Waterboard
-
ఇటు సూరీడు.. అటు సర్కారు..
సాక్షి,సిటీబ్యూరో: మహానగర తాగునీటి అవసరాలు తీర్చే జలమండలి విద్యుత్ చార్జీల భారంతో కుదేలవుతోంది. ప్రస్తుతం పరిశ్రమల విభాగం కింద కరెంట్ చార్జీలతో బోర్డు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే రూ.150 కోట్ల పెండింగ్ విద్యుత్ బిల్లులు చెల్లించలేక బోర్డు ఆపసోపాలు పడుతోన్న విషయం విదితమే. దీనికి తోడు ప్రతినెలా రూ.68 కోట్ల మేర విద్యుత్ బిల్లులు చెల్లించడం గుదిబండగా మారింది. నవంబరు నెలలో ఏకంగా రూ.80 కోట్ల బిల్లు రావడంతో బోర్డు వర్గాలు ఇంత మొత్తం ఎలా చెల్లించాలో తెలియక తలలు పట్టుకుంటున్నాయి. ఈ విద్యుత్ భారం నుంచి బయట పడేందుకు సౌరవిద్యుత్ వినియోగించే అంశంపై జలమండలి దృష్టిసారిస్తోంది. ఇక వందల కిలోమీటర్ల దూరం నుంచి గ్రేటర్కు తరలిస్తోన్న కృష్ణా, గోదావరి జలాల పంపింగ్, స్టోరేజీ రిజర్వాయర్ల నుంచి 9.65 లక్షల నల్లా కనెక్షన్లకు నీటి సరఫరాకు నెలకు సుమారు 100 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతోంది. ఈ స్థాయిలో సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పేందుకు ఏకమొత్తంలో దాదాపు రూ.600 కోట్లు అవసరమవుతాయని లెక్క తేల్చింది. సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు జలమండలికి సంబంధించి కృష్ణా, గోదావరి జలాల నీటిశుద్ధి, పంపింగ్ కేంద్రాల వద్ద సుమారు 989 ఎకరాల విస్తీర్ణంలో భూములుండడం గమనార్హం. అయితే ఈ ప్రాజెక్టుకయ్యే నిధులను రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రైవేటు ఆర్థిక సంస్థల నుంచి రుణంగా సేకరిస్తేనే ఈ ప్రాజెక్టు సాకారమవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కనీసం యాన్యుటీ విధానంలోనైనా చేపడితే బోర్డు నష్టాల నుంచి గట్టెక్కే అవకాశముంది. తాగునీటికి కరెంట్ బిల్లుల షాక్.. జలమండలికి నెలవారీగా నీటిబిల్లుల వసూలు, ట్యాంకర్ నీళ్ల సరఫరా, నూతన నల్లా కనెక్షన్ల జారీతో రెవెన్యూ ఆదాయం కనాకష్టంగా రూ.100 కోట్ల వరకు సమకూరుతోంది. కానీ నెలవారీ వ్యయం రూ.112 కోట్లు దాటుతోంది. ప్రధానంగా నెలవారీగా విద్యుత్ బిల్లుల రూపేణా రూ.68 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. మిగతా మొత్తంలో ఉద్యోగుల జీతభత్యాలు, గతంలో తీసుకున్న రుణాలకు సంబంధించిన వాయిదాలు, వడ్డీ చెల్లింపులు, నిర్వహణ వ్యయాలు, మరమ్మతులు, నీటిశుద్ధి తదితర ప్రక్రియలకు సుమారు రూ.44 కోట్లు వ్యయమవుతోంది. ఇలా ప్రతినెలా బోర్డు రూ.10 నుంచి రూ.12 కోట్ల లోటుతో నెట్టుకొస్తోంది. దీనికి తోడు గత కొన్ని నెలలుగా రూ.150 కోట్ల మేర విద్యుత్ బిల్లులు కొండలా పేరుకుపోవడంతో బోర్డు ఖజానాపై భారీ భారం పడినట్టయింది. ఖజానాపై మోయలేని భారం ఈ ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్లో ప్రభుత్వం జలమండలికి పేరుకు రూ.1,420 కోట్లు కేటాయింపులు చేసినా.. రెండో త్రైమాసికానికి బోర్డుకు అందిన నిధులు కేవలం రూ.367 కోట్లే. ఇందులోనూ రూ.167 కోట్లు రుణ వాయిదాల చెల్లింపునకే సరిపోయాయి. మిగతా బడ్జెటరీ నిధుల విడుదలపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడం గమనార్హం. పులిమీద పుట్రలా హడ్కో సంస్థ నుంచి గతంలో జలమండలి తీసుకున్న రూ.700 కోట్ల రుణాన్ని గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఏకమొత్తంగా ఇతర అవసరాలకు దారి మళ్లించింది. ఇందులో ఏడాదిగా రూ.300 కోట్లు మాత్రమే బోర్డుకు చెల్లించింది. మిగతా రూ.400 కోట్లు చెల్లించే విషయంలో రిక్తహస్తం చూపించింది. దీంతో కీలకమైన తాగునీటి పథకాల పూర్తికి నిధుల లేమి శాపంగా పరిణమిస్తుండడం గమనార్హం. -
పేదింటికి నల్లా
►1,476 బస్తీల్లో అమలకు జలమండలి నిర్ణయం ►రూ.100 కోట్ల నిధులతో ఏర్పాట్లు ►రూ.1కే 50వేల నల్లా కనెక్షన్ల మంజూరు ►వందరోజుల ప్రణాళిక సిద్ధం ►ఇక పేదల తాగునీటి ఎదురుచూపులకు చెక్! ►తగ్గనున్న ట్యాంకర్ల నిర్వహణ వ్యయం ►పెరగనున్న జలమండలి ఆదాయం సిటీబ్యూరో: మహానగరం పరిధిలోని ఎంపికచేసిన 1,476 మురికివాడల్లో వందరోజుల్లో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఏర్పాటే లక్ష్యంగా జలమండలి కార్యాచరణ సిద్ధం చేసింది. నిరుపేదలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు రూ.100 కోట్లను వెచ్చించనుంది. ఆయా బస్తీలు, మురికివాడల్లో ఇప్పటివరకు నల్లా కనెక్షన్ లేని ఆవాసాలకు రూ.1కే ఇవ్వాలని, నూతనంగా 50 వేల నల్లా కనెక్షన్లు మంజూరు చేయడం ద్వారా సుమారు 5 లక్షల మంది పేదలకు మేలు చేకూర్చాలని నిర్ణయించింది. ఈ అంశంపై గురువారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రధానంగా మంచినీటి సరఫరా పైప్లైన్ వ్యవస్థ ఏర్పాటులేని, కలుషిత జలాలతో ఇబ్బంది పడుతున్న.. తక్కువ వత్తిడితో నీటిసరఫరా జరుగుతున్న ప్రాంతాలను తక్షణం సెక్షన్ల వారీగా గుర్తించాలని క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మేనేజర్లను ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో ఇంటింటి నల్లా కనెక్షన్ ఏర్పాటుకు చేయాల్సిన పైపులైన్లు, బూస్టర్ పంప్లు, కలుషిత జలాల నివారణకు చేపట్టాల్సిన పనులపై అంచనాలు సిద్ధంచేసి పనులు ప్రారంభించాలన్నారు. బస్తీలకు తీరనున్న దాహార్తి.. నగర శివార్లలోని 12 శివారు మున్సిపల్ సర్కిళ్లను కలుపుకొని 2007లో మహానగర పాలకసంస్థ (జీహెచ్ఎంసీ) ఏర్పాటైంది. సుమారు 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన జీహెచ్ఎంసీలో 1476 మురికివాడలున్నాయి. వీటిలో చాలా నివాసాలకు ఇప్పటికీ నల్లా కనెక్షన్లు లేవు. దీంతో పబ్లిక్ నల్లాలు, ట్యాంకర్ల ద్వారానే ఇక్కడి పేదలు గొంతు తడుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హడ్కో నిధులు రూ.1900 కోట్లతో జలమండలి ఆయా ప్రాంతాల్లో 1300 కి.మీ. పైప్లైన్ వ్యవస్థ ఏర్పాటు చేసింది. మరో 56 భారీ స్టోరేజీ రిజర్వాయర్లను నిర్మిస్తోంది. ఈ పైపులైన్లు, రిజర్వాయర్ల ఏర్పాటుతో సమీప భవిష్యత్లో ఆయాబస్తీల్లో నూతనంగా ఏర్పాటు చేసిన నల్లా కనెక్షన్లకు రోజూ నీటిసరఫరా చేస్తారు. ఇదే జరిగితే ఆయా బస్తీలకు ట్యాంకర్ నీళ్లకోసం ఎదురు చూసే పరిస్థితి తప్పుతుంది. సీఎం సంకల్పాన్ని సాకారం చేస్తాం జలమండలి ఏర్పాటై 28 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ చాలా బస్తీల్లో ఇంటింటికీ నల్లా లేదు. చాలా ప్రాంతాలకు ట్యాంకర్ నీరే దాహార్తిని తీరుస్తోంది. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. గ్రేటర్ పరిధిలో ప్రతి బస్తీలో ఇంటింటికి నల్లాల ఏర్పాటు ద్వారా సీఎం కలను సాకారం చేస్తాం. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే బస్తీల్లో పైపులైన్లు విస్తరించడానికి తక్షణం ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించాం. కొత్తగా నీటిని సరఫరా చేయాల్సిన ప్రాంతాల తుది జాబితాను సిద్దం చేయాలని సూచించాం. – ఎం.దానకిశోర్, జలమండలి ఎండీ -
రూ.100 కోట్లతో బస్తీలకు నీళ్లు
త్వరలో డైలీ వాటర్..! జలమండలి ఎండీ దానకిషోర్ సిటీబ్యూరో: నగరంలో మంచినీటి సరఫరా వ్యవస్థ అందుబాటులో లేని బస్తీలకు నూతనంగా ఏర్పాటు చేసిన పైప్లైన్ల ద్వారా రూ.100 కోట్లు ఖర్చుచేసి తాగునీరు అందిస్తామని జలమండలి ఎండీ ఎం.దాన కిషోర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు త్వరలో నగరంలో రోజూ మంచినీరు సరఫరా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. బుధవారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో నిర్వహణ విభాగం అధికారులతో.. సిల్ట్ ఛాంబర్లు, వర్షాకాల ప్రణాళిక, రెవెన్యూ ఆదాయం తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జలమండలి ఏర్పాటై 28 సంవత్సరాలైనా.. నగరంలో చాలా బస్తీల్లో ఇప్పటికీ ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తోందన్నారు.ఆయా బస్తీల్లో నూతనంగా పైపులైన్లు ఏర్పాటుకు బోర్డు సిద్ధంగా ఉందని, దీంతో ట్యాంకర్ల వినియోగం గణనీయంగా తగ్గుతుందన్నారు. మినీ జెట్టింగ్ యంత్రాలతో మురుగు ఉప్పొంగడం, చౌకేజీ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. వాణిజ్య భవనాలకు డ్రైనేజీ, నల్లా కనెక్షన్లు ఇవ్వాలంటే విధిగా సిల్ట్ ఛాంబర్లు నిర్మించుకోవాలన్నారు. సిల్ట్ ఛాంబర్ల నిర్మాణంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని, కొత్తగా నిర్మించిన 630 సిల్ట్ ఛాంబర్లకు ఈ వారంలో జియోట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. ప్రతి డివిజన్లో నెలకు 40 సిల్ట్ ఛాంబర్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాల ప్రణాళిక, రెవెన్యూ ఆదాయం, వినియోగదారుల ఫిర్యాదులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన డైరెక్టర్లను అభినందించారు. ఈ సమావేశంలో జలమండలి ఆపరేషన్స్ డైరెక్టర్ అజ్మీరా కృష్ణ, పీ అండ్ ఏ డైరెక్టర్ ఎ. ప్రభాకర్, ప్రాజెక్టు–1 డైరెక్టర్ బి.విజయ్ కుమార్ రెడ్డి, సీజీఎమ్లు పి.రవి, ఎంబీ ప్రవీణ్ కుమార్, ఎస్.ఆనంద్ స్వరూప్, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు పాల్గొన్నారు. -
ఇక కను‘మరుగు’
►జలమండలి ప్రీ మాన్సూన్ యాక్షన్ ప్లాన్ రెడీ ►రూ.3.03 కోట్లతో మురుగునీటి పైపులైన్ల ప్రక్షాళన రూ.13 కోట్లతో 170 ►‘హాట్స్పాట్స్’కు మరమ్మతులు జూన్ తొలివారం లోగా పనుల పూర్తి సిటీబ్యూరో: గ్రేటర్లో చినుకుపడితే చాలు.. ఉప్పొంగే మ్యాన్హోళ్లు..మురుగు, వరద నీరు సుడులు తిరుగుతూ రహదారులు చెరువులను తలపిస్తాయి. వాహనదారులకు నరకం చూపిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు వర్షాకాలం అవస్థలను తొలగించేందుకు జలమండలి ‘ప్రీ మాన్సూన్ యాక్షన్ప్లాన్’ (వర్షాకాల ముందస్తు ప్రణాళిక)కు శ్రీకారం చుట్టింది. జూన్ తొలివారంలోగా మురుగునీటి పైపులైన్లు, మ్యాన్హోళ్లలో పేరుకుపోయిన పూడిక తొలగించేందుకు యుద్ధప్రాతిపదికన వాటి ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించింది. ఇరుకైన కాలనీలు, బస్తీల్లో ఈ ప్రక్షాళన పనులు చేపట్టేందుకు 37 మినీ ఎయిర్టెక్ యంత్రాలను రంగంలోకి దించనుంది. గ్రేటర్లో సుమారు ఐదువేల కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన మురుగునీటి పారుదల వ్యవస్థలో.. సుమారు వెయ్యి కిలోమీటర్ల వరకు తరచూ మురుగు నీరు ఉప్పొంగి సమీపబస్తీలు, కాలనీలు, రహదారులను ముంచెత్తే పరిస్థితులున్నాయి. వీటికి తక్షణం ప్రక్షాళన చేపట్టనున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. ఇందుకవసరమైన రూ.16 కోట్ల నిధులను సైతం కేటాయించామని పేర్కొన్నాయి. ముందస్తు ప్రణాళిక అమలు ఇలా.. మహానగరంలో జలమండలికి 5 వేల కిలోమీటర్ల పరిధిలో విభిన్న పరిమాణం గల మురుగునీటి పైపులైన్ వ్యవస్థ అందుబాటులో ఉంది. వీటిపై ప్రతి 30 మీటర్లకు ఒకటిచొప్పున 1.85 లక్షల మ్యాన్హోళ్లున్నాయి. వీటిలో ప్రధానంగా వెయ్యి కిలోమీటర్ల పైపులైన్లు, మరో 50 వేల వరకు మ్యాన్హోళ్లలో ప్రస్తుతం చెత్తా, చెదారం, కొబ్బరిబోండాలు, ప్లాస్టిక్ కవర్లు వంటి వ్యర్థాల చేరికతో మురుగునీరు సాఫీగా వెళ్లే పరిస్థితులు లేవు. దీంతో ప్రీమాన్సూన్ యాక్షన్ప్లాన్ను జలమండలి అమలుచేయనుంది. మరోవైపు మెస్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు, ఫంక్షన్హాళ్లు, డెయిరీ ఫారాలు, సినిమాహాళ్ల నుంచి వెలువడుతోన్న మురుగునీటిలో ఘనవ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు అధిక మొత్తంలో వెలువడుతోన్న నేపథ్యంలో ఆయా వాణిజ్య భవనాల ముందు విధిగా సిల్ట్ఛాంబర్లు(ఘనవ్యర్థాలను నిలువరించేవి)నిర్మించుకునేలా క్షేత్రస్థాయి మేనేజర్లు, డీజీఎంలు చర్యలు తీసుకోవాలని ఎండీ దానకిశోర్ ఆదేశాలిచ్చారు. ఏ పనులకు ఎంత వ్యయం అంటే.. ► గ్రేటర్ పరిధిలో తరచూ మురుగునీరు ఉప్పొంగే 170 హాట్స్పాట్స్ వద్ద రూ.13 కోట్లతో మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు. ► అసాధారణ స్థాయిలో మురుగు ఉప్పొంగే ప్రభావిత ప్రాంతాల్లో రూ.88 లక్షల అంచనా వ్యయంతో పైపులైన్లు, మ్యాన్హోళ్లను సమూలంగా ప్రక్షాళన చేస్తారు. ► ఇతర ప్రాంతాల్లో సుమారు రూ.22 లక్షలతో 37 మినీ ఎయిర్టెక్ యంత్రాలతో మ్యాన్హోళ్లు, మురుగునీటి పైపులైన్లను శుద్ధి చేయనుంది. ►చిన్నపాటి వర్షం కురిస్తే చాలు వరద, మురుగునీరు ఉప్పొంగి బస్తీలు, కాలనీలను ముంచెత్తే ప్రాంతాల్లో రూ.2.03 కోట్లతో అత్యవసర బృందాలను రంగంలోకి దించి వారి ఆధ్వర్యంలో ప్రక్షాళన, నష్టనివారణ చర్యలను చేపట్టనుంది. సమస్యలకు తక్షణ పరిష్కారం ప్రీ మాన్సూన్ యాక్షన్ప్లాన్లో ప్రధానంగా ఉప్పొంగే మ్యాన్హోళ్లు, మురుగునీటి పైపులైన్లలో తక్షణం ప్రక్షాళన పనులు చేపట్టాలని నిర్ణయించాం. తరచూ సమస్యలు తలెత్తే ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ, ప్రక్షాళన పనులు చేపడతాం. వినియోగదారుల నుంచి జలమండలి టోల్ఫ్రీ నెంబరు 155313తోపాటు ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా అందిన ఫిర్యాదులను 24 గంటల్లోగా పరిష్కరించాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం ప్రతి సెక్షన్ పరిధిలో సిల్ట్ ఛాంబర్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధచూపాలని అధికారులను ఆదేశించాం. – ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ -
నీటి లెక్క ఇక పక్కా!
గ్రేటర్లో ఆర్ఎఫ్ఐడీ మీటర్ల వినియోగం జలమండలి ప్రయోగాత్మక చర్యలు.. సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో సరఫరా చేస్తున్న ప్రతి నీటిబొట్టును శాస్త్రీయంగా లెక్కించేందుకు జలమండలి ప్రయోగాత్మకంగా ఆర్ఎఫ్ఐడీ మీటర్లను ప్రవేశపెడుతోంది. వందల కిలోమీటర్ల దూరం నుంచి మహానగరానికి నిత్యం 404 మిలియన్ గ్యాలన్ల మేర కృష్ణా, గోదావరి జలాలను తరలిస్తోంది. ఈ నీటిని 9.65 లక్షల నల్లాలకు సరఫరా చేస్తోంది. కానీ ఇందులో బిల్లులు వసూలవుతున్నది కేవలం 209 మిలియన్ గ్యాలన్లకు మాత్రమే. మిగతా నీరంతా లీకేజీలు, చౌర్యం, అక్రమ నల్లాల కారణంగా బోర్డు లెక్కలోకి రాకపోవడంతో జలమండలి ఖజనా నష్టాల నుంచి గట్టెక్కడంలేదు. ప్రస్తుతం నెలవారీ ఆదాయం రూ.90 కోట్లు కాగా...జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులు, విద్యుత్ బిల్లులకు రూ.102 కోట్ల మేర ఖర్చుచేస్తోంది. ఈ నేపథ్యంలో సరఫరా నష్టాలకు శాస్త్రీయంగా చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. తొలివిడతగా జూబ్లిహిల్స్, రెడ్హిల్స్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో బడా భవంతులకున్న నల్లాలు, మాల్స్, హోటల్స్, రెస్టారెంట్లకున్న వాణిజ్య నల్లాలకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) సాంకేతికత ఆధారంగా పనిచేసే అత్యాధునిక మీటర్లను ఏర్పాటుచేయాలని సంకల్పించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే గ్రేటర్ పరిధిలో ఇతర డివిజన్లకు కూడా క్రమంగా విస్తరించాలని నిర్ణయించింది. కాగా సుమారు రూ.7,500 ధర పలికే ఈ మీటర్లను సుమారు ఐదు లక్షల నల్లాలకు ఏర్పాటు చేసి నెలవారీ బిల్లులో కొంతమొత్తాన్ని వాయిదాల పద్ధతిలో వసూలు చేయాలని సంకల్పించింది. ఇందుకయ్యే వ్యయాన్ని వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణంగా స్వీకరించాలా..లేక ప్రభుత్వం ఇందుకయ్యే వ్యయాన్ని కేటాయిస్తుందా అన్న అంశం మున్సిపల్ పరిపాలన శాఖ పరిశీలనలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆర్ఎఫ్ఐడీ మీటర్లతో ఉపయోగాలివే.. మీటర్ రీడింగ్లో 100 శాతం కచ్చితత్వం ఉంటుంది. సిబ్బంది నిల్చున్న చోట నుంచే రీడింగ్ సేకరించే వీలు చేతిలో ఉన్న ప్రత్యేక పరికరం ద్వారా డేటా సేకరణ. ప్రతి ఇంటికీ వెళ్లి నల్లా గుంతలో దిగాల్సిన అవసరం ఉండదు. నీటి సరఫరా నష్టాలను ఇట్టే గుర్తించవచ్చు. బెంగళూరులో ఇలా... మన పొరుగునే ఉన్న బెంగళూరు తరహాలో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) నీటి మీటర్లను అక్కడి జలబోర్డు ఏర్పాటుచేసింది. అక్కడి వి«ధానంపై ఇటీవల జలమండలి ఉన్నతాధికారుల బందం బెంగళూరు వెళ్లి పరిశీలించి వచ్చింది.బెంగళూరులో తొలుత ఆయా నల్లాల కు మీటర్లు ఏర్పాటుచేసి తర్వాత విని యోగదారుల నుంచి వాయిదాల పద్ధతిలో వసూలు చేస్తున్నారు. ప్రతి నల్లాకు అక్కడ బెంగళూరు జలబోర్డు ఆర్ఎఫ్ఐడీ మీటర్లను అమర్చుతోంది.మీటరు పనితీరుపై ఫిర్యాదు వచ్చిన 12 గంటల వ్యవధిలోనే రంగంలోకి దిగి మీటరు మరమ్మతులు లేదంటే కొత్తది ఏర్పాటు చేస్తారు. ఒక్కో ఆర్ఎఫ్ఐడీ మీటరు మార్కెట్లో రూ.7,500 ధర పలుకుతోంది. నగరంలో ఇలా... వినియోగదారులు తమ ఇళ్లలోని నల్లాలకు సాధారణ మీటర్లు పెట్టుకుంటున్నారు. ఇవి రూ.1,000 నుంచి రూ.1,500 లోపు ఉంటున్నాయి. నాణ్యత లేకపోవడంలో కొన్ని రోజుల్లోనే మూలకు చేరుతున్నాయి.ప్రస్తుతం నల్లాలకున్న నీటి మీటరు భూమిలోపల ఉంటుంది. ఈ గోతిలోకి దిగి రీడింగ్ తీయడం జలమండలి సిబ్బందికి కష్టమవుతోంది. దీంతో చాలామంది మీటరు రీడర్లు తోచినంత రీడింగ్ వేసి బిల్లులు ఇస్తున్నారు.కొన్నిసార్లు వాడని నీటికి వినియోగదారులు భారీ ఎత్తున బిల్లులు చెల్లిస్తున్నారు. ఈ మీటర్ల ద్వారా కచ్చితమైన లెక్కలు తెలియడం లేదు. వినియోగిస్తున్న నీటికి చెల్లిస్తున్న బిల్లులకు పొంతన ఉండటం లేదు.ఈ నేపథ్యంలో ఆర్ఎఫ్ఐడీ మీటర్లు పెట్టాలనేది జలమండలి యోచన. -
కొత్తగా లక్ష నల్లా కనెక్షన్లు
బీపీఎల్ కుటుంబాలకు రూ.1కే కనెక్షన్.. ‘భగీరథ’ విజయవంతం తీరనున్న శివారు ప్రజల దాహార్తి సిటీబ్యూరో: ‘గ్రేటర్’లో పట్టణ భగీరథ పథకం సత్ఫలితాలిస్తోంది... త్వరలో శివారు ప్రజల దాహార్తి తీరనుంది.. ఈ నెలలోనే కొత్తగా ‘లక్ష’ నల్లా కనెక్షన్లు ఇస్తారు. ఇందులో బీపీఎల్ కుటుంబాలకు రూ. 1కే కనెక్షన్ మంజూరు చేస్తారు. దరఖాస్తు అందిన 2–3 రోజుల్లోనే నల్లా బిగిస్తారు. ఖైరతాబాద్లోని జలమండలి కార్యాలయంలో సోమవారం పట్టణ భగీరథ ప్రాజెక్టు, నిర్వహణ విభాగం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ ఈ విషయం వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న పేదలకు, వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా బోర్డు గ్రీన్బ్రిగేడ్ సిబ్బంది.. వారి ఇంటికి వెళ్లి కొత్త కనెక్షన్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రూపాయికే నల్లా.. బీపీఎల్ కుటుంబాలకు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ మంజూరు చేయాలని ఎండీ ఆదేశించారు. దీనికి అదనంగా ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. సాధారణ వినియోగదారులు మాత్రం రోడ్డు కటింగ్ ఛార్జీలతో పాటు ఇంటి నిర్మాణ విస్తీర్ణం, అంతస్తులను బట్టి నల్లా కనెక్షన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. కొత్త నల్లా ఛార్జీలను డెబిట్ , క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించే సదుపాయం కల్పించినట్లు దానకిషోర్ తెలిపారు. ప్రతిసెక్షన్ మేనేజర్ రాబోయే మూడునెలల్లో నూతన నల్లా కనెక్షన్ల జారీకోసం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఈడీ సత్యనారాయణ,ప్రాజెక్టు విభాగం డైరెక్టర్లు డి.శ్రీధర్బాబు, ఎల్లాస్వామి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆటోనగర్ నడిగడ్డ తండాలో ట్రయల్రన్.. ఆటోనగర్ నడిగడ్డ తండాలో నూతనంగా నిర్మించిన రిజర్వాయర్ పరిసరాల్లోని నిరుపేదలు, ఇతర వినియోగదారులకు నూతన నల్లా కనెక్షన్లను ఏర్పాటు చేసి త్వరలో నీటిసరఫరా చేసేందుకు ట్రయల్ రన్ నిర్వహిస్తామని దానకిశోర్ తెలిపారు. జలమండలి సిబ్బంది కంప్యూటర్లు, స్కానర్లతో ఆయా బస్తీలకు వెళ్లి క్షేత్రస్థాయిలో వినియోగదారులు, నిరుపేదల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. అక్కడికక్కడే వినియోగదారుని వివరాలను తనిఖీ చేసి నల్లా కనెక్షన్లు మంజూరీ చేయాలని సూచించారు. వినియోగదారులకు తక్షణ సాయం అందించేందుకు క్షేత్రస్థాయిలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలన్నారు. సెల్ఫ్హెల్ప్ గ్రూప్ సభ్యులతో కలిసి కొత్త నల్లా కనెక్షన్ల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కరపత్రాల పంపిణీ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎండీ తెలిపారు. ఈ నెలలో 12 రిజర్వాయర్లు ప్రారంభం.. మహానగరంలో విలీనమైన శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో రూ.1900 కోట్ల హడ్కో నిధులతో చేపట్టిన 56 భారీ స్టోరేజి రిజర్వాయర్లలో 12 రిజర్వాయర్లను ఏప్రిల్ నెలలోనే ప్రారంభిస్తామన్నారు. శివార్లలో తాగునీటి సరఫరా వ్యవస్థ అందుబాటులో లేని వందలాది బస్తీలు, కాలనీల్లో నూతన నల్లాకనెక్షన్ల జారీకి ఇప్పటివరకు 1800 కి.మీ మార్గంలో తాగునీటి పైపులైన్లు ఏర్పాటు చేశామన్నారు. ఆయా ప్రాంతాల్లో నూతనంగా రెండు లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేశామని దానకిశోర్ తెలిపారు. కాగా జలమండలి పరిధిలో ప్రస్తుతం 9.65 లక్షల నల్లా కనెక్షన్లున్నాయి. నూతనంగా ఇచ్చే కనెక్షన్లతో వీటి సంఖ్య 11.65 లక్షలకు చేరుకోనుండటం విశేషం. -
వీణ - వాణిలకు నీటి కష్టాలు
-
వీణ - వాణిలకు నీటి కష్టాలు
హైదరాబాద్: వీణ - వాణి ఆశ్రయం పొందుతున్న యూసఫ్గూడ లోని స్టేట్ హోంకు అధికారులు నీటి సరఫరా బంద్ చేశారు. హోం ఆవరణలో ఉన్న ఏడు భవనాలకు జలమండలి అధికారులు నీటి కనెక్షన్ కట్ చేశారు. స్టేట్ హోం తమకు రూ.24 లక్షల మేర చెల్లించాల్సి ఉందని జలమండలి అధికారులు అంటున్నారు. వృద్ధులు, పసిపిల్లలతో కలిపి 700 మంది పైగా ఈ ఆవరణలో మూడు రోజులుగా నీళ్లు లేక అల్లాడుతున్నారు. -
వందేళ్ల వనరు!
‘గ్రేటర్’ దాహార్తిని తీర్చనున్న ‘కేశవాపూర్’ రిజర్వాయర్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక రెడీ - ఆరు నెలల్లోగా భూసేకరణ దిశగా వడివడిగా అడుగులు - అటవీ భూమి సేకరణపైనే దృష్టి - పాములపర్తిసాగర్ నుంచి 20 టీఎంసీల గోదావరి జలాలను ఈ రిజర్వాయర్కు తరలించేందుకు ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: త్వరలో గ్రేటర్ హైదరాబాద్ దాహార్తి తీరనుంది. ఎండాకాలం కూడా తాగు నీరు సమృద్ధిగా లభించనుంది. మరో వందేళ్లవరకు మహానగరానికి తాగునీటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు శామీర్పేట్ మండలం కేశవాపూర్లో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన భారీ స్టోరేజి రిజర్వాయర్ నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమైంది. జలమండలి ఆధ్వర్యంలో సుమారు రూ.7,770 కోట్ల అంచనా వ్యయంతో 20 టీఎంసీల గోదావరి జలాల నిల్వసామర్థ్యంతో దీన్ని నిర్మించనున్నారు. ఈ రిజర్వాయర్కు అవసరమైన అటవీ, ప్రైవేటు భూములను ఆరునెలల్లోగా సేకరించే అంశంపై రెవెన్యూ, జలమండలి యంత్రాంగం దృష్టిసారించింది. ఈ రిజర్వాయర్కు ప్రధానంగా కొండపోచమ్మ సాగర్ నుంచి గోదా వరి జలాలను తరలించి నింపేందుకు వీలుగా ఏర్పా ట్లు చేయనున్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి సం బంధించి సాంకేతిక అంశాలు, డిజైన్లు, డ్రాయింగ్స్, పైప్లైన్స్, నీటిశుద్ధికేంద్రాలు, శుద్ధిచేసిన నీటిని ఘన్పూర్ రిజర్వాయర్కు తరలించే పైప్లైన్ల ఏర్పాటు.. తదితర అంశాలను వ్యాప్కోస్ సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదికలో పొందుపరిచి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులు చేపట్టేందుకు జలమండలి సన్నద్ధమౌతోంది. భూసేకరణ దిశగా వడివడిగా అడుగులు... ఈ రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన 3,822 ఎకరాల భూమిలో 918.84 ఎకరాల మేర అటవీ భూమి ఉంది. మిగతాది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించింది. ప్రభుత్వం అనుమతిస్తే ఈ భూమిని ఆరు నెలల్లో సేకరించేందుకు రెవెన్యూ యంత్రాంగం సన్నద్ధమౌతోంది. భూసేకరణ, పరిహారం చెల్లింపునకు సుమారు రూ.518.7 కోట్ల అంచనా వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. రాబోయే వందేళ్లకు గ్రేటర్కు జల భాగ్యం... విశ్వనగరం బాటలో పయనిస్తున్న మహానగర జనా భా కోటికి చేరువైంది. పదేళ్లలో జనాభా అనూహ్యంగా పెరిగే అవకాశముంది. కోట్లాది జనాభా తాగునీటి అవసరాలకు మరో వందేళ్లపాటు ఢోకాలేకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ భారీ స్టోరేజి రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. చుట్టూ సహజసిద్ధమైన కొండలు, మధ్యలో జలసిరులు కొలువై ఉండేలా అందమైన రాతి ఆనకట్టతో ఈ రిజర్వాయర్ నిర్మాణానికి డిజైన్లు సిద్ధమయ్యాయి. దీంతోపాటు చౌటుప్పల్ మండలం(యాదాద్రి జిల్లా) లోని దండుమల్కాపూర్లోనూ మరో 20 టీఎంసీల కృష్ణా జలాల నిల్వకు మరో భారీ స్టోరేజి రిజర్వాయర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. అయితే కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించాలని ప్రభుత్వం యోచి స్తోంది. అయితే ప్రభుత్వం బడ్జెటరీ నిధులు కేటాయిం చడం లేదా హడ్కో, జైకా, ప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వంటి ఆర్థిక సంస్థల నుంచి రుణ సేకరణ లేదా, కేంద్ర ప్రభుత్వ గ్రాంటుతో ఈ రిజర్వాయర్ను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రావాటర్ తరలింపునకు ఏర్పాటు చేసే ప్రధాన పైప్లైన్ పొడవు: 18.2 కి.మీ నీటిశుద్ధి కేంద్రం: 172 మిలియన్ గ్యాలన్ల నీటిని శుద్ధిచేసేందుకు వీలుగా నిర్మాణం రావాటర్ తరలింపునకు ఏర్పాటు చేసే పంపులు,వాటి సామర్థ్యం: 16 మెగావాట్ల సామర్థ్యంగల 4 పంప్లు శుద్ధిచేసిన నీటి తరలింపునకు ఏర్పాటు చేసే పంపులు, వాటి సామర్థ్యం: 2 మెగా వాట్ల సామర్థ్యంగల 8 పంప్లు శుద్ధిచేసిన నీటిని తరలించేందుకు ఏర్పాటు చేసే పైప్లైన్లు: 8 కి.మీ మార్గంలో 3,000 డయా వ్యాసార్థం గలవి సీడబ్ల్యూఆర్(క్రాప్ వాటర్ రిక్వైర్మెంట్):80 మిలియన్ లీటర్లు -
ఆలస్యానికి చెక్
►బుక్ చేసిన వెంటనే నీటి ట్యాంకర్ ►అదే రోజు 90 శాతం సరఫరా.. ►సిటీలో తగ్గుతున్న నీటి డిమాండ్ సిటీబ్యూరో: జలమండలి ట్యాంకర్ను బుక్చేసి నీటి కోసం కళ్లు కాయలు కాసేలా వేచిచూడాల్సిన అవసరం ఇక ఉండదు. మహానగరం పరిధిలో ఇక నుంచి బుకింగ్లు జరిగిన రోజునే 90 శాతం మందికి నీటిని సరఫరా చేసేందుకు జలమండలి సన్నద్ధమవుతోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ట్యాంకర్ నీటి బుకింగ్లు క్రమంగా తగ్గుతుండడంతో కోరినవారికి వెంటనే ట్యాంకర్ను సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కృష్ణా, గోదావరి జలాలతో గ్రేటర్ దాహార్తిని తీర్చేందుకు జలమండలి ప్రణాళికాబద్ధంగా పలు ప్రాంతాల్లో సరఫరా నెట్వర్క్ విస్తరిస్తోంది. దీంతో పలు ప్రాంతా ల్లోని సిటీజన్ల దాహార్తి క్రమంగా తీరడంతోపాటు ట్యాంకర్లకు డిమాండ్ భారీగా తగ్గింది. గతంలో సింగూరు, మంజీరా, ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాల నుంచి నగరానికి 340 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేసేవారు. ప్రస్తుతం వాటి నుంచి నీటిసరఫరా నిలిచిపోవడంతో కృష్ణా, గోదావరి పథకం కింద 376 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తోంది. డిమాండ్ తగ్గుతోందిలా.. సుమారు కోటి జనాభా, 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన నగరానికి ప్రస్తుతం మంచినీటి సరఫరాకు 8 వేల కిలోమీటర్ల మార్గంలో పైప్లైన్ వ్యవస్థ అందుబాటులో ఉంది. దీనికి అదనంగా హడ్కో సంస్థ మంజూరు చేసిన రూ.1900 కోట్ల రుణంతో శివారు ప్రాంతాల్లో 2000 కి.మీ. మార్గంలో పైప్లైన్లు, నీటినిల్వకు జలమండలి 56 భారీ స్టోరేజీ రిజర్వాయర్లను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వెయ్యి కిలోమీటర్ల మార్గంలో పైప్లైన్ పనులు పూర్తికావడంతో వందలాది శివారు కాలనీలకు జలభాగ్యం దక్కింది. దీంతో ఆయా ప్రాంతాల్లో నీటి సరఫరా వ్యవస్థ అందుబాటులోకి రావడం.. ఇంటింటికీ నల్లా ఏర్పాటుతో నీటిసరఫరా జరుగుతుండడంతో ట్యాంకర్ నీటిపై ఆధారపడడం తగ్గినట్లు జలమండలి వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం శివారు ప్రాంతాల్లో సరఫరా వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నాయి. రుతుపవనాలు కరుణిస్తే ఆయా ప్రాంతాలకు జూలై నుంచి రోజూ నీటిసరఫరా జరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి. -
ఔటర్ చుట్టు జలహారం
∙రూ.400 కోట్లతో పనులు.. ∙తొమ్మిది నెలల్లో పూర్తి ∙కృష్ణా, గోదావరితో నీటి సరఫరాకు ఏర్పాట్లు ∙నీటి వృథాపై సర్వే.. వాణిజ్య నల్లాలపై నజర్ ∙జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దానకిశోర్ సిటీబ్యూరో: రాజధానికి మణిహారంలాంటి ఔటర్ రింగ్రోడ్డు చుట్టూ భారీ మంచినీటి పైప్లైన్ (రింగ్మెయిన్)తో గ్రేటర్ వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు జలమండలి శ్రీకారం చుడుతోంది. ఇందుకు రూ.400 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధంచేసి తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పదిరోజుల్లో ఈ పనులకు టెండర్లు పిలిచి.. 9 నెలల్లో పనులు పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. మహా నగరానికి సింగూరు, మంజీరా జలాశయాల నుంచి నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయంగా ఈ గ్రిడ్ను ఏర్పాటు చేస్తున్నారు. దీనిద్వారా ఎల్లంపల్లి నుంచి ప్రస్తుతం సిటీకి తరలిస్తున్న 116 మిలియన్ గ్యాలన్లకు అదనంగా.. మరో 54 మిలియన్ గ్యాలన్ల నీటిని నగరం నలుమూలలకు సరఫరా చేసేందుకు వీలవుతుంది. ఇందుకోసం 1800 డయా వ్యాసార్థం గల భారీ పైప్లైన్ను ఏర్పాటు చేయనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే సింగూరు, మంజీరా నీటి సరఫరా వ్యవస్థలున్న పటాన్చెరు, రామచంద్రాపురం, కుత్బుల్లాపూర్ ప్రాంతాల దాహార్తి సమూలంగా తీరుతుంది. ప్రస్తుతం జంట జలాశయాలు, సింగూరు, మం జీరా జలాశయాల నుంచి నీటిసరఫరా లేకున్నా కృష్ణా, గోదావరి నుంచి నిత్యం 372 మిలియన్ గ్యాలన్ల నీటిని నగరానికి తరలించి సరఫరా చేస్తున్నారు. ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలోసోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్.. ఈడీ సత్యనారాయణ, డైరెక్టర్లు శ్రీధర్బాబు, ఎల్లాస్వామి, సత్య సూర్యనారాయణతో కలిసి ఈ వివరాలను వెల్లడించారు. రుతుపవనాలు కరుణిస్తే ఈ ఏడాది జూలై నుంచి నగరంలో రోజూ నీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రస్తుతం 170 బస్తీల్లో 10 వేల నల్లాలకు రోజూ నీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఔటర్ గ్రామాలకు తీరనున్న దాహార్తి.. వచ్చే వేసవి (2018 మే) నాటికి ఔటర్ రింగ్రోడ్డుకు లోపలున్న 190 గ్రామాలు, నగర పంచాయతీల దాహార్తిని తీర్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు దానకిశోర్ తెలిపారు. రూ.628 కోట్లతో యాన్యుటీ విధానంలో చేపట్టనున్న పనులకు సింగిల్ టెండరు దాఖలైంది. దీంతో ఇటీవల ఈ టెండరును రద్దుచేసి తాజాగా టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. ఇందులో పలు సంస్థలు పాల్గొనేందుకు వీలుగా వడ్డీరేటులో సడలింపు, 70 శాతం పనులు పూర్తయిన తరవాతే కమర్షియల్ ఆపరేషన్స్ డేట్ వర్తింపు వంటి అంశాల్లో వెసులుబాటు కల్పించామన్నారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడిపై సర్పంచ్లతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం అధికారులతో చర్చించి దాహార్తిని తీర్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు. శరవేగంగా హడ్కో పనులు శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో రూ.1900 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన తాగునీటి పథకం పనుల్లో మొత్తం 2,600 కి.మీ. పైప్లైన్ వ్యవస్థకు ఇప్పటి వరకు 908 కి.మీ. పైప్లైన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈనెలలో 20, ఏప్రిల్లో 15, మేలో మరో 15, జూన్లో 10 భారీ స్టోరేజీ రిజర్వాయర్లను పూర్తి చేస్తామన్నారు. పనుల్లో నాణ్యత లోపించకుండా 10 మంది ఇంజినీర్లతో నాణ్యతా తనిఖీ బృందం ఏర్పాటు చేశామని, బయటి ఏజెన్సీలతో నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కృష్ణా ఫేజ్–2 పైప్లైన్ పనులకు 3 కి.మీ. మార్గంలో మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టడం ద్వారా పాతనగరానికి ఈ వేసవిలో 25 మి.గ్యాలన్ల జలాలను అదనంగా సరఫరా చేస్తామన్నారు. జంటజలాశయాలపై అధ్యయనం.. జంట జలాశయాల పరిరక్షణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అధ్యయనం చేస్తుందని, ఈ అంశంపై గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, సుప్రీంకోర్టు తీర్పు మేరకు పరిరక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదన్నారు. ప్రస్తుతం 43 శాతం ఉన్న నీటి సరఫరా నష్టాలను తగ్గించేందుకు నారాయణగూడ, ఎస్.ఆర్.నగర్, మారేడ్పల్లి డివిజన్లలో ప్రయోగాత్మకంగా శాస్త్రీయ సర్వే చేస్తామని తెలిపారు. వచ్చే నాలుగు నెలల్లో ఈసర్వే పూర్తవుతుందన్నారు. రెవెన్యూ నష్టాలను తగ్గించే దిశగా ఇటీవల రూ.46 కోట్ల మొండి బకాయిలు వసూలు చేశామన్నారు. వాణిజ్య నల్లాల గుర్తింపునకు 360 డిగ్రీ సర్వేకు ఉన్నతాధికారులను రంగంలోకి దించామన్నారు. గృహ వినియోగ కేటగిరీ కింద ఉన్న 5,942వాణిజ్య భవంతులను గుర్తించామన్నారు. దెబ్బతిన్న పైప్లైన్లను గుర్తించేందుకు గ్రౌండ్ పెనిట్రేటషన్ రాడార్ సాంకేతికత, ఎన్జీఆర్ఐ సహకారం తీసుకోనున్నట్లు తెలిపారు. నెక్లెస్రోడ్లో దెబ్బతిన్న భారీ సీవరేజీ పైప్లైన్ను క్యూర్డ్ ఇన్ప్లేస్పైప్ సాంకేతికతతో మరమ్మతులు చేపట్టనున్నట్లు వివరించారు. -
జూలై నుంచి జలసిరి!
