-
మే 2న సూర్యుడిపై అత్యంత శక్తివంతమైన విస్ఫోటనం
-
అత్యంత ప్రమాదకర పర్యాటక ప్రాంతం ఏది?
కొద్ది రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో పలువురు పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్లాన్ చేసుకుంటున్నారు. అందమైన పర్యాటక ప్రదేశాలకు వెళ్లి, అక్కడి ప్రకృతిని చూడాలని చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. అయితే ప్రపంచంలో అత్యంత ప్రమాదకర పర్యాటక ప్రాంతం కూడా ఉంది. అయితే అది ఎక్కడ ఉంది? ఎందుకు ఆ ప్రాంతం ప్రమాదకరంగా ఉంది? అంటార్కిటికా ఖండం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పర్యాటక ప్రాంతంగా పేరొందింది. దక్షిణ ధ్రువం వద్ద ఉన్న ఈ ఖండంలో బలమైన మంచు గాలులు వీస్తాయి. అంటార్కిటికాలో దాదాపు రెండు కిలోమీటర్ల మందపాటి మంచు పలక విస్తరించి ఉంది. రక్తాన్ని గడ్డకట్టే చలి వాతావరణం ఉన్నప్పటికీ, ఈ ఖండంలో సందర్శించదగిన అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ప్రపంచంలో ఆరు నెలలు పగలు, ఆరు నెలలు రాత్రి ఉండే ఏకైక ప్రదేశం అంటార్కిటికా. ఇక్కడ శీతాకాలం, వేసవికాలం అనే రెండు సీజన్లు మాత్రమే ఉంటాయి. అంటార్కిటికా ఖండంలో వేసవి కాలంలో ఆరు నెలల పాటు పగటి వెలుతురు ఉంటుంది. అయితే చలికాలంలో ఆరు నెలల పాటు ఎక్కడ చూసినా చీకటే కనిపిస్తుంది. అంటార్కిటికా ఖండంలోని ఎత్తైన శిఖరం పేరు విన్సన్ రేంజ్. దాదాపు 4,892 మీటర్ల ఎత్తు ఉన్న ఈ శిఖరాన్ని విన్సన్ మాసిఫ్ అని కూడా పిలుస్తారు. పద్మశ్రీ డాక్టర్ అరుణిమ సిన్హా ఈ పర్వత శిఖరంపై భారత జెండాను ఎగురవేశారు. ఈ శిఖరం పర్వతారోహకులను అమితంగా ఆకర్షిస్తుంది. అంటార్కిటికాలో సౌత్ షెట్లాండ్ ద్వీపం ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది. సౌత్ షెట్లాండ్ దీవుల్లోని పరిశోధనా కేంద్రాలకు వివిధ దేశాల నుంచి పరిశోధకులు వస్తుంటారు. ఈ ఖండంలో డ్రేక్ పాసేజ్, ఫాక్లాండ్ దీవులు, దక్షిణ జార్జియా వంటి అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రయాణించడాన్ని పర్యాటకులు సాహసంగా పరిగణిస్తారు. అంటార్కిటికా ఖండాన్ని సందర్శించడానికి వేసవి కాలం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. -
‘ఇస్రో’ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి
సాక్షి, బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. వాతావరణ రంగంలో సేవలందించేందుకు గాను జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ సాయంతో ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. ఈ ప్రయోగం విజయవంతమైంది. ప్రయోగంలో భాగంగా ఇన్శాట్-3డీఎస్లోని 6-ఛానల్ ఇమేజర్, 19-ఛానల్ ఇమేజర్ భూ చిత్రాలను తీసింది. ఆ చిత్రాల సాయంతో దేశ వాతావరణ పర్యవేక్షణ, అంచనా సామర్థ్యాలను గుర్తించేందుకు ఉపయోగపడతాయి.ఇన్శాట్-డీఎస్ తీసిన చిత్రాలు వాతావరణ అంచనా, వాతావరణ పర్యవేక్షణ, వాతావరణ పరిశోధనల కోసం కీలకమైన డేటాను అందించడానికి ఉపయోగపడతాయని ఇస్త్రో ప్రకటించింది. 6-ఛానల్ ఇమేజర్ భూమి ఉపరితలం, వాతావరణ చిత్రాలను ఒడిసిపట్టింది. ఈ చిత్రాల సాయంతో భూమి ఉపరితల ఉష్ణోగ్రత, వృక్ష ఆరోగ్యం, నీటి ఆవిరి పంపిణీ వంటి వివిధ వాతావరణ, ఉపరితలాల సమాచారాన్ని సేకరించడానికి వీలవుతుంది. 19-ఛానల్ ద్వారా సేకరించే చిత్రాల సాయంతో భూమి వాతావరణం ద్వారా విడుదలయ్యే రేడియేషన్ను వివిధ వాతావరణ భాగాలు, నీటి ఆవిరి, ఓజోన్, కార్బన్ డయాక్సైడ్, ఇతర వాయువుల వంటి లక్షణాల ద్వారా విడుదలయ్యే రేడియేషన్ గురించి తెలుసుకునేందుకు సహా పడతాయి. -
భూమి అంతానికి నాలుగు కారణాలు!
పుట్టిన ప్రతీదీ గిట్టక తప్పదని అంటారు. ఈ సృష్టిలో ఉద్భవించిన భూమి కూడా ఏదో ఒకరోజు అంతమవుతుందని చెబుతుంటారు. మరి భూమి ఎప్పుడు అంతమవుతుంది? ప్రస్తుతం భూమిపై నెలకొన్ని విపత్కర వాతావరణ పరిస్థితులు భూమి అంతానికి దారి తీస్తున్నాయా? దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ‘సూపర్ ఖండం’తో పెనుముప్పు గడచిన 500 మిలియన్ సంవత్సరాలలో మన గ్రహం లెక్కలేనన్నిసార్లు భారీ ప్రళయాలను చవిచూసింది. ఆయా ప్రళయకాలాల్లో భూమిపై ఉన్న జాతులలో 90 శాతం జాతులు అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ఈ ప్రళయాలు ‘సూపర్ కాంటినెంట్’ ఏర్పడేందుకు దారితీస్తున్నాయి. రాబోయే 250 మిలియన్ సంవత్సరాలలో భూ ఖండాలు మళ్లీ కలిసి ‘పంగియా అల్టిమా’ అని పేరుతో ‘సూపర్ ఖండం’గా ఏర్పడతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది భూమధ్యరేఖకు సమీపంలో ఉంటుంది. అలాగే ఇది అత్యంత వేడి ఖండంగా ఉండబోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటన్లోని లీడ్స్ యూనివర్శిటీ, యూఎస్లోని నార్త్వెస్టర్న్ యూనివర్శిటీకి చెందిన పలువురు శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం ప్రకారం ‘పాంగియా అల్టిమా’ పరిస్థితులు క్షీరదాల మనుగడకు ప్రతికూలంగా మారనున్నాయి. మనుగడ కోసం పోరాటంలో.. అమరత్వం అనేది కథల వరకే పరిమితం. అంతరించిపోవడం అనేది కాదనలేని సత్యం. జీవ పరిణామక్రమంలో వివిధ జాతుల మనుగడ కోసం ఒత్తిళ్లు పెరుగుతాయి. జన్యు ఉత్పరివర్తనలు సంభవించినప్పుడు పలు సమస్యలు తలెత్తుతాయి. కొన్ని ఉత్పరివర్తనలు ఒక నిర్దిష్ట సమయంలో జీవిపై ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నా, మనుగడ సాగించడానికి ప్రయోజనకరంగానే ఉంటాయి. ఆ జన్యువులు తరువాతి తరానికి తరలే అవకాశం ఉంది. వైవిధ్యం, అనుకూలత అనేవి జీవులు జీవించడానికి కావాల్సిన లక్షణాలు. తక్కువ వైవిధ్యం, అననకూల పరిస్థితులు ఉన్పప్పుడు మానవ జనాభా అంతరించిపోయే అవకాశం ఉంది. పరిమిత వనరుల మధ్య.. భూమిపై వనరులు పరిమితం అవుతుండటానికి తోడు అణు, రసాయన, జీవ ఆయుధాలు, అంతుచిక్కని వ్యాధులు మొదలైనవి మానవ మనుగడకు ముప్పుగా మారనున్నాయి. ఇదేవిధంగా భారీ గ్రహశకలాల దాడి కూడా భూమి అంతరించిపోయేందుకు కారణం కావచ్చు. అలాంటి సంఘటన సంభవించినా, సంభవించకున్నా ఏదో రూపంలో మానవాళికి ముప్పు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. భౌగోళిక, ఖగోళ పరిశోధన ఫలితాల ప్రకారం చూస్తే, ఈ విపత్తు సమీపంలోనే ఉందనే అంచనాలున్నాయి. వేడెక్కుతున్న మహాసముద్రాలు వేడెక్కుతున్న వాతావరణం కారణంగా మహాసముద్రాలు వేడెక్కుతున్నాయి. ఇవి భూమి మనుగడకు మప్పుగా పరిణమిస్తున్నాయి. అమెరికన్ శాస్త్రవేత్తల పరిశోధనలో 580 అమెరికన్, 216 సెంట్రల్ యూరోపియన్ నదుల డేటాతో వర్షపాతం, నేల రకం, సూర్యకాంతి తదితర అంశాలను పరిశీలించారు. భవిష్యత్తులో నదులలో ఆక్సిజన్ తగ్గే ఆక్సిజన్ రేటు జీవ వ్యవస్థకు ప్రమాదకరంగా పరిణమించనుంది. అధ్యయనంలోని శాంపిల్స్ రాబోయే 70 సంవత్సరాలను అంచనా వేశాయి. తక్కువ ఆక్సిజన్ కారణంగా కొన్ని జాతుల చేపలు పూర్తిగా అదృశ్యమవుతాయి. దీని వల్ల జల వైవిధ్యానికి భారీ నష్టం వాటిల్లుతుంది. మానవులతో సహా అనేక జాతుల మనుగడకు ఇది పెను ముప్పుగా పరిణమించనుంది. -
చండ ప్రచండ మార్తాండ!
భగభగలాడే భానుడిపై ఓ నల్ల మచ్చ... తొలిసారి ఈ నెల 18న కనిపించింది... భయం పుట్టించేలా అది నేరుగా భూమికేసి కసిగా చూస్తోంది.... వారం రోజుల క్రితం తన నోట్లోంచి భూమి వైపు మూడు సౌరజ్వాలల్ని కక్కింది. దాంతో హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగింది. అదృష్టవశాత్తు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ లేకపోవటంతో పెద్దగా నష్టం సంభవించలేదు. తర్వాత ఫిబ్రవరి 24-26 తేదీల మధ్యకాలంలో కేవలం రెండు రోజుల్లోనే ఇంతింతై అన్నట్టు... ఆ మచ్చ సైజు అమాంతంగా 25% పెరిగిపోయింది. .. తొమ్మిదిన్నర భూగ్రహాల వైశాల్యానికి సరిపోయేంతగా ఆ సన్ స్పాట్ విస్తరించింది. 2019లో మొదలైన ప్రస్తుత 25వ సౌరచక్రంలో సూర్యుడిపై ఇదే అతి పెద్ద మచ్చగా అవతరించింది. దీని పేరు ‘ఏఆర్3590’. ఏఆర్ అంటే యాక్టివ్ రీజియన్. సూర్యుడిపై క్రియాశీల ప్రాంతం. భూమికి పొంచి వున్న ముప్పు దృష్ట్యా సన్ స్పాట్ ఏఆర్3590 ప్రస్తుతం ఖగోళ శాస్త్రవేత్తల దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది. ఎందుకంటే సూర్యుడి అంతర్గత స్వరూపంలో గణనీయ మార్పులు వస్తున్నాయి. సూర్యుడిపై నల్ల మచ్చలు మామూలే. సౌరజ్వాలలకు పుట్టినిల్లయిన ఈ మచ్చలు అంతరిక్ష వాతావరణం, సౌరవ్యవస్థలోని గ్రహాలపై ప్రభావం చూపుతాయి. సూర్యుడి ఉపరితలంపై భారీ వైశాల్యంలో ఏర్పడే ఈ మచ్చల అయస్కాంత క్షేత్రం... భూ అయస్కాంత క్షేత్రం కంటే 2,500 రెట్లు శక్తిమంతం. లోలోన సూరీడు బాగా క్రియాశీలంగా ఉన్నచోట ఈ సన్ స్పాట్స్ ద్యోతకమవుతాయి. తమ పరిసర ప్రాంతాలతో పోలిస్తే వీటిలో ఉష్ణోగ్రతలు తక్కువ. Photo Credits: thesuntoday అయినప్పటికీ ఈ మచ్చల్లో 3,600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక మచ్చల సంఖ్య మాత్రం 11 ఏళ్ల సౌరచక్రాన్ని అనుసరించి మారుతుంది. సౌరచక్రంలో ఇప్పుడు మనం ముప్పు ముంగిట ఉన్నాం. గణించడం ఆరంభమయ్యాక ప్రస్తుతం 25వ సౌరచక్ర ప్రక్రియ కొనసాగుతోంది. మానవాళిని ఇబ్బంది పెట్టకుండా 24వ సౌరచక్రం ప్రశాంతంగా పూర్తయింది. 