Notifications
-
మరో 35 వేల పోస్టులకు నోటిఫికేషన్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తామని.. మరో 35 వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన మాసబ్ట్యాంక్లో బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్ను సీఎం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ఉద్యోగాల కోసం విద్యార్థులు పోరాటాలు చేశారని.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. తెలంగాణలో మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువ. తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత కూడా నిరుద్యోగం ఎక్కువగా ఉంది’’ అని సీఎం రేవంత్ అన్నారు.‘‘నిరుద్యోగుల దశ, దిశ నిర్దేశించడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కోసం కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద నిధులు ఇస్తున్నాం. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగులకు శిక్షణ ఇస్తారు. ఉద్యోగాలు రాక తెలంగాణ యువత డ్రగ్స్, గంజాయిలకు బానిసలుగా మారుతున్నారు. పరిశ్రమలకు, నిరుద్యోగులకు మధ్య గ్యాప్ ఉంది.’’ అని సీఎం రేవంత్ తెలిపారు.ఇదీ చదవండి: నా కాలేజీలు కాంగ్రెస్ హయాంలో కట్టినవే: మాజీ మంత్రి మల్లారెడ్డి‘‘ప్రతిభ ఉన్నా.. నైపుణ్యం లేకపోతే ఉద్యోగ అవకాశాలు రావు. అందుకే ఈ సమస్యను గుర్తించి నైపుణ్య శిక్షణ అందించే చర్యలు చేపట్టాం. తెలంగాణలో ప్రతీ ఏటా 3 లక్షల మంది డిగ్రీ పట్టాలు పొంది బయటకు వస్తున్నారు. కానీ వారికి ఇండస్ట్రీ అవసరాలకు సంబంధించి నైపుణ్యం లేకపోవడంతో ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని అందించాలనే బీఎఫ్ఎస్ఐ తో మాట్లాడాం. బీఎఫ్ఎస్ఐ ఇచ్చిన ప్రతిపాదనలతో ఒక ప్రణాళిక రూపొందించాం. డిగ్రీ పట్టా పొందేనాటికి విద్యార్థులకు నైపుణ్యాన్ని అందించాలనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి అవసరమైన నిధులను కూడా వాళ్లే సమకూర్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.ఈ శిక్షణ తరువాత బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్సూరెన్స్ సెక్టార్స్ లో ఉద్యోగాలు పొందుతారు. ప్రపంచానికి నైపుణ్యం కలిగిన యువతను అందించాలనేదే మా లక్ష్యం. గత పదేళ్లలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక కొంతమంది తెలంగాణ యువత గంజాయి, డ్రగ్స్కు బానిసలయ్యారు. ఇటీవల పట్టుబడినవారిలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉండటం ఆందోళనకరమైన విషయం. డ్రగ్స్, గంజాయి నియంత్రించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. వ్యసనాల నుంచి యువతను బయటపడేయాలంటే ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది.65 ఐటీఐలను అప్గ్రేడ్ చేసి టాటా టెక్నాలజీస్ సహకారంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నాం.. రాబోయే రెండేళ్లలో అన్ని ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తాం.. ఇంజనీరింగ్ కాలేజీలపైనా ప్రత్యేక దృష్టి సారించాం. కనీస ప్రమాణాలు లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీల అనుమతులు రద్దు చేయడం ఖాయం. పాలిటెక్నిక్ కాలేజీలను అప్ గ్రేడ్ చేస్తున్నాం.యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా విద్యార్థులకు నైపుణ్యం అందించబోతున్నాం. హైదరాబాద్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చడమే కాదు.. నైపుణ్యం అందించడంలోనూ హైదరాబాద్ కేరాఫ్ గా మార్చనున్నాం. సాంకేతిక నైపుణ్యానికి హైదరాబాద్ డెస్టినేషన్ కావాలి. ప్రపంచ వేదికపై హైదరాబాద్ను విశ్వనగరంగా నిలబెట్టాలి. అందుకు మీ అందరి సహకారం అవసరం.రాబోయే ఏడాదిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీ ఏర్పాటు చేస్తాం. తెలంగాణను దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దుతాం. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన వారు ప్రపంచంలోనే పెద్ద సంస్థలకు సీఈవోలుగా ఉన్నారు. అలాంటి వారి సహకారం తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళతాం’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
Apple: స్పైవేర్ దాడులు జరగొచ్చు
న్యూఢిల్లీ: ప్రభుత్వ మద్దతున్న సైబర్ నేరగాళ్లు మీ ఐఫోన్ తదితర యాపిల్ ఉత్పత్తులపై సైబర్దాడులు చేయొచ్చని గతంలో హెచ్చరించి తీవ్ర చర్చకు తెరలేపిన యాపిల్ సంస్థ తాజాగా మరోమారు అలాంటి హెచ్చరికనే చేసింది. పెగాసస్ తరహా అత్యంత అధునాతనమైన స్పైవేర్ దాడులు కీలకమైన పాత్రికేయులు, కార్యకర్తలు, రాజకీయవేత్తలు, దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుని జరగొచ్చని యాపిల్ ఏప్రిల్ పదో తేదీ ఒక ‘థ్రెట్’ నోటిఫికేషన్లో పేర్కొంది. ‘‘కొనుగోలుచేసిన అధునాతన స్పైవేర్తో సైబర్ దాడులు జరిగే అవకాశాలను ముందే పసిగట్టి యూజర్లకు సమాచారం ఇవ్వడం, వారిని అప్రమత్తం చేయడం కోసం థ్రెట్ నోటిఫికేషన్లను రూపొందించాం. సాధారణ సైబర్నేరాల కంటే ఈ దాడులు చాలా సంక్షిష్టమైనవి. అత్యంత తక్కువ మందినే లక్ష్యంగా చేసుకుంటారు కాబట్టి ఎవరిపై, ఎందుకు దాడి చేస్తారో చెప్పడం కష్టం. అయితే దాడి జరిగే అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా అంచనావేసి ముందే యూజర్లను అప్రమత్తం చేస్తాం’’ అని థ్రెట్ నోటిఫికేషన్లో యాపిల్ హెచ్చరించింది. సార్వత్రిక ఎన్నికలకు సంసిద్ధమవుతున్న భారత్సహా 60 దేశాల్లోని యూజర్లకు యాపిల్ ఈ నోటిఫికేషన్లు పంపించింది. ఇజ్రాయెల్ తయారీ పెగాసస్ స్పైవేర్ సాయంతో మొబైల్ ఫోన్కు వాట్సాప్ ద్వారా మిస్డ్కాల్ ఇచ్చి కూడా ఆ ఫోన్ను సైబర్నేరగాళ్లు తమ నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. ‘‘ఎవరైనా యూజర్ను సైబర్నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటే ముందే గుర్తించి ఆ యూజర్ను హెచ్చరిస్తాం. ఐఫోన్ను సైబర్భూతం నుంచి కాపాడాలంటే దానిని లాక్డౌన్ మోడ్లో పెట్టుకోవచ్చు. అప్పుడు ఆ ఫోన్లో ఫింగర్ఫ్రింట్ సెన్సార్, ఫేఫియల్ రికగ్నీషన్, వాయిస్ రిగ్నీషన్ ఏవీ పనిచేయవు. ఒకవేళ మనమే మళ్లీ వాడుకోవాలంటే పిన్ లేదా పాస్కోడ్ లేదా ప్యాట్రన్ సాయంతోనే మళ్లీ ఫోన్ను పనిచేసేలా చేయొచ్చు’’ అని యాపిల్ సూచించింది. ఒక సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 49 శాతం సంస్థలు తమ ఉద్యోగుల డివైజ్లపై సైబర్ దాడులు/ ఉల్లంఘన ఉదంతాలను పసిగట్ట లేకపోతు న్నాయి. భారత్లో లెక్కిస్తే మొబైల్ మాల్వే ర్ సాయంతో సగటు వారానికి 4.3 శాతం సంస్థలపై సైబర్ దాడులు జరుగుతు న్నాయి. అదే ఆసియాపసిఫిక్ ప్రాంతంలో అయితే గత ఆరు నెలల్లో సగటును 2.6 శాతం సంస్థలపై సైబర్ దాడులు చోటుచేసుకున్నాయి. -
అప్పటి సర్వీస్ కమిషన్ కాదు బాసూ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్సర్వీస్ కమిషన్.. ఒకప్పుడు చంద్రబాబు సేవలో తరించిన ఈ సంస్థ.. ఇప్పుడు నిరుద్యోగుల సేవలో లీనమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సంస్థను పూర్తిగా ప్రక్షాళన జరిపి, నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చే కేంద్రంగా మలిచారు. ఇది గత నాలుగున్నరేళ్లల్లో 78 నోటిఫికేషన్లు ఇచ్చి, 6,296 ఉద్యోగాలను వివాద రహితంగా భర్తీ చేసింది. అంతేకాకుండా సచివాలయాల్లో ఒకేసారి 1.21 లక్షల మందిని నియమించి రికార్డు సృష్టించింది. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చి వివాదాల్లో ఉన్నవాటిని సైతం పరిష్కరించి, పోస్టుల భర్తీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఇందులో విద్యావంతులైన నిరుద్యోగ యువతకు మేలు చేసేలా గ్రూప్–1, గ్రూప్–2 వంటి గెజిటెడ్ పోస్టులతో పాటు, వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఇంజినీర్లు, అగ్రికల్చరల్ ఆఫీసర్లు, మరెన్నో నాన్ గెజిటెడ్ పోస్టులకు నియామకాలు పూర్తి చేశారు. ఒక్క కోర్టు కేసు లేదు.. ఒక్క విమర్శా లేదు.. ఒక్క ఫిర్యాదూ లేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదకలో దేశంలోని 15 రాష్ట్రాల సర్వీస్ కమిషన్లు వివాదాల్లో చిక్కుకుంటే, వివాద రహితంగా ఉద్యోగాలు భర్తీ చేసిన బోర్డుగా ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడే పచ్చ మీడియా బాసు రామోజీకి కాలేది. ‘ఏ వివాదం లేకుండా, ఉద్యోగాలెలా ఇచ్చేస్తారు? అసలు వివాదాలు పెట్టేదే ఉద్యోగాలు ఎగ్గొట్టడానికి కదా. చంద్రబాబు హయాంలో అంతా ఇలానే జరిగింది కదా! ఇప్పుడంతా సక్రమంగా జరగడమేంటి’ అంటూ లోలోన మండిపోయి.. ఏపీపీఎస్సీపై ఓ బండ వేయాలని చూశారు. చంద్రబాబు హయాంలో ఏపీపీఎస్సీలో చైర్మన్, సభ్యుల నియామకాల్లో జరిగిన ఆశ్రిత పక్షపాతం, అవకతవకలను వదిలేసి, ఇప్పుడు కమిషన్ను ప్రక్షాళన చేసి నియామకాలన్నీ రాజ్యాంగబద్ధంగా జరిగినప్పటికీ, ‘‘ఏపీపీఎస్సీనా? వైసీపీఎస్సీనా?’’ అంటూ ఈనాడు పత్రికలో విషం కక్కారు. కమిషన్ను కమీషన్లతో నింపేసిన బాబు చంద్రబాబు సీఎంగా ఉండగా ఏపీపీఎస్సీని తన అభిమానులు, తనకు సేవ చేసే వారితో నింపేశారు. ఆయన హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చినా పరీక్షలు ఎప్పుడు జరిగేది, నియామకాలు ఎప్పుడు పూర్తయ్యేదీ తెలియని పరిస్థితి. ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్ పైనా అనేక వివాదాలు.. కోర్టు కేసులు వంటి కారణాలతో నిలిచిపోవడమో లేక పరీక్షలు రద్దు కావడమో జరిగేవి. 2014–18 మధ్య ఇచ్చిన నోటిఫికేషను వేళ్లపై లెక్కించేవే అయినా దాదాపు 350కి పైగా కేసులు పడ్డాయి. అసలు సభ్యుల నియామకమే కమీషన్లపై జరిగిందని ఆ పార్టీలోని ముఖ్య నేతలే విమర్శించారు. 2014 ఎన్నికలకు ఎన్నారైల నుంచి నిధులు సేకరించినందుకు ఉదయ్ భాస్కర్కు ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి కట్టబెట్టారన్న విమర్శలు ఉండేవి. సభ్యుల విషయానికి వస్తే నాటి ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే కుమార్తె గుర్రం సుజాత, తాడికొండలో టీడీపీ అభిమాని విజయకుమార్, నాటి హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప సిఫారసుతో పద్మరాజును నియమించారు. చంద్రబాబు ప్రభుత్వంలో చక్రం తిప్పిన నాటి ఐఏఎస్ అధికారి సతీష్చంద్ర తన శిష్యుడు రామరాజుకు సభ్యుడిగా పదవి ఇప్పించారు. మరో సభ్యుడు రంగ జనార్థన్ కూడా ఇలా వచ్చినవారే. వీరికి పదవులు ఇచ్చే ముందే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ఎస్వీ యూనివర్సిటీ ఉద్యోగి భాస్కర్ నాయుడు తిరుపతిలో వీరితో వేర్వేరుగా సమావేశమై, తాము చెప్పినట్టు వింటేనే పదవులు ఉంటాయని హెచ్చరించిన విషయం ఎల్లో మీడియా కప్పిపుచ్చినా బయటకు వచ్చేసింది. ♦ 2016లో నోటిఫికేషన్ ఇచ్చి, 2017 జూలైలో నిర్వహించిన గ్రూప్–2 మెయిన్స్ పరీక్షను ఎంత వివాదాలతో నింపేశారో ప్రతి నిరుద్యోగికీ తెలుసు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరగాల్సిన పరీక్షను వారికి అవసరమైన వారికోసం విశాఖపట్నం గీతం కాలేజీ, మరికొన్ని చోట్ల సాయంత్రం 5 నుంచి రాత్రి 9.30 గంటల వరకు నిర్వహించి వేల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు. కొన్ని ప్రశ్నలు ఉద్దేశపూర్వకంగా బయటకు వెల్లడించగా.. ఇవన్నీ గీతం కాలేజీ కేంద్రంగానే జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిపై పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి. ♦ అధికార పార్టీ పెద్దలతో సాన్నిహిత్యమున్న కొన్ని కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు ఏపీపీఎస్సీలో తిష్టవేసి ఇష్టారీతిన వ్యవహారాలు నడిపించాయి. తమ వద్ద చదివిన వారు ఒకే కేంద్రంలో వరుసగా వచ్చేలా ఏర్పాట్లు చేయించుకొని మాస్ కాపీయింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రశ్నపత్రాలు, సమాధాన పత్రాల స్క్రీన్షాట్లు ఏకంగా వాట్సప్లలో ప్రత్యక్షమయ్యాయి. ♦ కమిషన్లో మెజారిటీ సభ్యుల ఆమోదంతో తీసుసుకోవాల్సిన నిర్ణయాలను నాటి చైర్మన్ ఉదయ్ భాస్కర్ ఒక్కరే తీసుకుని వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. ♦ ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానాన్ని ప్రోత్సహించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంది. వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రాకుండా 2017లో జీవో నం.55 విడుదల చేసి, డిపార్ట్మెంటల్ టెస్టుల్లో ‘మైనస్ మార్కు’లను అమల్లోకి తెచ్చింది. దాంతో అంతకుముందు ఏటా సర్వీస్ కమిషన్ నిర్వహించే ఈ పరీక్షల్లో 60 శాతం మంది ఉత్తీర్ణులైతే.. జీవో నం.55 వచ్చాక ఆ సంఖ్య 4 నుంచి 6 శాతం మించలేదు. కొన్ని విభాగాల్లో ఒక్క శాతం కూడా పాసవలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ జీవోతో దాదాపు ఉద్యోగులు మూడేళ్లపాటు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు కోల్పోయారు. ♦ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2018 డిసెంబర్లో 32 నోటిఫికేషన్లు జారీ చేసి, భర్తీకి పరీక్షలు కూడా నిర్వహించలేదు. ఇప్పుడు నిబద్ధతతో పనిచేసే వారికే సభ్యులుగా అవకాశం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేసింది. అన్ని అర్హతలున్నవారు, సమర్థతతో పనిచేసే వారు, నిరుద్యోగుల కష్టాలు తెలిసిన వారిని సభ్యులుగా నియమించింది. దాంతో గత నాలుగేళ్లల్లో ఏపీపీఎస్సీ ద్వారా 78 నోటిఫికేషన్లు ఇచ్చి, 6,296 పోస్టులను సకాలంలో భర్తీ చేసింది. ‘సచివాలయ’ వ్యవస్థలో ఒకేసారి 1.21 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చే బాధ్యతను కూడా కమిషన్ విజయవంతంగా నిర్వర్తించింది. ఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగాల భర్తీ దేశచరిత్రలోనే లేదు. గత డిసెంబర్లో 899 గ్రూప్–2 పోస్టులతో పాటు గ్రూప్–1, పాలిటెక్నిక్ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు వంటి దాదాపు 1,446 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చింది. ఈనెల 25న జరిగే గ్రూప్–2 పరీక్షకు ఎల్లో మీడియా, టీడీపీ కలిసి ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నించినప్పటికీ, సర్వీస్ కమిషన్ సమర్థంగా అధిగమించి ముందుకెళుతోంది. 2019–23 మధ్య ఏపీపీఎస్సీ నిర్వహించిన 78 నోటిఫికేషన్లలో ఒక్కటి కూడా వాయిదా పడలేదు. నిరుద్యోగుల నుంచి ఒక్క కేసు నమోదైందీ లేదు. కేంద్ర ప్రభుత్వ ప్రశంసలూ పొందింది. అయినా, వాస్తవాలన్నింటినీ కప్పిపుచ్చి ఎల్లో బాసు రామోజీ మాత్రం అక్రమాలంటూ అభాండాలు వేస్తున్నారు. -
కొలువుల పట్టిక తారుమారు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్లలో కొలువుల పట్టిక తారుమారు కానుంది. ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లలో నిర్దేశించిన పోస్టుల క్రమంలో మహిళా రిజర్వేషన్ మాయం కానుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా హారిజాంటల్ పద్ధతిలో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హారిజాంటల్ రిజర్వేషన్ల అమలుకు నియామక సంస్థలు కసరత్తు వేగవంతం చేశాయి. ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసి, ఉద్యోగాలను భర్తీ చేయని వాటిల్లో హారిజాంటల్ రిజర్వేషన్లతో ఉద్యోగాల భర్తీకి నియామక సంస్థలు సన్నద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఆయా ప్రభుత్వ శాఖలు సవరణ ప్రతిపాదనలు సమర్పించాలని సూచిస్తూ నియామక సంస్థలైన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ), తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్ఈఐఆర్బీ)లు నోటీసులు ఇచ్చాయి. వీలైనంత వేగంగా పోస్టుల క్రమాన్ని మార్చి పంపించాలని స్పష్టం చేశాయి. ప్రభుత్వ శాఖలు ఉరుకులు, పరుగులు కొత్తగా ప్రతిపాదనలు సమర్పించిన తర్వాతే తదుపరి చర్యలకు దిగనున్నట్లు స్పష్టం చేయడంతో ప్రభుత్వ శాఖలు ఉరుకులు, పరుగులు పెడుతున్నాయి. గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4, గురుకుల కొలువులు, సంక్షేమ శాఖల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, గురుకుల టీచర్ ఉద్యోగాలకు సంబంధించి సవరణ ప్రతిపాదనల తయారీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు అనుసరించిన వంద పాయింట్ల రోస్టర్ పట్టికలో మహిళలకు 33 1/3 శాతం పోస్టులను ఆయా వరుస క్రమంలో రిజర్వ్ చేసి (నిర్దిష్ట పాయింట్ కింద ఉన్న పోస్టును మహిళలకని ప్రత్యేకంగా మార్క్ చేసి) చూపించేవారు. కానీ తాజా హారిజాంటల్ విధానంలో మహిళలకు ఎక్కడా పోస్టులను రిజర్వ్ చేయరు (ఎలాంటి మార్కింగ్ ఉండదు). భర్తీ సమయంలోనే ప్రతి మూడింటా ఒక్క పోస్టు ఫార్ములాతో నేరుగా నియామకాలు చేపడతారు. అందువల్ల సంబంధిత శాఖలన్నీ మహిళా రిజర్వేషన్తో కూడిన కొలువుల పట్టికను సవరించి కేవలం పోస్టుల వారీగా కొత్త పట్టిక తయారు చేసి నియామక సంస్థలకు సమర్పించాల్సి ఉంది. ఉదాహరణకు గతంలో ఓ శాఖలో పది ఉద్యోగాలకు సంబంధించి 3 పోస్టులను మహిళలకు రిజర్వ్ చేసి పంపినట్లైౖతే, తాజా నిబంధనల ప్రకారం ఆ రిజర్వేషన్ను తొలగించి పది పోస్టులను జనరల్కు కేటాయిస్తూ కొత్త పట్టిక తయారు చేయాలి. అయితే ఇక్కడ కమ్యూనిటీ రిజర్వేషన్లు మారవు. కేవలం మహిళలకు రిజర్వ్ చేసిన స్థానం సంబంధిత వర్గ జనరల్ కేటగిరీకి మారుస్తారు. ఇలా శాఖలన్నీ హారిజాంటల్ విధానంలో కొత్తగా ప్రతిపాదనలు సమర్పించిన తర్వాతే కొలువుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగనుంది. -
స్టాఫ్ నర్సులను భర్తీ చేసింది మేమే..
సాక్షి, హైదరాబాద్: స్టాఫ్ నర్సుల ఉద్యోగ భర్తీ ప్రక్రియను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తే ఇప్పు డు కాంగ్రెస్ ప్రభుత్వ ఘనతగా నియామక పత్రాల జారీ పేరిట హడావుడి చేస్తున్నారని వైద్యఆరోగ్య శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. స్టాఫ్ నర్సులకు నియామక పత్రా లు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ‘వంట అయ్యాక గరిటె తిప్పినట్లు’ఉందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు మంగళవారం హరీశ్ రావు ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రూప్ 1 నోటి ఫికేషన్ను ఫిబ్రవరి 1న ఇస్తామని ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన కాంగ్రెస్.. ప్రస్తుతం విద్యార్థుల దృష్టి మరల్చేందుకే స్టాఫ్ నర్సులకు నియామకపత్రాల జారీ పేరిట హడావుడి చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచి్చన హామీ ప్రకారం ఏడాదిలోగా 2 లక్షల పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ వల్ల ఆటంకం వైద్య సిబ్బంది కొరత లేకుండా చూసేందుకు మెడికల్, నర్సింగ్, పారామెడికల్, ఫార్మాసిస్టు, ఇతర సిబ్బంది నియామకానికి తామే శ్రీకారం చుట్టామని హరీశ్రావు పేర్కొన్నారు. మొత్తంగా 7,094 స్టాఫ్నర్సు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి, 2023 ఆగస్టు 2న ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించినా ఎన్నికల కోడ్ మూలంగా తుది ఫలితాల విడుదల జరగలేదని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేపట్టిన నియామకాలను తమ ఘనతగా చెప్పుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సు పోస్టులను ఉన్నతీకరిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేసినా కాంగ్రెస్ నేటికీ పరిగణనలోకి తీసుకోవడం లేదని హరీశ్రావు ఆ ప్రకటనలో విమర్శించారు. -
ఫలితాల మరుసటి రోజే మిమ్మల్ని కలుస్తా!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజున డిసెంబర్ నాలుగో తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ అశోక్నగర్లో యువతతో సమావేశమవుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు హామీనిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు తాము భరోసాగా ఉంటామని ప్రకటించారు. పలు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న కొందరు విద్యార్థులు సోమవారం కేటీఆర్తో భేటీ అయ్యా రు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పలు అంశాలపై ఆయన సుమారు రెండు గంటల పాటు విస్తృతంగా సంభాషించారు. నోటిఫికేషన్ల ఫలితాల జారీపై ఉన్న కేసుల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటామని, యువత ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ను ప్రక్షాళన చేస్తామని చెప్పారు. పదేళ్ల పాటు ఉద్యోగం చేసిన యువకుడిగా, సోదరుడిగా యువత ఆకాంక్షలను అర్ధం చేసుకోగలనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల తాలూకు వివరాల జాబితాను, ప్రస్తు తం భర్తీ చేస్తున్న ఉద్యోగాల ప్రక్రియ తాలూకు వివరాలను గణాంకాలతో సహా వివరించారు. మా నిబద్ధతను ప్రశ్నించే అవకాశం లేదు ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో తమ నిబద్ధతను ప్రశ్నించే అవకాశం ఎవరికీ లేదని కేటీఆర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏటా వేయి ఉద్యోగాలు కూడా కల్పించని కాంగ్రెస్ పార్టీకి తమను ప్రశ్నించే కనీస అర్హత లేదన్నారు. 2లక్షల30 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, ఇప్పటికే 1,62,000కి పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. రాజకీయ దురుద్దేశంతో విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలను ఇస్తే లెక్కలతో సహా వివరించాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ రాజకీయాల కోసం చేస్తున్న అసత్య పూరిత ప్రచారాన్ని యువత తెలుసుకుని తిప్పికొట్టాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. పోస్టుల సంఖ్యను పెంచండి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలను పెద్ద ఎత్తున ఇచ్చినప్పటికీ నియామక ప్రక్రియకు సంబంధించిన కొన్ని సమస్యల వల్ల యువతలో కొంత ఆందోళన నెలకొందని కేటీఆర్తో భేటీ అయిన యువకులు తెలిపారు. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టుల సంఖ్యను మరింతగా పెంచాలని విజ్ఞప్తి చేశారు. పోస్టుల భర్తీ ప్రక్రియ, రోస్టర్ పాయింట్ల కేటాయింపు, విద్య అర్హతల విషయంలో ఉన్న కొన్ని సమస్యలను సులభంగా పరిష్కరించే అవకాశం ఉందంటూ ఇందుకు సంబంధించిన కొన్ని సలహాలు, సూచనలను అందించారు. కేవలం సాంకేతికపరమైన అంశాల ఆధారంగా అనేక న్యాయపరమైన కేసులు ఎదురవుతున్నాయని, వీటి వలన భర్తీ ప్రక్రియకు ఆటంకం కలుగుతోందని చెప్పుకొచ్చారు. ఇందుకు కేటీఆర్ సానుకూలంగా స్పందిస్తూ, వివిధ నోటిఫికేషన్లు, భర్తీ ప్రక్రియ పై ఉన్న కోర్టు కేసుల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. -
ప్రతిపక్ష ఎంపీల ఐఫోన్ల హ్యాకింగ్!
న్యూఢిల్లీ: పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు తారస్థాయికి చేరిన వేళ విపక్ష నేతల ఫోన్ల హ్యాకింగ్ వార్తలు దేశవ్యాప్తంగా పెను రాజకీయ సంచలనానికి దారితీశాయి. కాంగ్రెస్ మొదలుకుని పలు విపక్షాల ఎంపీలు తదితరుల ఐఫోన్లకు దాని తయారీ సంస్థ యాపిల్ నుంచి మంగళవారం వచ్చిన హ్యాకింగ్ అలర్టులు తీవ్ర కలకలం రేపాయి. ‘ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్న హ్యాకర్లు మీ ఐఫోన్లను నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ వచ్చిన హెచ్చరిక నోటిఫికేషన్లు సంచలనం సృష్టించాయి. ఇది కచ్చితంగా కేంద్రంలోని మోదీ సర్కారు పనేనంటూ విపక్ష నేతలు భగ్గుమన్నారు. గతంలో పెగసెస్ సాఫ్ట్వేర్తో తమపై గూఢచర్యం చేసిన బీజేపీ, ఎన్నికల వేళ మరోసారి ఇలాంటి చౌకబారు చర్యలకు దిగిందంటూ దుయ్యబట్టారు. ఈ ఆరోపణలను కేంద్రం తీవ్రంగా ఖండించింది. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించి వాస్తవాలు వెలుగులోకి తెస్తామని ప్రకటించింది. మరోవైపు ఈ కలకలం నేపథ్యంలో, తమ నోటిఫికేషన్లలో కొన్ని ఫేక్ అలర్టులు కూడా ఉండొచ్చంటూ యాపిల్ స్పందించింది. భారత్లోనేగాక 150 దేశాల్లో పలువురు యూజర్లకు ఇలాంటి అలర్టులు వచ్చాయని పేర్కొంది. అయితే ఈ అలర్టులకు దారితీసిన కారణాలను బయట పెట్టేందుకు నిరాకరించింది. దుయ్యబట్టిన విపక్ష నేతలు ఈ ఉదంతంలో కేంద్రప్రభుత్వ పాత్ర కచ్చితంగా ఉందంటూ విపక్ష నేతలు ఆరోపించారు. తమ ఫోన్లలో అభ్యంతరకర సమాచారాన్ని చొప్పించి అందుకు తమను బాధ్యులను చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ అంశాన్ని తక్షణం లోక్సభ హక్కుల కమిటీకి నివేదించాలని డిమాండ్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీ మహువా మొయిత్రా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛ, గోప్యతలపై ఇలాంటి దాడి దారుణమని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తదితర విపక్ష నేతలను విచారణ పేరుతో వేధించడం, తాజాగా వారి ఫోన్ల హ్యాకింగ్కు ప్రయత్నించడం మోదీ సర్కారు అభద్రతా భావానికి సూచనలని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. లోతుగా దర్యాప్తు: ఐటీ మంత్రి వైష్ణవ్ విపక్ష నేతల ఆరోపణలను కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొట్టిపారేశారు. మోదీ నాయకత్వంలో దేశ ప్రగతిని చూసి ఓర్వలేక ఇలాంటి విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అయితే ఈ ఉదంతంపై కూలంకషంగా దర్యాప్తు జరిపించి నోటిఫికేషన్ల వ్యవహారాన్ని నిగ్గుదేలుస్తామని ప్రకటించారు. ‘పూర్తి పారదర్శకంగా సరైన సమాచారాన్ని అందజేయడం ద్వారా విచారణలో మాతో కలిసి రావాల్సిందిగా యాపిల్ను కోరాం. ముఖ్యంగా ప్రభుత్వ దన్నుతో హ్యాకింగ్ జరగవచ్చని ఏ ఆధారంతో చెప్పారో వివరించాలని సూచించాం. ఇది పూర్తిగా సాంకేతికపరమైన దర్యాప్తు. కనుక కంప్యూటర్ సెక్యూరిటీ సంబంధిత అంశాలకు బాధ్యత వహించే జాతీయ నోడల్ ఏజెన్సీ సెర్ట్–ఇన్ దీన్ని చేపడుతుంది.’ అని మంత్రి ప్రకటించారు. ఇలాంటి నోటిఫికేషన్లు 150కి పైగా దేశాల్లోని ఐఫోన్ యూజర్లకు వచ్చాయని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గుర్తు చేశారు. నా ఫోన్ తీసుకోండి: రాహుల్ ఈ ఉదంతంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. విపక్ష నేతల ఐఫోన్ల హ్యాకింగ్ కచ్చితంగా మోదీ సర్కారు పనేననంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. ‘మేం భయపడేది లేదు. మా ఫోన్లను ఎంతగా హాకింగ్ చేసుకుంటారో చేసుకోండి. మీకు కావాలంటే చెప్పండి, నా ఫోన్ కూడా ఇస్తా’ అంటూ విరుచుకుపడ్డారు. పారిశ్రామికవేత్త గౌతం అదానీయే ప్రస్తుతం దేశాన్ని రిమోట్ కంట్రోల్తో నడుపుతున్నారని ఆరోపించారు. ‘ఇప్పుడు దేశంలో అదానీయే నంబర్ వన్. తర్వాతి స్థానాల్లో మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నారు. మోదీ ఆత్మ అదానీ దగ్గరుంది. అందుకే అదానీని ఎవరైనా ఒక్క మాటన్నా వెంటనే నిఘా వర్గాలు రంగంలోకి దిగుతున్నాయి. అలర్టులు అందుకున్న నేతలు.. మల్లికార్జున ఖర్గే, శశి థరూర్, పవన్ ఖేరా, కె.సి.వేణుగోపాల్, సుప్రియా శ్రీనేత్, టి.ఎస్.సింగ్దేవ్, భూపీందర్ సింగ్ హుడా, రాహుల్గాంధీ సహాయకులు, మహువా మొయిత్రా (టీఎంసీ), సీతారాం ఏచూరి (సీపీఎం), ప్రియాంకా చతుర్వేది (శివసేన–యూబీటీ), రాఘవ్ ఛద్దా (ఆప్), అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్), సమీర్ సరణ్ (ఓఆర్ఎఫ్ అధ్యక్షుడు), సిద్ధార్థ్ వరదరాజన్ (ద వైర్ వ్యవస్థాపక ఎడిటర్), ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓఎస్డీ తదితరులు యాపిల్ అలర్టులో ఏముందంటే... ‘ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేసే హాకర్లు మీ ఐఫోన్ను టార్గెట్ చేసుకుని ఉండొచ్చని యాపిల్ అనుమానిస్తోంది. బహుశా మీ హోదా, మీరు చేస్తున్న పనుల వల్ల మీరు వ్యక్తిగతంగా వారి లక్ష్యంగా మారి ఉండొచ్చు. ఇలాంటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని హాకర్లు మీ ఫోన్ను హాక్ చేసి తమ అ«దీనంలోకి తీసుకుంటే అందులోని సున్నితమైన డేటా, సమాచారంతో పాటు కెమెరా, మైక్రోఫోన్ వారి చేతిలోకి వెళ్లిపోతాయి. ఇది ఫేక్ హెచ్చరికే అయ్యుండే ఆస్కారమూ లేకపోలేదు. కానీ దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోండి’ -
‘స్టేట్ స్పాన్సర్డ్ అటాక్’ వివాదం.. యాపిల్ స్పందన ఇదే..
పలువురు లోక్సభలోని ప్రతిపక్ష ఎంపీలకు యాపిల్ ఫోన్ వార్నింగ్ అలర్ట్ పంపిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎంపీల యాపిల్ ఐడీ ఆధారంగా స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్లు వారి ఐఫోన్, ఈ-మెయిల్స్ హ్యాక్ చేస్తున్నట్లు అలర్ట్ మెసేజ్లు వస్తున్నాయి. ఇప్పటికే త్రుణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంపీ ప్రియాంక చతుర్వేదికు అలర్ట్లు వచ్చినట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన మెసేజ్లను తమ ఎక్స్ ఖాతాద్వారా ప్రముఖులు పంచుకున్నారు. ఈ అలర్ట్లను ఉద్దేశించి యాపిల్ స్పందించింది. స్టేట్ స్పాన్సర్డ్ అటాక్ నోటిఫికేషన్లు కొన్నిసార్లు తప్పుడు అలారాలు కావచ్చని యాపిల్ చెప్పింది. అలా అటాక్ చేసేవారి వద్ద అధునాతన టెక్నాలజీ ఉంటుందని పేర్కొంది. దాంతో వారు ఎలాంటి దాడికైనా పాల్పడే అవకాశం ఉందని చెప్పింది. అయితే అలా వస్తున్న అలర్ట్ల్లో కొన్ని తప్పుడు నోటిఫికేషన్లు ఉండవచ్చని యాపిల్ వివరించింది. ఈ నోటిఫికేషన్ల జారీకి గల కారణాలపై వ్యాఖ్యానించడానికి కంపెనీ నిరాకరించింది. ఎందుకంటే పూర్తి వివరాలు వెల్లడిస్తే భవిష్యత్తులో దాడిచేసే వారిని గుర్తించకుండా తప్పించుకోవడానికి సహాయపడినట్లు అవుతుందని కంపెనీ తెలిపింది. -
విలువలతో కూడిన జర్నలిజం అవసరం
-
మెసేజ్ లింక్స్తో జాగ్రత్త..!
ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే పూర్ణిమ(పేరుమార్చడమైనది) ప్రతి పైసా జాగ్రత్తగా ఖర్చుపెడుతుంది. రాత్రి పడుకునే ముందు సోషల్మీడియా అకౌంట్స్తో పాటు, మెయిల్కి వచ్చిన నోటిఫికేషన్స్ చూడటం అలవాటు. వాటిలో తన ఆఫీసు నుంచి, స్నేహితుల నుంచి వచ్చిన మెసేజ్లకు రిప్లై చేసింది. అదే సమయంలో మరో మెసేజ్ వచ్చింది. గోల్డ్స్కీమ్కి సంబంధించిన సమాచారం అది. ఆసక్తిగా అనిపించడంతో దానిని ఓపెన్ చేసింది. ఆ స్కీమ్లో చేరితే తక్కువ ధరలో బంగారం కొనుగోలు చేయవచ్చు. అది, పేరున్న కంపెనీ వెబ్సైట్ నుంచి వచ్చింది. లిమిటెడ్ టైమ్లో వచ్చిన ఆఫర్ అది. మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకోవడం అని, అప్లికేషన్లో తన వివరాలను పొందుపరిచి, సెండ్ చేసింది. మిగతావి ఏమైనా ఉంటే రేపు చూసుకుందాం అని ఫోన్ పక్కన పెట్టేసి పడుకుంది. ఉదయం పనిచేసుకుంటూనే ఫోన్ చేతిలోకి తీసుకుంది. వచ్చిన బ్యాంక్ మెసేజ్లు చూసి షాక్ అయ్యింది. యాభై వేల రూపాయలు డెబిట్ అయినట్టుగా బ్యాంక్ మెసేజ్ అది. నిన్నరాత్రి ఆ డబ్బు ట్రాన్స్ఫర్ అయింది. స్కీమ్లో చేరినట్టుగా వివరాలు ఇచ్చింది కానీ, బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించిన సమాచారం ఏమీ ఇవ్వలేదు తను. తన డబ్బు మరెలా పోయినట్టు? మెయిల్ ఐడీలో ఉన్న కస్టమర్ కేర్కి మెసేజ్ చేసింది. ఫోన్ చేసింది. కానీ, ఎలాంటి సమాచారమూ లేదు. పూర్ణిమ మాదిరే చాలామంది మెసేజ్లు లేదా మెయిల్స్కు వచ్చిన ఆకర్షణీయమైన పథకాలతో ఉన్న లింక్స్ను ఓపెన్ చేయడం, వాటి ద్వారా మోసాలకు గురికావడం అతి సాధారణంగా జరుగుతున్నాయి. దీనికి కారణం అధికారిక కంపెనీల నుంచి వచ్చినట్టుగా మెసేజ్ లింక్స్ ఉండటం ప్రధాన కారణం. ఈ రోజుల్లో స్పూఫింగ్ అనేది మన భద్రత, గోప్యతకు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తుంది. ఈ రకమైన దాడుల గురించి తెలుసుకోవడం, వాటి నుండి తమను తాము రక్షించుకోవడానికి అందరం సిద్ధపడాల్సిన సమయం ఇది. పేరున్న కంపెనీల పేరుతో అధికారిక వెబ్సైట్లనుంచి వచ్చినట్టు మెసేజ్లు మెయిల్స్కు వస్తుంటాయి. అయితే, వాటిలో ఏవి కరెక్ట్ అనేది పెద్ద సంశయం. ఇలాగే, క్రెడిట్ కార్డ్ నంబర్లు, ఓటీపీ, లాగిన్ ద్వారా మోసగాళ్లు మన సమాచారాన్ని బయటపెట్టేలా చూస్తుంటారు. లాటరీ వచ్చింది, డబ్బు డిపాజిట్ చేయడానికి బ్యాంక్ వివరాలు ఇవ్వమని అడగడం, ఓటీపీ చెప్పమని కోరడం, బ్యాంక్ లేదా ఏదైనా ఇతర సంస్థ నుండి ఫోన్ కాల్స్ చేస్తుంటారు. ఈ కాల్స్ ద్వారా బ్యాంకుకు సంబంధించిన సమాచారాన్ని మనం బయటపెట్టేలా మోసం చేసే అవకాశం ఉంది. మనలో నమ్మకాన్ని కలిగించడానికి సులువైన, ఆకర్షణీయమైన పద్ధతులను మోసగాళ్లు ఎంచుకుంటారు కాబట్టి, మనమే జాగ్రత్త వహించాలి. ఇ–మెయిల్ ద్వారా.. ఫేక్ మెయిల్ ఐడీతో మన ఇన్బాక్స్లో ఓ మెసేజ్ వస్తుంది. అది వేరొకరి నుండి వచ్చినట్లు కనిపిస్తుంది. ఇది సాధారణంగా ఫిషింగ్ దాడులలో ఉపయోగించబడుతుంది, ఇక్కడ దాడి చేసే వ్యక్తి సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడానికి లేదా హానికరమైన సాఫ్ట్వేర్ను డౌన్ లోడ్ చేయడానికి, మోసగించడానికి ప్రయత్నిస్తాడు. ♦ పంపినవారి ఇ–మెయిల్ చిరునామా అనుమానాస్పదంగా ఉండచ్చు. ఉదాహరణకు.. మనకు వచ్చిన ఫేక్ మెయిల్ ఐడీలో లెక్కకు మించి, అక్షర దోషాలు లేదా వింత భాష ఉండచ్చు. గమనించాలి. ♦మోసపూరిత ఇ–మెయిల్లు ఎలా ఉంటాయంటే.. తరచుగా క్రెడిట్ కార్డ్ నంబర్లు, సోషల్ సెక్యూరిటీ నంబర్లు లేదా పాస్వర్డ్ల వంటి వ్యక్తిగత సమాచారం కోసం రిక్వెస్ట్లు కోరుతుంటాయి. ♦ ఇ–మెయిల్లోని అనుమానాస్పద లింక్లు చట్టబద్ధమైన వెబ్సైట్లా కనిపించే నకిలీ వెబ్సైట్కి దారితీయవచ్చు. లేదా అవి అసాధారణమైన అక్షరాలను కలిగి ఉండవచ్చు. లేదా వేరే వెబ్సైట్కి దారి మళ్లించవచ్చు. ఫోన్ ద్వారా దాడులు ♦ ఫోన్ ద్వారా దాడులకు పాల్పడే వ్యక్తులు ఉంటారు. వీరు వినియోగదారుడిని రకరకాల ఆకర్షణీయ పథకాల ద్వారా అతని వ్యక్తిగత, బ్యాంకు వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ♦ మీ ఫోన్కి బయటి దేశాల నుంచి కూడా ఫోన్లు వస్తుంటాయి. ♦ మీకు తక్కువ సమయంలో ఎక్కువ కాల్స్ వచ్చినా, పగలు లేదా రాత్రి అసాధారణ సమయాల్లో మీకు కాల్స్ వచ్చినా, అది కాలర్ ఐడీ స్పూఫింగ్కు సంకేతం కావచ్చు. ♦మీరు గుర్తించని కంపెనీలు లేదా వ్యక్తుల నుండి అయాచిత కాల్స్ను స్వీకరిస్తే, అది కాలర్ ఐడీ స్పూఫింగ్కు సంకేతం కావచ్చు. ♦కాలర్ ఐడీ స్పూఫింగ్ తరచూ క్రెడిట్ కార్డ్ నంబర్లు లేదా సామాజిక భద్రతా నంబర్ల వంటి వ్యక్తిగత సమాచారం కోసం రిక్వెస్ట్లు ఉంటాయి. ♦ఫోన్ కాల్లో అవతలి వారి మాటల్లో ఏ మాత్రం క్వాలిటీ లేకపోయినా, కాల్ సమయంలో అసాధారణ శబ్దాలు లేదా అంతరాయాలు ఉంటే, అది కాలర్ ఐడీ స్పూఫింగ్కు సంకేతం కావచ్చు. ఇలా సురక్షితం... ♦ అపరిచిత ఇ–మెయిల్లు, మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ♦ బ్రౌజర్ అడ్రస్ బార్లో లాక్ గుర్తు ఉండదు. అడ్రస్ బార్పై అక్షరాల్లో చిన్న చిన్న తేడాలు ఉంటా యి. ఈ చిన్న అక్షరాలను కూడా గమనించాలి. ♦యుఆర్ఎల్ అక్షరాలు సరిగా ఉన్నా డిజైన్లలో కూడా తేడాలు ఉంటాయి. గమనించాలి. ♦బ్యాంక్, డిజిటల్ రెండు రకాల కార్యకలాపాలకు రెండు కారకాల ఫోన్ ప్రమాణీకరణను ప్రారంభించడం శ్రేయస్కరం. - ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
పట్వారీ కొలువుల కోసం 12 లక్షలకు పైగా దరఖాస్తులు
భోపాల్: పెరుగుతున్న జనాభా, కరోనా తర్వాతి పరిస్థితులు.. ఇలా పలు కారణాలతో దేశంలో నిరుద్యోగం రేటు పెరిగిపోతోంది. మరోవైపు పోటీ ప్రపంచంలోనూ తీవ్రత ఊహించని రీతిలోనే ఉంటోంది. తాజాగా పట్వారీ కొలువుల కోసం ఏకంగా 12 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్లో ల్యాండ్ రెవెన్యూ అధికారుల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది అక్కడి పబ్లిక్ సర్వీస్ కమిషన్. అటు ఇటుగా ఆరు వేల దాకా ఖాళీలను భర్తీ చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే పోటీ ఎంతలా ఉందంటే.. ఏకంగా ఈ పోస్టుల కోసం పన్నెండున్నర లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీళ్లలో పీహెచ్డీ చేసిన వాళ్లతో పాటు ఇంజినీరింగ్ స్డూడెంట్స్, ఎంబీఏ చదివిన వాళ్లు సైతం ఉన్నారు. మొత్తం 12.79 లక్షల మంది అభ్యర్థులకుగానూ.. వెయ్యి మంది హీహెచ్డీ చేసిన వాళ్లు, 85 వేలమంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్, లక్ష దాకా ఎంబీఏ చేసిన వాళ్లు, మరో రెండు లక్షల మంది ఇతర డిగ్రీలు పూర్తి చేసిన వాళ్లు ఉన్నారు. మధ్యప్రదేశ్లో నిరుద్యోగ శాతం 1.9 గా ఉందని ఈ జనవరిలో సీఎంఐఈ(సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ) నివేదిక ఇచ్చింది. ఈ తరుణంలో ఈ స్థాయిలో దరఖాస్తులు రావడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉందన్న వాదనను తోసిపుచ్చుతున్నారు. ఎప్పటికప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్తున్నారాయన. ఇదిలా ఉంటే.. తాజా నోటిఫికేషన్ అభ్యర్థుల గణాంకాలపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ఉద్యోగవకాశాలను కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. -
తెలంగాణ: మరో 16 వేలకు పైగా ఖాళీ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా వున్న పోస్టుల్లో 60 వేల ఖాళీల భర్తీకి విడతలవారీగా నోటిఫికేషన్లు జారీ కాగా.. మరో గుడ్న్యూస్ ప్రకటించింది. మరో 16 వేలకు పైగా ఖాళీల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 16,940 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు ఆయన ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 90 వేల ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని, అందులో భాగంగా విడతలవారీగా నోటిఫికేషన్లు జారీ అవుతాయని సీఎం కేసీఆర్ ఇంతకు ముందు ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగానే ఇఫ్పటికే చాలా శాఖలకు చెందిన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. -
టీఎస్పీఎస్సీ బోర్డు సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ నియామకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రూప్–1తో పాటు వివిధ కేటగిరీల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఉద్యోగ ప్రకటనలపై టీఎస్పీఎస్సీ నిర్ణయం కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో శనివారం జరిగే బోర్డు సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. గ్రూప్–1 ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే శాఖల వారీగా ప్రతిపాదనలు టీఎస్పీఎస్సీకి చేరాయి. వీటిలో కొన్ని శాఖలకు సంబంధించి ప్రతిపాదనల్లో సవరణలు కోరగా.. వాటిని ఆయా శాఖలు సమర్పించినట్లు తెలిసింది. అవన్నీ సరిగ్గా ఉంటే ఉద్యోగ ప్రకటనకు ఇబ్బందులు ఉండవు. బోర్డు సమావేశంలో కోరం ఆమోదంతో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలుంటాయి. శనివారం సమావేశంలో తీసుకునే నిర్ణయంతో నోటిఫికేషన్లపై స్పష్టత రానుంది. -
టీఆర్ఏసీలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. తెలంగాణ హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ (టీఆర్ఏసీ) కార్యాలయంలో పలు పోస్టుల భర్తీకి ఈనెల 7న జారీచేసిన నోటిఫికేషన్ను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు నియామక ప్రక్రియ నిలిపివేయాలని, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న పిటిషనర్లను విధుల నుంచి తొలగించడానికి వీల్లేదని న్యాయమూర్తి జస్టిస్ వినోద్కుమార్ ఆదేశించారు. టీఆర్ఏసీ అదనపు డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో 2007 నుంచి విధులు నిర్వహిస్తున్నామని, తమను కాకుండా ఇతరులతో ఆ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ జి.వెంకట్రామయ్యతోపాటు మరో 14 మంది దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తి విచారించారు. ఈ పోస్టులకు పిటిషనర్లు కూడా దరఖాస్తు చేసుకున్నారని, వీరికి కాకుండా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికే కాల్లెటర్లు పంపించారని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. ఈనెల 23, 24 తేదీల్లో ఇంటర్వ్యూలకు హాజరుకావాలంటూ ఈమెయిల్ ద్వారా ఇతర అభ్యర్థులకు సమాచారం అందించారని వివరించగా.. కోర్టు పైవిధంగా స్పందించింది. -
నిరుద్యోగులకు గుడ్న్యూస్! ఇక్కడ అన్ని ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ ఇవ్వబడును
ఆదిలాబాద్: ప్రభుత్వ ఉద్యోగం ప్రతీ నిరుద్యోగి కల.. ప్రస్తుతం ప్రభుత్వ విభాగాల్లో కొలువులు తగ్గుతుండగా, నిరుద్యోగుల సంఖ్య ఏటా పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన ఎనిమిదేళ్ల తర్వాత ఎట్టకేలకు కొలువులు భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఉద్యోగ ఖాళీలను ప్రకటించారు. త్వరలోనే భర్తీకి నోటిపికేషన్లు ఇస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు, సర్కారు కొలువు కల నెరవేర్చుకునేందుకు ఎస్సీ, బీసీ, స్టడీ సర్కిళ్లు సన్నద్ధమవుతున్నాయి. జిల్లా కేంద్రంలో రెండు స్టడీ సర్కిళ్లు.. సర్కారు కొలువు సాధించాలనే లక్ష్యంతో పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుపేద నిరుద్యోగులకు దారిచూపుతున్నాయి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్లు. కొందరు ప్రిపరేషన్ కోసం హైదరాబాద్, వరంగల్ వంటి నగరాలకు తరలుతున్నారు. మరికొందరు ఇంటి వద్దే పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఆర్థికంగా వెనుకబడి, ప్రైవేట్ శిక్షణను పొందలేని, సరిగ్గా పుస్తకాలు సైతం కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్న వారికి స్థానికంగా ఉన్న స్టడీ సర్కిళ్లు ఆశా దీపాలుగా నిలుస్తున్నాయి. స్టడీ సర్కిళ్లలో సౌకర్యాలు... బీసీ స్టడీ సర్కిల్కు రూ.3.75 కోట్ల నిధులతో 2019లో అధునాతన భవనాన్ని నిర్మించారు. ఇందులో కాన్ఫరెన్స్ హాల్, డిజిటల్ లైబ్రరీ, స్టడీ హాల్, డైనింగ్ హాల్, క్లాస్ రూం, గెస్ట్రూంలు, 16 హాస్టల్ రూంలు ఉన్నాయి. ఎస్సీ స్టడీ సర్కిల్ను 2016 అక్టోబర్లో ప్రారంభించారు. ఈ రెండు కేంద్రాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే ఉద్యోగాలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అందజేయడమే కాకుండా వారిలో వివిధ నైపుణ్యాలు అభివృద్ధి చెందేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాయి. ఉద్యోగ మేళాలు నిర్వహిస్తూ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 3,176 ఉద్యోగ ఖాళీలు.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు మొదలైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల్లోని 3,176 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 1,193, మంచిర్యాల 1,025, నిర్మల్ 876, కొమరం భీమ్ ఆసిఫాబాద్ 825 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు తమ కొలువుల కల సాకారం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. సాధించిన విజయాలు.. ఇప్పటి వరకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా 2,395 మంది అభ్యర్థులకు వివిధ రకాల పోటీ పరీక్షలకు శిక్షణ అందించారు. 220 మంది ప్రభుత్వ కొలువులు సాధించారు. వీరిలో 10 మంది రెండు నుంచి ఐదు ఉద్యోగాలు సాధించారు. అత్యధికంగా 60మంది పోలీస్ కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. 35మంది ఉపాధ్యాయులుగా, 43మంది పంచాయతీ సెక్రెటరీలుగా, 20మంది గురుకుల ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. జాబ్మేళా ద్వారా 500మంది ప్రైవేట్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు సాధించారు. ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా ఇప్పటివరకు 600 మందికి శిక్షణ పొందారు. 107 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. 43 మంది ప్రైవేట్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు సాధించారు. డిజిటల్ శిక్షణ... స్టడీ సర్కిల్లో దాదాపుగా ప్రతీ బ్యాచ్లో 100మందికి శిక్షణ ఇస్తారు. ప్రభుత్వం కొలువులు భర్తీ చే యనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు పెద్దసంఖ్యలో నిరు ద్యోగులకు శిక్షణ అందజేయాలని భావిస్తున్నాయి. ఈ మేరకు డిజిటల్ విధానంలో శిక్షణ ఇవ్వడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. యూ ట్యూబ్, టీ–శాట్ చానళ్ల ద్వారా శిక్షణ అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా రోజుకు 100 పోటీ పరీక్షల ప్రశ్నలను అభ్యర్థులకు తెలియజేయనున్నారు. డిజిటల్ శిక్షణ విధానంలో 2వేల నుంచి పది వేల మందికి శిక్షణ అందించే వెసులుబాటు ఉంది. అత్యున్నత శిక్షణ ఇస్తున్నారు.. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఎస్సీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందుతున్నాను. ఉపాధ్యాయ నియామక పరీక్షకు, అదేవిధంగా గ్రూప్–1, గ్రూప్–2 నియామక పరీక్షలకు సిద్ధమవుతున్నాను. స్టడీ సర్కిల్లో ఉచిత వసతితో పాటు నిత్యం 8గంటలు శిక్షణ ఇస్తున్నారు. – రాజ్కుమార్, బెజ్జూర్, కుమురంభీం ఆసిఫాబాద్ ప్రణాళికాబద్ధంగా చదువుతున్న స్టడీ సర్కిల్లో చక్కని శిక్షణ ఇస్తున్నారు. కానిస్టేబు ల్, ఎస్సై ఉద్యోగాల కో సం ప్రయత్నిస్తున్నాను. రెండు ఉద్యోగాలను సాధించే దిశగా ప్రణాళి కాబద్ధంగా చదువుతున్న. మొదటిసారి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పటికీ, స్టడీ సర్కిల్లో శిక్షణ ద్వారా మార్గనిర్ధేశం చేస్తున్నారు. ఉద్యోగం సాధిస్తాననే నమ్మకంతో ఉన్న. –జే.సుప్రియ, ఆదిలాబాద్, ఎస్సీ స్టడీ సర్కిల్ త్వరలోనే తరగతులు... బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు శిక్షణ తరగతులు ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభిస్తాం. గురుకుల, ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన శిక్షణ ఇస్తాం. అన్ని వసతులతో కూడిన అధునాతన భవనంలో శిక్షణ అందిస్తాం. అభ్యర్థులను స్కీన్రింగ్ టెస్ట్ లేదా మెరిట్ ద్వారా ఎంపిక చేస్తాం. –ప్రవీణ్ కుమార్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్, ఆదిలాబాద్ లక్ష్యం చేరడానికి మార్గం.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించడం నిరుద్యోగులకు తీపి కబురు. ఇటువంటి సమయంలో నిరుద్యోగ అభ్యర్థులు ఎస్సీ, స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ పొంది తమ లక్ష్యం చేరడానికి మార్గం వేసుకోవాలి. ఎస్సీ, స్టడీ సర్కిల్లో నియామక ప్రకటనలకు అనుగుణంగా నాణ్యమైన శిక్షణ అందజేస్తాం. నిరుద్యోగులు తమ కొలువు కల సాధించే దిశగా కృషి చేస్తాం. –రమేశ్, ఎస్సీ స్టడీసర్కిల్ డైరెక్టర్, ఆదిలాబాద్ -
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు.. ఈ టిప్స్ పాటిస్తే జాబ్ మీదే!
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామనే సర్కారు ప్రకటనతో నిరుద్యోగుల ఆశలు చిగురించాయి. పోటీ పరీక్షలకు శిక్షణ కోసం కోచింగ్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. స్టడీ మెటీరియల్ కోసం పుస్తకాల షాపులను, నిపుణులను సంప్రదిస్తున్నారు. మరోవైపు స్టడీ హాళ్లు, లైబ్రరీలు సందడిగా మారాయి. ఆర్టీసీ క్రాస్రోడ్స్, చిక్కడపల్లి, అశోక్నగర్, దిల్సుక్నగర్, తదితర ప్రాంతాలోని కోచింగ్ సెంటర్లకు అభ్యర్థులు వెల్లువెత్తుతున్నారు. ఇదంతా ఒకవైపు అయితే, మరోవైపు పోటీ పరీక్షలనగానే ప్రతి ఒక్కరిలోనూ మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆందోళనకు గురవుతారు. ఇలాంటి ఒత్తిళ్లను అధిగమించేందుకు సానుకూలమైన దృక్పథంతో అధ్యయనం ఆరంభించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. లక్ష్యం పట్ల స్పష్టత ఉండాలి.. పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యేవారు మొదట స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఎంపిక చేసుకున్న లక్ష్యం పట్ల బలమైన ఆకాంక్షను కలిగి ఉండాలి. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయి కాబట్టి దరఖాస్తు చేస్తున్నాం అనే మొక్కుబడి వైఖరితో కాకుండా ఆ ఉద్యోగం తనకు ఎందుకు తప్పనిసరి అవసరమనే విషయంపై స్పష్టత ఏర్పర్చుకోవాలి. అనంతరం పరీక్షలకు అవసరమైన మెటీరియల్, కోచింగ్ వంటివి సమకూర్చుకొని మానసిక, శారీరక సంసిద్ధతతో ప్రిపరేషన్ ఆరంభించాలి. సంశయాత్మక వైఖరి కూడదు.. ప్రిపరేషన్ ప్రారంభించిన తర్వాత కూడా చాలా మంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. లక్షలాది మందితో పోటీపడడం తనకు సాధ్యం కాదేమోననే ఆందోళనకు గురవుతారు. తమ చుట్టూ ఉన్నవారు బాగా చదువుతున్నారని, తాము మాత్రమే వెనుకబడిపోతున్నామనే భావన కొంతమందిని వెంటాడుతుంది. ఇలాంటి సంశయాత్మక వైఖరి వల్ల చాలా నష్టం వాటిల్లుతుంది. తాము తప్పకుండా విజయం సాధిస్తామనే సానుకూలమైన భావనతో అధ్యయనం మొదలుపెట్టాలి. రాయబోయే పోటీపరీక్షలో తాను విజేతగా నిలవబోతున్నాననే ప్రగాఢమైన నమ్మకంతో సన్నద్ధం కావాలి. కఠినమైన అంశాలపై దృష్టి సారించాలి.. సాధారణంగా చాలా మంది పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయంలో తేలిగ్గా ఉండే అంశాలతో ప్రారంభించి ఆ తర్వాత కఠినమైన అంశాల్లోకి వెళ్తారు. కానీ ఇది సరైన పద్ధతి కాదని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఎవరికి వారు తమకు కఠినమైనవిగా అనిపించిన పాఠ్యాంశాలను మొదట ఓ పట్టుపడితే ఆ తర్వాత తేలిగ్గా ఉన్న అంశాలను వేగంగా పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. మన స్థాయిని అంచనా వేసుకోవాలి.. ఇతరులతో పోల్చుకొని తాము వెనుకబడిపోతున్నామని ఆందోళనకు గురికావొద్దు. తోటివారితో పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి కానీ తమ ప్రిపరేషన్ను నిరుత్సాహానికి గురి చేసేలా ఉండకూడదు. రోజుకు ఎన్ని గంటలు చదివామనే దాని కంటే ఆ రోజు చదివిన అంశాలపై మన అవగాహన ఏ స్థాయిలో ఉంది అనేది అంచనా వేసుకోవడం మంచిది. – డాక్టర్ గీత చల్లా, మానసిక నిపుణులు ప్రశాంతంగా ఉండాలి.. ప్రిపరేషన్ సమయంలో ఆందోళనకు గురైతే ఆరోగ్యం దెబ్బతింటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. యోగా, ప్రాణాయామం, ధ్యానం తప్పనిసరిగా అలవర్చుకోవాలి. దీంతో శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం బాగుంటాయి. అలసట లేకుండా అధ్యయనం చేయగలుగుతారు. సరైన నిద్ర, చక్కటి పోషకాహారం కూడా ఈ సమయంలో ఎంతో అవసరం. – డాక్టర్ సంహిత, సీనియర్ సైకియాట్రిస్ట్ -
ఉగాదికి ఉద్యోగ నోటిఫికేషన్లు.. తొలివిడతలో భారీ సంఖ్యలో భర్తీ?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ముమ్మరంగా కసరత్తు సాగుతోంది. ఉగాది నాటికి తొలివిడత నోటిఫికేషన్ జారీచేసే అవకాశముంది. ఏప్రిల్ 2న ఉగాది పండుగ జరుపుకోనుండగా, మరో రెండువారాల్లోగా తొలి విడత నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని 27 ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల శాసనసభలో ప్రకటించిన విషయం తెలిసిందే. దశలవారీగా ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలివిడతగా 30 వేల నుంచి 40 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్టు సమాచారం. ఎక్కువ మంది ఈ మెగా ఉద్యోగమేళాలో భాగం పంచుకోవాలన్న ఉద్దేశంతో విడతలవారీగా ఈ నోటిఫికేషన్లు జారీ కానున్నట్లు సమాచారం. ఒకేసారి 80 వేల పోస్టులకు నోటిఫికేషన్లు జారీచేయడం వల్ల ఇబ్బందులుంటాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. కాగా, వివిధ శాఖల నుంచి వస్తున్న ఉద్యోగ ఖాళీల సమాచారంపై రాష్ట్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. గురువారంనాటికి 10 ప్రభుత్వ శాఖలు కొలువుల భర్తీకి అనుమతి కోరుతూ ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపించాయి. హోం, వైద్యారోగ్య, రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలు ఇందులో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. హోంశాఖలో 18,334 పోస్టులు, వైద్యారోగ్య శాఖలో 12,755, పాఠశాల విద్యాశాఖలో 13,086 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలకు కొన్ని మార్పులను సూచించగా ఒకటి రెండు రోజుల్లో ఆ శాఖల నుంచి తుది ప్రతిపాదనలు మళ్లీ ఆర్థిక శాఖకు అందనున్నాయి. సీఎం సూచనలు అందిన వెంటనే జీవోలు సీఎం కేసీఆర్ నుంచి సూచనలు అందిన వెంట నే శాఖల వారీగా తొలివిడత పోస్టుల భర్తీకి పరిపాలనాఅనుమతులు జారీ చేస్తూ ఆర్థిక శాఖ జీవోలు జారీ చేయనుంది. ఆ వెంటనే సంబంధిత శాఖల సమన్వయంతో ఆయా నియామక సంస్థలు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనున్నాయి. వివిధ శాఖల నుంచి వస్తున్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమాచారంలో ఎక్కడా తేడా రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నోటిఫికేషన్లో ఎలాంటి తప్పులు రాకుండా తగిన చర్యలు చేపట్టారు. తొలివిడత నోటిఫికేషన్లకు సంబంధించిన ప్రక్రియ రెండువారాల్లో పూర్తి కానుందని, వచ్చే నెల ప్రారంభంలో నోటిఫికేషన్లు రావచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
ఆంధ్రప్రదేశ్: త్వరలో 1,180 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. మరో వారం పది రోజుల్లో నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. ఈ నెలాఖరున నోటిఫికేషన్లు విడుదల చేసేలా కమిషన్ కసరత్తు పూర్తి చేసి అంతా సిద్ధంగా ఉంచింది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వుడ్ క్యాటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి పెంపునకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల కాలపరిమితి మే నెలలో ముగిసింది. ఈ నేపథ్యంలో రిజర్వుడ్ అభ్యర్ధుల గరిష్ట వయో పరిమితి ఉత్తర్వుల పొడిగింపుపై కమిషన్ ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. మరోవైపు అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్) ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం కోటా అమలుకు ప్రభుత్వం ఇంతకు ముందే ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ కోటాలో పోస్టులు మిగిలితే కనుక వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయాలా? వద్దా? అనే అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత కోసం కమిషన్ లేఖ రాసింది. ఈ రెండు అంశాలపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడగానే నోటిఫికేషన్లను విడుదల చేయనున్నారు. 1,180 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీవో 49 విడుదల చేయడం తెలిసిందే. రిజర్వేషన్లు, ఈడబ్ల్యూఎస్ కోటా మిగులు పోస్టులపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందగానే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇస్తుందని కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం నుంచి స్పష్టత రాగానే 15 విభాగాల్లో ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేస్తూ పోస్టుల భర్తీకి కమిషన్ చర్యలు చేపట్టనుంది. -
Telangana: 56,979 కొలువులేవీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా ఉద్యో గాలను భర్తీ చేస్తామని ప్రభుత్వ పెద్దలు, అధికారులు తరచూ ప్రకటనలు చేస్తున్నా.. ఇప్పటికీ నోటిఫికేషన్లు రాకపోవడంపై నిరుద్యో గులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఏళ్లుగా నిరీక్షిస్తున్నామని, ఇంకెన్నాళ్లు వేచిచూడాలని ఆవేదన చెందుతున్నారు. నిజానికి రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కసరత్తు మొదలుపెట్టినట్టు ఆర్థిక శాఖ నాలుగైదు నెలల కిందటే ప్రకటించింది. మూడు నెలల క్రితం ఉద్యోగ ఖాళీల సంఖ్యను తేల్చింది. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి సేకరించిన సమాచారంతో మొత్తం 57వేలకుపైగా ఖాళీలు ఉన్నట్టు గుర్తించింది. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం తెలపడంతో.. ఉద్యోగాల భర్తీ అంశం మళ్లీ మొదటికి వచ్చింది. పోస్టుల విభజన కోసం.. కొత్త జోనల్ విధానం ఆధారంగా.. జిల్లా, జోనల్, మల్టీజోనల్, రాష్ట్రస్థాయిల్లో పోస్టుల విభజన, కొత్త జిల్లాల మధ్య పంపిణీ వంటి అంశాలను తేల్చడంపై ఆర్థికశాఖ దృష్టి పెట్టింది. తాజాగా ఈ కసరత్తు కూడా ఓ కొలిక్కి వచ్చిందని.. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 67 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలున్నట్టు తేలిందని అధికారవర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర మంత్రివర్గం ఈ ఖాళీల వివరాలను ఆమోదించాల్సి ఉందని.. ఆ తర్వాత మార్గదర్శకాలు రూపొందించి నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉంటుందని వివరిస్తున్నాయి. కానీ ప్రభుత్వం ఈ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో.. లక్షల మంది నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడున్నరేళ్లుగా ఒక్క నోటిఫికేషన్ లేదు కొత్త జోనల్ విధానం నేపథ్యంలో మూడున్నరేళ్లుగా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. అంతకుముందే జారీ అయిన కొన్ని నోటిఫికేషన్ల ప్రక్రియ మాత్రమే కొనసాగింది. కొత్త నోటిఫికేషన్లేవీ విడుదల కాలేదు. అయితే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీకి చర్యలు చేపడతామని ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన నిరుద్యోగుల్లో ఆశలు రేపింది. దీనిపై సీఎం ఆదేశాల మేరకు అధికారులు హడావుడిగా కసరత్తు మొదలుపెట్టారు. వివిధ ప్రభుత్వ శాఖలు విభాగాల వారీగా ఖాళీల జాబితాను రూపొందించాయి. రాష్ట్రవ్యాప్తంగా 56,979 నేరుగా భర్తీ చేసే (డైరెక్ట్ రిక్రూట్మెంట్) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వానికి నివేదించాయి. ఇందులో ప్రభుత్వ శాఖల్లో 44,022 ఉద్యోగాలు.. సొసైటీలు, కార్పొరేషన్ల పరిధిలో 12,957 ఉద్యోగాలు ఉన్నట్టు పేర్కొన్నాయి. ఇదే సమయంలో కొత్త జోనల్ విధానంలో సవరణలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ కొత్త విధానానికి అనుగుణంగా.. ఏ జిల్లాకు, జోన్కు నష్టం జరగకుండా మళ్లీ ఉద్యోగ ఖాళీలు, అవసరాల లెక్క తీశారు. దీని ప్రకారం.. 67 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ తేల్చింది. అడ్డంకులు తొలగిపోయినా.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల విషయంలో సర్వీసు సంబంధిత అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని.. కానీ కొత్త నియామకాల విషయంలో ఎలాంటి సమస్యలూ లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇంతకుముందు జిల్లాస్థాయి నియామకాల కమిటీ (డీఎస్సీ)లు ఉండేవి. ప్రభుత్వం వాటిని రద్దు చేసి.. దాదాపు అన్నిరకాల ఉద్యోగాల భర్తీని పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా ఇతర నియామకాల బోర్డుల ద్వారా చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ), తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు(టీఆర్ఈఐఆర్బీ), తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎస్పీఆర్బీ), తెలంగాణ రాష్ట్ర మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎంఆర్బీ)ల ద్వారా నియామకాలు చేపడుతున్నారు. వివిధ ప్రభుత్వశాఖల్లో పోస్టుల సంఖ్య, నియామకాల ఆవశ్యకత ఆధారంగా ప్రభుత్వం ఆయా శాఖలకు అధికారాలు ఇస్తోంది. ఈ క్రమంలోనే పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేకంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేసింది. ఇదే తరహాలో వివిధ ప్రభుత్వ శాఖలు గుర్తించిన ఖాళీలను ఇప్పటికిప్పుడు భర్తీ చేసుకునే వీలుందని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. మరోవైపు సొసైటీలు, కార్పొరేషన్ల పరిధిలోని 12,957 పోస్టుల భర్తీకి సర్వీసు నిబంధనల అడ్డంకులు ఉన్నాయని అంటున్నాయి. ప్రభుత్వం గుర్తించిన 67 వేల ఖాళ్లలో టీచర్ పోస్టులు లేవు. ఉపాధ్యాయులు, పాఠశాలల హేతుబద్ధీకరణ పూర్తయితే తప్ప ఖాళీల లెక్క తేలే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అంటే టీచర్ పోస్టుల భర్తీపై ఇప్పుడప్పుడే స్పష్టత వచ్చే అవకాశం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేడర్ స్ట్రెంత్ కొలిక్కి.. కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన దాదాపు కొలిక్కి వచ్చింది. ఇందుకు సంబంధించి శాఖలవారీగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది. కేడర్ వారీగా జిల్లా, జోనల్, మల్టీజోనల్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చి కౌన్సెలింగ్ పూర్తిచేస్తే.. విభజన ప్రక్రియ పూర్తవుతుంది. మరోవైపు ప్రభుత్వ రంగ విభాగాలైన వివిధ సొసైటీలు, కార్పొరేషన్లలోని పోస్టుల విభజన ఇంకా జరగలేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. వయసైపోతోంది ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు. రిజర్వేషన్లు వర్తించే అభ్యర్థులకు పలు సడలింపులు ఉన్నాయి. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో వయసు పెరిగి.. ఉద్యోగాలకు దూరమయ్యే పరిస్థితి ఉందని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2017 జూన్ నాటి గణాంకాల ప్రకారం.. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో వన్ టైం రిజిస్ట్రేషన్(ఓటీఆర్) కింద 24,62,032 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో పురుషులు 14,71,205, మహిళలు 9,90,827 మంది ఉన్నారు. రిజిస్ట్రేషన్ నాటికి 40 ఏళ్లు దాటినవారు 40,994 మంది ఉన్నారు. ప్రస్తుతం వారికి 44 ఏళ్లు దాటి ఉద్యోగాలకు అనర్హులు కానున్నారు. పీఆర్సీ చెప్పిన ఖాళీలు 1.9 లక్షలు మాజీ ఐఏఎస్ అధికారి సీఆర్ బిశ్వాల్ నేతృత్వంలోని తొలి వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) తమ నివేదికలో రాష్ట్రవ్యాప్తంగా 1.90 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని పేర్కొంది. అయితే అందులో పలు నోటిఫికేషన్లు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ నియామకాల ద్వారా 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని అధికారవర్గాలు చెప్తున్నాయి. అవిపోగా మిగతా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు వెల్లడిస్తున్నాయి. -
ఇక పోస్టుల భర్తీ చకచకా.. ఏపీపీఎస్సీ కసరత్తు
సాక్షి, అమరావతి: ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలు చకచకా భర్తీ కానున్నాయి. ఈ కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా చేపట్టి ఎప్పటికప్పుడు పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కసరత్తు చేపట్టింది. ప్రభుత్వ నిర్దేశాలను అనుసరించి పోస్టుల భర్తీ ప్రక్రియను నిరంతర కార్యక్రమంగా చేపట్టాలని నిర్ణయించింది. బుధవారం ఏపీపీఎస్సీ సమావేశం జరిగింది. సభ్యులు పలు అంశాలపై చర్చించారు. నోటిఫికేషన్ల విడుదల, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, అభ్యర్థుల ఎంపిక తదితర ప్రక్రియలను త్వరత్వరగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ వంటి అంశాల్లో ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా ముందునుంచే జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 1,180 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ నివేదించగా.. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయడంపై సమావేశంలో చర్చించారు. విడుదలైన నోటిఫికేషన్లలో పోస్టుల భర్తీపైనా .. గత టీడీపీ సర్కారు ఐదేళ్లపాటు ఉద్యోగాల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకుండా సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొన్ని నోటిఫికేషన్లు విడుదల చేయించి చేతులు దులుపుకుంది. అప్పట్లో ప్రభుత్వంపై నిరుద్యోగ యువత తీవ్ర అసంతృప్తి, ఆగ్రహావేశాలతో ఉండటంతో వారిని పక్కదోవ పట్టించేందుకు, వారి దృష్టిని ప్రభుత్వ వ్యతిరేకత నుంచి దారి మళ్లించేందుకు ఈ నోటిఫికేషన్లను ఇచ్చింది. కేవలం ఎన్నికల దృష్టితో ఇచ్చిన ఈ నోటిఫికేషన్లన్నీ లోపభూయిష్టంగా ఉండటం, అప్పట్లో జరిగిన పరీక్షలు, ఇతర అంశాలు అవకతవకల మయంగా మారడంతో వాటిపై న్యాయపరమైన, ఇతర వివాదాలు తలెత్తాయి. అప్పటి నోటిఫికేషన్లకు సంబంధించిన పలు పోస్టులకు సంబంధించి న్యాయ వివాదాలను పరిష్కరింపచేస్తూ ప్రస్తుత కమిషన్ భర్తీ చేసింది. మొత్తం 32 నోటిఫికేషన్లకు సంబంధించిన 3,944 పోస్టులలో ఇప్పటికే 3,013కి పైగా పోస్టుల్లో నియామకాలను ప్రస్తుత కమిషన్ పూర్తి చేయించింది. ఇతర పోస్టులపైనా వివాదాలను పరిష్కరింపజేసి నియామకాలు పూర్తి చేయించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. కోర్టు కేసులతో ఆగిపోయిన నియామకాలను తీర్పులు వచ్చిన వెంటనే భర్తీ చేయనున్నారు. ప్రభుత్వం నుంచి ఇటీవల ఆమోదం లభించిన 1,180 పోస్టులతో పాటు మరికొన్ని గ్రూప్–1, గ్రూప్–2 పోస్టుల భర్తీకి అవకాశముందని, వాటన్నిటినీ కలుపుకుని ఈ నెలలోనే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని కమిషన్ వర్గాలు వివరించాయి. -
టీఎస్పీఎస్సీలోనే ఖాళీలు, ఇక నోటిఫికేషన్లు ఎలా?