జంట నగరాల్లో ఐదు లక్షల నల్లాలకు రోజూ నీళ్లు ♦ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ వెల్లడి ♦ మే నుంచి గ్రేటర్లోని 9.05 లక్షల నల్లాలకు ఎస్ఎంఎస్ సందేశం ♦ ఆసక్తిగల సంస్థల నుంచి టెండర్ల ఆహ్వానం.. ♦ ఫిబ్రవరి ఒకటి నుంచి 173 మురికివాడలకు రోజూ నీళ్లు.. సాక్షి, హైదరాబాద్: జంటనగరవాసులకు శుభవార్త. జూలై నెల నుంచి ప్రధాన నగరం (కోర్సిటీ) పరిధిలోని ఐదు లక్షల నల్లాలకు రోజూ నీళ్లిచ్చేందుకు జలమండలి చర్యలు ప్రారంభించింది. కృష్ణా, గోదావరి జలాల లభ్యత పుష్కలంగా ఉండడం, జూన్ నెలా ఖరులోగా నగరంలో పలు భారీ స్టోరేజి రిజ ర్వాయర్ల నిర్మాణం పూర్తవనున్న నేపథ్యంలో ఈ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ తెలిపారు. మరోవైపు నల్లా నీళ్ల సరఫరా వేళలపై వినియోగదారుల మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ సమాచారం అందించేందుకు జలమండలి చర్యలు చేపట్టింది. ఈ ఏడాది మే నెల నుంచి గ్రేటర్ పరిధిలోని 9.05 లక్షల నల్లాలకు నీటి సరఫరా వేళలపై ఖచ్చితమైన సమాచారం అందించాలని సంకల్పించింది. ఈ మేరకు సంక్షిప్త సందేశం అందించే ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు త్వరలో టెండర్లు పిలవనున్నట్లు ఎండీ తెలిపారు. ప్రస్తుతానికి కూకట్పల్లి డివిజన్ పరిధిలో 50 వేల నల్లాలకు ఈ సందేశం చేరవేస్తున్నామని.. ఫిబ్రవరి నెలలో సనత్నగర్ నియోజకవర్గానికి ఎస్ఎంఎస్ అందించాలని నిర్ణయించామన్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి నగరంలోని 173 మురికివాడల్లో 50 వేల నల్లాలకు రోజూ నీటి సరఫరా ఉంటుందన్నారు. ఫిబ్రవరి రెండో వారం నుంచి అదనంగా మరో లక్ష నల్లాలకు రోజూ గంటకు తగ్గకుండా నీళ్లిస్తామన్నారు. ఇదే సమయంలో నీటి వృథాను అరికట్టడం, కలుషిత జలాల సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 9 గంటల వరకు లేదా సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్యన ఒక గంట పాటు మంచినీటిని సరఫరా చేయనున్నామన్నారు. బస్తీల్లో అవగాహన కార్యక్రమాలు.. నీటి పొదుపు, అన్ని నల్లాలకు నీటి మీటర్ల ఏర్పాటు, వృథాను అరికట్టడం, కలుషిత జలాల నివారణ, సమస్యల పరిష్కారంలో స్థానికుల భాగస్వామ్యం, రోజువారీగా ఎదుర్కొంటున్న సమస్యలపై జలమండలికి ఫిర్యాదు చేయడం ఎలా.. తదితర అంశాలపై పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అవగా హన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయిం చినట్లు ఎండీ చెప్పారు. ఆయా బస్తీల్లో కర పత్రాల పంపిణీ, పోస్టర్ల ఏర్పాటుతోపాటు, స్థానికులతో సదస్సులు, సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిందన్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం... అరకొర నీటి సరఫరా.. ఉప్పొంగుతున్న మురుగు సమస్యలు, కలుషిత జలాలు..అధిక నీటి బిల్లుల మోత.. తదితర సమస్యలపై సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేసే వినియోగదారుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఫేస్బుక్, ట్విట్టర్ను మరో నెల రోజుల్లో 50 వేల మంది అనుకరించేలా (ఫాలోవర్స్) చర్యలు ప్రారంభించారు. జలమండలి అందిస్తున్న సేవలను గ్రేటర్ సిటీజన్లకు చేరవేయడం, సమస్యల గుర్తింపు, తరచూ సమస్యలు తలెత్తే ప్రాంతాలను గుర్తించడం, తక్షణం ఆయా ఫిర్యాదులను పరిష్కరించేందుకు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదుల స్వీకరణ ఉత్తమ సాధనమని భావిస్తున్నట్లు బోర్డు ఉన్నతాధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న లైన్మెన్లకు అందజేసిన స్మార్ట్ఫోన్లలో ఉన్న జల్యాప్ మాధ్యమం ద్వారా నిత్యం 200కుపైగా ఫిర్యాదులు అందుతున్నాయ న్నారు. సిబ్బంది, అధికారుల్లో సేవాభావం పెంపొందించేందుకు ప్రతి సమావేశానికి ముందు గాంధీ ప్రతిజ్ఙ చేయిస్తున్నామని, వినియోగదారులే తమకు అత్యంత ముఖ్యమని భావించేలా ఉద్యోగుల్లో స్ఫూర్తి నింపే యత్నం చేస్తున్నామని దానకిశోర్ పేర్కొన్నారు. మరో వందేళ్లకు తాగునీటికి ఢోకా లేకుండా... గ్రేటర్ నగరానికి మరో వందేళ్లపాటు తాగునీటికి ఢోకాలేకుండా శామీర్పేట్ మండలం కేశవాపూర్లో 20 టీఎంసీల గోదావరి జలాల నిల్వకు భారీ స్టోరేజి రిజర్వాయర్... మరో 20 టీఎంసీల కృష్ణా జలాల నిల్వ సామర్థ్యంతో మల్కాపురం(నల్లగొండ) రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎండీ తెలిపారు. ఇందుకు అవసరమైన భూముల లభ్యతను గుర్తించడం, సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ పనుల్లో నిమగ్నమయ్యామన్నారు. -
శివారుకు సవాల్!
రూ.800 కోట్ల నిధులు దారిమళ్లింపు జలమండలి ఖజానా ఖాళీ శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో రిజర్వాయర్లు, పైపులైన్ల పనులకు బ్రేక్ రూ.60 కోట్ల మేర పెండింగ్ బిల్లులు సిటీబ్యూరో: గ్రేటర్ శివార్ల దాహార్తిని తీర్చేందుకు హడ్కో సంస్థ మంజూరు చేసిన రూ.800 కోట్ల తొలివిడత నిధులను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా దారి మళ్లించడంతో జలమండలి ఖజానా ఖాళీ అరుుంది. దీంతో గ్రేటర్ శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో చేపట్టిన స్టోరేజి రిజర్వాయర్లు, పైప్లైన్ పనులకు రూ.60 కోట్ల మేర పెండింగ్ బిల్లులు పేరుకుపోయారుు. ఖజనాలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఇటు బోర్డు అధికారులు సచివాలయం చుట్టూ....అటు పనులు చేపట్టిన సంస్థలు జలమండలి చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేస్తుండడం గమనార్హం. కొత్తగా మహానగరంలో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో 56 భారీ స్టోరేజి రిజర్వాయర్లు, 2700 కి.మీ మేర పైప్లైన్ పనులకు నిధుల లేమి శాపంగా మారింది. ఇటీవలే ఈ పనులకు జీహెచ్ఎంసీ రహదారి కోత అనుమతులు మంజూరు చేసినప్పటికీ.. అవసరమైన పైపులైన్లను కొనుగోలు చేసేందుకు సంబంధిత ఏజెన్సీలకు బిల్లులు చెల్లించని దుస్థితి తలెత్తింది. ఈనేపథ్యంలో పనులు చేపట్టిన సంస్థలు ఎలా ముందుకెళ్లాలా అన్న సంశయంలో పడ్డారుు. పలుచోట్ల పనులు నత్తనడకన సాగుతున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితితో శివార్ల దాహార్తి తీర్చే పనులు మరింత ఆలస్యమయ్యే ప్రమాదం పొంచి ఉంది. దాహార్తి తీరే దారేదీ.... మహానగర పాలకసంస్థలో 2007లో 11 శివారు మున్సిపల్ సర్కిళ్లు విలీనమయ్యారుు. వీటి పరిధిలో సుమారు వెరుు్య కాలనీలు, బస్తీలు దశాబ్దాలుగా మంచినీటి సరఫరా వ్యవస్థ అందుబాటులో లేక తీవ్ర దాహార్తితో అలమటిస్తున్నారుు. ఆయా ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు ఈ ఏడాది ప్రారంభంలో హడ్కో సంస్థ జలమండలి సంస్థాగత భూములను తాకట్టుపెట్టుకొని రూ.1900 కోట్ల రుణం జారీ చేసేందుకు అంగీకరించింది. అరుుతే హడ్కో సంస్థ మంజూరు చేసిన తొలివిడత రుణం రూ.800 కోట్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏకపక్షంగా ఇతర పథకాలకు దారిమళ్లించడంతో దాహార్తి తీర్చే పనులకు నిధుల లేమి తలెత్తింది. ప్రస్తుతం నీటి బిల్లులు, ట్యాంకర్ నీళ్ల సరఫరా, నూతన నల్లా కనెక్షన్ల జారీతో జలమండలి నెలవారీగా రూ.90 కోట్ల రెవెన్యూ ఆదాయం లభిస్తుండగా..విద్యుత్ బిల్లులు, ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ వ్యయాలు కలిపితే నెలకు రూ.102 కోట్ల వ్యయం అవుతోంది. ఇప్పటికే నెలకు రూ.12 కోట్ల లోటుతో నెట్టుకొస్తున్న బోర్డుకు ఇప్పుడు శివారు మంచినీటి పథకాలకు బిల్లులు చెల్లించడం తలకు మించిన భారంగా మారింది. ఇప్పటివరకు చేపట్టిన 56 రిజర్వాయర్ల నిర్మాణం పనులు 50 శాతం మేర పూర్తయ్యారుు. పూర్తిచేసిన పనులకు సంబంధించి గత రెండు నెలలుగా రూ.60 కోట్ల మేర పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పనులు చేపట్టిన సంస్థలు బోర్డు చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇచ్చిన చెక్కూ వృథానే..! కాగా జలమండలికి హడ్కో సంస్థ మంజూరు చేసిన నిధులను పెద్దమొత్తంలో దారిమళ్లించిన సర్కారు....బోర్డు అవసరాలకు రెండు నెలల క్రితం జారీ చేసిన రూ.50 కోట్ల చెక్కు కూడా పాస్ కాకపోవడం గమనార్హం. ఇప్పటికే రూకల్లోతు కష్టాల్లో కూరుకుపోరుున జలమండలికి నిధులలేమి కారణంగా శివార్లలో చేపట్టిన పనులను ఎలా పూర్తిచేయాలన్న అంశంపై బోర్డు అధికారులకు మింగుడు పడడంలేదు -
18న సగం సిటీకి నీళ్లు బంద్
సాక్షి, సిటీబ్యూరో : కృష్ణా ఫేజ్–3 పైపులైన్లకు ముందస్తు మరమ్మతుల కారణంగా ఈనెల 18న (మంగళవారం) నగరంలో పలు ప్రాంతాలకు నీటిసరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి ప్రకటించింది. దీంతో బీఎన్ రెడ్డినగర్, ఎల్బీనగర్, ఆటోనగర్, వనస్థలిపురం, సరూర్నగర్, అల్కాపురి, దిల్సుఖ్నగర్, ఆర్జీకె. బండ్లగూడ, బాలాపూర్, బాబానగర్, రియాసత్నగర్, బార్కాస్, డీఆర్డీఎల్, డీఎంఆర్ఎల్, మిధాని, చాంద్రాయణగుట్ట, ఉప్పల్, బీరప్పగడ్డ, కైలాస్గిరీ, ఎన్న్ఎఫ్సీ, మైలార్దేవ్పల్లి, మధుబన్, పీడీపీ, హైదర్గూడ, రాజేంద్రనగర్, ఉప్పర్పల్లి, సులేమాన్ నగర్, ఎంఎం పహాడీ, అత్తాపూర్, చింతల్మెట్, బుద్వేల్,మెహిదీపట్నం, కార్వాన్, లంగర్హౌజ్, కాకతీయనగర్, హుమయూన్ నగర్, తాళ్లగడ్డ, ఆసిఫ్నగర్, ఎంఈఎస్, గంధంగూడ, ఓయూకాలనీ, టోలిచౌకి, మల్లేపల్లి, విజయనగర్కాలనీ, రెడ్హిల్స్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, నాంపల్లి, లక్డికాపూల్, సెక్రటేరియట్, జియాగూడ, ఆళ్లబండ, గోడెఖీఖబర్, ప్రశాసన్ నగర్, గచ్చిబౌలి, లాలాపేట, చాణక్యపురి, గౌతంనగర్ ప్రాంతాలకు నీటిసరఫరా ఉండదని ప్రకటించింది. మరమ్మతులు పూర్తయిన 12 గంటల్లోగా సరఫరా పునరుద్ధరిస్తామన్నారు. -
నీళ్లొస్తున్నాయ్.. నల్లా తిప్పండి..
నల్లాలకు నీటి సరఫరా వేళలపై ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారం సాక్షి, హైదరాబాద్ : కోటి మందికిపైగా జనాభా ఉన్న మన భాగ్యనగరంలో మంచినీటికి ఎప్పుడూ కటకటే.. దీంతో జలమండలి గ్రేటర్ పరిధిలో రెండ్రోజులకు ఒకసారి.. శివారు ప్రాంతాల్లో మూడ్రోజులకు ఒకసారి మంచినీటిని సరఫరా చేస్తోంది. అయితే నల్లా నీళ్లు వచ్చే సమయం ఎప్పుడంటే మాత్రం సరైన సమాధానం లభించదు. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ మహానగరంలో ఇదే పరిస్థితి. ఇకపై నీటి వెతల నుంచి హైదరాబాదీలకు విముక్తి లభించనుంది. నల్లా నీళ్లు ఎప్పుడొస్తాయో.. నేరుగా వినియోగదారుల మొబైల్కే సంక్షిప్త సందేశం రూపంలో సమాచారం అందనుంది. ఈ మేరకు జలమండలి చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా కూకట్పల్లి డివిజన్ పరిధిలోని 70 వేల నల్లా వినియోగదారులకు నీటిసరఫరా వేళలపై ఎస్సెమ్మెస్లు అందజేస్తోంది. సెప్టెంబర్ 15 నుంచి నగరంలోని మిగతా 20 డివిజన్ల పరిధిలోని 8 లక్షల నల్లాలకు సైతం సంక్షిప్త సందేశాలను అందజేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ‘జీపీఎస్’తో ఎస్సెమ్మెస్లు.. వినియోగదారులకు ఎస్సెమ్మెస్లు పంపేం దుకు జలమండలి జీపీఎస్ పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. క్షేత్రస్థాయిలోని లైన్మెన్లకు స్మార్ట్ఫోన్లు అందించి.. అందులో ప్రత్యేక యాప్ను అందుబాటులో ఉంచింది. నీటి సరఫరా కోసం వాల్వ్ తిప్పేందుకు లైన్మెన్ వెళ్లినపుడు అతని ఫోన్లో ఆ వాల్వ్ నంబర్ ప్రత్యక్షమౌతుంది. దానిపై నొక్కగానే ఆ సమాచారం జలమండలి కేంద్ర కార్యాలయంలోని సర్వర్కు చేరుతుంది. అక్కడి నుంచి ఐవీఆర్ఎస్ విధానంలో ఆ వాల్వ్ పరిధిలోని వినియోగదారులందరికీ ఎస్సెమ్మెస్ ద్వారా నల్లా నీళ్లు వస్తున్నాయన్న సమాచారం అందుతుంది. ప్రయోగాత్మకంగా ‘జల్యాప్’ వినియోగం.. నిత్యం వినియోగదారుల నుంచి వచ్చే కలుషిత జలాలు.. అరకొర నీటి సరఫరా, మూతలు లేని మ్యాన్హోల్స్ వంటి 9 రకాల ఫిర్యాదులపై జలమండలి రూపొందించిన జల్యాప్ను ప్రయోగాత్మకంగా వంద మంది లైన్మన్ల వద్దనున్న స్మార్ట్ఫోన్లలో వినియోగంలోకి తీసుకొచ్చారు. జల్ యాప్కు అందే ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఒక్కో క్షేత్రస్థాయి మేనేజర్కు రూ.2 లక్షల నగదును అందజేయనున్నట్లు జలమండలి ఎండీ దాన కిశోర్ తెలిపారు. ఈ నిధులను సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా అన్న అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఓ చీఫ్ జనరల్ మేనేజర్ను నియమిస్తున్నామన్నారు. సెప్టెం బర్లో జలమండలిలో పనిచేస్తున్న మూడు వేల మంది లైన్మన్ల స్మార్ట్ఫోన్లలో జల్యాప్ అందుబాటులోకి రానుందన్నారు. లైన్మన్ల అక్రమాలకు చెక్.. నీటి సరఫరాపై వినియోగదారులకు ఎస్సెమ్మెస్లు అందించడం ద్వారా లైన్మన్ల చేతివాటానికి చెక్ పడనుంది. ఉన్నతాధికారులకు సైతం నీటి సరఫరా వేళలపై ఎప్పటికప్పుడు సమాచారం ఎస్సెమ్మెస్ ద్వారా అందుతుండడంతో డబ్బులు తీసుకుని ఓ ప్రాంతానికి అధికంగా.. మరో ప్రాంతానికి తక్కువ సమయం నీటిని సరఫరా చేయడానికి వీలుండదని జలమండలి అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. సెప్టెంబర్ 15 నుంచి అన్ని నల్లాలకూ ఎస్సెమ్మెస్ కూకట్పల్లి డివిజన్లోని 70 వేల నల్లాలకు ఎస్సెమ్మెస్లు అందుతున్నాయి. జలమండలి పరిధిలోని మిగతా 8.06 లక్షల నల్లాలకు సెప్టెంబర్ 15 నుంచి ఎస్సెమ్మెస్లు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇందుకోసంమహానగర పరిధిలో మంచినీటి పైపులైన్లపై ఉన్న వాల్వ్లను అవి ఉన్న అక్షాంశం, రేఖాంశం ఆధారంగా జీపీఎస్తో అనుసంధానిస్తున్నాం. దీంతోబోర్డు రికార్డుల్లో నమోదైన వినియోగదారుల మొబైల్స్కు నీటిసరఫరా వేళలపై ఎస్ఎంఎస్లు అందుతాయి. - దాన కిశోర్, జలమండలి ఎండీ -
‘నీటి’ లెక్క... లేదు పక్కా!
► నీటి మీటర్ల ఏర్పాటులో నిర్లక్ష్యం ► ఇంటింటి ప్రచారంపై క్షేత్రస్థాయి సిబ్బంది నిరాసక్తత ► ప్రతి నెలా జలమండలి ఖజానాకు రూ.కోట్లలో నష్టం ► 8.76 లక్షల నల్లాలకు..మీటర్లున్నవి 1.60 లక్షలకే.. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో అన్ని నల్లాలకు నీటిమీటర్ల ఏర్పాటు విషయంలో జలమండలి క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వీడడంలేదు. ప్రతి నీటి చుక్కను శాస్త్రీయంగా లెక్కగట్టడం ద్వారా వినియోగదారులకు బిల్లుల మోత లేకుండా చూసేందుకు బోర్డు యాజమాన్యం మీటర్లను తప్పనిసరిచేసింది. కానీ వీటి ఏర్పాటు విషయంలో వినియోగదారుల్లో ఉన్న అపోహలను తొలగించి వారికి అవగాహన కల్పించడంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న లైన్మెన్లు, మీటర్ రీడర్లు విఫలమవుతున్నారు. మీటర్లు లేకపోవడంతో ప్రస్తుతం డాకెట్ సరాసరి పేరుతో అశాస్త్రీయంగా జారీ అవుతున్న బిల్లులతో వినియోగదారులకూ బిల్లుల మోత మోగుతుండడం గమనార్హం. 1.60 లక్షల నల్లాలకే మీటర్లు.. గ్రేటర్ పరిధిలో 8.76 లక్షల నల్లా కనెక్షన్లుండగా..ఇందులో 1.60 లక్షల నల్లాలకు మాత్రమే మీటర్లున్నాయి. మిగతా నల్లాలకు మీటర్లు ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ మంత్రి కేటీఆర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర ఎం.దానకిశోర్ల ఆదేశాల మేరకు ఇటీవల జలమండలి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇందులోభాగంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మీటర్ రీడర్లు, లైన్మెన్లు వినియోగదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి మీటర్ల ఏర్పాటుపై అవగాహన కల్పించడంతోపాటు మీటర్లు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా నోటీసులు జారీ చేయాల్సి ఉంది. అయితే ఈ విషయంలో పలువురు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు కేవలం 43,328 మంది వినియోగదారులకు మాత్రమే నోటీసులివ్వడం గమనార్హం. ఇక మీటర్లు ఏర్పాటు చేసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన 1150 మంది వినియోగదారులకు వీటి ఏర్పాటుకు సహకరించే విషయంలోనూ అదే ధోరణి ప్రదర్శిస్తుండడంతో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహానగరం పరిధిలో అన్ని నల్లాలకు నీటిమీటర్లు ఏర్పాటు చేయకపోవడంతో నెలకు జలమండలి ఖజానాకు రూ.12 నుంచి రూ.15 కోట్ల వరకు నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా. -
నీటి కష్టాలకు ‘యాప్’ చెక్
► 2న లాంఛనంగా ప్రారంభం.. ► 9 సమస్యల తక్షణ పరిష్కారానికి శ్రీకారం ► గ్రేటర్లో 24 గంటల నీటిసరఫరా! ► నల్లాల క్రమబద్ధీకరణకు ఆగస్టు 31 వరకు గడువు ► 1 నుంచి మీటర్ల ఏర్పాటుపై డ్రైవ్.. ► ‘మీట్ది ప్రెస్’లో జలమండలి ఎండీ దానకిశోర్ సాక్షి,సిటీబ్యూరో: కలుషిత జలాలు.. పైప్లైన్లు, వాల్వ్ లీకేజీ, మురుగు.. ఇలా తొమ్మిది రకాల సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు ఆగస్టు రెండు నుంచి ప్రత్యేక ‘మొబైల్ యాప్’ అందుబాటులోకి రానుందని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ తెలిపారు. దీనికి ‘ఆపరేషన్స్ అండ్ మెయిన్టెనెన్స్ మానిటరింగ్ మొబైల్ యాప్’గా నామకరణం చేశామన్నారు. శనివారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘మీట్ది ప్రెస్’లో ఆయన వివరాలు వెల్లడించారు. సమావేశంలో బోర్డు డైరెక్టర్లు సత్యనారాయణ, రామేశ్వర్రావు, శ్రీధర్బాబు, రవీందర్రెడ్డి, ఎల్లాస్వామి ఉన్నారు. ఎండీ మాట్లాడుతూ.. ఈ యాప్ గ్రేటర్ పరిధిలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సుమారు 3 వేల మంది లైన్మెన్ల చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్లలో ఉంటుందన్నారు. వారు రోజువారీగా తాము పనిచేస్తున్న పరిధిలో తమ పరిశీలనకు వచ్చిన సమస్యలు, వినియోగదారులు తెలిపిన సమస్యలను తమ వద్దనున్న మొబైల్ఫోన్లలో ఫొటో తీసి ఈ యాప్లో కనిపించే 9 బటన్స్లో సంబంధిత ఫిర్యాదు బటన్పై ప్రెస్ చేస్తారన్నారు. దీని ద్వారా ఏకకాలంలో ఈ సమాచారం సంబంధిత సెక్షన్ మేనేజర్, డీజీఎం, జీఎం, సీజీఎం, ఎండీ, కేంద్ర కార్యాలయంలో ఉండే కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రానికి తక్షణం తెలుస్తుందన్నారు. తద్వారా కొన్ని గంటల వ్యవధిలో ఆ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. పరిష్కరించే సమస్యలివే.. మొబైల్ యాప్ తెరపై 9 రకాల సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా బటన్స్ ఉం టాయి. అవి.. 1. క్లోరిన్ లేని నీళ్లు 2.వాల్వ్ లీకేజీలు, 3.పైపులైన్ల లీకేజీ, 4.కలుషిత జలాలు, 5. పొంగుతున్న మురుగు, 6.మూతలు లేని మ్యాన్హోళ్లు, 7.నీటి బిల్లు అందకపోవడం, 8. మీటర్ కావాలని వినియోగదారుడు కోరడం/మీటర్ లేకపోవడం, 9. అక్రమ న ల్లా కనెక్షన్. పరిశీలనలో 24 గంటల నీటిసరఫరా.. ప్రస్తుతం కృష్ణా మూడు దశలు, గోదావరి పథకం, సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు పెరిగినందున నీటి లభ్యత 600 మిలియన్ గ్యాలన్లుగా ఉందని ఎండీ తెలిపారు. అయితే 24 గంటల పాటు నీటిసరఫరా అందించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. మహానగరంలో అన్ని ప్రాంతాలకు 24 గంటల పాటు నీరందించేందుకు అవసరమైన పైప్లైన్ వ్యవస్థ అందుబాటులో లేదని, నగరంలో వెయ్యి కిలోమీటర్ల మార్గంలో పురాతన మంచినీటి పైపులైన్లను మార్చాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. నల్లాల క్రమబద్ధీకరణకు అవకాశం గ్రేటర్ పరిధిలో అక్రమ నల్లాల క్రమబద్ధీకరణకు ఆగస్టు 31 వరకు అవకాశం కల్పించినట్టు ఎండీ దానకిషోర్ తెలిపారు. ఈ గడువులోగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి కేవలం నల్లా కనెక్షన్ చార్జీలు చెల్లించి తమ కనెక్షన్ను క్రమబద్ధీకరించుకోవచ్చని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో సెప్టెంబరు 1 నుంచి కనెక్షన్ చార్జీలు రెట్టింపు చేస్తామని స్పష్టం చేశారు. అక్రమ నల్లాలపై సమాచారం అందించిన పౌరులకుSఅక్రమార్కుల నుంచి వసూలు చేసే రెట్టింపు కనెక్షన్ చార్జీల్లో 25 శాతం ప్రోత్సాహకంగా అందజేస్తామన్నారు. 80 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకుని, రూ.2 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన బీపీఎల్ కుటుంబాలకు కేవలం ఒక్క రూపాయి చెల్లిస్తే వారి నల్లా కనెక్షన్ను క్రమబద్దీకరిస్తామని తెలిపారు. మీటర్లు లేని నల్లాలు 6 లక్షలు.. గ్రేటర్ పరిధిలో 8.76 లక్షల నల్లా కనెక్షన్లు ఉండగా ఇందులో 6 లక్షల నల్లాలకు మీటర్లు లేవని ఎండీ తెలిపారు. ప్రతి నల్లాకు మీటర్ ఏర్పాటు ద్వారా బోర్డు రెవెన్యూ ఆదాయం గణనీయంగా పెంచుకోవడంతో పాటు వినియోగదారులకు అధిక నీటి బిల్లుల మోత లేకుండా చూసేందుకు ఆగస్టు ఒకటి నుంచి మీటర్ల ఏర్పాటుకు నగర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్టు తెలిపారు. ఒకసారి రూ.1500 చెల్లించి మీటర్ ఏర్పాటు చేసుకుంటే నాలుగేళ్లపాటు వాడుకున్న నీటికే బిల్లు చెల్లించే వెసులుబాటు వినియోగదారులకు దక్కుతుందన్నారు. సెప్టెంబరు 30 లోగా నీటి మీటర్లు ఏర్పాటు చేసుకుంటే నెలవారీ నీటిబిల్లులో 5 శాతం రాయితీ లభిస్తుందని, లేకుంటే అక్టోబరు నుంచి రెట్టింపు బిల్లు చెల్లించాలన్నారు. -
పీసీబీ వర్సెస్ జలమండలి
► మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణంలో జాప్యం ► నిధులివ్వడం లేదని పీసీబీపై జలమండలి ఫిర్యాదు ► రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ.. సాక్షి, సిటీబ్యూరో: జలాశయాల చుట్టూ ఎస్టీపీల (మురుగు శుద్ధి కేంద్రాలు) నిర్మాణం విషయంలో జలమండలికి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) మధ్య సమన్వయ లోపం తలెత్తింది. చివరకు ఈ వివాదం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దకు చేరుకుంది. ఎస్టీపీల నిర్మాణానికి నిధుల విడుదల చేయడంలో పీసీబీ జాప్యం చేస్తోందని జలమండలి ఆరోపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే...గ్రేటర్ వరదాయినిలు ఉస్మాన్సాగర్(గండిపేట్), హిమాయత్సాగర్ జలాశయాలు కాలుష్య కాసారాలు కాకుండా కాపాడేందుకు పలుచోట్ల ఎస్టీపీలను నిర్మించాలని నిర్ణయించారు. ఈమేరకు పీసీబీ రూ.13 కోట్లు నిధులు మంజూరు చేయాల్సి ఉంది. అయితే మొదట నిధుల విడుదలకు అంగీకరించి, తర్వాత పీసీబీ వెనక్కి తగ్గినట్లు తెలియడంతో ఈ అంశంపై జలమండలి అధికారులు సీఎస్కు ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించాలని లేఖ రాశారు. ఈ వ్యవహారంపై త్వరలో సీఎస్ సమక్షంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగితేనే ఈ పంచాయతీకి ఫుల్స్టాప్ పడనున్నట్లు సమాచారం. మురుగు శుద్ధి కేంద్రాలు ఎందుకంటే.. జంట జలాశయాలకు కాలుష్య విషం నుంచి విముక్తి కల్పించేందుకు 11 గ్రామాల పరిధిలో మురుగు శుద్ధి కేంద్రాలు(ఎస్టీపీ)లను నిర్మించాలని ఏడాది క్రితం జలమండలి సంకల్పించింది. సుమారు రూ.40.50 కోట్ల అంచనా వ్యయంతో వీటిని నిర్మించాలని ప్రతిపాదించింది. ఉస్మాన్సాగర్(గండిపేట్)కు ఆనుకొని ఉన్న ఖానాపూర్,వట్టినాగులపల్లి, జన్వాడ, అప్పోజిగూడా, చిలుకూరు, బాలాజీ దేవాలయం, హిమాయత్నగర్ గ్రామాల పరిధిలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక హిమాయత్సాగర్ పరిధిలో హిమాయత్సాగర్, అజీజ్నగర్, ఫిరంగినాలా, కొత్వాల్గూడా పరిధిలో ఎస్టీపీలు నిర్మించాలని తలపెట్టింది. వీటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను పీబీఎస్ సంస్థ సిద్ధంచేసింది. వీటి నిర్మాణానికి అయ్యే వ్యయంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రూ.13 కోట్లు, పంచాయతీరాజ్శాఖ రూ.27.50 కోట్లు వ్యయం చేయాలని గతంలో నిర్ణయించారు. వీటి నిర్మాణం, నిర్వహణ పనులను జలమండలి పర్యవేక్షించనుంది. ఆయా గ్రామాల నుంచి రోజువారీగా వెలువడే వ్యర్థజలాలను మురుగు శుద్ధి కేంద్రాలకు తరలిస్తారు. రోజువారీగా ఇక్కడికి వచ్చే గృహ, పారిశ్రామిక, వాణిజ్య వ్యర్థజలాలను శుద్ధిచేసిన అనంతరం స్థానికంగా ఆయా గ్రామాల పరిధిలో గార్డెనింగ్, వనసంరక్షణకు వినియోగించనున్నట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఇన్ఫ్లో చానల్స్నూ ప్రక్షాళన చేయాల్సిందే..! జంటజలాశయాల ఎగువ ప్రాంతాల్లో ఉన్న సుమారు 84 గ్రామాల పరిధినుంచి జలాశయాలకు వరదనీటిని చేర్చే కాల్వలు(ఇన్ఫ్లోఛానల్స్)కబ్జాకు గురవడం,ఇటుకబట్టీలు, ఇసుక మాఫియాకు అడ్డాలుగా మారడం, ఫాంహౌజ్లు, ఇంజినీరింగ్ కళాశాలలు, గోడౌన్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు నిలయంగా మారడంతో జలాశయాలు రోజురోజుకూ చిన్నబోతున్నాయి. ప్రస్తుతం ఈ జలాశయాలు చుక్క నీరు లేక చిన్నబోయి కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఆయా ఇన్ఫ్లో చానల్స్ను యుద్ధప్రాతిపదికన ప్రక్షాళన చేయాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఎస్టీపీలు నిర్మించాల్సిన గ్రామాలు..వాటి సామర్థ్యం ఇలా... ♦ ఉస్మాన్సాగర్(గండిపేట్ జలాశయం పరిధిలో) ఖానాపూర్–0.6 మిలియన్ లీటర్లు వట్టినాగులపల్లి–0.8 మిలియన్ లీటర్లు జన్వాడ–0.6 మిలియన్ లీటర్లు అప్పోజిగూడా–0.1 మిలియన్ లీటర్లు చిలుకూరు–0.7 మిలియన్ లీటర్లు బాలాజీ దేవాలయం–0.1 మిలియన్ లీటర్లు హిమాయత్నగర్–0.3 మిలియన్ లీటర్లు ♦హిమాయత్సాగర్ పరిధిలో... హిమాయత్సాగర్–0.25 మిలియన్ లీటర్లు అజీజ్నగర్–0.9 మిలియన్ లీటర్లు ఫిరంగినాలా–2.9 మిలియన్ లీటర్లు కొత్వాల్గూడా–0.3 మిలియన్ లీటర్లు -
జలమండలి పనులపై కెమెరా కన్ను!
మ్యాన్హోళ్లు, మరమ్మతులు, నిర్మాణం పనులపై సీసీటీవీ నిఘా కేంద్ర కార్యాలయంలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షణ సిటీబ్యూరో: పోలీసు శాఖకే పరిమితమైన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఇప్పుడు జలమండలిలోనూ త్వరలో ఏర్పాటు కానుంది. మూతలు లేనివి, దెబ్బతిన్న మ్యాన్హోళ్లు, మంచినీరు, మురుగునీటి పైపులైన్ల లీకేజీలు, మరమ్మతులు, రిజర్వాయర్ల నిర్మాణం పనులను నిరంతరం పర్యవేక్షించేందుకు జలమండలి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను త్వరలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రానికి ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయం వేదిక కానుంది. ఈ కేంద్రంలో పోలీసుశాఖ నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీటీవీల నుంచి వీడియో ఫుటేజీని రోజువారీగా సేకరించి అధికారులు విశ్లేషించడం ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు నగరంలో నిర్మాణంలో ఉన్న 56 భారీ మంచినీటి స్టోరేజి రిజర్వాయర్ల పురోగతిని పర్యవేక్షించేందుకుసైతం పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 4500 కెమెరాల నుంచి ఫుటేజీ స్వీకరణ.. ప్రస్తుతానికి గ్రేటర్వ్యాప్తంగా పోలీసు శాఖ ఏర్పాటుచేసిన 4500 సీసీటీవీలతో ప్రధాన రహదారులపై ఉన్న మ్యాన్హోళ్లు, పైపులైన్లు, వాల్వ్లపైనా నిఘా పెట్టాలని నిర్ణయించింది. ఈవిషయంలో పూర్తిగా సహకరించేందుకు పోలీసువిభాగం సూత్రప్రాయంగా అంగీకరించడంతో..ఆయా కెమెరాల నుంచి ఆన్లైన్లోనే నిరంతరం ఫుటేజీ స్వీకరణకు జలమండలికి మార్గం సుగమం అయ్యింది. అంటే ప్రస్తుతం ముఖ్యమైన కూడళ్లు, ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీల నిఘా నేత్రం ఇక నుంచి మ్యాన్హోళ్లు, పైపులైన్లు, వాల్వ్లపైకీ మళ్లనుంది. ఈ ఫుటేజీని ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో వీక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు ఎండీ దానకిశోర్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ కేంద్రం ఏర్పాటుతో వర్షం కురిసిన ప్రతిసారీ వరద, మురుగునీరు కలిసి సుడులు తిరుగుతూ ఉప్పొంగే మూతలు లేని మ్యాన్హోళ్లు,పైపులైన్లు, వాల్వ్లకు పడుతున్న చిల్లులు వంటి అంశాలన్నీ ఎప్పటికప్పుడు తెరపై వీక్షించి వెంటనే మరమ్మతు పనులకు ఆదేశించవచ్చని బోర్డు ఉన్నతాధికారులు తెలిపారు. స్టోరేజీ రిజర్వాయర్ల నిర్మాణం పనులపైనా నిఘా నేత్రం.. ప్రస్తుతం గ్రేటర్లో విలీనమైన 12 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో హడ్కోసంస్థ మంజూరుచేసిన రూ.1900 కోట్ల అంచనా వ్యయంతో స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ పనులను ఏడాదిలోగా పూర్తిచేయాలని లక్ష్యం నిర్దేశించారు. ఆయా మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో సుమారు 56 భారీ స్టోరేజి రిజర్వాయర్లు, వందల కిలోమీటర్ల మేర నీటిసరఫరా పైపులైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులపై సైతం సీసీటీవీలతో నిఘా ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. తద్వారా అక్రమాలకు తావుండదని, నిర్మాణం పనులు వేగం పుంజుకుంటాయని అధికారులు చెబుతున్నారు. -
జలమండలిలో కమాండ్ కంట్రోల్ సెంటర్
పోలీసు శాఖకే పరిమితమైన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఇప్పుడు జలమండలిలోనూ ఏర్పాటు కానుంది. మూతలు లేనివి, దెబ్బతిన్న మ్యాన్హోళ్లు, మంచినీరు, డ్రెయినేజీ పైపులైన్ల లీకేజీలు, మరమ్మతులు, రిజర్వాయర్ల నిర్మాణం పనులను నిరంతరం పర్యవేక్షించేందుకు జలమండలి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను త్వరలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రానికి ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయం వేదిక కానుంది. ఈ కేంద్రంలో పోలీసుశాఖ నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీటీవీల నుంచి వీడియో ఫుటేజీని రోజువారీగా సేకరించి అధికారులు విశ్లేషించడం ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు నగరంలో నిర్మాణంలో ఉన్న 56 భారీ మంచినీటి స్టోరేజి రిజర్వాయర్ల పురోగతిని పర్యవేక్షించేందుకుసైతం పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. -
పైన పటారం...
‘బెస్ట్ కాలనీ’ సరిహద్దులో వరెస్ట్ వినయ్నగర్ కాలనీ బస్టాండ్లో డ్రైనేజ్ సమస్య 40 ఏళ్ల నాటి వ్యవస్థతో పదేళ్లుగా ఇబ్బందులు 250 మీటర్లు మార్చేందుకు జలమండలి కక్కుర్తి సిటీబ్యూరో: అది సైదాబాద్లోని ఐఎస్ సదన్ చౌరస్తాను ఆనుకుని ఉన్న వినయ్నగర్ కాలనీ... గతేడాది బెస్ట్ కాలనీగా ఎంపికై బల్దియా నుంచి రూ.10 లక్షల నజరానా అందుకుంది. అయితే కాలనీ లోపల హుందాగానే ఉన్నా సరిహద్దులో మాత్రం డ్రైనేజ్ వ్యవస్థ దుర్భరంగా మారింది. దాదాపు 40 ఏళ్ల నాటి పైప్లైన్ను కేవలం 250 మీటర్ల మేర మర్చడంలో ప్రభుత్వ విభాగాల కక్కుర్తితో 10 ఏళ్లగా స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని కాలనీ సంఘం ఆరోపిస్తోంది. ఐఎస్ సదన్ చౌరస్తాలోని మసీదు/దేవాలయం నుంచి దాదాపు 250 మీటర్ల మేర ఏళ్ల నాటి డ్రైనేజ్ పైప్ లైనే ఉంది. ఈ ప్రాంతంలో పదేళ్లుగా వాణిజ్య, నివాస సముదాయాలతో పాటు వసతిగృహాలు పెరగడంతో వాటి నుంచి బయటకు వచ్చే మురుగునీరు ఎన్నో రెట్లు పెరిగింది. చౌరస్తా నుంచి చంపాపేట్ వెళ్లే సాగర్ హైవే. వినయ్నగర్ కాలనీ సరిహద్దుల్లోనే ఇబ్రహీంపట్నం/దేవరకొండకు వెళ్లే బస్సులు నిలిపే బస్టాప్ సైతం ఉంది. ప్రధానంగా రద్దీ వేళల్లోనే పాత పైప్లైన్ కారణంగా మ్యాన్హోల్స్ పొంగి బస్టాండ్తో పాటు రహదారిని ముంచెత్తుతోంది. దీంతో ప్రయాణికులు అవస్థలుఎదుర్కొంటున్నారు. ఐఎస్ సదన్ చౌరస్తా వెంబడి జీవనం సాగించే చిరువ్యాపారులు, ఆటో స్టాండ్కు ఆటో ఎక్కేందుకు వచ్చే స్థానికులు మురుగు నీటిలోంచే వెళ్లాల్సి వస్తోంది. సమస్యను పరిష్కరించాలని ‘ఏడేళ్లుగా ఈదీబజార్లోని జలమండలి అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పటి వరకు అధికారులు కనీసం ఎస్టిమేట్స్ కూడా తయారు చేయలేదు. సోమవారం చంద్రాయణగుట్టలోని జలమండలి జనరల్ మేనేజర్ నాగేంద్రకుమార్ను కలిశాం. గరిష్టంగా మూడు రోజుల్లోపు అంచనాలు తీయారు చేయాల్సిందిగా ఈదిబజార్ అధికారుల్ని ఆదేశించారు. కేవలం 250 మీటర్ల మేర పైప్లైన్ మార్చడానికి ఇన్నాళ్లు కాలయాపన చేస్తూ స్థానికుల్ని, ప్రయాణికుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు’ అని వినయ్నగర్కాలనీ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి అవినాష్ కె.రౌత్ అన్నారు. -
ఏమిటీ నిర్లక్ష్యం?
