Gautam Sawang
-
కూటమి ప్రభుత్వ కక్ష.. బలవంతంగా రాజీనామా..
-
2018 గ్రూప్-1 మెయిన్స్పై రాజకీయ విమర్శలా? : గౌతమ్ సవాంగ్
సాక్షి, అమరావతి: 2018 మెయిన్స్ పరీక్ష రద్దుపై టీడీపీ నేతలు, ఎల్లో మీడియా అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్. సర్వీస్ కమిషన్, ప్రభుత్వంపైనా రాజకీయ విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. అసలు రాజకీయ విమర్శలకు కమిషన్ స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే నిరుద్యోగులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. 2018 గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిబంధనలకు అనుగుణంగా జరిగిందని గౌతమ్ సవాంగ్ తెలిపారు. మెయిన్స్ పరీక్ష ప్రశ్నాపత్రాలను పకడ్బందీగా ఒకేసారి మాన్యువల్ వ్యాల్యువేషన్ చేశామని, రెండోసారి జరగలేదని స్పష్టం చేశారు. 162 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లు 55 రోజులు క్యాంపులో కూర్చుని వ్యాల్యువేషన్ చేశారన్నారు. వ్యాల్యువేషన్ ప్రక్రియ అంతా సీసీ కెమెరాలో రికార్డు చేసినట్లు తెలిపారు. నియామకాలకు సంబంధించి అన్ని ఆధారాలూ ఎపీపీఎస్సీ వద్ద ఉన్నాయని చెప్పారు. నియామకాల్లో ఏపీపీఎస్సీ చాలా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఉద్యోగాలు చేస్తున్న 162 ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి న్యాయం జరిగేలా ప్రయత్నాలు చేస్తామన్నారు. ఈ క్రమంలో సోమవారం హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అప్పీల్ దాఖలు చేశారు. 2019 నుంచి ఇప్పటి దాకా కమిషన్ ఒక్క తప్పు లేకుండా పూర్తి పారదర్శకతతో వేలాది పోస్టులు భర్తీ చేసిందని పేర్కొన్నారు గౌతమ్ సవాంగ్. 2018 గ్రూప్-1 పోస్టుల భర్తీలోనూ అంతే పారదర్శకంగా మెయిన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించాయని చెప్పారు. ఎంపికైన అభ్యర్థుల్లో 14 మంది ఐఏఎస్కు ఎంపికవ్వడమే అందుకు నిదర్శనమని తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో దేశంలోని 15 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు వివాదాల్లో చిక్కుకుంటే, వివాద రహితంగా ఉద్యోగాలు భర్తీ చేసిన బోర్డుగా ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు 78 నోటిఫికేషన్లు ఇచ్చి, 6,296 ఉద్యోగాలను వివాదరహితంగా భర్తీ చేసిందని తెలిపారు. బాబు హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి వివాదాల్లో ఉన్నవాటిని సైతం పరిష్కరించి, పోస్టుల భర్తీ ప్రక్రియను సీఎం జగన్ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. ఇందులో విద్యావంతులైన నిరుద్యోగ యువతకు మేలు చేసేలా గ్రూప్-1, గ్రూప్-2 వంటి గెజిటెడ్ పోస్టులతోపాటు, వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఇంజినీర్లు, అగ్రికల్చరల్ ఆఫీసర్లు, మరెన్నో నాన్ గెజిటెడ్ పోస్టులకు నియామకాలు జరిగాయని తెలిపారు. నాడే పడిన వివాదాల బీజం 2018లో బాబు హయాంలో గ్రూప్-1 విషయంలో వివాదాలు తలెత్తిన్నట్లు గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. 2018 మే నెలలో నిర్వహించిన ప్రిలిమ్స్ పేపర్లో దాదాపు 62 తప్పులు దొర్లాయని చెప్పారు. వీటికి నాటి చంద్రబాబు ప్రభుత్వంగానీ, నాటి సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉదయ్ భాస్కర్గానీ సమాధానం చెప్పలేదని ప్రస్తావించారు. గ్రూప్-1 మెయిన్స్ పేపర్లను సంప్రదాయ పద్ధతిలో సబ్జెక్టు నిపుణులు మూల్యాంకనం చేయడం ఎప్పటి నుంచో ఉండగా..డిజిటల్ మూల్యంకనం ప్రతిపాదన నాటి చైర్మన్ ఉదయ్ భాస్కర్దేనని అన్నారు. సంప్రదాయ పద్ధతి విధానంలో అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఉదయ్ భాస్కర్ డిజిటల్ మూల్యాంకనం ప్రతిపాదన చేయగా, నాటి కమిషన్లోని సభ్యులు కూడా ఆమోదం తెలిపి కొత్త ప్రభుత్వం ముందుంచారని చెప్పుకొచ్చారు. అనంతరం దీనిపై జాతీయ స్థాయి సదస్సును విజయవాడలో నిర్వహించేందుకు సన్నాహాలు చేయగా అందుకు ప్రభుత్వం నిధులు కూడా కేటాయించిందని తెలిపారు. మెయిన్స్ పేపర్లను ఈ విధానంలోనే మూల్యాంకనం చేయాలని చూడగా.. నోటిఫికేషన్లో చెప్పని కారణంగా కోర్టు ద్వారా ఈ ప్రక్రియను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. దీంతో సంప్రదాయ విధానంలోనే పేపర్లను మూల్యాంకనం చేశారన్నారు. ‘2018 గ్రూప్-1 ఇంటర్వ్యూలకు 325 మంది ఎంపిక అయ్యారు. ఇందులో ఐఐటీ నుంచి 19 మంది, ఐఐఎం నుంచి 7, ఎన్ఐటీ నుంచి 17, బిట్స్ పిలానీ నుంచి 2, ట్రిపుల్ ఐటీల నుంచి 13 మంది ఉన్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్ చేసినవారు 177 మంది, సాధారణ పీజీ 51, గ్రాడ్యుయేట్లు 39 మంది ఉన్నారు. ఇక ఇంటర్వ్యూకు ఎంపికైన వారిలో 40 మంది సివిల్స్ రాయగా.. వీరిలో 14 మంది అదే ఏడాది ఐఏఎస్ సాధించగా, ఇద్దరు కేంద్ర సర్వీసుకు ఎంపికయ్యారు. మరో 24 మంది యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. 163 మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నారు. వీరంతా 2018 గ్రూప్-1 కంటే ముందే పలు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు ఎదుర్కొన్నవారు. వీరంతా మెయిన్స్లో ప్రతిభ చూపిన తర్వాతే ఇంటర్వ్యూని ఎదుర్కొన్నారు. సివిల్స్ ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకుని చదివినవారికి గ్రూప్-1లో గెలవడం లెక్కకాదు’ అని తెలిపారు. -
ఉద్యోగాలు వచ్చేశాయ్!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ శాఖల్లో పలు పోస్టుల భర్తీకి ఈ నెలలో వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. వీటిల్లో 900 వరకు గ్రూప్–2 పోస్టులుండగా వందకుపైగా గ్రూప్–1 పోస్టులున్నాయి. డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్ల పోస్టులతో కలిపి మొత్తం 23 నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడిన యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి డిసెంబర్లో సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. గతేడాది ఎలాంటి వివాదాలకు తావు లేకుండా గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేసి 11 నెలల వ్యవధిలో పారదర్శకంగా ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. ఏఈ నియామకాలను కూడా అతి తక్కువ సమయంలోనే పూర్తి చేశామన్నారు. గత నాలుగేళ్లల్లో న్యాయపరమైన పలు వివాదాలను అధిగమించి సంస్కరణలు తీసుకొచ్చినట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ తెలిపారు. గ్రూప్–1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, సమర్థంగా ఎంపిక, హేతుబద్ధంగా అభ్యర్థుల వాస్తవిక నైపుణ్యాలను అంచనా వేసేందుకు కొత్త విధానాన్ని రూపొందించినట్లు వివరించారు. ఇందుకోసం దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థలైన ఐఐటీ, హెచ్సీయూతో పాటు రాష్ట్రంలోని పలు వర్సిటీల్లోని నిపుణులతో చర్చించి సిలబస్లో సమూల మార్పులు తెస్తున్నట్లు చెప్పారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు ఓ వర్గం మీడియా ప్రభుత్వంపై, కమిషన్పై తప్పుడు కథనాలను ప్రచురిస్తూ నిరుద్యోగ యువతలో ఆందోళన రేకెత్తించేందుకు ప్రయత్నించటాన్ని ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో ఖండించింది. గ్రూప్ 2 విషయంలో ఇప్పటికే దాదాపు 900 ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ నుంచి అనుమతులు లభించాయని, 54 శాఖల నుంచి జోన్ల వారీగా జీవో నం.77కు అనుగుణంగా సమాచారం రావడం ఆలస్యమైందని పేర్కొంది. ఈ అంశంపై కసరత్తు దాదాపు పూర్తయిందని, ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. కొన్ని పత్రికలు ఉద్దేశపూర్వకంగా సర్వీస్ కమిషన్పై తప్పుడు కథనాలను వెలువరిస్తూ నిరుద్యోగులను ఆందోళననకు గురి చేస్తున్నాయని పేర్కొంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, గ్రూప్–1, గ్రూప్–2 నోటిఫికేషన్ల జారీపై తప్పుడు వార్తలు ప్రచురించడాన్ని ఖండించింది. సాధారణంగా ఏపీపీఎస్సీ పరిధిలోని నియామకాలకు మాత్రమే ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ వినియోగిస్తామని, శాసనసభ ప్రత్యేక చట్టం ద్వారా కమిషన్ పరిధిలోకి రాని పోస్టుల నియామక బాధ్యతలను తమకు అప్పగించినప్పుడు వాటి భర్తీ ఖర్చును ఆయా శాఖలే భరిస్తాయని తెలిపింది. 2018లో కూడా ఏపీపీఎస్సీ నిర్వహించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల పరీక్షల ఖర్చును ఆయా విద్యాసంస్థలే భరించాయని గుర్తు చేసింది. ఇప్పుడు కూడా అదే విధానాన్ని అనుసరించి పరీక్ష నిర్వహణ ఖర్చు అంచనాలను ఉన్నత విద్యా మండలికి పంపించామని తెలిపింది. ఈ లేఖను వక్రీకరిస్తూ కథనాలు ప్రచురించడం బాధాకరమని, వీటిని నమ్మవద్దని సూచించింది. ఈ నెలలోనే 23 నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు వెల్లడించింది. -
AP: నెలాఖరులో గ్రూప్ 1, 2 నోటిఫికేషన్లు
సాక్షి, విజయవాడ: ఈ నెలాఖరులోపు గ్రూప్ 1, గ్రూప్ -2 నోటిఫికేషన్లు ఇస్తామని, గ్రూప్-1లో 100, గ్రూప్-2 లో 900 పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫిబ్రవరిలో నిర్వహించాలనుకుంటున్నామని చెప్పారు. ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2022 గ్రూప్ వన్ ప్రక్రియను రికార్డుస్ధాయిలో తొమ్మిది నెలల్లో పూర్తి చేశామని గుర్తు చేశారు. ఈ గ్రూప్ వన్ ప్రక్రియ కూడా తొమ్మిది నెలల్లో పూర్తి చేస్తామన్నారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో రెండు పేపర్ల స్ధానంలో ఒకే పేపర్ ఉంటుందని తెలిపారు. గ్రూప్ వన్ మెయిన్స్ లో అయిదు పేపర్లకు బదులు నాలుగే ఉంటాయన్నారు. ఇందులో రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ తరహాలో, రెండు పేపర్లు డిస్క్రిప్షన్ తరహాలో ఉంటాయని చెప్పారు. లాంగ్వేజ్ లో రెండు పేపర్లకి బదులు ఒక పేపర్ మాత్రమే ఉంటుందన్నారు. సిలబస్ లో ఎటువంటి మార్పులు ఉండవన్నారు. నిరుద్యోగ అభ్యర్ధులకు మేలు చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. యూపీఎస్సీ, మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్లలో పరీక్షలను పరిశీలించిన తర్వాతే మార్పులు చేశామన్నారు. డిసెంబర్ లో 2200 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలోనే పరీక్షలు జరిపి జనవరిలో ఫలితాలు వెల్లడిస్తామన్నారు. APPSC Group-1&2 ఉద్యోగాల స్డడీ మెటీరియల్, బిట్బ్యాంక్, ప్రీవియస్ పేపర్స్, ఆన్లైన్ టెస్టులు, సక్సెస్ స్టోరీల కోసం క్లిక్ చేయండి -
ఏపీ గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల
సాక్షి, కృష్ణా: గ్రూప్-1 పరీక్షా తుది ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. విజయవాడలో బోర్డు చైర్మన్ గౌతం సవాంగ్ ఫలితాలను రిలీజ్ చేశారు. గ్రూప్-1లో ఖాళీల 110 పోస్టులకుగానూ తుది ఫలితాలను ప్రకటించారాయన. నోటిఫికేషన్ నుంచి ఫలితాలు వెల్లడి వరకు పూర్తి పారదర్శకత పాటించిన ఏపీపీఎస్సీ.. అతి తక్కువ సమయంలో వివాదాలకి దూరంగా ప్రక్రియ పూర్తి చేసింది. ఫలితాలను విడుదల చేసిన అనంతరం ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రికార్డు సమయంలోనే గ్రూప్ వన్ ఫలితాలు ప్రకటించాం. గ్రూప్ వన్ ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా పూర్తి చేశాం. మొదటిసారిగా సీసీ కెమెరాలను వినియోగించాం. 111 పోస్టులకి 110 పోస్టుల ఫలితాలు ప్రకటిస్తున్నాం. స్పోర్ట్స్ కోటాలో మరో పోస్టు ఎంపిక జరుగుతుంది. 1:2 కోటాలో ఇంటర్వ్యూలకి అభ్యర్ధులని ఎంపిక చేశాం. 11 నెలల రికార్డు సమయంలో గ్రూప్ వన్ ఎంపిక ప్రక్రియ పూర్తి చేశాం. ఏపీపీఎస్సీ చరిత్రలోనే తొలిసారిగా ఇంత తక్కువ సమయంలో ఎంపిక ప్రక్రియ పూర్తి కావడం ఇదే. ముగ్గురు ఐఐఎం, 15 మంది ఐఐటీ అభ్యర్ధులు ఇంటర్వ్యూలకి వచ్చిన వాళ్లలో ఉన్నారు. ఎంపికైన వారిలో మొదటి పది స్ధానాలలో ఆరుగురు మహిళా అభ్యర్ధులే ఉన్నారు. టాప్ ఫైవ్ లో తొలి మూడు ర్యాంకర్లు మహిళలదే అని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ర్యాంకర్ల వివరాలు ఫస్ట్ ర్యాంకర్- భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష ( బిఎ ఎకనామిక్స్ ఢిల్లీ యూనివర్సిటీ) సెకండ్ ర్యాంకర్ - భూమిరెడ్డి భవాని ( అనంతపురం) మూడవ ర్యాంకర్ - కంబాలకుంట లక్ష్మీ ప్రసన్న నాలుగవ ర్యాంకర్ - కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి ( అనంతపురం జెఎన్ టియు) అయిదవ ర్యాంకర్ - భానుప్రకాష్ రెడ్డి ( కృష్ణా యూనివర్సిటీ) ఆ పుకార్లు నమ్మొద్దు ఏపీపీఎస్సీ నిర్వహించబోయే పరీక్షల విషయంలో.. సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఈ పుకార్లపైనా చైర్మన్ గౌతమ్ సవాంత్ స్పందించారు. ‘‘సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మొద్దని, గ్రూప్ -2 కి వెయ్యి పోస్టులతో నోటిఫికేషన్ ఉండొచ్చని, అలాగే.. గ్రూప్-1 వంద పైనా పోస్టులతో నోటిఫికేషన్ ఉండొచ్చని’’ తెలిపారాయన. గ్రూప్-1 ప్రక్రియ సాగిందిలా.. గత ఏడాది సెప్టెంబర్ 30 న 111 పోస్టులకి నోటిఫికేషన్ విడుదలకాగా.. జనవరి 8 న ప్రిలిమ్స్ నిర్వహించింది ఏపీపీఎస్సీ. కేవలం 19 రోజులలో అంటే.. జనవరి 27 న ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడించారు. ప్రిలిమ్స్ కి 86 వేల మంది హాజరు కాగా.. 6, 455 మంది మెయిన్స్ కి అర్హత సాధించారు. జూన్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మెయిన్ పరీక్ష నిర్వహించారు. 111 పోస్టులకిగానూ 220 మంది అర్హత సాధించారు. ఇక.. ఆగస్ట్ 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించింది ఏపీపీఎస్సీ. -
AP: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం
సాక్షి, విజయవాడ: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. 6,455 మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. అభ్యర్థులకు ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటలలోపు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. జూన్ 10 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. ఈసారి ఆఫ్ లైన్ లోనే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లో 11 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, ఏపీపీఎస్సీ సెక్రటరీ జె.ప్రదీప్ కుమార్ పరిశీలించారు. మాస్ కాపీయింగ్కు ఆస్కారం లేకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. పూర్తి సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షల నిర్వహణ జరగనుంది. పరీక్షా కేంద్రాల్లోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్తో అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులకు బయోమెట్రిక్తో పాటు తొలిసారి ఫేస్ రికగ్నైజేషన్ విధానం అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఇందుకోసం 70 బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 290 మంది దివ్యాంగులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 58 మంది దివ్యాంగులు స్క్రైబ్స్ కు అనుమతి కోరారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు. ఇది కూడా చదవండి: నేడు ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ -
APPSC: గ్రూప్-1 దరఖాస్తుల గడువు పెంపు
సాక్షి, విజయవాడ: గ్రూప్-1 పరీక్షల కోసం దరఖాస్తు తేదీ పొడిగించినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వివరాలను వెల్లడించారు. దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 2వ తేదీ కాగా.. ఆ తేదీని నవంబర్ 5కి మార్చినట్లు వెల్లడించారు. ఎల్లుండి(4వ తేదీ) అర్థరాత్రి లోపు ఫీజు చెల్లించాలని ఆయన తెలిపారు. డిసెంబర్ 18న స్క్రీనింగ్ టెస్ట్, మార్చ్ 2023లో మెయిన్స్ పరీక్షలు ఉంటాయని.. ఈ దరఖాస్తు పొడిగింపును గమనించి వినియోగించుకోవాలని అర్హులకు సవాంగ్ సూచించారు. -
వచ్చే నెలలో గ్రూప్–1, 2 నోటిఫికేషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వం సూచించిన మేరకు ఖాళీ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్ పి.గౌతమ్ సవాంగ్ చెప్పారు. మంగళవారం గ్రూప్–1 తుది ఫలితాల విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే నెలలో 110 గ్రూప్–1 పోస్టులు, 182 గ్రూప్–2 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఇప్పటికే వివిధ ఉద్యోగాల భర్తీకి 16 నోటిఫికేషన్లు విడుదల చేయగా.. వాటిలో మూడింటిని పూర్తి చేశామని తెలిపారు. ఇంకా 13 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలు, ఇతర ప్రక్రియలను ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. 2 వేల వరకు వివిధ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. 670 జూనియర్ అసిస్టెంట్, 119 ఏఈ పోస్టులకు ఈ నెలాఖరున పరీక్షలు ఉంటాయన్నారు. ఈ పోస్టులకు 5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారన్నారు. అత్యంత పారదర్శకంగా నిపుణులైన ఉద్యోగులను రాష్ట్రానికి అందించేలా కమిషన్ చర్యలు చేపడుతుందన్నారు. పోస్టులకు ఎంపిక ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా కమిషన్ ముందుకు వెళ్తుందన్నారు. గ్రూప్–1 కేడర్లోనూ సీపీటీ పరీక్ష గ్రూప్–1 కేడర్ పోస్టులకు కూడా ఇకనుంచి కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (సీపీటీ) నిర్వహించనున్నట్టు సవాంగ్ తెలిపారు. ఈ–గవర్నెన్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లతో పరిపాలనలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, అందుకు అనుగుణంగా అధికారులు కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గ్రూప్–1 పోస్టులకు సంబంధించి సీపీటీ సిలబస్లో మార్పులు చేస్తామన్నారు. అంతేకాకుండా ప్రొబేషనరీ ఖరారుకు ఎంపికైన వారికి డిపార్ట్మెంటల్ టెస్ట్ కూడా నిర్వహించే ప్రతిపాదన ఉందన్నారు. గ్రూప్–1 పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండాలా వద్దా అనే దానిపై చర్చిస్తున్నామని, తుది నిర్ణయమేదీ లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అత్యున్నత పోస్టులకు ఎంపికైన వారికి అందుకు తగ్గ సామర్థ్యాలు ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవాలంటే రాత పరీక్షలతో పాటు ఇతర రకాల పరీక్షలు కూడా ముఖ్యమేనని అభిప్రాయపడ్డారు. దీనిపై జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతోందన్నారు. యూపీఎస్సీతో సహా పలు రాష్ట్రాల కమిషన్లతో దీనిపై చర్చిస్తున్నామని తెలిపారు. కేరళలో ఇంతకుముందు జరిగిన వివిధ రాష్ట్రాల కమిషన్ల భేటీలో దీనిపై చర్చ జరిగిందని, వచ్చేనెల 8న విశాఖపట్నంలో ఆలిండియా కమిషన్ల సమావేశం ఉంటుందని అందులోనూ చర్చిస్తామని తెలిపారు. గవర్నర్కు వివరణలు పంపించాం గ్రూప్–1పై ఇటీవల కొందరు అభ్యర్థులు గవర్నర్కు ఫిర్యాదు చేయడంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సవాంగ్ సమాధానమిస్తూ.. ఈ అంశాలు కోర్టు పరిధిలో ఉన్నందున బయటకు స్పందించలేమన్నారు. సంబంధిత అంశాలపై గవర్నర్ కార్యాలయానికి వివరణలు పంపించామన్నారు. తెలుగు మాధ్యమం అభ్యర్థులకు అన్యాయం జరిగిందనడం వాస్తవం కాదని, వీటిపై ఇంతకుమించి స్పందించలేమని పేర్కొన్నారు. అన్ని ఫైళ్లను కోర్టు ముందుంచామన్నారు. సమాధాన పత్రాలను అభ్యర్థులకు అందుబాటులో ఉంచడమనే విధానం ఏపీపీఎస్సీలో లేదని, యూపీఎస్సీలో కూడా లేదని వివరించారు. కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి వయోపరిమితి సడలించాలని అభ్యర్థుల నుంచి వస్తున్న వినతిపై స్పందిస్తూ దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో కమిషన్ సభ్యులు విజయకుమార్, ప్రొఫెసర్ పద్మ రాజు, డాక్టర్ సుధాకర్రెడ్డి, సలాంబాబు, రమణా రెడ్డి, పి.సుధీర్, ఎన్.సోనీవుడ్, ఎన్.సుధాకర్రెడ్డి, కార్యదర్శి అరుణకుమార్ పాల్గొన్నారు. -
ఏపీపీఎస్సీ 2018 గ్రూప్-1 ఫలితాల ప్రకటన
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2018 గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించింది. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ మంగళవారం సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు. మొత్తం లక్షా నలభై వేల మంది పరీక్షలు రాయగా. స్క్రీనింగ్ టెస్ట్కి యాభై వేల మందికి పైగా హాజరయ్యారు. 167 గ్రూప్ వన్ పోస్టులకి గాను 325 మంది ఇంటర్వ్యూలకి హాజరయ్యారు. కరోనాతో పాటు న్యాయపరమైన అంశాల వల్ల ఫలితాలు ప్రకటించడం ఆలస్యమైందని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఫలితాల్లో.. పిఠాపురం ప్రాంతానికి చెందిన సుష్మితకు ఫస్ట్ ర్యాంక్ దక్కింది. వైఎస్సార్ జిల్లా కొత్తులగుట్టకు చెందిన శ్రీనివాసులుకు రెండో ర్యాంక్, హైదరాబాద్కు చెందిన సంజన సిన్హాకు మూడో ర్యాంక్ దక్కింది. మొదటి పది స్ధానాలలో ఏడుగురు మహిళలు ఉండడం గమనార్హం. గ్రూప్-1 2018 నోటిఫికేషన్లో 167 పోస్టులకుగానూ.. 165 పోస్టులకు ఇప్పుడు ఫలితాలు ఇచ్చారు. వీటిలో 30 పోస్టులు డిప్యూటీ కలెక్టర్, 28 డిఎస్పీ పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 12వ తేదీలోపు బోర్డు ముందు హాజరై.. హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారాయన. వచ్చే నెలలోనే గ్రూప్-2 నోటిఫికేషన్లు ఉంటాయని, రాబోయే కాలంలో మరో 13 నోటిఫికేషన్లు ఉంటాయని, మరో రెండు వేల పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. -
దోషులను గుర్తించి శిక్షించాలనే చెప్పారు
