక్కపార్టీకీ మద్దతివ్వబోదని, తృతీయ కూటమిగా ఏర్పడుతున్న పార్టీల్లో అవినీతి పరులే ఎక్కువగా ఉన్నారని.. అవినీతిపై పోరాడతామంటూ బరిలో నిలిచిన తాము ఏవిధంగా ఆయా నేతలకు మద్దతిస్తామని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో కూర్చునేందుకే ఆప్ ప్రాధాన్యమిస్తుందని ట్విట్టర్లో స్పష్టం చేశారు. కేజ్రీవాల్కు ఈసీ నోటీసులు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. అమేథీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆదివారం ఈ నోటీసు ఇచ్చింది. మే 13 సాయంత్రంలోగా వివరణ ఇచ్చేందుకు గడువు విధించింది. ఆ లోపుగా కేజ్రీవాల్ వివరణ ఇవ్వకపోతే ఈ అంశంపై తామే నిర్ణయం తీసుకుంటామని ఈసీ స్పష్టం చేసింది. అమేథీ ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీలకు ఒక్క ఓటు వేసినా అది దేశాన్ని, దైవాన్నీ మోసగించడమే అవుతుందని కేజ్రీవాల్ చెప్పిన సంగతి తెలిసిందే. -
సోనియా, రాహుల్ ఓటమి ఖాయం
యూపీ ప్రచారంలో నరేంద్ర మోడీ జోస్యం కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవదు ఓటు ద్వారా ప్రజలు ఆ పార్టీకి గుణపాఠం చెప్పనున్నారు బాల్లియా/కుషీనగర్: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో ఖాతా కూడా తెరవదని, ఆ పార్టీలోని చాలా మంది హేమాహేమీలకు ఓటమి తప్పదని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని గుర్తించిన దేశ ప్రజలు ఆ పార్టీకి ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పనున్నారన్నారు. ముఖ్యంగా రాయ్బరేలీ, అమేథీలలో తల్లీకొడుకులు (సోనియాగాంధీ, రాహుల్గాంధీ) ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. శనివారం ఉత్తరప్రదేశ్లోని బాల్లియా, కుషీనగర్లలో నిర్వహించిన బహిరంగ సభల్లో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన యూపీఏ పాలనపై నిప్పులు చెరిగారు. యూపీఏ పాలనలో ఏసీ కార్యాలయాల్లో కూర్చున్న అధికారులు అవలంబించిన తప్పుడు విధానాల వల్ల రైతులు నష్టాల్లో కూరుకుపోయారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చాక రైతులకు కనీస మద్దతు ధర విధానాన్ని ప్రక్షాళన చేస్తామన్నారు. తాను నీచ రాజకీయాలకు పాల్పడుతున్నట్లు సోనియా చేసిన విమర్శలను మోడీ తిప్పికొట్టారు. బీజేపీపై ఎంతగా బురదజల్లితే కమలం (బీజేపీ చిహ్నం) అంతగా వికసిస్తుందన్నారు. అలాగే సంపన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి నుంచి తాను నేర్చుకోవాల్సింది ఏమీ లేదని పరోక్షంగా రాహుల్గాంధీకి చురకలంటించారు. యూపీలోని అధికార సమాజ్వాదీ పార్టీ, ప్రతిపక్ష బీఎస్పీ కూడా కాంగ్రెస్తో చేతులు కలిపి తాను అధికారంలోకి రాకుండా చూడాలని కుట్రపన్నుతున్నాయని మోడీ ఆరోపించారు. కానీ ఎవరెన్ని కుట్రలు పన్నినా ఈ ఎన్నికలు సుపరిపాలనకు నాంది పలుకుతాయన్నారు. జమ్మూలోని వైష్ణోదేవి ఆలయ దర్శనంతో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తాను 1857 నాటి సిపాయిల తిరుగుబాటులో అమరుడైన మంగళ్ పాండే స్వస్థలం బాల్లియాలో ప్రచారం ముగించడం తన అదృష్టమన్నారు. దేశవ్యాప్తంగా 450 బహిరంగ సభల్లో పాల్గొన్నానని, 3డీ ప్రచారం ద్వారా 5,800 ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రజలకు చేరువయ్యానన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్తో భేటీ:యూపీలో ప్రచారం ముగించుకున్న అనంతరం మోడీ ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్తో సమావేశయ్యారు. ఎన్నికల ప్రచారం తీరుతెన్నులను, భవిష్యత్ కార్యాచరణను ఆయనతో చర్చించారు. అంతకుముందు మాజీ ప్రధాని ఎ.బి. వాజ్పేయి ఇంటికి వెళ్లిన మోడీ ఆయన ఆశీర్వాదాలు అందుకున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్ను కూడా కలిసినట్లు ట్వీట్ చేశారు. -
విశాఖ లో విజయ వీచిక
ఎన్నికలంటే పోటీ అనివార్యం. అందునా విశాఖపట్నం వంటి ప్రతిష్టాత్మక స్థానంలో సహజంగానే ఆసక్తికరమైన పోరు సాగుతుంది. కానీ... ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ తీరంలో ‘విజయ’ వీచికలు ముందే వీస్తున్నాయని రాజకీయ విశ్లేషకులతో పాటు సామాన్యులూ భావిస్తున్నారు. వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో పోరు ఏకపక్షమైంది. విజయమ్మ రాకతో విశాఖ జిల్లాలోనే కాక, ఉత్తరాంధ్రలోనూ వైఎస్సార్ సీపీకి సరికొత్త ఉత్తేజం వచ్చింది. విశాఖ లోక్సభ స్థానంలో సార్వత్రిక ఎన్నికల పోరు రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా వైఎస్ విజయమ్మ పోటీ చేస్తుండటమే ఇందుకు కారణం. వైఎస్ సతీమణిగా ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నియోజకవర్గంలో ఎక్కడికెళ్లినా ‘మా ఇంటి ఆడపడచు’ అంటూ ఆదరిస్తున్నారు. పొత్తులో భాగంగా ఈ సీటును తెలుగుదేశం పార్టీ..బీజేపీకి అప్పగించింది. ఆ పార్టీ తరఫున సీమాంధ్ర అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి హరిబాబు రంగంలోకి దిగారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా బొలిశెట్టి సత్యనారాయణ, జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున సబ్బం హరి బరిలోకి దిగినా... కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతున్నారు. జోరుగా వీస్తున్న ‘ఫ్యాన్’ గాలి వైఎస్ పట్ల విశాఖ ప్రజలకు ప్రత్యేకాభిమానం ఉంది. ఆయనకూ విశాఖ అంటే ఎంతో ఇష్టం. విజయమ్మ కూడా ఇదే మాట చెబుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ప్రకటించిన పార్టీ మేనిఫెస్టో కూడా విశాఖపై ఆ కుటుంబానికి ఉన్న అభిమానాన్ని చాటింది. మేనిఫెస్టోలో ప్రకటించిన మెట్రో రైలు, కాలుష్యం నుంచి విముక్తి, ఈ ప్రాంతానికి ఉపయోగపడే రీతిలో పెట్రో యూనివర్సిటీ లాంటి అంశాలపై ఇప్పటికే ప్రజల్లో చర్చ నడుస్తోంది. వైఎస్ హయాంలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారెందరో ఇక్కడ ఉన్నారు. విజయమ్మ లాంటి ప్రముఖ నాయకురాలు ఎంపీగా ఎన్నికైతే విశాఖ రూపురేఖలు మారిపోతాయని, మేనిఫెస్టోను జగన్మోహన్రెడ్డి తప్పనిసరిగా అమలుచేసి.. మేలు చేస్తారని ఇక్కడి ఓటర్లు బలంగా నమ్ముతున్నారు. ఇక్కడి నుంచి ఇప్పటివరకూ ఎవరికీ రాని మెజారిటీతో ఆమెను గెలిపించాలన్న పట్టుదల వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో కన్పిస్తోంది. విశాఖపై స్పష్టమైన ఆలోచనతో ఉన్న విజయమ్మ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో చేపట్టనున్న అభివృద్ధి గురించి వివరిస్తున్నారు. ఇందుకు ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. కళ తప్పిన ‘కమలం’ బీజేపీ అభ్యర్థి హరిబాబు రేసులో వెనుకబడ్డారు. ఆ పార్టీ ఇక్కడ గతంలో రెండు ఎమ్మెల్యే స్థానాలను గెలిచింది. 1981లో జరిగిన నగర పాలక సంస్థ ఎన్నికలలో అత్యధిక డివిజన్లలో గెలుపొంది.. విశాఖ మేయర్ పదవినీ చేపట్టింది. ఈ నేపథ్యంలో లోక్సభ సీటును పట్టుబట్టి ఇప్పించుకుంది. ఈ స్థానంలో ఎలాగూ గెలవలేమని భావించిన టీడీపీ... ఈ సీటును బీజేపీకి అప్పజెప్పడానికి పెద్దగా అభ్యంతరాలు తెలపలేదు. దీంతో టీడీపీ శ్రేణులు అసంతృప్తికి గురయ్యాయి. బీజేపీ ప్రచారంలో వారు పాల్గొనడం లేదు. హరిబాబు నామినేషన్ కార్యక్రమానికి కూడా కనీస స్థాయిలో హాజరుకాకపోవడం ఇందుకు నిదర్శనం. అటుపక్క బలమైన అభ్యర్థి(విజయమ్మ) కావడంతో కమలనాథులకు ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదు. ‘తమ్ముళ్ల’కు తాయిలాలు ఇచ్చినా సరైన స్పందన కనిపించడం లేదు. ఇటీవల బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు నిర్వహించిన రోడ్షో వెలవెలబోయింది. హరిబాబు విషయానికొస్తే... ఈయన ఇటీవల పార్టీ సీమాంధ్ర అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.1999లో విశాఖ-1 అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున గెలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పనిచేసింది. ఆ తర్వాత దశాబ్ద కాలంలో బీజేపీ నగరంలో ప్రభావం చూపిన సందర్భాలు లేవు. స్థానికేతరులకు పట్టం విశాఖ ఓటర్లు విశాల దృక్పథాన్ని చాటుకుంటున్నారు. వివిధ సందర్భాల్లో ఇది రుజువైంది. స్థానికేతరులైనా పట్టం కడుతున్నారు. సమర్థ నేతలే ముఖ్యమని, స్థానికాంశం ఏమాత్రమూ సరికాదనే భావనతో తీర్పు ఇస్తున్నారు. పీవీజీరాజు(విజయనగరం), ఉమ(విజయనగరం), ఎంవీవీఎస్ మూర్తి(తూర్పు గోదావరి), కొమ్మూరి అప్పలస్వామి(విజయనగరం), టి.సుబ్బరామిరెడ్డి, నేదురుమల్లి జనార్దనరెడ్డి(నెల్లూరు),దగ్గుబాటి పురందేశ్వరి(ప్రకాశం)లను గెలిపించడమే ఇందుకు తార్కాణం. అసెంబ్లీ సెగ్మెంట్లు.. బలాబలాలు భీమిలి వైఎస్సార్ సీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(టీడీపీ)తో తలపడుతున్నారు. ఎన్నికకో నియోజకవర్గాన్ని మార్చడం.. టీడీపీ శ్రేణులు కలసి రాకపోవడం గంటాకు ప్రతికూలంగా పరిణమించాయి. దీనికితోడు టీడీపీ రెబల్ అభ్యర్థి అనితా సకురు ఆ పార్టీ ఓట్లను చీల్చనుండటం సైకిల్ శిబిరాన్ని కలవరపరుస్తోంది. స్థానికుడు కావడం వైఎస్సార్ సీపీ అభ్యర్థికి సానుకూలాంశం. విశాఖ తూర్పు ఈసారీ పాత అభ్యర్థులే తలపడుతున్నారు. గత ఎన్నికల్లో పీఆర్పీ తరఫున రెండో స్థానంలో నిలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ ఈసారి వైఎస్సార్ సీపీ పక్షాన బరిలోకి దిగారు. పాత ప్రత్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు(టీడీపీ)కు గట్టి సవాలు విసురుతున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యేగా వ్యతిరేకత, వివిధ కేసుల్లో నిందితుడు కావడం, రాష్ట్ర విభజనకు టీడీపీ సహకరించడం వెలగపూడికి మైనస్ పాయింట్లు. విశాఖ దక్షిణం గత ఎన్నికల్లో త్రుటిలో విజయానికి దూరమైన కోలా గురువులు వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా నిల్చున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి, వాసుపల్లి గణేష్కుమార్ టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. గురువులు స్థానిక మత్స్యకార వర్గానికి చెందిన నేత. ఇక్కడ టీడీపీకి అంత పట్టులేకపోవడం... కాలుష్య అంశం వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో ఉండటం ఆ పార్టీ అభ్యర్థికి లాభిస్తున్నాయి. విశాఖ ఉత్తరం వైఎస్సార్ సీపీ అభ్యర్థి చొక్కాకుల వెంకటరావు బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్రాజును ఎదుర్కొంటున్నారు. బలమైన సామాజిక వర్గం, సేవాతత్పరుడిగా గుర్తింపు, ప్రత్యర్థికి టీడీపీ శ్రేణులు సహకరించకపోవడం... తదితర అంశాలు వెంకటరావుకు అనుకూలంగా మారాయి. ఇక్కడ కాంగ్రెస్ పోటీ నామమాత్రమే. విశాఖ పశ్చిమం వైఎస్సార్ సీపీ అభ్యర్థి దాడి రత్నాకర్, టీడీపీ అభ్యర్థి పెతకంశెట్టి గణబాబు మధ్య పోటీ నెలకొంది. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గమైనా అన్ని వర్గాలనూ కలుపుకుని రత్నాకర్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే కనిపిస్తారనే ముద్ర గణబాబుకు మైనస్గా మారింది. తండ్రి దాడి వీరభద్రరావు ఎన్నికల అనుభవం, వైఎస్ సంక్షేమ పథకాలు, ప్రణాళికాయుతమైన ప్రచార వ్యూహం రత్నాకర్కు సానుకూల అంశాలుగా మారాయి. గాజువాక తిప్పల నాగిరెడ్డి వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేస్తున్నారు. పల్లా శ్రీనివాస్(టీడీపీ)ను ఎదుర్కొంటున్నారు. శ్రీనివాస్కు పార్టీలో అసమ్మతి తలనొప్పిగా మారింది. తాజా మాజీ ఎమ్మెల్యే చింతలపూడి కాంగ్రెస్, టీడీపీ టికెట్ల కోసం ప్రయత్నించి భంగపడి అసమ్మతితో రగిలిపోతున్నారు. దీర్ఘకాలిక పరిచయాలు, కుటుంబ నేపథ్యం, వైఎస్ పథకాలు.. నాగిరెడ్డికి లాభిస్తాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. శృంగవరపుకోట ఎస్.కోటగా పిలిచే ఈ అసెంబ్లీ సెగ్మెంట్ విజయనగరం జిల్లా పరిధిలో ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రొంగలి జగన్నాథం పోటీ చేస్తున్నారు. టీడీపీ తరఫున కోళ్ల లలితకుమారి(తాజా మాజీ ఎమ్మెల్యే) మరోసారి బరిలోకి దిగారు. ఈమెపై నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థికి ప్రచారంలో ప్రజల నుంచి విశేషాదరణ లభిస్తోంది. -
ప్రతీకార’ భాష!
సార్వత్రిక ఎన్నికల్లో ఆరు దశలు దాటి ఏడో దశకు వచ్చేసరికి పరస్పర దూషణలు కాస్తా ప్రతీకార భాషగా రూపాంతరం చెందాయి. ‘మేం అధికారానికి రావడం ఖాయం. మీ సంగతి చూడటమే తరవాయి’ అన్నట్టు ప్రతివారూ మాట్లాడుతున్నారు. చిత్రమేమంటే వీరంతా అందుకోసం అన్నివిధాలా అప్రదిష్టపాలైన సీబీఐ బూచినే చూపిస్తున్నారు. అవతలివారిని బెదరగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. తాము అధికారంలోకొచ్చిన వెంటనే సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాను జైలుకు పంపుతామని మొదట్లో బీజేపీ నేత ఉమాభారతి చెప్పినప్పుడు ఆ పార్టీలోనే చాలామంది ఆమెను వారించారు. తమకు అలాంటి ఉద్దేశాలేమీ లేవని, అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని పార్టీ నేతలు సంజాయిషీ ఇచ్చారు. ఇప్పుడు ఆ పార్టీ ధోరణి కొంత మారింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటున్నారు. అధికార పీఠం ఇంకా చేతికందకుండానే పాలకుల భాష అలవడిందన్న మాట! తమకు ప్రతీకారేచ్ఛలేదని ఆమధ్య నరేంద్ర మోడీ కూడా చెప్పారు. కానీ, ఆయనే ఇటీవలే జామ్నగర్ సభలో మాట్లాడుతూ ‘మీరు అన్నిరకాలుగా నన్ను వేధిస్తున్నారు. ఇంకెంత... 20 రోజుల వ్యవధి ఉంది. అటు తర్వాత ప్రతీకారం తప్పదు’ అని మాట్లాడారు. ప్రతీకారం తీర్చుకోవడమంటే ఏమిటని అడిగితే ఆయన అందుకు వేరే భాష్యం చెప్పినా చెప్పవచ్చు. అలా అనడంలో తన ఉద్దేశమే వేరని అనవచ్చు. కానీ, ఇలాంటి మాటల వెనకుండే ఆంతర్యం ఏమిటన్నది ఎవరికీ తెలియనిది కాదు. మన రాష్ట్రంలో ఇది ఇంకొంచెం ముదిరింది. ఇలాంటి దూషణలు బాబు నోటివెంట అలవోకగా వెలువడుతున్నాయి. కేసీఆర్ను ఆయన దుర్మార్గుడు, అవినీతిపరుడు, సన్నాసి వంటి పదాలతో తూలనాడటమే కాదు...ఇలాంటి తిట్లు ఇంకెన్ని తిట్టినా తక్కువేనని సెలవిచ్చారు. సైకిల్తో తొక్కించి పచ్చడి పచ్చడి చేస్తానని హెచ్చరించారు. ఆయన కుటుంబం మొత్తాన్ని జైలుకు పంపుతానని బెదిరించారు. ఇలాంటి మాటలతో ఓటర్లను ఆకట్టుకోగలమని, ప్రత్యర్థుల్ని హడలెత్తించగలననుకుంటున్నారు గానీ, తన అంతరాంతరాల్లో గూడుకట్టుకుని ఉన్న హింసాప్రవృత్తిని బయటపెట్టుకుంటున్నానని గుర్తించడం లేదు. గత పదేళ్ల పాలనలో ప్రత్యర్థులను వేధించడానికి సీబీఐని రెండు చేతలా వినియోగించుకున్న యూపీఏ సర్కారు దిగిపోయే క్షణాల్లో కూడా ఆ తరహా చేష్టలను కొనసాగించదల్చుకున్నది. అందువల్లే గుజరాత్లో ఒక మహిళపై నిఘా ఉంచిన ఉదంతంపై సిట్టింగ్ జడ్జితో కమిషన్ నియామకం కోసం పావులు కదుపుతున్నది. ఈ విషయంలో ఎన్నికల కోడ్కు ముందే కేంద్ర కేబినెట్లో స్థూలంగా నిర్ణయం తీసుకున్నందువల్ల తదుపరి చర్యకు ఎలాంటి ప్రతిబంధకాలూ ఉండవని భావిస్తోంది. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం ఈ విషయంలో మరో ముందడుగు వేయకతప్పని స్థితిని కల్పించాలని చూస్తోంది. గుర్తు తెలియని ఒక మహిళపై నరేంద్ర మోడీ నిఘా ఉంచారని, ఆమెను నీడలా వెన్నాడేందుకు పోలీసులను వినియోగించారని అభియోగం. ఒక మహిళ వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూడటం, అందుకోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించడం క్షమార్హం కాని నేరమే. ఈ ఉదంతానికి బాధ్యులెవరైనా తగిన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ, ఈ సంగతి రెండేళ్లక్రితమే వెల్లడైనా యూపీఏ సర్కారు ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయింది. సార్వత్రిక ఎన్నికలు మరికొన్ని రోజుల్లో పూర్తికానుండగా ఇప్పుడు దాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఒక సీరియస్ అంశాన్ని తన చవకబారు ఎత్తుగడలతో పలచన చేస్తోంది. యూపీఏ సర్కారు సీబీఐని ఇలాంటి పనులకు ఎడాపెడా వాడుకుంది. ఎన్నోసార్లు ఇది సరికాదని సుప్రీంకోర్టు మందలించినా ఈ వైఖరిలో అణుమాత్రమైనా మార్పురాలేదు. ఈమధ్యే సీబీఐ ఆధ్వర్యంలో ఒక సదస్సు జరిగినప్పుడు పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ, బీజేపీ నాయకుడు అరుణ్ జైట్లీ ఆ సంస్థ పనితీరును నిశితంగా విమర్శించారు. దాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరును దుయ్యబట్టారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగివుంటూనే ప్రజలకు జవాబుదారీగా ఉండటం అవసరమని సూచించారు. సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకొస్తే ఆ సంస్థ పనితీరు మెరుగుపడవచ్చునని అభిప్రాయపడ్డారు. సీబీఐ డెరైక్టర్ను ప్రభుత్వమే ఎంపిక చేసే విధానంవల్ల ఆ సంస్థ అప్రదిష్టపాలవుతున్నదని అరుణ్జైట్లీ అన్నారుగానీ...తాము వస్తే ఈ వ్యవస్థను ఎలా ప్రక్షాళన చేస్తామన్నది ఆయన చెప్పలేదు. నరేంద్ర మోడీ తదితర నేతలు కూడా సీబీఐని యూపీఏ సర్కారు స్వీయ ప్రయోజనాలకోసం వినియోగించుకున్నదని విమర్శించడమే తప్ప తాము వస్తే అలా చేయబోమని చెప్పడంలేదు. పైగా ‘ప్రతీకార భాష’ మాట్లాడుతున్నారు. కనుక ఆ సంస్థ ఒకరి నియంత్రణ నుంచి మరొకరి నియంత్రణలోకి వెళ్లడం మినహా మొత్తంగా పనితీరు మారదని దీన్నిబట్టి చూస్తే అర్ధమవుతుంది. సాధారణ సమయాల్లో ఎలాగూ కీలకమైన అంశాలపై చర్చ జరగడంలేదు. చట్టసభలు సైతం బలప్రదర్శన వేదికలుగా మారుతున్నాయి తప్ప ఆరోగ్యకరమైన చర్చలే జరగడంలేదు. కనీసం ఎన్నికల సమయంలోనైనా ఇలాంటి అంశాలపై చర్చ జరుగుతుందనుకుంటే పరస్పర దూషణలు తప్ప మరేమీ ఉండటంలేదు. ఆ దూషణలు కాస్తా ఇప్పుడు ప్రతీకార స్థాయికి చేరాయి. ఇలాంటి ధోరణులు మంచిదికాదని అన్ని పక్షాలూ గ్రహించాలి. హుందాతనంతో వ్యవహరించాలి. సంయమనం పాటించాలి. తమ మాటలైనా, చేతలైనా మంచి ప్రమాణాలను నెలకొల్పేందుకు దోహదపడాలని గుర్తించాలి. -
ఏడో దశకు ముగిసిన ప్రచారం
7 రాష్ట్రాలు, 2 యూటీలలోని 89 స్థానాలకు రేపే పోలింగ్ న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఏడో దశ ప్రచారానికి సోమవారం తెరపడింది. ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 89 లోక్సభ స్థానాలకు బుధవారం పోలింగ్ జరగనుంది. సుమారు 13.9 కోట్ల మంది ఓటర్లు 1,200 మందికిపైగా ఉన్న అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ప్రాంతంలో ఉన్న 17 లోక్సభ స్థానాలతోపాటు 119 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. అలాగే గుజరాత్లోని 26 లోక్సభ స్థానాలు, ఉత్తరప్రదేశ్లో 14 సీట్లు, పంజాబ్లో 13 సీట్లు, పశ్చిమ బెంగాల్లో 9 స్థానాలు, బీహార్లో 7, జమ్మూకాశ్మీర్, దాద్రా నగర్ హవేలీ, దామన్ దయూలలో ఒక్కో స్థానానికి ఓటింగ్ జరగనుంది. గుజరాత్, పంజాబ్లలో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. బరిలో హేమాహేమీలు... ఏడో దశ ఎన్నికల బరిలో నిలిచిన వివిధ పార్టీలకు చెందిన హేమాహేమీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (రాయ్బరేలీ), బీజేపీ అగ్ర నేత ఎల్.కె. అద్వానీ (గాంధీనగర్), ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ (వడోదరా), బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్ (లక్నో)ల భవితవ్యాన్ని ఓటర్లు నిర్దేశించనున్నారు. బరిలోని ఇతర ప్రముఖుల్లో కేంద్ర మంత్రి ఫరూఖ్ అబ్దుల్లా (శ్రీనగర్), -
రోడ్షో, బైక్ ర్యాలీలకు విశేష స్పందన
