Hong Kong
-
హైదరాబాద్ టు హాంకాంగ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి హాంకాంగ్కు నేరుగా విమాన సర్వీసులు వచ్చే మార్చి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం హాంకాంగ్కు వెళ్లాలంటే.. హైదరాబాద్ నుంచి సింగపూర్, కౌలాలంపూర్, బ్యాంకాక్ల మీదుగా రాకపోకలు సాగించేవారు. హైదరాబాద్ నుంచి ఏటేటా అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ పెరుగుతోంది. ఇప్పటి వరకు 20 నగరాలకు నేరుగా విమాన సర్వీసులు ఉన్నాయి. రానున్న 18 నెలల్లో దశలవారీగా మరిన్ని అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ ఏర్పాటు కానుంది. హాంకాంగ్తోపాటు అడిస్ అబాబా, ఆమ్స్టర్డామ్, రియాద్లకు కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆయా ఎయిర్లైన్స్తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ఈ ఏడాది జూన్లో ఇథియోపియన్ ఎయిర్లైన్స్ అడిస్ అబాబాకు విమానాలు నడపనుంది. సెప్టెంబర్లో ఆమ్స్టర్డ్యామ్కు సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. రియాద్కు కూడా త్వరలోనే సర్వీసులను ప్రవేశపెట్టనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి మరిన్ని నగరాలకు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.హైదరాబాద్ నుంచి పారిస్, ఆస్ట్రేలియా, హోచిమిన్ సిటీ, హనోయ్, క్రాబీ, కఠ్మాండు, మదీనా నగరాలకు కొత్తగా విమానాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, పలు విమానయాన సంస్థలతో చర్చలు జరుగుతున్నాయని ఎయిర్పోర్ట్ సీఈఓ ప్రదీప్ ఫణికర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2019–20 సంవత్సరంలో 32 లక్షల మంది విదేశాలకు రాకపోకలు సాగించగా, 2023–24 నాటికి ఈ సంఖ్య 42 లక్షలకు పెరిగింది. -
Hong kong: హాంకాంగ్లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
హాంకాంగ్ తెలుగు సమాఖ్య అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2025ని ఘనంగా జరుపుకుంది. ఈ దినోత్సవం భాషా వైవిధ్యం మరియు బహుభాషావాదం యొక్క ప్రాముఖ్యతను పునరుద్ఘాటించింది. జూమ్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో, హాంకాంగ్లోని వివిధ భాషా సమాజాల నుండి ప్రతినిధులు మరియు అతిథులు పాల్గొన్నారు. వివిధ భాషలలో కవితలు, కథలు, ప్రదర్శనలు, పాటలు మరియు జానపద నృత్యాలు పంచుకున్నారు. ఈ వేడుకలో పాల్గొన్న భాషలలో కాంటోనీస్, కుర్దిష్, బంగ్లా, మరాఠీ, రొమేనియన్, కన్నడ, సంస్కృతం, హిందీ, మలయాళం, పంజాబీ, గుజరాతీ, తమిళం, తెలుగు, బెంగాలీ మరియు నేపాలీ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు వీరే.. 1.మిస్టర్ యూజీన్ ఫాంగ్, పార్టనర్షిప్ ఎంగేజ్మెంట్ చైర్ మరియు మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు, యునెస్కో హాంకాంగ్ అసోసియేషన్ గ్లోకల్ పీస్ సెంటర్2. మిస్టర్ మార్కో క్వాంగ్, ప్రాజెక్ట్స్ ఆఫీసర్, యునెస్కో HK అసోసియేషన్-గ్లోకల్ పీస్ సెంటర్3. మిస్టర్ అష్ఫాకుర్ రెహమాన్, బంగ్లాదేశ్ అసోసియేషన్ ఆఫ్ హాంకాంగ్ అధ్యక్షుడు4 శ్రీమతి రీటా గురుంగ్, హాంకాంగ్ నేపాల్ ఫెడరేషన్ చైర్పర్సన్5. మిస్టర్ మెసుట్ టెమెల్, ఆంటోలియా కల్చరల్ అండ్ డైలాగ్ సెంటర్ చైర్మన్6. మిస్టర్ థాపా చురా బహదూర్, సర్ ఎల్లిస్ కడూరీ సెకండరీ స్కూల్ (వెస్ట్ కౌలూన్)లో NET టీచర్, టీచర్/రచయిత/రచయితమిస్టర్.7. తిరుపతి నాచియప్పన్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ & మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు, యునెస్కో హాంకాంగ్ అసోసియేషన్-గ్లోకల్ పీస్ సెంటర్ సహ-చైర్.బాంగ్లాదేశ్ అసోసియేషన్ అఫ్ హంగ్ కాంగ్ ప్రతి సంవత్సరం 1952లో మాతృభాష పవిత్రతను, గుర్తింపును కాపాడే పోరాటంలో అంతిమ త్యాగం చేసిన భాషా అమరవీరులకు కృతజ్ఞతలు తెలుపుతూ 21 ఫిబ్రవరి ని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. యునెస్కో వారి గ్లోకల్ పీస్ సెంటర్ కార్యకర్త శ్రీ తిరునాచ్ నాచియప్పన్ గారి సహాయ సహకారాలను మరియు ప్రోత్సాహాన్ని ప్రశంసించారు. ది హంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు , ఈ కార్యక్రమ రూపకర్తగా మాట్లాడుతూ, హంగ్ కాంగ్ లో మొదటి సారిగా తమ సంస్థ మాత్రమే 2021 నుంచి అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న సంస్థలకి, పిల్లలకు వారి తల్లి తండ్రులకు, గౌరవ్ అతిథులకు మరియు నిర్వహణ లో సహకరించిన వారందరికీ తమ కృతఙ్ఞతలు తెలిపారు. -
హాంకాంగ్ జాతీయ భద్రతా కేసులో సంచలన తీర్పు
హాంకాంగ్: పార్లమెంట్లో తమకు అనుకూలంగా వ్యవహరించే నేతల ఎంపిక కోసం అనధికారికంగా ప్రైమరీ ఎలక్షన్స్ చేపట్టి సమాంతర పార్లమెంటరీ వ్యవస్థ నిర్వహణకు తెగించారంటూ 45 మంది ప్రజాస్వామ్య ఉద్యమకారులు, మాజీ చట్టసభసభ్యులకు హాంకాంగ్ హైకోర్టు కఠిన శిక్షలు విధించింది. వీరికి నాలుగేళ్ల నుంచి పదేళ్ల శిక్షలుపడ్డాయి. పార్లమెంట్లో మెజారిటీ సభ్యులను తమ వైపునకు తిప్పుకుని ప్రభుత్వాన్ని నిర్విర్యంచేయాలని కుట్ర పన్నారని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. తదుపరి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తే విపక్షసభ్యులుగా ఉంటూ తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లను తిరస్కరిస్తూ వీటో చేసేందుకు వీరంతా కుట్ర పన్నారని కోర్టు తీర్పులో ప్రస్తావించింది. 2020 జూలై 10, 11వ తేదీల్లో జరిగిన ఈ అనధికార ప్రైమరీ ఎన్నికల్లో 6,10,000 ఓట్లు పోలయ్యాయి. అయితే ఆనాడు అధికార ఎన్నికలను ప్రభుత్వం కోవిడ్ మహమ్మారి విజృంభణ కారణంగా వాయిదా వేయడం తెల్సిందే. అయితే హాంకాంగ్ చరిత్రలోనే అతిపెద్ద జాతీయ భద్రతా కేసుగా పరిగణించబడిన ఈ కేసులో ఉద్యమకారులపై అన్యాయంగా శిక్షలు మోపారని ప్రపంచ దేశాలు ఖండించాయి. పరోక్షంగా చైనా ఏలుబడిలో ఉన్న హాంకాంగ్లో సమాంతర పాలనకు ప్రయత్నించారంటూ 2021 ఏడాదిలో 47 మంది ఉద్యమకారులను ప్రభుత్వం అరెస్ట్చేసింది. కఠిన జాతీయ భద్రతా చట్టం–2020 కింద కేసులు నమోదుచేసింది. ఈ చట్టం కింద దోషులుగా తేలితే గరిష్టంగా జీవితఖైదు పడే అవకాశముంది. 47 మందిలో గత ఏడాది ఇద్దరు నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. ఈ ఉదంతంలో సూత్రధారిగా కోర్టు పేర్కొన్న బెన్నీ థాయ్కు గరిష్టంగా పదేళ్ల జైలుశిక్షపడింది. మాజీ విద్యార్థి నాయకుడు జోషువా వాంగ్, మాజీ చట్టసభ సభ్యులకూ వేర్వేరు శిక్షలు పడ్డాయి. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందన్న విషయంపై తమకు కనీస అవగాహన కూడా లేదని కొందరు నిందితులు కోర్టులో చెప్పడంతో వారికి తక్కువ శిక్షలుపడ్డాయి. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు, మీడియాపై కఠిన ఆంక్షలు, ఎన్నికల్లో సాధారణ ప్రజల భాగస్వామ్యాన్ని తగ్గించడం వంటి పరిణామాల తర్వాత ప్రజాస్వామ్య ఉద్యమకారులు ఆనాడు ఇలా అనధికార ప్రైమరీ ఎన్నికలు నిర్వహించారు. దీంతో హాంకాంగ్ ప్రభుత్వం కన్నెర్రజేసింది. బ్రిటిష్ వలసప్రాంతంగా అభివృద్ధిచెందిన హాంకాంగ్పై పాలనాపగ్గాలు 1997లో చైనాకు దఖలుపడ్డాక హాంకాంగ్లో నిరంకుశ చట్టాలను డ్రాగన్దేశం అమలుచేస్తోందని ప్రపంచదేశాలు తప్పుపట్టడం విదితమే. ‘‘హాంకాంగ్ ప్రాథమిక చట్టం ప్రకారం శాంతియుతంగా తమ నిరసన తెలుపుతున్న ఉద్యమకారులపై కక్షగట్టి ప్రభుత్వం కేసులు బనాయించి ఆగమేఘాల మీద తీర్పు వెలువరించి శిక్షించింది’’అని హాంకాంగ్లోని అమెరికా కాన్సులేట్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ్రస్టేలియా, బ్రిటన్, ఐరోపా సమాఖ్యతోపాటు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి మానవహక్కుల పరిరక్షణా సంస్థలు తీర్పును తీవ్రంగా తప్పుబట్టాయి. అయితే తీర్పును చైనా స్వాగతించింది. -
జూపార్కులో 10 రోజుల్లో 12 కోతుల మృతి
హాంకాంగ్: హాంకాంగ్ జూ పార్కులో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కారణంగా 10 రోజుల వ్యవధిలో 12 కోతులు మృతిచెందాయి. కొద్ది రోజుల క్రితమే జూపార్కులో ప్రమాదకర బ్యాక్టీరియా విస్తరణను అధికారులు గుర్తించారు.మృతిచెందిన కోతులకు నిర్వహించిన పోస్ట్మార్టంలో జూ ఎన్క్లోజర్ల మట్టిలో ఒక రకమైన బ్యాక్టీరియా అధికంగా ఉన్నట్లు కనుగొన్నారు. తద్వారా ఇన్ఫెక్షన్ సోకింది. అనంతరం కోతులు సెప్సిస్ బారిన పడి మృతిచెందాయి. ఇన్ఫెక్షన్ వల్ల ఆ కోతులలోని కణాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా అవయవాలు పనిచేయడం ఆగిపోయి, అవి మృతిచెందాయి. జూ కార్మికుల బూట్ల ద్వారా కలుషితమైన మట్టి జంతువుల ఎన్క్లోజర్లకు చేరిందని అధికారులు భావిస్తున్నారు. జంతువుల కోసం గుహలు, ఇతర ఆవాసాల నిర్మాణ పనుల సమయంలో కోతుల సామూహిక మరణాలు సంభవించాయి.అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం మట్టి ద్వారా అంటువ్యాధులు సంక్రమించడమనేది సాధారణమే. కానీ జంతుప్రదర్శనశాలలలో ఇటువంటి సంఘటనలు చాలా అరుదు. బ్యాక్టీరియా సంక్రమణ కారణంగా కాటన్ టాప్ టామరిన్, వైట్-ఫేస్డ్ సాకి, కామన్ స్క్విరెల్ మంకీ, డి బ్రజ్జాతో సహా పలుకోతులు మృతిచెందాయి. మెలియోయిడోసిస్ అనేది కలుషితమైన మట్టి, గాలి లేదా నీటితో సంపర్కం ద్వారా వ్యాపించే ఒక అంటు వ్యాధి. ఇదే కోతుల ప్రాణాలను తీసింది. హాంకాంగ్ జూ పార్కు నగరం నడిబొడ్డున 14 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇన్ఫెక్షన్ కారణంగా కోతులు చనిపోవడంపై జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ఈ ఐదు నగరాల్లో.. మిన్నంటే దీపావళి సంబరాలు -
హాంగ్కాంగ్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు వేడుక
హాంగ్కాంగ్లో నివసిస్తున్న తెలంగాణా ఆడపడుచులు తెలంగాణ సాంస్కృతిక ప్రతీక, రాష్ట పండుగైన బతుకమ్మ పండుగను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూసే ప్రక్రుతి లోని అందమైన ఈ పుల పండుగను భక్తీ ఉత్సాహాలతో ఘనంగా జరుపుకుంటున్నారు. హాంగ్ కాంగ్ లో కూడా సాధారణంగా సెప్టెంబరు, అక్టోబరు నెలలలో రెండు పెద్ద పండుగలు జరుపుకుంటారు.ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు అంతా పండుగ సంబరాలు, కుటుంబ స్నేహితుల కోలాహలాలు, కలయకలతో నిండిపోయుంటుంది. ఈ పండుగలలో ఒకటి ’బతుకమ్మ పండుగ’, మరియొకటి దసరా (విజయ దశమి). బతుకమ్మ పండుగ మన తెలంగాణా ఆడపడుచులు మాత్రమె జరుపుకుంటారు, కాని ఉత్సాహంగా ఎందరో ఆడపడుచులు పాల్గొంటారు. దసరా నవరాత్రులలో లలితా పారాయణం , బొమ్మల కొలువులు , పేరంటాళ్ళతో రంగ రంగ వైభవంగా పండుగల సందడి పట్టు చీరలు ధగ ధగ మెరిసే నగలు గాజుల సవ్వడి తో విదేశీయులని కుడా ఆకర్షిస్తుంటుంది.సంవత్సరం కూడా హాంగ్ కాంగ్ లో బతుకమ్మ సంబరాలు ఎంతో ఘనంగా సముద్ర తీరాన లాన్తాఉ ఐలాండ్ తుంగ్ చుంగ్ ప్రోమేనెడ్ మీద జరిగాయని, పిల్లలు పెద్దలు ఎంతో ఆనందంగా రెట్టింపు ఉత్సాహాలతో పాల్గొనేవారు సంప్రదాయ వస్త్రాలలో మరిన్ని ఆట పాటలతో విందు భోజనంతో జరుపుకున్నారని, ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు ఆనందంగా తెలిపారు. -
హాంగ్కాంగ్ సిక్సర్స్ టోర్నీలో పాల్గొననున్న టీమిండియా
భారత క్రికెట్ జట్టు హాంగ్కాంగ్ క్రికెట్ సిక్సర్స్ టోర్నీలో పాల్గొననుంది. ఈ విషయాన్ని క్రికెట్ హాంగ్కాంగ్ అధికారికంగా ధృవీకరించింది. హాంగ్కాంగ్ క్రికెట్ సిక్సర్స్ టోర్నీ ఈ ఏడాది నవంబర్ 1న ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు సాగే ఈ టోర్నీలో భారత్, పాక్ సహా 12 జట్లు పాల్గొననున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి పెద్ద జట్లతో పాటు హాంగ్కాంగ్, నేపాల్, ఒమన్, యూఏఈ లాంటి చిన్న జట్లు ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.హాంగ్కాంగ్ క్రికెట్ సిక్సర్స్ టోర్నీ 1992లో తొలిసారి నిర్వహించబడింది. అప్పటి నుంచి 2017 వరకు ప్రతి ఏటా నిర్వహించబడిన ఈ టోర్నీ.. ఆతర్వాత వేర్వేరు కారణాల చేత గతేడాది వరకు నిర్వహించబడలేదు. తిరిగి ఏడేళ్ల తర్వాత ఈ టోర్నీ అభిమానులను అలరించేందుకు ముందుకు రానుంది. 🚨TEAM ANNOUNCEMENT🚨Team India is gearing up to smash it out of the park at HK6! 🇮🇳💥Prepare for explosive power hitting and a storm of sixes that will electrify the crowd! 🔥Expect More Teams, More Sixes, More Excitement, and MAXIMUM THRILLS! 🔥🔥HK6 is back from 1st to… pic.twitter.com/P5WDkksoJn— Cricket Hong Kong, China (@CricketHK) October 7, 2024ఈ టోర్నీలో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, షేన్ వార్న్, వాసిం అక్రమ్, సనత్ జయసూర్య లాంటి దిగ్గజాలు పాల్గొన్నారు. ఈ టోర్నీలో పాకిస్తాన్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు సక్సెస్ఫుల్ జట్లుగా ఉన్నాయి. భారత్ 2005 ఎడిషన్లో ఈ టోర్నీ విజేతగా నిలిచింది. శ్రీలంక, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ సైతం తలో ఏడాది విజేతలుగా నిలిచాయి.హాంగ్కాంగ్ క్రికెట్ సిక్సర్స్ టోర్నీ రూల్స్ ఇలా ఉంటాయి..ఈ టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టులో ఆరుగురు సభ్యులు ఉంటారు.ఈ టోర్నీలో ప్రతి జట్లు ఐదు ఓవర్లు వేయాల్సి ఉంటుంది. ఒక్కో ఓవర్లో ఎనిమిది బంతులు ఉంటాయి. వికెట్కీపర్ మినహా ప్రతి ఆటగాడు తలో ఓవర్ బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. వైడ్ మరియు నో బాల్స్కు రెండు పరుగులు కేటాయిస్తారు.ఆరుగురు బ్యాటర్లు ఔటయ్యేంత వరకు ప్రతి మ్యాచ్ కొనసాగుతుంది. ప్రతి గేమ్లో బ్యాటర్ 31 పరుగుల తర్వాత రిటైర్డ్ అవుతాడు. ఒకవేళ ఐదుగురు ఔటైతే అతను తిరిగి బరిలోకి దిగుతాడు. చదవండి: T10 League: ఊతప్ప ఊచకోత.. కేవలం 27 బంతుల్లోనే! -
ముంబై.. చాలా కాస్ట్లీ గురూ!
సాక్షి, అమరావతి: ప్రముఖ హెచ్ఆర్ కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్– ‘2024 కాస్ట్ ఆఫ్ లివింగ్’ సర్వే ప్రకారం దేశంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబై అగ్రస్థానంలో నిలిచింది.దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబైలో జీవించే ప్రవాసుల జీవన వ్యయం గణనీయంగా పెరిగినట్టు ఈ సంస్థ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 11 స్థానాలు ఎగబాకి 136వ స్థానానికి చేరుకుంది. ఢిల్లీ 164, చెన్నై ఐదు స్థానాలు దిగజారి 189వ స్థానానికి, అలాగే బెంగళూరు ఆరు స్థానాలు క్షీణించి 195వ స్థానానికి చేరుకున్నాయి. హైదరాబాద్ 202వ స్థానంలో స్థిరంగా కొనసాగుతోంది.ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం వేరొక నగరం, దేశానికి వలస వెళ్లి జీవించడంలో జీవన వ్యయం కీలక పాత్ర పోషిస్తున్నది. స్థానిక ఆర్థిక పరిస్థితులు కొన్ని నగరాలను ప్రవాసులకు మరింత ఖరీదైనవిగా చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ వరుసలోనే పూణే ఎనిమిది స్థానాలు ఎగబాకి 205వ, కోల్కతా నాలుగు స్థానాలు ఎగబాకి 207వ స్థానానికి చేరుకున్నాయి. ఇక్కడ ఈ ఖర్చులు ఎక్కువ ఆసియాలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై 21వ స్థానం, ఢిల్లీ 30వ స్థానంలో ఉన్నాయి. ఢిల్లీలో ఈ ఏడాది గృహాల అద్దెలు 12–15 శాతం పెరిగాయి. ముంబైలో 6–8 శాతం, బెంగళూరు, పూణే, హైదరాబాద్, చెన్నైలలో 2–6 శాతం పెరుగుదల నమోదైనట్లు నివేదిక చెబుతున్నది. ఇక ముంబైలో రవాణా ఖర్చులు భారీగా ఉంటున్నాయి. ఆ తర్వాత బెంగళూరు ఉంది.పాల ఉత్పత్తులు, రొట్టెలు, పానీయాలు, నూనెలు, పండ్లు, కూరగాయలు వంటి రోజువారీ నిత్యావసరాల కోసం కోల్కతాలో పొదుపుగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కేవలం ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు ఢిల్లీలో అత్యంత తక్కువ ధరలకు లభిస్తున్నాయి. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల ఖర్చుల్లో మాత్రం ముంబై అందనంత ఎత్తులో ఉంది. దీని వెనుకే చెన్నై ఉంది. ఎనర్జీ, యుటిలిటీ ఖర్చుల్లో ముంబై, పూణేలు భయపెడుతున్నట్లు నివేదిక పేర్కొంది. హాంకాంగ్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయాన్ని పరిశీలిస్తే మొదటి ఐదు నగరాలు ర్యాంకింగ్లో ఎటువంటి మార్పు కనిపించలేదు. హాంకాంగ్ (చైనా) అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, సింగపూర్, జ్యూరిచ్, జెనీవా, బాసెల్, బెర్న్ (స్విట్జర్లాండ్), న్యూయార్క్ సిటీ (యూఎస్), లండన్ (యూకే), నసావు (బహామాస్), లాస్ ఏంజిల్స్ (యూఎస్) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మెర్సర్ సర్వే ప్రపంచ వ్యాప్తంగా 227 నగరాల్లో జీవన వ్యయాన్ని అంచనా వేసింది. గృహనిర్మాణం, రవాణా, ఆహారం, దుస్తులు, గృహోపకరణాలు, వినోదం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది. 2024లో అధిక జీవన వ్యయాన్ని ఖరీదైన గృహ వినియోగం, అధిక రవాణా ఖర్చులు, వస్తువులు, సేవల అధిక ధర, ద్రవ్యోల్బణం, మారకపు రేటు హెచ్చుతగ్గులు, యుటిలిటీలు, స్థానిక పన్నులు, విద్య తీవ్రంగా ప్రభావితం చేసినట్టు వివరించింది. అధిక జీవన వ్యయాలకు ప్రసిద్ధి చెందిన న్యూయార్క్ నగరం ఈ జాబితాలో ఏడో స్థానాన్ని పొందింది. ఆసియా–పసిఫిక్ ప్రాంతాల్లోని నగరాలు టాప్–10లో ఎక్కువ సంఖ్యలో ఉండడం విశేషం. ఇందులో టోక్యో 5వ, బీజింగ్ 9వ స్థానంలో ఉన్నాయి. -
హాంకాంగ్ లో ఘనంగా ఉగాది వేడుకలు..
హాంగ్కాంగ్లో తెలుగు వారంతా కలిసి ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, కొత్త స్నేహితులతో ఉల్లాసంగా సాగిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు, శ్రీ కే. వెంకట రమణ గారుకాన్సల్, కన్సుల్టే జనరల్ అఫ్ ఇండియా,హాంగ్ కాంగ్ మరియు మకావ్; మాస్.ఏమి యుంగ్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ (ఐలాండ్స్), హాంగ్ కాంగ్ హోమ్ అఫైర్స్ డిపార్ట్మెంట్; శ్రీ. లాల్ హర్దసాని ప్రెసిడెంట్, ది హిందూ అసోసియేషన్; ఉస్తాద్ గులాం సిరాజ్, చైర్మన్, పుంహక మరియు శ్రీ. కె. వెంకట వంశీధర్, రీజినల్ హెడ్,స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా, ముఖ్య అతిధులుగా విచ్చేసారు. శ్రీ వెంకట రమణ గారు దీప ప్రజ్వలన చేయగా, ఇతర ముఖ్య అతిధులు కూడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. తదనంతరం శ్రీ వెంకట రమణ గారు,హాంగ్ కాంగ్ లో తెలుగు వారు సమాఖ్య ద్వారా చేస్తున్న భాష సేవ సాంస్కృతిక పరిరక్షణను కొనియాడారు. తదనంతరం శంకరంబాడి సుందరాచారి గారి రచన ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ‘ గానంతో ప్రారంభైన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. కూచిపూడి, భరతనాట్యం వంటి సాంప్రదాయ నృత్యాలు, ఫ్లూట్ మరియు యుకెలేలే వాయిద్యాలపై టాలీవుడ్ పాటలు, ఫ్యూజన్ డ్యాన్స్, పాత క్లాసిక్ మెడ్లీలకు నృత్యం వంటి విభిన్నమైన ఆట పాటలతో మరియు హాస్య నాటిక తో కార్యక్రమం ఆసాంతం ఆకట్టుకుంది. గౌరవనీయ అతిధులు కాన్సల్ శ్రీ వెంకట రమణ గారు మరియు మిస్ మాస్.ఏమి యుంగ్ సమాఖ్య లోని స్వచ్చంద సేవకులకు, తెలుగు బడి గురువులకు, స్థానికంగా జరిగే జాతీయ అంతర్జాతీయ మారథాన్లలో మరియు ఆక్స్ఫామ్ ట్రయిల్ వాకర్ లో పాల్గొని విజయవంతంగా పూర్తి చేసిన వారి ప్రతిభ గుర్తిస్తూ వారికి మొమెంటోలు అందించారు. సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి కార్యక్రమ వివరాలిస్తూ, హాంగ్ కాంగ్ లో నివసిస్తున్న తెలుగు వారు సంప్రదాయ వస్త్రధారణతో హాజరైన సభ్యులతో తెలుగుతనం వెల్లివిరిసిన ఈ వేడుకలతో తెలుగు నేలను మరిపించిందని హర్షం తెలిపారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరం కనుక ఇక్కడ తమకి ఇక్కడ పెద్ద హాల్ల్స్ అందుబాటులో ఉండవని, ప్రభుత్వ వసతులు లభ్యమైనప్పుడు వేడుకలు చేసుకుంటున్నామని, అందుకీ ఉగాది వేడుకలు చేసుకోవడం కొంత ఆలస్యంయ్యిందని వివరించారు .జూన్ లో తమ సంస్థ క్రీడా దినోత్సవానికి సిద్ధమవుతున్నామని చెప్పారు. సమాఖ్య కార్యవర్గ సభ్యులు జయ పీసపాటి, రాజశేఖర్ మన్నే,రమేష్ రేణిగుంట్ల, హరీన్ తుమ్మల, రమాదేవి సారంగా, మాధురి కొండా మరియు ఇతర సభ్యులు అపర్ణ కంద, రాధికా సంబతూర్, ప్రత్యుష – రవికాంత్ గునిశెట్టి, కల్పన – జయసురేష్ మట్టపర్తి, ప్రియాంక – బాబీ సత్తినేని, కృష్ణ ప్రసాద్ రెడ్డి, భరత్ కోరాడ, ధర్మ రాజు దుంప, సుగుణ రవి, మానస గర్దాస్, శాంతి పలుకూరి తదితరులు ఉగాది వేడుకల నిర్వాహణలో ఉత్సాహంగా పాల్గొన్నారు. -
32 వీడియో లింకులను బ్లాక్ చేసిన యూట్యూబ్!
ప్రముఖ ఆన్లైన్ వీడియో ప్లాట్ఫామ్ యూట్యూబ్ నిషేధిత కంటెంట్గా భావించే 32 వీడియో లింకులను బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించింది. హాంకాంగ్ కోర్టు నిర్ణయానికి లోబడి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది.చైనా-హాంకాంగ్ మధ్య కొన్నేళ్లుగా రాజకీయ, బౌగోళిక సమస్య కొనసాగుతోంది. హాంకాంగ్లో ప్రత్యేకపాలన ఉంటుంది. అక్కడి ప్రభుత్వాన్ని చైనాకు అనుకూలంగా ఉండే వారికి కట్టబెడుతారు. దాంతో స్థానిక ప్రజలనుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. అందులో భాగంగా 2019లో ‘గ్లోరీ టు హాంకాంగ్’ అనే నిరసన గీతం ప్రాచుర్యంలోకి వచ్చంది. దీన్ని నిషేధించాలని కోరుతూ హాంకాంగ్ అప్పీల్ కోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఆ గీతం యూట్యూబ్లో వైరల్గా మారడంతో దాన్ని తొలగించాలని తాజాగా కోర్టు ఆదేశించింది. ఫలితంగా పాటకు సంబంధించిన 32 వీడియో లింకులను తొలగిస్తున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. చైనా నుంచి హాంకాంగ్ విభజనను కోరుకుంటున్న అసమ్మతివాదులు ఆ పాటను ఉపయోగించుకోవచ్చని న్యాయమూర్తులు హెచ్చరించారు.ఇదీ చదవండి: టీవీ రిమోట్ పనిచేయడం లేదా..? చిట్కా మీ కోసమే..కోర్టు నిర్ణయంతో నిరాశ చెందినట్లు యూట్యూబ్ చెప్పింది. అయినప్పటికీ ఆ తీర్పును పాటిస్తామని స్పష్టం చేసింది. బుధవారం నుంచి ఇకపై యూట్యూబ్లో ఆ గీతం కోసం సెర్చ్చేస్తే ‘కోర్టు ఆర్డర్ వల్ల ఇందుకు సంబంధించిన కంటెంట్ దేశీయ డొమైన్లో నిషేధించడమైంది’ అనే పాప్అప్ మెసేజ్ వస్తుందని చెప్పింది. ఆన్లైన్లో స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తీకరించానుకునేవారిని కట్టడి చేయడం సరికాదని, ఈ వ్యవహారానికి సంబంధించి ఇతర వర్గాలకు అప్పీల్ చేస్తామని తెలిపింది. ఇప్పటికే మానవ హక్కుల సంస్థలతో తమ భావాలను పంచుకున్నట్లు కంపెనీ పేర్కొంది. -
NRI: హాంగ్కాంగ్లో జేమీ లీవర్ పండించిన నవ్వుల డోలలు!
మే 1979లో ఒక సొసైటీ గా నమోదు చేయబడిన ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ అనేది లాభాపేక్ష లేని సంస్థ. సభ్యులు మరియు సాధారణ ప్రజల కోసం భారతీయ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం, సభ్యులలో నాటకం, సంగీతం, నృత్యం, సాహిత్యం మరియు దృశ్య కళలపై ఆసక్తిని పెంపొందించడం మరియు ఇలాంటి సంస్థలతో సహకరించడం దీని లక్ష్యాలు. స్థానిక ప్రతిభావంతులకు అవకాశాలను అందించడానికి ఈ బృందం ప్రతి సంవత్సరం రెండు కార్యక్రమాలను నిర్వహిస్తుంది మరియు భారతదేశం నుండి ప్రఖ్యాత కళాకారులను కూడా ఆహ్వానిస్తుంది. భారత కాన్సుల్ జనరల్ మరియు శ్రీమతి పూర్విజ్ ష్రాఫ్ గౌరవ పోషకులు, మరియు శ్రీ జి.టి. గుల్ సర్కిల్ యొక్క శాశ్వత సలహాదారుగా సేవలు అందజేస్తున్నారు.కోవిడ్ తరువాత అంటే నాలుగు సంవత్సరాల తరువాత మొదటి సారి, ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ ఈ సంవత్సరం మన తెలుగు అమ్మాయి జేమి లీవర్ ని హాంగ్ కాంగ్ కి ఆహ్వానించారు. "గూన్జ్ సితారోన్ కి" అనే సాంస్కృతిక వినోద కార్యక్రమం 18 ఏప్రిల్ న స్థానిక సిటి హాల్ లో నిర్వహించారు. పూర్వ చైర్ పర్సన్ శ్రీమతి రాణి సింగ్ , చైర్ పర్సన్ శ్రీమతి రానూ సింగ్ , ఉపాధ్యక్షుడు సర్దార్ నవ్తేజ్ సింగ్ మరియు కార్యదర్శి శ్రీమతి జయ పీసపాటి మరియు ఇతర కార్యవర్గ సభ్యులందరూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. చైర్ పర్సన్ శ్రీమతి రానూ సింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించటానికి భారత కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీమతి సత్వంట్ ఖనాలియా గారిని ఆహ్వానించి సన్మానించారు. సత్వంత గారు ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ చేస్తున్న అద్భుతమైన కార్యక్రమాలను మరియు కళారులకి ఒక చక్కని వేదికని అన్జేస్తున్నందుకు,వారిని ప్రోత్సహిస్తున్నందుకు ప్రశంసించారు. స్థానిక కళాకారుల బాలీవుడ్ , హిప్ హాప్, జానపద , నృత్యాలతో మరియు అలనాటి మధుర గీతాలతో ప్రారంభమైన ‘గూన్జ్ సితారోన్ కి” ని ప్రేక్షకులు ఆనందిస్తూ కరతాళ ధ్వనులతో కళాకారులని ప్రోత్సహించారు. అప్పుడు జేమీ లీవర్ ఎంట్రీ ఇచ్చారు … ఇంకా అప్పటినుంచి నవ్వుల పువ్వుల పండిస్తూ జేమీ మిమిక్రీ తో కామిడి చేస్తూ ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్స్ హేమ మాలిని , మలాయికా, దీపికా పడుకోన, కంగనా రనౌత మో వారిని అనుకరిస్తూ తనకు ప్రత్యెక గుర్తింపు తెచ్చిన ప్రముఖ గాయని ఆశా భోంస్లే , కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ మరియు తన తండ్రి జాని లీవర్ ల మిమిక్రీ తో ఉత్తేజభరితమైన వాతావరణo ప్రేక్షకులని ఆనందోత్సాహాలతో ముంచేసింది. హాస్యంలో మిమిక్రి, గానం, నృత్యంమేళవించి ఒక గంట సేపు నవ్వుల మారథాన్ చేసారు జేమి!! ప్రముఖ సిని నటుడు, కమెడియన్ జాని లీవర్ అసలు పేరు జాన్ ప్రకాష్ రావు జనుముల, అయితే ఆయన హిందూస్తాన్ లేవేర్స్ లో పని చేస్తూ స్టాండ్ అప్ కామెడి పండించి స్టాఫ్ ని నవ్వుల డోలలూగించినప్పుడు, యాజమాన్యం వారు ఆయనకీ 'లీవర్' అని పేరు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఆయన ఇంటి పేరే 'జానీ లీవర్' పాపులర్ అయ్యింది. తెలుగు హిందీ చిత్రరంగం లో కమెడియన్ గా పేరొందిన ప్రముఖ నటులు తండ్రి జానీ లీవర్ ప్రతిభని పుణికి పుచ్చుకుంది అని జెమీ లీవర్ గురించి చెప్పడం అతిశయోక్తి కాదేమో ! హాంగ్ కాంగ్ కళా ప్రేమికుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాయించుకున్న జేమి తను ఇంత ఉత్సాహభరితమైన ప్రేక్షకుల మధ్య ప్రదర్శించడం తనకి ఎంతో ఆనందంగా వుందని హర్షం వ్యక్తం చేసారు. స్థానికంగా విచ్చేసిన ప్రముఖులు , భారతీయ కన్సులార్ శ్రీ కుచిభోట్ల వెంకట్ రమణ గారు తదితరులు జేమి కి తమ శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఆమె స్టాండ్ అప్ కామెడి లో గొప్ప శిఖరాలను అందుకోవాలని త్వరగా మరల హాంగ్ కాంగ్ రావాలని స్థానికులు ఆశ వ్యక్తం చేసారు అందుకు జేమి తన చెరగని చిరునవ్వుతో అందరిని మంత్రముగ్ధుల్ని చేసింది. ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ జేమీ గౌరవార్ధం విందు భోజనం ఏర్పాటు చేసి అభినందించారు. జేమి ఇంస్టా లింక్ మీకోసం https://www.instagram.com/p/C58BqvivjhS/https://www.instagram.com/p/C5qEy7FoTut/?img_index=1ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ ఇంస్టా లింక్ https://www.instagram.com/p/C58IYSFy8qR/ -
హాంకాంగ్ కోర్టు సంచలన తీర్పు.. చిక్కుల్లో చైనా కంపెనీ!
చైనా రియల్ ఎస్టేట్ కంపెనీ 'ఎవర్గ్రాండే' గ్రూప్ను లిక్విడేషన్ చేయాలని హాంకాంగ్ కోర్టు ఆదేశించింది. రుణదాతలతో పునర్వ్యవస్థీకరణ ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలమైన నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆచరణాత్మకమైన పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక అమలు చేయలేకపోవడంతోపాటు, కంపెనీ దివాళా దిశగా అడుగులేస్తున్న కారణంగానే కంపెనీ మూసివేస్తేనే మంచిదని పేర్కొంటూ హాంకాంగ్ కోర్టు న్యాయమూర్తి లిండా ఛాన్ పేర్కొన్నారు. ఈ ప్రభావం చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ఎవర్గ్రాండే గ్రూప్ లిక్విడేషన్ జరిగితే.. స్టాక్ మార్కెట్లో వివిధ సంస్థల స్టాక్స్పై అమ్మకాల ఒత్తిళ్లు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కంపెనీ ఆస్తుల విలువ మొత్తం 240 బిలియన్ డాలర్లు, కాగా.. సంస్థ చేసిన అప్పులు విలువ సుమారు 300 బిలియన్ డాలర్లు. ఇదీ చదవండి: అంబానీ కంటే ముందే 'లోటస్' కారు కొన్న హైదరాబాద్ మహిళ హాంకాంగ్ కోర్టు తీర్పు నేపథ్యంలో ఎవర్గ్రాండే స్టాక్స్ 20 శాతానికి పైగా నష్టపోయాయి. ఫలితంగా కొంత సేపు హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజీలో ట్రేడింగ్ కూడా నిలిపేశారు. చైనాలోని రియాల్టీ రంగంలో రుణాలు అదుపు తప్పాయి. వాటిని నియంత్రించడంతో పాటు.. రియాల్టీ రంగాన్ని క్రమబద్ధీకరించేందుకు చైనా రెగ్యులేటరీ సంస్థలు కఠినమైన నిబంధనలు అమలులోకి తెచ్చాయి. ఫలితంగా ఎవర్గ్రాండే వంటి చాలా కంపెనీలు చిక్కుల్లో పడ్డాయి. ఇదే ప్రస్తుతం కంపెనీని దివాళా అంచులకు తీసుకువెళ్ళింది. -
హాంగ్కాంగ్లో ముచ్చటైన తెలుగు సాంస్కృతిక ఉత్సవం
సౌత్ చైనా సముద్ర తీరాన వున్న చిన్న ద్వీపం 'హాంగ్కాంగ్' లో ఇతర భారతీయ ప్రాంతాల వారితో పాటు మన ఉభయ తెలుగు రాష్ట్రాల వారు ఇక్కడ నివసిస్తున్నారు. వారి సంఖ్య చాలా తక్కువే అయినా, మన తెలుగు భాష , దేశ సంస్కృతీ సంప్రదాయాలను భావి తరాలకి అందించే కృషి లో భాగంగా తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు గత కొన్ని సంవత్సరాల కాలంగా నిర్వహిస్తున్నారు. క్రిస్మస్ పండుగ, ఆంగ్ల నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల ఉత్సాహాన్ని మేళవించి ఈ కార్యక్రమాన్ని రూపొందించామని అధ్యక్షులు తెలిపారు. ఈ సంవత్సరం కూడా 'తెలుగు సాంస్కృతిక ఉత్సవం' లో ముద్దులొలికే చిన్నారుల ఫాన్సీ డ్రెస్ ,పద్యాలు - శ్లోకాలు, భక్తి పాటలు, టాలీవుడ్ - కూచిపూడి నృత్యాలు, వయోలిన్ , కీబోర్డ్ , తబలా వాయిద్యాల తో చక్కని చిక్కని కర్నాటిక్ సంగీతాలు, అక్షరమాలలో సంపూర్ణ రామాయణం కథ, చిత్ర లేఖనం ..ఇలా అనేక అంశాలలో పిల్లలు తమ ప్రతిభలతో అందరిని మురిపించారు. వ్యాఖ్యాతలుగా ఇక్కడ పెరిగి పెద్దయి, ఇదే వేదిక మీద ప్రదర్శనలు ఇచ్చిన రజిత మరియు హర్షిత, ఇద్దరు అక్కాచెల్లెలిద్దరు చక్కటి తెలుగులో నిర్వహించారు. ముఖ్య అతిధులుగా కౌన్సలార్ శ్రీ. కె. వెంకట రమణ గారు,కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ హాంగ్ కాంగ్ & మకావ్, స్థానిక ఇంటర్నేషనల్ ప్రైమరీ స్కూల్ హెడ్ శ్రీమతి ప్రియా కాంతన్ మరియు హాంగ్ కాంగ్ ఆర్ట్అఫ్ లివింగ్ టీచర్ శ్రీమతి సీమా హిరానందాని విచ్చేసి, పిల్లల ప్రతిభలని చూసి ఆనందించి, మెచ్చుకొని తల్లి తండ్రులని ప్రశంసించారు. పిల్లల్ని ఇలాగే తమ భాష, సంస్కృతీ, దేశం గురించిన ఇటువంటి కార్యక్రమాలలో ఎప్పుడు పాల్గొనే లా ప్రోత్సహించాలని, సంస్థ చేస్తున్న సేవలను కొనియాడారు. అతిధులకు తమ కృతజ్ఞతలు తెలుపుతూ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి, కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో తమ కార్యవర్గ సభ్యులను, వ్యాఖ్యాతలను, పిల్లలను వారి తల్లి తండ్రులకు దయవాదాలు తెలుపుతూ, అభినందించారు. -
హాంకాంగ్లో చూసి కొత్త ఆలోచన
కొమరం భీమ్: ఉపాధి కోసం హాంకాంగ్ వెళ్లిన యువకుడు అక్కడ వేసిన డ్రాగన్ఫ్రూట్ పంటను చూడడంతో తనకు ఓ కొత్త ఆలోచన వచ్చింది. తమ చేనులో కూడా డ్రాగన్ ప్రూట్ పంట వేయాలనుకుని విషయం తన అన్నతో చెప్పాడు. అతను కూడా సై అనడంతో పంట సాగుకు ముందుకు వచ్చారు. ఏడాదిక్రితం పంట వేయగా ప్రస్తుతం ఫలాలు ఇస్తుంది. హాంకాంగ్లో చూసి ఆలోచన జన్నారం మండలం దేవునిగూడ గ్రామానికి చెందిన కల్లెం రవీందర్రెడ్డి, జమున దంపతులకు ఇద్దరు కుమారులు. పిల్లలు చిన్నతనంలోనే తండ్రి అనారోగ్యంతో మరణించాడు. దీంతో తల్లి జమున కూలిపని చేస్తూ వారిని డిగ్రీ వరకు చదివించింది. పెద్ద కుమారుడు శివకృష్ణారెడ్డి వ్యవసాయం వైపు వెళ్లగా సాయికృష్ణారెడ్డి ఉపాధి కోసం హాంకాంగ్ వెళ్లాడు. అక్కడ ఎక్కువశాతం మంది డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తుండడంతో పంట గురించి తెలుసుకున్నాడు. జగిత్యాల రైతు వద్ద అవగాహన జగిత్యాల జిల్లా అంతర్గావ్కు చెందిన రైతు శుభాష్రెడ్డి డ్రాగన్ఫ్రూట్ సాగు చేస్తున్నట్లు శివకృష్ణారెడ్డి యూట్యూబ్లో తెలుసుకున్నాడు. అక్కడికి వెళ్లి రైతు వద్ద పంట గురించి పూర్తిగా తెలుసుకుని తమ్మునికి వివరించాడు. అతను సరే అనడంతో తమకున్న ఎకరం 10 గుంటల భూమిలో 2022 డిసెంబర్లో అదే రైతు వద్ద నుంచి రూ.80కి ఒక మొక్క చొప్పున 2 వేల మొక్కలు కొనుగోలు చేశారు. 500 సిమెంటు దిమ్మెలు తీసుకువచ్చారు. ఒక్కో దిమ్మె చుట్టూ నాలుగు మొక్కలు నాటి డ్రిప్ ద్వారా నీటిని అందించారు. మొత్తంగా రూ.6 లక్షల వరకు ఖర్చు చేశారు. అందుతున్న ఫలాలు గతేడాది డిసెంబర్లో మొక్కలు నాటగా 2023 నవంబర్లో కాయలు కాశాయి. మొదటి దశలో ఆశించినంత కాయకపోవడంతో వాటిని సొంతానికి వాడుకున్నారు. ఏటా జూన్ నుంచి నవంబర్ వరకు పంట చేతికి వస్తుందని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలోకు రూ.150 ఉందని, ఎకరం పది గుంటల్లో సుమారు 2 టన్నుల పంట వచ్చే అవకాశం ఉందన్నారు. ఒక్కసారి పంట వేస్తే 20 సంవత్సరాల వరకు ఫలాలు వస్తుంటాయని, మొక్క పెరిగిన కొద్దీ కత్తిరిస్తూ ఉంటే ఏటా పంట చేతికి వస్తుందన్నారు. ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు లాభాలు వచ్చే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. కొత్త ఆలోచనతో సాగు ఉపాధి కోసం హాంకాంగ్ వెళ్లా. అక్కడ ఆన్లైన్ పనిచేస్తూ అప్పుడప్పుడు బయటకు వెళ్లగా ఎక్కువగా డ్రాగన్ఫ్రూట్ పంట కనిపించేది. అదే పంటను మా భూమిలో కూడా వేయాలని కొత్త ఆలోచనతో వచ్చింది. అన్నతో చర్చించి మా భూమిలో మొక్కలు నాటాం. ఇప్పుడు మొదటి క్రాపు చేతికి వచ్చింది. – సాయికృష్ణారెడ్డి సబ్సిడీ ఇవ్వాలి మా తమ్మునికి వచ్చిన ఆలోచనతో ఎకరం పది గుంటల్లో మొక్కలు నాటాం. డ్రిప్తో నీరందిస్తున్నాం. ఇప్పటి వరకు రూ.6 లక్షలు ఖర్చు వచ్చింది. వచ్చే జూన్ వరకు రెండో క్రాప్ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆయిల్పాం పంట మాదిరి డ్రాగన్ఫ్రూట్ పంటకు కూడా సబ్సిడీ ఇస్తే బాగుండు. ఖర్చులు తగ్గుతాయి. – శివకృష్ణారెడ్డి -
హాంగ్కాంగ్లో బుజ్జాయిలతో భోగిపండ్లు
ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య స్థాపించక ముందు నుంచే దాదాపు రెండు దశాబ్దాలుగా భోగిపండ్లు వేడుకని చేస్తున్న, వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి తమ సంతోషాన్ని తెలుపుతూ ఈ సంవత్సర నిర్వహించిన భోగిపండ్ల సరదాల విశేషాలు తెలిపారు. ముఖ్య అతిధులు స్థానిక యునెస్కో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు శ్రీ తిరునాచ్ దంపతులు మరియు బాలవిహార్ గురువు శ్రీమతి చిత్ర జికేవీ దంపతులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా పిల్లలకు భోగి పండ్లు పొసే అంశాన్ని కొనసాగించారు. పిల్లలు సందడిగా చాకోలెట్లు ఏరుకొంటూ, మరి కొందరు అవి తినే ప్రయత్నం చేస్తుంటే వారి అమ్మ నాన్నలు వద్దని ఆరాట పడుతుంటే చూడ ముచ్చట కొలిపింది. మరింత ఆనందంగా కొనసాగింది పిల్లల కానుకలు ఇచ్చి పుచ్చుకోవడం. ముఖ్య అతిధులు కూడా పిల్లలకు భోగి పండ్లు పోసీ ఆశీర్వదించి చాలా సంతోశాన్ని తెలిపారు. తమకి ఇటువంటి అనుభవం ఎప్పుడు కలగలేదని అన్నారు. అలాగే మరి కొందరూ.. తమకి ఈ వేడుక అనుభవం తొలిసారిదని, తమ పిల్లలకి అందరితో కలిపి చేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. కార్యవర్గ సభ్యులందరు శ్రీమతి రమాదేవి, శ్రీ రమేష్, శ్రీ రాజశేఖర్ అలాగే శ్రీమతి మాధురి అధ్యక్షులు శ్రీమతి జయతో కలసి కార్యక్రమాన్ని నిర్వహించడంలో కీలకపాత్ర పోషించారు. విచ్చేసిన సభ్యులందలందరితో పాటు కొందరు పిల్లలు కూడా తమ వంతు సహాయాన్నిఈ కార్యక్రమ నిర్వాహణలో అందించారు. ఈ విషశేషాలను తమ కెమెరాలో అద్భుతమైన జ్ఞాపకికాలుగా అందించారు శ్రీ రవికాంత్. వచ్చే వారం తమ వార్షిక తెలుగు కల్చరల్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నామని, పిల్లలు తమ సంగీత నాట్య కళలను ప్రదర్శించనున్నారని ఉత్సాహంగా తెలిపారు. ఆత్మీయ పాఠకులందరికి మా హాంగ్ కాంగ్ తెలుగు వారి సంక్రాతి పండుగ శుభాకాంక్షలు! ఇవి చదవండి: సందేశాన్నిచ్చిన సంక్రాంతి ముగ్గు.. 'డోంట్ బి అడిక్టెడ్' -
అలరించిన నారాయణి గాయత్రి నృత్య ప్రదర్శన
ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య, భారతీయ సంస్కృతి మరియు సంప్రదాయాలను ప్రోత్సహించడానికి, ప్రతిభావంతులైన కళాకారులు ప్రదర్శించడానికి వేదికను అందించడం అనే అంకితభావనతో సేవలను అందిస్తున్న సంస్థ. దాదాపు రెండు దశాబ్దాలుగా, హాంగ్ కాంగ్ లో భారతీయ సంస్కృతిని చురుకుగా ప్రచారం చేస్తోంది. భారతదేశంలోని విభిన్న కళారూపాలను ప్రదర్శించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. వారి ప్రయత్నాలు భారతీయ సంప్రదాయాలను పరిరక్షించడంలో మాత్రమే కాకుండా హాంగ్ కాంగ్ లోని భారతీయ ప్రవాసులలో సమైఖ్యత - సమ భావాన్ని సృష్టించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.ఇటీవల, వారధి ఫౌండేషన్ (హైదరాబాద్) మరియు శ్రుతిలయ కేంద్ర నటరాజలయ (హైదరాబాద్) వారి సహకారంతో హాంగ్ కాంగ్ లో “మార్గం” అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. శాస్త్రీయ నృత్యం భరతనాట్యం మరియు కర్ణాటక సంగీతంలో రాణిస్తున్న యువ కళాకారిణి నారాయణి గాయత్రి ఈయుణ్ణి సోలో రిసైటల్ ఏర్పాటు చేసారు . హాంగ్ కాంగ్ నివాసులైన శ్రీ.రాజీవ్ ఈయుణ్ణి మరియు శ్రీమతి.అపర్ణ కంద దంపతుల కుమార్తె గాయత్రి ఈయుణ్ణి. గురు కలైమామణి డా.రాజేశ్వరి సాయినాథ్ గారి శిష్యరికంలో ఇటీవలే ఆగస్టు 2023లో హైదరాబాద్ లో తన ఆరంగేట్రం చేసి అందరి మన్ననలు పొందింది. ఆమె సాధించిన ఆరంగేట్ర విజయాన్ని పురస్కరించుకుని, హాంగ్కాంగ్లోని లాంటౌ ద్వీపంలో తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాల్లో 6 జనవరి 2024న నృత్య ప్రియులకు, ఆమె ఆరంగేత్రం నుండి కొన్నిఅంశాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి హాంగ్ కాంగ్ & మకావులోని భారత కాన్సుల్ జనరల్ హాజరై, ప్రారంభోత్సవం చేశారు, వారు గాయత్రి మరియు ఆమె తల్లిదండ్రులను శాస్త్రీయ కళారూప సంస్కృతిని కొనసాగించడాన్నిఅభినందించారు మరియు గాయత్రికి ప్రశంసా పత్రాన్ని అందించి ప్రశంసించారు. హాంగ్ కాంగ్లోని వివిధ శాస్త్రీయ నృత్య-సంగీత గురువులు కూడా హాజరయ్యారు. దీప ప్రజ్వలన తరువాత, గాయత్రి కర్ణాటక సంగీతంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఆమె శ్రావ్యమైన స్వరం ప్రేక్షకులను విస్మయానికి గురి చేసింది. గాయత్రి తల్లి శ్రీమత అపర్ణ, ప్రతి నాట్య అంశాన్ని లయబద్ధంగా వివరిస్తూ వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. గాయత్రి తన అందమైన సాంప్రదాయ భరతనాట్య వేషధారణలో సంప్రదాయ ఆవాహనతో ప్రారంభిన్చింది. పుష్పాంజలి, అల్లారిపు, దేవీ స్తుతి, ముద్దుగారే యశోధ, తిల్లానా, మరియు మంగళం వంటి అభినయ అంశాలని అద్భుతంగా ప్రదర్శిస్తూ.. చక్కని హావ భావాలతో అందరిని ఆకట్టుకుంది. ఆమె మనోహరమైన కదలికలు మరియు వ్యక్తీకరణలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఆమె ప్రతిభ మరియు ఆమెకు కళ పట్ల గల అంకితభావం ఆమె నృత్యంలో స్పష్టంగా కనిపించాయి, అలా ఆమె ప్రేక్షకుల నుండి అనేక ప్రశంసలను అందుకుంది. గాయత్రి అభినయ చాతుర్యం, ఆమె కృషి మరియు అంకితభావం ఈ తరం యువతకి చక్కని నిదర్శనం. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత విద్వాంసులు ఉస్తాద్ ఘులాం సిరాజ్, కథక్ గురువులు నీశ ఝవేరి, శ్వేత రాజ్ పుట్, భరతనాట్యం గురువు సంధ్య గోపాల్, మోహినియాట్టం గురు దివ్య అరుణ్, మృదంగం కళాకారుడు అరవింద్ జేగాన్ పాల్గొన్నారు . ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి స్పందిస్తూ, మనోహరంగా సాగిన “మార్గం” లో నారాయణి గాయత్రి ఈయుణ్ణి ప్రదర్శన ద్వారా భారతీయ సంస్కృతిని ప్రోత్సహించడానికి, తమ సమాఖ్య లక్ష్యం యొక్క నిజమైన ప్రతిబింబంమని .. గాయత్రి వంటి వర్ధమాన కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, భారతీయ సంప్రదాయాలు - సంస్కృతిని అనుసరించడానికి ఇతరులను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం సరైన వేదిక యని అందుకు తమ సమాఖ్య సదా సిద్ధమే అన్నారు. -
Hongkong: హాంకాంగ్ తెలుగు సామాఖ్య ఆధ్వర్యంలో కార్తిక వనభోజనాలు
కార్తీకమాసం అనగానే వనభోజనాల హడావిడి మొదలౌతుంది. కార్తీక వనభోజనాలు స్నేహాన్ని, సమైక్యతను పెంపొందిస్తాయన్న మాట, ఆథ్యాత్మికం..ఆనందం..ఆరోగ్యం..సందేశం..కలగలిపి వడ్డించిన విందు భోజనం..వనభోజనం. దైనందిన జీవితంలో ఎదురయ్యే చిరాకులు, పరాకులకు దూరంగా అందరూ కలిసి వేడుక చేసుకోవడం వల్ల వత్తిళ్ళు, వేదనలు తీరతాయి. వనభోజనాలను పెద్దల కంటే పిల్లలు మరీమరీ ఆనందిస్తారు. హాంకాంగ్ తెలుగు సమాఖ్య తమ వార్షిక పిక్నిక్, కార్తీక మాసం ‘వనభోజనం’ హాంకాంగ్లోని అతిపెద్ద కంట్రీ పార్కులలో ఒకటైన ట్యూన్ మున్ కంట్రీ పార్క్లో జరుపుకున్నారు. సభ్యులు ఎంతో ఆనందంగా నీలి ఆకాశం క్రింద మరియు పార్క్ సహజ ఆవాసాలతో అందమైన పచ్చదనం మధ్య వారు సరదాగా ఆటలు ఆడారు మరియు రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించారు. ప్రతి సంవత్సరం, సభ్యులందరూ ఒకరినొకరు కలుసుకోవడానికి మరియు కనెక్ట్ అవ్వడానికి ఎదురుచూస్తున్నఆనంద సమయం అది. వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయపీసపాటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు తన సమర్ధవంతమైన బృందానికి మరియు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, హాంగ్ కాంగ్ లో ప్రజల ఆరోగ్య , ఆహ్లాదం మరియు శ్రేయస్సు కోసం అక్కడ వున్న కంట్రీ పార్క్స్ గురించి , తాము వనభోజనం కోసం వచ్చిన పార్క్ గురించి కొన్ని విశేషాలను తెలిపారు. హాంకాంగ్ కేవలం ఆకాశహర్మ్యాలు మరియు రద్దీగా ఉండే వీధులు మాత్రమే కాదు; నగరంలో చాలా పచ్చటి ప్రదేశాలు ఉన్నాయి, సుందరమైన ప్రదేశాలు, హైకింగ్ ట్రయల్స్, వన్యప్రాణులు, చారిత్రాత్మక ప్రదేశాలు మరియు అవుట్డోర్ అడ్వెంచర్ కోసం అంతులేని అవకాశాలు ఉన్నాయి. అటువంటి జనసాంద్రత కలిగిన మహానగరానికి విశేషమేమిటంటే, మొత్తం భూమిలో మూడొంతుల భూమి గ్రామీణ ప్రాంతాలు మరియు హాంకాంగ్ యొక్క మొత్తం భూభాగంలో 40 శాతం - 435 చదరపు కిలోమీటర్లు - 24 కంట్రీ పార్కుల సరిహద్దులలో రక్షించబడింది. వాటిలో అడవులు, గడ్డి భూములు మరియు 3,300 స్థానిక మొక్కల రకాలు మరియు చిరుతపులి మరియు సివెట్ పిల్లుల నుండి అడవి పందులు మరియు కొండచిలువల వరకు వన్యప్రాణులు ఉన్నాయి. పాంగోలిన్లు మరియు రోమర్స్ చెట్టు కప్పలు వంటి ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జాతులు కూడా స్వేచ్ఛగా తిరుగుతాయి, తద్వారా దేశ ఉద్యానవనాలు పరిరక్షణకు ముఖ్యమైనవి. ట్యూన్ మున్ పార్క్ మొత్తం 12.5 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది, ఇది కొత్త భూభాగాలలో విస్తృతమైన సౌకర్యాలను అందించే మొదటి ప్రధాన పార్క్. ఇది 3 దశలను కలిగి ఉంటుంది, ఫేజ్ I ఆగస్ట్ 1985లో, ఫేజ్ II ఆగస్ట్ 1988లో మరియు ఫేజ్ III ఫిబ్రవరి 1991లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ పార్క్ టుయెన్ మున్ జిల్లా పట్టణ కేంద్రంలో మరియు ట్యూన్ మున్ టౌన్ హాల్ పరిసరాల్లో ఉంది. పునరుద్ధరణ భూమిపై నిర్మించబడిన ఈ ఉద్యానవనం ట్యూన్ మున్ నివాసితులకు అలాగే భూభాగంలోని సందర్శకులకు పచ్చదనంతో కూడిన విశ్రాంతి స్థలాన్ని అందిస్తుంది. ఉద్యానవనంలో సుమారు 1500 చెట్లు మరియు 200 వివిధ జాతులకు చెందిన 100 000 పొదలు నాటబడ్డాయి. ల్యాండ్స్కేప్ ఫీచర్లు మరియు అందమైన వాతావరణంతో పాటు ఉల్లాసంగా మరియు రిలాక్స్గా అనిపించేలా, పార్క్లో దాదాపు 1 హెక్టారు విస్తీర్ణంలో కృత్రిమ సరస్సు ఉంది. పార్క్ యొక్క దక్షిణ భాగంలో ఉన్న రెప్టైల్ హౌస్ చాలా మంది సందర్శకులను ఆకర్షిస్తున్న మరొక ప్రధాన వాన్టేజ్ పాయింట్. పార్క్లోని ఇతర సౌకర్యాలు వాటర్ క్యాస్కేడ్, మోడల్ బోట్ పూల్, యాంఫీథియేటర్, రోలర్-స్కేటింగ్ రింక్, పిల్లల ప్లేగ్రౌండ్ మరియు మల్టీ-గేమ్ ఏరియా మొదలైనవి ఉన్నాయి. మొత్తం మీద, పార్క్ సందర్శకులకు ఒక రోజు సరదాగా గడిపేందుకు అనువైన విశ్రాంతి ప్రదేశం. 1999లో ప్రారంభించబడిన ఈ రెప్టైల్ హౌస్ విశ్రాంతి మరియు సాంస్కృతిక సేవల విభాగంలో ఇదే మొదటిది. ఇది పార్క్ యొక్క దక్షిణ భాగంలో టర్ఫెడ్ ప్రాంతం వద్ద ఉంది మరియు 245 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది, ఇది 2006లో మొత్తం 500 చదరపు మీటర్లకు విస్తరించబడింది. రెప్టైల్ హౌస్లోని సౌకర్యాలలో ఇండోర్ టెర్రేరియా మరియు ప్రాంగణంలో టెర్రిరియం ఉన్నాయి. ఇక్కడ వివిధ రకాల సరీసృపాలు ప్రదర్శించబడతాయి. ప్రస్తుతం, రెప్టైల్ హౌస్ లో 53 ప్రత్యక్ష ప్రదర్శనలతో కూడిన 33 జాతులు ఉన్నాయి, వీటిలో కార్పెట్ పైథాన్, వోమా పైథాన్, బాల్ పైథాన్, గ్రీన్ ట్రీ పైథాన్, పిగ్-నోస్డ్ టర్టిల్, రేడియేటెడ్ టార్టాయిస్ ఉన్నాయి. ఆసియాటిక్ లీఫ్ తాబేలు, స్పైడర్ తాబేలు, నల్ల చెరువు తాబేలు, స్పర్డ్ టార్టాయిస్, మడ అడవుల మానిటర్, నీలి నాలుకగల చర్మం, అలంకరించబడిన స్పైనీ-టెయిల్డ్ బల్లి, చిరుతపులి గెక్కో మరియు చైనీస్ వాటర్ డ్రాగన్. అంతేకాకుండా, సంబంధిత సమాచారం యొక్క గ్రాఫిక్ ప్రదర్శన మరియు 7 సరీసృపాల నమూనాలు కూడా అందించబడ్డాయి. 28 800 మంది సమూహ సందర్శకులతో సహా 360 000 వార్షిక ప్రోత్సాహంతో, సరీసృపాలు హౌస్ పార్క్లోని ప్రధాన వాన్టేజ్ పాయింట్లలో ఒకటిగా మారుతోంది. -
హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు
ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో దీపావళి-2023 వేడుకలను ఘనంగా జరిగాయి. స్థానిక ఇండియా క్లబ్లో నిర్వహించిన ఈ వేడుకల్లో సమాఖ్యలో సభ్యులుగా ఉన్న కుటుంబాలన్నీ పాల్గొన్నాయి. అందర్నీ ఆహ్వానిస్తూ వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి ప్రారంభోపన్యాసం చేశారు. ప్రవాసులంతా కలిసి వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రవాసులంతా ఒక్కచోట చేరడం వల్ల ఒకరికొకరు తోడు ఉన్నారన్న భావన కలుగుతుందన్నారు. పిల్లలు, పెద్దలు ఒక కళా వేదిక కల్పించామని, అందుకు అందరూ సమిష్టిగా కృష్టి చేశారని తెలిపారు. తమ కార్యవర్గసభ్యులు రాజశేఖర్ మన్నె, రమాదేవి సారంగ, మాధురి అరవపల్లి, హరీన్ తుమ్మల, రమేశ్ రేనిగుంట్ల తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. తదనంతరం సంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించారు. చిన్న ఆదిత్య సార్ల శ్లోక పద్యాలతో వినాయకుడిని స్తుతిస్తూ కార్యక్రమం మొదలు పెట్టారు. ఆ తరువాత ప్రేక్షకులని పరవశింప చేసిన అద్వైత ఈయుణ్ణి తబలా ప్రదర్శన, మన కళళ ప్రాముఖ్యతను చాటి చెప్పాయి.చిన్నారులు గుణ ఘట్టి మరియు భేవిన్ ఘట్టి మదురమైన లలితా సంగీతం వినిపించారు. అందరినీ ఆహ్లాద పరిచిన చిట్టి పొట్టి అడుగుల బుజ్జాయిలు జాహ్నవి బెల్లంకొండ, ధన్య సత్తినేని, అమృత ధర్మపురి, ముద్దోచ్చేలా తమ నృత్యాలతో అందరిని ఆశ్చర్యచకితుల్ని చేసారు. ఆ తరువాత, హాంకాంగ్ తెలుగు భామల హుషారైన డాన్స్ స్టెప్పులతో దీపావళి పటాసుల వలె ప్రదర్శనలిచ్చారు. అందరూ సరదాగా ఖబుర్లు చెబుకుంటూ, ముచ్చట్లు వేసుకుంటూ నోరు ఊరించే భోజనం చేసిన తరువాత, నృత్య - గాన ప్రద్శనలతో అందరినీ ఆనంద పరిచిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగంది. సాంస్కృతిక కార్యక్రమాని చక్కటి చిక్కటి అచ్చ తెలుగు లో భామలు రాధిక సంబతూర్ మరియు రాధిక నూతలపాటి చక్కగా నిర్వహించి అందరి మన్ననలు పొందారు. హాంగ్ కాంగ్ లో మూడు దశాబ్దాలకు పైగా నివసించిన వైద్య నిపుణులు డాక్టర్ మోహన్ భాస్కరభట్ల గారు, సతీమణి సూర్య గారు ఆకస్మిక సందర్శన అందరిని ఆశ్చర్యపరుస్తూ ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆ తరువాత అందరూ ఎంతో ఆనందంగా కలిసి గ్రూప్ ఫోటోలు,సెల్ఫీలు తీసుకొని వచ్చిన ప్రతి కుటుంబం తమ బహుమతులు ఉత్సాహంగా అందుకున్నారు. చివరిగా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించిన - పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అందరు మన దేశ జాతీయ గీతంతో కార్యక్రమాన్ని ముగించారు. -
హాంగ్ కాంగ్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
దసరాకి రెండు రోజుల ముందు వచ్చె బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగను ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వారందరు కలిసి ఎంతో ఆనందోత్సాహాలతో, భక్తీ శ్రద్ధలతో సకుటుంబంగా జరుపుకున్నారు. లాంటౌ ద్వీపం లో క్రొత్తగా నిర్మించబడ్డ వాటర్ ఫ్రంట్ ప్రోమేనాడ పై అందమైన ఆకాశంలో నక్షత్రాల మెరుపుల క్రింద, రంగు రంగుల పూలతో అందంగా తయారైన గౌరమ్మను మెరిసే పట్టు చీరలు, నగలలో అందాల భామలు, అందమైన నవ్వులతో, పిల్ల - పాపలతో ఆడపడుచులందరూ చక చక తరిలి వచ్చారు. తుంగ్ చుంగ్ మెట్రో స్టేషన్ నుండి కేవలం కొద్ది దూరంలో ఉన్న తుంగ్ చుంగ్ ఈస్ట్ ప్రొమెనేడ్, జాగర్స్, బైకర్స్, డాగ్ వాకర్స్ మరియు విహార యాత్రలకు వచ్చే వారితో ప్రసిద్ది చెందింది, ఇది విశ్రాంతి తీసుకోవడానికి మరియు ప్రక్రుతిని ఆస్వాదించటానికి సరైన ప్రదేశం. హాంకాంగ్, న్యూ టెరిటరీస్ లో ఉన్న తుంగ్ చుంగ్ ఈస్ట్ ప్రొమెనేడ్ 1.9 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ పార్క్ సహజ దృశ్యాలతో పాటు, ఈ పార్కులో పిల్లలు, పెద్దలు మరియు వయో వృద్ధులు అందరికి అనువైన అందమైన విహార స్థలం. చివరి రోజు బతుకమ్మ (సద్దుల బతుకమ్మ) పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు తంగేడు, గునుగు మొదలగు పూలను ఇంటిళ్ళపాదీ స్నేహితులు కూర్చుని ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ఇందులో గునుగు పూలు, తంగెడు పూలు ముఖ్య భూమికను పోషిస్తాయి.ఈ పూలను జాగ్రత్తగా ఒక పళ్ళెం (తాంబలం) లో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగెడు ఆకులు, పూలు పళ్లెంలో లేదా తాంబోలంలో పేర్చి, ఆపై తంగేడు పూల కట్టలు పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది. తెల్లని గునుక పూలను రంగులతో అద్ది పెడతారు. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరి మాతను పెడతారు. ఇలా పేర్చిన బతుకమ్మను గృహంలోని దైవస్థానంలో అమర్చి అగరొత్తులతో అలంకరించి పూజిస్తారు. చీకటి పడుతుండగా, స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని వాటర్ ఫ్రంట్ కి ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ఊరేగింపు లో బతుకమ్మ పాటలు బతకమ్మ బతకమ్మ ఉయ్యాలో పాడుతూ అందంగా అలంకిరించుకున్నబాలికలు, కన్నె పడుచులు, స్త్రీలు, బతుకమ్మలతో అత్యంత సుందరంగా, వైభావయానంగా ఉంటుంది. ఈ ఊరేగింపు కొనసాగినంత సేపూ, జానపద గీతాలతో వీధులు మారుమోగుతాయి. చూస్తున్న స్థానికులు ఆశ్చర్యంగా , ఆనందంగా చూస్తూ ఫోటోలు తీసుకుంటారు. సాయంకాలం అందరూ తమ తమ బతకమ్మలతో ప్రోమేనాడ చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ ఆడి పాడారు. ఇలా చాలా సేపు ఆడాక గౌరమ్మను పూజించి వెళ్ళి రావే బతుకమ్మ అంటూ సముద్రంలో నిమజ్జనం చేసారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు.ఆపై ఇంటి నుండి తీసుకువచ్చిన సత్తుపిండి (మొక్కజొన్నలు, లేదా వేరుశనగ లేదా పెసర విత్తనాలను దోరగ వేయించి, వాటిని పిండి చేసి, వాటితో చక్కెర పిండి లేదా బెల్లం, నెయ్యి తగినంత కలిపి తయారు చేస్తారు) వాయనాలను ఇచ్చి పుచ్చుకొని ప్రసాదం సేవించారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య (THKTS) వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమతి జయ పీసపాటి మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో వరుసగా ఆరవ సంవత్సరం జరుగుతున్న బతుకమ్మ ఉత్సవమని ఆనందంగా తెలుపుతూ, ఈ ఉత్సవానికి సహాయ సహకారాలు అందించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. THKTS సభ్యులు, వారి కుటుంబ సభ్యుల కృషివల్లే బతుకమ్మ సంబురాలను ఇంత బాగా చేయగలుగుతున్నామని అన్నారు. నవంబర్ లో కార్తిక వనభోజనాలు మరియు దీపావళి వేడుకల ఏర్పాట్లకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. -
పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన హాంగ్కాంగ్ బౌలర్లు.. అయినా..!
