dasari narayana rao
-
'ఇది ఒక సవాలు మాత్రమే కాదు'.. మోహన్బాబు ఎమోషనల్ పోస్ట్
వెండితెరపై విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ దిగ్గజం మోహన్ బాబు. 1970లో అసిస్టెంట్ డైరెక్టర్గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. దాసరి నారాయణరావు తెరకెక్కించిన ‘స్వర్గం నరకం’ సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. తన నటనతో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్ గా, నిర్మాతగా, విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా మెప్పించిన ఏకైక నటుడు ఆయనే. తన దశాబ్దాల సినీ ప్రస్థానంలో మోహన్ బాబు స్వయంకృషితోనే ఎదిగారు. పెదరాయుడు, శ్రీరాములయ్య, అడవిలో అన్న లాంటి సినిమాలు మోహన్ బాబు స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఎక్కడో రాయలసీమలోని ఒక మారుమూల గ్రామం నుంచి ఇండస్ట్రీకి వచ్చిన తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే తాజాగా తాను నటించిన కోరికలే గుర్రాలైతే(1979) చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రంలో యమధర్మరాజు పాత్రలో ఆయన కనిపించారు. ఈ సినిమాలో సీన్స్ నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులోని ఈ సన్నివేశం నా కెరీర్లో ఓ ప్రత్యేక మైలురాయిగా మిగిలిపోతుందని ట్విటర్ ద్వారా పంచుకున్నారు.మోహన్ బాబు తన ట్వీట్లో రాస్తూ..'నా గురువు, లెజెండరీ శ్రీ దాసరి నారాయణరావు గారు, నిర్మాత శ్రీ జి జగదీష్ చంద్ర ప్రసాద్ ఆధ్వర్వంలో వచ్చిన ఈ సన్నివేశం నా కెరీర్లో ఓ ప్రత్యేక మైలురాయిగా నిలిచిపోతుంది. చంద్రమోహన్, మురళీ మోహన్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం. ఇది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తొలిసారిగా యమ ధర్మరాజు పాత్ర చేయడం మరచిపోలేని అనుభూతి. ఈ సన్నివేశం ఒక సవాలు మాత్రమే కాదు.. ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ చిత్రం నా సినీ ప్రయాణంలో ఒక ప్రత్యేకతగా నిలిచింది.' అంటూ పోస్ట్ చేశారు.Korikale Gurralaithe(1979): Directed by my guru, the legendary Sri. Dasari Narayana Rao garu, and produced by Sri. G. Jagadeesh Chandra Prasad garu, this scene was a special milestone in my career. Sharing the screen with Sri. Chandramohan garu and Sri. Murali Mohan garu made it… pic.twitter.com/sIsJIDRW5C— Mohan Babu M (@themohanbabu) December 8, 2024 -
వీళ్లూ ఎక్కారు... గిన్నిస్ రికార్డుల్లోకి!
నాలుగు దశాబ్దాలకుపైగా సినిమా ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడిగా మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. తన డ్యాన్స్, నటనతో కోట్లాదిమంది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు. తన సినీ జర్నీలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న మెగాస్టార్ తాజాగా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. 156 సినిమాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో రికార్డ్ బ్రేక్ చేశారు. దీంతో ఆయనకు ఈ రికార్డు దక్కింది. సెప్టెంబర్ 22న గిన్నిస్ బుక్ ప్రతినిధులు హైదరాబాద్కు చేరుకుని బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేతులు మీదుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. అయితే, చిరు కంటే ముందే మన టాలీవుడ్ లెజెండ్స్ కొందరు ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. వారు ఎవరో తెలుసుకుందాం.దాసరి నారాయణరావుతెలుగు, తమిళం, హిందీ భాషల్లో 150 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి దాసరి నారాయణరావు రికార్డ్ క్రియేట్ చేశారు. దీంతో అత్యధిక చిత్రాల దర్శకుడుగా ఆయనకు గుర్తింపు రావడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడంతో పాటు 53 సినిమాలను స్వయంగా నిర్మించారు. ఈయన 250 పైగా చిత్రాలకు కథ, మాటల రచయితగా, గీత రచయితగా పనిచేశారు. తెలుగు సినీ దిగ్గజంగా కీర్తిని పొందిన ఆయన 2017 మే 30న మరణించారు.ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంశ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.. ఆయన్ను ఎస్పీ బాలు అని ఎంతోమంది ప్రేమతో పిలుస్తారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మరాఠ,మలయాళం భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు బాలు పాడారు. ఇలా ఎక్కువ సంఖ్యలో పాటలు పాడిన ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. బాలు నేపథ్య గాయకుడిగానే కాకుండా.. సంగీత దర్శకుడు, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా గుర్తింపు పొందారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ , పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. 6 జాతీయ పురస్కారాలను కూడా ఆయన అందుకున్నారు. 2020 సెప్టెంబరు 25న బాలు మరణించగా.. 2021లో కేంద్ర ప్రభుత్వం బాలుకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.దగ్గుబాటి రామానాయుడుదగ్గుబాటి రామానాయుడు.. మూవీ మోఘల్గా ఆయన అందరికీ దగ్గరయ్యారు. ఒకే వ్యక్తి 100 చిత్రాలకు పైగా నిర్మాతగా తెరకెక్కించి ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేశారు. దీంతో రామానాయుడు పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. పద్మ భూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. బెంగాలీలో ఆయన నిర్మించిన అసుఖ్ (1999) ఉత్తమ జాతీయ చలనచిత్ర పురస్కారం దక్కించుకుంది. 2015 ఫిబ్రవరి 18న క్యాన్సర్ వ్యాధితో ఆయన మరణించారు.విజయనిర్మల తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా సినిమాల్లో నటించిన విజయనిర్మల దర్శకురాలుగా కూడా తన ప్రతిభను చాటారు. డైరెక్టర్గా 44 చిత్రాలను తెరకెక్కించి రికార్డ్ సెట్ చేశారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళా దర్శకురాలిగా 2002లో గిన్నీస్ బుక్లో ఆమె చోటు సంపాదించారు. 11 ఏళ్ల ప్రాయంలోనే ‘పాండురంగ మహత్యం’ సినిమా ద్వారా సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన ఆమె.. 1971లో 'మీనా' చిత్రంతో దర్శకురాలిగా మెగాఫోన్ పట్టారు. సూపర్ స్టార్ కృష్ణతో ఆమె సుమారు 50కి పైగా సినిమాల్లో నటించారు. 2019లో విజయనిర్మల మరణించారు. పి. సుశీల ఆరు దశాబ్దాల పైగా భారతీయ సినీ పరిశ్రమలో ప్రసిద్ధురాలైన గానకోకిల పి. సుశీల పేరు ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు దక్కింది. 12 భాషల్లో (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, ఒరియా, హిందీ, సంస్కృత, సింహళ, పడుగు, తుళు, బెంగాలీ, పంజాబీ) సినీ, ప్రైవేట్ పాటలన్నీ కలిపి దాదాపు 30 వేల పాటలు పాడినట్లు ఒక అంచనా. అయితే, గిన్నీస్ బుక్ వారు మాత్రం 1960ల నుంచి 6కు పైగా భారతీయ భాషల్లో 17,695 సోలో, డ్యూయట్, కోరస్ సహకారమున్న పాటలను మాత్రమే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చేర్చారు. ఈ ఘనత సాధించిన ఏకైక ఫిమేల్ సింగర్గా ఈ ‘గాన సరస్వతి’కి దక్కింది. దీంతో ఆమెకు గిన్నీస్ బుక్లో చోటు దక్కింది. భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ ఇచ్చి గౌరవించాయి.బ్రహ్మానందంకన్నెగంటి బ్రహ్మానందం.. ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఒకే భాషలో 754 చిత్రాలలో నటించినందుకుగాను ఆయన పేరు ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చేరింది. ఒకే భాషలో ఇన్ని సినిమాలు నటించిన నటులు ఇంతవరకు ఎవరూ లేరు. అయితే, వాస్తవంగా బ్రహ్మానందం ఇప్పటి వరకు 1250 సినిమాలకు పైగానే నటించారు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ఉత్తమ హాస్య నటుడిగా ఐదు నంది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డ్ను దక్కించుకున్నారు. రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా నటించిన ఆహనా పెళ్ళంట సినిమా ద్వారా బ్రహ్మానందం సినీ రంగ ప్రవేశం చేశారు. -
శిల్పకళావేదిక : దర్శకరత్న DNR ఫిల్మ్ అవార్డ్స్ (ఫొటోలు)
-
వేరు కుంపట్లతో దాసరిగారి పేరు చెడగొట్టొద్దు: దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ
‘‘నరసింహారావుగారు (దర్శకుడు) మాట్లాడి, దాసరిగారి పేరిట రామ సత్యనారాయణ ఓ ఈవెంట్ చేశారు. రేపు మేం చేయబోతున్నాం అన్నారు. నేనేం అంటున్నానంటే... వచ్చే ఏడాది నుంచి సినిమా ఇండస్ట్రీ తరఫున దాసరిగారి జయంతిని అందరూ ఒక్కటై, ఒకే వేడుకలా జరుపుకునేలా ΄్లాన్ చేద్దాం. బయటివాళ్లు కావాలంటే ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు చేసుకుంటారు.ఇండస్ట్రీలో వేరు వేరు కుంపట్లు పెట్టి, గురువు (దాసరి నారాయణరావు) గారి పేరుని మనం చెడగొట్టొద్దు. గురువుగారి పేరును నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దాం’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి (మే 4)ని ‘డైరెక్టర్స్ డే’గా తెలుగు పరిశ్రమ సెలబ్రేట్ చేసుకుంటోంది. తెలుగు దర్శకుల సంఘం ఆధ్వర్యంలో మే 4న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ వేడుక జరగాల్సింది.కానీ ఎన్నికల సమయంలో ఇలాంటి పెద్ద ఈవెంట్ నిర్వహిస్తే లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని పోలీస్ శాఖ చెప్పిన నేపథ్యంలో ఈవెంట్ తేదీని ఈ నెల 19కి మార్చామని తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. ఈ వేడుక కొత్త తేదీ పోస్టర్ను తమ్మారెడ్డి భరద్వాజ, సి. కల్యాణ్, దామోదర ప్రసాద్ విడుదల చేశారు. ‘‘దేశవ్యాప్తంగా సినీ కార్మికుల సంక్షేమంలో టాలీవుడ్ నంబర్ వన్గా ఉందంటే కారణం దాసరిగారే’’ అన్నారు సి. కల్యాణ్.‘‘డైరెక్టర్స్ డే ఈవెంట్ సక్సెస్ కావడానికి శ్రమిస్తున్న యువ దర్శకులకు ధన్యవాదాలు’’ అన్నారు వీరశంకర్. ‘‘దాసరిగారి పేరిట రామసత్యనారాయణ ఈవెంట్ చేశారు. మే 5న మేం చేస్తున్నాం. దర్శకుల సంఘం చేయనున్న ఈవెంట్ కూడా సక్సెస్ కావాలి’’ అన్నారు రేలంగి నరసింహారావు. నిర్మాతలు దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, దర్శకులు ఎన్. శంకర్, సముద్ర, మెహర్ రమేష్, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, వశిష్ఠ, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని తదితరులు పాల్గొన్నారు. -
Directors Day 2024: డైరెక్టర్స్ డే వేడుకను ఘనంగా నిర్వహిస్తాం
దివంగత దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని మే 4న హైదరాబాద్లో నిర్వహించనున్నారు. దాసరి జయంతి అయిన మే 4న ‘డైరెక్టర్స్ డే’గా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్ మాట్లాడుతూ– ‘‘దాసరి నారాయణరావుగారి జయంతిని ఈ ఏడాది మే 4న ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించబోతున్నాం. ఈ ఈవెంట్ ద్వారా ఫండ్ రైజ్ చేసి డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కోసం, మిడ్ డే మీల్స్, అసోసియేషన్కు కొత్త బిల్డింగ్ నిర్మాణం, వయసు పైబడిన దర్శకులకు ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. ఈ కార్యక్రమాల కల్చరల్ కమిటీలో డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, శివ నిర్వాణ, నందినీ రెడ్డి, అనుదీప్ కేవీ, విజయ్ కనకమేడల ఉంటారు’’ అన్నారు. -
ఛాన్స్ కోసం దాసరి కాళ్ళ మీద పడి ఏడ్చేసా
-
సినీ దిగ్గజాల సమక్షంలో దాసరి ఫిల్మ్ అవార్డ్స్
దివంగత దర్శకరత్నం డాక్టర్ దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లో దాసరి ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ సభ పలువురు సినీ దిగ్గజాల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ, ముత్యాల సుబ్బయ్య, వి.వి.వినాయక్, సి.కల్యాణ్, ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, అలి, టి ఎఫ్ డి సి చైర్మన్ అనిల్ కూర్మాచలం, ధవళ సత్యం, రేలంగి నరసింహారావు, రాజా వన్నెం రెడ్డి, డా: రఘునాధ్ బాబు.(దాసరి గారి అల్లుడు) రైటర్ రాజేంద్ర కుమార్, తదితరులు ముఖ్య అతిధులుగా హాజరైన ఈ వేడుకలో... ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ, హీరో శ్రీకాంత్, డాక్టర్ బ్రహ్మానందం, బలగం నిర్మాత హర్షిత్ రెడ్డి, వంశీ రామరాజు, కళా జనార్దన్. వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ గౌరీ శంకర్, దివాకర్. పబ్లిసిటీ డిజైనర్ రాంబాబు, వి.ఎఫ్.ఎక్స్ చందు, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ ప్రభు, ధీరజ అప్పాజీ, కవిరత్న చింతల శ్రీనివాస్ తదితరులు దాసరి ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు. ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ - వాసవి ఫిల్మ్ అవార్డ్స్ వ్యవస్థాపకులు కొత్త వెంకటేశ్వరరావు, మడిపడిగె రాజు, ముఖ్య సలహాదారులు బండారు సుబ్బారావు. పబ్బతి వెంకట రవి కుమార్ సారథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ వేడుకలో ఆంధ్ర, తెలంగాణలో పలు రంగాల్లో విశేష కృషి చేస్తున్న ప్రతిభావంతులకు కూడా ఈ పురస్కారాలు ప్రదానం చేశారు. (చదవండి: జేడీ చక్రవర్తి కి అంతర్జాతీయ అవార్డు) అలీ మాట్లాడుతూ "ఉత్తమ హీరోకి తన వంతుగా 50,000 పారితోషకం ఇస్తాను" అని అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ "దాసరి గారి పేరు మీద జరిగే ప్రతి కార్యక్రమంలో నేను ఉంటాను" అన్నారు. వి వి వినాయక్ మాట్లాడుతూ "రామ సత్యనారాయణ దాసరి గారి మీద ఉండే అభిమానంతో ప్రతి ఏటా ఇలా చేయటం అభినందనీయం" అన్నారు. సి కళ్యాణ్ మాట్లాడుతూ "మా తమ్ముడు రామ సత్యనారాయణ దాసరి గారిని గుర్తుంచుకుని ప్రతిభావంతులకి అవార్డ్స్ ఇవ్వటం చాలా ఆనందకరం" అన్నారు. -
తెలుగు చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ లేదు: సుమన్ సంచలన వ్యాఖ్యలు
తెలుగు చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ లేదని సీనియర్ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం(మే 30) దర్శకరత్న దాసరి నారాయణరావు వర్థంతి సందర్భంగా ఇండస్ట్రీ ప్రముఖులు ఆయనను గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను స్మరించుకుంటూ నిర్వహించిన ఓ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులతో పాటు నటుడు సుమన్ కూడా పాల్గొన్నారు. చదవండి: అదిరిపోయిన అనన్య, విజయ్ హుక్ స్టెప్, వీడియో చూశారా? ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాసరిగారు ఇండస్ట్రీ పెద్దగా అందరి సమస్యల గురించి ఆలోచించేవారని గుర్తు చేశారు. ‘ముఖ్యంగా ఆయన బయ్యర్స్ గురించి ఆలోచించేవారు. ఒక సినిమా ప్లాప్ అయితే తర్వాత సినిమాను ఫ్రీగా చేసి బయ్యర్స్ను కాపాడేవారు. కానీ ప్రస్తుత నిర్మాతలు బయ్యర్స్ గురించి ఆలోచించడం లేదు. మేకర్స్ వల్ల బయ్యర్స్ నష్టపోతున్నారు. వారి తీరుతో బయ్యర్స్ సంతోషంగా ఉండటం లేదు. కోట్టకు కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. చదవండి: అలాంటివి విని విసిగిపోయాను, నా వ్యక్తిత్వం అది కాదు: రాధిక ఆప్టే సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో బయ్యర్స్ కొంటున్నారు. ఒకవేళ ఆ సినిమా ప్లాప్ అయితే నష్టపోయేది వారే. అసలు బయ్యర్ల గురించి ఆలోచించే వారే లేరు. సినిమా షూటింగ్స్లో సమయపాలన అసలు లేదు. నిర్మాతకు అదనపు భారం కలిగేలా మేకర్స్ ఉన్నారు. ఇది నేను ఆవేశంతో మాట్టాడుతున్నాను అనుకున్నా.. ఇది మాత్రం నిజం’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో సుమన్ చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. -
దాసరి జయంతి: పాన్ ఇండియా దర్శకులకు సత్కారం
దర్శకదిగ్గజం దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని పాన్ ఇండియా దర్శకులకు దాసరి కల్చరల్ ఫౌండేషన్ ఆద్వర్యంలో తెలుగు సినిమా వేదిక-ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ సమన్వయంతో ఎఫ్.ఎన్.సి సి క్లబ్ లో అంగరంగ వైభవంగా సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన బాలీవుడ్ దర్శకులు, నటీమణులు మాట్లాడుతూ.. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిని అందుకుందని కితాబునిచ్చారు. దాసరి బయోపిక్ ను ‘దర్శకరత్న’ పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తాడివాక రమేష్ నాయుడు స్థాపించిన దాసరి కల్చరల్ ఫౌండేషన్... తెలుగు సినిమా వేదిక వ్యవస్థాపకులు పాకలపాటి విజయ్ వర్మ, ఎఫ్ టి పి సి అధ్యక్షులు చైతన్య జంగా సంయుక్త సారధ్యంలో దాసరి సంస్మరణ వేడుక హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సంగీత విద్వాంసులు తరుణ్ భట్టాచార్య, ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, ధవళ సత్యం, రేలంగి నరసింహారావు బి.గోపాల్, వీరశంకర్, ముప్పలనేని శివ, ఆర్.నారాయణమూర్తి, చంద్రమహేష్, రాజా వన్నెంరెడ్డి, బి.సి.కమిషన్ చైర్మన్ వకులాభారణం కృష్ణమోహన్ రావు, సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు, తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షులు కాశీ విశ్వనాధ్, మాదాల రవి, మోహన్ గౌడ్, బాబ్జి తదితరులు పాల్గొన్నారు. ఈసందర్బంగా దేశవ్యాప్తంగా 16 భాషలకు చెందిన దర్శకులకు సన్మానం చేశారు. అనంతరం సీనియర్ దర్శకులు ధవళ సత్యం సారధ్యంలో తాడివాక రమేష్ నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బహుభాషా బయోపిక్ "దర్శకరత్న" పోస్టర్ ను ఆవిష్కరించారు. -
ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు: మంచు విష్ణు
దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి నేడు. మే 4ను డైరెక్టర్స్ డేగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. బుధవారం(మే 4) ఆయన జయంతి సందర్భంగా దాసరిని గుర్తు చేసుకుంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు ట్వీట్ చేశారు. లెజెండరీ డైరెక్టర్, దర్శకరత్న దాసరి గారు, ది వన్ అండ్ ఓన్లీ గురువు గారు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఆయన్ను ఎంతగానో మిస్ అవుతున్నాం’ అంటూ విష్ణు ట్వీట్ చేశారు. చదవండి: బుల్లితెర ప్రేక్షకులకు షాకిచ్చిన కరణ్ జోహార్ Remembering the Man, the Legend, Sri Dasari garu. The one and only Guru garu. His place can never be replaced. Miss him a lot. pic.twitter.com/eHqt9cIrKh — Vishnu Manchu (@iVishnuManchu) May 4, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పాన్ ఇండియా మూవీగా దాసరి బయోపిక్
దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు జీవితం వెండితెరకు రానుంది. సీనియర్ దర్శకుడు ధవళ సత్యం ‘దర్శకరత్న’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కించనున్నారు. ఇమేజ్ ఫిలింస్ పతాకంపై తాడివాక రమేష్ నాయుడు నిర్మించనున్నారు. గురువారం విలేకరుల సమావేశంలో ధవళ సత్యం మాట్లాడుతూ– ‘‘రచయితగా, దర్శక–నిర్మాతగా ఎందరికో మార్గదర్శకుడైన దాసరిగారితో నాది విడదీయలేని అనుబంధం. ఆ బంధమే ‘దర్శకరత్న’ చేసేందుకు నన్ను పురిగొల్పింది’ అన్నారు. తాడివాక రమేష్ నాయుడు మాట్లాడుతూ– ‘‘ఓ జాతీయ స్థాయి నటుడు దాసరిగారి పాత్రను పోషిస్తారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందించనున్నాం’’ అన్నారు. డైరెక్టర్ రేలంగి నరసింహారావు, నిర్మాతల మండలి కార్యదర్శులు ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల, డైరెక్టర్ కాశీ విశ్వనాథ్, తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ పి.రామకృష్ణగౌడ్, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, వినాయకరావు తదితరులు దాసరితో తమ అనుబంధం గురించి మాట్లాడారు. -
దాసరి కొడుకులకు నోటీసులు జారీ చేసిన హైదరాబాద్ సివిల్ కోర్ట్
-
దాసరి నారాయణరావు ఇంటికి కోర్టు నోటీసులు
దివంగత సినీ దర్శకులు దాసరి నారాయణరావు ఇంటికి సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారి చేసింది. ఆయన తనయులు దాసరి అరుణ్, దాసరి ప్రభులకు ఆర్డర్ 34, సీపీసీ 151 సెక్షన్ల కింద సివిల్ కోర్టు బుధవారం నోటీసులు పంపింది. వ్యాపార లావేదేవిల్లో భాగంగా ఓ ప్లాంట్ నిర్మాణం కోసం సోమ శేఖర్రావు అనే వ్యాపారి వద్ద ప్రభు, అరుణ్లు 2 కోట్ల 11 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. చదవండి: అందుకే సూర్యను అమ్మాయిలు ఇష్టపడతారు, అదే నా టెన్షన్: జ్యోతిక తిరిగి డబ్బులు చెల్లించడంలో వారు జప్యం చేస్తున్నారంటూ సోమశేఖర్ రావు సివిల్ కోర్టును ఆశ్రయించాడు. అలాగే దాసరి ప్రభు, అరుణ్ అప్పుగా తీసుకున్న డబ్బు చెల్లించడంలేదని, త్వరలో తన డబ్బులు చెల్లించేలా వారిపై చర్యలు తీసుకోవాలంటే అతడు పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో కోర్టు దాసరి ఇంటికి నోటీసులు పంపుతూ రెండు వారాల్లో డబ్బులు చెల్లించాల్సిందిగా ప్రభు, అరుణ్లను ఆదేశించింది. చదవండి: Bheemla Nayak: భీమ్లా నాయక్ క్రేజీ అప్డేట్.. పవన్ లుక్ అదుర్స్ -
దాసరి బయోపిక్.. దాసరి అవార్డులు
దివంగత దర్శకులు దాసరి నారాయణరావు జీవితం తెరపైకి రానుంది. ఇమేజ్ ఫిల్మ్స్ అధినేత తాటివాక రమేష్ నాయుడు ‘దర్శకరత్న’ పేరుతో ఈ చిత్రం నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకులు ధవళ సత్యం దర్శకత్వం వహించనున్నారు. అంతేకాదు దాసరి జ్ఞాపకార్థం ‘దాసరి నారాయణరావు ఫిల్మ్ అండ్ టీవీ నేషనల్ అవార్డ్స్’ కూడా ప్రదానం చేసేందుకు తాడివాక రమేష్ నాయుడు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ– ‘‘నా గురువు, దైవం అయిన దాసరిగారి పేరుతో ప్రతి ఏటా ఫిల్మ్ అండ్ టీవీ నేషనల్ అవార్డ్స్ ఇవ్వాలని సంకల్పించాం. ఇందుకోసం ఇప్పటికే ‘దాసరి నారాయణరావు మెమోరియల్ కల్చరల్ ట్రస్ట్’ ఏర్పాటు చేశాం. పలు భాషలకు చెందిన కళాకారులు–సాంకేతిక నిపుణులకు జీవన సాఫల్య పురస్కారాలు కూడా ఇవ్వనున్నాం. అలాగే ధవళ సత్యంగారు ‘దర్శకరత్న’ స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారు. ఓ ప్రముఖ హీరో ఈ చిత్రంలో దాసరి పాత్రలో నటించనున్నారు’’ అన్నారు. -
దాసరి నారాయణరావుకి పద్మవిభూషణ్ ఇవ్వాలి
చెన్నై: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకుడుగా మూడు దశాబ్దాలు వెలుగొందిన స్వర్గీయ దాసరి నారాయణరావుకి నివాళిగా తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సభ జరిగింది. దాసరి నారాయణరావు గారికి కేంద్రం 2022 కి పద్మవిభూషణ్ను ప్రకటించాలని అందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేంద్రానికి ఒక లేఖ ద్వారా సిఫార్సు చేయాలని కేతిరెడ్డి పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అభ్యర్థిస్తూ ఒక వినతిపత్రాన్ని పంపారు. దానికి ముందు జరిగిన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈసి సమావేశంలో తీసుకొన్న నిర్ణీయాన్ని వారు రెండు ప్రభుత్వాలకు తెలిపారు.తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ లేఖలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవలే సినిమా టిక్కెట్ ధరలను పెంచుకొనే అవకాశాన్ని జీవో ద్వారా రద్దు చేయడాన్ని అభినందించారు. -
కమర్షియల్ విప్లవనాదం.. మనుషులంతా ఒక్కటే