చర్ల, న్యూస్లైన్: వైఎస్ఆర్సీపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ చర్ల మండలంలో ఆదివారం నిర్వహించిన రోడ్షో, బైక్ ర్యాలీలకు విశేష స్పందన లభించింది. ఉదయం సుబ్బంపేట వద్ద ప్రారంభమైన ర్యాలీ కొయ్యూరు, ఉప్పరిగూడెం, సీ కత్తిగూడెం, జీపీపల్లి. వీరీపురం, మొగళ్లపల్లి, గొంపల్లి, దండుపేట, చర్లకు చేరింది. మధ్యాహ్నం చర్ల నుంచి భయలు దేరిన ఈ రోడ్షో, బైక్ర్యాలీలు దోశిళ్లపల్లి, పెదమిడిసిలేరు, తేగడ, ఆర్ కొత్తగూడెం, దేవరాపల్లి మీదుగా రాళ్లగూడెం వరకూ సాగింది. వైఎస్ఆర్ సీపీ మద్దతుతో భద్రాచలం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థి సున్నం రాజయ్య, వైఎస్ఆర్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర కమిటీసభ్యుడు కడెం రామాచారి, జిల్లా మహిళా నాయకురాలు దామర్ల రేవతి పాల్గొని ప్రసంగించారు. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి సీపీఎం మద్దతుతో బరిలో ఉన్న డాక్టర్ తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థి సున్నం రాజయ్యలను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కూటమి నాయకులు కొప్పినీడి నానిబాబు, రామగిరి యాకయ్య, పొడుపుగంటి సమ్మక్క, కలిదిండి సోమరాజు, తెల్లం సమ్మయ్య, చీమలమర్రి మురళీకృష్ణ, మేరెడ్డి చలపతిరెడ్డి, లంకా వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
మీ చల్లని దీవెనలు కావాలి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సార్వత్రిక ఎన్నికలలో వైఎస్సార్సీపీ, సీపీఎం తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్. జగన్మోహన్రెడ్డి జిల్లా ప్రజలను కోరారు. జిల్లాలో మధిర, కొత్తగూడెం, సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో రెండురోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన చేసిన ప్రసంగాలు ప్రజలను ఆలోచింపచేశాయి. ఆదివారం సత్తుపల్లి బస్టాండ్సెంటర్లో జరిగిన భారీ సభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... విశ్వసనీయతకు, నిజాయితీకి పట్టం కట్టే నాయకులను ఎన్నుకోవాలని కోరారు. పేదల మనసెరిగిన నాయకులకు, వారి గుండెచప్పుడు తెలిసిన నాయకులకు, చనిపోయిన తర్వాత పేదల గుండెల్లో నిలిచిపోవాలన్న ఆరాటం ఉన్న నాయకులకు ఓట్లేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఆల్ఫ్రీ అంటున్న చంద్రబాబు ఆయన పాలించిన తొమ్మిదేళ్లలో పేదల గురించి ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు. ఏరోజూ పేదల జీవితాలు పట్టని చంద్రబాబు రాజకీయాలను దిగజార్చి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రోజుకోమాట, పూటకో అబద్ధం చెప్పి పట్టపగలే ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. వైఎస్ మరణం తర్వాత గత ఐదేళ్లలో పేదలకు ఒక్క కొత్త రేషన్కార్డు, కొత్త ఇల్లు, కొత్త పింఛన్ ఇవ్వలేని కాంగ్రెస్కు ఓటేయవద్దనికోరారు. ఈ రెండు పార్టీల నేతలు ఓట్ల కోసం వస్తే మీకు ఓటెందుకు వేయాలని ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లాలోని పలు చోట్ల జరిగిన రోడ్షోల్లో జగన్ ప్రసంగం ఇలా సాగింది... ‘‘మిట్టమధ్యాహ్నం... మండుతున్న ఎండలో... ఇంటికిపోవడానికి ఏ ఒక్కరూ కూడా కారణాలు వెతుక్కోవడం లేదు. నడిరోడ్డయినా, ఎండాకాలమనే సంగతి తెలిసినా, కార్యక్రమం ఆలస్యమవుతున్నా ఏ ఒక్కరి ముఖంలో కూడా చికాకు అనేది కూడా కనిపించడం లేదు. కష్టమనిపించినా, నడిరోడ్డుపై నిలబడి, ఎండ తీక్షణంగా ఉన్నా చిక్కటి చిరునవ్వుతో ఇంతటి ఆప్యాయతలు చూపెడుతున్నారు. ప్రేమానురాగాలు కురిపిస్తున్నారు. మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లికీ, ప్రతి అవ్వకు, తాతకు, ప్రతి సోదరునికి, ప్రతి సన్నిహితుడికి చేతులు జోడించి శిరస్సు వంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలలో ఎంపీ, ఎమ్మెల్యేల కోసం మీరు వేసే ఓటు చాలా కీలకమైనది. మీ తలరాతను మార్చే ఎన్నికలు ఇవి. వేసే ప్రతి ఓటు ఎటువంటి పార్టీకి వేస్తున్నారు... ఎటువంటి నాయకత్వానికి వేస్తున్నారనేది ప్రతి ఒక్కరూ ఓటేసే ముందు ప్రశ్నించుకోవాలి. ఏ నాయకుడు పేదవాడి గుండె చప్పుడు తె లుసుకుంటాడో, వారి మనసెరుగుతాడో, చనిపోయిన తర్వాత కూడా వారి గుండెల్లో ఉండాలని ఆరాటపడతాడో అలాంటి నేతలకే ఓట్లేయాలి. అలాంటి పార్టీనే అధికారంలోకి తెచ్చుకోవాలి. అప్పుడే మన తలరాతలు మంచిగా ఉంటాయి. ఒక్కటయితే చెపుతున్నా నాయకత్వం అంటే ఎలా ఉండాలి... సీఎం అంటే ఎలా ఉండాలి అనేదానికి వైఎస్ను చూడాలి. ఆ దివంగత నేత, ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర్రెడ్డి మన మధ్యలోంచి వెళ్లిపోయి ఐదేళ్లు గడుస్తున్నా మన హృదయాల్లోనే ఉన్నాడు. ఆయనకన్నా ముందు, ఆయన తర్వాత చాలా మంది సీఎంలను మనం చూశాం. కానీ సీఎం అంటే ఇలా ఉండాలని రాష్ట్రానికే కాదు దేశానికే చాటి చెప్పిన వ్యక్తి వైఎస్సార్. ఒక్క మాటలో చెప్పాలంటే నేను రామరాజ్యమైతే చూడలేదు కాానీ రాజశేఖరుని సువర్ణయుగాన్ని మాత్రం చూశాను. చాలా మంది సీఎంలు చేయలేనిది వైఎస్ చేశారు. ఇవ్వలేనివి ఇచ్చారు. ప్రతి పేదవాడి గుండెలో నిలిచిపోయారు. పేదల గురించి ఆలోచించని బాబు... వైఎస్ కన్నా ముందు పాలన సాగించిన చంద్రబాబునాయుడు ఏ రోజూ పేదల పరిస్థితి గురించి ఆలోచించలేదు. పేదవిద్యార్థుల గురించి ఆలోచించలేదు. వృద్ధులకు పింఛన్ను ఏదో ముష్టివేసినట్టు రూ.70 ఇచ్చేవారు. గ్రామంలో మూడు, నాలుగు వందల మంది పింఛన్కు అర్హులైన వారుంటే పదిమందికో, పదిహేనుమందికో ఇచ్చేవారు. మిగిలిన పింఛన్ల గురించి ఆర్డీవోను అడిగితే ఇప్పుడు ఇచ్చే 15 మందిలో ఎవరో ఒకరు చనిపోతేనే ఇంకో పింఛన్ ఇస్తామని చెప్పిన మాటలు నా చెవుల్లో మార్మోగుతున్నాయి. గ్రామాల్లో పేదలకు ఇళ్లు కట్టించే క్రమంలో మూడు, నాలుగు వందల ఇళ్లు అవసరం అయితే 10మందికి ఇచ్చేవారు. ఇళ్లకోసం గ్రామస్తులు ఆర్డీవో దగ్గరకు వెళితే నియోజకవర్గానికి 500 ఇళ్లు మాత్రమే ఇచ్చారని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సర్దుబాటు చేయాలంటే 5 ఇళ్లకంటే ఎక్కువ ఇవ్వలేమనే మాటలు నాకు గుర్తొస్తున్నాయి. చంద్రబాబు పాలన చేస్తున్న రోజుల్లో విశ్వసనీయత, నిజాయితీకి అర్థం లేదు. ఆయన ఎన్నికలకు ముందు ఓ మాట, ఎన్నికల తర్వాత ప్రజలతో నాకేం పనిలే అన్నట్టు మరో మాట చెప్తారు. ఇప్పుడు కూడా ఎన్నికలొస్తున్నాయికదా అని సాధ్యం కాని హామీలిస్తున్నాడు. రోజుకో అబద్ధం చెపుతున్నాడు. ఒకరోజు టీవీలు ఉచితంగా ఇస్తానంటాడు. మరోరోజు సెల్ఫోన్లు ఫ్రీ అంటాడు. రుణమాఫీ అంటాడు. డ్వాక్రా రుణాల మాఫీ అంటాడు. బుట్ట తీసుకుని మీ ఇంటికే వచ్చి అన్నీ ఫ్రీగా ఇస్తానంటాడు. పట్టపగలే ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న బాబును చూస్తే నిజంగా రాజకీయాలు ఇంతగా దిగజారాయా అనిపిస్తుంది. ఇంతటి విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబునాయుడు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన కూడా అంతే. గత ఐదేళ్లలో ఒక్క రేషన్కార్డయినా ఇచ్చారా? ఒక్క పింఛన్ అయినా ఇచ్చారా? ఒక్క ఇల్లయినా కట్టించారా అని ఓటడిగేందుకు వచ్చే కాంగ్రెస్ నేతలను ప్రశ్నించండి. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ అనే పదానికి అర్థం తేవాలి. నాయకుడు మాట ఇస్తే మడమ తిప్పడనే సంకేతాలివ్వాలి. నేను ఒకటే చెపుతున్నా. సీమాంధ్రకు సీఎంగా నేను ప్రమాణం చేస్తా. అయినా తెలంగాణను మాత్రం విడిచిపెట్టేది లేదు. వైఎస్ ప్రతి గుండెల్లో ఉన్నాడు. ఇంతపెద్ద కుటుంబాన్ని నాకిచ్చి వెళ్లాడు. నేను ఒకటయితే చెపుతున్నా అక్కడ చేసే 11 కార్యక్రమాలు ఇక్కడ కూడా అమలుచేస్తాం. నా సోదరి షర్మిల త్వరలోనే తెలంగాణలో ఓదార్పు యాత్ర చేస్తుంది. ఓదార్పు యాత్ర ఎందుకంటే... మంచి నాయకుడు కావాలంటే ఎవరూ చూడని గ్రామాలను చూడాలి. ఎవరూ వెళ్లని పూరి గుడిసెల్లోకి వెళ్లాలి. అక్కడ అక్కచెల్లెళ్లు ఎలా బతుకుతున్నారో గమనించాలి. ఒకటి కాదు రెండు కాదు... నేను 800 ఇళ్లు తిరిగాను. ఓదార్పు యాత్ర నిర్వహించాను. రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడికి తెలియని విషయాలు, పేదలగురించిన విషయాలు నాకు మాత్రమే తెలుసు. పేదల కష్టాలు తెలుసుకుంటేనే మంచి రాజకీయ నాయకుడవుతారు. ఏదిఏమైనా ఈ ఎన్నికలలో కలిసికట్టుగా ఒక్కటై దివంగత నేత, ప్రియతమ నాయకుడు వైఎస్ కలలు కన్న సువర్ణయుగాన్ని తీసుకువద్దాం. ఈ ఎన్నికల్లో ఒకవైపు నిజాయితీ, విశ్వసనీయత.., మరోవైపు కుట్రలు, కుతంత్రాల మధ్య పోటీ జరుగుతోంది. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఇచ్చి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరుతున్నా.’ కొత్తపార్టీ.. ఫ్యాన్ గుర్తు జగన్ సభల్లో మాట్లాడుతూ....‘మీకు ఒకమాట చెపుతున్నా..... మన పార్టీ కొత్త పార్టీ. గుర్తు కొత్త గుర్తు. మన గుర్తు తెలియని వ్యక్తులు కూడా ఉంటారు. అందుకే చెపుతున్నా మన ఫ్యాన్ గుర్తు తెలిసిన వారు తెలియనివారికి చెప్పాలి. మీలో ఎంత మందికి ఫ్యాన్ గుర్తు తెలుసో చేతులు లేపండి’ అన్నప్పుడు ఆయా సభలకు హాజరైన వారిలో 99 శాతం మంది చేతులు లేపారు. దీంతో ఇంతమందికి గుర్తు తెలిసినందుకు చాలా ఆనందంగా ఉందని, అ యినా ఒక్కసారి మన ఫ్యాన్ గుర్తు చూపిస్తానని, చూడవలసిందిగా జగన్ విజ్ఞప్తి చేశారు. సభ నలువైపులా గుర్తు చూపిస్తూ అన్నా ఫ్యాన్.. తల్లీ ఫ్యాన్... అవ్వా ఫ్యాన్..అంటూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లేయాల్సిందిగా అభ్యర్థించారు. -
ఎన్నికలు పూర్తయ్యాకే ఉద్యోగుల విభజన
-
ఎన్నికలు పూర్తయ్యాకే ఉద్యోగుల విభజన
ముందే విభజిస్తే ఎన్నికలపై ప్రభావం: సీఈఓ నోట్ విభజన మార్గదర్శకాలు సైతం మే 17వ తేదీ తర్వాతే.. హైదరాబాద్: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యే వరకు ఉద్యోగుల విభజన చేయరాదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) భన్వర్లాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. అఖిల భారత సర్వీసు ఉద్యోగుల విభజన కూడా ఎన్నికలయ్యాకనే చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక నోట్ పంపారు. ఉద్యోగుల విభజన.. ఈ నెల 30న తెలంగాణ జిల్లాల్లోను, మే 7న సీమాంధ్ర జిల్లాల్లో జరిగే ఎన్నికలపై ప్రభావం చూపుతుందని సీఈఓ అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికలయ్యే వరకు ప్రధానంగా రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగుల విభజనకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోరాదని తెలిపారు. ఒకవేళ తీసుకుంటే ఎన్నికలపై ప్రభావం చూపడంతో పాటు ఎన్నికల ప్రక్రియకు కూడా ఆటంకం కలగవచ్చనే అభిప్రాయూన్ని ఎన్నికల కమిషన్ వ్యక్తం చేసింది. ఉద్యోగుల విభజన ఎలా ఉండాలనే దానిపై ఇప్పటికే ఇరు ప్రాంతాల ఉద్యోగ సంఘాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. మరోవైపు ఈ అంశాన్ని ఎన్నికల్లో తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలను సైతం ఇప్పుడు వెలువరించరాదని సీఈఓ స్పష్టం చేశారు. ఎన్నికలు మే 7వ తేదీతో పూర్తి అవుతున్నప్పటికీ ఎన్నికల నియమావళి కౌటింగ్ పూర్తి అయ్యే వరకు అమల్లో ఉంటుంది. అందువల్ల ఉద్యోగుల విభజనకు సంబంధించిన ఏ నిర్ణయాలైనా మే 17వ తేదీ తరువాతనే తీసుకోవాలని భన్వర్లాల్ ఆ నోట్లో పేర్కొన్నారు. దీంతో కమలనాథన్ కమిటీ ఉద్యోగుల విభజన మార్గదర్శకాలపై అధికారికంగా ఎటువంటి ప్రకటనలు చేయరాదని నిర్ణరుుంచింది. గతంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా కూడా పనిచేసిన కమలనాథన్ ఈ విషయంపై చర్చించేందుకు సీఈఓ కార్యాలయానికి వచ్చారు. అరుుతే భన్వర్లాల్ భోజన విరామంలో ఉండటంతో పావు గంట వేచి చూసిన అనంతరం వెళ్లిపోయారు. మరోవైపు ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎస్ మహంతి ప్రధాన ఎన్నికల కమిషనర్ సంపత్ను కలసి విభజన పనులకు ఎన్నికల నియమావళి వర్తింపుపై చర్చించారు. -
‘ఆరు’కు ముగిసిన ప్రచారం
11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో 117 సీట్లకు రేపే పోలింగ్ బరిలోని ప్రముఖులు ములాయం, అజహర్, హేమమాలిని, సుష్మ న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఆరో దశ పోలింగ్కు మంగళవారంతో ప్రచారపర్వం ముగిసింది. 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 117 లోక్సభ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. తమిళనాడులోని మొత్తం 39 సీట్లతోపాటు మహారాష్ట్రలో 19 సీట్లు, యూపీలో 12, మధ్యప్రదేశ్లో 10, బీహార్, ఛత్తీస్గఢ్లలో ఏడు స్థానాలు చొప్పున, అస్సాం, పశ్చిమ బెంగాల్లలో ఆరు సీట్ల చొప్పున, రాజస్థాన్లో 5 సీట్లు, జార్ఖండ్లో 4, జమ్మూకాశ్మీర్, పుదుచ్చేరిలలో ఒక్కో స్థానానికి ఓటింగ్ జరగనుంది. మొత్తం 2,087 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని సుమారు 17.9 కోట్ల మంది ఓటర్లు నిర్దేశించనున్నారు. ఆరో దశ బరిలో నిలిచిన ప్రముఖుల్లో కేంద్ర మంత్రులు సల్మాన్ ఖుర్షీద్, మిలింద్ దేవ్రా, నమో నారాయణ్ మీనా, జితేంద్ర సింగ్, తారిక్ అన్వర్, ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్, ఎన్సీపీ నేత చగన్ భుజ్బల్, సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్, రాష్ట్రపతి ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ, బాలీవుడ్ ‘డ్రీమ్గర్ల్’ హేమమాలిని, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ తదితరులు ఉన్నారు. తమిళనాడులో ఎన్నికల బరిలో నిలిచిన 845 మంది అభ్యర్థుల్లో 100 మందికిపైగా నేరచరితులే ఉన్నట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, తమిళనాడు ఎలక్షన్ వాచ్ సంస్థలు వెల్లడించాయి. ఆజంగఢ్ స్థానానికి ములాయం నామినేషన్ ఆజంగఢ్: ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి స్థానానికి ఈ నెల 4న నామినేషన్ వేసిన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయంసింగ్ యాదవ్ మంగళవారం ఆ రాష్ట్రంలోని ఆజంగఢ్ స్థానానికి నామినేషన్ వేశారు. జిల్లా ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కార్యకర్తల ఒత్తిడి మేరకే రెండో స్థానంగా ఆజంగఢ్ నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తమ రాష్ట్రంలోని వారణాసి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి ప్రతిగా తనను ఆజంగఢ్ నుంచి పోటీ చేయాల్సిందిగా కార్యకర్తలు కోరారని చెప్పారు. అత్యంత ధనిక అభ్యర్థుల్లో ‘డ్రీమ్గర్ల్’ న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని మథుర నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న బాలీవుడ్ నటి, ‘డ్రీమ్గర్ల్’ హేమమాలిని ఆరో దశ ఎన్నికల బరిలో నిలిచిన అత్యంత ధనవంతుల్లో ఒకరిగా నిలిచారు. తనకు రూ. 178 కోట్ల ఆస్తులున్నట్లు హేమమాలిని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనడం తెలిసిందే. ఆరో దశలో పోటీ చేస్తున్న ఒక్కో బీజేపీ అభ్యర్థి సగటు ఆస్తి రూ. 14 కోట్లు ఉండగా హేమమాలిని ఆస్తులు మాత్రం అందుకు 12 రెట్లకన్నా ఎక్కువగా ఉన్నట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ తెలిపింది. -
మోడీ షో నేడే
-
పోలింగ్ జరిగిన చోట్ల బీజేపీదే ఆధిక్యం
బీజేపీ తెలంగాణ ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ హైదరాబాద్: ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 235 పార్లమెంటు స్థానాలకు జరిగిన పోలింగ్లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తే ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 300 పైచిలుకు స్థానాల్లో విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి రానుందని స్పష్టమవుతోందని ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. అవినీతి, కుంభకోణాలు, అస్తవ్యస్త పాలనతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన కాంగ్రెస్ దారుణ పరాజయాన్ని చవిచూడనుందని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్లో గతంలోకంటే 10 నుంచి 15 శాతం వరకు ఎక్కువగా నమోదైందని, అది బీజేపీకి లాభపడిందని తమ విశ్లేషణలో తేటతెల్లమైందని జవదేకర్ పేర్కొన్నారు. తమ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ సామాజిక వర్గం, చాయ్ అమ్ముకునే కుటుంబం నుంచి వచ్చిన తీరును కించపరిచేలా కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలు ఇప్పుడు తమకు వరంగా మారాయని తెలిపారు. అట్టడుగు వర్గాలు కాంగ్రెస్ ఆరోపణలతో ఆగ్రహంగా ఉన్నాయని, వారంతా మోడీని బలపరుస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ, సీమాంధ్ర లో కూడా బీజేపీ మంచి ఫలితాలను సాధిస్తుందన్నారు. సీమాంధ్రతో టీడీపీతో కలిసి అధికారంలోకి వస్తామని, తెలంగాణలో అనూహ్య ఫలితాలు సాధిస్తామని అన్నారు. మోడీ ప్రధాని అయితేనే ఈ రెండు రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఇక కేసీఆర్ చెబుతున్న మూడో కూటమికి మనుగడే ఉండదని, అయినా... తెలంగాణను వ్యతిరేకించిన వారితో ఉండే ఆ కూటమిలో కలుస్తానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ఎలా అంటారని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో దక్షిణ భారతదేశంలో 85 సీట్లు పొందిన కాంగ్రెస్ ఈసారి 15 సంఖ్య దాటదని, అదే 18 సీట్లు పొందిన బీజేపీ ఇప్పుడు 58 వరకు సీట్లు సాధించే అవకాశం ఉందని అన్నారు. -
మోడీ షో నేడే
నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, హైదరాబాద్లలో పర్యటన ఎల్బీ స్టేడియంలో ప్రసంగించనున్న పవన్కల్యాణ్ భారీ జనసమీకరణకు కమలదళం ముమ్మర ఏర్పాట్లు 'భారత్ విజయ్ సంకల్ప్ యాత్ర’గా నామకరణం హైదరాబాద్: సరిగ్గా ఎనిమిది నెలల క్రితం... ఆగస్టు 11న ఎల్బీ స్టేడియంలో బహిరంగసభలో ప్రసంగించటం ద్వారా బీజేపీ తరఫున సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ మరోసారి రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. మంగళవారం ఆయన సుడిగాలి పర్యటన కోసం తెలంగాణకు వస్తున్నారు. నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్తోపాటు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఒకేరోజు నాలుగు బహిరంగ సభలను ఏర్పాటు చేసిన బీజేపీ నేతలు వాటిని విజ యవంతం చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో బహిరంగ సభలతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యర్థులపై విమర్శలు కురిపిస్తుండడం... మూడు రోజుల క్రితం కరీంనగర్లో సోనియా, సోమవారం మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాల్లో రాహుల్ సభలతో కాంగ్రెస్ కాస్త ఉత్సాహం మీదుండగా బీజేపీ మాత్రం నియోజకవర్గాల ప్రచారానికే పరిమితమైంది. దీంతో మోడీ సభలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వాటిని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వాస్తవానికి తెలంగాణలో రెండు విడతల్లో ప్రచారం చేయటానికి తొలుత నరేంద్రమోడీ అంగీకరించారు. రెండు రోజుల్లో తెలంగాణ మొత్తాన్ని చుట్టడం సాధ్యం కానందున మూడు రోజులు సమయం కేటాయించాలని పార్టీ తెలంగాణ నేతలు కోరారు. కానీ దేశవ్యాప్తంగా ప్రచారాన్ని భుజానేసుకున్న మోడీ ఎన్నికల సభల షెడ్యూల్ అత్యంత బిజీగా ఉండటంతో దానికి అంగీకరించలేదు. ఆ తర్వాత సమయాభావం వల్ల రెండు విడతల పర్యటనను కూడా ఒక విడతకు కుదించుకున్నారు. తెలంగాణలో ప్రత్యర్థులకు గట్టిపోటీనిస్తున్నట్టుగా పార్టీ భావిస్తున్న నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాల్లోనే ప్రచారానికి వస్తున్నట్టు మోడీ తేల్చిచెప్పారు. దీంతో కంగుతిన్న పార్టీ తెలంగాణ నేతలు అతికష్టంమీద మహబూబ్నగర్ను కూడా జోడించగలిగారు. అక్కడ కూడా పార్టీ గట్టిపోటీనిస్తోందని, మోడీ ప్రచారం చేస్తే పరిస్థితి మరింత అనుకూలంగా మారుతుందని ఆయనకు నివేదిక ఇవ్వటంతో దానికి అంగీకరించారు. దీంతో ఒకేరోజు నాలుగు సభలకోసం ఆయన పర్యటన ఖరారైంది. సోనియా, రాహుల్ల సభలకు జనం ఊహించినంతగా రాలేదని భావిస్తున్న బీజేపీ నేతలు ముందుగానే జాగ్రత్త పడ్డారు. నియోజకవర్గాల వారీగా సమావేశమై భారీ జనసమీకరణకు ఏర్పాట్లు చేశారు. ‘భారత్ విజయ్ సంకల్ప్ యాత్ర’గా వీటికి బీజేపీ నామకరణం చేసింది. ఇదిలా ఉండగా నిజామాబాద్, హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభల్లో జనసేన అధినేత పవన్కల్యాణ్ కూడా పాల్గొననున్నారు. పవన్కల్యాణ్ను నిజామాబాద్ సభకు తీసుకువెళ్లడానికి బీజేపీ నేతలు ప్రత్యేక హెలికాప్టర్ను ఏర్పాటు చేశారు. ఈ సభ అనంతరం పవన్ అదే హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరిగి వచ్చి సాయంత్రం ఎల్బీ స్టేడియం సభకు హాజరై ప్రసంగిస్తారు. ఎమ్మల్యే అభ్యర్థులకు మరో వేదిక... మోడీ ఉండే వేదికపైకి బీజేపీ-టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రవేశం ఉండదని తెలుస్తోంది. వారి కోసం విడిగా వేదికలు ఏర్పాటు చేయాలని మోడీ భద్రతా సిబ్బంది పార్టీకి స్పష్టం చేశారు. దీంతో హైదరాబాద్, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన అభ్యర్థులు పాల్గొనే ఎల్బీస్టేడియం సభలో వారి కోసం అదనంగా మరో భారీ వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్డీయే సభ అయినందున ఎల్బీస్టేడియంకు టీడీపీ అభ్యర్థులు కూడా హాజరవుతున్నారు. నిజామాబాద్, కరీంనగర్లలో మాత్రం ఈ విషయంలో స్పష్టత రాలేదు. తామూ హాజరవుతామంటూ టీడీపీ అభ్యర్థులు కోరుతున్నా బీజేపీ నేతలు తర్వాత చెప్తామని పేర్కొనటం విశేషం. పర్యటన షెడ్యూల్ ఇలా... నిజామాబాద్: మధ్యాహ్నం 1.45 గంటలు - నరేంద్రమోడీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి జవదేకర్, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి, జనసేన అధినేత పవన్కల్యాణ్ పాల్గొంటారు. కరీంనగర్: మధ్యాహ్నం 3.15 - మోడీ, కిషన్రెడ్డిలు మాత్రమే పాల్గొంటారు. మహబూబ్నగర్: సాయంత్రం 5 గంటలు - మోడీ, చంద్రబాబు, బీజేపీ జాతీయస్థాయి నేత రాజ్ పురోహిత్, కిషన్రెడ్డి పాల్గొంటారు. ఎల్బీస్టేడియం (హైదరాబాద్): సాయంత్రం 6.15 గంటలలు - మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు జవదేకర్, కిషన్రెడ్డి, సతీష్జీ, మురళీధర్రావులు పాల్గొంటారు. -
