Bathukamma celebrations
-
ట్రయాంగిల్ తెలంగాణ అసోసియేషన్ (TTGA) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రైయాంగిల్ తెలంగాణ అసోసియేషన్ (TTGA) ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ ఉత్సవాలు అద్భుతంగా ముగిశాయి. సుమారు 7వేలమంది మంది పాల్గొన్న కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక వైభవం విశ్వవ్యాప్తంగా ప్రదర్శితమైంది. 25 అడుగుల ఎత్తైన కమల పీఠం బతుకమ్మల అందంతో అలరించింది. అష్టలక్ష్మి అలంకరణలు, 6 గంటలపాటు నిరాటంకంగా జరిగిన బతుకమ్మ నృత్యం కార్యక్రమం ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవానికి రెండు నెలల పాటు కఠోర సాధన చేసి మరీ బతుకమ్మను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో సెనేటర్ జే జె చౌదరి, మారిస్విల్ మేయర్ టిజే కౌలీ, మేయర్ ప్రో టెం సతీష్ గరిమెల్ల, కౌన్సిల్ సభ్యులు లిజ్ జాన్సన్, స్టీవ్ రావు, కేరీ టౌన్ కౌన్సిల్ సభ్యురాలు సరికా బన్సాల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం స్థానికులను మాత్రమే కాకుండా ఉత్తర కరోలినా ,ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన భారతీయులను ఆకర్షించింది. స్థానిక డెల్టా కంపెనీ ఐటీ డైరెక్టర్ స్టెఫనీ షైన్ తోపాటు, ఇతర వ్యాపార ప్రతినిధులు, ఐటీ డైరెక్టర్లు, ఇతర ప్రముఖులు హాజరు కావడం విశేషం.అతిథులకు భోజనవసతి, శాటిలైట్ పార్కింగ్ నుండి స్టేడియం వరకు రవాణా సౌకర్యం అందించారు. ఈ విజయవంతమైన కార్యక్రమాన్ని నిర్వహించడానికి TTGA నాయుకత్వంలో రెండు నెలలు ప్రణాళికా సూత్రాలను అమలు చేశారు.బతుకమ్మ కోసం ప్రత్యేక పాటను రూపొందించి మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఈ కార్యక్రమం TTGA అధ్యక్షుడు మహిపాల్ బిరెడ్డి, ఉపాధ్యక్షురాలు భారతి వెంకన్నగారి, ఈవెంట్ డైరెక్టర్ శశాంక్ ఉండీల, సాంస్కృతిక డైరెక్టర్ పూర్ణ అల్లె, యువత డైరెక్టర్ శ్రీకాంత్ మందగంటి, ఫెసిలిటీ డైరెక్టర్ రఘు యాదవ్, ఫుడ్ డైరెక్టర్ మహేష్ రెడ్డి, కోశాధికారి రవి ఎం, కమ్యూనిటీ సర్వీస్ డైరెక్టర్ స్వాతి గోలపల్లి, మెంబర్షిప్ డైరెక్టర్ ఉమేష్ పారేపల్లి, కమ్యూనికేషన్ డైరెక్టర్ మాధవి కజా నాయకత్వంలో విజయవంతంగా సాగింది.ఈ బతుకమ్మ వేడుకలు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటించడంతో పాటు, ఉత్తర కరోలినాలో భారత సాంస్కృతిక ఉత్సవాల పెరుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఈ ఉత్సవాల ద్వారా సాంస్కృతిక బంధాలను మరింత బలపరుస్తూ విజయవంతంగా ముందుకు సాగుతుందని TTGA ప్రకటించింది. -
Hyderabad: మేయర్ విజయలక్ష్మిపై కేసు నమోదు
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డునంబర్–12లోని ఎన్బీటీనగర్ ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో నిబంధనలకు విరుద్ధంగా డీజే ఏర్పాటు చేయడంతో పాటు గడువు ముగిసిన తర్వాత కూడా సౌండ్ పొల్యుషన్కు పాల్పడిన ఘటనలో నగర మేయర్తో పాటు మరో ఇద్దరిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఈ నెల 10వ తేదీ రాత్రి 10 గంటల çసమయంలో బంజారాహిల్స్ రోడ్డునంబర్–12లోని ఎన్బీటీనగర్లో అమ్మవారి విగ్రహాల నిమజ్జన ఊరేగింపుతో పాటు మండపాలను కానిస్టేబుళ్లు ఎస్కే నజీర్ అహ్మద్, హోంగార్డు సాయి ప్రసాద్లు పర్యవేక్షిస్తున్నారు. రాత్రి 11.40 గంటల ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల ముందు జరుగుతున్న బతుకమ్మ వేడుకల్లో భారీ సౌండ్తో డీజే ఏర్పాటు చేశారని, శబ్ద కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని పోలీసులకు సమాచారం అందింది. దీంతో నజీర్ అహ్మద్, సాయిప్రసాద్లు అక్కడికి చేరుకుని డీజేను ఆపాల్సిందిగా నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ అక్కడికి చేరుకుని పోలీసులు ఇందులో జోక్యం చేసుకోవద్దని, మ్యూజిక్ను కొనసాగించాలని వారికి సూచించారు. భారీ శబ్ద కాలుష్యంతో ఈవెంట్ను అలాగే కొనసాగించారని, వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కానిస్టేబుల్ నజీర్ అహ్మద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో బతుకమ్మ వేడుకల నిర్వాహకులు కందాడి విజయ్కుమార్, మ్యూజిక్ ప్లే చేస్తున్న మహ్మద్ గౌస్, జోక్యం చేసుకోవద్దంటూ చెప్పిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై బంజారాహిల్స్ పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 223, 280, 292, 49 రెడ్విత్ 3 (5), సెక్షన్ 21/76 సీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
డీజీపీ ఆఫీసులో బతుకమ్మ సంబరాలు (ఫోటోలు )
-
బోరివలిలో అంబరాన్నంటిన సంబరాలు బతుకమ్మ సంబరాలు
తెలుగు కల్చరల్ అసోసియేషన్ బతుకమ్మ వేడుకలు ముంబై పరిసర ప్రాంతాలనుంచి మూడు వేలమంది మహిళల హాజరు తీరొక్క పూలతో కనువిందుగా బతుకమ్మల కూర్పుడప్పుచప్పుళ్ల మధ్య ఉత్సాహంగా బతుకమ్మ పాటలకు కాలుకదిపిన అతివలు ముంబై తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు బోరివలి: బోరివలి తూర్పులోని సుకూర్వాడి, గోపాల్ హేమ్రాజ్ హైస్కూల్ లో సుమారు రెండెకరాల సువిశాల స్థలంలో ముంబై తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో దాదాపు మూడు వేల మంది మహిళలు పాల్గొన్నారు. వేడుకల కోసం ఉత్తర ముంబై ప్రాంతాలైన దహిసర్, బోరివలి, కాందివలి, మలాడ్, గోరేగావ్, మాల్వా నీ, శివాజీ నగర్, దౌలత్ నగర్, నవగాం తదితర ప్రాంతాల నుంచి వేలాదిమంది కుటుంబ సమేతంగా తరలివచ్చి రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి డప్పు చప్పుళ్ల మధ్య ఆటపాటలతో వాటి చుట్టూ తిరుగుతూ ఉత్సాహంగా గడిపారు. అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన విందుభోజనాన్ని ఆరగించారు. ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు... బతుకమ్మలను అందంగా పేర్చిన వారికి బహుమతులు ప్రదానం చేస్తామని ముంబై తెలుగు కల్చరల్ అసోసియేషన్ కమిటీ ముందే ప్రకటించడంతో మహిళలు ఒకరికొకరు పోటీపడుతూ తమ బతుకమ్మలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మనీషా కొమ్ము న్యాయనిర్ణేతగా వ్యవహరించిన ఈ బతుకమ్మ పోటీల్లో మొదటి బహుమతి లాల్ జీ పాడ, కాందివలి ప్రాంత మహిళలు, ద్వితీయ బహుమతి సాయిబాబా నగర్, బోరివలికి చెందిన మహిళలకు అదేవిధంగా తృతీయ బహుమతి మలాడ్ పద్మశాలీ సంఘానికి చెందిన మహిళలకు లభించాయి. ఈ సందర్భంగా మైదానంలో వివిధ రకాల రంగవల్లులను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది తెలుగు సంస్కృతిని జ్ఞప్తికి తెచ్చిన శారదరెడ్డి అనే మహిళను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి, అతిధులు ఉత్తర ముంబై మాజీ లోక్సభ సభ్యుడు గోపాల్ శెట్టి, భాస్కర్ నాయుడు, స్థానిక కార్పోరేటర్ సంధ్య విపుల్ జోషి, బహుజన సాహిత్య అకాడమీ మహా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ నాగెల్ల తెలంగాణ ప్రభు త్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ బతుకమ్మ వేడుకలను గురించి ప్రసంగించారు. అనంతరం వీరందరినీ కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముంబై తెలుగు కల్చరల్ అసోసియేషన్ కార్యవర్గం అధ్యక్షుడు సునీల్ అంకం, కార్యనిర్వాహక అధ్యక్షుడు కత్తెర శంకరయ్య, ప్రధాన కార్యదర్శి ఎలిజాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు మదుసుదన్ రావు, మేకల హనుమంతు, కోశాధికారి గాజుల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పద్మనగర్లో బతుకమ్మ, దాండియా వేడుకలు పద్మనగర్ మహిళ సాంస్కృతిక సేవ మండలి నిర్వహించిన బతుకమ్మ, దాండియా వేడుకలకు మహిళలనుంచి విశేష స్పందన లభించింది. అదివారం సాయంత్రం స్థానిక పార్లమెంటు సభ్యురాలు ప్రణతి శిందే, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపాలి కాలే లాంఛనంగా ఈ ఉత్సవాలను ప్రారంభించారు. స్థానిక తెలుగు మహిళలతో కలిసి వారు కూడా బతుకమ్మ పాటలకు కాలు కదిపి కార్యక్రమానికి మరింత శోభను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో భాగంగా ప్రథమ స్థానంలో నిలిచిన వారికి బంగారు, అలాగే ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి వెండి వస్తువులను బహూకరించారు. అదేవిధంగా దాదాపు 50 మంది మహిళలకు చీరలు, ఇతర రకాల దుస్తులను బహుమతులుగా అందించారు. అలాగే ఉత్తమంగా దాండియా ఆడిన మహిళలకు నిర్వాకులు నగదు బహుమతులపే అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ మేయర్ శ్రీ కాంచన యన్నం, మాజీ కార్పొరేటర్ దేవేంద్ర కోటే ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు మహిళా మండలి అధ్యక్షురాలు లీనా ఆకేన్, సెక్రటరీ మంజుశ్రీ వల్లకాటి, వైస్ ప్రెసిడెంట్ స్వప్న రవ్వ, కోశాధికారి అర్చన వల్లకాటి, సహాయ కోశాధికారి పల్లవి కనకట్టి, స్వాతి అడం, వందన గంజి పాల్గొన్నారు. థానేలో ఉత్సాహంగా ‘బతుకమ్మ’ థానేలో స్థిరపడిన తెలంగాణకు చెందిన గౌడ సమాజం సభ్యులు ఆదివారం రాత్రి సద్దుల బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. థానే లూయిస్వాడీలోని షెహనాయి హాల్లో జరిగిన ఈ బతుకమ్మ సంబరాలలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలంతా సంప్రదాయ వస్త్రధారణలో కార్యక్రమానికి విచ్చేసి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. తమను చల్లగా చూడాలని బతుకమ్మను వేడుకున్నారు.అనంతరం బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నవారందరికీ విందు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. గౌడ సమాజానికి చెందిన మహిళలందరినీ ఐక్యం చేసేందుకు గత రెండేళ్ల నుంచి ఈ బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకల్లో సంఘ ప్రముఖులు, పదాధికారులతోపాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు -
బంగరు నవ్వుల ఆట.. వాకిలయ్యే పువ్వుల తోట
సాక్షి,ముంబై: ముంబైలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా వర్లీ, లోవర్పరెల్, బాంద్రా, అంధేరి, బోరివలి తదితర ప్రాంతాల్లో బతుకమ్మ పాటలతో సందడి నెలకొంది. ఒక్కేసి పువ్వేసి ఆడవే చెల్లి బతుకమ్మ పాట అంటూ మహిళలు ఆటపాటలతో సందడి చేస్తున్నారు. ఓ వైపు బతుకమ్మ పాటలతోపాటు తెలుగు ప్రజలు కూడా దసరా నవరాత్రి ఉత్సవాల్లో దేవీమాతను అలంకరించే చీరల రంగుల ప్రకారమే చీరలు ధరించి బతుకమ్మలు ఆడుతూ కన్పిస్తున్నారు. ముఖ్యంగా ముంబైలోని అనేక ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు ప్రతీరోజు ఒకే రంగు చీరలతో బతుకమ్మ ఆడుతూ సంబురాలు చేస్తున్నారు. తిరంగ వెల్ఫేర్ కమిటీ... బాంద్రాలోని తిరంగా వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. తూర్పు బాంద్రా జ్ఞానేశ్వర్నగర్లో ఈ బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఉత్సవాలు ప్రతీ రోజు ఘనంగా కొనసాగుతున్నాయి. మహిళలందరూ ఒకే రంగుల చీరలు ధరించి తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటిచెబుతున్నారు. తెలుగు రజక సంఘం... తెలుగు రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు జరిగాయి. అంటప్హిల్ సీజిఎస్ కాలనీలోని గహ కల్యాణ్ కేంద్రహాల్లో శనివారం రాత్రి జరిగిన ఈ ఉత్సవాల్లో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ బతుకమ్మ సంబురాలకు ముఖ్యఅతిథులుగా స్థానిక ఎమ్మెల్యే కెపె్టన్ తమిళ సెల్వన్, స్థానిక కార్పొరేటర్ కృష్ణవేణిరెడ్డి, ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు ఎం.కొండారెడ్డి తోపాటు బీజేపీ ముంబై సౌత్ సెంట్రల్ ఉపాధ్యక్షుడు అనీల్ కనోజియాలు హాజరయ్యారు. ముఖ్యంగా కృష్ణవేణిరెడ్డి మహిళల బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా బతుకమ్మ పాటలతో పరిసరాలన్నీ మార్మోగాయి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అదేవిధంగా ముంబై ఆంధ్ర ఎడ్యుకేషన్ హై స్కూల్ కాలేజీ పదాధికారి పురుషోత్తంరెడ్డి, ముంబై రజక సంఘం ఫౌండేషన్ అధ్యక్షుడు ఎలిజాల శ్రీనివాస్, ముంబై ప్రజాగాయకుడు గాజుల నర్సారెడ్డితోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులందరినీ సంఘం పదాధికారులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు నడిగోటి వెంకటేశ్, ఉపాధ్యక్షుడు మర్రిపల్లి మల్లేశ్, ప్రధాన కార్యదర్శి అవనిగంటి రామలింగయ్య, కోశాధికారి భూమ చిన్న నరసింహ, ఉపకోశాధికారి భూమ యాదయ్య, కమిటీ సలహాదారులు భూమ పెద్దనర్సింహ, చెరుకు కృష్ణ, తాందారి వెంకటేశ్, బసవాడ కృష్ణ, భూమ సురేశ్, కమిటీ సభ్యులు రెడ్డిపల్లి ఎల్లయ్య, అక్కనపల్లి నరసింహ, బసాని ఉపేందర్, ఐతరాజు మల్లయ్య, భూమ వెంకటేశ్, భూమ శంకర, పున్న సోమయ్య, బొడ్డుపల్లి రాజుతోపాటు తదితరులతోపాటు విజయనగర్, మోతిలాల్నెహ్రూనగర్, వాడాలా, సైన్కు చెందిన మహిళలు కూడా పాల్గొన్నారు. పద్మశాలి యువక సంఘం...తూర్పు దాదర్ నాయిగావ్లోని పద్మశాలి యువక సంఘం మహిళ మండలి ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. సంఘం హాల్లో శనివారం రాత్రి జరిగిన ఈ ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని దాండి యా, కోలాటాలు ఆడి సందడి చేశారు. ముఖ్యంగా దసరా నవరాత్రులతోపాటు బతుకమ్మ సంబురాల నేపథ్యంలో ప్రతి ఏటా పద్మశాలి యువక సంఘం మహిళ మండలి ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా నవరాత్రి ఉత్స వాల తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ ఆడారు. అనంతరం స్థానిక సంప్రదాయాలమేరకు యువత దాండియా కోలాటాలు ఆడారు. ఇక అక్టోబరు 10వ తేదీన సద్దుల బతుకమ్మ ఉత్సవాలు కూడా నిర్వహించనున్నారు. ముఖ్యంగా దాండియా, కోలాటాలు మంచిగా ఆడి విజేతలుగా నిలిచిన వారికి అక్టోబరు 22న సద్దుల బతుకమ్మ పండుగ రోజున బహమతులు అందించనున్నారని సంఘం అధ్యక్షుడు గంజి సీతారాములు వెల్లడించారు. అదేవిధంగా సద్దుల బతుకమ్మ రోజు అందంగా పేర్చిన బతుకమ్మలకు, బతుకమ్మలు బాగా ఆడినవారికి కూడా బహమతులు అందించనున్నారన్నారు. మరోవైపు శనివారం ఆడిన దాండియా, కోలాటాల పోటీలకు అతిథిగా హాజరైన తిలక్నగర్ పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యురాలు పారెపెల్లి లత, మహారాష్ట్ర తెలుగు మహిళ సంస్థ కార్యదర్శి గాజెంగి హారికలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అతిథులను న్యాయనిర్ణేతలను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో సంఘం మహిళ మండలి ఉపాధ్యక్షురాలు జిల్లా శారద, కార్యదర్శి చెరిపెల్లి పరమేశ్వరి, సహ కార్యదర్శి బిట్ల సోని, కోశాధికారి పేర్ల గీతాంజలి, సభ్యులు అడ్డగట్ల ఐశ్వర్య, చెడుదుపు పద్మ, దొంత ప్రభావతి, ఇడం పద్మ, గుజ్జరి జాహ్నవీ, కైరంకొండ లక్షి్మ, కండ్లపెల్లి కవిత, మహేశ్వరం సాక్షి, పగుడాల రోహిణి, సీతారేఖ, ధర్మకర్తల మండలి చైర్మన్ కోడి చంద్రమౌళి, అనబత్తుల ప్రమోద్, పొన్న శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు లక్సెట్టి రవీంద్ర, ప్రధాన కార్యదర్శి మహేశ్వరం చంద్రశేఖర్, కోశాధికారి దోర్నాల బాలరాజు, దుస్స అమరేంద్ర, దోమల శంకర్, కస్తూరి గణేశ్, పుట్ట గణేశ్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పద్మశాలి సంఘం... సిరిసిల్ల పద్మశాలి సంఘం ముంబై శాఖ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం వర్లీ బీడీడీ చాల్స్లోని మార్కండేయ మందిరం ప్రాంగణంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిఫలించేలా ఆడపడచులు బతుకమ్మ పాటలు ఆలపిస్తూ పూలతో పేర్చిన బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమానికి సిరిసిల్ల సంఘం మహిళలే కాకుండా స్థానిక, వివిధ ప్రాంతాల నుంచి మహిళలు పాల్గొని బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో పాల్గొన్న వివాహిత మహిళలకు లక్కీడిప్ ద్వారా 15 మందిని ఎంపికచేసి చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వాసాల శ్రీహరి, ఉపాధ్యక్షుడు కొక్కుల రమేశ్, ప్రధాన కార్యదర్శి యేముల లక్ష్మీనారాయణ, సంయుక్త కోశాధికారి దూస మురళీధర్, కోశాధికారి సుంక ప్రభాకర్, సంయుక్త కోశాధికారులు ఆడెపు చంద్రశేఖర్, అడ్డగట్ల ముఖేశ్ సాంస్కృతిక అధికారి మార్గం శ్రీనివాస్, సోషల్ మీడియా అడ్మిన్ అడెపు అశోక్, కమిటీ సభ్యులు కోడం మనోహర్, ముదిగంటి అంజనేయులు, జిందం దశరథ్, జిందం నాగేశ్, కోడం గంగాధర్, వాసం నారాయణ, గాజుల సురేశ్, వాసా ల గంగాధర్, కట్టెకోల అశోక్, యంజాల్ భూమేశ్వర్, గాలిపెల్లి లక్ష్మణ్, వాసం అనిల్ కుమార్, రాపెల్లి సతీశ్, సలహాదారులు దూస నారాయణ, అడ్డగట్ల సుదర్శన్, ఆడెపు హనుమంతు పాల్గొన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక, టూరిజం శాఖ, ఎఫ్–టామ్ సంయుక్త ఆధ్వర్యంలో..తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, టూరిజం శాఖ, ఎఫ్–టామ్ సంయుక్త ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని థానేలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచి్చన మహిళలు తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను చాటిచెబుతూ బతుకమ్మ వేడుకను జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. బతు కమ్మ వేడుకలకు హాజరైన మహిళలు గోదావరి, కావేరి, గంగ వంటి దేశంలోని వివిధ నదుల పేర్లతో గ్రూపులుగా విడిపోయి ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో గోదావరి మహిళా బృందానికి మొదటి బహుమతి రాగా, గంగా నది మహిళా గ్రూపునకు రెండవ బహుమతి, కావేరి నది మహిళా గ్రూపునకు మూడో బహుమతి లభించాయి. బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలకు అంజలి మచ్చ ఆధ్వర్యంలో స్నేహ అంబ్రె, రమేశ్ అంబ్రె, ఎఫ్–టామ్ సంస్థ అధ్యక్షుడు గంజి జగన్ బాబు చేతులమీదుగా చీరలు అందజేశారు. కార్యక్రమంలో రాఘవరావు, కిరణ్మయి, సునీల్ బైరి, వాణి వేముల, విజయ, స్నేహ వంగ, స్నేహ బొమ్మకంటి, మహేశ్ గుజ్జ, రాధిక, రమేశ్, పద్మాకర్, అర్జున్, సుభాష్, మహేంద్ర, హరితరావు, సత్యనారాయణ కంచెర్ల పాల్గొన్నారు. -
ఆనందమే జీవన మకరందం!
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ వేడుకలు, దాండియాలకు సంబం«ధించి ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికర చర్చ జరిగింది. ఓ నెటిజనుడు అడిగిన ప్రశ్నకు కొత్వాల్ సీవీ ఆనంద్ తనదైన శైలిలో స్పందించారు. దీనికి తన వ్యాఖ్యను జోడించిన ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంభాషణను మరింత రక్తికట్టించారు. వందలాది స్పందనలతో ఈ ట్వీట్ ఆదివారం వైరల్గా మారింది. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ శనివారం పాతబస్తీలోని పేట్లబుర్జులో ఉన్న సీఏఆర్ హెడ్ క్వార్టర్స్కు వెళ్లారు. అక్కడ పోలీసు విభాగం ఏర్పాటు చేసిన బతుకమ్మ, దాండియా వేడుకల్లో సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ ఫొటోలు, వీడియోలను కొత్వాల్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. దీనిపై స్పందించిన ఓ నెటిజనుడు 1999 నాటి ‘ప్రేమికుల రోజు’ చిత్రంలోని ‘దాండియా ఆటలు ఆడ’ పాటలోని ఓ భాగాన్ని జోడించారు. దీంతో పాటు ‘నిజం చెప్పండి... మీ స్కూల్, కాలేజీ రోజుల్లో దాండియా, బతుకమ్మతో ముడిపడిన ప్రేమకథలు ఉన్నాయా? అప్పట్లో మీరు కవితలు కూడా రాసి ఉంటారని భావిస్తున్నా’ అంటూ వ్యాఖ్యానించారు. దీన్ని సానుకూలం దృక్పథంతో స్వీకరించిన ఆనంద్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘ఎన్నో ప్రేమ కథలు.. అయితే బతుకమ్మ, దాండియాలతో సంబంధం లేదు. మీరు కాసేపు మనసారా నవ్వుకునేలా నా పోస్టు ఉన్నందుకు సంతోషం’ అంటూ ఆంగ్లంలో వ్యాఖ్యానించారు. దీంతో పాటు ‘ఔర్ క్యా రహాహై జిందగీ మే! జరా హసీన్ మజాక్ హోజాయే హర్ దిన్’ (జీవితంలో ఇంకా ఏం మిగిలింది.. ప్రతిరోజూ అందంగా, ఆనందంగా నవ్వుకోవడం తప్ప) అనే వ్యాఖ్యను ఆయన జోడించారు. దీనిపై పలువురు నెటిజనులు పోస్టులు, ట్యాగ్లు చేస్తుండగా... హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రంగంలోకి వచ్చారు. సీవీ ఆనంద్ను ఉద్దేశిస్తూ ‘నిజాం కాలేజీ జిందాబాద్’ అంటూ పోస్టు చేశారు. కొత్వాల్ ఆనంద్, ఎంపీ అసదుద్దీన్ ఇద్దరూ క్లాస్మేట్స్ కావడమే కాదు.. నిజాం కాలేజీ పూర్వ విద్యార్థులు కావడం ఇక్కడ గమనార్హం. -
జాహ్నవి కాలేజీలో బతుకమ్మ సంబురాలు (ఫోటోలు)
-
రవీంద్రభారతిలో ఘనంగా బతుకమ్మ, పేరిణి నృత్యం (ఫోటోలు)
-
‘తెలంగాణ’ జిల్లాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
వైభవంగా బతుకమ్మ, దసరా పండగ వేడుకలు
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ పోర్ట్లాండ్ సిటీ చార్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా పండగల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలను చార్టర్ ప్రెసిడెంట్ శ్రీని అనుమాండ్ల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మహిళలు, చిన్నారులు సహా పలువురు తెలుగు వాళ్లంతా సందడిగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో తెలుగుదనం ఉట్టి పడేలా ముస్తాబై రంగుల బతుకమ్మలతో సందడి చేశారు. బతుకమ్మ నిమజ్జనం తర్వాత దసరా ఉత్సవాన్ని పురస్కరించుకొని షమీ స్తోత్రం చదివి జమ్మి (బంగారం) ఇచ్చి పుచ్చికొని అలయ్బలయ్ చేసుకున్నారు. ఇక బతుకమ్మ, రాఫెల్ డ్రా విజేతలకు టీడీఫ్ టీం బహుమతులను అందజేశారు. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలందరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
కాలిఫోర్నియాలోని శాన్ రామన్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
-
TDF ఆధ్వర్యం లో బతుకమ్మ వేడుకలు
-
కెనడా, టొరంటోలో సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలు
-
శాన్ రామన్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
-
న్యూజెర్సీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
-
డాలస్లో బతుకమ్మ వేడుకలు, స్పెషల్ అట్రాక్షన్గా సంయుక్తా మీనన్
డాలస్ నగరంలో బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీపాడ్) ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించింది. సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలను సంయుక్తంగా ఫ్రిస్కో పట్టణ పరిధిలోని కొమెరికా సెంటర్లో వైభవంగా జరిపించింది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు జరిగిన కార్యక్రమం ఆసాంతం జనం రాకతో సందడిగా మారింది. సుమారు 12వేల మంది ఈ వేడుకల్లో భాగస్వాములైనట్టు టీపాడ్ బృందం తెలిపింది. ఫౌండేషన్ కమిటీ చైర్ రఘువీర్ బండారు, బీవోటీ చైర్ సుధాకర్ కలసాని, ప్రెసిడెంట్ లింగారెడ్డి అల్వ, కోఆర్డినేటర్ రోజా ఆడెపు నేతృత్వంలో నిర్వహించిన ఈ సంబరాల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకల్లో హీరోయిన్ సంయుక్తామీనన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మగువలతో కలిసి బతుకమ్మ ఆడుతూ సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. అనంతరం దుర్గామాతను ప్రతిష్టించి నిర్వాహకులు శమీపూజలు నిర్వహించి అమ్మవారిని పల్లకిలో ఊరేగించారు. దసరా పండుగ రోజు బంగారంలా భావించే శమీపత్రాలను ఒకరినొకరు పంచుకుని అలయ్బలయ్ తీసుకున్నారు. ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శన అనంతరం కళాకారుల బృందం అమ్మవారి మహాశక్తిని నృత్యరూపకంగా ప్రదర్శించి గూస్బంప్స్ తెప్పించింది. అటు డ్యాన్సర్లు, ఇటు గాయకుల అలుపెరగని ప్రదర్శనతో కార్యక్రమం మరింత కనులవిందుగా, వీనులవిందుగా మారింది. సింగర్స్ సమీర భరద్వాజ్, పృథ్వీ, ఆదిత్య, అధితీ భావరాజు.. దాదాపు 3 గంటల పాటు తమ పాటలతో మనసునిండా పండుగ తృప్తితో పాటు సాంత్వన కలిగిస్తూ కొత్త శక్తిని నింపారు. జాతరను తలపించిన కొమెరికా సెంటర్ కార్యక్రమంలో భాగంగా బైక్రాఫెల్, 10 గ్రాములు, 5 గ్రాములు, 2 గ్రాముల గోల్డ్రాఫెల్ను సినీనటి సంయుక్తామీనన్ డ్రా తీసి విజేతలను ప్రకటించారు. జాతరకు ఏమాత్రమూ తీసిపోదన్నట్టు వెలిసిన వెండర్బూతలు ఆసాంతం రద్దీతో కనిపించాయి. కొమెరికా సెంటర్లోకి అడుగుపెట్టేందుకు తొక్కిసలాట జరగకుండా నిర్వాహకులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. -
జర్మనీలో వైభవంగా బతుకమ్మ వేడుకలు
-
సింగపూర్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో సింగపూర్ బతుకమ్మ2023 పండగను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సంబవాంగ్ పార్క్లో ఈ బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. ప్రతీ ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా సింగపూర్లో తెలుగు వాళ్లలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సింగపూర్లో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల వారు కూడా బతుకమ్మ, బోనాలు జరుపుకోవడం ఎంతో అభినందనీయని సింగపూర్ కల్చరల్ సొసైటీ సభ్యులు అన్నారు. తెలంగాణ సాంప్రదాయ పండగలను అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అందంగా బతుకమ్మ పేర్చిన వారికి ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తామని తెలిపారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా ఉన్న వాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
బతుకమ్మ వేడుకల్లో విషాదం.. ముగ్గురు కార్మికులు గల్లంతు
సాక్షి, సిద్దిపేట జిల్లా: జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామంలో బతుకమ్మ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. బతుకమ్మ పండుగ కోసం చెరువులో చెత్తను తొలగిస్తుండగా ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు గల్లంతయ్యారు. గల్లంతయిన కార్మికులు గిరిపల్లి బాబు, గిరిపల్లి భారతి, యాదమ్మల కోసం స్థానికులు గాలిస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. చదవండి: కూతురు ప్రేమ వ్యవహారం.. ఉన్మాదిగా మారిన తండ్రి ఏం చేశాడంటే -
బతుకమ్మ సంబరాలు షురూ.. నేడే ఎంగిలిపూల బతుకమ్మ