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సక్రమంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి దోషులను గుర్తించి శిక్షించాలనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని పూర్వ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. దోషులు ఎంతవారైనా సరే కచ్చితంగా ఉపేక్షించొద్దనే చెప్పారని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి తనను ఉద్దేశించి కొన్ని పత్రికల్లో ప్రచురితమైన కథనాలు పూర్తిగా అవాస్తవమని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీ అవినాశ్రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్రెడ్డి, డి.శివశంకర్రెడ్డిలను తన వద్దకు సీఎం పంపారని పత్రికల్లో ప్రచురితమైన సమాచారం పూర్తిగా అవాస్తవమన్నారు. తాను డీజీపీగా ఉండగా ఆ ముగ్గురూ ఎప్పుడూ కలవలేదని తెలిపారు. ఆ ముగ్గురూ తనకు రెండు కళ్లు లాంటివారని సీఎం జగన్మోహన్రెడ్డి అన్నట్లుగా తాను వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, ఆమె భర్త ఎన్.రాజశేఖరరెడ్డి వద్ద వ్యాఖ్యానించినట్లు కొన్ని పత్రికలు అవాస్తవాలను ప్రచురించాయన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ అవినాశ్రెడ్డి కుటుంబాలు తనకు రెండు కళ్లు అని మాత్రమే ముఖ్యమంత్రి తనతో చెప్పారని, అదే విషయాన్ని 2019 సెప్టెంబర్లో తనను కలిసిన సునీత, రాజశేఖరరెడ్డి దంపతులకు చెప్పినట్టు పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా నిర్వహించి దోషులను శిక్షించాలని ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారని వారికి వివరించినట్లు చెప్పారు. అదే సమయంలో అమాయకులు ఇబ్బంది పడకుండా చూడాలని ఆయన తనతో చెప్పారని కూడా వారికి తెలియజేశానన్నారు. తదనంతరం ఈ కేసుకు సంబంధించి అన్ని రికార్డులు, వాస్తవాలను కోర్టు ముందుంచాలని సీఎం జగన్ తమకు స్పష్టంగా నిర్దేశించారన్నారు. సక్రమంగా దర్యాప్తు చేయడమే కాకుండా అదే విశ్వాసాన్ని అందరిలోనూ కల్పించాలని సీఎం నిర్దేశించారన్నారు. ఈ కేసు దర్యాప్తులో ఏ దశలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. -
ఏపీపీఎస్సీ చైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్
-
ఏపీపీఎస్సీ ఛైర్మన్గా గౌతమ్ సవాంగ్
-
ఏపీ: డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన రాజేంద్రనాథ్రెడ్డి
సాక్షి, మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ నూతన డీజీపీకి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, 1992 బ్యాచ్కు చెందిన రాజేంద్రనాథ్రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. ఆయన 1994లో ఉమ్మడి ఏపీలో నిజామాబాద్ జిల్లా బోధన్ అదనపు ఎస్పీగా పోస్టింగ్లో చేరారు. నిజామాబాద్ జిల్లాలో పలు బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం ఆయన విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలతో పాటు సీఐడీ, రైల్వే ఎస్పీగా పనిచేశారు. విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్గా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్ వెస్ట్ జోన్, మెరైన్ పోలీస్ విభాగంలో ఉత్తర కోస్తా ఐజీగా పనిచేశారు. పలు కీలక కేసులను ఛేదించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. చదవండి: (సీఎంకు హృదయపూర్వక ధన్యవాదాలు: మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్) -
సీఎంకు హృదయపూర్వక ధన్యవాదాలు: మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్
సాక్షి, విజయవాడ: మంగళగిరిలోని 6వ బెటాలియన్ గ్రౌండ్లో బదిలీ అయిన డీజీపీ గౌతమ్ సవాంగ్కు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. బెటాలియన్ పోలీసు కవాతు నిర్వహించింది. ఈసందర్భంగా బదిలీ అయిన డీజీపీ గౌతమ్ సవాంగ్, నూతన డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సవాంగ్ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. 'నా 36 సంవత్సరాల పోలీసు సర్వీసు ఇవాళ్టితో ముగుస్తోంది. డీజీపీగా 2 ఏళ్ల 8 నెలల కాలం పనిచేశా. ముఖ్యమంత్రి ఇచ్చిన సూచనల ప్రకారం ఈ రెండున్నర ఏళ్ల పాటు పని చేశాను. చాలా సంస్కరణలు, పోలీసు వ్యవహార శైలిలో మార్పులు తెచ్చేందుకు కృషి చేశాను. ప్రజలకు పోలీసు వ్యవస్థను చేరువ చేసేందుకు పని చేశాను. గతంలో ఎన్నడూ చూడని విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. 2 ఏళ్ల 8 నెలల పాటు నన్ను డీజీపీగా కొనసాగించిన సీఎంకు హృదయపూర్వక ధన్యవాదాలు. దిశా, మొబైల్ యాప్ నుంచి కూడా కేసులు నమోదు అయ్యేలా చేశాం. బాధితులు పోలీసు స్టేషన్కు రాకుండానే ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యేలా చర్యలు తీసుకున్నాం. 36 శాతం కేసులు డిజిటల్గా వచ్చిన ఫిర్యాదులే. 75 శాతం కేసుల్లో కోర్టులు విచారణ చేసి శిక్ష వేశాయి. స్పందన ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో 40 వేలకు పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం. స్పందన, ఆపరేషన్ ముస్కాన్ ద్వారా మహిళలు, చిన్నారుల భద్రత కోసం పనిచేశాం. దిశా యాప్ డౌన్లోడ్ లక్ష్యాన్ని సీఎం జగన్ నిర్ధేశించారు. ప్రస్తుతం కోటి 10 లక్షల మంది ఈ యాప్ను డౌన్ లోడ్ చేశారు. అలాగే పోలీస్ సేవా వెబ్ సైట్ ద్వారా డిజిటల్గా ఎఫ్ఐఆర్లను డౌన్ లోడ్ చేసే అవకాశం కల్పించాం. డీజీపీ కార్యాలయం నుంచి ఇన్ స్పెక్టర్ కార్యాలయం వరకు డిజిటల్గా అనుసంధానం చేశాం. ఏపీ పోలీసు వ్యవస్థలో డీజిటల్గా చాలా మార్పులు చేయగలిగాం. పోలీసులకు వీక్లి ఆఫ్లు కల్పించారు. 7,552 ఎకరాల్లో పండించిన గంజాయిని తొలిసారిగా ధ్వంసం చేశాం. పోలీస్ వ్యవస్థ పై ప్రజలకు చాలా ఆశలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న వాతావరణంలో సవాళ్ళను ఎదుర్కొంటూనే పని చేయాల్సి ఉంటుంది. నూతన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పోలీస్ వ్యవస్థను ఉన్నత శిఖరాలపై నిలబెడతారని ఆశిస్తున్నా. సీఎం జగన్ మనపై ఉంచిన బాధ్యతలు పూర్తిగా నిర్వహించాలి' అని గౌతమ్సవాంగ్ అన్నారు. -
ఏపీపీఎస్సీ చైర్మన్గా గౌతమ్ సవాంగ్.. ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్గా సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, 2019 జూన్ నుంచి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించిన సవాంగ్ను ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో సవాంగ్ను ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: హత్య, కుట్ర రాజకీయాలే చంద్రబాబు నైజం.. ఈ ప్రశ్నలకు సీబీఐ, సీబీఎన్ సమాధానం చెప్పాలి) -
2 లక్షల కిలోల గంజాయి ధ్వంసం
సాక్షి, విశాఖపట్నం/పెందుర్తి : గంజాయి నియంత్రణ, నిర్మూలనలో దేశంలోనే ఇదో సరికొత్త రికార్డు.. ఒకటి కాదు.. రెండు కాదు.. వెయ్యి కాదు.. ఏకంగా 2 లక్షల కిలోల గంజాయిని శనివారం పోలీసులు ధ్వంసం చేశారు. దీని విలువ సుమారు రూ.300 కోట్లు ఉంటుందని అంచనా. ఆపరేషన్ పరివర్తన్లో భాగంగా గత కొద్ది నెలలుగా ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతో పాటు, తూర్పుగోదావరి జిల్లాలో అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయిది. అనకాపల్లి నియోజకవర్గం కోడూరులో డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ గంజాయి సంచులకు స్వయంగా నిప్పు పెట్టి ధ్వంసం చేశారు. దశాబ్దాల కాలంగా ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గంజాయి సాగు చేస్తున్నారు. దళారులు, మావోయిస్టులు గిరిజనులను భయపెట్టి గంజాయిని సాగు చేయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే ఆపరేషన్ పరివర్తన్లో భాగంగా ప్రభుత్వం గంజాయి రవాణా, సాగుపై దృష్టిపెట్టింది. నార్కొటిక్స్, ఇంటెలిజెన్స్, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఇంత భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 577 కేసుల్లో 1500 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 7,552 ఎకరాల్లో గంజాయి సాగు ధ్వంసం అలాగే ఏజెన్సీ ప్రాంతం 11 మండలాల్లోని 313 శివారు గ్రామాల్లో 406 ప్రత్యేక బృందాలతో మొత్తం 7,552 ఎకరాల్లోని గంజాయి సాగును పోలీసులు ధ్వంసం చేశారు. ఈ గంజాయి విలువ రూ.9,251.32 కోట్ల దాకా ఉంటుంది. ఎస్ఈబీ, శాంతి భద్రతల పోలీసులు 7,152 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేస్తే.. 400 ఎకరాల వరకూ ఆయా గ్రామాల గిరిజన ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ధ్వంసం చేయడం విశేషం. గంజాయి సాగును గుర్తించేందుకు అత్యాధునిక పరికరాలు, డ్రోన్లు, శాటిలైట్ ఫోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆథారిత శాటిలైట్ ఇమేజ్ ప్రాసెసింగ్తో ‘ఆడ్రిన్ ఇమేజరీ’ని వినియోగించారు. ఓ పక్క సరిహద్దు గిరిజన గ్రామాల్లో గంజాయి సాగును పెద్ద ఎత్తున ధ్వంసం చేస్తూనే.. అదే సమయంలో అన్ని రవాణా మార్గాల్లో విస్తృత తనిఖీలు, ఆకస్మిక దాడులు నిర్వహించారు. 120 అంతర్రాష్ట్ర మొబైల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో గిరిజనులు, స్థానికులు గంజాయి సాగు వైపు మళ్లకుండా వారిలో చైతన్యం కలిగేలా 1,963 అవగాహన కార్యక్రమాలు, 93 ర్యాలీలు నిర్వహించారు. అలాగే గంజాయి సాగుపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులకు ప్రత్యామ్నాయంగా కాఫీ, జింజర్, రాగులు, స్ట్రాబెర్రీ, మిరియాలు తదితర పంటలు సాగు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. టూరిస్టులుగా వచ్చి.. స్మగ్లింగ్ గంజాయి స్మగ్లర్లు ఉత్తరాది రాష్ట్రాల నుంచి టూరిస్ట్లుగా వస్తున్నారు. తిరిగి వెళ్లేటప్పుడు రైలు, బస్సు, ఇతర మార్గాలను ఉపయోగించుకుంటున్నారు. దేశంలోనే విశాఖ ఏజెన్సీలోని గంజాయికి ప్రత్యేకమైన ఆదరణ ఉండటంతో ఈ ప్రాంతం కీలకంగా మారింది. అరెస్ట్ అయిన 1500 మందిలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన స్మగర్లు 154 మంది ఉండటం గమనార్హం. గంజాయి ధ్వంసం కార్యక్రమంలో అడిషనల్ డీజీ(ఎల్ అండ్ బీ) రవిశంకర్ అయ్యన్నార్, అడిషనల్ డీజీ(గ్రే హౌండ్స్) ఆర్కే మీనా, ఎస్ఈబీ డైరెక్టర్ వినీత్ బ్రిజ్లాల్, ఐజీ రంగారావు తదితరులు పాల్గొన్నారు. గంజాయిని గుట్టలుగా పేర్చి తగలబెడుతున్న దృశ్యం శారదా పీఠంలో డీజీపీ.. విశాఖ శ్రీ శారదా పీఠాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ శనివారం సందర్శించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతిలను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా పీఠంలోని రాజశ్యామల అమ్మవారికి డీజీపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సచివాలయ వ్యవస్థతో గిరిజనుల్లో పెనుమార్పు ఆపరేషన్ పరివర్తన్తో గిరిజన గ్రామాల ప్రజలు, యువతలో మార్పు మొదలైంది. వారంతా అభివృద్ధిని కోరుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ గిరిజన యువతలో మార్పునకు కీలకంగా మారింది. గ్రామ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లుగా గిరిజన యువత చేరడం, తద్వారా గంజాయి సాగుతో నష్టాలు తెలుసుకోవడం, ప్రజలకు తెలియజేయడం వంటివి కీలక పరిణామాలు. – గౌతమ్ సవాంగ్, డీజీపీ -
జిల్లాకో సైబర్ సెల్, సోషల్ మీడియా ల్యాబ్
సాక్షి, అమరావతి: ఆన్లైన్ మోసాలు, వేధింపులను అరికట్టేందుకు జిల్లాకో సైబర్ సెల్, ల్యాబ్, సోషల్ మీడియా ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నట్టు డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. జిల్లా స్థాయిలో సైబర్ సెల్స్, సోషల్ మీడియా ల్యాబ్లకు వేర్వేరుగా బీటెక్ అర్హత ఉన్న ఎస్ఐ, ఐదుగురు కానిస్టేబుళ్లు, సిబ్బందిని ఎంపిక చేసినట్టు తెలిపారు. ప్రతి జిల్లాకూ సైబర్ లీగల్ అడ్వయిజర్, సైబర్ నిపుణులను నియమిస్తామని చెప్పారు. సైబర్ సెల్స్, సోషల్ మీడియా ల్యాబ్ల కోసం ఎంపిక చేసిన అధికారులు, సిబ్బందికి మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి వెబినార్ ద్వారా సోమవారం డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, డెస్క్ ఫోరెన్సిక్, మొబైల్ ఫోరెన్సిక్, పాస్వర్డ్ రికవరీ, సీడీఆర్ అనాలసిస్, ఇమేజ్ ఎన్హాన్స్మెంట్, ప్రోక్సీ ఎర్రర్ ఐడెంటిటీ, ఈ–మెయిల్, సోషల్ మీడియా తదితర టూల్స్లతో కూడిన ఈ సైబర్ సెల్స్, సోషల్ మీడియా ల్యాబ్లను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా స్థాయిలోనే డిజిటల్ ఎవిడెన్స్, సోషల్ మీడియా ఐడెంటిటీ వంటి కీలక సాక్ష్యాధారాలను సేకరించడం ద్వారా దోషులను గుర్తించి సత్వరం శిక్షలు పడేలా చొరవ చూపుతామని చెప్పారు. ఇప్పటికే సైబర్ నేరాలకు పాల్పడుతున్న 1,551 మంది ప్రొఫైళ్లను గుర్తించి, వారిపై సైబర్ బుల్లీ షీట్స్ తెరిచినట్టు డీజీపీ వెల్లడించారు. జిల్లా స్థాయి సైబర్ సెల్స్, సోషల్ మీడియా ల్యాబ్లను అనుసంధానిస్తూ రాష్ట్ర స్థాయిలో సైబర్ సెల్స్, సోషల్ మీడియా ల్యాబ్లను ఏర్పాటు చేస్తామన్నారు. అందుకు అవసరమైన నిధులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారని డీజీపీ గౌతం సవాంగ్ వివరించారు. -
మహిళా పోలీసులకు పదోన్నతులు
సాక్షి, అమరావతి: మహిళలు, బాలల సంరక్షణలో కీలకమైన సచివాలయ మహిళా పోలీసులకు ఇన్స్పెక్టర్ (నాన్ గెజిటెడ్) వరకు పదోన్నతులు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళా పోలీసుల నియామకం, శిక్షణ సిలబస్; జాబ్ చార్ట్, సబార్డినేట్ సర్వీస్ నిబంధనలను ఖరారు చేసింది. ఈమేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గుడి విజయకుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని పోలీసు శాఖలో ప్రత్యేక విభాగంగా పరిగణిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మహిళా పోలీసు, సీనియర్ మహిళా పోలీసు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ), సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ), ఇన్స్పెక్టర్ (నాన్ గెజిటెడ్).. ఇలా ఐదు కేటగిరీలుగా వీరిని పరిగణిస్తారు. మొదటి స్థాయిలో ప్రత్యక్ష ఎంపిక ద్వారా మహిళా పోలీస్లను నియమిస్తారు. అనంతరం సీనియర్ మహిళా పోలీస్, ఏఎస్ఐ, ఎస్ఐ, ఇన్స్పెక్టర్ వరకు పదోన్నతులు ఇస్తారు. నియామకం, పదోన్నతులు ఇలా.. ► ఇకపై రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మహిళా పోలీసుల నియామకం ఉంటుంది. ► 90 శాతం మందిని నేరుగా ఎంపిక చేస్తారు. మిగిలిన 10 శాతంలో 5 శాతం అర్హులైన హోమ్ గార్డులకు, మిగిలిన 5 శాతం గ్రామ/వార్డు సచివాలయాల వలంటీర్లకు కేటాయించారు. ► 5 అడుగులు ఎత్తు, 40 కిలోల తగ్గకుండా బరువు ఉన్న అభ్యర్థులు అర్హులు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని గిరిజనులకు ఎత్తు 148 సెంటీమీటర్లు, బరువు 38 కిలోలు ఉండాలి. ► దేహ దారుఢ్య పరీక్ష (ఫిజికల్ టెస్ట్)లో 20 నిమిషాల్లో 2 కిలోమీటర్లు నడవాలి. దీంతోపాటు రాత, మెడికల్ పరీక్షల్లో అర్హత సాధించాలి. ► రెండేళ్లు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ► కానిస్టేబుల్ నుంచి సీఐ/ఇన్స్పెక్టర్ వరకు పోలీస్ శాఖలో ఉన్న రిపోర్టింగ్, పర్యవేక్షణ, నిర్ణయాధికారాలు వీరికీ వర్తిస్తాయి. ► శాంతిభద్రతలు, మహిళలు, పిల్లల రక్షణ, ప్రజా సేవలు సహా పలు అంశాలపై ఇన్డోర్, 10 విభాగాల్లో అవుట్ డోర్ శిక్షణ ఉంటుంది. ► మహిళా పోలీస్గా కనీసం ఆరు సంవత్సరాలు, సీనియర్ మహిళా పోలీస్గా ఐదేళ్లు, ఏఎస్ఐగా ఐదేళ్లు, ఎస్ఐగా ఐదేళ్లు పనిచేసిన వాళ్లు ఆపై పదోన్నతులకు అర్హులు. సంబంధిత పోస్టులో పనితీరు, రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణతను పరిగణనలోకి తీసుకుని పదోన్నతి ఇస్తారు. బోర్డు పరీక్షలకు 90%, పనితీరుకు 10 శాతం వెయిటేజి ఇస్తారు. ► మహిళా పోలీస్ నుంచి ఏఎస్ఐ వరకు జిల్లా పరిధిలో, ఎస్ఐ నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి వరకు రేంజ్ పరిధిలో పదోన్నతులు, సీనియారిటీ, బదిలీలు ఉంటాయి. జాబ్ చార్ట్ ► శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలను ఎప్పటికప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు రిపోర్ట్ చేయాలి. ► తమ పరిధిలోని విద్యా సంస్థలను సందర్శించి విద్యార్థులకు రోడ్ సేఫ్టీ, సైబర్ క్రైమ్, మహిళల భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పించాలి. ► అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచాలి. ► ఆత్మహత్యలు, ఒత్తిడి అధిగమించడంపై రైతులకు కౌన్సెలింగ్ ఇవ్వాలి. ► అవసరం మేరకు పోలీస్ స్టేషన్లలో కేసుల విచారణకు సహాయపడాలి. ► ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించాలి. ► బాల్య వివాహాల కట్టడికి ఐసీడీఎస్, రెవెన్యూ, ఇతర శాఖలతో కలిసి పనిచేయాలి. ► గృహ హింస, బాల్య వివాహం, లైంగిక వేధింపుల చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వ నిర్ణయం గొప్ప పరిణామం గ్రామ మహిళా పోలీస్ వ్యవస్థను సాధారణ పోలీసు విభాగంలో అంతర్భాగం చేయడం గొప్ప పరిణామమని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మహిళా పోలీస్ వ్యవస్థను పోలీసు శాఖలో ప్రత్యేక విభాగంగా పరిగణిస్తూనే వారి సేవలను మరింత సమర్థంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉపయోగించుకునేలా ప్రభుత్వం జీవో జారీ చేయడంపట్ల డీజీపీ బుధవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. ‘యూనిఫామ్ అనేది ఒక గౌరవం. సగర్వంగా యూనిఫామ్ ధరించండి. ప్రజా సేవలో పునరంకితమవ్వండి. మహిళా పోలీసులకు పోలీస్ శాఖలో తగిన గౌరవం ఉంటుంది’ అని పేర్కొన్నారు. పోలీసు శాఖ పదోన్నతులతో సంబంధం లేకుండా మహిళా పోలీసులకు ప్రత్యేకంగా పదోన్నతులు లభిస్తాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, వార్డుకు ఒక మహిళను పోలీసు ప్రతినిధిగా నియమించిన ఘనత మన రాష్ట్రానికే దక్కుతుందన్నారు. సామాన్యులకు మెరుగైన సేవలందిస్తూనే, మహిళలు, చిన్నారులు, అట్టడుగు వర్గాల రక్షణే ధ్యేయంగా మహిళా పోలీసు వ్యవస్థను సమర్థవంతంగా, ఆదర్శనీయంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో విధులు నిర్వర్తించనున్న మహిళా పోలీసులకు నాలుగు నెలలు శిక్షణ ఇస్తామన్నారు. మొదటి మూడు నెలలు పోలీస్ కళాశాలలో, మరో నెల క్షేత్రస్థాయి శిక్షణ ఇస్తామన్నారు. మహిళా పోలీసుల పదోన్నతులపై తాజా జీవోను స్వాగతిస్తున్నామని పోలీస్ అధికారుల సంఘం పేర్కొంది. ఇంతవరకు ఈ వ్యవస్థపై నెలకొన్న అపోహలకు ప్రభుత్వం తెరదించిందని తెలిపింది. -
దేశంలోనే ఉత్తమ డీజీపీ గౌతమ్ సవాంగ్
DGP Gautam Sawang Best DGP In India: సాక్షి, అమరావతి: ప్రజలకు సేవలు అందించడంలో ఏపీ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ దేశంలోనే అత్యుత్తమ డీజీపీగా నిలిచారని ది బెటర్ ఇండియా సంస్థ ప్రకటించింది. 2021లో ఉత్తమ సేవలు అందించిన 12 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల జాబితాను ఆ సంస్థ శనివారం విడుదల చేసింది. గడిచిన రెండేళ్లలో కోవిడ్ వల్ల అనేక కఠినమైన సవాళ్లను ఎదుర్కొవాల్సి వచ్చిందని, అటువంటి క్లిష్ట సమయంలోనూ డీజీపీ సవాంగ్ ప్రజలకు విశేష సేవలు అందించారని కితాబిచ్చింది. దిశ యాప్లో ఎస్వోఎస్ బటన్ (ఆప్షన్) ద్వారా అనేక మంది బాధితులకు సత్వర రక్షణ కల్పించేలా డీజీపీ చొరవ చూపినట్లు పేర్కొంది. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని బాధితుల ఫిర్యాదులు, వేగవంతమైన దర్యాప్తులో ఎంతో సమయాన్ని ఆదా చేశారని సంస్థ వివరించింది. సాంకేతికను ఉపయోగించుకుని 85 శాతం కేసుల పరిష్కారానికి దోహదపడ్డారని, ఎస్వోఎస్ బటన్ ఆప్షన్ ద్వారా ఐదు నెలల్లోనే 2,64,000 డౌన్లోడ్లతో రికార్డు సృష్టించారని తెలిపింది. మహిళల కోసం ప్రారంభించిన దిశా మొబైల్ యాప్ కేవలం ఐదు నెలల్లోనే 12.57 లక్షల డౌన్లోడ్లను చేయడంతో అద్భుతాలు సాధించారని ది బెటర్ ఇండియా సంస్థ గౌతమ్ సవాంగ్ సేవలను ప్రశంసించింది. -
కోవిడ్ సమయంలో పోలీసుల సేవలు ప్రశంసనీయం
-
రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకుంటే.. నగదు, ‘ప్రశంస’లు
సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్యసాయం అందించి ప్రాణాపాయం నుంచి తప్పించేందుకు ఉద్దేశించిన ‘గుడ్ సమారిటన్’ అవార్డుల కోసం ఎంపిక కమిటీలను ప్రభుత్వం నియమించింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్గా ఉండే రాష్ట్ర స్థాయి కమిటీలో రవాణా శాఖ కమిషనర్, వైద్యారోగ్య శాఖ కమిషనర్, అదనపు డీజీ(రోడ్డు భద్రత) సభ్యులుగా ఉంటారు. జిల్లా కలెక్టర్/జిల్లా జడ్జి చైర్మన్గా ఉండే జిల్లా స్థాయి కమిటీలో జిల్లా ఎస్పీ, రవాణా శాఖ ఉప కమిషనర్, జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ సభ్యులుగా వ్యవహరిస్తారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మొదటి గంట(గోల్డెన్ అవర్)లోగా బాధితులను ఆస్పత్రికి తీసుకొచ్చిన వారికి రూ.5 వేల ప్రోత్సాహంతో పాటు ప్రశంస పత్రం అందించారు. రోడ్డు ప్రమాదం గురించి పోలీసులకు తక్షణ సమాచారం అందిస్తే.. ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తికి పోలీసులు ‘గుడ్ సమారిటన్’ రశీదు ఇస్తారు. అనంతరం సంబంధిత పోలీస్స్టేషన్ నుంచి ఆయన వివరాలు జిల్లా స్థాయి కమిటీకి పంపుతారు. జాతీయ స్థాయిలోనూ నగదు, ప్రశంస పత్రం రోడ్డు ప్రమాద బాధితులను నేరుగా ఆస్పత్రికే తీసుకొస్తే.. ఆస్పత్రి అధికారులు ‘గుడ్ సమారిటన్’ రశీదు ఇచ్చి ఆ వివరాలను పోలీస్స్టేషన్కు పంపుతారు. అక్కడ నుంచి జిల్లా కమిటీకి ప్రతిపాదిస్తారు. ఆ విధంగా వచ్చిన ప్రతిపాదనలను జిల్లా స్థాయి కమిటీ పరిశీలించి నగదు బహుమతి, ప్రశంస పత్రాన్ని నెల రోజుల్లోగా అందిస్తాయి. ఏడాదిలో వచ్చిన ‘గుడ్ సమారిటన్’లలో అత్యంత విలువైన మూడు ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి కమిటీ ఎంపిక చేసి జాతీయ స్థాయి అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ఆ విధంగా ఏడాదికి ఒకసారి దేశ వ్యాప్తంగా 10 అత్యుత్తమ ‘గుడ్ సమారిటన్’లను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసి రూ.లక్ష చొప్పున పోత్సాహం, ప్రశంస పత్రం ఇస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ‘గుడ్ సమారిటన్’ అవార్డుల ప్రక్రియను 2026, మార్చి 31 వరకూ కొనసాగించాలని కేంద్రం ప్రాథమికంగా నిర్ణయించింది. అందుకోసం జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలను నియమించినట్టు డీజీపీ గౌతం సవాంగ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 5న 10కె, 5కె మారథాన్ తాడేపల్లిరూరల్: ఈనెల 5వ తేదీన నిర్వహించనున్న 10కె, 5కె రన్ పోస్టర్లను డీజీపీ గౌతమ్ సవాంగ్, అదనపు డీజీపీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్లు బుధవారం డీజీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. మణిపాల్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి, అమరావతి రన్నర్స్, రెడ్ ఎఫ్ఎం ప్రతినిధులు మాట్లాడుతూ అమరావతి రన్నర్స్, రెడ్ ఎఫ్ఎం, డాక్టర్ రెడ్డీస్ వారి సహకారంతో మణిపాల్ హాస్పిటల్ 15వ వార్షికోత్సవం సందర్భంగా సమాజంలో ఆరోగ్య అవగాహన పెంపొందించడానికి డిసెంబర్ 5న విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. పోటీలో గెలుపొందిన వారికి భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ చేతుల మీదుగా నగదు బహుమతి ప్రదానం చేస్తామన్నారు. పోటీలో పాల్గొనదలచిన వారు 9618558989, 7569304232 నంబర్లకు ఫోన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. -
స్మార్ట్ పోలీసింగ్లో సర్వేలో ఏపీ అరుదైన రికార్డు..