ఒపీనియన్ పోల్స్ ఫలితాలపై ఆంక్షలు
మే 12 దాకా వెల్లడించవద్దని మీడియాకు ఈసీ ఆదేశాలు న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసేదాకా ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్పోల్స్ ఫలితాలను వెల్లడించరాదని మీడియాకు ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం ఆంక్షలు విధించింది. వచ్చే నెల 12న తుది విడత ఎన్నికలు ముగిసిన అరగంట వరకూ ఒపీనియన్, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రచురణ, ప్రసారాలను నిలిపేయాలని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలను ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికలకు ఈనెల 7న పోలింగ్ ప్రారంభం కాగా.. మొత్తం 9 విడతల్లో మే 12న ముగియనుంది. ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఇంతకుముందు ఏప్రిల్ 7 నుంచి మే 12 వరకూ ఎగ్జిట్పోల్స్ ఫలితాల వెల్లడిని నిషేధించింది. అలాగే ఆయా ప్రాంతాల్లో పోలింగ్కు 48 గంటల్లోపు ఒపీనియన్ పోల్స్ కూడా వెల్లడించరాదని స్పష్టం చేసింది. అయితే ఏప్రిల్ 14న పోలింగ్ జరిగిన 111 లోక్సభ స్థానాలకు సంబంధించి ఓ టీవీ చానెల్ (ఎన్డీ టీవీ) ఒపీనియన్ పోల్స్ ఫలితాలు ప్రసారం చేసిందని, ఓటింగ్ను ప్రభావితం చేసే ఇలాంటి చర్యలు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 126ఏను ఉల్లంఘించడమేనని ఈసీ పేర్కొంది. ఆ పార్టీల నుంచి పూర్తి పన్ను వసూలుచేయండి: సేకరించిన విరాళాల వ్యయానికి సంబంధించి నివేదికలు సమర్పించని పార్టీలకు పన్ను ప్రయోజనాలను రద్దు చేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ)ని ఈసీ కోరింది. విరాళాల వ్యయంపై చాలా పార్టీలు ఇంతవరకూ నివేదికలు సమర్పించలేదని, అందువల్ల ఆ పార్టీలు స్వీకరించిన విరాళాలపై పూర్తి పన్నును వసూలు చేయాలని ఈసీ పేర్కొంది. -
కుదిరిన రాయ‘బేరం’
ప్రతినిధి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కొలిక్కి తెచ్చినా ‘తమ్ముళ్ల’ గ్రూపు తగాదాలతో సతమతమవుతున్నారు. హిందూపురం అభ్యర్థిగా బాలకృష్ణ పేరును అధికారికంగా ఖరారు చేశారు. దీంతో 16న బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాయ‘బేరం’ కుదరడంతో మాజీ ఎమ్మెల్యే మధుసూదన్గుప్తాకు టీడీపీ తీర్థం ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారు. పనిలో పనిగా గుంతకల్లు అభ్యర్థిత్వాన్ని ఆయనకే ఖరారు చేసినట్లు సమాచారం. మడకశిర అభ్యర్థిగా ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ఈరన్ననే మరోసారి ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ రెండు అభ్యర్థిత్వాలను చంద్రబాబు ఆదివారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. చంద్రబాబు ఏకపక్ష వైఖరిపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. బీజేపీతో పొత్తులో భాగంగా అనంతపురం శాసనసభ స్థానాన్ని ఆ పార్టీకి టీడీపీ వదిలేసిన విషయం విదితమే. రెండు లోక్సభ, 13 శాసనసభ స్థానాల్లో పోటీ చేయాలని టీడీపీ నిర్ణయించింది. హిందూపురం లోక్సభ అభ్యర్థిగా ఎంపీ నిమ్మల క్రిష్టప్ప, ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ధర్మవరం, రాప్తాడు, పెనుకొండ, కదిరి, పుట్టపర్తి అభ్యర్థులుగా పయ్యావుల కేశవ్, ఉన్నం హనుమంతరాయచౌదరి, కాలవ శ్రీనివాసులు, వరదాపురం సూరి, పరిటాల సునీత, బీకే పార్థసారధి, కందికుంట వెంకటప్రసాద్, పల్లె రఘునాథరెడ్డిలను తొలి జాబితాలోనే ఖరారు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి విడుదల చేసిన రెండో జాబితాలో అనంతపురం లోక్సభ అభ్యర్థిగా జేసీ దివాకర్రెడ్డి, తాడిపత్రి, శింగనమల అభ్యర్థులు జేసీ ప్రభాకర్రెడ్డి, బండారు రవికుమార్లను ప్రకటించారు. రెండో జాబితాలోనే హిందూపురం అభ్యర్థిగా బాలకృష్ణ పేరును ప్రకటించాలని చంద్రబాబు నిర్ణయించారు. కానీ.. అదే సీటు కోసం హరికృష్ణ పట్టుబడుతుండటం, హిందూపురం స్థానిక నేతలు కూడా పోటీపడుతోండటంతో వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న ఉద్దేశంతో బాలకృష్ణ పేరును చివరి నిముషంలో తప్పించారు. ఇది పసిగట్టిన బాలకృష్ణ శనివారం ఉదయం చంద్రబాబుతో సమావేశమై తన అభ్యర్థిత్వంపై నిలదీసినట్లు సమాచారం. దీంతో హిందూపురం ఎమ్మెల్యే అబ్దుల్ఘనీ, ఆ నియోజకవర్గ నేతలను హుటాహుటిన హైదరాబాద్కు రప్పించిన చంద్రబాబు.. వారికి సర్దిచెప్పి బాలకృష్ణ అభ్యర్థిత్వాన్ని శనివారం ఖరారు చేశారు. ‘పురం’ అభ్యర్థిగా బాలకృష్ణ ఈనెల 16న నామినేషన్ దాఖలు చేయనున్నారు. కుదిరిన రాయ‘బేరం’ గుంతకల్లు టీడీపీ అభ్యర్థిత్వం కోసం జితేందర్గౌడ్, కేసీ నారాయణస్వామి, వెంకటశివుడు యాదవ్లు పోటీపడగా వారి పేర్లను చంద్రబాబు కనీసం పరిశీలించలేదు. మధుసూదన్ గుప్తాతో సీఎం రమేష్, జేసీ దివాకర్రెడ్డి ద్వారా రాయ‘బేరం’ జరిపారు. ‘బేరం’ కుదరడంతో గుప్తాను టీడీపీలో చేర్చుకోవడానికి చంద్రబాబు అంగీకరించారు. గుంతకల్లు అభ్యర్థిగా ఆయన పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. అధికారిక ప్రకటన ఆదివారం వెలువడే అవకాశం ఉంది. చంద్రబాబు తీరుపై జితేందర్గౌడ్, కేసీ నారాయణస్వామి, వెంకటశివుడు యాదవ్లు మండిపడుతున్నారు. ఆ ముగ్గురిని సంతృప్తిపరచి రాజీ చేసుకునే బాధ్యతను కూడా మధుసూదన్గుప్తాకే చంద్రబాబు అప్పగించినట్లు సమాచారం. రాయదుర్గం అభ్యర్థిత్వాన్ని కాలవ శ్రీనివాసులకు ఖరారు చేయడంపై దీపక్రెడ్డి భగ్గుమంటున్నారు. కాలవకు సహకరించే ప్రశ్నే లేదని తెగేసి చెబుతున్నారు. కార్యకర్తలతో ఆదివారం మరోమారు సమావేశమై భవిష్యత్పై దీపక్రెడ్డి నిర్ణయం తీసుకోనున్నారు. శింగనమల నియోజకవర్గంలో బండారు రవికుమార్కు కూడా ఆపార్టీ శ్రేణుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. చంద్రబాబు నిర్ణయంపై ఎమ్మెల్సీ శమంతకమణి మండిపడుతున్నారు. ‘అనంత’ కమలనాథులదే.. శుక్రవారం అర్ధరాత్రి చంద్రబాబుతో సమావేశమైన బీజేపీ నేతలు.. అనంతపురం శాసనసభ స్థానం తమకు వద్దని మరో స్థానం కేటాయించాలని ప్రతిపాదించారు. కానీ.. ఆ ప్రతిపాదనను చంద్రబాబు తోసిపుచ్చారు. అనంతపురం నియోజకవర్గంలో టీడీపీ ముఠా తగాదాలు భారీ స్థాయిలో ఉన్నందున ఆ స్థానాన్ని మీకు కేటాయించామని చంద్రబాబు స్పష్టీకరించడంతో కమలనాథలు తెల్లబోయారట. అనంతపురం బీజేపీ అభ్యర్థిగా తాళంకి శ్రీధర్ లేదా ఎన్టీ చౌదరిని ఎంపిక చేయాలని చంద్రబాబు ఉచిత సలహా ఇవ్వడం కమలనాథులను ఆగ్రహానికి గురిచేసినట్లు సమాచారం. తాళంకి శ్రీధర్ తండ్రి తాళంకి కృష్ణమూర్తి బీజేపీలో దశాబ్దాల పాటు పనిచేశారు. ఆర్ఎస్ఎస్లో కూడా పనిచేశారు. తాళంకి శ్రీధర్ అమెరికాలో స్థిరపడ్డారు. -
సార్వత్రిక నోటిఫికేషన్ విడుదల
తొలి రోజు 10 నామినేషన్లు ఎంపీ స్థానానికి ఒకటి, అసెంబ్లీ స్థానాలకు9 అనంతపురం కలెక్టరేట్, సార్వత్రిక సంగ్రామం మొదలైంది. శనివారం ఉదయం 11 గంటలకు తమ చాంబర్లో కలెక్టర్ లోకేష్కుమార్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ నోటిఫికేషన్ను విడుదల చేశారు. గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి బీ.విజయేందిర గుంతకల్లు తహసీల్దార్ కార్యాలయంలో విడుదల చేయగా అనంతపురం, ధర్మవరం, పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం ఆర్ఓలు హుస్సేన్సాబ్, నాగరాజ, వెంకటేష్ ఆయా ఆర్డీఓ కార్యాలయాల్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. మిగిలిన నియోజకవర్గాలకు చెందిన ఆర్ఓలు ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో నోటిఫికేషన్ జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ప్రతిని ఆయా కార్యాలయాల్లోని నోటీస్బోర్డుల్లో, గ్రామ పంచాయతీ భవనాల వద్ద ప్రదర్శించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ స్థానాలకు 9 నామినేషన్లు తొలి రోజు అసెంబ్లీ స్థానాలకు 9 నామినేషన్లు దాఖలయ్యాయి. అనంతపురం అర్బన్ అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బి.గురునాథ్రెడ్డి ఒక సెట్టు నామినేషన్ను రిటర్నింగ్ అధికారి హుస్సేన్సాబ్కు అందజేశారు. ఇదే స్థానానికి సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ (ఎస్యూసీఐ(సీ)) పార్టీ అభ్యర్థి డి.రాఘవేంద్ర నామినేషన్ వేశారు. గుంతకల్లు అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యరిగా బీ.ఉదయ్కిరణ్ ఒక సెట్టు నామినేషన్ వేశారు. పుట్టపర్తి అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కడపల మోహన్రెడ్డి తరఫున ఒక సెట్టు నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. కదిరి అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్, ఆయన సతీమణి కె. యశోదాదేవి ఒక్కో సెట్ నామినేషన్లు సమర్పించారు. ఇదే అసెంబ్లీ స్థానానికి వీ.భాస్కర్రెడ్డి ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు. శింగనమలలో వైఎస్ఆర్సీపీ నేత జొన్నలగడ్డ పద్మావతి నామినేషన్ వేశారు. ఇదే నియోజకవర్గానికి యుసీసీఆర్ఐ (ఎంఎల్) తరఫున ఓబుళేసు నామినేషన్ వేశారు. లోక్సభకు బోణి తొలి రోజే అనంతపురం లోక్సభ స్థానానికి బోణీ అయింది. సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ (ఎస్యూసీఐ(సీ)) పార్టీకి చెందిన అభ్యర్థి జీ.లలిత ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేశారు. పత్రాలను అనంతపురం లోక్సభ రిటర్నింగ్ అధికారి కలెక్టర్కు అందజేశారు. అంతకు ముందు పార్టీ కార్యాలయం నుంచి ఆమె ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. అభ్యర్థితో పాటు ఐదుగురిని మాత్రమే లోపలికి అనుమతించారు. -
సీమాంధ్రలో సమరభేరి
175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ హైదరాబాద్: రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తొలి సార్వత్రిక ఎన్నికల రణం ఊపందుకుంది. వచ్చే నెల 7న పోలింగ్ జరగనున్న 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం నోటిఫికేషన్ జారీ చేయగా.. తొలి రోజే నామినేషన్ల పర్వం జోరందుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకివే తొలి సార్వత్రిక ఎన్నికలు కాగా.. ఆ పార్టీ సీమాంధ్రలోని అసెంబ్లీ, లోక్సభ స్థానాలన్నింటికీ ఒకేసారి జాబితా విడుదల చేయాలని నిర్ణయించింది. సోమవారమే ఆ జాబితా వెలువడనుందని విశ్వసనీయ సమాచారం. జాబితా ప్రకటనకు ఒక్క రోజు ముందు ఆదివారం పార్టీ మేనిఫెస్టోను ప్రకటించడానికి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు బీజేపీతో పొత్తుపెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికి రెండు దఫాలుగా సీమాంధ్ర అభ్యర్థుల జాబితా ప్రకటించారు. రెండు జాబితాలు కలిపి మొత్తం 87 అసెంబ్లీ, 13 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను వెల్లడించారు. పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన 15 అసెంబ్లీ, 5 లోక్సభ స్థానాలను తీసేస్తే.. ఇంకా 73 అసెంబ్లీ, 7 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సీపీఎం, సీపీఐలు ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను వెల్లడించాయి. మరోవైపు రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ ఆదివారం తన జాబితా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. జోరుగా ప్రచారం.. ఇప్పటికే ‘వైఎస్సార్ జనభేరి’ పేరుతో రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేసిన వైఎస్సార్ సీపీ అగ్ర ప్రచారకర్తలు వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయమ్మ, షర్మిల రెండో దఫా పర్యటనకు సిద్ధమయ్యారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శనివారం గుంటూరు జిల్లాలో రెండో దఫా ప్రచారం ప్రారంభించగా.. అధ్యక్షుడు జగన్ సోమవారం జాబితా ప్రకటన అనంతరం కర్నూలు జిల్లా ప్రచారానికి బయల్దేరనున్నారు. షర్మిల ఆదివారం ఖమ్మంలో పర్యటించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. సీమాంధ్రతోపాటు ఆరు రాష్ట్రాలలోని స్థానాలకు నోటిఫికేషన్ ఎనిమిదో దశలో సీమాంధ్రతోపాటు ఎన్నికలు జరుగనున్న ఆరు రాష్ట్రాల్లోని 39 లోక్సభ నియోజకవర్గాలకూ శనివారం నోటిఫికేషన్ వెలువడింది. మే 7న ఉత్తరప్రదేశ్లోని 15 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేథీ నియోజకవర్గం కూడా ఉంది. బీహార్లోని ఏడు స్థానాలు, హిమాచల్ ప్రదేశ్లోని నాలుగు, జమ్మూ కాశ్మీర్లో రెండు, ఉత్తరాఖండ్లో ఐదు, పశ్చిమ బెంగాల్లో ఆరు నియోజకవర్గాలకు అదే రోజు ఎన్నికలు జరుగుతాయి. -
తెలంగాణలో 105 స్థానాల్లో వైఎస్సార్సీపీ పోటీ
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 13 పార్లమెంట్, 105 అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసింది. మంగళవారం 13 మంది పార్లమెంట్, 81 మంది అసెంబ్లీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేయగా... బుధవారం ఉదయం మరో 24 మందికి బీ-ఫారాలు అందజేసింది. దీంతో వైఎస్సార్సీపీ తరఫున బరిలో నిలిచిన వారి సంఖ్య 105కు చేరింది. -
నేడే రెండో విడత పోలింగ్
6 లోక్సభ స్థానాలు, అరుణాచల్లో 49 అసెంబ్లీ సీట్లకు... మూడో విడతకు ముగిసిన ప్రచారం సార్వత్రిక ఎన్నికల రెండో విడతలో భాగంగా.. నాలుగు ఈశాన్య రాష్ట్రాల్లోని ఆరు లోక్సభ స్థానాలకు, అరుణాచల్ప్రదేశ్లోని 49 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. అరుణాచల్ప్రదేశ్, మేఘాలయల్లో రెండేసి సీట్లకు, నాగాలాండ్, మణిపూర్లలో ఒక్కో స్థానానికి లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మిజోరంలోని ఏకైక లోక్సభ స్థానంలో కూడా రెండో విడతలోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. మిజో విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునివ్వడంతో పోలింగ్ను 11వ తేదీకి వాయిదా వేశారు. త్రిపురలోని శరణార్థుల శిబిరాల్లో తలదాచుకుంటున్న మిజోరం రాష్ట్రానికి చెందిన బ్రూ తెగ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసే అవకాశం కల్పించాలన్న ఈసీ నిర్ణయాన్ని నిరసిస్తూ మిజో విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో మిజోరంలోని ఏకైక లోక్సభ స్థానంతోపాటు అక్కడి హ్రాంగ్టుర్జో అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికను ఈసీ 11వ తేదీకి వాయిదా వేసింది. నాగాలాండ్లోని ఏకైక లోక్సభ స్థానానికి ఆ రాష్ట్ర సీఎం నేప్యూ రియోతో సహా ముగ్గురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. మణిపూర్లోని ఔటర్ మణిపూర్ స్థానంలో ప్రధాన పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి పది మంది బరిలో ఉన్నారు. ఇక అరుణాచల్లోని పశ్చిమ, తూర్పు స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ, ఎన్సీపీ, పీపీఏల మధ్య బహుముఖ పోరు నెలకొంది. మేఘాలయలోని రెండు లోక్సభ స్థానాల్లో పది మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఎన్పీపీ చీఫ్ పీఏ సంగ్మా సహా పలువురు సీనియర్లు ఇక్కడ పోటీలో ఉన్నారు. మరోవైపు మూడో విడత ఎన్నికల ప్రచారానికి మంగళవారం తో తెర పడింది. 11 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 92 సీట్లకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ స్పీకర్ మీరాకుమార్, కేంద్ర మంత్రులు సిబల్, కమల్నాథ్, శశి థరూర్, ఆర్మీ మాజీ చీఫ్ వి.కె.సింగ్లు మూడో దశ బరిలో ఉన్నారు. -
ప్రజలకు నక్సల్స్ ఎస్ఎంఎస్లు
బీహార్లో లోక్సభ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపు పాట్నా: మావోయిస్టులు తమ పాత పద్ధతులకు స్వస్తి చెప్పి సరికొత్త సాంకేతికతను వినియోగించుకుంటూ పోలీసులకు, ప్రభుత్వాలకు మరిన్ని సవాళ్లు రువ్వుతున్నారు. తాజాగా.. బీహార్లో ఈ నెల 10న జరగనున్న తొలిదశ సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించాలని హెచ్చరిస్తూ ఆరు నియోజకవర్గాల్లోన్ని ప్రజల మొబైళ్లకు భారీ సంఖ్యలో(బల్క్) సంక్షిప్త సందేశాలు పంపారు. మావోయిస్టు అధికార ప్రతినిధి అవినాష్ పేరిట వచ్చిన ఈ ఎస్ఎంఎస్లలో పోలీసులు సహా పోలింగ్ సిబ్బందికి సైతం మావోలు హెచ్చరికలు జారీచేశారు. అయితే, ఇప్పటి వరకు జరిగిన పలు ఎన్నికల సమయాల్లో మావోలు వాల్ పోస్టర్లు, కరపత్రాలు లేదా ప్రకటనల రూపంలో హెచ్చరికలు జారీ చేయడం తెలిసిందే. తాజాగా ఇప్పుడు మొబైల్ సందేశాల రూపంలో నక్సల్స్ హెచ్చరికలు జారీ చేయడం మాత్రం దేశంలో ఇదే తొలిసారి. ఈ పరిణామంతో ఉలిక్కిపడిన బీహార్ పోలీసు యంత్రాంగం ఎస్ఎంఎస్ల పనిపట్టేందుకు నడుం బిగించింది. బీహార్ డీజీపీ అభయానంద్ వెల్లడించిన వివరాలు.. ళీ బీహార్లోని మావోయిస్టు ప్రభావిత గయ, నవాడా, జముయి, ఔరంగాబాద్, ససారాం, కరాకట్ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 10న తొలిదశ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను బహిష్కరించాలని హెచ్చరిస్తూ ఆయా నియోజకవర్గాల ప్రజలకు మావోలు బల్క్ ఎస్ఎంఎస్లు పంపారు. సాధారణ ప్రజలు సహా రైతులు, కార్మికులు, మేధావులు, దేశ భక్తులు, విప్లవ కారులు అందరూ ఎన్నికలను బహిష్కరించాలని హెచ్చరించారు. అంతేకాకుండా మావోయిస్టు గెరిల్లా దళాలు ఎన్నికలు జరిగే రోజు దాడులకు దిగనున్నట్టు తెలిపారు. ఎన్నికల సిబ్బంది సదరు ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని పోలీసు వాహనాల్లో ప్రయాణించ రాదని హెచ్చరించారు. కాగా, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలూ చేపడతామని డీజీపీ చెప్పారు. ఈ ఆరు నియోజకవర్గాల్లోనూ దాదాపు 48 వేల మంది ఆర్మీ సిబ్బందిని రంగంలోకి దింపడంతోపాటు, హెలికాప్టర్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తామన్నారు. -
.ఉత్కంఠ!