‘ఎవడిదిరా ఈ భూమి? ఎవ్వడురా భూస్వామి?దున్నేవాడిదె భూమి... పండించేవాడే ఆసామి’. తీవ్రమైన ఆ ప్రశ్నలు... తెగువతో కవి కలం ఇచ్చిన ఆ బలమైన ఆ సమాధానాలు వింటే – ఇప్పుడంటే మాదాల రంగారావు, ఆర్. నారాయణమూర్తి తరహా ఎర్ర సినిమాలు గుర్తొస్తాయి. కానీ, వాటికన్నా ముందే ఓ స్టార్ సినిమా... వెండితెరపై విప్లవం పండించిందని తెలుసా? ఎన్టీ రామారావు లాంటి స్టార్ హీరో, వరుస విజయాల మీదున్న దాసరి నారాయణరావు లాంటి దర్శకుడు కలసి నాలుగున్నర దశాబ్దాల క్రితమే చేసిన సమసమాజ నినాదం ‘మనుషులంతా ఒక్కటే’ (1976 ఏప్రిల్ 7). ఆ సినిమాకు 45 వసంతాలు. ఆనాటి పరిస్థితులే... అలా తెరపై... వ్యవసాయ ఆధారితమైన మన దేశంలో స్వాతంత్య్రం వచ్చిన వెంటనే భూ సంస్కరణలు మొదలయ్యాయి. 1950లోనే జమీందారీ వ్యవస్థ రద్దు బిల్లు వచ్చింది. 1956లో అనేక ప్రాంతాలు ఆ బిల్లును చట్టం చేశాయి. ఆర్థిక అసమానతలెన్నో ఉన్న మన దేశానికి కమ్యూనిజమ్, సోషలిజమ్ తారక మంత్రాలయ్యాయి. నెహ్రూ, శాస్త్రి తర్వాత ప్రధాని అయిన ఇందిరా గాంధీ 1970లో రాజభరణాలను రద్దు చేశారు. 1971 ఎన్నికల్లో ‘గరీబీ హఠావో’ నినాదం మారుమోగించారు. ఆ సామాజిక పరిస్థితుల్లో, జనంలో బలపడుతున్న భావాలతో తెరకెక్కిన కథ – ‘మనుషులంతా ఒక్కటే’. బ్రిటీషు కాలం నాటి పెత్తందారీ జమీందారీ వ్యవస్థనూ, సమకాలీన సామ్య వాద భావనలనూ అనుసంధానిస్తూ తీసిన చిత్రం ఇది. తాతను మార్చే మనుమడి కథ కథ చెప్పాలంటే... జమీందారు సర్వారాయుడు (కైకాల సత్యనారాయణ), ఆయన కొడుకు రాజేంద్రబాబు (ఎన్టీఆర్) పేదలను ఈసడించే పెత్తందార్లు. కానీ, పేదింటి రైతు పిల్ల రాధ (జమున) వల్ల పెద్ద ఎన్టీఆర్ మారతాడు. ఆమెను పెళ్ళాడతాడు. పేదల పక్షాన నిలిచి, న్యాయం కోసం పోరా డతాడు. ప్రాణాలు కూడా కోల్పోతాడు. కానీ, ఆ పేదింటి అమ్మాయికీ, అతనికీ పుట్టిన రాము (రెండో ఎన్టీఆర్) పెరిగి పెద్దవాడై, జమీందారు తాతకు బుద్ధి చెబుతాడు. వర్గ భేదాలు, వర్ణ భేదాలు లేకుండా మనుషులంతా ఒక్కటే అని వాణిజ్యపంథాలో చెప్పడంలో సూపర్ హిట్టయిందీ చిత్రం. విప్లవ కథాచిత్రాలకు కమర్షియల్ మూలం కళాదర్శకుడు– పబ్లిసిటీ డిజైనింగ్ ‘స్టూడియో రూప్ కళా’ ఓనరైన వి.వి. రాజేంద్ర కుమార్ కు సినిమా చేస్తానంటూ అప్పటికి చాలా కాలం ముందే ఎన్టీఆర్ మాటిచ్చారు. మాటకు కట్టుబడి, డేట్లిచ్చారు. పౌరాణికం తీయాలని రాజేంద్ర కుమార్ మొదట అనుకున్నారు. చివరకు ఎన్టీఆర్ – దాసరి కాంబినేషన్కు శ్రీకారం చుడుతూ, సాంఘికం ‘మనుషులంతా ఒక్కటే’ తీశారు. రాజేంద్ర కుమార్ సమర్పణలో, ఆయన సోదరుడు – కథా, నవలా రచయిత వి. మహేశ్, గుంటూరుకు చెందిన దుడ్డు వెంకటేశ్వరరావు నిర్మాతలుగా ఈ సినిమా నిర్మాణమైంది. ‘మనుషులంతా ఒక్కటే’ అనే పేరు, ‘దున్నేవాడిదే భూమి’ లాంటి అంశాలు అచ్చంగా వామపక్ష భావజాలంతో కూడిన సినిమాల్లో కనిపిస్తాయి. కానీ ప్రజాపోరాటంతో పాటు, పెద్ద కుటుంబానికి చెందిన హీరో తక్కువ కులపు పేదింటి అమ్మాయిని పెళ్ళాడడం లాంటివన్నీ ఈ కమర్షియల్ చిత్రంలో ఉన్నాయి. అలా చూస్తే ‘భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం’ అనే విప్లవ భావాలతో వచ్చిన తర్వాతి సినిమాలకు ఒక రకంగా ‘మనుషులంతా ఒక్కటే’ మూలమనేవారు దాసరి. అంతకు మునుపు కూడా పెత్తందార్లపై, రైతు సమస్యలపై సినిమాలు వచ్చినా, అవన్నీ పూర్తిగా గ్రామీణ నేపథ్యంలోవే! బ్లాక్ అండ్ వైటే!! ఇలా కమర్షియల్, కలర్ చిత్రాలు కావనేది గమనార్హం. కథ వెనుక కథేమిటంటే... దాసరి రచయితగా, దర్శకత్వ శాఖలో సహాయకుడిగా ఉన్నప్పటి నుంచి ఎన్టీఆర్కు తెలుసు. ‘ఒకే కుటుంబం’ (1970 డిసెంబర్ 25)తో సెట్స్పై దాసరి దర్శకత్వ ప్రతిభ కూడా ఎన్టీఆర్కు తెలిసింది. మరో హిందీ షూటింగుతో క్లాష్ వచ్చి, దర్శకుడు ఎ. భీమ్సింగ్ అందుబాటులో లేనప్పుడు కొద్దిరోజులు ‘ఒకే కుటుంబం’ షూటింగ్ చేసింది ఆ చిత్రానికి సహ రచయిత, అసోసియేట్ డైరెక్టరైన దాసరే! అంతకు ముందు రచయితగానూ దాసరి ఒకటి రెండు కథలతో ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళినా, రకరకాల కారణాలతో అవేవీ సెట్స్ పైకి రాలేదు. ఈ ‘మనుషులంతా ఒక్కటే’కు దాసరి ముందు అనుకున్న మూలకథ కూడా వేరే ఎన్టీఆర్ నిర్మాతల దగ్గరకు వెళ్ళిందట! ఎన్టీఆర్, జమునలతో తీయాలనేది ప్లాన్. కానీ, అప్పటికే వచ్చిన ‘మంగమ్మశపథం’(1965)తో పోలికలున్నాయంటూ, ఆ నిర్మాత వెనక్కి తగ్గారట! ఆ తరువాత చాలాకాలానికి దాసరి దర్శకుడయ్యాక ఆ మూల కథే మళ్ళీ ఎన్టీఆర్, జమునలతోనే తెరకెక్కడం విచిత్రం. ‘మనుషులంతా ఒక్కటే’ నిర్మాతల్లో ఒకరైన నవలా రచయిత వి. మహేశ్ గతంలో దాసరి దగ్గర పలు చిత్రాలకు అసిస్టెంట్ స్టోరీ రైటర్. చాలాకాలం క్రితం తాను అనుకున్న కథలో మహేశ్, ఆర్కే ధర్మరాజు సహకారంతో మార్పులు, చేర్పులు చేశారు దాసరి. దాంతో, ఈ కథ నేపథ్యమే మారింది. దున్నేవాడిదే భూమి, జమీందారీ వ్యవస్థ, తాతకు మనుమడు బుద్ధి చెప్పడం లాంటి అంశాలతో కథ కొత్త హంగులు దిద్దుకుంది. నిర్మాత మహేశ్, ఆర్కే ధర్మరాజులకే కథారచన క్రెడిట్ ఇచ్చి, స్క్రీన్ప్లే, డైలాగ్స్, దర్శకత్వ బాధ్యతల క్రెడిట్ తీసుకున్నారు దాసరి. ఈ సినిమాలో తెరపై రెండో ఎన్టీఆర్ను హోటల్ రిసెప్షన్ దగ్గర పలకరించే చిరువేషంలోనూ మెరిశారు మహేశ్. సమాజానికి మంచి చెప్పే ఈ కథతో ఆ ఏటి ద్వితీయ ఉత్తమ కథారచయితగా మహేశ్ రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకున్నారు. క్రేజీ కాంబినేషన్! దాసరి కొడుకుకు ఎన్టీఆర్ పేరు!! దర్శకుడిగా దాసరికి ఇది 12వ సినిమా. అంతకు ముందు 11 సినిమాల్లో ‘సంసారం – సాగరం’, ‘రాధమ్మ పెళ్ళి’, ‘తిరపతి’, యావరేజ్ ‘యవ్వనం కాటేసింది’ పోగా మిగతా 7 సక్సెస్. ఆ మాటకొస్తే ‘మనుషులంతా ఒక్కటే’ రిలీజైన 1976కు ముందు సంవత్సరం 1975లో రిలీజైన దాసరి చిత్రాలు నాలుగూ శతదినోత్సవ చిత్రాలే. దాసరి మంచి క్రేజు మీదున్నారు. అయితే, శోభన్బాబు ‘బలిపీఠం’ మినహా అప్పటి దాకా ఆయన తీసిన సినిమాలన్నీ బ్లాక్ అండ్ వైటే! స్టార్ల కన్నా కథకే ప్రాధాన్యమున్న లోబడ్జెట్ చిత్రాలే! ఆ టైములో ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్తో, కలర్లో, ఔట్డోర్లో, భారీ బడ్జెట్తో తొలిసారిగా దర్శకత్వం వహించే ఛాన్స్ రాగానే దాసరి రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు. 1975 నాటికి శోభన్బాబు జోరు మీదున్నారు. టాప్ స్టార్గా ఎన్టీఆర్ కెరీర్ కొనసాగుతోంది. అప్పట్లో ఎన్టీఆర్ సెంటిమెంటల్ క్రైమ్ కథ ‘అన్నదమ్ముల అనుబంధం’ (1975 జూలై 4), ప్రయోగాత్మక ‘తీర్పు’(1975 అక్టోబర్ 1), మాస్ఫార్ములా ‘ఎదురులేని మనిషి’ (1975 డిసెంబర్ 12), విభిన్నమైన క్లాస్ ప్రేమకథ ‘ఆరాధన’ (1976 మార్చి 12) చిత్రాలతో 9 నెలల కాలంలో 4 హిట్లు, చారిత్రక కథా చిత్రం ‘వేములవాడ భీమకవి’ (1976 జనవరి 8) తర్వాత ‘మనుషులంతా ఒక్కటే’తో జనం ముందుకొ చ్చారు. జమీందారీ కథకు తగ్గట్టు రాతి కట్టడంతో కోటలా కనిపించే బెంగళూరులోని మైసూర్ మహారాజా ప్యాలెస్లో షూటింగ్ చేసిన తొలి తెలుగు చిత్రమూ ఇదే. అంతకు ముందొచ్చిన ‘దేవుడు చేసిన మనుషులు’ (1973) లాంటివన్నీ తెల్లగా, పాలరాతితో చేసినట్టు తోచే మైసూరులోని లలితమహల్ ప్యాలెస్లో తీసినవి. చిత్రమేమిటంటే, ఏ.వి.ఎం స్టూడియోలో ‘మనుషులంతా ఒక్కటే’ షూటింగ్ ప్రారంభమైనరోజునే దాసరికి అబ్బాయి పుట్టాడు. ఆ సంతోష వార్త తెలియగానే ఎన్టీఆర్తో పంచుకున్న దాసరి, ‘తారక రామారావు అనే మీ పేరు కలిసొచ్చేలా మా తొలి సంతానానికి నామకరణం చేస్తున్నాం’ అని చెప్పారు. కొడుకుకి‘తారక హరిహర ప్రభు’ అని పేరు పెట్టారు. ఎస్పీబీ గాత్రానికి ఓ కొత్త ఊపు ఇద్దరు ఎన్టీఆర్లు, ఇద్దరు హీరోయిన్లున్నా – ‘మనుషులంతా...’లో ఎన్టీఆర్కు ఒక్క డ్యుయెటైనా ఉండదు. బాపు సూపర్ హిట్ ‘ముత్యాల ముగ్గు’ సహా అక్కినేని ‘సెక్రటరీ’, కృష్ణంరాజు ‘భక్త కన్నప్ప’ తదితర చిత్రాల ఆడియోలతో గాయకుడు రామకృష్ణ హవా నడుస్తున్న రోజులవి. ఆ పరిస్థితుల్లో అప్పటికి ఇంకా వర్ధమాన గాయకుడైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ‘మనుషులంతా ఒక్కటే’లోని సోలో పాటలన్నీ ఎస్. రాజేశ్వరరావు స్వరసారథ్యంలో పాడి, ఆకట్టుకున్నారు. ‘అను భవించు రాజా..’, ‘తాతా బాగున్నావా..’, ‘ఎవడిదిరా ఈ భూమి..’ (రచన సినారె), ‘కాలం కాదు కర్మా కాదు..’ (ఆత్రేయ) – ఇలా ఆ సోలో సాంగ్స్ అన్నీ పాపులరే. ఇక, ‘ముత్యాలు వస్తావా...’ డ్యూయట్లో అచ్చంగా అల్లు రామలింగయ్యే పాడారేమో అనేట్టుగా ఎస్పీబీ తన గళంతో మాయాజాలం చేయడం మరో విశేషం. అలా ఆయన కెరీర్కు ఈ చిత్రం ఓ కొత్త ఊపు. హాస్యనటి రమాప్రభ ఈ సినిమాలో అల్లు రామలింగయ్య, నాగేశ్ల సరసన ద్విపాత్రాభినయం చేయడం ఓ గమ్మత్తు! అల్లుతో రమాప్రభకు ‘ముత్యాలు వస్తావా... అడిగింది ఇస్తావా...’ అంటూ డ్యూయెట్ పెట్టడం మరో గమ్మత్తు!! రాజేశ్ ఖన్నా, షర్మిలా టాగోర్ నటించిన హిందీ సినిమా ‘ఆరాధన’ (1969 సెప్టెంబర్ 27)లో ఎస్.డి. బర్మన్ బాణీకి ఆయన కుమారుడు ఆర్.డి. బర్మన్ హంగులు చేర్చగా, దేశమంతటినీ ఊపేసిన పాపులర్ శృంగారగీతం ‘రూప్ తేరా మస్తానా.’ సరిగ్గా ఆ బాణీనే అనుసరిస్తూ, కొసరాజు రాసిన ‘ముత్యాలు వస్తావా..’ అప్పట్లో రేడియోలో మారుమోగింది. ఇప్పటికీ ఎమోషనల్గా... ఆ బుర్రకథలు ఇదే సినిమాలో ఇంటర్వెల్కు ముందు పెద్ద ఎన్టీఆర్ పాత్ర ఒంటరిగా దుండగుల చేతిలో చనిపోయే ఉద్విగ్నభరిత ఘట్టం ఉంటుంది. ఆ సందర్భానికి తగ్గట్టు మహాభారతంలోని అభిమన్యుడి బుర్రకథను సినారె ప్రత్యేకంగా రాశారు. ప్రసిద్ధ బుర్రకథకుడు నాజర్ బృందంతో ఈ బుర్రకథ తీయాలనుకున్నారు. అయితే, ఆయన వయోభారం అడ్డమైంది. దాంతో, సినారె సూచనతో హైదరాబాద్కు చెందిన మరో ప్రముఖ బుర్రకథకుడు పి. బెనర్జీ బృందంతో ఆ బుర్రకథ తీశారు. ఆ బుర్రకథ, తెరపై దాని చిత్రీకరణ ఓ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. నాలుగున్నరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ –దాసరి కాంబినేషన్లోనే వచ్చిన ‘సర్దార్ పాపారాయుడు’ లోనూ ఇంటర్వెల్ ముందు ఇదే బెనర్జీ బృందంతో శ్రీశ్రీ రాసిన అల్లూరి సీతారామరాజు బుర్రకథ పెట్టడం విశేషం. యాభైకే... 100 రోజుల వసూళ్ళు తరువాతి కాలంలో దర్శకులైన కె. దుర్గానాగేశ్వరరావు ‘మనుషులంతా ఒక్కటే’కు కో–డైరెక్టరైతే, శతచిత్ర దర్శకుడైన కోడి రామకృష్ణ అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్. దాసరి శిష్యుడు – ఇప్పటి విప్లవ చిత్రాలకు చిరునామాగా మారిన ఆర్. నారాయణమూర్తి కూడా ఈ విప్లవాత్మక కథాచిత్రంలో క్లైమాక్స్లో ఒక చిన్న డైలాగు వేషంలో కనిపిస్తారు. తమిళనాడులోని మద్రాసు, కర్ణాటకలోని బెంగళూరు, నందీహిల్స్, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు పరిసరాల్లో – ఇలా 3 రాష్ట్రాల్లో భారీ వ్యయంతో ఈ సినిమా చిత్రీకరణ సాగింది. 33 ప్రింట్లతో 50 థియేటర్లలో రిలీజైన ఈ కలర్ చిత్రం అప్పట్లో దాదాపు అన్ని కేంద్రాలలో 50 రోజులు ఆడింది. నాలుగు కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. విజయవాడ లక్ష్మీ టాకీస్లో అత్యధికంగా 128 రోజులు ప్రదర్శితమైంది. ఇక, హైదరాబాద్ కేంద్రంలో షిఫ్టింగులతో, సంయుక్త రజతోత్సవం మాత్రం జరుపుకొంది. క్లైమాక్స్ చిత్రీకరణ సాగిన నెల్లూరులో విపరీతంగా ఆదరణ లభించింది. అలా నెల్లూరు, గుంటూరు లాంటి కొన్ని కేంద్రాలలో సర్వసాధారణంగా ఒక సినిమాకు వందరోజులకు వచ్చే వసూళ్ళను ‘మనుషులంతా ఒక్కటే’ కేవలం యాభై రోజులకే సాధించడం అప్పట్లో చర్చ రేపింది. ఆ ఏడాది జూలై 26న మద్రాస్ తాజ్ కోరమాండల్ హోటల్లో దర్శకుడు పి. పుల్లయ్య, నిర్మాత డి.వి.ఎస్ రాజు ముఖ్య అతిథులుగా సినిమా వంద రోజుల వేడుక ఘనంగా చేశారు. అప్పట్లో ఎమ్జీఆర్తో తమిళంలో ఈ సినిమాను రీమేక్ తీయాలనుకున్నారు. కానీ, ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి కావడంతో అది కుదరలేదు. ఏది ఎలా ఉన్నా, మనుషులంతా ఒక్కటే అనే సార్వకాలిక సత్యాన్ని జనరంజకంగా చెప్పిన చిత్రంగా ‘మనుషులంతా ఒక్కటే’ ఎప్పటికీ గుర్తుంటుంది. ఎన్టీఆర్ సహకారంతో... ‘మనుషులంతా...’ తరువాత రాజేంద్ర కుమార్కు ఎన్టీఆర్ ఇంకో సినిమా చేశారు. ‘రక్తసంబంధం’ ఫక్కీలోని ఆ అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ చిత్రం – ‘మహాపురుషుడు’. ‘ఆబాలగోపాలుడు’ టైటిల్ మధ్యలో అనుకొని, చివరకు ‘మహాపురుషుడు’ (1981 నవంబర్ 21)గానే రిలీజైందా సినిమా. నిర్మాణం సగంలో ఉండగానే రాజేంద్ర కుమార్ హఠాత్తుగా కన్నుమూశారు.చిత్ర నిర్మాణం సందిగ్ధంలో పడి, ఆలస్యమైంది. ఎన్టీఆర్ సహకరించి, సినిమా పూర్తి చేయించి, రిలీజ్ చేయించడం విశేషం. పబ్లిసిటీలో... పేరు వివాదం! ‘మనుషులంతా ఒక్కటే’తో మొదలైన ఎన్టీఆర్ – దాసరి కాంబినేషన్లో ఆ తరువాత మరో 4 సినిమాలు వచ్చాయి. ఈ సినిమా తీసేనాటికే ప్రింట్, పోస్టర్ పబ్లిసిటీలో దర్శకుడిగా దాసరి పేరు సినిమా టైటిల్ కన్నా పైన మేఘాలకు ఎక్కింది. కానీ, ఎన్టీఆర్తో తొలిసారి తీస్తున్న ‘మనుషులంతా ఒక్కటే’ ప్రిరిలీజ్ పబ్లిసిటీకి దాసరి తన పేరును సినిమా టైటిల్ కన్నా కిందే వేసుకున్నారు. ఆ పైన తమ కాంబినేషన్లో రెండో సినిమా ‘సర్కస్ రాముడు’ (1980 మార్చి 1)కు మాత్రం ఎందుకనో టైటిల్ పైన తన పేరు వేసుకున్నారు దాసరి. అది చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ దాసరి దగ్గర పంచాయతీ పెట్టారు. దాంతో, ఇకపై ప్రధాన పబ్లిసిటీలో ముందుగా పైన ఎన్టీఆర్ నటించిన అని పేరు వేసి, ఆ తరువాతే మరోవైపు తన పేరు మేఘాలలో వేయడానికి దాసరి రాజీ కొచ్చారు. ఒప్పుకున్నట్టే, ఆ తరువాత తీసిన ‘సర్దార్ పాపారాయుడు’ (1980 అక్టోబర్ 30), ‘విశ్వరూపం’ (1981 జూలై 25) ప్రధాన పబ్లిసిటీకి ఆ పద్ధతే అనుసరించారు. ఆఖరుగా వచ్చిన ‘బొబ్బిలిపులి’ (1982 జూలై 9)కి సైతం ‘‘నవరస నాయకుడు నటరత్న యన్.టి.ఆర్. నటనా వైభవం’’ అని ముందు వేసి, ఆ తరువాతే మేఘాలలో తన పేరు పబ్లిసిటీలో కనిపించేలా చూశారు. పబ్లిసిటీలో పేరెక్కడ ఉండాలనే ఈ వివాదం సినీప్రియుల్లో అప్పట్లో ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది. నాగభూషణం లాస్... సత్యనారాయణకు గెయిన్! ఈ సినిమాలో కీలకమైనది – మనుమడైన రెండో ఎన్టీఆర్ ఢీ కొట్టే తాత పాత్ర. అహంకారం నిండిన జమీందారుగా ఆ విలనీ తాత పాత్ర, ఆ గెటప్ అప్పట్లో నటుడు నాగభూషణం ట్రేడ్ మార్క్. నిజానికి, ఎన్టీఆర్ కూడా ఆయన పేరే సూచించారట. కానీ, నాగభూషణం సమర్పించిన ‘ఒకే కుటుంబం’కి పనిచేసిన దాసరి ఆ మాట వినలేదు. ‘తాత – మనవడు’లో నాగభూషణం బదులు గుమ్మడితో వేషం వేయించిన దాసరి ఈసారీ వ్యక్తిగత కారణాల రీత్యా నాగభూషణాన్ని వద్దనే అనుకొన్నారు. సత్యనారాయణ పేరు పైకి తెచ్చారు. అదేమంటే, ‘నన్ను నమ్మండి. ఆయన అద్భుతంగా చేస్తారని నిరూపిస్తా’ అని వాదించి మరీ ఒప్పించారు. నిరూపించారు. ‘ఎన్టీఆర్కు తాతగా మహామహులు చేయాల్సింది నేను చేయడమేమిట’ని సత్యనారాయణ సైతం భయపడ్డారు. కానీ, తాత పాత్రకు ప్రాణం పోశారు. ఆయన అభినయం, ‘తాతా బాగున్నావా’ లాంటి పాటలతో నేటికీ ఆ పాత్ర చిరస్మరణీయమైంది. ‘కర్ణ’ ఛాన్స్ ఇచ్చిన... జమున కెమేరా అందం పెద్ద ఎన్టీఆర్కు భార్యగా, చిన్న ఎన్టీఆర్కు తల్లిగా, ఆత్మాభిమానం ఉన్న పేదింటి రైతుబిడ్డగా జమునది క్లిష్టమైన పాత్ర. ఆ పాత్రను ఆమె అభినయంతో మెప్పించారు. నలభై ఏళ్ళ వయసులోనూ జమున లంగా, ఓణీలతో సినిమా ఫస్టాఫ్లో ఆకర్షణీయంగా, చలాకీగా కనిపిస్తారు. ఆ వయసులోనూ, ఆ కాస్ట్యూమ్స్తో ఆమెను అందంగా, హుందాగా చూపడంలో కెమేరామ్యాన్ కన్నప్ప ప్రతిభ కూడా ఉంది. ఆ పనితనం ఎన్టీఆర్కు బాగా నచ్చింది. ఆ వెంటనే ఎన్టీఆర్ తన 54వ ఏట స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ, త్రిపాత్రాభినయం చేస్తున్న పౌరాణిక చిత్రం ‘దాన వీర శూర కర్ణ’ (1977 జనవరి 14)కు కన్నప్పనే కెమేరామ్యాన్గా తీసుకున్నారు. కర్ణుడు, సుయోధనుడు, శ్రీకృష్ణుడు – ఈ మూడు పాత్రల్లోనూ తెరపై అందంగా కనువిందు చేశారు. ఆ పాట... అలా స్పెషల్! ఇదే సినిమాలో దాసరి చేసిన మరో మ్యాజిక్ – సినిమాల టైటిల్స్తోనే ఏకంగా ఓ పాటంతా రాసి, మెప్పించడం! ‘నిన్నే పెళ్ళాడుతా... రాముడూ భీముడూ...’ అంటూ ఆ పాట అంతా ఎన్టీఆర్ నటించిన సినిమాల టైటిల్స్తోనే సాగుతుంది. పి. సుశీల గానంలో హీరోయిన్ మంజుల స్టేజీపై నర్తిస్తుండగా, ఎన్టీఆర్ మీదే దాన్ని చిత్రీకరించడం విశేషం. అంతకు ముందు ‘ఒకే కుటుంబం’ లాంటి సినిమాల్లో గీతరచన చేసినా, దర్శకుడయ్యాక దాసరికి ఇదే ఫస్ట్ సాంగ్. ఈ సినిమాలో ఈ సందర్భం కోసం మొదట వేరే పాట అనుకున్నారు. ఎన్టీఆర్ పౌరాణిక గెటప్పుల్లో కనిపించేలా సినారె రాశారు. అయితే, ఆఖరి నిమిషంలో ఆ గెటప్పుల ప్రతిపాదన విరమించుకొని, ఆపద్ధర్మంగా దాసరి ఈ సినిమా టైటిల్స్పాట రాశారు. సినీటైటిల్స్తోనే ఓ పాట రావడం తెలుగులో అదే తొలిసారి. అప్పటికే ఎన్టీఆర్ దాదాపు 250 సినిమాల్లో నటించారు. అందులోని 34 టైటిల్స్ ఈ పాటలో ఉన్నాయి. అలా ఒక హీరోపై ఆయన సినీటైటిల్స్తోనే ఓ పాట రాసి, ఆయనపైనే చిత్రీకరించడం తెలుగులో ఇదొక్కసారే జరిగింది. తర్వాత ‘మరోచరిత్ర’ లాంటి సినిమాల్లో వేర్వేరు సినిమాల టైటిల్స్ తోనే పాటంతా రాయడమనే ధోరణి కొనసాగింది. - రెంటాల జయదేవ -
ప్రేమాభిషేకం: అక్కినేని ప్రేమకు... దాసరి పట్టాభిషేకం
ప్రేమకథలు... అందులోనూ భగ్న ప్రేమకథలు... తెరపై ఎప్పుడూ హిట్ ఫార్ములా! ఆ ఫార్ములాతో అక్కినేని, దాసరి కాంబినేషన్ తెలుగు సినీ చరిత్రలో సృష్టించిన అపూర్వ వాణిజ్య విజయం ‘ప్రేమాభిషేకం’. సరిగ్గా నలభై ఏళ్ళ క్రితం 1981 ఫిబ్రవరి 18న రిలీజైన సినిమా అది. కానీ ఇవాళ్టికీ ఆ పాటలు, మాటలు – ఇలా అన్నీ సినీ ప్రియులకు గుర్తే! ‘ప్రేమకు అర్థం– త్యాగ’మనే మరువలేని అంశాన్ని మరపురాని రీతిలో చెప్పిన ‘ప్రేమాభిషేకం’... అజరామర ప్రేమకు వెండితెర పట్టాభిషేకం! అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణా స్టూడియోస్(1976 జనవరి 14) స్థాపించి, అప్పటికి నాలుగేళ్ళవుతోంది. స్టూడియో పేరుపై ఆయన ‘రామకృష్ణు్ణలు’ (జగపతి రాజేంద్రప్రసాద్తో కలసి –1978), ‘కళ్యాణి’ (’79), ‘పిల్ల జమీందార్’ (’80) తీశారు. అదే కాలంలో ఎ.ఎ. కంబైన్స్ బ్యానర్పై ‘మంచి మనసు’ (’78), ‘బుచ్చిబాబు’ (’80) నిర్మించారు. ఇవన్నీ స్టూడియో మొదలెట్టాక, అక్కినేని సమర్పించిన చిత్రాలే. కానీ, ఏవీ అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేదు. మరోపక్క ఖర్చులతో స్టూడియో కష్టనష్టాలూ ఎక్కువగానే ఉన్నాయి. కాశ్మీర్లో పుట్టిన కథ! సరిగ్గా అప్పుడే... అక్కినేని వీరాభిమాని, అన్నపూర్ణా స్టూడియోస్కు ‘కళ్యాణి’, ‘బుచ్చిబాబు’ తీసిన పాపులర్ డైరెక్టర్ దాసరి నారాయణరావు తన అభిమాన హీరోతో కాశ్మీర్లో ‘శ్రీవారి ముచ్చట్లు’ చిత్రీకరిస్తున్నారు. ‘దేవదాసు మళ్ళీ పుట్టాడు’ (’78)తో మొదలుపెట్టి అక్కినేనితో దాసరికి అది 5వ సినిమా. ఓ రోజు కాశ్మీర్ డాల్ లేక్లో షూటింగ్ ముగించుకొని, పడవలో వస్తుండగా దాసరి మనసులో ఏవో ఆలోచనలు. అవన్నీ ఓ కొలిక్కి వచ్చి, ‘ప్రేమాభిషేకం’ కథాంశం మనసులో రూపుదిద్దుకుంది. ఓ అమ్మాయి ప్రేమ కోసం పరితపించే హీరో. కష్టపడి ఆ అమ్మాయి ప్రేమ గెలుస్తాడు. తీరా ఆమె ఓకే అన్నాక, ఊహించని పరిస్థితులు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని ఆమె క్షేమం, సౌభాగ్యం కోసం హీరో తన నుంచి దూరం పెట్టి ప్రేమను త్యాగం చేస్తే? ఈ కథాంశం చెప్పగానే అక్కినేని డబుల్ ఓకే. సొంత స్టూడియో బ్యానర్ మీదే తీద్దామన్నారు. అలా అక్కినేని సొంత చిత్రంగా, కుమారులు వెంకట్, నాగార్జున నిర్మాతలుగా ‘ప్రేమాభిషేకం’ పట్టాలెక్కింది. ఆగిన షూటింగ్! అన్నపూర్ణ మధ్యవర్తిత్వం!! మొదటి నుంచి ఈ కథపై దాసరికి గట్టి నమ్మకం. తీరా షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కినేనికి ఓ డౌట్ వచ్చింది. పెళ్ళిచూపుల్లో నటి కవితలో శ్రీదేవిని ఊహించుకొని, పెళ్ళికి ఓకే చెప్పి వస్తాడు హీరో. తీరా తరువాత కవిత పూలబొకేతో ఎదురైతే, ‘నువ్వెవరో నాకు తెలీదు, నిన్ను చూసి ఓకే చెప్పలేదు’ అంటాడు. ముందు ఓకే అన్నా, ఆ సీన్ తీస్తున్నప్పుడు తన లేడీస్ ఫాలోయింగ్ ఇమేజ్కు అది భంగం కలిగిస్తుందని అక్కినేని అనుమానించారు. ఆ సీను మార్చాల్సిందే అన్నారు. దాసరితో వాదించారు. కానీ, కథానుసారం ఇంటర్వెల్ వద్ద కథను కీలకమైన మలుపు తిప్పే సీనుకు ఈ సీనే లింకు అంటూ దాసరి పట్టుబట్టారు. వ్యవహారం ముదిరి ఒకరోజు షూటింగ్ ఆగింది. అక్కినేని, దాసరి – ఇద్దరూ భీష్మించుకున్న పరిస్థితుల్లో చివరకు అక్కినేని శ్రీమతి అన్నపూర్ణ కలగజేసుకొని, మధ్యవర్తిత్వం వహించారు. చివరకు దాసరి ‘‘ఆ సీనులో సారం చెడిపోకుండా, ఒకటి రెండు సవరణలు చేసి, అక్కినేనిని ఒప్పించా’’రు. అద్భుతంగా తీసి, మెప్పించారు. ఆ దేవదాసు పాత్రలే... మళ్ళీ! గమనిస్తే ఒకప్పటి దేవదాసు, పార్వతి, చంద్రముఖులే ఈ ‘ప్రేమాభిషేకం’లో అక్కినేని, శ్రీదేవి, జయసుధలు వేసిన పాత్రలు. పార్వతి ప్రేమ కన్నా చంద్రముఖి ప్రేమ గొప్పదనే చర్చ ఈ చిత్రంలోని శ్రీదేవి, జయసుధల పాత్ర ద్వారా చెలరేగింది. సూపర్ హిట్స్ ‘దేవదాసు’, ‘ప్రేమ్నగర్’ కథలను కలగలిపి, కొత్తగా వండి వడ్డించారు దాసరి. అయితే, స్క్రీన్ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వంలో దాసరి బహుముఖ ప్రజ్ఞ ఓ సంచలనం. ఆ పాటలకు వందనం... అభివందనం! చక్రవర్తి సంగీతంలో ‘దేవీ మౌనమా’, ‘కోటప్పకొండకు’, ‘తారలు దిగివచ్చిన’, ‘నా కళ్ళు చెబుతున్నాయి’, ‘ఒక దేవుడి గుడిలో’, ‘వందనం’, ‘ఆగదూ’– ఇలా దాసరి రాసిన అన్ని పాటలూ ఆల్టైమ్ హిట్. ఎస్పీబీకి సింగర్గా నంది అవార్డూ వచ్చింది. నిజానికి, ‘వందనం...’ పాట స్థానంలో దాసరి మొదట ‘జీవితాన్ని చూడు రంగు రంగుల అద్దంలో’ అనే పాట రాశారు. పాట ఇంకా బాగుండాలన్నారు అక్కినేని. అప్పుడు చేసిన కొత్త పాట ‘వందనం’ అయితే, ఆడియోలో మాత్రం ‘జీవితాన్ని చూడు’ పాట కూడా రిలీజ్ చేశారు. సినిమాలో లేకపోయినా, ఆ పాటా ఆ రోజుల్లో తెగ వినపడింది. 57వ ఏట ‘ప్రేమాభిషేకం’తో అంత పెద్ద సక్సెస్ రావడం అక్కినేనికి అన్ని విధాలా తృప్తినిచ్చింది. ‘‘ఈ క్రెడిట్ అంతా దాసరిదే. చక్రవర్తి సంగీతానిదీ మేజర్ కంట్రిబ్యూషన్’’ అని అక్కినేని తరచూ చెబుతుండేవారు. మరపురాని డైలాగ్ డ్రామా! నిజం చెప్పాలంటే – సీన్ల రూపకల్పనలో, డైలాగ్ డ్రామాలో దాసరి ప్రతిభకు ‘ప్రేమాభిషేకం’ ఓ మచ్చుతునక. ‘‘ఈ లోకంలో అందరికీ తెలుసు’’ అంటూ హీరోయిన్కు తన మీద అసహ్యం కలిగించడం కోసం హీరో డైలాగులు చెప్పే సీన్, శ్రీదేవి– జయసుధ– అక్కినేనివ మధ్య మాటల యుద్ధం సీను లాంటివి సినిమాను వేరే స్థాయిలో నిలిపాయి. ఆ డైలాగుల్ని జనం అందరూ తెగ చెప్పుకున్నారు. హీరో మరణించినా, మరణం లేని ప్రేమను తెరపై పదే పదే చూస్తూ, రిపీట్ ఆడియన్స్ కాసుల వర్షం కురిపించారు. పాత్ర చిన్నదే... ఆమె అభినయం పెద్దది! మొదట ఈ సినిమాలో వేశ్య పాత్ర ఎవరితో వేయించాలనే చర్చ జరిగింది. ఒక దశలో నటి లక్ష్మి పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. అప్పటికే టాప్ హీరోయినైన జయసుధ అయితేనో అన్నారు దాసరి. కానీ ‘కేవలం 2పాటలు, 6 సీన్లే ఉన్న పది రోజుల్లోపు పాత్రను, అదీ వేశ్య పాత్రను ఆమె ఒప్పుకుంటుందా’ అన్నది అక్కినేని అనుమానం. ఇంతలో ‘ప్రేమాభిషేకం’లో ఓ చిన్నపాత్రకు తనను అనుకుంటున్నారని జయసుధ దాకా వెళ్ళింది. ‘ఆ పాత్ర నేనే చేయాలని దాసరి అనుకుంటే, అది వేశ్య పాత్ర అయినా సరే చేస్తా’ అని జయసుధ యథాలాపంగా అనేశారు. తీరా అది వేశ్య పాత్రే! ‘ఏ–బి–సి–డి అండ్ జె’ హిట్ కాంబినేషన్! అప్పట్లో ‘అక్కినేని – బాలు – చక్రవర్తి – దాసరి అండ్ జయసుధ’ల కాంబినేషన్ వరుస హిట్లు అందించింది. విజయవాడలో ఈ చిత్ర విజయోత్సవంలో వీళ్ళను ‘ఏ–బి–సి–డి అండ్ జె’ హిట్ కాంబినేషన్ అని జర్నలిస్టులు ప్రస్తావించారు. చాలాకాలం ఫ్యాన్స్లో, ట్రేడ్లో ఆ పదం పాపులరైంది. బాక్సాఫీస్ చరిత్రలో... సువర్ణాధ్యాయం ‘ప్రేమాభిషేకం’ తెలుగు సినీ బాక్సాఫీస్ చరిత్రలో కొన్ని అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది. రిలీజుకు ముందు మంచి రేటొచ్చినా, దాసరి సలహా మేరకు హక్కులు అమ్మలేదు అక్కినేని. నెల్లూరు, సీడెడ్ ప్రాంతాల హక్కులు మాత్రం అమ్మి, మిగతాచోట్ల సొంత అన్నపూర్ణా ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ చేశారు. 31 కేంద్రాలలో రిలీజైన చిత్రం (గూడూరులో 32 రోజులకు తీసేయగా, 28 కేంద్రాల్లో డైరెక్ట్గా, ఒక కేంద్రంలో షిఫ్టుతో, మరో కేంద్రంలో నూన్షోలతో) మొత్తం 30 కేంద్రాల్లో అర్ధ శత దినోత్సవం చేసుకుంది. అలాగే, 24 కేంద్రాల్లో డైరెక్టుగా, 2 కేంద్రాల్లో షిప్టుతో, 4 కేంద్రాలు సికింద్రాబాద్, ఖమ్మం, గుడివాడ, ఆదోనిల్లో నూన్షోలతో మొత్తం 30 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది. 16 కేంద్రాల్లో డైరెక్ట్గా, 3 కేంద్రాల్లో షిఫ్టుతో, 10 కేంద్రాల్లో నూన్ షోలతో మొత్తం 29 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ (25 వారాలు) ఆడింది. తెలుగులో తొలిసారిగా గుంటూరు విజయా టాకీస్లో నేరుగా 365 రోజులు ప్రదర్శితమై, ‘ప్రేమాభిషేకం’ కొత్త రికార్డ్ సృష్టించింది. ఆ హాలులో 380 రోజుల ప్రదర్శన చేసుకుంది. గుంటూరు కాక, మరో 3 కేంద్రాల్లో షిఫ్టులతో, 4 కేంద్రాలలో నూన్ షోలతో – మొత్తం 8 కేంద్రాల్లో ఈ విషాద ప్రేమకథ గోల్డెన్ జూబ్లీ (50 వారాలు) ఆడింది. అటు పైన 5 కేంద్రాల్లో డైమండ్ జూబ్లీ (60 వీక్స్) నడిచింది. తర్వాత విజయవాడ, హైదరాబాద్లలో షిఫ్టులు, నూన్షోలతో కలిపి, ఏకంగా 527 రోజులు ప్రదర్శితమై, అప్పటి ఉమ్మడి ‘ఆంధ్రప్రదేశ్లో ప్లాటినమ్ జూబ్లీ (75 వీక్స్) ఆడిన తొలిచిత్రం’గా రికార్డు సృష్టించింది. అక్కడ ‘మరో చరిత్ర’... ఇక్కడ ‘ప్రేమాభిషేకం’ నిజానికి, ‘ప్రేమాభిషేకం’ కన్నా ముందే 1978లో కమలహాసన్ – కె. బాలచందర్ల నేరు తెలుగు చిత్రం ‘మరో చరిత్ర’ తమిళనాట మద్రాసులో ప్లాటినమ్ జూబ్లీ చేసుకొంది. అక్కడి సఫైర్ థియేటర్లో నూన్షోలతో ఏకధాటిగా 596 రోజులు ఆడి, ‘ప్లాటినమ్ జూబ్లీ జరుపుకొన్న తొలి తెలుగు చిత్రం’గా నిలిచింది. అలా మద్రాసులో ‘మరో చరిత్ర’, మన తెలుగునాట ‘ప్రేమాభిషేకం’ తొలి తెలుగు ప్లాటినమ్ జూబ్లీ చిత్రాలయ్యాయి. కానీ, విచిత్రంగా ఇక్కడి పబ్లిసిటీలో మాత్రం ‘ప్రేమాభిషేకం’ చిత్రాన్ని ‘తెలుగులోనే తొలి ప్లాటినమ్ జూబ్లీ చిత్రం’గా ప్రకటించుకున్నారు. ఇంకా గమ్మత్తేమిటంటే, దీని తరువాత ప్లాటినమ్ జూబ్లీ (525 రోజులు) రికార్డు దగ్గర దాకా వచ్చిన ‘ఇంట్లో రామయ్య – వీధిలో కృష్ణయ్య’ (1982లో– హైదరాబాద్లో 517 రోజులకు), ‘సాగర సంగమం’ (1983లో– బెంగుళూరులో 511 రోజులకు) ఎందుకో అర్ధంతరంగా హాళ్ళ నుంచి అదృశ్యమయ్యాయి. దాని వెనుక ‘ప్రేమాభిషేకం’ పెద్దల మంత్రాంగం ఉందని అప్పట్లో ట్రేడ్ వర్గాల టాక్. చివరకు 1984లో ‘మంగమ్మ గారి మనవడు’ (హైద్రాబాద్లో–565 రోజులు) ఆడి ప్లాటినమ్ జూబ్లీ చిత్రాల లిస్టుకెక్కింది. రన్లోనూ... కలెక్షన్లలోనూ... కోస్తా ఆంధ్రలో కొత్త రికార్డ్! ఏది ఏమైనా, ‘ప్రేమాభిషేకం’ మాత్రం బాక్సాఫీస్ వద్ద ఓ కొత్త చరిత్ర అయింది. లేట్ రన్లోనూ మరో 50 కేంద్రాల్లో అర్ధశత దినోత్సవం చేసుకుంది. మరో 11 కేంద్రాలలో (డైరెక్టుగా – మదనపల్లి, తుని, చిలకలూరిపేట, బెంగుళూరు, మద్రాసుల్లో, నూన్షోలతో – శ్రీకాళహస్తి (తొలి శతదినోత్సవం), నంద్యాల, హిందూపురం, నరసరావుపేట, పాలకొల్లు, తాడేపల్లిగూడెంలో) వంద రోజులాడింది. లేట్ రిలీజులోనే బెంగుళూరులో నూన్ షోలతో 365 రోజులకు పైగా ప్రదర్శితమైంది. మొత్తం 41 శతదినోత్సవ కేంద్రాలకు గాను 14 కేంద్రాల్లో అక్కినేని చిత్రాలలో ఏకైక శతదినోత్సవ చిత్రంగా నిలిచింది. ‘భార్యాభర్తలు’ (1961) తరువాత మళ్ళీ రెండు దశాబ్దాలకు బెంగుళూరులో అక్కినేనికి ఓ శతదినోత్సవాన్ని అందించింది. ఆ రోజుల్లో ‘ప్రేమాభిషేకం’ కోస్తా ఆంధ్రలోని ప్రధాన కేంద్రాలలో అటు ఆడిన రోజుల్లోనూ, ఇటు వసూళ్ళలోనూ కొత్త రికార్డులు సృష్టించింది. అలా విజయవాడ, గుడివాడ, గుంటూరు, తెనాలి, నెల్లూరు, చిత్తూరు, శ్రీకాళహస్తి, ఏలూరు, తణుకు, తుని, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం తదితర కేంద్రాల్లో రన్లోనూ, కలెక్షన్లలోనూ అప్పటికి ‘ప్రేమాభిషేకం’దే సరికొత్త రికార్డ్. అలా తన అభిమాన హీరో అక్కినేనికి దాసరి ఇచ్చిన అపురూప కానుక ఇది. ఊరూవాడా... ఎన్నెన్నో విజయోత్సవాలు ఇన్ని విజయాలు సాధించిన ‘ప్రేమాభిషేకం’కి ఉత్సవాలు చాలా జరిగాయి. విజయవాడలో శతదినోత్సవం, హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోలో సిల్వర్జూబ్లీ, నెల్లూరులో త్రిశతదినోత్సవం, ఆ తరువాత మద్రాసులో స్వర్ణోత్సవం నిర్వహించారు. ఇక, ఊరూవాడా ఫ్యాన్స్ చేసిన వేడుకలకైతే అంతే లేదు. అలా అక్కినేని కెరీర్కు కిరీటమైందీ చిత్రం. ఫస్ట్ రిలీజైన నాలుగున్నరేళ్ళ తరువాత 1985 సెప్టెంబర్ 20న అక్కినేని బర్త్డేకి భారీ పబ్లిసిటీతో, రాష్ట్రమంతటా ‘ప్రేమాభిషేకా’న్ని సెకండ్ రిలీజ్ చేశారు. అయితే, రిపీట్ రన్లలో అక్కినేని చిత్రాలలో ఎప్పుడూ ముందుండే ‘ప్రేమ్నగర్’ లాగా ‘ప్రేమాభిషేకం’ ఆశించిన ఆదరణ పొందలేదు. కానీ అదే ‘ప్రేమాభిషేకం’ మరో పదేళ్ళకు 1995లో ఏ హడావిడీ, అంచనాలూ లేకుండా తెలుగునాట అంచెలంచెలుగా రీ–రిలీజైనప్పుడు మంచి వసూళ్ళు తేవడం విశేషం. అందుకే, ‘ప్రేమాభిషేకం’ జనంలోనూ, బాక్సాఫీస్ జయంలోనూ అసలైన ప్రేమకు జరిగిన అపురూప పట్టాభిషేకం. వరుసగా మూడేళ్ళూ... ఆమెకే అవార్డ్! నిడివి చిన్నదైనా, ‘ప్రేమాభిషేకం’లో వేశ్యగా జయసుధదే కీలకపాత్ర అయింది. అందులోనూ గ్లామర్ నటి శ్రీదేవి ఎదుట ఏ మేకప్పూ లేకుండా ఆమె చూపిన సహజమైన నటన సినిమాను మరో మెట్టు పైకి ఎక్కించింది. ఆ ఏడాది ఉత్తమ నటిగా నంది అవార్డూ జయసుధకే దక్కింది. ‘ప్రేమాభిషేకం’తో మొదలుపెట్టి వరుసగా మూడేళ్ళు (‘ప్రేమాభిషేకం–1981, మేఘసందేశం–1982, ధర్మాత్ముడు–1983’) ఉత్తమ నటిగా నంది అవార్డులు అందుకొని, జయసుధ హ్యాట్రిక్ సాధించారు. దర్శకుడు కె. విశ్వనాథ్ (ఉత్తమ చిత్రాలు ‘చెల్లెలి కాపురం–1971, కాలం మారింది – 1972, శారద–1973’) తర్వాత అలాంటి హ్యాట్రిక్ మళ్ళీ జయసుధకే సాధ్యమైంది. అక్కినేని, జయసుధ చిత్రం... భళారే విచిత్రం! గమ్మత్తేమిటంటే, 1980లో అక్కినేని పుట్టినరోజైన సెప్టెంబర్ 20న ‘ప్రేమాభిషేకం’ షూటింగ్ మొదలైంది. హైదరాబాద్, చెన్నైలలో 32 షూటింగ్ డేస్లో పూర్తయింది. 