NHAI
-
‘మర్రి’కి అభయమిచ్చే వరకు విస్తరణ వద్దు
బీజాపూర్ జాతీయ రహదారి అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్ శివారులోని అప్పా కూడలి నుంచి మన్నెగూడ కూడలి వరకు నాలుగు వరుసలకు విస్తరించే రోడ్డు ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. విస్తరణలో ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) సరిగ్గా వ్యవహరించకపోవటాన్ని తప్పుపట్టిన జాతీయ హరిత ట్రిబ్యునల్.. మళ్లీ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్టు (పర్యావరణంపై ప్రభావ అంచనా నివేదిక) అందించే వరకు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించొద్దని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం తీర్పు వెల్లడించింది. – సాక్షి, హైదరాబాద్మర్రి వృక్షాలే కేంద్రంగా.. నగర శివారులోని అప్పా కూడలి నుంచి చేవెళ్ల–వికారాబాద్ రోడ్డులోని మన్నెగూడ కూడలి వరకు జాతీయ రహదారిని ఎన్హెచ్ఏఐ నాలుగు వరుసలతో 60 మీటర్లకు విస్తరించాల్సి ఉంది. ఇది కర్ణాటకలోని బీజాపూర్ వరకు విస్తరించిన రోడ్డు. ఎగువన పరిగి మీదుగా రాష్ట్ర సరిహద్దు వరకు గతంలోనే రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలోని జాతీయ రహదారుల విభాగం ఈ రోడ్డును విస్తరించింది. నగర శివారు నుంచి మన్నెగూడ వరకు 46 కి.మీ. నిడివి ఎన్హెచ్ఏఐ అదీనంలో ఉంది. దాదాపు రూ.950 కోట్లతో ఈ పనులు చేపట్టాల్సి ఉంది. మన్నెగూడ వరకు రోడ్డుకిరువైపులా స్వాతంత్య్రానికి పూర్వం నాటిన 915 మర్రి వృక్షాలున్నాయి. నాలుగు వరుసలకు విస్తరించాలంటే ఈ మొత్తం చెట్లను తొలగించాల్సి వస్తుంది. చేవెళ్ల, మొయినాబాద్ పట్టణాల వద్ద రోడ్డు విస్తరణలో ఇళ్లను కూడా తొలగించాల్సి రావటంతో ఆ రెండు చోట్ల బైపాస్ రోడ్లు నిర్మించాలనుకున్నారు. దీంతో మొయినాబాద్, చేవెళ్ల పట్టణాల వద్ద ఉన్న 232 చెట్లను తొలగించాల్సిన పని లేకుండాపోయింది. ఈ వృక్షాలను కొట్టకుండా కాపాడాలంటూ బాలాంత్రపు తేజ సహా పలువురు సామాజిక కార్యకర్తలు జాతీయ హరిత ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. పలుదఫాల విచారణ అనంతరం, ఆ వృక్షాల తొలగింపు వల్ల పర్యావరణంపై ఉండే ప్రభావాన్ని అంచనా వేయాలంటూ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖను ట్రిబ్యునల్ ఆదేశించింది. దీంతో గతేడాది జనవరిలో ఆ శాఖ అదీనంలోని నిపుణుల అంచనా కమిటీ (ఈఏసీ) అధ్యయనం చేసి ఎన్హెచ్ఏఐకి నివేదిక సమర్పించింది. కొన్ని చెట్ల పరిరక్షణకు వీలుగా సెంట్రల్ మీడియం వెడల్పు తగ్గించామని, దాని వల్ల 50 చెట్లు తొలగించాల్సిన అవసరం లేకుండా పోయిందని, బైపాస్ల వల్ల 232 మిగులుతున్నాయని, స్థానిక ముడిమ్యాల అటవీ ప్రాంతం వద్ద మిగిలే మరికొన్ని చెట్లు సహా మొత్తం 393 వృక్షాలు అలాగే మిగిలి ఉంటాయని, మిగతా వృక్షాలను ట్రాన్స్లొకేట్ పద్ధతిలో వేరే చోట నాటుతామని ట్రిబ్యునల్కు విన్నవించింది. ట్రిబ్యునల్ అసంతృప్తి.. ఏమన్నదంటే.. » ఎన్హెచ్ఏఐ సమర్పించిన నివేదికపై ట్రిబ్యునల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. » ప్రస్తుతమున్న అలైన్మెంట్ ప్రకారమే రోడ్డును విస్తరించాలని ఎందుకు అనుకుంటున్నారు. కొత్తగా మరో రోడ్డు నిర్మిస్తే అయ్యే నష్టమేంటన్న మాటకు ఎందుకు స్పష్టమైన సమాధానం ఇవ్వటం లేదు. » మర్రి వృక్షాలు కీలక భాగాల్లో సున్నితంగా ఉంటాయి. వాటిని ట్రాన్స్లొకేట్ చేసిన సందర్భంలో మనుగడ శాతం తక్కువగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. అందులోనూ ఎక్కువ వయసు ఉన్న వృక్షాల మనుగడలో తీసుకునే చర్యలేమిటో శాస్త్రీయబద్ధ నివేదిక రూపంలో సమర్పించలేదు. » ట్రాన్స్లొకేట్ చేసిన తర్వాత వృక్షాలు మనుగడ సాగించేందుకు తీసుకునే చర్యలేమిటో ప్రాజెక్టు రిపోర్టులో చేర్చలేదు. దానికి సంబంధించి పర్యావరణ ప్రభావ అంచనా నివేదికలో వెల్లడించలేదు. » అందుకే మరోసారి శాస్త్రీయపద్ధతిలో నిపుణుల ఆధ్వర్యంలో పర్యావరణ ప్రభావ అంచనా అధ్యయనం నిర్వహించి నివేదిక సమర్పించాలి. అప్పటి వరకు రోడ్డు విస్తరణ పనులను నిలిపివేయాలి. -
ఫాస్ట్ట్యాగ్ కొత్త రూల్స్: ఆ టోల్ ప్లాజాలకు వర్తించదు
జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే వాహనదారులకు 'నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా' (NHAI) పెద్ద ఉపశమనం కల్పించింది. ఇటీవల అమలులోకి వచ్చిన 70 నిమిషాల ఫాస్ట్ట్యాగ్ రూల్స్.. జాతీయ రహదారులపై ఉండే టోల్ ప్లాజాలకు వర్తించవని స్పష్టం చేసింది. అయితే ఈ కొత్త రూల్స్ ఎక్కడ వర్తిస్తాయనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం.ఫాస్ట్ట్యాగ్ కొత్త రూల్స్నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ 'ఫాస్ట్ట్యాగ్' (FASTag)లో రెండు కొత్త మార్పులను జారీ చేసింది. ఈ నియమాలు ఫిబ్రవరి 17 నుంచి అమలులోకి వచ్చాయి. టోల్ చెల్లింపులను క్రమబద్ధీకరించడం, వివాదాలను తగ్గించడం లక్ష్యంగా లావాదేవీలు ఈ రూల్స్ ప్రవేశపెట్టారు.ఫాస్ట్ట్యాగ్లో తగిన బ్యాలెన్స్ లేకపోతే.. అది బ్లాక్లిస్ట్లోకి వెళ్తుంది. టోల్ప్లాజా రీడర్ వద్దకు చేరుకునే సమయానికి ఒక గంట లేదా 60 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఫాస్ట్ట్యాగ్ ఇన్యాక్టివ్లోనే ఉంటే కోడ్ 176 ఎర్రర్ను చూపి లావాదేవీలు క్యాన్సిల్ అవుతాయి. అంతే కాకుండా మీరు స్కాన్ చేసిన 10 నిమిషాల తరువాత ఇన్యాక్టివ్లోకి వెళ్లినా.. మళ్ళీ లావాదేవీలు రిజెక్ట్ అవుతాయి. ఇలా లావాదేవీలు క్యాన్సిల్ అయినప్పుడు.. వాహనదారుడు ఫెనాల్టీ కింద రెట్టింపు టోల్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.ఇక బ్లాక్లిస్ట్ నుంచి బయటపడాలంటే, తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవడం మాత్రమే కాకుండా.. ఎప్పటికప్పుడు కేవైసీ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి దూర ప్రయాణాలు ప్రారంభించే ముందు ఖాతాల్లో తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. టోల్ ప్లాజాలను చేరుకునే ముందు FASTag బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి. ''కొత్త ఫాస్ట్ట్యాగ్ రూల్స్ రాష్ట్ర రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలకు వర్తిస్తాయి''.FASTag అంటే ఏమిటి?దేశంలోని అన్ని రహదారులపై టోల్ కలెక్షన్ పాయింట్ల ద్వారా వాహనాల ప్రయాణాన్ని సులభతరం చేయాలనే లక్ష్యంతో 2019 డిసెంబర్లో దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ ట్యాగ్ - ఫాస్ట్ట్యాగ్ స్కీమ్ ప్రారంభించారు. ఇది నగదు రహిత ఆర్థిక లావాదేవీలకు ఇది అనుమతిస్తుంది. అంతే కాకుండా టోల్ ప్లాజాల ద్వారా రోడ్డు ప్రయాణ వేగాన్ని వేగవంతం చేయడానికి ఇది సహాయపడుతుంది. ఫాస్ట్ట్యాగ్ వచ్చిన తరువాత వసూళ్లు కూడా భారీగా పెరిగాయి. -
నాగ్పూర్ హైవే ‘ప్రైవేటు పరం’
సాక్షి, హైదరాబాద్: నిధుల సమీకరణే లక్ష్యంగా భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) తెలంగాణలోని ఓ జాతీయ రహదారిని ప్రైవేటుపరం చేసింది. రోడ్డు మీద ఉన్న టోల్ బూత్ల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయటం ద్వారా నిర్ధారిత కాలానికి టోల్ వసూలు అంచనా మేరకు లెక్కగట్టి మొత్తాన్ని ఒకేసారి వసూలు చేసుకునేందుకు ప్రారంభించిన టీఓటీ (టోలింగ్, ఆపరేషన్, మెయింటెనెన్స్ అండ్ ట్రాన్స్ఫర్) విధానంలో ఓ జాతీయ రహదారిని ప్రైవేటుకు అప్పగించింది. టెండర్ పద్ధతిలో ఆ రోడ్డు బాధ్యతను పొందిన సంస్థ గురువారం అర్ధరాత్రి నుంచి దానిపై టోల్ వసూలు ప్రారంభించింది. 20 ఏళ్ల కాలానికి...: హైదరాబాద్–నాగ్పూర్ (ఎన్హెచ్ 44) జాతీయ రహదారి ఎన్హెచ్ఏఐ నిర్వహణలో ఉంది. 251 కి.మీ. నిడివి గల ఈ రోడ్డును తాజాగా టీఓటీ పద్ధతిలో ప్రైవేటు సంస్థకు అప్పగించింది. గత సెపె్టంబరులో టెండరు పిలవగా, నార్త్ తెలంగాణ ఎక్స్ప్రెస్వే లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. ఆ సంస్థ వచ్చే 20 ఏళ్లపాటు ఆ రోడ్డు నిర్వహణను పర్యవేక్షిస్తుంది. ఈ రోడ్డుపై ఆరు టోల్ ప్లాజాలుండగా, ఒకటి ఇప్పటికే ప్రైవేటు ఆ«దీనంలో ఉంది. మిగతా ఐదు టోల్బూత్లను ఎన్హెచ్ఏఐ ఇప్పుడు టీఓటీ పద్ధతిలో ప్రైవేటుకు అప్పగించింది. వచ్చే 20 ఏళ్ల కాలానికి సంబంధించి ఒకేసారి టీఓటీ మొత్తంగా ఆ సంస్థ రూ.6,661 కోట్లను ఎన్హెచ్ఏఐకి ఈనెల 12న జమచేసింది. ఇక టోల్ వసూలు బాధ్యత ప్రైవేటు సంస్థ చేపడుతుంది. ఈ 20 ఏళ్లపాటు రోడ్డు నిర్వహణ బాధ్యత ఆ సంస్థదే. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇదే తరహాలో ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్)ను ప్రైవేటు సంస్థకు అప్పగించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ నిర్ణయం పెద్ద వివాదాస్పదమైంది.ప్రైవేటు సంస్థ చెల్లించిన మొత్తం కంటే టోల్ ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుందని వైరి పక్షాలు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. కాగా, ప్రైవేటు సంస్థలు కేంద్రం నిర్ధారించిన మేరకే టోల్ వసూలు చేయాల్సి ఉంటుందని, సొంతంగా టోల్ ధరలను సవరించుకునే అధికారం వాటికి ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. కానీ, చాలా సంస్థలు, ఆశించిన స్థాయిలో వాహన సంచారం లేనందున తమకు నష్టం వస్తోందనే సాకుతో టోల్ పెంచుకునేందుకు ప్రతిపాదిస్తుండటం గమనార్హం. -
హైవేపై అన్లిమిటెడ్ టోల్ పాస్లు: ధరలు ఇవే..
భారత్ ఇప్పుడు అభివృద్ధి వైపు వేగంగా దూసుకెళ్తోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్ నెట్వర్క్ కలిగిన ఇండియాలో జాతీయ రహదారుల నిర్మాణం శరవేగంగా ఉంది. అయితే గత పదేళ్లలో జాతీయ రహదారులపైన టోల్ ప్లాజాలు పెరిగాయి, టోల్ ఫీజులు కూడా పెరిగాయి. దీనిపై వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం కూడా కొత్త చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు టోల్ ఫీజుల భారాన్ని తగ్గించడానికి వార్షిక టోల్ పాస్లు & జీవితకాల టోల్ పాస్లను అందించాలని యోచిస్తోంది.వాహనదారులకు ఉపశమనం కలిగించడానికి.. టోల్ వసూల్లలో సరళీకరణను సాధించడానికి కేంద్రం టోల్ పాస్ల జారీలో కొత్త విధానం తీసుకురానుంది. ఇందులో వార్షిక టోల్ పాస్లు, లైఫ్ టైం టోల్ పాస్లు జారీ చేయడానికి సంకల్పించింది.వార్షిక ప్లాన్ కింద ఏడాది 3000 రూపాయలు, లైఫ్ టైం టోల్ పాస్ (15 సంవత్సరాలు) కోసం రూ. 30,000 చెల్లించాల్సి ఉంటుందని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 340 రూపాయలకు నెలవారీ టోల్ పాస్ అందుబాటులో ఉంది. ఈ లెక్కన తీసుకుంటే ఏడాదికి రూ. 4080 చెల్లించాలి. కానీ ఏడాదికి టోల్ పాస్ తీసుకుంటే.. 1080 రూపాయలు ఆదా చేయవచ్చు.వార్షిక, లైఫ్ టైం పాస్లు ప్రస్తుత FASTag వ్యవస్థలో చేర్చనున్నారు. కాబట్టి దీనికోసం ప్రత్యేకించి డాక్యుమెంటేషన్ అవసరం లేదు. ఈ టోల్ పాస్ వ్యవస్థను త్వరలోనే తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. వార్షిక టోల్ పాస్ లేదా జీవిత కాల టోల్ పాస్ అనేది ఒక టోల్ గేటుకు మాత్రమే వర్తిస్తుందా? లేక అన్ని చోట్లా పనిచేస్తుందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.ఏకరీతి టోల్ విధానంవినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఏకరీతి టోల్ విధానంపై కసరత్తు చేస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలే తెలిపారు. ఇప్పుడు మనదేశంలోని రోడ్లు.. అమెరికాలోని రోడ్లకు సమానంగా ఉన్నాయని ఆయన అన్నారు.కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో రోడ్లు లేకపోవడం, అధిక టోల్ చార్జీల వసూలు వంటివి వాహనదారులలో అసంతృప్తిని నెలకొల్పాయి. కాబట్టి ఏకరీతి టోల్ ప్రవేశపెడితే.. ఇది అందరికి ప్రయోజనకారిగా ఉంటుందని నితిన్ గడ్కరీ అన్నారు. అయితే దీనికి సంబంధించిన చాలా వివరాలను ఆయన అధికారికంగా వెల్లడించలేదు. అంతకంటే ముందు GSS (గ్లోబల్ న్యావిగేషన్ శాటిలైట్ సిస్టం) ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: 2030 నాటికి ఈ రంగంలో 2.5 కోట్ల ఉద్యోగులు: నితిన్ గడ్కరీజాతీయ రహదారులపై గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్) ఆధారిత టోల్ వసూలు విధానం అమలు చేయడం ద్వారా ప్రయాణానికి ఎలాంటి అవరోధం ఉండదని ఆయన అన్నారు. అంతే కాకుండా.. సోషల్ మీడియాలో ప్రయాణికులు చేసే ఫిర్యాదులను చాలా సీరియస్గా తీసుకున్నామని.. దీనికి కారణమైన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని గడ్కరీ చెప్పారు. -
కార్లకు ‘టోల్’ పాస్లు
సాక్షి, అమరావతి: జాతీయ రహదారులపై టోల్ గేట్ ఫీజుల చెల్లింపు ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) కొత్త విధివిధానాలను రూపొందించింది. ప్రధానంగా ప్రైవేటు కార్ల యజమానులకు టోల్ ఫీజుల పాస్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. జాతీయ రహదారులపై తరచూ ప్రయాణం చేసే ప్రైవేటు కార్ల యజమానులకు సౌలభ్యంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అన్ లిమిటెడ్ యూసేజ్ (అపరివిుత వినియోగం) ప్రాతిపదికన టోల్ ఫీజు పాస్లను రెండు కేటగిరీలుగా జారీ చేసే ముసాయిదాను ఎన్హెచ్ఏఐ తాజాగా ఆమోదించింది. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ విధానం ద్వారానే పాస్ల విధానాన్ని అమల్లోకి తెస్తారు. వార్షిక టోల్ ఫీజు పాస్, లైఫ్టైమ్ పాస్ (15ఏళ్లు)లను అందుబాటులోకి తేనుంది. వార్షిక పాస్ రూ.3 వేలు, లైఫ్టైమ్ (15ఏళ్లు) పాస్ను రూ.30 వేలుగా నిర్ణయించింది. వార్షిక పాస్ తీసుకుంటే జాతీయ రహదారులపై టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఏడాదిలో ఎన్ని సారై్లనా దేశవ్యాప్తంగా ఎక్కడైనా ప్రయాణించేందుకు వెసులుబాటు ఉంటుంది. ఇక లైఫ్టైమ్ పాస్ తీసుకుంటే ఆ వాహన జీవిత కాలం అంటే గరిష్టంగా 15ఏళ్ల పాటు టోల్ ఫీజు చెల్లించకుండా జాతీయ రహదారులపై ఎన్నిసార్లయినా ప్రయాణించవచ్చు. ప్రస్తుతం టోల్ గేట్లకు సమీపంలో ఉన్న గ్రామాల వారికి ఆ ఒక్క టోల్ గేటు వరకు పాస్ల విధానాన్ని అమలు చేస్తోంది. అందుకోసం ఆ గ్రామాల ప్రజలు తమ అడ్రస్ ప్రూఫ్ను సమర్పిస్తే నెలకు రూ.340 పాస్ను జారీ చేస్తోంది. అంటే ఏడాదికి రూ.4,080 అవుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఏడాదిపాటు టోల్ ఫీజు లేకుండా ప్రయాణానికి రూ.3 వేలకే పాస్ అన్నది అత్యంత సమంజసమైనదిగా ఎన్హెచ్ఏఐ వర్గాలు చెబుతున్నాయి. 2023–24లో టోల్ఫీజుల రూపంలో రూ.55వేల కోట్లు వసూలయ్యాయి. వాటిలో ప్రైవేటు కార్ల వాటా రూ.8 వేల కోట్లు మాత్రమే. కాబట్టి ప్రైవేటు కార్లకు వార్షిక, లైఫ్టైమ్ టోల్ ఫీజు పాస్ల జారీతో రాబడిపై పెద్దగా ప్రతికూల ప్రభావం చూపించదని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. టోల్ ఫీజుల పాస్ల జారీ కోసం ఎన్హెచ్ఏఐ రూపొందించిన ముసాయిదాపై కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ త్వరలో తుది నిర్ణయం తీసుకోనుంది. -
సురక్షితం ఏఐ రాస్తే
నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని ప్రమాదాలకు మానవ తప్పిదాలు కారణమవుతుండగా, మరికొన్ని చోట్ల రోడ్ల నిర్మాణంలోని లోపాలు కారణంగా నిలుస్తున్నాయి. ఈ రెండో సమస్యకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పరిష్కారం కనిపెట్టారు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలోని ఐఎన్ఏఐ కేంద్రం ఆవిష్కరించిన ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ (ఐరాస్తే) ఈ సమస్యకు దారి చూపింది. తెలంగాణ ప్రభుత్వం, ఇంటెల్ సహకారంతో ఐరాస్తేను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. -సాక్షి, హైదరాబాద్ఒక రహదారిపై ప్రమాదాలు జరిగే అవకాశం 80 నుంచి 90 శాతం ఉన్న ప్రదేశాన్ని గ్రే స్పాట్గా గుర్తిస్తారు. అయితే, వరుసగా మూడేళ్లపాటు అదేచోట ప్రమాదాలు జరిగి పది మందికంటే ఎక్కువ చనిపోతే, ఆ ప్రదేశాన్ని బ్లాక్ స్పాట్ జాబితాలో చేర్చుతారు. ఇలాంటి ప్రదేశాలను గ్రే స్పాట్ల స్థాయిలోనే తెలుసుకోగలిగితే ప్రమాదాలు జరగకుండా, ప్రాణాలు పోకుండా కాపాడవచ్చు. సరిగ్గా ఈ పనే చేస్తుంది ఐరాస్తే. ఒక ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్గా గుర్తించేందుకు మూడేళ్లు ఆగాల్సిన పనిలేకుండా ఏఐ సహకారంతో ముందుగానే గుర్తిస్తుంది. మూడు రహదారులపై అధ్యయనం.. ఐరాస్తేను రాష్ట్రంలోని మూడు ప్రధాన రహదారులపై ప్రయోగించి చూశారు. 2023, ఏప్రిల్ నుంచి 2024, మార్చి వరకు టీఎస్ఆర్టీసీకి చెందిన 200 బస్సుల్లో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్) పరికరాలు, 10 డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ (డీఎంఎస్) యూనిట్లను ఏర్పాటు చేసి పరీక్షించారు. మొత్తం 691 కిలోమీటర్ల మేర రోడ్లను అధ్యయనం చేశారు. 2022 నుంచి 2024 వరకు 5,606 ఎఫ్ఐఆర్లు, రోడ్డు ప్రమాద రికార్డులతో సహా క్రాష్ నివేదికలు, ఏడీఏఎస్ హెచ్చరికలు, బ్లాక్ స్పాట్లపై నిర్వహించిన భద్రతా ఆడిట్ట్లను పరిశీలించి ఒక్కో రహదారిపై 20 చొప్పున గ్రే స్పాట్లను ఐ రాస్తే గుర్తించింది. 15 గ్రే స్పాట్ల్లో పరిష్కార చర్యలను సూచిస్తూ జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు నివేదికలు సమర్పించారు. బారియర్స్తో సరిదిద్దవచ్చు.. కొన్ని గ్రే స్పాట్లకు స్వల్ప పరిష్కారాలు సరిపోతాయి. బారియర్స్, సైన్బోర్డులు, టీ–ఇంటర్ సెక్షన్ హెచ్చరిక సంకేతాలతో వాటిని సరిదిద్దవచ్చు. మరికొన్నింటికి ఆకృతి మార్పులు అవసరం. ఇప్పటివరకు మూడు గ్రే స్పాట్స్ సరిదిద్దే చర్యలకు ఎన్హెచ్ఏఐ టెండర్లను ఆహ్వనించింది. మిగిలిన ప్రదేశాలలో పని జరుగుతోంది. – పృథ్వీ, ఐ–రాస్తే ఆపరేషన్స్ మేనేజర్ 600 మందికి ఏబీసీలో శిక్షణ ప్రమాదాలు జరిగినప్పుడు తొలి స్పందన కోసం ఐరాస్తే 600 మంది స్థానికులకు యాక్టివ్ బ్లీడింగ్ కంట్రోల్ (ఏబీసీ)లో శిక్షణ ఇచ్చింది. వీరు 8 నెలల్లో 10 మంది ప్రాణాలు కాపాడారు. ఈ ఇంటిగ్రేటెడ్ నివారణ విధానం బ్లాక్ స్పాట్స్ ఏర్పడుతున్నప్పుడు వాటిని అంచనా వేయగలదు. ఈ ప్రాజెక్టు విస్తరణకు రాజస్థాన్, జమ్ముకశీ్మర్ ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నాం. – గోవింద్ కృష్ణన్, ఐ–రాస్తే ప్రోగ్రామ్ మేనేజర్, ట్రిపుల్ హైదరాబాద్ -
దక్షిణ వలయం.. అయోమయం
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు దక్షిణ భాగం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం గందరగోళంగా మారింది. జాతీయ రహదారిగా నిర్మిస్తున్నందున, ఆ ప్రాజెక్టును ప్రతిపాదించినప్పటి నుంచి ట్రిపుల్ ఆర్ రెండు భాగాలూ ఎన్హెచ్ఏఐ పరిధిలోనే ఉన్నాయి. ప్రస్తుతం నేషనల్ హైవేస్ (ఒరిజినల్) జాబితాలో ఉత్తర భాగం ఉండగా, విజన్ 2047 పార్ట్ 2 జాబితాలో దక్షిణ భాగం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ భాగానికి డీపీఆర్ను రూపొందించే పనిలో ఉంది.గతంలో పిలిచిన టెండర్లకు స్పందన లేకపోవటంతో దాని గడువును పెంచింది. మరోవైపు దాని అలైన్మెంటును ఖరారు చేసేందుకు అధికారులతో గతంలో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఎన్హెచ్ఏఐ చేపట్టే ప్రాజెక్టులకు అలైన్మెంట్లు, డీపీఆర్లను అదే సొంతంగా ఖరారు చేసుకుంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వీటిపై కసరత్తు చేస్తుండటం అయోమయానికి కారణమవుతోంది. సీఎం సమీక్షలు, కమిటీలుఈ ప్రాజెక్టును ప్రతిపాదించిన సమయంలో అధికారులు ట్రాఫిక్ సర్వే నిర్వహించినప్పుడు దక్షిణ భాగం పరిధిలో వాహనాల రద్దీ అంత ఎక్కువగా ఉండదని తేలింది. టోల్ ఆదాయం అంతంత మాత్రంగానే ఉండే రోడ్లపై భారీ వ్యయం చేయటం సబబు కాదన్న ఉద్దేశంతో కేంద్రం అంత ఆసక్తి చూపలేదు. చివరకు రాష్టప్రభుత్వ ఒత్తిడితో సరేనంది. తొలుత ఉత్తర భాగాన్ని చేపట్టి ఆ తర్వాత దక్షిణ భాగంపై దృష్టి సారించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర భాగాన్ని భారత్మాల పరియోజనలో చేర్చింది. అయితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో ఏర్పడిన విభేదాలతో జాప్యం జరిగి, భారత్మాల పరియోజన గడువు తీరిపోయింది.అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మళ్లీ దాన్ని చేపట్టేందుకు నిర్ణయించి నిధులు, టెండర్ల ప్రక్రియ చేపట్టింది. దక్షిణ భాగాన్ని మాత్రం భవిష్యత్తులో చేపట్టేలా విజన్–2047 రెండో జాబితాలో చేర్చింది. అయితే ఆ భాగాన్ని తానే చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సొంతంగా అలైన్మెంటు రూపొందించటంతో పాటు డీపీఆర్ కూడా సిద్ధం చేయాలని భావించి సీఎం పలుదఫాలు సమీక్షలు నిర్వహించారు. అధికారులతో కమిటీలు కూడా ఏర్పాటు చేశారు.ఎవరి పనిలో వారు..!దక్షిణ భాగం నిర్మాణానికి దాదాపు రూ.20 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో మనసు మార్చుకుని, ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగం పనులు కూడా ప్రారంభించాలని కేంద్రాన్ని లిఖి తపూర్వకంగా కోరింది. కానీ ఆ భాగం ఎన్హెచ్ఏఐ అధీనంలోనే ఉన్నందున కేంద్రం తన పనితాను చేసుకుపోతోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ భాగం డీపీఆర్ తయారీ కసరత్తును కొనసాగిస్తోంది. వాస్తవానికి గత ప్రభుత్వం ఈ భాగానికి సంబంధించి ఓ డ్రాఫ్ట్ అలైన్మెంటును రూపొందించి ఎన్హెచ్ఏఐకి అందించింది.అయితే అది అనుకూలంగా లేదని కేంద్రం ఏర్పాటు చేసిన కన్సల్టెన్సీ సంస్థ వేరే అలైన్మెంటును తయారు చేసి ఎన్హెచ్ఏఐకి సమర్పించింది. అది ఖరారైతే ఆ కన్సల్టెన్సీ డీపీఆర్ను రూపొందిస్తుంది. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా డీపీఆర్ తయారీకి టెండర్లు కొనసాగిస్తుండటం ఇటు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని జాతీయ రహదారుల విభాగం, అటు కేంద్రం అధీనంలోని ఎన్హెచ్ఏఐ అధికారుల్లో అయోమయానికి కారణమవుతోంది.మేమే కసరత్తు చేస్తాం: ఎన్హెచ్ఏఐ‘దక్షిణ భాగం ముందునుంచీ మా అధీనంలోనే ఉంది. దా నిపై మేమే కసరత్తు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చే స్తోందో మాకు తెలియదు. తానే సొంతంగా నిర్మిస్తానంటూ మాకు అధికారిక సమాచారం ఇప్పటివరకు లేదు. ఉత్తర భాగంతోపాటు దక్షిణ భాగాన్ని కూడా పూర్తి చేయాలన్న లేఖ మాత్రం వచ్చింది. ఇలాంటప్పుడు అలైన్మెంటు, డీపీఆర్ తదితరాలు మేమే పూర్తి చేయాల్సి ఉంటుంది..’ అని ఎన్హెచ్ఏఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
‘రీజినల్’లో మెరుగైన పరిహారం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు భూనిర్వాసితులకు మెరుగైన పరిహారం అందించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు పరిహారంలో ఉదారంగా వ్యవహరించాలని... ఆర్బిట్రేటర్లుగా ఉన్న జిల్లా కలెక్టర్లు వీలైనంత మేర దాన్ని ఖరారు చేయాలని సూచించారు. సీఎం రేవంత్ శుక్రవారం రాత్రి రోడ్లు భవనాల శాఖ అధికారులతో సమీక్షించారు. రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం భూసేకరణను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణ సమయంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించాలని, తరచూ రైతులతో సమావేశమై రహదారి నిర్మాణంతో కలిగే ప్రయోజనాలను వివరించాలని సూచించారు. రీజినల్ రింగు రోడ్డు దక్షిణ భాగం నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ సూత్రప్రాయ ఆమోదం తెలిపినందున.. హెచ్ఎండీఏతో అలైన్మెంట్ చేయించాలని ఆదేశించారు. జిల్లాల నుంచి హైదరాబాద్ను కలిపే 11 రహదారులకు ఆటంకం లేకుండా రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు, రీజినల్ రింగురోడ్డు మధ్య అనుసంధానంలో ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఇతర ప్రధాన రహదారులపై ఫోకస్ మంచిర్యాల– పెద్దపల్లి– భూపాలపల్లి– వరంగల్– హన్మకొండ– మహబూబాబాద్– ఖమ్మం మీదుగా సాగే నాగ్పూర్–విజయవాడ రహదారి... ఆర్మూర్–జగిత్యాల–మంచిర్యాల రహదారి.. జగిత్యాల–కరీంనగర్ రహదారుల నిర్మాణంతోపాటు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల (ఎల్డబ్ల్యూఎఫ్) రోడ్ల నిర్మాణంపైనా సీఎం రేవంత్ సమీక్షించారు. ఈ రహదారుల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ, అటవీ అనుమతుల్లో ఆటంకాలను అధిగమించేందుకు పలు సూచనలు చేశారు. ప్రజలకు ఉపయోగపడే రహదారుల నిర్మాణంలో అటవీ శాఖ ఎందుకు కొర్రీలు పెడుతోందని ‘ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు (పీసీసీఎఫ్)’డోబ్రియల్ను ప్రశ్నించారు. పలు అంశాల్లో నిబంధనలు పాటించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని సీఎంకు పీసీసీఎఫ్ బదులిచ్చారు. దీనితో రాష్ట్రస్థాయిలో తేల్చగల సమస్యలను ఇక్కడే పరిష్కరిస్తామని.. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ వరకు వెళ్లే అంశాలపై వెంటనే నివేదిక రూపంలో సమర్పించాలని సూచించారు. ఆర్అండ్బీ, అటవీ శాఖల నుంచి ఒక్కో అధికారిని ప్రత్యేకంగా ఈ సమస్యల పరిష్కారం కోసం కేటాయించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సీఎస్ వారితో పదిరోజులకోసారి సమీక్షించి త్వరగా క్లియరెన్సులు వచ్చేలా చూడాలని... ఇక్కడ కాకపోతే సంబంధిత మంత్రులు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి, అధికారులను కలవాలని స్పష్టం చేశారు. జాతీయ రహదారుల నిర్మాణంలో అండర్ పాస్ల ఏర్పాటును విస్మరిస్తుండటంతో రైతులు ఇబ్బందిపడుతున్నారని సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గుర్తుచేశారు. దీనితో ఈ సమస్య ఎదురుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణంపై... హ్యామ్ విధానంలో ఆర్అండ్బీ పరిధిలో 12 వేల కిలోమీటర్లు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 17,700 కిలోమీటర్లు రహదారులు నిర్మించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ రహదారుల నిర్మాణానికి సంబంధించి పాత జిల్లాలను యూనిట్గా తీసుకోవాలని సూచించారు. కన్సల్టెన్సీల నియామకం, డీపీఆర్ల తయారీ, వేగంగా పనులు చేపట్టడంపై దృష్టి సారించాలని... మూడేళ్లలో నిర్మాణం పూర్తికావాలని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టాలని, కూలిన వంతెనలను వెంటనే నిర్మించాలని ఆదేశించారు. రహదారుల నిర్మాణం, మరమ్మతులకు సంబంధించి రాష్ట్ర వాటా నిధులు వెంటనే విడుదల చేసి.. కేంద్రం నుంచి రావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ను పొందాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రూ.వెయ్యి కోట్లు రాష్ట్రంలో గ్రామీణ రహదారుల నిర్మాణానికి సీఎం రూ.వెయ్యి కోట్లను కేటాయించారు. ఈ నెల నుంచే నెలకు రూ.150 కోట్ల చొప్పున ఈ నిధులను విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. గతంలో ఎడ్ల బండ్లు, సైకిళ్లు, మోటార్ సైకిళ్ల రాకపోకలకు అనుగుణంగా గ్రామ రోడ్లను నిర్వహించేవారని.. ఇప్పుడు అన్నిచోట్లా కార్లు, ట్రాక్టర్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు తిరుగుతున్నందున వాటి రాకపోకలకు వీలుగా రోడ్లను వెడల్పు చేయాలని సూచించారు. ప్రతి పంచాయతీకి బీటీ రోడ్డు ఉండాలని, గ్రామాల నుంచి మండలాలకు సింగిల్ రోడ్లు, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు కచి్చతంగా ఉండాలని పేర్కొన్నారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రహదారుల నిర్మాణ నాణ్యతలో తేడాలు చూపొద్దని స్పష్టం చేశారు. అటవీ ప్రాంతాల్లోని గ్రామాలకు సైతం రహదారులు నిర్మించాలని సూచించారు. -
రోడ్డెక్కిన ‘ఉత్తర రింగు’
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు నిర్మాణం దిశగా కీలక ముందడుగు పడింది. ఈ రోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) టెండర్లను ఆహా్వనించింది. 161.518 కిలోమీటర్ల నిడివి ఉన్న ఈ భాగాన్ని ఐదు ప్యాకేజీలుగా విభజించి విడివిడిగా టెండర్లు పిలిచింది. టెండర్ల దాఖలుకు ఫిబ్రవరి 14వ తేదీని తుది గడువుగా నిర్ధారించింది. ఆలోపు ఫైనాన్షియల్, టెక్నికల్ బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 17న టెండర్లను తెరవనుంది. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ రెండేళ్లలో రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుందని టెండర్ డాక్యుమెంట్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. నిర్మాణం పూర్తయిన తర్వాత ఐదేళ్లపాటు ఈ రహదారి నిర్వహణ బాధ్యతలను కూడా చూసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈపీసీ పద్ధతిలో నిర్మాణ పనులు.. రీజినల్ ఉత్తర భాగాన్ని ఇంజనీరింగ్, ప్రొక్యూ ర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. తొలుత బీఓటీ (బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్), హామ్ వంటి విధానాలను పరిశీలించినా.. ఈ రోడ్డుపై వాహన ట్రాఫిక్ ప్రస్తుతానికి తక్కువగా ఉంటుందన్న అంచనాతో ఈపీసీ వైపు మొగ్గు చూపింది. మిగతా రెండు పద్ధతుల్లో నిర్మాణ సంస్థ తొలుత నిర్మాణ ఖర్చు మొత్తాన్ని భరించి, టోల్ రూపంలో వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మార్గంలో ప్రస్తుతం టోల్ ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండే అవకాశం లేదని, నిర్మాణ సంస్థలు ముందుకురాకపోవచ్చని భావనకు వచ్చింది. దీంతో నిర్మాణ వ్యయాన్ని కేంద్రమే భరించేలా ఈపీసీ వైపు మొగ్గు చూపింది. నిర్మాణం పూర్తయ్యాక టోల్ను ఎన్హెచ్ఏఐ సొంతంగా వసూలు చేసుకుంటుంది. మొత్తం వ్యయం రూ.17,080 కోట్లు నెల రోజుల క్రితం కన్సల్టెన్సీ సంస్థ టెండర్ డాక్యుమెంటును సిద్ధం చేసి ఎన్హెచ్ఏఐకి సమర్పించింది. ఆ వెంటనే ఎన్హెచ్ఏఐ రీజనల్ ఉత్తర భాగం డీపీఆర్ను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖకు సమర్పించింది. రీజనల్ ఉత్తర భాగం నిర్మాణ వ్యయం రూ.17,080 కోట్లుగా (రాష్ట్ర ప్రభుత్వ వాటా సహా) ప్రతిపాదించింది. ఇందులో రోడ్డు నిర్మాణ వ్యయం రూ.8,500 కోట్లు, భూసేకరణ వ్యయంలో కేంద్రం వాటా రూ.2,580 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,580 కోట్లు, ఇతర వ్యయం రూ.3,420 కోట్లుగా పేర్కొంది. మొత్తంగా ఎనిమిది లేన్లతో ఈ రోడ్డును ప్రతిపాదించారు. అందుకు సరిపడా భూసేకరణ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం నాలుగు లేన్ల రోడ్డును నిర్మించి, భవిష్యత్తులో మిగతా నాలుగు లేన్లను నిర్మించనున్నారు. రెండింతలు అయిన వ్యయం రీజనల్ రింగురోడ్డును ప్రతిపాదించిన సమయంలో ఉత్తర భాగానికి రూ.9 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రతిపాదించిన ఏడేళ్ల తర్వాత డీపీఆర్ సిద్ధమైంది. ప్రస్తుత ధరలు, పరిస్థితుల మేరకు అంచనా వ్యయం సుమారు రెండింతలై ఏకంగా రూ.17 వేల కోట్లు దాటింది. రోడ్డు నిర్మాణం పూర్తయ్యే నాటికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తం ఐదు ప్యాకేజీలు ఇవే.. రీజనల్ రింగ్రోడ్డు ఉత్తర భాగాన్ని ఐదు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. ప్యాకేజీ–1: సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్ గ్రామం నుంచి రెడ్డిపల్లి వరకు 34.518 కిలోమీటర్లు. దీని నిర్మాణ వ్యయ అంచనా రూ.1,529.19 కోట్లు. ప్యాకేజీ–2: రెడ్డిపల్లి నుంచి ఇస్లాంపూర్ గ్రామం వరకు 26 కిలోమీటర్లు. అంచనా వ్యయం రూ.1114.80 కోట్లు. ప్యాకేజీ–3: ఇస్లాంపూర్ నుంచి రాజీవ్ రహదారి మీద ఉన్న ప్రజ్ఞాపూర్ వరకు 23 కిలోమీటర్లు. అంచనా వ్యయం రూ.1,184.81 కోట్లు. ప్యాకేజీ–4: ప్రజ్ఞాపూర్ నుంచి హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి మీద ఉన్న రాయగిరి గ్రామం వరకు 43 కిలోమీటర్లు. నిర్మాణ వ్యయం రూ.1,728.22 కోట్లు. ప్యాకేజీ–5: రాయగిరి నుంచి చౌటుప్పల్ సమీపంలోని తంగడపల్లి గ్రామం వరకు 35 కిలోమీటర్లు. వ్యయ అంచనా రూ.1,547.04 కోట్లు. 11 చోట్ల భారీ ఇంటర్చేంజ్ కూడళ్లు రీజనల్ ఉత్తర భాగంలో 11 చోట్ల భారీ ఇంటర్ చేంజ్ కూడళ్లను నిర్మించనున్నారు. జాతీయ/రాష్ట్ర రహదారులను ఈ రోడ్డు దాటే ప్రాంతాల్లో ఇవి ఉంటాయి. మొదటి కూడలి: సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్.. ఇక్కడ ఎక్సె్టండెడ్ డంబెల్ ఆకృతిలో భారీ ఇంటర్ఛేంజ్ స్ట్రక్చర్ ఉంటుంది. దీని నిడివి 3 కిలోమీటర్లు ఉంటుంది. 150 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తారు. రెండో కూడలి: సంగారెడ్డి తర్వాత వచ్చే రెండో కూడలి 161 జాతీయ రహదారిని క్రాస్ చేసే శివంపేట వద్ద నిర్మిస్తారు. ఇక్కడ డబుల్ డంబెల్ డిజైన్లో ఉంటుంది. మూడో కూడలి: నర్సాపూర్–మెదక్ రోడ్డుపై నర్సాపూర్ వద్ద నిర్మిస్తారు. అక్కడ డంబెల్ మోడల్ను ఎంపిక చేశారు. నాలుగో కూడలి: హైదరాబాద్–నాగ్పూర్ రహదారిపై తూప్రాన్ వద్ద. ఇక్కడ క్లీవర్ లీఫ్ డిజైన్ ఎంపిక చేశారు. ఐదో కూడలి: తూప్రాన్–గజ్వేల్ దారిలో మజీద్పల్లి వద్ద. ఇక్కడ రోటరీ డిజైన్ను ఖరారు చేశారు. ఆరో కూడలి: రాజీవ్ రహదారిపై ప్రజ్ఞాపూర్ సమీపంలో ఉంటుంది. ఇక్కడ పాక్షిక క్లీవర్ లీఫ్ (మూడు లూప్లు మాత్రమే) డిజైన్ ఎంపిక చేశారు. ఏడో కూడలి: జగదేవ్పూర్–తుర్కపల్లి మధ్య పీర్లపల్లి వద్ద నిర్మిస్తారు. ఇక్కడ రోటరీ డిజైన్ను ఎంపిక చేశారు. ఎనిమిదో కూడలి: తుర్కపల్లి–యాదగిరిగుట్ట రోడ్డుపై తుర్కపల్లి వద్ద ఉంటుంది. ఇక్కడ రోటరీ డిజైన్లో నిర్మిస్తారు. తొమ్మిదో కూడలి: హైదరాబాద్–వరంగల్ హైవేపై రాయగిరి వద్ద.. డబుల్ ట్రంపెట్ డిజైన్లో నిర్మించనున్నారు. పదో కూడలి: భువనగిరి–వలిగొండ రోడ్డుపై వలిగొండ వద్ద ఉంటుంది. ఇక్కడ రోటరీ డిజైన్ను ఖరారు చేశారు. 11వ కూడలి: చౌటుప్పల్ సమీపంలో నిర్మిస్తారు. ఎది ఎక్స్టెండెడ్ డంబెల్ నమూనాలో 150 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. దక్షిణ భాగం డీపీఆర్ కన్సల్టెన్సీ టెండర్లకు కానరాని స్పందన మరోవైపు రీజనల్ రింగురోడ్డు దక్షిణ భాగాన్ని కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టడంతో.. ఈ భాగాన్ని సొంతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల క్రితం నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రాథమిక అలైన్మెంట్ను రూపొందించింది. తుది అలైన్మెంట్ తయారీ కోసం అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. డీపీఆర్ తయారీ కోసం కన్సల్టెన్సీ సంస్థను ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచింది. దాన్ని రోడ్లు భవనాల శాఖ అధికారులు శనివారం తెరిచారు. అయితే ఒక్క సంస్థ కూడా బిడ్లు దాఖలు చేయలేదని తెలిసింది. మరోవైపు రోడ్డు నిర్మాణాన్ని తొలుత ప్రతిపాదించిన మేరకు ఎన్హెచ్ఏఐతోనే చేపట్టాలని కోరుతూ ఇటీవల రోడ్లు భవనాల శాఖ కేంద్రానికి లేఖ రాసింది. దీంతో ఆ రోడ్డు నిర్మాణంపై సందిగ్ధత చోటు చేసుకుంది. -
ఉత్తర ‘రింగు’ అలైన్మెంటుకు ఓకే
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు ఉత్తర భా గానికి సంబంధించిన అలైన్మెంటును కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదించింది. గతంలోనే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఆమోదించగా, ఇప్పుడు కేంద్ర మంత్రిత్వ శాఖ తుది ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన ఆదేశాలు వెలువడాల్సి ఉంది. ఇక ట్రిపుల్ ఆర్కు ఎక్స్ప్రెస్ వే నంబరు కూడా త్వరలో రానుంది. అలైన్మెంటు ఓకే అయిన నేపథ్యంలో మరో వారం పది రోజుల్లో ఉత్తర భాగానికి టెండర్లు పిలవనున్నారు. అలైన్మెంటు మార్పు వినతుల సంగతేంటి? ఉత్తర భాగం అలైన్మెంటులో కొన్ని మార్పులు చేయాలని ఇటీవల కొందరు ప్రజా ప్రతినిధులు సూచించారు. ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్గడ్కరీని కలిసి వినతులు అందించారు. సంగారెడ్డి సమీపంలో, యాదాద్రి సమీపంలోని రాయగిరి, చౌటుప్పల్ ఇంటర్ఛేంజ్ కూడలి.. ఇలా పలుచోట్ల అలైన్మెంటును కొంతమేర సవరించాలని కోరారు. ఇందులో ముగ్గురు ఎంపీలు, రాష్ట్ర మంత్రి ఒకరు ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో భూసేకరణకు సంబంధించి కొన్ని భూముల వివరాలు 3డీ గెజిట్లో నమోదు కాలేదు. ఆ గెజిట్ విడుదలైతేనే భూసేకరణ జరుగుతుంది. ఎలాగూ గెజిట్లో వివరాలు నమోదు కానందున, అలైన్మెంటు మార్పు పెద్ద కష్టం కాదనేది నేతల అభిప్రాయం. అయితే కేవలం సాంకేతిక కారణాలతోనే ఆయా భూముల వివరాలు 3డీ గెజిట్లోకి రాలేదని, అలాంటి భూములు మొత్తం భూముల్లో కేవలం 0.4 శాతం లోపేనని ఎన్హెచ్ఏఐ వారికి చెప్పినట్టు తెలిసింది. ఈ సమయంలో అలైన్మెంటులో మార్పులు చేస్తే, కొత్త ప్రాంతాల్లో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని కూడా చెప్పినట్టు సమాచారం. అయితే ఆ వినతులను పూర్తిగా కొట్టిపడేయలేదు. దీంతో అలైన్మెంటులో మార్పులు జరిగే అవకాశం ఉందన్న ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ తాజాగా కేంద్ర మంత్రిత్వ శాఖ అలైన్మెంటుకు ఆమోదముద్ర వేయటంతో మార్పుల అంశంపై ఇచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఎన్హెచ్ఏఐ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. గతంలో జాతీయ రహదారులకు సంబంధించిన అలైన్మెంట్లకు ఎన్హెచ్ఏఐ ఆమోదంతో సరిపోయేది. అయితే మూడేళ్ల క్రితం కేంద్ర మంత్రిత్వశాఖ కచ్చితంగా ఆమోదముద్ర వేయాలనే నిబంధన వచ్చింది. ఆ మేరకు మంత్రిత్వ శాఖలో కొత్తగా అలైన్మెంటు అప్రూవల్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ భేటీలోనే ఉత్తర భాగం అలైన్మెంటుకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. నంబర్ వస్తేనే పర్యావరణ అనుమతులు త్వరలో టెండర్లు పిలిచేందుకు ఎన్హెచ్ఏఐ ఏర్పా ట్లు చేస్తున్న క్రమంలో ఆ రోడ్డుకు ఎక్స్ప్రెస్ వే నంబరు కేటాయింపు కీలకంగా మారింది. ఆ నంబరు కేటాయిస్తేనే పర్యావరణ అనుమతులు లభిస్తాయి. అవి ఉంటేనే టెండర్లను తెరిచేందుకు వీలుంటుంది. ఈ నేపథ్యంలోనే ఎక్స్ప్రెస్ వే నంబరును వీలైనంత త్వరలో కేటాయించాలని నిర్ణయించారు. -
హైవేల పక్కనే ఈవీ స్టేషన్లు
జాతీయ రహదారులను ఆనుకుని ఈవీ చార్జింగ్ స్టేషన్లు నెలకొల్పే ప్రణాళికను వేగవంతం చేయాలని జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ(ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ‘ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్–2024’ కార్యక్రమం కింద వాటిని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం దేశంలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహించే దిశగా మౌలిక సదుపాయాల వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం రెండు పెట్రోలియం కంపెనీల భాగస్వామ్యంతో ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్న ప్రణాళికను ఆమోదించారు. – సాక్షి, అమరావతి దేశంలో జాతీయ రహదారులను ఆనుకుని మొత్తం 7,432 ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. ఇందుకోసం భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలతో కలసి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ పెట్రోలియం కంపెనీలకు రూ.800 కోట్లు సబ్సిడీగా ఇచ్చేందుకు ఎన్హెచ్ఏఐ ఆమోదం తెలిపింది. మొదటి దశలో 5,833 ఈవీ స్టేషన్లు ఏర్పాటుకు ఎన్హెచ్ఏఐ కార్యాచరణకు ఉపక్రమించింది. రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఎంపిక చేసిన జాతీయ రహదారులను ఆనుకుని ప్రతి 50 కి.మీ.కు ఒకటి చొప్పున ఈవీ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు.వచ్చే ఏడాది జూన్ నాటికి ఈవీ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యం.దేశంలో ఏర్పాటు చేయనున్న మొత్తం ఈవీ చార్జింగ్ స్టేషన్లు 7,432మొదటి దశలోఏర్పాటు చేయనున్న ఈవీ స్టేషన్లు 5,833 మన రాష్ట్రంలో మొదటి దశలో చెన్నై– కోల్కతా జాతీయ రహదారిలో ఏర్పాటు చేసే స్టేషన్లు 230 -
విశాఖ–ఖరగ్పూర్ మధ్య హైవే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం– ఖరగ్పూర్ (పశ్చిమ బెంగాల్) మధ్య గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించాలని కేంద్ర జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ను అనుసంధానిస్తూ ఈ గ్రీన్ఫీల్డ్ హైవేను నిర్మించనున్నారు. దీనికోసం సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) రూపొందించేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) టెండర్లు పిలిచింది. కేంద్ర ప్రభుత్వం గతి శక్తి ప్రాజెక్ట్లో భాగంగా దీనిని నిర్మించనుంది. గ్రీన్ఫీల్డ్ హైవే ప్రధాన అంశాలివీ⇒ తూర్పు, ఈశాన్య రాష్ట్రాల మధ్య సరుకు రవాణాను వేగవంతం చేయడం ద్వారా లాజిస్టిక్ రంగ అభివృద్ధి కోసం ఈ హైవేను నిర్మించనున్నారు. ⇒ విశాఖపట్నం– ఖరగ్పూర్ మధ్య 783 కి.మీ. మేర ఆరు లేన్లుగా దీనిని నిర్మిస్తారు.⇒ నిర్మాణం పూర్తయితే విశాఖపట్నం నుంచి ఖరగ్పూర్కు 8 గంటల్లోనే చేరుకునే అవకాశం.⇒ విశాఖపట్నం, భావనపాడు, గోపాల్పూర్, కేంద్ర పారా పోర్టులను ఈ హైవే అనుసంధానిస్తుంది.⇒ విశాఖపట్నం నుంచి ఖుర్దా రోడ్ ( ఒడిశా) వరకు ఒక ప్యాకేజీ, ఖుర్దా రోడ్ నుంచి ఖరగ్పూర్ వరకు మరో ప్యాకేజీ కింద ఈ ప్రాజెక్ట్ చేపడతారు.⇒ డీపీఆర్ రూపొందించేందుకు టెండర్లు పిలవగా.. 10 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. డిసెంబర్ చివరి వారానికి ఎన్హెచ్ఏఐ కన్సల్టెన్సీని ఖరారు చేయనుంది. ⇒ 2025 జూన్ నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభిస్తారు.⇒ ఏడాదిన్నరలో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తి చేయాలన్నది ఎన్హెచ్ఏఐ లక్ష్యం. -
అలైన్మెంట్లో టింక‘రింగ్’!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగు రోడ్డు దక్షిణ భాగాన్ని ఓపక్క రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా చేపట్టేందుకు సిద్ధమవుతుండగా, మరోపక్క ఉత్తర భాగం అలైన్మెంటులో మార్పులు చేయాలనే ఒత్తిడి మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో ప్రజల వ్యతిరేకతను ఆసరాగా చేసుకుని కొందరు నేతలు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రజలకు మద్దతు ముసుగులో తమకు అనుకూలమైనవారి కోసం పావులు కదుపుతున్నారు. ఢిల్లీ స్థాయిలో మంత్రాంగం నడుపుతున్నారు. ఉత్తర భాగానికి సంబంధించి అన్ని రకాల గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయి, భూ పరిహారానికి అవార్డులు పాస్ చేసే సమయంలో ఇప్పుడు ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. అలైన్మెంటు ఖరారై, టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నందున మార్పులు సాధ్యం కాదని ఎన్హెచ్ఏఐ అధికారులు చెబుతుండగా, కొందరు నేతలు ఈ విషయమై కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఒత్తిడి పెంచుతుండటం గమనార్హం. ఎక్కడెక్కడ మార్పులు – సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్ వద్ద ట్రిపుల్ ఆర్ ప్రారంభమవుతుంది. ఇక్కడ జాతీయ రహదారి మీద భారీ ఇంటర్ఛేంజ్ స్ట్రక్చర్ నిర్మించాల్సి ఉంది. అయితే ఈ ప్రాంతంలో భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు నిరాకరిస్తున్నారు. గతంలో పబ్లిక్ హియరింగ్, సర్వే జరగకుండా అడ్డుకున్నారు. ఇదే ప్రాంతంలో దక్షిణ రింగు ప్రారంభం కావాల్సి ఉంటుంది. దాన్ని ఉత్తర రింగులో భాగంగా నిర్మించే ఇంటర్ఛేంజ్ స్ట్రక్చర్తో అనుసంధానించాల్సి ఉంది. దక్షిణ రింగును మరింత దూరంగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో, కొందరు నేతలు దీన్ని ఆసరా చేసుకుని ఉత్తర రింగు కూడలిని మరోచోట నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. రైతుల వ్యతిరేకిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. తమకు అనుకూల ప్రాంతానికి చేరువగా రింగురోడ్డు ఉండాలన్న ఉద్దేశంతో కొందరు నేతలు మార్పు కోరుతుండగా, ప్రస్తుత అలైన్మెంటు తమకు చెందినవారి భూముల్లోంచి ఉండటంతో వాటిని కాపాడే ప్రయత్నంలో భాగంగా కొందరు మార్పు కోరుతున్నారు. – యాదాద్రి జిల్లాలో రింగురోడ్డు విషయంలో స్థానికుల వ్యతిరేకత ఎక్కువగా ఉంది. గతంలో జాతీయ రహదారి కోసం కొందరు, సాగునీటి ప్రాజెక్టు కాలువల కోసం కొందరు.. ఇలా పలు సందర్భాల్లో భూములు కోల్పోయారు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కోసం మరోసారి భూసేకరణ జరగటాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ కొందరు వ్యాపారుల భూములు కూడా అలైన్మెంటు పరిధిలో ఉన్నాయి. దీంతో వారు బడా నేతలను ఆశ్రయించారు. స్థానికుల అభ్యర్థనలను ఆసరాగా తీసుకుని అలైన్మెంటును మార్చాలని నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ఇంటర్ఛేంజ్ స్ట్రక్చర్ రాయగిరి హైవే వద్ద కాకుండా ఎగువన నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. – ఉత్తర రింగు చౌటుప్పల్ వద్ద ముగుస్తుంది. చౌటుప్పల్ పట్టణ శివారులోనే ఇంటర్ఛేంజ్ స్ట్రక్చర్ నిర్మించాల్సి ఉంది. ఇది పట్టణానికి మరీ చేరువగా ఉందని, దీనివల్ల విలువైన భూములును స్థానికులు కోల్పోవాల్సి వస్తుందని, పరిహారంగా వారికి న్యాయమైన మొత్తం దక్కదంటూ కొందరు నేతలు వకాల్తా పుచ్చుకుని గడ్కరీ కార్యాలయంలో ఒత్తిడి పెంచారు. పట్టణానికి దూరంగా ఉండేలా అలైన్మెంటు మార్చాలని కోరుతున్నారు. ఇతర ప్రాంతాల రైతుల్లో ఆందోళన అలైన్మెంటు మారుస్తున్నారంటూ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రచారం ప్రారంభమైంది. ఉన్నతస్థాయిలో ఒత్తిళ్ల వల్ల రింగురోడ్డును ప్రస్తుత ప్రాంతానికి దూరంగా మారుస్తున్నారంటూ స్థానికుల్లో తప్పుడు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇతర ప్రాంతాల్లోని రైతుల్లో ఆందోళ వ్యక్తమవుతోంది. తమ భూములకు ఎక్కడ ఇబ్బంది కలుతుందోనన్న భయంతో ఎన్హెచ్ఏఐ అధికారులను సంప్రదిస్తున్నారు. అయితే అలాంటిదేమీ లేదని అధికారులు చెబుతుండటంతో ..ఏది నిజమో తెలియని అయోమయంలో ఉన్నారు. చిన్న మార్పుతో భారీ తేడా! రింగురోడ్డు అలైన్మెంటులో ఓ ప్రాంతంలో చిన్న మార్పు చేస్తే దాని ప్రభావం ఇటు రెండు కిలోమీటర్లు, అటు రెండు కిలోమీటర్ల మేర ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇది ఎక్స్ప్రెస్ వే అయినందున ఉన్నఫళంగా రోడ్డును మలుపు తిప్పే వీలుండదు. రెండు కిలోమీటర్ల దూరం నుంచి మొదలుపెట్టి క్రమంగా మలుపు తిప్పాల్సి ఉంటుంది. ఇక మార్పు ఎక్కువగా ఉంటే, అలైన్మెంటులో కూడా భారీ మార్పు చోటు చేసుకుంటుంది. ప్రస్తుతం ఊరికి ఒకవైపు ఉందనుకుంటే, మార్పు వల్ల మరో వైపునకు మారే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే ప్రజల్లో తీవ్ర అలజడికి కారణమవుతుంది. కాబట్టి ఇలాంటి మార్పులకు అవకాశమే లేదని అధికారులు చెబుతున్నారు. అయితే నేతలు మాత్రం ఢిల్లీ స్థాయిలో తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు సమాచారం. -
వచ్చే నెలలో ట్రిపుల్ఆర్ టెండర్!