సాక్షి, అమరావతి: జాతీయ స్ధాయిలో ఘనతను చాటిన ఏపీ పోలీస్ శాఖను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించినందుకు ఏపీ పోలీసుశాఖను సీఎం మనస్పూర్తిగా అభినందించారు. ఇదేరీతిలో ప్రజలకు మరిన్నిసేవలను నిర్ణీతత సమయంలో అందించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. కాగా, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, పోలీసు ఉన్నతాధికారులు సచివాలయంలో సీఎంని కలిశారు. ఆ తర్వాత.. స్మార్ట్ పోలీసింగ్ సర్వే వివరాలను సీఎం జగన్కి వెల్లడించారు. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ స్మార్ట్ పోలీసింగ్ సర్వేలో.. ఏపీ పోలీసింగ్ నెంబర్వన్ ర్యాంక్ సాధించిందని తెలిపారు. దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించిన ఈ ఫౌండేషన్.. తొమ్మిది ప్రామాణిక అంశాల్లో ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాలలో సర్వే చేపట్టిందని డీజీపీ తెలిపారు. 2014లో డీజీపీల సదస్సులో ప్రధాని మోదీ పిలుపు మేరకు స్మార్ట్ పోలీసింగ్ పద్ధతులను పాటించామని తెలిపారు. ఆయా రాష్ట్రాలలో పోలీస్ ఫౌండేషన్ ఏడేళ్లుగా సర్వే నిర్వహిస్తుందన్నారు. ఈ ఏడాది ఏపీ తొలిసారిగా మొదటి ర్యాంకు సాధించిందని డీజీపీ వివరించారు. ఏపీ పోలీస్ శాఖ.. ప్రజల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఐపిఎఫ్ఐపిఎఫ్ అధ్యయనం చేస్తుందని అన్నారు. దీనిలో రిటైర్డు డీజీలు,ఐపీఎస్లు,ఐఏఎస్లు, ఐఐటీ ప్రొఫెసర్లు, పౌరసమాజ ప్రముఖులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. పౌరులపట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించడం, జవాబుదారితనం, ప్రజల నమ్మకం విభాగాల్లో ఏపీ నెంబర్ వన్ స్థానం సాధించిందని అన్నారు. సెన్సిటివిటీ, పోలీసుల ప్రవర్తన, అందుబాటులు పోలీస్ వ్యవస్థ, టెక్నాలజీ ఉపయోగం విభాగాల్లో అత్యుత్తమ ర్యాంకింగ్ కనబర్చిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, అడిషనల్ డీజీ (బెటాలియన్స్) శంకభ్రత బాగ్చి, డీఐజీ (టెక్నికల్ సర్వీసెస్) పాలరాజు, గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ, గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ హజరయ్యారు. -
మొదలకంటా ‘గంజాయి’ నరికివేత
సాక్షి, విశాఖపట్నం/జి.మాడుగుల: విశాఖ ఏజెన్సీలో గంజాయి పంట నిర్మూలన కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతోంది. గంజాయి ఎక్కడ సాగవుతుందో తెలుసుకొని.. ఆ ప్రాంతాల్లోని ప్రజలకు పోలీసులు అవగాహన కలిగిస్తున్నారు. స్థానికులు కూడా స్వచ్చందంగా ముందుకు వచ్చి గంజాయి నిర్మూలనలో పాల్గొంటున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు రెవెన్యూ, అటవీ, ఐటీడీఏ అధికారులతో కలిసి పోలీసులు గంజాయి నిర్మూలనకు ‘పరివర్తన’ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా జి.మాడుగుల మండలం ఏడుసావళ్లు, చీకుంబంద గ్రామాల సమీపంలో శనివారం ఒక్కరోజే దాదాపు 80 ఎకరాల్లోని గంజాయి తోటలను పోలీసులు, స్థానికులు ధ్వంసం చేశారు. విశాఖ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు, ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ సతీష్కుమార్, స్థానిక ఎస్ఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది కత్తి చేతపట్టి గంజాయి మొక్కలను నరికేశారు. గూడెం కొత్తవీధి మండలం నేలజర్త, బొరుకుగొంది, కనుసుమెట్ట, కిల్లోగూడా, కాకునూరు, గుమ్మిరేవుల సమీప ప్రాంతాల్లో సుమారు 25 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలను కూడా శనివారం ధ్వంసం చేశారు. -
అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవాలి
భవానీపురం (విజయవాడ పశ్చిమ): విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో గురువారం నిర్వహించిన ఏపీ పోలీస్ బ్యాండ్ ప్రదర్శనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో ఒక్క పోలీసులు మాత్రమే రోడ్డు మీద నిలబడి ప్రజల ప్రాణాలను కాపాడారన్నారు. ఈ క్రమంలో 206 మంది పోలీసులు కోవిడ్తో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరుల కుటుంబాలకు ఇన్సూరెన్స్ అందజేసిన బ్యాంకు, బీమా సంస్థల ప్రతినిధులకు ఆయన ప్రశంసాపత్రాలు అందజేశారు. కోవిడ్ సమయంలో 24/7 హెల్ప్లైన్తో పోలీసు కుటుంబాలకు వైద్యసేవలు అందించిన ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ సతీమణి సుమిత్రా రవిశంకర్ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. -
కరోనా కట్టడిలో పోలీసుల పాత్ర భేష్
సాక్షి, అమరావతి/గుంటూరు రూరల్: కరోనా కట్టడికి పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని హోం మంత్రి మేకతోటి సుచరిత అభినందించారు. పోలీసుల సేవలకు ప్రభుత్వం తగిన విధంగా గుర్తింపునిస్తోందని చెప్పారు. పౌర సమాజం కూడా పోలీసుల కృషిని గుర్తించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో కరోనా వల్ల మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున మొత్తం రూ.3.72 కోట్ల ఆర్థిక సాయాన్ని మ్యాన్కైండ్ ఫార్మా సంస్థ ఇటీవల ప్రకటించింది. ఈ చెక్కులను హోం మంత్రి సుచరిత బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వర్చువల్గా నిర్వహించిన సమావేశంలో ఆమె గుంటూరు నుంచి పాల్గొన్నారు. కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి పోలీసు సంక్షేమ నిధి నుంచి రూ.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల చొప్పున సాయం అందించామని చెప్పారు. మ్యాన్కైండ్ ఫార్మా సంస్థ కూడా ఉదారంగా స్పందించడం ప్రశంసనీయమన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. లాక్డౌన్ను సమర్థంగా అమలు చేయడం, వలస కూలీలకు సహాయం చేయడం, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం తదితర విధులను పోలీసులు నిబద్ధతతో నిర్వర్తించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. పోలీసుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి ఉద్యోగి హెల్త్ ప్రొఫైల్ను రూపొందించామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రమూ చేయని రీతిలో ఏపీ ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి చర్యలు తీసుకుందన్నారు. కార్యక్రమంలో మ్యాన్కైండ్ ఫార్మా సీఈవో రాజీవ్ జునేజా, గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ, రూరల్ ఎస్పీ విశాల్ గున్ని తదితరులు పాల్గొన్నారు. -
గంజాయిపై సమష్టి పోరు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/వరదయ్యపాళెం (చిత్తూరు జిల్లా) : దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న గంజాయి సాగును రాష్ట్రంలో సమూలంగా నిర్మూలించేందుకు పోలీసు యంత్రాంగం ఉమ్మడి వ్యూహం రచిస్తోంది. సాగు దశ నుంచే దీనిని కట్టడి చేసేందుకు పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని నిర్ణయించింది. తూర్పు గోదావరి జిల్లా వేదికగా రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీసు అధికారులకు ఈ మేరకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలోని పలు విభాగాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సుమారు మూడున్నర గంటలపాటు రాజమహేంద్రవరంలో అంతర్గత సమీక్షా సమావేశం నిర్వహించారు. సాగు దగ్గర నుంచే గంజాయి నియంత్రణ, రవాణా కట్టడికి సరిహద్దుల్లో ఎదురవుతున్న ప్రతిబందకాలను అధిగమించేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని సూచించారు. ఇందుకు పొరుగునున్న ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని సమష్టి పోరుకు సిద్ధంకావాలని ఆదేశించారు. ఇందుకోసం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను సిద్ధంచేస్తున్నామని చెప్పారు. దీనికి పోలీసు, రెవెన్యూ, అటవీ, వ్యవసాయ, ఐటీడీఏల సహకారం తీసుకుంటామన్నారు. అనంతరం డీజీపీ సమావేశం వివరాలను మీడియాకు వివరించారు. మీరే చూస్తారుగా.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నెలరోజులుగా రాష్ట్రంలో గంజాయిపై లోతైన అధ్యయనం చేశామని గౌతమ్ సవాంగ్ చెప్పారు. రానున్న రోజుల్లో గంజాయిని ఎలా అరికడతామో మీరే చూస్తారుగా అని డీజీపీ అన్నారు. నిజానికి ఆంధ్రా–ఒడిశా మధ్య గంజాయి సమస్య దశాబ్దాలుగా ఉందన్నారు. ఎన్ఐఎ సహకారంతో ఇప్పుడు దానిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఏడాది కాలంగా రాష్ట్రంలో 2.90 లక్షల కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని డీజీపీ చెప్పారు. పదేళ్ల కంటే గత ఏడాదిలో కొన్ని రెట్లు అధికంగా గంజాయి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గతంలో 3 వేల ఎకరాల్లో మాత్రమే గంజాయి సాగును ధ్వంసం చేసినట్లు చెబుతున్నారని.. కానీ, ఈసారి మొదటి విడతలోనే 4,500 ఎకరాల్లో ధ్వంసం చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని ఆయన చెప్పారు. మీడియాతో మాట్లాడుతున్న డీజీపీ సవాంగ్ ఇతర రాష్ట్రాలకు చెందిన నేరస్తులపై గట్టి నిఘా ఏర్పాటుచేయడంతో పాటు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి వారందరినీ చట్టం ముందు నిలబెడతామన్నారు. ఇప్పటికే 463 మంది అంతర్రాష్ట్ర నిందితులను దోషులుగా నిలబెట్టామన్నారు. అలాగే, 1,500 వాహనాలను జప్తుచేసి, 5,000 మంది నిందితులను అరెస్టు చేశామని గౌతమ్ సవాంగ్ చెప్పారు. సమస్యను శాశ్వతంగా ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తున్నామని, ఒడిశా డీజీపీతో కూడా మాట్లాడామన్నారు. ఈ విషయంలో ఆరోపణలు చేయడం సరికాదన్నారు. గంజాయి సాగుపై దాడులు విస్తృతం పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది గంజాయి రవాణా, సాగుపై పోలీసు దాడులు నిర్వహించామన్నారు. ఈ ప్రాంతాల్లో ఇంటెలిజెన్స్ బృందాలను నియమించామన్నారు. నిజానికి.. 2016లోనే ఏపీతో పాటు ఒడిశా సైతం గంజాయికి కేంద్రంగా మారిందన్నారు. ఇక గంజాయి ఏ విధంగా తరలిస్తున్నారు? ఎలా పట్టుకోవాలి? ఎక్కడ చెక్ పోస్టులు పెట్టాలి అనే అంశాలపై సమగ్రంగా చర్చించామని డీజీపీ చెప్పారు. నాలుగేళ్లుగా కేరళ నుంచి వచ్చిన స్మగ్లర్లు ఇక్కడే ఉండి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న విషయాన్ని గుర్తించామని ఆయన చెప్పారు. గంజాయి స్మగ్లింగ్ ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో ఎక్కువగా ఉందన్నారు. అసత్య ఆరోపణలు సరికాదు ఇక గుజరాత్ ముంద్రా, నరసాపురం ఉదంతాలతో రాష్ట్రానికి ఎలాంటి సంబంధంలేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ మరోసారి స్పష్టంచేశారు. కొందరు కావాలనే దీనిపై అసత్యపు ప్రచారం చేస్తున్నారన్నారు. విచారణ చేస్తున్న ఏజెన్సీలన్నీ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. డీఆర్ఐ, ఎన్సీబీ, ఇప్పుడు సీబీఐ కూడా ఆరా తీస్తున్నాయని ఆయన చెప్పారు. పోలీస్ వ్యవస్థపై రాజకీయంగా విమర్శలు చేయవద్దని డీజీపీ హితవు పలికారు. గంజాయి, ఇతర స్మగ్లింగ్ వ్యవహారాలపై ప్రజలు ముందుకొచ్చి సమాచారం ఇవ్వాలని డీజీపీ కోరారు. ఆ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఏపీ, తమిళనాడు పోలీసులు సహకారం శ్రీసిటీ వేదికగా ఇరు రాష్ట్రాల పోలీసు అధికారుల చర్చలు ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో అక్రమ రవాణా, శాంతిభద్రతల పరిరక్షణకు కసరత్తు చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) అడిషనల్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. రెండు రాష్ట్రాల పోలీసు శాఖల సమన్వయం, పరస్పర సహకారం కోసం మంగళ వారం శ్రీసిటీ పారిశ్రామికవాడలోని వ్యా పార వాణిజ్య కేంద్రంలో చిత్తూరు, నెల్లూరు, తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలకు చెందిన పలువురు పోలీసు అధికారులు సమావేశమయ్యారు. సెబ్ అడిషనల్ ఎస్పీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన శ్రీసిటీ సెజ్ పరిధిలో ఇరు ప్రాంతాల పోలీసుల మధ్య సహకారం, సమన్వయం ఉన్నప్పుడే అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చర్యలతో శ్రీసిటీని శాంతిభద్రతల విషయంలో మోడల్ సిటీగా మార్చవచ్చన్నారు. అలాగే, ఆకతాయిలు, రౌడీమూకలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అంతర్రాష్ట్ర నేరాలను నివారించడం, ఇసుక, కంకర, మట్టి, ఎర్రచందనం, మద్యం, గంజాయి, రేషన్ బియ్యంలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. శ్రీసిటీ వైస్ ప్రెసిడెంట్ (కస్టమర్ రిలేషన్స్) రమేష్కుమార్, శ్రీసిటీ సెక్యూరిటీ చీఫ్ రమేష్ సాదర స్వాగతం పలికారు. -
పోలీసు వ్యవస్థపై రాజకీయ విమర్శలు చేయడం తగదు: డీజీపీ గౌతమ్ సవాంగ్
సాక్షి, రాజమండ్రి(తూర్పుగోదావరి): పోలీసు వ్యవస్థపై రాజకీయ విమర్శలు చేయడం తగదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. పోలీసు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో రాజమండ్రిలో మాదక ద్రవ్యాల నియంత్రణపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. ఏపీలో మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని స్పష్టం చేశారు. అదే విధంగా.. గంజాయి సాగు, రవాణాను అరికట్టేందుకు ఎన్ఐఎ సహకారం కూడా తీసుకుంటామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. చదవండి: Shocking Video: స్విమ్మర్పై మొసలి భయంకర దాడి.. -
దురుద్దేశంతోనే డీజీపీపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు దురుద్దేశంతోనే డీజీపీ గౌతం సవాంగ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం మండిపడింది. గౌతం సవాంగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర పోలీసు శాఖ జాతీయ స్థాయిలో 113 అవార్డులను సొంతం చేసుకోవడం ఆయన సమర్థతకు నిదర్శనమని కొనియాడింది. నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న డీజీపీపై చంద్రబాబు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం గురువారం ఓ ప్రకటనలో ఖండించింది. పోలీసు ప్రధాన కార్యాలయంలో పీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న రిజర్వ్ ఇన్స్పెక్టర్ సుక్రూ నాయక్పై మూకుమ్మడిగా దాడి చేయడం ద్వారా టీడీపీ నేతలు ఎలాంటి సందేశం ఇస్తున్నారని నిలదీసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఆయన పోలీసు ప్రధాన కార్యాలయంలో పీఆర్వోగా విధుల్లో చేరిన విషయాన్ని గుర్తు చేసింది. టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఘర్షణల గురించి మీడియా ప్రతినిధులు వివరాలు కోరడంతో.. సమాచారం తెలుసుకునేందుకే సుక్రూ నాయక్ అక్కడకు వెళ్లారని తెలిపింది. తాను పోలీసు అధికారిని అని చెప్పి గుర్తింపు కార్డు చూపించినప్పటికీ టీడీపీ నేతలు పట్టించుకోకుండా ఆయనపై దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. -
బాబుకు లీగల్ నోటీసు
సాక్షి, అమరావతి: డ్రగ్స్ వ్యవహారంతో ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేదని దర్యాప్తు సంస్థలు, పోలీస్ శాఖ ఎన్నిసార్లు తేల్చి చెప్పినా విపక్ష నేతలు పట్టించుకోకుండా పదేపదే అవే అబద్ధాలను వల్లించడం, అనుకూల మీడియాలో అవాస్తవాలను ప్రచురించడం, తిరిగి వాటిని ప్రచారంలోకి తెస్తున్న నేపథ్యంలో ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో డీజీపీ న్యాయాస్త్రాన్ని సంధించారు. రాష్ట్రం, పోలీస్శాఖ ప్రతిష్టను మసకబార్చవద్దని సామరస్య పూర్వకంగా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఖాతరు చేయకపోవడంతో న్యాయబద్ధంగానే దీన్ని ఎదుర్కోవాలని, కుట్రలను ఎండగట్టాలని నిర్ణయించుకున్నారు. అసత్య ప్రచారంపై పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించి లీగల్ నోటీసులు జారీ చేశారు. అనివార్య పరిస్థితుల్లోనే.. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను దిగజార్చేలా జరుగుతున్న కుట్రలను ఎదుర్కొనేందుకుపోలీసు శాఖ సన్నద్ధమైంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చడంతోపాటు పోలీసు శాఖ స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు జరుగుతున్న పన్నాగాలపై ‘న్యాయ అస్త్రాన్ని’ ప్రయోగించింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేశ్, ఇతర పార్టీ నేతలతోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు డీజీపీ సవాంగ్ గత్యంతరం లేని పరిస్థితుల్లోనే లీగల్ నోటీసులిచ్చినట్లు సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష నేతతోపాటు మీడియా సంస్థలపై డీజీపీ హోదాలో ఉన్న అధికారి ఇలా న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించడం దేశంలో ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశంలో ఇదే తొలిసారి... సాధారణంగా సీఎస్, డీజీపీ స్థాయి అధికారులు ఇలా ప్రతిపక్ష నేతకు లీగల్ నోటీసులు జారీ చేయాల్సిన అనివార్యత తలెత్తదు. కానీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వంపై బురద జల్లడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారి పట్ల అనివార్యంగా న్యాయాస్త్రాన్ని ప్రయోగించాల్సి వచ్చింది. విపక్ష నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలతో వారి అనుకూల మీడియా కథనాలను ప్రచురిస్తోంది. టీడీపీ నేతలు తిరిగి వాటినే వల్లె వేస్తున్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలా పాత్రికేయ విలువలకు తిలోదకాలిచ్చిన దాఖలాలు లేవు. గుజరాత్లో కేంద్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు జప్తు చేసిన రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్తో ఏపీకి ముడిపెడుతూ విపక్షాలు దుష్ప్రచారానికి తెగించాయి. ఆ హెరాయిన్తో ఏపీకి సంబంధం లేదని డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు విస్పష్టంగా ప్రకటించినప్పటికీ చంద్రబాబు, టీడీపీ నేతలు, వారి అనుకూల మీడియాతో బురద చల్లుతూనే ఉన్నారు. డీజీపీ సామరస్యపూర్వకంగా వ్యవహరిస్తూ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ చంద్రబాబులోగానీ ఆ రెండు పత్రికల యాజమాన్యాల్లో గానీ ఏమాత్రం మార్పు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గత్యంతరం లేనందున న్యాయ పోరాటం ద్వారానే ఈ కుట్రలను బహిర్గతం చేయాలని డీజీపీ నిర్ణయించుకుని చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలతోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలు, ఎడిటర్లు, పాత్రికేయులకు లీగల్ నోటీసులు జారీ చేశారు. తప్పుడు ఆరోపణలు, అవాస్తవ వార్తలపై బేషరతుగా క్షమాపణలు చెప్పి అదే విషయాన్ని ఆ రెండు పత్రికలు ప్రముఖంగా ప్రచురించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే బురద రాజకీయ లబ్ధి కోసం యావత్ పోలీసు శాఖ స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు విపక్ష టీడీపీ కుతంత్రాలకు తెగిస్తోంది. నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న పోలీసు శాఖపై దుష్ప్రచారానికి పాల్పడుతోంది. టీడీపీ అనుకూల మీడియా దీనికి కొమ్ము కాస్తోంది. నిరాధార ఆరోపణలను ప్రముఖంగా ప్రచురిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాయి. ‘రాష్ట్రంలో జోరుగా డ్రగ్స్ రవాణా – గుజరాత్లో పట్టుబడ్డ హెరాయిన్ సీఎం ఇంటి సమీపంలోని సంస్థలదే’.. ‘దీనికి సీఎం, డీజీపీ ఏమని సమాధానం చెబుతారు?’ .. ‘మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై డీజీపీ అవాస్తవాలు’... ఇలా పలు రకాలుగా చంద్రబాబు, లోకేశ్ నిరాధారణ ఆరోపణలు చేశారు. వాటిని అవే శీర్షికలతో ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. ‘జగన్ పాలనలో రాష్ట్రం ఇరవై ఏళ్లు వెనక్కి’.. ‘డ్రగ్స్ మాఫియాకు రాష్ట్రాన్ని నిలయంగా మార్చారు. దీనికి జగన్, డీజీపీ ఏం చెబుతారు: చంద్రబాబు ధ్వజం’ అంటూ విపక్ష నేత చేసిన అసత్య ఆరోపణలను ఆంధ్రజ్యోతి ఉద్దేశపూర్వకంగా ప్రముఖంగా ప్రచురించింది. కుట్రలపై జాతీయస్థాయిలో చర్చ పోలీస్ శాఖ ప్రతిష్టను పరిరక్షించేందుకు డీజీపీ సవాంగ్ న్యాయపరమైన చర్యలకు సమాయత్తమవడం జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు అనివార్యంగా అంతటి నిర్ణయం తీసుకునేందుకు పురిగొల్పిన పరిస్థితులు ఏమిటన్న దానిపై దేశవ్యాప్తంగా అంతా దృష్టి సారించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన మీడియా సంస్థలు.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలకు సహకరిస్తుండటం పట్ల నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఇంటి పక్కన సంస్థే హెరాయిన్ దిగుమతి చేయించిందని దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం, టీడీపీ అనుకూల మీడియా దానికి వత్తాసు పలుకుతూ దుష్ప్రచారం చేస్తుండటాన్ని దేశమంతా గుర్తించింది. ఈ కుట్రలను ఎండగట్టేందుకు డీజీపీ సరైన నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు పేర్కొంటున్నారు. -
చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలకు డీజీపీ లీగల్ నోటీసులు
సాక్షి, అమరావతి: కేంద్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) గుజరాత్లో స్వాధీనం చేసుకున్న హెరాయిన్తో ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేకున్నా అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడంతోపాటు తమ ప్రతిష్టకు భంగం కలిగించారని ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేశ్, పలువురు టీడీపీ నేతలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ లీగల్ నోటీసులు జారీ చేశారు. నిరాధార ఆరోపణలతో కథనాలు.. ‘రాష్ట్రంలో జోరుగా డ్రగ్స్ రవాణా– గుజరాత్లో పట్టుబడ్డ హెరాయిన్ సీఎం ఇంటి సమీపంలో సంస్థలదే’, ‘దీనికి సీఎం, డీజీపీ ఏమని సమాధానం చెబుతారు?’, ‘మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై డీజీపీ అవాస్తవాలు’ అనే శీర్షికలతో ఈనాడు పలు కథనాలను ప్రచురించింది. ‘జగన్ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి’, డ్రగ్స్ మాఫియాకు రాష్ట్రాన్ని నిలయంగా మార్చారు. దీనికి జగన్, డీజీపీ ఏం చెబుతారు?, చంద్రబాబు ధ్వజం’ అనే శీర్షికలతో ఆంధ్రజ్యోతి వార్తలు ప్రచురించింది. నిరాధారమైన ఆరోపణలు చేయడం, వాటిని ప్రచురించడంపై చంద్రబాబు, లోకేశ్, ధూళిపాళ్ల నరేంద్ర, ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, బొండా ఉమా, బుద్దా వెంకన్న, కొమ్మారెడ్డి పట్టాభి, ఈనాడు వ్యవస్థాపకుడు రామోజీరావు, ఆయన కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్, ఉషోదయ పబ్లికేషన్స్, ఈనాడు ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు, ఆ పత్రిక బ్యూరో చీఫ్తోపాటు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఆమోద పబ్లికేషన్స్, ప్రింటర్–పబ్లిషర్ కోగంటి వెంకట శేషగిరిరావు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, ఆ పత్రిక బ్యూరో చీఫ్లకు డీజీపీ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసరెడ్డి లీగల్ నోటీసులు ఇచ్చారు. దురుద్దేశపూర్వకంగానే.. డీఆర్ఐ గుజరాత్లో స్వాధీనం చేసుకున్న రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్తో ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేదని విజయవాడ పోలీస్ కమిషనర్ స్పష్టం చేసినప్పటికీ చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలు ప్రభుత్వ ప్రతిష్టకు విఘాతం కలిగించడంతోపాటు పోలీసు శాఖ నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేలా అసత్య ఆరోపణలు చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ హెరాయిన్తో ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేదని డీఆర్ఐ ప్రకటించినా, డీజీపీ కూడా స్పష్టత ఇచ్చినా దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. ఆ నిరాధార ఆరోపణలపై వాస్తవాలను నిర్ధారించుకోకుండానే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ప్రముఖంగా ప్రచురించి పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగించాయన్నారు. దురుద్దేశపూరిత చర్యలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖకు క్షమాపణలు చెప్పడంతోపాటు ఆ వార్తను ఆయా పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించాలని నోటీసులో పేర్కొన్నారు. లేనిపక్షంలో వారిపై డీజీపీ న్యాయపరమైన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. -