1981లో సరిగ్గా అక్కినేని పెళ్ళిరోజైన ఫిబ్రవరి 18న రిలీజైంది. గమ్మత్తుగా ఎన్టీఆర్ పుట్టినరోజైన మే 28కి వంద రోజులు పూర్తి చేసుకుంది. అదే రోజున ఎన్టీఆర్, ఏయన్నార్ల కాంబినేషన్లో ఆఖరి చిత్రం ‘సత్యం – శివం’ రిలీజైంది. ఆ భాషల్లో మాత్రం వట్టి రీ ‘మేకు’! గమ్మత్తేమిటంటే, తెలుగులో ఇంత పెద్ద కమర్షియల్ సక్సెస్ అయిన ఈ కథ ఇతర భాషల్లో రీమేక్ అయినప్పుడు ఆశించినంత ఆడలేదు. తమిళంలో ఈ కథను ‘వాళ్వే మాయమ్’ (1982)గా కమలహాసన్తో రీమేక్ చేశారు. ఆ తమిళ చిత్రాన్నే మలయాళంలో ‘ప్రేమాభిషేకం’ పేరుతోనే డబ్ కూడా చేసి, రిలీజ్ చేశారు. ఇక హిందీలో సాక్షాత్తూ దాసరి దర్శకత్వంలోనే జితేంద్ర, రీనారాయ్, రేఖ నటించగా ‘ప్రేమ్ తపస్యా’ (1983) పేరుతో అక్కినేనే నిర్మించారు. కానీ, అవేవీ ఆదరణకు నోచుకోలేదు. కమలహాసనైతే అక్కినేనిలా తాను చేయలేకపోయానని బాహాటంగా చెప్పేశారు. కోటి అంటే... కోటిన్నర! ప్రేయసి బాగు కోసం తన ప్రేమనే త్యాగం చేసే క్యాన్సర్ పేషెంట్ హీరో కథకు జనం బ్రహ్మరథం పట్టారు. ‘‘ఈ సినిమా కథ చెప్పినప్పుడే ‘నన్ను నమ్మండి. మీకు మాట ఇస్తున్నా. ఇది బాక్సాఫీస్ వద్ద కోటి రూపాయలు వసూలు చేసే కథ అవుతుంది’ అని నాతో దాసరి అన్నారు. దాసరి అన్నమాట నిలబెట్టడమే కాక, అంతకు మించి ‘ప్రేమాభిషేకం’ కోటీ 30 లక్షలు వసూలు చేసింది’’ అని మద్రాసులో గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్లో అక్కినేని సభాముఖంగా చెప్పారు. అటుపైనా ఆ సినిమా అప్రతిహతంగా ఆడి, ఏకంగా 75 వారాల ప్లాటినమ్ జూబ్లీ చేసుకుంది. చివరకు కోటిన్నర దాకా వసూలు చేసింది. అక్కినేని కెరీర్లో తొలి రూ. కోటి వసూలు చిత్రం ఇదే! ఆయన కెరీర్లో రెండో గోల్డెన్ జూబ్లీ చిత్రం (మొదటిది ‘దసరా బుల్లోడు’) కూడా ఇదే!! ఇంతటి బాక్సాఫీస్ విజయంతో, ‘ప్రేమాభిషేకం’ అప్పట్లో అన్నపూర్ణా స్టూడియోస్ను బాలారిష్టాల నుంచి బయటపడేసింది. - రెంటాల జయదేవ -
శ్రీవారి ముచ్చట్లు @40
కాలు పెట్టిననాడే కాపురం చేసే కళ తెలుస్తుందని సామెత. కొన్ని సంవత్సరాలు మొదటి రోజునే తమ విజయోత్సవ లక్షణాన్ని బయటపెట్టేస్తాయి. తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్రలో అలాంటి ఏడాది – 1981. సరిగ్గా నలభై ఏళ్ళ క్రితం జనవరి 1న దాసరి దర్శకత్వంలో అక్కినేని ‘శ్రీవారి ముచ్చట్లు’, తాతినేని రామారావు దర్శకత్వంలో శోభన్ బాబు ‘పండంటి జీవితం’తో ఆ ఏడాది తెలుగు సినిమాల ప్రయాణం మొదలైంది. ఇద్దరూ లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువుండే హీరోలే. ఇద్దరి సినిమాలూ లేడీస్ సబ్జెక్ట్లే. ఒకే రోజున రెండూ బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. గమ్మత్తుగా రెండూ హిట్టే. అలా మొదలైన ఆ ఏడాది బాక్సాఫీస్ వద్ద ఏయన్నార్ ‘ప్రేమాభిషేకం’, ఎన్టీయార్ ‘కొండవీటి సింహం’ లాంటి ఎన్నో ఘన విజయాలను అందించింది. చరిత్రకెక్కిన తల్లీ కూతుళ్ళు తెలుగు సినీ చరిత్రలో తొలి తరం మహిళా నిర్మాతల్లో ఒకరు సి. కృష్ణవేణి. జీవిత భాగస్వామి అయిన శోభనాచలా పిక్చర్స్ మీర్జాపురం రాజా గారి బాటలో ఆమె ఎన్టీఆర్ ‘మనదేశం’ లాంటి సినిమాలు తీశారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ, వారి సంతానమైన ఎన్.ఆర్. (నంగునూరి రాజ్యలక్ష్మీ) అనూరాధాదేవి కూడా మహిళా నిర్మాతగా పలు చిత్రాలు తీయడం విశేషం. తెలుగు సినీచరిత్రలో ఇలా తల్లీ కూతుళ్ళిద్దరూ నిర్మాతలుగా వెలిగిన అరుదైన ఘట్టం ఇది. పైపెచ్చు, తల్లితండ్రులు తీసిన సినిమాల (‘కీలుగుర్రం’) బాటలో కూతురు కూడా అదే హీరో అక్కినేనితో ఏకంగా 6 సినిమాలు (‘చక్రధారి’, ‘రావణుడే రాముడయితే’, ‘శ్రీవారి ముచ్చట్లు’, ‘రాముడు కాదు కృష్ణుడు’, ‘అనుబంధం’, ‘ఇల్లాలే దేవత’) తీయడం విశేషం. ముక్కోణపు డ్రామా అక్కినేని, దాసరి కాంబినేషన్లో అంతకు ముందు ‘రావణుడే రాముడయితే’ (1979) నిర్మించారు అనూరాధాదేవి, శ్రీనివాసరావు దంపతులు. అది రిలీజైన ఏడాదికి మళ్ళీ అదే సక్సెస్ఫుల్ కాంబినేషన్లో వారు నిర్మించిన ఫ్యామిలీ సెంటిమెంట్ ఫిల్మ్ ‘శ్రీవారి ముచ్చట్లు’ (1981). అక్కినేని, జయప్రద, జయసుధ ముఖ్య పాత్రధారులుగా మహిళలు మెచ్చిన ముక్కోణపు కుటుంబకథ ఇది. ప్రేమించిన కాశ్మీరీ పిల్ల(జయప్రద)తో కాకుండా అనుకోని పరిస్థితుల్లో అయినవాళ్ళ అమ్మాయి (జయసుధ) సంబంధం చేసుకుంటాడు హీరో. తీరా తాళి కట్టాక, ప్రేమించిన పిల్ల పెళ్ళిమండపంలోకి వస్తుంది. ఆ ఇద్దరు స్త్రీల మధ్య నలిగిన ఆ శ్రీవారి ముచ్చట్లు ఏమిటి, ఒకరి సంగతి మరొకరికి తెలిసి ఆ స్త్రీమూర్తులు చేసిన త్యాగం ఏమిటన్నది సినిమా. ఒక సినిమా... రెండు ఓపెనింగ్లు... కథానుసారం కాశ్మీర్లో జరిగే ‘శ్రీవారి ముచ్చట్లు’ ఓపెనింగ్, ఓ మేజర్ షెడ్యూల్ అక్కడే చేశారు. హీరో, హీరోయిన్లతో దాసరి, నిర్మాతలు ఫ్లైట్లో చేరారు కానీ, కెమేరాతో సహా యూనిట్గా బయల్దేరిన దాసరి శిష్యుడు రేలంగి నరసింహారావు బృందానికి జమ్ము నుంచి కాశ్మీర్ రైలు మిస్సయింది. మరునాడే ముహూర్తం షాట్. నిర్మాత శ్రీనివాసరావు ముహూర్తం సెంటిమెంట్. దాంతో దేవుడి పటాల కోసం రాత్రికి రాత్రి జమ్మూ అంతా రేలంగి వెతికారు. చివరకు కృష్ణుడి పటాలు మినహా ఏమీ దొరకలేదు. కథ ప్రకారం హీరో పాత్రకు శ్రీకృష్ణుడి పటం సరిపోతుందని, దాని మీదే జమ్ములో ముహూర్తం షాట్ చేశారు రేలంగి. మరోపక్క కాశ్మీర్లో తన వద్ద యూనిట్ ఏమీ లేకపోయినా నిర్మాత సెంటిమెంట్ కోసం హీరో, హీరోయిన్లకు మేకప్ వేయించి, స్థానిక స్టిల్ ఫోటోగ్రాఫర్తో ఫోటోలు తీయించారు దాసరి. పాటలతో... కాసుల మూటలు నిజానికి, ఈ సినిమా టైటిల్ సాంగ్ వేటూరి రాయాల్సింది. ఆయన టైముకు బెంగుళూరు రాకపోవడంతో, నిర్మాతల కోరిక మేరకు సినిమాలో రెండుసార్లు వచ్చే ‘శ్రీవారి ముచ్చట్లు’ అనే టైటిల్ సాంగ్ ను దాసరే రాసేశారు. అదే ఊపులో సినిమాలో పాటలన్నీ దాసరి రచనలయ్యాయి. సినిమా రిలీజుకు ముందే ‘కాళ్ళా గజ్జా కంకాళమ్మా’ మొదలు ‘శ్రీవారి ముచ్చట్లు’ టైటిల్ సాంగ్, ‘ముక్కుపచ్చలారని కాశ్మీరం..’, ‘ఉదయకిరణ రేఖలో...’ – ఇలా పాటలన్నీ మారుమోగేవి. ఆ క్రేజుతో రిలీజైన సినిమా సూపర్ హిట్టయి, కాసులు కురిపించింది. పూర్ణా పిక్చర్స్ జి. విశ్వనాథ్ పంపిణీ చేసిన ఈ చిత్రం తొలి వారంలో ఏకంగా రూ. 22 లక్షలు వసూలు చేసింది. హీరోగా అక్కినేని కెరీర్ లో హయ్యస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. కాశ్మీరులో ఈ సినిమా షూటింగ్ లోనే దాసరికి ‘ప్రేమాభిషేకం’ (1981) స్టోరీ లైన్ తట్టింది. ‘శ్రీవారి ముచ్చట్లు’ రిలీజు వేళ నిర్మాత అనూరాధాదేవి, పూర్ణా పిక్చర్స్ వారి విజయవాడ ఊర్వశి థియేటర్కు వెళ్ళారు. సినిమా చూసి జనసందోహం మధ్య నుంచి ఆమె, ‘పూర్ణా’ విశ్వనాథ్, ఆయన సోదరుడు బాలు అంబాసిడర్ కారులో హోటలుకు బయలుదేరారు. సినిమా చాలా బాగుందనే ఆనందంలో అభిమాన ప్రేక్షకులు తాము కూర్చున్న కారును ఆనందంగా పైకి ఎత్తేశారని అనూరాధాదేవి ఇప్పటికీ గుర్తు చేసు కుంటారు. విశేష మహిళా ప్రేక్షకాదరణతో ‘శ్రీవారి ముచ్చట్లు’ నేరుగా 5 కేంద్రాల (విజయవాడ, గుంటూరు, నెల్లూరు, వైజాగ్ లలో 100 రోజులు, కాకినాడలో 98 రోజులు)లో, నూన్ షోలతో 9 సెంటర్లలో వంద రోజులు ఆడింది. మధ్యాహ్నం ఆటలతో సిల్వర్ జూబ్లీ చేసుకుంది. ‘శ్రీవారి ముచ్చట్లు’ రిలీజైన సరిగ్గా 48 రోజుల తర్వాత వచ్చిన ఇదే కాంబినేషన్లో ‘ప్రేమాభిషేకం’ వచ్చింది. అది ఏకంగా ఏడాది ఆడి, గోల్డెన్ జూబ్లీ జరుపుకొంది. అప్పట్లో నెల్లూరు కల్యాణి కాంప్లెక్స్ (కృష్ణ– కావేరి–కల్యాణి థియేటర్స్)లో ‘శ్రీవారి ముచ్చట్లు’ శతదినోత్సవం ఘనంగా చేశారు. తమిళ స్టార్ శివాజీ గణేశన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. రైల్వే ట్రాకు పక్కనే ఉన్న ఆ సినిమా హాలులో వేడుకలలో పాల్గొంటున్న అక్కినేని, తదితర తారలను రైళ్ళు ఆపి మరీ జనం చూడడం గమనార్హం. కాశ్మీర్ షూటింగ్... కచ్చిన్స్ డ్రెస్సులు... కాశ్మీరులో 15 రోజుల షెడ్యూల్లో 4 పాటలు, 10 సీన్లు తీశారు. బొంబాయిలోని ప్రసిద్ధ కచ్చిన్స్ సంస్థ అక్కినేనికీ, కాశ్మీరీ పాత్రలోని జయప్రదకూ ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ అందించింది. ఒక పాటలో అక్కినేని డజను డ్రస్సులు మార్చారు. షెడ్యూల్ చివరలో పని ముగించుకొని అక్కినేని, దాసరి వచ్చేస్తే, జయప్రద, చాట్ల శ్రీరాములుపైన కొన్ని సీన్లు, ప్యాచ్ వర్క్ రేలంగే షూట్ చేశారు. హిందీ రీమేక్లో రేఖ అనుమానం! ఈ హిట్ చిత్రాన్ని మూడేళ్ళ తరువాత హిందీలో ‘ఆశాజ్యోతి’ (1984) పేరిట దాసరి దర్శకత్వంలోనే నిర్మాత కోవై చెళియన్ తీశారు. రాజేశ్ ఖన్నా, రేఖ, రీనారాయ్ తారాగణం. హిందీ రీమేక్ రెండో షెడ్యూల్ సమయంలో దాసరి మరో సినిమా పనిలో బిజీగా ఉన్నారు. దాంతో, మైసూరులో చేయాల్సిన 15 రోజుల షూటింగ్ను శిష్యుడు రేలంగి నరసింహారావుకు అప్పగించారు. తీరా రేలంగి అక్కడకు వెళ్ళాక రేఖ తదితరులకు అనుమానం వచ్చింది. తొలి షెడ్యూలులో నిర్మాతకూ, దాసరికీ చిన్న అభిప్రాయ భేదాలు వచ్చాయి. అందుకని నిర్మాతే, దాసరి బదులు రేలంగిని తెచ్చారేమోనని భ్రమపడ్డారు. ఆ మాటే రేఖ అచ్చ తెలుగులో గౌరవంగా రేలంగితో చెప్పేశారు. చివరకు దాసరి ఫోన్ చేసి, రేలంగిని తానే పంపినట్టు వివరించారు. హిందీలోనూ ఈ లేడీస్ సెంటిమెంట్ కథ సక్సెస్ సాధించింది. - రెంటాల జయదేవ -
ఆర్. నారాయణమూర్తి సినిమాకు 25 ఏళ్లు
పాతికేళ్ళ తరువాత కూడా ఒక సినిమా గుర్తుందంటే... అందులోని పాత్రలు, పాటలు, అభినయం గుర్తున్నాయంటే.. ఆ సినిమా కచ్చితంగా ప్రత్యేకమే. దాసరి నారాయణరావు నిర్మాతగా, దర్శకుడిగా తన శిష్యుడు ఆర్. నారాయణమూర్తి హీరోగా రూపొందించిన ‘ఒరేయ్ రిక్షా’ ఆ ప్రత్యేకతను సంపాదించుకుంది. ఇవాళ్టికి ఈ సినిమాకు పాతికేళ్ళు. సరిగ్గా పాతికేళ్ళ క్రితం 1995. అగ్ర దర్శకుడు దాసరి నారాయణరావుకు ఎందుకో కాలం కలసిరాలేదు. వరుసగా కొన్ని ఫ్లాపులు. ఆర్థికంగా అనుకోని ఆటుపోట్లు! గతంలో ఆయనతో హిట్లు సాధించిన అగ్ర హీరోలు కూడా ఆ సమయంలో డేట్లు ఖాళీ లేవంటూ బిజీ మంత్రం పఠించసాగారు. సరిగ్గా అప్పుడే ఆయనకు తన శిష్యుడు ఆర్. నారాయణమూర్తి, అతని కోసం గతంలో తాను అనుకున్న ఓ మదర్ సెంటిమెంట్ కథ గుర్తొచ్చాయి. ఫ్లాష్బ్యాక్లోకి వెళితే..: అంతకుముందు కొన్నేళ్ళ క్రితం దాసరి ఓ తల్లి సెంటిమెంట్ కథ అనుకున్నారు. అప్పట్లో సామాజిక విప్లవ కథాంశాలతో ముందుకొస్తున్న టి. కృష్ణ దర్శకుడిగా, ఆర్. నారాయణమూర్తి హీరోగా దాసరి ఆ కథను నిర్మించాలనుకున్నారు. టి. కృష్ణతో మాట్లాడారు కూడా. అంతా ఓకే. కానీ, బిజీగా ఉన్న టి. కృష్ణ క్యాన్సర్ బారిన పడి కన్నుమూశారు. ఇప్పుడు టి. కృష్ణ లేరు. కానీ, ఆర్. నారాయణమూర్తి నమ్మినబంటులా గురువు గారి కోసం సిద్ధంగా ఉన్నారు. నిజానికి, ఈ మధ్య గ్యాప్లో నారాయణమూర్తి నిర్మాతగా, దర్శకుడిగా మారి, ‘అర్ధరాత్రి స్వతంత్రం, ఎర్రసైన్యం’ లాంటి వరుస విప్లవ సినిమాలు తీశారు. ఆ భారీ ఘన విజయాలతో ‘పీపుల్స్ స్టార్’ హీరోగా ఎదిగి, బిజీగా ఉన్న నారాయణమూర్తిని గురువు దాసరి పిలిచారు. గురువు గారి కోసం పైసా పారితోషికం లేకుండా, ఏం చేయడానికైనా శిష్యుడు సిద్ధమయ్యారు. మునుపటి తల్లీ కొడుకుల కథలో మరిన్ని అంశాలు జొప్పించి, లీడర్ వర్సెస్ క్యాడర్ అనేది ప్రధానాంశంగా, సినిమా తీద్దామన్నారు దాసరి. అలా దాసరి తన పేరు మీద దాసరి ఫిలిమ్ యూనివర్సిటీ పతాకం స్థాపించి, ఆ బ్యానర్పై తొలి సినిమాగా తీసిన చిత్రం ‘ఒరేయ్ రిక్షా’. సమకాలీన సామాజిక ఘటనలతో..: అంతకు ముందు వేషాల కోసం మద్రాసు వచ్చిన ఆర్. నారాయణమూర్తికి చిన్న వేషాలతో సినీజీవితమిచ్చిన దాసరి, కాలం మారి తన శిష్యుడు స్టార్ అయ్యాక, అడిగి హీరోగా పెట్టి మరీ తీసిన ఏకైక సినిమా ఇది. ఒక రాజకీయ నేత చెప్పిన మాటలు నమ్మి, అతని కోసం తన వాళ్ళతో ఓట్లన్నీ వేయించి, క్యాడర్గా ఒక రిక్షా కార్మికుడు శ్రమిస్తే, చివరకు ఆ లీడరే ఆ క్యాడర్ అందరినీ మోసం చేస్తే ఏమైందనేది కథాంశం. రాజకీయ నేతలు, పాలనా యంత్రాంగం, పోలీసు వ్యవస్థ గనక ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడకపోతే, యువతరం మరో మార్గం లేక తుపాకీ పట్టుకొని అడవుల్లోకి పోవాల్సి వస్తుందని సినిమాలో చెప్పారు దాసరి. రిక్షా కార్మికుడు సూర్యంగా ఆర్. నారాయణమూర్తి, అతని భార్యగా రవళి, అతని చెల్లెలిగా మధురిమ (నటి ప్రభ మేనకోడలు), తల్లిగా శివపార్వతి, రాజకీయ నేతగా రఘునాథరెడ్డి నటించారు. నారాయణమూర్తి ప్రభృతుల అభినయం, నాటక రచయిత సంజీవి రాసిన పదునైన మాటలు, ముక్కురాజు కొరియోగ్రఫీ – ఇవన్నీ ‘ఒరేయ్ రిక్షా’ను పైయెత్తున నిలిపాయి. నీ పాదం మీద పుట్టుమచ్చనై..: దాసరితో సంగీత దర్శకుడు ‘వందేమాతరం’ శ్రీనివాస్ పనిచేసిన తొలి చిత్రం ఇదే. ఆ తరువాత ఆ కాంబినేషన్లో ‘ఒసేయ్ రాములమ్మా’ సహా పలు చిత్రాలు వచ్చాయి. విప్లవ గాయకుడు గద్దర్ తాను రాసిన ‘రక్తంతో నడుపుతాను రిక్షాను..’ సహా పలు ప్రైవేట్ జనగీతాలను ఈ సినిమాలో వాడుకొనేందుకు అనుమతినిచ్చారు. ఆత్మీయుడు ఆర్. నారాయణమూర్తి కోసం పారితోషికమైనా తీసుకోలేదు. ఈ సినిమాలో ‘రక్తంతో నడుపుతాను.., జాగోరే జాగో జాగో.., జాతరో జాతర..’ – ఇలా అన్ని పాటలూ హిట్. అన్నాచెల్లెళ్ళ అనుబంధమూ కీలకమైన ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా..’ అనే పాట రాసి ఇచ్చారు గద్దర్. ఈ పాట చిరస్థాయిగా నిలిచింది. ఆ పాట రాసిన గద్దర్కూ, పాడిన ‘వందేమాతరం’ శ్రీనివాస్కూ ఇద్దరికీ ప్రభుత్వం ఆ ఏడాది నంది అవార్డులు ప్రకటించింది. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో గద్దర్ ఆ అవార్డును తిరస్కరించడం వేరే కథ. మరపురాని గురుదక్షిణ: పూర్తిగా తిరుపతి పరిసరాల్లో, కొంత మద్రాసులో చిత్రీకరణ జరుపుకొన్న ‘ఒరేయ్ రిక్షా’ అప్పట్లో పెద్ద సంచలనం. పాతికేళ్ళ క్రితం 1995 నవంబర్ 9న రిలీజైన ఈ చిత్రం సిల్వర్ జూబ్లీ హిట్గా నిలిచింది. పేరుతో పాటు పైసలూ తెచ్చింది. మచ్చుకు చెప్పాలంటే – షూటింగ్ వేళ గురువు గారికి ఇబ్బంది లేకుండా, ఈస్ట్ గోదావరి రైట్స్ కోసమంటూ 20 లక్షలు ముట్టజెప్పారు నారాయణమూర్తి. సినిమా విడుదలయ్యాక ఏకంగా అక్కడ 60 లక్షలు వసూలు చేసింది. మళ్ళీ దాసరికి కొత్త ఊపు తెచ్చింది. సాక్షాత్తూ దాసరి సతీమణి పద్మ సైతం ‘‘మీ గురువు ఋణం తీర్చుకున్నావయ్యా. మళ్ళీ మీ గురువును నిలబెట్టావయ్యా’’ అని తనతో అన్న విషయాన్ని ‘పీపుల్స్ స్టార్’ ఇప్పటికీ చెమర్చిన కళ్ళతో గుర్తు చేసుకుంటారు. తరువాత దాసరి ‘ఒసేయ్ రాములమ్మా’ లాంటి మరో ఆల్ టైమ్ హిట్ తీయడం వెనుక ‘ఒరేయ్ రిక్షా’ ప్రభావం కనిపిస్తుంది. బడుగు, బలహీన వర్గాల ఆత్మాభిమానాన్నీ, ఆత్మగౌరవాన్నీ చాటిచెప్పిన ఈ రెండు చిత్రాలూ దాసరి కెరీర్లో మైలురాళ్ళుగా మిగిలిపోయాయి. సాక్షాత్తూ దాసరి సైతం హైదరాబాద్లో జరిగిన ఓ సినిమా ఆడియో ఫంక్షన్లో హీరో కృష్ణ, నిర్మాత ఎమ్మెస్ రెడ్డి సమక్షంలో ‘‘విప్లవ సినిమాలు తీయడం ఓ ముళ్ళబాట. ఆ ముళ్ళబాటను సరిచేసి, రాస్తాగా మార్చాడు నా బిడ్డ ఆర్. నారాయణమూర్తి. ఆ రాస్తాలో ఇవాళ నేను, అనేకమంది పయనిస్తున్నాం’’ అని సభాముఖంగా మెచ్చుకోవడం గురువు ముఖతః శిష్యుడికి దక్కిన ఓ అపూర్వ గౌరవం. ఓ శిష్యుడు చెల్లించిన గురుదక్షిణగా చరిత్రలో మిగిలిపోయిన చిత్రం – ‘ఒరేయ్ రిక్షా’. – రెంటాల జయదేవ -
దేవి నాగవల్లికి దాసరి ఏమవుతారో తెలుసా?
బిగ్బాస్లో ఎన్ని ఎత్తుగడలు వేసినా ఎవరి మాటకు లొంగని, ఎవరినీ లెక్క చేయని ఏకైక వ్యక్తి, సీనియర్ జర్నలిస్ట్ దేవి నాగవల్లి. ఇప్పటివరకు లేడీ బిగ్బాస్ విన్నర్ లేరు. కాబట్టి తాను లేడీ బిగ్బాస్ అవుతాను అంటూ హౌస్లో అడుగు పెట్టారు. అక్కడ కూడా తన నైజం మార్చుకోలేదు. ఏ చిన్న తప్పు జరిగినా ప్రశ్నించేందుకు రెడీగా ఉంటారు. అందుకే ఇతర కంటెస్టెంట్లు కూడా ఆమెతో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఇక దేవి బలమైన కంటెస్టెంటు కాబట్టే మొన్నటి ఉక్కు హృదయం టాస్క్లోనూ మొదట ఆమెనే టార్గెట్ చేశారు. (చదవండి: బిగ్బాస్: మెహబూబ్ బ్యాగు సర్దేయనున్నాడా?) దేవి నాగవల్లి గురించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దివంగత దర్శకుడు దాసరి నారాయణ రావుకు ఆమె దగ్గరి బంధువని చెప్తున్నారు. ఈ విషయాన్ని దేవి తల్లి సత్యవతి ఓ ఇంటర్వ్యూలో ధ్రువీకరించారు. "దాసరి నారాయణ రావు.. మా అత్తగారి తమ్ముడు. మా ఆయనకు మేనమామ. దేవికి తాతయ్య అవుతారు. మాది రాజమండ్రి. అక్కడికి వచ్చినప్పుడు దాసరి మా ఇంటికి కూడా వచ్చేవారు. దేవి ఉద్యోగం చేస్తుందని తెలిసి చాలా సంతోషించేవారు, ఆమెకు ఎంతో సపోర్ట్ చేసేవారు" అని తెలిపారు. నిజానికి దేవిని మూడో సీజన్లోనే రమ్మన్నారని, కానీ అప్పుడు కుదరకపోవడంతో ఈసారి వెళ్లిందని సత్యవతి పేర్కొన్నారు. (చదవండి: బిగ్బాస్: గెలవడం కోసం ఆమె ఏమైనా చేస్తుంది!) -
నాన్న పేరు చెడగొడుతున్నందుకు బాధగా ఉంది
‘‘ఈ నెల 24న తన డ్రైవర్తో పాటు దాసరి అరుణ్ మా గేటు దూకి ఇంట్లోకి వచ్చాడు. మద్యం తాగి వచ్చి నాపై, నా భార్యపై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా మా నాన్నగారి బీరువా తెరవడానికి ప్రయత్నించాడు. మా నాన్నగారి వీలునామా ప్రకారం ఈ ఇంటికి ఆయన మనవరాలైన నా కూతురు అర్హురాలు. ఆస్తి కోసం దాసరి అరుణ్ దౌర్జన్యం చేస్తున్నాడు. దాసరి అరుణ్పై చర్యలు తీసుకోవాలి’’ అని శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు దాసరి ప్రభు. అలాగే మోహన్బాబు, సి.కల్యాణ్, మురళీమోహన్ వంటి పెద్దలు ఈ విషయంపై స్పందించి పరిష్కార మార్గాన్ని చూపాలంటున్నారు ప్రభు. ‘‘తెలుగు సినీ పరిశ్రమలోని ఏ శాఖకు సమస్య వచ్చినా ‘నేనున్నాను’ అంటూ మా నాన్నగారు దాసరి నారాయణరావు ముందుకొచ్చి పరిష్కరించేవారు. అలాంటి దాసరి కొడుకులుగా పుట్టి ఆయన పేరుని చెడగొడుతున్నందుకు చాలా బాధగా ఉంది. అందరి ఇళ్లల్లో ఉన్నట్లు మా ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. మేం దాసరి గారి పిల్లలం కాబట్టి ఇంత రచ్చ జరుగుతోంది. అన్నయ్య (దాసరి ప్రభు)కు, నాకు మధ్య ఉన్నవి వందకు వంద శాతం ఆస్తి గొడవలే’’ అంటున్నారు దాసరి అరుణ్కుమార్. శుక్రవారం అరుణ్పై అతని అన్న ప్రభు జూబ్లిహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు పెట్టారు. గోడ దూకి తన ఇంట్లోకి వచ్చి, ఇంట్లో ఉన్న ఆడవాళ్లపై చేయి చేసుకున్నాడని అరుణ్పై ఆరోపించారు దాసరి ప్రభు. ఈ కేసుకు సంబంధించి జరిగిన విషయాలను పంచుకోవడానికి శనివారం హైదరాబాద్లో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు దాసరి అరుణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘నేను 24వ తేదీన 9.30 నిమిషాలకు ఫిలింనగర్ రోడ్ నం 47లోని మా ఇంటి (చనిపోయేవరకూ దాసరి ఉన్న ఇల్లు. ఇప్పుడు పెద్ద కుమారుడు ప్రభు తన కుటుంబంతో ఆ ఇంట్లో ఉంటున్నారు)కి వెళ్లాను. ఆ రోజు సాయంత్రం 6.30 నాకు కొరియర్ వచ్చిందని కొరియర్ బాయ్ ఫోన్ చేస్తే, కలెక్ట్ చేసుకుందామని వెళ్లాను. అరగంట సేపు కాలింగ్ బెల్ కొట్టాను. ఎవరూ తలుపు తీయలేదు. మా ఇల్లే కదా అని గోడ దూకి వెళ్లాను. మా ఇంటి గోడను నాన్న (దాసరి నారాయణరావు) ఉన్నప్పుడు రెండు, మూడు సార్లు దూకాను. అందులో తప్పేముంది? మా ఇల్లే కదా. మూడు రోజుల క్రితం అలా దూకిన తర్వాత కింద హాలు తలుపు తీసుకుని హాల్లోకి వెళ్లాను. ఎవరూ కనిపించకపోయేసరికి పైకి వెళ్లాను. అక్కడ ఉన్న అన్నయ్యతో ‘నాకో డాక్యుమెంట్ వచ్చింది, అది ఇస్తే వెళ్లిపోతా’ అన్నాను. లేదని హడావిడిగా కిందికి వెళ్లాడు. ఓ పది నిమిషాల తర్వాత జూబ్లీహిల్స్ ఎస్.ఐ. నవీన్గారు, ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చారు. ఆయన వచ్చి ‘గొడవ ఏంటండి’ అన్నారు. ‘నాకో డాక్యుమెంట్ వచ్చింది, తీసుకోవటానికి వచ్చా’నన్నాను. ఆయన నాకు డాక్యుమెంట్ ఇప్పించారు. ఆయన అక్కడ ఉండగానే నేనక్కడ్నుంచి వెళ్లిపోయాను. ఇది జరిగిన రెండో రోజు నా మీద పోలీస్ కంప్లయింట్ ఎందుకు పెట్టారో తెలియదు. ఒకవేళ నేను ఎవరినైనా కొట్టుంటే ఆ రోజే కేస్ పెట్టాలి. ఒకరోజు గ్యాప్ తీసుకుని శుక్రవారం కేస్ ఫైల్ చేశారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు. అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావటం లేదు. ఒక అరగంట నాతో, మా చెల్లితో కూర్చుంటే మ్యాటర్ సెటిల్ అయిపోతుంది. అలా కాకుండా మీడియాకు పరిగెడతాడు. గతేడాది మే నెల నుండి ఈ ఆస్తి గొడవలు ఉన్నాయి. అప్పుడు కూడా జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్కి వెళ్లి ‘మా తమ్ముడు నాకు అన్యాయం చేశాడు’ అని చెప్పారట. అప్పుడు సీఐ గారు ఫోన్ చేసి, ‘మీ బ్రదర్కి మీరు అన్యాయం చేశారని కేస్ పెట్టారు’ అన్నారు. అన్యాయం చేశానని చెప్పడానికి ఏదైనా ప్రూఫ్ ఉందా? డాక్యుమెంట్ ఏదైనా ఉందా? చెక్ ఉందా? ఉంటే చెప్పండని అడిగాను. అప్పటినుండి ఇలానే ఏదో ఒక గొడవ చేస్తున్నాడు. నేను అన్నయ్యతో కూర్చుని మాట్లాడి సెటిల్ చేసుకోవటానికి రెడీ. కానీ, ఆయనే మీడియాకి వెళుతున్నారు. దానివల్ల ఏమీ రాదు. గతేడాదిగా ఆయన ఇంటర్వ్యూలు నేను నాలుగు చూశాను. ఇండస్ట్రీ పెద్దలు మాకేమీ చేయడంలేదు అంటారు. మా బ్రదర్ మాట్లాడితే మోహన్బాబు, మురళీమోహన్, సి.కల్యాణ్గార్ల చెబుతారు. అప్పటికీ నిన్న సి.కళ్యాణ్గారు ఫోన్ చేసి ఏం జరిగిందని అడిగితే జరిగింది చెప్పాను. సరేలే చూద్దాం అన్నారు. ఆయనేమన్నా చేస్తారేమో చూడాలి. ఇప్పుడు ఆ ఇంటి మీద కోర్టు ఆర్డర్ ఉంది. అదేంటంటే, మా ముగ్గురి అంగీకారంతోనే ఆ ఇంటిని అమ్మాలి. అలా కాకుండా ఏదైనా వీలునామా ఆయన దగ్గరుంటే చూపించమనండి, నాకేమీ అభ్యంతరం లేదు’’ అన్నారు. ‘ఈ ఇంట్లో మీరు ఎందుకు ఉండటంలేదు’ అని అడిగిన ప్రశ్నకు అరుణ్ సమాధానమిస్తూ – ‘‘నాకు జూబ్లీహిల్స్లో ఇంకో ఇల్లు ఉంది. అక్కడ ఉంటున్నాను. ఈ ఇంటిని ఆఫీస్లా వాడుకుంటున్నాను. మా సిస్టర్కి వేరే ఇల్లుంది. ఆమె అక్కడ ఉంటుంది. మా అన్నయ్య డిప్రెషన్తో బాధపడుతున్నాడేమో అనుకుంటున్నా. ఆ ఇంటికి సంబంధించి మా ముగ్గురికీ సమానమైన హక్కుంది. ఏడాదిగా వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు కేస్ పెట్టడంతో రియాక్ట్ అవ్వక తప్పలేదు. పోలీస్, మీడియాను సంప్రదించే టైమ్ని మా అన్నయ్య నాకు, మా సిస్టర్కి కేటాయిస్తే సమస్య ఈజీగా పరిష్కారమవుతుంది. ది గ్రేట్ దాసరి నారాయణరావుగారి పేరు ఇలా బజారుకి ఎక్కేది కాదు. నాకైతే ఎటువంటి సమస్య లేదు, ఏదైనా సమస్య ఉంటే వచ్చి క్లియర్ చేసుకోమని పత్రికా ముఖంగా మా అన్నయ్యకు చెబుతున్నాను. చిరంజీవిగారు మా సమస్యని సాల్వ్ చేస్తున్నారని కొన్ని మీడియా హౌస్లు రాస్తున్నాయి. అందులో ఎంత మాత్రం నిజం లేదు. అనవసరంగా ఆయన్ను ఇందులోకి లాగుతున్నారు’’ అన్నారు. -
నా ఇంట్లో నేను గోడ దూకితే తప్పేంటి?