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే కమిషన్ కార్యాలయంలో ఖాళీలు ఏర్పడ్డాయి. రెండు నెలలుగా అవి భర్తీకి నోచుకోవడంలేదు. దీంతో కార్యాలయంలో కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇదీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కీలకపాత్ర పోషించే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరిస్థితి. గతేడాది డిసెంబర్లో కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణితోపాటు ఇద్దరు సభ్యులు సి.విఠల్, చంద్రావతి పదవీకాలం పూర్తయింది. దీంతో మిగిలిన ఇద్దరు సభ్యులు కృష్ణారెడ్డి, సాయిలు మాత్రమే కొనసాగుతున్నారు. వీరిలో ఇన్చార్జి చైర్మన్గా కృష్ణారెడ్డిని ప్రభుత్వం నియమించింది. తాజాగా కృష్ణారెడ్డి ఈ నెలలో పదవీ విరమణ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో టీఎస్పీఎస్సీలో కేవలం ఒక్కరు మాత్రమే మెంబర్గా కొనసాగనున్నారు. ఒక్క సభ్యుడితో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొనసాగింపు అనేది మున్ముందు అయోమయంగా మారనుంది. ప్రభుత్వం పెద్దసంఖ్యలో ఉద్యోగాలభర్తీకి సన్నద్ధమవుతున్న వేళ కమిషన్లో సభ్యులు లేకపోవడంతో నియామకాలపై సందిగ్ధత ఏర్పడే అవకాశముంది. కోరం ఉంటేనే నోటిఫికేషన్లు... తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ ప్రకటనలు వెలువడాలంటే చైర్మన్తోపాటు ముగ్గురు సభ్యులు తప్పకుండా ఉండాలి. వారి ఆమోదంతోనే నోటిఫికేషన్లు విడుదల చేసేలా నిబంధనలున్నాయి. కానీ, ప్రస్తుతం ఇద్దరుసభ్యులు మాత్రమే ఉన్నారు. ఇందులో ఒకరు ఇన్చార్జి చైర్మన్గా ఉండగా, మరొకరు మాత్రమే సభ్యుడిగా కొనసాగుతుండటంతో ఇప్పటికిప్పుడు టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేసే పరిస్థితి లేదని కమిషన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 50 వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే శాఖలవారీగా ఉన్న ఖాళీలు, ప్రాధాన్యతల ప్రకారం భర్తీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించింది. మంజూరైన ఉద్యోగాలు, ప్రస్తుతం పనిచేస్తున్న వారు, ఖాళీలను లెక్కిస్తూ శాఖలవారీగా అంచనాలపై ఆర్థికశాఖ స్పష్టమైన నివేదికను తయారు చేసి ఉంచింది. ఆర్థికశాఖ అనుమతి ఇస్తే ప్రభుత్వం ఉద్యోగఖాళీల భర్తీకి ఇండెంట్లు వెలువడతాయి. ఇండెంట్లు వచ్చిన వెంటనే నోటిఫికేషన్లను టీఎస్పీఎస్సీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, నోటిఫికేషన్ల విడుదల కోరం మాత్రం లేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 39,952 పోస్టుల భర్తీకి అనుమతులు రాగా... అందులో అన్ని వివరాలు అందిన 36,758 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేశారు. అన్నింటికీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించగా, 35,724 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఇప్పటికే 31,062 మంది ఉద్యోగాలలో చేరిపోయారు. మిగతా ప్రక్రియ కొనసాగుతోంది. -
వచ్చే నెలలో టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదల చేయడానికి పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. దీని కోసం నిరుద్యోగ టీచర్ అభ్యర్థులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో త్వరితంగా నోటిఫికేషన్ల విడుదలపై ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రాథమికంగా 12 వేల నుంచి 15 వేల వరకు ఖాళీలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విద్యాశాఖలోని దాదాపు 18 వేల మందికి పదోన్నతులు కల్పించారు. వీరిలో 10 వేల మందికి పైగా పై స్థానాలకు వెళ్లడంతో కింది పోస్టులు ఖాళీ అయ్యాయి. పండిట్లు, పీఈటీల పోస్టులను అప్గ్రేడ్ చేసి ఆ పోస్టుల్లోకి కూడా పదోన్నతులు కల్పించారు. ప్రస్తుత డీఎస్సీలో ఈ ఖాళీలు కూడా చేరనున్నాయి. పోస్టుల వారీగా ఖాళీల సమగ్ర సమాచారాన్ని ఆయా జిల్లాల నుంచి రప్పించేందుకు అధికారులకు ఆదేశాలు పంపనున్నామని అధికారులు తెలిపారు. అలాగే, మున్సిపల్ స్కూళ్లకు సంబంధించిన వివరాలను కూడా ఆ శాఖ నుంచి తెప్పిస్తున్నారు. జనవరి మొదటి వారంలో టెట్..ఆఖర్లో డీఎస్సీ నోటిఫికేషన్ టీచర్ పోస్టుల భర్తీకి ముందుగా టీచర్ అర్హత పరీక్షను నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. గతంలో టీచర్ అర్హత పరీక్ష (టెట్)ను, టీచర్ నియామక పరీక్ష (టీఆర్టీ)ని కలిపి టెట్ కమ్ టీఆర్టీగా నిర్వహించారు. అయితే, ఈసారి రెండింటినీ కలపకుండా వేర్వేరుగా నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. జాతీయ విద్యాహక్కు చట్టం ప్రకారం.. టెట్ను ఏటా రెండుసార్లు నిర్వహించాలి. 2018లో టెట్ను ఒకసారి నిర్వహించారు. ఈ ఏడాదిలో ఎన్నికలు, కొత్త ప్రభుత్వం ఏర్పాటు తదితర కారణాలవల్ల దానిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో.. ఏటా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో టెట్, డీఎస్సీల నిర్వహణకు అడుగులు వేస్తున్నారు. డీఎస్సీ కన్నా ముందుగా టెట్ నోటిఫికేషన్ను జనవరి మొదటి వారంలో ఆ తరువాత నెలాఖరున డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముందని పాఠశాల విద్యాశాఖ వర్గాలు వివరించాయి. ఆంగ్ల నైపుణ్యం తప్పనిసరి ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6 వరకు వచ్చే ఏడాది నుంచి, ఆ తరువాతి ఏళ్లలో వరుసగా ఇతర తరగతుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నందున ఉపాధ్యాయ అభ్యర్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధనా నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండేలా టెట్, డీఎస్సీలలో సంబంధిత అంశాలపై ప్రశ్నలు పొందుపర్చనున్నారు. టెట్ పేపర్–1, 2 రెండింటిలోనూ ఇంగ్లీషు ప్రావీణ్యంపై ప్రశ్నలున్నాయి. పేపర్–2ఏలో భాషాంశాలు, కమ్యూనికేషన్ ఇతర సమగ్ర నైపుణ్యాలు పరీక్షిస్తున్నారు. కాగా, డీఎస్సీ–2018లో కొన్ని ప్రత్యేక పోస్టులకు ఆంగ్ల నైపుణ్యాలపై ఒక పేపర్గా పెట్టారు. ఈసారి ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి అవుతున్న నేపథ్యంలో ఎంపికయ్యే టీచర్లలో ఆంగ్ల నైపుణ్యాలను పరిశీలించేందుకు ప్రత్యేక పేపర్ పెట్టనున్నారు. అలాగే, టెట్లో ఇప్పుడు అడుగుతున్న అంశాలకు అదనంగా మరికొన్ని అంశాలను చేర్చనున్నారు. డీఎస్సీలో అన్ని కేటగిరీల పోస్టులకూ ప్రత్యేక పేపర్ ఉంటుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అభ్యర్థుల ఎదురుచూపు గత ఏడాదిలో డీఎడ్, బీఎడ్ కోర్సు పూర్తిచేసిన ఒక బ్యాచ్ అభ్యర్థులతో పాటు తాజాగా ఈ కోర్సులు పూర్తయిన వారు కూడా టెట్ కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో నిర్వహించిన టెట్లలో అర్హత సాధించలేని వేలాది మంది అభ్యర్థులు కూడా ఇప్పుడు టెట్ నోటిఫికేషన్పై దృష్టిసారించారు. డీఎడ్ అభ్యర్థులు రెండు బ్యాచ్లు కలిపి 80వేల మంది, బీఎడ్ అభ్యర్థులు 30వేల మందితో పాటు గతంలోని అభ్యర్థులూ వేలల్లోనే ఉన్నారు. -
ఉద్యోగాలు జో ‘నిల్’
ప్రభుత్వ శాఖల్లో కొత్త నియామకాలు ఇప్పట్లో కష్టమే. గతేడాది ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా అమల్లోకి వచ్చిన జోనల్ విధానంతో ఈ పరిస్థితి తలెత్తింది. అంతకుముందున్న విధానంతో ఉద్యోగాలను భర్తీ చేసిన నియామక సంస్థలు కొత్త జోనల్ విధానం అమల్లోకి రావడంతో ఉద్యోగాల ఖాళీల భర్తీ నోటిఫికేషన్ల విడుదలకు బ్రేక్ వేశాయి. ప్రభుత్వం ఆమోదించిన పోస్టులను సైతం భర్తీ చేయకుండా వాయిదా వేశాయి. దాదాపు ఏడాదిన్నర నుంచి వివిధ నియామక సంస్థలు ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల చేయలేదు. కొత్త విధానం ప్రకారం ఉద్యోగుల విభజన, పోస్టుల సర్దుబాట్లు, ఖాళీలపై స్పష్టత వచ్చే వరకు నూతన నియామకాలు చేపట్టే అవకాశాలు లేవనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సర్కారీ కొలువుపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం మరికొంతకాలం వేచిచూడాల్సిందే. – సాక్షి, హైదరాబాద్ కొత్త విధానమేమిటంటే.. రాష్ట్రంలో నూతన జోనల్ విధానాన్ని ఆమోదిస్తూ గత ఆగస్టులో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధానం ప్రకారం రాష్ట్రాన్ని రెండు మల్టీజోన్లు, ఏడు జోన్లు, 31 జిల్లాలుగా విభజించారు. ఉత్తర్వులు వెలువడిన తర్వాత కొత్తగా మరో రెండు జిల్లాలు ఏర్పాటు కావడంతో జిల్లాల సంఖ్య 33కు పెరిగింది. దీంతో మల్టీజోన్లు, జోన్ల పరిధిలో ఏయే జిల్లాలు వస్తాయనే అంశంపై స్పష్టత లేదు. రాష్ట్రంలో ఇదివరకు రెండు జోన్లు, 10 జిల్లాల మేరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొత్త జోనల్ విధానం అమల్లోకి రావడంతో స్థానికత, కేడర్ ఆధారంగా మల్టీజోన్లు, జోన్లు, జిల్లా స్థాయిలో ఉద్యోగులను విభజించాలి. దీనికి ప్రతి ఉద్యోగికి ఆప్షన్ ఇవ్వాలి. ఉద్యోగుల సుముఖత, శాఖల సౌలభ్యం ప్రకారం విభజన ప్రక్రియ పూర్తయితేనే కేటగిరీల వారీగా పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య, ఖాళీలపై స్పష్టత వస్తుంది. ఈ రెండు ప్రధాన కారణాలతో ఉద్యోగ నియామకాలకు బ్రేక్ పడింది. ఆ నోటిఫికేషన్ల సంగతి.. గతేడాది రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడే నాటికే ప్రభుత్వం కొన్ని రకాల పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈమేరకు ఆయా శాఖల వారీగా ప్రతిపాదనలు సంబంధిత నియామక సంస్థలకు పంపగా.. నోటిఫికేషన్ల రూపకల్పన దాదాపు పూర్తయింది. చివరి నిమిషంలో రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడటం.. కొత్త విధానం తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించడంతో ఆ నోటిఫికేషన్లు నిలిచిపోయాయి. టీఎస్పీఎస్సీ, గురుకుల, మెడికల్ బోర్డుల పరిధిలో 8,547 పోస్టులు భర్తీకి సిద్ధంగా ఉన్నాయి. టీఎస్పీఎస్సీ పరిధిలో గ్రూప్–1 కేటగిరీలో 138, గ్రూప్–2 కేటగిరీలో 60, గ్రూప్–3 కేటగిరీలో 339, అదేవిధంగా 117 అసిస్టెంట్ ఇంజనీర్, 58 డ్రాఫ్ట్మన్, 68 దేవాదాయ, 31 అటవీ అధికారి, 260 రెవెన్యూ అధికారి, 287 కార్మిక ఉపాధి కల్పన, 208 రోడ్డు రవాణా సంస్థ విభాగాలతో పాటు మరిన్ని శాఖల్లో సింగిల్ డిజిట్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటికి సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేసే క్రమంలో కొత్త జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. ►తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు పరిధిలో సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్, లైబ్రేరియన్, క్రాఫ్ట్, ఆర్ట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టాఫ్ నర్సు కేటగిరీల్లో దాదాపు 2,440 పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ బోర్డు నుంచి ఏడాదిన్నరగా నోటిఫికేషన్లు విడుదల కాలేదు. ►తెలంగాణ రాష్ట్ర వైద్య నియామకాల బోర్డు పరిధిలో కూడా డాక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, నర్స్, హెల్త్ అసిస్టెంట్ తదితర కేటగిరీల్లో 4,150 పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ ఇప్పటివరకు నోటిఫికేషన్లు వెలువడలేదు. -
త్వరలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లోని బోధన, బోధనేతర పోస్టుల భర్తీని 31 జిల్లాల ప్రకారమే చేపట్టే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పాటైన ములుగు, నారాయణ్పేట్ కలుపుకొని 33 జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో 31 జిల్లాల ప్రకారమే ముందుకు సాగాలని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఆర్ఈఐ–ఆర్బీ) భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని, ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించి త్వరలోనే గ్రీన్సిగ్నల్ ఇస్తామని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు సమాచారం. దీంతో గురుకులాల్లోని 2,500 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు బోర్డు కసరత్తు చేస్తోంది. మొత్తం 5 శాఖలకు చెందిన గురుకులాల్లోని బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులకు సంబంధించిన వివరాలను ఆయా గురుకులాల సొసైటీల కార్యదర్శులు ఇప్పటికే ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే బోర్డు నోటిఫికేషన్ను జారీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో 1,900 పోస్టులు బీసీ గురుకులాలకు చెందినవి కాగా, మరో 600 పోస్టులు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీతో పాటు జనరల్ రెసిడెన్షియల్ స్కూళ్లలోని పోస్టులను భర్తీ చేయనున్నారు. 1,900 పోస్టులు బీసీ గురుకులాల్లోనే.. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ గురుకులాలు 261 ఉండగా, అందు లో 119 గురుకులాలు ఈ ఏడాదే ప్రారంభం అయ్యాయి. వాటిల్లోనే 1,900 పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో 1,071 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), 119 స్టాఫ్నర్స్, 119 లైబ్రేరియన్స్, 119 ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్లు, 110 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అలాగే పీజీటీ హిందీ–100, ఫిజికల్ డైరెక్టర్స్–70 పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. ఇవి కాకుండా మరో 192 పోస్టులను మిగతా బీసీ గురుకులాల్లో భర్తీ చేయనున్నారు. ఇతర సంక్షేమ శాఖలకు చెందిన గురుకులాల్లో మరో 600 వరకు బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఆయా పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని రెసిడెన్షియల్ రిక్రూట్మెంట్ బోర్డు సీఎస్కు లేఖ రాసింది. -
గిరిజన వర్సిటీ ప్రవేశాలు లేనట్లే!
సాక్షి, హైదరాబాద్: గిరిజన యూనివర్సిటీ ఈ ఏడాది కూడా అందుబాటులోకి వచ్చేలా లేదు. వాస్తవానికి 2019–20 విద్యా సంవత్సరం నుంచి మహబూబాబాద్ జిల్లాలో ఈ వర్సిటీని ప్రారంభించాలని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. ఈమేరకు చర్యలు చేపట్టాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి సూచనలు సైతం చేశారు. నిర్దేశిత యూజీ, పీజీ కోర్సులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించి అడ్మిషన్లు చేపట్టాలి. ఈక్రమంలో హెచ్సీయూ ద్వారా విడుదలయ్యే నోటిఫికేషన్ ద్వారా గిరిజన యూనివర్సిటీ ప్రవేశాలు జరుగుతాయని భావించారు. ఇటీవల హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పలు పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులకు నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ ఇందులో గిరిజన యూనివర్సిటీకి సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. స్థలం కేటాయింపు... భవనాల అప్పగింత గిరిజన వర్సిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం 483 ఎకరాల భూమిని కేటాయించగా, ఇప్పటికే మెజార్టీ భూమిని రెవెన్యూ అధికారులు గిరిజన సంక్షేమ శాఖకు అప్పగించారు. తక్షణమే తరగతులు నిర్వహించుకునేందుకు వీలుగా యూత్ ట్రైనింగ్ సెంటర్ కోసం కేటాయించిన భవనాన్ని వర్సిటీకి గిరిజన సంక్షేమ శాఖ అప్పగించింది. దీంతో ఇప్పటికిప్పుడు తరగతులు మొదలుపెట్టే వీలుంది. అయితే డిగ్రీ, పీజీ కేటగిరీల్లో నిర్దేశిత కోర్సుల్లో ప్రవేశాలు, బోధన తదితర బాధ్యతలన్నీ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)కి అప్పగించింది. అయితే, ఇప్పటికీ గిరిజన వర్సిటీ ఊసే ఎక్కడా కనిపించడం లేదు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఇటీవల తెలంగాణ ఉన్నత విద్యామండలి పలు నోటిఫికేషన్లు జారీ చేయగా, చాలావాటికి దరఖాస్తుల స్వీకరణ గడువు సైతం ముంచుకొస్తోంది. గిరిజన యూనివర్సిటీ ప్రవేశ బాధ్యతలు ప్రభుత్వం హెచ్సీయూకు అప్పగించిన నేపథ్యంలో హెచ్సీయూ నోటిఫికేషన్ ద్వారా ప్రవేశాలు జరుగుతాయని అంతా భావించారు. ఇటీవల హెచ్సీయూ నోటిఫికేషన్లో గిరిజన వర్సిటీ ప్రవేశాల సమాచారం లేకపోవడంతో ఈ ఏడాది కూడా గిరిజన వర్సిటీ అందుబాటులోకి రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు కోర్సులకు అవకాశం ఉన్నా... 2019–20 విద్యా సంవత్సరంలో గిరిజన యూనివర్సిటీ అందుబాటులోకి వస్తే తొలుత ఆరు కోర్సులను ప్రారంభించాలి. ఇందులో డిగ్రీ, పీజీ కోర్సులున్నాయి. డిగ్రీలో బీఏ (హోటల్ మేనేజ్మెంట్), బీసీఏ, బీబీఏ, పీజీ కేటగిరీలో ఎంసీఏ, ఎంబీఏ (మార్కెటింగ్, ప్యాకేజింగ్), ఎంఏ (గిరిజన సంస్కృతి, జానపద కళలు) కోర్సులను ప్రారంభిస్తారు. మరిన్ని పీజీ, పీహెచ్డీ కోర్సులను దశలవారీగా అందుబాటులోకి తెస్తారు. తొలిఏడాది ప్రారం భించే కోర్సుల్లో మొత్తంగా 180 మందికి ప్రవేశా లు కల్పిస్తారు. ఏటా తరగతులు పెరుగుతూ, కొత్త కోర్సుల్లో ప్రవేశాలతో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. గిరిజనుల నేపథ్యంలో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ కావడంతో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రవేశాల్లో 30 శాతం సీట్లు వారికి కేటాయించనుంది. కానీ ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్లే విడుదల కాకపోవడంతో గందరగోళం నెలకొంది. -
ఎన్నికల దాహం!
మరికొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుందనే సమాచారంతో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో అధికార పార్టీ నేతల ధన దాహం పెరిగిపోయింది. రూ.50 లక్షలు దాటిన చెల్లింపులు కౌన్సిల్ సాధారణ సమావేశంలో పెట్టడం ఇష్టం లేక బిల్లులను విభజించి స్టాండింగ్ కమిటీలో ఉంచి ఆమోదింపజేసుకున్నారు. కాంట్రాక్టర్లు కూడబలుక్కుని రూ.కోట్ల విలువ చేసే పనులను నిర్ణీత ధరల కంటే 4.97 శాతం అధిక మొత్తానికి దక్కించుకున్నారు. రూ.1.57 కోట్ల విలువైన పనులకు సింగిల్ దరఖాస్తుతో టెండర్లు చేజిక్కించుకున్నారు. చిత్తూరు అర్బన్: ప్రభుత్వం మారిపోతే ఏమీ చేయలేమని, ఉన్నదంతా ఉన్నఫళంగా ఊడ్చేయాలన్నట్లుంది చిత్తూరు అధికార పార్టీ నేతల తీరు. చిత్తూరు మున్సిపల్ స్టాండింగ్ కమిటీ అజెండా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సమావేశం మేయర్ హేమలత అధ్యక్షతన శుక్రవారం ఉదయం నిర్వహించారు. కమిటీలో మేయర్ కాకుండా ఐదుగురు కార్పొరేటర్లు సభ్యులుగా ఉన్నప్పటికీ శ్రీకాంత్, నవీన్ అనే వ్యక్తులు ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా వీరు సమావేశానికి గైర్హాజరయ్యారు. మిగిలిన ముగ్గురిలో నళిని, లోకనాథం ప్రేక్షకపాత్ర వహించగా గుణశేఖర్నాయుడు కీలకంగా వ్యవహరించారు. మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, డెప్యూటీ మేయర్ సుబ్రమణ్యం తదితరులు సమావేశంలో పాల్గొని కమిటీ ఆమోదించిన వాటిని పుస్తకాల్లో రాసుకున్నారు. వీటికి ఆమోదం.. ♦ నగరంలో అద్దెనీటి ట్యాంకర్లకు గతేడాది జూలై నుంచి డిసెంబరు వరకు రూ.80 లక్షల బకాయిలున్నాయి. వీటిని కరవు నిధుల్లోంచి చెల్లించాలి. కానీ కరువు నిధులు వచ్చేలోపు ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలి యదు. అందుకే మున్సిపల్ సాధారణ పద్దుల నుంచి ఈ మొత్తాన్ని చెల్లించేలా ప్రణాళిక వేశారు. రూ.80 లక్షలు ఒక్కసారిగా చెల్లించా లంటే కౌన్సిల్ సమావేశంలో ఉంచాలి. ఇప్పటికిప్పుడు అంత సమయం లేదు. స్టాండింగ్ కమిటీకి రూ.50 లక్షల్లోపు బిల్లులను ఆమోదించే అవకాశం ఉండటంతో ఈ మొత్తాన్ని రూ.44.29 లక్షలుగా, రూ.34.94 లక్షలుగా విభజించి కాంట్రాక్టర్లు మునిరత్నంనాయుడు, రాజశేఖర్నాయుడుకు సాధారణ పద్దుల నుంచి చెల్లించేలా ఆమోదింపజేసుకున్నారు. ♦ మేయర్కు చెందిన 33వ డివిజన్లోని గంగనపల్లెలో శ్మశాన వాటిక అభివృద్ధి, ప్రహరీగోడ, అంతర్గత రోడ్ల నిర్మాణానికి 4.97 శాతం అధిక ధరతో రూ.34.97 లక్షలకు టెండర్, సబ్ ప్లాన్ నిధుల నుంచి బాలంబట్టు హరిజనవాడలో మురుగునీటి కాలువను నిర్మించడానికి 4.97 శాతం అధిక ధరతో రూ.35.21 లక్షలతో వేసిన టెండర్లను మునిరత్నంనాయుడు అనే వ్యక్తికి అప్పగిస్తూ తీర్మానించారు. ♦ కరువు నిధుల నుంచి నగరంలో నీటి బోర్ల డీపినింగ్, ఫ్లషింగ్ (అదనపు పైపులు వేయడం) కోసం 4.97 శాతం అధిక ధరతో రూ.17.79 లక్షల టెండర్ రాజశేఖర్నాయుడుకు కేటాయిస్తూ ఆమోదించారు. ♦ నీటి బోర్లకు మోటార్లు బిగించడం కోసం 4.97 శాతం అధిక ధరతో దాఖలు చేసిన రెండు టెండర్లను (రూ.37.80 లక్షలు) మనిదీప్ ట్రేడర్స్కు అప్పగించారు. ♦ గత రెండేళ్లలో రూ.84 లక్షలు, రూ.90 లక్షలు పలికిన చిత్తూరు కూరగాయల మార్కెట్లో గేటు వసూళ్ల టెండరును ఈ సారి వేలం పాటలో రూ.47 లక్షలకే వేలం దక్కించుకున్న లోకనాథనాయుడు అనే వ్యక్తికి గుత్తాధిపత్యం అప్పగిస్తూ తీర్మానం. ∙నగరంలోని 11 ప్రాంతాల్లో రూ.44.22 లక్షల విలువ చేసే పనులకు ఎలాంటి టెండర్లూ లేకుండా నామినేటెడ్ పద్ధతిలో వార్డ్ లెవల్ కమిటీల పేరిట టీడీపీ కార్యకర్తలకు అప్పగిస్తూ కమిటీ ఆమోదం తెలిపింది. వీటి అంచనాలను రూ.5 లక్షల్లోపు కుదించి తెలివిగా నామినేటెడ్లో చూపించారు. ∙తిమ్మసముద్రం, సీజీ పల్లె, ప్రశాంత్నగర్, పోతంబట్టు, గంగనపల్లె ప్రాంతాల్లో నీటి నిల్వ చేసే ఓవర్హెడ్ ట్యాంకర్ల నిర్మాణానికి 4.95 శాతం ఎక్కువ ధరకు సింగిల్ టెండరు దాఖలు చేసిన మునేశ్వర కన్స్ట్రక్షన్స్కు రూ.1.57 కోట్ల విలువైన పనులు అప్పగిస్తూ తీర్మానం చేశారు. -
నేడే నగారా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు నేడే నగారా మోగనుంది. తెలంగాణ శాసనసభ తొలి సాధారణ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్ర శాసనసభ పరిధిలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలతో సహా మొత్తం 119 నియోజకవర్గ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణం నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారు(ఆర్ఓ)లు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 19తో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. 20న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు 22తో ముగియనుంది. ఎన్నికల బరిలో మిగిలిన అభ్యర్థుల తుది జాబితా అదే రోజు వెల్లడికానుంది. డిసెంబర్ 7న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలోని 32,791 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,73,18,603 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నెల 19న ఓటర్ల జాబితా రెండో అనుబంధాన్ని ప్రచురించిన అనంతరం మొత్తం ఓటర్ల సంఖ్య 2.75 కోట్లకు పెరిగే అవకాశాలున్నాయి. డిసెంబర్ 11న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు. శాసనసభ ఎన్నికల ప్రక్రియ 13తో ముగియనుంది. రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకం... గడువుకు ముందే ఎన్నికలకు దూకిన అధికార టీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో నెగ్గి మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవడం ప్రతిష్టాత్మకంగా మారింది. కేసీఆర్ను గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ నేతృత్వంలో టీడీపీ, టీజేఎస్, సీపీఐ, తెలంగాణ ఇంటి పార్టీ మహాకూటమిగా ఏర్పడి టీఆర్ఎస్కు సవాల్ విసిరాయి. సామాజిక న్యాయం పేరుతో సీపీఎం నేతృత్వంలో బడుగు, బలహీనవర్గాల సంఘాలు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్)గా ఏర్పడి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్కుమార్ నేతృత్వంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేసింది. ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు, మద్యం, ఇతర కానుకలను పంపిణీ చేసి ప్రలోభపెట్టేందుకు జరిగే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఎన్నికల కోడ్ను పటిష్టంగా అమలు చేసేందుకు అన్ని జిల్లాల్లో వీడియో నిఘా బృందాలు, వీడియో వ్యూవింగ్ టీమ్లు, అకౌంటింగ్ బృందాలు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలియన్స్ టీంలు, ఖర్చుల పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసింది. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు 68 మంది సాధారణ పరిశీలకులను నియమించింది. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై నిఘా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న 53 మంది అధికారులను వ్యయ పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. శాంతిభద్రతల పర్యవేక్షణ, బందోబస్తు ఏర్పాట్లు, పరిపాలన, పోలీసు విభాగల మధ్య సమన్వయం కోసం 10 మంది ఐపీఎస్ అధికారులను సైతం పోలీస్ అబ్జర్వర్లుగా నియమించింది. పోలింగ్ రోజు అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఏర్పాట్లన్నీ పూర్తి: సీఈఓ రజత్కుమార్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సోమవారం గజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నాం. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణను ప్రారంభించేందుకు సంసిద్ధతతో ఉన్నాం. రాజకీయ పార్టీలతో సమావేశమై ఈ విషయాన్ని తెలియజేశాం. బందోబస్తు ఏర్పాట్ల కోసం 275 కంపెనీల కేంద్ర బలగాలను కోరాం. అంకెల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు 1) అక్టోబర్ 12న ప్రచురించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో ఉన్న ఓటర్లు మహిళా ఓటర్లు : 1,35,28,020 పురుష ఓటర్లు : 1,37,87,920 ఇతరులు : 2,663 మొత్తం ఓటర్ల సంఖ్య : 2,73,18,603 మొత్తం సర్వీస్ ఓటర్లు : 9,451 ఎన్ఆర్ఐ ఓటర్లు : 6 2) శాసనసభ నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్డ్ : 19 ఎస్టీ రిజర్వ్డ్ : 12 జనరల్ : 88 మొత్తం :119 3) పోలింగ్ కేంద్రాలు పట్టణ పోలింగ్ కేంద్రాలు : 12,514 గ్రామీణ పోలింగ్ కేంద్రాలు : 20,060 మొత్తం పోలింగ్ కేంద్రాలు : 32,574 అనుబంధ పోలింగ్ కేంద్రాలు : 217 సున్నిత పోలింగ్ కేంద్రాలు : 10,280 4) ఈవీఎంలు బ్యాలెట్ యూనిట్లు : 51,529 కంట్రోల్ యూనిట్లు :39,763 వీవీ ప్యాట్స్ : 42,751 5) పోలింగ్ అధికారులు, సిబ్బంది రిటర్నింగ్ అధికారులు : 119 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు : 645 పోలింగ్ సిబ్బంది : 1,62,870 6) భద్రత ఏర్పాట్లు రాష్ట్ర పోలీసు బలగాలు : 54 వేల మంది అవసరమైన కేంద్ర సాయుధ పోలీసు బలగాలు : 275 కంపెనీలు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పురుషులు 68.64 శాతం మహిళలు 69.03 శాతం మొత్తం 68.78 శాతం -
కొత్త కొత్తగా వాట్సాప్ నోటిఫికేషన్స్
న్యూఢిల్లీ : మెసేజింగ్ మాధ్యమంలో విపరీతంగా దూసుకుపోతున్న వాట్సాప్, ఎప్పడికప్పుడు సరికొత్త ఫీచర్లతో అలరిస్తూ ఉంది. తాజాగా మరో సరికొత్త ఫీచర్ను వాట్సాప్ తీసుకొచ్చేందుకు టెస్ట్ కూడా చేస్తోంది. నోటిఫికేషన్ల కోసం కొత్తగా ఇన్లైన్ ఇమేజ్ స్టయిల్ను ఉపయోగించబోతుంది. అంటే వాట్సాప్కు మెసేజ్ వచ్చినట్టు నోటిఫికేషన్లో ఇమేజ్ ద్వారా నోటిఫై చేస్తుంది. అంతకముందు కూడా వాట్సాప్ నోటిఫికేషన్లో ఇన్లైన్ ఇమేజస్ను వాడింది. కానీ తాజాగా కొత్త మెసేజింగ్స్టయిల్ నోటిఫికేషన్ ఫార్మాట్లో దీన్ని తీసుకొస్తోంది. వాట్సాప్ ప్రస్తుతం ఈ ఫీచర్ను బీటా ఛానల్లో టెస్ట్ చేశారు. అయితే ఈ ఫీచర్ కేవలం ఆండ్రాయిడ్ 9 పై డివైజ్లకు మాత్రమే పనిచేయనుంది. నోటిఫికేషన్ల కోసం తీసుకొస్తున్న ఈ ఫీచర్ జీఐఎఫ్లకు, వీడియోలకు పనిచేయదు. కేవలం చిన్న ఐకాన్ మాత్రమే ఇమేజ్ రూపంలో వస్తుంది. కేవలం ఆండ్రాయిడ్ పైలకు మాత్రమే ఈ ఫీచర్ పనిచేస్తుంది. కాగా, పాత ఐఫోన్లన్నీ పాత ఆండ్రాయిడ్ వెర్షన్లతోనే రన్ అవుతున్నాయి. దీంతో వాటికి ఈ ఫీచర్ అందుబాటులోకి రావడం లేదు. ఓరియో వెర్షన్ల బీటాలో కూడా ఈ ఫీచర్ కనిపించడం లేదు. కేవలం ఆండ్రాయిడ్ 9 పై వారికి మాత్రమే ఈ ఫీచర్. అంతేకాక ఆండ్రాయిడ్ బీటాలో కొత్త స్టికర్ ప్యాక్ను బిస్కెట్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్. కానీ ప్రస్తుతం ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులో లేదు. డిఫాల్ట్గా డిసేబుల్ అయింది. మెసెంజర్లో బిస్కెట్ పాపులర్ స్టిక్కర్ ప్యాక్. దీన్నే వాట్సాప్ కూడా తన యాప్లోకి తీసుకురావాలనుకుంది. -