తెలంగాణలో ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని బతుకమ్మ చాటిచెబుతుంది. బతుకమ్మ అంటేనే ఆడబిడ్డలా పండుగ.. దసరా ఉత్సవాలతో సమానంగా మహిళలు వైభవంగా నిర్వహించే వేడుక. దేశంలో ఎక్కడా లేని విధంగా పూలను పూజించే పండుగకు సమయం ఆసన్నమైంది. భాద్రపద అమావాస్య రోజు నుంచి తొమ్మిది రోజులపాటు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తారు. బతుకమ్మ పండగకు తెలంగాణ ముస్తాబైంది. ఏర్పాట్లకు సర్వం సిద్ధమయ్యాయి. నేటి(శనివారం) నుంచే రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై.. చివరిరోజైన దుర్గాష్టమి నాడు సద్దుల బతుకమ్మతో ముగియనుంది. ఈ తొమ్మిది రోజుల పాటు తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకోనున్నారు. తీరొక్క పూలతో.. ప్రకృతిలో సూర్యచంద్రులను కొలిచిన విధంగానే వివిధ రకాల పూలను కొలిచే పండుగ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోంది. తీరొక్క రంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను చేసి భక్తిశ్రద్ధలతో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ప్రజల కష్టసుఖాలను పాట రూపంలో పాడుతూ మహిళలు బతుకమ్మ ఆడుతారు. ఆడబిడ్డలను ఇళ్లకు ఆహ్వానించి కుటుంబమంతా సంబరాలు చేసుకుంటారు. బతుకమ్మ ఒక సామాజిక ఉత్సవం. కుల, మత, వర్గ, వృత్తి, ప్రాంత సంప్రదాయాలకు అతీతంగా బతుకమ్మ వేడుక నిర్వహిస్తారు. బతుకమ్మ పండుగ వారసత్వాన్ని ప్రపంచానికి చాటింది. ప్రకృతిలో లభించే అన్ని రకాల పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆడుతారు.గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతి, చామంతి ఇలా రకరకాల పూలతో బతుకమ్మను పేరుస్తారు ఒక్కో రోజు.. ఒక్కోలా.. మొదటి రోజు: బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారు. అమ్మకు తులసి ఆకులు, వక్కలు నైవేద్యంగా సమర్పిస్తారు. రెండో రోజు: బతుకమ్మను అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు. ఇది ఆశ్వీయుజ మాసం మొదటి రోజైనపౌడ్యమి రోజున నిర్వహిస్తారు. చప్పిడిపప్పు, బెల్లం, అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారు. మూడో రోజు: బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఈ రోజున ముద్దపప్పు, బెల్లం, పాలు, ఇతర పాల పదార్థాలతో అమ్మకు నైవేద్యం సమర్పిస్తారు. నాలుగో రోజు: నానబియ్యం బతుకమ్మను చేస్తారు. అంటే నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం వంటివి అమ్మవారికి సమర్పిస్తారు. ఐదో రోజు: అట్ల బతుకమ్మ అంటారు. ఈరోజు అట్లు(దోసలు) తయారు చేస్తారు. అమ్మకు నైవేద్యంగా పెడతారు. ఆరో రోజు: అలిగిన బతుకమ్మ అంటారు. ఈ రోజు బతుకమ్మ పేర్చరు. ఎలాంటి నైవేద్యం కూడా పెట్టరు. ఏడో రోజు: వేపకాయల బతుకమ్మ అని పిలుస్తారు. సకినాల పిండిని వేపకాయల్లా తయారు చేసి, నూనెలో వేయిస్తారు. వాటిని అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఎనిమిదో రోజు: వెన్నముద్దల బతుకమ్మ అని పిలుస్తారు. నువ్వులు, వెన్నముద్ద, బెల్లం వంటి పదార్థాలు అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. తొమ్మిదో రోజు: సద్దుల బతుకమ్మ. చాలా ముఖ్యమైన రోజు. ఇదే రోజు అశ్వయుజ అష్టమి.. దుర్గాష్టమి. సద్దుల బతుకమ్మను పెద్ద బతుకమ్మ అని కూడా పిలుస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్ రైస్, కొబ్బరి అన్నం నువ్వుల అన్నం అమ్మవారికి సమర్పిస్తారు. దీంతో బతుకమ్మ ఉత్సవాలను ముగిస్తారు. -
టీడీఎఫ్ అట్లాంటా ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు
అట్లాంటి తెలుగువారి తెలంగాణా సంప్రదాయ పండుగ బతుకమ్మను నాలుగువేల భారీ జనసందోహం మధ్య తెలంగాణా డెవలప్మెంట్ ఫోరమ్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుపుకున్నారు. అక్టోబర్ 1వ తేదీన నిర్వహించిన బతుకమ్మ, దసరా ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక కళాకారులు ప్రదర్శించిన రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ వేడుకలు ఆరంభమైనాయి. తెలుగింటి ఆడుపడుచులు రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు ఆహుతులను అలరించాయి. పిల్లలూ పెద్దలూ కలిసి వందకు పైగా కళాకారులు ప్రదర్శనలు నిర్వహించారు. ఆరుగంటలపాటు బతుకమ్మల ఆటపాటలతో సందడిగా సాగిన ఈ వేడుక, బతుకమ్మల నిమజ్జనంతో ముగిసింది. ఆకట్టుకునే బతుకమ్మలతో మహిళలు రెండువేల డాలర్ల వరకు క్యాష్ ప్రైజులు, డైమండ్ రింగ్, సిల్వర్ కాయిన్లు సిల్వర్ బౌల్ సెట్లు, వెరా బ్రాడ్లీ పర్సులు వంటి ఆకట్టుకునే ప్రైజులు గెల్చుకున్నారు. ఆహుతుల కోసం కాంప్లిమెంటరీ సాంప్రదాయ భోజనం ఏర్పాటు చేశారు వివిధ రకాల వెండర్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. టీడీఎఫ్ కోర్ టీమ్ సమిష్టి కృషితో ఘనమైన బతుకమ్మ పండుగను నిర్వహించి విజయవంతం చేయటం గర్వంగా ఉందని టీడీఎఫ్ అట్లాంటా చాప్టర్ అధ్యక్షురాలు స్వప్న కస్వా కృషిని కొనియాడుతూ అలాగే ఈ కార్యక్రామానికి సహకరించిన మహిళలతోపాటు, కార్యక్రమ విజయవంతం చేసిన వాలంటీర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. ఫోర్ ఓక్స్ ఇన్సూరెన్స్, పీచ్ క్లీనిక్, ర్యాపిడ్ ఐటీ, ఈఐయెస్ టెక్నాలజీస్, ఎవరెస్ట్ టెక్నాలజీస్ మొదలగు దాతలు స్పాన్సర్ చేయగా, టీడీఎఫ్ కోర్ టీమ్, అట్లాంటా చాప్టర్ కమిటీ, మరెందరో వాలంటీర్లు కలిసి ఈ కర్యక్రమాన్ని ఆద్యంతం రక్తి కట్టించారు. -
ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ, దసరా వేడుకలు
ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో దసరా, బతుకుమ్మ పండుగలని ఘనంగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫిన్లాండ్లోని అన్ని ప్రాంతాల నుంచి నాలుగు వందల మంది హాజరయ్యారు. చిన్నారులు, పెద్దలు తమ ఆట పాటలతో, నృత్య ప్రదర్శనలతో ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మన తెలుగు వాళ్లతో పాటు, ఫిన్లాండ్లోని ప్రజలు కూడ పాల్గొనడం గమనార్హం. గతంలో ఫిన్లాండ్ తెలుగు సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో తక్కువ మంది వరకు హాజరయ్యేవారని, కాని ఈ సారి నాలుగు వందలకి పైన హాజరుకావడం ఆనందకర విషయమన్నారు. తెలుగు వారు ఫిన్లాండ్కు అధికంగా వస్తున్నారనడానికి ఈ సంఖ్య నిదర్శనమని ఫిన్లాండ్ తెలుగు సంఘం సంస్థ కార్యవర్గం రఘునాథ్ పార్లపల్లి, సుబ్రమణ్య మూర్తి, జ్యోతి స్వరూప్ అనుమాలశెట్టి, సత్యనారాయణ కంచర్ల తెలిపారు. ఇంత మందితో కలిసి పండుగ చేసుకోవడం చూస్తుంటే.. మన ఊరిలో, మన ఇంటిలో ఉన్నట్లే అనిపించిందన్నారు. రాబోయే రోజుల్లో వెయ్యి మంది పాల్గొనేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని శ్రీవల్లి అడబాల, రోజా రమణి మొలుపోజు, వినయ్ శింగపురం, స్పందన ఈచూరి, శ్రుతి కొత్రిక్, వాసు దాసరి, వెంకట్ వారణాసి చెప్పారు. -
కాలిఫోర్నియాలో బతుకమ్మ వేడుకలు
-
కామారెడ్డిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
-
సీతమ్మజెడల పూల.. సిరుల వర్షం: ఎకరాకు 80 వేల నుంచి లక్ష దాకా ఆదాయం
Bathukamma- Seethamma Jada Flowers- మంచిర్యాల అగ్రికల్చర్: జిల్లాలో సీతమ్మ జెడల పూల సాగు రైతులకు సిరులు కురిపిస్తోంది. బతుకమ్మ పండుగ సీజన్లో దిగుబడితో లాభం చేకూరుతోంది. పత్తి, కంది, మొక్కజొన్న తదితర పంటల సాగు తగ్గిస్తూ పూలసాగుపై దృష్టి సారించడంతో విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. బతుకమ్మ తయారీలో విని యోగించే తంగేడు పూలతోపాటు సీతమ్మ జెడ పూలకు మహిళలు అధిక ప్రాధాన్యత ఇస్తారు. బతుకమ్మ పేర్చడానికి ఆకర్షణీయంగా ఉంటుందని విని యోగిస్తారు. చూడడానికి గుబురుగా, దట్టంగా, ఆకట్టుకునే గులాబీ, నారింజ రంగుల్లో కనువిందు చేస్తాయి. సీజన్లో ధర ఎక్కువగా ఉన్నా బతుకమ్మను పేర్చడానికి వెనుకడుగు వేయరు. సద్దుల బతుకమ్మ ముందు నుంచి సీతమ్మ పూలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. కిలోపూలకు రూ.100 నుంచి రూ.200 వరకు ధర పలుకుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత ఇవ్వడంతో మహిళలు అధిక సంఖ్యలో పేరుస్తున్నారు. దీంతో పూలకు డిమాండ్ ఏర్పడింది. పెరిగిన సాగు జిల్లాలో సీతమ్మ(సీతమ్మ జెడ) సాగు గతేడాది 60 ఎకరాల వరకు ఉండగా.. ఈ ఏడాది 120 ఎకరాల వరకు పెరిగింది. మంచిర్యాల నుంచి లక్సెట్టిపేట వె ళ్లే దారి పక్కనే ఉన్న గ్రామాల్లో సీతమ్మ పూల సాగు కనిపిస్తోంది. లక్సెట్టిపేట, హాజీపూర్, కన్నెపల్లి, బె ల్లంపల్లి, భీమిని, జైపూర్, చెన్నూర్ మండలాల్లో సా గు చేస్తున్నారు. తులం విత్తనం రూ.500కు కొనుగోలు చేసి విత్తుకున్నారు. రెండుమార్లు ఎరువులతోపా టు చీడపీడలు వ్యాప్తి చెందకుండా క్రిమిసంహారక మందులు పిచికారీచేశారు. జూలైలో విత్తుకున్న పంట పూతకు వచ్చింది. రెండు నుంచి మూడు తడుల నీటితో 70 నుంచి 80 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పెట్టుబడి పెడుతుండగా.. 30 నుంచి 35 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు. గత ఏడాది ఎకరం సాగు చేసిన రైతులు రూ.80 వేల నుంచి రూ. లక్ష రూపాయల వరకు ఆదాయం పొందారు. కొన్ని చోట్ల రైతులు పత్తిలో అంతరపంటగానూ సీతమ్మ జెడ పూల సాగు చేస్తున్నారు. చేను వద్దే విక్రయాలు.. కొందరు వ్యాపారులు ముందస్తుగానే సద్దుల బతుకమ్మ పండగ కోసం 20రోజుల ముందు నుంచే చేను వద్దకు వెళ్లి అడ్వాన్స్ ఇస్తున్నారు. గుత్త లెక్కన ఒ ప్పందం చేసుకుని డబ్బులు చెల్లిస్తున్నారు. ఒక్కో సా లుకు దూరాన్ని బట్టి రూ.1,500 నుంచి రూ.3,000 వేల వరకు రైతులు విక్రయిస్తున్నారు. పూలతోనే అందం బతకమ్మ పేర్చడానికి తంగెడుపూలు ఎంతో ప్రత్యేకం కాగా.. అలంకరణతో సీతమ్మజెడల పూలుకూడా ఎంతో అందాన్ని ఇస్తుంది. ఇతర పూలు ఎన్ని ఉన్నా సీతమ్మ పూలు ఆకర్శణీయంగా ఉంటాయి.పండుగ సమయంలో ధర ఎక్కువైనా సీతమ్మ పూలు తప్పనిసరి కొనుగోలు చేసి బతకమ్మను పేర్చుకుంటాం. – బీమరాజుల సరిత, మంచిర్యాల చదవండి: Sagubadi: కాసుల పంట డ్రాగన్! ఎకరాకు 8 లక్షల వరకు పెట్టుబడి! రెండో ఏడాదే అధికాదాయం.. 50 లక్షలకు పైగా! బతుకమ్మ ప్రత్యేకం.. బంతి, చామంతి, గునుగు, లిల్లీ, పట్టుకుచ్చులకు భలే గిరాకీ... -
Bathukamma Song: ఒక్కేసి పువ్వేసి చందమామా.. ఒక్క జాము ఆయె చందమామా
తెలంగాణ ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగ బతుకమ్మ. ఆదివారం ఎంగిపూలతో ఆరంభమైన ఈ పండుగ సందడి కొనసాగుతోంది. తొమ్మిదిరోజుల పాటు కోలాహలంగా సాగే ఈ వేడుకలో పాటలకు ప్రత్యేక స్థానం ఉంది. పల్లె, పట్నం అంతటా ప్రాచుర్యం పొందిన బతుకమ్మ పాట ఒక్కేసి పువ్వేసి చందమామా.. లిరిక్స్ ఈ పండుగ సందర్భంగా మీకోసం.. ‘‘ఒక్కేసి పువ్వేసి చందమామా.. ఒక్క జాము ఆయె చందమామా పైన మఠం కట్టి చందమామా.. కింద ఇల్లు కట్టి చందమామా మఠంలో ఉన్న చందమామా.. మాయదారి శివుడు చందమామా శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా గౌరి గద్దెల మీద చందమామా.. జంగమయ్య ఉన్నాడె చందమామా రెండేసి పూలేసి చందమామా.. రెండు జాములాయె చందమామా శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా మూడేసి పూలేసి చందమామా.. మూడు జాములాయె చందమామా శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా నాలుగేసి పూలేసి చందమామా.. నాలుగు జాములాయె చందమామా శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా ఐదేసి పూలేసి చందమామా.. ఐదు జాములాయె చందమామా శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా ఆరేసి పూలేసి చందమామా.. ఆరు జాములాయె చందమామా శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా ఏడేసి పూలేసి చందమామా.. ఏడు జాములాయె చందమామా శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా ఎనిమిదేసి పూలేసి చందమామా.. ఎనిమిది జాములాయె చందమామా శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా తొమ్మిదేసి పూలేసి చందమామా.. తొమ్మిది జాములాయె చందమామా శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా తంగేడు వనములకు చందమామా.. తాళ్లు కట్టబోయె చందమామా గుమ్మాడి వనమునకు చందమామా.. గుళ్లు కట్టబోయె చందమామా రుద్రాక్ష వనములకు చందమామా.. నిద్ర చేయబాయె చందమామా’’ సేకరణ : రాచర్ల శ్రీదేవి, భారత్ టాకీస్ రోడ్, కరీంనగర్ చదవండి: Bathukamma Songs: బతుకమ్మ: పుట్టిన రీతి జెప్పె చందమామ! పూర్వకాలం నాటి పాట! Bathukamma Songs: పుట్టింటికి వెళ్లేందుకు అనుమతి! కలవారి కోడలు ఉయ్యాలో..! -
మ్యూనిచ్ నగరంలో కన్నుల పండువగా బతుకమ్మ సంబురాలు
మునిచ్ నగరంలో తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన బతుకమ్మ కన్నుల పండుగల జరిగింది. ఈ వేడుకల్లో 200లకు పైగా ఎన్నారై మహిళలు పాల్గొన్నారు. బతుకమ్మ ఆటపాటలతో ఆ ప్రాంత పరిసరాలు మార్మోగాయి. ఆడపడుచులు రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది ఉయ్యాల పాటలు పాడారు. ఈ కార్యక్రమ నిర్వాహకుడ ఆనంద్ మాట్లాడుతూ.. తెలంగాణలో జరుపుకున్న విధంగానే జర్మనీలోను బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల్లో స్థిరపడిన తెలంగాణ, తెలుగు వాసులు కూడా బతుకమ్మ సంబురాలను ఘనంగ నిర్వహించుకోవాలన్నారు. మునిచ్ నగరంలో జరిగిన బతుకమ్మ సంబురాలు జర్మనీ లోని ఇతర నగరాలకు కూడా స్ఫూర్తినిచ్చాయి. అనంతరం నిర్వాహకులు అరవింద్, నరేష్, శ్రీనివాస్, వికాస్ ఈ కార్యక్రమం విజయవంతం కావడంపై ఆనందం వ్యక్తం చేశారు. -
బతుకమ్మ.. పుట్టిన రీతి జెప్పె చందమామ! పూర్వకాలం నాటి పాట!
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ఆరంభమైంది. తొమ్మిది రోజులు వేడుకగా సాగే ఈ సంబురంలో పాటలకు ప్రత్యేక స్థానం ఉంది. బతుకమ్మా చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ.. కోలాటాలతో ఆడబిడ్డలంతా కథాగానం చేస్తూ గౌరమ్మను పూజిస్తారు. ఈ పండుగ వేళ బతుకమ్మ జననం గురించి చెప్పే 200 ఏళ్ల నాటి పాట మీకోసం.. ‘‘శ్రీలక్ష్మీ దేవియు చందమామ- సృష్టి బతుకమ్మాయె చందమామ పుట్టిన రీతి జెప్పె చందమామ- భట్టు నరసింహకవి చందమామ ధర చోళదేశమున చందమామ- ధర్మాంగుడను రాజు చందమామ ఆరాజు భార్యయు చందమామ- అతి సత్యవతి యంద్రు చందమామ నూరునోములు నోచి చందమామ- నూరు మందిని గాంచె చందమామ వారు శూరులయ్యె చందమామ- వైరులచే హతమైరి చందమామ తల్లిదండ్రులపుడు చందమామ- తరగనీ శోకమున చందమామ ధనరాజ్యమునుబాసి చందమామ- దాయాదులను బాసి చందమామ వనితతో ఆ రాజు చందమామ- వనమందు నివసించె చందమామ కలికి లక్ష్మిని గూర్చి చందమామ- పలికె వరమడుగుమని చందమామ వినుతించి వేడుచు చందమామ- వెలది తన గర్భమున చందమామ పుట్టుమని వేడగా చందమామ- పూబోణి మది మెచ్చి చందమామ సత్యవతి గర్భమున చందమామ- జన్మించె శ్రీలక్ష్మి చందమామ అంతలో మునులునూ చందమామ- అక్కడికి వచ్చిరి చందమామ కపిలగాలవులునూ చందమామ- కశ్యపాంగీరసులు చందమామ అత్రి వశిష్టులూ చందమామ- ఆ కన్నియను జూచి చందమామ బతుకు గనె ఈ తల్లి చందమామ- బతుకమ్మ యనిరంత చందమామ’’ చదవండి: Bathukamma Songs: పుట్టింటికి వెళ్లేందుకు అనుమతి! కలవారి కోడలు ఉయ్యాలో..! -
Bathukamma: పుట్టింటికి వెళ్లేందుకు అనుమతి! కలవారి కోడలు ఉయ్యాలో..!
Bathukamma 2022- Song: తెలంగాణలో బతుకమ్మ పండుగ సందడి మొదలైంది. ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మతో ఆడపడుచుల సంబరాల వేడుక ఆరంభమైంది. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక్కచేట చేర్చి.. చుట్టూ తిరుగుతూ చప్పట్లతో తమ అనుభవాలు, ఆనందాలు, కష్టాలనే పాటలుగా మలిచి గౌరమ్మను కొలుస్తారు ఆడబిడ్డలు. ఇక ఏ పండక్కి పుట్టింకి వెళ్లినా వెళ్లకపోయినా చాలా మంది ఆడపడుచులు ఈ పండుగకు మాత్రం అమ్మగారింటికి వెళ్తారు. మరి అలా వెళ్లాలంటే అత్తింటి వారి అనుమతి తీసుకోవాలి కదా! ఓ ఆడబిడ్డను పుట్టింటికి తీసుకువెళ్లడానికి ఆమె అన్నలు రాగా.. అత్తమామలు, బావ- యారాలు(తోడికోడలు), ఆపై భర్తను అడిగి అనుమతి పొందిన తీరును పాటగా మలిస్తే... ఇలా.. ‘‘కలవారి కోడలు ఉయ్యాలో.. కనక మహాలక్ష్మి ఉయ్యాలో.. కడుగుతున్నది పప్పు ఉయ్యాలో.. కడవల్లోనబోసి ఉయ్యాలో.. అప్పుడే వచ్చెను ఉయ్యాలో.. ఆమె పెద్దన్న ఉయ్యాలో.. కాళ్లకు నీళ్లిచ్చి ఉయ్యాలో.. కన్నీళ్లు తీసింది ఉయ్యాలో.. ఎందుకు చెల్లెలా ఉయ్యాలో.. ఏమి కష్టాలమ్మ ఉయ్యాలో.. తుడుచుకో కన్నీళ్లు ఉయ్యాలో.. ముడుచుకో కురులమ్మ ఉయ్యాలో.. ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో.. వెళ్లి వద్దామమ్మ ఉయ్యాలో.. చేరి నీవారితో ఉయ్యాలో.. చెప్పిరాపోవమ్మ ఉయ్యాలో.. పట్టెమంచం మీద ఉయ్యాలో.. పవళించిన మామ ఉయ్యాలో.. మాయన్నలొచ్చిరి ఉయ్యాలో.. మమ్ముబంపుతార ఉయ్యాలో.. నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో.. మీ అత్తనడుగు ఉయ్యాలో.. అరుగుల్ల గూసున్న ఉయ్యాలో.. ఓ అత్తగారు ఉయ్యాలో.. మా అన్నలొచ్చిరి ఉయ్యాలో.. మమ్ముబంపుతార ఉయ్యాలో.. నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో.. మీ బావనడుగు ఉయ్యాలో.. భారతం సదివేటి ఉయ్యాలో.. బావ పెద్ద బావ ఉయ్యాలో.. మా అన్నలొచ్చిరి ఉయ్యాలో.. మమ్ముబంపుతార ఉయ్యాలో.. నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో.. మీ అక్కనడుగు ఉయ్యాలో.. వంటశాలలో ఉన్న ఉయ్యాలో.. ఓ అక్కగారు ఉయ్యాలో.. మా అన్నలొచ్చిరి ఉయ్యాలో.. మమ్ముబంపుతార ఉయ్యాలో.. నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో.. మీ భర్తనే అడుగు ఉయ్యాలో.. రచ్చలో గూర్చున్న ఉయ్యాలో.. రాజేంద్ర భోగి ఉయ్యాలో.. మా అన్నలొచ్చిరి ఉయ్యాలో.. మమ్ముబంపుతార ఉయ్యాలో.. కట్టుకో చీరలు ఉయ్యాలో.. పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో.. ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో.. వెళ్లిరా ఊరికి ఉయ్యాలో..’’ – సేకరణ: తొడుపునూరి నీరజ, కరీంనగర్ – విద్యానగర్(కరీంనగర్) -
వర్జీనియా, కాలిఫోర్నియాలో వెటా ఆధర్యంలో బతుకమ్మ సంబురం!
తెలంగాణలో ఊరూ వాడా పూలజాతర సందడి చేస్తున్నట్టే అమెరికాలో కూడా విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వెటా) సంస్థ బతుకమ్మ వేడుకలను వర్జీనియా రాష్ట్రంలోని FAIRFAX నగరంలో ఘనంగా నిర్వహించింది. స్థానిక ఎస్బీ లోటస్ టెంపుల్ ఆవరణలో పూలతో బతుకమ్మని పేర్చి, పసుపు ముద్దతో గౌరమ్మని అలంకరించుకుని, ఒక్కొక్క పువ్వేసి చందమామా...ఒక్క జాము గడిచె చందమామా, బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో మాతల్లి బతుకమ్మ ఊయ్యాలో అంటూ అనేక బతుకమ్మ పాటలతో బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపు కున్నారు. సంప్రదాయ వస్త్రాదారణలో తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడిపాడి సందడి చేశారు. మహిళా శక్తి స్వరూపిణిగా చెప్పే ఈ దసరా నవరాత్రి రోజులలో వచ్చే సంబరాల్లో "బతుకమ్మ పండుగ" తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అన్న విషయం తెలిసిందే. ‘ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా)’ స్థాపించినప్పటినుంచి ప్రతి ఏడాది ఈ బ్రతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈవేడుకల్లో ప్రముఖ యాంకర్ ఉదయ భాను దాదాపు 800 మంది పెద్దలు , పిల్లలను ఎంటర్టైన్ చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన వారందరికీ వెటాప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల , advisory కౌన్సిల్ కో-చైర్ Dr అభితేజ కొండా , ప్రెసిడెంట్ ఎలెక్ట్ శైలజ కల్లూరి, నేషనల్ మీడియా చైర్ సుగుణ రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం వర్జీనియా బోర్డ్ అఫ్ డైరెక్టర్ జయశ్రీ తెలుకుంట్ల, మేరీల్యాండ్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ ప్రీతి రెడ్డి, రీజినల్ కల్చరల్ చైర్ చైతన్య పోలోజు,రీజినల్ కోర్ కమిటీ స్మృతి రెడ్డి పర్యవేక్షణలో జరిగింది. సతీష్ వడ్డే, సుధ పాలడుగు, సతీష్ వేమన, విశ్వేశ్వర్ కలవాల,కాంగ్రెస్ మహిళజెన్నిఫర్ వెక్స్టన్ హాజరయ్యారు. కాలిఫోర్నియాలో బతుకమ్మ సంబరాలు కాలిఫోర్నియా లోని హ్యాంఫోర్డ్ నగరంలో వెటా ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమాండ్లగారి బంగ్లా ఆవరణలో " బతుకమ్మ పండుగ శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి ఫుడ్ స్పాన్సర్ చేసిన Dr కాంతం & సుజాత గాదె గారికి ఝాన్సీ గారు కృతజ్ఞతలు తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో WETA treasurer విశ్వ వేమిరెడ్డి, కమ్యూనిటీ చైర్ జ్యోతి, RVP పూజ రెడ్డి, సెక్రటరీ అనురాధ అలిశెట్టి, హైమ అనుమాండ్ల తో పాటు దాదాపు 500 మంది పెద్దలు, పిల్లలు పాల్గొన్నారు. -
పుష్ప విలాసం.. నేడు ఎంగిలి పూల బతుకమ్మ
తీరొక్క రంగులు. వేర్వేరు రకాలు. వాటన్నింటా సుగంధమే. నిర్జన ప్రదేశాల్లో జన్మ తీసుకొని తంతెలు తంతెలుగా నిర్మితమయ్యే పుష్పాల విలాసమే బతుకమ్మ. నేడు ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి, హన్మకొండ: తెలంగాణలోని సంప్రదాయాలకు సంస్కృతికి ప్రతీక బతుకమ్మ. ఈపండుగ వచ్చిందటే ఆడపడుచులకు ఎనలేని ఆనందం. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందు వచ్చే అమావాస్యను జానపదులు పెత్రమాస అంటారు. బతుకమ్మ పండుగ పెత్రమాసనాడు ప్రారంభమై మహాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మగా, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు. ఆరో రోజు అర్రెం అంటారు. ఈరోజు బతుకమ్మను పేర్చడం గానీ ఆడడం గానీ చేయరు. ఆరో రోజు బతుకమ్మ అలిగిందని భావిస్తారు. బతుకమ్మను పేర్చడానికి వరుసగా పూలను సేకరిస్తుంటారు. ఆకారణంగా ఆరో రోజు పూలను సేకరించకుండా ఉండడానికే అర్రెం అనే నియమం వచ్చినట్లు జానపద పరిశోధకుల అభిప్రాయం. బతుకమ్మను పేర్చేందుకు తంగేడు, గునుగు, సీతజడ, బంతి, కట్ల, మందార, మొల్ల, గోరంట, ముళ్లగోరంట, పట్నం బంతి, తురకబంతి, చామంతి, కలువ తామర, గన్నేరు, ఉద్రాక్ష, జాజి, గుమ్మడి, సంపెంగ తదితర పూలను సేకరించి ఇంటికి తెచ్చుకుంటారు. ఎంగిలిపూలు అని ఎందుకంటారంటే.. బతుకమ్మ తయారీకోసం ఒకరోజు ముందే పూలను సేకరిస్తారు. పూలు తీసుకొచ్చిన వారింట్లో ఈపూలు ఒకరోజు నిద్ర చేస్తాయి. అలా నిద్ర చేసిన పూలతో బతుకమ్మను పేర్చడం వల్ల ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారని పెద్దలు చెబుతున్నారు. ముందు రోజు పూలను సేకరించడం వల్ల మొగ్గలుగా ఉన్న పూలను తెచ్చుకొని బతుకమ్మను పేర్చుతున్నప్పుడు నోటితో పూలను ఊది వాటిని పేరుస్తారు. అలా పూలను ఎంగిలిపూల బతుకమ్మ అంటారని చెబుతుంటారు. పెత్రమాస రోజు ఉదయమే లేచి చనిపోయిన పెద్దలకు నివేదనలు చేసి అనంతరం భోజనం చేసిన తర్వాత బతుకమ్మను పేర్చడం వల్ల ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారని పలురకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. బతుకమ్మకు హారతి ఇస్తున్న మహిళలు పితృ అమావాస్య.. పెత్రమాసనే పితృ అమావాస్య అని, మహాలయ అమావాస్య అని పిలుస్తారు. పెద్దలకు బియ్యం ఇవ్వడానికి పెత్రమాసం మంచిరోజు. ఈరోజు పైలోకాల్లో ఉన్న పితృదేవతలు భూలోకంలో తమ వారి కోసం వస్తారని భావిస్తారు. వారికోసం వారి సంతృప్తి కోసం సహపంక్తి భోజనాలు నిర్వహించి కులమతభేదం లేకుండా కలిసి భుజించాలని అంటారు. అలా చేయడం అందరికీ వీలవదని పితృదేవతల పేరుమీద బ్రాహ్మణులకు బియ్యం ఇచ్చే సంప్రదాయం ప్రారంభమైనట్లు పురోహితులు చెబుతున్నారు. పూల దారులు ఆదివారం పెత్రమావాస్య కావడంతో ఎంగిలి పూల బతుకమ్మను పేర్చడానికి కావాల్సిన పూల సిబ్బిలు, రంగులు, తంగేడు పూలు, గునుగు, తామర పూలు, చామంతి, బంతి, సీతజడలు మొదలైనవి కొనుగోలు చేయడానికి వచ్చిన వారితో శనివారం రాత్రి రోడ్లు కిక్కిరిసిపోయాయి. హనుమకొండ చౌరస్తా, కుమార్పల్లి, టైలర్స్ట్రీ్టట్, అంబేడ్కర్ సెంటర్, వరంగల్లోని పిన్నవారి వీధి, రామన్నపేట, బట్టలబజార్, కాశీబుగ్గ, గోపాలస్వామి గుడి, కాజీపేటలోని బాపూజీనగర్ తదితర ప్రాంతాల్లో పూల అమ్మకాలు జోరుగా సాగాయి. 200 ఏళ్ల నాటి బతుకమ్మ పాట శ్రీలక్ష్మీ దేవియు చందమామ – సృష్టి బతుకమ్మాయె చందమామ పుట్టిన రీతి జెప్పె చందమామ – భట్టు నరసింహకవి చందమామ ధర చోళదేశమున చందమామ– ధర్మాంగుడను రాజు చందమామ ఆరాజు భార్యయు చందమామ– అతి సత్యవతి యంద్రు చందమామ నూరునోములు నోచి చందమామ – నూరు మందిని గాంచె చందమామ వారు శూరులయ్యె చందమామ – వైరులచే హతమైరి చందమామ తల్లిదండ్రులపుడు చందమామ – తరగనీ శోకమున చందమామ ధనరాజ్యమునుబాసి చందమామ – దాయాదులను బాసి చందమామ వనితతో ఆరాజు చందమామ – వనమందు నివసించె చందమామ కలికి లక్ష్మిని గూర్చి చందమామ – పలికె వరమడుగుమని చందమామ వినుతించి వేడుచు చందమామ – వెలది తన గర్భమున చందమామ పుట్టుమని వేడగా చందమామ – పూబోణి మది మెచ్చి చందమామ సత్యవతి గర్భమున చందమామ – జన్మించె శ్రీలక్ష్మీ చందమామ అంతలో మునులునూ చందమామ – అక్కడికి వచ్చిరి చందమామ కపిలగాలవులునూ చందమామ – కశ్యపాంగీరసులు చందమామ అత్రి వశిష్ఠులూ చందమామ – ఆ కన్నియను జూచి చందమామ బతుకు గనె ఈతల్లి చందమామ – బతుకమ్మ యనిరంత చందమామ నేడు పాటల పోటీలు శ్రీరాధేశ్యాం సాహితీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి వేయిస్తంభాల దేవాలయంలో బతుకమ్మ పాటల పోటీలు నిర్వహించనున్నారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ.. బతుకమ్మ పాటల పోటీల్లో పాల్గొని విజేతలైన మహిళలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. తొమ్మిది రోజులు మహిళలు ప్రశాంతంగా దేవాలయంలో ఆడుకోవచ్చని తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. -
తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పండుగ, 'బతుకమ్మ' ఉత్సవాల ప్రారంభం (ఆదివారం నుంచి) సందర్భంగా, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టింటికి చేరిన ఆడబిడ్డలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, ఆడుతూ పాడుతూ ఆనందోత్సాహాల నడుమ జరిగే బతుకమ్మ వేడుకలు, పల్లెల్లో ప్రత్యేకతను చాటుతాయని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, తొమ్మిది రోజుల పాటు సాగే ఉత్సవాల సందర్భంగా, రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక సంబురం గొప్పగా వెల్లివిరుస్తుందని సీఎం తెలిపారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సంస్కృతికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి పెద్ద పీట వేసిందన్నారు. దాదాపు రూ.350 కోట్ల ఖర్చుతో కోటి మంది ఆడబిడ్డలకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తయారు చేయించిన కోటి చీరెలను బతుకమ్మ కానుకగా అందిస్తూ గౌరవించుకుంటున్నామని సీఎం అన్నారు. ప్రజల జీవనంలో భాగమైపోయిన "బతుకమ్మ" ఖండాంతరాలకు విస్తరించి తెలంగాణ సంస్కృతిని విశ్వ వ్యాప్తం చేసిందన్నారు. బతుకమ్మ పండుగను జరుపుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రజలను సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో దీవించాలని ప్రకృతి దేవత బతుకమ్మను సీఎం కేసీఆర్ ప్రార్థించారు. చదవండి: (మీకో దండం ఠాగూర్ బాబు.. మమ్మల్ని వదిలి వెళ్లండి!) -
Bathukamma: ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. అమ్మనే అడిగి.. ఆమెకిష్టమైన విధంగా!