సాక్షి, హైదరాబాద్ : దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు కుమారులు అరుణ్ కుమార్, ప్రభుల మధ్య ఆస్తి తగాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తనపై అన్న ప్రభు చేసిన ఆరోపణలపై దాసరి అరుణ్ స్పందించారు. ఇంటికి గోడ దూకి వెళ్లింది నిజమేనని, కానీ దాడిమాత్రం చేయలేదని చెప్పారు. శనివారం ఆయన హైదరాబాద్ ఫిల్మ్ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ.. తమ మధ్య ఆస్తి గొడవలు తప్ప మరేం లేవని స్పష్టం చేశారు. దాసరి ప్రభు తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు. (చదవండి : దాసరి ఇంట పంచాయితీ: పోలీసులకు ఫిర్యాదు) ‘ఈ నెల 24న గోడ దూకి ఇంటికి వెళ్లింది నిజమే. ఇటీవల నాకు కొరియర్ వచ్చింది. తీసుకోవడానికి వెళ్లాను. బెల్ కొడితే డోర్ తీయలేదు. అందుకే గోడదూకాను. లోపలి వెళ్లాక ప్రభు వచ్చాడు. నా డాక్యుమెంట్ ఇస్తే వెళ్లిపోతానని చెప్పాను. కానీ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ముందే నా డాక్యుమెంట్ తీసుకొని వెళ్లాను. నా ఇంట్లో నేను గోడ దూకితే తప్పేంటి? నేను మద్యం తాగి గోడదూకితే పడిపోవాలి కదా? పోలీసుల ముందు కొడితే అప్పుడే అరెస్ట్ చేసేవాళ్లు కదా? ప్రభు ఉంటున్న ఇల్లు ముగ్గురిది. మా సోదరితో పాటు నాకు దాంట్లో పొత్తు ఉంది. అన్నయ్యకు,నాకు, సోదరికి ఎలాంటి వివాదాల్లేవు. ఆయన డిప్రెషన్లో ఉన్నారు. అందుకే ప్రతిసారి మీడియా, పోలీసుల దగ్గరకు వెళ్తున్నారు. ఆస్తి వివాదంపై సినీ పెద్దలు జోక్యం చేసుకొని పరిష్కరిస్తామంటే నాకెలాంటి అభ్యంతరం లేదు’ అని అరుణ్ కుమార్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లోని ఇల్లు విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఇల్లు నాదంటే నాదంటూ.. అరుణ్-ప్రభు తగువులాడుకుంటున్నారు. ఈ క్రమంలో దాసరి అరుణ్పై ఆయన సోదరుడు ప్రభు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరుణ్ అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చి బీరువా తెరిచేందుకు ప్రయత్నించాడని.. అడ్డుకున్న తమపై దాడికి చేశాడని ప్రభు ఫిర్యాదులో పేర్కొన్నారు. మా ఇంటికి కాలింగ్ బెల్ లేదు : దాసరి ప్రభు కాగా, దాసర్ అరుణ్ ఆరోపణపై ఆయన సోదరుడు ప్రభు స్పందించారు. తాను ఎలాంటి డిప్రెషన్లో లేనన్నారు. అరుణ్ కావాలనే అర్థరాత్రి గోడదూకి ఇంట్లోకి వచ్చాడని ఆరోపించారు. తమ ఇంటికి కాలింగ్ బెల్ లేదని, అలాంటప్పుడు ఆయన కాలింగ్ బెల్ ఎలా కొట్టాడని ప్రశ్నించారు.తనకు ఫోన్ చేస్తే కచ్చితంగా గేట్లు తీసేవాడినన్నారు. అరుణ్ వెనుక కొంతమంది ఉండి ఇలా మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. తాను ఆర్థికంగా బాగాలేనని, అందుకే సినీపెద్దలను ఆశ్రయించానని చెప్పారు. -
ఆస్తి తగదా: మీడియా ముందుకు దాసరి అరుణ్
సాక్షి, హైదరాబాద్ : దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు కుమారులు అరుణ్ కుమార్, ప్రభుల మధ్య ఆస్తి తగాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో దాసరి అరుణ్పై ఆయన సోదరుడు ప్రభు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరుణ్ అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చి బీరువా తెరిచేందుకు ప్రయత్నించాడని.. అడ్డుకున్న తమపై దాడికి చేశాడని ప్రభు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై అన్న ప్రభు చేసిన ఆరోపణపై అరుణ్ స్పందించారు. ఈ రోజు మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు చెబుతానని పేర్కొన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు దాసరి అరుణ్ మీడియా ముందుకు రానున్నారు. (చదవండి : దాసరి ఇంట పంచాయితీ: పోలీసులకు ఫిర్యాదు) జూబ్లీహిల్స్లోని ఇల్లు విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఇల్లు నాదంటే నాదంటూ.. అరుణ్-ప్రభు తగువులాడుకుంటున్నారు. ఆ ఇల్లు తన కూతురి పేరు మీద దాసరి వీలునామా రాశారని ప్రభు చెబుతున్నారు. సినీ పెద్దలు కలగజేసుకొని తనకు న్యాయం చేయాలని దాసరి పెద్ద కుమారుడు ప్రభు కోరుతున్నారు. -
దాసరి కుటుంబంలో ఆస్తి పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: దివంగత దర్శకనిర్మాత దాసరి నారాయణరావు ఇంట ఆస్తి వివాదం మరోసారి రాజుకుంది. ఆయన కొడుకులు దాసరి అరుణ్ కుమార్, ప్రభుల మధ్య ఆస్తి తగాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో దాసరి అరుణ్పై ఆయన సోదరుడు ప్రభు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 24న రాత్రి అరుణ్ తన ఇంటి గేటు దూకి లోపలికి వచ్చి తనపై, తన కుటుంబసభ్యులపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభు ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా తన తమ్ముడు నుంచి ప్రాణహానీ ఉందని పోలీసులే రక్షణ కల్పించాలని కోరారు. సినీ ఇండస్ట్రీ పెద్దలు ఈ విషయంలో జోక్యం చేసుకొని ఈ వివాదాన్ని పరిష్కరించాలని ప్రభు విజ్ఞప్తి చేశారు. సినీ ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్గా నిలిచినటువంటి దివంగత దాసరి నారాయణరావు కుటుంబంలో ఆస్తి పంచాయితీ నెలకొనడం పట్ల ఆయన అభిమానులు, సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదానికి త్వరగా ఫుల్స్టాప్ పెట్టి ఆయన గౌరవాన్ని కాపాడాలని పలువురు వాపోతున్నారు. ఈ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ.. ‘ ఈ నెల 24న రాత్రి దాసరి అరుణ్తో పాటు అతడి డ్రైవర్ మా ఇంటి గేటు దూకి లోపలికి వచ్చాడు. మద్యం తాగి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతూ నా భార్య, నాపై దాడి చేశాడు. అంతేకాకుండా మా నాన్న బీరువా తెరవడానికి ప్రయత్నించాడు. మా నాన్న(దాసరి) రాసిన వీలునామా ప్రకారం ఆయన మనవరాలు, నా కూతురు ఈ ఇంటికి అర్హురాలు. ఆస్తుల కోసం దాసరి అర్జున్ దౌర్జన్యం చేస్తున్నాడు. సి. కళ్యాణ్, మురళీమోహన్, మోహన్బాబు వంటి సినీ పెద్దలు ఈ విషయంపై స్పందించి పరిష్కరించాలి. అదేవిధంగా దాసరి అరుణ్పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాం’ అని అన్నారు. -
కొత్త నిర్మాతలు లేకుంటే మనుగడ లేదు – సి.కల్యాణ్
‘‘దర్శకుణ్ణి అవుదామని ఇండస్ట్రీకి వచ్చి, మెళకువలు నేర్చుకున్నాను. అనుకోకుండా నిర్మాత అయ్యాను. 2020లో కచ్చితంగా ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తాను. హీరో ఎవరు? అంటే నేనే అవ్వొచ్చేమో!(నవ్వుతూ)’’ అన్నారు నిర్మాత సి. కల్యాణ్. నేడు ఆయన పుట్టినరోజు(డిసెంబరు 9) సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో పంచుకున్న విశేషాలు.... ►నెల్లూరులోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన నాకు సి. కల్యాణ్ అనే ట్యాగ్ సంపాదించి ఇచ్చింది ఇండస్ట్రీయే. దర్శకులకు దాసరి నారాయణరావుగారు ఎలా ఉంటారో నిర్మాతలకు డి. రామానాయుడుగారు అలా. రామానాయుడుగారే నాకు స్ఫూర్తి. ►కొత్త సినిమా నిర్మాతలు లేకపోతే ఇండస్ట్రీకి మనుగడ లేదు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్నవారే సినిమా తీయాలి.. కొత్తవారు సినిమా తీయకూడదంటే ఆరు నెలల్లో ఇండస్ట్రీ మూతపడిపోతుంది. ఇప్పుడున్న నిర్మాతలందరూ ఒకప్పడు కొత్తవారే. ఇండస్ట్రీకి ఒక పెద్ద కావాలని చిరంజీవిగారితో ఇటీవలే మాట్లాడాను. ‘నాకు ఏదో పెద్ద బాధ్యతను ఇవ్వబోతున్నట్లుగా ఉన్నావ్’ అన్నారాయన. త్వరలోనే ఆ బాధ్యతలు తీసుకుంటారనుకుంటున్నా. ►వేరే ఇండస్ట్రీల్లో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, స్టూడియోలు, ఆర్టిస్టులు వేర్వేరుగా ఉంటారు. కానీ టాలీవుడ్లో వీరందరూ ఇంటర్లింకై ఉన్నారు. ఆ నాలుగు సెక్టార్స్ని అండర్గ్రౌండ్లో ప్లే చేస్తున్నారు. ఇది ఎన్ని రోజులో సాగదు. ఏదో ఒక రోజు పేలక తప్పదు. ఈ రోజుల్లో ఏడాదికి దాదాపు 280 సినిమాలు విడుదలవుతుంటే... స్టార్స్ సినిమాలు వచ్చేది కేవలం 30 నుంచి 50 సినిమాలే. ఒక పెద్ద స్టార్ ఏడాదికి ఒక సినిమా చేస్తాడు. అతను ఎన్ని సినిమాలు చేసినా వారికి పనిచేసే స్టాఫ్ ఒకరే. మ్యాగ్జిమమ్ 40శాతం మారతారు. నేను నోరు విప్పితే చాలామందికి చెమటలు పడతాయి. ►గతంలో చిత్ర పరిశ్రమ సమస్యలను ప్రభుత్వానికి ఇండస్ట్రీ తరఫున వెళ్లి చెప్పుకునేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. గిల్డ్ ఏజెంట్ల చేతుల్లోకి వెళ్లింది. ఇక్కడ ఎవరూ శాశ్వితం కాదు. నేను కూడా. తెలంగాణలో, ఆంధ్రలో వేర్వేరు ప్రభుత్వాలు. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత గ్రూపులయ్యాయి. చిరంజీవిగారి దగ్గరికి వెళితే ఒక ట్యాగ్.. బాలకృష్ణగారి దగ్గరికి వెళితే మరో ట్యాగ్.. పవన్ కల్యాణ్ వద్దకు వెళితో ఇంకో ట్యాగ్ కట్టేస్తున్నారు. థియేటర్స్, క్యూబ్లు చేతిలో పెట్టుకుని ఉండేవార ంతా ఒక్కటై వ్యాపారం చేస్తున్నారు. ఆ నలుగురి చేతుల్లో థియేటర్స్ ఉన్నాయనడం తప్పు. థియేటర్స్ని లీజుకి తీసుకొని వ్యాపారం చేస్తుండటాన్ని తప్పు అనలేం. ►బాలకృష్ణగారితో నా మూడో సినిమా ‘రూలర్’. భవిష్యత్లో ఇంకా సినిమాలు చేస్తాం. ఉత్తరప్రదేశ్లో సెటిలైన తెలుగువాళ్ల కథ ‘రూలర్’. ఈ సినిమాలో పొలిటికల్ యాంగిల్ లేదు. బాలకృష్ణ– దర్శకుడు వీవీ వినాయక్ కాంబినేషన్లో తప్పకుండా మరో సినిమా నిర్మిస్తాను. -
దాసరి ప్రభును తీసుకెళ్లిన మహిళ ఎవరు?
సాక్షి, హైదరాబాద్: దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు పెద్ద కుమారుడు దాసరి తారక ప్రభు ఆచూకీ లభ్యమైంది. ఈ నెల 9న అనుమానాస్పద స్థితిలో ఆయన అదృశ్యమైన విషయం తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 46లోని తన నివాసానికి వచ్చిన ప్రభును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తన అల్లుడు కనిపించడం లేదంటూ అతడి మామ నార్ల సురేంద్ర ప్రసాద్ ఈ నెల12న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. అదే రోజు సాయంత్రం తారక ప్రభు ఆటోలో ఇమ్లిబన్ బస్ స్టేషన్కు వెళ్లి అక్కడ చిత్తూరు బస్సు ఎక్కినట్లుగా సీసీ టీవీల్లో రికార్డైంది. ఎస్ఐ చంద్రశేఖర్ మూడు రోజుల పాటు తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో గాలింపు చేపట్టినా ప్రయోజనం కనిపించలేదు. కాగా ఈ నెల 12న ప్రభు తన పెద్ద భార్య దాసరి సుశీలతో కలిసి హైదరాబాద్ వచ్చినట్లుగా పోలీసులు గుర్తించినప్పటికీ హడావుడిగా తెల్లవారే వెళ్లిపోయారు. బుధవారం పోలీసుల ఎదుట హాజరైన ప్రభు మిస్సింగ్కు గల కారణాలను ఆరా తీస్తే సరైన సమాధానం చెప్పడం లేదని తెలుస్తోంది. ఓ మహిళ తనను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిందని ఓ సారి చెప్పగా, తాను ఇక్కడి నుంచి ముంబై వెళ్లానంటూ మరోసారి పొంతన లేని సమాధానం చెబుతున్నాడు. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఆయన చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన మిస్సింగ్ వెనుక గల కారణాలను ఆరా తీస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. -
ఇమ్లిబన్లో చిత్తూరు బస్సు ఎక్కినట్లు ఆనవాలు..
హైదరాబాద్ : దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు పెద్ద కుమారుడు దాసరి తారక ప్రభు(43) కనిపించడం లేదంటూ అతడి మేనమామ నార్ల సురేంద్రప్రసాద్ జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ఈనెల 5న రాత్రి చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చిన తారక ప్రభు ఈనెల 7వ తేదీ వరకు కూకట్పల్లిలోని తన పెద్ద అల్లుడి ఇంట్లో ఉన్నాడని, 8వ తేదీన పని ఉందంటూ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–46లోని తన కార్యాలయానికి వెళ్లిన అతను ఆ రోజు రాత్రి తన ఇంట్లోనే పడుకున్నట్లు తెలిపారు. ఈ నెల 9 వ తేదీ సాయంత్రం వరకు ఇంట్లోనే ఆఫీస్ పనులు చూసుకున్న ప్రభు ఇంటి వద్ద ఆటో ఎక్కి వాచ్మెన్ బహదూర్కు చెప్పి బయటికి వెళ్లిపోయాడన్నారు. అదే రోజు సాయంత్రం అతడి భార్య పద్మావతి ప్రభుకు ఫోన్ చేయగా, ఫోన్ రింగ్ అయినా కాల్ కట్ అవుతోందన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఫోన్స్విచ్ ఆఫ్ అయినట్లు తెలిపాడు. అతడి ఆచూకీ లేక పోవడంతో బుధవారం రాత్రి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు జూబ్లీహిల్స్ పోలీసులను అప్రమత్తం చేశారు. గురువారం తెల్లవారుజామున ఫిర్యాదు స్వీకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. మరో వైపు టాస్క్ఫోర్స్ పోలీసులు కూడా గాలిస్తున్నారు. అతడి కాల్డేటా, సీసీ ఫుటేజీ ఆధారంగా ప్రభు ఇమ్లిబన్ బస్స్టేషన్లో చిత్తూరు బస్సు ఎక్కినట్లు గుర్తించిన పోలీసులు అతడు చిత్తూరుకు వెళ్లి ఉంటాడని ఒక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసులకు సమాచారం అందించడంతో వారు గాలింపు ముమ్మరం చేపట్టారు. జూబ్లీహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
దాసరి నాకు తాత అవుతారు
‘‘ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఎంతో మంది దర్శకుల శ్రమ ఫలితం వల్లే ఓ హీరో రూపుదిద్దుకుంటాడు. ఎంతో గొప్ప ప్రతిభా పాటవాలున్న దాసరిగారి జన్మదినం రోజుని ‘డైరెక్టర్స్ డే’గా ప్రకటించి, జరుపుకోవటం నిజంగా దర్శకుల అదృష్టం’’ అన్నారు నటుడు చిరంజీవి. మే 4 దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి. ఈ సందర్భంగా శనివారం తెలుగు దర్శకుల సంఘం ఆధ్వర్యంలో ‘డైరెక్టర్స్ డే’ వేడుక జరిగింది. ఇందులో దాదాపు 300 మంది దర్శకులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా చిరంజీవి పాల్గొన్నారు. 2018లో మంచి చిత్రాలను అందించిన నలుగురు దర్శకులను ఈ వేదికపై సన్మానించారు. చిరంజీవి చేతుల మీదుగా ‘నీది నాది ఒకే కథ’ దర్శకుడు వేణు ఉడుగుల, ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల, ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేశ్ మహా, ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి సన్మానాలు అందుకున్నారు. ఇవే కాకుండా ‘ఫోర్స్డ్ ఆర్ఫన్స్’ అనే ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్కి దర్శకత్వం వహించి అవార్డులు అందుకున్న వీఎన్ ఆదిత్యను, కళాతపస్వి కె.విశ్వనాథ్ గారిపై ‘విశ్వదర్శనం’ చిత్రానికి దర్శకత్వం వహించి, ఇటీవల దాదాసాహెబ్ స్పెషల్ జ్యూరీ అవార్డు పొందిన జనార్థన మహర్షిని కూడా సన్మానించారు. చిరంజీవి మాట్లాడుతూ– ‘‘1940ల కాలం నుండి ఎంతోమంది దర్శకులు ఉన్నారు. నేను నటునిగా మేకప్ వేసుకున్న దగ్గరనుండి ఈ రోజు వరకు ఎంతో మంది దర్శకులను చూశాను. కానీ దాసరిగారి శైలి చాలా ప్రత్యేకమైనది. నాకు ఆయనతో సినిమా పరిచయం అయింది ‘లంకేశ్వరుడు’ ద్వారా. ఆయన దర్శత్వంలో నేను చేసిన ఒకే ఒక్క సినిమా. అది ఆయనకు వందో చిత్రం. సినిమా ఇండస్ట్రీలో ఆయనకు, నాకూ ఒక్క సినిమా పరిచయమే అయినా మా ఇద్దరికీ దగ్గరి బంధుత్వం ఉంది. అది చాలా కొద్దిమందికే తెలుసు. ఆయన వరసకు నాకు తాత అవుతారు. నేను ఆయనకు మనవడిని అవుతాను. అందుకే నేనెప్పుడూ ఆయనతో ‘మీ మొదటి సినిమా తాతా మనవడు. మీరు, నేను తాతామనవలం’ అనేవాణ్ణి. నేను 9 సంవత్సరాల గ్యాప్ తర్వాత రాజకీయాల నుండి మళ్లీ సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు ఆయన ఎంతో ఉత్సాహాన్నిచ్చారు. ‘ఖైదీ నంబర్ 150’ ప్రీ రిలీజ్ ఫంక్షన్కు రోడ్ జర్నీ చేసుకుంటూ వచ్చి ఆ సభలో ప్రసంగించారు. 150 ఘనవిజయం సాధిస్తుందని సభా ముఖంగా అన్నారు.. దాసరిగారు అన్నట్లుగానే ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. అప్పటికే ఆయన ఆరోగ్య స్థితి విషమించి ఆస్పత్రిలో చేరారు. నేను, మా ఆవిడ ఆయన్ను చూడ్డానికి వెళితే అంత ఇబ్బందికర పరిస్థితిలోనూ ‘సినిమా ఎలా ఉంది?’ అని పేపర్ మీద రాస్తూ అడిగారు. తర్వాత ఆయనకు అల్లు రామలింగయ్య అవార్డును ప్రకటించి నేను, అల్లు అరవింద్ ఆయన ఇంటికి వెళ్లి స్వయంగా అవార్డును అందజేస్తే ఎంతో చిన్న పిల్లాడిలా ఆనందపడిపోయి, ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ విధంగా ఆయన ఆఖరి రోజుల్లో నేను చాలా దగ్గరగా ఉండటం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘దాసరి పుట్టినరోజున నిర్వహించే ఈ సభలో బొకేలు, శాలువాల ఖర్చులు కూడా వద్దు. మన దగ్గర గతంలో పనిచేసిన దర్శకులకు ఏదైనా సాయం చేయాలనే ఉద్దేశంతో ఎంతో ఆలోచించి దర్శకులందరం ఓ నిర్ణయం తీసుకున్నాం. గతంలో దర్శకులుగా చేసి ఈ రోజున పిల్లలని చదివించుకోవటానికి కూడా లేకుండా ఇబ్బంది పడే అనేక మంది దర్శకులు ఉన్నారు. వారి సహాయార్థం ఓ నిధిని ఏర్పాటు చేయాలని ఓ నిర్ణయం తీసుకున్నాం. దాదాపు ఐదు కోట్ల నుంచి పది కోట్ల మధ్యలో వసూలు చేసి, నెలకు ఓ ఐదు వేల రూపాయల చొప్పున ఓ యాభై మంది నుండి వంద మంది వరకు సహాయం చేయాలనుకుంటున్నాం. ఈ విషయం తెలుసుకున్న రాజమౌళి ఎంతో మంచి మనసుతో యాభై లక్షల విరాళాన్ని తన వంతుగా అందించారు. నేను దర్శకునితో పాటు నిర్మాతని. బాహుబలి’ నిర్మాతల తరపున పదిహేను లక్షలు, నేను సొంతంగా పది లక్షలు ఇస్తున్నాం’’ అని చెప్పారు. మంచి మనసుతో చేస్తున్న ఈ కార్యక్రమానికి ఓ ఇరవై ఐదు లక్షలు తాను ఇస్తానని చిరంజీవి ప్రకటించారు. ఈ వేదికపై మొత్తంగా కోటి రూపాయల విరాళం అందడం ఆనందంగా ఉందని దర్శకుల సంఘం అధ్యక్షుడు యన్. శంకర్ అన్నారు. ఎ. కోదండ రామిరెడ్డి, రేలంగి నరసింహారావు, ఆర్. నారాయణమూర్తి, పరుచూరి బ్రదర్స్, తనికెళ్ల భరణి, కొరటాల శివ, వీర శంకర్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి తదితరులు పాల్గొన్నారు. పలువురు దర్శకులు స్కిట్లు చేసి అలరించారు. దర్శకుల సంఘం వెబ్సైట్ని ఆవిష్కరించారు. -
పరుచూరి బ్రదర్స్కు జీవిత సాఫల్య పురస్కారం
మే 4న దర్శకరత్న డా. దాసరి నారాయణరావు 75వ జయంతి. ఈ సందర్భంగా అంతర్జాతీయ సాంస్కృతిక సాహితీ సేవాసంస్థ వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్, రేలంగి నరసింహారావు చైర్మన్గా ఏర్పడిన డా. దాసరి– వంశీ జీవిత సాఫల్య పురస్కారం కమిటీలు ఈ నెల 10న ప్రముఖ సినీరచయితలు పరుచూరి బ్రదర్స్ (పరుచూరి వెంకటేశ్వరరావు పరుచూరి గోపాలకృష్ణ)కు జీవిత సాఫల్య పురస్కారం అందజేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొంటారని వంశీ వ్యవస్థాపక అధ్యక్షులు వంశీ రామరాజు పేర్కొన్నారు. -
మా దృష్టిలో దాసరి ఎప్పటికీ దేవుడే!
సినిమా వాళ్లు పారితోషికాలు తీసుకుంటూనే సేవ చేస్తున్నామని అంటుంటారని.. ప్రభుత్వాల నుంచి సబ్సడీలు, స్థలాలు కావాలని అడుగుతుంటారని చాలా మంది అంటుంటారు నిజమే.. కానీ, మా గురువు దాసరి నారాయణరావు నిజంగానే సేవ చేశారని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. డా.దాసరి నారాయణరావు అండ్ శ్రీమతి దాసరి పద్మ మెమొరియల్ నీడ చారిటబుల్ ట్రస్ట్ తరుపున దాసరి కుమార్తె హేమాలయ కుమారి, అల్లుడు డా.రఘునాథ్బాబు పలువురికి గురువారం చంద్ర, రాజేష్, చందు, నాగేశ్వరరావులకు స్కాలర్షిప్లు అందజేశారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘మా గురువు దాసరి గురించి గిట్టని వాళ్లు ఎన్ని చెప్పినా ముమ్మాటికి ఆయన సేవ చేశారు. తెలియకుండా ఎంతో మందికి దాన ధర్మాలు చేశారు. ఆయనను అత్యంత సన్నిహితంగా చూశాము కాబట్టి ఆయన ఏంటో మాకు తెలుసు. మా దృష్టిలో దాసరి ఎప్పటికీ దేవుడే. దాసరి సేవల్ని ఆయన కూతురు, అల్లుడు కొనసాగించడం ఆనందాన్ని కలిగిస్తోంది’ అని అన్నారు. ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. ‘తన చుట్టూ వున్న వారికి సహాయం చేయాలన్న గొప్ప హృదయం దాసరిది. తండ్రి ప్రారంభించిన సేవా సంస్థను ఆయన కూతురు హేమాలయ కుమారి, అల్లుడు డా. హరనాథ్బాబు కొనసాగించడం నిజంగా హేట్సాఫ్. తల్లిదండ్రులు ఈ రోజుల్లో పిల్లలకు చదువునే ఆస్థిగా ఇస్తున్నారు. తన దగ్గర పనిచేసిన పిల్లలకు ఆసరాగా నిలుస్తూ వారి పిల్లల చదువులకు స్కాలర్షిప్ అందజేస్తున్నారంటే మా గురువుగారు నిజంగా చిరంజీవే. ఆయన చనిపోలేదు. మనందరిలో బతికే వున్నారు’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాసరి నారాయణరావు మనవళ్లు, దవళసత్యం, రాజేంద్రకుమార్, సంజీవి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇదే వేదికపై కొంకపురి నాటక కళాపరిషత్కు దాసరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 20 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. -
బుద్ధా.. మీ మాటలు వెనక్కితీసుకోండి: దాసరి ఫ్యామిలీ
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు, వైఎస్సార్సీపీ నాయకుడు మోహన్బాబును ఉద్దేశించి.. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకట్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మోహన్బాబును విమర్శిస్తూ.. దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు గురించి ప్రస్తావించడంపై ఆయన కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మోహన్బాబు తమకు పెద్ద అన్నయ్యలాంటి వారు అని, నాన్న చనిపోయిన తరువాత అన్ని ఆయనే చూసుకుంటున్నారని దాసరి నారాయణరావు పెద్ద కొడుకు తారకప్రభు తెలిపారు. దాసరి నారాయణరావుకు మోహన్ బాబు పంగనామాలు పెట్టారని బుద్ధా వెంకన్న అన్నారని, ఈ వ్యాఖ్యలను ఆయన వెంటనే వెనక్కి తీసుకోవాలని తారకప్రభు కోరారు. తాము ఎప్పుడైనా, ఎక్కడైనా మోహన్ బాబు తమను మోసం చేశారని చెప్పమా? తాము చెప్పకుండా ఈ విషయంలోకి దాసరిని ఎందుకు లాగారని బుద్ధా వెంకన్నను ఆయన ప్రశ్నించారు. దాసరి నారాయణరావు గారి పెద్ద కోడలు పద్మ స్పందిస్తూ.. ‘మోహన్బాబు నన్ను అమ్మా అని పిలుస్తారు. నన్ను కూతురిలా ఆయన చూసుకుంటారు. మా రెండు కుటుంబాలు సన్నిహితంగా ఉంటాయి. బుద్ధా వెంకన్నగారూ.. మీ మాటలను వెనక్కి తీసుకోండి. రాజకీయాల కోసం మా కుటుంబాన్ని ఇందులోకి లాగకండి’ అని హితవు పలికారు. -
ఆచార్యా మజాకా!
దాసరి నారాయణరావు, మోహన్బాబు, అన్నపూర్ణ, జయలక్ష్మి...ప్రధాన పాత్రలు పోషించిన సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం కలిసికట్టుగా వచ్చినట్లున్నది అక్కడి పరిస్థితి.‘‘తక్షణం ఇల్లు ఖాళీ చేయాల్సిందే’’ అని ఒంటికాలి మీద లేచి వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నాడు ఇంటోనరు (ఇల్లు+ ఓనరు).‘‘ఒక్క పదిరోజులు ఆగండి’’ అన్నది ఆ ఇల్లాలు భయం భయంగా.‘‘వీల్లేదు. ఈ క్షణం ఖాళీ చేయాల్సిందే. నన్ను వెధవ అనుకుంటున్నాడా....దద్దమ్మ అనుకుంటున్నాడా...చవట అనుకుంటున్నాడా....వాజమ్మ అనుకుంటున్నాడా...అసలు ఏమనుకోవడం లేదా’’ అంటూ కేకలేస్తున్నాడు ఓనరు.అనుకున్నాడో లేదో తెలియదుగానీ ‘‘నమస్కారం గురూ’’ అని ఒక న‘మస్కా’ర బాణం విసిరాడు అద్దెదారు ఆచార్య. ఆచార్యను చూడగానే మరింత ఎత్తు ఎగిరాడు ఇంటోనరు.‘‘ఏం పెద్దమనిషివయ్యా బుద్ధిలేదా’’ అని తిట్టాడు. ఉందా లేదా అని చెప్పలేదుగానీ ‘‘చదువుకున్నావు బుద్ధి లేదు. పెద్ద మనిషిని అలా నిలబెట్టి మాట్లాడతావా! వెళ్లి కాఫీ పట్రా’’ అని అరిచి ‘‘లోనికి రండి సార్’’ అని ఇంటి యజమానిని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించాడు ఆచార్య.ఇక్కడ మనం ఆచార్య గురించి చెప్పుకోవాలి. కాస్త అటు ఇటుగా ‘కన్యాశుల్కం’లో గిరీశంలాంటి వాడు. మండు వేసవిలో కూడా చలికోట్లను బ్లాక్లో అమ్మగల నేర్పరి.‘‘ఏంటి సార్, ఆపరేషన్ చేయించుకున్నాక ఇలా అయ్యారు. ఏనుగులా ఉండేవారు పీనుగులా అయ్యారు’’ సానుభూతిగా అన్నాడు ఆచార్య.‘‘నీ మాటల్లో పడడానికి నేనేమైనా పిచ్చొడ్ని అనుకుంటున్నావా! అద్దెయ్యా....మూడు నెలల అద్దెయ్యా...మార్యాదగా ఇస్తావా లేకపోతే ఖాళీ చేస్తావా!’’ కరాఖండిగా, కఠినంగా అరిచాడు ఇంటి యజమాని.‘‘ఎందుకు సార్ అంత గట్టిగా అరుస్తారు. పాపం మీకు అసలే బ్లడ్ప్రెషర్. పొరపాటును మీకు గుండె నొప్పి వచ్చిందనుకో...ఫినిష్’’ అంటూ ఇటీవల ఎవరెవరు హార్ట్ ఎటాక్లతో చనిపోయింది పేర్లు, వృత్తితో సహా లిస్ట్ చదివాడు.ఈ దెబ్బకు ఇంటి ఓనరు భయంతో బిక్కచచ్చాడు.‘‘అన్నట్లు మీరు అమెరికా వెళ్లాలనుకుంటున్నారు కదా... మీకు అభ్యంతరం లేకపోతే మీ చెయ్యిని ఒకసారి ఇవ్వండి’’ అడిగాడు ఆచార్య.‘‘దానికేం...తప్పకుండా చూడు’’ అని చెయ్యి ఇచ్చాడు ఇంటి యాజమాని. ‘‘మీరు కొత్త ఇంట్లోకి వెళ్లి ఎన్నాళ్లయింది?’’‘‘మహా అయితే ఆర్నెల్లు అవుతుంది’’‘‘మరో ఆరు నెలల్లో నువ్వు పోతావు గురూ...’’ఇంటి యజమాని గుండెల్లోకి పిడుగు నేరుగా దూరింది. 60 లీటర్ల కన్నీరయ్యాడు.‘‘బావి ఎక్కడ తవ్వారు?’’‘‘మూలలో...’’‘‘ఏ మూలా? దక్షిణంలోనా....దానికి శాంతి చేయాలోయ్. ఓ పనిచెయ్. ఇప్పుడు నువ్వు వెళ్లిపో. నీ వెనకాలే నేను వస్తాను. నీ ఇంట్లో అన్నీ చూస్తాను. శాస్త్రోక్తంగా ఎక్కడ శాంతి చేయాలో అక్కడ చేస్తాను’’‘‘త్వరగా వచ్చేస్తావుగా’’ భయంభయంగా అన్నాడు ఇంటి యజమాని.‘‘నీ పని తప్ప నాకు వేరే ఏ పని ఉందోయ్... ఇదిగో ఒక పదిరూపాయలు ఉంటే ఇవ్వు’’ అడిగాడు ఆచార్య.వేరే సందర్భంలో అయితే ఎలా స్పదించేవాడో తెలియదుగానీ... ఇప్పుడు మాత్రం ఇరౖవై రూపాయలు తీసి...‘‘ఇరవై రూపాయల నోటే ఉంది’’ అన్నాడు ఇంటి యజమాని.‘‘ఉంటే ఏమవుతుంది! పూజకు మొత్తం 180 అవుతుంది. 20 రూపాయలు పోగా....160 మిగులుతుంది. ఆ డబ్బులు నువ్వు నాకు బాకీ అన్నమాట. ఫరవాలేదు. నీ మీద నాకు నమ్మకం ఉంది. ఇంటికి వచ్చి తీసుకుంటాలే’’ అన్నాడు ఆచార్య.కళ్ల ముందు భయం తప్ప యజమానికి ఏదీ కనిపించడం లేదు. ‘‘ఏమిటో’’ అనుకుంటూ వచ్చిన దారిన వేగంగా వెనక్కి వెళ్లాడు యజమాని.పాలవాడిని చూడగానే ఆచార్య బుర్ర బంపర్ ఐడియాతో మురిసిపోయింది.‘‘ఏమోయ్ నారాయణ ఇట్రా’’ అని పిలిచాడు.‘‘ఏమిటి బాబూ’’ అడిగాడు నారాయణ.‘‘ఏమిటయ్యా ఇది. నీ దగ్గర నేను బాకీ ఉన్నాను. నువ్వు అడగవు. నా దగ్గర తీసుకోవు’’ అన్నాడు ఆచార్య.‘‘మీలాంటి పెద్దల దగ్గర డబ్బు ఎక్కడికి పోతుంది బాబూ’’ మర్యాదగా అన్నాడు నారాయణ.‘‘పోయేది పెద్దల దగ్గరేనోయ్. ఇదిగో ఈ ఇరవై రూపాయలు తీసుకో’’ అని డబ్బు చేతిలో పెట్టాడు ఆచార్య.ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాడనే అమాయకత్వంతో ‘‘16 రూపాయలే బాబూ’’ అన్నాడు నారాయణ. ‘‘అయితే ఏమిటి! మిగిలిన నాలుగు రూపాయలతో...గేదెలున్నాయి కదా....వాటికి బ్రహ్మాండమై గడ్డి వేయించు’’ అన్నాడు ఉదారంగా నారాయణ.నారాయణ కళ్లు ఆనందంగా మెరిసాయి.‘‘ఒకమాట...నీ గేదెలను ఎవరో బందెలదొడ్లో పెట్టారని విన్నాను’’ అడిగాడు ఆచార్య.‘‘అవును బాబూ...రెండు వందలు కడితేగానీ వాటిని విడిపించుకోవడానికి లేదు’’ దీనంగా అన్నాడు నారాయణ.‘‘రెండొందలా!’’‘‘అవును బాబూ’’‘‘రెండొందలా!!!’’‘‘అవును బాబు’’‘‘ఒక యాభై రూపాయలు ఇవ్వు. వాటిని విడిపించేస్తాను’’ నమ్మకంగా అన్నాడు ఆచార్య.‘‘అంతకంటేనా బాబూ!’’ అని అడిగిన యాభై ఆచార్య చేతిలో పెట్టాడు నారాయణ. ‘‘సాయంత్రం అయిదు గంటలలోపు నీ గేదెలు నీ దొడ్లో ఉంటాయి. ఇదిగో జున్నుపాలు దొరుకుతాయా...ఆ...ఎందుకు దొరకవు...మా ఆవిడకు చాలా ఇష్టం. సాయంకాలం పట్రా’’ అని ఆర్డర్ వేసి...భార్యను కేకేసి...‘‘ఏమోయి మేరీ...నీ పుట్టిన రోజు ప్రెజెంటేషన్. ఈ యాభై రూపాయలు పెట్టి బ్రహ్మాండమైన చీర తీసుకో. ఇదిగో చూడు...సాయంత్రం నిన్ను రిసీవ్ చేసుకోవడానికి నేను రాలేను. మన హౌస్ఓనరు ఇంట్లో శాంతి చేయాలి....ఆ నారాయణ గేదెలు విడిపించాలి. ఈరోజు ఫుల్బిజీ’’ అంటూ హడావిడి పడతున్నాడు ఆచార్య. (జవాబు 38వ పేజీలో) -
దాసరి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోహన్బాబు
-
‘కొమ్ములు తిరిగిన నటుడైనా సరే.. ఆయన దగ్గరకు రావాల్సిందే’
సాక్షి, పశ్చిమగోదావరి : తన జీవితంలో దీపాన్ని వెలిగించి వెలుగులు నింపింది దర్శకరత్న దాసరి నారాయణ రావేనని సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. పాలకొల్లులో ఏర్పాటు చేసిన దాసరి కాంస్య విగ్రహాన్ని ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ మా నాన్న ఒక బడిపంతులు. విలన్గా ఉన్న నన్ను కమెడియన్గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా.. హీరోగా తయారు చేసింది మా గురువు గారే. అక్కినేని నాగేశ్వరరావు పక్కన నటించే గొప్ప అవకాశాన్ని కల్పించారు. నేను నిర్మించిన శ్రీ విద్యానికేతన్లో దాసరి పేరుతో ఆడిటోరియం, లైబ్రరీని నిర్మించాను’ అని మోహన్బాబు దాసరిపై అభిమానాన్ని చాటుకున్నారు. కొమ్ములు తిరిగిన నటుడైనా సరే దాసరిని వేషం ఇమ్మని అడిగారే తప్ప ఆయన ఏనాడు ఏ నటుడిని ఫలానా వేషం వేయాలని అడగలేదని గుర్తు చేసుకున్నారు. దాసరి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అంటూ కొనియాడారు. కాగా దాసరి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపీలు మురళీమోహన్, గోకరాజు గంగరాజు, మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు సహా సినీ ప్రముఖులు రాజా వన్నెంరెడ్డి, కోటి, రవిరాజా పినిశెట్టి, ఎన్.శంకర్, సురేష్ కొండేటి, అంబికా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
దాసరి విగ్రహావిష్కరణలో వివాదం..!