నిరుద్యోగులకు ‘పరీక్ష’!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకోవడానికి నిరుద్యోగులు ఏళ్లుగా చేస్తున్న తపస్సుకు ఆటంకం ఎదురవుతోంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి నియామక సంస్థలు నిర్వహిస్తున్న అర్హత పరీక్షలన్నీ ఒకేసారి వచ్చిపడటంతో ఆశావహుల్లో అయోమయం తలెత్తుతోంది. వేరువేరు సమయాల్లో నోటిఫికేషన్లు రావడం.. ఖాళీలు ఎక్కువగా ఉండటంతో వెలువడిన నోటిఫికేషన్లన్నింటికీ దరఖాస్తు చేసిన నిరుద్యోగి.. ఇప్పుడు ఒకేసారి పరీక్షలకు తలపడాల్సి వస్తోంది. ఉద్యోగ ఖాళీల అర్హత పరీక్షలు కొన్ని వరుసగా రాగా.. మరికొన్ని ఒకే రోజు జరగనుండటంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఇంతకీ ఏ పరీక్షకు సన్నద్ధం కావాలి, ఎలా సిద్ధమవ్వాలి, అసలు పరీక్ష ఎలా రాయాలనే ప్రశ్న గందరగోళానికి గురిచేస్తోంది. నెల రోజులు ‘కేంద్రం’పరీక్షలు రాష్ట్రంలో 2 నెలల పాటు వరుసగా ఉద్యోగ అర్హత పరీక్షలు జరగనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీ పరీక్షలు కాస్త వెనువెంటనే ఉన్నాయి. దీంతో అభ్యర్థులు ఇరకాటంలో పడ్డారు. ఆర్ఆర్బీ (రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు)లో గ్రూప్ ‘డీ’కేటగిరీలో 62,907 ఖాళీలకు ఈ నెల 17 నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 1.45 కోట్ల మంది దరఖాస్తు చేశారు. దీంతో రోజుకు సగటున 45 వేల మంది అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాబ ట్టి దాదాపు 45 రోజుల పాటు పరీక్షలు జరగనున్నా యి. ఇదే సమయంలో ఐబీపీఎస్ (బ్యాంకిం గ్) పరీక్షలూ నిర్వహిస్తున్నారు. ఈ నెల 29, వచ్చే నెల 7వ తేదీన ఐబీపీఎస్ పీవో పరీక్షలకు ఇటీవలే షెడ్యూల్ విడుదలైంది. దీనికి తోడు యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్), ఎస్ఎస్సీ (స్టాఫ్ సెలక్షన్ కమిషన్) పరీక్షలు కూడా సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 10 వరకు వేర్వేరు తేదీల్లో ఉన్నాయి. ఉరుకులు.. పరుగులే.. ఇలా నెల రోజులు వరుసగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ని ఖాళీల భర్తీ పరీక్షలుండగా.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలూ ఇవే తేదీల్లో ఉండటంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. గురుకుల పాఠశాలల్లో దాదాపు 3 వేల ఖాళీలకు ఈ నెల 26 నుంచి వచ్చే నెల 14 వరకు పీజీటీ, టీజీటీ అర్హత పరీక్షలు జరగనున్నాయి. ఈనెల 30న కానిస్టేబుల్ పరీక్ష, వచ్చే నెల 7న గ్రూప్–4తో పాటు ఏఏఓ, ఎఎస్ఓ, డీపీఏ, బిల్ కలెక్టర్, జూనియర్ అసిస్టెంట్ పరీక్షలున్నాయి. కాబట్టి గురుకుల పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు టీఎస్పీఎస్సీ పరీక్షలు రాయాలంటే ఉరుకులు, పరుగులు పెట్టాల్సిందే. దీంతో పరీక్ష తేదీల్లో మార్పులు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. గురుకుల పరీక్ష తేదీల్లో మార్పులు? గురుకుల పరీక్షల తేదీలు మార్చాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. తేదీల మార్పు కోసం శనివారం మాసబ్ట్యాంక్లోని తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ నియామకాల బోర్డు కార్యాలయం ఎదుట పలువురు అభ్యర్థు లు ధర్నా నిర్వహించారు. అనంతరం బోర్డు చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను కలసి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వానికి కూడా వినతులు పెరుగుతుండటంతో సీఎస్ ఎస్కే జోషి స్పందించారు. పరీక్షల తేదీలను పునః సమీక్షించుకోవాలని, అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని బోర్డుకు సూచించారు. దీంతో శనివారం సాయంత్రం గురుకుల బోర్డు సభ్యులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించా రు. పరీక్షల తేదీల్లో మార్పులపై త్వరలో స్పష్టత వస్తుందని ఓ ఉన్నతాధికారి చెప్పారు. -
ప్లాట్.. ప్లాన్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) మరోసారి ప్లాట్ల వేలానికి సిద్ధమైంది. మొత్తం 95 ప్లాట్ల వేలానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన తొమ్మిది లేఅవుట్లలోని 82 ప్లాట్లు, హెచ్ఎండీఏ అనుమతి పొందిన నాలుగు ప్రైవేట్ లేఅవుట్లలోని 13 ప్లాట్లు ఉన్నాయి. వీటి ఈ–వేలానికి సంబంధించిన బ్రోచర్ను బేగంపేట్ క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ మంత్రి కేటీఆర్... హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు, కార్యదర్శి బీఎస్ లత, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ నరేందర్, ఎస్టేట్ అధికారి గంగాధర్, సీఐవో సుబ్రమణ్యంలతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. అనంతరం బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు కార్యాలయంలో కమిషనర్ చిరంజీవులు వేలం వివరాలను మీడియాకు తెలిపారు. ఈ–వేలం ద్వారా 1,44,500.19 చదరపు గజాల విస్తీర్ణంలోని 95 ప్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. ఏప్రిల్లో 229 ప్లాట్లను పారదర్శకంగా విక్రయించామని, అదే విధానంలో ఈసారీ వేలం వేస్తున్నామన్నారు. ప్రస్తుత ప్లాట్లలో అత్యధికంగా ‘ది ప్రైడ్ ఆఫ్ హెచ్ఎండీఏ’ నినాదంతో ఉప్పల్ భగాయత్లో అభివృద్ధి చేసిన 67 ఉన్నాయని.. వీటి విక్రయం ద్వారానే దాదాపు రూ.500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. మిగిలిన 28 ప్లాట్ల విక్రయాలతో మరో రూ.100 కోట్లు వస్తాయని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉన్న భూమి విలువకు ఒకటిన్నర నుంచి మూడున్నర రేట్లు ఎక్కువగా ధర నిర్ణయించినట్లు చెప్పారు. అయితే వేలంలో ఒకే బిడ్డరు పాల్గొంటే.. దాన్ని రద్దు చేసి రెండోసారి నిర్వహిస్తామన్నారు. ఏ దశలోనైనా వేలాన్ని రద్దు చేసే అధికారం హెచ్ఎండీఏకు ఉందన్నారు. ఆన్లైన్లో ప్లాట్ల రిజిస్ట్రేషన్కుసెప్టెంబర్ 6 ఆఖరని, అదే నెల 8న ఉప్పల్ భగాయత్లోని ప్లాట్లు, 9న మిగిలిన ప్లాట్లు విక్రయిస్తామన్నారు. గజం రూ.28 వేలు... 2005లో మూసీ డెవలప్మెంట్లో భాగంగా ప్రభుత్వం ఉప్పల్ భగాయత్ రైతుల నుంచి 733 ఎకరాలు సేకరించింది. ఇందులో మెట్రో రైలు డిపో, మురుగు నీటి శుద్ధి కేంద్రం, మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు కొంత కేటాయించింది. మిగిలిన 413.32 ఎకరాల్లో ‘ఉప్పల్ భగాయత్’ పేరుతో లేఅవుట్ అభివృద్ధి చేసింది. భూములు కోల్పోయిన 1,520 మంది రైతులకు గతేడాది ప్లాట్లు కేటాయించింది. మిగిలిన 67 ప్లాట్లను ఇప్పుడు విక్రయిస్తోంది. గజానికి రూ.28వేలు ధర నిర్ణయించారు. వీటి ద్వారా రూ.500 కోట్ల ఆదాయం రానుంది. అలాగే ఇక్కడి ఫేజ్–2, ఫేజ్–3 ప్లాట్లను కూడా విక్రయిస్తే మరో రూ.500 కోట్ల ఆదాయం వస్తుంది. ఎక్కడెక్కడ..? హెచ్ఎండీఏ లేఅవుట్లలో 82 ప్లాట్లు ప్రధాన ప్రాంతాల్లో ఉన్నాయి. ఇందులో ఉప్పల్ భగాయత్లోని 67, గత ఏప్రిల్లో విక్రయించిన ప్రాంతాల్లో మిగిలిన 15 ప్లాట్లు ఉన్నాయి. వీటిలో అత్తాపూర్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లోని రెండు ప్లాట్లు, ముష్క్మహల్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లోని ఒక ప్లాట్, చందానగర్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లోని ఒక ప్లాట్, మైలార్దేవ్పల్లి మధుబన్ రెసిడెన్షియల్ కాలనీలోని ఆరు ప్లాట్లు, నల్లగండ్ల రెసిడెన్సియల్ కాంప్లెక్స్లోని ఒక ప్లాట్, వనస్థలిపురం రెసిడెన్షియల్ కాంప్లెక్స్లోని ఒక ప్లాట్, నెక్నాంపూర్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లోని రెండు ప్లాట్లు, తెల్లాపూర్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లోని ఒక ప్లాట్ ఉన్నాయి. అదేవిధంగా హెచ్ఎండీఏ అనుమతి పొందిన బాచుపల్లి, దూలపల్లి, జల్పల్లి గ్రామాల్లోని ప్రైవేట్ లేఅవుట్లలోని 13 గిఫ్ట్ డీడీ ప్లాట్లు కూడా విక్రయానికి ఉంచారు. రిజిస్ట్రేషన్ ఫీజు మళ్లీనా.? హెచ్ఎండీఏ ఏప్రిల్లో నిర్వహించిన 229 ప్లాట్ల ఆన్లైన్ విక్రయాలను థర్డ్ పార్టీగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎంఎస్టీసీ లిమిటెడ్ సంస్థకు అప్పగించింది. రూ.10 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏడాది పాటు ఏ వేలంలోనైనా పాల్గొనే వీలుండేలా నిబంధనలు పొందుపరిచారు. అయితే ఇది పెద్ద మొత్తంతో కూడుకున్నది కావడంతో కమిషనర్ కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకొని రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1,000 వరకు తగ్గించగలిగారు. దీంతో వేలాది మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరోసారి హెచ్ఎండీఏ వేలం నిర్వహిస్తే అవకాశం ఉంటుందనుకున్నారు. ఈసారి ఎంఎస్టీసీ లిమిటెడ్ కాకుండా ఐసీఐసీఐ బ్యాంక్కు ఈ–వేలం ప్రక్రియను అప్పగించారు. దీంతో ఎంఎస్టీసీ లిమిటెడ్లో ఈ–వేలం కోసం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి వేలంలో ఉచిత రిజిస్ట్రేషన్కు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై హెచ్ఎండీఏ అధికారులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రిజిస్ట్రేషన్ ఇలా... ఈ వేలంలో పాల్గొనాలకునేవారు hmda.auctiontiger.net వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. హెచ్ఎండీఏ వెబ్సైట్లో ‘ఉప్పల్ భగాయత్ ఈ–అక్షన్’ లింక్పై క్లిక్ చేస్తే నేరుగా పైన పేర్కొన్న వెబ్సైట్లోకి వెళ్లొచ్చు. అందులో కుడివైపునుండే రిజిస్టర్ ఆప్షన్పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలి. సెప్టెంబర్ 6 సాయంత్రం 5గంటల్లోపు రూ.500 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ వేలం జరిగే సెప్టెంబర్ 8, 9తేదీల్లో తమకు కేటాయించిన యూజర్ ఐడీ, పాస్వర్డ్లతో జిఝఛ్చీhmda.auctiontiger.net వెబ్సైట్లోకి లాగిన్ అయి, హెచ్ఎండీఏ నిర్ధరించిన ధరలో 10శాతం ఈఎండీ రూపంలో చెల్లించాలి. బిడ్డరు వేలంలో పాల్గొనేటప్పుడు కనీసం రూ.100 ఎక్కువగా కోట్ చేయాలి. అత్యధిక ధర కోట్ చేసిన వారికి ఈ–వేలం ప్రక్రియ ముగిసిన వెంటన సమాచారం పంపిస్తారు. ఇందులో సక్సెస్ఫుల్ బిడ్డర్ ప్లాట్ నిర్ధరిత ధరలో 25 శాతం డబ్బులు వారంలోగా చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే మిగిలిన 75 శాతం డబ్బును రెండు నెలల్లోగా హెచ్ఎండీఏకు చెల్లించాలి. లేని పక్షంలో ఇన్స్టాల్మెంట్ల వారీగా వడ్డీతో సహా కట్టాలి. బ్యాంక్ ద్వారా రుణసదుపాయం పొందేందుకు కొనుగోలుదారులకు అవసరమైన ప్రమాణ పత్రాన్ని కూడా హెచ్ఎండీఏ జారీ చేస్తుంది. -
ఇష్టారాజ్యంగా నిర్ణయాలు
నూజివీడు: రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలపై సిబ్బందిలో సైతం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రిపుల్ఐటీ ప్రారంభంలో నాన్ టీచింగ్ స్టాఫ్ కింద తీసుకున్న హెచ్ఆర్టీలు దాదాపు 25 మందిని ఇటీవలే ఐటీ మెంటార్ల పేరుతో టీచింగ్ స్టాఫ్గా మార్చడంతో పాటు జీతాలను కూడా పెంచడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జరిగిందిదీ.. ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేసినప్పుడు హోమ్ రూమ్ ట్యూటర్ల(హెచ్ఆర్టీ)లను తీసుకోవడం జరిగింది. వీరు ప్రతి తరగతికి ఒకరు చొప్పున ఉన్నారు. వీరిని అప్పట్లో పీజీ డిప్లొమా ఇన్ ఐటీ అర్హతతో తీసుకుని అప్పట్లో నెలకు రూ.10వేల చొప్పున జీతం ఇచ్చారు. తరగతిలో మెంటార్ లేనప్పుడు తరగతిని పర్యవేక్షించడం, ల్యాప్ట్యాప్ల వాడకాన్ని విద్యార్థులకు నేర్పించడం, విద్యార్థులకు నిర్వహించే స్టడీ అవర్స్ను పర్యవేక్షించడం వీరి పని. నాలుగేళ్లు గడిచిన తర్వాత హెచ్ఆర్టీలను రద్దు చేసి వీరినే ఐటీ ఎస్ఎస్లుగా మార్చి జీతాన్ని రూ.15వేలుకి పెంచారు. ఆ తర్వాత మరలా కొంతకాలానికి టెక్నికల్ అసిస్టెంట్ (టీఏ)గా మార్చడంతో పాటు వేతనాన్ని రూ.20వేలకు పెంచారు. ఈ మూడు రకాల హోదాలు కూడా నాన్టీచింగ్ స్టాఫ్కు సంబంధించినవే. అనంతరం కొంతకాలానికి వారి జీతాన్ని రూ.25వేలకు పెంచారు. నోటిఫికేషన్ లేదు.. ఇక్కడ టీఏలుగా పనిచేస్తున్న వారు ఉద్యోగం చేసుకుంటూనే నాగార్జున యూనివర్సిటీ నుంచి దూరవిద్యా విధానంలో ఎమ్మెస్సీ ఐటీ చదివారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులు టీఏలను ఐటీ మెంటార్లు(టీచింగ్ స్టాఫ్)గా మారుస్తూ, జీతాన్ని కూడా రూ.33వేలకు పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీచేసి వారందరికి ఆర్డర్లను అందజేసింది. ప్రస్తుతం ఇదే వివాదాస్పదం అవుతోంది. ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలతో యూనివర్సిటీ ప్రమాణాలు పతనం చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఐటీ మెంటార్లను నియమించాల్సి ఉంటే నోటిఫికేషన్ జారీ చేసి ఇంటర్వ్యూలు నిర్వహించి నియమించుకోవాలే గాని ఇలా చేయడమేమిటని మెంటార్లు సైతం ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ హెచ్ఆర్టీలందరూ 20వ శతాబ్దపు గురుకులంలో చదువుకున్న విద్యార్థులు కావడం వల్లనే కావాలనే వారికి ఇలా లబ్ది చేస్తున్నారనే ప్రచారం ట్రిపుల్ఐటీలో జరుగుతోంది. -
టీఎస్పీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ గురువారం రెండు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీలో 124 బిల్కలెక్టర్, బేవరేజెస్ కార్పొరేషన్లో 76 పోస్టులను భర్తీ చేయనుంది. వీటికి ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. ఈ పోస్టులకు గ్రూప్–4, ఆర్టీసీ పోస్టులతో పాటే కామన్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. వయోపరిమితి, విద్యార్హత తదితర వివరాలు దరఖాస్తుల తేదీ నాటికి వెబ్సైట్లో ఉంచనున్నట్లు పేర్కొంది. బేవరేజెస్ కార్పొరేషన్లో 78 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని భావించినా, రెండు పోస్టులపై స్పష్టత రానందునా 76 పోస్టులకే నోటిఫికేషన్ జారీ చేసినట్లు వివరించింది. -
202 పోస్టులకు నేడు నోటిఫికేషన్లు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో ఖాళీగా ఉన్న బిల్ కలెక్టర్ పోస్టులతోపాటు బేవరేజెస్ కార్పొరేషన్లో పలు పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఈనెల 19న రెండు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేయనుంది. జీహెచ్ఎంసీలోని 124 బిల్ కలెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి, వాటిని గ్రూపు–4 పరిధిలోకి తీసుకురానుంది. అలాగే బేవరేజెస్ కార్పొరేషన్లో మరో 78 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది. అందులో గ్రేడ్–2 అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు 56 ఉండగా, గ్రేడ్–2 అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్ పోస్టులు 13 ఉన్నాయి. అలాగే మరో 9 డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు వచ్చే వారం మరో 88 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వీటిలో 50 హెల్త్ అసిస్టెంట్ పోస్టులు (బయాలజీతో ఇంటర్మీడియట్ అర్హతతో) ఉండగా, 35 శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టులు (బయాలజీతో డిగ్రీ అర్హతతో) ఉన్నాయి. జిల్లాలకు ఎస్ఏ పోస్టుల మెరిట్ జాబితా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీ ప్రక్రియను టీఎస్పీఎస్సీ వేగవంతం చేసింది. వచ్చే నెల మొదటి వారంలో స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు 1:3 రేషియోలో మెరిట్ జాబితాలను ఆయా జిల్లాలకు పంపించనుంది. దీనిపై డీఈవోలతో టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్, పాఠశాల విద్య కమిషనర్ విజయ్కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్కూల్ అసిస్టెం ట్ జిల్లాల వారీ జాబితాలను గురువారం ఆయా జిల్లా కలెక్టర్లకు పంపించేందుకు చర్యలు చేపట్టారు. 13,665 మందితో ఎస్జీటీ మెరిట్ జాబితా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టుల భర్తీలో భాగంగా వివిధ మీడియంలలో 1:3 రేషియోలో 13,665 మంది అభ్యర్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఎంపిక చేసినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. 5,415 పోస్టుల భర్తీ కోసం వారిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు ఎంపిక చేసినట్లు తెలిపింది. రాష్ట్రంలోని పాత పది జిల్లా కేంద్రాల్లో వెరిఫికేషన్ ఉంటుందని, వెరిఫికేషన్ నిర్వహించే తేదీల వివరాలను తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది. వెరిఫికేషన్కు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను తమ వెబ్సైట్లో పొందవచ్చని సూచించింది. -
అవతరణ దినోత్సవ కానుక: టీఎస్పీఎస్సీ కొత్త నోటిపికేషన్లు
-
ట్రిపుల్ ఐటీ ఫ్యాకల్టీ నోటిఫికేషన్పై సందేహాలెన్నో?
రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో కాంట్రాక్టు పద్ధతిన ఫ్యాకల్టీల నియామకానికి ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లో పారదర్శకత లోపించడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్న సిబ్బంది, దరఖాస్తు చేసుకోవాలనుకునే వారిలో గందర గోళం ఉంది. నూజివీడు : రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో కాంట్రాక్టు పద్ధతిన ఫ్యాకల్టీల నియామకానికి ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లో పారదర్శకత లోపించడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంజినీరింగ్కు సంబంధించి సివిల్, మెకానికల్, ఈసీఈ, సీఎస్ఈ, కెమికల్, ఎంఎంఈ బ్రాంచిలకు, సైన్స్ సబ్జెక్టులైన గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జంతుశాస్త్రం, హ్యుమానిటీస్, సోషల్ సైన్స్లకు ఫ్యాకల్టీలు కావాలని ఈనెల 15న నోటిఫికేషన్ జారీచేశారు. వీటికి అర్హులైన వారు ఈనెల 29 సాయంత్రం 5గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్పై ప్రస్తుతం ఉన్న సిబ్బందిలోను, దరఖాస్తు చేసుకోవాలనుకునే వారిలోను అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోస్టర్ పాయింట్ పాటిస్తారా...లేదా..? ఏ ప్రభుత్వ విద్యాసంస్థ అయినా కాంట్రాక్టు పద్ధతిపై నియామకాలు చేస్తున్నప్పుడు కచ్చితంగా రోస్టర్పాయింట్ పాటించాలి. ఆర్జీయూ కేటీ విడుదల చేసిన నోటిఫికేషన్లో రోస్టర్ పాయింట్ విధానం అమలుచేస్తారా, లేదా అనేది పేర్కొనలేదు. అభ్యర్థులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ రోస్టర్పాయింట్ విధానం అమలైతే దరఖాస్తుతోపాటు కుల ధ్రువీకరణ పత్రాలను కూడా జతచేయాల్సి ఉంటుంది. ఈ వివరాలేమీ నోటిఫికేషన్లో పేర్కొనకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. పోస్టులపై స్పష్టత లేదు నాలుగు ట్రిపుల్ ఐటీలలో కలిపి 300పోస్టులపైనే ఫ్యాకల్టీలను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకుంటామని పేర్కొన్నారే తప్పితే ఏ సబ్జెక్టుకు ఎంతమంది అనే వివరాలు పొందుపరచలేదు. ఇంజినీరింగ్కు సంబంధించి సివిల్, కంప్యూటర్ సైన్స్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, కెమికల్, మెటీరియల్స్ అండ్ మెటలర్జికల్స్ బ్రాంచిలతోపాటు గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జంతుశాస్త్రం, ఇంగ్లీష్, తెలుగు, మేనేజ్మెంట్, ఫైన్ఆర్ట్స్, యోగా, సైకాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, లైబ్రరీ సైన్స్ తదితర సబ్జెక్టులకు ఫ్యాకల్టీలను నియమిస్తున్నామని తెలిపారే తప్పితే ఏ సబ్జెక్టుకు ఎంత మంది అవసరమో తెలపలేదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ట్రిపుల్ఐటీల వారీగా నోటిఫికేషన్ జారీచేయకుండా అన్నిటికి కలిపి ఒకే నోటిఫికేషన్ జారీచేశారు. అంతేగాకుండా ఇంజినీరింగ్ ఫ్యాకల్టీకి, పీయూసీ ఫ్యాకల్టీలకు ఎంతెంత జీతాలు చెల్లిస్తారో కూడా పేర్కొనలేదు. దరఖాస్తులో ఏ ట్రిపుల్ఐటీకి దరఖాస్తు చేసుకుంటున్నారనే ఆప్షన్ కూడా ఇవ్వలేదు. గతంలో ఏ ట్రిపుల్ఐటీకి ఆ ట్రిపుల్ఐటీనే నోటిఫికేషన్ జారీచేసి ఫ్యాకల్టీలను నియమించుకునే వారు. అందుకు భిన్నంగా ఇప్పుడు యూనివర్శిటీనే భర్తీ చేస్తున్నప్పటికీ నోటిఫికేషన్ పారదర్శకంగా లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అయోమయం..ఆందోళన
కడప, బద్వేలు : డిప్లొమో ఇన్ ఎడుకేష్యన్ (డీఎడ్) పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఈ ఏడాది విచిత్ర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. 2016–17 ఏడాదిలో మొదటి సంవత్సరం అభ్యసించిన విద్యార్థులు ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆయోమయానికి గురవుతున్నారు. ఈ ఏడాది వారికి నిర్వహించాల్సిన వార్షిక పరీక్షలు చేపట్టలేదు. ప్రస్తుతం వారంతా రెండవ సంవత్సరం చదువుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17 నుంచి మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరు కావాల్సి వస్తోంది. ఇవి ముగిసిన మరో మూడు నెలల్లోనే రెండవ సంవత్సరం పరీక్షలు రాయాల్సి ఉంది. దీనికి తోడు ప్రస్తుతం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విడుదల చేశారు. మొదటి సంవత్సరం వార్షిక పరీక్షల అనంతరం టెట్కు చదవాలా.. రెండవ సంవత్సరం పరీక్షలకు సన్నద్ధం కావాలా.. అనే సందేహంలో విద్యార్థులు ఉన్నారు డీఎడ్ ప్రవేశాలు 2016–17 విద్యా సంవత్సరంలో ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. సాధారణంగా జూన్ నెలలో జరగాల్సిన అడ్మిషన్లు నవంబరులో జరగడంతో విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో వారికి వార్షిక పరీక్షలు కూడా ఆలస్యంగానే నిర్వహిస్తున్నారు. రెండవ సంవత్సరం పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇలా చదవి పరీక్షలు రాయడం వల్ల ఫలితాల్లో ప్రభావం పడుతుందని విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో 78 డీఎడ్ కళాశాలలుండగా, వీటిలో 6,500 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థుల్లో ఆందోళన.. 2017–18 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం చేరిన విద్యార్థులు తమకు ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారో అని ఎదురు చూస్తున్నారు. తమ కంటే ముందు చేరిన విద్యార్థులే ప్రస్తుతం మొదటి ఏడాది పరీక్షలు రాస్తున్నారని, తమకు ఎప్పుడు నిర్వహిస్తారో అని ప్రశ్నిస్తున్నారు. తాము కూడా వీరిలానే ఒకే ఏడాది రెండు పరీక్షలు రాయాల్సి వస్తుందేమోనని వారిలో ఆందోళన నెలకొంది. రెండవ సంవత్సరం తరగతులు జరుగుతుండగా.. తాము చదివి వదిలేసిన మొదటి సంవత్సరం పరీక్షలు రాయాల్సి రావడంతో సన్నద్ధానికి సమయం సరిపోదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే రెండవ సంవత్సరం ప్రాక్టికల్స్ పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉందని వాపోతున్నారు. మండే ఎండలోనే సన్నద్ధం.. సరైన ప్రణాళిక లేకుండా పరీక్షల షెడ్యూల్ ప్రకటిం చడం.. వాటిని కూడా వేసవిలో నిర్వహించడం వి ద్యార్థులకు ఇబ్బందిగా మారింది. మండుటెండల్లో ç పరీక్షలు రాయడం ఫలితాలపై ప్రతికూల ప్రభా వం చూపుతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెట్ ఎలా..! ప్రస్తుతం రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులకు గతంలో టెట్ అవకాశం కల్పించారు. ప్రస్తుతమూ కల్పించాలని వారంతా కోరుతున్నారు. అవకాశం కల్పిస్తే టెట్కు ఎలా సన్నద్ధం కావాలో తెలియక ఆయోమయంలో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం విద్యా సంవత్సరం ప్రారంభించి పరీక్షలు నిర్వహించి ఉంటే ఈ ఇబ్బందులు వచ్చేవి కావని వారు పేర్కొంటున్నారు. -
ఆన్లైన్.. హైరానా!
యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీయూ పీ జీ విద్యార్థుల సెమిస్టర్ పరీక్ష దర ఖాస్తులు అప్లోడ్ కాకపోవడంతో వి ద్యార్థులు హైరానా పడుతున్నారు. ఎ స్వీయూలో పీజీ సెమిస్టర్ పరీక్షలకు దరఖాస్తు కోసం ఈ నెల 12న నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్ష దరఖాస్తు తుది గడువు శనివారంతో ముగియనుంది. అయితే దరఖాస్తు చేసుకోవడంలో సాంకేతిక సమస్యలు తలెతా ్తయి. దీంతో దరఖాస్తులు అప్లోడ్ కా వడం లేదు. ఫలితంగా విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గత విద్యాసంవత్సరం నుంచి అమలులోకి వచ్చిన సీబీసీఎస్ విధానం ప్రకారం విద్యార్థులు మూడు రెగ్యులర్ పేపర్లతో పాటు ఒక జనరల్ ఎలక్టివ్, ఒక ఓపెన్ ఎలక్టివ్ పేపర్ చదవాల్సి ఉం ది. ఆన్లైన్లో దరఖాస్తు చేసే సమయంలో జనరల్ ఎలక్టివ్ పేపర్లు ఎం చుకునే కాలమ్లో ఒక పేపర్ మా త్రమే ఎంటర్ చేస్తే అప్లోడ్ కావడం లేదు. రెండో పేపర్ ఎంటర్ చేయమ న్న ఆప్సన్ వస్తుంది. వాస్తవానికి వి ద్యార్థులు చదువుతున్నదీ, పరీక్ష రా యాల్సింది ఒక పేపర్ మాత్రమే. అ యితే రెండు జనరల్ పేపర్లు ఎంచుకొనేలా సాఫ్ట్వేర్ ఉండడంతో విద్యార్థుల దరఖాస్తులు అప్లోడ్ కావడం లేదు. గణితం, ఆక్వాకల్చర్, రసాయ న శాస్త్రం, సాంఖ్యక శాస్త్ర విభాగాల్లో ఈ సమస్యలు ఉన్నాయి. అకడమిక్ విభాగం నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ స మస్య తలెత్తిందని కొందరు విద్యార్థి నాయకులు పేర్కొంటున్నారు. ఈ స మస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ అంశంపై రె క్టార్ ఎం.భాస్కర్ను వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి వచ్చిందన్నా రు. ఈ అంశాన్ని వివిధ విభాగాల వా రితో చర్చించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దని సూచించారు. -
సూపర్ బాస్లు
రాయలసీమకే తలమానికంగా వెలుగొందుతూ సూపర్ స్పెషాలిటీ సేవలందిస్తున్న స్విమ్స్లో అవినీతి రాజ్యమేలుతోంది. ముఖ్యంగా పరిపాలనా విభాగంలో కీలక పదవుల్లో ఉన్న సీఎం బంధువులు సూపర్బాస్లుగా మారారు. చిన్నచిన్న కాంట్రాక్టు పనులు మొదులుకుని ఉద్యోగాల భర్తీ వరకు అన్నీ తామై వ్యవహరిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల ఎలాంటి నోటిఫికేషన్ విడుదల కాకుండానే అడహక్ పద్ధతిలో సీఎం బంధువును నెట్వర్క్ ఇంజినీర్గా నియమించడమే ఇందుకు నిదర్శనం. తిరుపతి (అలిపిరి) : స్విమ్స్ కంప్యూటర్ సెక్షన్లలో పనిఒత్తిడి పెరిగిందని, అందుకు తగ్గట్టుగా నెట్వర్క్ ఇంజినీర్ను నియమించాలని సీఎం బంధువులు భావించారు. అందుకు తగ్గట్టుగానే ఒక పర్మినెంట్ పోస్ట్ను క్రియేట్ చేశారు. చెన్నైలో ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినిర్గా పనిచేస్తున్న తేజ అనే వ్యక్తిని అత్యంత రహస్యంగా నెట్వర్క్ ఇంజినీర్గా నియమించారు. అతనికి నెలకు స్విమ్స్ నిధుల నుంచి రూ.50 వేల వేతనం చెల్లిస్తున్నారు. ఆరు నెలల క్రితం అత్యంత రహస్యంగా ఉద్యోగంలో చేరిన వ్యక్తి స్వయానా స్విమ్స్ పర్చేజింగ్ విభాగం ఇన్చార్జ్ అన్న కొడుకు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. నిబంధనలు గాలికి స్విమ్స్లో అడహక్ పద్ధతిలో నియమించాలంటే తప్పనిసరిగా నోటిఫికేషన్ విడుదల చేయాలి. అభ్యర్థుల నుంచి వచ్చే దరఖాస్తులను కమిటీ పరిశీలించి అర్హతలున్న వ్యక్తిని నియమించాలి. స్విమ్స్ నెట్వర్క్ ఇంజి నీర్ నియామకంలో ఇవేమీ పాటించలేదు. సీఎం సమీప బంధువు కావడంతో పర్మినెంట్ పోస్ట్లో నియమించేశారు. నిబంధనలకు విరుద్ధమని తెలిసినా డైరెక్టర్పై ఒత్తిడి తెచ్చి నియామక ఉత్తర్వులు జారీ చేశారన్న విమర్శలు ఉన్నాయి. పట్టించుకోని డైరెక్టర్ స్విమ్స్లో అవినీతి రాజ్యమేలుతున్నా డైరెక్టర్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నా యి. పరిపాలనా పరమైన కీలక పదవుల్లో సీఎం బంధువులు ఉండడం కూడా ఇందుకు ప్రధాన కారణమన్న ప్రచారం జరుగుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన స్విమ్స్లో సీఎం బంధువులు అవినీతికి పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తినా ప్రభుత్వం స్పందించకపోవడం గమనార్హం. ప్రతిభ ఆధారంగా నియామకం స్విమ్స్ కంప్యూటర్ సెక్షన్లో పనిఒత్తిడి పెరిగింది. ఉద్యోగులపై పనిభారం పెరగడంతో నెట్వర్క్ ఇంజినీర్ను నియమించాలని భావించాం. ప్రతిభ ఆధారంగా అడహాక్ పద్ధతిలో పోస్టును భర్తీ చేశాం. – ఆదిక్రిష్ణయ్య, పర్సనల్ మేనేజర్, స్విమ్స్, తిరుపతి -
నిరుద్యోగులకు మరో శుభవార్త...
సాక్షి, హైదరాబాద్ : నిరుద్యోగులకు మరో శుభవార్త. తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్కో)లో 1604 పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ కాగా, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్)లో మరో 3 వేలకు పైగా పోస్టుల భర్తీకి వారం పది రోజుల్లో నియామక ప్రకటనలు జారీ కానున్నాయి. 150 అసిస్టెంట్ ఇంజనీర్, 500 జూనియర్ అసిస్టెంట్, 100 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్(జేఏఓ) పోస్టులతో పాటు 2000 జూనియర్ లైన్మెన్(జేఎల్ఎం) పోస్టులు ఇందులో ఉండనున్నాయి. 150 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల్లో 130 ఎలక్ట్రికల్, 20 సివిల్ విభాగాలకు చెందిన పోస్టులుండనున్నాయి. ఈ పోస్టుల సంఖ్య స్వల్పంగా మారవచ్చని, మొత్తానికి 3 వేలకు పైగా పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేస్తామని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. త్వరలో సంస్థ పాలక మండలి సమావేశం నిర్వహించి ఈ పోస్టుల నియామకాలకు ఆమోదం తెలుపుతామన్నారు. అనంతరం ఈ పోస్టులకు వేర్వేరుగా ప్రకటనలు జారీ చేస్తామన్నారు. మరో 10 రోజుల్లో ఈ ప్రకటనలు జారీ కావచ్చు అన్నారు. -
అమెరికా ఎన్నికల్లో రష్యా 2,000 ప్రకటనలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి రష్యాకు చెందిన ఓ మీడియా సంస్థ ట్వీటర్లో దాదాపు 2,000 ప్రకటనలు ఇచ్చిందని ట్వీటర్ ప్రతినిధులు తెలిపారు. ఈ ఎన్నికల్లో రష్యా జోక్యంపై విచారణ జరుపుతున్న రెండు అమెరికా కాంగ్రెస్ కమిటీలకు పూర్తి వివరాలను అందజేసినట్లు వెల్లడించారు. రష్యా ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలున్న ఆర్టీ అనే మీడియా సంస్థ 2016 ఏడాది ట్వీటర్లో ప్రకటనల కోసం దాదాపు 2,74,000 డాలర్లు(రూ.1.79 కోట్లు) ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికే ఈ మొత్తాన్ని వినియోగించి ఉంటారని అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఫేస్బుక్లో వాడిన 450 ఖాతాలకు గానూ 22 అకౌంట్లు ట్వీటర్లో కూడా కొనసాగుతున్నట్లు గుర్తించామన్నారు. ట్వీటర్ నిబంధనలను ఉల్లంఘించినందున ఈ ఖాతాలన్నింటిని వెంటనే తొలగిస్తున్నట్లు వెల్లడించారు. -
భర్తీ లేదా.. బ్రదర్!
-
భర్తీ లేదా.. బ్రదర్!
ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు ► నోటిఫికేషన్లు జారీ అవుతున్నా ముందుకు సాగని భర్తీ ప్రక్రియ ► అర్హతలు, నియామక పరీక్షల్లో వరుస తప్పిదాలు ► విపరీత నిబంధనలతో గందరగోళం ► అభ్యర్థుల వ్యతిరేకత, కోర్టు కేసులతో నిలిచిపోతున్న వైనం ► గ్రూప్–2 ఉద్యోగాలకు వైట్నర్ దెబ్బ ► విపరీత నిబంధనలతో గురుకుల పోస్టులకు గండం ► మార్గదర్శకాలు పాటించక లక్ష మంది ‘టెట్’కు దూరం సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ అవుతున్నా భర్తీ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులు ఆందోళనలో కూరుకుపోతున్నారు. అర్హతలు, నిబంధనలు మొదలుకుని సిబ్బంది తప్పిదాలు, కోర్టు కేసుల దాకా ఎన్నో అడ్డంకులతో పోస్టుల భర్తీ జరగక ఆవేదన చెందుతున్నారు. గ్రూప్–2, గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు ఏడాదిన్నర కిందటే నోటిఫికేషన్లు జారీ అయినా ఇప్పట్లో ఉద్యోగ నియామకాలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో నిబంధనలతో దాదాపు లక్ష మంది పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు. వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీకి అనుమతినిచ్చి ఏడాది దాటుతున్నా.. మార్గదర్శకాల్లో అస్పష్టత కారణంగా పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు కదలడం లేదు. పలు శాఖలు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఈ పరిస్థితికి కారణమని విమర్శలు వస్తున్నాయి. గ్రూప్–2కు వైట్నర్ దెబ్బ రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,032 గ్రూప్–2 పోస్టుల భర్తీకి 2015 డిసెంబర్, 2016 మార్చిలో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ పోస్టులకు 7,89,437 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2016 నవంబర్ 11, 13 తేదీల్లో రాతపరీక్షలు నిర్వహించగా.. 4,97,961 మంది హాజరయ్యారు. అయితే పరీక్ష నిర్వహణ సమయంలో దాదాపు 50 వేల మంది అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలు మారిపోయాయి. కాసేపటికి ఈ తప్పును గుర్తించిన పరీక్షల సిబ్బంది.. ఎవరి జవాబు పత్రాలను వారికి ఇచ్చారు. అయితే అప్పటికే నష్టం జరిగిపోయింది. కొందరు అభ్యర్థులు ఓఎంఆర్ జవాబు పత్రాల్లో తమ వివరాలను రాసేశారు. మరికొందరు జవాబులు కూడా రాశారు (బబ్లింగ్ చేశారు). దీంతో పరీక్షల సిబ్బంది వైట్నర్ పెట్టి పరీక్ష రాయాలని సూచించగా.. అభ్యర్థులు అలాగే రాశారు. వాస్తవానికి టీఎస్పీఎస్సీ నిబంధనలు, గ్రూప్–2 నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం.. వైట్నర్ ఉపయోగిస్తే ఆ జవాబు పత్రాలను మూల్యాంకనం చేయరు. ఈ నిబంధన తెలిసిన కొందరు అభ్యర్థులు పరీక్షల సిబ్బంది తప్పిదం కారణంగా వైట్నర్ ఉపయోగించామని, తమను పరిగణనలోకి తీసుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే నిబంధనల ప్రకారం అది వీలుకాదని టీఎస్పీఎస్సీ కోర్టుకు వివరించింది. కోర్టు కూడా అభ్యర్థుల వాదనను తోసిపుచ్చింది. కానీ ఆ తర్వాత టీఎస్పీఎస్సీ మాట మార్చింది. అంతర్గత పరిశీలనలో 50 వేల మందికిపైగా అభ్యర్థులు వైట్నర్ ఉపయోగించినట్లు గుర్తించింది. ఓ కమిటీ వేసి.. ఆ కమిటీ సిఫారసు అంటూ వైట్నర్ ఉపయోగించిన వారిని కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు ఎంపిక చేసింది. దీంతో మిగతా నిరుద్యోగులు కోర్టును ఆశ్రయించగా.. పోస్టుల భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. టెట్కు నిబంధనల కష్టం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో విపరీత నిబంధనల కారణంగా లక్ష„ý మంది వరకు అభ్యర్థులు పరీక్ష రాసే అవకాశం కోల్పోయారు. 2010లో అమల్లోకి వచ్చిన ఎన్సీటీఈ మార్గదర్శకాల ప్రకారం ఇంటర్, డిగ్రీలలో 50 శాతం మార్కులుండి, ఉపాధ్యాయ విద్యా కోర్సులు పూర్తి చేసిన వారు టెట్ రాసేందుకు అర్హులు. అయితే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చే నాటికంటే ముందే ఇంటర్, డిగ్రీ పూర్తిచేసుకున్న వారికి మాత్రం 45 శాతం మార్కులు వచ్చినా అర్హులేననే మినహాయింపు ఉంది. కానీ విద్యా శాఖ మొత్తంగా 50 శాతం మార్కుల నిబంధనను అమలు చేయడంతో.. వేలాది మంది టెట్ రాసే అవకాశం కోల్పోయారు. ఇక డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) పూర్తిచేసి, తర్వాత డిగ్రీ (డీఎడ్+డిగ్రీ) చేసినవారు టెట్ పేపర్–2 రాసేందుకు అర్హులని ఎన్సీటీఈ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు సార్లు నిర్వహించిన టెట్లలోనూ వారికి అవకాశం కల్పించారు. కానీ టెట్–2017లో విద్యా శాఖ వారికి అవకాశం కల్పించకపోవడంతో చాలా మంది అభ్యర్థులు నష్టపోయారు. ఇక విద్యా హక్కు చట్టం ప్రకారం.. ప్రైవేటు పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులకూ టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. కానీ ఇంటర్, డిగ్రీల్లో 50 శాతం మార్కులు లేవంటూ టెట్కు దూరం చేయడంతో... చాలా మంది అభ్యర్థులు ప్రైవేటు స్కూళ్లలో పనిచేసుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నారు. గురుకుల పోస్టులకు ‘అర్హత’గండం! దాదాపు 2.5 లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న గురుకుల పోస్టుల భర్తీ కూడా గందరగోళంగా మారింది. గురుకుల స్కూళ్లలో ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) తదితర 7,306 పోస్టుల భర్తీకి గతేడాది ఫిబ్రవరిలో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో పీజీటీ, టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. డిగ్రీ, పీజీలలో 60 శాతం మార్కులు సాధించి ఉండాలని సంక్షేమ శాఖలు నిబంధనలు విధించాయి. వాస్తవానికి ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం... ఈ పోస్టులకు 2010 ఆగస్టు తర్వాత డిగ్రీ, పీజీలు పూర్తి చేసుకున్న వారికి 50 శాతం మార్కులు.. అంతకుముందు ఉత్తీర్ణులైన వారికి 45 శాతం మార్కులు ఉంటే చాలు. కానీ సంక్షేమ శాఖలు 60 శాతం మార్కుల నిబంధన విధించడంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దీంతో సీఎం కేసీఆర్ స్వయంగా కల్పించుకుని ఆ నోటిఫికేషన్ను రద్దు చేయించారు. ఎన్సీటీఈ నిబంధనల ప్రకారమే అర్హత నిర్ణయించాలని ఆదేశించారు. అయినా పరిస్థితి మారలేదు. విద్యార్హతలను ఎన్సీటీఈ నిబంధనల ప్రకారమే నిర్ణయించినా.. రిజర్వేషన్ విషయంలో తప్పిదం చేశారు. అత్యధిక పోస్టులను మహిళా అభ్యర్థులకు కేటాయించారు. జూన్ 1న 2,437 పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్లోనూ ఇదే తరహాలో వ్యవహరించారు. మహిళా కాలేజీల్లో పోస్టులను మహిళలతోనే భర్తీ చేయాలన్న నిబంధన ఎక్కడా లేకున్నా... డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పోస్టులను 100 శాతం మహిళా అభ్యర్థులకే రిజర్వు చేశారు. దీనిపై అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో.. ఈ పరీక్షలు కూడా ఆగిపోయాయి. వైద్యపోస్టుల భర్తీలో దిద్దుబాట! వైద్యారోగ్య శాఖ పరిధిలో 2,118 పోస్టుల భర్తీ ప్రక్రియ అంతులేకుండా సాగుతూనే ఉంది. ఈ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం గతేడాది జూలై 13న అనుమతి ఇచ్చింది. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో పోస్టులు భర్తీ చేయాలని.. అర్హతలు, నిబంధనలను వైద్య శాఖ రూపొందించాలని పేర్కొంది. దీనిపై వైద్యారోగ్య శాఖ దాదాపు ఏడాది పాటు జాప్యం చేసింది. చివరికి ఈ ఏడాది మేలో మార్గదర్శకాలను విడుదల చేసింది. కానీ వాటిలో స్పష్టత లేకపోవడంతో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయలేదు. స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలంటూ పలుసార్లు వైద్య శాఖకు సూచించింది. జూలై 5న టీఎస్పీఎస్సీ, ప్రభుత్వానికి లేఖలు సైతం రాసింది. ట్యూటర్ పోస్టుల భర్తీలో భారత వైద్య మండలి నిబంధనలు, రిజర్వేషన్ల వర్తింపు అంశాలపై స్పష్టత కోరింది. వైద్యవిద్య డైరెక్టరేట్ పరిధిలోని అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, లెక్చరర్, రేడియోలాజికల్, ఫిజిక్స్, ఫిజిసిస్ట్ పోస్టులకు... వైద్య విధాన పరిషత్ పరిధిలోని సివిల్ అసిస్టెంట్ సర్జన్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీలో పాటించే నిబంధనలపై స్పష్టత కోరింది. దీంతో చివరికి వైద్యారోగ్య శాఖ స్పందించి ఎంసీఐ మార్గదర్శకాల ప్రకారం పలు అంశాలపై స్పష్టతనిస్తూ మంగళవారమే టీఎస్పీఎస్సీకి, ప్రభుత్వానికి వివరాలు పంపింది. ఇప్పటికైనా భర్తీ ప్రక్రియ ముందుకు సాగేలా చర్యలు చేపట్టాలని అభ్యర్థులు కోరుతున్నారు. -
1,000 విద్యుత్ ఏఈ పోస్టులు
భర్తీకి వచ్చే నెలలో నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో దాదాపు 1,000 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి వచ్చే నెలలో నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ మేరకు విద్యుత్ సంస్థలు కసరత్తు ప్రారంభించాయి. రాష్ట్రంలో నిరం తర విద్యుత్, వ్యవసాయానికి కూడా 24 గంటల విద్యుత్ సరఫరాను పక్కాగా అమ లు చేసేందుకు కృషి చేస్తున్న విద్యుత్ ఉద్యో గులకు భారీ ఎత్తున పదోన్నతులు కల్పిస్తా మని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆరు నెలలు కిందే 13,500 కొత్త పోస్టులను మంజూరు చేశారు. ఆ పోస్టుల్లోకి ఇటీవల పదోన్నతులు కల్పించడంతో కింది స్థాయి పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర విద్యుదు త్పత్తి సంస్థ (జెన్కో), విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్కో), ఉత్తర తెలంగాణ విద్యు త్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్), దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లలోని వివిధ విభాగాల్లో దాదాపు 1,000 ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆయా సంస్థల యాజమాన్యాలు గుర్తించాయి. వీటిని భర్తీ చేసేందుకు వచ్చే నెలలో ఉద్యోగ నియామక ప్రక్రియ మొదలుపెట్టాలని నిర్ణయించాయి. వీటితోపాటు నాన్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను సైతం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని యోచిస్తున్నాయి. మొత్తంగా పోస్టుల భర్తీపై కసరత్తు ఇంకా పూర్తికాకపోవడంతో కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు ఇప్పుడే వెల్లడించలేమని అధికారవర్గాలు పేర్కొన్నాయి. వారంలో ఔట్ సోర్సింగ్ క్రమబద్ధీకరణ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. స్థానికత, పుట్టిన తేదీ, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే... ట్రాన్స్కో, జెన్కో, డిస్కంలలో 22 వేల మందికి పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు క్రమబద్ధీకరణకు అర్హులని దరఖాస్తుల పరిశీలన కోసం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీలు గుర్తించాయి. ఈ మేరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగా విలీనం చేసుకునే ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే న్యాయస్థానాల తీర్పులకు లోబడే క్రమబద్ధీకరణ జరుపుతామని ట్రాన్స్కో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
1,061 అధ్యాపక పోస్టులు
♦ వర్సిటీల్లో భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్లు ♦ మార్గ్గదర్శకాలు ఖరారు చేసిన వైస్ చాన్స్లర్ల కమిటీ ♦ ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక.. ♦ తర్వాత రెండు మూడు రోజుల్లో వెలువడనున్న ఉత్తర్వులు ♦ వర్సిటీల వారీగా వేర్వేరుగా నోటిఫికేషన్లు ♦ ఆబ్జెక్టివ్ విధానంలో స్క్రీనింగ్ టెస్టు ♦ 1:3 రేషియోలో ఇంటర్వ్యూలకు ఎంపిక సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,061 అధ్యాపక పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. వారం పది రోజుల్లో ఆయా యూనివర్సిటీల వారీగా నోటిఫికేషన్లు జారీకానున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ అధ్యాపక పోస్టుల భర్తీ కోసం అనుసరించాల్సిన నియమ నిబంధనలు, మార్గదర్శకాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ వేణుగోపాల్రెడ్డి, ఉస్మానియా వీసీ రామచంద్రం, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వీసీ సీతారామారావులతో కూడిన వీసీల కమిటీ ఖరారు చేసింది. ఈ మేరకు నివేదికను ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి అందజేయనుంది. తర్వాత రెండు మూడు రోజుల్లోనే నియమ నిబంధనలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. ఆ వెంటనే వర్సిటీల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీకానున్నాయి. మొత్తంగా యూనివర్సిటీల్లో 1,551 పోస్టులు ఖాళీగా ఉండగా.. మొదటి దశలో 1,061 పోస్టుల భర్తీకి గత నెలలోనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆమోదం తెలిపారు. దీంతో నియమ నిబంధనల రూపకల్పన కోసం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వీసీల కమిటీని ఏర్పాటు చేయగా.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల ప్రకారం మార్గదర్శకాలను సిద్ధం చేశారు. మార్గదర్శకాల్లోని ప్రధాన అంశాలివీ.. అధ్యాపక పోస్టుల భర్తీకి యూనివర్సిటీల వారీగా వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేస్తారు. అవి జాతీయ స్థాయి నోటిఫికేషన్లుగా ఉంటాయి. అన్ని యూనివర్సిటీలకు ఒకే రకమైన పరీక్షా విధానం ఉంటుంది. సబ్జెక్టును బట్టి పరీక్ష అంశాల్లో మార్పు ఉంటుంది. భర్తీ ప్రక్రియలో ముందుగా స్క్రీనింగ్ టెస్టు ఉంటుంది. 100 మార్కులకు లేదా 150 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. స్క్రీనింగ్ టెస్టు అర్హత సాధించిన వారి లో 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూలు నిర్వ హించి.. పోస్టులకు ఎంపిక చేస్తారు. యూజీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల ప్రకారం... అధ్యాపక నియామకాల్లో పరిశోధనలు, పరిశోధన పత్రాలు, ప్రాజెక్టులు, శిక్షణలు, కో–కరిక్యులర్ యాక్టివిటీస్ను పరిగణనలోకి తీసుకోవాలి. ఇంటర్వ్యూ విధానంలో అకడమిక్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ను పరిశీలించాలి. ముఖ్యంగా పరిశోధన పత్రాలకు (జర్నల్స్ తదితరాలు) 30 శాతం, పరిశోధన పబ్లికేషన్స్ (పుస్తకాలు తదితరాలు)కు 25 శాతం, పరిశోధన ప్రాజెక్టులకు 20 శాతం, రీసెర్చ్ గైడెన్స్కు 10 శాతం, శిక్షణ కోర్సులు, సదస్సులు/సమావేశాలకు 15 శాతం స్కోర్ను పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే జ్ఞానం, పరీక్షలు, మూల్యాంకనంలో భాగస్వామ్యం, బోధనా సామర్థ్యం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వంటి సహ పాఠ్య కార్యక్రమాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. వీటికి 50 శాతం స్కోర్ నిర్ధారించగా.. కనీసంగా 15 శాతం స్కోర్ సాధించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను తాజాగా అధ్యాపక పోస్టుల భర్తీలో అమలు చేయనున్నారు. -
ఇక కేటగిరీల వారీగా కటాఫ్
► రిజర్వ్డ్ అభ్యర్ధులకు నష్టం జరగకుండా చర్యలు ► ప్రభుత్వానికి ఏపీపీఎస్సీ ప్రతిపాదనలు ► త్వరలో మరికొన్ని నోటిఫికేషన్లు: చైర్మన్ ఉదయభాస్కర్ సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెలువరించే నోటిఫికేషన్లకు సంబంధించి ప్రిలిమ్స్ (స్క్రీనింగ్ టెస్టు)లో కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులతో మెయిన్స్కు అర్హులను ఎంపిక చేయాలని కమిషన్ భావిస్తోంది. ఆయా రిజర్వుడ్ కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు నిర్ణయించి ఆ మేరకు మెయిన్స్ పరీక్షకు అభ్యర్ధులను ఎంపిక చేయాలని తలస్తోంది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించామని ఏపీపీఎస్సీ ఛైర్మన్ పి.ఉదయభాస్కర్ బుధవారం తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే రానున్న కాలంలో వెలువరించే కొత్త నోటిఫికేషన్లన్నిటికీ వర్తింపచేస్తామని వివరించారు. ఏ రిజర్వుడ్ కేటగిరీకి ఎంత శాతం మేర మార్కులను కటాఫ్గా నిర్ణ యించాలని, మెయిన్స్ పరీక్షకు ఏ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలన్న అంశాలపై ప్రభుత్వ ఉత్తర్వుల తర్వాతనే కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. జనరల్ కటాఫ్తో రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్ధులకు తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త ప్రతి పాదనను ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆమోదం వచ్చాక కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తామని, రానున్న కాలంలో కొత్త నోటిఫికేషన్లు వెలువరించి తాజా నిబంధనలతో ప్రిలిమ్స్ నిర్వహిస్తామని చెప్పారు పాత ప్రతిపాదనలకు సర్కారు నో... ఏపీపీఎస్సీ నిర్వహించే వివిధ గ్రూపు కేటగిరీ పోస్టుల భర్తీ పరీక్షల్లో గ్రూప్–1 మినహా తక్కిన గ్రూపు కేటగీరీ పరీక్షలకు ప్రిలిమ్స్ విధానం లేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక అన్ని గ్రూపు పోస్టులకు కొత్తగా ప్రిలిమ్స్ను తెర పైకి తెచ్చింది. గ్రూప్–1 ఒక్కటే కాకుండా గ్రూప్–2,3 పోస్టులకు 25 వేలకు మించి దరఖాస్తులు వస్తే స్క్రీనింగ్ టెస్టు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. స్క్రీనింగ్ టెస్టులో రిజర్వేషన్ల వారీగా కటాఫ్ నిర్ణయించి అభ్యర్థులను ఎంపిక చేయాలని ముందు భావించారు. తద్వారా రిజర్వుడ్ కేటగిరీల్లోని పోస్టులకు మెయిన్స్ పరీక్షకు అర్హులైన అభ్యర్ధులు ఎంపికవుతారని, పోస్టులు ఖాళీగా ఉండిపోకుండా భర్తీకి అవకాశముంటుందని ప్రభుత్వా నికి నివేదించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో ఏపీపీఎస్సీలో కూడా ప్రిలిమ్స్ (స్క్రీనింగ్ టెస్టు) నుంచి మెయిన్స్కు అర్హులను ఎంపిక చేయడానికి జనరల్ కటాఫ్తో కాకుండా కేటగిరీల వారీగా కటాఫ్ తీసుకొని 1:12 లేదా 1:15 నిష్పత్తిలో అభ్యర్ధులను ఎంపిక చేయాలని భావించారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ ప్రతిపాదనలను పక్కన పెట్టి 1:50 చొప్పున ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు అభ్యర్ధులను ఎంపిక చేయాలని ఆదేశించింది. దాదాపు 4,250 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ 32 నోటిఫికేషన్లు వెలువరించింది. వీటిలో 25 వేలకు మించి దరఖాస్తులు వచ్చే అన్ని పోస్టులకూ స్క్రీనింగ్ టెస్టు పెట్టడంతో పాటు మెయిన్స్కు జనరల్ కటాఫ్తో 1:50 నిష్పత్తిలో అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారు. ఏపీపీఎస్సీ ఏఈ, ఏఈఈ పోస్టులకు, 2016 గ్రూప్–2 పోస్టులకు ప్రిలిమ్స్ నిర్వహించింది. కానీ స్క్రీనింగ్ టెస్టుల్లో జనరల్ కటాఫ్తో మెయిన్స్కు అర్హులను ఎంపిక చేయడం ద్వారా తమకు అన్యాయం జరుగుతోందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గ్రూప్–2 పరీక్షలో జనరల్ కటాఫ్ మార్కులతో మెయిన్స్కు ఎంపికయ్యే వారిలో తమ వర్గాల వారికన్నా ఇతరులకే ఎక్కువ అవకాశాలుం టాయని, తమకు అన్యాయం జరుగుతుందని వారు ఏపీపీఎస్సీకి మొరపెట్టుకున్నారు. ప్రిలిమ్స్ రాసినా జన రల్ కటాఫ్ మార్కులు సాధించకపోతే పలు రిజర్వుడ్ పోస్టులకు అభ్యర్ధులు ఎంపికయ్యే అవకాశమే లేదన్నారు. రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్ధులు జనరల్ కటాఫ్తో మెరిట్ మార్కులు సాధించినా వారిని ఓపెన్ కేటగిరీలో కాకుండా రిజర్వుడ్ కోటాలోకి తరలిస్తే ఆయావర్గాల్లోని ఇతర అభ్యర్ధులకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తపరి చారు. దీనిపై ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. రిజర్వుడ్ అభ్యర్ధులున్నా జనరల్ కటాఫ్ మార్కుల పేరిట ఆయా పోస్టులకు ఎంపిక కాకుండా అవి మిగిలిపోయే అవకాశ ముందని పేర్కొన్నారు. ఈ తరుణంలో ఏపీపీఎస్సీ ప్రభు త్వానికి తాజా ప్రతిపాదనలను సమర్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. స్క్రీనింగ్ టెస్టు నుంచి జనరల్ కటాఫ్ మార్కులతో కాకుండా రిజర్వుడ్ కేటగిరీల వారీగా అభ్యర్ధులను ఎంపిక చేసేలా ఉన్న ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే ఆయా వర్గాలకు న్యాయం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్త మవుతోంది. కటాఫ్ మార్కులు ఎన్ని? ఏ నిష్పత్తిలో మెయిన్స్కు ఎంపిక చేయాలి? అన్నది ఏపీపీఎస్సీ నిర్ణయిస్తుంది. కొత్త నోటిఫికేషన్లకు మాత్రమే... ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తే కొత్త నోటిఫికేషన్లకు మాత్రమే వర్తిస్తుంది తప్ప ఇప్పటికే వెలువడిన 2016 గ్రూప్–2కు కానీ, ఇతర నోటిఫికేషన్ల ప్రిలిమ్స్ పరీక్షలకు వర్తించదని ఏపీపీఎస్సీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పాత నోటిఫికేషన్లకు వర్తింప చేస్తే న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయంటున్నారు. నోటిఫికేషన్కు భిన్నంగా ఎంపికలు చేస్తే ఎవరైనా అభ్యంతరంతో న్యాయస్థానాలను ఆశ్రయిస్తే మొత్తం ప్రక్రియే నిలిచిపోతుందని పేర్కొంటున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారమే మెయిన్స్కు అభ్యర్ధులను పిలుస్తామని, అర్హులైన వారు ఆయా పోస్టులకు లేకపోయినా, లేదా పోస్టుల సంఖ్య కన్నా తక్కువగా ఉన్నా ప్రిలిమ్స్ జాబితాల నుంచి మళ్లీ తీసుకోవడమో, ఇతర ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెడతామని వివరిస్తున్నారు. ఇటీవల గ్రూప్–2 ప్రిలిమ్స్లో హాల్టిక్కెట్ల జారీలో అభ్యర్ధుల రిజర్వేషన్, స్థానికత సమాచారంలో తప్పులు దొర్లిన సంగతి తెలిసిందే. వీటిని సవరించుకొనేందుకు అవకాశమిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. కానీ ఎవరైనా అభ్యర్ధులు ఓసీ కేటగిరీలో ఉంటూ రిజర్వుడ్ కేటగిరీగా మార్పు చేసుకొని మెయిన్స్కు ఎంపికైతే అర్హులైన అసలు అభ్యర్ధులకు నష్టం జరుగుతుందేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపైనా ఏపీపీఎస్సీ దృష్టి సారించింది. -
7 వేల పోస్టులకు నోటిఫికేషన్లు
వచ్చే నెల మొదటి వారంలో జారీ చేస్తాం: టీఎస్పీఎస్సీ పాత, కొత్త గురుకులాల్లో పోస్టుల భర్తీ అనంతరం మరిన్ని ఉద్యోగ పరీక్షలు కూడా.. మొత్తంగా ఈ ఏడాది 10 వేల పోస్టుల భర్తీ వచ్చే నెలలోనే గ్రూప్–1, గ్రూప్–2 ఫలితాలు కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకులాల్లో ఖాళీ గా ఉన్న పోస్టులతోపాటు కొత్తగా ఏర్పాటు చేసే గురుకులాల్లో కలిపి 7 వేలకుపైగా పోస్టులను భర్తీ చేయనున్నామని, ఇందుకోసం వచ్చే నెల మొదటి వారంలో నోటిఫికేషన్లు జారీ చేస్తామని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడించారు. గురుకులాల కోసం ప్రభు త్వం మంజూరు చేసిన 23,494 పోస్టులకుగాను మొదటి విడతలో ఈ 7 వేలకుపైగా పోస్టులను భర్తీ చేయనున్నామని, ఈ మేరకు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు 6 రకాల నోటిఫికేషన్లను జారీ చేస్తామని తెలిపారు. మిగతా పోస్టులకు వచ్చే రెండేళ్లలో నోటిఫికేషన్లు జారీ అవుతాయన్నారు. బుధవారం ముఖ్యమంత్రి సంతకం చేసిన 1,900 పోస్టులకు సంబంధించి కూడా ఈలోగా ఉత్తర్వులు వస్తాయని.. అవసరమైన ఇండెంట్లను ఆయా శాఖల నుంచి తెప్పించుకుంటామని చెప్పారు. ఫిబ్రవరి 10లోగా మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలే జీల్లో 500 లెక్చరర్ పోస్టులు, 150కి పైగా రెసిడెన్షి యల్ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు. అలాగే గురుకు లాల్లో ప్రిన్సిపాల్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీ టీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), లైబ్రేరి యన్, పీఈటీ, స్టాఫ్ నర్సు, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్కు సంబంధించిన స్పెషల్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వివరించారు. మొత్తం ఈ ఏడాది 10 వేలకుపైగా పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు తెలిపారు. వచ్చే నెలలోనే గ్రూప్స్ ఫలితాలు 2011కు సంబంధించిన గ్రూప్–1 రాత పరీక్షల ఫలి తాలను, 1,036 పోస్టుల భర్తీకి గత నవంబర్లో నిర్వహించిన గ్రూప్–2 రాత పరీక్ష ఫలితాలను ఫిబ్రవరి నెలాఖరులోగా విడుదల చేస్తామని చక్రపాణి తెలిపారు. గ్రూప్–1కు ఇంటర్వూ్యలను మార్చిలో నిర్వహించే అవకాశముందని.. గ్రూప్–2 ఇంటర్వూ్యలను ఏప్రిల్ నెలాఖరు నుంచి ఇంటర్వూ్యలను నిర్వహిస్తామని వెల్లడించారు. -
వయోపరిమితి పెంచినా ఉపయోగమేదీ?
• రెండేళ్లుగా వయోపరిమితి పెంచుతున్నా.. నోటిఫికేషన్లు లేవు • గ్రూపు–2 మినహా సాధారణ డిగ్రీతో పోస్టులను భర్తీ చేయలేదు • అదనంగా మరో రెండేళ్లు వయోపరిమితి పెంచాలంటున్న నిరుద్యోగులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులకు వయో పరిమితి తంటాలు తప్పడం లేదు. తెలంగాణ ఏర్పడిన తరువాత సాధారణ డిగ్రీతో భర్తీ చేసే గ్రూప్–2 మినహా మరే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కాలేదు.దాదాపు 5లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇంతవరకు మోక్షం లభించలేదు. ప్రస్తుతం డిసెంబరు నెలాఖరు వచ్చేసింది. అయినా నోటిఫికేషన్లు జారీ కాలేదు. దీంతో ప్రభుత్వం 2015 నుంచి పెంచుతూ వచ్చిన గరిష్ట వయో పరిమితి ప్రయోజనం లక్షల మందికి అంద కుండా పోతోంది. గతంలోనూ పెద్దగా ఉద్యో గాల భర్తీ లేనందున 2015లో తెలంగాణ ప్రభుత్వం గరిష్ట వయోపరిమితిని పదేళ్లు పెంచింది. దీంతో 2015 జూలై 1 నాటికి 44 ఏళ్లు ఉన్న వారికి కూడా అవకాశం వచ్చింది కానీ టీచర్ పోస్టుల భర్తీకి, గ్రూప్–1, గ్రూప్–3, గ్రూప్–4 వంటి నోటిఫికేషన్లు ఆ సంవత్సరంలో వెలువడలేదు. దీంతో జనరల్ అభ్యర్థులకు వయోపరిమితి పెంచినా ఆ ప్రయోజనం చేకూరలేదు. ఇక 2016 జూలైలో నూ ఆ పదేళ్ల వయోపరిమితిని మరో ఏడాది పొడిగిస్తూ జీవో 264ను జారీ చేసింది. కానీ గ్రూప్–2 మినహా సాధారణ డిగ్రీతో భర్తీ చేసే గ్రూప్–1,3,4 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ కాలేదు. అలాగే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. దీంతో ఈ ఏడాదిలో నూ లక్షల మందికి వయో పరిమితి పెంపు ప్రయోజనం చేకూరని పరిస్థితి. టీచర్ పోస్టుల భర్తీకోసం ఎదురుచూస్తున్న వారిలో దాదాపు లక్ష మంది 43, 44 ఏళ్లు వయస్సు ఉన్న వారు ఉంటారని, గ్రూప్–1, గ్రూప్–3, గ్రూప్–4 కోసం ఎదురుచూస్తున్న వారిలోనూ అలాంటి వారు మరో లక్ష వరకు ఉంటారని అంచనా. దీంతో వారందరికి గరిష్ట వయో పరిమితి పెంపు ప్రయోజనం చేకూరని పరిస్థితి నెలకొందని నిరుద్యోగులు వాపోతు న్నారు. ప్రభుత్వం ఈ విషయంలో స్పందిం చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వచ్చే నెలాఖరు, లేదా ఫిబ్రవరిలో పాఠశాలల్లో టీచర్, గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో పదేళ్ల గరిష్ట వయోపరిమితి పెంపును మరో రెండేళ్లు కలిపి 12 ఏళ్లకు పెంచాలని, అప్పుడే నష్టపోయిన తమకు ప్రయోజనం చేకూరు తుందని కోరుతున్నారు. సీఎం కేసీఆర్కు విజ్ఞాపనలు ఈ పరిస్థితుల నేపథ్యంలో గరిష్ట వయో పరిమితి 12 ఏళ్లకు పెంచాలని, త్వరలో జారీ చేసే నోటిఫికేషన్లలో 46 ఏళ్ల వయసు వరకు అనుమతించాలని నిరుద్యోగులు కోరుతు న్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞాపనలు అందజేశారు. ప్రభుత్వం పదే ఏళ్లు గరిష్ట వయోపరిమితి పెంచినా, నోటిఫి కేషన్లు జారీ కాకపోవడంతో ఆ ప్రయో జనం చేకూరలేదని నిరుద్యోగులు చెబుతున్నారు. కేలండర్ ఇయర్కే కటాఫ్ టీఎస్పీఎస్సీ వంటి ఉద్యోగ నియా మక ఏజెన్సీలు ఏ నోటిఫికేషన్ను కేలండర్ ఇయర్లో ఎప్పుడు జారీ చేసినా గరిష్ట వయోపరిమితిని ఆ సంవత్సరపు జూలై 1వ తేదీని కటాఫ్ తేదీగా నిర్ణయించి నోటిఫికే షన్లు ఇస్తాయి. అంటే ఒక కేలండర్ ఇయర్ లోని జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చినా, డిసెంబరులో నోటిఫికేషన్ ఇచ్చినా ఆ సంవ త్సరపు జూలై 1నే వయోపరిమితి కటాఫ్ తేదీగా పరిగణనలోకి తీసుకుంటారు. సద రు కేలండర్ ఇయర్లోని డిసెంబర్ దాటితే కనుక ఆ కటాఫ్ తేదీ మారిపోతుంది. దీంతో కటాఫ్ తేదీ ప్రకారం గరిష్ట వయోపరిమితి కలిగిన వారందరికీ అన్యాయం తప్పదు. -
నోటీబాక్స్..
సాక్షి, వీకెండ్: బిజీగా ఉన్న వేళల్లో మొబైల్కు వచ్చే నోటిఫికేషన్స్ ను పట్టించుకునే తీరిక ఉండదు. ఏదో పని కోసం మొబైల్ ఓపెన్ చేయగానే స్క్రీన్ పై కుప్పలుతెప్పలుగా ఉండే నోటిఫికేషన్స్ చూడగానే అన్నీ క్లియర్ చేసేస్తాం. మనకు కావాల్సిన విషయాలను వెతుక్కునే క్రమంలో చాలా ముఖ్యమైన సమాచారాలను కోల్పోవాల్సి వస్తుంది. ఈ గందరగోళ పరిస్థితి నుంచి మనల్ని తప్పించేందుకే ‘నోటీబాక్స్’ అనే యాప్ వచ్చేసింది. మన మొబైల్కు వచ్చే నోటిఫికేషన్స్ ను తేదీల వారీగా పొందుపరచడమే ఈ యాప్ ప్రత్యేకత. తీరిక చిక్కినపుడు హాయిగా చదివేసుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్లో notibox అని టైప్ చేసి దీనిని డౌన్ లోడ్ చేసుకోవాలి. -
వచ్చే నెల 30లోగా నోటిఫికేషన్లు
ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్భాస్కర్ వెల్లడి సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 4,009 పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 30లోగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ పి.ఉదయ్భాస్కర్ వెల్లడించారు. ఈ పరీక్షలను తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహించనున్నట్టు చెప్పారు. బుధవారం విశాఖలో ఆయన మీడియా మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లలో ఇంకా భర్తీకి నోచుకోని పోస్టులను కూడా ఈసారి కలిపి భర్తీ చేయనున్నట్టు తెలిపారు. కాగా, గతంలో జరిగిన జాప్యం వల్ల వయోపరిమితిని ఆరేళ్లకు సడలిస్తూ జారీ చేసిన జీవో సెప్టెంబర్ 30తో ముగుస్తుందన్నారు. అందువల్ల ఈలోగా ఇచ్చే నోటిఫికేషన్లకే 40 ఏళ్ల వయోపరిమితి వర్తిస్తుందని చెప్పారు. ఆన్లైన్ పరీక్షల వల్ల అవకతవకలకు ఆస్కారం ఉండదన్నారు. ఆన్లైన్ పరీక్షల నిర్వహణ కోసం ఏపీ ఆన్లైన్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. గ్రూప్-1, 2, 3 పోస్టులకు 50 వేల మందికి పైగా అభ్యర్థులు పోటీపడే అవకాశం ఉన్నందున.. తొలుత స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో అర్హత సాధించిన వారినే ఆన్లైన్ పరీక్షకు అనుమతిస్తామన్నారు. -
ఉద్యోగాల భర్తీలో నాన్చుడు ధోరణి
నిజామాబాద్ నాగారం : తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన విద్యార్థులను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలంగాణ నవ నిర్మాణ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు శివప్రసాద్ ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని, బతుకులు బాగు పడతాయని భావించిన విద్యార్థులకు నిరాశే మిగిలిందన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవన్లో నిర్వహించిన విద్యార్థి సేన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ హామీని మర్చిపోయాడని విమర్శించారు. ఎంతో మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించాలనే తపనతో అప్పులు చేసి హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నారని, కానీ ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్లు ఇవ్వడం లేదన్నారు. డీఎస్సీ విషయంలో నాన్చుడు ధోరణి అవలంబిస్తోందని తెలిపారు. కేజీ టు పీజీ విద్యా అమలు చేయలేదని, ఎంసెట్ లీకేజీకి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, డిగ్రీ ఆన్లైన్ విషయంలో అన్ని ఇబ్బందులే ఉన్నాయన్నారు. అందుకే విద్యార్థులు మరోసారి ఉద్యమించడానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. విద్యారంగ సమస్యలపై త్వరలో జిల్లాలో భారీ బహరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థి సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి శ్రీకాంత్, నేతలు రవీంద్రయాదవ్, శేఖర్, వినయ్కుమార్, కిషోర్, నవీన్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఐఫోన్లు కొంటా..