తప్పుడు ఆరోపణలు చేయొద్దని మళ్లీ చెబుతున్నాం: డీజీపీ
సాక్షి, అమరావతి: కౌంటర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ 7వ జాతీయ స్థాయి ఈవెంట్లో ఏపీ అక్టోపస్ బలగాలు మొదటి స్థానం సాధించాయి. ఏపీ పోలీసులకు, ప్రజలకు ఇది గర్వించదగ్గ రోజు అని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'మన గ్రేహౌండ్స్ బలగాలు మంచి ప్రదర్శన చేస్తున్నాయి. అంతర్జాతీయస్థాయిలో కూడా ప్రతిభ కనిబరిచేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి కూడా అక్టోపస్ బలగాలను రీ లొకేట్ చేయాలని సూచించారు. ఇకపై జిల్లా కేంద్రాల్లో సైతం అక్టోపస్ బలగాలు సేవలు అందిచనున్నాయి. గ్రేహౌండ్స్, అక్టోపస్ బలగాలను ఇచ్చేందుకు కేంద్రం సహకరిస్తుంది. నైట్ ఫైరింగ్ విషయంలో ఏపీ అక్టోపస్ అత్యుత్తమ శిక్షణ ఇస్తోంది. రాష్ట్రంలో వివిధ ర్యాంకుల్లో మొత్తం 500 మంది అక్టోపస్ ఆఫీసర్లు ఉన్నారు. నైట్ ఫైరింగ్ విషయంలో ఏపీ అక్టోపస్ అత్యుత్తమ శిక్షణ ఇస్తోంది' అని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. చదవండి: (దుష్ప్రచారమే టీడీపీ అజెండా) తప్పుడు ఆరోపణలు చేయొద్దు: డీజీపీ ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్తో ఏపీకి సంబంధం లేదు. ఈ విషయం చాలాసార్లు స్పష్టంగా చెప్పినా నిరాధార ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి. మేం కూడా ఆ సంస్థలతో టచ్లో ఉన్నాం. కొన్ని రాజకీయ పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయి. ఈ తరహా విమర్శల వల్ల రాష్ట్రానికి చెడ్డ పేరు తెస్తున్నారు. రాష్ట్రం పరువు పోయేలా కొన్ని పార్టీలు హెరాయిన్ విషయంలో ఆరోపణలు చేయడం సరికాదు. ప్రజల్లో, యువతలో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. కొందరు అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారు కాబట్టే నోటీసులు జారీ చేస్తున్నాం. తప్పుడు ఆరోపణలు చేయొద్దని మళ్లీ చెబుతున్నాం. ఎన్ఐఏ వాళ్లే కాకుండా ఇంకొన్ని దర్యాప్తు సంస్థలు వచ్చి ఉంటాయి. ఏపీకి వచ్చి విచారణ చేసుకుంటే తప్పేంటీ..? అని ప్రశ్నించారు. చదవండి: (AP: బడితోనే అమ్మఒడి) -
అపోహల సృష్టికే ఏపీలో వదంతులు
సాక్షి, అమరావతి: గుజరాత్లో కేంద్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఇటీవల జప్తుచేసిన హెరాయిన్తో ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి సంబంధం లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. అయినా.. ప్రతిపక్ష పార్టీలు, ఓ సీనియర్ నాయకుడు (చంద్రబాబును ఉద్దేశించి) పదేపదే వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో గురువారం డీజీపీ మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీలు ఏమాత్రం బాధ్యత లేకుండా అపోహలు సృష్టించడం సమంజసం కాదన్నారు. ఇటువంటి అసత్య ఆరోపణలతో ప్రజలు అభద్రతాభావానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి, నిజనిజాలు బేరీజు వేసుకోవాలన్న విచక్షణను ప్రతిపక్ష పార్టీలు మరచిపోవడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. గుజరాత్ ముంద్రా పోర్ట్లో స్వాధీనం చేసుకున్న హెరాయిన్ నిల్వలతో విజయవాడకు, రాష్ట్రానికిగానీ అస్సలు సంబంధం లేదని విజయవాడ కమిషనర్ ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ కొందరు రాజకీయ నాయకులు ఆ అంశాన్ని పదేపదే ప్రస్తావించడం సమంజసం కాదన్నారు. ముంద్రా, చెన్నై, ఢిల్లీ, నోయిడాలలోనే హెరాయిన్ స్వాధీనాలు, అరెస్టులు చేశారని జాతీయ పత్రికలు, చానళ్లు కూడా ప్రముఖంగా ప్రసారం చేసిన విషయాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ గుర్తుచేశారు. ఆ నేరం ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్లో లేవని డీఆర్ఐతోపాటు కేంద్ర సంస్థలు ధ్రువీకరిస్తున్నా సరే సీనియర్ నాయకుడినని చెప్పుకునే ప్రతిపక్ష నేత ఉద్దేశపూర్వకంగా అపోహలు సృష్టించడం భావ్యం కాదని స్పష్టం చేశారు. ఆషీ ట్రేడింగ్ కంపెనీ చిరునామా మాత్రమే విజయవాడగా ఉంది తప్ప రాష్ట్రంలో ఇసుమంతైనా కార్యకలాపాలు జరపలేదని పునరుద్ఘాటించారు. అసత్య ప్రకటనలు మానుకోవాలి హెరాయిన్ను విజయవాడకుగానీ, ఏపీలోని ఇతర ప్రాంతాలకుగానీ దిగుమతి చేసుకున్నట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదని డీఆర్ఐ అధికారులు స్పష్టంచేసిన విషయాన్ని డీజీపీ గుర్తుచేశారు. అఫ్గానిస్తాన్ నుంచి ముంద్రా పోర్టుకు కన్సైన్మెంట్ ముసుగులో హెరాయిన్ దిగుమతి చేసుకుంటుండగా తనిఖీలు చేసి జప్తు చేశామని మాత్రమే డీఆర్ఐ అధికారులు పేర్కొన్నారని ఆయన చెప్పారు. అన్ని అంశాలపై డీఆర్ఐ, ఇతర కేంద్ర సంస్థలు ముమ్మరంగా పరిశోధన చేస్తున్నాయని కూడా సవాంగ్ చెప్పారు. కాబట్టి, ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రకటనలు చేయడం, ప్రజల మనసుల్లో భయాందోళనలు రేకెత్తించడం, ప్రజలను తప్పుదోవపట్టించడం మానుకోవాలని ఆయన కోరారు. హెరాయిన్ స్మగ్లింగ్ వంటి జాతి వ్యతిరేక కార్యకలాపాల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని సీఎం వైఎస్ జగన్ తమకు స్పష్టమైన మార్గనిర్దేశం చేశారని డీజీపీ చెప్పారు. ఈ సమావేశంలో విజయవాడ పోలీస్ కమిషనర్ బి. శ్రీనివాసులుతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. బహిరంగ మద్య సేవనంపై కఠిన చర్యలు రాష్ట్రంలో బహిరంగ మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతం సవాంగ్ హెచ్చరించారు. మహిళల భద్రత, ఘర్షణల నివారణకు పోలీసు యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో బహిరంగ మద్య సేవనంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వలంరెడ్డి లక్ష్మణరెడ్డి డీజీపీకి గురువారం వినతిపత్రం సమర్పించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఉద్యోగ నియామవళిలో బహిరంగ మద్యసేవనం నిరోధాన్ని కూడా చేర్చాలని కోరారు. దీనిపై సవాంగ్ స్పందిస్తూ.. బహిరంగ మద్య సేవనాన్ని అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. రాష్ట్రంలో నాటుసారా, అక్రమ మద్యం అరికట్టేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను పటిష్టపరిచామన్నారు. -
గుజరాత్ డ్రగ్స్తో ఏపీకి సంబంధం లేదు: డీజీపీ సవాంగ్
సాక్షి, అమరావతి: విజయవాడ కేంద్రంగా ఎటువంటి డ్రగ్స్ సరఫరా జరగలేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని ముంద్రా పోర్టులో దొరికిన హెరాయిన్పై కొన్ని తప్పుడు వార్తలు ప్రచారమవుతున్నాయని, డ్రగ్స్తో ఏపీ రాష్ట్రానికి సంబంధం లేదని వెల్లడించారు. విజయవాడలో జీఎస్టీ అడ్రస్ మాత్రమే ఉందని, హెరాయిన్ను విజయవాడకు గానీ, ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రదేశాలకు కానీ దిగుమతి చేసుకున్నట్లు ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. ఆఫ్గనిస్తాన్ నుంచి ముంద్రా పోర్టుకు వేరే కన్సైన్మెంట్ ముసుగులో హెరాయిన్ దిగుమతి చేసుకొనే క్రమంలో పట్టుబడిందిగా మాత్రమే డీఆర్ఐ, కేంద్ర సంస్థల అధికారులు పేర్కొన్నట్లు తెలిపారు. చదవండి: అక్రమ మద్యం తయారీపై ఉక్కుపాదం: సీఎం జగన్ అయితే కొంతమంది రాజకీయ నాయకులు డ్రగ్స్ వ్యవహారంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ తరహా తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. అన్ని అంశాలపై డీఆర్ఐ, కేంద్ర సంస్థలు ముమ్మరంగా పరిశోధన చేస్తున్నాయని డ్రగ్స్ వ్యవహారంలో డీఆర్ఐకి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం దీనిపై తగిన ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. కాబట్టి, ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రకటనలు చేయడం, ప్రజల మనసుల్లో భయాందోళనలు రేకెత్తించడం, ప్రజలను తప్పు దోవ పట్టించడం మానుకోవాలని హితవు పలికారు. చదవండి: ‘తల్లిదండ్రులను వేధించి ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు’ ‘సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి, నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ప్రజాప్రతినిధుల మీద ఉందన్న విషయాన్ని మరిచిపోవడం బాధాకరం. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ముంద్రా పోర్ట్ లో డీఆర్ఐ అధికారులు హెరాయిన్ స్వాధీనం చేసుకున్న విషయం అందరికీ విదితమే. ఈ అంశంపై విజయవాడ కమిషనర్ ఇప్పటికే ప్రెస్ నోట్ విడుదల చేసి ఆ అంశానికీ, విజయవాడకు లింక్ చేయడం సమంజసం కాదని చెప్పారు. అయినా రాజకీయ నాయకులు ఈ అంశాన్ని మరీమరీ ప్రస్తావించడం సరికాదు. నేరం ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్లో లేవన్న విషయం అటు డీఆర్ఐ, కేంద్ర సంస్థలు, ఇటు పత్రికలు ధృవీకరిస్తున్నా, సీనియర్ నాయకులు అపోహలు సృష్టించడం భావ్యం కాదు. ఆషి ట్రేడింగ్ కంపెనీ చిరునామా మాత్రమే విజయవాడగా ఉంది. వారి కార్యకలాపాలు ఇసుమంతైనా ఏపీలో లేవు’ అని డీజీపీ సవాంగ్ తెలిపారు. చదవండి: ‘అమెరికన్ కార్నర్’ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం జగన్ -
దిశ బిల్లు ఆమోదం కోసం.. కేంద్రాన్ని కోరతాం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ బిల్లు మహిళా భద్రత దిశగా అతిపెద్ద ముందడుగని ‘మహిళా సాధికారికతపై పార్లమెంటరీ కమిటీ’ ప్రశంసించిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. దిశ బిల్లును ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని కూడా కమిటీ తెలిపిందన్నారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ డాక్టర్ హీనా విజయ్కుమార్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ శనివారం విశాఖపట్నంలో పర్యటించి పోలీసు శాఖలో మహిళా అధికారులు, ఉద్యోగులతో సమావేశమవడంతోపాటు దిశ పోలీస్ స్టేషన్ను సందర్శించిందని తెలిపారు. మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ వ్యవస్థను తీసుకురావడం విప్లవాత్మక సంస్కరణగా పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడిందని చెప్పారు. దిశ పోలీస్ స్టేషన్కు అనుసంధానంగా క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ వాహనం ఏర్పాటు చేయడం ఎంతో ఉపయుక్తమైన అంశమని వైద్యురాలితోపాటు న్యాయవాది కూడా అయిన ఆమె ప్రశంసించారని తెలిపారు. దోషులను గుర్తించి 21 రోజుల్లో శిక్ష విధించాలనే నిబంధనలను దిశ బిల్లులో పొందుపరచడంతోపాటు అందుకు అవసరమైన దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ ల్యాబొరేటరీల ఏర్పాటు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం, ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు ప్రతిపాదించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శమని చెప్పారని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో దిశ వ్యవస్థను తన స్వరాష్ట్రమైన మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, పోలీసు అధికారులు పరిశీలించి వెళ్లారని తెలుసుకుని ఆమె సంతోషం వ్యక్తం చేశారన్నారు. ఏపీ ప్రభుత్వం ఆమోదించిన దిశ బిల్లు వెంటనే చట్టంగా మారేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని, అందుకోసం కేంద్ర హోం, న్యాయ, మహిళా–శిశు సంక్షేమ మంత్రిత్వశాఖలతో చర్చిస్తామని చెప్పారని తెలిపారు. దిశ బిల్లు, అందులో నిబంధనలు, అంద్జుకు ఏర్పాటు చేసిన మౌలిక వసతుల వ్యవస్థపై పార్లమెంటరీ కమిటీ ప్రశంసలు కురిపించడం మహిళా భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని డీజీపీ పేర్కొన్నారు. -
రమ్య హత్య కేసు: ఏపీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు..
గుంటురు: ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య ఘటన దురదృష్టకరమని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... హత్య కేసులో పోలీసులు వెంటనే స్పందించారని తెలిపారు. నిందితుడు శశికృష్ణను అరెస్టు చేసే సమయంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఏపీ పోలీసులు స్పందించిన తీరుపై ఎస్సీ కమిషన్ సైతం ప్రశంసించిందని అన్నారు. కాగా, వార్తలు ప్రచురించే విషయంలో తొందరపాటు వద్దని పేర్కొన్నారు. చదవండి: గుంటూరులో పట్టపగలు దారుణం.. ఇంజనీరింగ్ విద్యార్థిని హత్య చదవండి: మీడియా ముందుకు బీటెక్ విద్యార్థిని హత్యకేసు నిందితుడు -
నగదు లావాదేవీలపై నిరంతర నిఘా
కైకలూరు : ఇకపై ప్రధాన నగదు లావాదేవీలపై నిరంతర నిఘా కొనసాగిస్తామని కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మండవల్లి సబ్ రిజిస్ట్రార్ నకిలీ చలానా కేసులో ప్రధాన నిందితుడు రామ్థీరజ్ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్టు తెలిపారు. కైకలూరు సర్కిల్ కార్యాలయం వద్ద స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ రవీంద్రనాథ్, గుడివాడ డీఎస్పీ సత్యానందంతో కలసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముందుగా మోసపోయిన బాధితులు ప్రసాద్, వీరసత్యబాబులు తాము ఏ విధంగా నష్టపోయారో వివరించారు. ఎస్పీ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్లు.. నకిలీ చలానా కేసుపై సమీక్ష చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారని, దీంతో గుడివాడ డీఎస్పీ సత్యానందంను ప్రత్యేకాధికారిగా నియమించి విచారణ జరిపించినట్టు తెలిపారు. తండ్రీకొడుకులది ప్రధాన పాత్ర.. మండవల్లికి చెందిన స్టాంప్ వెండర్ మేడేపల్లి రామ్థీరజ్, అతని తండ్రి డాక్యుమెంట్ రైటర్ బాలాజీ కలిసి.. 568 రిజిస్ట్రేషన్ల నిమిత్తం 640 చలానాలలో రూ.2,68,04,943 ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా, చలానాలను మార్ఫింగ్ చేసి కేవలం రూ.15,92,158 మాత్రమే చెల్లించినట్టు తెలిపారు. అదే విధంగా నాన్–జ్యుడిషియల్ స్టాంపుల కొనుగోలు నిమిత్తం ఏడు చలానాల ద్వారా రూ.1,55,800 చెల్లించాల్సి ఉండగా.. కేవలం రూ.1,981 మాత్రమే చెల్లించి, ప్రభుత్వానికి రూ.1,53,819 జమ చేయలేదన్నారు. ఈ నెల 19న సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదుతో మండవల్లిలో కేసు నమోదు చేసి, బాధితులతో 21న డీఎస్పీ సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. కేసును ఛేదించిన గుడివాడ డీఎస్పీ, కైకలూరు సీఐ వైవీవీఎల్ నాయుడు, మండవల్లి ఎస్ఐ రామకృష్ణను అభినందించారు. అలాగే మండవల్లి నకిలీ చలానా కేసులో పోలీసుల పనితీరు అభినందనీయమని స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ డీఐజీ రవీంద్రనాథ్ ప్రశంసించారు. -
అనాథ బాలల సంరక్షణ సమాజ బాధ్యత
సాక్షి, అమరావతి: అనాథ బాలల సంరక్షణ సమాజంలో అందరి బాధ్యతని డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు. రక్షా బంధన్ పండుగ సందర్భంగా పలు అనాథ శరణాలయాలకు చెందిన బాలికలు ఆయనకు సోమవారం రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ గౌతం సవాంగ్ మాట్లాడుతూ బాలికలు బాగా చదువుకుని ఉన్నతస్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి కంటి గాయాన్ని గమనించిన ఆయన ఏమైందని వాకబు చేశారు. గతంలో విజయవాడలో ఓ ఇంట్లో పనిచేస్తుండగా యజమానురాలు కొట్టడంతో కంట్లో గాయమైందని ఆ బాలిక తెలిపింది. అప్పట్లో 1098కు సమాచారం ఇవ్వడంతో పోలీసు అధికారులు ఆ బాలికను రక్షించి జిల్లా పునరావాస కేంద్రంలో చేర్పించారని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు డీజీపీకి తెలిపారు. రమ్య కుటుంబాన్ని వేధిస్తున్నవారిపై కఠిన చర్యలు గుంటూరులో హత్యకు గురైన రమ్య కుటుంబ సభ్యులను మానసికంగా వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు. రమ్య కుటుంబ సభ్యులు డీజీపీ గౌతం సవాంగ్ను మంగళగిరిలోని ఆయన కార్యాలయంలో సోమవారం కలిశారు. పోలీసులు తక్షణం స్పందించి నిందితుడిని అరెస్టు చేసి తమకు న్యాయం చేశారని కృతజ్ఞతలు తెలిపారు. కాగా తాము డబ్బుకు అమ్ముడుపోయామని కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తుండడం తమకు తీవ్ర మానసిక వ్యథ కలిగిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై డీజీపీ స్పందిస్తూ రమ్య కుటుంబ సభ్యులను మానసికంగా వేధిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
డీజీపీని కలిసిన రమ్య కుటుంబ సభ్యులు
సాక్షి, మంగళగిరి: గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసును త్వరితగతిన ఛేదించిన ఆంధ్రప్రదేశ్ పోలీసులకు రమ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ను కలిసిన రమ్య కుటుంబ సభ్యులు.. ఘటనకు ముందు, అనంతరం జరిగిన పరిణామాలను వివరించారు. ఓ హత్య కేసులో పోలీసులు ఇంత వేగంగా స్పందించడం గతంలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. ఘటన అనంతరం తమ కుటుంబంపై కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ మానసికంగా వేదిస్తున్నారని ఫిర్యాదు చేశారు. డబ్బులకు అమ్ముడుపోయామంటు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారని, ఆ కారణంగా ఇంట్లో భోజనం కూడా చేయలేక పోతున్నామని వాపోయారు. అటువంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం డీజీపీ స్పందిస్తూ.. కేసు దర్యాప్తులో చురుకుగా వ్యవహరించిన గుంటూరు అర్బన్ ఎస్పీ, సిబ్బందిని అభినందించారు. రమ్య కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని.. వారికి రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. రమ్య కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
డీజీపీ గౌతమ్ సవాంగ్ను కలిసిన పీవీ సింధు
విజయవాడ: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ను పీవీ సింధు కలిశారు. ఈ సందర్భంగా పీవీ సింధును డీజీపీ గౌతమ్ సవాంగ్ సత్కరించారు. పీవీ సింధు విజయాలు మహిళలకు, యువతకు ప్రేరణ అని ఆయన కొనియాడారు. కాగా టోక్యో ఒలింపిక్స్లో మంచి ప్రదర్శన కనబరిచిన పీవీ సింధు, రజనీ, సాయిరాజ్లు శుక్రవారం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బిశ్వభూషణ్ సింధు, రజనీ, సాయిరాజ్లను ఘనంగా సన్మానించారు. ఇక టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధు ఒలింపిక్స్లో వరుసగా రెండు పతకాలు సాధించిన మహిళగా రికార్డు సాధించింది. ఇక భారత మహిళల హాకీ జట్టులో రజనీ గోల్ కీపర్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్లో మహిళల జట్టు మంచి ప్రదర్శన కనబరిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు 41 ఏళ్ల తర్వాత సెమీస్లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది. -
మానవ అక్రమ రవాణాపై కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: మానవ అక్రమ రవాణా నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, బాధితులను తక్షణమే ఆదుకునేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. మానవ అక్రమ రవాణా నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ పోలీస్, ఏపీ సీఐడీ ఆధ్వర్యంలో శుక్రవారం వర్చువల్ సమావేశం జరిగింది. ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించిన డీజీపీ ప్రారంభోపన్యాసం చేశారు. మానవ అక్రమ రవాణా నివారణ చర్యల్లో భాగంగా బాధితుల గుర్తింపు, వారు తక్షణ న్యాయం, సహాయం పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో నంబర్ 47ను తెచ్చిందని డీజీపీ తెలిపారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్టీయూ) లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఏపీ సీఐడీ ఏడీజీ పీవీ సునీల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ వర్చువల్ సమావేశంలో రాష్ట్ర శాంతి భద్రతల అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, దిశ ప్రత్యేక అధికారి బి.రాజకుమారి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డాక్టర్ పీఎం నాయర్, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫ్ ఇండియా ఫౌండర్ చైర్మన్ డాక్టర్ రమేష్ కన్నెగంటి, హెల్ప్ సంస్థ ఆర్గనైజేషన్ కన్వీనర్ ఎన్వీఎస్ రామ్మోహన్, బచపన్ బచావో ఆందోళన్ ప్రతినిధి తిరుపతి, రెడ్ రోప్ తదితర స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు పాల్గొని మాట్లాడుతూ.. అక్రమ రవాణాను అరికట్టడంతోపాటు దాని బారి నుంచి బయట పడిన బాధితులకు తక్షణ న్యాయం అందించడంపై మరింత దృష్టి పెట్టాలన్నారు. పలువురు డీఐజీలు, జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లు, పలు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొని మాట్లాడారు. -
ప్రతి జిల్లాలో ‘దిశ’ ప్రత్యేక కోర్టులు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో దిశ ప్రత్యేక కోర్డులను ప్రభుత్వం ఏర్పాటుచేయనుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్లో విశాఖ రేంజ్ పరిధిలోని మూడు జిల్లాలకు సంబంధించిన సచివాలయ మహిళా పోలీసులు, మహిళా మిత్రలకు దిశ యాప్పై శనివారం అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దిశ యాప్, సైబర్మిత్ర వాట్సప్, ఏపీ పోలీస్ సేవా యాప్ అందించే సేవలను నగర పోలీస్ కమిషనర్ మనీష్కుమార్ సిన్హా, టెక్నికల్ డీఐజీ పాలరాజు, దిశ డీఐజీ రాజకుమారిలు వివరించారు. అనంతరం డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీసులకు అదనపు బలంగా 15వేల మంది సచివాలయ మహిళా పోలీసులు మహిళల భద్రతకు సేవలందిస్తున్నారన్నారు. పోలీస్స్టేషన్ల్లో ఉండే మహిళా పోలీసులకు ఏవైతే అధికారాలు ఉంటాయో అవన్నీ సచివాలయ మహిళా పోలీసులకు ఉంటాయన్నారు. అవగాహన కార్యక్రమాలు ప్రతి డివిజన్, మండల, గ్రామాల స్థాయిలో దీనిని నిర్వహిస్తామన్నారు. ‘స్పందన’తో సామాన్య ప్రజలకు న్యాయం గతంలో పోలీస్స్టేషన్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంవల్ల అక్కడకు వెళ్లేందుకు ప్రజలు వెనుకడుగు వేసేవారని డీజీపీ అన్నారు. కానీ, వీటన్నింటికీ చెక్ చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘స్పందన’తో సామాన్య ప్రజలు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని వివరించారు. ప్రస్తుతం ఎఫ్ఐఆర్ నమోదైన 59 రోజుల్లో ఆ కేసు చార్జిషీట్ ఫైల్ చేయకపోతే.. తక్షణమే ఎస్పీకి మెసేజ్ వెళ్తుందన్నారు. కాగా, స్పందన కార్యక్రమం తీసుకొచ్చిన 20 నెలల కాలంలో 31,100 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు గౌతమ్ సవాంగ్ చెప్పారు. మరోవైపు.. ఏఓబీలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని డీజీపీ తెలిపారు. ఏజెన్సీలో గంజాయి సాగుకు మావోయిస్టులు సహకరిస్తున్నారని.. అలాగే, లేటరైట్ సమస్య ఇప్పటిది కాదని, దీనిని కావాలని కొందరు రాజకీయం చేస్తున్నారని డీజీపీ చెప్పారు. -