తెలంగాణ ఆడబిడ్డల సంబురం బతుకమ్మ పండుగకు సమయం ఆసన్నమైంది. ఆదివారం(సెప్టెంబరు 25) ఎంగిపూల బతుకమ్మతో సందడి మొదలు కానుంది. తీరొక్క పూలతో సిబ్బిలో బతుకమ్మ పేర్చి.. గౌరమ్మను మధ్యలో పెడతారు. సాధారణంగా గుమ్మడిపువ్వు, తంగేడు, కట్లపూలు, గోరంట పూలు, పట్టుకుచ్చులు(సీతజడలు), రుద్రాక్షలు, పొన్నపూలతో బతుకమ్మ పేరుస్తారు. ఈ పూల పండుగ అంటేనే ఆటపాటలు కదా! బతుకమ్మ ఆడేటపుడే కాదు పేర్చేటపుడు కూడా ఇలా పాట పాడుకుంటారు ఆడబిడ్డలు. ఏయే పూలతో నిన్ను కొలవాలమ్మా అంటూ గౌరమ్మనే అడిగి ఆమెకిష్టమైన విధంగా బతుకమ్మ పేర్చినట్లు మురిసిపోతారు. ఈ పండుగకు ఉన్న ప్రత్యేకతల్లో పాటలు ప్రధానమైనవన్న సంగతి తెలిసిందే. ‘‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ... ఏమేమి కాయొప్పునే గౌరమ్మ గుమ్మాడి పువ్వొప్పునే గౌరమ్మ... గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మ గుమ్మాడి చెట్టుకింద గౌరమ్మ... ఆట చిలకల్లారా ..పాట చిలకల్లారా బమ్మశ్రీమాడలూ గౌరమ్మ కందొమ్మ గడ్డలూ గౌరమ్మ... ఎనుగూల కట్టెలూ గౌరమ్మ తారు గోరంటాలు గౌరమ్మ... ఎర్రొద్దురాక్షలు గౌరమ్మ పోను తంగేడుపూలు గౌరమ్మ... రాను తంగేడుపూలు గౌరమ్మ ఘనమైన పొన్నపూలే గౌరమ్మ... గజ్జాల వడ్డాణమే గౌరమ్మ తంగేడు చెట్టుకింద గౌరమ్మ... ఆట చిలకల్లారా.. పాట చిలకల్లారా బమ్మశ్రీమాడలూ గౌరమ్మ కందొమ్మ గడ్డలు ఎనుగూల కట్టెలు గౌరమ్మ తారు గోరంటాలు ఎర్రొద్దురాక్షలు పోను తంగేడుపూలురాను తంగేడుపూలు ఘనమైన పొన్నపూలేగజ్జాల వడ్డాణమే కాకర చెట్టుకింద ఆట చిలుకాలార పాట చిలుకాలార బమ్మశ్రీమడలూ తారు గోరంటాలు ఎర్రొద్దురాక్షలు పోను తంగేడుపూలురాను తంగేడుపూలు ఘనమైన పొన్నపూలే గజ్జాల వడ్డాణమే రుద్రాక్ష చెట్టుకింద ఆట చిలుకాలార పాట చిలుకాలార కలికి చిలుకాలార కందొమ్మ గడ్డలూ బమ్మశ్రీమాడలూ తారు గోరంటాలు తీరు గోరంటాలు ఎనుగూల కట్టె ఎర్రొద్దురాక్షలు రాను తంగెడు పువ్వు పోను తంగెడు పువ్వు ఘనమైన పొన్నపూలే గజ్జాల వడ్డాణమే ఆ పూలు తెప్పించి పొందుగా పేరిచి గంధములు పూయించి పసుపు కుంకుమలు పెట్టి నీ నోము నీకిత్తునే గౌరమ్మ నా నోము నాకియ్యవే గౌరమ్మ’’ అంటూ పాడుకుంటారు తెలంగాణ ఆడపడుచులు! ఇక బతుకమ్మ పేర్చిన తర్వాత ఊరంతా ఒక్కచోట చేరి.. చప్పట్లూ కొడుతూ పాటలు పాడుతూ అమ్మవారిని కొలుస్తారు. చదవండి: Bathukamma: బతుకమ్మ పండుగ.. నేపథ్యం గురించి తెలుసా? -
Bathukamma: మలీద ముద్దల తయారీ విధానం! వీటిని తింటే ఇన్ని ఆరోగ్య లాభాలా?!
బతుకమ్మ వేడుకల్లో భాగంగా తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలు తయారు చేస్తారు. ఈ ప్రసాదాల్లో మలీద ముద్దలు మరింత ప్రత్యేకం. మరి మలీద ముద్దలు ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం! సాధారణంగా రొట్టె, బెల్లం లేదా చక్కెర కలిపి మలీద ముద్దలు తయారు చేస్తారు. ఆరోగ్య ప్రయోజనాలు మరింతగా పెంచేందుకు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటారు. కావాల్సిన పదార్థాలు ►గోధుమ పిండి- కప్పు ►కాజూ(జీడిపప్పు)- 10 గ్రాములు ►పిస్తా- 10 గ్రాములు ►బాదం- 10 గ్రాములు ►సోంపు పొడి- అర టీస్పూను ►యాలకుల పొడి- అర టీస్పూను ►కట్ చేసిన ఖర్జూరాలు- ఆరు ►బెల్లం- ఒక కప్పు ►నెయ్యి- రెండు టేబుల్ స్పూన్లు మలీద ముద్దల తయారీ విధానం ►చపాతీ పిండి కలుపుకొని 15 నిముషాలు పక్కన పెట్టుకోవాలి. పిండి మరీ మెత్తగా లేదంటే గట్టిగా కాకుండా చూసుకోవాలి. ►తర్వాత చపాతీలు ఒత్తుకోవాలి ►నెయ్యితో రొట్టెలను రెండు వైపులా కాల్చుకోవాలి. ►చల్లారిన తర్వాత ముక్కలు చేసి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ►అదే విధంగా.. ముందుగా తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్(కాజూ, పిస్తా, బాదం, ఖర్జూరాలు)ను పొడి చేసుకోవాలి. ►తర్వాత ఒక పాత్ర తీసుకుని అందులో రెట్టెల మిశ్రమం, డ్రై ఫ్రూట్స్ పొడి, సోంపు పొడి, యాలకుల పొడి, బెల్లం , నెయ్యి వేసి కలపాలి. ►ఈ మిశ్రమాన్ని ముద్దలుగా కట్టాలి. అంతే మలీద ముద్దలు రెడీ. ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ►సాధారణంగా రొట్టెలు కూరలు లేదంటే పప్పుతో కలిపి తింటారు. రొటీన్గా కాకుండా ఇలా చపాతీలతో స్వీట్ చేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. ►ఇక ఇందులో వేసే కాజూ, పిస్తా, బాదం, ఖర్జూరాల ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాజూలో ఆరోగ్యానికి మేలు చేసే మోనోసాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. ►పిస్తా తినడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. ఇందులోని కెరోటినాయిడ్లు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ►ఖర్జూరాలు శరీరానికి కావాల్సిన ముఖ్యమైన విటమిన్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. వీటన్నింటినీ కలిపి తయారు చేసిన మలీద ముద్దలు తింటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. -
Bathukamma: పండుగ వేళ తొమ్మిది రకాల నైవేద్యాలు.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో!
పూలనే దేవతారూపంగా కొలిచే అపురూపమైన పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ పూల పండుగ అంటే కేవలం ఆటపాటలే కాదు.. ఘుమఘుమలాడే పిండి వంటలు కూడా గుర్తుకువస్తాయి. బతుకమ్మ ఆటా.. పాటా మానసికోల్లాసాన్ని ఇస్తే.. ఇంటి తిరిగి వెళ్లే వేళ ఇచ్చిపుచ్చుకునే వాయినాలు.. ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తొమ్మిది రోజులు చేసే తొమ్మిది రకాల ప్రసాదాలు పోషక విలువలు కలిగి ఉంటాయి. ఐరన్ పుష్కలం సాధారణంగా మహిళలు, పిల్లల్లో ఐరన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. బతుకమ్మ సమయంలో తయారు చేసే సద్దిలో ఐరన్ శాతం ఎక్కువ. నువ్వులు, పల్లీలు, కొబ్బరి పొడి, సత్తుపిండి, పెసర ముద్దలు... ఇలా చిరుధానాల్యతో కూడిన వంటకాలు తింటే ఆరోగ్యకరమని పెద్దల మాట. నువ్వుల ముద్దలు నువ్వుల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బతుకమ్మ పండుగ వేళ వీటితో పొడి చేస్తారు. శరీరానికి ముఖ్యమైన అమైనోయాసిడ్స్ నువ్వుల్లో పుష్కలం. ఇక వీటిలో జింక్, కాల్షియం, పొటాషియం కూడా ఎక్కువే. మొదడును చురుకుగా ఉంచడంలో జింక్ కీలక పాత్ర పోషిస్తే.. కాల్షియం ఎమకల ధృడత్వాన్ని దోహదం చేస్తుంది. సత్తు పిండి బతుకమ్మ వేడుకల్లో మొదటి రోజు సాధారణంగా ఆకువక్కలు, తులసీదళాలు, దానిమ్మగింజలు, శనగపప్పు, పెసరపప్పు, నువ్వులు, మొక్కజొన్న గింజల సత్తు పిండిని తయారు చేసుకుంటారు. దీనిలో పీచు ఎక్కువగా ఉంటుంది. కార్బొహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. కాగా పీచు పదార్థాల వల్ల మలబద్దకం దూరమవుతుంది. ఇక రెండోరోజు పప్పు బెల్లం, రేగు పండ్లు, మూడో రోజు పూర్ణాలు, నాల్గోరోజు బెల్లం బియ్యం, ఐదో రోజు అట్లు, ఎనిమిదో రోజు నువ్వులు, బెల్లం కలిపిన వెన్న ముద్దలు, తొ మ్మిదోరోజు బియ్యం పిండి, గోధుమపిండి, బెల్లంతో మలీద ముద్దలు చేసుకుంటారు. వీటిలోనూ ఆరోగ్యానికి దోహదం చేసే కారకాలు ఎక్కువే. పెసర ముద్దలు పెసర్లను ఉడకబెట్టి అందులో బెల్లం కలిపి ముద్దలుగా చేస్తారు. ఇది జీర్ణశక్తిని పెంచడంతోపాటు జీర్ణ సంబంధిత వ్యాధులనూ తగ్గిస్తుంది. కొబ్బరి పొడి కొబ్బరిలో ప్రొటీన్లు అధికం. మహిళల ఆరోగ్యానికి కొబ్బరి పొడి చాలా ఉపయోగపడుతుంది. పెరుగన్నం, పులిహోర... పెరుగన్నంలో పల్లీలు, వివిధ రకాల ధాన్యాలను కలుపుతారు. చింతపండు లేదా నిమ్మరసంతో చేసిన పులిహోర ప్రసాదం తయారు చేసుకుంటారు. చిన్న గాయాల నుంచి క్యాన్సర్ వరకు పసుపు విరుగుడుగా పని చేస్తుంది. చింతపండు గుజ్జులో విటమిన్ ‘సి’ అత్యధిక. పంచామృతాల్లో పెరుగు ఒకటి. ఇందులో పోషక విలువలు మెండు. దీంతో అన్నం కలిపి నైవేద్యం చేస్తారు. దీనిలో ప్రొటీన్, కాల్షియం, విటమిన్ బీ6, బీ12 వంటివి ఎక్కువగా ఉంటాయి. కొవ్వు తక్కువగా ఉండే పెరుగులో లాక్లో బాసిల్లై అధికంగా ఉంటుంది. పల్లి పిండి పల్లి పిండి శరీర ఎదుగుదలకు దోహదం చేస్తుంది. ప్రోటీన్లు ఎక్కువ. అంతేకాదు నోటికి రుచికరంగా ఉండడంతో చాలా మంది దీనిని ఇష్టపడతారు. ఇక పల్లి పొడికి బెల్లం కలిపి తింటే మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. -
బతుకమ్మ ఆడారా? అని అడుగుతారు కానీ.. బతుకమ్మ చేశారా అనరు! ఎందుకంటే?
పండుగలేమైనా... సంస్కృతి సంప్రదాయాలను చాటి చెబుతాయి. కానీ... వాటితో పాటుగా వారసత్వాన్ని కూడా చాటే ఏకైక పండుగ బతుకమ్మ. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక బతుకమ్మ. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి చిహ్నం బతుకమ్మ. ప్రజల బతుకులోంచి పుట్టిన పండుగ బతుకమ్మ. అసలు బతుకమ్మ పండుగలో పువ్వులకు, నైవేద్యానికి ఎంత ప్రాధాన్యత ఉందో... ఆట పాటలకు అంతటి ప్రాధాన్యత ఉంది. బతుకమ్మ పండుగ సమయానికి తెలంగాణలో వ్యవసాయ పనులు చురుగ్గా ఉండవు. పల్లె జనానికి ఇది కాస్త తీరిక సమయం. మరోవైపు పంటలు, చెట్లు, పూలతో ప్రకృతి అంతా కళకళలాడుతూ ఉంటుంది. అందుకే ఈ పండుగ బొడ్డెమ్మతో మొదలవుతుంది. బతుకమ్మతో ముగుస్తుంది. తెలంగాణలోని ప్రతి ఆడపడుచు... ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే పండుగ బతుకమ్మ. రంగు రంగుల పూలతో ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ. ఆడపిల్లలను బతుకు అమ్మ ... అని మనసారా ఆశీర్వదించే పండుగ బతుకమ్మ. ఎక్కడైనా చూడండి.. బతుకమ్మ ఆడారా? అని అడుగుతారు కానీ.. బతుకమ్మ చేశారా అనరు. ఎందుకంటే ...ఇది నృత్య ప్రధానమైన పండుగ. గాన ప్రధానమైన పండుగ. చదవండి: Bathukamma 2022: బతుకమ్మ పండుగ.. నేపథ్యం గురించి తెలుసా? -
Bathukamma: బతుకమ్మ.. తొమ్మిది రోజులు.. తొమ్మిది నైవేద్యాలు ఇవే!
Bathukamma 2022- 9 Days- 9 Food Varieties: బతుకమ్మ పండుగ అంటేనే సంతోషాలు.. సంబరాలు.. పూలను ఆరాధించే ఈ అపురూప పండుగ సందర్భంగా రకరకాల ప్రసాదాలు, పిండి వంటకాలు, రుచికరమైన చిరుతిండ్లు తయారు చేస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ఏ ఇంట్లో చూసినా ఘుమగఘుమలు గుబాళిస్తాయి. ముఖ్యంగా పల్లెల్లో అయితే పోటా పోటీగా భిన్న రుచులను తయారు చేసి మరీ వడ్డిస్తారు. ఇంట్లో చేసుకున్న ఏ వంటకమయినా.. మరో నలుగురికి పంచి వారితో తినిపించడం బతుకమ్మ పండుగలో కనిపించే సంతోషకరమైన సన్నివేశం. తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరంలో కనిపించే ముఖ్యమైన ప్రసాదాలు ఇవి. ఎంగిలిపూల బతుకమ్మ.. బతుకమ్మ మొదటి రోజు పెతర అమావాస్య నాడు జరుపుకొంటారు. ఆరోజు నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. పండుగకు ముందు ఆయా పుష్పాలన్నీ వివిధ కీటకాల పరాగ సంపర్కం కారణంగా ఎంగిలి పడ్డాయని తలచి మొదటి రోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మగా వ్యవహరిస్తారు. ఆరోజు నువ్వుల సద్దిని అందరితో పంచుకుంటారు. అటుకుల బతుకమ్మ.. రెండో రోజు అటుకుల ప్రసాదం చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు కలిపి అమ్మవారికి ఇష్టంగా వడ్డించే నైవేద్యం ఇది. ముద్దపప్పు బతుకమ్మ.. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ. ముద్ద పప్పు, పాలు, బెల్లంతో వేడివేడిగా నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. నానబియ్యం బతుకమ్మ.. నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ. నాన బెట్టిన బియ్యంను పాలు, బెల్లంతో కలిపి ఉడికింది ప్రసాదంగా తయారు చేస్తారు. అట్ల బతుకమ్మ.. ఐదోరోజు అట్ల బతుకమ్మ. అట్లు లేదా దోశలను అమ్మవారికి నైవేద్యంగా వడ్డిస్తారు. అలిగిన బతుకమ్మ ఆరో రోజు అలిగిన బతుకమ్మగా జరుపుకొంటారు. ఆరోజు అమ్మవారికి అలకగా చెప్పుకుంటారు. ఉపవాసం పాటిస్తారు వేపకాయల బతుకమ్మ.. ఏడోరోజు వేపకాయల బతుకమ్మ. బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారుచేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. వెన్నెముద్దల బతుకమ్మ.. ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి వెన్నముద్దల నైవేద్యంగా వడ్డిస్తారు. సద్దుల బతుకమ్మ.. బతుకమ్మ నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజును సద్దుల బతుకమ్మగా జరుపుకొంటారు. తొమ్మిదోరోజు పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు. మలీద ముద్దలు ఇవి కాక.. రొట్టె, బెల్లం లేదా చక్కెర కలిపి మలీద ముద్దలను తయారు చేసి అందరికీ పంచుతారు. దీనిని గోధుమ పిండి, డ్రై ఫ్రూట్స్, బెల్లం, పాలు, నెయ్యితో కలిపి తయారు చేస్తారు. దీంతో పాటు రకరకాల పొడులు పెసరపొట్టు, బియ్యం పిండి, కంది పిండికి కావాల్సినంత బెల్లం, చక్కర కలిపి నెయ్యితో పొడులు తయారు చేస్తారు. చదవండి: Bathukamma 2022: బతుకమ్మ పండుగ.. నేపథ్యం గురించి తెలుసా? Bathukamma: పండగ వెనుక ఎన్ని కథలున్నా.. బతుకమ్మ ప్రత్యేకత ఇదే -
Bathukamma: ఆ తొమ్మిది రోజులు పల్లెలన్నీ పూల వనాలే! ఎంగిలిపూలు మొదలు సద్దుల దాకా!
Bathukamma 2022: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ బతుకమ్మ. ఆడబిడ్డలు ఎంతో సంబురంగా జరుపుకునే పండుగ. తొమ్మిది రోజులపాటు జరిగే పకృతి పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. పూల పండుగలో రోజుకో ప్రత్యేకం. ఎంగిలిపూలతో ప్రారంభమైన పండుగ సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. తొమ్మిది రోజులపాటు జరిగే పండుగలో తెలంగాణ పల్లెలన్నీ పూలవనాలను తలపిస్తాయి. తొమ్మిది రోజుల పాటు తీరొక్క పూలతో అందంగా బతుకమ్మను పేరుస్తారు ఆడబిడ్డలు. అమావాస్య రోజున మొదటి రోజు బతుకమ్మ ఆడతారు. ఈ రోజు పెత్రమాస (పెత్తర అమావాస్య) అంటారు. ఈసారి పెత్తర అమావాస్య సెప్టెంబరు 25న వచ్చింది. ►మొదటి రోజు- ఎంగిలిపూల బతుకమ్మ ►రెండో రోజు- అటుకుల బతుకమ్మ ►మూడో రోజు- ముద్దపప్పు బతుకమ్మ ►నాలుగో రోజు- నానే బియ్యం బతుకమ్మ ►ఐదో రోజు- అట్ల బతుకమ్మ ►ఆరవ రోజు- అలిగిన బతుకమ్మ ►ఏడో రోజు- వేపకాయల బతుకమ్మ ►ఎనిమిదవ రోజు- వెన్నముద్దల బతుకమ్మ ►తొమ్మిదో రోజు- సద్దుల బతుకమ్మ గ్రామీణ ప్రాంతాల్లో కష్టాసుఖాలను పాటల రూపంలో పలికే పండుగ బతుకమ్మ. అడవిలో దొరికే గునుగు, తంగేడు పూలను ఏరుకొచ్చి అందంగా బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మ మధ్యలో గౌరమ్మను అలంకరించి ఆటపాటలతో ఆనందంగా జరుపుకుంటారు. రకరకాల పువ్వులతో దేవతలను పూజించటం హైందవ సంప్రదాయం. అయితే పువ్వుల రాశినే దేవతా మూర్తిగా భావించి పూజ చేయటమే ఈ పండుగ ప్రత్యేకత. చదవండి: Bathukamma 2022: బతుకమ్మ పండుగ.. నేపథ్యం గురించి తెలుసా? -
Bathukamma: బతుకమ్మ పండుగ.. నేపథ్యం గురించి తెలుసా?
పూలనే దేవతగా కొలిచే అపురూపమైన పండుగ బతుకమ్మ. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.. ఆడపడుచులంతా ఒక్కచోట చేరి తమ అనుభవాలనే పాటలుగా మలిచి.. చప్పట్లతో గౌరమ్మను కొలిచే వేడుక. ప్రకృతిని ఆరాధిస్తూ.. పుడమి తల్లి గొప్పదనాన్ని కీర్తిస్తూ మురిసిపోయే క్షణాలకు వేదిక. తెలంగాణ అస్తిత్వానికి.. సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా భావించే బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది. బతుకమ్మ సంబరాలు ఏటా పెతర అమావాస్య రోజున ఎంగిపూల బతుకమ్మతో మొదలై.. సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈసారి సెప్టెంబరు 25(ఎంగిలిపూల బతుకమ్మ)న ఈ సంబరాలు మొదలు కానున్నాయి. ఈ సందర్భంగా పండుగ నేపథ్యం గురించి ఆసక్తికర విషయాలు బతుకమ్మ.. బతుకునీయవమ్మా! ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే పూలతో కూడిన అమరిక బతుకమ్మ. సాధారణంగా గునుగు, గుమ్మడి, తంగేడు, కట్ల పూలు, గోరంట్ల పూలు పట్టుకుచ్చులు(సీతజడ పూలు) స్థూపాకారంలో వరుసలుగా పేర్చి.. పైభాగం మధ్యలో ‘గౌరమ్మ’ను పెడతారు. గుమ్మడి పువ్వు మధ్య భాగాన్ని గౌరమ్మగా పిలుస్తారు. పువ్వులతో పాటు.. పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు. దుర్గరూపంగా.. బొడ్డెమ్మగా అమ్మవారిని కొలుస్తారు. ఇక పండుగ వేళ ఊరంతా ఒక్కచోట చేరి బతుకమ్మా(జీవించు అని అర్థం).. మాకు బతుకునీయవమ్మా(మమ్మల్ని చల్లగా చూడు తల్లీ) అని పాటలతో అమ్మను వేడుకుంటారు. బతుకమ్మ పండుగ నేపథ్యం బతుకమ్మ నేపథ్యానికి సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. బతుకమ్మ సంబరాల్లో భాగంగా పాడుకునే పాట ప్రకారం... ధర్మాంగధుడు అనే రాజుకు వంద మంది కుమారులు పుట్టి చనిపోయారు. దుఃఖంలో మునిగిపోయిన దంపతులు తమ కడుపున ఆ లక్ష్మీదేవి పుట్టాలని ప్రార్థిస్తారు. వారి మొరను ఆలకించిన ఆ తల్లి ఆ దంపతులకు జన్మిస్తుంది. ఆమెను దీవించేందుకు రాజు నివాసానికి వచ్చిన మునులు ‘నువ్వు ఎల్లకాలం బతుకమ్మ’ అని ఆమెను దీవించినట్టు కథ ప్రచారంలో ఉంది. చిన్న కోడలు కథ ఇక బతుకమ్మ చుట్టూ చేరి.. పండుగకు కారణమైన కథను గానం చేసే పల్లె ప్రజల పదాల ఆధారంగా.. బతుకమ్మ నేపథ్యానికి సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యం పొందింది. దాని ప్రకారం.. అనగనగా ఓ రాజు. ఆ రాజుకు ఓ చిన్న కోడలు. వారి ఊరికి జీవనాధారం చెరువు. ఎంతో విశాలమైన ఆ చెరువు వానలు బాగా పడటంతో మత్తడి దుంకుతుంది. ఎడతెరిపి లేని వానల వల్ల చెరువు నిండి కట్టకు గండిపడుతుంది. గండిని పూడ్చేందుకు ఊరంతా ప్రయత్నించినా ఫలితం ఉండదు. అయితే, చెరువు కట్ట అంటే అక్కడ మైసమ్మ(గ్రామ దేవత) కొలువు ఉంటుందని చాలా మంది నమ్మకం. ఆమే చెరువుకు రక్షణగా ఉంటుందని భావిస్తారు. అందుకే కట్ట నిలవాలంటే మైసమ్మను శాంతింపచేయాలని రాజు, ప్రజలు భావిస్తారు. కట్టను నిలిపేందుకు తన బర్రెల మందను ఇస్తానని రాజు మైసమ్మను వేడుకుంటాడు. ఇందుకు బదులుగా మైసమ్మ తల్లి తనకు కూడా బర్రెల మంద ఉందని సమాధానమిస్తుంది. ఆవుల మంద, గొర్రెల మంద, మేకల మంద.. ఇలా ఏది ఇస్తానన్నా అవన్నీ తన దగ్గర కూడా ఉన్నాయని చెబుతుంది. దీంతో ఆ రాజు.. తమ ఊరి బాగు కోసం తన కుటుంబ సభ్యులను అర్పిస్తానని ఆమెకు చెబుతాడు. కానీ.. ఆ గ్రామ దేవత శాంతించదు. ఎటూపాలుపోని స్థితిలో ఆ రాజు చిన్న కోడల్నిస్త ఉయ్యాలో.. కట్ట నిలుపే మైసు ఉయ్యాలో అని రాగం అందుకోగానే మైసమ్మ సంతృప్తి పడుతుంది. కట్ట తెగకుండా ఆపుతుంది. ఇక అన్న మాట ప్రకారం రాజు ఇంటికెళ్లి తన చిన్న కోడలిని చెరువు దగ్గరకు తీసుకువచ్చేందుకు పూనుకుంటాడు. కానీ.. ఆమెకు తను చేయాల్సిన త్యాగం గురించి చెప్పడు. అయితే, చిన్న కోడలి పసిపాపాయి గురించి వివరాలు అడుగుతూ.. అన్ని పనులు పూర్తయ్యాయని ఆమె చెప్పగానే చెరువుకు పోయి నీళ్లు తెమ్మని చెబుతాడు. మామ మాటను గౌరవించి ఆ చిన్న కోడలు బిందె పట్టుకుని చెరువు దగ్గరకు వెళ్తుంది. అయితే, ఎంత ముంచినా బిందె మునగదు. నడుము లోతు వరకు వెళ్లినా అదే పరిస్థితి. అంతలో ఆ రాజు కల్పించుకుని ఇంకొంచెం లోపలికి పొయ్యి నీళ్లు తే అని చెబుతాడు. అలా మరింత లోతుకు వెళ్లిన ఆమె బిందెతో పాటు చెరువులో మునిగిపోతుంది. తన పరిస్థితి ఏమిటో తెలుసుకున్న ఆ తల్లి.. తన తల్లిదండ్రులకు బిడ్డ లేదని, త బిడ్డకు తల్లి లేదని చెప్పమంటూ పాటు పాడుతూ పూర్తిగా మునిగిపోతుంది. బొడ్డెమ్మనై.. మళ్లీ వస్తానంటూ శాశ్వతంగా సెలవు తీసుకుంటుంది. అయితే, ఎక్కడైతే ఆ రాజు చిన్న కోడలు మునిగిందో అక్కడ పూలన్నీ నీళ్లలో తేలతాయి. ఊరి కోసం ప్రాణాలు అర్పించిన ఆ ఆడబిడ్డ తాగ్యాన్ని గుర్తు చేసుకుంటూ.. బతుకమ్మ రూపంలో ఆమె కలకాలం తమతోనే ఉంటుందని.. పూలతో ఆమెను పూజించుకుంటామని ఊరి వాళ్లంతా చెప్పినట్టు కథ సాగుతుంది. ఇవేగాక మరెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. -వెబ్డెస్క్ -
‘వేటా’ ఆధ్వర్యంలో అమెరికాలో బతుకమ్మ వేడుకలు!
కాలిఫోర్నియా: విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA ) సంస్థ ఆధ్వర్యంలో అమెరికాలోని పలు నగరాలలో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. తెలంగాణ బతుకమ్మ ప్రాశస్త్యం, విశిష్టత & సంబరాల సంస్కృతిని తెలియచేస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తోంది. మహిళా శక్తి స్వరూపిణిగా చెప్పే ఈ దసరా నవరాత్రి రోజులలో వచ్చే సంబరాల్లో "బతుకమ్మ పండుగ" తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అన్న విషయం తెలిసిందే. ‘ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ ‘వేటా’ స్థాపించినప్పటినుంచి ప్రతి ఏడాది ఈ బ్రతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈసారి సెప్టెంబర్ 25న వాషింగ్టన్ డీసీ, వర్జీనియా ప్రాంతంలో.. అక్టోబర్ 1న శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని సాన్ రమోన్ నగరం.. అక్టోబర్ 2న న్యూ జెర్సీలోను ఈ వేడుకలు జరగనున్నాయి. అయితే ఈ సంవత్సర వేడుకల్లో ప్రముఖ సినీ తార, టీవీ యాంకర్ ఉదయ భాను ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వేటా సంస్థ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల ,అడ్వౌజరీ కౌన్సిల్ కో-చైర్ డాక్టర్ అభితేజ కొండా , ప్రెసిడెంట్ ఎలెక్ట్ శైలజ కల్లూరి, కోర్ కమిటీ కోరారు. -
దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో బతుకమ్మ సంబరాలు
-
జర్మనీలో దసరా, బతుకమ్మ వేడుకలు
సమైక్య తెలుగు వేదిక స్టూట్గర్గ్ జర్మనీ ఆధ్వర్యంలో అక్టోబర్ బతుకమ్మ, దసరా పండగలను ఘనంగా జరుపుకున్నారు. కోవిడ్ నిబంధనల నడుమ ఈ వేడుకలను సంప్రదాయ బద్దంగా నిర్వహించారు. ఏ దేశంలో ఉన్న మన తెలుగు పండగలు, సంప్రదాయాలను మరిచిపోమంటూ ఎన్నారైలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కార్యవర్గ బృందానికి సమైక్య తెలుగు వేదిక సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. -
పోర్ట్ల్యాండ్లో ఘనంగా బతుకమ్మ
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) ఆధ్వర్యంలో అమెరికాలోని ఓరేగావ్ స్టేట్లోని పోర్ట్ల్యాండ్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. కోవిడ్ నిబంధనల కారణంగా వర్చువల్గా ఈ ఉత్సవాలను నిర్వహించారు. కఠిన పరిస్థితుల మధ్య మన సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తున్న ఎన్నారైలను టీడీఎఫ్, పోర్ట్ల్యాండ్ ఛాప్టర్ అధ్యక్షుడు అనుమాండ్ల శ్రీనివాస్ కొనియాడారు. ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించడంలో టీడీఎఫ్ పోర్ట్ల్యాండ్ టీం సభ్యులు సురేశ్ దొంతుల, వీరేశ్ బుక్క, శ్రీపాద్ రాంభట్ల, అజయ్ అన్నమనేని, రాజ్ ఆందోల్, మధుకర్రెడ్డిద పురుమాండ్ల, కొండల్రెడ్డి, జయ్అడ్ల, నిరంజన్, రఘుశ్యామా తదితరులు సహకారం అందించారు. -
కాలిఫోర్నియాలో బతుకమ్మ వేడుకలు
తెలంగాణ పూల పండుగైన బతుకమ్మ వేడుకలు అమెరికాలో కాలిఫోర్నియాలో ఘనంగా నిర్వహించారు. ఒక్కొసి పువ్వేసి చందమామ, ఏమేమీ పువ్వొప్పునే గౌరమ్మ అంటూ తీరొక్క పువ్వులతో పేర్చిన బతుకమ్మలను కొలుస్తూ మహిళలు సంబరంగా ఈ వేడుకలు నిర్వహించారు. ఉమన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు అంచనాలకు మించిన మహిళలు హాజరయ్యారు. అక్టోబరు 10వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కన్నుల పండువగా బతుకమ్మ ఉత్సవాలను ఆడిపాడి నిర్వహించారు. -
బతుకమ్మ శోభ
-
సింగపూర్లో బతుకమ్మ సంబరాలు
తెలుగు సమాజం ఆధ్వర్యంలో సింగపూర్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ ఫ్రెండ్స్, టాస్-మనం తెలుగు, మగువ మనసులు ఈ వేడుకల్లో భాగస్వామ్యం అయ్యారు. ఈ పండుగను సింగపూర్ తెలుగు సమాజం గత 13 సంవత్సరాలుగా దిగ్విజయంగా నిర్వహిస్తోంది. కోవిడ్ నేపథ్యంలో ఈసారి బతుకమ్మ వేడుకలను వర్చువల్గా నిర్వహించారు. ఐనప్పటికీ అధిక సంఖ్యలో తెలుగింటి ఆడపడుచులు సింగపూర్ నలువైపులా నుంచి ఆటపాటలతో , కోలాటాల విన్యాసాలతో బతుకమ్మ సంబరాలలో ఆనందంగా పాల్గొన్నారు. తీరొక్క పూలతో అనేక రంగురంగులతో తీర్చిదిద్దిన బతుకమ్మలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా హాజరైన మిస్ యూనివర్స్ సింగపూర్ 2021 నందిత బన్న మాట్లాడుతూ... కరోనా పరిస్థితుల్లో కూడా సింగపూర్లోని తెలుగు వారు ఇంత పెద్ద ఎత్తున ఈ పండగ జరుపుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని తెలిపారు. మధుప్రియ పాడిన బతుకమ్మ పాటలు మహిళలకు ఉత్సాహానిచ్చాయి. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి గారు మాట్లాడుతూ.. ఘనమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అన్నారు. టాస్ - మనం తెలుగు తరుపున అనితా రెడ్డి గారు మాట్లాడుతూ.. ప్రాంతాలు , మాండలికాలు వేరైనా తెలుగు వారందరూ కలసికట్టుగా బతుకమ్మ జరుపుకుంటున్నట్టు వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా ప్రసారం చేసిన ఈ కార్యక్రమంలో సుమారు 10,000 మందికి పైగా పాల్గొన్నట్టు కార్యక్రమ నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి పుల్లన్నగారి తెలిపారు. చదవండి :లండన్లో కన్నులపండువగా బతుకమ్మ వేడుకలు -
సద్దుల బతుకమ్మ: నువ్వుల ముద్దలు, సత్తుపిండి, కొబ్బరి పొడి, పల్లి పిండి..
