madhav singaraju
-
దీపికా పదుకోన్ (బాలీవుడ్ నటి) రాయని డైరీ
ఇప్పటికీ నాకు ఒక కల వస్తూ ఉంటుంది. ఇప్పటికీ అంటే, పాతికేళ్లు దాటిపోయినప్పటిMీ ! బహుశా ఇంకో పాతికేళ్లు దాటి పోయినా ఆ కల నాకు వస్తూనే ఉంటుందనుకుంటాను. అది ఎప్పుడూ వచ్చిపోతుండే కలే అయినా, అప్పుడే మొదటిసారిగా ఆ కలను కన్నట్లుగా ప్రతిసారీ నేను దిగ్గున మేల్కొంటాను! గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. నుదురు చెమట పట్టి ఉంటుంది. గొంతు ఆర్చుకునిపోయి ఉంటుంది. ‘‘సిద్ధివినాయకా! నాపై నీకెంత అనుగ్రహం! ఇది వట్టి కలేనా...’’ అని మనసులోనే ఆయనకు ప్రణమిల్లి పైకి లేస్తాను. ఒక గ్లాసు నీళ్లు తాగుతాను. అమ్మతో మాట్లాడతాను. నాన్నను పలకరిస్తాను. రణ్వీర్ను లేపుతాను. నా ఐదు నెలల కూతురు దువాను ముద్దాడతాను. నా స్ట్రెస్ అంతా పోతుంది. ‘పరీక్షా పే చర్చ’ కోసం ఢిల్లీ నుండి ఆహ్వానం రాగానే మొదట నాకు నా కలే గుర్తొచ్చింది! పిల్లల్లో పరీక్షల భయం పోగొట్టటం కోసం ‘మోదీజీ మోటివేషన్ టీమ్’ నన్నక్కడికి పిలిపించింది.నా ఎదురుగా స్కూలు ఫైనల్ పరీక్షలకు సిద్ధమౌతున్న చిన్నారులు కూర్చొని ఉన్నారు. అంతా పద్నాలుగూ పదిహేనేళ్ల వాళ్లు. ‘‘దీపికాజీ! చదువుతుంటే స్ట్రెస్గా ఉంటోంది. చదివింది ఒక్కటీ గుర్తుండటం లేదు. ఏం చేయమంటారు?’’ అని ఒక స్టూడెంట్!25 ఏళ్ల క్రితం మోదీజీ ప్రధానిగా ఉండి, ఇరవై ఐదేళ్ల క్రితమే ‘పరీక్షా పే చర్చ’ ఉండి ఉంటే... అలా ఆ ప్రశ్నను అడిగిన అమ్మాయి కచ్చితంగా దీపికా పదుకోన్ అయి వుండేది! అప్పుడు నేను టెన్త్కి ప్రిపేర్ అవుతున్నాను. సోఫియా హైస్కూల్లో చదివే అమ్మాయిలకు పరీక్షలంటే భయం ఉండదని టీచర్లు గొప్పగా చెబుతుండేవారు! పేరెంట్స్ ఆ మాటను ఇంకా గొప్పగా వింటుండేవారు. కానీ నాకు భయంగా ఉండేది. ‘మిస్’తో నా భయం గురించి చెబితే, ‘‘ఏ సబ్జెక్ట్ అంటే భయపడుతు న్నావో, ఆ సబ్జెక్ట్తో ఫ్రెండ్షిప్ చెయ్యి’’ అనేశారు! ఇదెక్కడి గొడవ!నేను ఫ్రెండ్షిప్ చేస్తాను సరే, నాతో ఫ్రెండ్షిప్ ఆ సబ్జెక్ట్కి ఇష్టమవ్వాలి కదా! అది ఆలోచించినట్లు లేరు మా మిస్. టీచర్లు ఇచ్చే టిప్స్ ఇలాగే అసాధ్యమైన ఫ్రెండ్షిప్లతో నిండి ఉండేవి! ఇప్పుడు మోదీజీ చెబుతున్నట్లుగా... ‘‘కంటి నిండా నిద్రపోండి. కలత లేకుండా చదవండి...’’ అని మేడ్ ఈజీగా ఒక్కమాటైనా అనేవాళ్లు కాదు.కొరివి దెయ్యాల్లాంటి పరీక్షల్ని వాకిట్లో పెట్టుకుని నిద్ర పోవటం, నిద్ర పట్టటం అయ్యే పని కాకపోయినా... మోదీజీ అంత బిజీలోనూ పిల్లలతో ఇంటరాక్ట్ అవటం; సద్గురువులను, న్యూట్రిషనిస్ట్లను ఇంటరాక్ట్ చేయించటం... ఇలా కదా పరీక్షల భయాన్ని పోగొట్టటం!నిజానికి – బోర్డ్ ఎగ్జామ్స్ కంటే కఠినమైనవి జీవితం పెట్టే పరీక్షలు! జీవితం పెట్టే పరీక్షలకు సిలబస్ ఉండదు. స్కూళ్లు, ట్యూషన్లు ఉండవు. టిప్స్ ఇచ్చేవాళ్లున్నా అవి మనకు పనికొచ్చేవై ఉండవు. జీవితంలో ప్రతిదీ ఫైనల్ ఎగ్జామే. పాసైన సంతోషమైనా, ఫెయిల్ అయిన విచారమైనా జీవితం మళ్లీ ఇంకో పరీక్ష పెట్టేవరకే! టెన్త్ ఎగ్జామ్స్ జన్మకోసారి. కానీ జన్మ మొత్తం కలలోకి వచ్చి జడిపిస్తూనే ఉంటాయి. పెళ్లయి, పేరెంట్స్మి అయి, పిల్లలు టెన్త్కి వచ్చినా కూడా... మన టెన్త్ మన కలలోకి వస్తూనే ఉంటుంది. రేపే పరీక్ష ఉన్నట్లు, అసలేమీ చదవనట్లు, ‘హే... గణేశా! ఎలా రాయాలి తండ్రీ...’ అని కలలో మొరపెట్టుకుంటూ ఉంటాం!‘పరీక్షా పే చర్చ’లో పిల్లలకు నేను నాలుగు టిప్స్ ఇచ్చాను. స్లీప్, ఎక్స్ప్రెస్, హైడ్రేట్, మెడిటేట్! నాన్న నాకు చిన్నప్పుడు చెప్పిన టిప్స్ అవి. పెద్దయ్యాక, చిన్నప్పటి ‘పరీక్ష కల’ వెంటాడకుండా ఉండేందుకు కూడా ఏవైనా టిప్స్ ఉండి ఉంటాయా?! ఉన్నా అవసరం లేదు. కొన్ని కలలు వెంటాడుతుంటేనే జీవితం పాస్ అవుతున్న ఫీల్ ఉంటుంది. -
ఎలాన్ మస్క్ (బిజినెస్ టైకూన్) రాయని డైరీ
డాడ్ నాపై చాలా కోపంగా ఉన్నారు! ఆయనలో నా పట్ల అంత నిజమైన కోపాన్ని నేను నా చిన్నప్పుడు కూడా చూడలేదు.‘‘ఎలాన్, ఆఫ్ట్రాల్ నువ్వొక ప్రపంచ కుబేరుడివి మాత్రమేనన్న సంగతి మర్చిపోకు...’’ అన్నారు డాడ్ ఫోన్ చేసి!‘‘కానీ డాడ్, మీ కుమారుడిగా ఉండటం కంటే ఎక్కువా నేను ప్రపంచ కుబేరుడిగా ఉండటం?! ఎక్కువ అని నేను అనుకుంటున్నప్పుడు కదా మీరు నన్ను ‘ఆఫ్ట్రాల్ నువ్వొక కుబేరుడివి మాత్రమే’ అని అనాలి...’’ అన్నాను. ‘‘సోది ఆపు’’ అన్నారాయన! ఏడేళ్ల తర్వాత, ఏడాది క్రితమే ఇద్దరం ఒకర్నొకరం చూసుకున్నాం. ఏడాది తర్వాత మళ్లీ ఇప్పుడే ఆయన ఫోన్ చేయటం. ‘‘విను ఎలాన్, నీ దగ్గర 500 బిలియన్ డాలర్ల సంపద ఉండొచ్చు. నీ టెస్లా కార్లు ఈ భూగోళమంతటా తిరుగుతుండొచ్చు. నీ స్పేస్ఎక్స్ రాకెట్లు భూకక్ష్యను దాటి చంద్రుడి పైకి, మార్స్ మీదకు, ఇంకా అవతలికి కూడా పోతే పోతుండొచ్చు. నువ్వు మాత్రం మనిషివే. చేతిలో ఐ–ఫోన్ ఉన్న ఒక మామూలు మనిషివి. బ్రిటన్ ప్రధానిలా నువ్వేమీ ఒక దేశాన్ని,లేదంటే బ్రిటన్ రాజులా ఓ 14 దేశాలను పరి పాలించటం లేదు...’’ అన్నారు డాడ్!‘‘కానీ డాడ్, అభిప్రాయాలను ట్వీట్ చెయ్యటం తప్పెలా అవుతుంది?!’’ అన్నాను. ‘‘చెయ్, ట్వీట్ చెయ్. కానీ ట్విట్టర్ మాత్రమే నీది. బ్రిటన్ నీది కాదు. ఫ్రాన్స్ నీది కాదు. జర్మనీ నీది కాదు. నార్వే నీది కాదు. అసలు ఐరోపాలోనే ఏదీ నీది కాదు. నీదంటూ ఉంటే అమెరికా ఒక్కటే. అది కూడా అమెరికా మొత్తం కాదు, అమెరికాలో ఉండే ట్రంప్ మాత్రమే...’’ అన్నారు డాడ్ చాలా నెమ్మదిగా!కోపాన్ని ఎంతగా అణచుకుంటేనో తప్ప ఆయన ఇంత నెమ్మదిగా మాట్లాడరు. స్కూల్కు వెళ్లనని నేను స్కూల్ బ్యాగ్ను విసిరికొట్టినప్పుడు కూడా ఆయన ఇంతగా కోపాన్ని అణచుకోలేదు. నా చెంప పగల గొట్టారు. కాలేజ్ నుండి నేను నేరుగా ఇంటికి రావటం లేదని తెలిసినప్పుడు కూడా ఇంతగా కోపాన్ని అణచుకోలేదు. లాగిపెట్టి చెంప చెళ్లుమనిపించారు. చెయ్యి చేసుకోలేనంత కోపం వచ్చినప్పుడే... ఆయనిలా నిశ్శబ్దంగా మాట్లాడతారు. ‘‘ఎలాన్, నీకు గుర్తుందా? నీ ఆరేళ్ల వయసులో నిన్ను మొదటిసారి బ్రిటన్ తీసుకెళ్లాను. ఆ దేశం నీకెంతో నచ్చింది. కేరింతలు కొట్టావు. నీ 30వ బర్త్డేని అక్కడే ఒక రాజభవంతిలో వారం రోజుల పాటు నీకై నువ్వే జరుపుకున్నావ్! నీకూ నాకూ మధ్య కూడా లేనంత అనుబంధం నీకు బ్రిటన్తో ఉంది. డాడ్ ‘దుష్టుడు’ అని లోకానికి నువ్వు చాటినప్పుడు కూడా నేను పట్టించుకోలేదు. కానీ, నాతో సమానంగా బ్రిటన్కు నువ్వు దుష్టత్వాన్ని ఆపాదిస్తుంటే పట్టనట్లు ఉండలేక పోతున్నాను..’’ అన్నారాయన!‘‘అందుకేనా డాడ్, ‘ఎలాన్ ఒక పిచ్చివాడు, అతడిని తరిమికొట్టండి’ అని మీరు బ్రిటన్కు చెబుతున్నారు!’’ అన్నాను నవ్వుతూ. డాడ్ నవ్వలేదు. ‘‘లోపలేం జరిగిందో తెలియకుండా బయటి నుంచి ఎలా మాట్లాడతావ్? తెలిసినా అసలు మనమెందుకు మాట్లాడటం?’’ అన్నారు. ఆశ్చర్యపోయాన్నేను! ఏళ్ల తర్వాత ‘మన’ అన్నారు డాడ్!! ఆయనకెప్పుడూ ‘నేను’, ‘నువ్వు’ అనటమే అలవాటు. మామ్తో కూడా అలానే అనేవారు. ‘‘ఎలాన్, బీ లైక్ ఎ బిజినెస్మేన్. దేశాలతో బిజినెస్ చెయ్యి. బిజినెస్ పోగొట్టుకునే పనులు చెయ్యకు. నీకు యాభై దాటి ఉండొచ్చు.నాకింకా నువ్వు చిన్న పిల్లాడివే. నేను, మీ మామ్, నువ్వు, నీ తమ్ముడు, నీ చెల్లెలు కలిసి అమెజాన్ రెయిన్ఫారెస్టు టూర్కి వెళ్లిప్పుడు నీ వయసెంతో ఇప్పుడూ అంతే నా దృష్టిలో...’’ అన్నారు డాడ్! చప్పున చెంపను తడుముకున్నాను! ఆయన చెయ్యి తాకితే ఎంతగా చుర్రు మంటుందో నాకు తెలుసు. అది ఎన్ని రెయిన్ ఫారెస్టుల వర్షానికైనా చల్లారని మంట! -
నారాయణ మూర్తి (ఇన్ఫోసిస్) రాయని డైరీ
కంపెనీలు వర్కర్ల మీద ఆధారపడి పనిచేయవు. ఇంఛార్జిల మీద వర్కర్లు ఆధారపడేలా చేసి చక్కటి ఫలితాలను సాధిస్తుంటాయి. ఎక్కడైనా చూడండి... ఇంఛార్జిలే, వర్కర్ల కన్నా ఎక్కువ కష్టపడి పని చేస్తుంటారు. వర్కర్లలో పని చేయనిదెవరో కనిపెట్టడానికి సెలవులు కూడా వాడుకోకుండా శ్రమిస్తూ ఉంటారు. అయితే అంత శ్రమ అవసరం లేదంటాన్నేను!దేనికైనా టెక్నిక్ ఉండాలి. పని చేయని వారెవరో వెతకటం మాని, పని చేస్తున్న వారెవరో నిఘా పెట్టి చూస్తే ఇంచార్జిల పనికి ప్రయోజనం చేకూరుతుంది, మరింత మెరుగైన ఫలితాలను తొలి త్రైమాసికంలోనే సాధించి యాజమాన్యానికి చూపించగలుగుతారు!సభాపర్వంలో ధర్మరాజుకు నారదుడు పని ఎలా చేయించుకోవాలో బోధిస్తుంటాడు. నేర్పరులనే సేవకులుగా పెట్టుకున్నావా? వారిలో పని చేస్తున్న వారిని గమనిస్తున్నావా? వారి పట్ల ఉదారంగా ఉంటున్నావా? అని అడుగుతాడు.పని చేయని వారిని కనిపెట్టటం వల్ల ఒరిగే ప్రయోజనం కన్నా, పని చేసే వారిని కనిపెట్టుకుని ఉండకపోవటం వల్ల జరిగే నష్టమే ఎక్కువని నారద ప్రబోధం.పని చేయని వారి వల్ల సంస్థలకు వచ్చే నష్టం ఏమీ లేదు. వాళ్ల పని కూడా మీద వేసుకుని చేయగల పనివాళ్లు పక్కనే అందు బాటులో ఉంటారు. వారానికి 70 గంటలైనా సరే, వాళ్లు అలా పని చేసుకుంటూ పోగలరు... ఇంఛార్జిలు కనుక వాళ్లకు అందరిముందూ చిన్న కాంప్లిమెంట్ ఇవ్వగలిగితే.పని చేసే వాళ్లకు అందరిముందూ కాంప్లిమెంట్ ఇస్తే, పని చేయని వాళ్లు హర్ట్ అవుతారని చెప్పి, చాటుగా పిలిచి భుజం తట్టడం వల్ల ముందు తరాల సంస్థలకు మంచి ఇంఛార్జిలు తయారు అయితే అవొచ్చు. మంచి వర్కర్లు తయారుగా ఉండరు. వర్క్–లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడేవారు మాత్రమే ఫైళ్లు పట్టుకుని ఇంటర్వ్యూలకొస్తారు.అనుపమ్ మిట్టల్ ట్వీట్ ఒకటి చూశాను. షాదీ డాట్ కామ్ ఫౌండర్ అతడు. ‘‘70 గంటల పనికి భయపడుతున్న వారంతా 2025లో రిలాక్స్డ్ గా ఉండొచ్చు. ఏఐ మన ఉద్యోగాలన్నిటినీ ఊడబెరుక్కోబోతోంది. హ్యాపీ న్యూ ఇయర్’’ అని విష్ చేశాడు. శాడిస్ట్. మిట్టల్ ఫౌండర్ అయిపోయాడు కానీ... గొప్ప ఇంచార్జి కావలసినవాడు.ఇంఛార్జి... ఫౌండర్లా ఉండాలి. ఇంకా చెప్పాలంటే గౌతమ్ అదానీలా ఉండాలి. ‘‘చేసే శక్తి, ఆసక్తి ఉన్న వాళ్లు... వద్దన్నా 70 గంటలు పని చేస్తారు. చేయనివ్వండి. ఒకటైతే నిజం. ఫ్యామిలీతో 8 గంటలు గడిపితే ఆ ఉక్కపోత భరించలేక జీవిత భాగస్వామి ఇంట్లోంచి పారిపోతుంది’’ అని పెద్దగా నవ్వుతారాయన.భార్యాభర్తలిద్దరూ వాళ్ల వాళ్ల ఆఫీస్లలో 70 గంటలు పని చేసి వస్తే ఇద్దరిలో ఎవరూ ఇల్లొదిలి పారిపోయే సమస్యే ఉండదు. అయితే వాళ్లు ఆఫీస్ వదిలి పారిపోకుండా ఇంచార్జిలు చూసుకోవాలి.మహా భారతంలో కర్ణుడు నాకు ఇష్టమైన క్యారెక్టర్. గొప్ప దాతృత్వం అతడిది. ఇంచార్జిలు కూడా ఎప్పుడైనా ఒకరోజు సెలవు ఇవ్వటానికి, హాఫ్ డే లీవు శాంక్షన్ చెయ్యటానికి కర్ణుడిలా గొప్ప దాతృత్వం ప్రదర్శిస్తే ఆఫీసంటే పడి చచ్చిపోని వర్కర్లు ఉంటారా?వర్కర్లు కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ‘వర్క్’ అంటే ఆఫీసు మరియు ఇంచార్జి. ‘లైఫ్’ అంటే భార్య మరియు పిల్లలు. (ఉద్యోగినులకైతే భర్త మరియు పిల్లలు). వర్క్ను లైఫ్, లైఫ్ను వర్క్ వాటికవే బ్యాలెన్స్ చేసుకుంటాయి కనుక వర్కర్లు పని కట్టుకుని లైఫ్ని, వర్క్ని బ్యాలెన్స్ చేసుకోనక్కర్లేదు. పనిలో మునిగి వుంటే చాలు.ఎండ్ ఆఫ్ ది డే... ఇంచార్జిలు కంపెనీకి మంచి ఫలితాలను సాధించి చూపేలా పని చేయటం వర్కర్ల కనీస బాధ్యత. -
14వ దలై లామా (బౌద్ధ గురువు) రాయని డైరీ
‘‘ఎలా ఉన్నారు?’’ అనే ప్రశ్నకు సమాధానం ఆ ప్రశ్న వేయటం వెనుక ఉన్నది పలకరింపా, పరామర్శా, ఆందోళనా లేక ఆరా తీయటమా అనే దానిని బట్టి మారుతూ ఉండవచ్చు. అయితే ఒక బౌద్ధ గురువు ఇలాంటి ఒక దైహికమైన ప్రశ్న ఎదుర్కొన్నప్పుడు ఆ గురువు ఇచ్చే సమాధానం... ప్రశ్న వేయటానికి వెనుక ఉన్న ఉద్దేశంతో నిమిత్తం లేకుండా సర్వకాల సర్వావస్థల్లో ఒకేలా ఉండాలి. అంటే... ఆయన ధర్మశాల పట్టణంలోని తన హిమాలయ నివాసంలో ఉన్నా, న్యూయార్క్లోని మోకాళ్ల శస్త్ర చికిత్సా కేంద్రంలో ఉన్నా సమాధానం మారకూడదు. అది కూడా, ‘‘నాకేం! నిక్షేపంగా ఉన్నాను’’ అని కాకుండా, ‘‘నీకేం! నిశ్చింతగా ఉండు’’ అని... భరోసా ఇచ్చేలా ఆ సమాధానం ఉండాలి. బౌద్ధాచార్యులైన ఒక దలై లామా ఎంతటి వృద్ధాప్యంలోనైనా ‘గుంభనం’గా ఉన్నప్పుడే ఆయన భక్తులు, అనుచరులు, పాలకులు ఆయన అంతిమ శ్వాసను గురించిన ఆలోచనలు చేయకుండా ఉంటారు.జూన్లో శస్త్ర చికిత్స జరిగాక నా మోకాలి కదలికలు కాస్త మెరుగుపడ్డాయి. నలుగురు కలిసి నడిపిస్తే నడవ గలుగుతున్నాను. ఇద్దరు కలిసి కూర్చోబెడితే కూర్చోగలుగుతున్నాను.ప్రపంచానికైతే నాకసలు చికిత్స జరిగింది కుడి కాలికా, ఎడమ కాలికా అన్న సంగతే తెలియదు. అదే ‘గుంభనత్వం’ అంటే! ఎవరికీ, ఏదీ తెలియనివ్వకపోవటం! ముఖ్యంగా మన ఆరోగ్యం గురించి! దర్శనాలకు సమయమౌతుండగా మిస్ డోల్మా త్సెరింగ్ తేఖాంగ్ వచ్చి, ‘‘ఎలా ఉన్నారు ఆచార్యా?’’ అని నన్ను పరామర్శించారు! ఆమె అలా మంద్రస్థాయిలో ఇటీవల కొంతకాలంగా నన్ను పరామర్శిస్తూ వస్తున్నారు!‘‘ఎందుకు మీరలా పదే పదే సందేహిస్తున్నారు మిస్ తేఖాంగ్?’’ అన్నాను. ధర్మశాలలోని ప్రవాస టిబెటన్ ప్రభుత్వ పార్లమెంటు డిప్యూటీ స్పీకర్ ఆమె.వచ్చే ఏడాది జూలై 6కు నాకు 90 ఏళ్లు నిండుతాయన్న ఆలోచన... ఆరామంలోని అందరితో పాటుగా మిస్ తేఖాంగ్నూ హృదయ శూన్యతకు గురిచేస్తోందా?! లేక, మునుపటి దలైలామా 57 ఏళ్లకే పరమపదించటం వల్ల, అది ఊహించుకుని ఆమె కలత చెందుతున్నారా?!‘‘ఇప్పటిలా వారానికి మూడుసార్లు కాకుండా, వారానికి ఒకసారి మాత్రమే సందర్శకులను అనుమతించటం వల్ల మీకు మరికాస్త విశ్రాంతి దొరుకుతుందని సిక్యోంగ్ పెన్పా త్సెరిన్ తలపోస్తున్నారు ఆచార్యా’’ అన్నారు తేఖాంగ్. సిక్యోంగ్ పెన్పా త్సెరిన్... ప్రవాస టిబెటన్ ప్రభుత్వ ప్రధాని. ‘‘వృద్ధాప్యంలో విశ్రాంతి అవసరమే మిస్ తేఖాంగ్. కానీ కలలకు వృద్ధాప్యం ఉంటుందా?! నా కల ప్రకారం నేను 110 సంవత్సరాలు జీవించబోతానని మునుపు నేను చెప్పిన మాటనే ఇప్పుడూ చెబుతున్నాను. మీరూ, మీ ప్రధానే నా కలపై విశ్వాసం లేక చింతాక్రాంతులై ఉన్నట్లున్నారు. నేనెలా ఉన్నాను అనే దానికన్నా, నా తర్వాత ఎవరున్నారు అన్నదే మీఆందోళనగా నాకు కనిపిస్తోంది’’ అన్నాను చిరునవ్వుతో. తేఖాంగ్ కలవరంగా చూశారు. ‘‘ఆచార్యా... మేము కేవలం సామాన్యులం.మీ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేము. అందువల్లనే మీరేమైనా చెబుతారేమోనని ఎదురుచూస్తున్నాం...’’ అన్నారు మిస్ తేఖాంగ్! నాకర్థమైంది. వారు నా పునర్జన్మ కోసం చూస్తున్నారు! 15వ దలైలామా ఆగమనం కోసం నిరీక్షిస్తున్నారు. కానీ వారికి అర్థం కానిది ఏమిటంటే – మరణించాక మాత్రమే పునర్జన్మ ఉండదనీ, కర్తవ్య నిర్వహణ కాంక్ష అన్నది ఒకే జన్మలో అనేక పునర్జన్మల్ని ప్రసాదిస్తుందనీ!‘‘నా దగ్గరింకా 20 హ్యాపీ న్యూ ఇయర్లుమీ అందరి కోసం మిగిలే ఉన్నాయి మిస్ తేఖాంగ్. ధీమాగా ఉండండి...’’ అని ఆమెతో నవ్వుతూ చెప్పాను. -
ఏక్నాథ్ శిందే (ఉప ముఖ్యమంత్రి) రాయనిడైరీ
మాధవ్ శింగరాజుఉదయ్ సామంత్, భరత్ గొగావాలే, రవి పాఠక్, సంజయ్ శిర్సాత్, నేను.. కూర్చొని ఉన్నాం. మాతో రాబిన్ శర్మ కూడా ఉన్నారు. రాబిన్ శర్మ పార్టీ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్. మిగతా నలుగురు... పార్టీలోని పొలిటికల్ స్ట్రాటజిస్టు లీడర్లు. ఉప ముఖ్యమంత్రి పదవిని నేను నిరాకరించాలా, లేక అంగీకరించాలా అనే పది రోజుల సుదీర్ఘ సంశయ స్థితి ముగియటానికి ముందు రోజు జరిగిన సమావేశంలో రాబిన్ శర్మ లేరు. నేను, ఆ నలుగురు లీడర్లు మాత్రమే ఉన్నాం. ఇప్పుడు – ఉప ముఖ్యమంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేసి వచ్చాక జరుగుతున్న ఈ ఆంతరంగిక సమావేశానికి రాబిన్ శర్మ కూడా వచ్చి జాయిన్ అయ్యారు.‘‘ఏమైనా మీరు తొందరపడ్డారు శిందేజీ...’’ అన్నారు శర్మ – కొంత సంభాషణ తర్వాత!నేను ఉప ముఖ్యమంత్రి పదవిని అంగీకరించటాన్నే ఆయన తొందరపాటు అంటున్నారని సమావేశంలో ఉన్న నలుగురికీ అర్థం అయింది. అసలు ఉప ముఖ్యమంత్రి పదవిని స్వీకరించేలా నన్ను మోటివేట్ చేసింది ఆ నలుగురే! ‘‘ముఖ్యమంత్రిగా తప్ప, ఉప ముఖ్యమంత్రిగా ఉండనని మీరు గట్టిగా చెప్పాల్సింది శిందేజీ. అప్పుడు ప్రధానిలో ఒక అస్థిమితం ఉండేది. ప్రధాని సహపాత్రధారి అమిత్ షాలో ఒక జాగ్రత్త ఉండేది. మొత్తంగా బీజేపీనే... శివసేన అంటే ఒక రెస్పెక్ట్ తో ఉండేది...’’ అన్నారు రాబిన్ శర్మ. ‘‘అలా అని మేము అనుకోవటం లేదు...’’ అన్నారు రవి పాఠక్, సంజయ్ శిర్సాత్. ‘‘అవును అనుకోవటం లేదు...’’ అన్నారు ఉదయ్ సామంత్, భరత్ గొగావాలే.‘‘ఉప ముఖ్యమంత్రి పదవిని నిరాకరించి ఉంటే కూటమిలో శిందేజీకి వచ్చే రెస్పెక్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఉప ముఖ్యమంత్రి పదవిని అంగీకరిస్తే కేబినెట్లో శిందేజీ వర్గానికి వచ్చే పోర్టుఫోలియోల గురించి మీరు మాట్లాడుతున్నారు...’’ అన్నారు రాబిన్ శర్మ.‘‘అవకాశాన్ని కాలదన్నుకొని రెస్పెక్ట్ని రాబట్టుకోవటం ఏం పని శర్మాజీ?! వచ్చిన అవకాశాన్నే నిచ్చెనగా వేసుకుని రెస్పెక్ట్ని కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలి కానీ...’’ అన్నారు ఆ నలుగురూ ఒకే మాటగా! ‘‘ఇక నేను వెళతాను...’’ అంటూ లేచారు రాబిన్ శర్మ. ‘‘కూర్చోండి శర్మాజీ, ఎన్నికల్లో కూటమిని గెలిపించారు. మీ ప్రచార వ్యూహమే కదా కూటమిని నిలబెట్టింది...’’ అన్నాన్నేను.‘‘అదే అంటున్నాను శిందేజీ. ప్రజలు శివసేన పై అభిమానంతో బీజేపీని గెలిపిస్తే, బీజేపీ ఏం చేయాలి?! శివసేన నాయకుడిని కదా ముఖ్యమంత్రిని చేయాలి?’’ అన్నారు రాబిన్ శర్మ.‘‘శర్మాజీ మీకు తెలియట్లేదు. ఎన్నికల ప్రచార వ్యూహం వేరు, ఎన్నికయ్యాక అధికారం కోసం వేయవలసిన ఎత్తుగడలు వేరు...’’ అన్నారు రవి పాఠక్ నవ్వుతూ. ఆ నవ్వుకు దెబ్బతిన్నట్లు చూశారు రాబిన్ శర్మ. ‘‘ఎత్తుగడ అంటే ఫడ్నవిస్ది పాఠక్జీ. ఆయన్ని ముఖ్యమంత్రిని చేయాలని ఆయన వెనుక ఉన్న ఒక్కరూ అనలేదు. శిందేజీ వెనుక ఉన్నవాళ్లు మాత్రం శిందేజీ ఉప ముఖ్యమంత్రి పదవిని నిరాకరించకూడదని పట్టుపట్టారు...’’ అన్నారు రాబిన్ శర్మ.ఆ మాట నిజమే అనిపిస్తోంది! ఈ నలుగురు పట్టిపట్టి ఉండకపోతే నా రెస్పెక్ట్ నాకుండేది. ఎప్పుడేం జరుగుతుందోనని మహారాష్ట్ర రాజకీయం అంతా నా చుట్టూ తిరుగుతుండేది. ఒకటి మాత్రం వాస్తవం. ఎవరైనా అయినవాళ్లు కానీ, కానివాళ్లు కానీ మన ఇష్టానికి వ్యతిరేకంగా మనల్ని ఏదైనా చెయ్యమని పట్టు పట్టినప్పుడు మనం వాళ్లకు తలొగ్గితే, ఆ తప్పు.. ‘పట్టుపట్టిన’ వాళ్లది అవదు. ‘పట్టుబడిన’ వాళ్లదే అవుతుంది. -
ఇమ్రాన్ ఖాన్ (మాజీ ప్రధాని) రాయని డైరీ
జైలు గదులకు ఉండే ఒక మంచి లక్షణం ఏంటంటే... అవసరమైనవి మాత్రమే కాదు, అనవసరమైనవి కూడా ఇక్కడ ఏ మూలా కనిపించవు! ఇరుకే అయినా ఇదొక సువిశాల సుఖమయ జీవితం. ఒకటి తీస్తుంటే ఒకటి పడిపోదు. అవసరం పడిందని వెతకటానికి కనిపించకుండా పోయేదేమీ ఉండదు.ఇల్లు అలాక్కాదు! అవసరమైనవి లేకున్నా పూట గడిచిపోతుంది కానీ, అనవసరమైనవి ఇంట్లో చేరిపోతుంటే చివరికి నడవటానికి కూడా దారి లేకుండా పోతుంది.ప్రధానిగా ఉన్నప్పుడు నేను, బుష్రా బీబీ ఉన్న మా నివాస భవనం నిరంతరం గిఫ్టుల రూపంలో వచ్చి పడుతుండే విలువైన చెత్తతో నిండిపోతూ ఉండేది. డైమండ్ జ్యూయలరీ, రోలెక్స్ వాచీలు, షాండ్లియర్లు, చెయిర్లు, సోఫాలు, ఆర్ట్ పీస్లు... వాటిని ఉంచుకోలేం, పడేయలేం. జ్యూయలరీకి ఒక మెడ, వాచీకి ఒక చెయ్యే కదా ఉంటాయి. అన్నన్ని ఏం చేస్కోను?! ఆరు రోలెక్స్ లు, కిలోల కొద్దీ జ్యూయలరీ, లివింగ్ రూమ్ని అమాంతం మింగేసే భారీ కలప ఫర్నిచర్!బుష్రా బీబీతో అన్నానొక రోజు, ‘‘బీబీ... మనింట్లో మనం వాడకుండా ఉండిపోయిన వస్తువులన్నీ వాటి విలువను బట్టి ఎక్కడివక్కడ ఏ మాయ వల్లనో కరెన్సీగా మారిపోతే ఎలా ఉంటుంది?!’’ అని. ఆ మాటకు బుష్రా బీబీ ఎంతో ఆహ్లాదకరంగా నవ్వారు. ‘‘వాడని వస్తువులు కూడా ఉంటేనే కదా అది ఇల్లవుతుంది ఇమ్రాన్జీ...’’ అన్నారు.ఆమె అలా నవ్వినప్పుడు బాబా ఫరీద్ దర్గాలోని ప్రశాంతత నన్నావరించినట్లౌతుంది. మేము తొలిసారి కలుసుకున్నది ఆ దర్గా ప్రాంగణంలోనే! ‘‘పోనీ ఇమ్రాన్జీ! మీరన్నట్లు ఇంట్లో వాడనివన్నీ వాటి విలువను బట్టి ఎక్కడివక్కడ కరెన్సీగా మారిపోతే మాత్రం... ‘ఇంతింత కరెన్సీ ఏంటి చెత్తలా కాలికీ చేతికీ తగులుతూ...’ అని అనకుండా ఉంటారా మీరు...’’ అన్నారు బుష్రా బీబీ నవ్వుతూ!జైలు గదికి ఉన్నట్లే బుష్రా బీబీ నవ్వుకు ఇరుకును అలవాటు చేయించే ‘గతి తాత్విక’ గుణం ఏదో ఉన్నట్లుంది! ‘‘ఇమ్రాన్ జీ! మీకు బెయిల్ వచ్చిందట!మీ లాయర్ వచ్చారు రండి...’’ అని నా సెల్ దగ్గరకు వచ్చి మరీ నన్ను వెంటబెట్టుకుని వెళ్లారు అసద్ జావేద్. నేనున్న రావల్పిండి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఆయన. విజిటర్స్ రూమ్లో సల్మాన్ సఫ్దర్ నాకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన చేతుల్లో బెయిలు పత్రాలు ఉన్నాయి. కానీ వాటి వల్ల ఏమీ ఉపయోగం లేదని సఫ్దర్కి, నాకు, బుష్రాకు, జైలు సూపరింటెండెంట్కి, పాక్ ప్రధానికి, నా పార్టీకి, పార్టీ కార్యకర్తలకు, ఇంకా... యావత్ ప్రపంచానికీ తెలుసు. గిఫ్టుగా వచ్చిన జ్యూయలరీ, రోలెక్స్ వాచీలను అమ్మేయగా జమ అయిన అమౌంట్కి సరిగా లెక్కలు చూపించలేదన్న కేసులో మాత్రమే నాకు వచ్చిన బెయిల్ అది. నాపై ఇంకా 149 కేసులు ఉన్నాయి. మూడేళ్ల శిక్ష, ఏడేళ్ల శిక్ష, పదేళ్ల శిక్ష, పద్నాలుగేళ్ల శిక్ష పడిన కేసులు కూడా వాటిల్లో ఉన్నాయి. కేసులన్నిటినీ కలిపి ఒకేసారి బెయిల్ ఇస్తేనే నేను బయటికి వచ్చినట్లు! గిఫ్టుల కేసులో నా భార్య బుష్రా బీబీ కూడా జైలు శిక్ష అనుభవించవలసి వచ్చింది! బుష్రాను జనవరి 31న అరెస్టు చేసి, తొమ్మిది నెలల తర్వాత, నెల క్రితమే అక్టోబర్ 24న బెయిల్ మీద విడుదల చేశారు. ఇద్దరం ఉన్నది ఒకే జైలు. ఏడాది పైగా నేను జైల్లోనే ఉంటున్నా... నేను కఠిన కారాగార శిక్ష అనుభవించింది మాత్రం ఆ తొమ్మిది నెలలే. ఒక నిశ్శబ్దపు నిట్టూర్పుతో సఫ్దర్ వైపు చూశాను.‘‘తనెలా ఉన్నారు సఫ్దర్జీ?’’ అని అడిగాను... బుష్రాను ఉద్దేశించి.‘‘మీరెలా ఉన్నారని తను అడుగుతున్నారు ఇమ్రాన్జీ...’’ అన్నారు సఫ్దర్!! -
పృథ్వీరాజ్ చవాన్ (కాంగ్రెస్ దిగ్గజం) రాయని డైరీ
‘‘మీరు వృద్ధాప్యంలో ఆలోచిస్తారు. యవ్వనంలో ఉండగా బీజేపీలో చేరి వికసిత్ భారత్లో ఎందుకు పాలు పంచుకోలేదా అని...’’ అన్నారాయన నాకు మళ్లీ ఫోన్ చేసి! ఆ ఫోన్ వచ్చింది ఆరెస్సెస్ నుంచి. ఆ ఫోన్ చేసింది ఆరెస్సెస్లోని ఒక పెద్ద మనిషి. ‘‘నేనిప్పుడు నా 78లో ఉన్నాను. అయినప్పటికీ... ‘మీరు మీ వృద్ధాప్యంలో ఆలోచిస్తారు...’ అని మీరు నాతో అనటం ద్వారా నా వయసు పట్ల మీరు కనబరుస్తున్న గొప్ప ఔదార్యం నన్ను కట్టిపడేస్తోంది. అలాగని నేను కాంగ్రెస్ కట్లు తెంపుకొని బీజేపీలోకి వచ్చేయలేను...’’ అన్నాను మృదువుగా.‘‘కట్లు అని మీరే అంటున్నారు. తెంపుకొని వచ్చేయటానికి ఏమిటి ఆలోచన?!’’ అన్నారాయన.‘‘అవి నన్ను నేను కాంగ్రెస్తో కట్టేసుకున్న కట్లు. కాంగ్రెస్ నన్ను ఫోన్ చేసి పిలిపించుకుని కట్టిపడేసిన కట్లు కావు...’’ అన్నాను. పెద్దగా నవ్వారాయన.‘‘మీలోని ఈ కట్టుబాటే నా చేత మీకు ఫోన్ చేయించేలా బీజేపీని ప్రేరేపించింది చవాన్జీ! ఢిల్లీలో బీజేపీకి మీ అవసరం ఉంది. సీనియర్ మోస్ట్గా మీకూ బీజేపీలో తగినంత గౌరవం ఉంటుంది. వచ్చేయండి...’’ అన్నారు.కోరుకున్న చోట దక్కే గౌరవం, కోరుకోని చోట పొందే గౌరవం... రెండూ ఒకటి కావు. దక్కింది సంతృప్తిని ఇస్తుంది. పొందిందిసంతోషాన్ని మాత్రమే ఇస్తుంది.‘‘నాకిక్కడ కాంగ్రెస్లో తగినంత గౌరవం దక్కుతూనే ఉంది మహోదయ్ జీ...’’ అన్నాను. ఆయన మళ్లీ నవ్వారు.‘‘నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉండటం, ఆరేళ్లు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో సహాయ మంత్రిగా ఉండటం, ఒక టర్మ్కు పైగా రాజ్య సభలో ఉండటం, రెండు టర్మ్లు లోక్సభలో ఉండటం, వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉండి, ఇప్పుడు మూడోసారి ఎమ్మెల్యేగా పోటీలో ఉండటం... ఇవన్నీ నిజంగా దక్కుదలలే అంటారా చవాన్ జీ... ఒక్కసారి మీ మనసును అడగండి...’’ అన్నారాయన!ఆయన ఉద్దేశం – ఇవేవీ ఆరెస్సెస్ ‘ప్రచారక్ ’, ‘విచారక్’లతో కానీ, బీజేపీ ‘మార్గదర్శక్ మండల్’ సభ్యత్వంతో కానీ సమానమైనవి కావన్నట్లుగా ఉంది!మొదటిసారి ఆయన నాకు ఫోన్ చేసింది ఎన్నికల నోటిఫికేషన్కు ముందు. రెండోసారి ఫోన్ చేసింది నామినేషన్లకు ముందు. మూడోసారి ఫోన్ చేసింది నవంబర్ 4న నామినేషన్ల ఉపసంహరణ గడువుకు ముందు. ఇప్పుడు మళ్లీ ఫోన్ చేసి, ‘‘ఇప్పటికైనా మించిపోయింది లేదు, వచ్చేయండి, చవాన్ జీ...’’ అంటున్నారు 20న పోలింగ్, 23నకౌంటింగ్ పెట్టుకుని!కరద్ సౌత్ నుంచి వరుసగా రెండుసార్లు నా మీద పోటీ చేసి ఓడిపోయిన అతుల్ సురేశ్ భోసలేనే మళ్లీ నాపై నిలబెట్టింది బీజేపీ. మొదటిసారి 18 వేలు, రెండోసారి 9 వేల ఓట్ల తేడాతో అతుల్ ఓడిపోయారు కనుక ఈసారి ఆయన కచ్చితంగా గెలిచి తీరుతారని ఆ పార్టీ నమ్మకం.నమ్మకాలు బీజేపీకి మాత్రమే ఉంటాయా?! కరద్ సౌత్లో మళ్లీ నేనే వస్తానని కాంగ్రెస్ నమ్ముతోంది. రాష్ట్రం మొత్తం మీద కాంగ్రెస్ వస్తే నేనే సీఎం అని నేను నమ్ముతున్నాను. తనే సీఎం అని మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ నానా పటోలే నమ్ముతున్నారు.అడ్డు తొలగించుకోవటం కోసం బీజేపీ ఏమైనా చేస్తుంది. బీహార్లో తమ కన్నా తక్కువ సీట్లు వచ్చిన నితీశ్కు సీఎం సీటును ఇచ్చేస్తుంది. కరద్ సౌత్లో అతుల్కి దీటైన పోటీ లేకుండా నన్ను పార్టీలోకి తీసుకోటానికి ఆరెస్సెస్తో ఫోనూ చేయిస్తుంది. ‘‘వృద్ధాప్యంలో మీరు ఆలోచిస్తారు...’’అంటూ ఈసారి మళ్లీ ఆ ఆరెస్సెస్ మహోదయ్ ఫోన్ చేస్తే ఒకటే చెప్పాలి... కాంగ్రెస్లో వృద్ధాప్యమనేదే ఉండదని గట్టిగా చెప్పాలి! - మాధవ్ శింగరాజు -
Rayani Dairy: అజిత్ పవార్ (డిప్యూటీ సీఎం)రాయని డైరీ
ఎవరి మీదనైనా మనకు పట్టనలవి కాని గౌరవం ఉన్నప్పుడు ఆ గౌరవాన్ని కాపాడు కోవలసిన బాధ్యత కూడా మనదే అవుతుంది తప్ప, అవతలి వాళ్లది కానే కాదని గట్టిగా నమ్ముతాన్నేను. శరద్జీ అంటే నాకు గౌరవం. సాధారణ గౌరవం కాదు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే మీద, నా సహ ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మీద ఉన్న గౌరవంతో సమానమైన గౌరవం. ‘‘అదంతా నాటకం, గౌరవం కాదు’’ అని శరద్జీ అనుకుంటున్నా కూడా... నేనా యన్ని గౌరవించటం మానను. మనిషి ఎదుటా మానను, మనిషి చాటునా మానను.భుజాలపై ఎప్పటికీ అలా ఉంచేసుకుం టారని స్టేజీ పైకి వెళ్లి శాలువాను కప్పి వస్తామా ఎవరికైనా? గౌరవమూ అంతే! మనం ఇచ్చిన గౌరవాన్ని నిలుపుకుంటున్నారా, లేదా అని మనం వెళ్లి అస్తమానం తొంగి చూస్తుండ కూడదు. అసలు చూసేందుకు వెళ్లనే కూడదు. గౌరవించాలి, వెంటనే అక్కడి నుంచి వెనక్కు వచ్చేసి వేరే పనిలో పడిపోవాలి. అయితే గౌరవనీయులు కొన్నిసార్లు తిన్నగా ఉండరు. మనల్నీ తిన్నగా ఉండ నివ్వరు. శరద్జీ పై నాకున్న గౌరవాన్ని నేను కాపాడుకోవలసిన పరిస్థితులను శరద్జీ ఈమధ్య నాకు తరచుగా కల్పిస్తున్నారు!సంతోషమే. ఆయనేం చేసినా ఆయనపై నా గౌరవం ఎక్కడికీ పోదు. కానీ నన్నుపంపించేందుకే ఆయన తన ఎన్నికలప్రచారంలోని అమూల్యమైన సమయాన్నంతా వినియోగిస్తున్నారు. ‘బారామతి’లో నాకు పోటీగా నా తమ్ముడి కొడుకు యోగేంద్ర పవార్ను దింపారు. ‘‘బాహుబలీ! నీదే ఇకపైబారామతి’’ అని ఆశీర్వదించారు. యోగేంద్ర నా తమ్ముడి కొడుకైతే, నేను శరద్జీతమ్ముడి కొడుకుని. ఇద్దరు ‘తమ్ముడికొడుకుల’ మధ్య పోటీకి బారామతే దొరికిందా శరద్జీకి? ‘‘ఇక చాలు. ముప్పై ఏళ్లు నేను బారామతి ఎమ్మెల్యేగా ఉన్నాను. ముప్పై ఏళ్లు అజిత్ బారామతి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడిక మూడో తరం రావాలి, యోగేంద్ర రాబోయే ముప్పై ఏళ్లు బారామతి ఎమ్మెల్యేగా ఉండాలి’’ అని సభల్లో హోరెత్తిస్తున్నారు శరద్జీ!ఇక చాలా!! ఎవరికి చాలు? వరుసలో కూర్చొని భోజనం చేస్తున్నవారు తాముతింటూ, ‘‘వాళ్లకు ఇక చాలు’’ అని పక్క వాళ్ల వైపు చెయ్యి చూపిస్తూ చెప్పినట్లుంది శరద్జీ నా మాటెత్తి ‘‘ఇక చాలు’’ అనటం!ఇలాంటప్పుడే, శరద్జీ పైన నాకున్న గౌరవాన్ని కాపాడుకుంటూ రావటం నాకు కష్టమైపోతుంటుంది. ‘‘పాత తరం ఎక్కడో ఒక చోట ఆగిపోవాలి, కొత్త తరం రావాలి...’’ అంటు న్నారు శరద్జీ! ఏదీ, పాత తరం ఎక్కడఆగింది? 83 ఏళ్లు వచ్చినా ఇంకా ర్యాలీలు తీస్తూనే ఉంది. మరో రెండేళ్లు రాజ్యసభఎంపీగా కూడా ఉంటుంది. పాత తరం ఎప్పటికీ ఆగిపోదని, పార్టీ అధ్యక్షుడిగాఈ భూమ్యాకాశాలు ఉన్నంతకాలంఉండిపోతుందని తేలిపోయాకే కదా నేనుకొత్త దారి వెతుక్కుంటూ వచ్చేసింది. వచ్చేశాక కూడా నేను శరద్జీని గౌరవించటం మానలేదు. నవంబర్ 20న పోలింగ్. ఎన్సీపీ నుంచి బయటికి వచ్చిన ఎన్సీపీ నాది. శివసేన నుంచి బయటికి వచ్చిన శివసేన ఏక్నాథ్ షిందేది. ఎన్సీపీ–శివసేన–బీజేపీ కలిసిన మా ‘మహాయుతి’కి; శరద్జీ ఎన్సీపీ–ఉద్ధవ్ ఠాక్రే శివసేన–కాంగ్రెస్ల ‘మహా వికాస్ ఆఘాడీ’ కి మధ్య 288 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల యుద్ధం ఇది. కానీ శరద్జీ అలా అనుకుంటున్నట్లు లేరు! ఇదంతా బారామతి కోసం జరగబోతున్న మహా సంగ్రామం అని, వాళ్లు మొత్తం అన్ని చోట్లా గెలిచినా, బారామతిలో నేను ఒక్కడినీ ఓడిపోకపోతే వాళ్లదసలు గెలుపే అవదని ఆయన భావిస్తున్నట్లుంది! ఆయన భావన ఎలాంటిదైనా ఆయనపై నా గౌరవ భావన మాత్రం చెక్కు చెదిరేది కాదు.-మాధవ్ శింగరాజు -
సల్మాన్ ఖాన్ (బాలీవుడ్ స్టార్)రాయని డైరీ
తప్పులు మానవ సహజం అయినప్పుడు శిక్షలు అమానుషంగా ఎందుకు ఉండాలి?! చట్టాల గురించి, బిష్ణోయ్ లారెన్స్ గ్యాంగ్ గురించీ కాదు నా ఆలోచన. శిక్షను విధిస్తు న్నట్లు తెలియపరచకుండానే మూతి బిగింపుల మౌనంతో యావజ్జీవ దూరాన్ని పాటిస్తుండే సొంత మనుషుల గురించి, ‘నా’ అనుకున్నా, నా వాళ్లు కాకుండా పోయిన వాళ్ల గురించి. చట్టం విధించే శిక్ష నిర్దాక్షిణ్యమైనదిగా కనిపించవచ్చు. కానీ, ఏ రూల్ బుక్కూ లేకుండా మనిషికి మనిషి విధించే శిక్ష అన్యాయమైనది. న్యాయం లేకపోవటం కన్నా దయ లేకపోవటం ఏమంత చెడ్డ విషయం?!శిక్షల విధింపులో చట్టానికి ఒక చక్కదనం ఉంటుంది. ఒక సక్రమం ఉంటుంది. చింపిరి జుట్టుకు దువ్వెన, దారిలో పెట్టే దండన... చట్టం.కారును ఢీకొట్టించు. జింకను వేటాడు. ఆయుధాలు కలిగి ఉండు. 26/11 పై కామెంట్లు చెయ్యి. యాకూబ్ మెమన్ మీద ట్వీట్లు పెట్టు. దరిద్రం నీ నెత్తి మీద ఉండి ఆఖరికి ఐశ్వర్యారాయ్ పైన కూడా చెయ్యి చేస్కో. నువ్వెన్ని చేసినా... చట్టం వెంటనే నిన్ను దూలానికి వేలాడదీయదు. శూలాలతో పొడిపించదు. మొదట విచారణ జరుపుతుంది. వాదనలు వింటుంది. వాయిదాలు వేస్తుంది. తీర్పును రిజర్వు చేస్తుంది. ఆ తర్వాతే నువ్వు దోషివో, నిర్దోషివో తేలుస్తుంది. దోషివైతే జైలుకు పంపుతుంది. కావాలంటే బెయిలిస్తుంది.మనుషులు విధించే శిక్షలో ఇవేవీ ఉండవు. దువ్వెనా, దండనా అసలే ఉండవు. దూరంగా జరిగిపోతారంతే. ‘‘ఎలా ఉన్నావ్?’’ అని అడిగేందుకైనా దగ్గరకు రారు. ‘‘భద్రంగా ఉండు..’’ అని చెప్పేందుకైనా దూరాన్ని తగ్గించుకోరు. ఎంత అమానుషం!!‘‘నువ్వు పెంచుకున్న దూరమే ఇది సల్మాన్..’’ ఎంత తేలిగ్గా అనేస్తారు!బంధాలను కదా నేను పెంచుకున్నాను. దూరాలనా?! స్నేహబంధం, ప్రేమబంధం, జీవితబంధం... అన్ని బంధాలనూ తెంచుకుని వెళ్లింది ఎవరు?!‘‘కానీ సల్మాన్, నువ్వొట్టి పొసెసివ్. గట్టిగా పట్టేసుకుంటావ్. ఎటూ కదలనివ్వవు. ఎటూ చూడనివ్వవు. ఏదీ మాట్లాడనివ్వవు. ఏమీ చెప్పనివ్వవు. దాన్నేమంటారు మరి? దూరం పెరగటమే కదా! నువ్వు పెంచుకున్న దూరం..’’ అంటారు!కేరింగ్ను పొసెసివ్ అని ఎందుకు అనుకుంటారు వీళ్లంతా?! కేరింగ్ అవసరం లేదని చెయ్యి విడిపించుకున్నప్పుడు దూరం పెరిగితే అది చెయ్యి వదిలిన వాళ్లు పెంచుకున్న దూరం అవుతుందా?!రోజుకొకరు ఫోన్ చేసి, ‘‘సల్మాన్ నిన్ను చంపేస్తాం’’ అని బెదిరిస్తున్నారు. వాళ్లు నయం కదా... ‘‘సల్మాన్ బాగున్నావా?’’ అని పరామర్శగా ఒక్క కాల్ అయినా చేయకుండా జూహూలో, బాంద్రాలో ఏళ్లకు ఏళ్లు నాకు ‘దగ్గరగా’ ఉంటున్న వారి కంటే!బయట క్రాకర్స్ పేలుతున్నాయి. గన్ పేలి నప్పుడు వచ్చే శబ్దం ప్రత్యేకంగా ఏమీ ఉండదు. సైలెన్సర్ బిగిస్తే అసలు శబ్దమే ఉండదు.నవ్వొచ్చింది నాకు. నా చుట్టూ ఉన్న వాళ్లంతా మౌనాన్ని బిగించుకున్న తుపాకుల్లా అయిపోయారా! సైలెన్సర్ ఉన్న బులెట్ మౌనంగా ఒకసారే దిగిపోతుంది. మౌనం అదేపనిగా బులెట్లను దింపుతూ ఉంటుంది.లేచి బాల్కనీ లోకి వచ్చాను. ఒక్కక్షణం నాకు గెలాక్సీ అపార్ట్మెంట్లో ఉన్నానో, పాన్వెల్ ఫామ్హౌస్లో ఉన్నానో అర్థం కాలేదు. ఎక్కడుంటే ఏమిటి, పక్కన మనిషే లేనప్పుడు? పలకరింపు కూడా కరువైనప్పుడు!కళ్లెదురుగా ఆకాశం వెలిగి ఆరిపోతూ, వెలిగి ఆరిపోతూ ఉంది. ఎగసిన కాంతి పూలు ఫెటేల్మని విచ్చుకుని, చప్పున అంతెత్తు నుంచి చీకట్లోకి జారిపోతున్నాయి.ఏనాడో జీవితంలోంచి వెళ్లిపోయినవారు ఇప్పుడు ఒక్కొక్కరూ గుర్తుకు వస్తున్నారంటే.. కష్టంలో ఉన్నామనా? కష్టాన్ని తట్టుకుని ఉన్నామనా?-మాధవ్ శింగరాజు -
కరణ్ సింగ్ (సీనియర్ మోస్ట్ లీడర్) రాయని డైరీ