సిటీబ్యూరో ‘చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేరా..గుంతలు, రోడ్లను కూడా నేనే పరిశీలించి ఆదేశాలు ఇవ్వాలా.. ? నేను (మంత్రి), మేయర్, కమిషనర్ వస్తే తప్ప పనులు చేయరా...’ అంటూ రాష్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులపై తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం శ్రీనగర్కాలనీ, యూసుఫ్గూడ, గాజులరామారం, బాలానగర్ తదితర ప్రాంతాల్లోని రహదారుల పనులను పరిశీలించిన ఆయన..తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీనగర్కాలనీ, యూసుఫ్గూడలలో రోడ్లపై గుంతలు, వివిధ విభాగాలు ఇష్టారాజ్యంగా చేస్తున్న తవ్వకాలపై మంత్రి సీరియస్ అయ్యారు. అధికారులు, విభాగాల మధ్య సమన్యయ లోపంతోనే ఈ సమస్యలు ఏర్పడుతున్నాయని తేల్చిచెప్పారు. తన పర్యటనతో అధికారుల్లో గుబులు పుట్టించారు. పనులు పూర్తి చేసేందుకు నెలరోజులు పడుతుందని కాంట్రాక్టర్, 15 రోజుల్లో అవుతుందని విద్యుత్ శాఖ ఇంజినీర్లు చెప్పడంతో ‘స్టోరీలు చెప్పొద్దు’ అంటూ హెచ్చరించారు. రెండు పనులు కలిసి నెల అనడంతో ‘కామన్సెన్స్ లేదా..’అంటూ అసహనం వ్యక్తం చేశారు. తవ్వకాలతో తాగునీటి లైన్లు పాడవడంతో దాదాపు 45 రోజులుగా నీరు రావడం లేదని స్థానికులు మంత్రి దృష్టికి తెచ్చారు. మరోచోట గత కొన్ని రోజులుగా మురుగునీటి సమస్య ఉందని ఫిర్యాదు చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే మరో భోలక్పూర్ ఘటన పునరావృతమవుతుందని మంత్రి హెచ్చరించారు. పనులు పూర్తయ్యేంత వరకు ఒక వర్క్ ఇన్స్పెక్టర్ను అక్కడే ఉంచాలని సూచించారు. హెచ్టీ లైన్లు, పైపులైన్లు తదితరమైన వాటికోసం రోడ్లు తవ్వి ఎంతకాలమైనా పనులు పూర్తికాపోవడంతో ప్రజలు పడుతున్న బాధలు చూసి అసహనానికి గురయ్యారు. ఎక్కడి కక్కడే చెత్తకుప్పలు, మట్టిదిబ్బలు, ప్రజలు నడవాల్సిన ఫుట్పాత్లపై పిచ్చిమొక్కలు కనిపించడంతో తట్టుకోలేకపోయారు. వాటిని ఎప్పటికప్పుడు బాగుచేయవద్దా అని అధికారులను నిలదీశారు. పలు చోట్ల రోడ్ల నాణ్యతపై, గుంతలపై తీవ్ర అసంతప్తి వ్యక్తం చేసారు. గవర్నర్ వ్యాఖ్యలపై ఆరా తీసిన మంత్రి.. పర్యటనలో యూసుఫ్గూడ కార్పొరేటర్ సంజయ్గౌడ్ను ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడారు. ఇటీవల ఆయన గవర్నర్ను కలిసిన నేపథ్యంలో ఆ వివరాలు కనుక్కొన్నారు. రోడ్ల పరిస్థితిపై గవర్నర్ చేసిన వ్యాఖ్యల గురించి ఆరా తీశారు. స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, స్థానిక సర్కిల్ అధికారులపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేసారు. కింది స్థాయి సిబ్బంది, డిప్యూటీ కమిషనర్స్థాయి అధికారుల పనితీరు ఏమాత్రం బాగులేద న్నారు. సాక్షాత్తు గవర్నర్ వచ్చి చెప్పినా సమస్యలు పట్టించుకోరా అంటూ అధికారులపై మండిపడ్డారు. అసలే ఇరుకు దారిలో నిత్యం మురగునీరు పారుతుందని, డంపర్బిన్లు నిండిపోతున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదని స్థానికులు ఈ సందర్భంగా మంత్రికి ఫిర్యాదు చేశారు. వివిధ విభాగాల వారు ఒకరి తర్వాత ఒకరు రోడ్లను తవ్వి వదిలేస్తున్నారని, ఆ తర్వాత గాలికి వదిలేస్తున్నారని, కళ్యాణ్నగర్, శ్రీనగర్కాలనీల్లో చాలా కాలం క్రితమే రోడ్లను తవ్వి కేబుల్స్ వేసినప్పటికి ఇప్పటికీ పూడ్చలేదని ఫిర్యాదు చేశారు. వివిధ విభాగాల అధికారులు , మెట్రో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మంత్రి పర్యటన ముఖ్యాంశాలు..... ⇒బురదమయంగా మారిన రహదారిపై మంత్రి వస్తున్నాడని తెలియడంతో అధికారులు అప్పటికప్పుడు ఎల్లారెడ్డిగూడ ఎస్బీఐ బ్యాంకు ముందు ఉన్న బురద మట్టిని ఫుట్పాత్ మీద వేస్తుండగా మంత్రి గమనించి ఇది పాదచారులకు ఇబ్బంది కాదా అని మందలించారు. ⇒కేబుల్ పనుల తవ్వకాల వల్ల, వర్షం వల్ల ఇక్కడ బురదలో కిందపడి ప్రజలు గాయపడుతున్నా అధికారులు ఏం చేస్తున్నారంటూ స్థానిక డీసీని పిలిచి మందలించారు. రెండు నెలలుగా ఇక్కడ పరిస్థితి ఇలాగే ఉందని స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా సంబంధిత సిబ్బంది మరమ్మతులు చేయకపోవడంపై ⇒ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుడు ఎండి. ఉమర్ అనే వ్యక్తి కేటీఆర్ వద్దకు వచ్చి మురుగునీటి సమస్యను ప్రస్తావించారు. ⇒యూసుఫ్గూడలో ఒకే రోడ్డులో రెండు వైపులా రోడ్ల తవ్వకాలతో మధ్యలో ఉన్న రోడ్డు గురించి అధికారులతో మంత్రి మాట్లాడారు. రెండు వైపులా తవ్వకాలకు అధికారులు అనుమతులిస్తే మధ్యలో వాహనదారులు చిన్న రోడ్డుపై సర్కస్ ఫీట్లు చేయాలా అంటూ ప్రశ్నించారు. ⇒యూసుఫ్గూడ చెక్పోస్టులో బస్టాప్లో మంత్రి ఆగి ఉన్న ప్రయాణికులతో సంభాషించారు. ఈ సందర్భంగా వారు ఇక్కడ బస్షెల్టర్లేదని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు దృష్టికి తేగా తాత్కాలికంగానైనా వెంటనే షెల్టర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ⇒ మెట్రోపనుల కోసం యూసుఫ్గూడ ప్రభుత్వ పాఠశాలలో కొంత భాగం ఇవ్వడంతో ఆ ప్రాంతానికి చేరుకున్న కేటీఆర్ అక్కడ పరిస్థితిపై విద్యార్థులతో మాట్లాడారు. ఇంకా పాఠశాలలో గ్రౌండ్ ఉందా, వసతులు ఎలా ఉన్నాయంటూ ప్రశ్నించారు. ⇒132 కేవీ విద్యుత్లైన్పనులు ఇంకా ఎన్ని రోజులు చేస్తారు. సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి రోడ్లపై జనాలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రాజెక్టు విభాగం అధికారికి కేటీఆర్ సూచించారు. గాలి వస్తే కరెంట్ ఎందుకు పోతుందని అడిగారు. ⇒ శ్రీనగర్ కాలనీలో మంత్రి వస్తున్నారని తెలిసి కూడా కాంట్రాక్టర్ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాన్హోల్ రోడ్డుకు ఎత్తుగా ఉండటంతో ఇలా ఉంటే ఎలా.. అంటూ మండిపడ్డారు. ⇒మొత్తం ఎన్ని రోడ్డు కటింగ్లకు అనుమతులిచ్చారు.. ఎన్ని పూర్తయ్యాయి.. మిగతావి ఎప్పుడవుతాయి..పూర్తి సమాచారం అందించాల్సిందిగా మంత్రి ఆదేశించారు. రూ.5 భోజనం బాగాలేదు...(బాక్సులో) ‘ఇది సాంబారా.. నీళ్లా.. ? కారం ఎక్కువ వేశారు..రచీ పచీ లేదు..ఎలా తినాలి దీన్ని... ’అంటూ స్వయంగా ‘రూ. 5 భోజనం’ తిన్న అనంతరం మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని రూ.5 భోజన కేంద్రంలో నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ఈ సంఘటన కుత్బుల్లాపూర్ పరిధిలోని షాపూర్నగర్లో చోటుచేసుకుంది. ఇక ఇక్కడే రూ. 6 కోట్లతో జరుగుతున్న 6 ఎంఎల్ రిజర్వాయర్ నిర్మాణ విషయంలో కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు పనుల విషయంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంట్రాక్టర్పై ఫిర్యాదు చేయగా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రి వెంట పర్యటనలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి, జలమండలి, విద్యుత్, తదితర శాఖల ఉన్నతాధికారులున్నారు. -
అరకొర నీటి సరఫరా నేడు
సిటీబ్యూరో: కోదండాపూర్ (నల్లగొండ జిల్లా)లోని కృష్ణా మూడోదశ నీటిశుద్ధి కేంద్రానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా శుక్రవారం పలు ప్రాంతాలకు ఆలస్యంగా, అరకొర నీటి సరఫరా ఉంటుందని జలమండలి ప్రకటించింది. ప్రభావిత ప్రాంతాలు ఇవే.. ఎల్బీనగర్, వనస్థలిపురం, వాసవీ కాలనీ, అల్కాపురి, ఆటోనగర్, బీఎన్రెడ్డి నగర్, మన్సూరాబాద్, అల్వాల్, ఫాదర్ బాలయ్య నగర్, ఎంఈఎస్, లోతుకుంట, ఎంఈఎస్, డిఫెన్స్కాలనీ, ఆర్.కె.పురం, సైనిక్పురి, సాయినాథ్పురం, గాయత్రీనగర్, ఆనంద్బాగ్, నేరేడ్మెట్, సఫిల్గూడ, మల్కాజ్గిరి, చాణక్యపురి, గౌతంనగర్, మౌలాలి, రాధిక, ఓయూటీ, మహేశ్నగర్, కాప్రా, హెచ్బీకాలనీ, చర్లపల్లి, నాచారం, చిల్కానగర్, బీరప్పగడ్డ, ఉప్పల్, కైలాస్గిరి, తుర్కపల్లి, ఐసీఐసీఐ నాలెడ్జ్ పార్క్, సింగపూర్ టౌన్షిప్, రైల్వేస్,ప్రశాసన్నగర్, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్సిటీ, బోరబండ, హస్మత్పేట్, భోజగుట్ట, ఆసిఫ్నగర్, రెడ్హిల్స్, రాజేంద్రనగర్ ప్రాంతాలు ఉన్నాయి. -
ధూంధాంగా
రాష్ట్రావతరణ వేడుకలకు సర్వం సిద్ధం విద్యుత్ కాంతులతో వెలుగులీనుతున్న నగరం అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు ముమ్మరం సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలకు గ్రేటర్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విద్యుల్లతల జిలుగు వెలుగులతో చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు, కూడళ్లు తళుకులీనుతున్నాయి. అంబరాన్నంటే స్థాయిలో సంబురాల నిర్వహణకు రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖలతోపాటు జీహెచ్ఎంసీ, జలమండలి, ఆర్టీసీ, రెవెన్యూ, మైనార్టీ సంక్షేమ శాఖలు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాయి. ప్రధానంగా చారిత్రక హుస్సేన్సాగర్లో గురువారం(జూన్ 2న) ఆకాశంలో మిరుమిట్లు గొలిపే రంగురంగుల కాంతులు వెదజల్లే బాణాసంచాతో ఆకాశానికి హరివిల్లులు అద్దేందుకు పర్యాటక శాఖ ‘ఫైర్వాల్’ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. రాత్రి 8.30 నుంచి 9 గంటల పాటు బాణాసంచా, మతాబుల వెలుగుల్లో సాగర పరిసరాలు కొత్త అందాలు సంతరించుకోనున్నాయి. చారిత్రక సంపద, వారసత్వ కట్టడాలు, సంస్కృతికి ఆలవాలమైన భాగ్యనగర సాంస్కృతిక ఔన్నత్యాన్ని దశదిశలా చాటేందుకు కవ్వాలి, గజల్, ముషాయిరా వంటి సాహితీ సమ్మేళనాలను నగర వ్యాప్తంగా ముఖ్యమైన ఆడిటోరియాల్లో ఏర్పాటు చేయనున్నారు. పీపుల్స్ప్లాజాలో 500 మంది కళాకారులతో పేరిణీ నృత్య సమ్మేళనాన్ని ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర స్థాయిలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులను ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఘనంగా సన్మానిస్తారు. పరేడ్గ్రౌండ్స్లో నిర్వహించనున్న కార్యక్రమంలో తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సన్మానించనున్నారు. హైటెక్సిటీలోని హెచ్ఐసీసీలో ఎంపికచేసిన ప్రముఖలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖాముఖి నిర్వహించనున్నారు. లుంబినీ పార్కులో అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. సంజీవయ్యపార్కులో అతిపెద్ద జాతీయ జెండా ఎగురవేయనున్నారు. నగరంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో తెలంగాణ వంటకాలతో ఫుడ్ఫెస్టివల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. హోటళ్ల అలంకరణ అత్యున్నతంగా ఉండాలని యాజమాన్యాలకు సూచించారు. అలంకరణ బాగున్న హోటళ్లను ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వం నగదుతో సత్కరించనుంది. తొలిస్థానంలో నిలిచిన వారికి రూ.లక్ష, ద్వితీయ బహూమతి కింద రూ.50 వేలు, తృతీయ బహుమతి కింద రూ.25 వేల నగదుతో సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో.. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల కోసం జీహెచ్ఎంసీ అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాన రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలను రంగురంగుల విద్యుత్దీపాలు, పూలతో తీర్చిదిద్దుతోంది.వంద జంక్షన్లలో 2247 ఫ్లడ్ లైట్లు, 530 రంగు రంగుల విద్యద్దీపాలతో పాటు ఆయా ప్రాంతాల్లో 240 హాలోజన్, 1721 పార్క్యాన్స్ లైట్లతో నగరాన్ని నయనానందకరంగా అలంకరించనున్నారు. వందరోజులప్రణాళికలో భాగంగా పూర్తిచేసిన బీటీరోడ్లకు లేన్ మార్కింగ్ , రేడియం స్టడ్ల పనులు ముమ్మరం చేశారు. ఎక్కడా చెత్త కనబడకుండా ప్రధాన మార్గాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ అన్ని జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో పతాకావిష్కరణలు చేయాల్సిందిగా జనార్దన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఉత్సవాలు జరిగే గన్పార్కు, ట్యాంక్బండ్, సంజీవయ్యపార్కు, నెక్లెస్రోడ్, పరేడ్గ్రౌండ్లకు వెళ్లే అన్ని మార్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జలమండలి .. జలమండలి పరిధిలోని అన్ని సెక్షన్, డివిజన్ కార్యాలయాలను సర్వాంగ సుందరంగా విద్యుద్దీపాలతో అలంకరించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎండీ దానకిశోర్ తెలిపారు. బోర్డులో సుదీర్ఘ సేవలందించిన రిటైర్డ్ ఉద్యోగులను సన్మానించేందుకు ఇంజినీర్స్ అసోసియేషన్ ఏర్పాట్లు చేస్తోంది. మైనార్టీ సంక్షేమ శాఖ .... జూన్ 2న జష్నే తెలంగాణ పేరుతో మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక వేడుకలకు సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వర్షాల కోసం పాతబస్తీలోని మక్కామసీదు, సికింద్రాబాద్లోని సీఎస్ఐ చర్చి, అమీర్పేటలోని గురుద్వార్లలో పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనల కోసం ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. నాంపల్లిలోని అనీస్-ఉల్-గుర్భా అనాథాశ్రమం లో పండ్లు, మిఠాయిల పంపిణీ కార్యక్రమం చేపట్టనుంది. సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనుంది. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, అధికారులు.. నగరంలో జరగనున్న పలు కార్యక్రమాల ఏర్పాట్లను పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు మంగళవారం పరిశీలించారు. సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేయనున్న భారీ జెండాను పరిశీలించారు. దేశం గర్వ పడేలా 303 అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఎగురవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. లుంబీనీ పార్కులో అమరవీరుల స్థూపానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారని, ఇక్కడ తెలంగాణ పోరాటానికి సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచే విధంగా హాలు నిర్మిస్తామన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ వేడుకల్లో నగరం నలుమూలల నుంచి ప్రజలు నెక్లెస్రోడ్, ట్యాంక్బండ్, పీపుల్స్ప్లాజా, లుంబినీపార్క్కు తరలివస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఎక్కడా అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
ప్లాన్ పిటీ
లక్ష్యం చేరని ‘100 రోజులు’ కార్యాచరణ ప్రణాళిక వందకు 34 మార్కులే... 26 పనుల్లో 12 మాత్రమే పూర్తిచేసిన జీహెచ్ఎంసీ.. జలమండలిలోనూ అంతంతే భాగ్యనగర రూపురేఖలు సమూలంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక మేడిపండు చందమే అయ్యింది. వంద రోజుల ప్రణాళికకు వంద మార్కులు కేటాయిస్తే..ప్రస్తుత అంచనా మేరకు దక్కింది 34 అత్తెసరు మార్కులే. రాష్ట్ర మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రకటించిన ఈ మహా ప్రణాళిక అమలులో జీహెచ్ఎంసీ అధికారులు చతికిలపడ్డారు. జలమండలి అధికారులు అప్పటికే ప్రారంభించిన పనులకు వందరోజుల ముసుగు తొడిగి మమ అనిపించేశారు. చేయగలిగిన పనులు మాత్రమే ప్రణాళికలో పొందుపరచాల్సిందిగా మంత్రి సూచించినప్పటికీ, అత్యుత్సాహంతో 26 పనుల్ని ప్రణాళికలో పొందుపరచి బల్దియా అధికారులు అభాసుపాలయ్యారు. ఇందులో మహా అయితే 12 పనుల్ని మాత్రమే పూర్తిచేశారు. స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో హడావుడి చేసిన మహానగర పాలక సంస్థ సిబ్బంది...కనీసం పబ్లిక్ టాయ్లెట్లను వినియోగంలోకి తేలేకపోవడం ఈ ప్రణాళిక అమలులో డొల్లతనం స్పష్టమవుతోంది. ఖాళీ స్థలాలకు ప్రహరీలు, పార్కుల్లో పిల్లల ఆటసామాగ్రి వంటి చిన్నచిన్న పనులను పూర్తిచేయడంలోనూ విఫలమవడం గ్రేటర్ పిటీ. ఇక జలమండలి ఆధ్వర్యంలో చేపట్టిన పనులదీ అదే తీరు. హుస్సేన్సాగర్లో పారిశ్రామిక వ్యర్థజలాలు చేరకుండా చేపట్టిన నాలా మళ్లింపు పనులు సహా మరో 11 ముఖ్యమైన పనులకు వందరోజుల ముసుగు తొడిగి.. పని పూర్తయినట్లు సంబురాలు చేసుకోవడం గమనార్హం. జీహెచ్ఎంసీ, జలమండలి ఆధ్వర్యంలో చేపట్టిన ‘వంద రోజుల ప్రణాళిక’ అమలు తీరుపై.. ‘సాక్షి’ ఫోకస్.. హైదరాబాద్ పట్టణం నగరమై.. నగరం మహానగరమై దాదాపు 125 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. కోటిమంది జనాభాతో కిక్కిరిసింది. 150 మంది కార్పొరేటర్లతో ప్రత్యేక పాలకమండలి.. అధికార యంత్రాంగం అభివృద్ధికోసం నిరంతరం శ్రమిస్తున్నారు (అలా అనుకోవాలి). ప్రపంచ ప్రసిద్ధి చెందిన పరిశ్రమలకు కేంద్రమైంది. ప్రపంచ నగరిగా విస్తరిస్తోంది. ఇన్ని గొప్ప లక్షణాలున్న భాగ్యనగరం మౌలిక సౌకర్యాల భాగ్యానికి మాత్రం నోచుకోలేదు. చాలావరకు వందల ఏళ్ల క్రితం నిజాములు ఏర్పాటు చేసిన వసతులే ఉన్నాయి. నగర రూపురేఖలు మార్చాలని ప్రపంచ గొప్ప నగరాల సరసన మనమూ నిలవాలని రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ ‘వంద రోజుల ప్రణాళిక’కు జీవం పోశారు. దీంతో సిటీ అద్భుతంగా మారిపోతుందని అంతా భావించారు. జీహెచ్ఎంసీ అధికారులు ఆర్భాటంగా పనులు ప్రారంభించారు. తర్వాత ఆరంభ శూరత్వంగా మిగిల్చారు. గతంలో చేపట్టిన పనులకు ‘వంద’ రోజుల ముసుగు వేశారు. ప్రణాళికను ప్రకటించి ‘వంద’రోజులు పూర్తయిన నేపథ్యంలో ప్రకటించిన 26 పనుల అమలు తీరుపై ‘సాక్షి’ ఫోకస్.. - సాక్షి, సిటీబ్యూరో వార్డు/ఏరియా కమిటీలు వార్డు కమిటీల ఎన్నికలకు మార్చి 9న ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీని ప్రకారం మే 28న ఎన్నికలు పూర్తి కావాల్సి ఉన్నా జరగలేదు. అధికార పార్టీకి తగినంత మంది సభ్యుల బలమున్నప్పటికీ, కోరం లేని కారణంగా ఈ ఎన్నికకు సంబంధించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం వాయిదా వేశారు. మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఎంఐఎంతో ఈ కమిటీలకు సంబంధించి పొత్తు కుదరకపోవడమే ఇందుకు కారణం. మరోవైపు వార్డు కమిటీ సభ్యత్వాలను సైతం అధికార పార్టీ కార్పొరేటర్లు లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బేరసారాలు పూర్తి కానందునే కోరం లేకుండా వాయిదా వేసుకున్నారనే విమర్శలూ ఉన్నాయి. ప్రయోజనం లేని పూడికతీత.. వర్షం వస్తే నాలాలు పొంగి పోర్లుతున్నాయి. రోడ్లు నీట మునుగుతున్నాయి. ఇందుకు వేసవిలోనే నాలాల్లో పూడికతీత పనులు పూర్తి కాకపోవడమని గుర్తించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రూ. 22.79 కోట్లతో 826 కి.మీ. మేర 317 పనులు చేయాల్సి ఉంది. కానీ 285 పనులు మాత్రమే పూర్తి చేశారు. ఆయా ప్రాంతాల్లో పూడికను బయటకు తీసి నాలా పక్కనే వేసి వదిలేశారు. దీన్ని డంపింగ్ యార్డుకు తరలించక పోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు తిరిగి మళ్లీ నాలాల్లోకే చేరింది. దీంతో చేసిన పనులకూ ప్రయోజనం లేకుండా పోయింది. బీటీ రోడ్లు సగం ప్రజా రవాణా సదుపాయాలు మెరుగు పరిచేందుకు రోడ్లు బాగుచేయాలని ప్లాన్లో పేర్కొన్నారు. ఇందుకు రూ. 200 కోట్లతో 569 రహదారుల పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. కానీ 250 పనులే పూర్తి చేశారు. దీంతో షరా మామాలే.. నాలుగు చినుకులు పడితే రహదారులు కుంటలను తలపించే పరిస్థితి. ఎగుడు దిగుడు ప్రయాణాలతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. శ్మశాన వైరాగ్యం.. ప్రణాళికలో భాగంగా రూ.10 కోట్లతో పది శ్మశానవాటికలను అభివృద్ధి చేయాలని తలపెట్టారు. కానీ ఒక్క శ్మశానవాటికలోనే పని జరిగింది. మిగతా తొమ్మిదింటినీ గాలికి వదిలేశారు. శ్మశానవాటికల్లో సదుపాయాలు మెరుగుపరచి, అంత్యక్రియలకు హాజరైన వారికి పరిసరాలు ప్రశాంతతనిచ్చేలా పచ్చని మైదానాలు.. దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు వంటి ఏర్పాట్లు చేయాలన్న లక్ష్యం నీరుగారింది. బస్బేల అభివృద్ధి తుస్.. నగరంలో బస్టాప్ ఒక చోట ఉంటే, బస్సులు మరోచోట ఆగుతాయి. ప్రయాణికులు ఆగిన బస్సును అందుకోవాలని పరిగెత్తేలోగా అది వెళ్లిపోతుంది. మరో బస్సుకోసం గంటల తరబడి వేచి చూడాల్సిందే. ఈ పరిస్థితి మార్చేందుకు నిర్ణీత ప్రదేశంలో బస్సులాగే విధంగా.. ప్రయాణికులు సౌకర్యవంతంగా బస్సు ఎక్కేందుకు వీలుగా 50 బస్బేలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ. 3 కోట్ల నిధులు విడుదల చేశారు. వీటిల్లో 20 కూడా పూర్తి చేయలేకపోయారు. ప్రజల ‘అత్యవసర’ పనులు తీర్చుకునేందుకు బహిరంగ ప్రదేశాలను పాడుచేయకుండా చూసేందుకు వందరోజుల్లో వంద ‘పబ్లిక్ టాయిలెట్ల’ను అందుబాటులోకి తెస్తామన్నారు. పనులు ఆలస్యం కాకూడదని ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్లను కూడా కొనుగోలు చేశారు. కానీ, ప్రజలకు సదుపాయం మాత్రం కల్పించలేకపోయారు. టాయిలెట్లయితే ఉన్నాయి. వాటి నిర్వహణ ఎవరికి అప్పగించాలో అర్థంకాక నిరుపయోగంగా వదిలేశారు. నిర్వహణ కాంట్రాక్టు కోసం టెండర్లు పిలిచారు. ప్రకటనల ఏర్పాటు ద్వారా వచ్చే ఆదాయంతో జీహెచ్ఎంసీయే నిర్వహించాలని ఒకసారి, ప్రకటనల ఆదాయాన్ని కాంట్రాక్టు సంస్థలే పొందేలా ఎవరు ఎక్కువ కాలం నిర్వహించేందుకు ముందుకు వస్తే వారికి అప్పగించాలని మరో సారి.. కాంట్రాక్టు ఏజెన్సీల డిమాండ్లు అడ్డగోలుగా ఉండటంతో ఎక్కడ ఉన్న టాయిలెట్లను వాటికి సమీపంలోని వ్యాపారులకే నిర్వహణ కివ్వాలని మరోసారి.. రకరకాల ఆలోచనలతోనే వంద రోజులు కరిగిపోయాయి. లక్ష్యం చేరని ఆటో టిప్పర్లు ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించేందుకు 2 వేల స్వచ్ఛ ఆటో టిప్పర్లు వినియోగంలోకి తేవాలని భావించారు. 1790 ఆటోల కొనుగోలు పూర్తయినా, వాటిలో కొన్ని చెత్త సేకరణ పనులు చేయడం లేదు. వాటిని అమ్ముకున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. దీనిపై విచారణ చేసి ఒక సర్కిల్వి మరో సర్కిల్లో పనిచేస్తున్నాయని, మాయం కాలేదని ప్రకటించారు. సమీపంలో చెత్త రవాణా కేంద్రాలు లేకపోవడంతో, ఎక్కువ దూరంలోని కేంద్రానికి వెళ్లి రావాల్సి ఉండటం వంటి సమస్యలతో నగరంలోని అన్ని ఇళ్లకూ ఈ ఆటోలు వెళ్లడం లేదు. ప్రభావం చూపని ప్రహరీలు గ్రేటర్లో ఖాళీగా ఉన్న 350 ప్రభుత్వ స్థలాలకు రూ. 20 కోట్లతో ప్రహరీలు నిర్మిస్తామన్నారు. ఇందులోనూ 89 మాత్రమే పూర్తి చేయగలిగారు. ఈస్ట్ జోన్లో 93 పనులకు 31 పనులు పూర్తి కాగా, సౌత్జోన్లో 30కి 10, సెంట్రల్ జోన్లో 32 పనులకు 7, వెస్ట్జోన్లో 87 పనులకు 21, నార్త్ జోన్లో 108 పనులకు 20 పనులు మాత్రమే పూర్తయ్యాయి. ‘డబ్బాలు’ కొట్టారు.. వంద రోజుల ప్రణాళికకు ముందే చెత్త సేకరణకు ఇంటింటికీ రెండు చెత్త డబ్బాల చొప్పున మొత్తం 44 లక్షల డబ్బాలను పంచాలని నిర్ణయించారు. ప్రణాళికను ప్రకటించే సమయానికి 14.22 లక్షల డబ్బాలు మాత్రమే పంపిణీ చేయాల్సి ఉంది. మిగతావి అప్పటికే పంపిణీ చేసేశారు. దీన్ని తెచ్చి ‘ప్లాన్’లో చేర్చారు. అయితే, వంద రోజులైనా ఇంకా పదివేల డబ్బాలను పంపిణీ అలాగే ఉండిపోయింది. చెత్త కేంద్రాల తొలగింపు ఓకే.. బహిరంగ ప్రదేశాల్లో చెత్త కుప్పలు లేకుండా చేసేందుకు 1116 ప్రదేశాలను ‘చెత్త రహితం’గా చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆయా ప్రదేశాల్లోని చెత్తను తొలగించడమే కాక, అక్కడ తిరిగి చెత్త వేయకుండా అందమైన ముగ్గులు, స్వచ్ఛ భారత్ నినాదాలతో వర్ణ చిత్రాలు వేస్తూ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారు. అయినప్పకీ ఇప్పటి వరకు అన్ని ప్రాంతాల్లో పూర్తి చేయలేకపోయారు. దాదాపు 960 ప్రాంతాల్లో ఈ పనులు చేశారు. ‘స్లాటర్ హౌస్’లకు ప్లాన్ ముసుగు వందరోజుల్లో చెంగిచెర్లలోని రెండరింగ్ ప్లాంట్తో పాటు నాలుగు మోడర్న్ స్లాటర్ హౌస్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. వీటిలో మూడింటికి మున్సిపల్ మంత్రి లాంఛనంగా ప్రారంభోత్సవాలు చేశారు. వాస్తవానికి వీటి నిర్మాణ పనులు వంద రోజుల ప్రణాళిక ప్రకటించే నాటికే పూర్తయ్యాయి. కొన్నింటికి గత పాలకమండలిలోనే అప్పటి మేయర్ మాజిద్ సైతం లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. బస్కీలు తీస్తున్న జిమ్లు వందరోజుల్లో 150 ప్రాంతాల్లో యువతకు ఉపకరించేలా తగిన సామగ్రితో జిమ్లు ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. కాగా, దాదాపు 50 ప్రాంతాల్లో సివిల్ వర్క్స్ మాత్రం జరిగాయి. మిగతా వాటిల్లో జరగలేదు. సివిల్ వర్క్స్ పూర్తయ్యాక జిమ్ సామగ్రిని అమర్చాల్సి ఉంది. ఇదిలా ఉండగా, 329 క్రీడా ప్రాంగణాల అభివృద్ధి లక్ష్యం కాగా, ప్రాథమిక పనులు మాత్రం జరిగాయి. మో‘డల్’ మార్కెట్లు.. నగరంలో 40 మోడల్ మార్కెట్లను నిర్మించాలని తలంచారు. ఇందుకు రూ. 26 కోట్లు అవసరమని అంచనా వేశారు. నిర్మాణ పనులు ప్రారంభించినప్పుడే పూర్తయినట్టు గొప్పలు చెప్పారు. రోజులు గడిచిపోయినా ఐదు కూడా పూర్తి చేయలేకపోయారు. ఈస్ట్ జోన్లో 9, సౌత్జోన్లో 5, సెంట్రల్ జోన్లో 9, వెస్ట్ జోన్లో 8, నార్త్జోన్లో 9 నిర్మాణం జరగాల్సి ఉండగా, ఈస్ట్, వెస్ట్, సౌత్జోన్లలో ఒక్కొక్కటి వంతున పూర్తయ్యాయి. -
కనెక్షన్లో కాసుల వేట
గ్రీన్బ్రిగేడ్ సిబ్బంది నిర్వాకం చేయి తడపకుంటే చుక్కలే.. రూ.25 వేల వరకు అక్రమ వసూళ్లు నిఘా పెట్టాలని వినియోగదారుల విజ్ఞప్తి సిటీబ్యూరో: సురేష్ ఆసిఫ్నగర్ డివిజన్ పరిధిలో నివాసం ఉంటున్నాడు. ఇటీవలే నూతన నల్లా కనెక్షన్ పొందేందుకు ఆన్లైన్లో జలమండలికి దరఖాస్తు చేసుకున్నాడు. తన ఇంటి విస్తీర్ణాన్ని బట్టి కనెక్షన్ చార్జీలు సైతం చెల్లించాడు. దీంతో బోర్డు అధికారులు అతనికి నల్లా కనెక్షన్ మంజూరు చేశారు. కానీ కనెక్షన్ ఇచ్చే గ్రీన్ బ్రిగేడ్ సిబ్బంది మాత్రం రూ.5 వేలు ఇవ్వకుంటే కనెక్షన్ వేసేది లేదని చెప్పడంతో సురేష్ విస్తుబోయాడు. దరఖాస్తుతో పాటే తాను కనెక్షన్ చార్జీలు చెల్లించినట్లు చెప్పినా వారు వినలేదు. చేసేదిలేక వారి చేతిలో డబ్బు పెట్టి కనెక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇది సురేష్ ఒక్కరి సమస్య మాత్రమే కాదు.. కొత్తగా నల్లా కనెక్షన్ తీసుకుంటున్న ప్రతి వినియోగదారుడిదీ. జలమండలి పరిధిలో నెలకు సుమారు మూడువేల మందికి నూతన నల్లా కనెక్షన్లు మంజూరు అవుతున్నాయి. ఇక్కడి దాకా బాగానే ఉన్నా కనెక్షన్ ఇచ్చే సిబ్బంది కనెక్షన్ బిగించే సమయంలో వియోగదారుల జేబులు ఖాళీ చేస్తున్నారు. ఇంటి విస్తీర్ణాన్ని బట్టి రూ.5 వేలు నుంచి రూ.25 వేల వరకు పిండుకోవడం ఆందోళన కలిగిస్తోంది. దొరికినంత దోచుకో.. నల్లా కనెక్షన్ల జారీలో కాసుల వేటతో వినియోగదారుల జేబులు గుల్లవుతున్నాయి. జలమండలి గ్రీన్బ్రిగేడ్ సి బ్బంది చేస్తున్న నిర్వాకాలతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లా కనెక్షన్కు దరఖాస్తు చేసుకునే సమయంలోనే ఇంటి నిర్మాణ స్థలం, అంతస్తులు, పోర్షన్ల సంఖ్యను బట్టి బోర్డు నిర్దేశించిన మేరకు చార్జీలు చెల్లిస్తున్నారు. ఆ తరవాత కనెక్షన్ మంజూరు అవుతుంది. ఇంటికి నల్లా వేసే సమయంలో కనెక్షన్లు ఇచ్చే గ్రీన్బ్రిగేడ్ సిబ్బంది వినియోగదారులకు చుక్కలు చూపుతున్నారు. దీనిపై ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆసిఫ్నగర్, మెహిదీపట్నం, సికింద్రాబాద్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో జలమండలికి నిర్ణీత మొత్తంలో కనెక్షన్ చార్జీలు చెల్లించినప్పటికీ తమకు అడిగినంత ఇవ్వనిదే కనెక్షన్ ఇచ్చేది లేదంటూ పలువురు గ్రీన్బ్రిగేడ్ సిబ్బంది అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోర్డు మంజూరు చేసిన పై పులను సైతం విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రీన్బ్రిగేడ్ సిబ్బంది ఆగడాలపై ఉన్నతాధికారుల నిఘా లేకపోవడంతో ఈ భాగోతం యథేచ్ఛగా సాగుతుండడం గమనార్హం. నెలకు మూడు వేల కనెక్షన్లు.. జలమండలి పరిధిలో ప్రస్తుతం 8.75 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా నిత్యం 356 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్నారు. కాగా, ప్రతి నెలా నీటి సరఫరా వ్యవస్థ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో మూడువేల నూతన నల్లా కనెక్షన్లను బోర్డు మంజూరు చేస్తోంది. వీటి ఏర్పాటుకు సుమారు 125 గ్రీన్బ్రిగేడ్ బృందాలు అందుబాటులో ఉన్నాయి. ఈ బృందాల్లో పలువురు ప్రతి కొత్త కనెక్షన్కు.. భవనం, ప్రాంతాన్ని బట్టి రూ.25 వేల వరకు అదనంగా దండుకోవడం గమనార్హం. వీరిపై అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గ్రీన్బ్రిగేడ్ సిబ్బంది ఆగడాలపై విజిలెన్స్ నిఘా పెట్టాలని కోరుతున్నారు. -
ప్రక్షాళన షురూ..
మురుగునీటి పైపులైన్ల ప్రక్షాళనకు రంగం సిద్ధం.. జూన్10లోగా పనులు పూర్తిచేయాలని ఎండీ దానకిశోర్ ఆదేశం.. 16 డివిజన్లకు రూ.2.31 కోట్లు కేటాయింపు.. సిటీబ్యూరో: గ్రేటర్లో చిన్నపాటి వర్షానికే ఉప్పొంగుతున్న మురుగునీటి పైపులైన్లు, మ్యాన్హోళ్ల ప్రక్షాళనకు ఎట్టకేలకు జలమండలి నడుం బిగించింది. మహానగర పరిధిలోని సుమారు ఐదు వేల కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన మురుగునీటి పైపులైన్లలో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న పూడికను జూన్ 10లోగా యుద్ధప్రాతిపదికన తొలగించాలని ఎండీ దానకిశోర్ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు ప్రీమాన్సూన్ యాక్షన్ ప్లాన్ను సోమవారం ఖరారు చేశారు. పనులు చేపట్టేందుకుగాను 16 నిర్వహణ డివిజన్ల పరిధిలో రూ.2.31 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. నిర్వహణ డివిజన్ల వారీగా చీఫ్ జనరల్ మేనేజర్లు తమకు కేటాయించిన బడ్జెట్ మేరకు పనులను గుర్తించి ఈ-ప్రొక్యూర్మెంట్ విధానంలో తక్షణం టెండర్లు పిలవాలని ఆదేశించారు. చేపట్టాల్సిన పనులు ఇవే.. లోతట్టు ప్రాంతాలు, తరచూ నీటమునిగే ప్రాంతాలు, మురుగు ప్రవాహానికి అడ్డుగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో మ్యాన్హోళ్లు, మురుగునీటి పైపులైన్ల పూడికను తొలగించాలి. పనులు చేపట్టాల్సిన ప్రాంతాలను తక్షణం గుర్తించి, కార్యాచరణ సిద్ధంచేయాలి. పనుల ప్రారంభానికి ముందు స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ల అనుమతి తీసుకోవాలి. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో జీఎంలు,సీజీఎంలు పర్యటించి ఫోటోలు తీసి సీడీల రూపంలో బిల్లులతో సహా బోర్డుకు సమర్పించాలి. ఎయిర్టెక్ యంత్రాల సాయంతో పూడిక తొలగించాలి. {పతి స్టోరేజి రిజర్వాయర్ వద్ద అవసరమైన మేరకు క్లోరినేషన్ ప్లాంట్లును జూన్1 లోగా ఏర్పాటు చేయాలి. 600 ఎంఎం డయా వ్యాసార్థం దాటిన మురుగునీటి మ్యాన్హోళ్లపై సేఫ్టీగ్రిల్స్ ఏర్పాటు చేయాలి. 29 అత్యవసర బృందాలకు అవసరమైన యంత్రసామాగ్రిని సమకూర్చాలి. ఒక్కో బృందంలో పదిమంది సభ్యులుండాలి. వారికి అవసరమైన వాహనం సమకూర్చాలి. జూన్-ఆగస్టు మధ్యకాలంలో అత్యవసర బృందాలు మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో రంగంలోకి దిగి పనులు చేపట్టాలి. జూన్-ఆగస్టు మధ్యకాలంలో ఖైరతాబాద్లోని బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ ఎమర్జెన్సీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్కు అందిన ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలి. ఫిర్యాదుల స్వీకరణకు షిఫ్టులవారీగా సిబ్బంది అందుబాటులో ఉండాలి. ఒక డీజీఎం ఈ సెల్ను పర్యవేక్షించాలి. సెంట్రల్ స్టోర్ డివిజన్ నుంచి 29 అత్యవసర బృందాలకు అవసరమైన సాధనాసంపత్తి,యంత్రాలను సమకూర్చాలి. -
మహా గండం!