25వదీ సాఫీగా అలాగే ఉంటుందని శాస్త్రవేత్తలు ఊహించారు. కానీ తమ అంచనాలను మించి శక్తిమంతంగా కనిపిస్తున్న ఈ 25వ సౌరచక్రం భూమికి అనర్థాలు, చిక్కులు తెచ్చిపెడుతుందేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల సూర్యుడిపై మచ్చలు తరచూ ఏర్పడటం, వాటి సైజు పెరుగుతుండటం, తీవ్ర సౌర తుపాన్లు చోటుచేసుకోవడం గమనిస్తుంటే సూర్యుడు తన తాజా 11 ఏళ్ల సౌరచక్రంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడని, మహోగ్ర విస్ఫోట దశను వేగంగా సమీపిస్తున్నాడని తెలుస్తోంది. తాము గతంలో ఊహించిన దాని కంటే చాలా ముందుగానే, బహుశా 2024 జూన్ మాసం ముగిసేలోపే ‘చండ మార్తాండ’ (సోలార్ మాగ్జిమమ్/సౌర గరిష్ఠం) దశ సంభవిస్తుందని శాస్త్రవేత్తల అంచనా. భూమిపై ఇది ఏ ఉత్పాతాలకు దారితీస్తుందో, ఏ ఉపద్రవాలు తెచ్చిపెడుతుందోనని వారు కలవరపడుతున్నారు. ఈ ఉగ్ర రూపం అనంతరం సూర్యుడు మళ్లీ నెమ్మదిస్తాడు. విశేషమేంటంటే... సోలార్ మాగ్జిమమ్ లేదా ‘పీక్ స్టేజి’ సమాప్తమైందనే సంగతి... అది ముగిసిన ఆరు నెలల దాకా శాస్త్రవేత్తలకు తెలియదు! Photo Courtesy: NASA/SDO, AIA, EVE, HMI Science Teams ఏఆర్3590తో ప్రమాదమే! సూర్యుడు లోపల్లోపల తీవ్రంగా ప్రజ్వలిస్తాడు. తన ఉపరితలంపై కొన్ని చోట్ల అకస్మాత్తుగా విస్ఫోటిస్తాడు. అప్పుడు ఆయా ప్రాంతాల నుంచి ఒక్కసారిగా హెచ్చు మొత్తంలో విద్యుదయస్కాంత వికిరణం విడుదలవుతుంది. ఇవే సౌరజ్వాలలు (సోలార్ ఫ్లేర్స్). ఈ జాజ్వల్యమాన ధగధగలు సూర్యుడిపై ప్రకాశవంతంగా గోచరిస్తాయి. సోలార్ ఫ్లేర్ ప్రక్రియ కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటలపాటు కొనసాగవచ్చు. తీవ్రత ఆధారంగా ‘సోలార్ ఫ్లేర్స్’ను X, M, C, B, A అంటూ అవరోహణ క్రమంలో ఐదు రకాలుగా వర్గీకరించారు. వీటిలో X రకం ఫ్లేర్స్ మహా శక్తిమంతం, భూమికి హానికరం. బలహీనపు A, B సౌరజ్వాలల ప్రభావం స్వల్పం. సన్ స్పాట్ ఏఆర్3590 ఫిబ్రవరి నెల 21న రెండు X రకం సౌరజ్వాలలను వెదజల్లింది. X1.7 తీవ్రతతో ఓసారి, X1.8 తీవ్రతతోమరోసారి రెండు సౌరజ్వాలలను భూమి దిశగా ఎగజిమ్మింది. మర్నాడు 22వ తేదీన X6.3 తీవ్రతతో ఇంకో సౌరజ్వాలను వదిలింది. 2017లో X8.2 తీవ్రతతో విడుదలైన సోలార్ ఫ్లేర్ తర్వాత గత ఆరేళ్ల కాలంలో జనించిన అతి తీవ్ర ఫ్లేర్ ఇదే. పై 3 ఫ్లేర్స్ తర్వాత రెండు బలహీన M క్లాస్ జ్వాలలను కూడా సన్ స్పాట్ ఏఆర్3590 వెలువరించింది. ఈ మచ్చలోని అస్థిర బీటా-గామా-డెల్టా అయస్కాంత క్షేత్రంలో మరిన్ని X రకం సౌరజ్వాలలకు కావాల్సిన శక్తి ఉండవచ్చని, మరో X రకం మహా సౌరజ్వాల కోసం అది శక్తిని సమీకరిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ రూపంలో భూమికి ముప్పు తొలగిపోలేదని హెచ్చరిస్తున్నారు. సౌరచక్రంలో అయస్కాంత ధ్రువాల మార్పిడి సూర్యుడిలో 11 ఏళ్లకోసారి సౌరచక్రం గిర్రున తిరుగుతుంది. ఈ కాలచక్ర మధ్యంలో సౌరక్రియ గరిష్ఠ స్థితిని సంతరించుకునే ‘సోలార్ మాగ్జిమమ్’ దశ సందర్భంగా సూర్యుడి అయస్కాంత క్షేత్రం దాని అయస్కాంత ధ్రువాలను తారుమారు చేస్తుంది. రెండు అయస్కాంత క్షేత్రాలు పరస్పరం మారతాయి. అటుదిటు, ఇటుదటు అవుతాయి. అలా ఉత్తర అయస్కాంత ధ్రువం కాస్తా దక్షిణ అయస్కాంత ధ్రువంగా మారిపోతుంది. ఈ మార్పిడి జరిగేవరకు సూర్యుడు అంతకంతకూ ఉత్తేజితమవుతాడు. అనుక్షణం క్రియాశీలమవుతాడు. సౌరమచ్చలు, జ్వాలలు, సీఎంఈలు పుట్టుకొస్తాయి. ఈ ప్రక్రియ తర్వాత సూర్యుడు నెమ్మదిస్తాడు. మెల్లగా సౌర కనిష్ఠం లేదా సోలామ్ మినిమమ్ దశకు చేరతాడు. ఇదొక చక్రం. కరోనల్ మాస్ ఎజెక్షన్స్.. సౌర తుపాన్లు! ‘కరోనా’ అనేది అత్యంత వేడితో కూడిన సౌర ధూళికణాలతో (ప్లాస్మా) నిండివుండే సూర్యుడి అతి బాహ్య పొర. X, M రకాల సౌర ప్రజ్వలనాలు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ (సీఎంఈ)కు కారణమవుతాయి. కరోనా నుంచి ప్లాస్మా, విద్యుదయస్కాంత వికిరణం భారీగా విడుదలై భూ అయస్కాంత క్షేత్రంలోకి చొరబడి దుష్ప్రభావం చూపుతాయి. ‘నార్తర్న్ లైట్స్’గా పిలిచే ‘అరోరాలు’ సాధారణంగా ధ్రువాల వద్దనే కనిపిస్తాయి. కానీ సీఎంఈల వల్ల తలెత్తే భూ అయస్కాంత తుపాన్లు... భూమధ్యరేఖ వద్ద ‘అరోరా’లను సృష్టిస్తాయి. 1989 మార్చిలో భూమిని తాకిన ఓ కరోనల్ మాస్ ఎజెక్షన్ వల్ల కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్ అంతటా 9 గంటలపాటు విద్యుత్ వ్యవస్థ కుప్పకూలి 60 లక్షల మంది ఇబ్బందిపడ్డారు. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వేళల్లో ఆవేశిత శక్తి కణాలు అతి వేగంగా ప్రయాణిస్తాయి. వీటి వల్ల పవర్ గ్రిడ్స్ కుప్పకూలతాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తగలబడతాయి. జీపీఎస్ నేవిగేషన్ వ్యవస్థలు అస్తవ్యస్తమై నౌకలు, విమానాల రాకపోకలు, ఇతర ప్రజా రవాణా వ్యవస్థలు స్తంభిస్తాయి. టెలిఫోన్, కంప్యూటర్, కమ్యూనికేషన్, ఇంధన పంపిణీ-పైపులైన్ వ్యవస్థలు పాడవుతాయి. ఆ సమయాల్లో సౌరతుపాను గండం గడిచేదాకా ఉపగ్రహాల్ని స్విచాఫ్ చేస్తారు. లేకపోతే అవి శలభాల్లా మాడిపోతాయి. పిట్టల్లా రాలి భూమిపై పడతాయి. లక్షల కోట్ల ఆస్తినష్టం జరుగుతుంది. ఇక వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) వెలుపలి కార్యక్రమాల్లో పాల్గొనకుండా కేంద్రంలోని సురక్షిత స్థానాల్లోకి వెళ్లిపోతారు. X, M రకాల సౌర ప్రజ్వలనాల కారణంగా... భూ వాతావరణంలో రేడియో తరంగాలు ప్రయాణించే ‘దిగువ అయనోస్ఫియర్’లో ఎలక్ట్రాన్ల సాంద్రత తీవ్రమవుతుంది. దాంతో రేడియో తరంగాల శక్తి క్షీణించి అవి పై పొరల్లోకి ప్రయాణించలేవు. సూర్యకాంతి 8 నిమిషాల్లో భూమిని చేరుతుంది. సోలార్ ఫ్లేర్స్ నుంచి చొచ్చుకొచ్చే సౌర ధార్మికత కూడా అదే కాంతి వేగంతో భూమిని తాకుతుంది. ఇక కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఫలితంగా వందల కోట్ల టన్నుల కరోనల్ ప్లాస్మా వెదజల్లబడుతుంది. సీఎంఈ వేగం సెకనుకు 250 కిలోమీటర్ల నుంచి 3 వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది. వేగవంతమైన కరోనల్ మాస్ ఎజెక్షన్ 15-18 గంటల్లో భూమిని చేరుతుంది. కారింగ్టన్ ఈవెంట్... అతి పెద్ద సౌర తుపాను! 1860లో సోలార్ మాగ్జిమమ్ దశకు కొన్ని నెలల ముందు 1859 సెప్టెంబరులో ఓ సౌర తుపాను సంభవించింది. చరిత్రలో రికార్డయిన అతి పెద్ద సౌర తుపాను ఇదే. 1859 ఆగస్టులో సూర్యబింబంలో నల్లమచ్చల సంఖ్య పెరిగిపోవతాన్ని ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు ఆసక్తిగా తిలకించారు. లండన్ సమీపంలోని రెడ్ హిల్ పట్టణానికి చెందిన ఔత్సాహిక వీక్షకుడు రిచర్డ్ కారింగ్టన్ కూడా వారిలో ఒకరు. 1859 సెప్టెంబరు 1న సౌరమచ్చల్ని ఆయన చిత్రీకరిస్తుండగా అకస్మాత్తుగా తెల్లటి కాంతి తళుక్కున మెరిసింది. అది 5 నిమిషాలు అలాగే ఉంది. నిజానికి అది కరోనల్ మాస్ ఎజెక్షన్. ఈ ఘటనకు ఆయన గౌరవార్థం ‘కారింగ్టన్ ఈవెంట్’ అని పేరు పెట్టారు. ఆ కరోనల్ మాస్ ఎజెక్షన్ సూర్యుడి నుంచి 15 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని 17.6 గంటల్లో ప్రయాణించి భూమిని చేరుకుంది. కారింగ్టన్ ఈవెంట్ తర్వాత మర్నాడు జియోమాగ్నెటిక్ తుపానుకు టెలిగ్రాఫ్ వ్యవస్థలు మొరాయించాయి. కొన్ని చోట్ల టెలిగ్రాఫ్ లైన్లపై అధిక విద్యుత్ ప్రసారమై టెక్నీషియన్లు కరెంటు షాక్ కు గురవగా ఇంకొన్ని చోట్ల టెలిగ్రాఫ్ సాధన సంపత్తి దగ్ధమైంది. నాటి ‘కారింగ్టన్ ఈవెంట్’కు కారణమైన నలమచ్ఛతో పోలిస్తే నేటి ఏఆర్3590 సన్ స్పాట్ సైజు 60%గా ఉంది. గ్రహణాల సమయంలో సూర్యుడిని వీక్షించడానికి వాడే సురక్షిత కళ్ళద్దాలు మన చెంత ఉంటే ఈ మచ్చను నేరుగా చూడొచ్చు. :::జమ్ముల శ్రీకాంత్ -
NASA: సౌర రేడియేషన్తో పెనుముప్పు
అంతరిక్షం నుంచి వెలువడే ప్రమాదకర సౌర రేడియేషన్ను భూమి అధికంగా శోషించుకుంటోందని దాంతో వాతావరణంలో మార్పులు, విపత్తులు సంభవిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. నాసా తాజా డేటాను విశ్లేషించి సౌర రేడియేషన్ గురించి వారు కీలక విషయాలు వెల్లడించారు. 2000 సంవత్సరం నుంచి 2023 డిసెంబర్ దాకా డేటాను వారు పరిగణనలోకి తీసుకున్నారు. రేడియేషన్ను భూమి శోషించుకోవడం అనేది సంవత్సరమంతా ఒకేతీరుగా లేదని, కొన్నిసార్లు ఎక్కువ స్థాయి, మరికొన్నిసార్లు తక్కువ స్థాయిలో నమోదైనట్లు గుర్తించారు. 2023లో ఫిబ్రవరి, మార్చి, డిసెంబర్లో అధికంగా సోలార్ రేడియేషన్ను భూమి గ్రహించిందని వెల్లడించారు. గత ఏడాది జనవరిలో స్వల్పంగా పెరిగిన రేడియేషన్ ఫిబ్రవరిలో చదరపు మీటర్కు 3.9 వాట్లు, మార్చిలో చదరపు మీటర్కు 6.2 వాట్లుగా నమోదైందని తెలియజేశారు. 2000 సంవత్సరం నాటి గణాంకాలతో పోలిస్తే 2023లో సౌర రేడియేషన్ను భూమి శోషించుకోవడం ఎన్నో రెట్లు పెరిగినట్లు తేల్చారు. ఇది ఇంకా పెరగడమే తప్ప తగ్గే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. దీనివల్ల భూగోళంపై శక్తి సమతుల్యతలో మార్పులు వస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇదంతా భూవాతావరణంలో ఉష్ణోగ్రతల పెరుగుదల, వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు, మంచు కరిగిపోవడం, సముద్ర మట్టాలు పెరగుదల వంటి పరిణామాలకు దారి తీస్తున్నట్లు స్పష్టం చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘కూల్ ఎర్త్’ పేరుతో భూమికే గొడుగు పట్టనున్న శాస్త్రవేత్తలు!