సాక్షి, హైదరాబాద్: ట్రిపుల్ఆర్ (రీజినల్ రింగురోడ్డు) నిర్మాణానికి కేంద్రం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. దీనికి వీలుగా ఎన్హెచ్ఐఏ ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం టెండర్ డాక్యుమెంటేషన్పై దృష్టి సారించింది. వచ్చే నెల మొదటి వారంలో టెండర్లు పిలిచే అవకాశాలున్నాయి. పర్యావరణ అనుమతులు రాకుండానే.. ట్రిపుల్ఆర్ విషయంలో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగింది. దీంతో భవిష్యత్లో మరింత ఆలస్యం జరగకుండా చూడాలని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. పర్యావరణ అనుమతులు రాకుండా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయటానికి వీలులేదు. కానీ, టెండర్లు పిలిచేందుకు అది అడ్డంకి కాదు. దీంతో పర్యావరణ అనుమతులు వచ్చేలోగా టెండర్లు పిలిచి, పర్యావరణ అనుమతులు వచి్చన తర్వాత టెండర్లు ఖరారు చేయాలని అధికారులు భావిస్తున్నారు. టెండర్లు తెరిచే నాటికి అనుమతులు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్స్ప్రెస్వేగా కొత్త నంబర్ జాతీయ రహదారి హోదాలో కేంద్రం ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు చేపడుతోంది. ఉత్తర భాగం విషయంలో ఆ స్పష్టత ఉంది. దక్షిణభాగాన్ని కేంద్రం కాకుండా సొంతంగానే చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉత్తర భాగాన్ని సొంత నిధులతో కేంద్రమే నిర్మిస్తోంది. గతంలో కేవలం జాతీయ రహదారిగా మాత్రమే దాన్ని పరిగణించింది. కానీ, ఇటీవల దాన్ని ఎక్స్ప్రెస్వే జాబితాలో చేర్చింది. అప్పటి వరకు తాత్కాలికంగా దానికి 161ఏ నంబర్ను పరిగణనలోకి తీసుకున్నారు. ఇప్పుడు అది కాకుండా ఎక్స్ప్రెస్వేగా కొత్త నంబర్ కేటాయించనున్నారు. ఈ నంబర్ అలాట్ అయిన తర్వాతే ఫారెస్టు క్లియరెన్సు వస్తుంది. ఇప్పటికే ఈ రోడ్డుకు సంబంధించి పబ్లిక్ హియరింగ్స్ ప్రక్రియ పూర్తి చేశారు. పర్యావరణ అనుమతులకు అది కీలకం.రోడ్డు నంబర్ అలాట్ అయిన తర్వాతనే పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. త్వరలో ఆ రోడ్డు నంబర్ కేటాయించే అవకాశముంది. పర్యావరణ అనుమతులు వచ్చిన తర్వాతే టెండర్లు తెరవాల్సి ఉంటుంది. ఈ తతంగం పూర్తయ్యే వరకు టెండర్ల కోసం ఎదురు చూడకుండా, ముందు నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు భూపరిహారం పంపిణీకి వీలుగా గ్రామాల వారీ అవార్డులు పాస్ చేసే ప్రక్రియ కూడా నిర్వహించాల్సి ఉంది.ఇది జరగాలంటే పరిహారం నిధులు ఎన్హెచ్ఏఐకి కేటాయించాలి. ఉత్తర భాగం భూసేకరణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం సగం మొత్తాన్ని భరించాల్సి ఉన్నందున, ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేయాలి. ఈ ప్రక్రియ కూడా వేగంగా పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. సమాంతరంగా ఈ ఏర్పాట్లు చేస్తూనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించబోతున్నారు. వచ్చేనెల మొదటి వారంలో టెండర్లు పిలిచి నిర్ధారిత గడువులోపు నిర్మాణ సంస్థను ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత వీలైనంత తొందరలో పనులు ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. -
సొంతంగానే దక్షిణ రింగు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగాన్ని సొంతంగానే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఒక నిర్ణయానికి వచి్చంది. గతంలో ఎన్హెచ్ఏఐ(నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ రూపొందించిన అలైన్మెంట్ను పక్కన పెట్టనుంది. కొత్త అలైన్మెంట్ రూపొందించడానికి 12 మందితో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ట్రిపుల్ ఆర్ను జాతీయ రహదారిగా నిర్ధారించి కేంద్రమే చేపట్టేందుకు గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో ఉత్తరభాగానికి భూసేకరణ ప్రక్రియ నిర్వహిస్తున్న సంగతి విదితమే.అదేక్రమంలో దక్షిణభాగాన్ని కూడా కేంద్రమే చేపట్టాల్సి ఉంది. ఉత్తర–దక్షిణ భాగాల నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరించాల్సి ఉంది. భూసేకరణలో సగం వ్యయాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. రోడ్డు నిర్మాణ వ్యయాన్ని కేంద్రం భరించాలంటే, అలైన్మెంట్ ప్రక్రియను కూడా కేంద్రమే నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు మాత్రమే తీసుకుంటుంది. ఇప్పుడు అలా కాదని, రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా అలైన్మెంట్ రూపొందించనున్నందున.. రోడ్డు నిర్మాణ బాధ్యతను ఇక కేంద్రం తీసుకోదని దాదాపు తేలిపోయింది.అంటే రోడ్డు నిర్మాణ వ్యయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. దక్షిణ భాగానికి దాదాపు రూ.18 వేల కోట్లకు పైగా ఖర్చు కానుంది. ఇంత భారీ మొత్తాన్ని కేంద్రం భరించాల్సిన అవసరం లేకుండా, తానే భరిస్తానని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేంద్రంతో సంబంధం లేకుండా, తనకు నచ్చిన ప్రాంతాల మీదుగా, నచి్చనట్టుగా రోడ్డు నిర్మాణానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేసుకునే అలైన్మెంట్ ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆ అలైన్మెంట్ ఖరారుకే ఏడాది సమయం ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్మెంట్ను రూపొందించేందుకు దాదాపు ఏడాది సమయం పట్టింది. ఆ సంస్థ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ..వాగులు, వంకలు, గుట్టలుమిట్టలను పరిగణనలోకి తీసుకుని అలైన్మెంట్ను రూపొందించారు. జల వనరులు, భవిష్యత్లో నిర్మించే ప్రాజెక్టులను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా అలైన్మెంట్ రూపొందించారు. మూడు అలైన్మెంట్లు సిద్ధం చేయగా, వాటిల్లో 189,25 కి.మీ. నిడివి గల అలైన్మెంట్ను ఎంపిక చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో పలు దఫాలుగా అధికారులు సమావేశమై ఈ దక్షిణ భాగం అలైన్మెంట్పై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రూపొందిన అలైన్మెంట్...తాము ప్రతిపాదిస్తున్న ఫోర్త్ సిటీకి అనుకూలంగా లేదని, అందులో చాలా మార్పులు చేయాల్సి ఉందని తేల్చారు.దానిని అలాగే వదిలేసి పూర్తి కొత్త అలైన్మెంట్ ను రూపొందించటమే మేలని సూత్రప్రాయంగా తేల్చారు. ఈ మేరకు గూగుల్ మ్యాపు సహాయంతో ఓ తాత్కాలిక అలైన్మెంట్ను అధికారులు తయారుచేసి ప్రభుత్వానికి సమరి్పంచారు. దాదాపు 194 కి.మీ. నిడివితో దీనిని రూపొందించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి తుది అలైన్మెంట్గా మార్చేందుకు 12 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి కనీ్వనర్గా ఉండే ఆ కమిటీలో పురపాలక, రెవెన్యూ శాఖల కార్యదర్శులు, రోడ్లు భవనాల శాఖ, ఎన్హెచ్ఏఐ అధికారులు, సంబంధిత జిల్లాల కలెక్టర్లు ఇందులో సభ్యులుగా ఉంటారు. త్వరలో ఈ కమిటీ ఆధ్వర్యంలో అలైన్మెంట్ ఖరారు ప్రక్రియ ప్రారంభం కానుంది. -
ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం194 కి.మీ!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రగతిపై ఎంతో ప్రభావం చూపించే రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మారుతోంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రణాళిక ప్రకారం దక్షిణ భాగం రింగ్రోడ్డు విస్తీర్ణం 189.25 కిలోమీటర్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రాథమికంగా రూపొందించిన ప్రతిపాదన ప్రకారం దాని విస్తీర్ణం 194 కిలోమీటర్లకు పెరిగింది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం (సంగారెడ్డి–తూప్రాన్–చౌటుప్పల్) 158 కిలోమీటర్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం 194 కిలోమీటర్ల వరకు పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లాను కూడా కలుపుతూ దక్షిణ భాగం అలైన్మెంట్ రూపొందించినట్లు స్పష్టమవుతోంది. కొత్తగా కొన్ని గ్రామాలను కలపడం వల్ల విస్తీర్ణం పెరిగినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఉత్తర భాగానికి సంబంధించిన భూ సేకరణ కార్యక్రమం కూడా దాదాపు పూర్తయింది. త్వరలోనే టెండర్లు పిలిచే అవకాశం ఉంది. కాగా దక్షిణ భాగం వైపు ఎన్హెచ్ఏఐ క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి 189.25 కిలోమీటర్ల విస్తీర్ణంలో రహదారికి సంబంధించిన మ్యాప్లను సిద్ధం చేసింది. వాటిని ప్రభుత్వ ఆమోదానికి పంపించాల్సిన సమయంలోనే లోక్సభ ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ భాగం ఆర్ఆర్ఆర్ను తామే నిర్మించుకుంటామంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. అంతేకాక దక్షిణ భాగం ఆర్ఆర్ఆర్ నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ పేరిట ఉన్నతాధికారులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. ఎన్హెచ్ఏఐ రూపొందించిన అలైన్మెంట్లో పేర్కొన్న పలు గ్రామాలు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మ్యాప్ ప్రకారం రహదారి బయటకు వెళ్లగా, కొన్ని గ్రామాలు లోపలికి వచ్చాయి. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తే ఇందులో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
టోల్ ఫీజు మినహాయింపు ఇక లేదు..
టోల్ ఫీజు మినహాయింపునకు సంబంధించిన మూడేళ్ల నాటి పాత నిబంధనలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఉపసంహరించుకుంది. టోల్ బూత్ల వద్ద ఫీజు వసూలు ఎక్కువ సమయం పట్టి వాహనాలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటే వాటిని టోల్ ట్యాక్స్ లేకుండానే అనుమతించాలని నిబంధన ఉండేది. దాన్ని ఎన్హెచ్ఏఐ తాజాగా తొలగించింది.ఎన్హెచ్ఏఐ 2021 మేలో జారీ చేసిన నిబంధన ప్రకారం ప్రతి టోల్ బూత్ వద్ద ఒక్కో వాహనం ముందుకు కదిలే సమయం 10 సెకన్ల కంటే తక్కువగా ఉండాలి. ఏ లేన్లోనైనా వాహనాల వరుస టోల్ బూత్ నుండి 100 మీటర్లకు మించకూడదు. టోల్ బూత్ నుండి 100 మీటర్ల దూరం దాటి వాహనాలు క్యూ పెరిగితే టోల్ వసూలు చేయకుండా వాటిని అనుమతించాలి. ప్రాజెక్ట్ పనులు జరుగుతున్న టోల్ బూత్లు, భూసేకరణ పూర్తికాని టోల్ ప్లాజాల కోసం ఎన్హెచ్ఏఐ ఈ నిబంధనను రూపొందించింది.అయితే, ఇప్పుడు మూడేళ్ల తర్వాత, ఎన్హెచ్ఏఐ 2021 నాటి ఆ విధానాన్ని ఉపసంహరించుకుంది. ఈ నియమాన్ని అమలు చేయడంలో ఇబ్బందులు, ప్రజల నుండి వచ్చిన విమర్శల తర్వాత ఈ నిబంధనను తొలగించినట్లు నివేదిక పేర్కొంది. ఎన్హెచ్ఏఐ ఇప్పుడు లాంగ్ లైన్లను నిర్వహించడానికి లైవ్ ఫీడ్ సిస్టమ్ను అమలు చేస్తోంది. టోల్ ప్లాజాల నిర్వహణకు సంబంధించి ఎన్హెచ్ఏఐ ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయానికి వర్తించే నిబంధనలు తక్షణమే రద్దవుతాయి. ఎందుకంటే ఎన్హెచ్ ఫీజు రూల్స్ 2008లో అటువంటి మినహాయింపు ప్రస్తావన లేదు. -
సీఎం భగవంత్ మాన్ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరిక
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరించారు. రాష్ట్రంలోని జలంధర్, లూథియానాలో జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు, కాంట్రాక్టర్లపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. జలంధర్లో ‘ఢిల్లీ- అమృత్ సర్–కత్రా ఎక్స్ప్రెస్వే ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతుండగా, ఇంజినీర్లు, సిబ్బందిపై దాడులు, ప్రాజెక్టు క్యాంప్ ఆఫీసు పైనా, లుధియానాలోని స్టాఫ్ మీద దాడులు సంఘటనలపై భగవంత్ మాన్కు గడ్కరీ లేఖ రాశారు.ఒకవేళ పంజాబ్లో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడకపోతే రాష్ట్రానికి కేటాయించిన మొత్తం 293 కిలోమీటర్ల పొడవుతో రూ. 14,288 కోట్లతో నిర్మించనున్న ఎనిమిది ప్రధాన జాతీయ రహదారుల ప్రాజెక్టులను భారతీయ జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) రద్దు చేయడం గానీ, పూర్తిగా తొలగించడం గానీ చేస్తుందని తన లేఖలో హెచ్చరించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా, సీఎం మన్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం తక్షణం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిందితులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.గత నెల 15న జరిగిన సమీక్షా సమావేశంలోనూ భూ సేకరణతోపాటు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటామని తమకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హామీ ఇచ్చారని నితిన్ గడ్కరీ గుర్తు చేశారు. కానీ, అందులో చెప్పుకోదగ్గ ప్రగతి కాన రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పంజాబ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందన్నారు. -
‘సర్వీసు’ లేకుండానే ఆర్ఆర్ఆర్!
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్)ను సర్వీసు రోడ్లు లేకుండా నిర్మించబోతున్నారు. తద్వారా పూర్తిగా యాక్సెస్ కంట్రోల్డ్ పద్ధతిలో.. పక్కల నుంచి ఇతర వాహనాలు ఈ ఎక్స్ప్రెస్ వేపైకి రాకుండా నిరోధించనున్నారు. దీంతో ఉత్తర, దక్షిణ భాగాలు కలిపి దాదాపు 352 కి.మీ. నిడివితో రూపుదిద్దుకోనున్న ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనాలు ఎలాంటి ఆటంకం లేకుండా దూసుకుపోయేందుకు అవకాశం ఉంటుంది. జాతీయ, రాష్ట్ర రహదారులను క్రాస్ చేసే చోట నిర్మించే ఇంటర్చేంజ్ కూడళ్లలోని స్లిప్ రోడ్ల మీదుగా మాత్రమే ఇతర వాహనాలు ట్రిపుల్ ఆర్ మీదకు చేరుకోవాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనాలు, ఆటో రిక్షాలు, నెమ్మదిగా కదిలే భారీ వాహనాలకు దీని మీదకు అనుమతి ఉండదు. సర్వీసు రోడ్ల ప్రతిపాదనకు తిరస్కారం హైదరాబాద్ నగరానికి మణిహారంగా మారిన నెహ్రూ ఔటర్ రింగురోడ్డు తరహాలో ట్రిపుల్ ఆర్కు కూడా తొలుత సర్వీసు రోడ్లను ప్రతిపాదించారు. ఆ మేరకు ఎన్హెచ్ఏఐ ప్రధాన కార్యాలయానికి డిజైన్లు పంపారు. అయితే ఎన్హెచ్ఏఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. జాతీయ రహదారులకు స్థానిక పరిస్థితుల ఆధారంగా సర్వీసు రోడ్లను నిర్మిస్తున్నారు. కొన్నిచోట్ల సర్వీసు రోడ్లను నిర్మించకుంటే స్థానికులు ఆందోళనలకు దిగుతున్న సంగతి తెలిసిందే. అయితే కొంతకాలంగా ఎక్స్ప్రెస్వేల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో ఎక్స్ప్రెస్ వేలకు ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ) ప్రత్యేక నియమావళిని రూపొందించింది. ఇందులో సర్వీసు రోడ్డు ప్రతిపాదనే లేదు. ట్రిపుల్ ఆర్ను కూడా ఎక్స్ప్రెస్వేగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నియమావళికి విరుద్ధమంటూ సర్వీస్ రోడ్ల ప్రతిపాదనకు కమిటీ తిరస్కరించింది. సర్వీసు రోడ్లుంటే ఇబ్బందేంటి? సాధారణ జాతీయ రహదారులతో పోలిస్తే ఎక్స్ప్రెస్ వేలపై వేగ పరిమితి చాలా ఎక్కువ. వాహనాలు భారీ వేగంతో దూసుకుపోతున్న సమయంలో, సర్వీసు రోడ్ల నుంచి అకస్మాత్తుగా వాహనాలు ప్రధాన క్యారేజ్ వే మీదకు వచి్చనప్పుడు ప్రమాదాలు చోటు చేసుకునే వీలుంటుంది. ⇒ ఎక్స్ప్రెస్ వేపై సర్వీసు రోడ్డుతో అనుసంధానమైన ప్రతిచోటా టోల్ బూత్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఇది వాహనాలు ఎక్స్ప్రెస్వే స్థాయి వేగంలో ప్రయాణించే వెసులుబాటును అడ్డుకుంటుంది. ⇒ పూర్తి యాక్సెస్ కంట్రోల్డ్ పద్ధతిలో నిర్మిస్తున్నందున అది దాదాపు 25 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఇరువైపులా బారికేడింగ్ ఉంటుంది. దీంతో పశువులు కానీ, జంతువులు కానీ దాని మీదకు రాలేవు. సర్వీసు రోడ్లు ఉంటే వాటి మీదుగా అవి ఎక్స్ప్రెస్ వే పైకి వచ్చి ప్రమాదాలకు కారణమయ్యే పరిస్థితి ఉంటుంది. ⇒ ఎక్స్ప్రెస్ వేల మీద సాధారణ ప్రయాణ వాహనాల కంటే అంతర్రాష్ట్ర సరుకు రవాణా వాహనాలు ఎక్కువగా దూసుకుపోతాయి. వాటికి అడ్డంకులు ఉండకూడదు. గతంలో గుజరాత్లో స్థానికులు సర్వీసు రోడ్ల మీదుగా ఎక్స్ప్రెస్ వే మీదకు పెద్ద సంఖ్యలో చేరుకుని వారి డిమాండ్ల సాధన కోసం రోజుల తరబడి నిరసనలు నిర్వహించారు. దీంతో అంతర్రాష్ట్ర సరుకు రవాణా వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా ఎక్స్ప్రెస్ వేలకు సర్వీసు రోడ్డు ఆప్షన్ తొలగించారు. గ్రీన్ఫీల్డ్ రహదారి అయినందున.. ఊళ్లకు దగ్గరగా ఉండే జాతీయ రహదారుల మీదకు స్థానిక వాహనాలు చేరుకునేందుకు వీలుగా సర్వీసు రోడ్లు నిర్మిస్తారు. కానీ ట్రిపుల్ ఆర్ పూర్తి గ్రీన్ఫీల్డ్ (పూర్తిగా కొత్త) రహదారి అయినందున దీన్ని ఊళ్లకు దూరంగా నిర్మిస్తున్నారు. కాబట్టి సర్వీసు రోడ్ల అవసరం ఉండదని ఎన్హెచ్ఏఐ చెబుతోంది. నెహ్రూ ఔటర్ రింగురోడ్డు కూడా ఎక్స్ప్రెస్ వే నే అయినా.. అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టు. కాబట్టి దీనికి జాతీయ ఎక్స్ప్రెస్ వేల నియమావళి వర్తించదు. ఖమ్మం–దేవరపల్లి మధ్య నిర్మిస్తున్న కొత్త హైవేకి అనుసంధానంగా సర్వీసు రోడ్లు నిర్మించాలని కొన్ని ప్రాంతాల్లో స్థానికులు ఆందోళన చేస్తూ పనులను ముందుకు సాగనీయటం లేదు. అది కూడా జాతీయ ఎక్స్ప్రెస్ వేలో భాగంగా నిర్మిస్తున్నందున, సర్వీసు రోడ్డు ఆప్షన్ ఏర్పాటు చేయలేదు. దీంతో పనులు కొనసాగాలంటే పోలీసు భద్రత కలి్పంచాలని ఇటీవల ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులు.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కోరటం విశేషం. -
ఇక రోడ్డు పక్కనే రెస్ట్ హౌస్
జాతీయ రహదారులపై ప్రయాణించేవారు బడలిక తీర్చుకునేందుకు కాసేపు సేదదీరాల్సి వస్తుంది. భోజనం, టిఫిన్లు చేసేందుకు రెస్టారెంట్స్ వద్ద ఆగాల్సి వస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రయాణించేవారు చార్జింగ్ చేసుకునేందుకు వేచి ఉండక తప్పదు. రాత్రివేళ డ్రైవర్లకు నిద్ర ఆవహిస్తుంటే ఓ కునుకు తీసేందుకు సురక్షితమైన ప్రదేశం ఏదన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ అవసరాలు తీర్చే ప్రదేశాలు వేర్వేరు ప్రదేశాల్లో కాకుండా ఒకేచోట అందుబాటులో ఉంటే ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా.. సురక్షితంగా ఉంటుంది. అందుకోసమే ‘వే సైడ్ ఎమినిటీస్’ (డబ్ల్యూఎస్ఏ)లు నిర్మించాలని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. దేశంలో తొలిసారిగా ‘వే సైడ్ ఎమినిటీస్’ను నిర్మించే ప్రణాళికకు ఎన్హెచ్ఏఐ ఆమోదించింది. – సాక్షి, అమరావతిఅన్ని వసతులూ ఒకేచోట..దేశంలో హైవేల వెంబడి రెస్ట్హౌస్ల తరహాలో నిర్మించే ‘వే సైడ్ ఎమినిటీస్’లలో ప్రయాణికులు సేదతీరేందుకు అన్ని వసతులు ఒకేచోట ఉండేలా చూస్తారు. ఇప్పటివరకు హైవేల నిర్మాణంతోపాటే ఎంపిక చేసిన ప్రదేశాల్లో వాహనాలు నిలిపేందుకు ప్రత్యేకంగా ‘పార్కింగ్ బే’లను నిర్మిస్తున్నారు. ఆ ప్రదేశంలో లారీలు, ఇతర వాహనాలను నిలిపేందుకు మాత్రమే అవకాశం ఉంది. కానీ.. డ్రైవర్లు, ప్రయాణికులకు విశ్రాంతి, భోజనం, ఆహ్లాదం, నిద్రించేందుకు ఎటువంటి వసతులు ఉండటం లేదు. భోజనం, టిఫిన్లు చేసేందుకు ఎక్కువగా ప్రైవేటు దాబాల వద్ద వాహనాలను నిలుపుతున్నారు. కానీ.. విశ్రాంతి తీసుకునేందుకు సరైన సౌకర్యాలు లేవు. ప్రధానంగా రాత్రి వేళల్లో ప్రయాణికుల భద్రతపై భరోసా ఉండటం లేదు. దాంతో అప్పటికే అలసిపోయినప్పటికీ, అర్ధరాత్రి అయినప్పటికీ వాహన ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. ఈ అనివార్య పరిస్థితి రోడ్డు ప్రమాదాలకు దారి తీస్తోంది. దీనికి పరిష్కారంగానే ప్రయాణికులకు అన్ని వసతులతో కూడిన ‘వే సైడ్ ఎమినిటీస్’ నిర్మించాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. వాటిలో రెస్టారెంట్లు, డార్మెటరీలు, పిల్లల ఆట స్థలాలు, పెట్రోల్ బంక్లు, ఈవీ చార్జింగ్ స్టేషన్లు, ఏటీఎంలు వంటి అన్ని వసతులు అందుబాటులోకి తీసుకొస్తారు.రాష్ట్రంలో తొలి దశలో 75 నిర్మాణందేశవ్యాప్తంగా హైవేలపై ప్రతి 50 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ‘వే సైడ్ ఎమినిటీ’ నిర్మించాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. తొలి దశలో దేశంలో 1,000 చోట్ల వీటి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. హైవే నిర్మాణ కాంట్రాక్టులో భాగంగా కాకుండా ప్రత్యేకంగా వే సైడ్ ఎమినిటీస్ నిర్మిస్తారు. అందుకోసం ప్రత్యేకంగా ఎన్హెచ్ఏఐ టెండర్ల ప్రక్రియ చేపట్టనుంది. ఒక్కొక్కటి సగటున రూ.10 కోట్ల చొప్పున మొత్తం మీద రూ.10 వేల కోట్లతో నిర్మించాలన్నది ప్రణాళిక. పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్(పీపీపీ) విధానంలో వాటిని నిర్మిస్తారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 8,683 కిలోమీటర్ల మేర హైవేలు ఉన్నాయి. ఏపీలో 75 ‘వే సైడ్ ఎమినిటీస్’ నిర్మించనున్నారు. కాగా.. వాటిలో అత్యంత ప్రధానమైనది కోల్కతా–చెన్నై హైవే రాష్ట్రంలో 1,025 కి.మీ. పొడవున ఉంది. మొదటి దశలో కోల్కతా–చెన్నై హైవే వెంబడి 25 నిర్మించాలని నిర్ణయించారు. అందుకోసం ఎన్హెచ్ఏఐ త్వరలోనే నిర్ణీత ప్రదేశాలను ఎంపిక చేయడంతోపాటు టెండర్ల ప్రక్రియను చేపట్టనుంది. రానున్న మూడేళ్లలో వాటిని నిర్మించాలన్నది ఎన్హెచ్ఏఐ లక్ష్యంగా నిర్ణయించింది.దేశంలో వే సైడ్ ఎమినిటీలు ఇలా..ఎక్కడ: ప్రతి 50 కి.మీ.కు 1ఎన్ని చోట్ల: 1,000ఒక్కోదానికి అయ్యే వ్యయం: రూ.10 కోట్లుమొత్తం వ్యయం: రూ.10,000 కోట్లుఆంధ్రప్రదేశ్లో మొత్తం హైవేలు: 8,683 కి.మీ ఏపీలో నిర్మించనున్న వే సైడ్ ఎమినిటీలు: 75మొదటి దశలో నిర్మించేవి: 25ఎన్నేళ్లల్లో నిర్మిస్తారు: 3 -
పోలీస్ పహారా కాస్తేనే.. ఎక్స్ప్రెస్వే పనులు
అదో ఎక్స్ప్రెస్ వే.. పూర్తి గ్రీన్ ఫీల్డ్ హైవే.. మరో ఆరేడునెలల్లో నాలుగు వరసల ఆ రోడ్డు అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ, రెండు కీలక ప్రాంతాల్లో పని మొదలు కాలేదు, ఏడాదిన్నరగా అలాగే ఉండిపోయింది.. ఇప్పుడు ఆ రోడ్డు పనులు పూర్తి కావాలంటే పోలీసు పహారా అవసరం ఏర్పడింది. స్వయంగా ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులు ఢిల్లీ నుంచి వచ్చి మరీ ముఖ్యమంత్రిని భద్రత కోరాల్సి వచ్చింది. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు 4 గంటల మేర తగ్గించే కీలక రోడ్డుకు ఇప్పుడు పోలీసు భద్రత అవసరం పడింది. మిగతాచోట్ల పనులు దాదాపు పూర్తి కాగా, రెండు కీలక ప్రాంతాల్లో స్థానికులతో పేచీ ఏర్పడింది. ఒకచోట అయితే, పలుకుబడి కలిగిన ఓ వ్యక్తే పనిని అడ్డుకున్నాడు. ఏడాదిన్నరగా ఇదే సమస్య. దీంతో ఈ పనిని ముందుకు తీసుకెళ్లాలంటే రాష్ట్ర ప్రభుత్వమే జోక్యం చేసుకోవాలంటూ ఢిల్లీ ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులు కోరాల్సి వచ్చింది. పోలీసు భద్రత కల్పిస్తే పనులు చేస్తామని లిఖితపూర్వకంగా రాష్ట్రప్రభుత్వానికి విన్నవించారు. ∙హైదరాబాద్–విశాఖపట్నం జాతీయ రహదారి లో ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు మూ డేళ్ల క్రితం ఎన్హెచ్ఏఐ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. ఖమ్మం పట్టణం నుంచి ఆంధ్రప్రదేశ్లోని దేవరపల్లి వరకు కొత్త యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్వేను ప్రతిపాదించింది. 162. 12 కి.మీ. నిడివి ఉండే ఈ నాలుగు వరసల రోడ్డు నిర్మాణాన్ని రూ.5 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. రోడ్డు పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. వచ్చే మార్చి నాటికి ఇది అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ, ఖమ్మం పట్టణం శివారులోని ధ్వంసలాపురం, చింతకాని మండలంలోని కొదుమూరు వద్ద అసలు పనులే ప్రారంభం కాలేదు. సమస్య ఏమిటంటే.. ఖమ్మం శివారులోని ధ్వంసలాపురం వద్ద ఈ రోడ్డుకు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఖమ్మం–బోనకల్ రోడ్డు, ౖరైల్వే లైన్, మున్నేరు సమాంతరంగా ఉన్నాయి. ఇక్కడ ఓవైపు మున్నేరు మీద 100 మీట ర్ల నిడివి వంతెన, మరోవైపు 150 మీటర్ల పొడవైన రైల్ ఓవర్బ్రిడ్డి నిర్మించాల్సి ఉంది. ఈ 2 వంతెనల నిర్మాణం నేపథ్యంలో, ధ్వంసలాపురం వద్ద ప్రతిపాదిత ఎక్స్ప్రెస్వే ఎత్తు ఏకంగా 14 మీటర్లుగా ఉంటుంది. అక్కడ పట్టణంలోకి వెళ్లేందుకు, పట్ట ణంలోని వాహనాలు ఈ రోడ్డు మీదకు వచ్చేందు కు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కానీ, అంత ఎత్తుండే రోడ్డు నుంచి ఈ అనుసంధానం కావాలంటే కిలోమీటరున్నర స్థలం అవసరం. కానీ అక్కడ కేవలం 350 మీటర్ల నిడివి మాత్రమే ఉ న్నందున అది సాధ్యం కాదని ఎన్హెచ్ఐఏ తేల్చే సింది. దీంతో స్థానికులు ఆ రెండు వంతెనల నిర్మా ణాన్ని ప్రారంభం కాకుండా అడ్డుకుంటూ వస్తున్నా రు. ఇక.. చింతకాని మండలం కొదుమూరు వద్ద సర్వీసు రోడ్డు నిర్మించాలని కొందరు అడ్డుకుంటున్నారు. యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్వేకు సర్వీసు రోడ్డు నిర్మించరు.అండర్పాస్లు మాత్రమే ఉంటాయి. కానీ, సర్వీసు రోడ్డు నిర్మిస్తే తమ భూము ల ధరలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఒకరిద్దరు స్థానికులను రెచ్చగొడుతున్నారు. సర్వీసు రోడ్డు నిర్మిస్తే దాని వెంబడి నిర్మాణాలు, వాణిజ్య కట్టడాలు వెలిసి ఎక్స్ప్రెస్వే ప్రయోజనం నెరవేరద న్నది అధికారుల మాట. ఇలా ఏడాదిన్నరగా ఈ రెండు ప్రాంతల్లో అసలు పనులే మొదలు కాలేదు. ఏం చేయాలనే దానిపై ప్రభుత్వ పరిశీలన పోలీసు బలగాలను కేటాయిస్తే ఆ రెండు చోట్ల పనులు నిర్వహిస్తామని ఎన్హెచ్ఏఐ పేర్కొంటోంది. ఈ రెండు అడ్డంకుల వల్ల హైదరాబాద్– విశాఖపట్నం మధ్య ప్రయా ణ సమయాన్ని తగ్గించాలన్న ప్రయత్నానికే విఘాతం కలిగిందని తాజాగా ఎన్హెచ్ఏఐ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసిన ఎన్హెచ్ఐఏ ఢిల్లీ అధికారులు ఈ మేరకు సహకరించాలని కోరారు. ఈ రోడ్డు పనులకు పోలీసు భద్రత క ల్పించటమా, స్థానికుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని మధ్యే మార్గంగా మార్పులు చేయటమా అన్న విషయాన్ని ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం పరిశీలిస్తోంది.. -
పెరిగిన టోల్ చార్జీలు.. ఈ రోజు నుంచే షురూ
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సోమవారం నుంచి 5 శాతం టోల్ పెంపును ప్రకటించింది. 2024 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రావాల్సిన కొత్త టోల్ చార్జీలు సార్వత్రిక ఎన్నికల కారణంగా వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో కొత్త రేట్లు అమలులోకి వస్తాయి.కొత్త టోల్ చార్జీలు ఈ రోజు నుంచే (జూన్ 3) అమల్లోకి వచ్చినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సీనియర్ అధికారులు పేర్కొన్నారు. కొత్త ధరలకు సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.భారతదేశంలో మొత్తం సుమారు 855 టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 675 పబ్లిక్ ఫండెడ్ కాగా, మిగిలిన 180 రాయితీదారుల నిర్వహిస్తున్నారు. నేషనల్ హైవే పే రూల్ 2008 ప్రకారం.. టోల్ ఫీజుల పెంపు జరిగిందని సంబంధింత అధికారులు చెబుతున్నారు.NHAI డేటా ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో టోల్ వసూలు రూ. 50,000 కోట్లను దాటింది (నవంబర్ 2023 వరకు). టోల్ గేట్లు పెరగటం, ఫాస్ట్ట్యాగ్ వినియోగదారుల సంఖ్య ఎక్కువ కావడంతో భారీ టోల్ వసూలు జరిగింది. ఇప్పుడు టోల్ చార్జీలు 5 శాతం పెరగడంతో టోల్ వసూలు మరింత పెరుగుతుందని స్పష్టంగా తెలుస్తోంది. -
వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. నేటి అర్ధరాత్రి ‘టోల్’ బాదుడు
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ ఛార్జీలు నేటి అర్ధరాత్రి(జూన్ 3) నుంచి 2025 మార్చి 31వ తేదీ వరకు అమలులో ఉంటాయని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్హెచ్ఐఏ) వెల్లడించింది. టోల్ చార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు పెరగనున్నాయి.టోల్ ఛార్జీలను సగటున 5 శాతం పెంచుతున్నట్లు ఎన్హెచ్ఐఏ తెలిపింది. ఛార్జీల పెంపు నిర్ణయం కొద్ది రోజుల క్రితమే తీసుకున్నప్పటికీ ఎన్నికల కారణంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి టోల్ ఛార్జీల పెంపును అమలు చేయనున్నట్లు పేర్కొంది.ఏప్రిల్ 1 నుంచే టోల్ ఛార్జీలు పెంచాలని ఎన్ హెచ్ఐఏ నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయాన్ని కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. ఎన్నికల నేపథ్యంలో ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయాలంటూ ఎన్ హెచ్ఐఏను ఎన్నికల సంఘం ఆదేశించింది. -
‘రింగు’ పరిహారానికి రుణం
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగురోడ్డు ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణలో సగం వాటా భరించడం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద భారంగా మారింది. ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరించనుంది. భూసేకరణలో సగం ఖర్చు కూడా కేంద్రమే భరిస్తుంది. మిగతా సగం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. అయితే ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేని ప్రస్తుత తరుణంలో భూసేకరణ వ్యయంలో సగం భరించడం కూడా ప్రభుత్వానికి కష్టంగా మారింది. సొంత ఆదాయవనరుల నుంచి నిధులు కేటాయించే పరిస్థితి లేకపోవడంతో రుణం తీసుకోవాలని నిర్ణయించింది. వాస్తవానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రుణం వైపే మొగ్గుచూపింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పంథాలో వెళ్తోంది. హడ్కో వైపు చూపు: భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను ఒకేసారి చెల్లించాలంటూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) గతంలో ఒత్తిడి చేసింది. దీన్ని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ఏర్పడింది. ఆ డబ్బు చెల్లించకుంటే ప్రాజెక్టే నిలిచిపోయే ప్రమాదం ఉందంటూ ఎన్హెచ్ఏఐ నుంచి పరోక్ష హెచ్చరికలూ వెలువడ్డాయి. చివరకు విడతలవారీగా చెల్లించేందుకు అంగీకారం కుదరింది. తొలుత రూ. వెయ్యి కోట్లు.. ఆ తర్వాత మిగతా మొత్తాన్ని చెల్లించేందుకు నాటి ప్రభుత్వం సమ్మతించింది. అయితే అలైన్మెంట్ మార్గంలో ఉన్న విద్యుత్ స్తంభాల లాంటి వాటి తరలింపునకు అవసరమయ్యే రూ. 364 కోట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని ఎన్హెచ్ఏఐ కోరడంతో ప్రస్తుత ప్రభుత్వం తొలుత తటపటాయించినా తర్వాత సమ్మతించింది. కానీ సీఎం రేవంత్రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించాక ఆ మొత్తాన్ని కేంద్రమే భరించేందుకు సిద్ధమైంది. ఈ తరుణంలో భూపరిహారం వాటా నిధుల కోసం రుణం పొందాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం ప్రారంభించింది. అప్పట్లో ఇదే విషయాన్ని అధికారులు ‘సాక్షి’కి వెల్లడించారు. కానీ ఎక్కడి నుంచి రుణం పొందాలనే విషయంలో డోలాయమానం నెలకొంది. వారం క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో దీనిపై స్పష్టత వచి్చంది. రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా హడ్కో నుంచి సేకరించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే ప్రాజెక్టు నిర్మాణ సన్నాహాలు వేగం పుంజుకోనున్నాయి. అంచనా వ్యయం పెరిగే అవకాశం.. గతంలో రాష్ట్ర ప్రభుత్వంతో నెలకొన్న విభేదాలు, ఆ తర్వాత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు.. ఇలా దాదాపు రెండేళ్ల సమయం గడిచిపోయింది. దీనివల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. 2022 చివర్లో రీజనల్ రింగురోడ్డుకు బడ్జెట్ ఖరారు చేసిన సమయంలో ఉత్తర భాగం నిర్మాణానికి రూ. 13,200 కోట్లు ఖర్చవుతుందని ఎన్హెచ్ఏఐ ప్రతిపాదించింది. ఇప్పుడు ఆ మొత్తం రూ. 16 వేల కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నారు. దీంతో ఇక జాప్యం చేయకుండా వెంటనే టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈలోగా భూపరిహారం వ్యవహారాన్ని కొలిక్కి తేవాల్సి ఉంది. ఇది జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీంతో వీలైనంత త్వరలో లోన్ మొత్తాన్ని పొందాల్సి ఉంది. -
కొత్తగా దక్షిణ ‘రింగ్’!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగురోడ్డులో దక్షిణ భాగాన్ని కూడా పూర్తి కొత్తగా నిర్మించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉన్న రోడ్ల అనుసంధానం, విస్తరణ వంటివేమీ లేకుండా.. మొత్తంగా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేగా రూపుదిద్దుకోనుంది. దీనితో ముందు భావించిన దానికన్నా రోడ్డు పొడవు పెరిగి.. 189.4 కిలోమీటర్ల నిడివికి చేరనుంది. సంగారెడ్డి నుంచి ఆమన్గల్ మీదుగా చౌటుప్పల్ వరకు నిర్మితం కానుంది. ఇప్పటికే కన్సల్టెన్సీ సంస్థ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు సమర్పించిన ఈ అలైన్మెంటుకు.. జూన్లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే ఆమోదముద్ర పడే అవకాశం ఉంది. ఆ వెంటనే భూసేకరణ సర్వే పనులు మొదలవుతాయి. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం 158.65 కిలోమీటర్ల రోడ్డుకు ఇప్పటికే భూసేకరణ కూడా జరుగుతోంది. త్వరలోనే దక్షిణ భాగంపై స్పష్టత రానుంది. తొలుత కొన్ని పాతరోడ్లతో కలపాలనుకున్నా.. సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్ నుంచి గజ్వేల్ మీదుగా చౌటుప్పల్ వరకు ఉత్తర భాగానికి కేంద్రం మూడేళ్ల క్రితమే గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఉత్తర భాగాన్ని పూర్తి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేగా నిర్మిస్తున్నారు. దక్షిణ భాగాన్ని మాత్రం ఇప్పటికే ఉన్న కొన్ని పాత రోడ్లను అనుసంధానిస్తూ నిర్మించాలని తొలుత భావించారు. ఉత్తర భాగంలోని ప్రాంతాలతో పోలిస్తే.. దక్షిణ భాగంలోని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు తక్కువగా ఉన్నాయని కేంద్రం గుర్తించింది. అలాంటప్పుడు భారీ వ్యయంతో నాలుగు వరుసల ఎక్స్ప్రెస్వేగా నిర్మించాల్సిన అవసరం ఉందా? అన్న సందేహం వ్యక్తం చేసింది. ఉత్తర భాగాన్ని నాలుగు వరుసల ఎక్స్ప్రెస్వేగా నిర్మించి.. దక్షిణ భాగాన్ని ప్రస్తుత రోడ్ల అనుసంధానంతో సాధారణ హైవేగా నిర్మిస్తే సరిపోతుందని భావించింది. కానీ రింగు రోడ్డుగా పూర్తి రూపం రావాలంటే.. దక్షిణ భాగాన్ని కూడా నాలుగు వరుసల ఎక్స్ప్రెస్ హైవేగా నిర్మించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కోరటంతో.. చివరికి కేంద్రం సరేనంది. ఆలోపే కన్సల్టెన్సీ సంస్థ మూడు అలైన్మెంట్లను రూపొందించింది. అందులో రెండు అలైన్మెంట్లు ప్రస్తుత రోడ్లను అనుసంధానిస్తూ రూపొందించగా.. ఒకదాన్ని పూర్తి కొత్త రోడ్డుగా ప్రతిపాదించారు. ఈ మూడో అలైన్మెంట్నే ఖరారు చేయాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించినట్టు తెలిసింది. ఆ ఒక్క రోడ్డును కలుపుదామనుకున్నా.. షాద్నగర్ నుంచి చేవెళ్ల, శంకర్పల్లి మీదుగా కంది వరకు ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించిన రోడ్డును.. దక్షిణ ‘రింగ్’ అలైన్మెంట్లో భాగం చేయాలని తొలుత భావించారు. కానీ ఆ రోడ్డు కొనసాగే ప్రాంతాల్లో వాణిజ్యపర కార్యక్రమాలు బాగా పెరిగాయి. కొత్తగా జనావాసాలు వేగంగా విస్తరించాయి. భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. అక్కడ భూసేకరణ కూడా కష్టంగా మారింది. దాంతో ఈ రోడ్డును కలపకుండా.. దానికి దూరంగా రూపొందించిన అలైన్మెంట్ వైపే మొగ్గుచూపినట్టు తెలిసింది. దీనితో రోడ్డు ప్రతిపాదిత పొడవు కూడా పెరిగిపోయింది. భారీగా పెరుగుతున్న అంచనా వ్యయం.. రీజనల్ రింగురోడ్డును తొలుత ప్రతిపాదించినప్పుడు మొత్తంగా రూ.19 వేల కోట్లతో పూర్తి చేయవచ్చనే అంచనా వేశారు. కానీ ప్రాజెక్టు జాప్యం అవుతున్న కొద్దీ.. ఆ మార్గం వెంట ఉన్న ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెంది, భూముల ధరలు విపరీతంగా పెరగటంతో ఖర్చు రెట్టింపవుతోంది. ఏడాదిన్నర క్రితం ఉత్తర భాగానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ బడ్జెట్ను ఖరారు చేసింది. ఈ భాగం 158.65 కిలోమీటర్ల నిడివికి రూ.13,200 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. కానీ ప్రక్రియ ముందుకు సాగలేదు. నిర్మాణ పనులు మరో ఏడాది తర్వాత గానీ ప్రారంభమయ్యే సూచనలు కనిపించటం లేదు. అప్పటికి ఉత్తర భాగం వ్యయ అంచనా రూ.16 వేల కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. ఇక తాజాగా అలైన్మెంట్ ఖరారు దశకు చేరిన దక్షిణ భాగానికి నిర్మాణ వ్యయం రూ.18 వేల కోట్లుగా అంచనా వేశారు. జాప్యం జరిగితే ఇది కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. అంటే మొత్తంగా రీజనల్ రింగురోడ్డు నిర్మాణ వ్యయం రూ.35 వేల కోట్లను దాటుతుందని అధికారవర్గాలు అంటున్నాయి. మొత్తం రీజనల్ రింగ్ రోడ్డు లెక్క ఇదీ.. ఉత్తర భాగం 158.65 కిలోమీటర్లు (ఖరారైనది) దక్షిణ భాగం 189.43 కిలోమీటర్లు (అంచనా) మొత్తం పొడవు 348.08 కిలోమీటర్లు (అంచనా) సేకరించే భూమి సుమారు 4,500 హెక్టార్లు భూసేకరణ వ్యయం అంచనా రూ.14,500 కోట్లు (భూముల ధరలు పెరిగేకొద్దీ మారుతుంది) నిర్మాణ పనులకు అయ్యే వ్యయ అంచనా రూ.19,500 కోట్లు (జాప్యం జరిగినకొద్దీ పెరిగే అవకాశం ఉంది) -
పేటీఎంకు మరో బిగ్ షాక్..!
టోల్ ప్లాజాల దగ్గర ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తకుండా మార్చి 15లోగా ఇతర బ్యాంకుల నుంచి ఫాస్టాగ్లు తీసుకోవాలంటూ పేటీఎం ఫాస్టాగ్ యూజర్లకు నేషనల్ హైవేస్ అథారిటీ (ఎన్హెచ్ఏఐ) సూచించింది. తద్వారా జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు జరిమానాలు, డబుల్ ఫీజు చార్జీలను నివారించవచ్చని ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇతరత్రా సందేహాల నివృత్తి కోసం ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ (ఐహెచ్ఎంసీఎల్) వెబ్సైట్లోని ఎఫ్ఏక్యూ సెక్షన్ను సందర్శించాలని తెలిపింది. నిబంధనల ఉల్లంఘనల కారణంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై (పీపీబీఎల్) రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 15 తర్వా త నుంచి పేటీఎం ఫాస్టాగ్ యూజర్లు తమ ఖా తాలను రీచార్జ్ చేసుకునే వీలుండదు. అయితే, తమ ఖాతాల్లో బ్యాలెన్స్ను వాడుకోవచ్చు. ఇవి చదవండి: భారీగా పడుతున్న స్టాక్మార్కెట్లు.. కారణాలు ఇవే.. -
కేవైసీ అప్డేట్.. ఈ రోజే లాస్ట్ డేట్ - ఎలా చేయాలంటే?
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్ట్ట్యాగ్ వినియోగదారులను హెచ్చరిస్తూ.. కేవైసీ చేయడానికి ఈ రోజే (ఫిబ్రవరి 29) చివరి గడవని గతంలోనే వెల్లడించింది. కేవైసీ అప్డేట్ పూర్తి చేయకపోతే అటువంటి ఫాస్ట్ట్యాగ్స్ డీయాక్టివేట్ లేదా బ్లాక్లిస్ట్ చేసే అవకాశం ఉంది. ఫాస్ట్ట్యాగ్ కేవైసీ ఎలా చెక్ చేసుకోవాలంటే.. వినియోగదారుడు ముందుగా ఫాస్ట్ట్యాగ్కు సంబంధించిన అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. ఓటీపీ అథెంటికేషన్ పూర్తయిన తరువాత.. డాష్బోర్డ్లో 'మై ప్రొఫైల్' అనే సెక్షన్లో KYC స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సులభంగా ఇలా చెక్ చేసుకుని ఫాస్ట్ట్యాగ్ కేవైసీ అప్డేట్ అవ్వకపోతే.. అప్డేట్ చేసుకోవచ్చు. కేవైసీ అప్డేట్ ఎలా చేసుకోవాలంటే.. ఫాస్ట్ట్యాగ్ కేవైసీ చెక్ చేసుకున్న తరువాత.. పెండింగ్లో ఉన్నట్లు కనిపిస్తే.. కేవైసీ సబ్ సెక్షన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. దీని కోసం అవసరమైన ఐడెంటిటీ ప్రూఫ్.. వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ఫ్రూఫ్ వంటి వాటితో పాటు పాస్పోర్ట్ సైజు ఫోటో అవసరమవుతుంది. ఇవన్నీ సబ్మిట్ చేసిన తరువాత చెక్ చేసి, చివరిగా సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. తర్వాత 'కంటిన్యూ'పై క్లిక్ చేసి, ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి సబ్మిట్ చేస్తే కేవైసీ వెరిఫికేషన్ పూర్తవుతుంది. కేవైసీ అప్డేట్ఎందుకంటే.. కొందరు ఒకే ఫాస్ట్ట్యాగ్తో పలు వాహనాలను వినియోగిస్తున్నట్లు, మరి కొందరు కేవైసీ పూర్తి కాకుండానే ఫాస్ట్ట్యాగ్లను జారీ చేస్తున్నట్లు గుర్తించి, ఈ విధానికి చరమగీతం పాడాలని ఉద్దేశ్యంతో 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్ట్యాగ్' విధానానికి శ్రీకారం చుట్టారు. కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా ఫాస్ట్ట్యాగ్ వినియోగదారుడు KYC అప్డేట్ చేసుకోవాల్సిందే. -
వాహనదారులకు ముఖ్య గమనిక, ఫాస్టాగ్లపై కీలక అప్డేట్!
టోల్గేట్ల వద్ద సమయం ఆదా చేయడంతో పాటు, వాహనాల రద్దీని తగ్గించేందుకు కేంద్రం ఎలక్ట్రానిక్ పద్దతిలో ఫాస్టాగ్ వ్యవస్థని అందుబాటులోకి తెచ్చింది. దీన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) నిర్వహిస్తోంది. ఫాస్టాగ్లోని రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా ఫాస్టాగ్కు అనుసంధానం చేసిన ప్రీ ప్రెయిడ్ లేదా సేవింగ్ ఖాతా నుంచి నేరుగా టోల్ చెల్లింపులకు అవకాశం కల్పిచ్చింది. ఈ ఫాస్టాగ్ చెల్లింపులు పేమెంట్స్ పేటీఎం బ్యాంక్ (పీపీబీఎల్) ద్వారా జరిగేవి. కానీ సెంట్రల్ బ్యాంక్ పేటీఎంపై ఆంక్షలు విధించడంతో ఇప్పుడు ఫాస్టాగ్ యూజర్లు.. టోల్ చెల్లింపుల కోసం ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తరుణంలో పీపీబీఎల్లో ఫాస్టాగ్లను ఫిబ్రవరి 29 లోపు వినియోగించుకోవాలని ఎన్హెచ్ఏఐ సూచించింది. ఆ తర్వాత నుంచి తాము నిర్ధేశించిన బ్యాంకుల్లో మాత్రమే ఫాస్టాగ్లను కొనుగోలు చేయాలని తెలిపింది. నిర్ధేశించిన గడువు తర్వాత పీపీబీఎల్ మినహా బ్యాంకులు అందించే ఫాస్టాగ్లను పొందాలని వెల్లడించింది. ఇప్పుడు ఆయా బ్యాంకుల్లో నిర్ధేశించిన మొత్తాన్ని చెల్లించి ఫాస్టాగ్లను పొందవచ్చు. ఫాస్టాగ్ ఛార్జీలు? హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఫాస్టాగ్ యాక్టివేషన్ ఛార్జీలు నామమాత్రంగా ఉన్నాయి. అయితే, వినియోగదారులకు మూడు రకాల ఫాస్టాగ్ ఛార్జీలు ఉన్నాయని గుర్తించాల్సి ఉంటుంది. వాటిల్లో 1.ఫాస్టాగ్ జాయినింగ్ ఫీజు - ఫాస్టాగ్ యూజర్గా పేరు నమోదు చేసుకొని, మీ వాహనానికి ఫాస్టాగ్ను వినియోగించేలా యాక్టీవేట్ చేసేందుకు ఫాస్టాగ్ జాయినింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు ఒక్కసారే ఉంటుంది. 2.సెక్యూరిటీ డిపాజిట్ - ఫాస్టాగ్ అకౌంట్ మూసివేసే సమయంలో ఎలాంటి బకాయిలు లేకుండా పూర్తిగా వాపస్ చేసేందుకు అతితక్కువ మొత్తంలో సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించాల్సి ఉంటుంది. మీ వాహనాన్ని బట్టి ఆ మొత్తం మారుతూ ఉంటుంది. యూజర్ల ఫాస్టాగ్ ఖాతాలో తగినంత నిధులు లేకుంటే, ఏదైనా బకాయి ఉన్న టోల్ ఛార్జీలను సర్దుబాటు చేయడానికి సెక్యూరిటీ డిపాజిట్ని బ్యాంకులు ఉపయోగించుకోవచ్చు 3.ఫాస్టాగ్ యాక్టివేషన్ టైం : ఫాస్టాగ్ యాక్టివేషన్ అయిన వెంటనే ఏదైనా టోల్ ఛార్జీలు చెల్లించడానికి ఈ మొత్తం మీ ఫాస్టాగ్ ఖాతాలో ఉంటుంది. ఈ థ్రెషోల్డ్ మొత్తం వాహనం తరగతిపై ఆధారపడి ఉంటుంది. ఫాస్టాగ్లు జారీ చేసే బ్యాంకులు, వినియోగదారులు ఫాస్టాగ్ కోసం ఎంత చెల్లించాలో తెలిపే వివరాలు ఇలా ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వాహనదారుల నుంచి ట్యాక్స్ కింద రూ.100, సెక్యూరిటీ కింద రూ.100 వసూలు చేస్తుంది. కారు, జీప్, వ్యాన్, టాటా ఏస్ ఇలాంటి మినీ-లైట్ కమర్షియల్ వాహనాలకు విధిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ జాయినింగ్ ఫీజుగా బ్యాంక్ రూ. 99.12 (GSTతో సహా) వసూలు చేస్తుంది. సెక్యూరిటీ డిపాజిట్ రూ. 200, కారు, జీప్, వ్యాన్ థ్రెషోల్డ్ మొత్తం రూ. 200. ఈ మొత్తం చెల్లిస్తేనే మీ ఫాస్టాగ్ పనిచేస్తుంది. లేదంటే ఎలాంటి ఉపయోగం ఉండదు ఎస్బీఐ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్లు, జీప్లు, వ్యాన్లు, టాటా ఏస్, ఇతర కాంపాక్ట్ లైట్ కమర్షియల్ వాహనాలకు ఫాస్టాగ్ ఫీజులు లేదా సెక్యూరిటీ డిపాజిట్లకు ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయదు. కాకపోతే ఫాస్టాగ్ యాక్టివేషన్ కోసం కనీస బ్యాలెన్స్ రూ. 200 అవసరమని గుర్తించాలి. యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఫాస్టాగ్ జారీ చేసినందుకు కస్టమర్ నుంచి ఎలాంటి రుసుమును వసూలు చేయదు. అయితే, తిరిగి రెన్యువల్ చేసే సమయంలో బ్యాంక్ రూ.100 (అన్ని ట్యాక్స్లు కలిపి) వసూలు చేస్తుంది. కారు, జీపు, వ్యాన్ వంటి వాహనాలకు బ్యాంకు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.200 వసూలు చేస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా బరోడా ఫాస్టాగ్ వన్ టైమ్ ఫీ కింద జీఎస్టీతో కలిపి రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ వాహనం రకాన్ని బట్టి మారుతుంది. థ్రెషోల్డ్ పరిమితి రూ. 200తో పాటు కారు, జీప్, వ్యాన్లకు రూ. 200 సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేస్తుంది. కెనరా బ్యాంక్ కెనరా బ్యాంక్ రెన్యువల్ సమయంలో రీ-ఇష్యూషన్ ఫీజు కింద రూ.100 వసూలు చేస్తుంది. టాగ్ని ఆన్లైన్లో రీ-లోడ్ చేయడానికి కన్వీనియన్స్ ఫీజు రూ.10 అవుతుంది. కారు, జీప్, వ్యాన్ వంటి వాహనాలకు సెక్యూరిటీ డిపాజిట్ రూ.200, థ్రెషోల్డ్ మొత్తం రూ. 100 ఉంది. ఐడీబీఐ ఐడీబీఐ బ్యాంక్ పన్నులతో సహా రూ. 100 రీ-ఇష్యూషన్ ఫీజును వసూలు చేస్తుంది. బ్యాంక్ ట్యాగ్ డిపాజిట్ రూ. 200 వసూలు చేస్తుంది. కొటక్ మహీంద్రా వీసీ4 కోసం బ్యాంక్ రూ. 100 వసూలు చేస్తుంది. ఇతర వెహికల్ క్లాస్కు ఫాస్టాగ్ జాయినింగ్ ఫీజుగా, డిపాజిట్గా రూ. 200 కట్టాల్సి ఉంటుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ సెక్యూరిటీ డిపాజిట్గా రూ. 200, కస్టమర్ వాలెట్లో లోడ్ చేసే థ్రెషోల్డ్ మొత్తంగా రూ. 200 వసూలు చేస్తుంది. బ్యాంక్ వన్ టైమ్ ట్యాగ్ జాయినింగ్ ఫీజుగా రూ. 100 , రీఇష్యూన్స్ ఫీజు కోసం రూ. 100 వసూలు చేస్తుంది. పీఎన్బీ కారు, జీప్ , వ్యాన్ వంటి వాహనాలకు రూ. 200 సెక్యూరిటీ డిపాజిట్ ఛార్జ్ చేయబడుతుంది . థ్రెషోల్డ్ మొత్తం రూ. 100 ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఫాస్టాగ్కి ఒక్కసారి రుసుము రూ. GSTతో కలిపి 100. ట్యాగ్ జాయినింగ్ ఫీజు (వన్-టైమ్ ఫీజు) రూ. 99.99 (అన్ని వర్తించే పన్నులతో సహా), వన్-టైమ్ ట్యాగ్ రీ-ఇష్యూషన్ ఫీజు రూ. 99.99 (అన్ని వర్తించే పన్నులతో సహా). రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ వాహనం రకాన్ని బట్టి ఉంటుంది. కారు / జీప్ / వ్యాన్ కోసం వన్-టైమ్ సెక్యూరిటీ డిపాజిట్ (రిజర్వ్ చేయబడిన మొత్తం) మొత్తం రూ. 150. -
హైవేల నిర్వహణ పదేళ్లు కాంట్రాక్టర్లదే
సాక్షి, అమరావతి: దేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారుల నిర్వహణ, మరమ్మతులకు సంబంధించి కాంట్రాక్టర్ల బాధ్యత కాలాన్ని రెట్టింపు చేసింది. అందుకోసం జాతీయ రహదారుల డ్యామేజీ లయబిలిటీని ఐదేళ్ల నుంచి పదేళ్లకు పెంచింది. ఈమేరకు కాంట్రాక్టర్లకు విధి విధానాలను నిర్దేశించింది. దేశంలో భారీగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు జాతీయ రహదారుల నిర్వహణ లోపం కూడా ఓ ప్రధాన కారణమని నిపుణుల కమిటీ ఇటీవల నివేదించింది. 2022లో దేశంలో సంభవించిన 4.61 లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.68 లక్షల మంది దుర్మరణం చెందారు. వాటిలో అత్యధికంగా 33 శాతం ప్రమాదాలు జాతీయ రహదారులపైన జరిగినవే. మొత్తం ప్రమాద మృతులు 1.68 లక్షల మందిలో జాతీయ రహదారులపై ప్రమాదాల్లోనే 24 శాతం మంది అంటే 41 వేల మంది దుర్మరణం చెందారు. 2021లో కంటే 2022లో జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు 12 శాతం పెరిగాయి. మృతుల సంఖ్య 9శాతం పెరిగింది. జాతీయ రహదారుల నిర్మాణంలో నాణ్యత లోపాలు, నిర్వహణ లోపం రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. దీంతో హైవేల నిర్వహణ విధానాన్ని మరింత పకడ్బందీగా రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జాతీయ రహదారులను నిర్మిస్తున్న కాంట్రాక్టు సంస్థలు ఐదేళ్ల పాటు వాటి నిర్వహణ చేపడుతున్నాయి. ఆ ఐదేళ్లలో రోడ్ల నిర్వహణ, గుంతలు పూడ్చడం, ఇతరత్రా మరమ్మతులు చేస్తాయి. ఆ తర్వాత ఆ బాధ్యతను ఎన్హెచ్ఏఐకి అప్పగిస్తున్నాయి. కానీ పలు కాంట్రాక్టు సంస్థలు కేవలం ఐదేళ్లే నాణ్యతతో ఉండేలా హైవేలను నిర్మిస్తున్నాయని ఎన్హెచ్ఏఐ ఆడిటింగ్ నివేదిక వెల్లడించింది. ఐదేళ్ల తర్వాత ఆ రోడ్లు దెబ్బతింటున్నాయి. వాటి నిర్వహణ భారం ఎన్హెచ్ఏఐపై పడుతోంది. దీనికి పరిష్కారంగానే నిర్వహణ బాధ్యతను పదేళ్లకు పెంచాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. ఈపీసీ, యాన్యుటీ, బీవోటీ పద్దతుల్లో నిర్మించే జాతీయ రహదారులకు ఈ నిబంధన వర్తిస్తుంది. తక్షణం అమలులోకి ఎన్హెచ్ఏఐ నూతన విధానాన్ని తక్షణం అమల్లోకి తెచ్చింది. ఇప్పటికే ఆమోదించిన జాతీయ రహదారుల నిర్మాణాలకు కొత్త విధానాన్ని వర్తింపజేసింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ చేపట్టినవాటికి, త్వరలో చేపట్టబోయే వాటికి కూడా ఈ విధానం వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా రూ.7.81 లక్షల కోట్లతో 25,713 కిలోమీటర్ల హైవేల నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ ఆమోదించింది. వాటిలో ఈపీసీ విధానంలో 56 శాతం, 42శాతం యాన్యుటీ విధానంలో, 2 శాతం బీవోటీ విధానంలో నిర్మించనుంది. వీటి నిర్మాణాన్ని చేపట్టే కాంట్రాక్టు సంస్థలు పదేళ్లపాటు వాటి నిర్వహణ, మరమ్మతుల బాధ్యతను చేపట్టాలి. తాజా నిర్ణయం వల్ల జాతీయ రహదారుల నిర్మాణంలో నాణ్యత పెరుగుతుందని, నిర్వహణ కూడా సక్రమంగా ఉంటుందని ఎన్హెచ్ఏఐ అధికారవర్గాలు తెలిపాయి. -
పేటీఎం, ఫాస్టాగ్పై ఆందోళనలు.. ఆర్బీఐ మరో కీలక నిర్ణయం!
ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎం సంక్షోభం నుంచి వినియోగదారులను సురక్షితంగా ఉంచేందుకు ఆర్బీఐ సిద్ధమైంది. ఇందులో భాగంగా వచ్చే వారం నేషనల్ హైవే అథారిటీ (ఎన్హెచ్ఏఐ), కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రతినిధులతో భేటీ కానుంది. ఈ సమావేశంలో పేటీఎంపై విధించిన ఆంక్షల నేపథ్యంలో ఆ సంస్థ యూజర్ల భద్రతపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ భేటీలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్(యూపీఐ) ద్వారా ఫాస్టాగ్ వ్యవస్థని నిర్వహిస్తున్న నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)తో పాటు ఇతర వాటాదారులు ఆర్బీఐ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. పేటీఎంపై ఆర్బీఐ గత వారం ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలపై పేటీఎం యూజర్లు ఫాస్టాగ్ గురించి, ఇతర చెల్లింపులు గురించి ఆర్బీఐని ప్రశ్నించారు. ఆ ప్రశ్నలన్నింటికి ఆర్బీఐ వచ్చే వారం ఎన్హెచ్ఏఐ, ఎన్సీపీఐతో భేటీ అనంతరం వివరణ ఇవ్వనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. టోల్ చెల్లింపుల కోసం ఫాస్టాగ్ మన దేశంలోని టోల్ వసూళ్ల కోసం కేంద్రం ఎలక్ట్రానిక్ పద్దతిలో ఫాస్టాగ్ వ్యవస్థని అందుబాటులోకి తెచ్చింది. దీన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ ఏ ఐ) నిర్వహిస్తోంది. ఫాస్టాగ్లోని రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా ఫాస్టాగ్కు అనుసంధానం చేసిన ప్రీ ప్రెయిడ్ లేదా సేవింగ్ ఖాతా నుంచి నేరుగా టోల్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తుంది. ఈ ఫాస్టాగ్ చెల్లింపులు పేటీఎం ద్వారా జరుగుతున్నాయి. కానీ సెంట్రల్ బ్యాంక్ పేటీఎంపై ఆంక్షలు విధించడంతో ఇప్పుడు ఫాస్టాగ్ యూజర్లు.. టోల్ చెల్లింపులపై ప్రత్యామ్నాయ మార్గాల్ని అందుబాటులోకి తీసుకుని రావాలని కోరుతున్నారు. -
FASTag: వాహనదారులకు గుడ్న్యూస్.. ఫాస్టాగ్ కేవైసీ గడువు పొడిగింపు
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వాహనదారులకు శుభవార్త చెప్పింది. రహదారి టోల్ వసూలుకు సంబంధించిన ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ గడువును పొడిగించింది. వాహనదారులు తమ ఫాస్టాగ్ అకౌంట్లకు ఫిబ్రవరి 29వ తేదీలోపు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ కోసం గతంలో విధించిన గడువు జనవరి 31తో ముగియగా ఎన్హెచ్ఏఐ మరోసారి పొడిగించింది. జాతీయ రహదారులపై సాఫీగా, నిరంతరాయమైన టోల్ చెల్లింపు అనుభవం కోసం సకాలంలో కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సిన ఆవశ్యకతను ఎన్హెచ్ఏఐ తెలియజేసింది. కమర్షియల్ లేదా ప్రైవేట్ వాహనాలు ఉన్నవారు ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థలో ఎలాంటి అంతరాయాలను నివారించడానికి వెంటనే కేవైసీ అప్డేట్ చేసుకోవడం చాలా అవసరం. ఫిబ్రవరి 29 గడువులోపు కేవైసీ వివరాలను అప్డేట్ చేయడంలో విఫలమైతే ఫాస్ట్ట్యాగ్ అకౌంట్ పనిచేయకుండాపోవచ్చు. కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు వాహన యజమానులు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, ఓటరు ఐడీ కార్డ్ వంటి ప్రూఫ్స్తో సహా నిర్దిష్ట పత్రాలను సమర్పించాలి. అదనంగా, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, పాస్పోర్ట్-సైజ్ ఫోటోగ్రాఫ్లు వంటివి చిరునామా రుజువు ప్రక్రియకు అవసరం. -
కేవైసీ అప్డేట్.. రేపే లాస్ట్ డేట్ - ఇలా అప్డేట్ చేసుకోండి
ఇప్పటికే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్ట్ట్యాగ్లను కేవైసీతో అప్డేట్ చేసుకోవాలని, దీని కోసం జనవరి 31ని తుది గడువుగా నిర్ణయించింది. ఎన్హెచ్ఏఐ ఇచ్చిన గడువు రేపటితో (జనవరి 31) ముగుస్తుంది. ఈ కథనంలో ఫాస్ట్ట్యాగ్ కేవైసీ చెక్ చేసుకోవడం ఎలా? అప్డేట్ చేయడం ఎలా? ఎందుకు అప్డేట్ చేసుకోవాలని అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం. ఫాస్ట్ట్యాగ్ కేవైసీ ఎలా చెక్ చేసుకోవాలంటే.. వినియోగదారుడు ముందుగా ఫాస్ట్ట్యాగ్కు సంబంధించిన అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. ఓటీపీ అథెంటికేషన్ పూర్తయిన తరువాత.. డాష్బోర్డ్లో 'మై ప్రొఫైల్' అనే సెక్షన్లో KYC స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సులభంగా ఇలా చెక్ చేసుకుని ఫాస్ట్ట్యాగ్ కేవైసీ అప్డేట్ అవ్వకపోతే.. అప్డేట్ చేసుకోవచ్చు. కేవైసీ అప్డేట్ ఎలా చేసుకోవాలంటే.. ఫాస్ట్ట్యాగ్ కేవైసీ చెక్ చేసుకున్న తరువాత.. పెండింగ్లో ఉన్నట్లు కనిపిస్తే.. కేవైసీ సబ్ సెక్షన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. దీని కోసం అవసరమైన ఐడెంటిటీ ప్రూఫ్.. వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ఫ్రూఫ్ వంటి వాటితో పాటు పాస్పోర్ట్ సైజు ఫోటో అవసరమవుతుంది. ఇవన్నీ సబ్మిట్ చేసిన తరువాత చెక్ చేసి, చివరిగా సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. తర్వాత 'కంటిన్యూ'పై క్లిక్ చేసి, ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి సబ్మిట్ చేస్తే కేవైసీ వెరిఫికేషన్ పూర్తవుతుంది. ఇదీ చదవండి: మంటల్లో కాలి బూడిదైన రూ.63 లక్షల ఎలక్ట్రిక్ కారు - వీడియో వైరల్ కేవైసీ అప్డేట్ఎందుకంటే.. కొందరు ఒకే ఫాస్ట్ట్యాగ్తో పలు వాహనాలను వినియోగిస్తున్నట్లు, మరి కొందరు కేవైసీ పూర్తి కాకుండానే ఫాస్ట్ట్యాగ్లను జారీ చేస్తున్నట్లు గుర్తించి, ఈ విధానికి చరమగీతం పాడాలని ఉద్దేశ్యంతో 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్ట్యాగ్' విధానానికి శ్రీకారం చుట్టారు. కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా ఫాస్ట్ట్యాగ్ వినియోగదారుడు KYC అప్డేట్ చేసుకోవాల్సిందే. -
నిధుల పేచీతో నిలిచిన ‘ఆర్ఆర్ఆర్’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ఎంతో కీలకమైన రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనులు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లిప్తత, పేచీల కారణంగా ప్రాజెక్టు తాత్కాలికంగా నిలిచిపోయింది. రైతుల నుంచి నిరసన వ్యక్తమైనా వేగంగా అలైన్మెంట్ను ఖరారు చేసిన జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ).. తీరా భూసేకరణ ప్రక్రియకు అవార్డులు పాస్ చేసే తరుణంలో చేతులెత్తేసింది. దీనితో ప్రాజెక్టుకు సంబంధించి గతంలో విడుదల చేసిన పలు గెజిట్ నోటిఫికేషన్లకు కాలదోషం పట్టి రద్దయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మార్చి ఆఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సర కేటాయింపులు సందిగ్ధంలో పడ్డాయి. త్వరలో లోక్సభ ఎన్నికలు కూడా ఉండటంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే.. ప్రాజెక్టుకు మరింత జాప్యం తప్పదు. కేంద్రంలో కొత్త సర్కారు కొలువుదీరేదాకా ఎదురుచూడక తప్పదు. అనుమతులకు దరఖాస్తే చేయలేదు పెద్ద రహదారుల నిర్మాణానికి పర్యావరణ అనుమతులు కీలకం. అనుమతులొచ్చాకే టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. భారతమాల పరియోజన–1లో కేంద్రం ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని చేర్చింది. అలైన్మెంట్కు అనుమతులు రావటంతో ఎన్హెచ్ఏఐ అధికారులు గత ఏడాదే భూసేకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ సభలు నిర్వహించారు. రైతులు అభ్యంతరాలు లేవనెత్తినా ఎలాగోలా సభలను పూర్తిచేశారు. పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర పర్యావరణ అటవీ శాఖకు దరఖాస్తు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఇది జరగాలంటే ముందు ఈ రోడ్డుకు జాతీయ రహదారి పేరిట కొత్త నంబర్ కేటాయించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను కేంద్రం పెండింగ్లో పెట్టింది. భూపరిహార వాటా నిధులు అందనందుకే.. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ పరిహారంలో రాష్ట్రప్రభుత్వం సగం ఖర్చును భరించాల్సి ఉంది. రాష్ట్ర వాటా రూ.2,600 కోట్లు అవుతుందని తాత్కాలికంగా నిర్ధారించారు. ఈ మొత్తాన్ని చెల్లించాలని ఎన్హెచ్ఏఐ పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. కానీ అన్ని నిధులు ఒకేసారి ఇవ్వడం కుదరదని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాదించింది. దీంతో తొలివిడతగా కనీసం రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని ఎన్హెచ్ఏఐ కోరింది. దీనిని కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి కూడా తెచి్చంది. కానీ నిధుల విడుదల కాలేదు. ఇలా నిధులు రాకుండా, అవార్డులు పాస్ చేయటం సరికాదని, ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన కేంద్రం రీజనల్ రింగ్రోడ్డు పనిని పక్కన పెట్టేసింది. జాతీయ రహదారి నంబర్ కేటాయించలేదు. కీలక ప్రాజెక్టు కాస్తా పెండింగ్లో పడింది. -
సమీపిస్తున్న గడువు.. ఫాస్ట్ట్యాగ్ కేవైసీ ఇలా అప్డేట్ చేసుకోండి
ఒకే ఫాస్ట్ట్యాగ్తో పలు వాహనాలను వినియోగిస్తున్నట్లు, కొందరు కేవైసీ పూర్తి కాకుండానే ఫాస్ట్ట్యాగ్లను జారీ చేస్తున్నట్లు గుర్తించిన 'నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా' (NHAI).. అలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్ట్యాగ్' విధానానికి శ్రీకారం చుట్టింది. దీంతో తప్పనిసరిగా ఫాస్ట్ట్యాగ్ వినియోగదారుడు కేవైసీ చేసుకోవాల్సిందే అంటూ ఆదేశాలను జారీ చేస్తూ ఈ నెల 31 తుది గడువుగా నిర్ణయించింది. జనవరి 31 నాటికి కేవైసీ పూర్తి చేయని ఫాస్ట్ట్యాగ్లు డీయాక్టివేట్ లేదా బ్లాక్ లిస్ట్లో పెట్టే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా వినియోగదారుడు నిర్దిష్ట సమయంలోనే కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఫాస్ట్ట్యాగ్ కేవైసీ చెక్ చేసుకోవడం ఎలా? 👉వినియోగదారుడు ముందుగా ఫాస్ట్ట్యాగ్కు సంబంధించిన అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. 👉ఓటీపీ అథెంటికేషన్ పూర్తయిన తరువాత.. డాష్బోర్డ్లో 'మై ప్రొఫైల్' అనే సెక్షన్లో KYC స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. కేవైసీ అప్డేట్ చేయడం ఎలా? 👉ఫాస్ట్ట్యాగ్ కేవైసీ చెక్ చేసుకున్న తరువాత.. పెండింగ్లో ఉన్నట్లు తెలిస్తే.. కేవైసీ సబ్ సెక్షన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. 👉దీని కోసం అవసరమైన ఐడెంటిటీ ప్రూఫ్.. వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్వంటి వాటితో పాటు పాస్పోర్ట్ సైజు ఫోటో కావాల్సి ఉంటుంది. 👉ఇవన్నీ సబ్మిట్ చేసిన తరువాత చెక్ చేసి, చివరిగా సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. 👉తర్వాత 'కంటిన్యూ'పై క్లిక్ చేసి, ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి సబ్మిట్ చేస్తే కేవైసీ వెరిఫికేషన్ పూర్తవుతుంది. -
FASTag: వాహనదారులకు అలర్ట్.. ఫాస్ట్ట్యాగ్పై NHAI కీలక ప్రకటన
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి ఫాస్ట్ట్యాగ్ (FASTag) ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఫాస్ట్ట్యాగ్లను డీయాక్టివేట్ చేస్తామని ప్రకటించింది. ఫాస్ట్ట్యాగ్లను డీయాక్టివేట్ చేయడానికి కారణం ఏంటి? ఆలా జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలు ఇక్కడ చూసేద్దాం.. ఈ నెల చివరి (2024 జనవరి 31) నాటికి ఫాస్ట్ట్యాగ్ KYC అసంపూర్తిగా ఉంటే అలాంటి వాటిని డీయాక్టివేట్ చేసే అవకాశం ఉంది. 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్ట్యాగ్' ప్రచారంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్హెచ్ఏఐ ప్రకటించింది. NHAI ప్రకారం KYC జనవరి 31 నాటికి పూర్తి కాకుండా ఫాస్ట్ట్యాగ్లో బ్యాలెన్స్ ఉన్నా.. అలంటి వాటిని డీయాక్టివేట్ లేదా బ్లాక్ లిస్ట్లో పెట్టే అవకాశం ఉంది. సదరు వినియోగదారుడు తమ ఫాస్ట్ట్యాగ్ డీ యాక్టివేట్ కాకుండా ఉండాలంటే జనవరి 31 లోపల కేవైసీ చేయించుకోవాల్సిందే. ఫాస్ట్ట్యాగ్ అనేది వాహనాలకు తప్పనిసరి చేసినప్పటి నుంచి ఇప్పటి వరకులు ఎనిమిది కోట్ల మంది దీనిని వినియోగిస్తున్నారని తెలుస్తోంది. అయితే చాలామంది ఫాస్ట్ట్యాగ్ వినియోగదారులు వాహనం ముందు భాగంలో కాకుండా ఇష్టానుసారంగా అతికించుకోవడం వల్ల టోల్ ప్లాజాలో ఇతరులకు ఇబ్బందులు కలుగుతున్నాయి గతంలో వెల్లడించారు. ఇదీ చదవండి: 60 వేలమందికి మొబైల్ నెంబర్ ఇచ్చిన సీఈఓ - ఎందుకంటే? కొందరు ఒకే ఫాస్ట్ట్యాగ్తో పలు వాహనాలను వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వాటిని అరికట్టడానికి 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్ట్యాగ్' విధానానికి శ్రీకారం చుట్టారు. దీంతో తప్పనిసరిగా ఫాస్ట్ట్యాగ్ వినియోగదారుడు KYC చేసుకోవాల్సిందే. ఇది మాత్రమే కాకుండా కొందరు కేవైసీ పూర్తి కాకుండానే ఫాస్ట్ట్యాగ్లను జారీ చేస్తున్నారు. ఈ విధానికి కూడా జనవరి 31 తరువాత మంగళం పాడనున్నారు. -
టోల్ప్లాజా తొలగింపుపై మంత్రి కీలక వ్యాఖ్యలు
సాధారణంగా చాలామందికి నిర్ణీత గడువు తర్వాత టోల్ప్లాజాలను మారుస్తారు లేదా తొలగిస్తారనే అపోహ ఉంది. కానీ దానికి సంబంధించి కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ రహదారుల రుసుముల నిబంధనలు-2008 ప్రకారం.. నిర్దిష్ట గడువు పూర్తయిన తర్వాత మూలధన వ్యయాన్ని రికవరీ చేశాక టోల్ ప్లాజాలను తొలగించాలనే ఎలాంటి నిబంధనా లేదని కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశంలోని జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన ఏ ఒక్క టోల్ ప్లాజాలోనూ ఇప్పటివరకు మూలధన వ్యయాన్ని పూర్తిగా రికవరీ చేయలేదని గురువారం లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేల నిర్మాణ బాధ్యతలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పర్యవేక్షిస్తాయి. రవాణా సౌకర్యాలను మెరుగు పరిచేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్హెచ్ఏఐ పని చేస్తుంది. ఇది ప్రైవేటు కాంట్రాక్టు సంస్థల సహాయంతో వివిధ రాష్ట్రాల మధ్య హైవేలు, ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మిస్తుంది. రోడ్డు వేయడానికి చేసిన ఖర్చును టోల్ రూపంలో వసూలు చేసి కాంట్రాక్టర్లకు చెల్లిస్తుంది. ఈ ప్రక్రియ కొన్నేళ్లపాటు సాగుతుంది. ఇదీ చదవండి: ఉంటుందో..? ఊడుతుందో..? మరోవైపు, జాతీయ రహదారులపై టోల్ ఛార్జీల వసూలుకు జీపీఎస్ ఆధారిత వ్యవస్థను 2024 మార్చి నాటికి తీసుకురానునట్లు గడ్కరీ ఇటీవల ప్రకటించారు. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగడంతో పాటు జాతీయ రహదారిపై ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
ఏఐతో రాజమార్గాల్లా.. జాతీయ రహదారులు
సాక్షి, అమరావతి: జాతీయ రహదారులపై ప్రమాదాలకు అధునాతన టెక్నాలజీతో చెక్ పెట్టేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) సిద్ధమవుతోంది. అందుకోసం ఆర్టిఫిషయల్ఇంటెలిజెన్స్(ఏఐ) పరిజ్ఞానంతో ‘అడ్వాన్స్డ్ టెక్నాలజీ సిస్టం(ఏటీఎస్)’ విధానాన్ని రూపొందించింది. ఇప్పుడున్న సీసీ కెమెరాలతో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారంగా పూర్తిస్థాయిలో డిజిటల్ పరిజ్ఞాన పర్యవేక్షణ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి దశలవారీగా కొత్త టెక్నాలజీని అమలు చేయనుంది. సరికొత్తగా పర్యవేక్షణ.. ప్రస్తుతం జాతీయ రహదారులపై ఉన్న కెమెరాల స్థానంలో సరికొత్త ‘వీడియో ఇన్సిడెంట్ డిటెక్షన్–ఎన్ఫోర్స్మెంట్ సిస్టం(వైడ్స్)’ టెక్నాలజీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. వైడ్స్తో రూపొందించిన ఈ కెమెరాలతో 14 రకాలుగా వాహనాలను పర్యవేక్షించడానికి సాధ్యపడుతుంది. వాహనాల వేగం అంచనాతో పాటు ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్, సీట్బెల్ట్ ధరించకపోవడం, నిర్దేశిత లైన్ను ఉల్లంఘించి ప్రయాణించడం, రాంగ్రూట్లో ప్రయాణం, జాతీయ రహదారులపై పశువుల సంచారం, పాదచారులు రోడ్డు దాటేందుకు ఏర్పాటు చేసిన క్రాసింగ్ లైన్స్, అంబులెన్స్ల రాక సహా 14 రకాల సంఘటనలను రికార్డ్ చేస్తుంది. ఈ సమాచారంతో వెంటనే జాతీయ రహదారులపై విధులు నిర్వహించే పాట్రోలింగ్ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేయవచ్చు. ప్రతి 10 కి.మీ.కు కెమెరాలు.. జాతీయ రహదారులపై ప్రతి 10 కి.మీ.కు ఓ చోట ఈ వైడ్స్ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. ఇక ప్రతి 100 కి.మీ.కు ఓ మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్ను నెలకొల్పుతారు. జాతీయ రహదారుల వెంబడి వేయనున్న ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ను సద్వినియోగం చేసుకుని ఈ సెంటర్లు పని చేస్తాయి. ఈ సెంటర్ల పరిధిలోని ప్రాంతంలోని కెమెరాల డాటాను అక్కడ విశ్లేíÙస్తారు. వైడ్స్ కెమెరాల ద్వారా వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను ఆటోమేటిగ్గా గుర్తించే వ్యవస్థను అందుబాటులోకి తెస్తారు. ఇక ప్రమాదాలను గుర్తించడం, రహదారులపై నిలిచిపోయిన వాహనాలను గుర్తించి తగిన చర్యలు తీసుకునేలా సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఆ ప్రాంతంలోని పోలీసు స్టేషన్లతోపాటు ఆయా రాష్ట్రాల విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాలతో అనుసంధానిస్తారు. సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి కనీసం ఒకరు ఆ కమాండ్కంట్రోల్ సెంటర్లలో అందుబాటులో ఉంటారు. ‘రాజ్మార్గ్ యాత్ర’ యాప్తో అనుసంధానం జాతీయ రహదారులపై ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఉద్దేశించిన ‘రాజ్మార్గ్ మొబైల్ యాప్’తో ఈ వైడ్స్ కెమెరాల డేటాను అనుసంధానిస్తారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనాలకు ఆటోమేటిగ్గా ఈ–చలానాలు జారీ చేస్తుంది. ఆ సమాచారాన్ని రాజ్మార్గ్ మొబైల్ యాప్ ద్వారా వెంటనే వాహన చోదకులకు చేరవేస్తుంది. దాంతోపాటు జాతీయ రహదారులపై ఎదురుగా ఉన్న సైన్బోర్డులు, ట్రాఫిక్ జామ్, ఇతర ప్రమాదకర పరిస్థితుల గురించి అప్రమత్తం చేస్తూ సందేశాలను పంపుతుంది. వాహన చోదకులు ఏదైనా అత్యవసర సహాయాన్ని అర్థించేందుకు ఆ యాప్ ద్వారా ఎన్హెచ్ఏఐ అధికారులను సంప్రదించవచ్చు. -
రోడ్డు కోసమని రోడ్డున పడేస్తున్నారు...
నారాయణ్పేట్: కేంద్ర ప్రభుత్వం మహబూబ్నగర్– చించోలి రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించింది. బెంగుళూరు– ముంబాయి మధ్య జాతీయ రహదారులను అనుసంధానం చేసేందుకు మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని భూత్పూర్ నుంచి కర్ణాటకలోని మన్నెకలి వరకు ఉన్న 192 కి.మీ., మేర రోడ్డును జాతీయ రహదారిగా విస్తరించడానికి గతేడాది రూ.703 కోట్లు మంజూరయ్యాయి. తెలంగాణలో మూడు జిల్లాలను కలుపుతూ వెళ్తున్న ఈ రోడ్డును 167 జాతీయ రహదారిగా గుర్తించారు. మొదటి ప్యాకేజీలో భాగంగా భూత్పూర్ నుంచి దుద్యాల వరకు ఈ ఏడాది మార్చిలో పనులు ప్రారంభించగా.. ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల బీటీ వేయగా.. అవసరమైన చోట కల్వర్టుల నిర్మాణం దాదాపుగా పూర్తిచేశారు. అయితే రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు తొలగిస్తుండటంతో గూడు కోల్పోవడమే కాక.. పలువురి ఉపాధికి ఎసరు వచ్చింది. దీంతో జాతీయ రహదారి వచ్చిందని సంతోషపడాలో.. లేక తమ గూడు చెదిరిందని బాధపడాలో అర్థం కాక గొడోమంటున్నారు. 400 ఇళ్ల వరకు.. 5 మండలాల్లోని 17 గ్రామాల్లో 50 ఫీట్లలోపు ఉన్న 400 ఇళ్ల వరకు తొలగిస్తుండడంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. రూ.లక్షలు వెచ్చించి నిర్మించుకున్న ఇళ్లు కళ్ల ముందే కూల్చివేస్తుండడంతో కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం సైతం లేకపోవడం.. అటు ప్రభుత్వం వేరే దారి చూపకపోవడంతో రోడ్డుపాలవుతున్నారు. 50 ఫీట్లలోపు ఉన్న ఇళ్లకు, వ్యవసాయ భూములకు ఎలాంటి పరిహారం ఇవ్వమని అధికారులు తేల్చిచెప్పారు. భూత్పూర్ నుంచి దుద్యాల వరకు కేవలం 100 మాత్రమే 50 ఫీట్ల బయట ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటికి మాత్రమే పరిహారం ఇస్తామనడంతో బాధితులు నెత్తి నోరు బాదుకుంటున్నారు. 81.5 ఎకరాల భూమి.. భూత్పూర్ నుంచి దుద్యాల వరకు 60 కి.మీ., రోడ్డు విస్తరణకు గాను 81.5 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. 5 మండలాల్లోని 17 గ్రామాలకు చెందిన 547 మంది రైతులు తమ భూములు కోల్పోతున్నారు. ఇందులో ప్రధానంగా వ్యవసాయ పొలాలతోపాటు ప్లాట్లు కూడా ఉన్నాయి. ఆయా గ్రామాల్లో బాధితుల వారిగా ఎవరి భూమి, ఇల్లు ఎంతెంత పోతుంది అని గతేడాది అక్టోబర్లోనే అధికారులు సర్వే చేసి మార్కింగ్ ఇచ్చారు. ఇళ్లు, భూ నిర్వాసితులకు కలిపి పరిహారం ఇవ్వడానికి రూ.135 కోట్లు కేటాయించారు. అయితే పనులు ప్రారంభమై 8 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా పరిహారం ఇవ్వలేకపోయారు. ఇటీవల రంగారెడ్డిపల్లి సర్పంచ్ లక్ష్మీదేవి పరిహారం చెల్లించాలని విస్తరణ పనులు అడ్డుకున్నారు. హోటల్ పోయింది.. గండేడ్లో మంచి అడ్డా దొరకడంతో తాత్కాలికంగా షెడ్డు వేసుకొని హోటల్ నిర్వహిస్తున్నా. నిత్యం రూ.2–3 వేల వరకు గిరాకీ అయ్యేది. ఇప్పుడు దాన్ని తీసేయమంటున్నారు. హోటల్నే నమ్ముకున్న మేము ఎలా బతకాలో అర్థం కావడం లేదు. ఇంటిల్లిపాది దానిపైనే ఆధారపడ్డాం. కనీసం ఇంకోచోట బతికే పరిస్థితి లేకపోవడంతో ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. – ఆంజనేయులు, చెన్నాయిపల్లి ఒక్క గదే మిగిలింది.. నాకు మూడు షెట్టర్లు, రెండు గదులు ఉండగా.. ఒక్క దాంట్లో మొబైల్ షాపు పెట్టుకొని మిగతావి అద్దెకు ఇచ్చాం. వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకునే వాళ్లం. అధికారులు వచ్చి రెండు రోజుల్లో మార్కింగ్ చేసిన వరకు తీసేయాలని.. లేదంటే జేసీబీతో కూల్చేస్తామన్నారు. అలా చేస్తే మొత్తం పోతుందని సొంతంగా కూల్చేయడం వల్ల ఒక్క గది మిగిలింది. – ఇజాజ్ హుస్సేన్, మహమ్మదాబాద్ పనులు జరుగుతున్నాయి.. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా 50 ఫీట్ల లోపు ఉన్నవాటికి ఎలాంటి పరిహారం ఇవ్వం. ఇక భూమి పోతున్న నిర్వాసితులకు సంబంధించి ఇప్పటికే అధికారులు వివరాలు సేకరించి బ్యాంకు ఖాతా నంబర్లు తీసుకున్నారు. ఎవరికి ఎంతెంత రావాలో నిర్ణయించారు. నిర్వాసితులకు నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. భూ నిర్వాసితులకు డబ్బులు ఇచ్చాకే పనులు చేపడతాం. ప్రభుత్వ భూములు ఉన్నచోట పనులు జరుగుతున్నాయి. – రమేష్, డీఈ, నేషనల్ హైవే సల్కర్పేట్కు చెందిన గిరమోని రవికుమార్కు 37 గుంటల తరిపొలం ఉండగా జాతీయ రహదారి నిర్మాణంతో మొత్తం పోతుంది. అయితే భాగాలు పంచుకోవడం మూలంగా ఇతని ఆధీనంలో ఉన్న సర్వే నంబర్ వేరే వారి పేరిట ఉండడంతో పరిహారం అందడం కష్టంగా ఉంది. అటు భూమి పోవడమే కాక.. ఇటు పరిహారం అందే పరిస్థితి లేకపోవడంతో అయోమయంలో పడ్డాడు. దాదాపు 25 ఏళ్లుగా అదే భూమిని నమ్ముకున్నాడు. రోడ్డు విస్తరణ కారణంగా సర్వం కోల్పోతున్నాడు. జానంపల్లికి చెందిన చెన్నారం వెంకటయ్య ఆర్సీసీ ఇల్లు నిర్మించుకొని అందులోనే హోటల్ నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. 15 రోజుల క్రితం అధికారులు వచ్చి మార్కింగ్ ఇచ్చి కూల్చివేస్తామని చెప్పారు. ఆ తర్వాత జేసీబీతో మార్కింగ్ ఇచ్చిన వరకు ఇల్లు కూల్చివేయడంతో ప్రస్తుతం ఒక్క గోడ మాత్రమే మిగిలింది. ప్రస్తుతం అతనికి ప్రత్యామ్నాయం లేకపోవడంతో బంధువుల ఇంట్లో తల దాచుకుంటున్నాడు. ఉపాధి కూ డా పోవడంతో బతుకు భారంగా మారింది. ఉపాధికి ఎసరు.. చాలా గ్రామాల్లో రోడ్డుకిరువైపులా పలు రకాల దుకాణాలు నిర్వహిస్తున్నారు. కిరాణం, మెకానిక్, జిరాక్స్, ఫర్టిలైజర్, మెడికల్ షాపు, హాస్పిటల్, హోటళ్లతో జీవనం సాగిస్తున్నారు. అయితే రోడ్డు విస్తరణ పేరిట ఇవన్నీ తొలగిస్తుండడంతో వారంతా ఉపాధి కోల్పోతున్నారు. మహమ్మదాబాద్లో రోడ్డుకిరువైపులా కనుచూపు మేర కనీసం ఒక్క టీ షాపు కూడా లేదు. రోజూవేలు సంపాదించే వారు కనీసం రూ.100 కూడా వచ్చే పరిస్థితి లేక.. కుటుంబాలు ఎలా పోషించాలో అని దిక్కుతోచని స్థితిలో పడ్డారు. -
ఎన్హెచ్ఏఐ, రాష్ట్ర ప్రభుత్వం మధ్యసయోధ్య!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగురోడ్డు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం – కేంద్ర ప్రభుత్వం మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం సద్దుమణిగినట్టే కనిపిస్తోంది. భూసేకరణకు సంబంధించి పరిహార మొత్తంలో రాష్ట్రప్రభుత్వం తన వంతు సగం వాటా డబ్బులు డిపాజిట్ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్హెచ్ఏఐ లేఖ రాయటంతో వివాదం మొదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఒకేసారి తన వాటా మొత్తం కాకుండా, అవార్డులు పాస్ చేసిన కొద్దీ విడతల వారీగా వాటా చెల్లిస్తానంటూ తాజాగా ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు ఎన్హెచ్ఏఐ అంగీకరించింది. దీంతో భూ పరిహారం పంపిణీకి మార్గం సుగమమైంది. వారం రోజుల్లో అందుకు కావాల్సిన ఏర్పాట్లను ఎన్హెచ్ఏఐ ప్రారంభించబోతోంది. త్వరలోనే భూసేకరణ ప్రాధికార సంస్థ (కాలా)ల వారీగా పరిహారం పంపిణీ ప్రారంభం కానుంది. దీంతో రీజనల్ రింగురోడ్డు పనులు ప్రారంభించేందుకు వీలుగా టెండర్లు పిలిచేందుకు అవకాశం కలగనుంది. రూ.100 కోట్లు జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి ప్రధాన గెజిట్లు జారీ అయిన విషయం తెలిసిందే. భూ పరిహారం పంపిణీకి సంబంధించిన 3డీ గెజిట్ నోటిఫికేషన్లు ఇటీవలే విడుదలయ్యాయి. అయితే వివరాలు గల్లంతైన భూములకు సంబంధించి మాత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది. 3డీ గెజిట్లు విడుదలైన భూములకు సంబంధించి పట్టాదారులకు పరిహారం అందజేసేందుకు ఎన్హెచ్ఏఐ కేంద్ర కార్యాలయం అనుమతి మంజూరు చేయటంతో స్థానిక అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 162 కి.మీ. ఉత్తర భాగానికి సంబంధించి 2 వేల హెక్టార్ల భూమిని సమీకరించాల్సి ఉంది. ఇందుకు పరిహారంగా రూ.5,170 కోట్లు అవసరమవుతాయని ఎన్హెచ్ఏఐ బడ్జెట్లో ఖరారు చేసింది. ఈ మొత్తంలో 50 శాతం రాష్ట్రప్రభుత్వం భరించాలి. అంటే రూ.2,585 కోట్లు, స్తంభాల వంటి వాటి తరలింపునకు అయ్యే వ్యయానికి సంబంధించి మరో రూ.363.43 కోట్లు.. మొత్తం 2,948.43 కోట్లు చెల్లించాలంటూ ఎన్హెచ్ఏఐ ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే అవార్డ్ పాస్ చేసే 3డీ గెజిట్లు కూడా విడుదల కాకుండానే పరిహారం జమ చేయాలనటం సరికాదంటూ ప్రభుత్వం నిరాకరించింది. దీనిపై ఎన్హెచ్ఏఐ మూడు లేఖలు రాసినా ప్రభుత్వం స్పందించకపోవటంతో ప్రతిష్టంభన నెలకొంది. ఆ తర్వాత అధికారులు చర్చించటంతో సయోధ్య కుదిరింది. ఇందులో భాగంగా తొలుత రూ.100 కోట్లు డిపాజిట్ చేసిన ప్రభుత్వం, పరిహారం చెల్లించే ప్రాంతాలకు అవార్డులు పాస్ చేసినప్పుడల్లా తన వాటా చెల్లిస్తాననడంతో ఎన్హెచ్ఏఐ అంగీకరించింది. తాజాగా 8 కాలాలకు సంబంధించి 3డీ గెజిట్లు విడుదల కావటంతో పరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు. యాజమాన్య పత్రాలు అందజేయాల్సిందిగా ఆదేశం.. ఏయే ప్రాంతాల్లో పరిహారం పంపిణీ చేయాలో గుర్తించిన ఎన్హెచ్ఏఐ తాజాగా, సంబంధిత భూముల యజమానులు వారేనని రూఢీ చేసే ఆధారాలు సమర్పించాల్సిందిగా పట్టాదారులకు సమాచారం పంపింది. వాటితోపాటు బ్యాంకు ఖాతా వివరాలు కూడా కోరింది. డాక్యుమెంట్లను ఆన్లైన్లో దాఖలు చేశాక, రికార్డులతో సరిచూసుకుని పరిహారాన్ని డిపాజిట్ చేయనున్నారు. పూర్తి వివరాలు సిద్ధమయ్యాక కాలాల వారీగా పత్రికాముఖంగా ప్రకటనలను కూడా వెల్లడించనుంది. భూములకు.. నిర్మాణాలకు.. చెట్లకు.. పట్టాదారుల భూములు, వాటిల్లో ఉన్న నిర్మా ణాలు, తోటలు, విలువైన చెట్లకు లెక్కకట్టి పరిహారం ఇస్తారు. ఆ ప్రాంతంలో మూడేళ్ల రిజి్రస్టేషన్ల విలువలను గుర్తించి వాటి సరాసరి లెక్కగట్టి.. దానికి మూడు రెట్లను గుణించి పరిహారంగా ఖాయం చేయనున్నారు. ఆస్తులు, చెట్లకు వాటి విలువ ఆధారంగా లెక్కగడతారు. -
ఇక ఆ భూములు ఎన్హెచ్ఏఐ ఖాతాలోకి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి అలైన్మెంటులో గుర్తించిన భూమిని తన పరిధిలోకి తీసుకుంటూ జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) 3డీ నోటిఫికేషన్లు జారీ చేసింది. యాదాద్రి–భువనగిరి, ఆందోల్–జోగిపేట, చౌటుప్పల్ అథారిటీ(కాంపిటెంట్ అథారిటీ ఫర్ లాండ్ అక్విజిషన్–కాలా)లకు సంబంధించి ఏప్రిల్లో మూడు గెజిట్లు జారీ చేయగా, తాజాగా భువనగిరి, ఆందోల్–జోగిపేటలోని అనుబంధ నోటిఫికేషన్లు, సంగారెడ్డి, గజ్వేల్, తూప్రాన్ కాలాలకు సంబంధించి 3డీ నోటిఫికేషన్లు జారీ చేసింది. అలైన్మెంటు ఖరారు చేసిన తర్వాత భూసేకరణ ప్రక్రియ ప్రారంభించేందుకు వీలుగా తొలుత జారీ చేసిన రెండు గెజిట్లలో దాదాపు 500 ఎకరాలకు సంబంధించిన భూముల వివరాలు గల్లంతైన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని ఇటీవలే గుర్తించి వాటికి మళ్లీ నోటిఫికేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. అలా గల్లంతైన భూములకు సంబంధించి మినహా మిగతా భూమలుకు సంబంధించి తుది గెజిట్ నోటిపికేషన్లు దాదాపు జారీ అయినట్టే. దీంతో ఈ భూములన్నీ ప్రైవేటు వ్యక్తుల ఆధీనం నుంచి ఎన్హెచ్ఏఐ పరిధిలోకి చేరినట్టయింది. భూ యజమానుల అభ్యంతరాలను తోసిపుచ్చిన ఎన్హెచ్ఏఐ: ఈ భూముల సేకరణ ప్రక్రియపై వాటి యజమానుల నుంచి వ్యక్తమైన అన్ని అభ్యంతరాలను ఎన్హెచ్ఏఐ తోసి పుచ్చింది. ఆయా అభ్యంతరాలకు సంబంధించి గ్రామ సభ ల్లో అధికారికంగా వెల్లడించిన సమాధానాలతో ఇక అభ్యంతరాలు రద్దయినట్టుగానే ఎన్హెచ్ఐఏ పరిగణిస్తుంది. ప్రజో పయోగానికి సంబంధించి రూపొందించిన ప్రాజెక్టు నిర్మాణానికి గాను ఈ భూములను సేకరించాలని నిర్ణయించినందున, ఆ ప్రాజెక్టు పనులు మందుకు సాగేందుకు వీలుగా భూములపై ఉన్న ప్రైవేటు యాజమాన్య హక్కులను రద్దు చేస్తున్నట్టుగా ఎన్హెచ్ఏఐ ప్రకటించింది. వెరసి ఆ భూములన్నీ కేంద్రప్రభుత్వ అధీనంలోకి చేరినట్టయింది. గెజిట్లో ఇలా: ‘‘కేంద్ర భూసేకరణ చట్టం సెక్షన్ 3డీలోని సబ్ సెక్షన్(1) ప్రకారం.. నిర్ధారిత గ్రీన్ఫీల్డ్ హైవే దిగువ తెలి పిన సర్వే నెంబర్లలోని భూమిని కేటాయించాము. దాని కో సం సేకరించనున్నాము’’ ‘‘కేంద్ర భూసేకరణ చట్టం సెక్షన్ 3డీ సబ్సెక్షన్(2) నోటిఫికేషన్ విడుదలైన వెంటనే.. నిర్ధారి త భూమి పూర్తిగా కేంద్రప్రభుత్వ అధీనంలోకి వచ్చినట్టుగా పరిగణించాలి. ’’ అని గెజిట్ నోటిఫికేషన్లో ప్రచురించింది. 158.62 కి.మీ.గాను 2 వేల హెక్టార్ల భూమి సేకరణ రీజినల్ రింగ్రోడ్డు ఉత్తరభాగంలో 158.62 కి.మీ. నిడివికి గాను దాదాపు 2 వేల హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. ఇందుకు రూ.5170 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ మొత్తంలో సగ భాగం.. అంటే రూ.2585 కోట్లు భూసేకరణకు, రూ.363.43 కోట్లు స్తంభాలు లాంటి వాటిని తరలించేందుకు అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. నిధులు ముందే జమ కట్టే విషయంలో కేంద్ర–రాష్ట్రప్రభుత్వాల మధ్య అప్పట్లో అభిప్రాయభేదాలు తలెత్తాయి. ఆ తర్వాత రాజీ కుదిరి రూ.100 కోట్ల మొత్తాన్ని జమ చేయటంతో 3 డీ నోటిషికేషన్ జారీకి మార్గం సుగమమైంది. 3ఏ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన ఏడాదిలోపు 3డీ గెజిట్ నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉంది. ఈ నెలతో ఏడాది పూర్తి అవుతున్నందున 3డీ గెజిట్ నోటిఫికేషన్లను ఎన్హెచ్ఏఐ జారీ చేయటం విశేషం. పూర్తి వివరాలతో నోటిఫికేషన్ రీజినల్ రింగురోడ్డు నిర్మించే అలైన్మెంట్ పరిధిలోకి వచ్చే భూములను గుర్తించి గతంలోనే సర్వే చేసిన అధికారులు.. తాజా గెజిట్ నోటిఫికేషన్లో ఊరు, సర్వే నెంబరు, భూమి విస్తీర్ణం, పట్టాదారు పేరు.. ఇలా పూర్తి వివరాలను గెజిట్ నోటిఫికేషన్లో ప్రచురించారు. -
పాడేరు–లంబసింగి రహదారికి పచ్చజెండా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో రెండు రహదారులు, ఒక రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ) నిర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పాడేరు–లంబసింగి రహదారి నిర్మాణానికి ఆమోదముద్ర వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దాంతోపాటు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సీతారాంపురం–దుత్తలూరు రహదారితోపాటు ఓ ఆర్వోబీ నిర్మాణానికి ఆమోద ముద్ర వేసింది. ఈ మూడు ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.545 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను ఖరారు చేసింది. దుత్తలూరు రోడ్డుకు రూ.267 కోట్లు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో సీతారామపురం నుంచి దుత్తలూరు వరకు 36.40 కి.మీ. మేర పావడ్ సోల్డర్స్తో రెండు లేన్ల రహదారి నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. అందుకోసం రూ.267 కోట్లతో టెండర్ల ప్రక్రియను ఖరారు చేసింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలోని చిన్నతిప్ప సముద్రం సమీపంలోని రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద ఆర్వోబీ నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. సేతు భారతం ప్రాజెక్ట్ కింద ఈ రెండు లేన్ల ఆర్వోబీ నిర్మాణానికి రూ.72.50 కోట్లతో టెండర్లను ఖరారు చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తూ రహదారులను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అందులో భాగంగా ఇప్పటికే రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం మీదుగా అరకుకు నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తున్నారు. మరోవైపు జిల్లా కేంద్రం పాడేరు నుంచి లంబసింగికి కూడా రహదారి నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆంధ్రా కశ్మిర్గా గుర్తింపు పొందిన లంబసింగిని పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయవచ్చన్నది ప్రభుత్వ ఉద్దేశం. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం పాడేరు–లంబసింగి మధ్య 48 కి.మీ. మేర పావడ్ సోల్డర్స్తో రెండు లేన్ల రహదారిని నిర్మించాలని నిర్ణయించింది. అందుకోసం రూ.206 కోట్లతో టెండర్ల ప్రక్రియను ఇటీవల ఖరారు చేసింది. త్వరలోనే పనులు ప్రారంభించి 2024 మార్చి కల్లా పూర్తి చేయాలని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. -
ఔటర్ నిర్వహణకు ‘గోల్కొండ ఎక్స్ప్రెస్ వే’.. 30ఏళ్ల పాటు టోల్ వసూలు, ఇంకా
సాక్షి, హైదరాబాద్: నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లీజు వ్యవహారంలో ముందడుగు పడింది. 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్ నిర్వహణ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటైంది. లీజు ఒప్పందంలో భాగంగా ‘ఐఆర్బీ గోల్కొండ ఎక్స్ప్రెస్ వే’ను ఎస్పీవీగా ఏర్పాటు చేశారు. ఇది ఐఆర్బీ ఇన్ఫ్రా తరఫున ప్రాతినిధ్య సంస్థగా ఉంటుంది. ఈ మేరకు ఈ నెల 28న హెచ్ఎండీఏతో కుదుర్చుకున్న లీజు ఒప్పందంపై ఐఆర్బీ గోల్కొండ ఎక్స్ప్రెస్ వే సంతకాలు చేసింది. ఇక నిర్ణీత 120 రోజుల గడువులోపు లీజు మొత్తం రూ.7,380 కోట్లను చెల్లించి ఔటర్ నిర్వహణ బాధ్యతలను చేపడతామని ఐఆర్బీ ఇన్ఫ్రా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వీరేంద్ర డి.మహిష్కర్ తెలిపారు. ఔటర్ ప్రాజెక్టును తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్టు చెప్పారు. నిర్వహణ అంతా ‘గోల్కొండ’దే.. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)కు అనుబంధంగా ఉన్న హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్) ఔటర్ రింగ్రోడ్డు నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తోంది. ఐఆర్బీ ఇన్ఫ్రాతో కుదిరిన లీజు ఒప్పందం మేరకు వచ్చే 30ఏళ్ల పాటు ‘ఐఆర్బీ గోల్కొండ ఎక్స్ప్రెస్ వే’ సంస్థ.. ఓఆర్ఆర్పై వాహనాల నుంచి టోల్ వసూలు చేయడం, రహదారుల నిర్వహణ, అవసరమైన మరమ్మతులు చేపట్టడం, ఇతర ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) బాధ్యతలను చేపట్టనుంది. హెచ్జీసీఎల్ ఇక ఓఆర్ఆర్ను ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్లు, ఔటర్ మాస్టర్ప్లాన్ అమలు, పచ్చదనం పరిరక్షణ వంటి బాధ్యతలకు పరిమితం కానుంది. టోల్ రుసుముపై హెచ్ఎండీఏ పర్యవేక్షణ 2006లో హైదరాబాద్ మహానగరం చుట్టూ 8 లేన్లతో ఔటర్రింగ్రోడ్డును నిర్మించారు. 2018 నాటికి ఇది పూర్తయింది. జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) 2008లో విధించిన నిబంధనల మేరకు ఇప్పటివరకు టోల్ రుసుమును వసూలు చేస్తున్నారు. భవిష్యత్తులోనూ టోల్ రుసుము పెంపుపై హెచ్ఎండీఏ నియంత్రణ, పర్యవేక్షణ ఉంటాయని అధికారులు చెప్తున్నారు. ఏకమొత్తంగా రూ.7,380 కోట్ల చెల్లింపు! ‘టోల్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (టీఓటీ) విధానంలో ఔటర్ రింగ్రోడ్డును 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు గతేడాది ఆగస్టు 11న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే సంవత్సరం నవంబర్ 9న అంతర్జాతీయ సంస్థల నుంచి హెచ్ఎండీఏ టెండర్లను ఆహ్వానించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి 11 బిడ్లు వచ్చాయి. ఇందులో చివరికి 4 సంస్థలు తుది అర్హత సాధించగా.. ఐఆర్బీ ఇన్ఫ్రాకు టెండర్ దక్కింది. ఒప్పందం మేరకు లీజు మొత్తం రూ.7,380 కోట్లను ఐఆర్బీ సంస్థ ఒకేసారి చెల్లిస్తుందని, ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవని హెచ్ఎండీఏ అధికారి ఒకరు చెప్పారు. ఒప్పందంలోని నిబంధనలన్నింటినీ కచ్చితంగా అమలు చేస్తామని.. మొత్తం నిధులు చెల్లించాకే ఔటర్ బాధ్యతలను అప్పగిస్తామని తెలిపారు. -
ఎన్హెచ్ నిర్మాణాల్లో ఏపీ టాప్
జాతీయ రహదారుల నిర్మాణంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మరోసారి తన సత్తాను చాటింది. 2022–23లో జాతీయ రహదారుల నిర్మాణంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలిపింది. ఈ మేరకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) నివేదిక వెల్లడించింది. కేంద్ర జాతీయ రహదారుల శాఖ నిధులతో రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ చేపట్టే రహదారుల నిర్మాణంలోనూ దేశంలో ఏపీ రెండోస్థానంలో నిలిచింది. తద్వారా ఎన్హెచ్ఏఐ రహదారుల నిర్మాణంలో, కేంద్రం నిధులతో ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యాన రోడ్ల నిర్మాణంలోనూ ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. రోడ్ల నిర్మాణాలకు గరిష్టంగా నిధులు రాబట్టడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాధించిన విజయానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. - సాక్షి, అమరావతి ఆర్అండ్బీ ద్వారా నిర్మాణాల్లోనూ రెండోస్థానం కేంద్ర జాతీయ రహదారులు, రవాణా శాఖ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే రహదారుల్లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన సమర్థతను నిరూపించుకుంది. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి వరుసగా నాలుగో ఏడాది కూడా కేంద్రం నుంచి రికార్డు స్థాయిలో నిధులను సాధించింది. 2022–23 వార్షిక ప్రణాళికలో రాష్ట్రానికి రూ.12,130 కోట్లు రాబట్టింది. కేంద్ర ప్రభుత్వం ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వార్షిక ప్రణాళిక కింద ఆమోదించిన నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రహదారుల ప్రాజెక్టులను పరిశీలిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తి చెందితేనే ఆ మేరకు ఆర్థిక సంవత్సరం ఆఖరులో నిధులు మంజూరు చేస్తుంది. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వ పనితీరుతో పూర్తి సంతృప్తి చెందినందున రికార్డు స్థాయిలో వార్షిక ప్రణాళిక నిధులను కేంద్రం మంజూరు చేసింది. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధికంగా ఆంధ్రప్రదేశ్కే నిధులు మంజూరు చేయడం విశేషం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో 2014–19 వరకు భాగస్వామిగా ఉన్నప్పటికీ నాటి టీడీపీ ప్రభుత్వం పెద్దగా నిధులు రాబట్టలేకపోయింది. ఐదేళ్లలో టీడీపీ సర్కారు కేవలం రూ.10,661 కోట్లు మాత్రమే తీసుకువచ్చింది. కానీ, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కానప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ రహదారుల నిర్మాణానికి రికార్డుస్థాయిలో నిధులు తీసుకురావడం విశేషం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క 2022–23లోనే రూ.12,130 కోట్లు సాధించింది. మొత్తం నాలుగేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో రూ.23,471.92 కోట్లు సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2019 జూన్ నాటికి రాష్ట్రంలో 6,861.68 కి.మీ.మేర జాతీయ రహదారులు ఉండేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా 1,302.04 కి.మీ. మేర జాతీయ రహదారులను నిర్మించింది. దాంతో 2023 మార్చి నాటికి రాష్ట్రంలో 8,163.72 కి.మీ.మేర జాతీయ రహదారులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పారిశ్రామిక, తీర ప్రాంతాలు, ఎకనావిుక్ జోన్లు, పర్యాటక ప్రదేశాలను అనుసంధానిస్తూ రహదారుల అభివృద్ధి జోరందుకుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా మిన్నగా... ఎన్హెచ్ఏఐ 2022–23లో దేశవ్యాప్తంగా 6,003 కి.మీ. మేర రహదారులను నిర్మించింది. అందులో అత్యధికంగా 845 కి.మీ.మేర జాతీయ రహదారుల నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ (740 కి.మీ.), మూడో స్థానంలో మధ్యప్రదేశ్ (524 కి.మీ.), నాలుగో స్థానంలో జార్ఖండ్ (442 కి.మీ.), ఐదో స్థానంలో కర్ణాటక (419 కి.మీ.) నిలిచాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా జాతీయ రహదారులను నిర్మించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో కొత్త జాతీయ రహదారుల్లో 56శాతం హైబ్రీడ్ యాన్యుటీ విధానం (హెచ్ఏఎం)లో, ఈపీసీ విధానంలో 35శాతం, ఐటం రేట్ విధానంలో 8శాతం, బీవోటీ విధానంలో ఒక శాతం నిర్మించినట్లు ఎన్హెచ్ఏఐ వెల్లడించింది. ఇక ప్రా జెక్టు నిర్మాణ విలువలో కూడా అత్యధికంగా 68 శాతంతో హెచ్ఏఎం విధానంలోనే నిర్మించారు. -
ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్ట్యాగ్ వసూళ్ల రికార్డు
న్యూఢిల్లీ: ఫాస్ట్ట్యాగ్ సిస్టమ్ ద్వారా రోజువారీ టోల్ వసూళ్లు రూ.193.15 కోట్లకు చేరాయని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) మంగళవారం తెలిపింది. ఏప్రిల్ 29న ఒక్క రోజులో 1.16 కోట్ల లావాదేవీల ద్వారా ఈ రికార్డు నమోదయినట్లు పేర్కొంది. 2021 ఫిబ్రవరిలో ఫాస్ట్ట్యాగ్ విధానాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఫాస్టాగ్ లేని వాహనాల నుంచి రెట్టింపు టోల్ ఫీజులు వసూలు చేస్తోంది. అప్పటి నుంచి ఒక్క రోజులో ఫాస్టాగ్ ద్వారా ఇంత భారీ మొత్తంలో వసూళ్లు జరగడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమం కింద టోల్ ప్లాజాల సంఖ్యను 770 నుంచి 1,228కి పెంచినట్లు ఎన్హెచ్ఏఈ తెలిపింది. ఇందులో 339 రాష్ట్ర టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 6.9కోట్ల ఫాస్టాగ్ కార్డులను జారీ చేసినట్లు ఎన్హెచ్ఏఐ వెల్లడించింది.టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు కేంద్రం ఈ ఫాస్టాగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో అటవీ సందర్శకులకు గుడ్ న్యూస్.. ఇక దూసుకెళ్లడమే! -
డిజిటల్ రోడ్లు రాబోతున్నాయ్!
(కేజీ రాఘవేంద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం): దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల వెంట 10 వేల కిలోమీటర్ల మేర ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్సీ) ఏర్పాటు చేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. తొలి విడతతో ప్రయోగాత్మకంగా 1,367 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఢిల్లీ–ముంబై జాతీయ రహదారితోపాటు 512 కిలోమీటర్ల మేర హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారులను డిజిటల్ రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎల్ఎంఎల్) పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) కూడా ఏర్పాటు చేసింది. జాతీయ రహదారి పక్కన 3 మీటర్ల మేర డెడికేటెడ్ కారిడార్లో ఓఎఫ్సీ ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారి సైతం డిజిటల్ రోడ్డుగా మారనుంది. డిజిటల్ రోడ్ల ఏర్పాటుతో ఈ రహదారి వెంట 5జీ, 6జీ నెట్వర్క్ సేవలు లభించడంతోపాటు రహదారి వెంట ఉన్న మారుమూల ప్రాంతాలకు కూడా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. ఈ కేబుల్ నెట్వర్క్ను ఎక్కడికక్కడ వినియోగించుకునేందుకు ప్లగ్ అండ్ ప్లే విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. తద్వారా ఈ రహదారి వెంట ఐటీ, ఐటీ అనుబంధ కంపెనీల ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఐటీ కంపెనీల ఏర్పాటుకూ అనుకూలం జాతీయ రహదారి వెంట ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు అవకాశాలు పెరుగుతాయి. హైదరాబాద్–బెంగళూరు రహదారి వెంట ఉన్న తెలుగు రాష్ట్రాల్లో గల జడ్చర్ల, కర్నూలు, అనంతపురం, గుత్తి, హిందుపూర్ వంటి ప్రాంతాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఉండనుంది. డిజిటల్ రోడ్ల వల్ల టైర్–2, 3 పట్టణాల్లో కూడా ఐటీ కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఏర్పడుతుంది. ♦ హైదరాబాద్లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేసే సంతోష్ అనంతపురం జిల్లాలోని స్వగ్రామానికి బయలుదేరాడు. మధ్యలో కంపెనీ నుంచి ఫోనొచ్చింది. అర్జెంటుగా క్లయింట్తో మాట్లాడమని. దగ్గరలోనే రహదారి వెంట ఏర్పాటైన ప్లగ్ అండ్ ప్లే వర్క్ స్టేషన్లోకి వెళ్లి క్లయింట్తో మాట్లాడిన సంతోష్ క్లయింట్కు గల అనుమానాలను నివృత్తి చేశారు. తన హెడ్కు ఇదే విషయాన్ని కమ్యూనికేట్ చేశాడు. కంపెనీ నుంచి సంతోష్కు అభినందనలు వెల్లువెత్తాయి. ♦ హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న రమేష్కు ఓ అలర్ట్ వచ్చింది. ఆ రహదారిలో యాక్సిడెంట్ అయ్యిందని.. రాకపోకలు స్తంభించిపోయాయని.. రోడ్డు క్లియర్ అయ్యేందుకు మరో గంట సమయం పడుతుందని అందులోని సారాంశం. దీంతో రమేష్ ప్రత్యామ్నాయ మార్గంలో తన ప్రయాణం కొనసాగించి సకాలంలో ఇంటికి చేరుకున్నాడు. ఇవేకాదు.. రానున్న రోజుల్లో డిజిటల్ రోడ్ల ఏర్పాటుతో మరింత సౌకర్యవంతమైన ప్రయాణంతోపాటు దారి వెంట మారుమూల ప్రాంతాల్లో కూడా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చి 5జీ, 6జీ సేవలు లభించనున్నాయి. ప్రయోజనాలివీ..! ♦ జాతీయ రహదారి వెంట వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ తెలిసే అవకాశం ఉండటంతో రోడ్డు ప్రమాదాలు తగ్గనున్నాయి. వాహనం నడిపే డ్రైవర్లకు అవసరమైన, కచ్చితమైన సమాచారం అందుతుంది. ♦ రియల్ టైం డేటాను ప్రయాణికులకు అందించడం ద్వారా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునేందుకు మరింత మెరుగ్గా అవకాశం కలుగుతుంది. ప్రమాదాలను నివారించే అవకాశం ఏర్పడుతుంది. పక్కా సమాచారం అందటం వల్ల ప్రయాణ సమయం కూడా తగ్గనుంది. ♦ డ్రోన్లను వినియోగించుకునే వీలు కలుగుతుంది. తద్వారా రిమోట్ ఏరియాల్లో సమాచారాన్ని కూడా పొందవచ్చు. ప్రతిసారి ఏవైనా పనులు చేపట్టే సంస్థ సైట్ విజిట్స్ను తగ్గించుకోవచ్చు. డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు ఏరియల్ సర్వే చేసే వీలవుతుంది. ♦ డ్రైవర్ అవసరం లేకుండా రోడ్లపై పరుగులు పెట్టనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా నడిచే వాహనాల వినియోగానికి ఈ రహదారులు మరింత అనువుగా ఉండనున్నాయి. ♦ ఈ రహదారులు మొత్తం కమాండ్ కంట్రోల్కు అనుసంధానించే వీలుంది. తద్వారా జాతీయ రహదారి వెంట ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే స్పందించే వీలు కలుగుతుంది. -
తెలుగు రాష్ట్రాల్లో అటవీ సందర్శకులకు గుడ్ న్యూస్..
తెలుగు రాష్ట్రాల్లో అటవీ ప్రాంతాలను సందర్శించే వారి కోసం ఎన్హెచ్ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ అధికారులు, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అనుబంధ సంస్థ ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ తాజాగా ఒప్పందం చేసుకున్నాయి. రెండు సంస్థల మధ్య కుదిరిన ఈ అవగాహన ఒప్పందం అటవీ ప్రాంతంలోకి వాహనాలు ప్రవేశించే ప్రక్రియను సులభతరం చేయడానికి మార్గం సుగమం చేస్తుందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం.. ఫారెస్ట్ ఎంట్రీ పాయింట్ల వద్ద ఫాస్ట్ట్యాగ్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. టైగర్ రిజర్వ్లోని వివిధ ప్రవేశ ద్వారాల వద్ద వసూలు చేసే ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్ కోఆర్డినేషన్ (ఈఎంసీ) రుసుమును ఫాస్ట్ట్యాగ్ ద్వారా వసూలు చేయనున్నారు. ఫారెస్ట్ ఎంట్రీ పాయింట్ల వద్ద ఫాస్ట్ట్యాగ్ ఆధారిత చెల్లింపులను ప్రారంభించడం వల్ల వాహనాల సుదీర్ఘ క్యూలు, జాప్యాలను నివారించవచ్చు. తద్వారా సందర్శకులు అటవీ ప్రాంతాలలోని అందాలను, ఆహ్లాదకర వాతావరణాన్ని, వన్యప్రాణులను ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆస్వాదించవచ్చు. టోల్ ప్లాజాల వద్ద ఆటోమేటిక్ టోల్ చెల్లింపుల కోసం ఎన్హెచ్ఏఐ ఫాస్ట్ట్యాగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సాంకేతికత ఆధారంగా పనిచేస్తుంది. దేశంమంతటా అన్ని ఫోర్-వీలర్లు, భారీ వాహనాలకు ఫాస్ట్ట్యాగ్ తప్పనిసరి. -
పెరిగిన టోల్ నేటి అర్ధరాత్రి నుంచే అమలు.. ఛార్జీలు వివరాలు ఇలా
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల్లో చార్జీల పెంపు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. రోడ్ల నిర్వహణకు సంబంధించి ఏటా ఏప్రిల్ ఒకటి నుంచి చార్జీల పెంపును ఆనవాయితీగా తీసుకున్న జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ).. ఈసారి కూడా కొత్త చార్జీలను సిద్ధం చేసింది. గతేడాది వివిధ కేటగిరీల వాహనాలకు సంబంధించి 8 శాతం నుంచి 15 శాతం వరకు ధరలు పెంచగా.. ఈసారి వాహనదారులపై కాస్త దయతలిచి 5.50 శాతంలోపే పెంపును పరిమితం చేసింది. (వాహనదారులకు షాక్?.. పెరగనున్న టోల్ చార్జీలు.. ఎంతంటే?) విజయవాడ రహదారిలోని పంతంగి టోల్ ప్లాజాను ఉదాహరణగా తీసుకుంటే.. గతేడాది కారు/జీపు/వ్యాన్ కేటగిరీలో చార్జీని రూ.80 నుంచి రూ.90కి అంటే రూ.10 పెంచగా... ఈసారి రూ.90 నుంచి రూ.95కు అంటే రూ.5 మాత్రమే పెంచింది. ఇక గతేడాది టోల్ ధరలు అమల్లోకి వచ్చాక కొత్తగా ఐదు ప్రాంతాల్లో టోల్గేట్లు అందుబాటులోకి వచ్చాయి. పెరగనున్న ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో టోల్ప్లాజాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.1,820 కోట్లు సమకూరాయి. ఈసారి దేశవ్యాప్తంగా మరిన్ని టోల్గేట్లు అందుబాటులోకి రావడం, ధరల పెంపు నేపథ్యంలో టోల్ వసూళ్లు రూ.2 వేలకోట్లను దాటిపోతాయని అంచనా. ఫాస్టాగ్తో కచ్చితమైన ఆదాయం గతంలో టోల్గేట్ల వద్ద నిర్వాహకులు భారీగా అక్రమాలకు పాల్పడటంతో.. వాహనాల నుంచి వసూలు చేసిన మొత్తంలో దాదాపు 25 శాతం పక్కదారి పట్టేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీనితో ప్రభుత్వ ఖజానాకు చేరే మొత్తం తక్కువగా కనిపించేది. ఫాస్టాగ్ అమల్లోకి వచ్చాక అక్రమాలకు తెరపడి, ప్రతి రూపాయి లెక్కలోకి వస్తోంది. దీనితో గత మూడేళ్లుగా టోల్ వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 98.6 శాతం వాహనాలు ఫాస్టాగ్ను వినియోగిస్తున్నాయి. విజయవాడ రోడ్డులోని కోర్లపహాడ్ ప్లాజాలో.. కార్లు, జీపులు సింగిల్ జర్నీ చార్జి రూ.120 నుంచి రూ.125కు.. రిటర్న్ జర్నీ రూ.180 నుంచి రూ.200కు.. నెల పాస్ రూ.4,025 నుంచి రూ.4,225కు.. ► లైట్ కమర్షియల్ వాహనాలకు సింగిల్ ట్రిప్ రూ.190–రూ.200, రిటర్న్ జర్నీ రూ.285–రూ.300, నెలపాస్ రూ.6,385–రూ.6,710.. ► బస్సు, ట్రక్కులకు సింగిల్ ట్రిప్ రూ.395–రూ.415, రిటర్న్ జర్నీ రూ.595–రూ.625, నెలపాస్ రూ.13,240–రూ.13,910కు.. ► ఓవర్ సైజ్డ్ వెహికల్స్ సింగిల్ ట్రిప్ రూ.765 నుంచి రూ.805కు, రిటర్న్ జర్నీ 1,150–రూ.1,210, నెలపాస్ రూ.25,540–రూ.26840కు సవరించారు. చిల్లకల్లు టోల్ప్లాజాలో.. కార్, జీప్ సింగిల్ ట్రిప్పు రూ.100 నుంచి రూ.105కు, రిటర్న్ జర్నీ రూ.150–రూ.160, నెలపాస్ రూ.3,350–రూ.3,520కు పెంచారు. ► లైట్ కమర్షియల్ వాహనాలకు సింగిల్ ట్రిప్పు రూ.160 నుంచి రూ.165కు, రిటర్న్ జర్నీ రూ.240–రూ.250, నెలపాస్ రూ.5,290–రూ.5,560కు.. ► బస్సు, ట్రక్కులకు సింగిల్ ట్రిప్పు రూ.330–రూ.345, రిటర్న్ జర్నీ రూ.490–రూ.515, నెలపాస్ రూ.10,940–రూ.11,495కు.. ► హెవీ వెహికల్స్ సింగిల్ ట్రిప్పు రూ.635–రూ.665, రిటర్న్ జర్నీ రూ.955–రూ.1,000, నెలపాస్ రూ.21,170–రూ.22,240కు సవరించారు. జాతీయ రహదారి 765 మీద కడ్తాల్ వద్ద.. కార్లు, జీపులకు సింగిల్ ట్రిప్పు రూ.45, రిటర్న్ జర్నీ రూ.65, నెల పాస్ రూ.1,495కు.. ► లైట్ వెహికల్స్ సింగిల్ ట్రిప్పు రూ.75, రిటర్న్ జర్నీ రూ.110, నెలపాస్ రూ.2,420కు.. ► బస్సు ట్రక్కులకు సింగిల్ ట్రిప్పు రూ.150, రిటర్న్ జర్నీ రూ.230, నెల పాస్ రూ.5,070 ► హెవీ వెహికల్స్ సింగిల్ ట్రిప్పు రూ.290, రిటర్న్ జర్నీ రూ.435, నెలపాస్ రూ.9,675కు పెంచారు. జాతీయ రహదారి 167పై మహబూబ్నగర్ జిల్లా మున్ననూర్ టోల్ ప్లాజా.. కార్లు, జీపుల సింగిల్ ట్రిప్పు రూ.45, రిటర్న్ జర్నీ రూ.65, నెలపాస్ రూ.1,475కు పెంచారు. ► లైట్ వెహికల్ సింగిల్ ట్రిప్పు రూ.70, రిటర్న్ జర్నీ రూ.105, నెలపాస్ రూ.2,385కు.. ► బస్సులు, ట్రక్కుల సింగిల్ ట్రిప్పు రూ.150, రిటర్న్ జర్నీ రూ.225, నెలపాస్ రూ.4,995 ► భారీ వాహనాలకు సింగిల్ ట్రిప్పు రూ.285, రిటర్న్ జర్నీ రూ.430, నెలపాస్ రూ.9,540గా నిర్ధారించారు. జాతీయ రహదారి 163 చిట్లపల్లి టోల్ప్లాజా వద్ద కార్లు, జీపులకు సింగిల్ ట్రిప్పు రూ.65, రిటర్న్ జర్నీ రూ.95, నెలపాస్ రూ.2,110కు పెంచారు. ► లైట్ వెహికల్స్ సింగిల్ ట్రిప్పు రూ.100, రిటర్న్ జర్నీ రూ.155, నెల పాస్ రూ.3,410కు.. ► బస్సు/ట్రక్కులకు సింగిల్ ట్రిప్పు రూ.215, రిటర్న్ జర్నీ రూ.320, నెలపాస్ రూ.7,145కు.. ► హెవీ వెహికల్స్కు సింగిల్ ట్రిప్పు రూ.410, రిటర్న్ జర్నీ రూ.615, నెలపాస్ రూ.13,645కు పెంచారు. -
వాహనదారులకు షాక్?.. పెరగనున్న టోల్ చార్జీలు.. ఎంతంటే?