సాక్షి, పెద్దపల్లి: బతుకమ్మ మానవ సంబంధాలకే పరిమితం కాకుండా అతివలకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆడపడుచుల్లో ఆరోగ్యకాంతులను వెలిగిస్తుంది. ఆటపాటలతో మానసికోల్లాసమే కాదు, బతుకమ్మ ఆడిన తర్వాత సద్ది పేరుతో ఇచ్చిన్నమ్మ వాయినం.. పుచ్చుకుంటినమ్మ వాయినం.. అంటూ మహిళలు ఫలహారాలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ఫలాహారాలు చేస్తారు. వీటిల్లో అనేక పోషక విలువలున్నాయి... శరీరానికి కావాల్సిన అనేక పోషకాలను ఫలహారాల రూపంలో బతుకమ్మ అందిస్తోంది. బతుకమ్మ సద్దిలో ‘ఐరన్’ స్త్రీలు, పిల్లల్లో ఐరన్ లోపం కనిపిస్తుంది. బతుకమ్మ వేడుకల్లో తయారు చేసుకునే సద్దిలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. సత్తుపిండి, పెసర ముద్దలు, నువ్వులు, కొబ్బరి, పల్లిపొడి లేదా ముద్దలు ఉంటాయి. ఇవన్నీ పండుగ సమయానికి చేతికి వచ్చే చిరుధాన్యాలు కాబట్టి వీటిని తింటే ఆరోగ్యకరమని పెద్దలు చెబుతున్నారు. ఒక్కోరోజు ఒక్కో తరహా పిండి వంటలను తయారు చేస్తుంటారు. చదవండి: నేడు, రేపు సద్దుల బతుకమ్మ వేడుకలు నువ్వుల ముద్దలు నువ్వులు ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. వీటితో పొడి చేస్తారు. నువ్వుల్లో అమైనోయాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ముఖ్యమైనవి. జింక్, కాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. జింక్ మొదడును చురుకుగా ఉండేలా చేస్తుంది. కాల్షియం ఎమకల ధృడత్వాన్ని పెంచుతుంది. సత్తు పిండి బతుకమ్మ వేడుకల్లో తొలిరోజు ఆకువక్కలు, తులసీదళాలు, దానిమ్మగింజలు, శనగపప్పు, పెసరపప్పు, నువ్వులు, మొక్కజొన్న గింజల సత్తు పిండిని తీసుకెళ్తారు. సత్తుపిండిలో పీచు అధికంగా, కార్బొహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. పీచు పదార్థాల వల్ల మలబద్దకం రాదు. రెండోరోజు పప్పు బెల్లం, రేగు పండ్లు, మూడో రోజు పూర్ణాలు, నాల్గోరోజు బెల్లం బియ్యం, ఐదో రోజు అట్లు, ఎనిమిదో రోజు నువ్వులు, బెల్లం కలిపిన వెన్న ముద్దలు, తొ మ్మిదోరోజు బియ్యం పిండి, గోధుమపిండి, బె ల్లంతో మలీద ముద్దలు తయారు చేస్తారు. íఇవి బతుకమ్మకు పెట్టే ప్రత్యేక నైవేద్యాలు పెసర ముద్దలు పెసర్లను ఉడకబెట్టి అందులో బెల్లం కలిపి ముద్దలుగా తయారు చేస్తారు. ఇది జీర్ణశక్తిని పెంచడంతోపాటు జీర్ణ సంబంధిత వ్యాధులనూ తగ్గిస్తుంది. కొబ్బరి పొడి కొబ్బరిలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. మహిళల ఆరోగ్యానికి పొడి చాలా ఉపయోగపడుతుంది. పెరుగన్నం, పులిహోర... పెరుగన్నంలో పల్లీలు, వివిధ రకాల ధాన్యాలను కలుపుతారు. చింతపండు లేదా నిమ్మరసంతో చేసిన పులిహోర ప్రసాదంగా వాడుతున్నారు. చిన్న గాయాల నుంచి క్యాన్సర్ వరకు పసుపు విరుగుడుగా పని చేస్తుంది. చింతపండు గుజ్జులో విటమిన్ ‘సి’ అత్యధికంగా ఉంటుంది. పంచామృతాల్లో పెరుగు ఒకటి దీనిలో పోషక విలువలు మెండు. దీంతో అన్నం కలిపి కమ్మనైన నైవేద్యాన్ని సమరి్పస్తారు. ఇందులో ప్రొటీన్, కాల్షియం, రిబోప్లా విటమిన్, విటమిన్ బీ6, బీ12, వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. కొవ్వు తక్కువగా ఉండే పెరుగులో లాక్లో బాసిల్లై అధికంగా ఉంటుంది. పల్లి పిండి పల్లి పిండి శరీర ఎదుగుదలకు అత్యంత ప్రాధానమైంది. అధిక ప్రోటీన్లతోపాటు రుచికరంగా ఉండడంతో చాలా మంది ఇష్టంగా తింటారు. దీనికి బెల్లం జోడించడంతో కావల్సిన పోషకాలు లభిస్తాయి. వీటిని ముద్దలుగా సైతం చేస్తారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది సత్తుపిండితో రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. రుచిగా ఉండే సత్తుపిండి పిల్లలకు, మహిళలకు చాలా ప్రొటీన్స్ను అందిస్తాయి. ఐరన్, కాల్షియంతో కండరాల పటిష్టత, ఎముకల గట్టితనం, పిల్లల్లో ఎదుగుదల వంటి అనేక రకాల ఉపయోగాలున్నాయి. షాపుల్లోని స్వీట్స్ తినడంకంటే, సాంప్రదాయ పిండివంటలను ప్రతీ ఒక్కరూ తినడం బెటర్. బతుకమ్మ ఆరోగ్యాన్ని పెంచే ప్రత్యేకమైన పండుగ. – రాజశేఖర్రెడ్డి, జనరల్ ఫిజీషియన్, గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి -
పులకించిన పీపుల్స్ ప్లాజా
సాక్షి, హైదరాబాద్: నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా రాగరంజితమైంది. పూల శోభతో పులకించిపోయింది. బతుకమ్మ ఆట పాటలు, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించింది. మంగళవారం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఇక్కడ బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ఎమ్మెల్సీలు కవిత, వాణీదేవి, మంత్రి సత్యవతి రాథోడ్, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ అనిత, ఎమ్మెల్యే దానం నాగేందర్ సతీమణి అనిత, నగర గ్రంథాలయ చైర్పర్సన్ ప్రసన్న, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
ఆటా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
అమెరికా తెలుగు ఆసోసియేషన్ (ఆటా,నాష్విల్లే) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సంప్రదాయబద్దంగా గణపతి, దుర్గమాతలకు పూజలు నిర్వహించి బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌరీమాతను ప్రత్యేకంగా అలంకరించారు. ఎన్నారై మహిళలంతా సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మలు పేర్చారు. అనంతరం ఆటపాటల మధ్య బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు ఆటా నాష్విల్లే మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగాయి. ఆటా అధ్యక్షుడు భువనేష్ బూజాలతో పాటు మధు బొమ్మినేని, ఆలా రామకృష్ణారెడ్డి, నూకల నరేందర్రెడ్డి, గూడూరు కిశోర్, సుశీల్ చందా, రాధికారెడ్డి, లావణ్య నూకల, మంజు లిక్కి, శ్రీలక్ష్మీ, బిందు మాధవి, శిరీష కేస తదితరులు సహయ సహకారం అందించారు. చదవండి : లండన్లో కన్నులపండువగా బతుకమ్మ వేడుకలు -
డల్లాస్లో.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టీప్యాడ్) ఆధ్వర్యంలో బిగ్బ్యారెల్ రాంచ్ ఇన్ ఆర్బేలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో 550 మందికి పైగా పాల్గొన్నారు. వీరిలో ఇండియన్లతో పాటు వివిధ దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు. బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని ఆడపడుచులు అందరూ స్వయంగా బతుకమ్మలు పేర్చారు. వీటితో పాటు టీప్యాడ్ తరఫున 14 అడుగుల బతుకమ్మను ప్రత్యేకంగా తయారు చేయించారు. బతుకమ్మ ఆటపాటల మధ్య సందడిగా ఈ వేడుకలు జరిగాయి. గతంలో టీ ప్యాడ్ ఆధ్వర్యంలో ఏకంగా 10 వేల మందితో బతుకమ్మ పండగ నిర్వహించారు. అయితే కోవిడ్ కారణంగా ఈ సారి వేడుకులను చెరువులు, పచ్చిక బయళ్ల మధ్యన ఉన్న 60 ఎకరాల ఫార్మ్ హౌస్లో పూర్తిగా గ్రామీణ వాతావరణంలో నిర్వహించారు. దుర్గాపూజ, జమ్మిపూజలను ప్రత్యేకంగా నిర్వహించారు. అనంతరం శ్రీరాముల వారి పరివారాన్ని ఎడ్లబండిలో ఉంచి ఊరేగించారు. బతుకమ్మల చుట్టూ చేరి ఆడిపాడారు. చివరకు స్థానికంగా ఉన్న చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేశారు. ఈ వేడుకలు ఘనంగా నిర్వహించడంలో టీప్యాడ్ ఫౌండేషన్ కమిటీ చైర్మన్ రావు కల్వలతో పాటు మాధవి సుంకిరెడ్డి, రవికాంత్ మామిడి, గోలి బుచ్చిరెడ్డి, బండారు రఘువీర్, పీ ఇంద్రాణి, రూపా కన్నయగారి, అనురాధ మేకల తదితరులు కృషి చేశారు. చదవండి : లండన్లో కన్నులపండువగా బతుకమ్మ వేడుకలు -
కేంద్రం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు: కిషన్రెడ్డి
హిమాయత్నగర్: కరోనా తగ్గిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నారాయణగూడ కేశవ మెమోరియల్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ వేడుకలకు కిషన్రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, స్థానిక కార్పొరేటర్ గడ్డం మహాలక్ష్మితో కలసి ఆయన బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేవుడికి అర్పించే పూలతో బతుకమ్మ ఆడటం నిజంగా సంతోషదాయకమని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ ఉత్సవాన్ని ఇకపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా కృషి చేస్తానని వెల్లడించారు. -
బతుకమ్మా... బతుకు ఇవ్వమ్మా...
ఖమ్మం మయూరిసెంటర్: బతుకమ్మ... నేల మీద కురిసే పూల వెన్నెల. పూలంటే ఓ ఆశ. పూల పండుగ బతుకమ్మ అంటే.. బతుకుకు భరోసానిస్తుందనే విశ్వాసం. ఆ నమ్మకంతోనేనేమో ఆ చిన్నారులు ఆడిపాడారు. తలసేమియాతో బాధపడుతున్న తమకు ‘బతుకు ఇవ్వమ్మా.. బతుకమ్మా.. ’అంటూ వేడుకున్నారు. ఖమ్మంలోని రోటరీ క్లబ్ లింబ్ సెంటర్లో సంకల్ప వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వ ర్యంలో తలసేమియా చిన్నారులతో ఆదివారం బతు కమ్మ వేడుకలు నిర్వహించారు. భారీ బతుకమ్మను తయారు చేసి... పిల్లలు ఉత్సాహంగా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. తమకు అవసరమైన రక్తాన్ని నెలనెలా దానం చేస్తూ కాపాడుతున్న దాతలను చల్లగా చూడాలని, తమ ఆయుష్షు పెంచాలని బతుకమ్మను వేడుకున్నారు. ఈ వేడుకల్లో కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య, వైద్యులు డి.నారాయణమూర్తి, సతీష్, సంస్థ బాధ్యులు ప్రొద్దుటూరి పావని, పి.రవిచందర్, అనిత, ఉదయ్భాస్కర్, శివ, రాజేష్రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని, చిన్నారులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. -
తెలంగాణ భవన్లో బతుకమ్మ సంబరాలు
హైదరాబాద్: తెలంగాణ బతుకు పండుగ బతుకమ్మ ఐదవరోజు ఘనంగా జరిగింది. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. టిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి యాదవ్, టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మూల విజయా రెడ్డి, మాజీ రీజినల్ ఆఫీసర్లు సుశీల రెడ్డి, సువర్ణలతోపాటు వందల సంఖ్యలో మహిళలు పాల్గొని ఆడిపాడారు. -
గాంధీభవన్లో బతుకమ్మ సంబురాలు
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్లో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం బతుకమ్మలు పేర్చి మహిళలు ఆటలు ఆడి, పాటలు పాడి సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, తెలంగాణ ఆడపడుచుల పూల పండుగను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా సోదరీమణులు ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ అందరి కుటుంబాల్లో సంతోషం నింపాలని కోరారు. సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి తన సతీమణి, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మలారెడ్డితో కలిసి బతుకమ్మ ఆడి ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, కోఆర్డినేటర్ నీలం పద్మతో పాటు పలువురు మహిళా నేతలు పాల్గొన్నారు. -
మంచి బతుకునిచ్చే.. బతుకమ్మ
నాంపల్లి(హైదరాబాద్)/సాక్షి, హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో శుక్రవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలసి బతుకమ్మను ఆడారు. అం తకు ముందు ఎన్టీఆర్ కళామందిరంలో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడు కిషన్రావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సభలో గవర్నర్ ‘అందరికి నమస్కారం’అంటూ ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు నవరాత్రి, బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. మంచి బతుకును ఇచ్చే దేవత బతుకమ్మ అని అభివర్ణించారు. బతుకమ్మ పాటల్లో పదాలపై పరిశోధన జరగాలని, జాగృతి సంస్థ ఇలాంటి ప్రయో గం చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత వివరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచా ర్య భట్టు రమేష్, విస్తరణల సేవా విభా గం ఇన్చార్జీ రింగు రామ్మూర్తి పాల్గొన్నారు. రాజ్భవన్లోనూ... రాజ్భవన్లోని దర్బార్హాల్లో శుక్రవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బతుకమ్మ ఆడారు. ఇందులో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో పాటు పలు రంగాల్లోని మహిళలు పాల్గొన్నారు. -
బతుకమ్మ వేడుకలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, ఎమ్మెల్సీ కవిత
-
బతుకమ్మల పైనుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు?.. మండిపడ్డ వీహెచ్
సాక్షి, వరంగల్: తెలంగాణలో బతుకమ్మ పండుగ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రంగు రంగు పూలను పేర్చి, ఆట పాటలతో అమ్మను కొలిచే ఈ పండగకు తెలంగాణ యావత్తూ పూలవనంలా మారిపోయింది. అలాంటి బతుకమ్మ పట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అమానుషంగా ప్రవర్తించారని కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. మహిళలంతా బతుకమ్మలతో వచ్చి బతుకమ్మ ఆడుతుండగా వాటిపైనుంచి ఎమ్మెల్యే కారు పోనిచ్చారని మండిపడ్డారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. మాట్లాడుతున్న ఏఐసీసీ మెంబర్ హన్మంతరావు మహిళలు బతుకమ్మ ఆడుతుండగా తన వాహనంతో తొక్కించి మహిళలను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అవమానపరిచిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై చర్య తీసుకోవాలని ఏఐసీసీ మెంబర్, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు డిమాండ్ చేశారు. మండలకేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళలు బతుకమ్మ ఆడుకుంటుండగా బతుకమ్మలపై నుంచి తన వాహనాన్ని తీసుకెళ్లిన ధర్మారెడ్డి.. మహిళలకు క్షమాపణలు చెప్పాలన్నారు. గతంలో ఎస్సీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అగ్రకుల అహంకారాన్ని ప్రదర్శించారని గుర్తుచేశారు. ఆత్మకూరు సర్పంచ్ రాజు బీసీ కావడం వల్లే ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇలా వ్యవహరిస్తున్నాడన్నారు. చదవండి: గర్భం దాల్చిన బాలిక.. అబార్షన్పై టీఎస్ హైకోర్టు కీలక తీర్పు సలేం జరిగింది ఆత్మకూరు పోచమ్మ సెంటర్ వద్ద ఉన్న వేణుగోపాలస్వామి దేవాలయం ఎదుట మహిళలు బతుకమ్మలు పెట్టుకొని ఆడుకుంటున్నారు. అదే సమయంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వస్తున్నారని, రోడ్డుపై నుంచి బతుకమ్మలు తీసివేయాలని మహిళలను ధర్మారెడ్డి అనుచరులు కోరారు. ఎంతో భక్తితో ఆడుకుంటున్న బతుకమ్మలను మధ్యలో తీసివేయలేమని మహిళలు చెప్పారు. దీంతో బతుకమ్మ ఆడుతున్న మహిళలను తోసేసి ఎమ్మెల్యే కారును బతుకమ్మల మీదుగా ముందుకు పోనిచ్చారని స్థానికులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చదవండి: పెద్దమనసు చాటుకున్న కేటీఆర్ -
నేటి నుంచి బతుకమ్మ సంబరాలు మొదలు.. పండుగ నేపథ్యం ఇదే
సాక్షి, కరీంనగర్: అవనిపై పచ్చని పైటేసినట్టు ఆకుపచ్చని మొక్కలన్నీ అందంగా సింగారించుకునే వేళ.. నిండిన చెరువులు, పండిన పంటలతో అలరారే సమయం.. కురిసే చినుకుల తాకిడితో పుడమి తల్లి పచ్చగా మెరిసే క్షణాల్లో తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా భావిస్తున్న పూల పండుగ బతుకమ్మ ప్రారంభమవుతోంది. పూలతో దేవుడిని కొలిచే దేశంలో.. ఆ పూలనే దేవతగా కొలిచే ఏకైక పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు అద్దం పట్టే బతుకమ్మ సంబరాలు ఏటా పెద్ద అమవాస్య నుంచి తొమ్మిది రోజులపాటు జరుగుతాయి. ఆడపడుచులు తీరొక్క పూలతో, రకరకాల పిండి వంటలతో గౌరీదేవిని పూజిస్తారు. ప్రకృతిలో లభించే రకరకాల పూలను బతుకమ్మగా పేర్చి, ఆటపాటలతో పూజించి దగ్గరలోని చెరువుల్లో నిమజ్ఞనం చేస్తారు. బుధవారం ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యే వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. బతుకమ్మ అంటే.. బతుకమ్మ అనే పదానికి తెలంగాణలో విభిన్న పర్యాయ పదాల వాడుకలో ఉన్నాయి. ముఖ్యంగా బతుకమ్మ అంటే పూలతో కూడిన అమరిక అని అర్థం. ఈ కాలంలో లభించే వివిధ రకాల పూలతో బతుకమ్మలను కొన్ని వరుసలు పేరుస్తారు. మ«ధ్యలో పసుపుతో చేసిన స్థూపాకారావు పదార్థాన్ని లేదా గుమ్మడి పూవులో నుంచి తీసిన మధ్య భా గాన్ని ఉంచుతారు. దీన్ని బొడ్డెమ్మ అని పిలుస్తారు. కొందరు బొడ్డెమ్మను దుర్గగా కొలుస్తారు. బతుకు అంటే తెలుగులో జీవించే లేదా జీవితం అని అర్థం. అమ్మ అంటే తల్లి అని అర్థం. దాన్నే బతుకమ్మ అని అంటారు. పండుగ నేపథ్యం ఇదీ.. 19వ శతాబ్దం పూర్వార్థం నిత్యం దారిద్య్రం, భయంకర అంటువ్యాధులు, ప్రకృతి బీభత్సాలతో తెలంగాణలోని గ్రామాల్లో అనేక మంది ప్రజలు చనిపోయేవారు. ఈ క్రమంలో ప్రజలు తమ కష్టాల నుంచి గట్టెక్కేందుకు, తమకు పుట్టిన పిల్లలు అనారోగ్యం బారిన పడి చనిపోకుండా బతకటానికి బతుకమ్మ(బతుకు+అమ్మ) పండుగను సృష్టించుకున్నారు. మరో కథనం ప్రకారం.. ఒక కాపు కుటుంబంలో ఏడో సంతానంగా పుట్టిన అమ్మాయే బతుకమ్మ. అంతకుముందు పుట్టి చనిపోయిన వారిలో కలవకూడదనే భావనతో ‘బతుకమ్మ’ అని పిలుచుకుంటూ పెంచుతారు. బతుకమ్మ ఎదిగాక పెళ్లి చేస్తారు. ఓ పండుగ రోజు బతుకమ్మ పుట్టింటికి వస్తుంది. అన్న భార్యతో కలిసి చెరువుకు స్నానానికి వెళ్తుంది. అక్కడ ఒడ్డున పెట్టిన ఇద్దరి చీరలు కలిసిపోయి వదిన చీరను బతుకమ్మ కట్టుకుంటుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి, వదిన బతుకమ్మ గొంతు నులిమి, చంపేసి చెరువు గట్టున పాతిపెడుతుంది. తర్వాత ఆమె తంగేడు చెట్టుగా మొలుస్తుంది. బతుకమ్మ తన భర్తకు కలలో కనిపించి, జరిగిన విషయం చెప్పి, తనను తీసుకుపొమ్మంటుంది. అలా పండుగ ప్రారంభమైందని చెబుతారు. ఎంగిలిపూల బతుకమ్మ.. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. పండుగకు ముందు ఆయా పుష్పాలన్నీ వివిధ కీటకాల పరాగ సంపర్కం కారణంగా ఎంగిలి పడ్డాయని తలచి ఎంగిలిపూలుగా పరిగణిస్తారు. పితృ అమావాస్య రోజు స్వర్గస్తులైన పెద్దలకు బియ్యం ఇచ్చుకొని, వారిని దేవతలుగా ఆరాధిస్తారు కాబట్టి ఈ నేపథ్యంలో తెచ్చిన పూలన్నీ ఎంగిలి పడ్డట్టుగా భావిస్తారు. అటుకుల బతుకమ్మ.. రెండోరోజు అటుకల బతుకమ్మగా పిలుస్తారు. రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి ఆడపడుచులందరూ ఆట పాటలతో సందడి చేస్తారు. బెల్లం, అటుకులు, పప్పుతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. ముద్దపప్పు బతుకమ్మ.. మూడోరోజు ముద్ద పప్పు బతుకమ్మగా జరపుకుంటారు. బెల్లం, ముద్దపప్పు, పాలతో నైవేద్యం తయారు చేస్తారు. నానబియ్యం బతుకమ్మ.. నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మను జరుపుకుంటారు. తంగేడు, గునుగు పూలతో బతుకమ్మను నాలుగు వరుసలుగా పేరుస్తారు. గౌరమ్మను పెట్టి, ఆడిపాడి, దగ్గరలోని చెరువులో నిమజ్ఞనం చేస్తారు. ఈ సందర్భంగా నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లంతో కలిపి ముద్దలుగా తయారుచేసి, నైవేద్యంగా సమర్పిస్తారు. అట్ల బతుకమ్మ.. ఐదోరోజు అట్ల బతుకమ్మ జరుపుకుంటారు. తంగేడు, మందారం, చామంతి, గునుగు, గుమ్మడి పూలతో ఐదు వరుసలు పేర్చి, బతుకమ్మను త యారు చేస్తారు. బియ్యం పిండితో తయారు చేసిన అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు. అలిగిన బతుకమ్మ.. ఆరోరోజు అలిగిన బతుకమ్మ. బతుకమ్మను పూ లతో అలకరించరు. నైవేద్యం సమర్పించరు. బ తుకమ్మను పేర్చి ఆడకుండా నిమజ్జనం చేస్తారు. వేపకాయల బతుకమ్మ.. ఏడోరోజు వేపకాయల బతుకమ్మ జరుపుకుంటారు. ఈరోజు తంగేడు, చామంతి, గులాబీ, గునుగు పూలతో బతుకమ్మను ఏడు వరుసల్లో పేరుస్తారు. బియ్యం పిండిని వేప పండ్లుగా తయారు చేసి, నైవేద్యం సమర్పిస్తారు. వెన్నెముద్దల బతుకమ్మ.. ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మ. తంగేడు, చామంతి, గునుగు, గులాబీ, గడ్డిపూలతో కలిపి ఎనిమిది వరుసల్లో బతుకమ్మను పేరుస్తారు. అమ్మవారికి ఇష్టమైన నువ్వులు, వెన్న, బెల్లంతో నైవేద్యం సమర్పిస్తారు. సద్దుల బతుకమ్మ.. బతుకమ్మ నవరాత్రి ఉత్సవాల్లో సద్దుల బతుకమ్మ చివరిది. ఈరోజు అన్ని రకాల పూలతో భారీ బతుకమ్మలను పేరుస్తారు. మహిళలు నూతన వస్త్రాలు ధరించి, ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను పెట్టి, ఆటపాటలతో గౌరమ్మను పూజిస్తారు. పెరుగు అన్నం, నువ్వుల అన్నం వంటి ఐదు రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం కుటుంబ సమేతంగా ప్రసాదాన్ని అరగిస్తారు. పూలు ప్రియం.. బతుకమ్మ పూలకే పూజలు చేసే వేడుక కాబట్టి పండుగ జరిగే తొమ్మిది రోజులూ పూలకు భలే గిరాకీ ఉంటుంది. తంగేడు, గునుగు, బంతి, చామంతి, కట్ల, రుద్రాక్ష, పోకబంతులు, చిట్టి చామంతులు తదితర పూల ధర ఎక్కువగా ఉంది. ఈ సీజన్లో రెండుసార్లు అధికంగా వర్షాలు కురిసి పంట చేలన్నీ నీటితో నిండిపోయాయి. సెప్టెంబర్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా పూల దిగుబడి గణనీయంగా పడిపోవడంతో రేట్లు అందనంత ఎత్తులో ఉంటున్నాయి. -
పోర్ట్లాండ్లో ఘనంగా బతుకమ్మ, దసరా వేడుకలు
అమెరికాలోని ఒరెగాన్ స్టేట్ పోర్ట్లాండ్ సిటీలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్) పోర్ట్లాండ్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్చ్యువల్ బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది కోవిడ్-19 నేపథ్యంలో బతుకమ్మ వేడుకలకు దూరం కాకూడదని టీడీఎఫ్ బృందం వినూత్నంగా జూమ్ మీటింగ్ ద్వారా కమ్యూనిటీని కనెక్ట్ చేసి వేడుకల్ని నిర్వహించింది. పోర్ట్లాండ్ చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీని అనుమాండ్ల తన నివాసం నుంచి జ్యోతి ప్రజ్వలనతో ఈ వేడుకల్ని ప్రారంభించారు. అక్టోబర్ 24న శనివారం జరిగిన ఈ వేడుకలకి పోర్ట్లాండ్ మెట్రో సిటీస్ నుంచి 70 కుటుంబాలు (దాదాపు 250మంది), జూమ్ యాప్ ద్వారా పాల్గొని వేడుకల్ని విజయవంతం చేశారు. ఈ వేడుకల్లో చిన్నారులు, మహిళలు తెలుగుతనం ఉట్టిపడేలా సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై రంగురంగుల బతుకమ్మలు పేర్చి ఆట పాటలతో హోరెత్తించారు. బతుకమ్మ నిమజ్జనం ఎవరి ఇళ్లల్లో వారు చేసుకుని గౌరమ్మ ప్రసాదం ఇచ్చి పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పోర్ట్లాండ్ చాప్టర్ ప్రెసిడెంట్ ఈ వేడుకల్లో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా పోర్ట్లాండ్ చాప్టర్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి వివరించారు. బతుకమ్మ పండుగని వైభవంగా జరగడానికి సాయం చేసి మహిళలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. బతుకమ్మ విజేతలకు బహుమతులు అందచేశారు. ఈ వేడుకల్ని మొదటిసారి ప్రత్యేక పరిస్థితుల్లో జూమ్ ద్వారా వైభవంగా నిర్వహించి విజయవంతం కావడానికి కృషి చేసిన టీమ్ సభ్యులు వీరేష్ బుక్క, నిరంజన్ కూర, సురేష్ దొంతుల, కొండల్ రెడ్డి పూర్మ, ప్రవీణ్ అన్నవజ్జల, నరేందర్ చీటి, మధుకర్ రెడ్డి పురుమాండ్ల, రాజ్ అందోల్, అజయ్ అన్నమనేని, రఘు శ్యామతో పాటు ఇతర సభ్యులకు అభినందనలు తెలిపారు. వేడుకలను స్పాన్సర్ చేసినవారికి శ్రీని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
పాఠకులు పంపిన బతుకమ్మ సెల్ఫీ ఫొటోలు
-
సెల్ఫీ విత్ బతుకమ్మ..