ఏషియన్ గేమ్స్ 2023లో పసికూన హాంగ్కాంగ్ పటిష్టమైన పాకిస్తాన్కు చుక్కలు చూపించింది. హాంగ్కాంగ్ మ్యాచ్ అయితే గెలవలేపోయింది కాని, పాక్ బ్యాటింగ్ను కకావికలం చేసి నామమాత్రపు స్కోర్కే పరిమితం చేసింది. 8.5 ఓవర్లలో కేవలం 54 పరుగులకే సగం పాక్ వికెట్లు పడగొట్టిన హాంగ్కాంగ్ బౌలర్లు.. ఆ తర్వాత పాక్ లోయర్ ఆర్డర్ బ్యాటర్ ఆమెర్ జమాల్ను (16 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కట్టడి చేయడంలో విఫలం కావడంతో పాక్ ఓ మోస్తరు చేయగలిగింది. అయితే ఛేదనలో బ్యాటర్లు చేతులెత్తేయడంతో హాంగ్కాంగ్ ఓటమిపాలైంది. ఈ గెలుపుతో పాక్ సెమీ ఫైనల్కు చేరుకోగా.. హాంగ్కాంగ్ ఇంటిదారి పట్టింది. ఇవాళ ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన క్వార్టర్ ఫైనల్-2లో టాస్ ఓడి హాంగ్కాంగ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. ఇన్నింగ్స్ ఆరంభంలో కష్టాల్లో పడినప్పటికీ, ఆతర్వాత తేరుకుని నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. పాక్కు ఆమెర్ జమాల్ (41) ఆదుకోగా.. ఆసిఫ్ అలీ (25), అరాఫత్ మిన్హాస్ (25), ఒమర్ యూసుఫ్ (21), ఖుష్దిల్ (13), రోహైల్ నజీర్ (13), ఖాసిమ్ అక్రమ్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. హాంగ్కాంగ్ బౌలర్లలో ఆయేష్ శుక్లా (4-0-49-4) పాక్ టాపార్డర్ను గడగడలాడించగా.. మెహమ్మద్ గజన్ఫార్ (4-0-26-3), అనాస్ ఖాన్ (3-0-18-2), ఎహసాన్ ఖాన్ (4-0-28-1) వికెట్లు తీశారు. అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హాంగ్కాంగ్.. ఖుష్దిల షా (4-0-13-3), అరాఫత్ మిన్హాస్ (4-0-19-2), సుఫియాన్ ముఖీమ్ (4-1-11-2), ఖాసిమ్ అక్రమ్ (1.5-0-6-2) ధాటికి 18.5 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌటై, 68 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. హాంగ్కాంగ్ ఇన్నింగ్స్లో బాబర్ హయత్ (29) టాప్ స్కోరర్గా నిలువగా.. ఎహసాన్ ఖాన్ (16 నాటౌట్), నియాజ్ అలీ (12), నిజఖత్ ఖాన్ (11), శివ్ మాథుర్ (100 రెండంకెల స్కోర్లు చేశారు. కాగా, ఈ మ్యాచ్కు ముందు జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో భారత్.. నేపాల్ను మట్టికరిపించి, సెమీస్కు చేరింది. సెమీస్లో భారత్.. క్వార్టర్ ఫైనల్-4 (బంగ్లాదేశ్ వర్సెస్ మలేషియా) విజేతను ఎదుర్కొంటుంది. పాక్ సెమీస్లో క్వార్టర్ ఫైనల్-3 (శ్రీలంక వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్) విజేతతో తలపడుతుంది. భారత్, పాక్లు సెమీస్ను దాటితే స్వర్ణ పతకం కోసం ఫైనల్లో తలపడతాయి. -
హాంకాంగ్లో ‘సురభి ... ఏక్ ఎహసాన్ ’
దేశభక్తిని ప్రబోధించే ‘సురభి ఏక్ ఎహసాన్ హాంకాంగ్లో ప్రవాస భారతీయుల ప్రత్యేక కార్యక్రమం. అమరవీరులైన సైనికుల స్ఫూర్తిని చాటిన జయ పీసపాటి టోరీ రేడియోల ప్రసారం సాక్షి, సిటీబ్యూరో టోరీ రేడియో పరిచయాల ద్వారా సైనికుల త్యాగాలు, వారి కుటుంబాలపైన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు, విశేషాలను సామాన్య ప్రజలకు విస్తృతంగా పరిచయం చేశారు. ఆ జయ పీసపాటి...మరో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్కు చెందిన ఆమె హాంకాంగ్లో నివాసం ఉంటున్నారు. అక్కడి నుంచే చాలాకాలంగా ఆమె టోరి రేడియో వ్యాఖ్యాతగా సేలందజేస్తున్నారు. తాజాగా ‘సురభి ... ఏక్ ఎహసాన్ ’ అనే పేరుతో మరో ప్రత్యేక కార్యక్రమాన్ని టోరి రేడియో ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇటీవల హాంకాంగ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనేక మంది ప్రవాస భారతీయులు పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు. పిల్లలు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశ భక్తి పాటలలు, నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో ప్రవీణ్ అగర్వాల్, సౌరభ్ రాఠీలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మంజరి గుహ, నేహా అగర్వాల్ , సాక్షి గోయల్ , సుగుణ రవి, కొరడ భరత్ కుమార్, ప్రశాంత్ పటేల్, శ్రీదేవి బొప్పన, లక్ష్మి యువ,సంజయ్ గుహ, తదితరులు స్వచ్ఛంద సేవకులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయ పీసపాటి నిర్వహించిన ‘ జై హింద్ ’ టాక్ షోలో ఉమేష్ గోపీనాథ్ జాదవ్ పాల్గొని ప్రసంగించారు. ‘సురభి ఏక్ ఎహసాన్‘కార్యక్రమానికి ఆయన అభినందలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘బి ది చేంజ్’ సంస్థ వ్యవస్థాపకులు పూనమ్ మెహతా, రిటైర్డ్ సివిల్ సర్వెంట్ నీనా పుష్కర్ణ, రుట్టోంజీ ఎస్టేట్స్ కంటిన్యూయేషన్ లిమిటెడ్ డైరెక్టర్ రానూ వాసన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారతీయ సంఘాల నుంచి పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు.కార్గిల్ యుద్ధంలో భారతీయ సైనికులు ప్రదర్శించిన అద్భుతమైన ధైర్యసాహసాలు, పరాక్రమాన్ని శ్లాఘిస్తూ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపాయి. సాయుధ దళాల వైద్య కళాశాలలో చదవాలనే ఆశయాన్ని సాధించలేకపోయినప్పటికీ టోరి రేడియో వ్యాఖ్యాతగా అనేక దేశభక్తి కార్యక్రమాలను నిర్వహిస్తున్న జయ పీసపాటి ‘‘జై హింద్’’ అనే టాక్ షో ద్వారా ఆమె పలువురు సాయుధ దళాల అధికారులు, విశ్రాంత అధికారులు, అమర వీరుల కుటుంబ సభ్యులతో ప్రత్యక్ష ప్రసారం నిర్వహించి ప్రపంచలోని ప్రవాస తెలుగు వారికి పరిచయం చేశారు. (చదవండి: శాన్ఫ్రాన్సిస్కోలో భారత నూతన కాన్సులేట్ జనరల్గా తెలుగు వ్యక్తి!) -
గగుర్పాటు కలిగించే ఘటన.. ఎత్తైన భవనంపై సాహసం.. అంతలోనే పట్టుతప్పి..
హాంగ్కాంగ్: డేర్డెవిల్ గా పేరొందిన 30 ఏళ్ల రెమీ లుసిడి ఎత్తైన భవనం అంచున నిలబడి వీడియో తీసుకునే సాహసం చేస్తుండగా పట్టుతప్పి జారిపోయాడు. 68వ అంతస్తు నుండి కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. లుసిడి చనిపోయిన స్పాట్ నుండి కెమెరాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటన హంగ్ కాంగ్ లోని ట్రెజుంటర్ టవర్ దగ్గర జరిగింది. రెమీ లుసిడి ఒళ్ళు గగుర్పొడిచే సాహసాలు చేసే ఓ బ్లాగర్. అతను చేసే సాహసాలంన్నిటినీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇదే క్రమంలో హాంగ్కాంగ్లోని ట్రెగుంటర్ టవర్ కాంప్లెక్స్ భవనంపైకి ఎక్కి వీడియో తీసుకోవాలని సంకల్పించాడు. అనుకుంది తడవు ఆ కాంప్లెక్స్ కి వెళ్లి 40వ అంతస్తులో తన ఫ్రెండుని కలవడానికి వెళ్తున్నానని చెప్పి సెక్యూరిటీ కళ్ళుగప్పి బిల్డింగ్లోకి ప్రవేశించాడు. BREAKING NEWS: Tragic Death of Fearless Instagram Daredevil in Hong Kong High-Rise IncidentIn a heartbreaking incident that shocked the world of extreme sports, Remi Lucidi, a 30-year-old French daredevil renowned for his high-rise stunts, lost his life after falling from the… pic.twitter.com/9jYKnrgVVt— URECOMM (@URECOMM) July 30, 2023 తీరా అతను చెప్పింది వాస్తవం కాదని సెక్యూరిటీ వారికి తెలిసే సమయానికే లుసిడి సీసీటీవీ ఫుటేజిలో 49వ అంతస్తులో బిల్డింగ్పైకి వెళ్లే మెట్లు ఎక్కుతూ కనిపించాడు. చివరిగా అతను 7.38 నిముషాలకు పెంట్ హౌస్ బయట కిటికీ తలుపు తడుతూ తాను ప్రమాదంలో ఉన్నట్లు చెప్పబోయాడని అందులో పని చేసే ఒకామె తెలిపింది. అంత ఎత్తు నుండి పడిపోవడంతో లుసిడి అక్కడికక్కడే చనిపోయాడని పోలీసులు తెలిపారు. స్పాట్లో లుసిడి కెమెరాను కనుగొన్న పోలీసులు అందులో కళ్లుచెదిరే సాహసాలకు సంబంధించిన అతడి వీడియోలు ఉన్నట్లు.. బలహీనమైన గుండె కలవారు వాటిని చూడలేరని తెలిపారు. లుసిడి మరణానికి గల కారణం ఏంటనేది మాత్రం వారు చెప్పలేదు. గతంలో లుసిడి చాలా సాహస కృత్యాలు చేశాడు. పారిస్ లోని ఈఫిల్ టవర్ తో పాటు దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పైకి ఒట్టి చేతులతో ఎక్కి ఫోటోలు తీసుకున్నాడు. చివరిసారిగా హంగ్ కాంగ్ లో లుసిడి తీసుకున్న ఫోటోను కింది ట్వీట్ లో చూడవచ్చు. #STUPIDITY gets you #KILLED #Daredevil #Remi #lucidi , 30, known for Instagram #stunts dies after falling 721ft from the top of a 68-story #Hong #Kong #skyscraper - having posted final photo from another high-rise pic.twitter.com/ooMDorcFdB— NEWS-ONE 🏴 (@NEWSONE14898745) July 31, 2023 ఇది కూడా చదవండి: పాలస్తీనా శరణార్ధుల శిబిరంలో అల్లర్లు.. ఐదుగురు మృతి -
అస్థికలు భద్రపరిచేందుకు అద్దె రూ.63 లక్షలు, ఫ్యామిలీ ప్యాక్ కూడా!
ప్రపంచ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అత్యంత ఖరీదైన ప్రాంతం ఏదంటే హాంకాంగ్ అని ఠక్కున చెప్పేయొచ్చు. ఒక జత చెప్పుల డబ్బా అంతటి విస్తీర్ణం ఉన్న స్థలం కూడా వేల డాలర్లు పలుకుతుంది. అలాంటి ప్రాంతంలో చూపరుల్ని ఆకట్టుకునే 12 అంతస్తుల అందమైన భవనాన్ని ఈ మధ్య నిర్మించారు. పాలరాతితో, వంపులు తిరిగిన డిజైన్, రూఫ్ గార్డెన్తో చూడముచ్చటగా కనిపిస్తున్న ఈ భవనాన్ని చూస్తే ఎవరైనా ఫిదా(వశం) అయిపోతారు. అయితే అది నిర్మించింది ధనవంతులు నివసించడం కోసం కాదు. మరణించిన వారి అస్థికలను భద్రపరచడం కోసం ప్రత్యేకంగా నిర్మించారు. ఒక లగ్జరీ అపార్ట్మెంట్ ఎలా ఉంటుందో అదే స్థాయిలో అందులో సకల సదుపాయాలు ఏర్పాటు చేశారు. షాన్ సమ్ టవర్ పేరుతో నిర్మించిన ఈ భవనంలో అస్థికల కలశాన్ని భద్రపరచాలంటే 76,000 డాలర్లు (రూ.63 లక్షలు) చెల్లించాలి. అది కూడా 10 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత లీజ్ రద్దయిపోతుంది. ఎందుకంటే ఆ భవనంలో 22,000 మంది అస్థికలను మాత్రమే భద్రపరచవచ్చు. ఒక కుటుంబంలో ఎనిమిది మంది అస్తికలను భద్రపరచడానికి ఫ్యామిలీ ప్యాకేజీ సదుపాయం ఉంది. అందుకయ్యే ఖర్చు 4,40,000 డాలర్లు (రూ.3.64 కోట్లు). షాన్ సమ్ అంటే చైనా భాషలో దయా హృదయం అని అర్థం. ఈ భవనం సంపన్నులకే అందుబాటులో ఉండడం గమనార్హం. అంతా అత్యాధునికం కేవలం అస్థికల కోసం ఇంత ఖరీదా? అని ఎవరైనా నోరెళ్లబెట్టొచ్చు. కానీ, అక్కడున్న హంగులు, ఆర్భాటాలు చూస్తే మతి పోవాల్సిందే. తమకెంతో ఇష్టమైన వారిని స్మరించుకోవడానికి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ భవనాన్ని నిర్మించారు. పైన అంతా రూప్గార్డెన్ ఉంటుంది. ప్రతి అంతస్తులోనూ పెద్ద పెద్ద బాల్కనీలు ఉంటాయి. చైనా సంస్కృతి సంప్రదాయాల్లో శ్మశాన వాటికలు ఎలా ఉంటాయో అలా వంపుల తిరిగిన డిజైన్తో భవనం ఉంటుంది. ఇక లోపల పాలరాతి ఫ్లోరింగ్, ఏసీలు, గాలిలో తేమని తొలగించే వ్యవస్థ కూడా ఉన్నాయి. అస్థికలను భద్రపర్చే చిన్నచిన్న గదుల తలుపులను బంగారు నాణేలతో సౌందర్యభరితం చేశారు. భిన్న సంప్రదాయాలు, ఆచారాలను పాటించే వారి అభిరుచులకు అనుగుణంగా ఈ భవన నిర్మాణం జరిగింది. పెద్దలకి నివాళులరి్పంచుకోవడానికి ముందస్తుగా యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. వారికిష్టమైన ఆహారాన్ని వండి తీసుకువెళ్లి, సంప్రదాయబద్ధంగా నివేదించవచ్చు. పెద్దలను గౌరవించుకోవడానికి మనుషుల అస్థికల కోసం ప్రత్యేకంగా అందమైన భవనం కట్టాలన్న ఆలోచన ఏడు పదుల వయసున్న మార్గరెట్ జీ అనే ఒక మహిళా పారిశ్రామికవేత్తకు వచ్చింది. జ్యువెలరీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న ఆమె వయసు మీదపడ్డాక సేవా కార్యక్రమాల బాట పట్టారు. తన పేరు మీదే ఒక ఫౌండేషన్ను ఏర్పాటు చేసి సమాజానికి సేవలందిస్తున్నారు.‘‘మరణించిన పెద్దలకి నివాళులర్పించడానికి చైనా సంప్రదాయంలో చాలా ప్రాధాన్యతనిస్తారు. దివికేగిన పెద్దల స్మృతుల్లో గడిపి, వారిని గౌరవిస్తే అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తారు. అలాంటి వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ భవనం నిర్మించాం’’ అని మార్గరెట్ చెప్పారు. భర్త మరణంతో.. హాంకాంగ్ నగర జనాభా 70 లక్షలపైమాటే. చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ జనాభా కిటకిటలాడిపోతూ ఉంటుంది. వాస్తవానికి విస్తీర్ణంలో హాంకాంగ్ పెద్దదే. కానీ కొండలు, గుట్టలు ఎక్కువగా ఉండడం వల్ల నివాసయోగ్యమైన ప్రాంతం తక్కువే. అందుకే ఇక్కడ ఆకాశహార్మ్యాల నిర్మాణం ఎక్కువగా ఉంది. ఈ నగరంలో ఒక ఇంటి సగటు విస్తీర్ణం 430 చదరపు అడుగులు మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. అస్థికల భవన నిర్మాణాన్ని తలపెట్టిన మార్గరెట్ భర్త 2007లో మరణించారు. ఆయన స్మృతి చిహ్నం ఏర్పాటు చేయడానికి ఆమెకి స్థలం దొరకలేదు. ఆ సమయంలోనే మరణించిన వారి కోసం ప్రత్యేకంగా ఒక అపార్ట్మెంట్ నిర్మించాలన్న ఆలోచన ఆమెకు వచి్చంది. అది ఇన్నేళ్లకి సాధ్యమైందని చెబుతున్నారు. ఇక హాంకాంగ్లో వృద్ధుల జనాభా పెరిగిపోతోంది. ప్రతి అయిదుగురిలో ఒకరు 65 ఏళ్లకు పైబడిన వారే. ఇక నగరంలో ప్రతి ఏటా దాదాపు 46,000 మంది మరణిస్తున్నారు. వారి అవశేషాలను భద్రపరచడానికి ప్రభుత్వం పలు సదుపాయాలు ఏర్పాటు చేసింది. అయితే అవి సరిపోకపోవడం వల్ల ప్రైవేట్ భవనం నిర్మించాల్సి వచి్చంది. హాంకాంగ్లో సంపన్నులు కూడా ఎక్కువే. అలాంటి వారి సౌకర్యార్థం షాన్ సమ్ అందుబాటులోకి వచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ACC Women's T20: భారత్- పాక్ మ్యాచ్ రద్దు.. సెమీస్లో ఇరు జట్లు
హాంకాంగ్: ఎమర్జింగ్ కప్ ఆసియా అండర్–23 మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్లో భారత ‘ఎ’ జట్టు సెమీఫైనల్ చేరింది. భారీ వర్షం కారణంగా భారత్ ‘ఎ’, పాకిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య శనివారం జరగాల్సిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్ రద్దయింది. దాంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. లీగ్ మ్యాచ్లు ముగిశాక భారత్, పాక్ జట్లు నాలుగు పాయింట్లతో గ్రూప్ ‘ఎ’ నుంచి సెమీఫైనల్కు చేరాయి. గ్రూప్ ‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లకు సెమీఫైనల్ బెర్త్లు ఖరారయ్యాయి. సోమవారం జరిగే సెమీఫైనల్స్లో శ్రీలంకతో భారత్; బంగ్లాదేశ్తో పాకిస్తాన్ తలపడతాయి. బంగ్లాదేశ్ భారీ విజయం.. టెస్టు క్రికెట్ చరిత్రలో.. మిర్పూర్: ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన బంగ్లాదేశ్ జట్టు తమ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. అఫ్గానిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టులో లిటన్ దాస్ సారథ్యంలోని బంగ్లాదేశ్ ఏకంగా 546 పరుగుల తేడాతో ఘనవిజయం అందుకుంది. 662 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 33 ఓవర్లలో 115 పరుగులకే కుప్పకూలింది. ఓవర్నైట్ స్కోరు 45/2తో ఆట నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన అఫ్గానిస్తాన్ మరో 70 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లను కోల్పోయింది. బంగ్లాదేశ్ బౌలర్లు తస్కిన్ అహ్మద్ (4/37), షోరిఫుల్ ఇస్లాం (3/28) అఫ్గానిస్తాన్ను దెబ్బ తీశారు. రెండు ఇన్నింగ్స్లలో సెంచరీలు చేసిన బంగ్లాదేశ్ బ్యాటర్ నజ్ముల్ హుస్సేన్ షాంతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకున్నాడు. మొత్తం టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల తేడా పరంగా బంగ్లాదేశ్ది మూడో అతి పెద్ద విజయం కావడం విశేషం. ఈ జాబితాలో ఇంగ్లండ్ (1928లో ఆస్ట్రేలియాపై 675 పరుగుల తేడాతో గెలుపు), ఆస్ట్రేలియా (1934లో ఇంగ్లండ్పై 562 పరుగుల తేడాతో గెలుపు) జట్లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. -
సంచలనం.. 34 పరుగులకే ఆలౌట్; భారత్ ఘన విజయం
ఏసీసీ వుమెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్లో సంచలనం చోటుచేసుకుంది. లీగ్లో భాగంగా మంగళవారం హాంగ్ కాంగ్ వుమెన్స్, ఇండియా వుమెన్స్-ఏ మధ్య మ్యాచ్ జరిగింది. కాగా మ్యాచ్లో ఇండియా వుమెన్స్ బౌలర్ల దాటికి హాంగ్కాంగ్ కేవలం 34 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రేయాంకా పాటిల్ ఐదు వికెట్లతో చెలరేగగా.. పార్శవీ చోప్రా, మన్నత్ కశ్యప్లు తలా రెండు వికెట్లు పడగొట్టగా.. తిటాస్ సాదు ఒక వికెట్ తీశాడు. హాంగ్ కాంగ్ బ్యాటర్లలో మరికో హిల్ 14 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మిగతా పది మంది సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. అందులో నాలుగు డకౌట్లు ఉన్నాయి. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ వుమెన్స్ 5.2 ఓవర్లలో వికెట్ నష్టపోయి 38 పరుగులు చేసి టార్గెట్ను అందుకుంది. గొంగిడి త్రిష 19, ఉమా చెత్రీ 16 పరుగులు చేశారు. టోర్నీలో తొలి మ్యాచ్ ఆడిన ఇండియా-ఏ వుమెన్స్ భారీ విజయం అందుకొని టేబుల్ టాపర్స్గా ఉన్నారు. Patil’s 5-fer demolishes Hong Kong! Put into bat, the 🇭🇰 batters had no answers to the Indian spinners - ending with just 34 runs. The 🇮🇳 top order completed the chase with over 14 overs to spare! #WomensEmergingTeamsAsiaCup #ACC pic.twitter.com/8e11IyECs5 — AsianCricketCouncil (@ACCMedia1) June 13, 2023 Shreyanka Patil was terrific today! She picked up 5 wickets and conceded just 2 runs. Her splendid spell has put India ‘A’ in the drivers seat at the break! #WomensEmergingTeamsAsiaCup #ACC pic.twitter.com/UqF0HPd3Xs — AsianCricketCouncil (@ACCMedia1) June 13, 2023 చదవండి: ఔను.. ఇంగ్లండ్లోనే ఎందుకు జరగాలి? వేరే పిచ్ పెట్టాల్సిందే.. పెరుగుతున్న మద్ధతు -
చెరువులో వింత జీవి.. వామ్మో ఇరవై నాలుగు కళ్లు..
హాంకాంగ్లోని ఒక చెరువులో బయటపడింది ఈ వింతజీవి. జెల్లీఫిష్ జాతికి చెందిన ఈ జీవికి ఏకంగా ఇరవైనాలుగు కళ్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక అంగుళం పరిమాణంలో పారదర్శకమైన శరీరం, మూడు పొడవాటి టెంటకల్స్ కలిగి ఉన్న ఈ జీవిని హాంకాంగ్లోని మై పో రిజర్వ్ చెరువులో గుర్తించారు. ఇది జెల్లీఫిష్లో ఇప్పటివరకు తెలియని కొత్తజాతికి చెందినదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. గంట మాదిరిగా కనిపించే దీని శరీరం లోపలి వైపు ఆరుభాగాల్లో పన్నెండు జతల కళ్లు ఉన్నాయని, ఆస్ట్రేలియన్ బాక్స్ జెల్లీఫిష్ మాదిరిగానే ఇది కూడా విషపూరితమైనదని శాస్త్రవేత్తలు వివరించారు. హాంకాంగ్ బాప్టిస్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ వింత జెల్లీఫిష్ను మూడేళ్ల కిందటే గుర్తించారు. దీనిపై విస్తృతంగా పరిశోధనలు జరిపి, ఇటీవల దీని విశేషాలను మీడియాకు వెల్లడించారు. చదవండి: కాంగోలో వరదల బీభత్సం..200 మందికిపైగా మృతి -
మంటల్లో చిక్కుకున్న 42 అంతస్తుల భవనం..ఒక్కసారిగా వీధుల్లో..
ఓ బారీ ఆకాశహర్మం మంటల్లో చిక్కుకుంది. దీంతో ఒక్కసారిగా వీధుల్లో నిప్పుల వర్షం కురిసింది. ఈ ఘటన హాంకాంగ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..హాంకాంగ్లోని సిమ్ షా సుయ్లో 42 అంతస్తుల భారీ ఆకాశహర్మంలో అర్థరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో నిర్మాణం లోపల ఏవో పెద్దపెద్దగా పేలుళ్ల శబ్దాలతో అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దీంతో వెంటనే రంగంలో దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నించగా..వీధుల్లో కుప్పలు కుప్పులుగా కాలిపోతున్న చెత్త చెదారం ఏదో ఎర్రటి నిప్పుల వర్షం మాదిరి కనిపించాయి. ఈ ఘటకు ముందు ఇద్దరు అగంతకులు ఇదే భవనంలోని క్వీన్ ఎలిజబెత్ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చినట్లు స్థానికి మీడియా పేర్కొంది. ఐతే ఈ ఘటనలో ఎంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందనేది తెలియాల్సి ఉంది. ఈ నిర్మాణ స్థలం 1967లో హాంకాంగ్ గవర్నర్ డేవిడ్ ట్రెంచ్ చేత ప్రారంభించబడిన మెరైనర్స్ అనే ఓ క్లబ్ ఉండేది. ఐతే ఈ పాత భవనం 2018లో కూల్చివేసి దాని స్థానంలో ఈ 42 అంతస్థుల కింప్టన్ హోటల్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది మంటల్లో పూర్తిగా దెబ్బతింది. దీన్ని సుమారు మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించినట్లు సమాచారం. ఇందులో సుమారు 500కి పైగా గదులు ఉంటాయని అంచనా. Huge fire tears through #HongKong #skyscraper: Fire hits skyscraper being built on site of old Mariner's Club in Hong Kong's #TsimShaTsui https://t.co/zmG6QrCLhQ pic.twitter.com/3DcPsuIykq — 🛰️ War in Ukraine 🍉 (@EUFreeCitizen) March 2, 2023 (చదవండి: అమెరికా, రష్యా, యూఏఈల వ్యోమగాములతో..) -
Hong Kong Model Case: సూప్ కుండలో ఆమె తల..కంగుతిన్న పోలీసులు
ప్రముఖ హాంకాంగ్ మోడల్ అబ్బి చోయ్ అతి దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తును చేస్తున్న హాంకాంగ్ పోలీసులు ఆమె ఛిద్రమైన శరీర భాగాలను నగర శివార్లలోని ఓ ఇంట్లోని ఫ్రిజ్లో గుర్తించగా.. తల, మొండెం కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు ఓ కుండలోని సూప్ చూసి కంగుతిన్నారు. నిండుగా ఉన్న సూప్ని నిశితంగా గమనించి దగ్గరకు వెళ్లితే గాని తెలియలేదు అందులో మోడల్ తల భాగం ఉందన్న విషయం. తొలుత ఆ కుండలో క్యారట్, ముల్లంగి వంటి వాటితో సూప్ మాదిరి చక్కగా ఆకర్షణీయంగా ఉండటంతో సూప్ అనే అనుకున్నారు. ఐతే అందులో ఆ మోడల్ తల భాగాం పుర్రె మాదిరిగా చూసి.. షాక్ గురైనట్లు తెలిపారు. ముఖం మీద చర్మం, మాంసం భాగాలు ఆ సూప్లోనే అవశేషాలుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జుట్టుతో సహా చోయి పుర్రె ఉన్నట్లు తెలిపారు. అంతేగాదు ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి కారులో ఉండగానే ఆమెపై దాడి చేసి ఇంటికి తీసుకువెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ మోడల్ పుర్రె వెనుక ఉన్న రంధ్రాన్ని బట్టి ఆమెపై ప్రాణాంతక దాడి జరిగి ఉండవచ్చని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, పోలీసుల దర్యాప్తులో.. చోయి మాజీ భర్త, అతని కుటుంబానికి సంబంధించి పది మిలియన్ల డాలర్లతో కూడిని విలాసవంతమైన ఆస్తుల విషయమై వివాదాలు ఉన్నట్లు తేలింది. చోయి అదృశ్యం కావడానికి ముందు రోజే చోయి భర్త అలెక్స్ క్వాంగ్, అతని తండ్రి క్వాంగ్ కౌ, సోదరుడు ఆంథోనీ క్వాంగ్, అత్తగారు జెన్నీ లీ కోర్టుకు హాజరుకాగా, వారికి బెయిల్ లభించలేదు. పైగా కోర్టు విచారణను మే 8కి వాయిదా వేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఈ దారుణ హత్యకు ఆ నలుగురి పాత్ర ఉండవచ్చన్న అనుమానంతో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా, అబ్బి చోయి హాంకాంగ్లో ప్రసిద్ధ మోడల్ మాత్రమేగాదు, పారిస్ ఫ్యాషన్ వీక్లో రెగ్యులర్గా పాల్గొంటోంది. ఆమె ఫిబ్రవరి19న చివరిసారిగా ఫ్యాషన్ మ్యాగజైన్ ఎల్ ఆఫీయల్ మోనాక్తో కలిసి ఒక ఫోటోషూట్ చేసినట్లు సమాచారం. (చదవండి: మోడల్ హత్య..చంపి, ఫ్రిజ్లో కాళ్లను దాచి..) -
మోడల్ హత్య..చంపి, ఫ్రిజ్లో కాళ్లను దాచి..
ఇటీవలకాలంలో కోపంతో లేదా మరేదైనా ఇతర కారణాలతోనూ హత్యలు చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా వారిలోంచి వికృతమైన సైకో బయటకు వచ్చి.. బాధితుల కుటుంబసభ్యులు కడసారిచూపు దక్కనివ్వకుండా చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు వరుసుగా చోటు చేసుకోవడం బాధకరం. అచ్చం అలాంటి దారుణ ఘటనే హాంకాంగ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. హాంకాంగ్లోని అబ్బి చోయి అనే 28 ఏళ్ల మోడల్ హత్యకు గురైంది. ఆమె కాళ్లను నగరశివార్లలోని ఒక ఇంట్లోని రిఫ్రిజిరేటర్లో గుర్తించారు పోలీసులు. ఆ ప్రాంతంలోని మృతదేహాన్ని కోసేందుకు వినియోగించే ఎలక్ట్రిక్ రంపాన్ని కూడా కనుగొన్నారు. ఇంకా.. ఆమె శరీరంలోని మొండెం, తల, చేతులు గుర్తించాల్సి ఉంది. ఇటీవలే ఎల్ అఫియల్ మొనాకో ఫ్యాషన్ మ్యాగజైన్ డిజిటల్ కవర్పై ఆమె ఫోటోలు ప్రచురితమయ్యాయి. ఈ కేసుకి సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి శరీర భాగాల కోసం గాలిస్తుండగా... స్థానిక మ్యాగజైన్లో ఆమె ఫోటోలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు హాంకాంగ్ పోలీసులు మాట్లాడుతూ..ఈ హత్యకు సంబంధించి ఆమె మాజీ భర్తను, బావా, అతని సోదరుడు, అత్తగారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆ మోడల్ చోయి మంగళవారం నుంచి కనిపించకుండా పోయిందని, చివరిసారిగా తాయ్ పీఓ జిల్లాలో కనిపించిందని తెలిపారు. ఆమె శరీర భాగాలను ఆ జిల్లాలోని గ్రామంలోనే గుర్తించారు. మిగతా భాగాల కోసం డ్రోన్ల తోహా అధికారుల బృందం ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపారు. ఐతే ఈ హత్యకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది. (చదవండి: పాక్, చైనాలకు సాయం కట్ చేస్తా.. అమెరికా విదేశాంగ విధానంలో మార్పులు రావాలి) -
ఆంగ్లో ఈస్టర్న్ భారీ నియామకాలు
ముంబై: నౌకల నిర్వహణలో ఉన్న హాంగ్కాంగ్ కంపెనీ ఆంగ్లో ఈస్టర్న్ గ్రూప్ భారత్లో కొత్తగా 2023 డిసెంబర్ నాటికి 1,000 మంది నావికులను నియమించుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా షిప్పింగ్ పరిశ్రమకు శిక్షణ పొందిన మానవ వనరులను అందించే ప్రధాన సరఫరాదార్లలో భారత్ ఒకటి. ఆంగ్లో ఈస్టర్న్ గ్రూప్ అనుబంధ కంపెనీ ఆంగ్లో ఈస్టర్న్ షిప్ మేనేజ్మెంట్ ఇండియాకు ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్కత, కొచ్చి, లక్నో, చండీగఢ్లో కార్యాలయాలు ఉన్నాయి. నావికా శిక్షణ కేంద్రం సైతం భారత్లో కంపెనీ నిర్వహిస్తోంది. ప్రస్తుతం దేశంలో కంపెనీకి 21,000 మంది సిబ్బంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 27,000. థర్డ్ పార్టీ షిప్ మేనేజ్మెంట్ కింద సంస్థ ఖాతాలో 600 నౌకలు కొలువుదీరాయి. 300 బల్క్ ట్యాంకర్స్, 200 ట్యాంకర్స్, 100 కంటైనర్ షిప్స్ ఉన్నాయి. ప్రపంచంలో నౌకల పరంగా తొలి స్థానంలో, సిబ్బంది పరంగా రెండవ స్థానంలో గ్రూప్ నిలిచిందని ఆంగ్లో ఈస్టర్న్ షిప్ మేనేజ్మెంట్ ఇండియా ఎండీ మనీశ్ ప్రధాన్ తెలిపారు. -
హాంగ్కాంగ్లో భలేగా బుజ్జాయిలతో భోగి!
తెలుగు సంస్కృతిలోని అందచందాలు చాలా ఎక్కువగా కనబడేది పండుగ సమయాలలోనే ఉదాహరణకు, సంక్రాంతినే తీసుకోండి. సంక్రాంతిలో అచ్చమైన తెలుగుదనం వెలుగుతూ ఉంటుంది. భోగి, మకర సంక్రమణం, కనుమ - ఈ మూడు రోజులూ పండుగే కనుక, దీన్ని పెద్ద పండుగ అంటారు. మన పండుగలకు చాలా సామాజిక, సాంప్రదాయ, సాంస్కృతిక మరియు స్వాభావికమైన ఆరోగ్య విలువలు ఉంటాయి. ఈ పండుగలలో పెద్దల ఆశీర్వదిస్తారు. పిల్లలు మహా సందడిగా ఉంటారు. ప్రత్యేకంగా భోగి పండుగనాడు సంబరమంతా పిల్లలదే. కొత్త బట్టలు ధరించి భోగి మంటల్లో భోగి పిడకలు వేయడంతో భోగి సంబరాలు మొదలవుతాయి. భోగిపళ్లలో, చెర్రీస్, శనగలు, చేమంతి, బంతి, గులాబీ పువ్వుల రేకులు, అక్షింతలు, చిల్లర నాణేలు, చాక్లెట్లు కలిపి సాయంత్రం భోగిపండ్లు పిల్లలకు దిష్టి తీసి వాటిని తలపై పోస్తారు. పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చినవారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలూ, పసుపు-కుంకుమలూ పెట్టడం ఆనవాయితీ. అయితే ప్రవాస భారతీయులుగా పండుగకు కావాల్సినవన్ని వారున్న దేశంలో సమకూర్చుకోలేకపోయినా, లభ్యమైన వాటితోనే వారు ఎంతో ఆనందోత్సాహాలతో పండుగలన్నీ సాంప్రదాయబద్ధంగా చేసుకునే ప్రయత్నం చేస్తారు. హాంగ్ కాంగ్ లో నివసిస్తున్న తెలుగు వారు కూడా ప్రతి యేట రెట్టింపు వుత్సాహంతో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి పండుగ వివరాలు తెలుపుతూ, వారి పాపకి భోగి పండ్లు సంధర్భంగా, తమ ఎస్టేట్ లో వున్న మరి కొంత మంది పసి పిల్లల్ని కలుపుకొని ‘బుజ్జాయిలతో భోగి’ చేయడం మొదలుపెట్టగా, భగవంతుని ఆశశీస్సులతో రెండు దశాబ్దాలుగా ఈ సంక్రాంతి వేడుక నిర్విఘ్నంగా కొనసాగుతున్నందుకు తమకు ఎంతో ఆనందాన్ని తృప్తినిస్తోందని తెలిపారు. హాంగ్కాంగ్లో ‘డూడు బసవన్నలు’ మరియు ‘గంగిరెద్దుల ఆటలు’ కనిపించక పోయినా, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ‘బుజ్జాయిలతో భోగి’ సందడి క్రిస్మస్ సెలవల నుంచే మొదలవుతుంది. సెలవలకి భారతదేశం వెళ్ళినప్పుడు, రానున్న సంక్రాంతి పండుగకు కావాల్సిన వస్తువులు, క్రొత్త బట్టలు, నగలు, బొమ్మలు మొదలగునవి తెచ్చుకోవడం ఒక ఆనవాయితీగా మారింది. అమ్మల పట్టు చీరలు, తళ తళ మెరిసే మేలిమి నగలు, నాన్నల పంచే సర్దుకొంటూ పిల్లల వెంట పరుగులు, చిన్నారుల క్రొత్త బోసి నవ్వులు - కేరింతలు, పిల్లల కాలి మువ్వల సవ్వడులుతో పండుగ వాతావరణానికి ఆహ్వానాలుగా ధ్వనిస్తాయి. అమ్మమ్మలు - బామ్మలు - తాతయ్యల మురిపాల నవ్వులు, సంతోషాలు ఆ భోగిపళ్ళ సందడికే ప్రకాశాన్నిస్తున్నాయి.. అందరూ భోగిపళ్ళతో సమావేశంకాగా అమ్మమ్మ - బామ్మల హస్తాల మీదుగా దీప ప్రజ్వలనంతో కార్యక్రమం ప్రారంభం కాగా, హాంగ్ కాంగ్ ప్రముఖ గాయని శ్రీమతి హర్షిణి ప్రార్థనగీతం ఆలపించగా, పెద్దలు వారు ముందుగా పిల్లలకి భోగి పళ్ళు పోసి ఆశీర్వదించగా, తల్లి తండ్రులందరు వరుసగా పిల్లలందరికి భోగి పళ్ళు పోసి ఆశీర్వదించారు. పిల్లలందరికి మరింత ఆసక్తి ఉత్సాహాన్ని ఇచ్చేది, పాల్గొంటున్న వారిచ్చే చిరు కానుకలు. వాటిని పుచ్చుకునేందుకు పిల్లల అరుపులు, కేకలు , పరుగులు ఎంత ముచ్చటగా వుంటాయో కదా. మరి కానుకలు అందుకున్న తరువాత వాటిని విప్పి చూసే హడావిడి మీ ఊహకే అంటున్నారు సంతోషంగా, ‘ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య’ సాంస్కృతిక బృందం నుంచి రమాదేవి, మాధురి, హర్షిణి, రాధిక. ఫిబ్రవరిలో తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మరొక్క మంచి మాట, హాంగ్కాంగ్లో కూడా మన దేశంలో సంక్రాంతికి గాలి పటాల పోటీల వలె ఇక్కడ జాతీయ - అంతర్జాతీయ గాలి పటాల పోటీలు నిర్వహిస్తుంటారు.. మీకు తెలుసా, గాలిపటాలు ఎగురవేయడం హాంగ్కాంగ్, చైనాలో ఒక ప్రసిద్ధ కాలక్షేపం. మొదటి గాలిపటం షాన్డాంగ్లో సన్నని చెక్క ముక్కలతో తయారు చేయబడిందని నమ్ముతారు. చైనీస్ గాలిపటాల నమూనాలు ఎక్కువగా జానపద కథలు మరియు బొమ్మలపై ఆధారపడి ఉంటాయి. మీరు తరచుగా డ్రాగన్లు, పువ్వులు, గోల్డ్ ఫిష్, సీతాకోకచిలుకల వంటి ఐకానిక్ చిహ్నాలు మరియు డిజైన్లను చూసివుంటారు. ఇలా అనేక దేశాలలో గాలిపటాలు ఎగురవేయడం ప్రసిద్ధి చెందింది - భారతదేశం, నేపాల్, ఆఫ్గనిస్థాన్, పాకిస్తాన్, చైనా, జపాన్, తైవాన్, గ్రీస్, సైప్రస్, దక్షిణ అమెరికా, పాలినేషియా, ఇండోనేషియా, హాంగ్కాంగ్. (క్లిక్ చేయండి: బెర్లిన్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు) -
హాంకాంగ్ హస్తగతమైంది.. తర్వాత తైవానే!
బీజింగ్: హాంకాంగ్ను పూర్తి స్థాయిలో తమ నియంత్రణలోకి తెచ్చుకున్నామని ప్రకటించారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. దాని ద్వారా అల్లర్ల నుంచి సుపరిపాలన దిశగా హాంకాంగ్ మార్పు చెందినట్లు చెప్పారు. మరోవైపు.. తైవాన్ వేర్పాటువాదంపై చైనా పోరాటం చేస్తోందన్నారు. తైవాన్ తమ అంతర్గత భాగమని, ఆ ప్రాంత సమగ్రతను తాము వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. బీజింగ్లోని ‘గ్రేట్ హాల్ ఆఫ్ ద పీపుల్’లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు జిన్పింగ్. ‘హాంకాంగ్లో పరిస్థితులు ఆందోళనల నుంచి సుపరిపాలన దిశగా మార్పు చెందాయి. స్వీయ పరిపాలన ద్వీపం తైవాన్లో వేర్పాటు వాదం, విదేశీ శక్తుల జోక్యంపై ప్రధానంగా పోరాటం చేస్తున్నాం.’ అని పేర్కొన్నారు జిన్పింగ్. తైవాన్ను స్వతంత్ర ప్రాంతంగా తాము అంగీకరించబోమని, తైపీ తమ అంతర్గత ప్రాంతమని చాలా సందర్భాలుగా చైనా చెబుతూ వస్తోంది. ఇటీవల అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ, ఇతర చట్ట సభ్యులు తైనాన్లో పర్యటించగా.. ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్ను అష్టదిగ్భందనం చేసి.. యుద్ధ మేఘాలను ఆవరించింది. ఇదీ చదవండి: చైనా అధ్యక్షుడిగా ముచ్చటగా మూడోసారి ఆయనే! -
టూరిస్టులకు పండగే: రూ.2వేల కోట్ల విలువైన విమాన టికెట్లు ఫ్రీ
న్యూడిల్లీ: కోవిడ్ సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా టూరిజానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. అయితే ఆంక్షల సడలింపు, ప్రస్తుతం నెలకొన్న సాధారణ పరిస్థితుల నేపథ్యంలో పర్యాటకులను ఆకర్షించేందుకు పలు దేశాలు నానా తంటాలు పడుతున్నాయి. తాజాగా పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ హాంకాంగ్ టూరిస్టులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 5 లక్షల విమాన టిక్కెట్లను ఉచితంగా అందించాలని హాంకాంగ్ టూరిజం బోర్డు నిర్ణయించింది. సుమారు రూ. 2,083 కోట్లు (254.8 మిలియన్ డాలర్లు) విలువైన విమాన టికెట్లను ఉచితంగా ఆఫర్ చేయనుంది. ఇదీ చదవండి : చిన్నారులను మింగేసిన దగ్గు మందు: సంచలన విషయాలు కోవిడ్-19 ఆంక్షలను తొలగిస్తామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత, ఉచిత విమాన టిక్కెట్ల ప్రకటనల ప్రచారాలను రూపొందిస్తామని హాంకాంగ్ టూరిజం బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డేన్ చెంగ్ మీడియాకు తెలిపారు. కేథే ఫసిఫిక్, కేథే డ్రాగన్, హాంకాంగ్ ఎయిర్లైన్స్, హాంకాంగ్ ఎక్స్ప్రెస్ లాంటి క్యారియర్ల ద్వారా ఈ టికెట్లను అందించనుంది. టిక్కెట్ల పంపిణీని హాంకాంగ్ ఎయిర్పోర్ట్ అథారిటీ నిర్వహిస్తుందని హాంకాంగ్ టూరిజం బోర్డు ప్రతినిధి వెల్లడించారు. (Infosys: మాజీ ఎగ్జిక్యూటివ్ ఫిర్యాదు, కోర్టులో ఇన్ఫోసిస్కు షాక్) కాగా కరోనా సమయంలో అక్కడి ప్రభుత్వం కఠినమైన ఆంక్షలను అమలు చేసింది. ముఖ్యంగా హాంకాంగ్ చేరిన మూడు రోజుల తర్వాత బహిరంగ ప్రదేశాలకు వారి కదలికలను పరిమితం చేసేలా రెండు వారాల హోటల్ క్వారంటైన్ తప్పని సరిచేసింది. సెప్టెంబరులో ఈ కరోనా ఆంక్షలు సడలించినప్పటికీ, పర్యాటకుల సంఖ్య తగినంత పుంజుకోకపోవడంతో హాంకాంగ్ తాజా నిర్ణయం తీసుకున్నట్టు సమచారం. దీనికి తోడు ఉక్రెయిన్ యుద్ధం, రష్యా గగనతలం మూత కారణంగా హాంకాంగ్ నుండి లండన్లోని హీత్రూకి దాదాపు రెండు గంటల సమయం పడుతోందట. ఈ సమస్యల కారణంగా హాంకాంగ్లో తన కార్యకలాపాలను నిలిపివేస్తామని బ్రిటిష్ ఎయిర్లైన్ వర్జిన్ అట్లాంటిక్ బుధవారం తెలిపింది. అలాగే అనేక విమానయాన సంస్థలు విమానాలను నిలిపివేసాయి లేదా ఆ ప్రాంతంపై ప్రయాణించకుండా ప్రత్యామ్నాయమార్గాలను ఎంచుకున్నాయి. ఇటీవలి గణాంకాలు ప్రకారం ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల(2022, జనవరి- ఆగస్టు) మధ్య హాంకాంగ్కు కేవలం 183,600 మంది మాత్రమే సందర్శకులు వచ్చారు. మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదలే. కానీ కరోనా ముందు (2019) నాటి 56 మిలియన్లతో పోలిస్తే చాలా తక్కువ. అందుకే హోటల్ క్వారంటైన్ నిబంధనలను తొలగించిన అక్కడి ప్రభుత్వం ఇన్బౌండ్ ప్రయాణికులపై మిగిలిన ఆంక్షలను కూడా రద్దు చేయాలని భావిస్తోంది. ఫలితంగా రానున్న ఒకటి లేదా రెండు త్రైమాసికాలలో పర్యాటకులు తమ దేశానికి తిరిగి వస్తారని అంచనా వేస్తోంది. (ఫెస్టివ్ బొనాంజా: కెనరా బ్యాంకు కస్టమర్లకు శుభవార్త!) -
హాంగ్ కాంగ్లో వైభవంగా దసరా - సద్దుల బతుకమ్మ సంబరాలు
ప్రపంచవ్యాప్తంగా భారతీయులు దసరా శరన్నవరాత్రులు ఎంతగానో ఇష్టంగా ఎదురుచూసే పండుగా అని చెప్పవొచ్చును . లలితా పారాయణం, బొమ్మల కొలువు, పేరంటాలు, గర్భాలు, దాండియా ఆటలతో పాటు బతుకమ్మ సంబరాలు కూడా విశిష్ట స్థానాన్ని పొందాయి. ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు శరన్నవరాత్రులు - దసరా (విజయ దశమి) మరియు బతుకమ్మ పండుగలు జరుపుకుంటారు. శరన్నవరాత్రులు, తొమ్మిది రోజులలో, రోజు ఉదయం, సాయంత్రం, ఎవరింటీలో లలిత పారాయణం చేస్తారు అంటూ, ఈ నవరాత్రులలో అమ్మవారు ఏ రోజు ఏ రూపంలో దర్శనమిస్తారు, ఏ రంగు అమ్మవారికి ఇష్టం.. ఎలాంటి నైవేజ్యం పెట్టాలి..ఇటువంటి వివరాలతో ఒక పట్టికను తయారు చేస్తారు, హాంగ్ కాంగ్ లాంటావ ద్వీపంలోని తుంగ చుంగ్ 'లలిత సహస్రనామం చాంటింగ్ గ్రూప్'. ఆ ప్రకారంగా వారు ప్రతి ఇంటా ఘనంగా అమ్మవారిని అందంగా అలంకరించి, మనసారా కొలిచి, అమ్మకు ప్రీతికరమైన నైవేద్యాలు పెడతారు. విచ్చేసిన ఆడపడుచులందరు పారాయణానికి వెళ్తూ, పూలు పండ్లు కాకుండా వారి శక్తికొలది ఒక డొనేషన్ బాక్స్ లో ధనాన్ని వేస్తారు. నవరాత్రులు పూర్తయ్యాక ఆ డబ్బులని మన దక్షిణ రాష్ట్రాలలోని ఏదైనా ఒకటి రెండు వృద్ధాశ్రమానికి లేదా అనాధ పిల్లల ఆశ్రమానికి విరాళంగా ఇస్తారు. ఈ గ్రూప్ ను ప్రారంభించిన శ్రీమతి సంధ్య గోపాల్ మాట్లాడుతూ ఇలా తామందరు కలసి మానవ సేవ - మాధవ సేవ చేసుకోగల్గుతున్నందుకు ఎంతో తృప్తిగా ఆనందంగా అనిపిస్తోందని అన్నారు. ఈ బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. అంటే బెంగాలీ వారు దుర్గాష్టమి నాడు ఘనంగా వేడుక చేసుకున్నట్లు, తెలుగింటి ఆడపడుచులు సద్దులబతుకమ్మ వేడుకలు జరుపుకొంటారు. ఈ శుభకృత నామ సంవత్సరం, ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆడపడుచులు, స్థానికంగా ఉన్న కఠినమైన కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, ఎంతో వుత్సాహంగా సద్దుల బతుకమ్మను ఆరాధిస్తు బతుకమ్మ ఆడారు అని సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి తెలిపారు. తమ సమాఖ్య మహిళా విభాగం "సఖియా" సంయుక్త కార్యదర్శి శ్రీమతి కొండ నాగ మాధురి, శ్రీమతి జెఖ అశ్విని రెడ్డి, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి రమాదేవి సారంగా, శ్రీమతి హర్షిణీ పచ్ఛంటి అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారని తమ సంతోషాన్ని వ్యక్త పరుస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సద్దుల బతుకమ్మ పండుగ, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. హైద్రాబాద్ లో బతుకమ్మ సంబరాలు ఎంతో వైభావంగా రాష్ట్ర వ్యాప్తంగా జరగడం తనకి మరింత ఉత్సాహాన్నిచ్చిందని, తన బంధు మిత్రులతో కలిసి ఆనందంగా బతుకమ్మ ఆడారని, అందమైన బొమ్మల కొలువులు చూశానని, లలిత దేవి పారాయణం - పేరంటాలకి వెళ్లానని చెప్పారు. చాలా కాలం తరువాత హైద్రాబాద్ లో ఈ పండుగ చేసుకోవడం ఒక మరపురాని మధుర జ్ఞాపకంగా ఉంటుందని ఆనందంగా తెలిపారు. త్వరలో తమ సమాఖ్య దీపావళి వేడుకలని ఘనంగా చేసే ఏర్పాట్లు చేస్తోందని సంతోషంగా ప్రకటించారు. -
ఇదేం బౌలింగ్ రా బాబు.. అప్పుడు సూర్య! ఇప్పుడు కుష్దిల్..
