Department of Health
-
మయోనైజ్పై నిషేధం
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న మయోనైజ్ వినియోగంపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2025 అక్టోబర్ చివరివరకూ ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కర్ణన్ ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కొన్ని నెలలుగా జరిగిన అనేక ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలకు పచ్చిగుడ్లతో చేసిన మయోనైజ్ కారణమని గుర్తించామని పేర్కొన్నారు. మయోనైజ్ సాధారణంగా శాండ్విచ్లు, సలాడ్లు, స్నాక్స్ వంటి వాటిల్లో రుచి కోసం వినియోగిస్తారు. గ్రిల్డ్, తందూరి చికెన్, కబాబ్లు వంటి వాటితో కూడా కలిపి తీసుకుంటుంటారు. మంత్రి సమీక్ష నేపథ్యంలో.. ఆహార భ్రద్రతపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం సమీక్ష నిర్వహించారు. టాస్క్ఫోర్స్ కమిటీల పనితీరుపై ఆరా తీశారు. 235 హోటళ్లు, హాస్టళ్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్, గోడౌన్లలో తనిఖీలు చేశామని, 170 సంస్థలకు నోటీసులు ఇచ్చామని జీహెచ్ఎంసీ టాస్క్ఫోర్స్ అధికారులు వివరించారు. దీంతో జిల్లాల్లోనూ విరివిగా తనిఖీలు చేయాలని, ఇందుకోసం రెండు టాస్్కఫోర్స్ కమిటీలను నియమించాలని మంత్రి సూచించారు. హైదరాబాద్లోని నందినగర్లో మోమోస్ తిని పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై మంత్రి ఆరా తీశారు. వివిధ రకాల ఆహార పదార్థాలతో కలిపి తినే మయోనైజ్ను కల్తీ గుడ్లు, ఉడకబెట్టని గుడ్లతో తయారు చేస్తున్నారని, దానివల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని అధికారులు వివరించారు. మయోనైజ్ క్వాలిటీ, అది తిన్న తర్వాత కలిగిన దుష్పరిణామాలపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. కేరళలో ఈ తరహా మయోనైజ్ తయారీని అక్కడి ప్రభుత్వం నిషేధించిందని, రాష్ట్రంలో కూడా నిషేధం విధించాలని సూచించారు. దీంతో పలువురు డాక్టర్లు, ఫుడ్ సేఫ్టీ ఉన్నతాధికారులతో చర్చించిన మంత్రి.. మయోనైజ్పై నిషేధం విధించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆహార భద్రతపై అధ్యయనం చేయండి రాష్ట్రంలో గత పదేళ్లలో హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్, హాస్టళ్ల సంఖ్య భారీగా పెరిగిందని, ఇందుకు అనుగుణంగా ఆహార భద్రతా విభాగం బలోపేతం కాలేదని, కొత్త పోస్టులు మంజూరు కాలేదని అధికారులు మంత్రికి వివరించారు. దీంతో ఫుడ్ సేఫ్టీలో ముందున్న రాష్ట్రాలు, దేశాల్లో అవలంభిస్తున్న పద్ధతులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. కొత్తగా మూడు ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయబోతున్నామని, 5 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు కలెక్టరేట్లలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కర్ణన్, డైరెక్టర్ శివలీల, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్లు మూర్తి రాజు, అమృత, ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
633 ఫార్మసిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్యశాఖలో 633 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2 పోస్టుల భర్తీ కోసం ‘మెడికల్ హెల్త్ సర్విసెస్ రిక్రూట్మెంట్ బోర్డు’మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్రెడ్డి దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. అభ్యర్థులు అక్టోబర్ ఐదో తేదీ నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తులో ఏవైనా పొరపాట్లు ఉంటే మార్చుకునేందుకు 23, 24వ తేదీల్లో అవకాశం ఉంటుందని వివరించారు. నవంబర్ 30న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో పరీక్ష ఉంటుందని వెల్లడించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. నోటిఫికేషన్లోని కీలక అంశాలు,వివరాలివీ.. » మొత్తం 633 పోస్టులు ఉండగా.. అందులో 446 ప్రజారోగ్య సంచాలకులు, వైద్యవిద్యా సంచాలకుల (డీఎంఈ) విభాగంలో ఉన్నాయి. మరో 185 తెలంగాణ వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో, ఇంకో 2 హైదరాబాద్ ఎంఎన్జే ఆస్పత్రిలో ఉన్నాయి. ళీ జోన్ల వారీగా చూస్తే.. జోన్–1లో 79, జోన్–2లో 53, జోన్–3లో 86, జోన్–4లో 98, జోన్–5లో 73, జోన్–6లో 154, జోన్–7లో 88 పోస్టులు ఉన్నాయి. » ఈ పోస్టులకు పేస్కేల్ రూ.31,040 నుంచి రూ.92,050 మధ్య ఉంటుంది. » రాష్ట్రవ్యాప్తంగా 13 ప్రాంతాలు.. హైదరాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటలలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. » ఫలితాల అనంతరం మెరిట్ జాబితాను బోర్డు వెబ్సైట్లో ప్రదర్శిస్తారు. » అభ్యర్థులు డి.ఫార్మసీ, బి.ఫార్మసీ, ఫార్మా డీ పూర్తి చేసి ఉండాలి. తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో తప్పక రిజి్రస్టేషన్ చేసి ఉండాలి. » ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిజేసే వారికి వెయిటేజీ ఉంటుంది. వారు అనుభవ పూర్వక ధ్రువీకరణపత్రం సమర్పించాలి. » అభ్యర్థుల వయసు ఈ ఏడాది జూలై 1 నాటికి 46 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు.. దివ్యాంగులకు పదేళ్లు సడలింపు,ఎన్సీసీ, ఎక్స్ సర్విస్మన్లకు మూడేళ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు (ఆర్టీసీ, మున్సిపల్ ఉద్యోగులు అనర్హులు) ఐదేళ్ల సడలింపునిచ్చారు. » రాత పరీక్షకు 80 మార్కులు ఉంటాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసినవారికి వెయిటేజీ కింద 20 పాయింట్స్ కేటాయిస్తారు. ఇందులో గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన ప్రతి ఆరు మాసాలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే ప్రతీ ఆరు నెలలకు 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. » పూర్తి వివరాలను అభ్యర్థులు ఠీఠీఠీ.ఝజిటటb.్ట్ఛ ్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్సైట్లో పొందవచ్చు. -
ప్రసవం కోసం వస్తే ప్రాణాలుపోయాయి!
లబ్బీపేట(విజయవాడతూర్పు): పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణీతోపాటు ఆమె కవల శిశువులు మరణించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పటమటలోని పద్మావతి హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. డాక్టర్ సకాలంలో స్పందించకపోవడంతోనే ఈ దారుణం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణాజిల్లా పోరంకికి చెందిన బండ్రపల్లి ప్రశాంత్, మాధవి(25) దంపతులకు ఒక బాబు(2) ఉన్నాడు. మాధవి రెండోసారి గర్భం దాల్చడంతో పటమటలోని పద్మావతి హాస్పిటల్లో రెగ్యులర్గా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. సోమవారం రాత్రి మాధవికి పురిటినొప్పులు రావడంతో ప్రసవం కోసం కుటుంబ సభ్యులు అదే ఆస్పత్రికి తీసుకొచ్చారు. మాధవిని పరీక్షించిన డాక్టర్ వెంకటరమణ సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించారు. తొలుత నార్మల్ డెలివరీలో ఒక శిశువు జన్మించినా, అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. రెండో శిశువు అడ్డం తిరగడంతో సిజేరియన్ చేశారు. అప్పటికే రెండో శిశువు కూడా మృతిచెందింది. సిజేరియన్ చేసిన అనంతరం మాధవి ఆరోగ్య పరిస్థితి కూడా విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మాధవి బుధవారం ఉదయం మృతిచెందారు. ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన తన భార్య, ఇద్దరు శిశువులు మృతిచెందడంతో పద్మావతి ఆస్పత్రి వద్ద మాధవి భర్త ప్రశాంత్తోపాటు బంధువులు ఆందోళనకు దిగారు. తాము ఆస్పత్రికి వచ్చిన వెంటనే డాక్టర్ వెంకటరమణ స్పందించి సిజేరియన్ చేసి ఉంటే తల్లీబిడ్డలు బతికేవాళ్లని, డాక్టర్ నిర్లక్ష్యంవల్లే మరణించారని ప్రశాంత్ ఆవేదన వ్యక్తంచేశారు. డాక్టర్ వెంకటరమణపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పటమట పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.వైద్యశాఖ విచారణ తల్లీ, ఇద్దరు బిడ్డలు మృతిచెందడంతో ఎన్టీఆర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని బుధవారం పద్మావతి ఆస్పత్రికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. వాస్తవాలను తెలుసుకునేందుకు నిపుణులైన వైద్యులను నియమించాలని విజయవాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్కు లేఖ రాశారు.ఈ మేరకు జీజీహెచ్ గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ హిమబిందు, పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ పరుచూరి అనిల్కుమార్, ఎనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ ఏవీ రావు, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ ఇందిర ఆస్పత్రికి చేరుకుని విచారణ చేశారు.డాక్టర్ వెంకటరమణ నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. వైద్య రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే మాధవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నట్లు సమాచారం. పోస్టుమార్టం రిపోర్టు, విచారణ కమిటీ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. -
మధ్యాహ్నం వేళ..బయటకు రావొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వడగాల్పుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య బయటకు రావొద్దని వైద్యారోగ్యశాఖ సూచించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీందర్నాయక్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 43 డిగ్రీల సెల్సియస్కు ఎగబాకడంతో వాతావరణశాఖ రాష్ట్రానికి హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసిందన్నారు. ఈ మేరకు ఆయన పలు సూచనలు చేశారు. జాగ్రత్తలు... ► దాహం వేయకపోయినా వీలైనంత వరకు తగినంత నీరు తాగాలి. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) తాగాలి. ఇంట్లో తయారు చేసిన నిమ్మరసం, లస్సీ, మజ్జిగ, పండ్ల రసాలు తాగాలి. ► ప్రయాణ సమయంలో వెంట నీటిని తీసుకెళ్లాలి. పుచ్చకాయ, మస్క్ మెలోన్, ఆరెంజ్, ద్రాక్ష, పైనాపిల్, దోసకాయ, పాలకూర లేదా ఇతర స్థానికంగా లభించే పండ్లు మరియు కూరగాయలు వంటి అధిక నీటి కంటెంట్ ఉన్న సీజనల్ పండ్లు, కూరగాయలు తినాలి. ► సన్నని వదులుగా ఉండే కాటన్ వ్రస్తాలు ధరించడం మంచిది. ► ఎండలో వెళ్లేప్పుడు గొడుగు, టోపీ, టవల్ వంటి వాటిని ధరించాలి. ► ఎండలో బయటకు వెళ్లేటప్పుడు బూట్లు లేదా చప్పల్స్ వేసుకోవాలి. ► వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. బాగా వెంటిలేషన్, చల్లని ప్రదేశాలలో ఉండాలి. ► పగటిపూట కిటికీలు, కర్టెన్లు మూసి ఉంచాలి. ► శిశువులు, చిన్న పిల్లలు, ఆరుబయట పనిచేసే వ్యక్తులు, గర్భిణులు, మానసిక అనారోగ్యం ఉన్న వ్యక్తులు, శారీరకంగా అనారోగ్యంతో, ముఖ్యంగా గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటుతో బాధపడేవారు జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్నం బయట ఉన్నప్పుడు శారీరక శ్రమకు సంబంధించిన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ► ఆల్కహాల్, టీ, కాఫీ, శీతల పానీయాలు లేదా పెద్ద మొత్తంలో చక్కెరతో కూడిన పానీయాలను నివారించాలి. ఇవి వాస్తవానికి ఎక్కువ శరీర ద్రవాన్ని కోల్పోయేలా చేస్తాయి. ► అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకోవద్దు, పాచిపోయిన ఆహారం తినవద్దు. ► పార్క్ చేసిన వాహనాల్లో పిల్లలు, లేదా పెంపుడు జంతువులను వదిలివేయవద్దు. ► ప్రమాద సంకేతాలు ఉంటే ఏదైనా ఉంటే సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల నుంచి వెంటనే వైద్యసాయం తీసుకోవాలి. ► గందరగోళం, ఆందోళన, చిరాకు, అటాక్సియా, మూర్ఛ, కోమా వంటి పరిస్థితులు ఉంటే డాక్టర్ను సంప్రదించాలి. ► శరీర ఉష్ణోగ్రత 104 ఫారిన్హీట్, తీవ్రమైన తలనొప్పి, కండరాల బలహీనత లేదా తిమ్మిరి, వికారం, వాంతులు, వేగవంతమైన హృదయ స్పందన, శ్వాసలో ఇబ్బందులు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ► ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం అన్ని ఆస్పత్రుల్లో ప్రత్యేక పడకలు, ఐవీ ఫ్లూయిడ్లు, అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచింది. -
కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ల జీవితాల్లో వెలుగులు
పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): వైద్యారోగ్య శాఖలో ఇన్నాళ్లూ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపింది. వారిని రెగ్యులర్ ఉద్యోగులుగా క్రమబదీ్ధకరించింది. దీంతో వారి జీవితాల్లో, కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలో 2006లో 49 మంది కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లుగా రూ.5 వేల వేతనానికి విధుల్లో చేరారు. 2012లో మరో 36 మంది వచ్చారు. గత టీడీపీ ప్రభుత్వం వీరి సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదు. దీంతో వీరంతా 20 ఏళ్లుగా చాలీచాలని జీతాలతో, ఉద్యోగ భద్రత కరువై వెట్టిచాకిరి చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వీరి వేతనాలు కేవలం రూ.25,400 మాత్రమే. దీంతో కుటుంబ పోషణ కూడా కష్టంగా మారింది. వేతనాల పెంపు కోసం ఎన్నోసార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా టీడీపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే న్యాయం 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక కొద్ది నెలలకే కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ల వేతనాలను భారీ స్థాయిలో పెంచింది. రూ.25,400గా ఉన్న వేతనాన్ని సీఎం జగన్ ఏకంగా రూ.32,460కు పెంచారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా 2014 కంటే ముందు ఉద్యోగంలో చేరిన కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లను ప్రభుత్వం రెగ్యులర్ చేసింది. ఇందులో భాగంగా ఈ ఏడాది మార్చి 10న పాడేరు ఐటీడీఏ పరిధిలో 11 మండలాల్లో పనిచేస్తున్న 85 మందికి రెగ్యులైజేషన్ ఆర్డర్లను అందజేశారు. దీంతో వారంతా సోమవారం ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారుల వద్దకు వెళ్లి వాటిని అందించారు. ఏప్రిల్ 1 నుంచి రెగ్యులర్ ఉద్యోగులుగా మారడంతో ఉద్యోగులు ఒకరినొకరు స్వీట్లు తినిపించుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. నెలకు సుమారు రూ.50 వేలు వేతనంగా అందుకోనున్నారు. సీఎం జగన్ వల్లే తమ జీవితాల్లో వెలుగులు నిండాయని, ఆయనకు రుణపడి ఉంటామంటున్నారు. -
మానసిక ఆరోగ్య సంరక్షణలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: ప్రజల మానసిక ఆరోగ్య సంరక్షణకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేషుగ్గా ఉంటున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రశంసించింది. దేశంలో మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సేవలందించడం, వారి హక్కులను కాపాడటమే లక్ష్యంగా మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టాన్ని 2017లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. చట్టం అమలుపై రాష్ట్రాలకు పలు మార్గదర్శకాలిచ్చింది. కాగా, చట్టం అమల్లో భాగంగా సీఎం జగన్ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన నేషనల్ మెంటల్ హెల్త్ వర్క్షాప్లో కేంద్ర ఆరోగ్య శాఖ కితాబిచ్చింది. మన రాష్ట్రం అవలంభిస్తున్న విధానాలను త్వరలో ప్రత్యేకంగా తెలుసుకుంటామని కేంద్ర ఆరోగ్య శాఖ అడిషనల్ సెక్రటరీ ఎల్ఎస్ ఛాంగ్సన్ పేర్కొన్నారు. ప్రత్యేక బోర్డ్ల ఏర్పాటు మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం అమల్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీ(ఎస్ఎంహెచ్ఏ)తో పాటు, విశాఖపట్నం, ఎన్టీఆర్, వైఎస్సార్, తిరుపతి జిల్లాల్లో రీజినల్ రివ్యూ బోర్డ్ల ఏర్పాటును చేపట్టింది. ఎస్ఎంహెచ్ఏలో రాష్ట్రంలో మానసిక రోగులకు చికిత్సలు అందించేలా ఆస్పత్రుల రిజి్రస్టేషన్ ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకూ 52 మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూషన్లు రిజిస్ట్రర్ చేసుకున్నాయి. మరోవైపు మానసిక స్థితి సరిగా లేక, రోడ్లపై తిరిగే నిరాశ్రయులను ఆదుకునే చర్యల్లో భాగంగా శ్రద్ధ రిహెబిలిటేషన్ ఫౌండేషన్తో వైద్య శాఖ ఎంవోయూ చేసుకుంది. మానసిక స్థితి సరిగా లేక రోడ్లపై తిరిగే వారిని గుర్తించి శ్రద్ధ ఫౌండేషన్ ద్వారా చికిత్సలు అందిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ వంద మంది బాధితులకు చికిత్సలు అందించి, వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. మరోవైపు యువతలో ఆత్మహత్యల నియంత్రణకు ఎమోషనల్ అసెస్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ బై ఎడ్యుకేటర్స్, రెఫరల్ ఇన్ ఏపీ(ఈఏఎస్ఈ) కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. నిమ్హాన్స్, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా ఆరిజన్(ఆపీ) వంటి ప్రముఖ సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నాయి. ఇప్పటి వరకూ మూడు వేల మందికిపైగా ఎంబీబీఎస్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. -
వైద్యారోగ్యశాఖలో డిప్యుటేషన్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖలోని అన్ని డిప్యుటేషన్లను రద్దు చేశారు. తక్షణమే రద్దు ఆదేశా లు అమలులోకి వ చ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. డిప్యుటేషన్లలో ఉన్న డాక్టర్లు, నర్సులు, ఇతర ఉద్యోగులు వెంటనే తమ ఒరిజినల్ పోస్టింగుల్లో చేరాలని హుకుం జారీ చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ ఎ.ఎస్.క్రిస్టినా చోంగ్తు బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) పరిధిలోని వైద్య సిబ్బంది తక్షణమే రిలీవ్ అయి బుధవారం సాయంత్రమే అసలు పోస్టింగ్ స్థలంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. వివిధ మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ కేడర్లో ఉన్న డాక్టర్లను రిలీవ్ చేయాలని సంబంధిత అధికారులకు డీఎంఈ డాక్టర్ త్రివేణి మెమో జారీ చేశారు. ఇక ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని వైద్య సిబ్బంది గురువారం సాయంత్రానికి తమ ఒరిజినల్ పోస్టింగ్లలో చేరాలని ప్రజా రోగ్య సంచాలకులు ఆదేశించారు. డిప్యుటేషన్లు లేదా వర్క్ ఆర్డర్లు రద్దయిన ఉద్యోగుల జాబితాను సంబంధిత విభాగాల అధిపతులు గురువారం సాయంత్రానికి సమర్పించాలని స్పష్టం చేశారు. తమ విభాగాల్లో డిప్యుటేషన్లలో ఎవరూ లేరన్న ధ్రువీకరణ పత్రాన్ని కూడా పంపాలని కోరారు. ‘అవసరాల మేరకు డిప్యుటేషన్లు అంటూ’పైరవీలకు రంగం సిద్ధం... జిల్లా కలెక్టర్లు లేదా ప్రభుత్వం నుంచి రాతపూర్వక ఆమోదంతో అవసరాల మేరకు ఆయా శాఖల అధిపతులు డిప్యుటేషన్లు జారీ చేస్తారని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఒకవైపు డిప్యుటేషన్లను రద్దు చేస్తూనే ఈ మెలిక పెట్టడంలో ఆంతర్యమేంటన్న ప్రశ్న తలెత్తుతోంది. మళ్లీ డిప్యుటేషన్లు తీసుకోవడానికే ఈ మెలిక అన్న చర్చ జరుగుతోంది. 2 వేల మందికిపైగా డిప్యుటేషన్లలోనే.. ఒక అంచనా ప్రకారం వైద్య,ఆరోగ్యశాఖలో జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో దాదాపు 2 వేల మందికి పైగా డిప్యుటేషన్లలో ఉంటారని తెలుస్తోంది. ఇప్పుడు వీటన్నింటినీ రద్దు చేయడం వెనుక కుట్ర ఉందన్న విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన డిప్యుటేషన్లను రద్దు చేసి, కొత్తగా ఇవ్వడం ద్వారా పైరవీలకు తెరలేపాలన్నదే కొందరు అధికారుల ఉద్దేశమన్న విమర్శలున్నాయి. ఆ మేరకు ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చారన్న చర్చ కూడా జరుగుతోంది. సొమ్ములు చేతులు మారేందుకేనా అవసరాల మేరకు ప్రభుత్వ రాతపూర్వక అనుమతితో డిప్యుటేషన్లు ఇవ్వొచ్చన్న నిబంధన పెద్ద ఎత్తున దుర్వినియోగం కానుందని అంటున్నారు. సాధారణ సిబ్బంది డిప్యుటేషన్లకు రూ.లక్ష, స్టాఫ్నర్సులకు రూ.లక్షన్నర, డాక్టర్లకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు డిమాండ్ ఉంటుంది. అలా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారేందుకే అన్ని డిప్యుటేషన్లను రద్దు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవసరాల మేరకు తీసుకోవచ్చని ఉత్తర్వులో చెప్పాల్సిన అవసరమేంటి? ఒకవేళ అవసరాలున్నచోట ఇప్పటికే ఉన్నవారిని తొలగించి వెనక్కు పంపించాల్సిన అవసరమేంటన్న వాదన కూడా వినిపిస్తోంది. ఆ 18 మంది డీఎంహెచ్వోల మాటేమిటి కాగా, డిప్యుటేషన్పై ఉన్న దాదాపు 18 మంది జిల్లా వైద్యాధికారులను (డీఎంహెచ్వో) వెనక్కు పంపించాలన్న ఆదేశాలు వెలువడలేదని ఒక అధికారి వెల్లడించారు. దీనికి కారణాలు ఏంటో అంతుబట్టడంలేదన్న వాదనలున్నాయి. ఉద్యోగులు... సంఘాల అభ్యంతరం ఒక్కరోజు కూడా సమయం ఇవ్వకుండా డిప్యుటేషన్లు రద్దు చేయడంతో ఒక్కసారిగా డాక్టర్లు, నర్సులు, ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. వివిధ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా యి. విద్యా సంవత్సరం మధ్యలో ఉండటం, పదో తరగతి, ఇంటర్, ఎంసెట్ వంటి పరీక్షలు ఉన్న నేపథ్యంలో డిప్యుటేషన్లు రద్దు చేయడం వల్ల గందరగోళం నెలకొంటుందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. తక్షణమే అమలు చేయడం వల్ల వివిధ ప్రాంతాలకు వెళ్లడం, అక్కడ ఏర్పాట్లు చేసుకోవడం కష్టమవుతుందని అంటున్నారు. ప్రభుత్వం తన ఆదేశాలను వచ్చే జూన్ వరకు నిలి పివేయాలని కోరుతున్నారు. కొంతమంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, స్పౌజ్ గ్రౌండ్లలో ఉన్న వారికి కూడా అవకాశం ఇవ్వకుండా డిప్యుటేషన్లు రద్దు చేయడం సమంజసం కాదంటున్నారు. విద్యా సంవత్సరం పూర్తయ్యేవరకు సమయం ఇవ్వాలని, సాధారణ బదిలీలను చేపట్టాలని కోరుతున్నారు. -
ఉద్దానం కిడ్నీకి రక్షణ కవచం
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత కిడ్నీ బాధితులకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు శ్రీకాకుళం జిల్లా పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సెంటర్కు “డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్’గా నామకరణం చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కిడ్నీ బాధితులకు కార్పొరేట్ వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించే లక్ష్యంతో రూ.50 కోట్లు వెచ్చించి రీసెర్చ్ ఆస్పత్రిని నిర్మి0చారు. ర్యాంప్ బ్లాక్తో కలిపి మూడు బ్లాక్లుగా నాలుగు అంతస్తుల్లో ఆస్పత్రి నిర్మాణం చేపట్టారు. మొదటి అంతస్తులో క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, హాస్పిటల్ స్టోర్స్, సెంట్రల్ ల్యాబ్స్ ఉంటాయి. రెండో అంతస్తులో నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, మూడో అంతస్తులో డయాలసిస్, నెఫ్రాలజీ వార్డులు, నాలుగో అంతస్తులో ఓటీ కాంప్లెక్స్, పోస్ట్ ఆపరేటివ్/ఐసీయూ, యూరాలజీ వార్డ్స్, రీసెర్చ్ ల్యాబ్స్ ఉంటాయి. అందుబాటులో అన్నిరకాల చికిత్సలు కిడ్నీ వ్యాధులకు సంబంధించి అన్నిరకాల చికిత్సలతో పాటు పరిశోధనలు చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం పరికరాలను సమకూరుస్తోంది. ఎంఆర్ఐ, సీటీ స్కాన్, 2డీ ఎకో, హై ఎండ్ కలర్ డాప్లర్, మొబైల్ ఎక్సరే (డిజిటల్), ఏబీజీ అనలైజర్ పరికరాలతో పాటు పూర్తిగా రిమోట్ కంట్రోల్ ఐసీయూ సౌకర్యాలను కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో అందుబాటులోకి రానున్నాయి. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ, వంటి వివిధ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య పోస్టులు 46, స్టాఫ్ నర్సు పోస్టులు 60, ఇతర సహాయ సిబ్బంది పోస్టులు 60 చొప్పున మంజూరు చేశారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా దాదాపు పూర్తయింది. త్వరలోనే సీఎం జగన్ చేతుల మీదుగా ఆస్పత్రిని ప్రారంభించనున్నట్టు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు పేర్కొన్నారు. ఇప్పటికే తీసుకున్న చర్యలివీ ♦ గత ప్రభుత్వ హయాంలో తీవ్రమైన కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.2,500 చొప్పున ఇచ్చే పెన్షన్ను సీఎం జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.10వేలకు పెంచింది. ప్రతినెలా 1వ తేదీనే లబి్ధదారుల గుమ్మం చెంతకు రూ.10 వేల చొప్పున పెన్షన్ను వలంటీర్లు అందజేస్తున్నారు. ♦ టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆస్పత్రుల్లో 69 మెషిన్లతో డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. హరిపురంలో డయాలసిస్ సెంటర్ను 2020లో ప్రారంభించారు. మరో 25 మెషిన్లతో కొత్తగా గోవిందపురం, అక్కుపల్లి, కంచిలి, బెలగాంలో డయాలసిస్ సెంటర్లు మంజూరయ్యాయి. ఇలా వరుసగా 2019–20లో 37,454 సెషన్లు, 2020–21లో 46,162 సెషన్లు, 2021–22లో 54,520 సెషన్లు, 2022–23లో (మే నాటికి) 55,708 సెషన్ల చొప్పున కిడ్నీ బాధితులకు డయాలసిస్ చేశారు. ♦ ఇచ్చాపురం, కంచిలీ సీహెచ్సీ, కంచిలి పీహెచ్సీల్లో 25 మెషిన్లతో డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ♦ వైద్య పరీక్షల కోసం ఉద్దానం ప్రాంతంలోని 18 పీహెచ్సీలు, 5 యూపీహెచ్సీలు, 6 సీహెచ్సీల్లో సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్ను అందుబాటులో ఉంచారు. ♦ టీడీపీ హయాంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులు మాత్రమే అరకొరగా ఇక్కడి ఆస్పత్రుల్లో అందించేవారు. ప్రస్తుతం ప్రతి ఆస్పత్రిలో 37 రకాల మందులు అందుబాటులో ఉంటున్నాయి. ♦కొత్త కేసుల గుర్తింపునకు వైద్య శాఖ నిరంతరాయంగా స్క్రీనింగ్ కొనసాగిస్తోంది. ఇందుకోసం వైఎస్సార్ విలేజ్ క్లినిక్లలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్వో)లకు ప్రత్యేకంగా ఒక యాప్ రూపొందించారు. వీరు ఈ ప్రాంతంలోని ప్రజలను స్క్రీనింగ్ చేసి అనుమానిత లక్షణాలున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించి సమీపంలోని పీహెచ్సీలకు సీరమ్ క్రియాటినిన్ పరీక్షలకు తరలిస్తున్నారు. -
లైఫ్ స్టయిల్ మారుద్దాం..!