రాంగోపాల్పేట్: ఓఎల్ఎక్స్లో ప్రకటన ఇచ్చిన వారినే టార్గెట్ చేసి ఐ ఫోన్లు కొంటానని మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని రాంగోపాల్పేట్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఆదిలాబాద్ జిల్లా భైంసాకు చెందిన ఉదయ్కిరణ్రెడ్డి (29) జగద్గిరిగుట్టలో నివసించే వాడు. ఏ పనీ చేయకుండా ఆవారాగా తిరుగుతూ ఖర్చులకు భార్యను డబ్బు అడిగి వేధిస్తుండటంతో ఐదు నెలల క్రితం ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి చైతన్యపురిలోని ఓ హాస్టల్లో ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడ్డ నిందితుడు ఓఎల్ఎక్స్లో ఐ ఫోన్లు అమ్ముతామని ప్రకటనలు ఇచ్చిన వారిని మోసం చేయాలని పథకం పన్నారు. అందులో ఇచ్చిన మొబైల్కు ఫోన్ చేసి ఐ ఫోన్ కొంటానని సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్లోని కిమ్స్ ఆస్పత్రి వద్దకు రావాలని చెబుతాడు. ఫోన్ తనసోదరికి కావాలని ఆమె కిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తుందని నమ్మిస్తాడు. అమ్మే వ్యక్తి చెప్పిన ధర చెల్లిస్తానని ఒకమారు ఆస్పత్రిలో ఉన్న సోదరికి చూపించి వస్తానని చెబుతాడు. ఆస్పత్రి లోపలికి వెళ్లి అటునుంచి అటే వెళ్లిపోతాడు. ఇలా ఐదుగురి నుంచి ఐ6ఎస్ రెండు, ఐ6 ఫోన్లు 3 కొట్టేశాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టి మంగళవారం వలపన్ని పట్టుకున్నారు. ఒక్కో వ్యక్తిని మోసం చేసేందుకు కొత్త సిమ్కార్డు కొనుగోలు చేసి దాంతో మోసాలు చేసేవాడు. నిందితుడి నుంచి రూ.2.30లక్షల విలువ చేసే ఐదు ఐ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ నేతృత్వంలో ఎస్ఐ సురేష్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. -
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ తీపికబురు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ద్వారా 4 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచే సిన నేపథ్యంలో ఆగస్టులో వరుసగా నోటిఫికేషన్లు జారీచేయడానికి ఆసంస్థ ఏర్పాట్లు చేసింది. ఆగస్టు మొదటి వారంలో తొలి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ తెలిపారు. సోమవారం ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ అనేక అంశాలు వివరించారు. ‘ఏపీపీఎస్సీలోని గ్రూప్ 1, 2, 3లోని పోస్టులను ఆయా కేటగిరీల్లోనే పాత విధానంలోనే భర్తీచేస్తాం. పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీలోని రూల్ 6ను అనుసరించారు. ఈ ప్రకారం మిగిలిపోయిన పోస్టులు తదుపరి నోటిఫికేషన్లోకి మళ్లించాలి. రూల్ 7 అందుకు భిన్నంగా తదుపరి ఖాళీలను మెరిట్ జాబితాలో తదుపరి స్థానాల్లో ఉన్న వారితో భర్తీచేయాలని సూచిస్తోంది. రూల్7ను రద్దుచేయాలని ప్రభుత్వానికి లేఖ రాశాం. ఇక నుంచి రూల్6 ప్రకారమే భర్తీ ఉంటుంది.’ అని ఆయన తెలిపారు. -
ఎల్జీ ఎక్స్ స్క్రీన్ ధర ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారు ఎల్జీ తన నూతన స్మార్ట్ఫోన్ 'ఎల్జీ ఎక్స్ స్క్రీన్'ను మార్కెట్ లో లాంచ్ చేసింది. దీనిధరను రూ.12,990 లుగా కంపెనీ నిర్ణయించింది. స్నాప్ డీల్ ద్వారా జులై 20 నుంచి అమ్మకాలు మొదలుకానున్నట్టు సంస్థ తెలిపింది. అలాగే ఎల్జీ ఎక్స్ స్క్రీన్' వినియోగదారులకు 45 రోజుల ఉచిత హంగామా మ్యూజిక్ వీడియో డౌన్లోడ్ అందిస్తోంది. వొడాఫోన్ స్మార్ట ఫోన్ వినియోగదారులకు డబుల్ డేటా ఉచితం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పానిక్ బటన్ ఇందులో అమర్చబడింది. వినియోగదారడు పవర్ బటన్ వరుసగా ఐదు సార్లు నొక్కితే నిర్దేశిత నెంబర్లకు హెచ్చరికలు పంపుతుంది. బడ్జెట్ స్మార్ట్ఫోన్ ఆఫరింగ్లో తమ స్థానాన్ని బలపర్చుకోవడానికి డ్యూయల్ డిస్ప్లే ఫోన్ మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు కంపెనీ వెల్లడించినసంగతి తెలిసిందే. ఈ డ్యూయల్ డిస్ప్లే ఫోన్ ద్వారా నోటిఫికేషన్లను చూసుకోవడాని వేరే ప్రోగ్రామ్ను ఆపాల్సిన అవసరం ఉండదు. బ్రౌజర్లో వర్క్ చేసుకుంటూనే వాట్సప్, ఫేస్బుక్ నోటిఫికేషన్లను చూసుకోవచ్చు. ఒకేసారి రెండు ప్రోగ్రామ్స్పై వర్క్ చేసుకోవచ్చు. ఎల్జీ ఎక్స్ స్క్రీన్ ఫీచర్లు... 4.93 ఇంచ్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, 1280-720 పిక్సెల్ స్ర్కీన్ రిజల్యూషన్ 1.76 ఇంచ్ సెకండరీ డిస్ప్లే, 520 x 80 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్ 1.2 జీహెచ్జడ్ క్వాడ్కోర్ స్నాప్డ్రాగన్ 410 ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్స్ 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 2 టీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 4.1, ఎన్ఎఫ్సీ 120 గ్రాముల బరువు 7.1 ఎంఎ మందం 2300 ఎంఏహెచ్ బ్యాటరీ కాగా ఇటీవల కె10,కె 7 పేరుతో డబుల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లో విడుదల చేసింది. -
ఏపీపీఎస్సీలో సమాచార బ్యాంకు
* నిరుద్యోగుల సమాచారం నిక్షిప్తం * ఆనందం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు * ఒక్కసారి నమోదు చేస్తే చాలు విజయనగరం: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దరఖాస్తుల సమయంలో వస్తున్న ఇబ్బందులను పరిష్కరించడానికి సాంకేతికత సాయం తీసుకుంది. పరీక్ష ఏదైనా విద్యార్థి లేదా నిరుద్యోగి ఒక్కసారి డేటా నమోదు చేసుకుంటే వాటిని ప్రతి సారీ వాడే వెసులుబాటును తీసుకువచ్చింది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు అన్నీ ఏపీపీఎస్సీ ద్వారానే వస్తుంటాయి. వీటికి తరచూ దరఖాస్తులు చేయడం అభ్యర్థులకు కాసింత కష్టం గానే ఉంటోంది. తాజాగా అమలు చేస్తున్న కొత్త విధానంతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. ఒక్కసారి దరఖాస్తు చేస్తే చాలు వాటిని ఏపీపీఎస్సీ తన వెబ్సైట్లో నిక్షిప్తం చేస్తుంది. మధ్యలో మన అర్హతలు పెరిగితే వాటిని మాత్రం నమోదు చేస్తే సరిపోతుంది. అర్హతల నమోదుకు అవకాశం.. పదో తరగతి ఆపై విద్యార్హత ఉన్న ప్రతీ విద్యార్థి విద్యార్హత వివరాలను ఏపీపీఎస్సీ తన వెబ్సైట్లో పొందుపరుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. దీనిలో వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, ఒక పాస్ పోర్టు సైజ్ ఫొటో, సంతకం, సహా ఆన్లైన్లోని ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన సెల్ఫోన్, ఈ మెయిల్ అడ్రస్లకు ఓ మెసేజ్ వస్తుంది. దీనిలో వచ్చిన కోడ్ నంబర్ను ఆన్లైన్లో పొందుపరి చి సబ్మిట్ చేయాలి. దీంతో నమోదు ప్రక్రి య పూర్తి అవుతుంది. అనంతరం ఆ వ్యక్తికి ఒక శాశ్వత నంబరు ఇస్తారు. ఏటా కొత్తగా వచ్చే విద్యార్హతలు ఎప్పటికప్పుడు నిరుద్యోగికి సంబంధించిన ప్రొఫైల్లో అప్లోడ్ చేయవచ్చు. ప్రయోజనాలు.. ఉద్యోగ ప్రకటన వెలువడిన వెంటనే ముం దుగా మనకు కేటాయించిన శాశ్వత నంబరు ఆధారంగా కేవలం నిర్ణీత రుసుం చెల్లిస్తే చాలు. మనం దరఖాస్తు చేసినట్లే. దీనివల్ల ఉద్యోగ ప్రకటన వచ్చే ప్రతి సారీ నెట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. డేటా బ్యాంకులో అప్పటికే విద్యార్థి లేదా నిరుద్యోగి విద్యార్హతలు నమోదై ఉండటంతో వాటిని పరిగణలోకి తీసుకుంటారు. ఏ పరీక్షకు అర్హత ఉందో తెలుసుకొని దానికి మనం రుసుం చెల్లిస్తే సరిపోతుంది. మున్ముందు పరీక్షలన్నీ ఆన్లైన్లోనే... విద్యార్థి లేదా నిరుద్యోగులకు సంబంధించిన ప్రొఫైల్ పొందు పరుచుకొనే విధానాన్ని మొదటిసారిగా అందుబాటులోనికి తెచ్చిన ఏపీపీఎస్సీ ఇకపై ప్రతి పరీక్షను ఆన్లైన్లో నిర్వహించనుంది. ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించిన శాఖా పరమైన పరీక్షలు (డిపార్టుమెంట్ టెస్టులు) ఆన్లైన్లోనే నిర్వహిస్తారు. వీటికి సంబంధించిన పరీక్షలు రాసే వారు ఇబ్బంది పడకుండా మాక్ టెస్టులను అందుబాటులో ఉంచారు. దీని వల్ల ఆన్లైన్ పరీక్ష అంటే భయపడాల్సిన పని లేదు. ఇలా నమోదు చేసుకోవాలి... ప్రతీ విద్యార్థి ‘పీఎస్ఈ.ఏపీ.జీఓటీ.ఐన్’ వెబ్సైట్లోకి వెళ్లి అక్కడ సూచనలకు అనుగుణంగా విద్యార్హతలు, ఇతర వివరాలు నమోదు చేసుకోవాలి. దీనిలో ఏమైనా ఇబ్బం దులు వస్తే ఏపీ ఆన్లైన్ కేంద్రాలకు వెళ్లి నిర్ణీత రుసుం చెల్లించి నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఈ విధానాన్ని ఈ నెల నుంచే అందుబాటులోనికి తీసుకువచ్చారు. నిరుద్యోగులకు ఎంతో ప్రయోజనకరం ఈ కొత్త సమాచార నిక్షిప్త కార్యక్రమం నిరుద్యోగులకు ఎంతో ఉపయోకరం. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు తమ ధ్రువపత్రాలను ఒకేచోట ఉంచడం, కొత్త విద్యార్హతలు పొందిన సందర్భంలో వాటిని అదనంగా నమోదు చేయడం మంచి విధానం. దీన్ని అందరూ వినియోగించుకోవాలి. అన్ని రంగాల్లోనూ సాంకేతిక విప్లవం వచ్చాక ఉద్యోగార్ధులకు కూడా ప్రాధాన్యం ప్రకారం ఉద్యోగాల కల్పన, దరఖాస్తులకు కొత్త విధానం రావడం అభినందనీయం. - తూముల నాగ కార్తీక్, కరస్పాండెంట్ తాండ్ర పాపారాయ ఇంజినీరింగ్ కళాశాల, కోమటిపల్లి -
కంప్యూటర్లోనూ స్మార్ట్ ఫోన్ నోటిఫికేషన్లు
న్యూయార్క్: స్మార్ట్ ఫోన్లకు వచ్చే ప్రతి నోటిఫికేషన్ ఇక నుంచి డెస్క్ టాప్ల పైకి రానుంది. అది ఎలా అనుకుంటున్నారా! సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాప్ట్ ఈ సేవలను విండోస్ 10 డెస్క్ టాప్ మీద అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. డెస్క్టాప్ మీద పనిచేస్తున్నప్పుడు స్మార్ట్ ఫోన్లకు వచ్చే ఏ నోటిఫికేషన్ అయినా దానిమీద కనిపించేలా రూపొందిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ను జేబులోంచి బయటకు తీయకుండానే కంప్యూటర్ డెస్క్టాప్ మీద నోటిఫికేషన్ లను చూసి, తొలగించేయడం దీని ప్రత్యేకత అని మైక్రోసాఫ్ట్ తెలిపింది. దీనివల్ల డెస్క్టాప్ మీద పనిచేసే వారికి, పదేపదే స్మార్ట్ ఫోన్లకు వచ్చే నోటిఫికేషన్ చిక్కులు తొలుగుతాయని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన రెండురోజుల 'బిల్డ్ కాన్ఫరెన్స్'లో మెక్రోసాప్ట్ చెప్పింది. మొదట మైక్రోసాప్ట్ కార్టనా యాప్ ద్వారా ఈ సర్వీసులను అందించి, తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్కు అనుసంధానించనున్నారు. కానీ ఈ సేవలు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయన్న విషయాన్ని మైక్రోసాప్ట్ ప్రకటించలేదు. విండోస్ 10 ఏడాది పండగ సందర్భంగా ఈ సేవలు మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తాయని సమాచారం. ఐఫోన్ ను దృష్టిలో ఉంచుకుని మైక్రోసాప్ట్ ఈ ఫీచర్స్ ను రూపొందిస్తోంది. -
'ఖాళీలు లక్షల్లో.. నియామకాలు వందల్లోనా'
అంబర్పేట: లక్షల్లో ఉద్యోగాల జాతర అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రకటనలకు క్షేత్ర స్థాయిలో చర్యలకు పొంతనే లేదని ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రభుత్వ శాఖల్లో వేలాదిగా ఉద్యోగాలు ఖాళీ ఉంటే వందల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. గురువారం అంబర్ పేటలో జరిగిన నిరుద్యోగ జేఏసీ గర్జన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 2 లక్షల ఖాళీ పోస్టుల భర్తీ కోసం తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రూప్-2 సర్వీస్ ఉద్యోగాలను 439 నుంచి 3500 పెంచాలని కోరారు. 1200 గ్రూప్-1, 8000 గ్రూప్-3, 36000 గ్రూప్-4 ఉద్యోగాల కోసం తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ, జూనియర్, డిగ్రీ, ఎయిడెడ్, రెసిడెన్సియల్ జూనియర్ కళాశాలు, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 9000 జూనియర్ లెక్చర్ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలన్నారు. టీచర్ పోస్టులను 15600 నుంచి 39 వేలకు పెంచాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. పోలీసు, ఆర్టీసీ, మున్సిపల్, విద్యుత్ శాఖల్లో వేలాదిగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని తక్షణమే భర్తీ చేయాలని ఆయన కోరారు. ఉద్యోగ నియామకాలను వెంటనేచేపట్టకపోతే లక్షలాది మంది నిరుద్యోగులతో సచివాలయాన్ని ముట్టడిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
వచ్చే వారంలో సెట్స్ నోటిఫికేషన్లు!
♦ అంతకంటే ముందుగా కన్వీనర్ల నియామకం ♦ ఎంసెట్ కన్వీనర్ బాధ్యతలపై ఉత్కంఠ! ♦ ఉన్నత విద్యా మండలి కసరత్తు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2016-17 విద్యా సంవత్సరంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) నోటిఫికేషన్లను వచ్చే వారంలో జారీ చేసేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఎంసెట్, ఈసెట్, ఐసెట్, ఎడ్సెట్, పీజీఈసెట్, లాసెట్, పీఈసెట్ నిర్వహణ తేదీలను, పరీక్ష నిర్వహించే యూనివర్సిటీలను ఎంపిక చేసిన మండలి ప్రస్తుతం సెట్స్ కన్వీనర్ల నియామకానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ వర్సిటీలకు లేఖలు రాసింది. ఒక్కో సెట్ నిర్వహణకు ముగ్గురి పేర్లను సూచించాలని ఆదేశించింది. ఇప్పటికే కన్వీనర్ల ఎంపికకు కొన్ని సెట్లకు కొందరి పేర్లను సూచించగా, మరికొన్ని సెట్లకు పేర్లు రావాల్సి ఉంది. వాటిని రెండు మూడు రోజుల్లో అందజేయాలని విశ్వవిద్యాలయాలను మండలి ఆదేశించింది. అవి రాగానే ఈనెల 8 లేదా 9న ఒక్కో సెట్కు ఒక్కో కన్వీనర్ను ఎంపిక చేసి, వెంటనే ఆయా కన్వీనర్లు నోటిఫికేషన్లు జారీచేసేలా చర్యలు చేపట్టింది. మే 19న ఐసెట్ ను, 24న మూడేళ్ల, ఐదేళ్ల లాసెట్, పీజీ లాసెట్ను నిర్వహించే బాధ్యతలను కాకతీయ వర్సిటీకి అప్పగించింది. గత ఏడాది కూడా వాటిని కాకతీయనే నిర్వహించినందున అప్పుడు కన్వీనర్లుగా చేసిన వారికే ఈసారీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అయితే వర్సిటీ ఇచ్చే జాబితాలోని మూడు పేర్లలో వారుంటే వారికే అప్పగించే అవకాశం ఉంది. ఇక మే 11 నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్, 27న ఎడ్సెట్, 29న పీజీఈసెట్లను నిర్వహించే బాధ్యతలను ఈసారి కూడా ఉస్మానియాకే అప్పగించింది. అందువల్ల వీటికి కూడా గత ఏడాది కన్వీనర్లుగా వ్యవహరించిన వారినే మళ్లీ నియమించే అవకాశం ఉంది. తేలాల్సింది ఎంసెట్ వ్యవహారమే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 2న జరిగే ఎంసెట్-2016 నిర్వహణ బాధ ్యతలు ఎవరికి అప్పగిస్తారన ్న దానిపై ఉత్కంఠ నెల కొంది. గతంలోలాగే ఈసారి కూడా ఎంసెట్ నిర్వహణను హైదరాబాద్ జేఎన్టీయూకే అప్పగించినప్పటికీ, కన్వీనర్గా ఎవరిని నియమిస్తారన్నది చర్చనీయాంశమైంది. గత ఏడేళ్లు ఎంసెట్ కన్వీనర్గా ఉన్న ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు దీన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈసారి కూడా ఆయనకే అప్పగిస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. 2015-16 విద్యా సంవత్సరంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల అఫిలియేషన్ల విషయంలో కొన్ని యాజమాన్యాలు రిజిస్ట్రార్గా ఉన్న ఆయనపై పలు ఆరోపణలు చేశాయి. ఆ వ్యవహారంతో ఎంసెట్ నిర్వహణకు సంబంధం లేనప్పటికీ 2016-17లో ఆబా ధ్యతలు అప్పగిస్తారా లేదా అన్నది ఉత్కం ఠగా మారింది. అలాగే మే 12న ఈసెట్ నిర్వహణను కూడా జేఎన్టీయూకే అప్పగిం చింది. దీనికి గత ఏడాది కన్వీనర్గా వ్యవహరించిన ప్రొఫెసర్ యాదయ్యకే మళ్లీ బాధ్యతలు అప్పగిస్తారా అన్నది తేలాల్సి ఉంది. -
ప్రభుత్వం కోరితే రిజిస్ట్రేషన్లు నిషేధించాల్సిందే
⇒ రిజిస్ట్రేషన్ చట్టంలోని 22ఏపై హైకోర్టు కీలక తీర్పు ⇒ సెక్షన్-22ఏ లోని క్లాజ్ (ఇ)పైనే ప్రధాన చర్చ ⇒ ఏ-డీ క్లాజుల్లో నిషేధిత ఆస్తుల జాబితా వెబ్సైట్లో ఉంది ⇒ క్లాజ్ (ఇ) పరిధిలోకి వచ్చే ఆస్తులపై నోటిఫికేషన్ జారీ చేయాల్సిందే ⇒ ఆ ఆస్తులపై అభ్యంతరాలు లేవనెత్తితే కమిటీ ఏర్పాటు చేయాలి ⇒ అభ్యంతరాలను ఈ కమిటీ మూడు నెలల్లో పరిష్కరించాలి ⇒ కమిటీ ఉత్తర్వులకు ప్రభుత్వం, బాధిత వ్యక్తులు కట్టుబడి ఉండాలి ⇒ ఆస్తుల రిజిస్ట్రేషన్పై అధికారులకు దిశానిర్దేశం సాక్షి, హైదరాబాద్: ఏదైనా ఒక ఆస్తిపై ప్రభుత్వం లేదా స్థానిక సంస్థలు హక్కును కోరుతూ దానిని రిజిస్టర్ చేయకుండా నిషేధించాలని కోరితే ఆ ఆస్తులను రిజిస్టర్ చేయకుండా తిరస్కరించాల్సిన బాధ్యత రిజిస్ట్రేషన్ అధికారులపై ఉందని ఉమ్మడి హైకోర్టు విస్తృత ధర్మాసనం స్పష్టంచేసింది. కొన్ని ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయకుండా నిషేధించేందుకు ఉద్దేశించిన రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్-22ఏ విషయంలో శనివారం అత్యంత కీలక తీర్పు వెలువరించింది. ఆస్తుల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఇకపై ఎటువంటి విధానాన్ని అనుసరించాలో ఉమ్మడి రాష్ట్రాల రిజిస్ట్రేషన్ అధికారులకు దిశానిర్దేశం చేసింది. ఏదైనా ఒక ఆస్తిపై ప్రభుత్వం లేదా స్థానిక సంస్థలు హక్కును కోరుతూ దానిని రిజిస్టర్ చేయకుండా నిషేధించాలని కోరుతుంటే ఆ ఆస్తి సెక్షన్-22ఎ క్లాజ్ (ఇ) పరిధిలోకి వస్తుందని తేల్చి చెప్పింది. అలాగే రీ సెటిల్మెంట్ రిజిష్ట్రార్ (ఆర్ఎస్ఆర్)లో డాట్లు ఉంటే ఆ ఆస్తికి సైతం క్లాజ్ (ఇ) వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇలాంటి ఆస్తులను నిషేధిత జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తే, ఆ ఆస్తులను రిజిష్టర్ చేయకుండా తిరస్కరించాల్సిన బాధ్యత రిజిస్ట్రేషన్ అధికారులపై ఉందని పేర్కొంది. సెక్షన్-22ఎ విషయంలో ఇప్పటివరకు వేర్వేరు సందర్భాల్లో ఆరుగురు హైకోర్టు న్యాయమూర్తులు వెలువరించిన తీర్పులు, తాము వెలువరించిన ఈ తీర్పులో వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా ఉంటే ఆ తీర్పులపై తమ తీర్పే అమలువుతుందని విస్తృత ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పునకు అందరూ కట్టుబడి ఉండాలంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తులు జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్, జస్టిస్ ఎం.సీతారామమూర్తులతో కూడిన ధర్మాసనం ఇటీవల 86 పేజీల తీర్పునిచ్చింది. సెక్షన్-22ఎ విషయంలో వచ్చిన తీర్పులపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, బాధిత వ్యక్తులు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఇదే అంశాన్ని పలువురు న్యాయవాదులు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నివేదించారు. దీంతో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి తన నేతృత్వంలో విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. 1200లకు పైగా వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. అందులోని ముఖ్యాంశాలు... క్లాజ్ (ఇ) పరిధిలోకి వచ్చే ఆస్తులకు నోటిఫికేషన్ ఇవ్వాలి... - ఆ ఆస్తులనైతే నిషేధించాలని కోరుతూ వాటి పూర్తి వివరాలను, అవి ఏ క్లాజు పరిధిలో వస్తాయో వాటి వివరాలను, అసలు వాటిని ఎందుకు నిషేధిత జాబితాలో చేర్చాలో సవివరంగా తెలియచేయాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది. ఇలా అన్ని వివరాలు అందుకున్న తరువాత, అందులో క్లాజ్ (ఇ) పరిధిలోకి వచ్చే ఆస్తులంటే వాటి గురించి మాత్రమే నోటిఫికేషన్ జారీ చేసి, దానిని గెజిట్లో ప్రచురించాలి. - క్లాజ్ (ఇ)లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, విద్యా, సాంస్కృతిక, ధార్మిక, మత సంస్థలకు అవోవ్డ్, అక్రూడ్ హక్కులున్న ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చకుంటే వాటిని విక్రయించే అవకాశాలుంటాయి. దీనివల్ల ప్రభుత్వానికి తీరని నష్టం కలుగుతుంది. అందువల్లే క్లాజ్ (ఇ) ఆస్తుల విషయంలో నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు, గెజిట్ ప్రచురణ అవసరం. - ‘ఎ’ నుంచి ‘డి’ క్లాజుల్లో ఉన్న నిషేధిత ఆస్తుల జాబితా రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో ఉంది. ఏ పౌరుడైనా ఆ జాబితాను చూసుకునే సౌలభ్యం ఉంది. కాబట్టి వాటికి నోటిఫికేషన్ అవసరం లేదు. ఉభయ రాష్ట్రాలు కమిటీని ఏర్పాటు చేయాలి... - క్లాజ్(ఇ) కింద చేర్చిన ఆస్తులపై అభ్యంతరాలుంటే వాటిపై సంబంధిత అధికారులను ఆశ్రయించే ప్రత్యామ్నాయం ఉంది. అక్కడ ఎవరైనా తన వాదనలను వినిపించుకోవచ్చు. అందువల్ల ప్రాథమిక స్థాయిలో వాదనలు వినాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. - సెక్షన్-22ఎ కింద నిషేధిత జాబితాలో చేర్చిన ఆస్తి విషయంలో అభ్యంతరాలు ఉంటే వాటిని ప్రభుత్వం తనంతట తానుగా (సుమోటో) లేదా ఎవరైనా సమర్పించే దరఖాస్తు ఆధారంగా పరిష్కరించవచ్చు. నిషేధిత జాబితా నోటిఫికేషన్ను పూర్తిగా గానీ లేదా అందులో కొంత భాగాన్ని గానీ డీనోటిఫై చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. - ‘ఎ’ నుంచి ‘డి’ వరకు ఉన్న క్లాజుల్లో చేర్చిన ఆస్తులపై ఎవరికైనా అభ్యంతరాలుంటే వారు సంబంధిత కోర్టును ఆశ్రయించాలి. ఆ కోర్టు ఇచ్చే తీర్పే ఫైనల్. - క్లాజ్ (ఇ)లో చేర్చిన ఆస్తులపై అభ్యంతరాలుంటే వాటిని పరిష్కరించేందుకు ఇప్పటికే ఓ యంత్రాంగం ఉంది. అయితే ఆ యంత్రాంగం సమర్థవంతంగా, న్యాయబద్ధంగా, వీలైనంత త్వరగా అభ్యంతరాలను పరిష్కరించేలా చూడాలి. ఇందుకుగాను ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా కమిటీ ఏర్పాటు చేయాలి. అందులో రెవిన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, డెరైక్టర్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, విశ్రాంత జిల్లా జడ్జీకి స్థానం కల్పించారు. ఈ కమిటీ గరిష్టంగా మూడు నెలల్లో అభ్యంతరాలను పరిష్కరించాలి. - నిషేధిత జాబితాలో చేర్చిన ఆస్తులను ఆ జాబితా నుంచి తొలగించడంతోపాటు అభ్యంతరాల దరఖాస్తును తోసిపుచ్చే అధికారం ఈ కమిటీకి ఉంటుంది. ఈ విషయంలో అవసరమైన రికార్డులను పరిశీలించే అధికారం కూడా ఉంటుంది. కమిటీ ఇచ్చే ఉత్తర్వులకు రాష్ట్ర ప్రభుత్వం, బాధిత వ్యక్తులు కట్టుబడి ఉండాలి. లేదంటే సంబంధిత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. ఉభయ ప్రభుత్వాలు ఎనిమిది వారాల్లో కమిటీని ఏర్పాటు చేయాలి. ధర్మాసనం జారీ చేసిన ఆదేశాలు... 1. ఆస్తుల నిషేధిత జాబితా తయారు చేసే అధికారి ఆ ఆస్తి ఏ క్లాజు కింద వర్గీకరించారో స్పష్టంగా పేర్కొన్నాలి. 2. క్లాజు-ఏలో పేర్కొన్న ఆస్తులను ఏ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేయకుండా నిషేధించారో కలెక్టర్ స్పష్టం చేయాలి. క్లాజు-బిలో పేర్కొన్న ఆస్తులకు సంబంధించి ఆ ఆస్తి ఏ ప్రభుత్వానికి చెందిందో పేర్కొనాలి. 3. క్లాజు-సీ, డీల ఆస్తుల విషయానికి వస్తే, ఆ ఆస్తులు దేవాదాయ లేదా వక్ఫ్, సీలింగ్ పరిధిలోకి వస్తాయా? రావా? అన్న దానిని స్పష్టంగా పేర్కొంటూ అందుకు సంబంధించి రిజిస్టర్లను, గెజిట్ నోటిఫికేషన్లను రిజిస్ట్రేషన్ అధికారులకు పంపాలి. 4. రిజిస్ట్రేషన్ అధికారులకు పంపే ఆస్తుల జాబితాను సంబంధిత అధికారులు రిజిస్ట్రేషన్ శాఖల వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఒకవేళ వెబ్సైట్లో మార్పులు, చేర్పులు ఉంటే వాటిని పత్రికా ప్రకటన ద్వారా ప్రజలందరికీ తెలియచేయాలి. 5. ‘ఎ’ నుంచి ‘డి’ వరకు ఉన్న క్లాజ్లుల్లో తమ ఆస్తిని చేర్చడంపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే, ఆ జాబితా నుంచి తన ఆస్తిని తొలగించాలని ఆ వ్యక్తి అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తుపై అధికారులు ఆరు వారాల్లోపు నిర్ణయం వెలువరించాల్సి ఉంటుంది. నిర్ణయాన్ని ఆ వ్యక్తికి తెలియచేయాల్సి ఉంటుంది. 6. ‘ఎ’ నుంచి ‘ఇ’ వరకు ఉన్న క్లాజుల్లో చేర్చిన నిషేధిత ఆస్తుల జాబితాను బాధిత వ్యక్తి కోరితే, ఆ జాబితాను అధికారులు ఆ వ్యక్తికి పది రోజుల్లో అందచేయాలి. 7. ‘ఎ’ నుంచి ‘ఇ’ వరకున్న క్లాజుల పరిధిలోకి రాని ఆస్తుల్లో ఏదైనా ఆస్తి రిజిష్టర్ అయినంత మాత్రాన కొనుగోలు చేసిన వ్యక్తికి ఆ ఆస్తిపై హక్కు రాదు. ఆస్తి రిజిష్టర్పై అభ్యంతరాలుంటే ప్రభుత్వం తగిన ఫోరాన్ని ఆశ్రయించవచ్చు. అసలు ‘22ఎ’ ఏం చెబుతోందంటే... సెక్షన్-22ఎ (1): రిజిస్ట్రేషన్ నిషేధించిన ఆస్తులు, డాక్యుమెంట్ల గురించి చెబుతోంది. క్లాజ్ (ఎ): రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం చేసిన ఏదైనా చట్టం ద్వారా స్థిరాస్తుల విక్రయాన్ని, బదలాయింపును నిషేధిస్తుంది. క్లాజ్ (బి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఆస్తులను చట్టం అనుమతించి వ్యక్తులు మినహా) అమ్మడం, అమ్మేందుకు ఒప్పందం చేసుకోవడం, బహుమతి ద్వారా ఇవ్వడం, లీజుకివ్వడాన్ని నిషేధిస్తుంది. క్లాజ్ (సి): దేవాదాయచట్టం, వక్ఫ్చట్టం పరిధిలోకి వచ్చే ఆస్తులను విక్రయించడం, అందుకు ఒప్పందం చేసుకోవడం, బహుమతి ద్వారా ఇవ్వడం, లీజుకివ్వడంపై నిషేధం విధిస్తుంది. క్లాజ్ (డి): ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణ చట్టం, ఆంధ్రప్రదేశ్ పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం కింద మిగులు భూములు ప్రకటించిన భూములపై నిషేధం విధిస్తుంది. క్లాజ్ (ఇ): సివిల్, క్రిమినల్, రెవెన్యూ కోర్టులు, ప్రత్యక్ష, పరోక్ష పన్నుల బోర్డులు జప్తు చేసిన ఆస్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, విద్యా, సాంస్కృతిక, మత, ధార్మిక సంస్థలకు అవోవ్డ్, అక్రూడ్ హక్కులుప్పుడు ఆ ఆస్తులను రిజిస్ట్రేషన్ నుంచి నిషేధిస్తుంది. అవోవ్డ్ ఇంట్రస్ట్: ఓ ఆస్తిపై ప్రభుత్వం బహిరంగంగా వ్యక్తం చేసే హక్కు అక్రూడ్ ఇంట్రెస్ట్: ఓ ఆస్తిపై కాలానుగుణంగా సక్రమించే హక్కు ఉదాహరణ 1: ప్రభుత్వం ఓ వ్యక్తిని భూమిని అసైన్మెంట్ కింద ఇచ్చింది. దీనిని అన్యాకాంత్రం చేయడం గానీ, విక్రయించడం గానీ చేయరాదన్న షరతుతో ప్రభుత్వం ఆ వ్యక్తికి పట్టా కూడా ఇచ్చింది. అయితే ఆ వ్యక్తి ఆ భూమిని ‘బి’ అనే వ్యక్తికి విక్రయించారు. ఆ తరువాత ఇది ప్రభుత్వ భూమి అని, దీని విక్రయంపై నిషేధం ఉందని ‘బి’ తెలుసుకున్నారు. అలాంటి భూమిని ప్రభుత్వం ఎప్పుడైనా స్వాధీనం చేసుకోవచ్చు. అలా ఉన్న హక్కే ‘అవోవ్డ్ ఇంట్రెస్ట్’ అవుతుంది. ఉదాహరణ 2: ఓ ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగం ద్వారా ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారు. దీంతో ఆ వ్యక్తిపై చట్టప్రకారం కేసులు నమోదుయ్యాయి. అతనిపై అభియోగాలు కూడా నిరూపణ అయ్యాయి. ఈ సమయంలో ప్రభుత్వం ఆ వ్యక్తి ఆస్తులను జప్తు చేయవచ్చు. అయితే కేసు తుది ప్రక్రియ ముగిసేంతవరకు ఆ ఆస్తులపై ప్రభుత్వానికి హక్కులు సంక్రమించవు. అంటే ఆ ఆస్తులపై ప్రభుత్వానికి కాలానుగుణంగా హక్కు సక్రమిస్తుంది. దీనినే ‘అక్రూడ్ ఇంట్రెస్ట్’ అంటారు. -
1069 కొలువులకు ఆమోదం: ఆర్ధిక శాఖ
-
సుదీర్ఘంగా సమావేశం కానున్న టీ కేబినెట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం శనివారం జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సమావేశాన్ని సుదీర్ఘంగా నిర్వహించనున్నారు. కేబినెట్ మీటింగ్కు అధికారులు భారీ ఎజెండాతో సిద్ధమయ్యారు. త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, టీఎస్పీఎస్సీ ద్వారా ఇటీవల వెలువడిన కొత్త నోటిఫికేషన్లు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు తదితర అంశాలను కేబినెట్ మీటింగ్లో చర్చించనున్నట్లు సమాచారం. -
ఎడ్యుకేషన్ & జాబ్స్
మరో 283 కొలువులకు నోటిఫికేషన్ * మూడు విభాగాల్లో నియామకాల కోసం విడుదల సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసిన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మరిన్ని కొలువులకు పచ్చజెండా ఊపింది. మూడు విభాగాలలో కలిపి 283 ఉద్యోగాలకు మంగళవారం నోటిఫికేషన్ జారీచేసింది. రవాణాశాఖలో అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్(ఏఎంవీఐ), హైదరాబాద్ జల మండలి, పారిశుద్ధ్య నిర్వహణ బోర్డులో ఫైనాన్స్ అండ్ అకౌంట్ అసిస్టెంట్లు, మున్సిపాలిటీల్లోని టౌన్ ప్లానింగ్ విభాగంలో నియామకాల కోసం ఈ నోటిఫికేషన్ వెలువరించింది. దరఖాస్తు విధానం మొత్తం ఆన్లైన్ ద్వారా చేపట్టనున్నట్లు పేర్కొంది. మరింత సమాచారం కోసం టీఎస్పీఎస్సీ వెబ్సైట్ను సంప్రదించవచ్చు. పోటీ పరీక్షలకు 24 నుంచి ఉచిత శిక్షణ హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలోని ఈక్వల్ ఆపర్చునిటీ సెల్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీలో ఈ నెల 24 నుంచి గ్రూప్-1, 2 తదితర పోటీ పరీక్షలకు నిష్ణాతులైన అధ్యాపకులతో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మంగళవారం సెల్ డెరైక్టర్ విష్ణుదేవ్ తెలిపారు. ఓయూలో చదివే విద్యార్థులు ఇందుకు అర్హులని, ఆసక్తి ఉన్నవారు ఈక్వల్ ఆపర్చునిటీ సెల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నేడు, రేపు ఓయూసెట్ స్లైడింగ్ హైదరాబాద్: ఓయూసెట్-2015 ప్రవేశాలకు ఈ నెల 23, 24న స్లైడింగ్ నిర్వహించనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ గోపాల్రెడ్డి తెలిపారు. బుధవారం ఎమ్మెస్సీ కోర్సులు, గురువారం ఎంఏ, సోషల్ సైన్స్ కోర్సులకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సీట్లు అలాట్ అయినట్లు ఎస్ఎంఎస్ వచ్చిన అభ్యర్థులు మాత్రమే స్లైడింగ్కు హాజరుకావాలని సూచించారు. అధిక ఫీజులు తీసుకుంటే చర్యలు * ఎడ్సెట్ కన్వీనర్ ప్రసాద్ హెచ్చరిక హైదరాబాద్: రెండేళ్ల బీఈడీ కోర్సులో చేరిన అభ్యర్థుల నుంచి నిర్ణీత ఫీజు కన్నా ఎక్కువగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎడ్సెట్-2015 కన్వీనర్ ప్రసాద్ హెచ్చరించారు. అసోసియేషన్ ఆఫ్ ఫీ రెగ్యులేషన్ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) నిర్ణయించిన ఫీజు కన్నా ఎక్కువ తీసుకుంటే ఫిర్యాదు చేయాలని కోరారు. డిసెంబర్లో రెండో విడత ‘విద్యానిధి’ సాక్షి, హైదరాబాద్: అంబేద్కర్ విద్యానిధి పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్యకు అర్హులైన ఎస్సీ విద్యార్థులను రెండో విడతలో భాగంగా డిసెంబర్లో ఎంపిక చేయనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ డెరైక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ-పాస్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సివిల్స్, గ్రూప్ -1, 2 వంటి పోటీ పరీక్షలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. నెలకు 50 యూనిట్ల లోపు విద్యుత్ను వినియోగిస్తున్న ఎస్సీ కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నట్లు, గతేడాది 2.7 లక్షల కుటుంబాలకు రూ.174.25 కోట్ల మేర లబ్ధిచేకూర్చినట్లు తెలిపారు. -
స్టడీ సర్కిల్ ఏది..?
ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సెంటర్ నివేదిక సిద్ధం చేయాలంటూ ఆదేశాలు పట్టించుకోని అధికారులు ప్రవేశ పరీక్ష జరిగినా కానరాని పురోగతి నోటిఫికేషన్లు జారీచేస్తున్న టీఎస్పీఎస్సీ ఆందోళనచెందుతున్న అభ్యర్థులు హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరంలో రెండో స్టడీసర్కిల్ను నిర్వహించేందుకు సాంఘిక సంక్షేమ శాఖ సిద్ధంగా ఉన్నా.. స్థానిక అధికారుల నుంచి స్పందన కరువైంది. సెప్టెంబర్ మొదటివారంలోగా వరంగల్లో స్టడీ సెంటర్ ప్రారంభించాలని ఉన్నతాధికారులు ఆదేశించినా.. అధికారుల్లో చలనం లేదు. గడువు ముగిసినా.. విలువైన సమయం హరిస్తున్నా.. స్టడీ సర్కిల్ ఏర్పాటు వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. హన్మకొండ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శ్రీకారం చుట్టింది. గడిచిన మూడు నెలలుగా వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో దళిత నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరంలో స్టడీసర్కిల్ నెలకొల్పాలని సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. గతనెలలో ఈ శాఖకు చెందిన డెరైక్టరు సుబ్రహ్మణ్యం వరంగల్కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. స్టడీసర్కిల్ నిర్వాహణకు సంబంధించి ఫ్యా కల్టీ ఎంపిక, స్టడీ సెంటర్ నిర్వాహనకు అవసరమైన సి బ్బంది, బాలురు, బాలికలకు వేర్వేరుగా శిక్షణ లేదా ఒకే క్యాంపస్లో శిక్షణ, వసతితో కూడిన శిక్షణ లేక వసతి లేకుండా శిక్షణా ఇవ్వాలా అనే అంశాలపై వెంటనే నివేదిక రూపొందించాలని ఆదేశించారు. సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందివ్వాలని, ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ మొదటివారంలో శిక్షణ తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చలనం లేదు స్టడీ సర్కిల్ నిర్వహనకు సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించడంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో స్టడీ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి కసరత్తు మొదలుపెట్టలేదు. మరోవైపు వరంగల్లో స్టడీ సర్కిల్ ఏర్పాటుపై కతృనిశ్చయంతో ఉన్న రాష్ట్రస్థాయి అధికారులు 2015 ఆగస్టు 16వ తేదీన ఉద్యోగార్థులకు నగరంలో ప్రవేశ పరీక్ష సైతం నిర్వహించారు. వందలాది మంది దళిత, దళితేతర నిరుద్యోగులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఫలితాలు విడుదల చేసిన వెంటనే శిక్షణ ప్రారంభించాల్సి ఉంటుంది. కోచింగ్కు సిద్ధమవుదామని కళ్లలో వొత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. కానీ జిల్లా నుంచి ఎటువంటి రిపోర్టు అందనందున ఫలితాల విడుదలలో జాప్యం చోటు చేసుకుంటోంది. స్టడీ సర్కిల్ ఏర్పాటు వివరాల కోసం కార్యాలయంలో సంప్రదిస్తే.. అధికారులు, సిబ్బంది స్టడీసెంటర్ ఏర్పాటుపై అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు. విలువైన సమయం వృథా.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలకమైన గ్రూప్-1, గ్రూప్-2 తదితర పోస్టులకు సిలబస్ సైతం ప్రకటించింది. పోటీ పరీక్షలలో విజయం సాధించాలంటే కనీసం ఆర్నెళ్ల శిక్షణ, ప్రిపరేషన్ అవసరం. ఇప్పటికే వరంగల్లో బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ క్లాసులు మొదలయ్యాయి. కానీ సాంఘిక సంక్షేమ శాఖ విభాగంలో క్షేత్రస్థాయి అధికారుల్లో చలనం కరువైపోవడంతో స్టడీ సర్కిల్ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. స్టడీ సర్కిల్ ఏర్పాటుకు సంబంధించి జిల్లా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తే..ఈ పాటికి శిక్షణ మొదలయ్యేది. పేద దళిత విద్యార్థులకు సివిల్స్, గ్రూప్స్, బ్యాంకు తదితర పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడంతో పాటు వసతి, లైబ్రరీ తదితర సౌకర్యాలు విద్యార్థులకు అంది ఉండేవి. గతకొంతకాలంగా టీపీపీఎస్సీ సిలబస్ను ప్రకటించి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తుండటంతో ఉద్యోగార్థుల్లో ఆందోళనమొదలైంది. స్టడీ సర్కిల్ ఏర్పాటులో జరుగుతున్న జాప్యం కారణంగా విలువైన సమయం కోల్పోవాల్సి వస్తుందని పేద దళిత ఉద్యోగార్థులు ఆవేదన చెందుతున్నారు. కమీషన్ల కక్కుర్తితో.. సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది కమీషన్ల కక్కుర్తి వ్యవహారంతో స్టడీ సర్కిల్ కోసం ఎంపిక చేయాల్సిన భవనం విషయంలో జాప్యం జరుగుతోంది. ఈ మేరకు నగర పరిధిలో మూడు భవనాలను ఎంపిక చేసినట్లుగా సమాచారం. ఈ భవన యజమానులు, సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బందికి మధ్య అద్దె కమీషన్ల విషయంలో పేచీ పడుతున్నట్లుగా ఈ శాఖ సిబ్బందే చెవులు కొరుక్కుంటున్నారు. -
నియామకాల్లో సింగరేణి ఆదర్శం
గోదావరిఖని: సింగరేణి సంస్థ వేగవంతంగా, పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడుతూ రాష్ట్రంలోని మిగతా సంస్థలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే రెండు నోటిఫికేషన్లు వెలువరించిన సంస్థ వెంటవెంటనే పరీక్షలు నిర్వహించి, అదే రోజు ఫలితాలు వెల్లడించి రికార్డు సృష్టించింది. అవినీతి, జాప్యానికి తావిచ్చే ఇంటర్వ్యూకు స్వస్తిపలికి రాత పరీక్ష మాత్రమే నిర్వహిస్తూ ఉద్యోగ నియామకాలు చేపడుతున్న ఏకైక సంస్థగా మన్ననలు పొందుతోంది. తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల వారికి 80 శాతం, ఇతర జిల్లాలవారికి 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నియామకాలను చేపడుతున్న తీరు స్ఫూర్తిదాయకంగా ఉంది. 2,254 ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు: సింగరేణిలో యాజమాన్యం రెండుసార్లు నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొదటి నోటిఫికేషన్లో పేర్కొ న్న ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది ఏప్రిల్ 26 నుంచి రాతపరీక్షలను ప్రారంభించింది. ఇందులో భాగంగా మొత్తం 1,178 ఉద్యోగాలకు రాతపరీక్ష నిర్వహించింది. రెండవ నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా మొత్తం 394 పోస్టులకు ఈ నెల 9న రాత పరీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ నాటికి 682 ఉద్యోగాల భర్తీ: సింగరేణి సంస్థ సెప్టెంబర్ నాటికి మరో 682 ఉద్యోగాలను భర్తీ చేయడానికి చర్యలు చేపట్టింది. రెండవ నోటిఫికేషన్లో పేర్కొన్న విధం గా ఈ నెల 16న 30 సబ్ ఓవర్సీర్ (సివిల్) ఉద్యోగాలకు, 30న 45 సర్వేయర్ ట్రైనీ ఉద్యోగాలకు రాతపరీక్షను నిర్వహించనున్నది. అలాగే 40 మోటార్ మెకానిక్ పోస్టులు, 48 మైన్ సర్వేయర్ పోస్టులు, మరో 48 సర్వేయర్ ట్రైనీ పోస్టులు, 471 గ్రేడ్-2 క్లర్క్ పోస్టులకు సెప్టెం బర్లోగా రాత పరీక్షను నిర్వహించేలా రిక్రూట్మెంట్ సెల్ చర్యలు తీసుకుంటోంది. పరీక్ష నిర్వహించిన రోజే ఫలితాలు: సింగరేణి యాజమాన్యం పరీక్ష పేపర్ను తయారు చేసే వారిని వారం రోజులకు ముందుగానే బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఉంచుతోంది. వారుండే చోట సీసీ కెమెరాల నిఘాను ఏర్పాటు చేశారు. ఆయా ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించిన రోజే ఫలితాలను వెల్లడించడంతో పాటు వాటిని అదే రోజు రాత్రికి వెబ్సైట్లలో అందుబాటులో ఉంచుతోంది. -
వారంలో గ్రూప్స్ సిలబస్!
వెబ్సైట్లో పెట్టేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు * అభ్యర్థులకు చదువుకునే సమయం ఇచ్చే యోచన * ఆయా కేడర్లలో రానున్న మరిన్ని పోస్టులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియదు.. పూర్తి స్థాయి సిలబస్ ఏంటో తెలియదు.. కొత్త రాష్ట్రంలో సిలబస్ మార్చుతున్నారు... అదేంటో స్పష్టత లేదు.. ఏ పుస్తకాలు చదువాలో అంతుచిక్కడం లేదు.. ప్రభుత్వం అనుమతిచ్చింది కనుక వెంటనే నోటిఫికేషన్లు ఇస్తే చదువుకునే సమయం ఉంటుందా ఇలా అనేక ప్రశ్నలు నిరుద్యోగ అభ్యర్థుల మెదళ్లను తొలిచేస్తున్నాయి! వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టే దిశగా టీఎస్పీఎస్సీ కసరత్తు ప్రారంభించింది. సిలబస్లో ఎక్కువ మార్పులు ఉండే గ్రూపు-1, గ్రూపు-2 విషయంలో అభ్యర్థులు ఆందోళన చెందకుండా కార్యాచరణపై దృష్టి పెట్టింది. చదువుకునే సమయం ఇవ్వడంతోపాటు, పూర్తి స్థాయి సిలబస్ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పరీక్షల విధానం, 15,522 పోస్టుల భర్తీకి ఆమోదం, ఆయా పేపర్లలో ఉండే సిలబస్ ఔట్లైన్ ఇచ్చినందున, అందుకనుగుణంగా వారం పది రోజుల్లో పూర్తి సిలబస్ను, వాటిల్లోని టాపిక్స్ను అభ్యర్థులకు అందుబాటులోకి తేనుంది. మరో ఐదారు రోజుల్లో అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వీటికి సంబంధించిన సిలబస్ రూపకల్పనకు చర్యలు చేపట్టింది. గత నెలలో ప్రభుత్వం వివిధ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిన వెంటనే పూర్తి స్థాయి సిలబస్ రూపకల్పనపై టీఎస్పీఎస్సీ దృష్టి సారించింది. ఇంజనీర్ పోస్టుల్లోనే పది రకాల పోస్టులు ఉండటం, వాట న్నింటికి అవసరమైన సిలబస్ రూపకల్పన చేయిస్తోంది. గత వారం నుంచి పలువురు ప్రొఫెసర్ల నేతృత్వంలో ఇదే పనిలో నిమగ్నమైంది. ఇది పూర్తయ్యేందుకు మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉంది. ఆ తరువాత మొదటి నోటిఫికేషన్లుగా ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రకటనలు జారీ చేసేందుకు సిద్ధమైంది. వాటికి సెప్టెంబర్, అక్టోబర్లో పరీక్షలు నిర్వహించి, ఫలితాలను ప్రకటించాలన్న ఆలోచనలు చేస్తోంది. ఈ నోటిఫికేషన్ల తరువాత ఇతర శాఖల్లోని పోస్టులకు పూర్తిస్థాయి సిలబస్ రూపొందించి, ఒక్కొక్కటిగా వరుస క్రమంలో నోటిఫికేషన్లను జారీ చేయాలని యోచిస్తోంది. ఇక ఈసారి ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడాన్ని నియంత్రించేందుకు బయోమెట్రిక్ విధానం (పరీక్ష సమయంలో వేలి ముద్రలు తీసుకోవడం) అమల్లోకి తేవాలని భావిస్తోంది. అలాగే పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకూ ఆలోచనలు చేస్తోంది. ముందు సిలబస్.. తరువాత నోటిఫికేషన్లు వారం పది రోజుల్లో గ్రూపు-1, గ్రూపు-2 తదితర పోస్టుల సిలబస్ ఖరారు చేసి వెబ్సైట్లో పెట్టేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఈనెల 15లోగా సిలబస్ ఇచ్చాక నెలా.. రెండు నెలల సమయమిచ్చి అక్టోబర్లో గ్రూపు-2 నోటిఫికేషన్ జారీ చేస్తే బాగుంటుందని యోచిస్తోంది. దీంతో అభ్యర్థులకు సమయం ఇవ్వలేదన్న అపవాదు ఉండదు. ఇక గ్రూపు-3 కూడా అదే సమయంలో ఇవ్వాలా? అంతకంటే ముందుగానే ఇవ్వాలా? అన్న ఆలోచనలు చేస్తోంది. మరోవైపు గ్రూపు-1 నోటిఫికేషన్ను మాత్రం డిసెంబరు నాటికి ఇవ్వడమే మంచిదన్న భావన ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం అనుమతిచ్చిన పోస్టుల్లో గ్రూపు-1 పోస్టులు కేవలం 56 వరకే ఉన్నాయి. అయితే అభ్యర్థులు ఎక్కువ మొత్తంలో దరఖాస్తు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో డిసెంబర్కు నోటిఫికేషన్ ఇస్తే మరిన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉంటుంది. పైగా అప్పటివరకు ఉద్యోగుల విభజన చివరి దశకు చేరుకోనుండటంతో మరిన్ని పోస్టులు రానున్నాయి. గ్రూపు-2లోనూ ఎక్కువ పోస్టులు వచ్చే అవకాశముంది. వార్షిక కేలండర్ అమలు దిశగా.. ప్రధానంగా గ్రూప్స్ పరీక్షల విషయంలో వార్షిక కేలండర్ అమలు దిశగా టీఎస్పీఎస్సీ యోచిస్తోంది. పోస్టులు ఖాళీ అయిన కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్లు ఇవ్వడం కాకుండా.. ఏడాదిలో నిర్ణీత సమయంలో నోటిఫికేషన్లు ఇస్తూ... వీలైనంత వరకు వార్షిక కేలండర్ను అమలు చేయడం మంచిదన్న భావనతో ఉంది. ఇక గ్రూపు-2 పరీక్షల నిర్వహణను సివిల్స్ పరీక్షల సమయంతో క్లాష్ కాకుండా పరీక్ష తేదీలను ప్రకటించే ఆలోచన చేస్తోంది. -
20 రోజుల్లో నోటిఫికేషన్లు!
-
తొలుత కీలక పోస్టులే!
ఆ తర్వాతే చిన్నాచితకా పోస్టుల భర్తీ నోటిఫికేషన్ల విడుదలపై సర్కారు కసరత్తు విభాగాల వారీగా ప్రాధాన్య పోస్టుల వివరాల సేకరణ హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సన్నాహాలు మొదలయ్యాయి. ప్రధానంగా ఏయే పోస్టులను భర్తీ చేయాలనే అంశంపై తుది కసరత్తు జరుగుతోందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. విభాగాల వారీగా ఇప్పటికే 60 వేలకు పైగా ఖాళీల సమాచారాన్ని ఆర్థిక శాఖ సేకరించింది. వీటిలో పెద్దగా ప్రాధాన్యత లేని సాధారణ పోస్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గంపగుత్తగా ఖాళీలన్నింటినీ భర్తీ చేయటం సరికాదని.. దానివల్ల ఆర్థికంగా భారమే తప్ప, అవసరం నెరవేరదని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రాధాన్య పోస్టులను తొలుత భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే గుర్తించిన ఖాళీల్లో అత్యవసరమైనవి, అత్యంత ప్రాధాన్యమైనవి ఏమిటనే లెక్కన సమాచారం సేకరిస్తున్నారు. ‘ఉదాహరణకు వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీవో పోస్టులు కీలకం. కానీ అందులో జూనియర్ అసిస్టెంట్లు, క్లర్కులు, అటెండర్, స్వీపర్ పోస్టులు ఇప్పటికిప్పుడు భర్తీ చేయడం అవసరం లేదు. అదే తరహాలో ఇరిగేషన్, ఇంజనీరింగ్ విభాగంలో ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్ల అవసరముంది. అంతకన్నా దిగువ పోస్టులతో పెద్దగా పనిలేదు. కాలేజీల్లోనూ లెక్చరర్లకు తక్షణ ప్రాధాన్యం. నాన్ టీచింగ్ స్టాఫ్ను నియమించాల్సిన అవసరం లేదు. ఇలా విభాగాల వారీగా తక్షణ అవసరమేమిటో లెక్క తేల్చాల్సి ఉంది...’ అని ఒక ఉన్నతాధికారి పేర్కొన్నారు. జూలైలో 25 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తామని, నోటిఫికేషన్లు జారీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జూలై ముగింపు దశకు చేరుకున్నా ప్రభుత్వంలో స్పందన లేకపోవడంతో... నోటిఫికేషన్లు వెలువడుతాయా, లేదా అనే సందిగ్ధత నెలకొంది. తొలి విడతలో భర్తీ చేసేందుకు విభాగాల వారీగా ప్రాధాన్య పోస్టుల సమాచారం సేకరిస్తున్నామని, సీఎస్ ఆధ్వర్యంలో జరిగే తదుపరి సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఈ కసరత్తు ముగిసిన వెంటనే ఉద్యోగాల భర్తీపై నిర్ణయం తీసుకుంటారని, సీఎం ఆమోదించిన వెంటనే నోటిఫికేషన్లు జారీ అవుతాయని పేర్కొన్నాయి. -
కొలువుల ఫైళ్లు నత్తనడక
ఉద్యోగ నియామకాల ఫైళ్లన్నీ ఎక్కడివక్కడే కీలకాంశాలపై స్పష్టత కరువు వయో పరిమితి పెంపుపై సందిగ్ధత పరీక్ష విధానం, జోన్ల వ్యవస్థ, టీఎస్పీఎస్సీ భర్తీ చేసే పోస్టులపై రాని స్పష్టత కమిటీలు, పరిశీలనతోనే కాలం వెళ్లబుచ్చుతున్న సర్కారు జూలై వచ్చినా జాడ లేని నోటిఫికేషన్లు ఆందోళనలో నిరుద్యోగులు సాక్షి, హైదరాబాద్: 'త్వరలోనే 25 వేల ఉద్యోగాల భర్తీ...' అంటూ సర్కారు వెలువరించిన ప్రకటన నిరుద్యోగులను ఊరిస్తున్నా నియామకాలకు సంబంధించిన కసరత్తు నత్తనడకన సాగుతోంది. జూలై నుంచి నోటిఫికేషన్ల ప్రక్రియ మొదలవుతుందని స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించినా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే ఉంది. నోటిఫికేషన్లకు ఎంచుకున్న ముహూర్తం ముంచుకొస్తున్నా.. ఫైళ్లన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. శాఖల వారీగా ఖాళీల గుర్తింపు మినహా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అడుగు ముందుకు పడలేదు. కీలకమైన నిర్ణయాలన్నీ సీఎం వద్ద పెండింగ్లో ఉన్నాయి. అభ్యర్థుల వయో పరిమితి ఎంత మేరకు సడలిస్తారు? జోనల్ విధానంలో మార్పుచేర్పులు ఉండబోతున్నాయా? అసలు పరీక్షల విధానం ఎలా ఉండబోతోంది? వీటికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. దీంతో లక్షలాది మంది నిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. మూడు వారాలు గడచినా.. సీఎం ఉద్యోగ నియామకాలపై ప్రకటన చేసి మూడు వారాలైంది. తొలి వారంలో 24 గంటల వ్యవధిలో ఖాళీల సమాచారం ఇవ్వాలని హడావుడి చేసిన సర్కారు.. ఆ తర్వాత వేగం తగ్గించింది. ఇంకా ఖాళీల గుర్తింపు ప్రక్రియే కొనసాగుతోంది. ఖాళీల వివరాలు కోరటం.. ప్రాధాన్యతా క్రమంలో ఏయే పోస్టులు భర్తీ చేయాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ రెండుసార్లు సమీక్ష నిర్వహించారు. 56 వేల ఖాళీలున్నట్టు వివిధ శాఖల నుంచి ఆర్థిక శాఖకు సమాచారం అందింది. నాలుగో తరగతి పోస్టులకు సంబంధించి ఖాళీల వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. కానీ జూనియర్ అసిస్టెంట్ స్థాయికి మించి ఎక్స్క్యూటివ్ పోస్టుల జాబితా సిద్ధం చేయాలని సర్కారు సూచింది. దీంతో ఆర్థికశాఖ తమ దగ్గరున్న ఖాళీల వివరాలను వడస్తోంది. తొలి విడతలో విద్య, వైద్యారోగ్యం, పురపాలక శాఖ, పంచాయతీరాజ్, హోంశాఖలోని ఖాళీలు భర్తీ చేసే అవకాశాలున్నాయి. ఈ అయిదు విభాగాల్లోని ఖాళీలపైనే సీఎస్ ఇటీవల ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించటం గమనార్హం. ఈ ఏడాది రాష్ట్ర స్థాయి పోస్టులు మినహా జోనల్, జిల్లా స్థాయి పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వయో పరిమితిపై సందిగ్ధత అభ్యర్థుల వయో పరిమితి పెంపుపై ప్రభుత్వం ఇప్పటికీ మార్గదర్శకాలు విడుదల చేయలేదు. జూన్ 10న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ భేటీలోనూ దీనిపై చర్చించారు. 'అయిదేళ్లు పెంచాలా.. పదేళ్లా.. అనే దానిపై భిన్నమైన అభిప్రాయాలున్నాయి. చీఫ్ సెక్రెటరీ సారథ్యంలోని కార్యదర్శుల కమిటీ దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. వారం రోజుల్లో నాకు నివేదిక ఇస్తుంది' అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పటికీ నిర్ణయం వెలువడలేదు. ఉద్యోగ నియామకాలకు ప్రస్తుతమున్న సాధారణ వయో పరిమితి 34 ఏళ్లు. యూనిఫాం సర్వీసులకు 28 ఏళ్లు. నిరుద్యోగులకు మాత్రమే వయోపరిమితి సడలింపు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న అభ్యర్థులకు గతంలో ఉన్న అయిదేళ్ల సడలింపు మాత్రమే వర్తింపజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. టీఎస్పీఎస్సీ పోస్టులేవీ ? తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఏయే పోస్టులు భర్తీ చేయాలన్న లెక్క తేలలేదు. టీఎస్పీఎస్సీ తొలి నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుంది? ఏయే పోస్టులు భర్తీ చేస్తారనేది సర్కారు వెల్లడించలేదు. ప్రభుత్వం భర్తీ చేయదలిచిన 25 వేల ఉద్యోగాల్లో వేటిని టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు.. వేటిని డిపార్టుమెంట్ బోర్డుల ద్వారా భర్తీ చేస్తారో తేలాల్సి ఉంది. చీఫ్ సెక్రెటరీలు, డిపార్టుమెంట్ సెక్రెటరీలు చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సీఎం చెప్పినా.. ఇప్పటికీ ఆ దిశగా తుది కసరత్తు జరగలేదు. పరీక్ష విధానంపై సందిగ్ధత టీఎస్పీఎస్సీ అధ్వర్యంలో నిర్వహించే పరీక్షల విధానం ఎలా ఉండబోతుందన్నది ఇప్పటికీ తేలలేదు. ఉద్యోగాల ప్రకటన అనంతరం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సారథ్యంలో ముగ్గురు మంత్రుల సబ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలు, టీఎస్పీఎస్సీ చేసిన సిఫారసులు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శుల కమిటీ ఇచ్చిన సలహాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిన సబ్ కమిటీ ఎప్పుడు తమ నివేదిక ఇస్తుందో వేచి చూడాల్సిందే! జోనల్ వ్యవస్థపై మల్లగుల్లాలు జోనల్ వ్యవస్థపై అనేక సందేహాలు నిరుద్యోగులను పట్టి పీడిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 371(డీ) కింద ఆరు జోన్ల వ్యవస్థ ఉంది. విభజన అనంతరం తెలంగాణలో రెండే జోన్లు ఉన్నాయి. వీటిని రద్దు చేసి ఒక్కటిగా విలీనం చేయాలా లేదా నాలుగు జోన్లుగా పునర్వ్యవస్థీకరించాలా అన్నది చర్చనీయాంశంగానే ఉంది. పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ జోన్ల విధానం అమల్లో ఉంది. దీనికి మార్పులు చేర్పులు చేయాలంటే కేంద్రం అనుమతి పొందడంతోపాటు ప్రస్తుతమున్న చట్టానికి సవరణ చేయాల్సి ఉంటుంది. -
.. ఆ తరువాతే డీఎస్సీ!
♦ 25 వేల ఉద్యోగాల్లో ఉపాధ్యాయ పోస్టులు లేనట్టే... ♦ క్రమబద్ధీకరణ తరువాతే లెక్చరర్ ఖాళీల భర్తీ ♦ గత డీఎస్సీ బాధితుల కోసం న్యాయసలహా తీసుకోనున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వం త్వరలో ప్రకటించి, నోటిఫికేషన్లు జారీచేయనున్న పోస్టుల్లో ఉపాధ్యాయ పోస్టులు లేనట్టే తెలుస్తోంది. ఉపాధ్యాయుల రేషనలైజేషన్ పూర్తయిన వెంటనే ఖాళీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు డీఎస్సీ ప్రకటించే పరిస్థితి కన్పించడం లేదు. త్వరలో నోటిఫికేషన్లు జారీచేసే 25 వేల పోస్టుల్లో ఉపాధ్యాయపోస్టుల భర్తీ ఉండకపోవచ్చని ప్రభుత్వం కూడా ఇదే ఆలోచనతో ఉందని తెలుస్తోంది. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇదే విషయాన్ని చెప్పారు. వాస్తవంగా ప్రస్తుతం రాష్ట్రంలో 17 వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. రేషనలైజేషన్ ద్వారా నాలుగైదు వేల పోస్టులు సర్దుబాటు అయ్యే అవకాశం ఉంది. తక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్లలో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమిస్తే మిగిలిన వాటిల్లోనూ చాలా వరకు పోస్టులు తగ్గిపోనున్నాయి. ఈ నేపథ్యంలో అన్నింటిపై స్పష్టత వచ్చాకే డీఎస్సీ విషయాన్ని ఆలోచిద్దామని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇక సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు గత డీఎస్సీల్లో నష్టపోయిన వారికి న్యాయం ఎలా చేయాలన్న విషయం పరిశీలిస్తున్నారు. 1998 నుంచి మొదలుకొని 2012 డీఎస్సీలలో అభ్యర్థులకు సంబంధించి కోర్టులో పలు కేసులు పెండింగ్లో ఉన్నాయి. అన్ని డీఎస్సీల్లో కలిపి దాదాపు 2 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తోంది. ఈ పరిస్థితులు అన్నింటిపై న్యాయశాఖ అభిప్రాయాలను తీసుకొని ముందుకు సాగాలని ప్రభుత్వం యోచిస్తోంది. కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధ్దీకరణ... జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో 4 వేల మందికిపైగా కాంట్రాక్టు లెక్చరర్లు పని చేస్తున్నారు. ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఎంతమంది కాంట్రాక్టు లెక్చరర్లు క్రమబద్ధీరణ పరిధిలోకి వస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 5 ఏళ్ల సర్వీసు ఉండి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ , రోస్టర్ ప్రకారం నియమితులైన వారినే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం క్రమబద్ధీకరణ నిబంధనలను పొందుపరిచినట్లు సమాచారం. దాని ప్రకారం కాంట్రాక్టు లెక్చరర్లలో చాలా మందికి అవకాశం రావడం కష్టమేనని డిగ్రీ కాలేజీ వర్గాలు పేర్కొంటున్నాయి. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో నియమితులైన అనేక మంది లెక్చరర్లు రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం నియమితులు కాలేదని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా తక్కువ మందికే రెగ్యులరైజేషన్ అవకాశం లభిస్తుందని పేర్కొంటున్నాయి. వీరి క్రమబద్ధీకరణ తరువాతే లెక్చరర్ పోస్టుల ఖాళీల భర్తీపై ప్రభుత్వం దృష్టిపెట్టనుంది. -
త్వరలో విద్యుత్శాఖ ఉద్యోగాల భర్తీ: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ శాఖ ఇంజనీర్లు ముఖ్యమంత్రి కే చంద్రశేకర్ రావును శనివారం కలిశారు. కోతలు లేని విద్యుత్ను తెలంగాణ ప్రజలకు అందిస్తున్నందుకు ఉద్యోగులను, కేసీఆర్ అభినందించారు. విద్యుత్ శాఖలో లాభాలు రాగానే ఉద్యోగుల జీతాల పెంపు అంశంపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యుత్ శాఖలో ఉన్న ఖాళీలను త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేస్తామన్నారు. -
రాజకీయ రిజర్వేషన్లతోనే బీసీల అభివృద్ధి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య హైదరాబాద్: రాజకీయ రిజర్వేషన్లు లేకుండా బీసీలు ఎదగలేరని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ‘తెలంగాణలో సామాజిక న్యాయం’ అంశంపై జరిగిన సదస్సు లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ఒక్క కులం 10 శాతానికి మించి లేకపోవడం వల్లే ఐక్యం కాలేకపోతున్నామన్నారు. రాజకీయ రిజర్వేష్లతోనే బీసీలు రాజకీయంగా అభివృద్ధి చెందగలరన్నారు. సీఎం కేసీఆర్కు బీసీ, దళిత, మైనారిటీలపై ప్రేమ లేదని కేవలం వారి ఓటు బ్యాంకు పట్ల మాత్రమే ప్రేమ ఉందని అన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. దేశం లో తెలంగాణలోనే బహుజనులు ఎక్కువగా ఉన్నా రాజ్యాధికారం సాధించకపోవడం బాధకరమన్నారు. సదస్సులో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్, ఎమ్మా ర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తదితరులు పాల్గొన్నారు. నోటిఫికేషన్లు వచ్చే వరకు ఉద్యమం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 1.07 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. అలాగే టీచర్ పోస్టులు 25 వేలు, గ్రూప్-1 ఉద్యోగాలు 1,200, గ్రూప్-2 కొలువు లు 2,500, గ్రూప్-4 36 వేలు, ఎస్ఐ పోస్టులు 1,600, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 14వేలు ఖాళీగా ఉన్నాయని బుధవారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. లక్ష ఉద్యోగాలిస్తామన్న కేసీఆర్ ఇప్పుడు ఏ లెక్కన 25 వేల ఉద్యోగాలు భర్తీచేస్తారని ప్రశ్నించారు. -
కొలువుల జాతర
5,565 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఈ నెలలోనే నోటిఫికేషన్ల జారీకి ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: వేలాది ఉద్యోగ నియామకాలకు రాష్ర్ట ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలీస్, విద్యుత్ , నీటిపారుదల శాఖల పరిధిలో మొత్తం 5,565 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ ఫైలుకు ఆమోదముద్ర వేయడంతో నియామకాల ప్రక్రియ వేగవంతం కానుంది. ఈ నెలలోనే సంబంధిత నోటిఫికేషన్లు జారీ చేసేం దుకు ఆర్థిక శాఖ కూడా క్లియరెన్స్ ఇచ్చింది. ఇటీవల రాష్ట్రంలో అలజడి రేపిన ఉగ్రవాద కార్యకలాపాలు, వరుసగా చోటు చేసుకున్న కాల్పుల ఘటనల నేపథ్యంలో పోలీస్ విభాగంలో ఖాళీల భర్తీని వేగవంతంగాపూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పోలీసు స్టేషన్లలో మౌలిక వసతులకు, వాహనాలకు భారీ మొత్తంలోనే నిధులు వెచ్చించింది. తొలి బడ్జెట్లో హోం శాఖకు అత్యధిక నిధులు కేటాయించింది. ఇన్నోవా, ఫార్చునర్ వంటి ఆధునిక వాహనాలతో పాటు ద్విచక్ర వాహనాలను భారీగా కొనుగోలు చేసింది. దాదాపు 1810 కొత్త వాహనాలను సమకూర్చింది. కానీ వీటిని నడిపేందుకు డ్రైవర్ల కొరత నెలకొంది. దీంతో వాహనాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అత్యవసరంగా ఈ ఖాళీలను భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఒక్కో వాహనాన్ని నడిపేందుకు రెండు షిఫ్టులవారీగా ఇద్దరు డ్రైవర్లు అవసరమవుతారని హోం శాఖ సూచించడంతో 3,620 డ్రైవర్ పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. పోలీసు కానిస్టేబుళ్ల తరహాలోనే శారీరక, రాత పరీక్షల ద్వారా ఈ నియామకాలను చేపట్టనున్నారు. లైట్ వెహికల్ డ్రైవింగ్ లెసైన్స్ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఈ పోస్టులకు అర్హులుగా పరిగణిస్తారు. దీంతో పాటు రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు తలపెట్టిన కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ట్రాన్స్కో, డిస్కంలలో ఖాళీలను భర్తీ చేయడం అత్యవసరమని సర్కారు గుర్తించింది. తెలంగాణ జెన్కో, ట్రాన్స్కోతో పాటు టీఎస్ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పరిధిలో ఖాళీగా ఉన్న ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయాలని రెండు నెలల కిందట జెన్కో అధికారులు కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో తొలి విడతగా జెన్కో, ట్రాన్స్కో, డిస్కంల పరిధిలో 1492 అసిస్టెంట్ ఇంజనీర్లు, 427 సబ్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇరిగేషన్ విభాగంలోనూ 26 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. పోలీస్ కానిస్టేబుళ్లు(డ్రైవర్లు): 3620 ఇరిగేషన్ విభాగం(డీఈఈలు): 26 విద్యుత్ శాఖలో పోస్టులు: 1919 (అసిస్టెంట్ ఇంజనీర్లు: 1492, సబ్ ఇంజనీర్లు: 427) -
విద్యార్థి, నిరుద్యోగుల ‘చలో అసెంబ్లీ’ ఉద్రిక్తం
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ బుధవారం చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ ఉద్రిక్తంగా మారింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ నేతలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ ఎన్సీసీ గేటువైపు వచ్చారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు... ర్యాలీకి అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. కొందరు పోలీసు వలయాన్ని ఛేదించుకుని వెళ్లేందుకు యత్నించగా... వారిని అదుపులోకి తీసుకుని, సమీప పోలీస్స్టేషన్లకు తరలించారు. దీనిని నిరసిస్తూ ఆందోళనకారులు పోలీసులపై రాళ్లురువ్వారు. అయితే పోలీసులు సంయమనం పాటించడంతో అవాంఛనీయ ఘటనలేమీ జరగలేదు. కాగా.. చలో అసెంబ్లీ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు ముందుగానే విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కల్యాణ్, అధ్యక్షుడు మానవతారాయ్ను అదుపులోకి తీసుకుని, బుధవారం సాయంత్రం వదిలేశారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడలను విడనాడి వెంటనే ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని, లేదంటే ఓట్లు వేసి గెలిపించిన విద్యార్థులే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
ఇంటికో ఉద్యోగం ఏమైంది?