వాహనదారలు నెత్తిన టోల్ బాదుడుకు రంగం సిద్ధమైంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనూ ఎన్హెచ్ఏఐ టోల్ ఛార్జీలను సమీక్షిస్తుంది. అందులో భాగంగా ఈసారి 5 నుంచి 10 శాతం మేర పెరగనున్నట్లు తెలుస్తోంది. కొత్త రేట్ల లిస్టును ఎన్హెచ్ఏఐ ఈరోజు రాత్రి లేదా రేపు విడుదల చేయనుంది. 2008 నేషనల్ హైవేస్ ఫీజ్ ప్రకారం.. ప్రతి ఏడు కేంద్ర రవాణ శాఖ టోల్ ఛార్జీల పెంపుపై కొన్ని ప్రతిపాదనలు తెస్తుంది. ఆ ప్రతిపాదనలకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత ఏప్రిల్ 1వ తేదీ నుండి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం కార్లు, తేలికపాటి వాహనాలపై ఒక్కో ట్రిప్పుకు ఐదు శాతం, భారీ వాహనాలకు టోల్ టాక్స్ అదనంగా 10 శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం టోల్ టాక్స్ లను పెంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చదవండి: టోల్ప్లాజా, ఫాస్టాగ్ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు! -
టోల్ప్లాజా, ఫాస్టాగ్ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు!
టోల్ ప్లాజాల వద్ద పొడవైన క్యూలను నివారించేందుకు కేంద్రం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) తరహాలో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ (ఫాస్టాగ్)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సాంప్రదాయ టోల్ వసూళ్ల విషయంలో కేంద్రం మార్పులు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో టోల్ వసూళ్లపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఆరునెలల్లో దేశంలోని అన్నీ టోల్ ప్లాజాల వద్ద..జీపీఎస్ టోల్ కలెక్షన్ (GPS-based toll collection) సిస్టమ్ను అందుబాటులోకి తేనున్నట్లు గడ్కరీ చెప్పారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ (cii) నిర్వహించిన కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ.. కొత్త టోల్ కలెక్షన్ ద్వారా టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీతో పాటు.. వాహనదారులు ప్రయాణించిన దూరాన్ని బట్టి ఖచ్చితమైన టోల్ ఛార్జీలను వసూలు చేసే అవకాశం కలగనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఎన్హెచ్ఏఐ జీపీఎస్- ఆధారిత వ్యవస్థ ప్రైలెట్ ప్రాజెక్ట్ పనిచేస్తోందని అన్నారు. ఈ ప్రాజెక్ట్లో భాగంగా టోల్ ప్లాజాల వద్ద వాహనాల్ని ఆపివేయకుండా.. వాహనాల నెంబర్ ప్లేట్లపై నంబర్లను గుర్తించే టెక్నాలజీపై పనిచేస్తోన్నట్లు తెలిపారు. రూ.1.40 లక్షల కోట్లకు చేరనున్న ఆదాయం ఇక టోల్ ఫీజు వసూళ్ల ద్వారా నేషనల్ హైవే అథారటీ ఆఫ్ ఇండియా (nhai)కు ఏడాదికి రూ.40వేల కోట్ల ఆదాయం వస్తోందని, మరో 2-3 ఏళ్లలో రూ.1.40లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు అంచనా వేశారు. వేచి చూసే సమయం మరింత తగ్గుతుంది 2018-19లో టోల్ ప్లాజాల వద్ద వెహికల్స్ కనీసం 8 నిమిషాల పాటు ఆగాల్సి వచ్చేంది. 2020-21, 2021-22లో ప్రవేశపెట్టిన ఫాస్టాగ్తో వాహనాలు నిలిపే సమయం 47 సెకండ్లకు తగ్గిందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సీఐఐ సమావేశంలో వివరించారు. చదవండి👉 ‘హార్ట్ ఎటాక్’ను గుర్తించే యాపిల్ వాచ్ సిరీస్ 8పై భారీ డిస్కౌంట్లు! -
నాగ్పూర్ టూ విజయవాడ: ఎకనమిక్ కారిడార్కు లైన్క్లియర్
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానిస్తూ నిర్మించనున్న తొలి ఎకనమిక్ కారిడార్కు పూర్తిగా లైన్ క్లియర్ అయింది. నాగ్పూర్ నుంచి విజయవాడ వరకు నిర్మించే ఈ కారిడార్ తెలంగాణ – ఏపీ మధ్య 306 కి.మీ మేర కొనసాగనుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన మొత్తం రూ.10 వేల కోట్ల ని«ధులకు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ ఆదీనంలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ (ఎస్ఎఫ్సీ) పచ్చజెండా ఊపింది. ఈ రోడ్డును తొమ్మిది ప్యాకేజీలుగా విభజించి టెండర్ల ప్రక్రియ చేపట్టారు. ఇప్పటికే తొలి ఆరు ప్యాకేజీలకు మార్గం సుగమం కావటంతో టెండర్ల ప్రక్రియ దాదాపు పూర్తికాగా, చివరి మూడు ప్యాకేజీలకు తాజాగా ఎస్ఎఫ్సీ ఓకే చెప్పి నిధులు మంజూరు చేసింది. దీంతో తెలంగాణ (మంచిర్యాల) నుంచి విజయవాడకు పూర్తిగా కొత్త (గ్రీన్ఫీల్డ్) యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్వే నిర్మాణానికి రంగం సిద్ధమైంది. రెండున్నరేళ్లలో ఈ జాతీ య రహదారి రెడీ అవుతుందని జాతీయ రహదారు ల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) పేర్కొంటోంది. మహారాష్ట్ర–తెలంగాణ–ఆంధ్ర: ఓవైపు పర్యావ రణ అభ్యంతరాలు, మరోవైపు భూసేకరణపై ప్రజల నిరసనలు, అలైన్మెంట్ మార్చాలంటూ రాజకీయ నేతల ఒత్తిళ్లు.. వెరసి ఈ ఎకనమిక్ కారిడార్పై ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి. వాటన్నింటినీ తోసిపుచ్చుతూ ఇప్పుడు ఎన్హెచ్ఏఐ రోడ్డు నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ కొత్త జాతీయ రహదారి మూడు రాష్ట్రాల మీదుగా సాగనుంది. మహారాష్ట్రలోని నాగ్పూర్లో మొదలై తెలంగాణలోని ఆసిఫాబాద్–మంచిర్యాల–వరంగల్–ఖమ్మంల మీదుగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ వరకు కొనసాగుతుంది. నాగ్పూర్ నుంచి తెలంగాణలోని ఆసిఫాబాద్ మీదుగా మంచిర్యాల వరకు ఇప్పటికే ఉన్న రోడ్డును నాలుగు వరసలకు విస్తరిస్తున్నారు. ఇక్కడివరకు పాత రోడ్డు (బ్రౌన్ఫీల్డ్ హైవే) కొత్తగా మారుతుందన్నమాట. మంచిర్యాల నుంచి కొత్తగా భూసేకరణ జరిపి పూర్తి కొత్త రోడ్డుగా నిర్మిస్తారు. 45 మీటర్ల వెడల్పుతో నాలుగు వరసలుగా ఈ రోడ్డు నిర్మితమవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ మీదుగా విజయవాడకు ఉన్న రోడ్డు పైనే ఎక్కువ వాహనాలు వెళ్తున్నాయి. దీంతో ఈ రోడ్డు బాగా రద్దీగా మారింది. ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా ఈ కొత్త రోడ్డు అందుబాటులోకి రానున్నందున.. నాగ్పూర్ నుంచి వచే ట్రాఫిక్, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల వాహనాలు దీని మీదుగానే ముందుకు సాగేందుకు వీలవుతుంది. ఈ కొత్త జాతీయ రహదారి కోసం 1,550 హెక్టార్ల భూమిని సేకరించారు. ఇదీ ప్యాకేజీల స్వరూపం ప్యాకేజీ 1,2,3 మంచిర్యాల నుంచి వరంగల్ వరకు 108.406 కి. మీ నిడివి. వ్యయం రూ.3,440.94 కోట్లు. టెండర్ల ప్రక్రియ పూర్తయింది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు పనులు దక్కాయి. అనుసంధానమయ్యే ప్రధాన పట్టణాలు.. మంచిర్యాల, మంథని, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, వరంగల్, పర్కాల, ఆత్మకూరు, శాయంపేట, దామెర. ప్యాకేజీ 4, 5, 6 వరంగల్ నుంచి ఖమ్మం వరకు 108.24 కి.మీ నిడివి. వ్యయం రూ.3,397.01 కోట్లు. ప్రస్తుతం టెక్నికల్ బిడ్ మదింపు జరుగుతోంది. అనుసంధానమయ్యే ముఖ్య పట్టణాలు.. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, ఊరుగొండ, గీసుగొండ, మచ్చాపూర్, సంగెం, నెక్కొండ, పర్వతగిరి, వెంకటయ్యపాలెం. ప్యాకేజీ 7, 8, 9 ఖమ్మం నుంచి విజయవాడ వరకు 89.42 కి.మీ నిడివి. వ్యయం రూ.3,007 కోట్లు. స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ తాజాగా ఈ ప్యాకేజీకే నిధులు మంజూరు చేసింది. ఇక టెండర్లు పిలవాల్సి ఉంది. అనుసంధానమయ్యే ముఖ్య పట్టణాలు.. సిరిపురం, తునికిపాడు, ఆత్కూరు, రెమిడిచెర్ల, దుగ్గిరాలపాడు, జక్కంపూడి. -
వాహనదారులకు షాక్.. పెరగనున్న టోల్ చార్జీలు!
హైవేలపై ప్రయాణించే వాహదారులకు టోల్ బాదుడు మరింత పెరగనుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హోచ్ఏఐ) ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై టోల్ రేట్లను పెంచే అవకాశం ఉందని హిందీ దినపత్రిక హిందూస్థాన్ ప్రచురించింది. దీని ప్రకారం.. టోల్ రేట్లు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశం ఉంది. జాతీయ రహదారుల రుసుము నియమావళి-2008 ప్రకారం.. సాధారణంగా ఏటా ఏప్రిల్ 1 నుంచి కొత్త టోల్ చార్జీ రేట్లు అమలులోకి వస్తాయి. అవసరాలను బట్టి నిర్దిష్ట టోల్ విషయమై విధాన నిర్ణయాలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటారు. ఇదీ చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్! రూ.295 కట్ అవుతోందా? ఎందుకో తెలుసుకోండి.. టోల్ ఫీజు పెంపు ప్రతిపాదనలను కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మార్చి నెల చివరి వారంలోపు పరిశీలించి ఆమోదించే అవకాశం ఉందని హిందూస్థాన్ నివేదిక పేర్కొంది. కార్లు, తేలికపాటి వాహనాలపై 5 శాతం, ఇతర భారీ వాహనాలపై 10 శాతం వరకు టోల్ చార్జీ పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వాహనదారులకు టోల్ ఫీజుపై రాయితీ ఇస్తూ నెలవారీ పాస్లు జారీ చేస్తుంటారు. ఆ పాస్ రుసుము కూడా 10 శాతం పెరుగుతుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: Samsung Galaxy Z Fold 5: మడత అంటే ఇదీ.. పర్ఫెక్షన్ అంటే ఇదీ! -
‘లైనే కదా అని దాటితే.. జరిమానా మోత
సాక్షి, అమరావతి: ‘లైనే కదా అని దాటితే.. జరిమానా మోత మోగుతుంది..’ అంటోంది జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ). హైవేలపై నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించే వాహనాలపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. హైవేలతోపాటు రాష్ట్ర ప్రధాన రహదారులపై కూడా ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. మార్కింగ్ లైన్లు దాటి వాహనాలు ప్రయాణిస్తుండటంతో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని ఈ నిర్ణయం తీసుకుంది. 2022లో హైవేలపై భారీ వాహనాలు మార్కింగ్ లైన్లు దాటి ప్రయాణించడంతో సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో 8,200 మంది దుర్మరణం చెందారు. ఇటీవల రోడ్డు ప్రమాదాల నివారణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ప్రధానంగా భారీ వాహనాలు మార్కింగ్ లైన్లు దాటి ప్రయాణిస్తుండటం ప్రమాదాలకు దారితీస్తోందని గుర్తించారు. మార్కింగ్ లైన్లు దాటి ప్రయాణించే వాహనాలపై ఎన్హెచ్ఏఐ భారీ జరిమానాలను ఖరారుచేసింది. భారీ వాహనాలు కచ్చితంగా హైవేలపై ఎడమలైన్లోనే ప్రయాణించాలి. ముందు నెమ్మదిగా వెళుతున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయాల్సి వస్తే తప్ప లైన్ దాటడానికి వీల్లేదు. అలా ఓవర్టేక్ చేసిన వెంటనే మళ్లీ ఎడమవైపు లైన్లోకి వచ్చేయాలి. అలాకాకుండా ఒక 200 మీటర్లకు మించి ఎడమవైపు లైన్ను దాటి ప్రయాంచే భారీ వాహనాలపై తొలిసారి రూ.500 జరిమానా విధిస్తారు. అదే వాహనం తరువాత లైన్ క్రాస్చేస్తే ప్రతిసారికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తారు. నిబంధనలు పాటించాలి భారీ వాహనాలు కచ్చితంగా నిబంధనలను పాటించేలా హైవే పెట్రోలింగ్ అధికారులు కన్నేసి ఉంచాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. హైవే పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించిన వాహనాలతోపాటు హైవేలపై ఇప్పటికే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, టోల్గేట్ల వద్ద సీసీ కెమెరాల పుటేజీలను తరచూ పరిశీలించి నిబంధనలను ఉల్లంఘించే వాహనాలపై జరిమానాలు విధిస్తారు. రాష్ట్ర రహదారులపైన కూడా ఈ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడాలని కేంద్ర రవాణాశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అందుకుగాను రాష్ట్ర ప్రధాన రహదారులపై వాహనచోదకులకు మార్గనిర్దేశం చేసేలా సైన్ బోర్డులు, లైన్ మార్కింగులు కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త జరిమానాల విధానం అమలు చేయాలని చెప్పింది. ఈ లోపు రాష్ట్ర ప్రధాన రహదారులపై సైన్ బోర్డులు, లైన్ మార్కింగ్లు పూర్తిచేయాలని సూచించింది. -
స్మార్ట్ హైవేలుగా మన జాతీయ రహదారులు.. ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యాలు ఇవీ!
సాక్షి, అమరావతి: మన జాతీయ రహదారులు త్వరలో స్మార్ట్ హైవేలుగా రూపాంతరం చెందనున్నాయి. దేశంలో జాతీయ రహదారుల వెంబడి ఆప్టికల్ ఫైబర్ కేబుల్(ఓఎఫ్సీ) లైన్లు వేయాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. రూ.6వేల కోట్లతో 25వేల కి.మీ. మేర ఓఎఫ్సీ లైన్ల ఏర్పాటుకు భారీ ప్రణాళికను ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం ‘గతి శక్తి ప్రాజెక్టు’ కింద ఈ ప్రణాళిక రూపొందించింది. కేంద్ర టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్)తో కలసి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) స్మార్ట్ హైవేలు/డిజిటల్ హైవేల ప్రాజెక్ట్ కార్యాచరణకు ఉపక్రమించింది. మొదటగా పైలట్ ప్రాజెక్ట్ కింద ముంబై–ఢిల్లీ, హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారులలో 2వేల కి.మీ.మేర ఓఎఫ్సీ లైన్ల పనులు చేపట్టనుంది. ఇందుకోసం రూ.500కోట్ల అంచనా వ్యయంతో ఇటీవల టెండర్లు పిలిచింది. అనంతరం చెన్నై–విజయవాడ, ముంబై–అహ్మదాబాద్ జాతీయ రహదారుల్లో 5వేల కి.మీ. మేర పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. బహుళ ప్రయోజనకరంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ను మూడేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యాలు ఇవీ... ► బహుళ ప్రయోజనకరంగా స్మార్ట్ హైవేల ప్రాజెక్ట్కు రూపకల్పన చేశారు. 2050నాటికి విస్తృతం కానున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ను రూపొందించారు. ► దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ను విస్తరించడం ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా జాతీయ రహదారుల వెంబడి నిరంతరాయంగా 5జీ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండటంతోపాటు దేశవ్యాప్తంగా లాజిస్టిక్ రంగాన్ని విస్తృతం చేసేందుకు ఇది దోహదపడుతుంది. ► 5జీ సేవల కోసం ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఓఎఫ్సీ లైన్లు వేసేందుకు వివిధ అనుమతులు పొందేందుకు సుదీర్ఘ సమయం పడుతుంది. అందుకే జాతీయ రహదారుల వెంబడి కేంద్ర ప్రభుత్వమే డార్క్ ఫైబర్ కనెక్టివిటీని ఏర్పరచడానికి ఓఎఫ్సీ లైన్లు వేయాలని నిర్ణయించింది. ► హైవేల వెంబడి అవసరమైన చోట్ల ఓఎఫ్సీ లైన్లను నిర్ణీత ఫీజు చెల్లించి ప్రైవేటు టెలికాం ఆపరేటర్లు వాడుకునేందుకు ట్రాయ్ సమ్మతిస్తుంది. ‘ప్లగ్ అండ్ ప్లే’ విధానంలో ఓఎఫ్సీ లైన్లను ఉపయోగించేందుకు వీలుగా ఏర్పాటుచేస్తారు. ► దేశవ్యాప్తంగా త్వరలో టోల్ గేట్లను ఎత్తి వేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. టోల్ గేట్లు లేకుండా 5జీ నెట్వర్క్ సహకారంతో ఫాస్ట్ ట్యాగ్ ద్వారా టోల్ ఫీజు వసూలు చేస్తారు. అంటే ఓ వాహనం జాతీయ రహదారిపై ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరానికి మాత్రమే శాటిలైట్ ఆధారిత పరిజ్ఞానంతో ఆటోమేటిగ్గా టోల్ ఫీజు వసూలు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం జాతీయ రహదారుల వెంబడి 5జీ నెట్వర్క్ను ఏర్పాటు చేయాల్సి ఉంది. దానికి కూడా ఓఎఫ్సీ లైన్లు ఉపయోగపడతాయి. ► జాతీయ రహదారులపై భద్రత, నిఘా వ్యవస్థను పటిష్టం చేసేందుకు సీసీ కెమెరాలను విస్తృతంగా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం కూడా ఈ ఓఎఫ్సీ లైన్లు ఉపకరిస్తాయి. ► రహదారి భద్రతా చర్యల్లో భాగంగా జాతీయ రహదారులపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ రాడార్లు ఏర్పాటు చేయనున్నారు. ఓఎ‹సీ లైన్లు ద్వారానే స్పీడ్ రాడార్లు పనిచేస్తాయి. ► జాతీయ రహదారుల వెంబడి దశలవారీగా స్మార్ట్ హైవే లైటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు ఓఎఫ్సీ లైన్లు దోహదపడతాయి. -
ఫాస్టాగ్తో టోల్ కలెక్షన్ అదుర్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదార్లలో ఫాస్టాగ్ ద్వారా టోల్ వసూళ్లు గతేడాది రూ.50,855 కోట్లు నమోదయ్యాయి. 2021తో పోలిస్తే ఇది ఏకంగా 46 శాతం అధికం కావడం విశేషం. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ప్రకారం డిసెంబర్లో ఫాస్టాగ్ ద్వారా సగటున రోజుకు రూ.134.44 కోట్ల టోల్ ఫీజు వసూలైంది. గత నెల 24న గరిష్టంగా రూ.144.19 కోట్లు నమోదైంది. 2022లో ఫాస్టాగ్ లావాదేవీలు 48 శాతం అధికమై 324 కోట్లకు చేరుకున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 6.4 కోట్ల ఫాస్టాగ్స్ జారీ అయ్యాయి. ఫాస్టాగ్ ఆధారంగా ఫీజును స్వీకరించే టోల్ ప్లాజాల సంఖ్య 922 నుంచి గతేడాది 1,181కి చేరింది. -
వాహనదారులకు భారీ ఊరట?..ఫాస్టాగ్పై కోర్టులో పిటిషన్..అదే జరిగితే..
ఫాస్ట్ట్యాగ్ లేని వాహనాలకు రెట్టింపు టోల్ ట్యాక్స్ చెల్లించాలనే నిబంధనను తప్పనిసరి చేయడాన్ని సవాలు చేస్తూ రవీందర్ త్యాగి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై చీఫ్ జస్టీస్ సతీష్ చంద్ర శర్మ, జస్టీస్ సుబ్రమణియం ప్రసాద్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా...ఈ నిబంధన వివక్షపూరితంగా, ఏకపక్షంగా ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని చీఫ్ జస్టీస్ సతీష్ చంద్ర శర్మ బెంచ్ వాదించింది. వాహనదారులు ఫాస్టాగ్ వినియోగించకుండా నగదు రూపంలో చెల్లించినట్లయితే..వారి వద్ద నుంచి రెట్టింపు రేటుతో టోల్ వసూలు చేస్తున్నారనే పిటిషన్పై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ), కేంద్రం ప్రతిస్పందనను కోరింది. అధికారులు తమ ప్రత్యుత్తరాలను దాఖలు చేసేందుకు నాలుగు వారాల గడువు ఇచ్చిన హైకోర్టు..తదుపరి విచారణను ఏప్రిల్ 18న వాయిదా వేసింది. ఫాస్ట్ట్యాగ్ లేని వాహనదారుల నుంచి డబుల్ టోల్ ఛార్జీలు వసూలు చేసేలా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ ఆఫ్ ఇండియా(ఎంఓఆర్టీ అండ్ హెచ్), నేషనల్ హైవే అథారటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)తో కూడిన నేషనల్ హైవే ఫీజ్ అమాండ్మెంట్ రూల్స్ -2020 యాక్ట్ను రద్దు చేయాలని పిటిషన్ రవీందర్ త్యాగి కోరారు. చదవండి👉 పద్మభూషణ్ నుంచి.. కటకటాల్లోకి, ‘ఎంత పనిచేశావయ్యా అరవింద్’ ఈ నిబంధనలు, సర్క్యులర్ వల్ల టోల్ లేన్లను 100 శాతం ఫాస్ట్ట్యాగ్ లేన్లుగా మారుస్తున్నాయని, దీని ఫలితంగా ఫాస్ట్ట్యాగ్ లేని ప్రయాణికులు టోల్ మొత్తాన్ని రెట్టింపు చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పిటిషనర్, న్యాయవాది సైతం..టోల్ కంటే రెట్టింపు నగదు చెల్లించాల్సిన అవసరం ఉన్నందున తన కారులో ఫాస్ట్ట్యాగ్ పరికరాన్ని ఇన్స్టాల్ చేయవలసి వచ్చిందని పేర్కొన్నారు. ఫాస్ట్ట్యాగ్ను ఇన్స్టాల్ చేసే ముందు రెట్టింపు రేటుతో టోల్ ట్యాక్స్ చెల్లించానని చెప్పారు. ఢిల్లీ నుంచి హర్యానాలోని ఫరీదాబాద్ పర్యటనలో తాను చూసిన ప్రయాణికుల వేదనను ఆయన ప్రస్తావించారు. అంతేకాదు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (చట్టం ముందు సమానత్వం), 19 (వాక్ మరియు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ)లను ఉల్లంఘించడమేనని, డబుల్ టోల్ టాక్స్ వసూలు చేసే పద్ధతిని నిలిపివేయాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు. కాగా, ఈ పిటిషన్పై కేంద్రం సానుకూలంగా స్పందింస్తే డబుల్ టోల్ ట్యాక్స్ రద్దు చేయడం లేదంటే.. ఫాస్టాగ్ను వినియోగించేలా మరింత సమయం ఇచ్చే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే డబుల్ టోల్ ఛార్జీల నుంచి వాహనదారులకు ఊరట లభించనుంది. డబుల్ టోల్ ఛార్జీలు టోల్ గేట్ల వద్ద వాహనదారులు గంటల తరబడి వేచి ఉంచే సమయాన్ని తగ్గించేందుకు కేంద్రం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) తరహాలో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ (ఫాస్టాగ్)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఫిబ్రవరి 14, 2021న ఫాస్టాగ్ విషయంలో వాహనదారులకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. నేటి అర్ధరాత్రి నుంచి వాహనదారులకు ఫాస్టాగ్ తప్పని సరిగా వినియోగించాలని, లేదంటే రెట్టింపు టోల్ పే చెల్లించాల్సిందే. వాహన దారులు తప్పని సరిగా ఫాస్టాగ్ విధానంలోకి మారాల్సిందేనని కేంద్ర రవాణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వాహన యజమానులు వెంటనే ఫాస్టాగ్ తీసుకోవాలని సూచించింది. చదవండి👉 టోల్ప్లాజా, ఫాస్టాగ్ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు! -
రూ. 930 కోట్లతో ఆరు బైపాస్ రహదారులు .. కీలక ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ రహదారులను జిల్లా ప్రధాన రహదారులను అనుసంధానించే కీలక ప్రాజెక్టులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈమేరకు రాష్ట్రంలో ఆరు బైపాస్ రహదారుల నిర్మాణానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ఆమోదం తెలిపింది. ఒకేసారి ఆరు బైపాస్ల నిర్మాణానికి ఆమోదించడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రూ. 930 కోట్లతో మొత్తం 64.20 కి.మీ. మేర ఈ ఆరు బైపాస్ రహదారులను నిర్మించనున్నారు. పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, పర్యాటకపరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆరు పట్టణాలను జాతీయ రహదారులతో అనుసంధానిస్తూ ఈ బైపాస్ల నిర్మాణానికి రూపకల్పన చేశారు. వాటిలో రాయలసీమలోని తాడిపత్రి, వి.కోట, బైరెడ్డిపల్లి, ఆదోని, పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ఉన్నాయి. సరుకు రవాణా వాహనాల రద్దీ పెరిగిన దృష్ట్యా ఈ ఆరు పట్టణాల్లో బైపాస్ రహదారులు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థకు ప్రతిపాదనలు పంపింది. వీటిని ఇటీవల ఎన్హెచ్ఏఐ ఆమోదించింది. ఎన్హెచ్ఏఐ నిర్మించనున్న ఆరు బైపాస్ రహదారుల ప్రణాళిక ఇలా.. ► బెంగళూరు–చెన్నై రహదారిని అనుసంధానిస్తూ చిత్తూరు జిల్లా వి.కోట వద్ద నాలుగు లేన్ల బైపాస్ రహదారిని నిర్మిస్తారు. 10 కి.మీ. ఈ రహదారి నిర్మాణానికి రూ. 120 కోట్లు కేటాయించారు. ► కర్నూలు జిల్లా బైరెడ్డిపల్లి వద్ద నాలుగు లేన్ల బైపాస్ రహదారిని ఆరు కి.మీ. నిర్మిస్తారు. రూ. 70 కోట్లతో నిర్మాణానికి ఆమోదించారు. ► తాడిపత్రిలో పేవ్డ్ షోల్డర్స్తో రెండు లేన్ల బైపాస్ రహదారిని నిర్మిస్తారు. 10 కి.మీ. ఈ రహదారిని రూ. 95 కోట్లతో నిర్మించడానికి ఆమోదం తెలిపారు. ► ఆదోనిలో పేవ్డ్ షోల్డర్స్తో రెండు లేన్ల బైపాస్ రహదారిని నిర్మిస్తారు. 7 కి.మీ. ఈ రహదారి నిర్మాణానికి రూ. 80 కోట్లు కేటాయించారు. ► నరసాపురం వద్ద చెన్నై–కోల్కతా జాతీయ రహదారిని అనుసంధానిస్తూ పేవ్డ్ షోల్డర్స్తో రెండు లేన్ల బైపాస్ రహదారి నిర్మిస్తారు. 23.20 కి.మీ. ఈ రహదారిని రూ. 490 కోట్లతో నిర్మించడానికి ఆమోదించారు. ► అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు వద్ద పేవ్డ్ షోల్డర్స్గా బైపాస్ రహదారి నిర్మిస్తారు. 8 కి.మీ. ఈ రహదారి నిర్మాణానికి రూ. 75 కోట్లు కేటాయించారు. -
‘మినీ’తో విశాఖ ట్రాఫిక్ సమస్యలకు చెక్.. 67 కి.మీ.పరిధిలో 12 ఫ్లై ఓవర్లు
సాక్షి, అమరావతి: విశాఖలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది. విశాఖ నగరాన్ని దశాబ్దాలుగా వేధిస్తోన్న ట్రాఫిక్ సమస్యలకు త్వరలో ముగింపు పలకనుంది. అనకాపల్లి నుంచి విశాఖ నగరం గుండా ఆనందపురం వరకు జాతీయ రహదారిపై 12 మినీ ఫ్లై ఓవర్లు నిర్మించడానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) సంసిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు ‘వన్టైం ఇన్వెస్ట్మెంట్స్కీం’ కింద ఈ మినీ ఫ్లై ఓవర్లను మంజూరు చేసింది. కేవలం 67 కి.మీ.పరిధిలోనే 12 మినీ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ఆమోదం తెలపడం విశేషం. విశాఖ, గంగవరం పోర్టులు, విశాఖ విమానాశ్రయంతోపాటు త్వరలో నిర్మాణం ప్రారంభం కానున్న భోగాపురం విమానాశ్రయాన్ని అనుసంధానించే రహదారుల జంక్షన్లలో ఈ మినీ ఫ్లై ఓవర్లు నిర్మిస్తారు. అందుకోసం రూ.350 కోట్ల అంచనాతో ఎన్హెచ్ఏఐ ప్రాథమికంగా అనుమతులు మంజూరు చేసింది. సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లను రూపొందించేందుకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి కన్సల్టెన్సీలను ఖరారు చేసింది. అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు ఆ 12 జంక్షన్ల భౌగోళిక స్వరూపాన్ని అనుసరించి 3 డిజైన్లలో ఫ్లై ఓవర్లు నిర్మించనుంది. నాలుగు రోడ్ల జంక్షన్ అయితే ప్లస్ (+), మూడు రోడ్ల కూడలి అయితే వై (Y), రెండు రోడ్ల కూడలి అయితే టీ (T) ఆకృతిలో వాటిని ని ర్మించాలని నిర్ణయించారు. అవసరమైన ప్రదేశాల్లో అండర్ పాస్లు నిర్మిస్తారు. భవిష్యత్లో విశాఖ మెట్రో రైల్ నిర్మాణానికి ఇబ్బంది లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్హెచ్ఏఐను కోరింది. 12 మినీ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి డీపీఆర్లను 2023 జనవరి చివరినాటికి ఖరారు చేసి ఆమోదించాలని భావిస్తున్నట్లుగా ఎన్హెచ్ఏఐ పేర్కొంది. మార్చి–ఏప్రిల్లో టెండర్ల ప్రక్రియ చేపట్టి ఏడాదిన్నరలో పూర్తి చేయాలని భావిస్తోంది. మినీ ఫ్లై ఓవర్లు నిర్మించే జంక్షన్లు ఇవే.. లంకెలపాలెం, దువ్వాడ, స్టీల్ప్లాంట్ మెయిన్ గేట్, గాజువాక, డెయిరీ ఫాం,తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెం, గురుద్వార, సీతమ్మధార, మద్దిలపాలెం, ఎండాడ, మధురవాడ. -
‘ఆర్ఆర్ఆర్’పై హైస్పీడ్లో భూసేకరణ.. నవంబర్లో రంగంలోకి కలెక్టర్లు!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగు రోడ్డు ఉత్తర భాగం భూసేకరణ ప్రక్రియను అధికారులు వేగిరం చేశారు. ఇప్పటికే సర్వే పూర్తిచేసిన అధికారులు.. భూసేకరణ అవార్డ్ పాస్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించారు. అవార్డ్ పాస్ చేయాలంటే కచ్చితంగా పర్యావరణ అనుమతి వచ్చి ఉండాలి, ఇది రావాలంటే అటవీ అనుమతుల్లో స్టేజ్–1 మంజూరు కావాలి. ఈ రెండింటిని త్వరగా పొందేందుకు చర్యలు చేపట్టారు. అటవీ అనుమతులు.. గ్రామసభలు రీజనల్ రింగు రోడ్డు ఉత్తర భాగంలో 70 హెక్టార్ల మేర అటవీ భూములు పోనున్నాయి. అంతమేర స్థలాన్ని అటవీశాఖకు అప్పగిస్తే చెట్లను పెంచుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ స్థలాలిచ్చే అవకాశం లేదు. బదులుగా ఖాళీగా ఉన్న అటవీ భూముల్లో రెట్టింపు స్థలంలో మొక్కలను పెంచనున్నారు. మొక్కలు నాటి, ఐదేళ్ల వరకు సంరక్షించేందుకు అయ్యే ఖర్చును అటవీ శాఖకు జాతీయ రహదారుల సంస్థ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి స్పష్టమైన హామీతో అటవీశాఖ స్టేజ్–1 అనుమతిని ఇస్తుంది. డబ్బులు డిపాజిట్ చేశాక స్టేజ్–2 అనుమతులు వస్తాయి. ఇక పర్యావరణ అనుమతుల కోసం నవంబర్లో గ్రామసభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జాతీయ రహదారుల సంస్థ అధికారులు 4 జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశారు. కలెక్టర్లు గ్రామసభల తేదీలను ప్రకటించి, ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో వివరిస్తారు. గ్రామసభల ఆమోదంతో పర్యావరణ అనుమతులు రానున్నాయి. ఆరు నెలలకోసారి వాహన శబ్దాలపై సమీక్ష రీజనల్ రింగ్ రోడ్డు యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే అయినందున వాహనాలు వేగంగా ప్రయాణిస్తాయి. ఈ రోడ్డును ప్రధాన పట్టణాలకు చేరువగా నిర్మిస్తుండటంతో శబ్ద కాలుష్యం జనావాసాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ క్రమంలో అవసరమైన ప్రాంతాల్లో శబ్దాన్ని నిరోధించే నాయిస్ బారియర్లను ఏర్పాటు చేస్తారు. మిగతా ప్రాంతాల్లో జనావాసాల్లోకి వెళ్లే శబ్దాన్ని అడ్డుకునేలా రోడ్ల పక్కన పొడవుగా ఉండే చెట్లను పెంచుతారు. వెలువడే శబ్దం పరిస్థితి పరికరాల ద్వారా ప్రతి ఆరు నెలలకోసారి సమీక్షిస్తారు. శబ్ద కాలుష్యం నిర్ధారిత పరిమాణాన్ని మించి ఉంటే మరిన్ని చర్యలకు సిఫార్సు చేస్తారు. ఈ వివరాలను వచ్చే నెలలో జరిగే గ్రామసభల్లో వివరించనున్నారు. -
ఎన్హెచ్ఏఐ రూ. 1,217 కోట్ల సమీకరణ
న్యూఢిల్లీ: ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) ద్వారా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) తాజాగా రూ. 1,217 కోట్ల నిధులు సమీకరించింది. ఈ నిధులను రహదారి ప్రాజెక్టుల అవసరాల కోసం వినియోగించనుంది. కేంద్ర రహదారి రవాణా, హైవేస్ శాఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ఈ మేరకు ట్వీట్ చేసింది. ఎన్హెచ్ఏఐ గతేడాది తమ తొలి ఇన్విట్ ద్వారా రూ. 5,000 కోట్ల పైచిలుకు నిధులను సమీకరించింది. కొత్తగా మూడు రహదారి ప్రాజెక్టుల కోసం ఈ ఏడాది అక్టోబర్లో ఎన్హెచ్ఏఐ రూ. 2,500 కోట్లు సమీకరించనున్నట్లు రహదారి శాఖ సీనియర్ అధికారి ఇటీవల వెల్లడించారు. -
క్యాపిటల్ మార్కెట్లకు రోడ్డు ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: రోడ్డు ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సమీకరణ కోసం ఈ నెలలో ప్రభుత్వం క్యాపిటల్ మార్కెట్లను ఆశ్రయించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఆర్థికంగా లాభదాయకం కావడంతో దేశీయంగా రహదారి ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇన్సూరెన్స్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. రానున్న మూడేళ్లలో జాతీయ రహదారుల అధీకృత సంస్థ(ఎన్హెచ్ఏఐ) టోల్ ఆదాయం రూ. 1.4 లక్షల కోట్లకు జంప్ చేయనున్నట్లు ఒక సదస్సుకు హాజరైన రోడ్ రవాణా, జాతీయ రహదారుల మంత్రి గడ్కరీ పేర్కొన్నారు. ప్రస్తుతం వార్షికంగా రూ. 40,000 కోట్ల టోల్ ఆదాయం లభిస్తోంది. పటిష్ట టోల్ ఆదాయం ఆర్జిస్తున్న ఎన్హెచ్ఏఐకు ఏఏఏ రేటింగ్ ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ క్యాపిటల్ మార్కెట్ల నుంచి భారీ స్పందన లభించనున్నట్లు గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల(ఇన్విట్స్) ద్వారా నిధులను సమీకరించనున్నట్లు గడ్కరీ గత నెలలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే రిటైల్ ఇన్వెస్టర్లకు రూ. 10 లక్షల పెట్టుబడుల పరిమితిని ప్రకటించారు. త్వరలో ఇన్విట్స్ను స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు ఇన్విట్ యూనిట్లలో లావాదేవీలు చేపట్టవచ్చని వివరించారు. మ్యూచువల్ ఫండ్స్ను పోలి ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన పెట్టుబడులకు ఇన్విట్స్లోనూ యూనిట్లను జారీ చేస్తారు. -
Regional Ring Road: ఇంటర్ ఛేంజర్లకు అదనంగా భూసేకరణ!
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు సంబంధించి అదనంగా మరో 40 ఎకరాల భూసేకరణకు ఎన్హెచ్ఏఐ అనుబంధ గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసినట్టు సమాచారం. గత ఏప్రిల్లో సంగారెడ్డి జిల్లా ఆందోల్–జోగిపేట ఆర్డీఓ పరిధిలో 270 ఎకరాల భూసేకరణకు కీలకమైన 3ఏ గెజిట్ నోటిఫికేషన్ను ఢిల్లీ అధికారులు జారీ చేశారు. ఇప్పుడు దానికి మరో 40 ఎకరాలను చేర్చినట్లు సమాచారం. ఇలాగే మరో రెండు అనుబంధ నోటిఫికేషన్లను విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత నోటిఫికేషన్లకు అనుబంధంగా.. ఆర్ఆర్ఆర్ ఇంటర్ ఛేంజర్లను విశాలంగా నిర్మించాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించి భూసేకరణకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను క్రాస్ చేసే ప్రాంతాల్లో ఇంటర్ ఛేంజ్ జంక్షన్లను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే జంక్షన్ల వద్ద వాహనాల వేగం కనీసం 60 కి.మీ. మేర ఉండేందుకు ఇంటర్ ఛేంజర్లను విశాలంగా నిర్మించాలని నిర్ణయించింది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి సంబంధించి 158.64 కి.మీ నిడివిగల రోడ్డుకు 8 భాగాలుగా భూసేకరణ జరపనున్న విషయం తెలిసిందే. ఇందులో మూడు భాగాలకు సంబంధించి గత ఏప్రిల్లో 3ఏ గెజిట్ నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఆందోల్–జోగిపేట ఆర్డీఓ, చౌటుప్పల్ ఆర్డీఓ, యాదాద్రి భువనగిరి అదనపు కలెక్టర్ పరిధిలో సేకరించాల్సిన భూమి వివరాలతో ఈ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇప్పుడు వాటికి అనుబంధ గెజిట్ నోటిఫికేషన్లు జారీ కానున్నట్టు తెలిసింది. ఉత్తరభాగానికి సంబంధించి 11 చోట్ల ఇంటర్ఛేంజ్ జంక్షన్లు నిర్మితం కానున్నాయి. ఇందుకోసం అధికారులు రెండు డిజైన్లు రూపొందించారు. మొదటిది వాహనాలు గంటకు 30 కి.మీ వేగంతో, రెండోది 60 కి.మీ.వేగంతో వెళ్లేలా డిజైన్ చేశారు. భూసేకరణకు సంబంధించి మొదటి మూడు గెజిట్ నోటిఫికేషన్లను తొలి డిజైన్కు సరిపోయేలానే జారీ చేశారు. కానీ ఢిల్లీ–ముంబై ఎక్స్ప్రెస్ వే తరహాలో గంటకు 60 కి.మీ. వేగంతో వాహనాలు వెళ్లాలని ఎన్హెచ్ఏఐ అధికారులు తర్వాత ఖరారు చేశారు. ఈ కారణంగానే గత నెలలో విడుదలైన మిగతా ఐదు గెజిట్ నోటిఫికేషన్లలో రెండో డిజైన్కు సరిపోయేలా భూమిని గుర్తిస్తూ విడుదల చేశారు. ఇప్పుడు మొదటి మూడు గెజిట్ నోటిఫికేషన్లకు సంబంధించి మిగతా భూమిని చేరుస్తూ అదనపు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఆందోల్–జోగిపేట ఆర్డీఓ పరిధిలోని శివంపేట గ్రామంలో అదనంగా 40 ఎకరాలు సేకరిస్తున్నారు. -
Andhra Pradesh: కొత్తగా రెండు చోట్ల నాలుగు లేన్ల రహదారులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో రెండు చోట్ల నాలుగు లేన్ల రహదారులు అందుబాటులోకి రానున్నాయి. కృష్ణా జిల్లాలోని పామర్రు–గుడివాడ, అన్నమయ్య జిల్లాలోని రాయచోటి బైపాస్ రహదారులను నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు. గతంలో రెండు లేన్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ఈ రహదారుల్లో ట్రాఫిక్రద్దీ పెరిగిన దృష్ట్యా నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) ఆమోదించింది. అందుకోసం త్వరలోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లో మార్పులు చేసి పనులు ప్రారంభించనుంది. చదవండి: (విషాదం: ఒక్క క్షణం ఆలోచించి ఉంటే.. నేడు నవ్వుతూ ఇంట్లో ఉండేది) -
YSR Kdapa-Renigunta: వడివడిగా హైవే.. రూ.4వేల కోట్లతో రోడ్డు నిర్మాణం
సాక్షి, రాజంపేట : శేషాచలం అటవీ ప్రాంతంలో పచ్చటి ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన ప్రయాణం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. రాయలసీమ జిల్లాలకు ముఖ్య రహదారిగా ప్రాచుర్యం పొందిన 716 కడప–రేణిగుంట జాతీయరహదారిని 2024 నాటికి పూర్తిగా అందుబాటులో తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. తక్కువ వ్యవధిలోనే తిరుపతి.. కడప–రేణిగుంట ఎన్హెచ్ ఏర్పడిన తర్వాత తక్కువ వ్యవధిలో తిరుపతికి చేరుకోవచ్చు. ఫలితంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాల నుంచి వచ్చేవారు తిరుపతి, చెన్నై నగరాలకు వెళ్లే వారికి కడప–రేణిగుంట రహదారి ఎన్హెచ్ చేయడం వల్ల త్వరితగతిన గమ్యానికి చేరుకునే వీలు కలుగుతుంది. రెండు ప్యాకేజీలుగా..హైవే నిర్మాణం కడప నుంచి చిన్నఓరంపాడు(64.2కేఎం), చిన్నఓరంపాడు నుంచి రేణిగుంట వరకు రెండుప్యాకేజీలుగా హైవే నిర్మాణపనులు జరుగుతాయి. నాలుగులేన్లుగా రోడ్డు నిర్మితం కానుంది. ఇందు కోసం టెండర్లను కూడా కేంద్రం పిలిచింది. రెండు ప్యాకేజీలకు కలిపి రూ.4వేల కోట్లు వ్యయం చేయనుంది. సెప్టెంబరు 16 తర్వాత టెండర్ల ఖరారును నిర్ణయిస్తారు. రాజంపేట, రైల్వేకోడూరులో బైపాస్ రహదారి కడప–రేణిగుంట రహదారిలో రాజంపేట, రైల్వేకోడూరులో బైపాస్ రహదారి నిర్మించాలని యోచిస్తున్నారు. ముంబై–చెన్నై రైలుమార్గం వెంబడి (పడమర వైపు )భాకరాపేట నుంచి చిన్నఓరంపాడు వరకు మార్గం నిర్మితం కానున్నది.ఇది పూర్తిగా అటవీమార్గంలోనే కొనసాగుతుంది. మార్గమధ్యలో ఆర్వోబీలు, చెయ్యేరునదిపై వంతెనలు, చిన్న చిన్న బ్రిడ్జిల నిర్మాణాలు ఉన్నాయి. త్వరతగితిన హైవే నిర్మాణానికి ఎంపీ మిథున్రెడ్డి కృషి కడప–రేణిగుంట నేషనల్ హైవే త్వరితగతిన నిర్మితమయ్యేలా రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి తన వంతు కృషిచే శారు. కేంద్రం తీసుకున్న ప్రయార్టీలో కడప–రేణిగుంట ఎన్హెచ్ను చేర్చేలా ఎంపీ విశ్వప్రయత్నాలు చేశారు. ఫలితంగా భూసేకరణ, మరోవైపు టెండర్ల ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. రెండేళ్లలో ఎన్హెచ్ను అందుబాటులోకి తీసుకురావాలన్నదే అభిమతంగా ఎంపీ ప్రయత్నిస్తున్నారు. ఒంటిమిట్ట, నందలూరు ప్రాంతాలకు స్పెషల్ కనెక్టిటివిటీ అవసరం జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలైన నందలూరు, ఒంటిమిట్ట కేంద్రాలకు ఎన్హెచ్ నుంచి కనెక్టిటివిటీ రోడ్ (సర్వీసురోడ్డు) అవసరమని పలువురు భక్తులు కేంద్రాన్ని కోరుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వెళ్లే యాత్రీకులు ఒంటిమిట్ట రామయ్య, సౌమ్యనాథుని దర్శించుకుంటారు. అంతేగాకుండా రాయలసీమలో తొలిసారిగా బయల్పడిన బౌద్ధారామాలున్నాయి. ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ప్రస్తుతం కడప–రేణిగుంట హైవేలో ట్రాఫిక్ పెరుగుతోంది. ఈ మార్గం మీదుగా తిరుపతి, చెన్నై, ముంబై, హైదరాబాదులకు రాకపోకలు జరుగుతున్నాయి. నిత్యం 17వేలకు పైగా వాహనాలు పరుగులు తీస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్కు హైవే కెపాసిటీ సరిపోవడంలేదు. ఫలితంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేగాకుండా కడప–రేణిగుంట రోడ్డు ప్రయాణం మూడు నుంచి నాలుగు గంటలకుపైగా పడుతోంది. సకాలంలో గమ్యాలకు చేరలేని పరిస్ధితి. నాలుగులైన్లరోడ్డు నిర్మాణంతో ట్రాఫిక్ తగ్గుతుంది. ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి. భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కడప–రేణిగుంట ఎన్హెచ్కు 1,066 ఎకరాల భూసేకరణ చేపట్టారు. ఇప్పటికే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పూర్తి అయింది. డ్రాఫ్ట్ డిక్లరేషన్ చేయాల్సి ఉంది. పరిహారం చెల్లింపు ప్రక్రియను రెవెన్యూ అధికారులు చేపట్టారు. అన్నమయ్య జిల్లా జేసీ తమీమ్ అన్సారియాలు పరిహారం అందజేసే అంశంపై కసరత్తు చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా భూసేకరణపై దృష్టి సారించారు. త్వరగా అందుబాటులోకి తీసుకొస్తాం రాజంపేట, రైల్వేకోడూరులో బైపాస్రోడ్డు నిర్మితం కానుంది. రూ.4వేల కోట్లతో రెండు ప్యాకేజీలుగా నిర్మాణ పనులు జరుగుతాయి. గ్రీన్హైవే ఎక్స్ప్రెస్లో పచ్చటి ప్రకృతిలో.. ఆహ్లాదకరమైన వాతవరణంలో త్వరితగతిన గమ్యాలకు చేరుకోవచ్చు. 2024 నాటికి అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. –పీవీ మిథున్రెడ్డి, ఎంపీ, రాజంపేట ప్రమాదాలు తగ్గుతాయి కడప–రేణిగుంట ఎన్హెచ్ నిర్మాణంతో ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి. కడప–తిరుపతి మధ్య ప్రయాణ వ్యవధి తగ్గిపోతుంది. ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఒంటిమిట్ట, నందలూరులో ఉన్నందున ప్రత్యేకంగా స్పెషల్ సర్వీసు రోడ్డు నిర్మిచాల్సిన అవసరం ఉంది. త్వరగా అందుబాటులోకి వస్తే ఉభయ వైఎస్సార్ జిల్లా వాసులే కాకుండా, ఉత్తరభారతదేశం వారికి సకాలంలో తిరుపతి,గా చెన్నైలకు వెళ్లే వీలు ఉంటుంది. –మేడారఘునాథరెడ్డి, అధినేత, ఎంఆర్కెఆర్ సంస్థ, నందలూరు -
విజయవాడకు తూర్పు మణిహారం
సాక్షి, అమరావతి: విజయవాడకు తూర్పు మణిహారంగా జాతీయ రహదారికి బైపాస్ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమమైంది. చెన్నై–కోల్కతా జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదనలకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ గతంలోనే ఆమోదం తెలిపింది. భూసేకరణ వ్యయానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను కూడా జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) సూత్రప్రాయంగా ఆమోదించడంతో అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. దాదాపు రూ.2 వేల కోట్లతో 40 కిలోమీటర్ల మేర విజయవాడ తూర్పు బైపాస్ మార్గం రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ తుదిదశకు చేరుకుంది. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు ఎన్హెచ్ఏఐ సిద్ధమవుతోంది. హైవేపై ట్రాఫిక్ కష్టాలకు తక్షణ పరిష్కారం చెన్నై–కోల్కతా జాతీయ రహదారి (ఎన్హెచ్–16) విజయవాడ నగరంలో నుంచి వెళుతుండటంతో దశాబ్దాలుగా ట్రాఫిక్ సమస్యలు జఠిలమవుతూ వస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ట్రాఫిక్ సమస్యకు తక్షణ పరిష్కారం గురించి యోచించకుండా గ్రాఫిక్కులతో కనికట్టు చేసిన అమరావతిలో ఓఆర్ఆర్ నిర్మించాలని ప్రతిపాదించింది. 30 ఏళ్ల తరువాత ఆ ప్రాంతంలో పెరిగే ట్రాఫిక్ కోసమని ఇప్పుడు పశ్చిమ బైపాస్ నిర్మాణం పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విజయవాడ ట్రాఫిక్ సమస్యలకు తక్షణ పరిష్కారం గురించి యోచించింది. బందరు పోర్టు నిర్మాణం పూర్తయితే పోర్టు నుంచి రాకపోకలు సాగించే భారీ వాహనాలతో విజయవాడ వద్ద జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు మరింత తీవ్రమవుతాయని గుర్తించింది. ఈ సమస్యకు పరిష్కారంగా విజయవాడకు తూర్పు వైపున బైపాస్ రహదారి నిర్మించాలని ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. ఆయన ప్రతిపాదనలపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించడంతో తూర్పు బైపాస్ నిర్మాణం దిశగా ఎన్హెచ్ఏఐ కార్యాచరణ చేపట్టింది. కాజ నుంచి చిన అవుటపల్లి వరకు.. జాతీయ రహదారిపై గుంటూరు జిల్లాలోని కాజ నుంచి కృష్ణాజిల్లాలోని కంకిపాడు మీదుగా చిన అవుటపల్లి వరకు నాలుగు లేన్ల బైపాస్ రహదారి నిర్మించాలని నిర్ణయించారు. 40 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ బైపాస్ ప్రాజెక్టులో భాగంగా కృష్ణానదిపై 3,600 మీటర్ల పొడవున వంతెన నిర్మిస్తారు. దాదాపు రూ.2 వేలకోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఈ బైపాస్ నిర్మాణంతో చెన్నై–కోల్కతా జాతీయ రహదారిపై వాహనాలు విజయవాడ నగరంలోకి రాకుండా ప్రయాణిస్తాయి. బందరు పోర్టుకు వెళ్లే, వచ్చే వాహనాలు కూడా విజయవాడ నగరంలోకి రాకుండానే జాతీయ రహదారిపై బైపాస్ మీదుగా అటు చెన్నై, కోల్కతా, హైదరాబాద్ల వైపు వెళ్లవచ్చు. మల్టీమోడల్ కాంప్లెక్స్ల నిర్మాణానికి 100 ఎకరాలు బైపాస్ రహదారి నిర్మాణానికి అయ్యే రూ.2 వేలకోట్లలో దాదాపు రూ.525 కోట్లు భూసేకరణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. రహదారి, వంతెన నిర్మాణాలకు ఎన్హెచ్ఏఐ నిధులు సమకూరుస్తుంది. భూసేకరణ వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలు ప్రతిపాదనలు సమర్పించింది. జీఎస్టీలో రాష్ట్ర ప్రభుత్వ వాటాను మినహాయించుకుంటామని ప్రతిపాదించింది. అందుకు సమ్మతించిన కేంద్రం భూసేకరణ వ్యయంలో 50 శాతం భరించాలని చెప్పింది. దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది. అదే సమయంలో ఎన్హెచ్ఏఐ రాష్ట్రంలో జాతీయ రహదారుల పక్కన మల్టీమోడల్ కాంప్లెక్స్లు నిర్మించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ కాంప్లెక్స్ల నిర్మాణం కోసం 100 ఎకరాలను కేటాయిస్తామని ప్రతిపాదించింది. దీనికి బదులుగా విజయవాడ తూర్పు బైపాస్ కోసం భూసేకరణ వ్యయాన్ని కేంద్రమే భరిం చాలని కోరింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పట్టుబట్టడంతో కేంద్రం ఆమోదించింది. భూసేకరణ వ్యయంతోసహా విజయవాడ తూర్పు బైసాస్ నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా భ రించేందుకు సూత్రప్రాయంగా సమ్మతించింది. -
ఎన్హెచ్ఏఐ రేటింగ్స్ ఉపసంహరణ: మూడిస్
న్యూఢిల్లీ: జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు చెందిన బీఏఏ3 ఇష్యూయర్ రేటింగ్, బీఏఏ3 సీనియర్ అన్సెక్యూర్డ్ మీడియం టర్మ్ నోట్ ప్రోగ్రామ్ రేటింగ్లను ఉపసంహరించుకున్నట్టు మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ ప్రకటించింది. సొంత వ్యాపార కారణాలే ఇందుకు దారితీసినట్టు తెలిపింది.రేటింగ్లను ఉపసంహరించుకోవడానికి ముందు ఎన్హెచ్ఏఐకు సంబంధించి స్టెబుల్ రేటింగ్ను మూడిస్ కొనసాగించడం గమనార్హం. -
అడవి మీదుగా రింగురోడ్డు.. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ను ఖరారు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరానికి చేరువగా ఉన్న ప్రాంతాల్లో అంతంతమాత్రంగానే ఉన్న అటవీ ప్రాంతాన్ని చీలుస్తూ ఇప్పుడు రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణం జరగనుంది. రీజినల్ రింగురోడ్డుకు సంబంధించి కేంద్రం అనుమతించిన 162 కి.మీ. ఉత్తరభాగం రోడ్డు నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. దీనికిగాను ఇప్పటికే కొంతభాగానికి భూసేకరణకు వీలుగా గెజిట్ విడుదల కావడంతో ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ ఉత్తర భాగానికి ఉన్న నిడివిలో నర్సాపూర్, గజ్వేల్ ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణం ఉంది. ఈ ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాన్ని చీలుస్తూ రోడ్డు అలైన్మెంట్ ఖరారైంది. అయితే ఎక్కువ అటవీ భూమిని సేకరించాల్సిన అవసరం లేకుండా, ఓ మూల నుంచి రోడ్డు నిర్మాణానికి వీలుగా అలైన్మెంట్ను ఖరారు చేశారు. ఇందుకోసం 235 ఎకరాల అటవీ భూమిని సేకరించాల్సిన అవసరం ఉందని తాజాగా తేల్చారు. వన్యప్రాణుల సంచారంపై పరిశీలన.. అటవీ ప్రాంతానికి సంబంధించి ఏయే ప్రాంతాల్లో ఎంత భూమిని సేకరించాల్సి ఉందో తాజాగా ఎన్హెచ్ఏఐ అధికారులు అటవీ శాఖ అధికారులకు తెలియపరిచారు. దీంతో రెండు విభాగాల అధికారులు సంయుక్త సర్వేకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ భారీ వర్షాల వల్ల ఈ ప్రక్రియకు అంతరాయం ఏర్పడటంతో వానలు తగ్గాక సర్వే చేపట్టి హద్దులు గుర్తించనున్నారు. అటవీ ప్రాంతం మీదుగా రీజినల్ రింగురోడ్డు ఎక్స్ప్రెస్ వే నిర్మాణం జరుగుతున్నందున దాని ప్రభావం వన్యప్రాణులపై ఎంత మేర ఉండనుందో అంచనా వేస్తున్నారు. ఉత్తరభాగం రోడ్డు అలైన్మెంట్లో గజ్వేల్, నర్సాపూర్ ప్రాంతాల్లోనే అటవీ భూములున్నాయి. ఈ రెండు ప్రాంతాలకు కలిపి 235 ఎకరాల మేర రోడ్డు నిర్మాణానికి వాడనున్నారు. ఆ ప్రాంతాల్లో అడవి రోడ్డుకు ఓవైపు సింహభాగం ఉండనుండగా మరోవైపు కొంత ప్రాంతమే ఉండనుంది. అయినా అటూఇటూ వణ్యప్రాణుల రాకపోకలు ఎలా ఉండనున్నాయనే విషయమై అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రాంతాల్లో అరుదైన వణ్యప్రాణులు పెద్దగా లేవు. కోతులు, జింకలు, నెమళ్లు, ఎలుగుబంట్ల లాంటి సాధారణమైన అడవి జంతువులే ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. వాటిల్లోనూ ఎక్కువ రాకపోకలుండే ప్రాంతాలను గుర్తించి ఆ వివరాలను అటవీ శాఖ అధికారులు ఎన్హెచ్ఏఐకి అందించనున్నారు. ఆయా ప్రాంతాల్లో వాటి రాకపోకలకు వీలుగా ఎకో బ్రిడ్జీలు నిర్మించే అవకాశం ఉంది. సామాజిక అటవీ వృద్ధికి విఘాతం.. రీజినల్ రింగురోడ్డు నిర్మాణానికి ప్రతిపాదిస్తున్న ప్రాంతాల్లో దట్టమైన అడవులంటూ లేవు. తక్కువ పరిధిలోనే ఓ మోస్తరు అటవీ ప్రాంతాలుండగా కొన్నిచోట్ల సామాజిక అటవీ ప్రాంతాలను వృద్ధి చేశారు. ఈ పరిధి కూడా తక్కువ ప్రాంతాల్లోనే ఉంది. తాజాగా రింగురోడ్డు నిర్మాణంతో నాలుగైదు ప్రాంతాల్లో ఈ సామాజిక అటవీ ప్రాంతాల వృద్ధికి విఘాతం కలగనుంది. దీంతో వాటికి ప్రత్యామ్నాయంగా కొత్త ప్రాంతాల్లో అలాంటి అడవులను అభివృద్ధి చేయాల్సి ఉంది. అటవీ భూములకు బదులుగా ప్రత్యామ్నాయ ప్రాంతాలను అటవీ శాఖకు అందిస్తారో లేక ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో వాటిని పెంచాల్సి ఉందో అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. -
ఎన్హెచ్ఏఐ కొత్త కార్యాచరణ.. పార్కింగ్ స్థలం లేకపోతే మూతే
సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) కొత్త కార్యాచరణకు ఉపక్రమించింది. జాతీయ రహదారులను ఆనుకుని ఉండే దాబాలు, హోటళ్లకు విధిగా పార్కింగ్ స్థలాలు ఉండాలని స్పష్టం చేసింది. నిర్ణీత గడువులోగా తగినంత పార్కింగ్ ప్రదేశాలు లేని దాబాలు, హోటళ్లను తొలగించాలని కూడా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల వెంబడి రోడ్డు ప్రమాదాల తీరును ఎన్హెచ్ఏఐ విశ్లేషించింది. జాతీయ రహదారులపై ఓ పక్కకు నిలిపి ఉంచే వాహనాలను ఇతర వాహనాలు ఢీకొట్టడమే ఎక్కువ ప్రమాదాలకు కారణమని గుర్తించింది. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న దాబాలు, హోటళ్లకు సమీపంలోనే ఎక్కువగా వాహనాలను నిలిపి ఉంచుతున్నట్టు కూడా ఎన్హెచ్ఏఐ పరిశీలనలో వెల్లడైంది. దాంతో హైవేల వెంబడి ఉన్న దాబాలు, హోటళ్లకు తగినంత పార్కింగ్ ప్రదేశాలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లోనూ హైవేల వెంబడి ఉన్న దాబాలు, హోటళ్లను గుర్తించి పార్కింగ్ ప్రదేశాలపై నివేదిక సమర్పించాలని కోరింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని హైవేలను ఆనుకుని ఉన్న దాబాలు, హోటళ్లపై ఎన్హెచ్ఏఐ అధికారులు చేపట్టిన సర్వే దాదాపు పూర్తి కావచ్చింది. చదవండి: (అల్లూరి విగ్రహావిష్కరణ: రచ్చ చేయబోయి.. చతికిలపడ్డ టీడీపీ) పార్కింగ్ లేకుండా 40 శాతం దాబాలు, హోటళ్లు రాష్ట్రంలో దాదాపు 40 శాతం దాబాలు, హోటళ్లకు పార్కింగ్ స్థలాలు లేవని సర్వేలో తేలినట్టు సమాచారం. ఆ దాబాలు, హోటళ్లకు త్వరలో నోటీసులు జారీ చేయనున్నారు. మూడు నెలల్లో పార్కింగ్ ప్రదేశాలు సమకూర్చుకోవాలని నిర్దేశించనున్నారు. జాతీయ రహదారిని ఆనుకుని 7.50 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదు. అంటే రోడ్డుకు దాబా, హోటళ్లకు మధ్య కనీసం 7.50 మీటర్ల దూరం ఉండాలి. ఆ మధ్యలో పార్కింగ్ ప్రదేశాన్ని చూపించకూడదు. దాబాకు పక్కన పార్కింగ్ ప్రదేశాన్ని వేరేగా చూపించాలి. దాబాలు, హోటళ్ల వద్ద తగిన లైటింగ్ సదుపాయం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. తెల్లవారుజామున మంచు కురుస్తున్నప్పుడు కూడా వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఫాగ్ లైట్లను ఏర్పాటు చేయాలి. తప్పనిసరిగా టాయిలెట్లు, స్నానాల గదులు ఉండాలి. ప్రతి దాబా, హోటల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉండాలి. ఆ సమీపంలోని ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్ల ఫోన్ నంబర్లు, ఇతర వివరాలతో బోర్డులు ఏర్పాటు చేయాలి. మూడు నెలల్లో పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయని దాబాలు, హోటళ్లను మూసివేయిస్తారు. -