లోకం మనల్ని పూర్తిగా పట్టించుకోవడం మానేసినప్పుడు లోకానికి మనం ఏదైనా కొత్తగా చేసి చూపించాలన్న తపన మన లోలోపల ఎందుకని అంత అర్థరహితంగా రేయింబవళ్లూ జ్వలిస్తూ ఉంటుంది?! ‘‘ఇదిగో.. చాణక్యపురిలోని న్యాయ్మార్గ్లో ఉన్న ‘మానస సరోవర్–3’ లో నేనింకా జీవించే ఉన్నాను..’’ అని లోకానికి గుర్తు చేయడానికా? లేదంటే, లోకం మనల్ని నిర్దయగా పట్టించుకోవడం మానేయడం వల్ల కాలం మనకు సమకూర్చిన అమూల్యమైన సమయాన్ని అంతకంతా సద్వినియోగం చేసి, ఆ సద్వినియోగ ఫలాన్ని లోకానికంతటికీ ప్రదర్శనకు పెట్టాలన్న ప్రతీకార భావన మనల్ని కొద్దిపాటిగానైనా స్థిమితంగా ఉండనివ్వక పోవడం వల్లనా? కారణం ఏదైనా నేనొక పొరపాటైతే చేశాను! తొంభై రెండేళ్ల వయసులో ఒక మనిషి పొరపాటు పని చేస్తే ఏమనుకోవాలి? ఏమైనా అనుకోవచ్చు. చూపు సన్నగిల్లిందని, మాట మెత్తబడిందని, వినికిడి మందగించిందనీ, ఆలోచన పలచనయ్యిందనీ.. ఏదైనా అనుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా నాలో చక్కగా పనిచేస్తూ ఉన్నప్పటికీ నేనెందుకు పొరపాటు చేసినట్లు?! తొంభై ఏళ్లు దాటిన వయసంటే.. నిరక్షరాస్యుడిని సైతం వేదవ్యాసుడిగా మార్చేసేటంతటి జీవితం! మరి ఇతిహాసాలను, ఉపనిషత్తులను అధ్యయనం చేసిన మనిషి ఇంకెంతలా మారి ఉండాలి! అసలు పొరపాటన్నదే చేయలేనంతగా కదా. కానీ నేను చేశాను. తొంభై రెండేళ్ల వయసుండీ; ఇతిహాసాలను, ఉపనిషత్తులను చదివి ఉండీ, పుస్తకం రాయడం అనే ఒక పెద్ద పొరపాటు చేశాను! పుస్తకం రాస్తున్నప్పుడు అనిపించ లేదు, పుస్తక ఆవిష్కరణప్పుడు అనిపించింది.. రాసి పొరపాటు చేశానని. ముండకోపనిషత్తుపై నేను రాసిన ఆ పుస్తకాన్ని ఆవిష్కరించింది గౌరవ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్. ‘‘ధన్ఖడ్జీ.. నేనొక పుస్తకాన్ని రాశాను. ఆ పుస్తకాన్ని మీరే ఆవిష్కరించాలి..’’ అని మొదట నేను ఫోన్ చేసి చెప్పినప్పుడు ధన్ఖడ్.. పుస్తకం పేరేమిటని అడగలేదు! ‘‘ధన్ఖడ్జీ.. మీరు అనుమతిస్తే కనుక నా పుస్తకం పేరేమిటో కూడా మీకు ఇప్పుడే తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను..’’ అన్నాను. అప్పుడైనా ఆయన ‘‘సరే, చెప్పండి..’’ అనలేదు! ఉపరాష్ట్రపతి నివాస్లో పుస్తకావిష్కరణ జరిగింది. ‘‘పుస్తకం బాగుంది కరణ్జీ.. ‘ముండకోపనిషత్తు’ పైన కదా రాశారు..’’ అన్నారు ధన్ఖడ్.. పేజీలను తిరగేస్తూ. ముండకోపనిషత్తులో కాంగ్రెస్ పార్టీ గురించి ఉండదు. రాహుల్గాంధీ అసలే ఉండరు. ‘సత్యమేవ జయతే‘ అని మాత్రమే చెబుతుంది ముండకోపనిషత్తు. కానీ ధన్ఖడ్ రాహుల్గాంధీ గురించి మాట్లాడారు! రాహుల్ లండన్ వెళ్లి ఇండియా పార్లమెంటును విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. ‘‘ఇప్పుడు కూడా నేను మౌనంగా ఉంటే రాజ్యాంగ విలువల్ని ఎవరు కాపాడతారు?’’ అని అడిగారు! ‘‘పార్లమెంటుకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ దుష్ప్రచారాన్ని ఎలా విస్మరించగలను?’’ అని అన్నారు. నా పుస్తకావిష్కరణకు నేను ధన్ఖడ్ను ఎంచుకుంటే, రాహుల్పై మండిపడేందుకు ధన్ఖడ్ నా పుస్తకావిష్కరణను ఎంచు కున్నారా?! ఐనా పుస్తకం రాయడం అనే పొరపాటును నేనెందుకు చేసినట్లు!! 1967లో నేను కాంగ్రెస్లో చేరాను. ఇప్పుడూ కాంగ్రెస్లోనే ఉన్నాను. కానీ కాంగ్రెస్కు నేనేమీ కాను. వర్కింగ్ కమిటీ లోనూ లేను. నన్నెవరూ ఏదీ అడగరు. ఏదీ నాకు చెప్పరు. పార్టీలో నేనిప్పుడు ఒక జీరో. పార్టీ నన్ను పూర్తిగా పట్టించుకోవడం మానేసిందని చెప్పి పార్టీకి నేనేదైనా కొత్తగా చేసి చూపించాలని తపించడం వల్లనే పుస్తకం రాయడం అనే ఇంత పెద్ద పొరపాటు నా వల్ల జరిగి ఉంటుందా?! -
బిల్ గేట్స్ (బిజినెస్ మాగ్నెట్) రాయని డైరీ
మిస్ పౌలా నవ్వారు. ఆమె నవ్వు సియాటిల్ నగరంలా అందంగా ఉంది. నన్ను అర్థం చేసుకున్న సిటీ సియాటిల్. అక్కడే నేను పుట్టాను. పర్వతాల అరణ్య జ్వాలలపై నాకు ప్రేమ కలిగిందీ అక్కడే. ‘‘ఏంటి నవ్వుతున్నారు మిస్ పౌలా?’’ అని అడిగాను. సియాటిల్లోని మొత్తం ఏడు లక్షల యాభై వేల మంది జనాభాకు కాస్త దూరంగా ఉండే కాఫీ షాప్లో ఇద్దరం పక్కపక్కన కూర్చొని ఉన్నాం. నేను ఆమె వైపు జరిగి కూర్చుంటే ఆమె నావైపు ఒరిగి కూర్చున్నారు. ‘‘మన గురించి ఏవో రాస్తున్నారు..’’ అన్నారు పౌలా.. నవ్వుతూనే. నేనూ నవ్వాను. ‘‘మీరెందుకు నవ్వుతున్నారు బిల్!’’ అన్నారామె. ‘‘ఏవో రాస్తున్నారు కానీ, ఏవేవో రాయడం లేదు. నయం కదా..’’ అన్నాను. ఇద్దరం కాసేపు మౌనంగా ఉండిపోయాం. మా భుజాలు వాటి కబుర్లలో అవి ఉండిపోయాయి. ‘‘మీ నవ్వు పొయెట్రీలా ఉంటుంది బిల్..’’ అన్నారు పౌలా హఠాత్తుగా! 67 ఏళ్ల వయసులో ఆమె కారణంగా సియాటిల్ నగరాన్ని నేను, 60 ఏళ్ల వయసులో నా కారణంగా పొయెట్రీని ఆమె ఇష్టపడుతున్నామా? అయినా నా నవ్వు పొయెట్రీలా ఉంటుందని ఆమె అన్నారే గానీ పొయెట్రీని తను ఇష్టపడతానని అన్లేదుగా!! ‘‘పొయెట్రీ అంటే మీకు ఇష్టమా?’’ అని అడిగాను. ఆమె నవ్వి, ‘‘ఎవరికుండదూ..!’’ అన్నారు. ‘‘బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్లక్కూడానా?’’ అన్నాను. ‘‘ఓయ్..’’ అంటూ తన భుజంతో నా భుజాన్ని నెట్టేశారు పౌలా. ఆమెలో ఏదో మాయ ఉంది. యాన్ విన్బ్లాడ్లో ఉన్నట్లు, జిల్ బెనెట్లో ఉన్నట్లు, మెలిందాలో ఉన్నట్లు! అసలు ఆడవాళ్లలోనే ఈ మాయ ఉంటుందా?! మెలిందా నాకు విడాకులు ఇవ్వడానికి విన్బ్లాడ్ కానీ, జిల్ బెనెట్ గానీ కారణం కాదు. పౌలాకు నేను దగ్గరవ్వడానికి మెలిందా కానీ మరొకరు కానీ కారణం కాదు. ప్రేమ, స్నేహం.. ఇవి మాత్రమే నడిపిస్తాయి జీవితాన్ని. జెఫ్రీ ఎప్స్టైన్ నా స్నేహితుడు. అతడితో మాట్లాడవద్దంటుంది మెలిందా. అతడి మీద కేసులు ఉన్నాయని, అతడు జైలుకు వెళ్లాడని, అతడితో స్నేహం వదిలేయమని అంటుంది. ‘‘ఎలా వదిలిపెట్టడం మెలిందా?’’ అంటే.. ‘‘పోనీ నన్నొదిలేయ్’’ అంటుంది!! జైల్లో జెఫ్రీ ఆత్మహత్య చేసుకుని చనిపోయాక కూడా మెలిందా మనసు కరగలేదు. ఎందుకుండాలి ఒక మనిషి పట్ల మరొక మనిషి అంత కఠి నంగా!! మెలిందాతో ఆ మాటే అన్నాను. కోపంతో నన్ను వదిలి వెళ్లింది. కానీ ప్రేమ, టెన్నిస్ ఎవర్నీ ఒంటరిగా ఉండనివ్వవు. నా జీవితంలోకి పౌలా ప్రవేశించారు. నాలానే పౌలా టెన్నిస్ అభిమాని. మొదటి సారి కలిసినప్పుడు.. ‘‘మీ..రూ..’’ అంటూ నన్నలా చూస్తూ ఉండిపోయారు పౌలా. రెండోసారి మేము కలుసుకున్నప్పుడు ‘‘మీ..రూ..’’ అంటూ తనను అలా చూస్తూ ఉండిపోయాన్నేను. మనసుకు నచ్చిన వాళ్లతో కలిసి కూర్చోడానికి టెన్నిస్ టోర్నమెంట్ల తర్వాత కాఫీ షాపులు బాగుంటాయి. అయితే ఒక్కటే నిరాశను కలిగిస్తుంది. కాఫీ షాపులలో ఎన్ని గంటలు కూర్చున్నా డ్యూటీకి వెళ్లడం కోసమైతే ల్యాప్టాప్ని తగిలించుకుని పైకి లేవవల సిందే. పౌలా ఈవెంట్ ఆర్గనైజర్. ‘‘ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు బిల్..’’ అన్నారు పౌలా తన భుజంతో మళ్లీ నా భుజాన్ని నెట్టేస్తూ. మా ముందున్న టేబుల్ మీద ఆవేళ్టి ట్యాబ్లాయిడ్స్ ఉన్నాయి. ‘బిల్ గేట్స్కి మళ్లీ ప్రేమ దొరికింది’.. అన్నిటిపైనా ముఖ్యాంశం ఒకటే! ‘అవునా! బిల్ గేట్స్కి ప్రేమ దొరికిందా?!’’ అంటూ నా కళ్లలోకి చూసి నవ్వారు పౌలా. మాధవ్ శింగరాజు -
ఎం.కె. స్టాలిన్ (తమిళనాడు సీఎం) రాయని డైరీ
మనిషిని చూస్తే శుభ్రంగా ఉన్నాడు. సంప్ర దాయంగా ఉన్నాడు. ధోతీ–చొక్కా ధరించి ఉన్నాడు. శ్రీమతితో కలిసి నడుస్తున్నాడు! ‘‘ఈయన రవి కదా, మన తమిళనాడు గవర్నర్!’’ అన్నాను... ఫొటోలో అలా శుభ్రంగా, సంప్రదాయంగా, ధోతీ–చొక్కా ధరించి, శ్రీమతితో కలిసి నడుస్తున్న వ్యక్తిని రఘుపతికి చూపిస్తూ. ‘‘ఆమా తలైవా. అలాగే అనిపిస్తోంది..’’ అన్నారు రఘుపతి. ఆయన ‘లా’ మినిస్టర్. ‘‘అనిపించడం కాదు, కనిపిస్తున్నది ఆయనే’’ అని నవ్వారు పెరియస్వామి. ఆయన రూర ల్ మినిస్టర్. ఆయన చేతిలో మరికొన్ని ఫొటోలు ఉన్నాయి. ఆ ఫొటోల్లో కూడా రవి శుభ్రంగా, సంప్రదాయంగా ఉన్నారు. రాజ్భవన్ పొంగల్ ఈవెంట్కు వచ్చిన వారందరినీ వారి దగ్గరకు వెళ్లి మరీ ఆత్మీయంగా పలకరిస్తున్నారు. పొంగల్ శుభాకాంక్షలు చెబుతున్నారు. నీలగిరి ట్రైబల్స్ కొందరు ఎంపికగా తెంపుకొచ్చి, గుత్తిగా ముడి వేసి తెచ్చిన కొండపూల బొకేను అపురూపంగా స్వీకరిస్తున్నారు. కేరళ నుంచి వచ్చిన బ్రాహ్మణులు పూజలు నిర్వహించి ఇచ్చిన ‘పరివట్టమ్’ను భక్తి ప్రపత్తులతో శ్రద్ధగా తన తలకు చుట్టుకుంటున్నారు. ఆ ఫొటోలను పెరియస్వామికి తిరిగి ఇచ్చేస్తూ... ‘‘ఇంత శుభ్రమైన, సంప్రదాయ బద్ధమైన మనిషి మొన్న అసెంబ్లీలో అలా ఎందుకు బిహేవ్ చేశారంటారూ!!’’ అన్నాను. రఘుపతి, పెరియస్వామి మాట్లాడలేదు. ఆ ప్రశ్న అందరిలోనూ ఉంది. సమాధానం గవర్నర్ రవి మాత్రమే చెప్పగలిగింది. రవికి, తమిళనాడుకు సంబంధమే లేదు. బిహార్ అతడి రాష్ట్రం. కేరళ అతడి క్యాడర్. ఢిల్లీ అతడి వర్క్ప్లేస్. మేఘాలయకు, నాగాలాండ్కు గవర్నర్గా ఉన్నారు. అలాగే ఇప్పుడు తమిళనాడుకు. మేఘాలయకు గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన మేఘాలయను మేఘాలయ అనే అన్నారు. నాగాలాండ్కు గవర్నర్గా ఉన్నప్పుడు నాగాలాండ్ను నాగాలాండ్ అనే అన్నారు. తమిళనాడును మాత్రం తమిళనాడు అనడం లేదు. ‘తమిళగం’ అంటున్నారు. బయటా అదే మాట. అసెంబ్లీలోనూ అదే మాట! తమిళనాడు అంటే ‘తమిళభూమి’ అనే అర్థం వస్తుంది కనుక.. అప్పుడది భరత భూమికి సంబంధం లేని స్వతంత్ర దేశంగా అనిపించే ప్రమాదం ఉంది కనుక.. తమిళ నాడును ‘తమిళుల ప్రాంతం’ అనే అర్థం వచ్చేలా ‘తమిళగం’ అనడమే కరెక్ట్ అని తను గవర్నర్గా వచ్చినప్పటి నుంచీ రవి అంటూనే ఉన్నారు. కాన్స్టిట్యూషన్ని రవి కాస్త ఎక్కువగా చదివినట్లున్నారు. ఎక్కువ చదివితే ముఖ్యమైనవి కొన్ని తక్కువగా అనిపిస్తాయి. మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలలో గవర్నర్ తల దూర్చకూడదని, వేలు పెట్టకూడదని, కాలు దువ్వకూడదని ఆర్టికల్ 163 (1) లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన అసెంబ్లీ ప్రసంగంలోంచి మహనీయులు పెరియార్ని, అంబేద్కర్ని, కామరాజ్ని అన్నాదురైని తొలగించి, తమిళనాడుకు బదులు తమిళగంను చేర్చి, అలా ఎలా చేస్తారని ప్రశ్నించినందుకు వాకౌట్ చేసి.. గవర్నర్ రవి ఎవరి ఔన్నత్యాన్ని నిలబెట్టినట్లు! రాజ్యాంగానిదా, రాజ్భవన్దా? రాజ్యాంగ నియమాలను శిరసావహించని ఈ పెద్దమనిషేనా ఇప్పుడు పొంగల్ సంప్రదాయాలను గౌరవిస్తూ కనిపిస్తున్నది!! ‘‘ఫొటోలు మనకెందుకు పంపారట?’’ అని పెరియస్వామిని అడిగాను. ‘‘పొంగల్ ఈవెంట్కి పిలిచినా మనం వెళ్లలేదని పొంగల్ ఈవెంట్నే మనకు పంపారు’’ అన్నారు నవ్వుతూ పెరియస్వామి. ఆ నవ్వుకు ఆయన చేతిలోంచి ఒక ఫొటో జారి కింద పడింది. ‘హ్యాపీ పొంగల్ – ఇట్లు మీ ప్రియమైన రవి’.. అని ఆ ఫొటో వెనుక రాసి ఉంది! -మాధవ్ శింగరాజు -
రేవంత్ రెడ్డి (పీసీసీ చీఫ్) రాయని డైరీ
కాంగ్రెస్ ఎప్పుడూ విశిష్టమైన వ్యక్తులనే ఎంపిక చేసుకుంటుంది. ఆ విశిష్టమైన వ్యక్తులతో పార్టీలో అప్పటికే ఉన్న అతి విశిష్టులు విభేదిస్తూ ఉండొచ్చు గాక. కోపంగా వెళ్లి వేరే పార్టీలో చేరొచ్చు గాక. కాంగ్రెస్ తన విశిష్టతను చేజార్చుకోదు. శశిధర్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయినందుకు.. ‘అయ్యో, ఊడల మర్రి.. వేళ్లు పెకిలించుకుందా..’ అని కాంగ్రెస్ ఏమీ హుటాహుటిన ఢిల్లీలో స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయలేదు. కాంగ్రెస్ను మించిన మహామర్రి దేశంలో ఎక్కడైనా ఉందా.. తెలంగాణలో ఉండటానికి?! స్కూల్లో ఉన్నప్పుడు ఆర్.ఎస్.ఎస్. ఆకర్షిస్తుంది. ఆకర్షించేది ఆర్.ఎస్.ఎస్. కాదు. ఆర్.ఎస్.ఎస్. చేతిలోని ఆ పొడవాటి కర్ర . కాలేజ్లో ఉన్నప్పుడు రాడికల్స్ ఆకర్షిస్తారు. ఆకర్షించేది రాడికల్స్ కాదు. వారి భుజాలకు వేలాడే ఆ పొడవాటి తుపాకీ. భ్రమలన్నీ తొలగిపోయాక ఆకర్షించేది కాంగ్రెస్. కాంగ్రెస్ చేతిలో కర్రా ఉండదు, కాంగ్రెస్ భుజానికి తుపాకీ ఉండదు. అయినా ఆకర్షిస్తుంది. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీకి తను ఎంపిక చేసుకున్న విశిష్టమైన వ్యక్తులే ఆయుధాలు! ఆయుధం పేరు ఖర్గే కావచ్చు, రేవంత్రెడ్డి కావచ్చు. పదును మాత్రం పార్టీదే. వ్యక్తిగా ఎదగాలని అనుకున్న వాళ్లే పార్టీని వదిలి వెళ్తారు. బీజేపీలో చేరడం కోసం శశిధర్ రెడ్డి ఢిల్లీ వెళ్లడానికి ముందు రోజు నేను ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నాను. ఖర్గే పిలిపించారని చెబితే ఖర్గే కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. ‘‘ఎంతసేపైంది రేవంత్ గారూ మీరు వచ్చి?’’ అనే మాట వినిపించి అటు వైపు చూశాను. మాణిక్కం ఠాగూర్! తెలంగాణ స్టేట్ ఇంచార్జ్. ఆయన వెనకే బోసు రాజు, రోహిత్ చౌదరి, నదీమ్ జావెద్ వచ్చారు. వాళ్లు ముగ్గురూ తెలంగాణ స్టేట్ను, తెలంగాణ స్టేటస్ను చూస్తున్న ఏఐసీసీ కార్యదర్శులు. మాణిక్కం ఠాగూర్ తమిళనాడు. బోసు రాజు కర్ణాటక, రోహిత్ చౌదరి ఢిల్లీ, నదీమ్ జావెద్ యూపీ. నలుగురూ నాతో చాలా ఆత్మీయంగా ఉన్నారు. నేను పార్టీలోకి వచ్చి ఐదేళ్లయింది. తెలంగాణలో ఒక్క సీనియర్ కూడా నాతో ఇంత ఆత్మీయంగా లేరు! ‘‘శశి థరూర్రెడ్డి అలా సడన్గా పార్టీకి రిజైన్ చేసి ఎందుకు వెళ్లిపోయారు రేవంత్?’’ అని అడిగారు రోహిత్ చౌదరి! శశి థరూర్రెడ్డి కాదు, శశిధర్రెడ్డి అని రోహిత్ చౌదరిని సరిదిద్దినందు వల్ల.. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒనగూడే ప్రయోజనం ఏమీ లేదు కనుక నేను ఆ ప్రయత్నం మానుకున్నాను. ‘‘రేవంత్ గారూ! మీరు పార్టీలో పెద్దల్ని గౌరవించడం లేదట! హనుమంతరావు గారిని గోడకేసి కొడతానన్నారట! స్టార్ క్యాంపెయినర్ వెంకట్రెడ్డి గారిని హోమ్ గార్డ్ అన్నారట!’’ అని అడిగారు బోసు రాజు. నేను ఎవర్ని ఏం అనినా పార్టీ కోసమే అన్నాను అని చెప్పినందు వల్ల హనుమంత రావుకి గానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గానీ కనువిప్పు కలిగి వారు నాతో కలిసి పనిచేసేది ఉండదు కనుక నేనేమీ మాట్లాడలేదు. ‘‘రాజగోపాల్ రెడ్డిని పూర్తి పేరుతో ఎవరూ పిలవొద్దు, ఆర్.జి.పాల్ అనండి చాలు అని పార్టీ క్యాడర్కి మీరు పిలుపునిచ్చారట..’’ అన్నారు నదీమ్ జావెద్. కేఏ పాల్తో పోల్చినందుకు ఆర్.జి.పాల్ అప్గ్రేడ్ అయినట్లు ఫీల్ అవాలి గానీ, అందులో డీగ్రేడ్ అవడానికి ఏముందీ అని అనబోయి, కేఏ పాల్పై హై కమాండ్కు అనవసరంగా ఇంట్రెస్ట్ జనరేట్ చేసినట్లవుతుందని ఆగిపోయాను. ‘‘గుడ్’’ అన్నారు మాణిక్కం ఠాగూర్! అంతకుమించి ఆయనేం మాట్లాడలేదు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చాక మాణిక్కం ఠాగూర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ‘‘రేవంతు గారూ.. కంగ్రాట్స్.. ఖర్గేజీ మీ పనితీరు పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నారు..’’ అని చెప్పారాయన. -
‘షిందేజీ! ఉద్ధవ్ కోసమే సంజయ్ రౌత్ బెయిల్ సంపాదించినట్లు అనిపిస్తోంది’
‘‘సంజయ్ రౌత్ జైలు నుంచి బయటికి వచ్చాడట..’’ అన్నారు దీపక్ కేసర్కర్! ఆ మాటను ఆయన నాకు బాగా సమీపానికి వచ్చి, మెల్లిగా... నా రెండు చెవుల్లో ఒక చెవికి మాత్రమే వినిపించేలా చెప్పారు. అప్పుడా సమయంలో చంపాసింగ్ థాపా, మోరేశ్వర్ రాజే నా పక్కన ఉన్నారు. ఒకప్పుడు బాల్ ఠాక్రేజీ పక్కన ముప్పై ఏళ్ల పాటు ఉన్నవాళ్లు.. ఇప్పుడు నెలన్నరగా నా పక్కన ఉంటున్నారు. ఠాక్రేజీ జీవించి ఉండగా ఆయనకు వచ్చే ఫోన్లను థాపా, రాజేలే లిఫ్ట్ చేసేవాళ్లు. ఠాక్రేజీ చెప్పదలచుకుంది కూడా వాళ్లే ఫోన్లో అవతలి వైపునకు బట్వాడా చేసేవాళ్లు. ‘‘షిందేజీ, అదేంటంటే.. ’’ అంటూ, వాళ్లిద్దరి వైపు చూస్తూ ఆగారు దీపక్. ‘‘పర్లేదు చెప్పండి దీపక్జీ. ఠాక్రేజీ దగ్గర నమ్మకంగా ఉన్న మనుషులు ఆయన కొడుకు ఉద్ధవ్ ఠాక్రే వైపు వెళ్లకుండా మనవైపు ఉండేందుకు వచ్చారంటే.. సంజయ్ గురించే కాదు, ఉద్ధవ్ గురించి కూడా మనం నిస్సంకోచంగా మాట్లాడుకోవచ్చు..’’ అన్నాను. ‘‘షిందేజీ! సంజయ్ రౌత్ని చూస్తుంటే ఉద్ధవ్ ఠాక్రే కోసం ఏం చేయడానికైనా సిద్ధమై అతడు బెయిల్ సంపాదించినట్లుగా నాకు అనిపిస్తోంది..’’ అన్నారు దీపక్. ‘‘అతడేమీ దేశభక్తుడు కాదు కదా దీపక్జీ.. ఏం చేయడానికైనా సిద్ధమవడానికి..’’ అని నవ్వాను. ‘‘కానీ షిందేజీ, అతడి మౌనం చూస్తుంటే దేశభక్తుడే నయం అనిపించేలా ఉన్నాడు..’’ అన్నారు దీపక్! దీపక్ మునుపెన్నడూ అంత హెచ్చరికగా మాట్లాడ్డం నేను వినలేదు! నా మంత్రివర్గంలో సీనియర్ మినిస్టర్ ఆయన. నాలుగు మినిస్ట్రీలను నడిపిస్తున్నారు. నా కన్నా పదేళ్లు పెద్దవారు. ‘‘దేశభక్తుడిని సైతం జైలు జీవితం మామూలు మనిషిగా మార్చేస్తుందని విన్నాను దీపక్జీ! కానీ మీరేం చెబుతున్నారంటే.. జైలుకు వెళ్లిన సంజయ్ రౌత్ అనే ఒక మామూలు మనిషి దేశభక్తుడిగా మారి, జైలు బయటికి వచ్చేశాడని!! అదెలా సాధ్యం?’’ అని అడిగాను. ‘‘జైలు నుంచి బయటికి రాగానే సంజయ్ రౌత్ నేరుగా సెంట్రల్ ముంబైలోని సిద్ధి వినాయక టెంపుల్కి వెళ్లాడు షిందేజీ! ఆ తర్వాత అతడు సౌత్ ముంబైలోని హనుమాన్ టెంపుల్కి వెళ్లాడు. తర్వాత శివాజీ పార్క్లోని బాల్ ఠాక్రే మెమోరియల్కి వెళ్లాడు. ఆ తర్వాతే ఇంటికి వెళ్లాడు! సాయంత్రం 6.50 కి ఆర్థర్ రోడ్ జైలు నుంచి అతడు విడుదలైతే.. నాహుర్లోని తన ఇంటికి వెళ్లేసరికి రాత్రి 10.20 అయింది. ఈ మూడున్నర గంటల వ్యవధిలో అతడు మాట్లాడిన సమయం తక్కువ. మౌనంగా ఉన్న సమయం ఎక్కువ. అదే నాకు ఆందోళన కలిగిస్తోంది షిందేజీ.. ’’ అన్నారు దీపక్. ‘‘ఆందోళన దేనికి దీపక్జీ?!’’ అన్నాను. ‘‘దేనికంటే.. అతడు మాట్లాడిన ఆ తక్కువ సమయంలోనే ఉద్ధవ్తో చాలా ఎక్కువ మాట్లాడాడు. మౌనంగా ఉన్న ఆ ఎక్కువ సమయంలోనే మన గురించి చాలా తక్కువగా మౌనం వహించాడు..’’ అన్నారు దీపక్. ‘‘అర్థం కాలేదు దీపక్జీ..’’ అన్నాను. ‘‘మూడు నెలలు జైల్లో ఉండి వచ్చాక కూడా ఉద్ధవ్దే రియల్ శివసేన అని అతడు అంటున్నాడు షిందేజీ! అంటే మనది రియల్ శివసేన కాదనీ, మీరూ రియల్ ముఖ్యమంత్రి కాదనే కదా అతడి ఉద్దేశం!’’ అన్నారు దీపక్! చంపాసింగ్ థాపా, మోరేశ్వర్ రాజే మాకు కాస్త దూరంగా నిలబడి ఉన్నారు. నవంబర్ 17న ఠాక్రేజీ 10వ వర్ధంతి. ఆ సంస్మరణ సభలో వాళ్లిద్దరి చేత మాట్లాడిస్తే?!వాళ్లే చెబుతారు.. రియల్ శివసేన ఎవరిది కాదో, రియల్ సీఎం ఎవరు కారో?! దీపక్ నా వైపే చూస్తూ ఉన్నారు. ‘‘దీపక్జీ! అసలైన దాన్ని ఎవరూ మార్చలేరు. సంజయ్ రౌత్ అనే ఒక దేశభక్త ఎంపీ మార్చగలడా?’’ అన్నాను నవ్వుతూ. -
‘‘థరూర్జీ! పార్టీలో మీకెవరూ వ్యతిరేకంగా లేరు’’
అక్టోబర్ 19 పెద్ద విశేషమేం కాదు. అక్టోబర్ 17న జరిగేవి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలే కనుక 19న జరిగే కౌంటింగ్లో కాంగ్రెస్ గెలుస్తుందా, బీజేపీ విజయం సాధిస్తుందా, లేక ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేస్తుందా అనే ఉత్కంఠ ఏమీ ఉండదు. నేనో, థరూరో ఎవరో ఒకరం గెలుస్తాం. మాలో ఎవరు గెలిచినా కాంగ్రెస్ గెలిచినట్లే కానీ, మాలో ఒకరు ఓడిపోయి, ఒకరు గెలిచినట్లు కాదు. ఈ నిజాన్ని అంగీకరించడానికి శశి థరూర్ ఎందుకు సిద్ధంగా లేరో మరి?! కాంగ్రెస్ను గెలిపించడం కోసం ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ పడుతున్నట్లుగా కదా ఆయన ఈ ఎన్నికల్ని మనసా వాచా కర్మణా చూడాలి! థరూర్ గానీ, నేను గానీ ఇప్పుడు ఆలోచించవలసింది హిమాచల్ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం గురించి; తర్వాత జరిగే పది రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం గురించి; ఆ తర్వాత 2024లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం గురించి. ఏడాదిలో ఇన్ని ఎన్నికల్ని పెట్టుకుని, ఏడాదికోసారి జరిగే పార్టీ అధ్యక్ష ఎన్నికలే తన సర్వస్వంగా థరూర్ భావించడం ఏమిటి?! ‘‘ఈ పోటీ న్యాయంగా జరగడం లేదు. అంతా నాకు వ్యతిరేకంగా జరుగుతోంది’’ అని ఆయన అంటున్నారు! ‘‘థరూర్జీ! మీరు అనుకుంటున్నట్లుగా పార్టీలో మీకెవరూ వ్యతిరేకంగా లేరు..’’ అన్నాను.. రెండు రోజుల క్రితం ఫోన్ చేసి. నిజానికి ఆ మాట చెప్పడానికి నేను ఆయనకు ఫోన్ చేయలేదు. సోనియాజీ పార్లమెంటరీ ప్యానెల్ ఛైర్పర్సన్గా థరూర్ని ఎంపిక చేశారని తెలిసి చేశాను. చేసి, ‘‘కంగ్రాట్స్ థరూర్జీ..’’ అన్నాను. ‘‘థ్యాంక్యూ ఖర్గేజీ! మరి నేను కూడా ఇప్పుడే మీకు కంగ్రాట్స్ చెప్పేయమంటారా, అక్టోబర్ 19 వరకు ఆగమంటారా?’’ అని నవ్వుతూ అడిగారు థరూర్. ఆయన ఉద్దేశం నాకు అర్థమైంది. సోనియాజీ నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి పార్టీ అధ్యక్షుడిగా ఆల్రెడీ నేను గెలిచేసినట్లేనని!! ‘‘అప్పుడు కూడా నేనే మీకు కంగ్రాట్స్ చెబుతాను థరూర్జీ. ‘మీ’ ప్రయత్నం వల్లనే కదా, పార్టీకి అసలంటూ ఎన్నికలు జరుగుతున్నాయి..’’ అన్నాను. ‘మీ’ అనడంలో నా ఉద్దేశం ‘జి–23’ అని. పార్టీలో ఎన్నికలకు ఒత్తిడి తెస్తూ రెండేళ్ల క్రితం సోనియాజీకి లేఖ రాసిన గ్రూప్ అది. జి–23 అనే మాటకు పెద్దగా నవ్వారు థరూర్. ‘‘ఖర్గేజీ! మీకొకటి తెలుసా? ఆ గ్రూపులో ఉన్నవారెవరూ ఇప్పుడు నాతో లేరు. మీ వైపు వచ్చేశారు. ఆ గ్రూపులో నేను ఉన్నందుకు కూడా ఇప్పుడు నాతో ఎవ్వరూ లేరు. వాళ్లూ మీ వైపే ఉన్నారు. నేనొస్తున్నానని తెలిసి దేశవ్యాప్తంగా పీసీసీ ప్రెసిడెంట్లు పొలాల్లోకి, పక్క ఊళ్లలోకి, లేని పోని సంతాపాల పనుల్లోకి పరుగులు తీస్తున్నారు! మొన్న తెలంగాణలో చూశారు కదా! అక్కడి ప్రెసిడెంట్ మీకు ఒకలా, నాకు ఒకలా ట్రీట్మెంట్ ఇచ్చారు. నాకు షాక్ ట్రీట్మెంట్. మీకు స్వీట్ ట్రీట్మెంట్..’’ అన్నారు నవ్వు ఆపకుండా థరూర్. ‘‘థరూర్జీ! మీపై నిజంగా వ్యతిరేకత ఉంటే సోనియాజీ మీకు పార్లమెంటరీ ప్యానెల్ పోస్ట్ ఇచ్చేవారా?! సోనియాజీనే స్వయంగా మీకు పోస్ట్ ఇచ్చాక కూడా పార్టీలో మిమ్మల్ని వ్యతిరేకించే వారు ఉంటారా?!’’ అన్నాను. ఆ మాటకు మళ్లీ పెద్దగా నవ్వి.. ‘‘ఖర్గేజీ.. వ్యతిరేకత లేకపోవడం మద్దతు అవుతుందా, మద్దతు ఇవ్వక పోవడం వ్యతిరేకత అవుతుంది కానీ..’’ అన్నారు థరూర్. రేపే పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక. ‘‘ఖర్గేజీ వస్తే మారేదేమీ ఉండదు. నేనొస్తే నాతో పాటు మార్పును తెస్తాను’’ అని థరూర్ చెబుతున్నారు. చూడాలి.. రేపు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రతినిధులు మార్పు కోసం ఓటేస్తారో, ఏదీ మారకుండా ఉండటం కోసమే ఓటేస్తారో -మాధవ్ శింగరాజు -
అశోక్ గెహ్లోత్ (రాజస్థాన్ సీఎం) రాయని డైరీ
రాహుల్ని నిందిస్తూ సోనియాజీకి గులామ్ నబీ ఆజాద్ రాసిన ఐదు పేజీల రాజీనామా లేఖ నాకెంతో ఆవేదనను కలిగించింది. ఒక తల్లికి ఆయన ఏం చెప్పదలచుకున్నారు? ‘అమ్మా.. నీ కొడుకు సమర్థుడు కాదు’ అనేనా?! మరి యాభై ఏళ్లుగా సమర్థుడిగా ఉండి, ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి చేసిందేమిటి? నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పించిన పద్మభూషణ్ని రెండు చేతులతో అపురూపంగా స్వీకరించడమేనా! అవార్డు కోసం ఆయన పట్టిన చేతులు ఎక్కడివి? కాంగ్రెస్లో పుట్టి పెరిగినవే కదా. కాంగ్రెస్ లేనిదే తను లేనన్న సంగతిని మరిచి, కాంగ్రెస్కు ఎవరూ లేకుండా పోతున్నప్పుడు ప్రధాన ద్వారం వద్ద తను కాపలా ఉండి, కాంగ్రెస్ని కాయాల్సింది పోయి, ‘నేనూ వెళ్లిపోతున్నాను – ఇట్లు ఆజాద్’ అని ఉత్తరం రాసి వెళ్లిపోతారా?! రాహుల్ పట్టించుకోనందువల్లే కాంగ్రెస్కు ఈ గతి పట్టిందని ఆరోపిస్తున్న ఆజాద్.. తనెందుకు కాంగ్రెస్ను పట్టించుకోకుండా రాహుల్లోని ‘అపరిపక్వత’ను పట్టించుకుంటున్నారు?! తన పరిపక్వతను ప్రదర్శించుకోడానికా? ‘‘మేడమ్జీ, నేనుంటాను కాంగ్రెస్ ప్రెసిడెంట్గా..’’ అని భరోసాగా పగ్గాలెందుకు అడిగి తీసుకోలేకపోయారు? ఇస్తే తీసుకుందాం అని చూస్తున్నవాళ్లా, ఇస్తున్నా తీసుకోడానికి ఆసక్తి చూపనివాళ్లా .. ఎవరు అసమర్థులు? తల్లి మెడికల్ చెకప్ కోసం ఆ కుటుంబం దేశం దాటి వెళ్లిన సమయం చూసి, తనిక్కడ గడప దాటి కాంగ్రెస్ కుటుంబ గౌరవాన్ని బయటపడేశారు ఆజాద్! ఆ గౌరవం తిరిగి నిలబడాలంటే రాహుల్ గాంధీ పార్టీ ప్రెసిడెంట్ అవడం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. వట్టి మార్గం మాత్రమే కాదు, కాంగ్రెస్ను వదిలి వెళ్లిన వాళ్లందరికీ గట్టి సమాధానం కూడా. వెళ్లినవాళ్లు హూందాగా ఒక్కరైనా వెళ్లారా! రాహుల్పై ఒక రాయి విసిరే వెళ్లారు. పార్టీని బతికించుకుందామని అనుకున్నవాళ్లు పార్టీలో ఉండి, పార్టీతో పోరాడతారు. పార్టీలో తమకు బతుకు లేదనుకున్నవాళ్లే ఇలా గులామ్ నబీ ఆజాద్లు, జైవీర్ షేర్గిల్లు, కపిల్ సిబాల్లు, ఆశ్వినీ కుమార్లు, ఆర్పీయన్ సింగ్లు, సునీల్ జాఖడ్లు, జ్యోతిరాదిత్య సింథియాలు అవుతారు. ఈ రాళ్లన్నిటికీ తిరుగులేని జవాబు.. రాహుల్ బాబు. రాహుల్కి ఫోన్ చేశాను. న్యూయార్క్లో స్టే చేసినట్లున్నారు. ‘‘మేడమ్ ఎలా ఉన్నారు రాహుల్?’’ అని అడిగాను. ‘‘ఇంకెలా ఉంటారు అశోక్జీ. పార్టీ ప్రెసిడెంట్గా ఉండేందుకు మీరు అంగీకరించి ఉండాల్సింది అని మమ్మీ ఇంతక్రితం కూడా అన్నారు. ఇప్పుడే చెకప్ కోసం లోపలికి వెళ్లారు’’ అన్నారు రాహుల్. ‘‘గాంధీలు కాకుండా వేరొకరు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షులుగా ఉండటం దేశానికి కలిసిరాలేదు రాహుల్బాబూ. ఇండియా తిరిగి రాగానే మీరు మీ సహజమైన కృతనిశ్చయం ప్రతిఫలించే చిరునవ్వుతో పార్టీ బాధ్యతలు స్వీకరించాలి’’ అని అభ్యర్థించాను. రాహుల్ పెద్దగా నవ్వారు. ‘‘ఏంటి రాహుల్ నవ్వుతున్నారు?’’ అన్నాను. ‘‘నా సహజమైన కృతనిశ్చయం దేనికి సంబంధించినదో తెలిసుండి కూడా అందుకు పూర్తి విరుద్ధమైన ప్రతిఫలనాన్ని మీరు నాలో ప్రేరేపించే ప్రయత్నం చేస్తుంటే నవ్వొచ్చింది అశోక్జీ..’’ అన్నారు! ఆ మాటకు ముగ్ధుడినైపోయాన్నేను. అంత క్లారిటీని ఇంతవరకు నేను ఏ కాంగ్రెస్ నాయకుడిలోనూ చూళ్లేదు! పార్టీ అయోమయంలో ఉండొచ్చు. రాహుల్ స్పష్టంగానే ఉన్నారు. తమకేం కావాలో పైకి చెప్పని గులామ్ నబీ ఆజాద్ వంటి వాళ్ల కన్నా, తనకేం వద్దో తెగేసి చెబుతూ వస్తున్న రాహుల్బాబే ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించగల నాయకుడని నాకనిపించింది. (క్లిక్: చదువుల్లో ‘వివక్ష’ తొలగింపు కోసమే!) -
శరద్ పవార్ (ఎన్సీపీ లీడర్) రాయని డైరీ
‘‘నన్ను ఆశీర్వదించండి పవార్జీ..’ అంటూ వచ్చాడు ఏక్నాథ్ శిందే. అప్పుడు నేను ఆశీర్వదించగలిగిన భౌతికస్థితిలో ఉన్నప్పటికీ, ఆశీర్వదించేందుకు తగిన అనుకూల స్థితిలో లేను. ఫోన్లో ఉద్ధవ్ ఠాక్రే ఉన్నాడు. ఠాక్రే అంటున్నాడు.. ‘‘పవార్జీ! ఈ లోకం మీద నాకు విశ్వాసం సన్నగిల్లకుండా ఉండేలా నన్ను ఆశీర్వదించండి..’’ అని. ఆ టైమ్లో వచ్చాడు ఏక్నాథ్ శిందే! వస్తున్నట్లు ముందుగా చెప్పలేదు. చెప్పకుండా నేరుగా సౌత్ ముంబైలో నేనుంటున్న సిల్వర్ ఓక్స్ బంగళాకే వచ్చేశాడు. ఈస్ట్ బాంద్రాలోని ఠాక్రేల ఇల్లు ‘మాతోశ్రీ’కి, మలబార్ హిల్స్లోని సీఎం అధికారిక భవంతి ‘వర్ష’కు, ఆ దగ్గర్లోనే ఉండే ప్రభుత్వ అతిథి గృహం ‘సహ్యాద్రి’కి కూడా అతడు ఇలా స్వేచ్ఛగా రాకపోకలు సాగిస్తూ ఉంటాడు. వేటినీ తనవి కావు అనుకోడు. ‘‘నన్ను ఆశీర్వదించండి పవార్జీ..’’ అన్నాడు మళ్లీ శిందే నాకు మరింతగా దగ్గరకు వచ్చి.. నా ఎదురుగా మోకాలిపై కూర్చుంటూ! నేనప్పుడు కుర్చీలో కూర్చొని ఉన్నాను. ‘‘లేచి, పైన కూర్చో శిందే...’’ అన్నాను, సోఫా వైపు చూపిస్తూ. అతడు లేవలేదు! ‘‘ఎవరు పవార్జీ మీ దగ్గర.. శిందేనేనా?’’ అంటున్నాడు అటువైపు ఫోన్లో ఉద్ధవ్. ఎవరో వచ్చినట్లున్నారు.. ఫోన్ పెట్టేద్దాం.. అని అతడూ అనుకోవడం లేదు! ‘‘అవును ఉద్ధవ్... శిందేనే...’’ అన్నాను.. ఫోన్లో ఉద్ధవ్ ఉన్నాడని శిందేకు తెలిసేలా. ‘‘ఏంటట పవార్జీ..’’ అన్నాడు ఉద్ధవ్! ‘‘ఉద్ధవ్ నేను మళ్లీ చేస్తాను. మళ్లీ చేసేంత టైమ్ నాకు దొరకడం లేదని నీకనిపిస్తే కనుక నువ్వే నాకొకసారి చెయ్యి..’’ అని, ఉద్ధవ్ ఫోన్ పెట్టేసే వరకు ఆగాను. శిందే ఇంకా మోకాలి మీదే ఉన్నాడు. ‘‘తిరుగుబాటు చేసినందుకు నా మీద కోపంగా ఉన్నారా పవార్జీ..’’ అన్నాడు. అతడి చెయ్యి మీద చెయ్యి వేశాను. శిందే అప్పటికే అనేకమంది ఆశీర్వాదాలు పొంది, ఇక్కడికి వచ్చాడు. ప్రమాణ స్వీకారానికి ముందు.. తన దివంగత రాజకీయ గురువు బాల్ ఠాక్రేను, తన స్వర్గీయ ఆధ్యాత్మిక గురువు ఆనంద్ డిఘేను తలచుకుని, వారి ఆశీర్వాదాల కోసం ప్రార్థించాడు. మోదీ, షాల ఆశీర్వాదాలకు భక్తి శ్రద్ధలతో తలవొగ్గాడు. వారివే కాకుండా.. అంకెలకు సరిపడినన్ని ఆశీర్వాదాలు ఎప్పుడు విశ్వాస పరీక్ష జరిగితే అప్పుడు శిందే మీద కురవడానికి సిద్ధంగా ఉన్నాయి. లెక్కకు మిక్కిలిగా అన్ని ఆశీర్వాదాలు ఉండి కూడా, నా ఆశీర్వాదం కోసం వచ్చాడంటే.. అతడు కేవలం ఆశీర్వాదం కోసమే వచ్చాడని. ‘‘కోపమేం లేదు శిందే. తిరుగుబాటు చెయ్యడం ఎంత కష్టమో నేను అర్థం చేసుకోగలను. అంతకంటే పెద్ద కష్టం ఏంటో తెలుసా? తిరుగుబాటు చెయ్యకుండా ఉండలేకపోవడం..’’ అన్నాను అతడి తలపై నా అరచేతిని ఆన్చి. అప్పుడు లేచాడు శిందే. ‘‘వెళ్లొస్తాను పవార్జీ’’ అని చేతులు జోడించాడు. అతడటు వెళ్లిపోయాక, నేనిటు నలభై నాలుగేళ్లు వెనక్కి వెళ్లిపోయాను. ఇప్పుడు ఉద్ధవ్పై శిందే తిరుగుబాటు చేసినట్లే అప్పట్లో వసంతదాదా పాటిల్పై నేను తిరుగుబాటు చేశాను. తప్పలేదు. తప్పనిపించలేదు. ఎవరైనా తిరుగుబాటు చేశారంటే వాళ్లు మనిషిగా బతికి ఉన్నట్లు! అవమానాలు భరిస్తూ కూడా ఎవరైనా తిరుగుబాటు చేయలేదంటే.. వాళ్లు ఒక మనిషి కోసం చూస్తున్నట్లు. అందుకే నేను తిరుగుబాటుదారుడిని గౌరవిస్తాను.. అతడు 1857 పాండే అయినా, 2022 శిందే అయినా. ఉద్ధవ్ మళ్లీ నాకు ఫోన్ చేస్తే చెప్పాలి.. లోకం మీద మనకు విశ్వాసం సన్నగిల్లితే లోకానికి పోయేదేమీ లేదని, అవిశ్వాస తీర్మానానికి ముందే మన మీద మనం విశ్వాసం కోల్పోతే లోకం వచ్చి చేసేదేమీ ఉండదని! -
కమలా హ్యారిస్ (యూఎస్ వైస్–ప్రెసిడెంట్) రాయని డైరీ
ఉక్రెయిన్ సరిహద్దు దేశాల ప్రయాణానికి వెళ్లడమా మానడమా అని అనుకుంటుండగా ‘అర్బన్ వన్’ రేడియో నుంచి కాల్. ‘‘అనుదినమూ ప్రసారమయ్యే మా ‘మార్నింగ్ హసిల్’ కార్యక్రమానికి ఇవాళ గానీ, రేపు గానీ, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముగిసేలోపు ఎప్పుడైనా గానీ.. రెండు నిముషాలు మీ వాయిస్ ఇవ్వగలరా మిస్ వైస్ ప్రెసిడెంట్?..’ అని హెడ్క్రాక్ అనే వ్యక్తి హృదయవిదారక విజ్ఞప్తి! నవ్వు ఆపుకొన్నాను. కాల్ని హోల్డ్ చేసి, ‘‘ఎవరతను?’’ అని ఇంటర్కమ్లో సబ్రీనాను అడిగాను. సబ్రీనా వైట్హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రెటరీ. ‘‘యా.. మేమ్. హెడ్క్రాక్ అనే ఆ వ్యక్తి, అతడికి జోడీ అయిన అమ్మాయి లోరెల్.. ఇద్దరూ కలిసి రోజూ రేడియోలో ‘మార్నింగ్ హసిల్’ ని హోస్ట్ చేస్తుంటారు. ఉదయరాగంలా ‘మార్నింగ్ హసిల్’ ఒక ప్రాతఃకాల కర్ణకఠోర కార్యక్రమం..’’ అని గలగలా నవ్వుతూ చెప్పింది సబ్రీనా. ‘‘వెల్ మిస్టర్ హెడ్క్రాక్! మీ విజ్ఞప్తిని నిరాకరించేందుకైతే నేను అమెరికా తొలి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవలేదు..’’ అన్నాను గట్టిగా నవ్వుతూ. ఇంటర్వ్యూ మొదలైంది. ‘‘థ్యాంక్యూ మిస్ వైస్ ప్రెసిడెంట్.. మీరిప్పుడు మా శ్రోతలకు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఎందుకు జరుగుతోందో రెండు మూడు తేలికపాటి మాటల్లో చెప్పాలి..’’ అన్నాడు హెడ్క్రాక్. ‘‘రెండు మూడు తేలికపాటి మాటల్లోనా! ఓకే దెన్. కానీ మీరన్నట్లు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం చేసుకోవడం లేదు. రష్యా ఉక్రెయిన్పై దాడి చేస్తోందంతే..’’ అన్నాను. ‘‘రైట్ మిస్ హ్యారిస్. మీరొక సాధారణ సిటిజెన్గా సాధారణమైన భాషలో మాత్రమే మా శ్రోతలకు చెప్పండి. ఉక్రెయిన్పై రష్యా ఎందుకు దాడి చేస్తోంది?’’. ‘‘యా.. మిస్టర్ హెడ్క్రాక్... నాటో అని, వార్సా అని ప్రపంచంలో రెండు గ్రూపులు ఉన్నాయి. నాటో అమెరికా గ్రూపు; వార్సా రష్యా గ్రూపు. అమెరికా గ్రూపులో పశ్చిమ ఐరోపా దేశాలు ఉన్నాయి. రష్యా గ్రూపులో తూర్పు ఐరోపా దేశాలు ఉన్నాయి..’’ ‘‘నో నో నో నో.. మిస్ హ్యారిస్. ఈ గ్రూపుల గొడవ లేకుండా విషయాన్ని మరింత తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పండి..’’ అన్నాడు హెడ్క్రాక్. ‘‘ముందు ఈ గ్రూపుల గొడవ గురించి చెబితేనే.. విషయం తేలికగా అర్థమౌతుంది మిస్టర్ హెడ్క్రాక్..’’ అన్నాను. ‘‘కానీ మీరేం చెప్పబోతారో మా శ్రోతలు చక్కగా ఊహించగలరు మిస్ హ్యారిస్. అందరూ చెబుతున్నట్లే.. 1991లో సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నమై 15 దేశాలుగా విడిపోయాక మళ్లీ వాటిని కలిపే ప్రయత్నంగా రష్యా ఉక్రెయిన్పై దాడి చేస్తోందనేగా మీరూ చెబుతారు..’’ అన్నాడు హెడ్క్రాక్. ‘‘సరే. ఇంకోలా ట్రై చేస్తాను.. ఉక్రెయిన్ అన్నది ఐరోపాలోని ఒక దేశం. అది రష్యా పక్కనే ఉంది. రష్యా పెద్ద దేశం. ఈ పెద్ద దేశం ఆ చిన్న దేశంపై దాడి చేస్తోంది. అది తప్పు. మనం ఏ విలువల కోసం అయితే నిలబడ్డామో ఆ విలువలకు వ్యతిరేకమైన దాడి అది..’’ అని చెప్పాను. ‘‘బాగా చెప్పారు మిస్ హ్యారిస్. కానీ ఇంతకన్నా తేలికైన సమాధానం మీ నుంచి మా శ్రోతలకు లభించదా అని నేను ఆలోచిస్తున్నాను. పెద్ద దేశం, చిన్న దేశం; నాటో, వార్సా; పుతిన్ పన్నాగం, ఉక్రెయిన్ పరాక్రమం.. ఇవన్నీ అందరూ వింటున్నవీ, అందరూ చెబుతున్నవే కదా! అసలేమీ తెలియని వారికి కూడా అర్థమయ్యేలా చెప్పవలసి వచ్చినప్పుడు మనమూ అసలేమీ తెలియని వ్యక్తిగా మారి, విషయాన్ని తేలిగ్గా చెప్పలేమా..?’’ అంటున్నాడు హెడ్క్రాక్!! ఉఫ్! ఏమీ తెలియని మనిషిగా ఎవరినీ మిగలనివ్వని ఈ ప్రపంచంలో.. దేనినైనా తేలిగ్గా చెప్పడం.. అంత తేలికా?! ఎట్లీస్ట్.. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించినంత తేలికైతే కాదు. -మాధవ్ శింగరాజు -
ఎం.కె.స్టాలిన్ (తమిళనాడు సీఎం)రాయని డైరీ
చదవాలన్న ఆశ బలంగా ఉన్నప్పుడు.. చదవలేక పోతామేమోనన్న భయమూ ఆ వెనకే ఆశను బలహీనపరుస్తూ ఉంటుంది. తమిళనాడు పిల్లలకు మెడిసిన్ పెద్ద ఆశ. కానీ భయం! ‘నీట్’లో పోటీ కి వచ్చే పెద్ద నగరాల పిల్లల్ని తట్టుకోగలమా? మేలురకపు ఇంగ్లిషును సులువుగా, మెలకువలతో మాట్లాడగలిగిన వాళ్లను నెగ్గుకువెళ్లగలమా? ఖరీదైన కోచింగ్ సెంటర్లలో తర్ఫీదై వచ్చినవాళ్లకు దీటుగా నిలవగలమా? ఇంట్లో ఏ గొడవా లేక ఏకధ్యానంతో స్థిమితంగా కూర్చొని టెస్ట్కి చక్కగా ప్రిపేర్ అయి వచ్చినవాళ్లతో తలపడగలమా? ఇన్ని భయాలు! నీట్.. ప్రభుత్వం పెట్టిన భయం. ఊహు.. భయం కాదు. ప్రభుత్వం సృష్టించిన భూతం! ఎవరి రాష్ట్రంలో వాళ్లు కష్టపడి చదివి వాళ్ల టెస్ట్లు వాళ్లు రాసుకుంటూ ఉన్నప్పుడు.. ‘అంతకష్టం ఎందుకు?! ఇక నుంచీ దేశం మొత్తానికి ఒకటే టెస్ట్’ అంటూ నీట్ పరీక్షను తెచ్చిపెట్టారు! దేశం మొత్తం ఒకేలా ఉందా.. దేశం మొత్తం పెన్ను, పేపరు పట్టుకుని కూర్చొని ఒకే టెస్టు రాయడానికి?! భయంతోనైనా, భూతంతోనైనా పోరాడేందుకు శక్తి కావాలి. సామాన్యమైన ఇళ్లల్లో, అసమానతల సమాజాల్లో, అనుకూలతలు లేని గ్రామాల్లో.. పోరాడేంత శక్తి పిల్లలకు ఎక్కడి నుంచి వస్తుంది?! గురువారం అసెంబ్లీకి వెళుతున్నప్పుడు టీటీకే రోడ్డులో ఒక యువకుడు ‘సిఎం సర్ ప్లీజ్ హెల్ప్ మీ’ అనే ప్లకార్డు పట్టుకుని కాన్వాయ్కి ఎదురొచ్చాడు! నీట్ ఎగ్జామ్ని అపోజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాడట. నీట్ వద్దన్న మిగతా స్టేట్లకు కూడా నీట్ లేకుండా చెయ్యమని అతడి అభ్యర్థన. అసెంబ్లీ ప్రాంగణంలోకి కారు మలుపు తిరుగుతుండగా, ఆ ముందురోజు పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఇచ్చిన 45 నిముషాల ప్రసంగంలోని రెండు మాటలు మళ్లొకసారి నా హృదయాన్ని మృదువుగా తాకాయి. ఆయనెంత అర్థవంతంగా మాట్లాడారు! ‘ఉత్తరప్రదేశ్లోని నా సోదరునికి రాజ్యాంగం ఎలాంటి హక్కులనైతే కల్పించిందో అవే హక్కులను తమిళనాడులోని నా సోదరుడికీ ప్రసాదించింది. ప్రతి రాష్ట్రానికీ ప్రత్యేకమైన సంస్కృతి ఉంటుంది. ప్రత్యేకమైన రాజకీయ ఆత్మాభిమానం ఉంటుంది. వాటిని గౌరవించకుండా ఏకఛత్రాధిపత్యంగా దేశాన్ని పరిపాలించడానికి మీరేమీ చక్రవర్తి కాదు’ అని మోదీకి ఎంత మర్యాదగా పాఠాలు చెప్పారు! కారు దిగి, అసెంబ్లీ వరండాలో నడుస్తున్నాను. స్పీకర్ ఎదురొచ్చి, నీట్ బిల్లును గవర్నర్ తిప్పి పంపించారని చెప్పారు! నీట్ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించమని కోరుతూ ఐదు నెలల క్రితం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన బిల్లు అది. ఏ కారణాలైతే చూపి తమిళనాడు నీట్ని వద్దందో.. అవే కారణాలు చూపి నీట్ని వద్దనడానికి వీల్లేదనేశారట గవర్నర్ గారు. నీట్ని ‘యాంటీ–పూర్’ అని మేము అంటే.. నీట్ని వద్దనడం ‘యాంటీ–పూర్’ అని గవర్నర్! మోదీకి ఏమాత్రం తీసిపోవడం లేదు గవర్నర్లు. మోదీ తనని తాను చక్రవర్తినని అనుకుంటుంటే, గవర్నర్లు తమని తాము మోదీలమని అనుకుంటున్నారు. ఆరోజు అన్నాదురై వర్ధంతి. సభలో నివాళులు అర్పించి కూర్చున్నాం. ‘ఆడుక్కు దాడియం, నాటుక్కు గవర్నురు తేవై ఇల్లయ్’ అని అన్నాదురై తరచూ అంటుండేవారని నాన్నగారు నా చిన్నప్పుడు చెబుతుండేవారు. ఆ మాట నాకు బాగా నవ్వు తెప్పించేది. మేకకు గడ్డం, రాష్ట్రానికి గవర్నర్ అక్కర్లేదని అన్నాదురై అలా బలంగా విశ్వసిస్తుండేవారట! గవర్నర్లపై ముఖ్యమంత్రులకు విశ్వాసాలు ఊరకే ఏర్పడతాయా?! విశ్వాసాలను ఏర్పరచడమే పనిగా కొంతమంది గవర్నర్లు రాష్ట్రాలకు బదలీ అయి వస్తారనుకుంటాను. శనివారం నీట్పై సెక్రటేరియట్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే బీజేపీ, అన్నాడిఎంకె రాలేదు. నీట్ పరీక్ష రాసే పని మనకైతే లేదుగా అనుకున్నట్లున్నారు!! -