సాక్షి, పశ్చిమగోదావరి : దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణలో ప్రొటోకాల్ వివాదం చోటుచేసుకుంది. ఆహ్వాన పత్రికలో నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మిల పేర్లు లేకపోవడంతో వివాదం మొదలైంది. ఎంపీల పేర్లు లేకుండా అన్నీ తానై నడిపించినట్టుగా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వ్యవహరించడంతో మాజీ మంత్రి హరిరామజోగయ్య తదితరులు మనస్తాపం చెందారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. ఆహ్వాన పత్రిక తెలుగుదేశం పోస్టర్లా ఉందంటూ మండిపడ్డారు. శనివారం సాయంత్రం పాలకొల్లులోని గాంధీబొమ్మల సెంటర్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఆయన అందరివాడు.. మాజీ మంత్రి హరిరామజోగయ్య మాట్లాడుతూ.. ‘దర్శకరత్న దాసరి అందరివాడు. ఏ పార్టీలో కొనసాగిన ఆయనను అందరూ అభిమానిస్తారు. పాలకొల్లులోని ప్రముఖులందరం కలిసి దాసరి కాంస్య విగ్రహ ఏర్పాటు కోసం విరాళాలు ప్రకటించాం. స్థానిక ఎమ్మెల్యేను గౌరవించాలనే ఉద్దేశంతో నిమ్మలను కార్యక్రమంలో ముందుండాలని కోరాం. కానీ, ఇవాళ ప్రకటించిన ఇన్విటేషన్ చూస్తే.. అది పక్తు టీడీపీ పోస్టర్లా ఉంది. అందరికి సంబంధించినదిలా కనపడడం లేదు. వాళ్ల తాలూకు మంత్రులు, ఎంపీలు, కాబోయే ఎంపీల పేర్లున్నాయి. అందుకే ఈ కార్యక్రమానికి వెళ్లడం లేదు. దాసరి విగ్రహావిష్కరణ కార్యక్రమం బాగా జరగాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు. -
దాసరి కోడలిపై దాడి
సాక్షి, హైదరాబాద్: తన భర్త మొదటి భార్య అర్ధరాత్రి తన ఇంట్లోకి చొరబడటమే కాకుండా తనపై దాడి చేసి గాయపరిచిందని దర్శకరత్న, దాసరి నారాయణరావు కుమారుడు దాసరి తారక హరిహర ప్రభు సతీమణి దాసరి పద్మ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 46లో తాను భర్తతో కలిసి ఉంటున్నానని ఈ నెల10వ తేదీ రాత్రి 7 గంటలకు తన భర్త మొదటి భార్య సుశీల, మరో మహిళ సంధ్యతో కలిసి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి నీ భర్త ఎక్కడని గొడవపెట్టుకోవడమేగాక, అక్కడే బైఠాయించిందన్నారు. దీంతో తానే ఈ విషయాన్ని తన సోదరుడు నార్ల కోడి, సోదరి లక్ష్మిప్రభ దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఆ రాత్రి సుశీల, సంధ్య ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారని, ఈ నెల 11న తెల్లవారుజామున కిచెన్లోకి వెళ్తున్న తనపై సుశీల, సంధ్య కర్రతో దాడి చేసినట్లు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దాసరి సుశీలపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, తారక హరిహర ప్రభు ఆస్తిలో తనకూ వాటా ఉందని సుశీల వాదిస్తున్నారు. -
మరోసారి రచ్చకెక్కిన దాసరి ఆస్తి వివాదం
-
గుర్తుకొస్తున్నారు గురువుగారూ!
గాడ్ఫాదర్ లేడు. ఇండస్ట్రీలో నాటుకుపోయిన కులపెద్ద లేడు. కాకా పట్టే గుణం లేదు. ఒక్క ఎర్రబస్ టికెట్ మాత్రం ఉంది. ఒక్కరు కూడా వేలెత్తి చూపలేని ప్రతిభ ఉంది. అనుకున్నది అయ్యేవరకు వదలని దీక్ష ఉంది. దళం లేకున్నా పట్టుంది. పట్టుదల ఉంది. చివరి ‘ఎర్రబస్’ ఎక్కేదాకా సినిమాపై అంతులేని అభిమానం ఉంది. అనంతమైన ప్రేమ ఉంది. గుర్తుకొస్తున్న గురువుగారికి.. ఇదిగో.. అక్షర దక్షిణ! దాసరి నాకు గురువు కాదు అందరికీ తెలియని విషయం ఏంటంటే దాసరి నాకు గురువు కాదు. మేమిద్దరం స్నేహితులం. 54 సంవత్సరాల స్నేహబంధం మాది. ఆయనది పాలకొల్లు, మాది నరసాపురం. ఇద్దరం ఒకే కాలేజీలో చదివాం. ఆయన బి.కాం నేను బి.యస్సీ చేశాం. మేం ఇంటర్మీడియట్ చదివే రోజులనుండే నాటకాలాడేవాళ్లం. ఆయన రాసిన ‘పన్నీరు–కన్నీరు’ నాటకంలో మేమిద్దరం అన్నదమ్ములుగా నటించాం. ఆ నాటకానికి మచిలీపట్నంలోని ‘బృందావనం నాటక కళా పరిషత్’ వారు దాసరిని ఉత్తమ నటుడు, నన్ను ఉత్తమ సహాయ నటుడు అవార్డులతో సత్కరించారు. ఆయన ‘ఇది కాదు జీవితం’ అని మాతో చెప్పి మదరాసు వెళ్లిపోయారు. అలా వెళ్లిన తర్వాత మా నాటక సమాజంలో ఉన్న స్నేహితులందరినీ మదరాసు రమ్మన్నారు. మేం ఒక్కొక్కరం చిన్నగా అక్కడికి చేరుకున్నాం. వెళ్లామే కానీ హోటల్లో ఉండే తాహతు ఎవరికీ లేదు. అప్పటికే దాసరి పెళ్లి చేసుకున్నారు. మదరాసు వెళ్లిన పదిమందిని తన ఇంట్లోనే ఉండమన్నారు. మాకోసం ఆయన సర్దుకుపోయేవారు. అలా వెళ్లిన పదిమంది సినీ పరిశ్రమలో ఏదో ఒక శాఖలో బాగానే స్థిరపడ్డాం. మా అందరికీ కర్త, కర్మ, క్రియ అంతా దాసరే. మేమందరం మంచి నటులమే కానీ సినీ పరిశ్రమలో నెట్టుకు రావటం ఎంత కష్టమో అందరికీ అర్థం అయింది. దాసరి రైటర్గా చాలా బిజీగా ఉండేవారు. రోజుకు 18 గంటలు పనిచేసేవారాయన. రైటర్గా అర్ధరాత్రి రెండింటి వరకూ రాస్తుంటే నేను వాటన్నింటినీ తెల్లారే సరికల్లా ఫెయిర్ చేసి ఇచ్చేవాణì ్న. ఆ సమయంలో నేను విపరీతంగా సిగరెట్ కాల్చేవాణ్ని. ఆయనే కొని తెచ్చి ఇచ్చేవారు. ఒకరోజు ఆయన లేని సమయంలో నేను సిగరెట్ తాగుతూ ఏదో రాసుకుంటున్నాను. ఆ సమయంలో ఓ నిర్మాత అటుగా వచ్చాడట. ఆయన వచ్చి వెళ్లినట్టు నాకు తెలియదు. ఆ రోజు దాసరి ‘ఇలా అయితే ఇక్కడ చాలా కష్టం. నిర్మాతల ముందు సిగరెట్ కాల్చటం అంటే వాళ్లను అవమానపరచటం కిందే లెక్క. నువ్వు చేసింది తప్పు’ అన్నారాయన. నాకు చాలా కోపం వచ్చింది. ‘నేను నీ ముందే సిగరెట్ తాగుతాను. ఎవరో గురించి నన్నంటావా’ అంటూ నా చేతిలో ఉన్న ప్యాడ్ను నేలకేసి కొట్టాను. అది తన ముక్కుకి తగిలి కొద్దిగా రక్తం వచ్చింది. అప్పుడు నేను లోపలికెళ్లి నా బ్యాగ్ తీసుకొని బయటికెళ్తుంటే ‘అబ్బాయి సత్యం.. ఎక్కడికి’ అంటూ నన్ను ఆపే ప్రయత్నం చేశారు దాసరి పద్మగారు. ‘సత్యం.. ఇప్పుడేమీ అవ్వలేదు, ఏం కాలేదు’ అని దాసరి వారిస్తున్నా వినకుండా ‘నీకు నాకు రాంరాం’ అంటూ నా దారిన నేను వెళ్లిపోయాను. కట్ చేస్తే.. 1973వ సంవత్సరం దాసరి ‘తాతా మనవడు’ సినిమాతో స్టార్ డైరెక్టరయ్యారు. నా దారిన నేను నా కమ్యూనిస్టు భావజాలంతో జనంలో తిరుగుతూ మీటింగ్లు గట్రా అంటూ హడావిడిగా ఉండేవాణ్ని. ‘మే’ డే సందర్భంగా రాజమండ్రి దగ్గరలోని ఓ ఊరిలో ప్రసంగించటానికి వెళ్లాను. అప్పుడు ఆయన తీస్తున్న ‘చిల్లర కొట్టు చిట్టెమ్మ’ షూటింగ్ అదే ఊరిలో జరుగుతోంది. ఇది తెలుసుకున్న దాసరి తన అసిస్టెంట్లను పంపించి నన్ను పిలిపించారు. ఆ రోజు రాత్రిని నేనెప్పటికీ మరచిపోలేను. అది నా జీవితాన్ని మార్చిన రాత్రి అని చెప్పొచ్చు. నన్ను చూడగానే హత్తుకుని ‘అయిందేదో అయిపోయింది. ఇక మద్రాసు బయలుదేరు’ అంటూ కట్టుబట్టలతో నన్ను తీసుకెళ్లారు. ‘ఇకనుండి మన ప్రయాణం ముందుకే సత్యం. ఎప్పుడూ వెనక్కి వద్దు’ అన్నారు. అప్పటికి దాసరి పెద్ద డైరెక్టర్. నాలాంటి మామూలు వాణ్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ స్నేహానికి ప్రాణమిచ్చే దాసరి అవేమీ పట్టించుకోకుండా మళ్లీ నన్ను మదరాసు తీసుకెళ్లారు. ఆ తర్వాత రెండేళ్లకు నాకు దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చింది. గత సంవత్సరం మే 30న జ్ఞాపకాలన్నింటినీ నాకొదిలి ఆయన వెళ్లిపోయారు. – దర్శకుడు ధవళ సత్యం ట్రైన్లో కథ రెడీ అయింది తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. ఆయన నాకు వాటన్నింటితో పాటు మంచి స్నేహితుడు, ఫిలాసఫర్, మార్గదర్శి అన్నీ. తన శిష్యులందరూ పైకి రావాలని తాపత్రయపడేవాడాయన. దర్శకుడిగా ఆయనకు ఎక్కడైనా పెద్ద హోటల్లో బస ఏర్పాటు చేస్తే ఆయనతో పాటు మమ్మల్ని కూడా అక్కడే ఉండమనేవారు. ఏదైనా సినిమా విడుదలై విజయం సాధిస్తే ఆ సినిమాలోని సీన్ గురించి ఎవరైనా మాట్లాడితే ఆ సీన్ రాసింది ఫలానా అసిస్టెంట్ అని పదిమందికి చెప్పేవారాయన. ‘నిర్మాతను దృష్టిలో ఉంచుకొని మనం సినిమా తీయాలి. మన నిర్మాత నవ్వుతుంటే మనం సక్సెస్ అయినట్లే’ అని చెప్పేవారు. సక్సెస్ను తలకెక్కించుకోకూడదని శిష్యులందరికీ చెప్పేవారు. ఒక సరదా సంఘటన చెప్తాను. హైదరాబాదు నుంచి బెంగళూరుకు ట్రైన్లో వెళ్తున్నాం మేమంతా. ఆయన చెప్తుంటే నేను రాసుకుంటూ వెళ్లాను. తెల్లారిపోయింది. ట్రైన్లోనే కథ, డైలాగ్ వెర్షన్ రెడీ అయ్యాయి. అదే ‘స్వర్గం–నరకం’ సినిమా. అది ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఓసారి నేను, ఆయన ఓ ప్రముఖ చానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్లాం. సడన్గా గురువుగారు ఇంటర్వ్యూ ఆపమన్నారు. నాకు భయమేసింది. ‘రామకృష్ణా.. తలకు గుడ్డ కట్టలేదేం’ అన్నారు. ‘సార్ మీ ముందు’ అన్నాను. అప్పుడాయన ‘నీ ఐడెంటిటీ నీ తలగుడ్డ. నువ్వు ఎప్పుడూ నీలా ఉండాలి’ అన్నారు. ‘మనం సినిమా తీసేది ఆస్కార్ అవార్డు కోసం కాదు. మన నిర్మాత ముఖంలో నవ్వు, ఆయన చేతి నుండి పొందే 100 రోజుల షీల్డే మనకు ఇంపార్టెంట్’ అని ఆయన చెప్పేవారు. నిర్మాతల శ్రేయస్సు కోరుకున్న మంచి దర్శకుడు. – దర్శకుడు కోడి రామకృష్ణ నిజమైన పులితో యాక్ట్ చేయించారు నాకు, దాసరిగారికి ఒక కంపేరిజన్ ఉంది. సినీ పరి శ్రమ మొదట్లో మదరాసులో ఉండే టైమ్లో నేను పదిహేను సంవత్సరాలకు పైగా ‘తెలుగు ఆర్టిస్ట్స్ అసోసియేషన్’కి అధ్యక్షుడిగా వ్యవహరించాను. అప్పుడు ఆర్టిస్టులందరి బాగోగులను చాలా సమర్థవంతంగా ఎదుర్కొని వాళ్ల సమస్యలను తీర్చినందుకే పదిహేను సంవత్సరాలు పైగా అధ్యక్షునిగా కొనసాగాను. ఆ తర్వాత కాలంలో పరిశ్రమ అంతా మదరాసు నుండి హైదరాబాద్ వచ్చింది. అప్పటికే దాసరి ఇక్కడ 24 శాఖల వారితో బాగా కలిసి మెలిసి ఉండటం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. అన్ని శాఖలు బావుంటేనే పరిశ్రమ బావుంటుందనేవారాయన. కేవలం ఆర్టిస్టుల సమస్యలను తీర్చటమే చాలా కష్టం అనుకుంటుంటే ఏకంగా ఇండస్ట్రీలోని అన్ని శాఖల వారి కష్టాలను ఓపికగా విని, వాళ్లందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకునేవారాయన. అందుకే ఆయన అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మిగిలిపోయారు. నాకు పర్సనల్గా ఆయనతో చాలా మంచి అనుబంధం ఉంది. నేను చాలా సినిమాలు ఆయనతో కలిసి పనిచేశాను. అప్పుడే ‘అడవిరాముడు’ విడుదలై సంచలన విజయం సాధించింది. ‘నీతో అంతకంటే మంచి సినిమా చేస్తాను అబ్బాయ్’ అని, ‘కటకటాల రుద్రయ్య’ మొదలుపెట్టారు. అందులో పులితో చాలా సీన్లుంటాయి. ఈ రోజుల్లో గ్రాఫిక్స్ వచ్చాయి కానీ ఆ రోజుల్లో నిజమైన పులితో నటించాను. పులితో ఎలా యాక్ట్ చెయ్యాలి? అని దాసరిగారు చెప్పేవారు. అదే సినిమాను హిందీలో జితేంద్ర చేసినప్పుడు పులితో యాక్ట్ చేయడానికి భయపడ్డారట. నాకు ‘రెబల్ స్టార్’ బిరుదు రావటానికి దాసరిగారు ఓ కారణమనే చెప్పాలి. – నటుడు కృష్ణంరాజు రాయితో ఫట్మని కొట్టారు నేను మద్రాసు వెళ్లి చిన్న చిన్న వేషాలు వేసే రోజుల్లో ఇంటర్మీడియెట్ చదువుతూ పరీక్షలు రాసి పాసయ్యా. ఎన్టీఆర్గారి పేరు పక్కన ‘బీఏ’ అని ఉండటం చూసి, నేను కూడా ఆ డిగ్రీ చేయాలనుకున్నా. ఇంటర్ రిజల్ట్ రాగానే గురువుగారితో నేను బీఏ పూర్తయ్యాక వస్తాను, వేషాలకి హెల్ప్ చేయాలని రిక్వెస్ట్ చేశా. వెళ్లి రా.. తప్పకుండా వేషం ఇస్తానన్నారు. 1976లో డిగ్రీ పూర్తి చేసి మద్రాసు వెళ్లా. అప్పుడు మా గురువుగారు ‘నీడ’ సినిమా స్టార్ట్ చేశారు. అందులో కృష్ణగారి అబ్బాయి రమేశ్బాబుగారు హీరో. నాది సెకండ్ లీడ్ వేషం. ఓ రోజు మూడు టేక్లు తిన్నా. రాళ్ల క్వారీలో షూటింగ్ జరుగుతోంది. ఓ రాయి తీసుకొని గురువుగారు ఫట్మని కొట్టారు. దెబ్బ గట్టిగా తగలడంతో నాకు కోపం వచ్చింది. ‘రమేశ్బాబుగారు ఎన్ని టేక్లు తిన్నా.. బాగా చేయమ్మా అంటూ బుజ్జగిస్తున్నారు. నన్ను మాత్రం కొట్టారేంటి?’ అనడిగా. మళ్లీ ఫట్మని కొట్టారు. ‘నోర్ముయ్ రా.. రమేశ్బాబు మా సినిమాలో యాక్ట్ చేయాలని మేమే కృష్ణగారిని అడిగాం. కానీ, నువ్వొచ్చి నన్ను అడిగావ్రా. నీ కెరీర్ని దృష్టిలో పెట్టుకో. నువ్వు యాక్ట్ చేయలేదని కొడితే కృష్ణగారబ్బాయిని కొట్టలేదని నన్ను ప్రశ్నిస్తావా?’ అన్నారు గురువుగారు. కరెక్టే కదా. సినిమా పిచ్చితో మద్రాసు వెళితే ఆ మహానుభావుడు నా ఊరేంటో? పేరేంటో? నా కులమేంటో? మతమేంటో తెలుసుకోకుండా ఎంకరేజ్ చేశారు. ఇంత మంచి వేషం ఇస్తే నేనేంటి? ఇలా అనేశాను అని ఫీలయ్యా. నేను స్టూడెంట్ని. ఆయన టీచర్. స్టూడెంట్ తప్పు చేస్తే టీచర్ కొడతాడు.. కొట్టాలి కూడా. అలా కొట్టా రు మా గురువుగారు. కరెక్టే కదా అనుకుని నేను బాధతో ఓ మూలకెళ్లి కూర్చుని ఫీలవుతున్నా. లంచ్ బ్రేక్ టైమ్ వచ్చింది. నేను తినటం లేదు. ‘రారా ఇటు.. తిను’ అంటూ మా గురువుగారు భోజనం పెట్టారు. ఆయనకేం అవసరం? ఆయన గ్రేట్ పర్సనాలిటీ. నాలాంటివాళ్లకి ఒక అండ.. భరోసా. గ్రేట్ మేన్. గురువుగారూ... సెల్యూట్. – దర్శక–నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి ఆ ఆకాంక్ష నెరవేరలేదు దాసరిగారు పెద్ద దర్శకుడే కాదు... పెద్ద మనసున్న వ్యక్తి. ఇబ్బందుల్లో ఉన్న కొందరు పేద కళాకారులకు నెల నెలా ఆర్థిక సహాయం చేసేవారు. నాకు బాగా గుర్తు. దాదాపు 20 ఏళ్ల క్రితం అనుకుంటా.. గురువుగారు ఫైనాన్షియల్గా కొంచెం ట్రబుల్లో ఉన్నారు. అప్పుడు కూడా ప్రతి నెలా పేద కళాకారులకు డబ్బులు పంపించేవారు. అంత మంచి మనిషి. ఇక.. దాసరిగారి తీరని కోరికల్లో ఒకటి అలానే మిగిలిపోయింది. ఆయనకు సావిత్రిగారంటే అభిమానం. ‘అక్కా’ అని పిలిచేవారు. ఫిల్మ్నగర్లో సావిత్రిగారి విగ్రహం పెట్టాలనుకున్నారు.చాలా రకాలుగా ప్రయత్నం చేశారు. అప్పుడు నేను ఎమ్మెల్యేని. కిరణ్కుమార్ రెడ్డిగారు ముఖ్యమంత్రి. ప్రభుత్వ అనుమతి కోసం నా ద్వారా గురువుగారు ప్రయత్నం చేయించారు. ప్రభుత్వం కూడా సుముఖంగానే ఉన్నప్పటికీ టెక్నికల్ రీజన్స్ వల్ల కుదరలేదు. ఆ తర్వాత కూడా దాసరిగారు ప్రయత్నాలు చేశారు కానీ ఆయన ఆకాంక్ష నెరవేరలేదు. ఒక కథానాయికకు విగ్రహం పెట్టాలని గురువుగారు సంకల్పించడం మరో కథానాయికగా నాకు ఆనందాన్నిచ్చింది. అది నెరవేరిందా? లేదా? అన్నది వేరే విషయం. నటీమణులంటే దాసరిగారికి ఉన్న గౌరవానికి ఇది నిదర్శనం. – నటి జయసుధ గురువుగారి మాటలు గుర్తొస్తున్నాయి ఒక రోజు మా గురువుగారు నాతో మాట్లాడుతూ.. ‘‘పద్మ ఉన్నంతకాలం నాకు ఏ కష్టం, లోటు తెలియలేదు. ఆవిడ పోయిన తర్వాత తెలుస్తోంది’’ అన్నారు. ఆ రోజు ఆయన అన్న ఆ మాటలు రోజూ ఏదో సందర్భంలో గుర్తొస్తున్నాయి. ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాయంటే.. పరిశ్రమలో ఎవరికి కష్టం వచ్చినా గురువుగారి దగ్గరకు వెళితే చాలు పరిష్కారమవుతుంది. ఆయన ఉన్నప్పుడు లేని కష్టాలు, కన్నీళ్లు ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తున్నాయి. ఈ మధ్య పరిశ్రమలో జరిగిన అనేక సంఘటనలను ప్రపంచమంతా నివ్వెరపోయి చూసింది. అప్పుడు అందరూ ఒక మనిషి పేరే తలచుకున్నారు. ఆయనే దాసరి గారు. గురువుగారిలానే ఎంతోమంది అద్భుతమైన దర్శకులు ఈ పరిశ్రమలో ఉన్నారు కానీ వారంతా వారి పని చూసుకుని వెళ్లిపోతుంటారు. అది నేరమేమీ కాదు. దాసరి గారి ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. 24 శాఖల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ ఇంటి దారే పట్టేవారు. ఎవరు ఏ సమయంలో వెళ్లినా ఆకలితో బయటికెళ్లేవారు కాదు. దాసరిగారితో పాటు ఆయన డైనింగ్ టేబుల్ మీద ఓ యాభైమంది భోజనం చేసేవాళ్లం అంటే అతిశయోక్తి కాదేమో. ఈ రోజు (మంగళవారం) ఉదయం ఓ నిర్మాత కలిసి మీ గురువుగారిలాంటి వ్యక్తి ఇంకో అవతారం ఎత్తి రావాలి అంటుంటే నా కళ్లు చెమర్చాయి. – దర్శకుడు రేలంగి నరసింహారావు నాకూ గురువుగారే సినిమా ఇండస్ట్రీలో అంకుల్ని అందరూ ‘గురువుగారూ’ అంటారు. నాక్కూడా ఆయన గురువుగారే. జీవితానికి ఉపయోగపడే ఎన్నో సలహాలు ఇచ్చారు. ‘క్రమశిక్షణ చాలా ముఖ్యం’ అనేవారు. ఆయన్నుంచి నేను నేర్చుకున్నది క్రమశిక్షణ. ఆయన విషయంలో నాకు ఆశ్చర్యంగా అనిపించినదేంటంటే.. హ్యాపీనెస్ని అందరితో పంచుకునేవారు. కష్టాలను మాత్రం ఒక్కరితోనూ చెప్పుకునేవారు కాదు. వెరీ స్ట్రాంగ్. నేనోసారి ‘‘మాతో కష్టాలను షేర్ చేసుకోవచ్చు కదా అంకుల్’ అంటే, ‘‘మనిషికి కష్టం అంటే మరణం మాత్రమే. మిగతాదేదీ కష్టం కాదు. సాల్వ్ చేసేసుకోవచ్చు. ఎవరి దగ్గరా చెప్పుకోనక్కర్లేదు. సమస్య వచ్చినప్పుడు ఒక బంతిలా నేను బౌన్స్ బ్యాక్ అవ్వగలను’’ అన్నారు. అత్తయ్య (దాసరి పద్మ)గారు ఉన్నంతవరకూ ప్రతి ఆదివారం మేమందరం లంచ్కి కలవాల్సిందే. గోదావరి జిల్లావాళ్లకు మర్యాదలు ఎక్కువ అంటారు కదా. ఇక అల్లుడికైతే చెప్పాల్సిన పని లేదు. ఆ విధంగా మా అంకుల్ నాకు ఎక్కువ మర్యాదలు చేసేవారు. బయటివాళ్ల దగ్గర నా గురించి చెప్పేటప్పుడు ‘అల్లుడుగారు’ అనేవారు. చెప్పాలంటే.. అలాంటి వ్యక్తికి అల్లుణ్ని కావడం నా అదృష్టం. – డా. రఘునాథ్బాబు (దాసరి అల్లుడు) -
సరిలేరు నీకెవ్వరు
-
ఫిలిం ఛాంబర్లో దాసరి విగ్రహాన్ని ఆవిష్కరణ
-
దాసరి లాంటి పెద్దలు కావాలి: పవన్
సాక్షి, హైదరాబాద్: దర్శకరత్న, నిర్మాత, నటుడు డాక్టర్ దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని మే 4ను 'డైరెక్టర్స్ డే'గా నిర్ణయించడం సంతోషకరమని సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. దర్శకుడి పేరుకి ఓ బ్రాండ్ తీసుకొచ్చి.. దర్శకుడి స్థాయిని సగర్వంగా పెంచిన వ్యక్తి దాసరి అని కొనియాడారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. దాసరి మొదటి సినిమా తాతామనవడు నుంచి వారి సినిమాల్లో కుటుంబ విలువలు, సామాజికి స్పృహ కనిపించేవని, దాసరితో తనకు మంచి అనుబంధం ఉండేదని ఆయన గుర్తు చేసుకున్నారు. తెలుగు సినీ కుటుంబానికి పెద్దగా దాసరి స్థానం సుస్థిరమని పవన్ అభిప్రాయపడ్డారు. తెలుగు సినిమాకు దాసరి లాంటి కుటుంబ పెద్దల అవసరం ఎంతైనా ఉందన్నారు. దాసరి బాటను అనుసరించినప్పుడే ఆయనకు ఘనమైన నివాళి అర్పించినట్లని పవన్ పేర్కొన్నారు. రంగస్థలం నుంచి సినిమాలకి వచ్చిన దాసరి.. ఓ నటుడిగా, నిర్మాతగా, రచయితగా సినీ రంగానికి సేవలందించారని చెప్పారు. కాగా, నేడు దాసరి 71వ జయంతి. శుక్రవారం ఉదయం దాసరి ఇంట్లో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఫిల్మ్ నగర్ సొసైటీ కాంప్లెక్స్లో సాయంత్రం దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. దాసరి జయంతిని పురస్కరించుకుని తెలుగు చిత్ర పరిశ్రమ ఆయనకు అరుదైన గౌరవాన్ని అందిస్తూ.. మే 4ను డైరెక్టర్స్ డే ప్రకటించిన విషయం తెలిసిందే. టాలీవుడ్కు చెందిన పలువురు దాసరి సేవల్ని కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. -
‘దర్శకుల ద్రోణాచార్యుడు దాసరి’
సాక్షి, హైదరాబాద్: దర్శక దిగ్గజం, నిర్మాత, నటుడు డాక్టర్ దాసరి నారాయణరావు 71వ జయంతి నేడు(మే 4). ఆ దివంగత దిగ్గజానికి నివాళిగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ అరుదైన గౌరవాన్ని అందించింది. ఆయన జయంతిని డైరెక్టర్స్ డేగా ప్రకటించింది. భౌతికంగా ఆయన దూరమైనా.. ఆయన చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుండిపోతారని తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం ఈ సందర్భంగా ప్రకటించింది. దాసరి జయంతి వేడుకలను నేడు ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్లో నిర్వహించనున్నారు. ఇక పలువురు దర్శకులు ఆయన్ని గుర్తు చేసుకుంటూ తమ సందేశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ‘తెలుగు చలన చిత్ర పరిశ్రమకు భీష్మాచార్యుడు, తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘానికి ద్రోణాచార్యుడు , సినిమా ఇంటికి పెద్ద, దాసరి నారాయణ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. ఆయన గొప్ప హృదయం ఉన్న వ్యక్తి అని.. ఇండస్ట్రీలో ఎందరికో మార్గదర్శి అని దర్శకుడు శీనువైట్ల పేర్కొన్నారు. ‘అందరం ఇక్కడే ఉన్నాం. కానీ ఆయనలేరు. దాసరి నారాయణ రావు గారు లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది అని దర్శకుడు పూరి జగన్నాథ్ ట్వీట్ చేశారు. ఈ వేడుకలో భాగస్వామి అవుతున్నందుకు గర్వంగా ఉందని దర్శకులు హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి, సంపత్ నందిలు ట్వీట్లు చేశారు. దర్శకరత్న , ఆదర్శమూర్తి , సినీపరిశ్రమలో పెద్దాయన అన్న పిలుపుకు న్యాయం చేసిన మా పెద్ద దిక్కు , కీర్తిశేషులు దాసరి నారాయణరావు గారికి జన్మదిన నివాళులు అర్పిస్తూ .. ఈరోజు దర్శకుల రోజుగా ప్రకటించడం గొప్ప ఆలోచన అని కోన వెంకట్ తెలిపారు. హీరో మంచు మనోజ్, నటి మంచు లక్ష్మీ దాసరితో తమ అనుబంధం గుర్తు చేసుకుంటూ ట్వీటర్లో పోస్టులు చేశారు. ఇక ఈ ఉదయం దాసరి ఇంట్లో పుట్టినరోజు వేడుకలు జరగ్గా, దాసరి టాలెంట్ అకాడమి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని అభిమాన సంఘాలు ప్రకటించాయి. మరోవైపు ఫిల్మ్ నగర్ సోసైటీ కాంప్లెక్స్లో సాయంత్రం దాసరి నారాయణరావు విగ్రహావిష్కారణ కార్యక్రమం జరగనుంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, నటశేఖర కృష్ణ, విజయనిర్మలా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. -
విశాఖలో దాసరి జయంతి ఉత్సవాలు
-
శిఖరం
-
హాస్య, కుటుంబ కథా చిత్రాలంటే ఎంతో ఇష్టం
నెల్లూరు(బృందావనం): ప్రముఖ దర్శకులు దాసరినారాయణరావు శిష్యుడిగా తాను హాస్యానికి ప్రాధాన్యమిస్తూ కుటుంబ పరమైన చిత్రాలను నిర్మించినందుకు ఎంతో సంతృప్తిని పొందుతున్నానని ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు అన్నారు. శతవసంతాల చిత్ర దర్శకుడు కేఎస్ఆర్ దాస్ జయంతిని పురస్కరించుకుని మనం చారిటబుల్ట్రస్ట్, కొండాసోదరుల సంయుక్త ఆధ్వర్యంలో జీవిత సాఫల్య పురస్కారం అందుకునేందుకు ఆదివారం ఆయన నెల్లూరు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో కొద్దిసేపు మాట్లాడారు. తన సొంత ఊరు పాలకొల్లు అని ఫొటోగ్రఫీపై ఉన్న ఆసక్తితో సినిమారంగంలో ప్రవేశించానన్నారు. తొలినాళ్లలో దాసరినారాయణరావు దగ్గర ఫొటోగ్రఫీలో మెళకువలు తెలుసుకున్నానన్నారు. పలువురు దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్గా పనిచేసినట్లు తెలిపారు. తెలుగు చలనచిత్ర రంగంలో 1981 ప్రవేశించిన తాను ఇప్పటి వరకు 75సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించానన్నారు. ఇందులో 24చిత్రాలు చంద్రమోహన్తో 32 చిత్రాల రాజేంద్రప్రసాద్తో ఉన్నాయన్నారు. తమిళంలో ఒకటి, కన్నడంలో ఏడు చిత్రాలు నిర్మించినట్లు చెప్పారు. ప్రస్తుతం రెండు చిత్రాలను నిర్మించనున్నానని వివరించారు. తనకు హాస్య, కుటుంబ కథా చిత్రాల నిర్మాణ సమయంలో చంద్రమోహన్, కాశీవిశ్వనాథ్, పూసల సహకరించారన్నారు. తనకు హాస్యమన్నా, కుటుంబ అంశమన్నా ఎంతో ఇష్టం కావడంతో తన చిత్రాలన్నీ హాస్యభరిత కుటుంబ చిత్రాలేనన్నారు. నేడు వస్తున్న చిత్రాలు యువతకోసంగా ఉన్నాయని, కుటుంబపరంగా లేవన్నారు. -
విలన్గా మరో హీరో..?
సీనియర్ హీరోలతో పాటు పెద్దగా ఫాంలోని లేని హీరోలందరూ ఇప్పుడు నెగెటివ్ రోల్స్ పై దృష్టి పెడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో మరో స్టార్ వారసుడు చేరబోతున్నాడట. చాలా కాలం కిందటే గ్రీకువీరుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు దాసరి అరుణ్ కుమార్. దర్శకరత్న దాసరి నారాయణరావు వారసుడిగా వెండితెరకు పరిచయం అయినా.. ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు అరుణ్. దీంతో సినిమాలకు దూరమయ్యారు. అయితే ఇటీవల దాసరి మరణించిన సమయంలో తన నాన్న కోరి నన్ను నటుడిగా చూడటమే అని చెప్పిన అరుణ్ ప్రస్తుతం ఆ ప్రయత్నాల్లో ఉన్నాడు. అల్లు శిరీష్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో దాసరి అరుణ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఈ సినిమాలో అరుణ్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా అరుణ్ కు నటుడిగా బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. -
మామగారు... ఊరుకోరు...