రూ. 96.21 కోట్ల నామా ఆస్తులు జప్తు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్రావు షెల్ కంపెనీలతో బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టడమే కాకుండా రుణంగా పొందిన కోట్ల రూపాయలను తన జేబులోకి మళ్లించుకున్న వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝుళిపించింది. మధుకాన్ సంస్థలకు చెందిన రూ. 96.21 కోట్లను అటాచ్ చేసింది. ఈ మేరకు ఈడీ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. జార్ఖండ్లోని రాంచీ నుంచి జంషెడ్పూర్ వరకు 163 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మించేందుకు 2011లో నామా నాగేశ్వర్రావుకు చెందిన మధుకాన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) నుంచి కాంట్రాక్టు దక్కించుకుంది. దీని నిర్మాణం కోసం కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.1,030 కోట్ల రుణం పొందింది. కానీ నిర్ణీత సమయంలో రోడ్డు నిర్మాణం పూర్తి చేయలేదు. 50.24 శాతం మాత్రమే చేసి చేతులెత్తేసింది. దీనిపై ఎన్హెచ్ఏఐ సీబీఐకి ఫిర్యాదు చేసింది. రోడ్డు నిర్మాణం నిమిత్తం 90 శాతం మేర రుణం పొంది నిర్మాణ పనులు ఆపేసిందని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో సీబీఐ 2019లో కేసు నమోదు చేసింది. రంగంలోకి దిగిన ఈడీ... ఈ కేసును ఆధారంగా చేసుకొని మనీల్యాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. అనేక సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. రాంచీ ఎక్స్ప్రెస్ వేస్ లిమిటెడ్ అనే అనుబంధ కంపెనీ ద్వారా రోడ్డు నిర్మాణం కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని నామా నాగేశ్వర్రావు, కంపెనీ ప్రమోటర్లు నామా సీతయ్య, కమ్మ శ్రీనివాస్రావు, నామా పృథ్వీతేజ కుట్రపూరితంగా షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి తమ ఇతర ప్రాజెక్టుల్లోకి మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. రూ. 75 కోట్లకుపైగా నిధులను షెల్ కంపెనీలైన ఉషా ప్రాజెక్ట్స్, శ్రీ బీఆర్ విజన్స్, శ్రీ ధర్మశాస్త కన్స్ట్రక్షన్స్, శ్రీ నాగేంద్ర కన్స్ట్రక్షన్స్, రాగిని ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరలక్ష్మీ కన్స్ట్రక్షన్స్లోకి మళ్లించినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. ఈ కంపెనీలకు సబ్ కాంట్రాక్ట్ కింద పనులు ఇచ్చినట్లు నకిలీ అలాట్మెంట్ లెటర్లు సృష్టించి నిధులను మళ్లించి మళ్లీ అక్కడ నుంచి నామా నాగేశ్వర్రావు తన జేబులోకి వచ్చేలా చేసుకున్నట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. 2021 జూన్లో మధుకాన్ కంపెనీ చైర్మన్ నామా నాగేశ్వర్రావు కార్యాలయం, నివాస సముదాయాలు, ఆ కంపెనీల డైరెక్టర్ల ఇళ్లపై ఈడీ సోదాలు నిర్వహించింది. నామా ఇంట్లో రూ. 34 లక్షల లెక్కచూపిన సొమ్ముతోపాటు నేరపూరితమైన ఆధారాలను సీజ్ చేసినట్లు వివరించింది. మొత్తంగా ఈ కేసులో రూ. 361.29 కోట్ల రుణం సొమ్మును షెల్ కంపెనీలతోపాటు ఇతర మార్గాల ద్వారా దారి మళ్లించినట్లు తేల్చింది. ఈ కేసు దర్యాప్తు లో భాగంగా హైదరాబాద్, పశ్చిమ బెంగాల్లో ఉన్న రూ. 88.85 కోట్ల విలువగల స్థిరాస్తులు, విశా ఖ, ప్రకాశం, కృష్ణా జిల్లాలో ఉన్న రూ.7.36 కోట్ల చరాస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ పేర్కొంది. -
రోడ్డు మారేటప్పుడూ ‘ఎక్స్ప్రెస్ వే’గమే!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)ను దేశంలోనే ఆధునిక రాజమార్గంగా నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో ప్రస్తుతం అత్యంత భారీ ఎక్స్ప్రెస్ వేగా పేర్కొంటున్న ఢిల్లీ–ముంబై ఎక్స్ప్రెస్ వేపై నిర్మిస్తున్న ఇంటర్ఛేంజ్ల కంటే మెరుగ్గా దీనిపై ఇంటర్ఛేంజ్లను డిజైన్ చేస్తోంది. రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి సంబంధించిన 158.64 కి.మీ. నిడివిగల రహదారిలో 11 చోట్ల జాతీయ/రాష్ట్ర రహదారులను దాటుతున్నందున ఆయా ప్రాంతాల్లో ఇంటర్ఛేంజ్లను నిర్మించనుండటం తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే రూపొందించిన డిజైన్లను పరిశీలించిన ఢిల్లీ ఎన్హెచ్ఏఐ అధికారులు... మరింత విశాలమైన నిర్మాణాల కోసం కొత్త డిజైన్లను రూపొందించాలని ఆదేశించడంతో కన్సల్టెంట్ సంస్థ వాటిని ఎన్హెచ్ఏఐ పరిశీలనకు పంపింది. తొలుత 60 ఎకరాల్లో.. రెండోది 75 ఎకరాల్లో.. ఎక్స్ప్రెస్ వేగా ఉండే రింగురోడ్డుపై 120 కి.మీ. వేగంతో వాహనాలు దూసుకెళ్లేలా రోడ్డును డిజైన్ చేస్తారు. సాధారణ రోడ్లు–ఎక్స్పెస్ వే మధ్య మారేందుకు వీలుగా నిర్మించే ఇంటర్ఛేంజ్లపై ఆ వేగం 30–40 కి.మీ. మధ్య మాత్రమే ఉంటుంది. ఔటర్ రింగురోడ్డుపై అలాగే డిజైన్ చేశారు. ప్రస్తుతం నిర్మించబోయే రీజినల్ రింగురోడ్డుపైనా అదే స్థాయిలో ఇంటర్ఛేంజ్లను తొలుత డిజైన్ చేశారు. ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఇప్పుడు ఇంటర్ఛేంజర్లపైనా వాహనాలు కనీసం గంటకు 50 కి.మీ. వేగంతో వెళ్లేలా కొత్త డిజైన్లను రూపొందించారు. ఇంటర్ఛేంజ్ మలువుల వద్ద వేగం 30–40 కి.మీ. మధ్యలో ఉండాలి. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాటి వేగం 50 కి.మీ. కంటే ఎక్కువ వేగంతో దూసుకుపోయినా ఇబ్బంది లేకుండా 75 మీటర్ల ముందు నుంచి రోడ్డు మలుపు తిరిగేలా కొత్త డిజైన్ రూపొందించారు. పాత డిజైన్లో 60 మీటర్ల ముందు మలుపు ప్రారంభమయ్యేలా ఉంది. పాత డిజైన్ ప్రకారం ఇంటర్ఛేంజ్ నిర్మాణానికి 60 ఎకరాల స్థలం సరిపోయేది. కొత్త డిజైన్ ప్రకారం 70 ఎకరాలకుపైగా అవసరం కానుంది. ఈ రెండు డిజైన్లు పరిశీలిస్తున్న ఎన్హెచ్ఏఐ వాటి ల్లో ఏయే ప్రాంతాల్లో ఏయే డిజైన్ల ప్రకారం రోడ్డు నిర్మించాలనే విషయాన్ని ఖరారు చేయనుంది. వచ్చే వారం సర్వే షురూ.. ఆందోల్–జోగిపేట ఆర్డీఓ పరిధిలో 108.9491 హెక్టార్లు, చౌటుప్పల్ ఆర్డీఓ పరిధిలో 300.3820 హెక్టార్లు, యాదాద్రి–భువనగిరి అదనపు కలెక్టర్ పరిధిలో 208.6090 హెక్టార్ల భూసేకరణకు వీలుగా ఏప్రిల్ 19న 3ఏ (క్యాపిటల్) నోటిఫికేషన్కు సంబంధించిన గెజిట్ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ప్రాజెక్టులో ఇది రెండో గెజిట్. భూసేకరణకు సంబంధించి ఒక అదనపు కలెక్టర్, ఏడుగురు ఆర్డీఓలను నియమించగా ముగ్గురి పరిధికి సంబంధించే ఈ గెజిట్ను విడుదల చేశారు. ఇంటర్చేంజర్ల డిజైన్ల మార్పు నేపథ్యంలో మిగతా ఆర్డీఓల పరిధిలోని భూమికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కాలేదు. డిజైన్లు పూర్తయినందున మిగతా ప్రాంతాలకు సంబంధించి, గెజిట్ విడుదలైన మూడు ప్రాంతాలకు సంబంధించి అదనపు గెజిట్ విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే గెజిట్ విడుదలైన మూడు ప్రాంతాలకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ వచ్చే వారం ప్రారంభం కానుంది. రెవెన్యూ అధికారులు ఫీల్డ్కు వెళ్లి రోడ్డు అలైన్మెంట్ ప్రకారం 100 మీటర్ల వెడల్పుతో సేకరించే భూమికి హద్దులు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియ డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (డీజీపీఎస్) యంత్రాలతో ఉపగ్రహ సహకారంతో నిర్వహిస్తారు. -
ప్రజాప్రయోజనాల కోసమే భూసేకరణ: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) చట్టబద్ధమైన సంస్థ అని, ప్రజాప్రయోజనార్థం నిర్మించే రహదారుల కోసమే భూ సేకరణ చేపడుతోందని హైకోర్టు స్పష్టం చేసింది. అందుకే ఆ సంస్థ దాఖలు చేసిన అప్పీళ్లను అనుమతిస్తున్నామని పేర్కొంది. సంగారెడ్డి నుంచి నాందేడ్ వరకు నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం కోసం ఎన్హెచ్ఏఐ భూసేకరణ చేపట్టింది. ఈ ప్రక్రియలో చట్ట ప్రకారం నిబంధనలు పాటించలేదంటూ సంగారెడ్డి జిల్లా కంది గ్రామానికి చెందిన నర్సింగ్రావు మరికొందరు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. వాదనల తర్వాత సింగిల్ జడ్జి పిటిషనర్ల అభ్యంతరాలను పరిశీలించి భూసేకరణను చేపట్టాలని తీర్పునిచ్చింది. దీనిపై ఎన్హెచ్ఏఐ రివ్యూ పిటిషన్ వేస్తూ.. మారిన అలైన్మెంట్కు అనుమతించాలని కోరింది. దీన్ని రివ్యూ కోర్టు కొట్టివేసింది. దీంతో ఎన్హెచ్ఏఐ రెండు రిట్ అప్పీళ్లను దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సూరేపల్లి నందా ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ కుశలశెట్టి కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది. ఇక్కడ కూడా నేషనల్ హైవేస్ యాక్ట్, 1956 ప్రకారమే భూ సేకరణ చేసిందని తెలిపింది. సదరు యజమానులు తగిన పరిహారం పొందడానికి అర్హులేనన్న ధర్మాసనం.. మారిన అలైన్మెంట్కు సంబంధించి దాఖలైన రిట్ అప్పీళ్లను అనుమతిస్తున్నామని వివరించింది. -
విజయవాడ–నాగ్పూర్ ఎక్స్ప్రెస్ హైవేకి పచ్చజెండా
సాక్షి, అమరావతి: ఏపీ నుంచి మరో జాతీయ రహదారి మహారాష్ట్రను అనుసంధానించనుంది. విజయవాడ–నాగ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) కార్యాచరణకు ఉపక్రమించింది. పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాను మరింత వేగవంతం చేసే లక్ష్యంతో మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని అనుసంధానిస్తూ ఈ గ్రీన్ఫీల్డ్–బ్రౌన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మించనున్నారు. రూ.14 వేల కోట్లతో మొత్తం 457 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించే ప్రణాళికను ఎన్హెచ్ఏఐ ఆమోదించింది. చదవండి: AP: ఎగుమతులపై ‘పుష్’ పాలసీ ఈమేరకు ఫీజబులిటీ నివేదిక, డీపీఆర్లను ఖరారు చేసింది. విజయవాడ–నాగ్పూర్ ఎక్స్ప్రెస్ హైవేను అయిదు ప్యాకేజీల కింద నిర్మిస్తారు. వాటిలో విజయవాడ–ఖమ్మం, ఖమ్మం–వరంగల్, వరంగల్–మంచిర్యాల ప్యాకేజీలను గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలుగా.. మంచిర్యాల–రేపల్లెవాడ, రేపల్లెవాడ–చంద్రాపూర్ ప్యాకేజీలను బ్రౌన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలుగా నిర్మించాలని నిర్ణయించారు. చంద్రాపూర్ నుంచి నాగ్పూర్కు ఇప్పటికే ఉన్న 4 లేన్ల ఎక్స్ప్రెస్ హైవేకి ఈ రహదారిని అనుసంధానిస్తారు. మొత్తం మీద 310 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్, 147 కిలోమీటర్ల బ్రౌన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే రూపుదిద్దుకోనుంది. తగ్గనున్న వ్యయ, ప్రయాసలు ఈ హైవేతో విజయవాడ–నాగ్పూర్ మధ్య ప్రయాణానికి వ్యయ, ప్రయాసలు బాగా తగ్గుతాయి. ప్రస్తుతం విజయవాడ నుంచి నాగ్పూర్ వెళ్లాలంటే హైదరాబాద్, అదిలాబాద్ మీదుగా 770 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. దాదాపు 13 గంటల సమయం పడుతోంది. కొత్త ఎక్స్ప్రెస్ హైవేను విజయవాడ నుంచి ఖమ్మం, వరంగల్, మంచిర్యాల మీదుగా నిర్మించన్నారు. దీంతో విజయవాడ–నాగ్పూర్ మధ్య దూరం 163 కిలోమీటర్లు తగ్గి ఐదుగంటల సమయం కలసివస్తుంది. ఇప్పటికే డీపీఆర్ సిద్ధం కావడంతో భూసేకరణ ప్రక్రియపై ఎన్హెచ్ఏఐ ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు వేగవంతం చేసింది. విజయవాడ రూరల్, జి.కొండూరు, గంపలగూడెం మండలాల్లో దాదాపు 1.65 లక్షల చదరపు మీటర్ల భూసేకరణకు రెవెన్యూ శాఖ సన్నాహాలు చేస్తోంది. డిసెంబరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి 2025నాటికి ఈ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం పూర్తిచేయాలని ఎన్హెచ్ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది. -
సీపోర్టు టు ఎయిర్పోర్టు 'సువిశాల రహదారి'
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో సుందర సాగర తీరాన్ని ఆనుకుని ఆరులేన్ల సువిశాల రహదారి రానుంది. విశాఖపట్నం నుంచి భీమిలి మీదుగా భోగాపురం వరకు బీచ్ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. అలాగే విశాఖపట్నం పోర్ట్ టెర్మినల్ నుంచి నాలుగు లేన్ల జాతీయ రహదారిని నిర్మించి దానిని బీచ్ కారిడార్కు అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దాదాపు రూ. 3 వేల కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టనున్న ఈ ప్రాజెక్టుతో పర్యాటక, పారిశ్రామిక అభివృద్ధికి రాచబాట పరచుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ విశాఖపట్నం బీచ్ కారిడార్ నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించే ప్రక్రియ చేపట్టింది. రెండు దశలుగా బీచ్ కారిడార్.. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు సన్నద్ధమైంది. దానిలో భాగంగా విశాఖపట్నం బీచ్కారిడార్ను నిర్మించనుంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఇప్పటికే పలు దఫాలుగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రెండు దశలుగా బీచ్కారిడార్ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అందులో మొదటిగా విశాఖపట్నం నుంచి భీమిలి మీదుగా భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టును అనుసంధానిస్తూ బీచ్కారిడార్ను 20.20 కి.మీ. మేర ఆరు లేన్లుగా నిర్మిస్తారు. విశాఖపట్నంలో రుషికొండ, ఎండాడ, భీమిలి ప్రాంతాలు పర్యాటక, ఐటీ రంగాలకు కేంద్రస్థానంగా మలచాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. అందుకోసం ఈ బీచ్కారిడార్ నిర్మాణం ఎంతగానో ఉపకరించనుంది. ఈ బీచ్ కారిడార్ వెంబడి పర్యాటక ప్రాజెక్టులు, దిగ్గజ ఐటీ, కార్పొరేట్ సంస్థలు కొలువు దీరేందుకు సౌకర్యంగా ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధికి ఈ బీచ్ కారిడార్ చోదక శక్తిగా పనిచేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆరులేన్ల బీచ్ కారిడార్ నిర్మాణానికి సుముఖత తెలిపిన కేంద్ర ప్రభుత్వం.. డీపీఆర్ రూపొందించే ప్రక్రియ చేపట్టింది. ఇక ఈ బీచ్ కారిడార్ కోసం దాదాపు 346 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించనుంది. అందుకు దాదాపు రూ. 1,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. పోర్ట్ను అనుసంధానిస్తూ నాలుగు లేన్ల రహదారి... ఇక ఈ ప్రాజెక్టులో రెండో దశ కింద బీచ్ కారిడార్ను విశాఖపట్నం పోర్టుతో అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. విశాఖపట్నం పోర్టు టెర్మినల్ను జాతీయ రహదారితో అనుసంధానిస్తూ నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తారు. ఆ రహదారిని విశాఖపట్నం–భోగాపురం బీచ్కారిడార్కు అనుసంధానిస్తారు. అంటే పోర్ట్ టెర్మినల్ నుంచి బీచ్ కారిడార్ ప్రారంభం వరకు నాలుగు లేన్ల రహదారి.. అక్కడ నుంచి తీరాన్ని ఆనుకుని విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు ఆరు లేన్ల రహదారి నిర్మించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆరు లేన్ల బీచ్ కారిడార్, నాలుగు లేన్ల విశాఖపట్నం పోర్ట్ టెర్మినల్ రహదారికి కలిపి దాదాపు రూ. 2 వేల కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టుతో ప్రధానంగా విశాఖపట్నం పోర్ట్ను భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానించడం సాధ్యమవుతుంది. దాంతో సరుకు రవాణాకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని, విశాఖపట్నం లాజిస్టిక్ హబ్గా అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విశాఖపట్నం పోర్ట్ టెర్మినల్ నుంచి బీచ్ కారిడార్ వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణంపై కూడా జాతీయ రహదారుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ త్వరలో డీపీఆర్ ప్రక్రియ చేపడుతుందని ఎన్హెచ్ఏఐ వర్గాలు చెప్పాయి. -
టోల్గేట్లకు త్వరలో టాటా
సాక్షి, అమరావతి: జాతీయ రహదారులపై టోల్గేట్లు త్వరలో కనుమరుగు కానున్నాయి. టోల్ఫీజు చెల్లింపునకు టోల్గేట్ల వద్ద వాహనాలు బారులుతీరిన దృశ్యాలు కొన్నాళ్ల తరువాత కనిపించవు కూడా. ఎందుకంటే టోల్ఫీజు వసూలు కోసం కొత్త విధానంపై జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) కసరత్తు చేస్తోంది. రెండు టోల్గేట్ల మధ్య దూరాన్ని బట్టి టోలుఫీజు వసూలు చేస్తున్న విధానానికి స్వస్తి పలకాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రయాణించే దూరాన్ని బట్టి టోల్ఫీజు వసూలు చేసేందుకు ఉపగ్రహ ఆధారిత ‘గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం’ (జీఎన్ఎస్ఎస్) ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. పాశ్చాత్య దేశాల్లో విజయవంతంగా అమలవుతున్న ఈ విధానాన్ని పరిశీలించేందుకు ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు చేపట్టింది. హేతుబద్ధంగాలేని ప్రస్తుత విధానం ప్రస్తుతం జాతీయ రహదారులపై రెండు టోల్గేట్ల మధ్య దూరాన్ని బట్టి టోల్ఫీజు వసూలు చేస్తున్నారు. వాహనాలు టోల్గేటు వద్దకు చేరుకోగానే వాటిపై ఉన్న ఫాస్టాగ్ను స్కాన్చేసి సంబంధిత ఫీజు మొత్తం ఆ ఖాతా నుంచి ఆటోమేటిగ్గా వసూలు చేస్తున్నారు. వాహనాలు ఆ రెండు టోల్గేట్ల మధ్య దూరాన్ని పూర్తిగా ప్రయాణిస్తే ఆ ఫీజు హేతుబద్ధమే. కానీ రెండు గేట్ల మధ్య పూర్తి దూరాన్ని ప్రయాణించకపోయినా ఈ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. ఉదాహరణకు చెన్నై–కోల్కతా జాతీయ రహదారి (ఎన్హెచ్–16) మీదుగా గుంటూరు నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న వాహనాలు గుంటూరు జిల్లాలో కాజ వద్ద టోల్ ఫీజు చెల్లించాలి. మళ్లీ ఆ రహదారిపై 66 కిలోమీటర్ల తరువాత కలపర్రు వద్ద టోల్గేట్ ఉంది. అంటే కాజ నుంచి కలపర్రు వరకు 66 కిలోమీటర్ల ప్రయాణానికి కాజ టోల్గేట్ వద్ద ఫీజు చెల్లిస్తున్నారు. కాజా నుంచి కలపర్రు వరకు ప్రయాణించే వాహనాలకు ఆ టోల్ఫీజు సహేతుకమే. కానీ వాహనాలు కాజ గేటు దాటిన తరువాత విజయవాడ వరకుగానీ, గన్నవరం వరకుగానీ ప్రయాణించినా సరే.. కలపర్రు వరకు అంటే 66 కిలోమీటర్ల దూరానికి టోల్ఫీజు చెల్లించాల్సి వస్తోంది. టోల్గేటు దాటి ఒక కిలోమీటరు ప్రయాణించినా సరే మొత్తం 66 కిలోమీటర్లకు టోలుఫీజు చెల్లించాల్సిందే. ఈ విధంగా దేశంలో ఉన్న వెయ్యికిపైగా టోల్గేట్లలో ప్రస్తుతం ఫీజు వసూలు చేస్తున్నారు. దీంతో 4.50 కోట్లకుపైగా ఫాస్టాగ్ కలిగిన వాహనదారులు తాము ప్రయాణించే దూరానికి మించి టోల్ఫీజు చెల్లిస్తున్నారు. నావిగేషన్ టోల్ఫీజు విధానం ఇలా.. టోల్ఫీజు విధానాన్ని మరింత హేతుబద్ధీకరించేందుకు జీఎన్ఎస్ఎస్ ప్రవేశపెట్టాలని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. ఈ విధానంలో ఒక వాహనం జాతీయ రహదారిపై ప్రయాణించే దూరాన్ని బట్టి ఫాస్టాగ్ ఖాతా నుంచి టోల్ఫీజు వసూలు చేస్తారు. అంటే వాహనం జాతీయ రహదారిపైకి చేరుకున్నప్పటి నుంచి ఆ దారిలో ప్రయాణించే దూరాన్ని జీఎన్ఎస్ఎస్ విధానంలో పరిశీలించి టోల్ వసూలు చేస్తారు. జాతీయ రహదారిపై నుంచి పక్కకు జరగగానే ప్రయాణించిన దూరాన్ని ఆటోమేటిగ్గా లెక్కించి ఫాస్టాగ్ ఖాతా నుంచి టోల్ఫీజు తీసుకుంటారు. ఈ విధానంలో జాతీయ రహదారిపై ఎంతదూరం ప్రయాణిస్తే అందుకుతగ్గ టోల్ఫీజే వసూలు చేస్తారు. ఇక టోల్గేట్లు ఉండవు. కాబట్టి జాతీయ రహదారులపై టోల్ఫీజు చెల్లింపునకు వాహనాలు బారులు తీరాల్సిన అవసరం ఉండదు. దీంతో వాహనదారులకు ఎంతో సమయం, ఇంధనం ఆదా అవుతాయి. ఐరోపా దేశాల్లో ప్రస్తుతం విజయవంతంగా అమలవుతున్న ఈ జీఎన్ఎస్ఎస్ విధానాన్ని మనదేశంలో ప్రవేశపెట్టనున్నామని కేంద్ర ఉపరితల, జాతీయ రహదారుల అభివృద్ధిశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ప్రకటించారు. ఈ విధానంపై ఎన్హెచ్ఏఐ ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టును పరిశీలిస్తోంది. దేశంలో 1.37 లక్షల వాహనాల నుంచి ప్రస్తుతం ఈ విధానంలో టోల్ఫీజు ప్రయోగాత్మకంగా వసూలు చేస్తున్నారు. ఈ పైలెట్ ప్రాజెక్టుపై రష్యా, దక్షిణ కొరియాలకు చెందిన నిపుణులు త్వరలో నివేదిక సమర్పించనున్నారు. అనంతరం జీఎన్ఎస్ఎస్ విధానం అమలుపై ఎన్హెచ్ఏఐ తుది నిర్ణయం తీసుకుంటుందని అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. అందుకోసం అవసరమైతే జాతీయ రవాణా విధానంలో సవరణలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. -
వాహనదారులకు షాకింగ్ న్యూస్..! పెరగనున్న టోల్గేట్ ఛార్జీలు..!
ఇప్పటికే పెరుగుతున్న ఇంధన ధరలతో సతమతమవుతున్న వాహనదారులకు మరో షాకింగ్ న్యూస్...! ఏప్రిల్ 1 నుంచి హైవే రోడ్లపై ప్రయాణం మరింత ఖరీదైనది మారనున్నట్లు సమాచారం. భారీగా పెరగనున్న టోల్ ఛార్జీలు..! నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను 65 శాతం పెంచనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి . హైవేలపై తిరిగే అన్ని రకాల వాహనాల టోల్ ఛార్జీలను ఎన్హెచ్ఏఐ సవరించినట్లుగా తెలుస్తోంది. ధరల పెంపుతో ఇప్పుడు వాణిజ్య వాహనాలు టోల్ ట్యాక్స్ కోసం అదనంగా రూ. 65 చెల్లించాల్సి ఉండనుంది. కాగా ప్రైవేట్ వాహనాల వన్-వే ప్రయాణం కోసం అదనంగా రూ. 10 చెల్లించాల్సి ఉంటుంది. సవరించిన ధరలు మార్చి 31 అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చదవండి: కాసుల వర్షం కురిపిస్తోన్న హైదరాబాద్ కంపెనీ..! ఒక లక్షకు రూ. 3 కోట్ల లాభం..! -
రాష్ట్రంలో ఆరేడు టోల్ప్లాజాల తొలగింపు?
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులపై కొన్ని టోల్ప్లాజాలను మూసివేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 60 కి.మీ., అంతకంటే తక్కువ దూరంలో టోల్గేట్లు ఉంటే ఒకదాన్ని మూసేయనున్నట్లు ఇటీవల కేంద్రమంత్రి నితిన్గడ్కరీ ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో జాతీయ రహదారులపై 29 టోల్గేట్లున్నాయి. కేంద్రం నిర్ణయం మేరకు పంతంగి, రాయ్కల్, కొత్తగూడెం, మన్ననూరు, గుమ్మడిదల, గూడూరు, కడ్తాల్ టోల్ప్లాజాలను తొలగించాల్సి ఉంటుంది. అయితే ఏవేవి మూసేస్తారన్న విషయంపై స్పష్టత ఇవ్వలేమని, దేశం మొత్తం యూనిట్గా ఢిల్లీలోని ఎన్హెచ్ఏఐ అధికారులు నిర్ణయం తీసుకుంటారని ఎన్హెచ్ఏఐ స్థానిక ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. పక్క రాష్ట్రంలోని చివరి టోల్ప్లాజా, మన రాష్ట్రంలోని ఆ రూట్లో మొదటి టోల్ప్లాజాల మధ్య 60 కి.మీ. దూరంలేని పక్షంలో ఒకదాన్ని తొలగించాలి. ఆ లెక్కన రాష్ట్రంలోని టోల్ప్లాజాలు, పొరుగున ఉన్న కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని టోల్బూత్లతో కలిపి చూసి నిర్ణయం తీసుకుంటారని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, పీపీపీ పద్ధతిలో రోడ్ల నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్, పెట్టుబడి మొత్తాన్ని వడ్డీతో కలుపుకొని టోల్ రూపంలో వసూలుకు అనుమతి ఉంటుంది. ఇప్పుడు వాటిని ఎత్తేస్తే, కాంట్రాక్టర్ నష్టపోయే మొత్తాన్ని కేంద్రం చెల్లించాలి. ఈ విషయంలో ఎలాంటి విధివిధానాలను అనుసరిస్తారనే దానిపై అధికారుల్లో ఇంకా స్పష్టత రాకపోవడం విశేషం. ఢిల్లీ నుంచి తమకు ఎలాంటి మార్గదర్శకాలు అందలేదని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. (చదవండి: దివ్యాంగులు ఐపీఎస్కు అర్హులే..) -
ఫాస్ట్ ట్యాగ్ చరిత్రలో రికార్డు స్థాయి వసూళ్లు..!
న్యూఢిల్లీ: 2019-20 ముందు సంవత్సరంతో పోలిస్తే ఏప్రిల్ 2021 నుంచి జనవరి 2022 మధ్య కాలంలో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ ఫాస్ట్ ట్యాగ్ ద్వారా సేకరించిన ఆదాయం 148% పెరిగినట్లు కేంద్ర రోడ్డు & రవాణా మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఎఐ) 2016లో ఫాస్ట్ ట్యాగ్ ప్రవేశ పెట్టిన తర్వాత మొదటిసారి రికార్డు స్థాయిలో ఈ ఏడాది ₹26,622.93 కోట్ల టోల్ వసూలైంది. 2022-23 సంవత్సరంలో ఫాస్ట్ ట్యాగ్ ద్వారా టోల్ సేకరణ రూ.35,000 కోట్ల వరకు పెరుగుతుందని ఆ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ ఫాస్ట్ ట్యాగ్ ద్వారా ఎన్హెచ్ఎఐ 2019-20లో ₹10,728.52 కోట్లు ఆర్జించింది. ఈ టోల్ వసూళ్లు 2020-21లో ₹20,837.08 కోట్లకు చేరుకున్నట్లు పేర్కొంది. జనవరి 31 వరకు 45 మిలియన్లకు పైగా ఫాస్ట్ ట్యాగ్లు జారీ చేసినట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం పార్లమెంటులో తెలిపారు. 2025 నాటికి ₹50,000 కోట్లను టోల్ ద్వారా సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిందని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి గిరిధర్ అరామానే తెలిపారు. ఫిబ్రవరి 5 నాటికి 1.2 మిలియన్ ఫాస్ట్ ట్యాగ్ రీఫండ్ కేసులను జనవరి 202 నుంచి పరిష్కరించినట్లు గడ్కరీ రాజ్యసభకు తెలిపారు. 2020-21 వరకు సుమారు ₹3,36,661 కోట్ల విలువైన హైవే ప్రాజెక్టులను మంత్రిత్వ శాఖ మంజూరు చేసినట్లు గడ్కరీ ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 2020లో జాతీయ రహదారులపై జరిగిన 1,16,496 రోడ్డు ప్రమాదాల్లో 47,984 మంది మరణించారని ఆయన తెలిపారు. (చదవండి: శాలరీ రూ.7.3లక్షలు!! విద్యార్ధులకు టీసీఎస్ బంపరాఫర్!) -
ఆరు వరుసల్లో హాయిగా.. బెంగళూరు, నిజామాబాద్ హైవే.. ఇంకా మరిన్ని..
►అక్కల్కోట్–కర్నూలు ఎకనమిక్ కారిడార్ రూపంలో పూర్తి కొత్త రోడ్డు ►గద్వాల రోడ్డుపై కర్ణాటక–తెలంగాణ సరిహద్దు నుంచి కర్నూలు వరకు నిర్మాణం ►కొత్తూరు నుంచి తొండుపల్లి వరకు బెంగళూరు హైవే విస్తరణ ►బోయిన్పల్లి నుంచి కాల్లకల్ వరకు నిజామాబాద్ హైవే విస్తరణ సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఆరు వరుసల హైవేలొస్తున్నాయి. గతంలో రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులుగా ఉన్న కొన్నింటిని ఇటీవల కేంద్ర ప్రభుత్వం జాతీయ రహ దారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) పరిధిలోకి తెచ్చింది. ఇప్పుడు ఆ సంస్థ వాటిని ఆరు వరసల జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయనుంది. దీనికి సంబంధించి ఇటీవల డీపీఆర్లు రూపొందించి పంపగా, కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఆమోదముద్ర వేసింది. ఇప్పుడు వాటికి క్రమంగా టెండర్లు పిలుస్తూ ఈ సంవత్సరంలోనే పనులు ప్రారంభించబోతోంది. ఇంతకాలం నగరంలో మినహా, వెలుపల ఆరువరసల రోడ్లు పెద్దగా పరిచయం లేదు. కీలక రహదారులు కావటంతో, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకపోవటం, ప్రమాదాలు లేకుండా వాహనాలు వేగంగా గమ్యం చేరటం లక్ష్యాలుగా వీటిని ఆరు వరసలకు అభివృద్ధి చేయనున్నారు. సూరత్– చెన్నై ఎక్స్ప్రెస్వేపై ప్రత్యేక ఎకనమిక్ కారిడార్ దేశంలో ఉత్తర–దక్షిణ రాష్ట్రాలను అనుసంధానిస్తూ కొత్తగా ఎక్స్ప్రెస్వేలను కేంద్రం అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గుజరాత్లోని సూరత్ నుంచి చెన్నై వరకు యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్వేను నిర్మించనున్నారు. ఇందులో భాగంగా కొన్ని పట్టణాల మధ్య ఎకనమిక్ కారిడార్లను అభివృద్ధి చేస్తున్నారు. అందులో ఒకటి 280 కి.మీ. నిడివి గల మహారాష్ట్రలోని అక్కల్కోట్ పట్టణం నుంచి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు వరకు నిర్మించే కారిడార్. ఇందులో.. కర్ణాటక–తెలంగాణ సరిహద్దులో రాయచూర్–గద్వాల్ రోడ్డు నుంచి జూలెకల్ గ్రామం వరకు ఒక ప్యాకేజీగా, అక్కడి నుంచి కర్నూలు వరకు రెండో ప్యాకేజీగా ఇప్పుడు టెండర్లు పిలిచారు. రూ.1,870 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. బెంగళూరు హైవేపై.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే 44వ నంబర్ జాతీయ రహదారిపై కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంది. దీంతో దాన్ని ప్యాకేజీలుగా చేసి ఆరు వరసల రోడ్డుగా విస్తరించాలని నిర్ణయించారు. హెచ్ఎండీఏ లిమిట్స్ ముగియగానే శంషాబాద్ దాటిన తర్వాత ఔటర్ జంక్షన్వద్ద ఉండే తొండుపల్లి నుంచి ఎగువన కొత్తూరు కూడలి వరకు 12 కి.మీ. ప్రాంతాన్ని ఆరు వరసలకు విస్తరించబోతున్నారు. ఇందుకు రూ. 410 కోట్లు వ్యయం చేయనున్నారు. అప్పా జంక్షన్–మన్నెగూడ విస్తరణకు టెండర్లు.. హైదరాబాద్ శివారులోని అప్పా జంక్షన్నుంచి వికారాబాద్ రోడ్డుపై పరిగి మలుపు సమీపంలో ఉండే మన్నెగూడ కూడలి వరకు 45.5 కి.మీ. మేర రోడ్డును నాలుగు వరసలు గా నిర్మించనున్న విషయం తెలిసిందే. రెండున్నరేళ్లలో ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిజామాబాద్ హైవేలో.. హైదరాబాద్–నిజామాబాద్ జాతీయ రహదారిపై నగర శివారులో కొత్త కాలనీలు, వాణిజ్య కేంద్రాలు ఎక్కువగా వెలుస్తుండటంతో కొన్నేళ్లుగా ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరుగుతూ వస్తోంది. దీంతో నగర శివారులోని బోయిన్పల్లి నుంచి మేడ్చల్ దాటిన తర్వాత కల్లకల్ వరకు రోడ్డును ఆరు వరసలుగా విస్తరించనున్నారు. దీన్ని రెండు ప్యాకేజీలుగా చేసి వెడల్పు చేయనున్నారు. బోయిన్పల్లి నుంచి గుండ్లపోచంపల్లి వరకు 10 కి.మీ. నిడివి రోడ్డును రూ.521 కోట్లతో విస్తరిస్తారు. గుండ్లపోచంపల్లి నుంచి కల్లకల్ వరకు 17 కి.మీ. నిడివిని రూ.730 కోట్ల భారీ వ్యయంతో విస్తరించనున్నారు. ఈ రోడ్డులో కొంపల్లి–దూలపల్లి కూడలి వద్ద, జీడిమెడ్ల కూడలి వద్ద సినీప్లానెట్ సమీపంలో, రద్దీగా ఉండే సుచిత్ర కూడలిలో భారీ ఫ్లైఓవర్లు రానున్నాయి. ఇక ఇరుకుగా మారి తరచూ రోడ్డు ప్రమాదాలతో హడలెత్తిస్తున్న వరంగల్–కరీంనగర్ జాతీయ రహదారిని నాలుగు వరసలుగా విస్తరించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్లు పిలిచారు. -
గిద్దలూరు–వినుకొండ రోడ్డుకు లైన్క్లియర్
సాక్షి, అమరావతి: రాయలసీమను విజయవాడతో అనుసంధానిస్తూ మరో కొత్త రహదారి నిర్మాణానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. గ్రేటర్ రాయలసీమ పరిధిలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి గుంటూరు జిల్లా వినుకొండకు కొత్త రహదారిని నిర్మించనున్నారు. ప్రధానంగా రాయలసీమలోని వెనుకబడిన ప్రాంతాల నుంచి విజయవాడకు మరింత మెరుగైన కనెక్టివిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు విజయవాడ నుంచి బెంగళూరుకు ఎక్స్ప్రెస్ హైవే, అనంతపురం నుంచి విజయవాడకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆమోదించింది. వాటితో రాయలసీమ ప్రాంతానికి పూర్తిస్థాయిలో అనుసంధానం సాధ్యపడుతోంది. కానీ, రాయలసీమలోని నల్లమల ప్రాంతానికి మాత్రం విజయవాడతో సరైన రహదారి లేకుండాపోయింది. దాంతో సీమలోని వెనుకబడిన ప్రాంతాలను విజయవాడ ప్రాంతంతో మరింతగా అనుసంధానించేందుకు గిద్దలూరు–వినుకొండ రహదారి నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. వినుకొండ నుంచి విజయవాడకు ఇప్పటికే ప్రధాన రహదారితో కనెక్టివిటీ ఉంది. కాబట్టి గిద్దలూరు నుంచి వినుకొండ వరకు రహదారి నిర్మిస్తే సరిపోతుందని ప్రభుత్వం భావించింది. దీనిపై ఎన్హెచ్ఏఐ సానుకూలంగా స్పందించి ప్రాజెక్టును ఆమోదించింది. రూ.925.60 కోట్లతో ప్రణాళిక ► ఈ జాతీయ రహదారిని ఎన్హెచ్–544డీ పేరుతో ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి గుంటూరు జిల్లా వినుకొండ వరకు నిర్మిస్తారు. ► 112.80 కి.మీ. పొడవున రెండు వరుసల రహదారిగా నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు రూ.925.60 కోట్ల ప్రణాళికను ఎన్హెచ్ఏఐ ఆమోదించింది. ► ఈ రహదారి నిర్మాణానికి త్వరలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ త్వరలో శంకుస్థాపన చేస్తారు. ► 2023 జనవరి నాటికి ఈ రహదారి నిర్మాణాన్ని పూర్తిచేయాలన్నది ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. -
ఆర్ఆర్ఆర్.. 4,400 ఎకరాలు.. కసరత్తు మొదలైంది
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. దీని కసరత్తు మొదలైంది. 158.6 కి.మీ. ఈ భాగానికి సమీకరించాల్సిన భూమి ఏయే సర్వే నంబర్లలో ఎంతెంత ఉందన్న వివరాల నమోదు పూర్తయింది. గెజిట్ జారీకి వీలుగా దీన్ని ఈ నెల 15న ఢిల్లీలోని ఎన్హెచ్ఏఐ ప్రధాన కేంద్రంలో అందజేయనున్నట్లు సమాచారం. భూసేకరణలో ఇదే తొలి ప్రక్రియ. ఆ వివరాలను పరిశీలించి, కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకున్నాక గెజిట్ విడుదల చేయనున్నారు. ఆ తర్వాత భూసేకరణ వివరాలు ప్రజల ముంగిటికి అధికారికంగా రానున్నాయి. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి కేంద్రం అనుమతి మంజూరు చేసిన నేపథ్యంలో, ఇటీవలే దాని అలైన్మెంట్ను కూడా ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ రోడ్డుకు దాదాపు 4,400 ఎకరాల భూమి అవసరమవుతుందని గుర్తించారు. అలైన్మెంట్ ఆధారంగా ఈ భూమి ఏయే గ్రామాల పరిధిలో ఎంత అవసరమో ఆ వివరాలతో ఓ నివేదికను తాజాగా సిద్ధం చేశారు. అభ్యంతరాలకు 21 రోజులు.. గెజిట్ విడుదల తర్వాత పత్రికా ముఖంగా ప్రచురించి ప్రజల ముంగిట ఉంచుతారు. ఈ జాబితాపై అభ్యంతరాలు తెలిపేందుకు ప్రజలకు 21 రోజుల గడువు ఇవ్వనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కాంపిటెంట్ అథారిటీ ముందు అభ్యంతరాలను వ్యక్తం చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. మండలాలవారీగా (ఇంకా తేల్చలేదు) పబ్లిక్ హియరింగ్ సమావేశాలు (గ్రామసభ తరహా) ఏర్పాటు చేసి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఆ మేరకు కాంపిటెంట్ అథారిటీ మార్పుచేర్పులకు అవకాశం కల్పించేందుకు దాదాపు నెల రోజుల సమయమివ్వనున్నారు. ఆ తర్వాత రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో హద్దుల నిర్ధారణతో పాటు భూ వివరాలను నమోదుచేస్తారు. దీని కోసం ఒక్కో గ్రామానికి 10 మంది వరకు రెవెన్యూ సిబ్బందిని నియమించనున్నట్లు ఆ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ లెక్కన దాదాపు 2వేల మందిని ఈ అథారిటీకి అప్పగించనున్నారు. దీని అధారంగా మరో జాబితాను ప్రచురించి పత్రికాముఖంగా ప్రజల ముందు ఉంచుతారు. దీనిపైనా ప్రజా అభ్యంతరాలకు 2 నెలల గడువు ఇవ్వనున్నారు. ఆ అభ్యంతరాల ఆధారంగా పొరపాట్లను సరిదిద్దుతారు. ఆ తర్వాత.. ఆ భూమిలోని చెట్లు, పైపులైన్లు, ఇతర ఆస్తుల వివరాలు సేకరించి ప్రచురిస్తారు. ఇక ఏ పట్టాదారుకు ఎంత పరిహారం ఇవ్వనున్నారో లెక్కించి ఆ వివరాలను కూడా బహిరం గంగా ప్రచురిస్తారు. దీనిపై కూడా అభ్యంతరాలు స్వీకరిస్తారు. పరిష్కరించగలిగినవి పరిష్కరించి.. వారికి రావాల్సిన పరిహారం వివరాలు పొందు పరుస్తూ (భూమి, అందులోని ఇతర ఆస్తులు కలిపి) అవార్డు పాస్ చేస్తారు. ఈ సందర్భంగా ఆ భూ యజమానుల లిఖితపూర్వక అంగీకారాన్ని అధికారులు సేకరిస్తారు. అంగీకరించని వారికి కూడా రెవెన్యూ అధికారులతో ఓ జాయింట్ ఖాతా తెరిచి అందులో పరిహారాన్ని జమచేస్తారు. వారి అభ్యంతరాలు వీగిపోయిన తర్వాత నిర్బంధంగా భూమిని సమీకరించి పరిహారాన్ని చెల్లిస్తారు. ఏడాది నుంచి రెండేళ్లు పట్టే అవకాశం.. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులో ఇదే అత్యంత కీలక ప్రక్రియ. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు ఏడాది నుంచి రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. అనుకున్నది అనుకున్నట్లు సవ్యంగా సాగితే 6 నెలలు పడుతుందని అంచనా. కానీ.. న్యాయపరంగా, ఇతర ఇబ్బందులను అధిగమించేందుకు రెండేళ్ల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. కాంపిటెంట్ అథారిటీ.. భూసేకరణ ప్రక్రియకు ప్రత్యేకంగా ఓ కాంపిటెంట్ అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం 4 జిల్లాల పరిధిలో ఉండనుంది. సాధారణంగా జిల్లా అదనపు కలెక్టర్ (పరిపాలన) ఆధ్వర్యంలో డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి భూ సేకరణను పర్యవేక్షిస్తారు. ఈ రోడ్డు విషయంలో జాప్యం ఉండకూడదని అథారిటీని ఏర్పాటు చేస్తు న్నారు. ఇందులో ఆర్డీఓ స్థాయి (ఖరారు కాలేదు) ముగ్గురిని నియమించనున్నట్లు సమాచారం. దీని అనుమతి కోసం ఇటీవలే అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. ఒక్కో అధికారికి 50 కి.మీ. నిడివి అప్పగించనున్నట్లు ఓ రెవెన్యూ ఉన్నతాధికారి ‘సాక్షి’తో చెప్పారు. ఒక్కో అధికారికి మూడునాలుగు మండలాల పరిధి రానుంది. పరిహారం.. ప్రభుత్వ విలువపై 3 రెట్ల విలువను పరిహారంగా లెక్కగట్టనున్నారు. లేదా స్థానికంగా ఇటీవల ఏదైనా ప్రాజెక్టు కోసం జరిగిన భూసేకరణలో లెక్కగట్టిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకునే వీలుంది. ఏడాదిలోపు పరిహారం అందివ్వలేని పక్షంలో 12 శాతం వడ్డీ కలుపుకొని చెల్లిస్తారు. -
'అలా చేస్తే తక్కువ కాలంలోనే భూముల ధరలకు రెక్కలు'
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారుల ఆధునీకరణ రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త వ్యాపార అవకాశాలను అందిస్తుంది. ఫెసిలిటీ ఆపరేటర్లతో పాటు డెవలపర్లు, పెట్టుబడిదారులకు ప్రయోజనాలను అందిస్తాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి, కనెక్టివిటీ కారణంగా స్వల్ప కాలంలో జాతీయ రహదారుల వెంబడి భూముల ధరలు 60–80 శాతం వరకు అలాగే రెస్టారెంట్లు, ఫుడ్ కోర్ట్స్, రిటైల్ ఔట్లెట్స్, ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్లు, వేర్హౌస్లు వంటి వాణిజ్య కార్యకలాపాల ప్రారంభంతో ఆయా ప్రాంతాలలోని భూముల ధరలు దీర్ఘకాలంలో 20–25 శాతం మేర వృద్ధి చెందుతాయని జేఎల్ఎల్ తెలిపింది. దేశంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాలలోని ఎన్హెచ్ఏఐ ప్రాపర్టీ ల కోసం జేఎల్ఎల్ను అంతర్జాతీయ కన్సల్టెంట్గా నియమించుకుంది. ఎన్హెచ్ఏఐకు ప్రస్తుతం ఉన్న, కొత్త ప్రాపర్టీలను గుర్తించడం, ల్యాండ్ మానిటైజేషన్ కోసం ఎంపిక చేయడం, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడం, ఫైనాన్షియల్ వయబులిటీలను అంచనా వేయడం జేఎల్ఎల్ పని. 3 వేల హెక్టార్ల అభివృద్ధి.. జాతీయ రహదారుల వెంబడి వాణిజ్య ప్రదేశాలు, గిడ్డంగులు, లాజిస్టిక్ పార్క్లు, వేసైడ్ అమెనిటీస్ వంటి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సేవలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రస్తుతం దేశంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)కు జాతీయ రహదారుల వెంబడి 180 ప్రాపర్టీలున్నాయి. అదనంగా 376 కొత్త నేషనల్ హైవే/ఎక్స్ప్రెస్లను నిర్మాణంలో ఉన్నాయి. దేశంలోని 22 రాష్ట్రాలలో 650కి పైగా ప్రాపర్టీలను ఎన్హెచ్ఏఐ గుర్తించింది. వీటిలో ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్వేలో 94 ప్రాపర్టీలున్నాయి. ఇప్పటికే 130 సైట్లకు బిడ్లను ఆహ్వానించారు కూడా. వచ్చే ఐదేళ్లలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో 3 వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణాన్ని అభివృద్ధి చేయాలని లకి‡్ష్యంచింది. రోజుకు 40 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని సంకల్పించింది. 15–30 శాతం ఆదాయం.. ఒక్కో ప్రాపర్టీ అభివృద్ధికి సగటున రూ.1–10 కోట్ల మూలధన పెట్టుబడులు కావాలి. మొత్తంగా వచ్చే ఐదేళ్లలో రూ.4,800 ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశముంటుంది. ఒక్కో సైట్ లీజు ఆదాయం 15–30 శాతం ఉంటుందని జేఎల్ఎల్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ అండ్ వాల్యుయేషన్ అడ్వైజరీ హెడ్ శంకర్ అంచనా వేశారు. క్లియర్ ల్యాండ్ టైటిల్, ఉచిత ఎన్కంబరెన్స్, ప్రీ–అప్రూవ్డ్ సైట్తో పాటు భూ వినియోగ మార్పు అవసరం లేకుండా 30 ఏళ్ల పాటు లీజు ఆదాయాలను పొందవచ్చు. దీంతో పాటు ప్రాజెక్ట్ అభివృద్ధి పనులతో డెవలపర్లు, పెట్టుబడిదారులకు మరిన్ని వ్యాపార అవకాశాలుంటాయన్నారు. గుర్తించిన సైట్ల డెవలప్మెంట్తో చుట్టుప్రక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక జనాభాకు ఉపాధి అవకాశాలొస్తాయని తెలిపారు. చదవండి: హైదరాబాద్పై దేశీ రియల్టర్ల ఫోకస్.. కారణాలు ఇవే -
Hyderabad RRR: అలైన్మెంట్.. ఆల్రైట్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డు ఉత్తరభాగం అలైన్మెంట్కు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఆమోదం తెలిపింది. మూడు వారాల క్రితం తుది అలైన్మెంట్ను ఖరారు చేయగా తాజాగా దానికి మరో చిన్న సవరణ చేసి తుది అలైన్మెంట్కు ఆమోదముద్ర వేసింది. ఈ విషయం త్వరలోనే అధికారికంగా వెల్లడి కానుంది. ఉత్తర భాగానికి కన్సల్టెన్సీ బాధ్యతలు చూస్తున్న కే అండ్ జే కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గతంలో నాలుగు అలైన్మెంట్ ఆప్షన్లను ఢిల్లీలోని ఎన్హెచ్ఏఐ కేంద్ర కార్యాలయానికి పంపగా.. ‘ఆప్షన్–ఏ’ను ఖరారు చేసింది. మూడేళ్ల క్రితం కన్సల్టెన్సీగా వ్యవహరించిన సంస్థ అలైన్మెంట్తో పోలిస్తే 1.2 కి.మీ. నిడివిని తగ్గిస్తూ ఈ అలైన్మెంట్ ఉంది. అయితే ఇందులో అత్యవసరంగా మరో సవరణ చేశారు. దీని ప్రకారం పాత అలైన్మెంట్ (మూడేళ్ల కిందటిది)కు కేవలం 200 మీటర్ల తేడాతో ఈ కొత్త అలైన్మెంట్ను 158.645 కి.మీ.గా నిర్ధారించారు. నాలుగు జిల్లాలు.. 15 మండలాలు.. ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగం సంగారెడ్డి, యాదాద్రి, మెదక్, సిద్దిపేట జిల్లాల పరిధిలో నిర్మితం కానుంది. ఈ జిల్లాల పరిధిలోని 15 మండలాలను అనుసంధానిస్తూ రూపుదిద్దుకుంటుంది. 120 గ్రామాల పరిధిలో భూసమీకరణ జరగనుంది. ఇందులో 80–82 గ్రామాల నుంచి సింహభాగం భూమిని సమీకరించనుండగా వాటికి కి.మీ. లోపు దూరంలో ఉండే మరో 38–40గ్రామాల నుంచి స్వల్పంగా సమీకరిస్తారు. అలైన్మెంట్లో భాగంగా ఆయా గ్రామాల పేర్లను గుర్తించి కేంద్రానికి పంపారు. మరో నెల రోజుల్లో భూసమీకరణ ప్రక్రియ ప్రారం భం కానుందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. రూ. 7,512 కోట్ల నిర్మాణ వ్యయం అవుతుం దని అంచనా వేస్తున్న ఈ ప్రాజెక్టుకు 4 వేల ఎకరాల భూమిని సమీకరించనున్నారు. భూసేకరణకే దాదాపు రూ. 1,800 కోట్ల వరకు ఖర్చు కానుంది. ముందే వెల్లడించిన ‘సాక్షి’ ఎన్హెచ్ఏఐ తుది అలైన్మెంట్ను ఖరారు చేసిన విషయాన్ని పక్షం రోజుల కిందటే ‘సాక్షి’ఎక్స్క్లూజివ్గా వెల్లడించింది. మూడేళ్ల కిందట పాత కన్సల్టెన్సీ సంస్థ రూపొందించిన అలైన్మెంట్కు సవరణలు చేస్తూ ఆప్షన్–ఏను ఖరారు చేసిన విషయాన్ని పాఠకులకు అందించింది. ఇప్పుడు ఎన్హెచ్ఏఐ దాన్నే ఓకే చేసింది. ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగం నిర్మాణ పరిధిలోకి వచ్చే మండలాలు.. ► సంగారెడ్డి- సంగారెడ్డి, చౌటకూరు, హత్నూరు ► మెదక్- నర్సాపూర్, శివంపేట, తూప్రాన్ ► సిద్దిపేట- గజ్వేల్, వర్గల్, మర్కూక్, జగదేవ్పూర్ ► యాదాద్రి- తుర్కపల్లి, యాదాద్రి, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ ► 158.465 కిలోమీటర్లు- ఉత్తర భాగం రహదారి మొత్తం పొడవు ► 4,000-ఎకరాలు సమీకరించే భూమి ► రూ. 7,512 కోట్ల అంచనా వ్యయం -
కృష్ణానదిపై మరో వంతెనకు ప్రణాళిక
సాక్షి, అమరావతి: కోల్కతా–చెన్నై జాతీయ రహదారి (ఎన్హెచ్–16)పై ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేసేందుకు విజయవాడ తూర్పు బైపాస్ రహదారి నిర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రణాళిక రూపొందించింది. విజయవాడ నగరంపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనపై ఎన్హెచ్ఏఐ సానుకూలంగా స్పందించింది. కృష్ణానదిపై కొత్త వంతెనతో కలిపి 40 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల విజయవాడ తూర్పు బైపాస్ రహదారి నిర్మాణానికి రూ.1,675 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జీఎస్టీ, భూసేకరణ అంశంపై త్వరలో నిర్ణయం తీసుకున్న అనంతరం దీనిపై కార్యాచరణ చేపట్టాలని భావిస్తోంది. ఎన్హెచ్–16 మీద గన్నవరం ముందు నుంచే గుంటూరుకు నేరుగా చేరేందుకు విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు నిర్మించనున్నారు. ప్రస్తుతం కోల్కతా– చెన్నై మార్గంలో వాహనాలన్నీ విజయవాడ మీదుగా వెళ్లాల్సి ఉంది. దీంతో విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీ బాగా ఎక్కువైంది. ఈ సమస్యకు పరిష్కారంగా తూర్పు బైపాస్ రహదారిని ప్రతిపాదించారు. తద్వారా ఎన్హెచ్–16 మీద వాహనాలు మరింత తక్కువ సమయంలో గమ్యం చేరుకోవచ్చు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎన్హెచ్ఏఐ ఐదు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలతో డిజైన్లు రూపొందించి పరిశీలించింది. వాటిలోఒకదాన్ని సూత్రప్రాయంగా ఆమోదించారు. దీని ప్రకారం గన్నవరం విమానాశ్రయానికన్నా ముందునుంచే విజయవాడకు తూర్పు దిశగా కంకిపాడు మీదుగా గుంటూరు జిల్లాలోని కాజ వరకు నాలుగు లేన్ల బైపాస్ రోడ్డు వేస్తారు. దీన్లో భాగంగా కృష్ణానది మీద వంతెన నిర్మిస్తారు. 445 ఎకరాల సేకరణకు రూ.515 కోట్లు అవసరం విజయవాడ తూర్పు బైపాస్ రహదారి కోసం మొత్తం రూ.1,675 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనల మేరకు.. 40 కి.మీ. పొడవున 4 లేన్ల రహదారి నిర్మాణానికి రూ.728 కోట్లు, కృష్ణానదిపై 3,600 మీటర్ల పొడవైన వంతెన నిర్మాణానికి రూ.432 కోట్లు, 445 ఎకరాల భూసేకరణకు రూ.515 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో జీఎస్టీ, మైనింగ్ సెస్ కింద వచ్చే రూ.95 కోట్ల రాబడిని వదలుకునేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. భూసేకరణ వ్యయాన్ని ఎన్హెచ్ఏఐ భరించాలని చెప్పింది. ఎన్హెచ్ఏఐ ప్రధాన కార్యాలయం ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. దీనిపై స్పష్టత వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టును చేపట్టాలని భావిస్తోందని ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులు తెలిపారు. -
హరిత ‘హాయి’ వే
సాక్షి, హైదరాబాద్: బీజాపూర్ జాతీయ రహదారిలో భాగంగా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ కూడలి వరకు నిర్మించనున్న ఎక్స్ప్రెస్ వే నిర్మాణంలో కొంతభాగం గ్రీన్ఫీల్డ్ అలైన్మెంట్గా రూపొందనుంది. అంటే.. ఉన్న రహదారిని విస్తరించడం కాకుండా పూర్తిగా కొత్త రోడ్డును నిర్మిస్తారన్న మాట. ఇది దాదాపు 12 కి.మీ.మేర ఉండనుంది. బైపాస్లలో భాగంగా ఈ కొత్త రోడ్డు నిర్మాణం జరగనుంది. సాధారణంగా బైపాస్లు తక్కువ నిడివి తో ఉంటాయి, కానీ ఇక్కడ రెండు భారీ బైపాస్ల ను కిలోమీటర్ల మేర నిర్మిస్తుండటంతో, అంత మేర గ్రీన్ఫీల్డ్ అలైన్మెంట్గా మారనుంది. ఈ ఆలోచన మొయినాబాద్, చేవెళ్లలను నగర శివారు టౌన్షిప్లుగా మార్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిర్మాణాలు తొలగించాల్సిన పని లేకుండా.. నగరం నుంచి మొయినాబాద్, చేవెళ్ల మీదుగా సాగే బీజాపూర్ రోడ్డును భారత్మాల పరియోజన పథకంలో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. ఇందు లో 46 కి.మీ. మేర అంటే.. అప్పా కూడలి నుంచి వికారాబాద్ రోడ్డులోని మన్నెగూడ వరకు ఎన్హెచ్ఏఐ ఎక్స్ప్రెస్వే తరహాలో నాలుగు వరసలుగా విస్తరించనుంది. ఈ మేరకు ఇప్పటికే టెండర్లు పిలిచింది. నవంబరు 30న వాటిని తెరవాల్సి ఉంది. కానీ మరిన్ని బిడ్లు దాఖలుకు వీలుగా టెండర్ల గడువును మరో నెల పెంచారు. అయితే నగరం నుంచి అప్పా కూడలి వరకు విశాలంగానే ఉన్న రోడ్డు ఆ తర్వాత 25 మీటర్లు, కొన్నిచోట్ల 30 మీటర్లు వెడల్పుతో ఉంది. దాన్ని 60 మీటర్లకు విస్తరించనున్నారు. ప్రధాన రోడ్డు 45 మీటర్లు కాగా, రెండు వైపులా విద్యుత్తు స్తంభాలు, చెట్లు, ఇతర అవసరా ల కోసం 15 మీటర్ల (రెండువైపులా కలిపి) స్థలం ఉంటుంది. దీన్ని రూ.897 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్నారు. ఇక్కడే రెండు భారీ బైపాస్లకు ప్లాన్ చేశారు. ఇప్పటికే మొయినాబాద్ ప్రాంతం బాగా విస్తరించింది. దీంతో ఉన్న రోడ్డును వెడల్పు చేయాలంటే భారీగా నిర్మాణాలను తొలగించాల్సి వస్తుంది. పక్కనుంచే బైపాస్ నిర్మిద్దామంటే కావాల్సినంత స్థలం లేదు. దీంతో నాలుగు కి.మీ. దూరంగా దాదాపు నాలుగున్నర కి.మీ. మేర నాలుగు లైన్ల ప్రధాన క్యారేజ్వేను కొత్త గ్రీన్ఫీల్డ్ రోడ్డుగా నిర్మించాలని నిర్ణయించారు. చేవెళ్ల పట్ట ణం వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ పట్టణానికి దూరంగా దాదాపు ఆరున్నర కి.మీ. మేర మరో భారీ బైపాస్ను గ్రీన్ఫీల్డ్ అలైన్మెంట్ తరహాలో నిర్మించబోతున్నారు. అలాగే మరోచోట చిన్న బైపాస్ రానుంది. ఇలా 46 కి.మీ ఎక్స్ప్రెస్ వేలో 12 కి.మీ. మేర పూర్తిగా కొత్త రోడ్డు రాబోతోంది. రెండు పట్టణాలకు మహర్దశ! నగర శివారు ప్రాంతాల్లో కొంతకాలంగా ఆధునిక కాలనీలు వెలుస్తున్నాయి. నగరానికి చేరువగా ఉన్న మొయినాబాద్, చేవెళ్లల్లో ఇప్పటికే ఫామ్హౌస్ల ఏర్పాటుతో నగరవాసుల మకాం మారుతోంది. ఈ కొత్త రోడ్డుతో ఈ దిశగా పురోగతి మరింత వేగంగా సాగుతుందని భావిస్తున్నారు. పాత రోడ్డు, కొత్త రోడ్డు మధ్య కాలనీల అభివృద్ధి వేగంగా జరిగే అవకాశం ఉంది. -
ఎలక్ట్రిక్ వెహికల్ కొనేవారికి కేంద్రం శుభవార్త!