ఆంధ్రప్రదేశ్లో ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు
సాక్షి, అమరావతి: పోలీసు శాఖలో రానున్న మూడేళ్లలో పెద్ద ఎత్తున నియామకాలు చేపడతామని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. వచ్చే ఏడాది జాబ్ క్యాలెండర్ నుంచి ఏడాదికి 6,500 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. కొత్త నియామకాలపై యువత అపోహలు, సందేహాలు పెట్టుకోవద్దని సూచించారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహిళల భద్రత కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించిన దాదాపు 15 వేల మంది మహిళా సురక్షా కార్యదర్శులకు మహిళా పోలీసుల హోదా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వారికి కానిస్టేబుల్ తరహా విడతల వారీగా క్యాప్సుల్ శిక్షణ ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర పోలీసు శిక్షణ కేంద్రంలో ఒకసారి 6,500 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉందని డీజీపీ గుర్తు చేశారు. కాబట్టి 15 వేల మంది మహిళా పోలీసులకు క్యాప్సుల్ శిక్షణ ముగిసిన తరువాత ఇతర రెగ్యులర్ పోలీసు నియామక ప్రక్రియపై దృష్టి సారిస్తామన్నారు. 2019–20లో ఇప్పటికే 3,057 కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేసి శిక్షణ ఇచ్చి విధుల్లో చేర్చుకున్నామన్నారు. ఇంకా 11,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. కొందరు నిరుద్యోగుల్లో అపోహలు సృష్టించేలా అవాస్తవాలను ప్రచారం చేయడం తగదని చెప్పారు. ఈ ప్రభుత్వం గడచిన రెండేళ్లలో మొత్తం 6,05,949 పోస్టులు భర్తీ చేసిన విషయాన్ని డీజీపీ గుర్తు చేశారు. వాటిలో 1,84,264 రెగ్యులర్ ఉద్యోగాలు, కాంట్రాక్టు పద్ధతి ద్వారా 19,701 ఉద్యోగాలు, ఔట్ సౌర్సింగ్ ద్వారా 3,99,791 ఉద్యోగాలు, డీఎస్సీ ద్వారా 2,193 ఉద్యోగాలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 34,563 ఖాళీలు మాత్రమే భర్తీ చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన చెప్పారు. -
మహిళా భద్రతపై ‘దిశా’ నిర్దేశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళా భద్రత కోసం విప్లవాత్మక రీతిలో వ్యవస్థాగత సంస్కరణలు తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ అంశంపై పూర్తి అవగాహన కల్పించడం ద్వారా తాము సురక్షితమైన భద్రత వ్యవస్థలో ఉన్నామని మహిళలకు భరోసా కల్పించేందుకు ఉపక్రమించింది. అందుకోసం ‘దిశ’ మొబైల్ యాప్పై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు కార్యాచరణను విస్తృతం చేసింది. విపత్కర పరిస్థితులు ఎదురైతే తక్షణం పోలీసు సహాయం పొందేందుకుగాను విద్యార్థినులు, యువతులు, మహిళలు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకునేలా అవగాహన కార్యక్రమాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిస్తున్నారు. దిశ యాప్పై ప్రజల్లో స్వయంగా అవగాహన కల్పించాలని ఆయన నిర్ణయించారు. కృష్ణాజిల్లా గొల్లపూడిలో మంగళవారం నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి కూడా ఆయన మార్గనిర్దేశం చేయనున్నారు. యాప్ను డౌన్లోడ్ చేయించనున్న సీఎం గొల్లపూడిలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్న ‘దిశ’ యాప్ అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటారు. గొల్లపూడిలోని ఒకటో నంబర్ రోడ్డులో ఉన్న పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందుకోసం పెద్ద తెర, ప్రొజెక్టర్ మొదలైనవి ఏర్పాటు చేస్తున్నారు. దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరాన్ని, ఆపదలో ఉపయోగించాల్సిన విధానాన్ని విద్యార్థినులు, యువతులు, మహిళలకు ముఖ్యమంత్రి వివరిస్తారు. కొందరు మహిళల మొబైల్ ఫోన్లలో ఆయనే స్వయంగా ఆ యాప్ను డౌన్లోడ్ చేయిస్తారు. దశ ‘దిశ’లా మహిళా భద్రత మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకంగా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలను కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివరిస్తారు. దిశ చట్టం తేవడంతోపాటు దాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం పటిష్టమైన వ్యవస్థను రూపొందించింది. మహిళలపై వేధింపులకు పాల్పడితే దోషులను సత్వరం శిక్షించేందుకు క్రిమినల్ జస్టిస్ విధానంలో సంస్కరణలు తీసుకొచ్చింది. దిశ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేసింది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిల్లో ఫోరెన్సిక్ ల్యాబ్లు ఏర్పాటు చేసింది. ఇక ఆపదలో చిక్కుకుంటే తక్షణం పోలీసు సహాయం పొందేందుకు దిశ యాప్ను రూపొందించింది. ఇవన్నీ వివరించడం ద్వారా మహిళలు తాము రాష్ట్రంలో సురక్షితమైన వ్యవస్థలో ఉన్నామనే భరోసాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 16 లక్షలమందికిపైగా దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. గొల్లపూడిలో నిర్వహించే అవగాహన సదస్సుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, పెద్ద స్క్రీన్ మీద యాప్ పనితీరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా వివరిస్తారని సీఎం కార్యక్రమాల కన్వీనర్ తలశిల రఘురాం ‘సాక్షి’కి తెలిపారు. దేశానికే దిశా నిర్దేశం మహిళా భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థాగత సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. దిశ చట్టం తేవడంతోపాటు ఆ చట్టం సమర్థ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం తగిన మౌలిక వ్యవస్థను ఏర్పాటుచేసి ఓ రక్షా కవచాన్ని రూపొందించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా దిశా యాప్ అవగాహన సదస్సులో పాల్గొననుండటం పోలీసు వ్యవస్థకు, ప్రజలకు గొప్ప స్ఫూర్తినిస్తుంది. – గౌతం సవాంగ్, డీజీపీ -
దిశ యాప్పై అవగాహనకు ప్రత్యేక డ్రైవ్
సాక్షి, అమరావతి/ఒంగోలు: రాష్ట్రంలో మహిళా భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్ రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్రంలో విద్యార్థినులు, యువతులు, మహిళలు అందరూ ‘దిశ’ యాప్ను డౌన్లోడ్ చేసుకుని, వినియోగించుకునేలా ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని, ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో డీజీపీ గౌతం సవాంగ్ జిల్లాల ఎస్పీలు, డీఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, సబ్ డివిజన్ అధికారులు, సీఐలు, ఎస్సైలు, దిశ పోలీస్ స్టేషన్ల అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మహిళా పోలీసులు, మహిళా పోలీసు అధికారులు దిశ యాప్పై మహిళలకు అవగాహన కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులకు, గ్రామ/వార్డు వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. శిక్షణ తర్వాత వీరంతా తమ పరిధిలోని ఇంటింటికీ వెళ్లి వారి ఫోన్లలో దిశ యాప్ను డౌన్లోడ్ చేయడంతోపాటు అత్యవసర సమయాల్లో యాప్ను వినియోగించడంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. దీంతోపాటు పాఠశాలలు, కళాశాలల్లో సదస్సులు నిర్వహించి దిశ యాప్పై అవగాహన కల్పించాలని చెప్పారు. మహిళలపై వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు వస్తే తక్షణం స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నిర్ణీత గడువులోగా దోషులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్పందన, ఏపీ పోలీస్ సేవా యాప్, దిశ యాప్, సైబర్మిత్ర, వాట్సాప్ల ద్వారా వచ్చిన సమాచారం మేరకు కేసులు నమోదు చేయాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను డీజీపీ పునరుద్ఘాటించారు. తమ పరిధి కానప్పటికీ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీలు రవిశంకర్ అయ్యన్నార్, హరీష్కుమార్ గుప్తా, శంకర బత్ర బాగ్చి, ఐజీ నాగేంద్రకుమార్, దిశ ప్రత్యేక అధికారి దీపికా పాటిల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకాశం ఎస్పీ ‘మ్యాపింగ్’ ఐడియా అమలు డీజీపీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మాట్లాడుతూ.. ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో గల అనుమానాస్పద శివారు ప్రాంతాలను, గతంలో అవాంఛనీయ ఘటనలు జరిగిన ప్రదేశాలను, నేరాలు జరగడానికి ఆస్కారం ఉండే ప్రదేశాలను గుర్తించి, మ్యాపింగ్ చేయడం ద్వారా ఆయా ప్రదేశాల్లో ప్రత్యేక బీట్లు ఏర్పాటు చేసి, నిరంతరం నిఘా ఉంచాలన్నారు. తద్వారా నేరాలను మరింత సమర్థవంతంగా అరికట్టేందుకు అవకాశం కలుగుతుందని వివరించారు. ఈ ‘మ్యాపింగ్’ ఐడియా పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన డీజీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసు యూనిట్లలోనూ దీనిని అమలు చేయాలని ఆదేశించారు. చదవండి: వైద్య విద్యార్థులకు మరో శుభవార్త.. ఏపీ: ఉత్తర, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు -
ప్రేమికులపై దాడి ఘటన హేయం: గౌతం సవాంగ్
సాక్షి, అమరావతి: తాడేపల్లి పరిధిలోని సీతానగరంలో జరిగిన ప్రేమికులపై దాడి ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఈ దాడి అత్యంత హేయం, బాధాకరం అన్నారు. బాధ్యులైన నిందితులను పట్టుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ఇప్పటికే కృష్ణ, గుంటూరు జిల్లా ఎస్పీలు, విజయవాడ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇటువంటి అమానవీయ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. నేరానికి పాల్పడిన నిందితులు ఎంతటివారైనా ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలిపారు గౌతమ్ సవాంగ్. మహిళల భద్రత మా ప్రథమ కర్తవ్యం. ఎన్నో చర్యలు చేపట్టినా, ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరం అన్నారు. ప్రతి మహిళ దిశ యాప్ను ఖచ్చితంగా వాడాలని గౌతమ్ సవాంగ్ సూచించారు. -
181 మంది ఎస్ఐలకు సీఐలుగా పదోన్నతి
సాక్షి, అమరావతి: పదోన్నతుల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఎస్ఐల కుటుంబాల్లో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. ఏకంగా రాష్ట్రంలోని 181 మంది ఎస్ఐలకు సీఐలుగా ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ శుక్రవారం రేంజ్ల వారీగా పదోన్నతుల జాబితాలను ఆయా రేంజ్ పోలీస్ అధికారులకు పంపించారు. 2009 ఎస్ఐ బ్యాచ్కు చెందిన 181 మందికి సీఐలుగా పదోన్నతులు కల్పించారు. వారిలో విశాఖపట్నం రేంజ్ పరిధిలో 31 మంది, ఏలూరు రేంజ్ పరిధిలో 58 మంది, గుంటూరు రేంజ్లో 33 మంది, అనంతపురం, కర్నూలు రేంజ్లో 59 మంది ఉన్నారు. పోలీస్ శాఖలో దాదాపు 37 ఏళ్లకు పైగా సేవలు అందిస్తున్న అనేక మంది ఈ నెలాఖరున రిటైర్ అవుతున్నవారు ఉన్నారు. వారంతా పదోన్నతులు లేక ఎస్ఐలుగానే రిటైర్ అయిపోతామా? అని ఆవేదన చెందుతున్న తరుణంలో సీఐలుగా ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. దీంతో ఈ నెలాఖరున రిటైర్ అవుతున్న పలువురు త్రీస్టార్ (సీఐ) అన్పించుకుని రిటైర్ అవుతామంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ సార్కు రుణపడి ఉంటాను కానిస్టేబుల్గా పోలీస్ శాఖలో విధులు చేపట్టిన నేను 38 ఏళ్లుగా పోలీస్ శాఖలో అనేక బాధ్యతలు నిర్వహించాను. 2009లో ఎస్ఐగా పదోన్నతి పొందాను. 1998లో విజయనగరం జిల్లా కొమరాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొప్పడంగి, ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గొట్లబద్ర గ్రామాల్లో జరిగిన రెండు ఎన్కౌంటర్లకు ముందు కీలకమైన మావోయిస్టుల సమాచారం అందించినందుకు నాకు నగదు అవార్డులు దక్కాయి. ఇలా అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించిన నేను ఎస్ఐగానే ఈ నెలాఖరున రిటైర్ అయిపోతానా? అని బాధపడుతున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్, డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ పెద్ద మనసుతో సీఐగా పదోన్నతి ఇవ్వడం సంతోషకరం. వారికి రుణపడి ఉంటాను. – బొద్దాని రమణయ్య, విజయనగరం స్పెషల్ బ్రాంచ్ ప్రభుత్వ మేలు మరువలేను కానిస్టేబుల్గా 1984లో బాధ్యతలు చేపట్టిన నేను 2009లో ఎస్ఐగా పదోన్నతి పొందాను. నాలుగేళ్లుగా సీఐ పదోన్నతి కోసం ఎదురు చూస్తున్నాను. 2001 జూన్ 21న ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్పై దాదాపు వంద మంది మావోయిస్టులు దాడి చేస్తే స్టేషన్ ఇన్చార్జి (హెడ్ కానిస్టేబుల్)గా ఉన్న నేను కేవలం ఇద్దరు ఏపీఎస్పీ బెటాలియన్కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్ల సాయంతో తిప్పి కొట్టాను. అప్పటి డీజీపీ హెచ్జే దొర నగదు రివార్డు కూడా ఇచ్చారు. 2003లో మహారాష్ట్రకు చెందిన అతి క్రూరమైన భావారియా గ్యాంగ్ పందిళ్లపల్లిలో ఎదురుపడితే ఫైరింగ్ ఓపెన్ చేసి ఎదుర్కొన్నాను. విధి నిర్వహణలో 37 ఏళ్లపాటు ధైర్యంగా ఇన్ని సేవలు చేసిన నేను ఈ నెల 31న ఎస్ఐగానే పదవీ విరమణ చేయాల్సి వస్తుందని బాధపడ్డాను. కానీ, నాకు ఈ సమయంలో పదోన్నతి కల్పించిన ప్రభుత్వం మేలు జీవితాంతం మరువలేను. సీఎం వైఎస్ జగన్, డీజీపీ సవాంగ్లకు నా కృతజ్ఞతలు. – పులి భావన్నారాయణ, ప్రకాశం జిల్లా -
వేగంగా ఆక్సిజన్ చేరుస్తున్నాం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకనుగుణంగా రాష్ట్రంలో అన్ని ఆస్పత్రులకు ఆక్సిజన్ను వేగంగా, సురక్షితంగా అందించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. వేరే రాష్ట్రాలు, మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆక్సిజన్ను తరలించేటప్పుడు జాప్యం జరగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా గ్రీన్ చానల్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆక్సిజన్ సరఫరా చేసే 11 ప్లాంట్లను మ్యాపింగ్ చేసి అక్కడ నుంచి ఎటువంటి అవరోధాలు లేకుండా రవాణా జరిగేలా చర్యలు చేపట్టామన్నారు. ఇందుకు సంబంధించి ఒడిశా, తమిళనాడు, కర్ణాటక డీజీపీలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామని తెలిపారు. ఆయా రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లు ప్రయాణించే మార్గాల్లో ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా పోలీస్ ఎస్కార్ట్ వాహనాలను పంపుతున్నామన్నారు. ఆక్సిజన్ ట్యాంకర్లకు జీపీఎస్ అమర్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పొరుగు రాష్ట్రాల పోలీసులు తమ రాష్ట్ర సరిహద్దుల వరకు ఎస్కార్ట్గా వచ్చి ఆక్సిజన్ ట్యాంకర్లను అప్పగిస్తున్నారని తెలిపారు. ఆక్సిజన్ రవాణాను స్టేట్ ఆక్సిజన్ వార్ రూమ్ నుంచి ముగ్గురు ఐపీఎస్ అధికారులు, ఆయా జిల్లాల పోలీస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారన్నారు. ఆక్సిజన్ సిలిండర్లు అందించిన ఎమ్మెల్యే వంశీ కరోనా సెకండ్ వేవ్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఆపద కాలంలో అందుబాటులో ఉండేలా కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయానికి సోమవారం వెళ్లిన వంశీ, పలు సంస్థలకు చెందిన దాతలు డీజీపీ సవాంగ్కి 25 ఆక్సిజన్ సిలిండర్లు, 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 25 వేల ఎన్95 మాస్క్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాడ్యులర్ ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ రమేశ్ జైన్, ఆర్ఆర్హెడ్ సీఈవో పులిపాటి కెన్నడి పాల్గొన్నారు. -
ఏపీ: పోలీస్ శాఖలో గర్భిణులకు ‘వర్క్ ఫ్రం హోమ్’
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖలో గర్భిణులు ఇంటి నుంచే పనిచేసేలా (వర్క్ ఫ్రం హోమ్) వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్సవాంగ్ శనివారం రాష్ట్రంలోని అన్ని పోలీస్ యూనిట్లకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని 18 పోలీస్ యూనిట్ల పరిధిలో పనిచేస్తున్న మహిళా పోలీస్ సిబ్బంది, వారిలో గర్భిణుల వివరాలను రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయానికి వెంటనే పంపాలని ఆయన ఆదేశించారు. గర్భిణులు ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహించేలా తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. వారి ఆరోగ్యం, వారికి అందుతున్న వైద్య సేవలపై పోలీస్ హెల్ప్డెస్క్నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన సహకారం అందించాలని ఆదేశించారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని గర్భిణులు, మహిళల పట్ల కోవిడ్ సమయంలో శ్రద్ధ వహించాలని డీజీపీ స్పష్టం చేశారు. చదవండి: కానిస్టేబుల్ ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే దుద్దుకుంట కుట్రలు బయటపడతాయని బాబు గగ్గోలు -
ఏపీ: కర్ఫ్యూ సమయంలో ఈ పాస్ తప్పనిసరి
సాక్షి, అమరావతి: కర్ఫ్యూ సమయంలో అంతర్రాష్ట్ర ప్రయాణాలు చేసేవారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని, అందుకు అవసరమైన ఈ పాస్కు దరఖాస్తు చేసుకోవాలని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఈ పాస్కు దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన వివరాలను ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సిటిజన్ సర్వీసు పోర్టర్లో appolice.gov.in, twitter@appolice100, facebook@andhrapradeshstatepolice ద్వారా ఈ పాస్ పొందవచ్చని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తగిన ధ్రువపత్రాలను జతచేసి దరఖాస్తు చేసుకునేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. శుభకార్యాలు, అంత్యక్రియలకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సంబంధిత స్థానిక అధికారుల వద్ద నుంచి సరైన గుర్తింపుపత్రాలతో అనుమతులు పొందాలని సూచించారు. అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ పోలీస్శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చదవండి: అత్యవసరమైతేనే బ్యాంకులకు రండి Ongole: కోవిడ్ కేర్ సెంటర్.. మెనూ అదుర్స్ -
ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఈ–పాస్ అమలు
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా అంతర్రాష్ట్ర కదలికలపై పోలీస్ ఆంక్షలు కొనసాగుతున్నాయని, అత్యవసర ప్రయాణికులకు సోమవారం నుంచి ఈ–పాస్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ చెప్పారు. విజయవాడలో కర్ఫ్యూ అమలు తీరును ఆయన ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద డీజీపీ మీడియాతో మాట్లాడారు. అన్ని జిల్లాల్లో కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయాల్సిందిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే దుకాణాలకు అనుమతివ్వాలని, 12 గంటల తర్వాత కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేయాలని సీఎం సూచించారన్నారు. ప్రతి జిల్లా నుంచి మధ్యాహ్నం 1 గంటకు, సాయంత్రం 5 గంటలకు కర్ఫ్యూపై నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారన్నారు. అంతర్రాష్ట్ర రాకపోకలపై రాష్ట్ర ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకొనేంత వరకు ఆంక్షలు కొనసాగుతాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తే వారి కోసం సోమవారం నుంచి ఈ–పాస్ విధానాన్ని సీఎం ఆదేశాలతో అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ప్రస్తుత కరోనా సమయంలో బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే నేరుగా ఏపీ పోలీస్ సేవ అప్లికేషన్ ద్వారా తమ సమస్యను ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. ముందస్తు అనుమతులు తప్పనిసరి శుభకార్యాలకు సంబంధించి స్థానిక అధికారుల వద్ద నిబంధనల మేరకు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలన్నారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను భయాందోళనలకు, ఆయోమయానికి గురిచేయడం సరికాదన్నారు. అటువంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని కోరారు. అత్యవసర సమయంలో బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రెండు మాస్్కలను ధరించాలని, శానిటైజర్ను ఉపయోగించాలన్నారు. కరోనా నిబంధనలను, కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించిన వారి సమాచారాన్ని డయల్ 100, 112కి సమాచారం అందించాలని డీజీపీ కోరారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు వారి వాహనాలను జప్తు చేస్తామన్నారు. ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఏపీ డీజీపీ
సాక్షి, విజయవాడ: కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. నగరంలో ఆయన ఆదివారం ఆకస్మికంగా పర్యటించారు. కర్ఫ్యూ అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, అందరూ రెండు మాస్క్లు ధరించాలని, శానిటైజర్ ఉపయోగించాలని సూచించారు. జాగ్రత్తలు పాటించడం ద్వారానే కరోనాను జయిస్తామని పేర్కొన్నారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించేవారి కోసం రేపటి నుంచి ఈ-పాస్ విధానం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమతి లేదని డీజీపీ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. కరోనా లక్షణాలను గుర్తించిన వారు, హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారు ప్రభుత్వం అందుబాటులో ఉంచిన 104, 108 సేవలను వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని డీజీపీ పేర్కొన్నారు. శుభ కార్యాలకు సంబంధించి ప్రభుత్వం పేర్కొన్న సంబంధిత స్థానిక అధికారుల వద్ద నిబంధనల మేరకు తప్పనిసరిగా అనుమతి పొందాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. చదవండి: మామిళ్లపల్లె పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి విచారణ ఆటో డ్రైవర్ పాడుపని.. యువతి కేకలు వేయడంతో.. -
96 శాతం పోలీసులకు వ్యాక్సినేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటివరకు 96 శాతం మంది పోలీసులకు మొదటి డోసు వ్యాక్సిన్, 76 శాతం మందికి రెండో డోస్ పూర్తయినట్టు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ తెలిపారు. మిగిలిన వారికి కూడా వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏపీ పోలీస్ శాఖ, అపోలో ఆస్పత్రి వైద్యుల సమన్వయంతో మంగళవారం వెబినార్ ద్వారా ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. కరోనాపై జరుగుతున్న యుద్ధంలో ఫ్రంట్లైన్ వారియర్స్ను రక్షించుకోవడం ద్వారా సమాజానికి భద్రత కలుగుతుందన్నారు. వైరస్ను జయించిన పోలీస్ సిబ్బంది ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. అపోలో ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ సాయిప్రవీణ్ మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను కాపాడడంలో ఏపీ పోలీస్ శాఖ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. రీసెర్చ్, అనుభవం పంచుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. క్రిటికల్ కేసులకు వైద్యం అందించడం, సూచనలు చేయడం వంటి సౌకర్యాలను పోలీస్ సిబ్బందికి అందిస్తామన్నారు. వైద్యులు సుబ్బారెడ్డి, మంజులరావు పోలీసులకు పలు సూచనలు చేశారు. శాంతి భద్రతల అడిషనల్ డీజీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్, డీఐజీ పాలరాజు, రిటైర్డ్ ఐపీఎస్, వెల్ఫేర్ ఓఎస్డీ రామకృష్ణ, పలువురు సీనియర్ ఐపీఎస్లు పాల్గొన్నారు. -
వారియర్స్కు అండగా..