సమ్సారం సంసారంలో సినిమా దుర్గాప్రసాద్ బీకామ్లో ఫిజిక్స్ చదువుకోలేదు. ఒకవేళ అలాంటి ఆడ్ చదువు చదివి ఉంటే అతడికి మనుషుల్ని మడత పేచీలని చదవడం తెలిసేదేమో. ముఖ్యంగా మామగారిని చదవడం తెలిసేదేమో. దుర్గాప్రసాద్కు అతని మామగారు అర్థం కాడు. ఈ సమస్య ఇప్పుడల్లా పోదు. దుర్గా ప్రసాద్ మంచి భర్త. అతడు చిన్నప్పుడు చీమలకు చక్కెర పోసేవాడు కాబట్టి దేవుడు మెచ్చి అతడికి మంచి భార్యను ఇచ్చాడు. అయితే అతడే ఒకసారి తన క్లాస్మేటు అంజిగాడు జామెట్రీ బాక్సులో దాచుకున్న జీడిముక్కలు కాజేశాడు కనుక దేవుడు కోపగించి అతడికి చెడ్డ మామగారిని కూడా ఇచ్చాడు. చెడ్డ మామగారంటే సినిమాల్లో విలన్లా రావుగోపాలరావులా ఉంటాడని అనుకోవడానికి వీల్లేదు. దుర్గా ప్రసాద్ మామగారిది పాము పొట్ట. కనుక ఎంత తిన్నా పొట్ట కనపడదు. వెదురు పుటక. కనుక ఏం చేసినా లావు పెరగడు. ముళ్లపంది అనువంశీకం. కనుక ఎంత దువ్వినా జుట్టు రాలదు. చక్కగా చల్ మోహన్ రంగా అనుకుంటూ ఇప్పటికిప్పుడు పెళ్లి చేసినా తాళి కడతాను అన్నట్టుగా ఉంటాడు. టీచర్గా క్లాసులను పొదుపుగా చెప్పి ఎనర్జీని బాగా సేవ్ చేసుకున్నాడు. ఇప్పుడు రిటైరయ్యి ఏం చేయాలో తోచక ఒక్కగానొక్క కుమార్తె దగ్గరకు వచ్చి చేరాడు. ‘పాపం... నాన్న కదండీ’ అంటుంది భార్య. ‘నాకు నరకం కదటే’ అంటాడు భర్త. పుణ్యం కొద్దీ పురుషుడు అనేది పాతమాట. ప్రాప్తం కొద్దీ మామగారు అనేది కొత్తమాట. మగాడనేవాడు గుడికి వెళ్లి మంచి భార్య కోసం మొక్కుకోవడానికి ఒక గజం ముందే మంచి మామగారి కోసం మొక్కుకోవాలని సెంటర్లో బండ్లాపి చాయ్లు తాగే పెళ్లి కాని కుర్రాళ్లకు చెబుతూ ఉంటాడు. టార్చర్కు కత్తులు కటార్లు అక్కర్లేదు. న్యూస్ పేపర్ చాలు. దుర్గాప్రసాద్ ఏడున్నరకు– అంటే ఎర్లీ కిందనే లెక్క– లేస్తాడు. కాని మామగారు అంతకు హాఫెనవర్ ముందు లేచి ఇంటికి వచ్చే హిందు, ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి న్యూస్పేపర్లన్నింటినీ చదివి ఫ్రీగా మడత పెట్టి ఉంటాడు. మడత నలిగిన న్యూస్ పేపర్ చదవడం దుర్గాప్రసాద్కు నచ్చదు. అలాంటి న్యూస్పేపర్ అతడికి చితికిన కమలాపండులా అనిపిస్తుంది. మామగారు రాకమునుపు కరకరలాడే న్యూస్పేపర్ తెరిచి కాఫీ తాగుతూ వార్తలు చదవడాన్ని ఎంజాయ్ చేసేవాడు. మామగారు వచ్చాక పేపర్ ఇక్కట్లే కాదు, కాఫీ కష్టాలూ వచ్చాయి. అప్పటికి ఆయన రెండుసార్లు ఫిల్టర్ కాఫీని జుర్రేస్తుండేసరికి తనకు డికాషన్ తక్కువ పలుచటి కాఫీయే గతి అవుతూ ఉంది. మామగారికి పౌడరు పిచ్చి. అల్లుడుగారికి వాసనలు పడవు. మామగారు బజారు నుంచి రోజ్, జాస్మిన్, కాలిఫ్లవర్ వంటి ఫ్లేవర్స్ ఉన్న పౌడర్లు తెచ్చి మెడకు అద్దుకుని కాలర్ వెనక్కు నెట్టి ఫ్రెష్ ఫీలవుతుంటాడు. అంతటితో ఆగితే మేలే. స్కూలు నుంచి వచ్చిన పిల్లలకి స్నానం చేయించి వారి వొళ్లంతా కూడా జల్లుతాడు. దుర్గాప్రసాద్కు ఆఫీసు నుంచి రాగానే పిల్లలను దగ్గరకు తీసుకోవడం అలవాటు. ఈ పౌడరు వాసన పిల్లలను దగ్గరకు తీసుకుంటూ ఉంటే ఊపిరాడక అలర్జీతో ఒకటే తుమ్ములు. మామగారి మూడ్స్ కూడా చాలా తీవ్రంగా మారిపోతుంటాయి. ఉదాహరణకు ‘కొంగు బంగారం’ సీరియల్లో వినిత అనే పాత్రధారిని ఆమె భర్త చెంపకు పట్టించి కొట్టిన రోజు ఆయన అగ్గిరాముడే అయ్యాడు. ‘ఆడదాని మీద చెయ్యేస్తాడా. అదే నా కూతురైతేనా వాడి పేగులు తీసి మేకులు దించేవాణ్ణి’ అని ఊగిపోయాడు. దుర్గాప్రసాద్ ఎందుకైనా మంచిదని ఆ రోజు నుంచి ఆయన ఎదుట భార్య భుజం మీద కూడా చేయి వేయడం మానేశాడు. మామగారికి పొట్లకాయ, పనసకాయ, పొటాటో వంటి ‘ప’ అక్షరం కూరగాయలంటేనే ఇష్టం. దుర్గాప్రసాద్కు కొంచెం మటన్ ముక్కో చికెన్ తునకో తగలాలి. ‘ఒక మనిషిని సుపారీ ఇచ్చి చంపడం, ఒక కోడిని తరాజులో పెట్టి తూయడం రెండూ పాపాలే’ అంటాడు మామగారు. పైగా మటన్ వండిన రోజు తన నిరసనలో భాగంగా గ్లాసు పాలు మాత్రమే తాగి పడుకుంటాడు. ‘ఇది పరోక్ష హింస కాదా’ అని దుర్గా ప్రసాద్ భార్య దగ్గర వెచ్చటి వెక్కిళ్లు పెట్టేవాడు. అయితే దేవుడు కూడా ఒక మగవాడే కనుక అతడికి సాటి మగవాడంటే జాలి కనుక దుర్గా ప్రసాద్ దృష్టి ఒక న్యూస్ పేపర్ కటింగ్ మీద పడేలా చేశాడు.ఈ సీజన్లో అమర్నాథ్ యాత్ర చేయడం పుణ్యదాయకమనీ సీనియర్ సిటిజన్స్కు ప్రత్యేక ఏర్పాట్లు చేసి తీసుకుపోతున్నామని కనీసం నెలరోజుల పాటు ఈ యాత్ర సాగుతుందని ఆ ప్రకటన సారాంశం. అయితే దాని కంటే ముఖ్యం – ఆ యాత్రలో ప్రమాదాలు పొంచి ఉంటాయన్న హెచ్చరిక అతణ్ణి ఆకర్షించింది. దుర్గాప్రసాద్ స్వతహాగా పొదుపరి. అయినప్పటికీ మామగారి కోసం ఆ యాత్రను బుక్ చేశాడు. ‘మీరొక్కరే క్షేమంగా వెళ్లి లాభంగా రండి మామగారు’ అని ఎంతో భక్తి శ్రద్ధలు ప్రదర్శించాడు.మామగారు ప్రస్తుతం అమర్నాథ్ యాత్రలో ఉన్నారు. దుర్గాప్రసాద్ చాలా రోజుల తర్వాత తృప్తిగా న్యూస్ పేపర్ చదివాడు. తృప్తిగా కాఫీ తాగాడు. ఆ రాత్రి తృప్తిగా కోడికూరతో భోం చేశాడు. అంతే కాదు సుమా. ధైర్యంగా భార్య భుజం మీద చేయి కూడా వేశాడు.మామగారు వచ్చాక మామగారికి ఈ సంగతి తెలిస్తే ఊరుకుంటారో... కోరో. సినిమాలో సంసారం పనిమానేసి కబుర్లేంట్రా సత్తెయ్య(దాసరి నారాయణరావు) సంతలో పశువులు అమ్మడం, కొనడం చేస్తుంటాడు. పశువులు అమ్మిన డబ్బుతో ఇంటికొస్తుండగా ఓ సారి దొంగలు డబ్బు కోసం ఆయన్ను చంపాలని చూస్తారు. వారి బారి నుంచి దుర్గసముద్రం ప్రెసిడెంట్ విజయ్బాబు(వినోద్ కుమార్) సత్తెయ్యను కాపాడుతాడు. విజయ్ అక్క (అన్నపూర్ణ), బావ పోతురాజు(కోట శ్రీనివాసరావు) తమ కూతురు రాణిని(ఐశ్వర్య) విజయ్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. సత్తెయ్య కూతురు లక్ష్మిని (యమున) ఇష్టపడిన విజయ్బాబు ఆమెనే పెళ్లి చేసుకుంటాడు. ఒంటరి అయిన మామగారిని ఇక కష్టపడకుండా తమతో పాటే ఉండి హాయిగా విశ్రాంతి తీసుకోమని చెబుతాడు విజయ్బాబు. కష్టానికి అలవాటు పడ్డ సత్తెయ్య అల్లుడి పొలంలో పని చేస్తూ, ఇతర కూలీలతో పనులు చేయిస్తుంటాడు. ఓ రోజు... పొలంలో పని మానేసి కబుర్లు చెప్పుకుంటుంటారు కూలీలు. వారి వద్దకు వచ్చిన సత్తెయ్య కూలీలతో ‘‘పనిమానేసి కబుర్లేంట్రా. కలుపు తీయడం పూర్తయితే ఎరువులు చల్లాలి. త్వరగా పని కానివ్వండి’’ అంటూ దబాయిస్తుంటాడు. ఈ ముసలాడేంట్రా మన పైన పెత్తనం చెలాయిస్తున్నాడంటూ మాట్లాడుకుంటారు కూలీలు ‘మామగారు’ చిత్రంలో. సత్తెయ్య చేసే కొన్ని పనులు అల్లుడు వినోద్కుమార్కి ఇబ్బందిగానే ఉంటాయి. అయినా సరే... మామగారు ఎక్కడ నొచ్చుకుంటారోనని ఏమీ అనలేక, అన్నింటినీ భరిస్తుంటాడు. – శేఖర్ వెనిగళ్ల -
తెరపైకి దాసరి జీవితకథ
పాలకొల్లు టు హైదరాబాద్ వయా చెన్నై.. దర్శకరత్న దాసరి నారాయణరావు సినిమా జర్నీ ఇది. ఈ జర్నీలో ఎన్నో విజయాలు, అపజయాలూ ఉన్నాయి. దర్శకుడిగా, నటుడిగా, రచయితగా, నిర్మాతగా దాసరి రియల్ లైఫ్ని రీల్పై చూడబోతున్నాం. ఈ దర్శక దిగ్గజం జీవితకథతో ఓ సినిమా తీయనున్నట్లు నటుడు, ఫిల్మ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు ఓ. కల్యాణ్ ప్రకటించారు. ఓ. కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘సినీ కళామతల్లికి దాసరిగారు ముద్దు బిడ్డ. సినీ రంగానికి ఆయనొక దిక్సూచి. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది. దాసరిగారు మన మధ్య లేకున్నా ఆయన జ్ఞాపకాలు మనతోనే ఉండాలని ఆయన బయోపిక్ నిర్మించబోతున్నా. గురువుగారి జీవితంలోని ఎత్తుపల్లాలను ఈ సినిమాలో చూపిస్తాం. దాసరిగారి ప్రియ శిష్యుడైన ఓ డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తారు. టైటిల్, నటీనటుల వివరాలు త్వరలో చెబుతా’’ అన్నారు. -
త్వరలో దాసరి బయోపిక్
ఇటీవల మరణించిన ప్రముఖ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు జీవితం ఆదారంగా సినిమా తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నటుడు, ఫిలిం ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు ఓ.కళ్యాణ్ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. దాసరి శిష్యుల్లోని ఓ ప్రముఖ దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉందని తెలిపారు. ఇదే తమ గురువుగారికి తానిస్తున్న ఘననివాళి అని ప్రకటించారు ఓ.కళ్యాణ్. ఈ సినిమాతో దాసరి సినీ రాజకీయ జీవితాన్ని ప్రస్థావించనున్నారు. ఆ సాధించిన విజయాలు, ఆ ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా తెర మీద చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో నటించబోయే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
నాన్న ఇష్టాన్ని నెరవేరుస్తా!
‘‘నాన్న చనిపోయారనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. అసలిలా జరుగుతుందని ఊహించలేదు’’ అని దాసరి అరుణ్కుమార్ అన్నారు. ఇటీవల ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న ఆయన మరణం సినీ వర్గాలకు పెద్ద లోటు. ‘‘మా ఫ్యామిలీకి కూడా తీరని లోటు’’ అని అరుణ్ కుమార్ చెబుతూ– ‘‘నాన్న ఆపరేషన్కి వెళ్లే ముందు ధైర్యంగా కనిపించారు. ఇలా జరుగుతుందని ఆయన ఊహించలేదు. మేం కూడా ఊహించలేదు’’’ అన్నారు. మీ కెరీర్ పుంజుకుంటే బాగుంటుందని పలు సందర్భాల్లో దాసరిగారు అన్నారు. మీతో ఆ విషయం గురించి మాట్లాడేవారా? అనే ప్రశ్నకు – ‘‘సినిమాలు చెయ్యిరా.. ఎదగాలి’ అనేవారు. నేనేమో అంత ఇంట్రస్ట్ చూపించేవాణ్ణి కాదు. నాన్నకి బాధగా ఉండేది. ఆయన ఉన్నప్పుడు నాకేం అనిపించలేదు కానీ, ఇప్పుడు నాన్న ఇష్టాన్ని తీర్చాలనే సెంటిమెంట్ బలపడింది. అందుకే ఇకనుంచి సినిమాలు చేయాలనుకుంటున్నా’’ అన్నారు. హీరోగా చేస్తారా? అనడిగితే – ‘‘అలా ఆలోచిస్తే తప్పు అవుతుంది. హీరోగా చేయడం కరెక్ట్ కాదు. మంచి క్యారెక్టర్ రోల్స్, విలన్గా చేయాలనుకుంటున్నా’’ అని అరుణ్కుమార్ అన్నారు. మీ నాన్నగారిలా డైరెక్షన్ చేయరా? అనడిగితే – ‘‘డైరెక్షన్ చాలా చాలా టఫ్. నా వల్ల కాదు. ప్రొడక్షన్ వ్యవహారాలు మాత్రం చూసుకోగలుగుతాను. నాన్న ఉన్నప్పుడు చూసేవాణ్ణి’’ అన్నారు. -
దాసరికి నివాళులర్పించిన వైఎస్ జగన్
హైదరాబాద్: దివంగత సినీ దర్శకుడు దాసరి నారాయణరావు సంస్మరణ సభ ఆదివారం నగరంలోని ఇమేజ్ గార్డెన్లో జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ సభకు హాజరయ్యారు. దివంగత దాసరి విగ్రహానికి పూలమాల వేసి వైఎస్ జగన్ నివాళులర్పించారు. దాసరి సేవలను కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. విదేశాల్లో ఉండటంతో దాసరిని కడసారి వైఎస్ జగన్ చూడలేకపోయారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా దాసరి సంస్మరణ సభకు హాజరై నివాళులర్పించారు. సినీ, రాజకీయ, మీడియా రంగాలలో అపారమైన కృషి చేసిన దాసరి నారాయణరావు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ శనివారం నగరంలోని ఫిలించాంబర్లోనూ సంస్మరణ సభ నిర్వహించారు. -
దాసరి సంస్మరణ సభ
-
పెద్ద దిక్కును కోల్పోయాం..
దర్శకరత్న దాసరి సంతాప సభల్లో వక్తలు ► ఎంతోమందికి ఆప్యాయతను పంచిన వ్యక్తి దాసరి: చిరంజీవి ► తండ్రి లాంటి వ్యక్తిని పోగొట్టుకుని సినీ కార్మికులు అనాథలయ్యారు.. ► కులం అడగకుండా అవకాశమిచ్చారు..: ఆర్.నారాయణమూర్తి సాక్షి, హైదరాబాద్: ‘దర్శకరత్న’ డాక్టర్ దాసరి నారాయణరావు కార్మికుల కష్టాలను తన కష్టాలుగా భావించేవారని, సినీ పరిశ్రమలో ఎవరికి ఏ అవసరం వచ్చినా సహాయం చేశారని వక్తలు పేర్కొన్నారు. సినీ పరిశ్రమల్లో 24 శాఖలకు వారధిగా ఉండేవారని, పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయిందని అన్నారు. హైదరాబాద్లో శనివారం ఉదయం తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం, సాయంత్రం యావత్ చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో దాసరి నారాయణరావు సంతాప సభలు జరిగాయి. ఈ రెండు సభల్లో పలువురు ప్రముఖులు పాల్గొని దాసరి వ్యక్తిత్వం గురించి, ఆయనతో తమ అనుబంధం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. ఆయన లేని లోటు భర్తీ చేయలేనిదని పేర్కొన్నారు. తన కష్టాలుగా భావించారు: చిరంజీవి దాసరి నారాయణరావు ఆస్పత్రిలో చేరిన మొదట్లో నేను వెళ్లినప్పుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. పేపర్ తీసుకుని ‘నీ సినిమా స్కోర్ ఎంత’ అని అడిగారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన నా సినిమా ఎలా ఆడుతోందో తెలుసుకోవాలని ఉత్సాహం చూపించారు. ‘హయ్యస్ట్ గ్రాసర్ అవుతుంది’ అనగానే, చిన్న పిల్లాడిలా విజయ సంకేతం చూపించారు. ఆయన చివరి సారిగా పబ్లిక్ ఫంక్షన్లో మాట్లాడింది మా ‘ఖైదీ నంబర్ 150’ ప్రీ–రిలీజ్ ఫంక్షన్లోనే. చివరిసారిగా ప్రెస్ను అడ్రెస్ చేస్తూ మే 4న తన పుట్టిన రోజు నాడు ఆయన మాట్లాడారు. ఆ రోజు శ్రీ అల్లు రామలింగయ్య అవార్డు ఆయనకు అందజేసినప్పుడు తన సంతోషాన్ని తెలియజేశారు. ఆయన ఆశీస్సులను మాకు అందజేశారు. ఆ రకంగానైనా ఆయన ఆశీస్సులు పొందడం, ఆ రెండు సభల్లో నేను పాలుపంచుకోవడం తృప్తినిచ్చింది. ఇటీవల వారి ఇంట్లో కొంతమంది పెద్దలతో సమావేశం జరిగినప్పుడు మేం 50 మందిదాకా వెళ్లాం. ‘నువ్వు మా ఇంట్లో భోజనం చేసి వెళ్లాలి. మన జిల్లా నుంచి వచ్చిన బొమ్మిడాయిలు తినాలి’ అంటూ దగ్గరుండి నాకు తినిపించి, పితృ వాత్సల్యం చూపించారు. ఎంతోమందికి ఆప్యాయతానురాగాలు పంచిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు మన మధ్య లేరు. ఈ రోజు ఎంతో మంది సినిమా కార్మికులు ఆ బాధను అనుభవిస్తున్నారు. అలాంటి బాధే నాకూ ఉంది. ఒక పెద్ద దిక్కును, తండ్రి వంటి వ్యక్తిని పోగొట్టుకుని సినీ కార్మికులు అనాథలయ్యారు. కార్మికుల కష్టాలను తన కష్టాలుగా భావించారు. దాసరి లేని లోటు ఎవరూ పూడ్చలేనిది.. తీర్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. గీతా ఆర్ట్స్ ఆయన వేసిన పునాదే నా మొదటి రెండు సూపర్ హిట్స్ (‘బంట్రోతు భార్య, దేవుడే దిగి వస్తే’)కి దాసరి దర్శకులు. గీతా ఆర్ట్స్ నలభై ఏళ్ళుగా నిలబడి ఉందంటే అది ఆయన వేసిన పునాదే. ప్రతి చిన్నవాడు కొట్టగలిగే ఒకే ఒక్క తలుపు దాసరి నారాయణరావు ఇల్లు. ఇండస్ట్రీలో నిర్మాతలకు, వర్కింగ్ క్లాస్కు మధ్య వారధిగా నిలిచిన వారు దాసరి. ఆ ‘వారధి’ లేరిప్పుడు. – నిర్మాత అల్లు అరవింద్ ప్రతి ఒక్కరికీ సాయం చేశారు ‘దాసరి నారాయణరావు తెలుగు చిత్రసీమకు గురువు. ఆయనకు ఎవరిపైనా ద్వేషం లేదు. అడిగిన ప్రతి ఒక్కరికీ సహాయం చేశారు’ అని తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం నిర్వహించిన శ్రద్ధాంజలి సభలో దర్శకుడు ‘ధవళ’ సత్యం అన్నారు. ఇటీవల స్వర్గస్తులెన దర్శకుల సంఘం సభ్యులు కేఎస్ రావుగారు, తిరుమలరావు మృతికి ఇదే వేదికపై సంతాపం ప్రకటించారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ ‘చిత్రసీమలోని 24 శాఖల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించ గల గొప్పవ్యక్తి దాసరిని కోల్పోవడం మన దురదృష్టం. ఈ కార్యక్రమానికి రాలేని దర్శకులకు దండాలు. తెలిసీ రాని దర్శకులకు శతకోటి దండాలు’ అని అన్నారు. కార్యక్రమంలో దర్శకులు ముత్యాల సుబ్బయ్య, రేలంగి నరసింహారావు, క్రిష్ణమోహన్రెడ్డి, సత్యనాయుడు, రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎంత చెప్పినా తక్కువే మద్రాసులో ఎటూ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు ‘తమ్ముడూ..’ అని పలకరించిన నా గురువు దాసరి నారాయణ రావును ఎప్పటికీ మరచిపోలేను. నీ కులమేంటి? మతమేంటి అని అడగకుండా అవకాశం ఇచ్చిన ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. – నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి -
గురుభ్యోనమః
గురువు గారికి నేను వీరాభిమానిని. ఆయనను తెగ పొగిడేవా డిని. ఆయన కొన్ని సినిమాలకు నేను రచయితను. ఆయనతో దెబ్బలాడేవాడిని. ఆయనకు నేను సన్నిహితుడిని. ఆయన భావో ద్వేగాలను పంచుకునేవాడిని. ప్రేమాభిషేకం గొప్ప సినిమా అని అంటే, ‘‘అది నేను ఆడుతూ పాడుతూ తీశానయ్యా. దేవదాసు మళ్లీ పుట్టాడు ప్రాణం పెట్టి తీశా, గొప్ప సినిమా’’ అనేవాడు. బొబ్బిలిపులి అదిరి పోయింది అంటే, విశ్వరూపం కూడా చాలా మంచి సినిమా అనే వాడు. తన ఆడిన సినిమాలకంటే, ఆడని సినిమాలను ఎక్కువ సొంతం చేసుకునేవారు. ఆదుర్తి సుబ్బారావు గారు గురువు గారి అభిమాన దర్శకుడు. ఒక రకంగా ఆయనను ఫాలో అయ్యారు. ఆదుర్తి గారు అందరు కొత్త వాళ్ళతో తేనె మనసులు తీశారు. అది పెద్ద హిట్టు. గురువు గారు కూడా అందరు కొత్త వాళ్ళతో స్వర్గం–నరకం తీశారు. అదీ పెద్ద హిట్టు. ఆదుర్తిగారు ప్రయోగాత్మకంగా సుడిగుండాలు తీశారు. ఆడలా! గురువుగారు అలాంటిదే నీడ సినిమా తీశారు. ఆడింది!! అవి శంకరాభరణం సినిమా గొప్పగా ఆడుతున్న రోజులు. ఒకరోజు రాత్రి విజయవాడ స్టేషన్లో గురువుగారు... జనం గుమి గూడారు. గుంపులో నుంచి ఎవరో అరిచారు ‘‘రేయ్ చేతనైతే శంకరాభరణం లాంటి సినిమా తీయండ్రా!’’ గురువు గారు మద్రాస్ వెళ్లగానే తన బృందాన్ని పిలిచారు. ‘‘మనం శంకరా భరణం లాంటి సినిమా తీస్తున్నాం’’ అన్నారు. అదే మేఘ సందేశం! అది జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు గెలుచుకొంది. చైనా ఫిల్మ్ ఫెస్టివల్కు వెళ్లింది. అక్కడివాళ్లు ఆ సినిమాలో ఉన్న ఓ గొప్ప విశేషాన్ని బయటపెట్టారు. అదేంటంటే, ఆ సినిమాలో ట్రాలీ, క్రేన్, జూమ్ షాట్లు అస్సలు వాడలా, అన్నీ స్టడీ షాట్లే! మనవాళ్లకు ఆ విషయం అప్పటి దాక తెలీదు ‘‘నిజమా!’’ అని నోళ్లు వెళ్లబెట్టారు. గురువుగారు షూటింగ్ స్పాట్కి వచ్చాకే డైలాగులు రాసే వారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మేకప్తో రెడీగా ఉండేవారు. గురువు గారు వచ్చి టేప్ రికార్డర్లో డైలాగులు చెప్పేవారు. అసిస్టెంట్ డైరెక్టర్లు పేపర్ మీద పెట్టేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఓపిగ్గా వెయిట్ చేసేవాళ్లు. ఏఎన్ఆర్ అంటుండేవారు ‘‘డైరెక్టర్ గారు డైలాగులు వండడం ఇంకా పూర్తి కాలేదా? వండినంతవరకు సీన్ పేపర్ తీసుకురండి చేసుకుంటూ పోదాం.’’ బొబ్బిలిపులి క్లైమాక్స్ సీన్ షూటింగ్! ఎన్టీఆర్ రెడీ, సీన్ పేపర్ రెడీ, స్టార్ట్ చెయ్యడమే తరువాయి. గురువు గారు రామా రావు గారి దగ్గరకు వెళ్లారు ‘‘సార్! నాకు సీన్ నచ్చలా.’’ ‘‘అదేంటి మీరు రాసిందేగా’’ అన్నారాయన. ‘‘ఇంకా ఏదో కావా లనిపిస్తుంది. మళ్లీ రాస్తాను’’ అన్నారు గురువుగారు. ‘‘ఓకే’’ అన్నారు ఎన్టీఆర్. సెట్లో ఓ మూల వెళ్లి కూర్చోని రాయడం మొదలు పెట్టారు గురువుగారు. రెండు గంటల తరువాత గురువు గారు ఎన్టీఆర్కి కొత్తగా రాసిన సీన్ వినిపించారు. కళ్ళు మూసు కొని తదేకంగా విన్నారు ఎన్టీఆర్. ‘‘డైరెక్టర్ గారు! ఈ డైలాగులు మీ మాడ్యులేషన్లో రికార్డ్ చేసి ఇవ్వండి’’ అన్నారు. ఆ టేప్ రికా ర్డర్ని తీసుకొని మెరీనా బీచ్కు వెళ్లారు. డైలాగులు ప్రాక్టీసు చేశారు. తిరిగి వచ్చారు.‘‘డైరెక్టర్ గారు మేం రెడీ’’ అన్నారు. లంచ్ బ్రేక్ తర్వాత షూటింగ్ మొదలుపెట్టారు, నమ్మండి! ప్రతి షాట్ సింగిల్ టేక్! సాయంత్రానికి సీన్ ఫినిష్ అయిపోయింది. బొబ్బిలిపులి ఒక చరిత్ర! ఇదీ కోర్టు సీన్లో రామారావు గారి డైలాగుల చరిత్ర!!‘‘నా ఆయుష్షు 87 ఏళ్లు! నేను చెయ్యాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి’’ అనేవారు. ఒకదాని కోసం హాస్పిటల్కి వెళ్లారు, ఇంకొకటి జరిగింది. మహోన్నతవ్యక్తి మహాభినిష్క్రమణం జరిగి పోయింది. కళామతల్లి చేతిముద్ద ఆయన! కాలపురుషుడి పాద ముద్ర ఆయన! సినీ పుష్పక విమానంలో ఎంతమంది మహామహులైనా ఎక్కొచ్చు. కాని గురువు గారి స్థానం ఖాళీగానే ఉంటుంది. దాన్ని ఎవ్వరూ భర్తీ చెయ్యలేరు! వామనుడు ముల్లోకాల మీద మూడు పాదాలు మోపాడు. గురువుగారు సినీ వామనుడు. రచన మీద, దర్శకత్వం మీద, నాయకత్వం మీద మూడు పాదాలు మోపారు!! ‘‘ఈ శతాబ్దం నాది’’ అన్నాడు శ్రీ శ్రీ. గురువు గారు అనలా! కానీ బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఈ శతాబ్దం ఆయనదే. నేను ఆయనతో చాలా ఏళ్లు సన్నిహితంగా ఉన్నా. చాలా రాత్రిళ్లు అలా ఆయన ఎదురుగా కూర్చుండేవాడిని. సినిమాలు, రాజకీయాలు, ఒకటేమిటి ఎన్నో విషయాలు చెప్తుండేవారు. వింటుండేవాడిని. వెళ్తానని నాకు నేనుగా ఎప్పుడు లేవలా.‘‘సరే ఇక బయల్దేరు’’ అన్నాకే బయలుదేరేవాడిని. ఆయన చెబితేనే నేను బయలుదేరేవాడిని కదా, గురువు గారు నాకు చెప్పకుండా బయల్దేరిపోయాడేంటి? ఒకసారి అడిగాను. ‘‘గురువు గారు! నేను మీకు ఏమవు తాను?’’ ఆయనన్నారు ‘‘నమ్మకమైన నేస్తానివయ్యా’’.ఈ జన్మకిది చాలు!! కొన్నేళ్ళ క్రితం గురువు గారు తన పర్స నల్ డైరీని నాకు ఇచ్చారు. దాంట్లో ఆయన రాసిన నాలుగు మాటలు మనమందరం భద్రపరుచుకుందాం. ‘‘శెలవ్–కలుస్తా. మరు జన్మలో’’. – రాజేంద్ర కుమార్, సినీ రచయిత -
జ్ఞాపకాలు హౌస్ఫుల్
దేవుడు కట్ చెప్పాడు. విధాత కదా... చెబుతాడు. ప్రేక్షకులం కదా... మనం నొచ్చుకుంటాం. ఇంకో వంద సీన్లుంటే బాగుండు... అనుకుంటాం. చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలిచ్చినా దాసరి లేకపోవడాన్ని భరించలేకపోతున్నాం. మానవ సంబంధాలను అల్లి... తెలుగు సినిమాకు కండువాగా వేసి వెళ్లిన దర్శకుడు... దార్శనికుడు దాసరి. దాసరి గారూ... మీరూ– మీ సినిమా మీరూ – మీ ప్రేమ మీరూ – మీ పరంపర ఎప్పుడూ ఆడుతూనే ఉంటాయి. మీ జ్ఞాపకాలు ఎప్పుడూ హార్ట్ఫుల్... హౌస్ ఫుల్. ఆకాశ దేశాన... ఆషాఢ మాసాన... డైలాగులతో పైకి వచ్చిన దాసరి పాటను పట్టుకున్నాడట. సంగీత ప్రధానమైన సినిమా తీస్తున్నాడట. ‘ఆ.. ఆయన వల్ల కాదు’ అనుకున్నారు ప్రత్యర్థులు. ‘మేఘసందేశం’ రిలీజైంది. అవును... డైలాగులనే నమ్ముకున్న దాసరి అసలు డైలాగులకే ప్రాధాన్యం ఇవ్వకుండా గొప్ప భావుకత్వంతో సంగీత ప్రధానంగా సినిమా తీయగలడని నిరూపించుకున్నాడు. ఆ సమయంలోనే ఒక తమిళ దర్శకుడు ఈ సినిమా గురించి విని దాసరితో కలిసి ప్రత్యేకంగా ఆ సినిమాను చూశాడు. సినిమా పూర్తయ్యాక ‘ఇన్స్పైర్ అయ్యాను నారాయణరావ్’ అని మెచ్చుకున్నాడు. ఆ స్ఫూర్తితో ఆయన తమిళంలో ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాను తీశాడు. దాని పేరు ‘సింధుభైరవి’. ఆ దర్శకుడు కె. బాలచందర్. … తమిళంలో వచ్చిన గొప్ప దర్శకుడు శంకర్. భారీ సినిమాలు జనరంజక సినిమాలు తీయడంలో పేరు సాధించాడు. ఆయన కమలహాసన్తో ఒక సినిమా తీశాడు. స్వాతంత్య్ర సమరయోధుడొకడు వర్తమాన సమాజంలో పేరుకునిపోయిన అవినీతిని చూసి దాని మీద పోరాటం మొదలుపెడతాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. చాలా డబ్బు సంపాదించింది. కాని – దాసరి నారాయణరావు అదే సినిమాను చాలా కాలం క్రితమే తీసేశారు. పేరు సర్దార్ పాపారాయడు. అలాంటి కథాంశమే శంకర్ చేతిలో పడి ‘భారతీయుడు’గా బయటికొచ్చింది. … పి.వాసు అంటే తమిళంలో పెద్ద దర్శకుడు. రజనీకాంత్ను హీరోగా పెట్టి, విజయశాంతిని హీరోయిన్గా పెట్టి ‘మన్నన్’ అనే సినిమా తీశాడు. తమిళంలో బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. దానిని తెలుగులో చిరంజీవితో ‘ఘరానా మొగుడు’ అని రీమేక్ చేస్తే ఇక్కడా పెద్ద హిట్. కాని ఈ సినిమాను కన్నతండ్రి దాసరినారాయణరావే. కృష్ణంరాజు కార్మికవర్గ నాయకుడిగా, జయప్రద ఫ్యాక్టరీ యజమానిగా ఆయన తీసిన ‘సీతారాములే’ మళ్లీ తారలను మార్చుకుని తెర మీదకు వచ్చింది. … మణిరత్నం గ్రేట్ డైరెక్టరే. ‘దళపతి’ సినిమా తీశాడు. ఈ కథ భారతంలో కర్ణుడి ఉదంతం. కాని దాసరి నారాయణరావు ఇంకా గ్రేట్. దాని కంటే చాలా ఏళ్ల ముందే అదే కథాంశాన్ని ‘కటకటాల రుద్రయ్య’గా తీశారు. హుందాగా బతికారు... అలానే వెళ్లిపోయారు-మోహన్బాబు గురువుగారు హఠాత్తుగా ఇలా కనుమరుగవుతారని ఊహించలేదు. ఆయనకు కూడా ఎలాంటి సందేహం లేదు. ఆపరేషన్ చేయించుకుని, ఇంటికి వచ్చేస్తా అనుకునేవారు. మొదటిసారి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి, ఆయన ఇంటికి తిరిగొచ్చాక నేను ప్రతి రోజూ వెళ్లకపోయినా ఫోన్ చేసి, క్షేమసమాచారాలు తెలుసుకునేవాణ్ణి. అప్పుడప్పుడూ వెళుతుండేవాణ్ణి. అప్పుడు ‘ఇదిగో నిలబడ్డా చూడు.. నడుస్తున్నాను కూడా’ అని నాలుగు అడుగులు వేసి, చూపించేవారు. ఒకవేళ అలా చేయకపోతే, ‘ఏంటి గురువుగారూ.. నిలబడాలి, నడవాలి’ అని దబాయించేవాణ్ణి. అప్పుడు నడవడానికి ప్రయత్నించేవారు. ఆయన చాలా హుందాగా బతికారు. గురువుగారి అంతిమ క్రియలు కూడా అంతే హుందాగా జరిగాయి. అది నాకు తృప్తిగా ఉంది. ఆయన మరణవార్త విన్న వెంటనే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారు వచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్గారికి విషయం తెలియజేశారు. కేసీఆర్గారు గురువుగారి పట్ల చూపించిన మర్యాద అద్భుతం, అమోఘం. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా హాస్పిటల్ నుంచి ఇంటి వరకు ట్రాఫిక్ క్లియర్ చేయించారు. ఇంటి దగ్గర విపరీతమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయించారు. ప్రభుత్వ లాంఛనాలతో దాసరిగారి అంత్యక్రియలను నిర్వహించారు. ఒక వ్యక్తిని ప్రభుత్వ లాంఛనాలతో ఖననం చేయాలంటే కేబినేట్ మీటింగ్ పెట్టాలని ఇంకోటని... ఇంకోటని రకరకాలు చెప్పి, తప్పించుకుంటారు. కానీ, విషయం తెలిసిన కాసేపటికి అన్నీ ఏర్పాటు చేశారు. మా గురువుగారి పట్ల చూపించిన ఆదరాభిమానాలను నేను మరచిపోలేను. … దర్శకులు చాలా మంది ఉండొచ్చు. దాసరి నారాయణరావు మాత్రం ‘దర్శకులకే దర్శకుడు’ . … చిత్ర పరిశ్రమలో ఒక ఘనమైన పరంపర ఉంది. అది ప్రొడక్షన్ హౌస్ల పరంపర. ఇది వాహినివారి చిత్రం... ఇది విజయా వారి చిత్రం... ఇది ఏవీఎం వారి చిత్రం... సినిమా– ప్రొడక్షన్ హౌస్ వారిది. పోస్టర్ మీద ప్రొడక్షన్ హౌస్ ఎలివేట్ అవుతుండేది. ఆ తర్వాత హీరో హీరోయిన్లు ఎలివేట్ అయ్యేవారు. దర్శకుడు అనేవాడు ఆ ప్రొడక్షన్లో ఒక ఉద్యోగి హోదాలో ఉండేవాడు. ఈ పరంపరలో ఉంటూనే తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ను ఏర్పరుచుకున్న దర్శకుడు కె.వి.రెడ్డి. మరో నలుగురైదుగురు ఈ స్థాయికి దగ్గరగా ఉన్నా పోస్టర్ మీద పేరును పైకి చేర్చిన తెలుగు దర్శకుడు మాత్రం దాసరి నారాయణరావు. తమిళంలో ఆయన కంటే కొద్దిగా ముందు కె.బాలచందర్ ఇదే పనిని చేశాడు. పోస్టర్లో ఒక ‘ఫిల్మ్ ముక్క’లో ఆయన పేరు కనిపిస్తే ఇక్కడ తెలుగులో ఒక ‘మబ్బు తుంట’లో దాసరి నారాయణరావు పేరు కనిపించేది. ఓడలో ఎవరు ఏ అంతస్తులో ఉన్నా కెప్టెన్ పై అంతస్తులో ఉండి ఓడను నడిపిస్తాడు. సినిమాలో దర్శకుడిది కూడా పై స్థానమే అని దాసరి చిత్ర పరిశ్రమకు చెప్పగలిగారు. నిర్మాత గౌరవం నిర్మాతకు ఇస్తూ దర్శకుడుగా తాను పొందాల్సిన గౌరవాన్ని పొందినవారు దాసరి నారాయణరావు. అంతేకాదు భిన్న శాఖలను ఒక్క మనిషే నిర్వహించవచ్చు అని ఆయన నిరూపించారు. సాధారణంగా ఒకప్పుడు దర్శకుడంటే కథ కోసం ఒక మనిషి దగ్గరకు, మాటల కోసం మరో మనిషి దగ్గరకు, పాటల కోసం వేరో మనిషి దగ్గరకు, స్క్రీన్ ప్లే కోసం ఇంకో మనిషి దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. దాసరి నారాయణరావు వచ్చి అవన్నీ తానే చేసుకోగలను అని చేసి చూపించారు. కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం– దాసరి నారాయణరావు అని టైటిల్స్ చివర పడటం ప్రేక్షకులు అబ్బురంగా చూడటం మొదలుపెట్టారు. నా ఫ్యామిలీకి మంచి గైడ్-జయసుధ కొన్నాళ్ల పాటు తీర్థయాత్రలకు ప్లాన్ చేసుకున్నాను. అందుకే మే 29న నేను విదేశాలకు వెళ్లాను. 