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనేవారిని ప్రోత్సహించడం కోసం కేంద్రం ఇప్పటికే సబ్సిడీ ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు మరో శుభవార్త ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు చెప్పింది. ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారిని వేదిస్తున్న ప్రధాన సమస్యకు చెక్ పెట్టేందుకు జాతీయ రహదారులపై ప్రతి 40 నుండి 60 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేయాలని ఎన్హెచ్ఏఐ లక్ష్యంగా పెట్టుకున్నట్లు రోడ్డు కార్యదర్శి గిరిధర్ అరామానే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 2023 నాటికి దేశంలో ఉన్న 40,000 కిలోమీటర్ల జాతీయ రహదారులను ఛార్జింగ్ స్టేషన్లతో కవర్ చేయాలని అథారిటీ యోచిస్తున్నట్లు ఎన్హెచ్ఏఐ చైర్మన్ అరామే తెలిపారు. మొత్తం మీద, రాబోయే రెండేళ్లలో 700 ఛార్జింగ్ ఏర్పాటు చేయనున్నారు. " ఇక ఎలక్ట్రిక్ వాహనంలో జాతీయ రహదారులపై వెంట ప్రయాణిస్తున్న వారు ఛార్జింగ్ ఆయిపోతే భాదపడాల్సిన అవసరం లేదు" అని అరామానే తెలిపారు. ఛార్జింగ్ స్టేషన్లు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వేస్, ఇప్పటికే ఉన్న రహదారుల వెంట ప్రైవేట్ సంస్థల ద్వారా అభివృద్ధి చేయనున్నారు. "ఎలక్ట్రిక్ వేహికల్ ఛార్జింగ్ సదుపాయాలను మెరుగుపరచడానికి వేసైడ్ సౌకర్యాల కోసం మేము రాయితీ ఒప్పందాన్ని సవరించాము. అంతేగాకుండా రెస్టారెంట్, మరుగుదొడ్లు, డ్రైవర్ల విశ్రాంతి గదులు, పెట్రోల్ & డీజిల్ పంపిణీ యంత్రాలు ఏర్పాటు చేయనున్నట్లు" అరామానే తెలిపారు. ఇప్పటివరకు ఎన్హెచ్ఏఐ 700 వేసైడ్ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి బిడ్లను ఆహ్వానించింది. ఇందులో ఈవి ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఉన్నాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది, కానీ తగినంత ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల కొనుగోలు దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2017-18లో 69,012 యూనిట్ల రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించినట్లు అప్పటి భారీ పరిశ్రమల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మార్చిలో పార్లమెంటుకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఈ సంఖ్య 2018-19లో 1,43,358 యూనిట్లు, 2019-20లో 1,67,041కు పెరిగాయి. (చదవండి: ఎలక్ట్రిక్ వాహనాలు ఎప్పటికీ అదే రేంజ్ మైలేజ్ ఇస్తాయా?) -
తిరుపతి–మదనపల్లె ఫోర్లేన్కు శ్రీకారం
సాక్షి, మదనపల్లె : తిరుపతి– మదనపల్లె ఫోర్లేన్ రోడ్డుకు ఎన్హెచ్ఏఐ టెండర్లు ఆహ్వానించింది. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి కృషి ఫలించింది. ఇటీవల ఆయన కేంద్రమంత్రి నితిన్గడ్కరీతో సమావేశమై ఎన్హెచ్–71 నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరడంతో ప్రక్రియ ప్రారంభమైంది. మదనపల్లె నుంచి చెర్లోపల్లె (తిరుపతి) వరకు 103 కిలోమీటర్ల రహదారిలో తొలిదశగా రూ.1,474.54కోట్ల అంచనా వ్యయంతో మదనపల్లె–పీలేరు మధ్య 55.90 కిలోమీటర్ల రోడ్డు నిర్మించనున్నారు. డిజైన్, బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (డీబీఓటీ) విధానంలో రహదారి నిర్మించాలని ఎన్హెచ్ఏఐ అధికారులు నిర్ణయించారు. ఎన్హెచ్ఏఐ పోర్టల్లో ఈ–ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో డిసెంబర్ 13 లోపు ఈ–టెండర్లు దాఖలు చేయాలని కోరారు. డిసెంబర్ 14న టెండర్లను ఖరారు చేసి వచ్చే ఏడాది జనవరి నుంచి రోడ్డు నిర్మాణం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నా రు. ఫోర్లేన్ రోడ్డు మంజూరుకు చొరవ చూపిన ఎంపీ మిథున్రెడ్డికి ఎమ్మెల్యే నవాజ్బాషా కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (రైల్వే స్టేషన్లో పేలుడు.. నలుగురు జవాన్లకు తీవ్రగాయాలు) -
రూ.1,513 కోట్లతో ఎన్హెచ్ 167బి
సాక్షి, అమరావతి: ఆంద్రప్రదేశ్లో మరో ప్రధాన రహదారిని అభివృద్ధి చేయాలని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. వైఎస్సార్ జిల్లాను చెన్నై–కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానిస్తూ ‘ఎన్హెచ్–167బి’ ని రెండు లేన్లు + పావ్డ్ సోల్డర్స్ (12 అడుగుల వెడల్పు)గా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం మైదుకూరు నుంచి ప్రకాశం జిల్లా సింగరాయకొండ వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి ఆమోదముద్ర వేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖకు సమర్పించిన నివేదికలో ఈ రహదారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. 189 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నాలుగు ప్యాకేజీల కింద మొత్తం రూ.1,513.31 కోట్లతో నిర్మించేందుకు ఆమోదించారు. దీన్లో మాలకొండ నుంచి సింగరాయకొండ వరకు 46 కిలోమీటర్ల రహదారికి రూ.369.81 కోట్లతో పనులకు టెండర్ల ప్రక్రియ చేపట్టారు. మిగిలిన రూ.1,143.5 కోట్ల పనుల కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ పూర్తికావచ్చింది. -
జాతీయ రహదారిపై 170 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన కేంద్ర మంత్రి
దేశ రోడ్డు రవాణా వ్యవస్థలో కీలకమైన ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే పనులు 2023, మార్చి నాటికి పూర్తి కానునట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్ధిక రాజధాని ముంబై మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి కేంద్రం రూ.98 వేల కోట్లతో ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే నిర్మాణ పనులను 2019 నుంచి చేపడుతుంది. ఈ ప్రాజెక్టు పనులను కేంద్రం మంత్రి గడ్కరీ తనిఖీ చేశారు. ప్రస్తుతం దీని నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అలాగే, ఈ రహదారి మీద నితిన్ గడ్కరీ స్పీడ్ టెస్ట్ నిర్వహించారు. నిర్మాణ దశలో ఉన్న ఈ రహదారి మీద 170 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లారు. రత్లామ్ జిల్లాలోని ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే నిర్మాణ పనులను పరిశీలించే సమయంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అకస్మాత్తుగా తన పక్కనున్న వ్యక్తితో కారు వేగాన్ని పెంచామని సూచించారు.. దీంతో ఆ వ్యక్తి వెంటనే కారును 170 కి.మీ వేగంతో తీసుకెళ్ళాడు. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ ఎంపీ లోకేంద్ర పరాశర్ ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు.ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గడ్కరీ ఇంతకు ముందు హెలికాప్టర్ లో ఈ ప్రాంతాన్ని తనిఖీ చేశారు.(చదవండి: అమ్మకానికి విరాట్ కోహ్లి కారు ? ధర ఎంతంటే) #नया_भारत केंद्रीय मंत्री @nitin_gadkari जी ने रतलाम जिले से गुजरने वाले दिल्ली-मुंबई एक्सप्रेस वे पर 170 किमी प्रति घंटे की रफ्तार से कार चलवाकर लिया स्पीड टेस्ट @BJP4MP pic.twitter.com/Xq5b4jupqs — लोकेन्द्र पाराशर Lokendra parashar (@LokendraParasar) September 16, 2021 ఇప్పటివరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల ప్రాజెక్టుల కోసం రూ.1.50 లక్షల కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రోడ్డు ప్రాజెక్టుల కోసం మరో లక్ష కోట్ల రూపాయలు మంజూరు చేయబోతున్నాను అని ఆయన ఒక కార్యక్రమంలో చెప్పారు. ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వేలో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వాహనాన్ని నడిపినట్లు గడ్కరీ పేర్కొన్నారు. 45 నిమిషాలకు పైగా కొనసాగిన ఈ తనిఖీలో గడ్కరీతో పాటు ఎంపిలు గుమాన్ సింగ్ దామోర్, అనిల్ ఫిరోజియా, సుధీర్ గుప్తా, రత్లాం జిల్లా ఎమ్మెల్యే చేతన్యా కశ్యప్ ఉన్నారు. ఈ ఎక్స్ ప్రెస్ వే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మూడు జిల్లాల గుండా వెళుతుంది, వీటిలో రత్లామ్, మాండ్ సౌర్, ఝబువా ఉన్నాయి. -
మూడు రాష్ట్రాలకు మణిహారం
సాక్షి, అమరావతి: మూడు రాష్ట్రాల్లో ఆర్థికాభివృద్ధికి మణిహారం లాంటి విశాఖపట్నం–రాయ్పూర్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. తూర్పు తీరం నుంచి అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర స్థాయి కార్గో రవాణాకు విశాఖ ప్రధాన కేంద్రం కానుంది. విశాఖపట్నం నుంచి ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ను అనుసంధానిస్తూ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణాన్ని చేపట్టనున్నారు. భారత్మాల ప్రాజెక్టు మొదటి దశ కింద మొత్తం 464 కి.మీ. మేర ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) సన్నాహాలు వేగవంతం చేసింది. రాష్ట్రంలో రూ.3,200 కోట్లతో 100 కి.మీ. కార్గో రవాణాకు కీలకమైన రాయ్పూర్ – విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్కు ఎన్హెచ్ఏఐ ప్రణాళిక రూపొందించింది. దాదాపు రూ.20 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును ఆమోదించింది. రాయ్పూర్ నుంచి ఒడిశా మీదుగా విశాఖలోని సబ్బవరం వరకు 464 కి.మీ. మేర గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను నిర్మిస్తారు. ఛత్తీస్గఢ్లో 124 కి.మీ, ఒడిశాలో 240 కి.మీ, ఆంధ్రప్రదేశ్లో 100 కి.మీ. మేర నిర్మాణం చేపడతారు. అత్యంత కీలకమైన గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కోసం ఒడిశాలో అటవీ భూముల సేకరణకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు కూడా జారీ చేసింది. మూడు ప్యాకేజీల కింద ఈ రహదారి పనులను చేపట్టాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను రూపొందించేందుకు టెండర్లు పిలిచి కన్సల్టెన్సీలను ఖరారు చేసింది. రాష్ట్రంలో విజయనగరం జిల్లా సాలూరు నుంచి విశాఖ జిల్లా సబ్బవరం వరకు ఈ రహదారిని నిర్మిస్తారు. ఏపీలో ఆరు లేన్ల రహదారికి రూ.3,200 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక ఖరారైంది. దాదాపు 2 వేల ఎకరాలను సేకరించాలని అంచనా వేశారు. అత్యధికంగా విజయనగరం జిల్లాలో దాదాపు 1,300 ఎకరాలను సేకరించాల్సి ఉంది. కీలకమైన ఈ ప్రాజెక్టు భూసేకరణకు విజయనగరం, విశాఖ జిల్లా యంత్రాంగాలు సన్నాహాలు వేగవంతం చేశాయి. పారిశ్రామికాభివృద్ధికి చుక్కాని.. రాయ్పూర్– విశాఖ ఎకనామిక్ కారిడార్ పారిశ్రామికాభివృద్ధికి చుక్కానిలా నిలవనుంది. కార్గో రవాణాకు కీలకంగా మారనుంది. విశాఖపట్నం, గంగవరం పోర్టుల నుంచి రాష్ట్రంతోపాటు ఒడిశా, ఛత్తీస్గఢ్లకు కార్గో రవాణాకు ఈ రహదారే రాచబాట కానుంది. విశాఖ స్టీల్ప్లాంట్, భిలాయి స్టీల్ప్లాంట్ (ఛత్తీస్గఢ్), బైలదిల్లాలోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఛత్తీస్గఢ్), దామంజోడిలోని నేషనల్ అల్యూమినియం కార్పొరేషన్(ఒడిశా), సునాబెడలోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(ఒడిశా) లాంటి కీలక పారిశ్రామిక కేంద్రాలను ఈ రహదారి అనుసంధానించనుంది. కార్గో రవాణా, పారిశ్రామిక అనుబంధ పరిశ్రమల వృద్ధి ద్వారా భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంత కీలకమైన ప్రాజెక్టు కావడంతో వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఇటీవల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఈ రహదారి గురించి కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు. 2024 నాటికి రాయ్పూర్ – విశాఖ ఎకనామిక్ కారిడార్ను పూర్తి చేస్తామని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆయనకు తెలియజేశారు. ఈ రహదారి నిర్మాణ పనులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నట్లు రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. -
లంకెలపాలెం నుంచి మధురవాడ వరకు ట్రా‘ఫికర్’ లేకుండా..
సాక్షి, అమరావతి: విశాఖ మహా నగరంలో లంకెలపాలెం నుంచి మధురవాడ వరకు ప్రయాణమంటే హడలెత్తాల్సిందే. ఆ 46 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే రద్దీ సమయంలో రెండు గంటలకు పైనే పడుతుంది. త్వరలో ఎక్కడా ట్రాఫిక్ జామ్ అనేది లేకుండా.. సిగ్నల్ పాయింట్ల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా ప్రయాణించే అవకాశం రాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు లంకెలపాలెం నుంచి మధురవాడ వరకు 12 జంక్షన్ల వద్ద చిన్న ఫ్లై ఓవర్లతో ట్రాఫిక్ జంక్షన్ల అభివృద్ధికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) కార్యాచరణ ప్రణాళికను ఆమోదించింది. రూ.298 కోట్లతో 12 జంక్షన్ల అభివృద్ధి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విశాఖ నగరాన్ని అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం రెండు కీలక ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది. నగరం మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి–16 అభివృద్ధితోపాటు మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ రెండింటినీ విశాఖ శివారులోని లంకెలపాలెం నుంచి మధురవాడ వరకు చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, ప్రయాణికులు తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకోవడం కోసం ఈ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. అందుకోసం లంకెలపాలెం నుంచి మధురవాడ మధ్య కీలకమైన 12 జంక్షన్లను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. లంకెలపాలెం, దువ్వాడ, స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్, గాజువాక, తాటిచెట్ల పాలెం, అక్కయ్య పాలెం, గురుద్వారా, విప్రో జంక్షన్, మద్దిలపాలెం, డెయిరీ ఫాం జంక్షన్, యండాడ జంక్షన్, మధురవాడ జంక్షన్ల వద్ద చిన్నపాటి ఫ్లై ఓవర్లు నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఎన్హెచ్ఏఐ ఆమోదం తెలిపింది. అందుకోసం రూ.298 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికను ఖరారు చేసింది. విశాఖలో ఫ్లైఓవర్ల నిర్మాణానికి గుర్తించిన 12 జంక్షన్లు మూడు డిజైన్లలో ఫ్లై ఓవర్లు జంక్షన్లను అనుసంధానించే రోడ్లకు తగ్గట్టుగా మూడు రకాల ఫ్లై ఓవర్ల డిజైన్లను ఎన్హెచ్ఏఐ రూపొందించింది. ప్లస్ (+), టీ, వై డిజైన్లను ఖరారు చేశారు. కాగా మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రణాళిక కూడా ఖరారయ్యాక తుది నిర్ణయం తీసుకుంటారు. అనంతరం ఏడాదిలోగా నిర్మాణాలను పూర్తి చేయాలని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. -
అరకు అందాలకు రాచబాట
సాక్షి, అమరావతి: చుట్టూ పచ్చని కొండలు.. ఆకాశాన్ని తాకుతున్నట్టుండే దట్టమైన వృక్షాలు.. వాటి మధ్య నల్లటి నాగులా మెలికలు తిరుగుతూ రహదారి.. ఓ వైపు లోయలు.. అక్కడక్కడా కనువిందు చేసే జలపాతాలు.. సేద తీరేందుకు వేసవి విడిదిలు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా తూర్పుగోదావరి–విశాఖ ఏజెన్సీలను కలుపుతూ మణిహారం వంటి రహదారి నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచ బ్యాంకు నిధులతో విశాఖపట్నం ఏజెన్సీలో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ముందుగా నిర్ణయించిన రహదారులను అనుసంధానిస్తూ ఈ రెండు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల మీదుగా కొత్త రహదారి నిర్మించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించారు. 406 కి.మీ. మేర రూ.900 కోట్లతో ఈ రహదారి నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ ఆమోదం తెలిపింది. పర్యాటకానికి మణిపూసలా.. ఎన్హెచ్ఏఐ ప్రపంచ బ్యాంకు నిధులతో విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాన్ని విజయనగరం జిల్లాతో కలుపుతూ రెండు రహదారులను నిర్మిస్తోంది. బౌదర నుంచి విజయనగరం, పాడేరు నుంచి అరకు వరకు 76.31 కి.మీ. మేర రూ.493 కోట్లతో రహదారి నిర్మాణాన్ని చేపట్టింది. అదేవిధంగా కొయ్యూరు నుంచి పాడేరు వరకు రూ.785.72 కోట్లతో మరో రహదారి నిర్మిస్తోంది. ప్రస్తుతం అరకులోని పర్యాటక ప్రాంతాలను సందర్శించే పర్యాటకులు ఈ మార్గం నుంచే వెళ్తున్నారు. అటు విశాఖపట్నం నుంచి.. ఇటు విజయనగరం నుంచి బౌదర మీదుగా అరకు వెళ్తున్నారు. అంటే ఉత్తరాంధ్ర నుంచే ఆ మార్గం అరకుకు కనెక్టివిటీగా ఉంది. కాగా అరకు లోయకు రాష్ట్రంలోని మరో వైపు నుంచి కూడా కనెక్టివిటీ పెంచితే పర్యాటకులను మరింతగా ఆకర్షించ వచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించారు. ప్రధానంగా రాజమహేంద్రవరం నుంచి నేరుగా అరకు లోయకు కనెక్టివిటీ మెరుగుపరిస్తే రాష్ట్రంలోని మిగిలిన 10 జిల్లాల వారికి కూడా అరకు పర్యటన మరింత సులభమవుతుంది. హైదరాబాద్, విజయవాడ వైపు నుంచి వచ్చేవారికి రాజమహేంద్రవరం మీదుగా అరకుకు అనుసంధానించేలా రహదారి నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. మొత్తం 406 కి.మీ. మేర నిర్మించే ఈ రహదారులకు రూ.900 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన అధికారులు ప్రణాళికను ఖరారు చేశారు. దీనిపై సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)రూపొందిస్తున్నారు. డీపీఆర్ అనంతరం టెండర్ల ప్రక్రియ చేపట్టాలని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. -
6 వరుసలుగా నాగ్పూర్ హైవే
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ చిక్కులతో విలవిల్లాడుతున్న 44వ నంబర్ జాతీయ రహదారి(నాగ్పూర్– నిజామాబాద్ హైవే)ని హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఆరు వరుసలకు విస్తరించనున్నారు. ఈ మేరకు భారత జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రతిపాదించింది. హైదరాబాద్లోని బోయిన్పల్లి నుంచి మేడ్చల్ తర్వాత ఉండే కాల్లకల్ వరకు దాదాపు 24 కి.మీ. మేర రహదారిని విస్తరించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖకు తాజాగా ప్రతిపాదించింది. ఇందుకు దాదాపు రూ.1,300 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. దీనికి కేంద్రం నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఈ జాతీయ రహదారికి ఇరువైపులా మేడ్చల్ వరకు కొత్త కాలనీలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ చిక్కులు ఏర్పడుతున్నాయి. కూడలి ప్రాంతాల్లో సిగ్నల్ పడితే కిలోమీటర్ మేర వాహనాల బారులు తీరుతున్నాయి. దీంతో ఈ రహదారిని విస్తరించాలని చాలాకాలం నుంచి ప్రజలు కోరుతున్నారు. భారీ ఎలివేటెడ్ కారిడార్లతో.. బోయిన్పల్లి నుంచి మేడ్చల్ వరకు కీలక కూడళ్లలో భారీ ఎలివేటెడ్ కారిడార్లకు ప్రణాళిక రచించారు. హైదరాబాద్ నుంచి మేడ్చల్ వెళ్లే దారిలో తొలుత కీలక జంక్షన్ అయిన సుచిత్ర కూడలి వద్ద 2 కి.మీ. పొడవైన వంతెన నిర్మించనున్నారు. ఇక్కడి నుంచి 10 కి.మీ. అంటే గుండ్లపోచంపల్లి వరకు మూడు భారీ వంతెనలు ఉంటాయి. సుచిత్ర కూడలి మొద టిది కాగా, సినీప్లానెట్ కూడలి వద్ద 560 మీటర్ల పొడవుతో రెండో వంతెన, కొంపల్లి–దూలపల్లి మధ్య 1.2 కి.మీ. మేర మూడో వంతెన నిర్మిస్తారు. అక్కడి నుంచి మేడ్చల్ దాటేవరకు రోడ్డును పూర్తి స్థాయిలో విశాలంగా మారుస్తారు. మేడ్చల్ దాటే వరకు రెండున్నర కి.మీ. మేర వంతెన నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టును రెండు భాగాలుగా విభజించారు. బోయిన్పల్లి నుంచి గుండ్ల పోచంపల్లి వరకు పనులకు రూ.450 కోట్లు, అక్కడి నుంచి మేడ్చల్ వరకు చేపట్టే పనులకు రూ.850 కోట్లు ప్రతిపాదించారు. -
టోల్ గేట్ల వద్ద పసుపు గీతలు.. భారీగా క్యూ ఉంటే నో టోల్ ఫీజు..!
సాక్షి, హైదరాబాద్: పసుపు గీతలు.. టోల్గేట్ల వద్ద వాహనదారుల కష్టాల పరిష్కారానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) తాజాగా ముందుకు తెచ్చిన ప్రతిపాదన. ఈ పసుపు గీతలు టోల్ గేట్ల వద్ద వాహనాలు క్యూ ఏర్పడకుండా చేస్తాయని సంస్థ చెబుతోంది. సాధారణ రోజుల్లో సమస్య లేకున్నా.. పండగలు, రద్దీ ఎక్కువగా ఉండే ఇతర రోజుల్లో టోల్ గేట్ల వద్ద పెద్దయెత్తున వాహనాలు బారులు తీరుతూ గేటు దాటడం విసుగుగా మారుతోంది. ఇటీవల పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చిన ఫాస్టాగ్ కూడా దీనికి పూర్తిస్థాయి పరిష్కారం చూపలేకపోతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్హెచ్ఏఐ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచి్చంది. ఈ మేరకు మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలకు పంపింది. తెలంగాణ ఎన్హెచ్ఏఐ అధికారులు కూడా వీటిని అందుకున్నారు. కానీ దీని అమలు విషయంలో వారిలో కొంత అయోమయం నెలకొంది. ఫాస్టాగ్లో కోత పడదు జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద గేట్లను ఆనుకుని వంద మీటర్ల దూరంలో పసుపు రంగులో జీబ్రాలైన్స్ తరహా గీతలు ఏర్పాటు చేస్తారు. గేటు వద్ద ఆగే క్రమంలో ఈ వంద మీటర్ల దూరంలో ఉండే పసుపు రంగు గీతలకు మించి వాహనాలు బారులు తీరితే ఈ కొత్త విధానం అమలవుతుంది. అలాంటి సమయంలో పసుపు గీతలు ఉండే వంద మీటర్ల లోపు ఉన్న వాహనాలన్నింటినీ ఒకేసారి గేటు ఎత్తి ముందుకు వదులుతారు. అది కూడా ఎలాంటి టోల్ రుసుము వసూలు చేయకుండానే. అంటే ఫాస్టాగ్ మొత్తంలో ఎలాంటి కోతా పడదన్న మాట. అలా ఎప్పుడు పసుపు గీతలకు మించి క్యూలు ఏర్పడినా వదిలేయడం వల్ల భారీ క్యూలు ఏర్పడవనేది ఎన్హెచ్ఏఐ ఉద్దేశం. అలా అయితే టోల్ గేటు ఎందుకు? ఈ విషయమై స్థానిక అధికారుల్లో పూర్తిస్థాయి స్పష్టత లేదు. పసుపు రంగు గీత దాటి వాహనాలు క్యూగా ఏర్పడితే.. ముందున్న వాటిని గేటు ఎత్తి పంపించేస్తారు..సరే. కానీ అవి వెళ్లిన వెంటనే మళ్లీ వెనక క్యూ ఏర్పడితే వాటినీ అలాగే పంపాలి. అలా రద్దీ ఉన్న సమయంలో వంద మీటర్ల మేర వాహనాల వరస ఏర్పడటం సాధారణమేనని అధికారులు అంటున్నారు. అలా పంపుతూ అన్ని వాహనాలూ వదిలేస్తే ఇక టోల్ గేటు ఎందుకనేది అధికారుల ప్రశ్న. దీంతో దీనిపై ఢిల్లీ అధికారుల నుంచి స్పష్టత తీసుకున్నాక ఈ విధానం అమలులోకి తేవాలని భావిస్తున్నారు. -
Telangana: నలుదిశలా రోడ్ల విస్తరణ..
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారుల విషయంలో కాస్త వెనుకబడి ఉన్న తెలంగాణ రోడ్ నెట్వర్క్ రూపురేఖలు మారేలా కేంద్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. గతంలో పలు సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను అంగీకరిస్తూ కొత్త జాతీయ రహదారులను మంజూరు చేసిన కేంద్రం.. ఇప్పుడు వాటిని సాకారం చేసేందుకు వీలుగా నిధులను కేటాయించింది. ఇటు జాతీయ రహదారుల విభాగం (ఎన్హెచ్), అటు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ద్వారా 1,272 కి.మీ. జాతీయ రహదారులను అభివృద్ధి చేసేందుకు ఏకంగా రూ.18,492 కోట్లను కేటాయిస్తూ కొత్త జాతీయ రహదారుల వార్షిక ప్రణాళికను ప్రకటించింది. దీంతో ఇప్పటికే జాతీయ రహదారులుగా గుర్తింపు పొంది, పనుల కోసం వేచి చూస్తున్న రోడ్ల రూపురేఖలు మారబోతున్నాయి. ఇందులో గతంలో రాష్ట్ర రహదారులుగా ఉండి, కేవలం ఏడు మీటర్లు, అంతకంటే తక్కువ వెడల్పు ఉన్న రోడ్లను 10 మీటర్లకు విస్తరిస్తారు. జాతీయ రహదారిగా మారాలంటే ఆ రోడ్డు కనీసం పది మీటర్ల వెడల్పుతో ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న జాతీయ రహదారుల విభాగం చేపట్టే 787 కి.మీ. రోడ్లు పది మీటర్లకు విస్తరిస్తారు. మొత్తం 18 రోడ్లకు సంబంధించి రూ.6,962 కోట్లు ఖర్చు చేస్తారు. ఇక కేంద్రప్రభుత్వ ఆధీనంలోని ఎన్హెచ్ఏఐ చేపట్టే 485 కి.మీ. రోడ్లను నాలుగు వరసలుగా విస్తరిస్తారు. ఇవి జాతీయ రహదారుల హోదాలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం అవి రెండు వరసలుగా మాత్రమే ఉన్నాయి. ఇది పెద్ద పని అయినందున వీటికి రూ.11,530 కోట్లు ఖర్చు కానున్నాయి. ఇప్పుడు జాతీయ సగటును మించి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి స్థానికంగా జాతీయ రహదారుల నిడివి చాలా తక్కువగా ఉండేది. మొత్తం రోడ్లలో జాతీయ రహదారుల వాటా ప్రకారం లెక్కిస్తే, దక్షిణ భారత్లోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ వెనుకబడి ఉండేది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలంగా స్పందించి వేగంగా జాతీయ రహదారులను మంజూరు చేయటంతో పాటు భారీగా నిధులు కేటాయించటంతో గత ఏడేళ్లలో పనులు మెరుగ్గా జరిగాయి. ఫలితంగా ప్రస్తుతం ప్రతి వంద చ.కి.మీ. నిడివిలో జాతీయ రహదారుల వాటా 4.2 కి.మీ.కు చేరుకుంది. ఇది జాతీయ సగటు 3.8 కంటే ఎక్కువ కావటం విశేషం. ఇప్పుడు అభివద్ధి చేయబోయే రోడ్లు కూడా ఇందులో కలిసే ఉన్నాయి. కేంద్రం కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు జాతీయ రహదారుల అనుసంధానంలో భాగంగా చేపట్టిన భారత్మాలా ప్రాజెక్టు కింద ఎన్హెచ్ఏఐ పనులు చేపట్టనుంది. భూసేకరణ ఎంత వేగంగా జరిగితే, రోడ్లను నాలుగు వరసలుగా అభివృద్ధి చేసే పని అంత వేగంగా జరగనుంది. ఇక రాష్ట్రప్రభుత్వ ఆధీనంలోని జాతీయ రహదారుల విభాగం చేపట్టే పనులకు పెద్దగా భూసేకరణ అవసరం లేదు. -
Telangana: అభివృద్ధికి రాచబాట..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల్లో జాతీయ రహదారుల అభివృద్ధికి భారీగా నిధులను కేటాయించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కేటాయించిన మేరకు తెలంగాణలో మొత్తం 1,272 కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి కోసం రూ. 18,492 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. వీటికి సంబంధించిన వివరాలను మే 24వ తేదీనాడే తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం పంపించిందని చెప్పారు. సోమవారం ఆయన వర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. జాతీయ రహదారుల విభాగం వార్షిక ప్రణాళిక కింద తెలంగాణకు 787 కిలోమీటర్ల రోడ్లకు గాను రూ.6,962 కోట్లు కేంద్రం కేటాయించిందని కిషన్రెడ్డి తెలిపారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) కింద మరో 485 కిలోమీటర్లకు రూ.11,530 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. ఇక ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారుల కోసం రూ. 14,630 కోట్లను కేంద్రం కేటాయించిందని కిషన్రెడ్డి తెలిపారు. అందులో జాతీయ రహదారుల విభాగం కింద రూ. 6,421 కోట్లు, ఎన్హెచ్ఏఐ కింద మరో రూ.8,209 కోట్లు కేటాయించిందని చెప్పారు. మోదీ ప్రభుత్వం వచ్చాక తెలంగాణకు అంతకు ముందున్న దానికన్నా ఎక్కువ జాతీయ రహదారులను మంజూరు చేసిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. దేశంలో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మోదీ ప్రభుత్వం వచ్చేవరకు ఎన్ని జాతీయ రహదారులు ఉన్నాయో.. మోదీ ప్రభుత్వం వచ్చాక అన్ని జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా భూసేకరణను చేపట్టి నిర్మాణాలు ప్రారంభమయ్యేలా చూడాలని కోరారు. 50% జనాభా ఆర్ఆర్ఆర్ లోపలే.. రూ.17 వేల కోట్లతో 340 కిలోమీటర్ల పొడవున 125 గ్రామాల నుంచి రింగ్ రోడ్డు వెళ్తుందని కిషన్రెడ్డి తెలిపారు. 17 చోట్ల జాతీయ, రాష్ట్ర హైవేలను కలుపుతూ రీజినల్ రింగ్ రోడ్డు అద్భుతంగా ఆవిష్కృతం కాబోతోందన్నారు. 50 శాతం జనాభా ఈ రోడ్డు లోపలే ఉంటుందని, తెలంగాణకు ప్రధాని మోదీ ఇచ్చిన అద్భుత కానుక ఇది అని పేర్కొన్నారు. మొదటి దశలో నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, జగదేవ్పూర్, భువనగిరి, చౌటుప్పల్ జంక్షన్వరకు ఉంటుందన్నారు. రోడ్డు పరిసరాల్లో భూములు కొంటున్నారనే వార్తలు వస్తున్నాయని, భూములు కొనుక్కోవాలా? అని తనను కూడా అడుగుతున్నారని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదని, అలాగే రోడ్లు ఎలా వెళతాయన్నది డీపీఆర్ రాకముందు ఏమీ తెలియదని మంత్రి స్పష్టం చేశారు. డీపీఆర్ను కన్సల్టెన్సీ తయారు చేయాల్సి ఉందని చెప్పారు. ఈ రోడ్డు వస్తే తెలంగాణ ముఖ స్వరూపమే మారుతుందన్నారు. టౌన్షిప్లు, ట్రాన్ప్పోర్టు, టూరిజం అభివృద్ధి పెరుగుతుందని, తెలంగాణ గేమ్ ఛేంజర్ అవుతుందని పేర్కొన్నారు. పూర్తిగా కేంద్రం నిధులతోనే దీని నిర్మాణం జరుగుతుందని, భూసేకరణకు కూడా 50 శాతం నిధులు కేంద్రం సమకూరుస్తుందని, 50 శాతం నిధులను రాష్ట్రం వెచ్చిస్తుందని చెప్పారు. మొదటి దశ డీపీఆర్ పూర్తయిన తర్వాత రెండో దశకు వెళతామన్నారు. ధాన్యం కొగుగోలులో సమస్యలను ఎఫ్సీఐ, కేంద్ర మంత్రులతో మాట్లాడి పరిష్కరిస్తామని కిషన్రెడ్డి చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్డు వస్తే రాష్ట్ర స్వరూపమే మారిపోతుంది. తెలంగాణ గేమ్ ఛేంజర్ అవుతుంది. 340 కిలోమీటర్ల పొడవున, 125 గ్రామాల నుంచి వెళుతూ, 17 చోట్ల జాతీయ, రాష్ట్ర హైవేలను కలుపుతూ ఆర్ఆర్ఆర్ అద్భుతంగా ఆవిష్కృతం కాబోతోంది. 50 శాతం జనాభా ఈ రోడ్డు లోపలే ఉంటుంది. రోడ్డు పరిసరాల్లో భూములు కొంటున్నారనే వార్తలు వస్తున్నాయి.. భూములు కొనుక్కోవాలా? అని నన్ను కూడా అడుగుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు. అలాగే రోడ్లు ఎలా వెళతాయన్నది డీపీఆర్ రాకముందు ఏమీ తెలియదు. డీపీఆర్ను కన్సల్టెన్సీ తయారు చేయాల్సి ఉంది. – కేంద్రమంత్రి కిషన్రెడ్డి నేడు ఆర్ఆర్ఆర్ కన్సల్టెన్సీ టెండర్లు ఓపెన్ రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారు చేసే కన్సల్టెన్సీ ఎంపిక కోసం చేపట్టిన టెండర్ ప్రక్రియ కరోనా కారణంగా ఆలస్యం అయిందని కిషన్రెడ్డి తెలిపారు. గతంలో ఎవరూ టెండర్లు వేయకపోవడంతో మళ్లీ పిలిచామని, ఈ నేపథ్యంలో జూన్ 1 వరకు టెండర్ల గడువును పొడిగించారని చెప్పారు. మంగళవారం టెండర్లు ఓపెన్ చేస్తారని తెలిపారు. అది ఖరారైతే రాష్ట్రం భూసేకరణ పనులను చేపడుతుందన్నారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి టెండర్లు వేయవచ్చన్నారు. -
గుడ్ న్యూస్: అలా అయితే టోల్ గేట్ చార్జీలు కట్టక్కర్లేదు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం టోల్ గేట్ చార్జీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు సజావుగా ప్రయాణించేలా టోల్ ప్లాజా దగ్గర రద్దీ సమయంలో కూడా వాహనదారులకు 10 సెకన్ల కంటే ఎక్కువ సమయం పట్టకుండా ఉండేలా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. టోల్ ప్లాజాల నుంచి 100 మీటర్ల దూరంలో ఉన్న పసుపు గీత దాటి వాహనాలు వేచి ఉంటే అప్పుడు ఆ గీత ముందున్న వాహనాలు టోల్ చార్జీలు చెల్లించకుండానే వెళ్లిపోవచ్చు. ఇలా లైన్ పొడవు 100 మీటర్ల లోపునకు వచ్చే వరకు ముందు వెహికల్స్ చార్జీలు చెల్లించకుండానే వెళ్లిపోవచ్చు అని కేంద్రం తెలిపింది. టోల్ ప్లాజా ఆపరేటర్లలో జవాబుదారీతనం తేవడానికి, వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఇది ఇలా ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచి ఫాస్టాగ్స్ తప్పనిసరి రూల్స్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద ఆగకుండానే వెంటనే వెళ్లిపోవచ్చు. టోల్ చార్జీలు ఫాస్టాగ్ నుంచి కట్ అవుతాయి. దీన్ని మళ్లీ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దేశంలో రాబోయే 10 సంవత్సరాలలో పెరగబోయే వాహనాల సంఖ్యకు అనుగుణంగా రాబోయే టోల్ ప్లాజాల డిజైన్ చేపట్టాలని కేంద్రం తెలిపింది. చదవండి: వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు -
ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు పనులు చేపట్టిన ఎన్హెచ్ఏఐ
సాక్షి, అమరావతి : నేషనల్ హైవే అథారిటీ ఆంధ్రప్రదేశ్లో 42 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు పనులను మొదలుపెట్టింది. ఆదివారం తొలివిడతగా 4 ప్లాంట్ల నిర్మాణాన్ని చేపట్టింది. హిందూపురంలో 1000 ఎల్పీఎం సామర్థ్యంతో ప్లాంట్.. అమలాపురంలో 500 ఎల్పీఎం, మదనపల్లెలో 500 ఎల్పీఎం.. తాడేపల్లి గూడెంలో 1000 ఎల్పీఎం సామర్థ్యంతో ప్లాంట్ల నిర్మాణాన్ని మొదలుపెట్టింది. ఎన్హెచ్ఏఐ ఇప్పటికే 3 ప్లాంట్ల నిర్మాణ పనులు చేపట్టింది. అధికారులు రేపు అమలాపురంలో ప్లాంట్ల నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. మిగిలిన 38 ప్లాంట్ల ఏర్పాటుకు కూడా స్థలాలు ఖరారయ్యారు. ప్రభుత్వం గుర్తించిన ఆస్పత్రుల వద్ద ప్లాంట్ల ఏర్పాటు జరగనుంది. -
ఈ వాహనాలకు టోల్ ఛార్జీ నుంచి మినహాయింపు..!
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజుకు నాలుగు లక్షలకు తక్కువ కాకుండా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో ఆక్సిజన్ కొరతతో రోజు వందల మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. వివిధ ప్రాంతాలనుంచి ఆస్పత్రులకు వాయు, రోడ్డు, రైలు మార్గాలగుండా ఆక్సిజన్ను రవాణా చేస్తున్నారు. తాజాగా ఆక్సిజన్ను రవాణా చేసే ట్యాంకర్లపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఎఐ) కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారుల మీదుగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను మోసే ట్యాంకర్లు, కంటైనర్లకు టోల్ ఫీజును మినహాస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్హెచ్ఎఐ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను తీసుకెళ్లే ట్యాంకర్లు, కంటైనర్లను అంబులెన్స్ వంటి ఇతర అత్యవసర వాహనాలతో సమానంగా చూడాలని ప్రకటించారు. కాగా ఈ వాహనాలను టోల్ ఫీజు నుంచి రెండు నెలలపాటు మినహాయింపును ఇచ్చింది. తదుపరి ఆదేశాల వచ్చేంత వరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని ఎన్హెచ్ఎఐ పేర్కొంది. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్కు గణనీయంగా డిమాండ్ ఏర్పడటంతో ఎన్హెచ్ఎఐ ఈ నిర్ణయం తీసుకుంది. Toll Fee for Tankers Carrying Liquid Medical Oxygen exempted on National Highways. Click here for more details: https://t.co/GmiogH1l8D — NHAI (@NHAI_Official) May 8, 2021 చదవండి: Break The Chain: లాక్డౌన్పై ఉత్కంఠ! -
రోడ్లతో కాసుల వర్షం.. రూ.లక్ష కోట్లు!
న్యూఢిల్లీ: జాతీయ రహదారుల ప్రాజెక్టుల అభివృద్ధి, నిర్వహణను ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం ద్వారా వచ్చే ఐదేళ్లలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) రూ.లక్ష కోట్లను సమీకరించే ప్రణాళికతో ఉన్నట్టు కేంద్ర రవాణా, ఎంఎస్ఎంఈ శాఖల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ రంగంలోని కంపెనీలు పెట్టుబడులతో ముందుకు వచ్చి మంచి అవకాశాలను సొంతం చేసుకోవాలని కోరారు. ఈ నిధులను తిరిగి మరిన్ని మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించనున్నట్టు మంత్రి చెప్పారు. ఇది వృద్ధికి ఊతమిస్తుందన్నారు. జాతీయ అస్సెట్ మానిటైజేషన్ (ఆస్తులపై ఆదాయం రాబట్టుకోవడం) పైప్లైన్ మౌలిక సదుపాయాల రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించే మంచి కార్యక్రమంగా మంత్రి అభివర్ణించారు. ప్రభుత్వం నూతన డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్ (డీఎఫ్ఐ)ను ఏర్పాటు చేసే పనిలో ఉన్నట్టు చెప్పారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధుల అవసరాలను తీర్చే లక్ష్యంతో కేంద్రం దీనికి రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. కేంద్రం తన వాటాగా రూ.20,000 కోట్లను సమకూర్చనుంది. ఐదేళ్లలో దీని ద్వారా రూ.5 లక్షల కోట్ల రుణ వితరణ చేయాలన్నది లక్ష్యం. ఢిల్లీ–ముంబై ఎక్స్ప్రెస్వేపై ప్రత్యేక ఈ హైవే ఢిల్లీ– ముంబై మధ్యనున్న 1,300 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ రహదారి పొడవునా ప్రత్యేకంగా ఈ–హైవేను నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నట్టు గడ్కరీ తెలిపారు. ఈ–హైవేపై బస్సులు, ట్రక్కులు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు వీలుంటుందన్నారు. దీనివల్ల రవాణా వ్యయం 70 శాతం తగ్గుతుందని లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా మంత్రి తెలిపారు. అయితే, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. -
జాతీయ రహదారుల వెంట ప్రపంచ స్థాయి సౌకర్యాలు!
న్యూఢిల్లీ: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) ప్రయాణీకుల సౌకర్యం కోసం దేశంలోని జాతీయ రహదారుల వెంట ఆధునిక వసతులను కల్పించనుంది. వచ్చే ఐదేళ్లలో 22 రాష్ట్రాల్లో హైవే మార్గాలలో 600కు పైగా ప్రాంతాల్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలను అభివృద్ధి చేయనుంది. వీటిలో 130 ప్రాంతాల్లో 2021-22లో అభివృద్ధి చేయాలని లక్ష్యించినట్లు. ఇప్పటికే 120 ప్రాంతాల్లో సౌకర్యాల అభివృద్ధికి బిడ్లను ఆహ్వానించినట్లు ఎన్హెచ్ఏఐ తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఎన్హెచ్లు, భవిష్యత్తులో రాబోయే రహదారులు, ఎక్స్ప్రెస్వే మార్గాలలో ప్రతి 30-50 కి.మీ.లకు ఈ సౌకర్యాలుంటాయని పేర్కొంది. పెట్రోల్ బంక్లు, ఎలక్ట్రిక్ చార్జీంగ్ సదుపాయాలు, ఫుడ్ కోర్ట్లు, రిటైల్ షాపులు, బ్యాంక్ ఏటీఎంలు, మరుగుదొడ్లు, పిల్లల ఆట స్థలాలు, క్లినిక్లు, స్థానిక హస్తకళల కోసం విలేజ్ హట్లు, ట్రక్ మరియు ట్రెయిలర్ పార్కింగ్, ఆటో వర్క్షాప్స్, దాబా, ట్రక్కర్ వసతి గృహాలు వంటి సౌకర్యాలను అభివృద్ధి చేయనున్నట్లు వివరించింది. దేశవ్యాప్తంగా ఎన్హెచ్ఏకు ఉన్న 3 వేల హెక్టార్ల స్థలంలో ఆయా వసతులను అభివృద్ధి చేస్తుంది. దీంతో ఆయా మార్గాలలో పెట్టుబడిదారులు, డెవలపర్లు, ఆపరేటర్లు, రిటైలర్లకు భారీ అవకాశాలు వస్తాయని, అలాగే స్థానిక ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పేర్కొంది. ప్రస్తుతం ఎన్హెచ్ఏఐ రహదారుల అభివృద్ధి, కార్యకలాపాల కోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భవిష్యత్తులో రాబోయే కొత్తగా నిర్మించే/విస్తరించే జాతీయ రహదారి ప్రాజెక్ట్ల వెంట ఆధునిక వసతులు, లాజిస్టిక్ పార్క్లు తప్పనిసరిగా ఉంటాయని తెలిపింది. స్థలాల గుర్తింపు, ఆదాయ ప్రణాళికలు, స్థానిక అనుకూలతలు, సౌకర్యాల డిజైన్ రూపకల్పన వంటి అంశాలపై ఎన్హెచ్ఏఐ నిమగ్నమైంది. చదవండి: సూయజ్కు అడ్డంగా నౌక.. గంటకు రూ.3వేల కోట్ల నష్టం -
వాహనదారులకు కేంద్రం తీపికబురు
మీకు కారు కానీ ఏదైనా భారీ వాహనం కలిగి ఉన్నారా? అయితే మీకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు తీపికబురు అందించింది. ఉచితంగానే ఫాస్టాగ్ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 2021 మార్చి 1 వరకు దేశవ్యాప్తంగా ఉన్న 770 టోల్ ప్లాజాలలో (స్టేట్ ప్లాజాతో సహా) ఉచితంగానే ఫాస్టాగ్ పొందవచ్చు అని ఎన్హెచ్ఏఐ తెలిపింది. దీనితో వాహనదారులకు రూ.100 ఆదా కానుంది. జాతీయ రహదారులపై నడిచే వాహనాల యూజర్ల ఫాస్టాగ్ వినియోగించడాన్ని పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం, ఫాస్టాగ్ ను 87 శాతం మంది వినియోగదారులు వాడుతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే ఫాస్టాగ్ వినియోగం 7 శాతం పెరిగింది. ఇక దేశంలో 100 టోల్ ప్లాజాల దగ్గర ఫాస్టాగ్ వినియోగించే వారి సంఖ్య 90శాతం చేరుకుంది. ఒక్కరోజులోనే ఫాస్టాగ్ ద్వారా 63 లక్షల లావాదేవీలతో రూ.100 కోట్ల టోల్ వసూలు చేశారు. టోల్ ప్లాజా దగ్గర ఏదైనా సాంకేతిక లోపం ఉంటే ఫాస్టాగ్లలో బ్యాలెన్స్ ఉన్నంత వరకు ఒక్క పైసా కూడా చెల్లించకుండా వినియోగదారులు టోల్ ప్లాజాలు దాటవచ్చు అని ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు. గత రెండు రోజుల్లో 2.5 లక్షలకు పైగా ట్యాగ్ల అమ్మకాలు జరిగాయని ఎన్హెచ్ఏఐ పేర్కొంది. ప్రతి వాహనదారుడి దగ్గర ఫాస్టాగ్ తప్పక ఉండాల్సిందే. లేదంటే భారీ జరిమానా పడుతుంది. చదవండి: వాట్సాప్కు దీటుగా స్వదేశీ సందేశ్ యాప్ -
ఒకేసారి నాలుగు రికార్డులు.. దేశానికే మైలురాయి
సాక్షి, ముంబై: రోడ్ల నిర్మాణంలో భారత్ అత్యంత వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. ముంబై– ఢిల్లీలతో బడోదాను కలిపే ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం పనుల్లో ఒకేసారి 4 ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. దీంతో గోల్డన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఈ నిర్మాణపనులు స్థానం సంపాదించుకున్నాయి. ఈ నాలుగు ప్రపంచ రికార్డులలో మొదటిది 12 వేల టన్ను సిమెంట్ కాంక్రీట్ను ఉత్పత్తి(తయారు)చేయడంకాగా, రెండోది కాంక్రీట్ను వేగంగా పంపిణీ(విడుదల) చేయడం. ఇక మూడో రికార్డు.. ఒక అడుగు మందం, 18.75 మీటర్ల వెడల్పుతో ఏకధాటిగా 2 కి.మీ.ల పొడవైన రోడ్డును నిర్మించడం. రిజిడ్పేవ్మెంట్, క్వాలిటీ మెయింటెయిన్ చేయడంతో నాలుగో రికార్డు సాధ్యమైంది. ఇవన్ని కేవలం 24 గంటల్లో పూర్తి చేయడం విశేషం. ఇలా ఎక్స్ప్రెస్ హైవే ఒకేసారి 4 ప్రపంచ రికార్డులను సృష్టించింది. గుజరాత్లో ప్రస్తుతం బడోదా నుంచి భారూచ్ల మధ్య ఎక్స్ప్రెస్ హైవే పనులు జరుగనున్నాయి. ఫిబ్రవరి 2న 23 గంటల్లో 2 కి.మీ.ల పొడవు, 18.75 వెడల్పు రోడ్డును కేవలం 24 గంటల్లో నిర్మించారు. ఇందుకోసం 1.10 లక్షల సిమెంట్ బస్తాలు (5.5 టన్నులు), 500 టన్నుల ఐస్ను వాడారు. మొత్తం రూ. 5 కోట్లు ఖర్చయింది. చదవండి: రాజీవ్ హత్య కేసు: రాష్ట్రపతి భవన్కు క్షమాభిక్ష ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంలో విశేషాలు.. ►1250 మంది పనులు చేశారు. ► గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కోసం ► 115 ట్రిప్పర్ ట్రక్కుల వినియోగం ► మెకానికల్ విభాగంలో 300 మంది పనిచేశారు. ► 250 మంది ప్రొడక్షన్ యూనిట్ బాధ్యతలను చేపట్టారు. దేశానికి మైలురాయి: అరవింద్ పటేల్ ‘ఒకేసారి నాలుగు రికార్డులు సృష్టించడం అనేది దేశానికే మైలురాయి. ఈ రికార్డును అంత తొందరగా సులభంగా ఏ సంస్థా బద్దలు కొట్టబోదు. ఇది కేవలం రికార్డు సృష్టించడంకాదు. ఆధునిక భారత ముఖచిత్రం’ అని పటేల్ ఇన్ఫ్రాస్టక్చర్ సంస్థ ఎండీ అరవింద్ పటేల్ అభివర్ణించారు. ‘ఇది దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక బెంచ్మార్కు. నిర్మాణం ఇంకా వేగవంతం కానుంది. మా ప్లాంట్లో ప్రస్తుతం గంటకు 840 ఘనపు మీటర్ల కాంక్రీట్ను తయారుచేస్తున్నాం’ అని ఆయన అన్నారు. కాంక్రీట్ ఉత్పత్తి కోసం జర్మనీ నుంచి రూ. 20 కోట్లు వెచ్చించి మూడు అధునాతన యంత్రాలను తెప్పించామని తెలిపారు. -
ఇక వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి
న్యూఢిల్లీ: కేంద్ర రహదారి, రవాణా మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 15వ తేది నుంచి అన్ని ఫోర్ వీలర్ వాహనాలకు ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసింది. ఇక నుంచి ఫాస్ట్ టాగ్ లేకుండా టోల్ ఫీజు చెల్లించాలనుకుంటే మాత్రం రెండింతలు చెల్లించాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ గడువు తేది దగ్గర పడుతుండటంతో ఈ కొత్త విధానంపై కేంద్రం ప్రజలకు అవగాహనా కల్పించడం కోసం కేంద్రం ప్రకటనలు ఇస్తుంది. అయితే కొత్త ఫాస్టాగ్ విధానంపై చాలా మందికి కొన్ని సందేహాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.(చదవండి: ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్!) ఇప్పుడు అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేయబడింది. ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా టోల్ ఫీజ్ ఆటోమేటిక్ చెల్లించవచ్చు. ఈ ఫాస్టాగ్ పొదుపు ఖాతా లేదా డిజిటల్ వాలెట్తో అనుసంధానించబడుతుంది. దీనిని మీ ఫోర్ వీలర్ వాహనం విండ్స్క్రీన్పై అమర్చిన ఒక బార్ కోడ్ స్టిక్కర్. దీని ద్వారా టోల్ చెల్లించడానికి మీరు వాహనం ఆపవలసిన అవసరం లేదు. టోల్ను దాటేటప్పుడు సమయం, ఇంధనం ఆదా చేయడం, ట్రాఫిక్ను తగ్గించడం కోసం ఈ ఫాస్టాగ్ విధానాన్ని తప్పని సరి చేసింది. ఫాస్టాగ్ ఎక్కడ పొందవచ్చు? ఫాస్టాగ్ లను ఏదైనా బ్యాంకు లేదా ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. దీనికోసం ఐసిఐసిఐ, ఎస్బిఐ, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డిఎఫ్సి బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి. ఇదే కాకుండా, టోల్ ప్లాజా, ఈ-కామర్స్ వెబ్సైట్ల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. అలాగే "మై ఫాస్టాగ్ యాప్"ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటితో పాటు ప్రముఖ డిజిటల్ చెల్లింపుల ప్లాట్ ఫామ్ లు గూగుల్ పే, అమెజాన్ పే, పేటీఎం వంటి యాప్లు కూడా ఫాస్టాగ్ ను అందిస్తున్నాయి.(చదవండి: జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం) ఈ ఫాస్టాగ్ లో వాహనం రిజిస్ట్రేషన్ వివరాలతో కూడిన ఒక బార్ కోడ్ ఉంటుంది. ఈ బార్ కోడ్ ను వాహనం ముందు అద్దం లేదా సైడ్ మిర్రర్ పై స్టిక్కర్ లా అతికిస్తారు. కాగా, ఇది జారీ చేసిన తేదీ నుండి ఐదేళ్ల కాలం పాటు చెల్లుతుంది. దీన్ని కొనుగోలు చేసిన తర్వాత మీరు "మై ఫాస్ట్ ట్యాగ్" మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ లో మీ వివరాలు, ఫాస్టాగ్ వివరాలు సమర్పించిన తర్వాత ఆక్టివేట్ చేసుకోవచ్చు. ఆర్సి లేకుండా ఫాస్టాగ్ తీసుకోవచ్చా? ఆర్సి లేకుండా ఫాస్టాగ్ తీసుకోలేము. ఆర్సి అనగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. ఫాస్టాగ్ తిసుకోవాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ నంబర్ కలిగి ఉండాలి. ఫాస్ట్ ట్యాగ్ బదిలీ చేయవచ్చా? మీ వాహనం యొక్క ఫాస్టాగ్ మరెవరికీ బదిలీ చేయకూడదు. మీరు వాహనాన్ని విక్రయిస్తుంటే మీ వాహనం యొక్క ఫాస్టాగ్ ఖాతాను నిలిపివేయాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ ను ఎలా రీఛార్జ్ చేసుకోవాలి? ఫాస్టాగ్ డిజిటల్ వాలెట్ ను క్రెడిట్, డెబిట్ కార్డులు లేదా యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి సదుపాయాలతో రీచార్జ్ చేసుకోవచ్చు. పేటీఎం, ఫోన్ పే, గూగుల్పే వంటి డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లా ద్వారా కూడా ఫాస్టాగ్ వాలెట్ ను రీచార్జి చేసుకోవచ్చు. ఫాస్టాగ్ చెల్లింపుల నుంచి ఎవరికి మినహాయింపు? న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, ఎమర్జెన్సీ సర్వీస్ వర్కర్స్ ఫాస్టాగ్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. వీరికి ఫాస్టాగ్ చెల్లింపుల నుంచి మినహాయింపు లభిస్తుంది. -
ఎన్హెచ్ఏఐకు ప్రధాన రోడ్డు ప్రాజెక్టుల డీపీఆర్ బాధ్యత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రధానంగా చేపట్టే రోడ్డు ప్రాజెక్టులకు సవివర నివేదికల (డీపీఆర్) తయారీ బాధ్యతను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)కు అప్పగించారు. కన్సల్టెన్సీల ఎంపిక మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్టు అండ్ హైవేస్ (మోర్త్ – రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ) నిర్వహించనుంది. సాధారణంగా రాష్ట్రంలో చేపట్టే రహదారి ప్రాజెక్టుకు డీపీఆర్, కన్సల్టెన్సీ బాధ్యతలు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చూస్తుంది. రోడ్డులో వెళ్లే ట్రాఫిక్ వాహనాల సంఖ్య, ప్యాసింజర్ కార్ యూనిట్ల వివరాలపై నివేదిక రూపొందించి మోర్త్కు రాష్ట్ర ప్రభుత్వం సమర్పిస్తుంది. అయితే కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసిన బెంగుళూరు–విజయవాడ ఎక్స్ప్రెస్ వే, విశాఖ పోర్టు నుంచి భోగాపురం ఎయిర్పోర్టు వరకు నిర్మించే రహదారుల ప్రాజెక్టులతో పాటు అనంతపురం–గుంటూరు రహదారి నిర్మాణానికి డీపీఆర్లను ఎన్హెచ్ఏఐ తయారు చేయనుంది. టెండర్ల ద్వారా కన్సల్టెన్సీలను ఎంపిక చేసి, రహదారుల ప్రాజెక్టులకయ్యే అంచనా వ్యయం, అలైన్మెంట్ను ఖరారు చేయనున్నారు. ► రాష్ట్ర ఆర్అండ్బీ మంత్రి శంకర్ నారాయణ ఇటీవల.. కేంద్ర మంత్రి గడ్కరీని కలిసినప్పుడు బెంగుళూరు–విజయవాడ ఎక్స్ప్రెస్ వే అలైన్మెంట్ను ఖరారు చేయాలని విన్నవించారు. ► కొడికొండ చెక్పోస్టు, పులివెందుల, ముద్దనూరు, మైదుకూరు మీదుగా ఎక్స్ప్రెస్ వే నిర్మించాలని ఆర్అండ్బీ ప్రతిపాదన సమర్పించింది. అయితే మైదుకూరు నుంచి విజయవాడకు పూర్తిగా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే (అటవీ ప్రాంతం మీదుగా) నిర్మించాలని ప్రతిపాదించారు. ► విశాఖ పోర్టు నుంచి భోగాపురం ఎయిర్పోర్టు వరకు నిర్మించే రహదారి ప్రాజెక్టుకు ఏపీఐఐసీ రూ.1,500 కోట్లతో డీపీఆర్ను రూపొందించింది. అయితే ఈ డీపీఆర్పై ఎన్హెచ్ఏఐ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఎన్హెచ్ఏఐ ఇంజనీర్లు డీపీఆర్ తయారు చేయడంతో పాటు కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నారు. ► అనంతపురం – గుంటూరు రహదారి నిర్మాణం కేంద్రమే చేపట్టనుంది. అనంతపురం, బుగ్గ, కొలిమిగుండ్ల, బనగానపల్లె, గిద్దలూరు, కంభం, వినుకొండ, గుంటూరు వరకు రహదారి నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ డీపీఆర్ను రూపొందించనుంది. -
వాహనదారులకు కేంద్రం శుభవార్త
న్యూఢిల్లీ: వాహనదారులకు శుభవార్త తెలిపింది కేంద్ర ప్రభుత్వం. గతంలో జనవరి 1 నుండి ఫాస్ట్టాగ్ ను తప్పని సరిచేస్తూ తీసుకున్న నిబంధనలను మరోసారి సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం ఫాస్ట్టాగ్ ఉపయోగించి జాతీయ రహదారులపై టోల్ ఛార్జీల వసూలు చేయడానికి గడువును రోడ్డు రవాణా మరియు రహదారి మంత్రిత్వ శాఖ పొడిగించింది. ఈ గడువు మొదట జనవరి 1, 2021 వరకు ఉండేది. తాజాగా ఫిబ్రవరి 15, 2021 వరకు పొడిగించబడింది. అసలు గడువు ప్రకారం, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా జనవరి 1 నుండి టోల్ ప్లాజాలలో ఫాస్ట్ ట్యాగ్ చెల్లింపుకు పూర్తిగా మారాలని నిర్ణయించారు.(చదవండి: అమెజాన్లో 'మెగా శాలరీ డేస్' సేల్) ప్రస్తుతం, ఫాస్ట్ ట్యాగ్ ద్వారా చేసిన లావాదేవీల వాటా 75-80 శాతం ఉంటుందని చెబుతున్నారు. డిజిటల్, ఐటీ ఆధారిత టోల్ ఫీజుల చెల్లింపు విధానాలను ప్రోత్సహించే దిశగా 2017 డిసెంబర్ 1కి ముందు విక్రయించిన వాహనాలన్నింటికీ ఫాస్టాగ్ను తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఫీబ్రవరి 15 నుండి 100 శాతం నగదు రహిత రుసుము వసూలు చేయాలనీ కేంద్రం భావిస్తుంది. ప్రభుత్వం ఇంకో వైపు సింగల్ లేన్ మినహా అన్ని దారులను ఫాస్ట్ ట్యాగ్ లేన్లుగా మార్చాలని చూస్తుంది. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా చూడటం వల్ల ఇటు ఇంధనంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది అని కేంద్రం పేర్కొంది. -
ఫాస్టాగ్ యూజర్లు 57 శాతమే!
సాక్షి, అమరావతి: ఏపీలో ప్రస్తుతం ఫాస్టాగ్ యూజర్లు 57 శాతం వరకు ఉన్నట్టు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అంచనా వేస్తోంది. టోల్గేట్ల వద్ద ఫాస్టాగ్ లైన్ ద్వారా ప్రస్తుతం 50 నుంచి 57 శాతం వాహనాలు మాత్రమే వెళుతున్నట్టు లెక్కగట్టింది. ఈ నెలాఖరు నాటికి 90 శాతం వాహనాలకు ఫాస్టాగ్ ఉండేలా.. టోల్గేట్ల వద్ద ప్రత్యేకంగా ఫాస్టాగ్ స్టిక్కర్లను విక్రయించే కౌంటర్లు ఏర్పాటు చేసింది. జనవరి 1 నుంచి అన్ని టోల్గేట్లలో ఫాస్టాగ్ వాడకాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి నుంచి నగదు చెల్లించే లైన్లను తొలగించాలంటూ టోల్ ప్లాజాల నిర్వాహకులకు ఆదేశాలందాయి. ఏ వాహనమైనా ఫాస్టాగ్ లేకుండా టోల్గేట్ల వద్దకు వస్తే.. వెనక్కి పంపిస్తారు. మొండికేసి ముందుకు వెళ్దామంటే రెట్టింపు ఫీజు వసూలు చేస్తారు. మరోవైపు ఫాస్టాగ్ ఉంటేనే రవాణా వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలని రవాణా శాఖ సైతం ఆదేశాలు జారీ చేసింది. ఫాస్టాగ్ అంటే.. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ (ఆర్ఎఫ్ఐడీ)తో కూడిన స్టిక్కర్ను ఫాస్టాగ్ అంటారు. 2014లోనే ఫాస్టాగ్ విధానాన్ని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అమల్లోకి తెచ్చింది. వాహనాలకు అతికించి ఉండే ఈ స్టిక్కర్పై గల బార్కోడ్ను టోల్ప్లాజాలోని ఆర్ఎఫ్ ఐడీ యంత్రం రీడ్ చేస్తుంది. వాహనం టోల్ ప్లాజా దాటుతున్నప్పుడు టోల్ ఫీజును సం బంధిత వాహన యజమాని ఫాస్టాగ్కు రీచార్జి చేయించుకున్న మొత్తం నుంచి ఆటోమేటిక్గా మినహాయించుకుంటుంది. బ్యాంక్ ఖాతాతో అనుసంధానించిన ఫోన్కు ఎస్ఎంఎస్ వస్తుంది. జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు కానున్న ‘వన్ నేషన్.. వన్ ట్యాగ్’ కింద అన్ని టోల్గేట్లలో ఫాస్టాగ్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయనున్నారు. కనీసం రూ.వందతో ఫాస్టాగ్ ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ పొందవచ్చు. రాష్ట్ర రహదారులపైనా.. స్టేట్ హైవేస్పై ఉన్న టోల్ప్లాజాల్లోనూ ఫాస్టాగ్ అమలు చేయాలని ఎన్హెచ్ఏఐ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఆర్ అండ్ బీ అధికారులతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. టోల్గేట్లలో ఆర్ఎఫ్ ఐడీ యంత్రాలు పెట్టేందుకు అయ్యే ఖర్చులో 50 శాతాన్ని ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ భరిస్తుంది. ఇవీ ఉపయోగాలు ► ఇంధనం, టోల్గేట్ల వద్ద వేచి ఉండే సమయం ఆదా అవుతాయి. ► పొల్యూషన్ తగ్గుతుంది. ట్రాఫిక్ సమస్యలుండవు. ► ఫాస్టాగ్ ఉన్న వాహనం చోరీ అయితే.. ఆ వాహనం టోల్ప్లాజా దాటితే ఎక్కడ దాటిందో.. ఏ సమయంలో దాటిందో ఫోన్కు మెసేజ్ వస్తుంది. వాహనాన్ని కనిపెట్టే ఆస్కారం కలుగుతుంది. ► టోల్ ఫీజుల వసూళ్లు క్యాష్లెస్ విధానంలో సాగటం వల్ల వాహనదారునికీ ఇబ్బందులు తప్పుతాయి. -
ఆర్డర్లే ఆర్డర్లు- ఈ షేర్లకు భలే జోష్
ముంబై, సాక్షి: ఒక్కరోజు విరామం తదుపరి తిరిగి దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 234 పాయింట్లు ఎగసి 46,194 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 68 పాయింట్లు ఎగసి 13,546కు చేరింది. వెరసి మార్కెట్లు మళ్లీ రికార్డుల ర్యాలీ బాట పట్టాయి. కాగా.. ఆర్థిక రికవరీ పరిస్థితులు నెలకొనడంతో పలు కంపెనీలు ఆర్డర్లు, కాంట్రాక్టులను దక్కించుకుంటున్నాయి. తాజాగా ఇర్కాన్ ఇంటర్నేషనల్, గాయత్రి ప్రాజెక్ట్స్, ఇండియన్ హ్యూమ్పైప్స్, పీఎన్సీ ఇన్ఫ్రాటెక్, ఎస్పీఎంఎల్ ఇన్ఫ్రా ఈ జాబితాలో చేరాయి. ఫలితంగా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. (డిస్నీప్లస్లో హాట్స్టార్.. హాట్హాట్) ఆర్డర్ల బాటలో రైల్వే రంగ పీఎస్యూ.. ఇర్కాన్ ఇంటర్నేషనల్కు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) నుంచి రూ. 900 కోట్ల విలువైన కాంట్రాక్టు లభించింది. దీనిలో భాగంగా గుర్గావ్- పటౌడీ- రేవారీ సెక్షన్లో అప్గ్రేడ్ పనులు చేపట్టవలసి ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఇర్కాన్ షేరు ఎన్ఎస్ఈలో 5.6 శాతం జంప్చేసి రూ. 93 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 96కు చేరింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇండియన్ హ్యూమ్ పైప్ రూ. 550 కోట్ల ఆర్డర్ను దక్కించుకుంది. 21 నెలలో పూర్తిచేయవలసిన ఆర్డర్లో భాగంగా కాన్పూర్ డివిజన్లోని 550 గ్రామాలలో మంచినీటి సరఫరా సౌకర్యాలను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఇండియన్ హ్యూమ్ పైప్స్ షేరు 6 శాతం ఎగసి రూ. 195 వద్ద ట్రేడవుతోంది. (ర్యాలీ షురూ- 46,000 ఎగువకు సెన్సెక్స్) అప్పర్ సర్క్యూట్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి నమామీ గంగే, గ్రామీణ నీటి సరఫరా పథకాలకు అనుగుణంగా సౌకర్యాల కల్పనకు రూ. 1,332 కోట్ల విలువైన కాంట్రాక్టులు లభించినట్లు గాయత్రి ప్రాజెక్ట్స్ తెలియజేసింది. భాగస్వామ్య సంస్థ ద్వారా సాధించిన ఈ ప్రాజెక్టులో 97.5 శాతం వాటా తమకున్నట్లు వెల్లడించింది. దీంతో్ గాయత్రి ప్రాజెక్ట్స్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 36.35 వద్ద ఫ్రీజయ్యింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి భాగస్వామ్య సంస్థ ద్వారా పీఎన్సీ ఇన్ఫ్రాటెక్, ఎస్పీఎంఎల్ ఇన్ఫ్రా రూ. 952 కోట్ల విలువైన కాంట్రాక్టును సొంతం చేసుకున్నాయి. నమామీ గంగే, గ్రామీణ నీటి సరఫరా కార్యక్రమాలలో భాగంగా 952 గ్రామాలకు 10ఏళ్లపాటు నీటి సరఫరా సంబంధ పనులను నిర్వహించవలసి ఉన్నట్లు జేవీ తెలియజేసింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎస్పీఎంఎల్ 10 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకి రూ. 13.20 వద్ద ఫ్రీజయ్యింది. ఇక పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ 3.5 శాతం పెరిగి రూ. 182 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 190 వరకూ జంప్చేసింది. -
అభినందించాలంటే సిగ్గుగా ఉంది..