సాక్షి, అమరావతి: ప్రాణాలను సైతం లెక్కచేయక కోవిడ్ కట్టడిలో ఫ్రంట్లైన్ వారియర్స్గా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు తక్షణ సాయం అందించేలా ప్రతి జిల్లాలో కోఆర్డినేషన్ సెల్లు ఏర్పాటు చేస్తున్నారు. సెకండ్ వేవ్లోనూ కోవిడ్ బారిన పడుతున్న పోలీసుల సంఖ్య పెరుగుతుండటంతో వారి కోసం డీజీపీ గౌతమ్ సవాంగ్ తక్షణ చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలు జిల్లాల్లో కోఆర్డినేషన్ సెల్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వైరస్ బారిన పడిన సిబ్బంది పరిస్థితి, ఆస్పత్రి బెడ్, వైద్య సేవలు, తదితర అన్ని విషయాలను జిల్లా కేంద్రాల నుంచి ఎస్పీలు పర్యవేక్షిస్తున్నారు. కోవిడ్ సోకిన పోలీసులతో మాట్లాడుతూ వారికి ధైర్యం చెబుతున్నారు. జిల్లాల నుంచి ఈ సమాచారాన్ని డీజీపీ కార్యాలయానికి చేరవేస్తున్నారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలోని హెల్ప్ డెస్క్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు. రెండో దశలో 2,150కి పైగా పోలీసులకు కోవిడ్ రాష్ట్రంలో తొలి దశలో దాదాపు 15 వేల మందికిపైగా పోలీసులు కోవిడ్ బారిన పడగా ఇందులో 109 మంది మరణించారు. తాజాగా రెండో దశలో 2,150 మందికిపైగా పోలీసులకు కోవిడ్ సోకింది. ఇందులో ఇప్పటివరకు సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ వింగ్ (ఎస్ఐడబ్ల్యూ) ఎస్పీ రాంప్రసాద్తో సహా 14 మంది మృతి చెందారు. దీంతో అప్రమత్తమైన పోలీసు శాఖ నష్టనివారణ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 18 పోలీస్ యూనిట్ల పరిధిలో ఇప్పటికే 94 శాతం తొలి దశ టీకా కార్యక్రమాన్ని పూర్తి చేసింది. త్వరలోనే రెండో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టనుంది. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న, 55 ఏళ్లు పైబడిన ఆరు వేల మందికిపైగా పోలీసులకు కోవిడ్ విధుల నుంచి మినహాయింపు ఇచ్చింది. వీరిని స్టేషన్ డ్యూటీలు, రోజువారీ విధులకు వాడుకుంటోంది. కాగా, కోవిడ్ డ్యూటీలను ఎస్పీ కార్యాలయాల నుంచి పర్యవేక్షిస్తున్నారు. కోవిడ్ విధుల్లో భాగంగా మాస్క్, శానిటైజేషన్పై ప్రజలకు అవగాహన కల్పించడం, రాత్రిపూట కర్ఫ్యూ నిర్వహించడంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ పోలీసుకు కోవిడ్ లక్షణాలు కనిపించినా తక్షణం జిల్లా ఎస్పీ, నగర పోలీస్ కమిషనర్ కార్యాలయాలకు సమాచారం అందిస్తున్నారు. -
డీజీపీ సవాంగ్ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు మారన్న
సాక్షి, విజయవాడ : ఆంధ్ర ఒరిస్సా స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు ముత్తన్నగిరి జలంధర రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. మావోయిస్టు జలంధర్ రెడ్డి అలియాస్ మారన్నపై 20 లక్షల రివార్డ్ ఉందని డీజీపీ తెలిపారు. పోలీస్ స్టేషన్లపై దాడులు చేసిన సంఘటనల్లో మారన్న పాత్ర ఉందన్నారు. ముత్తన్నగిరి జలంధర్ అలియాస్ మారన్న అలియాస్ కృష్ణ (40) కొంపల్లి, సిద్దిపేట జిల్లా, తెలంగాణకు చెందిన మావోయిస్టు అని, మెదక్ డిస్ట్రిక్ట్ కమిటీలో మొదట జాయిన్ అయ్యాడని వెల్లడించారు. ఏఓబీలో పలు దాడులు, 2008 బలివెల సంఘటనలో మారన్న సభ్యుడుగా ఉన్నాడని డీజీపీ సవాంగ్ తెలిపారు. సున్నిపెంట, ఎర్రగొండపాలెంలో జరిగిన బాంబు పేలుళ్ళలో, విన్నికృష్ణ, మల్ఖాన్గిరి కలెక్టర్ను కిడ్నాప్ చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. ఆరు హత్యలలో నిందితుడైన మారన్న.. ప్రజా బలం లేక తాను జనజీవనంలోకి రావాలని నిర్ణయించుకున్నాడని తెలిపారు. పార్టీ గతంలో లాగా లేకపోవడం, ఏజెన్సీ ప్రాంతాలలో పార్టీలో రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల కూడా మారాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఏఓబీలో ఎక్కువగా జరుగుతున్న పోలీస్ యాక్టివిటీస్తో రిక్రూట్మెంట్ లేదంటున్నాడని, ప్రభుత్వం ఇచ్చిన కొత్త లొంగుబాటు పాలసీకి ఆకర్షితుడై స్వయంగా లొంగిపోయాడని తెలిపారు. ఏపీ ప్రభుత్వం నుంచి అతను మారడానికి కావలసిన అన్ని సదుపాయాలు అందిస్తామని డీజీపీ హామీ ఇచ్చారు. -
డీజీపీ సవాంగ్ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు మారన్న
-
‘పెద్దకడుబూర్’కు జాతీయ అవార్డు
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా పెద్దకడుబూర్ పోలీస్ స్టేషన్కు జాతీయ అవార్డు లభించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ‘సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్సీ’ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డుకు సంబంధించిన రూ.25 వేల నగదు రివార్డును మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెలి్లకి డీజీపీ గౌతమ్ సవాంగ్ సోమవారం అందజేశారు. కేంద్ర హోంశాఖ ఇటీవల నిర్వహించిన డీజీపీల కాన్ఫరెన్సులో 2020 ఏడాదికి సంబంధించి ఈ అవార్డును ప్రకటించారు. ఏపీలో అత్యత్తమ పోలీసు స్టేషన్గా కర్నూలు జిల్లా పెద్దకడుబూరు పోలీస్స్టేషన్ను ‘సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డు’కు ఎంపిక చేశారు. ఉత్తమ పోలీసు స్టేషన్గా ఎంపిక చేయడానికి పది ప్రధాన అంశాలను కేంద్ర హోంశాఖ పరిగణనలోకి తీసుకుంది. నేరాలను ముందస్తుగా నిరోధించడం, క్షుణ్ణంగా దర్యాప్తు చేయడం, వేగవంతంగా దర్యాప్తు చేసి పరిష్కరించడం, త్వరితగతిన ఛేదించడం, కమ్యూనిటీ పోలీసింగ్, శాంతిభద్రతలను పరిరక్షించడం, శాంతిభద్రతల పరిరక్షణలో విధులు నిర్వర్తించిన పోలీసు అధికారులు, సిబ్బంది వ్యవహార శైలి గురించి ప్రజల స్పందన (ఫీడ్ బ్యాక్), నేర సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి ఆన్లైన్ చేయడం, డేటాను భద్రపరచడం, మహిళలు, ఎస్సీ, ఎస్టీ ప్రజలపై నేరాలు, ఆస్తులకు సంబంధించిన నేరాలపై అవగాహన కల్పించి నియంత్రించడం, సకాలంలో ఎఫ్ఐఆర్లు, చార్్జషీట్లు దాఖలు చేయడం వంటి వాటిని పరిశీలించిన అనంతరం పెద్దకడుబూర్ పోలీస్ స్టేషన్ను ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఎంపిక చేశారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకోవడం కర్నూలు జిల్లాకు, రాష్ట్రానికి గర్వకారణమని డీజీపీ సవాంగ్ అన్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్పను, సిబ్బందిని డీజీపీ సవాంగ్, శాంతిభద్రతల అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ అభినందించారు. డీజీపీ మాట్లాడుతూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. పోలీసింగ్లో ఆధునిక, సాంకేతిక టెక్నాలజీని వినియోగించి శాంతిభద్రతలను సమర్థంగా నిర్వహించాలన్నారు. -
ఏఓబీలో హైఅలర్ట్
సాక్షి, అమరావతి: ఛత్తీస్గఢ్ ఎదురుకాల్పుల ఘటనతో ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో ఏపీ పోలీస్ యంత్రాంగం హైఅలర్డ్ ప్రకటించింది. దండకారణ్యంలో పథకం ప్రకారం మూడు వైపులా చుట్టుముట్టిన మావోయిస్టులు బుల్లెట్ల వర్షం కురిపించడంతో 24 మంది జవాన్లు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. మరణించిన వారిలో రాష్ట్రంలోని విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన జవాను రౌతు జగదీష్, గుంటూరు జిల్లా గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణలు ఉన్నారు. మరోవైపు.. కోబ్రా యూనిట్కు చెందిన రాకేశ్వర్సింగ్ను బందీగా పట్టుకున్నట్లు మావోయిస్టులు సోమవారం ప్రకటించారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్గా స్పందించింది. కేంద్ర నిఘా వర్గాలు సైతం రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో.. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ, నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. ఇదిలా ఉంటే.. ఎన్కౌంటర్ జరిగిన బీజాపూర్–సుక్మా ప్రాంతం ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని విలీన మండలమైన ఏటపాక సరిహద్దుకు ఘటన ప్రాంతం దగ్గర కావడంతో ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు, గ్రేహౌండ్స్ దళాలు జల్లెడపడుతున్నాయి. అప్రమత్తం చేశాం ఛత్తీస్ఘఢ్ ఘటన అనంతరం కేంద్ర హోంశాఖ, నిఘా వర్గాల ఆదేశాలతో ఆంధ్ర–ఒడిశా బోర్డర్ (ఏఓబీ) ప్రాంతంలోని ఏజెన్సీ మండలాల్లో పోలీసులను అప్రమత్తం చేశాం. ఘటన జరిగిన ప్రాంతం మన రాష్ట్రంలోని విలీన మండలానికి సరిహద్దు ప్రాంతం. ఇక్కడ మావోయిస్టుల ప్రభావం పెద్దగా లేదు. అయినప్పటికీ ఏఓబీ ప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేశాం. పరిషత్ ఎన్నికల నేపథ్యంలోను ఏజన్సీ ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మరింత అప్రమత్తమై కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాం. మన గ్రేహౌండ్స్ బలగాలు, నిఘా వర్గాలు పటిష్ట వ్యూహంతో వ్యవహరిస్తున్నాయి. – డీజీపీ డి. గౌతమ్ సవాంగ్ -
ఏపీ: మాస్క్ పెట్టని సీఐకి జరిమానా
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం చేపట్టిన ప్రత్యేక కార్యాచరణ ఫలితాన్నిస్తోంది. ఎవరైనా మాస్క్ ధరించకుండా రోడ్డెక్కితే.. తొలుత అవగాహన కల్పించడం ఆపై జరిమానా విధించడం చేస్తుండటంతో ‘మాస్క్ మస్ట్’ అనే దిశగా ప్రజా చైతన్యం వెల్లివిరిస్తోంది. స్పెషల్ డ్రైవ్లో భాగంగా అన్ని జిల్లాల్లోనూ ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లు, డీఐజీలు, ఐజీలు సైతం రోడ్డెక్కి ప్రజలను అప్రమత్తం చేస్తున్న తీరు అందర్నీ ఆలోచింపజేస్తోంది. ప్రతిరోజు సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు రెండు గంటలపాటు మొత్తం పోలీస్ యంత్రాంగం రోడ్లపైనే ఉంటోంది. మాస్క్ ధరించకుండా ప్రయాణించే వారిని గుర్తించి వారికి అవగాహన కల్పించడం, జరిమానాలు విధించడం వంటి కార్యక్రమాల్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. మాస్క్ ధరించే విషయంలో పోలీసులు సైతం మినహాయింపు లేదనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఓ సీఐకి సైతం జరిమానా విధించారు. గుంటూరు లాడ్జి కూడలిలో స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఎస్పీ అమ్మిరెడ్డి పరిశీలనకు వెళ్లారు. ఆ సమయంలో తుళ్లూరు ట్రాఫిక్ సీఐ మల్లికార్జునరావు మాస్క్ ధరించకుండా వెళ్తుండటంతో ఆపి మాస్కు ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు. హడావుడిలో మర్చిపోయానని బదులిచ్చిన సీఐ మల్లికార్జునరావుకు జరిమానా విధించిన ఎస్పీ అమ్మిరెడ్డి ఆయనకు స్వయంగా మాస్క్ తొడిగారు. కోవిడ్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాం. ఇందుకోసం యంత్రాంగం మొత్తం మూడు రోజులుగా రోడ్లపైనే ఉంటూ కోవిడ్ నిబంధనల అమలుకు కృషి చేస్తున్నారు. వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దు. వేడుకలు, విందులు, వినోదాలు వంటి వాటిని సాధ్యమైనంత తక్కువ మందితో జరుపుకోవాలి. వీలైతే వాటిని కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మరీ మంచిది. బయటకి వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించడం, శానిటైజ్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించటం వంటి వాటిని అలవాటుగా మార్చుకోవాలి. దుకాణదారులు సైతం వినియోగదారులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. పాఠశాలలు, కళాశాలల్లో భౌతిక దూరం ఉండేలా విద్యార్థులను కూర్చోబెట్టాలి. – గౌతమ్ సవాంగ్, డీజీపీ -
Andhra Pradesh Police: పోలీస్ సేవలకు ఫిదా
సాక్షి, అమరావతి: సేవకు ప్రతిరూపంలా నిలుస్తున్న ఏపీ పోలీసుల తీరుకు ప్రజలు ఫిదా అవుతున్నారు. తాజాగా.. విశాఖ జిల్లా రాంబిల్లి మండలం సీతపాలెం సముద్ర తీరంలో కుళ్లిపోయిన అనాథ శవాన్ని భుజాలపై 3 కి.మీ. మోసుకెళ్లిన ఎస్సై వి.అరుణ్కిరణ్, సిబ్బందిపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సీతపాలెం తీరానికి మృతదేహం కొట్టుకు రాగా.. రాంబిల్లి పోలీసులు గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. తెలిసిన వాళ్లుంటే మృతదేహాన్ని తీసుకెళ్లాలని చుట్టుపక్కల గ్రామాలకు ఎస్సై అరుణ్కిరణ్ సమాచారం అందించారు. మూడు రోజులైనా ఎవరూ రాకపోవడంతో మృతదేహం కుళ్లిపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. ఎస్సై అరుణ్కిరణ్ ముందుకొచ్చి ఏఎస్సై దొర, హెడ్ కానిస్టేబుల్ మసేను, కానిస్టేబుల్ నర్సింగరావు, హోంగార్డ్ కొండబాబు సాయంతో మృతదేహాన్ని భుజాలపై మోసుకుని యలమంచిలి మార్చురీకి తరలించారు. ఇదిలావుంటే.. ఈ నెల 26న కర్ణాటక నుంచి వచ్చిన 40 మంది భక్తులు శ్రీశైలం అటవీ మార్గంలో కాలినడకన బయలుదేరారు. భీముని కొలను లోయ వద్దకు వచ్చేసరికి తీవ్రమైన ఎండ కారణంగా దాహంతో అలమటించారు. ఈ స్థితిలో డయల్ 100కు కాల్ చేశారు. శ్రీశైలం వన్టౌన్ ఎస్సై హరిప్రసాద్ సిబ్బందితో వెళ్లి భక్తుల దాహార్తి తీర్చి, వారిని క్షేమంగా స్వామివారి దర్శనానికి తీసుకువెళ్లి అందరి మన్ననలు అందుకున్నారు. ఇటువంటి సేవలే పోలీస్ ప్రతిష్ట పెంచుతాయి శాంతిభద్రతల నిర్వహణలో అలుపెరుగక శ్రమిస్తున్న పోలీసులు తమదైన రీతిలో అందిస్తున్న ఇటువంటి సేవలు పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచుతున్నాయి. విధి నిర్వహణలోనే కాదు సమాజ సేవలోనూ ముందుంటామని మరోసారి రుజువు చేసిన రాంబిల్లి, శ్రీశైలం పోలీసులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. – గౌతమ్ సవాంగ్, డీజీపీ -
మాస్క్ వాడకపోతే జరిమానా
సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు పోలీస్ శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టిందని, ఇందుకు ప్రజలు సహకరించాలని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఒక ప్రకటన చేస్తూ.. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా నిబంధనల్ని పౌరులంతా కచి్చతంగా పాటించాలని కోరారు. కరోనా ఉధృతమవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచించడంతో కఠిన చర్యలు చేపట్టామన్నారు. కరోనా నియంత్రణకు సంబంధించిన నియమాలను ప్రజలకు తెలియజేసేలా నగర పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో మాసు్కలు ధరించని వారికి, కోవిడ్ నియమావళిని పాటించని వారికి పెద్ద మొత్తంలో జరిమానాలు విధించేలా ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ప్రయాణాలు చేయవద్దని, నిత్యావసర సరుకులు, అత్యవసరాల కోసమే బయటకు రావాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. వేడుకలు, విందులు, వినోదాలు వంటి వాటిని సాధ్యమైనంత తక్కువ మందితో జరుపుకోవడం, వీలైతే వాటిని కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిదని సూచించారు. బయటకు వస్తే తప్పనిసరిగా మాసు్కలు ధరించడం, శానిటైజర్ వాడటం, భౌతిక దూరం పాటించటం వంటివి విధిగా పాటించాలని కోరారు. పాఠశాలలు, కళాశాలల్లో భౌతిక దూరం ఉండేలా విద్యార్థులను కూర్చోబెట్టాలని, విద్యార్థులు కోవిడ్ నియమాలు కచి్చతంగా పాటించేలా చూడాలని పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, విద్యాసంస్థల అధికారులకు సూచించారు. ఒకే రోజు 18,565 మందికి ఫైన్ కరోనా కట్టడికి రంగంలోకి దిగిన పోలీసులు మాస్్కలు ధరించని వాహన చోదకులకు జరిమానాలు విధిస్తున్నారు. శనివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మాసు్కలు ధరించని 18,565 మందికి రూ.17,33,785 జరిమానా విధించినట్టు డీజీపీ కార్యాలయం తెలిపింది. విశాఖపట్నం నగరంలో 1,184 మందికి రూ.1,16,700, తూర్పు గోదావరి జిల్లాలో 2,299 మందికి రూ.1,78,050, విజయవాడలో 2,106 మందికి రూ.1,93,850, గుంటూరు అర్బన్లో 844 మందికి రూ.1,05,720 జరిమానా విధించారు. -
అత్యవసరమైతే తప్ప ప్రయాణాలొద్దు: గౌతమ్ సవాంగ్
సాక్షి, విజయవాడ: ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా కేసుల దృష్ట్యా ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించాలన్నారు. కరోనా వ్యాప్తి కట్టడికి పోలీసు శాఖకు సహకరించాలని.. కోవిడ్ నిబంధనలు పాటించకపోతే భారీగా జరిమానాలు విధించక తప్పదన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్ధన్నారు. ఫంక్షన్స్, పార్టీలు వీలైతే వాయిదా వేసుకోవాలని సూచించారు.మాస్క్, భౌతికదూరం, శానిటైజర్ వాడటం అలవాటుగా మార్చుకోవాలన్నారు. స్కూల్స్, కాలేజీల్లో భౌతికదూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ సూచించారు. చదవండి: మహిళలే టార్గెట్: పరిచయాలు పెంచుకుని.. మగవాళ్లు ఆడవాళ్లుగా.. హోలీ సంబరాల్లో వింత ఆచారం -
కరోనాపై మళ్లీ పోలీస్ వార్
సాక్షి, అమరావతి: మళ్లీ కోరలు చాస్తున్న కరోనాపై పోలీసులు వార్ ప్రకటించారు. కోవిడ్ జాగ్రత్తలు పాటించేలా ప్రజలను చైతన్యవంతం చేయాలంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ శనివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లకు ఆదేశాలిచ్చారు. దీంతో వారు రంగంలోకి దిగి ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించారు. శనివారం సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపైకి వచ్చిన పోలీసులు వాహన చోదకులకు అవగాహన కల్పించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాస్క్ ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని, ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ కె.నారాయణ్నాయక్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. మాస్క్ ధరించకుండా తిరుగుతున్న వారిని ఆపి వారికి గులాబీ పూలు అందించి కోవిడ్ ప్రమాదాన్ని వివరించి జాగ్రత్తలు చెప్పారు. వారి చేతులకు శానిటైజ్ చేసి ఉచితంగా మాస్క్లు అందించారు. కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆధ్వర్యంలో పోలీసులు రోడ్డుపైకి వచ్చి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఉచితంగా మాస్క్ లు పంపిణీ చేశారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్బాబు, వైఎస్సార్ జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్లతో పాటు పలువురు ఎస్పీల పర్యవేక్షణలో ఆయా జిల్లాల్లో కోవిడ్ జాగ్రత్తలపై స్పెషల్ డ్రైవ్లు నిర్వహించారు. మాస్కులు ధరించకుండా రోడ్లపైకి, జనంలోకి వచ్చే వారికి జరిమానా తప్పదని హెచ్చరించారు. -
డీజీపీకి సీఎం జగన్ అభినందన
సాక్షి, అమరావతి: జాతీయ స్ధాయిలో ఉత్తమ డీజీపీతో పాటు అత్యుత్తమ పోలీసింగ్లో 13 జాతీయస్ధాయి అవార్డులు పొందిన నేపథ్యంలో పోలీస్ శాఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను సోమవారం డీజీపీ గౌతమ్ సవాంగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ స్ధాయిలో ఉత్తమ డీజీపీతో పాటు అత్యుత్తమ పోలీసింగ్లో 13 జాతీయస్ధాయి అవార్డులు సాధించడంపై సీఎం జగన్ అభినందనలు తెలిపారు. ఆయన వెంట ఇంటెలిజెన్స్ డీజీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, డీఐజీ టెక్నికల్ సర్వీసెస్ జి. పాలరాజు తదితరులు ఉన్నారు. రాష్ట్ర పోలీసు శాఖ జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటిన విషయం తెలిసిందే. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో దేశంలోనే తొలి స్థానంలో ఉందని స్కోచ్, ఫిక్కీ, ఎన్సీఆర్బీ-నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో/కేంద్ర హోంశాఖ అవార్డులను ప్రకటించాయి. వీటిలో అత్యుత్తమ పోలీసింగ్లో ఒకేరోజు ఏకంగా 13 అవార్డులను అందుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. దేశంలోనే ఉత్తమ డీజీపీ అవార్డు కూడా రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్కే దక్కింది. చదవండి: జాతీయ స్థాయిలో మరోసారి సత్తాచాటిన ఏపీ పోలీస్ -
జాతీయ స్థాయిలో మరోసారి సత్తాచాటిన ఏపీ పోలీస్
సాక్షి, అమరావతి: రాష్ట్ర పోలీసు శాఖ జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని జాతీయస్థాయిలోని మూడు సంస్థలు (స్కోచ్, ఫిక్కీ, ఎన్సీఆర్బీ–నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో/కేంద్ర హోంశాఖ) గుర్తించి అవార్డులను ప్రకటించడం విశేషం. అత్యుత్తమ పోలీసింగ్లో ఒకేరోజు ఏకంగా 13 అవార్డులను అందుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాక.. ఏపీ పోలీసు శాఖ మొత్తం 125 జాతీయ అవార్డులను దక్కించుకోగా, ఈ ఏడాదే 17 అవార్డులను అందుకుంది. దేశంలోనే ఉత్తమ డీజీపీ అవార్డు కూడా రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్కే దక్కింది. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర పోలీసు శాఖకు లభించిన ముఖ్యమైన అవార్డులివీ.. స్మార్ట్ ఇన్నోవేటివ్ పోలీసింగ్ స్టేట్ ఆపత్కాలంలో పౌరులకు అందించే సేవలలో ఏపీ పోలీస్ శాఖకు అనుబంధంగా ఉన్న అన్ని విభాగాల్లో మెరుగైన సేవలు అందిస్తున్నందుకు ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఫిక్కీ) ఈ అవార్డును ప్రకటించింది. పోలీసుల సామర్థ్యం పెంచేందుకు పూర్తిగా డిజిటలైజ్ చేయడంలో అత్యంత ప్రతిభ కనపరిచినందుకు రాష్ట్ర పోలీసు శాఖకు ఈ అవార్డు దక్కింది. ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజీ దేశంలోనే తొలిసారిగా అత్యంత వేగంగా 85శాతం కేసుల దర్యాప్తును పూర్తిచేసినందుకు ఈ అవార్డును గెలుచుకుంది. కేసుల దర్యాప్తులో సాంకేతిక సాక్ష్యాధారాలను సేకరించడంలో ఏపీ పోలీసులు అద్భుత పనితీరు కనబరిచారు. అలాగే, ఎలాంటి రుసుము లేకుండా 87 సేవలతో కూడిన ఏపీ పోలీస్ సేవ అప్లికేషన్ను పౌరులకు అందుబాటులో ఉంచింది. దిశా పోలీస్స్టేషన్లు మహిళలకు సత్వర న్యాయం అందించడంతో పాటు కేసు దర్యాప్తును వేగవంతంగా పూర్తిచేయడమే కాక.. సంవత్సర కాల వ్యవధిలోనే 1,551 కేసులలో సత్వర చార్జిషీట్లు దాఖలు చేశారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలోని 13లక్షల మంది మహిళలు దిశ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకున్నారు. ‘దిశ’ కేసుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు, ప్రతి జిల్లాలో స్పెషల్ కోర్టులను ఏర్పాటుచేయడంతో జాతీయ స్థాయి అవార్డు లభించింది. మహిళలకు హెల్ప్ డెస్క్ దిశ పోలీస్స్టేషన్లలో ‘ఉమెన్ హెల్ప్ డెస్్క’లను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇక్కడ మంచినీటి సౌకర్యం, విశ్రాంతి గది, విశాలమైన రిసెప్షన్ సెంటర్, నిరక్షరాస్యులైన మహిళల కోసం ఫిర్యాదు రాయడానికి సిబ్బందిని నియమించారు. అదనంగా మహిళా మిత్ర వలంటీర్లు కూడా తమ సేవలను అందిస్తారు. వీటికి గుర్తింపుగా జాతీయ స్థాయి సిల్వర్ అవార్డు వచ్చింది. సైబర్ మిత్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంతర్జాలంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రవేశపెట్టిన సైబర్ మిత్ర (వాట్సాప్ నంబర్ 9121211100) సత్ఫలితాలనిస్తోంది. ఈ కేసుల సత్వర పరిష్కారానికి గాను జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. కోర్ట్ బ్లేజ్ కోర్టు బ్లేజ్ అనే అప్లికేషన్ ద్వారా సామాన్య ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు కేసుల దర్యాప్తు, సంబంధిత అధికారి వివరాలు, ఆయన పనితీరు గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి ఎస్ఎంఎస్ రూపంలో అందిస్తుంది. ఈ అప్లికేషన్ జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. స్కోచ్ సంస్థ ప్రకటించిన అవార్డుల్లో ఇది సిల్వర్ అవార్డ్ దక్కించుకోగా, మరో జాతీయ సంస్థ ఫిక్కీ ప్రకటించిన అవార్డునూ సొంతం చేసుకుంది. ఉత్తమ డీజీపీ అవార్డు శాంతిభద్రతల పరిరక్షణతోపాటు రాష్ట్ర పౌరులకి పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తున్నందుకు దేశంలో ఉత్తమ డీజీపీగా సవాంగ్కు ఈ అవార్డు ప్రకటించారు. పోలీసు శాఖలో పరివర్తనతో కూడిన మార్పునకు కారణమైన నాయకుడిగా ఆయనకు ఈ అవార్డు ప్రకటించారు. సవాంగ్ అత్యున్నత నాయకత్వ లక్షణాలు కనబరుస్తున్నారని ప్రశంసించారు. దేవాలయాల పరిరక్షణ దేశంలో ఆలయాల పరిరక్షణకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోని విధంగా ఏపీ పోలీసు విభాగం అనేక రక్షణ చర్యలు చేపట్టింది. ప్రత్యేకంగా కమిటీలను నియమించడం, సీసీ కెమెరాల ఏర్పాటు, జియో ట్యాగింగ్తో పాటు సెక్యూరిటి ఆడిట్ చేయటం ద్వారా దేవాలయాలకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తోంది. ఇందుకుగాను జాతీయ స్థాయి అవార్డు లభించింది. సెంట్రల్ లాకప్ మానిటరింగ్ సిస్టం మానవ హక్కుల పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో సెంట్రల్ లాకప్ మానిటరింగ్ సిస్టం కోసం పైలెట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని 500 పోలీస్స్టేషన్లను ఎంపిక చేశారు. వీటిల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. వీటిని పోలీస్ ప్రధాన కార్యాలయంతో అనుసంధానించినందుకుగాను గోల్డ్ అవార్డు లభించింది. ఐసీజేఎస్ (ఇంటర్ ఆపరెబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్): పౌరులకు పారదర్శకంగా సత్వర న్యాయాన్ని అందించే దిశగా ఇంటర్ ఆపరెబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టంను కేంద్ర హోంశాఖ ఏర్పాటుచేసింది. దేశంలో రూల్ ఆఫ్ లా అమలులో ఇది అత్యంత కీలకం. ఈ విధానంలో పౌరులకు ఉత్తమమైన సేవలు అందిస్తున్న ఏపీ మొదటి స్థానంలో నిలిచి అవార్డును సొంతం చేసుకుందని ఎన్సీఆర్బీ తెలిపింది. ప్రజల భద్రతకు పూర్తి భరోసా మహిళలు, చిన్నారులు, వెనుకబడిన వర్గాలకు పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తున్నామని రాష్ట్ర పోలీసు శాఖ భరోసా కల్పిస్తోంది. గతంలో ఎన్నడూలేని విధంగా సమూలమైన మార్పులు తీసుకొచ్చి, సిబ్బందిలోని జబాబుదారీతనాన్ని పెంపొందిస్తున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఆధునిక టెక్నాలజీని వినియోగించడమే కాక దాని ఫలాలు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికీ చేరేలా కృషిచేస్తున్న ఏపీ పోలీసు శాఖకు అభినందనలు. – సీఎం వైఎస్ జగన్ ఇతర రాష్ట్రాలకు ఏపీ రోల్ మోడల్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో మన పోలీసు శాఖ దేశంలోనే అగ్రగామిగా ఉంది. ఇప్పటికే 14 నెలల కాలంలో జాతీయ స్థాయిలో 125 అవార్డులను సొంతం చేసుకుంది. ఈ ఏడాది 17 జాతీయ స్థాయి అవార్డులను దక్కించుకుంది. ఇతర రాష్ట్రాలకు ఏపీ రోల్ మోడల్గా నిలుస్తోంది. ఈ సంధర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. – గౌతమ్ సవాంగ్, డీజీపీ -
గరళాన్ని కాస్తున్న గోదారి లంకలు