రాయని డైరీ.. జైరామ్ రమేశ్ (కాంగ్రెస్ ఎంపీ)
మేడమ్ సోనియాజీ స్క్రీన్ మీదకు వచ్చాక వీడియో కాన్ఫరెన్సింగ్ మొదలైంది. మేడమ్ రాగానే మాలో కొందరం లేచి, కూర్చున్నాం. మాలోనే మరికొందరు లేచే లోపే, కూర్చోమన్నట్లుగా మేడమ్ వారించడంతో వాళ్లెవరూ లేచి కూర్చోలేకపోయారు. ఆంటోనీ, వేణుగోపాల్, మల్లికార్జున్ ఖర్గే, అధీర్ రంజన్, ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోయ్, కె.సురేశ్, మాణిక్యం టాగోర్, మనీశ్ తివారీ, నేను.. మొత్తం పది మందితో మేడమ్ ఏర్పాటు చేసిన ప్రీ–బడ్జెట్ మీటింగ్ అది. మేడమ్ స్క్రీన్ మీదకు రావడంతోనే.. ‘‘జయ్! మీరేం చెప్పబోతున్నారు?’’ అన్నారు.. నా వైపు చూస్తూ! ఆ మాటకు ఆంటోనీ నవ్వారు. సాధారణంగా మా ప్రీ–బడ్జెట్ మీటింగ్ని.. ‘వెల్కమ్ టు స్ట్రాటెజీ గ్రూప్’ అనే మాటతో మొదలుపెడతారు మేడమ్. కానీ ఈసారి అలా జరగలేదు. మీటింగ్ని నాతో స్టార్ట్ చేశారు! ‘‘ఎంత ఎకానమిస్ట్ అయితే మాత్రం బడ్జెట్ గురించి జైరామ్జీ కొత్తగా ఏమైనా చెప్పబోవ డానికి నిర్మలా సీతారామన్ అవకాశం ఇవ్వబోతారంటారా!’’ అన్నారు ఆంటోనీ. లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఎలాగైతే ఉండాల్సిన విధంగా లేదో, ఈ ఇయర్ కూడా అలానే ఉంటుందని నేను చెప్పగలను..’’ అన్నారు ఆనంద్ శర్మ. ‘‘మనం మాత్రం అలా ఉండకూడదు. లాస్ట్ ఇయర్ బడ్జెట్ సెషన్స్లో ఎంత గట్టిగా డిబేట్ చేయబోయామో అంతకన్నా గట్టిగానే చెయ్యాలి..’’ అన్నారు మల్లికార్జున్ ఖర్గే. ‘‘ఇష్యూస్ అవే కనుక.. సేమ్ రిలీఫ్ ప్యాకేజ్, సేమ్ డిజిన్వెస్ట్మెంట్, సేమ్ ఇన్ఫ్లేషన్, సేమ్ చైనా బోర్డర్, సేమ్ ఫార్మర్స్.. మనం కొత్తగా స్ట్రాటెజీ మార్చే పని కూడా లేదు’’ అన్నారు మనీశ్ తివారీ. ‘‘స్ట్రాటెజీలో ఒకటైతే యాడ్ చేయొచ్చు. ప్రతిపక్షంలోని వాళ్లకు ‘పద్మ’ అవార్డులిచ్చి అంతర్గత విభేదాలు సృష్టించాలని చూసే పాలకపక్ష కుట్రల్ని, కుయుక్తుల్ని బట్టబయలు చెయ్యొచ్చు’’ అన్నారు మాణిక్యం. అవునన్నట్లు మాణిక్యం వైపు చూసి, నా వైపు తిరిగారు మేడమ్. ‘‘జయ్! మీ ట్వీట్ చూశాను. సెవన్టీ త్రీలో ప్రభుత్వం పద్మవిభూషణ్ని ఆఫర్ చేస్తే అప్పటి పి.ఎం. ప్రిన్సిపల్ సెక్రెటరీ పి.ఎన్.హస్కర్ ఎంత మర్యాదపూర్వకంగా నిరాకరించిందీ మీరు ట్వీట్లో పోస్ట్ చేసిన పుస్తక భాగాన్ని చదివాను. అంతగా విలువల్ని పాటించే మనిషిని ఈకాలంలో అరుదుగా మాత్రమే చూస్తాం..’’ అన్నారు. ‘‘అవును మేడమ్జీ! అవార్డుల్ని నిరాకరించేందుకు ఆత్మబలం, ఆత్మనిగ్రహం కావాలి’’ అన్నాను. ‘‘కానీ జైరామ్జీ, మీరు పెట్టిన మరొక ట్వీట్లో మీ ఉద్దేశాన్ని మన సీనియర్ సహచరులు కరణ్సింగ్ సరిగా అర్థం చేసుకోలేకపోవడాన్ని నేనెంతో ఆవేదనతో గమనించాను. మోదీజీ ఇచ్చిన ‘పద్మభూషణ్’ని తిరస్కరించినందుకు మీరు బుద్ధదేవ్ భట్టాచార్యజీని ప్రశంసించారు. కానీ ఆ ప్రశంసను కరణ్సింగ్.. పద్మభూషణ్ని నిరాక రించని గులామ్ నబీ ఆజాద్పై ఎత్తిపొడుపుగా తీసుకున్నారు’’ అన్నారు అధీర్ రంజన్. ‘‘కరణ్సింగ్ అలా ఎప్పుడు ట్వీట్ చేశారు?!’’ అన్నారు గొగోయ్. ‘‘ట్వీట్ చేయలేదు. స్టేట్మెంట్ విడుదల చేశారు’’ అన్నారు సోనియాజీ! ఆజాద్ తన ‘పద్మ’ అవార్డును నిరాకరించని పర్యవసాన పరిణామాలను మేడమ్ ఆసక్తిగా గమనిస్తున్నట్లున్నారు! మేడమ్తో వీడియో కాన్ఫరెన్సింగ్ అయ్యాక మా పది మందిలో ఒకరితో నేను వేరుగా కనెక్ట్ అయ్యాను. ‘‘ఆత్మబలం కాదు, ఆత్మ నిగ్రహం కాదు. అవార్డును నిరాకరించడానికి ఆత్మప్రబోధానుసారం వెళ్లగలిగి ఉండాలి. దురదృష్టవశాత్తూ మన పార్టీలోని సీనియర్లు తమ ఆత్మ ఢిల్లీలో ఉంటుందన్న వాస్తవాన్ని విస్మరించేందుకు నిరంతరం పెనుగు లాడుతూనే ఉంటారు..’’ అన్నారాయన. -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: అమిత్ షా (కేంద్ర మంత్రి)
‘‘ఇండియాలో ఏంటి విశేషాలు అమిత్జీ..’’ అని రాత్రి పన్నెండు గంటలప్పుడు రోమ్ నుంచి మోదీజీ ఫోన్ చేశారు. రోమ్ కన్నా ఢిల్లీ మూడున్నర గంటలు ముందుంటుంది కాబట్టి, ఆయన నాకు ఫోన్ చేసిన టైమ్లో అక్కడ రాత్రి ఎనిమిదిన్నర అయుండాలి. మోదీజీ అప్పుడే డిన్నర్ ముగించుకుని నాలుగడుగులు వేయడానికి బాల్కనీలోకి వచ్చి ఫోన్ చేసినట్లున్నారు. ‘‘పెద్దగా విశేషాలేం లేవు మోదీజీ’’ అన్నాను.. బలమైన ఆవలింత నొకదాన్ని బలంగా నొక్కిపట్టేస్తూ. ‘‘పెద్దగా లేవంటే.. కొద్దిగా ఉన్నాయనేగా..’’ అని మోదీజీ తన కవితాత్మక ధోరణిలో అన్నారు. మామూలుగానైతే అది నేను కవితల్ని ఆస్వాదించే టైమ్ కాదు. డిన్నర్ ముగించుకుని బాల్కనీలో నేనూ నాలుగు అడుగులు వేసి అప్పటికే మూడున్నర గంటలు దాటింది కాబట్టి ఇక్కడి విశేషాలు కూడా ఏవీ వెంటనే గుర్తుకు రాలేదు. నిద్ర మత్తును వదిలించుకునేందుకు కొంత టైమ్, విశేషాలను బలవంతంగా గుర్తుకు తెచ్చుకోవడానికి మరికొంత టైమ్ తీసుకున్నాను. మొత్తం మీద ఐదు సెకన్ల టైమ్ తీసుకుని ఉంటాను. ‘‘చెప్పండి అమిత్జీ..’’ అన్నారు ఉత్సాహంగా. అక్కడ మోదీజీకి నిద్ర తన్నుకొచ్చేవరకు ఇక్కడ నేను విశేషాలను గుర్తుకు తెచ్చుకోడానికి తన్నుకులాడటం తప్పేలా లేదని అర్థమైంది. ‘‘కొన్ని విశేషాలైతే ఉన్నాయి మోదీజీ! రాజ్నాథ్సింగ్ మిమ్మల్ని ఇక్కడ ఒక సభలో 24 క్యారెట్ల బంగారం అన్నారు. అంతే కాదు. గాంధీజీ తర్వాత గాంధీజీ అంతటి వారని కూడా అన్నారు. లక్నో వెళ్లినప్పుడు నేను కూడా అదే మాట అన్నాను. 2024 లోనూ మోదీజీనే మనకు కావాలంటే కనుక 2022లోనూ యోగినే మనం ఎన్నుకోవాలి అని అక్కడి వారికి చెప్పి వచ్చాను’’ అన్నాను. ‘‘మన విశేషాలు మనకెందుకు అమిత్జీ! మనవాళ్ల విశేషాలేమైనా ఉంటే చెప్పండి’’ అన్నారు మోదీజీ. మనవాళ్లు అంటే ఆయన అర్థం వేరే. ‘‘ఉన్నాయి మోదీజీ! రాహుల్ గుజరాత్ వెళ్లి సూరత్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. ‘రెండేళ్ల క్రితం.. మోదీ అనే పేరున్న వాళ్లంతా దొంగలే అని మీరు అన్నారా?’ అని రాహుల్ని జడ్జి అడిగితే.. నేనెప్పుడన్నాను, నేనెందుకంటాను అని అనకుండా.. ‘నాకు తెలియదు’ అని చెప్పి వచ్చేశాడు. రాహుల్ సూరత్ కోర్టులో అలా చెప్పి వచ్చేయడం ఇది మూడోసారి మోదీజీ’’ అని చెప్పాను. ‘‘ఇంకా..’’ అన్నారు. ‘‘మమతా బెనర్జీ పణాజి వెళ్లారు మోదీజీ’’ అని చెప్పాను. ‘‘వెళ్లి?’’ అన్నారు. ‘‘టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్ కాదు.. టి అంటే టెంపుల్, ఎం అంటే మసీద్, సి అంటే చర్చి అని అంటున్నారు మోదీజీ..’’ అని చెప్పాను. ‘‘ఇంకా..’’ అన్నారు! ‘‘లాలూ ప్రసాద్ యాదవ్ గురించి కూడా ఒక విషయం ఉంది మోదీజీ. అయితే అది విషయమే కానీ విశేషం ఏమీ కాదు..’’ అన్నాను. ‘‘అయినా చెప్పండి’’ అన్నారు. ‘‘2024లో మీరు వచ్చే ప్రసక్తే లేదట. పార్టీలన్నీ ఏకమై, మిమ్మల్ని ఓడిస్తాయని లాలూ అంటున్నారు మోదీజీ’’ అని చెప్పాను. ‘‘అవునా’’ అన్నారు. ‘మరి అక్కడి విశేషాలేంటి మోదీజీ’ అని అడగబోయి ఆగాను. అప్పటికే ఒంటి గంట అవుతోంది. ‘‘ఇక్కడా విషయాలున్నాయి అమిత్ జీ. ఓ గంటలో మళ్లీ ఫోన్ చేస్తాను.. మీ డిన్నర్ అయింది కదా?’’.. అని ఫోన్ మాట్లాడుతూనే ఎవరితోనో మాటల్లోకి వెళ్లిపోయారు!! -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: శశి థరూర్ (కాంగ్రెస్ ఎంపీ)
రాత్రి కలలోకి మన్మోహన్ సింగ్, చిదంబరం, అరుణ్ శౌరి వచ్చారు! ముగ్గురూ కలిసే కలలోకి వచ్చారా, కలలోకి వచ్చాకే ముగ్గురూ కలిశారా గుర్తుకు రావడం లేదు. ‘‘డెంగీ నుంచి ఎప్పుడు కోలుకున్నారు మన్మోహన్ జీ’’ అని అడిగినట్లున్నాను. అందుకు ఆయన.. ‘‘ఢిల్లీ నుంచి ఎప్పుడొచ్చారు మన్మోహన్జీ అని అడిగినట్లుగా అడుగుతున్నావేంటి థరూర్..’’ అని మృదువుగా నవ్వుతూ అన్నారు! ఎనభై తొమ్మిదేళ్ల వయసులోని ఒక మాజీ ప్రధానిని ఎంపిక చేసుకుని మరీ ఆ డెంగీ దోమ కుట్టడం వెనుక ఉండగల సంభావ్యతల గురించి కలలోనే నేను ఆలోచిస్తూ ఉన్నాను. ‘‘ఏమిటి ఆలోచిస్తున్నావు థరూర్?’’ అని అడిగారు మన్మోహన్! ఆ అడగడం కూడా ఆయన నా కలలోకి వచ్చి అడిగినట్లుగా కాకుండా, నేను ఆయన కలలోకి వెళితే అడిగినట్లుగా అడిగారు. ‘‘ఏం లేదు మన్మోహన్ జీ. కబురు పంపితే నేనే ఢిల్లీ వచ్చేవాడిని కదా.. మీరు తిరువనంతపురం వరకు రావడం ఎందుకు అని ఆలోచిస్తున్నాను’’ అని చెప్పాను. ‘‘నువ్వు అంత టైమ్ ఇస్తే కదా థరూర్’’ అన్నారు మన్మోహన్ భారంగా. ‘‘ఎంత టైమ్ మన్మోహన్ జీ’’ అన్నాను ‘‘కబురు పంపేంత టైమ్’’ అన్నారు మన్మోహన్. ‘‘అవునవును. కబురు పంపే టైమ్ కూడా ఇవ్వలేదు మీరు..’’ అని చిదంబరం గొంతు కలిపారు. అరుణ్ శౌరి కలపలేదు. గొంతూ కలపలేదు, మాటా కలపలేదు. మన్మోహన్ కాంగ్రెస్. చిదంబరం కాంగ్రెస్, నేను కాంగ్రెస్. అరుణ్ శౌరి ఒక్కరే బీజేపీ. ‘‘ఇప్పుడు నువ్వే పార్టీలో ఉన్నావని అనుకుంటున్నావు థరూర్?’’ అని అడిగారు మన్మోహన్!! ‘‘ఇప్పుడు మీరే పార్టీలో ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు థరూర్’’ అని చిదంబరం అడిగారు!! ‘‘ఇప్పుడు మీరే పార్టీలో ఉన్నారో గుర్తు చేసే టైమ్ని కూడా మీరు మాకు ఇవ్వలేదు థరూర్’ అని అరుణ్ శౌరి అన్నారు!! ‘‘ఆ ట్వీట్ ఏంటి థరూర్! కాంగ్రెస్ పార్టీనే వంద కోట్ల వ్యాక్సిన్లు వేయించినంత గొప్పగా ట్వీట్ చేశావు! ‘ఇది భారతీయులకు గర్వకారణం’ అంటావు! ‘క్రెడిట్ అంతా గవర్నమెంటుదే’ అంటావు. దేశంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందనుకుంటున్నావా ఏంటి?’’ అన్నారు మన్మోహన్. ‘‘అందుకే థరూర్.. మీరెంత అందంగా ఉన్నా, మీకెంత ఇంగ్లిష్ వచ్చినా, మీరెన్ని పుస్తకాలు రాసినా, ఆఖరికి న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి అండర్ సెక్రెటరీ జనరల్గా పని చేసి వచ్చినా.. కాంగ్రెస్ పార్టీలో సహాయ మంత్రిగా తప్ప మీరు ఏ టెర్మ్లోనూ పూర్తి స్థాయి మంత్రిగా లేరు’’ అన్నారు అరుణ్ శౌరీ!! ‘‘మళ్లీ ఎప్పుడైనా మోదీని అభినందిస్తూ ట్వీట్ ఇచ్చే ముందు మాక్కొద్దిగా టైమ్ ఇవ్వు థరూర్. మోదీని విమర్శిస్తూ నువ్వొక పుస్తకం రాసిన సంగతిని నీకు గుర్తు చేస్తాం..’’ అన్నారు మన్మోహన్. ‘‘అవును గుర్తు చేస్తాం..’’ అన్నట్లు చూశారు చిదంబరం, అరుణ్శౌరి. కల ఎగిరిపోయింది. మోదీని అభినందించడం ఏంటని అడిగేందుకు.. వస్తే రాహుల్ రావాలి. లేదంటే సోనియాజీ రావాలి. వాళ్లు రాకుండా వీళ్లు కలలోకి రావడం ఏంటి? అసలు ఈ ముగ్గురి కాంబినేషన్ కలకు అర్థం ఏమై ఉంటుంది? ‘కలలు–అర్థాలు’ పుస్తకం కోసం షెల్ఫ్ వెతుకుతున్నాను. వరుసల్లోంచి ‘ది ప్యారడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్’ చేతిలోకి వాలింది. మోదీని విమర్శిస్తూ నేను రాసిన పుస్తకం అదే. కలకు అర్థం, కాంబినేషన్కు లింకూ రెండూ దొరికాయి! మూడేళ్ల క్రితం.. వేదికపై ఆ పుస్తకాన్ని ఆవిష్కరించింది మన్మోహన్, చిదంబరం, అరుణ్ శౌరీలే! -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: అశోక్ గెహ్లోత్ (రాజస్తాన్ సీఎం)
‘‘గురూ.. నేను కూడా ఢిల్లీ వెళ్లి ఒకసారి మోదీజీని కలిసొస్తే బాగుంటుందా..!’’ అని భూపేష్ బఘేల్ ఉదయాన్నే ఫోన్ చేశాడు. బఘేల్ నన్నెప్పుడూ ‘గురూ’ అన్నది లేదు. ఇప్పుడు అంటున్నాడు! గురూ అనే అవసరం లేకున్నా ఎవరైనా ఇంకొకర్ని ‘గురూ’ అన్నారంటే ఆ ఇంకొకరితో తమని ఈక్వల్ చేసుకుంటున్నారని. లేదంటే, ఆ ఇంకొకరిని తమకు ఈక్వల్ చేస్తున్నారని. ‘‘నేను బాగానే ఉన్నాను బఘేల్’’ అన్నాను. బఘేల్ ఒక్క క్షణం మాట్లాడలేదు. ‘‘అశోక్జీ.. నేను మిమ్మల్ని ‘గురూ’ అన్నందుకు మీరు చిన్నబుచ్చుకున్నట్లున్నారు. నేను కూడా మీలా ఒక రాష్ట్రానికి సీఎంని కనుక మీతో సమస్థాయినో, సమస్థానాన్నో ఆశించి మిమ్మల్ని ‘గురూ’ అనలేదు. ఇద్దరం కాంగ్రెస్ సీఎంలమే కనుక మిమ్మల్ని ‘గురూ’ అని చొరవగా అనగలిగాను’’ అన్నాడు. ‘‘మనిద్దరం కాంగ్రెస్ సీఎంలమే అయినప్పటికీ నేను బాగానే ఉన్నాను బఘేల్’’ అన్నాను నవ్వుతూ. కొంచెం తేలిక పడినట్లున్నాడు. ‘‘అందుకే మిమ్మల్ని గురూ అన్నాను అశోక్జీ. నేను కూడా మీలా బాగున్న ఒక కాంగ్రెస్ సీఎంగా ఉండాలని ఆశ పడుతున్నాను..’’ అన్నాడు బఘేల్. ఆ మాటతో అతడిలో నాకు గురుస్వరూపం గోచరించింది! అలాగని అతడిని నేను గురూ అంటే అతడింకేదో స్వరూపాన్ని నాకు చూపించవచ్చు. కాంగ్రెస్లో స్వరూపాలను ఊహించలేం. సాక్షాత్కారం జరిగినప్పుడు చూసి ఆశ్చర్యపోవడమే. అందుకే, ‘‘చెప్పు బఘేల్’’ అని మాత్రం అన్నాను. ‘‘చెప్పడానికి కాదు అశోక్జీ, నేను కూడా ఢిల్లీ వెళ్లి ఒకసారి మోదీజీని కలిస్తే బాగుంటుందా అని అడగడానికి ఫోన్ చేశాను’’ అన్నాడు. కాంగ్రెస్కు ఉన్నదే ముగ్గురు సీఎంలు. రాజస్తాన్లో నేను, ఛత్తీస్గఢ్లో బఘేల్, పంజాబ్లో కొత్తగా వచ్చిన చరణ్జిత్ చన్నీ. కొత్తగా వచ్చాడు కాబట్టి చన్నీ కర్టెసీగా వెళ్లి మోదీజీని కలిసుంటాడు. చన్నీకైతే సాకుగా రైతు చట్టాల రద్దు డిమాండ్లు ఉన్నాయి. మరి బఘేల్కి ఏమున్నాయి? ‘‘ఇష్యూ ఏంటి బఘేల్..’’ అన్నాను. ‘‘ఇష్యూ కాకూడదనే అశోక్జీ’’ అన్నాడు! బఘేల్ మళ్లీ నాకు గురుస్వరూపాన్ని అనుగ్రహించాడు. ‘‘అశోక్జీ! కాంగ్రెస్లో సీఎం అనే ప్రతి రూపానికీ ఎప్పుడూ ఒక ప్రతిరూపం ఉంటుంది. పంజాబ్లో అమరీందర్ సింగ్కి నవజోత్ సింగ్ సిద్ధూ, రాజస్తాన్లో అశోక్ గెహ్లోత్ అనే మీకు సచిన్ పైలట్, ఛత్తీస్గఢ్లో భూపేశ్ బఘేల్ అనే నాకు టి.ఎస్. సింగ్ దేవ్ ఆ ప్రతిరూపాలు’’ అన్నాడు బఘేల్. బఘేల్ గురుస్వరూపం క్రమంగా ఎత్తుకు పెరుగుతోంది. ‘‘నేనైతే అమరీందర్ సింగ్ని కావాలనుకోవడం లేదు అశోక్జీ! అమరీందర్ కూడా ముందు నుంచే మోదీజీని కలుస్తూ ఉంటే ఇప్పుడు అమరీందర్ అయి ఉండేవారు కాదు. మొన్న చన్నీ కూడా అమరీందర్ కాకుండా ఉండేందుకే కదా మోదీజీని కలిశారు. మీకైతే మోదీజీని కలిసే అవసరమే రాలేదు. ఆయనే మిమ్మల్ని కలుపుకొన్నారు. ‘అడిగే సీఎంలు ఉంటే పెట్టే పీఎంలు ఉంటారు’ అని ఆయన మిమ్మల్ని పొగిడారు కాబట్టి మీరూ అమరీందర్ అయ్యే ప్రమాదం లేదు..’’ అంటున్నాడు బఘేల్! ‘‘మోదీజీకి టచ్లో ఉంటే కాంగ్రెస్ మనల్ని టచ్ చెయ్యదు అనుకోవడంలో లాజిక్ కనిపించడం లేదు బఘేల్..’’ అన్నాను. ‘‘నిజమే అశోక్జీ! లాజిక్ లేదు. లాజిక్తో అసలు మన పార్టీకి ఏం పనుంది కనుక?! రాహుల్ గాంధీ అధ్యక్షుడు కాకుండానే, అధ్యక్షుడిగా నిర్ణయాలన్నీ తీసుకోవడంలో మాత్రం లాజిక్ ఉందా?..’’ అన్నాడు అశోక్!! మళ్లొకసారి గురు సాక్షాత్కారం!! గురుబ్రహ్మ.. గురుర్విష్ణుః గురు బఘేల్!! -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: నరేంద్ర మోదీ (ప్రధాని)
యు.ఎస్. నుంచి తిరుగు ప్రయాణం. సీటు బెల్టులింకా పెట్టుకోలేదు. నాతో పాటు జైశంకర్, శ్రింగ్లా, అజిత్ డోభాల్ ఉన్నారు. శ్రింగ్లా విదేశీ వ్యవహారాల కార్యదర్శి. అతడిని చూస్తుంటే ఎందుకో నాకు పన్నెండేళ్ల తర్వాత అతడు యోషిహిడేలా ఉంటాడేమో అనిపించి నవ్వొచ్చింది. యోషిహిడే జపాన్ ప్రధాని. శ్రింగ్లాకు అరవై. యోషిహిడేకు డెబ్బై రెండు. ‘‘ఏంట్సార్ నవ్వుతున్నారు?’’ అన్నాడు జైశంకర్. అతడు విదేశీ వ్యవహారాల మంత్రి. ‘‘నవ్వుతున్నానా, నవ్వుకుంటున్నానా జైశంకర్?’’ అన్నాను. ‘‘నవ్వుకుంటున్నా నవ్వినట్లే కదా సర్ కనిపిస్తుంది..’’ అని నవ్వాడు జైశంకర్. అతడి నవ్వు చూస్తుంటే ఐదేళ్ల క్రితం నా నవ్వు అతడి నవ్వులా ఉండేదేమో అనిపించింది. అతడికి అరవై ఆరు. నాకు డెబ్బై ఒకటి. ‘అవును సర్, మీరు నవ్వుకోవడం నేనూ చూశాను’ అని శ్రింగ్లా గానీ, అజిత్ డోభాల్ గానీ అంటారేమోనని చూశాను. అనలేదు! శ్రింగ్లా ఏవో ఫైల్స్ సర్దుకుంటున్నాడు. అజిత్ డోభాల్ తన విండో పైభాగాన్ని చేతి వేళ్లతో కొట్టి చూస్తున్నాడు. విమానంలో కాకుండా విధి నిర్వహణలో ఉన్నట్లున్నారు వాళ్లిద్దరూ!! ‘‘ఏమైంది అజిత్జీ? విమానాన్ని అలా వేళ్లతో ఎందుకు కొట్టి చూస్తున్నారు అని అడిగాను. ‘‘కొట్టలేదు మోదీజీ, కొట్టినట్లు ఉన్నాను..’’ అన్నారు అజిత్ తన వేళ్లను చూసుకుంటూ! అజిత్ జాతీయ భద్రత సలహాదారు. డెబ్బై ఆరేళ్ల మనిషి. ఇంకో రెండేళ్లు పోతే బైడెన్ వయసుకు వచ్చేస్తారు ఆయన. జైశంకర్ ఇంకా నావైపే చూస్తూ ఉన్నాడు. నేనెందుకు నవ్వుకున్నానో తెలుసుకోవడం కోసం కావచ్చు. శ్రింగ్లాలో నాకు యోషిహిడే కనిపిస్తున్నాడని, అందుకే నవ్వొచ్చిందనీ చెబితే బాగుంటుందా? ‘క్వాడ్’లోని మా నలుగురిలో బైడెన్ కన్నా, యోషిహిడే కన్నా, పద్దెనిమిదేళ్లు నా కన్నా కూడా యంగెస్ట్.. ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్. ఒకవేళ ఆ యంగ్ మ్యాన్తో కనుక శ్రింగ్లా తనని తను పోల్చుకుని ఉంటే.. శ్రింగ్లాలో నాకు యోషిహిడే కనిపిస్తున్నాడని జైశంకర్తో నేను అనడం శ్రింగ్లాను హర్ట్ చేయడమేగా!! అందుకే.. ‘‘ఏం లేదు జైశంకర్’’ అన్నాను. జైశంకర్, శ్రింగ్లా, అజిత్ సీటు బెల్టులు పెట్టుకుంటూ కనిపించారు. ‘‘అజిత్జీ ఇంత టెక్నాలజీ వచ్చాక కూడా ఇంకా ఈ సీటు బెల్టులు పెట్టుకోవడం ఏంటి?!’’ అన్నాను నేనూ సీటు బెల్టు పెట్టుకుంటూ. అజిత్ సగం ఆశ్చర్యంతో చూశారు. మిగతా సగం అది ఏ భావమో అర్థం కాలేదు. బహుశా.. ఇండియాలో సీటు బెల్టు పెట్టుకుంటున్నప్పుడు రాని సందేహం అమెరికాలో సీటు బెల్టు పెట్టుకుంటున్నప్పుడు రావడం ఏంటీ అని అలా చూసి ఉండొచ్చు. ఇండియా నుంచి వచ్చేటప్పుడు నా చేతి నిండా ఫైల్సే ఉన్నాయి. విమానం ఎప్పుడు ఎక్కానో, సీటు బెల్టు ఎప్పుడు పెట్టుకున్నానో గుర్తే లేదు! ‘‘మోదీజీ.. సీటు బెల్టు అన్నది టెక్నాలజీకి ఏమాత్రం సంబంధం లేని ఒక భద్రతా ఏర్పాటు. అమెరికా అధ్యక్షుడి ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో కూడా సీటు బెల్టులు ఉంటాయి. మన బెల్టులు అంతకన్నా బలమైనవి..’’ అని నవ్వారు అజిత్. ఇండియాకు పదిహేను గంటల ప్రయాణం. విమానంలో చేయడానికి పనేమీ లేదు. యు.ఎస్. వచ్చేటప్పుడు ‘వర్క్ ఫ్రమ్ ఫ్లయిట్’ అంటూ నా ఫొటో ఒకటి ట్వీట్ చేసినందుకు ప్రతీకారంగా కాంగ్రెస్ వాళ్లు ఫ్లయిట్లో వర్క్ చేస్తున్న రాజీవ్ గాంధీ పాత ఫొటోను పోస్ట్ చేశారు! దేశం లోపలే కలిసిరాని వారుంటే దేశం బయట ఐక్యరాజ్య సమితిలో ఎప్పుడూ ఎవరో ఒకరు కశ్మీర్ పేరు ఎత్తడంలో వింతేముంది?! -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: మల్లికార్జున్ ఖర్గే
ల్యాండ్లైన్ మోగుతోంది!! సాధారణంగా అది మోగదు. వారం క్రితం మాత్రం వెంకయ్య నాయుడు చేశారు. ‘‘ఆ రోజు అలా జరిగి ఉండాల్సింది కాదు ఖర్గేజీ..’’ అన్నారు వెంకయ్య నాయుడు నిన్న శనివారం కాకుండా ఆ ముందరి శనివారం ఫోన్ చేసి! ఏ రోజు, ఏలా జరిగి ఉండాల్సింది కాదని ఆయన అంటున్నారో వెంటనే గ్రహించలేక పోయాను. ‘వెంకయ్యాజీ... మీరు దేని గురించి మాట్లాడుతున్నారు?!’ అని నేను ఆయన్ని అడగొచ్చు. అయితే అలా అడగటం ఆయనకు ఆగ్రహాన్నో, ఆవేదననో ఏదో ఒకటి కలిగించే ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి కూడా నేను సిద్ధపడి ఉండాలి. ఎవరైనా కరెంట్ ఈవెంట్స్ తెలియకుండా ఊరికే జీవించేస్తుంటే వారిపై వెంకయ్య నాయుడుకి ఆగ్రహం వస్తుంది. కరెంట్ ఈవెంట్స్ని ఫాలో అవుతున్నప్పటికీ సమయానికి వాటిని తిరిగి గుర్తుకు తెచ్చుకోలేని వారిని చూస్తే ఆయనకు ఆవేదన కలుగుతుంది. ‘ఎటువైపు వెళుతోంది సమాజం!’ అని ఆగ్రహం. ‘ఏమైపోతున్నాయి విలువలు!’ అని ఆవేదన. ఏ రోజు, ఏలా జరిగి ఉండాల్సింది కాదో గుర్తుకు తెచ్చుకునేందుకు అప్పటికప్పుడు ప్రయత్నించి, విఫలమై.. ఇక తప్పక.. ‘‘ఏ రోజు వెంకయ్యాజీ’’ అని అడిగేశాను. ‘‘ఏ రోజు అని అడుగుతున్నారా ఖర్గేజీ! రాజ్యసభలో మీరు ప్రధాన ప్రతిపక్షానికి నాయకుడై ఉండీ ‘ఏ రోజు?’ అని అడుగుతున్నారా? ఏ రోజో చెప్పడం నాకు ఇష్టం లేదు. కావాలంటే ఆ రోజు ఏం జరిగిందో చెబుతాను. గర్భగుడి లాంటి సభలో మీవాళ్లు టేబుళ్ల పైకి ఎక్కారు. ఫైళ్లు విసిరేశారు. పెద్ద పెద్దగా అరిచేశారు. కాగితాలు చింపేశారు. వాటన్నిటిపై దర్యాప్తు కోసం ఒక క్రమశిక్షణ కమిటీ వేస్తున్నాను. కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఆ కమిటీలో ఉండాలి..’’ అన్నారు వెంకయ్య నాయుడు. గుర్తొచ్చింది నాకు! సభలో వెంకయ్య నాయుడు ఆవేదనతో కంటతడి పెట్టిన రోజు అది. ఆగస్టు 11. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాయిదా పడి, రెండు రోజుల ముందే ముగిసిన రోజు. పాత సంగతిని ఇప్పుడెందుకు గుర్తుచేసుకుని ఆయన కమిటీ వేస్తున్నట్లు! ‘‘వెంకయ్యా జీ... మా మీద కమిటీ వేస్తూ మమ్మల్నే కమిటీలో చేరమంటే ఎలా చెప్పండి? ఆ రోజు మీరు చర్చకు పెట్టకుండా బీమా బిల్లును పాస్ చేయించడం కూడా జరిగి ఉండాల్సింది కానీ వాటిలో ఒకటి కదా..’’ అని.. అప్పటికేమీ చెప్పకుండా.. ఆ తర్వాత లెటర్ రాసి పంపాను. ఇప్పుడు మళ్లీ ల్యాండ్లైన్ మోగుతోంది!! మళ్లీ వెంకయ్య నాయుడేనా! అయినా ఈరోజు, రేపు ఆయన పుదుచ్చేరిలో బిజీగా ఉంటారు. పక్కనే లెఫ్ట్నెంట్ గవర్నర్ తమిళిసై ఉంటారు. ‘జిప్మెర్’లో సోలార్ పవర్ ప్లాంట్ను ప్రారంభించాక అక్కడి నుంచి ఇద్దరూ అరవింద ఆశ్రమానికి వెళ్తారు. మధ్య మధ్య తెలుగు భాష గొప్పదనం గురించి వెంకయ్యనాయుడు, తమిళ భాష ప్రాచీన ప్రాశస్త్యం గురించి తమిళిసై ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ ఉంటారు. కనుక ఆయన నాకు ఫోన్ చేసే అవకాశం లేదు. ఒకవేళ ఫోన్ చేస్తున్నది ఆయనే కనుకైతే.. ఈసారి ‘ఆ రోజు’ జరిగి ఉండాల్సినవి కాని వాటిని టాపిక్లోకి రానివ్వకుండా.. చరిత్రలో ఆ రోజు జరిగిన ఒక ‘అపురూప’ ఘటనను ఆయనకు గుర్తు చేయాలి. నాలుగేళ్ల క్రితం సరిగ్గా ఆగస్టు 11నే వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అయ్యారు. ఆనాటి కరెంట్ ఈవెంట్ను నేనింకా మర్చిపోలేదంటే... ‘సమాజంలో విలువలు ఎక్కడికీ పోలేదు, భద్రంగానే ఉన్నాయని’ ఆయన సంతోషించవచ్చు. ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన అధికార పక్షంలోని ఒక వ్యక్తిని సంతోష పెట్టకూడదనేముంది? -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ యడియూరప్ప (కర్ణాటక సీఎం)
నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. ఎనిమిది రోజులు ఒకసారి, మూడు రోజులు ఒకసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రాణానికి సుఖంగా ఉంది! ఈ డెబ్బై ఎనిమిదేళ్ల వయసులోనూ వదులుకోవడానికి నేను ఏమాత్రం ఇష్టపడని నా తలనొప్పిని ఎలా ఇంకో రెండేళ్లయినా భద్రంగా కాపాడుకోవడం?! ‘‘లాక్డౌన్లో మీ అబ్బాయి ఏదో చేశాడట కదా, మీరింకా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారేమిటీ?!’’ .. అంటారు! అబ్బాయిలు లేకుండా ఉంటారా, ఏదో ఒకటి చేయకుండా ఉంటారా?! ‘‘ఏం చేశావ్ విజయేంద్రా ఈ లాక్డౌన్లో చెయ్యకూడని పని!’’ అని పిలిచి అడిగాను. ‘‘మీ కోసమే నాన్నగారూ, నంజనగూడు శ్రీకంఠేశ్వర దేవస్థానానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయించాను. ఎక్కువసేపు కూడా ఉండలేదు. ఐదే నిమిషాల్లో తిరిగొచ్చేశా..’’ అన్నాడు. ‘‘నా కోసం దేవస్థానానికి వెళ్లాలా విజయేంద్రా.. ఇంట్లో దండం పెట్టుకుంటే సరిపోయేదిగా. ఇప్పుడు చూడు. పాలనలో వైఫల్యం అంటున్నారు. పాలన అంటే ఎవరు? నేనే కదా. తండ్రులు కొడుకుల్ని అర్థం చేసుకోగలరు కానీ, కోర్టులు ప్రభుత్వాలను అర్థం చేసుకోలేవు విజయేంద్రా. నీపై కఠిన చర్యలు తీసుకోవాలని జడ్జి అన్నారట’’ అన్నాను. ‘‘సారీ నాన్నగారూ, ఇక ముందు ఇంట్లోనే దండం పెట్టుకుంటాను’’ అన్నాడు. ‘సరే వెళ్లు’ అన్నట్లు చూసి, ప్రభులింగకు ఫోన్ చేశాను. లైన్లోకి వచ్చాడు. ‘‘ఏం చేద్దాం?’’ అని అడిగాను. ‘‘ఎవరు మాట్లాడుతున్నది..’’ అన్నాడు!! ‘‘నేను ఫోన్ చేసింది అడ్వకేట్ జనరల్ ప్రభులింగకు అని నాకు తెలిసినప్పుడు.. మీకు ఫోన్ చేసింది కర్ణాటక సీఎం యడియూరప్ప అని మీకెందుకు తెలియడం లేదు!’’ అన్నాను. ‘‘సర్.. మీరా! నమస్తే. మీ గొంతు ఎవరిదో గొంతులా ఉంది సర్. వెంటనే పోల్చుకోలేక అలా అడిగేశాను’’ అన్నాడు. ‘‘నా గొంతు గుర్తుపట్టకుండా ఉండటానికి మీకింకా రెండేళ్ల టైమ్ ఉంది ప్రభులింగా. పాలనలో వైఫల్యం అని మావాళ్లు అంటున్నా మా పైవాళ్లేమీ నన్ను తీసేయరు. ఇంకో రెండేళ్లు సీఎంగానే ఉంటాను. విజయేంద్రది అంత సీరియస్ కేసు కాదనకుంటున్నాను. మీరేమంటారు?’’ అని అడిగాను. ‘‘నేనూ అదే అన్నాను సర్. టెంపుల్లో విజయేంద్ర దండం పెట్టుకుంది ఐదే నిమిషాలు అని వాదించాను. చీఫ్ జస్టిస్ నా మీద సీరియస్ అయ్యారు. నెక్ట్స్ వాయిదా ఉంది. అప్పుడు మళ్లీ వాదిస్తాను’’ అన్నాడు. ‘‘వాదించండి’’ అని ఫోన్ పెట్టేశాను. పెట్టిన వెంటనే ఎవరిదో కాల్. శివరాజ్సింగ్ చౌహాన్!! ‘‘యడియూరప్పాజీ.. విప్లవ్దేవ్ మీకేమైనా ఫోన్ చేశాడా?’’ అన్నాడు. విప్లవ్దేవ్ త్రిపుర ముఖ్యమంత్రి. చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి. నేను కర్ణాటక ముఖ్యమంత్రి. ఒక బీజేపీ ముఖ్యమంత్రి ఇంకో బీజేపీ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి మరొక బీజేపీ ముఖ్యమంత్రి గురించి అడగడం గత ఏడేళ్లలో ఇదే మొదటిసారి కావచ్చు. ‘‘విప్లవ్దేవ్ నాకేమీ ఫోన్ చేయలేదు చౌహాన్జీ. ఎందుకు అలా అడుగుతున్నారు?’’ అని అడిగాను. ‘‘ఏం లేదు. ఇంతక్రితం నాతో మాట్లాడుతూ సలహా కోసం మీకు ఫోన్ చేయాలని అన్నాడు. అందుకే.. చేశాడా అని అడుగుతున్నాను’’ అన్నాడు. ‘‘దేనికి సలహా?’’ అని అడిగాను. ‘‘రాష్ట్రంలో పాలన వైఫల్యం అని మనవాళ్లు అతడిని దిగిపొమ్మంటున్నారట. మీ రాష్ట్రంలోనూ పాలన వైఫల్యం అని మీవాళ్లు మిమ్మల్ని దిగిపొమ్మంటున్నారు కనుక మీరేదైనా సలహా ఇస్తారని మీకు ఫోన్ చేస్తానన్నాడు. మా రాష్ట్రంలోనూ పాలన వైఫల్యం అని నన్ను మావాళ్లు దిగిపొమ్మంటున్నారు కనక అతడికి మీరిచ్చే సలహా నాకూ పనికొస్తుందని మీకు ఫోన్ చేశాను’’ అన్నాడు! - మాధవ్ శింగరాజు -
గౌతమ్ గంభీర్ (ఢిల్లీ ఎం.పి.).. రాయని డైరీ
పదేళ్ల క్రితం అందరం పదేళ్లు చిన్నవాళ్లం. వరల్డ్ కప్ గెలిచాం! మా కెప్టెన్ ధోనీ. ధోనీలో నాకెప్పుడూ ఒక గొప్పతనం కనిపిస్తుంది. ప్రతి గెలుపులోనూ అతడొక్కడే మనందరికీ కనిపిస్తున్నా.. ‘ఇదిగో నేనిక్కడ ఉన్నాను’ అంటూ అతడెక్కడా మనకు కనిపించడు! ఆ రోజు వరల్డ్ కప్ గ్రూప్ ఫొటోలో కూడా ధోనీ ఎత్తిపట్టిన కప్పు కనిపించింది తప్ప, ధోనీ కనిపించలేదు. మరి మనం ఎందుకు కప్పు గెలిచి పదేళ్లు అయిన సందర్భంగా కప్పుని కాకుండా అతడిని ఎత్తిపట్టి చూపిస్తున్నాం?! అతడికి నచ్చే విషయమేనా? చేతులు కట్టుకుని దూరంగా చిరు దరహాసంతో తన టీమ్ సంబరాలను పదేళ్లుగా చూస్తూ నిలబడి ఉన్న కెప్టెన్ దగ్గరకు వెళ్లి, ‘నేటికి పదేళ్లు’ అని గుర్తు చేసి, అతడి చేతిని బలవంతంగా పైకెత్తించి, ఆ చేతిలోని రెండు వేళ్లను ‘వి’ షేప్లో బలవంతంగా తెరిపించి.. ఏమిటిదంతా! నాయకుడి ఆత్మ టీమ్లో ఉంటుంది. టీమ్ ఆ ఆత్మకు తిరిగి నాయకుడి రూపం ఇవ్వడం అంటే అతడి పెద్దరికాన్ని అతడికి కాకుండా లాగేయడమే. వరల్డ్ కప్ విజయంలో ప్లేయర్స్కి మాత్రమే కాదు.. ప్రతి రన్కి, ప్రతి బంతికి భాగస్వామ్యం ఉంది. రన్ అవుట్కి, మిస్ అయిన క్యాచ్కి కూడా గెలుపులో షేర్ ఉంది. పదేళ్ల క్రితం ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టు వరల్డ్ కప్ గెలిచింది. అదీ ఆ రోజు ఫైనల్స్లో ఇండియా సాధించిన అసలు విజయం. దాని గురించి చెప్పుకోవాలి. లేదంటే, పదేళ్ల తర్వాత ఇప్పుడు ఆ టీమ్లోని వాళ్లంతా ఏం చేస్తున్నారో చెప్పుకోవడం కూడా ఆ రోజు సాధించిన విజయం గురించి చెప్పుకోవడమే అవుతుంది. అది మంచి సంగతి కదా! ధోనీ ఇప్పుడు చికెన్ ఫామింగ్ చేస్తున్నాడు. క్రి కెట్ మానేశాడని కాదు. ఆడుతున్నాడు. ఆటెప్పుడూ ఆటగాడిని వదిలేసిపోదు. సచిన్ రిటైర్ అయ్యాడని ఆట అతడిని ఏ రోజైనా ‘ఏయ్ రిటైర్డ్ మ్యాన్’ అనిందా? లేదు. ఈమధ్యే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్లో ఆడొచ్చాడు. ఈ పదేళ్లలో సెహ్వాగ్ కామెంటేటర్ అయ్యాడు. ట్విట్టర్లోనే ఎప్పుడూ అతడు కనిపించడం! కోహ్లీ వరల్డ్కప్లో బేబీ బాయ్. ఇప్పుడొక బేబీ గర్ల్కి ఫాదర్. యువరాజ్ పదేళ్ల క్రితం మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్. తర్వాత క్యాన్సర్తో ఫైట్. ధైర్యంగా ఆడాడు. గట్టిగా నిలబడ్డాడు. గ్రేట్. రైనా ఆనాటి స్క్వాడ్లో యంగ్మ్యాన్. స్టార్లు ఆడుతుంటే తను ఆడే చాన్స్ కోసం చూశాడు. కప్పొచ్చిన టీమ్లో ఉన్నాడు కానీ, కప్పు విజయాన్ని ఒక చెయ్యేసి పట్టుకునే చాన్సే రాలేదు. ఇప్పుడతడు చెన్నై సూపర్ కింగ్. పఠాన్ ఆల్ రౌండర్. వరల్డ్ కప్పులో పెద్దగా బ్యాటింగ్ చేయలేదు. సచిన్లా అతడూ ఇప్పుడు కరోనాపై ఆడుతున్నాడు. హర్బజన్ కెరీర్ చివరికొచ్చేశాడు. కోల్కతా నైట్ రైడర్ అతడిప్పుడు. జహీర్ ముంబై ఇండియన్స్కి క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్. పటేల్ కనిపించడం లేదు. వినిపించడం లేదు. నెహ్రా కామెంటరీలు చెబుతున్నాడు. ఈ మధ్యే ఢిల్లీ నుంచి గోవా షిఫ్ట్ అయ్యాడు.. నేనిప్పుడు ఢిల్లీ నుంచి బెంగాల్ షిఫ్ట్ అయినట్లు! కొన్ని రోజులుగా ఇక్కడే నా మకాం. బెంగాల్లో ఎలాగైనా మమతా బెనర్జీని ఓడించాలని అమిత్షా! ‘‘అమిత్జీ అలా వద్దు. బీజేపీని గెలిపించుకుందాం’’ అని చెప్పి క్యాంపెయిన్ కోసం బెంగాల్ వచ్చాను. ‘‘ఆ రోజు ప్రపంచ కప్ ఫైనల్స్లో ఓపెనర్గా నువ్వు తొంభై ఏడు రన్స్ తీసి శ్రీలంక మీద ఇండియా గెలవడానికి కారణం అయినట్లే.. తృణమూల్ మీద బీజేపీ జట్టును గెలిపించి మంచి ఓపెనింగ్ ఇవ్వాలి గౌతమ్’’ అంటున్నారు అమిత్షా! అశ్విన్, పీయుష్, శ్రీశాంత్.. వరల్డ్ కప్పులో ఆడిన మిగతా ప్లేయర్స్. అశ్విన్ ప్రస్తుతం ఫామ్లోనే ఉన్నాడు. పీయుష్ గుజరాత్ వెళ్లిపోయాడు. శ్రీశాంత్ బ్యాన్ నుంచి బయట పడ్డాడు. జీవితంలోనైనా, ఆటలోనైనా కలిసి ఆడిన ఆటలోని గెలుపు ఓటములకు ఏ ఒక్కరో కారణం అయి ఉండరు. వరల్డ్ కప్పు విజయంలోనూ అంతే. -
రాయని డైరీ: జో బైడెన్ (అమెరికా అధ్యక్షుడు)
అధ్యక్షుడిగా వైట్ హౌస్లోకి వచ్చాక ఇది నా ఫస్ట్ సోలో ప్రెస్ కాన్ఫరెన్స్. ‘‘కమలా హ్యారిస్ ఎక్కడికి వెళ్లారు మిస్టర్ ప్రెసిడెంట్’’ అని తొలి ప్రశ్న! నిజానికైతే ఆ ప్రశ్నకు నేను అదిరిపడాలి. అదిరిపడేంత ఓపిక లేకపోయింది. ఒక మంచి ప్రశ్నతో నేను నా ప్రెస్ కాన్ఫరెన్స్ని ప్రారంభించడానికి సహాయ పడేలా వాళ్ల దగ్గర అనేకమైన ప్రశ్నలు ఉండక పోవు. ‘వ్లాదిమిర్ పుతిన్ పళ్లు ఎలా రాలగొట్ట బోతున్నారు?’ అని అడగొచ్చు. ‘జిన్పింగ్ నిరంకుశత్వపు తోకను మొత్తంగా మొదలు దగ్గరే కత్తిరిస్తారా లేక తోక చివర కొద్దిగా కత్తిరించి యాంటీబయాటిక్కేమీ రాయకుండా అలా వదిలేస్తారా?’ అని అడిగి తెలుసు కోవచ్చు. ‘ఉత్తర కొరియాలో ఉండే కిమ్ బెటరా, కాంగ్రెస్లో మీ ఎదురు సీట్లలో కూర్చునే రిపబ్లికన్లు బెటరా?’ అని అర్థవంతమైన ప్రశ్నొకటి వేయవచ్చు. కనీసం ట్రంప్ని గుర్తు చేసి నన్ను చికాకు పరచవచ్చు. ఇవన్నీ వదిలేసి, ‘కమలా హ్యారిస్ ఎక్కడికి వెళ్లారు మిస్టర్ ప్రెసిడెంట్’’ అని అడుగుతున్నారు! వంశానికి ఒక్క ఆడపిల్ల అయినందువల్లనేనా?! ‘‘నేను తనని వేరే పనుల మీద పంపించాను’’ అని చెప్పాను. ‘కమలకు అప్పుడే పనులు చెప్పడం మొదలుపెట్టేశారా’ అని అడిగేసింది ఒక అమ్మాయి! ‘‘ఏ చానల్ అమ్మా’’ అని అడిగాను. ‘‘సీఎన్ఎన్’’ అంది. ‘‘సీఎన్ఎన్లో ఎప్పుడు చేరావ్!’’ అన్నాను. ‘‘చేరలేదు. ట్రెయినీగా ఉన్నాను’’ అంది. ‘‘నువ్వింకా ట్రెయినీగా ఉన్నప్పుడే సీఎన్ఎన్ నిన్ను అమెరికన్ ప్రెసిడెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్కి పంపింది! మరి కమలను నేను ముఖ్యమైన పనుల మీద ఎందుకు పంపకూడదు?!’’ అన్నాను. ‘‘ఏమిటా ముఖ్యమైన పనులు?’’అని మరొక కుర్ర జర్నలిస్టు గద్దించినట్లుగా అడిగాడు! వీళ్లంతా కమలాహ్యారిస్కు ఫ్యాన్స్లా అనిపిస్తున్నారు. వాళ్ల హెడ్లను అడిగి మరీ ఈ అసైన్మెంట్ వేయించుకుని వచ్చినట్లున్నారు. ‘‘ఓకే ఓకే.. మనతో కమలా హ్యారిస్ లేకపోవడం నాకూ లోటుగానే ఉంది. కానీ ప్రెసిడెంట్ సోలో ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ప్రెసిడెంట్ ఒక్కడే మాట్లాడతాడని ట్రెయినింగ్లో మీకు చెప్పలేదా?’’ అని నవ్వాను. ‘‘ప్రెసిడెంట్ సోలో కాన్ఫరెన్స్లో మాట్లాడేది ప్రెసిడెంటే అయినా, ఆయన పక్కన వైస్ ప్రెసిడెంట్ కూర్చోకూడదనేమీ లేదుగా మిస్టర్ ప్రెసిడెంట్?’’ అంది సీఎన్ఎన్ అమ్మాయి. ‘‘మంచి ఆలోచన’’ అన్నాను. ‘‘వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ని ఏ ముఖ్యమైన పనుల మీద మీరు పంపారో మేము తెలుసుకోవచ్చా మిస్టర్ ప్రెసిడెంట్..’’ అని మళ్లీ ఆ కుర్ర జర్నలిస్టు అడిగాడు! ‘‘వెల్, హ్యారిస్పై మీ అభిమానం నన్ను కట్టిపడేస్తోంది. ఎంతగానంటే నేనూ ఒక జర్నలిస్టునై మీ మధ్యలో కూర్చొని.. ‘కమలను ఏం చేశావు మిస్టర్ ప్రెసిడెంట్’ అని అడగాలన్నంతగా. అన్నీ నేనే చేయాలను కోవడం ఆమెలోని తల్లి మనసును అవమానించినట్లు అవుతుంది. అందుకే మెక్సికో సరిహద్దు నుంచి అమెరికాలోకి వలస వచ్చే తల్లీబిడ్డలకు వేళకు ఆహారం అందించే ముఖ్యమైన పనిని హ్యారిస్కు అప్పగించాను..’’ అని చెప్పాను. ‘‘మిస్టర్ ప్రెసిడెంట్.. మీ ఫిట్నెస్ గురించి నాదొక ప్రశ్న’’.. మొదటి వరుసలోని వారెవరో చెయ్యెత్తారు. ‘‘నాకు తెలుసు. విమానం మెట్లెక్కుతూ మూడుసార్లు తూలిపడిన నేను రెండో టర్మ్లో కూడా ప్రెసిడెంట్గా నిలబడతానా అనే కదా మీ ప్రశ్న. తప్పకుండా నిలబడతాను’’ అన్నాను. సీఎన్ఎన్ అమ్మాయి సీరియస్గా నా వైపే చూస్తోంది! ‘అప్పుడు కూడా మీరే ప్రెసిడెంటా..’ అన్నట్లు చూడటం లేదు. ‘అప్పుడు కూడా సోలో ప్రెస్ కాన్ఫరెన్సేనా’ అన్నట్లు చూస్తోంది! -మాధవ్ శింగరాజు -