ఆసియాకప్-2022లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 156 పరుగుల తేడాతో హాంగ్ కాంగ్ ఘోర పరాజయం పాలైంది. ఈ క్రమంలో టోర్నీ నుంచి హాంగ్ కాంగ్ ఇంటిముఖం పట్టగా.. పాకిస్తాన్ సూపర్-4లో అడుగుపెట్టింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్(57 బంతుల్లో 78 పరుగులు నాటౌట్), ఫఖర్ జమాన్(53) పరుగులతో రాణించగా.. అఖర్లో కుష్దిల్ షా (15 బంతుల్లో 35 పరుగులు నాటౌట్, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా పాకిస్తాన్ ఇన్నింగ్స్ అఖరి ఓవర్ వేసిన అజాజ్ ఖాన్ బౌలింగ్లో.. కుష్దిల్ షా ఏకంగా 29 పరుగులు పిండుకున్నాడు. దాంట్లో నాలుగు భారీ సిక్సర్లు ఉన్నాయి. అయితే భారత్తో జరిగిన మ్యాచ్లోనూ హాంగ్ కాంగ్ బౌలర్ ఆర్షద్ వేసిన అఖరి ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ ఏకంగా 26 పరుగులు రాబట్టాడు. అతడు కూడా నాలుగు భారీ సిక్సర్లతో ఇన్నింగ్స్ను ముగించాడు. ఇక 194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హాంగ్ కాంగ్ కేవలం 38 పరుగులకే కుప్పకూలింది. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ నాలుగు వికెట్లు తీయగా.. మహ్మద్ నవాజ్ మూడు, నసీమ్ షా రెండు, దహినీ ఒక వికెట్ తీశారు. ఇక సూపర్-4లో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 4న) భారత్తో పాకిస్తాన్ తలపడనుంది. చదవండి: Babar Azam: 'నువ్వే సరిగ్గా ఆడడం లేదు.. ఇంకెందుకు సలహాలు!' -
38 పరుగులకే కుప్పకూలిన హాంగ్ కాంగ్.. సూపర్-4కు పాకిస్తాన్
ఆసియా కప్లో భాగంగా పాకిస్తాన్ జట్టు సూపర్-4లోకి ప్రవేశించింది. శుక్రవారం హాంగ్ కాంగ్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 156 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంగ్ కాంగ్ను పాక్ బౌలర్లు వణికించారు. ఏ దశలోనూ పోరాడలేకపోయిన హాంగ్ కాంగ్ 38 పరుగులకే కుప్పకూలి దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. హాంగ్ కాంగ్ బ్యాటర్లలో పది మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ నాలుగు వికెట్లు తీయగా.. మహ్మద్ నవాజ్ మూడు, నసీమ్ షా రెండు, దహినీ ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్(57 బంతుల్లో 78 పరుగులు నాటౌట్, 6 ఫోర్లు, ఒక సిక్సర్) బాధ్యతాయుతంగా ఆడగా.. ఫఖర్ జమాన్(41 బంతుల్లో 53, 3 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించగా.. ఆఖర్లో కుష్దిల్ షా(15 బంతుల్లో 35 పరుగులు నాటౌట్, 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు.ఇక గ్రూఫ్-ఏ నుంచి ఏ-2గా సూపర్-4లో అడుగుపెట్టిన పాకిస్తాన్ జట్టు.. ఈ ఆదివారం(సెప్టెంబర్ 4న) మరోసారి చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో తలపడనుంది. ఆ తర్వాత వరుసగా అఫ్గానిస్తాన్, శ్రీలంకలతో ఆడనుంది. చదవండి: జట్టును ప్రకటించి 24 గంటలు కాలేదు.. టి20 ప్రపంచకప్కు ఇంగ్లండ్ స్టార్ దూరం Babar Azam: 'నువ్వే సరిగ్గా ఆడడం లేదు.. ఇంకెందుకు సలహాలు!' -
శివాలెత్తిన పాక్ బ్యాటర్లు.. హాంగ్ కాంగ్ ముందు భారీ లక్ష్యం
ఆసియాకప్లో భాగంగా గ్రూఫ్-ఏలో హాంగ్ కాంగ్తో మ్యాచ్లో పాకిస్తాన్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్(57 బంతుల్లో 78 పరుగులు నాటౌట్, 6 ఫోర్లు, ఒక సిక్సర్) బాధ్యతాయుతంగా ఆడగా.. ఫఖర్ జమాన్(41 బంతుల్లో 53, 3 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించగా.. ఆఖర్లో కుష్దిల్ షా(15 బంతుల్లో 35 పరుగులు నాటౌట్, 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. అంతకముందు టాస్ గెలిచి పాకిస్తాన్ను బ్యాటింగ్ ఆహ్వానించిన హాంగ్ కాంగ్కు ఆరంభంలో బాబర్ ఆజం రూపంలో బిగ్ వికెట్ లభించింది. కానీ ఆ తర్వాత మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్లు మరో వికెట్ పడకుండా ఆడారు. ఇద్దరి మధ్య వంద పరుగులకు పైగా భాగస్వామ్యం నమోదైంది. ఫిప్టీ పూర్తి చేసిన తర్వాత ఫఖర్ జమాన్ ఔటైనప్పటికి.. చివర్లో కుష్దిల్ షా విధ్వంసంతో పాక్ భారీ స్కోరు సాధించింది. హాంగ్ కాంగ్ బౌలర్లలో ఎహ్సాన్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. చదవండి: Babar Azam: 'నువ్వే సరిగ్గా ఆడడం లేదు.. ఇంకెందుకు సలహాలు!' -
'నువ్వే సరిగ్గా ఆడడం లేదు.. ఇంకెందుకు సలహాలు!'
ఆసియాకప్ 2022లో భాగంగా శుక్రవారం హాంకాంగ్, పాకిస్తాన్ మధ్య కీలకమ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఇరజట్లకు చావోరేవో లాంటిది. గెలిచిన జట్టు సూపర్-4కు వెళితే.. ఓడిన జట్టు ఇంటిబాట పట్టాల్సిందే. అయితే మ్యాచ్కు ముందు పాక్ కెప్టెన్ బాబర్ ఆజంను.. హాంకాంగ్ కెప్టెన్ నిజాఖత్ ఖాన్ కలిశాడు. ఇద్దరు కరచాలనం చేసుకొని సరదాగా మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో నిజాఖత్ ఖాన్.. బాబర్ ఆజంను బ్యాటింగ్ టిప్స్ అడిగాడు. అందుకు బాబర్.. ''నిన్ను నువ్వు నమ్ము.. బాగా ప్రాక్టీస్ చెయ్యు.. పరుగులు అవే వస్తాయి'' అని చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే మ్యాచ్లో మాత్రం పాక్ కెప్టెన్ బాబర్ ఆజం మరోసారి బ్యాటింగ్లో విఫలమయ్యాడు. టీమిండియాతో మ్యాచ్లో తక్కువ స్కోరుకే వెనుదిరిగిన బాబర్.. మరోసారి నిరాశపరిచాడు. 9 పరుగులు మాత్రమే చేసి ఇషాన్ ఖాన్ బౌలింగ్లో కాట్ అండ్ బౌల్డ్గా వెనుదిరిగాడు. దీంతో బాబర్ ఆజంను క్రికెట్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. కెప్టెన్ అయ్యుండి నువ్వే సరిగ్గా ఆడడం లేదు.. ఇంకెందుకు సలహాలు అంటూ ట్రోల్ చేశారు. గతేడాది టి20 ప్రపంచకప్ ముగిసిన అనంతరం 9 టి20 మ్యాచ్లు ఆడిన బాబర్ ఆజం 190 పరుగులు మాత్రమే చేశాడు. ©️ meets ©️ Candid chat between the two skippers 🇵🇰🇭🇰#AsiaCup2022 | #PAKvHK pic.twitter.com/mMEwXihuiP — Pakistan Cricket (@TheRealPCB) September 1, 2022 చదవండి: పాక్కు చావోరేవో.. గెలిస్తే సూపర్-4కు; ఓడితే ఇంటికి -
పాక్కు చావోరేవో.. గెలిస్తేనే సూపర్-4కు
ఆసియా కప్-2022లో భాగంగా పాకిస్తాన్ తమ రెండో మ్యాచ్లో హాంగ్ కాంగ్తో తలపడనుంది. టాస్ గెలిచిన హాంకాంగ్ బౌలింగ్ ఎంచుకుంది. షార్జా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం(సెప్టెంబరు 2)న గ్రూప్-ఏలోని ఈ రెండు జట్లు సూపర్-4లో ఎంట్రీ కోసం పోటీపడనున్నాయి. ఇరుజట్లకు ఇది చావో రేవో మ్యాచ్ లాంటిది. అయితే మ్యాచ్లో పాకిస్తాన్ ఫెవరెట్గా కనిపిస్తున్నప్పటికి.. హాంకాంగ్ను తక్కువ అంచనా వేయకూడదు. టీమిండియాతో జరిగిన గత మ్యాచ్లో 192 పరుగుల లక్ష్య ఛేదనలో హాంకాంగ్ తన పోరాటపటిమతో ఆకట్టుకుంది. ముఖ్యంగా హాంకాంగ్ టాప్-3 బ్యాటర్స్ నిజఖత్ ఖాన్, బాబర్ హయత్, యాసిమ్ ముర్తజాలు ఎంత తొందరగా ఔట్ చేస్తే అంత మంచిది. ఈ ముగ్గురి తర్వాత ఆడేవారు ఎవరు లేకపోవడం హాంకాంగ్కు నష్టం కలిగించే అంశం. ఇక టీమిండియాతో మ్యాచ్లో చేసిన పొరపాట్లను హాంకాంగ్తో చేయకూడదని పాకిస్తాన్ భావిస్తుంది. గత మ్యాచ్లో విఫలమైన బాబర్ ఆజం హాంకాంగ్తో మ్యాచ్లో ఫామ్లోకి రావాలని చూస్తున్నాడు. మహ్మద్ రిజ్వాన్, వన్డౌన్ బ్యాటర్ ఫఖర్ జమాన్లు మంచి టచ్లో కనిపిస్తున్నారు. మిడిలార్డర్లో ఇఫ్తికర్ అహ్మద్, కుష్దిల్ షాలు ఉండగా.. లోయర్ ఆర్డర్లో షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ బ్యాట్ను ఝులిపించగల సమర్థులు. టీమిండియాతో మ్యాచ్లో బౌలింగ్లో ఆకట్టుకున్న నసీమ్ షా మరోసారి ప్రభావితం చూపిస్తే హాంకాంగ్కు కష్టాలు తప్పకపోవచ్చు. ఇతనికి తోడుగా హారిస్ రౌఫ్, మహ్మద్ నవాజ్, షాహనాజ్ దహనీలు ఉన్నారు. పాకిస్థాన్ జట్టు: మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర), బాబర్ ఆజం(కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దీల్ షా, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, హరీస్ రవూఫ్, నసీమ్ షా, షానవాజ్ దహానీ హాంకాంగ్ జట్టు: నిజాకత్ ఖాన్ (కెప్టెన్), యాసిమ్ ముర్తాజా, బాబర్ హయత్, కించిత్ షా, ఐజాజ్ ఖాన్, జీషన్ అలీ, స్కాట్ మెక్కెచ్నీ (వికెట్ కీపర్), హరూన్ అర్షద్, ఎహ్సాన్ ఖాన్, ఆయుష్ శుక్లా, మహ్మద్ గజన్ఫర్ -
Pak Vs HK: గత రికార్డులు ఘనమే! కానీ ఇది టీ20! హాంగ్ కాంగ్ను లైట్ తీసుకుంటే!
Asia Cup 2022 Pakistan vs Hong Kong- Head To Head Records: ఆసియా కప్-2022లో భాగంగా పాకిస్తాన్ తమ రెండో మ్యాచ్లో హాంగ్ కాంగ్తో తలపడనుంది. షార్జా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం(సెప్టెంబరు 2)న గ్రూప్-ఏలోని ఈ రెండు జట్లు సూపర్-4లో ఎంట్రీ కోసం పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్లో పసికూన హాంగ్ కాంగ్పై పాకిస్తాన్ విజయం నల్లేరు మీదే నడకేనని గత రికార్డులు చెబుతున్నాయి. అయితే, అప్పటికీ.. ఇప్పటికీ హాంగ్ కాంగ్ జట్టు ఆట తీరు మెరుగుపడింది. అంతేకాదు తాజా టోర్నీలో పటిష్టమైన టీమిండియాతో మ్యాచ్లోనూ హాంగ్ కాంగ్ ఆఖరి వరకు పోరాట పటిమ కనబరిచిన తీరు గమనార్హం. ఇదిలా ఉంటే.. భారత్ చేతిలో ఆరంభ మ్యాచ్లో ఓటమి పాలైన పాకిస్తాన్కు ఈ మ్యాచ్ కీలకం. భారత్తో పాటు సూపర్-4కు చేరాలంటే ఈ మ్యాచ్లో గెలుపు తప్పనిసరి. పసికూనే కదా అని బాబర్ ఆజం హాంగ్ కాంగ్ను తేలికగా తీసుకునే పరిస్థితి లేదు. అందుకు గల ప్రధాన కారణాలేమిటో గమనిద్దాం. కీలక బౌలర్కు గాయం పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది ఇప్పటికే గాయం కారణంగా ఆసియా కప్-2022 టోర్నీకి అందుబాటులో లేకుండా పోయాడు. గాయపడిన మహ్మద్ వసీం సైతం జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో టీమిండియాతో మ్యాచ్లో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లు నసీం షా, హారిస్ రవూఫ్, షానవాజ్ దహానీలతో బరిలోకి దిగింది. అయితే, భారత్తో మ్యాచ్లో బౌలింగ్ చేస్తున్న సందర్భంగా 19 ఏళ్ల నసీం షా గాయపడిన విషయం తెలిసిందే. కాలి నొప్పితో విలవిల్లాడిన ఈ యువ బౌలర్ మైదానంలోనే కుప్పకూలాడు. అతడు ఫిట్నెస్ సాధించినా ఈ మ్యాచ్లో ఆడించకపోవచ్చు. నసీం స్థానంలో మహ్మద్ హస్నైన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, టీమిండియాతో మ్యాచ్లో అద్భుత బౌలింగ్తో కీలక వికెట్లు తీసిన నసీం షా సేవలు కోల్పోతే మాత్రం పాక్కు నిజంగా ఎదురుదెబ్బే. కుప్పకూలిన మిడిలార్డర్ పాకిస్తాన్ జట్టుకు ప్రధాన బలం ఓపెనర్లు. మహ్మద్ రిజ్వాన్, కెప్టెన్ బాబర్ ఆజం ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. అయితే, టీమిండియాతో మ్యాచ్లో రిజ్వాన్(42 బంతుల్లో 43 పరుగులు) పోరాడినా.. బాబర్ ఆజం 10 పరుగులకే పరిమితం కావడంతో పాక్ కష్టాల్లో పడింది. దీంతో ఒత్తిడిలో కూరుకుపోయిన మిడిలార్డర్ కుప్పకూలడంతో 147 పరుగులకే పాక్ ఆలౌట్ అయింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 5 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. హాంగ్ కాంగ్తో మ్యాచ్లోనూ ఇలాగే జరిగితే పాకిస్తాన్ భారీ షాక్ తప్పదు. ముఖ్యంగా ఓపెనర్లను కట్టడి చేయగలిగితే హాంగ్ కాంగ్కు మంచి ఆరంభం లభిస్తుంది. ఒత్తిడి సహజమే ఈ మ్యాచ్లో ఓడిపోతే అసోసియేట్ దేశం హాంగ్ కాంగ్ పెద్దగా కోల్పోయేది ఏమీ లేదు. క్వాలిఫైయర్స్లో యూఏఈని ఓడించి టోర్నీకి అర్హత సాధించి.. గ్రూప్-ఏలో టీమిండియా, పాకిస్తాన్ వంటి మేటి జట్లతో ఆడటమే ఓ మంచి అవకాశం. అలాంటిది మొదటి మ్యాచ్లో భారత్కు పోటీనివ్వగలిగింది. ఈ మ్యాచ్లో హాంగ్ కాంగ్ ప్రదర్శనను తేలికగా తీసిపారేయలేం. ఇప్పుడు పాక్తో మ్యాచ్కు సిద్ధమైంది. మరోవైపు.. ఆరంభ మ్యాచ్లోనే దాయాది భారత్ చేతిలో ఓడిన పాక్కు హాంగ్ కాంగ్తో మ్యాచ్లో గెలిస్తేనే రేసులో నిలిచే పరిస్థితి. గాయాల బెడద వెంటాడుతున్న తరుణంలో బాబర్ ఆజం బృందంపై కాస్త ఒత్తిడి ఉండటం సహజమే. గత రికార్డులు ఘనమే.. కానీ.. ఆసియా కప్ చరిత్రలో పాకిస్తాన్, హాంగ్ కాంగ్ ఇప్పటి వరకు మూడు సందర్భాల్లో తలపడ్డాయి. 2004, 2008, 2018లో వన్డే ఫార్మాట్లో హాంగ్ కాంగ్పై పాక్ జట్టు ఘన విజయాలు సాధించింది. 2004లో డీఎల్ఎస్ మెథడ్లో 173 పరుగులు, 2008లో 155 పరుగులు, 2018లో 8 వికెట్ల తేడాతో పసికూనపై అలవోకగా గెలుపొందింది. అయితే, ఈసారి టోర్నీ టీ20 ఫార్మాట్లో జరుగుతోంది. ఇక పొట్టి ఫార్మాట్ అంటేనే సంచలనాలకు మారుపేరు. మ్యాచ్ ఎప్పుడు ఏ జట్టు చేజారుతుందో అంచనా వేయలేని పరిస్థితి. కాబట్టి పాకిస్తాన్.. ఈ మ్యాచ్లో హాంగ్ కాంగ్ను తేలికగా తీసుకుంటే అంతే సంగతులు! చదవండి: SL Vs Ban: టోర్నీ నుంచి అవుట్! మా ఓటమికి ప్రధాన కారణం అదే: షకీబ్ అల్ హసన్ Asia Cup 2022: 'రోహిత్ శర్మ భయపడుతున్నాడు.. ఎక్కువ కాలం కెప్టెన్గా ఉండడు' -
Ind Vs HK: వాళ్ల బౌలింగ్ నాసిరకం.. ఇక కోహ్లి హాఫ్ సెంచరీ: గంభీర్
Asia Cup 2022- India Vs Hong Kong: ‘‘ఇలాంటి జట్టుతో మ్యాచ్లో కోహ్లి ఒక్కడనే కాదు.. ఏ ఇతర బ్యాటర్ ప్రదర్శనను కూడా జడ్జ్ చేయలేము. అయితే, ఏ ప్రత్యర్థి ఎవరైనా పరుగులు రాబట్టడమే ముఖ్యం కదా’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇప్పుడే కోహ్లి ఆట తీరుపై అంచనాకు రాలేమని పేర్కొన్నాడు. కాగా టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి చాలా రోజుల తర్వాత అర్ధ శతకంతో మెరిసిన విషయం తెలిసిందే. ఆసియా కప్-2022లో భాగంగా దుబాయ్ వేదికగా హాంగ్ కాంగ్తో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ సాధించాడు. మొత్తంగా 44 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్, మూడు సిక్సర్ల సాయంతో 59 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో కోహ్లి ప్రదర్శన గురించి స్టార్ స్పోర్ట్స్ చర్చ సందర్భంగా గౌతీ కీలక వ్యాఖ్యలు చేశాడు. హాంగ్ కాంగ్ వంటి పసికూనపై ఈ స్కోరుతో కోహ్లి మునుపటి లయ అందుకున్నాడా లేదా అన్న విషయంపై అంచనాకు రాలేమన్నాడు. ఈ మ్యాచ్లో హంగ్ కాంగ్ బౌలింగ్ గొప్పగా ఏమీలేదని(నాసిరకంగా ఉందన్న ఉద్దేశంలో).. ఏదేమైనా కోహ్లి పరుగులు సాధించడం సానుకూల అంశం అని గౌతీ అన్నాడు. తదుపరి మ్యాచ్లలో మరింత మెరుగ్గా రాణించాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు. వాళ్లకు అవకాశాలు వస్తున్నాయి.. కానీ అదే విధంగా టీమిండియా ఓపెనర్లు.. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్తో పోలిస్తే కోహ్లి బెటర్ అని గౌతమ్ గంభీర్ అన్నాడు. ‘‘విరాట్ కోహ్లి మాదిరిగానే.. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్కు అవకాశాలు వస్తున్నాయి. అయితే, కోహ్లి వాటిని సద్వినియోగం చేసుకుంటున్నాడు. కానీ.. వీళ్లిద్దరి విషయంలో అలా జరగడం లేదు. కఠిన శ్రమ.. ప్రణాళిక ఉంటేనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలం’’ అంటూ కోహ్లిని ప్రశంసించాడు. కాగా రోహిత్, రాహుల్ పాకిస్తాన్, హాంగ్ కాంగ్ మ్యాచ్లలో సాధించిన పరుగులు వరుసగా.. 12, 0.. 21, 36. ఇదిలా ఉంటే.. హాంగ్ కాంగ్తో మ్యాచ్లో కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ రాణించడంతో టీమిండియా 40 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా సూపర్-4కు అర్హత సాధించింది. చదవండి: Asia Cup 2022: హవ్వ.. మరీ హాంగ్ కాంగ్ చేతిలోనా? కంటి మీద కునుకు ఉంటుందా: భారత మాజీ క్రికెటర్ Ind Vs HK: 'నీ బౌలింగ్కు ఓ దండంరా అయ్యా.. నీకన్నా కోహ్లి బెటర్' -
కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన రోహిత్
టీమిండియా ప్రస్తుత, తాజా మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు పోటాపోటీన ఒకరి రికార్డులు మరొకరు బద్దలు కొట్టడం లేదా సమం చేయడం లాంటివి ఇటీవలి కాలంలో మనం తరుచూ గమనిస్తూ ఉన్నాం. ఆసియా కప్ 2022లో భాగంగా నిన్న హాంగ్కాంగ్తో జరిగిన మ్యాచ్లోనూ ఈ సీన్ మరోసారి రిపీట్ అయ్యింది. తొలుత భారత ఇన్నింగ్స్ సమయంలో కోహ్లి.. రోహిత్ పేరిట ఉండిన అత్యధిక టీ20 అర్ధసెంచరీల రికార్డును (31) సమం చేయగా, హాంగ్కాంగ్పై గెలుపుతో రోహిత్.. కోహ్లి పేరటి ఉండిన సెకండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఇండియన్ కెప్టెన్ రికార్డును చెరిపేశాడు. తాజా గెలుపుతో రోహిత్ సారధ్యంలో టీమిండియా 37 మ్యాచ్ల్లో 31 విజయాలు సాధించగా.. కోహ్లి కెప్టెన్గా టీమిండియా 50 టీ20ల్లో 30 సార్లు గెలుపొందింది. టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ రికార్డు ఎంఎస్ ధోని (72 మ్యాచ్ల్లో 41 విజయాలు) పేరిట ఉండగా.. హాంగ్కాంగ్పై విజయంతో రోహిత్ కోహ్లిని వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. ఇదిలా ఉంటే, హాంగ్కాంగ్తో నిన్న (ఆగస్ట్ 31) జరిగిన మ్యాచ్లో కోహ్లి క్లాస్ ఇన్నింగ్స్ (44 బంతుల్లో 59 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు), సూర్య భాయ్ నాటు కొట్టుడు (26 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) దెబ్బకు టీమిండియా 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, గ్రూప్-ఏ నుంచి సూపర్-4 బెర్తు ఖరారు చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది. భారత్ వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 4) సూపర్-4లో పాక్తో తలపడే అవకాశం ఉంది. చదవండి: Ind Vs Hk: రవీంద్ర జడేజా అరుదైన రికార్డు.. టీమిండియా తొలి బౌలర్గా.. -
Ind Vs HK: మరీ హాంగ్ కాంగ్ చేతిలోనా? నిద్ర కూడా పట్టదు: భారత మాజీ క్రికెటర్
Asia Cup 2022- India Vs Hong Kong- Avesh Khan- Arshdeep Singh: ఆసియా కప్-2022లో భాగంగా హాంగ్ కాంగ్తో మ్యాచ్లో టీమిండియా యువ పేసర్లు ఆవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్ ఆట తీరుపై భారత మాజీ క్రికెటర్ రితీందర్ సోధి పెదవి విరిచాడు. వీరిద్దరి నుంచి మరీ ఇలాంటి ఘోరమైన ప్రదర్శనను ఊహించలేదన్నాడు. మరీ హాంగ్ కాంగ్ వంటి జట్టుతో మ్యాచ్లో ఇలా ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం వారి కెరీర్లో పీడకలలా మిగిలిపోతాయని ఈ మాజీ ఆల్రౌండర్ అన్నాడు. పాకిస్తాన్తో మ్యాచ్తో పోలిస్తే.. హాంగ్ కాంగ్తో మ్యాచ్లో మరీ దారుణంగా విఫలమయ్యారని ఆవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్లను విమర్శించాడు. ఆసియా కప్-2022లో పాకిస్తాన్తో ఆరంభ మ్యాచ్లో ఆవేశ్ ఖాన్ రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 19 పరుగులు ఇచ్చి ఒక వికెట్(ఫఖర్ జమాన్) తీశాడు. దంచి కొట్టిన హాంగ్ కాంగ్ బ్యాటర్లు! ఇక అర్ష్దీప్ సింగ్ 3.5 ఓవర్ల బౌలింగ్లో 33 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, పాక్తో మ్యాచ్లో ఫర్వాలేదనిపించినా పసికూన హాంగ్ కాంగ్తో మ్యాచ్లో మాత్రం.. వీరిద్దరి బౌలింగ్లో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు దంచికొట్టారు. అర్ష్దీప్ 4 ఓవర్ల బౌలింగ్లో 44 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. మరోవైపు.. ఆవేశ్ ఖాన్ తన బౌలింగ్ కోటా పూర్తి చేసి ఏకంగా 53 పరుగులు సమర్పించుకుని ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. ఆవేశ్ ఖాన్ మరీ హాంగ్ కాంగ్ చేతిలోనా?! ఈ నేపథ్యంలో ఇండియా న్యూ స్పోర్ట్స్తో మాట్లాడిన రితీందర్ సోధి.. ఇలాంటి చెత్త ప్రదర్శన యువ బౌలర్లు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందన్నాడు. ‘‘పాకిస్తాన్తో మ్యాచ్లో మన పేస్ బౌలింగ్ మెరుగ్గానే అనిపించింది. కానీ ఈ మ్యాచ్లో మరీ ఘోరం. ముఖ్యంగా అర్ష్దీప్ లయ తప్పినట్టు కనిపించింది. ఇక ఆవేశ్ అయితే భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. హాంగ్ కాంగ్ వంటి జట్టు చేతిలో ఇలాంటి ప్రదర్శన వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. నిద్ర కూడా పట్టదు. ఇలాంటి వాటి వల్ల వారు ఆత్మవిశ్వాసం కోల్పోతారు’’ అని రితీందర్ సోధి పేర్కొన్నాడు. ఇక మాజీ సెలక్టర్ సబా కరీం సైతం.. ఆవేశ్, అర్ష్దీప్ ఇద్దరూ మెరుగ్గా రాణించలేకపోతున్నారని.. కోచ్ పారస్ మంబ్రే వారి ఆటపై దృష్టి సారించాలని సూచించాడు. ముఖ్యంగా ఆవేశ్ ఖాన్ లోపాలను వీలైనంత త్వరగా సరిదిద్దుకునేలా శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నాడు. చదవండి: Asia Cup 2022: రవీంద్ర జడేజా అరుదైన రికార్డు.. టీమిండియా తొలి బౌలర్గా! Asia Cup 2022: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్.. తొలి భారత ఆటగాడిగా! -
కోహ్లి అలా చేస్తాడని ఊహించలేదు.. అది నన్ను క్లీన్ బౌల్డ్ చేసింది..!
Asia Cup 2022 IND VS HK: ఆసియా కప్లో భాగంగా బుధవారం హాంగ్కాంగ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, గ్రూప్-ఏ నుంచి సూపర్-4 బెర్తు ఖరారు చేసుకున్న తొలి జట్టుగా నిలిచిన విషయం తెలసిందే. ఈ మ్యాచ్లో కోహ్లి క్లాస్ ఇన్నింగ్స్, సూర్య భాయ్ నాటు కొట్టుడు మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిస్తే.. భారత ఇన్నింగ్స్ అనంతరం కోహ్లి చేసిన ఓ పనికి యావత్ క్రికెట్ ప్రపంచం పులకించి పోయింది. తన కంటే చాలా జూనియర్ అయిన సూర్యకుమార్ పెర్ఫార్మెన్స్కు ఫిదా అయిన కోహ్లి.. ఇన్నింగ్స్ అనంతరం సూర్యను తలవంచి మరీ అభినందించాడు. కోహ్లి నుంచి ఊహించని ఈ చర్యకు ఆశ్చర్యపోయిన సూర్యకుమార్ ఏం మాట్లాడాలో తెలియక.. ఏంటి బ్రో ఇది.. మనం మనం ఒకటి.. పదా ఇద్దరం కలిసి డ్రెస్సింగ్ రూమ్కు వెళ్దాం అని కోహ్లిని హత్తుకుని అటుగా తీసుకెళ్లాడు. Should we bow? Y̶e̶s̶,̶ ̶h̶e̶'̶s̶ ̶a̶ ̶k̶i̶n̶g̶ Yes, the King himself does! DP World #AsiaCup2022 #BelieveInBlue #SuryakumarYadav #INDvHK #INDvHKG #ViratKohli #KingKohli pic.twitter.com/IDmxM0Z8Fu — Star Sports (@StarSportsIndia) August 31, 2022 దీనికి సంబంధించిన వీడియో నిన్నటి నుంచి సోషల్మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ విషయంపై మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ మాట్లాడుతూ.. కోహ్లి లాంటి అనుభవజ్ఞుడి నుంచి ఊహించిన ఈ చర్యకు చర్యకు ఎలా రియాక్ట్ కావాలో అర్ధం కాలేదని, కింగ్ కోహ్లి చేసిన ఈ పని నన్ను క్లీన్ బౌల్డ్ చేసిందని అన్నాడు. కాగా, కోహ్లి-సూర్యకుమార్ల మధ్య ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఓ చిన్నపాటి గొడవ జరిగిన విషయాన్ని క్రికెట్ అభిమానులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే, హాంగ్కాంగ్తో జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ సిక్సర్ల సునామీ సృష్టించి, 22 బంతుల్లోనే మెరుపు అర్ధశతకం బాదగా.. కోహ్లి క్లాస్ ఇన్నింగ్స్ ఆడి కెరీర్లో 31వ అర్ధసెంచరీ సాధించాడు. సూర్య.. 26 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 68 పరుగులతో అజేయంగా నిలువగా.. కోహ్లి 44 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్ల సాయంతో 59 చేసి నాటౌట్గా నిలిచాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో సూర్య వరుసగా 6, 6, 6, 0, 6, 2 బాది 26 పరుగులు పిండుకోవడం మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. ఫలితంగా భారత్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఛేదనలో హాంగ్కాంగ్ 152 పరుగులకే పరిమతం కావడంతో టీమిండియా సునాయాసంగా విజయం సాధించింది. చదవండి: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్.. తొలి భారత ఆటగాడిగా! -
చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్.. తొలి భారత ఆటగాడిగా!
ఆసియాకప్ టీ20 ఫార్మాట్లో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డు సాధించాడు. ఆసియాకప్లో భాగంగా ఒకే మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన తొలి భారత బ్యాటర్గా రికార్డులకెక్కాడు. ఆసియాకప్-2022లో భాగంగా హాంగ్ కాంగ్తో జరిగిన మ్యాచ్లో 6 సిక్సర్లు బాదిన సూర్య ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఇంతకుముందు ఆసియా కప్ టీ20 మ్యాచ్లో ఏ భారత ఆటగాడు కూడా 3 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టలేదు. తొలి భారత ఆటగాడిగా కాగా ఈ మ్యాచ్లో సూర్య విధ్వంసం సృష్టించాడు. కేవలం 26 బంతుల్లోనే 68 పరుగులు సాధించాడు. ముఖ్యంగా భారత ఇన్నింగ్స్ అఖరి ఓవర్ వేసిన ఆర్షద్ బౌలింగ్లో సూర్య ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. తద్వారా మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అఖరి ఓవర్లో అత్యధిక పరుగులు బాదిన తొలి టీమిండియా బ్యాటర్గా సూర్య నిలిచాడు. రోహిత్ రికార్డును సమం చేసిన సూర్య ఈ మ్యాచ్లో కేవలం 22 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించిన సూర్యకుమార్.. టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో చేరాడు. అదే విధంగా 22 బంతుల్లో అర్ధ శతకం నమోదు చేసిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇంగ్లండ్తో టీ20 సిరీస్, వెస్టిండీస్ సిరీస్లలో అదరగొట్టిన సూర్య.. ఆసియాకప్లోనూ సత్తా చాటుతున్నాడు. కాగా ఇంగ్లండ్పై తన తొలి అంతర్జాతీయ సెంచరీని కూడా సాధించాడు. Suryakumar Yadav 4 sixes back to back #INDvsHK #Surya pic.twitter.com/AOVt6T1wPc — DD Sports (@Mahesh13657481) August 31, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: Ind Vs HK: 'నీ బౌలింగ్కు ఓ దండంరా అయ్యా.. నీకన్నా కోహ్లి బెటర్' Asia Cup 2022: రవీంద్ర జడేజా అరుదైన రికార్డు.. టీమిండియా తొలి బౌలర్గా! -
'నీ బౌలింగ్కు ఓ దండంరా అయ్యా.. నీకన్నా కోహ్లి బెటర్'
Asia Cup 2022 India Vs Hong Kong: ఆసియా కప్-2022లో భాగంగా హాంగ్ కాంగ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా పేసర్ అవేశ్ ఖాన్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్లో తన నాలుగు ఓవర్ల కోటాలో ఒక్క వికెట్ పడగొట్టి ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో అవేశ్ ఖాన్ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. "నీ బౌలింగ్కు ఓ దండంరా అయ్యా.. నీకన్నా కోహ్లి బెటర్" అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆసియాకప్కు ప్రకటించిన భారత జట్టులో ముగ్గురు పేసర్లు మాత్రమే ఉన్నారు. కాబట్టి అవేశ్ ఖాన్కు ప్రత్నామ్యాయంగా మరో పేసర్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు ఈ మ్యాచ్కు పార్ట్టైమ్ పేసర్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతిని ఇవ్వడంతో అవేశ్ ఖాన్ తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేశాడు. పాకిస్తాన్తో జరిగిన తొలి మ్యాచ్లో పాండ్యాతో నాలుగు ఓవర్లు వేయించిన రోహిత్.. అవేష్కు కేవలం రెండు ఓవర్లు మాత్రమే ఇచ్చాడు. భారత్ తదుపరి మ్యాచ్కు హార్ధిక్ జట్టులోకి వస్తే.. అవేష్ను పక్కన పెట్టే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్లో కేవలం ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఆవేశ్ ఖాన్పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. మీమ్స్తో నెటిజన్లు రెచ్చిపోతున్నారు. హాంగ్ కాంగ్ను చిత్తు చేసిన భారత్ ఈ మ్యాచ్లో హాంగ్ కాంగ్పై టీమిండియా 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగులు సాధించింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లోనే 68 పరుగులు సాధించి విధ్వంసం సృష్టించగా.. కింగ్ కోహ్లి 59 పరుగులతో రాణించాడు. అనంతరం 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి హాంగ్ కాంగ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో జడేజా, అర్ష్దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });చదవండి: Welcome to dinda academy avesh khan #INDvHK #IndvsHkg #aveshkhan pic.twitter.com/cqIUWRCuuk — Kashif_Khan331 🇮🇳 (@kashif_khan1212) August 31, 2022 Retweet for. Like for Avesh Khan Kohli Economy :- 13+. Eco :- 6#INDvHK #ViratKohli𓃵 #aveshkhan #IndvsHkg pic.twitter.com/QlGL8nn6Hi — Sanuj Lodhi (@sanuj_lodhi) August 31, 2022 చదవండి: Ind Vs HK: కోహ్లికి హాంగ్ కాంగ్ జట్టు స్పెషల్ గిఫ్ట్.. థాంక్యూ విరాట్ అంటూ! ఫిదా అయిన ‘కింగ్’! Asia Cup 2022 Ind Vs HK: ఆరేళ్ల తర్వాత కింగ్ కోహ్లి బౌలింగ్.. అభిమానులు ఫిదా -
Ind Vs Hk: రవీంద్ర జడేజా అరుదైన రికార్డు.. టీమిండియా తొలి బౌలర్గా..
Asia Cup 2022 India Vs Hong Kong- Ravindra Jadeja: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆసియా కప్ టోర్నీ చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మెగా ఈవెంట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా నిలిచాడు. ఆసియా కప్-2022లో భాగంగా.. హాంగ్ కాంగ్తో బుధవారం(ఆగష్టు 31) జరిగిన మ్యాచ్లో బాబర్ హయత్ వికెట్ తీయడం ద్వారా ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పేరిట ఉన్న రికార్డును జడ్డూ బద్దలు కొట్టాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో జడేజా ఇప్పటి వరకు మొత్తంగా 23 వికెట్లు పడగొట్టాడు. 2010 నుంచి ఆసియా కప్ టోర్నీలో ఆడుతున్న ఈ ఆల్రౌండర్ తాజాగా సాధించిన ఘనతతో దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీధరన్, లసిత్ మలింగ, అజంతా మెండిస్, సయీద్ అజ్మల్ తర్వాతి స్థానంలో నిలిచాడు. కాగా హాంగ్ కాంగ్తో మ్యాచ్లో జడేజా 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 15 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అంతకుముందు పాకిస్తాన్తో ఆరంభ మ్యాచ్లో 2 ఓవర్లలో 11 పరుగులు ఇచ్చాడు. ఆసియా కప్ టోర్నీలో 2010 నుంచి 2022లో హాంగ్ కాంగ్తో మ్యాచ్ వరకు రవీంద్ర జడేజా తీసిన వికెట్లు: ►2010- నాలుగు వికెట్లు ►2012- ఒక వికెట్ ►2014- ఏడు వికెట్లు ►2016- మూడు వికెట్లు ►2018- ఏడు వికెట్లు ►2022 హాంగ్ కాంగ్తో మ్యాచ్ నాటికి- ఒకటి ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 ఆటగాళ్లు(ఇప్పటి వరకు) 1. మురళీధరన్(శ్రీలంక)- 30 2. లసిత్ మలింగ(శ్రీలంక)- 29 3. అజంతా మెండిస్(శ్రీలంక)- 26 4. సయీద్ అజ్మల్(పాకిస్తాన్)- 25 5. రవీంద్ర జడేజా(ఇండియా)- 23 చదవండి: Ind Vs HK: కోహ్లికి హాంగ్ కాంగ్ జట్టు స్పెషల్ గిఫ్ట్.. థాంక్యూ విరాట్ అంటూ! ఫిదా అయిన ‘కింగ్’! Asia Cup 2022: నాడు కోహ్లి వర్సెస్ సూర్య! ఇప్పుడు సూర్యకు విరాట్ ఫిదా! తలవంచి మరీ! వైరల్ IND VS HK: అక్కడ ఉన్నది జడేజా.. కొంచెం చూసి వెళ్లాలి కదా! వీడియో వైరల్ -
Asia Cup 2022: హాంగ్ కాంగ్ జట్టు స్పెషల్ గిఫ్ట్.. ‘కింగ్’ కోహ్లి భావోద్వేగం!
Asia Cup 2022- India vs Hong Kong- Virat Kohli: సమకాలీన క్రికెటర్లలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన శైలితో అనేకానేక అద్భుత ఇన్నింగ్స్తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఈ టీమిండియా మాజీ కెప్టెన్. అంతర్జాతీయ కెరీర్లో 70 సెంచరీలు నమోదు చేసి.. పరుగుల యంత్రంగా పేరుగాంచాడు. బ్యాటర్గా.. కెప్టెన్గా తనదైన ముద్ర వేసి టీమిండియా ముఖ చిత్రంగా మారిన కోహ్లి ఆటకు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు సైతం ఫిదా అవ్వాల్సిందే! చాలా రోజుల తర్వాత.. కానీ, గత కొన్నిరోజులుగా కోహ్లి తన స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శల పాలైన విషయం తెలిసిందే. కనీసం అర్ధ శతకం కూడా నమోదు చేయలేక విమర్శకుల నోటికి పనిచెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆసియా కప్-2022లో భాగంగా హాంగ్ కాంగ్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ సాధించాడు కోహ్లి. పసికూనే అయినా హాంగ్ కాంగ్ బౌలర్లు.. భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్(36), రోహిత్ శర్మ(21)ను తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగారు. ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి (44 బంతుల్లో 59 పరుగులు నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 68 నాటౌట్) అర్ధ శతకాలతో మెరిసి టీమిండియా భారీ స్కోరు చేయడంలో.. తద్వారా హాంగ్ కాంగ్పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. PC: Virat Kohli థాంక్యూ కోహ్లి.. మీకు కూడా ధన్యవాదాలు ఇదిలా ఉంటే కోహ్లి ఇలా తిరిగి ఫామ్లోకి రావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లి ఇన్స్టా స్టోరీలో షేర్ చేసిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. తమ అభిమాన ఆటగాడు కోహ్లి పట్ల ప్రేమను చాటుకుంది హాంగ్ కాంగ్ జట్టు. ‘‘విరాట్.. ఓ తరానికి స్ఫూర్తిదాతగా నిలిచినందుకు ధన్యవాదాలు. మేము ఎల్లప్పుడూ నీతోనే ఉంటాము. నీకు మద్దతుగా నిలుస్తాము. రాబోయే రోజుల్లో నువ్వు మరిన్ని గొప్ప ఇన్నింగ్స్ ఆడాలి. ప్రేమతో.. టీమ్ హాంగ్ కాంగ్’’ అంటూ తమ జెర్సీపై రాసి కోహ్లికి పంపింది. ఇందుకు స్పందించిన కోహ్లి.. ‘‘మీ ఆత్మీయతకు ధన్యవాదాలు. వెరీ వెరీ స్వీట్’’ అంటూ ఉద్వేగానికి గురయ్యాడు. ఈ ఫొటో నెట్టింట్లో వైరల్గా మారింది. ఇక కోహ్లి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న వేళ.. సొంత జట్టుతో పాటు ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్, పాకిస్తాన్ సారథి బాబర్ ఆజం తదితర విదేశీ క్రికెటర్లు కూడా అతడికి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: Asia Cup 2022: నాడు కోహ్లి వర్సెస్ సూర్య! ఇప్పుడు సూర్యకు విరాట్ ఫిదా! తలవంచి మరీ! వైరల్ Asia Cup 2022 Ind Vs HK: ఆరేళ్ల తర్వాత కింగ్ కోహ్లి బౌలింగ్.. అభిమానులు ఫిదా! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Ind Vs HK: నాడు కోహ్లి వర్సెస్ సూర్య! ఇప్పుడు సూర్యకు విరాట్ ఫిదా! తలవంచి మరీ!
Asia Cup 2022- India vs Hong Kong- Suryakumar Yadav- Virat Kohli: ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా హాంగ్ కాంగ్తో మ్యాచ్లో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. దుబాయ్ వేదికగా బుధవారం(ఆగష్టు 31) జరిగిన మ్యాచ్లో సూర్య నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు.13 ఓవర్లలో 94 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి టీమిండియా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ బ్యాట్ ఝులిపించాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి అద్భుత అర్ధ శతకం సాధించాడు. మొత్తంగా 26 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 6 సిక్స్ల సాయంతో 68 పరుగులు పిండుకున్నాడు. వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి(44 బంతుల్లో 59 నాటౌట్)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగుల భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరి హాఫ్ సెంచరీలతో టీమిండియా ఆఖరి ఏడు ఓవర్లలో 98 పరుగులు రాబట్టడం విశేషం. ఒకే ఓవర్లో నాలుగు సిక్స్లు.. కోహ్లి ఫిదా! ముఖ్యంగా ఆఖరి ఓవర్లో సూర్య వరుసగా 6, 6, 6, 0, 6, 2 బాది 26 పరుగులు సాధించడం మ్యాచ్కు హైలైట్గా నిలిచింది. ఇక సూర్య ఇన్నింగ్స్.. మరో ఎండ్లో కోహ్లికి సైతం ముచ్చటగొలిపింది. దీంతో ‘కింగ్’ టేక్ ఏ బో అన్నట్లుగా తలవంచి సూర్యకు అభినందనలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఇన్స్టాలో షేర్ చేసింది. ‘‘మనం కూడా ఇలాగే తలవంచాలా? అవును.. ఆయన కింగ్.. ఆ కింగ్ స్వయంగా తలవంచాడు కదా మరి’’ అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక వీడియోపై నెటిజన్లు.. ముఖ్యంగా కోహ్లి అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘హుందాతనానికి మారుపేరు మా కింగ్.. ఎట్టకేలకు అర్ధ శతకం సాధించావు భయ్యా. సూర్య భాయ్కు కూడా శుభాకాంక్షలు’’ అని విషెస్ తెలుపుతున్నారు. నాడు అలా.. నేడు ఇలా! మరికొందరు మాత్రం ఐపీఎల్-2020 సీజన్లో కోహ్లి- సూర్య మధ్య జరిగిన ఘటనను గుర్తుచేస్తూ.. ‘‘అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ఆనాడు సూర్యతో గొడవపడ్డ కోహ్లి ఈనాడు మాత్రం తన ముందు తలవంచి మరీ అభినందించాడు. దేశానికి ఆడినప్పుడు ఒకలా.. ఫ్రాంఛైజీకి ఆడినపుడు మరొకలా.. ఇదేం పద్ధతి’’ అని కామెంట్లు చేస్తున్నారు. అయితే, కోహ్లి ఫ్యాన్స్ మాత్రం మైదానంలో ప్రత్యర్థులుగా ఉన్నపుడు అలాంటివి సహజమేనని కొట్టిపారేస్తున్నారు. ఐపీఎల్-2020 సందర్భంగా సూర్య- కోహ్లి(PC: IPL) అప్పుడు కోహ్లి వర్సెస్ సూర్య.. ఇప్పుడు సూర్యపై ప్రేమతో విరాట్! కాగా ఐపీఎల్-2022 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన కీలకమైన మ్యాచ్లో జట్టును గెలిపించి.. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు సూర్య. నాటి మ్యాచ్లో 13వ ఓవర్లో కోహ్లి బంతిని షైన్ చేస్తూ సూర్య వద్దకు వచ్చిన కోహ్లి దూకుడుగా వ్యవహరించాడు. అద్భుతమైన షాట్లు ఆడుతున్న సూర్యతో వాగ్వాదానికి సిద్ధమయ్యాడు. అయితే సూర్యకుమార్ ఏమాత్రం స్పందన లేకుండా కళ్లతోనే బదులిస్తూ, కోహ్లికి దూరంగా వెళ్లిపోయాడు. ఈ వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఇక మెరుగైన ప్రదర్శన కనబరిచినా సూర్యకు టీమిండియాలో చోటు దక్కకపోవడానికి నాటి కెప్టెన్ కోహ్లినే కారణం అంటూ అప్పట్లో సూర్యకుమార్ ఫ్యాన్స్.. ఈ మాజీ సారథిని ట్రోల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజా మ్యాచ్లో టీమిండియా 40 పరుగుల తేడాతో హాంగ్ కాంగ్పై విజయం సాధించి సూపర్-4కు అర్హత సాధించింది. చదవండి: IND VS HK: అక్కడ ఉన్నది జడేజా.. కొంచెం చూసి వెళ్లాలి కదా! వీడియో వైరల్ Asia Cup 2022 Ind Vs HK: ఆరేళ్ల తర్వాత కింగ్ కోహ్లి బౌలింగ్.. అభిమానులు ఫిదా! View this post on Instagram A post shared by Star Sports India (@starsportsindia) -
ఆరేళ్ల తర్వాత కింగ్ కోహ్లి బౌలింగ్.. అభిమానులు ఫిదా!
ఆసియాకప్-2022లో భాగంగా హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి బౌలింగ్ చేసి అందరనీ ఆశ్చర్యపరిచాడు. టీ20 క్రికెట్లో దాదాపు ఆరేళ్ల తర్వాత కోహ్లి బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో విరాట్ కేవలం ఒక్క ఓవర్ మాత్రమే వేశాడు. హాంకాంగ్ ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన కోహ్లి.. కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు. కోహ్లి బౌలింగ్కు అతడి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక ఇందుకు సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా కోహ్లి టీ20ల్లో చివరగా 2016 ఆసియాకప్లో బౌలింగ్ చేశాడు. ఇప్పటి వరకు 101 టీ20లు ఆడిన కోహ్లి నాలుగు వికెట్లు పడగొట్టాడు. కాగా ఈ మ్యాచ్లో కోహ్లి తొలుత బ్యాటింగ్లో కూడా అదరగొట్టాడు. విరాట్ 44 బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్స్లతో 59 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్తో కలిసి 98 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని కింగ్ కోహ్లి నెలకొల్పాడు. ఇక ఈ ఏడాదిలో కోహ్లికి ఇది రెండో టీ20 హాఫ్ సెంచరీ. కాగా టీ20 ప్రపంచకప్కు ముందు కోహ్లి ఈ తరహా ఇన్నింగ్స్ ఆడటం జట్టుకు సానుకూలాంశం. ఇక ఈ మ్యాచ్లో హాంకాంగ్పై భారత్ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Omg Kohli bowling. Kohli is in form. Kohli is epicccccccc #ViratKohli #INDvHK #Cricket pic.twitter.com/5gB8AqcABt — Aarit Jindal - 10 Years Old Investor (@Jindalaarit) August 31, 2022 చదవండి: IND VS HK: గ్రౌండ్లోనే గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసిన హాంకాంగ్ క్రికెటర్.. వీడియో వైరల్! -
గ్రౌండ్లోనే గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసిన హాంకాంగ్ క్రికెటర్.. వీడియో వైరల్!