సిటీబ్యూరో: మహానగర దాహార్తిని తీరుస్తున్న గోదావరి పైపులైన్లకు అడుగుకో గండం పొంచి ఉంది. ఈ జలాలు తమకూ పంచాలని సమీప గ్రామాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. గ్రేటర్కు తాగునీరు అందించేందుకు కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి జలాశయం నుంచి నగర శివారు ఘన్పూర్ వరకు 186 కిలోమీటర్ల మేర పైపులైన్ వేశారు. ఈ మార్గంలో నిత్యం 86 మిలియన్ల గోదావరి జలాలను సిటీకి తరలిస్తున్నారు. ఈ పైపులైన్కు ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు తమకు తాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా పైపులైన్ల వాల్వ్లు తొలగించి మరీ నీటిని మళ్లించుకుంటున్నారు. తాజాగా (శుక్రవారం) కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం పూసల గ్రామంలో ఆ జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ చర్యకు పాల్పడ్డారు. పైపులైన్కు ఉన్న బటర్ఫ్లై వాల్వ్ కవర్ను తొలగించి నీటిని సమీప చెరువు, కుంటలకు మళ్లించుకున్నారు. దీన్ని పసిగట్టిన జలమండలి సిబ్బంది తొలగించిన వాల్వ్ కవర్ను బిగించడంతో ప్రమాదం తప్పింది. కాగా, ప్రస్తుతం మంజీరా, సింగూరు, హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాలు వట్టిపోవడంతో ఇపుడు కృష్ణా గోదావరి జలాలే నగర గొంతు తడుపుతున్నాయి. కృష్ణా మూడు దశల ద్వారా 270 మిలియన్ గ్యాలన్లు, గోదావరి ద్వారా 86 ఎంజీడీలు వెరసి రోజుకు 356 ఎంజీడీల నీటిని జలమండలి నగరంలోని 8.75 లక్షల నల్లాలకు అందిస్తోంది. మహానేత చొరవతో.. నగర నీటి అవసరాల కోసం కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి నగర శివారు ఘన్పూర్ వరకు గోదావరి మంచినీటి పథకం మొదటిదశ (మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ సుజలస్రవంతి) పథకాన్ని రూ.3800 కోట్లతో పూర్తి చేశారు. దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో 2008లో మొదలైన ఈపనులు 2015 నాటికి సాకారమయ్యాయి. ఈ జలాల రాకతో నగరంలోని కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ తదితర నియోజకవర్గాలకు తాగునీటి కష్టాలు తీరాయి. తాజాగా ఈ పైపులైన్లకు అడుగుకో గండం నెలకొనడంతో నగర తాగునీటి అవసరాలకు తరలిస్తున్న నీటికి గండి పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ రెండు జిల్లాల నుంచే వత్తిడి సిటీకి తరలిస్తున్న గోదావరి జలాలు కరీంనగర్, మెదక్ జిల్లాల మీదుగా వస్తున్నాయి. అయితే, తమ ప్రాంతం నుంచి వెళుతున్నందున ఆ నీటితో తమ దాహార్తిని కూడా తీర్చాలని పైపులైన్లకు ఆనుకొని ఉన్న పలు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా గోదావరి జలాలను శుద్ధి చేస్తున్న కొండపాక మంచినీటి శుద్ధి కేంద్రం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్కు తాగునీటిని తరలిస్తుండడంతో మిగతా నియోజకవర్గాలకు కూడా తాగునీటిని తరలించాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఆయా ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనడంతో పశువులకు సైతం తాగునీరు దొరకడం లేదు. దీంతో పైప్లైన్ వాల్వ్లను తొలగించక తప్పడంలేదని స్థానికులు చెబుతున్నారు. బాధ్యులపై క్రిమినల్ కేసు గోదావరి పైపులైన్లకున్న వాల్వ్లు, వాటి కవర్లు తొలగించి నీటిని మళ్లిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని జలమండలి వర్గాలు స్పష్టం చేశాయి. గతంలో జరిగిన సంఘటనలతో పాటు తాజా ఘటనకు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని తెలిపాయి. భారీ పైపులైన్లకు ఉన్న వాల్వ్ కవర్లను తరచూ తొలగిస్తుండడంతో పైపులైన్ల ద్వారా తరలిస్తున్న తాగునీరు పలు చోట్ల లీకవుతోం దని.. లీకేజీని అరికట్టాలంటే ఒకరోజు నగరానికి గోదావరి నీటి సరఫరాను నిలిపివేయాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. ప్రస్తుత తరుణంలో నగరంలో తాగునీటి డిమాండ్ అధికంగా ఉన్నందున సరఫరా నిలిపివేసే పరిస్థితి లేదు. ఇక వర్షాకాలంలోనే ఈ లీకేజీలకు మరమ్మతులు చేపట్టనున్నారు. -
అవినీటి వ్యాపారం
దారితప్పించి.. హోటళ్లకు ట్యాంకర్ల తరలింపు రూ. కోట్లలో నీటి వ్యాపారం శివారులో క‘న్నీటి’కష్టాలు బస్తీల్లో వారాకి ఒకరోజు సరఫరా నగరంలో నీటి వ్యాపారం ‘మూడు ట్యాంకర్లు.. ఆరు ఫిల్టర్ప్లాంట్లు’ అన్నట్లుగా కొనసాగుతోంది. అసలే వేసవి ఎండలతో భూగర్భజలం అడుగంటింది. శివారు ప్రాంతాల్లో లక్షలాది మందికి జలమండలి నల్లా కనెక్షన్లు లేక...మంచినీళ్లు దొరక్క నానాపాట్లు పడుతున్నారు. బస్తీలకు వెళ్లాల్సిన మంచినీటి ట్యాంకర్లు బడాబాబులకు, వాణిజ్య సంస్థలకు తరలుతున్నాయి. దీంతో నిరుపేదల గొంతెండుతోంది. తప్పనిసరి పరిస్థితిలో జనం ప్రైవేట్ ట్యాంకర్లను, ఫిల్టర్ ప్లాంట్లను ఆశ్రయిస్తున్నారు. తద్వారా నెలకు దాదాపు రూ.100 కోట్లకు పైగానే నీటికోసం వెచ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో శివారు ప్రాంతాల్లోని నీటి సమస్యపై సాక్షి ఫోకస్.... - సాక్షి, సిటీబ్యూరో సిటీబ్యూరో: జలమండలి మంచినీటి సరఫరా వ్యవస్థ లేని శివారు ప్రాంతాలు మండువేసవిలో తాగునీటికి విలవిల్లాడుతున్నాయి. బస్తీలకు వెళ్లాల్సిన మంచినీటి ట్యాంకర్లు బడాబాబులకు, వాణిజ్య సంస్థలకు సరఫరా అవుతుండడంతో నిరుపేదల గొంతెండుతోంది. జలమండలి నల్లా కనెక్షన్లేని లక్షలాది కుటుంబాలు ప్రైవేటు ట్యాంకర్నీళ్లు, ఫిల్టర్ప్లాంట్లు విక్రయిస్తున్న నీటిని ఆశ్రయించి నెలకు రూ.వంద కోట్లకు పైగానే ఖర్చు చేయక తప్పని దుస్థితి తలెత్తింది. కన్నీటి కష్టాలివిగో.. కాప్రా సర్కిల్ పరిధిలోని సాయిరాంనగర్, సాయిబాబానగర్, ఇందిరానగర్, ఆర్టీసీ కాలనీ, శ్రీశ్రీనగర్, వంపుగూడ, వినాయక్నగర్, శాంతివి హార్, అయోధ్యనగర్, గ్రీన్పార్కు, న్యూ శ్రీనివాసన గర్, గణేష్నగర్, నెహ్రూనగర్, సోనియాగాంధీనగర్, ఆదర్శ్నగర్, ఇందిరమ్మ గహకల్ప, బీఎన్రెడ్డినగర్, బీజేఆర్నగర్, హనుమాన్నగర్, భరత్నగర్, గోకుల్నగర్, బాబానగర్, ఏపీపుడ్స్ గుడిసెలు, అనాధ హాస్టల్, బ్రహ్మపురి కాలనీ సహా మొత్తం 30 బస్తీలు ఉన్నాయి. ఇక్కడ 50 వేల మందికిపైగా నివసిస్తున్నారు. 27 టా ్యంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. ఒక్కో ట్యాంకర్ రోజుకు 8 ట్రిప్పులు వేయాలి. కానీ నాలుగుతోనే సరిపెడుతున్నారు. మిగిలినవి గుట్టుచప్పుడు కాకుండా దారి మళ్లిస్తున్నారు. సాయిబాబానగర్లో ‘మాకు నా లుగు రోజులకు ఒక ట్యాంకర్ రావాల్సి ఉండగా అది ఎప్పుడొస్తుందో ఎప్పుడు రాదో తెలియదు. దీంతో నీటి కోసం పనులు మానుకోవాల్సి వస్తంది. ట్యాంకర్ నీళ్లకోసం కూలీ డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తోంది’అని కాప్రాకు చెందిన ధనమ్మ వాపోయింది. ‘రాధికా రిజర్వాయర్ రికార్డులో ట్యాంకర్ మా పాయింట్ వద్దకు వచ్చినట్లు ఉంది. కానీ అది ఎక్కడికి వెళ్లిందో తెలీదు. ఇంటికి బంధువులు వస్తే.. ఎవరైనా సంతోషిస్తారు. కానీ మా పరిస్థితి ఇందుకు భిన్నం. ఈ సమయంలో ఎందుకొచ్చారా? అని బాధపడాల్సి వస్తోంది’ అని కనకయ్య వాపోయాడు. వచ్చిన వారికి కడుపునిండా అన్నం పెట్టగలుగుతున్నాం కానీ...దాహమేస్తే మంచినీరు ఇవ్వలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బాలానగర్, ఫతేనగర్ డివిజన్ లోని వెయ్యి మందికిపైగా ఉండే కార్మికనగర్కు రోజుకు ఒక ట్రిప్పు చొప్పున, ఐదు వేల మంది కిై పెగా ఉండే లంబాడీ బస్తీలో రోజుకు నాలుగు ట్రిప్పుల చొప్పున, నవజీవన్నగర్లో రోజు విడిచి రోజు మంచినీరు సరఫరా చేస్తుండ గా, బాలానగర్, ఫతేనగర్ ఫరిధిలోని దిల్ఖుష్నగర్కు ప్రతి ఆదివారం, రాజుకాలనీలోని సాయిబాబా ఆలయం సమీపంలోని వారికి ప్రతి గురువారం మాత్రమే మంచినీరు సరఫరా చేస్తున్నారు. ఉప్పల్ శివారులోని కురుమానగర్, ఉప్పల్ హిల్స్, లక్ష్మీనర్సింహా కాలనీలకు పది రోజులకు ఒకసారి మాత్రమే ట్యాంకర్ల ద్వారా ఉచిత మంచినీరు సరఫరా అవుతోంది.నగరంలో ఒక వైపు నీటి కొరత వేధిస్తుంటే..మరో వైపు ఐడీపీఎల్,హైదర్నగర్, కుత్బుల్లాపూర్, అల్వాల్, షాపూర్నగర్, బాలా నగర్, షాపూర్నగర్లో ప్రధాన పైప్లైన్కు ఏర్పడిన లీకేజీలను అరికట్టడంలో జలమండలి అధికారులు ఘోరంగా విఫలం అవుతున్నారు. యాప్రాల్ శ్యామల లక్ష్మినగర్, రాజీవ్గహకల్ప, బర్షిపేట, కౌకూర్ కిందబస్తి కాలనీల్లో 5 రోజులకు ఒక సారి మంచినీటి ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా అవుతుంది. ఈ ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రాల వద్ద ప్రైవేటు నీటి విక్రయాలు జోరందుకున్నాయి. ఒక్కో ట్యాంకర్ రూ.1500 చొప్పున విక్రయిస్తున్నారు. గోపన్పల్లి, నానక్రాంగూడ, మాదాపూర్, కొండాపూర్, ఖానామెట్, హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ, ప్రకాశ్నగర్ తదితర ప్రాంతాలలో వాటర్ మాఫియా విస్తరించుకుంది. గోపన్పల్లి తండాలో దాదాపు 10 వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ఒక్కో వాటర్ ప్లాంటు నుంచి రోజు 20 వేల లీటర్ల నీటిని తాగు నీటి పేరిట తరలిస్తున్నారు. గోపన్పల్లిలో ఆర్ఓ ప్లాంట్ల ద్వారా తరలిస్తున్న నీటినే చాలా మంది తాగేందుకు వినియోగిస్తున్నారు. కానీ అపరిశుభ్రమైన వాతావరణంలో, ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా శుద్ధిచేసి తరలిస్తున్న ఈ నీళ్లు కలుషిత జలాలేనని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కుత్బుల్లాపూర్లో ఎలాంటి అనుమతులు లేకుండా 500కు పైగా నీటి ఫిల్టర్ ప్లాంట్లు వెలిశాయి. భగత్సింగ్నగర్, చంద్రానగర్, విజయ్నగర్కాలనీ, బోళాశంకర్ నగర్, భూమిరెడ్డి కాలనీ, సుభాష్నగర్, భాగ్యలక్ష్మికాలనీ, కురుమ బస్తీ, సీపీఆర్ కాలనీ,తదితర ప్రాంతాల్లో ఎలాంటి నాణ్యతాప్రమాణాలు లేని నీటినే క్యాన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇరుకు గదుల్లో అపరిశుభ్రమైన వాతావరణంలో నీటి ప్లాంట్లు పెట్టారు. ఇంటి అద్దెలతో సమానంగా నీటి ఖర్చు.. కొండాపూర్లోని గౌతమీ ఎన్క్లేవ్లో 55 అపార్ట్మెంట్లున్నాయి. ప్రతి రోజు 100 ట్యాంకర్ల నీళ్ల కొనుగోలుకు లక్ష రూపాయలు చెల్లిస్తున్నారు .ప్రతి అపార్ట్మెంట్కు రోజుకు కనీసం 25 వేల లీటర్ల నీళ్లు వినియోగిస్తున్నారు. వీరు ఇంటి అద్దెలతో సమానంగా నీటికి డబ్బులు చెల్లిస్తున్నారు. నిజాంపేట్లో నీటి ఎద్దడి థార్ ఎడారిని తలపిస్తోంది. ఇక్కడ 1500 బహుళ అంతస్తుల భవనాలున్నాయి. ప్రతి అపార్ట్మెంట్లో 20 ప్లాట్లున్నాయి. నిజాంపేట్లో ప్రతి రోజు 3000 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ప్రతి అపార్ట్మెంట్కు రోజుకు 2 ట్యాంకర్లు వినియోగిస్తున్నారు. ఒక్క బండారి లే అవుట్లో 225 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇక్కడ రోజుకు 400 ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా అవుతున్నాయి. ఒక్కో అపార్ట్మెంట్ వారు నీటి కోసమే నెలకు సుమారు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రతి ఫ్లాట్ యజమాని ట్యాంకర్ నీళ్లకు రూ.3 వేల చొప్పున, తాగు నీళ్ల కోసం మరో మరో రూ.600 చొప్పున ఖర్చు చేస్తున్నారు. -
నల్లా...అక్రమాలు నిలువెల్లా!
వాణిజ్య భవంతులే అధికం ఏడాదిలో ఐదు వేలు గుర్తింపు సిటీబ్యూరో: గ్రేటర్లో తవ్వినకొద్దీ అక్రమ నల్లాల భాగోతం బయట పడుతోంది. వాణిజ్య భవంతులు, హోటళ్లు, హాస్టళ్లు, మాల్స్, మెస్లు, ఫంక్షన్ హాళ్ల వంటి వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తున్న భవనాలే ఈ జాబితాలో ముందుంటున్నాయి. జలమండలి విజిలెన్స్ విభాగం వరుస తనిఖీలతో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఏడాదిలో సుమారు ఐదు వేల అక్రమ కనెక్షన్ల గుట్టు రట్టయింది. జలమండలిలోని 16 నిర్వహణ డివిజన్ల పరిధిలో 8.64 లక్షల నల్లాలు ఉన్నాయి. అదనంగా సుమారు లక్ష వరకు అక్రమంగా ఉన్నట్లు అనధికారిక అంచనా. తనిఖీలు నిర్వహించినపుడే ఇవి బయట పడుతున్నాయి. భూమి లోపల ఉన్న నీటి సరఫరా పైపులైన్లకు కన్నాలు వేసి... కొందరు అక్రమార్కులునల్లాలను ఏర్పాటు చేసుకోవడం, వాటిపై యధావిధిగా మట్టి కప్పేయడంతో పసిగట్టడం కష్టమవుతోంది.స్థానికులు ఫిర్యాదు చేసినపుడు, రెవెన్యూ సిబ్బంది తనిఖీ చేసినపుడే ఇవి బయట పడుతుండడం గమనార్హం. జలమండలి ఖజానాకు చిల్లు నగరానికి గోదావరి, కృష్ణా జలాలను అందించే పైపులైన్లకు లీకేజీలు, అక్రమ నల్లాలు శాపంగా పరిణమిస్తుండడంతో జలమండలి ఖజనాకు భారీగా గండి పడుతోంది. సరఫరా నష్టాలు 40 శాతానికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. జలమండలికి నల్లా బిల్లులు, మురుగు శిస్తు, ట్యాంకర్ నీటి సరఫరా, నూతన కనెక్షన్లతో నెలకు రూ.89 కోట్ల ఆదాయం సమకూరుతోంది. నిర్వహణ వ్యయాలు, ఉద్యోగుల జీతభత్యాలు, మరమ్మతులకు రూ.91 కోట్లు ఖర్చవుతోంది. అంటే నెలకు రూ.2 కోట్ల నష్టాన్ని భరిస్తోంది. అక్రమ నల్లాల భరతం పడితే ఆదాయం రూ.100 కోట్లకు పైగానే సమకూరుతుందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. తనిఖీలతో గుట్టు రట్టు ఇటీవలి కాలంలో రెవెన్యూ ఆదాయం పెంచుకునేందుకు బోర్డు విజిలెన్స్ బృందం నగరంలో విస్తృత తనిఖీలు చేపట్టింది. కింగ్కోఠి, కొత్తపేట, ఎల్లారెడ్డిగూడ తదితర ప్రాంతాల్లో హోటళ్లు, హాస్టళ్లకు ఉన్న అక్రమ నల్లాల గుట్టును రట్టు చేసింది. అక్రమార్కులపై స్థానిక పోలీస్ స్టేషన్లలో ఐపీసీ 269, 430 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఇదే స్ఫూర్తితో ఇతర ప్రాంతాలపై దృష్టి సారిస్తేనే సత్ఫలితాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. క్రిమినల్ కేసులు అక్రమ నల్లా కనెక్షన్లు కలిగిన వారు తమ భవన విస్తీర్ణాన్ని బట్టి నిర్ణీత కనెక్షన్ చార్జీలు, పెనాల్టీ చెల్లించి క్రమబద్ధీకరించుకోవాలని జలమండలి అధికారులు సూచిస్తున్నారు. లేని పక్షంలో క్రిమినల్ కేసులు తప్పవని స్పష్టం చేస్తున్నారు. అక్రమ నల్లాలపై జలమండలి టోల్ఫ్రీ నెంబరు 155313కి ఫోన్ చేసి వివరాలు తెలపాలని కోరుతున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు. -
నీటి కొరత రానివ్వం
జలమండలి ఎమ్డీ దానకిశోర్ బాధ్యతలు స్వీకరణ సిటీబ్యూరో: ప్రస్తుత వేసవిలో జలమండలి పరిధిలో ఉన్న నల్లా కనెక్షన్లకు కొరత లేకుండా నీటిని సరఫరా చేస్తామని బోర్డు నూతన మేనేజింగ్ డెరైక్టర్ దానకిశోర్ తెలిపారు. గురువారం ఆయన ఏసీ గార్డ్స్లోని సీడీఎంఏ కార్యాలయంలో ఎమ్డీగా బాధ్యతలు స్వీకరించారు. 1996 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆయన... 20 ఏళ్లుగా అనేక కీలక పదవీ బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. మహా నగర దాహార్తిని తీరుస్తున్న జలాశయాల్లో నిల్వలు తక్కువగా ఉన్నందున వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు. మెరుగైన సేవలందించడం, కలుషిత జలాలు, అరకొర నీటి సరఫరా, ట్యాంకర్లు, మురుగు సమస్యలపై అందిన ఫిర్యాదులను తక్షణం పరిష్కరించడమే తన ధ్యేయమన్నారు. దాహార్తితో సతమతమవుతున్నప్రాంతాలకు అదనంగా 70 ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ట్యాంకర్ బుక్ చేసుకున్న వినియోగదారులకు సుదీర్ఘ నిరీక్షణ లేకుండా చూస్తామన్నారు. వినియోగదారులకు దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. వరుస సమీక్షలు.. విస్తృత తనిఖీలు బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎమ్డీ దానకిశోర్ గురువారం సమీక్షలు, విస్తృత తనిఖీలతో బిజీగా గడిపారు. కలుషిత జలాలతో సతమతమవుతున్న మాదాపూర్, హిమాయత్ నగర్ ప్రాంతాల్లోని వివిధ కాలనీలు, బస్తీలను సందర్శించారు. స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. వాటిని తక్షణం పరిష్కరించాలని క్షేత్ర స్థాయి అధికారులను ఆదేశించారు. అనంతరం జలమండలి ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టు పనులు, వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక, నిర్వహణ పనులు, రెవెన్యూ ఆదాయం పెంపు వంటి అంశాలపై సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. డేటా బ్యాంక్ సిద్ధం చేయండి గ్రేటర్ పరిధిలో మంచినీరు, మురుగు నీటి పారుదల వ్యవస్థ ఉన్న, లేని ప్రాంతాలపై సమగ్ర డేటా బ్యాంక్ (సమాచార నిధి) సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఈడీ సత్యనారాయణ, ప్రాజెక్టు డెరైక్టర్ కొండారెడ్డి, రెవెన్యూ డెరైక్టర్ సత్యసూర్యనారాయణ, ఆపరేషన్స్ డెరెక్టర్ రామేశ్వరరావు, ఎల్లాస్వామి, సీజీఎం శ్రీధర్బాబు పాల్గొన్నారు. -
నేడు, రేపు గోదావరి నీరు బంద్
సిటీబ్యూరో: దెబ్బతిన్న వాల్వ్ మరమ్మతుల కారణంగా బుధ, గురువారాల్లో వివిధ ప్రాంతాలకు గోదావరి జలాల సరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి ఒక ప్రకటనలో తెలిపింది. కరీంనగర్ జిల్లా ముర్మూర్ వద్దనున్న పోట్యాల గ్రామంలో స్థానికులు వాల్వ్ను తొలగించి నీటిని వాడుకుంటున్నారని వెల్లడించింది. మరమ్మతులు చేపట్టేందుకు బుధవారం ఉదయం 6 నుంచి 18 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేయనున్నామని వివరించింది. దీంతో గురువారం వివిధ ప్రాంతాలకు ఆలస్యంగా నీటి సరఫరా జరిగే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలివే... ఎర్రగడ్డ, ఎల్లారెడ్డిగూడ, వెంగళరావు నగర్, యూసుఫ్గూడ, సోమాజిగూడ, వెంకటగిరి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బోరబండ, ఎస్పీఆర్హిల్స్ ఏరియా, సనత్నగర్, ప్రకాశ్నగర్, కూకట్పల్లి, కేపీహెచ్బీ, బాలానగర్, భాగ్యనగర్, బాలాజీనగర్, ఎల్లమ్మబండ, మూసాపేట్, హస్మత్పేట్, హైదర్నగర్, నిజాంపేట్, ఆల్విన్కాలనీ, జగద్గిరిగుట్ట, ఆదర్శ్నగర్, షాపూర్నగర్, రోడామిస్త్రీ నగర్, హెచ్ఎంటీ కాలనీ, సూరారం, చింతల్, జీడిమెట్ల, సుభాష్నగర్, హఫీజ్పేట్, చందానగర్, మియాపూర్, ఆర్ సీపురం, అశోక్నగర్, బొల్లారం, శేరిలింగంపల్లి, మాదాపూర్. -
జలగండం
గ్రేటర్లో తాగునీటి ఇక్కట్లు నిత్యం రెండు వేలకు పైగా జలమండలి ట్యాంకర్ల బుకింగ్ వీరిలో 1500 మందికే సత్వర సరఫరా నిరీక్షణలో 500 మంది వినియోగదారులు అడ్డూ అదుపూ లేని ప్రైవేటు ట్యాంకర్ల దోపిడీ సిటీబ్యూరో: వేసవి ప్రారంభంలోనే గ్రేటర్లో క‘న్నీటి’ కష్టాలు తీవ్రమయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటడం... జలమండలి సరఫరా చేస్తున్న నల్లా నీళ్లు సరిపోక పోవడంతో ట్యాంకర్ నీటికి డిమాండ్ పెరిగింది. మహా నగరంలో జలమండలి ట్యాంకర్ బుకింగ్లు రోజుకు రెండు వేలు దాటుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 1 నుంచి 10వ తేదీ వరకు 20,965 ట్రిప్పుల ట్యాంకర్ నీళ్లను సిటీ జనం బుక్ చేసుకున్నారు. వీరిలో 15,534 మందికిబుక్ చేసుకున్న 24 గంటల్లోనే నీటి సరఫరా చేశారు. మిగతా 5,431 మందికి నిరీక్షణ తప్పడం లేదు. వీరంతా ట్యాంకర్ నీళ్లకు 48 నుంచి 72 గంటల పాటు నిరీక్షించాల్సి వస్తోంది. నిజాంపేట్, శేరిలింగంపల్లి, మియాపూర్, మల్కాజ్గిరి తదితర శివారు ప్రాంతాల్లో ట్యాంకర్ బుక్ చేసి వారం రోజులు దాటినా నీరు అందకపోవడం గమనార్హం. దారి తప్పుతున్న ఉచిత ట్యాంకర్లు జలమండలి పరిధిలోని 65 ఫిల్లింగ్ కేంద్రాల వద్ద నీటి సరఫరాకు సుమారు వెయ్యి ట్యాంకర్లు ఉన్నాయి. వీటి ద్వారా బుక్ చేసిన వినియోగదారులకు నీటిని సరఫరా చేస్తున్నారు. ఐదువేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకర్కు రూ.400, వాణిజ్య అవసరాలకైతే రూ.700 వసూ లు చేస్తున్నారు. ఇవి కాక ఉచితంగా బస్తీలకు నీటిని సరఫరా చేసే ట్యాంకర్లు సుమారు 200 వరకు ఉన్నాయి. ఇవి తరచూ పక్కదారి పడుతున్నాయి. బస్తీలకు ఉచితంగా సరఫరా చేయాల్సిన నీటిని హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు, మెస్లకు రూ.వెయ్యి వంతున విక్రయిస్తూ కొందరు భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు దోపిడీ.... జలమండలి ట్యాంకర్లకు సుదీర్ఘ నిరీక్షణ తప్పకపోవడంతో జనం ప్రైవేటు ట్యాంకర్లతో జేబులు గుల్ల చేసుకుంటున్నారు. మియాపూర్, వనస్థలిపురం, నిజాంపేట్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో బోరుబావులు వట్టిపోవడంతో ప్రైవేటు ట్యాంకర్ల మాఫియా ఆడింది ఆట..పాడింది పాటగా మారింది. కుంటలు, చెరువులు, పారిశ్రామిక వాడల్లో అక్రమంగా బోర్లు వేసి భూగర్భ జలాలను తోడేస్తున్నారు. ఒక్కో ట్రిప్పుకు డిమాండ్ను బట్టి రూ.1000 నుంచి రూ.1500 వరకు దండుకుంటున్నారు. వారు సరఫరా చేస్తున్న నీటిలో బురద, వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థజలాలు ఉంటున్నాయని జనం గగ్గోలు పెడుతున్నారు. ఈ ఆగడాలను అడ్డుకునే నాథుడే కరువయ్యారని వాపోతున్నారు. ట్యాంకర్ నీళ్ల లెక్కలివే.. జలమండలి ట్యాంకర్ల బుకింగ్: రోజుకు రెండువేలకు పైగా రోజు వారీగా అందుతున్నది: సుమారు 1500 మందికి నిరీక్షణ జాబితాలోని వినియోగదారులు: సుమారు 500 మంది జలమండలి ట్యాంకర్ నీళ్లకు నిరీక్షించాల్సి సమయం: శివారు ప్రాంతాల్లో 48 నుంచి 72 గంటలు. కొన్నిచోట్ల వారం రోజులు. గృహ అవసరాలకు సరఫరా చేస్తున్న నీటికి జలమండలి చార్జీ: రూ.400 (ఐదు వేల లీటర్లు) వాణిజ్య అవసరాలకు తరలిస్తున్న నీటికి జలమండలి చార్జీ: రూ.700 (ఐదువేల లీటర్లు) జలమండలి పరిధిలో ట్యాంకర్లు: సుమారు వెయ్యి. మరో 200 ఉచిత ట్యాంకర్లు ప్రైవేటు వ్యాపారులు ప్రతి ట్యాంకర్కు వసూలు చేస్తున్న చార్జీ: రూ.1000 నుంచి రూ.1500 -
నేడు, రేపు నీళ్లు బంద్
సిటీబ్యూరో: కృష్ణా ఫేజ్-1 పైపులైన్కు అత్యవసర మరమ్మతుల కారణంగా మంగళ, బుధవారాల్లో వివిధ ప్రాంతాలకు 30 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి ప్రకటించింది. మంగళవారం ఉదయం 6 నుంచి బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా నిలిచిపోనుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఆజంపురా, సుల్తాన్ షాహీ, మొఘల్పురా, దారుల్షిఫా, ఫలక్నుమా, బహదూర్పురా, జహానుమా, చార్మినార్, పత్తర్ఘట్టి, మిశ్రీగంజ్, అన్సారీ రోడ్, వట్టేపల్లి, ఇంజిన్ బౌలి, ఆశా మహల్, మహబూబ్ మాన్షన్, సంతోష్ నగర్, వినయ్ నగర్, సైదాబాద్, చంచల్గూడ, ఆస్మాన్ఘడ్, మూసారాంభాగ్, మలక్పేట్, అలియాబాద్, మైసారం, గౌలిపురా, తలాబ్కట్ట, మాదన్నపేట్, యాకుత్పుర, బొగ్గులకుంట, అఫ్జల్గంజ్, జియాగూడ, అడిక్మెట్, రామంతాపూర్, గోల్నాక, డీడీకాలనీ, నల్లకుంట,విద్యానగర్, ముషీరాబాద్, అజామాబాద్, నారాయణగూడ, భోలక్పూర్, భాగ్లింగంపల్లి, వైశాలి నగర్, దిల్సుఖ్నగర్ పార్ట్ ప్రాంతాలకు సరఫరా ఉండదని తెలిపారు. మరమ్మతులు పూర్తయిన తరవాత సరఫరా పునరుద్ధరిస్తామని వెల్లడించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగానికి కూడా... : కృష్ణా ఫేజ్-1 కింద గ్రామీణ నీటి సరఫరా విభాగానికి అందిస్తున్న నీటినీ నిలిపివేయనున్నారు. దీంతో నల్లగొండ, నాసర్లపల్లి, గోడకొండ్ల, ఇబ్రహీంపట్నం, గున్గల్ ప్రాంతాలకు కూడా 30 గంటల పాటు సరఫరా నిలిచిపోనుంది. -
24 గంటల పాటు నీరు బంద్
సిటీబ్యూరో: అత్యవసర మరమ్మతుల నేపథ్యంలో ఈ నెల 19న (శుక్రవారం) ఉదయం 6 నుంచి 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు వివిధ ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి ప్రకటించింది. బోయిగూడ, రైల్ కళారంగ్, పద్మారావు నగర్, సీసీ నగర్, హమాలీబస్తీ, వెంకటాపురం, బోయిగూడ సెక్షన్, పాన్బజార్, ఓల్డ్బోయిగూడ, కుర్మబస్తీ, ఆవుల మంద, రంగ్రేజ్ బజార్, గ్యాస్ మండీ, నల్లగుట్ట సెక్షన్లకు మంచినీటి సరఫరా ఉండదని సంబంధిత అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మరమ్మతులు పూర్తయిన వెంటనే సరఫరా పునరుద్ధరిస్తామని వెల్లడించారు. -
రేపు సగం సిటీకి కృష్ణా నీళ్లు బంద్
సిటీబ్యూరో: కృష్ణా మూడోదశ పైప్లైన్ మరమ్మతు పనుల కారణంగా ఈనెల 9న(మంగళవారం)సగం సిటీకి కృష్ణాజలాల సరఫరా నిలిచిపోనుంది. సచివాలయంతోపాటు శివారు మున్సిపల్ సర్కిళ్లు, పాతనగరంలోని పలు ప్రాంతాలకు 24 గంటలపాటు (మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటలవరకు) నీటిసరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి ప్రకటించింది. దీంతో చర్లపల్లి, బిట్స్, ఈసీఐఎల్, సైనిక్పురి, ఏఎస్రావునగర్, సెంట్రల్ ప్రిజన్, ఎంఈఎస్, కంటోన్మెంట్, ఐసీఐసీఐ నాలెడ్జ్పార్క్, తుర్కపల్లి, లాలాపేట్, తార్నాక, నాచారం పారిశ్రామికవాడ, మౌలాలి, గాయత్రీనగర్, సాయినాధ్పురం, గోకుల్నగర్, డిఫెన్స్కాలనీ, సైనిక్పురి, ఆర్.కె.పురం, మల్కాజ్గిరి, మీర్జాలగూడా, సఫిల్గూడా, ఆనంద్భాగ్, గౌతంనగర్, పాత, కొత్త అల్వాల్, లోతుకుంట,ఫాదర్బాలయ్యకాలనీ, హౌజింగ్బోర్డు కాలనీ, కైలాస్గిరీ, నాచా రం, మల్లాపూర్, ప్రశాసన్నగర్, గచ్చిబౌలి, ఫిలింనగర్, మాదాపూర్, కూకట్పల్లి, హౌజింగ్బోర్డు, హుడా చందానగర్, బీఎన్రెడ్డినగర్, ఎల్బీనగర్, ఆటోనగర్, వనస్థలిపురం, సరూర్నగర్, అల్కాపురి, దిల్సుఖ్నగర్, ఆర్జికె బండ్లగూడ, ఉప్పల్, బీరప్పగడ్డ, మైలార్దేవ్పల్లి, మధుబన్, పీడీపీ, హైదర్గూడ, రాజేంద్రనగర్, ఉప్పర్పల్లి, సులేమాన్నగర్, ఎంఎంపహాడ్, అత్తాపూర్, చింతల్మెట్, మెహిదీపట్నం, కార్వాన్, లంగర్హౌజ్, కాకతీయనగర్, హుమయూన్నగర్, తాళ్లగడ్డ, ఆసిఫ్నగర్, ఎంఈఎస్, గంధంగూడ, షేక్పేట్, ఓయూకాలనీ, టోలిచౌకి, మల్లేపల్లి, విజయ్నగర్కాలనీ, రెడ్హిల్స్, ఓల్డ్ఎమ్మెల్యే క్వార్టర్స్, నాంపల్లి, మసాబ్ట్యాంక్,లక్డీకాపూల్, సచివాలయం, జియాగూడ, ఆళ్లబండ, గోడేకీకబర్ ప్రాంతాలకు నీటిసరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపింది. మరమ్మతుల అనంతరం సరఫరా పునరుద్ధరిస్తామని పేర్కొంది. -
అంకెల్లో హైదరాబాద్
డ్రైనేజీ, మంచినీటి వ్యవస్థల స్వరూపం ► రూ.90 కోట్లు - నెలకు నీటి బిల్లుల ద్వారా జలమండలికి వస్తున్న ఆదాయం ► 4,800- జలమండలి బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులు ► 688.20 - చదరపు కిలోమీటర్లు గ్రేటర్లో అందుబాటులో ఉన్న మంచినీటి సరఫరా వ్యవస్థ ► 518.90- చదరపు కిలోమీటర్లు శివారు ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న మంచినీటి సరఫరా వ్యవస్థ ► 7,980 - చదరపుకిలోమీటర్లు సిటీ నలుమూలలకు నీటిని సరఫరా చేసే డిస్ట్రిబ్యూటరీ పైపులైన్లు ► 612 కిలోమీటర్లు - నగరంలో 600 ఎంఎం డయా ప్రధాన పైపులైన్లతో అందుబాటులో ఉన డ్రైనేజీ వ్యవస్థ ► 4,050 కిలోమీటర్లు - వీధుల్లో మురుగునీటి పారుదలకు అందుబాటులో ఉన్న లేటరర్స్, సబ్మెయిన్స్ ► 1.85 లక్షలు-సిటీలోని మ్యాన్హోళ్లు ► 5- నగరంలోని మురుగునీటి శుద్ధి కేంద్రాలు ► 750 మిలియన్ లీటర్లు - రోజు వారీగా శుద్ధి చేసే మురుగు నీరు ► 169.30 చదరపు కిలోమీటర్లు - గ్రేటర్ కార్పొరేషన్గా ఉన్నప్పటి మంచినీటి సరఫరా వ్యవస్థ ► 900 చదరపు కిలోమీటర్లు - నగరానికి పలు జలాశయాల నుంచి నీటిని తరలించే ప్రధాన పైపులైన్లు -
వాటర్ ట్యాంక్ ఎక్కిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు
కుత్బుల్లాపూర్ పరిధిలోని షాపూర్నగర్లో శనివారం ముగ్గురు జలమండలి ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వాటర్ ట్యాంకెక్కారు. వేతనాలు సక్రమంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం రూ.15 వేలు చెల్లించాలని చెప్పినా మధ్యలో ఏజెన్సీలు రూ.5 వేలు చెల్లిస్తున్నాయని ఉద్యోగులు తెలిపారు. అదేమని ప్రశ్నిస్తే బయటి వారిని పెట్టుకుని తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. తమకు న్యాయం జరగకపోతే ట్యాంక్పై నుంచి దూకుతామని హెచ్చరిస్తున్నారు. -
ఈ నీరు తాగలేం!
కలుషిత జలాలపై ఫిర్యాదుల వెల్లువ సాక్షి,సిటీబ్యూరో: కలుషిత జలాలపై జలమండలికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 1 నుంచి 9 వరకు ఈ సమస్యపై నగర వ్యాప్తంగా 261 మంది వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ఇందులో 106 సమస్యలను అధికారులు పరిష్కరించగా.. మరో 155 ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయి. సింగూరు, మంజీర, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలు వట్టిపోవడంతో ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకు గోదావరి జలాలను సరఫరా చేస్తున్నారు. బురదతో, రంగుమారిన జలాలు సరఫరా అవుతున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు గోదావరి పైపులైన్లలో పేరుకుపోయిన మట్టి, చెత్త నీటితో కలిసి సరఫరా అవుతుండడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జలాలను శుద్ధి చేస్తున్న మల్లారం నీటి శుద్ధి కేంద్రం వద్ద మొత్తం 52 ఫిల్టర్బెడ్స్కుగాను ప్రస్తుతానికి 17 ఫిల్టర్బెడ్లు మాత్రమే పని చేస్తుండడంతోఈ పరిస్థితి తలెత్తిందని సమాచారం. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీటిని సరఫరా చేసే పైపులైన్లకు చిల్లులు పడుతుండడంతో డ్రైనేజి నీరు, చెత్త అందులో కలిసి కలుషిత జలాల సమస్య ఉత్పన్నమవుతోంది. హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్లలో నీరుఅడుగంటడంతో పాత నగరంలోని వివిధ ప్రాంతాలకు బురద, మట్టి కలిసిన జలాలు సరఫరా అవుతున్నాయి. కలుషిత జలాలతో సతమతమవుతున్న ప్రాంతాలివే.. బంజారాహిల్స్: ఎన్బీటీనగర్, సింగాడికుంట, ఉదయ్ నగర్, చింతలబస్తీ, ప్రేమ్నగర్ సనత్నగర్: ఫతేనగర్, ఎస్.ఆర్.నగర్, ఎస్ఆర్టీ కాలనీ, జెక్ కాలనీ, రాజరాజేశ్వరీనగర్, సుందర్నగర్. కూకట్పల్లి: ఆల్విన్కాలనీ, బాలానగర్, మూసాపేట్, బాలాజీనగర్, కేపీహెచ్బీ కాలనీ, హైదర్నగర్ ముషీరాబాద్: గాంధీనగర్, జవహర్నగర్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్రోడ్స్. చార్మినార్: అమితానగర్, పటేల్నగర్, హబీబ్నగర్, ఘన్సీబజార్, చందూలాల్ బారాదరి, రియాసత్నగర్, పురానాపూల్. -
ఏది నీటి చుక్కాని?
నెలాఖరుకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, సింగూరు జలాశయాలు ఖాళీ వట్టిపోయిన మంజీర ఈ నెల 29 నుంచి నిలిచిపోనున్న నీటి సేకరణ గ్రేటర్ ప్రజలకు తప్పని కష్టాలు కుత్బుల్లాపూర్: గ్రేటర్ శివార్లను నీటి కష్టాలు వేధిస్తున్నాయి. ఈ కష్టాల నుంచి ఒడ్డున పడేసే చుక్కాని కోసం శివారు జనాలు ఆశగా ఎదురు చూస్తున్నారు. మహా నగర దాహార్తిని తీరుస్తున్న సింగూరు, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలు ఈ నెలాఖరుకు పూర్తిగా వట్టిపోనున్నాయి. ప్రస్తుతం మంజీర జలాశయం నుంచి నీటి సరఫరా నిలిచిపోవడంతో శివారు మున్సిపల్ సర్కిళ్లలో తీవ్ర ఎద్దడి నెలకొంది. కుత్బుల్లాపూర్ సర్కిల్లో మంగళవారం నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో వందలాది కాలనీలు, బస్తీలు తీవ్ర దాహార్తితో విలవిల్లాడాయి. సింగూరు, మంజీర జలశయాల ద్వారా సరఫరా చేసే నీటిలో సగానికి కోత విధించారు. ఎస్.ఆర్నగర్ , కూకట్పల్లి, శేరిలింగంపల్లి మున్సిపల్ సర్కిళ్లకు సరఫరా అవుతున్న నీటిలో 50 శాతం కోత పడింది. ప్రస్తుతం సింగూరు నుంచి తరలిస్తున్న 50 మిలియన్ గ్యాలన్ల నీటిని వివిధ ప్రాంతాలకు పొదుపుగా (రేషన్) సరఫరా చేస్తుండడంతో జనం అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. డిసెంబరు రెండో వారంలో సరఫరా చేసే 85 ఎంజీడీల గోదావరి జలాలతో నగర దాహార్తిని తీరుస్తామని జలమండలి అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. కుత్బుల్లాపూర్లో యుద్ధాలు కుత్బుల్లాపూర్ సర్కిల్కు వారం రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లుజలమండలి జీఎం ప్రవీణ్కుమార్ ప్రకటించడం కలకలం రేపింది. గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు, అపార్టుమెంట్లు, కాలనీలు, మురికివాడలకు మంగళ వారం 36 ట్యాంకర్లతో అరకొరగా నీటి సరఫరా చేశారు. దీంతో ఈ సర్కిల్లోని వివిధ ప్రాంతాల్లో ట్యాంకర్ల వద్ద నీటి కోసం స్థానికులు యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రసూన నగర్లో గొడవ చోటు చేసుకోగా ఓ మహిళ ముక్కు పగిలి గాయమైంది. మాణిక్యనగర్లోని ప్రతి వీధిలో జనం ట్యాంకర్ల కోసం పడిగాపులు కాశారు. వాణీ నగర్, వసంత కెమికల్స్, షాపూర్ నగర్, జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో రిజర్వాయర్ల వద్ద కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు క్యూ కట్టి ట్యాంకర్లు తెచ్చుకునే పరిస్థితి నెలకొంది. మొత్తం సర్కిల్లో 58 వేలకు పైగా ఉన్న కనెక్షన్లకు వారం రోజులుగా నీళ్లు లేవు. చింతల్ డివిజన్కు 18 ఎంజీడీల నీరు రావాల్సి ఉండగా కేవలం 8 ఎంజీడీలు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవ సరఫరా 3 ఎంజీడీలకు మించి లేకపోవడం గమనార్హం. ముందుకు సాగని రిజర్వాయర్ నిర్మాణం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాది మార్చి 2న ఇక్కడ 5 ఎంఎల్ రిజర్వాయర్కు రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ఫిబ్రవరి 21న టెండర్లు పిలిచారు. రిజర్వాయర్ నిర్మాణానికి రూ.7 కోట్ల వ్యయమే అవుతుండగా... మరో రూ.3 కోట్ల మేరకు అంచనాలు పెరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. టెండర్లు రద్దు చేయడంతో రిజర్వాయర్ నిర్మాణం అటకెక్కింది. నీటి కోసం ఆందోళనలు... మంచినీటి ఎద్దడి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ మంగళవారం వివిధ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి భారీ ఆందోళన చేపట్టారు. ఐడీపీఎల్ చౌరస్తా వద్ద ఆందోళన చేసి.. అక్కడి నుంచి ర్యాలీగా కుత్బుల్లాపూర్ వాటర్ వర్క్స్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. గోదావరి జలాలతో కొరత తీరుస్తాం ప్రస్తుతం మంజీర జలాశయం నుంచి నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సింగూరు నుంచి అరకొరగా సరఫరా అవుతోంది. ఈ నెలాఖరుకు ఇదీ నిలిచిపోనుంది. డిసెంబరు ద్వితీయ వారంలో నగరానికి తరలించనున్న 85 ఎంజీడీల నీటితో వివిధ ప్రాంతాల దాహార్తిని తీరుస్తాం. -విజయ్ కుమార్ రెడ్డి, జలమండలి ట్రాన్స్మిషన్ విభాగం సీజీఎం -
తాగునీటి ఇక్కట్లకు చెక్!
భారీ స్టోరేజి రిజర్వాయర్లకు డీపీఆర్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశం సిటీబ్యూరో: గ్రేటర్ దాహార్తిని సమూలంగా తీర్చేందుకు నగర శివార్లలోని కేశవాపూర్(రంగారెడ్డిజిల్లా), మల్కాపురం(నల్లగొండ జిల్లా)ల వద్ద భారీ స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం జలమండలి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ప్రస్తుతం జంటజలాశయాలు, సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటినిల్వలు త్వరితంగా అడుగంటుతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా వీటి నిర్మాణం అత్యవసరమని సీఎం స్పష్టంచేసినట్లు తెలిసింది. కాగా కేశవాపూర్ రిజర్వాయర్కు మెదక్జిల్లా మల్లన్నసాగర్ లేదా పాముల పర్తి రిజర్వాయర్ల నుంచి గోదావరి జలాలను తరలించాలని, మల్కాపురం రిజర్వాయర్కు డిండి ఎత్తిపోతల పథకం నుంచి కృష్ణా జలాలను తరలించాలని సూచించినట్లు సమాచారం. రిజర్వాయర్లకు రూట్మ్యాప్ ఇదే.. కరీంనగర్ జిల్లా కాలేశ్వరం-మిడ్మానేరు-కొమురెల్లిమల్లన్న సాగర్(మెదక్) మీదుగా కేశవాపూర్కు నీటిని తరలించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నూతనంగా నిర్మించ తలపెట్టిన కొమురెల్లి మల్లన్న సాగర్(కుక్నూరుపల్లి-మెదక్)లో సుమారు 50 టీఎంసీల మేర గోదావరి జలాలను నింపడం ద్వారా అక్కడి నుంచి 42 కి.మీ దూరంలో ఉన్న కేశవాపూర్ రిజర్వాయర్కు 25 కిలోమీటర్ల మేర గ్రావి టీ(భూమ్యాకర్షణశక్తి), మరో 17 కి.మీ మార్గంలో పంపింగ్ ద్వారా నీటిని తరలించి నింపవచ్చని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇక పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా డిండి (నల్లగొండ జిల్లా)కి అక్కడి నుంచి మల్కాపురం(నల్లగొండ) వరకు భారీ పైప్లైన్ ఏర్పాటు చేసి ఈ స్టోరేజి రిజర్వాయర్లో 20 టీఎంసీల కృష్ణా జలాలను నింపే అవకాశం ఉంటుందని జలమండలి అధికారులు తెలిపారు. రూ.1500 కోట్లతో దేవులమ్మనాగారం రిజర్వాయర్.. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపూర్ సరిహద్దుల్లో రూ.1500 కోట్ల అంచనా వ్యయంతో భారీ స్టోరేజి రిజర్వాయర్ను నిర్మించనున్నారు. ఈ ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన రెండువేల ఎకరాల మేర ప్రభుత్వ, అటవీ, అసైన్డ్భూములు అందుబాటులో ఉన్నాయి. ఈ జలాశయాన్ని కాంక్రీటుతో భూమట్టానికి 70-80మీటర్ల ఎత్తులో నిర్మిస్తారు. ఈ జలాశయంలో పాలమూరు ఎత్తిపోతల, డిండి పథకం ద్వారా కొంత మార్గం లో పంపింగ్, మరి కొంత మార్గంలో గ్రావిటీ ద్వారా 20 టీఎంసీల జలాలను తరలించి నింపనున్నారు. వర్షాకాలం లో నీటిలభ్యత అధికంగా ఉన్నప్పుడే ఈ భారీ జలాశయాన్ని పూర్తిస్థాయిలో నింపే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రూ.1200 కోట్లతో కేశవాపురం రిజర్వాయర్ .. రంగారెడ్డి జిల్లా శామీర్పేట్ మండలం కేశవాపురం వద్ద రూ.1200 కోట్ల అంచనా వ్యయంతో 15 టీఎంసీల గోదావరి జలాల నిల్వకు అవసరమైన భారీ స్టోరేజి రిజర్వాయర్ను నిర్మించనున్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన 3600 ఎకరాల మేర ప్రభుత్వ, అటవీ భూములు అందుబాటులో ఉన్నట్లు క్షేత్రస్థాయి నివేదికలో పేర్కొన్నారు. ఈ జలాశయాన్ని భూమట్టం నుంచి 60 మీటర్ల ఎత్తులో కాంక్రీట్ డ్యామ్ నిర్మించనున్నారు. ఈ జలాశయంలో గోదావరి మంచినీటి పథకం మొదటి, రెండు, మూడో దశల్లో తరలించనున్న నీటితో ఈ జలాశయాన్ని నింపే అవకాశం ఉంటుందని, గోదావరి నదిలో సమృద్ధిగా వరద ప్రవాహం ఉన్నప్పుడే ఈ రిజర్వాయర్ పూర్తిస్థాయి జలకళ సంతరించుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. -
విషం తాగుతున్నామా!