నీరవ్ మోదీ (వజ్రాల వ్యాపారి).. రాయని డైరీ
వెళ్లడం తప్పేలా లేదు. తప్పించుకుని వెళ్లే వీలూ లేదు. నన్ను బ్రిటన్ జైల్లోనే ఉంచి, ఇండియాలో విచారణ జరిపిస్తే బ్రిటన్కి గానీ, ఇండియాకు గానీ పోయేదేమీ లేదు. కొంచెం డబ్బు ఖర్చవచ్చు. ఖర్చెందుకు దండగ అనుకున్నట్లున్నాయి ఇండియా, బ్రిటన్! మరీ ఇంత మనీ మైండెడ్ అయితే మనీ ఎలా çసంపాదిస్తారు? డబ్బు కావాలనుకుంటే డబ్బును వెదజల్లాలి. వ్యాపారంలో ఇది మొదటి సూత్రం. సూత్రాలు కొన్నిసార్లు పని చేయకపోవచ్చు. ఆలోచిస్తే ఇంకో సూత్రమేదైనా దొరుకుతుంది. ఆర్థికమంత్రులు, దేశాధినేతలు ఆ ఇంకో సూత్రం గురించి ఆలోచించరులా ఉంది! ఆలోచించే బదులు నీరవ్నో, మాల్యానో దేశం రప్పిస్తే దేశ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని నిర్మలా సీతారామన్, నరేంద్ర మోదీ అనుకుంటూ ఉండొచ్చు. నిర్మల, నరేంద్ర, నీరవ్.. ముగ్గురి పేర్లూ ‘ఎన్’ తో భలేగా మొదలయ్యాయే అనే ఆలోచన వచ్చింది నాకు! వాళ్లకూ ఈ అర్థంలేని ఆలోచన వచ్చి ఉంటుందా? మాల్యా పేరు కూడా ‘ఎన్’ తో స్టార్ట్ అయుంటే నాకు నిస్సందేహంగా నవ్వొచ్చి ఉండేది. ముంబై వెళ్లి జైల్లో కూర్చున్నాక కూడా పగలబడి నవ్వుతూ ఉండేవాడిని. మాల్యా కూడా బ్రిటన్లోనే ఉన్నా, బ్రిటన్లో నేనున్నంత ధైర్యంగా మాల్యా లేడు! ఫోన్ చేస్తే ‘ష్.. ఇప్పుడు కాదు’ అనేవాడు. ‘ఎక్కడున్నావో అదైనా చెప్పు’ అని అడిగేవాడిని. ‘ఇద్దరం ఇండియాలోనైతే లేము కదా. ఇండియాలో లేనప్పుడు ఎక్కడున్నా మనం ఒకే చోట ఉన్నట్లు. ఒకేచోట ఉన్నప్పుడు ఫోన్లెందుకు? ఇండియాలో ఉన్నవాళ్లకు ఫోన్ చేసి మరీ మన ఫోన్ నెంబర్లు ఇవ్వడం కాకపోతే..’ అనేవాడు! ఓసారెప్పుడో తనే చేశాడు.. ‘ఎక్కడున్నావ్?!’ అని. ‘నీ అంత పిరికివాణ్ని కాదు. నువ్వెక్కడున్నావో చెప్పు నేనే నీ దగ్గరకు వస్తాను’ అన్నాను. ‘నా దగ్గరికి రావడానికీ నీకు ధైర్యం అక్కర్లేదు నిజమే కానీ, నీ దగ్గరకు రావాలంటే మాత్రం నేను ధైర్యంగానో, పిరికిగానో ఉండాలి. నువ్వెక్కడున్నావో చెబితే అక్కడికి రావడానికి నాకు ధైర్యం అవసరమా, పిరికితనం అవసరమా నిర్ణయించుకుంటాను. కొన్నిసార్లు పిరికితనం కూడా ధైర్యం చేసినంత మేలు చేస్తుంది. కొన్నిసార్లు ధైర్యం కూడా పిరికితనమంత కీడు చేస్తుంది’’ అన్నాడు. తర్వాత ఫోన్ కట్ అయింది. మళ్లీ మాల్యా నాకు గానీ, నేను మాల్యాకు గానీ ఫోన్ చెయ్యలేదు. ఆ ఫోన్ మాల్యా కట్ చేశాడా, నేను కట్ చేశానా అన్నదీ గుర్తు లేదు. ఆ రోజు.. ‘ఎక్కడున్నావ్?’ అని ఎందుకు అడిగి ఉంటాడా అని మాత్రం అప్పుడప్పుడు గుర్తుకు వస్తుంటుంది. ౖటñ మ్ చూసుకున్నాను. చూసుకున్నాను కానీ టైమ్ ఎంతైందో చూసుకోలేదు. ఈ క్షణమో, మరు క్షణమో ఇండియా ఫ్లయిట్ ఎక్కవలసి రావచ్చు. చివరిసారి బ్రిటన్లో ఎవరైనా ఆప్తులతో మాట్లాడాలనిపించింది. ఆప్తులు అనుకోగానే మాల్యానే గుర్తొచ్చాడు. ఫోన్ చేశాను. లిఫ్ట్ చేశాడు! ‘‘ఎలా ఉన్నావ్ మాల్యా? వెళ్లిపోతున్నాను..’’ అన్నాను. ‘‘నన్ను ఒంటరిని చేసి..’’ అన్నాడు. అతడి గొంతులో ధ్వనించిన దిగులును వింటే.. నాతో పాటే నేనెక్కిన ఫ్లయిట్లోనే నా పక్క సీట్లో కూర్చొని ఇండియా వచ్చేసేట్లున్నాడు. ‘‘ఫోన్ చేస్తుంటాన్లే..’’ అన్నాను. ఏంటో ఈ ఆర్థిక వ్యవస్థలు, వ్యవహారాలు! మాల్యా డబ్బు మొత్తం చెల్లించేస్తానంటే తీసుకోనంటున్నారు. నేను ఒక్క రూపాయి కూడా చెల్లించలేనంటే నన్ను తీసుకుపోతున్నారు! -
అమిత్ షా (హోమ్ మినిస్టర్).. రాయని డైరీ
రేపు ఉదయం కోల్కతాలో ఉండాలి. అక్కడొక స్పెషల్ కోర్టు జడ్జి ఉంటారు. సోమవారం ఉదయం పది గంటలకు కోర్టుకు రాగలిగితే బాగుంటుందని ఆయన నాకు సమన్లు ఇష్యూ చేశారని నా లాయర్ చెప్పాడు. నా మీద కేసు పెట్టిన వ్యక్తి ప్రముఖుడేం కాదు. అలాగని అతడికి సామాన్యుడి హోదాను కూడా ఇవ్వలేం. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ. మమతా బెనర్జీకి దగ్గరి బంధువు. తనని నేనేదో అన్నానని అతడి కంప్లయింట్. అన్నది నిజమా కాదా అని కోర్టు అడుగుతుంది. నిజమో కాదో నా ప్లీడర్ వెళ్లి చెప్పగలడు. బొత్తిగా ఇది ప్లీడర్కు ప్లీడర్కు మధ్య వ్యవహారం. అయినప్పటికీ నేనే స్వయంగా కోర్టుకు వస్తే తన తడాఖా ఏమిటో పశ్చిమ బెంగాల్ ప్రజలకు తెలుస్తుందని మమత ఆశిస్తుండవచ్చు. ఎన్నికలకు ముందు ఆశలు ఎవరికైనా సహజమే. అయితే కేసులతో ఆశలు నెరవేరతాయా! ఈ సందేహం మమతకు రాకపోవడమే అసహజం. గురు, శుక్రవారాల్లో బెంగాల్లోనే ఉన్నాను. గురువారం మమత వాళ్లవాళ్లతో మీటింగేదో పెట్టుకున్నారు. సరాసరి ఆ మీటింగు నుంచే వస్తున్నానని అంటూ.. ఒక వ్యక్తి బెరుకు బెరుగ్గా నా దగ్గరికి వచ్చాడు. ‘మీరే కదా అమిత్ షా’ అన్నాడు. ‘అవును నన్నే అమిత్ షా అంటారు. మోదీజీ నన్ను అలాగే అంటారు. మీ మేడమ్ మమత కూడా అలాగే అంటారు’ అన్నాను. ‘వాళ్లు అంటారు నిజమే. వాళ్లు అంటున్న అమిత్ షా యేనా మీరు అని నా సందేహం. ఆ సందేహం తీరితే నేను అడగవలసింది అడగగలను..’ అన్నాడు రొప్పుతూ. ‘మీ సందేహం తప్పక తీరుతుంది. అయితే ముందు నా సందేహం తీరనివ్వండి. దేశంలో అంతా నన్ను ఇట్టే పోల్చుకుంటారు నేను అమిత్ షా నని. నా పక్కన మోదీజీ లేకున్నా కూడా నేను అమిత్ షానేనని గుర్తుపట్టేందుకు కూడా ఎవరూ ఏమీ ఇబ్బంది పడరు. అలాంటప్పుడు దేశ ప్రజల్లో ఒకరైన మీకెందుకు సందేహం కలుగుతోంది?’ అని ప్రశ్నించాను. ‘లేదు. అలా ఏం లేదు. అయితే నేను వేరేలా ఆలోచించాను. రెండుసార్లు కరోనా వచ్చిన అమిత్షా.. అమిత్షాలా ఎలా ఉండగలరు అని నేను అనుకున్నాను. అందుకే మీరు అమిత్ షా అయి ఉంటారని మిమ్మల్ని చూసిన వెంటనే అనుకోలేకపోయాను’ అన్నాడు! అతడి మాటల్లో నిజాయితీ కనిపించింది. మమత మాటల్లో ఒక్కనాడైనా కనిపించని నిజాయితీ అది! ‘నేనే అమిత్షాని. ఇందుకు నేను మీకేమీ రుజువులు చూపించలేను. కరోనా వచ్చిపోయినా, రేపు ఎన్నికల్లో మమత ఓడిపోయినా నేను ఒకేలా ఉంటాను. నేనే అమిత్షా అనడానికి అదొక్కటే రుజువు. ఇప్పుడు చెప్పండి. నన్ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చారు మీరు?’ అని అడిగాను. ‘మిమ్మల్ని వెతుక్కుంటూ వెళితే మేము వెతుకుతున్నవాళ్లు మీ దగ్గర కనిపిస్తారని మమతా దీదీ పంపారు’ అని చెప్పాడు. ‘మిమీ చక్రవర్తి, ప్రతిమా మండల్, జీవన్ ముఖర్జీ, దేవశ్రీ రాయ్, మన్తూరామ్ పఖీరా.. వీళ్లనేనా మీరు వెతుకుతున్నది?’ అని అడిగాను. ‘అవును వాళ్లనే! మీకెలా తెలుసు దీదీ మీటింగ్కి వాళ్లు మిస్ అయ్యారని’ అని ఆశ్చర్యపోయాడు. ‘మీ దీదీ మీటింగ్కి వాళ్లు మిస్ అయ్యారని నాకు తెలీదు’ అన్నాను. ‘మరి వాళ్ల పేర్లు ఎలా చెప్పగలిగారు’ అన్నాడు మళ్లీ ఆశ్చర్యపోతూ. నన్ను మీట్ అవ్వాలనుకుంటున్న వాళ్ల పేర్లే నేను అతడికి చెప్పాను. ఆ సంగతి అతడికి చెప్పలేదు. ‘మీరు అమిత్షానే. రుజువులక్కర్లేదు’ అన్నాడు వెళ్లిపోతూ. సోమవారం కోర్టు పని మీద కోల్కతా వెళితే మళ్లొకసారి నేనే అమిత్షాని అని పనిలో పనిగా రుజువు అవుతుంది కానీ, రుజువు చేసుకునేంత అవసరం ఇప్పుడేముందని?! -
రాయని డైరీ.. నరేంద్ర మోదీ (ప్రధాని)
ప్రేమ గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. ఎక్కడో చదవనైతే చదివాను. ప్రేమ మనకు తెలియకుండా హృదయాన్ని పట్టేసుకుంటుందని! హృదయాన్ని పట్టేసుకున్నా ఏం కాదు. హృదయం పట్టనంత అయితేనే ఆ ప్రేమను ఎంతోకాలం లోపలే పట్టి ఉంచలేం. ఎవరితోనైనా పంచుకోవాలి. చెన్నైలో ఫ్లయిట్ దిగ్గానే.. ‘ఐ లవ్ చెన్నై’ అనేయాలన్నంతగా హృదయోద్వేగం ఒకటి నన్ను కమ్మేసింది. బలంగా నిలదొక్కుకున్నాను. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్సెల్వం పరుగున వచ్చారు. ‘‘మోదీజీ మీరు గానీ ఇప్పుడు తూలిపడబోయారా?’’ అని ఇద్దరూ ఒకేసారి అడిగారు. వాళ్ల ఆందోళన అర్థమైంది. నేనొస్తున్నానని చెన్నైలో నాలుగు అంచెల భద్రతా ఏర్పాట్లు చేయించారు. ఆరు వేల మంది సెక్యూరిటీ సిబ్బందిని సిటీ అంతా వరుసగా నిలబెట్టారు. ఒకవేళ నేను తూలిపడినప్పటికీ ఆ ఆరువేల మంది సిబ్బందీ చేయగలిగింది, చేయవలసిందీ ఏమీ లేదని తెలిసినా నేను తూలిపడటం కూడా తమ భద్రతా ఏర్పాట్ల వైఫల్యం కిందకే వస్తుందేమోనన్న కంగారు వారిలో కనిపించింది. ‘‘నన్ను నేను నియంత్రించుకున్నాను. అది మీకు తూలిపడబోయినట్లు అనిపించి ఉండొచ్చు’’ అని నవ్వాను. స్వామి, సెల్వం నవ్వలేదు. వెనక్కు తిరిగి చూసుకుంటున్నారు. ‘‘ఏమైంది? అన్నాను. మాట్లాడలేదు. ‘‘ఏమైంది.. మీరూ మిమ్మల్ని మీరు నియంత్రించుకోబోయారా?’’ అని అడిగాను. నియంత్రణ అనగానే అప్పుడు తేరుకుని అడిగారు.. ‘‘మోదీజీ.. మీరెందుకు మిమ్మల్ని మీరు నియంత్రించుకోవలసి వచ్చింది.. అదీ ఎయిర్ పోర్ట్లో..!’’ అని పళనిస్వామి అడిగారు. పన్నీర్సెల్వం అడగలేదు. ఇద్దరిదీ ఒకే ప్రశ్న అయినప్పుడు ఇద్దరూ ఒకే ప్రశ్న వేయడం ఎందుకన్నట్లు ఆగి, నా వైపు చూస్తున్నారు పన్నీర్సెల్వం. ‘‘నిజంగా అది నియంత్రించుకోవలసిన పరిస్థితే పళనిజీ. ఫ్లయిట్ దిగీ దిగగానే మొదట నాలో రెండు భావాలు చెలరేగాయి. ‘ఐ లవ్ చెన్నై’ అనే మాట నా ప్రమేయం లేకుండానే నా నోటి నుంచి రాబోయింది. ఆపుకున్నాను. ఫ్లయిట్ దిగీ దిగగానే వంగి ఈ తమిళభూమిని ముద్దాడాలన్న ఉద్వేగం నన్ను గాఢంగా కమ్ముకుంది. మళ్లీ ఆపుకున్నాను. ఐ లవ్ చెన్నై అనకుండా, తమిళభూమిని ముద్దాడకుండా ఉండేందుకే నన్ను నేను నియంత్రించుకోవలసి వచ్చింది’’ అని చెప్పాను. స్వామి, సెల్వం మాట్లాడలేదు! మళ్లీ వెనక్కు తిరిగి చూసుకుంటున్నారు. ‘‘ఏమైంది!’’ అన్నాను. ‘‘ఏం లేదు మోదీజీ! మీరు చెబుతున్నది వింటున్నాం. వింటూ వెనక్కు తిరిగి ఆలోచిస్తున్నాం. ‘ఐ లవ్ చెన్నై’ అని అనకుండా, తమిళభూమిని ముద్దాడకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోడానికి కారణం మాకు అర్థమైంది’’ అన్నారు పన్నీర్ సెల్వం. ‘‘అవును... అర్థమైంది మోదీజీ. వాలెంటైన్స్ డే పై మీకూ, ఆరెస్సెస్కు మంచి ఇంప్రెషన్ లేదు కనుక మీరు ‘ఐ లవ్’ అనే మాట అనకూడదు. తమిళభూమిని ముద్దాడకుండా ఉండేందుకు మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడమూ సహజమే. రేపు రాహుల్ అనొచ్చు.. ఎన్నికలొస్తున్నాయి కనుక మీకు తమిళభూమి ముద్దొస్తోందని. అందుకే ముద్దాడకుండా మీరు ముద్దాపుకున్నారు’’ అన్నారు పళనిస్వామి! ‘‘సరిగ్గా అర్థం చేసుకున్నారు’’ అన్నాను. చప్పుడు లేదు! మళ్లీ వెనక్కు తిరిగి చూసుకుంటున్నారు. వాళ్ల వెనకెవరూ లేరు. నీడలు మాత్రం ఉన్నాయి. వాటిని చూసుకుంటున్నారు. ఎవరి నీడలు వాళ్లు చూసుకోవడం ఏంటి! మళ్లీ వాళ్లు వెనక్కు తిరిగినప్పుడు చూశాను. పళనిస్వామి నీడను పన్నీర్సెల్వం, పన్నీర్సెల్వం నీడను పళనిస్వామి చూసుకుంటున్నట్లు నాకు అర్థమైంది. -
రాయని డైరీ.. నిర్మలా సీతారామన్ (ఆర్థిక మంత్రి)
‘‘ఊరెళ్లాలి మేడమ్ సెలవు కావాలి’’ అన్నాడు అనురాగ్ ఠాకూర్ సడన్గా వచ్చి! ‘‘ఏమైంది అనురాగ్?!’’ అన్నాను. ‘‘ఏం కాలేదు మేడమ్’’ అన్నాడు. ‘‘ఏం కానప్పుడు నువ్వు ఫిబ్రవరి 15 తర్వాత గానీ, మార్చి 8 లోపు గానీ, ఏప్రిల్ 8 తర్వాత గానీ ఊరెళ్లొచ్చు కదా అనురాగ్’’ అన్నాను. అవి సెషన్స్ ఉండని రోజులు. అయినా ఊరెళ్లడానికి సెలవు తీసుకునే వయసు కాదు అనురాగ్ది. నాకన్నా పదిహేనేళ్లు చిన్నవాడు కదా అని మాత్రమే అతడికి ఇస్తే సెలవు ఇవ్వాలి. ‘‘నువ్వేమీ బడి పిల్లాడివి కాదు అనురాగ్. బడ్జెట్ను సమర్పించిన ఆర్థికమంత్రికి సహాయ మంత్రివి. ప్రతిపక్షాలు ప్రశ్నలు అడిగే సమయానికి ఊరెళతానంటే ఎలా! బడ్జెట్ సెషన్స్ కానివ్వు..’’ అన్నాను. ‘‘బడ్జెట్ సెషన్స్ బోర్ కొడుతున్నాయి మేడమ్’’ అన్నాడు!! ‘‘బడ్జెట్ సెషన్స్ బడ్జెట్ హల్వాలా ఎలా ఉంటాయి అనురాగ్!’’ అన్నాను. ‘‘ఓ.. హల్వా! రెండు వారాలైంది కదా మేడమ్. మాలో ఎవరికైనా హల్వా చేయడం వచ్చా అని కూడా అడిగారు మీరు..’’ అన్నాడు. నిజమే! నిన్న మొన్న హల్వా చేసినట్లుంది. సినిమాల్లో డాక్టర్ ఆపరేషన్ చేస్తుంటే చుట్టూ చిన్న డాక్టర్లు చేరి మాస్కుల్లోంచి కళ్లు అప్పగించి చూస్తున్నట్లు నా ఫైనాన్స్ స్టాఫ్ అంతా నా చుట్టూ చేరి హల్వా తయారవుతున్న బాణలిలోకి తొంగి చూస్తున్నారు తప్పితే చూడ్డం వచ్చని గానీ, రాదని గానీ చెప్పలేదు! నా వెనుక భుజం మీద నుంచి ఎవరో చెక్క గరిట అందించారు. హల్వాను మెల్లిగా గరిటెతో పైకీ కిందికీ తిప్పుతున్నాను. పిల్ల డాక్టర్లు హల్వా మీదకు వంగి చూస్తున్నారు. ‘హల్వాని ఎలా తిప్పుతాం అబ్బాయిలూ.. పైకీ కిందికా, పక్కలకా..’ అని మా హల్వా డాక్టర్లని అడిగితే, ‘అసలు తిప్పుతామా మేడమ్’ అని తిరిగి నన్నే అడిగాడు ఒక డాక్టర్. ఆ అడిగిన డాక్టర్ ఎవరా అని తలతిప్పి చూశాను. అనురాగ్ ఠాకూరే! ‘కొంచెం చూస్తుంటావా అనురాగ్, బ్రేక్ తీసుకుంటాను..’ అన్నాను. ‘అలాగే మేడమ్’ అని కదా నా సహాయకుడిగా అతడు అనవలసింది.. ‘అందరం బ్రేక్ తీసుకుందాం మేడమ్..’ అన్నాడు! ‘అవును మేడమ్ అందరం బ్రేక్ తీసు కుందాం.. హల్వా కింద స్టౌ మంటను ఆపేసి..’ అనే మాట వినిపించింది! ఆ మాట అన్నది అనురాగ్ డాక్టర్ కాదు. ఇంకో హల్వా డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్. ఫైనాన్స్ సెక్రెటరీ. ‘అరె సుబ్రహ్మణియన్.. నువ్వెప్పుడొచ్చావ్?’ అన్నాను. ‘మీ చేతికి గరిటె ఇచ్చింది నేనే మేడమ్’ అన్నాడు. ‘బ్రేకులు మనం తీసుకోవచ్చు సుబ్రహ్మణియన్. స్టౌ మీద ఉన్న హల్వాకు బ్రేక్లు ఇవ్వకూడదు’ అని చెప్పాను. ఆ రోజంతా హల్వాతోనే గడిచిపోయింది. నా టీమ్లో స్టౌ వెలిగించడం వచ్చిన వాళ్లు కూడా లేనట్లున్నారు. ‘హల్వా సూపర్గా ఉంది మేడమ్’ అనైతే అన్నారు. ‘మీరు కూడా నేర్చుకుని చేసి చూడండయ్యా.. ఇంకా సూపర్గా వస్తుంది’ అన్నాను. మోటివేట్ అయినట్లు లేదు. ఈ మగపిల్లలు మాటలు ఎన్నైనా చెబుతారు. వంట మాత్రం నేర్చుకోరు. సండే కావడంతో రిలాక్సింగ్గా ఉంది. మొన్న మాన్సూన్ సెషన్స్కైతే శని, ఆది వారాల్లో కూడా పని చేశాం. ‘‘నమస్తే ఆంటీ..’’ అంటూ వచ్చింది పక్కింట్లో పేయింగ్ గెస్ట్గా ఉంటున్న అమ్మాయి. సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నట్లుంది. ‘‘రామ్మా.. కూర్చో..’’ అన్నాను. ‘‘ఆంటీ, వృద్ధి రేటు 11 శాతం వరకు ఉంటుంది అన్నారు కదా మీరు. అంత ఎలా పెరుగుతుంది ఆంటీ!’’ అంది. ‘‘అబ్బాయిలు వంట నేర్చుకుంటే పెరుగుతుందమ్మా..’’ అన్నాను. పెద్దగా నవ్వింది. ‘‘అవునాంటీ.. వృద్ధి రేటు పెరగడానికైనా ఈ బాయ్స్ వంట నేర్చుకోవాల్సిందే..’’ అంది. -
జో బైడెన్ (అమెరికా అధ్యక్షుడు).. రాయని డైరీ
ఫస్ట్ డే! వైట్ హౌస్ వెస్ట్ వింగ్లో ఉన్న ఓవల్ ఆఫీస్లోకి వెళ్లి కూర్చున్నాను. ప్రెసిడెంట్ చెయిర్! బాగా తొక్కి, పాడు చేసినట్లున్నాడు ట్రంప్. కూర్చోగానే కుర్చీ కిందకీ వెళ్లలేదు. పైకీ రాలేదు. చుట్టూ తిరగలేదు. కొన్ని స్క్రూలు, కొన్ని నట్లు ఏమైనా ఊడదీసి గానీ వెళ్లాడా ఏంటి ట్రంప్ అనే డౌట్ వచ్చింది. అలా చేస్తాడని నేను అనుకోను కానీ, కమలకు చెబితే మాత్రం తను అనుకుంటుంది.. ‘ఆ మనిషి అలాంటివాడే మిస్టర్ ప్రెసిడెంట్’ అని పెద్దగా నవ్వుతుంది. కమల నవ్వు బాగుంటుంది. ఆ నవ్వు ట్రంప్కి నచ్చదు. ‘ఎందుకు పిచ్చిదానిలా ప్రతిదానికీ పగలబడి నవ్వుతుంది!’ అని కమల ఎలా నవ్వుతుందో ఎన్నికల ర్యాలీలో నవ్వి చూపించాడు ట్రంప్! ఏమైంది? అమెరికన్ ప్రజలు కమల నవ్వును ఇష్టపడ్డారు. ‘కమల ఇలా నవ్వుతుంది’ అని నవ్వి చూపించిన ట్రంప్ని ఇష్టపడలేదు. వెస్ట్ వింగ్లోనే నా ఆఫీస్కి ఓ పక్కగా కమల ఆఫీస్. అందులోనే వైస్ ప్రెసిడెంట్ చెయిర్. రెండొందల తొంభై ఏళ్ల ఆ చెయిర్ జీవితంలో తొలి మహిళ కమల. చెయిర్కి మాటలు వచ్చుంటే కమలతో ఇప్పటికే ఇష్టంగా కబుర్లు చెప్పడం మొదలుపెట్టి ఉంటుంది. కబుర్లు చెప్పడం, కబుర్లు వినడం ఆడవాళ్ల రైట్ అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడీ సీట్లో నేను కాకుండా ట్రంప్ ఉండి, పక్క సీట్లో కమల ఉండి ఉంటే.. ‘ఏంటా కబుర్లు!’ అని ఇక్కడి నుంచే గట్టిగా కుర్చీని తిట్టేసేవాడు.. కుర్చీ అని కూడా చూడకుండా. అప్పుడు కమల.. ‘మిస్టర్ ట్రంప్.. మీకెందుకంత కోపం వస్తోంది. కుర్చీ అయితే మాత్రం?! కబుర్లు చెప్పాలని ఉండదా తనకు?!’ అని కుర్చీకి సపోర్ట్గా వెళ్లి ఉండేవారు. అప్పుడు ట్రంప్కు ఇంకా కోపం వచ్చి ఉండేది. ‘కుర్చీకి బుద్ధి లేకపోతే నీకు బుద్ధుండక్కర్లా? కుర్చీ.. కబుర్లు చెబుతోందని వింటూ కూర్చుంటావా?’ అని కుర్చీ ముందే కమలని తిట్టేసేవాడు. స్త్రీ ద్వేషి! అయినా ఫస్ట్ డే ఫస్ట్ టైమ్ ప్రెసిడెంట్ చెయిర్లో కూర్చొని, వెళ్లిపోయిన ప్రెసిడెంట్ గురించి ఆలోచిస్తున్నానేమిటి! కాళ్లు లాగుతున్నాయి! కుర్చీలో వెనక్కి వాలి, రెండు కాళ్లూ లేపి లేబుల్పై పెట్టే ప్రయత్నం చేశాను. కుర్చీ వెనక్కి వెళ్లడం లేదు! అమెరికా ప్రెసిడెంట్లకు కాళ్లు టేబుల్ పైన ఎత్తి పెట్టి కూర్చునే అలవాటు ఉంటుంది. ఒబామా అయితే కాళ్లు టేబుల్ మీద ఎత్తి పెట్టుకోడానికే వచ్చి కుర్చీలో కూర్చున్నట్లుగా ఉండేవారు! నేను మాత్రం పూర్వపు ప్రెసిడెంట్లు కూర్చున్నంత స్వేచ్ఛగా కాళ్లెత్తి పెట్టుకోడానికి లేదు. కమల ఎప్పుడొచ్చి.. ‘హాయ్.. మిస్టర్ ప్రెసిడెంట్’ అంటారో తెలీదు. అదీగాక ఎన్నికల ఫలితాలు వచ్చీరావడంతోనే ఆమెకు చెప్పేశాను.. ‘మన మధ్య ఎక్స్క్యూజ్మీలు, మే ఐ కమిన్లు ఉండకూడదు’ అని. ఆ మాటకు కమల పెద్దగా నవ్వారు. ‘మిస్టర్ ప్రెసిడెంట్.. నేను మిమ్మల్ని ‘మే ఐ కమిన్’ అని అడగక్కర్లేదు. కానీ మీరు నన్ను ‘మే ఐ కమిన్’ అని అడగడం నాకు సౌకర్యంగా ఉంటుంది’’ అన్నారు. నిజమే కదా! ఓవల్ ఆఫీస్ ఇక తనకు అలవాటు లేని కొత్త మర్యాదల్ని నేర్చుకోవడం మొదలుపెట్టాలి. కొంచెం శుభ్రం, కొంచెం శుచీ కూడా.. మాటల్లో, చేతల్లో, చూపుల్లో. ‘‘మిస్టర్ ప్రెసిడెంట్, మే ఐ కమిన్’’ అంటూ వచ్చారు కమల! ‘‘ప్లీజ్ కమ్.. మీ గురించే ఆలోచిస్తున్నాను’’ అన్నాను. ‘‘నా గురించా!’’ అని పెద్దగా నవ్వారు కమల. ఆమె నవ్వు బాగుంది. ‘‘అవును మీ గురించే’’ అన్నాను. ‘‘ఏంటి నా గురించి!’’ అన్నారు. ‘‘ఓవల్ ఆఫీస్ మీకు డే వన్ నుంచే అలవాటవుతుంది. ఓవల్ ఆఫీస్కి మీరు ఎప్పటికి అలవాటవుతారా అని ఆలోచిస్తున్నాను’’ అన్నాను. క్షణం ఆగగలిగి, నవ్వునిక ఆపుకోలేక పోయారు కమల. -
ఈటల రాజేందర్ (హెల్త్ మినిస్టర్) రాయని డైరీ
వ్యాక్సినేషన్లో పార్టిసిపేట్ చేసి గాంధీ హాస్పిటల్ నుంచి బయటికి వచ్చాను. వ్యాక్సిన్ వేయించుకున్నట్లు గుర్తుగా ఎడమ చేతి బొటనవేలికి ఇంకు చుక్క పెడుతున్నారు. రెండు వారాల తర్వాత రెండో డోస్ అంటున్నారు. అప్పుడు అదే వేలి మీద రెండో చుక్క పెడతారో, ఇంకో వేలేదైనా పట్టమంటారో! ఆ మాటే అడిగాను సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీని. బయట నాకోసం ఎదురుచూస్తూ ఉన్నాడతను. తెలంగాణ హెల్త్ సెక్రెటరీ. మనిషి చువ్వలా ఉంటాడు. యాంటీ బయాటì క్స్తో ల్యాబ్లో తయారైనట్లుగా ఉంటుంది బాడీ. ‘‘మీరు గ్రేట్ సర్’’ అన్నాడు. ‘‘దేనికి గ్రేట్ రిజ్వీ భయ్యా’’ అని అడిగాను. ‘‘నిన్న ప్రెస్ మీట్లో ‘మొదటి వ్యాక్సిన్ నేనే తీసుకుంటాను’ అంటున్నప్పుడు మీ కళ్లల్లో భయం కనిపించలేదు. ఈరోజు గాంధీ హాస్పిటల్ నుంచి బయటికి వస్తున్నప్పుడూ మీ కళ్లల్లో భయం కనిపించడం లేదు!’’ అన్నాడు. ‘‘అందులో గ్రేట్ ఏముంది రిజ్వీ భయ్యా! ఆరోగ్యశాఖ మంత్రికి ప్రజలొచ్చి ధైర్యం చెబుతారా? ఆరోగ్యశాఖ మంత్రే కదా వెళ్లి ప్రజలకు ధైర్యం చెప్పాలి’’ అన్నాను. ‘‘అయినా గానీ మీరు గ్రేట్ సర్. రెండోసారి వ్యాక్సినప్పుడు రెండో చుక్కను మళ్లీ అదే చేతికి, మళ్లీ అదే వేలికీ వేస్తారా అని అడిగారు తప్పితే, వ్యాక్సిన్ని మళ్లీ అదే చేతికి, అదే జబ్బకు వేస్తారా అని మీరు అడగలేదు. అది కూడా ధైర్యమే కదా సార్’’ అన్నాడు రిజ్వీ. నవ్వాను. చెయ్యి చురుక్ మంది! నవ్వితే చురుక్మందా? వ్యాక్సినేషన్లో పార్టిసిపేట్ చేసి వచ్చినందుకు చురుక్కుమనడం మొదలైందా?! రమేశ్రెడ్డి, శ్రీనివాస్ నా వెనకే వస్తున్నారు. రిజ్వీని వెళ్లనిచ్చి రమేశ్రెడ్డిని, శ్రీనివాస్ని దగ్గరకు పిలిచాను. రాలేదు! దూరం నుంచే.. ‘చెప్పండి సర్’ అన్నారు! ‘‘వ్యాక్సినేషన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ల నుంచి ఏమీ అంటవులేవయ్యా.. రండి దగ్గరకు..’’ అని పిలిచాను. ధైర్యం చేసి వచ్చారు. రమేశ్రెడ్డి మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్. శ్రీనివాస్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్. ‘‘వాళ్లు వేస్తున్నది కోవాగ్జినా, కోవిషీల్డా’’ అని అడిగాను. ‘‘గమనించలేదు సార్’’ అన్నారు! ‘‘హెల్త్ మినిస్టర్ పార్టిసిపేట్ చేసిన ప్రోగ్రామ్ని కూడా మీరు గమనించరా! వ్యాక్సిన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో కనీసం అదైనా తెలుసా?’’ అన్నాను. చెయ్యి మళ్లీ చురుక్కుమంది. ‘‘సూది గుచ్చిన చోట ‘చురుక్’ మంటుంది సర్..’ అన్నాడు రమేశ్రెడ్డి. ‘‘అది సైడ్ ఎఫెక్ట్ ఎందుకౌతుంది రమేశ్రెడ్డీ.. ఎఫెక్ట్ అవుతుంది కానీ! నువ్వు చెప్పలేవా శ్రీనివాస్.. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో?’’ అన్నాను. ‘‘సర్.. ఒకట్రెండు ఉంటాయి. తలనొప్పి, అలసట, కండరాల నొప్పి, జ్వరం, కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు. ఇంకా.. కడుపులో వికారం, వాంతులు, చెమటలు పట్టడం, జలుబు, దగ్గు, వణుకు, చికాకు..’’ చెప్పుకుంటూ పోతున్నాడు! ఆగమన్నాను. ఒకట్రెండు అని చెప్పి బాడీలో ఏ పార్ట్నీ వదలడం లేదు! ‘‘శ్రీనివాస్.. నేనడిగింది సైడ్ ఎఫెక్ట్స్ గురించి. నువ్వు చెబుతున్నది కరోనా సింప్టమ్స్ గురించి..’’ అన్నాను. ‘‘రెండూ ఒకేలా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు సార్. వ్యాక్సిన్ వేసుకోకుండానే ఈ లక్షణాలు కనిపిస్తే కరోనా అన్నట్టు. వ్యాక్సిన్ వేసుకోగానే కనిపిస్తుంటే వ్యాక్సిన్ పని చేస్తున్నట్టు..’’ అన్నాడు రమేశ్రెడ్డి. తలనొప్పి మొదౖలైంది! ‘వ్యాక్సిన్ వేయించుకోకున్నా ఊరికే వ్యాక్సినేషన్లో పార్టిసిపేట్ చేసి వచ్చినందుకు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా శ్రీనివాస్..’ అని అడగబోయీ అడగలేదు. -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: కె. జానారెడ్డి (కాంగ్రెస్)
నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు అభ్యర్థిగా నా పేరు వినిపిస్తోంది. కాంగ్రెస్లో వినిపించడం ఉండదు. వెళ్లి వినిపించుకోవడమే ఉంటుంది. నేను వెళ్ల లేదు, వెళ్లి వినిపించుకోలేదు. మరి నా పేరు నాకు వినిపించడం ఏమిటి?! ‘‘ఎనీబడీ హియర్ మీ’ అని మాణిక్యం ఠాగూర్ని అనుకుంటా, ఫోన్ చేసి అడిగాను. ‘‘చెప్పండి జానారెడ్డి గారూ మీరేనని తెలుస్తోంది’’ అన్నారు అటువైపు నుంచెవరో! ‘‘నేను జానారెడ్డినని మీకు తెలుస్తూనే ఉంది, మీరు మాణిక్యం ఠాగూర్ అని నాకు తెలిసేదెలా?!’’ అని అడిగాను. ‘‘తెలియకపోయినా ఏమౌతుంది చెప్పండి జానారెడ్డి గారూ. పొరపాటున మీ ఫోన్ ఉత్తమ్కుమార్రెడ్డికి వెళ్లినా ఏం కాదు. కాంగ్రెస్ నుంచి తను వెళ్లిపోయానని ఆయన అనుకుంటున్నారు తప్ప, ఆయన వెళ్లిపోయినట్లు కాంగ్రెస్ అనుకోవడం లేదు. నాగార్జున సాగర్ ఉపఎన్నికలో మిమ్మల్ని గెలిపించే బాధ్యత కూడా ఉత్తమ్కుమార్రెడ్డిదే. కనుక మీరు నాకు ఫోన్ చేయాలనుకుని ఉత్తమ్కి చేసినా, చేయవలసిన వాళ్లకే చేసినట్లవుతుంది. నేనొకటి కాదు, ఉత్తమ్ ఒకటి కాదు’’ అన్నాడు! ఉత్తమ్ వేరు, మీరు వేరు అని నేను మీతో అనలేదు కదా మాణిక్యం. మన పార్టీలో ఉన్నది ఇదే. ఊహించుకుని మాట్లాడతాం. ఉప ఎన్నికకు అభ్యర్థిగా నా పేరు ఎవరు చెప్పారో నాకై నేను ఊహించుకోలేక మీకు ఫోన్ చేస్తే, నన్ను గెలిపించే బాధ్యత ఎవరి మీద పెట్టారో చెప్పమని అడగడానికి నేను మీకు ఫోన్ చేసినట్లు మీరు ఊహించుకున్నట్లున్నారు! నాగార్జున సాగర్ అభ్యర్థిగా నా పేరును నాకు వినిపించేలా చేసిన ఆ మంచి వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనిపించే ఇప్పుడు మీకు ఫోన్ చేశాను. మీరు తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చినా, ఇక్కడ సోనియాజీకి దగ్గరగా ఉన్న తెలంగాణ నాయకులు మీరే కనుక మీకు ఫోన్ చేశాను? ఢిల్లీలో ఎవరైనా నా పేరు చెప్పారా? లేదంటే తెలంగాణలోనే ఎవరైనా చెప్పారా?’’ అని అడిగాను. ‘‘రెండు చోట్లా కాదు. తమిళనాడులో చెప్పారు’’ అన్నాడు!! ‘‘నాగార్జున సాగర్కి జానారెడ్డిని నిలబెడితే బాగుంటుందని తమిళనాడులో చెప్పారా?’’ అన్నాను. మాణిక్యం నవ్వారు. ‘‘అవును జానారెడ్డి గారూ.. నేను తమిళనాడులో ఉన్నప్పుడు సోనియాజీ ఫోన్ చేసి చెప్పారు. ఉత్తమ్కుమార్ వెళ్లిపోయిన ఖాళీని నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత భర్తీ చేస్తే బాగుంటుందని మీరు మేడమ్కి ఫోన్ చేసి చెప్పారట కదా. ‘అలా చేస్తే పార్టీకి ఎలాంటి ఉపయోగం కలుగుతుందో నాకైతే తెలియదు కానీ ఠాగూర్.. జానారెడ్డి నాకు ఫోన్ చేయడం వల్ల ఒక ఉపయోగం అయితే కలిగింది. నాగార్జున సాగర్కి ఎవరైతే బాగుంటుందా అని ఆలోచిస్తున్న టైమ్లో ఆయన ఒకరున్నారు కదా అని గుర్తొచ్చింది’ అని మేడమ్ నాతో అన్నారు’’ అని చెప్పాడు మాణిక్యం ఠాగూర్. నాకు తెలియకుండా నేనే నా పేరు వినిపించుకున్నట్లున్నాను! కాంగ్రెస్లో ఏం జరగబోతోందో అందరూ ఊహిస్తూనే ఉంటారు కానీ చివరికి ఎవరూ ఊహించనిదే కాంగ్రెస్లో జరుగుతుంది. అదే కాంగ్రెస్ గొప్పదనం. ‘‘నేను అస్సలు ఊహించలేకపోతున్నాను మాణిక్యం..’’అన్నాను. ‘‘పోనీ మీరు కాకుండా నాగార్జున సాగర్కు ఎవరున్నారో చెప్పండి. మిమ్మల్ని కాకుండా నాగార్జున సాగర్కు ఎవరిని ఉంచాలో నేను చెబుతాను’’ అన్నాడు. ‘‘అర్థం కాలేదు మాణిక్యం’’ అన్నాను. ‘‘నాగార్జునసాగర్లో టీడీపీని ఓడించింది మీరే. టీఆర్ఎస్ని ఓడించిందీ మీరే. ఇప్పుడిక బీజేపీని ఓడించవలసిందీ మీరే కదా జానారెడ్డి గారూ..’’ అన్నాడు! తెలంగాణ కాంగ్రెస్ కన్నా, తమిళనాడు కాంగ్రెస్ షార్ప్గా ఉన్నట్లుంది!! -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: నరేంద్ర మోదీ (ప్రధాని).
‘‘మెస్మరైజ్ చేశారు మోదీజీ మీ సన్రైజ్ కవిత్వంతో..’’ అని ఉదయాన్నే ఫోన్ చేశాడు హర్షవర్ధన్! ‘‘హర్షవర్ధన్.. నిన్న కదా నా కవిత్వానికి నువ్వు మెస్మరైజ్ అవాల్సింది’’ అన్నాను. ‘‘నేను మళ్లీ ఈరోజు విన్నాను మోదీజీ. నిన్న వ్యాక్సిన్ ఏర్పాట్లలో ఉండి.. విన్నానని, బాగుందనీ చెప్పలేకపోయాను. ‘అభీ తో సూరజ్ ఉగా హై..’ అని మీ గొంతులోంచి దిగుతున్న కవిత్వం, సూర్యుణ్ణి పైకి లేపుతోంది’ అన్నాడు. ‘నా కవిత్వం బాగుందన్న విషయాన్ని నువ్వు నీ కవిత్వంతో చెప్పక్కర్లేదు హర్షవర్ధన్. చెప్పు.. ఏంటి? ’’ అన్నాను. ‘‘జనవరి ఫస్ట్ ఉదయం ఆలస్యంగా లేవకూడదనుకుని డిసెంబర్ థర్టీ ఫస్ట్న త్వరగా పడుకున్నాను మోదీజీ. త్వరగా పడుకున్నందువల్ల త్వరగా నిద్ర పట్టింది కానీ, త్వరగా నిద్ర లేవలేకపోయాను! మధ్యాహ్నం అయింది. ‘సూర్యుడిప్పుడే మేల్కొన్నాడు’ అని మోదీజీ గొప్ప కవిత్వం రాసి చదివారు విన్నారా?’ అని అమిత్జీ ఫోన్ చేసి అడిగారు. ‘వినబోతుంటేనే మీరు ఫోన్ చేశారు’ అని ఆయనకు చెప్పి, విన్నాక మీకు ఫోన్ చేశాను మోదీజీ’’ అన్నాడు. ‘‘ఏం చెబుతామని ఫోన్ చేశావో అది చెప్పు హర్షవర్ధన్. జనవరి ఫస్ట్ కోసం చదివిన కవిత్వం అది. ఫస్ట్ వెళ్లిపోయింది కదా.. నెక్స్›్ట ఏమిటో చెప్పు..’’ అన్నాను. ‘‘నెక్స్›్ట మళ్లీ రెండువేల ఇరవై రెండులోనే కదా మోదీజీ ఇంకో జనవరి ఫస్ట్ సన్రైజ్ ఉంటుంది’’ అన్నాడు!! దేశంలోకి కరోనా ఎంటరైనప్పటి నుంచి హర్షవర్ధన్ నెలల్నీ, రోజుల్నీ వదిలేసి, సంవత్సరాల్లోనే మాట్లాడుతున్నాడు! కరోనా ఎప్పటికి పోతుంది? కనీసం ఏడాది. కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది? ఏడాది తర్వాతే. వ్యాక్సిన్ పని చేస్తుందా? ఏడాదికి గానీ తెలి యదు. మళ్లీ రాకుండా ఉంటుందా? ఏడాది చూసి గానీ చెప్పలేం. ఏడాదిగా ఇంతే! ఇప్ప టికీ హర్షవర్ధన్ తన స్టాండ్పై తను ఉన్నాడు. ‘అలా ఎలా చెబుతావ్ హర్షవర్ధన్?’ అని ఓ రోజు ఫోన్ చేసి అడిగాను. తన స్టాండు మార్చుకోలేదు! ‘ఆరోగ్యశాఖ ధైర్యం చెప్ప కూడదు మోదీజీ. ప్రజల్లో భయం పోతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా భయం చెప్పిందే కానీ..వ్యాక్సినొస్తుందని గానీ, వచ్చిన వ్యాక్సిన్ బాగా పని చేస్తుందని గానీ ఏనాడూ ధైర్యం చెప్పలేదు’ అన్నాడు. ఇప్పుడైనా స్టాండు దిగాడో లేదో?! ‘‘ వ్యాక్సిన్ డ్రై రన్ బాగానే జరుగుతోందా హర్షవర్ధన్? మనవి కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు కదా. ఫారిన్ వాళ్ల ఫైజర్ వ్యాక్సిన్ ఎలా పని చేస్తోందట? రష్యా వాళ్ల స్పుత్నిక్ వ్యాక్సిన్ గురించి ఏమైనా తెలిసిందా?’’ అని అడిగాను. ‘‘ఇప్పుడే అడిగితే బాగా పని చేస్తుందని చెబుతారు మోదీజీ. ఏడాది తర్వాత అడుగుదాం’’ అన్నాడు! ‘‘బాగా పనిచేస్తుంటే మనమూ ఫైజర్ వ్యాక్సిన్ తెప్పించుకుందాం హర్షవర్థన్. కోవి షీల్డ్, కోవాగ్జిన్ కోసం ఆగడం ఎందుకు? డ్రై రన్ కూడా మొదలుపెట్టేశాం కదా..’’ అన్నాను. ‘‘మోదీజీ.. ఫైజర్ వ్యాక్సిన్ ఎలా పని చేస్తుందో తెలీదు. స్పుత్నిక్ వ్యాక్సిన్ ఎలా పని చేస్తుందో తెలీదు. మన కోవిషీల్డ్, కోవాగ్జిన్లు ఎలా పని చేస్తాయో తెలీదు. ఒకటి మాత్రం నమ్మకంగా చెప్పగలను’’ అన్నాడు! ‘చెప్పగలను’ అన్నాడు కాబట్టి చెప్పడం కోసం ఆగాను. ‘‘మోదీజీ.. డిసెంబర్ థర్టీఫస్టంతా నాకు గొంతునొప్పిగా ఉంది. కాస్త జ్వరంగా కూడా ఉంది. రెండు మూడు పొడి దగ్గులూ దగ్గాను. జనవరి ఫస్ట్ మధ్యాహ్నం నుంచీ అవేమీ లేవు. అందుకే అన్నాను.. మెస్మరైజ్ చేశారు మీ సన్రైజ్ కవిత్వంతో.. అని. అది చెప్పడానికే ఫోన్ చేశాను’’ అన్నాడు!! -
హ్యాపీ న్యూ ఇయర్ సిల్వీ
జీవితాన్ని ముఖ్యమైనదిగా తప్ప ఇష్టమైనదిగా గడిపే అవకాశాన్ని నిరాకరించే అననుకూలతలు స్త్రీలకే ఎక్కువ. తనకు ఇష్టమైన కలలతో పాటు.. తన భర్తకు, పిల్లలకు ముఖ్యమైన కలల్నీ ఆమె నిజం చేసుకోవాలి! సాధ్యం అవుతుందా? అవుతుంది. ఇల్లు సపోర్ట్ ఇస్తే జీవితమూ పూలగుత్తితో వస్తుంది. మనస్ఫూర్తిగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతుంది. ‘‘నేనేం గ్రహించానో తెలుసా? జీవితం మనకు అస్సలు ఇష్టంలేని వాటికి సమయాన్ని వెచ్చించలేనంత చిన్నది..’’ అంటుంది సిల్వీ. ఉద్యోగం చేస్తుంటుంది తను. టీవీ స్టేషన్లో తనకు ఇష్టమైన ఉద్యోగం. ఉద్యోగంలా చేయదు. ఉద్యోగమే తన జీవితం అన్నంతగా చేస్తుంది. ఆమె జీవితంలో మరికొన్ని కూడా ఉంటాయి. ఇల్లు, వంట, భర్త, ఇంటికి వచ్చిపోతుండే అతిథులు. ‘‘అవన్నీ నువ్వే చూస్కో, నేను చేయలేను..’’ అంటుంది భర్తతో. ఆఖరికి అతిథుల్ని కూడా! ‘‘బాగోదు సిల్వీ.. అతిథులు ముఖ్యం కదా. కొన్నిరోజులు ఆఫీస్కి సెలవు పెట్టేయ్..’’ అంటాడు భర్త. ఆ ఘర్షణలోనే.. ‘జీవితం మనకు అస్సలు ఇష్టం లేనివాటికి సమయాన్ని వెచ్చించలేనంత చిన్నది..’ అని భర్తతో అంటుంది సిల్వీ. వాపోవడమది. సిల్వీస్ లవ్’ చిత్రంలో సిల్వీ పాత్రధారి టెస్సా థాంప్సన్ జీవితంలో ముఖ్యమైనవీ, ఇష్టమైనవీ రెండూ ఉంటాయి. రెండిటికీ కలిపి ఒకే సమయం ఉంటుంది. ముఖ్యమైనవీ, ఇష్టమైనవీ వేటికవి జరిగిపోతున్నా.. ఇష్టమైనవి చేయనివ్వకుండా ముఖ్యమైనవి అడ్డుపడుతున్నప్పుడే.. ‘జీవితం పొద్దెక్కిపోతోందే’ అని మనసు త్వరపడి బలాన్ని కూడదీసుకుని ఇష్టమైనవాటి వైపు పరుగులు తీయాలని చూస్తుంది. ఆ వెనకే.. స్ట్రెస్. కన్నీళ్లు. ఇక్కడ సిల్వీ కూడా ఏడుస్తుంది. అర్థం చేసుకోగలిగిన భర్త అయుండీ, అర్థం చేసుకోలేకపోతున్న స్థితిలో మృదువుగా నెమ్మదైన స్వరంతో సిల్వీతో వాదించి ఆమె గదిలోంచి వెళ్లిపోతాడు. ఇంట్లోని గెస్ట్లకు మర్యాదలు అందించే పనిలో పడతాడు. అది అతడికి ముఖ్యమైన పని కాకుండా, ఇష్టమైన పని అయి ఉంటే కనుక అతడికోసం సిల్వీ తనకు ఇష్టమైన పనిని వదిలి, అతడికి ఇష్టమైన పనిని తన ముఖ్యమైన పనిగా మీద వేసుకుని గెస్ట్లు ఉన్న హాల్లోకి వెళ్లి ఉండేదేమో. ఇష్టమైన పని చేయడానికి వీల్లేకపోవడం ఎంత తీవ్రమైన మానసికమైన ఒత్తిడో ఆమెకు తెలుసు కాబట్టి వెళ్లి ఉండేదే..నేమో. కొండంత పని కలిగించే ఒత్తిడి కన్నా, ఇష్టమైన పనిని పిసరంతైనా చేయడానికి వీల్లేకపోవడం కొండంత ఒత్తిడి. నోటిఫికేషన్ పడకుండానే, దరఖాస్తు చేయకుండానే, ఇంటర్వ్యూ లేకుండానే, అసలు ఇష్టమే లేకుండానే వెళ్లిపోయి తప్పనిసరిగా చేయవలసిన ఉద్యోగం స్త్రీకి.. పెళ్లి, భర్త, ఇల్లు! ఆమెకు ఇష్టమైన ఉద్యోగం వేరే చోట ఎక్కడైనా ఉండొచ్చు సిల్వీకి టీవీ స్టేషన్లో ఉన్నట్లు. ఈ ‘ముఖ్యం’–‘ఇష్టం’ మధ్య ఆ గోడకూ ఈ గోడకూ షటిల్ అవుతూ కింద పడిపోకుండా జీవితాన్ని లాగించేవాళ్లలో స్త్రీలు మాత్రమే ఉంటారని కాదు. జీవితాన్ని ముఖ్యమైనదిగా తప్ప ఇష్టమైనదిగా గడిపే అవకాశాన్ని నిరాకరించే అననుకూలతలు స్త్రీలకే ఎక్కువే. తనకు ఇష్టమైన కలలతో పాటు.. తన భర్తకు, పిల్లలకు ముఖ్యమైన కలల్నీ ఆమె నిజం చేసుకోవాలి! సాధ్యం అవుతుందా? అంత సమయాన్ని ఆమెకు ఉదారంగా ఇచ్చేందుకు జీవితమేమీ స్త్రీవాది కాదు. జీవితం మనకు అస్సలు ఇష్టంలేని వాటికి సమయాన్ని వెచ్చించలేనంత చిన్నది అంటే, జీవితం మనకు అస్సలు ఇష్టం లేని పనులను చేసుకుంటూ పోగలిగినంత పెద్దది కాదనే. ముఖ్యమైన పని ‘స్టేటస్’ను ఇస్తే ఇవ్వొచ్చు. ఇష్టమైన పని ‘సాఫల్యత’ను ఇస్తుంది. ఇంటిముందుకు ఖరీదైన కొత్త కారు రావడం స్టేటస్. స్టేటస్ లేట్ అవుతుంటే ‘ఏంటండీ.. మీరింకా కారే కొనలేదు’ అని ఇంటి ముందుకొచ్చి ఎవ్వరూ అడిగిపోతుండరు. సాఫల్యతకు సమయం మించిపోతుంటేనే.. ‘గడియారం చూసుకున్నావా? జీవితం ఎంతైందో తెలుసా!..’ అని మనసు అదేపనిగా అడగడానికొస్తుంది. సిల్వీపాత్ర ఇటీవలి హాలీవుడ్ చిత్రం ‘సిల్వీస్ లవ్’ లోనిది. సిల్వీ వర్కింగ్ ఉమన్. ఈ కొత్త సంవత్సరం సిల్వీలందరినీ వారికి ఇష్టమైన ఉద్యోగాలను హాయిగా చేసుకోనివ్వాలి. ఇల్లు సపోర్ట్ ఇస్తే జీవితమూ పూలగుత్తితో వస్తుంది. మనస్ఫూర్తిగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతుంది. -
రేవంత్రెడ్డిని మాత్రం కానివ్వను..