సహజ సౌందర్యానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీకయైన పండుగ బతుకమ్మ. తంగేడు, గునుగు, కట్ల, గుమ్మడి, రుద్రాక్ష వంటి తీరొక్కపూలను ఒక్కచోట చేర్చి గౌరమ్మను కొలిచే వేడుక. ఏడాదికి ఒకసారైనా ఊరు ఊరంతా ఒక్కచోట చేరి సంబరంగా జరుపుకునే ఉత్సవం. తెలంగాణ విలక్షణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన ఈ పూల జాతరలో సందడంతా ఆడపడుచులదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది కేవలం పూల పండుగే కాదు, ఆడపిల్లల ఆటవిడుపు పండుగ కూడా. ఏడాదంతా అత్తవారింట్లో గడిపిన, ఆడపడుచులను తప్పనిసరిగా పుట్టింటికి తీసుకువచ్చే ఈ పండుగ నాడు ఆటపాటలు, కోలాటాలతో గౌరీదేవిని కొలిచే మన ఇంటి మహాలక్ష్ములను చూసేందుకు రెండుకళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. చిన్నా, పెద్దా ప్రతిఒక్కరికి సంతోషాన్ని పంచే బతుకమ్మ వేడుకలు, శరన్నవరాత్రులు ప్రారంభమైన నేపథ్యంలో.. మీ పండుగ ఫొటోలు, మధుర జ్ఞాపకాలను ప్రపంచంతో పంచుకునే అవకాశాన్ని ‘సాక్షి’మీకు కల్పిస్తోంది. సెల్ఫీ విత్ సాక్షి పేరిట sakshi.com నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలంటే 9010533389 వాట్సాప్ నంబర్కు బతుకమ్మతో ఉన్న మీ సెల్ఫీలు పంపండి. పండుగ సంబరాన్ని మాతో షేర్ చేసుకోండి. మీరు పేరు, ఏరియా పేరు రాయడం మర్చిపోకండి. -
కూకట్పల్లిలో బతుకమ్మ వేడుకలు
-
ప్రారంభమైన ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు
సాక్షి, రాజన్నసిరిసిల్ల జిల్లా : వేములవాడలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది అధికమాసం రావడంతో ఈ రోజు ఎంగిలి పూల బతుకమ్మ నిర్వహించి వచ్చే నెల 17 నుండి మళ్లీ యాథవిధిగా బతుకమ్మ వేడుకలు జరుపుకోనున్నారు. రాష్ట్రంలో జరిగే వేడుకలకు భిన్నంగా వేములవాడలో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ నిర్వహించనున్నారు. దీంతో స్థానిక మహిళలు అటు పుట్టినింట్లో ఇటు మెట్టినింట్లో రెండు చోట్ల వేడుకలు జరుపుకునే అవకాశం ఉంది. రాష్ట్రమంతా అక్టోబర్ 22 తేదిన సద్దుల బతుకమ్మ వేడుకలు జరపనున్నారు. (17న ఎంగిలిపూల బతుకమ్మ ) (‘తెలంగాణ నుంచి స్పందన లేదు..’) -
శాక్రమెంటోలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
నటోమాస్ గ్రూప్ ఆధ్వర్యంలో తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించేలా బతుకమ్మ పండుగను శాక్రమెంటోలో ఘనంగా నిర్వహించారు. తెలుగుతనం ఉట్టిపడే విధంగా సంప్రదాయ దుస్తులలో దాదాపు 1000 మంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వేదపండితులు గౌరమ్మకు పూజలు నిర్వహించారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ రాగయుక్తంగా మహిళలు ఆడుతూ, పాడుతూ చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమం సొంతఊరిలోని పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ జానపద గాయకుడు డాక్టర్ శ్రీనివాస్ లింగా తనదైన బాణీలతో శ్రోతలను అలరించారు. స్థానికంగా ఉన్న చిన్నారుల నృత్యవిన్యాసాలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించాయి. ఈ బతుకమ్మ వేడుకలకు ప్రధాన కర్త అయిన వెంకట్ మేచినేని మాట్లాడుతూ.. తమ తోటి స్నేహితులు, ఆప్తుల అండదండలతో ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. ఈ కార్యక్రం ద్వారా ఎంతో ఆనందాన్ని, అనుభూతులను, మధురస్మృతులను పొందామని, అందరు సుఖ సంతోషాలతో జీవించాలని అందుకు దేవతల అనుగ్రహము ఉంటుందని నమ్ముతూ, ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిగేందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
శోభాయమానంగా డాలస్ బతుకమ్మ వేడుకలు
డలాస్ : తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీపాడ్) ఆధ్వర్యంలో అమెరికాలోని డాలస్లో బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలెన్ ఈవెంట్ సెంటర్, ఆలెన్, టెక్సాస్లో నిర్వహించిన ఈ సంబరాల్లో మహిళలు, యువతులు బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. జానకి రామ్ మందాడి ఫౌండేషన్ కమిటీ చైర్, పవన్ గంగాధర బోర్ట్ ఆప్ ట్రస్టీ చైర్ చంద్రారెడ్డి, పోలీస్ ప్రెసిడెంట్ సుధాకర్ కలసాని, ఎగ్జిక్యూటీవ్ కమిటీ కోఆర్డినేటర్ మాధవి సుంకిరెడ్డి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ వైస్ చైర్మన్ రవికాంత్ మామిడి, వైఎస్ ప్రెసిడెంట్ మాధవి లోకిరెడ్డి, జనరల్ సెక్రటరీ అనురాధ మేకల ఆధ్వర్యంలో ఇప్పటి వరకు కనీ, వినీ ఎరుగని రీతిలో ఈ వేడుకలు జరిగాయి. పొటెత్తిన జనసందోహాన్ని కట్టడి చేయలేక ఆలెన్ ఈవెంట్ సెక్యూరిటీ యాజమాన్యం సైతం కొంతమందిని వెలుపలే నిలిపివేసింది. ఈ సంబరాల్లో ప్రముఖ మాటల రచయిత కోనా వెంకట్, సినీ నటి మెహ్రీన్ ముఖ్య అతిథులుగా హాజరై బతుకమ్మ ఆడి, జమ్మి పూజలో పాల్గొన్నారు. శనివారం సాయంత్రం (అక్టోబర్ 5) డాలస్ మహిళలు అందరూ అందంగా ముస్తాబాయ బతుకమ్మలు పేర్చుకొని వచ్చారు. కోలాటాలతో, దీపాలతో చప్పట్లతో బతుకమ్మ చుట్టూ ఆడిపాడి, గౌరీదేవికి నైవేద్యాలు సమర్పించారు. టీపాడ్ సంస్థ ప్రత్యేంగా సత్తుపిండి నైవేద్యాలు చేయించి ప్రజలందరికీ పంచిపెట్టింది. అనంతరం ఆడవాళ్లందరికి సంప్రదాయబద్దంగా గాజులు, పసుపు బోట్టు, ఇతర కానుకలు భారీ మొత్తంలో అందజేశారు. బతుకమ్మ కార్యక్రమం తర్వాత దసరా, జమ్మి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పల్లకి ఊరేగింపులు, నృత్యాలు, పరస్పరం జమ్మి ఆలింగానాల మధ్య ఎంతో వైభవంగా దసరా వేడుకలు జరిగాయి. టీపాడ్ సంస్థ 2019వ సవంత్సరానికి గాను చేసిన బతుకమ్మ స్వాగత పాట, కార్యవర్గ సభ్యులందరితో చేసిన వీడియోను అందరి సమక్షంలో విడుదల చేశారు. ప్రముఖ గాయని గాయకులు ప్రవీణ్ కొప్పోలు, అంజనా సౌమ్య, శిల్పారావు, వ్యాఖ్యాత రవళి సాయంత్రం సంగీత విభవారిలో పాల్గొని ఆటపాటలతో అందరిని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో టీపాడ్ సంస్థ ప్రెసిడెంట్ చంద్రారెడ్డి, రావ్ కల్వల, రామ్ అన్నాడి, అశోక్ కొండల, శ్రీనివాస్ గంగాధర, లక్ష్మీ పోరెడ్డి, శంకర్ పరిమళ, శ్రీనివాస్ వేముల, రత్న ఉప్పాల, రూప కన్నయ్యగిరి, మధుమతి వైస్యరాజు, దీప్తి సూర్యదేవర, శరత్ ఎర్రం, రోజా ఆడెపు, లింగారెడ్డి, వంశీకృష్ణ, స్వప్న తుమ్మపాల, గాయత్రిగిరి, శ్రీనివాస్ తుల, విజయ్ రెడ్డి, అపర్ణ కొల్లూరి, అనూష వనం, శశిరెడ్డి కర్రి, మంజుల తొడుపునూరి, మాధవి ఓంకార్, రవీంద్ర ధూళిపాళ, శరత్ పునిరెడ్డి, శ్రీధర్ కంచర్ల, శ్రీనివాస్ అన్నమనేని, శ్రవణ్ నిడిగంటి, నితిన్ చంద్ర, మాధవి మెంట, వందన గోరు, శ్రీకాంత్ రౌతు, తిలక్ వన్నంపుల, రఘు ఉత్కూర్, అభిషేక్రెడ్డి, కిరణ్ తళ్లూరి, దీపిక, ఇంద్రాణి పంచార్పుల, బుచ్చిరెడ్డి గోలి, శారద సింగిరెడ్డి, వేణు భాగ్యనగర్, విక్రమ్ జంగం, అరవింద్ రెడ్డి ముప్పిడి, నరేష్ సుంకిరెడ్డి, కరణ్పోరెడ్డి, జయ తెలకలపల్లి, గంగదేవర, సతీష్ నాగిళ్ల, కల్యాణి తాడిమెట్టి. రఘువీర్ బంగారు, అజయ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శోభాయమానంగా డాలస్ బతుకమ్మ వేడుకలు
-
అట్లాంటాలో వెల్లువెత్తిన బతుకమ్మ సంబరాలు
అట్లాంటా: ప్రకృతిని పూజించే సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అట్లాంటాలో ఘనంగా జరుపుకున్నారు. ఆటపాటలతో ఈ కార్యక్రమం హోరెత్తిపోయింది. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్(టీడీఎఫ్) ఆధ్వర్యంలో అక్టోబర్ 5న సౌత్ ఫోర్సిత్ మిడిల్ స్కూల్లో బతుకమ్మ వేడుకలు జరిగాయి. అట్లాంటాలో వందల సంఖ్యలో నివసిస్తోన్న తెలంగాణ మహిళలు వేడుకకు తరలి వచ్చారు. వారంతా కలిసి గౌరీదేవీని తీర్చిదిద్దిన బతుకమ్మలతో హాజరయ్యారు. అందంగా పేర్చి తీసుకువచ్చిన బతుకమ్మలను మధ్యలో ఉంచి దాని చుట్టూ వృత్తాకారంలో తిరుగుతూ చప్పట్లు కొడుతూ ఆడిపాడారు. ఈ వేడుకలో పసి పిల్లల నుంచి పండు ముసలి దాకా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ, దసరా సంబరాలకు 2,500మంది పైచిలుకు హాజరయ్యారు ఇక దసరా పండగను జమ్మి పూజతో ప్రారంభించారు. కోలాటాల కోలాహలంతో వేడుక కన్నులవిందుగా సాగింది. అందంగా తయారు చేసిన బతుకమ్మలకు టీడీఎఫ్ జ్యూరీ బహుమతులను అందజేసింది. టీడీఎఫ్ బృందం ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ బతుకమ్మ ప్రాముఖ్యతను చాటిచెప్పడమే కాక, తెలంగాణ ఉద్యమంలో టీడీఎఫ్ పాత్రను గుర్తు చేయడమే ఈ వేడుక ముఖ్య ఉద్దేశమని తెలిపింది. నానమ్మ-మనుమరాలు థీమ్తో ఈ యేడాది తీసుకువచ్చిన ఆన్సైట్ బతుకమ్మకు విశేష స్పందన వచ్చిందని సంతోషం వ్యక్తం చేసింది. కనుమరుగైపోతున్న సాంప్రదాయాన్ని భావి తరాలకు తెలియజేయడమే లక్ష్యంగా ఈ వేడుకలను నిర్వహించామని పేర్కొంది. టీడీఎఫ్ సంస్థ తెలంగాణలో చేపడుతోన్న అభివృద్ధి, సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఈ కార్యక్రమానికి టైటిల్ స్పాన్సర్ చేసిన ఈఐఎస్ టెక్నాలజీస్కు టీడీఎఫ్ బృందం కృతజ్ఞతలు తెలిపింది. వేడుకలు విజయవంతమవడానికి సహాయ సహాకారాలు అందించిన రాపిడ్ ఐటీ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ, పీచ్ క్లినిక్, ఫార్మర్స్ ఇన్సూరెన్స్, డ్రవ్ ఇన్ఫో, ఆర్పైన్ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ, శేఖర్ పుట్ట రియల్టర్, సువిధ గ్రోసరీస్, పటేల్ బ్రదర్స్, ఏజెంట్ రమేశ్, ఓర్దశన్ టెక్నాలజీస్కు ధన్యవాదాలు తెలిపింది . ఈ ప్రోగ్రాంకు రఘు వలసాని ఫొటోగ్రఫీ, డీజే దుర్గం సౌండ్ సిస్టమ్ను అందించారు. సువిధ ఇండో పాక్ గ్రోసరీస్, బిర్యానీ పాట్, అడ్డా ఈటరీ వారు విందును ఏర్పాటు చేశారు. స్వప్న కట్ట, స్థానిక కళాకారులైన శ్రీనివాస్ దుర్గమ్లు వారి గాత్రంతో ప్రేక్షకులను అలరించారు. -
లండన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
లండన్లో తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. 3000 మందికి పైగా ప్రవాసులు ఈ బతుకమ్మ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రాంచందర్ రావు హాజరయ్యారు. మొదటగా దుర్గా అమ్మవారి పూజతో ఈ వేడుకలు ప్రారంభించారు. ఇండియా నుండి ప్రత్యేకంగా తెచ్చిన జమ్మి చెట్టుకు పూజ నిర్వహించి అనంతరం బతుకమ్మ ఆట, కట్టే కోలాటం ఆడారు. సంప్రదాయక బతుకమ్మ ఆటనే ప్రోత్సహించి నూతన పోకడలకు, డీజేల జోలికి వెళ్లకుండా బతుకమ్మను నిర్వహించారు. ఎమ్మెల్సీ రాంచందర్ రావు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు నిలవాలని భావిపౌరులకు సాంప్రదాయాలు, మాతృదేశం మూలాలు తెలిపే కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎన్నారై సంఘాలకు అభినందనలు తెలిపారు. ప్రకృతిని పూజించే పండుగ చేసుకోవడం తెలంగాణ సంస్కృతికి చిహ్నం అని అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన భారత రాయబారి కార్యాలయం ఉన్నతాధికారి మనమీత్ నరాంగ్ మాట్లాడుతూ దక్షిణ భారత అతిపెద్ద సంస్కృతిక కార్యక్రమాన్ని చూస్తున్నానన్నారు. ఇండియా డే సంబరాల్లో తెలంగాణ సంఘం సేవలని కొనియాడారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన లండన్ ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయాలు కాపాడాల్సిన బాధ్యత ఎన్నారైల పైన ఉందని, 7 ఏళ్లుగా బతుకమ్మ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసినందుకు తెలంగాణకు ధన్యవాదాలు తెలిపారు. అధ్యక్షుడు ప్రమోద్ గౌడ్ అంతటి మాట్లాడుతూ యూరోప్లోనే అతి పెద్ద బతుకమ్మ నిర్వహణ బాధ్యతకు సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలుపుతూ 2010లో నిర్వహణ ఎలా చేయాలో ఎక్కడ చేయాలో ఆర్థిక వనరులు ఎలా సమకూర్చాలో తెలియని సమయంలో యూరోప్ లోనే మొట్ట మొదటి బతుకమ్మకు పునాదులు వేసి నిర్వహించిన తెలంగాణ ఎన్నారై ఫోరమ్ వ్యవస్థాపకుడు గంప వేణుగోపాల్ చేసిన కృషిని కొనియాడారు. 2012లో బ్రిటన్ లో వివిధ ప్రాంతాల్లో ఊరూరా బతుకమ్మ నిర్వహించి బతుకమ్మ భావజాలాన్ని చాటుతూ ప్రతి తెలంగాణ బిడ్డ బతుకమ్మ ఆటలో పాల్గొనే స్థాయికి చేరుకుందని అన్నారు. ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ 2017 నుండి ప్రతి సంవత్సరం అతిపెద్ద బతుకమ్మ నిర్వహించి 2018లో అదేవిధంగా మళ్లీ ఈ ఏడాది చరిత్ర తిరగరాసి అతిపెద్ద బతుకమ్మ నిర్వహించి చరిత్ర సృష్టించిన ఘనత తెలంగాణ ఎన్నారై ఫోరమ్ సభ్యులదేనని అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో వ్యవస్థాపక చైర్మన్ గంప వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి రంగు వెంకట్, కార్యదర్శి పిట్ల భాస్కర్, అడ్వైజరీ సభ్యులు డా. శ్రీనివాస్, మహేష్ జమ్ముల, వెంకట్ స్వామి, బాలకృష్ణ రెడ్డి, మహేష్ చాట్ల, శేషు అల్లా, వర్మా, స్వామి ఆశా, అశోక్ మేడిశెట్టి, సాయి మార్గ్, వాసిరెడ్డి సతీష్ రాజు కొయ్యడ, నర్సింహారెడ్డి నల్లలు తమ వంతు కృషి చేశారు. మహిళా విభాగం మీనా అంతటి, వాణి అనసూరి, శౌరి గౌడ్, సాయి లక్ష్మి, మంజుల, జయశ్రీ , శ్రీవాణి మార్గ్, సవిత జమ్మల, దివ్యా, అమృత, శిరీషా ఆశ, ప్రియాంక, రోహిణిలు బతుకమ్మ నిర్వహణలో కీలకంగా పని చేసి విజయవంతం చేశారు. -
ఘనంగా "టాక్ - చేనేత బతుకమ్మ - దసరా" సంబరాలు
లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్లో చేనేత బతుకమ్మ - దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి 1200 మందికిపైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా భారత హై కమిషన్ ప్రతినిధి రాహుల్, స్థానిక హౌన్సలౌ మేయర్ టోనీ లౌకిలు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, అదే స్పూర్తితో రాష్ట్ర మంత్రి కేటీఆర్ కృషికి మా వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ఈ సంవత్సరం కూడా వేడుకలను "చేనేత బతుకమ్మ మరియు దసరా "గా జరుపుకున్నామని సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం తెలిపారు. తమ పిలుపు మేరకు హాజరైన ప్రవాసులు చేనేత బట్టలు ధరించి పాల్గొనడం ఎంతో సంతోషాన్ని..స్ఫూర్తినిచ్చిందని టాక్ ఈవెంట్స్ ఇంచార్జ్ రత్నాకర్ కడుదుల అన్నారు. కల్చరల్ ఇంఛార్జ్ సత్య చిలుముల మాట్లాడుతూ.. దసరా పండుగ సందర్బంగా స్వదేశం నుండి తెచ్చిన శమీ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన దసరా " అలాయ్ - బలాయ్ " కార్యక్రమంలో, చేనేత శాలువాలను ఒకరికొరకు పరస్పరం వేసుకొని, జమ్మి ( బంగారం)ని ఇచ్చి పుచ్చుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చేనేతకు చేయూతగా వీలైనన్ని సందర్భాల్లో చేనేత బట్టలు దరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. జమ్మి ఆకులు పంచుకుంటూ లండన్ పట్టణానికి ‘అలాయ్ బలాయ్’ల తెలంగాణ స్నేహమాధుర్యాన్ని ప్రత్యక్షంగా రుచి చూపించారని పలువురు ప్రశంశించారు. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ, దసరాపండగ సందర్బంగా మహిళలందరు భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ బద్దంగా గౌరీ దేవికి పూజలు జరిపి బతుకమ్మ ఆట పాటలతో, కోలాటాల నృత్యాలతో, చప్పట్లు కలుపుతూ, రంగు రంగుల బతుకమ్మలతో సందడి చేశారు. బతుకమ్మల మధ్య కాకతీయ కళాతోరణం వేడుకలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఆతిథులందరి ప్రశంసలందుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రత్యేకతను చాటి చెప్పేలా వినూత్నంగా ఇలా ఎదో ఒక ప్రతిమను ఏర్పాటు చేస్తున్నామని, పోయిన సంవత్సరం చార్మినార్ని ఏర్పాటు చేశామని కార్యదర్శి మల్లా రెడ్డి తెలిపారు. విదేశాల్లో స్థిరపడ్డా కానీ, తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడటం అందరిని ఆకట్టుకుంది. చిన్నారులు సైతం ఆటల్లో పాల్గొనడం కాకుండా, చిన్న చిన్న బతుకమ్మలతో సంబరాలకు కొత్త అందాన్ని తెచ్చారు. రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ జోగినపల్లి చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో ప్రజలంతా పాల్గొనాలని, ప్రవాసులంతా ఎంపీ సంతోష్ చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రశంసించడమే కాకుండా తమ వంతు బాధ్యతగా ముందుకు తీసుకెళ్లి ప్రజల్లో అవగాహన కలిపిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ భారీ పోస్టర్ని ఆవిష్కరించారు. హాజరైన ముఖ్య అతిధులు మరియు ప్రవాసులంతా " ఐ ప్లెడ్జ్ టు సపోర్ట్.. గ్రీన్ ఇండియా చాలెంజ్’’ అనే సెల్ఫీ స్టాండ్ వద్ద ఫోటోలు దిగి తమ మద్దతును తెలియజేసారు. ఈ కార్యక్రమంలో భారత హై కమీషన్ ప్రతినిధి రాహుల్తో పాటు ప్రవాస సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. చేనేత పేరుతో బతుకమ్మ వేడుకల్ని నిర్వహించడం వినూత్నంగా ఉందని, వీరి ప్రయత్నం ఫలించి నేత కుటుంబాలకు మేలు జరగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక హౌన్సలౌ మేయర్ టోనీ లౌకి మాట్లాడుతూ.. సంప్రదాయ తెలంగాణా వంటకాలతో పండగ భోజనం సొంత ఇంటిని తలిపించిందని హాజరైన వారు అభిప్రాయపడ్డారు. టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. గత సంవత్సరాలుగా చేనేతకు చేయూతగా మా వేడుకలని చేనేత బతుకమ్మ సంబరాలుగా చేయడం ద్వారా ఎన్నో నేతన్న కుటుంబాలకు మేలు జరిగిందని తెలిపారు. ఉద్యమ బిడ్డలుగా ప్రతి కార్యక్రమానికి సామాజిక బాధ్యతను జోడించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అన్నింటిని ప్రోత్సహించి విజయవంతం చేస్తున్న ప్రవాసులందరికి కృతఙ్ఞతలు తెలిపారు. వీలైనంత వరకు ప్రవాసులల్లో చేనేతపై అవగాహన కలిపించి, వీలైనన్ని సందర్భాల్లో చేనేతవస్త్రాలు ధరించి నేత కుటుంబాలకు అండగా నిలవాలని కోరుతున్నట్టు తెలిపారు. రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ జోగినపల్లి గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది మాట్లాడుతూ ఈ వేడుకలలో భాగంగా గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నట్టు పండుగకి వచ్చే ప్రతీ ఒక్కరినీ చేనేతవస్త్రాలు ధరించాలని కోరామని అలాగే చాలామంది ఈ రోజు చేనేత వస్త్రాలు ధరించడం సంతోషంగా వుందని అన్నారు. టాక్ సంస్థ ఆవిర్భావం నుండి నేటి వరకు అన్ని సందర్భాల్లో వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న మాజీ ఎంపీ కవిత గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎంపీ కవిత గారితో కేవలం పోస్టర్ ఆవిష్కరణ మాత్రమే కాకుండా, వారి ఆలోచలనకు ఆశయాలకు అనుగుణంగా మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి అన్నిరకాలుగా కృషి చేస్తామని, ఎప్పటికప్పుడు వారి సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని తెలిపారుఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసారి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాతే మన పండగలకు, మన సంస్కృతికి సరైన గౌరవం గుర్తింపు లభించిందని, ఉద్యమ నాయకుడే నేడు మనకు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే నేడు అధికారికంగా రాష్ట్ర పండుగగా బతుకమ్మను నిర్వహించుకోగల్గుతున్నామని, కాబట్టి కెసిఆర్ గారి పేరు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని అన్నారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చేనేతకు చేయూతగా చేస్తున్న వేడుకల్లో ఎంతో సామాజిక బాధ్యత ఉందని తెలిపారు. టాక్ ఈవెంట్స్ ఇంచార్జ్ సత్య చిలుముల మాట్లాడుతూ.. నేటి వేడుకల్లో స్థానిక బ్రిటిష్ వారు సైతం పాల్గొనడమే కాకుండా, మమ్మల్ని అడిగి తెలుసుకొని బతుకమ్మను తయారు చేసి తెచ్చి, బతుకమ్మ ఆటలో పాల్గొనడం మాకెంతో స్ఫూర్తినిచ్చింది తెలిపారు. టాక్ కార్యదర్శి నవీన్ రెడ్డి మాట్లాడుతూ మా వేడుకలకు హాజరైన ప్రవాస సంస్థల ప్రతినిధులకు, సహకిరించిన మీడియా సంస్థలకు మరియు స్థానిక ప్రభుత్వ అధికారులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఇక్కడికి వచ్చిన ప్రవాసులు, టాక్ సంస్థ ప్రతినిధులను ఉద్దేశించి ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణా సంస్కృతి ని ప్రపంచానికి చాటి చెప్తున్న టాక్ సంస్థని ప్రశంసించారు. ఒక పక్క వ్యక్తిగతంగా ఇక్కడున్న బిడ్డలు రోజు వారి పనుల్లో బిజీగా ఉన్నపట్టికి, బాధ్యత గల తెలంగాణా బిడ్డలుగా ఆనాడు ఉద్యమంలో నేడు పునర్నిర్మాణంలో పోషిస్తున్న పాత్ర ఎందరికో ఎంతో స్పూర్తినిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టాక్ వ్యవస్థాపకుడు, ఎన్నారై టి. ఆర్.ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, టాక్ అద్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, టాక్ ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం, టాక్ జాతీయ కన్వీనర్ శ్రీకాంత్ పెద్దిరాజు ముఖ్య సభ్యులు మట్టా రెడ్డి, వెంకట్ రెడ్డి దొంతుల,నవీన్ రెడ్డి, రత్నాకర్ కడుదుల,మల్లా రెడ్డి, సత్యపాల్ పింగిళి,వంశీ రెక్నర్ , రంజిత్ చాతరాజు,సత్యం కంది,గణేష్ పాస్తం ,రాకేష్ పటేల్,రవి రేటినేని ,రవి ప్రదీప్ పులుసు,,సత్య చిలుముల,శ్రీధర్ రావు,వెంకీ సుదిరెడ్డి, సతీష్ రెడ్డి గొట్టిముక్కుల, జస్వంత్,వంశీ పొన్నం, భరత్ బాశెట్టి, వేణు నక్కిరెడ్డి, హరి గౌడ్ నవాబ్ పేట్ , నవీన్ మాదిరెడ్డి, చిత్తరంజన్ రెడ్డి,సురేష్ బుడగం,మధుసూదన్ రెడ్డి,వంశీ పొన్నం మహిళా విభాగం సభ్యులు శ్వేతా రెడ్డి,సుష్మన,జహ్నవి వేముల, సుప్రజ పులుసు,క్రాంతి రేటినేని,మమత జక్కీ ,శ్వేతా మహేందర్, ప్రియాంక, తదితరులు పాల్గొన్నారు. -
పూలకు పండగొచ్చింది
రకరకాల పరిమళ భరిత పువ్వులతో దేవతలను పూజించడం హైందవ సంప్రదాయం. అయితే పువ్వుల రాశినే దేవతా మూర్తిగా భావించి పూజ చేయడం ఈ పండుగ ప్రత్యేకత. అదే బతుకమ్మ పండుగ. ఆంధ్రప్రదేశ్లో అంగరంగవైభవంగా జరిగే దసరా నవరాత్రులకు ఒకరోజు ముందే బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభమవుతాయి. పూలతో పండగ చేసుకోవడం కాదు... పూలకే పండగ వేడుకలు చేయడం బతుకమ్మ ప్రత్యేకత. ఈ పండుగ విశేషాలు... ఆశ్వయుజ మాసం వచ్చేస్తుందంటే.. బతుకమ్మ పండుగ కూడా వచ్చేసినట్లే. భాద్రపద అమావాస్య నుంచి తొమ్మిదిరోజుల పాటు జరిగే ఈ పండగ తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాలలో జరుపుకుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో ఈ పండుగకి ఎంతో ప్రాముఖ్యత వుంది. ఎంత ప్రాముఖ్యత అంటే, రాష్ట్ర పండుగగా అధికారికంగా జరిపేంత. ఈ పండుగను బతుకమ్మ పండుగ, గౌరి పండుగ, సద్దుల పండుగ అనే పేర్లతో పిలుస్తారు. బతుకమ్మ అంటే సంబురమే సంబురం. పండుగకు వారం ముందు నుంచే ఇళ్ళలో హడావిడి మొదలవుతుంది. ఈ వేడుక కోసం ఎదురు చూస్తున్న ఆడపడుచులు ముందే పుట్టింటికి చేరుకుని ఆనందోత్సాహాలతో పండగ ఏర్పాట్లు చేసుకుంటారు. ప్రధాన పండుగకి వారం రోజుల ముందు నుంచే తెలంగాణ ఆడపడుచులు రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన చిన్న చిన్న బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ పాడే బతుకమ్మ పాటలు పాడతారు. ఆ పాటల వెనుక మర్మం ఇదే..! నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు.. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు..ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయలులో పూసి ఉంటాయి. వీటిలో గునుగు పూలు, తంగేడు పూలు ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. గునుగు, తంగేడు పూలతోపాటు అనేకరకాల పూలు ఒక రాగి పళ్ళెంలో పేర్చుతారు. ఒక రంగు పువ్వు తర్వాత మరో రంగు పువ్వును పేరుస్తూ ఆకర్షణీయంగా వుండే విధంగా బతుకమ్మని తయారు చేస్తారు. ఈ పూల అమరిక ఎంత పెద్దగా వుంటే బతుకమ్మ అంత అందంగా కనిపిస్తుంది. పూలను చక్కగా పేర్చడం పూర్తయిన తర్వాత బతుకమ్మ మీద పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. ఇలా తయారు చేసిన బతుకమ్మను పూజగదిలో అమర్చి పూజిస్తారు. పూజ పూర్తయ్యాక బతుకమ్మని బయటకి తీసుకువచ్చి ఆడపడుచులు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు. ఆటలు పూర్తయ్యాక వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో వాయనాలు ఇచ్చి పుచ్చుకుంటా రు. వాయనాలు పూర్తయ్యాక.. సత్తుపిండి ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుని ప్రసాదంలా స్వీకరిస్తారు. ఈ పండుగరోజుల్లో పుట్టమన్నుతో ఒక బొమ్మను చేసి, బహుళ పంచమి నాడు దానిని ప్రతిష్ఠించి దాని పైన, ఒక కలశాన్ని వుంచి, కలశంపైన పసుపు ముద్దతో గౌరమ్మను నిలిపి పూలతోనూ, పసుపుతోనూ అలంక రిస్తారు. బొడ్డెమ్మను నిలిపిన తరువాత ఆ వాడలో వున్న ఆడపిల్లలందరూ అక్కడ గుమికూడుతారు. ఈ వినోదాన్ని చూడడానికి పెద్దలందరూ వస్తారు. ఇలా ఎనిమిది రోజులూ కన్నెపడచులు ఆడుకుంటారు. తరువాత నవమి రోజున కోడి కూసే సమయాన స్త్రీలు లేచి, పరిసరాలన్నీ తిరిగి రకరకాల పూలు సేకరించి గోరువెచ్చని జీడిగింజల నూనెతో తలంటి పోసుకుని నూతన వస్త్రాలు ధరించి అలికి ముగ్గులు వేసిన ఇంట్లో బతకమ్మలను పేర్చి గుమ్మడి పూవు అండాశయాన్ని తుంచి పసిడి గౌరమ్మగా పెడతారు. పసుపుతో ముద్ద గౌరమ్మను చేసి పెట్టి అగరవత్తులు వెలిగించి పసుపు కుంకాలతో అలంకరించి పగలంతా అలాగే వుంచుతారు.సాయంత్రం పిన్నలు, పెద్దలు, నూతన వస్త్రాలు ధరించి స్త్రీలు, వివిధ అలంకారాలను అలంకరించుకుని బతకమ్మలను చేత బట్టుకుని చెరువు కట్టకో, కాలువ గట్టుకో దేవాలయానికో వెళ్ళి బతకమ్మలను మధ్య వుంచి, బాలికలు, కన్నె పడుచులు, స్త్రీలు వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు చరుస్తూ, గొంతెత్తి ఒకరు పాడగా వలయాకారంగా తిరుగుతున్న వారు ఆ పాటను అనుసరిస్తూ పాడుతారు. మగపిల్లలు కొయ్యగొట్టాలలో, కాగితపు అంచులను కన్నెపిల్లల పైనా స్త్రీల పైనా ప్రయోగిస్తారు. బతకమ్మ పాటలు, ఒకో ప్రాంతంలో ఆయా మాండలిక పదాలతో ప్రతి చరణాంతం లోనూ, ఉయ్యాలో అని, కోల్ కోల్ అనీ, చందమామా అనీ, గౌరమ్మ అనీ పదాలు పాడతారు. పాటల్లో లక్ష్మీ సరస్వతుల స్తోత్రాలేగాక, అనేక పౌరాణిక గాథలైన, శశిరేఖ, సతీ అనసూయ, కృష్ణలీల, సీతాదేవి వనవాసం మొదలైనవే గాక, సారంగధర, బాలనాగమ్మకు సంబంధించిన వినసొంపైన ఎన్నో పాటలు పాడుతూ వుంటారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయా లకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. స్త్రీలకు సంబం« దించిన ఈ పండుగలో అందరూ చల్లగా ఉండాలని గౌరమ్మను ప్రార్థిస్తారు. ప్రతి మనిషికి ప్రకృతితో విడదీయరాని సంబంధం ఉంటుంది. బతుకమ్మ పండుగకి తొమ్మిదిరోజులపాటు మనిషి ప్రకృతితో మమైకమైపోతాడు. అదే బతుకమ్మ పండుగ గొప్పతనం. ►తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు. ఈ తొమ్మిది రోజులలో వీరు రోజూ బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం వాటి చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు. – పూర్ణిమాస్వాతి గోపరాజు -
‘జాగృతి’ బతుకమ్మ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: ప్రకృతి పూల పండుగ బతుకమ్మను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంగిలి పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు 300కి పైగా ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకలు నిర్వ హించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ సంబురాలపై శనివారం ఆయా జిల్లా బాధ్యులతో సమీక్ష నిర్వహించారు. ముంబైతో పాటు అమెరికా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, ఖతార్, ఒమాన్లతో పాటు 12 దేశాల్లో బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తామని వెల్లడించారు. జాగృతి బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 30న రవీంద్రభారతిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు 316 మంది కవయిత్రుల కవితా పఠనం ఉంటుందన్నారు. అక్టోబర్ 2 నుంచి 4వ తేదీ వరకు వరుసగా మూడు రోజుల పాటు హైదరాబాద్లోని జేఎన్యూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో 50 మంది మహిళా ఆర్టిస్టులతో ఆర్ట్ వర్క్ షాప్ ఏర్పాటు చేశామని తెలిపారు. బతుకమ్మ పండుగ సందర్భంగా తెలుగు సాహితీ రంగంలో అతిపెద్ద కవయిత్రుల కవితా సంకలనం ‘పూల సింగిడి’ని వెలువరిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాల వారీగా బతుకమ్మ సంబురాలు నిర్వహించే పట్టణాలు, మండల కేంద్రాల జాబితాను కవిత ఈ సందర్భంగా విడుదల చేశారు. -