ఆసియా కప్-2022లో భాగంగా బుధవారం జరిగిన భారత్- హాంకాంగ్ మ్యాచ్ అనంతరం ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. హాంకాంగ్ బ్యాటర్ కించిత్ షా.. స్టేడియంలోనే తన గర్ల్ఫ్రెండ్కి ప్రపోజ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. భారత్తో మ్యాచ్ ముగిసిన వెంటనే స్టాండ్స్లోకి వెళ్లిన కించిత్.. అక్కడ కూర్చుని మ్యాచ్ని వీక్షిస్తున్న తన ప్రేయసికి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆమె ముంగిట మోకాళ్ల మీద కూర్చొని తన ప్రేమను వ్యక్తపరిచాడు. స్టేడియంలో అందరూ చూస్తుండగా.. ఆమె చేతికి రింగ్ తొడిగాడు. కించిత్ క్యూట్ ప్రపోజ్కు ఆమె ఫిదా అయిపోయింది. అనంతరం ఒకరినొకరు కౌగిలించుకుని ఆనందంలో మునిగితేలారు. దీంతో స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గతంలో టీమిండియా క్రికెటర్ దీపక్ చహర్ సైతం ఇలాగే స్టేడియంలో గర్ల్ఫ్రెండ్కు ప్రపోజ్ చేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది జూన్లో వారి వివాహం జరిగింది. ఇదిలా ఉంటే... మ్యాచ్ విషయానికి వస్తే.. హాంకాంగ్పై భారత్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా సూపర్-4కు టీమిండియా ఆర్హత సాధించింది. భారత విజయంలో సూర్యకుమార్ యాదవ్(68 నాటౌట్), విరాట్ కోహ్లి(59 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చేలరేగి కీలక పాత్ర పోషించాడు. She said YES! 😍💍 A heartwarming moment where Hong Kong's @shah_kinchit95 proposed to his SO after playing a big match against India 🥰 A huge congratulations to the happy couple. We wish you all the joy and happiness in your new life together ❤️#AsiaCup2022 #GetReadyForEpic pic.twitter.com/CFypYMaPxj — AsianCricketCouncil (@ACCMedia1) August 31, 2022 చదవండి: IND VS HK: అక్కడ ఉన్నది జడేజా.. కొంచెం చూసి వెళ్లాలి కదా! వీడియో వైరల్ -
హాంగ్కాంగ్పై ఘన విజయం సాధించిన భారత్ (ఫొటోలు)
-
అక్కడ ఉన్నది జడేజా.. కొంచెం చూసి వెళ్లాలి కదా! వీడియో వైరల్
ఆసియా కప్-2022లో భాగంగా హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సూపర్-4కు టీమిండియా ఆర్హత సాధించింది. భారత విజయంలో సూర్యకుమార్ యాదవ్(68 నాటౌట్), విరాట్ కోహ్లి(59 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చేలరేగి కీలక పాత్ర పోషించాడు. కాగా ఈ మ్యాచ్లో భారత్ స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సంచలన త్రో మెరిశాడు. హాంకాంగ్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో ఐదో బంతిని ఆర్ష్దీప్ సింగ్ సింగ్ నో బాల్గా వేశాడు. దీంతో ప్రత్యర్ధి బ్యాటర్కు ఫ్రీ హిట్ లభించింది. అయితే ఈ ఫ్రీ హిట్ను హాంకాంగ్ ఉపయోగించుకోకపోవడమే కాకుండా కీలక వికెట్ను కూడా కోల్పోయింది. ఈ బంతిని ఎదుర్కొన్న హాంకాంగ్ కెప్టెన్ నిజాకత్ ఖాన్ పాయింట్ దిశగా షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే నిజాకత్ సింగిల్ తీయడానికి ప్రయత్నించి ముందుకు వెళ్లగా.. నాన్ స్ట్రైక్లో ఉన్న బాబర్ హయత్ తిరస్కరించాడు. దీంతో తిరిగి వెనుక్కి వచ్చే క్రమంలో పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న జడేజా మెరుపు త్రో తో వికెట్లను గిరాటేశాడు. దీంతో నిజాకత్ ఖాన్ నిరాశతో పెవిలియన్కు చేరాడు. కాగా ఇందుకు సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ స్పందిస్తూ.. 'అక్కడ ఉన్నది జడేజా.. కొంచెం చూసి వెళ్లాలి కదా భయ్యా' అంటూ కామెంట్ చేశాడు. #Jaddu what a run out pic.twitter.com/b8mjgMmd7u — Cricket fan (@Cricket58214082) August 31, 2022 చదవండి: Asia Cup 2022 IND VS HK: కోహ్లి క్లాస్.. సూర్య మాస్.. హాంగ్కాంగ్ను చిత్తు చేసిన భారత్ -
కోహ్లి క్లాస్.. సూర్య మాస్.. హాంగ్కాంగ్ను చిత్తు చేసిన భారత్
ఆసియా కప్ 2022లో భాగంగా బుధవారం హాంగ్కాంగ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా అలవోకగా విజయం సాధించింది. కోహ్లి క్లాస్ ఇన్నింగ్స్ (44 బంతుల్లో 59 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు), సూర్యకుమార్ మాస్ ఇన్నింగ్స్తో (26 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో టీమిండియా 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా గ్రూప్-ఏలో సూపర్ 4కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 192 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో హాంగ్కాంగ్ 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి హాంగ్కాంగ్ను కట్టడి చేశారు. భువనేశ్వర్, అర్షదీప్, జడేజా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. హాంగ్కాంగ్ ఇన్నింగ్స్లో బాబర్ హయత్ (41) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ (13 బంతుల్లో 21; 2 ఫోర్లు, సిక్స్) అనవసరపు షాట్కు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (39 బంతుల్లో 36; 2 సిక్సర్లు) నెమ్మదిగా ఆడి విసుగు తెప్పించాడు. హాంగ్కాంగ్ బౌలర్లలో స్పిన్నర్ యాసిమ్ ముర్తజా (0/27), ఆయుష్ శుక్లా (1/29), మహ్మద్ గజన్ఫార్ (1/19) కాస్త పర్వాలేదనిపించారు. చదవండి: రోహిత్ వరల్డ్ రికార్డును సమం చేసిన కోహ్లి -
రోహిత్ వరల్డ్ రికార్డును సమం చేసిన కోహ్లి
ఆసియా కప్ 2022లో భాగంగా బుధవారం (ఆగస్ట్ 31) హాంగ్కాంగ్తో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి.. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న ఓ వరల్డ్ రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్లో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి కెరీర్లో 31వ హాఫ్సెంచరీ సాధించి.. రోహిత్ పేరిట ఉన్న అత్యధిక హాఫ్సెంచరీల (అంతర్జాతీయ టీ20ల్లో) రికార్డును సమం చేశాడు. రోహిత్ 134 మ్యాచ్ల్లో 31 హాఫ్ సెంచరీలు సాధించగా.. కోహ్లి 101 మ్యాచ్ల్లోనే 31 హాఫ్ సెంచరీల మార్కును చేరుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక హాఫ్సెంచరీలు సాధించిన టాప్-5 ఆటగాళ్లలో కోహ్లి, రోహిత్ల తర్వాతి స్థానాల్లో బాబర్ ఆజామ్ (27), డేవిడ్ వార్నర్ (23), మార్టిన్ గప్తిల్ (22) ఉన్నారు. ఈ మ్యాచ్లో కోహ్లి.. రోహిత్ పేరిట ఉన్న ఈ రికార్డును సమం చేస్తే.. రోహిత్ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 3500 పరుగులు చేసిన ఏకైక బ్యాటర్గా హిట్మ్యాన్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో 21 పరుగులు చేసి ఔటైన రోహిత్ ప్రస్తుతానికి 134 మ్యాచ్ల్లో 3520 పరుగులు స్కోర్ చేశాడు. రోహిత్ తర్వాత రెండో స్థానంలో న్యూజిలాండ్ వెటరన్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (3497), మూడో ప్లేస్లో విరాట్ కోహ్లి (3402) ఉన్నారు. ఇదిలా ఉంటే, ఇవాళ (ఆగస్ట్ 31) హాంగ్కాంగ్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లి (44 బంతుల్లో 59 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) క్లాస్ ఇన్నింగ్స్, సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) ఊర మాస్ ఇన్నింగ్స్తో చెలరేగడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 192 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ (13 బంతుల్లో 21; 2 ఫోర్లు, సిక్స్) అనవసరపు షాట్కు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (39 బంతుల్లో 36; 2 సిక్సర్లు) నెమ్మదిగా ఆడి విసుగు తెప్పించాడు. హాంగ్కాంగ్ బౌలర్లలో స్పిన్నర్ యాసిమ్ ముర్తజా (0/27), ఆయుష్ శుక్లా (1/29), మహ్మద్ గజన్ఫార్ (1/19) కాస్త పర్వాలేదనిపించారు. చదవండి: సూర్యకుమార్ విధ్వంసం.. టీమిండియా భారీ స్కోర్ -
సూర్యకుమార్ విధ్వంసం.. టీమిండియా భారీ స్కోర్
ఆసియా కప్ 2022లో భాగంగా బుధవారం (ఆగస్ట్ 31) హాంగ్కాంగ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు విరాట్ కోహ్లి (44 బంతుల్లో 59 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగి ఆడారు. వీరిలో సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగి పసికూనపై వరుస సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. హరూన్ రషీద్ వేసిన ఆఖరి ఓవర్లో సూర్య పూనకం వచ్చినట్లు ఊగిపోయి ఏకంగా నాలుగు సిక్సర్లు బాదాడు. సూర్య.. తన హాఫ్ సెంచరీని కేవలం 22 బంతుల్లోనే పూర్తి చేశాడంటే, అతని విధ్వంసం ఏ స్థాయిలో ఉండిందో అర్ధమవుతుంది. మరో ఎండ్లో కోహ్లి కూడా బాధ్యతాయుతంగా ఆడి టీ20ల్లో 31వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. కోహ్లి సైతం చెత్త బంతులను భారీ సిక్సర్లుగా మలచి, చాలాకాలం తర్వాత కాన్ఫిడెంట్గా కనిపించాడు. కోహ్లి బాధ్యతాయుతమైన బ్యాటింగ్, సూర్య ప్రతాపం ధాటికి టీమిండియా నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 192 పరుగుల భారీ స్కోర్ చేసింది. అంతకుముందు టీమిండియా టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ (13 బంతుల్లో 21; 2 ఫోర్లు, సిక్స్) అనవసరపు షాట్కు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (39 బంతుల్లో 36; 2 సిక్సర్లు) భారీ స్కోర్ చేయాలనే లక్ష్యంతో నెమ్మదిగా ఆడి విసుగు తెప్పించాడు. హాంగ్కాంగ్ బౌలర్లలో స్పిన్నర్ యాసిమ్ ముర్తజా (0/27), ఆయుష్ శుక్లా (1/29), మహ్మద్ గజన్ఫార్ (1/19) కాస్త పర్వాలేదనిపించారు. చదవండి: టాస్ ఓడిన భారత్, స్టార్ ప్లేయర్కు రెస్ట్.. పంత్కు ఛాన్స్ -
Ind Vs HK: షాట్లతో అలరించిన కోహ్లి, పంత్, రాహుల్, డీకే! వీడియో వైరల్
Asia Cup 2022- India vs Hong Kong: ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా టీమిండియా బుధవారం(ఆగష్టు 31) హాంకాంగ్తో తలపడనుంది. దుబాయ్ వేదికగా ఇరు జట్ల మధ్య రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో నెట్స్లో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీసు చేస్తున్న దృశ్యాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి ట్విటర్లో షేర్ చేసింది. ‘‘మ్యాచ్ డే.. ఆల్ సెట్ ఫర్ హాంకాంగ్ మ్యాచ్’’ అంటూ బీసీసీఐ తాజాగా పంచుకున్న వీడియోలో విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ, దినేశ్ కార్తిక్, దీపక్ హుడా తదితరులు బ్యాటింగ్ చేస్తూ కనిపించారు. ఇక రిషభ్ పంత్ హెలికాప్టర్ షాట్తో అలరించాడు. మరోవైపు.. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, యజువేంద్ర చహల్, రవిచంద్రన్ అశ్విన్ సహా పేసర్లు ఆవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్ సొంత జట్టు బ్యాటర్లకు బౌలింగ్ వేస్తూ కావాల్సినంత ప్రాక్టీసు చేశారు. కాగా రిషభ్ పంత్కు పాకిస్తాన్తో మ్యాచ్లో తుది జట్టులో చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లోనైనా అతడికి అవకాశం వస్తుందేమోనని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. Match Day 💪#TeamIndia all set for #INDvHK 👊#AsiaCup2022 pic.twitter.com/hy8YkOl2pr — BCCI (@BCCI) August 31, 2022 ఇక ఆసియా కప్-2022లో పాకిస్తాన్తో మ్యాచ్లో ప్రయాణం ఆరంభించిన టీమిండియా.. ఐదు వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో చివర్లో హార్దిక్ పాండ్యా మెరుపులతో చిరకాల ప్రత్యర్థిపై విజయ ఢంకా మోగించింది. ఇక హాంకాంగ్తో మ్యాచ్లో ఘన విజయం సాధించి గ్రూప్- ఏ టాపర్గా నిలిచి.. సూపర్ 4కు అర్హత సాధించేందుకు భారత్ సమాయత్తమవుతోంది. కాగా గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, హాంకాంగ్ ఉండగా.. గ్రూప్- బిలో శ్రీలంక, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఇక ఇప్పటికే శ్రీలంక, బంగ్లాదేశ్పై గెలుపొంది అఫ్గన్ సూపర్ 4కు చేరుకుంది. @RishabhPant17 hitting helicopter shot in nets#INDvHK #AsiaCup2022 pic.twitter.com/VIKD6WgM3Z — @KHABARMENIA_SPORTS (@Vikas07K) August 31, 2022 చదవండి: Rishabh Pant: జట్టులో పంత్కు ప్రస్తుతం స్థానం లేదు! అతడిని తప్పిస్తే గానీ.. చోటు దక్కదు! -
హాంకాంగ్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
హాంకాంగ్లో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా, కాన్సుల్ జనరల్ మిస్ సత్వంత్ ఖనాలియా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సుర్ సాధన గ్రూప్ వారి దేశభక్తి గీతాలు, సలాంగై డ్యాన్స్ అకాడమీచే 'జై హో'పై భరతనాట్యం, శ్రీ శక్తి అకాడమీ 'భారత్' కథక్లు అలరించాయి. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని హాంకాంగ్ ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. దేశం పట్ల ప్రేమను వ్యక్తం చేస్తూ...ప్రధాని మోదీకి మద్దతు పలికారు. అనంతరం 'ఆఫ్బీజేపీ' హాంకాంగ్, చైనా అధ్యక్షుడు సోహన్ గోయెంకా మాట్లాడుతూ 'భారత దేశ ప్రతిష్టను ఖండాంతరాలకు చాటి చెప్పడమే తమ లక్ష్యమన్నారు. ఉపాధ్యక్షుడు రాజు సబ్నానీ, రమాకాంత్ అగర్వాల్, అజయ్ జకోటియా, రాజు షా, కుల్దీప్ ఎస్. బుట్టార్, సోనాలి వోరా, ఆఫ్ బీజేపీ హాంకాంగ్, చైనా ప్రధాన కార్యదర్శి శశిభూషణ్తో పాటు పలువురు పాల్గొన్నారు. -
నీరవ్ ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన రూ.253.62 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. హాంకాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న నీరవ్ కంపెనీలకు చెందిన రత్నాలు, నగలు, బ్యాంక్ డిపాజిట్లను జప్తు చేసినట్లు తెలిపింది. సుమారు రూ.16వేల కోట్ల మేర పంజాబ్ నేషనల్ బ్యాంక్ను మోసం చేసిన కేసులో ప్రస్తుతం యూకేలో జైలు శిక్ష అనుభవిస్తున్న నీరవ్ను భారత్కు రప్పించే ప్రయత్నాలు తుదిదశలో ఉన్నట్లు పేర్కొంది. తాజా జప్తుతో కలిపి నీరవ్కు చెందిన మొత్తం రూ.2,650 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లయిందని వివరించింది. -
పాపం.. తిండి మానేసి మరీ కన్నుమూసింది
హాంకాంగ్: ప్రపంచంలో అత్యంత వయస్కురాలైన మగ పాండా కన్నుమూసింది. 35 ఏళ్ల యాన్ యాన్(పాండా పేరు) హాంకాంగ్ ఓషన్ థీమ్ పార్క్లో మృతి చెందినట్లు నిర్వాహకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ భూమ్మీద మానవ సంరక్షణలో ఉన్న అత్యంత వయసుర్కాలైన మగ పాండా ఇదే. దీని వయసు 35 ఏళ్లు కాగా, ఈ వయసు మనిషి వయసు 105 ఏళ్లకు సమానం. అత్యంత సున్నితమైన జీవరాశి జాబితాలో పాండాకు సైతం చోటు ఉంది. యాన్ యాన్ 1999 నుంచి ఈ పార్క్లో ఉంటోంది. గత పదిరోజులుగా అది తిండి తగ్గిస్తూ వచ్చింది. ఆరోగ్యంగానే ఉన్నా.. అది ఎందుకలా చేస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. బలవంతంగా తినిపించే ప్రయత్నం చేసినా.. ప్రయత్నాలు ఫలించలేదు. ఇంతకు ముందు అత్యధిక వయసున్న పాండాగా జియా జియా పేరిట రికార్డు ఉండేది. 38 ఏళ్ల వయసులో అది 2016లో కన్నుమూసింది. జియా జియా, యాన్ యాన్లను చైనా ప్రభుత్వం హాంకాంగ్ పార్క్కు కానుకగా ఇచ్చింది. పాండాల సంరక్షణకు మారుపేరుగా ఉన్న హాంకాంగ్లో.. వాటి జనాభా మాత్రం అంతగా వృద్ధి చెందడం లేదు. మరోవైపు చైనా నుంచే కానుకల రూపంలో వచ్చిన యింగ్ యింగ్, లే లే పాండాలతో సంతానోత్పత్తి చేయించాలన్న పదిహేనేళ్ల ప్రయత్నాలు ఫలించడం లేదు. -
అర్థరాత్రి నడిరోడ్డుపై కొడవళ్లతో విధ్వంసం ... వీడియో వైరల్
కొంతమంది మద్యం తాగితే ఆ మత్తులో వారి చేసే హంగామా మామాలుగా ఉండదు. ఒక్కోసారి బార్ లేదా పబ్ల వద్ద ఫుల్గా తాగి ఏదో చిన్న చిన్న విషయాలకే ఇగోకి వెళ్లి ఆ మత్తులోనే ఘోరమైన అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. అచ్చం అలానే ఇక్కడొక గ్రూప్ బార్లో జరిగిన చిన్న వివాదాన్ని సీరియస్ తీసుకుని అర్థరాత్రి అని కూడా లేకుండా వెంటపడి మరీ దాడి చేసేందుకు రెడీ అయిపోయారు. ఈ ఘటన హంకాంగ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...హాంకాంగ్లో లాన్ క్వాయ్ ఫాంగ్ ప్రాంతంలోని బార్లో రెండు గ్రూప్ల మధ్య చిన్న వివాదం చోటు చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత ఆ గ్రూప్లలో ఒక బృందం ఆ బార్ నుంచి నిష్క్రమించి వెళ్లిపోయింది. ఐతే మరో గ్రూప్ ఆ వివాదాన్ని కాస్త సీరియస్ తీసుకుని వారి పై దాడి చేసేందుకై వారిని ఫాలో అవుతూ.. ఒక లగ్జరీ కారులో బయలుదేరారు. ఇంతలో ట్రాఫిక్ జంక్షన్లో కారులన్ని ఆగిపోయి ఉన్నాయి. అంతే సదరు గ్రూప్ తమ కారుని తమ ప్రత్యర్థి గ్రూప్కి సంబంధించిన తెల్ల కారు పక్కనే ఆపి మరీ.. కొడవళ్లు తీసుకుని దాడి చేసేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు మొత్తం ఎనిమిది మంది నడి రోడ్డుపై కొడవళ్లతో పెద్ద బీభత్సం సృష్టించారు. ఇంతలో వెనెక ఉన్న ఒక నలుపు వ్యాన్ ఆ రెండు కార్ల మధ్యలోంచి దూసుకుపోయింది. ఆ తర్వాత ఏమైందో ఏమో ఇంతలో ఆ బృందం అకస్మాత్తుగా వెనక్కి తమ కారు వద్దకు వచ్చి ఎక్కి హడావిడిగా వెళ్లేందుకు యత్నిస్తారు. ట్వీస్ట్ ఏంటంటే అక్కడే సమీపంలో పోలీసులు ఉన్నారు. వెంటనే వారు స్పందించి అక్కడికక్కడే దాడిచేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. అంతేకాదు ఆ ప్రాంతంలో కర్ఫ్యూని కూడా విధించారు. ఐతే ఈ ఘటనకు సంబంధించిని వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: మరణ శిక్ష రద్దు చేసేందుకు సమ్మతించిన ప్రభుత్వం!) -
హాంకాంగ్ పాలకునిగా జాన్ లీ ఎన్నిక
హాంకాంగ్: హాంకాంగ్ పాలకునిగా చైనా అనుకూల జాన్ లీ ఆదివారం ఎన్నికయ్యారు. 1,500 మంది కమిటీ సభ్యుల్లో 1,416 మంది లీకి ఓటేశారు. కమిటీలో మెజారిటీ సభ్యులు చైనా మద్దతుదారులే కావడంతో ఎన్నిక సులభమైంది. ఎన్నికల్లో ఆయన ఒక్కరే పోటీ చేశారు. జూన్ 1న కేరీ లామ్ స్థానంలో లీ బాధ్యతలు చేపడతారు. హాంకాంగ్ సెక్యూరిటీ చీఫ్గా చైనా అండతో నగరంలో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని లీ కఠినంగా అణచివేశారన్న అపవాదు ఉంది. చైనాకు విధేయులుగా ఉన్నవారే పోటీ చేయగలిగేలా హాంకాంగ్ ఎన్నికల చట్టాల్లో చైనా గతేడాది మార్పులు చేసింది. హాంకాంగ్ను పూర్తిగా విలీనం చేసుకొనేందుకు డ్రాగన్ దేశం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
రూ. 371 కోట్లు పలికిన డైమండ్ .. ఎందుకో తెలుసా!
వజ్రం అంటేనే వ్యాల్యూ ఎక్కువ. అలాంటిది ఇది నీలం రంగు(వివిడ్ బ్లూ) వజ్రం.. పైగా.. 15.10 క్యారెట్లది. దీంతో రికార్డు స్థాయిలో రూ.371 కోట్లు ధర పలికింది. సదబీస్ సంస్థ బుధవారం హాంకాంగ్లో దీని వేలాన్ని నిర్వహించింది. రూ.350 కోట్ల దాకా పలుకుతుందని తొలుత అనుకున్నారు. అయితే.. అంతకుమించిన ధర వచ్చింది. 2021లో దక్షిణాఫ్రికాలోని గనుల్లో ఈ వజ్రం దొరికింది. దీన్ని రూ.308 కోట్లకు డిబీర్స్, డయాకోర్ సంస్థలు కొనుగోలు చేసి.. పాలిషింగ్ అనంతరం అమ్మకానికి పెట్టాయి. చదవండి: International Dance Day: కాలు సిందు తొక్కేలా దుమ్మారం రేగినట్టు.. -
హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు!
హాంకాంగ్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కోవిడ్ నిబంధనల కారణంగా ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఉగాది వేడుకల్ని ఆన్లైన్ వేదికగా నిర్వహించింది. ఈ వేడుకల్లో తెలుగు సంస్కృతిని చాటి చెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలతో కన్నుల విందుగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని హాంకాంగ్ తెలుగు సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీమతి జయ పీసపాటి ప్రారంభించగా, శాంతి మోగంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ ఉగాది వేడుకలను ఆర్థిక కార్యదర్శి రాజశేఖర్ మన్నే, ట్రెజరర్ నర్రా వరప్రసాద్, జనరల్ సెక్రటరీ గరదాస్ జ్ఞానేశ్వర్ తో పాటు ఇతర తెలుగు అసోసియేషన్ సభ్యుల సహకారంతో ఘనంగా నిర్వహించారు. -
గ్రానైట్ ఎగుమతులు ఆపాలని చైనా, హాంకాంగ్ నుంచి ఆదేశాలు
-
రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు.. ప్రధానంగా ఆ దేశాల్లోనే..
EU Says Cases Of Omicron BA.2: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రపంచదేశాలు ఆంక్షలను ఎత్తివేస్తున్న సమయంలో మళ్లీ కోవిడ్-19 సబ్వేరియంట్ అయిన ఒమిక్రాన్ BA.2 కేసులు యూరోపియన్ యూనియన్(ఈయూ) అంతటా పెరుగుతున్నాయని యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ(ఈఎంఏ) తెలిపింది. ఎక్కువగా ఆగ్నేయాసియా దేశాల్లో కోవిడ్-19 కేసులు అత్యధికంగా పెరుగుతున్నాయని వెల్లడించింది. దీంతో భారత ప్రభుత్వం తమ పౌరులను సురక్షితంగా ఉండమని హెచ్చరించడమే కాక మాస్కలు ధరించడం మానేయవద్దని ఆదేశించింది. చైనా, హాంకాంగ్, సింగపూర్, దక్షిణ కొరియాలో డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్లకు సంబంధిందచిన కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నివేదికలో పేర్కొంది. దీంతో డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడమే కాక హెచ్చరికలు జారీ చేసింది. ఐదు ఆసియా దేశాల్లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు: చైనా: చైనాలో కరోనా కేసులు అనూహ్యంగా రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అన్ని దేశాల కంటే చైనా కఠినమైన కరోనా ఆంక్షలను విధించింది. పైగా జిరో కోవిడ్ టోలరెన్స్ని లక్ష్యంగా ప్రజలపై కఠినమైన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కానీ చైనా అమలు చేసిన ఆంక్షలన్ని విఫలమయ్యేలా కేసులు రికార్డు స్థాయలో నమోదవుతున్నాయి. గత రెండేళ్లలో లేని విధంగా కేసులు నమోదవ్వడమే కాక మరణాలు కూడా మొదలయ్యాయి. చైనాలో అనేక నగరాలు నిర్బంధంలోనే ఉన్నాయి. సింగపూర్: సింగపూర్లో శనివారం తాజాగా 10,244 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య దాదాపు 1,007,158కి చేరుకుంది. ప్రస్తుతం 1,130 బాధితులు ఆసుపత్రులో చికిత్స పొందుతుండగా, 27 బాధితులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో ఉన్నారు. మూడు కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో మరణాల సంఖ్య సుమారు 1,194కు చేరుకుందని ఆ దేవ హెల్త్ డిపార్టుమెంట్ తెలిపింది. హాంకాంగ్: హాంకాంగ్లో శనివారం ఒక్క రోజులో దాదాపు 16,597 కేసులు నమోదయ్యాయి. వైరస్ను అదుపు చేసే దిశలో హాంకాంగ్ కట్టుదిట్టమైన చర్యలను అమలు చేస్తోంది. దక్షిణ కొరియా: కొత్త కోవిడ్ -19 కేసులు శనివారం 4 లక్షల కంటే తక్కువగా నమోదైయ్యాయి. ప్రస్తుతం దాదాపు 381,454 కొత్త కోవిడ్-19 కేసులు అందులో విదేశాల నుంచి వచ్చిన 63 మందితో సహా సుమారు 9,038,938కి పెరిగిందని కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ(కెడిసిఎ) పేర్కొంది. తాజా గణంకాల ప్రకారం ఆల్-టైమ్ గరిష్ట స్థాయి సుమారు 621,328 నుంచి గణనీయంగా తగ్గింది, అయితే కేసుల ఆకస్మిక పెరుగుదల మునుపటి రోజు కంటే అనుహ్యంగా 70 వేల కేసులు పెరుగుదలను సూచిస్తోంది. మరణించిన వారి సంఖ్య 12,101కి చేరుకుంది. మరణాల రేటు 0.13 శాతంగా ఉంది. మయన్మార్: కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ BA.2 చెందిన 31 కేసులు నమోదైయ్యాయని మయన్మార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్చి 15న పరీక్షించిన 31 మంది కోవిడ్-19 పాజిటివ్ పేషెంట్లలో BA.2 కేసులు గుర్తించినట్లు పేర్కొంది. 2020 ప్రారంభంలో మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఈ దేశంలో సుమారు 608,384 కేసుల మరణాల దాదాపు 19,420 నమోదయ్యాయని నివేదిక తెలిపింది. (చదవండి: చైనాలో మళ్లీ మొదలైన కరోనా మరణాలు.. ఏడాది తర్వాత) -
రూ.2కే లీటర్ పెట్రోల్.. ఏ దేశంలో తెలుసా?
ఉక్రెయిన్పై కొనసాగుతున్న రష్యా దాడులు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. ఉక్రెయిన్ పరిణామాలతో భారత్లోనూ ధరాఘాతం నెలకొంటోంది. పలు నిత్యవసరాలు, ఇతర వస్తువల ధరలు రోజురోజుకూ పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బ్యారేల్ చమరు ధర 130 డాలర్లకు చేరుకుంది. దీంతో చాలా దేశాలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మన దేశంలో కూడా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలతో పోల్చితే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరగాల్సి ఉంది. కానీ, ఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు జీవనకాల గరిష్టానికి చేరుకోవడంతో ఆయిల్ ధరల విషయంలో ఆయిల్ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వం వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నాయి. హోలీ పండుగ తర్వాత ఏ క్షణమైనా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముందన్న ప్రచారం రెండ్రోజుల క్రితం నుంచి జరుగుతోంది. అయితే పెట్రో ధరల విషయంలో గుడ్ న్యూస్ అందుతోంది. పెట్రో ధరలు త్వరలో తగ్గే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రష్యా నుంచి డిస్కౌంట్ ధరకు భారీగా ముడిచమురును ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి. భారత్కు తక్కువ ధరకే ముడిచమురు ఇస్తామని ఇప్పటికే రష్యా బంపర్ ఆఫర్ ప్రకటించడంతో వచ్చే కాలంలో ఇంధన ధరలు తగ్గనున్నట్లు సమాచారం. అయితే, మన దేశంలో పెట్రోల్ ధరలు రూ.100కి పైగా ఉంటే, ఇతర దేశాలలో పెట్రోల్ ధరలు ఎంతగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణాసియాలో పెట్రోల్ ధరలు: మన దాయాది దేశం అయిన పాకిస్తాన్'లో ఒక లీటర్ పెట్రోల్ ధర 0.837 డాలర్లు(సుమారు రూ.63.43) ఉండగా, శ్రీలంకలో ఇది 1.111 డాలర్లు(రూ. 84) వద్ద ఉంది. బంగ్లాదేశ్ దేశంలో వాహనదారులు ప్రతి లీటర్ ఇంధనానికి $1.035(రూ.78.43) చెల్లిస్తూ ఉంటే, నేపాల్'లో ఉన్నవారు $1.226(రూ.93) చెల్లిస్తున్నారు. మన చుట్టూ పక్క దేశాలతో పోలిస్తే మన దేశంలోనే చమరు ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. లీటర్ పెట్రోల్ చౌకగా దొరికే దేశాలు: ఇతర దేశాలలో పోలిస్తే ప్రపంచంలోనే పెట్రోల్ ధర తక్కువగా ఉన్న దేశం "వెనిజులా". ఈ దేశంలో ఒక లీటర్ పెట్రోల్ $0.025(రూ.1.89)గా ఉంది. ఆ తర్వాత లిబియాలో ఇంధనం చౌకగా ఉంది. ఇక్కడ ఒక లీటర్ పెట్రోల్ ధర $0.032(రూ.2.43)గా ఉంది. పెట్రోల్ ధర ఎక్కువగా ఉన్న దేశాలు: ఇతర దేశాలలో పోలిస్తే ప్రపంచంలోనే పెట్రోల్ ధర ఎక్కువగా ఉన్న దేశం "హాంగ్ కాంగ్". ఈ దేశంలో ఒక లీటర్ పెట్రోల్ $2.879(రూ.218)గా ఉంది. ఆ తర్వాత లిబియాలో ఇంధనం చౌకగా ఉంది. ఆ తర్వాత నార్వే, నెదర్లాండ్స్, ఫిన్లాండ్, లిచెన్ స్టెయిన్, జర్మనీ వంటి దేశాలలో ఇంధనం ధర లీటరుకు రూ.200కు పైగా ఉంది. (చదవండి: దేశ చరిత్రలో ఇదే తొలిసారి! కరోనా ఉన్నా..అదరగొట్టిన పన్నువసూళ్లు, ఏకంగా!) -
మూడేళ్లలో 60 లక్షల మరణాలు
బ్యాంకాక్: కోవిడ్–19 ప్రబలిన మూడేళ్లలో ప్రపంచదేశాల్లో 60 లక్షల మందిని బలితీసుకుంది. ఇప్పటికీ వైరస్ తీవ్రతతో చాలా దేశాల్లో ప్రజలు అల్లాడుతున్నారు. మాస్క్ ధరించడం మానేసి, ప్రయాణాలు, వ్యాపారాలు తిరిగి మొదలైనా ఈ మహమ్మారి ఇప్పటికీ ప్రపంచ దేశాలను భయపెడుతూనే ఉందని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ పేర్కొంది. గత నాలుగు నెలల్లోనే 10 లక్షల కోవిడ్ మరణాలు నమోదైనట్లు తెలిపింది. ఇప్పటి వరకు వైరస్ సోకని పసిఫిక్ ద్వీపాల్లో సైతం మొదటి వేవ్ ప్రజలను వణికిస్తోంది. హాంకాంగ్ ప్రభుత్వం ఈ ఒక్క నెలలోనే మొత్తం 75 లక్షల మంది ప్రజలకు మూడు పర్యాయాలు కరోనా పరీక్షలు జరిపింది. అయినప్పటికీ అక్కడ రోజువారీ కేసులు భారీగా నమోదవుతున్నాయని వ్యాఖ్యానించింది. ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో 10 లక్షల మంది కోవిడ్తో ప్రాణాలు కోల్పోయారు. మొత్తమ్మీద ఇప్పటి వరకు 45 కోట్ల మంది కోవిడ్ బారినపడినట్లు లెక్కలు తేల్చింది. అయితే, కోవిడ్తో 1.40 కోట్ల నుంచి 2.35 కోట్ల మంది మరణించినట్లు ‘ది ఎకనామిస్ట్’విశ్లేషకుల అంచనా. చైనాలో మళ్లీ కోవిడ్ చైనా ప్రభుత్వం కోవిడ్–19 వ్యాప్తిని నిరోధించేందుకు అత్యంత కఠినమైన చర్యలు చేపడుతున్నప్పటికీ కేసులు కొత్తగా బయటపడుతూనే ఉన్నాయి. దేశంలో సోమవారం ఒక్క రోజు వ్యవధిలో వెలుగు చూసిన 214 కొత్త కేసుల్లో గ్వాంగ్డాంగ్ ప్రావిన్సులో 69, జిలిన్లో 54, షాడోంగ్ ప్రావిన్స్లో 46 నిర్ధారణ అయినట్లు ప్రధాని లీ కెకియాంగ్ తాజాగా నేషనల్ లెజిస్లేచర్కు అందజేసిన వార్షిక నివేదికలో తెలిపారు. 2019లో వూహాన్లో మొట్టమొదటిసారిగా కరోనా వైరస్ జాడలు వెలుగుచూశాక ఇంత ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. దేశ రాజధాని బీజింగ్లో కొత్తగా కేసులు రానప్పటికీ మాస్క్ తప్పనిసరి చేశారు. కోవిడ్ వ్యాప్తిని పూర్తిస్థాయిలో అదుపులోకి తెచ్చేందుకు చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. స్వల్పసంఖ్యలో కేసులు బయటపడిన చోట్ల కూడా క్వారంటైన్, లాక్డౌన్లను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. బీజింగ్లోని ప్రముఖ బౌద్ధాలయాలు, చర్చిలు, మసీదులను జనవరి నుంచి నిరవధికంగా మూసే ఉంచారు.చైనాలో ఇప్పటి వరకు 1,11,195 కేసులు, 4,636 మరణాలు నమోదయ్యాయని నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 3,837 మంది కోవిడ్తో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. -
భారత్ను గెలిపించిన మిథున్.. క్వార్టర్స్కు చేరాలంటే మాత్రం..
Asia Badminton Team Championship 2022- షా ఆలమ్ (మలేసియా): ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు నాకౌట్ చేరే ఆశలు సజీవంగా నిలిచాయి. గ్రూప్ ‘ఎ’లో భాగంగా గురువారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో భారత్ 3–2తో హాంకాంగ్పై గెలిచింది. ఈ టోర్నీలో భారత్కిదే తొలి గెలుపు. భారత్ క్వార్టర్ ఫైనల్కు చేరాలంటే ఇండోనేసియాతో నేడు జరిగే మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాలి. మరోవైపు హాంకాంగ్ చేతిలో దక్షిణ కొరియా ఓడిపోవాలి. కాగా హాంకాంగ్తో జరిగిన పోరులో నిర్ణాయక ఐదో మ్యాచ్లో మిథున్ మంజునాథ్ 21–14, 17–21, 21–11తో జేసన్ గుణవాన్ను ఓడించి భారత విజయాన్ని ఖాయం చేశాడు. అంతకుముందు తొలి మ్యాచ్లో లక్ష్య సేన్ 21–19, 21–10తో లీ చెయుక్ యుపై నెగ్గి భారత్కు 1–0 ఆధిక్యం అందించాడు. ఇక రెండో మ్యాచ్లో మంజిత్ సింగ్–డింకూ సింగ్ జంట ఓడిపోగా... మూడో మ్యాచ్లో కిరణ్ జార్జి కూడా ఓటమి పాలయ్యాడు. అయితే నాలుగో మ్యాచ్లో హరిహరన్–రూబన్ కుమార్ జోడీ 21–17, 21–16తో చౌ హిన్ లాంగ్–లుయ్ చున్ వాయ్ జంటపై నెగ్గి స్కోరును 2–2తో సమం చేసింది. నిర్ణాయక మ్యాచ్లో మిథున్ గెలుపొందడంతో భారత్ గట్టెక్కింది. చదవండి: Ishan Kishan-Rohit Sharma: ఇషాన్ కిషన్కు క్లాస్ పీకిన రోహిత్ శర్మ.. విషయమేంటి -
హాంగ్కాంగ్లో ఘనంగా తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు
ఈ తరం మిలినియల్ పిల్లల్లో తెలుగు భాష మాధుర్యాన్ని, తెలుగు సంస్కృతి సంపదను తెలియజేసేందుకు ‘ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య’ ప్రతి సంవత్సరం జనవరిలో పిల్లలతో భోగి, తెలుగు సాంస్కృతిక ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తోంది. అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోవిడ్ నిబంధనల కారణంగా పిల్లలతో భోగి వేడుకలు సామూహికంగా చేయలేక పోయినా, ఆన్లైన్లో జూమ్ ద్వారా తెలుగు సాంస్కృతిక ఉత్సవాలను జరుపుతున్నామని సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటీ తెలిపారు. ఈసారి ఉత్సవాలు నిర్వహించేందుకు కొన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ.. ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అయితే.. వేడుకల్లో పాల్గొనేందుకు సభ్యులు, పిల్లలు ఎంతో ఉత్సాహం ప్రదర్శించడంతో ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్లో నిర్వహించేందుకు సిద్ధమయ్యామన్నారు. కాగా.. ఈ కార్యక్రమాన్ని, హాంగ్ కాంగ్ వాస్తవ్యులు, NRI తెలుగు ఐడల్ 2021 రెండవ విజేత హర్షిణీ పచ్చంటి.. ప్రార్థన గీతంతో ప్రారంభించారు. సాంప్రదాయ దుస్తులలో మెరిసిపోయిన చిన్నారులు.. భారతీయ శాస్త్రీయ సంగీతంలో ముద్దులొలికే తెలుగులో పాటలు పాడగా, మరికొందరు కన్నులకు ఇంపుగా భరతనాట్యం, కూచిపూడి నృత్యప్రదర్శన చేశారు. మరికొందరు టాలీవుడ్ పాటలకు డాన్స్ చేశారు. చిన్నారులు భారతీయ, పాశ్చాత్య శాస్త్రీయ వాయిద్యాల తమకున్న ప్రతిభను ప్రదర్శించి అందరి మన్ననలు పొందారు. కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన త్యాగరాజు, స్వాతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్ర బోస్కు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాంగ్ కాంగ్ వాస్తవ్యులు డా. సుజాత గోవాడ (ప్రసిద్ధ అర్బన్ డిసైనర్, సెర్టిఫైడ్ టౌన్ ప్లానర్) మాట్లాడుతూ.. పిల్లల ప్రదర్శనలు ఎంతో ముచ్చటగా ఉన్నాయని, వారి ఉత్సాహం తమకెంతో ఆనందాన్నిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లల్ని, వారి తల్లిదండ్రులని అభినందించారు. తెలుగు సమాఖ్య చేస్తున్న భాష - సాంస్కృతిక సేవను, తెలుగు వారందరిని ఒక తాటిపై తెచ్చేందుకు చేస్తున్న కృషిని ఎంతగానో మెచ్చుకున్నారు. ఇక విశిష్ట అతిథిగా విచ్చేసిన, టాలీవుడ్ దర్శకులు కిషోర్ మాట్లాడుతూ, పిల్లల ప్రదర్శనలను మెచ్చుకొన్నారు. తాను సినిమాల్లో బిజీగా వుండి, కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనలేకపోయినా, సమాఖ్య నిరంతరం తెలుగు వారిని వివిధ కార్యక్రమాల ద్వారా కలిపేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. హాంగ్ కాంగ్లో మూడు దశాబ్దాలకు పైగా వైద్యుడిగా సేవలు అందిస్తున్న డా.వెంకట్ రావు తన సతీమణి శాంతితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లల ఆట పాటలను ఎంతో మెచ్చుకున్నారు. ప్రస్తుతం సమాఖ్య చేస్తున్న కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన సరస్వతి దేవిని స్మృతిస్తూ ఒక చక్కని భక్తి గీతాన్ని కూడా పాడి వినిపించారు. దంపతులు ఎంతో ఉల్లాసంగా పిల్లల్ని ఆశీర్వదించారు. ఇక ఈ వేడుకలు విజయవంతమయ్యేందుకు కృషి చేసిన పిల్లలను, వారి తల్లిదండ్రులును, సాంస్కృతిక కార్యదర్శి సువర్ణ చుండూరు, ఉప కోశాధికారి రమాదేవి సారంగా, ఆర్ధిక కార్యదర్శి రాజశేఖర్ మన్నే, జనరల్ సెక్రటరీ గర్దాస్ గ్యానేశ్వర్, స్వచ్చందంగా సేవనందించిన అపర్ణ కందా, రాజీవ్ ఈయు తదితరులను సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటీ కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: నిరాటంకంగా ఘంటసాల స్వర రాగ మహాయాగం -
21 బంతుల్లోనే సెంచరీ.. టీమిండియా బతికిపోయింది
South Africa Batsman Martin Coetzee Century In 21 Balls.. డిసెంబర్ 26 నుంచి టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ఆరంభానికి ముందు దక్షిణాఫ్రికా క్రికెటర్ మార్టిన్ కోయెట్జ్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 21 బంతుల్లోనే సెంచరీ బాదిన కోయెట్జ్ ఓవరాల్గా 120 బంతుల్లో 13 ఫోర్లు.. 8 సిక్సర్ల సాయంతో 157 పరుగులు చేశాడు. అయితే కోయెట్జ్ ఈ ఇన్నింగ్స్ దక్షిణాఫ్రికా తరపున ఆడాడనుకుంటే పొరపాటే. అసలు మార్టిన్ కోయెట్జ్ ఇంతవరకు దక్షిణాఫ్రికా తరపున ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. కేవలం ఫస్ట్క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడిన కోయెట్జ్ ప్రస్తుతం ప్రైవేట్ లీగ్ల్లో బిజీగా గడుపుతున్నాడు. దీంతో కోయెట్జ్ దక్షిణాఫ్రికా జట్టులో లేకపోవడంతో టీమిండియా బతికిపోయిందంటూ కొందరు అభిమానులు కామెంట్స్ చేయడం వైరల్గా మారింది. చదవండి: India Tour Of South Africa: దక్షిణాఫ్రికాకు ఎదురుదెబ్బ.. టెస్ట్లకు స్టార్ ప్లేయర్ దూరం ఇక మార్టిన్ కోయెట్జ్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే... హాంకాంగ్ ఆల్ స్టార్స్ 50 ఓవర్ల సిరీస్లో ఈ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కోవ్లూన్ లయన్స్, హాంకాంగ్ ఐలాండ్స్ మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోవ్లూన్ లయన్స్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. వకాస్ ఖాన్ 122, ఎజాజ్ ఖాన్ 104 సెంచరీలు బాదడంతో ఈ స్కోరు నమోదైంది. అనంఆలతరం 300 పరుగుల లక్ష్యతో బరిలోకి దిగిన హాంకాంగ్ ఐలాండర్స్ మార్టిన్ కోయెట్జ్ విధ్వంసంతో 44 ఓవర్లలోనే చేధించింది. మార్టిన్ కోయెట్జ్కు జతగా.. కెప్టెన్ బాబార్ హయత్ 67 బంతుల్లోనే 81 పరుగులు చేశాడు. చదవండి: Shane Warne Test Batsmen List: 'కెప్టెన్సీ పోతే పోయింది.. నా టాప్-5లో నువ్వు ఒకడివి' -
ఉత్తుత్తి కంపెనీలు.. ఊళ్లు దాటిన వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: చైనా, హాంకాంగ్లకు చెందిన గేమింగ్, డేటింగ్ యాప్స్ కేసులో ఈడీ సంచలన విషయాలు బయటపెట్టింది. యాప్స్ నిర్వహిస్తున్న కంపెనీల లావాదేవీలు చూస్తున్న చార్టెడ్ అకౌంటెంట్ రవికుమార్.. రూ.1,500లకో సంతకంతో వేల కోట్లు దేశం దాటేలా సహకరించాడని వెల్లడించింది. షెల్ కంపెనీల లావాదేవీలకు బోగస్ సర్టిఫికెట్లు జారీ చేసి రూ.1,100 కోట్లు చైనా, హాంకాంగ్ చేరేలా చేశాడని చెప్పింది. హెయిర్ మర్చంట్స్.. క్రిప్టో కరెన్సీ రూపంలో ఢిల్లీకి చెందిన చార్టెట్ అకౌంటెంట్ రవికుమార్.. చైనా, హాంకాంగ్కు చెందిన లింక్యూన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, డోకిపే టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల లావాదేవీలు చూస్తున్నాడు. సంబంధిత కంపెనీలు మన దేశంలో డేటింగ్, గేమింగ్ యాప్ల ద్వారా వేల కోట్లు వసూలు చేసి మోసం చేశాయి. ఈ డబ్బు ను మనీలాండరింగ్ ద్వారా రవికుమార్ దేశం దాటించినట్టు ఈడీ గుర్తించింది. నకిలీ ఎయిర్ వే బిల్లులు, సీసీ కెమెరాల క్లౌడ్ స్టోరేజ్ మెయింటెనెన్స్ పేరుతో నకిలీ బిల్లులు సృష్టించి ఎస్బీఐ, ఎస్బీఎమ్ బ్యాంకుల ద్వారా రూ.1,100 కోట్ల డబ్బును రవికుమార్ దేశం దాటించినట్టు ఈడీ గుర్తించింది. కొంత డబ్బును హవాలా రూపంలో హెయిర్ మర్చంట్స్, క్రిప్టో కరెన్సీ పేరుతో సింగపూర్కు మళ్లించినట్టు తేల్చింది. సంతకానికి రూ. 1,500 మనీ లాండరింగ్ ద్వారా రూ.1,100 కోట్లను దేశాన్ని దాటించేందుకు చైనా, హాంకాంగ్లో ఉన్న మాఫియా నేతృత్వంలో రవికుమార్ 621 బోగస్ కంపెనీలు సృష్టించాడని, అలాగే బోగస్ ఫామ్ 15 సీబీ సర్టిఫికెట్లు జారీ చేశాడని ఈడీ గుర్తించింది. చార్టెడ్ అకౌంటెంట్గా బ్యాలెన్స్ షీట్లను చూడకుండానే షెల్ కంపెనీలకు సంతకాలు చేశాడంది. ఈ మొత్తం వ్యవహారంలో రవికుమార్ తన ప్రతి సంతకానికి రూ.1,500 చొప్పున తీసుకున్నట్టు గుర్తించింది. బోగస్ కంపెనీల సృష్టికర్తలు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, రవికుమార్ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టామని ఈడీ తెలిపింది. రవికుమార్ను విచారించేందుకు కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతించినట్టు చెప్పింది. -
హాంగ్ కాంగ్లో ఘనంగా కార్తీక మాస పూజ, వనభోజనాల సందడి!!
హాంగ్ కాంగ్లో కార్తీక మాసం నాడు దీపావళి సంబరాలు, భాయ్ దూజ్(భాగిని హస్త భోజనం), కందషష్టి పూజలను తమిళ సంఘం వారు నవంబర్ 4 నుంచి 10 వరకు ఎంతో వైభవంగా జరిపించగా, హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వారు శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతం, వనభోజనం నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం హాంగ్కాంగ్కి వచ్చే తెలుగు వారిలో సాధారణంగా యువ జంటలు ఎక్కువగా ఉంటారు. వీరు శ్రీ సత్యనారాయణ స్వామి వారి పూజ చేసుకోవాలనుకున్నా ఇక్కడ తెలుగు పురోహితులు లేనందుకు నిరాశ చెందేవారు. ఈ విషయాన్ని సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటీ తమ సభ్యులతో చర్చించగా శ్రీ పత్రి భీమసేన తాము చేయిస్తామని స్వచ్చందగా ముందుకు వచ్చి ప్రతి సంవత్సరము కార్తీక మాసం లేదా మాపు మాసంలో తప్పకుండా వ్రతం చేయిస్తున్నారు. వారు హాంగ్కాంగ్లో మూడు దశాబ్దాలకు పైగా ఇక్కడ నివసిస్తున్నారు. దేశం కాని దేశంలో ఉన్న తెలుగు యువ జంటలకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యాలని సంకల్పం కలగటం ప్రశంసనీయమైన విషయం! పట్టు వదలకుండా కొన్ని సంవత్సరాలుగా వీరి సంకల్పాన్ని సార్థక పరచటం లో విజయాన్ని సాధిస్తున్న శ్రీమతి జయ ప్రయత్నం మరింత ప్రశంసనీయం అన్నారు శ్రీ భీమసేన గారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సారి కూడ ఎంతో శ్రద్దా భక్తులతో వ్రతం చేసుకున్న యువ జంటలకు మా హార్దిక శుభాకాంక్షలు. ఈ రోజుల్లో పాశ్చాత్య సంస్కారానికి లొంగిపోయిన యువతలో పూజ చేసే సరైన సదుపాయం లేని హాంగ్ కాంగ్లో ఈ పూజ చెయ్యాలని సంకల్పించి పూజ సామాగ్రిని ప్రయాసతో సమకూర్చుకొన్న ఈ జంటలకి, పూజ సక్రమంగా జరగటానికి దోహద పడిన స్వచ్చంద సేవకులకు హార్దిక అభినందనలు తెలిపారు. ముందుగా విఘ్నేశ్వర పూజ చేయించి తర్వాత శ్రీ రామా సహిత సత్యనారాయణ స్వామి ప్రాణ ప్రతిష్ట చేయించి, నవగ్రహాల ఆవాహనం ప్రతి గ్రహానికి అష్టోత్తర పూజ, అష్ట దిక్పాల పూజ మొదలైన వాటి తర్వాత, లక్ష్మీ సమేత శ్రీ సత్యనారాయణ ప్రతిమలకు రూపులకు పురుషసూక్త స్త్రీ సూక్త భూసూక్తాలతో అభిషేకం, పిమ్మట సత్యనారాయణ అస్టోత్తరం, సత్యనారాయణ స్వామి ప్రసాదాలు నైవేద్యం పెట్టించి వ్రత కధలు అయిదు చెప్పి, పునః పూజ తరువాత మహా నైవేద్యం, హారతితో పూజ సంపూర్ణం కాగా అందరూ ఎంతో భక్తితో ప్రసాదాలు స్వీకరించి ఆనందంగా తమ ఇళ్లకు తరలి వెళ్లారు. వీరందరూ ఎంతో ఏకాగ్రతతో మూడు గంటలసేపు కుటుంబ సమేతంగా పూజ చేసి శ్రీ సత్యనారాయణ స్వామి వారి కటాక్షాన్ని పొందారు. హిందు దేవాలయ సిబ్బంది సహకారంతో పూజామంటపాన్ని చాలా అందంగా అలంకరించిన సేవకులకు కృతజ్ఞతలు. ఈ పూజ కలకాలం నిరాటంకంగా కొనసాగాలని, అందరి సత్సంకల్పాలు దివ్యంగా నెరవేరాలని, ప్రపంచమంతా అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండేలా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని మనస్పూర్తిగా ప్రార్ధించడం జరిగింది. 2018 లో కార్తీక వనభోజనం తర్వాత, 2019లో నిరసనలు & 2020లో కోవిడ్ కారణంగా ఎటువంటి కార్యక్రమాలు జరగలేదు. రెండు ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం కార్తీక వనభోజనాలని సభ్యులందరు ఎంతో ఆనందోత్సాహాలతో కలిసి జరుపుకున్నారు. అదే రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారికి, అలాగే పెళ్లిరోజు ప్రధమ వార్షికోత్సవం జరుపుకుంటున్న యువ జంటతో పాటు మరొక జంట తమ పన్నెండవ పెళ్లిరోజుని ఎంతో సంబరంగా తెలుగు వారందరితో జరుపుకున్నారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వారిది ఒక ప్రత్యేక ఆనవాయితీ ఉందని, క్రొత్తగా హాంగ్ కాంగ్ వచ్చిన వారిని తమ పరిచయాలు తెలుపమని, తద్వారా వారికి క్రొత్త స్నేహితులు ఏర్పడటానికి అవకాశం కల్పించడం సమాఖ్య ముఖ్యోద్దేశమని వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమతి జయ పీసపాటీ తెలియజేశారు. రానున్న సంవత్సరంలో తమ సంస్థ తలపెట్టిన కార్యక్రమాల విషయాలను ప్రస్తావిస్తూ, యువతరం ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనడమే కాదు, భాద్యతలు కూడా చేపట్టాలని ప్రోత్సహించారు. ఎంతో కాలం తరువాత, ఇలా దేశం కానీ దేశంలో కార్తీక మాసంలో వనభోజనాలలో బంతి భోజనం చేయడం తమకేంతో ఆనందాన్నిచ్చిందని అందరూ తెలిపారు. -
ఈ దీపాలు కంటి వెలుగులు
ఆరుషి అగర్వాల్ గోల్డెన్ స్పూన్తో పుట్టిన అమ్మాయి. తల్లిదండ్రుల వృత్తి వ్యాపారాల రీత్యా హాంగ్కాంగ్లో పుట్టింది. సింగపూర్, యూఎస్లలో చదువుకుంది. ఏడేళ్ల కిందట ఆమె తన సొంత దేశం ఇండియాకి వచ్చింది. ఆ రావడమే ఆమె జీవన ప్రస్థానాన్ని నిర్దేశించింది. సేవా కార్యక్రమాల అవసరాన్ని గుర్తించింది. అందుకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడానికి సోషల్ ఎంటర్ప్రెన్యూర్గా మారింది. ఆరుషి యూఎస్లో గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత పెళ్లి చేసుకుని ఏడేళ్ల కిందట ఇండియాకి వచ్చింది. ఆ పర్యటన ఆమెను జాగృతం చేసింది. ఆమె సమాజంలోని అంతరాలను దగ్గరగా చూసిందప్పుడే. వాళ్లది వ్యాపార కుటుంబం. తండ్రి హోటల్ పరిశ్రమ నడిపేవాడు. వాళ్ల కుటుంబానికి ఉన్న చైన్ రెస్టారెంట్ల నిర్వహణ బాధ్యత తల్లి చూసుకునేది. కాటరాక్ట్ కారణంగా కంటి చూపు మసకబారితే ఆపరేషన్ చేయించుకునే స్థోమత లేని కారణంగా చూపును శాశ్వతంగా కోల్పోయే వాళ్లుంటారనే కఠోరమైన వాస్తవం ఆమెకు అవగతమైంది ఇండియాకి వచ్చిన తర్వాత మాత్రమే. అది కూడా ముంబయిలోని పేద కుటుంబాలను దగ్గరగా చూసినప్పుడే. ముంబయిలో ఏ రోజుకు ఆ రోజు అన్నట్లు బతుకు వెళ్లదీస్తున్న అనేక కుటుంబాల్లో ఆదివాసీలే ఎక్కువ. వారికి కంటి ఆపరేషన్లు చేయించే బాధ్యత మనసావాచా చేపట్టింది ఆరుషి. ఇదీ ఓ మార్గమే! ఆలోచన మంచిదే, కానీ ఆచరణ ఎలాగ? ఒక్క అడుగు ముందుకు వేయాలన్నా సరే... నిధులు సమకూర్చుకోవడం మొదట జరగాల్సిన పని. విరాళాల కోసం ఇంట్లో వాళ్ల ముందు కూడా చేయి చాచకూడదనుకుంది. సొంతంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనుకుంది ఆరుషి. ‘సేవ’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. పదిహేను మంది మహిళలకు సువాసనలు వెదజల్లే క్యాండిల్స్ తయారీలో శిక్షణనిచ్చి మరీ వారికి ఉద్యోగం ఇచ్చింది. ఇటలీ, ఫ్రాన్స్లలో తప్ప మనదేశంలో దొరకని అరోమాటిక్ క్యాండిల్స్ తయారు చేసి ఆన్లైన్లో అమ్మకాలు మొదలు పెట్టింది ఆరుషి. వాటి ధరలు సామాన్యులకు కాదు కదా మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతికి కూడా భారమే. ఒక్కో క్యాండిల్ పద్నాలుగు వందల నుంచి ఎనిమిది వేల రూపాయలుంటుంది. ‘ఈ క్యాండిల్ మీ ఇంట్లో చీకటిని తొలగించి వెలుగును నింపుతుంది. మీరు ఈ క్యాండిల్ కొనడం ద్వారా మరొకరికి కంటి వెలుగును ప్రసాదించినవారవుతారు’ అని చెప్పి మరీ ఆ ధరకు అమ్ముతోంది. పరోక్ష సాయం! ‘సమాజంలో అభాగ్యులకు నేరుగా సేవ చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఈ క్యాండిల్ కొనడం వల్ల పరోక్షంగా సహాయం చేయగలుగుతాం’ అనుకున్న వాళ్లు వీటిని విరివిగా కొంటున్నారు. పదిహేను మంది మహిళలకు ఉపాధి, కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోలేని వాళ్లకు ఆపరేషన్కు ఆసరా... ఈ రెండు ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. దీంతో వెలుగులు మన ఇంటికే పరిమితం కావాలనే స్వార్థం వీడి ఇతరుల జీవితాల్లో కూడా వెలుగులు నింపాలనుకునే వాళ్లు ఆరుషికి ఆలంబనగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె వెయ్యికి పైగా ఆపరేషన్లు చేయించింది. ‘ఇలాంటి క్యాండిల్స్ని ఇటలీ, ఫ్రాన్స్ల నుంచి కొనగలిగిన వారే నా కస్టమర్లు. వాళ్లు ఆ దేశాల నుంచి కొనడం కంటే మనదేశంలోని స్టార్టప్కి సహాయం చేయడానికే ఇష్టపడుతున్నారు, పైగా ఇది చారిటీ కోసం చేస్తున్న పని కావడంతో సంతోషంగా తమ వంతు విరాళం ఇచ్చినట్లు భావిస్తున్నారు’ అని చెప్తోంది ఆరుషి. మంచి పని చేయాలనే చిత్తశుద్ధి ఉంటే మార్గం కూడా దానంతట అదే గోచరిస్తుంది. -
హాంకాంగ్లో ఘనంగా దసరా ఉత్సవాలు
హాంగ్ కాంగ్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలు జయ పీసపాటి ఆధ్వర్యంలో హాంగ్ కాంగ్ లో దసరా శరన్నవరాత్రి అంబురాలు సంబరాన్నంటాయి. ముఖ్యంగా భారతీయులు దుర్గ పూజలు, అష్టమి నాడు కన్య పూజలు, విజయదశమి నాడు రావణ దహనం చేయడం స్థానికుల్ని విశేషంగా ఆకట్టుంది. దీంతో హాంగ్ కాంగ్ వీధులు దసరా వేడుకలతో శోభాయమానం సంతరించుకున్నాయి. స్థానికులు సైతం భారతీయుల సంస్కృతి, సాంప్రదాయాల గురించి తెలుసుకునేందుకు ఉత్సహం చూపించారు. ముఖ్యంగా దసరా సందర్భంగా 9రోజుల పాటు పూలనే దేవతలుగా ఆరాధించి 9రోజులు 9రూపాల్లో బతుకమ్మను తయారుచేసి, పాటలు పాడుతూ భక్తిశ్రద్ధలతో బతుకమ్మ పండుగను వయోభేదం లేకుండా ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లగానే ఈ ఏడాది దసర ఉత్సవాల్ని జరిపారు. ప్రతిఏడాది దసరా అంటే స్థానికంగా ఉండే భక్తులు పారాయణనానికి వెళ్ళేటప్పుడు పండ్లు, పూలు, బహుమతులు తీసుకువెళ్ళే వారు. కానీ ఈ సంవత్సరం దసరా వేడుకల్లో భక్తులు కానుకల్ని అందించారు. భక్తులు చదివించిన ఆ కానుకల్ని స్వచ్చంద సంస్థలకు అందించడం సంతోషంగా ఉందంటూ ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు జయ పీసపాటీ ప్రశంసల వర్షం కురిపించారు. -
చైనా ‘ఎవర్గ్రాండ్’: దెబ్బ మీద దెబ్బ
China Evergrande shares fall: కరోనా సవాళ్లకు తోడు రియల్టీ రంగం సంక్షోభంతో ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ (చైనా) మందగమనంలో ఉంది. ఈ తరుణంలో తాజాగా మరో భారీ పతనం చైనాను కోలుకోలేని దెబ్బతీసింది. ప్రపంచంలోనే ప్రఖ్యాత నిర్మాణ సంస్థగా పేరు దక్కించుకున్న ఎవర్గ్రాండ్.. డిఫాల్టర్ మరకను అంటించుకునే టైం దగ్గర పడింది. చైనా ప్రాపర్టీ దిగ్గజం ‘ఎవర్గ్రాండ్’(ఎవర్గ్రాండే) షేర్లు భారీగా పతనం అయ్యాయి. పదిహేడు రోజుల విరామం అనంతరం.. గురువారం ఉదయం హాంకాంగ్ స్టాక్ ఎక్సేంజ్లో 14 శాతం పతనాన్ని చవిచూశాయి. ఇప్పటికే ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఎవర్గ్రాండ్.. యూనిట్లలో ఒకదానిని 2.6 బిలియన్ డాలర్లకు అమ్మేయాలనుకున్న ప్రయత్నం విఫలం అయ్యింది. దీంతో షేర్లు ఒక్కసారిగా పతనం అవుతున్నాయి. ఇది అంతర్జాతీయ మార్కెట్లో వణుకు పుట్టిస్తోంది. ఈ ప్రభావంతో గృహ నిర్మాణ రంగం మందగమనంలో కూరుకుపోయి ప్రపంచవ్యాప్తంగా మెటల్ షేర్లకు డిమాండ్ తగ్గవచ్చనే ఆందోళనలు అధికమయ్యాయి. ఎవర్గ్రాండే ప్రాపర్టీస్ సర్వీసెస్లో 51 శాతం భాగాన్ని.. హోప్సన్ డెవలప్మెంట్ హోల్డింగ్స్కు అమ్మాలనుకున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలనుకుంటున్నట్లు బుధవారం అధికారికంగా ఒక ప్రకటన చేసింది కూడా. అయితే హోప్సన్ డెవలప్మెంట్ మాత్రం ఎవర్గ్రాండ్ విధించిన తలాతోకలేని షరతుల వల్లే తప్పుకుంటున్నట్లు ప్రకటించడం విశేషం. చైనాకు చెందిన అతిపెద్ద(రెండవ) రియల్ ఎస్టేట్ డెవలపర్.. గ్లోబల్ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటిగా ఉండేది. సంస్థ జారీ చేసిన బాండ్లపై సెప్టెంబర్ 23నాటికి కట్టాల్సిన 80 మిలియన్ డాలర్లవడ్డీని చెల్లించలేనని ఎవర్గ్రాండ్ కిందటి నెలలో ప్రకటించడంతో ఒక్కసారిగా ఇన్వెస్టర్లు షాక్కు గురయ్యారు. అంతేకాదు 305 బిలియన్ డాలర్ల అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు నిర్ధారణ కావడంతో రియల్టీ రంగం ఉలిక్కిపడింది. అయితే ఈ సంక్షోభాన్ని తాము తట్టుకుని నిలదొక్కుకుంటామన్న ఎవర్గ్రాండ్ ఫౌండర్ క్జూ జియాయిన్(హుయి కా యాన్) హామీ ఫలించడం లేదు. తాజాగా షేర్లు భారీగా పడిపోతుండడంతో.. చైనాలో అతిపెద్ద కార్పొరేట్ పతనం తప్పదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే జరిగితే గ్లోబల్ మార్కెట్ కుదేలు కావడం ఖాయం. ఇక ఎవర్గ్రాండే షేర్లు చివరిగా 2010 మేలో కనిష్ట స్థాయిలో ట్రేడ్ కాగా.. ఇప్పుడు అంతకు మించే పతనం కావడం మరో విశేషం. షెంజెన్ కేంద్రంగా చైనా రియల్ ఎస్టేట్ రంగంలో రెండో స్థానంలో ఉన్న ఎవర్గ్రాండే.. పోయిన నెలలో పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పటికే డిఫాల్టర్ జాబితాలో చేరాల్సి ఉండగా.. అది కొంచెం ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. షేర్ల పతనంతో కుదేలు అవుతున్న తరుణంలో.. కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. బకాయిల్లో 83.5 మిలియన్ డాలర్ల చెల్లింపులు చేపట్టాలని 30 రోజుల గడువు విధించిన విషయం తెలిసిందే. ఒకవేళ అది జరగకుంటే ఎవర్గ్రాండ్ను డిఫాల్టర్గా ప్రకటిస్తారు. ఘనం నుంచి పతనం ఎవర్గ్రాండ్.. 1996 చైనాలో అర్బనైజేషన్ ఉవ్వెత్తున్న కొనసాగిన టైంలో ఏర్పాటైన రియల్ ఎస్టేట్ గ్రూప్. 2009లో 722 మిలియన్ డాలర్ల ఐపీవో ద్వారా హాంకాంగ్ స్టాక్ ఎక్సేంజ్లో కొత్త రికార్డు నెలకొల్పింది. ఆపై 9 బిలియన్ డాలర్లతో చైనాలోనే అతిపెద్ద ప్రైవేట్ ప్రాపర్టీ కంపెనీగా అవతరించింది. అంతేకాదు వ్యవస్థాపకుడు క్జూ జియాయిన్(హుయి కా యాన్) ను అపర కుబేరుడిగా మార్చేసింది. 2010లో గువాన్గ్జౌ ఫుట్బాల్ టీం కొనుగోలు చేయడం, టూరిజం రిక్రియేషన్ వ్యాపారాలతోనూ వార్తల్లోకి ఎక్కింది. వాటర్ బాటిల్స్ తయారీ, ఈవీ తయారీ రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టింది. అయితే కిందటి ఏడాది అగష్టులో ప్రభుత్వం డెవలపర్స్ మీద ఉక్కుపాదం మోపడం, అడ్డగోలు డిస్కౌంట్లతో అమ్మకాల నుంచి ఎవర్గ్రాండ్ పతనం మొదలైంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్పా.. డిఫాల్ట్ గండం నుంచి ఎవర్గ్రాండ్ బయటపడే పరిస్థితులు కనిపించడం లేదు. - సాక్షి, వెబ్స్పెషల్ -
నిజంగా ఆపిల్ పండు లాంటి బిడ్డ, కట్ చేస్తే..