హలో సార్...ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాలకు తూర్పు గోదావరి జిల్లా ఎస్ఈబీ ఏఎస్పీ సుమిత్ సునీల్ గర్డ్ ఫోన్ రింగ్ అయింది. హలో చెప్పండి.. సార్.. నేను ప్రత్తిపాడు మండలంలోని తోటపల్లి గ్రామ వలంటీర్ను.. ఓకే.. చెప్పండి.. సార్.. మా ఊర్లో పెద్ద ఎత్తున నాటుసారా కాచి వేలాది లీటర్లను పీపాల్లో పెట్టి భూమిలో పాతి నిల్వ చేశారు సార్.. సరే నేను చూస్తాను.. అంటూ ఏఎస్పీ ఫోన్ కట్ చేశారు. వెంటనే కాకినాడ డీఎస్పీ ప్రసాద్ కు ఫోన్ చేసి సమాచారం అందించారు. అక్కడి నుంచి యాక్షన్ టీమ్ రంగంలోకి దిగింది. తోటపల్లి గ్రామ వలంటీర్ అందించిన సమాచారం నిజమేనని నిర్ధారించుకున్నారు. ఉదయం 7.50 గంటలకు ఎస్ఈబీ టీం తోటపల్లి ఫారెస్ట్లో కూంబింగ్ మొదలు పెట్టింది. 10 గంటలకు 112 సారా ఊట పీపాలను గుర్తించింది. 10.05 గంటలకు డీఎస్పీ ప్రసాద్.. సిబ్బందితో బయలు దేరారు. గంటన్నరపాటు ప్రయాణించి తోటపల్లికి చేరుకున్నారు. అక్కడ 20 నిమిషాలకు పైగా అడవిలో కాలినడకన ముందుకు సాగి.. సారా డంప్ ఉన్న చోటుకు చేరారు. 22,400 లీటర్ల ఊటను వెలికి తీసి ధ్వంసం చేశారు. ఆదివారం అయినప్పటికీ ఎస్ఈబీ టీం 8 గంటలపాటు శ్రమించి సారా బట్టీలు, బెల్లం ఊటను ధ్వంసం చేసింది. ఇలా ప్రతిరోజూ గోదారి లంక గ్రామాల్లో జల్లెడ పడుతూ.. నాటు సారా బట్టీలను ఎస్ఈబీ బృందాలు ధ్వంసం చేస్తున్నాయి. గోదావరి లంకలు.. సముద్ర తీరంలోని ఇసుక తిన్నెలు.. కొల్లేరు దిబ్బలు.. సెలయేటి గట్లు.. పిల్ల కాలువ మాటున బట్టీలు పెట్టి రాత్రిళ్లు నాటు సారా కాస్తున్నారు. దాన్ని ఇసుక తిన్నెలు, గడ్డివాముల్లో కప్పిపెడుతున్నారు. డిమాండ్ మేరకు గ్రామాల్లోకి తరలించి పగటి పూట అమ్మకాలు సాగిస్తున్నారు. అక్రమార్జన కోసం కొందరు ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. నీటిలో బెల్లం కలిపి దాన్ని పులియబెడతారు. దాంట్లో అమ్మోనియా, యూరియా, ఈస్ట్.. కిక్కు కోసం మసాలా దినుసులు, ఎండు మిర్చి, స్పిరిట్, యాసిడ్ వంటి వాటిని కలిపి వేడి చేసి, సారా తయారు చేస్తారు. ఎక్కడికక్కడ గ్రూపులుగా సారా తయారీ సాగుతోంది. ఇదొక మాఫియాగా పరిణమించడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) దాడులు ముమ్మరం చేసింది. జనం గొంతులో గరళం నింపుతున్న ‘నాటు సారా’పై వేటు వేస్తోంది. -ఇర్రింకి ఉమామహేశ్వరరావు, సాక్షి, అమరావతి కాపు సారా బడుగు జీవుల బతుకులను కాటేస్తోంది. తాగుడుకు బానిసలైన అనేక మంది నాటు సారా తాగి ప్రాణాలు కోల్పోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో 2010లో కల్తీ సారాకు 21 మంది బలయ్యారు. అంబాజీపేట మండలం మొసలపల్లి, జి.అగ్రహారం, అమలాపురం మండలం పాలగుమ్మి, బండారులంక గ్రామాలకు చెందిన పేదలు కల్తీ సారాతో మృత్యువాత పడటం అప్పట్లో సంచలనం రేపింది. అదే ఏడాది కృష్ణా జిల్లా మైలవరంలో 17 మంది నాటు సారాకు బలయ్యారు. 2013లో ఆలమూరు మండలం మడికి శివారు ప్రాంతం నాగులపేటకు చెందిన సీతెన రాజబాబు (59) కల్తీ సారా తాగి మృత్యువాతపడ్డాడు. సారా మహమ్మారిని తరిమికొట్టాలంటూ రంగంపేట మండలం మర్రివాడలో గతంలో యువత ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోను మహిళలు అప్పట్లో సారా వ్యతిరేక ఉద్యమాలు చేశారు. గత సర్కారు హయాంలో ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్కు ప్రజలు ఫిర్యాదు చేశారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. బైండోవర్లు.. రౌడీషీట్లు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలను సాకారం చేసే దిశగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 18 పోలీస్ యూనిట్ల ద్వారా పక్కా కార్యాచరణతో, ఒక్కో యూనిట్లో ఒక్కో ఐపీఎస్ అధికారి(ఏఎస్పీ)కి బాధ్యతలు అప్పగించడం ద్వారా ముందుకు సాగుతోంది. గ్రామాల్లో నాటుసారా కట్టడికి ‘నవోదయం’ పేరుతో ప్రత్యేక యాక్షన్ ప్లాన్ (కార్యాచరణ) అమలులోకి తెచ్చింది. సారా తయారీ, అక్రమ మద్యంపై ఎప్పటికప్పుడు సమాచారం అందించే కొరియర్ (వేగుల) వ్యవస్థను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నాటు సారా తయారీ కేంద్రాల లెక్కలు తేల్చింది. అవి ఎక్కడ.. ఎన్ని ఉన్నాయి? ఎవరు తయారు చేస్తున్నారు? తదితర వివరాలను ఎస్ఈబీ ప్రత్యేక బృందాలు సేకరించాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 79 పోలీస్ స్టేషన్ల పరిధిలో 191 మండలాల్లో మొత్తం 682 నాటుసారా తయారీ కేంద్రాలను గుర్తించారు. వాటిలో భారీగా సారా తయారు చేస్తున్నవి 141, ఒక మోస్తరువి 249, తక్కువ మోతాదువి 292 కేంద్రాలు ఉన్నట్టు తేల్చారు. రాష్ట్రంలో నేర చరిత్ర ఉన్న పది వేల మందిని ఇకపై సారా తయారు చేయబోమంటూ హామీ ఇచ్చేలా బైండోవర్ చేశారు. ఎంత చెప్పినా వినకుండా సారా తయారీ వీడని 1500 మందిపై రౌడీషీట్లు తెరిచారు. ఆరుగురిపై పీడీ యాక్ట్లు పెట్టారు. సమన్వయం.. సామాజిక పరివర్తన లాఠీకి పని చెప్పినా వినని వారికి లౌక్యంతో మంచి మాటలు చెప్పి దారికి తెస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని సామాజిక చైతన్యాన్ని తేవడంలో పోలీసులు చేస్తున్న కొత్త ప్రయోగం వారిలో ‘పరివర్తన’ తెస్తోంది. ఇలా రాష్ట్రంలో 436 కుటుంబాల్లో మార్పు తెచ్చారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన తొలి జిల్లాగా కృష్ణా జిల్లా రాష్ట్రానికి రోల్ మోడల్గా నిలిచింది. 5 లక్షల లీటర్లకుపైగా సారా స్వాధీనం రాష్ట్రంలో ఎస్ఈబీ ఏర్పాటైన గతేడాది మే నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు నాటు సారా తయారీ, రవాణా, అమ్మకాలపై దాడులు నిర్వహించిన పోలీసులు పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేశారు. 5,00,482 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. 1,26,26,673 లీటర్ల బెల్లపు ఊట (సారా తయారీకి ఉపయోగించేది) ధ్వంసం చేశారు. 38,595 కేసుల్లో 32,372 మందిని అరెస్టు చేశారు. 4,653 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే ఆదివారం 200 మందితో కూడిన 12 ఎస్ఈబీ ప్రత్యేక బృందాలు 35 వేల లీటర్లకు పైగా నాటు సారా ఊటను ధ్వంసం చేశాయి. ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో దశల వారీ మద్య నియంత్రణ కోసం అనేక చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రజారోగ్యాన్ని దెబ్బతీసి, ప్రాణాల మీదకు తెచ్చే నాటుసారా విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఎస్ఈబీ అధికారులు సమర్థవంతంగా పని చేస్తున్నప్పటికీ, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరించాలి. – డి.గౌతమ్ సవాంగ్, డీజీపీ సారా తయారు చేస్తే పీడీ యాక్ట్ సారా తయారీ మానకుంటే పీడీ యాక్ట్ కింద కేసులు పెడతాం. రౌడీషీట్లు తెరుస్తాం. అయినా సారా తయారీ మానకపోతే వారి ఆస్తుల జప్తునకు చర్యలు తీసుకుంటాం. పట్టుబడిన వారిని వెంటనే రిమాండ్కు పంపించేలా జ్యుడిషియల్ వ్యవస్థను సంప్రదిస్తున్నాం. నిఘా తీవ్రతరం చేశాం. మొబైల్ చెక్పోస్టులు ఏర్పాటు చేశాం. ఇన్ఫార్మర్లు, ఆ«ధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాం. – వినీత్ బ్రిజ్లాల్, కమిషనర్, ఎస్ఈబీ ‘పరివర్తన’కు ప్రయత్నిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా సారా తయారీదార్లు, తయారు చేస్తున్న ప్రాంతాలను ఇప్పటికే గుర్తించాం. తయారీదార్లలో మార్పు తెచ్చేందుకు డీఎస్పీ స్థాయి అధికారితో ప్రత్యేక టీమ్లు ఏర్పాటు చేశాం. వారికి నయానా, భయానా నచ్చజెప్పి సారా జోలికి పోకుండా ‘పరివర్తన’ తెచ్చేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వారికి ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపించడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాం. – పీహెచ్డీ రామకృష్ణ, డైరెక్టర్, ఎస్ఈబీ సామాజిక బాధ్యతలో గర్వంగా ఉంది ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా పోలీసులు చేస్తున్న ప్రయత్నాల్లో మేము భాగస్వామి కావడం ఆనందంగా ఉంది. నాటుసారా తయారీ నిలిపి వేసే కుటుంబాలకు ఉపాధి చూపించడంలో భాగంగా ఒక్క కృష్ణా జిల్లాలోనే 170 కుటుంబాలకు చెందిన యువతకు అవుట్ సోర్సింగ్ సంస్థ ద్వారా ఉద్యోగాలు ఇప్పించాం. – పామర్తి గోపీచంద్, చైర్మన్, పీవీఎన్నార్ సంస్థ సారా జోలికి పోకుండా ఉద్యోగం ఇప్పించారు చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామంలోని లంబాడీ తండాలోని చాలా కుటుంబాలకు దశాబ్దాల తరబడి నాటు సారా తయారీయే జీవనాధారం. ఎంటెక్, బీటెక్, డిగ్రీ, ఇంటర్ చదివిన మా తరం యువతకు చాలా మందికి ఉద్యోగావకాశాలు రావడం లేదు. దీంతో మేము ఉపాధి కోసం మళ్లీ నాటుసారా తయారీ జోలికి పోకుండా పోలీసులు మాకు అవగాహన కల్పించి చైతన్యం తెచ్చారు. నాకు ఠాకూర్ ఆక్వా ఇండస్ట్రీస్లో ఉద్యోగం ఇప్పించారు. – బుక్యా శ్యామ్ సుందర్ సారా ప్రాణం తీస్తుంది.. సారా తయారీదారులు కిక్కు కోసం అనేక ప్రమాదకరమైన సరుకులు వాడుతున్నారు. కిక్కు కోసం, ఘాటు కోసం వాడే ఆ పదార్థాల వల్ల మనిషి గొంతు నుంచి జీర్ణాశయం వరకు దెబ్బతింటోంది. లివర్ సంబంధమైన అనేక తీవ్ర వ్యాధులతో ప్రాణాలు పోయే వరకు దారితీస్తోంది. కిక్కు కోసం అనేక మంది వ్యసనపరులు తమ ప్రాణాలను పణంగా పెట్టి వారి కుటుంబాలను దిక్కులేని వారుగా చేస్తున్నారు. – బి.దుర్గాప్రసాద్, ప్రభుత్వ వైద్యాధికారి, భీమవరం -
దిశ యాప్లో పుష్ బటన్ ఆప్షన్
సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్న దిశ మొబైల్ అప్లికేషన్ (యాప్)లో కొత్త ఆప్షన్ పొందుపరిచారు. తప్పుడు ప్రచారాలకు తెర దించుతూ..అత్యవసర సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు సందేశాలను పంపేలా రాష్ట్ర పోలీస్ శాఖ ‘పుష్ బటన్ మెస్సేజ్ ఆప్షన్’ను యాప్లో చేర్చింది. ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు జరుగుతున్న ‘దిశ’ కార్యక్రమాలు మంచి ఫలితాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. దిశ యాప్ గత 13 నెలల్లో నాలుగు జాతీయ అవార్డులు దక్కించుకోవడం గమనార్హం. దిశ కార్యక్రమాలను బలోపేతం చేసేలా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. దిశ పెట్రోలింగ్ వాహనాలు, సైబర్ కియోస్క్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఫుష్ బటన్ ఆప్షన్ ఇలా... రాష్ట్రంలో దిశ మొబైల్ యాప్ను 12.57 లక్షల మంది తమ డౌన్లోడ్ చేసుకున్నారు. వారందరికీ పోలీసులు ఏదైనా సమాచారాన్ని పంపించి అప్రమత్తం చేయాలనుకుంటే పుష్ బటన్ ఆప్షన్ను వినియోగిస్తారు. ఈ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే చాలు అందరికీ ఏకకాలంలో పోలీస్ సందేశం చేరుతుంది. దీనిపై అజమాయిషీ పూర్తిగా పోలీసు ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిధిలో ఉంటుంది. డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు దిశ యాప్ను మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దామని, ఇందులో భాగంగా పుష్ బటన్ ఆప్షన్ తెచ్చామని పోలీస్ శాఖ టెక్నికల్ చీఫ్ పాలరాజు తెలిపారు. -
టెక్నాలజీలో దేశానికే ఆదర్శంగా ఏపీ పోలీస్
సాక్షి, అమరావతి: అనేక అంశాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న ఏపీ పోలీస్ శాఖ తాజాగా టెక్నాలజీ విభాగంలోనూ అదే ఒరవడిని కొనసాగించింది. దేశంలో అనేక విభాగాల్లో టెక్నాలజీ వినియోగానికి సంబంధించి ‘డిజిటల్ టెక్నాలజీ సభ గ్రూప్’ ప్రకటించిన అవార్డుల్లో తన సత్తా చాటింది. జాతీయ స్థాయిలో 12 అవార్డులను ప్రకటించగా అందులో ఏకంగా నాలుగింటిని ఎగరేసుకుపోయింది. ఏపీ పోలీస్ శాఖ నిర్వహిస్తున్న దిశ మొబైల్ అప్లికేషన్, దిశ క్రైమ్ సీన్ మేనేజ్మెంట్, సెంట్రల్ లాకప్ మానిటరింగ్ సిస్టమ్, 4ఎస్4యు యూట్యూబ్ చానెల్కు ఈ నాలుగు అవార్డులు దక్కాయి. వెబినార్ ద్వారా శనివారం నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ అవార్డులను అందుకున్నారు. ‘దిశ’కు అవార్డుల పంట రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అనేక ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దిశ బిల్లును ఆమోదించి దిశ స్కీమ్ పేరుతో చేపడుతున్న అనేక కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే దిశ కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండుతోంది. దిశ మొబైల్ అప్లికేషన్కు తాజాగా డిజిటల్ టెక్నాలజీ సభ గ్రూప్ ఇచ్చినదానితో కలిపి ఇప్పటివరకు నాలుగు జాతీయ అవార్డులు లభించాయి. దిశ క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ సిస్టమ్కు కూడా తాజా అవార్డుతో కలిపి రెండు జాతీయ అవార్డులు దక్కాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇటీవల దిశ క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ప్రత్యేకంగా ప్రశంసించిన సంగతి తెలిసిందే. సెంట్రల్ లాకప్ మానిటరింగ్లో ఏపీ ఫస్ట్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి అన్ని పోలీస్స్టేషన్లలో ‘సెంట్రల్ లాకప్ మానిటరింగ్ సిస్టమ్’ అమలులో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. పారదర్శకత, జవాబుదారీతనం, మానవ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో ప్రతి పోలీస్స్టేషన్లో సెంట్రల్ లాకప్ మానిటరింగ్ సిస్టమ్ను అమల్లోకి తెచ్చారు. ప్రతి పోలీస్స్టేషన్ లాకప్లో ఆడియో, వీడియో, నైట్ విజన్లతో కూడిన సీసీ కెమెరాల ఏర్పాటుకుగాను ఏపీ పోలీస్ శాఖ రెండోసారి జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై జరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణ కోసం ప్రవేశపెట్టిన 4ఎస్4యు యూట్యూబ్ చానెల్కు మరోసారి జాతీయ స్థాయి అవార్డు దక్కడం విశేషం. ఏపీ పోలీస్ శాఖకు సీఎం వైఎస్ జగన్ అభినందనలు అత్యాధునిక టెక్నాలజీ వినియోగంలో ఏపీ పోలీస్ శాఖ గత 13 నెలల కాలంలో ఏకంగా 112 జాతీయ స్థాయి అవార్డులను దక్కించుకుని చరిత్ర సృష్టించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత అభినందనలు తెలిపారని డీజీపీ సవాంగ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పారదర్శకత, జవాబుదారీతనం, సత్వర న్యాయంతో ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్న పోలీస్ సిబ్బందిని ప్రశంసించారని పేర్కొన్నారు. -
మా వాళ్లపై తప్పుడు కేసులు పెడుతున్నారు
సాక్షి, అమరావతి: తమ పార్టీ వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని, వాటిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డీజీపీ గౌతమ్సవాంగ్ను కోరారు. ఈ మేరకు శనివారం డీజీపీకి లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతర పరిణామాల్లో టీడీపీ సానుభూతిపరులపై పోలీసులు పలుచోట్ల కేసులు పెట్టారని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఇల్లాపల్లి పంచాయతీలో సర్పంచ్గా గెలిచిన వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయోత్సవ ర్యాలీ నిర్వహించి టీడీపీ మద్దతుదారులను ఇబ్బందులకు గురిచేయటంతో పాటు వారిపై తప్పుడు కేసులు పెట్టించారని చంద్రబాబు పేర్కొన్నారు. దాడి చేసిన వారిపై కేసు పెట్టకుండా గాయపడిన బాధితులపై పోలీసులు కేసులు బనాయించారని తెలిపారు. తమ పార్టీ నేతలు ఒత్తిడి చేశాక పోలీసులు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశారని, ఇప్పుడు కేసు ఉపసంహరించుకోవాలంటూ బాధితులను పోలీసులు, వైఎస్సార్సీపీ నేతలు బెదిరిస్తున్నారన్నారు. పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యత డీజీపీదేనన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా చూస్తారని ఆశిస్తున్నానన్నారు. -
రాష్ట్రంలో పోలీసులకు కోవిడ్ వ్యాక్సిన్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించే కార్యక్రమం మొదలైంది. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. పోలీసులకు వ్యాక్సిన్ వేసిన వైద్య ఆరోగ్య సిబ్బందితో పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అన్ని పోలీస్ యూనిట్లకు చెందిన పోలీస్ అధికారులతో డీజీపీ సవాంగ్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పోలీస్ సిబ్బందికి వ్యాక్సిన్ వేయించే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాల్లో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పోలీసులకు వ్యాక్సినేషన్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. పల్లె పోరు ప్రక్రియ పూర్తి కావడంతో ఇప్పుడు పోలీసులకు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని చేపట్టారు. -
ఎస్ఈబీకీ ‘ఎక్సైజ్’ అధికారాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణా, జూదం, డ్రగ్స్, గంజాయి వంటి వంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ)కి ప్రభుత్వం అదనపు అధికారాలను కట్టబెట్టింది. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్భార్గవ్ (ఎక్సైజ్), ఎక్స్అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ గౌతమ్ సవాంగ్(డీజీపీ) మంగళవారం వేర్వేరుగా ఉత్తర్వులిచ్చారు. ఏపీ ఎక్సైజ్ యాక్ట్–1968, ఏపీ ప్రొహిబిషన్ యాక్ట్–1995, ఎన్డీపీఎస్ యాక్ట్–1985లోని పలు సెక్షన్ల ప్రకారం ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖకు గల పలు అధికారాలు ఇకపై ఎస్ఈబీకి కూడా ఉంటాయి. అక్రమ మద్యం, సారాను, ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం, ధ్వంసం చేయడం, వేలం వేయడం తదితర అన్ని అధికారాలను ఎస్ఈబీకి అప్పగిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇటీవల వరకు ఎస్ఈబీ స్వాధీనం చేసుకున్న 2.8 లక్షల లీటర్ల మద్యం విషయంలోనూ ఎస్ఈబీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని చర్యలు చేపట్టేలా అధికారం ఇచ్చారు. ‘గనుల’ అధికారాలు కూడా.. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా భూగర్భ గనుల శాఖకు ఉండే అధికారాలను ఎస్ఈబీకి కూడా ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ చట్టం (ఎంఎండీఆర్)–1957లోని నిబంధనలను సవరించింది. కోర్టుల్లో కేసులు పెట్టాలంటే ఇçప్పుడున్న ఎంఎండీఆర్ నిబంధనల ప్రకారం భూగర్భ గనుల శాఖ అధికారులకే అధికారం ఉంది. ఇప్పుడు ఎస్ఈబీ అధికారులకు కూడా ఈ అధికారాలను కల్పిస్తూ ప్రభుత్వం కొత్త నిబంధనలను చేర్చింది. దీని ప్రకారం ఎస్ఈబీ అధికారులు కూడా ఇసుక క్వారీలను తనిఖీ చేయవచ్చు. క్వారీ పరిమాణాన్ని కొలతలు వేయవచ్చు. ఏ క్వారీలో అయినా ఇసుక పరిమాణాన్ని తూకం, కొలత వేయించవచ్చు. రికార్డులు, రిజిష్టర్, పత్రాలు తనిఖీ చేయవచ్చని భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది మంగళవారం ఉత్తర్వులిచ్చారు -
ప్రశాంత ఎన్నికలకు పక్కాగా ప్రణాళిక
సాక్షి, అమరావతి: ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. అలజడులు సృష్టించే అవకాశం ఉన్న వారిని గుర్తించి బైండోవర్ చేస్తున్నారు. అనుమతి కలిగిన ఆయుధాలను ఎన్నికలు అయ్యే వరకు స్వాధీనం చేసుకుంటున్నారు. మద్యం, డబ్బు రవాణాను అడ్డుకుని పంపిణీకి అవకాశం లేకుండా చెక్పోస్టుల వద్ద గట్టి నిఘా చర్యలు చేపట్టారు. ఎన్నికల నియమ నిబంధనలు అమలు జరిగేలా ప్రత్యేకంగా ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల మ్యాపింగ్ చేసి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్పెషల్ బ్రాంచ్ని రంగంలోకి దించి సమాచారాన్ని సేకరిస్తున్నారు. గత ఎన్నికల్లో విధ్వంసాలు, అలజడులకు పాల్పడిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి బాడీవోర్న్ కెమెరాలు, డ్రోన్లు, కాల్ సెంటర్, డయల్ 100 వంటి వాటిని వినియోగిస్తున్నారు. పోలింగ్ అనంతరం కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టారు. గ్రామాలను పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు సందర్శిస్తాయి. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఫ్యాక్షన్ , పాత కక్షలు ఉండే గ్రామాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే చర్యలు, పార్టీలను, వ్యక్తులను కించపరిచే పోస్టింగ్లు, తప్పుడు ప్రచారాలు చేసే వారిపై నిఘా పెట్టారు. 1,47,391 మంది బైండోవర్.. ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు.. వాటిలో తీవ్ర సమస్యాత్మక ప్రాంతాలు 6,254, సమస్యాత్మక ప్రాంతాలు 8,555, వామపక్ష తీవ్రవాద ప్రభావం, సంఘ వ్యతిరేక శక్తులు ఉన్న ప్రాంతాలు 983 ఉన్నట్టు నిర్ధారించారు. ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు 44 ఘటనలపై కేసులు నమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన ఘటనలకు సంబంధించి 12,779 కేసుల్లో నిందితులుగా ఉన్న 1,47,391 మందిని బైండోవర్ చేశారు. నేరాల్లో నిందితులుగా ఉండి నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్లో ఉన్న 4,865 మందిలో 2,246 మందిని పోలీసులు పట్టుకోగలిగారు. లైసెన్స్ కలిగిన ఆయుధాలు 9,942 ఉండగా వాటిలో ఇప్పటి వరకు 9,199 స్వాధీనం చేసుకున్నారు. అనుమతిలేని పేలుడు పదార్థాలు, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేశీయ ఆయుధాలు 17, జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్స్ 1,058, ఎలక్ట్రిక్ వైర్స్ మూడు క్వాయిల్స్, బ్యాటరీలు 2, సేఫ్టీ ఫ్యూజ్లు, డిటోనేటర్ ఫ్యూజ్లు 37, ఎయిర్ ఫిస్టల్ ఒకటి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు రూ. 5,02,49,007 నగదు, రూ. 13,03,73,319 విలువైన బంగారం, వెండి, మద్యం, నాటుసారా, గంజాయి, చీరలు, వాహనాలను తనిఖీల సందర్భంగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి 707 కేసులు నమోదు చేశారు. అందరూ సహకరించాలి: డీజీపీ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పక్కా ప్రణాళికతో కార్యాచరణ చేపట్టినట్టు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ చెప్పారు. శాంతిభద్రతల అడిషినల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కమిషనర్ వినీత్ బ్రిజ్లాల్తో కలిసి మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం డీజీపీ మీడియా సమావేశం నిర్వహించారు. నామినేషన్లు, పోలింగ్, పోలింగ్ అనంతరం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ఏ చిన్న ఘటన జరిగినా పోలీసులు తక్షణం స్పందిస్తున్నారని డీజీపీ వివరించారు. బందోబస్తుకు బయటి ప్రాంతాల నుంచి ఎటువంటి బలగాలు రావడంలేదని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా జరిగే ఈ ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పంచాయతీ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తే ఎవర్నీ ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారికి ఎన్నికల బందోబస్తు విధులు కేటాయించడంలేదని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి రక్షణ పరికరాలు అందిస్తామన్నారు. మంత్రి పెద్దిరెడ్డి గృహ నిర్భందం విధించాలంటూ ఎస్ఈసీ జారీ చేసిన ఉత్తర్వులపై స్పందించిన డీజీపీ.. ఆ ఆదేశాల లేఖ ఇంకా తనకు అందలేదని, దానిని పరిశీలించాకే స్పందిస్తానని తెలిపారు. ఏ ఘటనపైన అయినా ఆధారాలు ఉంటే పోలీసుల దృష్టికి తేవాలని, వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు. -
పంచాయతీ ఎన్నికలు: భద్రత కట్టుదిట్టం..
సాక్షి, విజయవాడ: పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. ఎక్కడా ఇబ్బంది లేకుండా పోలీసు సిబ్బందిని నియమించామని, 13 వేల పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచామన్నారు. రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా పోలీసులు వెంటనే స్పందిస్తున్నారని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.(చదవండి: ఏకగ్రీవాలు జరిగితే తప్పేంటి: వైఎస్సార్సీపీ నేతలు) ‘‘షాడో, నిఘా టీమ్లు ఏర్పాటు చేశాం. చెక్పోస్టుల వద్ద మద్యం, డబ్బు తరలింపుపై తనిఖీలు చేస్తున్నాం. ఫ్యాక్షన్ ఉన్న గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేస్తాం.మొదటి విడతలో పోలింగ్ బాక్స్ల భద్రతకు 61 స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాటు చేశాం.1122 రూట్ మొబైల్స్, 199 మొబైల్ చెక్పోస్టులు, 9 ఎస్సీ రిజర్వు, 9 అడిషనల్ ఎస్సీ రిజర్వ్ పార్టీలు సిద్ధం చేశాం. ఇప్పటివరకు 9,199 ఆయుధాలు డిపాజిట్ అయ్యాయి. 1,47,931 బైండోవర్,12,779 సెక్యూరిటీ కేసులు నమోదు చేశాం. అనధికారిక, అధికారిక ఆయుధాలు సీజ్ చేస్తాం.కోడ్ అఫ్ కండక్ట్ తప్పినవారిపై ఫ్లైయింగ్ స్క్వాడ్లు ఉంటాయని’’ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. (చదవండి: టీడీపీ కుటిల యత్నం!) -
నేర పరిశోధనలో సమర్థులకు ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: నేర పరిశోధనలో సమర్థులను గుర్తించి అవార్డులతో ప్రోత్సహించడం ద్వారా మిగిలిన వారిలో స్ఫూర్తిని రగిలించినట్లవుతుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఏపీ సీఐడీ ఆధ్వర్యంలో మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ‘అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్(ఏబీసీడీ)’లను అందించారు. నేర పరిశోధనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 66 మందికి డీజీపీ బహుమతులు అందించారు. మొదటి, రెండు, మూడవ బహుమతులుగా రూ.లక్ష, రూ.60 వేలు, రూ.40వేల నగదుతోపాటు ప్రశంసాపత్రాలు అందించారు. ► విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఉయ్యూరులో రూ.60 లక్షల చోరీని ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన విజయవాడ సీసీఎస్ పోలీస్ టీమ్కు 2020 సెకండ్ క్వార్టర్ ఏబీసీడీ కింద మొదటి బహుమతి దక్కింది. సీసీఎస్ పోలీస్స్టేషన్ ఏసీపీ కె.శ్రీనివాసరావు మరో 9 మంది అవార్డును అందుకున్నారు. రెండు, మూడు బహుమతులను మదనపల్లె డీఎస్పీ కె.రవిమనోహరాచారి బృందం.. గుంటూరు అర్బన్లోని దిశ మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ ఎ.లక్ష్మీనారాయణరావు బృందం అందుకున్నాయి. కారు చోరీ కేసులో తీగలాగితే 15 క్రిమినల్ కేసుల్లోని గ్యాంగ్ను నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ టీమ్ పట్టుకోవడంతో 2020 మూడవ క్వార్టర్ అవార్డుల్లో మొదటి బహుమతి దక్కింది. కోవూరు సీఐ జి.రామారావు బృందం అవార్డు అందుకుంది. రెండు, మూడు బహుమతులను చిత్తూరు జిల్లా పీలేరు సీఐ ఎ.సాదిక్ అలీ బృందం.. మార్కాపురం అడిషనల్ ఎస్పీ కె.చౌడేశ్వరి బృందం అందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి నా సెల్యూట్: ఎస్సై శిరీష మహిళలను ప్రోత్సహించడంతోపాటు వారి రక్షణకు ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర పోలీస్ శాఖకు సెల్యూట్ చేస్తున్నానని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఎస్సై కత్తూరు శిరీష కృతజ్ఞతలు తెలిపారు. రెండ్రోజుల క్రితం అనాథ శవాన్ని మోసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించిన శిరీషకు డీజీపీ చేతుల మీదుగా డీజీపీ కమాండేషన్ డిస్క్ అవార్డును అందజేశారు. తుపాను సమయంలో వరదల్లో చిక్కుకున్న ఒడిశా పోలీసుల ప్రాణాలను కాపాడిన ఎచ్చెర్ల ఎస్సై రాజేష్కు కూడా డీజీపీ కమాండేషన్ డిస్క్ను అందజేశారు. అలాగే పోలీస్ మెడల్ కూడా దక్కింది. -
పోలీస్ అయితే పెళ్లి సంబంధాలు రావన్నారు..