టీపాడ్ బతుకమ్మ వేడుకల ‘కిక్ ఆఫ్’ ఈవెంట్
డాలస్ : డాలస్ తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో అక్టోబర్ 5వ తేదీన అతి వైభవంగా నిర్వహించే బతుకమ్మ, దసరా సంబరాలకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. టెక్సాస్ ఇర్వింగ్లోని కూచిపూడి ఇండియన్ కిచెన్ బాంక్వెట్ హాల్లో జరిగిన ఈ ‘కిక్ ఆఫ్’ ఈవెంట్కు టీపాడ్ అధ్యక్షుడు చంద్రారెడ్డి పోలీస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకి, అమెరికా జాతీయ తెలుగు సంస్థల, ప్రాంతీయ తెలుగు సంస్థల, తెలుగేతర సంస్థల కార్యవర్గ సభ్యులకు ఆయన హృదయపూర్వక స్వాగతం పలికారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ కో ఆర్డినేటర్ సుధాకర్ కలసాని, సెక్రటరీ మాధవి లోకిరెడ్డి కిక్ ఆఫ్ ఈవెంట్కు సమన్వయకర్తలుగా వ్యవహరించి కార్యక్రమానికి శోభను తీసుకువచ్చారు. సాంఘికపరమైన బాధ్యతలో భాగంగా ఈ ఏడాది టీపాడ్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు కార్యక్రమాలను సమన్వయకర్తలు అతిథులకు వివరించారు. మార్చిలో జరిపిన రక్తదాన శిబిరం, ఏప్రిల్లో ఆస్టిన్ స్ట్రీట్ సెంటర్లోని 450 మంది నిరాశ్రయులకు భోజన ఏర్పాటు, మే నెలలో నిర్వహించిన యాంగ్జైటీ, డిప్రెషన్ మేనేజ్మెంట్పై అవగాహన సదస్సు, జూన్లో జరిపిన వనభోజనాలు, ఆగస్టులో జరిపిన మీట్ అండ్ గ్రీట్ గురించిన వివరాలు తెలియజేశారు. గత ఆరేళ్లుగా కమ్యూనిటీలో జరిగే ప్రతి కార్యక్రమానికి టీపాడ్ సంస్థ ఏ విధంగా సహాయ సహకారాలు అందజేస్తూ.. అండగా నిలబడుతుందో అతిథులకు తెలిపారు. అలాగే అక్టోబర్ 5న డాలస్లో టీపాడ్ ఆధ్వర్యంలో జరిపే బతుకమ్మ, దసరా సంబరాల ‘ఫ్లయర్ చిత్రాన్ని’ సంస్థ ఫౌండేషన్ కమిటీ చైర్ జానకి మందాడి, బోర్డు ఆఫ్ ట్రస్టీ చైర్ పవన్ గంగాధర, అధ్యక్షుడు చంద్రారెడ్డి పోలీస్లు కార్యక్రమానికి హాజరైన అతిథులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా పన్నెండు వేల మందికి పైగా హాజరు కానున్న బతుకమ్మ దసరా వేడుకల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను చంద్రారెడ్డి, జానకి మందాడి, పవన్ గంగాధర తెలియజేశారు. అలాగే ఈ సంబరాలకు హాజరయ్యే సినిమా, జానపద కళాకారుల, రాజకీయ అతిథుల వివరాలను వెల్లడించారు. ఈ కిక్ ఆఫ్ ఈవెంట్కు టీపాడ్ ఫౌండేషన్ టీమ్ అజయ్రెడ్డి, రావు కలవల, రఘువీర్ బండారు, మహేందర్ కామిరెడ్డి, బోర్టు ఆఫ్ ట్రస్టీస్ శారద సింగిరెడ్డి, ఇంద్రాణి పంచార్పుల, గోలి బుచ్చిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ శ్రీనివాస్ గంగాధర, లక్ష్మి పోరెడ్డి, అనురాధ మేకల, మధుమతి వ్యాసరాజు, దీప్తి సూర్యదేవర, రత్న ఉప్పల, శ్రీనివాస్ వేముల, లింగారెడ్డి అల్వా, అడ్వైజరీ కమిటీ రామ్ అన్నాడి, అశోక్ కొండల, వేణు భాగ్యనగర్, విక్రమ్ జంగం, జయ తెలకలపల్లి, కరణ్ పోరెడ్డి, కొలాబరేషన్ టీమ్ గాయత్రి గిరి, స్వప్న తుమ్మపాల, రేణుక చనుమోలు, శశి కర్రి, శ్రవణ్ నిడిగంటి, బాల గణపవరపు, కిరణ్ తల్లూరి, శ్రీనివాస్ తుల, విజయ్రెడ్డి, సత్య పెర్కారి, నీరజరెడ్డి పడిగెలలు కిక్ ఆఫ్ ఈవెంట్కు హాజరయి.. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమానికి విరాళాలు ఇచ్చిన దాతలకు, కూచిపూడి కిచెన్ యాజమాన్యానికి, మీడియా మిత్రులకు, తానా, ఆటా, నాట్స్, టాటా, ఐఎన్టీ, టాంటెక్సస్, డాటా, జెట్, మనబడి సంస్థలకి, కమ్యూనిటీ లీడర్స్కి జానకి మందాడి, చంద్రారెడ్డి పోలీస్, సుధాకర్ కలసానిలు సంయుక్తంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అక్టోబర్ 5 డాలస్లోని ఆలెన్ ఈవెంట్ సెంటర్లో జరిగే బతుకమ్మ, దసరా సంబరాలకు ప్రపంచ నలుమూలాల ఉన్న భారతీయులందరికీ స్వాగతం పలికారు. -
ఇటలీలో ఘనంగా బతుకమ్మ పండుగ
రోమ్ : ఇటలీ తెలుగు సాంస్కృతిక సంఘం(ఐటీసీఏ) ఆధ్వర్యంలో రోమ్లోని కాళీ మందిర్ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా జరిపారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా జరిగాయి. మహిళలు, యువతులు సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలతో ఆలయ ప్రాంగణం అంతా పండగ వాతావరణం నిండిపోయింది. ఇతర దేశాలకు చెందిన మహిళలు కూడా ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇటలీలో దొరికే వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారు చేసి విదేశీవనితలు రోజంతా ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో ఈవెంట్ ఆర్గనైజర్లు పిన్నమరెడ్డి సౌమ్యారరెడ్డి, నల్లయగరీ అశ్వినిరెడ్డి, ఐటీసీఏ వ్యవస్థాపకులు కొక్కుల మనోజ్ కుమార్, నరబోయిన రాహుల్ రాజ్, ఇతర సభ్యులు ఆడెపు అనుదీప్, ప్రణవ్ తదితరులు పాల్గొన్నారు. -
టెన్నెస్సీ తెలుగు సమితి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
టెన్నెస్సీ : అమెరికాలోని నాష్విల్ నగరంలో టెన్నెస్సీ తెలుగు సమితి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. సుమారు 700 మందికి పైగా పాల్గొన్న ఈ సంబరాలకు దీప్తి రెడ్డి దొడ్ల నాయకత్వం వహించారు. ముందుగా కొబ్బరికాయ కొట్టి అమ్మవారి పూజతో సంబరాలను ఘనంగా ప్రారంభించారు. తెలంగాణలో గుడుల్లోలానే తులసి అమ్మవారి విగ్రహంతోపాటు బతుకమ్మ ముగ్గు వేసి మరీ చేసిన అందరంగా అలంకరించి వేడుకలను జరిపారు. సాంప్రదాయ దుస్తుల్లో వచ్చిన ఆడపడుచులు, పిల్లలు, పెద్దలు వేదిక ప్రాంగణానికి వన్నె తెచ్చారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆటపాటలతో తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తూ ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ లను భక్తిశ్రద్దలతో కొలిచారు. అలాగే స్థానిక కళా నివేదనం, కోలాటం మరియు ధీంతానా గ్రూప్స్ వారు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. స్థానిక వ్యాపారులు ఏర్పాటు చేసిన వెండర్ స్టాల్స్ లో అందరు కలియ తిరుగుతూ షాపింగ్ చేశారు. సభాప్రాంగణ సమర్పకులకు, ఫుడ్ వాలంటీర్లకు సర్ప్రైజ్ రాఫుల్ బహుమతులు అందజేశారు. బతుకమ్మ పోటీలలో రెండు కేటగిరీల్లోనూ రంగు రంగుల పూలతో ఎంతో అందంగా, క్రియేటివ్గా చూడ చక్కగా అలంకరించడంలో విజేతలను న్యాయనిర్ణేతలు ఎంపిక చేశారు. విజేతలకు చీరలు బహుకరించారు. బతుకమ్మను తెచ్చినవారందరికి గుడీ బ్యాగ్స్ అందజేశారు. అలాగే స్టెమ్ బిల్డర్స్ వారు సమర్పించిన రాఫుల్ బహుమతులు కూడా అందజేశారు. మహిళలకు ఆహ్వానంలో భాగంగా మల్లె పూలు, జాజి పూలు అలాగే తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో తాంబూలం అందించారు. చివరిగా టెన్నెస్సీ తెలుగు సమితి బతుకమ్మ సంబరాలకు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాష్విల్ వాసులందరికి, రుచికరమైన తేనీయ విందునందించిన అమరావతి రెస్టారంట్, ప్యారడైజ్ బిర్యానీ రెస్టారెంట్ వారికీ, ఈ కార్యక్రమ రూపకల్పనలో సహాయం చేసిన టెన్నెస్సీ తెలుగు సమితి కార్యవర్గ సభ్యులకు, యూత్ కమిటీ సభ్యులకు, శ్రేయోభిలాషులకు దీప్తి రెడ్డి దొడ్ల ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. -
‘సంస్కృతికి ప్రతిబింబం బతుకమ్మ’
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.కిషన్రావు అన్నారు. బుధవారం సింగరేణి భవన్లో జరిగిన సద్దుల బతుకమ్మ సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బతుకమ్మ పండుగను సింగరేణి కాలరీస్ ప్రాంతాల్లో ఈ ఏడాది వైభవంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఇలాంటి పండుగల ద్వారా ఉద్యోగుల్లో మరింత అంకిత భావం నెలకొనాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజా కవి జయరాజును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ ప్రేమ్కుమార్, జనరల్ సెక్రటరీ రాజశేఖర్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ బి.భాస్కర్ , సింగరేణి భవన్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
బతుకమ్మ పూల విషాదం
సాక్షి, కృష్ణా/ఖమ్మం : పండగ పూట విషాదం నెలకొంది. బతుకమ్మ పూల కోసం వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ మృత్యువాత పడ్డాడు. పంటలపై దాడులు చేస్తున్న అడవిపందులను కట్టడిచేయడానికి పెట్టిన మీటా (మందు గుండు ఉచ్చు)కు గురై ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కొర్లగూడెం గ్రామానికి చెందిన గడ్డం శ్రీనివాసరెడ్డి (50) మరణించారు. ఈ ఘటన కృష్ణాజిల్లాలోని గంపలగూడెం మండలం కనుమూరు - చిక్కుళ్లగూడెం మధ్య గల అడవిలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
టొరంటోలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
టొరంటో : తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో గ్రేటర్ టొరంటోలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. లింకన్ అలెగ్జాండర్ పాఠశాల ఆడిటోరియంలో 1000 మందికి పైగా తెలంగాణా వాసులు పాల్గొని బతుకమ్మ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడారు. ఈ పండుగ సంబురాలు తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వర రావు చిత్తలూరి ఆధ్వర్యంలో జరుగాయి. 2018-20 కి ఎన్నికైన నూతన కమీటీలను ఈ పండుగ వేడుకలలో ప్రకటించి పరిచయం చేశారు. నూతన అధ్యక్షులుగా రమేశ్ మునుకుంట్ల, ఉపాధ్యక్షులుగా విజయకుమార్ తిరుమలాపురం, కార్యదర్శిగా శ్రీనివాస్ మన్నెం, సాంస్కృతిక కార్యదర్శిగా దీప గజవాడ, కోషాధికారిగా దామోదర్ రెడ్డి మాది, డైరక్టర్లుగా మనోహర్ భొగా, శ్రీనివాస్ చంద్ర, మంగ వాసం, మూర్తి కలగోని, గణేశ్ తెరల, ట్రుస్టీ బోర్డు అధ్యక్షునిగా హరి రావుల్, ట్రస్టీలుగా సురేశ్ కైరోజు, వేణుగోపాల్ రెడ్డి ఏళ్ళ, కిరన్ కుమార్ కామిశెట్టి, నవీన్ ఆకుల ఈ సందర్భంగా ఈ సంవత్సరపు ఉత్తమ బతుకమ్మలకు బహుమతులను అందజేశారు. బతుకమ్మలను హంబర్ నదిలో నిమజ్జనం చేసి సాంప్రదాయ బద్దంగా తయరు చేసుకొని వచ్చిన ఫలహారాలను ఆరగించారు. మహిళలు గౌరమ్మ పసుపు కుంకుమలను పంచుకున్నారు. చివరగా ఉపాధ్యక్షులు రాజేశ్వర్ ఈద, విజయకుమార్ తిరుమలాపురం సాంస్కృతిక కార్యదర్శి వందన సమర్పణతో బతుకమ్మ ఉత్సవాలు ముగిశాయి. తెలంగాణ కెనడా అసోసియేషన్ ఫౌండేషన్ కమీటీ అధ్యక్షులు దేవెందర్ రెడ్డి గుజ్జుల, ట్రుస్టీ బోర్డు అధ్యక్షులు ప్రభాకర్ కంబాలపల్లి, ఉపాధ్యక్షులు రాజేశ్వర్ ఈద, కార్యదర్షి రాధిక బెజ్జంకి, కోషాధికారి సంతోష్ గజవాడ, సాంస్కృతిక కార్యదర్షి విజయ్ కుమార్ తిరుమలాపురం, డైరక్టర్లు శ్రీనివాస్ మన్నెం, భారతి కైరొజు, మురళి కాందివనం, ట్రుస్టీ సభ్యులు శ్రీనివాసు తిరునగరి, సమ్మయ్య వాసం, అథీక్ పాష, ఫౌండర్లు రమేశ్ మునుకుంట్ల, చంద్ర స్వర్గం, శ్రీనాధ్ రెడ్డి కుందూరి, అఖిలేశ్ బెజ్జంకి, కలీముద్దిన్, వేణుగోపాల్ రోకండ్ల, హరి రావుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. -
సీటెల్లో ఘనంగా దసరా సంబరాలు
సీటెల్ : వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. సీటెల్లోని తెలుగు వారు బెల్లెవులే హై స్కూల్లో బతుకమ్మ ఉత్సవాలు వేడుకగా జరిగాయి. సీటెల్ ప్రాంతానికి చెందిన దాదాపు వేయి మంది తెలుగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆడపడుచులు అందమైన పూలతో బతుకమ్మలను పేర్చి సాంప్రదాయ వస్త్రాధరణలో బతుకమ్మ పాటలు ఆడి పాడారు. ఈ కార్యకమంలో తెలంగాణ సింగర్ మధు ప్రియ, బాహుబలి సింగర్ సత్య యామిని తమ గాత్రంతో ఆకట్టుకున్నారు. ఈసారి సీటెల్ తెలుగు వాళ్లు అతి పెద్ద బతుకమ్మను పేర్చి ఉరేగింపుగా తీసుకువచ్చారు. ప్రతి ఏడాది సామాజిక సేవ చేసే తెలంగాణ మహిళలకు 'వుమెన్ అఫ్ ది ఇయర్' అవార్డును తెలంగాణ అసోసియేషన్ అందించింది. 2018 ఏడాదికి గానూ వుమెన్ ఆఫ్ది ఇయర్ అవార్డు అరవిందరెడ్డికి సీ2ఎస్ ఛైర్మన్ జగన్ చిట్టిప్రోలు చేతుల మీదుగా ఇచ్చారు. బోర్డు మెంబెర్స్ రాజ్, సూర్యప్రకాష్ రెడ్డి, సంగీతా రెడ్డి , శ్రీధర్, రాజా, రామ్, సాయి, శ్రీధర్ల ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ వేడుకలు జరిగాయి. -
బతుకమ్మ ఎత్తుకున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి
-
బతుకమ్మ వేడుకలు
-
సికింద్రాబాద్లో బతుకమ్మ ఉత్సవాలు
-
శివునీ ముద్దులగుమ్మ.. బతుకమ్మ..
-
పూల సంబరం
-
ప్రగతిభవన్లో బతుకమ్మ వేడుకలు
-
ఏమేమి పువ్వొప్పునే...
-
నేటి నుంచి బతుకమ్మ పండుగ
-
ఏమేమి పువ్వొప్పునే.. గౌరమ్మ!
సాక్షి, హైదరాబాద్: ‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మ...’ అంటూ తీరొక్క పువ్వులను పేర్చి భక్తితో కొలిచే తెలంగాణ ప్రత్యేక పండుగ బతుకమ్మకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బతుకమ్మ పండుగ ఉత్సవాలు మంగళవారం మొదలవ్వనున్నాయి. ఆటపాటలతో పల్లెల్లో ఆనందం నింపే ఈ పండుగ 9 రోజుల పాటు సాగనుంది. అక్టోబర్ 17న సద్దుల బతుకమ్మతో ఉత్సవాలు ముగియనున్నాయి. అన్ని గ్రామాల్లోనూ బతుకమ్మను ఘనంగా నిర్వహిం చాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. బతుకమ్మ ఉత్సవాల నిర్వహణ కోసం ప్రతి జిల్లా కేంద్రంలో ఉత్సవాలకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ప్రత్యేకతల పండుగ... బతుకమ్మ పండుగకు ఓ విశిష్టత ఉంది. ఈ పండుగలో పాటలదే ప్రాధాన్యత. పూర్తిగా ప్రకృతి, ఆత్మీయతలు, జీవనశైలిని తెలియజెప్పేలా పాటలుం టాయి. తెలంగాణ ఉద్యమంలో భాగంగా సాంస్కృ తిక అస్తిత్వం నిలుపుకునే ప్రక్రియలో బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత పెరిగింది. వానాకాలం ముగింపు, చలికాలం మొదలయ్యే రోజుల్లో ఈ పండుగ వస్తుంది. ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున తొలిరోజు (ఎంగిలిపూల) బతుకమ్మతో పండుగ మొదలవుతుంది. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో పండుగ ముగుస్తుంది. బతుకమ్మను పూలతో పేర్చడం, మట్టిలో ఆడటం, నీళ్లలో కలపడం అంతా ప్రకృతితో మమేకమైన ప్రక్రియ. బతుకమ్మకు వినియోగించే ఒక్కో పువ్వులో ఒక్కో రకమైన రోగ నిరోధక శక్తి ఉంటుంది. బతుకమ్మ పండుగ సందర్భంగా తయారు చేసే ప్రసాదాల్లోనూ ప్రత్యేకత ఉంది. వర్షాకాలంలో వచ్చే ఆహార పంటలతో ప్రసాదాలను తయారు చేస్తారు. హైదరాబాద్లో 9 రోజుల పాటు... బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. గతేడాది కంటే ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అన్ని శాఖలను ఆదేశించారు. హైదరాబాద్లోని ట్యాంక్బండ్, పీపుల్స్ప్లాజా, రవీంద్రభారతి, బైసన్పోలో, పరేడ్గ్రౌండ్స్, తెలంగాణ కళాభారతి మైదానాల్లో 9 రోజులు వివిధ కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సద్దుల బతుకమ్మ రోజున 21 దేశాలకు చెందిన మహిళలు ఉత్సవాల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో, ఢిల్లీల్లోని తెలంగాణభవన్లోనూ బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
బతుకమ్మ వేడుకలకు తెలంగాణ జాగృతి దూరం
-
ఐర్లాండ్లో దసరా, బతుకమ్మ వేడుకలు
ఐర్లాండ్లో దసరా, బతుకమ్మ వేడుకలు డబ్లిన్లోని ఉపాధ్యక్షులు మెట్టు జయంత్ రెడ్డి ఆద్వర్యంలో అట్టహాసంగా జరిగాయి. ఇందులో మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ కోలాటం ఆడారు. పురుషులకు ప్రత్యేకంగా జమ్మి పూజ, అలై బలై కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాగృతి యూరప్ అధ్యక్షులు సంపత్ ధనంనేని, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవి ప్రసాద్ రావు, మేయర్ మేరీ మాక్ కేంలేయ్, కౌన్సిలర్ టేడ్ లేడే, ఇండియన్ హై కమిషన్ ఫస్ట్ సెక్రటరీ అనిత శుఖ్ల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జాగృతి యూరప్ అధ్యక్షులు సంపత్ ధనంనేని మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడంలో జాగృతి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. బతుకమ్మ పండుగలతోపాటు తెలంగాణ చరిత్ర, తెలంగాణ ప్రాచీన కవులను స్మరిస్తూ కవితాంజలి, యువత నైపుణ్యతకు స్కిల్ డెవలప్మెంట్ లాంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. అనంతరం బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవి ప్రసాద్ రావు మాట్లాడుతూ.. ఐర్లాండ్ తెలంగాణ ప్రజలలో దసరా బతుకమ్మ పండుగలను జరుపుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. బంగారు తెలంగాణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు ఒక వారధిలాగ జాగృతి పని చేయాలని తెలిపారు. జయశంకర్, కాళోజీ, దాశరధిలాంటి మహనీయుల ఆశయాల కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి జాగృతి యూరప్ అధ్యక్షులు సంపత్ ధనంనేని, ఐర్లాండ్ జాగృతి ఉపాధ్యక్షులు జయంత్ రెడ్డి, తేరా శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ మధిర, రమణ యాదగిరి , జనగాం నవీన్, దుగ్యాల అనిల్ , రామ్, పవన్ తదితరులు పాల్గొన్నారు. -
న్యూజిలాండ్లో బతుకమ్మ వేడుకలు..
ఆక్లాండ్: న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్( టాంజ్) ఆధ్వర్యంలో శనివారం బతుకమ్మ వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. మహిళలు తమ ఇళ్లలో బతుకమ్మలు పేర్చుకొని రావడమే కాకుండా అందరూ కలిసి ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా టాంజ్ బతుకమ్మను పేర్చారు. ఆడవారంతా బతుకమ్మల ఆడుతూంటే మగవారు చుట్టూ చేరి దాండియా ఆడారు. చిన్నారులు బతుకమ్మ పాటలతో ఆక్లాండ్ నగరం మార్మోగింది. చిన్నారి అతిర ఎర్రబెల్లి పాడిన ‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ’. పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా నిర్వహాకులు పాటలు పాడిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వారందరూ తెలంగాణ వంటకాలతో భోజనాలు చేశారు. ఈ సందర్భంగా టాంజ్ అధ్యక్షుడు శ్రీ కళ్యాణ్ కాసుగంటి మాట్లాడుతూ.. మన రాష్ట్ర పండగైన బంగారు బతుకమ్మను తెలంగాణ బిడ్డలందరం కలిసి న్యూజిలాండ్ లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుతూ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. టాంజ్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి ఉమా సల్వాజి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నమైన మన బతుకమ్మఆట శారీరక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడటమే కాక, బతుకమ్మ పాటలు చారిత్రక, సాంఘిక మరియు మానసిక ఆధ్యాత్మిక వికాసలతోపాటు విలువలను పెంపొందిస్తాయని తెలిపారు. బతుకమ్మ ఉత్సవాలకు సహకరించిన దాతలకు, బతుకమ్మలు పేర్చుకొచ్చిన మహిళలకు ఆమె, ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టాంజ్ వైస్ప్రెసిడెంట్ శ్రీ రాం మోహన్ దంతాల, జనరల్ సెక్రటరీ శ్రీ సురేందర్ అడవల్లి లతోపాటు ఇతర టాంజ్ సభ్యులు,న్యూజిలాండ్ లోని తెలంగాణ వారే కాకుండా ఇతర ప్రాంతాలవారు, న్యూజిలాండ్ ఇండియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ బీకు బానా, జనరల్ సెక్రెటరి శ్రీ ప్రకాశ్ బిరాదర్, న్యూజిలాండ్ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి అరుణజ్యోతి, ముద్దం,టి.ఆర్.ఎస్ న్యూజిలాండ్ అధ్యక్షుడు శ్రీ విజయ్ కోస్న, న్యూజిలాండ్ తెరాస మరియు జాగృతి సభ్యులు పాల్గొన్నారు. -
వర్షం ఎఫెక్ట్ : 'బతుకమ్మ'కు గిన్నిస్ మిస్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆడ బిడ్డల ముఖ్య పండుగ, రాష్ట్ర పండుగ బతుకమ్మ గిన్నిస్ రికార్డును మిస్సయింది. వర్షం భారీగా పడటంతో రికార్డు చేజారింది. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం సద్దుల బతుకమ్మ(మహా బతుకమ్మ) సంబురం జరుగుతుండగా.. ఎల్బీ స్టేడియంలో కూడా దాదాపు మూడు వేల మందితో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కేలా ఈ ఉత్సవాన్ని నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఇందుకోసం 300 మంది టీం లీడర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరపాలనుకున్నారు. ఆ మేరకే ఉదయం 10 గంటలకు సద్దుల బతుకమ్మ ఉత్సవం ప్రారంభమైంది. మహిళలంతా తంగేడు పూల ఆకృతిలో చేరి మరింత ఆకర్షణీయంగా కనిపించారు. బతుకమ్మ పూలతో తివాచీ ఏర్పాటుచేశారు. ఇందుకోసం మహిళలు ప్రత్యేకంగా పసుపు పచ్చని చీరలు, ఆకుపచ్చని చీరలతో స్టేడియానికి చేరారు. అయితే, అనుకోని విధంగా వర్షం రావడంతో అనుకున్న విధంగా బతుకమ్మ ఫీట్ చేయలేక గిన్నిస్ రికార్డు మిస్సయింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు బుర్రా వెంకటేశం మాట్లాడుతూ వర్షం వల్ల గిన్నిస్ రికార్డు చేయలేకపోయామన్నారు. అటెంప్ట్ మాత్రమే ఫెయిల్ అయిందని, కచ్చితంగా రికార్డ్ నెలకొల్పుతామని, వీలైతే నవంబర్లో మరోసారి బతుకమ్మ గిన్నిస్ రికార్డును నెలకొలకొల్పడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా గిన్నిస్ రికార్డ్ అధికారి స్వప్నిల్ మాట్లాడుతూ మహా బతుకమ్మ గిన్నిస్ రికార్డ్ మిస్సయిందని, బెటర్ లక్ నెక్ట్స్ టైం అని వ్యాఖ్యానించారు. -
ఎమ్మెల్యే అదిరే స్టెప్పులు.. వైరల్ వీడియో
సాక్షి, సూర్యాపేట : తెలంగాణ ప్రజల సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ సంబరాల్లో సామాన్యులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అనే భేదాలు లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లాలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ నేను సైతం అంటూ స్టెప్పులేసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న వారిలో ఉత్సాహాన్ని రెట్టింపుచేశారు. శాలిగౌరారంలో జరిగిన మహా బతుకమ్మ వేడుకల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ పాటలు ప్లే అవుతుండగా ఆయన రెట్టించిన ఉత్సాహంతో కాలు కదిపారు. ఎమ్మెల్యే ఉత్సాహంగా స్టెప్పులేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రజాప్రతినిధులు.. పండుగలు, సంస్కృతికి ఎప్పుడూ సామాన్యులే అన్న తరహాలో బతుకమ్మ వేడుకల్లో పాటలకు డ్యాన్స్ చేస్తూ అందర్నీ గాదరి కిషోర్ అలరించారు. ఎమ్మెల్యే డ్యాన్స్ చేస్తున్నంతసేపు అక్కడున్నవారు ఈలలువేస్తూ ఆయనకు మద్ధతు తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలు.. సామాన్యులు, సెలబ్రిటీలు అందర్నీ ఏకం చేస్తాయంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. -
మహా బతుకమ్మ సంబరాలు
-
అంగరంగ వైభవంగా ‘మహా బతుకమ్మ’
-
అంగరంగ వైభవంగా ‘మహా బతుకమ్మ’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 35 వేల మంది మహిళలు రంగురంగుల పూల బతుకమ్మలతో తరలిరాగా స్టేడియం కళకళలాడుతోంది. 19 రాష్ర్టాలకు చెందిన కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 15 రాష్ర్టాల నుంచి బ్రహ్మకుమారీలు తరలివచ్చి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ బొడ్డెమ్మ ఆడారు. ఎల్బీ స్టేడియం పూలవనాన్ని తలపిస్తుంది. 31 జిల్లాల నుంచి తరలివచ్చిన మహిళలు వలయాకారంలో లయబద్దంగా బతుకమ్మ ఆడుతున్నారు. ఉయ్యాల పాటలతో ఎల్బీ స్టేడియం మార్మోగుతుంది. తెలంగాణ సంస్కృతి వైభవానికి ప్రతీకగా మహాబతుకమ్మ నిలిచింది. మహిళలందరూ గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించడమే లక్ష్యంగా బతుకమ్మ ఆడుతున్నారు. ఈ వేడుకల్లో జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మామిడి హరికృష్ణ, బుర్రా వెంకటేశం, పలువురు మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ వేడుకలు
-
ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
మెల్బోర్న్ : ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ఇన్ కార్పొరేషన్ (ఏటీఏఐ) ఆధ్వర్యంలో మెల్బోర్న్ నగరంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ ఆడపడుచుల అతిపెద్ద పండుగగా పేరొందిన బతుకమ్మను కొలుచుకొంటూ వేల సంఖ్యలో హాజరైన మహిళలు, పిల్లలు ఆటపాటలతో, కోలాటాలతో అలరించారు. అమితోత్సాహంతో మహిళలందరు రకరకాల పువ్వులతో పేర్చుకొని తెచ్చిన బతుకమ్మలు అందరిని ఎంతో ఆకర్షించాయి. బతుకమ్మను తీసుకువచ్చిన ప్రతి మహిళకు వెండి నాణెంతో పాటు, ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన బతుకమ్మలను తెచ్చిన ఆడపడుచులకు బంగారు నాణేలను అందించారు. ఈ సందర్బంగా ఏఐటీఐ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి దేశం మాట్లాడుతూ.. తాము తెలంగాణ సంస్కృతిని ఖండాంతరాల్లో చాటిచెప్పేందుకు గత నాలుగేళ్లుగా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇట్టి బృహత్తర కార్యాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి కృషి చేస్తున్న తన కమిటీ సభ్యులందరినీ అభినందించారు. ఇంత గొప్పగా బతుకమ్మ సంబరాలను నిర్వహించడం చాలా గర్వంగా ఉందని అందుకు సహకరించిన టీఆర్ఎస్ ఆస్ట్రేలియా సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాగే పాటుపడుతూ తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను ఆస్ట్రేలియాలో విస్తరించడానికి తమవంతు కృషి చేస్తామన్నారు. -
కూకట్పల్లిలో బతుకమ్మ సంబురాలు
-
చికాగోలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