ప్రపంచవ్యాప్తంగా భూతాపం ప్రభావం చూపుతోంది. కొన్నేళ్లుగా చాలాప్రాంతాల్లో వేసవులు మరింతగా నిప్పులు చెరుగుతున్నాయి. శీతకాలాలు నులివెచ్చగా మారుతున్నాయి. భూతాపం నియంత్రణ లేకుండా పెరుగుతూపోతే, భవిష్యత్తులో భూమ్మీద జీవరాశి మనుగడ ప్రశ్నార్థకమే అవుతుంది. పరిస్థితి ఆ స్థాయికి దిగజారిపోక ముందే భూతాపాన్ని అదుపులోకి తేవడానికి శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా నిర్విరామంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఎండ ధాటిని తగ్గించడానికి ఏకంగా పుడమికే గొడుగు పట్టడానికి సన్నాహాలు ప్రారంభించారు. శాస్త్రవేత్తలు పుడమికి గొడుగు పట్టగలిగితే, దాని ఫలితంగా భూమ్మీద వేడి తీవ్రత చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. వేసవి తీవ్రత భరించగలిగే స్థాయికి పరిమితమవుతుంది. పుడమికి గొడుగు పట్టడంతో పాటు భూతాపాన్ని తగ్గించడానికి శాస్త్రవేత్తలు మరికొన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఎంత త్వరగా ఫలిస్తే, రానున్న వేసవులు అంత త్వరగా చల్లబడే అవకాశాలు ఉంటాయని ఆశించవచ్చు. భూతాపం తగ్గించడానికి ప్రస్తుతం శాస్త్రవేత్తలు సాగిస్తున్న వినూత్న, విలక్షణ ప్రయోగాలపై ఒక విహంగవీక్షణం... భూతాపం పెరుగుదలకు గల కారణాలను శాస్త్రవేత్తలు ఇదివరకే గుర్తించారు. భూతాపం పెరుగుదలకు కారణమవుతున్న అంశాలను నియంత్రణలోకి తీసుకొస్తే భూతాపం అదుపులోకి వస్తుందని వారి అంచనా. అయితే, భూతాపం పెరుగుదలకు కారణమవుతున్న అంశాలను నియంత్రణలోకి తీసుకురావడమే పెను సవాలుగా నిలుస్తోంది. విచ్చలవిడిగా వాతావరణంలోకి చేరుతున్న కర్బన ఉద్గారాలు, అడవుల నరికివేత, వాహనాల వినియోగంలో పెరుగుదల, వనరుల అతి వినియోగం వంటివి భూతాపం పెరుగుదలకు దారి తీస్తున్నాయి. వీటిని నియంత్రించడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నా, సాధ్యం కావడంలేదు సరికదా, ఇవన్నీ నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. అందుకే శాస్త్రవేత్తలు ఏకంగా పుడమికి గొడుగు పట్టాలనే నిర్ణయానికి వచ్చారు. మన తల మీద గొడుగు నీడ ఉంటే, ఎండ వేడి తీవ్రత నేరుగా నెత్తిమీద పడకుండా ఉన్నట్లే, అంతరిక్షం నుంచి భూమికి గొడుగు పడితే, దాని నీడ వల్ల భూమ్మీద వేడి తీవ్రత గణనీయంగా తగ్గి, మనుషులకు వేసవి కష్టాలు కొంతవరకైనా తీరగలవని అంచనా వేస్తున్నారు.గొడుగు నీడతో పుడమికి చల్లదనం సాధ్యమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమ్మీద ఒక చదరపు మైలు (2.589 చదరపు కిలోమీటర్లు) విస్తీర్ణంలో నీడ కల్పించగలిగితే, రెండేళ్ల వ్యవధిలోనే ఏకంగా 2.7 డిగ్రీల ఫారెన్హీట్ (–16.27 డిగ్రీల సెల్సియస్) మేరకు ఉష్ణోగ్రతను తగ్గించగలమని ఇజ్రాయెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పుడమికి గొడుగు పట్టే ప్రయత్నంలో తొలుత ప్రయోగాత్మకంగా వంద చదరపు అడుగుల నమూనాను అంతరిక్షంలోకి పంపాలని ఇజ్రాయెలీ శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. దీనికి 20 మిలియన్ డాలర్లు (రూ.166.17) కోట్లు ఖర్చు కాగలవని, 2027 నాటికి వంద చదరపు అడుగుల నమూనా గొడుగును అంతరిక్షంలోకి పంపగలమని వారు చెబుతున్నారు. ధరిత్రీ ఛత్రవిలాసం ఇజ్రాయెలీ శాస్త్రవేత్తలు ఈ గొడుగు వివరాలను మీడియాకు వెల్లడించారు. భూతాపాన్ని తగ్గించే దిశగా భూమికి శాశ్వతమైన నీడ కల్పించాలని వారు భావిస్తున్నారు. ‘కూల్ ఎర్త్’ ప్రాజెక్ట్ పేరుతో చేపడుతున్న ఈ ప్రయోగంలో భాగంగా తొలుత చేపట్టనున్న వంద చదరపు అడుగుల నమూనా గొడుగు ప్రయోగం విజయవంతమైతే, ఆ తర్వాత త్వరలోనే దాదాపు అర్జెంటీనా దేశం విస్తీర్ణంతో సమానమైన (దాదాపు 27.8 లక్షల చదరపు కిలోమీటర్లు) అతిపెద్ద గొడుగును అంతరిక్షంలోకి పంపి, అక్కడి నుంచి భూమికి శాశ్వతంగా నీడ కల్పించాలనుకుంటున్నారు. దీనికయ్యే ఖర్చు కొన్ని లక్షల కోట్ల డాలర్ల మేరకు ఉండవచ్చని వారి అంచనా. ‘అంతరిక్షంలో ఇలాంటి భారీ నిర్మాణాలను ఏర్పాటు చేయాలంటే, అందుకు ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. ఇలాంటి ప్రయోగాల కోసం రక్షణ శాఖ బడ్జెట్ నుంచి, అంతర్జాతీయ సహకారం నుంచి నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రయోగానికి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 3 మిలియన్ డాలర్లు (రూ.24.92 కోట్లు) ఇప్పటికే ఇచ్చారు. భూమిపై సూర్యకాంతి తక్కువగా పడేలా చేసే ప్రయోగాలకు బాసటగా ఉంటామని గత ఏడాది అమెరికా అధ్యక్షుడు కూడా ప్రకటించారు’ అని ఇజ్రాయెలీ శాస్త్రవేత్త అవీ లోయబ్ తెలిపారు. అంతరిక్షంలోకి ఎలా చేరవేస్తారంటే.. ఈ గొడుగును సౌరశక్తితో పనిచేసే వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి చేరవేస్తారు. తక్కువ బరువు కలిగిన ‘సోలార్ సెయిల్స్’తో రూపొందిన ఈ గొడుగును మొదటి ల్యాగ్రేంజ్ పాయింట్ (ఎల్1) వద్ద నిలిచేలా చేస్తారు. ఈ ప్రదేశంలో భూమి, సూర్యుడి ఆకర్షణ వికర్షణ శక్తులు గరిష్ఠ స్థాయిలో ప్రభావం చూపుతాయి. ఈ ప్రదేశంలో గొడుగును నిలిపి ఉంచడం ద్వారా భూమి ఉపరితలంపై ఎక్కువభాగంలో నీడ పడుతుంది. భూమి నుంచి ఈ ఎల్1 పాయింట్ 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుంచి భూమి ఉపరితలంపై ఎక్కువ ప్రదేశంలో నిరంతరాయంగా పలచని నీడ పడుతుండటం వల్ల భూతాపం గణనీయంగా తగ్గుతుంది. ఇజ్రాయెలీ శాస్త్రవేత్తలు ప్రస్తుత అంచనాల మేరకు ఈ గొడుగును సకాలంలో అంతరిక్షంలోకి పంపకుంటే మాత్రం ఈ ప్రాజెక్టు ఖర్చు ఊహాతీతంగా పెరిగే ప్రమాదం ఉందని కూడా కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. ‘ఇప్పటికి అనుకుంటున్న సమయంలోగా ఈ భారీ గొడుగును అంతరిక్షంలోకి పంపకుంటే, ఈ ప్రాజెక్టు ఖర్చు చుక్కలను తాకే అవకాశం ఉంది. ఇది ఆర్థిక వ్యవస్థలకు పెనుభారంగా మారే అవకాశం కూడా ఉంది’ అని ఫ్రాన్స్లోని యూరోపియన్ సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ అడ్వాన్స్డ్ ట్రెయినింగ్ ఇన్ సైంటిఫిక్ కంప్యూటింగ్కు చెందిన పరిశోధకురాలు సూజన్ బోయెర్ వ్యాఖ్యానించారు. ఈ భారీ ప్రయోగానికి జరిగే ఖర్చు గురించి మాత్రమే కాదు, ఈ అంశంలో శాస్త్రవేత్తలకు మరికొన్ని భయాలు కూడా ఉన్నాయి. ఈ గొడుగును అంతరిక్షంలో ఎల్1 పాయింట్ వద్ద సుదీర్ఘకాలం స్థిర కక్ష్యలో నిలిపి ఉంచడం ఎంతవరకు సాధ్యమనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతరిక్షంలో అదుపు తప్పే గ్రహశకలాలు తాకినా, సౌర తుఫానులు చెలరేగినా ఈ గొడుగు దెబ్బతినే అవకాశాలు లేకపోలేదని, అప్పుడు లక్షల కోట్ల ఖర్చుతో చేపట్టిన ఈ ప్రయోగం వృథా అవుతుందని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. సముద్రాల్లో నాచు పెంపకం.. భూతాపం పెరుగుదల భూభాగానికి మాత్రమే పరిమితం కావడం లేదు. భూతాపం ప్రభావానికి సముద్రాలు కూడా వేడెక్కుతున్నాయి. సముద్రాలలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం పెరుగుదల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తుతోందని గుర్తించిన శాస్త్రవేత్తలు సముద్రాలను చల్లబరచేందుకు కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే సముద్రాల ఉపరితల వాతావరణంలోకి మితిమీరి చేరిన కార్బన్ డయాక్సైడ్ను తొలగించడానికి ‘ఓషన్ ఫర్టిలైజేషన్’ వంటి ప్రక్రియలను ప్రారంభించారు. ‘ఓషన్ ఫర్టిలైజేషన్’ భారీ స్థాయిలో చేపట్టే జియోఇంజినీరింగ్ ప్రక్రియ. ఇందులో సముద్రాల ఉపరితలంపై సూర్యరశ్మి నేరుగా సోకే పొరలలో సముద్రపు నాచు పెరిగేలా చేస్తారు. సముద్రపు నాచు తన పోషకాల కోసం జరిపే కిరణజన్య సంయోగక్రియ ఫలితంగా పరిసరాల్లోని వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ను పీల్చేసుకుంటుంది. సముద్ర ఉపరితల పరిసరాల్లోని వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ ఈ పద్ధతిలో గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా సముద్రాల ఉపరితలం చల్లబడి, సముద్రంలో బతికే చిన్నా పెద్దా జలచరాలు సురక్షితంగా మనుగడ సాగించగలుగుతాయి. సముద్రంలో నాచు త్వరగా పెరగడానికి నైట్రోజన్, ఐరన్ వంటి పోషకాలు అవసరమవుతాయి. ఈ పోషకాలను నేరుగా సముద్రం ఉపరితలంపై చల్లడం ద్వారా సముద్రపు నాచు త్వరగా, ఎక్కువగా పెరిగేలా చేస్తారు. ఇదంతా ఒకరకంగా మొక్కలకు ఎరువు వేసే ప్రక్రియలాంటిదే! కాబట్టి ఈ ప్రక్రియను ‘ఓషన్ ఫర్టిలైజేషన్’ అని, ‘ఓషన్ నరిష్మెంట్’ అని అంటున్నారు. సముద్రాల ఉపరితలంలో నాచు పెంచడం ద్వారా భూతాపాన్ని తగ్గించే ఈ ప్రయత్నంలో కొన్ని లాభాలు ఉన్నా, కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా లేకపోలేదని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్రాల ఉపరితలంపై నాచు పెంచడంలో ఎలాంటి రసాయనాల వినియోగం జరగదు. అందువల్ల ఇది చాలావరకు సురక్షితమైన పద్ధతి. ఈ ప్రక్రియ ద్వారా వాతావరణంలోకి లేదా సముద్రంలోకి కాలుష్యాలు విడుదలయ్యే సమస్య ఉండదు. దీని వల్ల సముద్రజలాల ఆమ్లీకరణ గాఢత కూడా గణనీయంగా తగ్గుతుంది. ఈ ప్రక్రియ నేరుగా వాతావరణంపై తక్షణ ప్రభావం చూపదు. కాకుంటే, భూతాపం పెరుగుదలలో ఉధృతిని నిదానంగా తగ్గిస్తుంది. అయితే, సముద్రాల ఉపరితలంపై నాచును మోతాదుకు మించి పెంచినట్లయితే, సముద్రంలో జీవించే జలచరాల సహజమైన ఆహారచక్రం గతి తప్పి, కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్రంలో నాచు మితిమీరి పెరిగితే, కొన్ని రకాల చేపలు తదితర జలచరాల జనాభా గణనీయంగా క్షీణించే ప్రమాదం కూడా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. ఏళ్లనాటి ఆలోచన ఆకాశం నుంచి భూమికి గొడుగు పట్టాలనే ఆలోచన ఈనాటిది కాదు. శాస్త్రవేత్తలు 1923 నుంచి ఈ దిశగా ఆలోచనలు చేస్తూ వస్తున్నారు. జర్మన్ భౌతిక శాస్త్రవేత్త హెర్మన్ ఓబెర్త్ ఈ దిశగా తన ప్రయోగాల్లో కొంత ముందంజ కూడా వేశారు. అంతరిక్ష కక్ష్యలోకి 100–300 కిలోమీటర్ల వ్యాసం పరిధిలో భారీ అద్దాలను పంపడం ద్వారా భూమ్మీద పడే సూర్యకాంతిని తిరిగి అంతరిక్షంలోకి పరావర్తనం చెందేలా చేయడం ద్వారా భూతాపాన్ని తగ్గించడం సాధ్యమవుతుందని ఓబెర్త్ ప్రతిపాదించాడు. సూర్యకాంతిని నిరోధించడం ద్వారా భూతాపాన్ని తగ్గించే దిశగా ఆయన 1923 నుంచి 1978 వరకు విస్తృతంగా పరిశోధనలు సాగించాడు. భూమికి సూర్యడికి మధ్యన ఒక డిస్క్లాంటిది అంతరిక్షంలో ఏర్పాటు చేయడం ద్వారా భూమ్మీద పడే సూర్యరశ్మి వేడిని తగ్గించగలమని 1989లో మరికొందరు శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. ఈ డిస్క్కు సౌర ఫలకాలను అమర్చినట్లయితే, వాటి నుంచి అపరిమితంగా సౌర విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయవచ్చనే ఆలోచన చేశారు. అయితే, ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. ఇవి జరిగిన చాలాకాలం తర్వాత రెండేళ్ల కిందట మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు అలివీయా బోర్గ్, ఆండ్రూస్ హీన్లు ఈ దిశగా మరో కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చారు. స్పేస్ఎక్స్ షిప్ వంటి వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి అతిసన్నని పాలిమర్ నానో బుడగలతో కూడిన అతిపలుచని ఫిల్మ్ను పంపి, సూర్యడికి భూమికి మధ్య తెరలా ఏర్పాటు చేయడం ద్వారా భూతాపాన్ని తగ్గించడం సాధ్యమవుతుందని వారు చెప్పారు. ఇప్పటి వరకు ఈ ప్రతిపాదనకు కార్యాచరణ దిశగా అడుగులు ముందుకు పడలేదు. కార్బన్ క్యాప్చరింగ్.. భూతాపం పెరుగుదలకు అతిపెద్ద కారణం కర్బన ఉద్గారాల పెరుగుదల. కార్బన్ కణాలు వాతావరణంలోకి మోతాదుకు మించి చేరడం వల్ల భూతాపం గణనీయంగా పెరుగుతోంది. వాతావరణంలో కలిసే కర్బన కణాలను యంత్రాల ద్వారా పీల్చేసి, సేకరించే పద్ధతికి శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. ఈ సాంకేతికతను ‘కార్బన్ క్యాప్చరింగ్ టెక్నాలజీ’ అంటున్నారు. పారిశ్రామిక కర్మాగారాలు ఎక్కువగా ఉండేచోట వాటి నుంచి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వంటి వాయువుల నుంచి కార్బన్ కణాలను పీల్చివేయడానికి భారీ యంత్రాలను ఏర్పాటు చేస్తారు. ఈ యంత్రాలు గాలిలోకి కార్బన్ కణాలు చేరకుండా నిరోధిస్తాయి. గాలి నుంచి పీల్చేసిన కార్బన్ కణాలను ఈ యంత్రాలు ఘనరూపంలో బంధించి ఉంచుతాయి. అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల ఇలాంటి యంత్రాలను నెలకొల్పారు. ఇవి గాలిలో కలిసే కార్బన్ కణాలను దాదాపు 90 శాతం వరకు పీల్చుకోగలవు. వీటిని ‘పైరోజెనిక్ కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్’ గా వ్యవహరిస్తున్నారు. యంత్రాల ద్వారా పీల్చి సేకరించిన కార్బన్ను పైపులైన్ల ద్వారా కార్బన్ను నేరుగా ఉపయోగించుకునే పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారు. అంతర్జాతీయ గణాంకాల ప్రకారం 2020 నాటికి ప్రపంచంలోని వివిధ దేశాల్లో నెలకొల్పిన కార్బన్ క్యాప్చరింగ్ యంత్రాలు ఏడాది 5 కోట్ల టన్నుల కార్బన్ను గాలి నుంచి తొలగించగలుగుతున్నాయి. పగడపు దిబ్బల పరిరక్షణ.. సముద్రాలు సైతం వేడెక్కేస్థాయికి భూతాపం చేరడం వల్ల విలువైన పగడపుదిబ్బలు వేగంగా క్షీణించే పరిస్థితి ఏర్పడింది. పగడపుదిబ్బలు అంతరించిపోయే పరిస్థితిని నివారించడానికి శాస్త్రవేత్తలు 1998 నుంచి ముమ్మరంగా ప్రయత్నాలను ప్రారంభించారు. పగడపుదిబ్బల పరిరక్షణ కోసం ఒకవైపు శాస్త్రవేత్తలు ఎన్ని ప్రయత్నాలు సాగిస్తున్నా, గడచిన పదిహేనేళ్లలో ముప్పయి శాతం పగడపుదిబ్బలు పూర్తిగా కనుమరుగయ్యాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, రానున్న రెండేళ్లలో మరో ఆరు శాతం పగడపుదిబ్బలు అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సముద్రాల అడుగున ఉండే పగడపుదిబ్బలు గొప్ప జీవవైవిధ్యానికి నెలవులు. పగడపుదిబ్బలను ఆవాసంగా చేసుకుని, నాలుగువేలకు పైగా మత్స్యజాతులు, ఎనిమిదివందలకు పైగా పగడపుజీవులు, వాటితో పాటే ఎనబైలక్షలకు పైగా వృక్షజాతులు మనుగడ సాగిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ సగటున మూడు కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ సముద్రగర్భంలోకి చేరుతోంది. మితిమీరిన కార్బన్ డయాక్సైడ్ సముద్రగర్భంలోకి చేరడం వల్ల సముద్రజలాల ఆమ్లీకరణ జరిగి, పగడపుదిబ్బలు శరవేగంగా క్షీణించిపోతున్నాయి. సముద్రాల అడుగున ఉండే పగడపుదిబ్బలు నశిస్తే, మానవాళికి వాటిల్లే నష్టమేమిటనుకుంటే పొరపాటేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పగడపుదిబ్బలు అంతరించడం వల్ల జీవవైవిధ్యానికి, పర్యావరణానికి జరిగే నష్టం ఫలితంగా 2030 నాటికి పదికోట్ల మంది మనుషులు అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వాటిల్లుతుందని వారు హెచ్చరిస్తున్నారు. మానవాళికి వాటిల్లబోయే ఈ ముప్పును అరికట్టడానికే శాస్త్రవేత్తలు పగడపుదిబ్బలను చల్లబరచడానికి ‘సీ వాటర్ ఎయిర్కండిషనింగ్’ వంటి పద్ధతుల్లో ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనికోసం భారీ యంత్రాలను ఉపయోగించి, వేడెక్కిన సముద్రజలాలను పైపుల ద్వారా పైకి తీసుకొచ్చి, ఆ నీటిని చల్లబరిచి తిరిగి సముద్రంలోకి పంపుతుండటం వల్ల కొంతవరకు పగడపుదిబ్బలను చల్లబరచగలుగుతున్నారు. పగడపుదిబ్బలను చల్లబరచిన ప్రదేశాల్లో అక్కడి పగడాల రంగులో గాఢత పెరగడం వంటి గుణాత్మకమైన మార్పులను సాధించగలుగుతున్నారు. అయితే, ఇలాంటి ప్రయత్నాలు మరింత ముమ్మరంగా సాగితేనే పగడపుదిబ్బలు పదికాలాల పాటు సురక్షితంగా ఉండగలవు. వాటితో పాటే మనుషులు కూడా పదిలంగా మనుగడ సాగించగలరు. (చదవండి: థింక్ ట్యూన్ అప్!) -
NASA: మెరుస్తున్న భూమి.. అందమైన చిత్రాలు తీసిన ఐఎమ్ వన్
కాలిఫోర్నియా: చంద్రునిపైకి నాసా పంపిన ఇంట్యూటివ్ మెషిన్(ఐఎమ్ వన్) నింగి నుంచి భూగోళం అద్భుతమైన చిత్రాలను తీసింది. ఈ చిత్రాల్లో భూమి వజ్రంలా మెరిసిపోతుండటం విశేషం. స్పేస్ ఎక్స్ రాకెట్ నుంచి వేరుపడి రెండో దశ ప్రయాణం ప్రారంభించన వెంటనే ఐఎమ్ వన్ భూమి అందమైన చిత్రాలను కెమెరాలో బంధించింది. ఈ నెల తొమ్మిదో తేదీన కేప్కెనరావల్లోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్లో ఐఎమ్ వన్ నోవా సి ల్యాండర్ను నింగిలోకి పంపారు. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 22న నోవా సీ ల్యాండర్ చంద్రునిపై అడుగు పెడుతుంది. నాసా, ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ వాణిజ్య పరంగా కస్టమర్ల కోసం చేపట్టిన కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ ప్రోగ్రామ్(సీఎల్పీఎస్) కింద నోవా సి ల్యాండర్ చంద్రునిపై ప్రయోగాలు చేయనుంది. ఈ దశాబ్దం చివర్లో చంద్రునిపైకి వ్యోమగాములను(నాసా ఆర్టెమిస్ ప్రోగ్రామ్) పంపేందుకుగాను అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు వీలుగా ఐఎమ్ వన్ వ్యోమనౌకలో నాసా ఆరు పేలోడ్లను అమర్చింది. ఇది చంద్రునిపై విజయవంతంగా ల్యాండ్ అయితే 1972 తర్వాత అమెరికా వ్యోమగాములతో సహా చంద్రునిపైకి పంపిన అపోలో మిషన్ తర్వాత రెండో మిషన్గా చరిత్రకెక్కనుంది. ఇదీ చదవండి.. పిల్లల ప్రపంచం తగ్గిపోతోంది -
ISRO: సముద్రంలోకి కార్టోశాట్–2
బెంగళూరు: పాత ఉపగ్రహాలతో ఆయా కక్ష్యల్లో పెరిగిపోతున్న అంతరిక్ష చెత్తను కాస్తయినా తగ్గించే లక్ష్యంతో ఇస్రో మరో అడుగు ముందుకేసింది. దాదాపు 17 సంవత్సరాల క్రితం ప్రయోగించాక చాలా ఏళ్లు దేశానికి సేవలందించిన కార్టోశాట్–2 ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా భూవాతావరణంలోకి తీసుకొచ్చి హిందూ మహాసముద్రంలో పడేలా చేసింది. ఫిబ్రవరి 14వ తేదీ మధ్యాహ్నం 3.48 గంటలకు ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని ఇస్రో శుక్రవారం ప్రకటించింది. పట్టణ ప్రణాళికలకు సాయపడేలా అత్యంత స్పష్టమైన హై రెజల్యూషన్ ఇమేజీలు తీసేందుకు 2007 జనవరి పదో తేదీన 680 కేజీల ఇస్రో కార్టోశాట్–2 ఉపగ్రహాన్ని 635 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో విజయవంతంగా పంపింది. ఇది 2019 ఏడాదిదాకా పనిచేసింది. తర్వాత కక్ష్య తగ్గించుకుంటూ క్రమంగా భూవాతావరణంలోకి ప్రవేశించి అత్యంత వేగంగా తిరుగుతూ మండి, ధ్వంసమై అతి చిన్న ముక్కలుగా మారిపోనుంది. అలా కావడానికి సాధారణంగా 30 సంవత్సరాల సమయం పడుతుంది. ఈలోపు ఉపగ్రహాలుండే కక్ష్యల్లో అంతరిక్ష చెత్తను తగ్గించేందుకు ముందుగానే దీనిని భూవాతావరణంలోకి రప్పించారు. -
Copernicus Climate Change Service: ఏడాదంతా భూతాపం 1.5 డిగ్రీల పెరుగుదల
న్యూఢిల్లీ: కాలుష్యం, భూతాపం కారణంగా భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయన్నది తెలిసిన సంగతే. కానీ, 2023 ఫిబ్రవరి నుంచి 2024 జనవరి దాకా ఏడాదంతా భూసగటు ఉష్ణోగ్రత 1.52 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైనట్లు యూరోపియన్ యూనియన్కు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసు (సీ3ఎస్) గురువారం వెల్లడించింది. 1850–1900 నాటి ఉష్ణోగ్రతల సగటుతో పోలిస్తే ఏడాది పొడవునా 1.52 డిగ్రీలు అధికంగా నమోదు కావడం ఇదే మొదటిసారి అని పేర్కొంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతాయని చెప్పడానికి ఇదొక సంకేతమని తెలియజేసింది. ఈ ఏడాది జనవరి నెల అత్యంత వేడి జనవరిగా రికార్డుకెక్కిందని వివరించింది. 1850–1900 నాటి కంటే ఈ జనవరిలో 1.66 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. వాతావరణంలో ఎల్ నినో పరిస్థితులే ఇందుకు కారణమని అభిప్రాయపడింది. వాతావరణ మార్పులతోపాటు సెంట్రల్ పసిఫిక్ సముద్రంలో ఉపరితల జలాలు వేడెక్కడం వల్ల భూఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని కోపరి్నకస్ క్లైమేట్ చేంజ్ సరీ్వసు స్పష్టం చేసింది. -
వామ్మో 2023!
భూతాపం విషయంలో 2023 కనీవినీ ఎరగని రికార్డు సృష్టించింది. అత్యంత వేడిమి డిసెంబర్ నెల ముగియక ముందే 2023 రికార్డులకెక్కడం తెలిసిందే. అయితే చరిత్రలో ఇప్పటిదాకా అత్యధికంగా 1.48 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత పెరుగుదల నమోదైన ఏడాదిగా 2023 నిలిచింది! 2016 నాటి రికార్డు కంటే ఇది ఏకంగా 0.17 డిగ్రీలు అధికం! అదే 1991–2020 మధ్య 20 ఏళ్ల సగటుతో పోలిస్తే ఏకంగా 0.6 డిగ్రీలు ఎక్కువ!! గతేడాదికి సంబంధించిన ఉష్ణోగ్రతల గణాంకాలను క్షుణ్నంగా విశ్లేషించిన మీదట యూరోపియన్ యూనియన్ వాతావరణ పర్యవేక్షణ సంస్థ కోపర్నికస్ మంగళవారం విడుదల చేసిన నివేదిక ఈ మేరకు పేర్కొంది. అంతేకాదు, 2023 రెండో అర్ధ భాగంలో దాదాపుగా ప్రతి రోజూ ఎండ తీవ్రతలో కొత్త రికార్డులు నెలకొల్పినట్టు తేల్చింది! ఇది నిజంగా భయానక పరిణామమేనని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు... – సాక్షి, నేషనల్ డెస్క్ 2023 నవంబర్ 17. భూ ఉష్ణోగ్రతలో ఏకంగా 2.06 డిగ్రీల పెరుగుదల నమోదైన తేదీ! మానవ చరిత్రలో ఉష్ణోగ్రతల పెరుగుదలను రికార్డు చేయడం మొదలు పెట్టినప్పటి నుంచీ అత్యధిక పెరుగుదల అదే! అలా మానవాళి చరిత్రలో ఓ దుర్దినంగా నవంబర్ 17న నిలిచిపోయింది. తర్వాత అదే నెలలో మరోసారి ఉష్ణోగ్రత పెరుగుదల 2 డిగ్రీలను దాటేసింది. దాంతో పర్యావరణవేత్తల్లో గగ్గోలు మొదలైంది. కానీ 2023 రెండో భాగంలో, అంటే జూలై నుంచి డిసెంబర్ దాకా ప్రతి రోజూ ఎండలు కనీవినీ ఎరగని రీతిలో ప్రపంచాన్ని అల్లాడించాయని కోపర్నికస్ తాజా నివేదిక తేల్చింది. పైగా 2023లో 1.48 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత పెరుగుదల నమోదవడమూ భయపెట్టే పరిణామమే. భూ ఉష్ణోగ్రతలో పెరుగుదలను పారిశ్రామికీకరణనాటి తొలినాళ్లతో, అంటే 1850–1900 సంవత్సరాల మధ్య కాలపు సగటుతో పోల్చి చెబుతారు. అప్పటితో పోలిస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ 1.5 డిగ్రీల కంటే దిగువకు కట్టడి చేయాలన్నది 2015 నాటి పారిస్ ఒప్పందంలో ప్రపంచ దేశాలన్నీ సంయుక్తంగా చేసుకున్న తీర్మానం. కానీ 2023లో సగటు ఉష్ణోగ్రత పెరుగుదల దాదాపుగా ఆ లక్ష్మణరేఖను తాకింది. 1850తో పోలిస్తే గతేడాది ప్రతి రోజూ ఉష్ణోగ్రతలో 1 డిగ్రీ కంటే ఎక్కువ పెరుగుదల నమోదైంది! 2015లో తొలిసారిగా ఒక్క రోజు ఇలా 1 డిగ్రీ పెరుగుదల నమోదైతేనే ప్రపంచమంతా విస్మయపడింది. అది కాస్తా కేవలం ఏడేళ్లకే రోజువారీ పరిణామంగా మారిపోయింది. పైగా సగటు పెరుగుదలే దాదాపుగా 1.5 డిగ్రీలను తాకేసింది. గ్లోబల్ వారి్మంగ్ అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతోందనేందుకు ఇంతకు మించిన తార్కాణం అవసరం లేదని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన 2024లో ఉష్ణోగ్రత సరికొత్త రికార్డులు సృష్టించి భూగోళాన్ని మరింత వినాశనం దిశగా నెట్టడం ఖాయమని తాజా నివేదికలో కోపర్నికస్ కూడా అంచనా వేయడం మరింత ఆందోళన కలిగిస్తోంది. జూన్లోపే సగటు భూతాపోన్నతి 1.5 డిగ్రీలను దాటేస్తే ఆశ్చర్యం లేదని అది అభిప్రాయపడింది. అదే జరిగితే భూమిపై కీలక పర్యావరణ వ్యవస్థల్లో చాలావరకు అంతటి తాపాన్ని తట్టుకోలేవు. అప్పుడిక ప్రపంచంలో ఒకవైపు తీవ్ర కరువులు, కార్చిచ్చులు, మరోవైపు భయంకరమైన తుపాన్లు నిత్య సమస్యలుగా మారిపోతాయి. గతేడాది అమెరికా, కెనడా, హవాయి, దక్షిణ యూరోప్ల్లో నిత్యం కార్చిచ్చులు చెలరేగడం, పలు దేశాలు కనీవినీ ఎరగని వరదలతో, గడ్డకట్టించే చలి పరిస్థితులతో అతలాకుతలం కావడం తెలిసిందే. వాతావరణ మార్పులు, ఎల్ నినో... 2023 ఇంతగా మండిపోవడానికి వాతావరణ మార్పులే ప్రధాన కారణమని కోపర్నికస్ నివేదిక స్పష్టం చేసింది. దానికి తోడు గతేడాది జూలైకల్లా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో నెలకొన్న ఎల్ నినో (కరువు) పరిస్థితులు పరిస్థితిని మరింత దిగజార్చినట్టు వివరించింది. ఫలితంగా పసిఫిక్ మొదలుకుని ప్రతి మహాసముద్రమూ ఎప్పుడూ లేనంతగా వేడెక్కినట్టు పేర్కొంది. 1991–2020 సగటుతో పోలిస్తే 2023లో సముద్రాల సగటు ఉష్ణోగ్రత పెరుగుదల ఏకంగా 0.44 డిగ్రీలుగా నమోదైంది! దాంతో మంచు ప్రాంతాలైన ఆర్కిటిక్, అంటార్కిటికాలపై దీని ప్రభావం విపరీతంగా పడటం మొదలైంది. అక్కడి మంచు ఎన్నడూ లేనంతగా కొన్నాళ్లుగా శరవేగంగా కరిగిపోతోంది. ఈ దెబ్బకు సముద్ర మట్టాలు ప్రమాదకరంగా పెరిగేలా కనిపిస్తున్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంత మహా నగరాలు చాలావరకు నీట మునుగుతాయి. అదే జరిగితే ప్రపంచంలో కనీసం మూడో వంతు జనాభా నిర్వాసితులుగా మారతారని అంచనా. ఊహించుకోవడానికే భయం కలిగే ఇలాంటి పరిణామాలెన్నో అతి త్వరలో జరిగేలా కనిపిస్తున్నాయని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. -
అక్కాచెల్లెళ్ల హెల్త్ఫుల్ సప్లిమెంట్స్!