రేవంత్రెడ్డిని ప్రెసిడెంట్ని చేస్తారని మళ్లీ ఓ బ్రేకింగ్. రెండు రోజులుగా టీవీల్లో ఆ బ్రేకింగ్ వినిపిస్తూనే ఉంది. బ్రేకే రావడం లేదు. మీరుండగా, కోమటిరెడ్డి ఉండగా, భట్టి విక్రమార్క ఉండగా, శ్రీధర్బాబు ఉండగా, జీవన్రెడ్డి ఉండగా, పొన్నం ప్రభాకర్ ఉండగా, మధు యాష్కీ ఉండగా.. టీడీపీని ముంచి కాంగ్రెస్లోకి వచ్చిన రేవంత్రెడ్డిని టీపీసీసీ చీఫ్ని చెయ్యడం ఏమిటని టీవీ చానెళ్ల వాళ్లు మైకులు, వ్యాన్లు వేసుకొచ్చి బాధగా మా ఇంటి బయట అరుగు మీద కూర్చున్నారు. నేనూ బయటికే కనిపించేలా ఇంటి లోపల కూర్చొని ఉన్నాను. కొద్దిసేపు అలా కూర్చున్నాక.. దారిన పోయేవాళ్లు నన్ను, మీడియాను కలిపి చూసుకుంటూ వెళ్తున్నట్లు అనిపించి పడక్కుర్చీలోంచి కుర్చీలోకి మారాను. ‘‘హనుమంతరావు గారూ.. మీకేం వయసైపోయిందని.. మీరుండగా, కోమటి రెడ్డి ఉండగా, భట్టి విక్రమార్క ఉండగా..’’ అని మళ్లీ మొదలు పెట్టారు! ‘‘ఇదిగో బాబూ.. నేనేమీ అనుకోను గానీ, ‘మీరుండగా..’ అని అనడానికి మీరేమీ కష్టపడకండి. నేను కాకుండా మిగతావాళ్లలో ఎవరు ప్రెసిడెంట్ అయినా నేనేమీ అనుకోను. రేవంత్రెడ్డిని మాత్రం కానివ్వను’’ అన్నాను. ‘‘ఒకవేళ అయితే?’’ అని గుంపులోంచి ఎవరో అన్నారు. అతడి వైపు చూశాను. ‘కానివ్వను’ అని నేను అంటుంటే, ‘ఒకవేళ అయితే’ అని అంటున్నాడు! ‘‘నువ్వుగానీ సోనియాజీతో మాట్లాడి రేవంత్రెడ్డిని ప్రెసిడెంట్ని చేయబోతున్నావా?’’ అని అడిగాను. అతడు మళ్లీ మాట్లాడలేదు. సమర్థుడు కాని వారెవరినీ కాంగ్రెస్ చేరనివ్వదు. సమర్థులైనవారిని చేరదీసేందుకు తొందరపడదు. ఉత్తమ్కుమార్రెడ్డి తొందరపడి వెళ్లిపోయాడు కానీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాం అని ఉత్తమ్ని గానీ, నన్ను గానీ, తక్కిన సీనియర్లను గానీ కాంగ్రెస్ అడిగిందా?! రాహుల్ అడిగాడా, సోనియా అడిగారా, గులామ్ నబీ ఆజాద్ అడిగారా? నిజానికి వీళ్లంతా అడగవలసిన బాధ్యత ఉన్నవాళ్లు. మోదీని అడుగుతారు. మోదీని అడగమని రాష్ట్రపతిని అడుగుతారు. సొంత పార్టీలోని వాళ్లను మాత్రం ఒక్క మాటా అడగరు. కాంగ్రెస్లో ఉండే పద్ధతీ పెద్దరికమే ఇది. నిలబడి నీళ్లు తాగడం మేలనుకుంటుంది. అప్పటికీ తాగదు. పరుగెత్తడం లేదు కదా, తాగడం ఎందుకు అనుకుంటుంది! నాకైతే నమ్మకం. టీపీసీసీ పోస్టును ఇప్పట్లో కాంగ్రెస్ ఎవరికీ ఇవ్వదు. ప్రధాని కొన్ని కేబినెట్ పోస్టుల్ని దగ్గర పెట్టుకున్నట్లుగా కాంగ్రెస్ అధిష్టానం పార్టీ ప్రెసిడెంట్ పోస్టులను బూజు పట్టేవరకు తన దగ్గరే ఉంచుకుంటుంది. పార్టీ ఓడిపోడానికి, పార్టీ ప్రెసిడెంటుకు సంబంధం లేదని కాంగ్రెస్ నమ్ముతుంది కనుక పార్టీని గెలిపించడం కోసమైతే మాత్రం పార్టీ ప్రెసిడెంటును నియమించదు. పార్టీ ఓడిపోయిందని పార్టీ అధ్యక్షుల్ని తొలగించదు. రాహుల్ అయినా, ఉత్తమ్ అయినా ఓటమి బాధ్యతను వాళ్ల భుజాన వాళ్లు వేసుకుని వెళ్లిపోవడమే. కాంగ్రెస్ ఏం చేస్తుందో ఏం చెయ్యదో ఊహించడం కూడా కష్టమే. పార్టీని గెలిపించలేకపోయిన వాళ్లను ఎంపిక చేసుకుని మరీ అధ్యక్షుడిని చేసినా చేస్తుంది! జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రేవంత్రెడ్డి నలభై ఎనిమిది డివిజన్లకు ఇన్చార్జిగా ఉన్నాడు. బీజేపీకీ సరిగ్గా నలభై ఎనిమిది సీట్లొచ్చాయి. కాంగ్రెస్కు రెండంటే రెండే. పెరగలేదు. తగ్గలేదు. అందుకు రేవంత్రెడ్డి కారణం కాదనుకుంటే కనుక రేవంత్ని ప్రెసిడెంట్ని చెయ్యడానికి కాంగ్రెస్కి కారణం ఉండదు. మీడియా వాళ్లకు బ్రేకింగ్ ఏదో వచ్చినట్లుంది! సరంజామా సర్దుకుంటున్నారు. రేవంత్రెడ్డి దగ్గరకే కావచ్చు. వర్క్ లేకున్నా ప్రెసిడెంట్లు అయ్యే వర్కింగ్ ప్రెసిడెంట్లు కాంగ్రెస్లోనే ఉంటారు. మాధవ్ శింగరాజు -
బండి సంజయ్ (బీజేపీ).. రాయని డైరీ
ప్రెస్వాళ్లు వచ్చి కూర్చున్నారు. తెలంగాణలో బీజేపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి ఆ సీఎం పెట్టిన ప్రెస్ మీట్కు వచ్చినట్లుగా వచ్చింది మీడియా మొత్తం! హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘన విజయం ముందు పార్టీ ఆఫీసు బాగా చిన్నదైపోయినట్లుగా కనిపిస్తోంది. ఒకరిద్దరు మీడియా మిత్రులు ఒకే కుర్చీపై సర్దుకుని కూర్చోవడం గమనించాను. ‘‘ఈ విజయాన్ని మీరెలా ఆస్వాదిస్తున్నారు?’’ అని వారిలోంచి ఒకరు అడగడంతో నా ప్రమేయం లేకుండానే ప్రెస్ మీట్ మొదలైంది. అసలైతే ప్రెస్ మీట్ను నేను ఇంకోలా ప్రారంభించాలని తలచాను. ‘‘మీరెలా ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు?’’ అని నేనే ప్రెస్ను అడగదలచుకున్నాను. మోదీజీ అయితే ఇలానే అడుగుతారు ప్రెస్ని. అయినా, ఆయనెప్పుడు విజయాన్ని ఆస్వాదించారని! ఆరేళ్లుగా ప్రతిపక్షాల అపజయాలను ఆస్వాదించడంతోనే సరిపోతోంది మోదీజీకి. ‘‘చెప్పండి, ఈ విజయాన్ని మీరెలా ఆస్వాదిస్తున్నారు?’’ అని గద్దించినట్లుగా తన ప్రశ్నను రిపీట్ చేశాడు ఆ పత్రికా ప్రతినిధి. ‘‘విజయం ఆసనం లాంటిది. ఆసనంపై ఆసీనమవడమే కానీ, ఆస్వాదించడం ఉండదు’’ అన్నాను. ఆ మాటకు ఎవరైనా నవ్వుతారని ఆశించాను. నవ్వలేదు! ప్రెస్ మీట్లో కేసీఆర్ ఏదైనా అంటే నవ్వుతారు. కేటీఆర్ ఏదైనా అంటే నవ్వుతారు. కేసీఆర్ లేదా కేటీఆర్ మాటలకే నవ్వడానికి వీళ్లు అలవాటు పడ్డారా?! అలా అలవాటు చేయబడ్డారా?! ‘మిత్రులారా, బీజేపీ విజయం గురించి అడగడానికి మీ దగ్గర ప్రశ్నలేమీ ఉండవని నాకు తెలుసు. టీఆర్ఎస్ అపజయం గురించి మీరు కొన్ని ప్రశ్నలు వేయవచ్చు..’’ అన్నాను. ‘‘టీఆర్ఎస్ది అపజయం అని మీరెలా అంటారు బండి గారు’’ అన్నాడు ఓ ప్రతినిధి. ఆశ్చర్యపోయాను. ‘‘కొన్ని గంటల ముందే కదా.. ప్రెస్కి మా విజయాన్ని గుర్తించవలసిన పరిస్థితి ఏర్పడి మీరంతా నన్ను కలుసుకున్నది. ఆ కొత్తదనమైనా లేకుండా అప్పుడే మీరు నన్ను బండి గారు అంటున్నారేమిటి! నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నదేమిటంటే.. బీజేపీ విజయాన్ని మీరు టీఆర్ఎస్ అపజయంగా భావించో లేదా, టీఆర్ఎస్ అపజయాన్ని బీజేపీ విజయంగా భావించో బీజేపీని ఏ విధంగానూ అంగీకరించేందుకు మనసొప్పక, ఆ అనంగీకారతతో నన్ను ‘బండి’ అని సంబోధిస్తున్నారని! ఇక నా అభ్యర్థన ఏమిటంటే.. నేను మీ చేత బండి అని పిలిపించుకోడానికి నాక్కొంత శక్తిని, తగినంత సమయాన్ని ఇమ్మని. ఇప్పటికైతే సంజయ్ అనొచ్చు’’ అన్నాను. ఈలోపు మరొక ప్రతినిధి చెయ్యి లేపాడు. ‘‘సంజయ్ గారూ.. టీఆర్ఎస్ సీట్లు తగ్గి, బీజేపీ సీట్లు ఎక్కువ రావడానికి మీకు కనిపి స్తున్న కారణాలు ఏమిటి? మీకు అనిపిస్తున్న కారణాలు ఏమిటి?’’ అని అడిగాడు. ‘‘మిత్రమా.. నాకు కనిపిస్తున్న కారణాలు, నాకు అనిపిస్తున్న కారణాలు ఏమిటని మీరు అడిగారు. నిజానికి మీకు కదా కారణాలు కనిపించవలసినదీ, కారణాలుగా ఏవైనా అనిపించవలసినదీ. కనుక మీరే చెప్పండి’’ అని అడిగాను. తర్వాత కొన్ని ప్రశ్నలు. వాటికి జవాబులుగా నా ప్రశ్నలు. చివరి ప్రశ్న ఒక మహిళా ప్రతినిధి నుంచి వచ్చింది. ‘‘సంజయ్ గారూ.. మీరేమైనా చెప్పదలచుకున్నారా?’’ అని! గుడ్ క్వొశ్చన్ అన్నాను. ‘‘అయితే గుడ్ ఆన్సర్ ఇవ్వండి’’ అన్నారు నవ్వుతూ ఆ ప్రతినిధి. ‘‘నేను చెప్పదలచినది, గ్రేటర్ ఫలితాలు చెప్పేశాయి’’ అన్నాను. -
రాయని డైరీ : కపిల్ సిబల్ (కాంగ్రెస్)
‘‘ఉన్నారా?’’ అని ఫోన్ చేశారు చిదంబరం! ‘‘ఉన్నాను చెప్పండి చిదంబరం జీ’’ అన్నాను. ‘‘మీరూ నేను ఎక్కడికి పోతాం చెప్పండి సిబల్ జీ. ‘ఉన్నారా’ అని నేను అడిగింది ‘మీరు ఉన్నారా’ అని కాదు. ‘మీ పక్కన ఎవరైనా ఉన్నారా’ అని’’ అన్నారు చిదంబరం. నాకూ ఆ సందేహం వచ్చింది. నాకు ఫోన్ చేసి నన్నే ‘ఉన్నారా’ అని చిదంబరం ఎందుకు అడుగుతారు.. ఎంత నాకన్నా మూడేళ్లు పెద్దవారైతే మాత్రం! ఆ మాటే చిదంబరంతో అన్నాను. పెద్దగా నవ్వారు. కాంగ్రెస్లో వయసుడిగేవారు, వయసడిగేవారు ఉండరు. ‘‘సో, ఎవరూ లేరు మీ పక్కన. ఉంటే మీరు మీ వయసు గురించి కానీ, నా వయసు గురించీ కానీ ఆలోచించేవారు కాదు కదా..’’ అని మళ్లీ నవ్వారు. నవ్వి, ‘‘ఎక్కడున్నారు?’’ అని అడిగారు. ఒక్క క్షణం ఆగాను. నేనున్నది ఢిల్లీలో. ఢిల్లీలో ఉన్నాను అని చెబితే.. ఢిల్లీలో కాంగ్రెస్ లేదని తెలిసీ ‘విషయాలేంటి?’ అని అడుగుతారు. కొన్నిసార్లు నేను జలంధర్లో కూడా ఉంటాను. జలంధర్లో ఉన్నానని చెబితే పంజాబ్లో ఉన్నది కాంగ్రెస్సే కనుక ‘విషయాలేంటి?’ అని అడగరు. ఓసారి ఇలాగే జలంధర్లో ఉన్నానని చెబితే టప్మని ఫోన్ పెట్టేశారు. ‘ ఫోన్ పెట్టేశారేమిటి?’ అని వెంటనే ఫోన్ చేసి అడిగాను. ‘ఢిల్లీలో ఉన్నారేమో విషయాలేంటి అని అడుగుదామనుకున్నాను. జలంధర్లో ఉన్నానన్నారు కనుక విషయాలేముంటాయ్ లెమ్మని పెట్టేశాను’ అన్నారు. అది గుర్తొచ్చి, జలంధర్లో ఉన్నాను అని అబద్ధం చెప్పాను. విషయాలు అడగరని. ‘‘జలంధర్లో ఉన్నారా.. ఢిల్లీ ఎప్పుడు వెళ్తారు?’’ అన్నారు. ‘‘ఎందుకు చిదంబరం జీ?’’ అని అడిగాను. ‘‘ఏం లేదు, మీరు ఢిల్లీ వెళ్లాక ‘విషయాలేంటి?’ అని అడుగుదామనీ..’’ అన్నారు! ఒక గంటలో ఢిల్లీలో ఉంటాను. నేనే మీకు ఫోన్ చేస్తాను’’ అన్నాను. గంట తర్వాత ఆయనే చేశారు! ‘‘ఉన్నారా?’’ అని అడిగారు! ‘చేరుకున్నారా?’ అని అడగాలి. ‘ఉన్నారా?’ అని అడిగారు! తెలిసిపోయిందా నేను ఢిల్లీలోనే ఉన్నట్లు?! ‘‘చిదంబరం జీ, ‘ఢిల్లీ చేరుకున్నారా?’ అని కదా మీరు నన్ను అడగవలసింది, ‘ఉన్నారా?’ అని అడిగారేమిటి?’’ అని అడిగాను, ‘‘చేరుకుని ఉంటారని ఊహించి.. ‘ఉన్నారా?’ అని అడిగాను’’ అన్నారు! ‘ఉన్నాను..’ అని మళ్లీ నన్ను చెప్పనివ్వకుండా.. ‘‘మీ పక్కన ఎవరైనా ఉన్నారా?’’ అని అడిగారు. ‘‘లేరు చిదంబరం జీ, నా పక్కనెవరూ లేరు చెప్పండి’’ అన్నాను. ‘‘ఎక్కడున్నారు?’’ అని అడిగారు!! ‘‘ఢిల్లీలోనే చిదంబరం జీ.. మీకెందుకు డౌటొచ్చిందీ’’ అన్నాను. ‘‘ఎక్కడున్నారు అని అడిగింది మిమ్మల్ని కాదు సిబల్ జీ, మీ పక్కన లేనివారు ఇప్పుడెక్కడున్నారూ అని..’’ అన్నారు! చిదంబరం అడుగుతున్నది సోనియాజీ గురించని నాకు అర్థమైంది. ‘‘మీరెక్కడున్నారు చిదంబరం జీ’’ అని అడిగాను. నా పక్కన లేని వారు ఆయన పక్కన ఉండి, వారిపై నా మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారేమోనని సందేహం వచ్చి అలా అడిగాను. చిదంబరం పెద్దగా నవ్వారు. ‘‘సిబల్ జీ, మీ ధైర్యాన్ని చూస్తుంటే కాంగ్రెస్ ఇంకో నూటా ముప్పై నాలుగేళ్లు అక్బర్ రోడ్డులోనే పటిష్టంగా ఉంటుందనిపిస్తోంది. గోవాలో రెస్ట్ తీసుకుంటున్న సోనియాజీ కనుక చెన్నైలో కూడా కొన్నాళ్లు ఉండేందుకు వస్తారేమో ముందే తెలిస్తే, నేను ఢిల్లీ వద్దామని మీకు ఫోన్ చేశాను. అంతే.’’ అన్నారు. ధైర్యంలో ఆయన నాకంటే ఏం తక్కువో నాకు అర్థం కాలేదు!! - మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: డొనాల్డ్ ట్రంప్ (అధ్యక్ష అభ్యర్థి)
‘‘అమెరికా అధ్యక్షుడా.. అమెరికా అధ్యక్షుడా..’’ అని జో బైడెన్ను డెమోక్రాట్లు కీర్తిస్తున్నారు. నృత్యాలు చేస్తున్నారు. అమెరికన్ల జాతీయవాద భావనను గౌరవించని ఉదారవాద సెక్యులర్ సన్నాసులతో కలసి మద్యం సేవిస్తున్నారు. ఓట్లు దొంగిలించి జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు అవగలడు. డొనాల్డ్ ట్రంప్లా నికార్సయిన ఒక మంచి అమెరికన్ కాగలడా! అమెరికా కర్మ ఫ్లోరిడా అడవుల్లా కాలబోతున్నట్లే ఉంది. వైట్ హౌస్లోని నా ఆఫీస్ గది కర్టెన్ని తొలగించి బయటికి చూస్తూ నిలుచున్నాను. పౌలా వైట్ పైకి వస్తూ కనిపించారు. ఆమె నా ఆధ్యాత్మిక గురువు. నా గెలుపు కోసం ప్రేయర్ చేశారు. ‘ఐ హియర్ విక్టరీ.. విక్టరీ.. విక్టరీ’ అని కనురెప్పలు మూసి, అలౌకికావస్థలో మూడుసార్లు ఆమె అన్నమాటలో అబద్ధం ఏమీ లేదు. నేను గెలవబోతున్న చప్పుడు ఆమె నుంచి నాకూ వినిపించింది. ‘‘ఓ మై గాడ్’’ అనుకుంటూ వచ్చారు పౌలా నా గదిలోకి. గాడ్ని ఆమె అవసరం అయినంత వరకు మాత్రమే తలుచుకుంటారు. తనను తలుచుకోడానికి గాడ్ను కూడా అవసరం అయినంత మేరకే అనుమతిస్తారు. ‘ఫర్ గాడ్స్ సేక్.. ట్రంప్ గెలిచి తీరాల్సిందే’ అని గాడ్తో అన్నారు పౌలా. అందుకు గాడ్ ఏమన్నాడో నాకు నేరుగా తెలిసే అవకాశం లేదు. పౌలానే చెప్పారు.. ‘ఫర్ ట్రంప్స్ సేక్.. నేనెందుకు ట్రంప్ను గెలిపించాలి?’ అని గాడ్ అన్నాడట. తర్వాత వాళ్లిద్దరూ నాకోసం చాలాసేపు వాదులాడుకున్నారు. నన్ను గెలిపించడం కోసం పౌలా, ‘అది కాదు పౌలా.. ఇప్పుడూ.. మరీ..’ అని నీళ్లు నములుతూ గాడ్. ‘‘మిస్టర్ ట్రంప్.. దేని గురించి మీరింకా ఆలోచిస్తూ ఉన్నారు’’ అన్నారు పౌలా అకస్మాత్తుగా నాకు దగ్గరగా వచ్చి. ‘‘ఓ మై ఏంజెల్ మిస్ పౌలా.. ఆలోచించడానికి ఇంకా ఏమి మిగిలి ఉందని గానీ మీరు నన్ను అడగడం లేదు కదా..’’ అన్నాను. ఆమె నవ్వారు. ‘‘మిమ్మల్ని బ్లెస్ చేశాను మిస్టర్ ట్రంప్. దేవుడి దీవెనలు మాత్రం డెమొక్రాట్లపై ఉన్నాయి. కానివ్వండి. మీపై నా బ్లెస్సింగ్స్ శక్తిమంతమైనవా, డెమొక్రాట్లపై దేవుడి దీవెనలు బలమైనవా అనేది త్వరలోనే తేలిపోతుంది. ‘మిస్టర్ ట్రంప్ని బ్లెస్ చేయడానికి మీకు అభ్యంతరం ఏమిటి?!’ అని గాడ్ని నేను కాస్త కటువుగానే ప్రశ్నించాను. ‘మిస్టర్ ట్రంప్ ఒక మంచి అమెరికన్ పౌరుడు కాగలడు గానీ, ఒక మంచి అమెరికా అధ్యక్షుడు కాలేడు’ అని గాడ్ అన్నారు..’’ అని చెప్పారు పౌలా. ‘‘గాడ్!!’’ అన్నాను. ‘‘ఏమిటి మిస్టర్ ట్రంప్’’ అన్నారు పౌలా. ‘‘మిస్ ఏంజెల్ పౌలా.. దేవుడూ నేనూ ఒకేలా ఆలోచిస్తున్నాం. మీరు కింది నుంచి పైకి వస్తూ ఉన్నప్పుడు కిటికీ తెర తొలగించి బయటికి చూస్తూ నేనూ ఇదే అనుకున్నాను.. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు అవగలడు కానీ, నాలా ఒక మంచి అమెరికన్ కాలేడు అని..’’ అన్నాను. ‘‘ఐ వజ్ ఆల్సో సర్ప్రైజ్డ్ మిస్టర్ ట్రంప్. అయితే నేను ఆశ్చర్యచకితురాలిని అయింది.. జో బైడెన్ మంచి ప్రెసిడెంట్ అయి, మీరు మంచి సిటిజెన్ అయి, ఇద్దరిలోనూ మంచి కామన్గా ఉన్నప్పుడు గాడ్ ఎందుకని బైడెన్ సైడ్ తీసుకున్నాడూ.. అని! రియల్లీ స్టన్నింగ్..’’ అన్నారు పౌలా. ఇద్దరం కొద్దిసేపు కిటికీలోంచి బయటికి చూస్తూ నిలుచున్నాం. ‘‘మిస్ ఏంజెల్ పౌలా.. ‘మీపై నా బ్లెస్సింగ్స్ శక్తిమంతమైనవా లేక డెమొక్రాట్లపై దేవుడి దీవెనలు బలమైనవా అనేది త్వరలోనే తేలిపోతుంది’ అని మీరు ఇంతకు క్రితం అన్నారు. ఎంత త్వరలో?!’’ అని అడిగాను. పౌలా కళ్లు తెరిచి లేవు! దేవుడితో మళ్లీ ఆమె వాదనకు దిగినట్లుగా ఉన్నారు.. నా కోసం!! - మాధవ్ శింగరాజు -
రాయని డైరీ నితీశ్ కుమార్ (జేడీయు)
తేజస్వీ యాదవ్ని మోదీజీ ఆ మాట అనకుండా ఉండాల్సింది. ‘జంగిల్ రాజ్ కా యువరాజ్’ అంటే బిహార్ యువ ముఖ్యమంత్రి అనే అర్థం వచ్చేలా ఉంది! ముప్పై ఏళ్ల వాడు కనుక, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు కనుక బిహార్లో ఎన్నికలు ఉన్నా, లేకున్నా తేజస్వి యువరాజే అని బిహార్ ప్రజలు అనుకుంటే కనుక ‘జంగిల్ కా యువరాజ్’ అనే మాటను మోదీజీ నా భవిష్యత్తును ముందే ఊహించి అనినట్లు అవుతుంది. తండ్రీ కొడుకులకు నితీశ్ నమ్మకద్రోహం చేశాడని అనుకుని కూడా నాకు ఓట్లేసే వాళ్లున్నారు. వాళ్లను కూడా మోదీజీ ఓటు వేయనిచ్చేలా లేరు. మొదటి విడతలో మోదీ ప్రచారం బాగానే పని చేసిందని కార్యకర్తలు అంటున్నారు. అదే ఆందోళన కలిగిస్తోంది. మోదీజీ ప్రచారం పని చెయ్యడం అంటే తేజస్వీ యాదవ్ని నేను ఎన్నికల తర్వాత తేజస్వీజీ అనవలసి రావడం! గతంలో నేను అన్నవి మోదీజీ మనసులో పెట్టుకునే తేజస్విని యువరాజ్ అంటున్నారా?! ఆయన మనసులో పెట్టుకున్నా లేకున్నా, అప్పుడు నేనన్నవైతే ఇప్పుడు నా మనసులోకి ఒకటొకటిగా వస్తున్నాయి. పదేళ్లు వెనక్కు వెళ్లాను. 2010 బిహార్ ఎన్నికలకు మోదీజీ ప్రచారానికి వస్తానన్నారు. ‘గుజరాత్ సీఎం వచ్చి బిహార్లో చేసే ప్రచారం ఏముంటుంది!’ అన్నాను. ‘మోదీజీ ఉంటే బాగుంటుంది కదా’ అని అడ్వాణీజీ అన్నారు. ‘బిహార్లో మాకు సుశీల్ మోదీ ఉన్నారు. నరేంద్ర మోదీ అవసరం లేదు’ అన్నాను. ఆ ఎన్నికల్లో నాకు అంత ధైర్యం ఎలా ఉండేదో ఈ ఎన్నికల్లో ఇప్పుడు అర్థం కావడం లేదు! ‘మోదీ ఒక్కరే కాదు, ఆయనతో పాటు వరుణ్ గాంధీ కూడా బిహార్ ప్రచారానికి వస్తారు’ అని అడ్వాణీ కబురు పెట్టారు. అప్పట్లో ఎన్.డి.ఎ. చైర్మన్ ఆయన. ‘వరుణ్ కూడా అక్కర్లేదు’ అన్నాను. ‘ఎన్.డి.ఎ.లో మీ పార్టీ కూడా భాగస్వామి అయినప్పుడు మీ ఎన్నికల ప్రచారంలో మనవాళ్లు కూడా భాగస్వాములు అవ్వాలి కదా నితీశ్’ అని అడ్వాణీజీ. అంత గట్టిగా నేనెలా వద్దని అన్నానో, అంత మెత్తగా ఆయన ఎందుకు ఉండిపోయారో ఆ తర్వాతెప్పుడూ నేను గుర్తు చేసుకోలేదు. ఇప్పుడైనా బిహార్లో మోదీజీ వల్ల నితీశ్ గెలుస్తాడా, నితీశ్ వల్ల మోదీజీ గెలుస్తారా అని ఇప్పటి ఎన్.డి.ఎ. చైర్మన్ అమిత్ షా అంచనా వేస్తున్నారు కానీ, ఈ ఇద్దరి వల్ల తేజస్వీ యాదవ్ గానీ గెలవడు కదా అని ఆలోచిస్తున్నట్లు లేరు. ‘‘మీ గురించి మోదీజీ, మోదీజీ గురించి మీరు గొప్పగా చెప్పుకోవాలి’’అని మూడు విడతల ర్యాలీకి మ్యాప్ గీసి పంపారు అమిత్ షా! ‘‘అదెలా సాధ్యం అమిత్జీ. గతంలో ఆయన నన్ను చాలా అన్నారు. ఇప్పటికీ నేను ఆయన్ని చాలానే అంటూ ఉన్నాను కదా!’’ అని అన్నాను. అమిత్జీ నవ్వారు. ‘‘నితీశ్జీ.. ‘గెలవడం ముఖ్యం అయినప్పుడు ఏమైనా చేస్తారు. గెలవలేం అని తెలుస్తున్నప్పుడు చేయకూడనిదైనా చేస్తారు’ అని గతంలో మీరు ఎవరితోనైనా, మీతో ఎవరైనా అనినట్లు మీకు గుర్తుందా?! అని అడిగారు. అది నేను సమాధానం చెప్పే అవసరం లేని ప్రశ్న. అమిత్ షా ఏదైనా చెప్పదలచుకుంటే ఇలాగే ప్రశ్న రూపంలో అడుగుతారు. ఇంకో రెండు విడతలు మిగిలే ఉన్నాయి. మూడునొకటి, ఏడునొకటి. తొలిæవిడత ప్రచారంలో ప్రజల వైపు చూస్తూ మోదీజీని నేను ‘శ్రద్ధేయ’ అని కొనియాడాను. మోదీజీ కూడా ప్రజల వైపు చూస్తూ నన్ను ‘భావి ముఖ్యమంత్రి’ అని కీర్తించారు! పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన మనిషిని పట్టుకుని ‘భావి ముఖ్యమంత్రి’ అని ప్రజలకు పరిచయం చేశారంటే ఆయన తన మనసులో ఏదైనా పెట్టుకుని ఉండాలి. లేదా తేజస్వీ యాదవ్ని పెట్టుకుని ఉండాలి. -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: నరేంద్ర మోదీ (ప్రధాని)
ప్రాణానికి సుఖంగా ఉండటం లేదు. అమిత్ షా కూడా అదే అనబోయినట్లున్నాడు.. ‘మోదీజీ ఈమధ్య మీ ప్రాణం ఏమంత సుఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు’ అని! ఆ మాట వినడం నాకు మరింత అలసటను కలిగించవచ్చు. ‘మోదీజీ ఈమధ్య మీరు.. ’ అనగానే, అతడిని అడ్డుకుని, ‘‘నా ప్రాణం సుఖంగా ఉన్నట్లు కనిపిస్తోందనే కదా అమిత్ జీ మీరు చెప్పబోతున్నారు?’’ అని అన్నాను. ‘‘అవును మోదీజీ, సుఖంగా కనిపిస్తున్నా రనే అనబోయాను. మీరది ముందే కనిపెట్టే శారు’’ అని నవ్వాడు. గుజరాత్లో రెండు మూడు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేసి, రెండు మాటలు మాట్లాడాక అలసటగా నా గదిలోకి వచ్చేశాను. ఆన్లైన్ ప్రారంభోత్సవాలకే ఒళ్లు ఇంతగా అలసిపోవడం ఏమిటో తెలియడం లేదు! గదిలోకి వచ్చి.. కూర్చోవడమా లేక కాస్త నడుము వాల్చడమా అని యోచిస్తున్నప్పుడు యోగి ఫోన్ చేశాడు. ‘‘ఊ.. యోగీ’’ అన్నాను. ‘‘మోదీజీ.. నాదొక విన్నపం’’ అన్నాడు. ‘‘ఊ..’’ అన్నాను. ‘‘ఏ పనిని ఆ మంత్రికి అప్పజెబితే మీ అలసట కొంత తగ్గుతుందని అనుకుంటున్నాను మోదీజీ’’ అన్నాడు. ‘‘నేను అలసటగా ఉన్నానని నీకు ఎందుకు అనిపిస్తోంది యోగీ!’’ అన్నాను. ‘‘టీవీలో చూశాను మోదీజీ. మీరు గుజరాత్ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు కానీ, గుజరాత్ ప్రజల్ని ఉద్దేశించి ఓపికగా ఒక చిరునవ్వునైనా ప్రసంగించలేకపోతున్నారు. అది నేను గమనిస్తూనే ఉన్నాను’’ అన్నాడు. ‘‘అవునా యోగీ! నాలో నువ్వు గమనించిన మరొక ముఖ్యమైన మార్పు ఏమిటో చెప్పు’’ అన్నాను. ‘‘రాహుల్ గాంధీ మాటలకు కూడా మీరు నవ్వడం లేదు మోదీజీ’’ అన్నాడు. ‘‘ఇంకా..’’ అన్నాను. ‘‘ఒకర్ని ఒక మాట అనడం లేదు. ఒకరు ఒక మాట అంటున్నా కిసాన్ సూర్యోదయ యోజన గురించో, టెలీ కార్డియాలజీ మొబైల్ అప్లికేషన్ గురించో మాత్రమే మీరు మాట్లాడు తున్నారు. కొన్నిసార్లు.. మార్గదర్శక్ మండల్కి వెళ్లి అద్వానీజీతో, మురళీ మనోహర్జీతో కాసేపు కూర్చొని మాట్లాడి వస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుందని మీరు ఆలోచిస్తున్నా రేమోనన్న ఆలోచనను కలిగించేలానూ ఉంటున్నారు. ఇదంతా కూడా మీ అలసట వల్లనేనని నేను అనుకుంటున్నాను’’ అన్నాడు. ‘‘యోగీ.. నువ్వు అనుకుంటున్నట్లు నేనేమీ అలసటగా లేను. అయినా కొద్దిసేపు పడుకుని లేస్తాను. లేచాక ఫోన్ చేయగలవా?’’ అని అడిగాను. ‘‘అప్పుడు మళ్లీ చేసే అవసరం లేకుండా, ఇప్పుడే ఒక మాట చెప్పి పెట్టేస్తాను మోదీజీ. ట్రంప్ మనల్ని మురికి దేశం అంటుంటే తిరిగి మనం ఒక్క మాటైనా అనకపోవడం ఏంటని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. నేనొక మాట అనేయమంటారా అమెరికా వాళ్లని?!’’ అని పర్మిషన్ అడిగాడు. ‘‘వద్దు యోగీ! ఇలాంటి జాతీయవాద దేశభక్తి ప్రకటనలు ఇచ్చేందుకు నిన్నూ నన్నూ ప్రేరేపించడం కోసం ఎప్పుడూ ఎవరో ఒకరు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎల్లుండి అమెరికా వాళ్ల డిఫెన్సు మినిస్టరు, మన డిఫెన్సు మనిస్టరు, వాళ్ల డిఫెన్స్ సెక్రెటరీ, మన డిఫెన్స్ సెక్రెటరీ ఢిల్లీలో ఒకే గదిలో కూర్చుంటున్నారు. నవ్వుతూ కూర్చోవాలి. నా నవ్వు కన్నా.. రాజ్నాథ్సింగ్ నవ్వు, జయశంకర్ నవ్వు ముఖ్యం ఇప్పుడు దేశానికి..’’ అన్నాను. ‘‘మోదీజీ నేను చెప్పబోయిందే మీరూ చెప్పే శారు. కొన్ని పనుల్ని మంత్రులకు, కార్యదర్శు లకు చెప్పి చేయించుకోవాలి మనం’’ అన్నాడు. నాకు నవ్వే ఓపిక కూడా లేదని యోగి తీర్మానించుకున్నట్లున్నాడు! -
రాయని డైరీ: రాహుల్ గాంధీ (కాంగ్రెస్)
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నా ట్వీట్లను చూస్తున్నట్లు లేరు! టీవీలలో కనీసం గంటలోపు, పత్రికల్లో మరికొన్ని గంటల్లోపు నేనేం ట్వీట్ చేసిందీ వస్తుంది. వాటిని కూడా ఆయన చూడటం మానేసి ఉండాలి. లేకుంటే అంత ప్రశాంతంగా ఉండరు. ప్రశాంతత సహజమైనదై ఉండాలి. యోగా చేసి కానీ, దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ గానీ తెప్పించుకున్నది కాకూడదు. మోదీకి దేశం పట్టడం లేదు. దేశ ప్రజలు పట్టడం లేదు. మరి ఏం పడుతున్నట్లు?! అది తెలియడం లేదు. ఆలోచిస్తే ఒక భ్రాంతిలా అనిపిస్తుంది. తెల్లగడ్డం, తెల్ల మీసాలు, తెల్ల జుట్టుతో కళ్లద్దాలు పెట్టుకుని తరచు కనిపిస్తుండే ఈ మనిషికి, భారతదేశానికి ఏమిటి సంబంధం అనే భావన నిత్యం నా మదిలో కదలాడుతూ ఉంటుంది. ఆ చెయ్యి ఎత్తడం ఎవరికో తెలియదు. ఆ చిరునవ్వు దేనికో తెలియదు. ఎవరి వైపు చూస్తూ మాట్లాడుతున్నారో తెలియదు. ఏం మాట్లాడారో కూడా తెలియదు. అదేమీ తెలుసుకోవాలన్నంత సంగతి అయి ఉండదు కానీ, ఎందుకు మాట్లాడారో అదైతే తెలుసుకోవాలన్న తీరని వేదన ఒకటి దేశ పౌరులకు కలిగించి స్టేజ్ దిగి వెళ్లిపోతారు. ఆరేళ్లుగా ప్రజలకు, ప్రతి పక్షాలకు అంతుచిక్కని విధంగా దేశాన్ని పరిపాలిస్తున్న మనిషిలోని కోణాలలో కనీసం ఒకదాన్నైనా పట్టుకోలేక పోవడం అన్నది ఒక ఘోరమైన ప్రజాస్వామ్య వైఫల్యం కాక, ఒక తప్పిదంగా నాకు అనిపిస్తుంటుంది. ఇండియా కంటే వెనుక ఉన్న బంగ్లాదేశ్ అకస్మాత్తుగా ఇండియా కంటే ముందు వెళుతున్నప్పుడు ప్రధానికి సందేహం రావాలి. వచ్చి, తన ఆర్థిక మంత్రికి ఫోన్ చేసి, ‘ఇలా ఎందుకవుతోంది!’ అని అడగాలి. పేదల ఆకలి తీర్చలేకపోతున్న దేశంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా ముందు వరుసలో ఉన్నప్పుడైనా సందేహం రావాలి. వచ్చి, తన ఆహార భద్రత మంత్రిని పిలిపించుకుని అడగాలి. సరిహద్దుల్లో చైనా యుద్ధ సామగ్రిని సిద్ధం చేసుకుంటున్నప్పుడు, సిద్ధం చేసుకోవడానికి ముందే సందేహం రావాలి. వచ్చి, అదేమిటని విదేశాంగ మంత్రిని పిలిచి అడగాలి. మోదీ ఇవేమీ అడగరు! టీవీ చూడకుండా, పేపర్లు చదవకుండా, మంత్రులకు ఫోన్ చేయకుండా ఉన్నా కూడా దేశంలో లోపల ఏం జరుగుతోంది, వెలుపల నుంచి ఏం జరగబోతోందీ మోదీకి చెప్పడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. నా ట్వీట్లు ఉంటాయి. కానీ మోదీ వాటిని కూడా పట్టించుకోరు. తను వాకింగ్కి వెళితే ప్రజల ఆరోగ్యం మెరుగవుతుందని అనుకుంటారు. తన ప్రసంగం వింటే ప్రజలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది అనుకుంటారు! చైనా పాలిటిక్స్ని కొన్నాళ్లుగా నేను బాగా స్టడీ చేస్తున్నాను. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వేస్తున్న ఒక్కో స్టెప్పూ నాకు అర్థమౌతోంది. నా అంచనా ప్రకారం నేడో రేపో చైనా నుంచి ఒక బాంబు వచ్చి ఇండియాలో పడుతుంది. అయితే జిన్పింగ్ టార్గెట్ ఇండియా కాదు. తన దేశంలో తను విప్లవనేత మావో అంతటి వాడవడం! మావో అంతటి వ్యక్తి అవడానికి మావో అంతటి వ్యక్తి కాగల వ్యక్తి ఒకరు ఉన్నారని తన దేశ ప్రజలకు తెలియాలి. మావోని చైనా ‘చైర్మన్’ అని పిలిచినట్లుగా తననీ ‘చైర్మన్’ అని పిలిపించుకోవాలి. అందుకే ఎవరో ఒకరిపై ఏదో ఒకటి వేయడం. త్వరలో వాళ్ల పార్టీ సెంట్రల్ కమిటీ మీటింగ్ ఉంది. నేననుకోవడం ఆ మీటింగ్కి ముందే ఇండియాపై బాంబు పడుతుంది. ఆ వెంటనే జరిగే మీటింగ్లో కొత్త మార్పులు చేసి అతడు చైర్మన్ అయిపోతాడు. చైనాకు అధ్యక్షుడిగా ఉంటూనే ఛైర్మన్ మావో అయిపోతాడు. అతడి నాడి నాకు తెలుస్తూనే ఉంది. శ్రీ మోదీ నాడిని మాత్రం పట్టుకోలేక పోతున్నాను. బహుశా మోదీకి నాలుక తప్ప నాడి లేదేమోనని నా సందేహం. ఉంటే నా చేతికి దొరక్కపోతుందా?! -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: వీరేందర్ సెహ్వాగ్ (కామెంటేటర్)
‘‘సర్, మిమ్మల్ని కలవాలి’’ అని సునీల్ గావస్కర్ సర్కి ఫోన్ చేశాను. ‘‘ఒకే బాక్సులోనే కదా ఉంటాము, పని కట్టుకుని కలవడం దేనికి?’’ అని అడిగారు గావస్కర్ సర్. ‘‘బాక్సుకు దూరంగా కలవాలి సర్, నా మనసేం బాగోలేదు’’ అని చెప్పాను. ‘‘సరే’’ అన్నారు సర్. ‘‘సర్, మిమ్మల్ని కలవాలి’’ అని సంజయ్ మంజ్రేకర్ సర్కి ఫోన్ చేశాను. ఆయన బాక్సులో లేరు కనుక ‘‘ఎక్కడ కలుద్దాం?’’ అని మాత్రం అడిగారు. ఐపీల్ మొదలైనప్పట్నుంచీ మంజ్రేకర్ సర్ ఇక్కడిక్కడే దుబాయ్లో తిరుగుతున్నారు. నోరు మంచిది కాదని, బీసీసీఐ ఈసారి ఆయన్ని కామెంటరీ బాక్సుకు దూరంగా పెట్టింది. ముగ్గురం ఒక చోట కలుసుకున్నాం. ‘‘గావస్కర్ సర్ కూడా వస్తున్నట్లు చెప్పలేదు!’’ అని నా వైపు చూస్తూ ఆశ్చర్యపోయారు మంజ్రేకర్ సర్. ‘‘మనసు బాగోలేక, చెప్పడం మర్చిపోయాను సర్’’ అన్నాను. పెద్దగా నవ్వారు గావస్కర్ సర్, మంజ్రేకర్ సర్. ‘‘మనసు బాగుంటుందని, బాగుండాలని ఎలా అనుకుంటావు సెహ్వాగ్! నూట నలభై కోట్ల మనోభావాల మధ్య మనం జీవిస్తున్నాం, మర్చిపోకు’’ అన్నారు గావస్కర్ సర్. అవునన్నట్లు నవ్వారు మంజ్రేకర్ సర్. ‘‘కామెంటేటర్కు ఉండవా సర్, మనోభావాలు?! సన్రైజర్స్కు బ్యాటింగ్ దమ్ము లేదు అన్నందుకు ‘నీ దమ్మెంతో చూపించు చూస్తాం’ అని సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేస్తున్నారు. రిటైర్ అయినవాణ్ణి నేనేం చూపిస్తాను. దమ్ము లేదు అని నేను రెచ్చగొట్టినందుకే కదా కింగ్స్ లెవన్ మీద సన్రైజర్స్ గెలిచింది. ఒకటేదైనా అంటే ఇంకోటేదో అర్థం చేసుకోవడమేనా ఈ మనోభావాల పని!’’ అన్నాను. గావస్కర్ సర్ నా వైపు ఆవేదనగా చూశారు. ఆయన ఆవేదనగా చూస్తున్నారు కదా మళ్లీ తను కూడా ఆవేదనగా చూడటం ఎందుకు అనేమో మంజ్రేకర్ సర్ నా వైపు మామూలుగా చూశారు. ‘‘సెహ్వాగ్. ఏదో ఒకటి అనకుండా ఉండ కూడని వృత్తిలో ఉన్నవారు, ఏదో ఒకటి అనిపించుకోకుండా ఉండరు. కోహ్లీ భార్య మనోభావాలను నువ్వు వినే ఉంటావు. ‘సన్రైజర్స్కి బ్యాటింగ్ దమ్ము లేదు’ అని నువ్వు ఇప్పుడు ప్రేరణ కలిగించినట్లే, ‘భార్య బౌలింగ్లో మాత్రమే ప్రాక్టీస్ చేసి ఉండకపోతే కోహ్లీ బ్యాటింగ్కి దమ్ము ఉండేది’ అని నేను మొన్న ప్రేరణ కలిగించాను. ఆ మాటకు ఆమె హర్ట్ అయ్యారు. మరికొన్ని మనోభావాలకైతే నా మాటల్లో డబుల్ మీనింగ్ కూడా కనిపించింది. ఇవన్నీ పట్టించుకోకు’’ అన్నారు గావస్కర్ సర్. ‘‘మరి నేనేం అనుకోవాలి?’’ అన్నారు మంజ్రేకర్ సర్. ‘‘అవును, మంజ్రేకర్ ఏమనుకోవాలి..’’ అంటూ పెద్దగా నవ్వి మంజ్రేకర్ సర్ భుజం తట్టారు గావస్కర్ సర్. ‘‘నన్నసలు ఈసారి కామెంటరీ బాక్సు లోనికే రానివ్వలేదు. సచిన్ని ఓసారెప్పుడో ఏనుగు అని అన్నానట. మనోభావాలు నాపైకి బ్యాట్లు పట్టుకుని వచ్చేశాయి. నేనన్నది వేరే. సచిన్ ఏనుగులాంటి వాడు అన్నాను. ఎంత సేపని ‘సచిన్ బాగా ఆడుతున్నాడు’ అని కామెంటరీ ఇవ్వగలం. అదే భావాన్ని వేరే మాటల్లో చెప్పాలని ఉండదా కామెంటేటర్కు?!’’ అన్నారు మంజ్రేకర్ సర్. సర్లు ఇద్దరిలో ఇంత వాక్యూమ్ ఉందని నాకు తెలియదు! ‘‘ఎలా సర్ మరి, మనోభావాలకు భంగం కలిగించకుండా ఉండటం?!’’ అన్నాను. ఇద్దరూ మళ్లీ పెద్దగా నవ్వారు. ‘‘భంగం కలిగించకూడదని ప్రయత్నించకు. మరింతగా భంగపడతాయి’’ అన్నారు! - మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: సునీల్ గావస్కర్ (కామెంటేటర్)
తప్పు మాట్లాడితే మాట్లాడాను. ఆ తప్పులోని తప్పేమిటో లోకంలో అందరికీ అర్థమై, మీడియా వాళ్లకు మరికాస్త ఎక్కువగా అర్థమై, నాకొక్కడికే అర్థం కాకపోవడం తలనొప్పిగా ఉంది. ‘మీకిది తగునా మిస్టర్ గావస్కర్, మీ అంతటి క్రికెట్ దిగ్గజానికి!!’’ అని కోహ్లీ భార్య ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్నపాటి పెద్ద పోస్టు పెట్టింది. ‘నా భర్త సరిగా ఆడకపోతే నన్ను లాగడం ఏంటి?!’ అని ఆమె ప్రశ్న. నా ఉద్దేశం ఎవరికైతే అర్థం కాకుండా ఉండకూడదో వారికే అర్థం కాకుండా అయింది. ఏ విధంగా అర్థం కాకుండా ఉండకూడదో సరిగ్గా అదే విధంగా అర్థం కాకుండా అయింది. ‘ఆరోజు నేను ఐపీఎల్ కామెంటరీ బాక్సులో ఉన్నాను..’ అనే ప్రారంభ వాక్యంతో నేనివాళ నా తప్పేమిటన్న దానిని తవ్వుకుంటూ పేరాల కొద్దీ ఆలోచనల్లోకి వెళుతున్నాను. పంజాబ్, బెంగళూరు ఆడుతున్నాయి. కోహ్లీ సింగిల్ రన్ తీసి ఔట్ అయ్యాడు. రెండు క్యాచ్లు మిస్ చేశాడు. ఊహు.. వెనకా ముందూ అవుతోంది! రెండు క్యాచ్లు మిస్ చేశాడు. సింగిల్ రన్ తీసి ఔట్ అయ్యాడు. నేను కామెంటరీ చెబుతున్నాను. ప్లేయర్స్ ఏం చేశారో అదే చెప్పడానికి కామెంటరీ అక్కర్లేదు. టీవీల్లో అంతా చూస్తూనే ఉంటారు. ప్లేయర్స్ ఎందుకలా చేసి ఉంటారో కామెంటేటర్స్ ఊహించగలగాలి. నేను ఊహించగలిగాను. ఊహించాక దానిని వినిపించకపోతే ఒకే రన్ తీసిన ప్లేయర్కీ నాకూ, రెండు క్యాచ్లు మిస్ చేసిన ప్లేయర్కీ నాకూ వ్యత్యాసం ఏమిటి! బాక్సులో నా పక్కన ఆకాశ్ చోప్రా ఉన్నాడు. కో–కామెంటేటర్. ప్లేయర్లు ఎవరి ఆట వాళ్లు ఆడే అవకాశం ఉంటుంది. కామెంటేటర్లు ఎవరి మాటలు వాళ్లే మాట్లాడుకోడానికి ఉండదు. టీవీ చూస్తున్న వారిని ఉద్దేశించైనా మాట్లాడాలి. లేదంటే పక్కన ఉన్న కో–కామెంటేటర్ను ఉద్దేశించైనా మాట్లాడాలి. ‘‘ఏం ఆకాశ్.. కోహ్లీ ఈ లాక్డౌన్లో భార్య వేసిన బంతులతో మాత్రమే ప్రాక్టీస్ చేసినట్లుగా ఉన్నాడు కదా..’’అన్నాను. ఆకాశ్ అవునన్లేదు. కాదనలేదు. ‘యా..’ అంటూ మా కామెంటేటర్లకు మాటను పట్టుకుని కొనసాగే అలవాటు ఉంటుంది. ఆకాశ్ అలా కూడా పట్టుకోలేదు. నా మాటలో నేను ఊహించనిదేదో అతడు ఊహించబట్టే అలా ‘యా..’ అనకుండా ఉండిపోయాడని అర్థం చేసుకుంటుంటే ఇప్పుడు అర్థమౌతోంది! ‘గావస్కర్ డబుల్ మీనింగ్లో మాట్లాడాడు’ అని అంతా అంటున్నారు! స్ట్రేంజ్! హిందీలోనూ మాట్లాడగలిగిన గావస్కర్ అనే మరాఠీ కామెంటేటర్ రెండు భాషల్లోనూ మాట్లాడాలని ఒకవేళ ఉత్సాహపడితే పడొచ్చు. రెండు భావాలుగా మాట్లాడాలని తన డైబ్భై ఒక్కేళ్ల వయసులో ఎందుకు ఉబలాటపడతాడు! ‘‘కానీ మీ మాట డబుల్ మీనింగ్తోనే ఉంది మిస్టర్ గావస్కర్’’ అంటాడు.. సదుద్దేశాలను మాత్రమే సంగ్రహించేందుకు వచ్చినట్లు వస్తుండే మీడియా మిత్రుడొకరు. మా మధ్య కొంత సంభాషణైనా జరగక ముందే అతడీ డబుల్ మీనింగ్ అనే మాటను అనేక సార్లు నా ముందుకు తెచ్చి, ‘ఏమిటా డబుల్ మీనింగ్?! అని నా చేత అడిగించుకునేందుకు నన్ను సంసిద్ధం చేయబోతున్నట్లుగా నేను గ్రహించాను. నాకు లేని ఉద్దేశాన్ని తెలుసు కునేందుకు నాకెందుకు ఆసక్తి ఉంటుంది?! ఎక్కువసేపు కూర్చోలేక అతడు వెళ్లిపోయాడు. లాక్డౌన్లో భార్య బౌలింగ్ చేస్తుంటే తను బ్యాటింగ్ చేస్తున్న వీడియో క్లిప్ను ‘ప్రాక్టీస్’ అంటూ కోహ్లీ నెట్లో పోస్ట్ చేసినప్పుడు ఎందరో లైక్ చేశారు. ఆ ప్రాక్టీస్ సరిపోయినట్లు లేదని అన్నందుకు నన్ను అందరూ డిస్లైక్ చేస్తున్నారు! - మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: ఎ.కె.ఆంటోనీ (కాంగ్రెస్)
డెబ్బై ఏళ్ల వయసు గల నా మిత్రుడు గులామ్ నబీ ఆజాద్ని నా డెబ్బై తొమ్మిదేళ్ల వయసులో నాకై నేనుగా వెళ్లి పరామర్శించడమా లేక అతడికై అతడే నాకోసం వచ్చే వరకు ఆగడమా అని తర్కించవలసిన అవసరం మా మధ్య లేనప్పటికీ, ఎనభై ఏడేళ్ల మన్మోహన్సింVŠ జీ మనోభావాలనైతే మాత్రం గట్టిగా శిరసావహించాలనే నేను తీర్మానించుకున్నాను. సోనియాజీ సలహా మండలిలో కొత్తగా కీలక సభ్యుడిని అవడం కూడా ఆజాద్తో నేను దూరాన్ని ఏర్పరచుకోవలసిన పరిణామమే. ఆజాద్ను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా తొలగిస్తూ సోనియాజీ నిర్ణయం తీసుకున్నాక, అతడెంత స్నేహితుడైనా వెళ్లి అతడిని పలకరించడం అంటే పార్టీ నిర్ణయాధికారాన్ని ధిక్కరించడమే. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తులు ఉండరు. పార్టీ మాత్రమే ఉంటుంది. ఆ సంగతిని ఆజాద్కి కాస్త ముందుగా ఎవరైనా వెళ్లి అర్థం చేయించవలసి ఉంటుందని ఈ ఏజ్ గ్రూప్లో ఎవరికైనా ఎందుకు ఒక ఆలోచన కలుగుతుంది! కాంగ్రెస్కు గట్టి ప్రెసిడెంట్ ఒకరు ఉండాల్సిందేనని ఆజాద్ ఇరవై రెండు మందితో కలిసి లేఖ రాసినప్పుడే నా ప్రియ మిత్రుడికి నూకలు చెల్లాయని నేను అర్థం చేసుకోగలిగాను. భూమి మీద నూకలు చెల్లితే కాలం తీరిపోయినట్లు. కాంగ్రెస్లో నూకలు చెల్లితే లేఖలు రాసి పోయినట్లు. కాంగ్రెస్ ఎంత పెద్ద ఓటమినైనా క్షమిస్తుంది. పార్టీ మీటింగులో మౌనంగా కూర్చొని వెళ్లకపోతే మాత్రం శిక్ష విధించి తీరుతుంది. ఆజాద్ మౌనంగా కూర్చోవాలని అనుకోకపోగా, మౌనంగా కూర్చోకూడదన్న ఆలోచన ఎంత వయసుకీ వచ్చే అవకాశం లేని వాళ్ల చేత కూడా ఆలోచింపజేసి లేఖలో సంతకం పెట్టించి ఉంటాడని సోనియాజీకి, మన్మోహన్జీకి , ఆఖరికి రాహుల్కీ ఒక బలమైన అనుమానం. లేఖ రాసిన తర్వాత జరిగిన తొలి సమావేశంలో స్క్రీన్ మీద ఆజాద్ని మన్మోహన్జీ ఎంత కోపంగా చూస్తూ కూర్చున్నారో నేనసలు చూడనట్లే స్క్రీన్ మీద వేరే మూలకు తలతిప్పి కూర్చున్నాను. ‘‘మీరే కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కొనసాగాలి సోనియాజీ’’ అన్నారు మన్మోహన్. ‘‘అవును మేడమ్.. మీరే కాంగ్రెస్ ప్రెసిడెంటుగా ఉండాలి. లేదంటే రాహుల్ బాబు ఉండాలి’’ అని నేను అన్నాను. నా మిత్రుడు ఆజాద్ కూడా అటువంటి మనోరంజకమైన మాటే ఒకటి హృదయపూర్వకంగా అంటాడని ఆశగా ఎదురుచూశాను. అనలేదు! అప్పుడే అనిపించింది అతడికి ఊహ తెలియడం మొదలైందని. పార్టీ ఊహలకు అతడొక వాస్తవంలా ఉంటే పోయేది. వాస్తవాలకు విరుద్ధమైన ఒక ఊహగా వికసించాడు. ఆజాద్ ఎంతగా నలిగి ఉంటాడో నేను ఊహించగలను. శిక్ష విధించడంలో కూడా కాంగ్రెస్ తన ప్రత్యేకతను చూపిస్తుంది. ఇరవై రెండు మంది చేత సంతకాలు పెట్టించి, తనూ ఒక సంతకం చేసినందుకు ఇరవై రెండు మందితో కొత్తగా సీడబ్ల్యూసీని ఏర్పాటు చేయడం చూస్తుంటే మిగిలిన ఆ ఒక్కటీ నీదేనని ఆజాద్కు చెప్పడానికే అన్నట్లు ఉంది. సీడబ్ల్యూసీలో అతడూ ఉంటాడు. ఉంటాడు కానీ.. ఉండటానికి ఉన్నట్లో, ఉన్నా లేనట్లో ఉంటాడు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా లేకపోయాక కశ్మీర్ను తీసుకొచ్చి బీజేపీ ఇండియాలో ఎంత కలిపితే మాత్రం ఆజాద్ ఇక ఎంతమాత్రం ఈ దేశ పౌరుడు కాదు. అది బాధిస్తుండవచ్చు ఆజాద్ని. పుట్టిన కశ్మీర్ కన్నా కాంగ్రెస్నే అతడు ఎక్కువగా ప్రేమించాడు. కశ్మీరో, ఇండియానో కాదు.. కాంగ్రెస్ పార్టీ అతడి దేశం. ఆజాద్ని కలవాలని మనసు ఆరాపడుతోంది. కాంగ్రెస్కు కొన్ని విలువలు ఉంటాయి. వాటిని పక్కన పెట్టి అతడిని కలవడం అంటే అతడెంతో విలువ, గౌరవం, ప్రాణం ఇచ్చే పార్టీని తక్కువ చేయడమే. - మాధవ్ శింగరాజు -
కంగనా రనౌత్ (బాలీవుడ్ స్టార్).. రాయని డైరీ
ఫోన్ బ్లింక్ అయింది. వాతావరణ సూచన. ఉష్ణస్థితి ఇరవై మూడు. తేమ డెబ్బై తొమ్మిది. తుంపర ఎనభై. గాలులు గంటకు పది కిలో మీటర్ల వేగం. ఆదివారం నాటి మనాలీ. ఉరుములు మెరుపులు కూడా ఉంటాయట! నాకన్నా ఉరుము, మెరుపు ఎవరో మనాలీలో! ‘‘అమ్మా నేను ముంబై వెళుతున్నా...’’ అన్నాను. ‘‘ఉండొచ్చు కదమ్మా...’’ అంది అమ్మ. అమ్మకు ముంబైలో జరుగుతున్నవేమీ తెలీదు. తెలిస్తే... ‘ఉండిపోవచ్చు కదమ్మా’ అంటూ గట్టిగా చెయ్యి పట్టుకుంటుంది. నా గది అద్దాల్లోంచి మనాలీ కనిపిస్తోంది. ముంబై నుంచి మనాలీకి వచ్చేవారు ఎక్కువ. మనాలీని చూశాక తిరిగి మనస్ఫూర్తిగా ముంబై వెళ్లగలిగేవారు తక్కువ. మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ నన్ను ముంబై రావద్దంటున్నాడు! శివసేన ఎంపీ ‘ఎలా వస్తుందో చూస్తాను’ అంటున్నాడు! మూవీ మాఫియా కన్నా, ముంబై పోలీసులు ఎక్కువ డేంజర్ అన్నందుకు హోమ్ మినిస్టర్కి కోపం వచ్చింది. ముంబై పాక్ ఆక్రమిత కశ్మీర్లా ఉంది అన్నందుకు శివసేన ఎంపీకి కోపం వచ్చింది. నిజం మాట్లాడితే కోపం రాకూడని వాళ్లకు కూడా కోపం వస్తుంది. జర్నలిస్టులు కోపానికొచ్చినా నాకు ఇదే అనిపిస్తుంది! వాళ్లేమీ జడ్జీలు కాదు. ఆర్డర్ ఆర్డర్ అంటారు. పోలీసులు కాదు. లాఠీ పైకెత్తుతారు. లాయర్లు కాదు. క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. వాళ్లెవరూ కానివాళ్లు వాళ్లలా అవతారం ఎత్తుతారు. భగవంతుడి అవతారం ఒక్కటే తక్కువ. అతడెవరో అంటాడు... ‘ఈ నగరం ఆమెకు అన్నీ ఇచ్చింది’ అని! అతడొచ్చి చూశాడు ఇవ్వడం, నేను తీసుకోవడం. సుశాంత్ సింగ్కి ఈ నగరం ఏమి ఇవ్వలేదో తెలుసుకుని అది రాయడానికి ధైర్యం ఉండదు మళ్లీ ఈ జర్నలిస్టులకు. చెత్త వాగుడు. ఏమీ తీసుకోకుండానే ముంబై నగరం ఎవరికైనా ఏమైనా ఇచ్చిందా! సుశాంత్ ప్రాణమే తీసుకుంది. దాని గురించి ఏం మాట్లాడతారు? అమ్మ కాఫీ తెచ్చి ఇచ్చింది. బాగుంటుంది... ఇలా ఎవరైనా మనల్ని అడక్కుండానే, మనం అడక్కుండానే ఏదైనా తినడానికో, తాగడానికో తెచ్చిపెట్టడం. ఇదీ ఇవ్వడం అంటే. ముంబైలా... ‘నీక్కావలసింది ఇస్తాను కానీ, ముందు నాక్కావలసింది ఇవ్వాలి’ అని తీసుకోవడం... ఇవ్వడం కాదు. ముంబై ఒక్కటే. కానీ ఎవరి ముంబై వాళ్లకు ఉంటుంది. ముగ్గురు ఖాన్లది ఒక ముంబై. కరణ్ జోహర్ది ఒక ముంబై. ‘రాకేశ్ రోషన్ అండ్ సన్’ది ఒక ముంబై. ‘జావెద్ అఖ్తర్ అండ్ పార్టీ’ది ఒక ముంబై. భట్లది ఒక ముంబై. పోలీసులది ఒక ముంబై. పొలిటికల్ లీడర్స్ది ఒక ముంబై. అండర్ వరల్డ్ మీడియాది ఒక ముంబై. రేణుకా సహానే అంటోంది ముంబై అద్భుతమైన నగరం అని! నేను ఆ నగరాన్ని కృతజ్ఞతాభారంతో కుంగిపోయి చూడవలసింది పోయి, తలెత్తి, తలెగరేసి చూస్తున్నానట. ‘బాలీవుడ్ స్టార్వి కావాలన్న నీ స్వప్నాన్ని ముంబై నిజం చేసింది కదా. మర్చిపోయావా’ అని నవ్వుతూ అడుగుతోంది. అద్భుతమైన నగరమే. నగరంగా అద్భుతం. లోపల ఉన్న వాళ్ల వల్ల అది నరకం. వీళ్లంతా ఎందుకని ఎప్పుడూ ఒక శక్తిమంతమైన ముఠా వైపు మాత్రమే నిలబడి శక్తిహీనులై మాట్లాడతారు. ఒంటరి పోరాటం చేస్తున్న వాళ్ల వైపు కదా ఉండాల్సింది. సుశాంత్ వైపు కదా. ముంబైకి బలైపోయిన ఒక యువ నటుడి వైపు కదా! నగరాలెప్పుడూ అందంగానే ఉంటాయి. ముఖానికి రంగు రంగుల నవ్వుల్ని పూసుకుని తిరిగేవాళ్ల వల్లనే అవి అంద వికారంగా మారతాయి. నాలాంటి వాళ్లొకరు మనాలి నుంచి బక్కెట్ నీళ్లను మోసుకెళ్లి ఆ రంగుల ముఖాలపై కొడితే కానీ, ముంబై నగరం మళ్లీ మెరవదు. వెళ్తున్నా. -