చికాగో: తెలంగాణ పర్యాటక శాఖ, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో చికాగో మహానగర తెలుగు సంస్థ(టీఏజీసీ) దసరా, బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించింది. తెలంగాణ ప్రజల జీవన విధానం, సంస్కృతిని అద్దం పట్టేలా, కులమతాలకు అతీతంగా, ప్రాంతీయ విభేదాలు లేకుండా, ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారిని గుర్తించేలా, ఘనంగా బతుకమ్మ వేడుకలను చికాగోలో టీఏజీసీ నిర్వహించింది. ఈ నెల 24న శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం, పంచవటి కళాప్రాంగణములో సుమారు వెయ్యికి పైగా అతిథులతో బతుకమ్మ, దసరా వేడుకలను చాలా ఘనంగా నిర్వహించారు. గత పదిహేనేళ్ల నుంచి టీఏజీసీ కార్యవర్గం, జాతీయ సంస్థల సహకారంతో దసరా వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నారు. గత ఏడాది నుంచి తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో టీఏజీసీ బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైన సంప్రదాయ గుర్తింపు తెచ్చేందుకు టీఏజీసీ అధ్యక్షురాలు జ్యోతి చింతలపాణి, మహిళా బోర్డు డైరెక్టర్లు విశేష కృషి చేశారు. 125 మంది మహిళలు పోచంపల్లి ప్రత్యేక చీరలు ధరించి టీఏజీసీ బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక వన్నెను తెచ్చారు. టీఏజీసీ అలంకరణ కమిటీ చైర్ శ్వేతా జనమంచి నాయకత్వంలో వాలంటీర్ల సహాయముతో పంచవటి కళాప్రాంగణాన్ని మరియు బతుకమ్మలను పెట్టే ప్రాంతాన్ని రంగుల రంగుల పూలతో అలంకరించారు. టీఏజీసీ బతుకమ్మ తయారుచేయడానికి న్యూ జెర్సీ నుండి పూలను తెప్పించి ఆదివారంనాడు సాంప్రదాయ పద్దతిలో అమర్చారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు దేవాలయములో పార్వతి దేవికి పసుపు, కుంకం, ముక్కు పుడక మరియు పుష్పాలను సమర్పించారు. టీఏజీసీ బతుకమ్మ కమిటీ చైర్ మమతా లంకాల మరియు టీఏజీసీ అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి ఏడే అతిథులను స్వాగతిస్తూ పండుగా విశిష్టతను వివరించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం బతుకమ్మ సాగనంపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యక్ష సాంప్రదాయ సన్నాయి, సంగీత వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్ళి టీఏజీసీ పురుషు వాలంటీర్ల సహాయంతో ఆలయ ప్రాంగణ కొలనులో నిమజ్జనం చేశారు. అనంతరం మహిళలకు బతుకమ్మ పోటీలను నిర్వహించారు. గెలుపొందిన వారికి టీఏజీసీ అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి ఏడే బహుమతులు అందజేశారు. టీఏజీసీ ఫుడ్ కమిటీ చైర్మెన్ అవదూత నాయకత్వంలో తెలంగాణ సాంప్రదాయ పద్దతిలో తయారు చేసిన ఆహార పదార్థాలను అమ్మకానికి ఉంచారు. వాటిద్వారా వచ్చిన డబ్బును వరుస హారికేన్లతో సతమతమైన వరదబాధితుల సహాయర్థం ఉపయోగించనున్నారు. బతుకమ్మలను సాగనంపిన తరువాత, అన్ని కుటుంబాలు టీఏజీసీ నిర్వహించే జమ్మి పూజలో పాల్గొన్నారు, బాలాజీ ఆలయ పూజారి హనుమాన్ ప్రసాద్ పూజ అనంతరము భక్తులందరికి పూజలో కంకణాలను కట్టి జమ్మి ఆకులు, అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు. అన్ని కుటుంబాలు జమ్మీని పంచుకోవడం మరియు పెద్దల నుండి అతిథిలు నుండి దీవెనను తీసుకున్నారు. టీఏజీసీ అధ్యక్షులు రామచంద్రా రెడ్డి ఏడే మాట్లాడుతూ, రాబోయే కాలానికి మన సంస్కృతిని కాపాడుకోవటానికి ఈ పండుగ వేడుకలు ఎంతోగానో ఉపయోగపడతాయన్నారు. అంతేకాకుండా ఈ వేడుకలను ఇంత ఘనంగా జరుపుకోవడానికి సహకరించిన మహిళలందరికీ, సంస్థ కార్యవర్గ సభ్యులకు, స్వచ్చంద సేవలను అందించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిత్వశాఖ, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ బృందం, ఎస్వీఎస్ బాలాజీ ఆలయం నిర్వహణ కమిటీ, దాతలు, మీడియాకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
ప్రగతి భవన్లో బతుకమ్మ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధికారిక నివాసం ప్రగతి భవన్లో శనివారం మహిళలు ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ ఆడారు. గవర్నర్ సతీమణి విమల, సీఎం కేసీఆర్ సతీమణి శోభ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సతీమణి విమల, మంత్రి హరీశ్ రావు సతీమణి శ్రీనిత, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, ఎంపీ కల్వకుంట్ల కవిత, అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా, మహిళాభివృద్ధి సంస్థ చైర్పర్సన్ సుధారాణి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నర్కు సీఎం కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు బతుకమ్మ, నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం ఈ మేరకు రాజ్భవన్లో గవర్నర్ను కలిశారు. కేసీఆర్తోపాటు ప్రముఖ సాహితీ వేత్త నర్సింహానాయుడు గవర్నర్ను కలసిన వారిలో ఉన్నారు. సచివాలయంలో బతుకమ్మ సంబురాలు సాక్షి, హైదరాబాద్: సెక్రటేరియట్ మహిళా ఉద్యోగులు ఆనందోత్సాహాల మధ్య సచివాలయంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. శనివారం తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుక ఆటపాటలతో హోరెత్తిపోయింది. ఈ వేడుకలో ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
సిడ్నీలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు
-
సిడ్నీలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు
సిడ్నీ: బతుకమ్మ, దసరా సంబురాలు సిడ్నీలో ఘనంగా జరిగాయి. ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ నిర్వయించిన బతుకమ్మ ఉత్సవాలతో సిడ్నీ నగరం పులకించింది. ఆటపాటలు, కోలాటాల చప్పుళ్లతో వీధులు మార్మోగాయి. వందలాది మంది తెలంగాణ ఆడపడచులు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో....బంగారు బతుకమ్మ ఉయ్యాలో....ఉయ్యాల అంటూ ఈవేడుకల్లో పాల్గొన్నారు. పాటలు పాడారు. బతుకమ్మ సంబురాలకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈవేడుకల్లో ఉత్తమ బతుకమ్మల పోటీ నిర్వహించారు. గెలుపొందిన మహిళలకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు. తెలంగాణ తల్లికి వేల మైళ్ల దూరంలో ఉంటున్నా.. ఎన్నారైల మనసుంతా తెలంగాణ పైనే ఉందని సిడ్నీ బతుకమ్మ అధ్యక్షుడు అనిల్ మునగాల తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను పాటిస్తుండటంతో పాటు, ఇక్కడే పుట్టి పెరిగిన పిల్లలకు తెలంగాణ సంస్కృతిని నేర్పించడం తమ ముఖ్య లక్ష్యం అన్నారు. సిడ్నీలో నివసించే తెలంగాణ ఎన్నారైలు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జోడి మక్కే, జియోఫ్ లే, హుగ్ మక్డాట్ బతుకమ్మ వేడుకల్లో పాలుపంచుకున్నారు. -
సీఎం క్యాంపులో కార్యాలయం బతుకమ్మ
-
డీజీపీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ
సాక్షి, హైదరాబాద్: శాంతి భద్రతలు, పోలీస్ అడ్మినిస్ట్రేటివ్ పనుల్లో బిజీగా ఉండే రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలో బతుకమ్మ సంబరాలను గురువారం ఘనంగా నిర్వహించారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న మహిళల కోసం సురక్ష బతుకమ్మ పేరిట ప్రత్యేకంగా బతుకమ్మ పాటలను రూపొందించారు. ఈ సీడీని డీజీపీ అనురాగ్శర్మతో పాటు సీపీ మహేందర్రెడ్డి ఇతర అధికారులు ఆవిష్కరించారు. అనంతరం ఐపీఎస్ అధికారుల సతీమణులు, పోలీస్ కార్యాలయ మహిళా సిబ్బంది బతుకమ్మ ఆడారు. కోలాటాలతో ఉల్లాసంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సీనియర్ ఐపీఎస్, కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైల్వే పోలీస్ ఆధ్వర్యంలో..: బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్రంలోని అన్ని రైల్వే స్టేషన్లలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్టు రైల్వే పోలీస్ డీజీపీ కృష్ణప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. జనరల్ రైల్వే పోలీస్ విభాగంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది వారి కుటుంబీకులతో బతుకమ్మ వేడుకల్లో పాల్గొని రాష్ట్ర పండుగను ఘనంగా నిర్వహించాలని కోరారు. -
ఘనంగా బతుకమ్మ సంబరాలు
-
20 నుంచి బతుకమ్మ ఉత్సవాలు
-
20 నుంచి బతుకమ్మ ఉత్సవాలు
ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్ ఎస్పీ సింగ్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ వేడుకతో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. బతుకమ్మ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రక టించి మూడేళ్లుగా అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలను ఈ నెల 20 నుంచి 28 వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయా లని భావిస్తోంది. బతుకమ్మ వేడుకకు అంతర్జా తీయంగా గుర్తింపు తెచ్చేందుకు రెండేళ్లుగా కృషి చేస్తోంది. ఈసారి దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేడుకలను పెద్దఎత్తున నిర్వహిం చటం ద్వారా ఈసారైనా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభు త్వ ప్రధానకార్యదర్శి ఎస్పీసింగ్ గురువారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 26న దాదాపు 35 వేల మంది మహిళలతో సామూహికంగా ఎల్బీ స్టేడియంలో ‘‘బతు కమ్మ ఉత్సవం’’నిర్వహించడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా 28న వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బతుకమ్మలను హైదరాబాద్లోని హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నిమజ్జనం సందర్భంగా తాత్కాలిక మరుగుదొడ్లు, రోడ్ల మరమ్మతులు, మంచినీటి సౌకర్యం కల్పించా లన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సమగ్రమైన ట్రాఫిక్ ప్రణాళిక రూపొందిం చాలని నగర పోలీసు కమిషనర్ను ఆదేశిం చారు. జిల్లాలలో కూడా ఘనంగా నిర్వహిం చేందుకు కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వ హించాలని సూచించారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే రాష్ట్రాలతోపాటు విదేశీ నగరాల్లో కూడా పండుగను ఘనంగా నిర్వహించడానికి చర్యలు చేపట్టాలని పర్యాటక శాఖ కార్యదర్శి వెంకటేశంను ఆదేశించారు. ప్రభుత్వ సలహాదారు రమణాచారి మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈసారి వేడుకలు మరింత ఉత్సాహంగా, కొత్తగా ఉండేలా చూడాలని సూచించారు. పర్యాటక శాఖ కార్యదర్శి వెంకటేశం మాట్లాడుతూ ఒక్కోరోజు ఒక్కో రంగం మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నామని చెప్పారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా పీపుల్స్ ప్లాజా నుంచి బతుకమ్మ ఘాట్ వరకు మహిళలతో ర్యాలీ నిర్వహించి హుస్సేన్సాగర్లో బతుకమ్మలను నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్, సీఎం కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, హైదరాబాదు జిల్లా కలెక్టర్ యోగితా రాణా, హెచ్.ఎం.డి.ఎ. కమిషనర్ చిరంజీవులు, నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటి మేనేజింగ్ డైరెక్టర్ దినకర్ బాబు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. -
డల్లాస్లో వైభవంగా బతుకమ్మ-దసరా సంబరాలు
డల్లాస్: తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్) కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఆధ్వర్యంలో డల్లాస్లో బతుకమ్మ-దసరా సంబరాలు అంబరాన్ని అంటేలా వైభవంగా జరిగాయి. ప్రవాస తెలంగాణ ప్రజలంతా కలిసివచ్చి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయినా బతుకమ్మ- దసరా పండుగను ఎంతో అట్టహాసంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా చిన్నారులంతా దేవతల, జానపద, చారిత్రాత్మక దుస్తులు ధరించి 'దసరా వేషాలు' పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకుని అందరిని మురిపించారు. ఈ కార్యక్రమానికి యుగంధర్ మరిన్ గంటి స్వామి, మంజురెడ్డి ముప్పిడి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. మహిళలందరూ భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్దంగా గౌరీ దేవీకి పూజలు జరిపి బతుకమ్మ ఆటపాటలతో, కోలాటాల నృత్యాలతో, ఢోల్ భాజాలతో వేడుకలకు కొత్త అందాలను తెచ్చారు. బతుకమ్మ పాటలతో ఊరేగింపులతో బతుకమ్మల నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిపారు. టీరేఫ్ సంస్థ వనితలందరికీ పసుపు, కుంకుమ గాజులు బ్యాగులలో పెట్టి కానుకలు ఇచ్చారు. సాయి నృత్య అకాడమీ నుంచి శ్రీదేవి ఎడ్లపాటి శిష్యులు జమ్మి పూజ ప్రారంభించే ముందు 'హైగిరి నందిని' పాటతో నృత్యాన్ని ప్రదర్శించారు. పురుషులందరూ కూడా జమ్మి పూజలో పాల్గొన్నారు. ఐదువేల మందితో ఆలయ ప్రాంగణమంతా పండుగ సంబరాలతో కిక్కిరిసి పోయింది. 'బీచ్ బీట్స్' అకాడమీ నుంచి ఆదిత్య గంగసాని బృందం కాల్ వాయిద్యాలతో పండుగకి మరింత వన్నె తెచ్చారు. కార్యక్రమంలో పాల్గొనవారికి పులిహోర, దద్ధోజనం, రవ్వకేసరి, సత్తుపిండి ప్రసాదాలతో చక్కటి విందుని టీరేఫ్ ఫుడ్ కమిటీ నిర్వహకులు వడ్డించారు. యోయో, టీ న్యూస్, టీవీ 9, ఐనా మీడియా వారికి టీరేఫ్ కార్యవర్గ బృందం కృతజ్ఞతలను తెలిపింది. టీడీఎఫ్, డల్లాస్, నేషనల్ కార్యవర్గ బృందం కలిసి గత 2006 నుంచి ఈ వేడుకలను ప్రతి ఏడాది ఘనంగా జరుపుతున్నారు. -
వాషింగ్టన్లోనూ బతుకమ్మ సంబరాలు.
-
ఘనంగా ముగిసిన బతుకమ్మ ఉత్సవాలు
డల్లాస్: మునుపెన్నడూ లేనంత ఘనంగా ఈసారి అమెరికాలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. డల్లాస్ నగరంలో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టీపీఏడీ) ఆధ్వర్యంలో దసరా-బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. తొమ్మిది రోజులుగా తెలుగు సంప్రదాయ బద్ధంగా నిర్వహించిన ఈ సంబురాల్లోని చివరి రోజు వేడుకను డా.పెప్పర్ ఆరియన్ లో నిర్వహించారు. దాదాపు పది వేల మంది ఈ వేడుకకు హాజరయ్యారు. వీరిలో దాదాపు 1500 మంది మహిళలు బతుకమ్మ ఆటపాటలతో హోరెత్తించారు. అమెరికా మొత్తంలో ఇక్కడే అతిపెద్ద బతుకమ్మ ఉత్సవం జరిగిన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సినీనటులు, రాజకీయ ప్రముఖులు పలువురు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బుల్లితెర యాంకర్, నటీ శ్రీముఖి, అందాల తార రాశి కన్నన్, రెజీనా, ఈషా రెబ్బా, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, సినీనటి ఆర్కే రోజా, తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, గాయనీగాయకులు గీతా మాధురీ, సతీష్, నరేంద్ర తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను టీపీఏడీ కన్వీనర్ సుధాకర్ కలసాని, సెక్రటరీ కరణ్ పోరెడ్డి, జాయింట్ సెక్రటరీ రమణ లష్కర్లు టీపీఏడీ చైర్మన్ అజయ్ రెడ్డి, వైస్ చైర్మన్ రఘువీర్ బండారు తదితరులు చేపట్టారు. -
అట్టహాసంగా ప్రారంభమైన దసరా-బతుకమ్మ సంబరాలు
డల్లాస్: అమెరికాలోని డల్లాస్ నగరంలో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టీపీఏడీ) ఆధ్వర్యంలో దసరా-బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెలుగు సంప్రదాయం ప్రకారం తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తున్న సంబరాల్లో భాగంగా చివరి రోజైన అక్టోబర్ 8న డా.పెప్పర్ ఆరియన్ లో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. చివరిరోజు వేడుకలకు దాదాపు 10వేల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు కార్యక్రమ నిర్వహకులు వెల్లడించారు. అదే సమయంలో 1500 మంది మహిళలు బతుకమ్మ పాటలతో బతుకమ్మ ఆటలు ఆడుతారు. అమెరికాలో ఇదే అతిపెద్ద బతుకమ్మ ఉత్సవం కావడంతో ఉత్సవాలకు సినీనటులు, రాజకీయ ప్రముఖులు పలువురు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. బుల్లితెర యాంకర్, నటీ శ్రీముఖి, అందాల తార రాశి కన్నన్, రెజీనా, ఈషా రెబ్బా, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, సినీనటి ఆర్కే రోజా, తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, గాయనీగాయకులు గీతా మాధురీ, సతీష్, నరేంద్ర తదితరులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను టీపీఏడీ కన్వీనర్ సుధాకర్ కలసాని, సెక్రటరీ కరణ్ పోరెడ్డి, జాయింట్ సెక్రటరీ రమణ లష్కర్లు టీపీఏడీ చైర్మన్ అజయ్ రెడ్డి, వైస్ చైర్మన్ రఘువీర్ బండారు తదితరులు చేపట్టారు. -
కోటలో వేడుక
-
గంగమ్మ మెరిసె.. గౌరమ్మ మురిసె..
జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబురాలు శనివారం అంబరాన్నంటాయి. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చుకుని చెరువుల వద్దకు తరలివెళ్లారు. గౌరీదేవికి నిర్వహించి ఉయ్యాల పాటలు పాడారు. పిల్లపాపలను చల్లంగా చూసి, ఇళ్లలో సిరులు కురిపించాలని భక్తి శ్రద్ధలతో గౌరమ్మను వేడుకున్నారు. ‘‘మాయమ్మ లక్ష్మీదేవి పోయిరావమ్మా..’’ అంటూ బతుకమ్మను గంగమ్మ ఒడికి ఆనందంగా సాగనంపారు. సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం చెరువుల వద్ద భారీ ఏర్పాట్లు చేసింది. -
బతుకమ్మ మహోత్సవంలో పాల్గొన్న కోదండరాం
-
బతుకమ్మ వేడుకల్లో వెంకయ్య,దత్తాత్రేయ
-
ఈసారి సిటీలో బతుకమ్మ ప్రత్యేకతలివే..!
ఓనం తరహాలో ఘనంగా వేడుకలు కవాడిగూడ (హైదరాబాద్ సిటీ): తెలంగాణ సాంస్కృతిక వైభవం, రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబురాలను ఈసారి కూడా నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కేరళ సంప్రదాయ పండుగ ఓనం తరహాలో ట్యాంక్బండ్ వద్ద బతుకమ్మ వేడుకను గొప్పగా నిర్వహిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 9న ట్యాంక్బండ్ వద్ద నిర్వహించే ఈ వేడుకల ఏర్పాట్లను ఆయన గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ బతుకమ్మ పండుగకు దేశవ్యాప్తంగా గొప్ప పేరుందని, అందుకు తగినవిధంగానే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఈ సంబురాలను నిర్వహిస్తామని తెలిపారు. పెద్ద సంఖ్యలో హాజరయ్యే ప్రజలకు, మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. నగరంలో గణేష్, బక్రీద్ పండుగలు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయని, అదేవిధంగా బతుకమ్మ పండుగను సైతం ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈసారి వర్షాలు పుష్కలంగా పడినందున ప్రజలు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకొంటున్నారని అన్నారు. బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు చేపట్టేందుకు నీళ్ళు కూడా పుష్కలంగా ఉన్నాయన్నారు. వేడుకలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారిశుద్ధ్య సమస్య రాకుండా సానిటేషన్ సిబ్బంది టీమ్లు పనిచేస్తాయన్నారు. రహదారికి ఇరుపైపులా ప్రత్కేక లైటింగ్ను, మంచినీటి సౌకర్యం అందిస్తామన్నారు. 'స్వచ్ఛ భారత్- స్వచ్ఛ హైదరాబాద్'లో భాగంగా మొబైల్ మరుగుదొడ్లను ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. మహిళల రక్షణ కోసం నిఘా సిబ్బందితో పోలీసులు ప్రత్కేక భద్రతా ఏర్పాట్లు చేశారని తెలిపారు. టూరిజం శాఖ, జీహెచ్ఎంసీ సంయుక్తంగా నిర్వహించే బతుకమ్మ సంబురాలలో ప్రజలు సంతోషంగా పాల్గొనాలని ఆయన కోరారు. -
గవర్నర్తో సీఎం కేసీఆర్ భేటీ
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీయ్యారు. రాజ్భవన్లో గురువారం ఉదయం గవర్నర్ను కలిసి దసరా నుంచి ఏర్పడనున్న కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలకు సంబంధించిన వివరాలను సీఎం వివరించారు. బతుకమ్మ ఉత్సవాలకు రావాల్సిందిగా గవర్నర్ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. -
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న హోంమంత్రి
సైదాబాద్: తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ వేడుకలు ప్రతీక అని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఐఎస్సదన్ డివిజన్ పరిధిలోని ఇంద్రప్రస్థ కాలనీ, కేశవనగర్ కాలనీలో బుధవారం జరిగిన బతుకమ్మ వేడుకల్లో రాష్ట్ర హోంమంత్రి పాల్గొని బతుకమ్మ ఆడారు. స్థానిక కార్పొరేటర్ సామ స్వప్న సుందర్రెడ్డి, మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతు అందరిని ఉత్సాహపరిచారు. అనంతరం దాండియా ఆడారు. -
సీఎం క్యాంప్ ఆఫీస్లో బతుకమ్మ వేడుకలు
-
పూలన్నీ పులకించే..
సంగారెడ్డి జోన్: పూలన్నీ పులకించి.. పుడమి తల్లి పరవశించేలా జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలు హుషారుగా సాగాయి. సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం సంబురాలను ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. వయోజన విద్య, జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి, జడ్పీ ఉద్యోగులు సంయుక్తంగా వేడుకల్లో పాల్గొన్నారు. ప్రకృతిని ఆరాధించే మహోన్నత వారసత్వానికి ప్రతిక బతుకమ్మ పండుగ అని ఎస్పీ చంద్రశేఖర్ అన్నారు. కార్యక్రమంలో పోలీస్ మినీస్టిరియల్ స్టాఫ్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు అనురాధ, మహిళ ఉద్యోగులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే ఊరూరా బతుకమ్మల సందడి కనిపించింది. -
పూల సేకరణలో బిజీబిజీ
మిరుదొడ్డి: బతుకమ్మ సంబరాల్లో చిన్నారులు మునిగి తేలుతున్నారు. రంగురంగుల పూలను సేకరించడంలో బిజీ అయ్యారు. ఆ పూలతో బతుకమ్మలను పేర్చి సాయంత్రం పూట మహిళలతో కలిసి ఆడుతూ ఆనందంగా గడుపుతున్నారు. ఆదివారం మిరుదొడ్డిలో చిన్నారులు పూల సేకరణలో బిజీబిజీగా గడుపుతూ కన్పించారు. -
డల్లాస్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
అమెరికాలోని డల్లాస్ నగరంలో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టీపీఏడీ) దసరా-బతుకమ్మ సంబరాల్లో తొలిరోజును ఘనంగా నిర్వహించింది. ఈ మేరకు టీపీఏడీ ఓ ప్రకటన విడుదల చేసింది. సంప్రదాయం ప్రకారం తొమ్మిది రోజుల పాటు సంబరాలు నిర్వహిస్తామని నిర్వహకులు తెలిపారు. ఫ్రిస్కోలోని రిడ్జ్ పార్కులో తొలిరోజు వేడుకలు నిర్వహించినట్లు చెప్పారు. చివరి రోజైన అక్టోబర్ 8న డా.పెప్పర్ ఆరియన్ లో వేడుకలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. తొలిరోజు వేడుకలకు 200 మంది మహిళలు హాజరైనట్లు తెలిపారు. ఉభయ తెలుగురాష్ట్రాల మహిళలు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ పాటలు పాడినట్లు చెప్పారు. చివరిరోజు వేడుకలకు దాదాపు 10వేల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం 60 మంది టీపీఏడీ కమిటీ సభ్యులు నిరంతరం కృషి చేస్తూ స్టేడియంను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమ నిర్వహణకు విరాళాలు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మరిన్ని వివరాల కోసం www.tpadus.orgని చూడాలని చెప్పారు. ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను టీపీఏడీ కన్వీనర్ సుధాకర్ కలసాని, సెక్రటరీ కరణ్ పోరెడ్డి, జాయింట్ సెక్రటరీ రమణ లష్కర్ లు భుజాలకెత్తున్నట్లు తెలిపారు. టీపీఏడీ చైర్మన్ అజయ్ రెడ్డి, వైస్ చైర్మన్ రఘువీర్ బండారు, ఫౌండేషన్ కమిటీ మెంబర్లు రావ్ కల్వల, జానకి మండాది, ఉపేందర్ తెలుగు, మహేందర్ కామిరెడ్డి, రాజ్ గొంధీ, ట్రస్టీలు రామ్ అన్నాది, పవన్ గంగాధర, గంగా దేవర, అశోక్ కొండాల, ప్రవీన్ బిల్లా, మనోహర్ కసగాని, మాధవి సుంకిరెడ్డి, రాజేందర్ తొడిగాల, కార్యనిర్వహణ కమిటీ చంద్రా పోలీస్, లింగా రెడ్డి అల్వా, రూప కన్నయ్యగారి, సురేందర్ చింతల, శ్రీనివాస్ వేముల, శ్రీని గంగాధర, సత్య పెర్కారీ, రవికాంత్ మామిడి, శరత్ యర్రం, సతీశ్ జానుపల్లి, టీపీఏడీ అడ్వైజర్లు వేణు భాగ్యనగర్, సంతోష్ కోర్, విక్రమ్ జనగాం, నరేశ్ సుంకిరెడ్డి, జయ తెలకపల్లి, రవిశంకర్ పటేల్, సహకార కమిటీ అఖిల్ చండీరాల, సునీల్ కుమార్ ఆకుల, లక్ష్మీ పోరెడ్డి, కళ్యాణి తాడిమేటి, మధుమతి వ్యాసరాజు, కారుణ్య దామర్ల, క్రాంతి తేజ పండా, పల్లవి తోటకూర, రత్న ఉప్పల, రోహిత్ నారిమేటి, శంకర్ పరిమళ్, వసుధా రెడ్డి, అనూష వనం, కవిత ఆరుట్ల, మాధవి లోకిరెడ్డి, సతీష్ నాగెళ్లలు కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడినట్లు పేర్కొన్నారు. -
మినిస్టర్స్ క్వార్టర్స్లో బతుకమ్మ సంబరాలు
-
తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయాలి
-
విద్యాసంస్థల్లో సంబరాలు
వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ సతీమణి సిద్దిపేట జోన్: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు సిద్దిపేటలో ప్రారంభమయ్యాయి. అమావాస్యతో మొదలై సద్దుల బతుకమ్మతో వేడుకలను ముగించడం ఆనవాయితీగా వస్తోంది. గురువారం పట్టణంలోని పలు విద్యాసంస్థల్లో బతుకమ్మ వేడుకలు జరిగాయి. శ్రీవాణి విద్యాలయంలో రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. వాటికి ఒక్కదగ్గరికి తెచ్చి బతుకమ్మ ఆడారు. కోలాటం, గౌరమ్మ కార్యక్రమాలు నిర్వహించారు. చక్కటి ప్రదర్శన నిర్వహించిన వారికి మున్సిపల్ చైర్మన్ రాజనర్సు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కృపాకర్, డైరెక్టర్లు సత్యం, రవీందర్రెడ్డి, అశోక్గౌడ్ పాల్గొన్నారు. పట్టణంలోని కేరళ మోడల్ స్కూల్లో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శ్రీసాయి విద్యాలయంలో బతుకమ్మ వేడుకలను కౌన్సిలర్ మల్యాల ప్రశాంత్ ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సత్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మెరిడియన్ హైస్కూల్లో బతుకమ్మ వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో విద్యాసంస్థ ప్రతినిధులు దేవేందర్రెడ్డి, రాజా వెంకట్రాంరెడ్డి, సిబ్బంది ప్రదీప్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
9 దేశాల్లో బతుకమ్మ
♦ జాగృతి అధ్యక్షురాలు కవిత ♦ ఈసారి 1,100చోట్ల సంబురం ♦ బతుకమ్మ పాటల యాప్ విడుదల ♦ వచ్చే నెల 6వ తేదీన 30 వేల మందితో బతుకమ్మ సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ జాగృతి తరపున ఈ ఏడాది 9 దేశాల్లో 11 వందల ప్రాంతాల్లో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నామని సంస్థ అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పారు. జాగృతి తరపున బతుకమ్మ పాటలతో కూడిన మొబైల్ యాప్ను ఆమె తెలంగాణ భవన్లో బుధవారం విడుదల చేశారు. ఈ నెల 30వ తేదీ నుంచి బతుకమ్మ సంబురాలు మొదలవుతాయన్నారు. అక్టోబరు 6న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో 30 వేల మందితో గిన్నిస్ రికార్డు సాధించేలా ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనుందని చెప్పారు. జాగృతి బతుకమ్మ యాప్లో పాటలను డౌన్లోడ్ చేసుకోవచ్చని, పాటలతో పాటు జాగృతి కార్యకలాపాల సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చని అన్నారు. గత ంలో ప్రతీ నియోజకవర్గంలో అయిదు చోట్ల మాత్రమే నిర్వహించామని, ఈసారి పది చోట్ల జరపనున్నామని చెప్పా రు. వర్షాలను శుభసూచకంగా భావించి బతుకమ్మను ఘనంగా జరుపుకోవాలని పిలుపు ఇచ్చారు. తెలంగాణ ఆడబిడ్డలు అందరూ వేడుకల్లో పాల్గొని తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు. ఏపీకి ఇచ్చినంతే తెలంగాణకు ఇవ్వాలి తెలంగాణ విమోచన అన్నప్పుడు మాత్రమే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు తెలంగాణ గుర్తుకు వస్తుందని, వరదలంటే మాత్రం ఏపీ గుర్తుకు వస్తుందని కవిత అన్నారు. వరద సాయంగా ఏపీకి ఎంతిస్తే, తెలంగాణకు అంతే ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దె బ్బకొట్టేందుకు ఒక వర్గం మీడియా కుట్ర చేసిందని, హైదరాబాద్ సాంతం మునిగిపోయినట్లు దుష్ర్పచారం చేసిందని అన్నారు. వర్షాల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. వరదలప్పుడు రాజకీయాలకతీతంగా పనిచేయాల్సిన ప్రతిపక్షాలు వాటినీ రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ అవినీతి గురించి తాము బయట పెట్టదలుచుకుంటే ఇప్పటి వరదల కంటే వారి అవినీతి వరదే ఎక్కువన్నారు. మిడ్మానేరుపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1992లో మిడ్మానేరు నిర్మించాలని ప్రతిపాదిస్తే 2006లో తొలిసారి టెండర్లు పిలిచారని గుర్తుచేసిన ఆమె, 2006 నుంచి రెండేళ్ల కిందటి దాకా ఎవరు అధికారంలో ఉన్నారని ప్రశ్నించారు. గత ఎనిమిదేళ్లలో జరగని పనులు ఈ రెండేళ్లలోనే జరుగుతాయా అని నిలదీశారు. వర్షాలు పడినప్పుడు నష్టం జరుగుతుందని, ఈ సమయంలో ప్రజలకు సాయం చేయకుండా రాజకీయం చేయడం తగదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. -
91 చోట్ల బతుకమ్మ సంబురాలు
తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు ఉదయ్భాస్కర్ జోగిపేట: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘బంగారు బతుకమ్మ’ పేరుతో రాష్ర్ట వ్యాప్తంగా సంబురాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు జి. ఉదయ్ భాస్కర్ అన్నారు. ఆదివారం అందోలు గెస్ట్హౌస్లో బంగారు పండుగ వాల్పోస్టర్, పాటల సీడీలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ర్ట వ్యాప్తంగా 1100 ప్రాంతాల్లో, జిల్లాలో 90 చోట్ల తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బతుకమ్మలను అందంగా, సాంప్రదాయపద్ధతిలో పేర్చిన వారిని గుర్తించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేస్తామన్నారు. అందోలు నియోజవకర్గంలోని 7 మండలాల్లో 9 చోట్ల వేడుకలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో బంగారు బతుకమ్మల మెదక్, నిజామాబాద్ జిల్లాల ఇన్చార్జ్లు ఉదయ్కిరణ్, భిక్షపతి, తెలంగాణ జాగృతి జిల్లా మహిళా అధ్యక్షురాలు మల్లిక, నియోజకవర్గ ఇన్చార్జి అనిల్రాజ్, కో ఇన్చార్జి అశోక్ ముదిరాజ్, కో కన్వీనర్ గీతారెడ్డి, నియోజకవర్గ మహిళా కన్వీనర్లు బాలమణి, వీరమణి, యూత్ విభాగం కన్వీనర్ శేఖర్, సంగారెడ్డి పట్టణ అధ్యక్షులు సురేష్రెడ్డి, మండల కన్వీనర్ బి. చంద్రశేఖర్, నాయకులు వినోద్ పాల్గొన్నారు. -
బతుకమ్మ ఉత్సవాలకు ప్రత్యేక రంగు చీర
హైదరాబాద్: రాష్ట్ర సర్కారు బతుకమ్మ పండుగను సరికొత్త పంథాలో ఆకర్షణీయంగా నిర్వహించబోతుంది. గతేడాది కేటాయించిన రూ.10 కోట్ల బడ్జెట్ను ఈసారి సీఎం కేసీఆర్ రూ.15 కోట్లు పెంచి మంజూరు చేశారు. అందులో బతుకమ్మ పండుగ నిర్వహణకు ప్రతి జిల్లాకు రూ.10 లక్షలు కేటాయించారు. ప్రతి గ్రామంలో బతుకమ్మ పండుగ కళ కనపడేలా చేయనున్నారు. ఈ నెల 30 నుంచి తొమ్మిది రోజులపాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు జరగనున్నాయి. కేరళీయుల గ్రామీణ పండుగ ఓనంను అక్కడి ప్రజలు పదిరోజులపాటు చూడముచ్ఛటగా జరుపుకొంటారు. ఈ పండుగను నేరుగా తిలకించేందుకు విదేశీయులు సైతం హాజరు అవుతారు. సర్కారు కూడా ఈసారి తిరువనంతపురంలో ఓనం పండుగ ఎలా నిర్వహిస్తారో అలాగే వినూత్నంగా హైదరాబాద్లో నిర్వహించాలని సంకల్పించింది. కేరళ మహిళలు 'కసవు చీరలు' ధరించి పండుగ ఉత్సవాల్లో భాగస్వాములు అవుతారు. అదే తరహాలో ఇక్కడ కూడా బతుకమ్మ పండుగలో మహిళలు తెలంగాణ విశిష్ఠతను యాది చేసే ప్రత్యేక రంగుతో కూడిన చీరను తీసుకురానున్నారు. అక్టోబర్ ఆరో తేదీన 15 వేలమంది మహిళలతో ఒకే రంగు చీర ధరింపచేసి ఎల్బీ స్టేడియంలో గ్రాండ్ బతుకమ్మ పేరుతో సరికొత్త సాంస్కృతిక అంశాలు మేళవించి బతుకమ్మ ఉత్సవం నిర్వహించనున్నారు. సర్కారులోని కొందరు అధికారుల ఆలోచనలను సీఎం కార్యాలయ అధికారులు కూడా ఆమోదం తెలినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులు ఒకటి రెండు రోజుల్లో వెల్లడించనున్నారు. తొమ్మిదో తేదీన మాత్రం ట్యాంక్బండ్పై బతుకమ్మ ఉత్సవాలు యథావిధిగా నిర్వహించనున్నారు. -
ముగిసిన బతుకమ్మ సంబరాలు
-
అంబరాన్నంటిన సంబురం
♦ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ♦ ఆటపాటలతో బతుకమ్మను సాగనంపిన ఆడపడుచులు ♦ హైదరాబాద్లో ట్యాంక్బండ్పై కన్నుల పండుగ ♦ ఎల్బీ స్టేడియంలో వేలాది బతుకమ్మలు పేర్చిన మహిళలు ♦ ట్యాంక్బండ్కు భారీ ర్యాలీగా శోభాయాత్ర ♦ అలరించిన సాంస్కృతిక శకటాలు, కళాకారుల ప్రదర్శనలు ♦ రంగురంగుల విద్యుత్ కాంతులు.. ఎల్ఈడీ బెలూన్లు ♦ మిన్నంటిన బాణసంచా వెలుగులు సాక్షి, హైదరాబాద్: ‘పోయి రావమ్మా బతుకమ్మా.. మళ్లేడు దాకా సల్లంగ జూడు బతుకమ్మా.. వెళ్లిరావమ్మా..’ అంటూ కోట్లాది మంది మహిళలు తెలంగాణ ఆడపడుచును సాగనంపారు. ఇంటింటి ఆడపడుచుకు ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలంతా తీరొక్క పూలతో పెద్ద బతుకమ్మను పేర్చి, పసుపుతో గౌరమ్మను చేసి.. మనసు నిండా పూజించి, చల్లంగ చూడాలని మొక్కుకుని ఊరేగింపుగా చెరువుల వద్దకు చేరుకున్నారు. ‘ఒక్కేసి పువ్వేసి చందమామా.. ఒక జాము అయే చందమామా, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ పాటలు పాడి, బతుకమ్మ ఆడి ‘వెళ్లి రావమ్మా.. బతుకమ్మా.. పోయిరావమ్మా గౌరమ్మా..’ అంటూ సాగనంపారు. వరంగల్లోని వేయి స్తంభాల గుడి, పద్మాక్షి అమ్మవారి గుడి ప్రాంగణం, భద్రకాళి ఆలయం వద్ద, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు వైభవంగా జరిగాయి. ఇక హైదరాబాద్లోని ట్యాంక్బండ్ వద్ద ‘సద్దుల బతుకమ్మ’ సంబరాలు అంబరాన్ని తాకాయి. వేలాది బతుకమ్మలు, జిల్లాల శకటాలు, కళాకారుల ప్రదర్శనలతో శోభాయాత్ర, రంగురంగుల విద్యుద్దీపాలు, బాణసంచా వెలుగులు. ఎల్ఈడీ బెలూన్లు అలరించాయి. శోభాయమానం.. సోమవారం నుంచే హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో వేలాది మంది మహిళలు బతుకమ్మలను పేర్చారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 25 పెద్ద బతుకమ్మల వద్ద మంగళవారం సాయంత్రం ఐదున్నర సమయంలో ఎంపీ కవిత గౌరమ్మ పూజ చేశారు. ఆ తర్వాత కవితతో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ర్యాలీగా బయలుదేరారు. వారంతా స్టేడియం బయటకు అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న జిల్లాల శకటాలు, కళాకారులతో కలసి ట్యాంక్బండ్కు శోభాయాత్ర ప్రారంభమైంది. దారి పొడవునా నిర్వహించిన ఆటాపాటా, కళాకారుల ప్రదర్శనలు, నృత్యాలు, విన్యాసాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టాయి. మహిళల కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన 12 మంది కళాకారుల ఒగ్గుడోలు, డప్పు నృత్యాలు అలరించాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కళాకారులు చేసిన భేరీ నృత్యం అందరినీ ఆకర్షించింది. వివిధ జిల్లాలకు చెందిన అస్తిత్వాన్ని ప్రదర్శించే సాంస్కృతిక శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాసర సరస్వతీ దేవి, పొచ్చెర్ల జలపాతం, వన దేవతలతో, అడవిని తలపించేలా రూపొందించిన ఆదిలాబాద్ శకటం.. గోల్కొండ, బిర్లా మందిర్తో ఐడీఎల్ కాలనీలో నిర్మిస్తున్న డబుల్బెడ్రూమ్ ఇళ్ల నమూనాతో కూడిన హైదరాబాద్ శకటం, వేములవాడ రాజరాజేశ్వర ఆలయం నమూనాతో రూపొందిన కరీంనగర్ శకటం, భద్రాచలం పుణ్యక్షేత్రంతో రూపొందించిన ఖమ్మం, మెదక్ మంజీరా శకటం, వరంగల్ కాకతీయ శకటం, ఆలంపూర్ జోగులాంబ ఆలయంతో మహబూబ్నగర్ శకటం ఆకట్టుకున్నాయి. హాజరుకాని సీఎం, గవర్నర్.. సద్దుల బతుకమ్మ ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ దంపతులు, గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొంటారని తొలుత ప్రకటించినా.. వారు హాజరుకాలేదు. గతేడాది వేడుకలకు వారు హాజరవడమే కాకుండా సీఎం సతీమణి, గవర్నర్ సతీమణి బతుకమ్మ ఆడి ఆకట్టుకున్నారు. ఈసారి రాకపోవడంతో చాలా మందికి నిరాశే ఎదురైంది. ట్యాంక్బండ్ వద్ద డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని, తలసాని, అజ్మీరా చందులాల్, టి.పద్మారావు, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం అధికారిక నివాసంలో... సీఎం కేసీఆర్ అధికారిక నివాసంలో సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం సీఎం సతీమణి శోభారాణి, కుమార్తె కవిత, పలువురు మహిళలు బతుకమ్మను పేర్చారు. అనంతరం అక్కడే బతుకమ్మ ఆడారు. బంజరాహిల్స్లోని మంత్రుల నివాస సముదాయంలోనూ బతుకమ్మ శోభ కనిపించింది. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఇంట్లో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, ఎంపీ కవిత, కొందరు మంత్రుల భార్యలు బతుకమ్మను పేర్చారు. జన సాగరం.. పూలహారం రాత్రి 8 గంటల సమయంలో ట్యాంక్బండ్పై లాంఛనంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. అప్పటికే బతుకమ్మల శోభాయాత్రతో పాటు వివిధ ప్రాంతాల నుంచి బతుకమ్మలతో పెద్ద సంఖ్యలో మహిళలు ట్యాంక్బండ్కు చేరుకున్నారు. వేడుకలకు హాజరైన అతిథులు, అధికారులు పెద్ద సంఖ్యలో ఎల్ఈడీ బెలూన్లను గాల్లోకి వదిలారు. మరింత ఎత్తుకు వెళుతున్న కొద్దీ ఈ బెలూన్లు నక్షత్రాల్లా కనిపిస్తూ ఆకట్టుకున్నాయి. అనంతరం మహిళలు బతుకమ్మ ఆడి బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఎంపీ కవిత, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి తదితరులు బతుకమ్మ ఆడారు. వేడుకల నేపథ్యంలో తెలంగాణ సంస్కృతిని, జీవన విధానాన్ని, చరిత్రను ప్రతిబింబించే బతుకమ్మ పాటలు అలరించాయి. ఇక రంగురంగుల బాణసంచా మెరుపులతో హుస్సేన్సాగర్పై హరివిల్లులు విరబూశాయి. బతుకమ్మ శోభాయాత్ర నుంచి నిమజ్జనం వరకు ప్రతి ఘట్టాన్ని హైదరాబాద్ అంతటా భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఓరుగల్లులో వైభవంగా.. సాక్షి ప్రతినిధి, వరంగల్: చారిత్రాత్మక వరంగల్ జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. బతుకమ్మ పుట్టుకతో సంబంధమున్న దేవతగా భావించే పద్మాక్షి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం జరిగిన వేడుకలలో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. తంగేడు, గునుగు, సీతజడ, గుమ్మడి తదితర తీరొక్క పూలతో మురిపెంగా పేర్చిన బతుకమ్మలతో చెరువుల వద్దకు చేరుకున్నారు. బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడారు. భద్రకాళీ దేవాలయ ప్రాంగణం, రంగలీలా మైదానం, బంధం చెరువు, కట్టమల్లన్న చెరువు, పోచమ్మ మైదాన్, వడ్డేపల్లి చెరువు, ఉర్సు రంగసముద్రం చెరువు తదితర చోట్ల బతుకమ్మ వేడుకలు జరిగాయి. మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, నర్సంపేట, పరకాల పట్టణాల్లో సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. -
మా అమ్మ గౌరమ్మా.. బంగారు బతుకమ్మా..
-
‘బతుకమ్మ’ వేడుకల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు
* రేపు సాయంత్రం 4 నుంచి రాత్రి 11.30 వరకు * ట్యాంక్బండ్, ఎల్బీస్టేడియం కేంద్రంగా అమలు సాక్షి, సిటీబ్యూరో: మధ్య మండల పరిధిలోని ఎల్బీ స్టేడియంతో పాటు అప్పర్ ట్యాంక్బండ్పై మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు ప్రాంతాల కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపు నిబంధన విధిస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం 4 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఇవి అమలులో ఉండనున్నాయి. ఆ సమయంలో సికింద్రాబాద్, కట్టమైసమ్మ, కవాడీగూడ, ఇక్బాల్మీనార్, ఏఆర్ పెట్రోల్ పంప్, డీజేఆర్ స్టాట్యూ, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, పోలీసు కంట్రోల్ రూమ్, నాంపల్లి, హిమాయత్నగర్ వై జంక్షన్, పంజగుట్ట, రాజ్భవన్, బుద్ధభవన్ వైపునకు ప్రయాణించే వాహనచోదకులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని కమిషనర్ కోరారు. కార్యక్రమాలకు హాజరయ్యే ఆహుతులు తమకు జారీ చేసిన పాసుల శ్రేణిని బట్టి నిర్ణీత ప్రాంతాల్లో ఆపి దిగిపోవడంతో పాటు కేటాయించిన ప్రాంతాల్లోనే పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కారు పాసుల్లేని వాహనాలను ట్రాఫిక్ మళ్లింపులు ఉన్న ప్రాంతాలు దాటి రావడానికి అనుమతించరు. చిల్డ్రన్ పార్క్ జంక్షన్ దాటి, ఎల్బీ స్టేడియం నుంచి అప్పర్ ట్యాంక్బండ్ మధ్య ఉన్న బషీర్బాగ్, లిబర్టీ, అంబేద్కర్ స్టాట్యూ మధ్య వాహనాలను అనుమతించరు. ఆహుతులు తమ డ్రైవర్ నెంబర్లను దగ్గర ఉంచుకుని, కార్యక్రమం ముగిసిన తర్వాత మాత్రమే నిర్ణీత ప్రాంతాలకు కార్లను పిలిపించుకోవాలని పోలీసులు కోరుతున్నారు. బతుకమ్మ సంబరాలకు భారీ బందోబస్తు ఖైరతాబాద్: బతుకమ్మ సంబరాలకు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు సైఫాబాద్ ఇన్స్పెక్టర్ పూర్ణచందర్ తెలిపారు. సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు ఏసీపీలు, 20మంది సీఐలు, 60మంది ఎస్ఐలతో పాటు మొత్తం 400 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లా నుంచి 200 మంది మహిళలతో పాటు 10 వేల మంది మహిళా పొదుపు సంఘాల మహిళలు మొత్తం 12వేల మంది మహిళలు లాల్బహదూర్ స్టేడియంలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు. వీరితో పాటు రాజకీయ, ఇతర ప్రముఖులు, నాయకులు పాల్గొనే ఈ కార్యక్రమంలో జిల్లాల వారీగా ప్రత్యేక శకటాలు లాల్బహదూర్ స్టేడియం నుంచి ట్యాంక్బండ్ వరకు ప్రదర్శనగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో 20వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బతుకమ్మ ఘాట్లకు రూ.70లక్షలు బంజారాహిల్స్: సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా ఎన్టీఆర్ మార్గ్, నెక్లస్ రోడ్, ట్యాంక్బండ్ పైన ఉన్న బతుకమ్మ ఘాట్లలో బతుకమ్మ నిమజ్జనాలు చేసేందుకు ఏడు ఘాట్లను సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు రూ.70లక్షల నిధులు వెచ్చిస్తున్నట్లు జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ కమిషనర్ కిషన్ తెలిపారు. ఈ ఘాట్లలో పరిశుభ్రమైన నీరు ఉండే విధంగా చెత్తను తొలగిస్తున్నామని రోడ్డు మరమ్మతులు చేపట్టి లైటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛమైన నీళ్లలో బతుకమ్మ నిమజ్జనం చేసే విధంగా కొన్ని చోట్ల టబ్ల నిర్మాణం కూడా చేపడుతున్నట్లు వెల్లడించారు. సోమవారం సాయంత్రానికి ఘాట్ల వద్ద పూర్తి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. -
పూల వెలుగులు
-
బతుకమ్మ వేడుకల్లో కేసీఆర్ సతీమణి
సీఎం కేసీఆర్ సతీమణి శోభ తెలంగాణ భవన్ లో శనివారం జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. శోభ రాకతో.. తెలంగాణ భవన్ లో సందడి వాతావరణం నెలకొంది. బతుకమ్మ వేడుకలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలి వచ్చారు. వారిలో కలిసి సీఎం సతీమణి బతుకమ్మ ఆడారు. కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. గతంలో టీజీవో భవన్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో శోభ పాల్గొన్న సంగతి తెలిసిందే. అప్పట్లో మహిళా ఉద్యోగులతో కలిసి ఆమె బతుకమ్మ ఆడారు. -
బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న కవిత
-
తల్లీ బతుకమ్మ
-
అసెంబ్లీ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు
-
‘మండలి’ సిబ్బంది బతుకమ్మ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో పూల వేడుకగా బతుకమ్మ ప్రసిద్ధి చెందిందని శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. మంగళవారం మండలి సచివాలయ సిబ్బంది అసెంబ్లీ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి మండలి చైర్మన్ స్వామిగౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా మహిళలతో కలసి ఆయన బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంత ఘనంగా బతుకమ్మ పండుగ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని, ఇలాంటి అవకాశం వలస పాలనలో రాలేదని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక ఆ స్వేచ్ఛ లభించిందని చెప్పారు. కార్యక్రమంలో శాసనసభ కార్యదర్శి రాజా సదారాం, డిప్యూటీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, టీఆర్ఎస్ నేత రాజేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
హుస్నాబాద్లో నేడు బంగారు బతుకమ్మ
ముకరంపుర/హుస్నాబాద్రూరల్/భీమదేవరపల్లి : తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం హుస్నాబాద్లో బంగారు బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఆర్టీసీ గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జాగృతి జిల్లా ఇన్చార్జి ప్రణీత్రావు, జిల్లా కన్వీనర్ జాడి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం కరీంనగర్ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తంగా చాటిచెప్పిన బతుకమ్మ పండుగను జాగృతి సంస్థ తొమ్మిదేళ్లుగా నిర్వహిస్తోందన్నారు. హుస్నాబాద్లో జరిగే వేడుకలకు నిజామాబాద్ ఎంపీ, జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరువుతారని తెలిపారు. సాయంత్రం మల్లెచెట్లు చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు లంబాడీ నృత్యాలు, ఒగ్గుడోలు కళారూపాలతో ప్రదర్శన ఉంటుందన్నారు. సుమారు 20 వేల మంది మహిళలు వచ్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. 200 మంది జాగృతి కార్యకర్తలు వాలంటీర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతాయని పేర్కొన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి బంగారు బతుకమ్మ వేడుకను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జాగృతి జిల్లా అధికార ప్రతినిధి ఇమ్రాన్ అహ్మద్, విద్యార్థి విభాగం రాష్ట్ర కో కన్వీనర్ పసుల చరణ్, మహిళా సమాఖ్య జిల్లా కన్వీనర్ గందె కల్పన, యువజన విభాగం జిల్లా కన్వీనర్ ఠాకూర్ సంగ్రామ్సింగ్, జిల్లా కోశాధికారి గన్నమనేని రంగారావు, పీఆర్వో పుల్లూరి రవీందర్, కవి నంది శ్రీనివాస్, సిటీ మహిళా కన్వీనర్ తొడుపునూరి పద్మజ, యువజన సమాఖ్య జిల్లా కో కన్వీనర్ మల్లేషం పాల్గొన్నారు. ముల్కనూర్ టు హుస్నాబాద్.. బంగారు బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు ఎంపీ కవిత మంగళవారం ఉదయం 9గంటలకు భీమదేవరపల్లి మండలం ముల్కనూరు చేరుకుంటారని జాగృతి జిల్లా కో కన్వీనర్ మూల రాంగౌడ్ తెలిపారు. స్థానిక వెంకటసాయి గార్డెన్స్లో సుమారు వెయ్యి మంది మహిళలతో కలిసి బతుకమ్మను పేర్చనున్నారని చెప్పారు. ఏర్పాట్లను ఎంపీపీ సంగ సంపత్యాదవ్, ఎస్సై సతీష్, సర్పంచ్ వంగ రవీందర్గౌడ్ పరిశీలించారు. ముల్కనూర్లో బతుకమ్మ పేర్చిన అనంతరం కవిత ఉదయం 10 గంటలకు హుస్నాబాద్ మండ లం పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారని ఎమ్మెల్యే సతీష్కుమార్ తెలిపారు. 11 గంటలకు స్థానిక జయశ ంకర్ డిఫెన్స్ అకాడమీ ట్రైనింగ్ క్యాంపును సందర్శించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. 11.30 గంటలకు కేజేఆర్ గార్డెన్కు చేరుకుని బతుకమ్మ పేర్చుతారని తెలిపారు. సాయంత్రం 5గంటలకు మల్లెచెట్టు చౌరస్తా నుంచి బతుకమ్మలతో ర్యాలీగా వెళ్లి ఆరు గంటలకు ఆర్టీసీ డిపోగ్రౌండ్లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. -
నందనవనం
-
బంగారు బతుకమ్మతో ప్రజాక్షేమం
-
వర్ణ సంగమం
12 నుంచి బతుకమ్మ వేడుకలు ఘనంగా జీహెచ్ఎంసీ ఏర్పాట్లు వివిధ జంక్షన్లలో వంద భారీ బతుకమ్మలు సిటీబ్యూరో: మహా నగరం రంగు రంగుల పూల వనంగా మారనుంది. బంగారు బతుకమ్మ ఉత్సవాలకు గ్రేటర్ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ నెల 12 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ బతుకు చిత్రానికి... సంప్రదాయానికి... సంస్కృతికి... సబ్బండ వర్ణాల కళలు... ఆకాంక్షలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. సోమవారం నుంచి మహిళలు బతుకమ్మ ఆటలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వారికి తగిన సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.నగరం నలుమూలల నుంచి ప్రజలు ట్యాంక్బండ్కు చేరుకోనున్న నేపథ్యంలో... అన్ని ప్రాంతాల నుంచి అటువైపు వెళ్లే ప్రధాన రహదారుల మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. వీధి దీపాలు, ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు చేయనుండడంతో బతుకమ్మలు కొత్త కాంతులతో తళుకులీననున్నాయి. బతుకమ్మ విశిష్టతను చాటేలా... నగరమంతా పూలవనంలా మార్చేందుకువంద చోట్ల భారీ హోర్డింగులు, యూనిపోల్స్తో ప్రత్యేక ప్రచారం నిర్వహించనున్నారు. దాదాపు వంద ప్రధాన కూడళ్లలో భారీ బతుకమ్మలను ఏర్పాటు చేయనున్నారు. వంద బస్ షెల్టర్లు, మరో వంద ప్రాం తాల్లో ప్రత్యేకంగా రూపొందిస్తున్న త్రిభుజాకార ఫ్రేమ్స్ తదితరమైన వాటి తో ప్రచారం చేయనున్నారు. ఎన్నో వన్నెల బతుకమ్మలు.. వాటి చుట్టూ పాటలు పాడుతూ.. మహిళలు ఆటలాడే రమణీయ దృశ్యాలను కనువిందు చేసేలా హోర్డింగులపై చిత్రీకరించనున్నారు. ఫుట్ఓవర్ బ్రిడ్జిలు (ఎఫ్ఓబీలు), ఆర్చిలన్నింటినీ పూలతో ముస్తాబు చేయాలని... దేశ, విదేశీ పర్యాటకులకు బతుకమ్మ ఉత్సవాల విశిష్టత తెలిపి వారి మనసు దోచుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మహా నగర పాలక సంస్థ నిర్ణయించింది. నగర వ్యాప్తంగా అన్ని డివిజన్ల పరిధిలో స్థానికంగా బతుకమ్మలను ఆడే మహిళలు...వాటిని నిమజ్జనం చేసేం దుకు వివిధ చెరువుల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ప్రత్యేక ఏర్పాట్లివీ... ట్యాంక్బండ్పై గత సంవత్సరం ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్ను ప్రత్యేకంగా తీర్చిదిద్దనున్నారు. నగరంలోని అన్ని ప్రధాన మార్గాల్లోనూ రంగు రంగుల విద్యుల్లతలను తోరణాలుగా అమర్చే పనులు చేయనున్నారు. నగర వ్యాప్తంగా ఉన్న చెరువుల వద్ద అవసరమైనన్ని తాత్కాలిక లైట్లతో పాటు రంగురంగుల విద్యుద్దీపాలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. ప్రధాన రహదారుల్లోని సెంట్రల్ మీడియన్లలోనూ రంగుల విద్యుల్లతలను ఏర్పాటు చేయనున్నారు. నెక్లెస్ రోడ్డు, బషీర్బాగ్, ట్యాంక్బండ్ సహా వివిధ జంక్షన్లలో 5-9 అడుగుల ఎత్తయిన భారీ బతుకమ్మలను సోమవారం నుంచి తొమ్మిది రోజుల పాటు ప్రదర్శన లో ఉంచనున్నారు. దీని కోసం వివిధ డిజైన్లు, రకరకాల పూలతో కూడిన బతుకమ్మ నమూనాలను పరిశీలిస్తున్నారు. -
12 నుంచి 20 వరకూ బతుకమ్మ సంబురాలు
హైదరాబాద్ : తెలంగాణ మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే బతుకమ్మ పండుగను వైభవోపేతంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. బతుకమ్మ పండుగ నిర్వహణపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా ప్రభుత్వం ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకూ ఘనంగా బతుకమ్మ సంబురాలు నిర్వహించనుంది. హైదరాబాద్ సహా జిల్లాల్లో బతుకమ్మ నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాల్లో భాగంగా ఎల్బీ స్టేడియంలో చివరిరోజు బతుకమ్మలను పేర్చుకుని మహిళలతో ట్యాంక్బండ్ వరకు ఊరేగింపు ఉంటుంది. అలాగే ఊరేగింపుతోపాటు మంగళవాయిద్యాలు, మేళతాళాలు, కళాకారులు తెలంగాణ కళలను ప్రదర్శించనున్నారు. -
ప్రజల బతుకు బంగారం కావాలి
- అందుకే బతుకమ్మ ఉత్సవాలు - జాగృతి అధ్యక్షురాలు కవిత - 12 నుంచి 19 వరకు ఉత్సవాలు - బతుకమ్మ వాల్ పోస్టర్ విడుదల సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట ప్రజల బతుకు బంగారం కావాలనే.. బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత పేర్కొన్నారు. గురువారం తెలంగాణ భవన్లో ఆమె బతుకమ్మ పండుగ వాల్ పోస్టర్, పాటల సీడీలు, పుస్తకాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పది జిల్లాల జాగృతి అధ్యక్షులు, మహిళలు పాల్గొన్నారు. బతుకమ్మ ఉత్సవాలు మొదలైనప్పటి నుంచి అనేక అవమానాలు ఎదుర్కొన్నామని, ఇప్పటికీ అనేక ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఉత్సవాల నిర్వహణకు తన నగలు తాకట్టు పెట్టిన సందర్భాలున్నాయని గుర్తుచేసుకున్నారు. స్వాతంత్రోద్యమ కాలంలో బాలగంగాధర్ తిలక్ నిర్వహించిన గణేశ్ ఉత్సవాల స్ఫూర్తితోనే బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉద్యమాల్లో సాంస్కృతిక ప్రాధాన్యం గుర్తించిన జాగృతి.. రాష్ట్ర మహిళలందరినీ బతుకమ్మతో ఏకతాటిపైకి తీసుకొచ్చిందని వివరించారు. బతుకమ్మ ఆడుకోవడానికి హైదరాబాద్లో ఒకప్పుడు ఇబ్బంది ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా చేశామని పేర్కొన్నారు. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలు ఎక్కడెక్కడ నిర్వహిస్తారో ఆమె వెల్లడించారు. ఇవీ పట్టణాలు.. తేదీలు.. అక్టోబరు 12న నర్సంపేట (వరంగల్ జిల్లా), 13న హుస్నాబాద్ (కరీంనగర్), 14న కామారెడ్డి (నిజామాబాద్), అక్టోబర్ 15న కౌడిపల్లి (మెదక్), 16న వికారాబాద్ (రంగారెడ్డి), 17న కొత్తకోట (మహబూబ్నగర్), 18న ముంబై (మహారాష్ట్ర), 19న దేవరకొండ (నల్లగొండ)లో బతుకమ్మ పండుగను నిర్వహించనున్నట్లు తెలిపారు. -
ఈ నెల 20నుంచి బతుకమ్మ సంబరాలు
-
ఐర్లాండ్లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
-
జిల్లా ప్రజలకు పొంగులేటి శుభాకాంక్షలు
సాక్షి, ఖమ్మం: జిల్లా ప్రజలకు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తొమ్మిది రోజుల పాటు ఆడపడుచులు, చిన్నారులు ఉత్సాహంగా బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారని, మళ్లీ వచ్చే బతుకమ్మ పండుగను ఇంతకంటే ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా వేర్వేరు ప్రకటనల్లో జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. -
బంగారు బతుకమ్మ
కళాకారులు తమ సృజనతో సరికొత్త రీతిలో బతుకమ్మలను ఆవిష్కరిస్తున్నారు. అల్వాల్ వాసి పూనా ప్రదీప్కుమార్ 0.08 మిల్లీగ్రాముల బంగారంతో కంటి రెప్పల మధ్య ఇమిడిపోయే బతుకమ్మను రూపొందించాడు. హస్తినాపురం కళాకారుడు విద్యాధరచారి పధ్నాలుగు రకాల పూలతో బల్బులో బతుకమ్మను అమర్చి అబ్బురపరిచాడు. - అల్వాల్/హస్తినాపురం -
ట్యాంక్ బండ్పై సద్దుల బతుకమ్మ సంబరాలు
-
నేడు సద్దుల సంబరం
- గౌరీదేవిని కొలిచిన మహిళాలోకం - నేడు సద్దుల బతుకమ్మ సిరిసిల్ల/కరీంనగర్ కల్చరల్ : ప్రకృతి ఆరాధనతో కూడిన బతుకమ్మ పండగను జిల్లా మహిళలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించుకున్నారు. బతుకమ్మ పాటలు పాడుతూ.. పాదం కలుపుతూ ఊరూవాడను ఏకం చేశారు. పల్లెపల్లెనా ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ అనే పాటలు మార్మోగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండగకు అధికారిగా గుర్తింపు ఇచ్చింది. నిర్వహణ కుసైతం ఏర్పాట్లు చేసింది. మహిళలు ఇందులో భాగస్వాములయ్యారు. జిల్లావ్యాప్తంగా గురువారం సద్దుల బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. అధికారిక ఏర్పాట్లు బతుకమ్మ పండగ నిర్వహణకు తొలిసారిగా అధికారికంగా ఏర్పాట్లు జరిగాయి. అన్ని స్థాయిల్లోనూ అధికారులు భాగస్వాములవుతూ.. బతుకమ్మ పండగను నిర్వహించారు. బతుకమ్మ పాటల పోటీలు, ఫలహారం తయారీ పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఒక్కోచోట వేర్వేరుగా.. జిల్లాలో సద్దుల బతుకమ్మ విడతలవారీగా నిర్వహిస్తున్నారు. వేములవాడలో ఏడు రోజుల్లోనే బతుకమ్మ నిమజ్జనం జరిగింది. రుద్రంగి, కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల్లో పదకొండు రోజులుకు జరుపుకుంటారు. జిల్లావ్యాప్తంగా గురువారం మెజార్టీ ప్రాంతాల్లో బతుకమ్మ నిమజ్జనం జరుగుతుంది. బతుకమ్మ పండుగ ప్రతి ఏటా జరుగుతున్నా.. తెలంగాణరాష్ట్రంలో తొలిసారి మాత్రం అధికారికంగా జరగడం మహిళా ఉద్యోగుల భాగస్వామ్యం పెరగడం విశేషం. తెలంగాణ మహిళలున్న ప్రతి దేశంలోనూ బతుకమ్మ ఆటలు వేడుకగా జరిగాయి. పూలతో తీర్చిదిద్ది సద్దుల బతుకమ్మ కోసం మహిళలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గుమ్మడి, తంగేడు, గునుగు, పట్టుకుచ్చులు, చేమంతి, కట్లపువ్వులు, గోరింటతోపాటు అందుబాటులో ఉన్న ఇతర పూలనూ వినియోగిస్తారు. బతుకమ్మ పైభాగంలో గౌరీదేవిని ప్రతిష్ఠించి అగరవత్తులు, ప్రమిదలు వెలిగించి వీధి కూడళ్లలో పెట్టి మహిళలు వాటి చుట్టూ తిరుగుతూ ‘పోవయ్యా దేవ ఉయ్యాలో... తేవయ్యా పూలు ఉయ్యాలో, ఒక్కేసి పువ్వేసి సందమామ.. ఒక్క జాములాయే సందమామ’ అంటూ పాటలు పాడుతారు. చివరగా సమీప చెరువులు, కుంటల్లో బతుకమ్మలు నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత వరి, గోధుమ, నువ్వులు, పెసర, మినుము, మొక్కజొన్న వంటి నవధాన్యాలు, చక్కెర కలిపి చేసిన పిండిని వాయినాలుగా ఇచ్చుకుంటారు. దీంతో బతుకమ్మ పండగ ముగుస్తుంది. భగ్గుమంటున్న ధరలు ఈ ఏడాది తంగేడు పూలు, గునుగ పూలు అవసరం మేరకు అందుబాటులో లేవు. దీంతో వ్యాపారులు పిడికెడు తంగేడుపూలను రూ. పది విక్రయించారు. గునుగు పూలకట్టలు మూడింటికి రూ.10 చొప్పున వసూలుచేశారు. చేమంతి పూలు కిలోకు రూ.200 నుంచి రూ250 అమ్మకాలు సాగించారు. బంతిపూలు కిలో 250 రూపాయలకు అమ్మారు.