30న దాసరిగారు చనిపోయారు. ఆ విషయం నాకు తెలిసేసరికే ఆలస్యం అయింది. చివరి చూపు కోసం వచ్చేద్దామంటే నేనిక్కడికి వచ్చే లోపే ఆయన అంతిమ క్రియలు జరుగుతాయని తెలిసింది. చాలా బాధపడ్డాను. దాసరిగారు నా కుటుంబానికి పెద్దదిక్కు లాంటివారు. ఆయన నాకు ‘ఫాదర్ ఫిగర్’. నా లైఫ్కి గైడ్. నితిన్గారికి, నాకూ పెళ్లి చేసింది ఆయనే. దాసరిగారి దగ్గరే మా ఆయన అసోసియేట్ డైరెక్టర్గా చేసేవారు. అప్పుడే మేము ప్రేమలో పడ్డాం. మాకు అండగా దాసరిగారు నిలబడ్డారు. అప్పటి నుంచి మాకే సమస్య వచ్చినా ఆయన దగ్గర చెప్పుకునేవాళ్లం. మా ఆయన డిప్రెషన్లోకి వెళ్లిపోయినప్పుడు దాసరిగారు కౌన్సెలింగ్ ఇచ్చేవారు. కానీ, నితిన్గారు డిప్రెషన్ నుంచి బయట పడలేకపోయేవారు. నితిన్గారి మరణం నాకు పెద్ద షాక్ అయితే... దాసరిగారి మరణం ఇంకో షాక్. బహుశా నేనిక్కడ ఉండి ఉంటే... ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయి ఉండేదాన్ని. అందుకే ఆ దైవమే నన్ను తీర్థయాత్రలకు పంపించాడేమో అనిపిస్తోంది. దాసరిగారు దూరం కావడం ద్వారా ఇండస్ట్రీలో ఓ ‘పెద్ద వాయిస్’ మిస్ అయింది. ఇతరుల కోసం ఫైట్ చేసేవాళ్లు ఎవరున్నారు చెప్పండి? ఈ భూమ్మీద నిర్వహించాల్సిన పనులన్నింటినీ ఆయన సక్రమంగా చేశారు. బతికి ఉండగానే దాసరిగారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చి ఉంటే బాగుండేది. ఇతరుల కోసం జీవించారు. అందరి మనసుల్లో జీవించే ఉంటారు. … ఒక గురువును గురువు అని చెప్పాలంటే ఆయన పరంపర ఎలా సాగుతుందనేది చూడాలి. చరిత్రలో కొందరు గొప్పవారు తమ పరంపరను కొనసాగించగలిగే శిష్యులను ఇవ్వలేదు. దర్శకులలో కూడా బాపు, కె.విశ్వనాథ్, వంశీ వంటివారు తాము నిత్య విద్యార్థులుగా ఉంటూ శిష్యపరంపరను కొనసాగించే ఆనవాయితీకి దూరంగా ఉన్నారు. కాని దాసరి నారాయణరావు అలా కాదు. ఒక ఫ్యాక్టరీని స్థాపించినట్టుగా శిష్యులను ఉత్పత్తి చేశారు. ఒక దర్శకుడు వంద సినిమాలు తీయడం అతి గొప్ప. దాసరి ఆ ఘనతను చిటికెలో సాధించారు. ఆ దర్శకుడి శిష్యుడు కూడా వంద సినిమాలు తీయడం విడ్డూరం. కాని కోడి రామకృష్ణ ఆ ఘనతను సాధించి గురువుకు దక్షిణ చెల్లించారు. వంద సినిమాలు తీసిన గురుశిష్యులు భారతదేశంలో కాదు కదా ప్రపంచంలోనే లేరు. కోడి రామకృష్ణ అనే ఏముంది రేలంగి నరసింహారావు, రవిరాజా పినిశెట్టి, ఎం.ఎస్.కోటారెడ్డి. ధవళ సత్యం, రాజా చంద్ర ఇలా ఎందరో దర్శకులు దాసరి దగ్గర తయారయ్యారు. దర్శకత్వం జోలికి రాకుండా కో డైరెక్టర్లుగా వెలిగినవారు మరెందరో. ఆయన శ్రామికుల హీరో -జయప్రద దాసరిగారి గురించి మాట్లాడాలంటే ఎక్కణ్ణుంచి మొదలుపెట్టాలో అర్థం కావడంలేదు. ఆయనకు ఆపరేషన్ జరిగే ముందు ఆస్పత్రికి వెళ్లి, కలిశాను. ‘‘మంచి ఆరోగ్యంతో ఇంటికి వస్తారు సార్.. గెట్ వెల్ సూన్’’ అంటే, ‘‘అలాగే’’ అని నవ్వారు. కాసేపయ్యాక ‘‘నీకు ఫ్లైట్కి టైమ్ అవుతోంది కదా... వెళ్లు... ఏం ఫర్వాలేదులే జయా’’ అన్నారు. దాసరిగారితో నేను మాట్లాడిన చివరి మాటలవే. నేను ఆయన్ను కలవడం అదే చివరిసారి అవుతుందనుకోలేదు. దాసరిగారు చనిపోయినప్పుడు ఇక్కడ లేను. చివరి సారి చూద్దామనుకుంటే ఫ్లైట్ టికెట్స్ దొరక్క రాలేకపోయాను. అందుకే ఈ రోజు పెద్ద కర్మను మిస్ కాకూడదనుకున్నా. దాసరిగారు పైకి గంభీరంగా కనిపించే చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నవారు. ‘విశ్వనాథ నాయకుడు’ షూటింగ్ అప్పుడు నేను ఒకరోజు ఆలస్యంగా షూటింగ్కి వెళ్లాను. సాంగ్ షూట్ అన్నమాట. మేకప్ హెవీగా చేసుకోవాల్సి వచ్చింది. హెయిర్ సై్టల్కి చాలా టైమ్ పట్టేసింది. లొకేషన్కి వెళ్లాక, దాసరిగారు ఏం మాట్లాడలేదు. సాంగ్ షూట్ మొదలైంది. డాన్స్ మాస్టర్ చెప్పిన స్టెప్స్ వేయడం మొదలుపెట్టాను. మాస్టర్ ‘ఓకే’ అంటున్నారు కానీ, దాసరిగారు మాత్రం ‘కట్’ అనేవారు. అలా పదీ పదిహేను టేక్స్ అయ్యాయి. దాంతో ‘సార్.. మాస్టర్ చెప్పినట్లే చేస్తున్నాను కదా.. ఏదైనా ప్రాబ్లమా?’ అనడిగితే, గట్టిగా నవ్వేశారు. ‘‘నువ్వు లేట్గా వచ్చావు కదా జయా.. అందుకే’’ అన్నారు. నా మీద అలిగారని అప్పుడు అర్థమైంది. ఇద్దరం నవ్వుకున్నాం. లొకేషన్కి వెళ్లగానే, ‘ఏంట్రా జయా... ఎలా ఉన్నావ్’ అని ఆప్యాయంగా పలకరించేవారు. ఇక ఆ పిలుపు వినపడదంటే బాధగా ఉంది. దాసరిగారు శ్రామికుల హీరో. ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయం చేశారు. ఇండస్ట్రీ ఓ పెద్ద దిక్కుని కోల్పోయింది. … కొందరు నటులు కొందరు దర్శకులకు సూట్ అవుతారు. లేదా కొందరు దర్శకులు కొందరు నటులకు సూట్ అవుతారు. దాసరి కూడా కొందరు నటీనటులతోనే ఎక్కువగా తన సినిమా ప్రయాణాన్ని కొనసాగించారు. కమెడియన్గా ఉన్న రాజబాబు అంటే దాసరికి ఇష్టం. ఆయనను దాసరి ‘తాత–మనవడు’, ‘తిరుపతి’, ‘యవరికి వారే యమునా తీరే’ సినిమాలలో హీరోగా చేశారు. మురళీమోహన్ సినీ జీవితంలో స్థిరపడటానికి కారణం దాసరి. ఎన్టీఆర్ ఏఎన్నార్ ప్రభంజనంలో మురళీమోహన్ తనకుంటూ సినిమాలు మిగుల్చుకోగలిగారంటే దాసరి వాత్సల్యమే కారణం. దాసరి– మురళీమోహన్ కాంబినేషన్లో ‘భారతంలో ఒక అమ్మాయి’, ‘ముద్దబంతిపువ్వు’, ‘ఓ మనిíషీ తిరిగి చూడు’, ‘ఇదెక్కడి న్యాయం’, ‘అద్దాల మేడ’ వంటి ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇక మోహన్బాబుకు సినిమా జన్మనిచ్చిన సంగతి అందరికీ తెలుసు. దాసరి–మోహన్బాబు కాంబినేషన్లో ‘స్వర్గం–నరకం’, ‘శివరంజని’, ‘సర్దార్ పాపారాయుడు’, ‘ప్రేమాభిషేకం’, ‘దీపారాధన’ వంటి సినిమాలు ఎన్నో వచ్చాయి. ఆర్.నారాయణమూర్తి, శ్రీహరి, ఈశ్వరరావు... వీరంతా దాసరి నీరు పోసి పెంచిన మొక్కలు. కాని దాసరి అనగానే వెంటనే తలుకోవడానికి వచ్చే పేరు అక్కినేనే. ఒక సందర్భంలో కె.రాఘవేంద్రరావు– ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమాలు ఎక్కువగా వచ్చేవి. పారలల్గా దాసరి–అక్కినేని కాంబినేషన్లో ఎక్కువగా సినిమాలు వచ్చేవి. రాఘవేంద్రరావు ఎన్టీఆర్తో ‘అడవిరాముడు’ ఇస్తే దాసరి అక్కినేనితో ‘ప్రేమాభిషేకం’ ఇచ్చారు. రాఘవేంద్రరావు ‘జస్టిస్ చౌదరి’ ఇస్తే దాసరి ‘రాముడు కాదు కృష్ణుడు’ ఇచ్చారు. రాఘవేంద్రరావు సినిమాల్లో యాక్షన్, గ్లామర్ ఉంటే దాసరి సినిమాల్లో మెసేజ్, డ్రామా ఉండేది. తెలుగులో కమర్షియల్ సినిమా తరాజును దాసరి ఎప్పుడూ తన సినిమాలతో సరిచేస్తూ ఉండేవారు. తెలుగు సినిమాల్లో కథ అంటూ ఒకటి బతికి ఉండటానికి దాసరి చాలా ముఖ్యమైన ఒక కారణం. … దాసరి తన జీవిత కాలంలో ఒక రోత పుట్టించే హారర్ సినిమా తీయలేదు. తన జీవిత కాలంలో ఒక అశ్లీలమైన మాటను రాయలేదు. తన జీవితకాలంలో కుటుంబాలు చూడటానికి ఇబ్బంది పడే సినిమా తీయలేదు. తెలంగాణ భాషను కొందరు కొన్ని సినిమాల్లో వినోదానికీ విలనిజానికీ వాడుకుంటే దాసరి తెలంగాణ ఆత్మను పట్టుకునే ప్రయత్నం చేశారు. తెలం గాణ గొప్పతనం చూపే ‘ఒసే రాములమ్మ’, ‘సమ్మక్క–సారక్క’ సినిమాలు తీశారు. వర్కింగ్ క్లాస్ అంటే దాసరికి ముందు నుంచి అభిమానమే. అందుకే ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’, ‘ఏడంతస్తుల మేడ’, ‘సూరిగాడు’, ‘ఎంకన్నబాబు’, ‘ఒరేయ్.. రిక్షా’, ‘మేస్త్రీ’ వంటి సినిమాలు తీశారు. ఇక ఆయన స్త్రీ పక్షపాతి. ఆడవాళ్ల కోసం తీసిన సినిమాలకు లెక్క లేదు. ‘బంట్రోతు భార్య’, ‘రాధమ్మ పెళ్లి’, ‘యవ్వనం కాటేసింది’, ‘కన్యాకుమారి’, ‘శివరంజని’, ‘గోరింటాకు’, ‘స్వప్న’, ‘శ్రీవారి ముచ్చట్లు’, ‘కాంచనసీత’, ‘అమ్మ రాజీనామ’, ‘అక్క పెత్తనం–చెల్లెలి కాపురం’, ‘కంటే కూతుర్నే కను’... ఇన్ని సినిమాలు తీశారు. ఆయన చిన్న సినిమాల పెద్ద దర్శకుడు. పెద్ద సినిమాల పెను దర్శకుడు. మీడియం బడ్జెట్ ఆయనకు కొట్టిన పిండి. ఓవర్ బడ్జెట్ ఆయన డిక్షనరీలో లేదు. … దాసరి నారాయణరావు మే 30న మరణించారు. కాని ఆయన అసలైన ఘన జీవితం ఆ రోజు నుంచే తిరిగి ప్రారంభమైంది. కొత్త తరాలు, భావితరాలు ఈ దర్శక శిఖరాన్ని అధ్యయనం చేయడం, పరిశోధన చేయడం, ఆయన వేసిన దారిని తిరిగి కనగొనడం, ఆ సాధించిన ఘన విజయాలను పునర్ మూల్యాంకనం చేయడం ఇప్పుడే సరిగ్గా మొదలవుతుంది. మహారథం ఆగినప్పుడే అది ఎంత దూరం ప్రయాణించిందో అంచనాకొస్తుంది. … దాసరి సినీ ఘనతను ఇప్పుడు సరిగ్గా అంచనా వేయాల్సిన సమయం వచ్చింది. ఆయన పేరున ఒక యూనివర్సిటీని తెరవాల్సిన సందర్భం వచ్చింది. దాసరి అనే పేరు వెలుతురులో ఎన్నో కొత్త తారలు, కలాలు, దర్శక దివ్వెలు వెండితెరను వెలిగించాల్సిన సన్నివేశం వచ్చింది. అది జరిగినప్పుడే ఆ దర్శకుడికి అది సినీ పరిశ్రమ అర్పించే ప్రేమాభిషేకం అవుతుంది. నిజమైన కృతజ్ఞతాభివందనం అవుతుంది. వందనం అభివందనం దాసరికి స్మరణాభి వందనం. ఆయన ఓ ఇన్స్టిట్యూషన్ దాసరిగారి డైరెక్షన్లో నేను పది సినిమాల వరకు చేశాను. ఆయనతో నేను చేసిన ఫస్ట్ మూవీ ‘బహుదూరపు బాటసారి’. మల్టీస్టారర్ మూవీ అన్నమాట. దాసరిగారి సినిమాల గొప్పతనం ఏంటంటే.. చిన్న పాత్ర అయినా ఆ పాత్ర చేసిన ఆర్టిస్ట్కి మంచి గుర్తింపు వస్తుంది. అలా నాకు ‘బహుదూరపు బాటసారి’ మంచి పేరు తెచ్చింది. మిగతా డైరెక్టర్స్కి, ఈయనకీ ఉన్న తేడా ఏంటంటే.. దాసరిగారు ఒక డైలాగ్ ఇచ్చి, ‘‘ఈ డైలాగ్ని ఎలా చెప్పాలనుకుంటున్నావో చెప్పు’’ అని ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవారు. చెప్పిన తర్వాత ఏమైనా కరెక్షన్స్ ఉంటే, వాటి గురించి చెప్పేవారు. ఆయన డైరెక్షన్లో చేసిన వాటిలో నాకు ‘తిరుగుబాటు’ సినిమా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే, అందులో నాది పూలన్ దేవి టైప్ క్యారెక్టర్. ‘ఈ క్యారెక్టర్ చేయగలనా’ అని నాలో నేనే అనుకున్నాను. పైగా లెంగ్తీ డైలాగ్స్ ఉండేవి. అవి చెప్పగలనా అని సందేహం. అది గమనించి, దాసరిగారు ‘‘ఏంటీ... చేయలేననుకుంటున్నావా? నువ్వు అమ్మాయిని అనే సంగతి మరచిపో. నిన్ను నువ్వు చిరంజీవి అనుకో. హీరోని అనుకుని చేసేయ్’’ అన్నారు. ఆ మాటలు నా మీద చాలా ప్రభావం చూపించాయి. ఆ పాత్రను సునాయాసంగా చేసేశాను. నటీనటులకు ఆయన చెప్పే విధానం చాలా క్లియర్గా ఉంటుంది. దాసరిగారు ‘హార్ట్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ’. తెలుగు సినిమాకి ఇన్స్టిట్యూట్ లాంటివారు. ఆయన మరణం తీరని లోటు. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కడసారి చూడకపోవడం బాధ కలిగిస్తున్నది: చిరంజీవి
హైదరాబాద్: విఖ్యాత దర్శకుడు దాసరి నారాయణరావు కడసారి చూపు తనకు దక్కకపోవడం ఎంతో బాధ కలిగిస్తున్నదని సినీ నటుడు, ఎంపీ చిరంజీవి అన్నారు. హైదరాబాద్ ఫిల్మ్నగర్లో నిర్వహించిన దాసరి నారాయణరావు సంతాపసభలో చిరంజీవి మాట్లాడారు. విదేశాల్లో ఉండటం వల్ల దాసరి చనిపోయినప్పుడు తాను రాలేకపోయానని, అది తన జీవితంలో తీవ్ర అసంతృప్తి కలిగించే విషయమని అన్నారు. అయితే, దాసరి పాల్గొన్న చివరి రెండు బహిరంగ సభలు తమకు సంబంధించినవే కావడం కొంత ఊరట కలిగించిందని చెప్పాడు. తన సినిమా ఖైదీ నంబర్ 150 ప్రీ-రిలీజ్ వేడుకలో దాసరి పాల్గొన్నారని, ఇదే ఆయన పాల్గొన్న కడసారి బహిరంగ సభ అని అన్నారు. అంతేకాకుండా మే 4న అల్లు రామలింగయ్య అవార్డు అందజేసినప్పుడు ఆయన కడసారి మీడియాతో మాట్లాడారని, తమను పక్కన ఉంచుకొని ఆయన ఆఖరిసారిగా మీడియాతో మాట్లాడటం తనకు తృప్తినిచ్చిందని అన్నారు. కనీసం ఆ రకంగానైనా ఆయన ఆశీస్సులు తమకు దక్కాయని చెప్పారు. ఆస్పత్రి నుంచి వచ్చిన తర్వాత దాసరిని చూసి తాను మాట్లాడలేకపోయానని, కానీ అలాంటి సమయంలోనూ ఆయన నీ సినిమా స్కోరు ఎంత అని ఆయన అడిగారని, హయ్యెస్ట్ గ్రాసర్గా నిలుస్తుందని తాను చెప్పగానే చిన్నపిల్లల మాదిరిగా విజయసంకేతం చూపి చప్పట్లు కొట్టారని గుర్తుచేసుకున్నారు. అనంతరం తమ ఇంటికి తీసుకెళ్లి దగ్గరుండి భోజనం వడ్డించి.. పితృవాత్యల్సం చూపించారని చెప్పారు. దాసరి మన మధ్య లేకపోవడం చిత్ర పరిశ్రమకు పెద్ద లోటు అని, ఆయన కార్మికుల కష్టాల పరిష్కారం కోసం ఎంతో చిత్తశుద్ధితో నిరంతరం కష్టపడ్డారని అన్నారు. -
దా'సరిరారు'
ఆయన ప్రతిభకు ఎవరూ సరిరారు... ఆయన ప్రేమకు ఎవరూ సాటి రారు... ఆయన దాసరికారు... ఆయన ‘ద సర్’... అంటే మా గురువు కాని ఆయనలో ఒక అద్భుతమైన కోరిక ఉండేది... మేమంతా గురువును మించిన శిష్యులు కావాలని! ఎవరు ప్రయత్నం చేసినా ఎందరు ప్రయత్నించినా దాసరికి సరిరారు... ఇంకో దాసరి రారు. ► దాదాపు 45 ఏళ్ల మీ సినీ జీవితంలో దాసరిగారు ఉన్నారు. ఇప్పుడు ఆయన లేని ఈ లైఫ్ మీకెలా అనిపిస్తోంది? ఆయన టీచర్, నేను స్టూడెంట్. పద్మ (దాసరిగారి సతీమణి)గారు కూడా నన్నో బిడ్డలా చూసుకున్నారు. ఒక్కోసారి పరోక్షంగా ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడతాం. కానీ, ఒక్కరోజు కూడా నన్ను ఒక్క మాట అని ఎరగరు. దాసరిగారి మరణంతో నేను అవిటివాణ్ణి అయిపోయా. ► దాసరిగారి అంతిమ క్రియల వరకూ వెన్నంటే ఉండి మీ గురువుగారి పట్ల అభిమానం చూపించుకున్నారు. మంగళవారం ఆయన చనిపోయారు. ఆ ముందు రెండు రోజులు నేను నిద్రపోలేదు. ‘మరీ డల్ అయ్యారు. నిద్రపోండి’ అని, అందరూ అన్నారు. ‘దాదాపు 45 సంవత్సరాల పరిచయం... 48 గంటలు మేల్కోలేవా మోహన్బాబూ? నిద్రపోతావా?’ అని నాకు నేనుగా అనుకుని, కుర్చీలో కూర్చుండి పోయా. నిద్రపట్టలేదు. ‘ఇక లేరు’ అని తెలిశాక, ఆయన డెడ్ బాడీని అంబులెన్స్లో ఇంటికి తీసుకు వచ్చాం. నేను కూడా అంబులెన్స్లో ఎక్కా. ఆ క్షణాల్లో నాకు ఊపరి సలపలేదు. భయపడిపోయా. గురువు గారితో వ్యాన్లో వెళ్తున్నామేంటి? అది కూడా ఆయన డెడ్ బాడీని తీసుకెళ్లడం ఏంటి? అని నాకు భయం వేసింది. రెండు రోజుల పాటు చెప్పలేని ఫీలింగ్ వెంటాడింది. ఆ ఫీలింగ్ పోవడానికి చాలా టైమ్ పడుతుంది. ► ఇండస్ట్రీలో నెక్ట్స్ ‘దాసరి’? ఆ ‘దేవుడు’ తప్ప ఇంకెవరూ లేరు. దాసరిగారికి ఎవరూ సరి రారు. ‘ఎవరికి వారే యమునా తీరే... యథారాజా తథా ప్రజా’ అన్నట్లు ఉంటుంది ఇండస్ట్రీ. ఇప్పుడు ఎవడికి వాడే గొప్ప. ఒక సినిమా హిట్ అయితే వాడే పెద్ద హీరో అనుకుంటాడు. సినిమా హిట్కు ఒక్క హీరోనే కారణం కాదు. అది సమష్టి కృషి. నా గురువుగారిలా ఇండస్ట్రీ సమస్యలను తమ నెత్తిన వేసుకుని సాల్వ్ చేసేవాళ్లు లేరు. ఎప్పటికీ రారు కూడా. ► పుట్టుక, చావు కామన్. అది తెలిసి కూడా భయం..? ‘మృత్యువంటే నాకెందుకు భయం. నేను ఉన్నప్పుడు అది రాదు. అది వచ్చినప్పుడు నేను ఉండను’ అని ఆత్రేయగారు అన్నారు. మరణం పట్ల నాకెలాంటి భయమూ లేదు. అయితే కొందరు దూరం అయినప్పుడు ఆ బాధ భరించలేనిదిగా ఉంటుంది. 90 ఏళ్లకు పైగా నిండు జీవితాన్ని అనుభవించిన మా నాన్నగారు చనిపోయినప్పుడు, ఇప్పుడు గురువుగారి మరణం నన్ను చాలా కుంగదీసింది. ► మిమ్మల్ని ఆయన ‘పెద్ద బలం’లా అనుకునేవారా? నా బలం దాసరిగారికి ఉందని ఆయన లేనప్పుడు నేనెలా అనగలను? ఆయన ఉన్నప్పుడు అడిగితే, ‘నేను లేకపోతే మా గురువుగారు లేరు. మా గురువుగారు లేకపోతే నేను లేను అనేవాణ్ణి’. ‘నాకేమన్నా జరిగితే అన్నీ చూసుకునేది నా పెద్ద కొడుకే’ అని నన్ను ఉద్దేశించి అనేవారు. నేను పెద్ద దిక్కును కోల్పోయాను. నాకే కాదు.. 24 క్రాఫ్ట్స్లో ప్రాబ్లమ్ వస్తే తీర్చే నాథుడు లేడు. న్యాయం చేసేవాళ్లు లేరు. ► అనారోగ్యంతో మొదటిసారి దాసరిగారు ఆస్పత్రికి వెళ్లినప్పుడు మీకేమైనా అనుమానం..? ‘ఇన్ని హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్న వ్యక్తి బతకడం కష్టం’ అన్నారు. కానీ, కిమ్స్ ఆçస్పత్రి డాక్టర్ భాస్కరరావుగారి బృందం సమష్టి కృషి చేసి, ఆయన్ను బతికించి బయటకు తీసుకు వచ్చింది. ‘పుట్టినరోజు చేసుకుంటాను’ అంటే, ఇన్ఫెక్షన్స్ వస్తాయని వద్దన్నా. కానీ, ఆయన బాగా ఇష్టపడటంతో కాదనలేకపోయా. అంతా బాగానే ఉంది కదా అనుకున్నా. ఈ ఘోరాన్ని ఊహించలేకపోయా. ► కన్నబిడ్డలకు ఆస్తి పంపకాలు చేశారా? లిటిగేషన్స్ ఏమైనా..? దాని గురించి ఇప్పుడు మాట్లాడితే తొందరపాటవుతుంది. సమస్యలు ఉన్నాయి. పరిష్కరించే బాధ్యత నాపై ఉంది. నాతో ప్రభు (దాసరిగారి పెద్ద కొడుకు), అల్లుడు రఘు మాట్లాడుతుంటారు. అంతా సాఫీగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. ► ఆర్థిక వ్యవహారాల గురించి మీరేమైనా దాసరిగారితో మాట్లాడారా? రెండోసారి గురువుగారు ఆస్పత్రిలో చేరి, ఆపరేషన్ థియేటర్కి వెళ్లే ముందు, ‘పిల్లలకు ఏమీ చేయలేదు. ఇంకా ఏమైనా సెటిల్ చేయాల్సినవి ఉంటే చెప్పండి’ అనడిగితే, ఎదురుగా ఉన్న ఒక వ్యక్తిని చూపించారు. ఆ వ్యక్తి ఒకట్రెండు చెప్పారు. అంతకుమించి ఏం చెప్పలేదు. ► ఆయన భౌతికంగా దూరమవుతారనే డౌట్ వచ్చిందా? లేదు. డాక్టర్లు ‘ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్’ అన్నారు. అయినా గురువుగారు క్షేమంగా ఇంటికి వచ్చేస్తారనుకున్నా. మరెందుకు అడగాలనిపించిందో అడిగా. ► దాసరిగారి పిల్లలు మిమ్మల్ని కలుపుకుంటారా? మొన్న ప్రభు ఫోన్ చేసి, ‘అంకుల్... ఈ ఇంటికి మీరు పెద్ద కొడుకు. మీరు వచ్చి రెండు రోజులైంది. రండి’ అంటూ ఫోన్ చేశాడు. ‘వస్తానురా... అందరూ ఉన్నారు కదా. కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా’ అన్నాను. కానీ, వెళ్లకుండా ఎందుకు ఉంటాను? ఆయన బతికుండగానే దాసరి ఆడిటోరియం కట్టాను తిరుపతిలో. సౌత్ ఇండియాలోనే అలాంటిది లేదు. గురువుగారి మీద నా ప్రేమ అలాంటిది. ఆయన లేకపోయినా ఆయన కుటుంబం మీద ప్రేమ ఉంటుంది. ► మీ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చేవా? ముందుగా ఎవరు మాట్లాడేవారు? ఎన్నోసార్లు ఆయన అలిగారు... నేనూ అలిగాను. ఏ ఇంట్లో తండ్రీకొడులు, అన్నదమ్ములు అలగరు. మా అలక కూడా అలాంటిదే. నేను బాగా బిజీ అయ్యాక అప్పటికప్పుడు డేట్స్ అడిగితే, అడ్జస్ట్ చేయలేకపోయినప్పుడు అలిగేవారు. అలాగే ఆయనలా ఇండస్ట్రీ సమస్యలను నెత్తినేసుకున్నప్పుడు. ‘మీకెందుకు’ అనేవాణ్ణి. నా మాటకు ఒక్కొక్కసారి విలువిచ్చేవారు. విశ్వాస ఘాతకులు అనేవాళ్ల సమస్యలను కూడా నెత్తిన వేసుకున్నప్పుడు అలిగేవాణ్ణి. ఆ తర్వాత ఆయనే, నా అసిస్టెంట్కి ఫోన్ చేసి, నాకివ్వమని ‘మోహనా.. ఇంటికి రా’ అనేవారు. ‘గురువుగారూ నమస్కారం’ అంటూ వెళ్లేవాణ్ణి. ‘ఆ.. ఇప్పుడేమైంది? నేనేం అన్నానని’ అనేవారు. ఇద్దరం మళ్లీ మాట్లాడుకునేవాళ్లం. ► దాసరిగారు ఎంతోమందికి అవకాశం ఇచ్చారు. వాళ్లల్లో చాలామంది ఆయనకు కడసారి వీడ్కోలు పలకడానికి రాకపోవడంపై... గురువుగారి ద్వారా లబ్ధి పొందనివాళ్లు లేరు. ఆయన ఎవరి ఇంట్లో దీపాలు వెలిగించారో, ఎవరి సమస్యలను సాల్వ్ చేశారో వాళ్లు రాలేదు. దాసరిగారి పాదాలు టచ్ చేస్తే చాలు, ఆయన సినిమాల్లో యాక్ట్ చేస్తే చాలనుకున్నవాళ్లు ఎందరో. వాళ్లకు ఛాన్స్ ఇచ్చారు. అలాంటివాళ్లలో కొందరు ఆఖరి చూపుకి కూడా రాలేదు. అది వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఊళ్లో లేనివాళ్ల గురించి నేను మాట్లాడటం లేదు. ఉండీ రానివాళ్ల గురించి అంటున్నాను. ‘నీకు సహాయం చేసిన వ్యక్తి మరణించినప్పుడు నువ్వు చూడ్డానికి రాకపోతే రేపు నువ్వు పోయాక నిన్ను చూడ్డానికి ఎవరూ రారు’ అనుకుని, వదిలేశా. ► దాసరిగారు ఎంతోమందిని హీరోయిన్లను చేశారు కదా.. అంతిమ క్రియల్లో వాళ్లెవరూ కనిపించలేదు... ఏ హీరోయిన్లు ఆయన పాద ధూళి కావాలనుకున్నారో వాళ్లందరూ ఏమైపోయారో తెలియడంలేదు. ఆయన సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులుగా చేసిన కొందరు ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్లుగా ఉన్నారు. వివాదాస్పదంగా మాట్లాడుతున్నానుకోవద్దు. నా తండ్రి ఎంతోమందికి ఎంతో చేస్తే వాళ్లల్లో కొందరు విశ్వాసం కూడా చూపించలేదు. విశ్వాస ఘాతకులు. ► దాసరిగారిని ఎక్కడ కలిశారు? ‘కూతురు–కోడలు’ అనే సినిమాకి దర్శకుడు లక్ష్మీ దీపక్ దగ్గర అప్రెంటిస్గా చేరాను. నిజానికి నా లక్ష్యం ప్రతి నాయకుడు కావడం. పొట్టకూటి కోసం డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరాను. ఆ సినిమాకి దాసరిగారు కో–డైరెక్టర్, డైలాగ్ రైటర్. అప్పుడు నా పేరు భక్త వత్సలం నాయుడు. ఒక్కోసారి ‘భక్తా’ అనీ, ఒక్కోసారి ‘భక్తాగారూ’ అని పిలిచేవారాయన. ఆ తర్వాత దర్శకుడిగా మారి, మంచి స్వింగ్లో ఉన్నారు. ఓ నలభై యాభై సార్లు మార్నింగ్ నాలుగున్నరకు ఆయన ఇంటికి వెళ్లాను. ఆ టైమ్కు నిద్ర లేస్తారనీ, లేకపోతే రాత్రంతా షూటింగ్ చేసి వస్తారని. ఇంటికెళ్లి కాలింగ్ బెల్ కొట్టగానే, అక్కయ్య (దాసరి సతీమణి పద్మ) తలుపు తెరిచేవారు. ‘ఏంటయ్యా.. ఈ టైమ్లో వచ్చావు.. కూర్చో’ అనేది. ఆయనేమో ‘భక్తా.. ఏదైనా ఉంటే నేనే పిలుస్తా’ అనేవారు. అలా ఓ రోజు మేకప్ టెస్ట్కి రమ్మన్నారు. నాతో పాటు ఓ పది మంది మేకప్ టెస్ట్కి వచ్చారు. మా అందరికీ మేకప్ చేసి, డైలాగ్ చెప్పించారు. ఆ రషెస్ చూసి, సెలక్ట్ చేయాలి. కానీ, నా రషెస్ ఎవరో దాచేశారు. ఎదుటి వ్యక్తికి చెడు చేయాలని చూస్తే.. ఏదో రూపేణా వాళ్లకే చెడు జరుగుతుంది. అదే జరిగింది. నా రషెస్ని స్వయంగా ఆయనే వెతికి, బయటికి తీయించారు. ఆ తర్వాత ‘ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారు. ఒకతను ఈశ్వరరావు, ఇంకొకతను మోహన్బాబు’ అన్నారు. అప్పటి నుంచి మోహన్బాబు నా పేరైంది. ఆ రోజు పాదాలకు నమస్కారం పెట్టడం నుంచీ చివరి వరకూ ఆయన పాదాలకు నమస్కారం చేయడాన్ని నేను గర్వంగా ఫీలయ్యేవాణ్ణి. ► దాసరిగారికి ‘సారీ’ చెప్పాల్సిన వ్యక్తులెవరైనా ఉన్నారా? తిన్నింటి వాసాలు లెక్కపెట్టినవారు చాలామంది ఉన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో. టాలెంట్ని ప్రోత్సహించారు. ఎప్పుడూ కులాల ప్రస్తావన వచ్చేది కాదు. ఏ రోజునా ఫలానా వ్యక్తి కాపు, అతన్ని ప్రోత్సహించాలని దాసరిగారు అనుకోలేదు. ఆయన కులాన్ని గౌరవించుకున్నారు. అలాగని వేరే కులాన్ని ద్వేషించలేదు. నేను ఏ కులం.. ఆయన ఏ కులం? మా మధ్య ఎప్పుడూ కులానికి సంబంధించిన వ్యత్యాసం కనిపించలేదు. ‘మనం మొదటిసారి కలిసినప్పుడు నాదే కులమో మీకు తెలీదు. ఎక్కడో మద్రాసు పాండీబజార్లో కలిశాం. రైటర్ రాసిన ప్రతి పాత్రనూ నాతో వేయించింది మీరే. నా తండ్రి పేరు పెట్టారు, తర్వాత మీరు పేరు పెట్టారు. గురువుగారూ! నేను పెదకాపు మీరు చినకాపు’ అనేవాణ్ణి. నవ్వుకునేవాళ్లం. ► దాసరిగారికి ‘పద్మశ్రీ’ అవార్డు లేకపోవడం... భారతదేశంలోనే దర్శకునిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తి దాసరి నారాయణరావుగారు. దర్శక కులానికి గౌరవం తెచ్చిన వ్యక్తి. చరిత్ర సృష్టించిన వ్యక్తి. మూడు లక్షల్లో సినిమా తీసిన వ్యక్తి. ‘మేఘసందేశం’ లాంటి సినిమా తీసి జాతీయ అవార్డు అందుకున్న వ్యక్తి. అలాంటి ‘దర్శక మేధావి’ పద్మశ్రీకి అర్హులు కారా? పద్మవిభూషణ్కు అర్హులు కారా? దాదా సాహెబ్కు అర్హులు కారా? ఇప్పుడు గురువుగారు లేరు. అవార్డులు గురించి అప్రస్తుతం. ► దాసరిగారు మిమ్మల్ని చివాట్లు పెట్టిన సందర్భాలు? ఒక సినిమాకి లెంగ్తీ డైలాగ్ ఇచ్చారు. నేనేమో టేక్స్ మీద టేక్స్ తిన్నాను. ఫిల్మ్ అయిపోతోంది. కాలితో ధన్మని తన్నారు. ‘అబ్బా’ అని రూమ్లోకి వెళ్లిపోయాను. ఆ రాత్రి మేకప్మేన్ రామూతో ‘నేను వెళ్లిపోతాను. అరవడం, కాలితో తన్నడం... ఏంటయ్యా ఇది’ అంటే, ‘డైలాగ్ చెప్పకపోతే’ తిట్టరా అన్నాడు. ప్రొడ్యూసరేమో ‘ఏంటయ్యా వెళ్లిపోతావా? నువ్వెళ్లిపోతే ఆగిపోతుందనుకున్నావా? ’ అన్నారు. మళ్లీ ఆయనే ‘నువ్వేంటి.. నీ పర్సనాల్టీ ఏంటి?’ అని అభినందించారు. నేను మేకప్ వేసుకుని లొకేషన్కి వెళ్లాను. ‘ఏంటయ్యా.. ఎక్కడికెళతావ్’ అని గురువుగారు అన్నారు. ► దాసరిగారంటే మీకు గౌరవంతో పాటు భయం ఉండేదా? ఓ పదీ, పదిహేనేళ్ల నుంచి ఆయనతో ‘ఏవండీ! మీరు ఫాదర్, నేను సన్. ఎందుకు భయపడాలి మీకు? అందరిలా భయడపడను. కొంచెమే భయపడతా’ అంటే నవ్వారు. నేను విస్కీ తాగుతాను. గురువుగారు తాగరు. ఆయనకు మంచి మంచి బ్రాండ్స్ని గిఫ్ట్ చేసేవాళ్లు. వాటిని చూసి, ‘ఆయన తాగడు. మనల్ని తాగనివ్వడు’ అని జోకులేసుకునేవాళ్లం. ఆయన ముందు ఎవరమూ తాగేవాళ్లం కాదు. ఒకసారి నేను ‘గురువుగారూ... మీరు రాగానే గ్లాస్లు పక్కన పెట్టడం, భయపడటం... ఇబ్బందిగా ఉంది. అసలెందుకు భయపడాలండీ? నేను ఇకనుంచి మీ ముందే తాగుతా’ అంటే, ఆయన గట్టిగా నవ్వారు. అలా అన్నానని అయనంటే నాకు గౌరవం లేక కాదు. నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకూ ఆయన అంటే గౌరవం ఉంటుంది. ► ఫైనల్లీ... దాసరిగారి తీరని కోరికలేమైనా మీతో చెప్పారా? నేను ఎన్నో కుటుంబాల్లో దీపాలు వెలిగించినవాణ్ణి అని ఆయన ఎప్పుడూ చెప్పుకోలేదు. కానీ,ఎంతోమందికి చేశారాయన. కాకపోతే ‘నా బిడ్డలకు భగవంతుడు ఎందుకు సహాయం చేయలేదు’ అనే ఫీలింగ్ ఉండేది. అది చెప్పి, బాధపడేవారు. అరుణ్ కుమార్ (దాసరిగారి రెండో కొడుకు) చూడ్డానికి చాలా బాగుంటాడు. అతనితో కూడా ఆయన సినిమాలు తీశారు. కానీ, ఆశించినట్లుగా కెరీర్ ఎదగలేదు. ఆ విషయంలో ఆయనకు దిగులు ఉండేది. – డి.జి. భవాని -
అర్ధ శతాబ్ది సినిమా చరిత్ర
దాసరి మంచి స్క్రీన్ప్లే రచయిత. గొప్ప నటుడు. ఆయనదొక ప్రత్యేకమైన మాడ్యులేషన్. ఒక చిత్రంలోని ఆయన డైలాగులు గ్రాంఫోన్ రికార్డులుగా రాష్ట్రమంతా మార్మోగాయి. శరణన్న వారికి అభయమిచ్చి ఆదుకున్న భోళాశంకరుడు. 75 ఏళ్ల జీవితంలో యాభై ఏళ్ల సినీ జీవితాన్ని సమగ్రంగా, సలక్షణంగా గడిపిన దర్శకరత్నం దాసరి నారాయణరావు. నాటకాలతో ఆయన జీవితం ఆరంభమైంది. రచయితగా, నటుడిగా, దర్శకునిగా ఆ రంగంలో అభినివేశం గడిం చారు. ప్రారంభదశలో వెండితెరకి సంబంధించిన పలు శాఖలను గమనిస్తూ వచ్చారు. వాటితో పాటు అవమానాల్ని, ఆకలిని భరిస్తూ, సహిస్తూ తగినంత చేవ తేలారు. తారాబలం లేకపోయినా మంచి కథాచిత్రాలను సామాన్య ప్రేక్షకులు ఆదరిస్తున్న రోజులు. ఒక మంచి ఇతివృత్తం, సందేశం, పరిష్కారం మిళితమైన కథతో సినీ బజారున పడ్డారు దాసరి. చిన్న బడ్జెట్ చిత్రం కావడం కంటే, ఆయన కథ చెప్పిన తీరు నిర్మాతని విశేషంగా ఆకట్టుకుంది. చెప్పిన దానికంటే ఆసక్తికరంగా వెండితెరపై కథ చూపించాడు. అదే తాత–మనవడు. కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం– ఇలా సర్వం తనే అయ్యారు. తొలి సూపర్హిట్తో దాసరి నారాయణరావు ఇక జీవితంలో వెనుతిరిగి చూసింది లేదు. ఆయన బలం సెన్సాఫ్ డ్రామా. ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’ అప్పటికే తెలుగునాట ప్రసిద్ధికెక్కిన నాటకం. దాసరి చేతుల్లో చిట్టెమ్మ బంగారు కాసులు కురి పించింది. వయసుకి మించిన లోకానుభవం, పరిశీలన, గోదావరితనం దాసరికి మనోధైర్యాన్నిచ్చాయి. ఎవరీ దాసరి నారాయణరావ్, పైన మేఘాల్లో... కిందికి దించండి అన్నవారే, కాదు ఉంచండని సగౌరవంగా నిలిపారు. సినిమా ఫీల్డ్ని ఒక ఇండస్ట్రీగా అంతా గుర్తించి గౌరవించే స్థాయి దాసరితోనే మొదలైంది. దేనికీ వెరపెరుగని దిగ్గజంగా ఎదిగారు. వైటాన్వైట్లో నిలువెత్తు విగ్రహంతో సినీప్రపంచంలో స్వైరవిహారం చేసి, అన్ని శాఖల్లోనూ హారతులందుకున్నారు. చాలా బిజీ జీవితంలో ఎన్నో శిఖరాలు అధిరోహించారు. ఎందరికో జీవితాలు ప్రసాదించారు. పొద్దుటే నిద్ర లేచి, అయిదు నిమిషాల్లో రెడీ అయి, కారెక్కి దారి పొడుగునా టేప్రికార్డర్లో డైలాగులు చెప్పేసి, కారు దిగి షూటింగ్ స్పాట్కి వెళ్లేవారు. లైటింగ్ గ్యాప్లో తర్వాతి కథ చర్చలు నడిపేవారు. పాలగుమ్మి పద్మరాజు, రాజశ్రీ లాంటి దీటైన రచయితలు ఆయన వెంట ఉండేవారు. కనుకనే ఒక సంవత్సరం (1984)లో దాసరి దర్శకత్వంలో అటు హిందీ ఇటు తెలుగులో కలిపి పది చిత్రాలు విడుదలైనాయి. దాసరి మంచి స్క్రీన్ప్లే రచయిత. గొప్ప నటుడు. ఆయనదొక ప్రత్యేకమైన మాడ్యులేషన్. ఒక చిత్రం లోని ఆయన డైలాగులు గ్రాంఫోన్ రికార్డులుగా రాష్ట్రమంతా మార్మోగాయి. శరణన్న వారికి అభయమిచ్చి ఆదుకున్న భోళాశంకరుడు. ఆయన ప్రారంభించి నడిపిన ‘ఉదయం’పత్రిక ఒక సంచలనం. బలహీన వర్గాలకు, తిరుగుబాటువాదులకు గర్జించే శక్తిగా నిలిచింది. ఎన్నో కొత్త గళాలను, కలాలను మీడియా రంగానికి ‘ఉదయం’ అందించింది. దాసరి త్రిముఖుడు, త్రివిక్రముడు. కలకాలం గుర్తుండే మహామనిషికి అక్షర నివాళి. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఎవరు రాయగలరు...