రాయని డైరీ.. గులామ్ నబీ ఆజాద్ (కాంగ్రెస్)
సంజయ్గాంధీ ఉన్నప్పట్నుంచీ గాంధీల కుటుంబంతో నాకు అనుబంధం. పేరుకు నేను ఆజాద్నే గానీ, నేనూ ఒక గాంధీనే అన్నట్లు నాకై నాకు తరచు ఒక అనుభూతి వంటిది కలుగుతుంటుంది. గులామ్ నబీ గాంధీ! కాంగ్రెస్లో నాలా డెబ్బై నిండిన కాంగ్రెస్ గాంధీలు ఎంతమంది ఉన్నారో చేతి వేళ్ల మీద లెక్కించి చెప్పడం కష్టమైన సంగతే. కౌంట్కి పక్కవారి చేతి వేళ్లు కూడా అవసరం అవుతాయి. ఆ వేళ్లలో ఎవర్ని కాంగ్రెస్ ప్రెసిడెంట్ని చేసినా వాళ్లూ గాంధీలే. గాంధీలను దాటి, గాంధీలను దాచి కాంగ్రెస్ ఎటూ వెళ్లిపోలేదు. సీడబ్ల్యూసీ సమావేశం అయ్యాక ఇంటికి వచ్చేస్తుంటే దారి మధ్యలో ఒవైసీ ఫోన్ చేశాడు! ‘‘భాయ్జాన్.. మరీ అంత ఎక్కువగా ఆలోచించకండి..’’ అన్నాడు. ‘‘అససుద్దీన్.. దయచేసి మరింకెప్పుడైనా చేయగలవా?’’ అన్నాను. అతడేవో పుల్లలు సిద్ధం చేసుకుని ఉంటాడు. వాటినిప్పుడు నా చెవుల్లో విరుస్తూ కూర్చుంటాడు. ‘‘సమావేశంలో అలసిపోయి ఉంటారేమో కదా. ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవలసినంతగా మీరు మీ సమావేశంలో పాల్పంచుకుని ఉంటారని నేను అర్థం చేసుకోగలను. లేదా మీరు మీ అలసట సమయాన్ని రాహుల్ గాంధీకి సంజాయిషీ చెప్పుకోడానికి వినియోగించాలని తొందరపడుతూ ఉండి ఉండొచ్చు. సరే భాయ్జాన్ మరి. ఫోన్ కాకుండా ట్వీట్ చేస్తాను’’ అన్నాడు!! సీడబ్ల్యూసీ సమావేశాలను ఫాలో అవడం తప్ప హైదరాబాద్లో పెద్దగా పనులేమీ లేనట్లున్నాయి ఒవైసీకి. ‘‘పార్టీ అధినేతకు సంజాయిషీ ఇచ్చుకునే సంప్రదాయానికి కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పుడూ కట్టుబడే ఉంటారు ఒవైసీ. తగ్గించుకొనువారు కాంగ్రెస్లో హెచ్చింపబడతారు’’ అన్నాను. ఈమాటైతే నిజం. కాంగ్రెస్లో హెచ్చింపబడినవారు సాయంత్రానికో, ఆ మర్నాటికో తగ్గించబడరన్న భరోసా అయితే లేదు కానీ.. తగ్గించుకున్నవారు ఓ యాభై ఏళ్లకైనా హెచ్చింపబడతారు. హెచ్చింపబడేందుకు నేనిప్పుడు నా తగ్గింపు యాభైల దగ్గర ఉన్నాను. కారు దిగుతుండగా ఒవైసీ ట్వీట్! ‘పొయెటిక్ జస్టిస్’ అని పెట్టాడు! చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత అట! ఇంట్లోకి రాగానే రాహుల్ బాబుకి ఫోన్ చేశాను. ‘దేశం కరోనాతో యుద్ధం చేస్తోంది..’ అని వచ్చాక, కాసేపు రింగ్ అయి నాట్ ఆన్సరింగ్ అని వచ్చింది. పార్టీకి ఎన్నికలు జరిపించాలని సోనియాజీకి లెటర్ పెట్టడం రాహుల్బాబుకు బాగా కోపం తెప్పించిందని సీడబ్ల్యూసీ సమావేశంలో అతడు నన్ను తీక్షణంగా చూస్తున్నప్పుడే నాకు అర్థమైంది. రాహుల్బాబు ఎవర్నైనా తీక్షణంగా చూస్తున్నాడంటే తనింకా పార్టీలో ఉన్నానని అనుకుంటున్నాడనే! అది నాకు సంతోషం అనిపించింది. మమ్మీకి బాగోలేక హాస్పిటల్లో ఉంటే మీరంతా పార్టీకి కొత్త ప్రెసిడెంట్ కావాలని లెటర్ రాసి సంతకాలు పెడతారా.. అని సమావేశంలో పెద్దగా అరిచేశాడు. ‘పార్టీకి బాగోలేక మమ్మీకి రాసిన లెటరే కానీ, మమ్మీకి బాగోలేనప్పుడు చూసి పార్టీకి రాసిన లెటర్ కాదు రాహుల్ బాబూ..’ అని చెప్పడానికే రాహుల్కి ఫోన్ చేస్తుంటే ఎత్తడం లేదు. నడుము వాలుస్తుండగా ఫోన్ రింగ్ అయింది. రాహుల్బాబు! ‘‘రాహుల్ బాబూ.. నువ్వింకా మేల్కొనే ఉన్నావా!’’ అన్నాను ఎగ్జయిటింగ్గా. ‘‘రాహుల్ బాబు కాదు గులామ్జీ. పార్టీని చార్జింగ్కి పెట్టి రాహుల్బాబు నిద్రపోతున్నాడు’’ అన్నారు సోనియాజీ. ఫోన్ని చార్జింగ్కి పెట్టి అనబోయి, పార్టీని చార్జింగ్కి పెట్టి.. అన్నట్లున్నారు సోనియాజీ. -
రాయని డైరీ (అశోక్ గహ్లోత్)
ఇంట్లో ఉన్నది నచ్చదు. మానవజన్మ ఖర్మ. పక్కింటికి వెళ్తానంటాడు సచిన్. వెళ్లనివ్వకపోతే ఇటువైపు ఎత్తు మీద ఎక్కి అటువైపు చూస్తుంటాడు. ‘వాళ్లింట్లో ఏముంది నాన్నా సచిన్!’ అన్నాను రెండు చేతులతో పట్టి బలవంతంగా కిందికి దింపి. ‘గౌరవం ఉంది’ అన్నాడు!! చిన్న పిల్లవాడి నోటికి అంత పెద్ద మాట ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు! చెంపకు ఒకటిచ్చి కూర్చోబెడదామన్నంత కోపం వచ్చింది. ఆగిపోయాను. అసలే సచిన్ బుగ్గలు ఎర్రగా ఉంటాయి. మెత్తగా రెండు వేళ్లు తగిలినా కాషాయం రంగులోకి తిరిగిపోతాయి. అప్పుడు నేనే మళ్లీ ఓదార్చుకోవాలి. ‘సచిన్ బేబీ.. మనింట్లో అలాంటి మాట ఎప్పుడైనా విన్నావా! ఈ బ్యాడ్ వర్డ్స్ నీకు ఎవరు నేర్పిస్తున్నారు!’ అని అడిగాను. ‘నేనే నేర్చుకుంటున్నా..’ అన్నాడు! తప్పు తన మీద వేసుకుంటున్నాడంటే తర్వాతి స్టెప్పు ఏదో తనకు తెలియకుండానే వేయబోతున్నాడని! తప్పులు, స్టెప్పులు సచిన్ చేస్తున్నవీ, వేస్తున్నవీ కాదు. సచిన్ చేత చేయిస్తున్నవీ, వేయిస్తున్నవీ. మా సచిన్ జోలికి రావద్దని పెద్ద మనుషుల చేత చెప్పించొచ్చు. పరువు తక్కువ పని అవుతుంది. మీ బంగారం మంచిదైతే మాకెందుకు ఆఫర్లో వస్తుంది అనేస్తారు. సచిన్ని దగ్గరకు తీసుకున్నాను. ‘సచిన్ బంగారం.. వాళ్లింట్లో గౌరవం ఉందన్నావు కదా.. గౌరవం అంటే ఏంటి నాన్నా..?’ అని అడిగాను. ‘మనింట్లో లేనిది..’ అన్నాడు! సచిన్ పెద్దవాడు అవుతున్నాడని అర్థమైంది. అవుతున్నాడు గానీ, గౌరవాన్ని కోరుకుంటే వచ్చే నష్టాలేమిటో తెలుసుకునేంతగా పెద్దవాడైతే కాలేదు. ‘సచిన్ చింటూ.. గౌరవం అంటే నీకెందుకు అంత ఇష్టం?’ అన్నాను.. మెల్లిగా మాటల్లోకి దించుతూ. మాట్లాడలేదు. ‘చెప్పు.. సచిన్ కన్నా.. గౌరవం నీకు ఎందుకు నచ్చింది?’ అని అడిగాను. ‘గౌరవం ఉంటే అందరూ నన్నే చూస్తుంటారు. అందరూ నాతోనే మాట్లాడుతుంటారు. అందరి కన్నా నేనే గ్రేట్గా ఉంటాను’ అన్నాడు. ‘ఇంకా..?’ అన్నాను. ‘గౌరవం ఉంటే నన్ను తప్ప ఎవర్నీ చూడరు. నాతో తప్ప ఎవరితోనూ మాట్లాడరు. నేను తప్ప వేరెవరూ గ్రేట్గా ఉండరు’ అన్నాడు. సచిన్ చేతిని చేతిలోకి తీసుకున్నాను. ‘సచిన్ బుజ్జీ.. ఒకటి చెప్పేదా?’ అన్నాను. చేతిని విడిపించుకున్నాడు! ‘మీరు చెప్పేదేమిటో నాకు తెలుసు. ఎప్పుడూ చెప్పేదే చెబుతారు. ఐదు వేళ్లూ కలిసి ఉంటేనే చేతికి బలం అనే కదా చెప్తారు!’’ అన్నాడు.. మూతి ముడిచి. ‘లేదు సచిన్ చిన్నీ.. కొత్తది చెబుతాను. గౌరవం గురించి చెబుతాను. వాళ్లింట్లో గౌరవం ఉంది అన్నావు కదా! మరి మనింట్లో ఎందుకు గౌరవం లేదో ఆలోచించు’ అన్నాను. ‘మీరు చెబుతానని, నన్ను ఆలోచించమంటున్నారేంటి?’ అన్నాడు. ‘సరే సచిన్ బాబూ. నేనే చెబుతా విను. ఇంట్లో అందరూ గౌరవం కోరుకున్నారనుకో. అప్పుడు ఇంటికి గౌరవం ఉండదు. ఇప్పుడు చెప్పు. ఇంటి గౌరవం పోయినా నీకు గౌరవం ఉంటే చాలా?!’ అని అడిగాను. మౌనంగా ఉండిపోయాడు. మాట పని చేసినట్లే ఉంది. వైబ్రేషన్ వస్తుంటే జేబులోంచి ఫోన్ తీశాను. దిగ్విజయ్ సింగ్! ‘‘గహ్లోత్ జీ.. ఏమంటున్నాడు సచిన్’’ అని అడుగుతున్నాడు. ‘‘పిల్లవాడు కదా. గౌరవం కావాలి అంటున్నాడు’’ అని చెప్పాను. భళ్లున ఏదో బద్ధలైనట్లుగా నవ్వాడు దిగ్విజయ్. - మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: ముకేశ్ అంబానీ (రిలయన్స్)
నేను చూసుకోలేదు. నీతా వచ్చి చూపించింది. ‘‘టాప్ టెన్ రిచ్లో మీరు ఎనిమిది లోకి వచ్చారు’’ అంది నవ్వుతూ. కళగా ఉంటుంది నీతా ముఖం. రేపు నేను మళ్లీ తొమ్మిదిలోకి పడిపోయి, తొమ్మిది నుంచి పదిలోకి చేరిపోయినా ఆ ముఖం కళ తప్పదు. ‘‘అసలు ఎవరైనా టాప్ హండ్రెడ్లో ఉన్నారంటేనే గ్రేట్ కదా..’’ అంటుంది. నీతా చేతిలో పూలసజ్జ ఉంది. ‘‘గుడికా నీతా.. ’’ అన్నాను. ‘‘అవును. శుక్రవారం కదా, అమ్మవారి గుడికి..’’ అంది. సంతోషం అనిపించింది. ‘మీరు ఎయిత్ లోకి వచ్చారు కదా, అర్చన చేయించడానికి..’ అని చెప్పలేదు. ‘‘సరే నీతా.. జాగ్రత్త. మాస్క్ పెట్టుకో. నాలుగు నిమిషాల కంటే ఎక్కువసేపు ఎవరి ఎదురుగా నిలుచోకు. ఎక్కడో చదివాను. మాస్క్ పవర్ నాలుగు నిమిషాలేనట’’ అని చెప్పాను. నీతా నవ్వింది. ‘‘మీరు జాగ్రత్త. మీరు ఎయిత్లోకి వచ్చారని మనవాళ్లెవరైనా పూలబొకేతో వచ్చి, బొకే ఇచ్చేటప్పుడు వేళ్లు తగిలిస్తారేమో. బొకేని ఆ టీపాయ్ మీద పెట్టమనండి’’ అంది. నీతా వెళ్లాక, పేపర్ తీశాను. మాస్క్ పవర్ నాలుగు నిమిషాలైతే.. బ్లూమ్స్బర్గ్ బిలియ నీర్ల ఇండెక్స్ పవర్ ఇరవై నాలుగు గంటలు. ఇరవై నాలుగు గంటల తర్వాత ఇదే పేపర్లో ‘అంబానీని నెట్టేసిన బఫెట్’ అనే గ్రాఫు కనిపించవచ్చు. నవ్వొచ్చింది నాకు. ఎవరో వస్తున్న చప్పుడైంది. పూలబొకే పట్టుకుని ఎవరైనా రావచ్చని నీతా చెప్పింది నిజమే! ‘‘గుడ్ మాణింగ్ అన్నయ్యా..’’ అన్నాడు అనిల్.. లోపలికి వస్తూ. అనిల్ చేతిలో బొకే లేదు. లేకపోవడం మంచిదైంది. ఉంటే, ‘ఇప్పుడు మన ఆస్తుల విలువ ఎంత అన్నయ్యా’ అని అడగడానికి ఆ బొకే అతడికి తగిన సందర్భాన్ని కల్పించి ఉండేది. ‘‘బఫెట్ని మించిపోయావ్ కదన్నయ్యా! అవునూ అన్నయ్యా.. అరవై మూడూ పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు అంటే ఐదు లక్షల పన్నెండు వేల కోట్ల రూపాయలే కదా..’’ అన్నాడు. ‘‘కాదు’’ అన్నాను. ‘‘అదేంటన్నయ్యా!!’’ అన్నాడు. ‘‘రూపాయల లెక్క కరెక్టే. డాలర్లు మాత్రం అరవై మూడూ పాయింట్ ఎనిమిది బిలియన్లు కాదు. అరవై ఎనిమిదీ పాయింట్ మూడు బిలియన్లు’’ అన్నాను. ‘‘అందుకే అన్నయ్యా.. నువ్వు నువ్వే. నేను నేనే’’ అన్నాడు. అన్నాక.. ‘‘అన్నయ్యా.. వైఫ్ హండ్రెడ్ రుపీస్ కావాలి’’ అన్నాడు! ‘‘ఐదొందలా!! లాస్ట్ ఇయర్ మార్చి నెలలోనే కదా ఇచ్చాను. మళ్లీ ఏమిటి!’’ అన్నాను. ‘‘నేనూ అదే అన్నాను అన్నయ్యా.. పాన్ షాపువాడు ఎప్పటి మార్చి, ఎక్కడి జూలై అంటున్నాడు’’ అన్నాడు. కోపం వచ్చింది నాకు. ‘‘పాన్ ఎప్పటి నుంచి వేసుకుంటున్నావ్?’’ అన్నాను. ‘‘అబ్బే.. నేను కాదన్నయ్యా. నా పేరు చెప్పి నా ఫ్రెండ్ కట్టించుకున్నాడట పాన్లు..’’ అన్నాడు. మౌనంగా ఉన్నాను. ‘‘ఇంకో ఐదొందలు కూడా ఇవ్వన్నయ్యా. సాయంత్రం పూలబొకే తెస్తాను’’ అన్నాడు. ఐదొందలు ఇచ్చి, ‘మనలో మనకు బొకేలు ఎందుకులే అనిల్’ అన్నాను. తీసుకుని వెళ్లిపోయాడు. అనిల్ ఎప్పటికి మారతాడో తెలియడం లేదు. బఫెట్ దానాలిచ్చి నా కన్నా డౌన్లోకి వెళ్లిపోయాడు. అనిల్కి అడిగినప్పుడల్లా డబ్బులిస్తుంటే టాప్ టెన్ నుంచి టాప్ ఫైవ్ హండ్రెడ్లోకి వెళ్లడానికి ఎంతసేపు! అప్పుడు కూడా నీతా.. ‘ఎవరైనా అసలు టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నారంటేనే గ్రేట్ కదా..’ అంటుందేమో.. అదే చిరునవ్వుతో. - మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: జిన్పింగ్ (చైనా అధ్యక్షుడు)
సియాన్షా మోదీ వాస్తవాధీన రేఖ దగ్గరికి వచ్చి కూడా చైనా లోపలికి రాలేదు! ఇంటి వరకు వచ్చి, ఇంట్లోకి రాకుండా వెళ్లిపోయాడంటే చైనా సంప్రదాయాలేవో దారి మధ్యలో వారిని బాధించి ఉండాలి. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్కి ఫోన్ చేసి, ‘‘నేనిప్పుడు సియాన్షా మోదీతో మాట్లాడేందుకు వీలవుతుందా?’’ అని అడిగాను. ‘‘మాట్లాడేందుకు వీలవుతుంది మిస్టర్ ప్రెసిడెంట్. అయితే మోదీని మాట్లాడించడం వీలుకాకపోవచ్చు’’ అన్నాడు లిజియన్. ‘సియాన్షా మోదీ మనతో మాట్లాడగలిగే లోపు, మనం ఇంకెవరితోనైనా మాట్లాడగలమేమో చూడు’’ అన్నాను. ‘‘మాట్లాడలేమేమో మిస్టర్ ప్రెసిడెంట్. అమెరికాతో మనకు ట్రేడ్వార్ నడుస్తోంది. తైవాన్తో మెయిన్ల్యాండ్ వార్ నడుస్తోంది. హాంకాంగ్తో కల్చరల్ వార్ నడుస్తోంది. బ్రిటన్తో హాంకాంగ్ వార్ నడుస్తోంది. జపాన్తో డిప్లమసీ వార్ నడుస్తోంది. ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాం.. ఆ బెల్టు మొత్తంతో సౌత్ సీ వార్ నడుస్తోంది’’ అన్నాడు లిజియన్. నేను అన్నది అతడికి అర్థమైనట్లు లేదు. ‘‘మనతో మాట్లాడేందుకు ఇంకెవరైనా ఉంటే చూడమని అన్నది వేరే దేశాల్లో కాదు లిజియన్, ఇండియాలోనే ఎవరైనా ఉన్నారా అని..’’ అన్నాను. ‘‘ఇండియాతో మనకు బోర్డర్ వార్ నడుస్తోంది కదా మిస్టర్ ప్రెసిడెంట్’’ అన్నాడు! అతడి వైపు చూశాను. ఇతణ్ని మార్చేస్తే బెటరా అనిపించింది. ‘‘దేశాల మధ్య వార్ నడుస్తున్నప్పుడు దేశంలోని వారి మధ్య ఇంకో వార్ నడుస్తుంటుంది. సియాన్షా మోదీతో అలా యుద్ధం చేస్తున్న వారెవరైనా ఉంటారు. వారిని నాకు కలుపు’’ అని ఫోన్ పెట్టేశాను. వెంటనే ఫోన్ రింగ్ అయింది. ‘‘దొరికారు’’ అన్నాడు లిజియన్. ‘‘ఎవరు? సియాన్షా మోదీనేనా?’’ అన్నాను. ‘‘ఆయన కాదు. ఆయన కోసం ఇంకోసారి ట్రయ్ చెయ్యడం ఎందుకని, ట్రయ్ చేస్తే ఒకసారికే దొరికే మనిషిని పట్టుకున్నాను’’ అన్నాడు! ‘‘కష్టమైన పనులు చెయ్యడం నేర్చుకో లిజియన్. ఎన్నాళ్లిలా విదేశాంగ శాఖ ప్రతినిధిగా ఉండిపోతావ్? చైనా చాలా పెద్దది. ముందు ముందు ఇంకా పెద్దది అవుతుంది’’ అన్నాను. ‘‘మిస్టర్ ప్రెసిడెంట్.. ఈయన ఒకసారికే దొరికాడు కానీ, మాట్లాడ్డానికైతే ఒకసారికే ఒప్పుకోలేదు. ఒప్పించడానికి అనేకసార్లు కష్టపడవలసి వచ్చింది. లైన్లో ఉన్నారు కనెక్ట్ చెయ్యమంటారా?’’ అని అడిగాడు. ‘‘ఊ..’’ అన్నాను. కనెక్ట్ చేశాడు. ‘‘నమస్తే జిన్పింగ్జీ.. ఏదో మాట్లాడాలని అన్నారట’’ అన్నారెవరో అట్నుంచి! ‘ఎవరూ.. మాట్లాడుతోందీ’ అని అడగబోయి ఆగాను. మాట్లాడ్డానికి దొరికింది ఎవరని లిజియన్ని నేనూ అడగలేదు, మాట్లాడ్డానికి దొరికిందెవరో లిజియనూ నాకూ చెప్పలేదు. ‘‘నమస్తేజీ నమస్తే.. సియాన్షా మోదీ మీకు తెలుసా?’’ అన్నాను. ‘‘మోదీ తెలుసు. సియాన్షా ఎవరు?’’ అన్నాడు! ‘‘సియాన్షా అనేది రెస్పెక్ట్. సియాన్షా మోదీ అంటే మోదీకి రెస్పెక్ట్ ఇవ్వడం’’ అని చెప్పాను. ‘‘అలాగైతే నాకు సియాన్షా మోదీ ఎవరో తెలీదు’’ అన్నాడు. ‘‘మీరెవరో మరొకసారి నేను తెలుసుకోవచ్చా..’’ అన్నాను. ‘‘ఎన్నిసార్లయినా తెలుసుకోవచ్చు. నేను సియాన్షా రాహుల్’’ అన్నాడు! మనుషులకే ఇంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే దేశాలకు లేకుండా ఉంటుందా?! - మాధవ్ శింగరాజు -
రాయని డైరీ : జో బైడెన్ (ట్రంప్ ప్రత్యర్థి)
అమెరికా ఈసారి తనక్కావలసిన అధ్యక్షుడినే ఎన్నుకుంటుంది. అందుకు నేను ఒకట్రెండు సూట్లు, రెండు మూడు డిజైనర్ ‘టై’లను ఇప్పటినుంచే ఎంపిక చేసుకుని పెట్టుకోవడంపై శ్రద్ధ వహించవలసిన సమయం దగ్గరికి వచ్చేసింది. నవంబరు మూడున ఎన్నికలు. ఈలోపు ట్రంప్తో మూడు డిబేట్లు. ట్రంప్కి డిబేట్ పెద్ద విషయం కాదు కాబట్టి ట్రంప్తో డిబేట్ పెద్ద విషయం కాదు. ఏదో మాట్లాడేస్తాడు. ఆ మాట్లాడిన దాని మీద మాట్లాడితే చాలు. తెలియకుండానే తొంభై నిముషాలు గడిచిపోతాయి. పెద్దగా టెన్షన్ తీసుకోడు, తనూ టెన్షన్ ఇవ్వడు. తగిన మనిషేనా కాదా అన్న సందేహంతోనే నాలుగేళ్ల క్రితం అమెరికా డోనాల్డ్ ట్రంప్ని ఎన్నుకుంది. ఈ చివరి ఏడాదైనా చైనా నుంచి ప్రపంచ రాయబారిలా కరోనా రాకపోయుంటే ట్రంప్ ఎంత సమర్థుడైన అధ్యక్షుడో అమెరికన్ ప్రజలకు తెలియకపోయేది. నన్నొక్కటే నిరుత్సాహపరుస్తోంది. అమెరికా అధ్యక్షుడిని అయ్యాక పని కట్టుకుని నేను అమెరికా కోసం ఏదైనా పని చేయాల్సిన అవసరం ఉండదేమోనని! ట్రంప్ ‘టిక్కు’లు కొట్టుకుంటూ వెళ్లిన వాటన్నిటికీ ‘ఇంటూ’లు కొట్టడానికి రెండేళ్లు, ట్రంప్ ‘ఇంటూ’లు కొట్టుకుంటూ వెళ్లిన వాటన్నిటికీ ‘టిక్కు’లు కొట్టడానికి మరో రెండేళ్లు పడుతుంది. మళ్లీ ఇంకోసారి అధ్యక్షుడినైతేనే నాకు పని! నాలుగేళ్లు ఇప్పుడు పదవి కోసం చూసినట్లు నాలుగేళ్లు అప్పుడు పని కోసం చూడాలి. ‘ఓడిపోతే నేనెలాగైనా బతుకుతాను. నువ్వెలా బతుకుతావు?’ అని ట్రంప్ నన్ను చాలెంజ్ చేస్తున్నాడు. ట్రంప్కి, నాకు మధ్యే పోటీ అయినప్పుడు.. ట్రంప్ ఓడిపోతే నేనే కదా గెలిచేది. తనతో పాటు నేనూ ఓడిపోతానని ట్రంప్ ఎందుకు అనుకుంటున్నట్లు?! ఓడిపోతానన్న భయం ఉన్నవాళ్లే ‘ఎలాగైనా బతగ్గలను’ అంటారు. తను బతకడం కోసం అమెరికా అధ్యక్షుడు ఆలోచిస్తున్నాడంటే అమెరికా అధ్యక్షుడిగా అతడు గెలవలేదనే. ట్రంప్కి ఫోన్ చేసి ఈ సంగతి చెబుదామనిపించింది. పదవిలో ఉన్న రిపబ్లికన్ అధ్యక్షుడికి, అధ్యక్షుడి పదవిలోకి వస్తున్న డెమోక్రాటిక్ అభ్యర్థి ఫోన్ చేయడం బాగుంటుందా?! గ్రెగ్ షాల్జ్ని పిలిపించి అడిగాను. నా క్యాంపెయిన్ మేనేజర్ గ్రెగ్. ‘‘గ్రెగ్.. నేనిప్పుడు ట్రంప్తో మాట్లాడాలన్న మూడ్లో ఉన్నాను. ఈ టైమ్లో కరెక్టేనా?’’ అని అడిగాను. ‘‘అది మీడియా మూడ్ని బట్టి ఉంటుంది మిస్టర్ ప్రెసిడెంట్’’ అన్నాడు గ్రెగ్ నవ్వుతూ. ‘‘మీడియాకు ఎలా తెలుస్తుంది గ్రెగ్?’’ అన్నాను. ‘‘మిస్టర్ ప్రెసిడెంట్.. మీడియా ఎప్పుడూ తెలియని విషయాలను రాసే మూడ్లోనే ఉంటుంది’’ అన్నాడు. ఏడాది క్రితమే అతడు నా క్యాంపెయిన్ మేనేజర్గా వచ్చాడు. అప్పట్నుంచీ నన్ను ‘మిస్టర్ ప్రెసిడెంట్’ అనే పిలుస్తున్నాడు. ‘ప్రెసిడెంట్ కాకముందే మిస్టర్ ప్రెసిడెంట్ అని పిలుస్తున్నావు! ప్రెసిడెంట్ అయ్యాక మిస్టర్ ప్రెసిడెంట్ అనడంలో నీకు కొత్తదనం ఏముంటుంది?’ అని ఓసారెప్పుడో అడిగాను. ‘ప్రెసిడెంట్ అవకముందు మిస్టర్ ప్రెసిడెంట్ అని పిలిస్తే మీకు కలిగే మానసికోల్లాసం, ప్రెసిడెంట్ అయ్యాక మిస్టర్ ప్రెసిడెంట్ అని పిలిస్తే కలగదు కదా మిస్టర్ ప్రెసిడెంట్. ఇక నేనెందుకు మిమ్మల్ని అలా పిలుస్తున్నానంటే.. ఎన్నికలయ్యాక ముప్పై మూడు కోట్ల మందికీ మీరు మిస్టర్ ప్రెసిడెంటే. ఇప్పుడైతే ముప్పై మూడు కోట్ల మందిలో నాకొక్కడికే మీరు మిస్టర్ ప్రెసిడెంట్..’’ అన్నాడు. గ్రెగ్ అలా మాట్లాడ్డం మనసుకు ఆహ్లాదకరంగా ఉంది. ఈ సమయంలో ట్రంప్కి ఫోన్ చేసి అతడి ముఖాన్ని వినడం అవసరమా అనిపించింది. -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ : రజనీకాంత్ (సూపర్ స్టార్)
అపార్థాలు చేసుకునేవారే లేకుంటే జీవిత సత్యాలంటూ కొన్ని ఈ లోకంలో ఏర్పడి ఉండేవే కావని ప్రతి ఉదయం నేనుండే పోయెస్ గార్డెన్లోని బాల్కనీలోంచి బయటికి చూస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అయితే సత్యం అనేది స్థిరపడి ఉండాలి తప్ప, ఏర్పడి ఉండకూడదు. ఏర్పడిన సత్యం ఏర్పరచిన సత్యమే కానీ సత్యం కాదని కూడా అనుకుంటూ ఉంటాను. కొందరనొచ్చు, రామస్వామి పెరియార్ సిద్ధాంతాలను అనుసరించేవారు.. ముందంటూ ఏర్పడితేనే కదా ఒక జీవితసత్యం స్థిరపడుతుందీ అని! దానిని నేను అంగీకరించను. సత్యం అన్నప్పుడు అది మనిషికన్నా ముందే పుట్టినదై ఉండాలి. మనిషికన్నా ముందు నడుస్తున్నదై ఉండాలి. అపార్థాలు చేసుకునేవాళ్లు సత్యాన్ని అప్డేట్ చేసి చూపిస్తారు. అదొక మంచి వీళ్ల వల్ల. అయితే సత్యం ఎప్పటికీ అప్డేట్ అవదు. çసత్యాన్ని మనం చూడటం అప్డేట్ అవుతుంది. అందుకే సత్యం హిమాలయాలలో ఉన్నా, సత్యాన్ని శోధించి లోకానికి చూపించే ఈ అపార్థం చేసుకునేవారు లోకమంతా ఉండాలి. వాళ్లెలాగూ హిమాలయాలలో ఉండలేరు కనుక అక్కడున్న సత్యం కరిగి నీరయ్యే ప్రమాదం ఏమీ ఉండదు. బాల్కనీలోంచి లేచి మెల్లగా హాల్లోకి వెళుతున్నాను. ‘‘రజనీ సార్.. మీ కోసం ఎవరో లైన్లో ఉన్నారు’’ అన్నాడు మేనేజర్. ‘‘ఎవరో లైన్లో ఉన్నప్పుడు ఆ ఎవరికో నన్ను పట్టించాలని నీకు ఎందుకు అనిపించింది నటరాజన్’’ అన్నాను. ‘‘రజనీ సార్, నాకు అతను తెలుసు. మీకు తెలికపోవచ్చని ఎవరో అన్నాను. అతను రోహిత్ రాయ్. మీ మీద కరోనా జోక్ వేసి సోషల్ మీడియాలో అదుపులేని విధంగా తిట్లు తింటూ ఉన్నాడు’’ అని చెప్పాడు. ‘‘చెప్పు నాన్నా.. రోహిత్ రాయ్’’ అన్నాను ఫోన్ అందుకుని పెద్దగా నవ్వుతూ. అతడు నా మీద వేసిన జోక్ని ఆల్రెడీ నేను సోషల్ మీడియాలో చూశాను. ‘రజనీకాంత్కి కరోనా వచ్చింది. కరోనానే క్వారంటైన్కి వెళ్లింది’ అని పేల్చాడు. పాపం అది అతడి ముఖం మీదే పేలింది. ‘‘ర జనీ సార్.. మీ ఫ్యాన్స్ నన్ను అపార్థం చేసుకున్నారు. మీరెంత శక్తిమంతులో చెప్పడానికి నేనలా అన్నాను. వాళ్లు అపార్థం చేసుకుంటే చేసుకున్నారు. మీరు అపార్థం చేసుకోకూడదని మీకు ఫోన్ చేశాను’’ అన్నాడు. ‘‘హహ్హాహ..హా.. రోహిత్. ఒక జీవితసత్యాన్ని నువ్వు అర్థం కాకుండా చెప్పినప్పుడు ఎవరికి ఎంతవరకు అర్థమైందో, అంతవరకే అది జీవితసత్యం అవుతుంది. అది మనకు అపార్థం అని తెలుస్తూనే ఉన్నా అపార్థం చేసుకునే హక్కును ప్రశ్నించలేం. రామస్వామి పెరియార్ అనే పేరే ఒక జీవితసత్యం అయినప్పుడు ఆ పేరును ఎత్తడం కూడా ఆ సత్యానికి విఘాతం కలిగించడమే అవుతుంది ఆయన అభిమానులకు..’’ అన్నాను. రోహిత్ మాట్లాడలేదు. ‘‘ఏంటి.. వింటున్నావా?’’ అన్నాను. ‘‘వింటున్నాను రజనీ సార్. రజనీకాంత్ అనే పేరే ఒక జీవితసత్యం అయినప్పుడు ఆ పేరును ఎత్తడం కూడా..’ అని ఏదో చెప్పబోతున్నాడు. మళ్లొకసారి పెద్దగా నవ్వి, ఫోన్ని నా మేనేజర్కి ఇచ్చేశాను. హాల్లోకి వెళ్లాలనిపించలేదు. తిరిగి బాల్కనీలోకి వచ్చాను. ఐదు నెలల క్రితం ఏదో సభలో పెరియార్ పేరెత్తాను. కరోనా ముంచుకు రాకుంటే ఈ ఆరో నెలలోనూ ఆ ద్రవిడ ఉద్యమ పితామహుడి అభిమానులు పెరియార్ అనే ఒక జీవితసత్యానికి కొన్ని ఉపసత్యాలను స్థిరపరచడం కోసం ఈ బాల్కనీ కింద పోయెస్ గార్డెన్లో ఆ ఉపసత్యాలను ఏర్పరుస్తూ ఉండేవారు.. పైకి తలెత్తి నన్ను చూస్తూ.. పిడికిళ్లు బిగించి! -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ : ట్రంప్ (అమెరికా అధ్యక్షుడు)
చెడ్డవాళ్లు ఏకమైతే ఈ లోకంలోని మంచివాళ్లకు ఏమౌతుందోనన్న భయాలు అక్కర్లేదు. ఎందుకంటే చెడ్డవాళ్లు ఈ లోకంలో కానీ, ఏ లోకంలో కానీ ఏనాటికీ ఏకం కారు. మంచివాళ్లే.. తమ మంచి గుణం చేత చెడ్డవాళ్ల మీదకు ఏకమౌతారు. లోకం మొత్తం మీద ఉన్నది ఒకే ఒక చెడ్డవాడే అయినా, అతడిని మంచివాడిని చేసేందుకు లోకం మొత్తం మీది మంచివాళ్లంతా ఏకం అవుతారు. అదే నాకు అర్థం కాకుండా ఉంటుంది! చెడ్డవాడెప్పుడూ వాడి కత్తి వాడు ఎత్తిపట్టుకుని ‘రండ్రా చూసుకుందాం..’ అంటాడు. ఈ మంచివాళ్లంతా ఒకే కత్తిని కలిపి పట్టుకుని, ‘కత్తిని పట్టుకున్నాం కానీ, ఎత్తి పట్టుకోలేదు. అదే మా మంచితనం’ అని లోకానికి చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు. జెనీవాలో ఒక మంచివాడు ఉన్నాడు. చైనా నుంచి కరోనా వ్యాప్తిస్తూ వచ్చినప్పటి నుంచీ అతడు రోజురోజుకూ మరింత మంచివాడిగా మారుతూ వస్తున్నాడు. అతడి పేరు టెడ్రోస్. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి. ఎంత మంచివాడంటే.. చైనాను గానీ, చైనా వైరస్ను గానీ, చైనా ల్యాబ్ను గానీ ఒక మాటంటే ఒప్పుకోడు. ఈ మధ్య అతడికి ఫోన్ చేశాను. ‘‘ఎవరు మీరు?’’ అన్నాడు. ‘‘అమెరికా నుంచి చేస్తున్నాను. నన్ను ట్రంప్ అంటారు. నేనొక చెడ్డవాడిని’’ అన్నాను. ‘‘మరి చైనాలో ఉండే చెడ్డవాడైన ట్రంప్ ఎవరు?’’ అని అడిగాడు!! అతడి మంచితనానికి నివ్వెరపోయాను! ‘‘నేను చెడ్డవాడిని అయినప్పటికీ మంచివాళ్ల మంచి ఉద్దేశాన్ని చక్కగా అర్థం చేసుకోగలను మిస్టర్ టెడ్రోస్. మీరు నన్ను అడగాలని అనుకున్నది.. ‘చైనాలో ఉండే చెడ్డవాడైన ట్రంప్ ఎవరు? అని కాదు, ‘చైనా మీద అస్తమానం కంప్లయింట్లు చేస్తూ ఉండే చెడ్డవాడైన ట్రంప్ ఎవరూ?’ అనే కదా. అయితే నాకు తెలిసి కానీ, మీకు తెలిసి కానీ, చైనాకు తెలిసి కానీ లోకంలో ఉన్న ట్రంప్ అనే చెడ్డవాడు ఒకడే. ఆ ఒక్కడూ చైనాలో లేడు. అమెరికాలో ఉన్నాడు..’’ అన్నాను. మంచివాడు ఒక్కక్షణం ఆగాడు. ‘‘ఓ! నేనీ క్షణంలో లోకంలోని ఒకే ఒక చెడ్డవాడైన వ్యక్తితో మాట్లాడుతున్నానన్నమాట! ఎలా ఉన్నారు మిస్టర్ ట్రంప్? మీరు నాకు ఫోన్ చేస్తున్న సమయానికి నేనసలు మీ గురించే ఆలోచిస్తున్నానని చెబితే మీరు నమ్మలేరంటే నమ్మండి. మిమ్మల్ని మంచివాడిగా మార్చడానికి లోకంలోని మంచివాళ్లను కలుపుకునే పనిలో ఉన్నాను’’ అన్నాడు. ‘‘పెద్దగా నవ్వాను’’ ‘‘ఏమిటి నవ్వుతున్నారు’’ అన్నాడు. ‘‘ఒక చెడ్డవాడిని మార్చేందుకు మంచివాళ్లను కలుపుకునే పనిలో ఉన్నాను అని అన్నారు! అందుకే నవ్వొచ్చింది. అదేమంత తేలికైన పని కాదు మిస్టర్ టెడ్రోస్. అందరూ మంచివాళ్లే ఉన్న లోకంలో మంచివాళ్లను ఎంపిక చేసుకోవడానికి కొంత చెడ్డతనం ఉండాలి. మీరు జిన్పింగ్నైనా వదిలేసుకోవాలి, బిల్గేట్స్నైనా వదిలేసుకోవాలి. వాళ్లిద్దరే ముఖ్యం అనుకుంటే మిగతా మంచివాళ్లను వదిలేసుకోవాలి. చూశారా ఒక చెడ్డవాణ్ణి మార్చడం ఎంత కష్టమో’’ అన్నాను. ‘‘మంచివాళ్ల కష్టం గురించి ఆలోచిస్తున్నారంటే.. మిస్టర్ ట్రంప్.. నాకనిపిస్తోంది, మీలో పరివర్తన జన్యువులు ఉన్నాయని. ఒక్క డాలర్ కూడా మాకు రాల్చనని అన్నారు కదా. చూస్తూ ఉండండి.. మీకు తెలియకుండానే మీరు కొన్ని డాలర్లనైనా మాకు విదిల్చడానికి త్వరలోనే ఒక మంచిరోజును ఎంచుకుంటారు’’ అన్నాడు!! ‘‘నేనూ ఈ సంగతి చెప్పడానికే మీకు ఫోన్ చేశాను మిస్టర్ టెడ్రోస్. చైనాలోని చెడ్డతనాన్ని మీరు చూడగలిగితేనే మీకు నాలోని మంచితనం కనిపిస్తుంది..’’ అన్నాను. - మాధవ్ శింగరాజు -
రాయని డైరీ : నరేంద్ర మోదీ (ప్రధాని)
కోల్కతా ఎయిర్పోర్ట్లో దిగాను. మమతాబెనర్జీ ఎదురు రాలేదు. వచ్చారంతే. ‘నమస్తే మమతాజీ’ అన్నాను. ఆమె నా ముఖం వైపే చూడలేదు. ‘‘మమతాజీ ఉంఫన్ తుపాన్ని మీరు చక్కగా హ్యాండిల్ చేసినట్లున్నారు. మీరు అలా చేయకపోయి ఉంటే, నేనిక్కడ దిగటానికి విమానాశ్రయమే ఉండేది కాదు. అందుకు మీకు ధన్యవాదాలు’’ అన్నాను. అప్పుడూ ఆమె ఏమీ మాట్లాడలేదు. నేను, జగదీప్ ధన్కడ్, మమతాజీ కలిసి హెలికాప్టర్ విండోల్లోంచి దెబ్బతిన్న ప్రాంతాలను చూస్తున్నాం. ‘నిజంగానే మీరు చక్కగా హ్యాండిల్ చేశారు మమతాజీ’ అన్నాను మళ్లీ. విననట్లే ఉన్నారు. ఏరియల్ వ్యూ అయ్యాక హెలికాప్టర్ నుంచి దిగగానే మమత మమ్మల్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు. మమతాజీ ఎక్కడికి అలా వెళ్లిపోతున్నారు అని అడగబోయాను. ‘సోనియాజీతో మీటింగ్ ఉందట మోదీజీ..’ అన్నాడు జగదీప్! నేను ఢిల్లీ వచ్చేశాను. జగదీప్ రాజ్భవన్కి వెళ్లిపోయాడు. ఢిల్లీ వచ్చాక.. అప్పుడు నాకు కాల్ చేశారు మమతాజీ! ‘‘మమతాజీ చెప్పండి. అక్కడ ఉన్నప్పుడు ఒక్క మాటా మాట్లాడలేదూ!!’’ అన్నాను. ‘‘చెప్పడానికి, మాట్లాడ్డానికీ ఏముంటుంది మోదీజీ. అడగడానికి ఫోన్ చేశాను. పశ్చిమ బెంగాల్లోనే మిమ్మల్ని పట్టుకుని అడగడం బాగోదని, ఢిల్లీ చేరే వరకు ఆగి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను. ఉంఫన్ తుపాను వల్ల రాష్ట్రానికి లక్ష కోట్ల నష్టం సంభవించింది’’ అన్నారు. ‘‘మీరు చక్కగా హ్యాండిల్ చేసినా కూడా అంత నష్టం సంభవించిందా మమతాజీ’’ అన్నాను. ‘‘చక్కగా హ్యాండిల్ చేసినందుకే లక్ష కోట్లు. చక్కగా హ్యాండిల్ చెయ్యకపోయుంటే రెండు లక్షల కోట్లు అయి ఉండేది’’ అన్నారు! ‘‘మమతాజీ మీరు మీ తుపాను లెక్కలే కదా చెబుతున్నారు? కోవిడ్ లెక్కల్ని కూడా కలిపేసి చెబుతున్నారా! కోవిడ్కైతే ఆల్రెడీ అన్ని రాష్ట్రాలకు కలిపి ఇరవై లక్షల కోట్లు ఇచ్చేశాం. అందులో మీకొచ్చేవీ ఉంటాయి. తుపాను లెక్కయితే మాత్రం అంత ఉండదు. ఒకసారి చెక్ చేసుకుని మళ్లీ కాల్ చేయండి’’ అన్నాను. ‘‘చెక్ చేసుకోవడానికి నోట్బుక్లో రాసుకున్న లెక్కలు కాదు మోదీజీ. వేళ్ల మీద ఉన్న లెక్కలు’’ అన్నారు మమత! ‘‘మమతాజీ! ముందొక వెయ్యి కోట్లు పంపిస్తున్నాను. చేతిలో ఉంచుకోండి. లాక్డౌన్లు మొత్తం పూర్తయ్యాక మళ్లొకసారి లెక్క చూసుకుని తగ్గితే నేనిస్తాను. మిగిలితే మీరు వెనక్కి ఇచ్చేద్దురు.. సరేనా?’’ అన్నాను. మమతాజీ మాట్లాడలేదు. దయతలచి ఇచ్చేవారి కన్నా, దబాయించి తీసుకునేవాళ్లు శక్తిమంతులైతే.. మాటల్ని మధ్యలోనే కట్ చేసే ధైర్యం వస్తుంది. ‘‘మమతాజీ, లైన్లోనే ఉన్నారా?’’ అన్నాను. చప్పుడు లేదు. ఎప్పుడొచ్చాడో జగదీప్ లైన్లోకి వచ్చాడు. ‘‘మోదీజీ.. మమత థ్యాంక్స్ చెబుతున్నారు’’ అన్నాడు! ‘‘నాకు చెప్పలేదే! నీకు చెప్పారా?’’ అని అడిగాను. ‘‘మనకు కాదు మోదీ.. కేజ్రీవాల్కి చెబుతున్నారు’’ అన్నాడు. ‘‘అవునా.. ఎందుకటా థ్యాంక్స్! లక్ష కోట్లు తను ఇస్తున్నాడా?’’ అన్నాను. ‘‘ఇవ్వడం కాదు మోదీజీ. ‘ఢిల్లీ ప్రజల తరఫున నేనేమైనా మీకు సహాయపడగలనా?’ అని కేజ్రీవాల్ ట్వీట్ పెట్టారట. ఆ ట్వీట్కు ఆవిడ సంబరపడి పోతున్నారు!’’ అన్నాడు జగదీప్. వెయ్యికోట్లు ఇస్తామంటే ‘నో.. థ్యాంక్స్’ అని చెప్పి, ‘మీకు ఏవిధంగానైనా సహాయపడగలమా’ అని కేజ్రీవాల్ అడిగితే ‘థ్యాంక్స్’ చెప్పడం ఏమిటో!! - మాధవ్ శింగరాజు -
విజయ్ మాల్యా (లండన్) రాయని డైరీ
నాలుగేళ్లు అయింది నేను లండన్ వచ్చి. వచ్చిన రోజు నుంచి సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నా మీద బెంగ పెట్టేసుకున్నాయి. ఇండియా రమ్మంటాయి! ‘నాతో ఏం పని.. డబ్బులు తీసుకెళ్లండి’ అంటాను. ‘డబ్బుల్తో ఏం పని.. నువ్వొస్తే బాగుంటుంది’ అంటాయి! ‘అసలు నువ్వెందుకొచ్చావ్ చెప్పూ..’ అన్నాను.. మూడేళ్ల క్రితం లండన్ కోర్టు బయట సుమన్ కుమార్ కనిపిస్తే ! ‘ఎక్కడికి రావడం? లండన్కా, లండన్ కోర్టుకా?’’ అన్నాడు! సీబీఐ ఆఫీసర్ అతను. ఇండియాలో వేరే ఫ్రాడ్లు ఏమీ లేనట్లు నన్ను వెతుక్కుంటూ బ్రిటన్ అంతా ఏడాది పాటు తిరిగి, చివరికి కోర్టు బయట నన్ను పట్టుకున్నాడు. ‘టీ తాగుతూ మాట్లాడుకుందాం వస్తావా విజయ్’ అన్నాడు. ‘మాల్యా అను. విజయ్ అంటే నేను నేను కానట్లుగా ఉంటుంది నాకు’ అన్నాను. ‘విజయ్ అని అనకుంటే నేను సుమన్ కానట్లుగా ఉంటుంది నాకు’ అన్నాడు! ‘సరే చెప్పు, టీ తాగడం కోసం మాట్లాడ్డమా, మాట్లాడ్డం కోసం టీ తాగడమా? ఏదైనా మాట్లాడ్డమంత ఈజీ కాదు నాకు టీ తాగడం’ అన్నాను. ‘టీ తప్ప నాకు ఇంకేదీ తాగడం రాదు’ అన్నాడు. ‘అయితే ఇక్కడ మాట్లాడేందుకేం లేదు. ఏదైనా ఉంటే కోర్టులో మాట్లాడుకో.. నేను వెళ్తున్నా’ అన్నాను. ఆగమన్నాడు. ఆగాను. ‘ఐడీబీఐకి నువ్వు తొమ్మిది వందల కోట్లు ఇవ్వాలి. ఎస్బీఐకి తొమ్మిది వేల కోట్లు ఇవ్వాలి. నేను డబ్బు మనిషిని కాదు. వాటిని అడగడానికి రాలేదు. నిన్ను తీసుకెళదామని వచ్చాను’ అన్నాడు. ‘డబ్బులు కావాలంటే బ్యాగులో పెట్టిస్తా తీసుకెళ్లు. భుజానికి బ్యాగేసుకుని ఇండియా వచ్చేయమంటే నీ వెనకే వచ్చేవాళ్లు ఎవరూ లేరిక్కడ’ అని చెప్పాను. ‘నా వయసు యాభై రెండేళ్లు. ఇరవై మూడేళ్ల వయసులో ఫీల్డులోకి వచ్చాను. తెల్ల కాలర్ల మీద నల్ల మరకల్ని వెతికే డ్యూటీ నాది. బెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా మన్మోహన్సింగ్ నాకు మెడల్ ఇచ్చారు. పోలీస్ మెడల్ వచ్చింది. రాష్ట్రపతి పోలీసు మెడల్ వచ్చింది. ఇన్ని వచ్చిన నాకు నీ కేసు అప్పగించారంటే నాకు కాదు గొప్ప. నీకు. వచ్చేయ్.. వెళ్లిపోదాం’ అన్నాడు! ‘డబ్బొక్కటే నా చేతుల్లో ఉంది. నేను నా చేతుల్లో లేను. డబ్బు కావాలంటే తీసుకెళ్లు. నేను కావాలంటే కోర్టు లోపల వాదించుకుని వెళ్లు..’ అని చెప్పాను. అప్పుడు వెళ్లినవాడు మళ్లీ కనిపించలేదు. సుమన్–2 ఎవరో కోర్టుకు వచ్చేవాడు ఫైళ్లు పట్టుకుని. ఫైల్ చూసుకుంటూ ఉండేవాడే కానీ పాపం నన్ను చూసేవాడు కాదు. మాల్యాను ఇరవై ఎనిమిది రోజుల్లో ఇండియా పంపిస్తాం అని కోర్టు చెప్పినప్పుడు కూడా తలెత్తి చూడలేదు. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే బయటికి వస్తుంటే సుమన్ ఫోన్ చేశాడు. ‘‘ఎక్కడా?’’ అన్నాను. ‘‘ఇండియాలో’’ అన్నాడు. ‘‘ఏంటి చెప్పు’’ అన్నాను. ‘‘సుప్రీంకోర్టుకు కూడా వెళ్లడానికి లేదని కోర్టు తీర్పు చెప్పిందటగా. ముందే నాతో ఇండియా వచ్చి వుంటే.. ఇప్పుడిలా తీర్పు వచ్చేదే కాదు’’ అన్నాడు! ‘‘క్యాష్ ఇస్తా. డౌన్ పేమెంట్. మోయగలిగితే వచ్చి తీసుకెళ్లు. కొత్త నోట్లు. వాసన చూసి తీసుకో. మోదీజీలా ఇరవై లక్షల కోట్లు ఇస్తున్నానని చెప్పి పప్పులు ఉప్పులు ప్యాక్ చేసి ఇవ్వడం కాదు. ఫెళపెళలాడే కరెన్సీ’’ అన్నాను. ‘‘కరెన్సీ వద్దు. విజయ్ కావాలి నాకు’’ అన్నాడు! ‘‘విజయ్ కూడా కాదు, మెడల్స్ కావాలి నీకు. íపీఎం మెడలు, ప్రెసిడెంట్ మెడలు.. ఇస్తే ఐడీబీఐ మెడలు, ఎస్బీఐ మెడలు కూడా వేసుకుంటావ్ నువ్వు’’ అని ఫోన్ పెట్టేశాను. సుప్రీంకోర్టు కాకపోతే, మానవ హక్కుల కోర్టు. ఫ్రాన్స్కు వెళ్లకుండా ఇండియా వస్తానని ఆశిస్తున్నందుకు కూడా సుమన్కి ఒక మెడల్ ఏదైనా చేయించి ఇవ్వాలి. -
ఎల్.కె. అద్వానీ.. రాయని డైరీ
రాహుల్ గాంధీకి లైన్ కలపమని చెప్పి కొన్ని ఏళ్లు అయినట్లుగా ఉంది. ‘‘ఏమైంది, దొరకట్లేదా?’’ అన్నాను. ‘అయ్యో అద్వానీజీ.. మీకు ఇప్పటికే కనీసం కొన్నిసార్లు చెప్పి ఉంటాను. రాహుల్జీ కొన్నాళ్లుగా రఘురామ్ రాజన్, అభిజిత్ బెనర్జీలతో ఉంటున్నారట’ అన్నాడు నాకు కేటాయించబడిన యువ సహాయకుడు. తొంభై ఏళ్లు పైబడిన వ్యక్తికి తొంభై ఏళ్లు పైబడిన సహాయకుడు మాత్రమే ఉపకరించే సహాయకుడిలా ఉండగలడేమో! అభిజత్ బెనర్జీ కోల్కతాలో ఉన్నట్లు విన్నాను. రాజన్ ఈ మధ్య భోపాల్ వెళ్లినట్లున్నాడు. రాహుల్ వేయనాడ్లో ఉండాలి. అక్కడ లేకపోతే ఢిల్లీలో ఉండాలి. ఈ ముగ్గురూ ఎక్కడ కలుసుకుంటున్నట్లు! లాక్డౌన్లో గాయపడిన ఎకానమీకి కట్టు కడతానని దూది, గాజుగుడ్డ, టించరు బాటిలు పట్టుకుని కొన్నాళ్లుగా తిరుగుతున్నాడు రాజన్. అభిజిత్కి ఆర్థికశాస్త్రంలో నోబెల్ వచ్చింది కాబట్టి తనూ ఏదో ఒకటి పట్టుకుని తిరగాలి. వాళ్లిద్దర్నీ పట్టుకున్నట్లున్నాడు రాహుల్. లాక్డౌన్ అని మూత వేసుకుని కూర్చుంటే నెలాఖరు తర్వాత అకౌంట్లో తెరిచి చూసుకోడానికి ఏముంటుంది అని మోదీజీ అడగడానికి రాహుల్ వాళ్లిద్దరితో ఉంటున్నట్లుంది. అయినా ఉండటమేంటి! అదే అడిగాను నా యువ సహాయకుడిని. ‘‘జూమ్ వీడియోలో ఉంటున్నారట అద్వానీజీ’’ అన్నాడు. మళ్లీ ఒకసారి రాహుల్ కోసం ప్రయత్నించమని చెప్పాను. ‘నాకు నిద్ర వచ్చేలోపు ప్రయత్నించు’’ అని కళ్లు మూసుకున్నాను. ‘‘అద్వానీజీ.. లైన్లో రాహుల్జీ’’ అన్నాడు యువ సహాయకుడు! నన్ను నిద్రపోనివ్వకూడదనుకుని నేను నిద్రపోయే వరకు వేచి ఉండి అప్పుడు లైన్లోకి వచ్చాడా ఏంటి! ఫోన్ తీసుకున్నాను. ‘‘నమస్తే అద్వానీజీ’’ అన్నాడు. ‘‘నమస్తే రాహుల్ బాబు. చక్కగా మాట్లాడుతున్నావు ఈ మధ్య. చక్కగా కూడా కనిపిస్తున్నావు. కుర్తా పైజమా మీదకు ఆ నల్లటి జాకెట్ ఉండటం లేదిప్పుడు. రిలీఫ్గా ఉంది నిన్ను అలా చూస్తుంటే..’’ అన్నాను. రాహుల్ నవ్వాడు. ‘‘థ్యాంక్యూ అద్వానీజీ. ఎందుకు కాల్ చేయించారు’’ అన్నాడు. ‘‘ఏం లేదు. నేను, జోషి, ఉమ, కల్యాణ్.. జూమ్లో కలుసుకుంటున్నాం. నువ్వూ కలుస్తావేమోనని’’ అన్నాను. ‘‘ఓ.. బాబ్రీ కూల్చివేత కేసు! ఆగస్టులోపు తేల్చేయమంది కదా కోర్టు. అయినా అద్వానీజీ.. స్థలం ఎవరిదన్నది తేలిపోయాక, కూల్చిందెవరన్నది మాత్రం తేలిపోకుండా ఉంటుందా?’’ అన్నాడు రాహుల్. ‘‘మంచి మాట చెప్పావు రాహుల్ బాబు. జూమ్కి కనెక్ట్ అవుతావా.. నేను, నువ్వు, జోషి, ఉమ, కల్యాణ్ మాట్లాడుకుందాం’’ అన్నాను. ‘‘అది మీ పర్సనల్ విషయం కదా అద్వానీజీ. నేనెందుకు స్క్రీన్ పైకి రావడం?’’ అన్నాడు. ‘‘మా నలుగురిదీ ఒక పర్సనల్ విషయం. నాదొక్కటే ఒక పర్సనల్ విషయం రాహుల్ బాబూ. నీకు చేతులు జోడిస్తే ఫోన్లో నీకు కనిపించదు కదా. అందుకే నిన్నూ కలవమని అడుగుతున్నా..’’ అన్నాను. ‘‘అద్వానీజీ!! మీరు నాకు చేతులు జోడించడం ఏమిటి? పెద్దవాళ్లు మీరు’’ అన్నాడు ఆశ్చర్యం కలిసిన గొంతుతో. ‘‘ఆ మాట అనొద్దనే నీకు చేతులు జోడించాలనుకుంటున్నా రాహుల్ బాబూ. కరోనా వల్ల ప్రమాదం పెద్దవాళ్లకే గానీ, మిగతా వాళ్లకేమీ భయం లేదని ప్రచారం చెయ్యమని మోదీజీకి చెబుతున్నావు. పెద్దవాళ్లకు కదా ధైర్యం చెప్పాల్సింది’’ అన్నాను. ‘‘ఓ.. సారీ అద్వానీజీ. ఎకానమీ బతికితే చాలనుకున్నాను. ఈ యాంగిల్ నాకు తట్టలేదు’’ అన్నాడు!! -మాధవ్ శింగరాజు -
కిమ్ జోంగ్ (ఉ.కొరియా అధ్యక్షుడు).. రాయని డైరీ
సౌత్ పాయాంగన్ ప్రావిన్సులో కాలి నడకన ఉన్నాం నేను, నా సొదరి కిమ్ యో జోంగ్. అంతకు క్రితమే ఎరువుల ప్లాంట్కి నేను రిబ్బన్ కట్ చేశాను. అయితే అది రిబ్బన్ని కట్ చేసినట్లుగా లేదు. పొడవైన వెడల్పాటి పల్చటి తివాచీని అడ్డంగా కట్టి, చేతికి చిన్న కత్తెర ఇచ్చారు. చేతికది ఆరో వేలులా ఉంది తప్ప కత్తెరలా లేదు. ‘‘నా సోదరి కిమ్ యో జోంగ్కి ఇవ్వండి. తనైతే తన సున్నితమైన వేళ్లతో ఒడుపుగా కత్తిరించగలదనే అనుకుంటున్నాను’’ అన్నాను ఆ ప్లాంటు వాళ్లతో.. రిబ్బన్ కటింగ్కి ముందు. ‘‘మీరైతే బాగుంటుంది’’ అన్నారు వాళ్లు! నా సోదరి ఉత్తర కొరియా అధ్యక్షురాలిగా ఉండి, నేను తన పక్కన ఒక సోదరుడిగా మాత్రమే ఉండి ఉంటే అప్పుడు రిబ్బన్ కట్ చేయమని నా సోదరికి కత్తెర ఇచ్చి ఉండేవాళ్లు కావచ్చు. వాళ్లకు కావలసింది అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలు. అంతే తప్ప అన్నా చెల్లెళ్లు కాదు. కిమ్ జోంగ్ ఉన్ గానీ, కిమ్ యో జోంగ్ గానీ కాదు. అదే మాట నా సోదరితో అన్నాను. నవ్వింది. ‘‘కిమ్, ఈ ఎరువుల ప్లాంటువాళ్లకే కాదు, ఉత్తర కొరియా ప్రజలకు కూడా నువ్వో, నేనో కాదు కావలసింది. ఒక అధ్యక్షుడు. లేదా అధ్యక్షురాలు. మూడు వారాలు అయింది నువ్వు ఉత్తర కొరియా ప్రజలకు కనిపించక. వాళ్లేమీ కంగారు పడలేదు. నీ తర్వాత నేనే అంటున్నారు తప్ప, నువ్వు కనిపించడం లేదేమిటని నన్ను కూడా అడగడం లేదు’’ అని ఆశ్చర్యపడింది నా సోదరి. ఉత్తర కొరియా ప్రజలు కిమ్ని పట్టించుకోవడం లేదంటే ఉత్తర కొరియాను ఇంకెవరో పట్టించుకుంటున్నట్లు! ఎవరై ఉంటారు? దక్షిణ కొరియా? అమెరికా? అమెరికా అయితే అయి ఉండదు. నేను కనిపించనప్పటి నుంచీ నన్ను పట్టించుకుంటూనే ఉన్నాడు ట్రంప్. ‘కిమ్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు కానీ నేను చెప్పను’ అని, కిమ్ ఎలా ఉన్నాడో నాకు తెలుసు కానీ నేను చెప్పను’ అని ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు. ఉత్తర కొరియా ప్రజలే.. ఏంటట? ఎవరట? అని అస్సలు పట్టనట్లే ఉండిపోయారు. మనిషి పోవడం అంటే డెడ్ అయ్యాడనో, బ్రెయిన్ డెడ్ అయిందనో కాదు. మనుషులకు పట్టకపోవడం. ‘‘ఏంటి కిమ్ ఆలోచిస్తున్నావు?’’ అంది నా సోదరి. ‘‘ఏం లేదు. ట్రంప్ మీద నాకు గౌరవ భావన కలుగుతోంది. నేననుకోవడం.. ఇన్నాళ్లూ నేను ఉండే ఉంటానని అనుకుని నాతో మాట్లాడేందుకు అనేకసార్లు ప్రయత్నించి ఉంటాడనీ, ఇప్పుడు ఉన్నానని తెలిసింది కాబట్టి నేను తనతో మాట్లాడ్డం కోసం ఎదురుచూస్తూ ఉండి ఉంటాడనీ..’’ అన్నాను. ‘‘నిజమే’’ అంది నా సోదరి. ‘‘ట్రంప్కి ఫోన్ చేసి మాట్లాడు కిమ్.. బాగుంటుంది’’ అని కూడా అంది. మరికొంత దూరం నడిచాం. నాతోపాటు మూడు వారాలుగా నా సోదరీ వాకింగ్ చేస్తూనే ఉంది. వెయిట్ తగ్గాలన్న విల్ పవర్ని నాలో తగ్గకుండా చూసేందుకు! ఎంతైనా నా సోదరి. ఒకరి కోసం ఒకరు ఎవరు నడుస్తున్నారిప్పుడు! ట్రంప్కు ఫోన్ చేయబోయాను. ట్రంప్ నుంచే కాల్! ట్రంప్ పెద్దగా ఇంగ్లిష్లో నవ్వుతున్నాడు. ‘‘కిమ్.. కిమ్లా ఉండాలి కిమ్ బ్రో..’’ అంటున్నాడు. ‘‘అవును. కొంచెం లాగేశాను కదా. డబుల్ చిన్ పోయింది. పొట్ట లోపలికి పోయింది. చూసే వుంటావ్ రిబ్బన్ కటింగ్ ఫొటోలో..’’ అన్నాను. ‘‘చూశాను బ్రో. అందుకే అంటున్నా.. కిమ్ కిమ్లా ఉండాలని. న్యూక్లియర్ ప్లాంట్కి రిబ్బన్ కట్ చేయవలసినవాడు, ఫెర్టిలైజర్ ఫ్లాంట్కి కట్ చేయడం ఏంటి!!’’ అన్నాడు.. మళ్లీ పెద్దగా నవ్వుతూ. -