పోలీసు కుటుంబంలో జన్మించారు సుప్రజ. విధి నిర్వహణలో తన తాత, తండ్రి ఎదుర్కొన్న కష్టాలను చూసి కూడా భయపడలేదు. ఆడపిల్ల పెద్ద చదువులు చదివితే, అందులోనూ పోలీసు అయితే పెళ్లి సంబంధాలు రావని ఎవరెంతగా నిరుత్సాహపరిచినా లక్ష్య పెట్టకుండా కష్టపడి చదివారు. 2015లో గ్రూప్–1 అధికారిగా విధుల్లో చేరారు. చేరిన తొలి రోజు నుంచే సామాన్యులకు రక్షణగా నిలిచారు. ఏడు నెలల వ్యవధిలో 74 మందిపై రౌడీషీట్లు తెరిచి నేరస్థులకు సింహస్వప్నంగా నిలిచారు. ఉత్తమ పిసిఆర్ అవార్డు విజేత అయ్యారు. కడప జిల్లా నందలూరుకు చెందిన కోర్లకుంట సుప్రజ.. గర్భిణిగా ఉండి కూడా కరోనాకు వెరవకుండా సుప్రజాసేవ నిర్వహించినందుకు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ నవాంగ్ నుంచి ఉత్తమ డీఎస్పీగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో పలు విషయాలు పంచుకున్నారు. ► మీ విధి నిర్వహణలోని సవాళ్లు, ఒత్తిళ్లు ఎలాంటివి? రెండు ఘటనల గురించి చెబుతాను. కర్నూలు జిల్లాలో పనిచేసేటప్పుడు గ్రామ సర్పంచ్ తన భార్య తప్పిపోయిందని ఫిర్యాదు చేశాడు. నాకెందుకో అతని మీద అనుమానం వచ్చి ఎంక్వైరీ చేయించాను. అతనికున్న రాజకీయ పలుకు బడితో అధికారులు, నాయకులు నాపై వత్తిడి తెచ్చినప్పటికీ, అతని నేరాలను నిరూపించి అరెస్టు చేశాము. గుంటూరు ఈస్ట్లో విధులు నిర్వహించేటప్పుడు నా కార్యాలయానికి కూతవేటు దూరంలోనే సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్న ఓ కాల్మనీ మోసగాడిని అరెస్టు చేసి అతడి దగ్గర నుంచి 40 లక్షలు రికవరీ చేసాను. అప్పుడు అనేక వత్తిళ్లు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. ► ట్రైనింగ్ సమయంలోని ఫిజికల్ ట్రైనింగ్ విధి నిర్వహణలో ఉపయోగపడిందంటారా? అవును. గుంటూరు ఈస్ట్లో విధులు నిర్వహిస్తున్నప్పుడు ఐదు నెలల గర్భిణిని. పెద్ద మొత్తంలో గంజాయి రవాణా జరుగుతున్న బస్సు గుంటూరు దాటి వెళ్లిపోతోందని విన్నాను. వాహనంలో వేగంగా ఛేజింగ్ చేసి బస్సు ఆపించి, కిటికీలో నుంచి దూకి పారిపోతున్న నిందితులను వెంటాడి పట్టుకున్నాము. నలభై కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నాము. కర్నూలు జిల్లాలో అడవుల్లో పలు నక్సలైట్ డంప్లు స్వాధీనం చేసుకునే సమయంలోనూ కొన్ని సాహసాలు చేయాల్సి వచ్చింది. ► మహిళగా మహిళలకు జరిగే అన్యాయాలపై మీ స్పందన ఎలా ఉంటుంది? జాప్యం అయితే జరగదు. నా ప్రసవం అనంతరం ఓ రాత్రి పదిన్నర సమయంలో కార్యాలయంలో ఉండగా ‘బాబు పాల కోసం ఏడుస్తున్నాడు (బాబుకు నా పాలే ఫీడ్ చేస్తాను). వెంటనే రమ్మని’ అమ్మ ఫోన్ చే యడంతో బయటకు వచ్చాను. ఓ యువతి ఏడుస్తూ వాకిట్లో కనిపించింది. లోపలకు పిలిచాను. భర్త వేధింపులు తట్టుకోలేక పుట్టింట్లో ఉన్నానని, అయినా నిఘా పెట్టి వేధిస్తున్నాడని ఆమె చెప్పడంతో లోతుగా విచారణ జరిపి ఆమె భర్తను అరెస్ట్ చేశాం. అలాగే ఓ 80 సంవత్సరాల వృద్ధుడు ఒకటిన్నర సంవత్సరాల బాలికపై దారుణంగా లైంగిక దాడి చేసిన ఘటనలో అతడిని అరెస్టు చేశాము. దిశా పోలీస్టేషన్ డిఎస్పీగా పలువురు మహిళలకు అండగా నిలబడ్డ సంఘటనలు కూడా అనేకం సంతృప్తినిచ్చాయి. ► లాక్డౌన్ సమయంలో గర్భిణి అయి ఉండీ మీరు విధులు నిర్వహించిన విషయాన్ని డిపార్ట్మెంట్లో గొప్పగా చెబుతుంటారు! (నవ్వుతూ..) ఆ సమయంలో గర్భిణిగా ఉండడంతోపాటు ఇంట్లో రెండు సంవత్సరాల కుమార్తె ఉన్నా ఎన్నో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయంలోనూ పని చేశాను. ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ వార్డులు, అనాథల షెల్టర్ ల ఏర్పాట్ల పర్యవేక్షణ, నిర్వహణ నా దేశానికి చేసిన సేవగా భావిస్తున్నాను. ఇక నేను నా విధులను సక్రమంగా నిర్వర్తించగలుగుతున్నానంటే అదంతా నా భర్త ఐఆర్ఎస్ ప్రేమ్కుమార్, కుటుంబ సభ్యుల సహకారం వల్లనే అన్నది నిజం. డీజీపి గౌతమ్ సవాంగ్ నుండి పిసిఆర్ అవార్డు అందుకుంటున్న డిఎస్పీ సుప్రజ తల్లి , తండ్రి, భర్తతో సుప్రజ – కోలుకొండ శ్రీకర్, సాక్షి, గుంటూరు ఈస్ట్ -
మహిళా ఎస్ఐ మానవత్వం
సాక్షి, అమరావతి/కాశీబుగ్గ: మానవత్వం చాటుకున్న మహిళా ఎస్ఐ కె.శిరీషపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఓ అనాథ శవాన్ని తన భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లిన ఆమె ఫొటోలు, వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆ ఫొటోలను ట్విట్టర్, ఏపీ పోలీస్ ఫేస్బుక్ పేజీలలో ట్యాగ్ చేసి, ‘మహిళా ఎస్ఐ.. మానవీయ కోణం’ అంటూ ప్రశంసించారు. ఆమెకు ప్రçశంసపత్రం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. హోం మంత్రి సుచరిత సైతం ట్విట్టర్లో శిరీషకు అభినందనలు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఉన్న అడవి కొత్తూరులోని పంటపొలాల్లో గుర్తు తెలియని వృద్ధుని మృతదేహం ఉన్నట్లు సోమవారం పోలీసులకు సమాచారం అందింది. ఎస్ఐ శిరీష ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల ద్వారా వివరాలు తెలుసుకున్న ఆమె.. ఆ శవాన్ని తరలించేందుకు ముందుకు రావాలని అక్కడున్న వారిని అభ్యర్ధించారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో తనే ముందడుగు వేసి.. వేరొకరి సాయంతో కిలోమీటర్కు పైగా మృతదేహాన్ని మోసుకెళ్లారు. స్థానికంగా ఉన్న లలితా చారిటబుల్ ట్రస్ట్కు మృతదేహాన్ని అప్పగించడమేగాక, ట్రస్ట్ నిర్వాహకులతో కలిసి దహన సంస్కారాలు నిర్వహించారు. -
టీడీపీ దాడులు.. దౌర్జన్యాలు
సాక్షి నెట్వర్క్: పార్టీ రహితంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గొడవలు సృష్టించాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ రహిత ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు ఈ ఎన్నికలకు పార్టీ రంగు పూస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వయంగా బెదిరింపులకు పాల్పడగా పలుచోట్ల మాజీ మంత్రుల అనుచరులు, మాజీ ప్రజాప్రతినిధులు ప్రత్యర్థుల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నారు. అచ్చెన్నాయుడు తన స్వగ్రామం నిమ్మాడలో తమకు పోటీగా ఎవరూ నామినేషన్ వేయకుండా ఫోన్లో బెదిరించడమేగాక ఆయన సోదరుడు, సోదరుడి కుమారుడు, టీడీపీ కార్యకర్తలు ఆదివారం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలంలో ఆదివారం నామినేషన్ కేంద్రాల వద్ద హల్చల్ చేసిన టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు తన కారుతో ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఢీకొట్టిన విషయం విదితమే. వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం బద్రిపల్లెలో ఆదివారం రాత్రి దళితులపై టీడీపీ వర్గీయులు దౌర్జన్యానికి దిగారు. 9వ వార్డు మెంబరు పదవికి నామినేషన్ వేసిన డేగల చంద్రలీల నామినేషన్ ఉప సంహరించుకునేందుకు వీల్లేదంటూ నెర్రవాడకు చెందిన టీడీపీ నాయకులు మాజీ జెడ్పీటీసీ మేకల బాబు, బుర్రి నాగరాజు, టీడీపీ మద్దతుతో బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థి భర్త గుత్తి వీరనారాయణ, మేకల సుదర్శన్ మరో ఐదుగురు తమ మనుషులతో కలసి దళితులపై బెదిరింపులకు పాల్పడుతూ దాడికి యత్నించారు. దీనిపై దళితులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసి, న్యాయం చేయాలంటూ పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. దళిత తహసీల్దార్పై దాడికి యత్నం చిత్తూరు జిల్లా పాకాల తహసీల్దార్ లోకేశ్వరిని టీడీపీ పాకాల మండల మాజీ అధ్యక్షుడు నాగరాజునాయుడు శనివారం ఫోన్లో అంతుచూస్తానంటూ బెదిరించాడు. దళితురాలైన ఆమెను కులం పేరుతో దూషించాడు. అనుచరులతో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆమె మీద, సిబ్బంది మీద దాడికి ప్రయత్నించాడు. తహసీల్దార్ పాకాల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నాగరాజు, మరో ఆరుగురిపై కేసు నమోదు చేశామని, నిందితులు పరారీలో ఉన్నారని పాకాల ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. నిమ్మాడలో జరిగిన దౌర్జన్యకాండలో అరెస్టు చేసిన వారిని కోర్టుకు తరలిస్తున్న పోలీసులు పరిటాల సునీత అనుచరుల బెదిరింపులు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం మాదాపురంలో ‘మాపైనే పోటీ చేస్తావా.. మీ అంతుచూస్తాం’ అంటూ పరిటాల వర్గీయులు వీరంగం చేశారు. సర్పంచి పదవికి నాగరాజు భార్య నిర్మలమ్మ పోటీచేస్తోంది. టీడీపీకి చెందిన మాదాపురం శంకర్ భార్య గంగమ్మ బరిలో ఉన్నారు. సోమవారం గ్రామ వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేస్తుండగా టీడీపీ నాయకుడు మాదాపురం శంకర్ తమ వారికి ఇంతవరకు ఎందుకు పింఛన్లు ఇవ్వలేదని వలంటీర్లపై విరుచుకుపడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానికుడు బోయ నాగేంద్ర సర్దిచెప్పబోయాడు. మాపైనే మీ వదినను పోటీకి నిలుపుతావా? మీ అంతు చూస్తాం.. అంటూ శంకర్ బెదిరించాడు. బాధితులు రామగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిమ్మాడ ఘటనపై ఎస్ఈసీకి ఫిర్యాదు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసేందుకు వెళ్లిన కింజరాపు అప్పన్నతో పాటు ఆయనకు అండగా వెళ్లిన తనపైన కూడా అచ్చెన్నాయుడు వర్గీయులు దాడిచేసి చంపేందుకు ప్రయత్నించారని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జ్ దువ్వాడ శ్రీనివాస్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం కలెక్టరేట్ ప్రాంగణంలో సోమవారం ఆయన నిమ్మగడ్డను కలిశారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని వినతిపత్రం ఇచ్చారు. పరారీలో కింజరాపు హరిప్రసాద్, సురేష్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇలాకా అయిన నిమ్మాడలో ఆదివారం జరిగిన దౌర్జన్యకాండకు సంబంధించి 12 మందిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిమ్మాడ సర్పంచ్ అభ్యర్థిగా అదే గ్రామానికి చెందిన కింజరాపు అప్పన్న నామినేషన్ వేసేందుకు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్తో కలిసి వెళ్లగా.. అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్, ఆయన కుమారుడు సర్పంచ్ అభ్యర్థి సురేష్, ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలంతా బీభత్సం సృష్టించటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం విదితమే. ఈ సంఘటనపై బాధితుడు కింజరాపు అప్పన్న కోట»ొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం సీఐ ఆర్.నీలయ్య, ఎస్ఐ రవికుమార్ నేతృత్వంలో 12 మందిని అరెస్టు చేసి కోటబొమ్మాళి కోర్టుకు తరలించారు. వీరికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ను విధించటంతో అంపోలు జైలుకు తరలించారు. ఘటనలో ప్రధాన సూత్రధారులైన కింజరాపు హరిప్రసాద్, ఆయన కుమారుడు సురేష్ పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని నామినేషన్ కేంద్రం రిటర్నింగ్ అధికారి యు.శ్రీనివాసరావు కూడా కోటబొమ్మాళి ఎస్ఐ రవికుమార్కు ఫిర్యాదు చేశారు. నిమ్మాడ ఘటనలో కేసు నమోదు:డీజీపీ సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నిమ్మాడ పంచాయతీ నామినేషన్ల సందర్భంగా.. నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం, జన సమీకరణ చేసి శాంతిభద్రతల సమస్య సృష్టించడం వంటి వాటిపై కేసు నమోదు చేసినట్టు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ చెప్పారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన పోలీసు ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్తో కలిసి డీజీపీ మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలను రాజకీయాలు చేస్తూ కొందరు నేతలు వివాదాస్పదం చేయడం సరికాదన్నారు. రాజకీయ జోక్యంతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసేవారిని సాంకేతిక పరిజ్ఞానం ఇట్టే పట్టిస్తుందన్నారు. నిమ్మాడలో ఒక అభ్యరి్థకి ఫోన్ చేసి బెదిరించిన ఒక పార్టీ నాయకుడి ఆడియో టేపు లీకవ్వడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఎన్నికల అనంతరమే టీకా వేయించుకోవాలని పోలీసులు నిర్ణయించినట్లు చెప్పారు. డీజీపీతో చర్చల అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎండీ మస్తాన్, గౌరవాధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడుతూ పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా రాజకీయ నేతలు చేస్తున్న విమర్శలు మానాలని కోరారు. -
మహిళా ఎస్సైపై డీజీపీ ప్రశంసలు
సాక్షి, శ్రీకాకుళం: ముక్కూమొహం తెలియని ఓ మృతదేహాన్ని భుజాల మీద మోసి అందరికీ ఆదర్శంగా నిలిచిన మహిళా ఎస్సై శిరీషను డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. ఆపదలో నేనున్నానంటూ వారికి బాసటగా నిలబడిన ఆమెకు ప్రశంసా పత్రాన్ని అందజేయనున్నారు. హోం మంత్రి మేకతోటి సుచరిత సైతం సదరు పోలీసు అధికారిణిని మెచ్చుకున్నారు. శ్రీకాకుళంలో అడవికొత్తూరు గ్రామ పొలాల్లో గుర్తు తెలియని వృద్ధుడు మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహాన్ని మోసేందుకు స్థానికులు నిరాకరించారు. ఈ విషయం తెలుసుకున్న కాశీబుగ్గ మహిళా ఎస్సై శిరీష తానే రెండు కిలోమీటర్లు మోసుకుంటూ వెళ్లి లలితా చారిటబుల్ ట్రస్ట్తో కలిసి అంత్యక్రియలు జరిపించిన విషయం తెలిసిందే. (చదవండి: మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లిన మహిళా ఎస్సై) (చదవండి: డబ్బు.. మద్యం పంపిణీకి చెక్ పెట్టేలా..) Women SI of @POLICESRIKAKULM Carries Homeless Man's Dead Body For 2 kilometres After Villagers Refused to Help in Srikakulam District. Appreciating the humanitarian gesture of Sub inspector Kotturu Sirisha of Kasibugga police station. 👏🏻 pic.twitter.com/53udc8bxoO — Mekathoti Sucharitha (@SucharitaYSRCP) February 1, 2021 -
‘డీజీపీగా ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా’
సాక్షి, విజయవాడ : గత నాలుగు రోజులుగా పోలీసులు పలు ఛాలెంజ్లు ఎదుర్కొంటున్నారని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఫ్రంట్లైన్ సిబ్బందిగా పోలీసులకు వేక్సినేషన్ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు కూడా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశం రావడంతో ఏవిధంగా ముందుకు వెళ్ళాలి అనేదానిపై పోలీసు ఉద్యోగ సంఘాలతో చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎలక్షన్ సెకండ్ ఫేజ్లో సెంటర్లు, ఓటర్లు ఎక్కువ ఉంటారని, పొలీసులు గ్రామస్థాయిలో కచ్చితంగా పనిచేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో వ్యాక్సినేషన్ అనేది కోవిడ్ పోర్టల్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుందని పేర్కొన్నారు. బందోబస్తు పోలీసులు వ్యాక్సినేషన్కు వెళ్ళడానికి వారి ఎలక్షన్ బాధ్యతలు వదిలి వెళ్ళాల్సి వస్తుందని డీజీపీ తెలిపారు. చదవండి: మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లిన మహిళా ఎస్సై ఎన్నికలకు రెండు రోజుల ముందు నుంచి పోలీసులు పనిచేయాల్సి వస్తుందని గౌతమ్ సవాంత్ తెలిపారు. ఎలక్షన్ ఫేజ్లో పోలీసులు ఉండే ప్రాంతం మారిపోతుందున్నారు. రాజ్యాంగ బద్ధమైన విధులు నిర్వహించడానికి తాము వ్యాక్సినేషన్ చేయించుకోవడాన్ని త్యాగం చేస్తాం అని పోలీసు, ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నారన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పోలీసు ఉద్యోగులు తీసుకున్న నిర్ణయానికి తాను గౌరవిస్తున్నానన్నారు. ప్రజా సంక్షేమం ముందు, స్వ ప్రయోజనాలు తరువాత అని నిర్ణయించిన పోలీసు ఉద్యోగులకు డీజీపీగా ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నానని తెలిపారు. ఏపీ పోలీస్ ఒక నిబద్ధతతో పని చేస్తున్నామని పేర్కొన్నారు. పోలీస్ పని చేస్తున్న కొంత మంది రాజకీయ నాయకులు అడుగడుగునా రాజకియం చేస్తున్నారని, టెక్కలిలో సీఐపై దాడి చేసిన వాళ్ళను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కొంతమంది సిస్లో ఉండకూడా.. వెనక ఉండి నడిపిస్తున్నారని తెలిపారు. విచారణ చేస్తున్నామని, ఎలాంటి వారైన వదిలే ప్రసక్తే లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. -
డబ్బు.. మద్యం పంపిణీకి చెక్ పెట్టేలా..
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహానికి చెక్ పెట్టేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) రంగంలోకి దిగింది. డీజీపీ డి.గౌతమ్ సవాంగ్, ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ప్రత్యేక కార్యాచరణ మొదలైంది. రాష్ట్రంలోని 18 పోలీస్ యూనిట్ల పరిధిలో.. ఏఎస్పీల నేతృత్వంలో ఎస్ఈబీ టీమ్లు డబ్బు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు కృషి చేస్తాయి. పోలీస్, ఎక్సైజ్, మైనింగ్ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ స్పెషల్ టీమ్లు ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాయి. రాష్ట్ర స్థాయిలోను, 18 పోలీస్ యూనిట్ల పరిధిలో 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ప్రతి కంట్రోల్ రూమ్లో సీఐ నేతృత్వంలో ఒక ఎస్సై, సిబ్బంది విధులు నిర్వహిస్తారు. డబ్బు, మద్యం పంపిణీకి సంబంధించిన సమాచారాన్ని ప్రజలు కంట్రోల్ రూమ్లకు తెలియజేయవచ్చు. ఈసీఎంఎస్ యాప్తో పర్యవేక్షణ డబ్బు, మద్యం పంపిణీ.. వాటి రవాణాకు సంబంధించిన ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేలా పర్యవేక్షణ చేపట్టేందుకు ప్రత్యేకంగా ఎక్సైజ్ కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈసీఎంఎస్) యాప్ను ఉపయోగిస్తున్నారు. దీంతోపాటు ఆన్లైన్ సిస్టమ్, వాట్సాప్, కంట్రోల్ రూమ్ తదితర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఫిర్యాదులపై ఎంతవరకు చర్యలు తీసుకున్నారు, చర్యలు తీసుకోకపోతే కారణాలేమిటి, దాడులు చేసిన ఫలితాలు తదితర అన్ని వివరాలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. వీటిపై ప్రతిరోజూ ఉదయం రాష్ట్రస్థాయి అధికారులతో మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలోను, జిల్లాల స్థాయిలోను వేర్వేరుగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అనంతరం అన్ని జిల్లాల ఎస్ఈబీ టీమ్లతో టెలీ కాన్ఫరెన్స్లో తక్షణ ఆదేశాలిస్తున్నారు. రంగంలోకి టాస్్కఫోర్స్ టీమ్లు మద్యం, డబ్బు రవాణా, పంపిణీలకు అడ్డుకట్ట వేసేందుకు ఎస్ఈబీ నేతృత్వంలో ప్రత్యేకంగా 12 టాస్్కఫోర్స్ టీమ్లను, ప్రతి జిల్లాలో 10 చొప్పున 180 ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేశారు. వీటితోపాటు ఎస్ఈబీ ప్రత్యేకంగా 130 మొబైల్ పార్టీలతోపాటు పోలీస్, మైనింగ్, ఎక్సైజ్ శాఖలకు చెందిన బృందాలు కూడా ఉంటాయి. మద్యం, డబ్బు రవాణా, పంపిణీకి సంబంధించిన సమాచారాన్ని ఎప్పుటికప్పుడు ఎస్ఈబీకి చేరవేసేలా ఇంటెలిజెన్స్(నిఘా) బృందాలు కూడా పనిచేస్తున్నాయి. 439 చెక్పోస్టులు పొరుగు రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి మద్యం, డబ్బు రవాణా కాకుండా రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. వీటితోపాటు జిల్లాలు డివిజన్ల వారీగా కూడా చెక్పోస్టులు పెట్టారు. ఎస్ఈబీ ప్రత్యేకంగా 50 చెక్పోస్టులను ఏర్పాటు చేయగా, మైనింగ్, ఎక్సైజ్, పోలీస్ శాఖలకు చెందిన మరో 389 చెక్పోస్టులు ఉన్నాయి. మొత్తం 439 చెక్పోస్టులు ఈ ఎన్నికల్లో నిరంతర తనిఖీలు నిర్వహిస్తాయి. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పనిచేస్తున్న స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు(ఎస్పీవోలు) 2,200 మందితోపాటు ఎస్ఈబీ అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ చెక్పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఒక్క రోజే 219 కేసులు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నాం. నామినేషన్లు మొదలైన శుక్రవారం ఒక్క రోజే ఎస్ఈబీ 219 కేసులు నమోదు చేసి 219 మందిని అరెస్ట్ చేసింది. 35 వాహనాలను స్వా«దీనం చేసుకున్నాం. డీజీపీ డి.గౌతమ్ సవాంగ్, ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో రాష్ట్రంలో ఎస్ఈబీ, పోలీస్, ఎక్సైజ్, మైనింగ్ సమన్వయంతో మంచి ఫలితాలు సాధించే దిశగా చర్యలు చేపట్టారు. – పీహెచ్డీ రామకృష్ణ, ఎస్ఈబీ డైరెక్టర్ -
ఆలయాల భద్రతకు అన్ని చర్యలూ తీసుకున్నాం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలోని ఆలయాలన్నీ సర్వే చేసి జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయడం ద్వారా భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. దేవదాయ ధర్మాదాయ శాఖ, రాష్ట్ర దేవాలయాల పాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన సదస్సులో డీజీపీ మాట్లాడారు. అంతర్వేది ఘటన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయన్నారు. ఆలయాల్లో వరుసగా ఘటనలు జరుగుతుండటంతో పోలీస్ విభాగం అప్రమత్తమై.. దేవాలయాల భద్రతకు అన్ని చర్యలూ తీసుకుందని వివరించారు. 13 జిల్లాల్లో ఉన్న 59 వేల ఆలయాలను సర్వే చేసి.. వాటికి జియో ట్యాగింగ్ చేశామని చెప్పారు. 47,734 ఆలయాల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే 23,832 ఆలయాల్లో గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయాల్లో ఘటనలకు సంబంధించి.. 1,893 మందిని విచారించామని తెలిపారు. 198 కేసుల్లో 373 మందిని అరెస్టు చేశామని చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు దేవాలయాలే మూలమన్నారు. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. పాలక మండళ్లు, ఈవోలు చర్చించుకుని ఆలయాల్లో భద్రత ప్రమాణాలను మెరుగుపరచుకోవాలన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆలయాల భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాలని దేవదాయ శాఖ కమిషనర్ అర్జునరావు సూచించారు. గ్రామాలకు దూరంగా ఉన్న ఆలయాలతో పాటు పురాతన ఆలయాలపై తగిన నిఘా ఉంచాలన్నారు. దేవదాయ అడిషనల్ కమిషనర్ రామచంద్రమోహన్ మాట్లాడుతూ.. కార్యనిర్వహణ అ«ధికారులు, పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని ఆలయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలన్నారు. సమావేశంలో పాల్గొన్న డీజీపీ సవాంగ్కు దుర్గగుడి ఈవో సురే‹Ù.. అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. అంతకుముందు డీజీపీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సమావేశంలో ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్, నగర పోలీస్ కమిషనర్ బత్తుల శ్రీనివాసులు, సిట్ అధికారి జీవీజీ అశోక్కుమార్, టెక్నికల్ సర్వీసెస్ డీఐజీ డి.పాల్రాజ్, డీసీపీ విక్రాంత్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.