-
విషం తాగుతున్నామా!
జలమండలి నీటిలో ప్రమాదకరమైన ఈ-కొలి, కోలిఫాం బ్యాక్టీరియా ఏసిరెడ్డి రంగారెడ్డి: బొట్టుబొట్టులో హాలాహలం.. ప్రమాదకరమైన ఈ-కొలి, కోలిఫాం బ్యాక్టీరియా.. మంచినీరే కదా అని తాగారో.. అతిసారం, టైఫాయిడ్, న్యుమోనియా, జీర్ణకోశ వ్యాధులు తథ్యం! భాగ్యనగరానికి జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటిలోకి ఓసారి తొంగిచూస్తే ఇన్ని రకాల జబ్బులు పలకరించాయి మరి!! ఆరోగ్యాన్ని కుప్పకూల్చే బ్యాక్టీరియాలు కుప్పలుతెప్పలుగా కనిపించాయి. ఒకటి కాదు రెండు కాదు.. నగరంలో 8.65 లక్షల నివాసాలకు జలమండలి మంచినీటి రూపంలో ఇలా హాలాహలాన్ని పంచుతోంది. నగరంలో కలుషిత జలాలపై స్వల్ప కాలంలోనే 647 ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో.. పలు ప్రాంతాల్లో జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటిని ‘సాక్షి’ సేకరించింది. ఆ నీటిని ల్యాబ్లో పరీక్షించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. పలు బస్తీలు, కాలనీలకు సరఫరా చేస్తున్న జలంలో మానవ మలమూత్రాదుల్లో ఉండే కోలిఫాం, ఈ-కొలి, సిట్రోబ్యాక్టర్ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. ఎల్బీనగర్, సికింద్రాబాద్, బహదూర్పురా, ముషీరాబాద్, చంచల్గూడ, కార్వాన్, మెహిదీపట్నం, సీతాఫల్మండి తదితర ప్రాంతాల నుంచి సేకరించిన నీటిలో ఈ విష కారకాలు ఉన్నట్టు వెల్లడైంది. నగరంలో అనేకచోట్ల మంచినీటి పైప్లైన్లు డ్రైనేజీ లైన్లతో కలిసిపోవటం, పలుచోట్ల లీకేజీలు, శుద్ధి కేంద్రాల్లో నిబంధనలను గాలికొదిలేయడంతో మంచినీళ్లు పూర్తిగా కలుషితమైపోతున్నాయి. చిత్త’శుద్ధి’ఏదీ?: హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్, సింగూరు, మంజీరా, కృష్ణా నీటిని శుద్ధిచేసి సరఫరా చేసేందుకు జలమండలి ఏటా సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రతి వెయ్యి లీటర్ల నీటి శుద్ధికి రూ.27 ఖర్చు చేస్తున్నారు. నగరంలో నాలుగు చోట్ల, మెదక్, నల్లగొండ జిల్లాల పరిధిలో మరో 12 చోట్ల ఫిల్టర్బెడ్లున్నాయి. ఈ నీటిని మహానగరానికి సరఫరా చేసేందుకు 250 స్టోరేజీ రిజర్వాయర్లున్నాయి. ఈ కేంద్రాల వద్ద నీటిశుద్ధి ప్రక్రియను గాలికొదిలేస్తున్నారు. పొరుగు జిల్లాల నుంచి నగరానికి నీటిని తరలించేందుకు 900 కి.మీ. మేర ట్రంక్మెయిన్ భారీ పైపులైన్లు, నగరవ్యాప్తంగా మరో 9 వేల కి.మీ. మేర పైపులైన్లు ఉన్నాయి. వీటికి తరచూ ఏదో ఓచోట లీకేజీలు ఏర్పడుతుండడంతో పైప్లైన్లలోకి మురుగు నీరు, చెత్తాచెదారం చేరుతోంది. ఇలా శుద్ధి చేయాలి.. జలాశయాల్లోని నీటిని(రా వాటర్) నాలుగు దశల్లో శుద్ధి చేయాలి. మొదటి దశ: క్లోరిన్, ఫెర్రిక్ సల్ఫేట్ రసాయనాలు కలిపి కెమికల్ ట్రీట్మెంట్ నిర్వహించాలి. రెండో దశ: నిల్వ ఉన్న నీటిలో ఆలం కలిపి అందులోని ఘన వ్యర్థాలు, ధూళి కణాలు రిజర్వాయర్ అడుగున చేరేలా చూడాలి. మూడో దశ: మంచినీటిని వివిధ ఫిల్టర్ల ద్వారా శుద్ధిచేయాలి. చిన్న, పెద్ద సైజు గులక రాళ్లు, సన్న ఇసుక, దొడ్డు ఇసుక, లేయర్స్ మీడియా ఫిల్టర్ల మీదుగా నీటి ప్రవాహం వెళ్లనివ్వాలి. నాలుగో దశ: బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద ప్రతి వెయ్యి లీటర్ల నీటికి 2 పీపీఎం, సర్వీసు రిజర్వాయర్ల వద్ద 1.5 పీపీఎం, వినియోగదారుడికి నల్లాల ద్వారా అందించే సమయంలో 0.2 పీపీఎం మోతాదులో క్లోరిన్ ఉండేలా చూడాలి. * కార్బోనేట్ ఫిల్టర్లను ఏర్పాటు చేసి నీటిని పూర్తి స్థాయిలో శుద్ధిచేయాలి. * ఫిల్టర్ బెడ్లోకి వచ్చిన నీటిలోకి ఆక్సిజన్ను అధిక మోతాదులో పంపితే నీటి నాణ్యత మెరుగుపడుతుంది. రంగు మటుమాయమౌతుంది. కాలుష్యానికి కారణాలెన్నో.. * ఫిల్టర్ బెడ్లు, స్టోరే జీ రిజర్వాయర్ల వద్ద నీటిని శుద్ధి చేసేందుకు ఆలం, క్లోరిన్, ఫెర్రిక్ సల్ఫేట్లను సరైన మోతాదులో కలపడం లేదు. క్షేత్రస్థాయి సిబ్బంది క్లోరిన్ గ్యాస్ సిలిండర్లు, ఇతర రసాయనాలను ప్రైవేటు వ్యక్తులకు, దళారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. * ప్రతి స్టోరేజీ రిజర్వాయర్ వద్ద 600 కేజీల ఆలం, 36 కేజీల క్లోరిన్గ్యాస్ను కలిపి నీటిని శుద్ధి చేయాల్సి ఉన్నా ఆ నిబంధన పాటించడం లేదు. * మంచినీటిలోకి ఆక్సిజన్ను పంపే ఏరియేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేయకపోవడం. నీటిలో రంగు పూర్తిగా పోవాలంటే నాన్ఫెర్రిక్ హైడ్రేటెడ్ లైమ్ కలపాలి. దీన్నీ గాలికొదిలేస్తున్నారు. * బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, సర్వీసు రిజర్వాయర్ల వద్ద క్లోరినేషన్ కోసం కేటాయించిన క్లోరిన్ గ్యాస్ సిలిండర్లు పక్కదారిపడుతున్నాయి. దీంతో తగు మోతాదులో క్లోరిన్ ను కలపడం లేదు. * నగరంలో 250 సర్వీసు రిజర్వాయర్లను సీజన్ మారగానే శుద్ధి చేయాల్సి ఉన్నా పట్టించుకోవడంలేదు. సుమారు 50 రిజర్వాయర్ల వద్ద అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. * మంచినీరు, డ్రైనేజీ పైప్లైన్లు అల్లుకుపోయిన ప్రాంతాల్లో లీకేజీల వల్ల మురుగు నీరు, మంచినీటి లైన్లలోకి ప్రవేశిస్తోంది. గ్రేటర్లో 1,500 బస్తీలు ఉండగా.. లీకేజీల వల్ల తరచూ 100 బస్తీలు కలుషిత జలాల బారిన పడుతున్నాయి. * నగరంలో యుద్ధప్రాతిపదికన 1,100 కిలోమీటర్ల మేర పురాతన మంచినీటి పైప్లైన్లు మార్చాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. * నీటి నాణ్యత తెలుసుకునేందుకు చేసే ఫిజికో కెమికల్, బ్యాక్టీరియాలజీ పరీక్షలను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. * జలాశయాల నుంచి ఫిల్టర్బెడ్కు వచ్చే నీటికి కెమిక ల్, క్లోరిన్, బ్లీచింగ్, ఆలం, వైట్ పౌడర్లను సరైన మోతాదులో కలపకుండానే శుద్ధి చేస్తున్నారు. * గండిపేట క్యాండుట్ కాలువ నిజాంకాలం నాటిది. కొన్నిచోట్ల నాలాపై కప్పు లేకపోవడంతో చెత్తాచెదారం చేరుతోంది. * అనేక స్టోరేజీ రిజర్వాయర్ల వద్ద నీటిలో ఘన వ్యర్థాలు, ధూళి కణాలను తొలగించేందుకు ఫిల్టర్లు లేవు. పురాతన పైపులైన్ల వల్లే.. నగరంలో డ్రైనేజీ, మంచినీరు పైపులైన్లు పక్కపక్కనే ఉండ డం, చాలాచోట్ల 50 ఏళ్ల నాటి పైపులైన్ల కారణంగానే తరచూ జలాలు కలుషితమవుతున్నాయి. తక్ష ణం పురాతన పైపులైన్లు మార్చి స్టెయిన్లెస్ స్టీలు పైపులు వేస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. - పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధి తాగడానికి పనికిరాదు ఈ-కొలి, కోలిఫాం బ్యాక్టీరియా ఆనవాళ్లున్న నీరు తాగడానికి పనికిరాదు. తాగితే తీవ్రమైన జీర్ణకోశ వ్యాధుల బారిన పడతారు. యూవీ ఫిల్టర్స్ ద్వారా శుద్ధిచేసిన నీటిని తాగితే మంచిది. - ఎనుముల రాజు, వాటర్ క్వాలిటీ అనలిస్ట్ జలమండలి వైఫల్యమే.. నగరవాసులకు స్వచ్ఛమైన నీటి ని సరఫరా చేయడంలో జల మండలి విఫలమవుతోంది. కలుషిత జలాలు జనం ఉసురు తీస్తున్నాయి. ఈ నీళ్లు తాగి అనారోగ్యానికి గురవుతున్నారు. స్వచ్ఛమైన తాగునీరు అందించే బాధ్య త ప్రభుత్వానిదే. జలమండలిపై నమ్మకం లేక జనం ఫిల్టర్ నీళ్లు కొనుక్కుంటున్నారు. -ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి, చేతనా సొసైటీ ఫర్ వాటర్ చీఫ్ మెంటార్ జీర్ణకోశ వ్యాధులు వస్తాయి కోలిఫాం, ఈ-కొలి బ్యాక్టీరియా ఉన్న నీళ్లు తాగి తే జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. అతిసారం, టైఫాయిడ్, న్యుమోనియా వంటి వ్యాధులకు గురవుతారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణిలపై దీని ప్ర భావం అధికం. నల్లా నీరు కాచి చల్లార్చి తాగాలి. - డాక్టర్ బి.రమేష్,గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ఉస్మానియా ఆస్పత్రి -
జల విధ్వంసం
పగిలిన కృష్ణా పైప్లైన్... ఉప్పొంగిన జలాలు జనం పరుగులు బాలాపూర్ చౌరస్తాలో స్తంభించిన ట్రాఫిక్ నీటిలో కొట్టుకుపోయిన వాహనాలు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన జలమండలి ఎమ్డీ మీర్పేట్(హైదరాబాద్): సమయం.. బుధవారం మధ్యాహ్నం 1.58 గంటలు.. ఒక్కసారిగా భారీ శబ్దం. ఏం జరిగిందోనని స్థానికులు తేరుకొని చూసేసరికి ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న కృష్ణా జలాలు. సినిమా సన్నివేశాలను తలపించేలా ఆ నీటితో పాటే ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలు ఒక్కసారిగా పైకి ఎగిరికిందపడడం...ప్రవాహంలో కొట్టుకుపోవడం.. .క్షణాల్లో జరిగిపోయాయి. విస్ఫోటం దాటికి ఓ ఆటో తునాతునకలైంది. ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. సమీప దుకాణాలను భారీగా నీరు ముంచెత్తింది. ఈ భయానక వాతావరణం సరూర్నగర్ మండలం బాలాపూర్ చౌరస్తాలో చోటు చేసుకుంది. సాహెబ్నగర్ నుంచి మైలార్దేవ్పల్లి వరకు గల కృష్ణాఫేజ్-2 రింగ్మెయిన్-1 పైప్లైన్కు గల జాయింట్ వద్ద ఒత్తిడి పెరిగి ఒక్కసారిగా పేలిపోడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అకస్మాత్తుగా చోటు చేసుకున్న ఈ సంఘటనతో స్థానికులు భీతిల్లిపోయారు. బాంబు పేలుడు సంభవించిందేమోనని కొంతమంది పరుగులు తీశారు. ప్రస్తుతం భారీ లీకేజీ ఏర్పడిన ప్రాంతంలో రెండు రోజుల క్రితమే చిన్నపాటి లీకేజీకి మరమ్మతులు పూర్తి చేయడం గమనార్హం. ఘటనా స్థలాన్ని జలమండలి ఎమ్డీ బి.జనార్దన్రెడ్డి, ఈఎన్సీ సత్యనారాయణ, సీజీఎం విజయ్కుమార్రెడ్డి పరిశీలించారు. లీకేజీల గండం కృష్ణా ఫేజ్-1, ఫేజ్-2, ఫేజ్-3 పైప్లైన్లు, నగరంలో నీటి సరఫరాకు ఏర్పాటు చేసిన రింగ్మెయిన్ పైప్లైన్లకు నిత్యం ఏదో ఒక చోట గండి పడుతుండడంతో తాగునీరు వృథా అవుతోంది. వీటి నివారణకు జలమండలి ఏటా రూ.50 కోట్ల వరకు వ్యయం చేస్తోంది. అరకొర మరమ్మతులతో లీకేజీలకు అడ్డుకట్ట పడడం లేదు. పీఎస్సీ, ఆర్సీసీ మిశ్రమంతో తయారు చేసిన పైప్లైన్ల స్థానంలో మైల్డ్స్టీల్తో రూపొందించినవి వేయకపోవడం...రహదారుల విస్తరణ, భూగర్భ కేబుల్స్ వేస్తున్నపుడు... భారీ ట్రక్కులు పైప్లైన్ల పైనుంచి రాకపోకలు సాగిస్తుండడంతో ఏదో ఒక చోట లీకేజీలు ఏర్పడుతున్నాయి. మరోవైపు పైప్లైన్ జాయింట్లు, కవర్లు, వాల్వ్ల ఏర్పాటు సమయంలో తలెత్తే ఇంజినీరింగ్ లోపాలను క్షేత్రస్థాయి అధికారులు సరిచేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో వందల కిలోమీటర్ల దూరం నుంచి నగరానికి తరలిస్తున్న తాగునీరు వృథా అవుతోంది. జలమండలి నిత్యం సరఫరా చేస్తున్న 365 ఎంజీడీల జలాల్లో 40 శాతం సరఫరా నష్టాలకు లీకేజీలే కారణమని తెలుస్తోంది. పీఎస్సీ పైప్లైన్ కావడమే కారణం కృష్ణా పైప్లైన్ పగలడానికి ప్రధాన కారణం అది ప్రీస్ట్రెస్డ్ కాంక్రీట్తో తయారు చేసినది కావడమే. బాలాపూర్ చౌరస్తాలో సుమారు 500 మీటర్ల మార్గంలో తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ మైల్డ్స్టీల్ పైప్లైన్ వేయాల్సి ఉందని గతంలో ప్రభుత్వానికి నివేదించాం. ఈ మార్గంలో ప్రస్తుతం రహదారి విస్తరణ పనులు జరుగుతుండడం... రక్షణ శాఖకు చెందిన 50 టన్నుల సామర్థ్యం గల భారీ ట్రక్కులు రాకపోకలు సాగిస్తుండడంతోనే పైప్లైన్ జాయింట్ వద్ద ఒత్తిడి పెరిగి పగిలినట్టు భావిస్తున్నాం. -సత్యనారాయణ, జలమండలి ఇంజినీర్ ఇన్ చీఫ్ -
బొట్టు బొట్టుకూ లెక్క!
నల్లాలకు ఆటోమేటిక్ రీడింగ్ మీటర్లు ♦ 22 వేల వాణిజ్య సంస్థలు, పరిశ్రమల్లో త్వరలో ఏర్పాటు ♦ జలమండలి సన్నాహాలు ♦ ప్రతి నెలా రూ.10 కోట్ల మేర ఆదాయం పెరిగే అవకాశం.. సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ పరిధిలో పరిశ్రమలు, వాణిజ్య భవంతులకున్న నల్లా కనెక్షన్లకు ఆటోమేటిక్ నీటి మీటర్ల(ఏఎంఆర్) ఏర్పాటుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. బోర్డు పరిధిలోని 16 నిర్వహణ డివిజన్ల పరిధిలో ఉన్న 22 వేల వాణిజ్య, పరిశ్రమల కనెక్షన్లకు వీటిని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇదే విభాగంలో ఉన్న 1500 బడా సంస్థల నల్లాలకు ఇప్పటికే ఏఎంఆర్ నీటిమీటర్లను ఏర్పాటు చేయడంతో బోర్డు ఆదాయం బాగా పెరిగింది. దీంతో మిగతా వాటికి కూడా మరో నెలరోజుల్లో ఏఎంఆర్ మీటర్లను తప్పనిసరి చేసి ప్రతి నీటిబొట్టుకూ లెక్కతీయాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం ఈ 22 వేల నల్లాలకు మెకానికల్ మీటర్ల ఆధారంగానే బిల్లులు జారీ చేస్తుండడంతో రోజువారీగా సరఫరా చేస్తున్న నీటిని శాస్త్రీయంగా లెక్కించడం సాధ్యపడడంలేదు. తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా జరిగినపుడు ఈ మీటర్లు సరిగా పనిచేయకపోవడంతో ఈ నిర్ణయానిక వచ్చినట్లు తెలిసింది. ఇందుకయ్యే వ్యయాన్ని సంబంధిత వినియోగదారుల నుంచే వసూలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. నీటి కనెక్షన్ పరిమాణం, నీటి వినియోగాన్ని బట్టి ఈ మీటర్ల ఖరీదు రూ.10 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఈ మీటర్ల ఏర్పాటుతో జలమండలి రెవెన్యూ ఆదాయం ప్రస్తుతం రూ.93 కోట్లుండగా.. అదనంగా మరో పదికోట్ల మేర పెరిగే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకే... జలమండలి పరిధిలో ఉన్న 8.65 లక్షల నల్లాలకు రోజువారీగా 365 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తోంది. నీటి బిల్లుల ద్వారా నెలవారీగా రూ.93 కోట్ల ఆదాయం లభిస్తుండగా.. విద్యుత్ బిల్లులు, రుణవాయిదాలు, ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులు, మరమ్మతులకు నెలకయ్యే వ్యయం రూ.95 కోట్లకు పైగానే ఉంది. మరోవైపు లీకేజీలు, నీటిచౌర్యం కారణంగా వందల కిలోమీటర్ల దూరం నుంచి నగరానికి సరఫరా చేస్తున్న నీటిపరిమాణంలో 40 శాతం మేర కోత పడుతుండడంతో బోర్డు ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆటోమేటిక్ నీటిమీటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఏఎంఆర్ మీటర్ల పనితీరు ఇలా... వాణిజ్య, పరిశ్రమల నల్లాలకు ఏర్పాటు చేసే ఏఎంఆర్ మీటర్లు మొబైల్ ఫోన్ టెక్నాలజీలో వాడే జీఎస్ఎం సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పనిచేస్తాయి. ప్రతి మీటరును ఖైరతాబాద్లోని బోర్డు ప్రధాన కార్యాలయంలో ఉన్న సర్వర్కు అనుసంధానిస్తారు. దీంతో రోజువారీగా ప్రతి నల్లా కనెక్షన్కు ఎంత పరిమాణంలో నీటిని సరఫరా చేస్తున్నారు, బిల్లింగ్ ఏమేర జరుగుతుందో ఉన్నతాధికారులు పరిశీలిస్తారు. ఈ మీటర్లను ట్యాంపరింగ్ చేయడం వీలుకాదు. మరోవైపు వినియోగదారునికి కూడా పాస్వర్డ్ ఇచ్చే అవకాశం ఉండడంతో వినియోగదారులు సైతం నీటిసరఫరా, బిల్లింగ్ అంశాలను ఒక్క క్లిక్తో తెలుసుకునే సౌలభ్యం ఉంటుందని బోర్డు రెవెన్యూ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఇటీవల 1500 నల్లాలకు ఏర్పాటు చేసిన ఏఎంఆర్ మీటర్లతో బోర్డు రెవెన్యూ ఆదాయం క్రమంగా పెరిగిందని పేర్కొన్నాయి. -
మల్కాపూర్, కేశవాపురంలోనే..
‘గ్రేటర్’ దాహార్తి తీర్చే భారీ స్టోరేజీ రిజర్వాయర్ల నిర్మాణం ఇక్కడే ప్రభుత్వానికి నివేదించిన జలమండలి అధికారులు మొత్తం 35 టీఎంసీల నీటి నిల్వకు అవకాశం ఏడాది పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు సరిపడా నీళ్లు హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ దాహార్తిని తీర్చే రెండు భారీ స్టోరేజీ రిజర్వాయర్ల నిర్మాణానికి క్షేత్రస్థాయి నివేదిక సిద్ధమైంది. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం దేవులమ్మ నాగారం వద్ద 20 టీఎంసీల మేర కృష్ణా జలాలు, రంగారెడ్డి జిల్లా శామీర్పేట్ మండలం కేశవాపురం వద్ద 15 టీంఎంసీల గోదావరి జలాల నిల్వ చేసేందుకు ఈ రిజర్వాయర్లు నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన క్షేత్రస్థాయి నివేదికను సిద్ధం చేసిన జలమండలి అధికారులు మంగళవారం ప్రభుత్వానికి నివేదించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు త్వరలో సమగ్ర నివేదిక సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. ముంపు సమస్యలు తక్కువే..? ఈ భారీ రిజర్వాయర్ల నిర్మాణంతో భూములు కోల్పోయేవారు నామమాత్రంగానే ఉన్నారని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఇది క్షేత్రస్థాయి నివేదిక మాత్రమేనని, సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేశాక అవసరమైన భూములు, అంచనా వ్యయంపై స్పష్టత వస్తుందని జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. వందేళ్ల అవసరాలకు తగ్గట్లుగా... వచ్చే వందేళ్లలో హైదరాబాద్ జనాభా, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ భారీ రిజర్వాయర్లను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. మహానగరం వేగంగా విస్తరిస్తుండటం, జనాభా పెరుగుతున్న నేపథ్యంలో మరో 35 టీఎంసీల నీటి నిల్వకు ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఇందుకోసం ఈ రెండు భారీ రిజర్వాయర్లు నిర్మించాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం ఉస్మాన్సాగర్ (గండిపేట్), హిమాయత్సాగర్లలో 7 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. సింగూరు, మంజీరా జలాశయాలతో పాటు అక్కంపల్లి రిజర్వాయర్లో మరో 32 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. కానీ ఆయా జలాశయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలు 5.266 టీఎంసీలకు మించి లేవు. ఈ నీటినే ఏడాది పొడుగునా 365 ఎంజీడీల చొప్పున నగరం నలుమూలలకూ జలమండలి సరఫరా చేస్తోంది. ఇవి ఏ మూలకు సరిపోవడం లేదు. అందుకే కొత్తగా నిర్మించే ఈ భారీ రిజర్వాయర్లకు కృష్ణా,గోదావరి నదుల నుంచి నీటి లభ్యత అధికంగా ఉన్న సమయాల్లో పంపింగ్ ద్వారా నీటిని తరలించి నగర దాహార్తిని తీర్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం సిరియా, అమెరికా, స్కాండినేవియా దేశాల్లోనే ఇలాంటి భారీ నీటి స్టోరేజీ రిజర్వాయర్లు అందుబాటులో ఉన్నాయి. ఇదే తరహాలో నగరంలోనూ విపత్కర, కరువు పరిస్థితుల్లోనూ నగరవాసుల దాహార్తిని తీర్చేందుకు ఇలాంటి రిజర్వాయర్లు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. దేవులమ్మనాగారం రిజర్వాయర్.. రూ. 1,500 కోట్లు నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం దేవులమ్మ నాగారం, మల్కాపూర్ సరిహద్దుల్లో రూ. 1,500 కోట్ల అంచనా వ్య యంతో స్టోరేజీ రిజర్వాయర్ను నిర్మిస్తారు. సము ద్ర మట్టానికి 70-80 మీటర్ల ఎత్తులో ఉండేలా దీని రూపకల్పన చేశారు. ఈ ప్రాంతంలో ప్రాజెక్టు ఏర్పాటుకు వీలుగా 2 వేల ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉంది. పాలమూరు ఎత్తిపోతల, డిండి నీటి పథకం ద్వారా కొంతదూరం పంపింగ్ మరికొంత మార్గంలో గ్రావిటీతో 20 టీఎంసీల జలాలను ఈ రిజర్వాయర్కు తరలిస్తారు. వర్షాకాలంలో నీటి లభ్యత అధికంగా ఉన్నప్పుడే ఈ జలాశయాన్ని పూర్తిస్థాయిలో నింపే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కేశవాపురం రిజర్వాయర్.. రూ. 1,200 కోట్లు రంగారెడ్డిజిల్లా శామీర్పేట్ మండలం కేశవాపురం వద్ద రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో 15 టీఎంసీల గోదావరి జలాల నిల్వకు అవసరమైన స్టోరేజీ రిజర్వాయర్ను నిర్మించనున్నారు. ఈ నిర్మాణానికి అవసరమైన 3,600 ఎకరాల మేర ప్రభుత్వ భూమి ఇక్కడ అందుబాటులో ఉంది. సముద్ర మట్టం నుంచి 60 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మిస్తారు. గోదావరి మంచినీటి పథకం మొదటి, రెండవ, మూడవ దశల ద్వారా ఈ జలాశయానికి నీటిని తరలిస్తారు. అయితే గోదావరిలో వరద ప్రవాహం ఉన్నప్పుడే ఈ రిజర్వాయర్ పూర్తిస్థాయి జలకళ సంతరించుకుంటుంది. -
క్రమం...అక్రమం!
- గ్రేటర్ పరిధిలో లక్షకు పైగా అక్రమ నల్లాలు - నత్త నడకన క్రమబద్ధీకరణ - సిబ్బంది నిర్వాకంతో అడ్డంకులు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో అక్రమ నల్లాల క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది. జలమండలి క్షేత్ర స్థాయి సిబ్బంది నిర్వాకమే దీనికి కారణంగా తెలుస్తోంది. మహా నగర పరిధిలో లక్షకు పైగా అక్రమనల్లాలు ఉన్నట్టు బోర్డు అధికారులే బహిరంగంగా చెబుతున్నారు. అయినా ఏడాది కాలంలో కేవలం 15 వేల నల్లాలను మాత్రమే క్రమబద్ధీకరించడం గమనార్హం. వినియోగదారుల నుంచి నామమాత్రంగా డిక్లరేషన్ తీసుకొని కనెక్షన్ చార్జీ వసూలు చేసి... క్రమబద్ధీకరించాలని ఉన్నతాధికారులు చెబుతున్నారు. క్షేత్ర స్థాయి అధికారులు మాత్రం సవాలక్ష కొర్రీలతో వినియోగదారులకు చుక్కలు చూపుతున్నారు. సంబంధిత భవంతికి మున్సిపల్ లేదా గ్రామ పంచాయతీ ధ్రువీకరణ, విద్యుత్ కనెక్షన్లు ఉన్నప్పటికీ ఆక్యుపెన్సీ, లింక్ డాక్యుమెంట్లు, అఫిడవిట్లు సమర్పించాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో పలువురు క్రమబద్ధీకరణకు వెనుకంజ వేస్తున్నారు. బోర్డు ఆదాయానికి నెలకు రూ.పది కోట్ల మేర గండి పడుతున్నట్లు అంచనా. గ్రేటర్లో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్లలోని కాలనీలు, బస్తీలు, పంచాయతీల్లో ప్రస్తుతం ఇదే దుస్థితి నెలకొంది. బోర్డు ఖజానాకు భారీగా గండి గ్రేటర్ పరిధిలోని 16 నిర్వహణ డివిజన్లలో జలమండలికి 8.64 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. నీటి బిల్లులు, ట్యాంకర్లతో నీటి సరఫరా, మురుగు శిస్తు కలిపి జలమండలికి నెలకు రూ.91 కోట్ల మేర ఆదాయం లభిస్తోంది. కానీ వ్యయం రూ.93 కోట్లుగా ఉంది. అంటే నెలకు రూ.2 కోట్ల లోటుబడ్జెట్తో నెట్టుకొస్తోందన్నమాట. ఈ నేపథ్యంలో నగరంలో మరో లక్ష అక్రమ కనెక్షన్లను క్రమబద్ధీకరిస్తే ఆదాయం నెలకు రూ.100 కోట్లకు మించే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న మేనేజర్లు, డీజీఎంలు, జీఎంల నిర్వాకంతో క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది. 189 మంది అక్రమార్కుల గుర్తింపు గ్రేటర్ పరిధిలో గత ఎనిమిది నెలలుగా అక్రమ కనెక్షన్లు, బహుళ అంతస్తుల భవంతులకు గృహ వినియోగ కనెక్షన్లు ఉండడం, ఎక్కువ మొత్తంలో నీటిని వాడుకుంటూ... నల్లా పరిమాణాన్ని తక్కువ చూపుతున్న కేసులను 189 వరకు బోర్డు విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఇందులో అక్రమ కనెక్షన్లు ఉన్న పది మంది వినియోగదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. పక్కాగా సమాచారం అందితేనే విజిలెన్స్ సిబ్బంది రంగంలోకి దిగుతున్నారు. దీంతో అక్రమాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. -
అరచేతిలో నీటి వేళలు
సాక్షి, సిటీబ్యూరో : నల్లా నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియక పనులు మాను కొని కూర్చుంటున్నారా? ఇకపై ఇలా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అర్ధరాత్రి, అపరాత్రి నిద్ర మానుకొని వేచి ఉండాల్సిన పనిలేదు. వినియోగదారుడి మొబైల్కే నీటి సరఫరా వేళల సమాచారం వస్తుంది. ఈ దిశగా జలమండలి సన్నాహాలు చేస్తోంది. ముందుగా కూకట్పల్లి డివిజన్ లోని భాగ్యనగర్ సెక్షన్ పరిధిలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తోంది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం ఆధారంగా ఒక వీధిలో ఏ వేళకు నీటి సరఫరా జరుగుతుందో వినియోగదారుల మొబైల్ నెంబర్లకు నేరుగా సంక్షిప్త సందేశం(ఎస్ఎంఎస్) రూపంలో సమాచారం చేరవేయడం ఈ విధానం ప్రత్యేకత. ప్రస్తుతం ప్రధాన నగరంలో రోజువిడిచి రోజు(రెండురోజులకోమారు), శివారు ప్రాంతాల్లో మూడు లేదా నాలుగుర ోజుల కోమారు నీటిసరఫరా జరుగుతోంది. మరికొన్ని చోట్ల వారం రోజులకోమారు మాత్రమే నల్లా నీరు వస్తోంది. పాతనగరంలోని కొన్ని ప్రాంతాలకు అర్థరాత్రి 1 లేదా 2 గంటలు, తెల్లవారుఝామున 3 లేదా 4 గంటలకు కూడా నీటి సరఫరా జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో నీళ్లకోసం జాగారం చేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎస్సెమ్మెస్తో వినియోగదారులకు ఉపశమనం కలిగించనుంది. ఇలా చేరవేస్తారు... జలమండలి పరిధిలో మొత్తం 16 నిర్వహణ డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 150 సెక్షన్లున్నాయి. ఒక్కో సెక్షన్లో 8 నుంచి 10 మంది వరకు నీటిని సరఫరా చేసే వాల్వులను నియంత్రించే లైన్మెన్లు పనిచేస్తున్నారు. భాగ్యనగర్ సెక్షన్లో పనిచేస్తున్న 8 మందికి జీపీఎస్ ఆధారంగా పనిచేసే చేతిలో ఇమిడే స్మార్ట్ పరికరం అందజేస్తారు. ఈ యంత్రంలో సదరు వీధిలో ఉన్న వినియోగదారుల మొబైల్ నెంబర్లు ఉంటాయి. ఆ వీధికి నీటిని సరఫరా చేసేందుకు వాల్వు తిప్పేందుకు వెళ్లిన ప్రతిసారీ యాప్కు గల బటన్ను నొక్కితే చాలు. ఆ వీధిలోని వారందరికీ నేరుగా నీటి సరఫరా సమాచారం క్షణాల్లో తెలిసిపోతుంది. దీంతో వారు అప్రమత్తమై నీళ్లు పట్టుకునే వీలుంటుందని జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. నీటిసరఫరా వేళల సమాచారం చేరవేసే జీపీఎస్ ఆధారిత యంత్రాల కొనుగోలుకు సెక్షన్కు రూ.5 లక్షల చొప్పున మొత్తం 150 సెక్షన్లకు రూ.7.50 కోట్లు వ్యయం అవుతుందని జలమండలి అంచనా. ఈ నిధులను ఎలా సమకూర్చుకోవాలన్నది సవాల్గా మారడం గమనార్హం. -
2 భారీ రిజర్వాయర్లు
హైదరాబాద్ మహానగర దాహార్తిని తీర్చేందుకు కృష్ణా, గోదావరి జలాలను నిల్వ చేసేందుకు నగర శివార్లలో రెండు భారీ స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణానికి జలమండలి సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కృష్ణా, గోదావరి జలాలను నిల్వ చేసి వేసవిలో నగర దాహార్తిని సమూలంగా తీర్చేందుకు పది టీఎంసీల నిల్వ సామర్థ్యంతో వీటిని నిర్మించనున్నారు. వీటి కోసం స్థలాలను అన్వేషించేందుకు, క్షేత్రస్థాయి పరిశీలన జరిపేందుకు జలమండలి డెరైక్టర్లతో గురువారం కమిటీని నియ మించారు. ఇందులో జలమండలి ఇంజనీర్ ఇన్ చీఫ్, ప్రాజెక్టు, ఆపరేషన్స్, టెక్నికల్, రెవెన్యూ విభాగాల డెరైక్టర్లను సభ్యులుగా నియమించినట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. - సాక్షి, హైదరాబాద్ * నగర శివార్లలో త్వరలో నిర్మాణం * తీరనున్న ‘గ్రేటర్’ దాహార్తి * జలమండలి డెరైక్టర్లతో కమిటీ నియామకం * కృష్ణా, గోదావరి జలాల నిల్వ కోసమే.. * పది టీఎంసీల సామర్థ్యంతో రెండు జలాశయాలు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా... రాబోయే వంద సంవత్సరాల కాలంలో మహానగర తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ భారీ స్టోరేజి రిజర్వాయర్లను నిర్మించాలని సంకల్పించారు. నగరం శరవేగంగా విస్తరిస్తుండడం, జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న జలాశయాలకు అదనంగా మరో 20 టీఎంసీల నీటి నిల్వకు ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ సంకల్పించారు. దీని కోసం కృష్ణా, గోదావరి బేసిన్లలో పది టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రెండు రిజర్వాయర్లను నిర్మించాలని యోచిస్తున్నారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి నీటి లభ్యత అధికంగా ఉన్న సమయాల్లో పంపింగ్ ద్వారా వాటర్ను తరలించి ఈ రిజర్వాయర్లలో నిల్వ చేయాలని నిర్ణయించారు. అనువైన స్థలాల ఎంపికే కీలకం.. ఈ రిజర్వాయర్ల నిర్మాణానికి సుమారు 15 వేల ఎకరాల భూములు అవసరమవుతాయి. ఔటర్రింగ్రోడ్డు లోపల భూసేకరణకు కోట్లాది రూపాయలు వ్యయం చేయాలి. దీంతో మెదక్, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల పరిధిలోని ఎత్తై గుట్టలు, ప్రభుత్వ భూములున్న ప్రాంతాల్లోనే ఈ భారీ రిజర్వాయర్ల నిర్మాణం సాధ్యపడుతుందని జలమండలి వర్గాల ప్రాథమిక అంచనా. నాలుగు వైపులా ఎత్తై రాతి కొండలు రక్షణ గోడవలె ఉండి మధ్యలో నీటి నిల్వకు అవకాశం ఉన్న ప్రాంతాలైతే స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణానికి అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. ఇందుకోసం ఏరియల్ సర్వే నిర్వహించడంతోపాటు వ్యాప్కోస్ వంటి నిపుణులైన సంస్థలతో సమగ్ర సర్వే చేయించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ముంపు సమస్యలు లేకుండా చూడాలి భారీ స్టోరేజి రిజర్వాయర్లు నిర్మించే సమయంలో ముంపు సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. సుమారు 40 గ్రామాలు విస్తరించి ఉండే స్థలంలో ఈ రిజర్వాయర్లను నిర్మించాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన స్థలాలు సేకరించడం కూడా కష్టసాధ్యమే. ఇక నగరానికి తరలించేందుకు అవసరమైన పంపింగ్ ఏర్పాట్లు, లిఫ్ట్ల ఏర్పాటు, విద్యుత్ అవసరాలు, వ్యయ అంచనాలను కూడా పరిగణనలోకి తీసుకొని సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలి. ప్రస్తుతం ఉన్న జలాశయాల్లో నీటినిల్వలను స్వల్పంగా పెంచేందుకు ప్రయత్నించాలి. - టి.హనుమంతరావు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, నీటిపారుదల శాఖ -
నీరు...రానీరు
గ్రేటర్ గ్రిడ్కు మొండి చేయి తాగునీటి పథకాలకు గ్రహణం మహా నగర దాహార్తిపై సర్కారు నిర్లక్ష్యం సిటీబ్యూరో: ‘రాబోయే నాలుగేళ్లలో గ్రేటర్లో ఇంటింటికీ నల్లా నీళ్లు అందిస్తాం’... ముఖ్యమంత్రి కేసీఆర్ సహా నగరానికి చెందిన మంత్రులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు నిత్యం ఏదో ఒక సందర్భంలో నగర వాసులకు ఇస్తున్న వాగ్దానమిది. వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. రాబోయే నాలుగేళ్లలో ఇంటింటికీ నీళ్లిచ్చే అవకాశాలు దరిదాపుల్లో కనిపించడం లేదు. మహా నగర దాహార్తిని తీర్చేందుకు జలమండలి సిద్ధం చేసిన కీలక మంచినీటి పథకాలపై సర్కారు శీతకన్ను వేయడంతో వీటిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. గ్రేటర్ మంచినీటి ముఖచిత్రం పరిశీలిస్తే.. మహా నగరంలో సుమారు 22 లక్షల భవంతులు ఉండగా.. వీటిలో నల్లా కనెక్షన్లు ఉన్నవారు కేవలం 8.64 లక్షలు మాత్రమే. మిగిలిన ఇళ్లలో నివాసం ఉంటున్న వారంతా బోరుబావులు, ప్రైవేటు ఫిల్టర్ ప్లాంట్లు, ట్యాంకర్ నీళ్లపై ఆధార పడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. వీరందరికీ కుళాయి నీళ్లు అందని ద్రాక్షగా మారాయి. ‘మహా’ నిర్లక్ష్యం... గ్రేటర్లో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీల పరిధిలోని సుమారు వెయ్యి కాలనీలు, బస్తీలకు మంచినీటి సౌకర్యం లేదంటే అతిశయోక్తి కాదు. జలమండలి మంచినీటి సరఫరా పైప్లైన్ నెట్వర్క్, స్టోరేజి రిజర్వాయర్లు అందుబాటులో లేకపోవడంతో లక్షలాది మంది దాహార్తితో అలమటిస్తున్నారు. దీని నుంచి బయట పడేందుకు జలమండలి అధికారులు మంచినీటి పథకాలను పూర్తి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించినా.. అవి కాగితాలకే పరిమితమయ్యాయి. వీటిలో ఏ ఒక్క పథకానికీ రాష్ట్ర సర్కారు మోక్షం కల్పించలేదు. దీంతో ఇంటింటికీ నల్లా నీరు అందించడం తీరని కలగా మారనుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
బ్యాక్టీరియాతో మురుగుకు చెక్!
- మూసీ ప్రక్షాళనకు సరికొత్త ప్రయోగం - సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న జలమండలి - ముందుకొచ్చిన మహారాష్ట్ర కంపెనీ సాక్షి, సిటీబ్యూరో: మురుగుతో కాలుష్యమవుతున్న మూసీ జలాలను ప్రక్షాళన చేసేందుకు జలమండలి వినూత్న ప్రయోగంపై దృష్టిపెట్టింది. జీవ,రసాయన వ్యర్థాలను హరించే ‘మైక్రో ఆర్గానిజం కల్చర్ బ్యాక్టీరియా’తో మురుగు నీటిని శుద్ధిచేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం అమెరికా, జపాన్ తదితర దేశాల్లోనే అమల్లో ఉన్న ఈ విధానాన్ని త్వరలో నగరంలోని నల్లచెరువు సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లోనూ పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టనున్నారు. నీటిలో ఉన్న ఆర్గానిక్ వ్యర్థాలను ఈ బ్యాక్టీరియా ఆహారంగా స్వీకరించి క్రియారహితంగా మారుతుంది. సూపర్బగ్ తరహాలో పనిచేస్తుంది. ఈ విధానం పర్యావరణానికి కూడా హానికలిగించదని జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఈ బ్యాక్టీరియాను పౌడర్ రూపంలో అందజేసేందుకు మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తున్న ‘ఫెర్మెంటా బయోటెక్ లిమిటెడ్’ (ఎఫ్బీఎల్) ముందుకొచ్చింది. ఈ బ్యాక్టీరియా పనితీరుపై సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు, జలమండలి అధికారులకు ఇటీవల పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ విధానం అమలు విషయంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిపుణుల సలహాలను కూడా స్వీకరించనున్నారు. పౌడర్ బ్యాక్టీరియా... తెల్లటి పౌడర్ రూపంలో ఉన్న మిశ్రమంలో ఈ బ్యాక్టీరియా దాగి ఉంటుంది. దీనిని సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లో ప్రవేశిస్తున్న వ్యర్థ జలాలపై పెద్ద మొత్తంలో చల్లుతారు. దీంతో బ్యాక్టీరియా క్రియాశీలమవుతుంది. మురుగులోని వ్యర్థాలను తిని సరళ పదార్థాలుగా విడగొడుతుంది. అనంతరం ఇది క్రియారహితంగా మారుతుంది. మురుగు ప్రవాహంలో కొట్టుకుపోతుంది. దీని జీవితకాలం తక్కువగానే ఉంటుంది. ఈ బ్యాక్టీరియా పర్యావరణానికి మేలు చేస్తుందే తప్ప కీడు చేయదని నిపుణులు చెబుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇది తిరిగి చైతన్యం అయ్యే వీలులేదని తెలిపారు. ప్రస్తుతానికి నో ఛార్జ్.... నల్లచెరువు ఎస్టీపీలో ఈ బ్యాక్టీరియాను ప్రవేశపెట్టినందుకు సదరు సంస్థకు ప్రస్తుతం నిధులు కేటాయించబోమని జలమండలి స్పష్టంచేసింది. ఈ బ్యాక్టీరియా పనితీరు సంతృప్తికరంగా ఉంటేనే అంబర్పేట్, అత్తాపూర్ ఎస్టీపీల్లో ప్రయోగించే అంశాన్ని పరిశీలిస్తామని జలమండలి ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈవిషయంలో పర్యావరణ వేత్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఉపయోగాలివీ.. - మురుగునీటిలో వ్యర్థాల నుంచి మీథేన్ గ్యాస్ను రిలీజ్ చేస్తాయి. - ఈ గ్యాస్తో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. - మురుగు శుద్ధి కేంద్రంలో ఉన్న ఏరేటర్స్, టర్భైన్స్పై వత్తిడి బాగా తగ్గుతుంది. - మురుగు ప్రవాహానికి ఆటంకాలు తొలగుతాయి. - ఎస్టీపీలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గించవచ్చు. - శుద్ధిచేసిన వ్యర్థజలాల్లో బీఓడీ, సీఓడీ స్థాయిలను ప్రమాణాల ప్రకారం ఉండేలా చూడవచ్చు. అనర్థాలూ ఉంటాయి.. మైక్రో ఆర్గానిజం బ్యాక్టీరియాతో భవిష్యత్లో మనుషులు, జంతువులు, భూగర్భ జలాలపై దుష్ర్పభావం చూపే అవకాశాలుంటాయి. ఈ బ్యాక్టీరియా కేవలం ఆర్గానిక్ కాలుష్యాలను మాత్రమే తొలగిస్తుంది. మురుగు నీటిలోని నైట్రోజన్, పాస్ఫరస్, అమ్మోనియా వంటి మూలకాలు, భారలోహాలు, రసాయనాలను తొలగించే అవకాశం ఉండదు. పర్యావరణ వేత్తల పర్యవేక్షణలోనే ఇలాంటి బ్యాక్టీరియాను వినియోగించాల్సి ఉంటుంది. -డాక్టర్ వెంకటేశ్వర్, ఓయూ జంతుశాస్త్ర విభాగాధిపతి -
ఇది క్లిక్ అయితే..!