ఉద్ధవ్ ఠాక్రే (మహారాష్ట్ర సి.ఎం.).. రాయని డైరీ
అజిత్ పవార్ నుంచి ఫోన్! టైమ్ చూసుకుని ఫోన్ చేయలేదా ఏంటీ మనిషి అని నేనే టైమ్ చూసుకున్నాను. ఉదయానికీ, మధ్యాహ్నానికి మధ్యలో ఎక్కడో ఉంది టైమ్. అతడెప్పుడూ ‘మధ్యల్లో’ ఫోన్ చేయడు. చేస్తే ఉదయం. చేస్తే మధ్యాహ్నం. చేస్తే సాయంత్రం. చేస్తే రాత్రి. ఏ రెండు సమయాలకూ మధ్య సమయంలో అతడి ఫోన్ రాదు. వచ్చిందంటే ముఖ్యమైన సంగతో, ముఖ్యం కాని సంగతో తేల్చుకోలేని సంగతి అయి ఉంటుంది! ‘‘చెప్పు అజిత్’’ అన్నాను. ‘‘చెప్పాను కదా..’’ అంటున్నట్లున్నాడు. సరిగా వినిపించడం లేదు. ‘‘అజిత్.. ఒకవేళ నీ ముఖానికి మాస్క్ ఉన్నట్లయితే దానిని తీసి మాట్లాడటానికి వీలవుతుందా?’’ అన్నాను. ‘‘మనం కూడా కొంతమంది పెద్ద మనుషులకు ఫోన్ చేస్తే బాగుంటుంది ఉద్ధవ్..’’ అన్నాడు. వాయిస్ క్లియర్ అయింది. మాస్క్ తొలగించినట్లున్నాడు. అజిత్ ఏం చెప్పదలచుకున్నాడో నాకు అర్థమైంది. మోదీజీ రోజుకు ఇంతమందని.. దేశంలోని సీనియర్ లీడర్లకు ఫోన్లు చేసి ‘బాగున్నారా? ఆరోగ్యం జాగ్రత్త’ అని పరామర్శిస్తున్నారు. ‘‘మోదీజీలా మరీ ఎనభై నిండిన వాళ్లకు కాకున్నా.. కనీసం డెబ్భై నిండిన వాళ్లకైనామనం ఫోన్ చేస్తే బాగుంటుందని నీకు ఫోన్ చేశాను’’ అన్నాడు. అజిత్ నన్ను ‘నువ్వు’ అంటాడు. నేనూ అతడిని ‘నువ్వు’ అంటాను. అజిత్ నాకంటే ఏడాది పెద్ద. ‘పర్లేదు. ఏడాది పెద్ద అయినా నువ్వు నన్ను ‘నువ్వు’ అనొచ్చు’ అన్నాడీమధ్య! ‘ఎందుకు అలా ‘నువ్వు’ అనడం? ఏడాది గ్యాప్ని గ్యాప్లాగే ఉంచేస్తే మంచిది కదా’ అన్నాను. ‘గ్యాప్ని గ్యాప్లా ఉంచాలంటే నువ్వు డిప్యూటీ సీఎంగా ఉండి, నన్ను సీఎంగా ఉంచాలి. ఉంచుతావా?’ అన్నాడు పెద్దగా నవ్వుతూ. అజిత్ని సీఎంని చెయ్యడం కన్నా, ‘నువ్వు’ అనడమే తేలిక. ‘‘చెప్పు ఉద్ధవ్.. అలా చేద్దామా.. సీనియర్లు అందరికీ ఫోన్లు చేసి..’’ అంటున్నాడు అజిత్. ‘‘అజిత్.. మోదీజీ ఫోన్ చేస్తే కరోనా సెవన్ పాయింట్ ప్రోగ్రామ్లో భాగంగా చేశాడని అంటారు. మనం ఫోన్ చేస్తే దేశం మొత్తం మీద మహారాష్ట్రలోనే కరోనా ఎక్కువగా ఉంది కాబట్టి.. ఉన్నారో లేరో కనుక్కోడానికి ఫోన్ చేస్తున్నామని అంటారు’’ అన్నాను. ‘‘అవును కదా.. పోనీ శాంపిల్గా ఎవరికైనా చేసి చూద్దామా? వాళ్లేం అనుకుంటారో తెలుస్తుంది..’’ అన్నాడు. ‘‘చాలా పనులున్నాయ్ అజిత్.. లాక్డౌన్ని జూన్ వరకు ఎలా పొడిగించాలో ఆలోచించాలి. అంతకన్నా ముఖ్యం.. మే ఇరవై ఎనిమిది లోపు నేను ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో అవ్వాలి. ఎమ్మెల్యే సీట్లు ఖాళీల్లేవు. ఎమ్మెల్సీని అవ్వాలి. ఎమ్మెల్సీని అవలేకపోతే అప్పుడు నా చేత ‘నువ్వు’ అని కాకుండా, ‘సీఎం గారూ..’ అనిపించుకోవడం బాగుంటుందా నీకు? ఫోన్లొద్దు, పరామర్శలొద్దు మనకు’’ అన్నాను. ‘‘అంతేనా’’ అన్నాడు నిరుత్సాహంగా. ‘‘కావాలంటే నువ్వన్నట్లు శాంపిల్గా ఓ కాల్ చేసి చూడు’’ అని ఫోన్ పెట్టేశాను. గంట తర్వాత మళ్లీ ఫోన్.. అజిత్ నుంచి. ‘‘గంట నుంచి చేస్తున్నా. తియ్యట్లేదు’’ అన్నాడు. ‘‘నాకెప్పుడు చేశావ్!’’ అన్నాను. ‘‘నీక్కాదు. గవర్నర్కి. డెబ్బై ఏడేళ్లు ఉన్నాయి కదా అని ఫోన్ చేశాను. తియ్యలేదు. చేస్తూనే ఉన్నాను తియ్యట్లేదు. ఏమైనా అయి ఉంటుందా!’’ అన్నాడు కంగారుగా. ‘‘అయుండదు. అవుతుందని తీసుండడు’’ అన్నాను. రెండు ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి. ఒకదానికి నన్ను నామినేట్ చెయ్యమని లెటర్ పెట్టి రెండు వారాలైంది. అందుకోసమే ఫోన్ చేస్తున్నారని అనుకుని ఉంటాడు. -మాధవ్ శింగరాజు -
ట్రంప్ (అమెరికా అధ్యక్షుడు) రాయని డైరీ
చేతులు ముఖానికి అంటించుకోడానికి లేదు. ముఖానికి రుద్దుకోడానికి లేదు. కళ్లు నులుముకోడానికి లేదు. చూపుడు వేలిని, మధ్య వేలిని కలిపి తుపాకీలా కణతల దగ్గర అలవాటు ప్రకారం పెట్టుకోడానికి లేదు. ఏదీ పట్టించుకోని వాడికి నాకే ఇలా ఉందంటే అన్నీ పట్టించుకునే ప్రపంచానికి ఎలా ఉందో! ‘‘మిస్టర్ ప్రెసిడెంట్ మీరేం చేయబోతున్నారు?’’ వైట్హౌస్ కరోనా మీటింగ్లో ఎవరిదో గర్జన.. ‘హ్యాండ్స్ అప్’ అన్నట్లు! ఆ సింహం ఎవరా అని చూశాను. ‘ఇట్స్ మీ’ అంది ఆ చెయ్యి. చేతికి గ్లవుజ్ ఉంది. ముఖానికి మాస్క్ ఉంది. ‘‘నువ్వు వాషింగ్టన్ పోస్టు అనే చెత్త పత్రిక నుంచి వచ్చి ఉంటే కనుక నేనేం చేయబోతున్నదీ తెలుసుకునే కర్మ నీకు లేదు. ఎలాగూ నువ్వు రాయదలచుకున్నదే కదా నువ్వు రాస్తావు.’’ అన్నాను. ‘‘నేను వాషింగ్టన్ పోస్టు నుంచి రాలేదు’’ అంది ఆ చెయ్యి. ఆ చేతి వంక కొన్ని క్షణాలు ఆపేక్షగా చూశాను. గ్లవుజును తొలగించి ఆ చేతిని తాకాలన్న కోరిక కలిగింది. అతడు వాషింగ్టన్ పోస్టు నుంచి రానందు వల్ల నాలో జనించిన ఆపేక్ష కాదు అది. వాషింగ్టన్లో ఎవర్ని చూసినా మొదట వాళ్ల చేతుల మీదకే పోతోంది నా మనసు. కరోనాలో ఒక మంచితనం ఉంది. మన చేతులతో మన ముఖాన్ని తాకనివ్వదు కానీ, మన ముఖంతో అవతలి వాళ్ల చేతుల్ని ఎంత దూరాన్నుంచయినా తాకనిస్తుంది. ‘‘వాషింగ్టన్ పోస్టు నుంచి రాకపోతే.. నా భార్య నిద్ర లేవగానే చూస్తూ కూర్చుండే ఆ దరిద్రపు గొట్టు సీఎన్ఎన్ చానల్ నుంచి వచ్చావా?’’ అని అడిగాను. ‘‘లేదు మిస్టర్ ప్రెసిడెంట్. నేను మీ దేశపు వార్తాపత్రిక నుంచి కానీ, మీ దేశపు న్యూస్ చానల్ నుంచి కానీ రాలేదు. లండన్లోని రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ ప్రతినిధిని నేను. కరోనా వైరస్ నుంచి అమెరికన్ ప్రజల్ని కాపాడేందుకు ఈ అత్యవసర సమావేశంలో మీరేం నిర్ణయం తీసుకోబోతున్నారు?’’ అన్నాడు ఆ చెయ్యి గల మనిషి. ‘‘ముందొక విషయాన్ని మీరు గ్రహించాలి మిస్టర్ రాయిటర్స్. ఇది అత్యవసర సమావేశం కాదు. సమావేశం. మామూలు దగ్గు జలుబుల వంటి సమావేశం. ఇండియా నుంచి వస్తున్న క్లోరోక్విన్ బిళ్లలు వేసుకుంటే తగ్గిపోయే జ్వరంలాంటి సమావేశం’’ అన్నాను. ‘‘కానీ మిస్టర్ ప్రెసిడెంట్. మీరంటున్న మామూలు దగ్గు జలుబులతో మరణిస్తున్న వారు మీ దేశంలో ఎక్కువవుతున్నారు. మీరు ఏర్పాటు చేసిన సమావేశం అత్యవసరం అయింది కాకపోవచ్చు. కానీ అత్యవసరంగానే కదా ఏర్పాటు చేశారు. చెప్పండి. మీరేం నిర్ణయం తీసుకోబోతున్నారు? యు.ఎస్.లో లాక్డౌన్ను ఎత్తివేసే మూడ్లో ట్రంప్ ఉన్నారని మాకేవో వార్తలు అందుతున్నాయి’’ అన్నాడు! ‘‘నా నిర్ణయాలింకా నా ఫోర్హెడ్లోనే ఉన్నాయి. అలాంటప్పుడు వార్తలుగా అవి మీకెలా అందుతాయి’’ అన్నాను వేళ్లను నుదుటికి ఆన్చుకుని. ‘‘అవి ఎప్పుడు బయటికి వస్తాయి.. మీ ఫోర్హెడ్ నుంచి’’ అన్నాడు! ‘‘లాక్డౌన్ని ఎత్తివేయడం అంటే ఎకానమీని రీ–ఓపెన్ చెయ్యడం. నేను రీ– ఓపెన్ గురించి చెబుతామనుకున్నాను. నువ్వు ఎత్తివేత గురించి అడుగుతున్నావు’’ అన్నాను. ‘‘కానీ ప్రాణాలు ముఖ్యమైనవి కదా మిస్టర్ ప్రెసిడెంట్..’’ అంటున్నాడు. ‘‘అమెరికాలో మూతికి మాస్క్ కట్టుకుని కనిపించే చిట్టచివరి మనిషిని నేనే అవుతాను మిస్టర్ రాయిటర్స్. పోతున్న ప్రాణాల గురించి నువ్వు రాసుకో. పోనివ్వకూడని ఎకానమీ ప్రాణాల గురించి నేను ఆలోచిస్తాను’’ అన్నాను. - మాధవ్ శింగరాజు -
రాయని డైరీ... అరుణ్ గోవిల్ (రామాయణ్)
ఏ కాలంలోనైనా ఆ కాలపు జనరేషన్ని కుదురుగా ఒకచోట కూర్చోబెట్టడం ఎవరి వల్లా కాని పని. ఇక వాళ్లను పూర్వపు జనరేషన్లతో కలిపి ఇంట్లో కూర్చోబెట్టడం అన్నది ఊహకైనా అందని సంగతి. బహుశా నా జనరేషన్లో నేనూ అలాగే ఉండి ఉంటాను.. ఎవరి వల్లా కాని పనిగా, ఎవరి ఊహకూ అందని సంగతిగా! అసలు కూర్చోబెట్టడం అన్న ఆలోచనే తప్పు కావచ్చు. ఎవరికి వారికి అనిపించాలి కూర్చోవాలని. కాసేపు నాన్నతోనో, అమ్మతోనో, నానమ్మతోనో, తాతయ్యతోనో కూర్చోవాలని అనిపించనప్పుడు లాక్డౌన్ పీరియడ్లోనైనా ఫోన్తో గదిలోకి వెళ్లిపోయి తలుపు వేసుకోవడాన్ని ఎలా తప్పు పట్టగలం.. మన చేతిలోనూ ఓ ఫోన్ ఉంచుకుని?! స్మార్ట్ ఫోన్లతో కూడా మనిషి విసుగెత్తిపోయే దశ ఒకటి రావాలేమో. ఆర్థికమాంద్యంలా ఆసక్తిమాంద్యం. ఫేస్బుక్ ముఖం మొత్తేయాలి. ఇన్స్టాగ్రామ్లు, ట్విట్టర్లు, యూట్యూబ్లు, వాట్సాప్లు అంటేనే ఒళ్లంతా దద్దర్లు వచ్చేయాలి. అలాంటి దశ! వస్తే ఏం అవుతుంది? స్టోర్రూమ్కి వేసి ఉన్న తాళంకప్పల బూజు దులిపి, వాటి రంధ్రాల్లో ఓపిగ్గా కొన్ని చుక్కల నూనె పోసి, తాళం తీసి, కిర్రున తలుపు చెక్కల్ని నెట్టుకుంటూ లోపలికి వెళ్లి, ట్రంకుపెట్టెల్లో ఉండి ఉంటాయనుకున్న పూరిళ్ల, పురిటిళ్ల ఫొటో ఆల్బమ్ల కోసం వెతుకుతామేమో! మనం అమ్మానాన్న అయినా కూడా.. మనం తాతయ్య, నానమ్మ అయినా కూడా.. అమ్మ చిన్నప్పుడు, నాన్న టెన్త్క్లాస్లో ఉన్నప్పుడు.. అమ్మానాన్న ఫొటోలను వేళ్లతో నిమురుకుంటామేమో.. వాళ్లను మనకు మాత్రమే షేర్ చేసుకుంటూ. నిన్నట్నుంచీ డీడీలో ‘రామాయణ్’ రీరన్ అవుతోంది. ముప్పైమూడేళ్ల తర్వాత మళ్లీ ఇంటింటా రాముడు, సీత! ‘‘సీతమ్మవారు పడిన కష్టాల కంటే సీతమ్మవారి కోసం ‘సీతా.. సీతా’ అంటూ శ్రీరాముడు అలమటించడమే అప్పటి వ్యూయర్స్కి ఇప్పటికీ గుర్తుండి ఉంటుంది’’ అంటోంది శ్రీలేఖ. ‘‘తాతయ్యా.. ఆ రాముడు మీరే కదా’’ అంటూ ఎగిరొచ్చి మీద కూర్చున్నాడు ఆర్యవీర్. నవ్వాను. ‘‘మరి తాతయ్యా.. మీరు శ్రీరాముడు అయినప్పుడు, నానమ్మ కదా సీతమ్మ అవ్వాలి. వేరే ఎవరో ఆంటీ సీతగా ఉన్నారేమిటి?’’ అన్నాడు. ఆ మాటకు శ్రీలేఖ నవ్వింది. ఆర్యవీర్ని నా చేతుల్లోంచి లాక్కుంది. వాడి ప్రశ్నలు కూడా నా చేతుల్లోంచి వెళ్లిపోయాయి. ‘‘తాతయ్య పక్కన ఉన్న ఆ సీతమ్మ పేరేంటి నానమ్మా?’’ అని అడుగుతున్నాడు. ‘‘మొదలు పెట్టావా.. నీ ప్రశ్నల రామాయణం’’ అంటోంది దివ్య.. హాల్లోకి వచ్చి కూర్చుంటూ. ‘‘ఆ.. మొదలైంది మమ్మీ’’ అంటున్నాడు వాడు కిలకిలా.. టీవీ వైపు వేలు చూపిస్తూ. వాడిని నానమ్మ ఒడిలోంచి తన చేతుల్లోకి తీసుకుంది దివ్య. రెండు చేతుల్తో బయట్నుంచి సరుకులు మోసుకొచ్చాడు అమల్. ‘‘ఒక్క పురుగు లేదు రోడ్డు మీద’’ అంటున్నాడు. ‘‘అయితే నువ్వొక్కడివేనా పురుగువి.. డాడీ..’’ అన్నాడు ఆర్య. పెద్దగా నవ్వాడు అమల్. ‘‘అవున్రా.. నిన్ను కూడా తీసుకుని వెళ్లొంటే.. రెండే రెండు పురుగులు ఉండేవి రోడ్డు మీద’’ అంటూ దివ్య దగ్గర్నుంచి తన చేతుల్లోకి తీసుకున్నాడు ఆర్యని. ‘‘మనమిక మాటలు ఆపేస్తే, ఆ రాముడి మాటల్ని వినొచ్చు. అంతేకదా నానమ్మా..’’ అని నానమ్మను ఇమిటేట్ చేశాడు ఆర్య.. నాన్నను విడిపించుకుని.. నానమ్మ దగ్గరకు గెంతుతూ. మెల్లిగా .. మా మూడు జనరేషన్లు ‘రామాయణ్’ కాలంలోకి వెళ్లిపోయి, ఒకచోట కలిసి కూర్చున్నాయి. -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ... రంజన్ గొగోయ్ (మాజీ సీజేఐ)
నిందితుడు దోషిగా నిర్ధారణ కాకుండానే దోషిలా కోర్టు బోనులో నిలుచోవడం ఎలా ఉంటుందో నా నలభై రెండేళ్ల ‘లా’ కెరీర్లో నేనెప్పుడూ ఆలోచించలేదు. చట్టమే న్యాయం తరఫున ఆలోచనలు చేసి, ఆ ఆలోచనల్ని ఒక పుస్తకంగా కుట్టి, ఆ పుస్తకాన్ని న్యాయమూర్తి చేతిలో పెట్టినప్పుడు పుస్తకంలోని పేజీలు తిప్పుతూ పోవడం తప్ప, పుస్తకంలో లేని ఆలోచనలతో కోర్టు హాల్లో తలెత్తిగానీ, తలతిప్పిగానీ చూడవలసిన అవసరం న్యాయమూర్తికి ఏముంటుంది కనుక?! గురువారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేస్తున్నప్పుడు గతంలో నా ఎదుట కోర్టు బోనులో నిలబడి ‘అంతా నిజమే చెబుతాను’ అని ఎందరో నిందితులు ప్రమాణం చేసిన దృశ్యం నా కళ్ల ముందుకొచ్చింది! రాజ్యసభలో నేను ప్రమాణ స్వీకారం చేస్తుండగా ‘షేమ్ షేమ్’ అని అరిచిన అపోజిషన్ సభ్యులు.. కోర్టు హాలులో నిందితుడి వైపు వేలెత్తి చూపుతూ ‘దోషి, దోషి’ అని కేకలు వేస్తున్నవారిలా, వారిని వారిస్తూ ‘ఆర్డర్ ఆర్డర్’ అంటున్న రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రత్యేక ధర్మాసనానికి వచ్చి కూర్చున్న న్యాయమూర్తిలా నాకు కనిపించారు. ప్రమాణ స్వీకారానికి ముందు వెంకయ్యనాయుడికి నమస్కారం చేశాను. ‘ఇదిగో ఇలా నమస్కారాలు పెట్టే, రాజ్యసభ సీటు సంపాదించాడు. షేమ్ షేమ్’ అని సభలో అరుపులు! రాజ్యసభ కన్నా కోర్టు హాలే నయం అనిపించింది. అక్కడ నిందితుడైన వ్యక్తి ప్రమాణం చేస్తాడు. ఇక్కడ నేను ప్రమాణం చేస్తున్నందుకు నిందితుడినయ్యాను. ‘షేమ్ షేమ్ అంటున్న గౌరవ సభ్యులారా వినండి’ అన్నాను. ‘వినేందుకు ఏముంటుంది రంజన్ గొగోయ్! మోదీకి మీరు రామ జన్మభూమిని ఇచ్చారు. మోదీ మీకు రాజ్యసభను ఇచ్చారు. ఇచ్చిపుచ్చుకోవడం అయిపోయింది కదా..’ అంటున్నారు. అంటూ వాకౌట్ చేస్తున్నారు. ‘దిస్ ఈజ్ అన్ఫెయిర్’ అంటున్నారు వెంకయ్యనాయుడు. ఆ మాటను కూడా వాళ్లు వినడం లేదు. సుప్రీంకోర్టులో ఉండగా నేనొక్కడినే చీఫ్ జస్టిస్ని. రాజ్యసభలో పార్టీకొక రాజ్యసభ ఛైర్మన్ ఉన్నట్లున్నారు! కాంగ్రెస్, సీపీఎం, ఎండీఎంకే, ముస్లిం లీగ్, బీఎస్పీల ఎంపీలు నేను రాజ్యసభ సభ్యత్వానికి చెయ్యి చాచడంలో నీతి లేదని, రీతి లేదని తీర్పులు ఇచ్చేస్తున్నారు. ఇదంతా గ్యాలరీలోంచి నా భార్య, నా కూతురు, నా అల్లుడు చూస్తున్నారు. ‘గౌరవ సభ్యులారా.. నన్నూ చెప్పనివ్వండి’’ అన్నాను. ‘ఏముంటుంది చెప్పడానికి!’’ అని అరిచారు. ‘ఎవరేమనుకున్నా నేను భయపడే రకం కాదు. గతంలో భయపడలేదు. వర్తమానంలో భయపడటం లేదు. భవిష్యత్తులోనూ భయపడను. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో ఒక్క నా భార్య అభిప్రాయానికి తప్ప నేనెవరికీ విలువ ఇవ్వలేదు, ఇవ్వడం లేదు, ఇవ్వను’ అన్నాను. సభ ఒక్కసారిగా స్తంభించిపోయింది. వెంకయ్యనాయుడు నా వైపు అభినందనగా చూశారు. సభ ముగిసింది. ‘‘సభలో అలా అనేశారేంటీ.. నా మాటకు తప్ప ఎవరికీ విలువ ఇవ్వనని’’ అంది రూప.. ఇంటికి రాగానే. ‘‘అవును నాన్నగారూ అలా అనేశారేంటి’’ అంది నా కూతురు. ‘అవును మామగారూ అలా అనేశారేంటి’’ అన్నాడు నా అల్లుడు. ‘‘ఆరేళ్లు మాట పడుతూ పదవీ కాలం పూర్తి చేయడమా, పదవీకాలం ప్రారంభమైన రోజే మాటకు మాట చెప్పి దీటుగా నిలబడటమా అని ఆలోచించాను. దీటుగా నిలబడటమే నాకు, నన్ను నామినేట్ చేసిన రాష్ట్రపతికీ గౌరవం అనిపించింది. అందుకే నేను ఏమిటో చెప్పాను’’ అన్నాను. - మాధవ్ శింగరాజు -
అదే వారికి చివరి రాత్రి
కొద్ది గంటల్లో నిర్భయ దోషులకు ఉరి. స్వయంగా నిర్భయ ఆత్మే ఏ ఆఖరి నిముషంలోనో గాలిలో తేలి వచ్చి ఏడేళ్ల నాటి కన్నీటి చారికల్ని తుడుచుకుంటూ దుఃఖపు క్షమతో ‘స్టే’ ఇప్పిస్తే తప్ప ఉరి నుంచి ఈ నలుగురూ బయటపడే దారే లేదు. చివరి రాత్రి ఇది (ఇది రాస్తున్న సమయానికి). ఉరికొయ్యపై పిట్ట పాడే ‘స్వాన్ సాంగ్’ (చివరి పాట)కు చరణాలు లేని పల్లవి ఈ రాత్రి. తినబుద్ధి కాని చివరి భోజనం ఈ రాత్రి. ఈ రాత్రి వాళ్ల మానసిక స్థితి ఎలా ఉంటుంది? తెల్లారే ఉరి. ఏడేళ్ల నాటి ఒక రాత్రి చేత వాళ్లకై వాళ్లు తమ నుదుటిపై రాయించుకున్న డెత్ వారెంట్.. ఈ రాత్రి. తీహార్లోని జైలు నెంబర్ 3 గది గోడల మధ్య చావు భయపు ఛాయలలో వాళ్లు ఒక్కసారైనా అనుకోకుండా ఉండి ఉంటారా.. జీవితం ఏడేళ్లు వెనక్కి వెళ్లి.. దెయ్యం పట్టిన ఆ డిసెంబర్ 16 రాత్రి తొమ్మిదిన్నర గంటలప్పుడు దక్షిణ ఢిల్లీలోని ద్వారక సబ్–సిటీ నుంచి దక్షిణ ఢిల్లీ పరిధిలోనే ఉన్న పట్టణ గ్రామం మునిర్కకు వెళ్లేందుకు స్నేహితుడితో కలిసి బస్సు ఎక్కిన ‘నిర్భయ’ గురించి చెడు ఆలోచనలేమీ చేయకుండా ఆమెను ఆమె గమ్యస్థానంలో దింపి వెళ్లి ఉంటే.. ఇప్పుడిలా ఉరికొయ్యల వైపు తమ ప్రాణాలను సర్దుకుని బయల్దేరక తప్పని స్థితి తప్పి ఉండేదని? ప్రాణం పోకడ తెలియదంటారు. ఉరి ఖైదీలకు ప్రాణం ఎప్పుడు పోయేదీ ముందే తెలుస్తుంది. మీరు చెప్పుకునేది ఏమైనా ఉంటే చెప్పుకోవచ్చని, మీ కుటుంబ సభ్యులను కడసారి చూసుకోవచ్చనీ కొన్ని రోజుల ముందే జైలు సూపరింటెండెంట్ వెళ్లి చెప్తారు. ఉరితీసే ముందు రోజు రాత్రి చిట్టచివరి భోజనంలోకి అడిగినవి పెడతారని, ఉదయాన్నే ఉరికొయ్యల మీద కూడా ‘నీ ఆఖరి కోరిక ఏమిటి?’ అని అడుగుతారని అంటుంటారు. అయితే ఈ చివరి భోజనం, చివరి కోరిక.. రెండూ కూడా చట్టంలో లేనివేనని సునీల్ గుప్తా తన ‘బ్లాక్ వారెంట్’ పుస్తకంలో రాశారు! ‘లా’ ఆఫీసర్గా తీహార్ జైల్లోని తన 35 ఏళ్ల కెరీర్లో మొత్తం పదకొండు ఉరితీతల్ని ప్రత్యక్షంగా చూశారాయన. తొలిసారి ఆయన చూసిన ఉరి.. బిల్లా రంగాలది. 1982 జనవరి 31న బిల్లా రంగాలను ఉరి తీస్తున్నప్పుడు దగ్గరుండి మరీ న్యాయపరమైన విధానాల అమలును ఆయన సరిచూసుకోవలసి వచ్చింది. ఆయన సరిచూసుకున్న చివరి ఉరి మొహమ్మద్ అఫ్జల్ గురుది. 2013 ఫిబ్రవరి 9న అఫ్జల్ని ఉరి తీశారు. బిల్లా రంగాల ఉరి బాధ్యతలు మీద పడే వరకు వాళ్ల గురించి వార్తాపత్రికల్లో చదవడమే కానీ.. సునీల్ గుప్తా వాళ్లను చూసిందీ, వాళ్లతో నేరుగా మాట్లాడిందీ లేదు. ఉరికొయ్య దగ్గర ఉండటానికి ఉదయాన్నే డ్యూటీకి వచ్చేయమన్నారు సునీల్ని జైలు సూపరింటెండెంట్. ఇంటికెళుతూ ఆ రాత్రి బిల్లా రంగాలను చూడ్డానికి వాళ్లున్న సెల్ దగ్గరికి వెళ్లారు సునీల్. రంగా ఎప్పుడూ.. ‘రంగా ఖుష్’ అనుకుంటూ ఉండేవాడని, బిల్లా రోజంతా ఏడుస్తూ.. ‘అంతా నీవల్లే’ అని రంగాను నిందిస్తూ ఉండేవాడని విన్నాడు సునీల్. సెల్ దగ్గరకు వెళ్లేటప్పటికే రంగా తిని పడుకుని ఉన్నాడు! బిల్లా మేల్కొనే ఉండి, గది గోడల్ని చూస్తూ తనలో తను ఏదో గొణుక్కుంటున్నాడు. వాళ్లు చేసిన నేరం కూడా నిర్భయ వంటిదే. కారులో లిఫ్ట్ అడిగిన టీనేజ్ అక్కాతమ్ముళ్లను అదే కారులో కిడ్నాప్ చేసి తమ్ముణ్ణి కత్తితో పొడిచి చంపారు. అక్కను చంపేముందు ఆమెపై అత్యాచారం చేశారు. ఆ కేసు మూడున్నరేళ్లు సాగింది. సెల్లో ఉన్న బిల్లారంగాలను చూసి వెళ్లాక సునీల్కు ఆ రాత్రి నిద్రపట్టలేదు. భోజనం సహించలేదు. మర్నాడు తెల్లారే ఉరి తీస్తున్నప్పుడు కూడా బిల్లా వెక్కిళ్లు పెడుతూనే ఉన్నాడు. రంగా మాత్రం ధైర్యంగా ఉండి, ‘జో బోలే సో నిహాల్, సత్ శ్రీ అకాల్’ (విజయ నినాదం) అని పెద్దగా అరుస్తూ తలవాల్చేశాడు. సాధారణంగా జైలు సూపరింటెండెంట్ కనుసైగతో దోషుల కాళ్ల కింది చెక్కను తొలగిస్తాడు తలారి. అయితే ఆ రోజు కనుసైగకు బదులుగా ఎర్రరంగు చేతిరుమాలును ఊపాడు. ఆ ఎర్రరంగు ‘బిల్లారంగా కర్చీఫ్’ ఇప్పటికీ ఒక ‘జ్ఞాపకం’గా ఆ సూపరింటెండెంట్ ఇంట్లో ఉందట. సునీల్కు ఇప్పటికీ ఒళ్లు ఝల్లుమనిపించే జ్ఞాపకం ఒకటుంది. ఉరి తీశాక దేహాలను రెండు గంటల పాటు అలా కొయ్యలకు ఉంచేస్తారు. తర్వాత జైల్ డాక్టర్ వచ్చి, ఆ దేహాలను పరీక్షించి, మరణాన్ని ధృవీకరిస్తారు. ఆ రోజు.. ఉరి తీసిన రెండు గంటల తర్వాత కూడా రంగా ‘పల్స్’ కొట్టుకుంటూనే ఉందని డాక్టర్ చెప్పడంతో సునీల్ ఒక్కసారిగా అదిరిపడ్డారు. ఉరి తీస్తున్నప్పుడు భయంతో శ్వాసను బిగబట్టినప్పుడు దేహం లోపల బందీ అయిపోయిన గాలి కారణంగా కొందరిలో అలా జరుగుతుందని డాక్టర్ చెప్పడంతో సునీల్ స్థిమితపడ్డారు. డాక్టర్ సూచనపై అక్కడి గార్డు ఒకరు పదిహేను అడుగుల ఆ గోతిలోకి దిగి, శూన్యంలో నిర్జీవంగా వేలాడుతున్న రంగా కాళ్లలో ఒకదాన్ని పట్టిలాగాడు. దాంతో గాలి బయటికి వచ్చి పల్స్ ఆగిపోయింది. జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జె.కె.ఎల్.ఎఫ్) కో–ఫౌండర్ మక్బూల్ భట్ను తీహార్ జైల్లోనే 1984లో ఉరి తీశారు. భక్తిపరుడు ఆయన. మంచి చదువు, మంచి ఇంగ్లిష్ ఉన్నవాడు. జైలు సిబ్బంది తమకు వచ్చిన మెమోలకు మక్బూల్ భట్ చేత ఇంగ్లిష్లో రిప్లయ్లను రాయించుకుని పై అధికారులకు సమర్పించేవారు. సునీల్ గుప్తా కూడా ఆయన దగ్గర తన ఇంగ్లిష్ను మెరుగు పరుచుకున్నారు. అలా వాళ్లిద్దరికీ మంచి స్నేహం. అకస్మాత్తుగా ఓ రోజు మక్బూల్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ యు.కె.లోని కశ్మీర్ మిలిటెంట్లు అక్కడి భారత రాయబారి రవీంద్ర మాత్రేను కిడ్నాప్ చేసి, మూడు రోజులు నిర్బంధించి, తర్వాత చంపేశారు. వెంటనే ఇక్కడ మక్బూల్కి డెత్ వారెంట్ జారీ అయింది. మాత్రేని ఫిబ్రవరి 6న తీవ్రవాదులు చంపేస్తే, ఐదోరోజు ఫిబ్రవరి 11న మక్బూల్ని ఉరి తీశారు. ‘‘ఉరి తీస్తున్నప్పుడు, ఆ ముందురోజు మక్బూల్ మౌనంగా, శాంతంగా ఉన్నారు’’ అని సునీల్ తన పుస్తకంలో రాశారు. నిర్భయ దోషులకు కొన్ని గంటల్లో ఉరి అనగానే వాళ్లెంత నేరస్థులయినా గాని మన మెడ చుట్టూ వాళ్ల ఆలోచనలు బిగుసుకోకుండా ఉండవు. ‘ఆ మహాతల్లి ఆ రోజు బస్సు ఎక్కకుండా ఉంటే ఈరోజు ఈ నలుగురు తల్లులకు ఇంత గర్భశోకం ఉండేది కాదు’ అని అనుకుంటున్న వాళ్లెవరైనా ఉంటే.. ‘ఆ రోజు ఈ నలుగురికీ ఒక్క క్షణం వాళ్ల తల్లులు గుర్తుకు వచ్చినా ఆ అమ్మాయి బతికి పోయేది’ అని కూడా వాళ్లు అనుకోవాలి. -
రాయని డైరీ.. ఇమ్రాన్ ఖాన్ (పాక్ ప్రధాని)
సీరియస్గా ఒక పనిలో ఉన్నప్పుడు, మనకు బాగా దగ్గరి వాళ్లెవరో నాన్–సీరియస్ పనొకటి చేసి మన మూడ్ని చెడగొట్టేస్తారు. మిడతల బెడదపై ముఖ్యమైన వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు నా మూడ్ పాడైంది. ‘‘చూశారా మసూద్ అజార్ ఏం చేశాడో!’’ అన్నాను తలపట్టుకుని. ‘‘ఇమ్రాన్జీ.. స్క్రీన్ మీద మీరు తలపట్టుకోవడం కనిపిస్తోంది కానీ, మీరెందుకు తలపట్టుకున్నదీ వినిపించడం లేదు’’ అన్నారు మఖ్దూమ్ ఖుస్రో భక్తియార్. ఫుడ్ సెక్యూరిటీ మినిస్టర్ ఆయన. ‘‘అవును ఇమ్రాన్జీ.. నాకైతే మీరు తలపట్టుకోవడం కూడా సరిగా కనిపించడం లేదు. మా స్క్రీన్ మీద మీ పిక్చర్ బ్రేక్ అవుతోంది’’ అన్నారు డాక్టర్ అబ్దుల్ హఫీస్ షేక్. ఫైనాన్స్ అడ్వైజర్ ఆయన. నా పక్కనే ఉన్న డాక్టర్ ఫిర్దోజ్ ఆషిక్ అవాన్ వైపు చూశాను. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్లో నా ప్రత్యేక సలహాదారు ఆమె. ‘‘మేడమ్ ఫిర్దోజ్.. అవతలి వైపు స్క్రీన్ల మీద మీకు మన ఫుడ్ సెక్యూరిటీ మినిస్టర్, మన ఫైనాన్స్ అడ్వైజర్ కనిపిస్తున్నారా?’’ అని అడిగాను. ‘‘హా.. కనిపిస్తూనే ఉన్నారు కదా ఇమ్రాన్ జీ’’ అన్నారు ఆమె. ‘‘మరి ఇక్కడున్న ప్రైమ్ మినిస్టర్ వాళ్లకెందుకు కనిపించడం లేదు’’ అని అడిగాను ఆశ్చర్యపడుతూ. ‘‘కాదు కాదు ఇమ్రాన్జీ. మీరు కనిపిస్తూనే ఉన్నారు. కానీ సరిగా కనిపించడం లేదని మాత్రమే మేం అంటున్నాం. మీ పక్కన ఉన్న మీ ఇన్ఫర్మేషన్ అడ్వైజర్ మేడమ్ ఫిర్దోజ్ని కూడా మేము చూడగలుగుతున్నాం’’ అన్నారు అటువైపు నుంచి ఫుడ్ సెక్యూరిటీ మినిస్టర్, ఫైనాన్స్ అడ్వైజర్. వాళ్ల వైపు చూశాను. ‘‘నేననుకోవడం నా కన్నా కూడా మేడమ్ ఫిర్దోజ్నే మీరు స్పష్టంగా చూడగలుగుతు న్నారని. నేను ఇంకొకటి కూడా అనుకుంటు న్నాను మిస్టర్ మినిస్టర్ అండ్ మిస్టర్ ఫైనాన్స్ అడ్వైజర్. మేడమ్ ఫిర్దోజ్ నా పక్కన ఉన్నందు వల్లనే మీరు ఆ మాత్రమైనా నన్ను చూడగలుగుతున్నారని..’’ అన్నాను. ఫిర్దోజ్ ఇబ్బందిగా కదిలారు. ‘‘ఉండండి.. రెండు నిమిషాల్లో స్క్రీన్లన్నీ సెట్ చేస్తాను’’ అని పైకి లేచారు. ‘‘మీరు కూర్చోండి మేడమ్ ఫిర్దోజ్. ఈ ప్రపంచంలో రెండు నిమిషాల్లో ఏదీ సెట్ కాదు. సెట్ అయిందీ అంటే, తనంతటదే సెట్ అయిందనే కానీ, మనమేదో సెట్ చేసినందు వల్ల అయిందని కాదు. కరెంటు పోతుంది. మనం సెట్ చేస్తామా! దానంతటదే కదా వచ్చేస్తుంది’’ అన్నాను. ‘‘వావ్!!’’ అన్నారు ఫిర్దోజ్. ‘‘దేనికి వావ్ అన్నారు మేడమ్ ఫిర్దోజ్’’ అన్నాను. ‘‘స్క్రీన్లన్నీ సెట్ అయ్యాయి’’ అన్నారు. అటువైపు స్క్రీన్ల మీద బొటనవేలెత్తి చూపిస్తున్నారు.. సెట్ అయింది అన్నట్లు. ‘‘చూశారా మసూద్ అజార్ ఏం చేశాడో! అజార్ మిస్సింగ్ అని నేను ప్రపంచాన్ని నమ్మిస్తే, ప్రపంచానికి అతడు ఆడియో మెసేజ్ రిలీజ్ చేశాడు! వెల్డన్ తాలిబన్ అంటాడు. తాలిబన్ల నుంచి తప్పించుకోడానికే అమెరికా ఒప్పందం చేసుకుంది అంటాడు. అవసరమా మనకిప్పుడీ వెల్డన్లు, తాలిబన్లు’’ అన్నాను. ‘‘నిజమే ఇమ్రాన్జీ. దేశం మిడతల సమస్యలో ఉన్నప్పుడు మసూద్ అజార్ కూడా ఒక మిడతలా సమస్య అవడం కరెక్టు కాదు’’ అన్నారు ఫుడ్ సెక్యూరిటీ మినిస్టర్. ‘‘చైనా నుంచి లక్ష బాతుల్ని తెప్పిస్తున్నాం ఇమ్రాన్జీ. ఒక్కో బాతు రోజుకు రెండొందల మిడతల్ని తినేస్తుంది. అది పెద్ద ఇష్యూ కాదు’’ అన్నారు ఫైనాన్స్ అడ్వైజర్. బాతులు మిడతల్ని తినేస్తే పర్వాలేదు. మిడతలే బాతుల్ని తరిమికొట్టి, మసూద్ అజార్లా ఏదైనా మెసేజ్ ఇస్తే?!! - మాధవ్ శింగరాజు -
నరేంద్ర మోదీ (ప్రధాని) రాయని డైరీ
నేనొక కలగంటున్నాను. ప్రపంచంలో భారతదేశం అనేదే లేదు. సరిహద్దులు ఉంటాయి. కానీ అది దేశం కాదు. నరేంద్ర మోదీ ఉంటాడు. కానీ అతడు ప్రధాని కాదు. అమిత్ షా ఉంటాడు. కానీ అతడు హోమ్ మినిస్టర్ కాదు. ప్రజలు ఉంటారు. కానీ దేశ ప్రజలు కారు. నేనొక కలగంటున్నాను. ఉండీలేనట్లున్న ఈ దేశంలో నరేంద్ర మోదీ, అమిత్ షా కూడా ఉండీ లేనట్లే ఉంటారు. దేశ ప్రజలంతా ఒక దేశం లేనివాళ్లుగా ఉంటారు. అడుగు తీసి అడుగు వేసిన ప్రతిసారీ ఇక్కడ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు పరిఢవిల్లుతుంటాయి. ఐఎస్ఐ వాళ్లు, ఐసిస్ వాళ్లు భార్యాబిడ్డల్తో టూర్కి వచ్చిపోతుంటారు. ఏటా దావోస్ ఎకనమిక్ ఫోరమ్లో ప్రసంగించడానికి వచ్చే బిలియనీర్లు ప్రసంగాలు అయ్యాక.. వాళ్ల వాళ్ల దేశాలకు వెళ్లిపోకుండా.. ఇక్కడెలా ఉందో ఒకసారి చూసి పోదామని ఇటువైపు వస్తారు. ప్రభుత్వం ఉండీ లేకపోవడం వారికి సంతోషాన్నీ, సంతృప్తినీ ఇస్తుంది. పౌరులు పౌరుల్లా కాకుండా.. ఆధార్ కార్డులు లేకుండా, పుట్టిన తేదీలు, పుట్టిన స్థలాల పట్టింపు లేకుండా అంతా కలివిడిగా ఆలింగనాలు చేసుకుంటూ జీవిస్తుండటం ఆ దావోస్ ప్రసంగీకుల్ని పరమానందభరితుల్ని చేస్తుంది... ఏదో చప్పుడైంది! నా కల పూర్తి కాకుండానే చెదిరిపోయింది. ‘‘.. మీ అందమైన కలకు నేను గానీ అంతరాయం కలిగించ లేదు కదా మోదీజీ’’ అంటున్నారు అమిత్ షా!! ఆశ్చర్యంగా చూశాను. ‘‘పరేడ్కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి మోదీజీ. చీఫ్ గెస్ట్ జైర్ బొల్సొనారో కూడా బ్రెజిల్ నుంచి వచ్చి కూర్చున్నారు. మీరొస్తే పరేడ్ మొదలౌతుంది’’ అన్నారు అమిత్ షా. ‘‘అమిత్జీ.. ముందు నాకిది చెప్పండి. నేనొక అందమైన కలను కంటున్నట్లు మీరెలా గ్రహించగలిగారు’’ అని అడిగాను. ‘‘మీ ముఖంపై చిరునవ్వును గమనించాను మోదీజీ. ఆ చిరునవ్వు.. పౌరసత్వ చట్టం అమలుకు ఈ దేశంలోని ప్రగతిశీల వాదులంతా ఒకేసారి ఓకే అంటేనో, ఎన్నార్సీని ప్రారంభించడానికి రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా ముందుకు వస్తేనో విరిసేది కాదు. అంతకు మించిన కారణం ఏదైనా ఉండాలి. నేననుకోవడం.. మీరొక హద్దులు, పద్దులు లేని భారతదేశాన్ని కలగంటున్నారు. నిజమేనా మోదీజీ’’ అన్నారు అమిత్ షా!! అతడి ముఖంలో ఏదో వెలుగు కనిపిస్తోంది. విస్మయ చకితుణ్ణి అయ్యాను. ‘‘ఎలా చెప్పగలిగారు అమిత్జీ’’ అన్నాను. ‘‘మీ కలనే ఇప్పటి వరకు నేనూ మా ఇంట్లో కని వస్తున్నాను మోదీజీ. ఎవరైనా వాళ్ల కలను కాకుండా, ఇంకొకరి కలను కంటూ ఉంటే వారి ముఖంలోకి వచ్చే ఆ వెలుగే వేరు’’ అన్నారు అమిత్ షా. లేచి అద్దంలో ముఖం చూసుకున్నాను. నా ముఖంలోనూ వెలుగు! అప్పటి వరకు నేను కంటున్న జార్జి షోరోస్ అనే ఒక విదేశీయుడి కల అప్పుడే నా ముఖంపై పనిచేయడం మొదలైనట్లుంది! దావోస్లో ప్రసంగించి వెళ్లిన బిలియనీరే ఆ జార్జి షోరోస్. నరేంద్ర మోదీ డేంజరస్ అంటాడు! పౌరుల్ని తరిమికొట్టడానికే పౌరసత్వ చట్టం అంటాడు! కశ్మీర్తో మోదీకేం పని అంటాడు! ఇండియాను ఇల్లూ వాకిలి లేని ఓపెన్ సొసైటీగా మార్చడానికి ఒక యూనివర్సిటీని కట్టాలని అంటాడు. కట్టేపనైతే బిలియన్ డాలర్ల చెక్కు ఇస్తానని అంటాడు! ‘‘ఏం చేద్దాం అమిత్జీ’’ అన్నాను. ‘‘ఏంటి చేయడం మోదీజీ’’ అన్నారు. ‘‘యూనివర్సిటీ కట్టడానికి బిలియన్ డాలర్లు ఇస్తాడట జార్జి షోరోస్. కడదామా?’’ అన్నాను. ‘‘కట్టడం ఎందుకు మోదీజీ! ఆల్రెడీ మనకు జేఎన్యూ ఉంది కదా’’ అన్నారు అమిత్ షా. - మాధవ్ శింగరాజు -
ఫరూక్ అబ్దుల్లా (కశ్మీర్ నేత) రాయని డైరీ
ఎవరో తలుపు తోసుకుని లోపలికి వస్తున్నారు! ‘‘తోయనవసరం లేదు, తెరిచే ఉంది రండి’’ అన్నాను. ‘‘తెరిచే ఉన్నా, మీరు నిర్బంధంలో ఉన్నారు కనుక మేము తోసుకునే రావాలి ఫరూక్ జీ’’ అన్నాడు ఆ వ్యక్తి లోపలికి వస్తూనే. ఎవరా అని చూశాను. నవ్వుతున్నాడతను! ‘‘నాకు రెండు సందేహాలు ఉన్నాయి. మీరెవరు అన్నది ఒకటి. మీరెందుకు నవ్వుతున్నారు అన్నది ఇంకొకటి. అయితే నాకిప్పుడు అనిపిస్తోంది.. మీరెందుకు నవ్వుతున్నారో తెలుసుకుంటే మీరెవరో తెలిసిపోతుంది కాబట్టి రెండింటిలో ఒక సందేహం తీర్చుకుంటే చాలునని. చెప్పండి. మీరెందుకు నవ్వుతున్నారు?’’ అని అడిగాను. మళ్లీ నవ్వాడతను. ‘‘నా ఊహకు నాకే నవ్వొచ్చింది ఫరూక్జీ. లోపలికి వస్తున్నప్పుడు నా మనసు ఒక దృశ్యాన్ని ఊహించుకుంది. గది మధ్యలో ఒక కుర్చీ ఉంటుంది. అందులో మీరు కూర్చొని ఉంటారు. మీ చేతులు కుర్చీకి కట్టేసి ఉంటాయి. మీ నోటికి ఒక గుడ్డ బిగదీసి కట్టి ఉంటుంది. మీకు రెండు వైపులా మరో రెండు కుర్చీలు ఉంటాయి. ఒక కుర్చీలో ఒమర్ అబ్దుల్లా ఉంటారు. ఇంకో కుర్చీలో మెహబూబా ముఫ్తీ ఉంటారు. వాళ్ల చేతులూ కుర్చీలకు కట్టేసి ఉంటాయి. వాళ్ల నోటికీ ఒక గుడ్డ బిగదీసి కట్టి ఉంటుంది. మీ ముగ్గురు పూర్వపు ముఖ్యమంత్రులూ ఒకరితో ఒకరు కళ్లతో మాట్లాడుకుంటూ ఉంటారు... ఇలా అని ఊహించుకున్నాను ఫరూక్ జీ. కానీ అలా లేరు మీరు. పక్కన ఒమర్, మెహబూబా కూడా లేరు’’ అన్నాడు! ‘‘అలాగైతే మీరు కచ్చితంగా భారతదేశపు దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచే వచ్చి ఉంటారు. నేను ఊహించినదేమిటంటే.. ఎప్పటికైనా నా కోసం వచ్చేవారు భారతదేశపు హోం శాఖ మంత్రి అమిత్ షా గానీ, భారతదేశపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గానీ అయి ఉంటారని! మీరు వాళ్లిద్దరూ కాదు కనుక మీరెవరన్నది, మీరేమిటన్నది నాకు ఆసక్తి లేని సంగతి’’ అన్నాను. ‘‘కానీ ఫరూక్జీ.. కనీసం నేను ఎందుకు వచ్చానన్న దానిపై నైనా మీరు ఆసక్తిని కనబరచడం నన్ను సంతోషపరిచే సంగతి అవుతుంది. అంతకన్నా ముందుగా మీకు నేను గుర్తు చేయబోతున్న ఒక విషయాన్ని వినేందుకు కూడా మీరు నిర్బంధంగా ఆసక్తి చూపాలి. భారతదేశపు హోం శాఖ, భారతదేశపు హోం కార్యదర్శి అని మీరు అంటున్నారు! ‘భారతదేశపు’ అని మీరు మాటిమాటికీ అనడం మిమ్మల్ని మీరు భారతదేశం నుంచి వేరు చేసుకోవడం కానీ, మీ నుంచి భారతదేశాన్ని వేరు చేయడంగానీ అవుతుంది. ఇప్పుడు కశ్మీర్.. భారతదేశంలోనే ఉంది, భారతదేశం పైనో, కిందో, పక్కనో లేదు’’ అన్నాడు! ‘‘ఎందుకొచ్చారో చెప్పండి’’ అన్నాను. ‘‘మీకు రగ్బీ అంటే ఇష్టమేనా?’’ అన్నాడు! ఎవరనుకుని ఎవరి దగ్గరికి వచ్చాడో!! ‘‘మీరు నన్ను ఫరూక్జీ అంటున్నారు కనుక నేనే ఫరూక్నని మీకు తెలిసే ఉంటుందని నేను భావించవచ్చా?’’ అన్నాను. ‘‘పోనీ.. మీకు బీర్ ఫెస్టివల్ అంటే ఇష్టమేనా ఫరూక్జీ..? బాత్ ఫెస్టివల్, కాఫీ ఫెస్టివల్, కామెడీ ఫెస్టివల్, లిటరరీ ఫెస్టివల్. ఫుడ్ ఫెస్టివల్..?’’ అన్నాడు!! ‘‘ఇవన్నీ ఇప్పుడు ఇండియాలో జరుగుతున్నాయా.. త్రీసెవంటీని ఎత్తేశాక..’’ అన్నాను. ‘‘ఇండియాలో కాదు ఫరూక్జీ.. యు.కె.లో జరుగుతున్నాయి. ఇండియాలో ఉండకుండా, యు.కె. వెళ్లిపోడానికి మీరు కనుక ఓకే అంటే మిమ్మల్ని, మీ అబ్బాయి ఒమర్ని విడుదల చేస్తారట. ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రత్యేక కార్యదర్శి రీనా మిత్ర అడిగి రమ్మన్నారు’’ అని చెప్పాడతను!! - మాధవ్ శింగరాజు -
రాయని డైరీ : రతన్ టాటా (గౌరవ చైర్మన్)
కుర్చీకి తగని వ్యక్తిని తెచ్చిపెట్టుకుంటే కుర్చీ ఎంత చిన్నదైనా అది ఆ వ్యక్తికి పెద్దదే అవుతుంది. టాటా కంపెనీలో అసలు చిన్న కుర్చీలే ఉండవు. కుర్చీ ఎత్తుకు ఎదగాలని రోజూ ఆ కుర్చీలో కూర్చుని లేచే వాళ్లకు అనిపించాలి. అప్పుడే వాళ్లూ ఎదుగుతారు. కంపెనీ ఎదుగుతుంది. సైరస్ మిస్త్రీ అలా అనుకోలేదు! చైర్మన్గా కుర్చీలో కూర్చున్న రోజే.. ‘కుర్చీ నాకు చిన్నదైపోయింది రతన్జీ..’ అని నా క్యాబిన్కి వచ్చి కంప్లయింట్ చేశాడు! కంప్లయింట్ చేస్తూ.. నేను కూర్చొని ఉన్న కుర్చీ వైపు చూశాడు. ‘నీ కుర్చీ నీకు చిన్నదైందని నువ్వు అనుకున్నా, నా కుర్చీ నీకేమీ పెద్దదవదు మిస్త్రీ.. ఏం చేద్దాం?’’ అన్నాను. ‘కూర్చోడానికి కుర్చీ సరిపోనప్పుడు, కనీసం కాళ్లు చాపుకుని కూర్చోడానికి కాళ్ల దగ్గర ఇంకో కుర్చీ వేసుకునే ఏర్పాటైనా ఉండాలి రతన్జీ. అయితే నేను కాళ్లు చాపుకుని కూర్చోవాలని అనుకుంటున్న వైపు మీ క్యాబిన్ ఉంది. అది మీకు గౌరవం కాదు. పైగా టాటా కంపెనీలో నేను గౌరవించే ఏకైక వ్యక్తి మీరు’ అన్నాడు! మిస్త్రీ ఏమంటున్నాడో అర్థమైంది. నన్నిక ఆఫీస్కి రావద్దంటున్నాడు! పాత చైర్మన్ కళ్లముందే కనిపిస్తుంటే.. కొత్త చైర్మన్ని ఆఫీస్లో ఎవరు చూస్తారు అని హెచ్ఆర్ మేనేజర్ రాజన్తో అన్నాడని కూడా తెలిసింది. ‘‘నేను గౌరవం ఇచ్చే మనిషినే కానీ, తిరిగి గౌరవం కోరుకునే మనిషిని కాదు మిస్త్రీ. మీరు మీ కాళ్లను ఎటువైపు పెట్టుకునైనా కూర్చోడానికి ఒక కుర్చీని తెప్పించుకునే ఏర్పాట్లను మీరు నిరభ్యంతరంగా చేయించుకోవచ్చు’ అని చెప్పాను. అతడు వెళ్లిపోయిన కొద్ది సేపటికి హెచ్ ఆర్ మేనేజర్ నా క్యాబిన్లోకి వచ్చారు. ‘కూర్చోండి రాజన్’ అన్నాను. ‘మిమ్మల్నో విషయం అడగడానికి వచ్చాను రతన్జీ. ఆ విషయాన్ని నేను నిలబడి కూడా అడగ్గలను’ అన్నాడు. ‘అడగండి రాజన్జీ’ అన్నాను. ‘రతన్జీ.. సెక్షన్ హెడ్లంతా కొత్తగా కనిపిస్తున్నారు. వాళ్లెవరూ నేను రిక్రూట్ చేసినవాళ్లు కాదు. రోజూ మధ్యాహ్నం క్యాంటీన్లో కూడా వాళ్లు కనిపిస్తున్నారు. ‘ఎక్స్క్యూజ్ మీ.. మీరెవరో నేను తెలుసుకోవచ్చా?’ అని వాళ్లలో ఒక వ్యక్తి దగ్గరకు వెళ్లి ఫ్రెండ్లీగా అడిగాను. ‘మిస్త్రీ ఎవరో మీకు తెలుసా?’ అని ఆ వ్యక్తీ నన్ను ఫ్రెండ్లీగా అడిగాడు’ అన్నారు రాజన్. ‘అవునా!’ అన్నాను. ‘వాళ్లెవరో నాకు మాత్రమే తెలియదా, మీక్కూడా తెలియదా అని అడగడానికే మీ దగ్గరికి వచ్చాను రతన్జీ’ అన్నాడు. ‘ఇద్దరికీ తెలియదంటే.. మిస్త్రీకి తెలిసే ఉంటుంది’ అని నవ్వాను. వెళ్లిపోయాడు. వెళ్లిన కొద్ది సేపటికే మళ్లీ వచ్చాడు! ‘ఏంటి రాజన్!’ అన్నాను. ‘నా కుర్చీలో పద్మనాభన్ అనే వ్యక్తి కూర్చొని ఉన్నాడు రతన్జీ. ‘ఎవరు మీరు?’ అని నేను అడిగేలోపే, ‘అడక్కుండా లోపలికి వచ్చేయడమేనా! ఇదేమైనా రతన్ టాటా క్యాబిన్ అనుకున్నావా? హెచ్ ఆర్ మేనేజర్ క్యాబిన్..’ అని, బెల్ కొట్టి నన్ను బయటికి పంపించాడు’ అని చెప్పాడు రాజన్! నాలుగేళ్లు కుర్చీలో ఉన్నాడు మిస్త్రీ. ఆ నాలుగేళ్లూ టాటా కంపెనీ అతడి కాళ్ల కింది కుర్చీలానే ఉండిపోయింది. ‘రతన్జీ.. అతడిని చైర్మన్ని చేసి మీరు పెద్ద తప్పు చేశారు’ అన్నారు కంపెనీ స్టాఫ్. అలా అన్న రోజే మిస్త్రీని బయటికి çపంపించాను. ‘పంపడం కుదరదు’ అని కంపెనీ ‘లా’ నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నాడు మిస్త్రీ. కుర్చీ కన్నా చిన్నవాళ్లే కుర్చీ కోసం పోరాటాలు చేయగలరు. మిస్త్రీ మూడేళ్లు పోరాడాడు. కుర్చీ గౌరవం కాపాడేందుకు టాటా మాత్రం పోరాడకుండా ఉంటుందా? -
బిపిన్ రావత్ (ఆర్మీ చీఫ్)
మంచి మాట చెప్పడానికి లేనప్పుడు మంచి స్థానంలో ఉండి వ్యర్థమనిపిస్తుంది. ‘ పిల్లల్ని చదువుకోనివ్వండి. వాళ్ల హాస్టళ్లలోకి వెళ్లి పాలిటిక్స్ ప్లే చెయ్యకండి’ అని మంచి చెప్పినందుకు..‘ఆర్మీ చీఫ్ మంచి చెప్పడం ఏంటని’ రెండు రోజులుగా దేశంలో మంచి–చెడు, భారత్–పాక్, హిందూ–ముస్లిం అని డివైడ్ టాక్ నడుస్తోంది! దేశం ఒక్కటే, దేశంలోని మనుషులంతా ఒక్కటే అని మళ్లీ నాచేత మంచి చెప్పించుకునేంత వరకు ఈ నాయకులు ఆగేలా లేరు. మంచి చెప్పేవాళ్లు లేకపోతే మంచి చెయ్యడానికి ఆర్మీ దిగవలసి వస్తుంది. ఒకేసారి మంచి చెయ్యడానికి దిగకుండా, మొదటే మంచి చెబితే మంచికి దిగే అవసరం ఉండదని చెప్పడం మంచి ప్రయత్నమే కదా! అయినా నేనెందుకు మంచి మాట్లాడానో నాకు గుర్తుకు రావడం లేదు. నా చేత మంచిని మాట్లాడించిన వాళ్లెవరో కూడా గుర్తు లేదు. ఏదో హెల్త్ ప్రోగ్రామ్కి పిలిస్తే వెళ్లాను. బాగా గుర్తు చేసుకుంటే అక్కడ నేను మాట్లాడిన రెండు మంచి మాటలు మాత్రం గుర్తుకొస్తున్నాయి. నాయకుడంటే ఎలా ఉండాలో చెప్పాను. నాయకుడు ముందు నడవాలనో, వెనకుండి ముందుకు నడిపించాలనో చెప్పాను. అంత వరకే! ఇంటికొచ్చి టీవీ చూసుకుంటే.. నేను వెళ్లిన హెల్త్ ప్రోగ్రామ్ రావడం లేదు. హెల్త్ ప్రోగ్రామ్లో నేను మాట్లాడిన మంచి మాటలు రావడం లేదు. యోగేంద్ర యాదవ్ అనే ఆయన టెలికాస్ట్ అవుతున్నాడు! ‘ఆయన అన్నది నిజమే’ అంటున్నాడు. ‘మోదీని దృష్టిలో పెట్టుకునే ఆయన ఆ మాట అన్నాడు’ అంటున్నాడు. ఎవరీయన అని చూశాను. ‘హక్కుల కార్యకర్త’ అని పేరు కింద వేస్తున్నారు. ‘ఆయన’ అని ఆయన అంటున్నది నా గురించే! దిగ్విజయ్ సింగ్, అసదుద్దీన్ ఒవైసీ, బ్రిజేష్ కాలప్ప.. ఇంకా ఎవరెవరో స్క్రీన్ మీదకు వచ్చిపోతున్నారు. కాలప్ప పేరు వినగానే నాకు జనరల్ కరియప్ప గుర్తుకొచ్చారు. ఇండియన్ ఆర్మీ ఫస్ట్ జనరల్ ఆయన. కరియప్ప కూడా డ్యూటీలో ఉండగా మంచి మాట్లాడే ఉంటారు. అప్పుడిన్ని పేపర్లు, ఇన్ని టీవీ చానళ్లు, ఇన్ని ప్రతిపక్షాల లేవు కాబట్టి ఆయన మంచి మాటలు రంగు మారకుండా మంచి మాటలుగానే ప్రజల్లోకి వెళ్లి ఉంటాయి. ఈ కాలప్ప ఎవరా అని చూశాను. కాంగ్రెస్ స్పోక్స్పర్సన్! ‘పౌరసత్వ చట్టం గురించి రావత్ని మాట్లాడనిస్తే, చట్టాన్ని తీసుకెళ్లి ఆయన చేతుల్లో పెట్టినట్లే’ అంటున్నాడు! ఒవైసీ కూడా వేలు పైకెత్తాడు. ‘నిన్ను నువ్వు తెలుసుకో’ అంటున్నాడు. అంటే నన్ను హద్దుల్లో ఉండమని! ఆయనకెప్పుడూ హద్దుల గొడవే! దిగ్విజయ్ కూడా ఏదో అన్నాడు కానీ, ఏదో ఒకటి అనకపోతే బాగుండదన్నట్లుగా అన్నాడు. ‘పర్స్ జాగ్రత్త’ అని అకౌంటెంట్ జనరల్ చెబితే తప్పు లేదు, ‘పాలన జాగ్రత్త’ అని అటార్నీ జనరల్ చెబితే తప్పు లేదు, ‘విద్యార్థులు జాగ్రత్త’ అని ఆర్మీ జనరల్ చెబితే తప్పయిందా! నేనైనా నాయకులు ఎలా ఉండాలో చెప్పకుండా, ప్రజలు ఎలా ఉండాలో చెప్పి ఉండాల్సింది. ఆ తేడాను నాయకులు అర్థం చేసుకునేలోపు నా రిటైర్మెంట్ వచ్చేసేది. అప్పుడీ ఒవైసీకి, కాలప్పకీ మాట్లాడ్డానికి ఏమీ దొరక్కపోయేది. డిసెంబర్ 31న నా రిటైర్మెంట్. కొత్తగా పెట్టిన ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్’ పోస్టులోకి నన్ను తీసుకోవడం కోసం మోదీకి అనుకూలంగా మాట్లాడానని వీళ్ల అనుమానం. పైకి మాట్లాడేవారికి మోదీ ఎప్పుడూ పవర్ ఇవ్వలేదు. నేనూ అంతే. పవర్ కోసం పైకి మాట్లాడకుండా ఉన్నదెప్పుడూ లేదు. పవర్ రావడం, పవర్లో ఉండటం, పవర్ పోవడం.. వీటి గురించి పవర్ఫుల్ మనుషులెప్పుడూ పట్టించుకోరు. -మాధవ్ శింగరాజు -
జి. కిషన్ రెడ్డి (కేంద్ర మంత్రి) రాయని డైరీ