‘‘మన నేల సుసంపన్నం... పోషకాలన్నీ ఉన్నాయి. కానీ... పోషకాహారలోపంతో బాధపడుతోంది మనదేశం. ఆరోగ్యాభిలాషులుగా మేము హెల్దీ లివింగ్ కోసం ఉద్యమించాం. మొక్కలతో పోషకాలందించాలనే సంకల్పాన్ని చేబూనాం. భూమి... మొక్క మనకు సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తాయి. అందుకే మా ప్రయోగాలకు ఎర్త్ ఫుల్ అని పేరు పెట్టాం’’ తమను తాము బ్లాగ్లో ఇలా పరిచయం చేసుకున్నారీ అక్కాచెల్లెళ్లు. వాళ్ల పేర్లు సుధ, వేద. ఇద్దరూ ఐఐటీ ఖరగ్పూర్ ఇంజనీర్లు. కెరీర్లో కొత్త మలుపు గురించి సాక్షితో పంచుకున్నారిద్దరూ". ‘‘మా నాన్న సొంతూరు విజయవాడ దగ్గర మానికొండ. నాన్న వ్యాపార రీత్యా ఒడిశా, వైజాగ్, హైదరాబాద్లో పెరిగాం. అమ్మ ఏజీ ఎమ్మెస్సీ చదివింది. మమ్మల్ని ఐఐటీలో ఇంజనీరింగ్ చేయించాలనే సంకల్పం అమ్మదే. కోచింగ్కి చుక్కారామయ్య గారి ఇన్స్టిట్యూట్లో చేర్చడం కోసమే హైదరాబాద్లో నల్లకుంటలో ఉండేవాళ్లం. నేను కెమికల్, చెల్లి బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్ చేశాం. నాకు ఐటీసీ లిమిటెడ్లో ఉద్యోగం. హరిద్వార్లో పోస్టింగ్. దాదాపు ఆరువందల మంది ఉద్యోగుల్లో ఒక్క అమ్మాయిని. అర్బన్ టచ్లో ఉద్యోగం చేసేటప్పుడు సొంత స్టార్టప్ ఆలోచన వచ్చింది. హైదరాబాద్కి వచ్చి ఎంబీఏ చేసి ఊబెర్లో లాంచింగ్ సమయంలో ఉద్యోగం చేశాను. ఇక వేద విషయానికి వస్తే... బ్యాంకింగ్రంగంలో ముంబయి, లండన్లలో చేసింది. సివిల్స్ కోసం ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటూ మూడేళ్లు ప్రయత్నించింది. తనకు బిజినెస్ నాలెడ్జ్ ఎక్కువ. మీషో స్టార్టప్ కోసం బెంగళూరులో ఉద్యోగం చేసింది. ఈ సమయంలో కోవిడ్ ప్రపంచాన్ని కుదిపేసింది. వేద ఇంటి నుంచి పని చేయడానికి హైదరాబాద్కి వచ్చింది. ఇద్దరమూ ఎప్పుడూ ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. ఆ సమయంలో బర్నింగ్ టాపిక్ ఆరోగ్యమే. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండి వ్యాధినిరోధక శక్తి సమృద్ధిగా ఉండాల్సిన అవసరం గురించి ప్రపంచం అంతా మాట్లాడుతోంది. ఆహారం ద్వారా సమగ్ర ఆరోగ్యాన్ని పొందడం గురించి డాక్టర్లు చెబుతున్నారు. కానీ పరిపూర్ణమైన పరిష్కారం అందుబాటులో లేదప్పటకి. మనకు తెలిసింది... మంచి ఆహారం తీసుకోవడం, అనారోగ్యం వస్తే ఔషధాలు తీసుకోవడం మాత్రమే. ఈ రెండింటికీ మధ్య ఫుడ్ సప్లిమెంట్ అనే మరొక ప్రత్యామ్నాయం ఉందని మనదేశంలో అవగాహన చాలా తక్కువ. మేము ఆ చైతన్యం కోసమే పని చేస్తున్నాం’’ అన్నారు సుధ. సీట్లో కూర్చోవడం నుంచి మొదలు... ‘‘మేమిద్దరం కార్పొరేట్ రంగంలో ఉద్యోగం చేశాం. పనిలో నిర్దేశించిన లక్ష్యాలను చేరడానికి విపరీతంగా శ్రమించేవాళ్లం. ఆఫీస్ వర్క్లో దేహకదలికలు తగినంత ఉండవు. యాసిడ్ రిఫ్లక్స్తో సమస్యలు జీర్ణవ్యవస్థ నుంచి మొదలవుతాయి. బ్యాక్ పెయిన్ వరకు వెళ్తుంది. ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిసేటప్పటికే దేహం శక్తిని కోల్పోయి ఉంటుంది. మంచి ఆహారం తీసుకుంటున్నప్పటికీ దేహానికి కావల్సినంత శక్తి అందడం లేదని అర్థమవుతుంది. అనారోగ్యం ఏమిట’ని ప్రశ్నిస్తే ఫలానా అని ఏమి చెప్పాలో అర్థం కాదు. డాక్టర్ సూచన మేరకు ఐరన్, క్యాల్షియమ్, ప్రొటీన్, విటమిన్లతోపాటు మైక్రో న్యూట్రియెంట్స్తో కూడిన మందులు వాడుతాం. మందులు ఆపేసిన రెండు వారాలకు మనతో స్నేహం చేయడానికి తిరిగి నీరసం, నిస్సత్తువలు దరి చేరతాయి. మా జనరేషన్ మాత్రమే కాదు, కొంచెం అటూ ఇటూగా సమాజంలో ఎక్కువమంది ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఇంట్లో దీర్ఘకాలంగా డయాబెటిస్తో బాధపడుతున్న మా నాన్నను చూస్తున్నాం. బలహీనమవుతున్న దేహం మనం అనుసరిస్తున్న డైలీ రొటీన్ ఆరోగ్యానికీ– అనారోగ్యానికీ మధ్య ఉండాల్సిన రక్షణరేఖ చెరిపేసిందనిపించింది. ముఖ్యంగా ఇండియన్ ఉమెన్ ఎదుర్కొంటున్న సమస్యలైతే మరీ విడ్డూరం. అనారోగ్యమేమీ ఉండదు. నడవాలంటే మోకాళ్లు నొప్పులు, కూర్చోవాలంటే వెన్నునొప్పి, బరువు ఎత్తితే భుజం నొప్పి, త్వరగా అలసిపోవడం, నీరసం. నిజానికి ఇవేవీ అనారోగ్యాలు కావు. మనం దేహానికి అవసరమైన పోషకాలందకపోవడం వల్లనే అని మా అధ్యయనంలో తెలుసుకున్నాం. పాశ్చాత్య దేశాల్లో అయితే రోజూ ఆహారంతోపాటు ఫుడ్ సప్లిమెంట్లు కూడా తీసుకుంటారు. నిజానికి మన దేహానికి అవసరమైన పోషకాలన్నింటినీ ఆహారం ద్వారా అందించడం అంత సులువైన పనేమీ కాదు, పోషకాహార పట్టిక, న్యూట్రిషనిస్టుల సూచన ప్రకారం ఒక మనిషికి ఒక రోజుకు అవసరమైనంత ఐరన్ ఆహారం ద్వారా అందాలంటే తొమ్మిది కప్పుల పాలకూర తినాలి. మా రీసెర్చ్లో తెలుసుకున్న విషయాలతోనే సమాజం ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం దొరికింది. అదే మా స్టార్టప్ అయింది. మా ఎర్త్ఫుల్ బోర్డ్ సభ్యులుగా డాక్టర్, న్యూట్రిషనిస్ట్, ఫుడ్ ఎక్స్పర్ట్లున్నారు. ఆకు నుంచి గింజ వరకు... ప్రకృతి మనకు అవసరమైన అన్నింటినీ సమగ్రంగా, సమతూకంగా ఇచ్చింది. కానీ మనమే లైఫ్స్టయిల్ని పక్కదారి పట్టించుకున్నాం. జామపండుని కొరికి తినాలంటే దంతాలు సహకరించవు. దాంతో గింజలను వదిలేయడమో లేదా రెడీమేడ్ జ్యూస్లు తాగడమో చేస్తున్నాం. దాంతో గింజల ద్వారా అందాల్సిన పోషకాలను కోల్పోతున్నాం. జామ ఆకులో జింక్ ఉంటుందని తెలిసినప్పుడు మేము కూడా ఆశ్చర్యపోయాం. ఇలాంటి వాటిని సులువైన రూపంలో అందించడమే మా ప్రయత్నం. అలాగే ఆరోగ్యం పట్ల చైతన్యవంతం చేయడం కూడా. వ్యాపారం అంటే డబ్బు సంపాదన కోసం మాత్రమే కాకూడదు. సామాజిక బాధ్యత ఉండాలి. అలాగే నైతిక విలువలతో కూడినదై ఉండాలి. సమాజాన్ని ఆరోగ్యవంతం చేయడంలో మా కృషి ఉంటోందంటే కలిగే సంతృప్తిని మాటల్లో వివరించలేం. బాక్స్ మార్కెట్ మా వెంట వస్తోంది! భూమ్మీద జీవించాల్సిన మనిషి కోసం భూమి అన్నింటినీ మొక్కల రూపంలో ఇచ్చింది. వాటిని తెలుసుకోవడంలో మనం విఫలమవుతున్నాం. ‘భూమి నుంచి ఉద్భవించిన మొక్కల ఆధారంగా ఫుడ్ సప్లిమెంట్స్ తయారు చేస్తున్నాం, మొక్కల్లో మనకు అవసరమైనవన్నీ ఉన్నాయ’ని చెప్పాలనే ఉద్దేశంతో మా స్టార్టప్కి ఎర్త్ఫుల్ అని పెట్టాం. ఈ స్టార్టప్ కోసం చేసిన హోమ్ వర్క్ చిన్నది కాదు. ఈ జర్నీలో మేము ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉత్తేజితులమవుతున్నాం. తెలుసుకున్న విషయాలను ఎప్పటికప్పుడు బ్లాగ్లో, ఎఫ్బీలో షేర్ చేసుకుంటూ ఉండడంతో స్టార్టప్ ప్రారంభించేటప్పటికే మాకు ఫాలోయింగ్ బాగా వచ్చేసింది. దాంతో మార్కెటింగ్ కోసం ప్రయాస పడాల్సిన అవసరం లేకపోయింది. అవుట్లెట్లే స్వయంగా మా ఉత్పత్తులను అడుగుతున్నాయి. కానీ మా ఉత్పత్తులు కమర్షియల్ కావడం మాకిష్టం లేదు’’ – సుధ, వేద, ఫౌండర్స్, ఎర్త్ఫుల్ , హైదరాబాద్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: ఆమెను చూస్తే..'ధైర్యే సాహసే ఆరోగ్య లక్ష్మీః' అనకతప్పదు!) -
fact check: మేలెంచినా కీడెంచుతారా!?