సార్వత్రిక ఎన్నికల నగారా మోగనుంది. బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. జిల్లాలోని రెండు లోక్సభ, 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ వెలువడే 2వ తేదీ నుంచే నామినేషన్లు కూడా స్వీకరిస్తారు. 9వ తేదీ ఆఖరు తేదీ. ఎన్నికలు ముంగిట్లో నిలిచినా.. ఇప్పటి వరకు ప్రధాన రాజకీయ పార్టీలేవీ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఒక్క సీపీఎం మాత్రమే నల్లగొండ, భువనగిరి లోక్సభ, మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్ అసెంబ్లీ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ వంటి ప్రధాన రాజకీయ పార్టీలు ఇంకా తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేదు. ఉగాది రోజునే తొలి జాబితా ప్రకటిస్తామని తొలుత ప్రకటించిన కాంగ్రెస్ నాయకత్వం.. పొత్తుల వ్యవహారం ఓ కొలిక్కిరాని కారణంగా మరో మూడు నాలుగు రోజులు జాబితాల విడుదలను వాయిదా వేసుకుంది. దీంతో కాంగ్రెస్లో ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో రకరకాల ప్రచారాలు తెరపైకి వస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తున్న పలువురు ఢిల్లీలో మకాం వేసి ఏఐసీసీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఆ పార్టీ సీపీఐతో పొత్తులు దాదాపు ఓ కొలిక్కి వచ్చినా, అధికార ప్రకటన వెలువడక పోవడంతో అభ్యర్థులనూ ప్రకటించడం లేదు. పార్టీ వర్గాల సమాచారం మేరకు సీపీఐ మునుగోడు, దేవరకొండలను తీసుకుం టుంది. కాంగ్రెస్ మరో పదిచోట్ల అభ్యర్థులను బరిలోకి దింపాల్సి ఉంది. మిర్యాలగూడ, నకిరేకల్ నియోజకవర్గాలు తీవ్ర ఉత్కంఠను రేపుతుండగా, కోదాడ అభ్యర్థిత్వంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దింపాలన్న ఆలోచనలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకత్వం ఇంకా, తమ అభ్యర్థులను మాత్ర,అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు ఆ పార్టీ నుంచి టికెట్లు ఖాయం అన్న ధీమాతో ఉన్న నాయకులు కొందరు నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఒంటరి పోరుకు సిద్ధమంటున్న టీఆర్ఎస్ సైతం తమ అభ్యర్థులను ప్రకటించకపోవడం గమనార్హం. అయితే, చివరి నిమిషంలో కాంగ్రెస్తో పొత్తు కుదిరినా కుదరొచ్చన్న కారణంగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హుజూర్నగర్ నుంచి తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను పోటీకి పెడుతున్నట్లు ప్రచారం జరిగినా, పార్టీ అధినేత కేసీఆర్ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. సీపీఐతోనూ ఆ పార్టీ పొత్తు ఉంటుందా, ఉండదా అన్న విషయంలోనూ ఇంకా స్పష్టత రాలేదు. ఈ కారణంగానే జిల్లాలో టీఆర్ఎస్ పోటీ చేసే స్థానాల విషయంపై ఇంకా గందరగోళమే నడుస్తోంది. టీడీపీ-బీజేపీల పరిస్థితి దీనికంటే భిన్నంగా ఏమీలేదు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదురిందని, ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న విషయమూ ఖరారైందంటున్నా.. ఇంకా అధికార ప్రకటన రాలేదు. దీంతో ఈ రెండు పార్టీల శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. బీజేపీ మొత్తం అన్ని సీట్లలో పోటీ చేసే పరిస్థితిలో లేకపోవడం, టీడీపీ తరపున బరిలోకి దిగడానికి కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత ఉండడం వంటి కారణాలతో ఇరు పార్టీల కార్యకర్తలు టెన్షన్లోనే ఉన్నాయి. లోక్సభ, అసెంబ్లీ స్థానాల పంపకాలు జరిగినా, నాయకత్వాల నుంచి ఎప్పుడు ప్రకటన వెలువడుతుందాని ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్తో పొత్తు ఖరారు చేసుకున్న సీపీఐ మాత్రం తమ సిట్టింగ్ స్థానం మునుగోడు, చానాళ్ల పాటు తమ ప్రాతినిధ్యంలో ఉన్న దేవరకొండ సీట్ల నుంచి పోటీకి సిద్ధమవుతోంది. అయితే, ఆ పార్టీ సైతం తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఈసారి మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యే యాదగిరిరావును పక్కన పెట్టి వేరొకరికి అవకాశం ఇవ్వాలన్న చర్చ సీపీఐలో జరుగుతోందని చెబుతున్నారు. నోటిఫికేషన్ వెలువడుతున్న తరుణంలో కూడా మెజారిటీ ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను ప్రకటించకుండా రాజకీయ విశ్లేషకులకు పనికల్పించాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
సార్వత్రికానికి’ రెడీ
పార్లమెంట్, అసెంబ్లీ సాధారణ ఎన్నికల్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎం.గిరిజాశంకర్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం స్థానిక రెవెన్యూ సమావేశపు మందిరంలో సాధారణ ఎన్నికలపై అఖిల పక్ష నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికల్ని సమర్థంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లనూ సిద్దం చేసుకొని ఎన్నికలకు రెడీగా ఉన్నట్లు వెల్లండించారు. ఇక రాజకీయ పార్టీలు కానీ అభ్యర్థులు ర్యాలీలు, సమావేశాలు నిర్వహించుకోవాలంటే ముందస్తు అనుమతు తప్పనిసరన్నారు. లేకుంటే ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తప్పవన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థి వెంట మూడు వాహనాలకే అనుమతిస్తామనీ, కాన్వాయ్ పది వాహనాలకు మించరాదన్నారు. నామినేషన్ కేంద్రానికి వంద మీటర్ల దూరంలోనే ర్యాలీలు నిలిపి లోపలికి అభ్యర్థి వెంట ఐదుగురిని మాత్రమే అనుమతిస్తామన్నారు. నేడు నోటిఫికేషన్.. పార్లమెంట్, సాధారణ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 2న నోటిఫికేషన్ను విడుదలవుతుందనీ, అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ చేపడతామన్నారు. ఇది ఈనెల 9వరకు ఉంటుందన్నారు. అయితే మధ్యలో 5, 6, 8 తేదీల్లో ప్రభుత్వ సెలవు దినాలైనా, నామినేషన్లను స్వీకరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇక 10న నామినేషన్ల పరిశీలన, 11, 12 ఉపసంహరణకు గడువుతోపాటు, అదే రోజు బరిలో ఉండే అభ్యర్థుల జాబితా, వారికి గుర్తుల కేటాయింపు ఉంటుందన్నారు. ఇక నామినేషన్ల విషయానికొస్తే మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థులు తన గదిలో, నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థులు జేసీ గదిలో దాఖలు చేయాలన్నారు. అసెంబ్లీ విషయానికొస్తే నియోజకవర్గ తహశీల్దార్ కార్యాలయాలు, డివిజన్ అయితే ఆర్డీఓ కార్యాలయాల్లో దాఖలు చేయాలన్నారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు అఫిడవిట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఏమైనా ఖాళీలను భర్తీ చేయకుంటే వాటిని పరిశీలనలో తిరస్కరిస్తామన్నారు. జిల్లాతోపాటు, దేశం, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఆస్తులున్నా వాటిని పేర్కొనాలన్నారు. నామినేషను పత్రాలను అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామని, వాటిని పూర్తి చేసేందుకు ఏమైనా సందేహాలుంటే హెల్ప్లైన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అభ్యర్థులంతా ఒక్కరోజు ముందుగా వచ్చి వాటిని తీసుకెళ్లి అన్ని కాలమ్స్ని భర్తీ చేసుకొని రావాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇబ్బందులు సృష్టిస్తే.. కఠిన చర్యలు : జిల్లా ఎస్పీ పోటీచేసే అభ్యర్థులు ఒక దానికి అనుమతి తీసుకొని ఇంకోలా ప్రవర్తించి ఇబ్బంది వాతావరణాన్ని సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ర్యాలీలు, మైక్ అనుమతులకు నేరుగా డీఎస్పీ కార్యాలయానికి వెళ్లాల్సిన పని లేదని, సంబంధిత పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేసుకొని రశీదు తీసుకొంటే చాలన్నారు. అక్కడ్నుంచి ఆ ప్రాంత ఎస్సై ఫ్యాక్స్లో డీఎస్పీకి సమాచారం పంపితే ఒక్కరోజులో అనుమతుల్ని జారీ చేస్తామన్నారు. డీజే సౌండ్కు అనుమతి లేదని, వాటిని వినియోగించినట్లు ఫిర్యాదులొస్తే చర్యలు తప్పవన్నారు. ఈ సందర్భంగా సీపీఐ పట్టణ అధ్యక్షుడు నల్లవల్లి కురుమూర్తి మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ గూర్చి నేరుగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఈసారి అలా కాకుండా, అప్రమత్తంగా ఉండేలా చూడాలని కోరారు. బీజేపీ నేత నాగురావు నామాజీ మాట్లాడుతూ, ప్రతి సారీ అనుమతుల విషయంలో కొంత అలస్యమవుతోందని దాన్ని సరిదిద్దాలన్నారు. ఈ సమావేశంలో అన్ని డివిజన్ల డీఎస్పీలు, రిటర్నింగ్ అధికారులతోపాటు, కాంగ్రెస్ తరుపున సత్తూర్ రాములు గౌడ్, రంగారావు, బిజెపి తరుపున రతంగ్ పాండురెడ్డి, సిపిఐ తరుపున కిల్లెగోపాల్, టీఆర్ఎస్ తరుపున బెక్కెం జనార్ధన్, వైఎస్సార్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు రవిప్రకాష్, టీడీపీ తరపున జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
లెక్కల్లో పార్టీలు..!
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతున్న తరుణంలో అభ్యర్థుల జాబితాపై ప్రధాన పార్టీలు చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది.ఎంపికను పూర్తి చేసిన ప్రధాన పార్టీలు ఈ నెల నాలుగైదు తేదీల వరకు ఫైనల్ లిస్టును ప్రకటించి ...నామినేషన్ల దాఖలు చేసుకునే వెసులుబాటు కల్పించేందుకు తగిన ప్లానుతో ముందుకు సాగుతున్నాయి.అప్పటి వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత ఎన్నికలు ూడా పూర్తి కాగలవని భావిస్తున్నారు. ల్లాలోని రెండు లోక్సభ, 14 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ నెల 4 లేదా 5న అధికారికంగా ప్రకటించాని యోచిస్తోంది.సీపీఐతో సీట్ల సర్దుబాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాంగ్రెస్ సంఖ్యాపరంగా సీట్లను ఫైనల్ చేసినప్పటికీ నియోజక వర్గాల చిక్కు ముడి వీడక పోవటం వల్ల అధికారికంగా వెల్లడించలేక పోతున్నారు.ఒకటి, రెండు రోజుల్లో ఈ చిక్కముడి విడిపోగలదని ఇరు పార్టీలు భావిస్తున్నాయి.సీపీఐ మాత్రం సర్దుబాటులో భాగంగా నాగరుకర్నూల్ అసెంబ్లీ స్థానాన్ని ప్రతిప్రాదించినట్టుగా చెప్పుతుండగా...ఈ జిల్లానుంచి ఏమి ఉండక పోవచ్చునని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా టీడీపీ, బీజెపీ ల మధ్య కూడా సీట్ల సర్దుబాటు వ్యవహారం ఎటూ తేలడం లేదు. ఒక వేళ జరిగితే బీజెపీ జిల్లా నుంచి మహబూబ్నగర్ లోక్సభతో పాటు మహబూబ్నగర్,నాగరుకర్నూల్,నారాయణపేట,కల్వకుర్తి, కొడంగల్, మక్తల్ అసెంబ్లీ స్థానాలు ప్రతి ప్రాదించినట్టు తెలుస్తోంది. జిల్లా విషయానికి వస్తే ఈ స్థానాలపైనే చర్చజరుగుతున్నట్లు విశ్వనీయ వర్గాల సమాచారం.టీడీపీ కూడా ఈ సీట్లల్లో ఒకటి, రెండు అటో,ఇటో అన్నరీతిలో చర్చలు సాగిస్తున్నట్టు భోగట్టా. సీపీఎం అభ్యర్థిగా జబ్బార్..: సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న సీపీఎం ...జిల్లాలోని కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గ అభ్యర్థిగా జబ్బార్ ను ఆ పార్టీ తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం ప్రకటించారు.కొల్లాపూర్ సీపీఎం డివిజన్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జబ్బార్ పానుగల్ మండలం రేమొద్దుల గ్రామ సర్పంచిగా పనిచేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. -
మీ సర్వేతో ఏకీభవించలేం
ఐబీఎన్ సర్వేపై సాయినాధ్, సంజయ్బారు అసంతృప్తి వైఎస్సార్సీపీకే విజయావకాశాలున్నాయని స్పష్టీకరణ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ ఆధిక్యం ప్రదర్శిస్తుందన్న సీఎన్ఎన్-ఐబీఎన్ సర్వేపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఈ సర్వేతో తాను ఏకీభవించలేనని, సీమాంధ్రలోని అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీయే అత్యధిక స్థానాలు సాధిస్తుందని చర్చలో పాల్గొన్న ప్రముఖ పాత్రికేయుడు, హిందూ రూరల్ అఫైర్స్ ఎడిటర్ పాలగుమ్మి సాయినాధ్ తెగేసి చెప్పారు. ప్రధాని మాజీ మీడియా సలహాదారు సంజయ్బారు కూడా సీమాంధ్రలో వైఎస్సార్సీపీకే విజయావకాశాలు ఎక్కువని అభిప్రాయపడ్డారు. సీఎస్డీఎస్-లోక్నీతి ఎలక్షన్ ట్రాకర్తో కలిసి సీఎన్ఎన్-ఐబీఎన్ నిర్వహించిన సర్వే ప్రకారం రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 42 లోక్సభ సీట్లలో టీడీపీ 13-19, వైఎస్సార్సీపీ 9-15, టీఆర్ఎస్ 4-8, కాంగ్రెస్ 4-8 సీట్లు చేజిక్కించుకుంటాయని అంచనా వేశారు. వైఎస్సార్సీపీకే విజయావకాశాలు: సాయినాధ్ సీమాంధ్రలో 39శాతం ఓట్లతో టీడీపీ ముందంజలో ఉంటుందని, వైఎస్సార్సీపీ 33శాతం ఓట్లు సాధిస్తుందన్న సర్వే ఫలితాలతో సాయినాధ్ ఏకీభవించలేదు. ముఖ్యంగా కోస్తాలో టీడీపీ 43శాతం సాధిస్తుందని, వైఎస్సార్సీపీకి కేవలం 23శాతం ఓట్లు వస్తాయని, రాయలసీమలో వైఎస్సార్సీపీకి 41శాతం, టీడీపీకి 31శాతం ఓట్లు వస్తాయని ప్రకటించారు. దీనిపై సాయినాధ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘‘ఈ సర్వేతో నేను అంగీకరించలేను. నెల, రెండు నెలల కంటే ఇప్పుడు టీడీపీ పరిస్థితి మెరుగుపడిందనడంపై నేను ఏకీభవించను. గత దశాబ్దంగా సీఎన్ఎన్తోసహా వివిధ సర్వేలు చంద్రబాబు నాయుడు బలాన్ని ఎక్కువగా అంచనా వేశాయి. మళ్లీ ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. రాష్ట్రాన్ని కాంగ్రెస్ అడ్డగోలుగా విభజించడంవల్ల సీమాంధ్రలో పూర్తిగా కనుమరుగవుతోంది. ఆ పార్టీ నేతలు వైఎస్సార్సీపీ, టీడీపీవైపు చూస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువమంది కాంగ్రెస్ నేతలు టీడీపీలో చేరుతున్నారు. దీనివల్ల ఇప్పటికే ఆ పార్టీలో ఉన్న నేతల్లో అసంతృప్తి నెలకొంటోంది. ముఖ్యంగా రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలను అర్థం చేసుకోవాలి. 30, 40 ఏళ్లుగా ప్రత్యర్థులుగా ఉన్నవారు ఒకే పార్టీలో, ఒకే వేదికను పంచుకోవాల్సి వస్తుంది. ఇది అంత సులభంకాదు. నేతలు మారినా కేడర్ మారదు. బీజేపీతో పొత్తు తెలంగాణలో లాభించవచ్చేమోగాని సీమాంధ్రలో టీడీపీకి ఎలాంటి మేలు చేకూరదు. విభజన విషయంలో బీజేపీకూడా తమను మోసం చేసింది సీమాంధ్ర ప్రజలు భావిస్తున్నారు. సీమాంధ్ర ప్రాంతంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీయే విజయం సాధిస్తుందని భావిస్తున్నా’’ అని సాయినాధ్ స్పష్టంచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్రలో వైఎస్సార్సీపీకే విజయావకాశాలు ఎక్కువని సంజయ్బారు కూడా అభిప్రాయపడ్డారు. నెలరోజుల్లో ఇంతమార్పా? సీఎన్ఎన్-ఐబీఎన్ నెల రోజుల వ్యవధిలోనే విభిన్న సర్వే ఫలితాలను ప్రకటించడంపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఈ సంస్థ ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేలో సీమాంధ్రలో వైఎస్సార్సీపీ 45శాతం ఓట్లు సాధిస్తుందని చెప్పగా, తాజా సర్వేలో 33 శాతానికే పరిమితం చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నెలరోజుల్లో 12శాతం ఓట్లు చేజారేంత రాజకీయ పరిణామాలు ఏం జరిగాయని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అలాగే రాష్ర్ట విభజనకు లేఖనిచ్చిన టీడీపీకి 33నుంచి 39శాతానికి ఓట్లెలా పెరిగాయని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఏడుశాతం ఓట్లు రాగా, ఇతరులకు 14శాతం ఓట్లు రావడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. మార్చి 18-23 మధ్య నిర్వహించిన ఈ సర్వేకోసం రాష్ట్రంలో కేవలం 1308 మంది అభిప్రాయాలను మాత్రమే సేకరించి ఈ అంచనాకు రావడం గమనార్హం. -
ఇక ‘సార్వత్రికం’
‘పుర’ పోరు ముగిసింది. ‘స్థానిక’ సమరం సాగుతోంది. ఇక జిల్లా యంత్రాంగం సార్వత్రిక ఎన్నికల రంగానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. దీనికి సంబంధించి నామినేషన్ల పర్వానికి గడువు సమీపిస్తుండడంతో అధికారులు అందుకు రెడీగా ఉన్నారు. ఇందుకు అనుగుణంగా పార్టీలు కూడా తమ అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు తీవ్రస్థాయిలో చేస్తున్నాయి. వివిధ కోణాల్లో అంచనాలు వేసుకుంటూ జాబితాలు రూపొందించే పనిలో పడ్డాయి. సార్వత్రిక సమరభేరికి రాజకీయ పక్షాలు సన్నద్దమయ్యాయి. రేపటి(బుధ వారం)నుంచి అసెంబ్లీ, పార్లమెంటు సాధా రణ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. జిల్లా అధికారయంత్రాంగం అందుకు అనుగుణంగా సర్వసన్నద్దమైంది. జిల్లాలోని రెం డు పార్లమెంట్, 14 అసెంబ్లీ స్థానాలకు సం భందించి నామినేషన్ల దాఖలు కార్యక్రమం ఈ నెల 2 నుంచి 9వ తేదిల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది. ఏప్రిల్ 10న నామినేషన్ల పరిశీలన, 11, 12 తేదిల్లో నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం ఉంటుంది. ఎన్నికలు ఈనెల 30న జరుగనున్నాయి. నామినేషన్ దాఖలిలా... మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీచేయనున్న అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ ఎం.గిరిజా శంకర్కు అందజేయాల్సి ఉంటుంది. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేయనున్న అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల సహాయాధికారి అయిన జాయింట్ కలెక్టర్ ఎల్.శర్మన్కు దాఖలు చేయవలసి ఉంటుంది. పార్లమెంట్కు పోటీచేయనున్న జనరల్ లేదా బీసీ అభ్యర్థులు నామినేషన్ ధరావత్తు రూ..25 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే రూ.12,500లు చెల్లించవలసి ఉంటుంది. అసెంబ్లీ స్థానాలకు పోటీచేయనున్న అభ్యర్థులు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఎన్నికల కార్యాలయంలో నియోజకవర్గ ఎన్నికల అధికారికి తమ నామినేషన్ పత్రాలను అందజేయాల్సి ఉంటుంది. అసెంబ్లీ స్థానానికి పోటీచేయనున్న జనరల్, బీసీ అభ్యర్థులు నామినేషన్ ధరావత్తు రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఖర్చు... పార్లమెంట్ స్థానానికి పోటీచేయనున్న అభ్యర్థి రూ.70 లక్షలకు మించి ఎన్నికల వ్యయం చేయకూడదు. అసెంబ్లీ స్థానానికి పోటీచేయనున్న అభ్యర్థి రూ.28 లక్షల వరకే ఎన్నికల ఖర్చు పెట్టవలసి ఉంటుంది. పోటీచేస్తున్న అభ్యర్థులు నామినేషన్లు వేసే ముందురోజు ఎన్నికల ఖర్చుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా బ్యాంకు అకౌంట్లను తెరవాల్సి ఉంటుంది. లావాదేవీలన్ని అదే అకౌంట్ ద్వారా నిర్వహించి ఎన్నికల అధికారులకు ఖర్చు లెక్కలు చూపాల్సి ఉంటుంది. ప్రతి ఖర్చుకు పొందుపర్చవలసిన అవసరం ఉంటుంది. -
సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీదే విజయం
పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయ్ బొబ్బిలి, రానున్న సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ ఘన విజయం సాధిస్తుందని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉందని, అందుకు అనుగుణంగా మున్సిపల్ ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని ఆ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయకృష్ణ రంగారావు అన్నారు. ఆదివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బొబ్బిలి 26వ వార్డులోని తాండ్ర పాపారాయ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూలులో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో అధిక శాతం స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. విజయనగరం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను చేజిక్కించుకుంటామన్నారు. -
ఎన్నికల వేళ.. ఏరులై పారుతోంది!