మనం మన జీవితకాలంలో ఎవరి గురించి అయితే ఆలోచించకూడదని అనుకుంటామో వారి గురించిన ఆలోచనల్లోకి మనకు తెలియకుండానే వెళ్లిపోయామని గ్రహించినప్పుడు ఒక్కసారిగా ఎక్కడో దారి తప్పినట్లుగా అయిపోతాం. మనం తిన్నగానే ఉంటాం. దారీ తిన్నగానే ఉంటుంది. ఆగి చూస్తే.. మన ఆలోచనల్లో లేని ఆ వ్యక్తి దారి మధ్యలోకి వచ్చి తలకిందులుగా నిలబడి ఉంటాడు! రేవంత్రెడ్డి గురించి ఆలోచించకూడదనే అనుకున్నాను. కానీ ఎంతటివాళ్లయినా ఆలోచన కోల్పోయి తన గురించి ఆలోచించేలా చేసుకుంటాడు అతడు! కాంగ్రెస్ డీఎన్ఏ అది. దారి వెంట మనిషిని ఊరికే పోనివ్వదు కాంగ్రెస్. ఆపుతుంది. ఆగకుండా పోతుంటే పిలుస్తుంది. పిలుస్తున్నా వినిపించుకోకుంటే.. ‘ఒక చట్టం తెచ్చారు తెలుసా? అంటుంది. అయినా పట్టించుకోకుండా వెళుతుంటే.. ‘ఆ చట్టాన్ని నీ కోసమే తెచ్చారు’ అంటుంది. ‘నీ కోసం’ అనే మాట వినగానే ఆ మనిషి ఆగిపోతాడు. ‘నీ కోసం’ అన్న దగ్గరే ఆగిపోతాడు. అప్పుడు రేవంత్రెడ్డిని అక్కడికి పంపుతుంది కాంగ్రెస్. ‘నీ కోసం’ అంటే ఏంటో ఆ మనిషికి వివరంగా చెప్పి రమ్మని పంపుతుంది. చట్టంలో ఏముందో ఆ మనిషికి చెప్పడు రేవంత్రెడ్డి. చట్టంలో ఏముందని చెప్పడానికి కాంగ్రెస్ తనను పంపిందో అది చెప్తాడు. ‘‘రేవంత్రెడ్డి ఇక్కడ దారి కాచి అందర్నీ అటకాయిస్తున్నాడు సార్..’’ అని హైద్రాబాద్ నుంచి మళ్లీ ఫోన్!! ‘‘అటకాయించి ఏం చేస్తున్నాడు?’’ అని అడిగాను. ‘‘పాకిస్తాన్లో పుట్టిన ఒక వ్యక్తి ఐఎస్ఐ లో ట్రైనింగ్ తీసుకుని హిందువుగానో లేక సిక్కుగానో మారువేషంలో ఇండియా వచ్చి, ఇండియా పౌరసత్వం తీసుకుని, రాజకీయాల్లో చేరి, ఎంపీ అయి, ఐఎస్ఐ ఇచ్చిన లక్ష కోట్లతోనో, రెండు లక్షల కోట్లతోనో ఎంపీలందర్నీ కొనేసి, ప్రధాన మంత్రి అయిపోయి, ప్రధాని అయ్యాక జమ్మూకశ్మీర్ను పాకిస్తాన్కు, పశ్చిమ బెంగాల్ను బంగ్లాదేశ్కు ఇచ్చేస్తే నీ పరిస్థితి ఏంటని అందర్నీ ఆపి ఆపి అడుగుతున్నాడు సార్’’ అన్నాడు ఆ ఫోన్ చేసిన మనిషి. ‘‘నువ్వెవరు?’’ అన్నాను. ‘‘నేను ఈ దేశ పౌరుడిని సార్. భారతీయుడిని. నా దగ్గర అన్ని డాక్యుమెంట్లూ ఉన్నాయి. డాక్యుమెంట్లు ఉన్నా కూడా వాటిని పరపర చింపి నోట్లో వేసుకుని.. ‘వేర్ ఆర్ యువర్ డాక్యుమెంట్స్’ అని ఢిల్లీ వాళ్లొచ్చి ఇంగ్లిష్లో అడుగుతారని రేవంత్రెడ్డి చెబుతున్నాడు సార్’’ అన్నాడు! ‘‘ఆర్ అండ్ బీ వాళ్లకు చెప్పకపోయావా?’’ అన్నాను. ‘‘ఎందుకు సార్?’’ అన్నాడు. ‘‘ఇలాంటి వాళ్లందరూ రోడ్లు, భవనాల శాఖ పరిధిలోకి వస్తారు. వాళ్లకోమాట చెబితే దారి మధ్యలో అడ్డంగా ఉన్నవాటిని క్రేన్లతోనో, బుల్డోజర్లతోనో తొలగించి దారిని క్లియర్ చేస్తారు’’ అని చెప్పాను. ‘‘థ్యాంక్యూ సార్’’ అన్నాడు. ‘సరే’ అని ఫోన్ పెట్టేయబోతుంటే మళ్లీ ‘‘సార్..’’ అన్నాడు. ‘‘చెప్పు’’ అన్నాను. ‘‘సార్.. నేను నా దేశంలోనే ఉంటాను కదా సార్’’ అన్నాడు! ‘‘మనం మన దేశంలోనే ఉంటాం. మన దేశంలోకి వచ్చినవాళ్లు మన దేశంలోనే ఉంటారు. మన దేశంలోకి రాబోతున్నవాళ్లూ మన దేశంలోనే ఉంటారు. సరేనా’’ అన్నాను. ‘‘మరి చట్టం ఎందుకు సార్?’’ అన్నాడు! రేవంత్రెడ్డి ఏ లెవల్లో అటకాయిస్తున్నాడో అర్థమైంది. ‘‘లేనివాళ్లకు ఇవ్వడానికి చట్టం గానీ, ఉన్నవాళ్ల నుంచి తీసుకోడానికి కాదయ్యా. నిశ్చింతగా ఉండు’’ అని చెప్పాను. -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: బోరిస్ జాన్సన్ (బ్రిటన్ ప్రధాని)
ట్రంప్ ట్వీట్ పెట్టాడు. ‘యు ఆర్ లుకింగ్ సో గుడ్’ అన్నట్లుంది ఆ ట్వీట్. అన్నట్లుందే కానీ, అతడు అన్నదైతే అది కాదు. ‘సెలబ్రేట్ బోరిస్’ అంటాడు. గెలిచిన వాళ్లెవరిలోనైనా అందాన్నే చూస్తాడు ట్రంప్. గెలుపంటేనే అందం ట్రంప్కి. దగ్గర్లేను. ఉంటే ఒక్కటిచ్చేవాడు. మగాడు మగాడికి ఇవ్వకూడనిది ఏదైతే ఉంటుందో సరిగ్గా దాన్నే ఇచ్చి ఉండేవాడు. ఇచ్చి నవ్వేవాడు. ‘యు ఆర్ లుకింగ్ సో గుడ్’ అనేవాడు మళ్లీ. లోపల ఇంకో ట్రంపేం ఉండడు పాపం నాన్–మేల్ రూపంలో. అదొక ధోరణి అంతే. దాన్ని అర్థం చేసుకున్నవాళ్లు మూడేళ్ల క్రితం ట్రంప్కి ఓటేశారు. మూడేళ్లు ట్రంప్ని చూశాక కూడా అర్థం చేసుకోనివాళ్లు అతడి ఇంపీచ్మెంట్కి నిన్న ఓటేశారు. నవ్వుకుని ఉంటాడు. ట్వీట్లో ‘సెలబ్రేట్ బోరిస్’ అనడానికి ముందు.. నువ్వూ నేను కలిస్తే ఇక నీకెవరి డీల్సూ అక్కర్లేదని కూడా అన్నాడు ట్రంప్! ‘జనవరిలో యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి వచ్చేటప్పుడు యూనియన్తో నువ్వు కుదుర్చుకునే డీల్స్ అన్నిటికన్నా, అందులోంచి బయట పడినందుకు జనవరి తర్వాత నేనిచ్చే డీల్ నీ ముఖాన్ని వెలిగించేంత మనోహరంగా ఉంటుంది’ అంటాడు! ప్రధానిగా గెలిచినందుకు కాకుండా, ప్రధానిగా గెలిచినందుకు ట్రంప్ నాకేదో ఇస్తానని అన్నందుకూ కాకుండా.. నన్ను నేను సెలబ్రేట్ చేసుకోవలసిన గెలుపు ఇది. నేనేమిటో బ్రిటన్కి తెలుసు. తెలిసీ బ్రిటన్ ప్రజలు నాకు ఓటు వేశారంటే.. బ్రిటన్కి ఒక ప్రధానిగా వాళ్లు నన్నెన్నుకోలేదు. బ్రిటన్కి అవసరమైన ఒక ప్రధానిగా నన్ను ఎన్నుకున్నారు! అదీ నేను చేసుకోవలసిన సెలబ్రేషన్. ఎన్నికల ప్రచారంలో లేబర్పార్టీ నా మీద చేసిన పెద్ద దుష్ప్రచారం.. నేను ట్రంప్లా ఉంటానని. ఇద్దరి ఫేస్లు ఒకేలా ఉంటాయని. ఇద్దరి జోక్లు ఒకేలా ఉంటాయని. ఇద్దరికీ ‘గే’ లంటే పరిహాసం అని. ఇద్దరికీ ముస్లింలంటే పడదని! స్కాటిష్ నేషనల్ పార్టీ ఆ దుష్ప్రచారాన్ని ఫొటోషాప్లో ఇంకొంచెం పై లెవల్కి తీసుకెళ్లింది. యాభై ఐదేళ్ల వయసులో ట్రంప్ ఎలా ఉన్నాడో ఆ ఫొటోను సంపాదించి, ‘చూడండి ప్రజలారా.. అచ్చు బోరిస్లా ఉన్నాడు కదా’ అంది. డెబ్భై మూడేళ్ల వయసులో బోరిస్ ఎలా ఉంటాడో ఫేస్యాప్లోంచి తీసి, ‘చూశారా ప్రజలారా.. అచ్చు ట్రంప్లా ఉన్నాడు కదా’ అంది. ప్రజలు చప్పట్లు కొట్టారు. బోరిస్, ట్రంప్ ఒకలా ఉంటారు అన్నందుకు చప్పట్లు కొట్టారో.. బోరిస్, ట్రంప్ ఒకలా ఉన్నందుకు చప్పట్లు కొట్టారో ఇప్పుడా రెండు పార్టీలకు అర్థమయ్యే ఉంటుంది. యూరోపియన్ యూనియన్ నుంచి మనస్ఫూర్తిగా ఒక్క శుభాభినందనా అందలేదు. ఇంట్లోంచి ఒకరు వెళ్లిపోయి స్వతంత్రంగా ఉండాలనుకోవడం ఆ వెళ్లేవాళ్లకు సంతోషాన్నిస్తుంది కానీ, వాళ్లు ఉంటే బాగుంటుందని కోరుకునే ఇంటికి సంతోషాన్నివ్వదు. జనవరి లోపు ఇల్లు వెకేట్ చేస్తామని చెప్పిన వాళ్లనే బ్రిటన్ గెలిపించింది. బోరిస్ ముఖం, ట్రంప్ ముఖం సేమ్ టు సేమ్ అన్నవాళ్లను పట్టించుకోలేదు. ఎవరి ముఖం ఎలా ఉంటే ఏమిటీ, ఒక ముఖమైతే ఉండటం ముఖ్యం కానీ అనుకుని ఉండాలి. స్కాట్లాండ్ ఎప్పట్నుంచో బ్రిటన్నుంచి వెళ్లిపోతానని అంటోంది. ఈయూ నుంచి బ్రిటన్ బయటికి వచ్చాక.. బ్రిటన్ నుంచి బయటికి వెళ్లిపోతానని స్కాట్లాండ్ ఈసారి పట్టుపట్టొచ్చు. ‘నువ్వు బయటికి రావచ్చు కానీ నేను బయటికి వెళ్లిపోకూడదా..’ అని కూడా అంటుంది. ట్రంప్ ఇస్తానన్న మనోరంజకమైన డీల్కి ముడిపెట్టి ఎలాగైనా స్కాట్లాండ్ను బయటికి వెళ్లకుండా ఆపాలి. మాధవ్ శింగరాజు -
రాయని డైరీ : వెంకయ్య నాయుడు
మాట్లాడే భాష వినబుద్ధి అవదు. మాట్లాడలేని భాషను వదలబుద్ధి కాదు. భాషల్లోని వైరుధ్యమా లేక ఇది మనుషుల్లోని వైపరీత్యమా! పార్లమెంటు ప్రాంగణంలో తటాలున కొందరు ఎదురుపడి ‘నమస్కారమండీ వెంకయ్యనాయుడు గారూ.. బాగున్నారా’ అని పలకరిస్తుంటారు. మందంగా నవ్వుతాను. ‘బాగున్నాను’ అని చెప్పడం అది. దేవుడు మనిషికి మందస్మితం పెట్టడం మంచిదైంది. మాట్లాడే ఓపిక లేనపుడు, మాట్లాడే ఆసక్తి లేనప్పుడు యూజ్ఫుల్గా ఉంటుంది. ‘హాయ్.. వెంకీ, హవ్యూ’ అని వెళ్లిపోతుంటారు కొందరు. అది నాకు సుఖంగా, సౌఖ్యంగా ఉంటుంది. పొడవాటి కుశలపు పలకరింపు షార్ట్ కట్లోకి అనువాదం అవడం వల్ల లభ్యమైన సుఖసౌఖ్యాలు కావచ్చవి. లేదా, నేను బదులు చెప్పే భారాన్ని వాళ్లు నాపై పెట్టి నేను ఆ బరువును వాళ్ల కళ్లెదుటే దించుకునే వరకు అక్కడే ఎదురుచూడకుండా వాళ్ల మానాన వాళ్లు వెళ్లిపోవడం వల్ల కావచ్చు. రాని భాష రాహుల్గాంధీని కూడా మంచి వక్తను చేస్తుంది! టీవీ మ్యూట్లో ఉండగా చూశాను. మలప్పురంలో ఏదో మాట్లాడుతున్నాడు. ఇక్కడ పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే అక్కడ కేరళలో ఏం పని! రాహుల్ ఒక్కో మాటకు జనం హర్షధ్వానాలు చేస్తున్నారు! అంతగా ఏం మాట్లాడుతున్నాడా అని మ్యూట్ని తీసి చూశాను. రాహుల్ వేదికను అలంకరించి ఇంగ్లిష్లో మాట్లాడుతుంటే పక్కనే ఒక విద్యార్థిని నిలబడి ట్రాన్స్లేట్ చేసి చెప్తోంది. ‘నౌ’ అని రాహుల్ అంటే.. ‘ఇప్పో’ అని ఆ అమ్మాయి, ‘ఫస్ట్ ఆఫ్ ఆల్’ అని రాహుల్ అంటే.. ‘ఒన్నామటై’ అని ఆ అమ్మాయి. ఏదో స్కూల్ కార్యక్రమం. చీఫ్గెస్ట్గా వెళ్లినట్లున్నాడు. అ అమ్మాయి కారణంగా ఇంగ్లిష్ వినసొంపుగా మలయాళంలోకి తర్జుమా అయి అక్కడ ఉన్నవాళ్లందరి చేతా చప్పట్లు కొట్టిస్తోంది. శుక్రవారం రాజ్యసభలో సరోజినీ హేంబ్రమ్ తన సొంత సంతాలీ భాషలో మాట్లాడినప్పుడు కూడా.. ఆ స్కూల్ అమ్మాయి మలయాళం మాట్లాడుతున్నట్లే ఉంది వినబుద్ధయ్యేలా. సభలో అంతా చప్పట్లు. రాజ్యసభలో మునుపెవరూ వినని భాష! రఘునాథ్ ముర్ము అనే ఆయన ఆ భాషకు లిపిని కనిపెట్టారని, ఆయనకు భారతరత్న ఇవ్వాలని సరోజినీ హేంబ్రమ్ డిమాండ్. జేఎన్యూలో పీహెచ్డీ చేస్తున్న అమ్మాయిని రాజ్యసభలో రెడీగా కూర్చోబెట్టి సంతాలీని అక్కడికక్కడ హిందీలోకి ట్రాన్స్లేట్ చేయించుకుంటే ఇవన్నీ తెలిశాయి. ‘‘ప్రతి సమావేశంలోనూ ఇవన్నీ చెప్పడానికి ట్రైచేస్తున్నాను నాయుడూజీ’’ అన్నారు సరోజిని.. జీరో అవర్ ముగిశాక. ‘‘అవును ఒకసారి సభ ఎడ్జార్న్ అయింది. ఒకసారి డిస్కషన్కి టైమ్ తక్కువైంది కదా’’ అన్నాను. ‘‘ఈ సమావేశాలు కాదు నాయుడూజీ. నేను రాజ్యసభ సభ్యురాలిని అయినప్పటి నుంచీ ట్రై చేస్తున్నాను. ఇంకో ఏడాదికి నా టెర్మ్ అయిపోతుంది. నా భాషలో నేనిక ఎప్పటికీ మాట్లాడలేనేమో అనుకున్నాను. మీరు మాట్లాడనిచ్చారు’’ అన్నారు సరోజిని నాకు ధన్యవాదాలు తెలుపుతూ. ‘‘నేను మాట్లాడనిచ్చేదేముందీ సరోజినీజీ. మీ భాషను మీరు మాట్లాడకుండా మిమ్మల్ని ఎవరు ఆపగలరు.. రాజ్యసభలోనైనా, లోక్సభలోనైనా, ఒరిస్సాలోనైనా, ఓవర్సీస్లోనైనా..’’ అన్నాను. ‘‘మాట్లాడేవాళ్లు లేకపోతే కాదు నాయుడూజీ, వినేవాళ్లు లేకపోతే ఏ భాషైనా చచ్చిపోతుంది’’ అన్నారు సరోజినీ. కరెక్ట్ అనిపించింది. ‘‘బాగా చెప్పారు అనే మాటను మీ సంతాలీ భాషలో ఏమంటారు సరోజినీజీ’’ అని అడిగాను. - మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: అజిత్ పవార్ (ఎన్సీపీ)
‘‘సీఎం గారు లోపల బిజీగా ఉన్నారు. కాసేపు వెయిట్ చెయ్యండి’’ అన్నాడు అతడెవరో లోపల్నించి వచ్చి! ‘‘సీఎంలు ఎప్పుడూ బిజీగానే ఉంటారు. కొత్త సీఎంలు ఇంకా బిజీగా ఉంటారు. ఉద్ధవ్ ఠాక్రే లాంటి సీఎంలు ప్రధాని కన్నా బిజీగా ఉంటారు. అది నువ్వు చెప్పే పని లేదు. నా పేరు అజిత్ పవార్. లోపలికెళ్లి చెప్పు. వెయిట్ చేసేంత టైమ్ లేదు నాకు’’ అన్నాను. ‘‘సీరియస్ మేటర్ సార్, డిప్యూటీ సీఎంగా ఎవర్ని తీసుకోవాలో డిస్కస్ చేస్తున్నారు’’ అన్నాడు! అతడెవరికో సీఎం దేని గురించి డిస్కస్ చేస్తున్నాడో తెలిసిందంటే అదంత సీరియస్ డిస్కషన్ కాదని సీఎం అనుకుంటున్నాడని నాకు అర్థమైంది. ‘‘లోపల ఎవరు ఉన్నారు?’’... నన్ను లోపలికి పోనివ్వకుండా ఆపిన మనిషిని అడిగాను. ‘‘ఎవరూ లేర్సార్. సీఎం సార్ ఒక్కరే ఉన్నారు’’ అన్నాడు. ‘‘మరి డిస్కషన్స్ అన్నావు?’’ అన్నాను. అతను నవ్వాడు. డిస్కషన్స్కి మనుషులే ఉండాలా సార్! ఫోన్లు ఉంటే సరిపోదా?’’ అన్నాడు. సీఎం దేని గురించి డిస్కస్ చేస్తున్నాడో తెలిసిన మనిషికి సీఎం ఎవరితో డిస్కస్ చేస్తున్నాడో కూడా తెలిసే ఉంటుంది. ‘‘ఫోన్లో ఎవరు?’’ అని అడిగాను. ‘‘సారీ సర్, అవన్నీ చెప్పకూడదు. కానీ మీ పేరు అజిత్ పవార్ అంటున్నారు కాబట్టి చెబుతున్నాను. పృథ్వీరాజ్ చవాన్తో మాట్లాడుతున్నారు. బాలాసాహెబ్ థోరత్తో మాట్లాడుతున్నారు. శరద్ పవార్తో మాట్లాడుతున్నారు’’ అన్నాడు. ‘‘నా పేరు అజిత్ పవార్ కాబట్టి చెబుతున్నాను అన్నావు!! అదేంటి?!’’ అన్నాను. ‘‘సీఎం గారు చవాన్తో మాట్లాడుతున్నప్పుడు.. ‘అజిత్కి ఇవ్వకుండా మీకు ఇవ్వగలనా!’ అన్నారు. బాలాసాహెబ్తో మాట్లాడుతున్నప్పుడూ.. అదే మాట అన్నారు.. ‘అజిత్కి ఇవ్వకుండా మీకు ఇస్తే బాగుంటుందా..’ అని. రెండుసార్లు సీఎం నోటి నుంచి మీ మాట విన్నాను. ఇప్పుడు మిమ్మల్ని నేరుగా చూస్తున్నాను. లోపల మీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు లోపల ఎవరెవరు మాట్లాడుకుంటున్నదీ మీకు చెప్పకపోవడం ధర్మం కాదనిపించింది. అందుకే చెప్పాను’’ అన్నాడు అతను. ‘‘మరి మీ సీఎం గారు శరద్ పవార్తో మాట్లాడుతున్నప్పుడు నా పేరు వినిపించలేదా?’’ అని అడిగాను. ‘‘తెలీదు సార్. ‘చెప్పండి శరద్జీ’ అని సీఎం గారు అంటున్నప్పుడు లోపల ఉన్నాను. ఆ తర్వాత బయటికి వచ్చేశాను.. మీరొచ్చారంటే’’ అన్నాడు. ‘‘సరే, నేను వచ్చి వెళ్లానని మీ సీఎం గారికి చెప్పు’’ అని.. నా పేరు, నా ఫోన్ నెంబరు ఉన్న కార్డు అతడికి ఇచ్చాను. ‘‘మీ గురించే మాట్లాడుకుంటున్నప్పుడు మీ పేరు, మీ ఫోన్ నెంబర్ సీఎం గారికి తెలియకుండా ఉంటాయా సార్’’ అని నవ్వాడతను. ‘‘సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందు వరకు తెలిసే ఉంటుంది. తర్వాత బిజీ అయి ఉంటారు కదా. తెలియకపోవచ్చు. మర్చిపోకుండా ఈ కార్డివ్వు’’ అని చెప్పి వచ్చేశాను. గేటు దాటుతుంటే ఉద్ధవ్ నుంచి ఫోను! ‘‘సారీ అజిత్ జీ. మీ పని మీదే బిజీగా ఉన్నాను. పోర్ట్ఫోలియోలు తెగట్లేదు. అన్ని పార్టీలకీ హోమ్ కావాలి. అర్బన్ డెవలప్మెంట్ కావాలి. రెవిన్యూ కావాలి, హౌసింగ్ కావాలి. ఎవరూ అంతకు తగ్గట్లేదు’’ అంటున్నాడు!! డిప్యూటీ సీఎం పోస్ట్ గురించి కాకుండా క్యాబినెట్ పోస్ట్ల గొప్పదనం గురించి మాట్లాడుతున్నాడంటే నాకు ఏది ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో శరద్ జీ నుంచి ఉద్ధవ్కేవో సూచనలు, సలహాలు అందినట్లే ఉంది! -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: నితిన్ గడ్కారి (కేంద్ర మంత్రి)
ముంబైలో ఉన్నాను కానీ, ముంబైలో నేనెక్కడున్నానో నాకు తెలియడం లేదు. గూగుల్ మ్యాప్స్లో కొట్టి చూడొచ్చు. కానీ చుట్టూ క్యాడర్ ఉంది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి తనెక్కడున్నదీ తెలుసుకోడానికి ఫోన్లో గూగుల్ మ్యాప్స్ సెర్చ్ చేస్తున్నాడని వాళ్లకు తెలియడం బాగుండదు. దారుల మంత్రికి దారి తెలియలేదంటే బీజేపీ క్యాడర్ పెద్దగా పట్టించుకోదు కానీ.. నా ముందున్న ఆర్ఎస్ఎస్ క్యాడర్, విహెచ్పీ క్యాడర్, శివసేన క్యాడర్.. ఈ మూడూ పట్ట నట్లు ఉండలేవు. తటాలున మాట అనేస్తాయి.. బీజేపీ దారి తప్పుతోందని! దారి తెలియకపోతే దారి తప్పేదేమీ ఉండదు. కొత్త దారి వేసుకుంటుంది బీజేపీ. ‘‘ఇప్పుడు మీరున్న చోటు లోకేషన్ను మీకు వాట్సాప్ పెట్టమంటారా నితిన్ జీ’’ అని అడిగాడు కిశోర్ తివారీ!! ఆశ్చర్యపోబోయాను కానీ, ఆశ్చర్యపడిపోకుండా గట్టిగా నిలదొక్కు కున్నాను. ‘‘నేను దారి వెతుక్కుంటున్నానని మీరెందుకు అనుకున్నారు కిశోర్ జీ’’ అన్నాను. ‘‘దారిలో పెట్టడానికి వచ్చినవాళ్లు.. ముందు దారెక్కడుందో వెతుక్కోవాలి కదా.. అందుకని అలా అనుకున్నాను’’ అన్నాడు. కిశోర్ రైతు కార్యకర్త. సరిగ్గా ఎన్నికలకు ముందు దారి తప్పి శివసేనలోకి వచ్చాడు. నాకు ఆప్తుడు. నాకు ఆప్తుడైనవాడు బీజేపీలోకి రాకుండా శివసేనలోకి వెళ్లాడంటే.. నన్నూ శివసేనకు ఆప్తుడిని చెయ్యాలని అనుకుంటు న్నాడని! శివసేనకు నేను ఆప్తుడిని అవడం అంటే.. ఆదిత్య ఠాక్రేని దగ్గరుండి మరీ ముఖ్య మంత్రి సీట్లో కూర్చోబెట్టి ఢిల్లీ వెళ్లిపోవడం. ఆ సంగతి చెప్పకుండా.. ‘‘ప్రయాణం ఎలా సాగింది నితిన్ జీ’’ అని అడిగాడు కిశోర్!! ‘‘ఢిల్లీ నుంచి నేను ముంబై వచ్చి రెండు రోజులైంది’’ అన్నాను. ‘‘ఢిల్లీ నుంచి ముంబైకి మీ ప్రయాణం ఎలా సాగింది అని కిశోర్ అడగటం లేదు నితిజ్ జీ. ముంబై వచ్చాక ఆదిత్య ఠాక్రేని సీఎంని చేసి వెళ్లే మీ ప్రయాణం ఎలా సాగింది అని అడుగుతున్నాడు’’ అన్నారు మోహన్ భాగవత్. ఆర్.ఎస్.ఎస్. చీఫ్ ఆయన. ఆయన చెబితే.. మోదీజీ అయినా, అమిత్జీ అయినా, ఇంకెవరైనా వినాల్సిందేనని కిశోర్ నమ్మకం. ‘గడ్కారికి మీరొక మాట చెప్పండి భాగవత్జీ, మహారాష్ట్ర రెండే రెండు నిముషాల్లో సెటిలైపోతుంది’ అని భాగవత్కి కిశోర్ ఉత్తరం రాశాడని ఢిల్లీ నుంచి ఫ్లైట్లో ముంబై వస్తున్నప్పుడు నా పక్క సీట్లో కూర్చున్న ప్రయాణికుడెవరో నేనెవరో గుర్తుపట్టకుండానే నాతో అన్నాడు! పైగా తనకు బొత్తిగా పాలిటిక్స్ తెలియవు అని కూడా అన్నాడు. నన్ను కన్విన్స్ చెయ్యమని భాగవత్కి కిషోర్ ఉత్తరం రాసిన సంగతి నా కన్నా ముందు ఫ్లయిట్లో నా పక్క సీట్లో పాలిటిక్స్ అంటే ఏమిటో కూడా తెలియకుండా కూర్చొని ఉన్న ఒక వ్యక్తికి తెలిసిందంటే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సీటునే తప్ప, ముఖ్యమంత్రి పక్క సీటును, ముఖ్యమంత్రి వెనుక సీటును శివసేన కోరుకోవడం లేదనే. ‘‘మహారాష్ట్రను సెట్ చెయ్యడానికో, సెటిల్ చెయ్యడానికో నేను ముంబై రాలేదు కిశోర్ జీ. తెలిసిన వాళ్ల ఫంక్షన్కి వచ్చాను’’ అన్నాను. కిశోర్ నిరుత్సాహంగా చూశాడు. ఉద్ధవ్ అసహనంగా చూశాడు. భాగవత్ పెద్దమనిషిలా చూశాడు. ఆదిత్య ఎలానూ చూడకుండా.. తండ్రి వైపే చూస్తున్నాడు. ‘‘చూద్దాం. దారే లేదనుకున్నప్పుడు బీజేపీ ఎన్ని దారులు వేయలేదూ?! కశ్మీర్కు దారి వేసింది. కర్తార్పూర్ కారిడార్కు దారి వేసింది. ఇప్పుడు అయోధ్యకు దారి వేసింది’’ అన్నాను. ‘అయితే?!’ అన్నట్లు చూశారు తండ్రీకొడుకులు ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే. ‘‘బీజేపీ.. కశ్మీర్కు దారి వేసినప్పుడు, కర్తార్పూర్కు దారి వేసినప్పుడు, అయోధ్యకు దారి వేసినప్పుడు.. మహారాష్ట్రకు దారి వేయలేకపోతుందా! పార్టీలో నేనొక్కడినే మీకు పైకి కనిపించే దారుల మినిస్టర్ని’’ అన్నాను. -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: అమిత్ షా (బీజేపీ అధ్యక్షుడు)
‘‘పులి ప్రెసిడెంట్ రూల్కి భయపడదు అమిత్జీ. అదిగో పులి అంటారు కానీ, అడుగో ప్రెసిడెంట్ అని ఎవరూ అనరు’’ అన్నాడు ఉద్ధవ్ ఠాక్రే సడన్గా ఫోన్ చేసి. ‘‘నేను అమిత్షాని ఉద్ధవ్’’ అన్నాను. ‘‘బిడ్డకు పాలిచ్చి వస్తానని ఆవు పులికి ప్రామిస్ చేసింది కానీ, బిడ్డకు పాలిచ్చి వచ్చే వరకు నిన్నేమీ చెయ్యను పో అని పులి ఆవుకు ప్రామిస్ చెయ్యలేదు అమిత్జీ’’ అన్నాడు! ‘‘నేను అమిత్షాని ఉద్ధవ్’’ అన్నాను. ‘‘నేను మిమ్మల్ని అమిత్జీ అంటున్నానంటే మీరు అమిత్షా అని తెలిసే మాట్లాడు తున్నానని అర్థం అమిత్జీ. మీతో మాట్లాడుతున్నది ఉద్ధవ్ ఠాక్రేనేనా అని మీకు తెలుసుకోవాలని ఉంటే మాత్రం చెప్పండి. ‘నేను ఉద్ధవ్ ఠాక్రేని మాట్లాడుతున్నాను’ అని చెప్పి మీతో మాట్లాడ తాను’’ అన్నాడు! బాగా ప్రశాంతంగా ఉన్నట్లున్నాడు! ‘‘పులి ప్రశాంతంగా ఉంటే పులిగా దానిని గుర్తు పట్టడం కష్టం ఉద్ధవ్’’ అన్నాను. ‘‘అర్థం కాలేదు అమిత్జీ!’’ అన్నాడు. ‘‘పులెప్పుడూ పులుల గురించి మాట్లాడదు ఉద్ధవ్. మనుషులే పులుల గురించి మాట్లాడ తారు. అందుకే కన్ఫ్యూజ్ అయ్యాను.. మాట్లాడుతున్నది మీరేనా అని’’ అన్నాను. ‘‘అమిత్జీ.. ఈ పులి.. పులుల గురించి ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే.. మనుషులు పులిని పట్టించుకోవడం మానేశారు! అది నేను నమ్మలేకపోతున్నాను. ఎన్నికల ముందు ఒక మనిషి పులి ఇంటికి వచ్చాడు. ‘పులీ పులీ.. ఎన్నికలయ్యాక అడవిని కొన్నాళ్లు నువ్వు పాలించు, కొన్నాళ్లు నేను పాలిస్తా’ అన్నాడు. పోనీలే పాపం.. మనిషి కదా, ఆశలు ఉంటాయి కదా అని ‘సరే’ అన్నాను. ఎన్నికలయ్యాక ఇప్పుడు.. ‘నేనొక్కడినే పాలిస్తా. నువ్వు నీ బిడ్డకు పాలివ్వడానికి వెళ్లు. బిడ్డకు పాలిచ్చి మళ్లీ రానక్కర్లేదు’ అని పులికే అభయం ఇస్తున్నాడు. ‘పులేంటి, బిడ్డకు పాలివ్వడం ఏంటి?’ అని అడిగాను. ‘ఇంకేం మాట్లాడకు. ప్రెసిడెంట్ వచ్చాడంటే నీకూ ఉండదు, నాకూ ఉండదు. అడవి ప్రెసిడెంట్ది అయిపోతుంది’ అని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు’’ అన్నాడు ఉద్ధవ్. అతడు చెప్పిన కథలో, చెప్పకూడదనుకున్న నీతి ఏమిటో నాకు అర్థమైంది. ‘నా కొడుకు సి.ఎం. కాకుండా వేరెవరైనా సి.ఎం. ఎలా అవుతారో నేనూ చూస్తాను’ అని అంటున్నాడు! ‘‘అమిత్జీ.. ఈరోజు పేపర్ చూశారా? నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి మరాఠ్వాడా ప్రాంతంలో పెద్ద పులి జాడ కనిపించిందట! పొలాల్ని, పెన్గంగా నదినీ దాటేసింది. ఐదు నెలల్లో రెండు వందల మైళ్లు ప్రయాణించింది! పార్ట్నర్ కోసం, కొత్త ప్లేస్ కోసం పులులు మైళ్లకు మైళ్లు నడుస్తాయట. సి1 అని పేరు పెట్టారు ఆ పులికి. నన్నడిగితే ఆదిత్యా ఠాక్రే అని పెట్టమని చెప్పేవాడిని. పేరుకు తగ్గ పులిలా ఉండేది’’ అన్నాడు ఉద్ధవ్. పుత్రోత్సాహం పీక్స్కి వెళ్లినట్లుంది! ‘‘పులి కొత్త ప్లేస్ వెతుక్కుంటూ వెళ్లే మాట నిజమే ఉద్ధవ్. అయితే ఫలానా కొత్త ప్లేస్ మాత్రమే కావాలని వెతుక్కుంటూ వెళ్లదు. ముఖ్యమంత్రి ప్లేసా, ఉప ముఖ్యమంత్రి ప్లేసా అని పులి చూసుకోదు’’ అన్నాను. ఉద్ధవ్ ఏమీ మాట్లాడలేదు. ‘‘పులి పార్ట్నర్ని వెతుక్కుంటూ వెళ్లే మాట కూడా నిజమే ఉద్ధవ్. అలాగని పులులు కాని వాటిని పులి పార్ట్నర్స్గా చేర్చుకోదు. ఎన్సీపీకి, కాంగ్రెస్కి ఉన్నవి పులిచారలే తప్ప, అవి పులులు కావు’’ అన్నాను. ఉద్ధవ్ ఏమీ మాట్లాడలేదు. ఫోన్ కట్ అయిందేమో చూశాను. లైన్ లోనే ఉన్నాడు! కానీ మాట్లాడ్డం లేదు. ‘హలో ఉద్ధవ్!’ అన్నాను. నో రెస్పాన్స్! ఉలిక్కిపడ్డాను. పులి కంటే పులిజాడ ఎక్కువ భయపెడుతుంది. -మాధవ్ శింగరాజు -
ఉద్ధవ్ ఠాక్రే (శివసేన)-రాయని డైరీ
అమిత్షా ఫోన్ ఎత్తడం లేదు! ఎందుకు ఫోన్ ఎత్తడం లేదో చెప్పడానికైనా ఒకసారి ఫోన్ ఎత్తమని అడగడానికి మళ్లీ ఫోన్ చేశాను. ఎత్తాడు!! ‘‘అమిత్జీ నేను ఉద్ధవ్ ఠాక్రే . ఫాదర్ ఆఫ్ ఆదిత్యా ఠాక్రే . వయసు ఇరవై తొమ్మిది. వర్లీ నుంచి భారీ మెజారిటీతో గెలిచాడు’’ అని చెప్పాను. ‘‘ఇదంతా నాకెందుకు చెబుతున్నారు ఉద్ధవ్! దీపావళి పనుల్లో ఉన్నాను. వేరే ఇంకే సమయంలోనైనా మీరు నాకు ఫోన్ చేయగలరా?’’ అన్నాడు విసుగ్గా! ఉలిక్కి పడ్డాను. పిల్లలెవరో బాంబు పేల్చినట్లున్నారు! ఫోన్ని అలా చెవికి ఆన్చుకునే వెళ్లి బాల్కనీలోంచి కిందికి చూశాను. ఆదిత్యను ముఖ్యమంత్రిని చెయ్యాలని ఆ ఈడు కుర్రాళ్లంతా ఇంటి ముందు ఔట్లు పేలుస్తున్నారు. సంతోషంగా అనిపించింది. ‘‘ఏమైంది ఉద్ధవ్! వేరే ఇంకే సమయంలోనైనా మీరు నాకు ఫోన్ చేయగలరా అని మిమ్మల్ని అడిగాను కదా! సమాధానం చెప్పరేమిటి?’’ అంటున్నాడు అమిత్షా. ‘‘అమిత్జీ.. ఆ బాంబుల చప్పుడేమిటని మీరు అడుగుతారని ఆశించాను. కానీ మీరు అడగలేదు. నిజానికి ఆ చప్పుళ్లు మీకు వినిపించడం కోసమే నేను మీకు సమాధానం చెప్పకుండా ఆగాను. ఆదిత్యను సీఎంను చేయాలని డిమాండ్ చేస్తూ కిందంతా ఔట్లు పేలుస్తున్నారు’’ అని చెప్పాను. ‘‘విన్నాను ఉద్ధవ్. మీ అబ్బాయిని సీఎంను చెయ్యాలన్న డిమాండ్తో పేలుస్తున్న ఔట్ల చప్పుడులా లేదది. మీ అబ్బాయి సీఎం అయ్యాక పేలుతున్న ఔట్ల చప్పుడులా ఉంది’’ అన్నాడు. మండిపోయింది నాకు! ‘‘ఏంటి ఉద్ధవ్.. మండిపడుతున్నారు!?’’ అన్నాడు!! ‘‘నేను మండిపడటం కాదు అమిత్జీ. ఇక్కడ టెన్ థౌంజండ్వాలా అంటించారు. పిల్లలు కదా. పెద్దా చిన్నా చూస్కోరు. మంట పెట్టేస్తారు. అవొచ్చి మనకు తగులుతాయ్’’ అన్నాను. ‘‘ముందా పిల్లాటలు మానేయమనండి ఆదిత్యని. రాజకీయాల్లోకి రావలసినవాడు’’ అన్నాడు! రాజకీయాల్లో ఉన్నవాడిని పట్టుకుని రాజకీయాల్లోకి రావలసినవాడు అంటున్నాడంటే.. ఆదిత్యను సీఎంని చెయ్యకూడదని అమిత్షా గట్టిగానే డిసైడ్ అయినట్లున్నాడు. ‘‘మావాడు ఇప్పుడు రాజకీయాల్లోకి రావడమేంటి అమిత్జీ! పదేళ్లుగా రాజకీయాల్లోనే కదా ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా అయ్యాడు. ఎన్నికల ముందు మీరు మా ఇంటికి వచ్చి.. ‘మనం పవర్లోకి వస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ’ అన్లేదా?! ఎన్నికలయ్యాక ఇప్పుడు.. దీపావళి పనులున్నాయి అంటున్నారేమిటి!’’ అని అడిగాను. పెద్దగా నవ్వాడు అమిత్షా. ‘‘దీపావళి పనులంటే మీకు, మీ వాడికి ఔట్లు పేల్చడం. నాకు మాత్రం మహారాష్ట్రకు ఒక కొత్త సీఎంని వెదకి తేవడం’’ అన్నాడు! ‘‘అర్థం కాలేదు అమిత్జీ’’ అన్నాను. ‘‘ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే మీకు యాభై ఆరు సీట్లు, మాకు నూట ఐదు సీట్లు కాదు ఉద్ధవ్. మాకొచ్చిన సీట్లలో సగం మాత్రమే మీకు వచ్చినప్పుడు మనం సగం సగం అవుతామని మీరు ఎలా అనుకున్నారు?’’ అన్నాడు! నేనిక మొహమాట పడదలచుకోలేదు. ‘‘అమిత్జీ.. ఎన్ని సీట్లు వచ్చాయని కాదు, ఎన్ని సీట్లు తగ్గాయో చూడండి. మాకు తగ్గిన సీట్లు ఏడైతే, మీకు తగ్గిన సీట్లు పదిహేడు. మాకు తగ్గిన వాటి కన్నా రెట్టింపుగా మీకు తగ్గినప్పుడు మనం సగం సగం కాబోమని మీరెలా అనుకుంటారు?’’ అన్నాను. ‘‘దీపావళి పనుల్లో ఉన్నాను. మళ్లీ చెయ్యండి ఉద్ధవ్’’ అన్నాడు! ‘‘మీ దీపావళి పనుల్లో మీరు ఉండండి. మా దీపావళి పనుల్లో మేము ఉంటాము’’ అని చెప్పి ఫోన్ పెట్టేశాను. -
పీయుష్ గోయల్ (కేంద్ర మంత్రి) రాయని డైరీ
‘‘గుడ్ ఈవెనింగ్ మిస్టర్ మినిస్టర్, మీ ఒపీనియన్ కావాలి’’ అన్నాడతను నా క్యాబిన్లోకి వచ్చీ రావడంతోనే!! అతడిని ఎక్కడో చూసినట్లుంది. అది కూడా గడ్డంతో చూసినట్లుంది. నా క్యాబిన్లోకి వచ్చినప్పుడు మాత్రం గడ్డం లేదు. ‘‘కూర్చోండి ప్లీజ్! ఇఫ్ ఐయామ్ నాట్ మిస్టేకెన్.. అండ్.. అన్లెస్ ఐయామ్ వెరీమెచ్ మిస్టేకెన్.. మీకు గడ్డం పెంచే అలవాటు ఉంది కదా’’ అన్నాను. నవ్వాడు. ‘‘పెంచే అలవాటూ ఉంది, ఉంచుకోని అలవాటూ ఉంది. ఆ కారణంగానే మీరు నన్ను వెంటనే గుర్తుపట్టలేక పోవడం సహజమే కానీ, మిమ్మల్ని విమర్శించిన వ్యక్తిని కూడా మీరు పోల్చుకోలేక పోవడంలో కొంత సహజత్వమేదో లోపించినట్లుగా ఉంది మిస్టర్ మినిస్టర్! విమర్శించిన మనిషిని ఎవరూ తమ కెరీర్లో మర్చిపోలేరు కదా..’’ అన్నాడు. ‘‘మీరు నన్ను విమర్శించారా?! ఎవరికైనా నన్ను విమర్శించే అవసరం వచ్చేంత పెద్ద కెరీర్లో నేనేమీ లేనే!!’’ అన్నాను ఆశ్చర్యపోతూ. ‘‘అఫ్కోర్స్ మిస్టర్ మినిస్టర్.. మిమ్మల్ని నేను మీ ఎదురుగా విమర్శించలేదు. మీ పక్కనా విమర్శించలేదు. నా మానాన నేను మిమ్మల్ని ట్విట్టర్లో విమర్శించుకున్నాను. అది మీ దృష్టికి వచ్చే ఉంటుంది. నా ట్విట్టర్ అకౌంట్ లోని ఫొటోలో నేను గడ్డంతో ఉన్నాను. మీరు నన్ను మరింత తేలిగ్గా గుర్తుపట్టడం కోసం ఆ గడ్డంతోనే మీ దగ్గరకు వచ్చేవాడినే కానీ, ఉదయమే షేవ్ చేసుకున్నాను. షేవ్ చేసుకున్నాక తెలిసింది నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ తన పుస్తకావిష్కరణ కోసం యు.ఎస్. నుంచి ఇండియా వస్తున్నారని!!’’ అన్నాడు. అప్పుడు గుర్తుకొచ్చాడతను! ‘‘రవీ నాయర్.. రైట్?!’’ అన్నాను. చిరునవ్వుతో తల ఊపాడు. ‘‘మిస్టర్ నాయర్.. మీరు మీ ట్విట్టర్లో నన్నొకర్నే విమర్శించలేదు. మా టీమ్ మొత్తాన్నీ విమర్శించారు. మేమెప్పుడూ మాకు సంబంధం లేని వాటి గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటామని కదా మీరు విమర్శించారు. హోంమంత్రి చరిత్ర గురించి, ఆర్థికమంత్రి అర్బన్ న క్సలిజం గురించి, మానవ వనరుల మంత్రి అంతర్జాతీయ వాణిజ్యం గురించి మాట్లాడతారని విమర్శించారు. ఆ వరసలోనే నన్నూ విమర్శించారు.. వాణిజ్యమంత్రి గురుత్వాకర్షణ శక్తి గురించి మాట్లాడతారని. సో ఫన్నీ యు నో! అది మీ విమర్శ కాదు. మీ అబ్జర్వేషన్. చెప్పండి ఏ విషయం మీద మీకు నా ఒపీనియన్ కావాలి ఇప్పుడు?’’ అన్నాను. ‘‘అది కూడా మీకు సంబంధం లేని విషయం మీదే మిస్టర్ మినిస్టర్’’ అన్నాడు. పెద్దగా నవ్వాను. ‘‘నాకు సంబంధం లేనిదైతేనే నేను చక్కగా చెప్పగలనని కదా మిస్టర్ నాయర్ మీ నమ్మకం. అడగండి. మీ జర్నలిస్టులకు అన్నీ కావాలి. మేము మాత్రం మా శాఖల గురించే మాట్లాడాలి’’ అన్నాను. తనూ నవ్వాడు. ‘‘నేనిప్పుడు మిమ్మల్ని అడగబోతున్నది కష్టకాలపు ఆర్థిక దరిద్రాల నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు అభిజిత్ బెనర్జీ రాసిన పుస్తకం మీద మీ ఒపీనియన్ గురించి. చెప్పండి. అలాంటి ఒక పుస్తకం ఈ దేశానికి అవసరమనే మీరు భావిస్తున్నారా?’’ అని అడిగాడు. అతడి వైపు చూశాను. ‘‘భారతదేశ ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడే అర్హత ప్రపంచంలో ఇద్దరికి మాత్రమే ఉంది మిస్టర్ నాయర్. ఒకరు నిర్మలా సీతారామన్. ఈ దేశ ఆర్థికశాఖ మంత్రి. ఇంకొకరు నిర్మలా బెనర్జీ. అభిజిత్ తల్లి. ఆమెకున్న అర్హత కూడా అభిజిత్ తల్లి అవడం కాదు. కొడుకు అమెరికా పౌరుడిగా మారినప్పటికీ ఆమె ఇంకా ఈ దేÔ¶ పౌరురాలిగానే ఈ దేశంలోనే ఉండిపోవడం..’’ అన్నాను. లేని గడ్డాన్ని బరుక్కుంటూ నా వైపే చూస్తుండిపోయాడు రవీ నాయర్. -
మణిరత్నం-రాయని డైరీ
బెడ్రూమ్ తలుపులు తీసి బాల్కనీలోకి వచ్చి నిలబడ్డాను. బాల్కనీలోంచి మళ్లీ బెడ్రూమ్లోకి వెళుతున్నప్పుడు తలుపుపై ఏదో కాగితం అంటించి ఉంది! ఆ కాగితం మీద ‘రాజద్రోహం’ అని రాసి ఉంది!! రోజూ నిద్ర లేవగానే బాల్కనీలోకి వచ్చి నిలబడి, వీధికి అవతలివైపు ఉన్న పచ్చని చెట్లను చూస్తూ గుండె నిండా గాలి పీల్చుకోవడం అలవాటు. అలా గుండెల్నిండా గాలి పీల్చుకుంటున్నప్పుడు నా వెన గ్గుండా ఎవరో వచ్చి తలుపుపై కాగితం అంటించి వెళ్లి ఉండాలి. లేదా నేను నిద్ర లేవకముందే వచ్చి అంటించి వెళితే, నేను తలుపును చూసుకోకుండా బాల్కనీలోకి వచ్చి గుండెల్నిండా గాలి పీల్చుకుని తిరిగి బెడ్రూమ్లోకి వస్తున్నప్పుడు ఆ కాగితాన్ని చూసి ఉండాలి. సుహాసిని కాఫీ కప్పు అందించి వెళ్లడానికి వచ్చింది. ఆమె ఎప్పుడూ అందించి వెళ్లిపోతుంది. లేదంటే వెళ్లిపోవడం కోసం అందించడానికి వచ్చినట్లుగా ఉంటుంది. ‘‘కూర్చో’’ అన్నాను. (చదవండి : మణిరత్నంపై రాజద్రోహం కేసు) వచ్చి కూర్చుంది. ‘‘మీరెప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. మోదీకి వ్యతిరేకంగా ఆ సంతకం పెట్టేటప్పుడు కూడా ఏదైనా ఆలోచిస్తూ ఉండాల్సింది. లేదా ఆలోచించి సంతకం పెట్టాల్సింది. ఇప్పుడు చూడండి. రాజద్రోహం కేసు పెట్టారు’’ అంది సుహాసిని. ‘‘నేనూ ఊహించలేదు సుహా. పరమత సహనంపై చక్కటి సినిమాలు తీశారు కదా. ఓ సంతకం పెట్టేయండి అని కేరళ నుంచి అదూర్ గోపాలకృష్ణన్ ఫోన్ చేసి చెబితే పెట్టేశాను. ఎప్పుడు పెట్టానో గుర్తులేదు. ఎక్కడ పెట్టానో గుర్తులేదు. అసలు పెట్టినట్లే గుర్తులేదు’’ అన్నాను. ‘‘పెద్ద పెద్ద సినిమాలు తీస్తేనే ఏం కాలేదు. చిన్న సంతకం పెడితే ఏమైందో చూడండి’’ అంది సుహాసిని పైకి లేస్తూ! ‘‘సుహా.. వెళ్లిపోతున్నావా? వెళ్లబోతున్నావా?’’ అన్నాను. ‘‘వెళ్లడం లేదు. వెళ్లబోవడం లేదు. నిలుచున్నానంతే. చెప్పండి’’ అంది. ‘‘పొన్నియిన్ సెల్వన్’ని ఆపేద్దామనుకుంటున్నాను సుహా’’ అన్నాను. సుహాసిని షాక్ తింది! ‘‘అయ్యో ఆపేస్తారా! రెండేళ్లుగా కష్టపడి ప్లాన్ చేస్తున్నారు. థాయ్లాండ్లో సెట్స్ కూడా వేశారు. వాళ్లెవరో ఇంత మైదా పిండితో రాజద్రోహం అని తలుపుపై కాగితం అంటించి వెళ్లారని మీరు మీ ప్రేక్షకులకు ద్రోహం చేస్తారా!’’ అంది సుహాసిని. ‘‘లేదు సుహా. పొన్నియన్ సెల్వన్ని ఆపేసి, గీతాంజలి 2 తీద్దామనుకుంటున్నాను. గుర్తుంది కదా.. గీతాంజలి ఎంత హిట్టయిందో. కళ్ల ముందే ముప్పై ఏళ్లు గడిచిపోయాయి. గీతాంజలిని మళ్లీ తెరపైకి తెస్తాను’’ అన్నాను. ‘‘తెరపైకి తెస్తారు సరే. గీతాంజలిని ఎక్కడ నుంచి తెస్తారు’’ అంది. నవ్వాను. ‘‘గీతాంజలి దొరికింది సుహా. కథను అల్లుకోవాలి అంతే’’ అన్నాను. ‘‘ఎక్కడా?!!’ అంది. పేపర్లో షెహ్లా రషీద్ ఫొటో చూపించాను. ‘‘సుహా.. ఈ అమ్మాయే నా గీతాంజలి 2. యాక్టివిస్టు. ఎలా ఉంది? డేర్ డెవిల్. ‘ప్రైమ్ మినిస్టర్ని గౌరవించాలని రాజ్యాంగంలో ఉందా? ఐపీసీలో ఉందా? పార్లమెంట్ చేసిన చట్టాల్లో ఉందా?’ అని అడుగుతోంది. మాకు సపోర్ట్గా అడుగుతోంది సుహా. లెటర్పై సంతకం పెట్టిన మా నలభై తొమ్మిది మందికి సపోర్ట్గా అడుగుతోంది. ఈ అమ్మాయే నా కొత్త గీతాంజలి’’ అన్నాను ఎగ్జయిటింగ్గా. తనూ ఎగ్జయిట్ అయింది. ‘‘అయితే ఈ సినిమాకు నలభై తొమ్మిది అనే పేరు బాగుంటుంది. కావాలంటే ట్యాగ్లైన్గా ‘గీతాంజలి 2’ అని పెట్టుకోవచ్చు’’ అంది! -
శరద్ పవార్ (ఎన్సీపి).. రాయని డైరీ
ఇంట్లోంచి బయటికి వెళుతుంటే బయటి నుంచి ఇంట్లోకి వస్తూ కనిపించాడు ముంబై పోలీస్ కమిషనర్. ‘‘సంజయ్ బార్వే!’’ అన్నాను. అవునన్నట్లుగా తల ఊపి, ‘‘పవార్జీ మీరు నన్ను సంజయ్ బార్వేగా గుర్తించడం అన్నది ఈ మధ్యాహ్నం నాకెంతో సంతోషాన్నిచ్చిన విషయంగా నాకెప్పటికీ గుర్తుండిపోతుంది’’ అన్నాడు. ‘‘చెప్పు బార్వే.. ఇంట్లోంచి నేను పూర్తిగా బయటికి వచ్చాక నన్ను అరెస్ట్ చేస్తావా? నేనింకా ఇంట్లోనే ఉండగానే నువ్వే ఇంటి లోపలికి వచ్చి నన్ను అరెస్టు చేస్తావా? ఏది గొప్పగా ఉంటుంది నీకు, మీ డిపార్ట్మెంట్కీ?’’ అని అడిగాను. పెద్దగా నవ్వాడు బార్వే. ‘‘పవార్జీ.. నేనిప్పుడు లోపలికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసినా, మీరు బయటికి వచ్చే వరకు ఆగి అప్పుడు అరెస్ట్ చేసినా అది మీకే గొప్ప అవుతుంది కానీ.. నాకు, మా డిపార్ట్మెంటుకు గొప్ప అవదు. పవార్జీ.. మొదట మీకొక విషయం చెప్పడానికి మీరు నన్ను అనుమతించాలి. నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నుంచి కాదు’’ అన్నాడు. నవ్వాను. ‘‘అయితే చెప్పు బార్వే, మహారాష్ట్ర ఎన్నికలయ్యే వరకు మహారాష్ట్రలోని ఏ ఒక్క ప్రాంతానికీ నేను కదిలే వీలు లేకుండా చేసే ఆలోచన ఏదైనా మీ ముఖ్యమంత్రి మనసులో ఉండి, ఆ ఆలోచనను చక్కగా అమలు పరిచే విషయమై నా సహకారాన్ని కోరేందుకు వచ్చావా?’’ అని అడిగాను. ‘‘మిమ్మల్ని కదలకుండా చెయ్యడానికో, మిమ్మల్ని కదలకుండా చేసేందుకు ఏవైనా ఐడియాలుంటే చెప్పమని మిమ్మల్నే అడగడానికో నేనిప్పుడు రాలేదు పవార్జీ. మీ చేత ఒట్టు వేయించుకోడానికి వచ్చాను’’ అన్నాడు! ‘‘ఒట్టు దేనికి బార్వే’’ అన్నాను. ‘‘మీకై మీరుగా ఎప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం మెట్లెక్కి వెళ్లి అరెస్ట్ కానని నా మీద ఒట్టు వెయ్యాలి పవార్జీ’’ అన్నాడు! ‘‘కానీ.. వాళ్లు నన్ను పిలవాలని అనుకుంటున్నారన్న సంగతి తెలిసి కూడా వాళ్లు నన్ను పిలిచేవరకు నేను ఆగగలనని మీరంతా ఎందుకు అనుకుంటారు బార్వే. నేను బీజేపీ మనిషిని కానంత మాత్రాన నాక్కొన్ని ఎథిక్స్ ఉండకూడదా?!’’ అన్నాను. ‘‘కానీ పవార్జీ.. మీరు ఎథిక్స్ కోసం అరెస్ట్ అయిన మరుక్షణం ముంబై తన ఎథిక్స్ అన్నింటినీ వదిలేస్తుంది. ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బ్యాంకు స్కామ్లో మీ పేరు వినిపించడం కన్నా, ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బ్యాంకు స్కామ్లో మీరు అరెస్ట్ అవడం పెద్ద విషయం. వెంటనే శాంతిభద్రతలు దెబ్బతింటాయి. వెంటనే ఈ మహానగరం వెంటిలేటర్ మీదకు వెళ్లిపోతుంది’’ అన్నాడు బార్వే. అని ఊరుకోలేదు. ఒట్టు వెయ్యాల్సిందే అన్నట్లు చెయ్యి చాచాడు. ‘‘బార్వే.. అజిత్ పవార్ ఎవరో నీకు తెలిసే ఉంటుంది. మా పార్టీ ఎమ్మెల్యే. ఎందుకు రాజీనామా చేశాడో తెలుసా? స్కామ్లో తన పేరు ఉన్నందుకు కాదు. నా పేరు కూడా ఉన్నందుకు! అన్న కొడుకు. హర్ట్ అవడా మరి. అతడు హర్ట్ అవడం అతyì ఎథిక్. నేను అరెస్ట్ అవాలనుకోవడం నా ఎథిక్’’ అన్నాను ఒట్టేయకుండా. వెయ్యాల్సిందే అన్నట్లు నిలుచున్నాడు. ‘‘అయితే నువ్వూ నాకొక ఒట్టు వెయ్యాలి బార్వే’’ అన్నాను. ‘‘మీరు ఈ ఒట్టేస్తే నేను ఏ ఒటై్టనా వేస్తాను పవార్జీ’’ అన్నాడు. ‘‘అరెస్ట్ అవను అని నేను ఇక్కడ ఒట్టేశాక, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి వెళ్లి ‘అరెస్టు చేయం’ అని నువ్వు అక్కడ ఒట్టేయించు కోకూడదు. అలాగని ఒట్టేయ్’’ అన్నాను. -
రాయని డైరీ.. నరేంద్ర మోదీ (భారత ప్రధాని)
హ్యూస్టన్లో క్లైమేట్ అన్ఫ్రెండ్లీగా ఉంది! ఇండియా–పాక్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ మొదలయ్యే సమయానికి వర్షం పడి పిచ్ మొత్తం తడిసి ముద్ద అయినట్లుగా ఉంది హ్యూస్టన్ నగరం. ఈ రాత్రికే ‘హౌడీ మోదీ’ ప్రోగ్రామ్. నన్నూ, అమెరికా అధ్యక్షుడినీ కలిపి ఒకే వేదికపై చూడ్డం కోసం యాభైవేల మంది ఎన్నారైలు హ్యూస్టన్కు వస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు ఇప్పటికే న్యూయార్క్ చేరుకుని ఉన్న దేశాధినేతలు కూడా ట్రంప్నీ, నన్ను చూడ్డం కోసం ఈ రాత్రి టీవీలకు దగ్గరగా జరిగి కూర్చుంటారు. ఇమ్రాన్ ఖాన్ మరింత దగ్గరగా జరిగి కూర్చుంటాడేమో! వర్షం ఎంతకూ తగ్గడం లేదు. వర్షం ఎంతకూ తగ్గకపోతే ఆ సాకుతో ట్రంప్ నా కార్యక్రమానికి రాకపోయేందుకు అడ్డంకులేమీ ఉండవు. రేపు సోమవారం ట్రంప్, ఇమ్రాన్ఖాన్ ఇద్దరే విడిగా న్యూయార్క్లో కలుస్తున్నారు. ఒకర్నొకరు చూసుకోగానే, ‘హౌడీ ఇమ్రాన్’ అంటాడేమో ట్రంప్! ‘హౌడీ మోదీ’ అనవలసినవాడు హ్యూస్టన్ రాకుండా, న్యూయార్క్లో ‘హౌడీ ఇమ్రాన్’ అంటే కనుక ఇక వాళ్లిద్దరూ ఒకటయ్యారనే అనుకోవాలి. ఇద్దరూ ఒకటయ్యారంటే మంగళవారం జరిగే సమితి సమావేశంలో తన ప్రారంభోపన్యాసం పూర్తయ్యాక.. ‘వేదికపైకి వచ్చి కశ్మీర్ గురించి నాలుగు మాటలు మాట్లాడి వెళ్లండి ఇమ్రాన్..’ అని ట్రంప్ ఆహ్వానించినా ఆశ్చర్యం లేదు. హ్యూస్టన్లోని క్లైమేట్ మాత్రమే కాదు, హ్యూస్టన్లో దిగినప్పటి నుంచి ట్రంప్ కూడా నాతో అన్ఫ్రెండ్లీగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఫ్లయిట్ దిగ్గానే ‘హౌడీ మోదీ’ అని వాషింగ్టన్ నుంచి ట్రంప్ నాకు ఫోన్ చేస్తారని, అప్పుడు నేను ‘హౌడీ డొనాల్డ్’ అని అనాలనీ అనుకున్నాను. హౌడీ ట్రంప్ అనేకంటే, హౌడీ డొనాల్డ్ అనడం రిథమిక్గా ఉంటుందని! కానీ ఫోన్ రాలేదు! ‘‘వర్షాలు కదా, లైన్లు లేనట్లున్నాయి’’ అన్నారు నాతో ఉన్న హ్యూస్టన్ మేయర్ సిల్విస్టర్ టర్నర్. ‘‘వర్షాలైతే అన్నిచోట్లా ఉంటాయి. లైన్లు లేకపోవడం కూడా అన్నిచోట్లా ఉంటుందా మిస్టర్ సిల్విస్టర్ టర్నర్?’’ అన్నాను. ‘‘సర్, మీరనుకుంటున్నట్లు నేను సిల్విస్టర్ టర్నర్ని కాదు. సిల్విస్టర్ టర్నర్ ప్రతినిధిని’’ అన్నాడు ఆ మనిషి! ‘ఆయనెక్కడా..!’’ అన్నాను. ‘‘సర్, ఆయన దారి మధ్యలో చిక్కుకుపోయినట్లున్నారు’’ అన్నాడు. దారి మధ్యలో చిక్కుకుపోయాడా, ట్రంపే ఫోన్ చేసి దారి మధ్యలో చిక్కుకుపొమ్మని చెప్పాడా?! అనుమానం వచ్చింది నాకు. నిన్న ఒక్కరోజే ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు ఏడు లక్షల కోట్లు రావడం ట్రంప్ మనసులో పడే ఉంటుంది. నాలుగు నెలల్లో కొట్టుకుపోయిన పదకొండు లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డబ్బులో సగానికి పైగా ఒక్క రోజులోనే రికవరీ చేశాడంటే మోదీ సామాన్యుడు కాదని కూడా ట్రంప్ అనుకునే ఉంటాడు. ఇండియా అమెరికాను మించిపోయినా ట్రంప్ భరించగలడు కానీ, మోదీ ట్రంప్ను మించిపోయాడని ప్రపంచం అనుకుంటే మాత్రం తట్టుకోలేడు. ‘‘వస్తాను సర్. వర్షం ఎక్కువయ్యేలా ఉంది’’ అన్నాడు సిల్విస్టర్ టర్నర్ ప్రతినిధి. నాకెందుకో అతడే సిల్విస్టర్ అనిపిస్తోంది. వర్షంలో తడిసి వచ్చిన మనిషిని గుర్తుపట్టలేని వయసుకు నేనింకా రాలేదనే నా నమ్మకం. ‘‘మిస్టర్ సిల్విస్టర్.. ఈ రాత్రి నా హౌడీ మీటింగ్కి ట్రంప్ కాకుండా, ట్రంప్ ప్రతినిధి వస్తున్నట్లయితే ఆ విషయాన్ని మీరు నాకు కాస్త ముందుగా చెప్పగలరా?’’ అని అడిగాను. ‘‘చెప్పగలను మిస్టర్ మోదీ.. అయితే ఎంత పెద్ద వర్షమైనా మరీ ట్రంప్ ప్రతినిధి కూడా రాలేనంతగా కురవదని నా నమ్మకం’’ అన్నాడతను!!!