ఆపిల్పండు లాంటి బిడ్డను కనమని కాబోయే తల్లులను దీవిస్తుంటారు పెద్దలు. కానీ, సింగపూర్లో నిజంగానే యాపిల్ పండు సైజులో ఓ బిడ్డ పుట్టింది. అయితే బతకడం కష్టమనుకున్న తరుణంలో దాదాపు 25 వారాలపాటు శ్రమించిన డాక్టర్లు.. ఎట్టకేలకు ఆ బిడ్డను ఆరోగ్యవంతమైన బరువుకు తీసుకొచ్చి ప్రాణాలు కాపాడారు. సింగపూర్లోని నేషనల్ యూనివర్సిటీ హాస్పిటల్(NUH)లో కిందటి ఏడాది జూన్ 9న నెలలు నిండకుండానే ఓ పాప పుట్టింది. కేవలం 24 సెంటీమీటర్ల పొడవు, కేవలం 212 గ్రాముల బరువుతో పుట్టందా పాప. దీంతో సగటు ఆపిల్ పండు కన్నా తక్కువ బరువు ఉందంటూ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది ఆ చిన్నారి. అయితే బతకడం కష్టమని డాక్టర్లు తేల్చేయడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. వాళ్ల శోకాన్ని అర్థం చేసుకుని రిస్క్ చేసి మరీ 13 నెలలపాటు ఫ్రీ ట్రీట్మెంట్ ద్వారా ప్రయత్నించారు ఎన్హెచ్యూ వైద్యులు. 13 నెలల ఐసీయూ చికిత్సలో అద్భుతం జరిగింది. చివరికి 6.3 కేజీల ఆరోగ్యవంతమైన బరువుకు చేరిన ఆ చిన్నారిని.. ఈమధ్యే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ బిడ్డకు వెక్(క్వెక్) యూ గ్జువాన్ అని పేరుపెట్టుకున్న ఆ తల్లిదండ్రులు.. చిన్నారి ఆరోగ్యంగా తమ చేతికి దక్కడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ లోవా రికార్డుల ప్రకారం.. అమెరికాలో 245 గ్రాముల బరువుతో పుట్టిన చిన్నారి పేరిట రికార్డు ఉండగా.. వెక్ యూ గ్జువాన్ ఆ రికార్డును చెరిపేసింది. -
జలపాతం అంచున సెల్ఫీ, అనూహ్యంగా మృత్యు ఒడిలోకి
హాంకాంగ్: డేర్డెవిల్ ఇన్ఫ్లూయెన్సర్ సోఫియా చుంగ్ (32) సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ కింద పడి మరణించింది. వాటర్ఫాల్ అందాలు వీక్షించడానికి శనివారం తన స్నేహితులతో కలిసి హాంకాంగ్లోని హాపాక్లై అనే పార్క్కు వెళ్లిన ఆమె అక్కడి అందాలను వీక్షిస్తూ మైమరిచిపోయింది. ఈ సందర్భంగా తన స్నేహితులతో కలిసి జలపాతం అంచున సెల్ఫీ దిగడానికి ప్రయత్నించగా పట్టు తప్పి కింద పడిపోయింది. సుమారు 16 అడుగుల ఎత్తు నుంచి పడటంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. సోఫియాను పరీక్షించిన వైద్యులు ఆమె మరణించినట్లు ధృవీకరించారు. కాగా సోఫియా కొండలు, గుట్టలు ఎక్కుతూ ప్రమాదకర విన్యాసాలు చేస్తూ పాపులారిటీ సంపాదించుకుంది. డేంజరస్ స్టంట్లు చేయడంతో పాటు వాటి ఫొటోలను ఫాలోవర్లతో పంచుకునేది. ఇక ఆమె ఇన్స్టాగ్రామ్లో.. అభిమానులందరికీ మంచి వీకెండ్ ఉండాలని ఆశిస్తూ పెట్టిన ఆఖరి పోస్ట్ వైరల్గా మారింది. 'అందరికీ మంచి జరగాలని ఆశించిన నువ్వు ఇప్పుడు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయావు' అంటూ నెటిజన్లు సోఫియాకు నివాళులు అర్పిస్తున్నారు. -
హాంకాంగ్లో ‘యాపిల్ డైలీ’ కథ ముగిసింది
హాంకాంగ్: హాంకాంగ్ ప్రజాస్వామ్య డిమాండ్కు మద్దతుగా నిలిచిన చివరి పత్రిక ‘యాపిల్ డైలీ’ మూతపడింది. గురువారం ఆ పత్రిక చివరి సంచిక వెలువడింది. మొత్తం 10 లక్షల కాపీలు గంటల వ్యవధిలోనే అమ్ముడయ్యాయి. యాపిల్ డైలీ కాపీల కోసం పాఠకులు ఎగబడ్డారు. దుకాణాల ముందు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. అర్ధ స్వయంప్రతిపత్తి కలిగిన హాంకాంగ్పై పూర్తిగా పట్టుబిగించేందుకు డ్రాగన్ దేశం చైనా పావులు కదుపుతోంది. హాంకాంగ్ ప్రజాస్వామ్య ఉద్యమాలను కఠినంగా అణచివేస్తోంది. ఇన్నాళ్లూ ప్రజా పోరాటాలకు అండగా నిలిచిన యాపిల్ డైలీ పత్రిక మూతపడడంతో ఇక చైనాకు మరింత బలం చేకూరినట్లేనన్న వాదన వినిపిస్తోంది. జాతీయ భద్రతకు ప్రమాదం కలిగించేలా విదేశీ శక్తులతో కలిసి పనిచేస్తోందంటూ యాపిల్ డైలీపై చైనా పాలకులు కన్నెర్ర చేశారు. ఇటీవల ఆ పత్రికకు చెందిన ఐదుగురు సంపాదకులను అరెస్టు చేశారు. కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. 2.3 మిలియన్ డాలర్ల విలువైన యాపిల్ డైలీ ఆస్తులను స్తంభింపజేశారు. ఈ నేపథ్యంలో ఇక పత్రికను మూసివేయడమే శరణ్యమని యాపిల్ డైలీ యజమానులు నిర్ణయాని కొచ్చారు. ఈ పత్రిక మూతపడడం హాంకాంగ్లో పత్రికా స్వేచ్ఛకు చీకటి రోజని జార్జిటౌన్ సెంటర్ ఫర్ ఆసియన్ లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ థామస్ కెల్లాగ్ చెప్పారు. హాంకాంగ్ డౌన్టౌన్లో యాపిల్ ప్రతుల కోసం ప్రజల క్యూ -
ట్రైన్లో అడవి పంది: భళే పరుగులు తీస్తుందే!!
హాంకాంగ్: సాధారణంగా పక్షులు దారి తప్పి వచ్చి బస్సులు, రైళ్లలో చిక్కుకున్న సందర్భాలను చూశాం. మరికొన్ని చోట్ల కోతులు సైతం రైళ్లలోకి దూకి అల్లరి చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ అడవి పంది రైళులోకి వచ్చి.. బోగీ మొత్తం అటూ ఇటూ పరుగులు తీసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హాంకాంగ్ ద్వీపంలోని క్వారీ బే స్టేషన్లో టికెట్ కౌంటర్ వద్ద ఓ పంది పిల్ల జారి పడిపోయి ఓ ట్రైన్లోకి చేరుకుంది. దానికి బయటకు ఎలా వెల్లాలో తెలియక ట్రైన్ బోగీలో అటూ ఇటూ పరుగులు తీసింది. దీంతో రైలు ప్రయాణికుల ద్వారా సమాచారం అందుకున్న ట్రైన్ సిబ్బంది ఆ చిన్న అడవి పందిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ, ఆ పంది వేగంగా వారికి చిక్కకుండా పరుగు తీసింది. ఇక కొన్ని స్టాప్ల తర్వాత పంది పిల్ల మరో రైలులోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. ఇక ఆ ట్రైన్ డిపో చేరుకున్న తర్వాత సిబ్బంది జంతు పరిరక్షణ అధికారుల సాయంతో పంది పిల్లను పట్టుకొని అడవిలోకి వదిలేశారు. పలు ఆకాశహర్మ్యాలు ఉండే హాంకాంగ్లో కూడా పర్యతాలు, ఉద్యానవనాలు అధికంగానే ఉన్నాయి. అయితే వాటిలో ఈ అడవి పందులు సంచరిస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ వీడియోను హాంకాంగ్ వైల్డ్ బోర్ కాన్సెర్న్ అనే ఫేస్బుక్ ఖాతా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఇప్పటివరకు రైళ్లలో పక్షులు రావడామే చూశాం. ఇప్పడు అడవి పంది కూడా!!’, ‘వావ్..! రైలులో ఆ అడవి పంది భళే పరుగులు తీస్తుందే!’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: బెంగాల్ టైగర్: అటు కాదురా బాబూ.. ఇటూ.. -
హాంకాంగ్లో మీడియాపై... జాతీయ భద్రతా చట్టం ప్రయోగం
హాంకాంగ్: చైనా పాలకుల కర్కశత్వానికి మరో తార్కాణం. హాంకాంగ్లో ప్రజాస్వామ్య గళాలను అణచివేయడమే లక్ష్యంగా తీసుకొచ్చిన జాతీయ భద్రతా చట్టాన్ని తొలిసారిగా మీడియాపై ప్రయోగించారు. యాపిల్ డైలీ అనే పత్రికకు చెందిన ఐదుగురు ఎడిటర్లు, కార్యనిర్వాహకులను పోలీసులు ఈ చట్టం కింద గురువారం అరెస్టు చేశారు. ఈ పత్రికలో ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమ వార్తలను ప్రచురిస్తుంటారు. హాంకాంగ్కు చైనా చెర నుంచి విముక్తి లభించాలని, స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కావాలని యాపిల్ డైలీ గట్టిగా నినదిస్తోంది. చైనా, హాంకాంగ్పై ఇతర దేశాలు ఆంక్షలు విధించేలా కుట్ర పన్నడమే ధ్యేయంగా 30కిపైగా ఆర్టికల్స్ను ఈ పత్రిక ప్రచురించినట్లు ఆధారాలున్నాయని పోలీసులు వెల్లడించారు. -
హాంకాంగ్లో ఘోర అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి.. మరో 132 మంది
హాంకాంగ్: మధ్య చైనా నగరంలోని హుబీ ప్రావిన్స్లోని షియాన్ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ భవనంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో దాదాపు 138 మంది తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఉదయం 6:30 గంటలకు జరిగిన ఈ ఘటనలో పేలుడు ధాటికి ఆహార మార్కెట్ భవనం కూలిపోయింది. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న 150 మందిని రక్షించారు. ఇక మిగతా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. గాయపడిన వారిని షియాన్లోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. చదవండి: పెళ్లైన రెండో రోజే.. మాజీ ప్రియురాలి చేతిలో ప్రియుడి హత్య.. ఎందుకంటే? -
శ్మశానాలను తవ్వేసి.. భారీ భవంతులు
శాన్మార్కోస్ (యూఎస్): ప్రపంచ జనాభా వేగంగా పెరుగుతోంది. మరోవైపు భూమి విస్తీర్ణం మాత్రం పరిమితం. అందుబాటులో ఉన్న భూమితోనే అవసరాలు తీర్చుకోవాల్సి వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని నగరాల్లో మృతదేహాలను ఖననం చేయడానికి సైతం స్థలం దొరకడం లేదు. భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సింగపూర్లో పాత శ్మశానాలను తవ్వేసి, భారీ భవంతులు కట్టేస్తున్నారు. కొత్త శ్మశానాలను ఏర్పాటు చేయకపోవడం, స్థలం కొరత వల్ల అంత్యక్రియల విషయంలో ఆచారాలను సైతం మార్చుకోవాల్సి వస్తోంది. శ్మశానాల కోసం దొరకని స్థలం అగ్రరాజ్యం అమెరికాలోనూ శ్మశానాల కోసం స్థలం దొరకడం లేదంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సింగపూర్లో ప్రభుత్వం శ్మశానాల స్థానంలో కొలంబరియ్స్ నెలకొల్పుతోంది. ఒక ఎత్తయిన గోడ లాంటిది కట్టి, మధ్యలో గూళ్లు ఏర్పాటు చేస్తున్నారు. మృతుల అస్థికలతో కూడిన కలశాలను ఈ గూళ్లలో ఉంచుతున్నారు. పూర్వీకుల జ్ఞాపకార్థం ఇక్కడే ప్రార్థనలు చేసుకోవాలి. సింగపూర్లో ఒక మృతదేహాన్ని 15 ఏళ్ల పాటే శ్మశానంలో ఖననం చేయాలి. తర్వాత వెలికి తీసి, దహనం చేయాలి. అస్థికలను కలశాల్లో భద్రపర్చుకోవచ్చు. అదే స్థలంలో మరో మృతదేహాన్ని ఖననం చేస్తారు. దహనాలకే ప్రాధాన్యం: హాంకాంగ్లో భూముల విలువ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ స్థలాలు ప్రపంచంలోనే అత్యధిక ధర పలుకుతుంటాయి. శ్మశానాల్లో పార్థివ దేహాల ఖననానికి అవసరమైన స్థలాలను ధనవంతులు మాత్రమే కొనుక్కోగలరు. అందుకే హాంకాంగ్ ప్రభుత్వం ఖననం కంటే దహనాలకే ప్రాధాన్యం ఇస్తోంది. గ్రామాలకు తరలిపోదాం: వృద్ధుల జనాభా పెరిగి, జననాలు తక్కువగా ఉన్న జపాన్లో సైతం శ్మశానాల కొరత 1970ల నుంచే మొదలైంది. అందుకే అక్కడి అధికారులు గ్రామీణ ప్రాంతాలను ఎంచుకున్నారు. నగరంలో ఎవరైనా చనిపోతే కుటుంబసభ్యులు, బంధు మిత్రులు ఒక బస్సులో మృతదేహంతోపాటు యాత్రగా బయలుదేరుతారు. గ్రామానికి దూరంగా తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేస్తారు. జపాన్లో 1990ల్లో ‘గ్రేవ్–ఫ్రీ ప్రమోషన్ సొసైటీ’ అనే సంస్థ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. మృతదేహాన్ని దహనం చేసి, బూడిదను భూమిపై వెదజల్లాలని ప్రచారం చేసింది. అయితే, ఈ విధానం ఆదరణ పొందలేదు. వృక్ష సమాధితో పర్యావరణ పరిరక్షణ ఉత్తర జపాన్లోని షౌన్జీ టెంపుల్ 1999 నుంచి నవీన ఆవిష్కరణకు తెరతీసింది. అదేమిటంటే.. వృక్ష సమాధి(ట్రీ బరియల్). దీన్ని జపాన్ భాషలో జుమొకుసో అంటారు. ఇందులో శవాన్ని దహనం చేస్తారు. అస్థికలు, బూడిదను ఒకచోట భూమిలో పాతిపెట్టి, దానిపై మొక్క నాటుతారు. అదే ఆ మనిషి సమాధి. అది వృక్షంగా మారుతుంది. కుటుంబ సభ్యులు ఏటా అక్కడే ప్రార్థనలు చేస్తారు. ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడిన సులభమైన పద్ధతి అని షౌన్జీ టెంపుల్ చెబుతోంది. ప్రభుత్వం అనుమతించిన చోట ఒక వృక్ష సమాధి ఏర్పాటయ్యాక క్రమంగా ఇతరులూ అదే తరహా సమాధులు ఏర్పాటు చేసుకుంటున్నారు. తర్వాతి కాలంలో అదొక పెద్ద వనంగా మారుతోంది. ఇలా పర్యావరణాన్ని పరిరక్షించినట్లు అవుతోందని నిపుణులు అభినందిస్తున్నారు. షౌన్జీ టెంపుల్కు చెందిన స్థలంలో చిషోయిన్ పేరిట వృక్ష సమాధులతో ఒక చిట్టడవి ఏర్పడింది. ఈ శ్మశానంలో కేవలం పెద్దపెద్ద చెట్లే కనిపిస్తాయి. రాళ్లు, సమాధులు గుర్తులు కనిపించవు. మృతుల కుటుంబ సభ్యులు, మత గురువులు ఈ చెట్ల వద్ద ప్రార్థనలు చేస్తారు. సాధారణంగా బౌద్ధులు పర్యావరణ పరిరక్షణను ఆచారంగా పాటిస్తారు. సహజ ప్రకృతి ప్రపంచంలోనే దేవుడుంటాడని నమ్ముతారు. అందుకే ట్రీ బరియల్స్కు జపాన్లో ఆదరణ పెరుగుతోంది. చదవండి: కుప్పకూలిన విమానం: 12 మంది దుర్మరణం చదవండి: కోవిడ్ టీకా డోస్ల వృథాలో జార్ఖండ్ టాప్ -
గ్రేస్ ది రోబో.. కరోనా పేషెంట్ల కోసమే!
సోఫియా రోబో గుర్తుందా? ప్రపంచంలోనే అధికారిక గుర్తింపు పొందిన తొలి హ్యూమనాయిడ్ రోబో. ఈ రోబోను తయారు చేసిన కంపెనీనే ఇప్పుడు మనిషిలాంటి మరో మరమనిషిని తయారుచేసింది. దాని పేరు గ్రేస్. కరోనా కష్టకాలంలో పేషెంట్ల బాగోగులు చూసుకోవడం కోసమే దీనిని సృష్టించడం విశేషం. హంకాంగ్కు చెందిన హన్సన్ రోబోటిక్స్ టెక్ సైంటిస్టుల టీం గ్రేస్ను తయారు చేసింది. కరోనాతో ఐసోలేషన్లో ఉన్నవాళ్ల కోసం.. ముఖ్యంగా వయసు మళ్లిన వాళ్ల బాగోగుల ఈ రోబోను రూపొందించారు. గోధుమ రంగు విగ్గు, ఏషియన్ ముఖకవళికలతో బ్లూ నర్స్ గెటప్తో గ్రేస్ను ముస్తాబు చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీతో పనిచేసే ఈ రోబో చెస్ట్లో ఒక థెర్మల్ కెమెరా ఉంటుంది. ఇది అవతలి వాళ్ల టెంపరేచర్ను స్కాన్ చేసి వాళ్ల ఆరోగ్య స్థితిగతులపై ఒక అంచానకు వస్తుంది. అంతేకాదు ఆ పేషెంట్లకు అవసరమైన సహాయాన్ని అందిస్తుంది. హాంకాంగ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్లో గ్రేస్ సామర్థ్యం పరిశీలించిన తర్వాతే అనుమతులు పొందగలిగామని కంపెనీ వ్యవస్థాపకుడు డేవిడ్ హన్సన్ తెలిపాడు. మనిషి పోలికలతో ఉండే రోబోలు.. ఈ కరోనా టైంలో ఐసోలేషన్లో ఉన్నవాళ్లతో ఇంటెరాక్ట్ అయ్యేందుకు సరైనవని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఇంగ్లీష్తో పాటు మాండరిన్, కాంటోనీస్ భాషల్ని ఇది మాట్లాడగలుగుతుంది. ఆసియా హెల్త్ కేర్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన గ్రేస్ రోబోను ధరను ఇంకా నిర్ధారించలేదు. సోఫియా.. 2016లో హన్సన్ రోబోటిక్స్ తయారు చేసిన సూపర్ ఇంటెలిజెంట్ హ్యూమనాయిడ్ రోబో. ఇది మనుషుల్లాగే ప్రవర్తించడంతో పాటు జోకులు కూడా చెబుతుంది. 2017లో సోఫియాకి సౌదీ అరేబియా అక్కడి చట్టప్రకారం పౌరసత్వం ఇచ్చింది. అయినప్పటికీ సోఫియా పని తీరుపై నీలినీడలు అలుముకున్నాయి. అయితే రానున్న రోజుల్లో హ్యూమనాయిడ్స్కు లైన్ క్లియర్ అయ్యే అవకాశాల మీదే హన్సన్ రోబోటిక్స్ ఆశలు పెట్టుకుంది. చదవండి: రోబోకి చెల్లి ఇది -
వ్యాక్సినేషన్: టెస్లాకారు, ఇల్లు.. బహుమతుల బొనాంజా
హాంకాంగ్ : కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి గుడ్న్యూస్. హాంకాంగ్ నగరంలో వ్యాక్సినేషన్ పూర్తి చేసిన వారికి ఖరీదైన టెస్లా కార్లను, గోల్డ్ బార్లను అందించనున్నాయి అక్కడి కార్పొరేట్ సంస్థలు. వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రజలను ప్రోత్సాహించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా లీకా షింగ్ సీకే గ్రూప్, తన ఛారిటబుల్ సంస్థలతో కలిపి మంగళవారం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఫోటోలను షేర్ చేసిన వారికి లాటరీ ద్వారా 2.6 మిలియన్ డాలర్ల విలువైన షాపింగ్ వోచర్లను గిఫ్ట్గా ఇవ్వనుంది. మరో బిలియనీర్ అడ్రియన్ చెంగ్ నేతృత్వంలోని న్యూ వరల్డ్ గ్రోత్ కో ద్వారా టీకా తీసుకున్న అల్పాదాయ వర్గాల వారికి హాంకాంగ్ నగరంలో10 మిలియన్ డాలర్లను ఆఫర్ చేయనుందని ప్రభుత్వ ముఖ్య అధికారి క్యారీ లామ్ తెలిపారు. ఇంటిని గెల్చుకోవచ్చు! హాంకాంగ్లోని పటు కార్పొరేట్ కంపెనీలు, రెస్టారెంట్లు తమ ఉద్యోగులకు నగదు చెల్లింపులు, వోచర్లు ఇతర ప్రయోజనాలను ఇప్పటికే ప్రకటించాయి. తాజాగా సినో గ్రూప్నకు చెందిన చారిటీ విభాగం ఎన్జీ టెంగ్ ఫాంగ్ ఛారిటబుల్ ఫౌండేషన్, చైనీస్ ఎస్టేట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ సంయుక్తంగా గత నెలలో క్వాన్ టోంగ్ ప్రాంతంలో 1.4 మిలియన్ల అపార్ట్మెంటును బహుమతిగా అందిస్తామని వెల్లడించాయి. అలాగే మరో రెండు వేర్వేరు ప్రధాన హాంకాంగ్ కంపెనీలు కూడా ఈ నెలలో ప్రోత్సాహక ప్యాకేజీలను ప్రవేశపెట్టాయి. హాంకాంగ్కు చెందిన అతిపెద్ద డెవలపర్ సోలార్ హంగ్ కై ప్రాపర్టీస్ లిమిటెడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారికి ఐఫోన్లతోపాటు, ఇతర బహుమతులను అందిస్తోంది. బిజినెస్ టైకూన్ లీ షా కీ, హెండర్సన్ ల్యాండ్ గ్రోత్ కంపెనీ గోల్డ్ బార్స్ ఆఫర్ చేస్తోంది. దీంతోపాటు ఆస్ట్రేలియన్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ ఏజెన్సీ గుడ్మాన్ గ్రూప్ ఆగస్టు 31 నాటికి టీకాలు వేసుకున్న వారికోసం ఒక లాటరీని స్కీంను ప్రకటించింది. ఒక మిలియన్కు పైగా హాంకాంగ్ డాలర్ల బహుమతిని లాటరీ ద్వారా అందిస్తుంది. ఇందులో భాగంగా 5 లక్షల హాంకాంగ్ డాలర్ల విలువైన టెస్లా మన్నెక్విన్ 3 కారును కూడా అందించనున్నామని గుడ్మ్యాన్ ప్రతినిధి వెల్లడించారు. చదవండి : Petrol, diesel prices: పెట్రో బాంబు, రికార్డు ధర Alzheimer: అల్జీమర్సా..ఈ వీడియో చూస్తే.. -
‘తియాన్మెన్ స్క్వేర్’ సంస్మరణపై చైనా ఉక్కుపాదం
హాంకాంగ్: హాంకాంగ్లో జరగబోయే తియాన్మెన్ స్క్వేర్ సంస్మరణ కార్యక్రమాలపై చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హాంకాంగ్లో ఎలాంటి స భలు, సమావేశాలు, కార్యక్రమాలకు అనుమతి లే దని తేల్చిచెప్పింది. ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చ ర్యలు తప్పవని హెచ్చరించింది. చైనాలో ప్రజాస్వామ్య వ్యవస్థ కావాలని డిమాండ్ చేస్తూ 1989 జూన్ 4న బీజింగ్లోని తియాన్మెన్ స్క్వేర్లో వేలాది మంది విద్యార్థులు సమావేశమయ్యారు. చైనా సైన్యం వారిపై దమనకాండ సాగించింది. ఈ ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోయా రు. ఈ మా రణకాండలో బలైన విద్యార్థుల త్యాగాలను స్మరించుకొనేందుకు ప్రతిఏటా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే, చైనా కమ్యూనిస్టు ప్రభుత్వ ఆంక్షలు పెరగడంతో ప్రధాన సంస్మరణ కార్యక్రమాలను హాంకాంగ్లో నిర్వహిస్తున్నారు. కరోనా వల్ల హాంకాంగ్లోని విక్టోరియా పార్క్ పరిసరాల్లో ఈసారి వీటికి అనుమతి ఇవ్వ బోమని చైనా సర్కారు తేల్చిచెప్పింది. గత ఏడాది విక్టోరియా పార్క్లో వేలాదిమంది సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరోవైపు హాంకాంగ్లో క్యాండిల్ లైట్ ర్యా లీకి పిలుపునిచ్చిన చౌ హాంగ్ తుంగ్ అనే ఉద్యమకారిణిని, సంస్మరణ కార్యక్రమాలపై సోషల్ మీడియాలో ప్రచారం సాగిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంక్షలున్నప్పటికీ, జనం పెద్ద సంఖ్యలో విక్టోరియా పార్క్ వద్దకు చేరుతున్నట్లు సమాచారం. -
అక్కడ చదరపు అడుగు రూ.12లక్షలు పై మాటే!
విక్టోరియా : మనదేశంలో కోవిడ్-19 కారణంగా రియల్ ఎస్టేట్ కుదేలవటం, లాక్డౌన్తో నిర్మాణ రంగ కూలీలంతా తమ సొంతూళ్లకు వలసపోవడంతో సేల్స్ నేలచూపులు చూస్తున్నాయి. అయినా సరే అద్దె ఇంట్లో నివసించే ఎక్కువ శాతం మంది సొంతంగా ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. మనదేశంలో పరిస్థితి ఇలా ఉంటే విదేశాల్లో కారు పార్కింగ్కు సైతం కోట్లు కుమ్మరించాల్సి వస్తుంది. దీంతో కొనుగోలు దారులు వామ్మో కారు పార్కింగ్కు ఇంత ఖరీదా అంటూ ముక్కున వేలేసేకుంటున్నారు. బ్లూమ్బర్గ్ బిజినెస్ మ్యాగజైన్ కథనం ప్రకారం.. హాంకాంగ్ వాన్ ఛాయ్ జిల్లాలో అత్యంత రద్దీ ప్రాంతం మౌంట్ నికల్సన్. ఇక్కడ కొండల మీద ఇళ్లు వాటి ఎదురుగా విమానాశ్రయం. ఇంటి బయట కూర్చుంటే వీచే చల్లటి గాలులతో ఆ ప్రాంతంలో నివసించేందుకు సంపన్నులు మక్కువ చూపుతుంటారు. దీంతో ఆ ప్రాంతంలో నిర్మించుకున్న ఇళ్లు .. ప్రపంచంలో అత్యంత ఖరీదైనవిగా గుర్తింపు పొందాయి. ప్రతి ఏడు బ్లూమ్ బెర్గ్ అత్యంత ఖరీదైన ఇళ్ల జాబితాలో ఈ ప్రాంతంలో నిర్మించిన ఇళ్లు ప్రథమస్థానాన్ని సంపాదించుకుంటున్నాయి.ఈ ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉండడం, నిర్మించుకునేందుకు ప్లేసులు లేకపోవడంతో ఇప్పటికే ఇళ్లను నిర్మించుకున్న యజమానులు, ఇళ్ల పార్కింగ్ స్థలాన్ని కోట్లలో అమ్ముకుంటున్నారు. పార్కింగ్ ఏరియాల్ని కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు ఎగబడుతున్నారు. తాజాగా ఈ ప్రాంతంలో 12.5 చదరపు మీటర్లు (135 చదరపు అడుగుల) ఓ అపార్ట్ మెంట్ కారు పార్కింగ్ స్థలం 1.3 మిలియన్లకు అమ్ముడైనట్లు బ్లూమ్ బెర్గ్ తన నివేదికలో పేర్కొంది. ఇదే స్థలం ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 9,49,16,380.00గా ఉంది. ఫైనాన్షియల్ సంస్థ యూబీఎస్ 2019 నివేదిక ప్రకారం.. ఓ సాధారణ ఉద్యోగి ఇక్కడ 60 చదరపు మీటర్ల ఫ్లాట్ కొనడానికి 22 సంవత్సరాల ఆదాయం అవసరం అవుతుందని తెలిపింది. కాగా ఈ సంవత్సరం, 3,378 చదరపు అడుగుల పెంట్ హౌస్ 59 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది, ఇది చదరపు అడుగుకు,రూ.12,78,185.12 మార్క్ చేరి కొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. చదవండి : 'అద్దె ఇంట్లో ఉండలేం బాబోయ్..సొంతిల్లే కొనుక్కుంటాం' -
Hong Kong: జిమ్మీలాయ్కి 14 నెలల జైలు
హాంకాంగ్: హాంకాంగ్లో ప్రజాస్వామ్య అనుకూలవాదులపై చైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. స్థానిక మీడియా అధిపతి, ప్రజాస్వామ్య అనుకూలవాది అయిన జిమ్మీ లాయ్(73)కి హాంకాంగ్ న్యాయస్థానం శుక్రవారం మరో 14 నెలల జైలు శిక్ష విధించింది. 2019లో అనుమతి లేకుండా ర్యాలీలు చేపట్టారన్న నేరంపై ఇప్పటికే ఆయన జైలులో ఉన్నారు. 2019 ఆందోళనల సమయంలోనే అనధికారికంగా గుమికూడారన్న మరో కేసులో లాయ్తోపాటు 10 మందికి న్యాయస్థానం తాజాగా జైలు శిక్షలు విధించింది. కాగా, లాయ్ రెండింటికీ కలిపి 20 నెలలపాటు కటకటాల్లోనే గడపాల్సి ఉంటుంది. ది యాపిల్ డైలీ వ్యవస్థాపకుడైన జిమ్మీలాయ్ చైనా ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త జాతీయ భద్రత విధానం ప్రజాస్వామ్య హక్కులకు తీవ్ర విఘాతం కలిగించేదిగా ఉందని విమర్శిస్తున్నారు. చదవండి: కరోనా: జాన్సన్ సింగిల్ షాట్కు యూకే ఓకే -
వైరల్: ‘‘ది సాకురా’’ పింక్ డైమండ్ ఖరీదు తెలుసా?
హాంగ్కాంగ్: వేలం పాటలో వజ్రాలకు అత్యధిక ధర పలకడం తెలిసిందే. అయితే తాజాగా పర్పుల్-పింక్ డైమండ్ ‘ది సాకురా’ను హాంగ్కాంగ్లో వేలం వేయగా 213 కోట్లు పలికింది. 15.81 క్యారెట్ల ఈ డైమండ్ను ఆసియాలోని ఓ బడా వ్యాపారి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ‘ది సాకురా’ తో పాటు, గుండె ఆకారంలో ఉన్న మరో 4.2 క్యారెట్ల గులాబీ వజ్రాల ఉంగరాన్ని 6.6 మిలియన్ డాకర్లకు ‘ది స్వీట్ హార్ట్’ పేరుతో వేలం వేశారు. కాగా ‘ది సాకురా’ పింక్ డైమండ్ 29.3 మిలియన్ డాలర్లు పలికింది. జెనీవాలో గత నవంబర్లో ‘ది సాకురా’ అనే 14.8 క్యారెట్ల పర్పుల్-పింక్ డైమండ్ ‘ది స్పిరిట్ ఆఫ్ ది రోజ్’ వేలంలో 27 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. అలాగే దోషనివారణ ఓవల్ రత్నం "ది స్పిరిట్ ఆఫ్ ది రోజ్" 23-38 మిల్లియన్ డాలర్లు పలికినట్లు అంచనా. కాగా దీనిపై క్రిస్టీ వేలం సంస్థ స్పందిస్తూ.."ఈ రోజు ఆభరణాల వేలం చరిత్రలో మరో ముఖ్యమైన అధ్యాయాన్ని ‘‘ది సాకురా’’ నమోదు చేసింది. వేలంలో రికార్డ్ స్థాయిలో పలికిన ధర పట్ల మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే అత్యుత్తమ పింక్ వజ్రాలను అందించే క్రిస్టీ సంప్రదాయాన్ని కొనసాగిస్తాం." అని ఓ ప్రకటనలో తెలిపారు. (చదవండి: సెకండ్ వేవ్: మళ్లీ 2 లక్షలు దాటిన కరోనా కేసులు) -
తారస్థాయికి విభేదాలు: అమెరికాకు చైనా వార్నింగ్!
బీజింగ్: అమెరికా- చైనాల మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ డ్రాగన్ విదేశాంగ మంత్రి వాంగ్ యీ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికే తాము ప్రాధాన్యం ఇస్తామని, అయితే అదే సమయంలో తమపై పెత్తనం చెలాయించాలని చూస్తే మాత్రం సహించబోమని పునరుద్ఘాటించారు. పరస్పర గౌరవం, సమానత్వ భావనతో మెలగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. డొనాల్డ్ ట్రంప్ హయాంలో అగ్రరాజ్యం- డ్రాగన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. అయితే, జో బైడెన్ అధికారం చేపట్టిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపించాయి. కానీ, ఇటీవల అలస్కాలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు టోనీ బ్లింకెన్, వాంగ్ యీ మధ్య జరిగిన మొట్టమొదటి భేటీలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. జిన్జియాంగ్, హాంకాంగ్, తైవాన్ విషయంలో చైనా అవలంబిస్తున్న విధానాలు, ప్రపంచ స్థిరతకు భంగకరంగా మారాయని అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. చైనా సైతం.. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని గట్టిగా ఎదుర్కొంటామంటూ దీటుగానే బదులిచ్చింది. ఈ నేపథ్యంలో వాంగ్ యీ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకొంటూ ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయిస్తూ, తమ మాటే శాసనం అనే వైఖరిని చైనా ఎన్నటికీ అంగీకరించబోదు. ముఖ్యంగా మా దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించం. అంతేకాదు, తప్పుడు సమాచారం, అసత్యాల ఆధారంగా చట్టవ్యతిరేకంగా, ఏకపక్షంగా ఆంక్షలు అమలు చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు’’ అని అమెరికాను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు కథనం వెలువరించింది. కాగా అలస్కా సమావేశంలో భాగంగా, జిన్జియాంగ్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరుతోందన్న ఆరోపణలతో, చైనా అధికారులు, వస్తువులపై మరిన్ని ఆంక్షలు విధించే దిశగా అమెరికా నిర్ణయం తీసుకుంది. దీంతో, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా ముదిరిన నేపథ్యంలో వాంగ్ యీ ఈ మేరకు స్పందించడం గమనార్హం. చదవండి: భారత్లో బైట్డ్యాన్స్కు మరో షాక్! బద్ధశత్రువులతో వేదికను పంచుకోనున్న భారత్ -
ఆర్ట్ బై రోబో సోఫియా!
బొమ్మ బొమ్మను గీసింది. అవును మీరు చదివింది నిజమే. ఈ బొమ్మ అటుఇటూ కదలడమే గాకుండా మనం పలకరిస్తే చిలక పలుకులు పలుకుతుంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది మనం చెప్పుకునే మరబొమ్మ మరెవరో కాదు హ్యూమనాయిడ్ రోబో ‘సోఫియా’ అని. మీరడిగే ప్రశ్నలకు సమాధానాలే కాదండి మీరు గీసినట్టు నేను చిత్రాలు గీస్తున్నాను చూడండి అంటోంది సోఫియా. హాంగ్కాంగ్కు చెందిన హ్యన్సన్ రోబోటిక్స్ సంస్థ తయారు చేసిన ఈ సోఫియా ఇప్పటికే ఒక కార్యకర్తగా, మ్యుజీషియన్గా, ఫ్యాషన్ డిజైనర్గా పేరుగాంచింది. తాజాగా డిజిటల్ ఆర్టిస్ట్గా మారింది. 31 ఏళ్ల ఇటాలియన్ డిజిటల్ ఆర్టిస్ట్ ఆండ్రియా బోనాసెటో దగ్గర రంగురంగుల చిత్రాలు గురించి ఇన్పుట్స్ తీసుకుని ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులైన టెస్లా చీఫ్ ఎక్సిక్యూటివ్ ఎలన్ మస్క్ వంటి వారి చిత్రాలను సోఫియా గీసింది. ఈ చిత్రాలను నాన్ ఫంజిబల్ టోకెన్ (ఎన్ఎఫ్టీ) రూపంలో వేలం వేస్తున్నారు. ఈ చిత్రాన్నీ కొన్నవారికి ఎన్ఎఫ్టీ సర్టిఫికెట్ ఇస్తారు. ఎన్ఎఫ్టీ చిత్రం డిజిటల్ సంతకంలా బ్లాక్చెయిన్ లెడ్జర్స్లో భద్రపరచ బడుతుంది. వేలంలో సోఫియా చిత్రాన్నీ కొన్నవారికి హక్కులు అధికారికంగా ధ్రువీకరించబడతాయి. అయితే కృత్రిమమేధస్సుతో రూపొందించిన వస్తువును వేలం వేయడం ప్రపచంలో ఇదే తొలిసారి. సోఫియా చిత్రాన్ని ‘సోఫియా ఇన్స్టాంటియేషన్’ గా పిలుస్తున్నారు. దీనిలో బోనాసెటో గీసిన చిత్రాన్నీ సోఫియా డిజిటల్ చిత్రంగా ఎలా మర్చిందో చూపించే ఎమ్పీ4 ఫైల్ 12 సెకన్ల నిడివితో ఉంటుంది. దీనితోపాటు సోఫియా స్వయంగా తన చేతులతో పెయింటింగ్ వేసిన చిత్రం ప్రింట్ అవుట్ హార్డ్ కాపీ కూడా జతగా ఉంటుంది. ‘‘మనుషులు నా డిజిటల్ ఆర్ట్ను ఇష్టపడతారని అనుకుంటున్నాను, మనుషులతో కలిసి నేను ముందుకు సాగడానికి కొత్తరకం, ఉత్తేజకరమైన మార్గాల్లో సహకరిస్తారని ఆశిస్తున్నట్లు సోఫియా చెప్పింది. సిల్వర్ కలర్ సూటు ధరించి చేతిలో పెన్సిల్ పట్టుకొని ఉన్న సోఫియా మాట్లాడుతూ.. ట్రాన్స్ఫార్మర్ నెట్వర్క్స్, జెనిటిక్ అల్గారిథమ్స్ను ఉపయోగించి ఈ చిత్ర కళాఖండాలను రూపొందించాము. అందువల్ల ఈ చిత్రాలు డిజిటల్ ఆర్ట్లో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక నమూనాలను సృజనాత్మకంగా సృష్టిస్తాయి’ అని సోఫియా చెప్పింది. ఈ మధ్యకాలంలో పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే ప్లాట్ఫారమ్గా ఈ ఎన్ఎఫ్టీ టెక్నాలజీ వ్యవహరిస్తోంది. ఈ నెలలో నిర్వహించిన ఓ డిజిటల్ ఆర్ట్కు వేలం నిర్వహించ గా దాదాపు 70 మిలియన్ డాలర్లకు అమ్ముడయ్యింది. కాగా సోఫియా గీసిన డిజిటల్ చిత్రాన్నీ ఎవరు కొనుగోలు చేస్తారో వారిని కలిసి వారితో మాట్లాడి వారి ఫేస్ను రీడ్చేసి ఆ తరువాత సోఫియా తాను గీసిన చిత్రానికి తుది మెరుగులు దిద్దనుంది.l -
నెలకు ఈ ఇంటి అద్దెంతో తెలుసా!
హాంగ్కాంగ్: సాధారణంగా ఓ ఇంటి అద్దె వేలల్లో లేదా లక్షల్లో ఉంటుంది. కానీ దక్షిణ చైనాలో హాంగ్కాంగ్లోని ఈ ఇంటి అద్దె ఎంతో తెలిస్తే అందరూ కళ్లు తేలేయాల్సిందే. నెలకు ఈ ఇంటి అద్దె 1.26 కోట్ల రూపాయలు. ఇది వింటే ఇది అద్దెనా లేక ఇంటి ఖరీదా అని అందరికి డౌట్ రావోచ్చు. కానీ ఇది అక్షరాల అద్దె. ఎందుకంటే అదే రేంజ్లో ఈ ఇంటిలో స్టార్ హోటళ్లను మించిన గదులు, ఇతర సౌకర్యాలు ఉన్నాయట. చూడటానికి ప్యాలేస్ను తలపిస్తున్న ఈ ఇళ్లు మొత్తం 10, 804 అడుగుల విస్తిర్ణంలో... విలాసవంతమైన గదులు, రకారకాల పూలతో కూడిన తోటతో నిర్మించారట. ఇక లోపల ఓ ప్రైవేటు గ్యారేజ్, అధునాతమైన సాంకేతికతతో తయారు చేయించిన లిఫ్టులు ఉన్నాయట. ఇక ఈ భవనం నుంచి బయటకు చూస్తే విక్టోరియా హార్బర్ స్పష్టంగా కనిపిస్తుందట. అందుకే ఈ ఇంటికి హాంగ్కాంగ్లో అన్నిటికంటే అధిక రెంటు ఉన్నట్లు నైట్ ప్రాంక్ ఎల్ఎల్పీ ఎగ్జీక్యూటివ్ డైరెక్టర్ థామస్ లామ్ పేర్కొన్నారు. హాంగ్కాంగ్లో గృహల కొరత, లగ్జరీ ఇళ్ల అమ్మకాలు తక్కువ ఉండటం వల్ల అక్కడి శ్రీమంతులు ఈ ఇంట్లో రెంటుకు ఉండేందుకు ముందుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. చదవండి: ఇంటర్వ్యూలలో ఫెయిల్.. బాధతో 9 ప్లాస్టిక్ సర్జరీలు చైతు కోసం నదిలో దూకిన అభిమాని.. ఆ తర్వాత -
ఇతడు మొనగాడురా బుజ్జీ!
సాహసం సాహసం కోసమే చేసేవాళ్లు ఉన్నారు. పదిమందికి సహాయం కోసం సాహసం చేసేవాళ్లు ఉన్నారు. హాంకాంగ్కు చెందిన 35 సంవత్సరాల లై చి రెండో కోవకు చెందిన సాహసి. పదిసంవత్సరాల క్రితం జరిగిన కారు యాక్సిడెంట్ వల్ల లై చి వీల్చైర్కే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే తన వీల్చైర్నే విల్పవర్గా మార్చుకున్నాడు. ధైర్యసాహసాలకు ప్రతీక గా చెప్పుకునే 495 మీటర్ల లైన్రాక్ పర్వతాన్ని అయిదుసంవత్సరాల క్రితం వీల్చైర్తోనే అధిరోహించాడు.‘ఈ సాహస ప్రయాణంలో నేను దివ్యాంగుడిననే ఆలోచన ఎప్పుడూ రాదు’ అంటాడు లై చి. రాక్ క్లైంబింగ్లో నాలుసార్లు ఏషియన్ ఛాంపియన్గా నిలిచిన లైచి తాజాగా మరో సాహస ఘట్టానికి తెర తీశాడు. 320 మీటర్ల పొడవైన నైనా టవర్స్ను వీల్చైర్తోనే అధిరోహించి ‘భళా!’ అనిపించుకున్నాడు. పర్వతాన్ని అధిరోహించడం కంటే అద్దాల ఆకాశహర్మ్యాన్ని అధిరోహించడమే చాలా కష్టమని చెబుతున్నాడు. స్పైనల్ కార్డ్ పేషెంట్ల కోసం నిధుల సమీకరణలో భాగంగా ఈ సాహసం చేశాడు లై చి. -
ఐదోసారి ఎయిరిండియాకు నో ఎంట్రీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు మరోసారి ఎదురు దెబ్బతగిలింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎయిరిండియా విమానాల రాకపోకలను డిసెంబరు 3 వరకు హాంకాంగ్ నిషేధించింది. దీంతో హాంకాంగ్ ప్రభుత్వం ఎయిర్ ఇండియా విమానాలను నిషేధించడం ఇది ఐదోసారి. గత వారం ఎయిరిండియాలో ప్రయాణించిన కొంత మంది ప్రయాణికులకు కొవిడ్-19 పాజిటివ్ వచ్చిందని శుక్రవారం అధికారులు ధృవీకరించారు. భారత్ నుంచి హాంకాంగ్కు వచ్చే వారు ప్రయాణం చేయడానికి 72 గంటల ముందు కరోనా టెస్ట్ చేసుకోవాలి. నెగటివ్ అని నిర్ధారించిన సర్టిఫికెట్ను కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. అలాగే జూలైలో హాంకాంగ్ ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం అంతర్జాతీయ ప్రయాణీకులందరూ విమానాశ్రయంలో దిగిన వెంటనే కోవిడ్-19 పరీక్ష చేసుకోవాలి. తాజాగా మరోసారి ఎయిరిండియా ప్రయాణీకులకు కరోనా నిర్ధారణ కావడంతో అక్కడి ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. (చదవండి: అలయెన్స్ ఎయిర్కు తొలి మహిళా సీఈవో) ఇది ఐదో సారి ఎయిరిండియా ఢిల్లీ-హాంకాంగ్ విమానాలను ఆగస్టు 18 నుంచి ఆగస్టు 31 వరకు, సెప్టెంబరు 20 నుంచి అక్టోబరు 3 వరకు, అక్టోబరు 17 నుంచి అక్టోబరు 30 వరకు నిషేధించగా, రెండవసారి ముంబై-హాంకాంగ్ సర్వీస్లను అక్టోబర్ 28 నుంచి నవంబర్ 10 వరకు నిషేధించారు. గత వారం ఎయిరిండియాలో ప్రయాణించిన కొంత మంది ప్రయాణికులకు కొవిడ్-19 పాజిటివ్ రావడంతో హాంకాంగ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హాంకాంగ్కు నవంబరు 20 నుంచి డిసెంబరు 3 వరకు నిషేధించారని, ఈ రోజల్లో హాంకాంగ్కు ఎటువంటి విమానాలను షెడ్యూల్ చేయలేదని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణానికి కరోనా టెస్ట్ మస్ట్... హాంకాంగ్ ప్రభుత్వ నియమాల ప్రకారం భారతదేశంతో పాటు, బంగ్లాదేశ్, ఇథియోపియా, ఫ్రాన్స్, ఇండోనేషియా, కజకిస్థాన్, నేపాల్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, రష్యా, దక్షిణాఫ్రికా, యుకె, అమెరికా ప్రయాణీకులందరికీ విమానం ప్రయాణానికి ముందు కొవిడ్-19 నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఈ క్రమంలో ఆయా సంస్థలు తప్పనిసరిగా ప్రయాణికుల కరోనా సోకలేదని నిర్ధారించిన సర్టిఫికెట్లను ముందుగానే ఇవ్వాలి.కాగా భారతదేశంలో కరోనా మహమ్మారి కారణంగా మార్చి 23 నుంచి షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమానాలను నిలిపివేశారు. మే నుంచి వందే భారత్ మిషన్ కింద విమానయాన సంస్థలకు ప్రత్యేక అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. జూలై నుంచి ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం విమానాల రాకపోకలు సాగిస్తున్నాయి. ఇటువంటి ఒప్పందాలను భారత్ సుమారు 20 దేశాలతో చేసుకుంది. -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన నగరాలతోపాటు అత్యంత చౌక నగరాలు ఉంటాయని తెల్సిందే. ఖరీదైన నగరాల్లో మానవ జీవన వ్యయం ఎక్కువగా ఉంటే, చౌక నగరాల్లో మానవ జీవన వ్యయం తక్కువగా ఉంటుంది. అంటే ఓ మనిషి జీవించడానికయ్యే ఖర్చును జీవన వ్యయంగా పరిగణిస్తారు. అలా మానవ జీవితానికి అవసరమైన 138 వస్తువుల జాబితాలను రూపొందించి ప్రపంచంలోని 130 నగరాల్లో వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలసుకోవడం ద్వారా ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ‘ప్రపంచ దేశాల్లో జీవన వ్యయం 2020’ పేరిట ఓ సర్వే నివేదికను రూపొందించి విడుదల చేసింది. (చదవండి : ఏకైక శ్వేత జిరాఫీకి జీపీఎస్ ట్రాకర్) ఆ సర్వే ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలు హాంకాంగ్, పారిస్, జూరిచ్ కాగా, అంతకంటే కొంచెం తక్కువ ఖరీదైన నగరాలు సింగపూర్, ఒసాకా, టెల్ అవీవ్, న్యూయార్క్. ప్రపంచంలోనే అత్యంత చౌకైన దేశం సిరియా రాజధాని డమస్కస్. ఆ తర్వాత ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కంట్, లుసాకా, కారకాస్, ఆల్మటీ నగరాలు. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగంపై ప్రభావం చూపిన నేపథ్యంలో ఈఐయు ఈ సర్వేను నిర్వహించింది. అమెరికా డాలర్పై యూరో స్విస్ ఫ్రాంక్ల విలువ పెరగడంతో అత్యంత ఖరీదైన నగరాల్లో ఐదవ స్థానంలో ఉన్న పారిస్, జూరిచ్ అగ్రభాగానికి చేరుకున్నాయి. కరోనా ప్రభావం వల్ల రెండు ఆసియా దేశాల్లో నిత్యావసర సరకుల ధరలు పడిపోయాయి. అలా నాలుగో స్థానంలో ఉన్న సింగపూర్, ఒసాకా ఐదవ స్థానానికి పడి పోయాయి. విదేశీ కార్మికులు సొంత దేశాలకు తిరిగి పోవడంతో సింగపూర్లో కాస్త ధరలు పడి పోయాయి. -
కరోనా పుట్టిల్లు వూహాన్ ప్రయోగశాలే
లండన్: ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోన్న కరోనా వైరస్ పుట్టింది వూహాన్లోని ప్రభుత్వ ప్రయోగశాలలోనేనని చైనాకి చెందిన వైరాలజిస్టు సంచలన విషయాన్ని బయటపెట్టారు. దీనికి తన వద్ద శాస్త్రీయ ఆధారాలున్నాయని ఆమె వెల్లడించారు. బ్రిటిష్ టాక్ షో ‘లూస్ వుమన్’ఎక్స్క్లూజివ్ కార్యక్రమంలో డాక్టర్ లి–మెంగ్ యాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వూహాన్లో కొత్తగా న్యూమోనియా ప్రబలడంపై విచారించాల్సిందిగా తనని ప్రభుత్వం కోరిందనీ, ఆ విచారణలో భాగంగా ఈ వైరస్ను దాచిపెట్టడానికి జరిగిన ప్రయత్నాలు తన దృష్టికి వచ్చినట్లు ఆమె వెల్లడించారు. ఈమె హాంకాంగ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో వైరాలజీ, ఇమ్యునాలజీలో శాస్త్రవేత్త. డిసెంబర్– జనవరిలో తొలిసారి, జనవరి మధ్యలో మరోమారు డాక్టర్ లీ –మెంగ్ చైనాలో న్యూమోనియాపై రెండు పరిశోధనలు చేశారు. తరువాత ఆమె హాంకాంగ్ నుంచి అమెరికా పారిపోయారు. తన సూపర్వైజర్ అయిన డబ్ల్యూహెచ్వో కన్సల్టెంట్తో ఈ విషయం చెప్పాలని భావించాననీ, కానీ ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదని ఆమె తెలిపారు. తన పరిధి దాటి వ్యవహరించడం సరికాదని, లేదంటే తాను అదృశ్యమవడం ఖాయమని, అంతా తనను హెచ్చరించినట్టు ఆమె వెల్లడించారు. కరోనా వైరస్ ప్రకృతి నుంచి రాలేదని, చైనాలో మనిషి నుంచి మనిషికి కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని, ఈ వైరస్ తన రూపాన్ని మార్చుకుంటుందని, మహమ్మారిగా విస్తరిస్తుందని, అయితే చైనా కమ్యూనిస్టు పార్టీ ఈ విషయాన్ని బాహ్యప్రపంచానికి తెలియకుండా దాచిందని డాక్టర్ లీ–మెంగ్ తెలిపారు. కొందరు సైంటిస్టులతో కలిసి, దీనిపై రిపోర్టు తయారుచేస్తున్నామని, మొదటి రిపోర్టు విడుదలకు సిద్ధంగా ఉందని ఆమె స్పష్టం చేశారు. ప్రపంచానికి నిజం చెప్పకపోతే తానెంతో విచారించాల్సి ఉంటుందన్నారు. న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే ఒక ఫౌండేషన్, తాను హాంకాంగ్ వదిలి వెళ్ళడానికి సహకరించినట్టు, ఈ ఫౌండేషన్ చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవారికి సహాయం చేస్తుందని ఆమె తెలిపారు. 48 లక్షలు దాటిన కేసులు న్యూఢిల్లీ: భారత్లో కరోనా విజృంభణ ఆగడం లేదు. గత 24 గంటల్లో 92,071 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 48,46,427 కు చేరుకుంది. ఇటీవల రోజుకు 90 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో 1,136 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 79,722కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 37,80,107 కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 9,86,598 గా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు ప్రస్తుతం 78 శాతానికి పెరిగినట్లు తెలిపింది. మరణాల రేటు 1.64 శాతానికి పడింది. సెప్టెంబర్ 13 వరకు 5,72,39,428 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. -
మీకు మనశ్శాంతి లేకుండా చేస్తాం: చైనా
చైనా కాన్ఫిడెన్స్ చూస్తే శత్రువుకి కూడా ముచ్చటేస్తుంది. ట్రంప్ ఎన్నికల మూడ్లో లేకుంటే ఆయనా ముచ్చట పడేవారు. చైనా శుక్రవారం నాడు ఇంటి మీదకు వెళ్లి మరీ నార్వేని హెచ్చరించింది! మావాళ్లకు కనుక నోబెల్ శాంతిబహుమతి ఇచ్చి మాలో మాకు పెట్టారో మీకు మనశ్శాంతి లేకుండా చేస్తాం అని చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ ఇ నార్వేను గట్టిగా బెదిరించారు. ‘మాలో మాకు’ అంటే.. చైనాకు, హాంకాంగ్కి. హాంకాంగ్ ఒక ప్రత్యేక దేశంలా అనిపిస్తుంది కానీ అది చైనా పాలనాధికారాల కింద ఉన్న ప్రత్యేక ప్రాంతం మాత్రమే. ఈమధ్య చైనా ఒక కొత్త భద్రత చట్టం తెచ్చింది. దానిని హాంకాంగ్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. నిరసన ప్రదర్శనలు జరుపుతూనే ఉన్నారు. ఆ నిరసనకారులకు నార్వే నోబెల్ కమిటీ ‘అండ్.. ఈ ఏడాది శాంతి బహుమతి గోస్ టు..’ అంటూ అవార్డును ప్రకటించే ప్రమాదం ఉందని చైనా స్మెల్ చేసినట్లుంది. (66 రోజుల్లో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్?) అందుకే ఈ ముందు జాగ్రత్త బెదిరింపులు. ఈ మధ్య బ్రిటన్కి కూడా చైనా ఇలాగే వార్నింగ్ ఇచ్చింది. ‘మీ మంచితనం చేత మా మంచివాళ్లని మీ మంచి దేశంలో ఉండటానికి రప్పించుకుంటే మామూలుగా ఉండదు చూడండీ..’ అని టెస్ట్ ఫైర్ లేవో చేసింది. ఇప్పుడు నార్వేకు తాజాగా ‘శాంతి సందేశం’ ఇచ్చింది. అయినా నోబెల్ ఇచ్చేది స్వీడన్ కదా. మధ్యలోకి నార్వే ఎందుకొచ్చింది? పెద్దాయన ఆల్ఫెడ్ర్ నోబెల్ అలా వీలునామా రాసి వెళ్లారు. నోబెల్ శాంతి బహుమతిని మాత్రం నార్వేనే ఇవ్వాలని. కరోనాకు కారణం అయి, ఏమాత్రం గిల్టీ ఫీలింగ్ లేకుండా చైనానే తిరిగి అందరి పైనా కయ్యి కయ్యి మంటోందంటే.. ఆ కాన్ఫిడెన్స్ను చూసి నెక్స్ట్ ముచ్చట పడవలసిన వాళ్లం మనమే. ప్రస్తుతం చైనా చైనా లో లేదు. ఇండియా బోర్డర్ లో ఉంది. -
జాతీయ భద్రతా చట్టం : మీడియా మొఘల్ అరెస్ట్
హాంకాంగ్ : కొత్త భద్రతా చట్టం ప్రకారం హాంకాంగ్ ప్రభుత్వం మీడియా మొఘల్ ను అదుపులోకి తీసుకోవడం సంచలనం రేపింది. జాతీయ భద్రతా చట్టం కింద హాంకాంగ్ దిగ్గజ వ్యాపారవేత్త, నెక్ట్స్ డిజిటల్ మీడియా అధినేత జిమ్మీ లై (71), ఇతర ముఖ్యులను అరెస్టు చేసింది. భద్రతా చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలతో ఏడుగురిని అరెస్టు చేసినట్లు హాంకాంగ్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్య అనుకూల విధానాలతో హాంకాంగ్లో జరిగిన అల్లర్లకు జిమ్మీ మద్దతు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజా భద్రతా చట్టాన్ని వ్యతిరేకిస్తూ విదేశీ శక్తులతో జతకట్టాడన్నఆరోపణలపై జిమ్మీని అరెస్టు చేశారు. దాదాపు 200 మందికి పైగా పోలీసులు మీడియా సంస్థలోకి ప్రవేశించి గందరగోళ సృష్టించారని లై ప్రధాన వారసుడు సీనియర్ ఎగ్జిక్యూటివ్ మార్క్ సైమన్ ట్వీట్ చేశారు. ఈ రోజు వస్తుందని ముందే ఊహించానని, ఆపిల్ డైలీ జర్నలిస్టు ఒకరు ఆందోళనవ్యక్తం చేశారు. హాంకాంగ్ ప్రభుత్వానికి, బీజింగ్కు వ్యతిరేకంగా మాట్లాడే మీడియాను టార్గెట్ చేశారని ఆరోపించారు. ప్రధానంగా ఆపిల్ డైలీని మూసి వేయడం, ఇతర మీడియా సంస్థలను బెదిరించడం లక్ష్యంగానే ఈ దాడి అని మండిపడ్డారు. ఇది పత్రికా స్వేచ్ఛకు ముగింపు అని వ్యాఖ్యానించారు. జూలై 1 నుండి అమల్లోకి వచ్చేలా చైనా వివాదాస్పద జాతీయ భద్రతా చట్టాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం దోషులకు జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. అలాగే మీడియా సంస్థల ఎలక్ట్రానిక్ పరికరాలను శోధించడం, మీడియా సంస్థలతో సహా సర్వర్లను స్వాధీనం చేసుకునే విస్తృత అధికారాలను ఇస్తుంది. కాగా 1995లో జిమ్మీ లై స్థాపించిన నెక్స్ట్ డిజిటల్ మీడియాకు ఆపిల్ డైలీ మాతృ సంస్థ. తొలుత వస్త్ర వ్యాపారం నిర్వహించిన ఆయన ఆ తరువాత ఆపిల్ డైలీ అనే పత్రికతో మీడియా రంగంలోకి ప్రవేశించారు. కాలక్రమంలో ఇది హాంకాంగ్, చైనా ఆధిపత్యాన్ని విమర్శించే ప్రజాస్వామ్య అనుకూల వార్తా సంస్థగా ఖ్యాతి గడించింది. సుమారు వంద కోట్ల డాలర్లు ఆస్తి ఆయన సొంతం. ఉగ్రవాదం, విదేశీ శక్తులతో కలిసి పని చేయడం లాంటి అనేక ఇతర ఆరోపణలను ఇప్పటికే లై ఎదుర్కొంటున్నారు. తాజాగా అతని కుమారులు, ప్రచురణ బృందంలోని పలువురు ముఖ్యులను పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. -
మాస్కు ధరించనందుకు మహిళపై..