విజయనగరం రూరల్, న్యూస్లైన్ : జిల్లాలో వరుస ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 3వ తేదీ నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత వారం రోజులకే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కోడ్ అమల్లోకి వచ్చింది. మద్యం అనధికార అమ్మకాలు జోరు.. ఏ ఎన్నికలు వచ్చినా.. మందుబాబులకు పండగే. అలాంటిది మూడు ప్రధాన ఎన్నికలు ఒకేసారి వస్తే... వారి జీవితం మూడు ఫుళ్లు.. ఆరు క్వార్టర్ల లెక్కన సాగిపోయినట్లే. ప్రస్తుతం మందుబాబుల పరిస్థితి అలానే ఉంది. ఎన్నికల పుణ్యమాని జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. ఇదే సందర్భంలో బెల్టుషాపుల ద్వారా అనధికార అమ్మకాలు పెరిగాయి. నాటుసారా కూడా విరివిగా లభిస్తోంది. అబ్కారీశాఖ అధికారులు, పోలీసులు నిత్యం దాడులు చేస్తున్నా.. అక్రమ మద్య ప్రవాహం మాత్రం ఆగడం లేదు. దాబాల్లోనూ, రెస్టారెంట్లలోనూ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. లెసైన్స్ దుకాణాల్లో సైతం చిల్లర అమ్మకాలు సాగిపోతున్నాయి. ఇక కల్తీ సారా ప్రవాహానికి అడ్డుకట్టే లేకపోతోంది. ఈ నెల మూడో తేదీన ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 25వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ అధికారులు 516 కేసులు నమోదు చేశారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 237 మందిని అరెస్టు చేసి, రెండు వాహనాలను సీజ్ చేశారు.జిల్లా వ్యాప్తంగా సారా నిల్వలు ఉంచిన 149 మందిపై ఎక్సైజ్ అధికారులు కేసులు నమోదు చేశారు. 56 మందిని అరెస్టు చేశారు. 1,470 లీటర్ల సారాయిని సీజ్ చేశారు. 56,050 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారాయిని సరఫరా చేస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. నల్లబెల్లం కేసు ఒకటి నమోదు చేశారు. 1,460 కేజీల నల్లబెల్లాన్ని సీజ్ చేశారు.94 కల్లు నమూనాలను సేకరించి, ల్యాబ్లకు పంపారు.అనధికార బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్న 160 మందిని అరెస్టు చేశారు. బెల్టు దుకాణాల నుంచి 532.67 లీటర్ల మద్యాన్ని, 129.53 లీటర్ల బీరును స్వాధీనం చేసుకున్నారు. మద్యం అక్రమ రవాణా చేస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు.నిబంధనలు పాటించని 14 లెసైన్సు రెస్టారెంట్లు, మద్యం దుకాణాలపై కేసులు నమోదు చేశారు. 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఎంఆర్పీ ఉల్లంఘన కేసులు ఎనిమిది, నిర్ణీత సమయం కంటే అదనంగా అమ్మకాలు చేస్తున్న ఐదు దుకాణాలపై కేసులు నమోదు చేశారు.గంజాయి అక్రమ రవాణా కేసులు మూడు నమోదు చేశారు. ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. 34.900 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.102 మందిపై మండల తహశీల్దార్ల సమక్షంలో బైండోవర్ కేసులు నమోదు చేశారు. -
కాంగ్రెస్ ఓటమి ముందే నిశ్చయం: అద్వానీ
న్యూఢిల్లీ: గత 15 సార్వత్రిక ఎన్నికల్లో ఎప్పుడూ లేనంతగా కాంగ్రెస్ పార్టీ ఓటమి ఈసారి లోక్సభ ఎన్నికలకు ముందే నిశ్చయమైపోయిందని బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ ఎద్దేవా చేశారు. బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వం ఏర్పడేందుకు పదేళ్లపాటు అసమర్థ పాలనతో బాటలు వేసిన ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి తమ పార్టీ రుణపడి ఉంటుందంటూ తన బ్లాగ్లో చురకలంటించారు. ‘యూపీఏ సర్కారు పాలనలో జరిగినన్ని కుంభకోణాలు ఇప్పటివరకూ ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. అవినీతే యూపీఏ ప్రభుత్వ లక్షణంగా మారింది. ఈ ప్రభుత్వాన్ని త్వరగా గద్దె దించేందుకు ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 1952 నుంచి నేను అన్ని సాధారణ ఎన్నికల్లో పాల్గొన్నా. ప్రస్తుతం కాంగ్రెస్ ఓటమి నిశ్చయమైనట్లుగా గత 15 సార్వత్రిక ఎన్నికల్లో ఎప్పుడూ ఆ పార్టీకి ఇలాంటి పరిస్థితి ఎదురవలేదు’’ అంటూ దుయ్యబట్టారు -
‘పరిషత్తు’ ఎన్నికల వాయిదాపై మీ వైఖరేమిటి?
కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు హైకోర్టు ఆదేశం హైదరాబాద్:సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు పురపాలక, జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్పై వైఖరి ఏమిటో తెలియచేయాలని హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను ఆదేశించింది.ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పురపాలక, జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల ఫలితాల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ఉంటుందని, దీని వల్ల ఓటర్లు నిష్పాక్షికంగా ఓటు వేయలేరని, ఈ దృష్ట్యా పురపాలక, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిలుపుదల చేయాలని, లేదా కనీసం వాయిదా వేయాలని కోరుతూ వి.పవన్కుమార్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయమూర్తి... దాదాపు 45 రోజుల పాటు బ్యాలెట్ బాక్సులకు రక్షణ కల్పించడం సాధ్యమేనా? అని ఎన్నికల సంఘాలను ప్రశ్నించారు. దీనిపై వైఖరి ఏమిటో తెలియచేయాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. మున్సి‘పోల్స్’ ఫలితాలపై పిల్ : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు మునిసిపల్ ఎన్నికల ఫలితాలు నిలిపేసేలా ఉత్వర్వులివ్వాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. మునిసిపల్ ఎన్నికల ప్రభావం త్వరలో జరగబోయే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందని, అందువల్ల మునిసిపల్ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ప్రక్రియను చేపట్టకుండా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ నల్లగొండ జిల్లాకు చెందిన బుక్యా సైదా, నెల్లూరు జిల్లాకు చెందిన న్యాయవాదులు రమేష్రెడ్డి, వి.రమణారెడ్డి, హైదరాబాద్కు చెందిన న్యాయవాది ఎం.శివారావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించనున్నది. -
ఉధృతమైన వైఎస్సార్ జనభేరి
ఆరు జిల్లాల్లో జగన్, విజయమ్మ, షర్మిల ముమ్మర ప్రచారం రేపట్నుంచి విశాఖ, విజయనగరంలలో జగన్ నేడు ఖమ్మంలో విజయమ్మ, రేపు కృష్ణాలో షర్మిల వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన ప్రచారకర్తలైన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, షర్మిల ఆరు జిల్లాల్లో స్థానిక, సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు. వైఎస్సార్ జనభేరి పేరుతో ఇప్పటికే పలు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్న ఈ ముగ్గురు నేతల తదుపరి ఎన్నికల ప్రచారం వివరాలను పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 25, 26 తేదీల్లో విశాఖపట్నం జిల్లాలో, 27న విజయనగరం జిల్లాలో జగన్ పర్యటిస్తారు. 25వ తేదీ ఉదయం పది గంటలకు పాయకరావుపేట, సాయంత్రం 5 గంటలకు నర్సీపట్నంలో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. 26న ఉదయం 9గంటలకు యలమంచిలి రోడ్షోలోనూ, సాయంత్రం 5గంటలకు తగరపువలస బహిరంగ సభలోనూ పాల్గొంటారు. 27వ తేదీన విజయనగరంలో జరిగే రోడ్షోలో పాల్గొంటారు. ఈ నెల 24, 25 తేదీల్లో ఖమ్మం, పశ్చిమగోదావరి, 26న వైఎస్సార్ జిల్లాలో విజయమ్మ పర్యటిస్తారు. 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మధిర, సాయంత్రం 6 గంటలకు ఇల్లెందు, 25న ఉదయం 9 గంటలకు కొత్తగూడెం, సాయంత్రం 4గంటలకు సత్తుపల్లిలో జరిగే రోడ్షోలో పాల్గొని, సాయంత్రం 6 గంటలకు పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఆమె 26వ తేదీ మధ్యాహ్నానికి వైఎస్సార్ జిల్లాకు చేరుకుని అక్కడ పర్యటిస్తారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు షర్మిల కృష్ణా జిల్లాలో పర్యటిస్తారు. 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఉయ్యూరు, రాత్రి 7 గంటలకు పెడనలో జరిగే రోడ్షోలో పాల్గొంటారు. 26న ఉదయం 9గంటలకు నూజివీడు, సాయంత్రం 4గంటలకు తిరువూరులో జరిగే రోడ్షోలోనూ, రాత్రి 7 గంటలకు నందిగామ బహిరంగ సభలోనూ పాల్గొంటారు. 27న ఉదయం 9గంటలకు జగ్గయ్యపేట, సాయంత్రం 4గంటలకు రోడ్షోలో పాల్గొంటారు -
నలుగురు ఐఎం ఉగ్రవాదులు అరెస్ట్
జైపూర్లో ఇద్దరు, జోథ్పూర్లో ఒకరు, అజ్మీర్లో మరొకరు అదుపులో మరో అనుమానితుడు భారీగా పేలుడు పదార్థాల స్వాధీనం సార్వత్రిక ఎన్నికల ముందు ఉగ్రవాదులు పన్నిన భారీ విధ్వంస ప్రణాళికను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు విచ్ఛిన్నం చేశారు. పలు బాంబు పేలుళ్లలో కీలక నిందితుడిగా ఉన్న కరడుకట్టిన పాకిస్థాన్ ఉగ్రవాది, ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) సంస్థకు చెందిన జియా ఉర్రెహ్మాన్ అలియాస్ వకాస్(25)ను అతడి ముగ్గురు అనుచరులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు రాజస్థాన్లో అరెస్ట్ చేశారు. వకాస్ ముంబైలోని బాంద్రా నుంచి అజ్మీర్కు వస్తున్నాడనే సమాచారంతో కాపు కాసి.. అజ్మీర్ రైల్వే స్టేషన్లో శనివారం ఉదయం పట్టుకోగలిగారు. ఇతడు దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లలో కీలక నిందితుడు. వకాస్ అనుచరులైన మహమ్మద్ మహ్రూఫ్(21), మహమ్మద్ వకార్ అజార్ అలియాస్ హనీఫ్(21)ను జైపూర్లో, షకీబ్ అన్సారీ అలియాస్ ఖలీద్(25)ను జోథ్పూర్లో స్థానిక పోలీసుల సహకారంతో ఆదివారం వేకువ జామున అరెస్ట్ చేశారు. వీరితో సంబంధముందనే అనుమానంతో మరో యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరి అరెస్టుతో పెను ప్రమాదం తప్పిపోయింది. వీరి ఇళ్ల నుంచి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, డిటోనేటర్లు, ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు, టైమర్లను స్వాధీనం చేసుకున్నామని ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ ప్రత్యేక కమిషనర్ ఎస్.ఎన్.శ్రీవాత్సవ ఆదివారమిక్కడ మీడియాకు వెల్లడించారు. భారీ ఉగ్రదాడులను నిరోధించగలిగామని ఆయన చెప్పారు. విచారణలో వకాస్ తాను రాజస్థాన్ రావడానికి గల కారణాన్ని బయటపెట్టాడు. తెహ్సీన్ అక్తర్ ఆదేశాల మేరకు భారీ దాడికి సంబంధించిన ‘రాజస్థాన్ మాడ్యూల్’ విషయంలో ముగ్గురు అనుచరుల మధ్య సమన్వయం చేయడంతోపాటు వారు నిర్వహించిన సన్నాహకాలను పరిశీలించడానికి వచ్చినట్లు వకాస్ తెలిపాడు. ఇతడిని పోలీసులు ఆదివారం ఢిల్లీలోని స్పెషల్ కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు వకాస్కు 10 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఐఈడీ, ఇతర పేలుడు పదార్థాల వినియోగంలో వకాస్ సిద్ధహస్తుడు. ఐఎం సహ వ్యవస్థాపకుడైన యాసిన్ భత్కల్కు ముఖ్య అనుచరుడు. 2013 ఫిబ్రవరి 21 హైదరాబాద్లోని దిల్షుక్ నగర్ వరుస బాంబు పేలుళ్లలో పాల్గొన్నాడు. ఈ దాడిలో 17 మంది ప్రాణాలు కోల్పోగా, 119 మంది గాయాలపాలైన విషయం తెలిసిందే. వకాస్ అంతకుముందు 2012 ఆగస్టు1న పుణె వరుస పేలుళ్లు, 2011 జూలై 12న ముంబైలోని జవేరీబజార్లో జరిగిన పేలుళ్లు, 2010 సెప్టెంబర్ 19 జామా మసీదు, అదే ఏడాది డిసెంబర్ 7న వారణాసిలోని షీత్లా ఘాట్ వద్ద జరిగిన పేలుళ్లలో ఇతడి హస్తం ఉందని శ్రీవాత్సవ వెల్లడించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకున్నారా? అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు... ప్రస్తుత దర్యాప్తు స్థాయిలో ఏమీ చెప్పలేమని శ్రీవాత్సవ అన్నారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఎవరైనా రాజకీయ నేత లేదా సభపై దాడికి ఉగ్రవాదులు ప్రణాళిక రచించారా? అని అడగ్గా... ఏ ముఖ్య కార్యక్రమాన్నైనా వారు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. మహ్రూఫ్, వకార్ ఇద్దరూ జైపూర్లో ఇంజనీరింగ్ విద్యార్థులు కాగా, అన్సారీ డీటీపీ సెంటర్ నడుపుతున్నట్లు శ్రీవాత్సవ తెలిపారు. వీరు పాక్ ఉగ్రవాద శిబిరాల్లో శిక్షణ తీసుకొన్నారని చెప్పారు. రాజస్థాన్ మాడ్యూల్ గురించి యాసిన్ భత్కల్, హద్ది విచారణ సందర్భంగా లోగడే వెల్లడించినప్పటికీ దీనిలో ఎవరెవరు ఉన్నారన్న వివరాలను వారు వెల్లడించకపోవడంతో దీన్ని పోలీసులు ఇప్పటికీ చేధించలేకపోయారు. కస్టడీలో వకాస్, అతడి అనుచరుల ద్వారా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు లభిస్తాయని ఆశిస్తున్నారు. జోథ్పూర్ పోలీస్ కమిషనర్ సచిన్ మిట్టల్ మాట్లాడుతూ... ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు స్థానికంగా బర్కతుల్లాఖాన్ కాలనీలో మహమ్మద్ షకీబ్ అన్సారీని అరెస్ట్ చేశామని చెప్పారు. అతడి ఇంటి నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటిలో 6.5కేజీల అమ్మోనియం నైట్రేట్, 42కేజీల గన్ పౌడర్, 17.65 కేజీల రాతి పొడి, 1.6కేజీల ఫాస్పరస్, ఫ్యూజ్వైరు, 3టైమర్ స్విచ్చులు, 8 ఎలక్ట్రానిక్ స్విచ్చులు, 15 డయోడ్లు, బ్యాటరీలు, డిటోనేటర్ క్యాప్లు, పెన్డ్రైవ్లు, సెల్ఫోన్లు ఇతర వస్తువులు ఉన్నాయని తెలిపారు. ప్రాథమిక విచారణలో షకీబ్ అన్సారీ ఇద్దరు సహాయకులు బర్కత్, మహమ్మద్ ఆదిల్ పేర్లు వెల్లడించారని.. బర్కత్ పారిపోగా, ఆదిల్ పట్టుబడ్డాడని తెలిపారు. ఇతడు స్థానికంగా ఒక ఇంజనీరింగ్ కాలేజీలో బోధకుడిగా పనిచేస్తున్నట్లు మిట్టల్ చెప్పారు. బర్కత్ సివిల్ కాంట్రాక్టరని తెలిసిందని అతడిని త్వరలో పట్టుకుంటామన్నారు. వారి ప్రణాళిక ఏమిటో ఇంకా వెల్లడి కాలేదన్నారు. ‘దిల్సుఖ్నగర్’ కేసులో కీలక నిందితుడు హైదరాబాద్: తాజాగా పట్టుబడిన వకాస్తో దిల్సుఖ్నగర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో మరో ఉగ్రవాది పట్టుబడినట్లుయింది. అసదుల్లా అక్తర్, తెహసీన్ అక్తర్తో కలసి వకాస్ గతేడాది ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్పేలుళ్లలో పాల్గొన్నారు. ఈ కేసులో ఎన్ఐఏ అధికారులు రియాజ్ భత్కల్ను ప్రధాన నిందితుడిగా (ఏ-1)గా, యాసీన్ను ఐదో నిందితుడుగా, అసదుల్లా, వఖాస్, తెహసీన్లను ఏ-2, ఏ-3, ఏ-4గా పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీ పోలీసు కస్టడీలో ఉన్న వకాస్ను పీటీ వారంట్పై హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఎన్ఐఏ సన్నాహాలు చేస్తోంది. -
తెలంగాణలో కాంగ్రెస్కు 55 నుంచి 60 సీట్లు
ఎంపీ పాల్వాయి జోస్యం న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో 55 నుంచి 60 సీట్లు వచ్చే అవకాశం ఉందని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని చెప్పిన కేసీఆర్, కాంగ్రెస్ అధిష్టానం ముందు తననే సీఎం చేయాలని పట్టుపట్టారని, అది కుదరదని చెప్పినందునే విలీనంపై మాట మార్చారని విమర్శించారు. ఆదివారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడారు. పోలవరం డిజైన్ మార్చాలని, కృష్ణా నదీ జలాల పంపిణీపై కేంద్రంతో కొట్లాడింది తానేనని చెప్పారు. హరీష్రావు ప్రశ్నలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. కాగా, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వొద్దని అధిష్టానానికి తాను సూచించినట్లు వచ్చిన వార్తలను పాల్వాయి కొట్టిపారేశారు. -
యువోహం
కొండనైనా ఢీకొట్టే దైర్యం.. ఉప్పెనకే ఎదురెళ్లే సాహసం.. ఉరకలెత్తే ఉత్సాహం.. ఆలోచనతో కూడిన ఆవేశం..యువత సొంతం. కరో కరో జర జల్సా.. అనుకుంటూ ఎంజాయ్ చేసే కొత్త తరం కుర్రాళ్లంతా ప్రస్తుతం నవ సమాజం గురించి కలలు కంటున్నారు. ఎన్నికల వేళ... నడుస్తున్న రాజకీయం పైనా, విశ్వసనీయత కరువైన నాయకులపైనా గళమెత్తాలని ఆరాటపడుతున్నారు. వారి ఆరాటానికి.. ఆలోచనలకు మార్గం చూపే చుక్కాని లాంటి యువ నాయకత్వం ఇప్పుడు తక్షణావసరం. ఆవేశం, ఆలోచన కలగలిపిన నవతరం నేతను ఇప్పటి యువత కోరుకుంటోంది. నాన్న స్థానంలో నిలబడి ఫీజు కట్టే నాయకత్వం కావాలన్నా... అమ్మకో, నాన్నకో, అవ్వకో జబ్బు చేస్తే ఆత్మీయుడిలా నిలబడే అన్నలాంటి పాలకుడు కావాలన్నా.. యువత ప్రయోగించాల్సింది వారి చేతుల్లోని వజ్రాయుధం లాంటి ఓటునే. చీకటి రాజకీయాల్ని చీల్చి, కుట్రల రాజకీయాల్ని అంతం చేసి నిఖార్సయిన రాజకీయానికి ప్రాణం పోసేందుకు దాన్ని ప్రయోగించాలి. ఓ యువకుడి ఆలోచన, అవసరం.. మరో యువకుడికే అర్థమవుతుంది. అందుకే యువత లోంచే నాయకుడు రావాలని, యువ నాయకత్వానికే పగ్గాలు చిక్కాలని యువతీయువకులంతా కోరుకుంటున్నారు. - దారుషిఫా, న్యూస్లైన్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కొత్తతరం ఓట్లే కీలకంగా మారబోతున్నాయి. అంటే 18-21 ఏళ్ల యువకుల ఓట్లు నేతల తలరాతలు మార్చనున్నాయి. గత ఎన్నికల చరిత్రను చూస్తే.. 