ఈ రోజుల్లో...ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం!? పిల్లలు ఎలా ఎదుగుతున్నారు? ఉరుకుల పరుగుల జీవనంలో ఇవన్నీ సహజమే అని వదిలేస్తే ..‘భవిష్యత్తు తరాలు ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్నీ కావు’ అంటున్నారు లీ హెల్త్ డొమైన్ డైరెక్టర్ లీలారాణి. ఆరోగ్య విభాగంలో న్యూట్రాస్యు టికల్, ఫుడ్ సప్లిమెంట్ ఉత్పత్తుల పరిశోధన, అభివృద్ధిపై దృష్టిపెట్టే ఈ సంస్థ ద్వారా మన జీవనవిధానం వల్ల ఎదుర్కొనే సమస్యలకు మూలకారణాలేంటి అనే విషయంపై డేటా సేకరించడంతో పాటు, అవగాహనకు కృషి చేస్తున్నారు. హెల్త్ అండ్ వెల్నెస్, సీఐఐ ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ ఏపీ చాంబర్స్, విశాఖపట్నం జోన్ చెయిర్ పర్సన్గానూ ఉన్న లీలారాణి మహిళలు, పిల్లల ఆరోగ్య సమస్యలపై డేటా వర్క్, బేసిక్ టెస్ట్లు చేస్తూ తెలుసుకుంటున్న కీలక విషయాలను ఇలా మన ముందుంచారు.. ‘‘ప్రస్తుత జీవన విధానం, తీసుకునే ఆహారం వల్ల పిల్లలకు ఎలాంటి దీర్ఘకాలిక జబ్బులు వస్తున్నాయి అనే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు స్కూళ్లవైపుగా డేటా సేకరించాలనుకున్నాం. ముందు 8–10 ఏళ్ల పిల్లలకు స్కూళ్లలో ఇటీవలప్రారంభించాం. ఊర్జాప్రాజెక్టులో భాగంగా బేసిక్ న్యూట్రిషన్ ఫోకస్డ్ ఫిజికల్ ఎగ్జామినేషన్స్ చేస్తున్నాం. ఈ టెస్ట్ ద్వారా పిల్లల్లో .. ఆహారానికి సంబంధించిన సమస్యలు ఏమన్నాయి, తల్లిదండ్రులు– కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఎంత సమయం గడుపుతున్నారు, శారీర చురుకుదనం, డిజిటల్ ఎక్స్పోజర్ ఎలా ఉంది, నిద్ర సమస్యలు ఏంటి.. ఇలా కొన్నింటితో ఒక ప్రశ్నాపత్రం రూపొందించాం. పిల్లల దగ్గర సమాధానాలు తీసుకొని, వాటిలో ప్రధాన సమస్యలపై ఫోకస్ పెట్టాం. ఆంధ్రా, తెలంగాణలోని స్కూళ్లలో పెద్ద స్థాయిలో డేటా తీసుకోవాలని ప్రారంభించాం. ఇప్పుడైతే 200 మంది పిల్లలతో విశాఖపట్నంలో ఈ డేటా మొదలుపెట్టాం. 8–15 ఏళ్ల వయసులో .. పిల్లలతో కలిసి రోజువారి జీవనవిధానం గురించి చర్చించినప్పుడు ‘మా పేరెంట్స్ బిజీగా ఉంటారు. వాళ్లు డిజిటల్ మీడియాను చూస్తారు, మేమూ చూస్తాం.’ అని చెబుతున్నారు. ఈ వయసు పిల్లలు సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉండటమే కాకుండా, చురుకుగా ఉంటున్నారు. కారణం అడిగితే – ‘అమ్మనాన్నలను ఏదైనా విషయం గురించి అడిగితే చెప్పరు. అందుకని డిజిటల్లో షేర్ చేసుకొని తెలుసుకుంటాం’ అంటున్నారు. తెలియని వ్యక్తులతో పరిచయాలు ఈ విధంగా పెంచుకుంటూ సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి స్కూళ్లలో ఎలాంటి గేమ్స్ ఉన్నాయి, ఇంటి బయట ఎలా ఉంటున్నారు,.. అనేది కూడా ఒక డేటా తీసుకుంటున్నాం. 8–15 ఏళ్ల లోపు పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేకపోవడం వల్ల వారు యంగేజ్కు వచ్చేసరికి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తించాం. ఊబకాయమూ సమస్యే ఎగువ మధ్యతరగతి పిల్లల్లో ఊబకాయం అనేది ప్రధాన సమస్యగా ఉంది. డబ్యూహెచ్ఓ సూచించిన టెస్ట్లు చేసినప్పుడు ఈ విషయాలు గుర్తించాం. వాటిలో శారీరక చురుకుదనం లోపించడమే ప్రధానంగా కారణంగా తెలుసుకున్నాం. బయట జంక్ ఫుడ్ నెలలో ఎన్ని సార్లు తీసుకుంటున్నారు అనేదానిపైన రిపోర్ట్ తయారుచేశాం. పిల్లల నుంచి సేకరించిన రిపోర్ట్ను ఆ స్కూళ్లకు ప్రజెంట్ చేస్తున్నాం. ఆ రిపోర్ట్లో ‘మీ స్కూల్ కరిక్యులమ్లో చేర్చదగిన అంశాలు అని ఓ లిస్ట్ ఇస్తున్నాం. వాటిలో, చురుకుదనం పెంచే గేమ్స్తో పాటు న్యూట్రిషన్ కిచెన్, గార్డెనింగ్.. వంటివి ఒకప్రాక్టీస్గా చేయించాలని సూచిస్తున్నాం. ముందుగా 40 ఏళ్ల పైబడినవారితో.. రెండేళ్ల క్రితం ఒక కార్పోరేట్ సెక్టార్లో దాదాపు పది వేల మందికి (40 ఏళ్లు పైబడినవారికి) ఎన్జీవోలతో కలిసి బిఎమ్డి టెస్ట్ చేశాం. వీరిలో బోన్డెన్సిటీ తక్కువగా ఉండటమే కాకుండా, మానసిక ప్రవర్తనలు, నెగిటివ్ ఆలోచనలు, స్ట్రెస్ ఇండెక్స్, బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్.. వంటివి దేని వల్ల వస్తున్నాయి అనేది తెలుసుకున్నాం. నిజానికి 60 ఏళ్ల పైబడి న వారి బోన్ డెన్సిటీ బాగుంది. కారణం, ఆ రోజుల్లో వారు చేసే శారీరక శ్రమయే కారణం. ఇప్పుడది తగ్గిపోయింది. పరిష్కారాలూ సూచిస్తున్నాం.. ఎక్కడైతే టెస్ట్లు చేశామో, వారి జీనవవిధానికి తగిన సూచనలూ చేస్తున్నాం. ఆరోగ్య సమస్యలు ఏవి అధికంగా వస్తున్నాయో తెలుసుకుని, వాటిని పరిష్కరించుకునే విధానాలను సూచిస్తున్నాం. చాలావరకు ఈ వయసు వారిలోనూ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్లే సమస్యలు. ముఖ్యంగా కార్పొరేట్ సెక్టార్ నుంచి ఈ సమస్య అధికంగా ఉంది. పని ప్రదేశంలో శరీర కదలికలు లేకపోడం, అక్కడి వాతావరణం, స్క్రీన్ నుంచి వచ్చే సమస్యలు, డిజిటల్ ఎక్స్పోజర్.. వీటన్నింటినీ ఒక్కొక్కరి నుంచి తీసుకొని వారికి తగిన సూచనలు ఇస్తూ వచ్చాం. సమస్యలు ఎక్కువ ఉన్నవారి బాల్య దశ గురించి అడిగితే మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. బాల్య దశ కీలకం పెద్దవాళ్లలో సమస్యలు గమనించినప్పుడు వారి బాల్య దశ కీలకమైందని గుర్తించాం. దీంతో పిల్లల్లోనే ముందుగా సమస్యను పరిష్కరిస్తే మంచిదని, పిల్లల్లో పరీక్షలు చేసినప్పుడు వారిలో బోన్డెన్సిటీ సమస్య కనిపించింది. దీని గురించి డాక్టర్లతో చర్చించినప్పుడు మూల కారణం ఏంటో తెలిసింది. ఒకప్పుడు గ్రామాల్లో పిల్లలు పరిగెత్తడం, గెంతడం, దుమకడం.. వంటివి చాలా సహజసిద్ధంగా జరిగిపోయేవి. వారి ఆటపాటల్లో శారీరక వ్యాయామం చాలా బాగుండేది. అది ఈ రోజుల్లో లేదు. క్రీడలు కూడా వృత్తిపరంగా ఉన్నవే తప్ప ఆనందించడానికి లేవు. ఒక స్ట్రెస్ నుంచి రిలీవ్ అయ్యే ఫిజికల్ యాక్టివిటీ రోజులో ఇన్ని గంటలు అవసరం అనేది గుర్తించి, చెప్పాలనుకున్నాం. భవిష్యత్తులో రాబోయే ఆరోగ్యసమస్యలను భరించడం కన్నా ముందే జాగ్రత్తపడటం మంచిది. మధ్య తరగతే కీలకం మధ్యతరగతి, దానికి ఎగువన ఉన్న పిల్లల్లో శారీరక చురుకుదనం లోపం ఎక్కువ కనిపించింది. వారి ఎముక సామర్థ్యం బలంగా లేకపోతే భవిష్యత్తులో ఎన్నో ఆరోగ్యసమస్యలను ఎదుర్కోక తప్పదు. పిల్లలు ఎదిగే దశలో వారి ఆహారం, అలవాట్లు బాగుండేలా చూసుకోవాలి. ఈ విషయంలో కార్పొరేట్ కన్నా ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలు బాగానే ఉన్నారు. ఈ అన్ని విషయాలపై ఇంకా చాలా డేటా సేకరించాల్సి ఉంది. ముందు మానసిక సమస్యలు అనుకోలేదు. కానీ, సైకలాజికల్ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. కుటుంబంలో ఉన్నవారితో సరైన ఇంటరాక్షన్స్ తగ్గిపోయినట్టుగా తెలుస్తోంది. ఎక్కువ డిజిటల్ మీడియాలో ఉండటం వల్ల కంటి సమస్యలు, కుటుంబంతో గ్యాప్ ఏర్పడం వంటివి జరుగుతున్నాయి. ఈ విషయాలను అవగాహన చేసుకొని, మన జీవన విధానంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది’ అని తెలియజేశారు. లీలారాణి. – నిర్మలారెడ్డి -
ప్రజలందరికీ ఆరోగ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలందరికీ ఆరోగ్యాన్ని అందించాలన్న సత్సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం చేపట్టారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ఐదు దశల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం శాసన సభలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ.. తొలి రెండు దశల్లో 1.60 కోట్ల కుటుంబాలకు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్యశ్రీ వైద్య సేవలపై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. బ్రోచర్ల ద్వారా వైద్యసేవలు పొందే విధానాన్ని వివరిస్తామన్నారు. అనంతరం ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అందించే వైద్య సేవలను వివరించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారన్నారు. బాధితులను గుర్తించిన అనంతరం ఇంటి వద్దే స్పెషలిస్టు వైద్యులతో చికిత్స అందించనున్నట్లు తెలిపారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ కింద రూ.9 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారన్నారు. ఒకప్పుడు 919 ఉండే నెట్వర్క్ ఆస్పత్రుల సంఖ్యను ఏకంగా 2,283కు పెంచారని తెలిపారు. ఇందులో 204 ఆస్పత్రులతో చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లోనూ అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నామన్నారు. క్యాన్సర్ వైద్యంలో 638 ప్రొసీజర్స్ను చేర్చడంతో పాటు రూ.600 కోట్లు ఖర్చు చేశామన్నారు. నెట్వర్క్ ఆస్పత్రుల్లో రోగులను ఇబ్బంది పెట్టినా, డబ్బులు వసూలు చేసినా 104కు ఫిర్యాదు చేస్తే ఆ హాస్పిటల్స్ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు: ప్రభుత్వ విప్ కొరముట్ల అనంతరం ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ చేపట్టిన చర్యల ఫలితంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. అందుకే పీహెచ్సీలు, వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో 300కు పైగా ఓపీలు నమోదవడంతో పాటు గుండె, క్యాన్సర్ వంటి వ్యాధులకు వైద్యం ఉచితంగా అందుతోందని, ఎంతో మంది పేదలకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. బద్వేల్ సీహెచ్సీలో ఆర్థోపెడిక్ సర్జన్ పోస్టు మంజూరు చేయాలని, ఎక్సరే యూనిట్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ సుధ కోరారు. సీఎస్ఆర్ కింద పూర్తయిన డయాలసిస్ యూనిట్ భవనాన్ని ప్రభుత్వం తీసుకుని వెంటనే వైద్య సేవలు ప్రారంభించాలని కోరారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో బలోపేతం చేసిందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గాజువాక ఎమ్మెల్యే తిప్పలనాగిరెడ్డి తెలిపారు. ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి పథకాన్ని చేరువ చేశారన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 1059 ప్రొసీజర్లు ఉంటే ఈ ప్రభుత్వం 3,257కు పెంచిందన్నారు. నెట్వర్క్ ఆస్పత్రులపై దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే జగన్మోహనరావు నెట్వర్క్ ఆస్పత్రుల్లో కొన్ని ప్రొసీజర్స్కు ఆరోగ్యశ్రీపై వైద్యం చేయట్లేదని నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో పేదలు అప్పులు చేసి వైద్యం చేయించుకుంటున్నారని, ఆ తర్వాత సీఎంఆర్ఎఫ్ కింద దరఖాస్తు చేసుకుంటే ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్లో ఉండటంతో సహాయ నిధిని విడుదల చేయట్లేదని తెలిపారు. ప్రభుత్వం నెట్వర్క్ ఆస్పత్రుల్లో సదుపాయాలపై తనిఖీలు చేయాలని, విలేజ్ హెల్త్ క్లినిక్స్లో నెట్వర్క్ ఆస్పత్రుల వివరాలు, అక్కడ లభించే ఆరోగ్యశ్రీ వైద్య సేవలపై అవగాహన కల్పించేలా దృష్టి సారించాలని కోరారు. ఇలాంటి ఆస్పత్రులపై చర్యలు తీసుకోండి: ఎమ్మెల్యే తిప్పేస్వామి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి పేదలకు ఉచిత వైద్యం అందించడమే కాకుండా, డిశ్చార్జి తర్వాత ఆసరా కింద రూ.5 వేలు ఇచ్చి, స్థానిక ఏఎన్ఎంల ద్వారా ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపడుతున్నారని మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి తెలిపారు. అయితే, కొన్ని నెట్వర్క్ ఆస్పత్రులు రోగుల దగ్గర, ఆరోగ్యశ్రీలోనూ రెండు రకాలుగా డబ్బులు వసూలు చేస్తున్నారని, అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 108లను కర్ణాటకకూ నడపండి: ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం ప్రజలు వైద్యం కోసం 150 కిలోమీటర్ల దూరంలోని అనంతపురానికి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల సమీపంలోనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలోనూ నెట్వర్క్ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కోరారు. రోడ్డు ప్రమాదం, ఇతర అత్యవసర సమయాల్లో 108 అంబులెన్సులు కర్నాటకకు తీసుకెళ్లడంలేదని, ఇకపై 108లను కర్ణాటకకు కూడా అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రిని వేగంగా పూర్తి చేయాలని కోరారు. -
అవసరమైన చోట ఎక్కువమంది ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే ప్రజారోగ్య సంచాలకుల విభాగాన్ని బలోపేతం చేయాలనే ఆలోచనతో హేతుబద్దికరణ చేపట్టాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. దీనిపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఏర్పాటు చేసిన కమిటీ ప్రతిపాదనల మేరకు గురువారం మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీచేశారు. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని ఉద్యోగుల హేతుబద్దికరణ ప్రక్రియకు అనుమతించారు. రోగుల తాకిడికి అనుగుణంగా తగిన వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసుకునేలా మార్గదర్శకాలు రూపొందించారు. కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్లో ఇప్పటివరకు ఒక్క డీఎంహెచ్వో మాత్రమే ఉన్నారు. హైదరాబాద్లో ఇక ఆరుగురు డీఎంహెచ్వోలు పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత, భవిష్యత్ వైద్య అవసరాలు గుర్తించిన ప్రభుత్వం అదనంగా 5 డీఎంహెచ్వోలను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. చార్మినార్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోన్ల వారీగా వీటి ఏర్పాటుకు అంగీకరించింది. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం ఆరుగురు డీఎంహెచ్వోలు ఉంటారు. కొత్త డీఎంహెచ్వోలను కలుపుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 38 మంది ఉంటారు. ఇక రాష్ట్రంలో 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా, అందులో సిబ్బంది ఏకరీతిగా లేదు. వైద్యాధికారి, పర్యవేక్షక సిబ్బంది పోస్టులు ఏకరీతిగా పంపిణీ జరగలేదు. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది ఏకరీతిగా ఉండేలా ప్రస్తుతం పునర్వ్యవస్థీకరించారు. కొత్తగా 40 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కొత్తగా ఏర్పడిన 40 మండలాల్లో పీహెచ్సీలు లేవు. వీటిలో 40 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. గతంలో 30 మండలాల్లో ఉన్న పీహెచ్సీలను ఆసుపత్రులుగా అప్గ్రేడ్ చేశారు. ఈ ప్రదేశాలలో ఔట్రీచ్ కార్యకలాపాలు సీహెచ్సీలతో నిర్వహి స్తున్నారు. అయితే అన్ని సీహెచ్సీలను తెలంగాణ వైద్య విధాన పరిషత్కు బదిలీ చేయడం వల్ల, ఔట్రీచ్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఈ ప్రదేశాలలో పీహెచ్సీల అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో 30 మండలాల్లో పీహెచ్సీలను మంజూరు చేశారు. రాష్ట్రంలోని 235 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యూపీహెచ్సీ)లను బలోపేతం చేయడానికి, తగిన సిబ్బందిని నియమించాలని నిర్ణయించింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ల సేవలు వినియోగించేందుకు వీలుగా, డెంటల్ అసిస్టెంట్ సర్జన్లను టీవీవీపీ ఆసుపత్రుల పరిధిలోకి తీసుకొచ్చారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఉన్న ప్రభుత్వ టీబీ ఆసుపత్రిని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తీసుకువచ్చారు. 4,246 ఎంపీహెచ్ఏ పోస్టులు మంజూరు 1,712 పోస్ట్లను సూపర్న్యూమరరీ పోస్ట్లుగా మార్చారు. మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మహిళ) కేడర్ ఈ హేతుబద్ధీకరణలో కవర్ చేయలేదు. దాంతో పీహెచ్సీలు, ఇతర సంస్థలలో మంజూరు చేసిన ఎంపీహెచ్ఏ (ఎఫ్) పోస్టుల స్థానం మారదు. దాంతో 4,246 ఎంపీహెచ్ఏ (మహిళ) పోస్టులను మంజూరు చేశారు. అయితే ఈ పోస్టులకు సంబంధించిన స్పష్టతను వైద్య, ఆరోగ్యశాఖ ఇవ్వలేదు. మార్గదర్శకాల్లో కొంత గందరగోళం ఉందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కాగా, ఈ హేతుబద్ధీకరణ ప్రక్రియలో రోగుల తాకిడికి అనుగుణంగా, అవసరాల మేరకు సిబ్బందిని స్థానచలనం చేయడానికి ప్రభుత్వం వీలు కలి్పంచింది. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి మూడు నెలల గడువు విధించింది. -
టెలి మెడిసిన్లో ఏపీనే టాప్
సాక్షి, అమరావతి: వయో వృద్ధులు, మహిళలకు టెలీ మెడిసిన్ సేవలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది జూలై 19వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 1,10,12,570 మంది వయో వృద్ధులు టెలిమెడిసిన్ సేవలు పొందగా ఆంధ్రప్రదేశ్లో 34.17 లక్షల మందికి ప్రయోజనం చేకూరినట్లు ఇటీవల పార్లమెంట్కు తెలిపింది. దేశవ్యాప్తంగా పోలిస్తే 31.04 శాతం వయో వృద్ధులకు ఏపీలో సేవలు అందాయి. మహిళలకు టెలిమెడిసిన్ సేవలందించడంలో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. దేశంలో 5,22,15,224 మంది మహిళలకు టెలిమెడిసిన్ సేవలు అందగా ఆంధ్రప్రదేశ్లోనే 1.37 కోట్ల మంది మహిళలు దీన్ని సద్వినియోగం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా పోలిస్తే ఏపీలో 26.41 శాతం మంది మహిళలు టెలి మెడిసిన్ సేవలు పొందారు. ఆంధ్రప్రదేశ్ మినహా మరే రాష్ట్రంలోనూ కోటి మందికి పైగా మహిళలకు టెలిమెడిసిన్ సేవలు అందలేదు. పశ్చిమ బెంగాల్లో 85.16 లక్షల మంది మహిళలు, తమిళనాడులో 62.94 లక్షల మంది మహిళలకు టెలిమెడిసిన్ సేవలను వినియోగించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. 21,236 స్పోక్స్ హబ్లు ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం టెలి మెడిసిన్ ద్వారా స్పెషలిస్టు డాక్టర్ల వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాలకు సైతం అందుబాటులోకి తెచ్చింది. టెలిమెడిసిన్ సేవలందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలు, జిల్లా అస్పత్రుల్లో ప్రత్యేక హబ్లను ఏర్పాటు చేసింది. వీటిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు వైఎస్సార్ పట్టణ ఆరోగ్య హెల్త్ క్లినిక్స్, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్లతో అనుసంధానం చేశారు. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా హెల్త్ వెల్నెస్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు టెలిమెడిసిన్ సేవలకు సంబంధించి 21,236 స్పోక్స్ హబ్లను ఏర్పాటు చేసినట్లు కేంద్రం తెలిపింది. ఒక్కో హబ్లో ఇద్దరు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, కార్డియాలజీ స్పెషలిస్టులు ఉంటారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, విలేజ్ క్లినిక్స్కు వచ్చిన రోగులకు స్పెషలిస్టు డాక్టర్ల వైద్య సేవలు అవసరమైతే టెలిమెడిసిన్ ద్వారా హబ్లోని వైద్యులను సంప్రదిస్తారు. హబ్ నుంచి వైద్యులు ఆడియో, వీడియో కాల్ రూపంలో రోగులతో మాట్లాడి తగిన ఎలాంటి మందులు వాడాలో సూచిస్తారు. ఆ మందులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్లోని వైద్య సిబ్బంది రోగులకు అందజేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు ఈ–సంజీవని (ఓపీడీ) యాప్తో ఇంటి నుంచే వైద్య సేవలను పొందవచ్చు. స్మార్ట్ ఫోన్ లేని వారితో పాటు వాటిని వినియోగించలేని వారి కోసం ఇంటి వద్దే ఈ–సంజీవని ఓపీ డిపార్ట్మెంట్ సేవలు అందించేందుకు ప్రభుత్వం 42 వేల మంది ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసింది. వీటిని హబ్ ల కు అనుసంధానించారు. దీంతో మారుమూల ప్రాంతాల్లోని వారు కూడా టెలిమెడిసిన్ ద్వారా స్పెషలిస్టు డాక్టర్ల వైద్య సేవలను పొందగలుగుతున్నారు. ఏపీలో పెద్ద ఎత్తున అందిస్తున్న టెలిమెడిసిన్ సేవలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున అవగాహన కల్పించడంతో అత్యధికంగా వృద్ధులు, మహిళలకు టెలి మెడిసిన్ సేవలు అందుతున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. -
నేటి నుంచి ఫీవర్ సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు వైద్య, ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. బుధవారం నుంచి ఇంటింటి ఫీవర్ సర్వేను ప్రారంభిస్తోంది. ఆరోగ్య సిబ్బంది, వలంటీర్లు రాష్ట్రంలోని 1.63 కోట్ల గృహాలను సందర్శించి డెంగీ, మలేరియా, విష జ్వరాలతో బాధపడుతున్న వారిని, లక్షణాలున్న వారిని ఈ సర్వే ద్వారా గుర్తించనున్నారు. ఈ సర్వే కోసం సోమవారం ఉన్నతాధికారులు జిల్లాల వైద్య శాఖ, ఇతర శాఖల అధికారులతో వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వే చేపట్టాల్సిన విధానం, మార్గదర్శకాలను వివరించారు. కరోనా వ్యాప్తి సమయంలో వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఫీవర్ సర్వేను ప్రారంభించింది. ఆరోగ్య సిబ్బంది రాష్ట్రంలోని ప్రతి ఇంటిని సందర్శించి, లక్షణాలున్న వారిని గుర్తించి, పరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రారంభ దశలోనే వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడింది. ఆ తర్వాత కూడా వ్యాధుల నియంత్రణకు సర్వే కొనసాగుతోంది. ఇప్పటివరకు 49 విడతలు రాష్ట్రంలో సర్వే నిర్వహించారు. ఇదే తరహాలో ప్రస్తుతం సీజనల్ వ్యాధుల నియంత్రణకు సర్వే చేపడుతున్నారు. డెంగీ, మలేరియా, ఇతర సీజనల్ వ్యాధులున్న వారిని, లక్షణాలున్నవారిని గుర్తిస్తారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. బాధితులకు మందులు అందిస్తారు. అవసరమైన వారిని ఆస్పత్రుల్లో చేర్పిస్తారు. సీజనల్ వ్యాధులను గుర్తించడానికి ఫీవర్ సర్వే యాప్లో మార్పులు చేశామని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ రామిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. గతంలో కరోనా వైరస్ ప్రశ్నావళి మాత్రమే ఉండేదని, ప్రస్తుతం డెంగీ, మలేరియా, విష జ్వరాల లక్షణాల ప్రశ్నావళిని అదనంగా చేర్చామని చెప్పారు. ఫీవర్ సర్వే నిర్వహణపై అన్ని జిల్లాల డీఎంహెచ్వోలకు మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలను సమన్వయం చేసుకుంటూ వైద్య శాఖ పనిచేస్తోందని వివరించారు. -
ఆరోగ్యాధారిత వ్యవస్థలు బలోపేతం కావాలి
సాక్షి, హైదరాబాద్: ‘రానున్న ఆరోగ్య విపత్తులను ఎదుర్కునేందుకు అంతర్జాతీయంగా ఆరోగ్యాధారిత వ్యవస్థలను ఏకీకృతం, బలోపేతం చేయడం తక్షణ అవసరం’ అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ అభిప్రాయపడ్డారు. జీ20 ఇండియా ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్లో జరిగిన 3వ హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఆమె ముఖ్య అతిధిగా ప్రసంగించారు. ప్రాథమిక ఆరోగ్యాన్ని మూలస్తంభంగా ఉంచి, బలమైన ఆరోగ్య వ్యవస్థలను రూపొందించడంపై మనం దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. అంతర్జాతీయంగా అనుసంధానించిన నెట్వర్క్, ఎకో సిస్టమ్ను సృష్టించే దిశగా కొనసాగుతున్న ప్రయత్నాలను బలోపేతం చేయాలని ఆమె ఈ సందర్భంగా జీ 20 దేశాలను కోరారు. దానికి ఇది అనువైన సమయంగా పేర్కొన్నారు. డిజిటల్ హెల్త్ పై అంతర్జాతీయ కార్యక్రమ ఏర్పాటుకు భారత్ చేసిన ప్రతిపాదనను ఆమె ఈ సందర్భంగా ప్రతినిధుల దృష్టికి తెచ్చారు. ఇది దేశాల మధ్య డిజిటల్ వైరుధ్యాలను తగ్గించడానికి సాంకేతికత ఫలాలు ప్రపంచంలోని ప్రతి వ్యక్తికీ అందుబాటులో ఉండేలా చూసేందుకు వీలు కలిగిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రపంచపు ఫార్మసీ భారత్: కిషన్రెడ్డి కేంద్ర çపర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యం, వెల్నెస్ల కోసం అత్యధికులు ఎంచుకుంటున్న 10 అగ్రగామి దేశాల్లో భారత్ ఒకటిగా ఉందన్నారు. ప్రపంచపు ఫార్మసీగా మన దేశాన్ని అభివరి్ణంచిన ఆయన...మొత్తం ప్రపంచంలోని వ్యాక్సిన్లలో 33శాతం హైదరాబాద్లోని ఒక్క జీనోమ్ వ్యాలీ ద్వారానే ఉత్పత్తి అవుతోందని చెప్పారు. వచ్చే 2030కల్లా అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యాన్ని చేరుకునే విషయంలో మన దేశం కృత నిశ్చయంతో ఉందన్నారు. స్థిరమైన ఆరోగ్య వ్యవస్థ ద్వారానే బలమైన ఆర్థిక వ్యవస్థ: కేంద్రమంత్రి బాఘెల్ కేంద్ర మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బాఘెల్ మాట్లాడుతూ స్థిరమైన ఆరోగ్య వ్యవస్థ ద్వారా మాత్రమే స్థిరమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించగలమని వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని ఇటీవలి కోవిడ్ 19 మహమ్మారి నేరి్పందని గుర్తు చేశారు. అందరికీ అత్యుత్తమ ఆరోగ్య సౌకర్యాలు, వ్యాక్సిన్లు, థెరప్యూటిక్స్, డయాగ్నస్టిక్లను జీ20 వేదిక ద్వారా అందించడం భారత్ లక్ష్యంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్, నీతి అయోగ్ సభ్యులు డా.వి.కె.పాల్, ఐసీఎంఆర్ డీజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ సెక్రటరీ డాక్టర్ రాజీవ్ బహ్ల్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అభయ్ ఠాకూర్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి హెకాలీ జిమోమి, జీ20 దేశాల ప్రతినిధులు, వైద్యరంగ ప్రముఖులు పాల్గొన్నారు. -
మరింత చేరువగా అత్యవసర వైద్యం
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు అత్యవసర వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు తెలంగాణ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఇనీషియేషన్ (టెరి)ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రకృతి విపత్తులు, రోడ్డు ప్రమాదాలు, పని ప్రదేశాల్లో ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, హార్ట్ అటాక్.. బ్రెయిన్ స్ట్రోక్, మాతా శిశు అత్యవసర సేవలు, మెడికల్.. సర్జికల్ ఎమర్జెన్సీస్ వంటి ఆరు రకాల బాధితులకు అవసరమైన వైద్యాన్ని తక్షణం అందించడం, తద్వారా ప్రాణ నష్టాన్ని సాధ్యమైనంతవరకు నివారించడమే దీని ప్రధాన లక్ష్యమని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఎమర్జెన్సీ కేసుల్లో 24% ట్రామా బాధితులే.. ఎమర్జెన్సీ విభాగానికి వచ్చే కేసుల్లో అత్యధికంగా 24 శాతం ట్రామా బాధితులే (గాయాలకు గురైనవారు) ఉంటున్నారు. ఆసుపత్రిలో చేరకముందు జరుగుతున్న 35 శాతం మరణాలకు, చేరిన 24 గంటలలోపు జరిగే 40 శాతం మరణాలకు రక్తస్రావం కారణం అవుతోంది. అయితే ప్రీ హాస్పిటలైజేషన్, ఎమర్జెన్సీ సర్విసెస్, రిహాబిలిటేషన్, సర్జరీ, స్పెషలిస్ట్, ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటీస్ మధ్య సమన్వయం లోపం కారణంగా మరణాల రేటు ఎక్కువగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. సకాలంలో స్పందించడం ద్వారా 30 నుంచి 40 శాతం హాస్పిటల్ మరణాలను నివారించవచ్చని అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని అన్ని రహదార్లు కవర్ అయ్యేలా 55 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 17 టీచింగ్ ఆసుపత్రులు, 21 జిల్లా ఆసుపత్రులు, 16 ఏరియా ఆసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. వీటినే ‘టెరి’లుగా వ్యవహరిస్తారు. ప్రీ హాస్పిటల్ సేవలు.. ప్రీ హాస్పిటల్, ఇంట్రా హాస్పిటల్ సేవలుగా విభజించి ట్రామా కేర్ సెంటర్లలో సేవలు అందించనున్నారు. ౖప్రీ హాస్పిటల్లో భాగంగా ప్రమాద బాధితులను తక్షణమే, సురక్షితంగా ఆసుపత్రికి చేర్చుతారు. ప్రమాద స్థలికి 108 అంబులెన్స్ వేగంగా చేరేలా అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తారు. ప్రస్తుతం 426 అంబులెన్సులు ఉండగా, 292 వాహనాల్లో ఏఈడీలున్నాయి. మిగతా 133 వాహనాల్లో త్వరలో ఏర్పాటు చేస్తారు. 108 వాహనంలోకి బాధితుడిని తీసుకున్న వెంటనే అతని ఆరోగ్య పరిస్థితిని ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ఈ వివరాలు సమీపంలోని ఆసుపత్రికి చేరగానే అత్యవసర విభాగం వైద్యులు చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉంటారు. ఇంట్రా హాస్పిటల్ కేర్... ట్రామా కేర్ ఏర్పాటు చేయనున్న ఆసుపత్రుల్లో తగిన మార్పులు చేయనున్నారు. అంబులెన్స్ సులభంగా వచ్చి పోయేలా ఏర్పాటు చేయడంతో పాటు, దిగగానే ఎమర్జెన్సీ సేవలు అందేలా సదుపాయం కల్పిస్తారు. ఎమర్జెన్సీ విభాగం సులువుగా గుర్తించేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. ప్రత్యేక ఓపీ సేవలు కొనసాగిస్తారు. క్యాజువాలిటీ డిపార్ట్మెంట్లను ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లుగా మార్చుతారు. ఎమర్జెన్సీ విభాగంలో డెడికేటెడ్ ట్రయాజ్ ఏర్పాటు చేస్తారు. ఇందులో నాలుగు క్లినికల్ మేనేజ్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తారు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నలుపు రంగు సూచీలతో వీటిని విభజిస్తారు. ట్రయాజ్లో మల్టీ పారామీటర్ మానిటర్లు, మెడికల్ గ్యాస్ ఔట్ లెట్స్, ఇతర వైద్య సదుపాయాలు ఉంటాయి. అందుబాటులో అధునాతన వైద్య పరికరాలు ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రకారం, 5,000 చదరపు అడుగుల్లో 10 పడకల ఎమర్జెన్సీ మెడికల్ డిస్పాచ్ (ఈఎండీ) ఏర్పాటు చేస్తారు. ఆస్పత్రుల సామర్థ్యాన్ని బట్టి ఎమర్జెన్సీకి పడకలు కేటాయిస్తారు. ఆటోక్లేవ్ మిషన్, మొబైల్ ఎక్స్ రే, ఈ ఫాస్ట్, సక్షన్ ఆపరేటర్స్, డిఫ్రిబ్రిలేటర్స్, సీ ఆర్మ్, ఆల్ట్రాసోనోగ్రఫీ, ఆల్ట్రా సౌండ్, సీటీ స్కాన్, వెంటిలేటర్లు, ఓటీ ఎక్విప్మెంట్ వంటి అధునాతన వైద్య పరికరాలు సమకూరుస్తారు. ఒక్కో ట్రామా కేర్ సెంటర్లో మొత్తం 7 విభాగాలకు చెందిన స్పెషాలిటీ వైద్యులు, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బంది ఉంటారు. వీరికి జిల్లా స్థాయిలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ అందజేస్తారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణకు కృషి రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోం. ప్రకృతి విపత్తులు, రోడ్డు ప్రమాదాలు ఇతర అత్యవసర సమయాల్లో సరైన సమయంలో అవసరమైన వైద్యం అందక బాధితులు విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్ని నివారించేందుకు ‘టెరి’కి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట< వ్యాప్తంగా 55 చోట్ల ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. – టి.హరీశ్రావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి -
జనాన్ని పట్టిపీడిస్తున్న.. ‘హికికోమొరి’ పరిస్థితి.. కోవిడ్తో మరింత తీవ్రం
చలాకీగా ఉండే ఓ 35 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్.. ఉన్నట్టుండి ముభావంగా మారిపోయాడు.బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు..ఎవరితోనూ పెద్దగా మాట్లాడటం లేదు.ఎవరితోనూ కలవడం లేదు. అసలు ఇల్లు వదిలి బయటికి రావడం లేదు. డిగ్రీ చదువుతున్న ఓ అమ్మాయి..కాలేజీకి వెళ్లడం మానేసింది.. అలాగనిస్నేహితులతో షికార్లు, కబుర్లు వంటివి కూడా లేవు.. ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఓ గదిలో కూర్చుండి పోతోంది.. ఏమిటని అడిగితేబాగానే ఉన్నానంటోంది.. .. ఏమైంది ఈ ఇద్దరికి? వారు దారుణమైన ఘటనలేమీ ఎదుర్కోలేదు.. తీర్చలేని ఇబ్బందేమీఎదురుకాలేదు.. కానీ ‘హికికోమొరి’బారినపడ్డారు. అందరికీ దూరంగా ఏకాంతంగా గడిపేస్తున్నారు. అసలు ఏమిటీ ‘హికికోమొరి’? అదేమైనా మానసిక సమస్యా? దానికి కారణాలేమిటి?నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకుందామా.. జపాన్లో 15లక్షల మందికి.. జపాన్ ఆరోగ్య శాఖ ఇటీవల ఓ సర్వే చేసింది. దాదాపు 15 లక్షల మంది ‘హికికోమొరి’పరిస్థితిలో ఉంటున్నారని గుర్తించింది. నెలలు, సంవత్సరాలుగా వారు ఎవరితోనూ కలవడం లేదని తేల్చింది. వారి మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని చక్కదిద్దడానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. దానిపై స్పందించిన పలు స్థానిక సంస్థలు.. ‘హికికోమొరి’లతో మెటావర్స్ వేదిగా సమావేశాలు నిర్వహించనున్నట్టు ప్రకటించాయి. దీనికి సంబంధించి భారత్ సహా పలు దేశాల ఆంగ్ల మీడియాలో కథనాలు వచ్చాయి. ఏమిటీ హికికోమొరి? సామాజిక జీవనానికి దూరంగా దాదా పు ఒంటరితనంతో కూడిన జీవితాన్ని గడపడమే ‘హికికోమొరి’. 1980వ దశకంలో ఏర్పడిన ఆర్థిక మాంద్యం, ఉద్యోగాలు, ఉపాధి దెబ్బతినడంతో.. తొలిసారిగా ఇలాంటి పరిస్థితిని గుర్తించారు. దానికి ‘హికికోమొరి (అంతర్ముఖులుగా మారిపోవడం)’అని పేరుపెట్టారు. దీనిబారిన పడినవారు తమచుట్టూ తామే గిరి గీసుకుని బతికేస్తుంటారు. అలవాట్లను మార్చుకుంటారు. మానసిక ఆందోళన (యాంగ్జైటీ), కుంగుబాటు (డిప్రెషన్), అందరి మధ్య ఉన్నా ముభావంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కొందరిలో అయితే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వస్తుంటాయని నిపుణులు చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు అధికారికంగా దీనిని మానసిక సమస్యగా ప్రకటించలేదు. దీనికి కారణాలేమిటి? సామాజిక, విద్య, ఉద్యోగ పరమైన ఒత్తిళ్లు, కుంగుబాటు, ఆర్థికపరమైన సమస్యలతో ఆందోళన, వివిధ రకాల వేధింపులు వంటివి ‘హికికోమొరి’పరిస్థితికి దారితీస్తాయని నిపుణులు చెప్తున్నారు. ‘‘ఉమ్మడి కుటుంబాలు, సామాజిక సంబంధాలు తగ్గిపోవడం, విద్య, ఉద్యోగాల్లో తీవ్రమైన పోటీ వంటివి కూడా హికికోమొరి సిండ్రోమ్కు దారితీస్తాయి. ఇది వారిపై వ్యక్తిగతంగా, పరోక్షంగా సమాజంపైనా వ్యతిరేక ప్రభావం చూపుతుంది’’అని కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ విష్ణుప్రియ భగీరథ్ తెలిపారు. బయటపడేందుకు డబ్బులిస్తూ.. దక్షిణకొరియాలో 19 ఏళ్ల నుంచి 39 ఏళ్ల మధ్య వయసున్న మూడున్నర లక్షల మంది ‘హికికోమొరి’ సమస్యతో బాధపడుతున్నట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ ఇటీవల గుర్తించింది. ముఖ్యంగా తొమ్మిదేళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులు, ఉద్యోగులపై ప్రభావం ఎక్కువగా ఉందని తేలి్చంది. వారిని ఈ సమస్యనుంచి బయటపడేలా ప్రోత్సహించేందుకు నెలకు సుమారు రూ.40 వేలు (490 డాలర్లు) లివింగ్ అలవెన్స్గా ఇవ్వనున్నట్టు ఆ దేశ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. కుటుంబం,దగ్గరివారితో పరిష్కారం! ‘హికికోమొరి’బారినపడినవారు అందరికీ దూరంగా, ఏకాంతంగా గడపడం వల్ల మరింతగా మానసిక, శారీరక సమస్యలు చుట్టుముడతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒక్కోసారి ఇవి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. దీని బాధితులు మందుల కంటే.. కౌన్సెలింగ్, కుటుంబ సభ్యుల సాంత్వన వంటి మార్గాల ద్వారానే త్వరగా కోలుకుంటారని స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో అవసరమైతే డిప్రెషన్ వంటి కొన్ని సమస్యలకు మందులు వాడితే సరిపోతుందని అంటున్నారు. సంస్థలు, కార్యాలయాలు తమ ఉద్యోగుల్లో, విద్యా సంస్థలు తమ విద్యార్థులలో ఒత్తిడి తగ్గించేలా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. భారత్ సహా అన్ని దేశాల్లోనూ.. అన్ని రంగాల్లో పోటీ విపరీతంగా పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితులకు తోడు కరోనా మహమ్మారి దెబ్బతో ‘హికికోమొరి’పరిస్థితి పెరిగిపోయిందని నిపుణులు చెప్తున్నారు. ‘‘ఆర్థిక మాంద్యం, ఉద్యోగాలు పోవడం, ఉపాధి దెబ్బతినడం, నెలలకు నెలలు లాక్డౌన్, కోవిడ్ బారినపడి ఆరోగ్యం దెబ్బతినడం వంటివాటి నుంచి కోలుకోవడానికి చాలా మంది ఇంకా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు హికికోమొరి బారినపడుతున్నారు..’’అని ఢిల్లీకి చెందిన లైఫ్ కోచ్, సైకాలజిస్ట్ నిఖిలా దేశ్పాండే వివరించారు. వర్క్ ఫ్రం హోం, అన్నిరకాల సరుకుల హోం డెలివరీ వంటివి దీనికి తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు. ఒక్క జపాన్ అనే కాకుండా ప్రపంచదేశాలన్నిటా ఇలాంటి పరిస్థితి కనిపిస్తోందని వెల్లడించారు. భారతదేశంలో మానసిక ఆరోగ్యంపై దృష్టిపెట్టడం చాలా తక్కువకావడంతో.. ‘హికికోమొరి’సమస్య తలెత్తినా గుర్తించడం కష్టమని పేర్కొన్నారు. 8% 2017 నాటి ఆస్పెన్ అధ్యయనం ప్రకారం..భారతదేశంలో ఒంటరితనంతో బాధపడుతున్న యువత – సాక్షి సెంట్రల్ డెస్క్ -
అప్రమత్తతే అత్యంత కీలకం.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకర పరిస్థితులు!