డిజిటల్ బేస్ మ్యాపులకు సన్నాహాలు ఇక సులువుగా పైపులైన్ల సమాచారం జలమండలి ప్రయోగం సిటీబ్యూరో: మహా నగర పరిధిలోని మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థలకు సంబంధించిన పైప్లైన్లపై సమగ్ర సమాచారాన్ని ఇకపై ఒక్క క్లిక్తో పొందవచ్చు.దీని కోసం జలమండలి డిజిటల్ బేస్ మ్యాపుల తయారీకి సన్నాహాలు చేస్తోంది. బోర్డులోని సెంట్రల్ డిజైన్ సెల్ ఆధ్వర్యంలో జరిగే ఈ కసరత్తులో నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సంస్థ సహకారంతో రూపొందిం చిన జీఐఎస్ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేయనున్నారు. ప్రాథమికంగా బోర్డు పరిధిలోని 16 నిర్వహణ డివిజన్ల పరిధులను సూచించే శాటిలైట్ చిత్రాలను వినియోగిస్తారు. ఇందులో కేవలం ప్రాంతం వివరాలు మాత్రమే కనిపిస్తాయి. వీటిని మరింత అభివృద్ధి చేసి రహదారులు, సీవరేజిై లెన్లు, మంచినీటి లైన్లు, ఎత్తయిన భవనాలు, అపార్ట్మెంట్లు, చారిత్రక కట్టడాలు స్పష్టంగా కనిపిచేలా వేర్వేరుగా మ్యాపులను తయారు చేయూల్సి ఉంది. ఇక డివిజన్ పరిధిలో ప్రతి ఇంటి వివరాలను మ్యాపులో పొందుపరిచేలా చూస్తారు. దీంతో సాధారణంగా కాగితంపై ఉన్న వివరాల్లో దొరకని అతిసూక్ష్మ సమాచారం సైతం మ్యాపులో ప్రత్యక్షమవుతుంది. ఉదాహరణకు గాంధీనగర్ రోడ్డు నెంబరు 12లో ప్లాట్ నెం.22లో ఉన్న భవనం ఎన్ని అంతస్తులు ఉంది. అందులో ఎంతమంది నివాసం ఉంటున్నారు. దానికి ఎన్ని నల్లా, సీవరేజి కనెక్షన్లు ఉన్నాయన్న సమాచారాన్ని ఇట్టే తెలుసుకోవచ్చు. కంప్యూటర్ తెరపై కనిపించే మ్యాపును ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ ప్రతి ఇంటి సమాచారం ప్రత్యక్షమవుతుంది. నెలవారీ నీటి బిల్లులు జారీచేసే మీటర్ రీడర్లు ఈ వివరాలను సేకరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయితే ఒక వీధిలో డాకెట్ల వారీగా (ప్రధాన పైప్లైన్కు అనుసంధానమైనవి) ఉన్న కనెక్షన్ల వివరాలు వెంటనే కనుక్కోవచ్చు. మరోవైపు బహుళ అంతస్తుల్లో ఉన్న నల్లాల వివరాలు, రోజువారీ ఎంత నీటిని వియోగిస్తున్నారో తెలుసుకొని డేటాబేస్లో పొందుపరచవచ్చు. దీని ద్వారా బిల్లుల జారీని కట్టుదిట్టం చేసి తద్వారా బోర్డు రెవెన్యూ ఆదాయూన్ని గణనీయుంగా పెంచుకునే వీలుంటుంది. ఉపయోగాలివీ.. జీఐఎస్ టెక్నాలజీ ఆధారిత డిజిటల్ బేస్ మ్యాపులు సిద్ధమైతే డాకెట్ల వారీగా అక్రమ నల్లాల భరతం పట్టవచ్చు.కలుషిత జలాల సమస్య తరచూ ఉత్పన్నమయ్యే ప్రాంతాలను గుర్తించి. పైప్లైన్లను మార్చవచ్చు .తరచూ మంచినీటి లీకేజీలు ఏర్పడుతున్న పైప్లైన్లను గుర్తించవచ్చు. మూతలు లేని మ్యాన్హోళ్లు, దెబ్బతిన్న మురుగు నీటి పైప్లైన్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలిసేలా చేయవచ్చు.మహా నగర పరిధిలోని నల్లా కనెక్షన్ల వారీగా నీటి వినియోగం, వారు చెల్లిస్తున్న బిల్లుల వివరాలను ఒక్క క్లిక్తో తెలుసుకోవచ్చు.శరవేగంగా విస్తరిస్తున్న శివారు కాలనీల్లో మంచినీటి నెట్వర్క్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయవచ్చు.{పధాన మంచినీటి పైప్లైన్లు, స్టోరేజి రిజర్వాయర్లు, పంపిణీ పైప్లైన్లను వేర్వేరుగా గుర్తించి, పరిరక్షణకు చర్యలు తీసుకోవచ్చు. దెబ్బతిన్న వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయవచ్చు. మంచినీటి సరఫరా నష్టాలు, చౌర్యం తదితరాలను తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న 40 శాతం సరఫరా నష్టాలను 20 శాతానికి కుదించవచ్చుమురుగు నీటి పైప్లైన్లలో పేరుకుపోయిన వ్యర్థాలను, డీసిల్టింగ్ పనులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పర్యవేక్షించవచ్చు. మంచినీటి సరఫరా వీలుకానివి, అత్యంత ఎత్తయినవి, చివరన ఉన్న ప్రాంతాలను గుర్తించవచ్చు. మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థల్లో ఉన్న పైప్లైన్లను వాటి పరిమాణం ఆధారంగా తేలికగా గుర్తించవచ్చు. ఈ డేటాను ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలోని సర్వర్లో నిక్షిప్తం చేయవచ్చు. -
అపార్ట్మెంట్కో ఎస్టీపీ!
మినీ మురుగు శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు నీటి కొరత తీర్చేందుకు జలమండలి కొత్త యోచన 20 ఫ్లాట్లు దాటిన అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలపైనే దృష్టి రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ పద్ధతులపై ఆసక్తి తాగడానికి మినహా ఇతరత్రా అవసరాలకు ఉపయోగించుకునే వీలు.. గ్రేటర్లో అపార్ట్మెంట్కో మురుగు శుద్ధికేంద్రం (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్-ఎస్టీపీ) ఏర్పాటుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది.భూగర్భజల నిల్వలు అడుగంటిపోతుండడం, జలాశయాల నీటి నిల్వలు తగ్గుతుండడంతో మురుగునీటిని మంచినీటిగా మార్చి ఇతరత్రా అవసరాలకు వినియోగించుకునే విధానాలపై దృష్టిసారించింది. కాంక్రీట్ మహారణ్యంలా మారిన మహానగరం పరిధిలో 20 ఫ్లాట్లు మించి ఉన్న అపార్ట్మెంట్లు, గేటెడ్కమ్యునిటీల వద్ద స్థానికుల సహకారంతో ఈ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించినట్లు బోర్డు వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఇందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసేందుకు ఆసక్తిగల సంస్థల నుంచి ‘ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ-ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్) దరఖాస్తులు’ పిలవాలని తాజాగా నిర్ణయించినట్లు తెలిసింది. - సాక్షి, సిటీబ్యూరో మహానగరం పరిధిలో బహుళ అంతస్తుల భవంతుల సముదాయాలు సుమారు 20 వేల వరకు ఉన్నట్లు బోర్డు వర్గాలు గుర్తించాయి. భూగర్భజలాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలో నివాసం ఉంటున్న వినియోగదారులు ముందుకొస్తే ఎస్టీపీలను ఏర్పాటుచేసే అవకాశం ఉంటుందని జలమండలి వర్గాలు తెలిపాయి. కాగా పలు అభివద్ధి చెందిన దేశాల్లో నీటి వినియోగాన్ని తగ్గించడం(రెడ్యూస్), వినియోగించిన నీటిని శుద్ధిచేయడం(రీసైకిల్), తిరిగి వినియోగించడం(రీ యూజ్)పద్ధతులను అమలుచేస్తున్నారు. ఈవిధానాన్ని మూడు ‘ఆర్’ల(3ఆర్) విధానంగా పిలుస్తారు. పది లక్షల ఖర్చుతో మినీ ఎస్టీపీ! అపార్ట్మెంట్ల వద్ద రోజువారీగా ఐదు వేల కిలోలీటర్ల మురుగు నీటిని(5కేఎల్) శుద్ధిచేసేందుకు ఏర్పాటుచేసే చిన్నపాటి ఎస్టీపీ నిర్మాణానికి సుమారు రూ.10 లక్షలు ఖర్చవుతుంది. ఈ ఎస్టీపీ వద్ద ఏరియేషన్, రివర్స్ ఆస్మోసిస్ విధానాల ద్వారా మురుగునీటిలోని బీఓడీ, సీఓడీ, నురుగు, ఇతరత్రా కలుషిత అనుఘటకాలను తొలగించి మురుగునీటిలో సుమారు 60 శాతం నీరు తిరిగి వినియోగించుకునేలా శుద్ధిచేస్తారు. అంటే వందలీటర్ల మురుగు నీటిని శుద్ధిచేస్తే 60 లీటర్లను తిరిగి వినియోగించుకోవచ్చన్నమాట. కాగా ఈ నీరు తాగడానికి పనికిరాదు. కానీ గార్డెనింగ్, బాత్రూం ఫ్లష్, వాహనాలు శుభ్రపరచడం, ఫ్లోర్క్లీనింగ్ ఇతరత్రా అవసరాలకు వినియోగించుకోవచ్చు. మన నగరంలో థర్మాక్స్ వంటి కంపెనీలు ఈటెక్నాలజీని అభివృద్ధిచేసి జలమండలికి ముందు మినీ ఎస్టీపీల ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిసింది. వినియోగదారుల సహకారమే కీలకం.. ఎస్టీపీ నిర్మాణానికి జలమండలి సాంకేతిక సహకారమే అందిస్తుంది. నిర్మాణానికయ్యే వ్యయాన్ని అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వినియోగదారులే భరించాలి. ఇప్పటికే నీటి బిల్లులు, ఇంటిపన్నులు, కరెంట్బిల్లుల మోతతో సతమతమౌతున్న వినియోగదారులు ఎస్టీపీల నిర్మాణానికి ఏమేర ముందుకొస్తారన్నది సందేహాస్పదంగా మారింది. వీటి నిర్మాణానికయ్యే వ్యయంలో జలమండలి సగం వ్యయాన్ని సమకూరిస్తే మిగతా మొత్తాన్ని ఫ్లాట్లలో నివాసం ఉంటున్న వినియోగదారులు భరించే ప్రతిపాదనను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు 20 ఫ్లాట్స్ దాటిన అపార్ట్మెంట్లకు మినీ ఎస్టీపీల నిర్మాణాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని మున్సిపల్ యాక్ట్లో సవరణలు చేస్తేనే సత్ఫలితాలుంటాయని స్పష్టంచేస్తున్నారు. మినీ మురుగు శుద్ధి కేంద్రాలతో ఉపయోగాలివీ.. భూగర్భజలాల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఎస్టీపీల నిర్మాణంతో నీటిఎద్దడి గణనీయంగా తగ్గుతుంది. వాడుకునే నీటికి కొరత ఉండదు.మినీ ఎస్టీపీల్లో శుద్ధిచేయగా మిగిలిన నీటిని భూగర్భంలోకి మళ్లించి భూగర్భజల నిల్వలు పెంచవచ్చు. జలమండలి ట్యాంకర్ నీటికోసం ఎదరుచూసే అవస్థలు తప్పుతాయి. {పైవేటు ట్యాంకర్ల దోపిడీ నుంచి విముక్తి పొందవచ్చు. ఎందుకంటే ఐదువేల లీటర్ల నీటి ట్యాంకర్కే రూ.800 నుంచి రూ.1000 చెల్లించాల్సిన దుస్థితి తప్పుతుంది. గార్డెనింగ్, గ్రీన్బిల్డింగ్లు, చిన్నపార్కుల నిర్వహణకు నీటికొరత ఉండదు. పచ్చదనానికి కొదవుండదు.పెద్దపెద్ద అపార్ట్మెంట్లలో మినీ ఎస్టీపీల నిర్మాణంతో నగరంలో మురుగునీటి ప్రవాహం గణనీయంగా తగ్గుతుంది. మూసీలోకి ప్రవహించే మురుగు ప్రవాహం తగ్గుతుంది. మూసీ ప్రక్షాళన మరింత సులువు అవుతుంది.లోతట్టు ప్రాంతాల్లో భూమిలోపల సుమారు 1500 ఫీట్ల వరకు డ్రిల్లింగ్ చేసి డీప్ ట్యూబ్వెల్స్ను ఏర్పాటుచేసి ఎస్టీపీల్లో శుద్ధిచేసిన నీటిని వీటిల్లోకి మళ్లిస్తే భూగర్భ జలాల రీఛార్జీ సులువు అవుతుంది. మండువేసవిలో బోరుబావులు ఎండిపోయే దుస్థితి తప్పుతుంది. -
వాన చుక్క.. ఇంకేదెట్టా!
మహానగరంలో జోరు వానలు కురుస్తున్నా భూగర్భంలోకి చుక్కనీరు చేరడం లేదు. నీరింకే దారిలేక వర్షం నీటిలో దాదాపు 60 శాతం వృథా అవుతోంది. వర్షాకాలంలోనూ భూగర్భ జలాలు పెరగకపోవడంతో బోరుబావులు బావురుమంటున్నాయి. నగరవాసికి నీటి కొరత ఏమాత్రం తీరడం లేదు. ప్రతి భవంతి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్న నిబంధనలు ఎవ్వరూ పాటించకపోవడంతో నీరింకే దారి కన్పించడం లేదు. గ్రేటర్లో 22 లక్షల భవంతులుంటే, ఇంకుడు గుంతలు లక్షలోపే ఉన్నాయి. జీహెచ్ఎంసీ, జలమండలి నిర్లిప్తత వల్లే ఈ దుస్థితి తలెత్తుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. - గ్రేటర్లో 22 లక్షల భవంతులకు..ఇంకుడు గుంతలు లక్ష లోపే? - వర్షపు నీటిలో సుమారు 60 శాతం మేర వృథా - చోద్యం చూస్తున్న జీహెచ్ఎంసీ, జలమండలి సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో జూన్ తొలి మూడు వారాల్లో సుమారు 157 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం (82 మి.మీ)కంటే ఇది సుమారు 75 మిల్లీమీటర్లు అధికమే. కానీ ఈనీటిని భూగర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన ఇంకుడు గుంతలు లేకపోవడంతో వర్షపునీరు రహదారులను ముంచెత్తి వృథాగా పోయింది. ఈ దుస్థితితో నగరంలో పలు బోరుబావులు వర్షపు నీటి రీచార్జి లేక బావురుమంటున్నాయి. మహానగరంలో సుమారు 22 లక్షల భవంతులుండగా ..ఇందులో ఇంకుడు గుంతలున్న భవనాలు లక్షకు మించి లేవంటే పరిస్థితి తీవ్రతను అర్థంచేసుకోవచ్చు. గడిచిన వేసవిలో జలమండలి సుమారు పదివేల ఇంకుడు గుంతలు తవ్వించాలని లక్ష్యం నిర్దేశించుకోగా అందులో నాలుగు వేలకు మించి తవ్వలేదు. మరోవైపు భవన నిర్మాణ అనుమతులు మంజూరు సమయంలో ఇంకుడు గుంత తవ్వితేనే అనుమతి మంజూరు చేయాల్సిన జీహెచ్ఎంసీ ఈ విషయంలో ప్రేక్షకపాత్రకే పరిమితమౌతుండడంతో భూగర్భ జలసిరులు రోజురోజుకూ అడుగంటుతున్నాయి. ఇంకుడు గుంతలు లేకనే ఈ దుస్థితి.. కాంక్రీట్ మహారణ్యంలా మారిన గ్రేటర్లో ప్రతి ఇళ్లు, అపార్ట్మెంట్, కార్యాలయాల వద్ద ఇంకుడు గుంతలు(రీచార్జింగ్ పిట్స్)లేకపోవడంతో ఏటా వర్షాకాలంలో 60 శాతం మేర వర్షపునీరు వృథాగా పోతోందని నిపుణులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వర్షపు నీరు వరద రూపంలో 40 శాతం మేర వృథా అవడం సర్వసాధారణమే. కానీ నగరంలో దీనికి అదనంగా మరో 20 శాతం నీరు వృథాగా పోవడం సిటీజనులు పాలిట శాపంగా మారుతోంది. ఈ నీటిలో సిం హభాగం భూగర్భంలోకి మళ్లిస్తే జలమట్టాలు మరో రెండు మీటర్ల మేర పెరిగే అవకాశం ఉంది. మూడేళ్ల క్రితం జీహెచ్ఎంసీ 10 వేలు, జలమండలి 22 వేల ఇంకుడు గుంతల ఏర్పాటు చేసేందుకు వినియోగదారుల నుంచి రూ.64 కోట్ల మేర రాబట్టాయి. కానీ తవ్వింది ఐదు వేల ఇంకుడు గుంతలే కావడం ఆయా శాఖల నిర్లక్ష్యానికి పరాకాష్ట. వర్షపు నీటిని ఇలా ఒడిసిపట్టొచ్చు - నగరంలో కురుస్తున్న వర్షపునీటిలో 80 శాతం వర్షపు నీటిని ఒడిసిపట్టే అవకాశం ఉంది. - ఫిలడెల్ఫియా(అమెరికా), బార్సిలోనా మహానగరాల్లో ఇంకుడు గుంతలను విస్తృతంగా తవ్వడంతో వర్షపునీటిలో 80 శాతం భూగర్భంలోకి చేరుతోంది. - ఉదాహరణకు 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇంటికి బోరుబావికి ఆనుకొని రెండు మీటర్ల వెడెల్పు, రెండు మీటర్ల లోతున ఇంకుడు గుంత తవ్వాలి. గుంత పూడుకుపోకుండా చుట్టూ లోపలి వైపు నుంచి బండ రాళ్లు లేదా, ఇటుకలతో మధ్యలో సన్నటి ఖాళీలుంచి పేర్చాలి. గుంతపై ఆర్సీసీ సిమెంటుతో తయారు చేసిన జాలిని ఏర్పాటు చేయాలి. జాలికి ఉన్న పెద్ద రంధ్రాల గుండా వర్షపునీరు గుంతలోకి మళ్లేలా ఏర్పాటు చేయాలి. - ఇంటి పైకప్పుపై చేరిన వర్షపునీరు నేరుగా ఈ గుంతలోకి చేరేలా ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే రోజుకు సుమారు 50 నుంచి 80 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని బోరుబావికి సమీపంలో ఇంకించవచ్చు. సీజన్లో నిల్వ చేసిన ఈ నీరు ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి మూడు నెలల అవసరాలకు సరిపోతాయి. - లోతట్టుప్రాంతాలు, పార్కులో పెద్ద విస్తీర్ణంలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తే వాటికి సమీప ప్రాంతాల్లో బోరుబావులు రీచార్జి అవుతాయి. వర్షపునీటిని ఎక్కడికక్కడే ఇంకింప జేస్తే రహదారులను మంచెత్తే వర్షపునీరు సైతం తగ్గుముఖం పడుతుంది. -
జలమండలిలో 1480 ఉద్యోగాలు ఖాళీ !
పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రికి లేఖ సాక్షి, సిటీబ్యూరో: జలమండలిలో కొలువుల మేళాకు రంగం సిద్ధమైంది. బోర్డులో దీర్ఘకాలంగా 1480 పోస్టులు ఖాళీగా ఉండడంతో గ్రేటర్ పరిధిలో మంచినీటి సరఫరా, డ్రైనేజి వ్యవస్థ నిర్వహణ, మరమ్మతు పనుల్లో తరచూ జాప్యం జరుగుతుందని, వినియోగదారులకు సకాలంలో సేవలు అందించలేకపోతున్నట్లు బోర్డు యాజమాన్యం తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదించినట్లు తెలిసింది. ఇటీవల స్వచ్ఛ హైదరాబాద్పై ఏర్పాటుచేసిన మంత్రుల కమిటీకి సైతం ఇదే విషయాన్ని స్పష్టంచేయడం విదితమే. కాగా హోదారీత్యా జలమండలికి ముఖ్యమంత్రి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతానికి మున్సిపల్ పరిపాలన శాఖ బాధ్యతలు సీఎం వద్దే ఉన్నాయి. ఈనేపథ్యంలో నగరంలో అత్యంత కీలకమైన వాటర్ బోర్డులో ఉద్యోగాల భర్తీని తక్షణం చేపట్టేందుకు ఆయన గ్రీన్సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నట్లు బోర్డు వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. అయితే మొత్తం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్కు అప్పగించాలా..? లేదా అసిస్టెంట్, టెక్నీషియన్ స్థాయి ఉద్యోగాలను బోర్డు యాజమాన్యం ప్రత్యేక పోటీ పరీక్ష నిర్వహించి సొంతంగా భర్తీ చేయవచ్చా..? అన్న అంశంపై ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం ఆధారంగానేస్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా ఖాళీలే.. జలమండలి బోర్డు 1989లో ఏర్పాటైంది. ప్రారంభంలో బోర్డులో 6111 మంది పనిచేసేవారు. శివారు ప్రాంతాల్లోని 11 మున్సిపల్ సర్కిళ్లు గ్రేటర్లో విలీనమవడంతో బోర్డు పరిధి అనూహ్యంగా విస్తరించింది. ప్రస్తుతం 8.34 లక్షల నల్లాలకు జలమండలి మంచినీరు సరఫరా చేస్తోంది. కానీ ఏటా పదవీ విరమణ పొందిన ఉద్యోగుల స్థానంలో కొత్త ఉద్యోగుల భర్తీ కాలానుగుణంగా జరగడంలేదు. దీంతో బోర్డు పరిధిలో పలు సేవల్లో అంతరాయం, జాప్యం ఏర్పడుతోంది. ప్రస్తుతం 16 డివిజన్ల పరిధిలో 4631 మంది రెగ్యులర్ ఉద్యోగులు, మరో 1004 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఖాళీగా 1480 పోస్టులున్నట్లు బోర్డు యాజమాన్యం ముఖ్యమంత్రికి సమర్పించిన లేఖలో పేర్కొంది. ఈ ఉద్యోగాల భర్తీతో జలమండలి పౌరసేవలు మెరుగవడంతోపాటు ఉద్యోగాల కోసం సుదీర్ఘకాలంగా వేచిచూస్తున్న నగర యువతకు కొలువులు దక్కే భాగ్యం దక్కుతుందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. కొలువుల భర్తీకి తక్షణం నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగ, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
తాగునీటికి మాస్టర్ప్లాన్!
► మంత్రుల కమిటీ సిఫారసు ► త్వరలో కన్సల్టెన్సీ నియామకం ► 20 జోన్లుగా విభజన సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వ్యాప్తంగా తాగునీటి అవసరాలు తీర్చేందుకు సరికొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించాలని జలమండలిపై ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ సూచించింది. గతంలో 1994లో మాత్రమే కోర్సిటీ నీటి సరఫరాకు మాస్టర్ప్లాన్ రూపొందిం చారు. ఆ తరువాత నగర శివార్లు శరవేగంగా విస్తరించడంతో పాటు జనాభా అనూహ్యంగా పెరుగుతూనే ఉంది. దీంతో గ్రేటర్లో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్లలోని సుమారు వెయ్యి కాలనీలు, బస్తీలు దాహార్తితో అలమటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 625 చదరపు కి.మీ. పరిధిలో ఉన్న నగరానికి సమృద్ధిగా తాగునీరందించేందుకు గ్రేటర్ను 20 తాగునీటి జోన్లుగా విభజించి.. సమగ్ర ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు కన్వీనర్లుగా ఉన్న కమిటీ జలమండలిని ఆదేశించింది. ఈ కమిటీలో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు సభ్యులుగా ఉన్న విషయం విదితమే. తాజా మాస్టర్ప్లాన్లో భాగంగా తక్షణం మంచినీటి సరఫరా నెట్వర్క్ పైప్లైన్లు, రిజర్వాయర్లు ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాలను గుర్తించనున్నారు. వీటిపై సమగ్ర ప్రతిపాదనలు సిద్ధంచేసి కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టనున్న అమృత్ పథకం కింద ఆర్థిక సాయం పొందేందుకు ప్రయత్నాలు చేయాలని, లేనిపక్షంలో హడ్కో సంస్థ నుంచి రుణం సేకరించాలని నిర్ణయంచినట్లు సమాచారం. గతంలో జలమండలి రూపొందించిన ప్రాథమిక అంచనాల ప్రకారం శివారు ప్రాంతాల్లో సుమారు రూ.3195 కోట్ల అంచ నా వ్యయంతో 436.28 కి.మీ. మేర తాగునీటి పైప్లైన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తాజాగా స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణానికి ఇంతకంటే అధికంగానే వ్యయమయ్యే అవకాశాలున్నట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. కన్సల్టెంట్ నియామకంతో అంచనా వ్యయం మారనుందన్నారు. మాస్టర్ప్లాన్ స్వరూపం ఇదే... ♦ గ్రేటర్ను 20 తాగునీటి జోన్లుగా విభజించే అంశంపై దృష్టి. ఆయా జోన్ల పరిధిలో స్టోరేజి రిజర్వాయర్లు, పైప్లైన్ నెట్వర్క్ , ఇన్లెట్, అవుట్లెట్ మెయిన్లు ఏర్పాటు చేయాల్సిన కాలనీలు, బస్తీల గుర్తింపు. ♦ వివిధ జోన్ల పరిధిలో నూతనంగా వెలసిన కాలనీలు, జనాభా, తాగునీటి అవసరాలపై శాస్త్రీయ అంచనా రూపొందించడం. ♦ మల్కాజ్గిగి, అల్వాల్, కుత్బుల్లాపూర్తదితర శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో ప్రస్తుతం నాలుగైదు రోజులకోమారు నీటి సరఫరా అందుతున్న ప్రాంతాల గుర్తింపు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు. ♦ శివారు మున్సిపల్ సర్కిళ్లలో నెట్వర్క్ విస్తరణకు గతంలో జలమండలి రూపొందించిన అంచనా వ్యయం వివరాలివే. -
జనం జనం... జలం గగనం!
- విస్తుగొల్పుతున్న జలమండలి అంచనాలు - 2015 నాటికి గ్రేటర్ జనాభా కోటి... నీటి డిమాండ్ 732.43 ఎంజీడీలు - 2021 నాటికి జనాభా 1.50 కోట్లు...నీటి డిమాండ్ 986.82 ఎంజీడీలు - 2041 నాటికి జనాభా 3 కోట్లు...నీటి డిమాండ్ 1908.39 ఎంజీడీలు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో నీటి లభ్యతపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. భవిష్యత్తులో జనాల అవసరాలకు సరిపడే స్థాయిలో నీరు దొరికే అవకాశాలు లేవనే సంకేతాలు వెలువడుతున్నాయి. జనాభాతో పాటే నీటి కొరత కూడా పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. తాగునీటి ముఖచిత్రంపై జలమండలి రూపొందించిన తాజా అంచనాలు విస్తుగొల్పుతున్నాయి. ప్రస్తుతం మహా నగర జనాభా సుమారు కోటికి చేరువైంది. గృహ, వాణిజ్య అవసరాలకు నిత్యం నీటి డిమాండ్ 732.43 మిలియన్ గ్యాలన్లు కాగా.. కొరత 130.43 ఎంజీడీలుగా ఉంది. ఇక 2021 నాటికి నగర జనాభా 1.50 కోట్లకు చేరువకానుంది. అప్పుడు నీటి డిమాండ్ 986.82 ఎంజీడీలకు చేరనుంది. కొరత 384.82 ఎంజీడీలు అవుతుందని అంచనా. ఇదే రీతిన లెక్కిస్తే 2041 నాటికి గ్రేటర్ జనాభా మూడుకోట్లకు చేరుకోనుంది. అప్పుడు రోజువారీ 1908.39 ఎంజీడీల నీరు అవసరమవుతుంది. కొరత కూడా 1306.39 ఎంజీడీలకు చేరుతుందని అంచనా. దీన్నిబట్టిపెరుగుతున్న జనాభాకు అవసరమైన తాగునీరు అందించడం భవిష్యత్లోనూసాధ్యపడదన్న సంకేతాలు వెలువడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాగునీటి సరఫరాలో నిత్యం లీకేజీలు, చౌర్యం కారణంగా ఏర్పడుతున్న 33 శాతం నష్టాలను గణనీయంగా తగ్గించుకుంటే ప్రజల దాహార్తిని తీర్చవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తాగునీటికి మహా డిమాండ్... ప్రస్తుతం గ్రేటర్లో 8.64 లక్షల నల్లాలకు జలమండలి నిత్యం 385 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తోంది. త్వరలో కృష్ణా మూడోదశ ద్వారా మరో 45 ఎంజీడీలు, ఈ ఏడాది ఆగస్టు నాటికి గోదావరి మంచినీటి పథకం మొదటి దశ ద్వారా మరో 172 ఎంజీడీల నీరు సిటీకి అందనున్నాయి. దీంతో మొత్తం 602 ఎంజీడీలు అందుబాటులోకి రానున్నాయి. ఇంకా 130.43 ఎంజీడీలకు కొరత తప్పదని జలమండలి వర్గాలు ‘సాక్షి'కి తెలిపాయి. గ్రేటర్లో విలీనమైన శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, రామచంద్రాపురం, పటాన్చెరు, కాప్రా, అల్వాల్, కూకట్పల్లి, ఎల్బీనగర్, గడ్డిఅన్నారం, ఉప్పల్, రాజేంద్రనగర్ మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో రూ.3195 కోట్ల వ్యయంతో మంచినీటి స్టోరేజి రిజర్వాయర్లు, తాగునీటి పైప్లైన్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తేనే ఆ ప్రాంతాల్లోని కాలనీలు, బస్తీల దాహార్తి తీరనుందని జలమండలి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేసింది. నిధులు విదిలిస్తేనే ఈ ప్రాంతాల దాహార్తి తీరనుందని సర్కారుకునివేదించింది. తలసరి నీటి వినియోగంలో శివార్ల వెనుకంజ అంతర్జాతీయ నిబంధనల ప్రకారం తలసరి నీటి వినియోగం (ఎల్పీసీడీ-లీటర్ పర్ క్యాపిటా డైలీ) 150 లీటర్లు. ఈ విషయంలో ప్రధాన నగరం శివార్ల కంటే ముందంజలో ఉంది. కోర్సిటీలో ప్రతి వ్యక్తికి రోజువారీ సరాసరి 150 లీటర్ల జలాలు సరఫరా చేస్తున్నట్లు జలమండలి తాజా నివేదిక వెల్లడించింది. శివార్లలోని వివిధ ప్రాంతాల్లో తలసరి నీటి వినియోగం 90 నుంచి 120 లీటర్ల మధ్యనే ఉందని స్పష్టం చేసింది. అక్కడ పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా మంచినీటి స్టోరేజి రిజర్వాయర్లు, పైప్లైన్ నెట్వర్క్స్ లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని తేల్చింది. -
నీరే బంగారం
- నీటి సరఫరా నెట్వర్క్ ఖర్చు స్థానికులదే - జలమండలి కొత్త నిర్ణయం - మాదాపూర్తో శ్రీకారం - 30:70 నిబంధనకు చెల్లు? సాక్షి,సిటీబ్యూరో: శివారు వాసులపై జలమండలి మరో భారం మోపుతోంది. శివారు కాలనీలు, బస్తీల్లో మంచినీటి సరఫరా నెట్వర్క్ ఏర్పాటుకయ్యే మొత్తం వ్యయాన్ని ఇకపై స్థానికులే భరించాల్సి ఉంటుంది. దీనికి ముందుకొస్తేనే పైప్లైన్లు వేయాలని జలమండలి నిర్ణయించింది. గతంలో స్థానికులు 30 శాతం, జీహెచ్ఎంసీ 70 శాతం నిధులు వెచ్చిస్తే మంచినీటి సరఫరా నెట్వర్క్ ఏర్పాటుకు జలమండలి చర్యలు తీసుకునేది. కొత్త నిర్ణయంతో భారమంతా ప్రజల పైనే పడనుంది. తాజాగా మాదాపూర్లోని ఓ కాలనీలో 15 అపార్ట్మెంట్ బ్లాకులు ఉన్న ఓ గేటెడ్ కమ్యూనిటీకి నీటి సౌకర్యానికి రూ.3 కోట్ల వ్యయాన్ని ఆ ఫ్లాట్లలో ఉండే వినియోగదారుల నుంచే వసూలు చేస్తోంది. కృష్ణా మూడో దశ ద్వారా నగరానికి ప్రస్తుతం సరఫరా చేస్తున్న 385 మిలియన్ గ్యాలన్లకు అదనంగా త్వరలో మరో 45 ఎంజీడీల జలాలు నగరానికి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈనీటిని ఆయా ప్రాంతాలకు సరిపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. నిబంధనకు చెల్లుచీటీ? గతంలో శివారు కాలనీలు, బస్తీలకు మంచినీటి సరఫరా పైప్లైన్లు, చిన్న పరిమాణంలో ఉండే స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణానికి అయ్యే వ్యయంలో జీహెచ్ఎంసీ 70 శాతం, స్థానికులు 30 శాతం నిధులు వెచ్చించేవారు. జీహెచ్ఎంసీ ఈ విషయంలో మొండి వైఖరితో వ్యవహరిస్తూ తమ వాటా నిధులను విదల్చకపోవడంతో శేరిలింగంపల్లి, కాప్రా, అల్వాల్, మల్కాజ్గిరి, ఎల్బీనగర్ తదితర మున్సిపల్ సర్కిళ్లలోని కాలనీలు, బస్తీలు ఏళ్లుగా దాహార్తితో అలమటిస్తున్నాయి. మరోవైపు రూకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న జలమండలి నెలవారీ ఆదాయం సుమారు రూ.92 కోట్లు విద్యుత్ బిల్లులు, ఉద్యోగుల జీతభత్యాలు, గతంలో తీసుకున్న లోన్లకు సంబంధించిన వాయిదాలు చెల్లించేందుకే సరిపోతున్నాయి. నిధులు వెచ్చించే పరిస్థితి లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నామని జలమండలి వర్గాలు వివరించాయి. 80 శాతం మంది ముందుకొస్తేనే... ఏదేని ఒక కాలనీ, బస్తీ, అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీకి సమీపంలో జలమండలి భారీ మంచినీటి పైప్లైన్ అందుబాటులో ఉండి.. అక్కడి నుంచి నేరుగా వినియోగదారుల ఇళ్లకు పైప్లైన్ ఏర్పాటు చేయాలంటే స్థానికంగా 80 శాతం మంది జలమండలికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మొత్తం వ్యయాన్ని అందరికీ సమానంగా పంచుతారన్నమాట. అంటే సుమారు రూ.కోటి వ్యయమయ్యే పనికి కావాల్సిన మొత్తాన్ని ఈ 80 శాతం మంది చెల్లించాలి. స్థానికంగా మొత్తం వంద శాతం మంది చార్జీలు చెల్లించే స్థితిలో ఉండరన్న దృష్టితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జలమండలి వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా... నగరానికి అదనంగా రానున్న మూడోదశ నీటిని మార్కెటింగ్ చేసి.. తద్వారా బోర్డు ఆదాయాన్ని గణనీయంగా పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. -
అవినీటి దందా
రూ.వంద కోట్ల వ్యాపారం శివార్లలో జోరుగా అక్రమాలు {పమాదంలో తాగునీటి నాణ్యత చోద్యం చూస్తున్న అధికారులు ఐఎస్ఐ ప్రమాణాలున్న నీటి ఫిల్టర్ ప్లాంట్లు 450... {పమాణాలు లేనివి సుమారు ఐదు వేలు..! కుళాయి తిప్పితే అరకొర మంచినీళ్లు... బోరుబావి తవ్వినా కానరాని నీటిబొట్టు... పాతాళానికి చేరిన భూగర్భజలాలు... జలమండలి ట్యాంకర్ బుక్చేసుకున్నా తీరని దాహార్తి.. ఎండాకాలం శివార్లలో సుమారు వెయ్యి కాలనీల్లో నివసిస్తున్న 30 లక్షల మంది వరకు పానీపరేషాన్తో విలవిల్లాడుతున్నారు. ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు నీటి దందాకు తెరలేపారు. కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా శుద్ధి చేయని జలాలను మినరల్ వాటర్ పేరుతో అంటగడుతున్నారు. ఇంట్లోనే ప్లాంట్లు ఏర్పాటు చేసి నీళ్లను అమ్మేస్తున్నారు. అక్రమార్కులను కట్టడి చేయాల్సిన సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. మహానగర పాలక సంస్థలో విలీనమైన శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో వాస్తవ చిత్రం కన్నీటి వ్యథ గానే మిగులుతోంది. పెరుగుతున్న నిత్యావసరాలకు తోడు మంచినీళ్లను కూడా అధిక ధరలకు కొనుగోలుచేస్తుండడంతో సిటీజనుల ఇంటి బడ్జెట్ చుక్కలను తాకుతోంది. సిటీబ్యూరో/నెట్వర్క: గ్రేటర్లో నెలకు వంద కోట్ల రూపాయలకు పైగా మంచినీటి వ్యాపారం జరుగుతోందని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. భారతీయ ప్రమాణాల సంస్థ(బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) నిర్దేశించిన మేరకు ప్రమాణాలను పాటించకుండానే గుర్తింపులేని ఫిల్టర్ప్లాంట్లలో భూగర్భ జలాలను అరకొరగా శుద్ధిచేసి ప్యాకేజ్డ్ నీటి పేరుతో విక్రయిస్తున్న నిర్వాహకులకు అడ్డూఆపూ లేకుండా పోయింది. మహానగరం పరిధిలో ఐఎస్ఐ నాణ్యతా ప్రమాణాలున్న ప్లాంట్లు 450 కాగా.. అనధికారికంగా పుట్టగొడుగుల్లా వెలిసినవి ఐదువేలకు పైగానే ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. బీఐఎస్ సంస్థ నుంచి లెసైన్స్ తీసుకోవడం, ప్లాంట్ నిర్మాణం, నాణ్యతా ప్రమాణాల తనిఖీ ల్యాబ్ నిర్మాణానికి రూ.25 లక్షల వరకు ఖర్చవుతుంది. అదే అనుమతి లేకుండా ఇంట్లోనే నాసిరకం ప్లాంటును ఏర్పాటుచేస్తే రూ.2 లక్షలే వ్యయం అవుతోంది. దీంతో అక్రమార్కులు వీటినే ఏర్పాటుచేస్తుండడం గమనార్హం. ప్రతినెలా జీహెచ్ఎంసీ పరిధిలో నెలకు సుమారు 20 లక్షల నీటిక్యాన్లు(20 లీటర్లవి) అమ్ముడవుతున్నాయి. వీటిలో ప్రముఖ బ్రాండ్లకు చెందినవి కేవలం ఐదు లక్షలు మాత్రమే. మరో ఐదు లక్షల క్యాన్లు ఐఎస్ఐ గుర్తింపు పొందిన ఫిల్టర్ నీటి ప్లాంట్లలో తయరవుతున్నాయి. ఇక పదిలక్షల క్యాన్లు అనధికారిక ప్లాంట్లలో తయారవుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థంచేసుకోవచ్చు. బస్టాండ్లు,రైల్వేస్టేషన్లు, క్యాంటీన్లు,హోటళ్లలో విక్రయిస్తున్న మంచినీటి బాటిళ్ల సంఖ్య(లీటరువి) సుమారు 50 లక్షల వరకు ఉంటుంది. వీటిలోనూ సగం బాటిళ్లకే ఐఎస్ఐ గుర్తింపు ఉంది. మొత్తంగా నీటి వ్యాపారం నెలకు వందకోట్ల మేర ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. నగరంలో 13 సంవత్సరాల క్రితం ప్రారంభమైన మంచినీటి వ్యాపారం ప్రతి ఏటా 20 శాతం వృద్ధితో పురోగమిస్తుండడం గమనార్హం. జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటి నాణ్యత, స్వచ్ఛతపై నమ్మకం లేకపోవడంతో మధ్యతరగతి వర్గం, ఉద్యోగులు, వ్యాపారులు ప్యాకేజీ నీటినే ఆశ్రయిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు మినరల్ వాటర్ను కొనుగోలు చేస్తున్నాయి. చోద్యం చూస్తున్న సర్కారు విభాగాలు శివారు మున్సిపాల్టీల్లో నీటి వ్యాపారం ఊపందుకున్నా.. అనుమతిలేకుండా బోరుబావులు తవ్వి ట్యాంకర్ల ద్వారా మంచినీటిని విక్రయిస్తున్న ముఠాలను కట్టడిచేయడంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా విఫలమౌతోంది. ఫిల్టర్ప్లాంట్లలో నీటి నాణ్యతను తనిఖీ చేయడంలో జీహెచ్ఎంసీ, జలమండలి, ఇన్సిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సంస్థలు చోద్యం చూస్తున్నాయి. దీంతో హైటెక్సిటీకి నెలవైన శేరిలింగంపల్లికీ కన్నీటి కష్టాలే. ఉప్పల్,మల్కాజ్గిరి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, అల్వాల్, కాప్రా తదితర ప్రాంతాల్లో నీటి వ్యాపారం మూడు క్యాన్లు.. ఆరు ట్యాంకర్లు అన్న చందంగా జోరుగా సాగుతోంది. ఉదాహరణకు కూకట్పల్లి మున్సిపాల్టీ పరిధిలోని నిజాంపేట్రోడ్, ఎల్లమ్మబండ చౌరస్తాల్లో విచ్చలవిడిగా బోరుబావులు తవ్వి బహిరంగంగా నీటివ్యాపారం చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. బస్తీలకు ఉచితంగా మంచినీటిని తరలించాల్సిన జలమండలి ఫ్రీ ట్యాంకర్లను హోటళ్లు, హాస్టళ్లకు, బిలర్డర్లకు అధిక ధరలకు సరఫరాచేస్తున్నా జలమండలి మొద్దునిద్ర వీడడంలేదు. అక్రమాలకు కొన్ని సాక్ష్యాలివిగో.. దిల్సుఖ్నగర్, మలక్పేట్, అక్బర్బాగ్, అజంపుర, సైదాబాద్, ఐఎస్సదన్, మాదన్నపేట్, ఆర్కేపురం, సరూర్నగర్, ఎన్టీఆర్నగర్, జిల్లెలగూడ, మీర్పేట్, గుర్రంగూడ, బాలాపూర్, బడంగ్పేట్, పహాడీషరీఫ్ తదితర ప్రాంతాల్లో అనుమతులు లేని అక్రమ ఫిల్టర్ ప్లాంట్లు నడుస్తున్నాయి. పలు కాలనీలు, గ్రామాలు, బస్తీలలో మినిరల్ వాటర్ పేరుతో కొందరు వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు కనీస ప్రమాణాలు, పరిశుభ్రత పాటించకుండా మినరల్వాటర్ బాటిళ్లలో అరకొరగా శుద్ధిచేసిన నీటిని నింపుతున్నారు. వీటికి వివిధ రకాల పేర్లతో ఉన్న లేబుళ్లు అంటించి విక్రయిస్తున్నారు. ఒక్కో క్యాను ధర రూ.25 నుంచి రూ.35 వరకు ఉంది. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో వీధికో ఫిల్టర్నీటి ప్లాంట్లు ఏర్పాటు చేసి వాటి నిర్వాహకులు జేబులు నింపుకుంటున్నారు. స్థానిక వెంకట్రామిరెడ్డినగర్లో రెండు ప్లాంట్లు పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నాయి. కొన్ని ప్లాంట్లలో బాలకార్మికులతో పనులు చేయిస్తుండడం గమనార్హం. భగత్సింగ్నగర్ చెరువు కట్టపై ఏకంగా నాలుగు ప్లాంట్లు ఉన్నాయి. సూరారం కాలనీలోకి ఎంబీ గ్రామర్ స్కూల్ వెనుక, సూరారం మార్కెట్ రోడ్డులో ఇంట్లోనే ప్లాంట్ ఏర్పాటు చేసి నీటి వ్యాపారం చేస్తుండడంతో సమీపంలో ఉన్న బోరుబావులన్నీ వట్టిపోయాయి. ఉప్పల్ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో బోరు నీళ్లను అరకొరగా శుద్ధిచేసి మినరల్ వాటర్ పేరిట విక్రయిస్తున్నారు. రామంతాపూర్, నాచారం, మల్లాపూర్, కుషాయిగూడ, చర్లపల్లి, బోడుప్పల్, హబ్సిగూడ, పర్వాతాపూర్, పిర్జాదిగూడ, మేడిపల్లి తదితర ప్రాంతాల్లో నిర్వహించే అక్రమ వాటర్ పిల్టర్స్లో బోర్ నీరునే నింపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో బోర్లు వేసి మరి దర్జాగా ట్యాంకర్లకొద్దీ నీటిని విక్రయిస్తున్నారు. మల్లాపూర్ బాబానగర్లో ప్రాతంలో ఇళ్లలో వేసిన బోర్లకు వాటర్ ప్లాంట్లు బిగించి జోరుగా వ్యాపారం కోనసాగిస్తున్నారు. మరి కొన్ని ప్లాంటు నేరుగా ఐఎస్ఐ ముద్రను సైతం ముద్రించి ప్రజలను నిలువునా దోపిడీ చేస్తున్నాయి. బోర్ల నుంచి వచ్చిన ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో దాదాపు వందకు పైగానే అక్రమ ప్లాంట్లు ఉన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థంచేసుకోవచ్చు. ఫిల్టర్ ప్లాంట్ల నీటితో జాగ్రత్త... నగరంలో ప్రమాణాలు పాటించని ప్లాంట్లలో తయారు చేస్తున్న ప్యాకేజీ వాటర్లో కోలిఫాం, పాథోజెన్స్, ఇ.కోలి, సిట్రోబ్యాక్టర్ ఆనవాళ్లున్నాయి. ఈ నీటిని తాగిన వారికి వాంతులు, విరేచనాలు, కామెర్లు, జీర్ణసంబంధిత వ్యాధులు సంభవిస్తున్నాయి. జంటనగరాలు, శివారు ప్రాంతాల్లో ఐఎస్ఐ గుర్తింపు పొందిన వాటర్ ప్లాంట్లు 450 వరకు ఉన్నాయి. ఇక పుట్టగొడుగుల్లా వీధికొకటి వెలిసిన ప్లాంట్లు ఐదువేలకు పైగానే ఉన్నాయి. ఐఎస్ఐ గుర్తింపు లేని ప్లాంట్లలో నీటినమూనాలను పరీక్షించే ల్యాబ్, నిపుణులు, మైక్రోబయాలజిస్ట్లు లేరు. అపరిశుభ్ర పరిసరాలు,పారిశ్రామిక వాడలు, మురికివాడలు, ఇరుకైన గదుల్లో వెలిసినవే అధిక సంఖ్యలో ఉన్నాయి. అనధికారిక ప్లాంట్లలో ప్రతి 20 లీటర్ల నీటి శుద్ధికి నిర్వాహకులు రూ. 4 ఖర్చుచేస్తున్నారు. జనం నుంచి రూ. 25 నుంచి రూ. 30 వరకు దోచుకుంటున్నారు. ఐఎస్ఐ ప్రమాణాలున్న నీటికి రూ. 15 వ్యయం చేయాలి. వీటి ధర బహిరంగ మార్కెట్లో రూ. 35 నుంచి రూ. 80 వరకు పలుకుతోంది. ఐఎస్ ప్రమాణాల ప్రకారం నీటిని నింపే సీసాలు, క్యాన్లు పాలీ ఇథిలిన్, పాలివినైల్ క్లోరైడ్, పాలీప్రొపిలీన్లతో తయారైన వాటిని వినియోగించాలి. వీటి ధర రూ.280 నుంచి రూ.400(20 లీటర్ల డబ్బా) వరకు ఉం టుంది. కానీ ధర ఎక్కువన్న కారణంతో తక్కువ ధరకు దొరికే నాసిరకం పెట్బాటిల్స్ను వినియోగిస్తున్నారు. వీటి ధర రూ.100 నుంచి రూ.120 లోపుగానే ఉంటుంది. వీటిలో త్వరలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతోంది. భూగర్భజలాన్ని శుద్ధిచేసే సమయంలో ఫిల్ట్రేషన్,ఏరేషన్, కార్బన్ఫిల్ట్రేషన్..ఇలా 12 రకాల శుద్ధిప్రక్రియలు నిర్వహిస్తున్న వారు వేళ్లమీద లెక్కపెట్టే సంఖ్యలోనే ఉన్నారు.శుద్ధిచేసిన 48 గంటల తరవాతనే బాటిళ్లలో మంచినీటిని నింపాలి. కానీ వెంటనే నింపుతున్నారు. దీంతో నీటి గాఢత పడిపోతుంది. ఈనీటిని తాగిన వారికి గొంతు సంబంధిత సమస్యలు వస్తున్నాయి. వందకోట్ల నీళ్లవ్యాపారం లెక్క ఇదీ.. {Vేటర్ పరిధిలో నివాస సముదాయాలు : సుమారు 25 లక్షలు జలమండలి నల్లా కనెక్షన్లున్న భవనాలు: 8.90 లక్షలు నల్లా కనెక్షన్లు లేని కుటుంబాలు: సుమారు 16.10 లక్షలు {Vేటర్ పరిధిలో బోరుబావులు: సుమారు 22 లక్షలు ఈ వేసవిలో వట్టిపోయిన బోరుబావులు: సుమారు 14 లక్షలు నెలకు నీళ్లకోసం గ్రేటర్ వాసుల ఖర్చు: సుమారు వందకోట్లు (బీఐఎస్)ప్రమాణాలు పాటిస్తున్న ఫిల్టర్ ప్లాంట్లు: సుమారు 450 బీఐఎస్ గుర్తింపు లేని ప్లాంట్లు: సుమారు ఐదువేలు ఒక్కో కుటుంబం ఫిల్టర్ నీళ్లు కోసం చేస్తున్న వ్యయం ( నెలకు): రూ. వెయ్యి నుంచి ఐదు వేలు ప్యాకేజీ నీటిని కొనేముందు... మీరు కొనుగోలు చేస్తున్నది బాటిల్ లేదా క్యాన్, ప్యాకెట్ అయినా సరే ఐఎస్ఐ మార్కు, దానికింద 14543 నెంబరు, బ్యాచ్నెంబరును పరిశీలించాలి. లేబుల్పై తయారీదారు పూర్తిచిరునామా ఉండాల్సిందే. ఇవి లేకుండా కొనుగోలుచేస్తే మీరు రోగాలను కొనితెచ్చుకున్నట్లేనని గుర్తించాలి. ఐఎస్ఐ నిబంధనలు ప్యాకేజీ వాటర్ ఎలా ఉండాలన్న అంశంపై భారతీయ ప్రమాణాల సంస్థ 60 రకాల ప్రమాణాలను రూపొందించింది. వీటిని ఐఎస్14543:2004 నిబంధనలుగా పేర్కొంటారు. భూగర్భజలాన్ని సేకరించి శుద్ధిచేస్తున్న వాటర్ప్లాంట్ల నిర్వాహకులు ఈ ప్రమాణాల ప్రకారమే ప్లాంట్లు నెలకొల్పాల్సి ఉంటుంది. అప్పుడే బీఎస్ఐ సంస్థ ఐఎస్ఐ మార్కును కేటాయిస్తుంది. కేవలం ఐఎస్ఐ ధ్రువీకరణకే నిర్వాహకులు ఏటా లక్ష రూపాయలు ఖర్చుచేయాలి. ఈ వ్యయంతో తయరు చేస్తున్న మంచినీటికి బీఐఎస్ సంస్థ 60 రకాల పరీక్షలు నిర్వహిస్తుంది. కానీ ఇవేవీ లేకుండా మహానగరంలో సుమారు ఐదువేల ఫిల్టర్ప్లాంట్లు నాణ్యతకు నీళ్లొదిలి యథేచ్ఛగా నీటివ్యాపారం చేస్తున్నాయి. -
హే...కృష్ణా!