19వ దశకం వరకు విద్యార్థులు ఉద్యమాలు, కాలేజీ ఎన్నికల్లో చురుకుగా పాల్గొనేవారు. దేశంలో ఎక్కడ ఏ ఉద్యమం ఉనికి లోకి వచ్చినా... అందులో యువకులు, విద్యార్థులదే కీలకపాత్ర. అనంతరం అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఇటు విద్యార్థులు, అటు యువకులు తమ జీవిత ఆశయాలు, లక్ష్యాలను సాధించడంలో నిమగ్నమయ్యారు. అందుకే గత రెండు దశబ్దాలుగా సమాజంలో జరుగుతున్న మార్పులు, రాజకీయ పరిణామాలపై యువకులు, విద్యార్థులు ఎక్కువ శాతం శ్రద్ధ చూపలేదు. కానీ మళ్లీ వారు రీచార్జ్ అయ్యారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్స్ యాప్ తదితర సోషల్ నెట్వర్క్ మీడియా పుణ్యమా అని చైతన్యవంతమయ్యారు. సమాచార ప్రసార మాధ్యమాల్లో వస్తున్న నూతన మార్పులు, సమాజంలో జరుగుతున్న పరిణామాలు, రాజకీయాల్లో వస్తున్న మార్పులు ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నారు. ప్రతీ అంశానికి తమదైన రీతిలో స్పందిస్తున్నారు. అంతేకాదు.. గత రెండు, మూడేళ్లలో జరిగిన ఎన్నికల్లో కీలకపాత్ర పోషించి, రాజకీయ మార్పుల కోసం కూడా ప్రయత్నించారు. గతేడాది జరిగిన ఢిల్లీ ఎన్నికలే దీనికి నిదర్శనం. భారీగా పెరిగిన యువ ఓటర్లు యువత ఈ ఎన్నికల్లో చైతన్యవంతమైన పాత్ర పోషించనుందని చెప్పడానికి పెరిగిన కొత్తతరం ఓట్లే నిదర్శనం. ఇప్పటివరకూ ఎన్నికలను అంతగా పట్టించుకోని యువతరం ఈసారి ఓటర్లుగా పేరు నమోదు చేయించుకోవడానికి పోటీపడింది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఈసారి 18-19 ఏళ్ల వయసు గల ఓటర్ల సంఖ్య గతంలో ఎన్నడూ లేని విధంగా 23 కోట్లకు చేరింది. ఇది మొత్తం దేశ ఓటర్లలో 2.88 శాతంగా ఉంది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం.. ఈ ఎన్నికల్లో 15వ లోక్సభ ఎన్నికల కంటే 10 కోట్ల మంది ఎక్కువగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గణంకాల ప్రకారం చూస్తే భారతదేశంలో సగం జనాభా 25 ఏళ్ల కంటే తక్కువగా ఉన్నారు. అంటే ఈ వయసు గల ఓటర్లే రాబోయే ఎన్నికల్లో తమ ప్రభావాన్ని చూపనున్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని సార్వత్రిక ఎన్నికల్లో ఈ వయసున్న ఓటర్లు ఇప్పటి వరకు సగం కూడా లేరు... ఇలా జరగడం ఇదే మొదటిసారి. టెక్నాలజీతో ఆకర్ష్ మంత్ర సార్వత్రిక ఎన్నికల్లో ఈ సారి అన్ని రాజకీయ పార్టీల ‘నవ’ భావమిదీ... రాజకీయ నాయకులు ఓట్ల కోసం పలు రకాలుగా పాట్లు పడుతుంటే.. యువ ఓటర్లు మాత్రం జాతి, కుల, మత భావాలకతీతంగా ఆలోచిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం, మార్పునకు కట్టుబడే నాయకుల వైపు మొగ్గు చూపుతున్నారు. నాయకుడంటే దీర్ఘకాల లక్ష్యాలతో సమాజానికి దిశానిర్దేశం చేసేవాడై ఉండాలంటోంది నగరానికి చెందిన కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని ఎ.చిన్మయి. యువత రాజకీయాలకు దూరంగా ఉండాలనుకోవడం సరికాదు. వారి నిర్ణయాలే సమాజాన్ని శాసిస్తాయి కనుక ఏ నాయకుడైతే మన ఆకాంక్షలు నెరవే రుస్తాడో తెలుసుకుని వారికి ఓటేయాలంటోందామె. వయసు పైబడిన వారు పార్టీని, అభ్యర్థి పలుకుబడిని చూసి ఓట్లు వేస్తారు. అలా కాకుండా నేటి యువత రాజకీయాల్లో జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకొని పార్టీ సిద్ధాంతాలను పక్కనబెట్టి దేశ తలరాతలను మార్చే విద్యావంతులైన యువ నాయకులకు పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్నారు. విద్యావంతులైన నాయకులైతేనే సమాజానికి ఏది మేలో సరియైన నిర్ణయం తీసుకోగలరని సంతోష్కుమార్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. ఉన్న వ్యవస్థను మార్చడం యువకులకే సాధ్యమని, రాజకీయాలపై అవగాహన పెంచుకుని సరైన నేతలను ఎంచుకోవాలని ఆయన సహవిద్యార్థులకు సూచిస్తున్నాడు. డబ్బు సంపాదన కోసమే రాజకీయాల్లోకి వచ్చే నేతల పట్ల కూడా యువత అప్రమత్తమవుతోంది. ఇలాంటి నేతల గురించి మాట్లాడుతూ అలవిగాని పథకాలు ప్రకటించే నేతలు, డబ్బులు పంచే నాయకులకు దూరంగా ఉండాలని ఇంజనీరింగ్ విద్యార్థిని అనురాధ యువతకు పిలుపునిస్తోంది. డబ్బు, మద్యం తదితర ప్రలోభాలకు లొంగవద్దని మరో ఇంజనీరింగ్ విద్యార్థి స్మరణ్ కోరుతున్నారు. యువకుడే యువకులు సమస్యలను తెలుసుకొని ప్రపంచ దేశాల్లో జరుగుతున్న అభివృద్ధిని మన దేశంలో చేస్తాడని ఆయన భావిస్తున్నారు. తొలిసారిగా ప్రవేశపెడుతున్న ‘నోటా’పైనా యువత ఆసక్తిగా ఉంది. సరైన నాయకుడు లేనప్పుడు ‘నోటా’ను ఆయుధంగా ప్రయోగించాలని నవతరం ప్రతినిధి విశాల అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో యువత ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే ప్రజాప్రతి‘నిధులను’ ఎన్నుకోవడమే కొత్తతరం ఏకైక లక్ష్యంగా మారింది. -
ముషీరాబాద్కు ‘సన్’స్ట్రోక్
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ పార్టీ టికె ట్లు ఆశిస్తున్నవారిలో టెన్షన్ పెరిగిపోతోంది. ప్రధాన పార్టీలు కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయకపోవడం.. ఎప్పటినుంచో టికెట్ తమకే ఇస్తారని ఆశల పల్లకిలో ఊరేగి ఊహల్లో తేలిపోతున్నవారు ఇప్పుడు ఏం జరుగుతుందోనని మదన పడుతున్నారు. ఒక్కో పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నవారు ఇద్దరికంటే ఎక్కువమంది ఉన్న నియోజకవర్గాల్లో అయితే పార్టీ జెండా ఎవరు ఎత్తుకుంటారోనని ప్రజలు సైతం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మలక్పేటలో ఎవరికి వారు.. మలక్పేట నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపిక ఇంకా ఓ కొలిక్కిరాలేదు. వైఎస్సార్సీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఈ స్థానం నుంచి ఎవరికీ టిక్కెట్ కేటాయించనప్పటికీ ఇక్కడి నేతలు ఎవరికివారు తమకే టిక్కెట్ వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్నారు.వైఎస్సార్సీపీ నుంచి నగర యువజన విభాగం అధ్యక్షుడు, మలక్పేట నియోజకవర్గ సమన్వయకర్త లింగాల హరిగౌడ్తో పాటు మరో సమన్వయకర్త బొడ్డు సాయినాథ్రెడ్డి కూడా సీటుపై ఆశలు పెట్టుకున్నారు. ఎవరికివారు సీటు కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ మహ్మద్ అలీ కుమారుడు ఆజం అలీ మలక్పేట నుంచి తానే పోటీ చేస్తున్నట్టు ప్రచారం మొదలెట్టగా.. కార్మికశాఖ నాయకుడు చెవ్వ సతీష్కుమార్ ఈ సీటు కోసం ప్రయత్నం చేస్తున్నారు. లేదంటే ఇబ్రహీంపట్నం టికెట్టు ఇవ్వాలని చెవ్వ పట్టుబడుతున్నారు. టీడీపీ నుంచి ఇప్పటికే ముజఫర్ అలీఖాన్ ప్రచారం మొదలెట్టారు. మరోవైపు జీహెచ్ఎంసీలో టీడీపీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, సలీంనగర్ కార్పొరేటర్ చెకొలేకర్ శ్రీనివాస్ కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు ఉంటుందని కింది స్థాయి కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు. ఒకవేళ పొత్తు ఉంటే ఈ సీటు టీడీపీకే కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. లేకుంటే బీజేపీ నుంచి పార్టీ నగర అధ్యక్షుడు వెంకట్రెడ్డి, బద్దం బాల్రెడ్డి కూడా ఈ సీటుపై కన్నేసినట్టు సమాచారం. స్థానిక నాయకుడు మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్చందర్జీతో పాటు బి.నర్సింహలు కూడా బీజేపీ నుంచి మలక్పేట సీటు కోసం పట్టుపడుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్లో కొనసాగుతున్న విజయసింహారెడ్డి బీజేపీలో చేరితే ఆయనకు టికెట్ ఇవ్వవచ్చనే ప్రచారం కూడా ఉంది. కాంగ్రెస్పార్టీ నుంచి ఆశావాహుల్లో పీసీసీ కార్యదర్శి బొల్లు కిషన్, బాలకృష్ణయాదవ్ పోటీలో ఉన్నారు. మొత్తానికి సిట్టింగ్ స్థానమైన ఎంఐఎం పార్టీకి ఈ ఎన్నికల్లో గెలుపు అంత సులువు కాదన్నది ఆ పార్టీని కొంత ఆందోళనకు గురిచేస్తోంది. ముషీరాబాద్కు ‘సన్’స్ట్రోక్ ముషీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థే ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి పోటీ చేయడానికి అనేక మంది కాంగ్రెస్ నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ సోమవారం టీపీసీసీకి పంపించిన జాబితాలో నగరం నుంచే అత్యధికంగా ఏడుగురు అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను అందించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అందులో టి.శ్రీనివాస్రెడ్డి, అనిల్కుమార్యాదవ్, విక్రమ్గౌడ్, వినయ్కుమార్, కోదండరెడ్డి, బాలరాజు, సురేష్కుమార్ పేర్లు ఉన్నాయి. వీరిలో బాల్రాజ్, కోదండరెడ్డి మినహా మిగతా ఐదుగురూ కాంగ్రెస్ ముఖ్య నేతల కుమారులే కావడం గమనార్హం. దివంగత మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య, ప్రస్తుత ఎమ్మెల్యే టి.మణెమ్మల కుమారుడు శ్రీనివాస్రెడ్డి, సికింద్రాబాద్ ఎంపీ అంజన్కుమార్ యాదవ్ కుమారుడు అనిల్కుమార్ యాదవ్, మంత్రి ముఖేష్గౌడ్ కుమారుడు విక్రమ్గౌడ్, దివంగత కేంద్ర మాజీ మంత్రి పి.శివశంకర్ కుమారుడు డాక్టర్ వినయ్కుమార్, ఎస్.యాదగిరి కుమారుడు సురేష్కుమార్ దానం పంపిన జాబితాలో ఉన్నారు. ఇక్కడి ప్రస్తుత ఎమ్మెల్యే మణెమ్మ కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతుండటం, ఆమె కొడుకు శ్రీనివాస్రెడ్డి ఉత్సాహంగా పని చేయక పోవడమే ఈ నియోజకవర్గం నుంచి ఏడుగురి పేర్లను సిఫార్సు చేయడానికి కారణమని చెప్పుకుంటున్నారు. అందుకే కాంగ్రెస్ నేతల కళ్లు ఈ స్థానంపై పడ్డాయని అభిప్రాయపడుతున్నారు. ఇదిలావుండగా, నియోజకవర్గంలో ప్రస్తు తం ఆరు డివిజన్లలో కాంగ్రెస్ కార్పొరేటర్లు, నలుగురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నప్పటికీ వారి అభిప్రాయాలను తీసుకోకుండా కేవలం నాయకుల కొడుకుల పేర్లను మాత్రమే పీసీసీకి పంపించడంతో వారంతా మండిపడుతున్నారు. కోదండరెడ్డి గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర కాంగ్రెస్లో కీలక పాత్ర పోషించారు. ఈయన ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని కృతనిశ్చయంతో ఉండి ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ పెద్దలను కలిసి వచ్చారు. ఇంతమంది పోటీలో ఉన్నా ఎవరికివారు సీటు మాత్రం తమకే వస్తుందని పైకి ధీమా వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ల సమయం దగ్గరపడుతుండటం, జాబితా ఇంకా సిద్ధం కాకపోవడంతో బీఫాం ఎంవరిని వరిస్తుందోనని కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠ పెరుగుతోంది. -
క్యాష్తో వెళ్తున్నారా..తస్మాత్ జాగ్రత్త!
వ్యాపార నిమిత్తమో.. శుభకార్యం కోసమో..మరేదైనా అవసరార్థమో.. పెద్ద మొత్తంలో డబ్బు వెంట తీసుకెళ్తున్నారా.. అయితే మీరు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందే. సాధారణ ఎన్నికల దృష్ట్యా ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున నగదు రవాణాలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. ఎంతటి వారైనా ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే తలనొప్పి తప్పదు. ఎట్టిపరిస్థితుల్లోనైనా రూ. 50వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లకపోవడం మంచిది. ఒకవేళ తీసుకెళ్లాల్సి వచ్చినా దానికి సంబంధించిన పూర్తి వివరాలు, ధ్రువీకరణ పత్రాలను దగ్గరే ఉంచుకోవాలి. సరైన డాక్యుమెంట్లు లేని డబ్బును సీజ్ చేస్తామని, సొత్తుకు సంబంధించి పూర్తి ధ్రువపత్రాలను అందజేస్తే తప్ప నగదు తిరిగి ఇవ్వబోమని అధికారులు ఖరాకండిగా చెప్తున్నారు. ఎన్నికల వేళ డబ్బుతో ఓటర్లను కొనుగోలు చేసేందుకు పార్టీలు చేస్తున్న పన్నాగాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల సంఘం ఈ కట్టుదిట్టమైన నిబంధనలు విధించింది. జిల్లా వ్యాప్తంగా ప్రతి చెక్పోస్టు వద్ద పోలీసులు నిఘా వేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక మొబైల్ టీంలు కూడా సంచరిస్తూ ఎక్కడిక్కడ తనిఖీలు చేస్తున్నాయి. ఇప్పటివరకూ జిల్లాలో రూ. 1.90 కోట్లకు పైగా సరైన ధృవపత్రాలు లేని నగదును పోలీసులు సీజ్ చేశారు. శనివారం ఒక్కరోజే సుమారు రూ. 70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ సొత్తుపై విచారణ జరిపేందుకు ఐటీ శాఖకు చెందిన ఉన్నతాధికారిని కూడా నియమించారు. నగదు తోపాటు బంగారం, వెండి వంటి విలువైన ఆభరణాల తరలింపులో తగుజాగ్రత్తలు పాటించాలి. బ్యాంకు లావాదేవీలపైనా రిటర్నింగ్ అధికారులు నిఘావేశారు. రూ. లక్షకు మించి ఎలాంటి లావాదేవీ జరిగినా తమ దృష్టికి తేవాల్సిందిగా అన్ని బ్యాంకుల యాజమాన్యానికి కలెక్టర్ శనివారం ఆదేశాలు జారీచేశారు. అయితే నిత్యం వ్యాపార నిమిత్తం అధిక మొత్తంలో నగదుతో సంచరించే వ్యాపారులు పోలీసుల తనిఖీల పట్ల ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకుని వెళ్తుంటే రెండు, మూడు చోట్ల పోలీసులు ఆపుతున్నారని, వారడిగిన డాక్యుమెంట్లు చూపాలంటే రెండు,మూడు సార్లు ఇంటికి వెళ్లి రావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అసలే ఆర్థిక సంవత్సరం ముగింపు రోజులు.. ఆపై ఎన్నికల అధికారుల నిబంధనలతో పని ఒత్తిడి పెరిగిపోయిందని బ్యాంకర్లు వాపోతున్నారు. నగదు రవాణా నిబంధనల వల్ల కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. సొంత డబ్బే అంటే కుదరదు సొంత డబ్బే కదా.. ఏమవుతుందని పెద్ద మొత్తంలో వెంట తీసుకెళ్తే చిక్కుల్లో పడక తప్పదు. బ్యాంకులో జమ చేసేందుకు రూ.50వేలు మించి డబ్బు తీసుకువెళ్లే వారు బ్యాంక్ పాస్బుక్, పాన్కార్డు వంటివి తీసుకెళ్లాలి. ఇక లక్షల్లో తీసుకెళ్లాల్సి వస్తే ఆదాయపు పన్ను చెల్లింపు వివరాల పత్రాలు విధిగా ఉండాలి. ముఖ్యంగా వ్యాపారులు, వివాహాలకు దుస్తులు, బంగారం కొనుగోలు చేసేందుకు వెళ్లే వారు ఇతరత్రా అవసరాలకు నగదు వెంట తీసుకెళ్లేవారు జాగ్రత్త వహించాలి. నగదుపైనే కాదు.. పోలీసులు నగదు రవాణాపైనే కాకుండా ఓటర్లను ప్రభావితం చేసే ఇతర వస్తువులపైనా నిఘా పెట్టారు. నగదుతోపాటే ఓటర్లను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు రకరకాల నజరానాలు ప్రకటిస్తుంటారు. మహిళా ఓటర్లు అయితే చీరెలు, పెద్దలకు మద్యం సీసాలు, యువకులకు క్రికెట్ కిట్లు, వాలీబాల్, ఫుట్బాల్, క్యారమ్ బోర్డులు గంపగుత్తగా నజరానాగా ఇవ్వడం ఆనవాయితీ. పోలీసులు వీటిపైనా దృష్టి కేంద్రీకరించారు. పైన పేర్కొన్నవి పెద్ద మొత్తంలో రవాణా చేస్తున్న సమయంలో పోలీసుల తనిఖీల్లో దొరికితే అంతే సంగతులు. వాటిని ఎక్కడ కొన్నారు? ఎందుకు కొన్నారు? వ్యాపారం కోసమా? అనే పోలీసుల ప్రశ్నలకు ఆధారాలతో సహా జవాబులివ్వాల్సి ఉంటుంది. జవాబు రాని పక్షంలో వాటిని జప్తు చేయడమే కాకుండా కేసు కూడా నమోదు చేస్తారు. అలాగే ఎన్నికల సందర్భంగా మద్యం ఏరులై పారకుండా పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. గుడుంబా స్థావరాలపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. విస్కీ, బ్రాందీ నిల్వలు లేకుండా నిఘా పెంచారు. -
మాకేం కావాలంటే...
ఉపాధి కల్పన, సామాజిక సమస్యల పరిష్కారానికి ప్రయత్నించే వారికే తమ మద్దతు ఉంటుందని ఢిల్లీ యువత చెబుతోంది. దేశరాజధానిలో నరేంద్ర మోడీ హవా చాలా తక్కువగా ఉంటుందని, ఆమ్ ఆద్మీ పార్టీవైపు మొగ్గుచూసే వారి సంఖ్యే అధికమని తొలిసారిగా ఓటు వేస్తున్న యువతీయువకులు అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల తరువాత వచ్చే ప్రభుత్వంపై ఢిల్లీ యువత ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఉపాధి చూపి, నగరాన్ని మహిళలకు సురక్షితంగా తీర్చిదిద్దగల వారికి ఓటు వేస్తామని చెబుతోంది. అవినీతి, ఆహార పదార్థాల ధరలను నియంత్రించగలిగిన వాళ్లకే మద్దతు ఇస్తామంటోంది. వచ్చే నెల 10న నిర్వహించే పోలింగ్లో ఎవరికి ఓటు వేయా లో ఇప్పటికే నిర్ణయించుకున్నామని 18-25 ఏళ్ల మధ్య వయసున్న పలువురు యువతీయువకులు చెబుతున్నారు. ఒక్కొక్కరికీ ఒక్కో తరహా రాజకీయ భావాలు ఉన్నా అత్యధికులు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వైపు చూస్తున్నారు. మొదటిసారిగా ఓటు వేయబోతున్న అన్మోల్ గుప్తా మాట్లాడుతూ సామాజిక అంశాల పరిష్కారానికి యత్నించే వారికే తన ఓటు పడుతుందని అన్నాడు. ఆప్ అభ్యర్థులంతా చదువుకున్న వాళ్లు, భవిష్యత్ ప్రణాళికలు ఏమిటో చెప్పారు కాబట్టే తను ఆ పార్టీవైపే మొగ్గుచూపుతానని చెప్పాడు. ఢిల్లీలో నరేంద్రమోడీ హవా ఉండకపోచ్చని ఢిల్లీ ఐఐటీలో చదివే ఈ యువకుడు అభిప్రాయపడ్డాడు. ఆయన ప్రభావం ఎల్లకాలం ఉండబోదన్నాడు. రాజకీయ పార్టీలు విద్యాభివృద్ధిపై దృష్టి సారించాలని పేర్కొన్నాడు. దేశవ్యాప్తంగా తొలి సారి ఓటు హక్కు ఉపయోగించుకుంటున్న 2.3 కోట్ల మందిలో గుప్తా ఒకడు. ఇతనిలాగే మొదటిసారి పోలింగ్బూత్కు వెళ్లబోతున్న సోనియా తల్వా ర్, దివ్యాగుప్తా కూడా ఆప్కే తమ ఓటు పడుతుం దని స్పష్టం చేశారు. వీళ్లిద్దరూ తరచూ రాజకీయాల గురించి మాట్లాడుకోవడమే కాదు..ఫేస్బుక్ ద్వారా అభిప్రాయాలను పంచుకుంటారు. ‘అన్నిం టికంటే ముఖ్యం ఉద్యోగాలు. ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం చాలా కష్టంగా మారింది. కాంగ్రెస్, బీజేపీ అవినీతి పార్టీలు. ఇప్పుడు ఆప్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీ ప్రభుత్వం కూడా కొన్ని పొరపాట్లు చేసి ఉండవచ్చు. నేర్చుకోవడానికి కాస్త సమయం పడుతుంది’ అని కాస్ట్ అకౌంటెంట్ ట్రెయినీగా పనిచేసే తల్వార్ వాదించింది. తాను కూడా ఆప్కే ఓటు వేస్తానని, అయితే మోడీ సర్కారు వస్తే ఉపాధి కల్పన పెరుగుతుందని గుప్తా చెప్పింది. గుజరాత్ అల్లర్లలో ఎంతోమంది మరణానికి కారకుడైన మోడీని అంత సులువుగా మర్చిపోలేమని స్పష్టం చేసింది. అన్ని ప్రాంతాల్లో శాంతి, మతసామరస్యాన్ని బీజేపీ తెస్తుందన్న నమ్మకం తనకు లేదని కుండబద్దలు కొట్టింది. జామియా మిలియా యూ నివర్సిటీలో ఇంజనీరింగ్ చదివే 22 ఏళ్ల అద్నాన్ హుస్సేన్ కూడా బీజేపీపై మండిపడ్డాడు. అది మైనారిటీలను ద్వేషిస్తోందని విమర్శించాడు. ఇటీవలే డిగ్రీ పూర్తి చేసుకొని చిన్న ఉద్యోగం తో నెలకు రూ.14 వేలు సంపాదించే మణికంఠ్ ఓ ఝాకు మాత్రం రాజకీయాల కంటే ధరలే ము ఖ్యాంశం. ఇంతకుముందు కాంగ్రెస్కు ఓటు వేశానని, ధరల స్థిరీకరణ గురించి బీజేపీ వాగ్ధానం చేసింది కాబట్టి ఈసారి దానికే మొగ్గుచూపుతానని చెప్పా డు. టెలికాం సంస్థలో పనిచేసే 31 ఏళ్ల తరుణకు సహజంగానే మహిళల భద్రత కీలకాంశంగా మా రింది. ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్కు మాత్రమే ఈ సమస్యను పరిష్కరించగల సత్తా ఉం దని ఈమె విశ్వసిస్తోంది. ముస్లిమ్ల అభ్యున్నతికి కృషి చేసే వారికి ఓటు వేస్తానని ఆటోరిక్షా డ్రైవర్ మహ్మ ద్ ఇమ్రాన్ అన్నాడు. ‘మా కుటుంబం చాలా ఏళ్లుగా కాంగ్రెస్కు ఓటేస్తోంది. ఇప్పుడు మార్పు అవసరం. బీజేపీ భారతీయులను విడదీసి పాలి స్తోంది. ముందు మనందరం మనుషులం’ అని ఇమ్రాన్ అన్నాడు. ఎనిమిదేళ్ల క్రితం ఢిల్లీ వచ్చి స్థిరపడ్డ 24 ఏళ్ల మోహిత్ కుమార్ కూడా మహిళల భద్రత చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. మోడీ ప్రభుత్వం వస్తేనే మహిళలు క్షేమంగా ఉండగలుగుతారని స్పష్టం చేశాడు. ఉపాధి కోసం ఇక్కడికి వచ్చిన బీహార్, ఉత్తరప్రదేశ్ యువత ఓటింగ్ కోసం స్వస్థలాలకు వెళ్తున్నామని చెబుతోంది. -
యమ హీట్..!