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ఇన్ఫ్లూయెంజా లైక్ ఇల్నెస్ (ఐఎల్ఐ), సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ (ఎస్ఏఆర్ఐ)... గత కొంత కాలంగా వైద్య పరిభాషలో తరచుగా వినియోగిస్తున్న పదాలివి. ఆస్పత్రుల్లో జ్వరం, తీవ్ర శ్వాసకోశ సమస్యలకు సంబంధించిన కేసులు వేగంగా పెరుగుతున్నాయి. సీజన్ మార్పు నేపథ్యంలో జ్వరాలు, జలుబు, దగ్గు లక్షణాలు రావడం సహజమే అయినప్పటికీ ప్రస్తుతం వీటి తీవ్రత కాస్త ఎక్కువగా ఉంటోంది. వైరస్ ప్రభావంతో వస్తున్న ఈ సమస్యలను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వైద్యుల సహకారాన్ని తీసుకోవాలని, ప్రభుత్వ వైద్య సేవలను విస్తృతం చేసిన క్రమంలో ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ హెచ్చరిస్తోంది. ఈ మేరకు దేశంలోని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేసింది. జాగ్రత్తలు తప్పనిసరి... ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐఎల్ఐ, ఎస్ఏఆర్ఐ కేసులు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. రాష్ట్రాల వారీగా వచ్చిన నివేదికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తే వీటి పెరుగుదల స్పష్టమవుతోంది. ఈ క్రమంలో ఇటీవల కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర మంత్రులతో పాటు నీతి ఆయోగ్ సభ్యులు, సంబంధిత శాఖలు, సంస్థలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా పరిస్థితులను సమీక్షించిన అనంతరం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్రాలకు పలు అంశాలపై సూచనలు చేసింది. తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లోనూ ఈ అంశాలను ప్రస్తావిస్తూ తక్షణ చర్యలను సూచించింది. తాజాగా నమోదవుతున్న జ్వరాలు, శ్వాస కోశ సంబంధిత వ్యాధులకు కారణం హెచ్1ఎన్1, హెచ్3ఎన్2 వైరస్ ప్రభావం ఉన్నట్లు అధ్యయనా లు చెబుతున్నాయి. ఈ వైరస్ ప్రభావంతో వస్తున్న వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశా లు ఎక్కువగా ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధి లక్షణాలున్నవారు వెంటనే వైద్యుడి సంరక్షణలో జాగ్రత్తలు పాటించి చికిత్స పొందాలని చెపుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారిపై ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉండటంతో వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వైరస్ సోకిన వ్యక్తులతో మెదిలే సమయంలో మాసు్కలు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించడం, చేతులు క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం లాంటి చర్యలు తప్పకుండా తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచనలు జారీ చేసింది. కోవిడ్–19 జాగ్రత్తలు మరవద్దు.. దేశవ్యాప్తంగా కోవిడ్ కట్టడిలో ఉన్నా.. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, వ్యాధుల తీరును పరిశీలి స్తే కోవిడ్ కేసుల పెరుగుదలకు అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్ అంశాలను తప్పకుండా పాటించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. జ్వరాలు, శ్వాస సంబంధిత వ్యాధులపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కలిగించాలని, జాగ్రత్త చర్యలపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. అదేవిధంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆస్పత్రుల్లో మందులను అందుబాటులో ఉంచాలని, వైద్య పరికరాల పనితీరును సరిచూసుకోవాలని కోరింది. ఆక్సిజన్ వస తులను పునఃసమీక్షించుకోవాలని స్పష్టం చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు అన్ని రకాల ఆస్పత్రులను సన్నద్ధం చేయాలని ఆదేశించింది. కాగా, ‘గత కొన్ని నెలలుగా కోవిడ్–19 కేసులు గణనీయంగా తగ్గినప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ టెస్ట్ పాజిటివిటీ రేట్ క్రమంగా పెరుగుతుండటం తక్షణమే పరిష్కరించాల్సిన అంశం’అని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ శనివారం రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కొత్తగా నమోదవుతున్న కేసులు తక్కువగానే ఉంటున్నా, కోవిడ్ కట్టడికి ఐదంచెల వ్యూహం అమలుపై అప్రమత్తంగా ఉండాలి అని కోరారు. ఇన్ఫ్లూయెంజా ఏటా సీజనల్గా వ్యాప్తి చెందేదే అయినప్పటికీ ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, ఎక్కువ మంది జనం ఒకే చోట గుమికూడటం వంటి కారణాలతో హెచ్1ఎన్1, హెచ్3ఎన్2 వంటి కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. -
పోస్ట్ కోవిడ్తో యువతలో గుండెపోటు!
సాక్షి, హైదరాబాద్: ఇటీవల యువత, మధ్య వయస్సు వారిలో గుండెపోటు సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. జిమ్ చేస్తూ కొందరు, సాధారణ పనుల్లో ఉంటూనే మరికొందరు గుండెపోటుతో కుప్పకూలిపోయి అకాల మరణాల పాలవుతున్నారు. కొందరిలో కోవిడ్ సోకి తగ్గిన తర్వాత (పోస్ట్ కోవిడ్) ఏర్పడుతున్న ఆరోగ్య సమస్యలు ఇలా గుండెపోటు మరణాలకు కారణం అవుతున్నాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో యువకుల్లో గుండెపోట్లను నివారించడానికి ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు గురువారం ఒక అడ్వైజరీ (సలహాలు, సూచనల నివేదిక)ను విడుదల చేశారు. కొందరు కోవిడ్ సోకి కోలుకున్నా కూడా.. వైరస్ ప్రభావం వల్ల ఎండోథెలియం (గుండె రక్తనాళాల్లోని లోపలి పొర)లో మార్పులు జరుగుతున్నాయని తెలిపారు. యువతీ యువకుల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా దీన్ని వెంటనే గుర్తించలేకపోతారని.. దీనితో ఒక్కోసారి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణాలు సంభవిస్తున్నాయని విశ్లేషించారు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ విడుదల చేసిన అడ్వైజరీ ఇదీ.. ►యువతీ యువకులు కూడా నిర్ణీత కాలంలో ఆ రోగ్య పరీక్షలు చేయించుకోవాలి. 18 ఏళ్లు దాటినవారు కనీసం రెండేళ్లకోసారి బీపీ పరీక్షలు చే యించుకోవాలి. 18–39 మధ్య వయసు వారు ఏడాదికోసారి, 40 ఏళ్లు దాటినవారు తరచూ బీపీ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ►20 ఏళ్ల వయసు నుంచే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను చెక్ చేసుకుంటూ ఉండాలి. దీని వల్ల గుండె జబ్బుల సమస్యను ముందుగా గుర్తించవచ్చు. పెద్దలు కనీసం 4 నుంచి 6 నెలలకోసారి కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవాలి. ►గుండె జబ్బులకు ప్రధాన కారణాల్లో మధు మేహం (షుగర్) ఒకటి. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా షుగర్ ఉంటే, ముందస్తుగానే షుగర్ పరీక్షలు చేయించుకోవడం మంచిది. ►గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. పండ్లు, బీన్స్, చిక్కుళ్లు వంటివి, చేపలు, తక్కువ కొవ్వు లేదా కొవ్వు రహిత పాల ఉత్పత్తులు, తృణధాన్యా లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు కలిగిన పదార్థాలు తీసుకోవాలి. ►ఎక్కువ ఉప్పు, చక్కెర ఉండేవి, ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్ ఆహారాలు, ఆల్కహాల్, మాంసం, కొవ్వు, పాల ఉత్పత్తులు, వేయించిన ఫాస్ట్ ఫుడ్, చిప్స్, కాల్చిన ఆహారం వంటివాటికి దూరంగా ఉండాలి. ►రోజూ 30 నుంచి 60 నిమిషాల వరకు వ్యాయామం చేయాలి. వారానికి కనీసం 150 నిమిషాలు మితమైన ఏరోబిక్ వ్యాయామం చేయాలి. లేదా వారానికి 75 నిమిషాలు రన్నింగ్ వంటి శ్రమతోకూడిన ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి. ►ఎత్తుకు తగ్గ శారీరక బరువు ఉండేలా చూసుకో వాలి. 3 నుండి 5 శాతం వరకు బరువు తగ్గడం వల్ల రక్తంలో కొన్ని కొవ్వులు, రక్తంలో చక్కెర (గ్లూకోజ్) తగ్గడం, టైప్–2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి తోడ్పడుతుంది. ►ఏ వయసు వారైనా కంటి నిండా నిద్రపోవాలి. పెద్దలకు రాత్రిపూట కనీసం ఏడు గంటల నిద్ర అవసరం. రోజూ ఒకే సమయాల్లో పడుకోవడం, మేల్కోవడం చేయాలి. పడకగది చీకటిగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలి. తద్వారా తగినంత నిద్రపోవడం సాధ్యమవుతుంది. ►మానసిక ఒత్తిడిని నియంత్రణలో ఉంచుకోవాలి. శారీరక శ్రమ, ధ్యానం వంటివి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ►ధూమపానం, పొగాకు వాడకాన్ని నిలిపివేయాలి. ఈ అలవాటు ఇప్పటికిప్పుడు మానేసినా గుండె జబ్బు ప్రమాదం సగం తగ్గుతుంది. -
వైద్యారోగ్య శాఖలో...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో పోస్టుల హేతుబద్ధీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. అవసరమైన చోట కొత్త పోస్టుల మంజూరు, అవసరం లేనిచోట రద్దు చేయడంతోపాటు వైద్యులు అధికంగా ఉన్నచోట నుంచి తక్కువగా ఉన్నచోటుకు బదిలీ చేయడం వంటి చర్యలు చేపట్టనున్నట్టు వెల్లడించాయి. కొత్తగా డీఎంహెచ్వో పోస్టులు ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలుంటే 19 జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్వో) పోస్టులు మాత్రమే ఉన్నాయి. అలాగే కోటి జనాభా ఉన్న హైదరాబాద్లో ఒక డీఎంహెచ్వో పర్యవేక్షించడం కష్టమైన వ్యవహారం. దీంతో హైదరాబాద్కు మరో ఐదు డీఎంహెచ్వో, ఇతర జిల్లాలకు ఒక్కో డీఎంహెచ్వో పోస్టులు అవసరమని వైద్యారోగ్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ మేరకు కొత్తగా 19 డీఎంహెచ్వో పోస్టులకు కేబినెట్ అనుమతి ఇచ్చిందని, మొత్తం డీఎంహెచ్వోల సంఖ్య 38కి పెరిగినట్టేనని వైద్యారోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక నుంచి హైదరాబాద్కు ఆరుగురు డీఎంహెచ్వోలు, మిగతా అన్ని జిల్లాలకు ఒక్కో డీఎంహెచ్వో ఉంటారు. త్వరలోనే హైదరాబాద్కు ఐదుగురు అదనపు డీఎంహెచ్వోల నియామకం జరగనుందని.. దీనితో నగరంలో ప్రభుత్వ వైద్య సేవలు మరింత మెరుగుపడతాయని.. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులపై పర్యవేక్షణ సులువు అవుతుందని అధికారులు అంటున్నారు. అవసరమైన చోటకి వైద్యం, సిబ్బంది వైద్యారోగ్యశాఖలో హేతుబద్ధీకరణ చర్యలు చేపట్టాలన్న ప్రతిపాదనలు చాలాకాలం నుంచి ఉన్నాయి. కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరానికి మించి వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది ఉంటుంటే.. కొన్ని ఆస్పత్రుల్లో అవసరమైన స్థాయిలో వైద్యులు, సిబ్బంది లేరు. చాలామంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో, జిల్లా కేంద్రాల్లోనే ఉండిపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో సిబ్బంది కొరతతో రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. ఈ క్రమంలో ఎక్కువగా ఉన్న చోటి నుంచి తక్కువగా ఉన్న చోట్లకు సిబ్బందిని సర్దుబాటు చేయాలని వైద్యారోగ్యశాఖ ప్రతిపాదించింది. దీనికి కూడా సర్కారు ఆమోదం తెలిపిందని వైద్య వర్గాలు వెల్లడించాయి. కౌన్సెలింగ్ పద్ధతిలో హేతుబద్ధీకరణ చేపట్టే అవకాశం ఉందని తెలిపాయి. అవసరం లేని పోస్టుల రద్దు లెప్రసీ వంటి పలు విభాగాల్లోని కొన్ని పోస్టులకు ప్రస్తుతం కాలం చెల్లిందని వైద్యారోగ్య శాఖ వర్గాలు అంటున్నాయి. వాటిలోని చాలా మందికి పనిలేదని, పలుచోట్ల ఆయా పోస్టుల అవసరం లేదన్న అభిప్రాయమూ ఉందని చెప్తున్నాయి. అటువంటి పోస్టులను అవసరమైన చోటికి మార్చడమో, రద్దు చేయడమో చేయాలనే ప్రతిపాదనలు ఉన్నట్టు తెలిసింది. కొన్నిచోట్ల లిఫ్ట్ ఆపరేటర్లు అవసరం లేదని భావిస్తున్నారు. ఇలా విభాగాల వారీగా అవసరం లేని పోస్టులను గుర్తించి.. రద్దు చేయడమా, ఇతర చోట్ల సర్దుబాటు చేయడమా, పోస్టుల విధులు మార్చడమా.. అన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. -
ఉగాది నాటికి విలేజ్ క్లినిక్స్ నిర్మాణాలు పూర్తి చేయాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖపై గురువారం సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగానే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఆరోగ్యశ్రీ, నాడు–నేడు కార్యక్రమాలు తదితర అంశాలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష జరిపారు. అయితే, అక్టోబరు 21న ప్రారంభించిన ఫ్యామిలీ డ్యాక్టర్ కాన్సెప్ట్ పైలెట్ ప్రాజెక్టు అమలుపై సీఎం జగన్ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రాజెక్టు అమలుకోసం తీసుకుంటున్న చర్యలను, పైలెట్ ప్రాజెక్టు అమలులో గుర్తించిన అంశాలను అధికారులు వివరించారు. ఈ క్రమంలో అధికారులు.. 26 జిల్లాల్లో నెలరోజుల వ్యవధిలో 7,166 విలేజ్ క్లినిక్స్లలో రెండుసార్లు చొప్పున, 2,866 విలేజ్ క్లినిక్స్లలో ఒకసారి చొప్పున ఫ్యామిలీ డాక్టర్ 104 వాహనంతో పాటు వెళ్లారని తెలిపారు. డిసెంబర్లో అదనంగా మరో 260.. 104 వాహనాలు సమకూర్చుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు. దీంతో పూర్తిస్థాయిలో 104 వాహనాలు అందుబాటులోకి రానున్నట్టు స్పష్టం చేశారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వల్ల వైద్య సిబ్బందిలో వివిధ విభాగాల మధ్య సమన్వయం, సమర్థత గణనీయంగా పెరిగాయన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పాఠశాల విద్యార్థులు, అంగన్వాడీ పిల్లలు, గర్భవతుల ఆరోగ్యంపైన కూడా పరిశీలన చేస్తున్నామన్న అధికారులు తెలిపారు. ఎనీమియాతో బాధపడుతున్న వారిని కూడా గుర్తించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా నెలరోజుల వ్యవధిలో 7,86,226 మందికి సేవలందించామని వెల్లడించారు. హైపర్ టెన్షన్తో బాధపడుతున్న 1,78,387 మందిని, 1,25,948 మంది మధుమేహంతో బాధపడుతున్నారని గుర్తించినట్టు తెలిపారు. వీరికి వైద్యసాయం అందించినట్టు స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇవే.. - ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో క్రమం తప్పకుండా మందులు ఇవ్వడమే కాదు.. వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నదానిపై సూచనలు కూడా ఇవ్వాలి. - ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి తగిన స్థాయిలో సన్నద్ధం కావాలి. - అవసరాలకు తగిన విధంగా 104 వాహనాలను సమకూర్చుకోవాలి. - ఎక్కడా ఖాళీలు లేకుండా సిబ్బందిని భర్తీచేయాలి. ఆలోగా విలేజ్ క్లినిక్స్ నిర్మాణాలను పూర్తిచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి. - ఉగాది కల్లా వీటిని పూర్తిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలి. - ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలులో స్త్రీ శిశుసంక్షేమ శాఖను భాగస్వామ్యం చేయాలి. - పిల్లలు, గర్భవతులు, బాలింతల్లో ఎనీమియాతో బాధపడుతున్న వారిని గుర్తించి ఆ డేటాను స్త్రీ శిశుసంక్షేమశాఖకు బదిలీచేయాలి. డేటా ప్రకారం ఆయా లక్షణాలున్నవారికి పౌష్టికాహారం, మందులు అందించేలా తగిన చర్యలు తీసుకోవాలి. - గ్రామ సందర్శనలో భాగంగా ఫ్యామిలీ డాక్టర్ ఆ గ్రామంలో మంచానికి పరిమితమైన రోగులను తప్పనిసరిగా కలవాలి. - వైద్య, ఆరోగ్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించాలి. - ఆరోగ్యశాఖలోని ఆశా వర్కర్ స్ధాయి వరకూ కూడా ట్యాబులు లేదా సెల్ఫోన్లు ఇవ్వాలి. - ఇందులో వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించి అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్యశ్రీ సహా వివిధ కార్యక్రమాలకు సంబంధించిన యాప్లు ఉంచాలని ఆదేశించారు. - ఆరోగ్యశ్రీపై మరింత అవగాహన కలిగించాలి. ఏ వ్యాధికి ఏ ఆసుపత్రిలో చికిత్స లభిస్తుందన్నది బాధితులకు తెలియాజేయాలి. - ఎవరికైనా ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించాలంటే.. సంబంధిత చికిత్సను అందించే నెట్వర్క్ ఆసుపత్రి వివరాలు వెంటనే తెలిసేలా యాప్ను రూపొందించాలి. సంబంధిత ఆసుపత్రి లొకేషన్తో పాటు డైరెక్షన్ కూడా చూపేలా ఈ యాప్ ఉండాలి. - ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు దగ్గర నుంచి కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రి గురించి గైడ్ చేసే పరిస్థితి రావాలి. ప్రజలకు కూడా ఈ యాప్ అందుబాటులో ఉండేలా చూడాలి. ఆరోగ్య శ్రీసాప్ట్వేర్ కూడా బాగా మెరుగుపరచాలి. - ఎవరైనా తమకు వైద్యం కోసం ఎక్కడకు వెళ్లాలి? ఏ జబ్బుకు ఎక్కడ వైద్యం అందుతుంది? దీనికి ఆరోగ్య శ్రీ సేవలు ఎక్కడ అందుతాయి అన్నదానిపై లొకేషన్ సైతం తెలియజేసేలా యాప్లో వివరాలు ఉండాలి. - అలాగే ఫ్యామిలీ డాక్టర్ సంబంధిత గ్రామానికి వెళ్లినప్పుడు కూడా రియల్టైం డేటా కూడా రికార్డు చేయాలి. దీనివల్ల సిబ్బంది మధ్య సమన్వయం, వివిధ విభాగాలు తీసుకునే చర్యల మధ్య కూడా సమన్వయం చక్కగా కుదురుతుంది. - ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పర్యవేక్షణకు సమర్థయంత్రాంగం ఉండాలి. రాష్ట్రస్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో, మండల స్థాయిలో అధికారులను ఉంచాలి. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటుచేయాలి. ఆరోగ్యరంగంలో ఎలాంటి ఫిర్యాదునైనా 104 ద్వారా స్వీకరించాలని, విలేజ్ క్లినిక్స్ సహా అన్నిచోట్లా ఈ నంబర్ను ఉంచాలని సీఎం జగన్ ఆదేశించారు. - ఆరోగ్యశ్రీ సేవల విషయంలో ఏమైనా తప్పులు ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. సరిగ్గా సేవలు అందించకపోవడం, సేవల్లో నాణ్యత లేకపోవడం వంటి అంశాలపై కచ్చితంగా దృష్టిపెట్టాలి. నెగిటివ్ ఫీడ్బ్యాక్పై కచ్చితంగా పరిశీలన, చర్యలు ఉండాలి. డయాలసిస్ పేషెంట్లకు సేవలందించేందుకు 108 వాహనాలు వినియోగించుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఏం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి జీ ఎస్ నవీన్ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ జి నివాస్, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్ హరీంద్రప్రసాద్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్ రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ వి వినోద్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ (డ్రగ్స్) రవి శంకర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
Telangana: గణనీయంగా తగ్గిన మాతృ మరణాలు..
సాక్షి, హైదరాబాద్: మాతా, శిశు సంరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. మాతృ మరణాల రేటు (ఎంఎంఆర్) గణనీయంగా తగ్గటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్ఆర్ఎస్) ప్రత్యేక బులిటెన్ 2018–20 ప్రకారం, రాష్ట్రంలో ఎంఎంఆర్ 43కు తగ్గింది. 2017–19లో ఇది 56 ఉండగా, వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల ఎంఎంఆర్ ఏకంగా 13 పాయింట్లు తగ్గింది. తద్వారా అతి తక్కువ మరణాలతో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. కేరళ, మహారాష్ట్ర మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. జాతీయ సగటు 97గా నమోదైంది. అంటే తెలంగాణ కన్నా రెట్టింపు అన్నమాట. 2017–19లోనూ తక్కువ ఎంఎంఆర్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రం ఏర్పడేనాటికి ఎంఎంఆర్ 92గా ఉండేది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల క్రమంగా తగ్గుతూ ఇప్పుడు 43కు చేరింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 49 పాయింట్లు తగ్గింది. జాతీయ సగటు 2014లో 130గా ఉండగా... ఇప్పుడు 97కు తగ్గింది. కేవలం 33 పాయింట్లు మాత్రమే తగ్గుదల నమోదైంది. ►అత్యధిక మాతృమరణాలు నమోదవుతున్న టాప్ మూడు రాష్ట్రాల్లో అస్సాం 195, మధ్యప్రదేశ్ 173, ఉత్తర్ ప్రదేశ్ 167గా నమోదయ్యాయి. 2017–19 నుంచి 2018–20 మధ్య ఆయా రాష్ట్రాల్లో ఎంఎంఆర్ తగ్గకపోగా పెరిగింది. మధ్యప్రదేశ్లో 10 పాయింట్లు, హరియాణాల్లో 14 పెరగగా, ఉత్తర్ ప్రదేశ్లో ఎంఎంఆర్ తగ్గుదలలో ఎలాంటి పురోగతి నమోదు కాలేదు. ఐరాస ప్రకారం 70 కంటే తక్కువ లక్ష్యం... ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ‘మాతృ మరణం అనేది ఒక మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు లేదా గర్భం ముగిసిన 42 రోజులలోపు సంబంధిత కారణాల వల్ల జరుగుతుంది. 15–49 ఏళ్ల వయస్సుగల సంబంధిత మహిళల్లో లక్షకు జరిగే మరణాలను లెక్కలోకి తీసుకుంటారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) లక్ష్యం లక్షకు 70 కంటే తక్కువ చేయాలని నిర్ణయించగా, తెలంగాణ ఎప్పుడో ఆ లక్ష్యానికి చేరుకుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కేసీఆర్ కిట్, మాతా శిశు సంరక్షణ చర్యల్లో భాగంగానే ఎంఎంఆర్ తగ్గింది. కేసీఆర్ కిట్ పథకంలో భాగంగా ప్రతి ఒక్క గర్బిణిని నమోదు చేసుకోవడం, ప్రతి నెలా చెకప్స్ చేయించడం, ఉచితంగా అమ్మ ఒడి వాహన సేవలు అందించడం వల్ల గర్భిణులకు నాణ్యమైన సేవలు అన్ని దశల్లో అందుతున్నాయి. అరికట్టగలిగిన మాతృ మరణాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడంలో భాగంగా మిడ్ వైఫరీ వ్యవస్థను ప్రభుత్వం ప్రారంభించింది. ఎంపిక చేసిన నర్సులకు శిక్షణ ఇచ్చి వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచింది. ఈ మేరకు 207 మంది మిడ్ వైఫరీ నర్సులు సేవలు అందిస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ కృషి అభినందనీయం: మంత్రి హరీశ్రావు ఎంఎంఆర్ 56 నుంచి 43కు తగ్గటం గొప్ప విషయం. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వాహనాలతో పాటు, ఇతర సంరక్షణ చర్యలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్రంలో 300 అమ్మ ఒడి వాహనాలు ఉండగా, ఈ ఏడాది ఇప్పటివరకు 12.61 లక్షల మంది గర్బిణులు లబ్ధి పొందారు. మొత్తం కేసీఆర్ కిట్ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన ఖర్చు రూ.1,525 కోట్లు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ కృషి అభినందనీయం. ఎంఎంఆర్ తగ్గుదలలో డబుల్ ఇంజిన్ రాష్ట్రాలు వెనుకబడ్డాయి. అత్యధిక మాతృ మరణాలు నమోదవుతున్న టాప్ మూడు రాష్ట్రాలు అస్సాం, మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రాలే. -
మరణించిన వ్యక్తికి.. బూస్టర్ డోస్
బయ్యారం(వరంగల్): మరణించిన వ్యక్తికి బూస్టర్ డోస్ వేసినట్లు ఆరోగ్యశాఖ నుంచి మెసేజ్ వచ్చింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. మండల కేంద్రానికి చెందిన బొందలపాటి కృష్ణయ్య(87) అనారోగ్యంతో గత నెల 28న మృతి చెందాడు. అంతకుముందు కృష్ణయ్య సంగారెడ్డి జిల్లా పరిధిలో నివాసం ఉండేవారు. కోవిడ్ టీకా రెండు డోసులూ సంగారెడ్డి జిల్లా బానూర్ పీహెచ్సీ పరిధిలో వేసుకున్నాడు. అయితే ఈనెల 17న క్రిష్ణయ్యకు బూస్టర్డోస్ వేసినట్టు సెల్ఫోన్కు మెసేజ్ వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆశ్చర్యానికి గురై ఆన్లైన్లో కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పరిశీలించారు. అందులోనూ బూస్టర్డోస్ వేసినట్టు ఉంది. -
కొత్త కళ్ల జోడుతో సరికొత్త వెలుగులు
సిద్దిపేటజోన్: కొత్త కళ్ల జోడు.. కళ్లలో కొత్త వెలుగులు నింపుతుందని, ప్రభుత్వం తరఫున గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కంటి సమస్యలు ఉన్న ప్రతీ ఒక్కరికి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు భరోసా ఇచ్చారు. సోమవారం స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో కంటి అద్దాలు పంపిణీ చేశారు. ‘‘మీ చల్లని చూపుతో మా కంటికి కొత్త వెలుగులు వచ్చాయని, ఇప్పుడు అన్ని బాగా చూడగలుగుతున్నాం. బిడ్డా... నీవు సల్లంగా ఉండాలి’’అని మంత్రిని ఈ సందర్భంగా వృద్ధులు ఆశీర్వదించారు. దశాబ్దాలుగా కంటి సమస్యలతో బాధపడుతున్న పేదవారికి కాటరాక్ట్ ఆపరేషన్లు చేసి మందులు ఇవ్వడం సంతృప్తినిచ్చిందని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 762 మందికి కాటరాక్ట్ ఆపరేషన్లు చేసి మందులు పంపిణీ చేశామన్నారు. మరో 1,800మందికి చేయాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జిల్లా వైద్యాధికారి కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: లిక్కర్ డీ ఎడిక్షన్ (మద్యానికి బానిసైన వారిని ఆ అలవాటు మాన్పించేలా చికిత్స ఇచ్చే) కేంద్రాల ఏర్పాటుపై మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. లేని పక్షంలో తదుపరి వాయిదాకు వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(డీహెచ్), డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)లు నేరుగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్ డీ ఎడిక్షన్, లిక్కర్ డీ ఎడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని జీవోలో ఉన్నా.. ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదంటూ అడ్వొకేట్, సామాజిక కార్యకర్త మామిడి వేణుమాధవ్ హైకోర్టులో 2016లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. వేణుమాధవ్ వాదనలు వినిపిస్తూ.. డీ ఎడిక్షన్ కేంద్రాలను జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తామని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013లో జీవో ఇచ్చిందన్నారు. పిటిషన్ దాఖలు చేసి ఆరేళ్లవుతున్నా ప్రతివాదులు ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది. -
సీజనల్ వ్యాధులకు చెక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టినందున సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి టి. హరీశ్రావు అన్నారు. డెంగీ, మలేరియా, ఇతర వ్యాధులు ప్రబలకుండా ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని, అధికారులు కూడా ఇంటింటి సర్వే ద్వారా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలతో మంత్రుల సమీక్ష జరిగింది. అనంతరం హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. గిరిజన ప్రాంతాలు, గూడేలతోపాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో డెంగీ కేసులు పెరుగుతున్నాయని, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మలేరియా కేసులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్త వహించాలని కోరారు. మలేరియా, డెంగీ కేసులు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నామని, అన్ని జిల్లాల్లో కిట్స్ అందుబాటులో ఉంచామని వెల్లడించారు. కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ను అంటువ్యాధులకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్గా నియమించినట్లు తెలిపారు. వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గురుకులాల్లో నిల్వ ఉంచిన బియ్యం స్థానంలో తాజా బియ్యాన్ని సరఫరా చేయాలని మంత్రి గంగుల కమలాకర్ను కోరినట్లు చెప్పారు. వరదల వల్ల ఏర్పడిన కరెంటు ఇబ్బందుల పరిష్కారానికి సంబంధిత శాఖలకు రూ.పదేసి కోట్ల చొప్పున విడుదల చేసినట్లు తెలిపారు. సమీక్షలో హరీశ్రావుతోపాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ సీఎస్ సోమేశ్కుమార్ పాల్గొన్నారు. గురుకులాలకు ఫుడ్ ఇన్స్పెక్టర్లు సంక్షేమ విద్యాసంస్థల్లో ఆహార నాణ్యతను నిర్ధారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తనిఖీలకు ఉపక్రమించింది. కొన్ని రోజులుగా సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు, వసతిగృహాలతోపాటు ఇతర విద్యాసంస్థల్లో ఆహారం వికటిస్తున్న సందర్భాలు వెలుగుచూస్తున్న క్రమంలో సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గురుకుల విద్యాసంస్థలు, సక్షేమ వసతి గృహాల్లో ఆహార నాణ్యతను పరిశీలించాలని కోసం ఫుడ్ ఇన్స్పెక్టర్లను ఆదేశించింది. మంకీపాక్స్పై అప్రమత్తంగా ఉన్నాం మంకీపాక్స్ వ్యాధి పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని హరీశ్రావు స్పష్టం చేశారు. ‘కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చిన ఇబ్రహీం అనే వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించాం. ప్రస్తుతం ఫీవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఇబ్రహీం నమూనాలను పుణేలోని ఎన్ఐవీ ల్యాబ్కు పంపాం. మంకీపాక్స్ చికిత్సకు ఫీవర్ ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. గాంధీ ఆసుపత్రిలో మంకీపాక్స్ పరీక్షలు నిర్వహిస్తారు. మంకీపాక్స్ లక్షణాలుంటే వెంటనే ఫీవర్ ఆసుపత్రిని సందర్శించాలి’అని హరీశ్రావు చెప్పారు. ప్లేట్లెట్స్ పడిపోతే ఆందోళనలతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని, అన్ని జిల్లా, బోధనాసుపత్రుల్లో ప్లేట్లెట్స్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. -
‘కరోనా’ కక్కుర్తిని కక్కించారు!