► కృష్ణా మూడో దశతో పాక్షికంగా నీటి సరఫరా ► శివార్లలో ఇంకా తీరని దాహార్తి ► అసంపూర్తిగా ఫిల్టర్బెడ్స్, జంక్షన్లు, రింగ్మెయిన్ నిర్మాణం ► అల్లాడుతున్న జనం సాక్షి, సిటీబ్యూరో : కృష్ణా మూడోదశ ట్రయల్న్త్రో నగరానికి పాక్షికంగా మంచినీటి సరఫరా జరుగుతున్నా... శివార్ల దాహార్తి తీరడం లేదు. నగరానికి అదనంగా 22.5 మిలియన్ గ్యాలన్ల జలాలను తరలిస్తున్నట్లు జలమండలి ఆర్భాటంగా ప్రకటిస్తున్నా.. ప్రయోజనం కనిపించడం లేదు. మూడో దశలో భాగంగా న ల్గొండ జిల్లా కోదండాపూర్ వద్ద సుమారు 34 ఫిల్టర్బెడ్ల నిర్మాణం పూర్తి కాకపోవడం... నీటిని నగరం నలుమూలలకు సరఫరా చేసేందుకు అవసరమైన రింగ్మెయిన్-1 పనుల్లో ఐదు కిలోమీటర్లు అసంపూర్తిగా ఉండడం... జంక్షన్ల నిర్మాణ పనులు టెండర్ల దశలో ఉండడంతో మూడో దశతో దాహార్తి తీరుతుందనుకున్న వారు మరికొన్నాళ్లు వేచి ఉండక తప్పని దుస్థితి నెలకొంది. లెక్కల చిక్కులు.. కృష్ణా మూడోదశలో కోదండాపూర్లో నిర్మించాల్సిన 40 ఫిల్టర్బెడ్లలో ఇప్పటికి కేవలం 6 మాత్రమే పూర్తయినట్లు సమాచారం. మరోవైపు ఇక్కడ ఏర్పాటు చేసిన 8 మోటార్లలో రెండింటిని మాత్రమే ప్రారంభించి.. నగరానికి నిత్యం 22.5 ఎంజీడీల నీటిని పంపింగ్ చేస్తున్నట్లు తెలిసింది. కృష్ణా ఫేజ్-1, ఫేజ్-2లో సరఫరా చేస్తున్న 180 ఎంజీడీలలో కొంత మేర తగ్గించి... మూడోదశలో 22.5 ఎంజీడీలు సరఫరా చేస్తున్నట్లు అంకెల గారడీ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. కొందరు అధికారులు ఏకంగా మూడోదశలో అదనంగా నిత్యం 30 ఎంజీడీలు తరలిస్తున్నట్లు సర్కారు పెద్దలు, మంత్రులను తప్పుదోవ పట్టిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ వరకూ నిరీక్షణ రూ.1670 కోట్ల అంచనాతో చేపట్టిన కృష్ణా మూడోదశలో నగరానికి పూర్తి స్థాయిలో 90 ఎంజీడీలు తరలించాలని నిర్ణయించిన విషయం విదితమే. ఈ నీటిని తీవ్ర దాహార్తితో అలమటిస్తున్న ఉప్పల్, కాప్రా, మల్కాజ్గిరి, అల్వాల్, సైనిక్పురి, బోడుప్పల్, ప్రశాసన్నగర్, మైలార్దేవ్పల్లి తదితర ప్రాంతాలకు రెండురోజులకోమారు సరఫరా చేయాంటే సుమారు 50జంక్షన్ల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సి ఉంది. ఈ పనులకు ప్రస్తుతం జలమండలి టెండర్ల ప్రక్రియను చేపట్టింది. మరోవైపు రింగ్మెయిన్-1లో ఐదు కిలోమీటర్ల మేర పైప్లైన్ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ప్రధాన నగరంలో ట్రాఫిక్ చిక్కులు, జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన రహదారి కోత అనుమతులు ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఈ పనులు మందగమనంలో సాగుతున్నాయి. ఇక కోదండాపూర్లోనూ 34 ఫిల్టర్బెడ్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. ఈ కారణాల రీత్యా మూడోదశను పూర్తి స్థాయిలో సాకారం చేయాలంటే ఈ ఏడాది సెప్టెంబరు వరకు నిరీక్షించకతప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పనులపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయిలో సమీక్ష నిర్వహిస్తేనే త్వరితగతిన పూర్తవుతాయని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. -
కన్నీటి వ్యథా చిత్రం
♦ మహా నగరంలో నీటి కష్టాలు ♦ ఓ వైపు లీకేజీలు... మరోవైపు జల దోపిడీ ♦ వృథాను అరికట్టడంలో యంత్రాంగం వైఫల్యం మహా నగరం నీటి జాడ తెలియక తల్లడిల్లుతోంది. దశాబ్దాలుగా దాహంతో అల్లాడుతోంది. ఎండలు ముదురుతున్నాయంటే భయంతో వణికిపోతోంది. భూగర్భ జలాలు అడుగంటి... హైదరాబాద్ నీటి కష్టాలకు రాజధానిగా మారుతోంది. దాహం తీరే దారి తెలియక బిక్కుబిక్కుమని చూస్తోంది. నిప్పులు చెరిగే ఎండలో... కుటుంబం యావత్తూ పనులు మానుకొని... నల్లాల దగ్గర బిందెలు పట్టుకొని.. గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఎప్పుడో ఒకసారి వచ్చే ట్యాంకర్ల దగ్గర...యుద్ధాలు షరా మామూలే. బస్తీల్లోనైతే బిందెల సమరమే. బలం ఉన్న వారిదే నీరు. ఒక్క బిందె నీరు దొరికితే ప్రపంచం గెలిచిన సంబరం.లేదంటే కి లోమీటర్లకొద్దీ ప్రయాణం. నాణేనికి మరోవైపు పైపు లైన్ల లీకేజీలు... మోటార్లతో సంపులు.. ట్యాంకులు నింపుకుని సొమ్ము చేసుకోవాలనేఅక్రమార్కుల నీటి దోపిడీ... నగర వాసుల నీటి కష్టాలను పెంచుతున్నాయి. కుటుంబంలో ఒక్కరు కష్టపడితే అందరి కడుపులూ నిండుతున్నాయ్... కానీ అందరూ కొళాయిల దగ్గర నిలబడకపోతే దాహం మాత్రం తీరడం లేదు. విశ్వనగరం నీటికష్టాలపై ‘సాక్షి’ ఫోకస్... విశ్వ నగరం గొంతెండుతోంది. ఏళ్ల తరబడి తాగునీటి సవుస్యతో నగరం అల్లాడుతోంది. అయినా... పట్టించుకునే నాథుడే లేరు. ఒక వైపు లీకేజీలు..వురో వైపు అక్రవూర్కుల నీటి దోపిడీ .. అరికట్టడంలో అధికార యుంత్రాంగం వైఫల్యం నీటి సమస్యను తీవ్రం చేస్తోంది. శివారు ప్రాంతాల్లోని కాలనీలు, బస్తీల్లో పరిస్థితి వురీ దారుణం. చిన్నా..పెద్దా అంద రూ నీటి కోసం పరుగులు తీస్తున్నారు. ఎన్నాళ్లీ నీటి కష్టాలు?...ఇవి కడతేరేదెప్పుడు? అందరిలోనూ ఇదే ప్రశ్న. ప్రభుత్వ పెద్దలు.. ఉన్నతాధికారులు ఉండే రాజధానిలో పానీ పరేషాన్పై ‘సాక్షి’ ఫోకస్. మహా నగరానికి జలమండలి రోజువారీగా తరలిస్తున్న 340 మిలియన్ గ్యాలన్ల నీటిలో సరఫరా,పంపిణీ నష్టాలు సుమారు 40 శాతం మేర ఉంటోంది. ఫలితంగా సరఫరా 204 మిలియన్ గ్యాలన్లు మించడంలేదు. వృథా అవుతున్న నీటిని ఒడిసిపడితే శివారు వాసుల గొంతు తడపొచ్చన్న సృ్పహ జలమండలికి కరువవడంతో నీటి కటకట రోజురోజుకూ తీవ్రమవుతోంది. వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లగొండ జిల్లా కోదండాపూర్ నుంచి కృష్ణా మొదటి రెండవ దశల ద్వారా 180 ఎంజీడీలు,మెదక్ జిల్లాలోని సింగూరు, మంజీరా జలాశయాల నుంచి మరో 120 ఎంజీడీలు, నగరానికి ఆనుకొని ఉన్న హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ నుంచి మరో 40 ఎంజీడీల నీటిని జలమండలి సేకరిస్తోంది. ఈ నీటిని శుద్ధిచేసి సరఫరా నష్టాలు పోను మిగిలిన జలాలను నగరంలోని 8.65 లక్షల నల్లాలకు జలమండలి అరకొరగానే సరఫరా చేస్తోంది. ఇక శివారు ప్రాంతాల్లో కొందరు నీటి జలగలు అక్రమంగా మోటార్ల ద్వారా నీటిని తోడి భారీ సంపులు, ట్యాంకులు నింపుకుంటున్నా బోర్డు విజిలెన్స్ విభాగం నిద్రమత్తులో జోగుతోంది. దీంతో ఎగువ ప్రాంతాలు, బస్తీ, కాలనీల్లో చివరి ప్రాంతాల్లో ఉన్నవారి గొంతెండుతోంది. లీకేజీలను అరికట్టేందుకు ఏటా వెచ్చిస్తున్న కోట్లాదిరూపాయల నిధులు నీళ్లపాలవుతుండడంతో పరిస్థితి విషమిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో స్టాటిక్ ట్యాంకులు నిరుపయోగంగా వూరారుు. లీకేజీలు,కన్నీటి కష్టాలకు సాక్ష్యాలివే.. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో మంచినీటి పైప్లైన్లు లీక్ అవుతున్నారుు. ఆగ్రోస్ కంపెనీ వద్ద, ఫాంతూష్, ఐడీపీఎల్ సూర్యానగర్, రాంరెడ్డినగర్, గాంధీనగర్ ఇండస్ట్రీయల్ కేఫ్ ఎదురుగా సంపు, ఎర్ర గోడల వద్ద 300 ఎంఎం పైపులైన్ సంపు, సుచిత్ర సమీపంలోని వెన్నెలగడ్డ, బ్యాంక్ కాలనీకి వెళ్లే రోడ్డు, గాజులరామారం చౌరస్తా.. ఇలా అనేక ప్రాంతాల్లో నీరు ఏరులై పారుతోంది.కూకట్పల్లి జగద్గిరిగుట్ట దీనబంధు కాలనీలో మంచినీటి పైపులైన్ వాల్వులు లీకై ప్రతిరోజూ నీరు వృథా అవుతోంది. మరికొన్ని వీధుల్లో భూగర్భ డ్రైనేజీ నీళ్లు మంచినీటి పైపుల్లో చేరడంతో కలుషితమైన తాగునీరు సరఫరా అవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆస్బెస్టాస్ కాలనీ, ఆల్విన్కాలనీ, పాపిరెడ్డినగర్, వెంకటేశ్వరనగర్, ఆదిత్యనగర్ తదితర ప్రాంతాలలో వారానికి ఒక మారు నీరు విడుదల చేయడంతో తాగడానికి నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.మూసాపేటలోని పలు బస్తీలోకి మంచినీరు రాకపోవడంతో జనతానగర్లోని నీటి ట్యాంక్ వద్దకు వచ్చి లీకేజీ నీటితో స్థానికులు పట్టుకొని గొంతు తడుపుకుంటున్నారు. నేరేడ్మెట్ డిఫెన్స్ కాలనీ డివిజన్ పరిధిలో మంచినీటి కటకటతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. డివిజన్లోని కాకతీయనగర్, రేణుకానగర్, మధురానగర్, రామకృష్ణాపురం, జేకే కాలనీ, శ్రీసాయినగర్, వాజ్పేయినగర్, సైనిక్పురి, శివసాయినగర్ తదితర కాలనీల్లో పవర్బోర్లు చెడిపోవడంతో నీరు నిల్వ ఉంచుకునేందుకు ఏర్పాటు చేసిన స్టాటిక్ ట్యాంకులు నీరు లేక అలంకార ప్రాయంగా మారాయి. షాపూర్నగర్లో వారానికి ఒక రోజు మాత్రమే ట్యాంకర్ నీళ్లు సరఫరా అవుతున్నాయి. ట్యాంకర్ కోసం డ్యూటీలు మానుకుని వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ట్యాంకర్ల వద్ద యుద్ధం చేయాల్సివస్తోంది. పాతనగరంలోని జియాగూడకు ప్రతినిత్యం పానీ పరేషానే. ఓల్డ్ సిటీ మిశ్రీ గంజ్, రెడ్హిల్స్ ప్రాంతాల నుంచి తక్కువ వత్తిడితో నీటిసరఫరా జరుగుతోంది. ఓల్డ్ సిటీ వాటర్ అక్కడి ప్రజలకు సరిపోయిన తర్వాతే జియాగూడకు సరఫరా అవుతోంది. లేనిపక్షంలో నీటి సరఫరా నిలిచిపోతోంది. దీనికి తోడు మల్లేపల్లి, నాంపల్లి,మంగళ్హాట్ తదితర ప్రాంతాల్లో కొంతమంది మంచినీటి పైప్లైన్ల నుంచి మోటార్ల ద్వారా నీటిని తోడేస్తున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడలో అక్రమ నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. అక్రమంగా బోర్లు వేసి నీటి దందా చేస్తుండడంతో నియోజక వర్గ పరిధిలో రోజు రోజుకూ భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. జల మండలి ద్వారా ఒక్కో నీటి ట్యాంకర్ రూ. 400 వరకు తీసుకుంటుండగా ప్రైవేట్ వ్యాపారులు ఒక్కో నీటి ట్యాంకర్కు 800 నుంచి 1200 వరకు వ్యాపారులు వసూలు చేస్తున్నారు.లోయర్ ట్యాంక్బండ్లోని ముషీరాబాద్ తహశీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే నలువైపులా, కవాడిగూడలో అక్రమ నీటి వ్యాపారం సాగుతున్నా వీటిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పాతబస్తీలో మంచినీటి సరఫరా అస్తవ్యస్తంగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున మోటార్లు పెట్టినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఒక్కో బస్తీలో మెజార్టీ ప్రజలు మోటార్ల ద్వారా నీటిని జలగల్లా తోడేస్తున్నారు. పాతబస్తీలోని శంషీర్గంజ్, మిశ్రీగంజ్, బాలాపూర్, మొఘల్పురా, సంతోష్నగర్ మంచినీటి రిజర్వాయర్ల పరిధిలో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. మొఘల్పురా నుంచి వాటర్ ట్యాంకర్ల నీటిని ప్రైవేట్గా విక్రయిస్తున్నారు. ఉప్పుగూడలోని పలు బస్తీలలో నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో బస్తీల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సాయిబాబానగర్, శివాజీనగర్, రాజీవ్గాంధీనగర్, చాంద్రాయణగుట్ట, బండ్లగూడ, గౌస్నగర్లో సమస్య తీవ్రత జటిలంగా ఉంది. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని కొత్తపేట, మన్సూరాబాద్, ఆర్కేపురం, హయత్ నగర్, వనస్థలిపురం, కర్మన్ఘాట్, చంపాపేట, చైతన్యపురి ప్రాంతాల్లో నీటి వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. కొత్తపేట, కర్మన్ఘాట్, హయత్నగర్, మన్సూరాబాద్ డివిజన్లలో ప్రైవేటు బోర్ల నుంచి పెద్ద ట్యాంకర్ల నుంచి వందలాది లీటర్ల నీటిని అక్రమంగా తోడేస్తూ వ్యాపారం చేసుకుంటున్నారు. ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలో 40 శాతం కాలనీలు, బస్తీలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే నీరంతా లీకేజీల ద్వారా వృథా కావడంతో కాలనీలకు సరిపడా నీరు అందడం లేదు. పాత పైపులైన్ల ద్వారా నీటిని సరఫరా చేయడంతో ఈ సమస్య తలెత్తుతోంది. పలు కాలనీలకు నీరు సరిపడా రాకపోవడంతో కాలనీవాసులు మోటార్లు బిగించుకుని నీటి చౌర్యానికి పాల్పడుతున్నారు. నీటి డిమాండ్ ఇలా.. గ్రేటర్ వ్యాప్తంగా రోజువారీగా నీటి డిమాండ్: 459 మిలియన్ గ్యాలన్లు గ్రేటర్లో రోజువారీగా జలమండలి సరఫరా చేస్తున్న నీరు: 340 మిలియన్ గ్యాలన్లు సరఫరా నష్టాలు 40 శాతం పోను వాస్తవ సరఫరా: 204 మిలియన్ గ్యాలన్లు గ్రేటర్ పరిధిలోని జలమండలి నల్లా కనెక్షన్లు: సుమారు 8.75 లక్షలు గ్రేటర్లో జలమండలి మంచినీటి పైప్లైన్ వ్యవస్థ లేని కాలనీలు,బస్తీలు: సుమారు 1000 నీటి వృథాకు కారణాలు: పైప్లైన్లు, వాల్వ్ల లీకేజీలు, నీటిచౌర్యం,మోటార్లతో నీటిని తోడడం, అక్రమ సంపులు, ట్యాంకుల్లో నీటిని నిల్వచేసుకోవడం. -
నేడు సగం సిటీకి నీరు బంద్
♦ ఆదివారం కొన్ని ప్రాంతాలకు... ♦ సోమవారం నాటికి పునరుద్ధరణ ♦ సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లకూ కష్టమే ♦ సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ సాక్షి, సిటీబ్యూరో : కృష్ణా మూడో దశ ట్రయల్న్ల్రో భాగంగా సుమారు 45 మిలియన్ గ్యాలన్ల జలాలను ఫేజ్-1, 2 పైప్లైన్ల ద్వారా నగరం నలుమూలలకు సరఫరాచేయనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నగరంలోని వివిధ ప్రాంతాలకు 180 ఎంజీడీల కృష్ణా జలాల సరఫరా నిలిచిపోనుంది. దీంతో సగం సిటీకి నీరందే పరిస్థితి లేదు.ఆదివారం కూడా కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదని జలమండలి ప్రకటించింది. సోమవారం సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపింది. ట్రయల్న్ల్రో భాగంగా నల్లగొండ జల్లాలోని అక్కంపల్లి జలాశయంలో నీటిని తొలగించి... మూడోదశకు అవసరమైన పైప్లైన్ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. రింగ్మెయిన్-1 పనులు 6.5 కి.మీ. మేర పూర్తి కానందున ఫేజ్-1, ఫేజ్-2 పైప్లైన్లను వాడుకోవడం అనివార్యమవుతోందని తెలిపింది. మరో మూడు నెలల్లో ఫిల్టర్బెడ్లు, రిజర్వాయర్లు, పైప్లైన్ పనులను పూర్తి చేసి నగరానికి 90 ఎంజీడీల నీటిని తరలిస్తామని జలమండలి మేనేజింగ్ డెరైక్టర్ ఎం.జగదీశ్వర్ తెలిపారు. శనివారం ఏం చేస్తారంటే... ♦ అక్కంపల్లి జలాశయంలో హెడ్ రెగ్యులేటర్ తెరచి ప్రస్తుతం నిల్వ ఉన్న నీటిని కిందకు వదులుతారు. ♦ నీటి నిల్వలు తగ్గిన తరువాత కృష్ణా ఫేజ్-1, 2 మోటార్లను ఉదయం 4- 5 గంటల మధ్యఆపేస్తారు. ♦ ఉదయం 6 గంటలకు అక్కంపల్లిలో కాపర్ బండ్ ఉంచి... మూడో దశకు అవసరమైన పైప్లైన్ ఏర్పాటు చేస్తారు. ♦ సాయంత్రం 4 గంటలకు జలాశయాన్ని నీటితో నింపుతారు. ♦ సాయంత్రం 5 గంటలకు మూడో దశలో ఏర్పాటు చేసిన రెండు పంపులను ప్రారంభించి...పరీక్షిస్తారు. ♦ రాత్రి 9 గంటలకు అక్కంపల్లి నుంచి నగర శివార్లలోని సాహెబ్నగర్ (సుమారు 108 కి.మీ)కు 45 ఎంజీడీల నీటిని తరలించి.. మార్గమధ్యలో నూతన రిజర్వాయర్లు, వాల్వ్లు, జంక్షన్ల వద్ద లీకేజీలను పరీక్షిస్తారు. ♦ ఈ నీటిని అర్థరాత్రికి కృష్ణా మొదటి, రెండో దశ పైప్లైన్ల ద్వారా నగరం నలుమూలల్లోని రిజర్వాయర్లకు సరఫరా చేస్తారు. రైల్వే స్టేషన్లలో ఇబ్బందే నగరంలోని నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లకు కూడా నీటి సరఫరా నిలిచిపోనుంది. దీంతో రైళ్లను శుభ్రపరచడం, నీటిని నింపుకునే పనులను వరంగల్, ఖాజీపేట్ తదితర స్టేషన్లలో పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. రైల్వే స్టేషన్లలో నీటి కొరత కారణంగా సుమారు 80కి పైగా ఎక్స్ప్రెస్, మరో వంద ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణించే వేలాదిమంది తీవ్ర ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే రైల్వే స్టేషన్లలోని ట్యాంకులలో నీటిని ముందుగానే నిల్వ చేసి పెట్టినట్లు ద.మ.రైల్వే అధికారులు తెలిపారు. నీటి సరఫరా పునరుద్ధరించే వరకు ప్రయాణికులు పొదుపుగా నీటిని వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
4న సగం సిటీకి నీళ్లు బంద్
కృష్ణా మూడోదశ కింద 45 మిలియన్ గ్యాలన్ల నీటి తరలింపు నేపథ్యంలో.. మొదటి, రెండవ దశల పరిధిలో నీటిసరఫరా నిలిపివేత.. ఈ వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటాం.. విలేకరుల సమావేశంలో జలమండలి మేనేజింగ్ డెరైక్టర్ ఎం.జగదీశ్వర్ సిటీబ్యూరో: ఈ నెల 4(శనివారం)న గ్రేటర్ పరిధిలో సగం నగరానికి కృష్ణా జలాల సరఫరా నిలిచిపోనుంది. కృష్ణా మూడోదశ పథకం కింద నగరానికి 45 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలించ డంతోపాటు.. ఈ నీటిని కృష్ణా ఫేజ్-1,2 పైప్లైన్ల ద్వారా నగరం నలుమూలలకు పంపిణీ చేసే విధానాన్ని పరీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో 180 మిలియన్ గ్యాలన్ల కృష్ణా జలాల సరఫరా నిలిపివేయడం అనివార్యమైందని జలమండలి ఎండీ ఎం.జగదీశ్వర్ తెలిపారు. మంగళవారం ఆయన ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నీటిసరఫరా నిలిపివేతకు గల కారణాలను ఇతర ఉన్నతాధికారులతో కలిసి వివరించారు. నల్లగొండ జిల్లాలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కృష్ణా మొదటి, రెండవ దశ పైప్లైన్ల ద్వారా ప్రస్తుతం నీటిని తరలిస్తున్నామని, ఈనెల 4న మూడోదశకు అవసరమైన పైప్లైన్ను ఈ జలాశయంలో ఏర్పాటు చేసి నీటిని తోడే ఏర్పాట్లను పదిగంటల వ్యవధిలో పూర్తిచేయనున్నామన్నారు. అదే రోజున కృష్ణా మూడోదశకు సంబంధించిన జంక్షన్లు, వాల్వ్లు, నూతన రిజర్వాయర్ల వద్ద పెం డింగ్ పనులను పూర్తిచేస్తామని ఎండీ తెలిపారు. మూడో దశ నీళ్లను నగరం నలుమూలలకు సరఫరా చేసేందుకు రింగ్మెయిన్-1 పనులు 6.5 కి.మీ మేర పూర్తికావాల్సి ఉన్నందున ఫేజ్-1,ఫేజ్-2 పైప్లైన్లను వాడుకోవాల్సి వస్తుందన్నారు. మరో మూడునెలల్లో మూడోదశ పథకానికి సంబంధించిన పెండింగ్ పనులను పూర్తిచేస్తామని స్పష్టంచేశారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. నీటి సరఫరా నిలిపివేయనున్న నేపథ్యంలో ఖైరతాబాద్లోని జలమండలి ప్రధానకార్యాలయంలో ఉన్నతాధికారులతో కూడిన సెంట్రల్ మానిటరింగ్ కమిటీ, అత్యవసర హెల్ప్లైన్ను ఏర్పాటుచేసినట్లు ఎండీ తెలిపారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు 9989995690,9989990824 నెంబర్లకు ఫోన్ చేసి తమ సమస్యలను వివరించాలని కోరారు. అత్యవసర పరిస్థితిని సమీక్షించేందుకు సెక్షన్, డివిజన్ స్థాయిలో అధికారులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. బస్తీల దాహార్తిని తీర్చేందుకు నగరంలో 16 డివిజన్ల పరిధిలో ప్రతి డివిజన్కు 500 ట్యాంకర్ ట్రిప్పులను అదనంగా సరఫరా చేస్తామన్నారు. వేసవిలో నో ఫికర్... ఈ వేసవిలో నగర తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎండీ తెలిపారు. ఏప్రిల్ 7న గండిపేట్ వద్ద పంపింగ్ ద్వారా నీటిని తోడనున్నామన్నారు. సింగూరు జలాశయం వద్ద మే నెలలో పంపింగ్ ద్వారా నీటిని తోడుతామన్నారు. కృష్ణా మూడోదశ ద్వారా అదనంగా నీటిని తరలించనున్న నేపథ్యంలో వేసవిలో అంత ఆందోళన అవసరం లేదని స్పష్టంచేశారు. వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలుకు రూ.73 కోట్లు కేటాయించామన్నారు. ఈ ప్రాంతాల్లోనే.. కృష్ణా ఫేజ్-1: పూర్తిగా సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు: నారాయణగూడ, బర్కత్పురా, నల్లకుంట, ముషీరాబాద్, నింబోలిఅడ్డా, అడిక్మెట్, శివం, చిలకలగూడ, బొగ్గులకుంట, మహబూబ్మాన్షన్, వినయ్నగర్, అస్మాన్ఘడ్, చంచల్గూడ, బార్కాస్, చాంద్రాయణగుట్ట, మైసారం, యాకుత్పురా, సంతోష్నగర్, వైశాలినగర్, దిల్సుఖ్నగర్, సరూర్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, ఎన్టీఆర్నగర్, అల్కాపురి, మలక్పేట్. పాక్షికంగా సరఫరా నిలిపివేయనున్న ప్రాంతాలు మీరాలం, మిశ్రీగంజ్ ,జహానుమా, బహదూర్పురా, ఆజంపురా, మొఘల్పురా కృష్ణా ఫేజ్-2: పూర్తిగా నీటిసరఫరా నిలిచిపోయే ప్రాంతాలు: సాహెబ్నగర్,బాలాపూర్,మైలార్దేవ్పల్లి,హైదర్గూడా,ఉప్పర్పల్లి, ప్రశాసన్నగర్, తార్నాక,లాలాపేట్,మౌలాలి, నాచారం, బీరప్పగడ్డ, బోడుప్పల్, హబ్సిగూడ, రామంతాపూర్, మల్కాజ్గిరి, డిఫెన్స్కాలనీ, సాయినాథ్పురం, గాయత్రీనగర్, చాణక్యపురి, భువనగిరి మున్సిపాల్టీ, గచ్చిబౌలి, సైనిక్పురి, ఎలుగుట్ట, కైలాశ్గిరి రిజర్వాయర్ ప్రాంతాలు. పాక్షికంగా నిలిచిపోనున్న ప్రాంతాలు: లింగంపల్లి, మారేడ్పల్లి, సీతాఫల్మండి, మెట్టుగూడ, బంజారాహిల్స్, సోమాజిగూడ, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, ఎల్లారెడ్డిగూడ, కెపిహెచ్బి, భాగ్యనగర్, మూసాపేట్. -
జనంపై జలభారం
గ్రేటర్ వాసులకు నీటి కష్టాలు ట్యాంకర్లే ఆధారం ఒక్కో కుటుంబంపైసుమారు రూ.2 వేల అదనపు భారం ఈ నెల 1 నుంచి 18 వరకు 30 వేల ట్రిప్పులకు బుకింగ్ {పైవేటు ట్యాంకర్ యజమానుల దోపిడీ సిటీబ్యూరో: గ్రేటర్లో పెరుగుతున్న ఎండలు.. అడుగంటుతున్న భూగర్భ జలాలు... వట్టిపోతున్న బోరు బావులతో గ్రేటర్ శివార్లు తాగునీటికి ట్యాంకర్లపైనే ఆధార పడాల్సిన దుస్థితి తలెత్తింది. జలమండలి పరిధిలో మార్చి ఒకటి నుంచి 18వ తేదీ వరకు ఏకంగా 30 వేల ట్రిప్పులకు ట్యాంక్లు బుక్ కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఇలా బుక్ చేసుకున్న వారిలో 15 వేల మందికి 24 గంటల్లోగా.. మరో పదివేల మందికి 48 గంటల్లోగా ట్యాంకర్ నీటిని సరఫరా చేస్తున్నట్టు జలమండలి వర్గాలు తెలిపాయి. మరో 2500 మందికి మాత్రం వారం రోజులైనా ట్యాంకర్ నీళ్లు అందకపోవడం గమనార్హం. ఇదే అదనుగా ప్రైవేటు ట్యాంకర్ ఆపరేటర్లు వినియోగదారుల అవసరాలను భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. జలమండలి ట్యాంకర్కు (ఐదువేల లీటర్ల నీటికి) రూ.450 వసూలు చేస్తుండగా.. ప్రైవేటు ఆపరేటర్లు ప్రాంతాన్ని, డిమాండ్ను బట్టి రూ.750 నుంచి రూ.వెయ్యి వరకు దండుకుంటున్నారు. ఇక బస్తీలకు ఉచితంగా మంచినీటిని సరఫరా చేయాల్సిన జలమండలి ట్యాంకర్లు సైతం పక్కదారి పడుతున్నాయి. పేదల గొంతు తడపాల్సిన నీటిని కొందరు ట్యాంకర్ యజమానులు హోటళ్లు, రెస్టారెంట్లు, మెస్లకు సరఫరా చేసి జేబులు నింపుకుంటున్నారు. కొన్ని బస్తీల్లో జలమండలి ఉచిత ట్యాంకర్ల వద్ద మహిళలు ఖాళీ బిందెలతో యుద్ధాలు చేస్తున్న దృశ్యాలు ఇటీవల బాగా పెరిగాయి. అదనంగా ట్యాంకర్ ట్రిప్పులను సరఫరా చేయని కారణంగానే ఈ పరిస్థితి తలెతోంది. టాం్యకర్ల పక్క దారి... జలమండలి పరిధిలో నీటి సరఫరాకు 6,674 ట్యాంకర్లున్నాయి. ఇందులో బస్తీలకు ఉచితంగా సరఫరా చేయాల్సినవి 125 ఉన్నాయి. కొన్ని బస్తీలకు ఉచితంగా మంచినీటిని సరఫరా చేయాల్సిన ట్యాంకర్లు పక్కదారి పడుతున్నట్లు ఇటీవల ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిపై బోర్డు అధికారులు దృషి ్టపెట్టి ట్యాంకర్ యజమానులను కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ వేసవిలో అదనంగా 500 ట్యాంకర్లతో గ్రేటర్ శివార్లలో మంచినీటి పైప్లైన్లు లేని వెయ్యి కాలనీలు, బస్తీలు, ఎగువ ప్రాంతాలకు ఉచితంగా నీటిని సరఫరా చేయాలని కాలనీ సంఘాలు, రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. గొంతెండుతోంది... గ్రేటర్ పరిధిలోని దాదాపు అన్ని మండలాల్లో గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం భూగర్భ జలాలు పాతాళంలోకి వెళ్లిపోయాయి. ఎండలు తీవ్రమవుతుండడంతో నీటి సమస్య పెరుగుతోంది. మల్కాజ్గిరి, బోడుప్పల్, కాప్రా, శేరిలింగంపల్లి, చందానగర్ తదితర ప్రాంతాల్లో వెయ్యి అడుగుల లోతునకు బోరుబావులు తవ్వినా నీళ్లు లేక బావురుమనాల్సి వస్తోంది. జలమండలి మంచినీటి సరఫరా నెట్వర్క్ లేని సుమారు వెయ్యి కాలనీలు, బస్తీల్లో పానీపరేషాన్ రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఒక ఇల్లు లేదా ఫ్లాట్ యజమాని నెలకు ట్యాంకర్ నీళ్లకు రూ.2 వేల నుంచి రూ.5 వేలు వెచ్చించాల్సిన దుస్థితి నెలకొంది. ఇదీ లెక్క... గ్రేటర్ పరిధిలోని అపార్ట్మెంట్లు: సుమారు 25 వేలు ఒక్కో ఫ్లాట్ లేదా ఇంటి యజమాని ట్యాంకర్ నీళ్ల కోసం నెలవారీ చేస్తున్న ఖర్చు: ప్రాంతాన్ని బట్టి సుమారు రూ.2వేలు గ్రేటర్ పరిధిలోని మొత్తం భవంతులు: సుమారు 20 లక్షలు జలమండలి నల్లా కనెక్షన్లు: 8.64 లక్షలు జలమండలి సరఫరా నెట్వర్క్ లేని కాలనీలు, బస్తీలు: సుమారు వెయ్యి జలమండలి ట్యాంకర్లు: 674 {పైవేటు నీటి ట్యాంకర్లు: సుమారు నాలుగు వేలు. ఈ నెల 1 నుంచి 18 వరకు ట్యాంకర్ ట్రిప్పులు: 30 వేలు వారం రోజులుగా పెండింగ్లో ఉన్న ట్రిప్పులు: 2500 {పైవేటు ట్యాంకర్ నీళ్లకు (ప్రతి ఐదువేల లీటర్లకు) చెల్లిస్తున్న ధర: రూ.750 నుంచి రూ.1000 జలమండలి ట్యాంకర్ నీటికి: రూ.450(గృహవినియోగానికి) -
విద్యుత్ టారిఫ్ తగ్గించండి
జలమండలి వినతి నేడు తెలంగాణ ఈఆర్సీతో అధికారుల భేటీ సిటీబ్యూరో: రూకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న జలమండలికి విద్యుత్ టారిఫ్ తగ్గించాలని కోరుతూ బోర్డు అధికారులు శనివారం తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్కు విన్నవించనున్నారు. ప్రస్తుతం కృష్ణా, మంజీర, సింగూరు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల నుంచి సేకరిస్తున్న 340 మిలియన్ గ్యాలన్ల జలాలను గ్రేటర్ నలుమూలలకు సరఫరా చేసేందుకు నెలకు 110 మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తున్నారు. దీనికి ప్రతి నెలా జలమండలి రూ.45 కోట్లు బిల్లులు చెల్లిస్తోంది. బోర్డును పరిశ్రమ కేటగిరీగా (హెచ్టీ) పరిగణిస్తూ యూనిట్కు రూ.5.70 వంతున వసూలు చేస్తున్నారు. ఇక నుంచి యూనిట్కు రూ.3.70కే సరఫరా చేయాలని జలమండలి అధికారులు ఈఆర్సీని కోరనున్నారు. దీంతో బోర్డుకు నెలకు రూ.10 కోట్ల వంతున ఆదా అవుతుందని.. ఈ నిధులు శివార్లలో మంచినీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు, స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణం, మరమ్మతులకు వినియోగించే అవకాశం ఉంటుందని ఈఆర్సీకి వివరించనున్నారు.బెంగళూరులో జలబోర్డుకు సరఫరా చేస్తున్న విద్యుత్ యూనిట్కు రూ.3.70 మాత్రమే వసూలు చేస్తున్నారని, మరోవైపు గ్రామీణ నీటి సరఫరా విభాగానికి సైతం రాయితీపై విద్యుత్ అందిస్తున్నారని బోర్డు అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. జలమండలి వాదనకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వంటి స్వచ్ఛంద సంస్థలు సైతం మద్దతు పలుకుతుండడం విశేషం. రెట్టింపు భారం ఈ ఏడాది జూన్కు పూర్తి కానున్న కృష్ణా మూడోదశ నీటి పంపింగ్, సరఫరాకు 36 మెగావాట్లు, ఆగస్టు చివరికి పూర్తి కానున్న గోదావరి మంచినీటి పథకానికి మరో 72 మెగావాట్ల విద్యుత్అవసరమవుతుందని జలమండలి అంచనా వేస్తోంది. ఈ రెండు పథకాలు పూర్తయితే ప్రతినెలా రూ.90 కోట్ల మేర విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తుందని బోర్డు వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతం బోర్డుకు నెలకు రూ.90 కోట్ల ఆదాయం వస్తుండగా.. విద్యుత్ బిల్లుల చెల్లింపు, ఉద్యోగుల జీతభత్యాలు, రుణ వాయిదాల చెల్లింపు, మరమ్మతులకు రూ.93 కోట్లు వ్యయమవుతోంది. ఈ రెండు మంచినీటి పథకాలు పూర్తయితే బోర్డుకు వచ్చే ఆదాయమంతా విద్యుత్ బిల్లులకే సరిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో సర్కారు జోక్యం చేసుకొని విద్యుత్ టారిఫ్ తగ్గించాలని బోర్డు వర్గాలు కోరుతున్నాయి. ఈఆర్సీ సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. -
‘మహా’ ఆశ
బడ్జెట్ వైపు ప్రభుత్వ శాఖల చూపు భారీ ఎత్తున ప్రతిపాదనలు కొత్త రాష్ట్రం... కొత్త బడ్జెట్పై ప్రభుత్వ విభాగాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. తమ పరిధిలో చేపట్టాల్సిన పనులు...అవసరమైన నిధులను ప్రస్తావిస్తూ సంబంధిత అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు. తాము కోరినంత నిధులు వస్తే అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు. సర్కారుపై ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు. సిటీబ్యూరో: విశ్వ నగరం వైపు అడుగులేస్తున్న గ్రేటర్లో మౌలిక వసతుల కల్పనకు సర్కారు విభాగాలు భారీ లక్ష్యాలు నిర్దేశించుకున్నాయి. 2015-16 వార్షిక బడ్జెట్పై ‘మహా’ ఆశలు పెట్టుకున్నాయి. అందమైన రహదారులు, పారిశుద్ధ్యం,ప్రజారోగ్య పరిరక్షణ, మురికివాడల్లో కనీస వసతుల కల్పన, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనతో పాటు నేర రహిత రాజధానిగా తీర్చిదిద్దే క్రమంలో శాంతిభద్రతల పటిష్టానికి భారీగా నిధులు అవసరమవుతాయని జీహెచ్ఎంసీ, జలమండలి, హెచ్ఎండీఏ, వైద్య ఆరోగ్యశాఖ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు విభాగాలు ఆశిస్తున్నాయి. ఈ విభాగాల అంచనాలకు అనుగుణంగా తెలంగాణ సర్కారు నిధులు విదిలిస్తుందా? లేదా? అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది. జీహెచ్ఎంసీ అంచనాలు రూ.1700 కోట్లు వచ్చే ఏడాది బడ్జెట్లో మౌలిక వసతుల కల్పనకు జీహెచ్ఎంసీ సుమారు రూ.1700 కోట్లు కోరినట్లు తెలిసింది. 2014-15 బడ్జెట్లో రూ.1093 కోట్లు కోరగా... రూ. 373 కోట్లు మాత్రమే సర్కారు కేటాయించింది. ఇది కేవలం నాలుగు నెలలకుసంబంధించినదే. గ్రేటర్ను స్లమ్ ఫ్రీ సిటీగా చేస్తామన్న హామీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయించింది. ఈ పథకానికి జీహెచ్ఎంసీ రూ.50 కోట్లు కోరగా... ప్రభుత్వం ఏకంగా రూ. 250 కోట్లు కేటాయించడం విశేషం. తాజా ప్రతిపాదనల్లో మౌలిక సదుపాయాలకు రూ.200 కోట్లు, కోటి మొక్కల కార్యక్రమానికి రూ.25 కోట్లు, మన వార్డు-మన ప్రణాళికకు రూ.150 కోట్లు కోరినట్లు సమాచారం. రహదారుల అభివృద్ధి, మల్టీలెవెల్గ్రేడ్ సెపరేటర్లు, ఫ్లైఓవర్లు, స్కైవేలకు రూ.500 కోట్లు కోరినట్లు తెలుస్తోంది. 2013-14లో ప్రణాళిక, ప్రణాళికేతర అంశాలకు రూ. 745 కోట్లు కోరగా.. ప్రభుత్వం రూ. 175 కోట్లే విదిల్చింది. జలమండలికి రూ.1852 కోట్లు 2015-16 ఆర్థిక సంవత్సరానికి జలమండలి రూ.1852 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో గ్రేటర్ దాహార్తిని తీర్చేందుకు ఉద్దేశించిన కృష్ణా మూడోదశ, గోదావరి మంచినీటి పథకాలతో పాటు శివారు ప్రాంతాల దాహార్తిని తీర్చే పథకాలు, మూసీ ప్రక్షాళన, సీవరేజి మాస్టర్ప్లాన్, ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలు ఉన్నాయి. ఏటా జలమండలి రూ.వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్ ప్రతిపాదనలు పంపిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.600 కోట్లకు మించి విదల్చడం లేదు. ఈసారైనా నిధుల వరద పారుతుందని జలమండలి వర్గాలు భావిస్తున్నాయి. రూ.1852 కోట్లలో శివారు ప్రాంతాల్లో డ్రైనేజీలకు రూ.786 కోట్లు, గోదావరి మంచినీటి పథకానికి రూ.573 కోట్లు, కృష్ణా మూడో దశ రుణ వాయిదాలకు రూ.50 కోట్లు అవసరమని పేర్కొన్నారు. మూసీ రెండో దశ ప్రక్షాళనకు రూ.165 కోట్లు, జీహెచ్ఎంసీ పరిధిలోని మురికివాడల్లో మంచినీటి వసతులకు రూ.150 కోట్లు, జీహెచ్ఎంసీ పరిధిలోని కాలనీల్లో మంచినీటికి రూ.92 కోట్లు, నిర్వహణ డివిజన్ల పరిధిలో మంచినీరు, మురుగునీటి పైప్లైన్ల మరమ్మతులకు రూ.36 కోట్లు ఖర్చు చేయనున్నట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. జంట కమిషనరేట్ల అంచనాలు రూ.1500 కోట్లు హైదరాబాద్, సైబరాబాద్ జంట కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాల నిఘా, నగదు రహిత చలానాల జారీ, ట్రాఫిక్ విభాగం, సిగ్నల్స్ ఆధునికీకరణ, కూడళ్ల అభివృద్ధి, నేరాల రేటును గణనీయంగా తగ్గించేందుకు కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. వీటితో పాటు క్లూస్ టీంల బలోపేతం, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరమైన చోట్ల బారికేడ్లు, జీపీఎస్ సదుపాయం ఉన్న వాహనాలు సమాకూర్చుకునేందుకు రూ.1500 కోట్లు అవసరమవుతాయని జంట కమిషనరేట్ వర్గాలు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. ఇందులో సిబ్బంది జీతభత్యాలు, ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలు కలిపి ఉన్నాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.1000 కోట్లు, సైబరాబాద్ పరిధిలో శాంతిభద్రతలకు రూ.500 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి నివేదించారు. హెచ్ఎండీఏ రూ.2362 కోట్లతో... 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ.2362 కోట్లకు పైగా అవసరమని హెచ్ఎండీఏ ప్రభుత్వానికి అంచనాలు సమర్పించింది. ఔటర్ రింగ్ రోడ్డుకు రూ.760 కోట్లు కేటాయించాలని కోరింది. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఔటర్ రింగ్ రోడ్డుకు బీఓటీ యాన్యుటీ కింద కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు రూ.415 కోట్లు కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. శివారు ప్రాంతాలను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.300 కోట్లు, చెరువుల సంరక్షణ, అభివృద్ధికి రూ.150 కోట్లు, హడ్కో రుణ వాయిదా చెల్లింపునకు రూ.100 కోట్లు, నగర మౌలిక వసతుల అభివృద్ధికి రూ.570 కోట్లు, హుస్సేన్సాగర్ ప్రక్షాళనకు రూ.67 కోట్లు కేటాయించాల్సిందిగా ప్రతిపాదించింది. 2014-15 బడ్జెట్లో రెండు విడతల్లో రూ.262 కోట్లు మాత్రమే హెచ్ఎండీఏకు విడుదలయ్యాయి. ఇదిలా ఉండగా... తాజా ప్రతిపాదనల్లో రీజనల్ రింగ్ రోడ్డు, చెరువుల సంరక్షణ, అభివృద్ధి పథకాలు మాత్రవే కొత్తవి. మిగతావన్నీ ఇప్పటికే మంజూరైన పథకాలు కావడం విశేషం. ప్రజారోగ్యానికి రూ.500 కోట్లు గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, నిమ్స్, కోఠి ఈఎన్టీ, ఎర్రగడ్డ మానసిక వైద్య శాల, పేట్లబుర్జు, సుల్తాన్బజార్ ప్రసూతి ఆస్పత్రి, యునాని, ఆయుర్వేద తదితర 109 సర్కారు ఆస్పత్రుల్లో మౌలిక వసతులకు రూ.500 కోట్లు అవసరమని వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు పంపింది. ఈ నిధులతో నూతన వైద్య పరికరాలు, పారిశుద్ధ్య సౌకర్యం, ఔషధాల కొనుగోలు, ఇతర మౌలిక వసతుల కల్పన, నూతన భవంతుల నిర్మాణం, ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. నోట్:జీహెచ్ఎంసీ,జలమండలి,హెచ్ఎండీఏ కార్యాలయాల ఫోటోలను సింబాలిక్గా వాడలరు. -
ఇక చెక్లు చెల్లవు..