సాక్షి, అమరావతి : కుక్క తోక వంకరలాగే ఈనాడు రాతల్లో కూడా అంతకు మించి వంకర్లు ఉంటాయి. ప్రభుత్వానికి సంబంధించిన ఏ విషయాన్నయినా వంకర బుద్ధితో చూడడమే ఇందుకు కారణం. పేదలకు మేలు చేసేందుకు.. వారు కట్టుకునే ఇళ్లను మెరక చేసుకునేందుకు, రైతుల పొలాలకు మట్టి తోలుకునేందుకు మట్టి తరలింపులో మినహాయింపులు ఇవ్వడాన్ని సైతం తప్పన్నట్లు గుండెలు బాదుకుంటోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంచి చేసినా తప్పేనంటూ ఆ పత్రికాధిపతి రామోజీరావు వితండవాద కథనాలను ప్రచురించటం పరిపాటిగా మారింది. ప్రజలకు ఉపయోగపడేలా ఏదైనా మినహాయింపు ఇస్తే తప్పు.. ఇవ్వకపోయినా, ఏం చేయకపోయినా తప్పేనంటూ రెండు నాల్కల ధోరణితో క్షుద్ర రాతలు రాయడం ఆయనకు నిత్యకృత్యంగా మారింది. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎలాగైనా బురద జల్లి ప్రజల్లో అపోహలు సృష్టించడం, వారికి మేలు జరుగుతుంటే దాన్ని వక్రీకరించి ఏదో జరిగిపోతోందని గగ్గోలు పెట్టడం.. తద్వారా చంద్రబాబును గద్దెనెక్కించాలన్నది ఆయన అసలు లక్ష్యం. ఇందులో భాగమే తాజాగా సోమవారం ‘దోపిడీకి రాజమార్గం’ అంటూ మట్టి తవ్వకాలపై అతిగా ఊహించుకుంటూ ఎప్పటిలాగే అభూతకల్పనలతో ఓ కథనాన్ని చేతికొచ్చింది ఇష్టానుసారం రాసిపారేసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు నానా ప్రయాసపడ్డారు. ఈ క్షుద్ర రాతలపై వాస్తవాల ‘ఫ్యాక్ట్చెక్’ ఏమిటంటే.. ఆమోదం పొందని ఫైలుపై సీఎంఓ ఒత్తిడా? రాష్ట్రంలో పేదలు నిర్మించుకునే ఇళ్లు, రైతుల పొలాలను మెరక చేసుకునేందుకు వీలుగా వారిపై ఎలాంటి భారం లేకుండా చిన్నతరహా ఖనిజాల వినియోగంపై మినహాయింపులకు గనుల శాఖ సదుద్దేశ్యంతో ప్రతిపాదించింది. కానీ, అక్రమార్కులకు సహకరించేలా ఖనిజ తవ్వకాలకు పలు రుసుముల మినహాయింపులు ఇస్తున్నట్లు రామోజీ పెడబొబ్బలు పెట్టారు. వాస్తవానికి ఈ ప్రతిపాదనలు ఇంకా ఆమోదం పొందలేదు. వాటిపై ఆర్థిక శాఖ నుంచి వచ్చిన అభ్యంతరాలకు గనుల శాఖ వివరణ సమర్పించింది. ఆ విషయం ఇంకా ఆర్థిక శాఖ పరిశీలనలోనే ఉంది. ఇంకా ఆమోదం పొందని ఫైలుపై సీఎంఓ ఎలా ఒత్తిడి తెచ్చిందో, దానికి ఆమోదముద్ర ఎవరు వేశారో రామోజీరావుకే తెలియాలి. అయినా.. పేదల ఇళ్లకు ‘మినహాయింపు’లను ఉచిత ఇసుకతో ఎలా పోలుస్తారు రామోజీ? అసలు మీ బాబు హయాంలో ఉచితంగా ఇసుక ఎవరికి అందింది? ఆ ముసుగులో చంద్రబాబు బినామీలు, రియల్టర్లు, కమర్షియల్ సంస్థలు, టీడీపీ నేతలకే ఆయన దోచిపెట్టిన బాగోతాలు జగమెరిగినవే కదా..! పేదలకు మేలు జరుగుతుంది.. నిజానికి.. రాష్ట్రవ్యాప్తంగా పేదలు ఒకొక్కరు 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకుంటున్నారు. వీరు తమ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ లక్షలాది మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. వీరంతా ఇంటిని నిర్మించుకునేందుకు కంకర, గ్రావెల్ వంటి చిన్నతరహా ఖనిజాలను వినియోగించాల్సి ఉంటుంది. దీనిపైన గనుల శాఖ వసూలు చేస్తున్న సీనరేజీ, కన్సిడరేషన్ రుసుం, డీఎంఎఫ్, మెరిట్ వంటి వసూళ్లతో పేదలపై ఆర్థికంగా భారం పడుతుంది. దీని మినహాయింపునకు ప్రభుత్వం అంగీకరిస్తే పేదలకు మేలు జరుగుతుంది. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశాల్లో చర్చించిన తర్వాతే ఈ రుసుం మినహాయింపు కోసం గనుల శాఖ ప్రభుత్వ ఆమోదానికి ప్రతిపాదనలు పంపింది. ఏటా రైతులు చెరువు మట్టిని వాడుకుంటారు.. ప్రతి ఖరీఫ్ సీజన్కు ముందు వేసవిలో రైతులు తమ పొలాల్లో మట్టిని సారవంతం చేసుకోవడం, లోతట్టు భూమిని మెరక చేసుకునేందుకు చెరువు మట్టిని సమీపంలోని పొలాల నుంచి తెచ్చుకుని వాడుకుంటారు. దీనివల్ల తిరిగి పంట వేసుకునే సమయానికి పొలం అనువుగా తయారై మంచి దిగుబడి లభిస్తుంది. తద్వారా రైతు కష్టానికి ఫలితం అందుతుంది. దీనికోసం వినియోగించే మట్టిపై కూడా గనుల శాఖ విధించే రుసుమునకు మినహాయింపులిస్తే రైతులపై ఆర్థిక భారం ఉండదు. ఈ సదుద్దేశంతోనే గనుల శాఖ వ్యవసాయ వినియోగం నిమిత్తం వాడే మట్టిపై మినహాయింపుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాస్తవాలిలా ఉంటే.. ఒత్తిడి తెచ్చి మరీ సీఎంఓ ఆమోదముద్ర వేయించుకుందని ఈనాడు అడ్డగోలుగా ఓ కథనాన్ని అచ్చేసింది. ఇలా తప్పుడు కథనాలు ప్రచురించిన ఈనాడు పత్రికపై ఇప్పటికే ప్రభుత్వం పలు పరువు నష్టం దావాలు దాఖలు చేసింది. అయినా సరే.. రామోజీది వంకర బుద్ధి కదా.. వంకర రాతలు కొనసాగిస్తూనే ఉన్నారు. వైఎస్సార్సీపీ నేతలకు ఎలా లబ్ధి కలుగుతుంది? ఇక ఈ ప్రతిపాదనల్లో వైఎస్సార్సీపీ నేతలకు ఎలా లబ్ధి చేకూరుతుందో రామోజీరావు చెప్పాలి. పేదలు, రైతులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకుంటే దానిని రాజకీయ పార్టీలకు ఎలా ఆపాదిస్తారని సాధారణ ప్రజలు మండిపడుతున్నారు. నిజానికి.. ఈ మినహాయింపుల్లేని సమయంలోనూ వీటి ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.70 కోట్ల వరకు మాత్రమే ఆదాయం వస్తుంది. అయినా సరే.. ఈ మినహాయింపులతో ఖజానాకు భారీగా నష్టం జరుగుతుందని రాద్ధాంతం చేయడం చూస్తుంటే పేదలు, రైతులపట్ల రామోజీరావుకు, చంద్రబాబుకు ఉన్న ఏహ్య భావానికి అద్దంపడుతోంది. ఆర్థిక శాఖకు పూర్తి వివరణ ఇచ్చాం పేదల ఇళ్లు, రైతుల పొలాలు మెరక చేసుకునేందుకు తరలించే మట్టి విషయంలో మినహాయింపులకు సంబంధించి ఆర్థిక శాఖ సందేహాలు, పరిశీలనలపై పూర్తి వివరణ ఇచ్చాం. గనుల శాఖలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలవల్ల ప్రతి జిల్లాకు విజిలెన్స్ స్క్వాడ్ తనిఖీలు, టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తున్నాం. వాటిపై తక్షణ చర్యల ద్వారా మైనింగ్ అక్రమాలను ఎప్పటికప్పుడు అరికడుతున్నాం. పేదలు, రైతులకు ఇచ్చిన ఈ మినహాయింపులను ఎవరైనా దుర్వినియోగం చేస్తే వారిపై కూడా చర్యలు ఉంటాయి. ఈ మినహాయింపులవల్ల మైనింగ్ రెవెన్యూలో తగ్గుదల చాలా పరిమితంగా ఉంటుంది. అక్రమాలకు ఆస్కారంలేదు కాబట్టి ఆర్థికశాఖ నుంచి ఆమోదం లభిస్తుందని భావిస్తున్నాం. ఈ ఫైలుపై గనుల శాఖ పంపిన వివరణను ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఈ ఫైలుకు ఎలాంటి ఆమోదం లభించలేదు. అయినా తప్పుడు సమాచారంతో అసత్యాలను పోగేసి ఈనాడు వార్తలు రాయడం దారుణం. – వీజీ వెంకటరెడ్డి, డైరెక్టర్, గనుల శాఖ -
పారిస్ ఒప్పందానికి చిల్లు? భయపెడుతున్న భూతాపం!
ప్రపంచ మానవాళిముందున్న అతిపెద్ద సవాల్ రోజురోజుకు పెరిగిపోతున్న భూతాపం. దీనిని నియంత్రించే లక్ష్యంతో 2015లో 200 దేశాలు పారిస్ వాతావరణ ఒప్పందాన్ని చేసుకున్నాయి. దీని ప్రకారం అధిక ఉష్ణోగ్రతల నియంత్రణకు ఈ దేశాలన్నీ తగిన చర్యలు చేపట్టాలి. ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను పూర్వపారిశ్రామిక స్థాయిలకంటే రెండు డిగ్రీల సెంట్రీగ్రేడ్ల కన్నా తక్కువకు నియంత్రించాలి. అప్పుడే విపత్కర వాతావరణ ప్రభావాలను గణనీయంగా తగ్గించవచ్చని పారిస్ ఒప్పందంలో తీర్మానించారు. అయితే ఇది విఫలమయినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2023 నవంబరు 17న నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆరోజు భూ ఉపరితల ఉష్ణోగ్రత పూర్వపారిశ్రామిక స్థాయిలకంటే రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ అధికంగా నమోదయ్యింది. ఇప్పటివరకూ నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలలో ఇదే రికార్డుగా నిలిచింది. ఇది అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అంతర్జాతీయంగా పెరిగిన గాలి ఉష్ణోగ్రత, సముద్ర ఉష్ణోగ్రత, అంటార్కిటిక్ సముద్రపు మంచు విస్తీర్ణం మొదలైనవి భూతాపం పెరగడానికి కారణాలుగా నిలుస్తున్నాయి. గత జూలైలోనూ భూ ఉపరితల ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైంది. సెప్టెంబర్ నాటికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామిక పూర్వ స్థాయిల కంటే 1.5సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉన్నాయని మరో నివేదిక పేర్కొంది. భూతాపం నియంత్రణకు అన్ని దేశాలు శిలాజ ఇంధన సబ్సిడీలను తొలగించడం, అటవీ రక్షణ పెంపుదల, మొక్కల ఆధారిత ఆహారాలవైపు మళ్లడం, కొత్త బొగ్గు ప్రాజెక్టులను ఎత్తివేయడం, చమురు, గ్యాస్ వినియోగాన్ని దశలవారీగా తగ్గించడానికి ప్రయత్నాలను తప్పనిసరిగా చేయాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. ప్రపంచ దేశాలు ఉష్ణోగ్రతలను లక్ష్యం మేరకు నియంత్రించలేకపోతే అత్యంత దారుణమైన పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ మేరకు పెరిగితే సముద్ర మట్టాలు 10 సెంటీమీటర్లు పెరిగి, చాలా ప్రాంతాలు నీట మునిగిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పరిమితం చేయగలిగితే కనీసం కోటి మందిని ఈ ముప్పు నుంచి బయటపడేయచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: భారతీయలు పాక్లో వ్యాపారం చేయవచ్చా? -
Chandrayaan-3: ఆ శకలంతో ఎటువంటి ప్రమాదం లేదు: ఇస్రో
బెంగళూరు: చంద్రయాన్–3 అంతరిక్ష నౌకను జూలై 14న నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టడంలో కీలకమైన క్రయోజనిక్ రాకెట్ ఇంజిన్లోని ఒక భాగం భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిందని ఇస్రో తెలిపింది. ఎల్వీఎం–3 ఎం4కు చెందిన ఈ శకలం బుధవారం మధ్యాహ్నం 2.42 సమయంలో భూ వాతావరణంలోకి ప్రవేశించినట్లు గుర్తించామని గురువారం ఇస్రో వివరించింది. దీని వల్ల ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. ఇది ఉత్తర పసిఫిక్ సముద్రంలో పడే అవకాశాలున్నాయని తెలిపింది. భారత గగనతలంలోకి ప్రవేశించే అవకాశాల్లేవని ఒక ప్రకటనలో ఇస్రో స్పష్టం చేసింది. -
సౌర కుటుంబానికి అవతల.. సప్త గ్రహ కుటుంబం!
నిన్న మొన్నటివరకూ సౌర కుటుంబానికి అవతల ఇంకో గ్రహం ఉందంటేనే నమ్మేవారు కాదు. కానీ. ఇప్పుడు ఇలాంటి ఎక్సోప్లానెట్లు కొన్ని వేలు ఉన్నాయన్న విషయం సుస్పష్టమైంది. మరి.. ఇన్ని వేల గ్రహాల్లో భూమిని పోలినవి? మన సౌరకుటుంబం మాదిరిగా ఉన్నవి ఏవైనా ఉన్నాయా? ఈ ప్రశ్నకూ సమాధానం అవుననే. కాకపోతే తాజాగా ఈ జాబితాలోకి ఇంకోటి వచ్చి చేరింది. అదేమిటో తెలుసా? సప్త గ్రహ కుటుంబం! భూమికి కొన్ని రెట్లు ఎక్కువ పరిమాణమున్న ఏడు గ్రహాలు ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతూంటాయి ఇందులో! సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలున్నాయన్నది కాసేపు పక్కనబెడదాం. విశ్వం మొత్తమ్మీద ఎన్ని ఉన్నాయంటే కచ్చితమైన సమాధానమైతే తెలియదు. కానీ.. ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా మన గ్రహ వ్యవస్థకు ఆవల గ్రహాలెన్ని ఉన్నాయి? వాటిల్లో భూమిని పోలినవి ఎన్ని? జీవించే పరిస్థితులు ఉన్నవాటి సంఖ్య ఎంత? మాతృనక్షత్రానికి (మనకు సూర్యుడు) ఎంత దూరంలో గ్రహాలు తిరుగుతున్నాయి? అన్న అనేక అంశాలపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 2009లో కెప్లర్ మిషన్ను ప్రయోగించింది. అంతరిక్షంలో ఉంటూ మన పాలపుంతలో భూమి సైజున్న గ్రహాలు ఎన్ని ఉన్నాయో చూడటం ఈ టెలిస్కోపు లక్ష్యం. తొమ్మిదేళ్లపాటు ఈ టెలిస్కోపు అంతరిక్షంలోని ఓ చిన్న భాగాన్ని మాత్రమే పరిశీలించి మన పాలపుంతలోనే కనీసం కొన్ని వందల కోట్ల ఎక్సోప్లానెట్లు ఉన్నాయని తేల్చింది. 2009 మార్చి ఆరవ తేదీన నింగికి ఎగిసినప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ కెప్లర్ టెలిస్కోపు వీటిల్లో ఐదు వేలకుపైగా గ్రహాలను గుర్తించింది కూడా! ట్రాపిస్ట్-1లోనూ ఏడు గ్రహాలు... కెప్లర్ గుర్తించి అనేకానేక గ్రహ వ్యవస్థల్లో ట్రాపిస్ట్-1 ఒకటి. భూమికి సుమారు 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుందీ వ్యవస్థ. ఓ రెడ్ డ్వార్ఫ్ నక్షత్రం (మన సూర్యుడి సైజులో 0.8 - 0.6 శాతం సైజు మాత్రమే ఉండే నక్షత్రాలు) చుట్టూ భూమి సైజున ఏడు గ్రహాలతో ఏర్పడింది ఇది. ఈ రెడ్ డ్వార్ఫ్ నక్షత్రాలు మన సూర్యుడి మాదిరి అంత ప్రకాశవంతంగా ఏమీ ఉండవు. మన పాలపుంతలో అనేక రకాల నక్షత్రాలు ఉన్నా ఈ రెడ్ డ్వార్ఫ్ రకంవి ఎక్కువగా ఉన్నాయని అంచనా. ట్రాపిస్ట్-1లోని ఏడు గ్రహాల్లోనూ నీళ్లు ఉండేందుకు అవకాశం ఉందని నాసా చెబుతోంది. స్పీట్జర్, కెప్లర్, హబుల్.. తాజాగా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపుల సాయంతో ఈ గ్రహ వ్యవస్థను ఇప్పటికే క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. తాజాగా ఇంకో సప్తగ్రహ వ్యవస్థ... కెప్లర్ టెలిస్కోపు ద్వారా సేకరించిన సమాచారాన్ని ఇప్పటికీ విశ్లేషిస్తూనే ఉండగా... తాజాగా దీనిద్వారా ఇంకో సప్తగ్రహ వ్యవస్థ గురించి తెలిసింది. కాకపోతే ఇందులో ట్రాపిస్ట్-1లో మాదిరిగా భూమి కంటే పెద్ద సైజున్న గ్రహాలు ఉండటం విశేషం. ఈ సరికొత్త గ్రహ వ్యవస్థను ‘కెప్లర్-385’ అని పిలుస్తున్నారు. భూమికి సుమారు వెయ్యి కాంతి సంత్సరాల దూరంలో ఉందీ వ్యవస్థ. భూమి సైజు కంటే 1.3 రెట్ల నుంచి 2.5 రెట్లు ఎక్కువ సైజుండే గ్రహాలను సూపర్ ఎర్త్లతో కూడి ఉంది ఇది. ఈ గ్రహాలకు... దాని మాతృ నక్షత్రానికి మధ్య ఉన్న దూరం మన సూర్యుడికి, బుధ గ్రహానికి మధ్య ఉన్నంత దూరం! చదవండి: ఉపన్యాసం వద్దు.. ట్రంప్పై న్యాయమూర్తి ఆగ్రహం -
భూమిపై అత్యంత విషపూరిత జంతువులు ఫోటో గ్యాలరీ
-
‘రింగ్ ఆఫ్ ఫైర్’ అంటే ఏమిటి? ఈ శనివారం ఆకాశంలో ఏం జరగనుంది?