హాంకాంగ్: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఓ మహిళపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. తమపై దాడి చేయడంతో ఆమెను అదుపు చేసేందుకు పెప్పర్ స్ప్రే చేసినట్లు వెల్లడించారు. ఉత్తర హాంకాంగ్లో జరిగిన ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక మీడియా కథనం ప్రకారం... మంగళవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఓ మహిళ షెంగ్ షూయి పట్టణంలోని సూపర్ మార్కెట్కు వచ్చారు. అయితే ఆమె మాస్కు ధరించకపోవడంతో సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తురాలైన సదరు మహిళ వారితో వాగ్వాదానికి దిగింది. (హాంకాంగ్తో ఒప్పందం రద్దు.. అయితే) ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరగడంతో విషయం పోలీసుల దాకా వెళ్లింది. సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. అయినా ఆమె తన తీరును మార్చుకోలేదు. అంతేగాక వారిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారికి గాయాలయ్యాయి. దీంతో ఆమెను అదుపు చేసేందుకు ముఖంపై పెప్పర్ స్ప్రే ప్రయోగించారు. అనంతరం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. క్షతగాత్రుడైన పోలీస్ను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో హాంకాంగ్లో మాస్కు ధరించాలనే నిబంధన తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఇక జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు అక్కడ 2884 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 23 మంది కోవిడ్తో మృతి చెందారు. -
చైనా గుప్పిట్లో హాంకాంగ్: కివీస్ కీలక నిర్ణయం
వెల్లింగ్టన్: ప్రపంచ వాణిజ్య ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా పేరొందిన హాంకాంగ్ విషయంలో న్యూజిలాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాంతంతో నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. హాంకాంగ్ స్వయంప్రతిపత్తిని కాలరాసేలా చైనా.. అక్కడ జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం వెల్లడించింది. అయితే ఒకవేళ చైనా భవిష్యత్తులో గనుక తన నిర్ణయాన్ని మార్చుకుని.. ‘‘ఒక దేశం- రెండు వ్యవస్థలు’’ విధానానికి కట్టుబడి ఉంటే ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ విషయం గురించి న్యూజిలాండ్ విదేశీ వ్యవహారాల మంత్రి విన్స్టన్ పీటర్స్ మాట్లాడుతూ.. చైనా గుప్పిట్లోకి వెళ్లిన హాంకాంగ్ నేర, న్యాయ వ్యవస్థపై తాము విశ్వాసం కోల్పోయామని.. అందుకే నేరస్తుల అప్పగింత ఒప్పందం నుంచి వైదొలగినట్లు తెలిపారు. హాంకాంగ్లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో అక్కడికి వెళ్లే తమ దేశ ప్రయాణికులను ఇప్పటికే అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. న్యూజిలాండ్- హాంకాంగ్ పరస్పర ఒప్పందాల విషయంలో డ్రాగన్ పరోక్ష ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా కరోనా వ్యాప్తి, హాంకాంగ్ పట్ల చైనా వైఖరిపై అమెరికా సహా యూకే తదితర దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. (చైనాపై కఠిన చర్యలకు సిద్ధమైన అమెరికా!) యూకే, కెనడా, ఆసీస్ బాటలో ఈ నేపథ్యంలో హాంకాంగ్పై చైనా ఆధిపత్య ధోరణిని నిరసిస్తూ.. అగ్రరాజ్యం అమెరికా హాంకాంగ్కు కల్పించిన ప్రత్యేక వెసలుబాట్లను రద్దు చేసేందుకు సిద్ధమైనట్లు ప్రకటించింది. నేరస్తుల అప్పగింత, ఎగుమతుల నియంత్రణ, సాంకేతికత ఉమ్మడి వినియోగం తదితర పలు కీలక ఒప్పందాలను రద్దు చేసుకునేందుకు సమాయత్తమైంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా, యూకే, కెనడా హాంకాంగ్తో ఇప్పటికే నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని రద్దు చేసుకోగా.. తాజాగా న్యూజిలాండ్ సైతం ఇదే బాటలో నడిచింది. ఇక కివీస్కు చైనా కీలక వ్యాపార భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఏడాదికి 21 బిలియన్ డాలర్ల మేర వాణిజ్య, వ్యాపార లావాదేవీలు సాగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తైవాన్కు న్యూజిలాండ్ మద్దతుగా నిలవడంతో కివీస్- డ్రాగన్ల మధ్య బంధం బలహీనపడింది. కాగా తైవాన్పై ఆధిపత్యం కోసం చైనా విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. (.తైవాన్ డబ్ల్యూహెచ్ఓపై విషం కక్కుతోంది: చైనా) -
మీ జోక్యం అక్కర్లేదు.. మాకు తెలివి ఉంది: చైనా
న్యూఢిల్లీ: భారత్- చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు పెంచేలా వ్యవహరిస్తున్న డ్రాగన్.. ఈ విషయంలో మూడో పార్టీ జోక్యం అక్కర్లేదంటూ యూకేపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిహద్దుల వెంబడి నెలకొన్న ప్రతిష్టంభనను ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకుంటామని పేర్కొంది. పరిస్థితులను చక్కదిద్దుకోగల తెలివి, సామర్థ్యాలు తమకు ఉన్నాయని ఘాటుగా విమర్శించింది. అదే విధంగా హాంకాంగ్ విషయంలోనూ ఇతర దేశాల జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేసింది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోనూ బాహ్య శక్తుల ప్రమేయం వల్లే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, వాటి కారణంగా శాంతి, సుస్థిరతకు భంగం కలుగుతోందంటూ అమెరికా, యూకేను ఉద్దేశించి విమర్శలు గుప్పించింది. ఈ మేరకు భారత్లో చైనా రాయబారి సన్ వెడాంగ్ శుక్రవారం ట్వీట్ చేశారు.(అక్కడ బలగాల ఉపసంహరణకు చైనా నిరాకరణ) కాగా హాంకాంగ్ స్వయంప్రత్తిని కాలరాస్తూ చైనా అక్కడ జాతీయ భద్రతా చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అదే విధంగా దక్షిణ చైనా సముద్రంపై కూడా ఆధిపత్యం చాటుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇక ఇప్పటికే చైనాలోని వుహాన్ నగరంలో పురుడుపోసుకున్నట్లుగా భావిస్తున్న కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతున్న వేళ అమెరికా, యూకే డ్రాగన్పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. అంతేగాకుండా భారత సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న తీరును విమర్శిస్తున్నాయి.(అమెరికాకు బదులిచ్చేందుకు సిద్ధమవుతున్న చైనా!) చైనా తీరు సరికాదు: యూకే ఈ క్రమంలో తాజాగా పాంగాంగ్ త్సో సరస్సు ప్రాంతం, గోగ్రా పోస్ట్ నుంచి బలగాల ఉపసంహరణకు చైనా నిరాకరిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో బ్రిటీష్ హై కమిషనర్ టు ఇండియా ఫిలిప్ బార్టన్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి అనేక సవాళ్లు విసురుతూ, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్న చైనాకు బుద్ది చెప్పేందుకు మిత్ర పక్షాలతో కలిసి పనిచేసేందుకు బ్రిటన్ సుముఖంగా ఉందని పేర్కొన్నారు. అదే విధంగా హాంకాంగ్ విషయంలో చైనా అనుసరిస్తున్న తీరు సరికాదని.. భారత్తో వాస్తవాధీన రేఖ వెంబడి, దక్షిణ చైనా సముద్రం విషయంలో కూడా డ్రాగన్ చర్యలపై దృష్టి సారించాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే భారత్- చైనా సరిహద్దు విషయంలో జోక్యం చేసుకునే ఆలోచన మాత్రం తమకు లేదని స్పష్టం చేశారు. ఇక భద్రతా కారణాల దృష్ట్యా చైనీస్ దిగ్గజం హువావేను తమ దేశంలో నిషేధించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఫిలిప్ వ్యాఖ్యలపై చైనా రాయబారి సన్ వెడాంగ్ ట్విటర్లో స్పందించారు. 1/2 Noted remarks regarding #China by British High Commissioner to India, rife with mistakes & false allegations. Boundary question falls within bilateral scope b/t #China & #India. We have wisdom & capability to properly handle differences. No need for third party interference. — Sun Weidong (@China_Amb_India) July 23, 2020 -
కరోనా : చైనాపై మరో బాంబు
బీజింగ్: కరోనా మహమ్మారి గురించి ప్రపంచానికి చెప్పకుండా దాచిపెట్టిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాకు సంబంధించి ఒక శాస్త్రవేత్త వెల్లడించిన కీలక విషయాలు తాజాగా సంచలనం రేపుతున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ లి-మెంగ్యాన్ ప్రాణాంతక వైరస్ గురించి చైనాకు ముందే తెలిసినా ప్రపంచాన్ని హెచ్చరించలేదంటూ బాంబు పేల్చారు. ప్రస్తుతం అమెరికాలో అజ్ఞాతంలో ఉన్న యాన్, కరోనా వైరస్ వ్యాప్తి గురించి చైనా అబద్ధాలు చెప్పడమే కాకుండా, తరువాత మానవుల నుంచి మానవులకు వ్యాప్తి గురించి కూడా కప్పిపుచ్చిందని ఆరోపించారు. గత సంవత్సరం డిసెంబరులో మహమ్మారి విస్తరణ గురించి మాట్లాడకుండా తన నోరు మూయించారని ఆమె ఆరోపించారు. వైరస్ గురించి చెప్పకుండా దాచిపెట్టిందంటూ ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. మరోవైపు కరోనా గురించి ముందుగా తమను హెచ్చరించింది తమ కార్యాలయమే కానీ, చైనా కాదని ఇటీవల డబ్ల్యూహెచ్ఓ వ్యాఖ్యానించిన నేపథ్యంలో తాజా ఆరోపణలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. హాంకాంగ్ నుంచి అమెరికాకు పారిపోయిన యాన్ ప్రాణాంతక వైరస్ గురించి ముందుగానే చైనాకు తెలుసని, ప్రభుత్వ అత్యున్నత స్థాయిలోనే గోప్యత పాటించారని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇమ్యునాలజీ నిపుణురాలు యాన్ ఈ విషయాలను వెల్లడించారు. 2020 ఆరంభంలోనే కరోనా విస్తరణ ప్రారంభమైందని, ఇన్ఫ్లూయేంజా వైరస్లు, మహమ్మారుల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ రిఫరెన్స్ లాబొరేటరీగా ప్రత్యేకతను కలిగి ఉన్న చైనాకు.. కరోనా గురించి ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు. అంతేకాదు, ఈ రంగంలో కొంతమంది అగ్రశ్రేణి నిపుణులుగా గుర్తింపు పొందిన తన పర్యవేక్షకులు తాను చేస్తున్న పరిశోధనలను కూడా విస్మరించారని ఆరోపించారు. (కరోనా : మరో సీనియర్ అధికారి మృతి) కోవిడ్-19 ను అధ్యయనం చేసిన ప్రపంచ మొట్టమొదటి శాస్త్రవేత్తలలో తానూ ఒకరని చెప్పిన యాన్ హాంకాంగ్తో సహా విదేశీ నిపుణులను పరిశోధనకు అనుమతించటానికి చైనా ప్రభుత్వం నిరాకరించిందని చెప్పారు. 2019 డిసెంబర్ చివరలో చైనాలో నమోదవుతున్న సార్స్ వంటి కేసుల క్లస్టర్ను పరిశీలించమని డబ్ల్యూహెచ్ఓ రిఫరెన్స్ ల్యాబ్లోని డాక్టర్ లియో ఆదేశించినట్టు గుర్తు చేసుకున్నారు. తనపై దేశద్రోహం ఆరోపణలు చేస్తున్నారనీ, మాతృదేశ ప్రతిష్టను దెబ్బతీశానంటూ తనను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే తన స్వస్థలమైన కింగ్డావోను స్వాధీనం చేసుకోవడంతోపాటు, తన తల్లిదండ్రులను కూడా ప్రశ్నించారని యాన్ వాపోయారు. ప్రభుత్వ గూండాలు తనపై సైబర్ దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. అయినా తన పోరాటాన్ని వదులుకోనని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే అమెరికాకు పారిపోయినట్టు ఫాక్స్ న్యూస్తో చెప్పారు. ఇదే చైనాలో ఉండగానే వెల్లడిస్తే తనను మాయం చేయడం లేదా చంపేస్తారని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ తన జీవితం ఇంకా ప్రమాదంలో ఉందని యాన్ అభిప్రాయపడ్డారు. తన ఇంటికి తిరిగి వెళ్లలేమోననే భయం పీడిస్తోందన్నారు. ఇది ఇలా వుంటే హాంకాంగ్ విశ్వవిద్యాలయం ఆమె పేజీని తొలగించింది. డాక్టర్ లి-మెంగ్ యాన్ ఇకపై తమ సిబ్బంది కాదని విశ్వవిద్యాలయం ప్రకటించింది. ప్రస్తుత, మాజీ ఉద్యోగుల పట్ల గౌరవంతో వారి వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వలేమని పేర్కొంది. అధికారికంగా వార్షిక సెలవులో ఉన్నట్టుగా చెప్పిన తర్వాత కూడా ఆన్లైన్ పోర్టల్స్, ఇమెయిల్ యాక్సెస్ను ఉపసంహరించుకోవడం గమనార్హం. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ 1.26 కోట్ల మంది కరోనా వైరస్ బారినపడగా, 5.62 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. -
చైనాపై కఠిన చర్యలకు సిద్ధమైన అమెరికా!
వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) వ్యాప్తి నేపథ్యంలో చైనాపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్న అమెరికా కఠిన చర్యలకు ఉపక్రమించనున్నట్లు తెలుస్తోంది. మహమ్మారి వ్యాప్తితో పాటు వివిధ అంశాల పట్ల డ్రాగన్ దుందుడు వైఖరికి తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వైట్హౌజ్ ప్రెస్ సెక్రటరీ కేలే మెకానీ బుధవారం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘చైనాపై అధ్యక్షుడు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో ఇప్పుడే చెప్పలేను. అయితే సరైన సమయంలో చైనాపై తీసుకోనున్న చర్యలపై కొన్ని రోజుల్లోనే ఓ వార్త వినబోతున్నారు. అది మాత్రం కచ్చితంగా చెప్పగలను’’ అని పేర్కొన్నారు. కాగా చైనాలోని వుహాన్ నగరంలో తొలిసారిగా వెలుగు చూసిన కరోనా కారణంగా ప్రపంచమంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికే అక్కడ దాదాపు ముప్పై లక్షల మందికి కరోనా సోకగా.. సుమారు లక్షన్నరకు పైగా కోవిడ్ మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా మహమ్మారి గురించి ముందే సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి, డ్రాగన్కు మద్దతుగా నిలిచారంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థపై కూడా మండిపడ్డారు. ఈ క్రమంలో అగ్రరాజ్యం నుంచి డబ్ల్యూహెచ్ఓకు అందే నిధులు సైతం నిలిపివేశారు. (చైనాపై మరోసారి ట్రంప్ తీవ్ర విమర్శలు) హాంకాంగ్ విషయంలో అదే విధంగా గత కొన్ని నెలలుగా అమెరికా- చైనాల మధ్య వాణిజ్య యుద్ధం నెలకొన్న వేళ.. ప్రపంచ వాణిజ్య ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా పేరొందిన హాంకాంగ్ను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్న డ్రాగన్పై అగ్రరాజ్యం గుర్రుగా ఉంది. హాంకాంగ్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసేలా చైనా అక్కడ ప్రవేశపెట్టిన జాతీయ భద్రతా చట్టంపై విరుచకుపడింది. ఈ నేపథ్యంలో హాంకాంగ్కు అమెరికా కల్పించిన ప్రత్యేక వెసలుబాట్లను రద్దు చేయాలని తన పాలనా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు ట్రంప్ ఇంతకుముందే స్పష్టం చేశారు. నేరస్తుల అప్పగింత, ఎగుమతుల నియంత్రణ, సాంకేతికత ఉమ్మడి వినియోగం తదితర పలు కీలక ఒప్పందాలపై ఇది ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. (విదేశాల్లో ఉన్న వాళ్లపై కూడా చైనా నిఘా!) ఉగర్ ముస్లింలపై చైనా అకృత్యాలపై ఇక వీటితో పాటు అమెరికా జర్నలిస్టులపై ఆంక్షలు, ఉగర్ ముస్లింల పట్ల చైనా వ్యవహరిస్తున్న తీరు, టిబెట్పై డ్రాగన్ విధానం తదితర అంశాలపై కూడా అగ్రరాజ్యం ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై వైట్హౌజ్ ప్రెస్ సెక్రటరీ కేలే మెకానీ బుధవారం స్పందించారు. అయితే ఇటీవల వైట్హౌజ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ బ్రెయిన్, విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చేస్తున్న వ్యాఖ్యల గురించి స్పందించేందుకు కేలె నిరాకరించారు. చైనా యాప్లపై నిషేధం దిశగా అమెరికా కాగా జాతీయ భద్రత, ప్రజల గోప్యత హక్కుకు భంగం వాటిల్లే ప్రమాదం ఉన్నందున టిక్టాక్, వీచాట్ తదితర చైనా యాప్లపై నిషేధం విధించనున్నట్లు మైక్ పాంపియో, ఓ బ్రెయిన్ సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేగాక చైనా కమ్యూనిస్టు పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక భారత్- చైనా సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న వేళ డ్రాగన్ దుందుడుకు చర్యలను ఖండించిన పాంపియో.. అవసరమైతే భారత్కు మద్దతుగా అమెరికా బలగాలు రంగంలోకి దిగుతాయంటూ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా హాంకాంగ్ విషయంలో చైనా కమ్యూనిస్టు పార్టీ అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డ ఓ బ్రెయిన్.. డ్రాగన్ ఆగడాలకు అడ్డుకుంటామని, వారి ఆటలు సాగనివ్వమని చెప్పుకొచ్చారు. -
హాంకాంగ్ నుంచి టిక్టాక్ అవుట్
హాంకాంగ్: భారత్లో నిషేధానికి గురైన టిక్టాక్ భారీ నష్టాన్ని మూటగట్టుకుంది. ఫలితంగా దాని మాతృ సంస్థ 'బైట్డాన్స్'కు దాదాపు 6 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. ఇదిలా ఉండగా టిక్టాక్ హాంకాంగ్ మార్కెట్ నుంచి వైదొలగనున్నట్లు మంగళవారం ప్రకటించింది. అయితే దీనికి ఓ ప్రత్యేక కారణం ఉంది. హాంకాంగ్ స్వయంప్రతిపత్తిని కాలరాస్తూ చైనా పార్లమెంటు ఇటీవలే జాతీయ భద్రతా చట్టానికి ఆమెదం తెలిపింది. దీంతో అక్కడ నిరసనలు భగ్గుమన్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు చైనా తీరును ఎండగడుతూ ఒకే తాటిపైకి వస్తున్నారు. (53 మందిని అరెస్టు చేశాం: హాంకాంగ్ పోలీసులు) దీనిపై కన్నెర్ర జేసిన ప్రభుత్వం హాంకాంగ్లో నిరసనలను అణిచివేసేంచుకు టిక్టాక్ వినియోగాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. ఇందుకోసం టిక్టాక్ నిర్వాహకులతోనూ అక్కడి ప్రభుత్వ అధికారులు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టిక్టాక్ తన కార్యకలాపాలను హాంకాంగ్లో నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అయితే ప్రభుత్వ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయానికి రాలేదని స్పష్టం చేసింది. కేవలం అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయానికొచ్చినట్లు వివరించింది. (టిక్టాక్ నిషేధంతో భారీగా నష్టపోయిన చైనా) ఈ చర్యతో 1,50,000 మంది యూజర్లను టిక్టాక్ కోల్పోనుంది. కాగా 1997లో బ్రిటన్ నుంచి హాంకాంగ్ చైనా చేతికి వచ్చాక.. ‘‘ఒక దేశం రెండు వ్యవస్థల విధానం’’ కింద హాంకాంగ్కు 50 ఏళ్ల పాటు అత్యున్నత స్వయంప్రతిపత్తి, న్యాయ స్వతంత్రత లభించాయి. అయితే హాంకాంగ్ స్వయంప్రతిపత్తి రద్దయ్యేలా చైనా తాజాగా జాతీయ భద్రతా చట్టాన్ని అక్కడ అమలు చేయనున్న నేపథ్యంలో మరోసారి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. (‘చైనా ప్రపంచానికి తలనొప్పిగా మారింది’) -
చైనాకు వ్యతిరేకంగా ఒక్కటైన నెటిజన్లు!
హాంకాంగ్: చైనా ఆధిపత్య ధోరణిని నిరసిస్తూ హాంకాంగ్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. డ్రాగన్ ఏకపక్ష నిర్ణయాలు, ఒకే దేశం- ఒకే పాలసీ విధానాన్ని ఎండగడుతూ సోషల్ మీడియాలో #JunkOneChina హ్యాష్ట్యాగ్తో ఉద్యమాన్ని చేపట్టారు. అదే విధంగా మైనార్టీలపై అకృత్యాలు, అణచివేతకు పాల్పడుతున్న చైనా తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ‘‘ఇప్పుడూ.. ఎప్పుడూ ఒకే చైనా లేదు. ఉండబోదు కూడా. చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం తెచ్చిన చట్టాలు మానవ హక్కులను ఉల్లంఘించే విధంగా ఉన్నాయి. జిన్జియాంగ్లో నివసించే ఉగర్ ముస్లింలు, టిబెటన్లు, తైవాన్ ప్రజలు, మంచూరియన్లు, హాంకాంగ్ వాసులను జిన్పింగ్ నేతృత్వంలో చైనా ప్రభుత్వం అణచివేస్తోంది. పశ్చిమ దేశాలు డ్రాగన్, దాని నియంత షీను పొగడటం మానేయాలి! ఒకే చైనా అనేది ఓ అభూతకల్పన. ప్రపంచ దేశాలు ఇప్పటికైనా చైనా ఆగడాలపై మౌనం వీడాలి’’అంటూ ట్విటర్ వేదికగా అభ్యర్థిస్తున్నారు.(చైనా వ్యతిరేక నినాదాలు.. 53 మంది అరెస్టు) (చైనాకు లడఖ్ ఒక వేలు మాత్రమే) చైనాకు వ్యతిరేకంగా ఒక్కటైన నెటిజన్లు.. ఇక గాల్వన్ లోయ ప్రాంతంలో భారత జవాన్లపై ఘాతుకానికి తెగబడిన చైనాపై భారతీయులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. డ్రాగన్ దుశ్చర్యకు నిరసనగా.. చైనా ఉత్పత్తులను బాయ్కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పిలుపునిస్తున్నారు. ఇదిలా ఉండగా.. విష్ణు అవతారమైన రాముడు.. చైనా డ్రాగన్పై బాణం సంధిస్తున్నట్లుగా ఉన్న ఫొటోను హాంకాంగ్ నెటిజన్లు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ధన్యవాదాలు చెబుతున్న భారత నెటిజన్లు.. #JunkOneChina హ్యాష్ట్యాగ్ను ప్రమోట్ చేస్తూ మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో టిబెటన్లు సైతం వీరికి తోడయ్యారు. (విదేశాల్లో ఉన్న వాళ్లపై కూడా చైనా నిఘా!) ‘‘ప్రపంచానికి చైనా పెద్ద తలనొప్పిగా మారింది. చైనా ఒకే దేశం- ఒకే వ్యవస్థ విధానాన్ని అందరూ వ్యతిరేకించాలి! చైనా కబంధ హస్తాల నుంచి టిబెట్ స్వాతంత్ర్యం పొందేలా చేయాలి. చైనా ఉత్పత్తులను అందరూ బహిష్కరించాలి’’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. కాగా చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలో నివసిస్తున్న ఉగర్లపై డ్రాగన్ ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదాన్ని బూచిగా చూపిస్తూ ఇప్పటికే వేలాది మందిని అనధికారికంగా నిర్బంధ క్యాంపులకు తరలించింది. ఇక స్వతంత్ర పాలనకు మొగ్గుచూపిన తైవాన్ సరిహద్దుల్లో సైతం చైనా పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అదే విధంగా హాంకాంగ్ స్వయంప్రతిపత్తిని కాలరాసేలా ఇటీవల జాతీయ భద్రతా చట్టానికి డ్రాగన్ పార్లమెంటు ఆమోదం తెలిపింది.(డ్రాగన్ దూకుడు.. తైవాన్ హెచ్చరికలు!) 印度朋友連中印大戰精美poster都整好了https://t.co/pdU9nS6Zra - 分享自 LIHKG 討論區 pic.twitter.com/ttl7XLPsmi — HoSaiLei🇺🇸🇬🇧🇧🇪🇯🇵🇮🇳 (@hkbhkese) June 16, 2020 1. Honkong isn't a part of China 2. Taiwan is an independent nation 3. Macau isn't a part of China 4. Tibet is an independent nation 5. China is harrasing Uighurs in Xinjiang 6. Also it's time to get our Aksai Chin back!! China is a threat to entire world.#JunkOneChina pic.twitter.com/6rJOoo30ht — श्रीमंत आदित्य पंत हिन्दू (देशस्थ ब्राह्मण) (@AdityaBangali1) June 19, 2020 -
చైనా వ్యతిరేక నినాదాలు.. 53 మంది అరెస్టు
హాంకాంగ్: చైనా వైఖరిని నిరసిస్తూ ఆందోళనకు దిగిన 53 మంది పౌరులను హాంకాంగ్ పోలీసులు అరెస్టు చేశారు. చట్టాన్ని ఉల్లంఘించి పెద్ద సంఖ్యలో ఒక్కచోట చేరినందుకు 36 మంది పురుషులు, 17 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన నిబంధనలను అతిక్రమించిన నేరానికి వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కాగా నేరస్తుల అప్పగింతకు సంబంధించిన బిల్లుపై ప్రభుత్వ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ గతేడాది హాంకాంగ్లో నిరసనలు మిన్నంటాయి. ఈ బిల్లుతో హాంకాంగ్లో నిందితుల్ని చైనాలో విచారించే అవకాశం ఉన్న నేపథ్యంలో హక్కుల కార్యకర్తలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో వివాదాస్పద ‘నేరస్తుల అప్పగింత’ బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్లు హాంకాంగ్ ప్రకటించింది.(హాంకాంగ్పై చైనా ఆధిపత్యం.. ట్రంప్ కీలక నిర్ణయం!) ఈ ఘటన జరిగి ఏడాది కాలం పూర్తవుతున్న సందర్భంగా మరోసారి వారంతా రోడ్ల మీదకు వచ్చి చైనా తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేశారు. హాంకాంగ్ స్వయంప్రతిపత్తిని కాలరాసే విధంగా ఉన్న చైనా జాతీయ భద్రతా చట్టాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేపట్టేందుకు ప్రజాస్వామ్యవాదులు ప్రణాళికలు రచించారు. ఈ నేపథ్యంలో మంగళవారం రోడ్ల మీదకు రాగా వారిని పోలీసులు అరెస్టు చేశారు. రోడ్ల దిగ్భంధనం చేసిన నిరసనకారులను చెదరగొట్టేందుకు వారిపై పెప్పర్ స్ప్రే ప్రయోగించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమైన తరుణంలో.. ‘‘చట్టబద్ధంగా చేసే నిరసనలకు ఎల్లప్పుడూ గౌరవం ఉంటుంది. కానీ చట్టవ్యతిరేక చర్యలను ఉపేక్షించం. దయచేసి చట్టాన్ని అత్రిమించడం మానుకోండి’’ అంటూ ట్విటర్ వేదికగా పౌరులకు విజ్ఞప్తి చేశారు. (వివాదాస్పద బిల్లుకు హాంకాంగ్ ఆమోదం) ఆనాటి నేరస్తుల అప్పగింత బిల్లులో ఏముంది? వివాదాస్పద నేరస్తుల అప్పగింత బిల్లుకు ఆమోదం లభిస్తే.. నేరానికి పాల్పడినట్లుగా భావిస్తున్న తమ పౌరులను చైనాతో పాటు ప్రపంచంలోని ఏ దేశానికైనా హాంకాంగ్ అప్పగించాల్సి ఉంటుంది. కాగా 1997లో బ్రిటన్ నుంచి హాంకాంగ్ చైనా చేతికి వచ్చాక.. ‘‘ఒక దేశం రెండు వ్యవస్థల విధానం’’ కింద హాంకాంగ్కు 50 ఏళ్ల పాటు అత్యున్నత స్వయంప్రతిపత్తి, న్యాయ స్వతంత్రత లభించాయి. ఈ క్రమంలో హాంకాంగ్కు అమెరికా, యూకే సహా 20 దేశాలతో నేరస్తుల అప్పగింత ఒప్పందం కుదిరింది. అయితే డ్రాగన్తో మాత్రం ఈ ఒప్పందం లేదు. ఈ క్రమంలో చాన్ అనే హాంకాంగ్ పౌరుడు తైవాన్లో తన ప్రేయసిని హత్య చేసి తిరిగి హాంకాంగ్కు వచ్చిన నేపథ్యంలో ఈ బిల్లును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఏడేళ్లు, లేదా ఆపై శిక్ష పడే నేరాలకే అప్పగింత వర్తించేలా ప్రతిపాదనను బిల్లులో చేర్చారు. అయితే ప్రజాస్వామ్య వాదుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో ఎట్టకేలకు వెనక్కి తగ్గిన ప్రభుత్వం దానిని ఉపసంహరించుకుంది. ఇక ఇప్పుడు హాంకాంగ్ స్వయంప్రతిపత్తి రద్దయ్యేలా చైనా జాతీయ భద్రతా చట్టాన్ని అక్కడ అమలు చేయనున్న నేపథ్యంలో మరోసారి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. -
వివాదాస్పద బిల్లుకు హాంకాంగ్ ఆమోదం
హాంకాంగ్: చైనా జాతీయ గీతాన్ని అవమానించడం చట్ట విరుద్ధం, శిక్షార్హమని తేల్చే వివాదాస్పద బిల్లుకు గురువారం హాంకాంగ్ చట్టసభ ఆమోదం తెలిపింది. ఓటింగ్ సందర్భంగా ప్రజాస్వామ్య అనుకూల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. దాంతో బిల్లుకు అనుకూలంగా 41 మంది ఓటేయగా, ఒక్కరు మాత్రమే వ్యతిరేకించారు. హాంకాంగ్ పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛకు, చైనాతో పోలిస్తే తమ పౌరులకు అధికంగా ఉన్న ఇతర హక్కులకు ఈ బిల్లు విఘాతమని ప్రజాస్వామ్య అనుకూలురు వాదిస్తుండగా.. చైనా జాతీయ గీతానికి సముచిత గౌరవం ఇవ్వాల్సిందేనని చైనా అనుకూలురు వాదిస్తున్నారు. ప్రతిపాదిత బిల్లు ప్రకారం.. హాంకాంగ్లో చైనా జాతీయ గీతమైన ‘మార్చ్ ఆఫ్ ద వాలంటీర్స్’ గీతాన్ని అవమానిస్తే మూడేళ్ల వరకు జైలుశిక్ష, 50 వేల హాంకాంగ్ డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశముంది. బిల్లుపై ఓటింగ్ సమయంలో ప్రజాస్వామ్య అనుకూల వాదులు సభలో ఆందోళనలు జరిపారు. (చైనా వివాదాస్పద చట్టానికి నేపాల్ మద్దతు!) -
చైనాకు మద్దతు పలికిన నేపాల్!
ఖాట్మండూ: హాంకాంగ్ను పూర్తిస్థాయిలో తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు చైనా ప్రవేశపెట్టిన వివాదాస్పద జాతీయ భద్రతా చట్టాన్ని నేపాల్ సమర్థించింది. హాంకాంగ్ చైనాలో అంతర్గత భాగమని.. డ్రాగన్ అవలంబిస్తున్న.. ‘‘ఒక దేశం- రెండు వ్యవస్థలు’’ విధానానికి అనుకూల వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు నేపాల్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘శాంతి- భద్రతలు కాపాడటమనేది పాలకుల ప్రాథమిక బాధ్యత. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో హాంకాంగ్ అంతర్భాగమని నేపాల్ పునరుద్ఘాటిస్తోంది. అక్కడ శాంతి భద్రతల పరిరక్షణకై చైనా చేస్తున్న ప్రయత్నాలకు నేపాల్ మద్దతు పలుకుతోంది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిదని నేపాల్ భావిస్తుంది’’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.(హాంకాంగ్పై చైనా పెత్తనం.. షాకిచ్చిన ట్రంప్!) కాగా నేరస్తుల అప్పగింతకై ఒప్పందం కుదుర్చుకునేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ గతేడాది అక్టోబరులో నేపాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేపాల్లో నివసిస్తూ.. చైనాను విమర్శించే వాళ్లు, తమకు వ్యతిరేకంగా మాట్లాడే టిబెట్లను అరెస్టు చేసి.. తమకు అప్పగించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ సమయంలోనే హాంకాంగ్లో అల్లర్లు చెలరేగగా.. తమ నుంచి హాంకాంగ్ను వేరు చేస్తే సహించేది లేదంటూ జిన్పింగ్ నేపాల్ గడ్డమీది నుంచే హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా నేపాల్ ఆయన వ్యాఖ్యలను మరింతగా సమర్థిస్తూ బుధవారం ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఇక లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర విషయంలో భారత్- నేపాల్ల మధ్య విభేదాలు నెలకొన్న విషయం విదితమే.(భారత బలగాలు వెనక్కి వెళ్లాలి: నేపాల్ మంత్రి) ఇక ప్రపంచ వాణిజ్య కేంద్రాల్లో ఒకటి భాసిల్లుతున్న హాంకాంగ్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసే విధంగా ఉన్న జాతీయ భద్రతా చట్టానికి మద్దతుగా నిలవాలని భారత్ సహా వివిధ ఆసియా దేశాలకు చైనా విజ్ఞప్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనా మిత్రదేశమైన పాకిస్తాన్.. హాంకాంగ్ విషయంలో తాము మనస్పూర్తిగా డ్రాగన్ వైపే నిలబడతామని స్పష్టం చేసింది. మరోవైపు అమెరికా, యూకే చైనా ఆధిపత్య ధోరణిని నిరసిస్తూ హాంకాంగ్ ప్రజలకు సంఘీభావం తెలియజేశాయి. -
హాంకాంగ్పై చైనా పెత్తనం.. షాకిచ్చిన ట్రంప్!
వాషింగ్టన్: ప్రపంచ వాణిజ్య ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా పేరొందిన హాంకాంగ్ను పూర్తిస్థాయిలో తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు చైనా తీసుకున్న నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ మండిపడ్డారు. దీర్ఘకాలంగా హాంకాంగ్ సంపాదించుకున్న పేరుప్రతిష్టలు, వైభవాన్ని కాలరాసేలా డ్రాగన్ విపరీత చర్యకు పాల్పడిందని విరుచుకుపడ్డారు. హాంకాంగ్ను పూర్తిస్థాయిలో తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఉద్దేశించిన వివాదాస్పద జాతీయ భద్రతా బిల్లుకు చైనా పార్లమెంట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ట్రంప్ శుక్రవారం శ్వేతసౌధంలో మాట్లాడుతూ.. ‘‘హాంకాంగ్ ప్రజలకు ఇది తీరని విషాదం. కేవలం వారికి మాత్రమే కాదు.. చైనా ప్రజలకు.. చెప్పాలంటే ప్రపంచం మొత్తానికి ఇదో పెను విషాదం’’ అని పేర్కొన్నారు. (స్వేచ్ఛకు సంకెళ్లు: మరో వివాదంలో చైనా) అదే విధంగా హాంకాంగ్పై చైనా ఆధిపత్య ధోరణిని నిరసిస్తూ.. అగ్రరాజ్యం హాంకాంగ్కు కల్పించిన ప్రత్యేక వెసలుబాట్లను రద్దు చేయాలని తన పాలనా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు తెలిపారు. ‘‘హాంకాంగ్కు కల్పించే ప్రత్యేక సదుపాయాలను తొలగించే ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించాను. నేరస్తుల అప్పగింత, ఎగుమతుల నియంత్రణ, సాంకేతికత ఉమ్మడి వినియోగం తదితర పలు కీలక ఒప్పందాలపై ఇది ప్రభావం చూపుతుంది’’ ట్రంప్ పేర్కొన్నారు. అంతేగాక అమెరికా యూనివర్సిటిల్లోని కొంతమంది చైనీస్ విద్యార్థులపై నిషేధం విధించనున్నట్లు తెలిపారు. తమ వాణిజ్య రహస్యాలను తెలుసుకునేందుకు చైనా ప్రభుత్వం దీర్ఘకాలంగా ప్రయత్నిస్తోందని.. ఈ క్రమంలో చైనా మిలిటరీతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న విద్యార్థులపై నిషేధం విధించేందుకు ఆదేశాలు జారీ చేశారు. (డబ్ల్యూహెచ్ఓతో సంబంధాలు రద్దు : ట్రంప్) చైనా పునరాలోచించాలి.. ప్రసక్తే లేదు! హాంకాంగ్పై చైనా చట్టాన్ని అమెరికాతో పాటుగా బ్రిటన్, జపాన్ కూడా తీవ్రంగా ఖండించాయి. చైనా నిర్ణయంపై పునరాలోచన చేయాలని.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వేదికగా ఈ అంశంపై చర్చ జరగాల్సి ఆవశ్యకత ఉందన్నాయి. 1984 నాటి అప్పగింత ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించిందని బ్రిటన్ మండిపడింది. ఆ ఒప్పందం ప్రకారం 2047 వరకు హాంకాంగ్ స్వతంత్రంగా కొనసాగేందుకు చైనా అంగీకరించిందని.. ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ వద్ద రిజిస్ట్రేషన్ కూడా జరిగిందని పేర్కొంది. ఇక ఈ అమెరికా, బ్రిటన్ విమర్శలపై స్పందించిన యూఎన్ చైనా విభాగం..‘‘చైనా అంతర్గత వ్యవహారమైన హాంకాంగ్ విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నా సహించం. భద్రతా మండలిలో దీని గురించి ఎటువంటి చర్చ జరుగబోదు. యూఎస్, యూకే డిమాండ్లకు అర్థం లేదు’’అని ఓ ప్రకటన విడుదల చేసింది.(వారంలోగా చైనాపై కఠిన చర్యలు: ట్రంప్) -
స్వేచ్ఛకు సంకెళ్లు: మరో వివాదంలో చైనా
బీజింగ్ : ప్రపంచ ప్రజానీకంపై పెను విషాదాన్ని నింపుతున్న ప్రాణాంతక కరోనా వైరస్కు పురుడుపోసిన చైనా.. ప్రపంచం ముందు మరో పెను వివాదాన్ని తెచ్చిపెట్టింది. ప్రపంచ దేశాల పెట్టుబడులకు స్వర్గధామంగా పేరొందిన హాంకాంగ్ స్వేచ్ఛకు డ్రాగన్ దేశం సంకెళ్లు వేసింది. తన సామ్రాజాన్ని మరింత విస్తరించుకునేందుకు మరో ముందడుగు వేసింది. ఈ మేరకు హాంకాంగ్పై మరింత పట్టు సాధించేందుకు వివాదాస్పద జాతీయ భద్రతా చట్టాన్ని గురువారం చైనా పార్లమెంట్ ఆమోదించింది. ఆ చట్టంపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటి వరకు స్వతంత్ర దేశంగా ఉన్న హాంకాంగ్ తాజా చట్టంతో పూర్తిగా చైనా ఆధిపత్యంలోకి వెళ్తుందని దీంతో పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. (చైనా పార్లమెంట్ కీలక నిర్ణయం) చైనా చేసిన దుశ్చర్యపై తాము లోతుగా ఆలోచిస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఇదివరకే ప్రకటించగా.. జపాన్ సైతం చైనా చట్టాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. మరోవైపు హాంకాంగ్ భవిష్యత్పై యూరోపియన్ యునియన్కు చెందిన 27 దేశాల ప్రతినిధులు శుక్రవారం చర్చలు జరిపినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే చైనా వివాదాస్పద చట్టంపై బ్రిటన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హాంకాంగ్ స్వేచ్చకు తూట్లు పొడిచే విధంగా చైనా చట్టం రూపొందించిందని విమర్శించింది. ఈ చట్టాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, హాంకాంగ్కు అండగా ఉంటామని బ్రిటన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా కరోనా వైరస్ను ప్రపంచ దేశాలపైకి చైనా కుట్రపూరితంగా లీక్ చేసిందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలోనే మరో వివాదంలో డ్రాగన్ దేశం విమర్శలపాలవుతోంది. (ట్రంప్ మధ్యవర్తిత్వం: కొట్టిపారేసిన చైనా) బ్రిటన్ 99 ఏళ్ల లీజు.. కాగా అప్పట్లో జరిగిన నల్లమందు యుద్ధాల ఒప్పందంలో భాగంగా హాంకాంగ్ను బ్రిటన్ 99 ఏళ్ల పాటు లీజుకు తీసుకుంది. ఈ ఒప్పందానికి గడువు 1996లోనే ముగియడంతో తిరిగి చైనాకు అప్పగించింది. దీంతో హాంకాంగ్ను ప్రత్యేక దేశంగానే గుర్తిస్తామని డ్రాగన్ ప్రకటించినప్పటికీ.. పెత్తనం మాత్రం కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే హాకాంగ్పై పూర్తి పట్టుసాధించాలని జాతీయ భద్రతా చట్టం పేరుతో దుశ్చర్యకు పాల్పడింది. ఈ చట్టం ప్రకారం కమ్యూనిస్ట్ చైనాలోని పలు చట్టాలు నేరుగా అక్కడ అమలవుతాయి. చైనా కరెన్సీ అమల్లోకి వస్తుంది. వాణిజ్య నిర్ణయాల్లో చైనా జోక్యం పూర్తిగా ఉంటుంది. ఈ కారణంగా పలు ప్రపంచ దేశాలు చైనా తీరును తీవ్రంగా ఎండగడుతున్నాయి. (హాంకాంగ్పై మరింత పట్టు) -
హాంకాంగ్పై మరింత పట్టు
బీజింగ్: హాంకాంగ్పై మరింత పెత్తనం చెలాయించేందుకు ఉద్దేశించిన వివాదాస్పద జాతీయ భద్రతా బిల్లును చైనా పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇవి అమల్లోకి వస్తే హాంకాంగ్ ప్రాదేశిక స్వతంత్ర ప్రతిపత్తి, పౌరులకున్న రాజకీయ స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడతాయని విమర్శకులు అంటున్నారు. ప్రధాన వాణిజ్య కేంద్రాల్లో ఒకటిగా హాంకాంగ్కున్న పేరు మరుగున పడుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చైనా ప్రభుత్వం రూపొందించిన ఈ ప్రతిపాదనలను నామమాత్రంగా ఉండే పార్లమెంట్(నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్, ఎన్పీసీ) ఏకగ్రీవంగా ఆమోదించింది. వీటిని హాంకాంగ్ పార్లమెంట్ ఆమోదిస్తే వచ్చే ఆగస్టు కల్లా చట్టరూపం దాల్చుతుంది. ప్రజాస్వామ్య హక్కులు, చైనా నుంచి మరింత స్వతంత్ర ప్రతిపత్తి కోసం గత ఏడాది ప్రజాస్వామ్య వాదులు చేపట్టిన ఆందోళనలతో హాంకాంగ్ అట్టుడికింది. తీవ్ర హింసాత్మక ఘటనలు చెలరేగాయి. వాణిజ్య కార్యకలాపాలు స్తంభించాయి. ఈ పరిణామాలను చైనా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. హాంకాంగ్పై మరింత పట్టు సాధించడం ద్వారా వీటికి చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది. -
చైనా పార్లమెంట్ కీలక నిర్ణయం
బీజింగ్ : ప్రపంచమంతా ప్రాణాంతక కరోనా వైరస్తో పోరాడుతున్న క్లిష్ట సమయంలోనూ చైనా తన సామ్రాజాన్ని విస్తరించుకోవాలని ప్రయత్నిస్తోంది. హాంకాంగ్పై ఆధిపత్యానికి వడివడిగా అడుగులు వేస్తున్న డ్రాగన్ దేశం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. హాంకాంగ్ వాసుల స్వేచ్ఛకు సంకెళ్లు వేసే జాతీయ భద్రతా చట్టానికి చైనా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అధ్యక్షుడు జిన్పింగ్ ఆదేశాలతో జాతీయ భద్రతా చట్టంపై చర్చించేందుకు గురువారం ప్రత్యేకంగా సమావేశమైన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్పీసీ) ఈ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు ఓ అంతర్జాతీయ పత్రిక తన కథనంలో పేర్కొంది. మొత్తం 2800 మంది ఎన్పీసీ సభ్యులు నూతన చట్టానికి అనుకూలంగా ఓట్లు వేశారని సమాచారం. తాజా నిర్ణయంతో చైనా ఇంటెలిజెన్స్ సంస్థలు హాంకాంగ్లో తిష్ట వేసే అవకాశం ఉంది. హాంకాంగ్లో ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని అణిచేయడానికి, విదేశీ జోక్యాన్ని నిరోధించడానికి ఈ చట్టం ఎంతో అవసరమని చైనా ప్రభుత్వం చెబుతోంది. ఒక దేశం రెండు వ్యవస్థల విధానాన్ని మరింత మెరుగుపరచి.. దానిని పటిష్టం చేయాలని భావిస్తోంది. కాగా చైనా చట్టాలను, జాతీయ గీతాన్ని అవమానిస్తే నేరంగా పరిగణించే బిల్లుకు గత నెలలోనే ముసాయిదాను తయారు చేసిన విషయం తెలిసిందే. (ఆమెను విడుదల చేయండి : చైనా వార్నింగ్!) -
హాంకాంగ్లో మళ్లీ చిచ్చు
జూలై నెల సమీపిస్తున్నదంటే హాంకాంగ్ వాసులు హడలెత్తుతారు. 1997 జూలై నెలలో ఆ నగరంపై బ్రిటన్కున్న లీజు ముగిసి, అది చైనాకు స్వాధీనమైంది. ఏటా ఆ వార్షికోత్సవం సమయానికల్లా హాంకాంగ్లో ఏదో ఒక చిచ్చు రేపడం చైనాకు ఆనవాయితీగా మారింది. ఈసారి అది భద్రతా చట్టాన్ని తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది. వాస్తవానికి చైనా జాతీయ గీతాన్ని అవమానిస్తే నేరంగా పరి గణించే బిల్లును గత నెలలో జనంపైకి వదిలింది. దానిపై ఆందోళనలు రాజుకుంటున్న జాడలు కనిపిస్తుండగానే ఈ భద్రతా చట్టం ప్రతిపాదన బయటికొచ్చింది. హాంకాంగ్లో ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని అణిచేయడానికి, విదేశీ జోక్యాన్ని నిరోధించడానికి ఈ చట్టం అవసరమంటోంది చైనా. ఆ దేశం చెప్పినదానికల్లా తలాడించడం అలవాటైన హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లామ్ యధాప్రకారం ఈ చట్టాన్ని గట్టిగా సమర్థిస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన నిరసనలు, ఆందోళనలు ఈ భద్రతా చట్టం పరిధిలోకి రావని, పౌరుల స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు భంగం వాటిల్లదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. హాంకాంగ్ వాసులపై ఆంక్షల సంకెళ్లు వుండబోవంటున్నారు. మెజారిటీ ప్రజల ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయమంటున్నారు. నెలక్రితం జాతీయ గీతం బిల్లు విషయంలోనూ ఆమె ఈ మాదిరే మాట్లాడారు. ఇరవైమూడేళ్లక్రితం హాంకాంగ్ను వెనక్కి తీసుకున్నప్పుడు చైనా చాలా హామీలు ఇచ్చింది. తాము స్వతంత్ర రాజ్యంగా మనుగడ సాగిస్తాం తప్ప, విలీనం కావడానికి ఒప్పుకోబోమని హాంకాంగ్ వాసులు ఆందోళనలకు దిగినప్పుడు నాటి చైనా అధినాయకుడు డెంగ్ షియావో పెంగ్ వారికి అనేక విధాల నచ్చజెప్పారు. చైనాలో తాము అమలు చేస్తున్న విధానాలేవీ హాంకాంగ్లో అమలుకాబోవని చెప్పారు. ఆ నగరంలో వచ్చే 50 ఏళ్లపాటు... అంటే 2047 వరకూ పాత విధానాలే పూర్తిగా అమల వుతాయని, దాని స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు భంగం రానీయబోమని రాతపూర్వకంగా వాగ్దానం చేశారు. అప్పటివరకూ ‘ఒకే దేశం– రెండు వ్యవస్థల’ విధానం కొనసాగుతుందని చెప్పారు. ఆయనిచ్చిన హామీల ప్రకారం ఆర్థిక, వాణిజ్య, న్యాయ వ్యవహారాల్లో హాంకాంగ్ సొంతంగా నిర్ణయాలు తీసు కోవచ్చు. పాలనా నిర్వహణ, శాసనాధికారం కూడా దానికే ఉంటాయి. కానీ అనంతరకాలంలో చైనా మాట తప్పడం మొదలుపెట్టింది. 2003లో తొలిసారిగా జాతీయ భద్రతా చట్టం ప్రతిపాదన తీసు కొచ్చింది. అప్పట్లో ఆ ప్రయత్నానికి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. హాంకాంగ్లో విదేశీ శక్తులు చొరబడకుండా ఆపడానికే చట్టం తెస్తున్నామని చెప్పినా ఉద్యమకారులు వినలేదు. గత్యంతరం లేని స్థితిలో దాన్ని చైనా ఉపసంహరించుకోవాల్సివచ్చింది. గత మూడేళ్లుగా బాహాటంగానే ప్రవర్తిస్తోంది. పాలనా వ్యవస్థలో వున్న చైనా వ్యతిరేకులను అనర్హులుగా ప్రకటించడం, చైనా వ్యతిరేకులన్న అను మానం కలిగినవారిని కిడ్నాప్ చేయడం వంటివి మొదలయ్యాయి. నిరుడు నేరస్తుల అప్పగింత చట్టం సవరణ బిల్లు తీసుకొచ్చారు. అది ఆమోదం పొందివుంటే నేరాలు చేసినవారిని చైనాకు అధికారికంగా అప్పగించడానికి వీలయ్యేది. విశ్వసనీయత అంతంతమాత్రంగా వున్న చైనా న్యాయ వ్యవస్థలో న్యాయం ఎంతో అందరికీ తెలుసు. పైగా వెనకటి కాలం నుంచి వర్తించేలా ఆ సవరణ బిల్లు రూపొం దించారు. ఆ బిల్లుపై చెలరేగిన ఆందోళనల్ని ఎంతగా అణచడానికి ప్రయత్నించినా హాంకాంగ్ పాలక వ్యవస్థకూ, చైనాకూ అసాధ్యమైంది. నయానా భయానా చెప్పి చూసినా ఆ ఉద్యమం చల్లారలేదు సరిగదా అది మరింత ఉధృతంగా కొనసాగింది. చివరకు ఆ బిల్లును వెనక్కు తీసుకుంది. అనంతరం నిరుడు నవంబర్లో హాంకాంగ్ పరిధిలోని 18 జిల్లా పాలకమండళ్లకు జరిగిన ఎన్నికల్లో 17 మండళ్లు ప్రజాస్వామ్య అనుకూలవాదుల చేతికి చిక్కడంతోపాటు 452 స్థానాల్లో 390 స్థానాలు లభించాయి. చైనా అనుకూలురకు కేవలం 59 స్థానాలు మాత్రమే వచ్చాయి. పాలకమండళ్లకు పెద్దగా అధికారాలు లేకపోయినా ఆ తీర్పు చైనాకు పెద్ద షాకిచ్చింది. పర్యవసానంగా నేరస్తుల అప్పగింత చట్టాన్ని మించిన కఠిన నిబంధనలతో తాజాగా ఈ చట్టానికి రూపకల్పన చేసింది. ఒకపక్క కరోనా వైరస్ మహమ్మారితో పోరాడటంలో ప్రపంచమంతా నిమగ్నమైన తరుణంలో చైనా ఇదే అదునుగా భావించి ఈ కఠినమైన చట్టాన్ని జనం నెత్తిన రుద్దడానికి ప్రయత్నిస్తోంది. ఇది అమల్లోకొస్తే చైనా ఇంటెలిజెన్స్ సంస్థలు హాంకాంగ్లో తిష్ట వేస్తాయి. ప్రజాస్వామ్య ఉద్యమాలను అణచడానికి పనిచేస్తాయి. హాంకాంగ్ పాలనా వ్యవస్థ, పోలీస్ విభాగం అప్పుడే ఆ చట్టానికి అనుకూ లంగా ప్రచారం మొదలుపెట్టాయి. వారు చెబుతున్న ప్రకారం హాంకాంగ్లో ఉగ్రవాదం పెరిగిపోతోందట. దాని స్వేచ్ఛాస్వాతంత్య్రాలను దెబ్బతీయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయట. అలా ప్రక టనలు చేసిందే తడవుగా హాంకాంగ్ పోలీసులకు ఆ నగరంలో తుపాకులు, కొన్ని పేలుడు పదార్థాలు ‘దొరికాయి’. ఉగ్రవాద దాడులకు దిగేవారు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివే వినియోగిస్తుంటారని పోలీస్ చీఫ్ క్రిస్ టాంగ్ చెబుతున్నారు. చట్ట ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న దశలోనే ఇలా తుపాకులు, పేలుడు పదార్థాలు దొరికాయంటే, మున్ముందు ఆ నగరం పరిస్థితేమిటో సులభంగానే అంచనా వేసు కోవచ్చు. హాంకాంగ్కు సంబంధించి చట్టాలు చేయదల్చుకున్నప్పుడు వాటికి సంబంధించిన బిల్లుల్ని అక్కడి పాలనా మండలిలో ప్రవేశపెట్టడం రివాజు. ఆ దారిన పోతే వికటిస్తోందని భయపడి ఈసారి చైనా కొత్త మార్గం ఎంచుకుంది. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్లో ఈ చట్టానికి సంబంధించిన బిల్లుపెట్ట బోతోంది. చైనా పాలకులకు రబ్బర్ స్టాంపుగా ఉపయోగపడే ఆ సభలో ఇది ఆమోదం పొందడం ఖాయం. ఇంతవరకూ బిల్లు గురించి స్థూలంగా ఒకటి రెండు ముక్కలు చెప్పడమే తప్ప, దాని పూర్తి పాఠాన్ని చైనా బయటపెట్టలేదు. ఆ పని చేస్తే వ్యతిరేకత మిన్నంటుతుందని దాని భయం. ప్రజా స్వామ్య పరిరక్షణకు గత 23 ఏళ్లుగా నిరంతరం పోరాడుతూ చైనా ప్రయత్నాలను వమ్ము చేస్తూ వచ్చిన హాంకాంగ్ పౌరులు ఈసారి తమ కృషిలో విజయం సాధిస్తారా లేదా అన్నది చూడాలి. -
వారంలోగా చైనాపై కఠిన చర్యలు: ట్రంప్
వాషింగ్టన్: హాంకాంగ్ విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్న చైనాపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మంగళవారం నాటి సమావేశంలో విలేకరుల ప్రశ్నలకు బదులిస్తూ.. ‘‘మేం ఇప్పుడు ఏం చేస్తున్నామో వారంలోగా మీకు తెలుస్తుంది. అది మీకు అత్యంత ఆసక్తికలిగించేదిగా ఉంటుంది. అంతేగాక అది శక్తివంతమైన నిర్ణయం అయి ఉంటుంది’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. కాగా స్వయంప్రతిపత్తి హోదాను కలిగి ఉన్న హాంకాంగ్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు డ్రాగన్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.(చైనా కీలక నిర్ణయం.. హాంకాంగ్కు ముగింపు ఇది!) ఇందులో భాగంగా వాణిజ్య, ఆర్థిక హబ్ అయిన హాంకాంగ్లో జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేసేందుకు వీలుగా ఓ ముసాయిదా బిల్లును ఇటీవలే చైనా పార్లమెంటులో ప్రవేశపెట్టి.. ఆమోదం తెలిపింది. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో చైనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అగ్రరాజ్యం అమెరికా.. చైనీస్ కంపెనీలను తమ స్టాక్ ఎక్ఛ్సేంజీల నుంచి డీలిస్టింగ్ చేసేందుకు సమాయత్తమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమకు వ్యతిరేకంగా నిరసనలకు దిగుతున్న హాంకాంగ్ను గుప్పిట్లోకి తెచ్చుకుని.. తమ కంపెనీలను బ్రిటన్ స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్ చేసి.. తద్వారా అమెరికాకు కౌంటర్ ఇవ్వాలని చైనా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హాంకాంగ్పై చైనా పెత్తనాన్ని సహించే ప్రసక్తే లేదంటూ ట్రంప్ ఇదివరకే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. (చైనాకు అమెరికా భారీ షాక్..) -
33 చైనీస్ కంపెనీలకు అమెరికా షాక్!