కోవిడ్ సందర్భంగా ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేసిన అధిక ఫీజులను వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. నగర వైద్య చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో ఆస్పుత్రుల మీద వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం వైద్యారోగ్య శాఖ వినతి మేరకు సిటీ ఆసుపత్రులు రోగుల నుంచి వసూలు చేసిన అధిక ఫీజులను వెనక్కి ఇచ్చేశాయి. నగరానికి చెందిన ఓ ఆర్టీఐ కార్యకర్తకు అందించిన సమాచారంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. సాక్షి, హైదరాబాద్: కోవిడ్ చికిత్స ఛార్జీలపై 2020 జూన్ 15న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత రేట్లను జారీ చేసింది చికిత్స పరీక్షల కోసం ప్రైవేట్ ఆసుపత్రులు/లేబొరేటరీలు వసూలు చేసే బిల్లులపై పరిమితిని విధించింది. అయితే వాటిని ప్రైవేటు ఆసుపత్రులు ఉల్లంఘించాయి. దారి చూపిన హెల్ప్లైన్ రొటీన్ వార్డు అండ్ ఐసోలేషన్లో చేరేందుకు రోజుకు రూ.4వేలు, వెంటిలేటర్ లేకుండా ఐసియూ ఐసోలేషన్కు రోజుకు రూ.7,500, వెంటిలేటర్తో ఐసియూ ఐసోలేషన్కు రోజుకు రూ.9 వేలుగా నిర్ణయించింది. అయితే ఆసుపత్రులు మాత్రం రకరకాల పేర్లు పెట్టి అధిక ఛార్జీలు వేసి బిల్లులు పెంచి సొమ్ము చేసుకుంటున్నారని రోగుల నుంచి పెద్ద యెత్తున ఆరోపణలొచ్చాయి. గత సంవత్సరం, కోవిడ్–19 రోగులను పదే పదే ఉల్లంఘించినందుకు కనీసం 30 ఆసుపత్రులను కోవిడ్ చికిత్సల నుంచి నిషేధించింది. అంతేకాకుండా ఒక హెల్ప్లైను ఏర్పాటు చేసి, ఆసుపత్రులు ఎక్కువ వసూలు చేస్తున్నాయని భావిస్తే ఫిర్యాదు చేయాలని కోరింది. వెల్లువెత్తిన ఫిర్యాదులు.. కరోనా చికిత్స కోసం ఆసుపత్రులు వివిధ అదనపు బిల్లులను వసూలు చేస్తున్నాయని రోగులు, బంధువుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గత నెల ఆఖరు వరకు ప్రభుత్వం నిర్ణయించిన చికిత్స ఛార్జీలను ధిక్కరించినందుకు 268 ప్రైవేట్ ఆసుపత్రులపై 843 ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో 87 ఫిర్యాదులకు రీఫండ్లు అందించాల్సి వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి వసూలు చేసిన బిల్లులను వాపసు చేసే విషయంపై ప్రైవేట్ ఆసుపత్రులతో చర్చలు జరిపేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా నగరంలోని 87 ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి రూ. 1.61 కోట్లకు పైగా సొమ్మును రోగులకు వెనక్కి ఇచ్చారు. అత్యధిక రిఫండ్ ఓమ్ని ఆసుపత్రిదే... కూకట్పల్లిలోని ఓమ్ని ఆసుపత్రి అత్యధికంగా రూ.27,41,948 రీఫండ్ చెల్లించింది. ఉప్పల్లోని టీఎక్స్ హాస్పిటల్ రూ.10,85,000, కొండాపూర్లోని మెడికవర్ హాస్పిటల్ రూ.10,82,205 రీఫండ్ చేశాయి. బంజారాహిల్స్లోని సెంచురీ హాస్పిటల్స్ (రూ.10 లక్షలు), ఎల్బీ నగర్లోని అంకురా హాస్పిటల్ (రూ.6.1 లక్షలు), ఎల్బి నగర్లోని దియా హాస్పిటల్ (రూ. 6 లక్షలు), హైదరాబాద్ నర్సింగ్ హోమ్ (రూ.5 లక్షలు), సెక్రటేరియట్లోని మెడికవర్ హాస్పిటల్ (రూ.5.7 లక్షలు), కూకట్పల్లిలోని ప్రతిమ హాస్పిటల్ (రూ.8.2 లక్షలు) గచ్చిబౌలిలోని సన్షైన్ హాస్పిటల్ (రూ.5 లక్షలు) రోగులకు రీఫండ్ చేసిన ఆసుపత్రుల్లో ఉన్నాయి. (చదవండి: ‘న్యాక్’కు దూరంగా కాలేజీలు!) -
‘బయోమెట్రిక్’ లెక్కనే జీతాలు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది హాజరుపై వైద్యారోగ్య శాఖ ప్రత్యేకంగా దృష్టిసారించింది. వైద్యులు నిత్యం ఆస్పత్రులకు వచ్చేలా, సకాలంలో హాజరయ్యేలా చూడాలని.. జీతాలు ఇవ్వాలంటే బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బయోమెట్రిక్ హాజరు సరిగా లేని వైద్యులు, సిబ్బందికి నోటీసులు జారీ చేస్తోంది. ఇప్పటికే ఏర్పాట్లు ఉన్నా.. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ హాజరు వ్యవస్థలు ఉన్నప్పటికీ సరిగా అమలు చేయడం లేదు. వైద్యులు, సిబ్బంది కూడా బయోమెట్రిక్ను పట్టించుకోవడం లేదు. కొన్నిచోట్ల సదరు పరికరాలను పాడుచేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇక నుంచి ఏరియా, జిల్లా ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, బోధనాస్పత్రుల్లో బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేయాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాల (సీహెచ్సీ)లోనూ బయోమెట్రిక్ వ్యవస్థను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి, బయోమెట్రిక్ హాజరు ప్రకారమే జీతాలు ఇవ్వనుంది. ఎక్కడైనా వైద్య సిబ్బంది సకాలంలో హాజరుకాకున్నా, చెప్పాపెట్టకుండా గైర్హాజరైనా ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇటీవల వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని కరీంనగర్, గజ్వేల్లలోని జిల్లా ఆస్పత్రుల్లో పలువురు డాక్టర్లు, స్టాఫ్ నర్సులు సకాలంలో హాజరుకాకపోవడంతో కమిషనర్ అజయ్కుమార్ నోటీసులు జారీచేశారు. నల్లగొండ మెడికల్ కాలేజీలో 57 మంది అధ్యాపకులకు కూడా నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. తెలంగాణ ప్రభుత్వ అధ్యాపకుల సంఘం నాయకులు అక్కడికి వెళ్లి పరిస్థితిని ఆరా తీశారు. కక్షగట్టి నోటీసులు ఇచ్చారని ఆందోళన చేయడంతో చివరికి నోటీసులను వెనక్కు తీసుకున్నారు. కొన్నిచోట్ల స్థానిక సూపరింటెండెంట్లు, కాలేజీల ప్రిన్సిపాల్లు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వైద్యులు ఆరోపిస్తుండటం గమనార్హం. ఆకస్మిక తనిఖీలు కూడా.. పేదలకు వైద్యాన్ని చేరువ చేయాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. పీహెచ్సీల నుంచి బోధనాస్పత్రుల దాకా అన్నిచోట్లా మెరుగైన వసతులు కల్పిస్తూనే, వైద్యులు, సిబ్బంది సరిగా హాజరయ్యేలా చూడాలని నిర్ణయించింది. వైద్యులు సకాలంలో హాజరయ్యేలా చూడాలని సంబంధిత అధిపతులకు సూచించింది. ‘‘ఉన్నతాధికారులు వారంలో మూడు రోజులు జిల్లాలకు వెళ్లాలి. ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలి. సకాలంలో హాజరుకాని వారిపైనా, అనధికారిక గైర్హాజరుపైనా చర్యలు తీసుకోవాలి. పరిస్థితిని చక్కదిద్దాలి’’ అని ఇటీవల వైద్యారోగ్యశాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్, వైద్య విద్య సంచాలకుడు రమేశ్రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు జిల్లాలకు వెళ్లి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. రోగులతో మాట్లాడి ఆస్పత్రుల్లో సేవలను మెరుగుపరుస్తున్నారు. వచ్చిన రెండు నెలల్లోనే వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ 20 జిల్లాల్లో పర్యటించారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఉదయం 8 గంటలకే ఆస్పత్రులకు వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. ఇలా ఉన్నతాధికారుల తనిఖీలతో వైద్య సిబ్బందిలో భయం నెలకొందని అంటున్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు కూడా వరుసగా జిల్లా ఆస్పత్రులు, బోధనాసుపత్రులపై సమీక్ష చేస్తున్నారు. మొత్తం అన్ని ఆస్పత్రులపైనా నెలవారీ సమీక్ష కేలండర్ చేపట్టి.. వైద్య సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లు ఉన్న వైద్యు లు, దూర ప్రాంతాల నుంచి వచ్చిపోయేవారు మాత్రం బయోమెట్రిక్ హాజరుపై ఆగ్రహంగా ఉన్నారని వైద్యారోగ్య సిబ్బంది చెప్తున్నారు. -
ఔట్ సోర్సింగ్లకూ 30% వెయిటేజీ
సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్యశాఖలో పోస్టుల భర్తీపై ఆ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చేపట్టిన నియామకాల్లో కాంట్రాక్టు ఉద్యోగులకే వెయి టేజీ కల్పించగా తాజా భర్తీల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకూ వర్తింపజేయాలని నిర్ణయించింది. డాక్టర్ పోస్టులకు రాత పరీక్ష ఉండకపోవడంతో వారికి వైద్యవిద్యలో వచ్చిన మార్కులకు 70 శాతం, మిగిలిన 30 శాతాన్ని వెయిటేజీగా ఇవ్వనుంది. నర్సులు, ఇతర పారామెడి కల్ సిబ్బంది రాత పరీక్షకు 70 శాతం, వెయిటేజీ 30 శాతం ఇవ్వాలని నిర్ణయిం చింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కొత్తగా చేరబో యే వైద్యులకు ప్రైవేటు ప్రాక్టీసు రద్దుపైనా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలు స్తోంది. వీటిని ప్రభుత్వానికి వైద్యారోగ్య శాఖ ఇటీవలే పంపింది. అనుమతి రాగా నే ఆ మార్గదర్శకాలపై ఉత్తర్వులు వెలువడతాయని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. సర్వీస్ నిబంధనల్లో భారీ మార్పులు: కొత్త పోస్టుల భర్తీ నేపథ్యంలో సర్వీస్ నిబంధనల్లో భారీగా మార్పులు చేర్పులు చేయాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయిం చింది. గతంలో స్టాఫ్ నర్సులు, ఇతర పారామెడికల్ పోస్టుల సమయంలో తలెత్తిన న్యాయపరమైన చిక్కులు ఈసారి తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని భావిస్తోంది. దాదాపు 2 దశాబ్దాల క్రితం తయారైన సర్వీస్ నిబంధనలు నాటి పరిస్థితుల ప్రకారం ఉన్నాయి. అప్పటికీ ఇప్పటికీ కోర్సులు, పోస్టుల్లో మార్పులు జరిగాయి. కొత్త కోర్సులు వచ్చాయి. పాత నిబంధనల ప్రకారం కొత్త కోర్సులు చేసినవారు అనర్హులయ్యే పరిస్థితులున్నాయి. దీంతో తాజా పరిస్థితుల ప్రకారం ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా, ఎవరూ కోర్టులకు వెళ్లే పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. దీనిపై కసరత్తు జరుగుతోం దని, సర్కారు ఆదేశాల తర్వాత నోటిఫికేషన్ జారీ చేస్తామని వైద్య వర్గాలు తెలిపా యి. మరో రెండు వారాల్లో నోటిఫికేషన్ వెలువడుతుందని అంటున్నారు. -
విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలే లక్ష్యం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆసుపత్రుల్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న సమాచార కియోస్క్ మోడల్ను పరిశీలించారు. ఆరోగ్యశ్రీలో మరింత సులువుగా వైద్య సేవలు పొందడం ఇలా అనే విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ► దశాబ్దాలుగా మార్పులకు నోచుకోని విద్య, వైద్యం లాంటి రంగాల్లోని వ్యవస్థలను మార్చాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. ► ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. వాటిద్వారా ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాం. ► విద్య, వైద్యం, వ్యవసాయ, గృహనిర్మాణం తదితర కీలక రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు చరిత్రాత్మకం. వైద్య రంగం విషయానికొస్తే.. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా వేల సంఖ్యలో పోస్టులను భర్తీచేశాం. ►వేల కోట్లను ఈ రంగంపై ఖర్చు చేస్తున్నాం. విలేజ్ / వార్డు క్లినిక్స్ దగ్గరనుంచి టీచింగ్ ఆస్పత్రుల వరకూ కూడా నాడు – నేడు కింద అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ► ఆరోగ్య శ్రీ కింద ఎలాంటి పెండింగ్ బిల్లులు లేకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం. ఆరోగ్య ఆసరా కింద రోగులకు.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటి వెళ్లే సమయంలో డబ్బులు ఇస్తున్నాం. ►ఆరోగ్య శ్రీ కింద చికిత్సల సంఖ్యను గణనీయంగా పెంచాం. 16 టీచింగ్ ఆస్పత్రులను తీసుకు వస్తున్నాం. ► ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలున్న మందులు ఇస్తున్నాం. భారీ మార్పులను ఆశించి, దానికి అనుగుణంగా లక్ష్యాలు పెట్టుకున్నాం. ► అందుకే విద్య, వైద్య సహా కీలక రంగాలను అత్యంత సీరియస్గా తీసుకుంటున్నాం. అనుభవం, సమర్థత ఉన్న అధికారులను ఆయా శాఖలకు అప్పగించాం. ►ఒక ముఖ్యమంత్రిగా నేను లక్ష్యాలను నిర్దేశిస్తాను. కాని, ఆ లక్ష్యాన్ని అందుకునేందుకు యజ్ఞంలా అధికారులు పనిచేయాలి. ► శాఖాధిపతులు, వారి కింద పనిచేస్తున్న సిబ్బంది ఛాలెంజ్గా స్వీకరించాలి. ఆశించిన మార్పుల సాధనకు, లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులుతో పాటు, సిబ్బంది అంతే సీరియస్గా పనిచేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ► రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను సీఎం వైఎస్ జగన్కు అధికారులు వివరించారు. డైలీ యాక్టివిటీ రేటు 0.13శాతానికి గణనీయంగా పడిపోయిందని అధికారులు తెలిపారు. ► ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్ కేసులు కేవలం 5 మాత్రమే ఉన్నాయని, 4,30,81,428 మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తిచేశామని అధికారులు తెలిపారు. ► 15– 17 ఏళ్ల మధ్య ఉన్నవారికి వందశాతం 2 డోసుల వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని, 12 నుంచి 14 ఏళ్ల మధ్య ఉన్నవారికి మొదటి డోసు 94.47 శాతం వ్యాక్సిన్లు వేశామని అధికారులు సీఎం వైఎస్ జగన్కు వివరించారు. ► వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. మే నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని సీఎం జగన్కు అధికారులు తెలిపారు. ► మే నెలాఖరు నాటికి అన్ని నియామకాలు పూర్తిచేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇందులో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలన్నారు. ► ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించడానికి పెద్ద సంఖ్యలో డాక్టర్లను నియమిస్తున్నాం. వైద్యులకు ఇచ్చే జీతాల విషయంలో ఎలాంటి రాజీపడకూడదు. ► ప్రజలకు తప్పకుండా వైద్యుల సేవలు అందుబాటులో ఉండేందుకు గతంలో జీతాలు పెంచుతూ కొన్ని నిర్ణయాలు తీసుకుని ఆమేరకు వారికి జీతాలు ఇచ్చేలా నిర్ణయాలు తీసుకున్నాం. అందుకనే ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్పై నిషేధం విధించామని సీఎం జగన్ తెలిపారు. ఆస్పత్రుల్లో నాడు-నేడు పనులు, విలేజ్ క్లినిక్స్, వార్డు క్లినిక్స్ నిర్మాణం, కొత్త పీహెచ్సీలు, మెడికల్కాలేజీల నిర్మాణంపై సీఎం సమీక్ష.. ► నిర్మాణాల్లో ఎక్కడా రాజీపడొద్దని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. వసతులు, సౌకర్యాల విషయంలో ఎక్కడా లోటు రానివ్వొద్దని తెలిపారు. ► పలాస కిడ్నీ ఆస్పత్రి, కడప సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, అలాగే గిరిజన ప్రాంతాల్లో స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణాల ప్రగతిని సీఎం జగన్కు అధికారులు వివరించారు. ► 16 మెడికల్ కాలేజీల్లో 6 చోట్ల జోరుగా నిర్మాణాలు సాగుతున్నాయని సీఎంకు అధికారులు తెలిపారు. ► పులివెందుల, పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ల, విజయనగరం, అమలాపురం మెడికల్ కాలేజీల్లో నిర్మాణాల ప్రగతిని సీఎం జగన్కు అధికారులు వివరించారు. ► మిగిలిన చోట్ల మే 15 నాటికల్లా మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు ప్రారంభం కావాలని సీఎం అధికారులను ఆదేశించారు. ► కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులపై దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. ► ఆస్పత్రుల్లో సౌకర్యాలను, సదుపాయాలను పర్యవేక్షించాలని, ఆస్పత్రి నిర్వహణ పరిశుభ్రంగా ఉందా? లేదా? అన్నదానిపై పరిశీలన చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ► టాయిలెట్ల దగ్గరనుంచి ప్రతి విభాగం పరిశుభ్రంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్యశ్రీలో అవసరమైన మేరకు ఇంకా ప్రొసీజర్లను పెంచాలనుకుంటే పెంచాలన్నారు. ► ప్రతిభ ఆధారంగా వాలంటీర్ల మాదిరిగా ఆరోగ్య మిత్రలకు కూడా నగదు ప్రోత్సహకాలు ఇవ్వాలన్నారు. దీనిద్వారా ఆరోగ్య మిత్రల సేవలనూ గుర్తించినట్టు అవుతుందని పేర్కొన్నారు. ఏడాదిలో ఒక రోజు ఎంపిక చేసి, ఆరోజు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఈ సమీక్షా సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్ శర్మ, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి (కోవిడ్ మేనేజిమెంట్ అండ్ వ్యాక్సినేషన్) ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్ చంద్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అరచేతిలో ఆరోగ్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పౌరుల ఆరోగ్యవంతమైన జీవనానికి ముందడుగు పడింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య స్థితిని పరిశీలించి ఆ వివరాలను డిజిటలైజ్ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. తాజాగా ఈ కార్యక్రమాన్ని ములుగు, సిరిసిల్ల జిల్లాలో శనివారం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ‘తెలంగాణ హెల్త్ ప్రొఫైల్’పేరిట చేపడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే చేసి ఆరోగ్య వివరాలు సేకరించడంతో పాటు 30 రకాల పరీక్షలు నిర్వహించనుంది. వాటి ఫలితా లను ప్రత్యేక పోర్టల్లో నిక్షిప్తం చేయనుంది. ఆ వ్యక్తికి మాన్యువల్ రిపోర్టులు ఇవ్వడం, ఫలితాల్లో తేడాలను గుర్తిస్తే మందులను ఉచితంగా పంపిణీ చేయడం, శస్త్ర చికిత్సలు అవసరమైతే పెద్దాసుపత్రికి రిఫర్ చేయడం జరిగిపోనుంది. కార్యక్రమాన్ని అతి త్వరలో రాష్ట్రమంతటా విస్తరించనున్నారు. కీలక పరీక్షలతో ప్రొఫైల్.. హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని 18 సంవత్సరాలు నిండిన వారికే పరిమితం చేశారు. రోగాలు, ఇతర అనారోగ్య సమస్యలు 18 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా నమోదవుతున్నందున ప్రభుత్వం ఈ మేరకు నిర్ధారించింది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ 30 రకాల పరీక్షలు చేయనుంది. ప్రధానంగా బ్లడ్ గ్రూపింగ్, మూత్రపిండాల పనితీరు, కాలేయం పనితీరుతో పాటు కొలెస్టరాల్, బ్లడ్ షుగర్, బ్లడ్ యూరియా తదితరాలు పరిశీలించనుంది. పరీక్షల ఫలితాలను డిజిటలైజ్ చేయనుంది. ప్రతి పౌరుడికీ ఓ విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేస్తుంది. ఈ సంఖ్య ఆధారంగా ప్రత్యేకంగా రూపొందించిన హెల్త్ ప్రొఫైల్ పోర్టల్లో వివరాలను నిక్షిప్తం చేస్తుంది. పోర్టల్ రూపకల్పనలో హైదరాబాద్ ఐఐటీ సహకారం తీసుకుంది. క్షేత్రస్థాయిలో ఇలా.. ‘హెల్త్ ప్రొఫైల్’అమలులో క్షేత్రస్థాయి సిబ్బంది పాత్రే కీలకం. కార్యక్రమంలో భాగంగా హెల్త్ వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటి సర్వే చేస్తారు. హెల్త్ వర్కర్లు, ఏఎన్ఎంలు ముందుగా కుటుంబానికి చేరుకుని అర్హుల వివరాలు సేకరిస్తారు. వారికి విశిష్ట గుర్తింపు సంఖ్యను జనరేట్ చేసిన తర్వాత శాంపిల్స్ (నమూనాలు) తీసుకుంటారు. వాటిని ప్యాక్ చేసి బ్లడ్ గ్రూపింగ్, సీబీపీ కోసం సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపిస్తారు. మిగతా పరీక్షల కోసం తెలంగాణ డయాగ్నస్టిక్స్కు చేరవేస్తారు. అక్కడ పరీక్షలు ముగిశాక ఉన్నతాధికారు లు, వైద్యనిపుణుల ఆమోదం తర్వాత విశిష్ట గుర్తింపు సంఖ్య ఆధారంగా వివరాలను పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత సదరు వ్యక్తులకు యూనిక్ డిజిటల్ హెల్త్ కార్డుతో పాటు పరీక్షల ఫలితాల ప్రతులను ఇస్తారు. పరీక్షల్లో లోపాలు గుర్తించిన వారికి మెడిసిన్ కిట్, ఆరోగ్యశాఖ మంత్రి సందేశాన్ని ఇస్తారు. ఇతర జబ్బులున్నట్టు తెలిస్తే జిల్లా ఆస్పత్రి, నగరంలోని ప్రధాన ఆస్పత్రులు, బోధనాస్పత్రులకు రిఫర్ చేసి ప్రత్యేక చికిత్సను అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారుల బృందం కృషి చేస్తుంది. -
వైద్యపరీక్షల్లో జాప్యానికి ‘రిపేర్’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాస్పత్రుల్లోని వైద్య పరికరాల మరమ్మతుల్లో జాప్యాన్ని నివారించేందుకు వైద్యారోగ్యశాఖ కొత్త విధానం తీసుకొచ్చింది. పరికరాలన్నింటినీ 4 కేటగిరీ లుగా విభజించి, ప్రత్యేక సాఫ్ట్వేర్ సాయంతో మరమ్మతుల నిర్వహణను పర్యవేక్షించనుంది. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఎస్ఐడీసీ) ఆధ్వర్యంలో ప్రత్యేక సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనితో ప్రభుత్వాస్పత్రుల్లో పరికరాలకు త్వరగా మరమ్మతులు పూర్తయి.. వైద్య పరీక్షలకు ఇబ్బందులు తప్పనున్నాయి. నాలుగు కేటగిరీలుగా చేసి.. కొత్త విధానంలో భాగంగా ప్రభుత్వాస్పత్రుల్లో ఉన్న వైద్య పరికరాలను నాలుగు కేటగిరీలుగా విభజించారు. రూ.5 లక్షలకుపైన విలువ ఉండి వ్యారంటీ కలిగి ఉన్నవి, సమగ్ర వార్షి క నిర్వహణ ఒప్పందం ఇంకా ప్రారంభంకాని పరికరాలను ఏ కేటగిరీగా.. రూ.5 లక్షలకుపైగా విలువ ఉండి కంపెనీ మెయింటెనెన్స్ అవసరమున్నవి, వ్యారంటీ పీరియడ్ తర్వాత నిర్వహణ ఒప్పందం చేసుకోవాల్సిన పరికరాలను బీ కేటగిరీగా.. రూ.5 లక్షలకుపైగా విలువ ఉండి ఏడేళ్లు దాటిన పరికరాలు, వ్యారంటీ సహా ఒప్పందం పూర్తయినా ఇంకా పనిచేస్తున్న పరికరాలను సీ కేటగిరీగా.. రూ.5 లక్షల కన్నా తక్కువ విలువైన పరికరాలను డీ కేటగిరీలో చేర్చారు. ఇందులో ఏ, బీ, సీ కేటగిరీ పరికరాల నిర్వహణ బాధ్యతను టీఎస్ఎంఎస్ఎస్ఐడీసీకి అప్పగించారు. డీ కేటగిరీలోని పరికరాల నిర్వహణను ఆయా ఆస్పత్రులు చూసుకుంటాయి. ప్రత్యేక వ్యవస్థ, సాఫ్ట్వేర్ వైద్య పరికరాల నిర్వహణను పర్యవేక్షించేందుకు టీఎస్ఎంఎస్ఎస్ఐడీసీలో ప్రోగ్రామ్ మేనేజెంట్ యూనిట్ (పీఎంయూ) పేరుతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారు. నిర్వహణ కోసం టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ ఆధ్వర్యంలో మెడికల్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఈఎంఐఎస్) పేరుతో సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేశారు. ఆస్పత్రుల సూపరింటెండెంట్లు వైద్య పరికరాలకు అవసరమైన మరమ్మతుల ప్రతిపాదనలను ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో పంపుతారు. వాటిని టీఎస్ఎంఎస్ఎస్ఐడీసీ పరిశీలించి, మరమ్మతులు చేయిస్తుంది. ఇందులో సీ కేటగిరీలోని పరికరాల మరమ్మతుల ధరలను ఖరారు చేసేందుకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేశారు. టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ మెంబర్ కన్వీనర్గా ఉండే ఈ కమిటీలో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ, డీఎంఈ, టీవీవీపీ కమిషనర్, వైద్యారోగ్యశాఖ సాంకేతిక సలహాదారు సభ్యులుగా ఉంటారు. ఏటా ఒక్కోబెడ్కు పీహెచ్సీలకు రూ.వెయ్యి, సీహెచ్సీలకు రూ.1,500, ఏరియా, జిల్లా ఆస్పత్రులకు రూ.2 వేలు, బోధన, స్పెషాలిటీ ఆస్పత్రులకు రూ.2,500 చొప్పున నిధులు విడుదల చేస్తారు. -
కనీసం 6 నెలలు బదిలీలు ఆపండి
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): వైద్యుల బదిలీల సమయం ఇది కాదని, కనీసం ఆరు నెలలు బదిలీలు అపాలని ఏపీ ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.శ్యామ్సుందర్ ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని ఓ హోటల్లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. బదిలీల విషయమై పక్షం రోజులుగా ఎటువంటి ఆందోళనలు చేపట్టకుండా, రోడ్లెక్కి నిరసనలు చేయకుండా, శాంతియుతంగా ప్రజా ప్రతినిధులను కలిసి మొర పెట్టుకున్నా స్పందన రాలేదన్నారు. బదిలీల విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య సంఘాలతో చర్చించిన తర్వాతే బదిలీల విషయమై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యశాఖ అధికారులు సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నారని శ్యామ్సుందర్ ఆరోపించారు. కేజీహెచ్లో ఉన్న 300 మందికి పైగా వైద్యులు ఐదేళ్లు పైబడి ఉన్నారని, వారందరినీ ఒకేసారి బదిలీ చేస్తే వ్యవస్థ తీవ్రంగా నష్టపోతుందన్నారు. ఫలితంగా ప్రజల ప్రాణాలు పోవడమే గాక, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని వివరించారు. అసోసియేషన్ విశాఖ అధ్యక్షుడు డాక్టర్ సుందరరాజు, కార్యదర్శి డాక్టర్ బి.రమేష్కుమార్ పాల్గొన్నారు. -
కార్పొరేట్ సంస్థల బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ సంస్థల కోసం అన్నట్లుగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. బడ్జెట్లో ఆరోగ్య శాఖకు కేటాయింపులు లేవని, కరోనాతో చిన్న పరిశ్రమలు దెబ్బతిన్నా వారిని ఆదుకునే ప్రయత్నం కూడా చేయలేదని మండిపడ్డారు. అలాగే రాజ్యాంగం మార్చాలని అనడానికి సీఎం కేసీఆర్కు బుద్ధి ఉండాలని, దీనిపై బీజేపీ, టీఆర్ఎస్ నాటకానికి తెరలేపారని భట్టి విమర్శించారు. -
టీనేజర్ల వ్యాక్సిన్లో హన్మకొండ టాప్
సాక్షి, హైదరాబాద్: టీనేజర్లకు వ్యాక్సినేషన్లో హన్మకొండ రికార్డు సృష్టించింది. మంగళవారం నాటికి జిల్లాలో 15–17 ఏళ్లవారికి వ్యాక్సిన్ల పంపిణీ 100 శాతం పూర్తయింది. రాష్ట్రంలో ఈ కేటగిరీలో 100 శాతం పూర్తి చేసుకున్న తొలి జిల్లాగా నిలిచింది. జిల్లాలో 55,694 మంది టీనేజర్లకు టీకాలు అవసరమని లక్ష్యంగా నిర్ధారించగా... అంతకుమించి 101 శాతం మందికి వేశారు. ఇప్పటివరకు 56,299 డోసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఇదే స్ఫూర్తితో వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. -
కోవిడ్ వాక్సినేషన్లో కరీంనగర్ రికార్డు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వాక్సినేషన్లో కరీంనగర్ రికార్డు సృష్టించింది. మంగళవారం నాటికి జిల్లాలో రెండో డోసు పంపిణీ 100 శాతం పూర్తయింది. తద్వారా రాష్ట్రంలోనే రెండు డోసులు 100 శాతం పూర్తి చేసుకున్న తొలి జిల్లాగా, దక్షిణాది రాష్ట్రాల్లో రెండో జిల్లాగా రికార్డు సొంతం చేసుకుంది. జిల్లాలో అర్హులైన 7,92,922 మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. మొదటి డోసు లక్ష్యానికి మించి 104 శాతం మందికి వేశారు. ఇప్పటివరకు 8,27,103 డోసులు పంపిణీ చేశారు. ఇదే స్ఫూర్తితో రెండో డోసు సైతం పూర్తిచేశారు. మంగళవారం నాటికి జిల్లాలో 7,94,404 మందికి రెండో డోసు పంపిణీచేసి 100 శాతం అధిగమించిన తొలి జిల్లాగా రికార్డు సృష్టించారు. దక్షిణాది రాష్ట్రాల్లో రెండు డోసులు పూర్తయిన తొలి జిల్లాగా బెంగళూరు అర్బన్ రికార్డు సృష్టించగా, కరీంనగర్ రెండో స్థానంలో నిలిచింది. దీనిపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం, రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఇదే స్ఫూర్తితో వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని జిల్లాలు వందశాతం దిశగా.. మొదటి డోసులో తెలంగాణ ఇప్పటికే 100% లక్ష్యాన్ని అధిగమించిన సంగతి తెలిసిందే. నిజామాబాద్, సూర్యాపేట, కామారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాల్లో వందశాతం పూర్తయితే అన్ని జిల్లాలు రెండు డోసులు వందశాతం పూర్తయిన రికార్డు సొంతం కానున్నది. -
Harish Rao: ప్రైవేటు ఎందుకు.. సర్కారే బెస్ట్
సాక్షి, హైదరాబాద్: కరోనా మూడోవేవ్ను ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. కరోనా టీకా రెండో డోసు లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేయడంతోపాటు, 15–18 ఏళ్ల వారి వ్యాక్సినేషన్ను మరింత వేగవంతం చేయాలని చెప్పారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో విద్యార్థులు ఇళ్లకు వస్తారని, వారికి అవగాహన కల్పించి టీకాలు ఇవ్వాలన్నారు. ఈనెల 10 నుంచి 60 ఏళ్లకు పైబడిన వారికి బూస్టర్ డోస్ ఇచ్చే కార్యక్రమానికి సిద్ధం కావాలన్నారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యం ఇచ్చి, రెండు డోసులు పూర్తి చేసి, బూస్టర్ డోస్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి అప్పులపాలు కాకుండా చూడాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. శుక్రవారం ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావుతో కలిసి అన్ని జిల్లాల వైద్యాధికారులు, పీవోలు, ఆశా కార్యకర్తలతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో హరీశ్రావు మాట్లాడారు. సబ్ సెంటర్, పీహెచ్సీ స్థాయిలోనే చికిత్స ‘కోటి హోం ఐసోలేషన్ కిట్లు, రెండు కోట్ల కరోనా నిర్ధారణ కిట్లు సమకూర్చుకున్నాం. వీటిని అన్ని జిల్లాల పీహెచ్సీ, సబ్సెంటర్ స్థాయికి సరఫరా చేశాం. ఎవరికి లక్షణాలు కనిపించినా ఎక్కడికక్కడే పరీక్షలు నిర్వహించి, సాధారణ లక్షణాలుంటే మందుల కిట్లు ఇచ్చి ఇళ్లలో ఐసోలేషన్లో ఉండేలా చర్యలు తీసుకోండి. వీరి ఆరోగ్య పరిస్థితిని ఆశ వర్కర్లు రోజు వారీ పరిశీలించి, అవసరమైతే వారిని సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించాలి’ అని హరీశ్రావు చెప్పారు. మూడోవేవ్లో వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రమాదం తక్కువగా ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయని, ప్రజలు భయాందోళనకు గురి కాకుండా చైతన్య పరచాలన్నారు. పంచాయతీ, మున్సిపల్ సహా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అవసరమైతే స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఐసోలేషన్ కేంద్రాలను స్థానికంగా ఏర్పాటు చేయాలన్నారు. ఇదే సమయంలో అన్ని ఆసుపత్రుల్లో ఓపీ, గర్భిణులకు సేవలు, దీర్ఘకాలిక రోగులకు సేవలు అందించడంలో ఎలాంటి అంతరాయాలు కలగకుండా జిల్లా వైద్యాధికారులు చూసుకోవాలని చెప్పారు. ప్రభుత్వానికి ఆశాల ధన్యవాదాలు గత ప్రభుత్వాల హయాంలో పారితోషికం పెంపు కోసం ఆశ కార్యకర్తలు ధర్నాలు చేసేవారని, ఇందిరాపార్క్ వద్ద లాఠీ దెబ్బలు తినాల్సిన పరిస్థితులు ఉండేవని మంత్రి హరీశ్రావు గుర్తు చేశారు. గుర్రాలతో తొక్కించిన సందర్భాలూ ఉన్నాయన్నారు. ఆశాల సేవలు గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి పారితోషికం పెంచారని, సీఎం నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆశాలకు సూచించారు. ఆశాల అందరి తరఫున ఆయన సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. పారితోషికం పెంపు సంతోషాన్ని ఆశ కార్యకర్తలు హరీశ్రావుతో పంచుకున్నారు. -
కోటి హోం ఐసోలేషన్ కిట్లు.. రెండు కోట్ల టెస్టింగ్ కిట్లు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఒమిక్రాన్ వేరియంట్ను ఎదుర్కొనేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోందని ఆ శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. కోటి హోం ఐసోలేషన్ కిట్ల(ఎనిమిది రకాల మందుల)ను పీహెచ్సీల్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఎంతమందికైనా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు రెండు కోట్ల కరోనా టెస్టింగ్ కిట్లు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. మంగళవారం జరిగిన సంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హరీశ్రావు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ ఫస్ట్వేవ్లో కరోనా కేసుల సంఖ్య తారాస్థాయికి చేరడానికి 8 నెలలు పడితే, రెండో వేవ్లో నాలుగు నెలలే సమయం పట్టిందని, ఈ థర్డ్ వేవ్లో రెండు నెలల్లోనే కేసులు భారీ స్థాయికి చేరుతాయని వైద్యనిఫుణులు అంచనా వేస్తున్నారని వివరించారు. అరవై ఏళ్లు దాటినవారికి బూస్టర్ డోసు ఇచ్చే ప్రక్రియను ఈ నెల 10 నుంచి ప్రారంభిస్తామని మంత్రి హరీశ్ ప్రకటించారు. మాతాశిశు మరణాల రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు. దశలవారీగా సబ్సెంటర్లలో వైద్యులను నియమించి పల్లె దవాఖానాలుగా మార్చుతామన్నారు. బంగారు తెలంగాణలో ఆరోగ్య తెలంగాణ ఒక భాగమని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 66 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా, అందులో 44మంది వ్యాక్సిన్ వేసుకోనివారేనని తెలిపారు. జగ్గారెడ్డి వచ్చారు.. వేదికపై కుర్చీ వేయండి.. రాజకీయ ప్రత్యర్థులుగా పేరున్న మంత్రి హరీశ్రా వు, సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిల మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. జెడ్పీ సమావేశం కొనసాగుతుండగా జగ్గారెడ్డి సమావేశం హాలులోకి రాగా.. ‘‘ఎమ్మెల్యే వచ్చారు.. వేదికపై కుర్చీ వేయండి’’అని హరీశ్రావు అన్నారు. అభివృద్ధి పనులు ప్రారంభ కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని హరీశ్రావుకు జగ్గారెడ్డి వినతిపత్రం అందజేశారు. ఏఎన్ఎంల పట్ల మంత్రి అసహనం.. ఉద్యోగుల కేటాయింపుల్లో తమను ఇతర జోన్లోకి మార్చారని, న్యాయం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ ఏఎన్ఎంలు మంత్రి హరీశ్కు వినతిపత్రం అందజేయగా ఆయన తీవ్ర అసహనానికి లోనయ్యారు. వారి ముందే వినతిపత్రాన్ని చింపివేశారు. -
కమ్ముకొస్తున్న కరోనా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ కరోనా దండయాత్ర ప్రారంభమైంది. ఒక్కరోజు తేడాలోనే రెట్టింపునకు మించి కరోనా కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. సోమవారం 482 కేసులు నమోదు కాగా, మంగళవారం ఏకంగా 1,052 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 659 మంది వైరస్ బారినపడ్డారు. సరిగ్గా వారం క్రితం అంటే గత నెల 29న రాష్ట్రంలో 235 కేసులు నమోదు కాగా, ఇప్పుడు దాదాపు ఐదు రెట్లు పెరిగాయి. ఇక జీహెచ్ఎంసీలో గత నెల 29న 121 కేసులు నమోదైతే, ఇప్పుడు ఐదున్నర రెట్లు పెరిగాయి. మంగళవారం 42,991 మందికి పరీక్షలు చేయగా, 2.44 శాతం మంది కరోనా బారినపడ్డారు. ఇప్పటివరకు 1.26 శాతం వరకే నమోదైన కేసులు, ఒక్కరోజులోనే భారీగా రికార్డు అయ్యాయి. మున్ముందు ఊహించని స్థాయిలో కేసులు పెరుగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పాయి. కాగా, తాజాగా ఇద్దరు కరోనాతో చనిపోగా, ఇప్పటివరకు 4,033 మంది వైరస్కు బలయ్యారు. చికిత్స పొందుతున్నవారు 4,858 రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 6,84,023కి చేరుకుంది. ఇక ఒక్కరోజులో 240 మంది కోలుకోగా, ఇప్పటివరకు మొత్తం 6,75,132 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రులు, ఇళ్లల్లో చికిత్స పొందుతున్నవారు 4,858 మంది ఉన్నారు. మరోవైపు 5,481 మంది కరోనా నిర్ధారణ ఫలితాలు రావాల్సి ఉంది. కాగా, రాష్ట్రంలో మంగళవారం 10 మంది విదేశీయులకు ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. అందులో ఐదుగురు ముప్పున్న దేశాల నుంచి, మరో ఐదుగురు ముప్పులేని దేశాల నుంచి వచ్చినవారున్నారు. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు 94కు చేరుకున్నాయి. ముప్పున్న దేశాల నుంచి 127 మంది రాగా, అందులో 8 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించారు. వాటితో కలిపి మొత్తం 50 జీనోమ్ సీక్వెన్సింగ్ ఫలితాలు రావాల్సి ఉంది. ఇదిలావుండగా, గత రెండ్రోజుల్లో రాష్ట్రంలో 15–18 ఏళ్ల వయస్సు వారికి 84,960 మందికి టీకా వేశారు. పరీక్షలను పెంచండి కేసులు భారీగా నమోదవుతుండటంతో వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడా వైద్యులు, ఇతర సిబ్బంది సెలవులు తీసుకోరాదని అంతర్గత ఆదేశాలు జారీచేసింది. కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచాలని విజ్ఞప్తి చేసింది. అనుమానం ఉన్నవారు, లక్షణాలున్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. మాస్క్లు పెట్టుకోకుంటే వెయ్యి రూపాయల జరిమానాను కఠినంగా అమలుచేయాలని పోలీసుశాఖను కోరింది. రాబోయే సంక్రాంతిని ఇళ్లలోనే ఉండి చేసుకోవాలని, అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని సూచించింది. 40–50% ఒమిక్రాన్ ఉండొచ్చు రాష్ట్రంలో గత జూన్ తర్వాత ఈస్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఇంత వేగంగా కరోనా వైరస్ వ్యాపిస్తోందంటే నమోదయ్యే కేసుల్లో దాదాపు 40–50 శాతం వరకు ఒమిక్రాన్ వేరియంట్వి ఉండే అవకాశం ఉంది. అయితే చాలా కేసుల్లో పెద్దగా లక్షణాలు ఉండటం లేదు. కేసులు పెరిగినా ఆస్పత్రుల్లో చేరికలు పెరగలేదు. వైరస్ వ్యాప్తి తీవ్రమైనందున రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో 55,810 పడకలను అందుబాటులో ఉంచాం.అందులో ప్రభుత్వంలో 15,339 పడకలు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 40,471 పడకలు ఉన్నాయి. ప్రస్తుతం 1,247 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, వారిలో 413 మంది ఐసీయూలో ఉన్నారు. –డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు -
సిద్ధంగా ఉన్నాం.. జాగ్రత్తగా ఉందాం!