-
ఆకాశదేశాన...
-
నీవు లేవు.. నీ జ్ఞాపకాలున్నాయ్
కష్టాన్నే నమ్ముకున్నావ్. ప్రతిభకు పదును పెట్టుకున్నావ్. బహుముఖ ప్రజ్ఞాశాలిగా శిఖరమెత్తు ఎదిగావ్. సినీ జగత్తుకు మూలస్తంభమై నిలిచావ్. ఎందరెందరికో బతుకు మార్గం చూపావ్. ఊరూరా అభివృద్ధికి బాటలు వేశావ్. పాలకొల్లుతోపాటు పశ్చిమ కీర్తి బావుటాను విను వీధుల్లో ఎగరేశావ్. జాబిలి చల్లనని.. వెన్నెల దీపమని చెప్పావ్. తెలిసినా గ్రహణం రాక మానదన్నావ్. పూవులు లలితమన్నావ్. తాకితే రాలునన్నావ్. తెలిసినా.. పెనుగాలి రాక మానదనే సత్యాన్ని చెప్పావ్. ‘జననం ధర్మమని.. మరణం కర్మమని.. తెలిసినా జనన మరణ చక్రమాగదు’ అంటూ నీకు నచ్చిన మేఘాల చాటుకెళ్లావ్. పేద విద్యార్థుల కోసం పాలకొల్లులో కట్టించిన మహిళా డిగ్రీ కళాశాల నీవు రావని తెలిసి బావురుమంటోంది. హిందూ శ్మశాన వాటిక వద్ద నెలకొల్పిన స్నానఘట్టం ఘొల్లుమంటోంది. గాంధీ బొమ్మల సెంటర్లో నరసాపురం ప్రధాన కాలువపై వేసిన వంతెన రోదిస్తోంది. శంభుని పేటలోని ప్రాథమిక పాఠశాల స్తబ్దుగా చూస్తోంది. క్షీరపురి నడిబొడ్డున 25 ఏళ్ల క్రితం నీ పేరుపెట్టుకున్న దాసరి పిక్చర్ ప్యాలెస్ భోరుమంటోంది. నీవు నడయాడిన నేలపై ప్రతి అడుగూ తల్లడిల్లుతోంది. నీవు లేవు కానీ.. జిల్లాలో ప్రతిచోట నీ జ్ఞాపకాలు మాత్రం పదిలంగానే ఉన్నాయ్. ‘వెళ్లిరా.. శిఖరమా’ అని కన్నీటితో నిన్ను సాగనంపినా.. మళ్లీ పుడతావనే నమ్మకాన్ని కూడగట్టుకుంటున్నాయ్. -
దాసరి మరణం మమ్మల్ని కుంగదీసింది
వైఎస్సార్ సీపీ గెలుపునకు కృషిచేస్తానన్నారు: భూమన కరుణాకరరెడ్డి సాక్షి, హైదరాబాద్: సినీ దిగ్గజం దాసరి నారాయణరావు మరణం సినీ, రాజకీయరంగాలకు తీరని లోటని, ముఖ్యంగా తమను కుంగదీసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఆయన బుధవారమిక్కడ దాసరి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తనతో కలసి దాసరి నారాయణరావును రెండుసార్లు కలుసుకున్నట్టు భూమన తెలిపారు. మనస్ఫూర్తిగా జగన్ను ఆశీర్వదిస్తూ... నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని దాసరి చెప్పారని ఆయన గుర్తు చేసుకున్నారు. అంతేకాదు 2017 చివరినాటికి వైఎస్సార్సీపీలో బేషరతుగా చేరతానని, 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతటా తిరిగి జగన్ గెలుపుకోసం ప్రచారం చేస్తానని దాసరి తమతో అన్నారని భూమన తెలిపారు. ఈ నెల 4న దాసరి జన్మదినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పినపుడు కూడా ఆయన ఆత్మీయంగా మాట్లాడి ఆశీర్వదించారన్నారు. ఇంతలోనే దాసరి మృత్యుఒడికి చేరుకోవడం చాలా బాధ కలిగిస్తోందన్నారు. ఆయన మృతి వైఎస్సార్ కాంగ్రెస్కూ తీరని లోటని పేర్కొన్నారు. -
శ్రామిక విప్లవం
జీవన కాలమ్ ‘ఉదయం’ పత్రిక నడిపే రోజుల్లో రోజంతా మద్రాసులో పనిచేసి సాయంకాలం విమానంలో– ప్రతీరోజూ విధిగా హైదరాబాదు ప్రయాణం చేసేవారు. ఏమిటీ కమిట్మెంట్. ఎందుకీ కమిట్మెంట్ అంటే.. పని ఆయనకు ప్రాణవాయువు. నా 54 సంవత్సరాల సినీ జీవితంలో దాసరి లాగా శ్రమించిన, ఆ శ్రమని సత్ఫలితాలుగా మలిచిన వ్యక్తిని చూడలేదు. ఆయన అనూహ్యమైన శ్రామిక విప్లవం అంటాను నేను. ఒక దశలో ఇటు అక్కినేని, అటు ఎన్టీఆర్ వారి షూటింగుకి వీజీపీ కాటేజీలలో ఉండటం నాకు తెలుసు. అక్కినేని షూటింగు అయ్యాక, ఎన్టీఆర్కి పిలుపు వెళ్లేది. ఇద్దరి చిత్రాలకూ సమగ్రమైన న్యాయం చేసి ఇద్దరి అభిమానులనూ అలరించిన ఘనత దాసరిగారిది. జబుల్లా రోడ్లో ఎన్టీఆర్ ఇంటికి ఎదురుగా దాసరి ఇల్లు. ఎప్పుడూ పెళ్లివారిల్లులాగా సందడిగా ఉండేది. రాత్రి అయితే మరీనూ. దాదాపు 40 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు పనిచేసేవారు. అందరి చేతుల్లోనూ టేప్ రికార్డర్లు. ఎందుకు? దాసరిగారు పిలిచినప్పుడు పరిగెత్తుకువెళ్తే –డైలాగులు– మాట్లాడేవారు. ఎవరి సినిమా? ఏ సీను? ఎవరు పాత్రలు? కథ ఏమిటి? అన్నీ దాసరిగారి మస్తిష్కంలో ఉండేవి. వీరుకాక మేకప్మాన్లు, చిన్న చిన్న నటీనటులు, కాస్ట్యూమ్స్ వారు– అందరికీ మించి నిర్మాతలు. అదొక సర్కస్. ఈ పద్మవ్యూహంలోకి ఏ రాత్రికో నాలాంటివారిని తీసుకెళ్లేవారు. ఎందుకు? కథ చెప్పడానికి. నేను ఆయనతో అనేవాడిని: ‘‘బయట సమూహాన్ని, మనుషుల్నీ చూస్తూ, మీతో ఇలా మాట్లాడటం నేరం చేసినట్టు అనిపిస్తోంద’’ని. ఆయన నిర్మలంగా నవ్వేవారు. ఇన్ని ఒత్తిడుల మధ్య ఎంతో తీరుబాటుగా, పవిత్రంగా, హాయిగా కనిపించేవారు. ఓసారి ఆయనకి కథ చెప్పడానికి– కేవలం కథ చెప్పడానికి– ఆయనతో – అసిస్టెంట్ల బృందంతో తిరువనంతపురం రైలులో వెళ్లాను. ఆయన ఎదుటి బెర్తుపై పడుకున్నారు. ఓ రాత్రికి తెలివొచ్చినట్టుంది. ఎవరో అసిస్టెంటుని పిలి చారు. టేప్ రికార్డర్ ఆయన నోటి దగ్గరకు వచ్చింది. డైలాగులు చెప్పారు. అంతే. మళ్లీ నిద్రపోయారు. ఇదేమిటి? చర్చలేదా? నేను ఆయన చిత్రాలు ఎన్నింటిలోనో ప్రధాన పాత్రలు చేశాను. ఆయన టేపు రికార్డర్లో ‘చెప్పిన’ డైలాగులకు పొల్లుకూడా మారదు! అదీ ఆయన ఏకాగ్రత. అంతకుమించి– పది చిత్రాల అరలు మెదడులో వేర్వేరుగా, గొప్పగా, భద్రంగా నిక్షిప్తమయి ఉంటాయి. ఎవరీ అసిస్టెంట్ డైరెక్టర్లు? రాబోయే కాలంలో కనీసం పాతిక సంవత్సరాలు తెలుగు చలన చిత్రసీమని ఏలిన ఉద్దండులు– కోడి రామకృష్ణ, రవిరాజా పినిశెట్టి, రాజాచంద్ర, రేలంగి నరసింహారావు, ఎస్.ఎస్. రవి చంద్ర, దుర్గా నాగేశ్వరరావు, ధవళ సత్యం, నందం హరి శ్చంద్రరావు, డిమిట్ రావు, రమణబాబు, అనిల్, ఎమ్మనేని ప్రభాకర్, రాధాకృష్ణ– ఇలాగ. వీరందరితోనూ నేను పనిచేశాను. ఒక్కొక్కరూ–ఒక్కొక్క శిఖరం. ‘ఉదయం’ పత్రిక నడిపే రోజుల్లో రోజంతా మద్రాస్లో పనిచేసి సాయంకాలం విమానంలో–ప్రతీరోజూ విధిగా హైదరాబాద్ ప్రయాణం చేసేవారు. ఎన్నోసార్లు మేమిద్దరం కలిశాం. ఏమిటీ కమిట్మెంట్. అంతకుమించి–ఎందుకీ కమిట్మెంట్? సమాధానం నాకు తెలుసు–పని ఆయనకు ప్రాణవాయువు. ఒత్తిడి ఆయన మెదడు రిలాక్స్ కావడానికి సాధన. ఈ ఒత్తిళ్లలోనే ఒక సర్దార్ పాపారాయుడు, ఒక ప్రేమాభిషేకం, ఒక రాములమ్మ–అనూహ్యం! చిన్న చిన్న కళాకారుల్ని నెత్తికి ఎత్తుకునేవారు. చిన్న చిన్న టెక్నీషియన్లకు ఊపిరి పోసేవారు. ఆ రోజుల్లో బడ్జెట్ సినిమాలకు మార్గాన్ని సుగమం చేసింది ఆయనే. మోహన్బాబు, అన్నపూర్ణ, నారాయణమూర్తి వంటి నటులు తమదైన ఫోకస్ని సాధించింది ఆ కార్ఖానాలోనే. దాసరితో నా బంధుత్వం ఆయన హైస్కూలు రోజుల్నుంచి. నా షష్టిపూర్తి సంచికకి ఆయన రాసిన వ్యాసంలో మొదటి పేరా.. ‘‘ఆయన్ని చూడ్డానికంటే ముందు నేను ఆయన్ని చదివాను. ఆయన సృష్టించిన పాత్రని నా ఒంటికి తగిలించుకున్నాను. ఉత్తమ నటుడిగా బహుమతిని పొందాను.. ఆ నాటిక ‘అనంతం’. ఆయన అరుదైన మిత్రుడు, అమూల్యమైన హితుడు’’. వ్యక్తిగా ఏ చిన్న వ్యక్తిలో, నిర్మాతలో, దర్శకునిలో ‘మెరుపు’ని చూసినా నెత్తికెత్తుకుని– పదిమందికి తెలిపే పెద్ద దిక్కు. పరిశ్రమలో ఏ సమస్యకయినా– ముందు నిలిచే మొండి ధైర్యం. ఇక్కడినుంచి సరాసరి ఢిల్లీ చేరి కేంద్రమంత్రిగా పదవి నెరపుకు రావటం మరో పెద్ద అంగ. ఆఖరుసారి దర్శకమిత్రులు క్రిష్ పెళ్లిలో అక్షింతలు వేసి లిఫ్టు ఎక్కాను. దాసరీ ఎక్కారు. లిఫ్టు కిందకి దిగే లోపున ఆయన తృప్తిగా చెప్పిన విషయం– ‘‘ఈమధ్య ఎనిమిది కిలోల బరువు తగ్గాను మారుతీరావుగారూ’’ అన్నారు. నవ్వాను. ‘‘తగ్గాలి. మీ కోసం కాదు. మా కోసం’’ అన్నాను. ఇద్దరం విడిపోయాం. దాసరి ‘శ్రమ’లో విజయాన్ని ఏరుకున్న పధికుడు. ప్రతి విజయానికీ హృదయాన్ని విశాలం చేసుకున్న ‘మనిషి’. చాలామందికి గురువు, మార్గదర్శి. మహా దర్శకుడు. కానీ.. కానీ.. అందరికీ–నడిచే ఉద్యమం. ఒక తరం సినీ ప్రపంచాన్ని మిరుమిట్లు గొలిపిన ఆకాశం. గొల్లపూడి మారుతీరావు -
సినీ దిగ్గజానికి ‘శోక్ శస్త్ర్’
పది నిమిషాల ‘కార్వాయ్’ నిర్వహించిన పోలీసులు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు సిటీబ్యూరో: సినీ దిగ్గజం దాసరి నారాయణరావు పార్థివ దేహానికి మొయినాబాద్లోని ఆయన ఫామ్హౌస్లో బుధవారం మధ్యాహ్నం పూర్తి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు సిటీ పోలీస్ పరిధిలోని సిటీ ఆరŠడ్మ్ రిజర్వ్ హెడ్–క్వార్టర్స్కు చెందిన సిబ్బంది ఈ సంప్రదాయాలు నిర్వహించారు. రిజర్వ్ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) తొట్టిపొతల అశోక్, ఆర్ఎస్సై రామారావు నేతృత్వంలో 10 మంది సిబ్బంది, మరో 12 మందితో కూడిన పోలీసు బ్యాండ్ మరో ఇద్దరు బిగ్లర్స్తో కలిసి మొత్తం 26 మంది పోలీసులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న వారితో పాటు జాతికి ఎనలేని సేవలు చేసిన వారికి ఈ తరహా లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆర్ఐ అశోక్ ‘సాక్షి’తో మాట్లాడుతూ... ఇదే తాను నిర్వహించిన తొలి కార్వాయ్ అని, ఎంతో బాధతో ఈ విధులు నిర్వర్తించినట్లు తెలిపారు. లాంఛనాలు ఇవీ ఝ ప్రభుత్వం తరఫున ఓపెన్ టాప్ ట్రక్ను పూర్తిస్థాయిలో పూలతో అలంకరించి తీసుకువస్తారు. తుపాకులతో ఉండే ఫైరింగ్ పార్టీలో 10 మంది, పార్థివ దేహాన్ని మోసే బేరర్ పార్టీలో 10 మంది ఉంటారు. ►ఇందులో పాల్గొనే సిబ్బంది ఫుల్ యూనిఫామ్లో ఉండటంతో పాటు వీరి తుపాకులు (.303 రైఫిల్స్) సైతం ఫుల్ వెపన్గా పిలిచే కత్తితో సహా ఉంటాయి. ►సదరు వ్యక్తి జాతికి చేసిన సేవలు, ప్రభుత్వం నుంచి అందుకున్న అవార్డులను గౌరవిస్తూ ఇంటి వద్ద పార్థివదేహానికి ఫైరింగ్ పార్టీ గార్డ్ ఆఫ్ హానర్ పేరిట గౌరవ వందన సమర్పిస్తుంది. ► అనంతరం బేరర్ పార్టీ మృతదేహాన్ని తమ భుజాలపై ఎత్తుకుని లయబద్ధంగా నడుస్తూ అంతిమ సంస్కారాలు చేసే ప్రాంతానికి తీసుకువెళతారు. దీన్ని ‘ధీరే చల్’ అంటారు. ►దాసరి నారాయణరావుæ ఇంటికి, అంత్యక్రియలు జరిగిన మొయినాబాద్ ఫామ్హౌస్కు మధ్య దూరం ఎక్కువగా ఉండటంతో ఇంటి దగ్గర నుంచి 200 మీటర్లు, అంత్యక్రియలు జరిగే ప్రదేశానికి 200 మీటర్ల దూరం నుంచి ‘ధీరే చల్’ నిర్వహించారు. ►అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశం ప్రవేశ ద్వారం దగ్గర ఇరుపక్కలా నిల్చునే పోలీసులు తమ తుపాకుల్ని తలకిందులుగా పెట్టి బాధను వ్యక్తీకరిస్తూ లోపలకు పంపుతారు. ►పార్థివ దేహాన్ని చితిపై పెట్టి కట్టెలు పేరుస్తున్న సమయంలోనూ మరోసారి గార్డ్ ఆఫ్ హానర్తో పాటు తుపాకుల్ని లయ బద్ధంగా తిప్పుతూ ‘సలామీ శ్రస్త్ర్’గా పిలిచే ప్రత్యేక సెల్యూట్ చేస్తారు. ఈ సందర్భంలో నేతృత్వం వహించే ఆర్ఐ ముందుండగా... మిగిలిన వారు రెండు వరుసల్లో నిల్చుంటారు. ► కట్టెలు పేర్చడం సలామీ శస్త్ర్ పూర్తయిన తరవాత తుపాకులకు ఉండే కత్తిని తీసి బెల్ట్కు ప్రత్యేకంగా ఉండే అరలో పెట్టుకుంటారు. ►చితికి నిప్పుపెట్టే ముందు గాల్లోకి మూడు రౌండ్లు చొప్పున కాల్పులు జరిపి రెండు నిమిషాల పాటు మౌనం వహిస్తారు. గాల్లోకి కాల్పులు జరిపే సమయంలో బిగ్లర్స్ విజిల్స్ ఊది సూచనలు చేస్తారు. ►ఇది పూర్తయిన తర్వాత తుపాకుల్ని తలకిందులుగా తిప్పి కుడి కాలుమీద పెట్టుకుంటారు. దీన్ని ‘శోక్ శస్త్ర్’గా పిలుస్తారు. ►సలామీ శస్త్ర్, శోక్ శస్త్ర్ సందర్భాల్లో శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రత్యేకంగా పోలీస్బ్యాండ్ వాయిస్తారు. పోలీసు బ్యాండ్కు శిక్షణ ఇచ్చే సమయంలోనే ఈ సందర్భంలో వాయించే ఫ్యూనరల్ ట్యూన్ను నేర్పిస్తారు. ►పోలీసు పరిభాషలో ‘కార్వాయ్’గా పిలిచే ప్రధాన తతంగం దాదాపు పది నిమిషాల పాటు సాగింది. దాసరి సేవలు ఎనలేనివి పంజగుట్ట: సినీరంగంలోనే కాక పత్రికా రంగానికి దాసరి నారాయణరావు చేసిన సేవలు ఎనలేనివని పలువురు సీనియర్ పాత్రికేయులు కొనియాడారు. బుధవారం ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆ«ధ్వర్యంలో దాసరి నారాయణరావు సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రెస్క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షులు రాజమౌళి చారి, ప్రధాన కార్యదర్శి ఎస్.విజయ్కుమార్రెడ్డి, మాజీ అధ్యక్షులు రవికాంత్రెడ్డి మాట్లాడుతూ... మీడియా గుత్తాధిపత్యం కొనసాగుతున్న రోజుల్లో ఉదయం పత్రికను స్థాపించి ఎంతో మందికి అవకాశం కల్పించారన్నారు. తన పత్రికద్వారా ఎన్నో కుంభకోణాలను వెలికితీసిన ఘనత దాసరికి దక్కుతుందన్నారు, జర్నలిస్టులకు అపారమైన స్వేచ్ఛ ఇచ్చారని, అటు సినీరంగంలో ఇటు పాత్రికేయ రంగంలోనూ ఎంతోమందికి ఉపాధి కల్పించిన మహానుభావుడని కొనియాడారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు సుబ్రమణ్యం, క్లబ్ వైస్ ప్రసిడెంట్ జనార్థన్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి, ఈసీ మెంబర్స్ రాజేష్, నరేందర్ పద్మశాలి పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. దాసరికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నివాళి లాలాపేట: తెలుగు సినీ దిగ్గజం దాసరి నారాయణరావుకు బుధవారం లాలాపేటలోని తెలుగు బుక్ ఆఫ్ రికారŠుడ్స ప్రధాన కార్యాలయంలో సంస్థ సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు వెంకటాచారి మాట్లాడుతూ దాసరి నారాయణరావు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో 151 సినిమాలకు దర్శకత్వం వహించి, ఎంతో మందికి సినీ జీవితాన్ని ప్రసాదించి చరిత్ర సృష్టించారని కొనియాడారు. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో చెరుగని ముద్ర వేసుకున్నారన్నారు. ఆయన 73వ జన్మదిన వేడుకల సందర్భంగా దాసరి పేరును తెలుగు బుక్ ఆఫ్ రికారŠుడ్సలో నమోదు చేసినట్లు గుర్తు చేశారు. -
నా భుజం తెగినట్లుగా ఉంది: రాఘవేంద్రరావు
హైదరాబాద్ : దర్శకరత్న దాసరి నారాయణారావు మృతి పట్లు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు స్పందించారు. ‘ నా భుజం తెగినట్లుగా ఉంది. ఇద్దరం మూడేళ్ళ విడిదిలోనే చిత్రసీమలోకి వచ్చాము. కలిసి ఎదిగాము. ఒడిదిడుకులు చూసాము. నిలబడ్డాము. గెలిచాము. అప్పుడే మమ్మల్ని అందరిని వదిలి వెళ్తావని గ్రహించలేదు మిత్రమా.. నువ్వు ఏ లోకాన ఉన్న నీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.’ అంటూ ఆయన బుధవారం ట్విట్ చేశారు. కాగా దాసరి నారాయణరావు తీవ్ర అనారోగ్యంతో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఇవాళ మొయినాబాద్ మండలం తోల్కట్ట సమీపంలోని సొంత వ్యవసాయక్షేత్రం పద్మా గార్డెన్స్లో జరిగాయి. -
దర్శక శిఖరం
-
శోకసంద్రంలో సినీ పరిశ్రమ
-
ఆకాశ దేశాన..
-
దాసరి ఒక చరిత్ర, ఒక స్ఫూర్తి: భూమన
హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణరావు ఎందరికో ఆశ్రయం ఇచ్చిన మహా పురుషుడని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. దాసరి ఒక చరిత్ర, ఒక స్ఫూర్తి అని కొనియాడారు. వైఎస్సార్ సీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, ఆర్కే రోజాతో కలిసి దాసరి భౌతికకాయానికి ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వైఎస్సార్ సీపీలో చేరి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేస్తానని ఇటీవలే తమతో చెప్పారని వెల్లడించారు. దాసరి నారాయణరావు మరణంతో సినీ పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. దాసరి పెద్ద వృక్షం లాంటి వారని, ఎంతో మంది కళాకారులకు నీడనిచ్చారని ఆమె పేర్కొన్నారు. -
దాసరి మృతి; మంచు లక్ష్మీ అభ్యర్థన
హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణరావు మరణంతో ఆయన శిష్యుల్లో అగ్రగణ్యుడైన మోహన్బాబు కుటుంబం దిగ్భ్రాంతికిలోనైంది. గురువు మరణవార్త తెలిసిన వెంటనే కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన మంచు కుటుంబం.. ఆ తర్వాత దాసరి నివాసం, అంతిమయాత్రలోనూ కీలకంగా వ్యవహరించారు. అయితే దర్శకరత్న మరణంపై స్పందించాల్సిందిగా పదేపదే అడగడంతో మీడియా ప్రతినిధులకు మంచు లక్ష్మీ ఒక అభ్యర్థన చేశారు. ‘ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో నేను లేను.. దయచేసి మాట్లాడించే ప్రయత్నం చేయకండి..’ అని ట్విట్టర్ ద్వారా అభ్యర్థించారు. ఇదిలాఉంటే తన తమ్ముడు మంచు మనోజ్ను దాసరి ఎత్తుకునిఉన్న అరుదైన ఫొటోను మంచు లక్ష్మీ షేర్ చేశారు. దాసరి ఒక శక్తి అని, అడిగినవారికల్లా కాదనకుండా సహాయం చేసేవారని లక్ష్మీ కామెంట్ పెట్టారు. దాసరి నిజమైన సినీ ప్రేమికుడని, ఆయన మరణం మా కుటుంబానికి తీరని లోటని లక్ష్మీ పేర్కొన్నారు. I humbly request the media to stop bombarding me w calls to give a statement. I am saddened beyond words. -
నింగికెగిసిన దర్శకతార
-
నన్ను సొంతవాడిలా చూసుకున్నారు
-
నన్ను సొంతవాడిలా చూసుకున్నారు: చంద్రబాబు
- దాసరి ఒక వ్యక్తికాదు.. వ్యవస్థ: ఏపీ సీఎం నివాళి హైదరాబాద్: దాసరి నారాయణరావు ఓ వ్యక్తి కాదు వ్యవస్థ అని కీర్తించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దర్శకుడిగానేకాక నటుడు, నిర్మాతగా తన ప్రత్యేకతను చాటుకున్నారని, రాజకీయాల్లోనూ రాణించి ఉన్నత పదవులు అధిరోహించారని, అదే సమయంలో సినీకార్మికుల బాగు కోసం ఎనలేని కృషి చేశారని చంద్రబాబు అన్నారు. బుధవారం ఫిలిం ఛాంబర్ లో దాసరి పార్థివదేహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మోహన్బాబు ద్వారా చాలా కాలం కిందటే దాసరి పరిచయం అయ్యారు. నా వివాహం సమయంలో, ఆ తర్వాత కూడా ఎంతో సాన్నిహితం ఉండేది. నారాయణరావు-పద్మ దంపతులకు నేనంటే చాలా అభిమానం. నన్ను సొంతవాడిలా చూసుకునేవారు. దాసరి మరణంతో చిత్రపరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయింది. అయితే ఆయన చేసిన పనులు శాశ్వతంగా గుర్తుండిపోతాయి. తెలుగువారిగుండెల్లో దాసరి చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థిస్తూ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నా’నని చంద్రబాబు అన్నారు. -
ఆయన ట్రెండ్ సెట్టర్: సోనియా గాంధీ
న్యూఢిల్లీ: దర్శకరత్న దాసరి నారాయణరావు మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. దాసరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. చలనచిత్ర రంగంలో ఆయన ట్రెండ్ సెట్టర్ అని, సామాజిక అంతరాలు తొలగించేవిధంగా సినిమాలు తీశారని కొనియాడారు. దాసరి నారాయణరావు నిబద్ధత కలిగిన సామాజిక రాజకీయ కార్యకర్త సోనియా గాంధీ పేర్కొన్నారు. లెజండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు మరణం బాధాకరమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. ముళీధర్రావు అన్నారు. సామాజిక అన్యాయం, అవినీతి, లింగ వివక్ష వ్యతిరేకంగా ఆయన సినిమాలు తీశారని గుర్తుచేశారు. -
దాసరికి వైఎస్ఆర్సీపీ నేతల సంతాపం
-
మహా దర్శకుడికి నివాళి
-
దాసరికి సినీ ప్రముఖుల సంతాపం
-
‘దాసరి లేరనకండి.. వింటారు...’
హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణరావు మరణం పట్ల యావత్ దక్షిణాది సినిమా పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమలో ‘పెద్దాయన’గా వెలుగొందిన దాసరికి ఘన నివాళులు అర్పిస్తోంది. దాసరి చనిపోతేదని విశ్రాంతి తీసుకుంటున్నారని దర్శకుడు జాగర్లమూడి క్రిష్ తన నివాళి సందేశంలో పేర్కొన్నారు. గురూ గారికి మరణం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ‘గుండె ఆడకపోతే ఏం? దాసరి గారి సినిమా ఆడుతూనే ఉంటుందిగా. ధియేటర్లోనో, టీవీ చానెల్స్లోనో.. తాతా మనవడు నుంచి 151 సినిమాలున్నాయి. ఆడుతూనే ఉంటాయి. భూమ్మీద సినిమా అనేది లేనప్పుడు దాసరిగారు లేరనాలి. అది జరగదుకదా. దాసరి గారంటే 74 ఏళ్లు నిండిన వ్యక్తి కాదు, 24 శాఖలు కలిసిన శక్తి. ఇలాంటి వారికి జయ జయ ద్వానాలు ఉంటాయి. కానీ జోహార్లు ఉండవు. దర్శకుడే సినిమాకి కెప్టెన్ అని ఎక్కడ ఎవరంటున్నా దాసరిగారు వింటారు. ఏ తెలుగు దర్శకుడికి ఏ గౌరవం దక్కినా అందులో దాసరిగారు ఉంటారు. పెద్దాయన విశ్రాంతి తీసుకుంటున్నారు. లేరనకండి, వింటారు’ అని క్రిష్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘శకాలు అంతరించిపోవచ్చు కానీ దిగ్గజాలు చిరస్థాయిగా జీవించే ఉంటార’ని దర్శకుడు పూరి జగన్నాథ్ ట్వీట్ చేశారు. దాసరి నారాయణరావు దిగ్గజమని, ఆయన మరణం తెలుగు సినిమా పరిశ్రమకు పూడ్చలేని లోటని మరో దర్శకుడు అనిల్ రావిపూడి పేర్కొన్నారు. తెలుగు సినిమా ఒక లెజెండరీ దర్శకుడిని కోల్పోయిందని దర్శకుడు హరీశ్ శంకర్ అన్నారు. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గురువు గారూ..మరి సెలవు
-
'పద్మ' చెంతకు దాసరి..
మొయినాబాద్: ప్రముఖ దర్శకుడు, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు అంత్యక్రియలు బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు మొయినాబాద్ మండలం తోల్కట్ట సమీపంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్నారు. దాసరికి ఇక్కడ 18 ఎకరాల్లో ఫామ్హౌస్ ఉంది. నాలుగేళ్ల క్రితం ఆయన భార్య దాసరి పద్మ అంత్యక్రియలను ఇక్కడే నిర్వహించారు. ఆనాటి నుంచి ఫామ్హౌస్ను పద్మాగార్డెన్ అని పిలుస్తున్నారు. అంతేకాకుండా దాసరికి ఈ గార్డెన్తో చాలా అనుబంధం ఉందని తెలిసింది. అందుకే భార్య అంత్యక్రియలను ఇక్కడే నిర్వహించారు. దాసరి నారాయణరావును ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కలిసేవాడినని, ఎంతో ఆప్యాయంగా పలకరించేవాడని తోల్కట్ట మాజీ సర్పంచ్, రైతు శంకర్ ముదిరాజ్ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.