వాషింగ్టన్: మైనార్టీల పట్ల చైనా వ్యవహరిస్తున్న తీరుపై అగ్రరాజ్యం అమెరికా మండిపడింది. అల్ప సంఖ్యాక వర్గాలపై అణచివేత ధోరణి అవలంబించేందుకు వీలుగా చైనా తరఫున గూఢచర్యం నెరపుతున్నాయన్న ఆరోపణలతో 33 చైనీస్ సంస్థలను ఎకనమిక్ బ్లాక్లిస్టులో చేర్చింది. సదరు సంస్థలు చైనా మిలిటరీతో సంబంధాలు కలిగి ఉన్నాయని, మైనార్టీల ప్రయోజనాలు కాలరాసే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ‘‘ఉగర్ల(షింజియాంగ్లోని తెగ) సామూహిక నిర్బంధం, శ్రమదోపిడి, అత్యాధునిక సాంకేతికతతో వారిపై నిఘా వేసేందుకు చైనా చేపట్టిన అణచివేత కార్యక్రమంలో భాగస్వామ్యమైన ఈ కంపెనీలు మానవ హక్కుల ఉల్లంఘన, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయి’’అని అమెరికా వాణిజ్య విభాగం రాయిటర్స్తో పేర్కొంది. ఎకనమిక్ బ్లాక్లిస్టులో పెట్టిన కనీసం ఏడు టెక్నాలజీ కంపెనీలు ఉండగా.. ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఉన్నట్లు వెల్లడించింది.(చైనా గుప్పిట్లోకి హాంకాంగ్.. అమెరికా స్పందన!) కాగా సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న హాంకాంగ్ను పూర్తిగా తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు జాతీయ భద్రతా చట్టాన్ని అక్కడ అమలు చేసే ముసాయిదా బిల్లుకు చైనా పార్లమెంటు శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో బిల్లు చట్టరూపం దాల్చితే హాంకాంగ్ స్వయంప్రతిపత్తి కోల్పోయే అవకాశం ఉంది. అమెరికాతో వాణిజ్య యుద్ధం ముదిరిన నేపథ్యంలో డ్రాగన్ ఈ మేరకు పావులు కదుపుతోంది. అదే విధంగా తైవాన్పై సైతం హాంకాంగ్ మాదిరి పెత్తనం చెలాయించేందుకు వ్యూహాలు రచిస్తోంది. అంతేగాకుండా సరిహద్దుల్లో పొరుగు దేశాల సైన్యాన్ని పదే పదే రెచ్చగొడుతూ దుందుడుకు వైఖరి ప్రదర్శిస్తోంది. (తైవాన్పై బాహ్య శక్తుల ప్రమేయాన్ని సహించం: చైనా) ఈ నేపథ్యంలో ఇప్పటికే కరోనా వైరస్ విషయంలో చైనాపై మండిపడుతున్న అమెరికా... చైనా కమ్యూనిస్టు పార్టీ పొరుగు దేశాలపై దురుసుగా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేగాక జాతీయ సైబర్ సెక్యూరిటీ చట్టాన్ని తీసుకువచ్చి ప్రపంచ దేశాల సమాచారాన్ని సేకరించి.. తద్వారా అందరి డేటాను చౌర్యం చేసేందుక సమాయత్తమైందని ఆరోపించింది. ఈ క్రమంలో అమెరికా వాణిజ్య విభాగ విదేశీ ప్రత్యక్ష ఉత్పత్తుల వినియోగం నిబంధనలు మరింత విస్తృతం చేస్తూ.. చైనీస్ టెలికం దిగ్గజం హువావే టెక్నాలజీస్ను అమెరికా చట్టాలను ఉల్లంఘించకుండా కట్టడి చేయాలని నిర్ణయించింది. ఇక తాజాగా హాంకాంగ్, ఉగర్ల పట్ల చైనా దమననీతిని నిరసిస్తూ 33 కంపెనీలను బ్లాక్లిస్టులో చేర్చి వాటికి నిధులు రాకుండా అడ్డుకట్ట వేసేందుకు ఉపక్రమించింది. గతేడాది సైతం ఇదే తరహాలో 28 చైనీస్ కంపెనీలను బ్లాక్లిస్టులో చేర్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజా పరిణామాల నేపథ్యంలో.. రక్షణ రంగానికి గతేడాది 177 బిలియన్ డాలర్ల బడ్జెట్ కేటాయించిన డ్రాగన్.. ఈసారి దానిని 6.6 శాతం పెంచుతూ 179 బిలియన్ డాలర్లు చేయడం గమనార్హం. (డ్రాగన్ దేశంపై ఉమ్మడిగా పోరాడాలన్న అమెరికా) -
చైనా కీలక నిర్ణయం.. హాంకాంగ్కు ముగింపు ఇది!
బీజింగ్/వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాతో వాణిజ్య యుద్ధం రోజురోజుకీ ముదురుతున్న నేపథ్యంలో ఆర్థిక, వ్యాపార కేంద్రంగా భాసిల్లుతున్న హాంకాంగ్ను పూర్తిగా తన గుప్పిట్లో బంధించేందుకు చైనా పావులు కదుపుతోంది. జాతీయ భద్రతా చట్టాన్ని హాంకాంగ్లో అమలు చేసే బిల్లుకు సంబంధించిన ప్రతిపాదనలను శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. తద్వారా చైనాకు వ్యతిరేకంగా హాంకాంగ్లో వెల్లువెత్తుతున్న నిరసనలను అణగదొక్కి వాణిజ్య హబ్పై మరింత పట్టు సాధించేలా ముందుకు సాగుతోంది. ఈ విషయం గురించి చైనా పార్లమెంట్ అధికార ప్రతినిధి జాంగ్ యేసూయీ మాట్లాడుతూ.. ‘‘హాంకాంగ్లో జాతీయ భద్రతా చట్టం’’అమలు చేసేందుకు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ తొలి రోజు సమావేశంలో ప్రతిపాదనలు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. తద్వారా చట్టాలను మరింత సమర్థవంతంగా అమలు చేసే వీలు కలుగుతుందని పేర్కొన్నారు. ‘‘ఒక దేశం రెండు వ్యవస్థల విధానాన్ని మరింత మెరుగుపరచి.. దానిని పటిష్టం చేయాలని చైనా పార్లమెంట్ భావిస్తోంది’’ అని చెప్పుకొచ్చారు. హాంకాంగ్కు మార్కెట్ ఎకానమీని పటిష్టం చేసేందుకు ఈ అంశం దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. (తైవాన్పై బాహ్య శక్తుల ప్రమేయాన్ని సహించం: చైనా) హాంకాంగ్కు ముగింపు ఇది చైనా తాజా నిర్ణయాన్ని హాంకాంగ్ ప్రజాస్వామ్య వాదులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. డ్రాగన్ చర్యలు హాంకాంగ్ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘హాంకాంగ్కు ముగింపు ఇది. ఒక దేశం- రెండు వ్యవస్థలకు చరమగీతం ఇది. ఇలాంటి తప్పులు చేయకండి’’ అంటూ సివిక్ పార్టీ చట్టసభ ప్రతినిధి డెన్నిస్ వోక్ ఆందోళన వ్యక్తం చేశారు. హాంగ్కాంగ్ ప్రజలకు బీజింగ్ ఏమాత్రం గౌరవం ఇవ్వడంలేదని మరో నేత తాన్యా చాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మమ్మల్ని సంప్రదించకుండానే ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలంతా ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. అయితే మేం ఎన్నటికీ ఆశావహ దృక్పథాన్ని విడిచిపెట్టం. పోరాడుతూనే ఉంటాం’’అని ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. ఇక హాంగ్ కాంగ్ చివరి బ్రిటీష్ గవర్నర్ క్రిస్ పాటన్..‘‘ పట్టణ స్వయంప్రతిపత్తిపై ఇది హేయమైన దాడి’’ అని మండిపడ్డారు. కొంతమంది చైనా మానవ హక్కుల కార్యకర్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.(చైనా చొరబాట్లు.. భారత్పై ఆక్రోషం!) అమెరికా స్పందన హాంకాంగ్ పట్ల చైనా వైఖరిపై అమెరికా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘‘అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అదే గనుక నిజమైతే.. ఆ వివాదంపై మా స్పందన చాలా స్ట్రాంగ్గా ఉంటుంది’’అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. సెనెటర్ పాట్ టూమీ మాట్లాడుతూ.. ‘‘ఇతర దేశాలపై చైనా జోక్యం ఎక్కువవుతోంది. హాంకాంగ్ ఆసియాకు బొగ్గు గని వంటిది’ ’అని పేర్కొన్నారు. చైనా గనుక తన నిర్ణయాన్ని అమలు చేస్తే అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుందని హెచ్చరించారు. 1997లో అప్పగింత.. బ్రిటన్ తన పాలనలో ఉన్న హాంకాంగ్ను 1997లో చైనాకు అప్పగించింది. ఆ సమయంలో ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ మినీ రాజ్యాంగాన్ని రూపొందించుకునేందుకు ఒప్పందం కుదిరింది. ఇక అందులోని ఆర్టికల్ 23 ప్రకారం చైనా ప్రభుత్వాన్ని ధిక్కరించకూడదు. అయితే గత కొన్నేళ్లుగా ప్రజాస్వామ్య వాదులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలకు దిగుతున్నారు. తమ దేశంపై సుదీర్ఘకాలంగా సాగుతున్న చైనా పెత్తనాన్ని వారు సహించలేకపోతున్నారు. ఇక నేరస్తుల అప్పగింతకు సంబంధించిన ఒక బిల్లుపై వచ్చిన చైనా ప్రతిపాదనలతో హాంకాంగ్లో గతేడాది నిరసనలు మిన్నంటాయి. ఈ బిల్లుతో హాంకాంగ్లో నిందితుల్ని చైనాలో విచారించే అవకాశం కలుగుతుంది. దీంతో రైట్ వింగ్ యాక్టివిస్టులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. హాంకాంగ్ ప్రత్యేక ప్రతిపత్తిని నిర్వీర్యం చేసేలా చైనా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ రోడ్డెక్కారు. (‘శరీరాలు నుజ్జునుజ్జు చేసి.. ఎముకలు విరగ్గొడతాం’)) బ్రిటన్ వైపు డ్రాగన్ చూపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో చైనాపై విరుచుకుపడుతున్న అమెరికా.. తమ దేశ స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్ అయిన చైనా కంపెనీలను డీలిస్ట్ చేయడం ద్వారా బిలియన్ల కొద్దీ అమెరికన్ డాలర్లు పెట్టుబడులుగా పొందుతున్న చైనీస్ సంస్థలను ఆర్థికంగా దెబ్బతీయాలనే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన బిల్లుకు అమెరికా సెనేట్ తాజాగా ఆమోదముద్ర వేసింది. ఇక అమెరికా తమ కంపెనీలపై గురిపెట్టే ప్రమాదాన్ని ముందుగానే ఊహించిన డ్రాగన్ దేశం తదుపరి వ్యూహాలతో సమాయత్తమవుతోంది. కంట్లో నలకలా మారిన హాంకాంగ్లో నిరసనలను అణగదొక్కే విషయంలో తమకు మద్దతుగా నిల్చిన బ్రిటన్ వైపు డ్రాగన్ చూస్తోంది. ఒకవేళ అమెరికన్ ఎక్స్చేంజీల నుంచి తమ కంపెనీలు డీలిస్ట్ అయినట్లయితే ప్రత్యామ్నాయంగా లండన్ ఎక్స్చేంజీలో కంపెనీలను లిస్ట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. (చైనాకు అమెరికా భారీ షాక్..) -
తైవాన్ను మా నుంచి విడదీయలేరు: చైనా
తైపీ/బీజింగ్: తమ భూభాగం నుంచి తైవాన్ను వేరు చేసే ఏ చర్యను తాము ఎన్నటికీ సహించబోమని చైనా హెచ్చరికలు జారీ చేసింది. చైనా అంతర్గత వ్యవహారాలు, రాజకీయాల్లో బాహ్య శక్తుల ప్రమేయాన్ని ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. తైవాన్ అధ్యక్షురాలిగా జనవరిలో రెండోసారి ఎన్నికైన డాక్టర్ త్సాయి ఇంగ్- వెన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ... ‘‘ఎన్ని సవాళ్లు ఎదురైనా ప్రజాస్వామ్య విలువలకు, స్వాతంత్ర్య కాంక్షకు కట్టుబడే ఉన్నాం. బీజింగ్ అధికారులు చెప్పే మాటలను తైవాన్ ఎన్నటికీ అంగీకరించబోదు. మన సార్వభౌమత్వాన్ని కాలరాసే హక్కు ఎవరికీ ఇవ్వదు’’ అని చైనా తీరుపై విమర్శలు సంధించారు. అదే సమయంలో సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందంటూ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్కు విజ్ఞప్తి చేశారు.(‘శరీరాలు నుజ్జునుజ్జు చేసి.. ఎముకలు విరగ్గొడతాం’) ఇక త్సాయి ఇంగ్-వెన్ వ్యాఖ్యలపై చైనా తైవాన్ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి మా జియోగాంగ్ స్పందించారు. ‘‘జాతీయ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుకునే శక్తి మాకు ఉంది. వేర్పాటువాద కార్యకర్తలు, చైనా నుంచి తైవాన్ను విడదీయాలనే బాహ్య శక్తులను సహించే ప్రసక్తే లేదు. శాంతియుతమైన పునర్కలయికకు.. ఒక దేశం- రెండు విధానాల పద్ధతికి మేం కట్టుబడి ఉన్నాం’’అంటూ హాంగ్హాంగ్పై ఆధిపత్య చెలాయిస్తున్న తీరును తైవాన్లోనూ అమలు చేస్తామన్న సంకేతాలు ఇచ్చారు. కాగా తైవాన్, హాంగ్కాంగ్లను ప్రత్యేక దేశాలుగా గుర్తించడానికి చైనా నిరాకరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ రెండు ప్రాంతాలు తమ భూభాగానికి చెందినవే అని బీజింగ్ వాదిస్తోంది. అయితే 1949లో జరిగిన పౌర యుద్ధం తర్వాత తైవాన్ స్వతంత్ర పాలనకు మొగ్గుచూపింది. ఇక 2016లో త్సాయి ఇంగ్- వెన్ తైవాన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత చైనాలో భాగంగా తమను గుర్తించడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. (తైవాన్పై చైనా పెత్తనం.. భారత్ సాయం కావాలి!) -
కరోనా ఫ్రీ దిశగా.. చైనా పొరుగు దేశం!
హాంకాంగ్ : మహమ్మారి కరోనా అన్ని దేశాలనూ చుట్టేసింది. అయితే, నిత్యం వేలాది కేసులు నమోదవుతున్న చైనా పొరుగు దేశం హాంకాంగ్ ఓ గుడ్న్యూస్ చెప్పింది. హాంకాంగ్లో సోమవారం ఒక్క కోవిడ్-19 కేసు కూడా నమోదు కాలేదు. ఈ విషయాన్ని ఆ దేశ వైద్యారోగ్య శాఖ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. మార్చి 23న అక్కడ తొలి కరోనా కేసు నమోదైంది. కోవిడ్ పుట్టుకకు కేంద్ర స్థానమైన చైనాకు అతి సమీపంలో ఉన్న హాంకాంగ్ భారీగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ప్రధానంగా అమెరికా, లండన్ ఇతర యూరప్ దేశాల నుంచి వచ్చే ఎయిర్లైన్స్ సేవలను రద్దు చేసింది. లాక్డౌన్ పాటించకున్నా.. ప్రజలు సామాజిక దూరం పాటించేలా కఠిన నిబంధనలు అమలు చేసింది. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించారు. ఫలితంగా ఆ దేశంలో కేసులు, మరణాలు సంఖ్య తక్కువగా నమోదైంది. (చదవండి: కరోనా: ‘వారి పరిస్థితి మరింత దారుణం’) కొత్త కేసులు నమోదు కాకపోతే.. ఇప్పటివరకు హాంకాంగ్లో 1,026 మంది కోవిడ్ బారినపడగా.. వారిలో 630 మంది కోలుకున్నారు. నలుగురు మరణించారు. ప్రస్తుతం 392 యాక్టివ్ కేసులున్నాయి. మరో రెండు వారాల్లో కొత్త కేసులు నమోదు కాకపోతే హాంకాంగ్ కరోనా ఫ్రీగా మారుతుంది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత ఉన్న దేశాల్లో హాంకాంగ్ ఒకటి. గత సార్స్ అనుభవాలు నేర్పిన పాఠాలనుంచి హాంకాంగ్ త్వరగానే మేలుకుంది. లాక్డౌన్ విధించకపోయినా ప్రజలు స్వీయ నియంత్రణలో ఉన్నారు. (చదవండి: లాక్డౌన్ ఎత్తివేయడం ప్రమాదకరం!) -
కుక్కల బోనులో బంధిస్తారు... చితకబాదుతారు!
న్యూఢిల్లీ: మానవాళి మనుగడకు పెనుముప్పుగా పరిణమించిన కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మహమ్మారిని అంతం చేసే పరిశోధనలకు నిధులు కేటాయిస్తూనే.. అంటువ్యాధి ప్రబలకుండా లాక్డౌన్ విధిస్తున్నాయి. కేవలం నిత్యావసరాల కోసం మాత్రమే బయటకు వెళ్లే వెసలుబాటును కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో కొంతమంది ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగానే లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తూ పోలీసుల చేతికి చిక్కుతున్నారు. ఇలాంటి వారి కారణంగా అత్యవసర సేవల నిమిత్తం రోడ్ల మీదకు వచ్చిన ప్రజలపై కూడా పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. అందరినీ ఒకే గాటన కట్టి విపరీత చర్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో మానవ హక్కుల సంఘాలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒక్కో దేశంలో పౌరుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతున్నాయి. అతడిని సస్పెండ్ చేశాం భారత్లో మార్చి 24 నుంచి 21 రోజుల పాటు లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. ఇక ఆనాటి నుంచి ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పోలీసులు విరుచుకుపడుతున్నారు. కరోనా వ్యాప్తి అరికట్టే చర్యల్లో భాగంగా లాఠీలకు పనిచెబుతున్నారు. మరికొన్ని చోట్ల గుంజీలు తీయిస్తూ.. వీధుల వెంట పరిగెత్తిస్తూ.. కొడుతున్నారు. ఇక మధ్యప్రదేశ్లో ఓ పోలీసు మరో అడుగు ముందుకేసి పౌరుడి నుదటిపై.. ‘‘నేను లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించాను. నాకు దూరంగా ఉండండి’’అంటూ రాతలు రాయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అతడిపై వేటు వేసినట్లు ఓ ఉన్నతాధికారి మీడియాకు వెల్లడించారు.(లాక్డౌన్: ఇది అమానవీయ చర్య: ప్రియాంక) రబ్బరు బుల్లెట్ల వర్షం ఇక దక్షిణాఫ్రికాలో శుక్రవారం నాటి నుంచి 21 రోజుల పాటు లాక్డౌన్ విధించారు. దీనిని పక్కాగా అమలు చేసేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వాటర్ కెనన్లు, రబ్బరు బుల్లెట్ల వర్షం కురిపిస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించారంటూ ఇష్టారీతిన చితకబాదుతున్నారు.(అక్కడ 5 మరణాలు.. భారత సంతతి వైరాలజిస్టు మృతి) ఫిలిప్పీన్స్లో ఏం చేస్తున్నారంటే... లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఫిలిప్పైన్స్లో అరెస్టు చేసి.. హింస పెడుతున్నారంటూ మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. తీవ్రమైన నేరస్తుల్లా చిత్రీకరించి సమాజంలో తలెత్తుకోకుండా చేస్తున్నారని మండిపడుతున్నాయి. ముఖ్యంగా యువతను కుక్కల బోన్లలో బంధించడం.. ఎర్రటి ఎండలో కూర్చోబెట్టడం వంటి అమానుష చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. లాక్డౌన్ అమలు అవుతున్న క్రమంలో ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తు మహమ్మారిని వ్యాప్తి చేస్తున్న వారిని కాల్చి చంపేందుకు కూడా వెనుకాడవద్దని దేశ అధ్యక్షుడు రోడ్రిగో పోలీసులు, మిలటరీ అధికారులను ఆదేశించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. (గీత దాటితే.. కాల్చి చంపండి) క్వారంటైన్లో ఉండకపోతే.. మెక్సికోలో అంతే.. కరోనా వైరస్ సోకిన వారు క్వారంటైన్లో ఉండకుండా బయటకు వస్తే మూడేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తామని మెక్సికోలోని యుక్టాన్ రాష్ట్రం హెచ్చరించింది. ఇక లాక్డౌన్ నేపథ్యంలో ప్రాంక్ కాల్స్ చేసి విసిగించిన వారికి 600 డాలర్ల జరిమానా విధిస్తామని పెరూ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. హాంగ్కాంగ్లో కూడా.. సామాజిక దూరం పాటించకుండా.. క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హాంగ్కాంగ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో నిబంధనలు అతిక్రమించిన దాదాపు 70 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి విపత్కర సమయాల్లో పిచ్చిగా ప్రవర్తిస్తే సహించేది లేదని.. ఆరు నెలల జైలు శిక్ష.. 25 వేల హాంగ్కాంగ్ డాలర్ల జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు. ఇక ఇదే తరహాలో సింగపూర్ కూడా సామాజిక దూరం నిబంధలను ఉల్లంఘిస్తే 10 వేల సింగపూర్ డాలర్ల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఆస్టేలియా సైతం నిబంధనలు అతిక్రమిస్తే 11 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు కట్టాల్సిందేనని తేల్చిచెప్పింది. ఇందుకు ఎవరూ అతీతులు కాదని.. జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష కూడా ఉంటుందని పేర్కొంది. -
పెంపుడు పిల్లికి కరోనా పాజిటివ్
హాకాంగ్ : కరోనా మహమ్మారి మనుషులపైనే కాదు జంతువులపైన కూడా తన ప్రతాపాన్ని చూపుతోంది. హాకాంగ్లో ఇప్పటికే రెండు పెంపుడు కుక్కలకు కరోనా వైరస్ పాజిటివ్ రాగా.. తాజాగా ఓ పెంపుడు పిల్లికి కూడా ఈ మహమ్మారి సోకినట్లు వైద్యులు గుర్తించారు. యజమాని వల్ల పిల్లికి కూడా కరోనా సోకిందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు మార్చి 31న హాంకాంగ్ అగ్రికల్చరల్ అండ్ ఫిషరీస్ అండ్ కన్జర్వేషన్ డిపార్టమెంట్ ఓ నోటీసులు విడుదల చేసింది. (చదవండి : కరోనా బారిన పడి 13 ఏళ్ల బాలుడి మృతి) అయితే దీని వల్ల ఎలాంటి ప్రమాదం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. పెంపుడు జంతువుల ద్వారా కరోనా వైరస్ సోకుతుందనే ఆధారాలు ఇంతవరకు లభించలేదని, యజమానులు ఎవరూ ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు. పెంపుడు జంతువులకు డెరెక్ట్గా కరోనా వైరస్ సోకలేదని, యాజమాని లేదా ఇతర మనుషుల ద్వారా అవి వైరస్ బారిన పడ్డాయని స్పష్టం చేశారు. వీటి వల్ల ఎటువంటి ముప్పు లేదన్నారు. పెంపుడు జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకదని, 14 రోజులు వాటిని క్వారంటైన్లో ఉంచితే సరిపోతుందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అంగీకరించింది. తప్పుడు వార్తలను నమ్మి పెంపుడు జంతువుల ప్రియులు ఆందోళన చెందొద్దని కోరింది. (చదవండి : అమెరికాలో ఒక్కరోజే 865 కరోనా మరణాలు!) కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితులు, మరణాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇటలీ, అమెరికా, బ్రిటన్, స్పెయిన్లో ఈ వైరస్ మరణ మృదంగం సృష్టిస్తోంది. వైరస్ బారిన పడి ఇప్పటికే 40 వేల మందికి పైగా మృతి చెందారు. బాధితుల సంఖ్య 8 లక్షలు దాటింది. -
వాయువేగంతో ప్రయాణించే కారు
ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. కార్బన్ ఉద్గారాలను విడుదల చేసే పెట్రోల్, డిజిల్ కార్ల కన్నా, కాలుష్యానికి హాని కలిగించని ఎలక్ట్రిక్ కార్ల వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని మోటారు రేసింగ్ ఔత్సాహికుల కోసం కంపెనీలు సరికొత్త మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. వాటిలో భాగంగానే గంటకు 305 కిలోమీటర్ల వాయు వేగంతో ప్రయాణించే ఏపీ-1 అనే ఎలక్ట్రిక్ సూపర్ కారును అపెక్స్ మోటార్స్ వారం రోజుల్లో ఆవిష్కరించనుంది. హాంకాంగ్కు చెందిన ఇద్దరు సోదరులు ఈ సూపర్ కారును రూపకల్పన చేశారని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఏపీ 1 సూపర్ కారు 620కిలోగ్రాముల బరువు, కార్బన్ ఫైబర్తో కూడిన అత్యుధునిక డిజైన్లతో రూపిందించినట్లు తెలుస్తోంది. కొండ ప్రాంతాలలో కూడా ఏపీ-1 కారు వేగంతో ప్రయాణిస్తున్నట్లు ఆవిష్కర్తలు చెబుతున్నారు. ఏపీ 1 ఎలక్ట్రిక్ కారు పూర్తి చార్జింగ్తో 515 కిలోమీటర్లు ప్రయాణించగలదని, ఫాస్ట్ చార్జర్తో 20 నిముషాల్లో 80శాతం చార్జింగ్ అవుతుందని కంపెనీ తెలిపింది. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగానే ఎలక్ట్రిక్ కారు రూపకల్పన చేశామని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. చదవండి: ప్రేమికులు మెచ్చే: ‘ట్విజీ’ బుల్లి కారు -
పెంపుడు కుక్క పిల్లకూ కోవిడ్ వైరస్
న్యూఢిల్లీ : హాంకాంగ్లో నివసిస్తున్న యువన్నె చెవ్ హౌ యీ అనే వృద్ధురాలితోపాటు ఆమె పెంచుకుంటున్న పొమరేనియన్ జాతికి చెందిన కుక్క పిల్లకు కూడా కోవిడ్-19 (కరోనా వైరస్) సోకిందని తేలింది. హాంకాంగ్లో జుహాయ్ మకావో వంతెనకు సమీపంలో నివసిస్తున్న యువన్నె చెవ్కు మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆమెకు కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయింది. ఆమెను అదే రోజు సమీపంలోని నిర్భంద వైద్య శిబిరానికి తరలించారు. ఆ మరుసటి రోజు బుధవారం నాడు వైద్య అధికారులు వచ్చి ఆమె ఇంట్లో పెంచుకుంటున్న కుక్క పిల్లను తీసుకొని పోయి పరీక్షలు నిర్వహించారు. దానికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అవడంతో కుక్క పిల్లను కూడా 14 రోజులపాటు నిర్భంద వైద్య శిబిరానికి తరలించారు. ఈ వార్త తెల్సిన వెంటనే హాంకాంగ్లో పలువురు తమ కుక్క పిల్లలకు కూడా ముందు జాగ్రత్తగా ముక్కుకు, నోటికి మాస్కులు తగిలిస్తున్నారు. కోవిడ్ సోకిన కుక్క పిల్లల నుంచి తిరిగి మనుషులకు వైరస్ సోకుతుందనడానికి తమ వద్ద ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు లేవని వైద్యాధికారులు తెలియజేశారు. అయితే ఎందుకైనా మంచిదని వైరస్ సోకిన కుక్క పిల్లల యజమానులను కూడా పిలిపించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. (చదవండి: అన్ని వైరస్ల కన్నా ప్రాణాంతకం ఇదే..) చైనాలోని వుహాన్ మార్కెట్లో బయట పడిన అత్యంత ప్రమాదకర కోవిడ్-19 ఇంత వరకు కుక్కలకు, పిల్లులకు సోకినట్లు వార్తలు రాలేదు. పెంపుడు కుక్కల నుంచి యజమానులకుగానీ, యజమానుల నుంచి పెంపెడు కుక్కలకుగానీ ఈ వైరస్ సోకదని ‘యూసీ డేవిస్ స్కూల్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్’ ప్రొఫెసర్, పెంపుడు కుక్కలు, పిల్లులకు సోకే వ్యాధుల నిపుణుడైన డాక్టర్ నీల్స్ పెడర్సన్ ‘యూసీ డెవిస్ వెబ్సైట్’లో తెలియజేశారు. ఈ విషయమై హాంకాంగ్ వైద్యాధికారుల నుంచి వివరణ లేదు. (కోవిడ్ 19: ‘ఆ మాంసం తిని ఎవరూ చనిపోలేదు’) -
కోవిడ్-19: టాయిలెట్ పేపర్ దొంగతనం
హాంకాంగ్: ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 (కరోనా వైరస్) బారిన పడిన బాధితుల సంఖ్య పెరుగుతోంది. అదేవిధంగా రోజురోజుకు కోవిడ్ వైరస్ వ్యాప్తి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. కాగా, కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా పలు కంపెనీలు బాధితుల కోసం మాస్క్లు, శానిటరీ నాప్కిన్ల ఉత్పత్తిని పెంచిన విషయం తెలిసిందే. చైనాలోని వూహాన్ నగరంలో ఉద్భవించిన కోవిడ్ వైరస్పై హాంకాంగ్ ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం హాంకాంగ్లోని వెల్కమ్ స్టోర్ అనే సూపర్ మార్కెట్లో ఆయుధాలు కలిగి ఉన్న ముగ్గురు దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. (కోవిడ్ మృతులు 1,665) వివరాలు.. ముగ్గురు దుండగులు సూపర్ మార్కెట్లోని 130 డాలర్ల విలువ గల 600 టాయిలెట్ పేపర్ రోల్స్ను దొంగిలించారు. దీంతో సమాచారాన్ని అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. టాయిట్ పేపర్ రోల్స్ దోపిడికి పాల్పడ్డ ముగ్గురిలో ఇద్దరిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. దుండగుల వద్ద ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. పరారీలో ఉన్న మరో దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. కోవిడ్ వైరస్ సంక్రమించకుండా రక్షించుకోవడానికి ఉపయోగపడే మాస్క్లు, నాప్కిన్ల కొరత రానుందనే అసత్యపు వార్తలు సోషల్ మీడియా, ఆన్లైన్లో వ్యాప్తి చెందడం వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. (‘కోవిడ్’ పేరిట రైతులకు బురిడీ) -
సరిహద్దుల్ని దాటి ప్రాణాల్ని హరించేస్తోంది..
హాంగ్కాంగ్: కరోనా వైరస్ పేరు వింటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఈ వైరస్ రోజు రోజుకు ఖండాలు, దేశాలను దాటేస్తోంది. తాజాగా కరోనా వైరస్ సోకి హాంకాంగ్లో ఓ వ్యక్తి మరణించాడు. చైనాలోని వుహాన్ నగరంలో మొదలైన వైరస్ ఇప్పుడు ప్రపంచంలోని 25 దేశాలను గజగజలాడిస్తోంది. కరోనా వైరస్ వల్ల చైనా బయట నమోదైన రెండవ మరణంగా దీన్ని ధృవీకరిస్తున్నారు. ఇటీవల ఫిలిప్పీన్స్లో 44 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్తో మరణించిన విషయం తెలిసిందే. (కరోనా వైరస్ తీవ్రతరం) కాగా హాంకాంగ్లో ఇప్పటి వరకు 15 మందికి వైరస్ సోకింది. వారిని ఆస్పత్రుల్లోని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనావైరస్ బారిన పడి చైనాలో ఇప్పటి దాకా 425 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరో 20 వేల మందికి పైగా వైరస్ బారినపడి చికిత్స పొందుతున్నారు. హాంకాంగ్కు చెందిన 39 ఏళ్ళ వ్యక్తి జనవరి 21న వుహాన్ నగరానికి వెళ్లి.. 2 రోజుల్లో తిరిగి స్వదేశానికి వచ్చాడు. ఆ వెంటనే కరోనా వైరస్ లక్షణాలతో అతను ఆస్పత్రిలో చేరాడు. రక్తపరీక్షలు నిర్వహించగా అతడికి వైరస్ సోకినట్లు తేలింది. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశాడు. కాగా సోమవారం అర్థరాత్రి నుంచి చైనా భూభాగంతో ఉన్న 13 సరిహద్దు క్రాసింగ్స్ను హాంకాంగ్ మూసివేసింది. కరోనావైరస్ గ్లోబల్ మార్కెట్లను కుదిపేయడంతో.. పలు విమానయాన సంస్థలు చైనాకు సర్వీసులను నిలిపివేశాయి. భారత్లో రెండో కరోనా కేసు..! -
కరోనా వైరస్ తీవ్రతరం
బీజింగ్/న్యూఢిల్లీ: చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ రోజు రోజుకూ బలం పుంజుకుంటోంది. ఇప్పటివరకూ ఈ వ్యాధి కారణంగా మొత్తం 41 మంది మరణించగా ఒక్క చైనాలోనే 1287 మందికిపైగా వ్యాధి బారినపడినట్లు.. వీరిలో 237 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో 1,965 మంది వ్యాధిబారిన పడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. కరోనా వైరస్ ఇప్పటికే హాంకాంగ్, మకావు, తైవాన్, నేపాల్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, థాయ్లాండ్, వియత్నాం, అమెరికాలకు విస్తరించగా భారత్లోనూ ఈ వ్యాధిపై ఆందోళన మొదలైంది. మధ్య చైనా ప్రాంతంలోని వూహాన్, హుబే యూనివర్సిటీల్లో సుమారు 700 మంది భారతీయ విద్యార్థులు ఉండటం దీనికి కారణమవుతోంది. భారత దౌత్య కార్యాలయం ఇప్పటికే ఈ విద్యార్థులను సంప్రదించేందుకు హాట్లైన్లను ఏర్పాటు చేయడం గమనార్హం. వూహాన్లో కొత్త ఆసుపత్రి... కరోనా వైరస్ను నియంత్రించేందుకు చైనా ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వైరస్కు మూలకేంద్రంగా భావిస్తున్న వూహాన్ నగరంలో కొత్తగా ఇంకో ఆసుపత్రిని నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రెండు వారాల్లోపు ఇక్కడ 1000పడకలతో మరో ఆసుపత్రిని కడతామని ప్రభుత్వం చెబుతోంది. వైరస్ బాధితులకు చికిత్స అందించేందుకు మిలటరీ వైద్యులను రంగంలోకి దింపింది. వూహాన్తోపాటు పరిసరాల్లోని సుమారు 12 నగరాల్లో రవాణాపై నిషేధం కొనసాగుతూండగా, శనివారం నాటి కొత్త సంవత్సర వేడుకలపై దీని ప్రభావం కనిపించింది. బీజింగ్లోనూ కొత్త సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన పలు ప్రత్యేక కార్యక్రమాలు రద్దయ్యాయి. ఫర్బిడన్ సిటీ, షాంఘైలోని డిస్నీల్యాండ్ వంటి పర్యాటక ప్రాంతాలనూ మూసివేశారు. టీకా తయారీకీ యత్నాలు కరోనా వైరస్ బారి నుంచి కాపాడేందుకు చైనా, అమెరికన్ శాస్త్రవేత్తలు టీకా తయారీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ వైరస్ బారిన పడితే వ్యాధి లక్షణాలను నియంత్రించడం మినహా ప్రస్తుతం ఏరకమైన చికిత్స లేదు. చైనా మొత్తం తనిఖీలు కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశం మొత్తమ్మీద తనఖీలు చేపట్టాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. విమానాలు, రైళ్లు, బస్సుల్లోనూ వైరస్ సోకిన వారి కోసం పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టాలని, ప్రత్యేక తనిఖీ కేంద్రాల ద్వారా నుమోనియా లక్షణాలతో ఉన్న వారిని గుర్తించి ఎప్పటికప్పుడు వారిని వైద్య కేంద్రాలకు తరలించాలని నేషనల్ హెల్త్ కమిషన్ శనివారం ఒక ప్రకటనలో ఆదేశించింది. అమెరికాలో మరో కేసు అమెరికాలోని షికాగోలో తాజాగా ఒక మహిళ ఈ వ్యాధి బారిన పడింది. మరో యాభైమందిని పరిశీలనలో ఉంచారు. జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే నేపాల్లోనూ 32 ఏళ్ల పురుషుడు ఒకరు ఈ వ్యాధి బారిన పడ్డారు. వూహాన్ నుంచి ఇటీవలే నేపాల్ వచ్చిన ఇతడికి ప్రస్తుతం ఖట్మండూలో చికిత్స అందించి డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు తెలిపారు. యూరప్లోని ఫ్రాన్స్లో ఇద్దరికి ఈ వ్యాధి సోకినట్లు వార్తలు వస్తూండటం ఆందోళన కలిగిస్తోంది. -
హాంకాంగ్లో భారీ ర్యాలీ
హాంకాంగ్: హాంకాంగ్లోని ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారులు నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్య ఆందోళనలను ఉధృతం చేస్తామని ప్రతిజ్ఞచేశారు. గత ఏడు నెలలుగా లక్షలాది హాంకాంగ్వాసులు ప్రజాస్వామ్య హక్కుల కోసం నిరసనలు చేస్తున్నారు. కొత్తే ఏడాది సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో లక్షలాది మంది ఆందోళనకారులు పాల్గొన్నారు. వారి ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పెప్పర్ స్ప్రే, టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లను ఆందోళనకారులపై ప్రయోగించారు. ప్రతిగా పోలీసులపై పెట్రోల్ బాంబులను ఆందోళనకారులు విసిరారు. వీధుల్లోని చైనా అనుకూల వ్యాపార సముదాయాలను ధ్వంసం చేశారు. కాగా, 100 మందిని పోలీసులు అరెస్ట్చేశారు. -
బిగిసిన పిడికిళ్లు
-
చైనాకు హాంకాంగ్ షాక్
జన చేతనను విస్మరిస్తే ఏమవుతుందో చైనా పాలకులకు అర్ధమై ఉండాలి. ఆదివారం హాంకాంగ్ పరిధిలోని 18 జిల్లా పాలకమండళ్ల నుంచి 452 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో చైనా అనుకూల ప్రతిని ధులు ఘోర పరాజయం చవిచూశారు. మొత్తం 17 మండళ్లు ప్రజాస్వామ్య అనుకూలవాదుల చేజి క్కించుకోవడంతోపాటు 452 స్థానాల్లో 390వారికి లభించాయి. ఇది దాదాపు 90 శాతం. చైనా అను కూలురకు దక్కినవి కేవలం 59 స్థానాలు మాత్రమే. సహజంగానే ఈ ఫలితాలు బీజింగ్ను దిగ్భ్రాంతి పరిచాయి. సాధారణంగా అయితే ఈ ఎన్నికలకు పెద్దగా ప్రాముఖ్యం ఉండేది కాదు. ఎందుకంటే ఈ మండళ్లకు ఉండే అధికారాలు చాలా పరిమితమైనవి. చెత్త తొలగింపు, బస్సు రూట్లు సదుపాయం, పర్యావరణంవంటి పౌరుల అవసరాలను పర్యవేక్షించి చర్యలు తీసుకోవడానికి మాత్రమే వీటికి అధికారాలుంటాయి. కానీ ఆర్నెలక్రితం చిన్నగా మొదలై, చూస్తుండగానే కార్చిచ్చులా వ్యాపించిన ప్రజాస్వామ్య ఉద్యమం కారణంగా ఈ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. హాంకాంగ్ ప్రజల మనో భీష్టం వ్యక్తమయ్యేది కేవలం ఈ ఎన్నికల ద్వారా మాత్రమే. పైగా హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కారీ లామ్ ఈ ఎన్నికలు తన పాలనకు రిఫరెండం అని ముందే చెప్పారు. ఫలితాలు వెలువడ్డాక సైతం ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తామని, లోపాలను సవరించుకుంటామని అన్నారు. కానీ ఆమెను ఆ పదవిలో కూర్చోబెట్టిన చైనా పాలకులకు మాత్రం ఈ ఫలితాలు కంటగింపుగా మారాయి. దీన్నుంచి గుణపాఠం నేర్చుకోవడం మాని, ఉద్యమకారులపై నిందలేస్తున్నారు. ప్రభుత్వ అనుకూల మీడియా అమెరికా రాజకీయ నాయకులపై ఆరోపణలు చేస్తున్నది. హాంకాంగ్లో కల్లోలం సృష్టించడమే వారి ఉద్దేశమని అంటున్నది. బ్రిటన్కున్న 150 ఏళ్ల లీజు ముగిసి 1997 జూలై 1న హాంకాంగ్ తిరిగి చైనాకు దఖలు పడినప్పుడు అప్పటి చైనా నాయకుడు డెంగ్ జియావో పెంగ్ ఇచ్చిన హామీ బహుశా చైనా నేతలు మర్చిపోయి ఉండొచ్చు. హాంకాంగ్లో ఇప్పుడున్న విధానాలన్నీ యధాతధంగా సాగుతా యని, తాము ‘ఒకే దేశం–రెండు వ్యవస్థలు’ అనే విధానానికి కట్టుబడి ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఒప్పందాన్ననుసరించి 2047లో ఆ నగరం పూర్తి స్థాయిలో చైనా పరిధిలోకొస్తుంది. అప్పటి వరకూ హాంకాంగ్ స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు వచ్చే ముప్పేమీ ఉండబోదని డెంగ్ తెలిపారు. ఆయన కన్నా ముందు 1993లో చైనా కమ్యూనిస్టు పార్టీ ‘పీపుల్స్ డైలీ’లో రాసిన వ్యాసంలో ఉన్నత స్థాయి నాయకుడొకరు హాంకాంగ్ స్వయంప్రతిపత్తిలో తమ జోక్యం ఉండబోదని చెప్పారు. కానీ 1997 నుంచి ఇప్పటివరకూ సాగిన చరిత్రంతా చూస్తే చైనా ఏ ఒక్క హామీనీ నిలబెట్టుకోలేదని అర్ధమవు తుంది. అక్కడి ప్రజల హక్కులు ఒక్కొక్కటే మింగేస్తూ, ఆ నగరాన్ని గుప్పెట్లో బంధించడానికి అది పావులు కదుపుతూనే ఉంది. అమెరికా తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో చైనాది ద్వితీయ స్థానం. అది ఎప్పుడో ఒకప్పుడు తమను మించిపోతుందన్న భయం అమెరికాకు ఉంది. ఈ దశలో బాధ్యతాయుతంగా వ్యవహ రించకపోతే, హాంకాంగ్కిచ్చిన వాగ్దానం నెరవేర్చకపోతే ప్రపంచ దేశాల్లో తన విశ్వసనీయత దెబ్బ తింటుందని చైనా గ్రహించడం లేదు. ఆర్నెల్లుగా హాంకాంగ్ను ఉక్కుపాదంతో అణిచేస్తూ అక్కడి ప్రజలు తిరిగి తనకే పట్టం కడతారని చైనా ఎలా అనుకుందో అంతుబట్టని విషయం. కేవలం గుప్పె డుమంది విదేశీ శక్తుల ప్రోద్బలంతో ఉద్యమం సాగుతున్నదని, దీనికి మెజారిటీ ప్రజల మద్దతు లేదని చెబుతూ వస్తున్న చైనాకు తాజా ఫలితాలు చెంపపెట్టు. కనీసం ఇప్పుడైనా పౌరుల ఆగ్రహా వేశాలు ఏ స్థాయిలో ఉన్నాయో అది గుర్తించాలి. నాలుగేళ్లక్రితం జరిగిన ఎన్నికల్లో 14 లక్షలమంది ఓటు హక్కు వినియోగించుకోగా ఈసారి ఆ సంఖ్య 29.5 లక్షలకు చేరుకుంది. మొత్తం 452 స్ధానాల్లో ప్రతి ఒక్కచోటా నువ్వా నేనా అన్న రీతిలో హోరాహోరీ పోరు సాగింది. అయితే నగర నిర్వహణ కమిటీలో ఇప్పటికీ చైనా అనుకూల ప్రతినిధులదే పైచేయిగా ఉంటుంది. అందులో ఉండే 1,200 మంది సభ్యుల్లో మండళ్ల నుంచి ఎన్నికైనవారిలో కేవలం 117మందికి మాత్రమే స్థానం లభిస్తుంది. మిగిలినవారంతా రకరకాల కేటగిరీల్లో చైనా ప్రభుత్వం నామినేట్ చేసేవారే ఉంటారు. కనుక 2022లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవికి జరగబోయే ఎన్నికల్లో చైనాదే పైచేయిగా ఉంటుంది. హాంకాంగ్ నగరంపై యధావిధిగా దాని ఆధిపత్యమే కొనసాగుతుంది. ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమైనప్పుడు సకాలంలో దాన్ని గుర్తించాలి. కానీ చైనా అందుకు భిన్నంగా తనకెదురు లేదన్నట్టు వ్యవహరించింది. ఆ ధోరణే ఇప్పుడు హాంకాంగ్ పౌరులను ఏకం చేసింది. హాంకాంగ్లో నేరాలు చేసేవారిని చైనాకు తరలించి, అక్కడి చట్టాల ప్రకారం శిక్షించ డానికి వీలిచ్చే బిల్లు తీసుకురావడం ఇప్పుడు హాంకాంగ్లో సాగుతున్న ప్రజాస్వామ్య ఉద్యమానికి మూలం. పైగా ఆ బిల్లు వెనకటి తేదీ నుంచి వర్తించేలా రూపొందించారు. నేరస్తుల అప్పగింత చట్టాన్ని సవరిస్తూ రూపొందించిన ఆ బిల్లు ఆమోదం పొందితే చైనా వ్యతిరేకులందరినీ ఏరిపారేయడం సులభమవు తుంది. అలాంటివారిని చైనా తరలించి అక్కడ అమలవుతున్న చట్టాల కింద కఠిన శిక్షలు విధించడం వీలవుతుంది. కేసుల విచారణ, నేరస్తులకు శిక్షలు వగైరాలన్నీ ఒక తంతుగా సాగే చైనా న్యాయ వ్యవస్థకు ఏమాత్రం విశ్వసనీయత లేదు. కనుకనే ఈ సవరణ బిల్లును అంగీకరించబోమని ఉద్యమ నిర్వాహకులు చెప్పారు. మొదట్లోనే చైనా ఇందుకు అంగీకరించి ఉంటే పరిస్థితి విషమించేది కాదు. కానీ లారీ కామ్ మొండికేయడంతో ఉద్యమం ఉధృతమైంది. చివరకు ఈ బిల్లును వెనక్కి తీసుకుం టున్నామని ఇటీవల ఆమె ప్రకటించినా ఉద్యమం ఆగే సూచనలు కనిపించడం లేదు. పైగా అది హింసాత్మకంగా మారుతోంది. అందుకు తగ్గట్టే పోలీసు బలగాలు కూడా తీవ్రంగా విరుచుకుపడు తున్నాయి. ఈ ఎన్నికలకు పాలనాపరంగా పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా, దీనిద్వారా వ్యక్తమైన జనాభీష్టాన్ని గ్రహించడం, అందుకు తగ్గట్టుగా వ్యవహరించడం ముఖ్యమని చైనా గుర్తించాలి. -
హాంకాంగ్లో అలీబాబా అదుర్స్
హాంకాంగ్: హాంకాంగ్ స్టాక్ ఎక్సే్ఛంజ్లో చైనా ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అలీబాబా షేర్లు శుభారంభం చేశాయి. అలీబాబా షేర్ అంచనాల కంటే తక్కువగానే 176 హాంకాంగ్ డాలర్ల వద్ద లిస్టయినప్పటికీ, ఆ తర్వాత 8 శాతం లాభంతో 189.50 హాంకాంగ్ డాలర్ల వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 6 శాతం లాభంతో 187.50 హెచ్కే డాలర్ల వద్ద ముగిసింది. అలీబాబా 20వ వార్షికోత్సవం సందర్భంగా హాంకాంగ్ స్టాక్ ఎక్సే్ఛంజ్లో లిస్ట్ కావడం ఒక మైలురాయని కంపెనీ సీఈఓ డేనియల్ జాంగ్ వ్యాఖ్యానించారు. పదేళ్లలో అది పెద్ద ఐపీఓ... ఐపీఓలో భాగంగా అలీబాబా కంపెనీ 50 కోట్ల షేర్లను ఆఫర్ చేసి 8,800 కోట్ల హాంకాంగ్ డాలర్లు (1,100 కోట్ల డాలర్లు–రూ.77,000 కోట్లు) సమీకరించింది. హాంకాంగ్లో గత పదేళ్లలో ఇదే అతి పెద్ద ఐపీఓ. హాంకాంగ్లో అలజడులు చెలరేగుతున్న ప్రస్తుత తరుణంలో అలీబాబా షేర్ లిస్ట్ కావడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. -
హాంకాంగ్ ఎన్నికల్లో చైనాకు షాక్
హాంకాంగ్: హాంకాంగ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైనా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రజాస్వామ్య అనుకూలవాదులు భారీ విజయం సాధించారు. మొత్తం 18 జిల్లాల్లోని 452 స్థానాల్లో 388 మంది ప్రజాస్వామ్య అనుకూలవాదులు గెలిచారు. చైనా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కేవలం 59 మంది, మరో ఐదుగురు స్వతంత్రులు గెలిచారు. చైనా అనుకూల పార్టీకి చెందిన 155 మంది ఓడిపోయారు. అయితే, హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ను ఎన్నుకునే 1,200 మందితో కూడిన ఎలక్టోరల్ కాలేజీ చైనా ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. ‘ఎన్నికల ఫలితమెలా ఉన్నా చైనా ఆధీనంలోనే హాంకాంగ్ కొనసాగుతుంది. నిరసనలు, హింసాత్మక ఘటనలను అణచివేస్తాం’ అని చైనా స్పందించింది. -
చైనా పోలీసులను వణికిస్తున్నారు...
సాక్షి, న్యూఢిల్లీ : హాంకాంగ్కు మరింత స్వాతంత్య్రం కావాలంటూ వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న యూనివర్శిటీ విద్యార్థులు రోజురోజుకు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. పాత కాలం నాటి యుద్ధ విద్యలను అవలంబిస్తూ చైనా పోలీసులను వణికిస్తున్నారు. విల్లంభులతోపాటు రాళ్లు విసిరే పంగ కర్రల (ఒడిసెల) తోని పెట్రోలు బాంబులు విసురుతున్నారు. నిఘా టవర్లను నిర్మిస్తున్నారు. ‘చైనా యూనివర్శిటీ ఆఫ్ హాంకాంగ్’ ప్రాంగణమే ఇప్పుడు ఓ యుద్ధ ప్యాక్టరీగా తయారయింది. బుధవారం ఒక్క రోజే యూనివర్శిటీ విద్యార్థులు చైనా సైనికులపైకి 400 పెట్రోలు బాంబులను విసిరారు. స్థానికులు విద్యార్థులకు గ్లాస్ బాటిళ్లు, హాల్కహాల్, పెట్రోలు సహాయం చేస్తున్నారు. హాంకాంగ్లో నేరం చేసిన వారిని చైనాకు అప్పగించాలనే బిల్లును చైనా ప్రభుత్వం ప్రతిపాదించడంతో ఒక్కసారిగా హాంకాంగ్ విద్యార్థులు ఆందోళనకు దిగిన విషయం తెల్సిందే. చివరకు విద్యార్థుల ఆందళనకు తలొగ్గి ఆ బిల్లును చైనా ప్రభుత్వం ఉపసంహరించుకున్నప్పటికీ విద్యార్థులు తమ ఆందోళనను వీడకుండా హాంకాంగ్కు పూర్తి ప్రజాస్వామ్యం కావాలంటూ తీవ్రతరం చేశారు. ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన విద్యార్థులందరిని బేషరతుగా విడుదల చేయాలని, విద్యార్థుల ఆందోళనను అల్లర్లుగా పేర్కొనడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగుతోందని హెచ్చరించారు. -
ప్రిక్వార్టర్స్లో సాత్విక్–అశ్విని జంట
హాంకాంగ్: బ్యాడ్మింటన్ సీజన్లోని చివరి వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ హాంకాంగ్ ఓపెన్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప (భారత్) జంట శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్–అశ్విని ద్వయం 16–21, 21–19, 21–17తో ప్రపంచ 17వ ర్యాంక్ జోడీ నిపిత్పోన్ ఫువాంగ్ఫుపెట్–సావిత్రి అమిత్రపాయ్ (థాయ్లాండ్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరింది. 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో తొలి గేమ్ను కోల్పోయిన భారత జోడీ రెండో గేమ్లో చివరి దశలో వరుస పాయింట్లు సాధించి మ్యాచ్లో నిలిచింది. ఇక నిర్ణాయక మూడో గేమ్లో ఆరంభంలోనే నాలుగు పాయింట్ల ఆధిక్యం సంపాదించి చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని ఖాయం చేసుకుంది. మరో మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్లో నేలకుర్తి సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట 10–21, 18–21తో మూడో సీడ్ దెచాపోల్–సప్సిరి (థాయ్లాండ్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్ విభాగంలో జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారమే జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్ల్లో తొలుత సౌరభ్ వర్మ 21–15, 21–19తో తనోంగ్సక్ సేన్సోమ్బూన్సుక్ (థాయ్లాండ్)పై... అనంతరం 21–19, 21–19తో లుకాస్ క్లియర్బౌట్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. శ్రీకాంత్ ముందంజ... మరోవైపు భారత స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ కోర్టులో అడుగు పెట్టకుండానే ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్తో తలపడాల్సిన టాప్ సీడ్, ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్వన్ కెంటో మొమోటా (జపాన్) టోర్నీ నుంచి వైదొలిగాడు. దాంతో తొలి రౌండ్లో శ్రీకాంత్కు వాకోవర్ లభించింది. ఈ ఏడాది 10 సింగిల్స్ టైటిల్స్ గెలిచి ఒకే ఏడాది అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన షట్లర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పిన మొమోటా... డిసెంబర్ 11 నుంచి 15 వరకు చైనాలో జరిగే సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్కు ముందు తగిన విశ్రాంతి ఉండాలనే ఉద్దేశంతో హాంకాంగ్ ఓపెన్ నుంచి వైదొలిగాడు. -
సింధు, సైనాల పోరు ఎందాకా?