సాక్షి, హైదరాబాద్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విషయమై ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చెప్పారు. అదే సమయంలో అజాగ్రత్త కూడా పనికిరాదని చెప్పారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలన్నారు. పని ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ మాస్క్ ధరించాలని, ప్రభుత్వం జారీ చేసే కోవిడ్ నిబంధనలను పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లతో కరోనాను ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం సోమవారం ప్రగతిభవన్లో వైద్యారోగ్య శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు టి.హరీశ్రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్యశాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, అధికారులు శ్రీనివాసరావు, రమేశ్ రెడ్డి, గంగాధర్, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ‘రాష్ట్రంలో కరోనా ప్రబలే ప్రమాదం ఉన్నందున ప్రజలు గుంపులు గుంపులుగా చేరకుండా చూడాలి. బహిరంగ సభలు, ర్యాలీలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో లాక్డౌన్ విధించే పరిస్థితులు లేవు. అవసరం కూడా లేదు’ అని వైద్యారోగ్య శాఖ అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఆక్సిజన్ ఉత్పత్తి సామర్ధ్యం, ఐసొలేషన్, టెస్టింగ్ కిట్లు పెంచండి ‘రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానాల్లో ఉన్న 99 శాతం బెడ్లను ఇప్పటికే ఆక్సిజన్ బెడ్లుగా మార్చారు. మిగిలిన మరో శాతాన్ని కూడా తక్షణమే ఆక్సిజన్ బెడ్లుగా మార్చాలి. అలాగే ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 140 మెట్రిక్ టన్నుల నుంచి 324 మెట్రిక్ టన్నులకు పెంచుకోగలిగాం. దీనిని 500 మెట్రిక్ టన్నులకు పెంచాలి. హోం ఐసోలేషన్ కిట్ల లభ్యతను 20 లక్షల నుంచి ఒక కోటికి, టెస్టింగ్ కిట్ల సంఖ్యను సైతం 35 లక్షల నుంచి రెండు కోట్లకు పెంచాలి. అన్ని దవాఖానాల్లో వైద్యులు తక్షణం అందుబాటులో ఉండేలా చూడాలి. ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలి. ఏ కారణం చేతనైనా ఖాళీలు ఏర్పడితే 15 రోజుల్లో భర్తీ చేసుకునే విధంగా విధివిధానాలను రూపొందించాలి. జనాభా ప్రాతిపదికన రాష్ట్రంలో వైద్యులు, బెడ్లు, మౌలిక వసతులను పెంచుకొని వైద్యసేవలను మెరుగుపరచాలి..’ అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయాల్లోకి పలు శాఖల కార్యాలయాలు మారుతున్న దృష్ట్యా ఖాళీ అయిన పాత కలెక్టరేట్ కార్యాలయాలు, ఆయా శాఖల భవనాలను, స్థలాలను విద్యా, వైద్య శాఖల అవసరాలకు ప్రత్యేకించి కేటాయించాలని ఆదేశించారు. పది వేల మంది కిడ్నీ రోగులకు డయాలిసిస్ సేవలు అందుతున్న నేపథ్యంలో డయాలిసిస్ మిషన్లను మరిన్ని పెంచి సేవలను విస్తృతం చేయాలని సూచించారు. అన్నిచోట్లా బస్తీ దవాఖానాలు ‘హైదరాబాద్ తరహాలో బస్తీ దవాఖానాలను నగరపాలికలకు విస్తరించాలి. జీహెచ్ఎంసీ పరిధిలో కూడా వీటి సంఖ్యను పెంచాలి. హెచ్ఎండీఏ పరిధిలోని కంటోన్మెంట్ జోన్ పరిధిలో ప్రజలకు సరైన వైద్య సేవలు మెరుగుపరిచేందుకు వార్డుకొకటి చొప్పున 6 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలి. రసూల్పురలో 2, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, మల్కాజిగిరి, జల్పల్లి, మీర్పేట, పీర్జాదిగూడ, బోడుప్పల్, జవహర్ నగర్, నిజాంపేటలో ఒకటి చొప్పున బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలి. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4, నిజామాబాద్లో 3, మహబూబ్ నగర్, నల్లగొండ, రామగుండం, ఖమ్మం, కరీంనగర్లో రెండు చొప్పున, జగిత్యాల, సూర్యాపేట, సిద్దిపేట, మిర్యాలగూడ, కొత్తగూడెం, పాల్వంచ, నిర్మల్, మంచిర్యాల, తాండూరు, వికారాబాద్, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి, సంగారెడ్డి, జహీరాబాద్, గద్వాల్, వనపర్తి, సిరిసిల్ల, తెల్లాపూర్, బొల్లారం, అమీన్ పూర్, గజ్వేల్, మెదక్ పురపాలికల్లో ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలి..’ అని కేసీఆర్ ఆదేశించారు. -
తెలంగాణపై పడగ విప్పిన ఒమిక్రాన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ రూపం లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. గత వారం రోజుల్లో రోజురోజుకూ కేసులు రెట్టింపయ్యా యి. మూడువారాల కిందట రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదవగా శనివారం నాటికి ఈ కేసులు 79కి చేరుకున్నాయి. ఇదే సమయం లో క్షేత్రస్థాయిలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాదాపు 3 నెలల తర్వాత రాష్ట్రంలో ఒక్క రోజులో 300కు పైబడి కేసులు నమోదవగా ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్కరోజే దాదాపు 200 కేసులు తేలాయి. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వాళ్లలో 2 శాతం మందికే పరీక్షలు చేస్తుండటం, వీళ్లలోనే 70 శాతం ఒమిక్రాన్ కేసులు బయటడిన నేపథ్యం లో కొత్త వేరియంట్ ఇప్పటికే కమ్యూనిటీలోకి వెళ్లి ఉంటుందని వైద్యారోగ్య వర్గాలు అనుమానిస్తున్నాయి. రాష్ట్రంలో తాజాగా నమోదవుతు న్న కేసుల్లో ఒమిక్రాన్ ఉండొచ్చని భావిస్తున్నాయి. ఓవైపు జనజీవనం సాధారణ స్థితికి చే రుకోవడం, మరోవైపు సంక్రాంతి రాకపోకలు పెరుగుతుండటం, పైగా ప్రజలు కరోనా జాగ్రత్తల పట్ల నిర్లక్ష్యం వహిస్తుండటంతో రెండు వారాల్లో రాష్ట్రంలో రోజుకు వెయ్యి కేసులు నమోదవుతాయని అంచనా వేస్తున్నాయి. ఒక్కో జీనోమ్ సీక్వెన్సింగ్కు రూ. 6 వేలు కరోనా వైరస్ను ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు (ర్యాట్), ఆర్టీపీసీఆర్ పరీక్షలతో గుర్తిస్తున్నారు. అయితే వైరస్ను నిర్ధారించినా అందులోని వేరియంట్ గుర్తించాలంటే జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ పరీక్షలు సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ), సీడీఎఫ్డీ (సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నస్టిక్స్), గాంధీ ఆస్పత్రులే చేస్తున్నాయి. సీసీఎంబీ, సీడీఎఫ్డీ సంస్థల పరిధిలో నెలకు సగటున 6 వేల జీనోమ్ సీక్వెన్సింగ్లు చేసే సామర్థ్యం ఉన్నట్లు సమాచారం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతో పాటు ఉత్తర కర్ణాటక రీజియన్ పరీక్షలు కూడా ఈ సంస్థలే చేస్తున్నాయి. ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ కిట్ విలువ రూ. 6 వేల వరకు ఉన్నట్లు సమాచారం. శాంపి ల్ తీసుకున్నాక 4 దశల్లో విశ్లేషణ చేసి ఫలితాలు వెల్లడిస్తారు. క్షేత్రస్థాయి కేసుల్లో సీక్వెన్సింగ్ ఏది? ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించగానే కొన్ని దేశాలను రిస్క్ కేటగిరీలో చేర్చారు. ఆ దేశాల నుంచి వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని, పాజిటివ్గా తేలితే జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో 2 శాతం మందికి పరీక్షలు చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో 70 శాతానికి పైగా నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వాళ్లకే సోకడం గమనార్హం. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులపై పెద్దగా నిఘా పెట్టకపోవడం, మరోవైపు రోడ్డు మార్గాల ద్వారా కూడా ప్రయాణికుల రాకపోకలు ఉండటంతో ఒమిక్రాన్ ఇప్పటికే కమ్యూనిటీలోకి చేరిందనే భావన వైద్యారోగ్య శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికం ఒమిక్రాన్గా అంచనా వేయొ చ్చని అంటున్నారు. పైగా క్షేత్రస్థాయి కేసుల్లోని కేసుల్లో ఒమిక్రాన్ వేరియెంట్ను గుర్తించట్లేదు. లోడ్ ఎక్కువే.. కానీ ప్రభావం తక్కువ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటివరకైతే ప్రమాదకరం కాదని వైద్యారోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఒమిక్రాన్ కేసుల్లో కొందరికే సాధారణ లక్షణాలైన జ్వరం, దగ్గు తదితరాలే ఉన్నట్టు చెబుతున్నారు. డెల్టా వేరియెంట్తో పోలిస్తే ఒమిక్రాన్ లోడ్ చాలా ఎక్కువుందని, కానీ దీని ప్రభావం ఊపిరితిత్తులపై పెద్దగా లేదని పలు పరిశీలనల్లో తేలినట్టు నిజామాబాద్ మెడికల్ కాలేజీ వైద్యులు డాక్టర్ కిరణ్ మాదల తెలిపారు. ఏదేమైనా ప్రజలు తప్పకుండా మాస్కు ధరించాలని, హ్యాండ్ వాష్ లేదా శానిటైజర్లు వాడాలని, భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. ఆ కేసులే కావొచ్చు ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువవుతున్నాయి. ఇలా వ్యాప్తి పెరగడమంటే కొత్త వేరియంట్ వచ్చినట్లేనని భావించవచ్చు. ప్రస్తుత కేసుల్లో ఒమిక్రాన్ అధికంగా ఉన్నట్లు అనుమానిస్తున్నాం. కొత్త కేసులన్నీ ఈ వేరియంట్తో కూడినవని అంచనా వేయొచ్చు. – జి. శ్రీనివాసరావు, డీహెచ్ -
2022 ప్రారంభ వేడుక... ఇంట్లోనే న్యూ ఇయర్ ఇలా..!
గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. ఎందుకు అన్నారో గాని ఈ కాలంలో ఆ మాట పదేపదే వల్లె వేసుకోవాల్సి వస్తోంది. గుడి కన్నా ఇల్లు పదిలం అని కూడా అనుకోవాల్సి వస్తోంది. బయటకు వెళ్లే పరిస్థితి లేనప్పుడు మనం ఉంటున్న ఇంటివైపే కన్నెత్తి కొత్తగా చూడాలి. కొత్తగా అలంకరించుకోవాలి. కొత్తగా కొత్త సంవత్సరానికి ఇంట్లో ఉంటూ ఆహ్వానం పలకాలి. ఎలా చేస్తే బాగుంటుంది? మళ్లీ కొత్త వేరియంట్ అంటున్నారు. బయటకు వెళ్లొద్దంటున్నారు. జాగ్రత్తగా ఉండమంటున్నారు. పార్టీలను అవాయిడ్ చేయమంటున్నారు. కొన్నిచోట్ల డిసెంబర్ 31న నైట్ కర్ఫ్యూలు అనౌన్స్ చేస్తున్నారు. ఇన్నేల? న్యూ ఇయర్ పార్టీని ఇంట్లోనే ఉండి చేసుకోవడం మేలని నిపుణులు, ఆరోగ్య శాఖ అధికారులు, హితవరులు హితవు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం న్యూ ఇయర్కి ఏ గోవాకో, కేరళకో వెళ్లడం ఆనవాయితీ. ఈసారి మానేస్తే ఏం పోతుంది? లేదంటే కారులో బయలుదేరి సొంత ఊరుకు వెళ్లడం పరిపాటి. వద్దు అనుకోవడం మంచిదే కదా. సిటీలోని ఏదైనా రిసార్ట్ బుక్ చేసుకొని ఇండియన్ ఐడల్ కొత్త సింగర్స్ పాడే పాటలకు నాలుగు డాన్స్లు చేయాలని కోరిక ఉంటుంది. ఈసారి నో అనుకుంటే సరిపోదా? ‘జాన్ హైతో జహా హై’ అని సామెత. అంటే ‘ప్రాణాలు ఉంటే ప్రపంచం’ ఉంటుంది అని అర్థం. ప్రాణాలు ఉండాలేగాని భవిష్యత్తులో బోలెడన్ని న్యూ ఇయర్ పార్టీలు బయట చేసుకోవచ్చు. న్యూ ఇయర్ వెల్కమింగ్ పార్టీకి బెస్ట్ ప్లేస్ ఇల్లే అనుకుందాం ఈసారి. సరిగ్గా ట్రై చేస్తే ఇంట్లోనే మంచి పార్టీ చేసుకోవచ్చు. కొత్త హుషారు తెచ్చుకోవచ్చు. న్యూ ఇయర్కు గ్రాండ్గా వెల్కమ్ చెప్పొచ్చు. ఏం చేద్దాం. ఒకటి రెండు కుటుంబాల్ని ఎంచుకోండి బయట పార్టీ వద్దన్నారు కానీ ఇంట్లో స్నేహితులతో వద్దు అనుకోలేదు. ఏ ఇంటి పార్టీ అయినా మనకు మనం చేసుకుంటే అంత బాగుండదు. మీకు బాగా ఇష్టమైన ఒకటి రెండు కుటుంబాలను పిల్చుకోండి. చాలా రోజులుగా రాని కొడుకు వచ్చినా కూతురు వచ్చినా మరీ మంచిది. బంధువుల కన్నా స్నేహితుల వల్లే సరదా అనుకున్నా సరే. ఆ గెస్ట్లను పిలవడం పూర్తి కాగానే పార్టీ పనుల్లో దిగండి. లైట్లు వెలిగించండి లైట్లు కొత్త వెలుతురును కాంతిని తెస్తాయి. బయట రెడిమేడ్ సీరియల్ సెట్లు దొరుకుతాయి. అవి తెచ్చి ఇంటి గేటు కు, కాంపౌండ్ వాల్కు, ముంగిలిలో ఉన్న చెట్లకు, మొక్కలకు, మిద్దెకు వేలాడ దీసి వెలిగించండి. కొనలేకపోతే ఏ ఎలక్ట్రీషియన్కు చెప్పినా ఒక రాత్రికి ఇంతని అద్దె తీసుకొని వేసి పోతాడు. అవి ఒక్కసారి మిలమిలమని వెలగడం ప్రారంభిస్తే ఇంటికి కొత్త కళ పార్టీ కళ వచ్చేస్తుంది. పెరడు ఉంటే అక్కడ రెండు ఫ్లాష్లైట్లు వెలిగించండి. వంట పనులకు కూడా పనికి వస్తుంది. దీనికి ముందు ఇల్లు నీట్గా సర్దుకోండి. కొత్త కర్టెన్లు వేలాడగట్టినా మంచాల మీద కొత్త దుప్పట్లు పరిచినా కొత్త కళ వచ్చేస్తుంది. షామియానా వేయండి షామియానా వేస్తే వచ్చే కళ వేరు. ఇంటి ముందు బుజ్జి షామియానా వేయించండి. పెరడు ఉంటే అక్కడ కూడా చిన్న షామియానా వేస్తే ఆ షామియానా కింద కుర్చీలు వేసుకుని కూచోబుద్ధవుతుంది. ఆ షామియానా కిందే వంట పనులు చేసుకుంటే ఆ హుషారే వేరు. అతిథులు డిసెంబర్ 31 మధ్యాహ్నానికే చేరుకుంటే సాయంత్రం నుంచి వంటలు మొదలెట్టుకోవచ్చు. అందరూ కలిసి సరదాగా వండొచ్చు. పార్టీలో పానీయాలు ఉంటే స్టార్టర్లు, పిల్లలకు స్నాక్స్, మెయిన్ కోర్సు, డిన్నర్ తర్వాత డిజర్ట్లు, సరిగ్గా 12 గంటలకు కోయడానికి కేక్ ఇవన్నీ సిద్ధం చేసుకోవడమే ఒక పార్టీ. అదంతా ఎంజాయ్ చేయండి. అదే సమయంలో డైనింగ్ టేబుల్ని కూడా అందంగా అలకరించండి. అందమైన ప్లేట్లు బయటకు తీయండి. ఆ పార్టీ... ఆ భోజనం రెండూ గుర్తుండిపోవాలి. ఫొటో కార్నర్ ఇంట్లో ఏ ప్రాంతంలో మంచి ఫోటోలు వస్తాయో అక్కడ ఒక ఫోటో కార్నర్ ఏర్పాటు చేయండి. హ్యాపీ న్యూ ఇయర్ 2022 అని రాసిన ఫ్రేమ్ తయారు చేసి దాని వెనుక నిలబడి ఫొటోలు దిగవచ్చు. లేదా అలాంటి అక్షరాలు హ్యాంగ్ చేసిన గోడ దగ్గర అయినా సరే. ఫొటోలు బాగా వచ్చే సెల్ఫోన్నే వాడండి. అందరూ నవ్వుతూ సంతోషంగా ఫొటోలు దిగండి. రోజులు గడిచిపోతాయి. కాని ఫోటోలు నిలిచిపోతాయి. మన ఇంటి పెద్దలతో తప్పక గ్రూప్ ఫోటో దిగండి. ఫోన్లు చేయండి పార్టీ ఒక వైపు నడుస్తుంటుంది. మీరు మీ అయిన వారికి ఆత్మీయులకు వీడియో కాల్స్ చేస్తూ మీ దగ్గరే వారు కూడా ఉన్నట్టు వారి దగ్గర మీరూ ఉన్నట్టు ఫీల్ రానివ్వండి. కెమెరాను ఇల్లంతా జూమ్ చేస్తూ పార్టీ హడావిడి చూపించండి. వారి హడావిడి చూస్తూ జోక్స్ కట్ చేయండి. చాలా రోజులుగా పలకరించని మిత్రులను పలకరించండి. కొత్త సంవత్సరం మన బంధాలు మరింత గట్టి పడాలని కోరుకోండి. ప్రార్థన చేయండి కొత్త సంవత్సర ఘడియలు వచ్చాక ఒక ఐదు పది నిమిషాలు మౌనంగా కూచుని ప్రార్థన చేయండి. ప్రార్థన వంటి పదాలు నచ్చని వారు ఈ విశ్వంలోకి పాజిటివ్ ఆలోచనలు పంపండి. అందరూ బాగుండాలని అంతా మంచే జరగాలని కోరుకోండి. మీరు ఎంత గట్టిగా కోరుకుంటే ఈ విశ్వం అంత బాగుంటుంది. న్యూ ఇయర్ పార్టీకి ఈ పద్ధతిలో రెడీ అయిపోండి. హ్యాపీగా జరుపుకోండి. సురక్షితంగా జరుపుకోండి. హ్యాపీ న్యూ ఇయర్. మ్యూజిక్ అండ్ డాన్స్ పార్టీలో మ్యూజిక్ లేకపోయినా డాన్స్ లేకపోయినా అస్సలు బాగోదు. అద్దెకు బాక్సులు దొరుకుతాయి. తెచ్చుకోండి. లేదా సొంతవి ఉంటే రెడీ చేసుకోండి. రకరకాల మ్యూజిక్ యాప్లు ఉన్నాయి. వాటి నుంచి మంచి డాన్స్ నంబర్లు ప్లే చేయండి. షామియానా కిందో, ఇంటి డాబా పైనో చిన్న స్టేజ్ కట్టుకుంటే అందరి నృత్యకౌశలం చూసి ఎంజాయ్ చేయవచ్చు. పిల్లలకు ఫస్ట్ సెకండ్ అని పోటీ పెట్టకండి. వారు ఏ చిన్న కళ ప్రదర్శించినా ఒక బహుమతి ఇవ్వండి. మన ఇంటి పాట వీధికి కళ తెస్తుంది. వీధికి కళ వస్తే ఊరికి వస్తుంది. అలాగని మరీ పెద్దగా సౌండ్ పెట్టకండి. మీరు ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉండాలి. డిస్ట్రబ్ చేస్తున్నట్టుగా కాదు. -
చికిత్స చేసిన డాక్టర్కే ఒమిక్రాన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి వైద్యుడికి కరోనా ఒమిక్రాన్ వేరియెంట్ సోకింది. సూడాన్ దేశం నుంచి వచ్చిన ఓ ఒమిక్రాన్ రోగికి (44) క్యాన్సర్ చికిత్స చేస్తుండగా ఆ వైద్యుడికి వైరస్ వ్యాపించినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆ డాక్టర్, పేషెంట్తో కాంటాక్ట్లో ఉన్నవాళ్లందరినీ ఆస్పత్రి యాజమాన్యం క్వారంటైన్కు పంపింది. ఇలా రాష్ట్రంలో ఒకరి నుంచి మరొకరికి ఒమిక్రాన్ వ్యాపించడం ఇదే తొలిసారి. డాక్టర్తో కలిపి మంగళవారం రాష్ట్రంలో 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మిగిలిన ముగ్గురిలో ఒకరు సూడాన్ వాసి, ఇద్దరు సోమాలియా దేశస్తులు. తాజా కేసులతో రాష్ట్రంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 24కు పెరిగింది. వీళ్లందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. వైద్యారోగ్య శాఖ అప్రమత్తం సూడాన్ దేశం నుంచి ఈ నెల 14న క్యాన్సర్ రోగి నగరానికి వచ్చారు. సూడాన్ నాన్ రిస్క్ కేటగిరీలో ఉండటంతో ప్రయాణికులకు ర్యాండమ్గా టెస్టులు చేసి పంపారు. ఆ సుడాన్ వాసికి ఇక్కడి ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స ప్రారంభించారు. అయితే ఆయనకు కరోనా ఉందని వెల్లడవడంతో జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపగా ఒమిక్రాన్ ఉన్నట్టు 16న తేలింది. అయితే ఆ క్యాన్సర్ రోగికి పరిస్థితి సీరియస్గా ఉండటంతో ఆస్పత్రి వర్గాలు జాగ్రత్తలు తీసుకొని చికిత్స చేయడం ప్రారంభించాయి. ఈ క్రమంలో వైద్యుడికి కొత్త వేరియెంట్ వ్యాపించింది. అప్రమత్తౖమైన వైద్యారోగ్య శాఖ ఆ వైద్యుడి కుటుంబీకులు, అతనితో సన్నిహితంగా మెలిగిన ఇతర వైద్య సిబ్బంది, రోగుల నుంచి నమూనాలను సేకరిస్తోంది. ఆ వైద్యుడి నుంచి ఇంకెంతమందికి వైరస్ అంటిందోనని ఆందోళన నెలకొంది. శంషాబాద్ ఎయిర్పోర్టుకు మరో 726 మంది శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మంగళవారం 726 మంది ప్రయాణికులు వచ్చారు. వీళ్లలో నలుగురికి పాజిటివ్గా తేలింది. వీరి నమూనాలను సీక్వెన్సింగ్కు పంపారు. మొత్తం 13 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో ముప్పు లేని దేశాల నుంచి వచ్చిన వాళ్లు 19 మంది ఉన్నారు. కొత్తగా 172 కరోనా కేసులు రాష్ట్రంలో కొత్తగా 172 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 6,79,892కు పెరిగింది. వైరస్ బారిన పడి మరొకరు కన్నుమూశారు. ఇప్పటి వరకూ 4,016 మంది మృతిచెందారు. -
తెలంగాణలో ఒమిక్రాన్ కలవరం.. ఒకే రోజు 14 కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో 14 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇంత ఎక్కువ సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. 14 మం దిలో రిస్క్ దేశంగా గుర్తించిన యూకే నుంచి వచ్చిన ప్రయాణికులు ఇద్దరుండగా.. నాన్ రిస్క్ దేశాలుగా పేర్కొన్న కెన్యా, సోమాలియా దేశాల నుంచి వచ్చినవారు 12 మంది ఉన్నారు. వీరిలో ముగ్గురు మహిళలు కాగా 11 మంది పురుషులున్నారు. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ బాధితుల సంఖ్య 38కి చేరింది. మొత్తం 38 కేసుల్లో 31 మంది నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. ఆరుగురు రిస్క్ దేశాల నుంచి రాగా.. తొలిసారిగా ఒక రికి తెలంగాణలో ఒమిక్రాన్ సోకింది. జీనోమ్ సీక్వెన్సింగ్కు 4 కేసులు నాన్ రిస్క్ దేశాల నుంచి వస్తున్న వారిలో కేవలం 2% మందికే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. మిగతా వారికి టెస్టులు చేయడం లేదు. టెస్టులు చేసిన వారిని కూడా ఫలితం వచ్చే వరకు ఉంచకుండా కేవలం శాంపిల్స్ సేకరించి పంపేస్తున్నారు. ఈ విధంగా బయటకు వస్తున్న వారిలో ఎంతమందికి ఒమిక్రాన్ సోకి ఉంటుందో, వారెంత మందికి వ్యాపింపజేసి ఉంటారో అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇలావుండగా.. తాజాగా నమోదైన 14 కేసుల్లో ఆరుగురి ఆచూకీ ఇంకా కనిపెట్టలేదని సమాచారం. ఇక బుధవారం శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన 259 మంది ప్రయాణికులకు నిర్వహించిన పరీక్షల్లో నలుగురికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వీరిలో ఒమిక్రాన్ వేరియంట్ ఉందా లేదా అని నిర్ధారించేందుకు నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు రిస్క్ దేశాల నుంచి 9,381 మంది ప్రయాణికులు హైదరాబాద్కు వచ్చారు. కొత్తగా 182 కరోనా కేసులు రాష్ట్రంలో కొత్తగా 182 కోవిడ్ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 6,80,074కు పెరిగింది. మహమ్మారి కారణంగా ఒకరు మరణించగా మొత్తం మృతుల సంక్య 4,017కు చేరింది. తాజాగా 196 మంది కరోనాకు చికిత్స పొంది ఆరోగ్యవంతులు కాగా... మొత్తంగా 6,72,447 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,610 మంది కోవిడ్ చికిత్స పొందుతున్నారు. -
తెలంగాణలో డెంగీ కేసులు 6,284
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఈ ఏడాది డెంగీ కేసులు అధికంగా నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే దాదాపు మూడు రెట్లు అధికంగా నమోదు కావడం గమనార్హం. ఈ ఏడాది నవంబర్ 21వ తేదీ నాటికి 6,284 డెంగీ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. ఈ మేరకు వివిధ సంవత్సరాల్లో దేశంలో డెంగీ కేసులు ఏస్థాయిలో నమోదయ్యాయో సమగ్ర నివేదిక విడుదల చేసింది. వివిధ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ కేసుల విషయంలో పదో స్థానంలో ఉందని వివరించింది. అత్యంత ఎక్కువగా ఉత్తరప్రదేశ్లో 27,506 డెంగీ కేసులు నమోదు కాగా, అత్యంత తక్కువగా అరుణాచల్ప్రదేశ్లో మూడు కేసులు నమోదయ్యాయి. ఇక లడఖ్, లక్షద్వీప్లో డెంగీ కేసులు నమోదు కాలేదని కేంద్రం తెలిపింది. గతేడాది దేశవ్యాప్తంగా 44,585 డెంగీ కేసులు నమోదు కాగా, 66 మంది చనిపోయారు. ఈ ఏడాది 1.64 లక్షల కేసులు నమోదు కాగా, 146 మంది చనిపోయారు. అందులో ఒక్క మహారాష్ట్రలోనే 70 మంది చనిపోవడం ఆందోళన కలిగించే అంశం. -
టీకా వేయకున్నా వేసినట్టుగా ఎస్సెమ్మెస్లు!