- లక్షన్నర ఖాళీలున్నా నోటిఫికేషన్లు ఏవీ? - సీఎం కేసీఆర్కు ఉత్తమ్కుమార్ ప్రశ్న సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఇంటికో ఉద్యోగం ఇస్తామని అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రశ్నించారు. గాంధీభవన్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు న్యాయం జరగాలంటే తెలంగాణ కావాలన్న కేసీఆర్ ..సీఎంగా ఏం చేస్తున్నాడని నిలదీశారు. అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగమిస్తానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ 10 నెలల్లో ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చాడన్నారు. ఈ 10 నెలల్లో ఇంటికో ఉద్యోగం కాదు, ఊరికో ఉద్యోగం కూడా రాలేదన్నారు. ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ వద్ద ఉన్న వివరాల ప్రకారం రాష్ట్రంలో 1,07,722 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వాస్తవానికి లక్షన్నర పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. మండలి ఎన్నికలు ప్రతిష్టాత్మకం: శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాలకు జరుగుతున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్ రెడ్డి సూచించారు. పార్టీ అనుబంధసంఘాల అధ్యక్షులు, పార్టీ ముఖ్యనేతలతో గాంధీభవన్లో ఆయన మంగళవారం సమావేశమయ్యారు. అనుబంధ సంఘాల అధ్యక్షులు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే గెలుపు సాధ్యమన్నారు. వ్యూహాత్మకంగా ఉంటే గెలుస్తాం.. శాసనమండలి ఎన్నికల్లో వ్యూహాత్మకంగా పనిచేస్తే గెలుస్తామని ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మల్లు భట్టివిక్రమార్క అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ ముఖ్యులతో గాంధీభవన్లో వీరు సమావేశమయ్యారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడంతో పట్టభద్రుల్లో అసంతృప్తి నెల కొందన్నారు. ఈ ఎన్నికల్లో పనిచేస్తే.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ ఉపయోగపడుతుందన్నారు. -
పట్టభద్రుల పోరుకు గ్రీన్ సిగ్నల్
ఖమ్మం జెడ్పీసెంటర్: శాసన మండలి(ఎమ్మెల్సీ) పోరుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు గురువారం నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి అక్కడ నోటిఫికేషన్ విడుదల చేశారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థాన ఎమ్మెల్సీ అభ్యర్థి పదవీ కాలం ముగియనుండడంతో ఎన్నికకు ఈ నెల 11వ తేదీన ఎన్నికల సంఘం షెడ్యుల్ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివరాలతో రిటర్నింగ్ అధికారి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి తోడు ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 16వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 19వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత గెలుపొందిన అభ్యర్థిని ప్రకటించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 84 పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. 500 మంది సిబ్బంది ఈ ఎన్నికల నిర్వహణలో పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2011 అక్టోబర్ 31వ తేదీ వరకు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే ఓటు వేసేందుకు అర్హులుగా ఉన్నారు. ఈ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారితో కలిపి నూతన ఓటర్ల జాబితను ఈ నెల 26వ తేదీన ప్రకటించనున్నారు. ఈ జాబితాలో పేరు ఉన్న పట్టభద్రులు మాత్రమే ఓటు వేసేందుకు అర్హులు. పార్టీల ఎత్తులు.. పై ఎత్తులు.... పట్టభద్రుల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కింది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తున్నారుు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధ/ంచడంతో ప్రతిపక్షాలు ఈ ఎన్నికలను సవాల్గా స్వీకరించి అభ్యర్థులను బరిలో దింపేందుకు సిద్ధమవుతున్నారుు. టీఆర్ఎస్ మాత్రం గెలుపు ధీమాతో అడుగులు వేస్తోంది. అభ్యర్థుల ఎంపికలో తలమునకలు ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికలో ఎత్తులు పై ఎత్తులు వేస్తూ దోబూచులాడుతున్నారుు. బీజేపీ అభ్యర్థిగా వరంగల్కు చెందిన ఎర్రబెల్లి రామ్మోహన్రావును ఆ పార్టీ ప్రకటించింది. దీంతో అతను ఇప్పటికే మూడు జిల్లాలో ఒక విడత ప్రచారం పూర్తి చేశారు. ఇక టీఆర్ఎస్ విషయంలో ఇద్దరి మధ్య పోటీ నడుస్తున్నట్లు తెలుస్తోంది. మరోపక్క పార్టీ అధిష్టానం మాత్రం నల్లగొండకు చెందిన నరేందర్రెడ్డిని నిర్ణయించారనే ప్రచారం సాగుతోంది. ఇక కాంగ్రెస్లో అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పలువురు ఆశావాహులు పోటీలో నిలిచేందుకు భారీగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన కొందరు అధికార పార్టీ తరుఫున పోటీ చేయూలని ఆసక్తి చూపుతున్నప్పటికీ అభ్యర్థి పేరు ఖరారైనట్లు ప్రచారం జరగడంతో ఆశావాహులు వెనుక్కు తగ్గినట్లు సమాచారం. ఇక వామపక్షాలు అభ్యర్థిని రంగంలోకి దింపుతాయూ.. లేక.. ఏ పార్టీకైనా మద్దతు ఇస్తాయూ..? అనే విషయం కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ ఇలా .... ఫ్రిబవరి 19న ఎన్నికల నోటిఫికేషన్ 26వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ 27వ తేదీన నామినేషన్ల స్క్రూటినీ మార్చి 2వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ మార్చి 16వతేదీన ఉదయం 8గంటల నుం చి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు మార్చి 19వ తేదీన ఉదయం 8 గంటల నుంచి కౌటింగ్ మార్చి 23తో ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. అభ్యర్థులకు సూచనలు.... పట్టభద్రుల స్థానం నుంచి బరిలో నిలిచే అభ్యర్థులు కొన్ని సూచనలు పాటించాలని ఎన్నికల అధికారి పేర్కొన్నారు. బరిలో నిలిచే అభ్యర్థిగాని, అతడిని ప్రతిపాదించే వారు కాని ఈ నెల 26 ఉదయం 11 గంటలనుంచి సాయంత్రం 3 గంటల మధ్యలో నల్లగొండ జిల్లా రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి(జిల్లా రెవెన్యూ అధికారి)కి నామినేషన్ పత్రాలు అందజేయూలని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ పత్రాలు పొందవచ్చని పేర్కొన్నారు. నామినేషన్ పత్రాలను ఈ నెల 27వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు నల్లగొండ కలెక్టరేట్లో పరిశీలించనున్నట్లు తెలిపారు. అభ్యర్థిత్వం ఉపసంహరించుకొనే నోటిసును అభ్యర్థిచే, ప్రతిపాదించిన వ్యక్తి, ఏ జెంటు చేత రాత పూర్వకంగా ఎన్నికల అ ధికారి, సహాయ రిటర్నింగ్ అధికారికి మా ర్చి 2వ తేదీ సాయం6తం మూడు గంట లలోగా అందజేయూలని పేర్కొన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో 25వేల వరకు ఓట్లు ఖమ్మం అర్బన్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేం దుకు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 25 వేల మంది వరకు ఓటు హక్కు కలిగి ఉన్నట్లు ఖమ్మం అర్బన్ రెవెన్యూ అధికారు లు తెలిపారు. బుధవారం వరకు 24, 129 ఓట్లు ఉండగా గురువారం మరికొంత మంది నమోదు చేసుకున్నారని, వాటన్నిటితో కలి పితే సుమారు 25వేల వరకు ఉండవచ్చని అధికారి కరుణాకర్ తెలిపారు. నోటిఫికేషన్ జారీ చేయడంతో మిగిలిన వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. నగరంలో అనేక మంది ఉద్యోగులు, పట్ట భద్రుల నివాసం ఉండటంతో వారంతా ఖమ్మం నియోజకవర్గంలో నమోదు చేసుకోవడంతో అత్యధికంగా ఖమ్మంలోనే ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
నిరుద్యోగుల సంగతేంటి?: పొన్నం
సాక్షి, న్యూఢిల్లీ: ‘నాయకులు నామినేటెడ్ పోస్టులతో బుగ్గకార్లల్లో తిరిగితే సరిపోతుందా? ఉద్యోగాల భర్తీపై కోటి ఆశలు పెట్టుకున్న నిరుద్యోగుల మాటేంటి?’ అంటూ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చినందుకు ఉద్యోగులు సంతోషంగానే ఉన్నారు. అయితే తెలంగాణ వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయని విద్యార్థి, యువజనులు కోటి ఆశలు పెట్టుకున్నారు. నిరుద్యోగులు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కోచింగులకు వెళుతున్నారు. నోటిఫికేషన్ల విడుదలకు సిద్ధంగా ఉన్నామని టీపీఎస్సీ కూడా ప్రభుత్వానికి తెలిపింది. కానీ ప్రభుత్వం మాత్రం సిద్ధంగా లేదు. గ్రూప్-2 పోస్టులు గ్రూప్-1లోకి అంటూ నోటిఫికేషన్ల జారీని జాప్యం చేసేందుకు ప్రయత్నిస్తోంది.’ అని విమర్శించారు. -
ఈ నెలలోనే ‘సింగరేణి’ నోటిఫికేషన్
హైదరాబాద్: సింగరేణి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి కల ఫలించనుంది. మొత్తం 5,500 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రకటించింది. సింగరేణిలో ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులతో పాటు ఇతరులకు అవకాశం కల్పించేలా రిక్రూట్మెంట్ చేపట్టేందుకు కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ నెల నుంచే రిక్రూట్మెంట్ ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేశారు. కొత్త నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 5,500 పోస్టులు భర్తీ చేస్తారు. అందులో 2,164 పోస్టులకుగాను ఫిబ్రవరి 10న నోటిఫికేషన్ జారీ చేస్తారు. వీటిలో 1,127 పోస్టులు మైనింగ్, సివిల్ డిగ్రీ, ఎలక్ట్రికల్, మెకానికల్ డిప్లొమా హోల్డర్లకు, 771 పోస్టులు ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, మైన్ సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్లు, 266 పోస్టులు పారా మెడికల్, ఇతర టెక్నికల్ సిబ్బందికి సంబంధించినవి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పరీక్షలు నిర్వహించి.. జూన్ వరకు ప్రక్రియను పూర్తి చేస్తారు. పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ జరగాలని.. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా నియామకాలు చేపట్టాలని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ శ్రీధర్ సూచించారు. డిపెండెంట్లకు ఉద్యోగాలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు పదేళ్లుగా నిరీక్షిస్తున్న డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. 2004 వరకు... మొత్తం 2,744 మంది డిపెండెంట్ ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. అందులో 753 మందికి ఇప్పటికే ఉద్యోగాలు కల్పించారు. మిగిలిన 1,991 మంది డిపెండెంట్లకు ఈ ఏడాది ఆగస్టు నాటికి వివిధ పోస్టుల్లో భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. వీటికి తోడు ఇప్పటికే కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు.. అర్హతలను బట్టి పైస్థాయి పోస్టుల్లో అవకాశం కల్పించేందుకు ఇంటర్నల్ మోడ్లో ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేయనుంది. -
కొత్త ఏడాదిలో కొత్త కొలువులు
త్వరలో నోటిఫికేషన్లు జారీ టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి నియామకాల్లో ప్రతిభకే పట్టం కడతాం పారదర్శకతకు పెద్దపీట రాజకీయ జోక్యానికి తావుండదు కమిషన్ చైర్మన్గా ఘంటా బాధ్యతల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు ఇస్తామని, కొత్త ఏడాది కొత్త ఉద్యోగాలతో నిరుద్యోగ సమస్య కొంత పరిష్కారం అవుతుందని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. పారదర్శకంగా నియామకాలు చేపట్టి ప్రతిభా వంతులకే ఉద్యోగాలిస్తామని స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమితులైన చక్రపాణితో గురువారం సచివాలయంలో సీఎస్ రాజీవ్శర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. కమిషన్ సభ్యులుగా నియమితులైన సి.విఠల్, బానోతు చంద్రావతితో చక్రపాణి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారిని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమానికి కమిషన్ మరో సభ్యుడు మతీదుద్దీన్ హాజరుకాలేదు. ఈ సందర్భంగా చక్రపాణి విలేకరులతో మాట్లాడారు. అనంతరం గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి, నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. కమిషన్ ఉద్యోగులు నిర్వహించిన స్వాగత కార్యక్రమంలో చక్రపాణి మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.07 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడతాం. నేటి నుంచే పని ప్రారంభిస్తాం. నియామకాల విధానంపై రెండు మూడు రోజుల్లో చర్చిస్తాం. నాలుగైదు నెలల్లో నియామకాల ప్రక్రియ ప్రారంభమవుతుంది’’ అని చెప్పారు. వివిధ శాఖల్లో విభజన పూర్తి కాలేదని, ఆ ప్రక్రియ పూర్తయితే మరిన్ని ఉద్యో గ ఖాళీలు వస్తాయన్నారు. ఖాళీగా ఉన్న అన్ని పోస్టుల భర్తీకి ప్రయత్నిస్తామన్నారు. నియామకాల్లో పైరవీలకు అవకాశం ఇవ్వబోమని, ఎవరి మాటా వినకుండా ఉంటాను కాబట్టే సీఎం తనకు ఈ బాధ్యతలు అప్పగించారన్నారు. ‘‘సీఎం చెప్పినా వినకుండా నిజాయితీకి పట్టం కడతా. కమిషన్ పరంగా గతంలో జరిగిన పొరపాట్లు తెలంగాణ కమిషన్లో జరగవు. ఇంటర్వ్యూలకు మినహా నిరుద్యోగులు కమిషన్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపడతాం. దరఖాస్తులు, హాల్టికెట్లు అన్నీ ఆన్లైన్ చేస్తాం. ఒత్తిళ్లకు లొంగకుండా, అవినీతికి తావు లేకుండా ఆదర్శ వ్యవస్థగా కమిషన్ను నిలబెడతాం’’ అని చెప్పారు. కమిషన్ సభ్యుడు విఠల్ మాట్లాడుతూ... పైరవీలు చేస్తే ఉద్యోగాలు వస్తాయన్నది గతమన్నారు. ఇకపై అలా ఉండదన్నారు. గతంలో నియామకాల్లో తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేశారని, ఇంటర్వ్యూల్లో ఏపీవారికి 80 మార్కుల వరకు వేస్తే తెలంగాణ వారికి 15 నుంచి 20 మార్కులే వేసి అన్యాయం చేశారన్నారు. తండ్రి పేర్లతో తెలంగాణ వారిగా గుర్తించి మరీ తప్పిదాలకు పాల్పడ్డారన్నారు. సభ్యురాలు బానోతు చంద్రావతి మాట్లాడుతూ అభ్యర్థుల ఆశలకు అనుగుణంగా నోటిఫికేషన్లు జారీ అవుతాయని చెప్పారు. నిరుద్యోగులు ప్రిపరేషన్లో ఉండాలని సూచించారు. తెలంగాణ సర్వీసు కమిషన్ను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ విద్యార్థుల ఆశలకు అనుణంగా సీఎం ఈ కమిషన్ను ఏర్పాటు చేశారన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగుల్లో ఆత్మవిశ్వాసం కల్పించాల్సిన బాధ్యత కమిషన్పై ఉందని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. గతంలో జరిగిన తప్పిదాలు జరక్కుండా కమిషన్ చూడా లని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రూపు-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్గౌడ్ తదితరులు మాట్లాడారు. త్వరలోనే గ్రూపు-1, గ్రూపు-2 నోటిఫికేషన్లు ఇవ్వాలన్నారు. టీఎస్పీఎస్సీకి చాంబర్ సమస్య తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కు వసతి సమస్య ఎదురైంది. రాష్ట్ర విభజన తరువాత కూడా ఏపీపీఎస్సీలోని ఉద్యోగులను, భవనాలను విభజించకపోవడంతో తెలంగాణ చైర్మన్కు, సభ్యులకు గదుల కొరత ఏర్పడింది. ఆగస్టు 8న టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేస్తూ టీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసినా ఏపీపీఎస్సీలోని ఉద్యోగులను, కార్యాలయ భవనాన్ని విభజించలేదు. మంగళవారం టీఎస్పీఎస్సీ కార్యదర్శిని, బుధవారం కమిషన్ చైర్మన్తోపాటు సభ్యులను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఏపీపీఎస్సీలో చైర్మన్, కార్యదర్శి, కొందరు సభ్యుల పోస్టులు ఖాళీగా ఉన్నందున వారి చాంబర్లను తీసుకోవాలని, బాధ్యతల స్వీకరణ ఏర్పాట్లు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ అధికారులకు స్పష్టం చేసింది. అయితే వారంతా గురువారం కార్యాలయానికి వెళ్లేసరికి అక్కడ విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఇన్చార్జి చైర్మన్గా కమిషన్ సభ్యుడు శివనారాయణ, ఇన్చార్జి కార్యదర్శిగా కమిషన్ అదనపు కార్యదర్శి రమాదేవిలు ఇన్నాళ్లూ తమ చాంబర్లలోనే (సభ్యునిగా శివన్నారాయణకు కేటాయించిన చాంబర్లో, అదనపు కార్యదర్శిగా రమాదేవికి కేటాయించిన చాంబర్లో) ఉన్నారు. కాని గురువారం టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమితులైన ఘంటా చక్రపాణి, కార్యదర్శి సుందర్ అబ్నార్ కమిషన్ కార్యాలయానికి వెళ్లగా ైచైర్మన్ చాంబర్లో శివనారాయణ, కార్యదర్శి చాంబర్లో రమాదేవి ఆసీనులయ్యారు. అయితే ఘంటా చక్రపాణి వెళ్లగానే ఏపీపీఎస్సీ ఇన్ చార్జి చైర్మన్ ఆ చాంబర్ నుంచి వెళ్లిపోయారు. కాని ఏపీపీఎస్సీ ఇన్చార్జి కార్యదర్శి మాత్రం ఆ చాంబర్ను ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఇదివరకు మీ చాంబర్లోనే ఉన్నారు కదా, మేము వచ్చేసరికి ఇందులోకి వచ్చారేంటని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అడిగినా కుదరదని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తేనే ఇస్తామన్నారు. పక్క గదిలో కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ ఉన్నందున ఈ చాంబర్ను ఇవ్వబోమన్నారు. కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ ఉన్నగదికి తాళం వేసి సీల్ వేసుకొమ్మని టీఎస్పీఎస్సీ కార్యదర్శి సూచించినా వినిపించుకోలేదు. ఎట్టకేలకు గురువారం సాయంత్రం కార్యదర్శి చాంబర్ను టీఎస్పీఎస్సీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
టికెట్ కోసం కౌన్సిలర్ల చక్కర్లు
న్యూఢిల్లీ: ఏ నిమిషంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండడంతో రాజధాని నగరంలో రాజకీయాలు జోరందుకున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు పార్టీ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నట్లు ఊహాగానాలు సాగుతుండడంతో ఆశావహుల సంఖ్య ఆ పార్టీలో ఎక్కువగా ఉంది. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేటర్లుగా ఉన్న చాలా మంది శాసనసభ్యులుగా పదోన్నతి పొందాలని ఆశిస్తున్నారు. దీంతో కొన్ని రోజులుగా పండిట్ పంత్ మార్గ్లోని బీజేపీ కార్యాలయం ఆ పార్టీ కార్పొరేటర్లతో సందడిగా మారింది. బీజేపీ ఢిల్లీ విభాగం ప్రస్తుత అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ కూడా స్వయంగా కౌన్సిలర్ కావడంతో, సహచర కార్పొరేటర్లు చాలా మంది తమకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాలని ఆయన్ని కోరుతున్నట్లు తెలిసింది. అసెంబ్లీ టికెట్ కోరుతున్న కార్పొరేటర్లలో ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ యోగేందర్ చందోలియా మొదటి స్థానంలో ఉన్నారు. పార్టీ హైకమాండ్ తనకు టికెట్ ఇస్తే తప్పకుండా బరిలోకి దిగుతానని ఆయన చెప్పారు. తనకు కరోల్బాగ్ స్థానం నుంచి టికెట్ లభించవచ్చని చందోలియా ఆశాభావం వ్యక్తం చేశారు. రోహిణి జోన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న రేఖా గుప్తా కూడా తనకు షాలీమార్ బాగ్ నుంచి పోటీ చేయాల నుందని మనసులో మాట చెప్పారు. అయితే తాము టికెట్ కోసం బీజేపీ ఆఫీసు చుట్టూ చక్కర్లు కొడుతున్నామన్నది మాత్రం నిజం కాదని చెప్పుకున్నారు. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఖుషీ రామ్ చునర్, విద్యా కమిటీ చైర్మన్ ఆశిష్ సూద్లకు అసెంబ్లీ బెర్తు ఖరారైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఖుషీరామ్ అంబేద్కర్ నగర్ నుంచి, సూద్ జనక్పురీ నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగుతారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. మరికొంత మంది కార్పొరేటర్లు, తమను సరైన అభ్యర్థులుగా పార్టీ గుర్తించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాను స్టాండింగ్ కమిటీ, సభా సమావేశాల్లో అనేక అంశాలను లేవనెత్తుతున్నానని, అయినా పార్టీ హైకమాండ్ తనను గుర్తించడం లేదని ఓ కౌన్సిల్ ఆవేదన వ్యక్తం చేశారు. -
విజయాన్ని నిర్ణయించే కీలక విభాగం..
త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడే అవకాశాలు ఉన్నాయి..ఈ రెండు రకాల పోస్టుల భర్తీ కోసం నిర్వహించే రాత పరీక్షలో జనరల్ స్టడీస్విభాగం చాలా కీలకమైంది.. అంతేకాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టేప్రతి నియామక ప్రక్రియలో తప్పనిసరిగా జనరల్ స్టడీస్ విభాగం ఉంటుంది..సబ్జెక్ట్ పేపర్లలో అందరూ అభ్యర్థులు మెరుగైన స్కోర్ సాధించవచ్చు..కానీ అన్ని సబ్జెక్ట్ల సమహారంగా ఉండే ఈ జనరల్ స్టడీస్లో పొందిన మార్కులేవిజయాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషియస్తాయని చెప్పొచ్చు..ఈ నేపథ్యంలో జనరల్ స్టడీస్లో కీలకమైన మెంటల్ ఎబిలిటీ విభాగానికి సంబంధించి ఏవిధంగా సన్నద్ధం కావాలి, సిలబస్, తదితర అంశాలపై విశ్లేషణ.. మెంటల్ ఎబిలిటీ జనరల్ స్టడీస్లో మిగతా సబ్జెక్ట్లో పోల్చితే మెంటల్ ఎబిలిటీ విభాగం భిన్నమైంది. ఎందుకంటే జ్ఞాపకశక్తి కంటే తార్కిక వివేచన ద్వారా మాత్రమే ఇందులోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం సాధ్యమవుతుంది. ప్రిపరేషన్ పరంగా సులువుగా ఉండడంతో మిగతా సబ్జెక్ట్లలో దాదాపు అభ్యర్థులందరూ అందులో మెరుగైన స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి. అడిగే ప్రశ్నలు తక్కువగా ఉన్నప్పటికీ.. మెంటల్ ఎబిలిటీ విభాగం కీలకంగా మారుతోంది. కాబట్టి ఈ విభాగంలో సాధించిన మార్కులే విజయ ప్రస్థానాన్ని నిర్ణయించడంలో ముఖ్య భూమికను పోషిస్తాయని చెప్పొచ్చు. దాదాపు 20 జనరల్ స్టడీస్లో భాగంగా మెంటల్ ఎబిలిటీ నుంచి దాదాపు 20 ప్రశ్నలు వస్తాయి. ఇందులో 17-18 ప్రశ్నలు వెర్బల్ రీజనింగ్ నుంచి ఇస్తే.. మిగతా 2-3 ప్రశ్నలు అర్థమెటిక్ నుంచి అడుగుతున్నారు. నాన్ వెర్బల్ రీజనింగ్కు అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కొన్ని సందర్భాల్లో గ్రూప్-2, జేఎల్ వంటి పరీక్షల్లో ఒకటి, రెండు ప్రశ్నలను ఈ విభాగం నుంచి అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులందరూ వెర్బల్ రీజనింగ్కు ప్రాధాన్యతనిస్తూ ప్రిపరేషన్ సాగించడం ప్రయోజనకరం. అంతేకాకుండా వీలైనన్నీ అర్థమెటిక్ ప్రశ్నలను సాధన చేయడం ఉపయోగకరం. కొత్తగా వెర్బల్ రీజనింగ్ విషయానికొస్తే.. ఇది అకాడమీ పుస్తకాలలో ఎక్కడా కనిపించదు. కొత్తగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కొంత మంది అభ్యర్థులు దీన్ని కొత్త అంశంగా భావిస్తారు. ఇది గణితంలో ఒక భాగం కానప్పటికీ.. గణితంతో కొంత సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇందులో పట్టు సాధించాల్సిన అంశాలు.. సిరీస్, అనాలజీ (పోలిక పరీక్ష), క్లాసిఫికేషన్ (వర్గీకరణ పరీక్ష), కోడింగ్-డీకోడింగ్, రక్త సంబంధాలు, దిక్కులు, సీటింగ్ అరేంజ్మెంట్స్, తార్కిక చిత్రాలు, పజిల్స్, మిస్సింగ్ నెంబర్స్, కేలండర్ లెక్కలు, మిస్సింగ్ లెటర్స్, గడియారం లెక్కలు. తెలిసిన విభాగం అర్థమెటిక్.. అభ్యర్థులందరికీ పరిచయం ఉండే విభాగం. ఇందులోని అంశాలన్నీ 5-10వ తరగతి వరకు గణిత పుస్తకాల్లో కనిపిస్తాయి. ఈ విభాగం ప్రిపరేషన్ కోసం పట్టు సాధించాల్సిన అంశాలు.. వివిధ రకాల సంఖ్యలు, కాలం- దూరం, కాలం-పని, సరాసరి, నిష్పత్తి- అనుపాతం, శాతాలు, క.సా.గు.-గ.సా.భా., లాభం-నష్టం, భాగస్వామ్యం, సాధారణ వడ్డీ, చక్రవడ్డీ, క్షేత్రమితి (వైశాల్యాలు, చుట్టుకొలతలు, ఘనపరిమాణాలు) తదితరాలు. మూలాలు తెలుసుకోవాలి ‘మెంటల్ ఎబిలిటీ అంశాలు సైన్స్ వారికి అనుకూలం’ అనే అభిప్రాయం బలంగా ఉంటుంది. కానీ గత ప్రశ్నపత్రాల సరళిని పరిశీలిస్తే.. ‘ఫలానా నేపథ్యం ఉన్న వారికే అనుకూలం’ అనే తరహా ప్రశ్నలు కనిపించట్లేదు. కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో తమ నేపథ్యానికి సంబంధించని అంశాలు చదివేటప్పుడు.. మూలాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఒక అంశానికి సంబంధించి నేపథ్యం నుంచి ప్రిపరేషన్ సాగిస్తూ సదరు అంశంపై విస్తృత అవగాహన పెంచుకోవాలి. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు 6 నుంచి 10వ తరగతుల మ్యాథ్స్ పుస్తకాల్లోని అంశాల్లో అవసరమైన కాన్సెప్ట్స్ను సాధన చేయూలి. ఆ తర్వాత గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రధానంగా... క.సా.గు., భిన్నాలు, సమీకరణాలు, సాధన, సంఖ్యలు, బీజీయ గణితం, వ్యాపార గణితం అంశాలపై దృష్టిసారించాలి. నిరంతం ప్రాక్టీస్కు ప్రాధాన్యం ఇవ్వాలి. మ్యాథ్స్ స్టెప్స్ కరెక్టుగా సాధన చేయూలి. అంతేకాకుండా వేగంగా, కచ్చితత్వంతో సమాధానాన్ని గుర్తించాలి. ఇందుకు ఉపకరించే ఏకైక మార్గం ప్రాక్టీస్. తద్వారా సమస్యా సాధనలో వేగం, కచ్చితత్వం పెరుగుతుంది. సూచనలు: సిలబస్కు సంబంధించి సరైన మెటీరియల్ లేదా పుస్తకాలను గుర్తించడం. సంబంధిత సబ్జెక్టులో ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది? అని గత ప్రశ్నపత్రాల ద్వారా తెలుసుకోవడం. దానికి అనుగుణంగా సంబంధిత అంశంపై సినాప్సిస్ రూపొందించుకోవడం. ఇలా చేస్తే పరీక్షలో ప్రశ్న ఏ మూల నుంచి అడిగినా సమాధానం గుర్తించవచ్చు. చదివేటప్పుడు కాన్సెప్ట్ ఆధారిత ప్రిపరేషన్ సాగించడం అవసరం. దీనివల్ల సంబంధిత అంశంపై అవగాహన లభిస్తుంది. పరీక్ష హాల్లో సమాధానం స్ఫురణకు రాకున్నా.. ఎలిమినేషన్ టెక్నిక్ వినియోగించేందుకు మార్గం ఏర్పడుతుంది. రిఫరెన్స్ బుక్స్: క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - ఆర్.ఎస్. అగర్వాల్ క్వికర్ మ్యాథ్స్ - ఎం.థైరా మెంటల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-ఎడ్గర్ థోర్ప్ 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న గణిత పుస్తకాలు పట్టు సాధించాల్సినవి వెర్బల్ రీజనింగ్, అర్థమెటిక్ ప్రశ్నలను త్వరగా, తప్పులు లేకుండా సాధించాలంటే నేర్చుకోవాల్సిన అంశాలు.. {పాథమిక సంఖ్యా వాదం, వివిధ రకాల సంఖ్యలు, భాజనీయత సూత్రాలు 35 వరకు వర్గాలు 15 వరకు ఘనాలు 100లోపు ప్రధాన సంఖ్యలు 20 వరకు ఎక్కాలు కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం వంటి ప్రక్రియలను వేగంగా చేసే నేర్పు సాధించాలి. ఇందుకోసం వేదగణిత చిట్కాలను సాధన చేయాలి. అర్థమెటిక్లోని ప్రతి అంశం సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ సూత్రాలను క్షుణ్నంగా నేర్చుకోవాలి. ఆంగ్ల అక్షరాలను అ నుంచి ో వరకు, ో నుంచి అ వరకు వేగంగా చదవగలగాలి.అ నుంచి ో వరకు అక్షరాల స్థాన విలువలు అంటే అ-1, ఆ-2, ..-26 పక్కాగా తెలిసి ఉండాలి అ నుంచి ో వరకు అక్షరాల తిరోగమన స్థాన విలువలు అంటే అ-26, ఆ-25, ....ో-1 క్షుణ్నంగా నేర్చుకోవాలి. అ నుంచి ో వరకు అక్షరాల తిరోగమన స్థాన అక్షరాలు అంటే అ-ో; ఆ-్గ, ఇ-గీ... ో-అ పై పట్టు సాధించాలి. ఆంగ్లంలో అచ్చులు అ, ఉ, ఐ, ై, ్ఖ తెలిసి ఉండాలి వేద గణిత చిట్కాలను ప్రాక్టీస్ చేయాలి. గతంలో వచ్చిన ప్రశ్నలు 1. 44, 484, 529, 566, 625.. వీటిలో ఒక సంఖ్య భిన్నమైంది. ఆ సంఖ్య? 1) 484 2) 529 3) 625 4) 566 సమాధానం: 4 వివరణ: ఇక్కడ ఇచ్చిన సంఖ్యలలో 566 తప్ప మిగతావన్నీ కచ్చితమైన వర్గాలు. 2. ఒక వేళ ఈఖఐగఉఖ = 12, ్కఉఈఉఖీఖఐఊ = 20, అఇఇఐఈఉూఖీ = 16 అయితే ఇఅఖ =? 1) 3 2) 8 3) 10 4) 6 సమాధానం: 4 వివరణ: ఈఖఐగఉఖ లోని అక్షరాల సంఖ్య 6. దీన్ని రెట్టింపు చేసి 12 రాసారు. అక్షరాల సంఖ్య 10. దీన్ని రెట్టింపు చేస్తే 20. అక్షరాల సంఖ్య 8. దీన్ని రెట్టింపు చేసి 16 రాసారు. అదేవిధంగా ఇఅఖ లోని అక్షరాల సంఖ్య 3. దీన్ని రెట్టింపు చేస్తే 6. కాబట్టి సమాధానం: 6 3. కింది వాటిలో భిన్నమైంది? 1) ఈఎఒక 2) ఖఖీగిో 3) ఊఏఓూ 4) గీఅఈఎ సమాధానం: 3 వివరణ: ఇక్కడ ఇచ్చిన అక్షరాల సమూహంలో.. అక్షరాల మధ్య వ్యత్యాసం 3. కానీ ఊఏఓూలో మొదటి రెండు అక్షరాల మధ్య తేడా 3 లేదు. 4. రాహుల్ ఉత్తరం వైపు 4 కి.మీ. ప్రయాణించి, కుడి వైపు మరో 8 కి.మీ. ప్రయాణించాడు. తర్వాత కుడి వైపు మరో 20 కి.మీ. ప్రయాణించి చివరగా కుడివైపు 20 కి.మీ. ప్రయాణించాడు. ఇప్పుడతను తన ప్రారంభ స్థానం నుంచి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడు? 1) నైరుతి 20 కి.మీ. 2) ఈశాన్యం 20 కి.మీ. 3) నైరుతి 16 కి.మీ. 4) ఆగ్నేయం 20 కి.మీ. సమాధానం: 1 వివరణ: ప్రారంభం స్థానం అ, తుది స్థానం ఊ కావాల్సిన దూరం అఊ పటం ఆధారంగా అఉ = 20 - 4 = 16 కి.మీ. ఉఊ = 20 - 8 = 12 కి.మీ. 5. సునీల్ ఎదురుగా వ స్తున్న అమ్మాయిని పరిచయం చేస్తూ ఆ అమ్మాయి తల్లి, మా నాన్న ఏకైక కుమారుడి భార్య అని చెప్పాడు. అయితే సునీల్కు ఆ అమ్మాయి ఏమవుతుంది? 1) తల్లి 2) భార్య 3) కూతురు 4) సోదరి సమాధానం: 3 వివరణ: సునీల్ తండ్రి ఏకైక కుమారుడు అంటే అతనే. సునీల్ భార్య.. తాను పరిచయం చేస్తున్న అమ్మాయి తల్లి అంటే ఆ అమ్మాయి సునీల్కు కూతురు అవుతుంది. 6. 2, 3, 8, 31, 154, 923..... 1) 5224 2) 6460 3) 6461 4) 7236 సమాధానం: 2 వివరణ: 2ణ2ృ1 = 3; 3ణ3ృ1 = 8; 8ణ4ృ1 = 31; 31ణ5ృ1 = 154; 154ణ6ృ1 = 923; అదేవిధంగా 923ణ7ృ1 = 6461 7. కింది వాటిలో ఏ సంవత్సరం 2005ను పోలి ఉంటుంది? 1) 2009 2) 2011 3) 2012 4) 2015 సమాధానం: 2 వివరణ: లీప్ సంవత్సరం తర్వాత వచ్చే ప్రతి సంవత్సరం.. ఆ సంవత్సరం నుంచి 6 సంవత్సరాల తర్వాత వచ్చే సంవత్సరాన్ని పోలి ఉంటుంది. \u3149?ట్చఛఙ 2005 సంవత్సరం 2005+6=2011 సంవత్సరాన్ని పోలి ఉంటుంది. 8. ఒక నిర్దిష్ట సంకేత భాషలో కఐఖీఅఓఉను 4356127 గా రాస్తే ఖీఉఅకను అదే భాషలో ఏ విధంగా పేర్కొనవచ్చు? 1) 13457 2) 75614 3) 65741 4) 56714 సమాధానం: 4 M I S T A K E 4 3 5 6 1 2 7 STEAMలోని ఐదు అక్షరాలు కఐఖీఅఓఉలో ఉన్నాయి. కాబట్టి ఆ అక్షరాల కోడ్లను రాస్తే సమాధానం వస్తుంది. T E A M 5 6 7 1 4 \ STEAM కోడ్ 56714 9. {పస్తుతం తండ్రి వయసు కొడుకు వయసుకు 4 రెట్లు. నాలుగు సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకు 3 రెట్లు. అయితే ప్రస్తుతం తండ్రి, కొడుకుల వయసులు ఎంత? 1) 24 సంవత్సరాలు, 6 సంవత్సరాలు 2) 28 సంవత్సరాలు, 7 సంవత్సరాలు 3) 32 సంవత్సరాలు, 8 సంవత్సరాలు 4) 36 సంవత్సరాలు, 10 సంవత్సరాలు సమాధానం: 3 వివరణ:మొదటి మూడు ఆప్షన్లలో తండ్రి వయసు కొడుకు వయసుకు 4 రెట్లు ఉంది. నాలుగు సంవత్సరాల తర్వాత వారి వయసులు పరిశీలిస్తే..ఆప్షన్3లో ఉన్న వయసులు మాత్రమే తండ్రి వయసు, కొడుకు వయసుకు 3 రెట్లు. సమాధానం: 3 -
అనుమతి లేకున్నా స్పాట్ అడ్మిషన్లు!
కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటాలోని ఖాళీల భర్తీ ప్రకటనలు ఇచ్చి మరీ సీట్లు నింపుకుంటున్న ఇంజనీరింగ్ కళాశాలలు హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటాలో మిగిలిపోయిన సీట్లను యాజమాన్యాలు అమ్మకానికి పెట్టాయి. స్పాట్ అడ్మిషన్ల పేరుతో సీట్లను భర్తీ చేస్తున్నాయి. నోటిఫికేషన్లు, ప్రకటనలు ఇచ్చి మరీ ఈ సీట్లను భర్తీ చేస్తుండడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి నుంచి ఎలాంటి అనుమతి లేకపోయినా స్పాట్ అడ్మిషన్ల పేరుతో మిగులు సీట్ల భర్తీకి యాజమాన్యాలు చర్యలు చేపట్టాయి. అయితే ప్రముఖ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో సీట్లు మిగలకపోయినా, మేనేజ్మెంట్ కోటాలోని సీట్లను చాలా వరకు అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక మధ్యతరహా కాలేజీలు మాత్రం ఉన్నత విద్యా మండలి ఆమోదం లేకపోయినా ప్రకటనలు జారీచేసి మరీ సీట్లను భర్తీ చేస్తుండడంతో భవిష్యత్తులో వాటికి ర్యాటిఫికేషన్ ఎలా ఇస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆగస్టు 31తోనే ఆఖరు.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆగస్టు 31తోనే ప్రవేశాల ప్రక్రియ ముగిసిపోయింది. అప్పటివరకు కన్వీనర్ కోటాలోనే ఆంధ్రప్రదేశ్లో 57వేల సీట్లు, తెలంగాణలో 15వేల సీట్లు మిగిలిపోయాయి. రెండు రాష్ట్రాల్లో మేనే జ్మెంట్ కోటాలో మరో 80 సీట్లు ఉండిపోయాయి. అయితే ఆగస్టు 31 తరువాత ఎలాంటి ప్రవేశాలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీని ఉన్నత విద్యామండలి నిలిపివేసింది. కౌన్సిల్ ఏర్పాటు చేసిన పోర్టల్ ద్వారా మేనే జ్మెంట్ కోటా సీట్లకోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు 30 వేల మందికి యాజమాన్యాలు సీట్లను కేటాయించేలా ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మిన్నకుండిపోయింది. అయితే యాజమాన్యాలు మాత్రం ప్రకటనలు జారీచేసి మరీ ఆ సీట్ల భర్తీకి గతంలోనే చర్యలు చేపట్టాయి. తాజాగా మేనేజ్మెంట్ కోట్లా, కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ పేరుతో ప్రకటనలు జారీ చేసి భర్తీ చేసుకుంటున్నాయి. అయితే ఆగస్టు 31 తర్వాత చేపట్టిన, చేపడుతున్న ఈ ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి ర్యాటిఫికేషన్ ఎలా ఇస్తుందన్నదీ ప్రశ్నార్థంగా మారింది.