హైదరాబాద్ సిటీ: ఇకమీదట హైదరాబాద్ మహానగరంలో నీటి సరఫరా, పారిశుధ్య బోర్డు నీటి బిల్లులకు సంబంధించిన చెల్లింపులు కేవలం ఆన్లైన్ ద్వారానే చెల్లించాలి. చెక్ల ద్వారా చెల్లింపులు నిలిపివేస్తున్నట్లు సంబంధిత శాఖ అధికారులు ఆదివారం తెలియజేశారు. ఈ చెల్లింపులు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వస్తాయి. వినియోగదారులు www.esevaonline.telangana.gov.in, www.meeseva.gov.in, www.aponline.gov.in, www.hyderabadwater.gov.in లలో ఏదేని వెబ్సైట్ ద్వారా చెల్లించవచ్చు. అన్ని పనిరోజుల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఆన్లైన్లో చెల్లించవచ్చు. -
కన్నీళ్లు
{పజలకు తప్పని దాహార్తి స్టోరేజి రిజర్వాయర్లు, పైప్లైన్లు లేక అవస్థలు శివారు వాసులకు కష్టాలు సిటీబ్యూరో: గ్రేటర్ శివారు వాసుల పరిస్థితి ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా తయారైంది. చెంతనే గంగ పొంగుతున్నా... తాగేందుకు వీలులేని దుస్థితి వారిది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 340 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్నారు. కృష్ణా మూడో దశ, గోదావరి మంచినీటి పథకం మొదటి దశల ద్వారా ఈ ఏడాది చివరి నాటికి అదనంగా 262 ఎంజీడీలు నగరానికి తరలించే అవకాశముంది. కానీ ఆ నీటిని గ్రేటర్లో విలీనమైన శివారు మున్సిపాల్టీలు, గ్రామ, నగర పంచాయతీల పరిధిలోని సుమారు వెయ్యి కాలనీలు, బస్తీలకు సరఫరా చేసేందుకు అవసరమైన స్టోరేజి రిజర్వాయర్లు, పైప్లైన్ నెట్వర్క్ లేదు. దీంతో ఆ ప్రాంతాల దాహార్తి ఈ ఏడాదిలోనూ తీరే అవకాశాలు కనిపించడం లేదు. డిమాండ్... సరఫరాల మధ్య అంతరం ప్రస్తుతం 688 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన జీహెచ్ఎంసీకి నిత్యం 340 మిలియన్ గ్యాలన్ల నీటిని జలమండలి సరఫరా చేస్తోంది. మహా నగరానికి ఆనుకొని ఉన్న శివారు ప్రాంతాల్లోని మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీల విస్తీర్ణం 519 చదరపు కిలోమీటర్లు. ఇటీవల జలమండలి అధికారులు ముఖ్యమంత్రికి సమర్పించిన నివేదికలో జీహెచ్ఎంసీ, శివారు ప్రాంతాల దాహార్తిని తీర్చాలంటే నిత్యం నగరానికి 732 ఎంజీడీల తాగునీరు అవసరమని సూచించారు. అంటే ప్రస్తుతం సరఫరా చేస్తున్న నీటికి, డిమాండ్కు మధ్య అంతరం 392 ఎంజీడీలు. ఈ కొరతలో కొంతైనా తీరాలంటే కృష్ణా మూడోదశ ద్వారా 90 ఎంజీడీలు, గోదావరి మొదటి దశ ద్వారా మరో 172 ఎంజీడీల నీటిని తరలిస్తే మొత్తం 262 ఎంజీడీల నీరు నగరానికి వస్తుంది.అయినప్పటికీ 130 ఎంజీడీల కొరత తప్పదు. పైప్లైన్లు లేకపోవడమే శాపం గ్రేటర్లో విలీనమైన కొన్ని శివారు మున్సిపాల్టీల పరిధిలో మంచినీటి సరఫరాకు అవసరమైన పైప్లైన్లు, స్టోరేజి రిజర్వాయర్లు లేకపోవడం శాపంగా పరిణమిస్తోంది. జలమండలి తాజా నివేదిక ప్రకారం శేరిలింగంపల్లిలో 96.99 కి.మీ., కుత్బుల్లాపూర్ పరిధిలో 52.02 కి.మీ., రామచంద్రాపురంలో 19.28 కి.మీ., పటాన్చెరువులో 15.6 కి.మీ., కాప్రాలో 43.81 కి.మీ., అల్వాల్లో 26.32 కి.మీ., కూకట్పల్లిలో 43.12 కి.మీ., ఎల్బీనగర్లో 64.61 కి.మీ., గడ్డిఅన్నారంలో 2.12 కి.మీ., ఉప్పల్లో 21.97 కి.మీ., రాజేంద్రనగర్లో 50.97 కి.మీ. మేరకు తక్షణం మంచినీటి పైప్లైన్లు వేయాల్సి ఉంది. అప్పుడే సంబంధిత మున్సిపల్ సర్కిళ్లలోని కాలనీలు, బస్తీలకు తాగునీరు అందించే అవకాశం ఉంటుంది. ఇందుకు రూ.3,195 కోట్లు అవసరమని ముఖ్యమంత్రికి జలమండలి నివేదించింది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి నెట్వర్క్ విస్తరణ పనులు చేపడితేనే శివారు ప్రాంతాల దాహార్తి తీరుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
21,22 తేదీల్లో నీళ్లు బంద్
సిటీబ్యూరో: మంజీర ఫేజ్-2 పంపింగ్ మెయిన్కు మరమ్మతుల కారణంగా ఈ నెల 21,22 తేదీ(బుధ, గురువారాలు)ల్లో నగరంలోని వివిధ ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి ప్రకటించింది. కేపీహెచ్బీ, హైదర్నగర్, జగద్గిరిగుట్ట, ఆల్విన్ కాలనీ, జీడిమెట్ల, షాపూర్ నగర్, చింతల్, భాగ్యనగర్ సెక్షన్, కుత్బుల్లాపూర్, అల్వాల్, నిజాంపేట్, బొల్లారం ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదని అధికారులు ప్రకటించారు. మరమ్మతులు పూర్తయిన వెంటనే సరఫరా పునరుద్ధరిస్తామన్నారు. -
జల ధన యోగం
రెట్టింపు కానున్న జలమండలి పరిథి సాకారమైతే నల్లా కనెక్షన్లు, ఆదాయం పెరిగే ఛాన్స్ సరఫరా నష్టాలపైనే ఆందోళన గుదిబండగా విద్యుత్ బిల్లులు సిటీబ్యూరో: గ్రేటర్ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు జలమండలి స్వరూపాన్ని పూర్తిగా మార్చనుంది. దీని పరిధి రెట్టింపు కానుంది. ప్రస్తుతం ప్రధాన నగరం, శివార్లు కలిపి 700 చదరపు కిలోమీటర్ల పరిధిలో జలమండలి పైప్లైన్ నెట్వర్క్ ఉంది. గ్రిడ్ సాకారమైతే ఇది సుమారు 1400 చదరపు కిలోమీటర్లకు విస్తరించే అవకాశాలు ఉన్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఉన్న 8.34 లక్షల నల్లా కనెక్షన్ల సంఖ్య దాదాపు రెట్టింపయ్యే అవకాశాలున్నట్లు అధికారుల అంచనా. మహా నగర పరిధిలో 91 లక్షల జనాభాకు నిత్యం 340 మిలియన్ గ్యాలన్ల నీటిని బోర్డు సరఫరా చేస్తోంది. పరిధి పెరిగిన తరవాత 2015 నాటికి 491 మిలియన్ గ్యాలన్లు.. 2021 నాటికి 1.10 కోట్ల జనాభాకు 594.65 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనాలు సిద్ధం చేస్తున్నారు. రెట్టింపు కానున్న నల్లాలు... ఆదాయం ప్రస్తుతం జలమండలి పరిధిలో 8.34 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. నాలుగేళ్లలో గ్రిడ్ పూర్తి చేస్తే శివార్లతో కలిపి నల్లాల సంఖ్య దాదాపు 16.50 లక్షలకు చేరుకునే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం నీటి బిల్లులు, సీవరేజి సెస్, నూతన నల్లా కనెక్షన్ల ద్వారా నెలకు రూ.93 కోట్ల ఆదాయం లభిస్తోంది. 2021 నాటికి అది రూ.186 కోట్లకు చేరడం తథ్యమని బోర్డు వర్గాలు లెక్కలు కడుతున్నాయి. నష్టాల పైనే ఆందోళన పరిధి, ఆదాయం, కనెక్షన్ల సంఖ్య రెట్టింపు కావడం వరకు బాగానే ఉన్నా... నీటి సరఫరా నష్టాలు బోర్డుకు దడ పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం జలమండలి రోజువారీ 340 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్నా.. అందులో సరఫరా నష్టాలు పోను వాస్తవ సరఫరా కనాకష్టంగా 200 మిలియన్ గ్యాలన్లు మించడం లేదు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం సరఫరా నష్టాలు 20 శాతం లోపలే ఉండాలి. నగరంలో అంతకు రెట్టింపు స్థాయిలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్లోనూ ఇదే స్థాయిలో నష్టాలు ఉంటే జనం దాహార్తి అరకొరగానే తీరే పరిస్థితులు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీఎస్ఎం టెక్నాలజీ ఆధారంగా పనిచేసే సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్(స్కాడా) విధానంతో ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పైప్లైన్లు, రిజర్వాయర్ల నీటిని, సరఫరా చేస్తున్న నీటిని శాస్త్రీయంగా లెక్కించడంతో పాటు నీటిచౌర్యం, లీకేజీలను అరికట్టాలని సూచిస్తున్నారు. విద్యుత్ భారం తడిసి మోపెడు ఇక పరిధి పెరగడంతో పాటే విద్యుత్ అవసరాలు కూడా గణనీయంగా పెరగనున్నాయి. ప్రస్తుతం నెలకు రూ.45 కోట్లు విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్న బోర్డు కృష్ణా మూడో దశ, గోదావరి మంచినీటి పథకాల పూర్తితో నెలకు మరో రూ.45 కోట్ల మేర అదనంగా వెచ్చించాల్సిన పరిస్థితి రానుంది. ఇప్పటికే రూ.250 కోట్ల మేర విద్యుత్ బకాయిలు పేరుకుపోయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ నీటి సరఫరా విభాగానికి ఇచ్చిన తరహాలో విద్యుత్ చార్జీలు తగ్గిస్తేనే గ్రిడ్ సాకారమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. -
‘నల్లా’వి తెల్లగా
అక్రమ నల్లాల క్రమబద్ధీకరణకు రంగం సిద్ధం మార్గదర్శకాలు రూపొందిస్తున్న జలమండలి 80 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటే రూ.2500 80-200 చదరపు మీటర్ల విస్తీర్ణమైతే రూ.8500 స్వచ్ఛందంగా ముందుకొస్తే జరిమానా ఉండదు ఈ వారంలోనే శ్రీకారం సిటీబ్యూరో:గ్రేటర్ పరిధిలో అక్రమ నల్లాల క్రమబద్ధీకరణకు జలమండలి సిద్ధమవుతోంది. దీని కోసం మార్గదర్శకాలు సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు అక్రమ నల్లా కలిగి ఉండి బోర్డుకు ఎలాంటి చార్జీలు చెల్లించని వారిపై అపరాధరుసుం (జరిమానా) విధించరాదని నిర్ణయించింది. 80 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకున్న అల్పాదాయ పేదలకు గృహ వినియోగ కనెక్షన్ (డొమెస్టిక్)కు రూ.2500, 80 నుంచి 200 చదరపు మీటర్ల విస్తీర్ణం లోపల ఇళ్లు నిర్మించిన వారికి రూ.8500, ఆపై పెరిగే ప్రతి చదరపు మీటరు విస్తీర్ణానికి రూ.47 చొప్పున వసూలు చేసి అక్రమ నల్లాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. క్రమబద్ధీకరణకు స్వచ్ఛందంగా ముందుకు వస్తే జరిమానా ఉండదని, లేని పక్షంలో క్రిమినల్ కేసులు తప్పవని బోర్డు రెవెన్యూ విభాగం అధికారులు హెచ్చరిస్తున్నారు. క్రమబద్ధీకరణకు నగరంలో నిర్వహణ డివిజన్ల వారీగా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామని, కాలనీలు, బస్తీల్లో వీధివీధినా మైకులతో ప్రచారం చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ వారంలోనే ఈ ప్రక్రియ చేపడతామన్నారు. గుర్తించింది ఏడు వేలే... అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా (ఆస్కి) నగరంలో అక్రమ నల్లాలపై సర్వే చేపట్టింది. కేవలం ఏడు వేల అక్రమ కనెక్షన్లు ఉన్నట్టు తేల్చింది. కానీ అనధికారికంగా వీటి సంఖ్య సుమారు లక్ష వరకు ఉంటుంద న్నది బహిరంగ రహస్యం. భూమి లోపల ఉన్న అక్రమ నల్లాలను కనిపెట్టడం జలమండలికి కత్తిమీద సాముగామారింది. ముఖ్యంగా పాతనగరం, శివార్లలో వేలాదిగా అక్రమ నల్లాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు వీటిపై ఎవరైనా సమాచారం అందిస్తేనే బోర్డు విజిలెన్స్ సిబ్బంది అక్రమార్కుల ఇళ్లకు వెళ్లి తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అవసరమైన పోలీసు సిబ్బంది లేకపోవడంతో ఈ విభాగం అక్రమార్కులను కట్టడి చేయడంలో విఫలమవుతోంది. అదనపు సిబ్బంది కేటాయింపుతో విజిలెన్స్ విభాగాన్ని పటిష్టం చేసి, క్రమబద్ధీకరణతో పాటు తనిఖీలు ముమ్మరం చేస్తేనే లక్ష్యం నెరవేరుతుందని నిపుణులు సూచిస్తున్నారు. బిల్లు బకాయిదారులపై ఆర్.ఆర్.యాక్ట్ నీటి బిల్లు బకాయిదారులపై జలమండలి బుధవారం నుంచి మరోమారు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటివరకు రూ.1075 కోట్ల మేర బిల్లులు పేరుకుపోయిన నేపథ్యంలో దశలవారీగా దీర్ఘకాలిక బకాయిదారులను గుర్తించి వారి చరాస్తులను జప్తు చేయాలని నిర్ణయించింది. తాజాగా 15 మంది బకాయిదారుల ఆస్తులను జప్తునకు బోర్డు రెవెన్యూ విభాగం రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. పెండింగ్ నీటి బిల్లుల్లో గ్రామీణ నీటి సరఫరా విభాగం, వివిధ ప్రభుత్వ సంస్థలు, మూతపడిన ప్రభుత్వ రంగ సంస్థల బిల్లులే సింహభాగం ఉండడం గమనార్హం. వీటి నుంచి బకాయిల వసూలు బోర్డుకు కత్తిమీద సాములా మారనుంది. -
‘జల జలా’ పనులు!
జంట జలాశయాల పరిరక్షణకు సన్నద్ధం డీపీఆర్ తయారీకి దరఖాస్తుల ఆహ్వానం నివేదిక తయారీకి రూ. 18 లక్షలు సిటీబ్యూరో: నగర దాహార్తిని తీరుస్తున్న చారిత్రక జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు మంచి రోజులు రాబోతున్నాయి. వీటి పరిరక్షణకు జలమండలి ముందుకొచ్చింది. సమీప గ్రామాలు, రిసార్టులు, కళాశాలలు, వాణిజ్య సముదాయాల మురుగు నీటితో జలాశయాలు ఆర్గానిక్ కాలుష్యం కాటుకు బలవుతున్నాయి. ఆలస్యంగా కళ్లు తెరిచిన బోర్డు తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్లో ఈ జలాశయాలు హుస్సేన్ సాగర్లా కాలుష్యం బారిన పడకుండా పటిష్ట చర్యలు తీసుకునేందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి ఆసక్తి, అనుభవం గల సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందుకోసం రూ. 18 లక్షలు కేటాయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ సమగ్ర ప్రాజెక్టు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించి, తద్వారా వచ్చే నిధులతో జలాశయాలు పది కాలాల పాటు మనుగడ సాగించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జలమండలి నిర్ణయిచింది. మురుగు నుంచి విముక్తి ఇలా... జంట జలాశయాల ఎగువ ప్రాంతాల్లోని ఇంజినీరింగ్ కళాశాలలు, గ్రామ పంచాయతీల నుంచి వచ్చే మురుగు నీటిని ఎక్కడికక్కడే భారీ సెప్టిక్ ట్యాంకులు నిర్మించి తాత్కాలికంగా నిల్వ చేస్తారు. అక్కడి నుంచి వ్యర్థ జలాలను సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ల ద్వారా మినీ మురుగు శుద్ధి కేంద్రాలకు తరలిస్తారు. అక్కడ శుద్ధిచేసిన నీటిని సమీప పంట పొలాలకు మళ్లించడంద్వారా జలాశయాల్లోకి మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకోవాలన్నది జలమండలి లక్ష్యం. నివేదికలో ఉండాల్సిన అంశాలివే.. జంట జలాశయాలు కలుషితం కాకుండా తీసుకోవాల్సిన స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలు.ఎగువ, సమీప ప్రాంతాల నుంచి మురుగు నీరు జలాశయాల్లోకి చేరకుండా రింగ్సీవర్ మెయిన్ (భారీ డ్రైనేజీ పైప్లైన్ నిర్మాణం) ఏర్పాటు. మురుగు నీటి శుద్ధికి మినీ ఎస్టీపీలు నిర్మించాల్సిన ప్రాంతాల గుర్తింపు. జలాశయాల సరిహద్దులను గుర్తించడం. జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన 111 జి.ఒ. ఉల్లంఘనలు, తీసుకోవాల్సిన చర్యలు. జలాశయాలకు రక్షణ కంచె ఏర్పాటు. చేపల వేట నిషేధం, ఇతర మానవ సంబంధ కార్యకలాపాలపై నిషేధం. -
శివార్లకు జలసిరి
* వాటర్గ్రిడ్తో పుష్కలంగా నీటి సరఫరా * ప్రణాళిక సిద్ధం చేస్తున్న జలమండలి * త్వరలో సీఎం సమక్షంలో కీలక భేటీ సాక్షి, సిటీబ్యూరో: రాజధానికి కూత వేటు దూరంలో ఉన్నా.. గుక్కెడు నీటి కోసం అలమటిస్తున్న 70 గ్రామాల ప్రజలకు శుభవార్త.. ఇకనుంచి ఆయా గ్రామాల వారికి నీరు పుష్కలంగా సరఫరా కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన గ్రేటర్ వాటర్గ్రిడ్ ప్రాజెక్టుతో ఇది సాధ్యం కానుంది . దీనికోసం జలమండలి బృహత్తర ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఔటర్ రింగ్రోడ్డుకు లోపలున్న ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు భారీ రేడియల్ మెయిన్స్, ట్రంక్మెయిన్స్ పైప్లైన్ నెట్వర్క్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ప్రాథమికంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిన జలమండలి శివార్లపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సుమారు రూ.13,495 కోట్ల అంచనా వ్యయంతో జలమండలి మహానగర వాటర్గ్రిడ్ ప్రాజెక్టు అంచనాలు సిద్ధంచేసిన విషయం విదితమే. ఈ గ్రిడ్ కార్యాచరణ ఎలా ఉండాలన్న అంశంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆధ్వర్యంలో త్వరలో కీలక భేటీ జరగనున్నట్టు సమాచారం. సీఎం ఆదేశాల మేరకు గ్రిడ్ పనులకు శ్రీకారం చుట్టేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. తీరనున్న దాహార్తి... గ్రేటర్కు ఆనుకొని ఔటర్ రింగ్రోడ్డుకు లోపలున్న సుమారు 70 గ్రామ పంచాయతీలకు రింగ్మెయిన్ పైప్లైన్స్ నుంచి నీటిని తరలించనున్నారు. గ్రేటర్లో విలీనమైన శివారు మున్సిపాలిటీల పరిధిలోనూ జనం దాహార్తిని తీర్చేందుకు గ్రిడ్లో ప్రాధాన్యమిస్తున్నారు. శేరిలింగంపల్లిలో 70 శాతం ప్రాంతాలకు, రాజేంద్రనగర్లో 55 శాతం, కుత్బుల్లాపూర్లో 50, మల్కాజ్గిరిలో 35 శాతం, కూకట్పల్లిలో 30, ఉప్పల్లో 20, ఎల్బీనగర్లో 20, కాప్రాలో 80, అల్వాల్లో 70 శాతం ప్రాంతాలకు ఈ గ్రిడ్ద్వారా దాహార్తిని తీర్చే సదవకాశం రానుంది. ఆయా ప్రాంతాల్లో మంచినీటి పైప్లైన్ నెట్వర్క్ విస్తరణ, స్టోరేజి రిజర్వాయర్లు, పంప్హౌస్ల నిర్మాణానికి ఈ గ్రిడ్ పథకంలో స్థానం కల్పించడం విశేషం. ఇదీ గ్రిడ్ స్వరూపం.. విశ్వనగరంగా అవతరించనున్న గ్రేటర్లో రాబోయే నాలుగేళ్లలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ మంజూరు చేసేందుకు వాటర్గ్రిడ్ పథకాన్ని రూపొందించారు. సుమారు కోటి జనాభాకు చేరువైన మహానగర దాహార్తిని తీర్చేందుకు వెయ్యి చదరపు కిలోమీటర్ల పరిధిలో గ్రిడ్ ఏర్పాటుకానుంది. ఇందుకు రూ.13,495 కోట్ల అంచనా వ్యయంతో జలమండలి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపితే పథకం పనులు మొదలుకానున్నాయి. గ్రిడ్కు సంబంధించిన ప్రాథమిక కసరత్తును జలమండలి పూర్తిచేసింది. ఇందుకోసం ఓ మాస్టర్ప్లాన్ ప్రణాళిక చిత్రపటాన్ని కూడా రూపొందించింది. ఈ గ్రిడ్ పరిధిలో ఏర్పాటు చేయాల్సిన రేడియల్ మెయిన్లు, ట్రంక్మెయిన్స్, ప్రెజర్మెయిన్స్, నెట్వర్క్ పైప్లైన్లు, స్టోరేజి రిజర్వాయర్లు, పంపింగ్ స్టేషన్లు, గ్రావిటీ ఆధారంగా నీటిసరఫరా తదితర అంశాలపై సమగ్ర డిజైనింగ్, డ్రాయింగ్లు పూర్తిచేసే సాంకేతిక పనులను ప్రముఖ సివిల్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీకి అప్పగించాలని నిర్ణయించారు. గ్రిడ్ అంచనాలివే.. సుమారు వెయ్యి చదరపు కిలోమీటర్ల పరిధిలో 2021 సంవత్సరం నాటికి పెరగనున్న జనాభా, ఐటీ, హార్డ్వేర్ పరిశ్రమల విస్తరణ, పారిశ్రామికీకరణ అవసరాలకు వినియోగించే నీటి డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని చేపట్టబోయే వాటర్గ్రిడ్ పనులు-వాటి అంచనా వ్యయాలిలా ఉన్నాయి. -
వాటర్గ్రిడ్ మాస్టర్ప్లాన్ రెడీ!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో రాబోయే నాలుగేళ్లలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ మంజూరుకు ఉద్దేశించిన వాటర్గ్రిడ్ పథకం అంచనాలు సిద్ధమయ్యాయి. సుమారు కోటి జనాభాకు చేరువైన మహానగర దాహార్తిని తీర్చేందుకు వెయ్యి చదరపు కిలోమీటర్ల పరిధిలో మంచినీటి సరఫరా పైప్లైన్ గ్రిడ్ ఏర్పాటుకు రూ.13,495 కోట్ల అంచనా వ్యయంతో జలమండలి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధంచేసింది. వీటికి సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపితే పథకం పనులు మొదలుకానున్నాయి. గ్రిడ్కు సంబంధించిన ప్రాథమిక కసరత్తును జలమండలి పూర్తిచేసింది. ఇందుకోసం ఓ మాస్టర్ప్లాన్ ప్రణాళిక చిత్రపటాన్ని కూడా రూపొందించింది. గ్రిడ్ పరిధిలో ఏర్పాటు చేయాల్సిన పైప్లైన్లు, స్టోరేజీ రిజర్వాయర్లు, పంపింగ్ స్టేషన్లు, గ్రావిటీ ఆధారంగా నీటిసరఫరా తదితర అంశాలపై సమగ్ర డిజైనింగ్, డ్రాయింగ్లు పూర్తిచేసే సాంకేతిక పనులను ప్రముఖ సివిల్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీకి అప్పగించాలని నిర్ణయించింది. అయితే గ్రేటర్ వాటర్గ్రిడ్ ముఖచిత్రంపై త్వరలో ముఖ్యమంత్రి సమక్షంలో ఉన్నతస్థాయి సమీక్షాసమావేశం జరగనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ సమావేశంలో గ్రిడ్ కార్యాచరణకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. తీరనున్న శివార్ల దాహార్తి ... * గ్రేటర్లో విలీనమైన పలు శివారు మున్సిపాల్టీల్లో ప్రస్తుతం మంచినీటి సరఫరా తీరును పరిశీలిస్తే...శేరిలింగంపల్లిలో కేవలం 30 శాతం ప్రాంతాలకే నీటి సరఫరా పైప్లైన్ నెట్వర్క్ ఉంది. * రాజేంద్రనగర్లో 45 శాతం, కుత్భుల్లాపూర్లో 50 శాతం, మల్కాజ్గిరిలో 65 శాతం, కూకట్పల్లిలో 70 శాతం, ఉప్పల్లో 82.5 శాతం, ఎల్బీనగర్లో 85 శాతం, కాప్రాలో 85 శాతం, అల్వాల్లో 90 శాతం ప్రాంతాలకే మంచినీటి సరఫరా నెట్వర్క్ ఉంది. ఈనేపథ్యంలో మిగతా ప్రాంతాల్లో పైప్లైన్ నెట్వర్క్ విస్తరణ, స్టోరేజి రిజర్వాయర్లు, పంప్హౌజ్ల నిర్మాణానికి ఈ గ్రిడ్ పథకంలో స్థానం కల్పించడం విశేషం. గ్రేటర్ వాటర్గ్రిడ్ అంచనాలివే ఔటర్ రింగ్రోడ్డుకు లోపల ఉన్న ప్రాంతాల్లో గ్రేటర్ వాటర్గ్రిడ్ ఏర్పాటుకానుంది. సుమారు వెయ్యి చదరపు కిలోమీటర్ల పరిధిలో 2021 సంవత్సరం నాటికి పెరగనున్న జనాభా, ఐటీ, హార్డ్వేర్ పరిశ్రమల విస్తరణ, పారిశ్రామికీకరణ అవసరాలకు వినియోగించే నీటి డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని చేపట్టబోయే వాటర్గ్రిడ్ పనులు-వాటి అంచనా వ్యయాలిలా ఉన్నాయి. (నిధులు రూ.కోట్లలో) * కృష్ణా హెడ్వర్క్స్ పనులు: రూ.1184 * కృష్ణా ఫేజ్-4 (110కి.మీ): రూ.1760 * కృష్ణాఫేజ్-4 నీటిశుద్ధికేంద్రాలు, రిజర్వాయర్ల నిర్మాణం: రూ.848 * ఔటర్రింగ్రోడ్డు చుట్టూ 160 కి.మీ పరిధిలో 3000 డయా వ్యాసార్థంగల నీటి పంపిణీ పైప్లైన్ల ఏర్పాటు: రూ.2860 * ఔటర్లోపల నీటిపంపిణీకి 1000 డయా వ్యాసార్థంగల రేడియల్ మెయిన్పైప్లైన్ల ఏర్పాటు:రూ.1040 * జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని కాలనీలు,బస్తీలకు నీటిసరఫరా పైప్లైన్ నెట్వర్క్ ఏర్పాటు:రూ.3195 * శివారు మున్సిపాల్టీలు, గ్రామపంచాయతీలు, నగరపంచాయతీలకు నీటి పంపిణీకి 3653 కి.మీపైప్లైన్ల ఏర్పాటు-రూ.2608 * మొత్తం:13,495 కోట్లు -
అయినా...తీరు మారలేదు!
జలమండలిలో అర్హతలేని కంపెనీకే ‘ఫెర్రిక్ ఆలం’ సరఫరా టెండర్? సిటీబ్యూరో: జలమండలిలో పటాన్చెరు నిర్వహణ డివిజన్ పరిధిలో నీటి శుద్ధికి వినియోగించే రూ.1.23 కోట్ల విలువైన ఫెర్రిక్ఆలం సరఫరా టెండరును గతంలో సరఫరా చేసిన అనుభవం, అర్హత, పీసీబీ గుర్తింపు లేని కంపెనీకే కట్టబెట్టేందుకు అధికారులు యత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సదరు టెండరుకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనలపై దుమారం చెలరేగడంతో ఆర్థిక బిడ్లు తెరిచే ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. తాము చేసిన పొరపాట్లు బయటికి పొక్కకుండా ఈ ప్రక్రియను వాయిదా వేసినట్లు సమాచారం.వివాదం సద్దుమణిగాక తాము అనుకున్న కంపెనీకే సరఫరా టెండరును కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుండడం గమనార్హం. ఈవిషయంలో లెక్కకు మిక్కిలి ఫిర్యాదులందినా అధికారులు వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. టెండరు నిబంధనల ప్రకారం గతంలో 61.87 లక్షల విలువైన ఆలంను సరఫరా చేసిన కంపెనీకి మాత్రమే ఈ టెండరులో పాల్గొనే అర్హత ఉంటుంది. కానీ అధికారులు ఓ అర్హత లేని కంపెనీకి ఈ టెండరును కట్టబెట్టేందుకు ఈ నిబంధనను పక్కనబెట్టడం సంచలనం సష్టిస్తోంది. ఈవ్యవహారంలో బోర్డు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని అనుభవం,అర్హత గల కంపెనీకి మాత్రమే ఆలం సరఫరా టెండరును కట్టబెట్టాలని కార్మికసంఘాలు కోరుతున్నాయి. -
భాగ్యనగరికి ‘కృష్ణ’మ్మ పరవళ్లు
సాక్షి,హైదరాబాద్: గ్రేటర్ వాసుల దాహార్తిని తీర్చే కృష్ణా మూడోదశ ప్రాజెక్టును ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేసేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. దీంతో భాగ్యనగరానికి అదనంగా నిత్యం 90 మిలియన్ గ్యాలన్ల నీరు అందే అవకాశముంది. ఇప్పటికే కృష్ణా మొదటి, రెండవ దశల ద్వారా రోజువారీగా మహానగరానికి 180 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తున్న విషయం విదితమే. కాగా, మూడోదశ పనుల్లో సింహభాగం పూర్తవడంతో భవిష్యత్లో శివారు జనం దాహార్తి తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 108 కి.మీ పైప్లైన్ పనులకు సెప్టెంబరు 23 నాటికి 105.5 కి.మీ పనులు పూర్తవడం విశేషం. మూడోదశ పనుల పురోగతి ఇలా.. ఏడాది క్రితం చేపట్టిన మూడోదశ ప్రాజెక్టును పది ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టారు. ఇందులో కృష్ణా జలాలను సిటీకి తరలించేందుకు భారీ పంప్ హౌస్లు, రిజర్వాయర్ల నిర్మాణం కూడా భాగ మే. ఇప్పటి వరకు పైప్లైన్ పనుల్లో కేవలం 2.5 కి.మీ పైప్లైన్ వేయాల్సి ఉంది. ఇక పంప్హౌస్ పనుల్లో 90 శాతం పూర్తయ్యాయి. రిజర్వాయర్ పనులు 85 శాతం మేర పూర్తయినట్లు జలమండలి ఈఎన్సీ సత్యనారాయణ, ప్రాజెక్టు విభాగం డెరైక్టర్ కొండారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి డిసెంబరు నాటికి నగరానికి 90 మిలియన్ గ్యాలన్ల కృష్ణా జలాలను తరలించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రూ.1217.69 కోట్ల పనులు పూర్తి మూడోదశ ప్రాజెక్టును రూ.1670 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. ఇందులో రూ.1500 కోట్లు హడ్కో సంస్థ నుంచి రుణంగా సేకరించారు. మరో రూ.170 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. కాగా, ఇప్పటి వరకు రూ.1217.69 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. వీటికి ఏజెన్సీలకు రూ.1197.27 కోట్లు బిల్లులు చెల్లించారు. మరో రూ.453 కోట్ల మేర పనులు పూర్తికావాల్సి ఉంది. రింగ్ మెయిన్-1 పనుల్లో జాప్యం మూడోదశ కింద నగరానికి తరలించే 90 మిలియన్ గ్యాలన్ల నీటిని నగరం నలుమూలలా సరఫరా చేసేందుకు రింగ్మెయిన్-1, రింగ్ మెయిన్-2 పనులను చేపట్టారు. ఇందులో రింగ్ మెయిన్-1 పనుల్లో 35.8 కి.మీకి 16.600 కి.మీ పైప్లైన్ పనులే పూర్తయ్యాయి. రింగ్ మెయిన్-2లో 29.650 కి.మీకి గాను 28.150 కి.మీ పైప్లైన్ పనులు పూర్తయ్యాయి.