ఇది ఇద్దరి సమస్య కాదు.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ప్రజలకు ఇలా వ్యాక్సిన్ వేసుకోకున్నా వేసుకున్నట్టుగా ఎస్సెమ్మెస్లు వస్తున్నాయి. ఉత్త మెసేజీలే కాదు.. అందులోని లింకును క్లిక్ చేస్తే వ్యాక్సినేషన్ పూర్తయినట్టు సర్టిఫికెట్లు కూడా డౌన్లోడ్ అవుతుండటం కలకలం రేపుతోంది. తొలిడోసు తర్వాత నిర్దేశిత గడువు పూర్తయినా రెండో డోసు తీసుకోని వారితోపాటు ఇంకా గడువు ఉన్నవారికి, అసలు ఒక్క డోసు కూడా వేసుకోని వారికీ.. ఇలా ‘వ్యాక్సినేషన్’ మెసేజీలు, సర్టిఫికెట్లు రావడం ఆందోళనకరంగా మారింది. ప్రభుత్వం పెట్టిన 100% వ్యాక్సినేషన్ లక్ష్యం కోసం కొందరు వైద్య సిబ్బంది ఈ నిర్వాకానికి పాల్పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ‘ఫేక్ వ్యాక్సినేషన్’ వ్యవహారంపై ‘సాక్షి’ చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో కీలక అంశాలు వెలుగు చూశాయి. దీనిపై ప్రత్యేక కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కరోనా వ్యాక్సినేషన్ చేపడుతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెలాఖరులోగా వందశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని వైద్యారోగ్య శాఖకు లక్ష్యంగా నిర్దేశించింది. తక్కువగా వ్యాక్సినేషన్ జరిగిన ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ స్వయంగా పర్యటిస్తున్నారు. ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు కూడా. కానీ టీకాలు వేసుకోకున్నా వేసుకున్నట్టుగా మెసేజీలు వస్తుండటం, సర్టిఫికెట్లు కూడా డౌన్లోడ్ అవుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకిలా జరుగుతోందన్న దానిపై ఎవరూ స్పష్టత ఇవ్వకపోవడంతో.. జనంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండో డోసు వేసుకోని వారివే.. రాష్ట్రవ్యాప్తంగా టీకా వేసుకునేందుకు 18ఏళ్లు పైబడిన అర్హులు 2,77,67,000 మంది ఉన్నారు. ఇందు లో ఇప్పటివరకు 94 శాతం మంది తొలి డోసు తీసుకున్నారని, రెండు డోసులూ తీసుకున్నవారు 51 శాతమేనని వైద్యారోగ్య శాఖ లెక్కలు చెప్తున్నాయి. ఒక్కడోసు కూడా వేసుకోని వారు ఆరు శాతం, రెండో డోసు వేసుకోనివారు 49శాతం మంది ఉండటం.. ఒమిక్రాన్ వేరియంట్ ముంచుకొస్తుందనే అంచనాలతో.. రాష్ట్రం వంద శాతం వ్యాక్సినేషన్పై సీరియస్గా దృష్టి సారించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖకు లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే రెండో డోసు తీసుకోవడానికి ప్రజలు ముందుకు రాకపోవడంతో జిల్లాల్లో కొందరు వైద్యాధికారులు, సిబ్బంది అడ్డదారి పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలి, రెండో డోసు మధ్య గడువు (కోవాగ్జిన్ టీకాకు 6 నుంచి 8 వారాలు, కోవిషీల్డ్ టీకాకు 12 నుంచి 16 వారాలు) దాటినా వ్యాక్సిన్ వేసుకోని వారిని గుర్తించి.. వారికి టీకా వేసినట్టుగా ఆన్లైన్లో నమోదు చేస్తున్నట్టు సమాచారం. ఒక్కోచోట ఒక్కో సమాధానం: రెండో డోసు తీసుకోకున్నా వేసుకున్నట్టు మెసేజీలు వచ్చినవారు అయోమయానికి గురవుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. వారికి ఒక్కోచోట ఒక్కో సమాధానం వస్తోందని చెప్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని ఓ పీహెచ్సీ సిబ్బంది దీనిపై స్పందిస్తూ..‘‘ఆటోమేటిక్ అప్డేట్ చేశాం.. రెండో డోసు వేసుకోలేదా.. ఇప్పుడు వేసుకో..’’ అని సమాధానం ఇచ్చినట్టు బాధితుడు తెలిపారు. మరోచోట వైద్య సిబ్బందిని అడిగితే.. ‘‘టీకా వేసుకోని వారిని అలర్ట్ చేసేందుకే ఇలా మెసేజీలు పెడుతున్నాం’’ అని పేర్కొనడం గమనార్హం. ‘‘రెండో డోసు వేసుకోకున్నా మెసేజీ వచ్చిన వారికి మళ్లీ రెండో డోసు ఇస్తాం. తప్పిదాన్ని సవరిస్తాం..’’ అని నిజామాబాద్ జిల్లాలోని ఓ పీహెచ్సీ వైద్య సిబ్బంది చెప్పారు. జనగామ జిల్లా కేంద్రంలోని కుర్మవాడకు చెందిన పన్నీరు మంజుల ఈమె. జూన్ 28న జిల్లా ఆస్పత్రిలో మొదటి డోసు టీకా వేసుకున్నారు. రెండో డోసు ఇంకా తీసుకోలేదు. కానీ నవంబర్ 11న రెండో డోసు తీసుకున్నట్టు ఫోన్కు మెసేజ్ వచ్చింది. ఇదేమిటని వైద్య సిబ్బందిని ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పకుండా దాటవేశారు. మరి తనకు రెండో డోసు టీకా వేస్తారో తెలియడం లేదని మంజుల ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రంలోని వ్యక్తి నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రానికి చెందిన తోట చంద్రశేఖర్. ఈ ఏడాది ఆగస్టు 2న స్థానిక పీహెచ్సీలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. నిర్దేశిత గడువు పూర్తయినా.. వ్యవసాయ పనులు ఉండటంతో రెండో డోసు తీసుకోలేదు. అయితే నవంబర్ 18న ఆయన రెండో డోసు తీసుకున్నట్టుగా ఎస్సెమ్మెస్ రావడంతో ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు తన పరిస్థితి ఏమిటి, రెండో డోసు వేస్తారా, లేదా అని వాపోతున్నాడు. వ్యాక్సిన్ తీసుకోకున్నా.. నేను ఇప్పటివరకు మొదటి డోసు వ్యాక్సిన్ కూడా తీసుకో లేదు. కానీ గత నెల 11న నేను టీకా తీసుకున్నట్టు మెసేజ్ వచ్చింది. పీహెచ్సీలో ఉన్న వైద్య సిబ్బందిని కలిసి అడిగితే.. ఎవరూ సమాధానం చెప్పలేదు. – కొండ్ర వెంకటేశ్, పోతారం, జనగామ జిల్లా -
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్.. డోసులు 4 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నాలుగు కోట్ల మైలురాయిని చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం నాటికి మొదటి, రెండో డోస్లు కలిపి అర్హులైన లబ్ధిదారులకు 4,02,79,015 కరోనా టీకాల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు, వైద్య సిబ్బందికి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అభినందనలు తెలిపారు. ఇప్పటికీ ఇంకా టీకాలు తీసుకోని లబ్ధిదారులు వెంటనే తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో టీకాలు తీసుకునేందుకు 18 ఏళ్లు వయసు పైబడిన అర్హులు 2.77 కోట్ల మంది ఉండగా అందులో 2.62 కోట్లమంది (94 శాతం)కి మొదటి డోస్, 1.40 కోట్ల మంది (51 శాతం)కి రెండో డోస్ అందించినట్లు వేసినట్లు ప్రజారోగ్య సంచాల కుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో నూరు శాతం మొదటి డోస్ వ్యాక్సిన్లు వేయగా, కొమురం భీం జిల్లాలో అత్యంత తక్కువగా 80 శాతం మందికి వేశారు. ఇక రెండో డోస్ హైదరాబాద్లో 76 శాతం, కరీంనగర్ జిల్లాలో 75 శాతం, రంగారెడ్డి జిల్లాలో 72 శాతం మందికి వేశారు. అత్యంత తక్కువగా కొమురం భీం జిల్లాలో 17 శాతం మంది రెండో డోస్ తీసుకున్నారు. వ్యాక్సినేషన్లో ముఖ్యాంశాలు... ►165: రాష్ట్రంలో కోటి టీకాలు వేయడానికి పట్టిన రోజులు. ►78: కోటి నుంచి 2 కోట్ల వరకు డోస్లు వేయడానికి పట్టిన రోజులు. ►27: 2 కోట్ల నుంచి 3 కోట్ల డోస్లు వేయడానికి పట్టిన రోజులు. ►38: 3 కోట్ల డోస్ల నుంచి 4 కోట్ల డోస్లకు చేరుకోవడానికి పట్టిన కాలం. ►57.80 లక్షలు: ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న కరోనా టీకా డోస్లు. ►180: కరోనా టీకాలు వేసేందుకు పనిచేసిన మొబైల్ టీమ్ల సంఖ్య. ►35,000: వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగస్వాములవుతున్న సిబ్బంది సంఖ్య. ►24 గంటలు: పగలూరాత్రీ నిరంతరం వ్యాక్సిన్ కేంద్రంగా పనిచేస్తున్న హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాజాగూడ స్పోర్ట్స్ కాంప్లెక్స్. త్వరలోనే మరొకటి ప్రారంభం కానుంది. -
కార్పొరేట్ రేంజ్లో నిమ్స్
లక్డీకాపూల్ (హైదరాబాద్) : నిరుపేదలకు కార్పొరేట్ వైద్య సేవలను అందించేందుకు నిమ్స్ ఆస్పత్రిలో మరిన్ని మెరుగైన సేవలను అందుబాటులోకి తీసుకురానున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. రూ.154 కోట్లతో అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చనున్నట్టు వెల్లడించారు. రూ. 18 కోట్ల విలువైన రోబోటిక్ సర్జరీ వైద్య పరికరాన్ని సమకూర్చాల్సిందిగా ఆంకాలజీ విభాగం వైద్యులు కోరారని, ఆ దిశగా చర్యలు చేపట్టనున్నామని చెప్పారు. హై రిస్క్ గర్భిణుల కోసం ప్రత్యేక గైనిక్ వింగ్ను ఏర్పాటు చేయనున్నామని, ఇందుకు 200 పడకలతో వార్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆస్పత్రిలో మరో 200 ఐసీయూ పడకలు, 120 వెంటిలేటర్లను సమకూరుస్తామన్నారు. దీంతో ఐసీయూ పడకలు 355కు, వెంటిలేటర్లు 209కు చేరుకుంటాయని చెప్పారు. మంగళవారం నిమ్స్లో రూ. 12 కోట్లతో ఏర్పాటు చేసిన వివిధ విభాగాల అధునిక వైద్య పరికరాలు, సరికొత్త పరీక్ష కేంద్రాలను ఆయన ప్రారంభించారు. నిమ్స్ ఆస్పత్రిపై ఆయా విభాగాధిపతులతో సమీక్ష చేశారు. నగరంలో మరో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిమ్స్లో ఇప్పటికే 85 శాతం మేర రోగులకు ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నామని, 15 శాతం మేరకే పేయింగ్ రోగులు చికిత్స పొందుతున్నారని మంత్రి చెప్పారు. కార్పొరేట్ ఆస్పత్రులకు తీసిపోని విధంగా అవయువ మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. ఒకేసారి 8 మందికి బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ శస్త్ర చికిత్స చేసే సామర్థ్యం నిమ్స్ సొంతం చేసుకుందని అన్నారు. బోన్ లోపాలు ముందే తెలుసుకునేందుకు బోన్ డెన్సిటోమీటర్, జన్యు లోపాలపై సరైన వైద్యం పొందేందుకు జెనెటిక్ ల్యాబ్లను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారందరికి ఆరోగ్య శ్రీ భోజనాన్ని వడ్డించాలని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె. మనోహర్ను ఆదేశించారు. రోగుల సహాయకులకూ రూ. 5 భోజనం అందుబాటులోకి తేవాలన్నారు. నగరంలో మరో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని, టిమ్స్ పేరుతో వాటిని నిర్వహిస్తామని తెలిపారు. 100% వ్యాక్సినేషన్పై సెలెబ్రిటీలు ప్రచారం చేయాలి రాష్ట్రంలో 100 శాతం వ్యాక్సినేషన్ను సాధించేందుకు సినిమా, క్రీడా, రాజకీయ మ్రుఖులు ప్రచారం చేయాలని మంత్రి కోరారు. ఒమిక్రాన్ నేపథ్యంలో నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని చెప్పారు. రోజూ 30 వేల కరోనా పరీక్షలు చేస్తున్నామని, వాటిని లక్షకు పెంచనున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతానికి 94 శాతం మంది మొదటి డోస్, 48 శాతం రెండో డోస్ తీసుకున్నారని చెప్పారు. ఈ నెలాఖరు నాటికి 70 లక్షల మందికి పైగా రెండో డోస్ తీసుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న ప్రతి బెడ్కూ ఆక్సిజన్ సదుపాయం కల్పిస్తామని, ఇప్పటికే 25 వేల బెడ్స్కు ఆక్సిజన్ సదుపాయం ఉందని చెప్పారు. మరో 2 వేల బెడ్స్కు వారంలో ఈ సదుపాయం కల్పించనున్నామన్నారు. -
ఎయిమ్స్ తరహాలో నాలుగు టిమ్స్లు
సాక్షి, హైదరాబాద్: టిమ్స్ (తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) తరహాలో హైదరాబాద్ నగరానికి నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. గచ్చిబౌలి, సనత్నగర్, ఎల్బీనగర్, అల్వాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో వీటి సేవలు ఉండాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లోని కంటోన్మెంట్, ఎయిర్పోర్టుల నిబంధనలు కూడా పరిగణనలోకి తీసుకొని నమూనాలు తయారు చేయాలని కోరారు. ఒక్కొక్కటి వెయ్యి పడకల సామర్ధ్యంతో కూడిన ఈ ఆసుపత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో శంకుస్థాపన చేస్తారని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి వివిధ అంశాలపై మంత్రి హరీశ్రావు సోమవారం వేర్వేరుగా సమీక్షలు నిర్వహించారు. వరంగల్ ఆసుపత్రికి టెండర్లు పూర్తి చేయండి వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని హరీశ్రావు ఆదేశించారు. జనవరి మొదటి వారంలో నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తయితే రాష్ట్రానికి మెడికల్ హబ్గా మారుతుందని చెప్పారు. మరోవైపు పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలోని కార్మికులకు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందేలా మరో కొత్త ఆసుపత్రిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఈ మేరకు త్వరగా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రూ.150 కోట్లతో 200 పడకల ఆసుపత్రి నిర్మాణానికి తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలు వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. 20 ఆసుపత్రులకు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు రాష్ట్రంలోని గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం, టిమ్స్, నీలోఫర్ సహా వివిధ జిల్లాల్లోని 20 ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని హరీశ్రావు ఆదేశించారు. సుమారు రూ.59.25 కోట్ల విలువైన పనులకు త్వరలో టెండర్లు పిలవాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయండి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని హరీశ్రావు ఆదేశించారు. రెండో డోసుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. కరోనాకు సంబంధించి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సమీక్షల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, వాణిజ్య పన్నుల శాఖ అధికారి నీతు కుమారి ప్రసాద్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, డీఎంఈ రమేష్ రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్, అధికారులు చంద్రశేఖర్ రెడ్డి, గణపతి రెడ్డి పాల్గొన్నారు. -
మూడేళ్లు.. 76 వేలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కేన్సర్ మరణాలు ఏటా పెరుగుతున్నాయి. గత మూడేళ్లలో తెలంగాణలో ఏకంగా 76,234 మంది కేన్సర్తో మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఈ మేరకు కేన్సర్పై ఒక నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం కేన్సర్ మరణాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో 13వ స్థానంలో నిలిచింది. నేషనల్ కేన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ రిపోర్ట్–2020, ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కేన్సర్ రిజిస్ట్రీ డేటా ప్రకారం 2018–2020 మధ్య దేశంలో కేన్సర్ మరణాలు గణనీయంగా పెరిగాయి. 2020లో దేశంలో 13.92 లక్షల కేన్సర్ కేసులు నమోదవగా 7.70 లక్షల మంది మరణించారు. అందులో అత్యధికంగా యూపీలో 1.11 లక్షల మంది కన్నుమూయగా ఆ తర్వాత మహారాష్ట్రలో 63,797 మంది మృతిచెందారు. అతితక్కువగా లక్షద్వీప్లో 13 మంది మరణించినట్లు కేంద్రం తెలిపింది. పొగాకు ఉత్పత్తుల వాడకంతో... వివిధ రకాల వ్యాధులు, వృద్ధాప్య జనాభా, మారిన జీవనశైలి, పొగాకు ఉత్పత్తుల వాడకం, అనారోగ్యకరమైన ఆహారం, వాయుకాలుష్యంతో కేన్సర్ వ్యాధులు ఏటా పెరుగుతున్నాయి. కేన్సర్పై అవగాహన కోసం జాతీయ కేన్సర్, మధుమేహ, హ్రుద్రోగ వ్యాధులు, స్ట్రోక్ నివారణ, నియంత్రణ కార్యక్రమానికి (ఎన్పీసీడీసీఎస్) కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీని కింద మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, మానవవనరుల అభివృద్ధి, ఆరోగ్యంపై అవగాహన, కేన్సర్ నివారణ కోసం చైతన్యం తీసుకురావడం, రోగనిర్ధారణ, నిర్వహణ వంటివి చేయాలని నిర్ణయించింది. ఈశాన్యంలో తక్కువే... ఈశాన్య రాష్ట్రాల్లో కేన్సర్ కేసులు సంఖ్య చాలా తక్కువ ఉండటానికి అక్కడి ప్రజల జీవన విధానమే ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా సిక్కిం, మేఘాలయాలలో వ్యవసాయ భూముల్లో రసాయనాలు, పురుగుమందులు వాడరు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే పంటలు సాగు చేస్తారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రైవేటు ఆసుపత్రులు కూడా పెద్దగా ఉండవని అంటున్నారు. విద్యాసంస్థల ఆవరణలో పొగాకు ఉత్పత్తులు నిషేధించాలి.. కేన్సర్ కేసుల నమోదు, మరణాలకు ప్రధాన కారణాల్లో పొగాకు ఉత్పత్తుల వాడకం ఒకటి. కాబట్టి పొగాకు ఉత్పత్తుల వాడకంపై ప్రభుత్వాలు దృష్టిసారించాలి. యువత పొగాకు ఉత్పత్తులకు బానిసలవుతున్నారు. దీన్ని నివారించేందుకు విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించాలి. కేన్సర్పైనా అవగాహన కల్పించాలి. స్క్రీనింగ్ ప్రక్రియను అందుబాటులోకి తీసుకురావాలి. వ్యవసాయ భూముల్లో రసాయనాలు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించాలి. – శిరీష, పొగాకు నియంత్రణ ఉద్యమ కార్యకర్త, హైదరాబాద్ -
భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా నిర్మిద్దాం
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఇందులో భాగంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సహా 8 మెడికల్ కాలేజీల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నూతన మెడికల్ కాలేజీల నిర్మాణంపై మంగళవారం బీఅర్కే భవన్లో వైద్య ఆరోగ్య, అర్అండ్బీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మెడికల్ కాలేజీలు త్వరగా పూర్తి చేస్తే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని, నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని కాలేజీలు ఉండాలని అన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరించుకునే విధంగా నిర్మాణాలు ఉండాలని సూచించారు. ప్రతి పేద బిడ్డకు జిల్లా పరిధిలోనే నాణ్యమైన వైద్య సేవలు అందాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కలను సాకారం చేసేలా పనులు వేగవంతం చేయాలని కోరారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో లక్ష్యాన్ని చేరుకుంటున్న నేపథ్యంలో.. విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పల్లె దవాఖానాల ద్వారా గ్రామీణులకు ఎంబీబీఎస్ వైద్యుల సేవలు, మెడికల్ కాలేజీల ద్వారా సమీపంలోనే సూపర్ స్పెషాలిటీ వైద్యుల సేవలు అందుతాయన్నారు. దీంతో ప్రాథమిక దశలోనే రోగాలకు చికిత్స అందించడం సాధ్యమవుతుందని చెప్పారు. సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్రెడ్డి, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
48 మందికి కరోనా పాజిటివ్
పటాన్చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ముత్తంగి గ్రామంలో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల విద్యాలయంలో ఇంటర్, టెన్త్ చదివే 47 మంది విద్యార్థినులు, ఒక ఉపాధ్యాయురాలు కరోనా బారిన పడ్డారు. వీరందరినీ గురుకులంలోని ‘ఎ’బ్లాక్లో ఐసోలేషన్ గది ఏర్పాటు చేసి అందులో ఉంచారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభమైన సంగతి తెలిసిందే. కేసుల సంఖ్య తగ్గడంతో గురుకులాలు తెరిచేందుకూ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో అంతా స్కూళ్లు, కళాశాలలు, వసతి గృహాలకు చేరుకున్నారు. ఈ క్రమంలో ముత్తంగి గురుకులంలో పదోతరగతి చదువుతున్న ఓ విద్యార్థిని జ్వరం బారిన పడింది. తల్లిదండ్రులు శనివారం ఆమెను తీసుకెళ్లి కరోనా టెస్ట్ చేయించగా పాజిటివ్ తేలింది. దీంతో వారు గురుకుల టీచర్లకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన సిబ్బంది గురుకులంలో 470 మంది విద్యార్థినులు ఉండగా.. ఆదివారం 261 మంది విద్యార్థినులు, సిబ్బందికి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు జరిపించారు. పరీక్షల్లో 37 మంది పదో తరగతి విద్యార్థినులు, ఐదుగురు ఇంటర్ విద్యార్థినులు, ఒక ఉపాధ్యాయురాలు మొత్తం 43 మందికి పాజిటివ్ తేలింది. సమాచారం తెలుసుకున్న జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి గాయత్రీదేవి, ఆర్డీఓ నాగేష్, పటాన్చెరు తహసీల్దార్ మహిపాల్ గురుకులాన్ని సందర్శించి కోవిడ్ బారిన పడిన విద్యార్థినులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. సోమవారం మిగిలిన 209 మంది విద్యార్థినులకు జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో టెస్టులు నిర్వహించగా, మరో ఐదుగురు ఇంటర్ విద్యార్థినులకు కూడా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో కరోనా బారిన పడిన విద్యార్థినుల సంఖ్య 47కు చేరింది. -
‘ఒమిక్రాన్’పై సబ్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాష్ట్రం లో కరోనా పరిస్థితి పరిశీలన, కోవిడ్ టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేయడం తదితర అంశాలపై మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. ఈ సబ్ కమిటీకి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చైర్మన్గా, మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, సబితా ఇంద్రారెడ్డి సభ్యులుగా ఉంటారు. సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రజారోగ్యం, వైద్యారోగ్యశాఖ సన్నద్ధత, అనుసరిస్తున్న కార్యాచరణ, మందుల లభ్యత, ఆక్సిజన్ బెడ్ల సామర్థ్యం తదితర అంశాలపైనా సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని దవాఖానాల్లో మందులు, టీకాలు, అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవాలని ఆరోగ్యశాఖను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని, ఈ విషయంలో మంత్రులంతా వారి జిల్లాల్లో సమీక్షలు నిర్వహించి, టీకా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్ సూచించారు. -
వరద బాధితులకు మెరుగైన సేవలందించండి
సాక్షి, అమరావతి: వరద బాధితులకు మెరుగైన వైద్య సేవలందించాలని డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శనివారం వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో వరద ముంపు జిల్లాల్లో అందుతున్న వైద్య సేవలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో పరిస్థితులను ఆయా జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారుల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి, ప్రతి క్యాంపులో సీనియర్ వైద్యుల బృందం అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు జిల్లాలు సహా వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య బృందాలు 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వరద బాధితులకు అవసరమైన వైద్య సేవలు అందించేలా వైద్య సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అలాగే శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. వరద తగ్గిన ప్రాంతాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిపై వివరాలు సేకరించాలని, అవసరమైన మందులు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఆయా జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అన్ని జిల్లాల్లోని వైద్యారోగ్య శాఖ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే మెడికల్ క్యాంపుల వద్ద 108 అంబులెన్స్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సమీక్షలో వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈవో వినయ్ చంద్ పాల్గొన్నారు. -
నిర్మాణ వేగం పెంచండి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజీలకు భవనాలను వేగంగా నిర్మించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. నిర్ణీత సమయంలోగా తాత్కాలిక భవనాలను పూర్తిచేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. సంగారెడ్డి, వనపర్తి, జగిత్యాల, మహబూబాబాద్, నాగర్కర్నూల్, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండంలలో ఈ కాలేజీలను నెలకొల్పాలని సంకల్పించారు. కానీ వాటి తాత్కాలిక భవనాల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. సకాలంలో భవనాల నిర్మాణం జరగకపోతే జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తనిఖీల సందర్భంగా సమస్యలు వచ్చే అవకాశముంది. ఈ అంశాలను ఎత్తిచూపుతూ ఈ నెల 12న ‘సాక్షి’ప్రధాన సంచికలో ‘వైద్య కాలేజీలేవీ?’శీర్షికన కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి హరీశ్రావు.. కొత్త కాలేజీ భవనాల నిర్మాణంపై ఆయా జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రతి మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పురోగతిని తెలుసుకున్నారు. కాంట్రాక్టర్లు, వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ), తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) అధికారులతోనూ మంత్రి చర్చించారు. నిర్ణీత సమయంలోగా భవనాలను నిర్మించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు ఇటీవలే వైద్యారోగ్యశాఖ బాధ్యతలు చేపట్టిన మంత్రి హరీశ్రావు.. ప్రజారోగ్య వ్యవస్థను గాడిలో పెట్టడంపైనా దృష్టిపెట్టారు. ఇందుకోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. వైద్యులే సమయపాలన పాటించడం లేదని, ఇక కిందిస్థాయి సిబ్బంది గురించి అడిగేవారే లేకుండా పోతున్నారన్న ఆరోపణలపై స్పందించారు. ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది నిర్ణీత సమయంపాటు ఆస్పత్రుల్లో ఉండాలని స్పష్టం చేశారు. సమయపాలన పాటించనివారిపై కఠిన చర్యలు చేపడతామని చెప్పారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని, సీసీ కెమెరాలు సరిగా పనిచేసేలా చూడాలని హరీశ్రావు ఆదేశించారు. రాష్ట్ర, జిల్లాస్థాయిల ఉన్నతాధికారులు కూడా ఆకస్మిక తనిఖీలను చేపట్టాలని సూచించారు. విభాగాల వారీగా ఖాళీలు, భర్తీపై నివేదికలు అందజేయాలని అధికారులను కోరారు. ఇక 108, 104, పల్లె దవాఖానాల బలోపేతానికి ఎటువంటి చర్యలు చేపట్టాలనే దానిపై నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. -
19 రాష్ట్రాలకు రూ. 8 వేల కోట్ల నిధులు విడుదల
న్యూఢిల్లీ: ఆరోగ్య విభాగం 19 రాష్ట్రాల్లో స్థానిక సంస్థలకు నిధులను విడుదల చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్య మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు నిధులు వినియోగించనున్నారు. వీటికి సంబంధించి మొత్తం రూ.8,453.92 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కు రూ. 488 కోట్లు విడుదల చేశారు. తెలంగాణ సహా 9 రాష్ట్రాల నుంచి ఇంకా ప్రతిపాదనలు అందలేదు. అయితే ప్రతిపాదనలు అందిన తర్వాత ఆ రాష్ట్రాలకు కూడా నిధుల విడుదల చేయనున్నారు. చదవండి: (సజ్జనార్ దెబ్బకు దిగొచ్చిన ర్యాపిడో..) -
1,125 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఓకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం కొత్తగా 1,125 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేపట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. త్వరలో పీజీ, ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు ప్రారంభం కానున్నాయి. అలాగే వచ్చే ఏడాది నుంచి మరో ఎనిమిది మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో భర్తీ ప్రక్రియ చేపట్టనుంది. ఇప్పటికే ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీల కోసం తాత్కాలిక భర్తీ ప్రక్రియ జరుగుతోంది. కొందరిని డిప్యుటేషన్పై తీసుకున్నారు. కొందరికి పదోన్నతులు కల్పించడం ద్వారా నియమించారు. కాగా, 1,125 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రక్రియ చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని వైద్య విద్య డైరెక్టర్ (డీఎంఈ) ప్రభుత్వానికి ప్రతిపాదించారు. మెడికల్ కాలేజీల్లో బోధన సిబ్బంది, ఇతర మౌలిక వసతులను పరిశీలించేందుకు కేంద్ర బృందం రానున్న నేపథ్యంలో వేగంగా భర్తీ ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారు. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే.. గతంలో మెడికల్ పోస్టులను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా భర్తీ చేసేవారు. అయితే టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ ప్రక్రియ ఆలస్యం కావడంతో సమస్యలు వస్తున్నాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఆర్బీ)ను ఏర్పాటు చేసింది. ఈ బోర్డు ద్వారానే వైద్య పోస్టులను భర్తీ చేయాలని వైద్య శాఖ నిర్ణయించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు మొదలు బోధనాసుపత్రుల వరకు అన్నిచోట్లా పోస్టుల మంజూరు నుంచి భర్తీ వరకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డే చూస్తుంది. రిటైర్మెంట్లు, ఖాళీలు ఏర్పడగానే సంబంధిత సమాచారం బోర్డుకు చేరుతుంది. బోర్డు ఆదేశం మేరకు వాటికి నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఇప్పటివరకు కొన్ని పోస్టులను మాత్రమే ఈ బోర్డు ద్వారా భర్తీ చేశారు. అయితే అనుకున్నట్లు ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీ జరగట్లేదన్న విమర్శలున్నాయి. కాగా, తాజాగా 1,125 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను కూడా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే భర్తీ చేయాలని నిర్ణయించారు. -
హెచ్ఐవీ బాధితులకు హెపటైటిస్ వ్యాక్సిన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని హెచ్ఐవీ బాధితులందరికీ హెపటైటిస్ వ్యాక్సిన్ వేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే హెచ్ఐవీ బాధితులకు హెపటైటిస్–బి వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ప్రస్తుతమున్న హెపటైటిస్ బాధితుల్లోనూ హెచ్ఐవీ సోకిన వారే ఎక్కువగా ఉన్నారని ఆరోగ్య శాఖ పరిశీలనలో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా 1.90 లక్షల మంది హెచ్ఐవీ బాధితులున్నారు. వీరంతా రాష్ట్రంలోని 45 యాంటీ రిట్రోవైరల్ టెస్టింగ్ (ఏఆర్టీ) సెంటర్లలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ సెంటర్లలోనే వీరికి వ్యాక్సిన్ వేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అలాగే బోధనాస్పత్రుల్లో కూడా వ్యాక్సిన్ వేస్తారు. ముందుగా వైద్య పరీక్షలు చేసి.. ఆ తర్వాతే వ్యాక్సిన్ వేయాలని ఆదేశాలిచ్చారు. వైద్య పరీక్షలు చేశాక హెపటైటిస్ ఉందని భావిస్తే.. వారిని వెంటనే మోడల్ ట్రీట్మెంట్ సెంటర్లకు పంపించి వైద్యమందిస్తారు. ముందుగా ఏఆర్టీ సెంటర్లలో పనిచేస్తున్న వైద్య అధికారులందరికీ ప్రత్యేక శిక్షణ ఇస్తారు. టెస్టులు, చికిత్సలకు సంబంధించిన సాంకేతిక సహకారాన్ని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అందిస్తుంది. -
ప్రతి చిన్నారికీ ఆధార్ నమోదు తప్పనిసరి
సాక్షి, అమరావతి: పుట్టిన ప్రతి చిన్నారికీ ఆధార్ నమోదు తప్పనిసరిగా చేయాలని, ఆస్పత్రిలో తల్లి డిశ్చార్జ్ అయ్యేలోగా ఇవన్నీ పూర్తి కావాలని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ ఆదేశించారు. సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో జనన, మరణాల రిజిస్ట్రేషన్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సుమారు 24 విభాగాల అధికారులు పాల్గొన్నారు. గర్భిణి ఆస్పత్రిలో చేరి ప్రసవం పూర్తయ్యాక మూడు రోజుల్లో శిశువుకు ఆధార్ ఎన్రోల్ చేయాలని, అప్పటికి వేలిముద్రలు, కంటిపాప ముద్రల్లో స్పష్టత ఉండదు కాబట్టి.. ఐదేళ్లు పూర్తయ్యేలోగా వారిని తిరిగి రప్పించి వేలిముద్రలు, ఐరిస్ తీసుకుని ఆధార్ ఎన్రోల్ చేయాలని ఆదేశించారు. శిశువుల జననాలతో పాటు, మరణాలనూ నమోదు చేయాలని, మృతికి గల కారణాలను పేర్కొనాలని సూచించారు. ఐదేళ్లు నిండేలోగా చిన్నారులకు శాశ్వత ఆధార్ కార్డు అందేలా చూడాలన్నారు. ఆస్పత్రుల్లో చిన్నారులు పుట్టగానే వారికి బర్త్ సర్టిఫికెట్లు జారీ చేయాలని, డిశ్చార్జ్ అయ్యేలోగానే ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నారుల జనన ధ్రువీకరణ పత్రాలకు తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
93.94 % చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు
సాక్షి, అమరావతి: ఆంద్రప్రదేశ్లో చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఓ వైపు కోవిడ్ ఉన్నా చిన్నారులకు ఇచ్చే టీకాల విషయంలో వైద్యారోగ్య శాఖ రాజీ పడకుండా ప్రతి చిన్నారికీ టీకా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఐదేళ్లలోపు చిన్నారులకు 93.94 శాతం టీకా వేసినట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి. అత్యధికంగా విశాఖ జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాన్ని మించి 108.90 శాతం వేశారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 76.20 శాతం నమోదైంది. పెంటావాలెంట్(ఐదు రకాల వ్యాధులకు ఒకే వ్యాక్సిన్) మూడో డోస్ను 92.76 శాతం మందికి ఇచ్చారు. ఓరల్ పోలియో(పోలియో చుక్కల మందు)ను మూడో డోస్లో 93.15% మందికి ఇచ్చినట్టు గణాంకాలు వెల్లడించాయి. మూడో డోసు పోలియో చుక్కల మందు 3.42 లక్షల మందికి ఇవ్వాల్సి ఉండగా.. 3.18 లక్షల మందికి ఇచ్చారు. పుట్టగానే వేసే బీసీజీ వ్యాక్సిన్ సెప్టెంబర్ చివరి నాటికి 85.55% మందికి, పోలియో చుక్కల జీరో డోసు 80.30% మందికి, హెపటైటిస్బి జీరో డోస్ వ్యాక్సిన్ 75.17 శాతం మందికి వేశారు. హెపటైటిస్ వ్యాక్సిన్ వేయడంలో 2.56% వృద్ధి కనిపించినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆరోగ్య ఉప కేంద్రం మొదలుకుని బోధనాస్పత్రి వరకు అన్ని ఆస్పత్రుల్లోనూ వ్యాధి నిరోధక టీకాలున్నాయని, ప్రతి ఒక్క తల్లీ తమ బిడ్డకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని కుటుంబ సంక్షేమ శాఖ కోరింది. -
కరోనా టీకా డోస్ @ 90 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఇచ్చిన కోవిడ్ వ్యాక్సిన్ డోస్ల సంఖ్య 90 కోట్ల మైలురాయిని దాటింది. కరోనా మహమ్మారి ఎదుర్కొనేందుకు చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా తొలుత ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్లైన్ వారియర్లకు వ్యాక్సిన్ వేసిన ప్రభుత్వం, మార్చి 1వ తేదీ నుంచి సాధారణ ప్రజలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించింది. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్లు వేయడం ప్రారంభించిన తర్వాత డ్రైవ్ వేగం పుంజుకుంది. గత 259 రోజుల్లో 90 కోట్లకు పైగా డోస్లను అందించారు. వీటిలో సెపె్టంబర్ 17న ప్రధాని మోదీ పుట్టినరోజున అత్యధికంగా 2.50 కోట్ల డోసులను ప్రజలకు అందించారు. కాగా దేశంలో మొట్టమొదటిసారిగా ఆగస్టు 27న రోజువారీ కోవిడ్ వ్యాక్సిన్ డోస్ల సంఖ్య 1 కోటి దాటింది. దేశంలోని 47.3%మందికి తొలిడోస్, 17.4% మందికి రెండు డోస్లను వేశారు. అమెరికాలో అత్యధికంగా 7 లక్షల మరణాలు: అత్యంత ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ 187 దేశాలలో గుర్తించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా, కరోనా వైరస్ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 50 లక్షల మార్క్కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 49.97 లక్షల మంది కరోనాతో మరణించినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. 197 రోజుల కనిష్టానికి యాక్టివ్ కేసులు దేశంలో 24 గంటల్లో నమోదైన 24,354 కేసులతో కలుపుకుని మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,37,91,061కు చేరుకుందని కేంద్రం తెలిపింది. అదేవిధంగా, 197 రోజుల తర్వాత యాక్టివ్ కేసులు 2,73,889కు తగ్గినట్లు శనివారం వెల్లడించింది. ఒక్క రోజు వ్యవధిలో కరోనా బాధితుల్లో మరో 234 మంది చనిపోవడంతో కోవిడ్ మరణాలు 4,48,573కు చేరినట్లు తెలిపింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.81%గా ఉన్నాయి. 2020 మార్చి తర్వాత ఇదే అత్యల్పం. అదే సమయంలో, రికవరీ రేట్ అత్యధికంగా 97.86%గా ఉంది. అయిదు నిమిషాలకో మరణం ఏడు రోజుల్లో ప్రపంచంలో 8 వేల మంది కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా మరణించారు. అంటే, ప్రతి 5 నిమిషాలకు ఒకరు కరోనాతో మరణిస్తున్నారు. గత ఏడు రోజుల్లో ప్రపంచ సగటు మరణాలలో సగానికి పైగా అమెరికా, రష్యా, బ్రెజిల్, మెక్సికో, భారత్ల్లో నమోదయ్యాయి. అయితే గత కొన్ని వారాలుగా ప్రపంచంలో కరోనా మరణాల రేటు తగ్గింది. ప్రపంచంలో కరోనా సంక్రమణ కారణంగా అత్యధిక మరణాలు అమెరికాలోనే సంభవించాయి. అక్కడ 7.02 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా అమెరికాలో ఇప్పటివరకు సుమారు 56.1% మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. అదే సమయంలో శుక్రవారం, రష్యాలో కరోనా కారణంగా 887 మరణాలు నమోదయ్యాయి. ఇది కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచిఒక రోజులో అత్యధికం. భారత్లో కరోనా రెండో వేవ్ సమయంలో, డెల్టా వేరియంట్ కారణంగా రోజుకు సగటున 4వేల మరణాలు సంభవించాయి, అయితే వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగం అందుకున్న తర్వాత ఈ సగటు కేవలం 300 కి తగ్గింది. -
మరో నాలుగు కొత్త మెడికల్ కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వైద్య విద్య పటిష్టతకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. వచ్చే ఏడాది నుంచి 7 వైద్య కళాశాలలు అందుబాటులోకి రానుండగా, ఆ తర్వాత ఏడాది అంటే.. ఎన్నికల నాటికి మరో 4కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వికారాబాద్, సిరిసిల్ల, భూపాలపల్లి, కామారెడ్డిలలోనూ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని తాజాగా సీఎం నిర్ణయించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 9 మెడికల్ కాలేజీలు ఉండగా, గతం లో ప్రకటించిన ఏడు (సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నాగర్కర్నూల్) కలిపి మొత్తం 11 కొత్త కాలేజీలు రానుండటం విశేషం. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ప్రస్తుత సంఖ్యకు రెట్టింపునకు పైగా కాలేజీలు రాష్ట్రంలో ఏర్పాటు కానుండటం గమనార్హం. ముఖ్యమంత్రి స్వయంగా వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షిస్తుండటంతో ఇది సులభ సాధ్యమైందని అధికారులంటున్నారు. ఈ 11 కాలేజీల ద్వారా వచ్చే రెండేళ్లలో 1,650 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. ఏం కావాలో చెప్పండి వైద్య ఆరోగ్యశాఖపై ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు ఒక ఉన్నతాధికారి తెలిపారు. ‘వైద్య ఆరోగ్యశాఖ నా వద్దే ఉంది. అందువల్ల ఇప్పుడే వీలైనంత అభివృద్ధి పనులు చేపట్టండి. మీకు ఏం కావాలో చెప్పండి’ అని అన్నట్లు తెలిసింది. -
ఒక్కసారిగా పెరిగిన డెంగీ కేసులు, అప్రమత్తమైన ఏపీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వారం రోజుల్లోనే (ఆగస్టు 23 నుంచి 29 వరకు) డెంగీ జ్వరాలు అకస్మాత్తుగా పెరిగాయి. ఎక్కువగా విశాఖపట్నం జిల్లాలోనే ఇవి నమోదయ్యాయి. గత ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు వరకు మొత్తం 1,388 డెంగీ కేసులు నమోదు కాగా, అందులో ఆగస్టు 23–29 మధ్యలోనే 225 కేసులున్నాయి. ఇందులో ఒక్క విశాఖలోనే 87 కేసులు నమోదయ్యాయి. మలేరియా కేసుల్లోనూ అంతే. 48 కేసులు వారం రోజుల్లో నమోదైతే అందులో 36 కేసులు విశాఖపట్నం జిల్లాలో నమోదైనట్లు ఆరోగ్యశాఖ తాజా గణాంకాల్లో వెల్లడైంది. ఒక్కసారిగా కేసులు పెరగడంతో ఆరోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. మరోవైపు.. చికున్ గున్యా కేసులు కూడా ఈ ఏడాది ఇప్పటివరకూ 25 నమోదైనట్లు అధికారులు తెలిపారు. దోమల సంతానోత్పత్తికి ఇవే కారణాలు.. ఎక్కడ నీళ్లు నిల్వ ఉంటే అక్కడ డెంగీ దోమలు సంతానోత్పత్తి చేస్తుంటాయి. ఉదా.. ఇంటి ఆవరణలో కొబ్బరి చిప్పలు, పాత నీళ్ల బాటిళ్లు, టైర్లు, పెంకులు ఇలా రకరకాల వస్తువుల్లో నీళ్లు నిల్వ ఉంటే లార్వా వృద్ధి చెందుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి 4,887 ప్రాంతాల్లో నీళ్లు నిల్వ ఉన్నట్లు అధికారులు ఇంటింటి సర్వేలో గుర్తించారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 896 ఉన్నాయి. మరో 7,425 చోట్ల పాత టైర్లు ఉన్న ప్రాంతాలను, 6,992 కొబ్బరి చిప్పలున్న ప్రాంతాలను గుర్తించి వాటిని తొలగించారు. మూడు శాఖల సమన్వయంతోనే కట్టడి మునిసిపల్, పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖ.. ఈ మూడు శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే ఈ జ్వరాల నియంత్రణ సాధ్యమవుతుంది. ఆరోగ్యశాఖ బృందాలు డెంగీ తీవ్రత ఉన్నచోట చర్యలు తీసుకుంటున్నాయి. ఇంటి పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉంచుకోవద్దని చెబుతున్నాం. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా, డెంగీ అదుపులోనే ఉన్నాయి. త్వరలోనే విశాఖలో డెంగీని అదుపులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. – డా. గీతాప్రసాదిని,ప్రజారోగ్య సంచాలకులు డెంగీ లక్షణాలు.. ► డెంగీ జ్వరం ఈడిస్ దోమ కుట్టడంవల్ల వస్తుంది. ► దోమ కుట్టిన 24 గంటల్లోనే విపరీతమైన తలనొప్పి వస్తుంది. ► జ్వర తీవ్రత పెరిగేకొద్దీ కళ్లు ఎర్రగా మారుతుంటాయి. ► మరుసటి రోజు కండరాల నొప్పి తీవ్రమవుతుంది. ► అనంతరం కీళ్ల నొప్పులు పెరుగుతాయి. ► శరీరమంతా దద్దుర్లు మొదలై, అవి ఎర్రగా మారతాయి. ► ఆహారం తినాలనిపించదు.. తీసుకున్నా వాంతులవుతాయి. ► డెంగీ హీమరోజిక్ ఫీవర్ (డీహెచ్ఎఫ్) అంటే ఎక్కువ తీవ్రత ఉన్నట్టు లెక్క. ► ఇక చివరి దశ అంటే డెంగీ షాక్ సిండ్రోమ్ (డీఎస్ఎస్) అంటారు. చికిత్సకు మార్గదర్శకాలు.. ► డెంగీ జ్వరాన్ని ఎలీశా టెస్టు ద్వారా నిర్ధారిస్తారు. ► ఫిజీషియన్ సూచనల మేరకు మాత్రమే యాంటీబయోటిక్స్ ఇవ్వాలి. ► తాజాగా యాంటీవైరల్ ఇంజెక్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ► జ్వర తీవ్రతను తగ్గించేందుకు తరచూ పారాసెటిమాల్ ఇవ్వాలి. ► రోగికి పళ్లు, పళ్ల రసాలు మాత్రమే ఆహారంగా ఇవ్వాలి. ► పరిస్థితిని బట్టి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాలి. ► రోగికి వీలైనంత ఎక్కువ మోతాదులో నీళ్లు తాగించాలి. మరో 30 ఆస్పత్రుల్లో పరీక్షలు రాష్ట్రంలో ఇప్పటివరకూ 24 ఆస్పత్రుల్లో మాత్రమే డెంగీ నిర్ధారణ పరీక్షలు చేసేవారు. ఇవి అందరికీ అందుబాటులోకి రావాలన్న ఉద్దేశంతో మరో 30 ఆస్పత్రుల్లో చేస్తున్నారు. ప్రధానంగా మునిసిపల్, పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖల మధ్య సమన్వయం లోపించడంవల్లే కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 9,147 లోతట్టు ప్రాంతాలున్నట్లు గుర్తించారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 8,042 ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 1,105 ఉన్నాయి. వర్షాల కారణంగా ఈ ప్రాంతాల్లో ఎక్కువ నీళ్లు నిలబడటంతో దోమల సంతానోత్పత్తి ఎక్కువగా ఉంటోంది. -
గడపగడపకూ టీకా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటింటికీ వెళ్లి కరోనా టీకాలు వేయాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. ఇప్పటికే మొబైల్ వ్యాన్లతో పల్లెలు, బస్తీలకు చేరుకున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింతగా విస్తృతం చేయడంపై దృష్టి పెట్టింది. వ్యాక్సిన్ కోసం ఎదురుచూడటం, గంటల తరబడి క్యూలో నిల్చోవడం వంటివేవీ లేకుండా.. ఆయా ప్రాంతాల్లో నిర్దేశించిన రోజున ఇంటివద్దకే వచ్చి టీకాలు వేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం రోజుకు సగటున లక్షన్నర వరకు వ్యాక్సిన్లు వేస్తుండగా.. గడపగడపకు వెళ్లే కార్యక్రమంతో ఇంతకు రెట్టింపు వేసేలా ప్రణాళిక రచించినట్టు వైద్యారోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా.. రాష్ట్రంలో ఇప్పటివరకు 1.66 కోట్ల డోసుల టీకా వేశారు. ఇందులో 1.24 కోట్ల మందికి మొదటి డోస్ వేయగా.. 42.55 లక్షల రెండు డోసులూ పూర్తయ్యాయి. మొదటిడోసు వేసుకున్నవారిలో అత్యధికంగా 18–44 ఏళ్ల మధ్య వయసు వారు 61 లక్షల మంది ఉన్నారు. వీరిలో 8.72 లక్షల మంది రెండు డోసులూ తీసుకున్నారు. అయితే రాష్ట్రంలో అర్హులందరికీ వ్యాక్సిన్ వేయాలంటే ఈ ఏడాది చివరివరకు సమయం పడుతుందని గతంలో అంచనా వేశారు. కానీ అంతకన్నా ముందే టీకా వేయాలని తాజాగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. డోసుల లభ్యతను బట్టి.. టీకాల లభ్యతను బట్టి ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కోసారి అనుకున్నంతగా వ్యాక్సిన్లు రాష్ట్రానికి అందడం లేదు. అలాంటప్పుడు టీకా కార్యక్రమం సజావుగా సాగడం లేదు. గత నెలలో రెండో డోసు వారికి మాత్రమే టీకాలు వేశారు. లభ్యత పెరగడంతో ఈ నెలలో మొదటి డోసు వారికి కూడా ఇస్తున్నారు. కొత్త వ్యాక్సిన్లకు అనుమతి వస్తుండటం, టీకాల ఉత్పత్తి పెరుగుతుండటంతో.. ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయాలని నిర్ణయించినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రముఖుల ఇళ్లకు వెళ్లి కరోనా టీకాలు వేస్తున్నారు. అదే తరహాలో సాధారణ ప్రజలకూ టీకాలు ఇంటిముందుకే రానున్నాయి. పీహెచ్సీ, బస్తీ దవాఖానాలు కేంద్రంగా.. రాష్ట్రంలో ప్రతి మండలానికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) ఉంది. పెద్ద మండలాల్లో రెండు వరకు ఉన్నాయి. అలాగే హైదరాబాద్ నగరంలో బస్తీ దవాఖానాలు ఉన్నాయి. వీటిని కేంద్రంగా చేసుకొని వ్యాక్సినేషన్ను ముమ్మరం చేయాలని అధికారులు భావిస్తున్నారు. పీహెచ్సీల్లో ప్రతి బుధ, శనివారాల్లో సాధారణ వ్యాక్సినేషన్ల కార్యక్రమం జరుగుతుంటుంది. ఏఎన్ఎంలు ఈ రోజుల్లో పిల్లలు, గర్భిణులకు పలురకాల టీకాలు ఇస్తారు. ఇకముందు సాధారణ వ్యాక్సినేషన్తోపాటు కరోనా టీకాలు కూడా వేయాలని నిర్ణయించారు. రియాక్షన్ వచ్చే అవకాశం ఉంటుందన్న అంచనాల కారణంగా వ్యాక్సినేషన్ మొదలుపెట్టిన కొత్తలో డాక్టర్, అంబులెన్స్ తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూశారు. అయితే వ్యాక్సిన్లతో రియాక్షన్ సమస్య దాదాపుగా లేనందున.. ఆ ఏర్పాట్లు అవసరం లేదని వైద్యారోగ్యశాఖ భావిస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కొందరికి ఒళ్లు నొప్పులు, జ్వరాలు వస్తుంటాయి. అందువల్ల పారాసిటమాల్ మాత్రలు అందజేయాలని నిర్ణయించారు. -
చిన్నవయసులోనే ఊదేస్తున్నారు..