హాంకాంగ్: గత కొన్నాళ్లుగా నిరాశాజనక ప్రదర్శనతో ఆరంభం దశలోనే ని్రష్కమిస్తున్న భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ హాంకాంగ్ ఓపెన్లో ముందంజ వేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నారు. ఈ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ –500 టోర్నమెంట్లో సంచలన జోడీ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టిలపై అందరి దృష్టి పడింది. ఇటీవల ఈ జంట అద్భుతమైన విజయాలతో దూసుకెళుతోంది. ఇక్కడ కూడా అదే జోరు కొనసాగించేందుకు ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ జోడీ సిద్ధమైంది. మహిళల సింగిల్స్లో భారత అగ్రశ్రేణి షట్లర్లు సింధు, సైనా వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచ చాంపియన్షి ప్ టైటిల్ తర్వాత సింధు ఆశ్చర్యకరంగా ఆరంభ రౌండ్లలోనే ని్రష్కమిస్తోంది. ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ మినహా బరిలోకి దిగిన ప్రతీ టోర్నీలోనూ ఒకట్రెండు రౌండ్లకే ఇంటిదారి పడుతోంది. సైనా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఈ టోర్నీ ద్వారా గాడిన పడాలని ఇద్దరు పట్టుదలతో ఉన్నారు. తొలిరోజు క్వాలిఫయింగ్ మ్యాచ్లు జరుగుతాయి. బుధవారం జరిగే తొలిరౌండ్లో ఆరో సీడ్ సింధు... ప్రపంచ 19వ ర్యాంకర్ కిమ్ గ ఇయున్ (కొరియా)తో; ఎనిమిదో సీడ్ సైనా... కాయ్ యాన్ యాన్ (చైనా)తో తలపడనున్నారు. పురుషుల సింగిల్స్లో ప్రపంచ పదో ర్యాంకర్ శ్రీకాంత్కు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. మొదటి రౌండ్లోనే అతను ప్రపంచ నంబర్వన్ కెంటో మొమోటా (జపాన్)తో పోటీపడతాడు. మూడో సీడ్ షి యుకీ (చైనా)తో సాయిప్రణీత్... వాంగ్ జు వీ (చైనీస్ తైపీ)తో సమీర్ వర్మ... కెంటా నిషిమోటో (జపాన్)తో కశ్యప్ తలపడతారు. -
నేరస్తుల అప్పగింత బిల్లు వెనక్కి
హాంకాంగ్/బీజింగ్: కొన్ని నెలలుగా నిరసనలకు కారణమైన వివాదాస్పద ‘నేరస్తుల అప్పగింత’ బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్లు బుధవారం హాంకాంగ్ ప్రకటించింది. ఈ బిల్లుపై వ్యతిరేకతే తరువాత కాలంలో మరిన్ని ప్రజాస్వామ్య మార్పులను కోరుతూ తీవ్రమైన నిరసనలకు కారణమైంది. బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్లు హాంకాంగ్ సిటీ సెక్రటరీ ఫర్ సెక్యూరిటీ జాన్ లీ స్థానిక చట్ట సభలో ప్రకటించారు. ఈ విషయమై ప్రశ్నించేందుకు కొందరు ప్రజాస్వామ్య మద్దతుదారులైన సభ్యులు ప్రయత్నించగా ఆయన సమాధానమివ్వలేదు. హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ను మార్చలేదు హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కేరీ లామ్ను మార్చేందుకు చైనా ప్రయత్నిస్తోందన్న మీడియా కథనాలను చైనా తోసిపుచ్చింది. అది స్వార్థ ప్రయోజనాల కోసం పుట్టించిన రాజకీయ వదంతి అని పేర్కొంది. కేరీ లామ్ స్థానంలో తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ను నియమించే దిశగా చైనా ఆలోచిస్తోందని లండన్ కేంద్రంగా వెలువడే ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక ఒక కథనం ప్రచురించింది. ఆ కథనాన్ని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ తోసిపుచ్చారు. లామ్కు తమ పూర్తి మద్దతు ఉందని పేర్కొన్నారు. హాంకాంగ్లో త్వరలోనే హింస నిలిచిపోయి, సాధారణ స్థితి ఏర్పడుతుందన్నారు. నేరస్తుల అప్పగింత బిల్లును వెనక్కు తీసుకోవడంతో పాటు లామ్ రాజీనామా చేయాలన్నది హాంకాంగ్లోని ప్రజాస్వామ్య వాదుల ప్రధాన డిమాండ్. బిల్లులో ఏముంది? ఈ బిల్లు ఆమోదం పొందితే చైనాతో పాటు ప్రపంచంలోని ఏ దేశానికైనా నేరానికి పాల్పడినట్లుగా భావిస్తున్న తమ పౌరులను హాంకాంగ్ అప్పగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం హాంకాంగ్కు అమెరికా, యూకే సహా 20 దేశాలతో నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంది. చైనాతో మాత్రం లేదు. 1997లో హాంకాంగ్ చైనా చేతికి వచ్చాక ఒక దేశం రెండు వ్యవస్థల విధానం కింద హాంకాంగ్కు 50 ఏళ్ల పాటు అత్యున్నత స్వయంప్రతిపత్తి, న్యాయ స్వతంత్రత లభించాయి. చాన్ అనే హాంకాంగ్ పౌరుడు తైవాన్లో తన గర్ల్ఫ్రెండ్ను హత్య చేసి తిరిగి హాంకాంగ్కు వచ్చిన నేపథ్యంలో ఈ బిల్లును ప్రభుత్వం తెచ్చింది. చాన్ హాంకాంగ్ జైళ్లో ఉన్నాడు. నేరస్తుల అప్పగింతకు ముందు ఆ అభ్యర్థనను కోర్టులో సవాలు చేసే అవకాశం బిల్లులో ప్రతిపాదించారు. ఏడేళ్లు, లేదా ఆపై శిక్ష పడే నేరాలకే అప్పగింత వర్తించేలా ప్రతిపాదనను బిల్లులో చేర్చారు. -
బాహ్య శక్తులను ఉపేక్షించేది లేదు: చైనా
-
‘శరీరాలు నుజ్జునుజ్జు చేసి.. ఎముకలు విరగ్గొడతాం’
బీజింగ్ : చైనాను విడగొట్టాలని ప్రయత్నించే వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోకతప్పదని ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ హెచ్చరించారు. చైనా భూభాగాన్ని వశపరచుకోవాలని చూసే వారి శరీరాలను నుజ్జునుజ్జు చేసి.. ఎముకలను చూర్ణం చేస్తామని హెచ్చరికలు జారీచేశారు. కాగా గత కొన్నిరోజులుగా చైనాకు వ్యతిరేకంగా హాంగ్కాంగ్లో మరోసారి తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారాంతపు పర్యటనలో భాగంగా నేపాల్లో ఉన్న జిన్పింగ్ తరఫున చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. చైనాను విడదీసేందుకు బాహ్య శక్తులు సహాయం చేసినా వారిని కూడా ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తమ అధ్యక్షుడు హెచ్చరించినట్లు పేర్కొంది. కాగా తైవాన్, హాంగ్కాంగ్లను ప్రత్యేక దేశాలుగా గుర్తించడానికి చైనా నిరాకరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ రెండు ప్రాంతాలు తమ భూభాగానికి చెందినవే అని బీజింగ్ వాదిస్తోంది. అయితే 1949లో జరిగిన పౌర యుద్ధం తర్వాత తైవాన్ స్వతంత్ర పాలనకు మొగ్గుచూపింది. ఇక 2016లో సై యింగ్ వెన్ తైవాన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత చైనాలో భాగంగా తమను గుర్తించడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో హాంగ్కాంగ్లో సైతం తమను స్వతంత్ర దేశంగా గుర్తించాలనే ఆందోళనలు అధికమవుతున్నాయి. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా నిరసనకారులు చైనాకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. రోడ్డు, రైలు మార్గాలను దిగ్బంధనం చేసి చైనా వాణిజ్యానికి గండికొడుతున్నారు. దీంతో బాహ్య శక్తులే వెనక ఉండి నిరసనకారులను ఎగదోస్తున్నాయంటూ చైనా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో హాంగ్కాంగ్లో సైన్యాన్ని మోహరించాలని భావించింది. అలా చేస్తే అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు వెల్లువెత్తుతాయన్న ఆలోచనతో.. అక్కడి పోలీసు వ్యవస్థ ద్వారానే నిరసలను అణచివేయాలని ప్రణాళికలు రచించింది. ఇక చైనా మెయిన్లాండ్లో భాగమైన తియానన్మెన్ స్క్వేర్లో ప్రజస్వామ్యబద్ధంగా జరిగిన పోరాటాన్ని చైనా మాజీ ప్రధాని లీపెంగ్ అణచివేసిన విషయం తెలిసిందే. ఈ ఊచకోతలో భాగంగా దాదాపు వెయ్యి మందికి పైగా మృత్యువాతపడ్డారు. 1989లో జరిగిన ఈ ఘటన కారణంగా చైనాపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాగా ప్రస్తుతం హాంగ్కాంగ్ విషయంలోనూ చైనా అనుసరిస్తున్న తీరు, జిన్జియాంగ్ ప్రాంతంలో ముస్లింలను ఇంటర్మెంట్ క్యాంపుల్లో బంధిస్తున్న తీరుపై అమెరికా సహా ఇతర దేశాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. -
గుండెల్లో దిగిన తుపాకీ తూటాలు
హాంకాంగ్: ఆసియాలో ఆగ్రరాజ్యంగా వ్యవహరిస్తున్న చైనాలో 70వ అవతరణ దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ.. హాంకాంగ్లో రక్తం ఏరులైపారింది. గత నాలగు నెలల నుంచి కొనసాగుతున్న ఆందోళన కార్యక్రమాలు, నిరసన ప్రదర్శనలపై మంగళవారం సైనిక దళాలు ఉక్కుపాదం మోపాయి. హాంకాంగ్ వీదుల్లో నిరసన తెలుపుతున్న గుంపుపై అక్కడి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. అంతకీ తగ్గకపోవడంతో తుపాకీ తూటాలకు పనిచెప్పారు. ఈ క్రమంలో ఓ ఆందోళకారుడి గుండెల్లోకి తుపాకీ తూటా దూసుకుపోయింది. దీంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని అక్కడి యూనివర్సిటీ విద్యార్థి చోంగ్ వెల్లడించాడు. ఇదిలావుండగా ఆదివారం ఉదయం వేలాది మందితో చేపట్టిన ర్యాలీలో నిరసనకారులు పోలీసులతో తలపడ్డారు. ప్రదర్శనలో పాల్గొన్న వారు సబ్వే రైల్వే స్టేషన్లలో విధ్వంసానికి పాల్పడ్డారు. పోలీసు బారికేడ్లకు నిప్పు పెట్టారు. చైనా అవతరణ దినోత్సవం పోస్టర్లను చించివేశారు. ఆందోళనకారులు రాళ్లు, పెట్రోల్ బాంబులు విసరగా పోలీసులు లాఠీచార్జి చేశారు. టియర్ గ్యాస్ను, రబ్బరు బుల్లెట్లు, వాటర్ కెనన్లను ప్రయోగించారు. పెద్ద సంఖ్యలో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులు ఆన్లైన్లో ఇచ్చిన పిలుపు మేరకు ఆస్ట్రేలియా, తైవాన్తోపాటు యూరప్, ఉత్తర అమెరికా దేశాల్లోని 40 ప్రాంతాల్లో సాయంత్రం సంఘీభావ ర్యాలీలు జరిగాయి. నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితులను పారదర్శకమైన విచారణ నిమిత్తం చైనాకు పంపించాలని ప్రతిపాదిస్తూ హాంగ్కాంగ్ ప్రభుత్వం ఓ బిల్లును ప్రవేశపెట్టిన విషయంతెలిసిందే. ఈ బిల్లుపై ఆ దేశంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో, హాంగ్కాంగ్ చీఫ్ కారీ లామ్ ఈ బిల్లు అంశాన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారు. ఈ బిల్లును పూర్తిగా రద్దు చేయాలని, లామ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలంటూ నిరసనకారులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. చైనా ప్రభుత్వం లామ్కు మద్దతుగా నిలిచింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఉపేక్షించొద్దని సూచించింది. దీంతో, హాంగ్కాంగ్ పోలీసులు ఎక్కడికక్కడ నిరసనకారులను అరెస్ట్ చేశారు. పోలీసులకు, నిరసనకారులకు మధ్య హాంగ్కాంగ్ వ్యాప్తంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. నిరసనకారులపై బాష్పవాయుగోళాలు, రబ్బరు బుల్లెట్లు సాధారణమయ్యాయి. హాంగ్కాంగ్లో అశాంతియుత వాతావరణం సృష్టించేందుకు పలు విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయని, హాంగ్కాంగ్ను చైనా నుంచి విడదీయడానికే ఈ నిరసనలని చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. చైనా ఏకపక్ష విధానాలు రుద్దుతోందంటూ మెజార్టీ హాంగ్కాంగ్ ప్రజలు నిరసిస్తున్నారు. -
వేలాది ఫేక్ న్యూస్ అకౌంట్ల క్లోజ్
వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ సంస్థ వేలాది ఫేక్ న్యూస్ అకౌంట్లను శుక్రవారం తొలగించింది. సౌదీ అరేబియాలో యుద్ధం అంటూ సౌదీకి అనుకూలంగా తప్పుడు సమాచారం శుక్రవారం ట్విటర్లో వైరల్ కావడంతో ట్విటర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా హాంకాంగ్లో ఆందోళనల గురించి చైనా నుంచి వస్తున్న పోస్టులకు సంబంధించిన అకౌంట్లను కూడా ట్విటర్ రద్దు చేసింది. ఇంకా స్పెయిన్, ఈక్వెడార్లోని అదనపు ఫేక్ అకౌంట్లను తొలగించింది. హాంకాంగ్ నిరసనకారుల గురించి పోస్టులు పెడుతున్న 4302 నకిలీ ఖాతాలను రద్దు చేసినట్టు ట్విటర్ వెల్లడించింది. హాంకాంగ్లో నిరసనలపై పోస్టులు పెట్టిన చైనా చెందిన 2 లక్షల నకిలీ ఖాతాలను గత ఆగస్టులో ట్విటర్ తొలగించింది. (చదవండి: ట్విటర్ సీఈవో అకౌంట్ హ్యాక్) -
భారత్కు ఆడాలని.. కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు!
హాంకాంగ్: భారత సంతతికి చెందిన అన్షుమన్ రాత్ హాంకాంగ్ జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు. మరొకవైపు సెలక్షన్కు సైతం అందుబాటులో ఉండనంటూ హాంకాంగ్ జట్టు యాజమాన్యానికి స్పష్టం చేశాడు. భారత్ తరఫున ఆడాలనే ఉద్దేశంతోనే హాంకాంగ్ జట్టుకు దూరంగా ఉండదల్చుకున్నానని రాత్ పేర్కొన్నాడు. ఈ మేరకు భారత్లో ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపాడు. ఏదొక రోజు భారత్ తరఫున ఆడాలనే ఉద్దేశంతోనే ప్రస్తుతం హాంకాంగ్ జట్టుకు వీడ్కోలు చెప్పినట్లు ఓ ప్రకటన ద్వారా వెల్లడించాడు. భారత్కు ఆడాలనేదే తన చిరకాల కోరికని పేర్కొన్నాడు. భారత పాస్పోర్ట్ కల్గిన రాత్.. ముందుగా వచ్చే సీజన్లో అన్క్యాప్డ్ ఆటగాడిగా ఐపీఎల్ ఆడాలని అనుకుంటున్నాడు. ఇప్పటివరకూ 15 వన్డేలు ఆడిన రాత్ 51.75 సగటుతో ఉన్నాడు. ఇక తొమ్మిది ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో 65 సగటుతో 391 పరుగులు చేశాడు. భువనేశ్వర్కు చెందిన రాత్ కుటుంబం.. హాంకాంగ్లో స్థిరపడింది. -
జనాగ్రహానికి జడిసిన చైనా
జనాగ్రహం పోటెత్తితే ఎంతటి నియంతైనా తలవంచాల్సిందేనని హాంకాంగ్ ఉద్యమకారులు నిరూపించారు. తమ స్వేచ్ఛాస్వాతంత్య్రాలను కొంచెం కొంచెంగా కబళించి, చివరకు పూర్తిగా నగరాన్ని చెప్పుచేతల్లోకి తీసుకోవచ్చుననుకున్న చైనాకు శృంగభంగం చేశారు. నేరస్తుల అప్పగింత చట్టం సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మూడు నెలలుగా ఉవ్వెత్తున సాగుతున్న నిరసనోద్యమానికి చైనా తలొంచక తప్పిందికాదు. సవరణ బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు ఆ నగర చీఫ్ ఎగ్జి క్యూటివ్ కారీ లామ్ బుధవారం ప్రకటించారు. కానీ ఇప్పటికే ఆలస్యమైపోయింది. తమ ఉద్యమ పరిధి విస్తరించిందని, కేవలం బిల్లు ఉపసంహరణ మాత్రమే సరిపోదని ఆందోళనకారులు ఇప్పుడు చెబుతున్నారు. ఇది అక్షరాలా ప్రజోద్యమం. ఎందుకంటే దీనికి నాయకులంటూ ఎవరూ లేరు. అయిదు నెలలక్రి తం ఈ చిన్నగా మొదలైన ఆందోళన చూస్తుండగానే విస్తరించింది. వేలాది మందితో జరిగే నిరసనలు కాస్తా లక్షల్లోకి ఎగబాకాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే నగర విమానాశ్ర యానికి పది లక్షలమంది వచ్చిపడటంతో చైనా పాలకులకు, వారి తరఫున రాజ్యమేలుతున్న కారీ లామ్కు ఎటూ పాలుపోలేదు. ఆధునిక టెక్నాలజీ సాయంతో ఆందోళనకారుల కూపీ లాగి ఎక్కడి కక్కడ అరెస్టులు చేస్తే అంతా సద్దుమణుగుతుందని వారు భావించారు. సెల్ఫోన్ల ఆధారంగా ఆందోళనకారులు ఎక్కడినుంచి వస్తున్నారో, ఎటుపోతున్నారో సులభంగా తెలుసుకోవచ్చునను కున్న ప్రభుత్వ వ్యూహాన్ని అదే టెక్నాలజీ సాయంతో యువతరం తుత్తినియలు చేశారు. నిఘా కెమెరాలు తమను గుర్తుపట్టకుండా మాస్క్లు ధరించారు. రోజులు గడిచేకొద్దీ ఆందోళన ఉధృత మైందే తప్ప ఎక్కడా తగ్గలేదు. బిల్లు ఇక మురిగిపోయినట్టేనని, దాన్ని గురించి ఎవరికీ ఆందోళన అవసరం లేదని కారీ లామ్ కొన్ని వారాల క్రితం చేసిన ప్రకటన ఎవరినీ సంతృప్తిపరచలేదు. చివ రకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. రబ్బర్ బుల్లెట్లు, పెప్పర్ స్ప్రే వగైరాలు వినియోగించారు. 1,100మందిని అరెస్టు చేశారు. ఉద్యమకారుల వేషంలో వెళ్లి నిరసనల్ని విచ్ఛి న్నం చేసే ప్రయత్నం చేశారు. ఏం చేసినా ఉద్యమం ఆగకపోవడంతో చైనాకు దిక్కుతోచలేదు. ఇక చేసేది లేక సవరణ బిల్లును ఉపసంహరించుకుంటున్నామని తాజాగా ప్రకటించాల్సివచ్చింది. ఎన్నడో 1840లో ఈ ప్రాంతాన్ని అధీనంలోకి తెచ్చుకున్న బ్రిటిష్ వలస పాలకులు ఆ తర్వాత 1898లో చైనాతో 99 ఏళ్ల లీజుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మధ్యలో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో స్వల్పకాలం అది జపాన్ ఏలుబడిలోకి కూడా వెళ్లింది. లీజు పూర్తయ్యాక 1997 జూలై 1న హాంకాంగ్ను తన స్వాధీనంలోకి తెచ్చుకున్నప్పుడు 50 ఏళ్లపాటు... అంటే 2047 వరకూ ఆ నగరానికి స్వయంప్రతిపత్తిని పూర్తి స్థాయిలో కొనసాగిస్తామని ఆనాటి చైనా ఉపప్రధాని డెంగ్ జియావోపింగ్ రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. ‘ఒకే దేశం–రెండు వ్యవస్థల’ విధానాన్ని పాటిస్తా మని, ఆ నగరంపై తమ పెత్తనం రుద్దబోమని ఆయన చెప్పారు. ఈ విధానం కింద హాంకాంగ్ తన ఆర్థిక, వాణిజ్య విధానాలను తానే నిర్ణయించుకోవచ్చు. పాలనా నిర్వహణ, శాసనాధికారం, న్యాయవ్యవస్థ కూడా హాంకాంగ్వే కొనసాగాలి. కానీ ఆచరణలో ఇదంతా నీరుగారింది. పాలన హాంకాంగ్దే అయినా, తాను నిర్ణయించిన వ్యక్తే దాని చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయ్యేవిధంగా చైనా పావులు కదిపింది. తెరవెనక ఉంటూ తన నిర్ణయాలు అమలు చేయడంతోపాటు హాంకాంగ్కి ఉన్న అధికారాలను కత్తిరించడం ప్రారంభించింది. 2017లో కారీ లామ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ ఇదే తంతు కొనసాగుతూ వస్తోంది. పాలనా వ్యవస్థలోని చైనా వ్యతిరేకుల్ని అనర్హులుగా ప్రకటించడం, ఉద్యమాల్లో పాల్గొనేవారికి పోటీ చేసే హక్కును నిరాకరించడం, చైనా వ్యతిరేకు లుగా ముద్రపడినవారిని చైనాకు అపహరించుకుని తీసుకెళ్లడం వగైరాలన్నీ సాగాయి. వీటన్నిటికీ పరాకాష్టగా నేరస్తుల అప్పగింత చట్టం సవరణ బిల్లు రంగ ప్రవేశం చేసింది. అది చట్టమైతే ఎవ రినైనా, ఏ సాకుతోనైనా చైనాకు అప్పగించవచ్చు. ఏమాత్రం విశ్వసనీయతలేని న్యాయవ్యవస్థ రాజ్యమేలుతున్న చైనాలో నేరం రుజువైందన్న పేరిట ఎంత కఠిన శిక్షలైనా విధించే ప్రమాదం ఉంది. పైగా అది వెనకటి కాలంనుంచి వర్తిస్తుందన్న నిబంధన ఉండటంతో హాంకాంగ్ ప్రజల సహనం నశించింది. దాని పర్యవసానమే ప్రస్తుత ఉద్యమం. మార్చిలో తొలుత ఇది కేవలం చిన్న పాటి నిరసనలకే పరిమితమైంది. అది చూస్తుండగానే జూన్ నాటికి పూర్తిస్థాయి మహోద్యమంగా మారింది. ఒక దశలో చైనా సైన్యం రంగంలోకి దిగుతుందన్న కథనాలు వినబడ్డాయి. బిల్లు ఉపసం హరణకు అనుమతించమంటూ తాను కోరినా చైనా పాలకులు అందుకు అంగీకరించడంలేదని, ఇక రాజీనామా చేయడం తప్ప గత్యంతరం లేదని కారీ లామ్ వ్యాపారవేత్తల సమావేశంలో మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వెల్లడై చైనా పరువుతీశాయి. ఆ ఉద్యమాన్ని అణిచేస్తే తన ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకుల్లో పడకతప్పదని చైనా ఆలస్యంగా నైనా గ్రహించకతప్పలేదు. గతంతో పోలిస్తే హాంకాంగ్ ఆర్థిక వ్యవస్థ నీరసించినా 2016 గణాంకాల ప్రకారం చైనాలోని 13,370 కోట్ల డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 61 శాతం ఆ నగరంద్వారా వచ్చినవే. వేరే దేశాల్లో చైనా పెట్టే పెట్టుబడుల్లో 60 శాతం హాంకాంగ్లోనే ఉన్నాయి. ఉద్యమంపై ఉక్కుపాదం మోపితే ఇదంతా పేకమేడలా కూలుతుంది కనుకే ఆ దేశం వెనక్కి తగ్గింది. ఇలాంటి ఉద్యమమే తన గడ్డపైన తియనాన్మెన్ స్క్వేర్లో అంకురించినప్పుడు చైనా దాన్ని ఉక్కుపాదంతో అణిచేసింది. కానీ అలాంటి ఎత్తుగడలు హాంకాంగ్లో చెల్లుబాటు కాలేదు. అసమ్మతిని, భిన్నాభి ప్రాయాలను గౌరవించలేని పాలకులకు హాంకాంగ్ ఉద్యమం కనువిప్పు కావాలి. ప్రజలకిచ్చిన హామీలను గౌరవించనప్పుడూ, వారి మనోభావాలను పరిగణనలోకి తీసుకోనప్పుడూ ప్రతిఘటన తప్పదని గుర్తించాలి. -
పెట్టుబడిదారీ స్వర్గధామంలో చిచ్చు
ఆధునిక ప్రపంచంలో బడా ఆర్థిక శక్తులకు, నయా పెట్టుబడిదారీ విధానానికి అత్యంత పరమోదాహరణగా హాంకాంగ్ నిలుస్తుంది. ఈ రెండు ప్రభావాల ఫలితంగా 93 మంది బిలియనీర్లు ఉన్న ఈ మహానగరం (ప్రపంచంలో రెండో స్థానం)లోని ప్రజలు తీవ్రమైన ఆర్థిక అభద్రతతో ఇక్కట్లకు గురవుతున్నారు. పేరుమోసిన నల్ల మందు యుద్ధాల తర్వాత బ్రిటన్ 150 ఏళ్లకు పైగా హాంకాంగ్ని వలసగా మార్చుకుంది. 1997లో ఈ నగరంపై తన అధికారాన్ని వదులుకోవలసి వచ్చిన తరుణంలో, హాంకాంగ్ను స్వయం పాలనా ప్రాంతంగా మార్చడం ద్వారా 50 ఏళ్ల పాటు నగర రాజకీయ, ఆర్థిక వ్యవస్థలను మార్చకూడదనే షరతుతో బ్రిటన్ ఆమేరకు చైనాతో ఒప్పందం కుదుర్చుకుంది. బ్రిట¯Œ తో కుదిరిన ఒప్పందం ప్రకారం ఒక దేశం, రెండు వ్యవస్థలను కొనసాగించడం అంటే చైనా సామాజీకరించిన వ్యవస్థనుంచి విడివడి హాంకాంగ్లో అత్యంత తీవ్రస్థాయిలో పెట్టుబడిదారీవిధానం కొనసాగడమని అర్థం. హాంకాంగ్ శాసనసభలో 50 శాతం సీట్లను వ్యాపార వర్గాల ప్రయోజనాలకు కేటాయించారు. హాంకాంగ్లో తలదాచుకున్న తీవ్ర నేరçస్తులను తైవాన్, మకావు, చైనా తరలించడానికి న్యాయపరమైన యంత్రాంగాన్ని ఏర్పర్చడానికి 2019 ఫిబ్రవరిలో హాంకాంగ్ ప్రభుత్వం ఒక బిల్లును ప్రతిపాదించింది. హాంకాంగ్ వాసులు ప్రపంచ వ్యాప్తంగా 46 రకాల తీవ్ర నేరాలకు పాల్పడినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు చేపట్టలేకపోయిన నేపథ్యంలోనే చైనా ఈ నేరస్తుల తరలింపు బిల్లును తీసుకొచ్చింది. ఈ తరలింపు బిల్లుపై వీధుల్లో ప్రదర్శనలు తలపెట్టడానికి నెలల క్రితమే హాంకాంగ్లోని బిజినెస్ కమ్యూనిటీ ఈ బిల్లును వ్యతిరేకించింది. వైట్ కాలర్ నేరాలను ఈ తరలింపు బిల్లునుంచి మినహాయించాలని హాంకాంగ్లోని రెండు బడా బిజినెస్ అనుకూల పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. చైనా ప్రభుత్వం ఆర్థిక నేరాల ఆరోపణ చేస్తూ హాంకాంగ్లోని అంతర్జాతీయ వాణిజ్య సంస్థల ఎగ్జిక్యూటివ్లను అరెస్టు చేసినా, లేక వారిని హాంకాంగ్ నుంచి తరలించినా అంతర్జాతీయ వ్యాపార కార్యకలాపాల స్వర్గధామంగా హాంకాంగ్కు ఉన్న ప్రతిష్ఠ దెబ్బతింటుందని వీరి వాదన. సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ అనుబంధ సంస్థ అయిన ఎన్ఈడీ.. ఈ బిల్లు ఆర్థిక స్వాతంత్య్రాన్ని దెబ్బతీస్తుందని, ఆరోపించడమే కాకుండా హాంకాంగ్లో చైనా వ్యతిరేక ఉద్యమానికి నేతృత్వం వహించింది. అమెరికా రాయబార కార్యాలయం ఈ ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించింది. దారినపోయేవారిపై, పోలీసులపై, మీడియాపై, ఎమర్జెన్సీ పనులు చేస్తున్న వారిపై హింసాత్మక దాడులకు ఉద్యమకారులు తలపెట్టడంతో జూలై 9న హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెర్రీ లామ్ ఈ తరలింపు బిల్లును సస్పెండ్ చేస్తున్న్టట్లు ప్రకటిం చారు. హాంకాంగ్లో అశాం తికి తరలింపు బిల్లు కంటే ఆర్థిక అభద్రతాభావమే ప్రధానకారణం. దశాబ్దాలుగా స్వేచ్ఛా మార్కెట్కు పగ్గాలు తెరిచి ప్రజలకు ఏ మేలూ చేయని తరహా విధానాల స్థానంలో మెజారిటీ ప్రజల ప్రయోజనాలు కాపాడే పాలనవైపుగా మారాలని హాంకాంగ్ వాసుల డిమాండ్. చైనాలో నయా ఉదారవాదం ఏ స్థాయికి చేరిందంటే 80 శాతం బ్యాంకులు బడా వాణిజ్యవర్గాలకు రుణాలు అందిస్తూ, కార్మికులకు అయ్యే వ్యయంపై కంపెనీలకే రాయితీలను అందిస్తున్నాయి. ఇలా రాయితీలివ్వడం అధర్మ వ్యాపారం అని అమెరికా వాదన. మరోవైపున పెట్టుబడిదారీ విధానానికి తనదైన ప్రత్యేక మార్గంలో తలుపులు తెరిచేసిన చైనాలో కార్మికులు వేలాది ప్రదర్శనలు, సమ్మెలు, ఆందోళనలు జరుగుతున్నట్లు నమోదవుతూనే ఉన్నాయి. ఈ ఆర్థిక సవాళ్లను, అసమానతల్ని, పర్యావరణ సమస్యలను చైనా ఎలా ఎదుర్కోనుంది అనేది దాని పాలనకు నిజమైన పరీక్షగా నిలుస్తోంది. బ్రిటన్, అమెరికా, పాశ్చాత్య శక్తులతో హాంకాంగ్పై చైనా కుదుర్చుకున్న ఒడంబడిక 2047లో ముగియనున్న నేపథ్యంలో హాంకాం గ్లో యథాతథ స్థితిని కొనసాగించాలని అంతర్జాతీయ వాణిజ్య శక్తులు ప్రయత్నిస్తున్నాయి. అమెరికన్ డాలర్కి, చైనా యువా¯Œ కు మధ్య జరుగుతున్న ఆర్థిక కుమ్ములాటే హాంకాంగ్ నేటి ఘర్షణలకు మూలబిందువుగా మారింది. నయా ఉదారవాదానికి చెందిన ఈ ఆర్థిక, రాజకీయ వ్యవస్థల ఘర్షణలు ఎలా తొలగిపోతాయి అనేది చైనా తన అంతర్గత వైరుధ్యాలను ఎలా పరిష్కరించుకోగలుగుతుంది అనే అంశంపైనే ఆధారపడి ఉంది. -కె. రాజశేఖరరాజు -
హాంకాంగ్ అల్లర్ల వెనుక 'ప్రజాస్వామ్యం'
హాంకాంగ్ ప్రజాస్వామ్య నిరసనకారులకు వ్యతిరేకంగా చైనా మీడియాలో ఓ వీడియో హోరెత్తుతోంది. నేరస్తుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలతో హాంకాంగ్ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. చైనా జోక్యాన్ని వ్యతిరేకిస్తూ హాంకాంగ్ ప్రజాస్వామ్య నిరసనకారులు గతకొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ఈ ఆందోళనలను హేళన చేస్తూ.. ప్రొ డెమొక్రసీ సభ్యులను ఉగ్రవాదులుగా అభివర్ణిస్తూ.. ‘సీడీ రేవ్’ అనే బ్యాండ్ రూపొందించిన ర్యాప్ వీడియో ఇప్పుడు చైనాలో వైరల్గా మారింది. 'హే డెమోక్రసీ!' అంటూ సాగే ఈ వీడియోలో మిలియన్ల మంది హాంకాంగ్ ప్రజలు వీధుల్లోకి వచ్చి.. చైనా పాలనను వ్యతిరేకించడాన్ని చూపిస్తూ.. నిరసనకారులు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని, వారు విదేశీ ఏజెంట్లుగా, ఉగ్రవాదులుగా అభివర్ణించింది. నిబంధనలకు విరుద్ధంగా హాంకాంగ్ అసెంబ్లీలోకి నిరసనకారులు చొరబడ్డారని చైనా దేశభక్త ర్యాప్ గ్రూప్ అయిన ‘సీడీ రేవ్’ ఈ వీడియోలో పేర్కొంది. హాంకాంగ్ చైనాలో భాగమేనంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఈ వీడియోలో జోడించింది. హాంకాంగ్ నిరసనకారులపై చైనా ప్రయోగించిన ఈ వీడియో ఆ దేశ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బ్రిటన్ జూలై 1, 1997 అర్ధరాత్రి హాంకాంగ్లో పాలనను ముగించి హాంకాంగ్పై సార్వభౌమాధికారం, భూభాగంపై నియంత్రణను చైనాకు ఇచ్చింది. నేడు ఇదే సాధారణంగా 'హాంకాంగ్ అప్పగింత'గా పిలువబడుతుంది. అప్పగించినప్పటి నుంచి హాంకాంగ్ సెమీ అటానమస్ సిటీగా (పాక్షికంగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు) మారింది. -
రిలయన్స్ గర్జన.. మార్కెట్ బేర్!
బలహీన అంతర్జాతీయ సంకేతాలకు దేశీయ ప్రతికూలతలు కూడా తోడవడంతో మన స్టాక్ మార్కెట్ మంగళవారం భారీగా పతనమైంది. అమెరికా–చైనాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం, తాజాగా హాంకాంగ్లో చెలరేగుతున్న నిరసనలు, హింసాకాండ, అర్జెంటీనా కరెన్సీ పెసో భారీగా పతనం కావడం ప్రతికూల ప్రభావం చూపించాయి. మన దగ్గర వివిధ రంగాల్లో డిమాండ్ క్షీణిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ మందగించడం, ఆర్థిక గణాంకాలు, క్యూ1 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దారుణంగా దెబ్బతిన్నది. బక్రీద్ కారణంగా సోమవారం సెలవు కావడంతో ఒక రోజు విరామం తర్వాత మంగళవారం ఆరంభమైన స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 37,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 10,950 పాయింట్ల దిగువకు పడిపోయాయి. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లకు సంబంధించి సూపర్ రిచ్ పన్నుపై సర్చార్జీ, ఆర్థిక వ్యవస్థను మందగమనం బారి నుంచి గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు ప్రకటించకపోవడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 624 పాయింట్లు పతనమై(1.66%) 36,958 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 184 పాయింట్లు క్షీణించి(1.65%) 10,926 పాయింట్ల వద్ద ముగిశాయి. బీఎస్ఈ ఇంధన, ఆయిల్, గ్యాస్ సూచీలు మాత్రమే లాభాల్లో ముగియగా, మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. లాభాల్లోంచి నష్టాల్లోకి సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. కొద్ది సేపటికే నష్టాల్లోకి జారిపోయింది. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు చోటు చేసుకున్నాయి. ఒక దశలో 173 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ మరో దశలో 693 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 870 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి చూస్తే, సెన్సెక్స్ 870 పాయింట్లు, నిఫ్టీ 244 పాయింట్లు పడింది. - ఈ ఏడాది జూలైలో వాహన విక్రయాలు 19 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయని సియామ్ వెల్లడించడంతో వాహన షేర్లు గతి తప్పాయి. - యస్ బ్యాంక్ షేర్ 10.3 శాతం నష్టంతో రూ. 73.60 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. నేడు(బుధవారం) క్యూఐపీ ఇష్యూ ధరను ఖరారు చేయనుండటంతో ఈ షేర్ ఈ స్థాయిలో పతనమైంది. రిలయన్స్ లాభపడకపోతే 1,000 పాయింట్ల నష్టం అన్ని రంగాల షేర్లు, సెన్సెక్స్లోని 29 షేర్లు నష్టపోగా, రెండు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. రిలయన్స్ ఇండస్డ్రీస్ 10 శాతం లాభపడి రూ. 1,275 వద్ద ముగిసింది. గత పదేళ్లలో ఈ షేర్ ఒక్క రోజులో ఇంతగా లాభపడటం ఇదే మొదటిసారి. సెన్సెక్స్లో బాగా లాభపడిన షేర్ ఇదే. సౌదీ ఆరామ్కో, బీపీలతో వాటా విక్రయ ఒప్పందాలతో రిలయన్స్కు రూ.1.15 లక్షల కోట్లు లభిస్తాయి. మరో వైపు ఏడాదిన్నరలో రుణ రహిత కంపెనీగా నిలవడం లక్ష్యమని 42వ ఏజీఎమ్లో కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ వెల్లడించడం రిలయన్స్ షేరును లాభాల బాట పట్టించాయి. షేరు జోరు తో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.71,638 కోట్లు పెరిగి, రూ.8,08,234 కోట్లకు చేరింది. ఈ షేర్ ఈ స్థాయిలో పెరగకపోతే సెన్సెక్స్ దాదాపు వెయ్యి పాయింట్ల మేర నష్టపోయి ఉండేది. నష్టాలు ఎందుకంటే... - అర్జెంటీనా అల్లకల్లోలం... అర్జెంటీనా ఎన్నికల్లో సంస్కరణలకు, మార్కెట్కు అనుకూల నిర్ణయాలు తీసుకునే అధ్యక్షుడు మారిసియో మాక్రి దారుణంగా ఓడిపోవడం ప్రపంచ మార్కెట్లపై తీవ్రమైన ప్రభావం చూపించింది. ఎన్నికల ఫలితాల కారణంగా అర్జెంటీనా కరెన్సీ పెసో 15 శాతం పతనం కాగా, ఆ దేశ స్టాక్ మార్కెట్, ఎస్ అండ్ పీ మెర్వల్ సూచీ 48 శాతం(డాలర్ల పరంగా) నష్టపోయింది. (గత 69 ఏళ్లలో ఒక్కరోజులో ఒక స్టాక్ మార్కెట్ ఈ రేంజ్లో పతనం కావడం ఇదే మొదటిసారి) - ప్రపంచ మార్కెట్ల పతనం.... అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత వేడెక్కడం, హాంగ్కాంగ్లో నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారడం, అర్జెంటీనా, ఇటలీల్లో రాజకీయ అనిశ్చితి, సింగపూర్ తన పూర్తి ఏడాది వృద్ధి గణాంకాల్లో కోత విధించడం వంటి కారణాలతో ఇన్వెస్టర్లు సురక్షిత మదుపు సాధనాలైన పుత్తడి, జపాన్ కరెన్సీ యెన్, బాండ్లవైపు పెట్టుబడులను మళ్లిస్తున్నారు. దీంతో ఆసియా మార్కెట్లు భారీగా నష్టపోయాయి. హాంగ్సెంగ్ 2.1 శాతం, షాంఘై కాంపొజిట్ సూచీ 0.63 శాతం, కోస్పి 0.85 శాతం, నికాయ్ 1.1 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇక యూరప్ మార్కెట్లు నష్టాల్లో ఆరంభమయ్యాయి. ఆ తర్వాత కోలుకొని స్వల్ప లాభాల్లో ముగిశాయి. - ఆర్థిక గణాంకాల నిరుత్సాహం: జూన్ నెలలో పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) నాలుగు నెలల కనిష్టానికి, 2 శాతానికి పడిపోయింది. శుక్రవారం వెలువడిన ఈ గణాంకాలు ఇన్వెస్టర్లలో నిరుత్సాహాన్ని నింపాయి. గత ఏడాది ఇదే నెలలో పారిశ్రామికోత్పత్తి 7 శాతంగా నమోదైంది. - పెదవి విప్పని ప్రభుత్వం: విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లకు వర్తించే సూపర్ రిచ్ ట్యాక్స్ సెస్పై ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు. మరోవైపు వాహన, ఎన్బీఎఫ్సీ, ఆర్థిక రంగాలను ఆదుకోవడానికి ప్యాకేజీ సంబంధిత అంశాలపై ప్రభుత్వ వర్గాలు ఇప్పటివరకూ పెదవి విప్పలేదు. -ఆరు నెలల కనిష్టానికి రూపాయి: డాలర్తో రూపాయి మారకం విలువ 62 పైసలు పతనమై 71.40 వద్దకు చేరింది. ఇది ఆరు నెలల కనిష్ట స్థాయి. - ముడిచమురు ధరలు భగ్గు: ముడి చమురు ధరలు మంగళవారం నైమెక్స్లో 4 శాతం పైగా ఎగబాకాయి. రూ. 2.21 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.2.21 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2,21,838 కోట్లు ఆవిరై రూ. 1,39,46,997 కోట్లకు పడిపోయింది. -
అట్టుడుకుతున్న హాంకాంగ్
హాంకాంగ్: నేరస్తుల అప్పగింత బిల్లు నిరసనలతో హాంకాంగ్ అట్టుడుకుతోంది. చైనా జోక్యాన్ని వ్యతిరేకిస్తూ ప్రొడెమోక్రసీ సభ్యులు చేస్తున్న ఆందోళనలు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి. కొన్నివేలమంది నిరసనకారులు హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి చొచ్చుకెళ్లారు. హాంకాంగ్ సురక్షితం కాదు, పోలీసు వ్యవస్థ తీరు బాగోలేదంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులతో విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. దీంతో సోమవారం నుంచి హాంకాంగ్లో విమాన సేవలు నిలిచిపోయాయి. రెండోరోజు మంగళవారం కూడా విమానాశ్రయంలో ఆందోళనకారుల నిరసన కొనసాగుతుండటంతో ప్రస్తుత పరిస్థితుల్లో సౌకర్యాలు కల్పించలేమంటూ .. అధికారులు విమాన రాకపోకలను రద్దు చేశారు. ఇప్పటికే హాంకాంగ్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే విమానాలతోపాటు ఆ దేశానికి వచ్చే విమానాలను కూడా రద్దు చేసినట్టు స్పష్టంచేశారు. ప్రయాణికులందరూ విమానాశ్రయ ప్రాంగణం నుంచి వెళ్లిపోవాల్సిందిగా అధికారులు సూచించారు. -
'మీ ప్రయాణం వాయిదా వేసుకోవడమే మంచిది'
న్యూఢిల్లీ : వేలమంది ప్రొ-డెమోక్రసీ నిరసనకారులు సోమవారం ఒక్కసారిగా హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి చొచ్చుకుపోయి నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హాంకాంగ్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాల్సిన అన్ని విమానాలను ఒకరోజు పాటు రద్దు చేస్తున్నట్లు అక్కడి ఎయిర్పోర్టు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ భారత ప్రయాణికులకు పలు కీలక సూచనలు చేసింది. హాంకాంగ్ విమానాశ్రయంలో మంగళవారం కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, మరిన్ని నిరసనలు జరిగే అవకాశం ఉండడంతో విమానాల రాకపోకలు ఆలస్యం కావడం లేదా రద్దయ్యే అవకాశం ఉందని తమ ప్రకటనలో తెలిపింది. హాంకాంగ్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరే వరకూ ప్రయాణికులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడమే మంచిదని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఇప్పటికే హాంకాంగ్లో ఉండిపోయిన భారత ప్రయాణికులు తిరిగి సేవలు పున: ప్రారంభం అయ్యేవరకు అక్కడి అధికారులతో టచ్లో ఉండాలని స్పష్టం చేసింది. ప్రయాణికులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి +852 90771083 హెల్ప్లైన్ ద్వారా సంప్రదించవచ్చని విదేశాంగ శాఖ వెల్లడించింది. -
20 లక్షల మంది మధ్య ఓ అంబులెన్స్
సాక్షి, న్యూఢిల్లీ : ‘మోజస్ వస్తుంటే ఆయనకు దారి వదులుతూ ఎర్ర సముద్రం నిలువునా చీలినట్లు అంబులెన్స్కు దారి ఇస్తూ లక్షలాది ప్రజలు పక్కకు తప్పుకున్నారు. హాంకాంగ్ ప్రజలేమీ గూండాలు కాదు’ అనే వ్యాఖ్యతో ఓ పౌరుడు అప్లోడ్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. హాంకాంగ్ వీధుల్లోకి ఆదివారం నాడు దాదాపు 20 లక్షల మంది ఉప్పెనలా వచ్చారు. వారి నినాదాల్లో సముద్ర ఘోష వినిపించింది. అన్ని లక్షల మంది వీధుల్లోకి రావడం బహూశ అదే మొదటిసారి కావచ్చు. అసమ్మతి వాదులను చైనాకు అప్పగించే వివాదాస్పద బిల్లును ఉపసంహరించుకుంటున్నామని, ఈ ఏడాదికి ఇక ఈ బిల్లు లేనట్లేనని హాంకాంగ్ సీఈవో క్యారీ లామ్ శనివారం రాత్రే ప్రకటించినప్పటికీ ఆదివారం నాడు ప్రజలు ఇంతపెద్ద సంఖ్యలో వీధుల్లోకి రావడం విశేషం. హాంకాంగ్ ప్రజల్లో క్రమశిక్షణ కొరవడిందంటూ క్యారీ లామ్ వ్యాఖ్యానించినందుకు సమాధానం అన్నట్లు అంతమంది జనం వీధుల్లోకి వచ్చారు. క్యారీ లామ్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. సరిగ్గా ఆ సమయంలోనే అటుగా అంబులెన్స్ రావడంతో ప్రజాసమూహం నిలువునా చీలిపోతూ దానికి దారిచ్చింది. కొద్దిగా అటు, ఇటు కావొచ్చుగానీ హాంకాంగ్ ప్రజలు క్రమశిక్షణలేని వారేమీ కాదని మానవ హక్కుల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కెన్నెత్ రోత్ వ్యాఖ్యానిస్తూ ఈ వీడియోను షేర్ చేశారు. అది చూస్తుంటే కేరళలోని పలక్కాడ్లో గత మార్చిలో వేడుకల్లో మునిగితేలుతున్న జనం అటుగా వచ్చిన అంబులెన్స్కు దారి ఇచ్చిన వైనం గుర్తుకురాక తప్పదు. ‘డూ యూ హియర్ ది పీపుల్ సింగ్, సింగింగ్ ది సాంగ్స్ ఆఫ్ ఆంగ్రీ మెన్, ఇటీ ఈజ్ ది మ్యూజిక్ ఆఫ్ ది పీపుల్, వూ విల్ నాట్ బి ది స్లేవ్స్ అగేన్’ అన్న ‘లెస్ మిసరబుల్’ హాలీవుడ్ చిత్రంలోని పాటను ఆలపిస్తూ ప్రజలు శాంతియుతంగా ఆందోళన చేశారు. -
మనసులు గెలుచుకున్న నిరసనకారులు
-
అట్టుడుకుతున్న హాంకాంగ్
ఒప్పందంలో ఇచ్చిన హామీలను నీరుగార్చాలని చూసిన చైనా ఎత్తుగడలకు వ్యతిరేకంగా ఇప్పుడు హాంకాంగ్ భగ్గుమంటోంది. తమ స్వేచ్ఛాస్వాతంత్య్రాలపై ఉక్కుపాదం మోపాలనుకుంటున్న చైనా నాయకత్వాన్ని హాంకాంగ్ పౌరులు నిలదీస్తున్నారు. వారంరోజులుగా ఆ నగరం నిరసనలతో హోరె త్తుతోంది. హాంకాంగ్లో నేరాలకు పాల్పడే వారిని చైనాకు అప్పగించడానికుద్దేశించిన నేరస్తుల అప్పగింత చట్టం సవరణ బిల్లు ఈ ఆగ్రహావేశాలన్నిటికీ మూలం. బ్రిటన్కున్న లీజు ముగిశాక 1997 జూలై 1న హాంకాంగ్ మళ్లీ చైనాకు వశమైంది. ఈ విలీనం కావడం తమకు సమ్మతం కాదని స్వతంత్ర నగర రాజ్యంగా ఉంటామని ఆనాడు అక్కడివారు పట్టుబట్టారు. అయితే హాంకాంగ్ ప్రజాస్వామ్య వ్యవస్థ యధాతథంగా ఉంటుందని చైనా నేతలు హామీ ఇచ్చారు. వారికి సార్వత్రిక ఓటు హక్కు కల్పిస్తామని చెప్పారు. తమ నాయకుడు డెంగ్ జియావో పెంగ్ అంతకు కొన్నేళ్లక్రితం హాంకాంగ్ చైనా పరిధిలోకొస్తే ‘ఒక దేశం–రెండు వ్యవస్థలు’ విధానాన్ని పాటిస్తామని హామీ ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. చైనా విధానాలేవీ హాంకాంగ్ను తాకబోవని చెప్పారు. అది పూర్తి స్థాయిలో తమ నియంత్రణలోకొచ్చేవరకూ... అంటే 2047 వరకూ నగర స్వయంపాలనే ఉంటుందని వాగ్దానం చేశారు. 1997లో నేరస్తుల అప్పగింత ఒప్పందం ఖరారైనప్పుడు చైనా, తైవాన్లను అందులో చేర్చలేదు. హాంకాంగ్ అనుసరిస్తున్న ప్రమాణాలకు ఆ రెండుచోట్లా అమలవుతున్న నేర న్యాయవ్యవస్థ విరుద్ధం గనుక ఆ నిర్ణయం తీసుకున్నారు. అందుకు చైనా కూడా అంగీకరించింది. కానీ హాంకాంగ్కు ఇచ్చిన ఇతర హామీల్లాగే దీన్ని కూడా నీరు కార్చాలని చైనా ప్రయత్నిస్తోంది. తన అభిప్రాయాలకు భిన్నంగా మాట్లాడేవారిని అది ఇప్పటికే శత్రువులుగా పరిగణిస్తోంది. రకరకాల సాకులతో అపహరించడం కూడా రివాజే. ఇప్పుడు నేరస్తుల అప్పగింత చట్టానికి తీసుకురాదల్చిన సవరణ బిల్లుకు ఆమోదం లభిస్తే అటువంటి వారందరినీ చైనాకు ‘చట్టబద్ధంగా’ తరలించి అక్కడి చట్టాల కింద విచారించి దశాబ్దాలపాటు ఖైదు చేయడమో, మరణశిక్ష వంటివి విధించడమో చేసే ప్రమాదం ఉన్నదని ఉద్యమకారులు ఆందోళనపడుతున్నారు. అయితే ఇవన్నీ ఉత్త అనుమానాలే నని నగర చీఫ్ ఎగ్జిక్యూటివ్ కారీ లామ్ చెబుతున్నారు. ఎవరినైనా నేరుగా చైనాకు అప్పగించడం ఉండదని, ప్రతి కేసునూ పరిశీలించి అవసరాన్నిబట్టి నిర్ణయం తీసుకుంటామని ఆమె అంటు న్నారు. కానీ దీనికొక మెలిక ఉంది. తాజా సవరణలు గత కాలంనుంచి అమల్లోకొచ్చేవిధంగా రూపొందించారు. సారాంశంలో బిల్లు ఆమోదం పొందగానే పాత కేసుల్ని తవ్వి తీసి, వాటిల్లో నిందితులుగా ఉన్నవారిని చైనాకు అప్పగించే అవకాశం లేకపోలేదు. వాస్తవానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థే పెద్ద ప్రహసనంలా నడుస్తోంది. స్వయంపాలన అమలు చేస్తామని, నగర నిర్వహణ చూసే చీఫ్ ఎగ్జిక్యూటివ్ను ప్రజలే ఎన్నుకోవచ్చునని 1997లో చైనా హామీ ఇచ్చింది. అది 2017 నుంచి అమలు చేస్తామని చెప్పింది. అంతవరకూ పాలనా వ్యవహా రాలు సాఫీగా సాగడానికి భిన్న రంగాలనుంచి కొందరు వ్యక్తుల్ని తానే ఎంపిక చేసి ఒక కమిటీని ఏర్పరిచింది. ఆ కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ను ఎన్నుకునే విధానాన్ని ఏర్పరిచింది. కానీ 2017 నుంచి అమల్లోకి రావాల్సిన ఎన్నికల విధానాన్ని చైనా నీరుగార్చింది. ఇప్పటికీ చైనా అనుకూలురదే నగర నిర్వహణ వ్యవస్థలో మెజారిటీ. వారిద్వారా ఎన్నికైన కారీ లామ్ ఆచరణలో చైనా ప్రతినిధిగానే వ్యవహరిస్తున్నారు. 2017లో చీఫ్ ఎగ్జిక్యూటివ్గా బాధ్యతలు స్వీకరించాక పాలనావ్యవస్థలోని చైనా వ్యతిరేకుల్ని అనర్హులుగా ప్రకటించారు. ఉద్యమకారులు ఎన్నికల్లో పాల్గొనడాన్ని నిషేధిం చారు. వారిని అరెస్టు చేయించారు. ఇవన్నీ చైనా మెప్పు పొందడానికి ఆమె తీసుకున్న చర్యలే. మరోపక్క చైనా వ్యతిరేకులుగా ముద్రపడినవారిని ఆ దేశం అపహరిస్తుంటే ఆమె నోరు మెదప లేదు. ఉద్యమకారుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇప్పటికైతే సవరణ బిల్లుపై జరిగే చర్చను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ ఉద్యమం మరికొన్నాళ్లకు చల్లారక తప్పదన్న అభిప్రాయంతో చైనా ఉంది. సరిగ్గా ఆ కారణం వల్లే ఉద్యమాన్ని దీర్ఘకాలం కొనసాగించాలని ఉద్యమకారులు నిర్ణయిం చుకున్నారు. తాజా సవరణలు అమల్లోకొస్తే అక్కడుండే తమ పౌరుల పరిస్థితి ఏమిటన్న ఆందోళన అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఉంది. అమెరికాకు చెందిన 1,300 సంస్థలు అక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఆ దేశ పౌరులు 85,000మంది వ్యాపారం, ఇతర రంగాల్లో పని చేస్తున్నారు. అలాగే ఆస్ట్రేలియా పౌరులు లక్షమంది, బ్రిటన్కు చెందిన 50,000మంది అక్కడుం టున్నారు. కొత్త చట్టం అమలైతే వీరందరూ చైనా ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదని ఆ దేశాల భావన. బ్రిటన్ వలసగా ఉన్నప్పుడు హాంకాంగ్లో ఉదారవాద ప్రజాస్వామ్యం అమలయ్యేది. భావప్రకటనా స్వేచ్ఛ ఉండేది. కానీ ఆ నగరం చైనా ఛత్రఛాయలోకి వచ్చాక భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే మీడియా సంస్థలపై నిఘా మొదలైంది. అప్రకటిత సెన్సార్ షిప్ అమలు ప్రారంభమైంది. కొన్ని చానెళ్ల లైసెన్స్ల గడువు తీరాక వాటిని పునరుద్ధరించడాన్ని నిలిపేశారు. గతంతో పోలిస్తే హాంకాంగ్ ఆర్థిక వ్యవస్థ కూడా అంతంతమాత్రమే. 1997నాటికి చైనా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో హాంకాంగ్ వాటా 16 శాతం. ఇప్పుడది కేవలం 2 శాతం మాత్రమే. అయితే చైనా ఆర్థిక వ్యవస్థ పటిష్టతకూ, ఎదుగుదలకూ హాంకాంగ్ ఇప్పటికీ తోడ్పడుతోంది. దాన్ని పరిగణనలోకి తీసుకుని కనీసం హామీ ఇచ్చినవిధంగా హాంకాంగ్లో యధాతథ స్థితిని కొన సాగించాలని కూడా చైనా భావించడం లేదు. హాంకాంగ్ పౌరుల నిరసనోద్యమ ఉధృతిని గమ నించి ఇప్పటికైనా అది తన వైఖరిని మార్చుకోవాలి. తియనాన్మెన్ స్క్వేర్లో 1989లో వందల మందిని ఊచకోత కోసి ప్రజాస్వామ్య ఉద్యమాన్ని అణిచిన తీరులోనే ఇప్పుడూ వ్యవహరిద్దా మనుకుంటే ప్రపంచం ముందు దోషిగా నిలబడవలసి వస్తుందని అది గుర్తించాలి. -
వైరల్ : దిస్ ఈజ్ హాంకాంగ్ బుమ్రా!
హాంకాంగ్ : విభిన్నమైన శైలితో బంతులను సంధించే టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా లిమిటెడ్ ఫార్మెట్ ప్రపంచ నెం1 బౌలర్ అన్న విషయం తెలిసిందే. అప్కమింగ్ ఆటగాళ్లకు బుమ్రా.. స్పూర్తిగా నిలుస్తున్నాడనే విషయంలో అతిశయోక్తి లేదు. అతని విభిన్నమైన శైలిని అనుకరించడం చాలా కష్టం. వైవిధ్యమైన బౌలింగ్తో బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టే బుమ్రా.. భారత బౌలింగ్ విభాగంలో కీలకమయ్యాడు. అయితే అతని బౌలింగ్ను అనుకరిస్తూ చాలా మంది ప్రయత్నించారు. ఆ తరహా వీడియోలు నెట్టింట రచ్చ కూడా చేశాయి. తాజాగా హాంకాంగ్ చెందిన అండర్-13 కుర్ర క్రికెటర్.. బుమ్రా బౌలింగ్ను ఫర్ఫెక్ట్గా కాపీ పేస్ట్ చేశాడు. అదే శైలితో బంతులను సంధించి ఔరా అనిపించాడు. ఈ వీడియోను హాంకాంగ్ క్రికెట్ అధికారిక ట్విటర్లో షేర్ చేయగా నెట్టింట హల్చల్ చేస్తోంది. ‘ఈ బౌలింగ్ చూస్తుంటే ఎవరో గుర్తుకు వస్తున్నారు.. కదా!’ అనే క్యాప్షన్గా పేరొన్న వీడియోకు.. అవును దటీజ్ హాంకాంగ్ బుమ్రా అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. Spotted in the U-13s League today - another interesting bowling action. Does this remind you of somebody? 🤔@Jaspritbumrah93 @BCCI @ICCMediaComms @ICC #Cricket #HKCricket pic.twitter.com/A8OOfmtfPG — Hong Kong Cricket (@CricketHK) March 3, 2019 -
హైదరాబాద్, హాంకాంగ్ మధ్య ఐదో కెథే పసిఫిక్ ఫ్లైట్
సాక్షి, న్యూఢిల్లీ : హాంకాంగ్ ఆధారిత ఎయిర్ లైన్ కెథే పసిఫిక్, తన ఇండియా నెట్ వర్క్ని పెంచాలనే లక్ష్యంతో హైదరాబాద్ నుంచి హాంకాంగ్ కి ఐదవ నాన్ స్టాప్ ఫ్లైట్ సేవల్ని ప్రకటించింది. ఈ సేవలు ఈ ఏడాది జూన్ 7 నుంచి ప్రారంభించనున్నట్లు పేర్కొంది. కేథే పసిఫిక్ సంస్థ హైదరాబాద్లో 2012 నుంచి వారానికి నాలుగు ఫ్లైట్లతో సేవలను అందిస్తోంది.ఈ సేవలు ఏయిర్ బస్ ఏ330-300 ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా నిర్వహించబడుతున్నాయి. తమ సేవలను విస్తరించే క్రమంలో భాగంగా తాజాగా ఐదో ఫ్లైట్ సేవల్ని ప్రకటించింది. ఈ ప్రకటనపై కంపెనీ సౌత్ ఆసియా రీజినల్ జెనరల్ మేనేజర్ మార్క్ సుచ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది జూన్ నుంచి తమ అదనపై ఫ్లైట్ ప్రారంభమవుతుందన్నారు. దీని ద్వారా దేశంలో తమ నెట్వర్క్ను మరింత దృఢ పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాజా ఫ్లైట్ సేవల ద్వారా హైదరాబాద్ పాసెంజర్ ప్రయాణంలో తమ కంపెనీ సామర్థ్యం14 శాతం పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. -
నైట్ డ్యూటీలతో డీఎన్ఏకు చేటు
బీజింగ్: రాత్రిపూట విధులు నిర్వర్తించే వారిలో డీఎన్ఏకు ముప్పు పొంచి ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీనివల్ల కేన్సర్, హృదయ, జీవక్రియ, నాడీ వ్యవస్థకు సంబంధించి వ్యాధులు వచ్చే అవకాశముందని తెలిపింది. ఫుల్ టైమ్ విధులు నిర్వర్తించే 49 మంది వైద్యుల రక్త నమూనాలను వివిధ సమయాల్లో సేకరించి యూనివర్సిటీ ఆఫ్ హాంగ్కాంగ్ పరిశోధకులు అధ్యయనం చేశారు. ‘ఈ పని చాలా చిన్నదైనప్పటికీ స్పష్టమైన ఫలితాలు వెల్లడయ్యాయి. రాత్రి పూట విధులు నిర్వర్తించే వారిలో నిద్రలేమి సమస్య కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇటు డీఎన్ఏ సైతం దిబ్బతింటోంది. ఇదే దీర్ఘకాలిక వ్యాధులను ప్రేరేపించేందుకు దోహదపడుతోంది..’ అని పరిశోధకుల్లో ఒకరైన సియూ–వై చోయ్ చెప్పారు. అలాగే డీఎన్ఏ ఎంత దెబ్బ తింటే అంతగా నిద్రలేమి సమస్య తీవ్రమవుతోందని వెల్లడించారు.