ఎన్నికలకు ఘడియలు సమీపిస్తుండటంతో టికెట్ల రభస పెరుగుతోంది. గ్రూపు రాజకీయాలు రాజుకొని నేతలను హడలెత్తిస్తున్నాయి. జిల్లా కాంగ్రెసులో మాజీ మంత్రులు డీకే అరుణ, జైపాల్ రెడ్డిల ప్రభావం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. ఎవరికి వారు తమవారిని బరిలో నిలిపేందుకు పావులు కదుపుతున్నారు. ఇక పురపాలక ఎన్నికల్లో ఆశావహులు డీసీసీ కార్యాలయంలో గురువారం చేసిన హంగామా వర్గాల తీవ్రతను తెలియజేస్తోంది. కిటికీల అద్దాలు ధ్వంసం చేసి వారు తమ ప్రతాపాన్ని చాటారు. పార్టీని నమ్ముకున్న వారిని కాదని కొత్తగా వచ్చిన వారికి ‘బీ ఫారం’ ఇస్తారా అని తిరగబడ్డారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ నేతలు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ వేటలో పావులు కదుపుతుండటంతో గ్రూపు రాజకీయాలు జోరందుకున్నాయి. తెలంగాణ ఎన్నికల కమిటీ ఏర్పాటు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు దిగ్విజయ్ సింగ్ రాకతో టికెట్ రాజకీయాలు వేడెక్కాయి. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన తెలంగాణ ఎన్నికల కమిటీలో 23 మందికి చోటు కల్పించారు. కేంద్ర మంత్రి జైపాల్రెడ్డితో పాటు జిల్లాకు చెందిన మాజీ మంత్రి డీకే అరుణకు ఈ కమిటీలో ప్రాతినిథ్యం దక్కింది. దీంతో ఈ ఇద్దరు నేతలు కేంద్రంగా జిల్లా కాంగ్రెస్లో కొనసాగుతున్న గ్రూపు రాజకీయాలు ఊపందుకున్నాయి. కేంద్రమంత్రి జైపాల్రెడ్డి మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఆయన వర్గీయుల్లో ఉత్సాహం నింపింది. మరోవైపు ఎన్నికల కమిటీలో డీకే అరుణకు కూడా చోటు దక్కడంతో మాజీ మంత్రి వర్గీయులూ ధీమాతో వున్నారు. గద్వాల, వనపర్తి మినహా మిగతా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ నేతలు రెండు వర్గాలుగా చీలి టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిటీలో సభ్యులుగా వున్న జైపాల్రెడ్డి, అరుణపై టికెట్ కోసం సొంత వర్గీయుల నుంచి తీవ్ర ఒత్తిడి వుండే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీకి విఠల్రావు? కేంద్రమంత్రి జైపాల్రెడ్డి మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారంతో కాంగ్రెస్లో రాజకీయ సమీకరణాలు మారే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో మహబూబ్నగర్ లోక్సభ నుంచి పోటీ చేసిన మాజీ ఎంపీ విఠల్రావు అసెంబ్లీ బరిలో నిలిచే అవకాశం వుంది. నారాయణపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు విఠల్రావు ఆసక్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు లోక్సభకు విఠల్రావు పోటీ చేయడంపైనా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. జైపాల్రెడ్డి ఎంపీగా బరిలో లేని పక్షంలో మాజీ ఎంపీ మల్లికార్జున్ సతీమణిని పోటీలో నిలిపేందుకు ఓ వర్గం ప్రయత్నం చేస్తోంది. జడ్చర్ల అసెంబ్లీ స్థానం ఖరారైందంటూ మాజీ ఎంపీ మల్లు రవి వర్గీయులు హడావుడి చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకులు దిగ్విజయ్ సింగ్ మరో రెండు రోజులు హైదరాబాద్లోనే వుండబోతున్నారు. దీంతో జిల్లా నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న నేతలు దిగ్విజయ్కు వినతిపత్రాల సమర్పణ, బల ప్రదర్శనకు సన్నద్దమవుతున్నారు. బీ ఫారాల కోసం ఒత్తిడి కొద్ది గంటల్లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియ నుంది. ఆశావహుల నుంచి ఒత్తిడి ఎక్కువగా వుండటం తో బీ ఫారాల జారీ మరింత ఆలస్యమ య్యే సూచనలు కనిపిస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు మా ర్చి 18 కావడంతో ఆలోపు బీ ఫారాలు జారీ చేసే అవకాశం వుంది. పార్టీ టికెట్పై ఆశతో ఔత్సాహికులు స్వతంత్రులుగా నామినేషన్లు వేసి బీ ఫారాల కోసం పార్టీ నేతలు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తమకే బీ ఫారం దక్కేలా ముఖ్య నేతలపై ఒత్తిళ్లు తెస్తున్నా జనరల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖం చాటేస్తున్నారు. గద్వాలలో మాజీ మంత్రి డీకే అరుణ, వనపర్తిలో మాజీ మంత్రి చిన్నారెడ్డి, నాగర్కర్నూలులో జడ్పీ మాజీ చైర్మన్ దామోదర్ రెడ్డి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. షాద్నగర్లో ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి, ఐజలో ఎమ్మెల్యే అబ్రహం, నారాయణపేటలో ఆప్కాబ్ చైర్మన్ వీరారెడ్డి అభ్యర్థుల జాబితా సిద్దం చేస్తున్నారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీ, కల్వకుర్తి నగర పంచాయతీలో మాత్రం నేతలు గ్రూపులుగా విడిపోవడంతో కమిటీలు ఏర్పాటు చేసినా కసరత్తు కొలిక్కి రావడం లేదు. -
ఎన్నాళ్లీ కన్నీళ్లు
పేరుకే మహానగరం.. దాహార్తిని తీర్చే దారే గగనం.. ఇదీ శివారు గ్రామాల ప్రజల దైన్యం. పానీ పరేషానే ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఎజెండాగా నిలవనుంది. ఎన్నాళ్లీ కన్నీళ్లని శివారు జనం ప్రధాన పార్టీలను నిలదీయనున్నారు. మంచినీళ్ల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన తరవాతేఓట్లు అడగాలని రాజకీయ పార్టీలకు స్పష్టం చేయనున్నారు. శివార్లలో తొమ్మిది శాసనసభ, మూడు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా స్థానాల్లో బరిలోకి దిగనున్న ప్రధాన పార్టీల అభ్యర్థులను పానీపరేషాన్పైనే జనం ప్రధానంగా ప్రశ్నించనున్నారు. ఆయా రాజకీయ పక్షాలు కూడా నియోజకవర్గాల వారీగా విడుదల చేయనున్న స్థానిక మేనిఫెస్టోల్లో మంచినీటి సమస్య పరిష్కరిస్తామని స్పష్టంగా పేర్కొనాల్సిన పరిస్థితి తలెత్తింది. ‘గ్రేటర్’లో నీటికి కటకట మహానగరంలో మొత్తం భవనాలు సుమారు 25 లక్షలు. కుళాయిలున్న నివాస సముదాయాలు కేవలం 8 లక్షలే. ఈ వివరాలు చాలు.. గ్రేటర్లో మంచినీటి సరఫరా దుస్థితి ఎలా ఉందో తేటతెల్లం చేయడానికి. శివార్లలోని 11 మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో మొత్తంగా 900 కాలనీలు, బస్తీలకు జలమండలి మంచినీటి పైప్లైన్ నెట్వర్క్ లేదు. ఫలితంగా నిత్యం 35 లక్షలమంది గొంతెండుతోంది. సుమారు 625 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన గ్రేటర్ పరిధిలో 300 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి మంచినీటి సరఫరా నెట్వర్క్ లేదంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఆయా ప్రాంతాల్లో జనం ఫల్టర్ప్లాంట్లు, బోరుబావులను ఆశ్రయించి బావురుమంటున్నారు. నెలకు మంచినీటి కోసమే ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారంటే నీటి కటకట ఏ స్థాయిలో ఉందో అర్థమౌతోంది. అంతేకాదు ఒకవైపు నగర శివార్లు శరవేగంగా విస్తరిస్తున్నాయి. కానీ మంచినీటి పైప్లైన్ నెట్వర్క్, స్టోరేజి రిజర్వాయర్లను నిర్మించడంలోనూ సర్కారు విఫలమౌతోంది. కుంటినడకన సాగుతున్న గోదావరి, కృష్ణా మూడోదశ ప్రాజెక్టులు, స్టోరేజి రిజర్వాయర్ల లేమి... వెరసి మహానగర సిటీజనులకు కన్నీటి కష్టాలే మిగులుతున్నాయి. శివారు మంచినీటి పథకాలను పూర్తిచేసేందుకు రూ.3195 కోట్ల అంచనా వ్యయంతో జలమండలి సిద్ధం చేసిన ప్రణాళికలు ఐదేళ్లుగా కాగితాల్లోనే మగ్గుతున్నాయి. నీళ్లఖర్చు తడిసి మోపెడు గ్రేటర్ పరిధిలో సుమారు 900 కాలనీలు, బస్తీలు నిత్యం దాహార్తితో అల్లాడుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో జలమండలి సరఫరా చేస్తున్న 300 మిలియన్ గ్యాలన్ల మంచినీటిలో 40 శాతం మేర సరఫరా నష్టాలే ఉన్నాయి. రోజువారీ సరఫరా 180 మిలియన్ గ్యాలన్లకు మించడం లేదు. ఇక శివారు ప్రాంతాల్లో జలమండలి సరఫరా నెట్వర్క్ లే కపోవడం, భూగర్భజలాలు తరిగిపోవడంతో ఫిల్టర్ ప్లాంట్లు, ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రతి ఇంటికి నెలకు రూ.వెయ్యి నుంచి రూ.రెండు వేల వరకు నీటిపైనే ఖర్చు పెట్టాల్సిన దుస్థితి తలెత్తింది. దీంతో అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలకు పానీపరేషాన్ తప్పడం లేదు. స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణం, మంచినీటి పైప్లైన్ నెట్వర్క్ను విస్తరించనిపక్షంలో కృష్ణా మూడోదశ, గోదా -
సీటు..ఫైటు
సాధారణ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు ఒకేసారి రావడంతో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్లో ఇన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న వర్గపోరు ఇప్పుడు బయటపడుతోంది. ఎన్నికల తరుణంలో అవకాశాల కోసం శ్రేణుల మధ్య పోటీ ఘర్షణలకు దారితీస్తోంది. స్టేషన్ ఘన్పూర్ టీఆర్ఎస్లోని వర్గాలు ఇప్పుడు స్థానిక అవకాశాల కోసం పోరాటం మొదలుపెట్టాయి. టీఆర్ఎస్ కీలక నేత కడియం శ్రీహరి, సిట్టింగ్ ఎమ్మెల్యే టి.రాజయ్య వర్గాల మధ్య కొన్నాళ్లుగా కొనసాగుతున్న వర్గపోరు... ద్వితీయ శ్రేణి నేతల ఘర్షణతో మంగళవారం మరోసారి బయటపడింది. తెలంగాణ ఏర్పాటుతో మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో కడియం శ్రీహరి వర్గీయులు తమ నేతను ఎమ్మెల్యేగా పోటీ చేయించే వ్యూహాన్ని ముందుకు తెచ్చారు. కడియం శ్రీహరితోపాటు టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన వర్గాన్ని సమీకరిస్తున్నారు. ఎమ్మెల్యే టి.రాజయ్య నిర్లక్ష్యంగా వ్యవహరించారని భావిస్తున్న టీఆర్ఎస్ వ్యవస్థాపక శ్రేణులను కడియం వర్గీయులు అక్కున చేర్చుకుంటున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థిత్వాల ఖరారు అంశాన్ని ముందుకుపెట్టి ఎమ్మెల్యే అభ్యర్థిగా కడియం శ్రీహరి అయితే బాగుంటుందనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యే అయితేనే స్టేషన్ ఘన్పూర్ మళ్లీ అభివృద్ధి చెందుతుందనే ప్రచారం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం మొదలైన ఈ ప్రక్రియ ఊపందుకుంది. దీన్ని పసిగట్టిన ఎమ్మెల్యే రాజయ్య వర్గీయులు ప్రతి వ్యూహాలతో సన్నద్ధమవుతున్నారు. స్థానిక ఎన్నికల్లో అవకాశాలు దక్కించుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వీరు సైతం టీఆర్ఎస్ మొదటి నేతలను కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా రెండు వర్గాలు మొదటి నుంచి టీఆర్ఎస్లో ఉన్న వారిని దగ్గరగా చేర్చుకుంటూ తమ నేతలను ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలా ఇరు వర్గాల వ్యూహాలు జోరందుకోవడంతో జఫర్గఢ్ మండలం తీగారం సమీపంలో ఏకంగా ఘర్షణ వరకు వెళ్లింది. ఒకరికొకరు తోపులాటకు దిగారు. ఈ ఘర్షణలో ఓ నాయకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యూరు. ఆయనను వెంట నే జఫర్గఢ్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అరుు తే స్థానిక, సాధారణ ఎన్నికలలోపు ఇలాంటివి ఇంకా జరిగే పరిస్థితి ఉందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కడియం శ్రీహరి, రాజయ్య వర్గీయుల పంచాయతీ.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్దకు వెళ్లిందని ప్రచారం జరుగుతోంది. రాజయ్య వర్గీయులు రెండుమూడు రోజుల్లో కేసీఆర్ను కలవనున్నట్లు చెబుతున్నారు. పదవుల కోసం పోటీ ఇన్నాళ్లు ఉద్యమం కారణంగా పదవుల కోసం పోటీ పడేందుకు సంశయంగా ఉన్న టీఆర్ఎస్ నేతలు మొహమాటం లేకుండా వ్యవహరిస్తున్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో మొదట టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పనిచేసిన వారే ఉన్నారు. 1994, 1999లో కడియం శ్రీహరి స్టేషన్ ఘన్నూర్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. పదేళ్లు మంత్రిగా పని చేశారు. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇక్కడ గెలిచింది. జి.విజయరామారావు ఏకంగా రాష్ట్ర మంత్రి అయ్యారు. 2008 ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి గెలిచారు. 2009 ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి టి.రాజయ్య చేతిలో కడియం శ్రీహరి ఓడిపోయారు. అనంతరం రాజయ్య టీఆర్ఎస్లో చేరారు. 2012లో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కడియం శ్రీహరిపై రాజయ్య గెలిచారు. అనంతరం కడియం శ్రీహరి కూడా టీఆర్ఎస్లో చేరారు. ఇలా మూడు పార్టీల్లో ముఖ్య నేతలుగా ఉన్న కడియం శ్రీహరి, జి.విజయరామారావు, ఎమ్మెల్యే రాజయ్యలు టీఆర్ఎస్లోనే చేరడంతో వర్గపోరు తీవ్రమైంది. తర్వాత విజయరామారావు కాంగ్రెస్లో చేరారు. అయినా కడియం, రాజయ్య వర్గాల మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. ఎన్నికల తరుణంలో ఇది బయటపడుతోంది. -
పోలీసులకు సవాల్!
మున్సిపల్, స్థానికసంస్థలు, సార్వత్రిక ఎన్నికలు పోలీసులకు సవాల్గా మారాయి. వరుసగా ఎన్నికలు జరుగనుండడంతో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. తిరుపతి పోలీస్ అర్బన్ జిల్లాలో సాధారణ విధులకే పోలీసుల కొరత ఉండడంతో ఎన్నికల విధులు వీరికి అదనపు భారం కానున్నాయి. అయినప్పటికీ, ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు సన్నద్ధం అవుతున్నారు. అదనపు పోలీసు బలగాలను జిల్లాకు రప్పిస్తున్నారు. ఇప్పటికే రెండు కంపెనీల పారా మిలటరీ బలగాలు జిల్లాకు చేరాయి. మరో 10 కంపెనీల బలగాలు రానున్నాయి. పోలీసులకు సెలవులు రద్దు రెండు నెలల వ్యవధిలో వరుసగా ఎన్నికలు జరుగనుండడంతో పోలీసులకు సెలవులు రద్దు చేస్తూ అర్బన్ ఎస్పీ ఎస్వీ రాజశేఖర్బాబు ఉత్తర్వులు జారీ చేశారు. అందరినీ వెంటనే సెలవులు రద్దు చేసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్లలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు ముగిసేవరకు 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అనారోగ్యంతో ఉన్న పోలీస్ సిబ్బంది కూడా సెలవులు రద్దు చేసుకుని రావాలన్నారు. శుభకార్యాలకు కూడా వెళ్లకూడదని, ఇతర ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోరాదని సూచించారు. సబ్డివిజన్ స్థాయి పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను తెలుసుకుంటూ ఉండాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. 419 సమస్యాత్మక గ్రామాలు తిరుపతి అర్బన్ పోలీసు జిల్లా పరిధిలో 419 సమస్యాత్మక గ్రామాలను పోలీసు అధికారులు గుర్తించారు. ఆయా గ్రామా ల్లో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇప్పటివరకు అర్బన్ జిల్లా పరిధిలో 52 మందిని ముందస్తుగా బైండోవర్ చేసుకున్నారు. అర్బన్ జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో 460 మంది రౌడీషీటర్లు ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. భారీ పోలీస్ బందోబస్తు ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల కావడంతో జిల్లాలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల విధులకు అర్బన్ జిల్లాలో ఉన్న ప్రస్తుత పోలీస్ సిబ్బంది, అధికారులతో పాటు మరో 12 కంపెనీల పారామిలటరీ బలగాల అవసరం ఉంది. ఇప్పటికే రెండు కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు అర్బన్ జిల్లాకు చేరుకున్నాయి. మరో వారం రోజుల్లోగా మిగిలిన బలగాలు రానున్నాయి. అర్బన్ జిల్లా పరిధిలో 9 చోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. వాటితోపాటు సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. చెక్పోస్టుల్లో స్పెషల్పార్టీ పోలీసులు, సివిల్ పోలీసులు ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను బట్టి గన్మెన్లను కేటాయించనున్నారు. మద్యం విక్రయాలపై నిఘా జిల్లాలో ఐఎంఎల్ లిక్కర్ గోడౌన్ల నుంచి తెచ్చిన మద్యాన్ని మాత్రమే విక్రయించాల్సి ఉంది. ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు సరిహద్దుగా ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి రాజకీయ నేతలు మద్యాన్ని తీసుకొచ్చి రహస్య ప్రాంతాల్లో పెట్టుకున్నారనిసమాచారం. జిల్లాలోకి ఇతర ప్రాంతాలకు చెందిన మద్యం రాకుండా నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి అన్ని నియోజకవర్గాల్లో నిఘా పెట్టాల్సి ఉంది. -
ఇదే టైం...
ప్రస్తుతం ఎన్నికల జాతర నడుస్తోంది. మునిసిపల్, స్థానిక, సాధారణ ఎన్నికలు ఒకేసారి వచ్చిపడ్డారుు. నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. ఈ తరుణంలో అందరి చూపు బడా రాజకీయ నేతలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన భారీ బకారుులపై పడింది. ప్రధానంగా తాజా, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పలువురు రూ.18.98 లక్షల మేర విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉందని కలెక్టర్ కిషన్కు ఆ శాఖ అధికారులు నివేదించడంతోపాటు వారిని అప్పుల జాబితాలో పెట్టాలని విన్నవించడమే ఇందుకు కారణం. ఎన్నికల బరిలో ఉండాలంటే... ప్రభుత్వానికి ఒక్క రూపారుు బకారుు ఉండొద్దని నిబంధనలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో కరెంట్ అధికారులు వసూళ్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో విద్యుత్ శాఖ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు. ఎవరైనా సామాన్య తరగతి చెందిన వినియోగదారులు ఒక నెల బిల్లు కట్టకపోతే చాలు... ఫైన్లు వేయడం, సర్వీస్ కట్ చేయడంతోపాటు వారిని ఆగమాగం చేసి బిల్లు పూర్తిగా కట్టేవరకు నిద్రపోరు. అలాంటిది కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న ప్రజాప్రతినిధులపై కనికరం చూపించడం వివక్ష కాదా.. అని ప్రశ్నిస్తున్నారు. నోటీసుల జారీ... జిల్లాలో మాజీ ప్రజాప్రతినిధులు నెల నెలా కరెంటు బిల్లులు చెల్లించని జాబితాలో ఉన్నారు. పార్టీలకతీతంగా వీరిలో కొందరు ప్రముఖులు తమ పేరిట... తమ కుటుంబీకుల పేరిట లక్షలాది రూపాయలు ఎన్పీడీసీఎల్కు బకాయి పడ్డట్లు రికార్డులు చెబుతున్నారుు. రాష్ట్ర మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య జనగామ ఏరియాలో ఉన్న సర్వీసుపై రూ. 6,387 బిల్లు నాలుగైదు నెలలుగా పెండింగ్లో ఉంటే.. జిల్లా కేంద్రంలో నివాసముంటున్న మాజీ మంత్రి, ఓ మాజీ ఎమ్మెల్సీ, ఆయన కుటుంబీకులు అత్యధికంగా రూ.8 లక్షల వరకు బాకీ పడ్డారు. ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, వినయ్భాస్కర్, తాటికొండ రాజయ్య, కొండేటి శ్రీధర్, మాలోతు కవిత, ఎంపీ గుండు సుధారాణి భర్త గుండు ప్రభాకర్ పేరిట బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇటీవలే విద్యుత్ రెవెన్యూ విభాగం తయారు చేసిన జాబితాలో ఈ వివరాలున్నాయి. అధికార, విపక్షాలకు చెందిన వీఐపీ నేతలు కావడంతో వారి నుంచి బిల్లులు వసూలు చేసేందుకు అధికారులు వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. తాజాగా సాధారణ ఎన్నికల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు నియోజకవర్గాల వారీగా కరెంట్ బిల్లు పెండింగ్ ఉన్న నేతలందరి జాబితాను కలెక్టర్కు సమర్పించారు. అంతేకాకుండా... ఇప్పటివరకూ బాకీ పడిన బిల్లు మొత్తం చెల్లించాలని వారికి నోటీసులు జారీ చేశారు. కాగా, ప్రజాప్రతినిధుల విద్యుత్ బాకీలను గత ఏడాది సెప్టెంబర్లో ‘సాక్షి’ బహిర్గతం చేసింది. హడావుడిగా విద్యుత్ బిల్లులన్నీ చెల్లించి నట్లు చేసినా... అప్పటినుంచి వారు మళ్లీ అదే పంథాలో నడిచారు. ఎవరేమనుకున్నా... మనకేంటి అనే తరహాలో దులుపేసుకున్నారు. బాకీ పడ్డ వారు వీరే... బాకీ పడిన రాజకీయ నేతల జాబితాను కలెక్టర్, ప్రభుత్వానికి విద్యుత్ శాఖ అధికారులు పంపించారు. వీరితోపాటు ఆయా నేతల బినామీల జాబితాను కూడా అందజేశారు. ఈ జాబితా ప్రకారం... పి.జగన్నాయక్ (మాజీ మంత్రి) రూ.1,95,190 ఆజ్మీరా చందూలాల్ (మాజీ మంత్రి) రూ.1,10,715 మాలోతు కవిత (ఎమ్మెల్యే) రూ.35,612 దాస్యం వినయ్ భాస్కర్ (ఎమ్మెల్యే) రూ.28,251 కొండేటి శ్రీధర్ (ఎమ్మెల్యే) రూ.20,609 సిరిసిల్ల రాజయ్య (ఎంపీ) రూ.17,759 గుండు సుధారాణి (ఎంపీ) రూ.15,142 కెప్టెన్ వి.లక్ష్మీకాంతారావు (మాజీ మంత్రి) రూ. 14,622 రేవూరి ప్రకాష్రెడ్డి (ఎమ్మెల్యే) రూ.11,582 పొన్నాల లక్ష్మయ్య (తాజా, మాజీ మంత్రి) రూ.6,387 తాటికొండ రాజయ్య (ఎమ్మెల్యే) రూ.6,272 దుగ్యాల శ్రీనివాసరావు (మాజీ ఎమ్మెల్యే) రూ.4,685 గండ్ర వెంకటరమణారెడ్డి (ఎమ్మెల్యే) రూ.4,201 టి.రాజేశ్వర్రావు (మాజీ మేయర్) రూ.3,565 పొదెం వీరయ్య (మాజీ ఎమ్మెల్యే) రూ.2,713 -
కదిలిన కమల దండు
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో హైదరాబాద్ నగరంలో బీజేపీ పక్కా వ్యూహంతో ముందస్తు ప్రచారానికి తెర లేపింది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటూ పార్టీ క్యాడర్లో కొత్త ఊపు తెచ్చేందుకు నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. ‘చాయ్ పే చర్చా’ కార్యక్రమంతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిన నాయకులు.. ఇకపై ప్రచారంలో మరింత వేగం పెంచేందుకు సిద్ధమయ్యారు. నగరంలోని నిజాం కాలేజీ గ్రౌండ్స్లో ఈ నెల 11న జరిగే ‘తెలంగాణ ఆవిర్భావ సభ’కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్ హాజరవుతుండటంతో ఈ సభను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సర్వశక్తులూ ఒడ్డి శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగా నగరంలోని అన్ని మున్సిపల్ డివిజన్లలో ఆ పార్టీ నాయకులు ఆదివారం పాదయాత్రలు నిర్వహించారు. తెలంగాణ సాధనలో బీజేపీ పాత్రను వివరిస్తూ ఇంటింటికీ కరపత్రాలు పంచారు. ‘మాట ఇచ్చాం.. మద్దతిచ్చాం.. తెలంగాణ తెచ్చాం..’ అన్న నినాదంతో బీజేపీ గ్రేటర్ అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అంబర్పేట డివిజన్లో ఆదివారం భారీ ఎత్తున పాదయాత్రలు నిర్వహించారు. ‘తెలంగాణ ఆవిర్భావ సభ’కు జన సమీకరణ చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ పనిలో పనిగా ప్రచారాన్ని ప్రారంభించారు. బీజేపీ మద్దతు వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వారు గట్టిగా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ గ్రేటర్ అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటుతో పాటు సీమాంధ్రకు కూడా న్యాయం చేయాలని రాజ్యసభలో ఒత్తిడి తేవడం వల్లే కొన్ని సవరణలు చేశారన్నారు. బీజేపీ వల్లే మేం తెలంగాణ ఇవ్వలేకపోయామని కాంగ్రెస్ చెప్పే ఎత్తులను రాజ్నాథ్సింగ్ చాకచక్యంగా తిప్పికొట్టారని తెలిపారు. భాగ్యనగరంలోని సీమాంధ్రులకు ఎలాంటి ఇబ్బంది కలగని విధంగా బీజేపీ పెద్దన్న పాత్ర పోషిస్తుందన్నారు. కృతజ్ఞతగానే... ప్రత్యేక తెలంగాణకు తాము అనుకూలమని బీజేపీ నేత రాజ్నాథ్ సింగ్ చేసిన వాగ్దానం మేరకు లోక్సభ, రాజ్యసభల్లో ఆ బిల్లును సమర్థించారని, దీనికి కృతజ్ఞతగా హైదరాబాద్లో సభను ఏర్పాటు చేస్తున్నామని వెంకటరెడ్డి తెలిపారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రతిపక్ష పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఆయన హైదరాబాద్ వస్తున్నారని.. ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు బీజేపీ నగర శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులు, విద్యార్థులు, జేఏసీ నాయకులు, కార్మిక, వ్యాపార వర్గాలన్నీ ఈ సభకు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ‘అసెంబ్లీ, మున్సిపల్ డివిజన్ల వారీగా ఇప్పటికే సమావేశాలు నిర్వహించాం. డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆదివారం గ్రేటర్ పరిధిలో పాదయాత్రలు చేసి కరపత్రాలు పంచాం. రాజ్నాథ్ సింగ్ సభకు వచ్చేందుకు అనేకమంది ఉత్సుకత చూపుతున్నారు. బీజేపీ అధ్యక్షుడిగా ఆయన ఏం మార్గదర్శకత్వం చేస్తోరోనని నగరవాసులు ఆతృతతో ఉన్నారు. బీజేపీ సహకారంతోనే తెలంగాణ వచ్చిందన్న వాస్తవం ఇప్పటికే ప్రజ ల్లోకి వెళ్లింది. తోక పార్టీలు ఏం చెప్పినా... ఇప్పుడు ప్రజలు వినే పరిస్థితిలో లేరు. తెలంగాణ కృతజ్ఞతతో పాటు స్థానిక సంస్థల సమరానికి కూడా ఇక్కడి నుంచే రాజ్నాథ్సింగ్ మార్గనిర్దేశం చేస్తారు’ అని ఆయన వివరించారు. నిజాం కాలేజీ గ్రౌండ్స్లో సభా వేదిక ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని, అలాగే ప్రధాన కూడళ్లలో, సభా ప్రాంగణంలో రాజ్నాథ్సింగ్, మోడీ, సుష్మాస్వరాజ్ల ప్లెక్సీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నామని వెంకటరెడ్డి తెలిపారు. ఈ సభకు సుమారు 70-80వేల మంది హాజరయ్యే అవకాశం ఉందన్నారు. -
కొత్తరకం’ ఓటెటో!
మరికొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ‘కొత్తతరం ఓటర్లతో పాటు కొత్తరకం’ ఓటర్లు కూడా పాల్గొనబోతున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేయడంలో భాగంగా పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఓటుహక్కు కల్పించాలని ఎన్నికల కమిషన్ భావించింది. ఈ నేపథ్యంలో గత ఏడాది కాలంగా కొత్తతరం యువతీ యువకులను ఓటర్లుగా నమోదు చేసేందుకు ఎన్నికల కమిషన్ స్పెషల్ డ్రైవ్లతో పాటు ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. విస్తృత ప్రచారం నిర్వహించింది. గతానికి భిన్నంగా ఈసారి ‘ఇతరులు’ కేటగిరి కింద కొత్తరకం వ్యక్తులకు కూడా ఓటర్ల జాబితాలో చోటు లభించింది. స్త్రీలు, పురుషులే కాకుండా ఇతరులు కేటగిరీలో ‘గే’లు కూడా పలువురు తమ ఓట్లు నమోదు చేసుకున్నారు. గ్రేటర్ పరిధిలో ఆడ, మగ కాని ఈ తరహా ఓటర్ల సంఖ్య ప్రస్తుతం 651 ఉంది. ఓట్ల నమోదుకు ఇంకా సమయం ఉన్నందున ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. కొన్ని నియోజకవర్గాల్లోనైనా గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగే అవకాశం ఈ ‘ఇతరుల’కు లేకపోలేదు. హైదరాబాద్ జిల్లాలో కంటే గ్రేటర్ శివారు నియోజకవర్గాల్లోనే ఈ ఇతరుల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. గ్రేటర్ పరిధిలో వీరు అత్యధికంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో (88 మంది) ఉండగా.. ఎల్బీనగర్లో 67, శేరిలింగంపల్లిలో 65 మంది ఉన్నారు. యాకుత్పురలో అతితక్కువగా (ఎనిమిది మంది) ఉన్నట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. మరి వీరి ఓటు ఎటువైపు అన్నది అతి త్వరలో తేలనుంది. -
తేల్చేది మార్పులే
సాధారణ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ కూడా విడుద లైంది. ప్రస్తుతం రాజకీయ అస్పష్టత నేపథ్యంలో నాయకుల్లో ఇప్పటికే టెన్షన్ నెల కొంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, వచ్చే ఎన్నికల్లో పార్టీల మధ్య అవగాహనలు, పొత్తుల వంటి కారణాలతో పోటీ చేసే నాయకులు గందరగోళంలో ఉన్నారు. వీటన్నింటికీ తోడు నియోజకవర్గాల వారీగా జరిగిన ఓటర్ల జాబి తాల్లో మార్పులు-చేర్పులు వారిని మరింత ఆందోళనకు గురిచేస్తున్నారుు. గత ఎన్నికల్లో సాధించిన మెజార్టీ ఎంత... ఎవరెవరు ఎటు వేశారు.. వంటి అంశాలు, జయాపజయాల తీరును బేరీజు వేసుకునే ఎవరైనా ముందుకెళుతారు. ఈ క్రమంలో ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్నమార్పులు ఆయూ నియోజకవర్గాల్లోని అభ్యర్థులను అయోమయంలోకి నెట్టారుు. నూతన ఓటర్లదే ప్రభావం... 2009 సాధారణ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. నేతల చతురతతోపాటు రాజకీయ పొత్తులతో అవకాశాలు కోల్పోయిన వారు పోటీకి దిగడం వంటి కారణాలతో ఆ ఎన్నికల్లో విజయం సాధించిన వారి మెజార్టీ తక్కువగానే ఉంది. 2009లో కొత్తగా ఓటు హక్కు పొందిన వారే గెలుపోటములను ప్రభావితం చేశారు. ప్రస్తుతం కొత్తగా ఓటు హక్కు పొందిన వారు ఎక్కువగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిపైనే అందరూ దృష్టి కేంద్రీకరిస్తున్నారు. వారి మనసులో ఏముందో... 2009లో జిల్లావ్యాప్తంగా మొత్తం 24,46, 551 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుత జాబి తా ప్రకారం 24,96,622 మంది ఓట ర్లు ఉన్నట్లు తేలింది. గత ఎన్నికలతో పోల్చి తే జిల్లాలో కొత్తగా ఓటు హక్కు పొందిన వా రు 50,071 మంది. దీన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో వీరి తీర్పే కీలకంగా మారనున్నట్లు స్పష్టమవుతోంది. తమతమ నియోజకవర్గాల్లో కొత్తగా ఓటు వేసే వారి మనసులో ఏముంది... వారి మెప్పు పొందడం ఎలా అనే పనిలో నేతలు నిమగ్నమయ్యూరు. గత ఎన్నికల్లో గెలిచిన వారు, ఓడిన వారు వీరి ఆదరణ విషయంలో ప్రత్యేక కార్యక్రమాలకు సన్నద్ధమవుతున్నారు. ఎనిమిది సెగ్మెంట్లలో పెరిగింది... జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య పెరిగింది. వరంగల్ పశ్చిమలో 2009లో గెలిచిన దాస్యం వినయ్భాస్కర్కు 6,684 ఓట్ల మెజార్టీ వచ్చింది. అప్పటి ఎన్నికలతో పోల్చితే ఈ నియోజకవర్గంలో 17,791 మంది కొత్త ఓటర్లు ఉన్నారు. మెజార్టీకి మూడు రెట్లుగా ఉన్న ఈ ఓటర్లతో ఫలితాలు తారుమారయ్యే పరిస్థితి ఉండనుంది. ములుగు, మహబూబాబాద్, నర్సంపేట, వర్ధన్నపేట, భూపాలపల్లి, డోర్నకల్, పాలకుర్తి సెగ్మెంట్లలో పెరిగిన ఓటర్ల సంఖ్యను గమనిస్తే... ఇలాంటి పరిణామాలే దారితీయొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నాలుగు చోట్ల తగ్గింది... వరంగల్ తూర్పు, స్టేషన్ఘన్పూర్, పరకాల, జనగామ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య తగ్గింది. ఈ అంశమే అక్కడ పోటీ చేయనున్న నాయకుల్లో ఎక్కువగా ఆందోళన కలిగిస్తోంది. మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రాతినిథ్యం వహిస్తున్న జనగామలో 2009తో పోల్చితే ప్రస్తుతం 2,331 మంది ఓటర్లు తగ్గారు. గత ఎన్నికల్లో ఆయన కేవలం 236 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఇప్పుడు తగ్గిన ఓటర్లు... గత ఎన్నికల్లో ఎవరికి మద్దతు ప్రకటించిన వారై ఉంటారనేది మంత్రితోపాటు ఆయన ప్రత్యర్థులను కలవరానికి గురిచేస్తోంది. వరంగల్ తూర్పు సెగ్మెంట్లో మరో మంత్రి బస్వరాజు సారయ్యకు 2009 ఎన్నికల్లో 7,255 ఓట్ల మెజార్టీ వచ్చింది. అప్పటితో పోల్చితే ఇప్పుడు ఈ సెగ్మెంట్లో 15,191 ఓట్లు తగ్గాయి. ఇలా తగ్గిన ఓట్లు మంత్రికి చేటు చేస్తాయా... ఆయన ప్రత్యర్థులకు లబ్ధి చేకూరుస్తాయూ... అనేది ఆసక్తికరంగా మారనుంది. -
జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు
విజయనగరం ఫోర్ట్, న్యూస్లైన్: ముచ్చటగా మూడో పోరుకు తెరలేచింది. ఇప్పటికే ఇటు మున్సిపల్ ఎన్నికలు, అటు సార్వత్రిక ఎన్నికలు ముంచుకొచ్చిన తరుణంలో ఆపసోపాలు పడుతున్న అధికారుల నెత్తిపై జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చిపడ్డాయి. వీటి కోసం జిల్లా పరిషత్ అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ల పదవీకాలం 2011 ఆగస్టుతో ముగిసింది. పదవీకాలం ముగిసి మూడున్నర ఏళ్లు అయినప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు ఎన్నికలు నిర్వహించలేదు. మరో వైపు మున్సిపల్ ఎన్నికలు ఆలస్యం చేయడంపై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. దీంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కూడా సుప్రీం కోర్టు హెచ్చరిస్తుందని గ్రహించి, ముందుగానే రిజర్వేషన్లు పూర్తి చేయాలని పంచాయతీరాజ్శాఖ అధికారులను ఆదేశించింది. అనుకున్నట్టుగానే సుప్రీం కోర్టు శుక్రవారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల జాప్యంపై ప్రభుత్వంపై మండిపడింది. రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో అధికారులు హడావుడిగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. 549 ఎంపీటీసీల్లో ఎస్టీలకు62 స్థానాలు, ఎస్సీలకు 57 స్థానాలు, బీసీలకు 277 స్థానాలు కేటాయించారు. 153 స్థానాలను అన్రిజర్వుడ్ చేశారు. ఎస్టీల్లో 37 స్థానాలు మహిళలకు, 25 స్థానాలు పురుషులకు కేటాయించారు. ఎస్సీల్లో 35 స్థానాలు మహిళలకు, 22 స్థానాలు పురుషులకు, బీసీల్లో 144 మహిళలకు, 133 పురుషులకు, అన్రిజర్వుడ్ స్థానాల్లో 86 మహిళలకు, 67 స్థానాలు పురుషులకు కేటాయించారు. జిల్లాలో 34 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. ఇందులో ఎస్టీలకు నాలుగు స్థానాలు, ఎస్టీలకు నాలుగు స్థానాలు, బీసీలకు 17 స్థానాలు, అన్రిజర్వుడ్ స్థానాలు 9 ఉన్నాయి. మండల పరిషత్ అధ్యక్షులకు సంబంధించి 19 ఎంపీపీ స్థానాలను మహిళలకు కేటాయించగా, 15 పురుషులకు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ స్థానాలకు వారి జనాభా ఆధారంగా, బీసీలకు ఓటర్ల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించారు. జిల్లాలో 13,22,694 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,34,000 మంది ఎస్సీ ఓటర్లు కాగా, 1,29,000 మంది ఎస్టీ ఓటర్లు, 9,66,000 మంది బీసీ ఓటర్లు, 93,694 మంది ఓసీ ఓటర్లు ఉన్నారు. వరుస ఎన్నికలతో ఉక్కిరిబిక్కిరవుతున్న అధికారులు: సాధారణ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలు తలమునికలు అయిన సందర్భంలో సుప్రీం కోర్టు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో రాజకీయనాయకులతో పాటు, అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంతలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించడంతో ఎలా నిర్వహించాలో అర్థకం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
మార్చి 7-10 మధ్యలో షెడ్యూలు!
-
మార్చి 7-10 మధ్యలో షెడ్యూలు!
లోక్సభతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం ఎన్నికలు సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు మార్చి 7 నుంచి 10వ తేదీ మధ్యకాలంలో షెడ్యూలు వెలువడే అవకాశాలున్నాయి. ఈ నెల 26 లేదా 28 తేదీల్లోనే షెడ్యూలు ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మరో వారం రోజులు గడువు తీసుకుంటున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. లోక్సభ సార్వత్రిక ఎన్నికలతోపాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల శాసనసభలకు కూడా సాధారణ ఎన్నికల షెడ్యూలును ప్రకటించనున్నారు. జాతీయస్థాయిలో ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం గురువారం అత్యంత కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లు, శాంతి భద్రతల పరిస్థితి, దశలవారీగా ఎన్నికల నిర్వహణ తదితర అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం ఈ సమావేశంలో రాష్ట్రాలవారీగా సమీక్షించనుంది. ఈ సమీక్ష అనంతరం లోక్సభ ఎన్నికలు, మూడు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ఎన్ని విడతల్లో ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై ఒక అంచనాకు రానుంది. ప్రాథమిక సమాచారం మేరకు ఐదునుంచి ఏడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ప్రస్తుత లోక్సభ కాలపరిమితి మే 31తో, ఆంధ్రప్రదేశ్ శాసనసభ కాలపరిమితి జూన్ 2తో, ఒడిశా జూన్ 7తో, సిక్కిం శాసనసభ కాలపరిమితి మే 21తో ముగుస్తుంది. ఈ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాల వారీగా ఓటర్ల తుది జాబితాను ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులు ఇప్పటికే ప్రకటించగా, ఆ సమాచారాన్ని క్రోడీకరించి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం రోజున జాతీయస్థాయిలో ఓటర్ల తుదిజాబితాను అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించవచ్చని తెలుస్తోంది. రాష్ట్రాల విభజన జరిగిన పక్షంలో తెలంగాణలో ఒక విడత, ఆంధ్రప్రదేశ్లో ఒక విడతగా ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని సమాచారం. మొత్తంగా గురువారం సమావేశం అనంతరం మార్చి 7నుంచి 10 మధ్యలో షెడ్యూలు ప్రకటించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
యువ చైతన్యం
తాజా ఓటరు జాబితాలో యువజనులే అధికం 40 ఏళ్లలోపు ఓటర్లు 31.14లక్షలు సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో యువ ఓటర్లదే హవా కనిపిస్తోంది. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వీరి తీర్పే శాసనం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం రెండ్రోజుల క్రితం ఓటర్ల తుది జాబితా ప్రకటించింది. ఇందులో జిల్లా ఓటర్ల సంఖ్య 50లక్షలు కాగా.. ఇందులో యువ ఓటర్లు 31.14లక్షలు. అంటే మొత్తం ఓటర్లలో యువ ఓటర్లు 62.27శాతం ఉన్నారు. ఈ లెక్కన ఎన్నికల్లో పోటీ చేసే నేతల భవిష్యత్తు అంతా యువ ఓటర్ల తీర్పుపైనే ఆధారపడనుంది. నేతల చూపు.. యువత వైపు.. తాజా గణాంకాలను పరిశీలిస్తే ఈ దఫా ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 7.41లక్షల మంది ఓటరు జాబితాలో చేరారు. ఓటరు నమోదుపై పెరిగిన చైతన్యం.. రెండుసార్లు ఓటరు నమోదు గడువు పెంచడంతో కొత్త ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఈ సారి కొత్తగా ఓటరు జాబితాలో చేరిన వారిలో అధికభాగం యువ ఓటర్లేనని తెలుస్తోంది. ఇందులో ముప్పై సంవత్సరాలలోపు ఉన్న ఓటర్లు 16.42లక్షలు ఉన్నారు. మొత్తం ఓటర్లలో వీరి శాతం 32.85. మరోవైపు సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గర పడుతుండటంతో నాయకగణం గెలుపోటములను విశ్లేషిస్తూ యువ ఓటర్ల వైపు దృష్టి సారిస్తున్నారు.