వచ్చే శనివారం అంటే అక్టోబర్ 14న అంతరిక్షంలో ఒక ప్రత్యేక దృశ్యం కనిపించనుంది. సూర్యుని లోపల ఒక నల్లని ఆకారం ఏర్పడనుంది. ఫలితంగా సూర్యుని చుట్టూ అగ్ని వలయం కనిపించనుంది. దీనినే ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని పిలుస్తారు. సూర్యగ్రహణం కారణంగా సూర్యుడు ఈ రీతిలో కనిపించనున్నాడు. సంవత్సరంలో చివరిసారిగా ఏర్పడే ఈ సూర్యగ్రహణం ప్రత్యేకంగా కనిపించనుంది. సూర్యగ్రహణం సంభవించే ప్రతీసారీ ఇలా జరగదు. చంద్రుని ప్రత్యేక స్థానం కారణంగా ఇలా జరగనుంది. భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు.. చంద్రుని నీడ భూమిపై పడనుంది. అక్టోబరు 14న ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే సూర్యగ్రహణం సాధారణమైనది కాదు. ఇది కంకణాకృతి సూర్యగ్రహణం. సూర్యగ్రహణం సమయంలో కొన్నిసార్లు సూర్యుడు మొత్తంగా చంద్రుని వెనుక దాక్కుంటాడు. కొన్నిసార్లు మెరుస్తున్న ఉంగరం మాదిరిగా కనిపిస్తాడు. సూర్యుని ప్రకాశాన్ని చంద్రుడు పూర్తిగా కప్పివేసినప్పుడు, సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కంకణాకార సూర్యగ్రహణంలో సూర్యుడు చంద్రుని బ్లాక్ డిస్క్ చుట్టూ ఉండే రింగ్ మాదిరిగా కనిపిస్తాడు. దీనినే యాన్యులస్ అంటారు. సాధారణ సంపూర్ణ సూర్యగ్రహణంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా అడ్డుకుంటాడు. అయితే వార్షిక సూర్యగ్రహణంలో, చంద్రుడు.. భూమి కక్ష్యలో దానికి దూరంగా ఉంటాడు. ఈ కారణంగా చంద్రుడు ఆకాశంలో సూర్యుడి కంటే కొంత చిన్నగా కనిపిస్తూ, సూర్యుడిని అడ్డుకుంటాడు. అంటే సూర్యుడిని పూర్తిగా కవర్ చేయడు. ఈ స్థితిలో సూర్యుని స్థానంలో అగ్ని వలయం కనిపిస్తుంది. కాగా ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఎందుకంటే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో రాత్రి సమయంలో సంభవిస్తుంది. గ్రహణం సమయంలో భారతదేశం చంద్రునికి వ్యతిరేక దిశలో ఉంటుంది. భారతదేశంలో చంద్రుడు కనిపించే సమయానికి, సూర్యగ్రహణం ముగుస్తుంది. ఈ గ్రహణం ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. అయితే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రత్యక్ష ప్రసారం ద్వారా భారతదేశ ప్రజలు ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు. నాసా తెలిపిన వివరాల ప్రకారం, ఈ సూర్యగ్రహణాన్ని భారత కాలమానం ప్రకారం రాత్రి 8.35 గంటలకు చూడవచ్చు. అమెరికాలో, ఒరెగాన్, కాలిఫోర్నియా, నెవాడా, టెక్సాస్, ఉటా, అరిజోనా, న్యూ మెక్సికో రాష్ట్రాల్లో ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది. మెక్సికో, గ్వాటెమాల, బెలిజ్, హోండురాస్, నికరాగ్వా, పనామా, కొలంబియా, బ్రెజిల్లలో ఇది సూర్యాస్తమయానికి ముందు కనిపించనుంది. ఇది కూడా చదవండి: రీల్స్ కోసం సరయూలో అశ్లీల నృత్యం.. రంగంలోకి దిగిన పోలీసులు! -
‘మార్స్ ’ రెడ్ ప్లానెట్ ఎందుకయ్యింది? విలక్షణత ఎలా వచ్చింది?
మార్స్ అంటే అంగారక గ్రహం. ఇది ఎర్రగా కనిపించడం వెనుక అనేక కారణాలున్నాయి. వీటిలో మొదటిది దాని ఉపరితలం నిర్మాణంతో ముడిపడి ఉంది. కాగా ఐరన్ ఆక్సైడ్ ఉనికిని రస్ట్ అని అంటారు. ఆక్సిజన్తో పాటు తేమకు చేరువైనప్పుడు భూమిపై ఉన్న ఇనుప వస్తువులు తుప్పు పడతాయి. ఇదేవిధంగా మార్స్పై ఇనుము ఆక్సీకరణ ప్రక్రియ జరుగుతుంది. ఫలితంగా అంగారక గ్రహం నేల, రాళ్ళకు విలక్షణమైన ఎరుపు రంగు సంతరించుకుంటుంది. భూమితో పోలిస్తే మార్స్ బలహీనమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. అక్కడి వాతావరణం కార్బన్ డయాక్సైడ్తో కూడి ఉంటుంది. ఈ బలహీన వాతావరణంలో సూర్యరశ్మి భిన్నంగా వెలువడుతుంది. సూర్యరశ్మి అంగారకుని వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు రేలీ స్కాటరింగ్ అనే ప్రక్రియ జరుగుతుంది. దీని వలన కాంతిలోని తక్కువ తరంగదైర్ఘ్యాలు (నీలం, ఆకుపచ్చ వంటివి) ఎక్కువ వెదజల్లుతాయి. ఎక్కువ తరంగదైర్ఘ్యాలు (ఎరుపు, నారింజ వంటివి) ప్రబలంగా మారతాయి. ఇదే అక్కడి ఎరుపు రంగుకు కారణం. మార్స్ చరిత్రలో గణనీయమైన అగ్నిపర్వత కార్యకలాపాలు జరిగాయి. ఈ విస్ఫోటనాల సమయంలో విడుదలయ్యే అగ్నిపర్వత శిలలు, ఖనిజాలు కూడా గ్రహం రంగుకు దోహదం చేస్తాయి. అంగారక గ్రహంపై ఉన్న కొన్ని అగ్నిపర్వత పదార్థాలు, వాతావరణం మారినప్పుడు ఎరుపు రంగును ఉత్పత్తి చేస్తాయి. అంగారక గ్రహంపై భారీగా దుమ్ము తుఫానులు చోటుచేసుకుంటాయి. సూక్ష్మ ధూళి కణాలతో నిండిన ఈ తుఫానులు, సూర్యరశ్మి వెదజల్లినప్పుడు మార్స్కున్న ఎరుపు రూపాన్ని మరింత వృద్ధి చేస్తాయి. ఈ రంగు ఖగోళ శాస్త్రవేత్తలు, అంతరిక్ష ప్రేమికులను ఆకర్షిస్తూనే ఉంటుంది. అంగారక గ్రహాన్ని అధ్యయనం చేసేందుకు కూడా అక్కడి ఎరుపురంగు దోహదపడుతుంది. ఇది కూడా చదవండి: దోమలను ఎవరు ఇష్టంగా తింటారు? -
375 ఏళ్లకు బయటపడిన 8 వ ఖండం ఏది?
మనిషి భూమి నలుచెరగులా తిరిగాడని, ఇక చూడాల్సినది ఏమీ లేదని అనుకుంటే అది తప్పే అవుతుంది. నేటికీ భూమిపై అన్వేషించేందుకు చాలా రహస్యాలు దాగివున్నాయి. 375 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇటీవలే శాస్త్రవేత్తలు భూమికి గల 8వ ఖండం అయిన జిలాండియాను కనుగొన్నారు. ఈ ఖండం చాలా పెద్దది. పలు చిన్న దేశాలకు ఇందులో వసతి కల్పించవచ్చు. ఈ ఖండానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా ఏళ్లుగా దాగున్న ఖండం అని చెబుతారు. 2017 సంవత్సరం వరకు ఈ ఖండం గురించి ఎవరికీ తెలియదు. అయితే ఈ ఏడాది కొందరు శాస్త్రవేత్తలు దీని గురించి ప్రస్తావించడంతో ప్రపంచం దృష్టి ఈ ఖండంవైపు మళ్లింది. ఈ 8వ ఖండం 49 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని పలు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు. దీని ఉనికి విషయానికొస్తే ఈ ఖండం దాదాపు 55 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఖండంలోని 94 శాతం భూభాగం నీటిలో మునిగిపోయింది. 6 శాతం భూమి మాత్రమే అందుబాటులో ఉంది. ఇది న్యూజిలాండ్ మాదిరిగా కనిపిస్తుంది. ఈ ఖండం చాలా ప్రత్యేకమైనది. అగ్నిపర్వత శిలలు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ కనిపించే జంతువులు, జీవులు ప్రపంచంలోని ఇతర జీవులకు భిన్నంగా కనిపిస్తాయి. ఈ ఖండంలో దాగున్న రహస్యాలను వెలికితీసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా చదవండి: భారత్లో ఆఫ్ఘన్ ఎంబసీ మూసివేత! -
డార్క్ ఎర్త్ అంటే ఏమిటి? శాస్త్రవేత్తలు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు?
మనిషి అంతరిక్షంలోకి వెళ్లడంలో విజయం సాధించాడు. శాస్త్రవేత్తలు ఇతర గ్రహాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు. అయితే భూమిపైగల అనేక రహస్యాల చిక్కుముడులు నేటికీ వీడటం లేదు. వాటి గురించి శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా ఎంఐటీ, యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా, బ్రెజిల్ పరిశోధకులు అమెజాన్లో డార్క్ ఎర్త్ను కనుగొన్నారు. డార్క్ ఎర్త్ పేరుతో సారవంతమైన భూమిని రూపొందించేందుకు పురాతన అమెజోనియన్లు ప్రయత్నించారని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ ఇటీవలి కాలంలో చేపడుతున్న వాతావరణ మార్పు ఉపశమన ప్రయత్నాలపై ఎంతో ప్రభావం చూపనుంది. పచ్చని వృక్షసంపద, వర్షపాతానికి ప్రసిద్ధి చెందిన అమెజాన్లోని ఈ డార్క్ ఎర్త్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పురాతన మానవ స్థావరాల చుట్టూ ఉన్న నల్లని, సారవంతమైన మట్టిని పురావస్తు శాస్త్రవేత్తలు డార్క్ ఎర్త్ అని పిలుస్తారు. ఈ నేలను ఉద్దేశపూర్వకంగా తయారు చేశారా లేక ఇది పురాతన సంస్కృతుల ప్రతిబింబమా అనేది స్పష్టంగా తొలుత తెలియరాలేదు. ఈ పరిశోధనా బృందం.. మట్టి విశ్లేషణ, ఎథ్నోగ్రాఫిక్ ప్రతిస్పందనలు, ఆధునిక స్వదేశీ కమ్యూనిటీల సాయంతో పలు వివరాలు సేకరించి, డార్క్ ఎర్త్ను పురాతన అమెజోనియన్లు ఉద్దేశపూర్వకంగానే తయారు చేశారని నిరూపించారు. డార్క్ ఎర్త్ను తయారు చేయడంలో నాటి ప్రజలు ప్రముఖ పాత్ర పోషించారని, దానిని మానవ జనాభా నివాసానికి అనువైన ప్రదేశంగా మార్చడానికి, వాతావరణాన్ని ఎంతో చొరవతో సవరించారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎంఐటీకి చెందిన ఎర్త్, అట్మాస్ఫియరిక్ ప్రొఫెసర్ టేలర్ పెర్రోన్ మాట్లాడుతూ డార్క్ ఎర్త్లో ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ భూమిలో భారీ మొత్తంలో నిల్వఅయిన కార్బన్ ఉంది. ఇది వేల సంవత్సరాలుగా ఈ భూమిలో పేరుకుపోయింది. తరతరాల ప్రజలు తమ ఆహార వ్యర్థాలు, బొగ్గు, చెత్తతో ఈ మట్టిని సారవంతం చేశారన్నారు. సైన్స్ అడ్వాన్సెస్లో ప్రచురితమైన నివేదికను ఆగ్నేయ అమెజాన్లోని ఎగువ జింగు నది పరీవాహక ప్రాంతంలోని క్యూకురో ప్రాంతం నుంచి సేకరించిన డేటా ఆధారంగా రూపొందించారు. పరిశోధకులు మట్టి నిర్వహణలో క్యూకురో పద్ధతులను అవగాహన చేసుకునేందుకు ప్రయత్నించారు. చెత్త, ఆహార స్క్రాప్ల కుప్పలు కంపోస్ట్ ఎరువు కుప్పల మాదిరిగానే ఉంటాయి. ఇవి కుళ్ళిపోయి మట్టిలో కలిసి, సారవంతమైన నేలను ఏర్పరుస్తాయి. ఈ డార్క్ఎర్త్ అభ్యాసాలను డాక్యుమెంట్ చేయడానికి పరిశోధకులు గ్రామస్తులతో ఇంటర్వ్యూలు కూడా చేపట్టారు. గ్రామస్తులు ఈడార్క్ ఎర్త్ను ఇగెపె అని పిలుస్తారు. వ్యవసాయ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, సారవంతమైన మట్టి రూపకల్పనకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందని గ్రామస్తులు తెలిపారు. ఇది కూడా చదవండి: పాక్లో మాజీ ప్రధానుల అరెస్ట్ ఎందుకు? ఏఏ కేసులలో అరెస్ట్ అయ్యారు? -
ప్రపంచ జనాభాలో 1,280 మంది మాత్రమే మిగిలిన విపత్తు ఏది? నాడు ఏం జరిగింది?