సాక్షి, హైదరాబాద్: పాఠశాలకు వెళ్లే చిన్న వయసు విద్యార్థులు పొగాకు వినియోగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. 13 నుంచి 15 ఏళ్ల విద్యార్థులు కూడా పొగాకు ఉత్పత్తులు వాడటం, బీడీ, సిగరెట్లు తాగడంపై వైద్య నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలకు వెళ్లే ఈ వయసు వారు తెలంగాణలో 5.2 శాతం మంది పొగాకు ఉత్పత్తులు వినియోగిస్తున్నారని తేలింది. 13 నుంచి 15 ఏళ్ల వయసు పాఠశాల విద్యార్థులు ఎంత స్థాయిలో పొగాకు వినియోగిస్తున్నారనే దానిపై గ్లోబల్ యూత్ టొబాకో సర్వే (జీవైటీఎస్) జరిగింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సర్వే వివరాలను కేంద్రం తాజాగా ప్రకటించింది. మనదేశంలో 2003, 2006, 2009, 2019లో నాలుగు రౌండ్లలో ఈ సర్వే జరిగింది. పొగాకు వినియోగం, మానేయడం, పడేసిన సిగరెట్ పీకలు తాగడం, మీడియా సందేశాలు, ప్రకటనలు, పొగాకు ఉత్పత్తుల లభ్యత, పొగాకు వినియోగానికి సంబంధించిన పరిజ్ఞానం వంటి అంశాలపై 2019లో సర్వే జరిగింది. దేశవ్యాప్తంగా 987 పాఠశాలల (544 ప్రభుత్వ, 443 ప్రైవేటు)కు చెందిన 97,302 మంది విద్యార్థులు సర్వేలో పాల్గొన్నారు. అయితే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సర్వే జరిగినా రాష్ట్రాల వారీగా అన్ని వివరాలను ప్రకటించలేదు. ఆయా రాష్ట్రాల్లో ఎంత శాతం మంది పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారన్న సమాచారాన్నే కేంద్రం వెల్లడించింది. సర్వేలోని ముఖ్యాంశాలు.. ►13 నుంచి 15 ఏళ్ల విద్యార్థులు పొగాకు ఉత్పత్తులను వినియోగించడంలో దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణ 20వ స్థానంలో ఉంది. ►అరుణాచల్ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల్లో అత్యధికంగా 57.9 శాతం చొప్పున పొగాకు ఉత్పత్తులను ఆ వయసు విద్యార్థులు వినియోగిస్తుండగా, హిమాచల్ప్రదేశ్లో అత్యల్పంగా 1.1 శాతం మంది వినియోగిస్తున్నారు. ►దేశవ్యాప్తంగా 9.6 శాతం బాలురు, 7.4 శాతం బాలికలు పొగాకు ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. ►పట్టణాల్లో 5.5 శాతం మంది, పల్లెల్లో 9.4 శాతం మంది పొగాకు వినియోగిస్తున్నారు. ►7.3 శాతం విద్యార్థులు పొగాకు వినియోగిస్తుండగా, అందులో 8.3 శాతం అబ్బాయిలు, 6.2 శాతం అమ్మాయిలు ఉన్నారు. ►2003లో సిగరెట్ తాగేవారు 4.2 శాతం ఉండగా, 2006లో 3.8 శాతం, 2009లో 4.4 శాతం, 2019లో 2.6 శాతం ఉన్నారు. ►2019లో బీడీ తాగేవారు 2.1 శాతం ఉన్నారు. 2009లో 5.3 శాతం ఉన్నారు. ►ఈ–సిగరెట్ తాగేవారు 2.8 శాతం మంది ఉన్నారు. ►వయసు కారణంగా 54.7 శాతం మంది సిగరెట్ కొనుగోలు చేసేందుకు ఇబ్బందిపడ్డారు. ►పొగతాగే వారిలో 25 శాతం మంది అబ్బాయిలు, 13 శాతం మంది బాలికలు పొగ మానేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే 21 శాతం మంది మానేయాలని భావిస్తున్నారు. ►పొగ తాగే పాఠశాల విద్యార్థుల్లో 78 శాతం మంది దుకాణం, పాన్షాప్, వీధి విక్రయ కేం ద్రాల నుంచి సిగరెట్లు లేదా బీడీలు కొనుగోలు చేశారు. ►71 శాతం మంది విద్యార్థులు సిగరెట్ తాగడం తమకు హానికరమని భావించారు. ఆరోగ్యంపై పెను ప్రభావం ఆ వయసు విద్యార్థులు పొగాకు వినియోగిస్తే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రత్యక్షంగా ఊపిరితిత్తులపై ప్రభావం పడి, చాలా జబ్బులకు కారణమవుతుంది. దేశంలో 40 శాతం టీబీ కేసులకు పొగ తాగడమే ప్రధాన కారణం. నోటి, ఊపిరితిత్తుల కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ -
ఏపీ: విధులకు హాజరవ్వని వైద్యులపై చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కొందరు వైద్యులు అనేక ఏళ్లుగా అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్నారు. వీరందరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాల అధిపతులకు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.రవిచంద్ర ఆదేశాలు జారీ చేశారు. వారి జాబితా తక్షణమే పంపించాలని స్పష్టం చేశారు. డిప్యుటేషన్పై ఇతర విభాగాల్లో ఉంటూ.. గడువు ముగిసినా ఇంకా అక్కడే కొనసాగుతున్న వారిని కూడా సొంత శాఖకు పిలిపించాలని ఆదేశించారు. ఎలాంటి సమాచారం లేకుండా అనధికారికంగా సెలవుపై ఉన్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. బదిలీ జరిగినా కదలడం లేదు.. కొంతమంది వైద్యులు, స్టాఫ్ నర్సులు డిప్యుటేషన్ రద్దయినా.. కదలకుండా అక్కడే కొనసాగుతూ వేతనాలు తీసుకుంటున్నారు. పదోన్నతులు పొంది బదిలీ అయినా.. వెళ్లడం లేదు. తాజాగా ఆరుగురు ప్రొఫెసర్లకు అదనపు సంచాలకులుగా పదోన్నతి ఇచ్చారు. ఇందులో ఒక్కరు మాత్రమే(విశాఖ కింగ్జార్జి ఆస్పత్రిలో) విధుల్లో చేరారు. మిగతా ఐదుగురు విధుల్లో చేరకుండా పాత చోటే ఉన్నారు. ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు, ఎవరు ఎక్కడ వేతనం తీసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి వారందరిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే.. హెచ్వోడీలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
ఆక్సిజన్ పైపులేశారు.. వదిలేశారు..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్ సెంటర్ ఏర్పాటు పనులను గాలికొదిలేశారు. కోవిడ్ రెండో వేవ్ సమయంలో ఆర్టీసీ ఉద్యోగులు దాదాపు 4 వేల మంది వ్యాధి బారినపడి, 120 మంది వరకు చనిపోయారు. ఈ నేపథ్యంలో 200 పడకల సామర్థ్యంతో కరోనా సెంటర్ను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వైద్య, ఆరోగ్య శాఖలోని మౌలిక వసతుల కల్పన సంస్థ హడావుడిగా ఆక్సిజన్ పైప్లైన్ ఏర్పాటు పనులను కొంతమేర పూర్తి చేసింది. ఈలోపు కోవిడ్ కేసులు తగ్గడంతో ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడలేదు. త్వరలో మూడో వేవ్ వచ్చే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఆర్టీసీ సిబ్బందిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మూడో వేవ్ వరకైనా కోవిడ్ సెంటర్ సిద్ధమవుతుందని భావించారు. మొదటి రెండు దశల్లో పడకలు దొరక్క ఆర్టీసీ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలోనే ఉద్యోగులు తమ ఆసుపత్రిలో కోవిడ్ సెంటర్ కోసం గళమెత్తారు. అయితే కోవిడ్ కేంద్రం పనులు చేసినట్లే చేసి మధ్యలోనే గాలికొదిలేశారు. ఆశలు వదులుకుని సొంతంగా.. రూ.2 కోట్లు నిధులు కేటాయిస్తే తామే పనులు చేసుకుంటామని ఆర్టీసీ ఆస్పత్రి అధికారులు వైద్య, ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ చుట్టూ తిరిగినా ప్రయో జనం లేకుండా పోయింది. దీంతో సొంతంగా విరాళాలు సేకరించటం, స్వచ్ఛంద సంస్థలను కోరి కొన్ని పనులు పూర్తి చేయించుకునేలా నడుం బిగించారు. హైదరాబాద్ రీజియన్కు చెం దిన డీవీఎంలు, డిపో మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్ స్థాయి అధికారులు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు విరాళాలిచ్చారు. వాటితో 50బెడ్ల ఏర్పాటుకు పనులు ప్రారంభించారు. నిర్మాణ్ అనే సంస్థ 10 లీటర్ల సామర్థ్యమున్న 25 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఇచ్చింది. సెర్చ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ తరఫున ఓ ప్రతినిధి 40 సాధారణ పడకలు, 10 ఫౌలర్ బెడ్లు, సైడ్ టేబుల్స్, ఐవీ ఫ్లూయిడ్ స్టాండ్లు, స్టెతస్కోపులు అందజేశారు. రాజ్భవన్ రోడ్డులో ఉన్న మరో సంస్థను కూడా సంప్రదించి పెద్ద ఆక్సిజన్ సిలిండర్ల కోసం చర్చిస్తున్నారు. వంద ఇస్తే చాలు.. ఆర్టీసీలో 45 వేల మంది ఉద్యోగులున్నారు. వీరంతా నెలకు రూ.100 చొప్పున చెల్లిస్తే ప్రతినెలా రూ.45 లక్షలు సమకూరుతాయి. అలా 4 నెలలు ఇస్తే కోవిడ్ సెంటర్ ఏర్పాటుకు ఇతరులపై ఆధారపడాల్సిన పని ఉండదు. ప్రతినెలా వసూలయ్యే మొత్తంతో అప్పటికప్పుడు కావాల్సిన ఏర్పాట్లు చేసుకునేందుకు వీలు పడుతుంది. తొలుత 50 బెడ్ల సామర్థ్యంతో ప్రారంభించి క్రమంగా పెంచు కుంటూ పోవాలని అధికారులు భావిస్తున్నారు. గతంలో హన్మకొండలో ఆర్టీసీ డిస్పెన్సరీని ఇలాగే ఉద్యోగుల విరాళంతో ఏర్పాటు చేశారు. తక్కువ విరాళంతో ప్రతినెలా ఓ బస్సు చొప్పున కొని నడిపిన ఉదంతాలున్నాయి. కావాల్సినవి ఇవి.. ►పూర్తయిన ఆక్సిజన్ పైపులైన్కు ఆక్సిజన్ సిలిండర్లు అమర్చాలి. ►200 పడకలకు 45 లీటర్ల సామర్థ్యం ఉన్న 600 సిలిండర్లు. ►ఒక్కో సిలిండర్ ధర రూ.22 వేల వరకు ఉందని అధికారులు తేల్చారు. అంటే వీటికే రూ.1.32 కోట్లు అవసరం. ►ఐసీయూకు సంబంధించిన పరికరాలు కావాలి. ►7 వెంటిలేటర్లు. అంబులెన్సు, మందులు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సత్వరం పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించింది. వెంటనే పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, సదుపాయాలను బలోపేతం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. అదనపు గదుల నిర్మాణాల ఆవశ్యకతను సమీక్షించి ఇప్పటికే పనులు ప్రారంభించిన వాటి పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో పీడియాట్రిక్ ఆక్సిజన్, పీడియాట్రిక్ ఐసీయూ పడకలను పెంచాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వ్యాక్సినేషన్ కోసం మిగిలిన వారందరినీ గుర్తించేందుకు ప్రత్యేకంగా ‘‘మాప్ అప్ డ్రైవ్’’నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ, ప్రజారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, వైద్య, విద్య సంచాలకుడు డాక్టర్ రమేశ్రెడ్డి, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తప్పుడు పేర్లు.. నకిలీ టెస్టులు!
ఇంజాపూర్కు చెందిన సుమతి (38) కూడా 21వ తేదీన టెస్టు చేయించుకున్నట్టు నమోదు చేశారు. ఆమెకు ఈ విషయమే తెలియదు. తన పేరు, తన భర్త ఫోన్ నంబర్ (8247323492)ను ఎందుకు నమోదు చేశారని ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోని చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన కౌశిక్ (31) కొద్దిరోజులుగా తిరుపతిలోనే ఉన్నారు. ఈ మధ్య హైదరాబాద్ వచ్చిన దాఖలాలు కూడా లేవు. కానీ బుధవారం అబ్దుల్లాపూర్మెట్లో కరోనా టెస్టు చేయించుకున్నట్టు ఆయన ఫోన్ నంబర్ (9440452123)తో సహా రికార్డు చేశారు. ఉమర్ఖాన్గూడకు చెందిన రజిత (30), సైదులు (37), శివకుమార్ (25), ప్రణవి (12), రాము (28)లు ఈ నెల 21న అబ్దుల్లాపూర్మెట్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు చేయించుకున్నట్టు ఆస్పత్రి రికార్డులో పేర్లు, ఫోన్ నంబర్ (7989983606) సహా నమోదు చేశారు. వారికి నెగెటివ్ వచ్చినట్టు చూపారు. నిజానికి ఆ రోజున వీరెవరూ టెస్టులు చేయించుకోలేదు. సాక్షి, హైదరాబాద్/అబ్దుల్లాపూర్మెట్ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా టెస్టులు చేయకుండానే.. చేసినట్టుగా నమోదు చేసి, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు కిట్లను పక్కదారి పట్టించిన తీరు ఇది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న కొందరు వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు కలిసి చేస్తున్న ఈ దందా ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో బయటపడింది. గతంలో టెస్టులు చేయించుకున్న వారి పేర్లు, వివరాలనే మళ్లీమళ్లీ రికార్డుల్లో నమోదు చేసి కిట్లను దారిమళ్లిస్తున్నట్టు తేలింది. వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యమే ఈ వ్యవహారానికి కారణమన్న విమర్శలు వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ ఆరోగ్య కేంద్రంలో జరిపిన పరిశీలనలో విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. ఈ ఆరోగ్య కేంద్రం పరిధిలో బుధవారం 43 మందికి, గురువారం 63 మందికి ర్యాపిడ్ యాంటీజన్ టెస్టులు చేసినట్టు రికార్డుల్లో నమోదు చేశారు. అందులో ఇద్దరికి మాత్రమే పాజిటివ్ నిర్ధారణ అయినట్టు, మిగతా వారందరికీ నెగిటివ్ వచ్చినట్టు రికార్డు చేశారు. కానీ రికార్డులో చూపించిన వారిలో ఐదారుగురికి మినహా మిగతావారెవరికీ టెస్టులే చేయలేదని తేలింది. కిట్లు లేవని జనాన్ని తిప్పిపంపేస్తూ.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 248 ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేస్తున్నారు. కోవిడ్ ఉధృతి ఎక్కువగా ఉన్న ఏప్రిల్, మే నెలల్లో రోజుకు సగటున 50 వేల నుంచి 60 వేల టెస్టులు చేశారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కానీ జనం టెస్టుల కోసం ఇప్పటికీ కొన్ని ఆరోగ్య కేంద్రాలకు క్యూ కడుతున్నారు. అక్కడి సిబ్బంది కిట్లు లేవని చెబుతూ చాలా మందిని తిప్పి పంపేస్తున్నారు. కానీ రికార్డుల్లో మాత్రం టెస్టులు చేసినట్టు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. నకిలీ పేర్లు, ఫోన్ నంబర్లు నమోదు చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా.. ప్రభుత్వ వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లలో కొందరు డ్యూటీ ముగిసిన తర్వాత ఇంటివద్ద, బయట ప్రైవేటుగా ప్రాక్టీసు చేస్తున్నారు. చిన్నచిన్నక్లినిక్లు పెట్టి నడిపిస్తున్నారు. వాటిల్లో ప్రైవేటుగా కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద క్యూలు ఉండటం, ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లలో ధరలు ఎక్కువగా ఉండటం, ర్యాపిడ్ కిట్లు లేకపోవడంతో.. చాలా మంది చిన్న క్లినిక్లలో కరోనా టెస్టులు చేయించుకోవడానికి సిద్ధమవుతున్నారు. కొందరు వైద్య సిబ్బంది దీనిని సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా రికార్డుల్లో తప్పుడు పేర్లు, ఫోన్ నంబర్లు నమోదు చేస్తున్నారు. పది, ఇరవై మందికి టెస్టులు చేసి.. 50 నుంచి 60 మందికి చేసినట్టు నమోదు చేస్తున్నారు. పాజిటివ్ రిపోర్టులు రాస్తే.. పైఅధికారులకు అనుమానం వస్తుందన్న ఉద్దేశంతో నెగిటివ్గా నమోదు చేస్తున్నారు. ఇక కొందరు వైద్య సిబ్బంది టెస్టు కిట్లను చిన్నచిన్న ప్రైవేటు ఆస్పత్రులకు అమ్ముకుంటున్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. తప్పుడు ఫలితాలతో సమస్యలు చేయని టెస్టులు చేసినట్టు.. నెగెటివ్ వచ్చినట్టు చూపుతుండటంతో కేసులు తక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం నెలకొంటోంది. వైరస్ వ్యాప్తి తగ్గిందన్న భావనతో జనం కోవిడ్ నిబంధనలను విస్మరిస్తున్న పరిస్థితి ఉందని.. మాస్క్లు, భౌతిక దూరం వంటివి పాటించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే వైరస్ చాపకింద నీరులా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు. -
150 గ్రామాల్లో కరోనా ఘంటికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కరోనా ఉధృతి తగ్గుతున్నప్పటికీ 150 గ్రామాల్లో మాత్రం వైరస్ విజృంభిస్తోందని, ఏడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కరోనా వీరవిహారం చేస్తోందని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కేసుల పెరుగుదల, వాటి ని యంత్రణ కోసం ఇటీవల వైద్య, ఆరోగ్యశాఖ క్యార్యదర్శి రిజ్వీ నేతృత్వం లో ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి. శ్రీనివాసరావు, సీఎం ఓఎస్డీ డాక్టర్ తాడూరి గంగాధర్, డీఎంఈ డాక్టర్ రమేశ్రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి 3 రోజులపాటు హెలికాప్టర్లో సుడిగాలి పర్యటన చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆ ప్రాంతాల్లో కరోనా విజృంభించడానికి గల కారణాలపై సీఎం కేసీఆర్కు నివేదిక అందజేశారు. మంత్రివర్గ సమావేశం సందర్భంగానే పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కరోనా విజృంభిస్తున్న ఏడు జిల్లాలకు ప్రభుత్వం ఒక్కో నోడల్ ఆఫీసర్ను నియమించింది. నివేదికలోని అంశాలు ఇలా... ►ప్రజలు మాసు్కలు ధరించకపోవడం, ఏపీ సరిహద్దుల్లో ఎక్కువగా ప్రయాణాలు చేయడం వల్ల నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ పరిధిలోని హాలియా, త్రిపురారం, పెద్దవూరల్లో కేసులు పెరుగుతున్నాయి. ►మిర్యాలగూడ పరిధిలోని అల్లగడప, వేమునాలపల్లి, దామరచర్లలో ఉన్న రైస్ మిల్లులు, పవర్ ప్లాంట్ వర్కర్లలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల వారే. తరచూ ప్రయాణాలు సాగిస్తుండటం వల్ల అక్కడ కరోనా విజృంభిస్తోంది. ►నకిరేకల్ పరిధిలోని పనగల్, ఒగుడు, రాములబండ, మంచెర్లగూడ ప్రాంతాల్లో జాతర, పెళ్లిళ్లు వైరస్ ఉధృతికి కారణం. ►సూర్యాపేట జిల్లాలో మార్కెట్ హడావుడి, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉండటం, చేపలు పట్టడం తదితర కారణాల వల్ల వైరస్ విజృంభిస్తోంది. ►ఖమ్మం జిల్లాలో నగరానికి చుట్టుపక్కల వైరస్ తీవ్రంగా ఉంది. ►మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పరిధిలోని గార్ల, కొత్తగూడ, కోమట్లగూడెం, ఉగ్గపల్లిల్లో కరోనా పరీక్షలు తగ్గాయి. ►కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పరిధిలోని జమ్మికుంట, వీణవంక ఏరియాల్లో కేసులు, పాజిటివిటీ రెండూ పెరుగుతున్నాయి. ►మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, జైపూర్, నస్పూర్, చెన్నూర్ ప్రాంతాల్లో సింగరేణి కాలరీస్ యాజమాన్యం, జిల్లా వైద్యాధికారుల మధ్య సహకారం కొరవడటం, తక్కువ పరీక్షలు, సరైన వైద్య చికిత్సలు చేయడంలో వైఫల్యం వల్ల ఇక్కడ కేసులు పెరిగాయి. ►పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, గారేపల్లి, కమాన్పూర్, ఓదెల, శ్రీరాంపూర్, అల్లూర్లలో తక్కువ పరీక్షలు, వివిధ శాఖల మధ్య సహకారం కొరవడటం, పవర్ ప్లాంట్ వర్కర్ల మొబిలిటీ వల్ల కేసులు పెరిగాయి. ►రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల అర్బన్, వేములవాడల్లో పరీక్షలు తగ్గడం, దేవస్థానానికి భక్తులు రావడం వల్ల కేసులు పెరుగుతున్నాయి. ►వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ, కమలాపూర్ ప్రాంతాల్లో జనం తాకిడి పెరగడం, మాస్్కలు ధరించకపోవడం వల్ల అధిక కేసులు. సిఫార్సులు... అన్నిచోట్లా కరోనా పరీక్షలు, ఫీవర్ సర్వే చేపట్టాలి. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ను ముమ్మరంగా నిర్వహించాలి. కోవిడ్ క్లినిక్స్ను కొనసాగించాలి. ఈ ప్రాంతాల్లో ఏ వేరియంట్ వైరస్ విస్తరిస్తుందో తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలి. వివిధ శాఖల మధ్య సహకారం పెంచాలి. -
హెచ్చరిక: నెల రోజుల్లోనే మూడో వేవ్!
సాక్షి, ముంబై: దేశంలో కరోనా రెండో వేవ్ మొదలైన మహారాష్ట్రలోనే మూడో వేవ్ కూడా మొదలుకావొచ్చన్న అంచనాల నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ కూడా ఇదే హెచ్చరిక చేసింది. కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా మూడో వేవ్ రావొచ్చని అంచనా వేసింది. లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో బయటికి వస్తున్నారని, ఇలాగే కొనసాగితే నెల రోజుల్లోనే మూడో వేవ్ మొదలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కరోనా పరిస్థితిపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ఇటీవల ఉన్నతస్థాయిలో సమీక్షించారు. మూడో వేవ్ తీవ్రంగా ఉండొచ్చని, మహారాష్ట్రలోనే యాక్టివ్ కేసుల సంఖ్య 8 లక్షలకు చేరొచ్చని.. బాధితుల్లో 10 శాతం వరకు పిల్లలు ఉండొచ్చని అధికారులు ఈ సందర్భంగా అంచనా వేశారు. కాగా మన దేశంలో వచ్చిన కరోనా రెండు వేవ్లలో మహారాష్ట్ర ఎక్కువగా ప్రభావితమైంది. తొలివేవ్లో 19 లక్షల కేసులు, రెండో వేవ్లో ఏకంగా 40 లక్షల కేసులు వచ్చాయి. మూడో వేవ్లో ఇంతకు రెండింతలుగా 80 లక్షల వరకు కేసులు రావొచ్చని అధికారులు భావిస్తున్నారు. కాగా మూడో వేవ్ సన్నద్ధతలో భాగంగా పూర్తి ఏర్పాట్లు చేయాలని.. బెడ్లు, ఆక్సిజన్, మందులు సిద్ధంగా ఉంచుకోవాలని మహారాష్ట్ర సీఎం అధికారులను ఆదేశించారు. పీపీఈ కిట్లు, ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లను పెద్ద సంఖ్యలో సమకూర్చుకోవాలని స్పష్టం చేశారు. జార్ఖండ్లోనూ కేసులు.. జార్ఖండ్లోనూ పలు డెల్టా ప్లస్ కోవిడ్ కేసులను గుర్తించినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. కొందరు పేషెంట్ల శాంపిల్స్ను భువనేశ్వర్లోని ల్యాబ్కు పంపామని, జన్యు పరీక్షల్లో డెల్టా ప్లస్గా గుర్తించినట్టు సమాచారం వచ్చిందని తెలిపాయి. ఈ కొత్త వేరియంట్ మరింత ప్రమాదకరం కావొచ్చని, వ్యాప్తి తీవ్రతపై నిర్ధారణ జరగాల్సి ఉందని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) మైక్రో బయాలజీ విభాగం అధిపతి మనోజ్ కుమార్ వెల్లడించారు. స్పైక్ ప్రొటీన్ మార్పు.. కరోనా డెల్టా వేరియంట్ (బీ.1.167.2)లో మ్యుటేషన్లు జరిగి డెల్టా ప్లస్ (ఏవై.1)గా రూపాంతరం చెందింది. ఈ వైరస్ మన శరీర కణాలకు అతుక్కుని, లోపలికి ప్రవేశించేందుకు తోడ్పడే స్పైక్ ప్రొటీన్లో మార్పులు జరిగాయి. ఈ మార్పును ‘కే417ఎన్’గా పిలుస్తున్నారు. కరోనా వ్యాక్సిన్లలో చాలావరకు ఈ స్పైక్ ప్రొటీన్ను లక్ష్యంగా చేసుకునే పనిచేస్తాయి. ఇప్పుడీ ప్రొటీన్లోనే మా ర్పులు రావడంతో వ్యాక్సిన్లు ఎంత వరకు ప్రభావం చూపగలవనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైరస్ సోకడం, వ్యాక్సిన్లు వేసుకోవడం వల్ల మన శరీరంలో ఉత్పత్తయిన యాంటీబాడీల నుంచి కొత్త వేరియంట్ తప్పించుకోగలదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని వ్యాప్తి విపరీతంగా ఉన్నా.. ప్రమాదకరంగా మారకపోవచ్చనే ఆశాభావం కనిపిస్తోంది. కాగా.. మోనో క్లోనల్ యాంటీబాడీస్ ఔషధం ప్రభావం నుంచి డెల్టా ప్లస్ వేరియంట్ తప్పించుకుంటున్నట్టుగా ఇటీవలి పరిశోధనల్లో గుర్తించారు. -
‘మితిమీరిన స్టెరాయిడ్స్ వాడకమే బ్లాక్ ఫంగస్కు కారణం’
సాక్షి, అమరావతి: వైద్యుల పర్యవేక్షణ లేకుండా మితిమీరిన స్టెరాయిడ్స్ వాడకమే బ్లాక్ ఫంగస్కు కారణమని ఏపీ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ చైర్మన్ కేఎస్ జవహర్రెడ్డి పేర్కొన్నారు. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి ఎక్కువగా బ్లాక్ ఫంగస్ వస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. బ్లడ్ షుగర్ ఎక్కువ ఉండి స్టెరాయిడ్స్ అధికంగా వాడిన వారికి బ్లాక్ ఫంగస్ వస్తోందని వైద్యులు చెబుతున్నారన్నారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బ్లాక్ ఫంగస్పై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 11 టీచింగ్ ఆస్పత్రులు, 2 ఈఎన్టీ ఆస్పత్రులను నోటిఫై చేశామని, ఇప్పటికే బ్లాక్ ఫంగస్ను ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నామని జవహర్రెడ్డి తెలిపారు. బ్లాక్ ఫంగస్ వైద్యం మందుల కోసం కేంద్రాన్ని సంప్రదించామని, ఇప్పటికే కేంద్రం బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్లో ఉపయోగించే లైపోజోమల్ ఆంఫోటెరిసిన్- బి ఇంజక్షన్లను రెండు వేలు పంపిందని తెలిపారు. ఈ ఇంజక్షన్స్ కొనుగోలుకు కంపెనీలతో నేరుగా మాట్లాడుతున్నామని, 75 వేల లైపోజోమల్ ఆంఫోటెరిసిన్- బి ఇంజక్షన్లకు ఆర్డర్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. 20 వేల ఇంజక్షన్ల ఆర్డర్ వీటిలొ మూడు వేల ఇంజక్షన్లు వచ్చాయని, రెండ్రోజుల్లో మరో రెండు వేల డోసులు వస్తాయని ఆశిస్తుస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే దీనికి ముడిపదార్ధాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సలో అవసరమైన మరో మందు పుష్కలోజోనల్ కోసం కంపెనీలతో మాట్లాడుతున్నామన్నారు. ఇవి ట్యాబ్లెట్స్, ఇంజక్షన్ల రూపంలో ఉంటాయని, లక్ష ట్యాబ్లెట్స్, 20 వేల ఇంజక్షన్లను ఆర్డర్ చేశామని తెలిపారు. సీఎం జగన్ ఆదేశాలతో మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వేర్వేరుగా క్వారంటైన్ కేంద్రాలు అదే విధంగా కోవిడ్ కట్టడికి స్వచ్చంద సంస్థలు సహకరించాలని జవహర్రెడ్డి కోరారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో నోడల్ అధికారులతో సమన్వయ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేర్చడంలో స్వచ్చంద సంస్థలు వారధిగా ఉండాలని, కోవిడ్ కుటుంబాలకు మానసిక, సామాజిక మద్దతు అందించాలన్నారు. ఐసోలేషన్, వ్యాక్సినేషన్, టెస్టింగ్ కేంద్రాల నిర్వహణ బాధ్యతను ఎన్జీవోలు స్వీకరించాలని తెలిపారు. సంచార వాహనాల ద్వారా చిన్నారులు, వృద్ధులకు వారి ఇళ్ల వద్దే కోవిడ్ టెస్టింగ్ సేవలు అందించాలని పేర్కొన్నారు. అనాథ బాల, బాలికలకు వేర్వేరుగా క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని జవహర్రెడ్డి తెలిపారు. చదవండి: ఆనందయ్య మందు: కృష్ణపట్నంలో టీడీపీ హడావుడి -
తెలంగాణలో వ్యాక్సిన్ టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: రెండో డోసు టీకా కోసం రాష్ట్రవ్యాప్తంగా జనం వ్యాక్సినేషన్ కేంద్రాలకు పోటెత్తారు. సోమవారం పొద్దున ఆరు గంటల నుంచే పెద్ద సంఖ్యలో క్యూలు కట్టారు. జనం పెరిగిపోవడం, తమ వరకు టీకా వస్తుందో లేదోనన్న ఆందో ళన కారణంగా పలుచోట్ల తోపులాటలు జరిగాయి. గంటల తరబడి క్యూలో నిలబడటంతో వృద్ధులు, మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. పరిస్థితి ఇలా ఉండటంతో పోలీసు పహారాలో టీకాలు వేయాల్సి వచ్చింది. అయితే వ్యాక్సిన్లు తక్కువగా ఉండటంతో వైద్య సిబ్బంది చేతులెత్తేశారు. చాలా మంది ఉసూరుమంటూ వెళ్లిపోవాల్సి వచ్చింది. తక్కువ కేంద్రాల్లోనే.. రాష్ట్రవ్యాప్తంగా 1,350 కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లు చేసిన వైద్యారోగ్య శాఖ.. పరిస్థితికి తగినట్టుగా కేంద్రాల సంఖ్యలో మార్పులు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం వెయ్యి కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో 45 ఏళ్లుదాటిన వారి కేటగిరీలో రెండో డోసు వారికి మాత్రమే టీకాలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. కానీ రెండో డోసు వారికి సరిపడా కూడా వ్యాక్సిన్లు లేక ఇబ్బందులు వస్తున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 12వ తేదీకల్లా సుమారు 5లక్షల మంది లబ్ధిదారులకు రెండో డోసు వ్యాక్సిన్ పంపిణీ చేయాలి. కానీ ఆ మేర టీకాలు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. తోపులాట జరుగుతుండటంతో అడ్డుగా కట్టిన తాడు కింద నుంచి వెళుతున్న వృద్ధుడు టీకాల నిల్వలు రెండు లక్షల డోసులే..! ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ వద్ద కేవలం 2లక్షల డోసులు మాత్రమే నిల్వ ఉన్నట్టు తెలుస్తోంది. సోమవారం తీసుకున్నవారుపోగా.. ఇంకా నాలుగు లక్షల మందికి టీకా వేయాల్సి ఉందని అంచనా. రెండ్రోజుల తర్వాత లబ్ధిదారుల సంఖ్య మరింత పెరగనుంది. కానీ కేంద్రం నుంచి వ్యాక్సిన్లు ఎప్పుడు వస్తాయన్నది తేలడం లేదు. వాస్తవానికి రెండో డోసు వ్యాక్సిన్కు రిజిస్ట్రేషన్ అవసరం లేదని, లబ్ధిదారులు నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రాలకు వస్తే అప్పటికప్పుడు వివరాలు నమోదు చేసి టీకాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం గందరగోళానికి దారితీసింది. చాలాచోట్ల టీకా కేంద్రాలకు లబ్ధిదారులు బారులు తీరారు. అయితే ఒక్కో సెంటర్లో 100 నుంచి 150 మందికే వ్యాక్సిన్ వేశారు. మిగతావారిని తిప్పి పంపేశారు. దీనిపై జనం తీవ్రంగా మండిపడ్డారు. సకాలంలో టీకా తీసుకోకుంటే పనిచేస్తుందో లేదోనని ఆందోళన పడ్డారు. వైద్య సిబ్బంది సర్ది చెప్తున్నా వినకుండా ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ సెంటర్ల వద్ద తోపులాట, జనం ఆగ్రహం నేపథ్యంలో పలుచోట్ల పోలీసు పహారాలో వ్యాక్సినేషన్ కొనసాగించారు. ఏ వ్యాక్సిన్ ఎక్కడిస్తున్నారో తెలియక.. రాష్ట్రంలో ప్రస్తుతం కోవాగ్జిన్, కోవిషీల్డ్ రెండు రకాల వ్యాక్సిన్లు పంపిణీ చేస్తున్నారు. తొలి డోసు ఏ వ్యాక్సిన్ తీసుకుంటే.. రెండో డోసు అదే వ్యాక్సిన్ వేసుకోవాలి. అయితే ఏ సెంటర్లో ఏ వ్యాక్సిన్ వేస్తున్నారో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఉప్పల్ పీహెచ్సీలో తోపులాట అధికారుల సమన్వయ లోపం కారణంగా హైదరాబాద్లోని ఉప్పల్ పీహెచ్సీ టీకా కేంద్రం వద్ద సోమవారం తోపులాట జరిగింది. అప్పటికే జనం భారీగా గుమిగూడగా.. సిబ్బంది వచ్చి కోవాగ్జిన్ వారు రావాలని పిలవడంతో ఒక్కసారిగా వందలాది మంది గేటు ముందుకు దూసుకొచ్చారు. 45–59 మధ్య వయసువారితోపాటు వృద్ధులూ వారి లో ఉన్నారు. ఉదయం నుంచీ క్యూలైన్లో ఉండటంతో అలసిపోయిన ఒక వృద్ధురాలు సొమ్మసిల్లి పడిపోయింది. అక్కడి జనం ఆమె ను లేపి నీళ్లు తాగించి కేంద్రంలోకి పంపారు. ఓవైపు టీకా కోసం, మరోవైపు కోవిడ్ పరీక్షల కోసం భారీగా జనం రావడంతో ఆస్పత్రి ప్రాం తం కిటకిటలాడింది. ఇక్కడా భౌతిక దూరం కనిపించలేదు. హైదరాబాద్ శివార్లలోని పటాన్చెరు ఏరియా ఆస్పత్రిలోనూ అదే పరిస్థితి. రెండో డోస్ టీకా కోసం ప్రజలు.. తెల్లవారుజాము నుంచే ఆస్పత్రి వద్ద బారులు తీరారు. దీంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి.. పంపిణీ చేయాల్సి వచ్చింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో వ్యాక్సిన్ కో సం జనం పెద్ద సంఖ్యలో గుమిగూడారు. భౌతి కదూరం వంటిదేమీ పాటించకుండా బారులు తీరారు. అధికారులు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో చాలా మంది ఇబ్బందిపడ్డారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ పరిస్థితి ఇదీ ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసులు : 51,89,389 మొదటిడోసు తీసుకున్నవారు : 43,74,338 రెండు డోసులు తీసుకున్నవారు : 8,15,051 ప్రస్తుతమున్న టీకా నిల్వలు : 2 లక్షలు -
ఏపీలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు.. భారీగా నిధులు కేటాయింపు
సాక్షి, అమరావతి: ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. రూ.309.87 కోట్లు కేటాయిస్తూ వైద్యారోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. 49 చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడంతో పాటు, 50 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్ వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. 10 వేల అదనపు ఆక్సిజన్ పైప్లైన్ల ఏర్పాటు చేయనుంది. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు వచ్చే 6 నెలలకు రూ.60 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. కోవిడ్ వైద్యానికి ఆక్సిజన్ సరఫరా కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణ ఇంఛార్జ్గా స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణ ఇంఛార్జ్గా స్పెషల్ సీఎస్ కరికాల వలవన్కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ దిగుమతిని ఆయన పర్యవేక్షిస్తారు. లిక్విడ్ ఆక్సిజన్ సరఫరాపై కరికాల వలవన్ దృష్టిసారించనున్నారు. చదవండి: మామిళ్లపల్లె పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి విచారణ ఏపీ: 9 మందితో ఆక్సిజన్ మానిటరింగ్ కమిటీ -
ఏపీలో ఎన్440కే వైరస్ లేదు.. ప్రజలను భయపెట్టొద్దు
సాక్షి, విజయవాడ: కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయొద్దని ఏపీ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్ కేఎస్ జవహర్ రెడ్డి అన్నారు. ఎన్440కే వైరస్పై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలో ఈ వైరస్ తీవ్రంగా ఉన్నట్టు ఎలాంటి నిర్థారణ జరగలేదని.. అందుకు సంబంధించిన పరిశోధన డేటా కూడా ఏమీలేదని ఆయన వెల్లడించారు. ‘‘ప్రతీ నెలా సీపీఎంబీకి 250 నమూనాలు పంపుతాం. ఏపీ, తెలంగాణ, కర్ణాటకల నుండి నమూనాలను జన్యు శ్రేణి పరీక్షల కోసం సీసీఎంబీ హైదరాబాద్కి పంపిస్తున్నారు. ఎన్ 440కె (బి.1.36) వైరస్ దక్షిణ భారత దేశం నుండి వెళ్లిన నమూనాల్లో గుర్తించారు. 2020 జున్, జూలై నెలల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక నుంచి వెళ్లిన నమూనాల్లో గుర్తించారు. దాని ప్రభావం గత డిసెంబర్, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కనిపించింది. కానీ మార్చి నెలలో అది పూర్తిగా అంతర్థానమైంది, ఇప్పుడు దాని ప్రభావం చాలా స్వల్పం. ప్రస్తుతం బి1.167, బి.1 వైరస్ స్ట్రెయిన్ల ప్రభావం దక్షిణ భారత దేశంపై ఎక్కువగా ఉంది. పాజిటివ్ కేసుల్లో ఏప్రిల్ నెల డేటాను పరిశీలించినప్పుడు నిర్థారణ జరిగింది. ఇది అధిక ఇన్ఫెక్షన్ కారకంగాను, యువతలో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏపీడేమియోలాజికల్లో కూడా బి.1.617ని ఇండియాలో గుర్తించినట్టు పేర్కొన్నారు. ఎన్ 440కే వేరియంట్ కోసం డబ్ల్యూహెచ్వో ఎక్కడా ప్రస్తావించలేదని’’ జవహర్రెడ్డి వివరించారు. ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తున్నట్టు దీని ప్రభావం ఉంటే ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్వో గుర్తించకుండా ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. మీడియాలో శాస్త్రీయమైన అంశాలపై వార్తలు ప్రసారం చేసేటప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని కేఎస్ జవహర్రెడ్డి అన్నారు. చదవండి: ఏపీలో కొత్త రకం వైరస్ లేదు YS Jagan: అత్యధిక పరీక్షలు, ఉచిత వైద్యం.. ప్రజలకు అండగా.. -
వ్యాక్సిన్ కూడా సరుకేనా?
ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ అందించడం ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వం కనీసంగా చేయవలసిన పని. కానీ కోట్లాదిమంది ప్రజలకు సార్వత్రిక ప్రయోజనం కలిగించే అంశం కూడా మార్కెట్ సరకుగా మారిపోవడాన్ని అర్థం చేసుకోవడం కష్టసాధ్యమే. విస్తృత ప్రజానీకం ప్రాణాలు కాపాడి భారత్ను ప్రస్తుత దుర్భర పరిస్థితుల నుంచి కాపాడటం కంటే స్వేచ్ఛా మార్కెట్ భావజాలంపై కేంద్రప్రభుత్వానికి ఉన్న సానుకూల అభిప్రాయమే పైచేయి సాధించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్షణంలో దేశ ఆరోగ్య భద్రతకు అత్యంత కీలకమైన ఒక ఉత్పత్తిపై వేరువేరు ధరల వ్యూహాలను అమలు చేయడాన్ని మరోలా ఆర్థం చేసుకోలేం. టీకాలు వేసే ప్రక్రియ ఉమ్మడిగా ప్రజలకు ప్రయోజనం కలిగించే అంశం. పైగా సాంక్రమిక వ్యాధులు ప్రబలిపోయినప్పుడు మరణాలు, బహుముఖ వ్యాధులను తగ్గించడానికి కారుచౌక మార్గం వ్యాక్సినేషన్ మాత్రమే. అందుకే పాశ్చాత్య దేశాలన్నీ తమ జనాభాకు ఉచితంగానే వ్యాక్సిన్ అందిస్తూ వస్తున్నాయి. ఈ దేశాల్లో సోషలిస్టు ప్రభుత్వాలు లేవు. అమెరికాలో వలే పశ్చిమదేశాలన్నీ పూర్తిగా మార్కెట్ ఆధారితంగా నడుస్తుం టాయి. ఈ దేశాల్లోని మెజారిటీ ప్రజలకు ఒక కరోనా టీకాపై 20 డాలర్లు పెట్టగలగేటంత తలసరి ఆదాయం ఉంటున్నప్పటికీ జనాభా మొత్తానికి ఇవి ఉచిత టీకాను అందిస్తున్నాయి. కానీ భారత రాజకీయ నాయకత్వం దీనికి పూర్తి భిన్నంగా ఎలా ఆలోచిస్తోంది? పూర్తిగా లోపభూయిష్టంగా ఉన్న వ్యాక్సిన్ సేకరణ విధానాన్ని భారత ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చిందో అర్థం చేసుకోవడం అసాధ్యం. అంతకుమించి సామూహిక ప్రజాప్రయోజనానికి సంబంధించిన అంశం మన దేశంలో మార్కెట్ సరకుగా ఎలా మారిపోయింది? కోట్లాదిమంది ప్రజల ప్రాణాలు కాపాడి భారత్ను ప్రస్తుత దుర్భర పరిస్థితుల నుంచి కాపాడటం కంటే స్వేచ్ఛా మార్కెట్ భావజాలంపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న సానుకూల అభిప్రాయమే పైచేయి సాధించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్షణంలో దేశ ఆరోగ్య భద్రతకు అత్యంత కీలకమైన ఒక ఉత్పత్తిపై వేరువేరు ధరల వ్యూహాలను అమలు చేయడాన్ని మరోలా ఆర్థం చేసుకోలేం. అపారమైన లాభాలపై దృష్టి ఉండే మార్కెట్ అనుకూలవాదులకు ప్రజాహితం అనే భావనే రుచించకపోవచ్చు. అలాంటి సందర్భంలో ప్రభుత్వం కనీసం ఆర్థిక సమర్థత, వనరుల హేతుపూర్వక వినియోగం విషయంలో అయినా దాపరికం లేకుండా వ్యవహరిం చాల్సి ఉంటుంది. భారత ఆర్థిక వ్యవస్థ కనీవినీ ఎరుగనంత స్థాయికి పతనమైపోయింది. ఆదాయాలు కుదించుకుపోవడం, కుటుంబాల స్థాయిలో ఆహారం, కనీసం ఆదాయం వంటి ప్రాథమిక అవసరాలు కూడా తీరని పరిస్థితుల్లో కోవిడ్–19 ఆర్థిక వ్యవస్థపై కలిగిస్తున్న ప్రభావం సూక్ష్మస్థాయిలో విధ్వంసకరంగా మారింది. దీనికి తోడుగా కునారిల్లిపోయిన ఆరోగ్య మౌలిక వ్యవస్థను, చిన్నాభిన్నమైపోయిన జీవితాలను పునర్నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే మన వ్యాక్సిన్ కంపెనీలు కనీస ఉత్పత్తి ధర వద్ద లేక ఉత్పత్తి ఖర్చుపై 10 శాతం కనీస లాభంతో వ్యాక్సిన్ని అందిస్తున్నాయి. కానీ కొన్ని నెలల్లోపే వ్యాక్సిన్ ధర పెరగనుండటం గమనార్హం. టీకాల కొరత అసలు కారణం ముందస్తుగా వ్యాక్సిన్ కొనుగోలు ఒప్పందాలు లేకపోవడం లేక వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించిన అన్ని అంశాలను పొందుపర్చి సమగ్రమైన వ్యూహాన్ని అమలు చేసే జాతీయ వ్యాక్సినేషన్ ప్లాన్ లేకపోవడం వల్లే ఇప్పుడు ఉన్నట్లుండి కోవిడ్–19 టీకాల కొరత ముంచుకొచ్చింది. వ్యాక్సిన్ ఉత్పత్తి స్థాయిని పెంచడానికి మనం మొదట్లోనే యుద్ధప్రాతిపదికన డజనుకు పైగా బీఎస్ఎల్–3 స్థాయి అత్యుత్తమ సంస్థలను నెలకొల్పి ఉండాలి. దేశంలో టీకాలకు ఏర్పడుతున్న విస్తృతమైన డిమాండ్ని తీర్చేందుకు ఇతర మందుల కంపెనీలను కూడా భాగస్యామ్యం చేయడం ద్వారా మొత్తం టీకాల సరఫరా వ్యవస్థను ముందుకు తీసుకుపోయి ఉండవచ్చు. దీనికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వ వ్యూహం మొత్తం రెండు కంపెనీలపైనే ఆధారపడటమే ప్రస్తుత ప్రతి ష్టంభనకు కారణమైంది. అలాగే జనాభాలోని అధిక శాతానికి టీకాలు వేయగలిగేలా వ్యాక్సినేషన్ కేంద్రాలను మరింతగా ఏర్పర్చేలా రాష్ట్రప్రభుత్వాలను ప్రోత్సహించే ముందు చూపు కూడా కరువైపోయింది. ప్రస్తుతం సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నెలకు 6 కోట్ల డోసులను మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. జూలై నాటికి నెలకు 19 కోట్ల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసేలా తన సామర్థ్యాన్ని విస్తరింపజేస్తోంది. కేంద్రప్రభుత్వం, జీఏవీఐ అందించిన రూ. 4,200 కోట్ల ఆర్థిక సహాయం కారణంగానే ఇది సాధ్యపడనుంది. మే 1 నుంచి జూలై నాటికి సీరమ్ ఏడాదికి 120 కోట్ల డోసులను ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకోనుంది. ఇకపోతే భారత్ బయోటెక్ ప్రస్తుతం నెలకు కోటి టీకాలు ఉత్పత్తి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూ. 1,500 కోట్ల ఆర్థిక సహాయంతో ఈ సంస్థ సామర్థ్యం కూడా గణనీయంగా పెరగనుంది. ఇతర కంపెనీలతో ఒప్పందాల మేరకు జూలై 22 నాటికి 70 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు. బహిరంగ ప్రకటనల మేరకు జూలై 22 నాటికే భారత్ తనకు అవసరమైన డోసులను పొందే అవకాశముందని స్పష్టమవుతోంది. ఇప్పటినుంచి వచ్చే రెండు నెలలలోపు భారత్ విదేశాలకు పంపపలసిన బాధ్యతను నెరవేర్చడానికి, దేశీయ డిమాండును తట్టుకోవడానికి 12 కోట్ల డోసులను ఉత్పత్తి చేసి పంపిణీ చేయగలగాలి. వీటన్నింటితోపాటు ప్రభుత్వం టీకాకు అర్హులైన వారి సంఖ్యను వేగంగా పెంచాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటికైతే ప్రభుత్వం 96 కోట్ల వయోజనులందరినీ టీకాల పరిధిలోకి తీసుకొస్తోంది. వీరిలో 30 కోట్లమంది ఆరోగ్య సిబ్బందికి, ప్రంట్ లైన్ కార్మికులకు, సాయుధబలగాలు వంటి అత్యవసర సర్వీసులకు, 45 ఏళ్లకు పైబడిన వయసు కలవారికి ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తం 60 కోట్ల డోసులు అవసరం కాగా, ఇప్పటివరకు ప్రభుత్వం 12 కోట్లమందికి టీకాలువేసింది. ఇప్పుడు టీకా నిల్వలు లేవు. దీంతో 50 కోట్ల మంది ప్రజల డిమాండ్ నెరవేరడం కష్టమైపోతోంది. ఏప్రిల్ 20న 18–45 ఏళ్లలోపు వయసు ఉన్న మరో 63 కోట్లమందికి టీకాలు వేయాలని ప్రభుత్వం సంకల్పించింది. వీరిలో 70 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే సామూహిక రోగ నిరోధక శక్తి సాధ్యపడుతుంది. ముందుగా 44 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలంటే వ్యర్థాలతో సహా వంద కోట్ల డోసులు అవసరం అవుతాయి. వీటిలో 20 శాతం వ్యాక్సిన్ను ప్రైవేటుగా మార్కెట్ చేస్తారనుకుంటే, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంకా 80 కోట్ల డోసులు అవసరం అవుతాయి. అంటే 45 ఏళ్ల పైబడిన వారికి 100 శాతం టీకాలు వేయాలన్నా, 18–45 ఏళ్లలోపు వారికి 70 శాతం టీకాలు వేయాలన్నా దానికి కేంద్రప్రభుత్వానికి 100 కోట్ల పైబడిన డోసులు అవసరం అవుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య టీకా ధరవరల్లో తేడాను పాటిం చడం ద్వారా, ప్రభుత్వాలను మార్కెట్లో టీకాలు కొనుగోలు చేసేలా విధానాన్ని మార్చడం ద్వారా తక్షణం జరిగేదేమిటంటే. దేశంలోని పేద రాష్ట్రాలు మరింత మొత్తాన్ని కోవిడ్–19 టీకాలకోసం చెల్లిం చాల్సి ఉంటుంది. అంటే మౌలికంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు టీకా ధరలు జరిమానా అవుతుండగా మందుల కంపెనీలు లాభాల బాట పట్టనున్నాయి. రాష్ట్రాలమధ్య వ్యత్యాసాలతోపాటు టీకాలకు ఖర్చు పెట్టే స్తోమత ఉన్న, లేని రాష్ట్రాల మధ్య అగాథం పెరిగిపోతుంది. అలాగే వ్యాక్సిన్లను కొనుగోలు చేయడానికి పలు నిరుపేద రాష్ట్రాలు తమ అత్యవసరాలను పణంగా పెట్టి తమ సొంత వనరులను టీకాల కోసం వెచ్చించాల్సి ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే కేంద్రం అనుసరిస్తున్న వ్యాక్సినేషన్ విధానం అసమానత్వంతోనూ, కఠినంగాను ఉంటోందన్నది స్పష్టం. అదే సమయంలో వైరస్కు హద్దులు లేవు. నిరుపేదలను ప్రస్తుత కేంద్ర విధానం గాలికి వదిలేస్తున్నందున వైరస్ మళ్లీ కమ్ముకు రావడం ఖాయం. ఇలాంటి లోపభూయిష్టమైన, ప్రమాదకరమైన వ్యాక్సినేషన్ విధానాన్ని సవరించవలసిన అవసరం ఉంది. అత్యవసరమైన వ్యాక్సిన్లను సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం తన మార్కెట్ శక్తిని ఉపయోగించి, అందరికీ ఉచితంగా టీకాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే కరోనా బారిన పడి విధ్వంసానికి గురైన ప్రజారాశులకు జీవితంపై భరోసా కల్పించాలంటే కేంద్ర ప్రభుత్వం కనీసంగా చేయవలసిన పని ఇదే మరి. కె. సుజాతారావు వ్యాసకర్త మాజీ కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య శాఖ (ది వైర్ సౌజన్యంతో) -
తెలంగాణ: వందలో తొమ్మిది మందికి కరోనా
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు విపరీతంగా పెరుగుతోంది. మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో టెస్టులు చేయించుకున్న ప్రతి వంద మందిలో తొమ్మిది మందికి పాజిటివ్గా వస్తోంది. వైద్యారోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ రేటు 8.94 శాతంగా ఉంది. కొత్తగా 6,551 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు వైరస్ బారినపడ్డ వారి సంఖ్య 4,01,783కు చేరింది. ఇందులో 3,34,144 మంది కోలుకున్నారు. ఇక ఆదివారం ఒక్కరోజే కరోనాతో ఏకంగా 43 మంది మృతిచెందారు. ఒక్క రోజులో ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు ఇదే తొలిసారి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 2,042కు చేరింది. సెలవుదినం కావడంతో తగ్గిన పరీక్షలు... రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 73,275 కోవిడ్ పరీక్షలు చేశారు. సెలవురోజు కావడంతో సంఖ్య తగ్గింది. ప్రభుత్వ కేంద్రాల్లో 58,626, ప్రైవేటులో 14,649 పరీక్షలు చేశారు. జాతీయ స్థాయిలో కోవిడ్ మరణాల రేటు 1.1 శాతం ఉండగా.. రాష్ట్రంలో 0.5 శాతం ఉంది. రికవరీ రేటు జాతీయ స్థాయిలో 82.6 శాతం ఉండగా.. రాష్ట్రంలో 83.1 శాతం ఉంది. కోవిడ్ బాధితుల్లో 79.9 శాతం మందికి లక్షణాలు కనిపించడం లేదు. కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నచోట మైక్రో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం రాష్ట్రంలో 282 మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటయ్యాయి. చదవండి: (దేశంలో రాబోయే రోజుల్లో కరోనా విశ్వరూపం) (కరోనాతో ప్రపంచదేశాలు గడగడ.. వారి జోలికి మాత్రం పోలేదు) -
ఫ్లైయింగ్ స్క్వాడ్స్తో ప్రైవేట్ ఆస్పత్రుల్లో తనిఖీలు
-
దేశంలో కరోనా మరణ మృదంగం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. వరుసగా నాలుగో రోజు 2 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఒక్కరోజులో ఏకంగా 2,61,500 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కరోనా వైరస్ మరణ శాసనం రాస్తోంది. మరో 1,501 మందిని బలితీసుకుంది. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,47,88,109కు, మరణాల సంఖ్య 1,77,150కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు క్రియాశీల(యాక్టివ్) కరోనా కేసులు వరుసగా 39వ రోజు కూడా పెరిగాయి. ప్రస్తుతం వీటి సంఖ్య 18,01,316కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 12.18 శాతం ఉన్నాయి. ఇక రికవరీ రేటు 86.62 శాతానికి పడిపోయిందని ఆరోగ్య శాఖ తెలియజేసింది. దేశంలో కరోనా బాధితుల్లో ఇప్పటివరకు 1,28,09,643 మంది కోలుకున్నారు. ప్రస్తుతం కరోనా సంబంధిత మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. భారత్లో కరోనా పాజిటివ్ కేసులు గత ఏడాది ఆగస్టు 7న 20 లక్షల మార్కును, ఆగస్టు 23న 30 లక్షల మార్కును, సెప్టెంబర్ 5న 40 లక్షల మార్కును, సెప్టెంబర్ 16న 50 లక్షల మార్కును, నవంబర్ 20న 90 లక్షల మార్కును, డిసెంబర్ 19న కోటి మార్కును దాటేశాయి. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) గణాంకాల ప్రకారం.. కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 17 వరకూ 26,65,38,416 నమూనాలను పరీక్షించారు. శనివారం ఒక్కరోజే 15,66,394 నమూనాలను పరీక్షించారు. దేశంలో కరోనా వల్ల 1,77,150 మంది మరణించగా, వీరిలో 59,970 మంది మహారాష్ట్రలో, 13,270 మంది కర్ణాటకలో, 13,071 మంది తమిళనాడులో, 11,960 మంది ఢిల్లీలో, 10,540 మంది పశ్చిమ బెంగాల్లో, 9,703 మంది ఉత్తరప్రదేశ్లో, 7,834 మంది పంజాబ్లో కన్నుమూశారు. భారత్లో కరోనా బారినపడి మృతిచెందిన వారిలో 70 శాతం మందికి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. 162 పీఎస్ఏ ప్లాంట్లు మంజూరు దేశంలో కోవిడ్–19 మహమ్మారి ఉధృతి నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో తక్షణమే ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రజారోగ్య కేంద్రాల్లో 162 ప్రెజర్ స్వింగ్ అడ్సార్ప్షన్ (పీఎస్ఏ) ప్లాంట్లను నెలకొల్పేందుకు అంగీ కారం తెలిపినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. ఈ ప్లాంట్ల ద్వారా ఆసుపత్రులు తమకు అవసరమైన మెడికల్ ఆక్సిజన్ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవచ్చు. తద్వారా ఆక్సిజన్ సరఫరా చేసే నేషనల్ గ్రిడ్పై భారం తగ్గిపోతుంది. మొత్తం 162 పీఎస్ఏ ప్లాంట్లను కేంద్రం మంజూరు చేసింది. అన్ని రాష్ట్రాల్లో వీటిని ఏర్పాట్లు చేస్తారు. వీటితో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం 154.19 మిలియన్ టన్నులకు చేరుకుంటుంది. ఇప్పటికే 33 పీఎస్ఏ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమయ్యింది. మధ్యప్రదేశ్లో 5, హిమాచల్ ప్రదేశ్లో 4, చండీగఢ్లో 3, గుజరాత్లో 3, ఉత్తరాఖండ్లో 3, బిహార్లో 2, కర్ణాటకలో 2, తెలం గాణలో రెండు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, హరియాణా, కేరళ, మహా రాష్ట్ర, పుదుచ్చేరి, పంజాబ్, యూపీరాష్ట్రాల్లో ఒక్కో టి చొప్పున నెలకొల్పుతున్నారు. దేశంలో ఏప్రిల్ ఆఖరుకల్లా మరో 55, మే చివరికిమరో 80 పీఎస్ఏ పాంట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 162 పీఎస్ఏ ప్లాంట్ల ఏర్పాటుకయ్యే రూ.201.58 కోట్ల భారాన్ని కేంద్రమే భరిస్తోంది. ఇక ఆక్సిజన్ రైళ్లు దేశంలో కోవిడ్–19 ఉధృతరూపం దాల్చడంతో ఆక్సిజన్ సిలండర్లకి డిమాండ్ బాగా పెరిగింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్కి కొరత ఏర్పడడంతో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేయడానికి రైల్వే శాఖ సిద్ధమైంది. ముంబైకి సమీపంలోని కలంబొలి, బోయిసార్ స్టేషన్ల నుంచి ఖాళీ ట్యాంకర్లు తీసుకొని ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లు సోమవారం తన ప్రయాణం ప్రారంభిస్తాయి. వైజాగ్, జంషెడ్పూర్, రూర్కెలా, బొకారోలలో లిక్విడ్ ఆక్సిజన్ను నింపుకొని అవసరమైన ప్రాంతాలకు తరలిస్తామని రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ ఆదివారం వెల్లడించారు. పరిశ్రమలకు ఆక్సిజన్ బంద్ పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్కు తీవ్ర కొరత ఏర్పడటంతో కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక అవసరాల ను ఆక్సిజన్ సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించింది. తద్వారా మెడికల్ ఆక్సిజన్ సరఫరా పెరిగి విలువైన ప్రాణాలను కాపాడుకోగలమని పేర్కొంది. ఈనెల 22 నుంచి ఇది ఈ నిషేధం అమలులోకి రానుంది. తొమ్మిది రకాల పరిశ్రమలకు దీనినుంచి మినహాయింపునిచ్చారు. పాజిటివిటీ రేటు 12 రోజుల్లోనే రెట్టింపు భారత్లో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు కేవలం 12 రోజుల్లోనే రెట్టింపయ్యిందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 8 శాతంగా ఉండేది. 12 రోజుల్లో ఇది 16.69 శాతానికి చేరింది. అంటే ప్రతి 100 కరోనా నిర్ధారణ పరీక్షల్లో 16.69 శాతం పాజిటివ్గా తేలుతున్నాయి. వీక్లీ పాజిటివ్ రేటు నెల రోజుల్లో 3.05 శాతం నుంచి 13.54 శాతానికి ఎగబాకింది. అత్యధికంగా వీక్లీ పాజిటివ్ రేటు చత్తీస్గఢ్లో 30.38 శాతం, గోవాలో 24.24, మహారాష్ట్రలో 24.17, రాజస్తాన్లో 23.33, మధ్యప్రదేశ్లో 18.99 శాతంగా ఉంది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 78.56 శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే బయటపడ్డాయి. కరోనా వల్ల తాజాగా మరణించిన 1,501 మందిలో మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ట్రాల వారు ఎక్కువ మంది ఉన్నారు. 9 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్తగా పాజిటివ్ కేసులు ఒక్కటీ నమోదు కాలేదు. 92 రోజుల్లో 12,26,22,590 డోసులు అగ్రరాజ్యం అమెరికాలో 12 కోట్ల కరోనా టీకా డోసులు ఇవ్వడానికి 97 రోజులు పట్టింది. చైనాలో అయితే 108 రోజులు పట్టింది. భారత్లో మాత్రం కేవలం 92 రోజుల్లోనే 12 కోట్లకుపైగా టీకాలు డోసులు అర్హులకు ఇవ్వడం గమనార్హం. కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతున్న దేశాల జాబితాలో భారత్ అగ్రభాగాన నిలుస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం హర్షం వ్యక్తం చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ భారత్లో ముమ్మరంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 18,15,325 సెషన్లలో 12,26,22,590 టీకా డోసులను అర్హులకు అందజేశారు. మొత్తం డోసుల్లో 59.5 శాతం డోసులను ఎనిమిది రాష్ట్రాల్లోనే ఇవ్వడం విశేషం. నాలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా చొప్పున డోసులను అందజేశారు. గుజరాత్లో 1,03,37,448, మహారాష్ట్రలో 1,21,39,453, రాజస్తాన్లో 1,06,98,771, ఉత్తరప్రదేశ్లో 1,07,12,739 డోసులు ఇచ్చారు. గుజరాత్లో ఏప్రిల్ 16 నాటికి కోటి డోసుల పంపిణీని పూర్తి చేయగా, మిగతా మూడు రాష్ట్రాల్లో ఏప్రిల్ 14 నాటికి కోటి డోసుల పంపిణీ పూర్తయ్యింది. కరోనా వ్యాక్సినేషన్లో 92వ రోజు శనివారం 26,84,956 డోసులు ఇచ్చారు. -
వినికిడి సమస్యలు లేని ఏపీనే లక్ష్యం
సాక్షి, అమరావతి: వినికిడి లోపాలు, ఇతర సమస్యలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. వైఎస్సార్ కంటి వెలుగు తరహాలోనే చెముడుతో బాధపడేవారిని వీలైనంత త్వరగా చిన్న వయసులోనే గుర్తించి.. వారికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేస్తే ఫలితం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నాలుగు అంచెల్లో వినికిడి లోపాలు ఉన్నవారిని గుర్తించాలని సర్కార్ ప్రణాళికను సిద్ధం చేసింది. పుట్టిన శిశువుతోపాటు తల్లికీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో వినికిడి లోపాలేమైనా ఉన్నాయో, లేదో తెలుసుకోవడానికి పరీక్షలు నిర్వహిస్తారు. తర్వాత పిల్లలకు ఒకటో నెల, మూడో నెల, ఆరో నెల రాగానే ఆస్పత్రుల్లోనే స్క్రీనింగ్ నిర్వహించి వినికిడి లోపాలుంటే చికిత్స చేస్తారు. అలాగే రెండేళ్లలోపు పిల్లలు, స్కూల్ బయట ఉన్న పిల్లలు, 50 ఏళ్లు పైబడినవారిలో ఈ లోపాలను గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేపడతారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పీహెచ్సీ డాక్టర్లతో 104 సంచార వైద్య వాహనాల ద్వారా స్క్రీనింగ్ను నిర్వహిస్తారు. పీహెచ్సీలు, 104 వాహనాల్లో వినికిడి లోపాలను గుర్తించే పరికరాలు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు 104 వాహనాల్లో వినికిడి లోపాలను గుర్తించే పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. రెండేళ్ల పై నుంచి 18 ఏళ్లలోపు వారికి అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లి పరీక్షలు చేస్తారు. చెముడుతో బాధపడేవారిని గుర్తించి.. అవసరమైనవారికి ఆపరేషన్లు చేయిస్తారు. అంతేకాకుండా వారికి కావాల్సిన పరికరాలను కూడా అందిస్తారు. గ్రామీణ, పట్టణ పీహెచ్సీల్లో వైద్యాధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. 74 ప్రభుత్వ ఆస్పత్రులు గుర్తింపు.. అలాగే శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పనిచేసేవారిలో కూడా వినికిడి లోపాలుంటాయని, అలాంటి వారిని కూడా గుర్తించి చికిత్సలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా శబ్ద కాలుష్యం ఉన్న పరిశ్రమల్లో పనిచేసేవారు, ట్రాఫిక్ పోలీసులు, డ్రైవర్లు, రైల్వే ట్రాక్ల సమీపంలో నివసించే వారిలో వినికిడి లోపాలను గుర్తించనున్నారు. ఇందుకోసం పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేయడంతోపాటు, ప్రత్యేకంగా స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహించనున్నారు. వినికిడి లోపాలున్నవారికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేసేందుకు 74 ప్రభుత్వ ఆస్పత్రులను గుర్తించారు. ఇందుకోసం ఈఎన్టీ సర్జన్లు, వైద్య సిబ్బంది నియామకంతోపాటు స్క్రీనింగ్ పరికరాలను సమకూర్చుకునేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళికను రూపొందించింది. -
బ్రెజిల్లో ఒకే రోజు 4 వేలకు పైగా మరణాలు
సావోపాలో: బ్రెజిల్లో మొదటిసారిగా ఒకే రోజులో 4 వేలకు పైగా కరోనా మరణాలు సంభవించాయి. 24 గంటల్లో 4,195 మంది కరోనాతో ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 3.40 లక్షలుగా నమోదైంది. అమెరికా, పెరూ తర్వాత ఒకే రోజు 4 వేలకు పైగా మరణాలు నమోదైన మూడో దేశంగా బ్రెజిల్ నిలిచింది. దేశంలో ఆస్పత్రులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. కరోనా సోకిన వారిలో అత్యధికులు ఆస్పత్రి పాలవుతూ ఉండడంతో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయింది. బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనోరా లాక్డౌన్కి వ్యతిరేకం కావడం వల్లే ఈ స్థాయిలో కేసులు పెరిగిపోతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. అధ్యక్షుడికి మద్దతుగా ఉన్న గవర్నర్లు, మేయర్లు, రాజకీయ నాయకులు, ఇతర వర్గాలు భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు పెట్టుకోక పోవడంతో కేసులు పెరిగిపోతున్నాయని బ్రెజిల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ పాలసీ స్టడీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిగెల్ లాగో అంచనా వేశారు. బ్రెజిల్ ఆస్పత్రుల్లో 90 శాతం పడకలు కోవిడ్ రోగులకే కేటాయించాల్సి వస్తోంది. ఆ దేశంలో వ్యాక్సినేషన్ కూడా మందకొడిగా సాగుతోంది. ఇప్పటివరకు 3 శాతం మంది ప్రజలు కరోనా టీకా తీసుకోలేదు.