సాక్షి, న్యూడిల్లీ : కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అధికారుల నిర్లక్ష్యం, ప్రాజెక్టుల జాప్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాగ్పూర్లోని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) కొత్త భవనాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గడ్కరీ భవనం నిర్మాణానికి తొమ్మిదేళ్లు పట్టడంపై అధికారులపై మండిపడ్డారు. ఈ ఆలస్యానికి బాధ్యులైన అధికారుల ఫోటోలను బహిరంగంగా ప్రదర్శించాలని వ్యాఖ్యానించారు. అంతేకాదు జాతీయ రహదారి అథారిటీలో తక్షణమే సంస్కరణలు అవసరమన్నారు. పనిచేయని ఉద్యోగులపై చర్య తీసుకోవలసిన సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియోను ఆయన ట్విటర్ లో పోస్ట్ చేశారు. 80 వేల నుంచి లక్ష కోట్ల రూపాయల విలువైన ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే నిర్మాణాన్ని కేవలం రెండు, మూడేళ్లలో పూర్తి చేయనున్నామని, ఇందుకు గర్వంగా ఉందని ప్రకటించిన ఆయన కేవలం 250 కోట్ల ఈ ప్రాజెక్టును పూర్తికి జరిగిన ఆలస్యాన్ని ప్రశ్నించారు. అనవసరమైన గందరగోళాలను సృష్టించి జాప్యం చేస్తున్న అధికారుల ఫోటోలను సంబంధిత భవనం గోడలపై వేలాడదీయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా ప్రజలు ఈ గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకుంటారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ భవనం ప్రారంభోత్సవంగా సందర్బంగా అధికారునుద్దేశించి మాట్లాడుతూ "ఎలా పలకరించాలోఅర్థం కావడంలేదు.. మిమ్మల్ని అభినందించాలంటే నాగే సిగ్గుగా ఉందంటూ'' మొదలుపెట్టారు. ఎన్హెచ్ఏఐ భవన నిర్మాణాన్ని పూర్తి చేయడంలో జరిగిన సుదీర్ఘ జాప్యం తనకు అవమానకరంగా ఉందన్నారు. 2008లో ఈ భవన నిర్మాణానికి నిర్ణయించాం. 2011లో టెండర్ పిలిచాం.. 200-250 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి 9 సంవత్సరాల కాలం పట్టిందని ఆరోపించారు. ఇందుకు సంబంధిత అధికారుల ఫోటోల భవన గోడలపై వేలాడదీస్తే.. ఆ అధికారుల నిర్వాకం ప్రజలకు తెలుస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు ఈ పని పూర్తి కావడానికి రెండు ప్రభుత్వాలు, ఎనిమిది మంది అధ్యక్షులు మారారని ఆయన గుర్తు చేశారు. భవిషత్తులో ఈ లోపాలను సరిచేసుకుని, వేగంగా పనులు పూర్తి చేయల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అధికారులకు సూచించారు. -
దిలీప్ బిల్డ్కాన్- సింజీన్.. అదుర్స్
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(NHAI) నుంచి ప్రాజెక్టులు లభించినట్లు వెల్లడించడంతో మౌలిక సదుపాయాల కంపెనీ దిలీప్ బిల్డ్కాన్ కౌంటర్కు డిమాండ్ పెరిగింది. మరోపక్క కోవిడ్-19 వ్యాధి పరీక్షల కిట్కు ఐసీఎంఆర్ నుంచి అనుమతి లభించినట్లు పేర్కొనడంతో సింజీన్ ఇంటర్నేషనల్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. దిలీప్ బిల్డ్కాన్ ఎన్హెచ్ఏఐ నుంచి కొత్త హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో ప్రాజెక్టు లభించినట్లు దిలీప్ బిల్డ్కాన్ తాజాగా పేర్కొంది. కాంట్రాక్టు విలువ రూ. 1,905 కోట్లుకాగా.. దీనిలో భాగంగా బీహార్లో ఎన్హెచ్ 131Aలో నరేన్పూర్ నుంచి పూర్నియా వరకూ 4 లైన్ల రహదారిని అభివృద్ధి చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ఇదే విధంగా పూర్నియా సమీపంలో రెండు లైన్ల రహదారిని సైతం నిర్మించవలసి ఉన్నట్లు వెల్లడించింది. రెండేళ్లలోగా ప్రాజెక్టును పూర్తి చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో దిలీప్ బిల్డ్కాన్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 7 శాతం జంప్చేసి రూ. 373 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 386 వరకూ ఎగసింది. సింజీన్ ఇంటర్నేషనల్ కోవిడ్-19 టెస్ట్ కిట్కు ఐసీఎంఆర్ నుంచి గ్రీన్సిగ్నల్ లభించినట్లు హెల్త్కేర్ కంపెనీ సింజీన్ ఇంటర్నేషనల్ తాజాగా వెల్లడించింది. కేంద్ర ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థ(సీడీఎస్సీవో) నుంచి కూడా అనుమతి మంజూరైతే ఈ ప్రొడక్టును మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. హైమీడియా ల్యాబొరేటరీస్తో సంయుక్తంగా ఎలీసేఫ్ 19 పేరుతో కోవిడ్-19 టెస్ట్ కిట్ను రూపొందించినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో సింజీన్ ఇంటర్నేషనల్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 9 శాతం దూసుకెళ్లి రూ. 494ను అధిగమించింది. ప్రస్తుతం 7 శాతం లాభంతో రూ. 485 వద్ద ట్రేడవుతోంది. -
భారత్ డైనమిక్స్ బోర్లా- అశోకా బిల్డ్కాన్ భేష్
సరిహద్దు వద్ద చైనాతో వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. కాగా.. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) నుంచి తాజాగా కాంట్రాక్టులను దక్కించుకున్నట్లు వెల్లడికావడంతో మౌలిక సదుపాయాల కంపెనీ అశోకా బిల్డ్కాన్ కౌంటర్కు డిమాండ్ పెరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా వాటా విక్రయాన్ని చేపట్టడంతో పీఎస్యూ.. భారత్ డైనమిక్స్ కౌంటర్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు. వెరసి అశోకా బిల్డ్కాన్ కౌంటర్ భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. భారత్ డైనమిక్స్(బీడీఎల్) కౌంటర్ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. అశోకా బిల్డ్కాన్ బీహార్లో రహదారుల అభివృద్ధి కోసం ఎన్హెచ్ఏఐ నుంచి రెండు ప్రాజెక్టులు సొంతం చేసుకున్నట్లు అశోకా బిల్డ్కాన్ తాజాగా వెల్లడించింది. వీటి విలువ రూ. 1,390 కోట్లుకాగా.. ప్యాకేజీ-1లో భాగంగా అరా- పరారియా సెక్షన్లో నాలుగు లైన్ల రహదారిని ఏర్పాటు చేయవలసి ఉంటుందని తెలియజేసింది. ప్యాకేజీ-2 కింద పరారియా- మోహనియా మధ్య సైతం నాలుగు లైన్ల రహదారిని అభివృద్ధి చేయవలసి ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అశోకా బిల్డ్కాన్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 7 శాతం జంప్చేసి రూ. 73 వద్ద ట్రేడవుతోంది. భారత్ డైనమిక్స్ రక్షణ రంగ పరికరాల తయారీ కంపెనీ భారత్ డైనమిక్స్లో కేంద్ర ప్రభుత్వం 15 శాతం వాటాను ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయానికి ఉంచింది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ఈ ఆఫర్ నేడు ప్రారంభమైంది. ఇందుకు ఫ్లోర్ ధర రూ. 330. సోమవారం ముగింపుతో పోలిస్తే ఇది 14 శాతం డిస్కౌంట్కావడం గమనార్హం! ఆఫర్లో భాగంగా ప్రభుత్వం 2.71 కోట్ల షేర్లను విక్రయించనుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 87.75 శాతం వాటా ఉంది. ఈ నేపథ్యంలో భారత్ డైనమిక్స్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 13 శాతం పతనమై రూ. 335 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 332 వరకూ జారింది. ఈ షేరు మార్చి 24న రూ. 147 వద్ద కనిష్టాన్ని తాకగా.. గత నెల 14న రూ. 481 వద్ద సరికొత్త గరిష్టానికి చేరింది. -
జాతీయ రహదార్లకు ర్యాంకింగ్లు
సాక్షి, అమరావతి: రహదారుల నాణ్యతను మెరుగుపరిచేందుకు రోడ్ల పనితీరు ఆడిట్ ఆధారంగా ర్యాంకింగ్ వ్యవస్థను ఎన్హెచ్ఏఐ ప్రవేశపెట్టనుంది. హైవేలపై ప్రయాణికులకు అందే సేవలపై, రోడ్డు నాణ్యత, రహదారి భద్రతలపై అభిప్రాయాలు సేకరించి ఆ మేరకు ర్యాంకింగ్లను నిర్ణయించనుంది. అక్టోబర్ నుంచి జాతీయ రహదార్ల ర్యాంకింగ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ర్యాంకింగ్లతో పాటు బీవోటీ (బిల్డ్–ఆపరేట్–ట్రాన్స్ఫర్), హెచ్ఏఎం (హైబ్రిడ్ యాన్యుటీ మోడ్), ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) ప్రాజెక్టుల కింద చేపట్టిన రోడ్లకు ప్రత్యేక ర్యాంకింగ్లను కేటాయిస్తారు. జాతీయ రహదార్లపై రోడ్ ఇంజనీరింగ్ లోపాల వల్ల కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ లోపాలపై సమగ్ర నివేదిక ఇచ్చేందుకు ఎన్హెచ్ఏఐ ఐఐటీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఐఐటీల ఇంజినీరింగ్ విద్యార్థులు, ప్రొఫెసర్లు సర్వే చేసి రోడ్ ఇంజినీరింగ్ లోపాలపై నివేదిక ఇస్తారు. ఏపీలో మొత్తం 6,672 కి.మీ. మేర జాతీయ రహదార్ల నెట్వర్క్ ఉంది. 38 జాతీయ రహదార్ల ప్రాజెక్టులకు ర్యాంకింగ్లు ఇవ్వనున్నారు. ర్యాంకింగ్ల అంచనాకు ప్రామాణికం ఇదే.. ► హైవే సామర్థ్యం (45 శాతం), రోడ్ సేఫ్టీ (35 శాతం), యూజర్ సర్వీసెస్ (20 శాతం) ఈ మూడు విభాగాల్లో అంచనా వేస్తారు. ► వాహనం ఆపరేటింగ్ వేగం, యాక్సెస్ కంట్రోల్, టోల్ ప్లాజాల వద్ద తీసుకున్న సమయం, సేవలు, ప్రమాద రేటు తదితర పారామీటర్లను పరిగణనలోకి తీసుకుంటారు. ► ఈ అంచనా ప్రకారం ఎన్హెచ్ఏఐ ర్యాంకింగ్లను నిర్ణయిస్తుంది. ► ప్రతి జాతీయ రహదారి కారిడార్ పొందిన స్కోరు, మెరుగుపరుచుకునేందుకు ప్రయాణికుల అభిప్రాయాలను ఎన్హెచ్ఏఐ సేకరిస్తుంది. ► నాణ్యమైన రహదార్లను నిర్మించేందుకు ఈ ఆడిట్ అవసరమని ఎన్హెచ్ఏఐ పేర్కొంటుంది. -
రూ . 3.3 లక్షల కోట్లతో ఎక్స్ప్రెస్ వేస్ నిర్మాణం
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 3.3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో 22 ఎక్స్ప్రెస్ వేలను నిర్మించే భారీ ప్రణాళికను జాతీయ రహదారుల అథీకృత సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఖరారు చేసింది. ఈ ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సమీకరణ కోసం స్సెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీ)లను ఏర్పాటు చేయాలని కూడా ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. ఈ మెగా ప్లాన్లో భాగంగా తొలుత ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే కోసం తొలి ఎస్పీవీకి ఎన్హెచ్ఏఐ బోర్డు ఆమోదముద్ర వేసింది. పూర్తిగా హైవేస్ అథారిటీ భాగస్వామ్యంతో ఈ ఎస్పీవీ ఏర్పాటైందని అధికారులు తెలిపారు. ఎన్హెచ్ఏఐ స్వతంత్ర సంస్థ కావడంతో ఎస్పీవీకి బ్యాంకులు, ఆర్థిక సంస్ధలు, బీమా సంస్ధలు, పెన్షన్ నిధుల నుంచి రుణాలు పొందడం సులభతరం కానుంది. కాగా, రూ 45,000 కోట్ల విలువైన ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ హైవే కోసం ఏర్పాటైన తొలి ఎస్పీవీలో ఎన్హెచ్ఏఐ రూ 5000 కోట్లు వెచ్చిస్తుండగా, మిగిలిన 40,000 కోట్లను రుణ మార్కెట్ నుంచి సమీకరించనున్నారు. భారత మౌలిక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు, పెన్షన్ నిధుల సంస్థలు, విదేశీ పెట్టుబడిదారులు సైతం ఆసక్తికనబరుస్తున్నారని ఎన్హెచ్ఏఐ వర్గాలు పేర్కొన్నాయి. చదవండి : ఆ రోడ్డు ఖర్చు భరించలేం : ఢిల్లీ ప్రభుత్వం -
జూలైకి ఆనందపురం–అనకాపల్లి హైవే పూర్తి
సాక్షి, అమరావతి: అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా చేపట్టిన అనకాపల్లి–ఆనందపురం ఆరు లైన్ల రహదారి వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తి చేయాలని ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) లక్ష్యంగా పెట్టుకుంది. లాక్ డౌన్ కారణంగా నాలుగు నెలలుగా పనులు నిలిచిపోవడంతో పాటు భూ సేకరణలో ప్రైవేటు భూములకు సంబంధించి యజమానుల గుర్తింపులో జాప్యం జరుగుతుండటంతో రహదారి నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయి. అనకాపల్లి–ఆనందపురం మధ్య 51 కిలోమీటర్ల మేర ఆరు లైన్ల రహదారి నిర్మించేందుకు గతేడాది జనవరిలో మధ్యప్రదేశ్కు చెందిన దిలీప్ బిల్డ్ కాన్ సంస్థ పనులు దక్కించుకుంది. ఈ రహదారిని కేంద్రం భారతమాల ప్రాజెక్టు కింద చేపడుతోంది. మొత్తం 330 హెక్టార్ల భూ సేకరణకు గాను 190 హెక్టార్లు ప్రైవేటు భూములు కావడంతో యజమానుల గుర్తింపులో జాప్యం జరుగుతోంది. మొత్తం భూసేకరణకు, ఆర్ అండ్ ఆర్కు రూ.700 కోట్లు కేటాయించారు. సగం నిర్మాణం పూర్తి ► మొత్తం 51 కిలోమీటర్లలో 24 కి.మీల రహదారి నిర్మాణం పనులు పూర్తయ్యాయి. తగరపువలస–సంగివలస మధ్య నిర్మాణం పూర్తయింది. ఈ రహదారి పూర్తయితే విశాఖ సిటీ పరిధిలో 40 శాతం ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ► ఈ ప్రాజెక్టు పూర్తయితే శ్రీకాకుళం నుంచి విజయవాడకు వెళ్లే భారీ వాహనాలు ఆనందపురం నుంచి అనకాపల్లికి మళ్లించవచ్చు. ► ఆనందపురం–పెందుర్తి–సబ్బవరం, షీలానగర్ పోర్టు కనెక్టివిటీ మధ్య 13.6 కిలోమీటర్ల రహదారితో కలిపి కేంద్రం రూ.3 వేల కోట్లు మంజూరు చేసింది. -
గ్రీన్ నేషనల్ హైవేస్ కారిడార్గా రాజమండ్రి–విజయనగరం ఎన్హెచ్
సాక్షి, అమరావతి: రాజమండ్రి–విజయనగరం జాతీయ రహదారి (516–ఈ)ని గ్రీన్ నేషనల్ హైవేస్ కారిడార్గా భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) గుర్తించింది. ఈ జాతీయ రహదారి నిర్మాణానికి పునరావాస పునర్నిర్మాణ (ఆర్ అండ్ ఆర్) పనులకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. సామాజిక ప్రభావ అంచనా సర్వే (సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్వే) ఇటీవలే పూర్తయింది. ఆర్ అండ్ ఆర్కు మొత్తం రూ.210 కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా. రాజమండ్రి–విజయనగరం జాతీయ రహదారిని ఏజెన్సీ ప్రాంతాల మీదుగా నిర్మించాలని ఎన్హెచ్ఏఐ ఈ ప్రాజెక్టును హరిత కారిడార్ ప్రాజెక్టుగా ప్రకటించింది. గ్రీన్ నేషనల్ హైవే కారిడార్ ప్రాజెక్టులుగా దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, హిమాచల్ప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్) 782 కి.మీ. హరిత కారిడార్లను అభివృద్ధి చేయనుంది. ఇందులో ఏపీకి సంబంధించి 209 కి.మీ. వరకు తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో రెండు వరుసల రహదారిని నిర్మించనున్నారు. మూడు ప్యాకేజీల కింద ఈ జాతీయ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. మొదటి దశ కింద రెండు స్ట్రెచ్లలో రహదారి నిర్మాణానికి త్వరలో టెండర్లు ఖరారు చేయనున్నారు. మార్చి నెలాఖరున టెండర్లు ఖరారు కావాల్సి ఉండగా, కోవిడ్–19 నేపథ్యంలో కేంద్రం ఈ ప్రక్రియను వాయిదా వేసింది. రహదారి నిర్మాణానికి మొత్తం రూ.1,550 కోట్లు ► 209 కి.మీ. మేర రహదారి నిర్మాణానికి 190 హెక్టార్ల మేర భూమి అవసరం అవుతుంది. రహదారి నిర్మాణానికి రూ.1,550 కోట్ల వరకు ఖర్చవుతుంది. ► కొయ్యూరు–పాడేరు (133 కి.మీ.), పాడేరు–అరకు (49 కి.మీ.), బౌదార–విజయనగరం (27 కి.మీ.) మూడు స్ట్రెచ్లుగా నిర్మాణం చేపడతారు. ► ఈ ఇంటర్ స్టేట్ హైవే నిర్మాణం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలైన లంబసింగి, పాడేరు, కేడీ పేట, అరకు ప్రాంతాల మీదుగా సాగుతుంది. ► సామాజిక ప్రభావ అంచనా సర్వే పూర్తి చేసిన ఎన్హెచ్ఏఐ గ్రీవియన్స్ రీడర్స్ కమిటీ (జీఆర్సీ) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ► బౌదార–విజయనగరం, పాడేరు–అరకు రెండు ప్యాకేజీలకు సంబంధించి 80 కి.మీ. రోడ్డు నిర్మాణానికి త్వరలోనే టెండర్లను ఖరారు చేయనున్నారు. -
క్యామ్లిన్- పీఎన్సీ.. భలే దూకుడు
రెండు రోజుల నష్టాలకు చెక్ పెడుతూ దేశీ స్టాక్ మార్కెట్లు తిరిగి బౌన్స్బ్యాక్ అయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 170 పాయింట్లు ఎగసి 35,013కు చేరింది. తద్వారా 35,000 పాయింట్ల కీలక మార్క్ను అధిగమించింది. ఈ బాటలో నిఫ్టీ 59 పాయింట్లు ఎగసి 10,348 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా ఓవైపు క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్, మరోపక్క పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ ప్రతిపాదిత నిధుల సమీకరణకు బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ తాజాగా వెల్లడించింది. తద్వారా రూ. 180 కోట్లను సమీకరించనున్నట్లు తెలియజేసింది. నిధులను మెక్సికో, చైనాలలో ఏర్పాటు చేసిన భాగస్వామ్య సంస్థల(జేవీలు)లో పూర్తి వాటాలను సొంతం చేసుకునేందుకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ కౌంటర్కు భారీ డిమాండ్ నెలకొంది. వెరసి ఎన్ఎస్ఈలో ఈ షేరు 10 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. అమ్మేవాళ్లు తక్కువకావడం.. కొనుగోలుదారులు అధికంకావడంతో రూ. 5 పెరిగి రూ. 53.6 వద్ద ఫ్రీజయ్యింది. గత మూడు నెలల్లో ఈ కౌంటర్ 57 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ జాతీయ రహదారుల అధీకృత సంస్థ(NHAI) నుంచి రూ. 1412 కోట్ల కాంట్రాక్టు లభించినట్లు మౌలిక సదుపాయాల కంపెనీ పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ వెల్లడించింది. దీనిలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని మీరట్ నుంచి నజీబాబాద్ వరకూ 54 కిలోమీటర్లమేర నాలుగు లేన్ల రహదారిని అభివృద్ధి చేయవలసి ఉంటుందని తెలియజేసింది. భారత్మాల పరియోజన పథకంలో భాగంగా హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతి(HAM)లో సాధించిన ఈ ఆర్డర్ను 24 నెలల్లోగా పూర్తి చేయవలసి ఉన్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ కౌంటర్కు భారీ డిమాండ్ నెలకొంది. వెరసి ఎన్ఎస్ఈలో ఈ షేరు 10 శాతం దూసుకెళ్లింది. అమ్మేవాళ్లు తక్కువకావడం.. కొనుగోలుదారులు అధికంకావడంతో రూ. 13 జమ చేసుకుని రూ. 146 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 152 వరకూ ఎగసింది. -
హైవేలపై మరణిస్తే ప్రత్యేకంగా పరిహారం లేదు
సాక్షి, హైదరాబాద్ : జాతీయ రహదారులపై ఒక మనిషి రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య ఏటా పెరిగిపోతోంది. వీటిలో కుటుంబ పెద్దలు మరణిస్తే.. వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఎలాంటి పరిహారం ఉండదని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) తెలిపింది. జాతీయ రహదారులపై ఏటా ఎంతమంది చనిపోతున్నారు? ఎంత మంది వికలాంగులుగా మారుతున్నారు? పరిహారం ఎంతమందికి ఇస్తున్నారు? టోల్గేట్ల రుసుములో ఏమైనా బీమాను కలుపుతున్నారా? అన్న ప్రశ్నలతో సూర్యాపేటజిల్లా కోదాడకు చెందిన జలగం సుధీర్ సమాచార హక్కు కింద చేసిన దరఖాస్తుకు ఎన్హెచ్ఏఐ ఈ మేరకు లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పింది. టోల్గేట్ రుసుము ద్వారా వసూలు చేసిన డబ్బులో ఎలాంటి బీమా రుసుము వసూలు చేయడంలేదని, జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగినపుడు వైద్యసదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపింది.అది విధానపరమైన నిర్ణయమని, అలా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినవారి కుటుంబాలకు ఎలాంటి బీమా, నష్టపరిహారం ఇవ్వడం లేదని సమాధానం ఇచ్చింది. కానీ, ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకంలో రూపే డెబిట్ కార్డు కలిగినవారికి ప్రమాదబీమా రూ.లక్ష వర్తిస్తుందన్నారు. అలాగే, మోటారు వాహన సవరణ చట్టం 2019 ప్రకారం.. జాతీయ రహదారులపై అంబులెన్స్ సౌకర్యంతోపాటు, తీవ్ర ప్రమాదాల్లో గాయపడ్డవారికి (గోల్డెన్ అవర్) నగదు రహిత వైద్యం అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ఉన్న జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల వల్ల పలు రైతు, కూలీల కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. జాతీయ రహదారుల వెంబడి ఉన్న పల్లెటూళ్లలో ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురినీ సైతం ప్రమాదాలు బలితీసుకుంటున్న ఉదంతాలు ఉన్న సంగతి పలువురికి విదితమే. (బుల్డోజర్లతో నదీ ప్రవాహం మళ్లింపు!) -
రోడ్డు భద్రతకు రూ. 400 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఏటా కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా రూ.500 కోట్ల వరకు రానున్నాయి. ఏప్రిల్ నుంచి దాదాపు ఐదేళ్ల వరకు ఈ నిధులు అందనున్నాయి. గురువారం రాష్ట్ర రోడ్సేఫ్టీ విభాగం చైర్మన్ క్రిష్ణప్రసాద్ నేతృత్వంలో ప్రపంచబ్యాంకు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ) ప్రతినిధులు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రోడ్డు భద్రత విభాగం ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న కార్యక్రమాలను డీజీపీ క్రిష్ణప్రసాద్ వారికి వివరించారు. ప్రమాదాలకు కారణంగా నిలుస్తోన్న అతివేగం, బ్లాక్స్పాట్లు, నిర్లక్ష్యం తదితర అంశాలను ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పర్యటిస్తోన్న ఈ బృంద సభ్యులు తెలంగాణ రోడ్సేఫ్టీ విధానాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బృందం నివేదిక ఆధారంగా ఏప్రిల్ నుంచి రోడ్సేఫ్టీ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏటా రూ.400 నుంచి 500 కోట్ల వరకు ప్రత్యేక గ్రాంటును అందజేయనుంది. ఎన్ఆర్ఎస్పీపై ప్రశంసల వర్షం.. దేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం డీజీపీ క్రిష్ణప్రసాద్ను నివేదిక రూపొందించమని కోరింది. 6 నెలలపాటు దేశంలోని రోడ్లు, ప్రమాదాలపై అధ్యయనం చేసిన క్రిష్ణప్రసాద్ నేషనల్ రోడ్సేఫ్టీ ప్లాన్ (ఎన్ఆర్ఎస్పీ)కి రూపకల్పన చేశారు. దానికి రూ.3,000 కోట్ల మూలధనం, ఏటా రూ.2,000 కోట్ల నిర్వహణ వ్యయంతో ప్రత్యేక నేషనల్ హైవే పోలీసు వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. ఈ నివేదికలోని ముఖ్యాంశాలను గురువారం జరిగిన సమావేశంలో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులకు వివరించారు. దేశంలో ఎన్ఆర్ఎస్పీ అమల్లోకి వస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. కార్యక్రమంలో ఏడీజీ రైల్వేస్ అండ్ రోడ్సేఫ్టీ సందీప్ శాండిల్య, జాతీయ రహదారుల విభాగం ఈఎన్సీ గణపతిరెడ్డి పాల్గొన్నారు. -
కనకదుర్గ ఫ్లై ఓవర్ పూర్తికి మరో నెల గడువివ్వండి
సాక్షి, అమరావతి: విజయవాడ నగరంలో కనకదుర్గ ఫ్లై ఓవర్ పూర్తికి మరో నెల గడువు కావాలని కాంట్రాక్టు సంస్థ ‘సోమా’ కేంద్రాన్ని కోరింది. నగరంలో బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ పూర్తయి ప్రారంభానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు కనకదుర్గ ఫ్లై ఓవర్ పూర్తికి గడువును ఇప్పటికే కేంద్రం రెండు సార్లు పొడిగించింది. గతేడాది డిసెంబర్ ఆఖరుకు పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థకు నోటీసులిచ్చినా జాప్యం చేయడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకెంత సమయం పడుతుందో నివేదిక పంపాలని ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) అధికారులను మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఆదేశించింది. భవానీ దీక్షల విరమణ, దసరా పండగ సీజన్లో పనులు ముందుకు సాగలేదని, అందువల్లే జాప్యం జరిగిందని కాంట్రాక్టు సంస్థ పేర్కొంది. 90 శాతం పనులు పూర్తి అయ్యాయని, మరో నెలలో ఫ్లై ఓవర్ పూర్తి చేస్తామని కాంట్రాక్టు సంస్థ చెబుతోందని ఎన్హెచ్ఏఐ అధికారులు కేంద్రానికి నివేదిక పంపించారు. కాగా, కృష్ణలంక నుంచి భవానీపురం వరకు 5.290 కిలోమీటర్ల మేర ఫ్లై ఓవర్ను నిర్మించేందుకు 2015లో టెండర్లు పిలవగా.. రూ. 307.58 కోట్లతో సోమా కంపెనీ కాంట్రాక్టు దక్కించుకుంది. 2016 డిసెంబర్లోగా ఫ్లై ఓవర్ పనులు పూర్తి చేయాలని ఒప్పందం కుదుర్చుకుని ఆర్థిక ఇబ్బందులు పేరుతో మూడేళ్లకు పైగా పనుల్ని సాగదీస్తూ వచ్చింది. గత ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని పట్టించుకోలేదు. రహదారులు, భవనాల సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కనకదుర్గ ఫ్లై ఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ పనులపై ఆరా తీశారు. త్వరిగతిన పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. -
ఫాస్టాగ్ లేకుంటే రాయితీ కట్
సాక్షి, హైదరాబాద్: ఫాస్టాగ్ తీసుకోకుంటే టోల్ప్లాజాల వద్ద క్యూలో ఎదురుచూడాల్సి రావటం ఇప్పటివరకు ఉన్న సమస్య.. కానీ ఇప్పుడు కేంద్ర ఉపరితల రవాణా శాఖ క్రమంగా కొత్త ఆంక్షలను తెరపైకి తెస్తోంది. ఎంత ప్రయత్నించినా, ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు విధానం వైపు వాహనదారులు వేగంగా మళ్లకపోతుండటంతో, ఒత్తిడి తెచ్చి మరీ ఫాస్టాగ్స్ కొనిపించాలని నిర్ణయించింది. సంక్రాంతి వేళ కొత్త ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఫాస్టాగ్ ఉంటేనే ఆ రాయితీ.. టోల్ప్లాజాల వద్ద రాయితీ చాలాకాలంగా అమల్లో ఉంది. టోల్గేట్ దాటి వెళ్లిన వాహనాలు 24 గంటల్లో తిరుగుప్రయా ణమై సంబంధిత టోల్ ప్లాజాకు చేరుకుంటే, రిటర్న్ టోల్ఫీజులో సగం రాయితీ ఉంటుంది. ఇప్పుడు ఈ రాయితీని ఫాస్టాగ్ వాహనాలకే వర్తింపచేస్తున్నారు. సంక్రాంతి నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. నగదు రూపంలో టోల్ చెల్లించే వాహనాలకు ఇది వర్తించదు. నగదు చెల్లించే వారు 24 గంటల్లో తిరిగి వచ్చినా మొత్తం టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ పాస్ రాయితీ కూడా.. జాతీయ రహదారులపై రెగ్యులర్ గా తిరిగే వాహనదారులకు నెలవారీ పాస్లనూ జారీ చేసే విధానం అమల్లో ఉంది. ఈ పాస్ తీసుకుంటే టోల్ చార్జీల్లో తగ్గింపు లభిస్తుంది. ఇప్పుడు ఈ పాస్లను కూడా ఫాస్టాగ్తో ముడిపెట్టారు. ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు విధానంలోనే ఇక రాయితీ వర్తిస్తుంది. ఫాస్టాగ్ లేకుంటే నెలవారీ పాస్ రాయితీ ఉండదు. అలాగే టోల్గేట్లకు 10 కి.మీ. పరిధిలో ఉండే వాహనదారులకు కూడా ప్రత్యేక రాయితీ పాస్ అమల్లో ఉంది. ఇప్పుడు ఈ పాస్ను కూడా ఫాస్టాగ్ ఉంటేనే రాయితీ వర్తించేలా మార్చారు. సంక్రాంతి నుంచి ఇదీ అమల్లోకి వచ్చింది. ఆ 2 టోల్ గేట్లు మినహా... సంక్రాంతి వరకు అమల్లో ఉన్న 25 శాతం హైబ్రిడ్ విధానం గడువు పొడిగింపునకు కేంద్రం సుముఖంగా లేదు. జాతీయ రహదారులపై ఉన్న టోల్ప్లాజాల వద్ద 25 శాతం లేన్లు నగదు చెల్లింపునకు వీలుగా ఉండేవి. వీటిల్లోంచి ఫాస్టాగ్ వాహనాలతోపాటు నగదు చెల్లించే వాహనాలు వెళ్లేవి. 14వ తేదీ అర్ధరాత్రితో ఈ గడువు తీరింది. దీంతో 15 నుంచి టోల్ ప్లాజాల వద్ద ఒక్కో వైపు ఒక్కో లేన్ మాత్రమే నగదు చెల్లింపునకు కేటాయించారు. రాష్ట్రంలో 17 ప్రాంతాల్లో ఉన్న టోల్ప్లాజాల్లో 15 చోట్ల ఇదే విధానం అమల్లోకి వచ్చింది. రద్దీ ఎక్కువగా ఉండే విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పంతంగి టోల్ప్లాజా, బెంగుళూరు హైవే మీదున్న రాయికల్ టోల్ప్లాజాలను దీని నుంచి మినహాయించారు. ఈ రెండు ప్లాజాల్లో మరో నెల రోజులు 25 శాతం హైబ్రీడ్ లేన్లు నగదు చెల్లించేందుకు అందుబాటులో ఉంటాయి. 1.12 లక్షలకు పెరిగిన ఫాస్టాగ్ వాహనాలు ప్రస్తుతం రాష్ట్రంలో ఫాస్టాగ్ వాహనాల సంఖ్య 1.12 లక్షలకు పెరిగింది. సంక్రాంతి వేళ సొంతూళ్లకు వెళ్లే సందర్భంలో ఎక్కువమంది ఫాస్టాగ్స్ కొనుగోలు చేయటంతో వాటి సంఖ్య కాస్త వేగంగా పెరిగింది. దీంతో టోల్ప్లాజాల నుంచి దూసుకెళ్తున్న మొత్తం వాహనాల్లో 54 శాతం వాహనాలకు ఫాస్టాగ్ ఉన్నట్టైంది. టోల్ వసూళ్లలో వీటి వాటా 65 శాతానికి పెరిగింది. -
‘ఫాస్ట్’గా వెళ్లొచ్చు!
సాక్షి, విశాఖపట్నం: వాహనదారులకు టోల్ ప్లాజాల వద్ద కష్టాలు తప్పనున్నాయి. దీనికి కారణం ఫాస్టాగ్ విధానం అమల్లోకి రానుండడమే. సాధారణంగా టోల్ ఫీజు చెల్లించడానికి ఒక్కో వాహనానికి కనీసం ఐదు నిమిషాలు పడుతోంది. ఈ పరిస్థితిల్లో టోల్ప్లాజా వద్ద ఆగకుండానే వాహనాలు వెళ్లిపోవడానికి జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఎలక్ట్రానిక్ టోల్ వసూలు చేసేందుకు ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చింది. విశాఖ శివారులోని అగనంపూడి సహా జిల్లాలోని నాలుగు టోల్ప్లాజాల వద్ద ప్రత్యేక “ఫాస్టాగ్’లైన్లు ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ నగదు రూపేణా టోల్ చెల్లించి వెళ్లడానికి ఉన్న క్యాష్ లైన్లు తగ్గించేశారు. ఉదాహరణకు అగనంపూడి టోల్ప్లాజా వద్ద రాక, పోక మార్గాల్లో నాలుగేసి చొప్పున మొత్తం ఎనిమిది మార్గాలు ఉన్నాయి. వాటిలో రాక, పోక మార్గాల్లో ఒక్కొక్కటి మాత్రమే క్యాష్ లైన్ ఉంటుంది. మూడేసి చొప్పున ఆరు లైన్లు ఫాస్టాగ్ ఉన్న వాహనాల కోసం కేటాయించారు. ఇప్పటివరకూ ఈ లైన్లలో ఫాస్టాగ్ ఉన్న వాహనాలే గాక నగదు రూపేణా టోల్ చెల్లించే వాహనాలనూ అనుమతిస్తున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి అలా కుదరదు. ఫాస్టాగ్ ఉన్న వాహనాలనే సంబంధిత లైన్లలోకి అనుమతిస్తామని ఎన్హెచ్ఏఐ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఫాస్టాగ్ లేని వాహనాలు ఆ మార్గాల్లో వెళ్తే రెట్టింపు టోల్ (రుసుం) వసూలు చేస్తారు. సంక్రాంతికి వాహనాల తాకిడి.. నక్కపల్లి, విశాఖ నగరంలో అగనంపూడి, పోర్టు అనుసంధాన మార్గంలోని పంచవటి, డాక్యార్డు టోల్ప్లాజాలు ఉన్నాయి. నక్కపల్లి టోల్ప్లాజా రాజమండ్రి రీజియన్లో ఉండగా.. మిగతా మూడు విశాఖ పరిధిలో ఉన్నాయి. జిల్లాలోని టోల్ప్లాజాల్లో అగనంపూడి, నక్కపల్లి జాతీయ రహదారి (ఎన్హెచ్ 16)పై ఉండటంతో ఇవెంతో కీలకమైనవి. అక్కడ సగటున రోజుకు 35 వేల నుంచి 40 వేల వాహనాలకు సంబంధించిన టోల్ చెల్లింపులు జరుగుతున్నాయి. రాక, పోక మార్గాల్లోని ఎనిమిది లైన్లలో ప్రయాణించే వాహనాలకు సంబంధించి టోల్ చెల్లించడానికి ఒక్కో వాహనానికి కనిష్టంగా ఐదు నిమిషాల సమయం పడుతోంది. దీంతో సాధారణ రోజుల్లో టోల్ప్లాజా దాటడానికి పది నిమిషాల సమయం పడుతోంది. సంక్రాంతి, దసరా వంటి పండుగల సమయాల్లో వాహనాల తాకిడి మూడు రెట్లు పెరుగుతుండాయి. ఇప్పటికే సంక్రాంతి సెలవులు ఇచ్చేయడంతో ఆదివారం నుంచి రోజూ లక్ష వాహనాల వరకూ రాకపోకలు సాగిస్తాయని ఎన్హెచ్ఏఐ అధికారులు అంచనా వేస్తున్నారు. ఫాస్టాగ్ లేకుంటే ఇబ్బందే... జిల్లాలోని నాలుగు టోల్ప్లాజాల వద్ద గత డిసెంబరు ఒకటో తేదీ నుంచే ఫాస్టాగ్ లైన్లను పక్కాగా అమలు చేయడానికి ఎన్హెచ్ఏఐ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అందుకు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. కానీ ప్రజాప్రతినిధులు, వాహనదారుల సంఘాల వినతి మేరకు ఆ గడువు పెంచుకుంటూ వచ్చారు. ఈనెల 15 నుంచి టోల్ప్లాజాల వద్ద రాక, పోక మార్గాల్లో ఒక్కొక్కటి చొప్పున మాత్రమే టోల్ రుసుం చెల్లింపు కౌంటర్లు ఉంటాయి. మిగతావన్నీ ఫాస్టాగ్ లైన్లే. ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాల్లో ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. లేని వాహనాలకు రాక, పోక మార్గాల్లో క్యాష్ లైను ఒక్కొక్కటి మాత్రమే ఉండటంతో టోల్ప్లాజా దాటడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. ఎంత రద్దీ ఉన్నా ఫాస్టాగ్ లైనులోకి మాత్రం వెళ్లకూడదు. 70 శాతానికి చేరిన ‘ఫాస్టాగ్’ ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనదారులకు ప్రత్యేక స్టిక్కర్ ఇస్తున్నారు. దీన్ని ఏ వాహనం నంబరుతో కొనుగోలు చేశారో ఆ వాహనం కోసమే వినియోగించాలి. ఈ స్టిక్కర్ను వాహనం అద్దంపై కుడివైపు పైభాగంలో అతికించాలి. ఈ స్టిక్కర్పైనున్న చిప్ను, బార్ కోడ్ను స్కాన్ చేయడానికి శక్తివంతమైన రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైస్ (ఆర్ఎఫ్ఐడీ)లను టోల్ప్లాజాల వద్ద ఏర్పాటు చేశారు. వాహనం టోల్ప్లాజా సమీపంలోకి వస్తున్నప్పుడే ఇవి స్కాన్ చేస్తాయి. దీంతో ఆ వాహనానికి చెల్లించాలి్సన టోల్ ఫాస్టాగ్కు అనుసంధానమైన బ్యాంకు ఖాతా నుంచి చెల్లింపు క్షణాల్లో జరిగిపోతుంది. ఆ సమాచారం వాహనదారుని సెల్ఫోన్కు వస్తుంది. ప్రస్తుతం టోల్ప్లాజా వద్దకు వస్తున్న వాహనాల్లో ఫాస్టాగ్ ఉన్నవి 70 శాతం వరకూ ఉంటున్నాయి. వీటిని వంద శాతం చేసేలా అధికారులు కృషి చేయాలని ఇటీవల విశాఖలో జరిగిన పార్లమెంటరీ స్థాయీసంఘం సూచించింది. రిజిస్ట్రేషన్కు పలు మార్గాలు... ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్కు వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లతో పాటు వాహనదారుడి బ్యాంకు ఖాతాకు సంబంధించిన కేవైసీ సమర్పించాలి. ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఇందుకోసం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. దీనిలో రూ.100 స్టిక్కర్ (ట్యాగ్) ఖరీదు కాగా మిగిలిన మొత్తంలో రూ.200 బ్యాంకులో సెక్యూరిటీ డిపాజిట్కు, రూ.200 టాప్అప్కు కేటాయిస్తారు. ఈ స్టిక్కర్ జాతీయ రహదారులపైనున్న అన్ని టోల్ప్లాజాల్లోనూ పనిచేస్తుంది. టోల్ప్లాజాలు, పలు పబ్లిక్ పాయింట్ల వద్ద ఫాస్టాగ్ల విక్రయానికి అధీకృత బ్యాంకులు ప్రత్యేక కౌంటర్ల (పాయింట్ ఆఫ్ సేల్ – పీవోఎస్)ను ఏర్పాటు చేశాయి. ఇది కొనుగోలు చేసిన తర్వాత వాహనదారులు ‘మై ఫాస్టాగ్ యాప్’ను సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. వాహన రిజిస్ట్రేషన్ నంబరుతో బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకోవాలి. డీలర్లూ ఫాస్టాగ్ ఇవ్వాలి మోటారు వాహనాల చట్టానికి 2017లో చేసిన సవరణ ప్రకారం కొత్త కార్లు, భారీ వాహనాల కొనుగోలు సమయంలోనే డీలర్లు ఫాస్టాగ్ ఇవ్వాలి. ఈ దృష్ట్యా వాహల కొనుగోలుదారులకు ఫాస్టాగ్ స్టిక్కర్ ఇచ్చేందుకు డీలర్లంతా సహకరించాలి. ప్రస్తుతం టోల్ప్లాజాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం 70 శాతం వాహనాలు ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ ఉన్నవి వస్తున్నాయి. మిగతా వాహనదారులంతా ఈ విధానంలోకి వస్తే జాతీయ రహదారిపై టోల్ప్లాజాల వద్ద ఇబ్బంది ఉండదు. – పి.శివశంకర్, ప్రాజెక్టు డైరెక్టరు, ఎన్హెచ్ఏఐ విశాఖ రీజియన్ -
లక్షకు చేరుకున్న ‘ఫాస్టాగ్’
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులపై సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ఫాస్టాగ్ కొనుగోళ్లు ఊపందుకున్నాయి. శుక్రవారానికి రాష్ట్రంలో ఫాస్టాగ్ వాహనాల సంఖ్య లక్ష మార్కును దాటింది. శుక్రవారం రాత్రి వరకు అమ్ముడైన మొత్తం ఫాస్టాగ్ల సంఖ్య 1.06 లక్షలకు చేరుకుంది. శుక్రవారం నుంచి సంక్రాంతి పండగ రద్దీ మొదలైన నేపథ్యంలో జాతీయ రహదారులపై టోల్ప్లాజాల వద్ద టోల్ చెల్లింపునకు క్యూలు ఏర్పడకుండా ఊరట కలిగించే విషయమిది. వచ్చే 4 రోజుల్లో నగరం నుంచి సొంతూళ్లకు 25 లక్షల మందికిపైగా వెళ్లనున్నారు. రాష్ట్రంలోని 17 ప్రాంతాల్లో ఉన్న టోల్ప్లాజాల వద్ద రుసుము చెల్లించేవారితో రద్దీ ఏర్పడనుంది. ప్రస్తుతం నగదు రూపంలో టోల్ చెల్లించేందుకు 25 శాతం లేన్లు ఉన్నాయి. 75 శాతం లేన్లలో ఫాస్టాగ్ వాహ నాలకే అనుమతి ఉంది. ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు ప్రారంభించిన కొత్తలో, నగదు చెల్లించే వాహనాల సంఖ్యే ఎక్కువగా ఉండటం, వాటికి కేటాయించిన లేన్ల సంఖ్య తక్కువగా ఉండటంతో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయేవి. డిసెంబర్ చివరికి వీటి సంఖ్య సగం సగంగా మారింది. ఇప్పుడు టోల్ గేట్ల నుంచి వెళ్లే వాహనాల్లో దాదాపు 51 శాతం వాహనాలు ఫాస్టాగ్వే ఉంటున్నాయి. టోల్ రూపంలో వసూలవుతున్న మొత్తంలో 63 శాతం ఫాస్టాగ్ ఉన్న వాహనాల నుంచే వస్తోంది. ఫాస్టాగ్ తీసుకున్న వాటిలో వాణిజ్య వాహనాలు ఎక్కువ ఉండటంతో వసూలయ్యే మొత్తం ఎక్కువే ఉంటోంది. రద్దీ అధికంగా ఉంటే మరో లేన్.... రాష్ట్రంలో ఫాస్టాగ్ వాహనాల సంఖ్య లక్ష మించినందున సంక్రాంతి ప్రయాణ సమయాల్లో ఇబ్బంది ఉండకపోవచ్చని ఎన్హెచ్ఏఐ అధికారులు భావిస్తున్నారు. 14 తేదీ వరకు హైబ్రీడ్ విధానం అమలులో ఉండనుంది. అంటే 25% లేన్లు నగదు చెల్లింపులకు ఉంటాయి. ఒకవేళ ఫాస్టాగ్ లేని వాహనాలు ఎక్కువగాఉండి, నగదు చెల్లింపుకు ఎక్కువ సమయం పట్టేలా ఉంటే అదనంగా మరో లేన్ను కేటాయించే విషయాన్ని పరిశీలిస్తామని ఎన్హెచ్ఏఐ ప్రాంతీయాధికారి కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. ఇక 15వ తేదీ నుంచి నగదు చెల్లింపులకు ఒక్క లేన్ మాత్రమే కేటాయించనున్నారు. తర్వాత కూడా నగదు లేన్ వద్ద రద్దీ అధికంగా ఉంటే కేంద్రం నుంచి అనుమతి తీసుకుంటామని కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. పండుగ తర్వాతే.. ఇక రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న రహదారులపై సంక్రాంతి తర్వాతే ఫాస్టాగ్ విధానం ప్రారంభించాలని నిర్ణయించారు. హైదరాబాద్–రామగుండం రాజీవ్ రహదారిపై 3 ప్రాంతాల్లో ఉన్న టోల్ప్లాజాల వద్ద జనవరి 20–25 మధ్య ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపులు ప్రారంభించాలని శుక్రవారం ఆయా రోడ్లను నిర్వహించే కాంట్రాక్టర్లతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఈ మార్గంలో 3 ప్లాజాలకు సంబంధించి 28 లేన్లున్నాయి. ఇక నార్కెట్పల్లి–అద్దంకి మార్గంలో ఉన్న ప్లాజా వద్ద ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ విధానం మొదలుకానుంది. ఇక్కడ ఏడు లేన్లు ఉండగా 5 ఫాస్టాగ్కు, 2 నగదు చెల్లించేందుకు కేటాయించనున్నారు. పరికరాల బిగింపుకయ్యే వ్యయాన్ని కాంట్రాక్టు సంస్థలే భరించనున్నాయి. ఆ ఖర్చును ప్రభుత్వమే భరించాలని కాంట్రాక్టు సంస్థలు డిమాండ్ చేయగా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సునీల్శర్మ అంగీకరించలేదు. -
టోల్ కష్టాలు ఇక తీవ్రం
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులపై టోల్ కష్టాలు మరింత తీవ్రం కానున్నాయి. ఈ నెల 15 నుంచి టోల్ప్లాజాల్లో ఒకటి మినహా మిగిలినవన్నీ ఫాస్టాగ్ లైన్లే ఉండనున్నాయి. నగదురూపంలో టోల్ చెల్లించేందుకు కేవలం ఒక లైన్ మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఫలితంగా ఫాస్టాగ్ లేని వాహనదారులకు ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం టోల్ప్లాజాల్లో 25 శాతం గేట్లను హైబ్రిడ్ మార్గాలుగా కొనసాగిస్తున్నారు. వీటిలో ఫాస్టాగ్ ఉన్న వాహనాలతోపాటు సాధారణ నగదు చెల్లింపు వాహనాలు కూడా వెళ్లొచ్చు. ఈ నెల 14 వరకు ఈ వెసులుబాటు ఉంది. దీన్ని ఈ నెలాఖరు వరకు పొడి గించాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ, కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ముందుగా ప్రతిపాదించినట్టుగా జనవరి 15 నుంచి ప్రతి టోల్ప్లాజా వద్ద ఒక్కో వైపు ఒక్క లేన్ మాత్రమే నగదు చెల్లింపునకు పరిమితం చేస్తామని ఎన్హెచ్ఏఐ చైర్మన్ స్పష్టంచేశారు. దీంతో జనవరి 15వ తేదీ తెల్లవారుజాము నుంచి ఒక్కో గేట్ మాత్రమే నగదు చెల్లింపునకు ఉండనుంది. అసలే సంక్రాంతి సమయం కావడంతో విపరీతంగా రద్దీ ఏర్పడి ఇబ్బందులు తలెత్తుతా యని అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో గడువును పొడిగించాలని వాహనదారులతోపాటు అధికారులు కోరుతున్నారు. మ రోవైపు రాష్ట్రంలో మంగళవారం నాటికి దాదా పు 94వేల ఫాస్టాగ్స్ అమ్ముడయ్యాయి. దీంతో టోల్ప్లాజాల్లో ఫాస్టాగ్ లేన్ల నుంచి వెళుతున్న వాహనాల సంఖ్య 52 శాతానికి చేరింది. స్పీడ్ బ్రేకర్ల తొలగింపు.. ఫాస్టాగ్ తీసుకున్న వాహనాలు టోల్ప్లాజాల నుంచి వేగంగా ముందుకు వెళ్లే అవకాశం ఉన్నందున అక్కడ ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లను తొలగించాలని ఎన్ హెచ్ఏఐ నిర్ణయించింది. ఇప్పటివరకు వాహనదారులు టోల్ప్లాజాల వద్ద ఆగి టోల్ చెల్లించి వెళ్లేవారు. దీంతో వెనుక వచ్చే వాహనాలు ముందున్న వాహనాలను ఢీకొట్టకుండా చూసేందుకు ఈ స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. ఫాస్టాగ్ విధానం వల్ల వాహనం ఆగాల్సిన అవసరం లేకపోవడంతో ఈ స్పీడ్ బ్రేకర్లను తొలగిస్తున్నారు. -
హైవే పక్కన హోటళ్లలో ఫాస్టాగ్ విక్రయం
సాక్షి, హైదరాబాద్: టోల్ప్లాజాల వద్ద సంక్రాంతి సమయంలో అయోమయం నెలకొనే పరిస్థితి ఉండటంతో ఎన్హెచ్ఏఐ అధికారులు అప్రమత్తమయ్యారు. సంక్రాంతి రద్దీ మొదలయ్యే నాటికి వీలైనన్ని ఫాస్టాగ్లు విక్రయించాలని నిర్ణయిం చారు. ఇప్పటికే టోల్ప్లాజాల వద్ద పెద్ద సంఖ్యలో కౌంటర్లు తెరిచి ఫాస్టాగ్లను విక్రయిస్తున్నారు. జాతీయ రహదారిపై ముఖ్యమైన హోటళ్లలో ఫాస్టాగ్ విక్రయ కౌంటర్లు తెరిచారు. విజయవాడ రహదారిలో రద్దీ ఎక్కువగా ఉంటున్నందున ఆ రోడ్డులోని 6 హోటళ్లలో విక్రయాలు ప్రారంభించారు. బుధవారం నుంచి వాటి అమ్మకాలు మొదలయ్యాయి. ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ ఈ హోటళ్లలోని కౌంటర్లను పరిశీలించి, హోటళ్లకు వచ్చే వాహనదారులతో మాట్లాడి ఫాస్టాగ్స్ కొనుగోలు చేసేలా చైతన్యపరచాలన్నారు. ఇక్కడ ఫాస్టాగ్ విక్రయాలు ఆశాజనకంగా ఉంటే మరిన్ని హోటళ్లలో వాటిని ప్రారం భించాలని నిర్ణయించారు. ఫాస్టాగ్ లేకుంటే సం క్రాంతి ప్రయాణం ఇబ్బందిగా ఉంటుందని, దా న్ని నివారించేందుకు వెంటనే ట్యాగ్ తీసుకోవాలని ప్రచారం చేస్తున్నారు. జాతీయ రహదారుల వెంట ఆ మేరకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం లేన్లు ఇలా.. ప్రస్తుతం జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద 25 శాతం లేన్లు హైబ్రీడ్ వేలుగా ఉన్నాయి. వాటిల్లో ఫాస్టాగ్ ఉన్న వాహనాలతోపాటు లేని వాటిని కూడా అనుమతిస్తున్నారు. 75 శాతం లేన్లు పూర్తిగా ఫాస్టాగ్ ఉన్నవాటికే కేటాయిం చారు. జనవరి 14 తర్వాత క్యాష్ లేన్ను ఒకటి మాత్రమే(ఒక్కోవైపు ఒకటి) ఉండనుంది. మరో పక్షం రోజులపాటు ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని ఎన్హెచ్ఏఐపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ విషయంలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గడువు పెంచకుంటే సంక్రాంతి రద్దీ సమయంలో ఒక్క కౌంటర్ మాత్రమే క్యాష్ చెల్లించే వాహనాలకు అందుబాటులో ఉండనుంది. గడువు పెంచితే మరికొన్ని రోజులు ఇబ్బందులు దూరమైనట్టే. రాష్ట్రంలో ఫాస్టాగ్స్ ఉన్న వాహనాల సంఖ్య 81 వేలకు చేరుకుంది. గత నాలుగైదు రోజులుగా వాటి విక్రయాలు పెరిగాయి. -
వసూళ్లు ఎక్కువ..వాహనాలు తక్కువ
సాక్షి, హైదరాబాద్: ఫాస్టాగ్ టోల్ వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఫాస్టాగ్ లేన్ల ద్వారా వస్తున్న ఆదా యం భారీగానే పెరుగుతోంది. ఫాస్టాగ్, క్యాష్ లేన్ల ద్వారా వస్తున్న ఆదాయం, వాహనాల రాకపోకల విషయంలో వింత పరిస్థితి తలెత్తుతోంది. ప్రస్తుతం తెలంగాణలో 58 శాతం టోల్ ఆదాయం ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు విధానం (ఫాస్టాగ్ లేన్స్) ద్వారా వసూలవుతోంది. ఇది నాలుగైదు రోజుల్లో 60 శాతా నికి చేరుకుంటుందని అధికారుల అంచనా. ఫాస్టాగ్ గేట్లతో పోలిస్తే క్యాష్ లేన్ల నుంచే ఎక్కువ వాహనాలు దూసుకుపోతున్నాయి. రాష్ట్రంలో టోల్ ప్లాజాల మీదుగా వెళ్తున్న వాహనాల్లో 48% ఫాస్టాగ్ లేన్ల నుంచి, 52% క్యాష్ లేన్ల నుంచి వెళ్తున్నాయి. ఫాస్టాగ్ లేన్ల ద్వారా టోల్ వసూలు ఎక్కువగా, వాహనాల గమనం తక్కువగా ఉంది. క్యాష్ లేన్ల నుంచి వాహనాల సంఖ్య ఎక్కువగా, ఆదాయం తక్కువగా ఉంది. ఈ విరుద్ధ వ్యవహారం రాష్ట్రంలో నెలకొంది. ఆదాయం అదుర్స్.. ఫాస్టాగ్ విధానం రావటానికి కొన్ని నెలల ముందే ప్రయోగాత్మకంగా అధికారులు పరిశీలిస్తూ వస్తున్నారు. కొన్ని లేన్లను ప్రత్యేకంగా వాటికోసం కేటాయించారు. నవంబర్ 15న రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ఉన్న 17 టోల్ ప్లాజాల్లో ఫాస్టాగ్ లేన్ల నుంచి రూ.96 ఆదాయం మాత్రమే వచ్చింది. అదే క్యాష్ లేన్ల ద్వారా రూ.1.95 కోట్ల ఆదాయం వచ్చింది. అదే నెల 26న ఫాస్టాగ్ లేన్ల ద్వారా రూ.1.01 కోట్లు వస్తే, క్యాష్ లేన్ల ద్వారా రూ.1.59 కోట్లు వసూలయ్యాయి. డిసెంబర్ 13న రూ.1.52 కోట్లు ఫాస్టాగ్ లేన్ల ద్వారా, రూ.1.44 కోట్లు క్యాష్ లేన్ల ద్వారా వచ్చింది. గత 2 రోజులుగా సగటున ఫాస్టాగ్ లేన్ల ద్వారా రూ.1.78 కోట్లు, క్యాష్ లేన్ల ద్వారా రూ.1.20 కోట్లు వసూలవుతోంది. ఈ వారాంతానికి ఫాస్టాగ్ ద్వారా రూ.2 కోట్లు, క్యాష్ లేన్ల ద్వారా రూ.1 కోటి వసూలయ్యే అవకాశం ఉందని అధికారుల అంచనా. ఫాస్టాగ్ వల్ల సగటు ఆదాయం రూ.50 లక్షలు చొప్పు న పెరిగినట్టు అంచనా. మరో 2 రోజుల తర్వాత నెల రోజుల లెక్కలు విడుదల చేయనున్నారు. పెరగని వాహనాల సంఖ్య.. ఫాస్టాగ్ వల్ల టోల్ చెల్లించే సమయంలో క్యూలో ఉండాల్సిన సమస్య ఉండదని తేలిపోయినా.. ఇంకా వాహనదారులతో కదలిక ఆశించిన వేగంగా ఉండట్లేదు. ఇప్పటికీ 72 వేల వాహనాలకు మాత్రమే రాష్ట్రంలో ఫాస్టాగ్ ట్యాగ్లు కొన్నారు. ట్యాగ్ లేని వాహనాలే ఎక్కువగా టోల్ గేట్ల నుంచి వెళ్తున్నాయి. గత 4 రోజులుగా టోల్గేట్ల నుంచి వెళ్తున్న వాహనాల్లో 52 శాతం ట్యాగ్ లేనివే ఉండటం విశేషం. వాణిజ్యపరమైన వాహనదారులు ఎక్కువగా, సొంత వాహనాలున్నవారు తక్కువగా ట్యాగ్లు కొంటున్నారు. కమర్షియల్ వాహనాలు టోల్ ఎక్కువగా చెల్లిం చాల్సి ఉండటంతో ఫాస్టాగ్ వాహనాల సంఖ్య తక్కువగా ఉన్నా.. వాటి ద్వారా వసూలవుతున్న టోల్ ఎక్కువగా ఉంటోంది. ఫాస్టాగ్ రావటానికి 5 రోజుల ముందు నుంచి ట్యాగ్లు కొనుగోళ్ల వేగం పెరిగింది. సగటున రోజుకు 3 వేల వరకు ట్యాగ్స్ కొన్నారు. కొన్ని రోజులుగా సగటున రోజుకు 1,300 ట్యాగ్లు మాత్రమే అమ్ముడవుతున్నాయి. 14 తర్వాత గందరగోళమే! ప్రస్తుతం టోల్ ప్లాజాల వద్ద 25 శాతం దారులను హైబ్రీడ్ వేలుగా మార్చారు. వీటిల్లో ట్యాగ్ ఉన్నవాటిని లేని వాటిని అనుమతిస్తున్నారు. జనవరి 14 వరకు ఈ వెసులుబాటుంది. ఆ తర్వాత కేవలం ఒకటి చొప్పున (ఒకవైపు) గేట్లను మాత్రమే క్యాష్ చెల్లించేందుకు పరిమితం చేయనున్నారు. అంటే ఫాస్టాగ్ లేని వాహనాలన్నీ ఈ ఒక్క గేటు నుంచే ముందుకు కదలాల్సి ఉం టుంది. ఫాస్టాగ్ లేన్ల నుంచి వెళ్లే సాధారణ వాహనాలకు రెట్టింపు టోల్ వసూలు చేస్తారు. అదే సమయంలో సంక్రాంతి రద్దీ ఉండనుండటంతో టోల్గేట్ల వద్ద అయోమయ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. కేంద్రం గడువు పొడిగించకుంటే గందరగోళం తప్పదని అధికారులు కలవరపడుతున్నారు. మరో పక్షం రోజుల్లో వీలైనన్ని వాహనాలు ట్యాగ్లు కొంటేనే పరిస్థితి అదుపులో ఉం టుంది. కొనుగోళ్లు ఇదే మందగమనంలో ఉంటే క్యాష్ లేన్ వద్ద మళ్లీ కిలోమీటరు మేర క్యూలు తప్పేలా కనిపించటం లేదు. పండగ కోసం సొం తూళ్లకు వెళ్లేవారు ఇబ్బంది పడకతప్పేలా లేదు. కనీసం మరో పక్షం రోజులు హైబ్రీడ్ లేన్ల కొనసాగింపునకు కేంద్రం అనుమతిని పొడిగించాలన్న అభ్యర్థనలు వినిపిస్తున్నాయి. -
సంక్రాంతికి ‘టోల్’ గుబులు!
సాక్షి, హైదరాబాద్: టోల్ రుసుము చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని నివారించటంతోపాటు నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు విధానం ఇప్పుడు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. ఫాస్టాగ్ ఉన్న వాహనాలు టోల్ గేట్ల వద్ద ఇబ్బంది లేకుండా దూసుకుపోతుండగా, ట్యాగ్ లేని వాహనాలు కిలోమీటర్ల మేర క్యూలో ఇరుక్కుపోవాల్సి వస్తోంది. ఇప్పుడే ఇలాఉంటే సంక్రాంతి సమయంలో పరిస్థితి ఏమిటని అధికారులు బెంబేలెత్తుతున్నారు. ఈ మేరకు ఎన్హెచ్ఏఐ అధికారులు మంగళవారం సమావేశమై దీనిపైనే చర్చించారు. సంక్రాంతిలోపు వీలైనన్ని ఫాస్టాగ్లు అమ్మేలా ప్రచారం చేయాలని నిర్ణయించారు. రద్దీ నుంచి తప్పించుకోవాలంటే ఫాస్టాగ్ కొనాల్సిందేనంటూ వివరించే కరపత్రాలు పెద్ద సంఖ్యలో ముద్రించి పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం నగదు చెల్లింపు వాహనాలు క్యూలలో చిక్కుకుపోవటం, ఫాస్టాగ్ వాహనాలు ఇబ్బంది లేకుండా వెళ్లిపోతున్న తీరుకు సంబంధించిన వీడియో లను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. ఇక రద్దీ ఎక్కువుంటే ఫాస్టాగ్ వాహనాల గేట్ల నుంచి సాధారణ వాహనాలు కూడా వెళ్లేందుకు అనుమతించాలని నిర్ణయించారు. కాగా, మంగళవారం జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల మీదుగా వెళ్లిన వాహనాల్లో 53.59 శాతం ఫాస్టాగ్తో వెళ్లినట్టు ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ చెప్పారు. -
నేటి నుంచే ఫాస్టాగ్
-
ఫాస్టాగ్ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలకు ఫాస్టాగ్ గడువును డిసెంబర్ 15 వరకు పొడిగించింది. డిసెంబరు 1 నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్ ఉండాల్సిందేనని ప్రకటించిన కేంద్రం.. తాజాగా గడువు పొడిగించింది. ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు టోల్ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా ఈ విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. దీని వల్ల వాహనాలు చెల్లింపుల నిమిత్తం నిలిచి ఉండాల్సిన పనిలేకుండా హైబ్రిడ్ లైన్లో వెళ్లిపోవచ్చు. నవంబర్ 21 నుంచి ట్యాగ్ వ్యయంలో వెసులుబాటు ఇచ్చిన దగ్గర నుంచి వీటి వినియోగం గణనీయంగా పెరిగినట్లు ప్రకటించింది. -
టోకెన్ గేటులో పాత టోలే!
సాక్షి, హైదరాబాద్: ఫాస్టాగ్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. టోల్ప్లాజాల వద్ద అప్పటికప్పుడు రుసుము చెల్లించే పద్ధతి స్థానంలో ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు (ఈటీసీ) విధానం అమల్లోకి రానుంది. ఆ పద్ధతిలో వాహనాలకు ముందు అద్దానికి అతికించే ట్యాగ్ పేరే ఫాస్టాగ్. డిసెంబర్ 1 నుంచి మన రాష్ట్రంలోని జాతీయ రహదారుల్లో 17 ప్రాంతాల్లో ఉన్న టోల్ప్లాజాల్లో ఇది అమలు కానుంది. కొత్త విధానం ప్రారంభమైనా.. అన్ని టోల్ ప్లాజాల్లో ఇరువైపులా ఒక్కో సాధారణ గేట్ కూడా కొనసాగించనున్నారు. అయితే, ఆ గేట్ నుంచి వెళ్లే వాహనాలకు రెట్టింపు టోల్ వసూలు చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఖండించింది. కేంద్రం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆ లైన్లో కూడా సాధారణ టోల్నే వసూలు చేస్తామని ఎన్హెచ్ఏఐ ప్రత్యేకాధికారి కృష్ణప్రసాద్ చెప్పారు. అదే సమయంలో ఫాస్టాగ్ కోసం కేటాయించిన గేట్ల నుంచి వెళ్లే సాధారణ వాహనాలకు రెట్టింపు టోల్ వసూలు చేస్తామన్నారు. కేంద్రం చెప్పే వరకు సాధారణ లైన్ కొనసాగిస్తామని, తర్వాత దానిని కూడా ఫాస్టాగ్ వేగా మారుస్తామని తెలిపారు. డిసెంబర్ 1 తర్వాత వీలైనంత తక్కువ సమయంలోనే వాటిని తొలగించి పూర్తిగా ఫాస్టాగ్ లేన్లుగా మార్చే అవకాశం ఉంది. ప్లాజాల వద్ద కూడా కౌంటర్లు.... ఫాస్టాగ్ విధానం మొదలుకావడానికి ఇంకా ఎన్నో రోజుల సమయం లేకపోయినా.. వాహనదారులు మాత్రం వాటిని తీసుకునే విషయంలో అంత ఉత్సాహం ప్రదర్శించడంలేదు. రాష్ట్రంలో దాదాపు 15 లక్షల కార్లు, 3 లక్షల లారీలు, 5 వేల బస్సులు ఉండగా.. ఇప్పటివరకు 3,500 వాహనాలు మాత్రమే ఫాస్టాగ్లు తీసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫాస్టాగ్ విక్రయాలపై అధికారులు దృష్టి సారించారు. అన్ని జాతీయ బ్యాంకులు, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీతోపాటు పేటీఎం, అమెజాన్ వంటి మరికొన్ని చెల్లింపు సంస్థలకు వీటిని విక్రయించే అనుమతి ఇచ్చారు. ఇవి ఆన్లైన్ ద్వారా కూడా వాటిని విక్రయిస్తుండగా, ఇప్పుడు అన్ని టోల్ప్లాజాల వద్ద ప్రత్యేకంగా కౌంటర్లు తెరిచాయి. ఒక్కో టోల్ప్లాజా వద్ద ఒక్కో ధర ఫాస్టాగ్ల ధరలు రాష్ట్ర మంతటా ఒకే రకంగా ఉండవు. వాహనాల కేటగిరీ ఆధారంగా వాటి ధరల్లో వ్యత్యాసం ఉన్నట్టే ఒక్కో టోల్ప్లాజాల పరిధిలో వాటి ధర తేడా ఉంటుంది. వాహనం ఆ దారిలో ప్రయాణించే దూరం ఆధారంగా వాటి రుసుముల్లో తేడాలుంటాయి. రెండు టోల్ప్లాజాల మధ్య దూరం తక్కువగా ఉంటే, తక్కువ రుసుము, ఎక్కువ దూరం ఉంటే ఎక్కువ రుసుము ఉంటుంది. రూ.100 కనిష్ట ధరగా ఈ ట్యాగ్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఫాస్టాగ్కు కాలదోషమంటూ ఉండదు. అందులో బ్యాలెన్సు అలాగే ఉంటుంది. టోల్ప్లాజా దాటినప్పుడు ఆ మొత్తంలోంచి నిర్ధారిత రుసుము డిడక్ట్ అవుతుంది. టోల్ప్లాజాల మీదుగా ప్రయాణం చేసే అవసరం ఉండదన్న ఉద్దేశంతో కొందరు వాటిని కొనేందుకు ఆసక్తి చూపడంలేదు. కాలపరిమితి లేనందున కొని పెట్టుకుని ఉంచుకోవచ్చని, టోల్ప్లాజాను దాటినప్పుడు రుసుము డిడక్ట్ అయ్యే వరకు ఆ మొత్తం అలాగే ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. -
టోల్గేట్లలో ఇక ఫాస్ట్గా!
గుంటూరు – విజయవాడ మధ్య జాతీయ రహదారిపై రద్దీగా ఉండే కాజ టోల్గేట్ను దాటాలంటే వాహనాలు బారులు తీరిన సమయంలో 10 – 15 నిమిషాలు పడుతోంది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో గంటల తరబడి నిరీక్షణ తప్పదు. వాహనాలు చీమల్లా కదులుతుండటంతో ఇంధనం వృథా అవుతోంది. జాతీయ రహదారులపై 10 టోల్గేట్లు దాటాలంటే సగటున అర లీటరు నుంచి లీటరు దాకా ఇంధనం వృథా అవుతోందని అంచనా. అదే ‘ఫాస్టాగ్’ వరుసలో వెళ్తే రెండు నిమిషాల్లో టోల్గేట్ దాటవచ్చు. ప్రస్తుతం టోల్గేట్లలో ఒక వరుస మాత్రమే ఫాస్టాగ్ కోసం అందుబాటులో ఉంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి టోల్గేట్లలో అన్ని వరుసలను ఫాస్టాగ్గా మారుస్తారు. వాహనదారులు కేవలం ఒక్క వరుసలో మాత్రమే డబ్బులు చెల్లించి రశీదు తీసుకునే వీలుంటుంది. సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా డిసెంబరు 1వ తేదీ నుంచి ‘వన్ నేషన్.. వన్ ట్యాగ్’ నినాదంతో అన్ని టోల్గేట్లలో ఫాస్టాగ్ విధానాన్ని విధిగా అమలు చేయనున్నారు. కేవలం ఒక్క వరుసలో మాత్రమే నగదు చెల్లించే అవకాశం ఉంటుంది. ఏపీలోని 43 ఎన్హెచ్ఏఐ టోల్గేట్లలో ఫాస్టాగ్ అమలవుతుంది. టోల్గేట్కు 20 కిలోమీటర్ల పరిధిలో ఉండే స్థానికులు, స్థానిక రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలకు ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ ప్రీ పెయిడ్ పాసులు ఇచ్చి.. ఫాస్టాగ్ విధానంలో రాయితీలు వర్తించేలా ఎన్హెచ్ఏఐ ఉత్తర్వులిచ్చింది. పలు రకాలుగా రీ చార్జి సదుపాయం: టోల్గేట్ వద్ద ఫాస్టాగ్ వరుసలో వాహనాలు 25–40 కి.మీ. వేగంతో మాత్రమే వెళ్లాలి. క్యాష్ లెస్ విధానంలో ఫాస్టాగ్ అమలవుతుంది. ఫాస్టాగ్ ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ల కోసం కేంద్రం 23 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. కనీసం రూ.వందతో ఫాస్టాగ్ ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ పొందవచ్చు. అమెజాన్, ఫాస్టాగ్ యాప్, పేటీఎం ద్వారా రీ ఛార్జి చేసుకునే సదుపాయం ఉంది. ఇవీ ఉపయోగాలు.. - ఇంధనం, సమయం ఆదా. - కాలుష్యం తగ్గుతుంది. - ట్రాఫిక్ సమస్యలుండవు. - చోరీకి గురైన ఫాస్టాగ్ ఉన్న వాహనం టోల్ప్లాజా దాటగానే యజమాని ఫోన్కు మెస్సేజ్ వస్తుంది. స్టేట్ హైవే టోల్ప్లాజాల్లోనూ... జాతీయ రహదారులతోపాటు రాష్ట్ర రహదారులపై ఉన్న టోల్ప్లాజాల్లోనూ ఫాస్టాగ్ అమలు చేయాలని ఎన్హెచ్ఏఐ ఆదేశాలిచ్చింది. నార్కట్పల్లి–అద్దంకి రహదారిలో తుమ్మలచెరువు వద్ద, సంతమాగులూరు సమీపం లోని ఏల్చూరు, రాజమండ్రి బ్రిడ్జి, పులిగడ్డ వారధి వద్ద ఇలాంటి టోల్గేట్లు ఉన్నాయి. వీటిలో రెండువైపులా ఫాస్టాగ్ డెడికేటెడ్ లైన్లు ఏర్పాటు చేయనున్నారు. టోల్గేట్లలో ఆర్ఎఫ్ఐడీ యంత్రాల వ్యయంలో 50 శాతాన్ని ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ భరించనుంది. ఫాస్టాగ్ అంటే..? బ్యాంకు ఖాతాతో అనుసంధానం కలిగి ఉండే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీతో కూడిన స్టిక్కర్ను ఫాస్టాగ్ అంటారు. ఫాస్టాగ్ స్టిక్కర్ మీదున్న బార్కోడ్ను టోల్ప్లాజాలోని ఆర్ఎఫ్ఐడీ యంత్రం గుర్తించి రీడ్ చేస్తుంది. వాహనం టోల్ప్లాజాను దాటుతుండగా టోల్ రుసుమును రీఛార్జి మొత్తం నుంచి మినహాయించుకుంటుంది. ఈ వివరాలు వెంటనే వాహనదారుడి ఫోన్కు ఎస్ఎంఎస్ ద్వారా అందుతాయి. ఏపీలో ఫాస్టాగ్ ద్వారా ప్రస్తుతం 20 నుంచి 25 శాతం వాహనాలు ప్రయాణిస్తున్నట్లు అంచనా. సిబ్బంది కుదింపు?: టోల్ప్లాజాల్లో ఫాస్టాగ్ అమలుతో భవిష్యత్తులో సిబ్బంది కుదింపు చర్యలు చేపట్టనున్నట్లు కొంతమంది టోల్ నిర్వాహకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో అన్ని టోల్ప్లాజాల్లో సగటున 105 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేలా ఎన్హెచ్ఏఐ చర్యలు చేపట్టాలని సిబ్బంది కోరుతున్నారు. సరుకు రవాణా సమయం ఆదా టోల్ప్లాజాల్లో ట్రాఫిక్ సమస్యతో సమయం, ఇంధనం వృథా అవుతోంది. పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలతో ఇప్పటికే రవాణా రంగం కుదేలైంది. ఫాస్టాగ్ అమలుతో కొన్ని సమస్యలు తీరినట్లే. – ఈశ్వరరావు, లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఫాస్టాగ్కు కేంద్రం సాయం స్టేట్ హైవేస్లోని టోల్ప్లాజాల్లో ఫాస్టాగ్ అమలుకు రూ.20 లక్షల చొప్పున ఖర్చవుతుంది. ఈ భారం భరించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. – మనోహర్రెడ్డి, రోడ్ డెవలప్మెంట్కార్పొరేషన్ ఎండీ -
టోల్గేట్..ఇక నో లేట్!
కేంద్రం ఎప్పట్నుంచో ప్రకటిస్తూ వస్తున్నట్టుగా డిసెంబర్ 1 నుంచి ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ విధానం అమల్లోకి రాబోతోంది. డిసెంబర్ నుంచి దీన్ని కచ్చితంగా అమలు చేస్తామని ఇప్పటికే పలుమార్లు కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. అనుకున్నట్టుగానే గత పక్షం రోజులుగా ఆ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. అది సాఫీగా సాగుతుండటంతో దేశవ్యాప్తంగా అనుకున్న సమయానికి ప్రారంభించబోతున్నారు. అయితే, మ్యానువల్ పద్ధతి కూడా కొంతకాలం కొనసాగనుంది. టోకెన్ కావాలనుకునేవారు టోల్ ప్లాజాల్లో డబ్బులు చెల్లించి తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ జాప్యమవుతుండటంతో ‘ఫాస్టాగ్’ వైపు.. పండుగలు, పార్టీల సమావేశాలు ఇతర ముఖ్య సమయాల్లో టోల్గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ మేరకు ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ విధానానికి రూపకల్పన చేశారు. దీనికి సంబంధించి వాహనాలకు నిర్ధారిత రుసుము చెల్లిస్తే ఫాస్టాగ్ పేరుతో స్టిక్కర్ రూపంలో ఉండే ప్రత్యేక ట్యాగ్ను ఇస్తారు. దాన్ని కారు అద్దానికి అతికించుకోవాలి. టోల్ గేట్ వద్దకు రాగానే, అక్కడి సెన్సార్లు ఆటోమేటిక్గా ఆ ట్యాగ్ నుంచి నిర్ధారిత రుసుమును మినహాయించుకుంటాయి. దీంతో ఆటోమేటిక్గా గేట్ తెరుచుకుని వాహనం ముందుకు వెళ్లేందుకు వీలు కలుగుతుంది. ఈ వ్యవస్థను దేశవ్యాప్తంగా ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో జాతీయ రహదారులపై అమలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తిగా సిద్ధంగా ఉన్నందున ఈ విధానాన్ని ముందు అనుకున్న సమయానికే అమలు చేయబోతున్నామని మూడ్రోజుల క్రితం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. బ్యాంకులతో పాటు పేటీఎంలో కూడా... ఫాస్టాగ్లను జాతీయ బ్యాంకులతోపాటు యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులతో పాటు పేటీఎం, అమెజాన్లలో అందుబాటులో ఉంచుతున్నారు. ఆయా వాహనాల కేటగిరీల ఆధారంగా వీటికి నిర్ధారిత రుసుములున్నాయి. కనిష్టంగా రూ. 100 నుంచి అవి ప్రారంభమవుతాయి. ట్యాగ్లో రుసుము అయిపోగానే మళ్లీ రీచార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. వాహన ఆర్సీ, ఫొటోతోపాటు ఆధార్/పాన్కార్డు/ఓటర్ ఐడీ కార్డు జిరాక్స్ ప్రతులను దాఖలు చేసి ట్యాగ్ పొందాల్సి ఉంటుంది. అవగాహన వచ్చేవరకు పాత పద్ధతి కూడా.. కేంద్రం తెచ్చిన కొత్త విధా నాన్ని అమలు చేయబోతున్నా మని ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ తెలిపారు. మన రాష్ట్రంలో జాతీయ రహదారులపై ఉన్న 17 టోల్ప్లాజాల్లో దీన్ని అమలు చేయనున్నట్టు ఆయన వెల్లడిం చారు. డిసెంబర్ 1 నుంచి ఈ విధానం మొదలైనా, ప్రస్తుతం కొనసాగుతున్న రుసుము చెల్లింపు విధానం కూడా అమలులో ఉండనుంది. మ్యానువల్గా టోల్ వసూలు చేసే ప్రస్తుత పద్ధతికి కొన్ని వరసలు కేటాయించనున్నారు. ఫాస్టాగ్పై వాహనదారుల్లో అవగాహన వచ్చేవరకు వీటిని కొనసాగించనున్నారు. వీలైనంత తొందరలో వారిని కొత్తపద్ధతి వైపు మళ్లించనున్నారు. కొత్త విధానం అమల్లోకి వచ్చాక టోల్ రుసుమును అప్పటికప్పుడు చెల్లించేవారు ప్రస్తుతమున్న మొత్తం కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. స్టేట్ రోడ్లపై గందరగోళం రాష్ట్రంలో జాతీయ రహదారులపై ఉన్న 17 టోల్ప్లాజాలు కాకుండా రాష్ట్ర రహదారులపై నాలుగున్నాయి. హైదరాబాద్–రామగుండం రాజీవ్ రహదారిపై దుద్దెడ, కొత్తపల్లి, రామగుండంల వద్ద ఒక్కోటి 6 లేన్లు చొప్పున మొత్తం 18 టోల్ వసూలు వరసలున్నాయి. ఇవి కాకుండా అద్దంకి–నార్కట్పల్లి రహదారిపై తిప్పర్తి వద్ద 6 లేన్ల టోల్ప్లాజా ఉంది. వెరసి 24 లేన్ల టోల్ గేట్లలో ఈ పద్ధతి అమలుచేయటం గందరగోళంగా మారింది. దేశవ్యాప్తంగా అన్ని టోల్ బూత్లలో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ విధానం ప్రారంభించాల్సి ఉన్నా, అందుకయ్యే వ్యయాన్ని ఎవరు భరించాల నే విషయంలో స్పష్టత రాక దాన్ని ఏర్పాటు చేయలేదు. ఈ టోల్ బూత్లలో ఒక్క లేన్కు మాత్రమే ఫాస్టాగ్ విధానాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికయ్యే వ్యయంలో 50 శాతాన్ని భరించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. కానీ మిగతా సగం, మిగిలిన లేన్లలో మొత్తం వ్యయాన్ని ఎవరు భరించాలన్నది గందరగోళంగా మారింది. రాష్ట్రప్రభుత్వం భరించాలా, కాంట్రాక్టర్ భరించాలా అన్న విషయంలో స్పష్టత రాలేదు. ఇప్పటివరకు కాంట్రాక్టర్లతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో డిసెంబర్1 నుంచి రాష్ట్రప్రభుత్వం అధీనంలోని పీపీపీ రోడ్లపై ఉన్న టోల్గేట్ల వద్ద కొత్త విధానం అమలుపై స్పష్టత లేదు. ‘స్టేట్ రోడ్స్లోని టోల్ వసూలు కేంద్రాల వద్ద అయోమయం ఉంది. కొత్త విధానం డిసెంబర్ నుంచి అమలు చేయటం అనుమానంగానే ఉంది’అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. -
రోడ్లు రయ్..రయ్
-
రహదారులకు మహర్దశ
ప్రభుత్వంలో జరిగే ప్రతి పనికీ రివర్స్ టెండర్లు పిలుస్తున్నాం. రివర్స్ టెండర్లు పిలిచిన ప్రతిసారి తక్కువకు టెండర్లు ఖరారవుతున్నాయి. రోడ్ల నిర్మాణంలో కూడా అదే పద్ధతి పాటించండి. అంచనాల్లో వాస్తవికతతో వ్యవహరించాలి. సింగిల్ లేన్ రోడ్లు అనే విధానాన్ని విడిచిపెడితే మంచిది. ఏ రోడ్డయినా రెండు లేన్లుగా విస్తరిస్తేనే బాగుంటుంది. – అధికారులతో సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) అందించే రుణ సాయంతో రాష్ట్రంలో రహదారుల రూపు రేఖలు మార్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఎన్డీబీ అందిస్తున్న రుణ సాయం రూ.6,400 కోట్ల నుంచి రూ.8,800 కోట్లకు పెంచేలా కోరాలని నిర్ణయించామన్నారు. సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో రహదారులు, భవనాల శాఖపై సమీక్ష నిర్వహించారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ఇస్తున్న రూ.6,400 కోట్లతో సుమారు 3,100 కిలోమీటర్లకు పైగా ఉన్న రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు అవసరమైన చోట కొత్త బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టులో జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకున్న రోడ్లకు ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలని, ఒకవేళ ఇప్పుడున్న రోడ్లు బాగుంటే.. మండల కేంద్రం నుంచి మరో మండల కేంద్రానికి వెళ్లే రోడ్లపై దృష్టి పెట్టాలన్నారు. అవసానదశలో ఉన్న 676 బ్రిడ్జిలను ఎన్డీబీ ప్రాజెక్టులో పెట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే గుర్తించి, రూ.625 కోట్లతో సత్వర మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. త్వరితగతిన భూసేకరణ అనంతపురం – అమరావతి ఎక్స్ప్రెస్ వేను చిలకలూరిపేట బైపాస్కు అనుసంధానం చేసే ప్రతిపాదనకు సీఎం వైఎస్ జగన్ అంగీకారం తెలిపారు. ఈ ఎక్స్ప్రెస్ వే భూసేకరణపై ప్రధానంగా దృష్టి పెట్టి పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని ఆదేశించారు. ప్రాథమికంగా నాలుగు లేన్ల రోడ్డు, భవిష్యత్తు కోసం 8 లేన్ల రహదారికి భూ సేకరణ చేస్తున్నామని ఆర్అండ్బీ అధికారులు సీఎంకు వివరించారు. ఎక్స్ప్రెస్ వే లో భాగంగా నిర్మించే టన్నెల్స్ నాలుగు లేన్లా.. లేక ఆరు లేన్లా అన్నది చర్చ జరుగుతుందన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆరు లేన్లకు సరిపడా టన్నెల్స్ ఉండాలని సీఎం సూచించారు. రోడ్ల నిర్మాణంలో ఎం–శాండ్ వినియోగంపై దృష్టి పెట్టాలన్నారు. ఏపీఆర్డీసీ బలోపేతం ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డీసీ) బలోపేతానికి అధికారులు చేసిన ప్రతిపాదనలకు సీఎం సానుకూలంగా స్పందించి చట్టంలో సపరణలకు అంగీకరించారు. కార్పొరేషన్ స్వావలంబనతో నడవడానికి, రోడ్ల నిర్మాణం, నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు ఉండేలా కార్పొరేషన్ ఉండాలని సీఎం సూచించారు. ఆర్టీసీకి సంబంధించిన 12 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన 3,600కు పైగా బస్సులను వెంటనే రీప్లేస్ చేయాలని సూచించారు. అప్పుడే ప్రయాణికుల భద్రతకు సరైన ప్రమాణాలు పాటించినట్లవుతుందన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు ప్రణాళికలు వేసుకుని వాటిని అమలు చేయడానికి కార్పొరేషన్ దృష్టి పెట్టాలన్నారు. రోడ్ల నిర్మాణం, నిర్వహణ కోసం ప్రత్యేక నిధి ఏపీఆర్డీసీ ద్వారా ఏర్పాటు కావాలన్న అధికారుల ప్రతిపాదనకు సీఎం అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలలో అమలవుతున్న విధానాలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమావేశంలో ఆర్అండ్బీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఎన్హెచ్ఏఐ ఆర్వో అనిల్ దీక్షిత్, ఆర్అండ్బీ చీఫ్ ఇంజనీర్లు మనోహర్ రెడ్డి, రాజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేగంగా జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ గుండుగొలను – కలపర్రు– గొల్లపూడి – మంగళగిరి బైపాస్ హైవేపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఎక్కడ సమస్యలు వచ్చినా వెంటనే జోక్యం చేసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. విజయవాడ నగరాన్ని ట్రాఫిక్ సమస్య నుంచి తప్పించేందుకు ఇదొక పరిష్కారం అవుతుందని సీఎం అన్నారు. అనకాపల్లి – ఆనందపురం రోడ్డు కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తవుతోందని ఎన్హెచ్ఏఐ అధికారులు సీఎంకు వివరించారు. ఒంగోలు– కత్తిపూడి జాతీయ రహదారికి సంబంధించి అక్కడక్కడ చిన్న స్థాయిలో పనులు మిగిలిపోయాయని, వాటిని త్వరలో పూర్తి చేస్తామని వారు చెప్పారు. రేణిగుంట నుంచి కడప, రేణిగుంట నుంచి నాయుడుపేట, నెల్లూరు నుంచి తడ వరకు ఆరు లేన్ల రహదారి.. తదితర ప్రాజెక్టుల గురించి వారు సీఎంకు వివరించారు. వైఎస్సార్ జిల్లా ముద్దనూరు నుంచి బెంగళూరు హైవేలోని కొడికొండ చెక్పోస్టు వరకు 150 కిలోమీటర్ల రహదారిని రూ.350 కోట్ల ఎన్డీబీ నిధులతో పది మీటర్ల మేర విస్తరించాలని సీఎం ఆదేశించారు. వశిష్ట గోదావరి పాయమీద సెకినేటిపల్లి వద్ద చిరకాలంగా పెండింగ్లో ఉన్న బ్రిడ్జిని రూ.100 కోట్లతో పూర్తి చేయాలన్నారు. అనంతపురం జిల్లా కదిరి బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని ఈ ఏడాది ప్రణాళికలోనే పెట్టాలని అధికారులకు సూచించారు. రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్ వినియోగం పర్యావరణ పరిరక్షణలో భాగంగా రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్ను వినియోగిస్తున్నామని ఎన్హెచ్ఏఐ అధికారులు సీఎంకు వివరించారు. నగరాలు, పట్టణాల్లో సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఎన్హెచ్ఏఐకు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీనికోసం ఒక విధానాన్ని రూపొందించాలన్నారు. రేషన్ పంపిణీలో భాగంగా బియ్యాన్ని ప్యాక్ చేసేందుకు ఇస్తున్న సంచులను తిరిగి సేకరించి వాటిని పునర్ వినియోగించడం లేదా రోడ్ల నిర్మాణంలో ఉపయోగించేందుకు ఇవ్వాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాల సరఫరాపై ఎంఓయూకు సిద్ధంగా ఉన్నామని ఎన్హెచ్ఏఐ అధికారులు చెప్పారు. -
ఎన్హెచ్ఏఐ పటిష్టంగానే ఉంది
న్యూఢిల్లీ: జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఎటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం లేదని చైర్మన్ ఎన్ఎన్ సిన్హా స్పష్టం చేశారు. చాలా బలమైన స్థితిలోనే ఎన్ఎచ్ఏఐ ఉందని, ప్రణాళికలో ఎన్నో ప్రాజెక్టులు కూడా ఉన్నట్టు తెలిపారు. గతేడాది 3,300 కిలోమీటర్ల మేర రహదారుల ప్రాజెక్టులను చేపట్టగా, ప్రస్తుత ఏడాది 4,500 కిలోమీటర్ల మేర ప్రాజెక్టులను నిర్మించనున్నామని ఆయన చెప్పారు. ‘‘ఎన్హెచ్ఏఐకు అనిశ్చయ నష్టాలు రూ.3 లక్షల కోట్ల మేర ఉంటాయని మీడియాలోని కొన్ని సెక్షన్లలో కథనాలు వచ్చాయి. ‘‘అనిశ్చయ నష్టాలను వారు సరిగా అర్థం చేసుకోకపోవడం లేదా ఆ గణాంకాలను పొరపాటుగా పేర్కొనడం జరిగింది. అనిశ్చయ నష్టాలన్నవి సహజంగానే అస్పష్టతతో ఉంటాయి. మా పరిశీలన, చెల్లింపుల రేషియో ప్రకారం చూస్తే ఆ స్థాయి నష్టాలేమీ ఉండబోవు. ఎన్హెచ్ఏఐ నుంచి క్లెయిమ్ బాధ్యతలన్నవి రూ.70,000 కోట్ల వరకు ఉంటాయి’’ అని సిన్హా వివరించారు. అదే సమయంలో తమకు ఎన్నో రూపాల్లో ఆదాయం ఉందని వివరించారు. అనిశ్చితిని సృష్టించడానికే సంబంధిత కథనాలను సృష్టించినట్టుగా ఉందన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పటికీ గడిచిన ఏడాదితో పోలిస్తే వెయ్యి కిలోమీటర్ల మేర అదనంగా రహదారులను ఈ ఏడాది నిర్మించనున్నట్టు చెప్పారు. బడ్జెట్ నుంచి మరిన్ని నిధులను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్టు తెలిపారు. జాతీయ రహదారుల నుంచి వచ్చే ఆదాయానికి అదనంగా, మార్కెట్ నుంచి నిధులను కూడా సమీకరించనున్నట్టు చెప్పారు. ఈ ఏడాది చివరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)ను తీసుకువస్తామని, కేబినెట్ ఆమోదం కోసం వేచి చూస్తున్నట్టు వెల్లడించారు. -
29న ‘రీజినల్’ డీపీఆర్కు ఆమోదం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీజినల్ రింగ్రోడ్డు (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టుకు సంబంధించిన అలైన్మెంట్లు దాదాపు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం రోడ్లు, భవనాలశాఖ అధికారులు వాటికి తుదిరూపు ఇచ్చే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నెల 29న ఢిల్లీలో జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) అధికారులతో జరిగే సమావేశంలో అలైన్మెంట్ల వివరాలతో కూడిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రాష్ట్ర అధికారులు సమర్పించనున్నారు. ఈ భేటీలోనే డీపీఆర్ను ఎన్హెచ్ఏఐ ఆమోదించి ఆ తర్వాత రెండు, మూడు రోజులకు అధికారికంగా అనుమతుల మంజూరును ప్రకటించనున్నట్లు తెలిసింది. రెండు వారాల్లో స్పష్టత: ఎన్హెచ్ఏఐకి సమర్పించేందుకు అధికారులు దాదాపు నాలుగు అలైన్మెంట్లు సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రాజెక్టులో ఎక్కడా న్యాయపరమైన, సాంకేతికపరమైన చిక్కులు, వివాదాలు తలెత్తకుండా ఉండేలా పకడ్బందీగా వాటిని రూపొందిస్తున్నారు. దాదాపుగా తుది దశకు వచ్చిన డీపీఆర్ పనులకు అధికారులు ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియ కూడా పూర్తయితే ఈ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడినట్లు అవుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు. కేంద్రం అనుమతిపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. రెండు దశల్లో నిర్మించే ఈ ప్రాజెక్టులో సంగారెడ్డి–గజ్వేల్ రోడ్డుకు జాతీయ రహదారిగా గుర్తింపు రాగా షాద్నగర్–చౌటుప్పల్ రోడ్డుకు ఇంకా గుర్తింపు రావాల్సి ఉంది. ఆమోదం పొందగానే భూసేకరణ... డీపీఆర్ విషయంలో ఎన్హెచ్ఏఐ అధికారుల సందేహాలను నివృత్తి చేసేందుకు రాష్ట్ర అధికారులు సమాయత్తమవుతున్నారు. గత సమావేశంలో ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు తెలంగాణకు ఎందుకు అవసరమో విపులంగా వివరించి వారిని ఒప్పించగా ఇప్పుడు కీలకమైన డీపీఆర్ ఆమోదానికి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. అత్యంత కీలకమైన ఈ భేటీలో డీపీఆర్కు ఆమోదం లభించగానే భూసేకరణ పనులు మొదలవుతాయని సమాచారం. మొత్తం 334 కి.మీ.లతో రెండు దశల్లో (సంగారెడ్డి–నర్సాపూర్–తూప్రాన్–గజ్వేల్–జగదేవ్పూర్–భువనరి–చౌటుప్పల్–దాదాపు 154 కి.మీ., చౌటుప్పల్–షాద్నగర్–కంది–దాదాపు 180 కి.మీ.) నిర్మించనున్న ఈ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి రూ. 12,000 కోట్లు ఖర్చు కానుంది. ఈ ప్రాజెక్టు కోసం 11,000 ఎకరాలు అవసరమవుతుందని అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. భూసేకరణకు ఖర్చయ్యే రూ. 3,000 కోట్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు ఆర్ఆర్ఆర్ స్వయంగా ప్రతిపాదించిన సీఎం కేసీఆర్.. ఈ పనుల పురోగతికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. -
తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం
-
వసుంధర రాజెకు సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ భూమిని ఎన్హెచ్ఏఐకి విక్రయించి రూ 1.97 కోట్లు స్వీకరించారనే ఆరోపణలపై రాజస్ధాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజె ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్లకు సుప్రీం కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ ఉదంతంలో వారిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్ధానం నోటీసులు జారీ చేసింది. 2010లో జాతీయ రహదారి విస్తరణ కోసం ప్రభుత్వ భూమిని వారు ఎన్హెచ్ఏఐకి విక్రయించే సమయంలో రూ 1.97 కోట్ల పరిహారం పొందారని ఆరోపణలున్నాయి. భూమిని విక్రయించే సమయంలో వసుంధరా రాజె అధికారంలో లేరు. ఆ సమయంలో విపక్ష నేతగా ఉన్న వసుంధర రాజె, ఆమె కుమారుడు కలిసి ధోల్పూర్లోని ధోల్పూర్ ప్యాలెస్ వద్ద 567 చదరపు మీటర్ల భూమిని అక్రమంగా సొంతం చేసకుని దాన్ని ఎన్హెచ్ఏఐకి విక్రయించడంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని పిటిషన్ ఆరోపించింది. ఈ పిటిషన్పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని బెంచ్ రాజె, ఆమె కుమారుడి నుంచి వివరణ కోరింది. తన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చడాన్ని సవాల్ చేస్తూ రాజస్ధాన్కు చెందిన న్యాయవాది సృజన శ్రేష్ట సుప్రీం కోర్టులో అప్పీల్ చేశారు. -
భూసేకరణ వేగవంతం చేయాలి: తుమ్మల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు కీలకమైన రహదారులకు భూసేకరణ వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. బుధవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం ఎన్హెచ్, ఎన్హెచ్ఏఐ పరిధిలో చేపట్టే పలు రహదారుల పనులపై సమీక్షించారు. వాటి నిర్మాణాలకు కావాల్సిన భూసేకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎన్హెచ్, ఎన్హెచ్ఏఐ అధికారులు పాల్గొన్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అన్నిశాఖలు పనులు వేగిరపరుస్తున్న నేపథ్యంలో ఆర్ అండ్ బీ శాఖ కూడా పనుల స్పీడు పెంచింది. -
'టోల్గేట్ల వద్ద ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయండి'
సాక్షి, చెన్నై: దేశవ్యాప్తంగా ఉన్న టోల్గేట్ల వద్ద సిట్టింగ్ జడ్జిలు, వీఐపీలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ)ను ఆదేశించింది. ఈ సదుపాయం తీసుకొచ్చేందుకు తగిన చర్యలు ప్రారంభించాలని తెలిపింది. 'వీఐపీలు, సిట్టింగ్ జడ్జిల వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆపడం బాధాకరం. న్యాయమూర్తులు కూడా టోల్గేట్ల వద్ద దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల పాటు వేచి ఉండాల్సి రావడం దురదృష్టకరం' అని న్యాయస్థానం పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్ హులువడి జి రమేష్, జస్టిస్ ఎంవీ మురళిధరన్తో కూడిన ధర్మాసనం జడ్జిలు, వీఐపీలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని ఎన్హెచ్ఏఐను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని టోల్ప్లాజాలకు దీని గురించి తెలియజేస్తూ గమనిక పంపించాలని ఎన్హెచ్ఏఐకు తెలిపింది. వీఐపీలు, సిట్టింగ్ జడ్జిల వాహనాలు ఎలాంటి అడ్డంకులూ లేకుండా వెళ్లగలిగేలా ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని తెలిపింది. కోర్టు ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, షోకాజ్ నోటీసులు అందుకోవాల్సి వస్తుందని ఎన్హెచ్ఏఐను హెచ్చరించింది. టోల్ ప్లాజాలకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను నాలుగు వారాల తర్వాతకు వాయిదా వేసింది. -
ఇంధనానికి తగ్గ రంగు స్టిక్కర్లు
న్యూఢిల్లీ: దేశరాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లో నడిచే వాహనాలకు అధికారులు ఇకపై ఇంధనాన్ని బట్టి స్టిక్కర్లు ఏర్పాటు చేయనున్నారు. హోలోగ్రామ్ స్టిక్కర్ రంగును బట్టి ఆ వాహనం పెట్రోల్, సీఎన్జీ, డీజిల్, విద్యుత్లలో దేంతో నడుస్తోందో కనిపెట్టేయవచ్చు. కేంద్ర రోడ్డు రవాణా జాతీయరహదారుల మంత్రిత్వ శాఖ చేసిన ఈ ప్రతిపాదనను సుప్రీంకోర్టు ఆమోదించింది. ఎన్సీఆర్లో శీతాకాలంలో కాలుష్యం బెడదను తగ్గించేందుకు తీసుకునే చర్యలపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. తాజా ప్రతిపాదనల ప్రకారం పెట్రోల్, సీఎన్జీ వాహనాలకు లేత నీలిరంగు, డీజిల్తో నడిచే వాహనాలకు ఆరెంజ్ కలర్ హోలోగ్రామ్ స్టిక్కర్లుంటాయి. దీంతోపాటు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలకు గ్రీన్ నంబర్ ప్లేట్లను లేదా గ్రీన్ హోలోగ్రామ్ స్టిక్కర్లను వాడేలా చూడాలని సూచించింది. -
ప్రధాని కోసం ఆలస్యం చేస్తారా..?: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ఢిల్లీపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించడానికి నిర్మించిన ఈస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వేను మే 31లోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎక్స్ప్రెస్ వేను ఏప్రిల్ 20 నాటికి ప్రారంభిస్తామని చెప్పినా ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడంపై ఎన్హెచ్ఏఐను ప్రశ్నించింది. ఏప్రిల్ 29న ప్రధానితో రహదారిని ప్రారంభించాలనుకున్నా ఆయన బిజీ షెడ్యూల్ వల్ల కుదరలేదని ఎన్హెచ్ఏఐ వివరించగా.. ‘ప్రధాని సమయం కోసం ఎందుకు ఆలస్యం చేస్తున్నారు. మీరే ఎందుకు ప్రారంభించకూడదు’ అని ప్రశ్నించింది. మే 31లోపు ప్రారంభించకపోతే, ఇక ప్రారంభించినట్లేనని జస్టిస్ మదన్ లోకుర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం పేర్కొంది. 135 కిలోమీటర్ల ఈ అత్యాధునిక ఎక్స్ప్రెస్ వే ద్వారా ఘజియాబాద్, ఫరీదాబాద్, గౌతమ్ బుద్ధ నగర్ (గ్రేటర్ నోయిడా) పల్వాల్లకు సిగ్నల్ రహిత కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. ఢిల్లీ మీదుగా వెళ్లే ట్రాఫిక్ను మళ్లించేందుకు రాజధాని వెలుపల రింగ్ రోడ్ నిర్మించాలని సర్వోన్నత న్యాయస్థానం 2006లో ఆదేశించగా ఈస్ట్రన్, వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ వేలు నిర్మించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. -
హైవేపై బాదుడే..
సాక్షి, న్యూఢిల్లీ : టోల్ రేట్లను జాతీయ హైవేల అథారిటీ (ఎన్హెచ్ఏఐ) ఏడు శాతం మేర సవరించడంతో దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై రాకపోకలు ఆదివారం నుంచి పెనుభారం కానున్నాయి. టోల్ రేట్ల ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై కూడా పడే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలకు అనుగుణంగా పలు వస్తువుల ధరల్లో ఆదివారం నుంచి మార్పులు చోటుచేసుకోనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న సమర్పించిన బడ్జెట్లో పలు పన్నులు, లెవీల్లో మార్పులకు అనుగుణంగా ఆయా వస్తువులు, ధరలు ప్రభావితమవుతాయి. మరోవైపు రూ లక్షకు మించిన షేర్ల అమ్మకాలపై దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్నును కేంద్రం తిరిగి ప్రవేశపెట్టింది. భారమవనున్న వస్తువులను చూస్తే..దిగుమతి చేసుకునే మొబైల్ హ్యాండ్సెట్లు, పెర్ఫ్యూమ్లు, సౌందర్య సాధనాలు, వాచీలు, కళ్లజోళ్లు, జెమ్స్టోన్స్, డైమండ్స్, చెప్పులు, సిల్క్ వస్ర్తాలు, జ్యూస్లు, ఆలివ్ ఆయిల్, వేరుశనగ నూనె, దిగుమతయ్యే బంగారు ఆభరణాల ధరలకు రెక్కలురానున్నాయి. . ఇక ముడి జీడిపప్పు, సోలార్ సెల్స్, ప్యానెల్స్, మాడ్యూల్స్, ఇతర ముడిపదార్థాల ధరలు కొంతమేర దిగిరానున్నాయి. -
టోల్ ధరలు పెంచిన ఎన్హెచ్ఏఐ
-
మా చట్టమే అనుసరించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ రెండు చట్టాల ప్రకారం జరగబోతోంది. జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్) రోడ్లకు రాష్ట్ర భూసేకరణ చట్టం.. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) రోడ్ల నిర్మాణంలో కేంద్ర భూ సేకరణ చట్టం ప్రకారం భూమిని సేకరించనున్నారు. రాష్ట్ర చట్టం ప్రకారం భూ సేకరణకు ఎక్కువ పరిహారం ఇవ్వాల్సి ఉండటంతో కేంద్ర చట్టాన్నే అనుసరించాలని కేంద్రం తాజాగా ఆదేశించింది. ఎన్హెచ్ఏఐ చేపడుతున్న రోడ్లకు భారీగా భూములు సేకరించాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఎన్హెచ్ రోడ్లకు రాష్ట్ర చట్టం ప్రకారమే భూమిని సేకరించనున్నారు. 3,500 హెక్టార్లు అవసరం.. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చట్టా న్ని గతేడాది సవరించింది. దీంతో సంప్రదింపులతో పరిహారం పెంచుకునేందుకు భూముల యజమానులకు అవకాశం కలిగింది. సాగు ప్రాజెక్టులకు వర్తింపజేస్తున్న ఈ చట్టాన్నే జాతీయ రహదారులకూ అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల కేంద్రం రూ.8 వేలకోట్ల వ్యయంతో కొత్త జాతీయ రహదారులను మంజూరు చేసింది. వీటిని ఎన్హెచ్ఏఐ ద్వారా చేపడుతున్నారు. ఎన్హెచ్ఏఐ రోడ్ల విషయంలో అవసరమైన చోట్ల రోడ్ల ను 6 లేన్లకు విస్తరించాల్సి ఉండటంతో సేకరణ ఎక్కువగా ఉంటోంది. ఎన్హెచ్ రోడ్లకు 200 హెక్టార్ల సేకరణ సరిపోనుండగా ఎన్హెచ్ఏఐకి 3,500 హె క్టార్లు కావాల్సి వస్తోంది. రాష్ట్ర చట్టం ప్రకారం సేకరిస్తే రిజిస్ట్రేషన్ ధరకు మూడున్నర రెట్లు చెల్లించటంతోపాటు మరింత పెంచుకునే వెసులుబాటు ఉంది. దీంతో ఎన్హెచ్ఏఐ రోడ్లకు కేంద్ర చట్టాన్నే అనుసరించాలని కేంద్రం ఆదేశించింది. మరోవైపు కొన్ని రోడ్లకు ఏది వీలుంటే అది అన్నట్లు రెండు చట్టాలు అనుసరిస్తుండటంతో కొందరు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఏదో ఒక చట్టాన్ని అనుసరించాలని కోర్టు పేర్కొంది. వె రసి ఎన్హెచ్ రోడ్లకు రాష్ట్ర చట్టం, ఎన్హెచ్ఏఐ రోడ్లకు కేంద్ర చట్టం అనుసరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
రాష్ట్రంలో హైవేల అభివృద్ధికి రూ. 4,494 కోట్లు
న్యూఢిల్లీ: రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) రూ.4,494 కో ట్లు కేటాయించింది. భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా మొత్తం 188.51 కిలోమీటర్ల మేర 4 జాతీయ రహదారుల అభివృద్ధి కోసం ఈ నిధులు కేటాయించింది. ఈ మేరకు ఎన్హెచ్ఏఐ ఉత్తర్వులు జారీచేసినట్లు బుధవారం కేంద్ర రోడ్డు రవాణా శాఖ వెల్లడించింది. 161వ జాతీయ రహదారిలో కంది నుంచి రామసానిపల్లె వరకు 40 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల రోడ్డు అభివృద్ధి కోసం రూ.1201.62 కోట్లు, రామసానిపల్లె నుంచి మంగ్లూ ర్ గ్రామం వరకు 46.6 కిలోమీటర్ల మేర 4 లైన్ల రోడ్డు కోసం మరో రూ.1,220 కోట్లు మంజూరు చేసింది. మంగ్లూర్ గ్రామం నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు 49 కి.మీ. మేర 4 లైన్ల రోడ్డు కోసం రూ.1,082 కోట్లు, రేపల్లె్లవాడ నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు 52.6 కి.మీ. 4 లైన్ల రోడ్డు కోసం రూ.988 కోట్లు కేటాయించినట్లు ఆ శాఖ వెల్లడించింది. -
కంటి చూపే కబళిస్తోంది!
గతేడాది అక్టోబరులో గుంటూరు జిల్లాలో ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో ఓ ఇంజనీరింగ్ కళాశాల బస్సు డ్రైవర్ వీరారెడ్డి (63) తనకు ముందుగా వెళుతున్న ఓ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. బైకుపై వెళ్తున్న శ్రీనివాసరెడ్డి, శ్రీరంగమ్మలు అక్కడికక్కడే మృతి చెందగా, ఆ సంఘటనతో గుండెపోటు వచ్చి.. డ్రైవరు వీరారెడ్డి బస్సులోనే కుప్పకూలిపోయి మరణించాడు. అయితే వీరారెడ్డి కంటి చూపు సమస్యలతో బాధపడటం వల్ల రెండు నిండు ప్రాణాలతోపాటు తాను కూడా మృత్యువాత పడ్డాడు. ఇటీవలే భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఆధ్వర్యంలో కాజ టోల్గేట్ వద్ద రవాణా డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షల వైద్య శిబిరం నిర్వహించగా, వంద మంది పరీక్షల్లో ఐదుగురికి కలర్ బ్లైండ్నెస్ తేలింది. శంకర కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో గుంటూరు రవాణా శాఖ కార్యాలయంలో అన్ని విద్యా సంస్థల బస్సుల డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహిస్తే, నలుగురికి కలర్ బ్లైండ్నెస్తో బాధపడుతున్నట్లు గుర్తించారు. యాభై మంది పరీక్షలకు హాజరైతే పది మందికి పైగా దృష్టి సమస్యలున్నట్లు తేల్చారు. సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఏటా వేలాదిమంది రోడ్డుప్రమాదాల్లో మరణిస్తున్నారు. అతివేగం ప్రమాదానికి కారణమనే విషయం మాత్రమే అధికారులు చెబుతున్నారు. కానీ.. మరెన్నో రోడ్డు ప్రమాదాలకు కారణం డ్రైవర్ చూపు సరిగ్గా లేకపోవడమేనని గణాంకాలు చెబుతున్నాయి. ఏపీలో 35 శాతం డ్రైవర్లకు సమస్య.. ఆంధ్రప్రదేశ్లోని 65 లక్షల మంది డ్రైవర్లలో 35 శాతం మంది కంటి చూపు సమస్యలతో బాధపడుతున్నారు. అంటే 22.75 లక్షల మంది డ్రైవర్లకు కంటి చూపు సమస్యలున్నాయి. కంటి చూపు సమస్యల కారణంగా 12 శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్ సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ నివేదిక స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో ఏటా కలర్ బ్లైండ్నెస్ పెరుగుతుందన్న నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. సర్వేలు చెబుతున్నా పట్టించుకోరా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలపై ప్రభుత్వ సంస్థలతోపాటు పలు ప్రైవేటు ఏజెన్సీలు విశ్లేషణలతో కూడిన సర్వేలు నిర్వహిస్తున్నాయి. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత రవాణా, పోలీస్ శాఖలు కేసు నమోదు చేసి డ్రైవరు మద్యం తాగి ఉన్నాడా? లేదా? అన్న పరీక్షలు చేయడం మినహా డ్రైవరు ఫిట్నెస్, కంటి సమస్యలపై పరీక్షలు చేయించడం లేదు. డ్రైవింగ్ లైసెన్సు జారీ, రెన్యువల్ సమయాల్లో రవాణా శాఖ అధికారులు కంటి సామర్థ్య పరీక్షలు నిర్వహించడం లేదు. ప్రాథమికంగా కంటి పరీక్షలు చేసే పరికరాలైనా రవాణాశాఖకు సమకూర్చడం లేదు. 40 ఏళ్లు దాటిన వారికి లైసెన్సు ఇవ్వాలంటే, ఆరోగ్య ధ్రువపత్రం సమర్పించాలని రవాణా అధికారులు కోరుతున్నారే.. తప్ప కంటి చూపు సమస్యలపై దృష్టి సారించకపోవడం గమనార్హం. ప్రమాదాలకు కారణాలు.. ఓవర్ స్పీడ్ – 40 శాతం డ్రంకన్ డ్రైవ్ – 20 శాతం కంటి చూపు సమస్యలు – 12 శాతం రెస్ట్ లేకుండా డ్రైవింగ్ – 18 శాతం సాంకేతిక కారణాలు – 5 శాతం నిర్లక్ష్య డ్రైవింగ్ – 5 శాతం -
నన్ను పీఏగా రమ్మంటావా..!
ఎన్హెచ్ఏఐ ఎస్ఈపై అశోక్ గజపతిరాజు ఆగ్రహం సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘నన్ను పీఏగా రమ్మంటావా..’ అంటూ జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏఐ) ఎస్ఈపై కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే వంతెనకు అప్రోచ్ రోడ్డు నిర్మాణం విషయమై ప్రతిపాదనలు అందలేదని ఎస్ఈ ఇచ్చిన సమాధానంతో అశోక్ గజపతిరాజు ఈ విధంగా తన అసహనం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలో చేపట్టిన పలు ప్రాజెక్టులపై అశోక్ గజపతిరాజు సోమవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. దీనికి మంత్రి సుజయకృష్ణ రంగారావు, కలెక్టర్ వివేక్యాదవ్తో పాటు పలువురు జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ.. రైల్వే శాఖ పట్టణంలో నిర్మిస్తున్న వంతెనకు అప్రోచ్ రోడ్డు ఏర్పాటు విషయంలో జాప్యం ఎందుకు జరుగుతోందని అధికారులను నిలదీశారు. దీంతో ఎన్హెచ్ఏఐ ఎస్ఈ మనోహర్రెడ్డి లేచి.. తమకసలు ప్రతిపాదనలే అందలేదని బదులిచ్చారు. రైల్వే అధికారులు కల్పించుకుని ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. రైల్వే శాఖ ప్రతిపాదనలు పంపించామంటుంటే.. మీరు రాలేదంటున్నారేంటని అశోక్ గజపతిరాజు ఎస్ఈని నిలదీశారు. ఇంతవరకూ అవి తమకు అందలేదని ఎస్ఈ మళ్లీ స్పష్టం చేశారు. లోపం ఎక్కడుందో తెలుసుకోవాలి కదా అని అశోక్ అనడంతో.. అది మీరే తెలుసుకోవాలని ఎస్ఈ బదులిచ్చారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన కేంద్ర మంత్రి.. ‘మీ పనులు చూసేందుకు నన్ను మీ పీఏగా రమ్మంటారా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
హైదరాబాద్ - అమరావతి మధ్య ఎక్స్ప్రెస్ వే
- రూ.7,500 కోట్లతో ఆరు వరుసలుగా నిర్మాణం - ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో నిర్మాణం - కేంద్రానికి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్– ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ ఆరు వరుసల ఎక్స్ప్రెస్వే రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే రెండు నగరాల మధ్య రైలుమార్గం అనుసంధానం కోసం కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిన నేపథ్యంలో, ఇప్పుడు రహదారి విషయంలో కూడా కదలిక వస్తోంది. వాస్తవానికి ఇప్పటికే ఈ పనులు మొదలు కావాల్సి ఉంది. రాష్ట్ర విభజన సమయంలో స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఈ హామీ ఇచ్చింది. దాన్ని విభజన చట్టంలోనూ పొందుపరిచింది. కానీ రాష్ట్రం విడిపోయి మూడేళ్లు గడుస్తున్నా ఇందులో కదలిక లేకపోవటంతో దాన్ని ప్రారంభించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి ప్రారంభించింది. రహదారుల విషయంలో వెనుకబాటుకు గురైన తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రహదారులు కోరుతూ ప్రతిపాదనలు సమర్పించినప్పుడల్లా కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలో వెంటనే ఎక్స్ప్రెస్వే నిర్మాణం చేపట్టాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారికంగా లేఖ రాయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి కూడా తెచ్చారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ రోడ్డు నిర్మాణం కోసం ఆసక్తి చూపుతున్నందున రెండు ప్రభుత్వాల నుంచి ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. రోడ్లు భవనాల శాఖ బడ్జెట్ ప్రతిపాదనల కోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం తమ శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఇందులో ప్రధానంగా ఈ ఎక్స్ప్రెస్వే నిర్మాణంపై చర్చ సాగింది. ‘ముఖ్యమంత్రితో చర్చించి ఈ రోడ్డు నిర్మాణంపై కేంద్రానికి లేఖ పంపబోతున్నాం. రాష్ట్ర అభివృద్ధి కోణంలో కూడా ఈ రోడ్డుకు ప్రాధాన్యం ఉంది. ఇది పెట్టుబడులను ఆకట్టుకునేందుకు దోహదం చేస్తుంది. వీలైనంత తొందరలోనే దీన్ని ప్రారంభించాలని కేంద్రంపై ఒత్తిడి తేనున్నాం.’అని సమావేశానంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సాక్షితో చెప్పారు. 250 కిలోమీటర్లు.. రూ.7,500 కోట్లు హైదరాబాద్ నుంచి నేరుగా అమరావతికి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం అవుతుంది. దాదాపు 250 కిలోమీటర్ల మేర సాగే ఈ ఆరు వరుసల రహదారి నిర్మాణానికి దాదాపు రూ.7,500 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనా, దీన్ని జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం లేఖ పంపితే వచ్చే నెలలోనే దీనిపై సర్వే ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్– మాల్– మల్లెపల్లి– నాగార్జునసాగర్– మాచర్ల– పిడుగురాళ్ల మీదుగా అమరావతికి దీనిని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు... రాష్ట్ర విభజనకు పూర్వం ఏపీ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నట్టుగానే ఇప్పుడు తెలంగాణకు ప్రత్యేకంగా రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచే కేటాయించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా రుణం తీసుకోవాలని నిర్ణయించారు. కాగా కొత్త జిల్లా కేంద్రాల నుంచి అన్ని మండల కేంద్రాలకు రెండు వరుసల రోడ్లను నిర్మించాలని నిర్ణయించారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి రూ.970 కోట్లు, నాబార్డ్, గ్రామీణ రహదారుల నిధికి రూ.575 కోట్లు, కలెక్టరేట్లు సహా ఇతర భవనాల నిర్మాణం కోసం రూ.1116 కోట్లు, రహదారుల నిర్వహణ వ్యవస్థ, కోర్ రోడ్డు నెట్వర్క్ కోసం రూ.260 కోట్లు, భవనాల నిర్వహణకు రూ.40 కోట్లు ప్రతిపాదించారు. వచ్చే సంవత్సరంలో 4 వేల కి.మీ. నిడివితో కొత్త రోడ్లను నిర్మించాలని, 40 వంతెనలు సిద్ధం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. -
టోల్ ప్లాజాల్లో మొబిక్విక్ ద్వారా చెల్లింపులు
ఎన్హెచ్ఏఐతో సంస్థ ఒప్పందం న్యూఢిల్లీ: మొబైల్ వ్యాలెట్ సంస్థ మొబిక్విక్ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)తో ఒప్పందం చేసుకుంది. దేశవ్యాప్తంగా 391 టోల్ ప్లాజాల వద్ద తమ కస్టమర్లు మొబిక్విక్ వ్యాలెట్ ద్వారా టోల్ రుసుములు చెల్లించవచ్చని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అతి త్వరలోనే ఈ సేవలు ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. నగదుకు కొరత నేపథ్యంలో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నిలిచిపోకుండా ఉండేందుకు తమ కస్టమర్లు మొబైల్ వ్యాలెట్ ద్వారా చెల్లింపులు చేసేందుకు ఎన్హెచ్ఏఐ నుంచి అనుమతి లభించినట్టు సంస్థ తెలిపింది. ‘‘టోల్ ప్లాజాల వద్ద మొబిక్విక్ ద్వారా రుసుము చెల్లించాలనుకునే వారు తమ ఫోన్లోని యాప్ను ఓపెన్ చేసి ప్లాజాలోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి. టోల్ ఆపరేటర్ చెప్పిన నగదును, వాహన నంబర్ను ఎంటర్ చేసి ‘పే’ బటన్ను ప్రెస్ చేస్తే లావాదేవీ పూర్తవుతుంది’’ అని సంస్థ తెలియజేసింది. మరోవైపు, వాహనాల రద్దీ నేపథ్యంలో డిసెంబర్ 2 వరకు టోల్ రుసుములు రద్దు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే. -
హైవేల వెంట పచ్చదనం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) నేషనల్ గ్రీన్ హైవేస్ మిషన్లో భాగంగా పర్యావరణ అనుకూల జాతీయ రహదారులను నిర్మించేందుకు నడుం బిగించింది. హైవేలకు ఇరువైపుల పెద్ద ఎత్తున చెట్లను పెంచుతారు. ఈ క్రమంలో ఎన్హెచ్ఏఐతో ఐటీసీ గురువారం న్యూఢిల్లీలో చేతులు కలిపింది. ఐటీసీకి చెందిన పేపర్బోర్డ్స్, స్పెషాలిటీ పేపర్స్ విభాగం ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తుంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా రెండు ప్రాంతాలను ఏపీలో గుర్తించారు. కర్నూలు నుంచి కడప మధ్య ఎన్హెచ్-40లో 114 కిలోమీటర్ల మేర 100 హెక్టార్లలో పేపర్ తయారీకి అవసరమైన చెట్లను పెంచుతారు. అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు రహదారిలో ఎన్హెచ్-44పై 149 కిలోమీటర్లలో 100 హెక్టార్లలో ఈ ప్రాజెక్టును చేపడతారు. -
అత్యంత ప్రమాదకరమైన హైవే ఏదో తెలుసా?
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన రహదారిగా ఢిల్లీ-జైపూర్ హైవే నిలిచింది. ఈ రహదారిలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్ హెచ్ఏఐ) వెల్లడించింది. 2010 నుంచి 2015 మధ్యకాలంలో ఈ మార్గంలో ఏడాదికి సగటున 191 మరణాలు సంభవించాయని తెలిపింది. ఢిల్లీకి చెందిన వేదపాల్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించింది. 230 కిలోమీటర్ల ఈ 8వ నంబరు జాతీయ రహదారిపై 2010-15 మధ్యకాలంలో ఏడాదికి సగటున 3వేలకు పైగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 1,637 దుర్ఘటనలు సంభవించాయంటే ఈ రహదారిలో ప్రయాణం ఎంత ప్రమాదమో అర్థమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టి, ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని వేదపాల్ కోరుతున్నారు. -
తగ్గిన తుఫ్రాన్ టోల్గేట్ ఛార్జీలు
హైదరాబాద్ : మెదక్ జిల్లా తుఫ్రాన్ (మనోహరాబాద్) టోల్గేట్ వద్ద వసూలు చేస్తున్న ఛార్జీలను తగ్గిస్తూ నేషనల్ హైవే అథారటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ టోల్గేట్ వద్ద వాహనాల నుంచి ఇకపై ఒకసారి వెళ్లడానికి రూ. 70 వసూలు చేస్తారని ... అలాగే వాహనానికి రాను పోను ఛార్జీ అయితే రూ. 105 వసూలు చేస్తారని ఎన్హెచ్ఏఐ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఈ టోల్గేట్ వద్ద ఇప్పటి వరకు కారు, జీపు, వ్యాను, ఇతర లైట్ మోటర్ వాహనాలు ఒకసారి వెళ్లడానికి రూ. 125... అలాగే రానుపోనుకూ రూ. 180 వసూలు చేస్తున్నారు. దీంతో తక్కువ దూరం ప్రయాణించే స్థానికులకు చాలా వ్యయం అవుతుంది. దీంతో ఈ అంశాన్ని స్థానిక టీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో ఈ అంశంపై కేసీఆర్... నేషనల్ హైవే అథారటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులతో చర్చించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఉన్నతాధికారులు ఛార్జీలు తగ్గిస్తూ... ఉత్తర్వులు జారీ చేశారు.