మానవులు భూమిపై అనేక విపత్తులను చవిచూశారు. ప్రతి సంవత్సరం లెక్కలేనంత జనాభా.. భూకంపాలు, వరదలకు బలవుతూవస్తోంది. ఇటీవలి కరోనా విధ్వంసం లక్షలాదిమంది ప్రాణాలను బలిగొంది. అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్న విధ్వంసం గురించి విన్నప్పుడు ఎవరికైనా సరే కాళ్ల కింద భూమి కంపించినట్లవుతుంది. నాటి ఆ విపత్తు తీవ్రతకు ఈ భూమండలంపై కేవలం 1,280 మంది మాత్రమే మిగిలారు. ఈ పెను విపత్తు ఎప్పుడు సంభవించింది? మనం చెప్పుకోబోతున్న ఈ సంఘటన తొమ్మిది లక్షల సంవత్సరాల క్రితం జరిగింది. అంతటి విపత్తులో తమను తాము రక్షించుకోగలిగిన 1,280 మంది మాత్రమే మిగిలారు. వారి కారణంగానే ఈ రోజు ఈ భూమిపై ఎనిమిది బిలియన్ల మంది ప్రజలు జీవించి ఉన్నారని చెబుతారు. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం జర్మన్ న్యూస్ వెబ్సైట్ డీడబ్ల్యు తెలిపిన వివరాల ప్రకారం మనిషి పూర్వీకులు ఒకప్పుడు విపత్తులకు చాలా దగ్గరగా ఉండేవారు. ఈ విషయాన్ని జన్యు విశ్లేషణ ఆధారంగా జరిపిన ఒక అధ్యయనం వెల్లడించింది. మానవ జనాభా దాదాపు అంతరించిపోయిన కాలం ఒకప్పుడు ఏర్పడిందని ఈ అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పరిశోధన రెండు లక్షల సంవత్సరాల క్రితం దొరికిన ఆదిమ మానవుల అవశేషాలపై జరిగింది. ఈ పరిశోధన ఎవరు సాగించారంటే.. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కు చెందిన షాంఘై ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఈ పరిశోధన చేసింది. తొమ్మిది లక్షల ముప్పై వేల సంవత్సరాల క్రితం భూమిపై తలెత్తిన ఆ విపత్తు అనంతరం భూమిపై కేవలం 1280 మంది మాత్రమే మిగిలారని పరిశోధకులు కంప్యూటర్ మోడలింగ్ ద్వారా కనుగొన్నారు. నాటి భీకర విపత్తులో 98.7 శాతం మానవ జనాభా నాశనమైందని ఈ పరిశోధన నిర్వహించిన ప్రధాన పరిశోధకుడు హైపెంగ్ లీ వివరించారు. ఇంతకీ నాడు భూమిపై ఏమి జరిగింది? ఈ పరిశోధనలో వెల్లడైన వివరాల ప్రకారం మంచు యుగంలో భూమిపై ఉష్ణోగ్రతలు విపరీతంగా తగ్గడం వల్ల ఈ విపత్కర పరిస్థితి ఏర్పడింది. ఈ మంచు యుగంలో మానవులు దాదాపు అంతరించిపోయారు. అయితే అంతటి దుర్భర పరిస్థితిలోనూ తమను తాము రక్షించుకోవడంలో కొందరు మానవులు విజయం సాధించారు. ఈ మానవులే తదుపరి మానవ నాగరికత అభివృద్ధికి కారణమయ్యారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: తల తీయడం మొదలు తుపాకీతో కాల్చడం వరకూ.. ఏ దేశంలో ఎటువంటి మరణశిక్ష? -
ఆదిత్య ఎల్1.. అసలు కథ షురూ
సూర్యుని పై పరిశోధనలు చేసేందుకు ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 మిషన్ లో మరో కీలక ఘట్టం నమోదైంది. ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం సూర్యుడిని చేరుకునేందుకు ఐదో సారి భూ కక్ష్యను పెంపును ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. తద్వారా ఆదిత్య ఎల్ -1 భూప్రదక్షిణ దశ ముగించుకుని.. సూర్యుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది.ఇక ఇక్కడి నుంచి అసలు ఉత్కంఠ మొదలవుతుంది. సోమవారం అర్ధరాత్రి దాటాక.. వాహన నౌక లగ్రాంజ్ పాయంట్ 1 దిశగా దూసుకెళ్లడం ప్రారంభించింది. ఇప్పటికే ఈ ఉపగ్రహ భూకక్ష్యను నాలుగుసార్లు పెంచారు. తాజాగా ఐదోసారి కక్ష్యను పెంచి సూర్యుడి దిశలో వెళ్లేలా విన్యాసం చేశారు. బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ కేంద్రంగా ఇస్రో ఆపరేట్ చేస్తుంది. అదేవిధంగా మారిషస్, పోర్ట్ బ్లెయిర్ లోని ఇస్రో గ్రౌండ్ స్టేషన్లు భూ కక్ష్య పెంపును సమీక్షించాయి. ప్రస్తుతం ఆదిత్య ఎల్-1 శాటిలైట్ 256 కి.మీ x 121973 కి.మీ. కక్ష్యలోకి ప్రవేశించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. శాటిలైట్ సూర్యుడి వైపు ప్రయాణించి.. నిర్దేశిత ఎల్-1 పాయింట్ కు చేరాలంటే మరో నాలుగు నెలల సమయం పడుతుందని పేర్కొన్నారు. డేటా సేకరణ ప్రారంభం సూర్యుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) సెప్టెంబర్ 2వ తేదీన ఆదిత్య ఎల్ -1 (Aditya-L1) ప్రయోగించింది. అయితే ఇది శాస్త్రీయ డేటాను సేకరించడం ప్రారంభించింది. భూమి చుట్టూ ఉన్న పార్టికల్స్ ప్రవర్తనను విశ్లేషించడానికి శాస్త్రవేత్తలకు ఈ డేటా ఉపయోగపడనుంది. Aditya-L1 Mission: Aditya-L1 has commenced collecting scientific data. The sensors of the STEPS instrument have begun measuring supra-thermal and energetic ions and electrons at distances greater than 50,000 km from Earth. This data helps scientists analyze the behaviour of… pic.twitter.com/kkLXFoy3Ri — ISRO (@isro) September 18, 2023 -
ఆకాశంలో వజ్రం.. 'లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై'
వాషింగ్టన్: సౌర కుటుంబంలో అత్యంత చిన్న గ్రహమైన బుధుడి ఫోటోను తీసింది నాసాకు చెందిన వ్యోమనౌక 'మెసెంజర్'. నాసా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఆ ఫోటోను చూస్తే చిన్నప్పుడు చదువుకున్న 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై' పదాలు గుర్తుకు రాక మానవు. అచ్చంగా వజ్రాన్ని పోలి ఉన్న బుధుడు ఆకాశంలో వెలుగుజిలుగులతో నిజంగానే డైమండ్లా మెరిసిపోతున్నాడు. 'మెసెంజర్' 'అడ్వెంచర్' ఈ గ్రహం చుట్టూ తిరుగుతున్న మొట్టమొదటి నాసా వ్యోమనౌక 'మెసెంజర్' తీసిన ఈ అద్భుతమైన ఫొటోను నాసా ఇన్ స్టాగ్రామ్లో షేర్ చేయగానే క్షణాల్లో వైరల్ అయ్యింది. ఫోటోలో మెర్య్కురీ వజ్రకాంతి ధగధగలతో తళుకులీనుతోంది. సూర్యుడికి అత్యంత చేరువలో ఉన్నట్లు కనిపించే ఈ గ్రాహం సూర్యుడికి 58 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నిజంగా వజ్రమేనా.. ఈ ఫోటో కింద నాసా రాస్తూ.. వారు నన్ను మిస్టర్ ఫారన్హీట్ అని పిలుస్తారు. సైజులో భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడి కంటే కొంచెం పెద్దగా ఉండే ఈ గ్రహం మన సౌర కుటుంబంలోనే అత్యంత చిన్నది. ఇది సూర్యునికి 58 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రహం చిన్నదే అయినప్పటికీ తన కక్ష్య చుట్టూ అత్యంత వేగంగా తిరుగుతుంది. సెకనుకి 47 కిలోమీటర్ల వేగంతో ఇది చక్కర్లు కొడుతుంది. ఈ గ్రహంపై ఒక సంవత్సర కాలం భూమిపై 88 రోజులతో సమానం. ఈ కక్ష్యలోకి ప్రవేశించిన మొట్టమొదటి స్పేస్క్రాఫ్ట్ మెసెంజర్ బుధుడి ఉపరితలంపై ఉన్న రాళ్లల్లో రసాయన, ఖనిజ, భౌతిక వ్యత్యాసాల్ని గుర్తించేందుకు వీలుగా ఇలా బుధుడి కలర్ ఫోటోని తీసింది. జూ. సూర్యుడు.. వాతావరణానికి బదులుగా బుధుడిపై చాలావరకు ఆక్సిజన్, సోడియం, హైడ్రోజన్, హీలియం, పొటాషియంతో కూడిన సన్నని ఎక్సోస్పియర్ను కలిగి ఉంటుంది. ఈ గ్రహంపై వాతావరణం లేకపోవడం, సూర్యునికి అత్యంత చేరువగా ఉండటంతో పగటిపూట 800ºF (430ºC) నుండి రాత్రికి -290 ºF (-180 ºC) వరకు ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. భూమితో పోలిస్తే దీని అయస్కాంత క్షేత్రం చాలా బలహీనంగా ఉంటుంది. శాస్త్రవేత్తలు దీని ఉపరితలాన్ని పరీక్షించేందుకు వీలుగా నీలి రంగు వర్ణాల ఉపరితలాన్ని అక్కడక్కడా గుంతలు ఉండటాన్ని మనం గమనించవచ్చని రాసింది. View this post on Instagram A post shared by NASA (@nasa) ఇది కూడా చదవండి: ఢిల్లీ హోటల్లో హైడ్రామా సృష్టించిన జీ20 చైనా బృందం -
చంద్రునిపై భూకంపాలు వస్తాయా? విజ్ఞానశాస్త్రం ఏమి చెబుతోంది?
చంద్రుని భౌగోళిక నిర్మాణం భూమి తరహాలో లేదు. అక్కడి టెక్టోనిక్ ప్లేట్లు భూమి టెక్టోనిక్ ప్లేట్ల మాదిరిగా చురుకుగా లేవు. చంద్రునిపై భూకంపాలు వస్తుంటాయి. ఇటీవల చంద్రునిపైకి చేరిన విక్రమ్ ల్యాండర్ అక్కడి భూకంప కార్యకలాపాల సంకేతాలను కనుగొంది. చంద్రునిపై వచ్చే భూకంపాలు భూమికి వచ్చే భూకంపాల కంటే శక్తివంతంగా ఉంటాయని, ఒక్కోసారి వాటి తీవ్రత 20 రెట్లు అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిపై వివిధ రకాల సాధనాలు భూకంపాల గురించిన సమాచారాన్ని అందిస్తాయి. అయితే చంద్రునిపై అపోలో 17లోని వ్యోమగాములు అక్కడ భూకంప కార్యకలాపాలను సంగ్రహించే ప్రదేశాలలో సీస్మోమీటర్లను విడిచిపెట్టారు. చంద్రునిపై ఈ సీస్మోమీటర్లు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే చురుకుగా ఉన్నాయి. అయితే అవి ఆ సమయంలో 12 వేల భూకంపాల గురించిన సమాచారాన్ని అందించాయి. చంద్రునిపై నాలుగు రకాల భూకంపాలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఒకటి లోతైన భూకంపం, మరొకటి తేలికపాటి లేదా నిస్సార భూకంపం, మూడవది ఉల్కా భూకంపం. నాల్గవది థర్మల్ భూకంపం. లోతైన భూకంపాలు లోతైన భూకంపాలు చంద్రునిపై అత్యంత సాధారణ తరహా భూకంపాలు. ఇవి చంద్రుని ఉపరితలం నుండి 700 కిలోమీటర్ల వరకు ఉద్భవించాయి. భూమిపైనున్న మహాసముద్రాలను చంద్రుడు ప్రభావితం చేసిన విధంగా, చంద్రుని లోతైన రాతి కోర్పై భూమి ఎక్కువగా ప్రభావితం అవుతుందని, ఇది భూకంపాలకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉల్కా భూకంపం చంద్రునిపై ఉల్కలు పరస్పరం ఢీకొనడం వల్ల కూడా భూకంపాలు సంభవిస్తాయి. ఇదేకాకుండా చంద్రుని ఉపరితలంపై మారుతున్న ఉష్ణోగ్రతల కారణంగానూ చంద్రునిపై ఉష్ణ భూకంపాలు సంభవిస్తాయి. రెండు వారాల పాటు చంద్రునిపై చీకటి ఉంటుంది. అప్పుడు ఉష్ణోగ్రత -115 డిగ్రీల సెల్సియస్కు తగ్గుతుంది. పగటిపూట +121 డిగ్రీల సెల్సియస్కు పెరుగుతుంది. ఈ హెచ్చుతగ్గుల కారణంగా భూకంప తరంగాలు ఉత్పన్నమవుతాయి. తేలికపాటి భూకంపం చంద్రునిపై సంభవించే తేలికపాటి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5 కంటే ఎక్కువగా ఉంది. చంద్రుని లోపలున్న టెక్టోనిక్ ప్లేట్, ఇటీవల ఏర్పడిన పెద్ద బిలం మధ్య పరస్పర చర్య ఈ భూకంపాలకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూకంపాలు ఎంతసేపు ఉంటాయి? భూమిపై భూకంపాలు 10 నుండి 30 సెకన్ల వరకు ఉంటాయి. కొన్ని రెండు నిమిషాల పాటు ఉంటాయి. మరికొన్ని పది నిమిషాల పాటు ఉంటాయి. భూమితో పోలిస్తే చంద్రుని దృఢత్వం అధికం. అందుకే అక్కడ ప్రకంపనలు పది నిమిషాలకు పైగా ఉంటాయి. కొన్ని గంటలపాటు కూడా ప్రభావం చూపిస్తాయి. భవిష్యత్తులో అక్కడ కాలనీ నిర్మించడానికి చంద్రునిపై భూకంపాల అధ్యయనం చాలా ముఖ్యమైనది. రాబోయే కాలంలో మరిన్ని మిషన్లు అక్కడ వివిధ పరికరాలను అమర్చర్చి భూకంపాల గురించి సమగ్ర సమాచారం తెలుసుకుంటాయి. నాసా సమీప భవిష్యత్తులో చంద్రునిపై అనేక సీస్మోమీటర్లను వ్యవస్థాపించే ప్రణాళికను రూపొందిస్తోంది. ఇది కూడా చదవండి: ఫిఫ్త్ ఫ్లోర్లో పెట్రోల్ బంక్ ఎందుకు కట్టారు? వాహనదారులు ఎలా వెళతారు?
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
ఫ్యాన్స్లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement