breaking news
Government of Telangana
-
Telangana: 'స్మార్ట్'గా సర్కారీ స్కూల్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నెట్ సదుపాయం, ఆధునిక కంప్యూటర్ వ్యవస్థ, డిజిటల్ లైబ్రరీ, అన్నిటికీ మించి డిజిటల్ విద్యాబోధనకు అనుగుణంగా డిజిటల్ స్క్రీన్లు..తదితర ఏర్పాట్లతో రాష్ట్రంలోని స్కూళ్లను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని విద్యా కమిషన్ భావిస్తోంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెరగాలంటే పెద్ద స్కూళ్ళ ఏర్పాటే మార్గమని స్పష్టం చేస్తోంది. ఈ విధానంతో ప్రైవేటు స్కూళ్ళకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను ముందుకు తీసుకెళ్ళొచ్చని అభిప్రాయపడుతోంది. విద్యార్థుల సంఖ్యను బట్టి మండలానికి 2 లేదా 3 స్కూళ్ళు ఉంటే సరిపోతుందని సూచిస్తోంది. విద్యా రంగం సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ వంద రోజులు స్కూళ్ళ నాణ్యతపై అధ్యయనం చేసింది. ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, స్థానిక ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకుంది. తక్షణమే తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలకు సంబంధించిన కొన్ని సిఫారసులతో త్వరలోనే నివేదిక సమర్పించనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. స్మార్ట్ విద్యా విధానంతో నాణ్యత: పాఠశాలల్లో ప్రతి సబ్జెక్టుకు సరిపడా టీచర్లు, ప్రయోగశాలలు, విశాలమైన తరగతులు, స్మార్ట్ కిచెన్, మౌలిక వసతులు, ఆట స్థలం ఉండేలా చూడాలి. విద్యార్థులు ప్రత్యక్షంగా చూసి వివిధ అంశాలు నేర్చుకునేందుకు వీలుగా స్టడీ టూర్లు నిర్వహించాలి. తొలిదశలో 3,673 పాఠశాలల్లోని 7,346 తరగతుల్లో తక్షణమే డిజిటల్ స్క్రీన్ ద్వారా బోధన జరగాలి. స్మార్ట్ విద్యా విధానం నాణ్యతను పెంచుతుంది. ఇందుకు కనీసం రూ.300 కోట్లు ఖర్చవుతుంది. ఒక్కో స్కూల్లో 100కు పైగా విద్యార్థులుండాలి పెద్ద స్కూళ్ల నిర్ణయం తీసుకునే ముందు ముఖ్యమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 41,628 ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లున్నాయి. ఇందులో 59 లక్షల మంది చదువుతున్నారు. ప్రభుత్వ స్కూళ్ళు 26,337 ఉంటే, వాటిల్లో 22.63 లక్షల మంది విద్యార్థులున్నారు. 11 వేల ప్రైవేటు స్కూళ్ళల్లో 34 లక్షల మందికి పైగా ఉన్నారు. ప్రైవేటు స్కూళ్ళు కూడా ఊరూరా లేవు. మండలంలోనూ ఒకటికి మించి ఉండటం లేదు. వీటిల్లో కనిష్టంగా 500, గరిష్టంగా 4 వేల మంది విద్యార్థులుంటున్నారు. కానీ రాష్ట్రంలోని 1,800 ప్రభుత్వ స్కూళ్ళల్లో అసలు అడ్మిషన్లే లేవు. 8,782 స్కూళ్ళల్లో 30కి మించి విద్యార్థులు లేరు. ఇందులో ప్రాథమిక పాఠశాలలే 8 వేలకుపైగా ఉన్నాయి. 10 వేల స్కూళ్ళల్లో 100 మందికి మించి లేరు. 5,800 స్కూళ్ళల్లో ఒకే ఉపాధ్యాయుడు ఐదు తరగతులకు బోధించే పరిస్థితి ఉంది. నిబంధనల ప్రకారం ప్రతి 30 మందికి ఒక టీచర్ ఉండాలి. కానీ ఇటీవల బదిలీలు, పదోన్నతుల నేపథ్యంలో 20 మందికి ఒక టీచర్ ఉండాలనే నిబంధన తెచ్చారు. అయినప్పటికీ గత ఏడాది కన్నా ఈ సంవత్సరం 1.62 లక్షల ప్రవేశాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఒక్కో స్కూల్లో కనీసం వందకు పైగా విద్యార్థులు ఉండేలా చూడాలనేది మెజారిటీ అభిప్రాయంగా ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో పది వేల స్కూళ్ళను ఆయా మండలాల పరిధిలో విలీనం చేయవచ్చు. ఉచిత రవాణా వ్యవస్థ అవసరం గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులను ప్రైవేటు యాజమాన్యాలు సులభంగా దూరంలో ఉన్న తమ స్కూళ్ళకు తీసుకెళ్తున్నాయి. ఇందుకోసం బస్సులు, ఆటోలు, వ్యాన్లు ఉపయోగిస్తున్నాయి. ఇదే తరహాలో ప్రభుత్వ స్కూళ్ళకు ఉచిత రవాణా వ్యవస్థ ఉండాలి. సూదూర ప్రాంతాలకు విద్యార్థులను పంపేందుకు 92 శాతం గ్రామీణ ప్రాంతాల తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నట్టు మా అభిప్రాయ సేకరణలో తేలింది. అయితే రవాణా సౌకర్యం కోసం ఖర్చు పెట్టేందుకు వాళ్ళు సిద్ధంగా లేరు. అందువల్ల ప్రభుత్వం ఉచితంగా ఈ సౌకర్యం కల్పిస్తే ప్రభుత్వ స్కూళ్ళ వైపే మొగ్గు చూపుతారు. -
3 ప్రాజెక్టుల డీపీఆర్లు వెనక్కి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) భారీ షాకిచ్చింది. అనుమతుల కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వం పంపించిన కాళేశ్వరం అదనపు టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి, వార్ధా ప్రాజెక్టుల డీపీఆర్లను వెనక్కి పంపించింది. ఈ మూడు ప్రాజెక్టులపై తాము లేవనెత్తిన అంశాల(అబ్జర్వేషన్ల)కు తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలంగా సమాధానం ఇవ్వలేదని పేర్కొంది. బీఆర్ అంబేడ్కర్ వార్ధా ప్రాజెక్టు డీపీఆర్పై తాము లేవనెత్తిన అంశాలకు ఏడాదిగా సమాధానం ఇవ్వలేదని, సత్వరంగా ఇవ్వకపోతే డీపీఆర్ను వెనక్కి పంపిస్తామని హెచ్చరిస్తూ గత నెల 22న రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ లేఖ రాసింది. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో.. మూడు ప్రాజెక్టుల డీపీఆర్లను పరిశీలించలేమని, వాటిని తమ పరిశీలనలో ఉన్న ప్రాజెక్టుల జాబితా నుంచి తొలగిస్తామని తేల్చి చెప్పింది. ఈ మేరకు డీపీఆర్లను వెనక్కి పంపిస్తూ సీడబ్ల్యూసీలోని ప్రాజెక్టుల మదింపు విభాగం డైరెక్టర్ రాజీవ్కుమార్ ఈ నెల 19న లేఖ రాశారు. తాము లేవనెత్తిన అంశాలకు 3 నెలల్లోగా సమాధానమివ్వకపోయినా, ట్రిబ్యునల్ పరిధిలో వివాదం ఉన్నా డీపీఆర్లను పరిశీలించకూడదనే నిబంధనలున్నాయని గుర్తుచేసింది. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్కు మార్గం సుగమం వార్ధా ప్రాజెక్టుపై పలు అంశాలను లేవనెత్తుతూ 2023 జూలై 4, జూలై 20, 2024 నవంబర్ 17 తేదీల్లో సీడబ్ల్యూసీలోని వేర్వేరు డైరెక్టరేట్లు రాసిన లేఖలకు తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదు. ప్రాజెక్టుతో మహారాష్ట్రలో ముంపు ఉండడంతో డీపీఆర్ను అంతర్రాష్ట్ర బోర్డు పరిశీలనకు పంపాలని సీడబ్ల్యూసీ గతంలో సూచించింది. ముంపుపై మహారాష్ట్ర నుంచి సమ్మతి తీసుకోవాలని కోరింది. ముంపు ఆధారంగా ప్రణాళికల్లో ఏమైనా మార్పులుంటే తెలపాలని సూచించింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కింద హెడ్వర్క్స్, సొరంగాలు, ఇతర పనులు ఎంత మేరకు చేశారు? వ్యయం ఎంత? పనుల లొకేషన్ ఏమిటి? ప్రాజెక్టు కోసం సేకరించిన పంపుసెట్ల వివరాలు, వార్ధా లేదా ఇతర ప్రాజెక్టులో వాటి వినియోగంపై సమాచారం ఇవ్వాలని కోరింది. ప్రభుత్వం సమాచారం ఇవ్వకపోవడంతో సీడబ్ల్యూసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. వార్ధా ప్రాజెక్టు డీపీఆర్ను సీడబ్ల్యూసీ వెనక్కి పంపడంతో ప్రాణహిత కింద ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మించడానికి మార్గం సుగమమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అదనపు ప్రయోజనం లేకుండా అంత ఖర్చు ఎందుకు? ఎలాంటి అదనపు ప్రయోజనాలు లేకపోయినా కాళేశ్వరం అదనపు టీఎంసీ ప్రాజెక్టుపై రూ.27 వేల కోట్లను ఎలా ఖర్చు చేస్తారని సీడబ్ల్యూసీ ప్రశ్నించింది. దీనిపై ఎన్నో లేఖలు రాసినా సమాధానం ఇవ్వడం లేదని తప్పుబట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు రోజువారీ పంపింగ్ సామర్థ్యాన్ని 2 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచడానికి ఈ పనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ప్రాజెక్టు నిర్వహణ ఆర్థికంగా ఆచరణీయమైనదని నిరూపించడానికి దానితో వచ్చే పంటల దిగుబడులను, వాటి విలువను భారీగా పెంచి చూపారంటూ సీడబ్ల్యూసీ తప్పుబట్టింది. చివరగా గత జనవరి 12న రాసిన లేఖకు ఇంకా సమాధానం ఇవ్వలేదని తెలిపింది. ట్రిబ్యునల్లో తేలేవరకు పాలమూరుకు అనుమతి నో ఏపీ, తెలంగాణల మధ్య కృష్ణా జలాల పంపిణీ వ్యవహారం కృష్ణా ట్రిబ్యునల్–2 పరిధిలో ఉన్నందున పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ను పరిశీలించలేమని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో ఉన్న 811 టీఎంసీల వాటాతో పాటు ‘పోలవరం’ప్రాజెక్టు నిర్మాణంతో సాగర్ ఎగువన లభ్యతలోకి వచి్చన 45 టీఎంసీల జలాలను ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ చేసే బాధ్యతను కృష్ణా ట్రిబ్యునల్–2కు కేంద్రం అప్పగించిన విషయాన్ని గుర్తు చేసింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు తరలిస్తే దానికి బదులుగా సాగర్ ఎగువ రాష్ట్రాలు 80 టీఎంసీలను వాడుకోవడానికి ట్రిబ్యునల్ అవకాశం కల్పించింది. ఈ 80 టీఎంసీల్లో మహారాష్ట్ర, కర్ణాటకలు 35 టీఎంసీలు వాడుకోగా, మిగిలి ఉన్న 45 టీఎంసీలను ఏపీ, తెలంగాణకు పంచే అంశం కృష్ణా ట్రిబ్యునల్–2లో పరిధిలో ఉంది. కాగా ట్రిబ్యునల్ తుది నిర్ణయం వచ్చే వరకు నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదని సీడబ్ల్యూసీ తాజాగా స్పష్టం చేసింది. -
ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఐఆర్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులతో సమానంగా వారికి మధ్యంతర భృతి మంజూరు చేసింది. మూలవేతనంపై 5 శాతం ఐఆర్ మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
అలాంటి వారికి అండగా నిలుద్దాం: అల్లు అర్జున్
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు సహరించాలని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోరారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ స్పెషల్ వీడియోని షేర్ చేస్తూ.. డ్రగ్స్ బాధితులను ఆదుకోవడానికి, సురక్షితమైన, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.‘‘మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్: 1908కు ఫోన్ చేయండి. వాళ్లు వెంటనే బాధితులను పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్లి.. సాధారణ జీవనశైలిలోకి వచ్చేవరకూ జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం వారిని శిక్షించడం కాదు. వారికి సాయం చేయడం. మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలుద్దాం’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.కాగా.. డ్రగ్స్ నియంత్రణలో సినీతారలు కూడా భాగం కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఓ ఈవెంట్లో రేవంత్ మట్లాడుతూ.. ఇకపై ఎవరికైనా సరే టకెట్ రేటు పెంపు కావాలంటే డ్రగ్స్, సైబర్ క్రైమ్పై అవగాహన కల్పిస్తూ ఓ వీడియో చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కూడా పుష్ప 2 సినిమా రిలీజ్కి కొద్ది రోజుల ముందుకు అలా వీడియో చేసి పంపారు. గతంలో కమల్ హాసన్, చిరంజీవి, ఎన్టీఆర్తో పాటు మరికొంతమంది హీరోలు కూడా ఇలాంటి అవగాహన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. Let’s unite to support the victims and work towards building a safer, healthier society.Humbled to join this impactful initiative by the Government of Telangana.@revanth_anumula @TelanganaCMO @TG_ANB @TelanganaCOPs pic.twitter.com/tZ5Rkiw5Lg— Allu Arjun (@alluarjun) November 28, 2024 -
మన ముత్యానికి మెరుపులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకే ప్రత్యేకమైన పలు ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్ –జీఐ) సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని ఆహారం, హస్తకళలు, వంగడాలు తదితర 17 రకాల ఉత్పత్తులకు ఇప్పటికే జీఐ గుర్తింపు లభించింది. ఇప్పుడు మరిన్ని ఉత్పత్తులకు జీఐ గుర్తింపు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఈ జాబితాలో హైదరాబాద్ ముత్యాలు, భద్రాచలం కలంకారీ, వరంగల్ మిర్చి తదితర ఉత్పత్తులు ఉన్నాయి. వీటికి జీఐ గుర్తింపు కోసం కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధీనంలోని ‘కం్రప్టోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, ట్రేడ్మార్క్’విభాగానికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు సమర్పించింది. 30 ఉత్పత్తులకు జీఐ ట్యాగింగ్ఇతర రాష్ట్రాలతో పోలిస్తే జీఐ ట్యాగింగ్ జాబితాలో తెలంగాణకు చెందిన ఉత్పత్తులకు పెద్దగా చోటు దక్కలేదు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ఉత్పత్తులు పెద్ద సంఖ్యలో జీఐ టాగింగ్ జాబితాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కనీసం 30 ప్రత్యేక ఉత్పత్తులకు జీఐ టాగింగ్ దక్కేలా చూడాలని పరిశ్రమల శాఖ నిర్ణయించింది. హైదరాబాద్ ముత్యాలు, భద్రాచలం కళంకారీ, వరంగల్ చపాటా మిర్చీకి గుర్తింపు ఇవ్వాలని దరఖాస్తు చేసింది. వరంగల్ చపాటా మిర్చీ తరహాలోనే ఖమ్మం మిర్చికి కూడా జీఐ టాగింగ్ ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. ఈ నేపథ్యంలో కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరిన్ని వివరాలు కోరింది. తెలంగాణకు చెందిన ప్రత్యేక ఉత్పత్తుల జాబితాను సిద్ధం చేసే ప్రక్రియ పురోగతిలో ఉన్నట్లు జీఐ టాగింగ్ నోడల్ అధికారి శ్రీహారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. – ఇప్పటివరకు తెలంగాణకు చెందిన 17 ప్రత్యేక ఉత్పత్తులకు జీఐ టాగింగ్ లభించింది. పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్ వెండి ఫిలిగ్రీ, నిర్మల్ కొయ్య బొమ్మలు, నిర్మల్ పెయింటింగ్స్, గద్వాల చీరలు, హైదరాబాద్ హలీమ్, చేర్యాల పెయింటింగ్స్, పెంబర్తి ఇత్తడి కళాకృతులు, సిద్దిపేట గొల్లభామ చీరలు, బంగినపల్లి మామిడి, పోచంపల్లి ఇక్కత్ లోగో, ఆదిలాబాద్ డోక్రా, వరంగల్ డర్రీస్, తేలియా రుమాల్, లక్క గాజులకు జీఐ గుర్తింపు లభించింది. – జీఐ చట్టం 1999 ప్రకారం భౌగోళిక ప్రత్యేకత, నాణ్యత, ప్రాముఖ్యత తదితరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగిన వాటికి జీఐ గుర్తింపు ఇస్తారు. వారసత్వ, సాంస్కృతిక సంపదను కాపాడటం, ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనను ప్రోత్సహించడం, ఉత్పత్తుల నాణ్యత, ప్రత్యేకతను పరిరక్షించడం, ఉత్పత్తులను నకలు కొట్టకుండా నిరోధించడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించడం జీఐ టాగింగ్ లక్ష్యం. -
ఫోర్త్సిటీకి మెట్రో
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైలు రెండోదశ పనులకు ప్రభుత్వం పరిపాలన ఆమోదం తెలిపింది. రెండోదశ ప్రాజెక్టులో భాగంగా రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కిలోమీటర్ల మేర ఐదు కారిడార్ల (పార్ట్–ఏ కింద)ను నిర్మించనున్నారు. పార్ట్–బీలో శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఫోర్త్ సిటీ (స్కిల్స్ యూనివర్సిటీ)వరకు ఆరో కారిడార్ను నిర్మించనున్నారు. దీనికి రూ.8 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. దీనికి సంబంధించిన అలైన్మెంట్, నిర్మాణ వ్యయం ఇతర అంశాలపై సర్వే జరుగుతోంది. ఈ మేరకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జాయింట్ వెంచర్గా నిర్మాణం రెండోదశ మెట్రో ప్రాజెక్టును దేశంలోని ఇతర నగరాల తరహాలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి 50:50 జాయింట్ వెంచర్ (జేవీ)గా నిర్మించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం నడుస్తున్న 69 కిలోమీటర్ల తొలిదశ మెట్రోరైలు ప్రపంచంలోనే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టు. ఐదు కారిడార్లలో 76.4 కిలోమీటర్ల రెండోదశ మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణానికి అంచనా వేసిన రూ.24,269 కోట్లలో తెలంగాణ ప్రభుత్వం వాటా రూ. 7,313 కోట్లు (30 శాతం) కాగా, కేంద్ర ప్రభుత్వం వాటా రూ.4,230 కోట్లు (18 శాతం), జపాన్ ఇంటర్నేషన్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా), ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ), న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) మొదలైన ఆర్థిక సంస్థల వాటా రూ.11,693 కోట్లు (48 శాతం), మరో 4 శాతం అంటే రూ.1,033 కోట్లను పీపీపీ విధానం ద్వారా సమీకరిస్తారు. ఫోర్త్సిటీ మెట్రో కనెక్టివిటీకి రూ.8 వేల కోట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించిన ఫోర్త్ సిటీ మెట్రో కనెక్టివిటీ లైన్ కోసం అనేక ఆకర్షణీయ ఫీచర్లతో వినూత్న రీతిలో డీపీఆర్ తయారు చేస్తున్నట్లు పురపాలక శాఖ తెలిపింది. ఈ కొత్త లైన్ డీపీఆర్ మినహా మిగిలిన ఐదు కారిడార్లకు సంబంధించిన డీపీఆర్ను త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని అధికారులు తెలిపారు. ఫోర్త్ సిటీ మెట్రో కనెక్టివిటీకి సుమారు రూ.8,000 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో మొత్తం రెండో దశ ప్రాజెక్ట్ కు అయ్యే వ్యయం దాదాపు రూ.32,237 కోట్లు (రూ.24,237 కోట్లు + రూ. 8,000 కోట్లు)గా అవుతుంది. కొత్త హైకోర్టును కలుపుతూ.. మెట్రో రైల్ రెండో దశ డీపీఆర్ల రూపకల్పనపై సీఎం రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం పురపాలక శాఖ సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మెట్రో రెండో దశ కారిడార్ల అలైన్మెంట్, స్టేషన్లు, ఇతర ముఖ్యమైన ఫీచర్లు తదితర అంశాల గురించి ప్రెజెంటేషన్ ఇచ్చారు. హెచ్ఎండీఏ కోసం సిద్ధం చేస్తున్న సమగ్ర మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ) ట్రాఫిక్ అధ్యయన నివేదిక తరువాత డీపీఆర్లకు తుదిరూపం ఇచ్చారు. మెట్రో మార్గాల్లో ట్రాఫిక్ అంచనాలను సీఎంపీతో క్రాస్–చెక్ చేయాల్సి ఉంటుంది. కేంద్రానికి డీపీఆర్లను సమర్పించడానికి ఈ అధ్యయనం తప్పనిసరి. దీంతో మెట్రో అలైన్మెంట్లు, స్టేషన్లు ఇతర అంశాలపై పూర్తిస్థాయిలో సర్వే చేసి, నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేశారు. ఆ డీపీఆర్లకు సీఎం ఆమోదం తెలిపారు. కాగా గతంలో ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయించిన ప్రకారం ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ ను ఇప్పుడు ఆరామ్ఘర్, 44వ నెంబర్ జాతీయ రహదారి (బెంగళూరు హైవే)లోని కొత్త హైకోర్టు ప్రాంతం మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా ఖరారు చేశారు. ఐదు కారిడార్ల అలైన్మెంట్లు ఇలా.. కారిడార్ –4 (ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్): నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు దాదాపు 36.6 కి.మీ. ఎల్బీ నగర్, కర్మన్ఘాట్, ఒవైసీ హాస్పిటల్, డీఆర్డీఓ, చాంద్రాయణగుట్ట, మైలార్దేవ్పల్లి, ఆరామ్ఘర్, న్యూ హైకోర్టు, శంషాబాద్ జంక్షన్ ద్వారా జాతీయ రహదారి మీదుగా ఈ మార్గం ఉంటుంది. ఇది నాగోల్, ఎల్బి నగర్, చంద్రాయన్ గుట్ట వద్ద ఉన్న అన్ని మెట్రోలైన్లకు అనుసంధానం చేయబడుతుంది. 36.6 కి.మీ పొడవులో 35 కి.మీ పిల్లర్ల మీద (ఎలివేటెడ్ ), 1.6 కి.మీ మార్గం భూగర్భంలో వెళ్తుంది. విమానాశ్రయం వద్ద భూగర్భ స్టేషన్ ఉంటుంది. ఈ మార్గంలో మొత్తం 24 స్టేషన్లు ఉంటాయి కారిడార్ 5: రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి కోకాపేట నియోపోలిస్ వరకు వరకు ఈ మార్గం ఉంటుంది. బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ రోడ్, నానక్ రామ్ గూడ జంక్షన్, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, కోకాపేట నియోపోలిస్ వరకు నిర్మిస్తారు. ఇది మొత్తం పిల్లర్లపైనే ఉండే ఎలివేటెడ్ కారిడార్. ఇందులో 8 స్టేషన్లు ఉంటాయి. కారిడార్ 6 (ఓల్డ్ సిటీ మెట్రో): ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ గుట్ట వరకు ఇది ఉంటుంది. ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న గ్రీన్ లైన్ పొడిగింపుగా 7.5 కి. మీ మేర నిర్మించబడుతుంది. ఓల్డ్ సిటీలోని మండి రోడ్, దారుల్షిఫా జంక్షన్, శాలిబండ జంక్షన్, ఫలక్నుమా మీదుగా ప్రయాణిస్తుంది. ఈ కారిడార్ సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్ నుంచి 500 మీటర్ల దూరం నుంచి వెళ్తున్నప్పటికీ చారిత్రక ప్రాముఖ్యత కారణంగా ఆ పేర్లనే స్టేషన్లకు పెట్టాలని నిర్ణయించారు. ఈ రూట్లో ఉన్న రోడ్లను విస్తరిస్తారు. రోడ్డు విస్తరణ, మెట్రో అలైన్మెంట్లో దాదాపు 1100 ఆస్తులు ప్రభావితమవుతాయి. ప్రభావితమైన 400 ఆస్తులకు ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేశారు. ఈ మార్గంలో దాదాపు 103 మతపరమైన, వారసత్వ, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నాయి. వాటన్నింటికీ తగిన ఇంజినీరింగ్ పరిష్కారాలు చూపుతారు. మెట్రో పిల్లర్ స్థానాల సర్దుబాటు ద్వారా ఆ నిర్మాణాలకు నష్టం కలుగకుండా చూస్తామని అధికారులు తెలిపారు. ఈ కారిడార్ దాదాపు 6 స్టేషన్లతో పూర్తి ఎలివేటెడ్ మెట్రో. కారిడార్ 7: ముంబై హైవేపై రెడ్ లైన్ పొడిగింపుగా నిర్మించబడుతోంది. ప్రస్తుతం ఉన్న మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి పటాన్చెరు వరకున్న 13.4 కి.మీ ఈ మెట్రోలైన్ ఆలి్వన్ క్రాస్ రోడ్, మదీనాగూడ, చందానగర్, బీహెచ్ఈఎల్, ఇక్రిసాట్ మీదుగా వెళ్తుంది. ఇది దాదాపు 10 స్టేషన్లతో ఉండే పూర్తి ఎలివేటెడ్ కారిడార్. కారిడార్ 8: విజయవాడ హైవేపై ఎల్.బి నగర్ నుంచి ప్రస్తుతం ఉన్న రెడ్ లైన్ పొడిగింపుగా హయత్నగర్ వరకు 7.1 కి.మీ మేర ఈ లైన్ నిర్మిస్తారు. ఈ లైన్ చింతలకుంట, వనస్థలిపురం, ఆటోనగర్, ఆర్టీసీ కాలనీ మీదుగా వెళుతుంది. ఇది కూడా పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్. ఈ లైన్లో 6 స్టేషన్లు ఉంటాయి. -
విద్యుత్ క్రయవిక్రయాలకు ఓకే
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. పవర్ ఎక్స్చేంజీల్లో విద్యుత్ క్రయవిక్రయాలు జరపకుండా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)పై గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా విధించిన ఆంక్షలపై స్టే విధించింది. ఎక్స్చేంజీల్లో విద్యుత్ క్రయవిక్రయాలు జరిపేందుకు టీజీఎస్పీడీసీఎల్కు అవకాశం కల్పించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యుత్ బిడ్డింగ్కు అనుమతించాలని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్ఎల్డీసీ)ను ఆదేశిస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 17కు వాయిదా వేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అత్యవసరంగా హైకోర్టులో కేసు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పీజీసీఐఎల్)కు రూ.261.31 కోట్ల చార్జీలను బకాయిపడినందుకు పవర్ ఎక్స్చేంజీల్లో విద్యుత్ క్రయవిక్రయాలు జరపకుండా టీజీఎస్పీడీసీఎల్పై గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా గురువారం ఉదయం ఆంక్షలు విధించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అత్యవసరంగా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి.. ఈ నిర్ణయంపై స్టే విధించాలని కోరింది. నిషేధంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, రాష్ట్రానికి మొత్తం విద్యుత్ కొనుగోళ్లు ఆగిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. రోజుకు 60 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోళ్లు నిలిచిపోతాయని.. వ్యవసాయం, పరిశ్రమలు, ఆస్పత్రులు, గృహాలు.. ఇలా యావత్ రాష్ట్రానికి ఇబ్బంది ఏర్పడుతుందని వివరించింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి విచారణ చేపట్టారు. కమిషన్ వద్ద పెండింగ్లో పిటిషన్ ప్రభుత్వం తరఫున ఏజీ ఏ.సుదర్శన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పీజీసీఐఎల్కు రూ.261.31 కోట్ల చార్జీల చెల్లింపు విషయంలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ) వద్ద కేసు పెండింగ్లో ఉండగా, ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్కుమార్ వాదనలు వినిపిస్తూ.. రూ.261.31 కోట్ల చెల్లింపులో తెలంగాణ ప్రభుత్వం విఫలమైనందునే లేట్ పేమెంట్ సర్చార్జీ నిబంధనల మేరకు ఆంక్షలు విధించినట్లు చెప్పారు. బకాయి పడిన మొత్తంలో 25 శాతం చెల్లించాలని గత ఫిబ్రవరిలో సూచించామని, అయినా చెల్లించలేదని పీజీసీఐఎల్ తరఫు న్యాయవాది తెలిపారు. గ్రిడ్ కంట్రోలర్కు అధికారం లేదు వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘రూ.261.31 కోట్ల చార్జీల చెల్లింపు వ్యవహారం సీఈఆర్సీలో పెండింగ్లో ఉన్నందున విద్యుత్ క్రయవిక్రయాలపై నిషేధం విధిస్తూ తెలంగాణ పేరును ప్రాప్తి పోర్టల్లో ప్రచురించే అధికారం గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు లేదు. అందువల్ల లేట్ పేమెంట్ సర్చార్జ్ నిబంధనల ప్రకారం ప్రాప్తి వెబ్సైట్లో ప్రచురణపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. ఈ ఆదేశాలను వెంటనే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర విద్యుత్ శాఖకు తెలియజేయాలని డీఎస్జీకి సూచిస్తున్నాం’ అని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
హైదరాబాద్ మా బలం: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘పొరుగు రాష్ట్రాలు సహా భారతదేశంలోనే ఎవరి వద్దా లేని హైదరాబాద్ నగరం మా వద్ద ఉంది. ఇక్కడ ఉన్న ఔటర్ రింగు రోడ్డు వంటి మౌలిక వసతులు, వాతావరణం, శాంతిభద్రతలు దేశంలో మరెక్కడా లేవు. మేము పక్క రాష్ట్రాలతో పోటీ పడాలనే ఆలోచనలకంటే ప్రపంచంతో పోటీ పడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. కేవలం అమెరికా, దక్షిణ కొరియాకే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలకు పిలుపునిస్తున్నా. తెలంగాణకు పెట్టుబడులతో వస్తే భద్రత, లాభంతో పాటు సాంకేతిక నైపుణ్యం అందించే యువశక్తి మా వద్ద ఉంది. పెట్టుబడులతో ఎవరు వచ్చినా రక్షణ ఉంటుందని హామీ ఇస్తున్నా. మీకు అవసరమైన అనుమతులు, వసతులు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుంది..’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి చెప్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ కోకాపేటలో 10 లక్షల చదరపు అడుగుల్లో ఏర్పాటు చేసిన కొత్త క్యాంపస్ను సీఎం బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘మా పోటీ కర్ణాటక, తమిళనాడు, ఏపీ వంటి రాష్ట్రాలతో కాదు. హైదరాబాద్ వంటి మహా నగరం, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ ఉన్నాయి. హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపేలా పాలసీల్లో పారదర్శకత పాటిస్తాం. పెట్టుబడులకు ప్రోత్సాహం ఇవ్వాలని భావిస్తున్నాం’అని రేవంత్ చెప్పారు. భిన్నాభిప్రాయాలు ఉన్నా అభివృద్ధి ‘కులీ కుతుబ్షాహీలు మొదలుకుని హైదరాబాద్ నగరం 430 ఏళ్లుగా రాజకీయ భిన్నాభిప్రాయాలను అధిగమిస్తూ అభివృద్ధి చెందుతోంది. అధికారంలో ఎవరు ఉన్నా భేదాభిప్రాయాలు లేనందునే ప్రపంచంతో పోటీ పడుతోంది. నిరుద్యోగ సమస్యకు సాంకేతిక నైపుణ్యంతో పరిష్కారం చూపాలనే రాజీవ్గాంధీ ఆలోచన మేరకు 1992లో నాటి సీఎం నేదురుమల్లి జనార్దన్రెడ్డి హైటెక్ సిటీకి పునాది వేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత హైటెక్ సిటీ నిర్మించారు. వైఎస్ హయాంలో మూడో నగరంగా సైబరాబాద్ నిర్మాణం జరిగింది. భవిష్యత్తు అవసరాలను హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాలు తీర్చే పరిస్థితి లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎయిర్పోర్టుకు కూతవేటు దూరంలో నాలుగో నగరం ‘ఫ్యూచర్ సిటీ’ని నిర్మిస్తాం. చైనా బయట పెట్టుబడుల కోసం చూస్తున్న అమెరికా, దక్షిణ కొరియా వంటి దేశాలకు ఫ్యూచర్ సిటీ సమాధానం చెప్తుంది. ఫ్యూచర్ సిటీలో కాగ్నిజెంట్ వంటి సంస్థలు భాగస్వాములు కావాలి..’అని సీఎం అన్నారు. ఇన్వెస్టర్ టాస్్కఫోర్స్ ఏర్పాటు ‘అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ద్వారా రూ.31,500 కోట్ల పెట్టుబడులు, 30,750 ఉద్యోగాల కల్పన జరుగుతుంది. త్వరలో మరిన్ని పెట్టుబడుల సాధన దిశగా సమావేశాల నిర్వహణ కోసం ‘ఇన్వెస్టర్ టాస్్కఫోర్స్’ఏర్పాటు చేస్తాం. తెలంగాణను ఫ్యూచర్ స్టేట్గా మార్చేందుకు హైదరాబాద్ను కోర్ అర్బన్ ఏరియాగా, ఔటర్ రింగు రోడ్డు, రీజినల్ రింగు రోడ్డు నడుమ ప్రాంతాన్ని సెమీ అర్బన్ ఏరియాగా, రీజినల్ రింగు రోడ్డు వెలుపల ఉన్న ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా వర్గీకరిస్తున్నాం. సెమీ అర్బన్ ఏరియాను తయారీ కేంద్రంగా, రూరల్ తెలంగాణలోని ప్రాంతాలను ఆసియాలోనే అత్యుత్తమ గ్రామాలుగా అభివృద్ధి చేస్తాం..’అని రేవంత్ చెప్పారు. 57 వేల మంది హైదరాబాద్ నుంచే: కాగ్నిజెంట్ ప్రెసిడెంట్ ‘హైదరాబాద్లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ను కేవలం ఆరు నెలల్లో సిద్ధం చేసి ప్రారంభిస్తున్నాం. 2002 నుంచి హైదరాబాద్ అభివృద్ధిలో కాగ్నిజెంట్ భాగస్వామిగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కాగ్నిజెంట్కు 3.56 లక్షల మంది ఉద్యోగులు ఉంటే అందులో 70 శాతం అంటే 2.40 లక్షల మంది భారత్ నుంచే ఉన్నారు. వీరిలో 57 వేల మంది హైదరాబాద్లోనే పనిచేస్తుండగా, 39 శాతం మంది మహిళలే కావడం గమనార్హం..’అని కాగ్నిజెంట్ ఈవీపీ ప్రెసిడెంట్ సూర్య గుమ్మడి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, ఐటీ, పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, కాగ్నిజెంట్ ప్రతినిధులు నారాయణన్, జాన్కిమ్, కేథరిన్ డియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
స్టాన్ఫోర్డ్ వర్సిటీ సహకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకొచ్చింది. బయోడిజైన్ రంగంలో నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో స్టాన్ఫోర్డ్ బయోడిజైన్ శాటిలైట్ సెంటర్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించింది. స్టాన్ఫోర్డ్ బైర్స్ సెంటర్ ఫర్ బయోడిజైన్ విభాగం సీనియర్ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా స్టాన్ఫోర్డ్ ఆధ్వర్యంలో జరిగే బయోడిజైన్ ఆవిష్కరణలను తెలంగాణలో విద్య, ఆరోగ్య రక్షణ విభాగాలకు అనుసంధానం చేయాలనే ఆలోచనను వర్సిటీ ప్రతినిధులతో సీఎం రేవంత్ పంచుకున్నారు. కొత్త యూనివర్సిటీల్లో భాగస్వామ్యం తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, న్యూ లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలని స్టాన్ఫోర్డ్ వర్సిటీని రాష్ట్ర బృందం ఆహా్వనించింది. అధునాతన పరిజ్ఞానం మారి్పడి, ఉమ్మడి పరిశోధనలపైనా చర్చించింది. ఈ సందర్భంగా స్టాన్ఫోర్డ్ వర్సిటీ తెలంగాణతో కలిసి పనిచేస్తుందని బయోడిజైన్ విభాగం అధిపతులు అనురాగ్ మైరాల్, జోష్ మాకోవర్ ప్రకటించారు. తమ ఆసక్తిని వ్యక్తం చేస్తూ సీఎం బృందానికి లేఖ ఇచ్చారు. వైద్య, విద్య పరికరాలు, కొత్త ఆవిష్కరణలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. స్టాన్ఫోర్డ్ వర్సిటీతో భాగస్వామ్యం తెలంగాణ యువత భవిష్యత్తుకు కొత్త బాటలు వేస్తుందని సీఎం రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. గూగుల్ కార్యాలయానికి రేవంత్ బృందం వర్సిటీలో పర్యటన అనంతరం సీఎం రేవంత్ బృందం కాలిఫోర్నియాలోని మౌంటేన్ వ్యూలో ఉన్న గూగుల్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. తెలంగాణలో టెక్ సేవల విస్తృతి, ఏఐ సిటీ నిర్మాణం, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు తదితర ప్రాజెక్టుల్లో భాగం పంచుకునే విషయమై గూగుల్ సంస్థ ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది. ప్రొఫెసర్ రామ్చరణ్తో భేటీ సీఎం రేవంత్ కాలిఫోర్నియాలో ప్రముఖ బిజినెస్ కన్సల్టెంట్, రచయిత, వక్త ప్రొఫెసర్ రామ్చరణ్తో భేటీ అయ్యారు. తెలంగాణ, హైదరాబాద్ ప్రత్యేకతలకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించేందుకు రాష్ట్రాన్ని సందర్శించాలని ఆహా్వనించారు. వేగంగా మారుతున్న వాణిజ్య వాతావరణంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం, పెట్టుబడుల సాధనకు అనుసరించాల్సిన మార్గాలపై వారు చర్చించారు. ప్రొఫెసర్ రామ్చరణ్ పలు అంతర్జాతీయ కంపెనీలు, సీఈవోలు, బోర్డులతో కలసి పనిచేశారు. హైదరాబాద్లో జొయిటిస్ విస్తరణ ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థ జొయిటిస్ హైదరాబాద్లో తమ కేపబులిటీ సెంటర్ (సామర్థ్య కేంద్రం)ను విస్తరించాలని నిర్ణయించింది. 2024 సెపె్టంబర్ నుంచి విస్తరణ కార్యకలాపాలు ప్రారంభిస్తామని, వందలాది మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొంది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు బృందంతో జొయిటిస్ ప్రతినిధులు భేటీ అయ్యారు. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి లైఫ్సైన్సెస్ హబ్గా తీర్చిదిద్దాలనే ఆలోచనలకు జొయిటిస్ విస్తరణ దోహదం చేస్తుందని వారు పేర్కొన్నారు. ఈ భేటీలో జోయిటిస్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కీత్ సర్బాగ్, ఇండియా కేపబిలిటీ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రాఘవ్ తదితరులు పాల్గొన్నారు. విస్తరణకు మోనార్క్ ట్రాక్టర్స్ ప్రణాళిక హైదరాబాద్లో తమ కార్యకలాపాల విస్తరణకు మోనార్క్ ట్రాక్టర్స్ సంస్థ ముందుకొచ్చింది. అమెరికాలో సీఎం రేవంత్ నేతృత్వంలోని రాష్ట్ర బృందం మోనార్క్ ట్రాక్టర్స్ సంస్థ సీఈఓ ప్రవీణ్ పెన్మత్స, ఇతర ప్రతినిధులతో భేటీ అయింది. హైదరాబాద్లోని తమ పరిశోధన, అభివృద్ధి కేంద్రానికి అనుబంధంగా అటానమస్ ట్రాక్టర్ టెస్టింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని మోనార్క్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రపంచంలోనే మొదటిసారిగా డ్రైవర్ లెస్ స్మార్ట్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను తమ సంస్థ రూపొందించిందని తెలిపారు. -
తెలంగాణలో నలుగురు ఐఏఎస్, 12 మంది ఐపీఎస్ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్, 12 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ► నిజామాబాద్ అదనపు కలెక్టర్ చిత్రమిశ్రాను ఐటీడీఏ ఏటునాగారం ప్రాజెక్టు అధికారిగా బదిలీ చేశారు. ఐటీడీఏ ఏటునాగారం ప్రాజెక్టు అధికారి అంకిత్ను నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్గా బదిలీ చేశారు. ► ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తాను ఉట్నూరు ప్రాజెక్టు అధికారిగా బదిలీ చేశారు. ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చేతన్ బాజ్పాయ్ను తదుపరి పోస్టింగ్కు సాధారణ పరిపాలన శాఖను రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. రాచకొండ సీపీగా తరుణ్జోషీ రాచకొండ పోలీస్ కమిషనరేట్ సీపీగా మల్టీజోన్–2 ఐజీగా ఉన్న డా.తరుణ్జోషి నియమితులయ్యారు.రాచకొండ సీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సుదీర్బాబును మల్టీజోన్ –2 ఐజీగా నియమించారు. మల్టీజోన్–1 ఐజీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. -
కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫన్నీ సెటైర్లు
-
జయ జయహే తెలంగాణ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చి, ఉత్తేజం రగిల్చిన ‘జయజయహే తెలంగాణ’ పాటను రాష్ట్ర గేయంగా గుర్తించాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనితోపాటు తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం భావితరాలకు గుర్తుండేలా కీలక మార్పులు చేపట్టాలని తీర్మానించింది. తెలంగాణ ఆత్మ కనిపించేలా రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, సీఎస్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 25కుపైగా అంశాలపై చర్చించారు. వాహనాల రిజి్రస్టేషన్ నంబర్లలో రాష్ట్ర కోడ్గా ‘టీఎస్’కు బదులు ‘టీజీ’ని ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు.. కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మరో రెండింటిని ఈ సమయంలోనే ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు మీడియాకు వివరించారు. ఇందిరమ్మ రాజ్య ఫలాలు అందిస్తాం కాంగ్రెస్ పార్టీకి అధికారమిచ్చిన రాష్ట్ర ప్రజలకు ఇందిరమ్మ రాజ్య ఫలాలు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. తొలిరోజున గవర్నర్ ప్రసంగిస్తారని, తర్వాతి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుందని తెలిపారు. మూడో రోజు బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు కొనసాగించేదీ బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ‘‘తెలంగాణ రాష్ట్రం కోసం సుదీర్ఘ పోరాటం జరిగింది. అలాంటి పోరాటాన్ని కాదని రాచరిక పోకడలతో రూపొందించిన రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తాం. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనిపించేలా చిహ్నాన్ని రూపొందిస్తాం. తెలంగాణ తల్లి రూపాన్ని కూడా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు కనిపించేలా మారుస్తాం. తెలంగాణ గేయంగా అందెశ్రీ రాసిన జయజయõహే తెలంగాణ పాట గుర్తించాలని మంత్రిమండలి నిర్ణయించింది..’’ అని పొంగులేటి తెలిపారు. త్వరలోనే కులగణన రాష్ట్రంలో బీసీలకు సంక్షేమ ఫలాలు పక్కాగా దక్కేలా కులగణన చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి చెప్పారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను అధికార యంత్రాంగం రూపొందిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గతంలో తెలంగాణ గెజిట్లో భాగంగా.. వాహనాల నంబర్ ప్లేట్లపై ‘టీజీ’ని నిర్దేశించిందని.. కానీ గత ప్రభుత్వం వారి పార్టీ ఆనవాళ్లు కనిపించేలా ‘టీఎస్’ను ఖరారు చేసిందని పేర్కొన్నారు. కేంద్ర గెజిట్ ప్రకారం టీఎస్కు బదులు టీజీగా మార్చాలని నిర్ణయించినట్టు వివరించారు. వీఆర్ఓల అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనప్పటికీ.. త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లోనే మరో రెండు గ్యారంటీ హామీలను సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీ.. రాష్ట్రంలోని 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. హైకోర్టు నిర్మాణం కోసం వంద ఎకరాల భూమి కేటాయింపునకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు చెప్పారు. త్వరలో వ్యవసాయాధికారి పోస్టుల భర్తీ చేపడతామన్నారు. గ్రూప్–1, ఇతర కేటగిరీల్లో ఉద్యోగ ఖాళీలను గుర్తించి, భర్తీ చేసే దిశగా కసరత్తు ముమ్మరంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం అతి త్వరలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణపై నివేదిక ఇవ్వండి రాష్ట్రంలో మూతపడిన నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ అంశంపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీకి సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ఆదివారం సచివాలయంలో సబ్ కమిటీతో ఈ అంశంపై సమీక్షించారు. బోధన్, ముత్యంపేటలలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలు చెల్లించాల్సిన పాత బకాయిలు, వాటి ఆర్థిక ఇబ్బందులు, ఆయా ప్రాంతాల్లోని చెరుకు రైతుల అవసరాలు, ప్రస్తుత పరిస్థితులపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించేందుకు అన్ని మార్గాలను అన్వేషించాలని, తగిన సూచనలను అందించాలని కమిటీని కోరారు. త్వరగా నివేదిక సిద్ధం చేస్తే.. మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుందామని సూచించారు. ఈ కమిటీ చైర్మన్, మంత్రి శ్రీధర్బాబు, ఇతర మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, రోహిత్రావు, అడ్లూరి లక్ష్మణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎ.చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. -
నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ లో ఎడతెగని చర్చ
-
తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్
-
తెలంగాణ: సొంత జాగా ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లు!
సాక్షి, హైదరాబాద్: పేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తొలుత సొంత జాగా ఉన్న వారికి ఇళ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. సొంత స్థలం లేనివారికి పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు వంటివి ఆ తర్వాత చేపట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇంటి స్థలాల పంపిణీ కోసం భూమిని సేకరించేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేశాయి. ఇప్పు డు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో.. మళ్లీ ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. సొంత జాగా ఉన్న అర్హులైన పేదలకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చింది. జాగా లేని పేదలకు స్థలం పట్టాలు ఇచ్చి, ఇంటి నిర్మాణానికి నిధులు ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఈనెల 28వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తొలుత సొంత జాగా ఉన్న పేదలకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు చొప్పున నిధులు విడుదల చేసి, వారు వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. తర్వాతే ఇంటి స్థలాల పంపిణీ.. రాష్ట్రంలో సొంత జాగా లేని నిరుపేదలు లక్షల్లో ఉన్నారు. అలాంటి వారికి తొలుత ఇంటి స్థలం ఇచ్చి, అందులో వారు ఇల్లు నిర్మించుకునేందుకు నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదలకు పంపిణీ కోసం భారీగా భూమిని సేకరించాల్సి ఉంది. ఈ ప్రక్రియ కోసం సమయం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇళ్ల డిజైన్లపై కసరత్తు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మూడు నమూనాలను సిద్ధం చేస్తున్నట్టు ఇటీవల గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అయితే నిర్ధారిత డిజైన్లో ఇళ్లను నిర్మించాలంటే.. కాలనీల తరహాలో ఒకే చోట భూమిని సేకరించాల్సి ఉంటుంది. సొంత జాగా ఉన్నవారు నిర్మించుకునే ఇళ్లు నిర్ధారిత డిజైన్లో ఉండాలంటే ఇబ్బంది ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. కొందరు ఉమ్మడి కుటుంబంగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. అందులో పెళ్లిళ్లు అయినవారు కొత్తగా ఇళ్లకు దరఖాస్తు చేసుకునే వీలుంది. వారు ఉంటున్న ఇంటికి ఆనుకుని ఉండే ఖాళీస్థలాల్లో ఇళ్లను నిర్మించుకుంటారు. అలాంటి ఖాళీ స్థలం ఆకృతి, అధికారులు సిద్ధం చేసే డిజైన్ ప్రకారం ఇల్లు నిర్మించేందుకు అనుకూలంగా ఉండకపోవచ్చనే సందేహాలు ఉన్నాయి. ఈ అంశంలో త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అమరుల కుటుంబాలకు ముందుగానే ప్లాట్లు తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు 250 చదరపు గజాల చొప్పున ప్లాట్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అదే స్థలాల్లో వారికి ఇళ్లను కూడా నిర్మించి ఇవ్వనున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారుల్లో సొంత జాగా లేనివారికి పట్టాలు ఇచ్చేందుకు కాస్త సమయం తీసుకున్నా.. అమరుల కుటుంబాలకు మాత్రం వెంటనే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే జాబితా రూపకల్పన, భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించి.. 2004– 2014 మధ్య ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి దాదాపు 19 లక్షల ఇళ్లను నిర్మించారు. మళ్లీ అధికారంలోకి వస్తే అదే తరహాలో ఇళ్లను నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. గెలిచి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కసరత్తు ప్రారంభించింది. అయితే గత సర్కారు ఎన్నికల ముందు స్వీకరించిన గృహలక్ష్మి దరఖాస్తులను తిరస్కరించాలని ఇప్పటికే నిర్ణయించింది. దీంతో ఇందిరమ్మ ఇళ్ల కోసం మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలోనే పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వాటిని పరిశీలించి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు. -
మాకు రేషన్ కార్డు రాక పదేళ్లయింది!
నల్లగొండ: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో నూతన రేషన్ కార్డులపై ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలోనే రేషన్ కార్డులను ఇచ్చింది. ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పదేళ్ల కాలంలో ఒక్క కార్డు కూడా ముద్రించి ఇవ్వలేదు. కానీ, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో అప్పటికే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న కొందరికి మాత్రమే ఫుడ్ సెక్యూరిటీ కార్డులను ఇచ్చింది. ఆ తర్వాత రేషన్ కార్డుల జారీ విషయాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న కొత్తవారితోపాటు పిల్లల పేర్లు కార్డులో నమోదు చేయించుకునేందుకు వేలాది మంది ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్న జరిగిన అసెంబ్లీలో ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే రేషన్ కార్డులు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ప్రస్తుతం కాంగ్రెస్సే అధికారంలోకి రావడం, పౌరసరఫరాల శాఖ మంత్రిగా జిల్లాకు చెందిన ఉత్తమ్కుమార్రెడ్డి బాధ్యతలు చేపట్టి తాజాగా మంగళవారం ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించడంతో కొత్త దరఖాస్తుదారులతోపాటు పాతవారు కూడా ఆనందపడుతున్నారు. 4.66లక్షల కార్డులు జిల్లాలో మొత్తం 4,66,180 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో పాతవాటితోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఫుడ్సెక్యూరిటీ కార్డులు కూడా ఉన్నాయి. కార్డుదారులందరికీ ప్రభుత్వం ప్రతినెలా 6 కేజీల చొప్పున ఉచితంగా బియ్యం అందిస్తోంది. ఒక్క బియ్యం తప్ప ఎలాంటి సరుకులు అందడం లేదు. అయితే జనాభా కంటే రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నాయన్న కారణంతో కార్డుల తొలగింపునకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయడం వల్ల చాలా మంది అనర్హులకు కార్డులు తొలగిపోయాయి. అలాగే అనర్హులు ఉంటే కార్డును స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించాలని కలెక్టరేట్తో పాటు తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక బాక్సులను ఏర్పాటు చేయడంతో చాలామంది అప్పగించడంతో చాలావరకు కార్డులు తగ్గాయి కానీ, అర్హులైన వారందరికీ ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు ముదిరంచి ఇవ్వలేదు. పదేళ్లయినా రేషన్ కార్డు రాలే.. నాకు పదేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు రాలేదు. ఇప్పడు నాకు ఇద్దరు కొడుకులు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో చెయ్యి తొలగించారు. రేషన్ కార్డు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ వంటి పథకం కింద వైద్యం చేయించుకోలేక పోతున్నాను. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తామన్నందుకు సంతోషంగా ఉంది. – గుండగోని రాజు, కట్టంగూర్ రెండేళ్ల క్రితం 11,950 కార్డులు జారీ.. రెండేళ్ల క్రితం హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన అవకాశం మేరకు జిల్లాలో 22వేల మంది కొత్త రేషన్కార్డుల కోసం జిల్లా వ్యాప్తంగా ఆన్లైన్లో 22వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో వివిధ కారణాలతో కొందరిని అనర్హులను తొలగించిన ప్రభుత్వం కేవలం11,950 మందికే ఫుడ్ సెక్యూరిటీ కార్డులు జారీచేసింది. అనంతరం కొత్త దరఖాస్తుల ఆహ్వానానికి ఓపెన్ చేసిన ప్రత్యేక సైట్ను బంద్ చేయడంతో దరఖాస్తులు చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకొని కార్డులురాని కుటుంబాలు ప్రస్తుతం 6,450 ఉన్నాయి. జిల్లాలో ఇంకా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు లక్ష కుటుంబాలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. -
తెలంగాణ మహిళలకే ఉచిత బస్సు సౌకర్యం..త్వరలో స్మార్ట్ కార్డులు జారీ
-
నాన్ టాక్స్ రెవెన్యూపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
-
తెలంగాణ: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీ అయ్యారు. అదే విధంగా వెయిటింగ్లో ఉన్న పలువురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇచ్చింది ప్రభుత్వం. ఈ బదిలీలు, పోస్టింగుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 మంది ఐఏఎస్ అధికారులు నూతన బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆర్థికశాఖ జాయింట్ సెక్రటరీగా కె. హరిత భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్గా ప్రియాంక ములుగు జిల్లా కలెక్టర్గా ఐలా త్రిపాఠి టూరిజం కల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజా రామయ్యర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్గా కొర్ర లక్ష్మీ టూరిజం డైరెక్టర్గా కె. నిఖిల ఆయుష్ డైరెక్టర్గా హరిచందన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎమ్సీఆర్ హెచ్ఆర్డీ) డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శిగా శైలజా రామయ్యర్, ఆయుష్ డైరెక్టర్గా దాసరి హరిచందన, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య నియమితులయ్యారు. హైదరాబాద్ కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టి నియమించారు. ఇక తెలంగాణ స్టేట్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్గా సంగీత సత్యనారాయణ, భద్రాచలం ఐటీడీఏ పీవోగా ప్రతీక్ జైన్, సెర్ప్ సీఈవోగా పాట్రు గౌతమ్, గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా నవీన్ నికోలస్, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్గా మంద మకరందు, ములుగు కలెక్టర్గా ఐలా త్రిపాఠి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా ముజమిల్ ఖాన్, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శిగా కె. హరితను నియమించారు. చదవండి: కవిత, కేటీఆర్పై సుఖేష్ సంచలన ఆరోపణలు, గవర్నర్కు మరో లేఖ హస్త కళల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా అలగు వర్షిణి, క్రీడల డైరెక్టర్గా కొర్రా లక్ష్మి, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్గా హైమావతి, పర్యాటక శాఖ డైరెక్టర్గా కే నిఖిల, వ్యవసాయ శాఖ ఉప కార్యదర్శిగా సత్య శారదాదేవి, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా స్నేహ శబారిష్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్గా ప్రియాంక ఆల, మహబూబ్నగర్ అదనపు కలెక్టర్గా వెంకటేశ్ ధోత్రే నియమితులయ్యారు. అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్గా ఉన్న కే స్వర్ణలతను జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి బదిలీ చేశారు. అభిలాష అభినవ్ను ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్గా, కామారెడ్డి అదనపు కలెక్టర్గా మను చౌదరిని, టీఎస్ దివాకరను జగిత్యాల అదనపు కలెక్టర్గా నియమించారు. నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్గా కుమార్ దీపక్, పెద్దపల్లి అదనపు కలెక్టర్గా చెక్క ప్రియాంక, కరీంనగర్ అదనపు కలెక్టర్గా జల్దా అరుణశ్రీ, సంగారెడ్డి అదనపు కలెక్టర్గా బడుగు చంద్రశేఖర్, రంగారెడ్డి అదనపు కలెక్టర్గా ప్రతిమా సింగ్, సిద్దిపేట అదనపు కలెక్టర్గా గరిమా అగర్వాల్ నియమితులయ్యారు. -
మన ఊరు.. తడ‘బడి’!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ప్రాథమిక విద్య అనేది హక్కు మాత్రమే కాదు. పేదల జీవితాల్లో చీకటిని శాశ్వతంగా తొలగించే ఏకైక సాధనం. సమాజ ఆర్థికాభివృద్ధికి శక్తివంతమైన చోదకం కూడా. అందువల్ల ప్రాథమిక దశలో మంచి అభ్యాసన కోసం చక్కటి పాఠశాల వాతావరణం, అన్నిరకాల మౌలిక సదుపాయాల ఏర్పాటు అత్యంత అవశ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకునే తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల రూపురేఖలు మార్చేలా ‘మన ఊరు – మనబడి’కి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 26,195 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు రూ.7,289 కోట్ల వ్యయంతో దీనిని ప్రారంభించింది. కానీ ఈ పథకం తొలి ఏడాదిలోనే తడబడుతోంది. నిధుల కొరతతో వెనకబడి పోతోంది. మూడు దశల్లో మొత్తం అన్ని పాఠశాలలను సకల హంగులతో తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశ కింద 9,058 పాఠశాలలను ఎంపిక చేయగా, జూన్ 12తో గడువు ముగిసినా 7 వేలకు పైగా పాఠశాలల్లో పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. చాలా పాఠశాలల్లో పనులు సుదీర్ఘంగా సాగుతుండగా, అనేకచోట్ల అసంపూర్తిగా నిలిచిపోయాయి. కొన్నిచోట్ల చెట్ల కింద, శిథిల భవనాల్లో పాఠాలు వినాల్సిన పరిస్థితి నెలకొంది. అన్ని హంగులతో ఆకర్షణీయంగా.. మంచినీళ్లు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, ఫర్నిచర్, కిచెన్ షెడ్లు, డైనింగ్ హాళ్ల ఏర్పాటుతో పాటు కొత్త క్లాస్రూంల నిర్మాణం, డిజిటల్ బోర్డు లు, పాఠశాల అంతా ఆకర్షణీయ మైన రంగులు లక్ష్యంగా ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఇందుకోసం ప్రభుత్వ నిధుల్ని కేటాయించడమే కాకుండా పూర్వ విద్యార్థులు, కార్పొరేట్ సంస్థల నుండి కూడా విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. కోటి రూపాయలకు పైబడి ఇస్తే పాఠశాలకు, రూ.10 లక్షలు ఇస్తే ఒక గదికి వారు సూచించే పేరును పెట్టాలని నిర్ణయించారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఆధ్వర్యంలో పనులను ప్రారంభించారు. కానీ దాతల నుండి ఆశించిన స్పందన లేకపోవటం, ప్రభుత్వం నుండి నిధులు ఆగిపోవటంతో పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి (టి) గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ‘మన ఊరు– మనబడి’ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పాఠశాలలో శిథిలావస్థకు చేరిన గదులను తొలగించి నూతన భవన నిర్మాణం చేపడుతున్నారు. దీంతో సరిపడా గదులు లేక విద్యార్థులను ఉపాధ్యాయులు ఆవరణలోని చెట్ల కింద కూర్చోపెట్టి పాఠాలు బోధిస్తున్నారు. ఇదీ లెక్క.. ♦ 2025 నాటికి అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేసి, 2030 నాటికి రాష్ట్రంలో 100% అక్షరాస్యత సాధించాలన్నది లక్ష్యం. కానీ ఇప్పు డు రాష్ట్ర సగటు అక్షరాస్యత 73.3 శాతమే. ఇక మహిళల్లో అక్షరాస్యత 64.8 శాతమే. ♦ రాష్ట్రంలో మొత్తం 62.29 లక్షల మంది విద్యార్థులుండగా అందులో అత్యధికం ప్రైవేటు పాఠశాలల్లోనే చదువుతున్నారు. 50.23 శాతం ప్రైవేటులో, 49.77 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. ♦ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారిలో 49.5% వెనకబడిన తరగతులు (బీసీ), 22.4% జనరల్ కేటగిరి, 17.5 శాతం ఎస్సీలు, 10.6 శాతం గిరిజనులు ఉన్నారు. ♦ ప్రభుత్వ పాఠశాలలు అత్యధికంగా నల్లగొండ జిల్లాలో, అతి తక్కువగా ములుగు జిల్లాలో ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలలు అత్యధికంగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఉన్నాయి. తక్కువ నిధులిస్తోంది మన రాష్ట్రమే రాజ్యాంగంలోని ఆరి్టకల్ 21 (ఎ) మేరకు విద్య అనేది ప్రాథమిక హక్కు. 6 నుండి 12 ఏళ్ల వరకు తప్పనిసరి విద్య అందించాలని రాజ్యాంగం చెబుతోంది. కానీ తెలంగాణలో విద్య అప్రాదాన్య సబ్జెక్ట్ అయింది. దీంతో పేదలు, వారి పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతోంది. దేశంలో విద్యకు అతి తక్కువగా నిధులు కేటాయిస్తున్న సర్కార్ మనదే. విద్య విషయంలో ప్రజల్లోనూ ప్రశ్నించే తత్వం పెరగాలి. – జస్టిస్ చంద్రకుమార్ ఆశించిన స్థాయిలో లేదు.. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా ప్రత్యేక పద్ధతుల్లో, తగిన మౌలిక సదుపాయాలతో విద్యా బోధన చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ముఖ్యంగా పేదలు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగుపడలేదు. ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ శాంతాసిన్హా. ఎంవీ ఫౌండేషన్ -
ధరణి పోర్టల్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
హైదరాబాద్లో సీ4ఐఆర్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్లోని దావోస్లో సోమవారం ప్రారంభమైన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం తొలిరోజే తెలంగాణ ప్రభుత్వం కీలక విజయం సాధించింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థల కార్యకలాపాలకు కేంద్రంగా మారిన హైదరాబాద్లో మరో అంతర్జాతీయ సంస్థ అడుగు పెడుతోంది. సీ4ఐఆర్ (సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్)కు చెందిన సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్ జెరేమీ జర్గన్స్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సెన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్ సంతకాలు చేశారు. ఐటీ, పరిశ్రమల మంత్రి కె.తారక రామారావు, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు బోర్జ్ బ్రెందే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జీవశాస్త్రాలు (లైఫ్ సైన్సెస్), ఆరోగ్య సంరక్షణ అంశాలపై ఈ కేంద్రం అధ్యయనం చేస్తుంది. భారత్లో సీ4ఐఆర్ విభాగాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఇలాంటి కేంద్రాలు ఉన్నాయి. తెలంగాణ అనుకూలతలు, సత్తాకు నిదర్శనం: కేటీఆర్ లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అనుకూలతలు, సత్తాకు సీ4ఐఆర్ కేంద్రం ఏర్పాటు నిదర్శనమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఒప్పంద కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతోనే ఈ సెంటర్ ఏర్పాటు సాధ్యమైందన్నారు. లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగంలో ఉన్న అవకాశాలను భారత్ అందిపుచ్చుకునేందుకు ఈ కేంద్రం దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధి కల్పనలో హైదరాబాద్ సీ4ఐఆర్ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రెసిడెంట్ బోర్జ్ బ్రెందే అన్నారు. సీ4ఐఆర్ ద్వారా ఆరోగ్య సంరక్షణలో ఇండియాను గ్లోబల్ పవర్హౌస్గా మార్చేందుకు తెలంగాణ నాయకత్వం వహిస్తుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెల్త్ కేర్ హెడ్ డాక్టర్ శ్యామ్ బిషెన్ పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంరక్షణ రంగంలో వినూత్న మార్పులు, రోగుల సౌకర్యాలను మెరుగు పరచడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. -
తెలంగాణ సర్కార్కు ఎన్జీటీ షాక్!
సాక్షి, అమరావతి: పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల పనులను నిలుపుదల చేయాలని 2021, అక్టోబర్ 29న జారీచేసిన ఆదేశాలను ఉల్లంఘించి యథేచ్ఛగా పనులు కొనసాగించిన తెలంగాణ సర్కార్పై గురువారం జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తంచేసింది. యథేచ్ఛగా పనులు చేయడంవల్ల పర్యావరణానికి అపారనష్టం వాటిల్లిందని తేల్చింది. దీంతో ఈ రెండు ఎత్తిపోతల పథకాల వ్యయంలో 1.5 శాతం చొప్పున మొత్తం రూ.620.85 కోట్లను జరిమానాగా తెలంగాణ సర్కార్కు విధించింది. అంతేకాక.. చట్టాలను అమలుచేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా వాటిని ఉల్లంఘిస్తున్నందున అదనంగా మరో రూ.300 కోట్లు జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది. ఇలా మొత్తం రూ.920.85 కోట్లను మూణ్నెళ్లలోగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) వద్ద డిపాజిట్ చేయాలని స్పష్టంచేసింది. తెలంగాణ సర్కార్ జరిమానాగా చెల్లించే రూ.920.85 కోట్లతో నమామి గంగే ప్రాజెక్టు తరహాలో కృష్ణా నదీ పరిరక్షణ చర్యలు చేపట్టాలని కృష్ణా బోర్డును ఆదేశించింది. అలాగే, పర్యావరణ అనుమతి తీసుకునే వరకూ పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులను కొనసాగించకూడదని తెలంగాణ సర్కార్ తేల్చిచెప్పింది. ఆ రెండు ఎత్తిపోతల డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)లను కృష్ణా బోర్డుకు పంపి, సీడబ్ల్యూసీ నుంచి అనుమతి తీసుకుని, అపెక్స్ కౌన్సిల్ మంజూరు చేశాకే వాటి పనులు చేపట్టాలని స్పష్టంచేసింది. ఈ మేరకు గురువారం ఎన్జీటీ తుది తీర్పు ఇచ్చింది. వివాదం నేపథ్యం ఇదీ.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీలు తరలించేలా రూ.35,200 కోట్ల వ్యయంతో పాలమూరు–రంగారెడ్డి.. రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీలు తరలించేలా డిండి ఎత్తిపోతలను రూ.6,190 కోట్ల వ్యయంతో 2015, జూన్ 10న తెలంగాణ సర్కార్ చేపట్టింది. పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిన ఈ రెండు ఎత్తిపోతలవల్ల పర్యావరణం దెబ్బతింటోందని, ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన జలాలు దక్కవని.. దీనివల్ల ఆయకట్టులో పర్యావరణం దెబ్బతింటుందని ఏపీకి చెందిన రైతులు 2021లో ఎన్జీటీ (చెన్నె బెంచ్)ను ఆశ్రయించారు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులతో జతకలిసింది. కృష్ణాలో 75 శాతం లభ్యత ఆధారంగా 2060 (పునరుత్పత్తి జలాలతో కలిపి 2130) టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. ఉమ్మడి రాష్ట్రానికి 800 టీఎంసీలు (పునరుత్పత్తితో కలిపి 811) టీఎంసీలు కేటాయించిందని ఎన్జీటికి ఏపీ ప్రభుత్వం వివరించింది. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలకు నీటి కేటాయింపుల్లేవని.. వాటి ద్వారా 120 టీఎంసీలను తెలంగాణ సర్కార్ తరలిస్తే.. శ్రీశైలం, సాగర్పై ఆధారపడ్డ ఆయకట్టుతోపాటు కృష్ణా డెల్టా కూడా నీటి కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతుందని, ఇది పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తుందని వాదించింది. దీనితో ఏకీభవించిన ఎన్జీటీ.. తక్షణమే పనులు నిలుపుదల చేయాలని 2021, అక్టోబర్ 29న తెలంగాణ సర్కార్ను ఆదేశించింది. ఎన్జీటీ ఉత్తర్వులు తెలంగాణ బేఖాతరు కానీ, ఎన్జీటీ ఉత్తర్వులను ఉల్లంఘించి పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులను తెలంగాణ సర్కార్ కొనసాగించింది. దాదాపు 90 శాతం పనులు పూర్తిచేసింది. ఇదే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రైతులు ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నిజానిజాలను నిర్ధారించడానికి కృష్ణా బోర్డు నేతృత్వంలో కమిటీని ఎన్జీటీ నియమించింది. క్షేత్రస్థాయిలో ఆ రెండు ఎత్తిపోతల పథకాలను పరిశీలించిన కమిటీ.. ఎన్జీటీ ఉత్తర్వులను తెలంగాణ సర్కార్ ఉల్లంఘించి యథేచ్ఛగా పనులు కొనసాగించినట్లు తేల్చింది. ఆ మేరకు ఎన్జీటీకి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు, రైతులు, కేంద్ర ప్రభుత్వం, కృష్ణా బోర్డు వాదనలను విన్న జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగస్టు 17న తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఆ తీర్పును గురువారం వెల్లడించింది. -
రూ.6200 కోట్లతో ‘కాపిటాలాండ్’
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ టెక్ పార్క్ (ఐటీపీహెచ్)లో డేటా సెంటర్ వృద్ధికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, కాపిటాలాండ్ ఇండియా ట్రస్ట్ మేనేజ్మెంట్ (క్లైంట్) నడుమ మంగళవారం పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. 2.50లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ డేటా సెంటర్ 36 మెగా వాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తొలిదశలో రూ.1200 కోట్ల అంచనా పెట్టుబడితో వృద్ధి చేసే ఈ డేటా సెంటర్ వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సమక్షంలో కుదిరిన ఈ ఒప్పందంపై ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, క్లైంట్ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఆధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసే ఈ డేటా సెంటర్లో కూలింగ్, భద్రత వంటి ఆధునిక సౌకర్యాలతో పాటు ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ను వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేసి ఆరు లక్షల చదరపు అడుగులకు విస్తరిస్తామని, రెండో దశలో భాగంగా మరో రూ.5వేల కోట్ల పెట్టుబడి పెడుతామని క్లైంట్ వెల్లడించింది. కేవలం డేటా సెంటర్ వృద్ధికే పరిమితం కాకుండా క్లైంట్ లాజిస్టిక్స్, సౌర విద్యుత్ ప్లాంట్ల వంటి మౌలిక వసతుల రంగంలోనూ తన కార్యకలాపాలను విస్తరిస్తామని వెల్లడించింది. డేటా సెంటర్లలో హైదరాబాద్ వృద్ది భారత్లో డేటా సెంటర్ల రంగంలో హైదరాబాద్ అతివేగంగా వృద్ధి చెందుతోందని మంత్రి కేటీ రామారావు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాపిటాలాండ్తో కేవలం డేటా సెంటర్ల రంగంలోనే కాకుండా ఇతర మౌలిక వసతుల కల్పన రంగంలోనూ తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేస్తుందన్నారు. కాపిటాలాండ్ వచ్చే ఐదేళ్లలో ఆఫీస్ స్పేస్ను రెట్టింపు చేయడం హైదరాబాద్ ఐటీ రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని కేటీఆర్ అన్నారు. యూరోప్, ఆసియా ఖండంలో 25 డేటా సెంటర్లను కలిగిన క్లైంట్ భారత్లో రెండో డేటా సెంటర్ను హైదరాబాద్లో వృద్ధి చేస్తుందని చెప్పారు. రెండు దశాబ్దాలుగా హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్లైంట్కు ఇప్పటికే స్థానికంగా ఐటీపీహెచ్, సైబర్ పెరల్, అవెన్స్ పేరిట మూడు బిజినెస్ పార్కులు ఉన్నాయని సంస్థ సీఈఓ సంజీవ్ దాస్గుప్తా వెల్లడించారు. 2.8 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు బిజినెస్ పార్కులు 30వేల మందికి ఉపాధి కల్పిస్తున్న 70 అంతర్జాతీయ సంస్థల అవసరాలు తీరుస్తున్నాయని చెప్పారు. యూరోప్, ఆసియా దేశాల్లో 500 మెగావాట్ల సామర్ద్యం కలిగిన 25 డేటా సెంటర్లను క్లైంట్ అభివృద్ధి చేసిందన్నారు. -
తెలంగాణలో అమర రాజా బ్యాటరీ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమర రాజా బ్యాటరీస్(ఏఆర్బీఎల్) తెలంగాణ లిథియం–అయాన్ బ్యాటరీల పరిశోధన, తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే పదేళ్లలో వీటిపై రూ. 9,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ శుక్రవారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. దీని ప్రకారం మహబూబ్నగర్ జిల్లాలో 16 గిగావాట్అవర్ (జీడబ్ల్యూహెచ్) అంతిమ సామర్థ్యంతో లిథియం సెల్ గిగాఫ్యాక్టరీ, 5 జీడబ్ల్యూహెచ్ వరకూ సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ‘లిథియం–అయాన్ సెల్ తయారీ రంగానికి సంబంధించి దేశంలోనే అతి పెద్ద పెట్టుబడుల్లో ఇది ఒకటి. తెలంగాణలో గిగాఫ్యాక్టరీ ఏర్పాటు కావడమనేది.. రాష్ట్రం ఈవీల తయారీ హబ్గా ఎదిగేందుకు, దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి సారథ్యం వహించాలన్న ఆకాంక్షను సాధించేందుకు దోహదపడగలదు‘ అని తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కేటీఆర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ‘అమర రాజా ఈ–హబ్ పేరిట అధునాతన పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నాం. అని ఈ సందర్భంగా అమర రాజా బ్యాటరీస్ సీఎండీ జయదేవ్ గల్లా ఈ సందర్భంగా తెలిపారు. ఏపీకి కట్టుబడి ఉన్నాం.. ఆంధ్రప్రదేశ్లో తమ కార్యకలాపాలు తగ్గించుకోవడం లేదని, రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని జయదేవ్ చెప్పారు. తిరుపతి, చిత్తూరు సైట్లు గరిష్ట స్థాయికి చేరాయని, కీలకమైన ఉత్తరాది మార్కెట్కు లాజిస్టిక్స్పరంగా వెసులుబాటు ఉండే ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నామన్నారు. భారత ఉపఖండం పరిస్థితులకు అనువైన లిథియం–అయాన్ బ్యాటరీలపై చాలా కాలంగా పని చేస్తున్నామని, ఇప్పటికే కొన్ని ద్వి, త్రిచక్ర వాహనాల తయారీ సంస్థలకు లిథియం బ్యాటరీ ప్యాక్లను సరఫరా చేస్తున్నామని తెలిపారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సంస్థ న్యూ ఎనర్జీ బిజినెస్ ఈడీ విక్రమాదిత్య గౌరినేని తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మునుగోడు మాజీ ఆర్వో సస్పెన్షన్.. రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేఎంవీ జగన్నాథరావును తక్ష ణమే సస్పెండ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. శుక్రవారం ఉదయం 11గంటల్లోగా సస్పెన్షన్ ఉత్తర్వులను పంపాలని రాష్ట్ర ప్రభుత్వా న్ని కోరింది. రిటర్నింగ్ అధికారికి సరైన భద్రత కల్పించడంలో విఫలమైనందుకు గానూ స్థానిక డీఎస్పీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో యుగ తులసి పార్టీ అభ్యర్థికి కేటా యించిన రోడ్డు రోలర్ గుర్తును మార్చి బేబీ వాకర్ గుర్తును కేటాయించడా న్ని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల తీవ్రంగా పరిగణించిన విషయం తెలి సిందే. ఈ వ్యవహారంలో బాధ్యుడైన రిటర్నింగ్ అధికారి(ఆర్వో) జగన్నాథ రావుపై వేటు వేసి ఆస్థానంలో మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్సింగ్ను ఆర్వో గా నియమించింది. యుగ తులసి పార్టీ అభ్యర్థికి తిరిగి రోడ్డు రోలర్ను కేటాయించింది. తాజాగా ఈ ఉదంతంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన అనంతరం జగన్నాథరావును సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. (చదవండి: ఉచితాలతో ఓటర్లను ఆధారపడేలా చేయొద్దు) మునుగోడు ఉపఎన్నికను రద్దు చేయండి భారత ఎన్నికల చరిత్రలోనే అతి ఖరీదైన ఎన్నిక మును గోడు ఉపఎన్నిక అని, అక్కడ జరుగుతున్న అక్రమాలు, డబ్బు, మద్యం పంపిణీని అరికట్టి ఉపఎన్నికను రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు గోనెల ప్రకాశ్రావు వినతి పత్రాలు పంపారు. మునుగోడులో అక్టోబర్ నెలలో దాదాపు రూ.132 కోట్ల మద్యం ఏరులైపారిందని, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ మునుగోడులో ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని వివరించారు. భారత రాజ్యాంగంలోని ఆరి్టకల్ 324 ప్రకారం ఎన్నికల రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘంకు ఉందని గుర్తు చేశారు. (చదవండి: మునుగోడు సైన్మా.. టక్కర్లు, ట్విస్ట్లు) -
Telangana: ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల ఖరారు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కళాశాల్లో ఫీజులను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. అడ్మిషన్, ఫీజుల నియంత్రణ కమిటీ(ఏఎఫ్ఆర్సీ) సిఫార్సుల మేరకు 159 కాలేజీల్లో ఫీజులు ఖరారు చేస్తూ తెలంగాణ సర్కార్ బుధవారం జీవో జారీ చేసింది. అదే విధంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో కనీస రుసుమును రూ.45వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 40 కాలేజీల్లో ఇంజినీరింగ్ ఫీజు రూ. లక్ష దాటింది. ఎంజీఐటీ రూ.1.60లక్షలు, సీవీఆర్ రూ.1.50లక్షలు, సీబీఐటీ, వర్ధమాన్, వాసవీ రూ.1.40లక్షలుగా నిర్ణయించింది. మూడేళ్లపాటు కొత్త ఇంజనీరింగ్ ఫీజులు అమల్లో ఉండనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అంతేగాక ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ ఫీజులు సైతం ప్రభుత్వం పెంచింది. ఎంబీయే, ఎంసీయే కనీస వార్షిక ఫీజు రూ.27వేలుగా.. ఎంటెక్ కనీస వార్షిక రుసుము రూ.57వేలకు పెంచుతూ జీవో జారీ చేసింది. చదవండి: మందుకొట్టి.. గొడ్డలి పట్టి కానిస్టేబుల్పై దాడి -
గోపాలమిత్రలకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుక
సాక్షి, హైదరాబాద్: పశుసంవర్థక శాఖ పరిధిలో పనిచేస్తున్న గోపాలమిత్రలకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. ప్రస్తుతం వారికి చెల్లిస్తున్న నెలవారీ వేతనానికి అదనంగా 30 శాతం పెంచుతున్నట్టు వెల్లడించింది. గోపాలమిత్రలకు రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల తరహాలోనే 30 శాతం వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీచేశామని, ప్రస్తుతం నెలకు వస్తున్న రూ.8,500కు తోడు పెంచిన 30 శాతం (రూ.2550) కలిపి రూ.11,050 చెల్లిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మంగళవారం తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతాంగానికి అందుబాటులో ఉంటూ పాడిగేదెలకు కృత్రిమ గర్భధారణ, వ్యాక్సినేషన్, నట్టల నివారణ మందుల పంపిణీ లాంటి కార్యక్రమాల అమలులో సేవలందిస్తున్న గోపాల మిత్రలను ప్రభుత్వ గుర్తించి వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుందని చెప్పారు. తెలంగాణలో గోపాలమిత్రలకు ఇస్తున్న వేతనాన్ని దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదని పేర్కొన్నారు. తాజా పెంపుతో 1,530 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. (చదవండి: ఉపఎన్నికలో ఓ గ్రామ ఇన్చార్జిగా కేసీఆర్.. ఏ గ్రామానికి అంటే?) -
పోలవరంతో భద్రాద్రి భద్రమే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలానికి ఎలాంటి ముంపు ముప్పు ఉండదని ఐఐటీ–హైదరాబాద్ తేల్చి చెప్పింది. పోలవరాన్ని కట్టాక భద్రాచలం వద్ద పెరిగే గోదావరి నీటి మట్టం కేవలం గోరంతేనని (2 సెంటీమీటర్లు) స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తాను స్వయంగా చేయించిన ఈ అధ్యయనంలోనే పోలవరం ద్వారా భద్రాచలానికి ఏ మాత్రం ముప్పు లేదని స్పష్టం కావడం గమనార్హం. వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేసేలా పోలవరం గేట్లను సమర్థంగా నిర్వహిస్తే బ్యాక్ వాటర్ ప్రభావం భద్రాచలం సహా తెలంగాణలోని ఇతర ప్రాంతాలపై ఏమాత్రం ఉండదని తెలిపింది. పోలవరం వద్ద గోదావరి గరిష్ట వరద, బ్యాక్ వాటర్ ప్రభావంపై తెలంగాణ నీటిపారుదల శాఖ 2017లో ఐఐటీ–హైదరాబాద్తో అధ్యయనం నిర్వహించింది. గోదావరి పరీవాహక ప్రాంతంలో సీడబ్ల్యూసీ, తెలంగాణ జలవనరుల విభాగం లెక్కల ప్రకారం వరద ప్రవాహాలు, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ నమోదు చేసిన వరద ప్రవాహాలను అధ్యయనం చేసేందుకు ఐఐటీ–హైదరాబాద్కు తెలంగాణ ప్రభుత్వం అందజేసింది. ముంపు ముప్పు ఉత్తదే.. ధవళేశ్వరం వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమోదు చేసిన రికార్డులు కచ్చితంగా ఉండటంతో వాటిని పరిగణలోకి తీసుకుని పోలవరం వద్ద వెయ్యేళ్లకు, పది వేల ఏళ్లకు ఒకసారి గరిష్టంగా వచ్చే వరదను లెక్కట్టిన ఐఐటీ–హైదరాబాద్ బ్యాక్ వాటర్ ప్రభావంపై సమగ్రంగా అధ్యయనం చేసింది. అందులో వెల్లడైన అంశాలివీ.. ► పోలవరంలో 45.72 మీటర్లలో 194.6 టీఎంసీలను నిల్వ చేస్తే 637 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ముంపునకు గురవుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 601, ఒడిశాలో 12, చత్తీస్గఢ్లో 24 చ.కి.మీ. భూభాగం ఉంది. ఆంధ్రప్రదేశ్ 222 రెవెన్యూ గ్రామాలు ముంపునకు గురవుతుండగా చత్తీస్గఢ్లో పది, ఒడిశాలో ఏడు రెవెన్యూ గ్రామాలపై ముంపు ప్రభావం ఉంటుంది. ► గోదావరిలో గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినప్పుడు భద్రాచలం వద్ద నీటి మట్టం పోలవరం కట్టక ముందు 57 మీటర్లు ఉంటే.. కట్టాక 57.02 మీటర్లు మాత్రమే ఉంటుంది. ► గోదావరి చరిత్రలో 1986 ఆగస్టు 16న ధవళేశ్వరం బ్యారేజ్లోకి గరిష్టంగా 35,06,338 క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. ► గోదావరి గరిష్ట వరద ప్రవాహాలను పరిగణలోకి తీసుకుంటే వెయ్యేళ్లకు ఒకసారి గరిష్టంగా 39.72 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది. ఆ స్థాయిలో వరద వచ్చినప్పుడు భద్రాచలం వద్ద నీటి మట్టం పోలవరం కట్టక ముందు 57.7 మీటర్లు ఉంటే.. నిర్మాణ పూర్తయ్యాక 57.77 మీటర్లు ఉంటుంది. ► పది వేల సంవత్సరాలకు ఒకసారి గోదావరికి గరిష్టంగా 44.61 లక్షల క్యూసెక్కుల వరద వస్తుంది. ఆ స్థాయిలో వరద వచ్చినప్పుడు భద్రాచలం వద్ద నీటి మట్టం పోలవరం కట్టక ముందు 61.41 మీటర్లు ఉంటే.. నిర్మాణ పూర్తయ్యాక 61.43 మీటర్లు ఉంటుంది. ► కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించిన డిజైన్ మేరకు గోదావరికి గరిష్టంగా 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా విడుదల చేసేలా పోలవరంలో ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్వే నిర్మిస్తున్నారు. పోలవరం డిజైన్ మేరకు అంటే గరిష్టంగా 50 లక్షల క్యూసెక్కుల వరద గోదావరికి వచ్చినప్పుడు భద్రాచలం వద్ద నీటి మట్టం ప్రాజెక్టు కట్టక ముందు 61.77 మీటర్లు ఉంటే కట్టాక 61.79 మీటర్లు ఉంటుంది. గేట్ల నిర్వహణే కీలకం పోలవరం ప్రాజెక్టు గేట్లను సమర్థంగా నిర్వహిస్తే బ్యాక్ వాటర్ ప్రభావం కనిష్ట స్థాయిలో ఉంటుందని ఐఐటీ–హైదరాబాద్ తేల్చింది. బ్యాక్ వాటర్ ప్రభావం లేకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించింది. ► పోలవరంలో నీటి నిల్వలు.. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వరదను దిగువకు విడుదల చేసేలా సమర్థంగా గేట్లను నిర్వహించాలి. ► పోలవరం జలవిస్తరణ ప్రాంతంలో నదీ గర్భంలో ఎప్పటికప్పుడు ఇసుక మేటలను తొలగించాలి. దీనివల్ల నీటి మట్టం పెరగదు. ► ముంపును నివారించాలంటే ఎగువన కాళేశ్వరం, మేడిగడ్డ లాంటి ప్రాంతాల్లో బ్యారేజ్లు నిర్మించాలి. ► పోలవరం డ్యామ్ నిర్మించడం వల్ల తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో భూఉపరితల మట్టం కంటే నీటి ఉపరితల మట్టం రెండు సెంటీమీటర్ల మేర పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రాధాన్యత క్రమంలో పది దశల్లో గోదావరికి ఇరువైపులా 124.55 కి.మీ. పొడవున కరకట్టలు నిర్మించాలి. ఇందుకు రూ.996.4 కోట్ల వ్యయం అవుతుంది. -
ఏపీ బకాయి పడిందంటూ కేసీఆర్ కొత్త పంచాయితీ.. ఆయన లెక్కలు సరైనవేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కొత్త పంచాయితీ పెట్టారు. ఎపి ప్రభుత్వమే తెలంగాణకు రూ.17,828 కోట్లు ఇవ్వాలన్న వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ఎపి నుంచి విద్యుత్ తీసుకున్నందుకు గాను తెలంగాణ ఇవ్వవలసిన మూడువేల కోట్లు, గత కొన్ని సంవత్సరాలుగా చెల్లించనందుకుగాను వడ్డీ మూడు వేలు , మొత్తం ఆరువేల కోట్లు వెంటనే ఇప్పించాలని కోరుతూ ఎపి ప్రభుత్వం కేంద్రానికి వినతులు ఇస్తోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడు చేసిన విజ్ఞప్తిలో కూడా ఈ అంశం ప్రముఖంగా ఉంది. ఉత్తరప్రత్యుత్తరాల తర్వాత కేంద్రం ఒక నిర్ణయం తీసుకుని ఎపికి ఆరువేల కోట్లు రూపాయలు చెల్లించాలని తెలంగాణను ఆదేశించింది. కెసిఆర్ దానిని వివాదాస్పదం చేస్తున్నారు. తమకే ఎపి రూ.17,828 కోట్లు ఇవ్వాలని, అందులో నుంచి ఈ ఆరువేల కోట్లు మినహాయించుకుని , మిగిలిన మొత్తం తమకు ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. నిజంగానే ఎపి ప్రభుత్వం ఆ మొత్తం ఇవ్వవలసి ఉంటే కచ్చితంగా ఇవ్వాల్సిందే. కాని ఇంతవరకు ఎన్నడూ తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి బాకీ ఉన్నట్లు కేంద్రానికి తెలియచేసినట్లు కనిపించదు. కెసిఆర్ ఇదంతా అధికారిక లెక్క అని చెబుతున్నా, అందుకు తగ్గ ప్రాతిపదిక కూడా అవసరమే. అలాకాకుండా ఎపి ప్రభుత్వానికి బాకీ చెల్లించకుండా ఉండడానికి పోటీగా ఈ లెక్కలు చెబితే అంత అర్దవంతంగా ఉండకపోవచ్చు. ఒక వైపు జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించాలని ఆలోచిస్తున్న కెసిఆర్, తన పొరుగు రాష్ట్రమైన ఎపితోనే సంబంధాలు సజావుగా నడపడం లేదన్న భావన వస్తే అది ఆయనకు రాజకీయంగా నష్టం చేస్తుంది. ఎపి ప్రభుత్వం ఇవ్వవలసినవి అంటూ ఆయన ఇచ్చిన వివరణ లో విద్యుత్ ఉద్యోగుల ట్రస్టు నిధులు ఉన్నాయని, కృష్ణపట్నం విద్యుత్ కేంద్రంలో తెలంగాణ వాటా ఉందని చెప్పారు. తాను ఎక్కువగా మాట్లాడుతున్నాననే ఎపికి ఆరువేల కోట్లు చెల్లించాలని కేంద్రం ఆదేశించిందని కెసిఆర్ ఆరోపించారు. నిజానికి కేంద్రం ఎప్పుడో ఈ సమస్యను పరిష్కరించి ఉండాల్సింది. ఈ నిర్ణయం చేయడానికి కేంద్రం ఎవరు అని ఆయన ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం. ఒకవేళ కేంద్రం నిర్ణయంలో తప్పు ఉంటే దానిని ఎత్తిచూపవచ్చు. కాని విభజన చట్టం ప్రకారం ఉభయ రాష్ట్రాల మధ్య చర్చల ద్వారా పరిష్కారం కాని అంశాలను కేంద్రమే చొరవ తీసుకుని సాల్వ్ చేయాలని స్పష్టంగా ఉంది. దానిని కెసిఆర్ విస్మరించలేరు. కృష్ణపట్నం విద్యుత్ కేంద్రంలో తెలంగాణకు వాటా ఎలా వస్తుందో తెలియదు. అది నిజమే అయితే తెలంగాణలో ఉన్న కొన్ని పవర్ ప్లాంట్ లలో తమకు వాటా ఇవ్వాలని ఎపి డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. అంతకన్నా ముఖ్యం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ లో ఉన్న వివిధ సంస్థల ఆస్తులు, బ్యాంకులలో ఉన్న నగదు పంపిణీ చేసుకోవలసి ఉన్నా, ఇంతవరకు అవి ఎటూ తెగడం లేదు. దీనివల్ల ఎపికే ఎక్కువ నష్టం జరుగుతుంది. తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ ఉన్నందున ఇక్కడి వివిధ సంస్థల ఆస్తులు ఈ ప్రభుత్వానికి అందుబాటులో ఉంటాయి. ఎపి ప్రభుత్వానికి ఆ అవకాశం ఉండదు. వారు తమ వాటా అడగడం తప్ప చేయగలిగింది లేదు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సున్నిత మైన సమస్యలను ముందుగానే పరిష్కరించి విభజన చేసి ఉంటే రెండు ప్రాంతాలకు న్యాయం జరిగేది. అలాకాకపోవడం వల్ల ఆంద్రకు నష్టం జరిగిందని ఆ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. అలాగే పోలవరం ముంపు మండలాలను ఎపికి కేటాయించడం, సీలేరు హైడల్ ప్రాజెక్టు గురించి కూడా కెసిఆర్ ప్రస్తావించారు. కాని ఆయన ఒక విషయం మర్చిపోతున్నారు. 1956కి ముందు భద్రాచలంతో సహా పోలవరం ముంపు మండల ప్రాంతం అంతా ఆంధ్ర రాష్ట్రంలో భాగంగా ఉండేది. కాకపోతే సదుపాయాల రీత్యా దానిని తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కలిపారు. అప్పుడు అది ఉమ్మడి రాష్ట్రం కనుక ఇబ్బంది రాలేదు. కాని విభజన జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నేపధ్యంలో దానిని పూర్తి చేయాలంటే ఈ ముంపు మండలాలు ఎపిలోనే ఉంచాలన్న ప్రతిపాదన వచ్చింది. దానిని ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదించి ఆర్డినెన్స్ జారీచేయించారు. అప్పుడు ఆ పని జరగకపోతే, ప్రస్తుతం రెండు రాష్ట్రాల మద్య తలెత్తున్న పలు వివాదాలలో అది కూడా ఒకటి అయ్యేది. పోలవరం ప్రాజెక్టు ముందుకు కదలడమే కష్టం అయ్యేది. ముందుగా ముంపు మండలాల పరిహారం తదితర సంగతులు తేల్చాలని, అంతవరకు ప్రాజెక్టు ముందుకు తీసుకు వెళ్లడానికి లేదని తెలంగాణ ప్రభుత్వం వాదించి ఉండేదేమో! కేంద్ర ప్రభుత్వంపై కెసిఆర్ ఎంతైనా విరుచుకుపడనివ్వండి. కేంద్రంలో బిజెపిని దేవుడు కూడా కాపడలేరని, నాన్ బిజెపి ప్రభుత్వమే వస్తుందని ఆయన చెప్పనివ్వండి. మంచిదే. ఆయన ప్రధాని హోదాకు వెళితే తెలంగాణ ప్రజలతో పాటు ఆంద్ర ప్రజలు కూడా సంతోషిస్తారు. కాని ఆ ప్రయత్నంలో ఉన్న తరుణంలో కెసిఆర్ ఇలాంటి తగాదాలు పెట్టుకుంటే ఆయనకు రాజకీయంగా నష్టం జరగవచ్చు. ఎపి కి వ్యతిరేకంగా సెంటిమెంటును రెచ్చగొట్టడానికి ఇక ఇవి అంతగా ఉపయోగపడకపోవచ్చు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎపి, తెలంగాణల మధ్య పలు అంశాలలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఆ వాతావరణం లేదు. ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా కెసిఆర్ పట్ల గౌరవంగా ఉండే వ్యక్తే. అందువల్ల సీనియర్ నేతగా కెసిఆర్ ఇప్పటికైనా చొరవ తీసుకుని ఉభయ రాష్ట్రాల సమస్యలను ఒక సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకోగలిగితే మంచి పేరు వస్తుంది. తద్వారా దేశానికి ఒక మంచి సందేశం అందించినవారు అవుతారు. ఒక జాతీయ నాయకుడిగా కూడా గుర్తింపు పొందుతారు. మరి అది కెసిఆర్ చేతిలోనే ఉంది. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు
సాక్షి, హైదరాబాద్: కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్-3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైందన్నారు. సచివాలయానికి అంబేద్కర్ నామకరణం.. తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు. అంబేద్కర్ పేరు సచివాలయానికి పెట్టడం దేశానికి ఆదర్శమని కొనియాడారు. భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ మహాశయుని తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నదన్నారు. పార్లమెంట్ కొత్త భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు. త్వరలోనే ప్రధాని మోదీకి లేఖ రాస్తానని వెల్లడించారు. చదవండి: మంత్రి vs సిట్టింగ్ ఎమ్మెల్యే -
రాజాసింగ్ బెయిల్పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే రాజాసింగ్కు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లో నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గత నెల 25న రాజాసింగ్ను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ రాజాసింగ్ భార్య ఉషాభాయ్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని 14, 21 అధికరణాలకు వ్యతిరేకంగా ఆగస్టు 26 నుంచి రాజాసింగ్ను అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు. పలు కేసుల గురించి చెప్పకుండానే పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. రాజాసింగ్కు బెయిల్ మంజూరు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె కోరారు. దీనిపై జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ధర్మాసనం విచారణ చేపట్టి.. కౌంటర్ దాఖలు కోసం ప్రభుత్వానికి నాలుగు వారాలు గడువిచ్చింది. విచారణను వాయిదా వేసింది. చదవండి: పాతబస్తీ క్షుద్రపూజల కలకలం -
ఫోర్టిఫైడ్ రైస్గా తడిసిన ధాన్యం
సాక్షి, హైదరాబాద్: రైస్మిల్లుల్లో తడిసిన ధాన్యాన్ని ఫోర్టిఫైడ్ రైస్ (పౌష్టికాహార బియ్యం)గా రాష్ట్ర ప్రభుత్వం మార్చనుంది. గత యాసంగిలో సేకరించిన 50.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులు, వాటి ఆవరణల్లో నిల్వ చేయగా అకాల వర్షాలకు భారీఎత్తున ధాన్యం తడిసిపోవడం తెలిసిందే. ప్రాథమిక అంచనా మేరకు 4.94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయిందని తేలింది. ఈ ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేయడం సాధ్యం కానందున పారాబాయిల్డ్ ఫోర్టిఫైడ్ రైస్గా మార్చాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశా లిచ్చింది. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్కు బదులుగా కొంత మేర ఫోర్టిఫైడ్ రైస్ను సెంట్రల్ పూల్ కింద సేకరించేందుకు గతంలోనే ఒప్పుకొంది. రాష్ట్రంలోని కుమురం భీం, ఆదిలాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో పేద గిరిజనులకు రేషన్ బియ్యంగా ఫోర్టిఫైడ్ రైస్నే పంపిణీ చేస్తున్నందున తడిసిన ధాన్యాన్ని ఆ మేరకు వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఫోర్టిఫైడ్ రైస్గా 5 ఎల్ఎంటీ... రాష్ట్రంలోని రైస్మిల్లుల్లో గత మూడు సీజన్లకు సంబంధించి 90.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం నిల్వలుగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టింది. అందులో 2020–21 యాసంగికి సంబంధించి 4.86 ఎల్ఎంటీ ఉండగా 2021–22 వానకాలానికి సంబంధించి 35.70 ఎల్ఎంటీ, మొన్నటి యాసంగికి సంబంధించి 50.39 ఎల్ఎంటీ ధాన్యం నిల్వలు ఉన్నాయి. ఈ మూడు సీజన్ల నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ ఫోర్టిఫైడ్ రైస్ను మిల్లింగ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 7.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరమవగా యాసంగిలో తడిసిన ధాన్యం 4.5 లక్షల మెట్రిక్ టన్నులు పోను మరో 3 లక్షల మెట్రిక్ టన్నులను 2020–21 యాసంగి, 2021–22 వానాకాలం ధాన్యాన్ని ఫోర్టిఫైడ్ రైస్గా మిల్లింగ్ చేయాలని పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో తడిసిన ధాన్యం సమస్య కొంతమేర తీరనుంది. చదవండి: అనగనగా హైదరాబాద్.. భాగ్యనగరంలో స్వరాజ్య సమరశంఖం 20 ఎల్ఎంటీ ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ కోసం.. రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా యాసంగిలో సేకరించిన ధాన్యం నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఫోర్టిఫైడ్ బియ్యంగా సెంట్రల్ పూల్కు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ కేంద్రానికి లేఖ రాయడంతోపాటు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్ను ఢిల్లీకి పంపారు. యాసంగిలో సేకరించిన 50.39 లక్షల టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 34 ఎల్ఎంటీ ముడిబియ్యం ఎఫ్సీఐకి ఇవ్వా ల్సి ఉంటుంది. కానీ యాసంగి ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేస్తే నూకల శాతమే అధికంగా ఉంటుందని టెస్ట్ మిల్లింగ్ ఫలితాల్లో తేలినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో క్వింటాలు ధాన్యానికి 55 శాతం మాత్రమే బియ్యంగా వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో యాసంగి ధాన్యాన్ని కేంద్రం 20 ఎల్ఎంటీ ఫోర్టిఫైడ్ బియ్యంగా తీసుకుంటే సమస్య ఉండదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయితే కేంద్రం నుంచి ఇంకా అనుమతులు రాలేదు. ఈ పరిస్థితుల్లో తమకు అవకాశం ఉన్న 5 ఎల్ఎంటీ ఫోర్టిఫైడ్ రైస్ కోసం 4.5 లక్షల మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని ముందుగా కేటాయించింది -
‘పోడు’పై తెగని పంచాయితీ!
సాక్షి, హైదరాబాద్: పోడు భూములకు సంబంధించిన పట్టాల పంపిణీకి విపక్షాలు ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఈ సమస్య మరోసారి రాష్ట్రంలో హాట్టాపిక్గా మారింది. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నా.. ఈ క్రమంలో అనేక సవాళ్లు ముందుకొస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పోడు వ్యవసాయం చేస్తున్న రైతుల వివరాల సేకరణ ప్రక్రియలో భాగంగా దరఖాస్తులను స్వీకరించింది. 28 జిల్లాల్లోని 3,041 గ్రామపంచాయతీల పరిధిలో సుమారు 12.60 లక్షల ఎకరాల పోడు భూముల్లో సుమారు 3,95,000 మంది రైతులు వ్యవసాయం చేస్తున్నట్లు తేలింది. ఇందులో 62 శాతం గిరిజనులు, 38% గిరిజనేతరులు ఉన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ అటవీ హక్కుల చట్టం 2006 ఆధారంగా 2008లో సుమారు 96,600 మందికి 3,08,000 ఎకరాల భూమిపై హక్కు లభించింది. అయితే పోడు వ్యవసాయం చేస్తున్నప్పటికీ కొంతమందికి హక్కులు దక్కలేదు. మరోవైపు మరికొంతమంది కొత్తగా అటవీ భూముల్లో పోడు వ్యవసాయం మొదలుపెట్టడంతో రాష్ట్రంలో పోడు రైతుల సమస్య సుదీర్ఘకాలంగా పెండింగ్లోనే ఉండిపోయింది. చట్ట సవరణతోనే సాధ్యం! అటవీ శాఖ భూములపై హక్కులు కల్పించే అటవీ హక్కుల చట్టం– 2006 లో అనేక కఠిన నియమ నిబంధనలు ఉన్నాయి. ఈ నియమ నిబంధనలే సమస్య పరిష్కారానికి ఆటంకంగా మారాయని, ఈ చట్ట సవరణ ద్వారానే పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యమనే అభిప్రాయం ఉంది. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 13 నాటికి పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు మాత్రమే ఆయా భూములపై హక్కులు కల్పించే అవకాశం ఉంది. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఆ తేదీ నాటికి వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు మాత్రమే హక్కులు కల్పించేందుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. ఇక గిరిజనేతరులు తాము 75 ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్నట్లు తగిన ఆధారాలను చూపిస్తే వారికి హక్కులు దక్కేలా అప్పటి ప్రభుత్వం ఈ చట్టాన్ని తయారుచేసింది. అయితే 75 ఏళ్ల పోడుకు సంబంధించి సాక్ష్యాధారాలను సంపాదించే అవకాశాలు లేకపోవడంతో గిరిజనేతరులకు ఈ భూములపై హక్కులు దక్కడం లేదనే అభిప్రాయం గట్టిగా ఉంది. అంతా కేంద్రం చేతిలోనే..! ప్రస్తుతం తెలంగాణలో హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు 3,95,000 మందికి ప్రయోజనం కలగాలంటే 2006 నాటి చట్టంలో ఉన్న డిసెంబర్ 2005 కట్ ఆఫ్ తేదీని మార్చాల్సి ఉంటుంది. దీంతో పాటు గిరిజనేతరులకు పోడు హక్కులు దక్కాలంటే, వారు 75 ఏళ్లుగా తాము వ్యవసాయం చేస్తున్నట్లు సాక్ష్యాధారాలను చూపించాలన్న నిబంధనను తొలగించాల్సిన అవసరం ఉంది. ఈ రెండు అంశాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న నేపథ్యంలో..దరఖాస్తులు స్వీకరించినా, అర్హులైన పోడు రైతుల ఎంపిక, క్షేత్రస్థాయిలో పరిశీలనకు అవకాశం లేకుండా పోయిందనే వాదనను రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వినిపిస్తున్నాయి. మినహాయింపులకు అవకాశం లేదు.. అటవీ హక్కుల చట్టానికి కొన్ని సవరణలు చేసి పోడు రైతుల సమస్యను పరిష్కరించాలని తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఒక లేఖ కూడా రాశారు. అయితే తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలు అడుగుతున్నట్టుగా మినహాయింపులు ఇచ్చే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరిస్తూ కేసీఆర్కు కేంద్ర మంత్రి అర్జున్ ముండా లేఖ రాశారు. ఒకవేళ రాష్ట్రాలు అడుగుతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వ అటవీ హక్కుల చట్టానికి మినహాయింపులు ఇస్తే, గిరిజనులతో పాటు అటవీ సంరక్షణకు తీవ్ర నష్టం కలుగుతుందని కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో ‘పోడు’మింగుడు పడని సమస్యగా మారింది. -
తెలంగాణ స్టార్టప్ల హబ్.. ప్రపంచంలోనే అతిపెద్దది (ఫొటోలు)
-
స్టార్టప్ గుండె చప్పుడు ‘టీ–హబ్’ డబ్
సాక్షి, హైదరాబాద్: వినూత్న ఆవిష్కరణలకు ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ ‘టీ–హబ్’ రెండో దశను సీఎం కె.చంద్రశేఖర్రావు మంగళవారం ప్రారంభించనున్నారు. రూ.400 కోట్లతో 3.62 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించిన ఈ రెండో దశలో.. ఒకే సమయంలో ఏకంగా రెండు వేలకుపైగా స్టార్టప్లు కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుండటం గమనార్హం. మంగళవారం సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ మేరకు ఏర్పాట్లను మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, టీ–హబ్ సీఈవో ఎం.శ్రీనివాస్రావు సోమవారం పరిశీలించారు. అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ కావడంతో ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. మంగళవారం ఉదయమే సీఎం కేసీఆర్ టీ–హబ్ను ప్రారంభిస్తారని భావించినా.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్టార్టప్ రంగ నిపుణులతో సదస్సులు ఉండటంతో సాయంత్రానికి వాయిదా వేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇక ప్రారంభోత్సవ కార్యక్రమానికి అడోబ్ చైర్మన్ శంతను నారాయణ్, సైయంట్ వ్యవస్థాపకుడు బీవీఆర్ మోహన్రెడ్డి, స్కైమోర్ వ్యవస్థాపకుడు దేశ్పాండ్, అథేరా వెంచర్స్ ఎండీ కన్వల్ రేఖి తదితరులతోపాటు సిలికాన్ వ్యాలీ ప్రముఖులు, పలు యూనికార్న్ల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఈ సందర్భంగా కూ యాప్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, హీరో మోటార్స్, పోంటాక్, వెబ్ 3.0లతో టీ–హబ్ ఎంఓయూలు కుదుర్చుకోనున్నట్టు అధికారులు తెలిపారు. ఉత్తమ స్టార్టప్లు, యూనికార్న్ల ప్రతినిధులను సన్మానించనున్నట్టు వెల్లడించారు. టీ–హబ్ భవనం లోపలి దృశ్యం, పరిశీలిస్తున్న కేటీఆర్. చిత్రంలో రంజిత్రెడ్డి టీ–హబ్ 2.0 ప్రత్యేకతలివీ.. 2015లో గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ–హబ్ మొదటి దశ నిర్మించిన విషయం తెలిసిందే. అనూహ్య స్పందన లభించడం, అది విజయవంతం కావడంతో.. మరింత భారీగా టీ–హబ్ రెండో దశ (టీ–హబ్ 2.0)ను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించారు. రూ.400 కోట్ల వ్యయంతో 3.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన టీ–హబ్ రెండో దశలో ఏకకాలంలో 4 వేల స్టార్టప్లకు అవసరమైన వసతి కల్పించవచ్చు. తొలిదశతో పోలిస్తే ఐదు రెట్లు పెద్దదైన రెండోదశ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్గా అవతరించనుంది. టీ–హబ్ మొదటిదశలో ప్రాథమిక స్థాయి వసతులు అందుబాటులో ఉండగా.. తాజా రెండో దశలో అత్యాధునిక వసతులు జోడించారు. ‘స్పేసెస్’ అనే కొరియన్ సంస్థ టీ–హబ్ రెండో దశ భవనాన్ని అత్యంత సృజనాత్మకంగా ‘శాండ్ విచ్’ నమూనాలో డిజైన్ చేసింది. పది అంతస్తుల్లో టీ–హబ్ రెండో దశ నిర్మాణం కాగా.. ప్రస్తుతం ఐదు అంతస్తుల్లో కార్యకలాపాలు మొదలుకానున్నాయి. ఈ ఏడాది చివర వరకు అదనంగా నెలకో అంతస్తు చొప్పున వినియోగంలోకి తేనున్నారు. ఇందులో కార్యాలయాలు ఏర్పాటు చేయాలనుకునే వెంచర్ క్యాపిటలిస్టులు, స్టార్టప్లు, ఇతర సంస్థలను నిపుణుల బృందం ఎంపిక చేస్తుంది. స్టార్టప్ సంస్కృతిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు రాబోయే రోజుల్లో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్నగర్లో టీ–హబ్ రీజినల్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక ఆవిష్కరణలకు రూపాన్ని ఇచ్చే ‘టీ–వర్క్స్’ను ఈ ఏడాది ఆగస్టులో, ఇమేజ్ సెంటర్ను మరో ఏడాదిన్నరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో దశలో ఎవరెవరికి అవకాశం ► మొదటి అంతస్తును వెంచర్ క్యాపిటలిస్టుల ఆఫీసుల కోసం పూర్తి ఉచితంగా కేటాయిస్తారు. ఇప్పటివరకు రెండు వీసీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. ► ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఉన్న తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ను ఇక్కడికి తరలించడంతోపాటు ‘సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’, హైదరాబాద్లో సీఐఐ ఏర్పాటు చేయనున్న ‘సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్’కు కార్యాలయ వసతి కల్పిస్తారు. ► కేంద్ర ప్రభుత్వ ‘స్టార్టప్ ఇండియా’ స్టేట్ సెంటర్, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖకు చెందిన ‘అటల్ ఇన్నోవేషన్ సెంటర్’ కూడా ఇక్కడే ఏర్పాటవుతాయి. ► ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని టీ–హబ్ మొదటి దశకు చెందిన 215 స్టార్టప్లను వెంటనే కొత్త ప్రాంగణంలోకి తరలిస్తారు. ► ఇతర ఇంక్యుబేటర్లతో పోలిస్తే తక్కువ అద్దెకు ఆఫీస్ స్పేస్ లభిస్తుంది. ► వ్యక్తిగతంగా లేదా ఒక చిన్న బృందంగా ఏర్పడి సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చే వారికి.. వారి ఆలోచన వాణిజ్య రూపం పొందేందుకు అవసరమైన అన్ని హంగులు టీ–హబ్ 2లో అందుబాటులో ఉంటాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) టీ–హబ్ తొలిదశ స్ఫూర్తితో! ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో 2015లో టీ–హబ్ తొలిదశ ఏర్పాటు చేశారు. అంతకుముందు హైదరాబాద్లో కేవలం ట్రిపుల్ ఐటీ, ఐఎస్బీ, జీనోమ్ వ్యాలీలో కలిపి మూడు ఇంక్యుబేటర్లు మాత్రమే ఉన్నాయి. టీ–హబ్ ఏర్పాటుతో ఆవిష్కరణల వాతావరణం పెరిగి ప్రస్తుతం 57 ఇంక్యుబేటర్లు పనిచేస్తున్నాయి. టీ–హబ్ తొలిదశ ప్రారంభం నుంచి ఇప్పటివరకు 1,100 స్టార్టప్లు మొదలవగా.. రూ.10 వేల కోట్ల ఫండింగ్ అందినట్టు అంచనా. మూడు యూనికార్న్లు (స్టార్టప్లుగా ప్రస్థానం మొదలుపెట్టి రూ.8వేల కోట్ల టర్నోవర్కు చేరుకున్న సంస్థలు) ఇక్కడి నుంచే ప్రస్థానం ప్రారంభించగా.. అందులో రెండు యూనికార్న్లు నేరుగా టీ–హబ్తో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. తొలిదశలో కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత టెక్నాలజీ స్టార్టప్లకు 20శాతం మేర కేటాయించారు. ఇదే తరహాలో రెండో దశలోనూ ఎమర్జింగ్ టెక్నాలజీ స్టార్టప్లకు ప్రాధాన్యత ఇస్తారు. – జయేశ్ రంజన్, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రెండో దశలో ఎవరెవరికి అవకాశం మొదటి అంతస్తును వెంచర్ క్యాపిటలిస్టుల ఆఫీసుకు ఉచితంగా కేటాయిస్తారు. ఇప్పటివరకు రెండు వీసీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ‘స్టార్టప్ ఇండియా’ స్టేట్ సెంటర్, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖకు చెందిన ‘అటల్ ఇన్నోవేషన్ సెంటర్’ కూడా ఇక్కడే ఏర్పాటవుతాయి. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని టీ–హబ్ మొదటి దశకు చెందిన 215 స్టార్టప్లను వెంటనే కొత్త ప్రాంగణంలోకి తరలిస్తారు. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఉన్న తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ను ఇక్కడికి తరలించడంతోపాటు ‘సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’, హైదరాబాద్లో సీఐఐ ఏర్పాటు చేయనున్న ‘సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్’కు కార్యాలయ వసతి కల్పిస్తారు. వ్యక్తిగతంగా లేదా చిన్నబృందంగా ఏర్పడి కొత్త ఆలోచనతో వచ్చే వారికి.. ఆ ఆలోచన వాణిజ్య రూపం పొందేందుకు అవసరమైన హంగులన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇతర ఇంక్యుబేటర్లతో పోలిస్తే తక్కువ అద్దెకు ఆఫీస్ స్పేస్ లభిస్తుంది. -
బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ముందడుగు
-
బాసర ట్రిపుల్ ఐటీ వద్ద మళ్ళీ ఉద్రిక్తత
-
జాగరణకు సిద్దమవుతున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
-
నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో అధికారుల చర్చలు విఫలం
-
శ్రీశైలం నీటిని తోడేస్తున్న తెలంగాణ
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ సర్కార్ ఉల్లంఘనలకు అంతులేకుండా పోతోంది. నిబంధనలను మళ్లీ యథేచ్ఛగా బేఖాతరు చేస్తూ ఏపీ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తోంది. గతేడాది అవసరం లేకున్నా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలలో నీటినిల్వ కనీస మట్టం కంటే దిగువన ఉన్నప్పుడే ఎడమ గట్టు కేంద్రం ద్వారా విద్యుదుత్పత్తి చేసి.. రాష్ట్రానికి హక్కుగా దక్కాల్సిన కృష్ణా జలాలను ప్రకాశం బ్యారేజీ ద్వారా వృథాగా కడలిపాలు చేసింది. ఈ ఏడాది కూడా అదే రీతిలో నీటి దోపిడీ చేస్తోంది. కృష్ణా బోర్డు నుంచి అనుమతి తీసుకోకుండానే శ్రీశైలంలోకి వచ్చిన ప్రవాహాన్ని వచ్చింది వచ్చినట్లుగా కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తరలిస్తోంది. రాష్ట్రంలో ప్రకాశం, గుంటూరు జిల్లాల తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి నీటి విడుదలను ఆపేసిన తెలంగాణ సర్కార్.. ఏఎమ్మార్పీ ద్వారా యథేచ్ఛగా నీటిని తరలిస్తోంది. ఈ వ్యవహారంపై కృష్ణా బోర్డుకు కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈ మురళీనాథ్రెడ్డి.. ప్రకాశం జిల్లా ప్రాజెక్ట్స్ సీఈ శ్రీనివాసరెడ్డిలు ఫిర్యాదు చేశారు. వరద వస్తున్నా పెరగని నీటిమట్టం శ్రీశైలంలో సాగు, విద్యుదుత్పత్తికి కనీస నీటిమట్టం 854 అడుగులుగా సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) నిర్ణయించింది. కృష్ణా బోర్డు రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ దాన్ని ఆమోదించింది. నీటి సంవత్సరం ప్రారంభమైన రోజునే అంటే ఈనెల 1న స్థానికంగా కురిసిన వర్షాలవల్ల శ్రీశైలంలోకి 862 క్యూసెక్కుల ప్రవాహం చేరింది. నీటి నిల్వ 816.8 అడుగుల్లో 38.63 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ► కృష్ణా బోర్డు నుంచి కనీసం అనుమతి తీసుకోకుండా కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తెలంగాణ సర్కార్ ఈనెల 1న 800 క్యూసెక్కులను తరలించింది. ► ఈనెల 2న 561 క్యూసెక్కులు శ్రీశైలంలోకి చేరితే కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 483 క్యూసెక్కులను తరలించింది. ► ఈనెల 9న శ్రీశైలంలోకి 4,618 క్యూసెక్కులు చేరితే.. 339 క్యూసెక్కులను.. ► ఈ నెల 10న 2,798 క్యూసెక్కులు చేరితే 1,300 క్యూసెక్కులను.. 11న 4,157 క్యూసెక్కులు చేరితే.. 1,266 క్యూసెక్కులను తెలంగాణ తరలించింది. ► తెలంగాణ దోపిడీతో శ్రీశైలంలోకి వరద ప్రవాహం చేరుతున్నా నీటి మట్టం పెరగడంలేదు. సాగర్ కుడి కాలువ నీరు నిలిపివేత ఇక నాగార్జునసాగర్లో సాగునీటికి కనీస నీటిమట్టం 510 అడుగులు. ప్రస్తుతం 534.9 అడుగుల్లో 177.87 టీఎంసీల నీరు ఉంది. రాష్ట్రంలో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగు, సాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువపైనే అవి ఆధారపడతాయి. ఈ హెడ్ రెగ్యులేటర్ తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉంది. తాగునీటి అవసరాల కోసం కుడి కాలువకు నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రకాశం జిల్లా సీఈ శ్రీనివాసరెడ్డి కృష్ణా బోర్డుకు, సాగర్ సీఈకి లేఖ రాశారు. కానీ.. ఈనెల 1 నుంచి కుడి కాలువకు నీటి విడుదలను తెలంగాణ ప్రభుత్వం ఆపేసింది. మరోవైపు.. కృష్ణా బోర్డు అనుమతి లేకుండానే ఈనెల 1న 2,000, 2న 2,000, 3న 218, 6న 218, 7న 500, 8న 500, 9న 854, 10న 1,000, 11న 1,000 క్యూసెక్కుల చొప్పున ఏఎమ్మార్పీ నుంచి తెలంగాణ ప్రభుత్వం యథేచ్ఛగా తరలిస్తోంది. ఈ అంశంపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశామని కర్నూల్ జిల్లా ప్రాజెక్ట్స్ సీఈ మురళీనాథ్రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలని కోరామని తెలిపారు. -
నీటి పంపిణీ తర్వాతే డీపీఆర్లు
సాక్షి, అమరావతి: ‘కొత్తగా గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. నదిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా మదింపు చేసి, రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేయాలి. అప్పటివరకు ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టుల డీపీఆర్లకు సాంకేతిక అనుమతి ఇవ్వకూడదు. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను పరిరక్షించాలి’ అని గోదావరి బోర్డుకు ఏపీ ప్రభుత్వం తేల్చిచెప్పింది. తెలంగాణ చేపట్టిన చనాకా – కొరటా, చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల డీపీఆర్లను మదింపు చేయవద్దని కోరింది. గోదావరి ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయలేదని గుర్తు చేసింది. వాటికి అనుమతి ఇస్తే గోదావరి డెల్టా, పోలవరం ప్రాజెక్టు ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. విభజన చట్టం ప్రకారం వాటికి సాంకేతిక అనుమతి ఇచ్చి, సీడబ్ల్యూసీ ఆమోదానికి పంపాలని పట్టుబట్టింది. గోదావరి బోర్డు చైర్మన్ మహేంద్ర ప్రతాప్సింగ్ ఏపీ వాదనతో ఏకీభవించారు. తెలంగాణ ప్రతిపాదించిన మూడు ప్రాజెక్టుల డీపీఆర్లకు సాంకేతిక అనుమతి ఇవ్వకుండా రెండు రాష్ట్రాల వాదనలను సీడబ్ల్యూసీకి పంపుతామని చెప్పారు. హైదరాబాద్లోని గోదావరి బోర్డు కార్యాలయంలో బుధవారం చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, సీఈ మోహన్కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పరిధిపై తలోమాట గోదావరి ప్రధాన పాయపై ఎస్సారెస్పీ నుంచి సీతారామసాగర్ వరకు అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఏపీ అధికారులు ప్రతిపాదించగా.. తెలంగాణ అధికారులు అభ్యంతరం తెలిపారు. ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగును మాత్రమే బోర్డు పరిధిలోకి తేవాలని అన్నారు. దీనికి ఏపీ అధికారులు అభ్యంతరం తెలిపారు. పరిధిపై మరో మారు చర్చిద్దామని, బోర్డుకు తగినంత మంది సిబ్బందిని కేటాయించాలని చైర్మన్ కోరారు. ఇందుకు ఏపీ సుముఖత వ్యక్తం చేయగా.. తెలంగాణ అంగీకరించలేదు. జూలై 15లోగా అనుమతి తీసుకోవాల్సిందే గోదావరి బేసిన్లో అనుమతి లేని ప్రాజెక్టులకు జూలై 15లోగా అనుమతి తీసుకోవాలని, లేదంటే వాటి ద్వారా నీటి వినియోగాన్ని అనుమతించబోమని ఛైర్మన్ స్పష్టంచేశారు. గోదావరిలో నీటి లభ్యతపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి, మదింపు చేయాలని 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో కోరామని ఏపీ అధికారులు గుర్తు చేశారు. రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేయడానికి కొత్తగా గోదావరి ట్రిబ్యునల్ వేయాలని కోరామన్నారు. వీటిపై బోర్డు నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ రెండు అంశాలు బోర్డు పరిధిలో లేవని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని బోర్డు చైర్మన్ చెప్పారు కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి సంప్రదించాలని ఏపీ అధికారులకు సూచించారు. -
ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దు
ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) మొదలు ఏరియా, సామాజిక, జిల్లా, బోధనాసుపత్రుల వరకు అన్నిచోట్లా డాక్టర్లు ఉన్నా, ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తుండటంతో వారి సేవలు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేదలు, దిగువ మధ్య తరగతి రోగులకు సరిగా అందడం లేదు. కొందరు డాక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్సీలకు రెండు మూడురోజులకోసారి వెళ్లి వస్తున్నారు. ఈ పరిస్థితిపై వైద్యశాఖ దృష్టి సారించింది. నిమ్స్లో పనిచేస్తున్న డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయవద్దన్న నిబంధన ఇప్పటికే ఉంది. అలాంటి నిబంధననే ప్రభుత్వ డాక్టర్లకు వర్తింపచేయాలని వైద్యశాఖ తొలుత నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులకు వర్తింపజేస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల కొత్తగా నియమితులయ్యే డాక్టర్లకు వర్తించేలా సర్వీస్ రూల్స్లో మార్పులు చేయాలని భావిస్తోంది. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దుతో పాటు మరికొన్ని సంస్కరణల దిశగా వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా చేయబోయే డాక్టర్ పోస్టుల భర్తీ సందర్భంగా సర్వీస్ రూల్స్ల్లో మార్పులు చేర్పులు చేయాలని, ఈ మేరకు ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవాలని వైద్యశాఖ వర్గాలు యోచిస్తున్నాయి. సర్వీస్ రూల్స్లో మార్పులు చేశాక డాక్టర్ల పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. పేదలకు అందని వైద్యం ప్రభుత్వ వైద్యులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆసుపత్రుల్లో ఉండాల్సి ఉన్నా, సొంత ప్రాక్టీస్ కారణంగా చాలామంది మధ్యాహ్నం వరకే ఉండి వెళ్లిపోతున్నారు. గాంధీ వంటి ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు కొందరు అక్కడికి సమీపంలోనే ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇలా వందలాది మంది ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తుండటంతో, పేదలకు వైద్యం అందడం లేదని వైద్యశాఖ వర్గాలు భావిస్తున్నాయి. కొందరు డాక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్సీలకు రెండు మూడు రోజులకోసారి వెళ్లి వస్తున్నారు. హైదరాబాద్ వంటి చోట్ల ఉంటూ, ప్రభుత్వ సేవలను మరిచిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పరిస్థితికి శాశ్వత పరిష్కారం చూపాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇష్టారాజ్యంగా సిజేరియన్లు దేశంలో అత్యధికంగా సిజేరియన్ ఆపరేషన్లు చేసే రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. రాష్ట్రంలో ఎక్కువగా కరీంనగర్ జిల్లాలో సిజేరియన్లు జరుగుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. డబ్బులకు కక్కుర్తిపడి ఇష్టారాజ్యంగా ప్రైవేట్ ఆసుపత్రులు సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నాయి. సాధారణ ప్రసవానికి రూ.10 వేలు తీసుకుంటే, సిజేరియన్కు రూ.40 వేలు కనీసంగా వసూలు చేస్తున్నారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులను నియంత్రించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అవనసరంగా సిజేరియన్ ఆపరేషన్లు చేసే ఆసుపత్రుల లైసెన్స్ రద్దు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించారు. సంబంధిత ఆపరేషన్లో పాల్గొనే డాక్టర్ రిజిస్ట్రేషన్ రద్దు చేసే ఆలోచనలో కూడా వైద్యశాఖ ఉంది. మరోవైపు కొందరు ముహూర్తాలు పెట్టి ఆ మేరకు సిజేరియన్ కాన్పులు చేయాలని డాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు వైద్య వర్గాలకు సమాచారం అందింది. ఇందుకోసం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులతో ప్రభుత్వ వైద్యులపై ఒత్తిడి తెస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని కూడా నిర్ణయించారు. ఆర్డీవోలు, ఐఏఎస్లకు బాధ్యతలు ఇటీవల ఎంజీఎం ఐసీయూలో ఒక రోగిని ఎలుకలు కరవడాన్ని (తర్వాత నిమ్స్లో చనిపోయాడు) వైద్యశాఖ వర్గాలు తీవ్రంగా పరిగణించాయి. కిందినుంచి పైస్థాయి వరకు అనేక లోపాలు ఇందుకు కారణమని భావిస్తున్నాయి. ముఖ్యంగా అనేక ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో పారిశుధ్య లోపం ప్రధానంగా ఉంది. మరోవైపు రోగులు ఆసుపత్రులకు వెళితే వారిపట్ల సిబ్బంది వ్యవహరించే తీరు విమర్శలకు తావిస్తోంది. డాక్టర్లే ఆసుపత్రుల సూపరింటెండెంట్లుగా వ్యవహరిస్తుండటంతో వారికి పరిపాలనా అనుభవం ఉండటం లేదు. ఈ కారణంగానే ఆసుపత్రుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఏరియా, జిల్లా ఆసుపత్రుల పరిపాలన బాధ్యతను ఆర్డీవోలకు అప్పగించాలని వైద్య ఆరోగ్యశాఖ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. వారిని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా నియమించే అవకాశముంది. గాంధీ, కాకతీయ వంటి బోధనాసుపత్రుల నిర్వహణ, పరిపాలన బాధ్యతలను ఐఏఎస్ స్థాయి అధికారులకు అప్పగించనున్నారు. ఉస్మానియా ఆసుపత్రి బాధ్యతను ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ వాకాటి కరుణకు అప్పగించారు. సీసీ కెమెరాలతో నిఘా డాక్టర్లు పీహెచ్సీలకు వెళ్లేలా పకడ్బందీ చర్యలకు వైద్య ఆరోగ్య శాఖ శ్రీకారం చుట్టింది. బయోమెట్రిక్ వ్యవస్థను ఏర్పాటు చేసినా వాటిని పాడుచేసి డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి పీహెచ్సీలో మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. డాక్టర్, నర్సు, లేబరేటరీ ఫార్మసిస్ట్ ఉండే గదుల్లో వీటిని అమర్చుతారు. ఈ మేరకు కొన్నిచోట్ల ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 900కు పైగా ఉన్న పీహెచ్సీ, యూపీహెచ్సీల కెమెరాలన్నింటినీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు మొబైల్ ఫోన్లకు లింక్ చేస్తారు. దీంతో ఏ పీహెచ్సీనైనా వారు తమ మొబైల్ ఫోన్ద్వారా పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుంది. మరికొన్ని కీలక నిర్ణయాలు.. – ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుధ్య నిర్వహణకు సంబంధించిన శానిటైజేషన్ కాంట్రాక్టులన్నీ రద్దు చేయాలని నిర్ణయం. కొత్త కాంట్రాక్టులకు కఠినమైన నిబంధనలను అమలు చేస్తారు. – గాంధీ, ఉస్మానియా సహా పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ప్రైవేట్ మందుల దుకాణాలను ఎత్తివేయాలని నిర్ణయం. ప్రభుత్వమే ఉచితంగా మందులు ఇస్తున్నప్పుడు ప్రైవేట్ దుకాణాలు ఎందుకని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. – గ్రామాల్లో ఆర్థో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తారు. మోకాళ్ల నొప్పులున్న వారిని గుర్తించి వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మోకాళ్ల మార్పిడి లేదా చికిత్సలు చేస్తారు. – ఒక్క గాంధీలోనే దాదాపు 60 మంది వరకు అనెస్థీషియా డాక్టర్లు ఉన్నారు. ఇతర స్పెషలిస్ట్ వైద్యులు కొన్నిచోట్ల ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల డాక్టర్ల క్రమబద్ధీకరణ చేపడతారు. – ప్రతి నెలా ఆసుపత్రుల నిర్వహణపై నివేదిక రూపొందిస్తారు. ఆ ప్రకారం సమీక్ష చేస్తారు. – ప్రభుత్వ ఆధ్వర్యంలో సంతాన సాఫల్య కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. తద్వారా ప్రైవేట్ దోపిడీకి చెక్ పెడతారు. – నిమ్స్, గాంధీల్లో కొత్తగా 250 పడకల చొప్పున మదర్ అండ్ చైల్డ్ ఆసుపత్రులను (ఎంసీహెచ్) నెలకొల్పుతారు. -
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న పేద నిరుద్యోగులకు శుభవార్త!
-
శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా! శ్రీ యాదగిరి నారసింహా!
యాదగిరి గుట్టకు సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలోని విభాండక ఋషి. అతడి పుత్రుడైన ఋష్యశృంగుడి కుమారుడు యాదరుషి. అతణ్ణే యాదర్షి అంటారు. చిన్నప్పట్నుంచి నరసింహుడి భక్తుడైన అతడికి ఆ స్వామిని దర్శించాలని బలమైన కోరిక ఉండేదట. నరసింహుణ్ణి అన్వేషించడానికి అడవులూ, కొండలూ కోనలూ తిరిగాడు. నరసింహుని దర్శనం కాలేదు. అలా సంచరిస్తున్న యాదర్షి ఒకరోజు ఇప్పుడున్న యాదగిరి అరణ్య ప్రాంతానికి చేరుకుని అలసిపోయి ఒక రావిచెట్టు కింద పడుకున్నాడు. అప్పుడు కలలో ఆంజనేయస్వామి కనిపించి ‘నీ పట్టుదల నాకు నచ్చింది. నీకు తోడుగా నేనుంటాను. కఠోరమైన తపస్సు చేస్తే స్వామి తప్పక ప్రత్యక్షమవుతాడు’ అని చెప్పారట. నిద్రలేచిన యాదర్షి అక్కడే తపస్సు మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు ఉగ్రనారసింహుడు ప్రత్యక్షమయ్యారట. ఆ తేజస్సును చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని కోరాడట యాదర్షి. అప్పుడు లక్ష్మీసమేతుడై దర్శనమిచ్చి ‘‘ఏం కావాలో కోరుకో’’ అని అడిగితే, ‘‘నీ దర్శనం కోసం ఇంత ఘోర తపస్సు సామాన్యులు చేయలేరు. అందుకే నువ్వు శాంత రూపంతోనే ఇక్కడ కొలువై ఉండిపో’’ అని కోరాడట. అప్పుడు కొండశిలమీద స్వామి ఆవిర్భవించాడు. కొన్నాళ్ల తరువాత యాదర్షికి మరో కోరిక కలిగింది. స్వామిని ఒకే రూపంలో చూశాను. వేర్వేరు రూపాల్లో చూడలేకపోయానే అనుకుని మళ్లీ ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు స్వామి మళ్లీ ప్రత్య„ý మయ్యాడు. యాదర్షి కోరిక విని, ‘‘నా రూపాలన్నీ నువ్వు చూడలేవు’ అయినా నీకోసం మూడు రూపాలు చూపిస్తాను’’ అని జ్వాలా, యోగానంద, గండభేరుండ నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడట జ్వాలా నారసింహుడు సర్పరూపంలో ఉంటాడు. యోగానందుడు అర్చా విగ్రహరూపంలో ఉంటాడు. గండభేరుండ నారసింహుడు కొండ బిలంలో కొలువై ఉంటాడు. తరువాత యాదర్షి... తనను స్వామిలో ఐక్యం చేసుకోమని కోరడంతో అలాగే చేసుకున్నాడట స్వామి. ఆ యాదర్షి పేరుమీదనే ఇది యాదగిరిగుట్ట అయింది. స్వాగత తోరణం.. యాదాద్రి కొండపైన భారీ స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తిరుమల తిరుపతి తరహాలో ఈ ఆర్చీ ఉంటుంది. ఇక వైపు కొండ ఎక్కడానికి, మరో వైపు కొండ దిగేందుకు ఈ ఆర్చీని నిర్మాణం చేశారు. ఈ ఆర్చీ పైభాగంలో శంకు, చక్ర, నామాలు, శ్రీలక్ష్మీనరసింహస్వామి రూపాలను తీర్చిదిద్దారు. ఆలయ విశిష్ఠత గర్భగుడిలో ఎదురుగా ఉండే స్వామి జ్వాలా నరసింహుడు. మరి కాస్త లోపలయోగముద్రలో యోగానందస్వామి, లక్ష్మీనరసింహ స్వాములను దర్శించుకోవచ్చు. గర్భాలయం నుంచి బయటకు వస్తే మెట్లకు ఎడమపక్కన క్షేత్రపాలకుడైన హనుమంతుడి గుడి ఉంది. హనుమంతుడి విగ్రహానికి కింద గల పెద్ద రాతిచీలికలో గండభేరుండ నరసింహుని స్వయంభువు రూపం కనిపిస్తుంది. ఆంజనేయస్వామిని దర్శించుకున్నాక బయట ఎడమవైపున మెట్లు దిగితే పుష్కరిణి. కుడివైపు కొన్ని మెట్లు దిగితే పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరుని ఆలయం అగుపిస్తాయి. ఆలయమంతా స్వర్ణమయం గర్భాలయంపైన దివ్య విమాన గోపురానికి భక్తులు విరాళంగా ఇచ్చిన 125 కిలోల బంగారంతో తాపడం చేయిస్తున్నారు. పంచనారసింహులు కొలువైన గర్భాలయ ద్వారాలకు బంగారు తాపడం చేసిన కవచాలను బిగించారు. ఆళ్వార్ మండపంలో 35 అడుగుల ఎత్తులో ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఈ ధ్వజస్తంభానికి సైతం బంగారు తొడుగులను ఇటీవలనే పూర్తి చేశారు. త్రితల, పంచతల, సప్తతల రాజగోపురాలకు పసిడి కలశాలు బిగించారు. వీటితోపాటు ఉప ఆలయాల ద్వారాలకు వెండి, ప్రథమ, ద్వితీయ ప్రాకారాల్లో ద్వారాలకు ఇత్తడి తొడుగులు, అష్టభుజి ప్రాకార మండప శిఖరాలపై రాగి కలశాలు బిగించారు. బంగారు తొడుగుల పనులన్నీ చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్ సంస్థలో చేయించారు. శివాలయం... యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైనే ఉన్న అనుబంధ ఆలయంగా శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి దేవాలయం కొనసాగుతోంది. శివాలయంలో ప్రధాన ఆలయం, ముఖ మండపం, ప్రకార మండపం, త్రితల రాజగోపురం నిర్మించారు. ప్రధాన ఆలయంంలోని మండపాల్లో, నాలుగు దిశల్లో కృష్ణ శిలతో స్టోన్ ఫ్లోరింగ్ పనులు చేశారు. ప్రధాన ఆలయం ముందు భారీ నందీశ్వరుడి విగ్రహాన్ని పెట్టారు. ఆలయానికి ఉత్తర దిశలో శ్రీస్వామి వారి కల్యాణ మండపం, ఆ పక్కనే రథశాల నిర్మించారు. ఆలయ ఉద్ఘాటన నాటికి ఆలయంలో స్ఫటిక లింగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ 25న శివాలయంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. విష్ణు పుష్కరిణి... కొండపైన విష్ణు పుష్కరిణిని అధునాతన హంగులతో తీర్చిదిద్దారు. గతంలో ఈ పుష్కరిణిలో భక్తులు స్నానాలు చేసే వారు. కానీ ఇప్పుడు విష్ణు పుష్కరిణిలో శ్రీస్వామి వారికి మాత్రమే ఉపయోగించనున్నారు. గిరి ప్రదక్షిణ... శ్రీస్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున భక్తులు గిరి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. వీరితో పాటు మండల దీక్ష చేసే భక్తులు సైతం ప్రతి రోజు గిరి ప్రదక్షిణ చేస్తారు. సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరి ప్రదక్షిణను ఆలయ అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. పుష్కరిణిలో భక్తుల స్నానాలు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వచ్చే భక్తుల కోసం గండి చెరువు సమీపంలో నిర్మించిన లక్ష్మీ పుష్కరిణి లో భక్తులు పుణ్య స్నానాలను ఆచరించారు. ప్రధానాలయం ఉద్ఘాటన సందర్భంగా పలువురు భక్తులు బాలాలయం లో శ్రీస్వామి వారిని కొండపైన దర్శనం చేసుకొని, అనంతరం కొండ కింద జరుగుతున్న నిర్మాణాలను తిలకించారు. ఈ సమయంలో లక్ష్మీ పుష్కరిణిలోకి వెళ్లి స్నానాలు చేసి ఆనందంగా గడిపారు. కల్యాణ కట్ట ప్రారంభం.. ఆధునిక హంగులతో నిర్మాణం చేసిన కల్యాణ కట్టను ఈవో గీతారెడ్డి ఆదివారం ప్రారంభించారు. 28వ తేదీ నుంచి ప్రధానాలయంలో స్వయంభూల దర్శనం కలగనున్న నేపథ్యంలో భక్తులు అధికంగా క్షేత్రానికి వచ్చే అవకాశం ఉంది, ఇందులో భాగంగానే ముందస్తుగా కల్యాణ కట్టలో పూజలు చేసి ప్రారంభించారు. క్షేత్రానికి వచ్చే భక్తులు అధికంగా ఈ కల్యాణ కట్టలోనే తలనీలాలను సమర్పించుకోనున్నారు. స్వామి పుష్కరిణి ఈ క్షేత్రంలోని స్వామివారి పుష్కరిణికి ఓ ప్రత్యేకత ఉంది. దీనినే ‘విష్ణుకుండం’ అని పిలుస్తుంటారు. యాదగిరి నరసింహస్వామి పాదాల వద్ద నుంచి నిరంతరం పెల్లుబుకుతూ వచ్చే నీరు ఈ పుష్కరిణిలో చేరుతుంటుంది. ఈ తీర్థం చాలా మహిమాన్వితమైనదని పేరు. భక్తుల రాక యేటేటా పెరగడంతో ఈ క్షేత్రం తెలంగాణ తిరుపతిగా వాసికెక్కింది. ఇదిలా ఉండగా హైదరాబాద్ వాస్తవ్యుడైన రాజామోతీలాల్ యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి వైభవం విని స్వామి వారిని దర్శించి స్వామి వారికి ఆలయనిర్మాణం చేయించాడు. ప్రాకారం, గోపుర ద్వారం, ముఖమండపం నిర్మించాడు. ఆ తర్వాత భక్తులు తమ యాత్ర సందర్భాల్లో పలు సౌకర్యాలు ఏర్పరుస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ క్షేత్ర యాజమాన్యం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంది. యాదగిరి లక్ష్మీనరసింహ క్షేత్రం జనాకర్షకమై భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతోంది. వైకుంఠద్వారం... యాదాద్రి కొండపైకి నడకదారిన వెళ్లే భక్తులు ఈ వైకుంఠ ద్వారం నుంచి వెళ్లాలి. ఈ వైకుంఠద్వారాన్ని యాలీ పిల్లర్ల మీద ఏర్పాటు చేశారు. వైకుంఠ ద్వారం వద్ద భక్తులు కొబ్బరి కాయలు కొట్టి మెట్లదారి నుంచి శ్రీస్వామి వారి క్షేత్రానికి వెళ్లవచ్చు. అన్నప్రసాదం... గండి చెరువుకు కొద్ది దూరంలో క్షేత్రానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదం కోసం అన్నసత్ర భవనాన్ని 2.7 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందుకు యాదాద్రి దేవాలయ అభివృద్ధి సంస్థ రూ.6కోట్లు ఖర్చు చేస్తుండగా.. రూ.11కోట్లను వేగేశ్న సంస్థ ఖర్చు చేస్తుంది. ప్రస్తుతం ఈ మండపం స్లాబ్ లెవల్ పనులు పూర్తయ్యాయి. కల్యాణ కట్ట... శ్రీస్వామి వారికి భక్తులు సమర్పించుకునే తలనీలాల కోసం అధునాతన హంగులతో కల్యాణ కట్టను నిర్మించారు. దీనిని 2.23 ఎకరాల విస్తీర్ణంలో రూ.20.3కోట్ల వ్యయంతో నిర్మాణం చేశారు. ఇందులో ఒకేసారి 360 మంది పురుషులు, 160 మంది మహిళ భక్తులు తలనీలాలు సమర్పించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. దీక్షాపరుల మండపం శ్రీస్వామి క్షేత్రంలో మండల దీక్ష చేసే భక్తులకు దీక్షాపరుల మండపాన్ని అధునాతనంగా నిర్మించారు. 1.88 ఎకరాల స్థలంలో రూ.8.09 కోట్ల వ్యయంతో ఈ దీక్షారుల మండపాన్ని తీర్చిదిద్దారు. ఇందులో 140 మంది పురుషులు, 108 మంది మహిళ భక్తులు దీక్షలు చేసే సమయంలో బస చేసేలా ఏర్పాట్లు చేశారు. గండి చెరువు... శ్రీస్వామి వారి తెప్పోత్సవం కోసం గండి చెరువును వైటీడీఏ అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో మల్లన్న సాగర్ ద్వారా గోదావరి జలాలను తీసుకువచ్చారు. ఇందులో శ్రీస్వామి వారి తెప్పోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతే కాకుండా భక్తులు సేద తీరేందుకు లాన్స్, గ్రీనరీ, బేంచీలను ఏర్పాటు చేసి, బోటింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఫలితాలనొసగే ‘ప్రదక్షిణల మొక్కు’ ఈ క్షేత్రంలో ప్రదక్షిణల మొక్కు’ ప్రధానమైనది. దీనివల్ల మానసిక, శారీరక, ఆర్థికబాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. మండలం (41 రోజులు), అర్ధమండలం, 11 రోజుల ప్రదక్షిణల మొక్కులు మొక్కుకుంటారు భక్తులు. నిత్యం గర్భాలయానికి రెండుసార్లూ, ఆంజనేయస్వామికి 16 సార్లూ ప్రదక్షిణలు చేస్తారు.ఈ మొక్కు తీర్చుకునే దశలో స్వామి కలలోనే తమకు చికిత్సలు చేసి, శారీరక బాధల నుంచి విముక్తి చేస్తారని నమ్ముతారు. యాగ స్థలం... యాదాద్రి కొండకు దిగువన 93 ఎకరాల్లో యాగ స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో గతంలో 1,008 కుండాలతో మహా సుదర్శన యాగం చేయాలని అధికారులు భావించారు. కానీ అనివార్య కారణాలతో ఈ యాగం వాయిదా పడింది. ఇప్పుడు ఇందులో భక్తుల వాహనాలను పార్కింగ్ చేసేందుకు వినియోగిస్తున్నారు. లక్ష్మీపుష్కరిణి... కల్యాణకట్టకు ఎదురుగానే భక్తుల కోసం లక్ష్మీ పుష్కరిణిని ఆధ్యాత్మిక హంగులతో అద్భుతం గా నిర్మించారు. 2.13 ఎకరాల్లో రూ.6.67కోట్ల వ్యయంతో ఈ లక్ష్మీ పుష్కరిణి రూపుదిద్దుకుంది. ఇందులో ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్లను నింపుతున్నారు. త్వరలోనే గోదావరి జలాలను సైతం నింపనున్నారు. ఈ పుష్కరిణిలో 1,500 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే విధంగా ఏర్పాట్లు చేశారు. పురుషులకు, మహిళలకు వేర్వేరుగా స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు. వ్రత మండపం... అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి క్షేత్రం తరువాత యాదాద్రీశుడి ఆలయంలోనే భక్తులు అధిక సంఖ్యలో శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలను జరిపిస్తారు. ఇందుకోసం నిర్మిస్తున్న వ్రత మండపం ఇది. లడ్డూ ప్రసాదం.. క్షేత్రానికి వచ్చే భక్తులు అధికంగా లడ్డూ, పులిహోరకే మక్కువ చూపెడతారు. ఇందుకు వైటీడీఏ అధికారులు అధునాతన హంగులతో మానవ ప్రమేయం లేకుండా మిషన్ల ద్వారా ప్రసాదం తయారీ చేసే విధంగా ఏర్పాటు చేశారు. క్షేత్రానికి ఎంత మంది వస్తే అంత మందికి లడ్డూ, పులిహోర, ఇతర ప్రసాదం తయారీ చేసి ఇచ్చేందుకు సిద్ధం చేశారు. ఇందులో ప్రత్యేక కౌంటర్లు, లైన్లు ఏర్పాటు చేశారు. పూర్వ జన్మ సుకృతం ‘‘యాదాద్రి నరసింహుని ఆలయ పునర్నిర్మాణం కోసమే భగవంతుడు నన్ను భూమి మీదికి పంపించి ఉంటాడు. అందుకోసమే భక్తులకు కావాల్సిన రీతిలో క్షేత్ర నిర్మాణంలో పాలు పంచుకోగలిగాను. యాదాద్రి ఆలయ ఆర్కిటెక్ట్ ఆనంద సాయి రూపొందించిన ప్లాన్ ప్రకారం పని చేయడానికి నన్ను పిలిపించారు. ప్రధాన స్థపతి సుందర రాజన్ ద్వారా ఆలయ ప్లాన్ను ఆమోదించారు. ఆ క్రమంలో నన్ను అదనపు స్థపతి, సలహాదారుగా నియమించారు. స్వామివారి ప్రధానాలయం, శివాలయం కార్యనిర్వహణ పనిని అప్పగించారు. స్థపతులు, శిల్పులు, టీటీడీ శిల్ప కళాశాల విద్యార్థులు... ఇలా అందరి భాగస్వామ్యంతో నాకప్పగించిన పనులు పూర్తి చేశాను. అందుకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి నిమిషం ప్రతి మనిషి పక్కన స్వామి వారే ఉండి ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఇది ఏ ఒక్కరి వల్లా పూర్తి కాలేదు. స్వామివారి ఆజ్ఞగానే భావించి అందరూ ఇందులో పాలు పంచుకున్నారు. సర్వేజనాస్సుఖినోభవంతు అన్న విధంగా స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉంటాయి. దేవాదాయ ధర్మాదాయ స్థపతి సలహాదారుగా ఎన్నో ఆలయాలు నిర్మించిన నేను.. యాదాద్రి క్షేత్ర నిర్మాణంలో పాల్గొనడం నా పూర్వ జన్మ సుకృతం. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. స్వామివారికి సహస్రాధిక నమస్సులు తెలియజేసుకుంటున్నాను’’. – స్థపతి డాక్టర్ ఆనందాచారి వేలు మహాద్భుత క్షేత్రంగా యాదాద్రి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం ఎంతో అద్భుతంగా జరిగింది.దేశంలోనే మహాద్భుత క్షేత్రంగా విలసిల్లుతుంది. ఈ మహాక్రతువులో నేను కూడా భాగస్వామిని కావడం ఎంతో సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని నభూతో న భవిష్యతి అన్న రీతిలో పూర్తి కావించారు. యావత్ భక్త ప్రపంచం ఎప్పడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ మహా ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుంది. నేటి ఉదయం నిత్యకైంకర్యం గావించగానే బాలాలయంలో నిత్య పూర్ణాహుతి జరుగుతుంది. వెంటనే శ్రీస్వామి వారు మేళతాళాలు, స్వస్తి మంత్రాలు, వేద దివ్య ప్రబంధ పాశుర పఠనాలతో ప్రధానాలయంలోకి వేంచేస్తారు. అక్కడ స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం. 11.45 నిమిషాల నుంచి గోపురాలకు పూజలు నిర్వహించి, 11.55కు కుంభాభిషేకం ఏకకాలంలో జరిపిస్తాం. 92 స్థానాల్లో 200 మంది రుత్విక్కులు పాల్గొని ఏకకాలంలో అన్ని గోపురాలు, ప్రాకార మండపాలు, గర్భాలయం, ఆండాల్, ఆళ్వార్, రామానుజులు, విష్వక్సేన సన్నిధి, చతుర గోపురాలకు మహా కుంభాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం ప్రధానాలయంలో మొదటి పూజ, మంత్రపుష్ప నీరాజనాలు, ప్రసాద వినియోగం పూర్తవుతాయి. తర్వాత సీఎం కేసీఆర్కు ఆశీర్వచన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం సంధ్యాసమయానికి ద్వితీయ ఆరాధన పూర్తి కాగానే శాంతి కల్యాణం నిర్వహించి ఉత్సవాలకు వచ్చిన పండితులకు సన్మానం చేస్తాం. భక్తులకు శ్రీస్వామి వారి ఆశీర్వచనం ఉంటుంది. – నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు ఆలయ ప్రధానార్చకులు కథనాలు: సాక్షి యాదాద్రి, యాదగిరి గుట్ట, ఫొటోలు: కొల్లోజు శివకుమార్, సాక్షి భువనగిరి -
మహబూబ్నగర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు .. వెనక్కి తగ్గిన తెలంగాణ సర్కార్!
సాక్షి, హైదరాబాద్: వెంచర్లు చేసేందుకు ఉపయోగపడే అసైన్డ్ భూములను సేకరించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం ఓ అడుగు వేసినట్టే వేసి వెనక్కు తగ్గింది. గతంలో పేదలకు కేటాయించిన అసైన్డ్ భూముల్లో జాతీయ రహదారులు, ప్రధాన రహదారుల పక్కన, రియల్ బూమ్ ప్రాంతాల్లో ఉన్న వాటిని గుర్తించి అభివృద్ధి చేయాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మహబూబ్నగర్ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకుంది. ఈ జిల్లాలోని జడ్చర్ల, రాజాపూర్, భూత్పూర్, బాలానగర్ మండలాల్లో ఖాళీగా ఉన్న అసైన్డ్ భూములను సర్వే చేయాలని, అసైనీలతో మాట్లాడి ఎకరానికి 400 గజాలను వారికి ఇచ్చేవిధంగా ఒప్పించాలని ఆయా మండలాల రెవెన్యూ అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. గత వారం రోజులుగా ఆయా మండలాల అధికారులు ఈ సర్వేలో నిమగ్నమయ్యారు. జాతీయ రహదారుల వెంట ఉన్న భూములను గుర్తించి అసైనీలతో మాట్లాడి ఆయా భూముల్లో ప్రభుత్వ బోర్డులు పెట్టే ప్రయత్నం చేశారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు అంగీకరించగా, మరికొన్ని చోట్ల రైతుల నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఎకరం భూమి తీసుకుని అందులో 10 శాతం ఇస్తామంటే ఎలా కుదురుతుందని, కనీసం 50:50, 60:40 లాంటి ప్రతిపాదనలతో వస్తే ఆలోచిస్తామని తేల్చిచెప్పారు. జడ్చర్ల లాంటి ప్రాంతాల్లో ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు కూడా దిగాయి. దీంతో తాత్కాలికంగా ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆయా మండలాల రెవెన్యూ అధికారులకు మళ్లీ మౌఖికంగానే ఆదేశాలు జారీ కావడం గమనార్హం. చదవండి: సీఎస్ సోమేశ్ను ఏపీకి కేటాయించండి: కేంద్రం మరిన్ని ప్రతిపాదనలతో మళ్లీ.. రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షల ఎకరాలకుపైగా అసైన్డ్ భూములున్నాయి. ఇందులో వ్యవసాయ యోగ్యం కాని భూములూ పెద్దఎత్తున ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ భూముల వల్ల అసైనీలకూ ఉపయోగం లేనందున వాటిని స్వాధీనం చేసుకోవాలని భావించింది. స్వాధీనం చేసుకున్న భూములను ఏం చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడిన అధికారులు ఈ భూముల్లో ప్రభుత్వమే వెంచర్లు చేయాలని, హెచ్ఎండీఏకి అప్పగించి భూములను అభివృద్ధి చేసి విక్రయించాలని, అసైన్డ్ భూములను ఇచ్చినందుకు అసైనీలకు కొంత వాటా ఇవ్వాలని నిర్ణయించారు. అందులోభాగంగానే ఎకరానికి 400 గజాల ప్రతిపాదనతో పాలమూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. అయితే, ఈ ప్రతిపాదనపై వ్యతిరేకత రావడంతో ప్రస్తుతానికి విరమించుకున్నప్పటికీ ప్రభుత్వం మరిన్ని ప్రతిపాదనలతో మళ్లీ వచ్చే అవకాశం లేకపోలేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. పేదల అసైన్డ్ భూములను లాక్కోవద్దు: తమ్మినేని సాక్షి,హైదరాబాద్: పేదలకిచ్చిన అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో ఆక్రమించి ప్లాట్లు చేసి అమ్ముకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ప్రభుత్వం చట్టాలను అమలు చేయకపోగా వాటిని ఉల్లంఘించడం అన్యాయమని గురువారం ఓ ప్రకటనలో ఆయన విమర్శించారు. ప్రభుత్వ ఖజానాను నింపుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల అసైన్డ్ భూములను లాక్కోవడం సరికాదన్నారు. చదవండి: వరంగల్ ఎన్ఐటీకి ఉద్యోగాల పంట.. అత్యధిక ప్యాకేజీ 62.5 లక్షలు పట్టణాలకు దగ్గరగా అసైన్డ్ భూముల విలువ కొన్ని చోట్ల రూ.కోటి పైగా పలుకుతోందని అలాంటి భూముల నుంచి పేద అసైన్డ్దారులను బయటకు గెంటివేసి ప్రభుత్వం జెండాలు పాతి శాంతి–భద్రతల సమస్యను సృష్టించడం దారుణమన్నారు. ప్రభుత్వం తన తప్పుడు విధానాన్ని విరమించుకుని అసైన్డ్ భూములున్న పేదవారికి రక్షణ కల్పించాలని కోరారు. -
కరెంట్ బకాయిలపై బాధ్యత తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు చెల్లించాల్సిన రూ.6 వేల కోట్లకుపైగా విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించేలా చొరవ తీసుకోవాలని వైఎస్సార్ సీపీ ఎంపీల బృందం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. విభజన నష్టాలతోపాటు కోవిడ్ కారణంగా రాబడి కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి బకాయిల వసూలు అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణకు విద్యుత్తు సరఫరా చేసినందున బకాయిలు చెల్లించేలా బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మన్నవరంలో విద్యుత్ ఉపకరణాల తయారీ జోన్ నెలకొల్పాలని కోరారు. పన్నుల వాటాలో మినహాయించైనా.. ఏపీ జెన్కోకు తెలంగాణ డిస్కమ్లు చెల్లించాల్సిన రూ.6,111 కోట్ల బకాయిలను వెంటనే ఇప్పించి నష్టాల్లో ఉన్న విద్యుత్ సంస్థలను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ ఎంపీల బృందం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ను కోరింది. పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్సభా పక్షనేత పీవీ మిధున్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీల బృందం బుధవారం ఆర్కే సింగ్ను కలుసుకుని పలు అంశాలతో వినతిపత్రాన్ని సమర్పించింది. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం ఆదేశాల మేరకు ఏపీ జెన్కో 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు తెలంగాణ డిస్కమ్లకు విద్యుత్ సరఫరా చేసినట్లు గుర్తు చేశారు. ఈ బకాయిలను తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకూ చెల్లించలేదని తెలిపారు. కేంద్ర విద్యుత్ శాఖ అధికారులతో గతేడాది నవంబర్ 8న తెలుగు రాష్ట్రాల అధికారుల చర్చల సందర్భంగా సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని సూచించినా ఇంతవరకు కొలిక్కి రాలేదని తెలిపారు. తెలంగాణ వాటాగా కేంద్రం విడుదల చేసే పన్నుల ఆదాయం నుంచైనా మినహాయించి ఆంధ్రప్రదేశ్కు బకాయిలను చెల్లించాలని విజయసాయిరెడ్డి కోరారు. వినతిపత్రంలో ఇతర అంశాలు.. ► చిత్తూరు జిల్లా మన్నవరంలో ఎన్బీపీపీఎల్ ప్లాంట్ కోసం కేవలం 5 ఎకరాలను మాత్రమే వినియోగిస్తోంది. వృథాగా ఉన్న మిగిలిన 748 ఎకరాలను ఎన్టీపీసీ – ఏపీఐఐసీ జాయింట్ వెంచర్తో పవర్ ఎక్విప్మెంట్ తయారీ కోసం మాన్యుఫాక్చరింగ్ జోన్గా మార్చాలి. ► కరువు నివారణకు రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 27 ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. రూ.12,500 కోట్ల మేర ఆర్థిక సాయం అందించేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఎస్పీవీ కింద ప్రతిపాదించిన అన్ని ప్రాజెక్టులను ఒకే ప్రాజెక్టుగా పరిగణించి రుణ సదుపాయం కల్పించాలి. ఆక్వా రైతులకు బీమా కేంద్ర మత్స్యశాఖ మంత్రికి వైఎస్సార్సీపీ ఎంపీల వినతి పెద్దఎత్తున విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్న ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు ఆక్వా రైతులకు బీమా పాలసీ అమలు చేయాలని వైఎస్సార్ సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆక్వా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోందని, కేంద్రం మద్దతిస్తే మెరుగైన తోడ్పాటు అందించవచ్చని నివేదించారు. ఆక్వా ఉత్పత్తులను ప్రోత్సహించి అభివృద్ధి చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుభరోసా కేంద్రాల ద్వారా ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. సీడ్, ఫీడ్ అందజేయడంతోపాటు మెరుగైన గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు వివరించారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఎంపీల బృందం బుధవారం ఢిల్లీలో కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలాను కలుసుకుని ఈమేరకు పది అంశాలపై వినతిపత్రాన్ని అందజే సింది. ఎంపీలు మోపిదేవి వెంకటరమణరావు, గురుమూర్తి, బెల్లాన చంద్రశేఖర్, వంగా గీత వీరిలో ఉన్నారు. దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టిందని తెలిపారు. విజయనగరం జిల్లా చింతపల్లి, విశాఖపట్నం జిల్లా భీమిలి, రాజయ్యపేటల్లో రూ.75 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన కింద కేంద్రం అనుమతించిందన్నారు. నెల్లూరు జిల్లా తడ, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో చేపల వేటకు వెళుతున్న మత్స్యకారులు పలు సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. తరచూ ఘర్షణలు చోటు చేసుకోవడం, పరస్పరం కేసులు నమోదు కావడంతో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు తెలిపారు. దీన్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు పులికాట్ సరస్సులో ఇసుకమేట డ్రెడ్జింగ్కు రూ.45 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. నిధులు వెంటనే విడుదల చేయాలని కోరగా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. వినతిపత్రంలో ఇతర ముఖ్యాంశాలివీ.. ► సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్వా కల్చర్ అథారిటీ ప్రాంతీయ కార్యాలయానికి కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో భూమి కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ► ఆక్వా రంగం ఆర్జించే విదేశీ మారక ద్రవ్యంలో రూ.15,600 కోట్ల వాటా ఏపీదే. ► ఆక్వా రంగానికి పవర్ టారిఫ్ తోడ్పాటు ఇవ్వాలి. ► రూ.40 కోట్లతో విశాఖ జిల్లా బండారుపల్లిలో ఆక్వా క్వారంటైన్ సెంటర్కు సవరించిన అంచనాలతో కేంద్రం గ్రాంటు మంజూరు చేయాలి. ► విశాఖలో నౌకాదళ విన్యాసాల సమయంలో జీవనోపాధికి ఇబ్బంది పడుతున్న మత్స్యకారులకు రూ.10 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. ► బుడగట్లపాలెం, చింతపల్లి, ముక్కాం గ్రామాల్లో జెట్టీలు ఏర్పాటు చేయాలి. -
ఎల్ఆర్ఎస్ రసీదు పోయింది.. ఇప్పుడెలా? అ‘ధనం’ కట్టాల్సిందేనా?
‘మామునూరులో 200 గజాల ఓపెన్ ప్లాట్ ఉన్న వినయ్ భవన నిర్మాణానికి మున్సిపల్ అధికారులను సంప్రదించాడు. రెండేళ్ల క్రితం ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పాడు. నిబంధనల ప్రకారం అప్పటి మార్కెట్ విలువ ఆధారంగా భవన నిర్మాణ ఫీజు చెల్లించాలి. కానీ అతడు దరఖాస్తు చేసుకున్న ఎల్ఆర్ఎస్ రసీదును పోగొట్టుకున్నాడు. ఎల్ఆర్ఎస్ వెబ్సైట్ సాంకేతిక సమస్యలతో తెరుచుకోకపోవడంతో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ ప్రకారం ఫీజు చెల్లించాల్సి వస్తోంది’ ‘నర్సంపేటలో ఉండే సిద్ధు్ద తనకున్న 160 గజాల ఓపెన్ ప్లాట్లో ఇళ్లు కట్టుకుందామనుకున్నాడు. ఓ లైసెన్స్డ్ సర్వేయర్ను సంప్రదించాడు. సేల్డీడ్ డాక్యుమెంట్లు, లేఅవుట్ కాపీతో పాటు రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్న ఎల్ఆర్ఎస్ రసీదు కావాలని సర్వేయర్ అడిగాడు. అది ఉంటే తప్ప అప్పటి మార్కెట్ విలువ ప్రకారం భవన నిర్మాణ ఫీజు దాదాపు రూ.20వేల వరకు తగ్గే అవకాశముందని చెప్పాడు. అయితే సిద్ధు ఆ రిసిప్ట్ను ఎక్కడో పోగొట్టుకున్నాడు. ఎల్ఆర్ఎస్ వెబ్సైట్ ఓపెన్ అయినప్పటికీ.. సాంకేతిక సమస్యలతో దరఖాస్తు తెరుచుకోలేదు. దీంతో అతడికీ అదనంగా డబ్బు చెల్లించడం తప్పలేదు’ సాక్షి, వరంగల్: కోవిడ్ వ్యాప్తి తగ్గడంతో సొంతిటి కల సాకారం చేసుకునేందుకు సామాన్యులు ముందుకొస్తున్నారు. ఇటీవల పెరిగిన ల్యాండ్ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం భవన నిర్మాణానికి ఆన్లైన్లో అదనంగా చెల్లించాలి. గతంలో ఎల్ఆర్ఎస్లో నమోదు చేసుకొని ఆ రసీదు పొంది ఉంటే.. ఇంటి పర్మిషన్కు కాస్త తక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అయితే చాలామంది ఎల్ఆర్ఎస్లో కట్టిన రసీదును నిర్లక్ష్యం చేశారు. దీనికి తోడు ఆన్లైన్లోనూ రసీదు లభించకపోవడంతో భవన నిర్మాణదారులకు అదనపు భారం తప్పట్లేదు. తెరుచుకోని సైట్! అక్రమ లే అవుట్లలో ఓపెన్ ప్లాట్ల క్రమబద్ధీకరణకు రెండేళ్లక్రితం ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చింది. ఈ పథకాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లకపోవడంతో ప్రస్తుతం భవన నిర్మాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. 2020కి సంబంధించి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుకు రూ.వెయ్యి ప్రాసెసింగ్ ఫీజును ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా వసూలు చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ ప్లాట్లు, ప్లాట్ల మార్కెట్ విలువను పెంచిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ రుసుం మరింత పెరిగింది. దీనికి తోడు గతంలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటి రసీదు కలిగి ఉండి టీఎస్బీపాస్ ద్వారా భవన నిర్మాణ అనుమతి తీసుకుంటే గతంలోని మార్కెట్ విలువ ప్రకారమే ఫీజు చెల్లించవచ్చు. కానీ గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ, నర్సంపేట, వర్ధన్నపేట మునిసిపాలిటీల పరిధిలో చాలా మంది ఆ రిసిప్ట్లను నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడూ వెబ్సైట్ https://lrs.telangana.gov.in కు వెళ్లి ఫోన్ నంబర్ ఎంట్రీ చేస్తే ఓటీపీతో దరఖాస్తు ఓపెన్ కావాల్సి ఉంది. కానీ సాంకేతిక సమస్యల కారణంగా దరఖాస్తు ఓపెన్ అవడం లేదు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఓటీపీ రావడం లేదు. దీంతో చాలామంది ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం భవన నిర్మాణ ఫీజులు కడుతున్నారు. (చదవండి: పేరుకే ప్రేమ పెళ్లి.. ఆడపిల్లలు పుట్టారని తన్ని తరిమేశారు..) ఇంటి నిర్మాణానికి సన్నద్ధం.. ప్రస్తుతం కోవిడ్ ఉధృతి తగ్గడంతో వేలాది మంది సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకొని రెండేళ్లుగా ఎదురుచూసిన వేలాది మంది భవన నిర్మాణ అనుమతులను పొందేందుకు సిద్ధమయ్యారు. గతంలో ఎల్ఆర్ఎస్ చెల్లించి అప్పటి రిసిప్ట్ ఉంటే.. గతంలోని మార్కెట్ విలువ ప్రకారమే భవన నిర్మాణ అనుమతికి డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు స్థలాల విస్తీర్ణం ప్రకారం రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు తగ్గింపు ఉండే అవకాశం ఉంది. కానీ చాలామంది దరఖాస్తుదారులు తమ వద్ద అప్పటి ఎల్ఆర్ఎస్ రసీదులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆన్లైన్లో వివరాలు లభించక 14 శాతం ఎల్ఆర్ఎస్ రుసుంతో ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారమే భవన నిర్మాణ అనుమతులు తీసుకుంటున్నారు. ఎల్ఆర్ఎస్ సైట్ను పునరుద్ధరించాలని, పురపాలక శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించాలని భవన నిర్మాణదారులు విన్నవిస్తున్నారు. (చదవండి: బాప్రే.. ఒక్క నిమిషానికి 700 పెండింగ్ చలాన్లు క్లియర్!) -
జాతీయ రహదారులు పెరుగుతున్నయ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జాతీయ రహదారుల వాటా క్రమంగా పెరుగుతోంది. కొంతకాలంగా కేంద్రం భారీగా కొత్త రోడ్లను మంజూరు చేస్తుండటంతో లెక్కల్లో మార్పు కనిపిస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2020–21 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం రాష్ట్రంలోని మొత్తం రోడ్లలో జాతీయ రహదారుల వాటా 3.6 శాతంగా ఉంది. మొత్తం రోడ్ల నిడివి 1,07,871.2 కిలోమీటర్లు ఉండగా ఇందులో జాతీయ రహదారులు 3,910 కిలోమీటర్ల మేర ఉన్నాయి. అయితే ఇది 10 నెలల కిందటి నాటి పరిస్థితి. 2021–22 ఆర్థిక ఆర్థిక సంవత్సరంలో దాదాపు మరో వెయ్యి కిలోమీటర్ల రోడ్డు అందుబాటులోకి వచ్చింది. దీంతో జాతీయ రహదారుల మొత్తం నిడివి 4,983 కి.మీ. కు చేరింది. అంటే మొత్తం రోడ్లలో వీటి వాటా 4.6 శాతానికి చేరింది. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ. ప్రస్తుతం దేశంలో ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు జాతీయ రహదారులు 4.06 కిలోమీటర్లు ఉండగా రాష్ట్రంలో 4.45 కిలోమీటర్లు ఉన్నాయి. నల్గొండ టాప్.. పెద్దపల్లి లాస్ట్: రాష్ట్ర సర్కారు లెక్కల ప్రకారం జాతీయ రహదారుల్లో నల్గొండ జిల్లా వాటా ఎక్కువుంది. ఈ జిల్లాలో 273 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులున్నాయి. నాగర్కర్నూలు, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో జాతీయ రహదారులే లేకపోవటంతో అట్టడుగు స్థానంలో ఉంది. -
ఆకట్టుకున్న ఊరు భంగం నాటకం
గన్ఫౌండ్రీ: నాటక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కె.వి.రమణాచారి అన్నారు. రసరంజని సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రవీంద్రభారతిలో ప్రదర్శించిన ఊరు భంగం అనే నాటకం ఆకట్టుకుంది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. అంతరించిపోతున్న నాటక రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతగానో ఉందన్నారు. రసరంజని సంస్థ ప్రతినిధులు, నాటక ప్రియులు పాల్గొన్నారు. -
తెలంగాణలో ఆయుష్మాన్ భారత్’ అమలు చేయాలి
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకుండా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం దూరం చేస్తుందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ అన్ని రాష్ట్రాలలో అమలవుతుంటే తెలంగాణలో అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం చిక్కడపల్లిలో బీజేపీ రాంనగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శులు సివేగి బాలు, కె.ఉపేందర్ ఆధ్వర్యంలో ఈ–శ్రమ్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం 300లకు పైగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కె.రవిచారి, జి.భరత్గౌడ్, జైపాల్రెడ్డి, సి.పార్ధసారథి, గడ్డం నవీన్, ప్రవీణ్ నాయక్, కిరణ్, లోక్యానాయక్, రమణయ్య, సంపత్రెడ్డి, వేణు తదితరులు పాల్గొన్నారు. -
మరోసారి చాన్స్! ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు ఓకే
2014 జూన్ 2 నాటికి ముందు ఆక్రమణలో ఉన్నట్టు రుజువులున్న స్థలాలనే క్రమబద్ధీకరిస్తారు. దరఖాస్తుదారులు ఏదైనా గుర్తింపు కార్డు (ఆధార్కార్డు/ఏదైనా డాక్యుమెంట్)తోపాటు.. స్థలం తమ అధీనంలో ఉన్నట్టు నిరూపించే ఆస్తిపన్ను రశీదు/విద్యుత్ బిల్లు/తాగునీటి బిల్లు/రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వంటివాటిలో ఏదైనా ఒకటి జత చేయాలి. ఖాళీ భూములను క్రమబద్ధీకరించరు. నివాసేతర వినియోగంలో ఉన్న స్థలాల్లో కూడా ఏదో ఒక నిర్మాణం ఉండాలి. ఎలాంటి వివాదాల్లేని ప్రభుత్వ భూములు, పట్టణ భూగరిష్ట పరిమితి చట్టంలోని మిగులు భూములను మాత్రమే క్రమబద్ధీకరిస్తారు. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరోమారు అవకాశం కల్పించింది. 2014 డిసెంబర్లో జారీ చేసిన జీవో నంబర్.58, 59కు అనుగుణంగా.. భూముల అసైన్మెంట్, క్రమబద్ధీకరణ, హక్కుల బదలాయింపు కోసం దరఖాస్తులకు గడువిస్తూ సీఎస్ సోమేశ్కుమార్ సోమవారం జీవో నంబర్ 14ను జారీ చేశారు. దీనికి అనుగుణంగా భూపరిపాలన ప్రధాన కమిషనర్, రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. ఈ నెల 21 నుంచి మార్చి 31 వరకు మీసేవ కేంద్రాల్లో క్రమబద్ధీకరణ దరఖాస్తు చేసుకోవచ్చు. 2014 జూన్ 2వ తేదీకి ముందే ఆక్రమణకు గురైన స్థలాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. పెండింగ్తోపాటు కొత్తగా కూడా.. గతంలో జారీచేసిన నంబర్ 58, 59 జీవోల కింద రాష్ట్రవ్యాప్తంగా 3.5 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో 2లక్షల వరకు దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. ప్రభుత్వం పెట్టిన నిబంధనల ప్రకారం రెండు వాయిదాల్లో నిర్దేశిత ఫీజును చెల్లించకపోవడం, తగిన ఆధారాలు సమర్పించకపోవడంతో మిగతా 1.5 లక్షల దరఖాస్తులు పెండింగ్లో పడ్డాయి. అయితే.. ఎన్ని దరఖాస్తులు, ఏయే కారణాలతో పెండింగ్లో పడ్డాయన్న వివరాలను ప్రభుత్వం ఇటీవలే అన్ని జిల్లాల నుంచి సేకరించింది. పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం ఆ వివరాలను పరిశీలించి.. మరోమారు క్రమబద్ధీకరణ అవకాశం కల్పించాలని సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలోనే తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి. పెండింగ్లో ఉన్నవాటిని పరిష్కరించడంతోపాటు గతంలో దరఖాస్తు చేసుకోలేనివారు కూడా జీవో 14 ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చని.. వ్యక్తిగత ధ్రువీకరణతోపాటు సదరు భూమి కబ్జాలో ఉన్నట్టు తగిన ఆధారాలను సమర్పించాలని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణల క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశమని పేర్కొన్నాయి. 58, 59 జీవోల్లోని అంశాలివే.. – 125 చదరపు గజాల్లోపు స్థలాలను ఆక్రమించుకుని నిర్మించుకున్న ఇళ్లను ఉచితంగా క్రమద్ధీకరిస్తారు. – 250 చదరపు గజాల్లోపు ఆక్రమణలకు ప్రభుత్వ కనీస ధరలో 50శాతం.. 250–500 చదరపు గజాల స్థలాలకు కనీస ధరలో 75 శాతం సొమ్మును ఫీజుగా కట్టాలి. – 500 నుంచి 1000 చదరపు గజాల స్థలాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేసుకున్నవారు ప్రభుత్వ కనీస ధరను పూర్తిగా చెల్లించాలి. – విస్తీర్ణంతో సంబంధం లేకుండా.. నివాసేతర వినియోగ భూములకు ప్రభుత్వ కనీస ధర పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. – ఈ భూముల క్రమబద్ధీకరణ కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. – క్రమబద్ధీకరణపై ఆర్డీవో చైర్మన్గా, సంబంధిత తహశీల్దార్ సభ్యులుగా ఉండే కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. – తహసీల్దార్లు సదరు దరఖాస్తుదారుల కుటుంబాల్లోని మహిళల పేరు మీదే కన్వేయన్స్ డీడ్ను చేసి ఇవ్వాల్సి ఉంటుంది. – ఏవైనా సమస్యలు తలెత్తితే జాయింట్ కలెక్టర్ సంబంధిత కమిటీకి తగిన సూచనలు చేస్తారు. – ఏ దరఖాస్తునైనా ఎలాంటి కారణం చూపకుండానే తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని జీవోల్లో పేర్కొన్నారు. చార్జీలు/ఫీజులపై స్పష్టత కరువు! 2014 నాటి 58, 59 జీవోల ప్రకారం తాజా క్రమబద్ధీకరణ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించినా.. చార్జీలు/ఫీజుల విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. గతంలో పెండింగ్లో పడ్డ 1.5 లక్షల దరఖాస్తులకు అప్పటి ధరలే వర్తింపజేయవచ్చని అధికారవర్గాలు చెప్తున్నా.. ఒకవేళ ప్రస్తుత మార్కెట్ ధరలను ఏమైనా పరిగణనలోకి తీసుకుంటారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక కొత్తగా చేసుకునే దరఖాస్తులకు సంబంధించి.. ఇటీవల పెంచిన భూములు/స్థలాల ధరలే వర్తిస్తాయని అధికారులు అంటున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వస్తే తప్ప స్పష్టత వచ్చే అవకాశం లేదని పేర్కొంటున్నారు. -
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఆల్విన్కాలనీ/భాగ్యనగర్కాలనీ: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానందనగర్, ఆల్విన్ న్కాలనీ, హైదర్నగర్, కూకట్పల్లి డివిజన్ల పరిధిలో పలువురు లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా లబ్దిపొందిన 14 మందికి చెక్కులను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ సంక్షేమ ప్రభుత్వంగా పేరు గాంచిందన్నారు. సంక్షేమ పథకాలకు ఏ లోటూ రాకుండా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ యాదగిరి, మాజీ కార్పొరేటర్ రంగారావు, చందానగర్ అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడ ఎర్రగుడ్ల శ్రీనివాస్యాదవ్, హఫీజ్పేట్ అధ్యక్షుడు గౌతమ్గౌడ్, నాయకులు కాశీనాద్ యాదవ్, యాదగిరి గౌడ్, వెంకటేష్గౌడ్, దాత్రి గౌడ్, సత్యనారాయణ రాజు పాల్గొన్నారు. -
ఆక్షన్కి యాక్షన్.. వేలానికి ప్రభుత్వ ప్లాట్లు
సాక్షి, హైదరాబాద్: ఖజానాకు మరింత ఆదాయం సమకూర్చుకోవడంపై దృష్టిపెట్టిన రాష్ట్ర సర్కారు.. వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న ‘రాజీవ్ స్వగృహ’ ఇళ్లస్థలాలను వేలం వేయాలని నిర్ణయించింది. తొమ్మిది జిల్లాల పరిధిలోని 1,408 ప్లాట్లను వేలం వేయడం ద్వారా రూ.800 కోట్ల వరకు రాబట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు జిల్లాలవారీగా ప్లాట్ల వేలానికి సంబంధించిన వివరాలను శుక్రవారం ప్రకటించింది. జీహెచ్ఎంసీ మినహా చోట్ల భౌతికపద్ధతిలో వేలం నిర్వహిస్తామని తెలిపింది. గతేడాది హైదరాబాద్లో జరిగిన భూముల ‘ఈ–వేలం’లో ‘హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన అభివృద్ధి సంస్థ (టీఎస్ఐఐసీ)’ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జిల్లాల్లో జరిగే వేలం నిర్వహణలో కలెక్టర్లకు సహకరించి, పర్యవేక్షించే బాధ్యతను వాటికే అప్పగించారు. వేలానికి వీలుగా ఉన్న ప్రాజెక్టుల లేఔట్లను ఇప్పటికే సిద్ధం చేసిన అధికారులు.. ఈనెల 18న, వచ్చే నెల ఏడున ప్రిబిడ్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 12 నుంచి వచ్చే నెల 10వ తేదీ మధ్య కొనుగోలుదారులు సంబంధిత స్థలాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నారు. వచ్చే నెల 14, 15, 16, 17 తేదీల్లో జిల్లాల వారీగా ప్లాట్ల వేలం ప్రక్రియ జరుగుతుందని అధికారులు వెల్లడించారు. త్వరగా ఇళ్లు కట్టుకునేలా వసతులు వేలం వేసే ప్రాజెక్టుల్లో ఈ ఏడాది డిసెంబర్ చివరినాటికి అంతర్గత రోడ్లు, వీధి దీపాలు తదితర మౌలిక వసతులను పూర్తిచేస్తారు. ఎటువంటి చిక్కుల్లేని వివాద రహిత ఓపెన్ ప్లాట్లలో వెంటనే నిర్మాణాలు చేపట్టేలా అనుమతులు కూడా ఇస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఈ ప్రాజెక్టుల్లో రెసిడెన్షియల్, ఇతర అవసరాలకు వీలుగా ప్లాట్లను 60 చదరపు గజాల నుంచి గరిష్టంగా 315 చదరపు గజాల వరకు విభజించారు. పెద్ద ప్లాట్లు, అపార్టుమెంట్లు, వాణిజ్య సముదాయాల కోసం 6,500 చదరపు గజాల విస్తీర్ణమున్న స్థలాలను కూడా వేలంలో విక్రయిస్తారు. ఇప్పటికే వేలం వేసే ప్రాజెక్టుల స్థితిగతులపై సంబంధిత జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. వేలానికి సంబంధించిన విధి విధానాలను ఇటీవల హైదరాబాద్లో జరిగిన సంబంధిత జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఖరారు చేశారు. మహబూబ్నగర్, గద్వాల, నల్లగొండ జిల్లాల్లో వేలం నిర్వహణ బాధ్యతలను హెచ్ఎండీఏకు అప్పగించగా.. రంగారెడ్డి, కామారెడ్డి, పెద్దపల్లి, ఆసిఫాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగే వేలాన్ని టీఎస్ఐఐసీ పర్యవేక్షిస్తుంది. హైదరాబాద్లో స్పందనను బట్టి.. గతేడాది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ భూములకు హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ ‘ఈ–వేలం’ నిర్వహించగా భారీ స్పందన వచ్చింది. ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.2 వేల కోట్ల మేర ఆదాయం లభించింది. ఖానామెట్, కోకాపేట, ఉప్పల్ భగా యత్, పుప్పాలగూడ తదితర కీలక ప్రాంతాల్లో ఎక రానికి అప్సెట్ ధర సగటున రూ.25 కోట్లుగా నిర్ణ యించగా.. గరిష్టంగా రూ.60 కోట్ల వరకు కూడా ధర పలికింది. ఈ నేపథ్యంలో జిల్లాల్లోనూ నిర్వ హించే భూముల వేలానికి మంచి ధర వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వచ్చే నెలలో నిర్వ హించే వేలంలో శేరిలింగంపల్లిలోని మూడు ప్లాట్లకు చదరపు గజానికి గరిష్టంగా రూ.40 వేలు అప్సెట్ ధర నిర్ణయించగా.. జిల్లాల్లో అప్సెట్ను రూ.5 వేల నుంచి రూ.10 వేల మధ్య నిర్ణయించారు. ‘స్వగృహ’ ఆగిపోవడంతో.. మధ్యతరగతి వారికి మార్కెట్ ధరతో పోలిస్తే 25% తక్కువ ధరకు ఇండ్లు నిర్మించి ఇచ్చే లక్ష్యంతో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ‘రాజీవ్ స్వగృహ’ పథకాన్ని ప్రారంభించింది. తెలంగాణలో జీహెచ్ఎంసీ సహా 15చోట్ల రాజీవ్ స్వగృహ ప్రాజెక్టులను ప్రారంభించారు. వివిధ కారణాలతో ఇవి మధ్యలో నిలిచిపోయాయి. చాలాచోట్ల ఓపెన్ ప్లాట్లతోపాటు నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లు, ఇళ్లు నిరుపయోగంగా ఉండిపోయాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న ఇళ్ల స్థలాలను వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
మణికొండ జాగీర్ భూముల వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. హైదరాబాద్ మణికొండ జాగీర్ భూముల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 1654 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో వేల కోట్లు విలువ చేసే భూములు ప్రభుత్వానికి దక్కాయి. 2016 నుంచి సుప్రీంకోర్టులో జాగీర్ భూముల కేసు కొనసాగుతుండగా.. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో 1654 ఎకరాలపై ప్రభుత్వానికి సర్వ హక్కులు లభించాయి. కాగా ప్రభుత్వం, వక్ఫ్ బోర్డుమధ్య ఎన్నో ఏళ్లుగా భూముల వివాదం కొనసాగుతోంది. హజరత్ హుస్సేన్ షా వలి అని పిలవబడే దర్గాకు చెందిన 1654 ఎకరాల 32 గుంటలు తమవేనంటూ వక్ఫ్ బోర్డు కోర్టు కెక్కింది. ఇందుకు సంబంధించి ఏపీ హైకోర్టులో వక్ఫ్ బోర్డుకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పలుమార్లు వాదనలు నడిచాయి. అయితే, 2012 ఏప్రిల్ 3న వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. చదవండి: అనూహ్య పరిణామం: ఎన్నికల వేళ డేరా బాబా బయటకు! దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ భూముల విషయంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టేసింది. హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ.. మొత్తం భూములపై సర్వ హక్కులు తెలంగాణా ప్రభుత్వానివేనంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హేమంత్ గుప్తా, రామసుబ్రమణిన్ ధర్మాసనం 156 పేజీల తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వానికి, వక్ఫ్ బోర్డు మధ్య నలుగుతున్న వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చదవండి: ఇసుక, సిమ్మెంట్ లేకుండా ఇల్లుని నిర్మించారు ఎలాగో తెలుసా!! -
భారీగా పెరిగిన వ్యవసాయ భూముల విలువ.. 42 గ్రామాల్లో 150% పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 42 గ్రామాల్లో వ్యవసాయ భూముల ప్రభుత్వ విలువలు 150 శాతం అంటే రెండున్నర రెట్లు పెరగనున్నాయి. ఈ మేరకు సగటున వ్యవసాయ భూముల విలువను 50 శాతం పెంచాలని, కొన్ని గ్రామాల్లో మాత్రం 75, 100, 125, 150 శాతం శ్లాబుల్లో సవరించాలని నిర్ణయించింది. ఇందుకు ప్రభుత్వ విలువ, అమ్మకపు ధరకు మధ్య ఉన్న తేడా (టైమ్ డిఫరెన్స్ రేంజ్ (టీడీఆర్)ను పరిగణనలోకి తీసుకుంది. వాస్తవానికి, రాష్ట్రంలో గతేడాది జూలైకి ముందు ఏడేళ్లపాటు భూముల విలువలు సవరించనందున ప్రభుత్వ విలువలకు, మార్కెట్లో అమ్మకపు ధరకు వ్యత్యాసం భారీగా పెరిగింది. దీన్నే ప్రాతిపదికగా తీసుకుని ఈ వ్యత్యాసం ఎక్కువగా ఉన్నచోట్ల వ్యవసాయ భూములతో పాటు ఖాళీస్థలాల విలువలను పెంచేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ కసరత్తు పూర్తిచేసి తుది విలువలను ఖరారుచేసింది. అయితే ఫ్లాట్ల విలువల సవరణ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించిన అధికారులు చాలా తక్కువగా సవరణ ప్రతిపాదనలను ఖరారుచేశారు. తద్వారా మధ్యతరగతి ప్రజలు అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనుగోలుచేసినా రిజిస్ట్రేషన్ ఫీజు భారం ఎక్కువ పడకుండా జాగ్రత్త తీసుకున్నారు. దీంతోపాటు ప్రభుత్వ విలువ పెరిగితే ఆ మేరకు రియల్టర్లు బహిరంగ మార్కెట్ ధరను కూడా పెంచితే ఫ్లాట్ల ధరలు భారీగా పెరిగే అవకాశమున్న నేపథ్యంలో ఫ్లాట్ల విలువలను పెద్దగా సవరించలేదు. ఖాళీ స్థలాలను సగటున 35 శాతం పెంచగా, ఫ్లాట్ల విలువను 25 శాతం మాత్రమే సవరించారు. సమస్యలు రాకుండా నోడల్ అధికారులు సవరించిన విలువలు వచ్చేనెల 1 నుంచే అమల్లోకి వస్తాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. జిల్లా స్థాయి కమిటీల ఆమోదం వచ్చి ఇందుకు సంబంధించిన కసరత్తు పూర్తయినందున శనివారం నుంచే విలువల అప్లోడ్పై అధికారులు దృష్టి పెట్టనున్నారు. ఆదివారం ఎలాగూ సెలవు కాబట్టి అవసరమైతే సోమవారం రిజిస్ట్రేషన్ కార్యకలాపాలను నిలిపివేసి కొత్త విలువల అమలులో ఇబ్బందులు, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ట్రయల్స్ పూర్తి చేసుకుంటామని చెబుతున్నారు. కొత్త విలువల అమల్లో సమస్యలూ రాకుండా చూసేందుకు 33 జిల్లాలకు 33 మంది నోడల్ అధికారులను నియమించారు. ఇందులో జిల్లా రిజిస్ట్రార్లతో పాటు పలువురు సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు. -
తెలంగాణలో ఆ 5,925 ప్రాంతాలు.. విలువల మధ్య భారీ వ్యత్యాసం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చాలాచోట్ల భూముల ప్రభుత్వ విలువలకు, బహిరంగ మార్కెట్లో అమ్ముతున్న ధరలకు పొంతనే లేదని తేలింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువల సవరణలో భాగంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ జరిపిన పరిశీలనలో ఐదు జిల్లాల్లోని 5,925 ప్రాంతాల్లో ఈ రెండు విలువల మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్టు తేలింది. ఆ శాఖ ఉన్నతాధికారులు తయారు చేసిన నివేదిక ప్రకారం ఈ రెండు విలువల మధ్య కనీసం మూడింతల నుంచి 13 రెట్ల వరకు వ్యత్యాసం కనిపిస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో భూముల విలువల సవరణను భారీగానే ప్రతిపాదించారని తెలుస్తోంది. ఈ ప్రాంతాల్లో అమ్మకపు విలువకు చాలా తక్కువగానే ప్రభుత్వ విలువను సవరించినా ప్రస్తుతమున్న విలువకు రెట్టింపు చేయాల్సి వచ్చింది. అదే విధంగా ఈ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ల విలువల్లో కూడా రెండింతల వ్యత్యాసం ఉన్నట్టు తేలింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న అనుకూలతకు అనుగుణంగా కొత్త ప్రభుత్వ విలువలను ప్రతిపాదించామని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. -
కాలేజీలు మూసి.. స్కూళ్లు తెరుస్తారా?: తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఒకపక్క యూనివర్సిటీలు, కాలేజీలు మూసేస్తూ మరోవైపు ఈనెల 30 తర్వాత పాఠశాలలు తెరుస్తామని పేర్కొనడం ఏంటని హైకోర్టు ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. పాఠశాలల ప్రారంభంపై ప్రభుత్వ అభిప్రాయం ఏంటో తెలిజేయాలని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను శుక్రవారం మరోసారి విచారించింది. ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే సమ్మక్క సారలమ్మ జాతరకు లక్షలాది మంది హాజరయ్యే నేపథ్యంలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేంటో తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే జంటనగరాల్లో జరుగుతున్న వారాంతపు సంతల్లో ప్రజలు గుమిగూడకుండా, భౌతిక దూరం పాటించేలా ఎటువం టి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని అడిగింది. 3.45 లక్షల కిట్లు పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా 77.33 లక్షల ఇళ్లల్లో జ్వర సర్వే నిర్వహించి స్వల్ప లక్షణాలున్నవారికి 3.45 లక్షల కిట్లు పంపిణీ చేశామని ప్రజా ఆరోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు వీడియో కాన్ఫరెన్స్లో ధర్మాసనానికి తెలిపారు. చిన్న పిల్లల వైద్యానికి సంబంధించి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్పడకల సంఖ్య బాగా పెంచామని వివరించారు. లక్షణాలున్న వారికి పంపిణీ చేస్తున్న మందుల కిట్లలో చిన్న పిల్లలకు అవసరమైన మందులు లేవని, వారికి ప్రత్యేకంగా కిట్లు ఇచ్చేలా ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కౌటూరి పవన్కుమార్ నివేదించారు. చిన్నారుల వైద్యానికి ప్రభుత్వం ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని మరో పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది రవిచందర్ నివేదించారు. వారాంతపు సంతల్లో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడుతున్నారని, వీరి ద్వారా కరోనా వ్యాపించే అవకాశం ఉందని మరో పిటిషనర్ తరఫు న్యాయవాది మయూర్రెడ్డి పేర్కొన్నారు. జాతరలో కోటిమంది పాల్గొనే అవకాశం గోదావరి నది తీరంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరలో ఐదు రాష్ట్రాల నుంచి 75 లక్షల నుంచి కోటి మంది పాల్గొనే అవకాశం ఉందని, కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున కరోనా వ్యాపించే అవకాశముందని మరో పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ నివేదించారు. కుంభమేళా సందర్భంగా పెద్ద ఎత్తున కరోనా వ్యాపించడాన్ని ఆయన గుర్తు చేశారు. చిరు వ్యాపారులను రోడ్డు మీద పడేయలేం వారాంతపు సంతలకు వెళ్లే వారి ద్వారా పెద్ద ఎత్తున కరోనా వ్యాపించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో వాటిని నిర్వహించకుండా ఆదేశించాలన్న వాదనను ధర్మాసనం సున్ని తంగా తిరస్కరించింది. ‘రోడ్ల మీద కూరగాయలు అమ్ముకొని, చిరు వ్యాపారాలు చేసుకొనేవారు వారి కొచ్చే రూ.100తో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వారాంతపు సంతలను మూసేసి వాళ్ల నోటి దగ్గర ముద్ద లాక్కోమంటారా? ఉపాధి లేకుం డా చేసి రోడ్ల మీద పడేయాలా? ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూనే ఉంది..’ అని ధర్మాసనం పేర్కొంది. మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తామని తెలిపింది. కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని డాక్టర్ శ్రీనివాసరావును ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 3కు వాయిదా వేసింది. -
హైదరాబాద్లో రూ. 1,14,000.. ములుగులో రూ. 1,700
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఖాళీ స్థలాల విలువలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. హైదరాబాద్కు, ములుగుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తాజాగా నిర్ధారించిన గజం భూమి ప్రభుత్వ విలువ మధ్య ఉన్న తేడా..‘భూమికీ ఆకాశానికీ..’ అనే నానుడిని గుర్తుతెస్తోంది. హైదరాబాద్లోని బంజారా హిల్స్ నడిబొడ్డున గజం విలువ రూ.1.14 లక్ష లుగా నిర్ధారణ కాగా, ములుగు జిల్లాలో అత్యధి కంగా గజానికి రూ.1,700గా మాత్రమే నిర్ధారిం చారు. అంటే ఈ రెండు ప్రాంతాల నడుమ ఏకంగా 67రెట్ల వ్యత్యాసం ఉండటం గమనార్హం. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ప్రభుత్వ విలువలను జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్ల శాఖ ఖరారు చేసి ఆయా జిల్లాలకు పంపింది. ఈ వివరాలను పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ములుగు తర్వాత భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా రూ.2,400 గజం విలువ కాగా, హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, చార్మినార్, నయాపూల్లో రూ.1.05 లక్షలుగా ఖరారయిం ది. హైదరాబాద్ దూద్బౌలీలో రూ.87,800గా విలువ ఖరారయితే, రంగారెడ్డి జిల్లా మియా పూర్, చందానగర్, రాయ్దుర్గ్ లాంటి ప్రాం తాల్లో రూ. 52,700గా నిర్ధారించారు. మరిన్ని ఆసక్తికర విషయాలివే.. ► హైదరాబాద్ దూద్బౌలీలో ప్రస్తుతం రూ.65 వేలుగా ఉన్న గజం విలువను రూ.87,800కు పెంచారు. అదే ఇక్కడ అపార్ట్మెంట్లకు సంబంధించి చదరపు అడుగుకు ప్రస్తుతం రూ. 6,200 ఉండగా దాన్ని రూ.7,800 మాత్రమే పెంచారు. ► బంజారాహిల్స్ రోడ్ నం:3, 1, పంజాగుట్ట ప్రాంతాల్లో ప్రస్తుతం రూ.84,500 ఉన్న చదరపు గజం విలువను రూ. 1,14,100కు పెంచారు. ఇక్కడ అపార్ట్మెంట్లకు గాను చదరపు అడుగుకు రూ.7,600 ఉండగా దాన్ని రూ.9,500కు పెంచారు. ► మాసాబ్ట్యాంక్, క్రాస్రోడ్స్, ఎస్ఆర్నగర్, ఖైరతాబాద్ అయోధ్య హోటల్, సంత్ నిరంకారి టూ రవీంద్రభారతి (లక్డీకాపూల్), ఏజీ ఆఫీస్ సర్కిల్ (సైఫాబాద్), అమీర్పేట క్రాస్రోడ్స్, పంజాగుట్ట రాజీవ్గాంధీ సర్కిల్, ఎర్రగడ్డ థెరెస్సా చర్చి, భరత్నగర్ ఫ్లైఓవర్, ఉమేశ్చంద్ర విగ్రహం తదితర ప్రాంతాల్లోనూ రూ.1.14 లక్షలుగా చదరపు గజం ఖాళీ స్థలం విలువలను నిర్ధారించారు. ► శ్రీనగర్ కాలనీలో రూ.78 వేలుగా ఉన్న విలువలను చదరపు గజానికి రూ. 1,05,300కు సవరించారు. ఫ్లాట్ల విలువ చదరపు అడుగుకు రూ. 7వేల నుంచి రూ.8,800కి సవరించారు. ► చార్మినార్ సమీపంలోని నయాపూల్లో కూడా ప్రభుత్వ విలువను భారీగానే పెంచారు. ఇక్కడ చదరపు గజానికి ఖాళీ స్థలం ప్రస్తుతం రూ. రూ.78 వేలు ఉండగా, దాన్ని రూ.1.05,300కు పెంచారు. ఫ్లాట్ల విలువ చదరపు అడుగుకు రూ. 7వేల నుంచి రూ.8,800కి సవరించారు. ► రంగారెడ్డి జిల్లాలో శంకరపల్లి, కేశంపేట, చౌదరిగూడ, ఫారూఖ్నగర్, కొందుర్గ్, మాడ్గుల్, కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఓ మోస్తరుగానే ధరలు ఖరారు చేశారు. నగర శివార్లలోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పలు చోట్ల భారీ ఎత్తున ధరలు నిర్ధారణ అయ్యాయి. ► సూర్యాపేట పట్టణంలోని కుడకుడ రోడ్డులో గజం భూమి విలువను అత్యధికంగా రూ.26,400గా నిర్ధారించగా, హుజూర్నగర్, కోదాడల్లో రూ.17,600, నేరేడుచర్లలో రూ.5,800గా అత్యధిక ధరలను ఖరారు చేశారు. ► యాదాద్రి జిల్లాలో భువనగిరిలో ఎక్కువ ధర ఉండగా, యాదగిరిగుట్టతో సహా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరుగానే ధరలను ఖరారు చేశారు. -
31 నుంచి పాఠశాలలు తెరుస్తున్నారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. పాఠశాలల ప్రారంభంపై వివరాలు తెలపాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 31 నుంచి పాఠశాలలు తెరుస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. అదే విధంగా వారాంతవు సంతల్లో కోవిడ్ నియంత్రణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సమ్మక్క జాతర ఏర్పాట్లపై నివేదిక సమర్పించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. ఆన్లైన్ ద్వారా చేపట్టిన విచారణకు డీహెచ్ శ్రీనివాస్ రావు హాజరయ్యారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 శాతం ఉందని తెలిపారు. 77 లక్షల ఇళ్లల్లో జ్వరం చేసి 3.45 లక్షల కిట్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. కిట్లలో పిల్లల చికిత్స ఔషధాలు లేవన్న న్యాయవాదులు ప్రస్తావించగా.. పిల్లలకు మందులు కిట్ల రూపంలో నేరుగా ఇవ్వకూడదన్న డీహెచ్ తెలిపారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో నివేదికను మూడు రోజుల్లో సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరోనా పరిస్థితులపై విచారణ ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది. చదవండి: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి షాకింగ్ న్యూస్.. ఇక ఇంటికొస్తారు! -
చేనేత సంస్థ పోచంపల్లికి వచ్చేనా?
సాక్షి, హైదరాబాద్: వస్త్ర, దుస్తుల తయారీ పరిశ్రమ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభు త్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (కేఎం టీపీ)తో పాటు అనేక టెక్స్టైల్, అపారెల్ పార్కులు ఏర్పాటుచేస్తోంది. కేఎంటీపీలో యాంగ్వాన్, కైటెక్స్ వంటి దిగ్గజ టెక్స్టైల్, అపారెల్ పరిశ్రమలు కార్య కలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేసు కుంటున్నాయి. రాష్ట్రంలో 40 వేలకు పైగా చేనేత కార్మికులు ఉండగా.. సుమారు 35 వేలకు పైగా మరమగ్గాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో జౌళి రంగంలో సాంకేతిక నిపుణులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇందుకోసం సాంకేతిక శిక్షణ సంస్థలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఉన్న అనుకూలతల దృష్ట్యా పోచంపల్లిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్ టీ) ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్రానికి పలు మార్లు ప్రతి పాదనలు పంపింది. ఐఐటీహెచ్ ఏర్పా టుకు అవసరమైన మౌలిక వసతులు సమకూర్చేం దుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సానుకూల సంకేతాలు అందడం లేదు. ఏపీ వెంకటగిరిలో ఐఐహెచ్టీ దేశవ్యాప్తంగా ప్రస్తుతం పది ఐఐహెచ్టీలు ఉం డగా, ఆరు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ, మరో ఆరు రాష్ట్రాల టెక్స్టైల్ కమిషనర్ల పరిధిలో పనిచేస్తు న్నాయి. వారణాసి (ఉత్తరప్రదేశ్), సాలెమ్ (తమిళ నాడు), గువాహటి (అస్సాం), జోధ్పూర్ (రాజ స్తాన్), బార్ఘార్ (ఒడిశా), శాంతిపూర్ (పశ్చిమబెం గాల్) లోనివి కేంద్రం పరిధిలో ఉన్నాయి. వెంకట గిరి (ఏపీ), గదగ్ (కర్ణాటక), కన్నూరు (కేరళ), చంపా (ఛత్తీ‹స్గఢ్) ఐఐటీహెచ్లు రాష్ట్రాల పరిధి లో ఉన్నాయి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ప్రస్తు తం తెలంగాణ విద్యార్థులకు వెంకటగిరి ఐఐటీ హెచ్లో మెరిట్ ప్రాతిపదికన ప్రవేశాలు లభిస్తున్నా యి. టెన్త్ చదివిన వారికి మెరిట్ ప్రాతిపదికన ఐఐహెచ్టీల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు దక్కితే స్టైపెండ్ కూడా లభిస్తుంది. 2024 నుంచి ప్రవేశాలు కష్టమే వెంకటగిరి ఐఐహెచ్టీలో 60 సీట్లు ఉండగా తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర కోటాలో 13 సీట్లు పోగా ఏపీ, తెలంగాణ విద్యార్థు లకు 47 సీట్లు అందుబాటులో ఉన్నాయి. విభజన చట్టం మేరకు 2023–24 విద్యా సంవత్సరం తర్వాత తెలంగాణ విద్యార్థులకు వెంకటగిరీ ఐఐటీ హెచ్లో ప్రవేశాలు నిలిచిపోనున్నాయి. విభజన సమయంలోనే ఒడిశాలోని బార్ఘర్ ఐఐటీహెచ్లో తెలంగాణ విద్యార్థులకు 8 సీట్లు ప్రత్యేకించారు. అయితే కోవిడ్ పరిస్థితుల్లో దూర ప్రాంతాల్లో ఉన్న ఐఐటీహెచ్లకు వెళ్లేందుకు రాష్ట్ర విద్యార్థులు విము ఖత చూపుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఐఐటీహెచ్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెరుగు తోంది. ఐఐటీహెచ్ ఏర్పాటు చేస్తే రాష్ట్ర విద్యార్థులు స్పిన్నింగ్, వీవింగ్ (నేత), డిజైనింగ్, డైయింగ్ (అద్దకం), ప్రింటింగ్ (ముద్రణ), గార్మెంట్ మేకింగ్ (దుస్తుల తయారీ), మార్కెటింగ్, మేనేజ్మెంట్ తదితర అంశాల్లో శాస్త్రీయ పద్దతుల్లో శిక్షణ, నైపుణ్యం పొందేందుకు అవకాశం లభిస్తుంది. నైపుణ్యాలు పెంపొందుతాయి ప్రస్తుతం చాలామంది యువకులు చేనేత రంగం వైపు వైపు వస్తున్నారు. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ మానేసి సొంతంగా 25 మగ్గాలు పెట్టి 50 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. నేనే స్వతహాగా డిజైన్లు తయారు చేసి చీరెలను తయారు చేయి స్తాను. ఐఐహెచ్టీ ఏర్పాటు ద్వారా సాంకేతిక పరి జ్ఞానం పెరిగి కొత్తకొత్త డిజైన్లు సృష్టించేందుకు అవకాశం ఏర్పడుతుంది. నాణ్యత పెరుగుతుంది. మరింత ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సాంప్రదాయ డిజైన్లకు నవీన పోకడలు చేనేత ఉత్పత్తుల్లో తెలంగాణ దేశంలోనే అగ్ర గామిగా ఉంది. అంతర్జాతీయంగా పేరొందిన ఇక్క త్తో పాటు గద్వాల పట్టు, కొత్తకోట పైఠానీ, వరం గల్ డర్రీస్ ఇలా లెక్కలేనన్ని నేత ఉత్పత్తులకు తెలంగాణ ప్రసిద్ది. ఇలాంటి చోట ఐఐహెచ్టీ లాంటి పేరొందిన సంస్థ ఏర్పాటు చేస్తే సాంప్రదాయ డిజైన్లకు నవీన పోకడలు జోడించి వస్త్ర రంగంలో నూతన ఆవిష్కరణలకు బాటలు వేయొచ్చు. – యర్రమాద వెంకన్న నేత, చైర్మన్, అఖిల భారత పద్మశాలి సంఘం (చేనేత విభాగం) -
తెలంగాణ: ఈ నెల 8 నుంచి 16 వరకు సెలవులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వైద్యారోగ్య శాఖపై సీఎం కేసీఆర్ సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఒమిక్రాన్ వ్యాప్తి, కరోనా పరిస్థితులు, టీకా పంపిణీ వంటి అంశాలపై చర్చించారు. 16 తర్వాత వైరస్ పరిస్థితులను బట్టి సెలవులపై నిర్ణయం తీసుకోనున్నారు. చదవండి: భార్య కోసం ఇద్దరు భర్తల లొల్లి.. మీడియా సమావేశం పెట్టి మరీ.. -
తెలంగాణ ప్రభుత్వంపై చిరంజీవి ప్రశంసలు
థియేటర్లలో సినిమా టికెట్ ధరలను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.‘తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు,థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి కృతఙ్ఞతలు. సినిమా థియేటర్ల మనుగడకు,వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది’అని చిరంజీవి ట్వీట్ చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు,థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ KCR గారికి కృతఙ్ఞతలు.🙏🏻🙏🏻 సినిమా థియేటర్ల మనుగడకు,వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది. pic.twitter.com/w6VbRMtrG5 — Chiranjeevi Konidela (@KChiruTweets) December 25, 2021 -
విదేశాల్లో చదువుకు తెలంగాణ ప్రభుత్వం 20 లక్షలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువులంటే గతంలో డిగ్రీ, పీజీ మాత్రమే. ఇక విదేశీ విద్య అంటే అది అందని ద్రాక్షగా ఉండేది. కేవలం సంపన్నులకు మాత్రమే విదేశాలకు వెళ్లి చదివే స్థోమత ఉండేది. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రతిభ ఉంటే చాలు సామాన్యులు కూడా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. ఆ విధంగా అవకాశాలు ఇంటి ముంగిట్లోకి వచ్చేశాయి. ఐటీ రంగం బాగా వ్యాప్తి చెందడంతో అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తదితర దేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ఇది కూడా విదేశీ చదువులపై విద్యార్థులు మక్కువ చూపేందుకు కారణమైంది. చదువుల్లో అత్యుత్తమ మార్కులు సాధించి విదేశీ వర్సిటీల్లో సీటు పొందిన వారికి తెలంగాణ ప్రభుత్వం విదేశీ విద్యానిధి పథకం కింద ఆర్థిక చేయూతను అందిస్తున్నది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నదని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలో అర్హత గల సుమారు 50 వేల మంది విద్యార్థులకు ఈ పథకం విశేషంగా దోహదపడునున్నది. చదవండి: ప్రేమ పేరుతో మోసం.. శారీరకంగా లొంగదీసుకొని.. చివరకు దరఖాస్తు కోసం ఏం చేయాలి విదేశీ విద్యకోసం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం విదేశీ విద్యానిధి వెబ్సైట్లో చూడవచ్చు. ఇతర సామాజిక వర్గాల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఇంకో అవకాశం కల్పించనున్నారు. ఇవీ అర్హతలు ► విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి. ► వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలి. ► తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి. ► డిగ్రీ, ఇంజనీరింగ్లలో 60 శాతం మార్కులు తప్పనిసరి. అర్హత సాధిస్తే రూ.20 లక్షలు మంజూరు విదేశీ విద్యానిధి పథకం కింద ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేస్తుంది. వీసా వచ్చిన తర్వాత రూ.10 లక్షలు అక్కడి ఖర్చుల నిమిత్తం రూ.10 లక్షలు చెల్లిస్తుంది. విద్యార్థులు ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి వడ్డీ కింద అదనంగా రూ.10 లక్షల విద్యారుణం తీసుకోవచ్చు. విమాన టిక్కెట్కు డబ్బులు ప్రభుత్వమే చెల్లిస్తుంది. జత చేయాల్సిన పత్రాలు ► పదో తరగతి ఇంటర్, డిగ్రీ, బీటెక్ ధ్రువీకరణ పత్రాలు ►ఆదాయ, నివాస, కుల ధవీకరణ పత్రాలు ► పాస్పోర్ట్, వీసా ►యూనివర్సిటీ అనుమతి పొందిన ఎఫ్–1 కాపీ ► జీఆర్ఈ, జీమాట్, టోఫెల్, ఐఎఫ్ఎల్టీఎస్ వివరాలు ►బ్యాంకు ఖాతా సమాచారం వెలువడిన ప్రకటన విద్యానిధి పథకానికి సంబంధించిన ప్రకటన వెలువడింది. ఎస్సీ, ఎస్టీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు గాను ఇప్పటికే అన్ని కళాశాలల విద్యార్థులకు ఆయా శాఖల కమిషనర్లు అవగాహన కల్పించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు సైతం పథకం వివరాలను అందజేశారు. దేశాలు.. కోర్సులు అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, సింగపూర్, జర్మని, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్ తదితర దేశాల్లో ఈ పథకం కింద చదువుకునేందుకు అవకాశం కల్పించారు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, సైన్స్, అగ్రికల్చర్ సైన్స్, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సైన్సెస్, పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో చేరేందుకు ఈ పథకం వర్తిస్తుంది. ఎంపిక ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కమిటీ ఎంపిక చేస్తుంది. కమిటీ చైర్మన్గా ఎస్సీ, ఎస్టీ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. ఉన్నత విద్యాశాఖ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జేఎన్టీయూ వైస్ చాన్స్లర్, ఎస్సీ కమిషనర్, టెక్నికల్ ఎడ్యుకేషనల్ కమిషనర్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్, విదేశీ విద్యలో ఒక అనుభవజ్ఞుడు ఉంటారు. -
వచ్చే ఏడాది సెలవులివే.. ఆ నెలలోనే అధిక సెలవులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది సాధారణ సెలవులను ప్రభుత్వం వెల్లడించింది. 2022 సంవత్సరంలో మొత్తం 23 ప్రభుత్వ సాధారణ సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ నెలలోనే ఆరు సాధారణ సెలవులు రానున్నాయి. ఉగాది, శ్రీరామనవమితో పాటు మరో నాలుగు సెలవులు ఈ నెలలో రానున్నాయి. చదవండి: కావలి మేఘనకు కేటీఆర్ అభినందనలు, శాలువాతో సత్కారం అన్ని ఆదివారాలు, రెండో శనివారాల్లో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయవని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే జనవరి 1న సెలవు దినంగా ప్రకటించినందున, ఆరోజుకు బదులుగా ఫిబ్రవరి 12 రెండో శనివారం రోజున కార్యాలయాలు పని చేస్తాయని తెలిపారు. వచ్చే ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగులు ఐదుకు మించి ఐచ్ఛిక సెలవులు (ఆప్షనల్ హాలిడేస్) వాడుకోరాదని సూచించారు. (చదవండి: కిలో టమాట రూ. 50.. ఎగబడ్డ జనం) -
మీరే ఇప్పించి.. తీసేసుకోండి!
సాక్షి, అమరావతి: తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకున్న విద్యుత్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు చెల్లించాల్సిన రూ.6,283.68 కోట్ల బకాయిలను ఇప్పించాల్సిందిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇంధన శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ సమస్యలపై శనివారం నివేదిక ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర డిస్కంలు పొందుతున్న ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకం రుణం కింద ఏపీ జెన్కో బకాయిలు జమ చేయాలని రాష్ట్రం కోరనుంది. ఈ పథకం ద్వారా కేంద్రం రాష్ట్రాలకు రుణాలిస్తుంటుంది. ఏపీకి సంబంధించిన రుణ బకాయిలను తెలంగాణ నుంచి తీసుకోవాలని ప్రధానంగా విజ్ఞప్తి చేయనుంది. నాడు ఆదుకున్న ఏపీ: ఏపీ విభజన సమయంలో డిమాండ్కు సరిపడా తెలంగాణలో విద్యుదుత్పత్తి లేకపోవడంతో ఏపీజెన్కో తెలంగాణ డిస్కంలకు 8,890 మిలియన్ యూనిట్ల విద్యుత్ను 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు సరఫరా చేసింది. ఆ కాలంలో సరఫరా చేసిన విద్యుత్ ఖర్చు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం, రూ.3,441.78 కోట్లు, ఆలస్యమైనందుకు సర్చార్జి రూ.2,841.90 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు తెలంగాణ చెల్లించలేదు. ప్రస్తుతం ఏపీ జెన్కో ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. తెలంగాణ బకాయిలు రాకపోవడంతో.. ఏపీ జెన్కో జూన్ 2021లో విద్యుత్ ఆర్థిక సంస్థ, గ్రామీణ విద్యుదీకరణ సంస్థలకు రూ.1700 కోట్ల రుణ వాయిదాలను గడువులోగా తీర్చలేకపోయింది. జూలై, ఆగస్టులో చెల్లించాల్సిన మరో రూ.1,020 కోట్లు చెల్లించలేదు. అంగీకరించారు గానీ..: వాస్తవానికి 2019 ఆగస్టు 19న ఏపీ, తెలంగాణ విద్యుత్ సంస్థల మధ్య జరిగిన సమావేశంలోనూ, 2020 జనవరి 30న ఏపీ, తెలంగాణ సీఎస్ల సమావేశంలోనూ తెలంగాణ, ఏపీలు కలిసి ఈ బకాయిల చెల్లింపుపై వివిధ సందర్భాల్లో చర్చించాయి. తెలంగాణ డిస్కంలు ఈ మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరించాయి. కానీ డబ్బులు ఇవ్వలేదు. కేంద్రం ఆదేశాలివ్వడం వల్లనే తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసినందున ఆ బకాయిలను ఆత్మనిర్భర్ పథకం ద్వారా రాష్ట్రానికి ఇప్పించి, వాటిని ఆర్ఈసీ, పీఎఫ్సీల రుణాలకు జమచేసుకోవాలనే ప్రతిపాదనను అమిత్ షా ముందుంచాలని రాష్ట్రం భావిస్తోంది. -
‘పాలమూరు’ కోసంమళ్లీ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై ఆధారపడి చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి పర్యావరణ అనుమతుల ప్రక్రియలో వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అనుమతులు పొందే వరకు నిర్మాణ పనులు పూర్తిగా నిలిపివేయాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించిన నేపథ్యంలో అనుమతుల సాధన ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే అవసరమైన అన్ని నివేదికలు సిద్ధం చేసిన ఇంజనీర్లు.. ప్రభుత్వం అనుమతించిన వెంటనే అనుమతుల కోసం కేంద్ర పర్యావరణ శాఖకు దరఖాస్తు చేయనున్నారు. ఈఏసీ ఓకే అంటేనే అనుమతి.. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్లు, పంప్హౌస్లు, ఇతర నిర్మాణాలకు 27,193 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉండగా మరో 205.48 హెక్టార్ల మేర అటవీ భూములు అవసరం కానున్నాయి. ఇందులో ఇప్పటికే 26 వేల ఎకరాల మేర భూసేకరణ పూర్తికాగా ఆగస్టులో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ వివరాలతోపాటు ఇతర అంశాలపై ఇరిగేషన్ శాఖ అధికారులు సమగ్ర నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖకు ఈ వివరాలు సమర్పించాల్సి ఉన్నా ప్రభుత్వం మొదట గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను ముగించి ఆ తర్వాత కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియ మొదలు పెట్టాలని భావించడంతో దీన్ని పక్కనపెట్టింది. అయితే ఎన్జీటీ పర్యావరణ అనుమతులు వచ్చేవరకు పనుల కొనసాగింపుపై ముందుకెళ్లొద్దని స్పష్టం చేయడంతో ఇప్పటికే సిద్ధం చేసిన నివేదికలను కేంద్ర పర్యావరణ శాఖకు పంపాలని ఇరిగేషన్ శాఖ భావిస్తోంది. ఈ నివేదికలను ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) పరిశీలించి పర్యావరణంపై పడే ప్రభావాన్ని మదింపు చేస్తుంది. ప్రాజెక్టు నిర్మాణాలకు ఎలాంటి అభ్యంతరం లేదని కమిటీ తేలిస్తేనే అనుమతుల ప్రక్రియ పూర్తి కానుంది. కేంద్రానికి దరఖాస్తు చేసిన రెండు నెలల్లో అనుమతులు వచ్చే అవకాశం ఉంటుందని ప్రాజెక్టు ఇంజనీర్లు చెబుతున్నారు. -
ఆజంజాహిలో కలెక్టరేట్ కష్టమేనా!
సాక్షి, వరంగల్: ఆజంజాహి మిల్లు స్థలంలో నిర్మించ తలపెట్టిన వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనం నిర్మాణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిల్లులోని 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ భవనం నిర్మిద్దామనుకున్నా ఈ సంస్థ కార్మికుల విషయంలో మంగళవారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో అక్కడ కలెక్టరేట్ నిర్మాణం కష్టం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మిల్లు మూతబడిన తర్వాత జీఓ 463 ప్రకారం 2007లో 134 మంది కార్మికులకు ఒక్కొక్కరికి 200 గజాల చొప్పున స్థలం ఉచితంగా కేటాయించారు. తమకు కేటాయించక పోవడంతో మిగిలినవారు హైకోర్టును ఆశ్రయించారు. మిగతా 318 మంది కార్మికులకు స్థలాలు ఇవ్వడం సబబేనంటూ సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. మంగళవారం అత్యున్నత న్యాయస్థానం కూడా ఆ తీర్పును సమర్థించింది. దీంతో అక్కడ కార్మికులకు పోనూ మిగిలే కొద్ది స్థలంలో కలెక్టరేట్ కడతారా.. అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై కలెక్టర్ గోపి వ్యక్తిగతంగా సమీక్షించి ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక సమర్పించనున్నట్టు తెలిసింది. ఒకవేళ ఆజంజాహి మిల్లులో కాకుంటే ఆటోనగర్లోని ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలించే అవకాశముందని వినవస్తోంది. ఇలావుండగా సుప్రీంకోర్టు తీర్పుపై ఆజంజాహి మిల్లు రిటైర్డ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా తమకు స్థలాలు కేటాయించాలని కోరారు. -
పంట చేతికొచ్చేవేళ.. గోనె సంచులేవీ?
వానాకాలం వరి కోతలు ఇప్పటికే మొదలయ్యాయి. దీంతోపాటే రైతులకు, అధికారులకు సమస్యలూ ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది. అయితే భారీయెత్తున ధాన్యం సేకరణకు పెద్ద సంఖ్యలో గోనె సంచులు కూడా అవసరం. కేంద్రానికి ఇండెంట్ పెట్టడంతో పాటు పాత సంచుల సేకరణకు రాష్ట్ర అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ సంచుల కొరత తీవ్రంగా ఉండటం ఓ సమస్యగా మారింది. ఇటు రైతు విషయానికొస్తే.. డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో వరి కోసే యంత్రాల అద్దెలూ పెరగడంతో ఆర్థిక భారంతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ధాన్యంలో తరుగు తీయవద్దంటూ తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అన్నదాతకు కొంతమేర ఉపశమనం కలిగించనున్నాయి. సాక్షి , హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ప్రారంభమ య్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జోరందుకోగా, నిజామా బాద్, కరీంనగర్ జిల్లాల్లో ప్రారంభమయ్యాయి. కోసిన పంటను కొనుగోలు చేసేందుకు కేంద్రాలు ప్రారంభించినా.. ధాన్యం సేకరించేందుకు అవసరమైన గోనె సంచులు (గన్నీ బ్యాగులు) పౌరసరఫరాల శాఖ వద్ద అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. ఈసారి కోటి మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని భావి స్తున్న పౌర సరఫరాల శాఖకు 25 కోట్ల వరకు గన్నీ బ్యాగులు అవసర మవుతాయి. పంట కొను గోళ్ల సీజన్లో గన్నీ బ్యాగుల సమస్య ఎదురవు తున్నా పౌర సరఫరాల శాఖ ముందస్తు చర్యలు చేపట్ట డం లేదు. దీంతో ఈసారి ధాన్యం దిగుబడి భారీగా పెరగడంతో పరిస్థితి మరింత ఇబ్బందిగా మారే సూచనలు కన్పిస్తున్నాయి. అందుబాటులో ఉన్న కొత్త బ్యాగులు 5.41 కోట్లే వానాకాలంలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 16.73 లక్షల హెక్టార్లు కాగా.. సమృద్ధిగా కురిసిన వర్షాలు, భూగర్భ జలాల కారణంగా రికార్డు స్థాయిలో దాదాపు 25 లక్షల హెక్టార్లలో వరి సాగైంది. తద్వారా 1.33 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి వస్తుందని పౌరసరఫరాల శాఖ లెక్కలు కట్టింది. రైతుల ఆహార అవసరాలు, మిల్లర్ల కొనుగోళ్లు, విత్తనాల కోసం పోగా 1.01 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నారు. ఇందుకోసం 25.36 కోట్ల బ్యాగులు (సంచికి 40 కిలోల ధాన్యం చొప్పున నింపితే) అవసరం అవుతాయని పౌరసరఫరాల శాఖ అంచనా వేసి కేంద్ర ప్రభుత్వ జౌళి శాఖకు వివరాలు పంపింది. ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ వద్ద కొత్త గన్నీ బ్యాగులు 5.41 కోట్లు అందుబాటులో ఉండగా, ఒకసారి వాడిన బ్యాగులు 49 లక్షలు ఉన్నాయి. మరో 54 లక్షలు చౌకధరల దుకాణదారుల వద్ద అందుబాటులో ఉన్నాయి. అలాగే రైస్ మిల్లర్ల వద్ద ఒకసారి ఉపయోగించిన గన్నీ బ్యాగులు 1.38 కోట్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాల్లో ఉన్న పాత గన్నీ బ్యాగులు కలిపి మొత్తంగా 8.06 కోట్ల గన్నీ బ్యాగులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఇంకా సుమారు 17.30 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమని పౌరసరఫరాల శాఖ నిర్ధారించింది. బెంగాల్, ఏపీల్లో ఉత్పత్తిపైనే ఆధారం రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన గన్నీ బ్యాగులను సరఫరా చేయాలని పౌరసరఫరాల శాఖ ఇప్పటికే కేంద్ర జౌళి శాఖకు ఇండెంట్ పెట్టినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. తదనుగుణంగా చెల్లించిన డీడీల ఆధారంగా పశ్చిమ బెంగాల్, ఏపీలోని ఏలూరు, విజయనగరం జిల్లాల్లో అందుబాటులో ఉన్న గన్నీ బ్యాగులు రాష్ట్రానికి రావాల్సి ఉంది. దేశం మొత్తానికి పశ్చిమబెంగాల్, ఏపీల నుంచే గన్నీ బ్యాగులు సరఫరా కావలసిన నేపథ్యంలో లభ్యత ఆధారంగా సరఫరా జరుగుతుందని ఆ అధికారి తెలిపారు. అయితే వానాకాలం పంటలో తేమ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున , కోతలు కోసినా ఆరబెట్టి మార్కెట్కు తెచ్చేందుకు సమయం పడుతుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది తలెత్తక పోవచ్చని అధికారులు భావిస్తున్నారు. గోనె సంచుల సమస్య ఉత్పన్నం కాదు రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చే ధాన్యం ఎంతైనా ప్రభుత్వమే కొంటుంది. సంచుల సమస్య ఉత్పన్నం కాదు. గన్నీ బ్యాగుల ఉత్పత్తిని బట్టి కేంద్రం ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా పంపిస్తుంది. ఇప్పటికే కేంద్ర జౌళి శాఖకు పంపిన ఇండెంట్ ఆధారంగా సప్లై జరుగుతుందని భావిస్తున్నాం. గన్నీ బ్యాగులతో పాటు కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఆదేశాలు జారీ చేశాం. – గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి -
చార్టర్డ్ ప్లేన్స్కు అనుమతివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిపాదించిన ఆరు కొత్త విమానాశ్రయాల ఏర్పాటు విషయంలో తీవ్ర జాప్యం నేపథ్యంలో తొలుత చార్టర్డ్ విమానాలను నడుపుకొనేందుకు వీలుగా అనుమతులు పొందాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదే విషయాన్ని తాజాగా అధికారులు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు ప్రతిపాదించారు. వాస్తవానికి ఏడాదిన్నర కిందటే ఈ అంశంపై ఏఏఐతో అధికారులు చర్చించారు. ఈ లోపు కన్సల్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్న ఏఏఐ వాణిజ్య విభాగం.. టెక్నో ఫీజిబులిటీ సర్వే నిర్వహించేందుకు సిద్ధం కావటంతో ఆ అంశం మరుగున పడింది. దాదాపు రెండు నెలల కింద ఆ నివేదిక వచ్చింది. దాని ప్రకారం విమానాశ్రయాల నిర్మాణానికి భారీగా ఖర్చు కానుందని స్పష్టం చేసింది. దీంతో వీలైనంత వరకు ఖర్చు తగ్గించేలా కొన్ని అడ్డంకులను దూరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో మళ్లీ సర్వే చేయాల్సి రావటంతో కొత్త విమానాశ్రయాల అంశం కొలిక్కి రాలేదు. దీంతో భవిష్యత్తులో వాటిని పెద్ద విమానాలు నడుపుకొనేందుకు వీలుగా తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేస్తూనే.. తొలుత చిన్నపాటి రన్వేలు నిర్మించి చార్టర్డ్ విమానాలను నడిపేందుకు అనుమతులు ఇవ్వాలని తాజాగా కోరింది. వరంగల్ ఒక్కటే అనుకూలం.. నిజాం హయాంలో నిర్వహించిన వరంగల్ శివారులోని మామునూరులో ఉన్న ఎయిర్స్ట్రిప్ను తిరిగి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా యత్నిస్తోంది. దీంతోపాటు జక్రాన్పల్లి (నిజామాబాద్), పాల్వంచ (భద్రాచలం–కొత్తగూడెం), బసంత్నగర్ (పెద్దపల్లి), ఆదిలాబాద్, మహబూబ్నగర్లో కూడా కొత్త విమానాశ్రయాలు నిర్మించాలని ప్రతిపాదించింది. తాజాగా ఏఏఐ అందించిన టెక్నో ఫీజిబిలిటీ నివేదిక ప్రకారం రూ.2,300 కోట్లకుపైగా ఖర్చు కానుంది. దీన్ని వీలైనంత తగ్గించేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అంశాలను ఏఏఐ ముందుంచింది. విమానాశ్రయాల ఏర్పాటుకు ఉన్న అడ్డంకుల్లో కొన్నింటిని వదిలేస్తే ఖర్చు తగ్గుతుందనేది రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం. అది సాధ్యమా కాదా అన్న విషయంలో ఏఏఐ తిరిగి నివేదిక అందించాల్సి ఉంది. ఆ తర్వాత తుది సర్వే చేయాలి. ఇదంతా జరిగేందుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున చార్టర్డ్ విమానాలను నడిపితే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇవి సమయ పట్టిక ఆధారంగా ప్రయాణికుల కోసం నడిపే విమానాలు కాదు. ముందస్తుగా బుక్ చేసుకుంటే సంస్థలు వాటిని ప్రైవేటు అవసరాల కోసం నడుపుతాయి. వీటిల్లో 19 సీట్ల వరకు ఉండే విమానాలకు మంచి డిమాండ్ ఉంది. కానీ ఈ ప్రైవేటు విమానాలకు మన వద్ద అంతగా వ్యాపారం ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ వేగంగా అభివృద్ధి చెందుతుండటం, అక్కడ పరిశ్రమలు భారీగా వస్తుండటం, సాఫ్ట్వేర్ రంగాన్ని కూడా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుండటంతో చార్టర్డ్ విమానాలకు కొంత డిమాండ్ మొదలవుతుందన్న అభిప్రాయంలో ఉంది. టేకాఫ్.. ల్యాండింగ్ ఒకవైపే.. సాధారణంగా రన్వేలకు టేకాఫ్, ల్యాండింగ్ వసతి రెండు వైపులా ఉండేలా ప్లాన్ చేస్తారు. మరోవైపు రెండు రన్వేలను నిర్మిస్తారు. రాష్ట్రంలో ప్రతిపాదిత ఆరు విమానాశ్రయాల ఖర్చు తగ్గించుకునే క్రమంలో తొలుత ల్యాండింగ్, టేకాఫ్ ఒకవైపే అయ్యేలా సాధారణ రన్వేతో ప్రారంభించాలని అధికారులు ఏఏఐకి ప్రతిపాదించారు. భవిష్యత్తులో వాటిని రెండు వైపులా విస్తరించటంతో పాటు రెండో రన్వేను కూడా నిర్మించుకోవచ్చని, తొలుత ఒకవైపే టేకాఫ్, ల్యాండింగ్ అయ్యేలా రన్వేకు అనుమతించాలని కోరారు. -
పెద్దవాగుతో మొదలు
సాక్షి, అమరావతి: గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) పరిధిపై ప్రాథమికంగా స్పష్టత వచ్చింది. రెండు రాష్ట్రాల అంగీకారం మేరకు ఈ నెల 14 నుంచి గోదావరి పరీవాహక ప్రాంతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన పెద్దవాగును తొలి దశలో బోర్డు తన పరిధిలోకి తీసుకోనుంది. శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ వరకు గోదావరిపై ఉన్న తెలంగాణ ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తీసుకోవాలన్న ఏపీ డిమాండ్పై తెలంగాణ సర్కార్ అభ్యంతరం తెలిపింది. దాంతో.. పరిస్థితులపై అధ్యయనం చేసి ఆ ప్రాజెక్టులను దశలవారీగా బోర్డు పరిధిలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తామని బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ చెప్పారు. పెద్దవాగు, సీలేరుపైనే కీలక చర్చ ప్రాజెక్టుల పరిధి, సిబ్బంది నియామకం, నిధులు తదితర అంశాలపై చర్చించేందుకు హైదరాబాద్లోని జలసౌధలో గోదావరి బోర్డు సోమవారం పూర్తిస్థాయి ప్రత్యేక సమావేశం నిర్వహించింది. బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరిగిన భేటీలో ఏపీ, తెలంగాణ జల వనరుల శాఖ కార్యదర్శులు శ్యామలరావు, రజత్కుమార్, ఈఎన్సీలు నారాయణరెడ్డి, మురళీధర్, నారాయణరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో ఎస్సార్ఎస్పీ నుంచి సీతమ్మసాగర్ వరకు చేపట్టిన అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలని ఏపీ అధికారులు పట్టుబట్టారు. ఎగువ రాష్ట్రమైన తెలంగాణ నుంచే గోదావరి ప్రవాహాలు దిగువకు రావాల్సి ఉందని, ఎగువన తెలంగాణ అనేక ప్రాజెక్టులు చేపట్టి నీటిని వినియోగించడంతో పాటు ఎప్పటికప్పుడు ఎత్తిపోతల ద్వారా చెరువులన్నింటినీ నింపుకుంటోందని తెలిపారు. దీనిపై తెలంగాణ అధికారులు అభ్యంతరం తెలిపారు. పెద్దవాగు కింద ఉన్న 16 వేల ఎకరాల ఆయకట్టులో 13 వేల ఎకరాలు ఏపీలోనే ఉన్నందున ఆ ప్రాజెక్ట్ నిర్వహణ వ్యయంలో ఏపీ 85 శాతం చెల్లించాలని తెలంగాణ అధికారులు కోరారు. తొలి దశలో ప్రయోగాత్మకంగా పెద్దవాగును తమ పరిధిలోకి తెచ్చుకొని, దాని అమలు, నిర్వహణ బాధ్యతలు చూస్తామని బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ స్పష్టం చేశారు. ఏ రాష్ట్ర సిబ్బంది ఆ రాష్ట్ర పరిధిలోనే పనిచేస్తారని తెలిపారు. ప్రభుత్వ స్థాయిలో చర్చించి.. పెద్దవాగును బోర్డుకు అప్పగించేలా ఉత్తర్వులు జారీ చేస్తామని రెండు రాష్ట్రాల అధికారులు చెప్పారు. సీలేరు విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి తేవాలని తెలంగాణ అధికారులు కోరడంపై ఏపీ అధికారులు అభ్యంతరం తెలిపారు. ఈ వ్యవహారంలో చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ జోక్యం చేసుకుంటూ.. ఈ అంశం కేంద్రం పరిధిలో ఉందని, దానిపై తర్వాత చర్చిద్దామని చెప్పారు. బడ్జెట్ ఉద్దేశం చెబితే సీడ్మనీ ఇస్తాం బోర్డులకు ఇరు రాష్ట్రాలు చెల్లించాల్సిన చెరో రూ.200 కోట్ల సీడ్మనీ అంశంపైనా చర్చ జరిగింది. కేవలం ఒక్క ప్రాజెక్టునే బోర్డు పరిధిలో ఉంచినప్పుడు రూ.200 కోట్ల నిధులు అవసరం ఏముంటుందని రెండు రాష్ట్రాల అధికారులు ప్రశ్నించారు. అదీగాక నిధుల విడుదల ఆర్థిక శాఖతో ముడిపడి ఉన్నందున బడ్జెట్ ఉద్దేశాలను బోర్డు తమకు చెబితే ఆర్థిక శాఖకు తెలియజేస్తామని వివరించారు. కొలిక్కిరాని కృష్ణా బోర్డు పరిధి తెలంగాణ జల వనరులు, జెన్కో అధికారుల దాటవేత ధోరణి వల్ల కృష్ణా బోర్డు పరిధి కొలిక్కి రాలేదు. గెజిట్ నోటిఫికేషన్లో షెడ్యూల్–2 ప్రాజెక్టుల వివరాలను సోమవారం ఇస్తామని ఆదివారం చెప్పిన తెలంగాణ అధికారులు ఆ తర్వాత మాట మార్చారు. దాంతో పరిధి, స్వభావంపై ముసాయిదా నివేదికను అసంపూర్తిగానే కృష్ణా బోర్డుకు సబ్ కమిటీ కన్వీనర్ ఆర్కే పిళ్లై అందించారు. పరిధిపై నిర్ణయాధికారాన్ని మంగళవారం జరిగే కృష్ణా బోర్డు ప్రత్యేక సమావేశానికి అప్పగించారు. ఆదివారం కృష్ణా బోర్డు సబ్ కమిటీ సమావేశంలో ప్రాజెక్టుల వివరాలను సోమవారం ఇస్తామని తెలంగాణ అధికారులు చెప్పడంతో సోమవారం రాత్రి సబ్ కమిటీ మరోసారి భేటీ అయ్యింది. కానీ.. తెలంగాణ అధికారులు ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. తెలంగాణ వాదనపై ఏపీ జల వనరుల శాఖ సీఈ శ్రీనివాసరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. శ్రీశైలం, సాగర్, పులిచింతలలో తెలంగాణ ఇష్టారాజ్యంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. ఏపీ హక్కులను కాలరాస్తుండటం వల్లే జల వివాదం ఉత్పన్నమైన అంశాన్ని ఎత్తిచూపారు. జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను బోర్డు నియంత్రణలోకి తీసుకోకుండా ప్రాజెక్టులను మాత్రమే పరిధిలోకి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని తేల్చిచెప్పారు. ఈ వాదనతో సబ్కమిటీ కన్వీనర్ పిళ్లై ఏకీభవించారు. బోర్డు పరిధి, స్వరూపంపై బోర్డుకు నివేదిక ఇచ్చేందుకు సబ్కమిటీ రూపొందించిన ముసాయిదాపై తెలంగాణ అధికారులు సంతకం చేయడానికి నిరాకరించగా.. ఏపీ అధికారులు సంతకం చేశారు. -
కృష్ణా జలాల పునఃపంపిణీ పిటిషన్ ఉపసంహరణకు అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య సెక్షన్ –3 ప్రకారం కృష్ణా జలాల పునఃపంపిణీకి కొత్త ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలంటూ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. నూతన ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశం సందర్భంగా కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సూచనల మేరకు పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ అంగీకరించడం తెలిసిందే. న్యాయస్థానం వెలుపల సమస్యను పరిష్కరించుకునేందుకు వీలుగా వీలైనంత త్వరగా నూతన ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని గతంలో కేసీఆర్ కోరారు. కేంద్రానికి ఎలాంటి ఆదేశాలూ ఇవ్వం కాగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు చాంబర్లో పలుసార్లు విచారణ జరిగినప్పటికీ షరతులు లేని ఉపసంహరణకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఎదుట బుధవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. రిట్ పిటిషన్ ఉపసంహరణకు అంగీకరిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. అయితే పిటిషన్లోని తమ అభ్యర్థనను పరిశీలించాలని తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాదులు సీఎస్ వైద్యనాధన్, వి.గిరి, ముకుల్ రోహత్గిలు ధర్మాసనాన్ని కోరగా మహారాష్ట్ర తరఫు సీనియర్ న్యాయవాది నార్గోల్కర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాంటి షరతులు లేకుండా ఆ పిటిషన్ ఉపసంహరణకు అభ్యంతరం లేదని ఏపీ తరఫు అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ మెహ్ఫజ్ నజ్కీ నివేదించారు. దీంతో దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోమని ధర్మాసనం ప్రకటించింది. నదీ జలాల అంశం చాలా సున్నితమైనదని, ఇప్పటికే కృష్ణా జలాలపై మూడు అవార్డులు ఇవ్వగా నాలుగు రాష్ట్రాలు వేర్వేరు పిటిషన్లతో సుప్రీంకోర్టును ఆశ్రయించాయని ఏపీ తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే నివేదించారు. పరిశీలిస్తామని మాత్రమే చెప్పాం.. తమ అభ్యర్థన పిటిషన్లో స్పష్టంగా ఉందని, దీనిపై ధర్మాసనానిదే నిర్ణయమని తెలంగాణ తరపు న్యాయవాది వైద్యనాధన్ తెలిపారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం మినిట్స్లో పొందుపరిచిన అంశాలను సీనియర్ న్యాయవాది వి.గిరి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ను ఉపసంహరించుకుంటే నూతన ట్రిబ్యునల్ ఏర్పాటును పరిశీలిస్తామని మినిట్స్లో ఉందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. తాము కేవలం పరిశీలిస్తామని మాత్రమే చెప్పామని కేంద్ర జలశక్తి శాఖ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. అనంతరం ఎలాంటి షరతులు లేని ఉపసంహరణకు అనుమతిస్తామని, ఏవైనా అంశాలు ఉంటే కేంద్రాన్ని కోరాలని సూచిస్తూ ధర్మాసనం విచారణను ముగించింది. -
TS: ప్రత్యామ్నాయ సాగు.. వరికి బదులు ఐదు పంటలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరి సాగును తగ్గించాలని నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం.. వచ్చే యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు రైతులను సన్నద్ధం చేసే దిశగా వ్యవసాయ శాఖ చర్యలు మొదలుపెట్టింది. గత ఏడాది యాసంగి సాగుతో పోలిస్తే దాదాపు 23శాతం దాకా వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి.. బదులుగా ఇతర పంటలను సాగు చేయించాలని జిల్లా అధికారులకు అంతర్గత ఆదేశాలు జారీచేసింది. వ్యవసాయ అధికారులు ప్రత్యామ్నాయ పంటల దిశగా రైతులను సన్నద్ధం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు మొదలుపెట్టారు. అయితే చాలాచోట్ల రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ముందుకు రావడంలేదని అధికారులు చెప్తున్నారు. ‘‘మేం గ్రామాలకు వెళ్లి వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని రైతులను కోరుతున్నాం. కానీ విత్తనాల నుంచి కొనుగోళ్ల దాకా రైతులు వ్యక్తం చేస్తున్న సందేహాలు, లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఏం చెప్పాలో అర్థంగాక మధ్యలోనే సభలను రద్దు చేసుకొని వెనుదిరుగుతున్నాం’’ అని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మండల వ్యవసాయాధికారి పేర్కొన్నారు. కొద్దికొద్దిగా తగ్గించేలా.. రాష్ట్రంలో వరిసాగు తగ్గించాలన్న ప్రభుత్వ ఆదేశం మేరకు రంగంలోకి దిగిన అధికారులు పలు ప్రతిపాదనలు రూపొందించారు. ఒకేసారి భారీగా వరి సాగు తగ్గించాలంటే రైతులు ముందుకు రారన్న ఆలోచనతో.. ముందుగా కొద్ది మొత్తంలో తగ్గించాలని నిర్ణయానికి వచ్చారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో వరి విస్తీర్ణాన్ని ఎక్కడ, ఏ మేర తగ్గించాలన్న దానిపై ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రణాళికల ప్రకారం.. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి, ఐదు రకాల పంటలను వేయించాలని జిల్లాల అధికారులను ఆదేశించారు. తప్పదంటేనే.. మినహాయింపు ఎక్కడైనా రైతులు తప్పనిసరిగా వరి మాత్రమే వేస్తామన్న భావనతో ఉంటే, ఎక్కడైనా వరి పండించడం అనివార్యమైతేనే.. ప్రత్యామ్నాయ సాగును మినహాయించాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించింది. అదికూడా ఎఫ్సీఐ సూచించిన ఫైన్ రకాల వరినే పండించేలా చూడాలని స్పష్టం చేసింది. వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, పెసర, శనగ పంటలకు సంబంధించి.. ఆయా జిల్లాల పరిధిలో ఎక్కడ, ఏ పంట అనుకూలమో గుర్తించాలని సూచించింది. మొత్తంగా 2,604 క్లస్టర్ల వారీగా షెడ్యూల్ను తయారు చేయాలని పేర్కొంది. ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని.. స్థానిక ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి సభ్యులు అందులో పాల్గొనేలా చూడాలని స్పష్టం చేసింది. ఈ నెల 30 నాటికి శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయాలని సూచించింది. మాకు భరోసా ఏది? ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలంటూ వ్యవసాయశాఖ నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల్లో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వరికి బదులు సాగుచేయాలని సూచిస్తున్న ఐదు పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తారా అని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఆయా పంటల విత్తనాలను సబ్సిడీపై అందజేసే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదేమని నిలదీస్తున్నారు. గత ఏడాది నుంచి సబ్సిడీ ఎత్తివేయడంతో విత్తనాలు కొనుగోలు చేయడం కష్టంగా మారిందని చెప్తున్నారు. వ్యవసాయశాఖ సూచిస్తున్న ఐదు రకాల పంటలు వరికి ప్రత్యామ్నాయం కాబోవని, పైగా లాభాలు కూడా ఉండబోవని స్పష్టం చేస్తున్నారు. అయితే విత్తన సబ్సిడీ, పంటల కొనుగోళ్లపై తమకు పైస్థాయి నుంచి సమాచారమేదీ లేకపోవడంతో రైతులకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేని పరిస్థితి నెలకొందని వ్యవసాయాధికారులు అంటున్నారు. మూడు జోన్లు.. ఐదు పంటలు.. ఉత్తర తెలంగాణ జోన్ కింద ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలను చేర్చారు. ఈ జిల్లాల్లో గత యాసంగిలో సాగైన వరి విస్తీర్ణంలో 20–25 శాతం వరకు తగ్గించి.. బదులుగా వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, శనగ సాగు చేయించాలని నిర్ణయించారు. సెంట్రల్ తెలంగాణ జోన్ కింద సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో గత యాసంగితో పోలిస్తే 10–15 శాతం వరి తగ్గించి.. దాని స్థానంలో వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, శనగ సాగు చేయించనున్నారు. దక్షిణ తెలంగాణ జోన్లో మహబూబ్నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, నారాయణపేట జిల్లాలను చేర్చారు. ఈ జిల్లాల్లో ఏకంగా 20–30 శాతం దాకా వరి తగ్గించి.. బదులుగా వేరుశనగ, పొద్దు తిరుగుడు, శనగ, పెసర పంటలు వేసేలా రైతులను సన్నద్ధం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలను కొనే దిక్కేది? తెలంగాణ కోటి ఎకరాల మాగాణ అని చెప్పి ఇప్పుడు వరి వద్దంటే ఎలా? సాగునీరు ఉన్న ప్రాంతాల్లో వరి తప్ప మరేం సాగు చేయగలరు? వరి వద్దనడం అశాస్త్రీయం. అయినా ప్రత్యామ్నాయ పంటలు అంటూ.. వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటివి చూపిస్తున్నారు. వాటిని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఇప్పటివరకు ముందుకు రాలేదు. రెండు, మూడు జిల్లాలకే పరిమితమైన వేరుశనగను కొనడానికే అప్పట్లో ప్రభుత్వం నానాయాతన పడింది. ఇప్పుడు అన్ని జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేస్తే కొనే పరిస్థితి ఉంటుందా? ప్రభుత్వం ఈ అంశంపై వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాలతో చర్చించి రైతులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటే బాగుండేది. ప్రత్యామ్నాయంగా కనీసం కూరగాయల సాగును ప్రోత్సహించినా బాగుండేది. – టి.సాగర్, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం -
నేడు సుప్రీం కోర్టు ముందుకు వినాయక విగ్రహాల నిమజ్జనం పిటిషన్
సాక్షి, ఢిల్లీ: వినాయక విగ్రహాల నిమజ్జనం పిటిషన్పై గురువారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిమజ్జనం అంశానికి సంబంధించి జీహెచ్ఎంసీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జీహెచ్ఎంసీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించనున్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతిని నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఉత్తర్వులు ఇవ్వాలని జీహెచ్ఎంసీ సుప్రీంకోర్టును విజ్ఞప్తి చేసింది. (చదవండి: సైదాబాద్ చిన్నారి కేసు: నిందితుడు రాజు ఆత్మహత్య) ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. ఊరేగింపుగా జరిగే వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించేందుకు అనేకమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని మూడు, నాలుగు నెలల ముందుగానే పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించామని జీహెచ్ఎంసీ పేర్కొంది. చదవండి: రాజు ఆత్మహత్య: కేటీఆర్ స్పందన.. -
గోదావరిలో వరద తగ్గుముఖం
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/కొవ్వూరు: నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో గోదావరిలో వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 9,09,385 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. గోదావరి డెల్టా కాలువలకు 9,200 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 9,00,185 క్యూసెక్కుల (77.78 టీఎంసీలు)ను సముద్రంలోకి వదిలేస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా, ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో ఉప నదులు ఉప్పొంగి గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం భద్రాచలం, ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శనివారం ఉదయం నుంచి గోదావరిలో వరద ప్రవాహం తగ్గింది. దాంతో భద్రాచలం, ధవళేశ్వరం వద్ద ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. పోలవరం వద్దకు చేరుతున్న 9.10 లక్షల క్యూసెక్కులను 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ఆ జలాలు ధవళేశ్వరం బ్యారేజీలోకి చేరుతున్నాయి. కృష్ణా, ప్రధాన ఉప నది, తుంగభద్రల్లో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 45 వేల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 880.1 అడుగులకు చేరుకుంది. ఆగని తెలంగాణ విద్యుదుత్పత్తి ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్ నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ 11 వేల క్యూసెక్కులు తరలిస్తోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 188.58 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నాగార్జునసాగర్లోకి 14,757 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో కాలువలకు, విద్యుదుత్పత్తి ద్వారా విడుదల చేస్తున్నారు. సాగర్లో 305.51 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టులోకి 6 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్ వే గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 25 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 35,150 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు 12,755 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 22,260 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. 2,600 కుటుంబాలు తరలింపు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం క్రమం తగ్గుతూ సాయంత్రానికి 11.10 అడుగులకు చేరింది. ఆనకట్టకు దిగువన యలమంచిలి మండలం కనకాయలంక గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. వరద నీరు పెరగడంతో వేలేరుపాడు మండలంలో పెద్ద వాగు, ఎద్దెలవాగు, మేళ్ల వాగులోకి వరదనీరు చేరింది. మండలంలోని 32 ఏజెన్సీ గ్రామాలు, పోలవరం మండలంలోని 19 ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అధికారులు ముందుజాగ్రత్త చర్యగా 2,600 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. -
ఔషధ రంగాభివృద్ధికి బీ–హబ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బయో ఫార్మా రంగాభివృద్ధికి ఊతమిచ్చేందుకు బయోఫార్మా హబ్ (బీ–హబ్)ను ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ ప్రకటించారు. బీ–హబ్ భవనం నమూనా డిజైన్ను ఆదివారం ఆయన ఆవిష్కరించి, ట్విట్టర్లో వాటి ఫొటోలను పోస్టు చేశారు. ఫార్మారంగంలో అడుగుపెట్టే కొత్త కంపెనీల శీగ్రాభివృద్ధికి కేంద్రం (గ్రోత్–ఫేజ్ సెంటర్)గా బీ–హబ్ సేవలందించనుందని తెలిపారు. దీంతో ఫార్మా ఉత్పత్తుల తయారీ సదుపాయం కూడా విస్తరిస్తుందన్నారు. 15 నెలల్లో బీ–హబ్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని, ఫార్మా రంగంలో తెలంగాణ ఆధిపత్యాన్ని నిలపడానికి ఇది దోహదపడనుందని చెప్పారు. రెండుదశల్లో లక్ష చదరపు అడుగుల నిర్మిత స్థలం (బిల్టప్ ఏరియా)లో జినోమ్ వ్యాలీలో దీన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. కేంద్రప్రభుత్వ సంస్థ బయోటెక్ ఇండియాతో పాటు సైటియా, సెరెస్ట్రా సంస్థల భాగస్వామ్యంతో తెలంగాణ ప్రభుత్వం బీ– హబ్ను నిర్మించనుందని, స్టార్టప్ల పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇందులో ప్రయోగశాలలుంటాయని వివరించారు. ఇతర సంస్థలతో చర్చలు, భాగస్వామ్యాలు చేసుకోవడానికి బీ–హబ్ వేదికగా ఉపయోగపడనుందని కేటీఆర్ పేర్కొన్నారు. -
16,800 మందికి దళితబంధు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దళితబంధు అమలులో తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. గతనెల 16న హుజూరాబాద్ మండలం శాలపల్లిలో నిర్వహించిన దళితబంధు సభ మొదలు ప్రభుత్వం ఈ పథకం అమలుకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తోంది. గత నెల 15 మందికి రూ.10 లక్షల చొప్పున అందజేసిన ప్రభుత్వం తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని 16,800 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమ చేసింది. అంటే.. మొత్తంగా రూ.1,680 కోట్ల నగదు వారి ఖాతాల్లోకి బదిలీ అయింది. ఈ మేరకు శనివారం ఉదయానికి లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమయ్యాయి. ఇప్పటికే ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం రూ.2,000 కోట్లను కరీంనగర్ కలెక్టరుకు బదిలీ చేసింది. వాటినుంచి తొలి 15 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.10 లక్షల చొప్పున జమ చేశారు. వారిలో మోటారు వాహనాలపై ఆసక్తి చూపిన నాలుగు కుటుంబాలకు ఇప్పటికే వాహనాలను అందజేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. నియోజకవర్గంలో మొత్తం 20,900 దళిత కుటుంబాలు ఉన్నాయి. తాజాగా పూర్తయిన దళితబంధు సర్వేతో అదనంగా మరో మూడువేల కుటుంబాలు చేరడంతో ఈ సంఖ్య 23,183 చేరింది. వీరందరికీ ప్రాధాన్యతాక్రమంలో దళితబంధు పథకం వర్తింపజేస్తామని అధికారులు స్పష్టం చేశారు. వాట్సాప్ గ్రూపు దళితుల జీవన స్థితిగతులను మార్చే ఉద్దేశంతో చేపట్టిన ఈ పథకం 100 శాతం విజయవంతం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. అందుకే ఈ పథకం అమలు కోసం ప్రత్యేకంగా మండలానికి ఒక రిసోర్స్పర్సన్ (ఆర్పీ)ను నియమించింది. ఈ పథకం ద్వారా అందజేసే రూ.10 లక్షల నగదును లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా వారికి మార్గనిర్దేశనం చేసే వ్యూహంలో భాగంగా దళిత విశ్రాంత ఉద్యోగులను రంగంలోకి దించుతున్నారు. దళితబంధు అమలుకు నియోజకవర్గాన్ని ఏడు యూనిట్లు (హుజూరాబాద్, వీణవంక, జమ్మికుంట, కమలాపూర్, ఇల్లందకుంట మండలాలు, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీ)గా విభజించారు. ఈ ఏడు యూనిట్లలో ప్రతి యూనిట్కు ఐదుగురు విశ్రాంత ఉద్యోగులు పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా వారికి దిశానిర్దేశం చేస్తారు. ఇదే సమయంలో హుజూరాబాద్ గ్రామాల్లో ఆదర్శభావాలు కలిగి, సామాజిక చైతన్యం ఉన్న యువకులను ఏడు యూనిట్ల నుంచి ప్రతి గ్రామానికి 10 మంది చొప్పున ఎంపిక చేస్తారు. వీరికి వివిధ రంగాల్లో నిపుణులైన వారితో హైదరాబాద్లో ప్రత్యేక తరగతులు ఇప్పిస్తారు. ప్రతి మండలానికి బాధ్యులుగా ఉన్న ఐదుగురు విశ్రాంత దళిత ఉద్యోగులు, ప్రతీ గ్రామానికి 10 మంది యువకులతో ఓ వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేస్తారు. ఈ గ్రూపునకు ఆయా మండలాల రిసోర్స్ పర్సన్లు అడ్మిన్లుగా ఉంటారు. ప్రభుత్వ అధికారులు చేస్తున్న ప్రచారానికి అదనంగా వీరు కూడా పథకం ప్రయోజనాలను వివరించనున్నారు. -
ప్రైవేటు భాగస్వామ్యంతో పాలియేటివ్కేర్
రాయదుర్గం: పాలియేటివ్ కేర్లోకి ప్రవేశించడానికి తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీరామారావు పేర్కొన్నారు.ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ సేవలు అందజేయాలని సంకల్పించినట్లు ఆయన తెలిపారు. గచ్చిబౌలి డివిజన్లోని ఖాజాగూడలో రూ.14 కోట్లతో నూతనంగా నిర్మించిన ‘స్పర్శ్ హోస్పిస్’ఆస్పత్రి భవనాన్ని మంత్రి కేటీరామారావు శనివారం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, 2016లో స్పర్శ్ హోస్పిస్ని మొదటిసారి సందర్శించినప్పుడు పాలియేటివ్కేర్ అంటే ఏమిటో తెలియదని, మానవత్వానికి ఇది గొప్ప సేవ అని ఆ తర్వాత తెలిసిం దని అన్నారు. ఇలాంటి ఆస్పత్రుల ఏర్పాటుకు చొరవ తీసుకుంటామని, ముందుకొచ్చే వారికి పూర్తిగా సహకరిస్తామన్నారు. స్పర్శ్ ఆస్పత్రికి మున్సిపల్ ఆస్తిపన్ను, నీటిపన్నుల మినహాయింపు ఇస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. ఒక రాజకీయ నాయకునిగా అనేక కార్యక్రమాలకు వెళ్తామని, కానీ కొన్ని కార్యక్రమాలు ఆత్మ సంతృప్తి కలిగిస్తాయని ఈ సందర్భంగా వెల్లడించారు. పదేళ్ళుగా మానవతా దృక్పథంతో వైద్యం అందించిన స్పర్శ్ హోస్పిస్ ఆస్పత్రి కల నెరవేరి సొంత భవనానికి నోచుకోవడం సంతోషంగా ఉందన్నారు. పన్ను మినహాయింపు ఇవ్వాలి: వరప్రసాద్రెడ్డి మానవతా దృక్పథంతో ఉచితంగా సేవలందిస్తున్న స్పర్శ్ హోస్పిస్ ఆస్పత్రికి మున్సిపల్ ఆస్తిపన్ను, నీటి పన్ను, విద్యుత్ బిల్లుల నుంచి మినహాయింపులు ఇవ్వాలని శాంతాబయోటెక్ సంస్థ వ్యవస్థాపకులు పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్రెడ్డి మంత్రి కేటీఆర్ను కోరారు. ఆస్పత్రి సీఈఓ రామ్మోహన్రావు మాట్లాడుతూ, దేశంలోనే రెండు అతిపెద్ద పాలియేటివ్కేర్ సదుపాయాలలో ఇది ఒకటని, దేశంలో అత్యంత అధునాతన అల్ట్రా మోడ్రన్ పాలియేటివ్కేర్ ఇదేనని గుర్తు చేశారు. తుదిదశ కేన్సర్ రోగులలో బాధను తగ్గించడమే తమ లక్ష్యమన్నారు. పదేళ్లుగా తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఇతర రాష్ట్రాలకు చెందిన నాలుగు వేల మంది రోగులకు ఉచితంగా సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. అనంతరం మంత్రి కేటీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు ఉండే గదుల్లోకి వెళ్ళి వారితో ముచ్చటించి వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, రోటరీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ మహేశ్కోట్బాగీ, ఫీనిక్స్ చైర్మన్ చుక్కపల్లి సురేష్, అధ్యక్షుడు వికాస్, ట్రస్టీలు సుబ్రహ్మణ్యం సురేష్రెడ్డి, జగదీశ్, ఎస్సీఎస్సీ కార్యదర్శి కృష్ణ ఎదులతోపాటు పలువురు డాక్టర్లు, దాతలు, వైద్యబృందం పాల్గొన్నారు. -
శ్రీశైలంలో ఆగని తెలంగాణ దందా
సాక్షి, అమరావతి: నీటి కేటాయింపులు లేకుండా శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుదుత్పత్తి చేయకూడదంటూ కృష్ణా బోర్డు జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా తుంగలో తొక్కుతోంది. కృష్ణా బోర్డు అనుమతి లేకుండా శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేయకూడదని కేంద్ర జల్ శక్తి శాఖ జారీ చేసిన ఉత్తర్వులను బేఖాతరు చేస్తోంది. నీటి సంవత్సరం ప్రారంభం నుంచే (జూన్ 1 నుంచి) ఎడమ గట్టు కేంద్రంలో అక్రమంగా నీటిని వాడుకుంటూ నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం ప్రాజెక్టును ఖాళీ చేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు దిగువన అటు తెలంగాణ, ఇటు ఏపీకి సంబంధించి తక్షణ సాగు, తాగునీటి అవసరాలు లేవు. ఎగువ నుంచి నీటిని దిగువకు విడుదల చేయాల్సిన అవసరమూ లేదు. కానీ.. తెలంగాణ సర్కార్ అదేమీ పట్టకుండా ఎడమ గట్టు కేంద్రంలో నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ రోజూ సగటున 3.15 టీఎంసీలను అక్రమంగా వాడుకుంటోంది. దీంతో దిగువకు వదిలేసిన జలాలు పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి చేరుతున్నాయి. కొద్దిపాటి నీరు కృష్ణా డెల్టాకు విడుదల చేయగా, మిగులుగా ఉన్న నీటినంతటినీ గేట్లు ఎత్తేసి దిగువకు వృథాగా వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలా జూన్ 1 నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు 162.76 టీఎంసీలు సముద్రంలో కలవడం గమనార్హం. వాటా నీటిని దక్కనివ్వకుండా.. శ్రీశైలం ప్రాజెక్టులోకి ఆగస్టు 12న వరద ప్రవాహం కనిష్ట స్థాయికి చేరుకుంది. ఆ రోజున 884.4 అడుగుల్లో 211.96 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. అదే రోజున సాగర్లో నీటి మట్టం గరిష్ట స్థాయిలో 589.5 అడుగుల్లో 311 టీఎంసీల నిల్వ ఉంది. శనివారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 878.40 అడుగుల్లో 180.28 టీఎంసీలకు తగ్గిపోయింది. రాష్ట్రానికి హక్కుగా దక్కిన జలాలను వాడుకోనివ్వకుండా చేయడానికే తెలంగాణ సర్కార్ కావాల్సిగా విద్యుదుత్పత్తి చేస్తోందని నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సీజన్ ప్రారంభం నుంచీ ఇదే తీరు ► శ్రీశైలం ప్రాజెక్టులో నీటి సంవత్సరం ప్రారంభమైన రెండో రోజే అంటే జూన్ 2న 808.5 అడుగుల్లో 33.43 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉండేది. శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 854 అడుగులు. ప్రాజెక్టు ఆపరేషనల్ ప్రొటోకాల్ ప్రకారం కనీస నీటి మట్టానికి దిగువన నీటి నిల్వ ఉన్నప్పుడు విద్యుదుత్పత్తి చేయకూడదు. ► కానీ.. కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండానే దిగువన ఎలాంటి సాగు, తాగునీటి అవసరాలు లేకపోయినా జూన్ 2న తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. తెలంగాణ సర్కార్ అక్రమ నీటి వినియోగంపై కృష్ణా బోర్డుకు, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు, ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ► ‘శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల కంటే ఎక్కువ స్థాయిలో నీరు నిల్వ ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, కేసీ కెనాల్కు నీటిని తరలించవచ్చు. దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగు, సాగునీరు.. చెన్నైకి తాగునీరు సరఫరా చేసే అవకాశం ఉంటుంది. తెలంగాణ సర్కార్ తీరుతో ప్రాజెక్టులో నీటి నిల్వ 854 అడుగుల కంటే తగ్గిపోతే, కేటాయింపులు ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టులకు నీటిని అందించలేము’ అని కేంద్రానికి, కృష్ణా బోర్డుకు స్పష్టంగా వివరించింది. ► దీంతో తక్షణమే విద్యుదుత్పత్తిని ఆపేయాలని తెలంగాణ సర్కార్ను కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణా బోర్డులు ఆదేశించాయి. అయినా సరే.. తెలంగాణ సర్కార్ ఖాతరు చేయకుండా రోజూ సగటున 3.15 టీఎంసీలను అక్రమంగా వాడుకుంటూ ప్రాజెక్టును ఖాళీ చేస్తోంది. ► ఈ పరిస్థితిలో న్యాయ పోరాటం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈనెల 27న జరిగే కృష్ణా బోర్డు సమావేశంలో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని నిర్ణయించింది. -
ఎలక్ట్రానిక్ క్లస్టర్లు... ఎనర్జీ పార్కులు
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్ పరిశోధన, అభివృద్ధి, తయారీ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎలక్ట్రిక్ వాహన రంగంలో వస్తున్న పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కూడా ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 2016లోనే ఎలక్ట్రానిక్స్ పాలసీని విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం... పెట్టుబడులు, ప్రోత్సాహకాలకు సంబంధించి ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశంలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో తెలంగాణ వాటా ప్రస్తుతం 7 శాతంకాగా వచ్చే నాలుగేళ్లలో అగ్రస్థానానికి చేరాలని భావిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఎలక్ట్రానిక్ క్లస్టర్లు, ఈవీ పార్కులకు తోడుగా కొత్త ఎలక్ట్రానిక్ క్లస్టర్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు అవసరమైన మౌలికవసతులను మెరుగుపరచడం ద్వారా వచ్చే నాలుగేళ్లలో రూ. 73 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని, 3 లక్షల ఉద్యోగాలు లభించేలా చూడాలని భావిస్తోంది. ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఈఎస్డీఎం) హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు తెలంగాణ నైపుణ్య శిక్షణ అకాడమీ (టాస్క్) ద్వారా యువతకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొత్తగా ఈవీ క్లస్టర్లు, ఎనర్జీ పార్కులు... ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహన రంగం కోసం ప్రస్తుతం రాష్ట్రంలో ఔటర్ రింగురోడ్డు సమీపంలోని రావిర్యాలలో ‘ఈ–సిటీ’, మహేశ్వరంలో హార్డ్వేర్ పార్క్ 912 ఎకరాల్లో ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఎల్ఈడీ పార్కులో 10 సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించగా ఈవీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల అవసరాల కోసం మరో 3 కొత్త పార్కులు/క్లస్టర్లు ఏర్పాటు ప్రక్రియ కొలిక్కి వస్తోంది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాల కోసం ఈవీ క్లస్టర్ను టీఎస్ఐఐసీ అభివృద్ధి చేస్తోంది. మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలోనూ 378 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఎనర్జీ పార్కు ఏర్పాటు పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ పార్కులో లిథియం–అయాన్ బ్యాటరీలు, సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్లు ఏర్పాటవుతాయి. కొత్తగా దుండిగల్లోనూ 511 ఎకరాల్లో కొత్త ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ను టీఎస్ఐఐసీ ప్రతిపాదించింది. వాటితోపాటు ప్రపంచస్థాయి ప్రమాణాలతో ప్రొటోటైపింగ్, టెస్టింగ్ వసతులతో కూడిన కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు కానుంది. ఏడాదిలోనే రూ. 4,500 కోట్ల పెట్టుబడులు... ఎలక్ట్రానిక్స్ రంగంలో పేరొందిన ఇంటెల్, మైక్రాన్, క్వాల్కామ్, మోటరోలా, ఏఎండీ, సిడాక్, యాపిల్ వంటి కంపెనీలతోపాటు మైక్రోమ్యాక్స్, స్కైవర్త్, ఒప్పో, వన్ప్లస్ వంటి మొబైల్ఫోన్ తయారీ కంపెనీలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. గతేడాది ఎలక్ట్రానిక్స్ రంగంలో రూ. 4,500 కోట్ల పెట్టుబడులతోపాటు 15 వేల మందికి ఉపాధి లభించినట్లు పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన కంపెనీలు కార్యకలాపాలను విస్తరిస్తుండటంతో ఐదేళ్లపాటు విద్యుత్పై 25 శాతం, పెట్టుబడులపై 20 శాతం చొప్పున సబ్సిడీ, ఏడేళ్లపాటు జీఎస్టీలో 100 శాతం మినహాయింపులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో మూడు షిఫ్టుల్లో మహిళలు పనిచేసేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. -
Telangana: 20న మొహర్రం సెలవు
సాక్షి, హైదరాబాద్: మొహర్రం మాసం 10వ రోజు ఇచ్చే సాధారణ సెలవును ఆగస్టు 19వ తేదీ(గురువారం) నుంచి 20వ తేదీ(శుక్రవారం)కి మారుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొహర్రం 9వ రోజు ఇచ్చే ఐచ్ఛిక సెలవును ఆగస్టు 18 నుంచి 19వ తేదీకి మార్పు చేశారు. నెలవంక ఆధారంగా మొహర్రం మాసం ఒకరోజు ఆలస్యంగా ప్రారంభమైందని, కాబట్టి సెలవులను మార్చాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు విజ్ఞప్తి చేయడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. కాగా, మొహర్రం సెలవును గురువారం నుంచి శుక్రవారానికి మారుస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. -
Telangana: నేటి నుంచి రైతు రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: రైతు ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము జమపై వ్యవసాయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. రూ.25,001 నుంచి రూ.25,100 వరకున్న రుణమాఫీపై ట్రయల్ నిర్వహించారు. సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రూ.25 వేల నుంచి 50 వేల వరకున్న రుణాలను ఈ నెల 30 వరకు మాఫీ చేస్తారు. 6,06,811 మంది రైతులకు రూ.2005.85 కోట్లు మాఫీ చేయనున్నారు. ఇప్పటికే తొలి విడతలో భాగంగా రూ.25 వేలలోపు రుణాలను 2.96 లక్షల మంది రైతులకు రూ.408.38 కోట్లు మాఫీ చేసిన సంగతి తెలిసిందే. రైతులకు శుభాకాంక్షలు: నిరంజన్రెడ్డి రుణమాఫీ చేసినందుకు సీఎం కేసీఆర్కు రైతాంగం తరఫున ధన్యవాదాలు. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన సాగురంగానికి కేసీఆర్ ఆసరాగా నిలిచారు. ఆకలితో తండ్లాడిన తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా మార్చారు. పంట మారి్పడి వైపు రైతులను ప్రోత్సహించి దేశానికి ఆదర్శంగా నిలిచేందుకు కృషి చేస్తాం. -
దళితబంధులో మొత్తం 30 పథకాలు.. జాబితా ఇదే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ దళితబంధు కింద లబ్ధిదారులకు ఉపయోగపడే పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. దళితులకు స్వయం ఉపాధి కల్పన కోసం మొత్తం 30 రకాల పథకాలు/కార్యక్రమాల జాబితాను విడుదల చేసింది. క్షేత్రస్థాయిలో సర్వే అనంతరం మినీ డెయిరీ యూనిట్ నుంచి మినీ సూపర్ బజార్ వరకు వివిధ రకాల స్వయం ఉపాధి పథకాలను ఇందులో చేర్చింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వారిని దృష్టిలో పెట్టుకుని వీటిని ఎంపిక చేసింది. దళితుల అభ్యున్నతికి అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న ఈ పథకం కింద ప్రతి నిరుపేద దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సహాయంతో లబ్ధిదారులు.. ప్రభుత్వం ఎంపిక చేసిన ఈ 30 పథకాల్లో తమకు నచ్చిన ఒక దానిని ఎంపిక చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నెల 16న హుజూరాబాద్లో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఈ పథకం అమలుపై మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. -
రికార్డు సమయంలో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు
సాక్షి, అమరావతి, సాక్షి, అమరావతి బ్యూరో, అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో గేటు విరిగిపోయిన రెండు రోజుల్లోనే దాని స్థానంలో శనివారం స్టాప్ లాగ్ గేటును ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులో నీటి నిల్వకు మార్గం సుగమం చేసి, రికార్డు సృష్టించారు. ప్రాజెక్టు గేటు విరిగిపోయాక.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత తక్కువ సమయంలో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేసి, నీటి నిల్వను పునరుద్ధరించిన దాఖలాలు లేవని నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణలో ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని చెబుతున్నారు. సాగర్ నుంచి దిగువకు విడుదల చేస్తున్న జలాల్లో శనివారం రాత్రి 11 గంటలకు పులిచింతల ప్రాజెక్టులోకి 37,332 క్యూసెక్కులు చేరుతున్నాయి. విద్యుదుత్పత్తి ద్వారా 12,968 క్యూసెక్కులను తెలంగాణ ప్రభుత్వం దిగువకు విడుదల చేస్తోంది. స్టాప్ లాగ్ గేటు ఏర్పాటుతో ప్రాజెక్టులో నీటి మట్టం 129.19 అడుగుల్లో 6.4 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు గేట్లు అన్నీ మూసి వేశారు. కాగా, గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఎగువ నుంచి ప్రాజెక్టులోకి భారీ ఎత్తున వరద వస్తుండటంతో అంతే స్థాయిలో దిగువకు విడుదల చేసేందుకు 16వ గేటును ఎత్తే సమయంలో ట్రూనియన్ బీమ్ యాంకర్ యోక్ గడ్డర్లో సమస్య తలెత్తడంతో గేటు ఊడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం జల వనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్, అధికారులను సీఎం ఆదేశించడంతో యుద్ధ ప్రాతిపదికన స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు పనులకు ఉపక్రమించారు. నిర్విరామ శ్రమతో ఫలితం 17 గేట్లు ఎత్తేసి.. దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో శనివారం తెల్లవారుజాముకు ప్రాజెక్టులో నీటి నిల్వను క్రస్ట్ లెవల్కు అంటే 3.66 టీఎంసీలకు తగ్గించారు. ఎగువ నుంచి 46 వేల క్యూసెక్కుల వరద వస్తున్నప్పటికీ లెక్క చేయకుండా శనివారం ఉదయం నుంచే ఈఎన్సీ సి.నారాయణరెడ్డి పర్యవేక్షణలో బీకెమ్ ప్రతినిధులు, జలవనరుల శాఖ అధికారులు స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేసే పనులు ప్రారంభించారు. స్టాప్ లాగ్స్ను క్రేన్ల ద్వారా సక్రమంగా బిగించేందుకు వైజాగ్కు చెందిన సీలైన్ ఆఫ్షోర్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన 10 మంది సభ్యుల బృందం నిర్విరామంగా శ్రమించింది. స్టాప్ లాగ్ను అమర్చుతున్న దృశ్యం విరిగిపోయిన 16వ గేటు వెనుక భాగంలో రెండు పియర్లకు ఏర్పాటు చేసిన రెయిలింగ్ ద్వారా స్పిల్ వే బ్రిడ్జిపై నుంచి గ్యాంట్రీ క్రేన్ ద్వారా తొలుత 17 మీటర్ల వెడల్పు, 1.5 మీటర్ల ఎత్తు, 28 టన్నుల బరువు ఉన్న ఎలిమెంటు (ఇనుప దిమ్మె)ను దించారు. దానిపై అంతే బరువున్న రెండో ఎలిమెంటును దించారు. అప్పటి నుంచే నీటి నిల్వ మొదలైంది. ఇలా ఎలిమెంట్లను ఒకదానిపై మరొకటి ఏర్పాటు చేస్తూ నీరు కిందకు రాకుండా రబ్బర్ సీళ్లు వేశారు. అర్ధరాత్రి చివరగా 23 టన్నుల బరువున్న 11వ ఎలిమెంటును దించారు. దాంతో 18.50 మీటర్ల ఎత్తు, 17 మీటర్ల వెడల్పుతో కూడిన స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. ఇది మిగతా గేట్ల తరహాలో ఎత్తడానికి, దించడానికి వీలుండదు. నీటి నిల్వకు దోహదం చేస్తుంది. పూర్తి గేటు ఏర్పాటుకు కసరత్తు విరిగిపోయిన పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు వరద ఉధృతికి కొట్టుకుపోయి, స్పిల్ వే నుంచి దాదాపు 750 మీటర్ల దూరంలో పడి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. గడ్డర్స్ ఆచూకీ లభించలేదు. ప్రవాహం తగ్గాక.. 250 టన్నుల బరువున్న గేటును వెలికితీసి, పరిశీలిస్తామని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తెలిపారు. పటిష్టంగా ఉంటే అదే గేటును బిగిస్తామని.. లేదంటే దాని స్థానంలో కొత్తగా గేటును తయారు చేస్తామని చెప్పారు. గేటు బిగించడానికి రెండు పియర్లకు ట్రూనియన్ బీమ్లు దెబ్బతిన్న నేపథ్యంలో వాటిని తొలగించి కొత్తగా నిర్మిస్తామన్నారు. ట్రూనియన్ బీమ్ యాంకర్లో గేట్ల ఆర్మ్ గడ్డర్లను అనుసంధానం చేయడానికి సెల్ఫ్ లూబ్రికెంట్ బుష్లను గతంలో జపాన్ నుంచి దిగుమతి చేసుకున్నామని చెప్పారు. ఇప్పుడు అవి బాగుంటే వాటినే ఉపయోగిస్తామని.. లేదంటే జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలో పూర్తి గేటును బిగించేందుకు రెండు నెలల సమయం పడుతుందన్నారు. స్టాప్ లాగ్ గేటు ద్వారా పూర్తి స్థాయిలో 45.77 టీఎంసీలు నిల్వ చేస్తామని, కృష్ణా డెల్టా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అన్ని ప్రధాన ప్రాజెక్టులను పరిశీలిస్తాం పులిచింతల ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాజెక్టులను పరిశీలిస్తామని జల వనరుల శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి తెలిపారు. శనివారం ఆయన ప్రాజెక్ట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యయన కమిటీ వేయాలని ఆదేశించారని చెప్పారు. ఈ కమిటీ వారం రోజుల్లోగా నివేదిక ఇస్తుందన్నారు. ఆ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవన్నారు. కాగా, స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు పనులను ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను శనివారం సందర్శించారు. -
ప్రభుత్వ అంచనాలకు తగ్గట్టు ఆదాయం...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అమ్మకపు పన్ను రాబడులు ప్రభుత్వ అంచనాలకు తగినట్టుగా వస్తున్నాయి. బడ్జెట్లో అంచనా వేసుకున్న మొత్తం సేల్స్ ట్యాక్స్ లక్ష్యంలో.. తొలి మూడు నెలల్లోనే 22.18 శాతం మేర ఖజానాకు చేరింది. ఈ మేరకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో వెల్లడైంది. 2021–22 ఆర్థిక సంవత్సరానికిగాను అమ్మకపు పన్ను కింద రూ.26,500 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేయగా.. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కలిపి రూ.5,878.77 కోట్లు సమకూరినట్టు కాగ్ తెలిపింది. మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను రాబడుల కింద రూ.1,06,900 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేయగా.. అందులో 19 శాతం అంటే రూ.20,225 కోట్లు తొలి త్రైమాసికంలో సమకూరాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాíసికంలో 11.66 శాతమే ఆదాయం రావడం గమనార్హం. ఈసారి స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, జీఎస్టీ రాబడులు పెరిగే అవకాశముందని, కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంటే.. నిధుల కటకట నుంచి గట్టెక్కినట్టేనని ఆర్థికశాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఇతర ఆదాయం కూడా.. ► జీఎస్టీ రాబడులు కూడా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 6 శాతం పెరిగాయి. ఆ ఏడాది జీఎస్టీ అంచనాల్లో మొదటి మూడు నెలల్లో 12.11 శాతమే సమకూరగా.. ఈసారి మొత్తం అంచనా (రూ.35,520 కోట్లు)లో 18.70 శాతం అంటే రూ.6,640.81 కోట్లు వచ్చాయి. ► ఈసారి ఎక్సైజ్ రాబడులు కూడా ఆశాజనకంగానే ఉన్నాయని కాగ్ గణాంకాలు చెప్తున్నాయి. గత ఏడాది ఈ సమయానికి 15.82 శాతమే రాగా.. ఈసారి 20.74 శాతం వసూళ్లు జరిగాయి. అంటే ఈసారి మొత్తంగా రూ.17 వేల కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసుకోగా.. తొలి మూడునెలల్లో రూ.3,526 కోట్లు వచ్చాయి. ► ఇక ఈసారి స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.1,668 కోట్లకుపైగా వచ్చింది. ► కేంద్రపన్నుల్లో వాటా, ఇతర పన్నులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ల రూపంలో రూ.6 వేల కోట్ల వరకు సమకూరాయి. ► బడ్జెట్లో అంచనా వేసుకున్న అన్నిరకాల ఆదాయం కలిపి చూస్తే.. తొలి మూడు నెలల్లో పరిస్థితి ఆశాజనకంగానే ఉందని కాగ్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మొ త్తం ప్రభుత్వ అం చనాల్లో 17 శాతం అంటే.. రూ.37, 533 కోట్లు అందా యని పేర్కొంటున్నాయి. -
థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధం
సాక్షి, హైదరాబాద్: కరోనా థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నామని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పిల్లల కోసం జిల్లా ఆస్పత్రుల్లో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు ఆస్పత్రులు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకోవాలని, నెల రోజుల్లో ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టుకొకపొతే అనుమతి రద్దు చేస్తామని హెచ్చరించారు. దేశంలోని 50 శాతం కేసులు కేరళలోనే నమోదవుతున్నాయన్నారు. తెలంగాణలో డెల్టా ప్లస్కి సంబంధించి 2 కేసులు నమోదయ్యాయని తెలిపారు. రెండు డెల్టా ప్లస్ కేసులు హైదరాబాద్లోనే వచ్చాయన్నారు. డెల్టా వేరియంట్ ప్రమాదకరమని.. ఇంటా బయటా మాస్క్ ధరించాలని తెలిపారు. వచ్చే రెండు వారాలు రెండో డోస్కి ప్రాధాన్యత ఇస్తామని డీహెచ్ శ్రీనివాసరావు వెల్లడించారు. -
తెలంగాణ స్కూళ్ల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాడు–నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూపొందించిన సాఫ్ట్వేర్ను తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ‘తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల ఏర్పాటుకు నిర్ణయించాం.. ఇందుకు సంబంధించి నాడు–నేడులో టీసీఎస్ ద్వారా సాఫ్ట్వేర్ను రూపొందించి వినియోగించారు. ఇది మంచి ప్రయోజనకరంగా ఉంది. మేం కూడా ఈ సాఫ్ట్వేర్ను వినియోగించుకుంటాం. దీనిపై నిరభ్యంతర ఉత్తర్వులివ్వాలి’ అని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఏపీ విద్యాశాఖ కార్యదర్శికి లేఖ రాసింది. ఈ అంశాన్ని అధికారులు సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ.. ఇలాంటి కార్యక్రమాలు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల అభివృద్ధికి దోహదం చేస్తాయని, సాఫ్ట్వేర్ వినియోగించుకునేందుకు నిరభ్యంతర ఉత్తర్వులివ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ సాఫ్ట్వేర్ను తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకునేందుకు సోమవారం నిరభ్యంతర(నో అబ్జెక్షన్) ఉత్తర్వులిచ్చారు. -
హక్కుల పరిరక్షణకే సుప్రీంకోర్టుకు..
సాక్షి, అమరావతి: ‘కృష్ణా బోర్డు ద్వారా కేంద్రం చట్టబద్ధంగా జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం తుంగలో తొక్కి.. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో ఇప్పటికే 62.59 టీఎంసీలను అక్రమంగా వాడుకుని నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేసింది. ఇలా ప్రాజెక్టులను ఖాళీ చేస్తూ ఆంధ్రప్రదేశ్కు వాటా నీరు దక్కకుండా చేస్తోంది. దాంతో ఇప్పటికే వృథాగా 7.1 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులను పరిరక్షించుకోవడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించడం మినహా మరో మార్గం కన్పించలేదు’ అని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం లేఖ రాశారు. న్యాయబద్ధంగా విధులు నిర్వర్తించడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇరుకున పెట్టడానికి కానే కాదని స్పష్టం చేశారు. తెలంగాణ దుందుడుకు చర్యల గురించి కృష్ణా బోర్డుకు, కేంద్ర జల్ శక్తి శాఖలకు పలుమార్లు ఫిర్యాదు చేశామని ఆ లేఖలో పేర్కొన్నారు. కేంద్రం.. కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేసి ఉంటే ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదన్నారు. -
అధిక ఫీజలు: ఆ స్కూళ్లపై చర్యలకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: అధిక ఫీజలు వసూలు చేస్తున్న స్కూళ్లపై చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమైంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై విద్యాశాఖకు అధికారులు నివేదిక సమర్పించారు. జీవో 46కి విరుద్ధంగా వ్యవహరిస్తున్న స్కూళ్లపై చర్యలకు రంగం సిద్ధమైంది. హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది. పాఠశాలల అనుమతులు రద్దు చేస్తే వచ్చే ఇబ్బందులపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. మణికొండలోని మౌంట్ లిటేరాజ్ స్కూల్, బంజారాహిల్స్లోని మెరీడియన్ స్కూల్, హిమాయత్నగర్లోని ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్, అమీర్పేట్లోని నీరజ్ పబ్లిక్ స్కూల్, జూబ్లీహిల్స్లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, బేగంపేటలోని సెయింట్ ఆండ్రూస్ స్కూల్, డీడీ కాలనీలోని నారాయణ స్కూల్, లిటిల్ ఫ్లవర్ స్కూల్స్పై అధికారులు నివేదిక ఇచ్చారు. -
కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ వాయిదా
సాక్షి, అమరావతి: తెలంగాణ సర్కార్ వ్యాఖ్యల నేపథ్యంలో శుక్రవారం జరగాల్సిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వాయిదా వేసినట్లు రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు గురువారం బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురే లేఖ రాశారు. మళ్లీ సమావేశం ఎప్పుడు నిర్వహించేది తర్వాత తెలియజేస్తామని లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో తెలంగాణ సర్కార్ అక్రమంగా నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తుండటం వల్ల కృష్ణా జలాలు కడలి పాలవుతున్నాయని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం అనేక సార్లు ఫిర్యాదు చేసింది. ఈ వివా దంపై చర్చించేందుకు ఈ నెల 9న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు 2న రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు లేఖ రాసిన విషయం విదితమే. -
'సీమ' ఎత్తిపోతలే శరణ్యం
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ సర్కార్ అక్రమంగా నీటిని తోడేస్తున్న నేపథ్యంలో తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకమే శరణ్యమని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ)కి రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు వివరించారు. ఎకో సెన్సిటివ్ జోన్కు 18 కిలోమీటర్ల దూరంలో చేపట్టే ఈ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర అటవీ, పర్యావరణశాఖకు నివేదిక ఇస్తామని ఈఏసీ పేర్కొంది. రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి పర్యావరణ అనుమతిపై కేంద్ర అటవీ, పర్యావరణశాఖ నేతృత్వంలో 15 మంది ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలతో కూడిన ఈఏసీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్, రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, సీఈ మురళీనాథ్రెడ్డి హాజరయ్యారు. శ్రీశైలంలో 881 అడుగుల్లో నీటిమట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా డిజైన్ మేరకు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, చెన్నైలకు.. ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ ప్రాజెక్టుల ద్వారా 44 వేల క్యూసెక్కులే తీసుకెళ్లవచ్చునని, 854 అడుగుల స్థాయిలో నీటిమట్టం ఉంటే అత్యవసరాలకు 6 వేల క్యూసెక్కులు తరలించవచ్చని ఈఏసీకి రాష్ట్ర అధికారులు వివరించారు. తెలంగాణ సర్కార్ ఇష్టారాజ్యంగా విద్యుదుత్పత్తి చేస్తుండటం వల్ల శ్రీశైలంలో నీటిమట్టం పెరగడం లేదని, దీంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కాలువల ద్వారా నీటిని తరలించలేని దుస్థితి నెలకొందని చెప్పారు. ఈ దుస్థితి అధిగమించడానికే శ్రీశైలంలో 800 అడుగుల నుంచి పోతిరెడ్డిపాడు దిగువన కాలువలోకి రోజుకు 3 టీఎంసీలను ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల చేపట్టామన్నారు. దుర్భిక్ష ప్రాంతాల్లో సాగు, తాగునీటి ఇబ్బందులను అధిగమించడానికి ఇది అత్యావశ్యకమని వివరించారు. ఈ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి ఇవ్వాలని కోరారు. పాత ప్రాజెక్టులైన ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్లకు ఇంతకుముందే పర్యావరణ అనుమతి తీసుకున్నామని, వాటి ఆయకట్టుకు నీళ్లందించడానికి చేపట్టిన ఈ ఎత్తిపోతలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అధికారుల ఇచ్చిన వివరణ, తమ అధ్యయనంలో వెల్లడైన అంశాల ఆధారంగా కేంద్ర అటవీ, పర్యావరణశాఖకు ఇవేదిక ఇస్తామని ఈఏసీ పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర అటవీ, పర్యావరణశాఖ రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి ఇవ్వడంపై నిర్ణయం తీసుకోనుంది. -
నీటి తరలింపును ఆపండి
నరసరావుపేట: తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. కృష్ణా జలాలను కిందకు వదలడం వల్ల ఏపీలోని రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని, వెంటనే ఆ చర్యను నివారించాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా ప్రతిరోజూ శ్రీశైలం నుంచి నాలుగు టీఎంసీలు, సాగర్ నుంచి మూడు టీఎంసీలు, పులిచింతల నుంచి 1.8 టీఎంసీలు వినియోగించుకుంటూ విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. దీంతో ఏపీలో రాబోయే రోజుల్లో తాగు, సాగునీటికి కొరత ఏర్పడనుందని పేర్కొన్నారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల రైతుల మనుగడకు తీవ్ర విఘాతం ఏర్పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేసి ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద సీఐఎస్ఎఫ్ బలగాలతో రక్షణ కల్పించాలని కేంద్రమంత్రిని కోరారు. -
తెలంగాణ.. 24 అక్రమ ప్రాజెక్టులు !
సాక్షి, అమరావతి: తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన 24 ప్రాజెక్టులను తక్షణమే అడ్డుకోవాలని కృష్ణా బోర్డును ఏపీ ప్రభుత్వం కోరింది. ఇందులో 15 మధ్య, భారీ తరహా ప్రాజెక్టులని, తొమ్మిది చిన్నతరహా ప్రాజెక్టులని వివరించింది. విభజన చట్టాన్ని తుంగలో తొక్కి.. కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి తీసుకోకుండా.. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో ఇప్పటికే ఆరింటిని పూర్తి చేసి.. ఆయకట్టుకు నీళ్లందిస్తోందని, మరో రెండు ప్రాజెక్టుల పనులను యథేచ్ఛగా కొనసాగిస్తున్నదని ఎత్తి చూపింది. కాగా, మరో ఏడు ప్రాజెక్టులు సర్వే దశలో ఉన్నాయని, ఇంకో తొమ్మిది ప్రాజెక్టులను త్వరలోనే చేపడుతున్నట్లు తెలంగాణ ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేసింది. అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను తక్షణమే ఆపేసేలా తెలంగాణను ఆదేశించాలని బోర్డును కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురేకు ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి మంగళవారం లేఖ రాశారు. విభజన చట్టం ప్రకారం కృష్ణా బేసిన్లో ఇరు రాష్ట్రాలు కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా.. ఆ ప్రాజెక్టు డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం)కు పంపాలని గుర్తు చేశారు. కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చాక.. వాటిని అపెక్స్ కౌన్సిల్ ముందు పెట్టాలని వివరించారు. ఇందుకు విరుద్ధంగా తెలంగాణ అపెక్స్ కౌన్సిల్ ఆమోదించకుండానే.. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా 24 ప్రాజెక్టులు చేపట్టిందని.. ఇది ఏపీ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కల్పిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అక్రమ ప్రాజెక్టులను ఆపేసేలా తెలంగాణను ఆదేశించి.. దిగువ రాష్ట్రమైన ఏపీ ప్రయోజనాలను పరిరక్షించాలని కృష్ణా బోర్డును కోరారు. అక్రమ నీటి వినియోగాన్ని అడ్డుకోండి కృష్ణా నదీ జలాలను చిన్న నీటివనరుల విభాగంలో కేటాయింపుల కంటే అదనంగా 86.39 టీఎంసీలను అక్రమంగా వాడుకుంటున్న తెలంగాణ సర్కార్పై చర్యలు తీసుకోవాలని కృష్ణా బోర్డును ఏపీ ప్రభుత్వం కోరింది. అక్రమంగా నీటిని వాడుకోకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురేకు ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి మంగళవారం లేఖ రాశారు. ► కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా బేసిన్లో చిన్న నీటివనరుల విభాగంలో 5,57,104 ఎకరాల ఆయకట్టుకు 89.15 టీఎంసీలను మాత్రమే తెలంగాణకు కేటాయించింది. ► 2014 నుంచి 2021 మధ్య కృష్ణా బేసిన్లో 16,163 చెరువులను పునరుద్ధరించడం తోపాటు కొత్తగా 24 చెరువులు, చెక్ డ్యామ్లు నిర్మించి తద్వారా చిన్న నీటివనరుల విభాగంలో 10,77,034 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే పనులను రూ.6,243 కోట్లతో చేపటినట్లు తెలంగాణ సర్కార్ జారీ చేసిన 474 జీవోలో పేర్కొంది. ఈ ఆయకట్టుకు నీళ్లందించడానికి 175.54 టీఎంసీలను తెలంగాణ వాడుకుంటోంది. ► అంటే.. కేటాయించిన నీటి కంటే అదనంగా 86.39 టీఎంసీలను తెలంగాణ అక్రమంగా వాడుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోంది. తెలంగాణ అక్రమంగా నీటిని వాడుకోకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలి. -
4 రోజుల్లో 3.301 టీఎంసీలు కడలిపాలు
సాక్షి, అమరావతి: కృష్ణానదిలో వరద ప్రవాహం లేదు. అయినా.. ప్రకాశం బ్యారేజీ నుంచి కేవలం 4 రోజుల్లోనే 3.301 టీఎంసీలు కడలిపాలయ్యాయి. దీనికి ప్రధాన కారణం తెలంగాణ సర్కారు అక్రమంగా నీటిని తోడేస్తూ విద్యుదుత్పత్తి చేస్తుండటమే. తెలంగాణ ప్రభుత్వం నిబంధనల మేరకు వ్యవహరించి ఉంటే.. 3.301 టీఎంసీల కృష్ణా జలాలు కడలిపాలయ్యేవి కాదు. ఈ నీటితో రెండు రాష్ట్రాల్లోను 40 వేల ఎకరాల్లో పంటలు పండించే అవకాశం ఉండేది. తెలంగాణ సర్కార్ వైఖరి వల్ల ఆ జలాలు ఆయకట్టు రైతులకు దక్కకుండా పోయాయి. మంగళవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం రాలేదు. అయినా తెలంగాణ యథేచ్ఛగా విద్యుదుత్పత్తి కొనసాగించింది. 14,126 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తుండటంతో శ్రీశైలంలో నీటిమట్టం 814.53 అడుగులకు పడిపోయింది. నీటినిల్వ 37 టీఎంసీలకు తగ్గిపోయింది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. పూర్తిస్థాయి నీటినిల్వ 215.81 టీఎంసీలు. వీటిని పరిశీలిస్తే.. శ్రీశైలంలో నీటినిల్వలు అడుగంటిపోయినట్లు స్పష్టమవుతోంది. నాగార్జునసాగర్లోకి 12,197 క్యూసెక్కులు వస్తుండగా.. దిగువన సాగునీటి అవసరాలు లేకపోయినా సరే విద్యుదుత్పత్తి చేస్తూ 30,576 క్యూసెక్కులను వదిలేస్తోంది. దీంతో సాగర్లో నీటిమట్టం 531.99 అడుగులకు తగ్గిపోయింది. నీటినిల్వ 172.08 టీఎంసీలకు పడిపోయింది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. పూర్తిస్థాయి నీటినిల్వ 312.04 టీఎంసీలు. పులిచింతల ప్రాజెక్టులోకి 33,394 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 34.45 టీఎంసీలకు చేరింది. ఈ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 11.32 టీఎంసీలు అవసరం. కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలు లేకపోయినా సరే తెలంగాణ సర్కార్ అక్రమంగా పులిచింతల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేస్తూ 9,200 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. ప్రకాశం బ్యారేజీలోకి 8,964 క్యూసెక్కులు చేరుతున్నాయి. బ్యారేజీలో నీటినిల్వ పూర్తిస్థాయి 3.07 టీఎంసీలకు చేరుకోవడంతో మిగులుగా ఉన్న 9,400 క్యూసెక్కుల నీటిని 20 గేట్లను అరడుగు మేర ఎత్తి వృథాగా సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లు ఈఈ స్వరూప్ తెలిపారు. తెలంగాణ అక్రమంగా నీటిని తోడేస్తుండటం వల్ల గత 3 రోజుల్లో మంగళవారం ఉదయం 6 గంటల వరకు ప్రకాశం బ్యారేజీ నుంచి 2.921 టీఎంసీలు కడలిపాలయ్యాయి. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 0.38 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. -
తెలంగాణ ఏజీపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు సీజే
సాక్షి, హైదరాబాద్: న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి.. కృష్ణా డెల్టా రైతులు దాఖలు చేసిన పిటిషన్ విచారణ నుంచి ఆయన తప్పుకోవాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా కేసులను విచారించే న్యాయమూర్తులకు ఉద్దేశాలను ఆపాదిస్తారా? ప్రాంతీయ భావంతో చూస్తారా? అంటూ మండిపడ్డారు. న్యాయస్థానం ప్రథమ కోర్టు అధికారైన అడ్వొకేట్ జనరల్ న్యాయమూర్తుల నిజాయితీని అనుమానిస్తూ... ఉద్దేశాలను ఆపాదిస్తూ అవమానించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కేసులను ఏ న్యాయమూర్తి విచారించినా మెరిట్స్ మీద వాదనలు వినిపించాలే తప్ప... న్యాయమూర్తులకు ఇలా నీచమైన, హీనమైన ఉద్దేశాలను ఆపాదించరాదని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో 34 ఆధారంగా విద్యుత్ ఉత్పత్తితో పులిచింతల ప్రాజెక్టు నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారని, దీంతో తమ సాగునీటికి తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుందంటూ కృష్ణా జిల్లాకు చెందిన రైతులు జి.శివరామకృష్ణ ప్రసాద్, ఎం.వెంకటప్పయ్య దాఖలు చేసిన పిటిషన్ను ఏ ధర్మాసనం విచారించాలన్న దానిపై సందిగ్ధత ఏర్పడిన నేపథ్యంలో... ఎవరు విచారించాలన్నది నిర్ణయిస్తామని సీజే పేర్కొన్నారు. తదుపరి విచారణను రెండుమూడు రోజుల్లో తెలియజేస్తామని స్పష్టం చేశారు. మళ్లీ ఏజీ అభ్యంతరం.. సీజే ఆగ్రహం మంగళవారం ఉదయం 10.30 గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం కేసుల విచారణ ప్రారంభించగానే అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హాజరై.. నీటిపారుదల ప్రాజెక్టుల కేసులను ఇదే(సీజే) ధర్మాసనం విచారించాలని తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అభ్యంతరం వ్యక్తం చేసినా.. జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు నేతృత్వంలోని ధర్మాసనం కృష్ణా డెల్టా రైతుల పిటిషన్ను విచారిస్తోందని చెప్పారు. అక్కడ విచారించకుండా ఇక్కడికి బదిలీ చేసేలా చూడాలని కోరారు. జస్టిస్ రామచందర్రావు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి విచారించరాదంటూ తెలంగాణ ప్రభుత్వం మధ్యంతర పిటిషన్ దాఖలు చేసిందని రైతుల తరఫున సీనియర్ న్యాయవా ది వేదుల వెంకటరమణ నివేదించారు. దీంతో జస్టిస్ హిమాకోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏవో ఊహించుకొని నిజాయితీ, నిబద్ధత కల్గిన న్యాయమూర్తిని విచారణ నుంచి తప్పుకోవాలని ఎలా కోరతారంటూ ఏజీపై మండిపడ్డారు. న్యాయమూర్తికి ప్రాంతీయ భావాన్ని అంటగడుతూ దాఖలు చేసిన పిటిషన్ను వెంటనే ఉపసంహరించుకోవాల ని ఆదేశించారు. న్యాయమూర్తులెవరికీ వ్యక్తిగత ఉద్దేశాలు, అభిప్రాయాలు ఉండవని, మెరిట్స్ ఆధారంగా తీర్పులిస్తారని స్పష్టం చేశారు. నీటిపారుదల ప్రాజెక్టులపై పిటిషన్లను తమ ధర్మాసనం, రాష్ట్ర పునర్విభజన చట్టంపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుందన్నారు. డెల్టా రైతుల పిటిషన్లో ఈ రెండు అంశాలు ఉన్నందున ఏ ధర్మాసనం విచారించాలన్న దానిపై సందేహం తలెత్తిందని, వివరణ తీసుకునేందుకు రిజిస్ట్రీ అధికారులకు తగిన సమయం ఇవ్వాల్సిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఫోరం హంటింగ్ (నచ్చిన ధర్మాసనానికి బదిలీ కోసం) చేస్తున్నట్లుగానే మీరు ఆఘమేఘాల మీద విచారణ చేయాలని ఎందుకు కోరారని, రిజిస్ట్రీకి కొంత సమయం ఇవ్వాల్సిందంటూ వెంకటరమణపై అసహనం వ్యక్తం చేశారు. ఏదేమైనా విచారణ ఆపాలని కోరుతూ తన ముందు ప్రస్తావించిన విషయాన్ని జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు ధర్మాసనానికి తెలియజేసి విచారణ ఆపాలని కోరాలని సూచించారు. ఈ పిటిషన్ను ఏ ధర్మాసనం విచారించాలన్నది తేలుస్తామన్నారు. ఈ కేసు ఫైల్ను తన ముందుంచాలని రిజిస్ట్రీ అధికారులను ఆదేశించారు. సీజే సూచన మేరకే విచారించాం... జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు ధర్మాసనం కృష్ణా డెల్టా రైతుల పిటిషన్పై విచారణను ప్రారంభించగానే.. సీజే ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణను ఆపాలని సూచించారని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ‘ఈ విషయంపై మాకు సమాచారం లేదు. సోమవారం తెలంగాణ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ ఇదే అభ్యంతరం వ్యక్తం చేశారు. రిజిస్ట్రీ అధికారులు విషయాన్ని సీజేకు తెలియజేశారు. ఈ పిటిషన్పై సీజే సమాచారం ఇచ్చిన తర్వాతే విచారించాలని నిర్ణయించాం. మీ అభ్యంతరాలను తోసిపుచ్చి విచారణ ప్రారంభించాం. పిటిషన్ విచారణార్హతపై కొన్ని సందేహాలను వ్యక్తం చేస్తూ తదుపరి విచారణను ఈ రోజుకు వాయిదావేశాం. ఒకసారి విచారణ ప్రారంభించిన తర్వాత మళ్లీ మరో ధర్మాసనానికి పంపాలని కోరడం ఏంటి?’అని జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే విచారణను భోజన విరామం తర్వాతకు వాయిదా వేయాలని, అప్పటిలోగా సమాచారం వస్తుందని ఏజీ తెలిపారు. భోజన విరామం తర్వాత ఈ పిటిషన్ను రిజిస్ట్రీకి పంపాలని సీజే సూచించారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వెంకటరమణ నివేదించారు. ఎవరు విచారించాలన్నది నిర్ణయిస్తామని పేర్కొన్నారని తెలిపారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం.. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను పేర్కొంటూ ఈ పిటిషన్ను రిజిస్ట్రీకి పంపాలని ఆదేశించింది. -
పూర్తిస్థాయి భేటీలోనే చర్చిద్దాం..
చర్చకు కోరిన అంశాలు ఇలా.. ►ఇప్పటివరకు కృష్ణా జలాలకు సంబంధించి ఉన్న నీటి వాటాల నిష్పత్తిని ఈ ఏడాది నుంచి మార్చాలి. ►ఏపీ అక్రమంగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతలు, ఆర్డీఎస్ కుడి కాల్వ పనులను ఆపేలా చర్యలు తీసుకోవాలి ►పోతిరెడ్డిపాడు ద్వారా ఇతర బేసిన్, ఇతర ప్రాజెక్టులకు అదనంగా నీటి తరలింపుపై చర్యలు తీసుకోవాలి ►బచావత్ అవార్డు ప్రకారం.. పోలవరానికి కేంద్ర జల సంఘం అనుమతులు ఇచ్చిన వెంటనే, కృష్ణా జలాల్లో 45 టీఎంసీల వాటాను తెలంగాణకు కేటాయించాలి. ►తాగునీటి అవసరాలకు వినియోగించే కృష్ణా నీటిలో 20 శాతం వినియోగాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ►బోర్డు ఇచ్చిన నీటి విడుదల ఆదేశాల్లో తెలంగాణ పొదుపు చేసిన జలాలను పక్కాగా లెక్కించాలి. సాక్షి, హైదరాబాద్ : కృష్ణా జలాలకు సంబంధించి నెలకొన్న వివిధ వివాదాల తీవ్రత దృష్ట్యా వాటిపై చర్చించేందుకు పూర్తిస్థాయి భేటీ నిర్వహించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. వివాదాస్పదమైన వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా, జూలై 20 తర్వాత తెలంగాణ, ఏపీలకు ఆమోదయోగ్యమైన తేదీల్లో సమావేశం నిర్వహించాలని కోరింది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్కు సంబంధించి సాగునీటి ప్రాజెక్టులను ఆరంభించే పనుల్లో తెలంగాణ సాంకేతిక బృందాలు తీరిక లేకుండా ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్కుమార్ సోమవారం బోర్డుకు లేఖ రాశారు. మూడు రోజుల కిందట సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు, త్రిసభ్య కమిటీ భేటీని కాకుండా పూర్తిస్థాయి సమావేశం జరపాలని ఆయన బోర్డును కోరారు. బోర్డుకు ఏపీ రాసిన లేఖలను ఆధారంగా చేసుకొని సభ్య కార్యదర్శి ఈ నెల 9న త్రిసభ్య కమిటీ భేటీ ఏర్పాటు చేశారని పేర్కొంటూ, ఈ మేరకు రాసిన లేఖలో సభ్య కార్యదర్శి కేవలం ఏపీ లేవనెత్తిన అంశాలనే ప్రస్తావించడంపై విస్మయం వ్యక్తం చేశారు. తెలంగాణ లేవనెత్తిన అంశాలనుఇందులో చేర్చలేదని తెలిపారు. బోర్డు పూర్తిస్థాయి భేటీలో చర్చించాల్సిన ఆరు అంశాలను రజత్కుమార్ తన లేఖలో పొందుపరిచారు. విద్యుత్ అవసరాలకే శ్రీశైలం ఇలావుండగా కృష్ణా జలాల ఆధారంగా చేపట్టిన శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా విద్యుత్ అవసరాల కోసం నిర్మించినదేనని రజత్కుమార్ మరోమారు పునరుద్ఘాటించారు. తెలంగాణ పూర్తిగా ఎత్తిపోతల పథకాలపై ఆధారపడి ఉందని, ఖరీఫ్లో సాగుకు నీరందిం చాలంటే భారీగా విద్యుత్ అవసరాలున్నాయని తెలిపారు. ఈ దృష్ట్యానే శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ద్వారా సాగర్కు నీటిని తరలించి రాష్ట్ర సాగు, తాగునీటి అవసరాలను తీర్చుకుంటున్నామని వివరించారు. -
జల జగడం
సాక్షి నెట్వర్క్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లోని సాగునీటి ప్రాజెక్టుల వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల పోలీసులు శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద భారీగా మోహరించారు. అడ్డుకున్న తెలంగాణ పోలీసులు తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద పోలీసుల పహారా పెట్టి మరీ విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తోంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం కూడా డ్యామ్ వ ద్ద దాదాపు 240 మంది పోలీసులను మోహరించింది. విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలంటూ టీఎస్ జెన్కో అధికారులకు వినతిపత్రం ఇవ్వడానికి ఏపీ జలవనరులశాఖ అధికారులు బయలుదేరగా కుడి కా లువ ఎస్ఈ గంగరాజును తెలంగాణ సరిహద్దుల్లో ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. కాగా సాగర్ నూతన బ్రిడ్జి వద్ద గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ శాంతిభద్రతలను పరిశీలించారు. పులిచింతలలో వినతిపత్రం అందజేత మరోవైపు పులిచింతలలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది. ఏపీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు 300 మంది పోలీసులను ఉంచింది. పులి చింతల ప్రాజెక్టు ఎస్ఈ రమేష్ బాబు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్దకు వెళ్లి వెంటనే విద్యుత్ ఉత్పత్తిని నిలుపుదల చేయాలని టీఎస్ జెన్కో అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. చెక్పోస్టులు.. ముమ్మరంగా తనిఖీలు.. కర్నూలు జిల్లాలోని రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్), పోతిరెడ్డిపాడు, శ్రీశైలం జలాశయం వద్ద భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప పర్యవేక్షించారు. -
తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు ఆపాల్సిందే
కడప (సెవెన్ రోడ్స్): రాయలసీమ తాగు, సాగునీటి అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నించడంపై వైఎస్సార్ జిల్లాలోని రైతు సంఘాలు, మేధావులు భగ్గుమంటున్నారు. ఎలాంటి నీటి కేటాయింపులు, అనుమతులు లేకుండా అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్న తెలంగాణ ప్రభుత్వం నిత్య కరువు పీడిత రాయలసీమకు నీరందించే పథకాలపై అభ్యంతరాలు లేవనెత్తడాన్ని తప్పుబడుతున్నారు. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులు ఆపాలంటూ హైకోర్టును ఆశ్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ వైఖరికి నిరసనగా ఈనెల 28వ తేదీన కడపలో ఆందోళన చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలవాలని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. శనివారం రాయలసీమ సాగునీటి సాధన సమితి జిల్లా కన్వీనర్ చంద్రమౌళీశ్వర్రెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, రైతు స్వరాజ్య వేదిక నాయకుడు శివారెడ్డి తదితరులు మైదుకూరు, కమలాపురం ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, పి.రవీంద్రనాథ్రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్.గోవర్దన్రెడ్డి, బి.హరిప్రసాద్, పీరయ్య తదితరులను కలిసి రైతుల ఆందోళనలో భాగస్వాములు కావాలని కోరారు. -
అన్లాక్లో అజాగ్రత్త.. కరోనాతో చెలగాటమే!
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ ఎత్తేశారు... కరోనాతో ఎలాంటి ప్రమాదం లేదని అనుకోవడం ఏమాత్రం మంచిది కాదని వైద్య నిపుణులు తేల్చిచెబుతున్నారు. అన్లాక్లో అజాగ్రత్త వహిస్తే కరోనాతో చెలగాటం ఆడినట్లేనని హెచ్చరిస్తున్నారు. అనేకమందిలో ఇక సాధారణంగా బయట స్వేచ్ఛగా తిరగవచ్చన్న దురభిప్రాయం ఉంది. అప్పుడే జనం పెద్ద ఎత్తున గుమిగూడుతున్నారు. బంధువులు, ఇతరుల ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు కొద్దిమందితో జరుపుకున్న శుభకార్యాలను, ఎక్కువ మందితో చేసుకునేందుకు సై అంటున్నారు. అవసరమున్నా లేకున్నా వివిధ కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. మధ్య, దిగువ ఆదాయ ప్రజలు ఎక్కువగా నివసించే దేశం మనది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం బతుకుదెరువు, ఆర్థిక అంశాలను ఆధారం చేసుకొని లాక్డౌన్ ఎత్తివేసిందనేది అందరికీ తెలిసిందే. అంతేతప్ప కరోనా ప్రమాదం పోయిందన్న భ్రమలో ఏమాత్రం అజాగ్రత్త వహించినా థర్డ్వేవ్కు స్వాగతం పలికినట్లేనని గట్టి హెచ్చరికలు ఇప్పటికే వచ్చాయి. ప్రమాదం పొంచే ఉంది... రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గిందేకానీ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మరణాలూ సంభవిస్తున్నాయి. మే 1న 7,430 కేసులు నమోదు కాగా, 53 మంది చనిపోయారు. హోం ఐసోలేషన్లో, ఆసుపత్రుల్లో 80,695 మంది ఉన్నారు. నెలన్నర తర్వాత అంటే జూన్ 20న 1,006 కేసులు నమోదు కాగా, 11 మంది చనిపోయారు. 17,765 మంది హోం ఐసోలేషన్లో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆనాటి ఉధృతి ఇప్పుడు లేదన్నది వాస్తవమే. లాక్డౌన్తో కరోనా వ్యాప్తి తగ్గింది. అంతేగానీ కరోనా ప్రమాదం తొలగిపోలేదని ఈ లెక్కలే చెబుతున్నాయి. మన చేతుల్లోనే థర్డ్వేవ్... అందరికీ వ్యాక్సిన్ వేసేంతవరకు కరోనా ప్రమాదం ముప్పు పొంచే ఉంటుంది. అయితే మనం ఎంతమేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న దానిపైనే దాని తీవ్రత ఆధారపడి ఉంటుందనేది ఇప్పటివరకు కరోనా చరిత్ర చెబుతున్న పాఠం. మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్లో కరోనా తీవ్రత, వ్యాప్తి పెరిగింది. అనేక మ్యుటేషన్లు వచ్చాయి. ఏది ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో ఊహించలేని పరిస్థితి. థర్డ్వేవ్ అంటూ దానికో సీజన్ అంటూ ఉండదు. ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకుండా, జనం జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే థర్డ్ వేవే కాదు, ఫోర్త్, ఫిప్త్... వేవ్లు వస్తూనే ఉంటాయని అంటు న్నారు. అదీగాక ఇప్పుడు వానాకాలంలో డెంగీ, మలేరియా, చికున్గున్యా వంటి వ్యాధులు పొంచి ఉంటాయి. దానికితోడు కరోనా జతకలిస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని అంటున్నారు. డెంగీ, మలేరియా, చికున్గున్యా వంటివి కూడా జ్వరంతోనే వస్తాయి. కరోనా లక్షణాల్లోనూ జ్వరం ఉంటుంది. కాబట్టి గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉంది. డాక్టర్ సూచన మేరకు పరీక్షలు చేయించుకోవాలి. మందులు వాడాలి. పది రెట్లు జాగ్రత్తగా ఉండాలి లాక్డౌన్లో అందరం ఇళ్లకు పరిమితమయ్యాం. కాబట్టి బయటకు వెళ్లకుండా వైరస్ బారినపడకుండా చూసుకోగలిగాం. కానీ ఇప్పుడు అన్లాక్తో మళ్లీ సాధారణ జనజీవనం ఉంటుంది. కాబట్టి లాక్డౌన్లో కంటే ఇప్పుడే పది రెట్లు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముంది. మనం బయటకు వెళ్లినప్పుడు ప్రతిఒక్కరినీ అనుమానించాల్సి ఉంటుంది. ఎవరికి వైరస్ ఉందో ఎవరికి లేదో మనం గుర్తించలేం. అలాగే టీకా వేయించుకున్నా కూడా నిర్లక్ష్యంగా లేకుండా కరోనా ప్రొటోకాల్స్ పాటించాలి. లేకుంటే థర్డ్ వేవ్ ముప్పు తప్పదు. ఆరు నెలలపాటు జాగ్రత్తగా ఉండాల్సిందే. – డాక్టర్ ఎ.ఎం.భరత్రెడ్డి (సినీ నటుడు), కార్డియాలజిస్ట్, అపోలోఆసుపత్రి కరోనా నుంచి ఇంకా బయటపడలేదు కోవిడ్ సమస్య నుంచి మనం పూర్తిగా బయట పడలేదు. అహ్మదాబాద్ సీరో సర్వే ప్రకారం 70 శాతం మందికి యాంటీబాడీస్ ఉన్నప్పటికీ వీరంతా ఏకకాలంలో ప్రభావితమైనవారు కాదు. ఫిబ్రవరి నాటికి 28 శాతం ఉంటే, రెండో దశలో 42 శాతం మంది ప్రభావితమయ్యారు. వ్యాక్సినేషన్తోనే ఏకకాలంలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం. కానీ మన దేశం వ్యాక్సినేషన్ను పూర్తిస్థాయిలో వేయాలంటే ఆరు నెలలు పడుతుంది. కాబట్టి అప్పటివరకు జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ -
Corona Vaccine: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పని ప్రదేశాల్లో 18 ఏళ్లు దాటినవారికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. వ్యాక్సిన్ వేసేందుకు ప్రైవేట్ ఆస్పత్రులకూ అనుమతి ఇచ్చింది. వ్యాక్సిన్ కోసం ప్రైవేట్ సంస్థలు ప్రైవేట్ ఆస్పత్రులతో కోఆర్డినేట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కాగా, పది రోజుల విరామం తర్వాత ఈ రోజు నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వ్యాక్సి నేషన్ కేంద్రాల వద్ద రెండవ డోసు కోసం ప్రజలు బారులు తీరారు. ఉదయం కేంద్రాలు ప్రారంభం కంటే ముందే తరలి వచ్చారు. కొందరికి నిర్దిష్ఠ సమయం పూర్తి కావటంతో ఆందోళనకు గురయ్యారు. తాజాగా మళ్ళీ వ్యాక్సిన్ వేస్తుండటంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇకపై వ్యాక్సిన్ కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చదవండి: తిన్నది అరగడం లేదు సార్..అందుకే బయటకు వచ్చా.. లాక్డౌన్: అమ్మలా.. ఆకలి తీరుస్తున్నాడు -
తెలంగాణ జూడాలు, హౌస్ సర్జన్లకు తీపి కబురు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని జూనియర్ డాక్టర్లు, హౌస్ సర్జన్లు, పీజీ వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పది రోజుల క్రితం జూనియర్ డాక్టర్లు జీతాలు పెంచాలంటూ ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన హామీ మేరకు జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం 15 శాతం స్టైఫండ్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. హౌస్ సర్జన్ మెడికల్, హౌస్ సర్జన్ డెంటల్కు 19,589 రూపాయల నుంచి రూ.22,527కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పీజీ డిగ్రీ, డిప్లొమా, సూపర్ స్పెషాలిటీ, ఎండీఎస్ వారికి.. ప్రస్తుత స్టైఫండ్కి 15 శాతం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నేటి ఉదయం స్నేహ సోమారెడ్డి అనే వైద్యురాలు గత నాలుగు నెలలుగా తమకు సరిగా జీతాలు అందడం లేదంటూ కేటీఆర్కు ట్వీట్ చేశారు. ‘‘సార్ కరోనా కష్టకాలంలో మీరు ఎందరికో సహాయం చేస్తున్నారు. కానీ రెసిడెంట్ డాక్టర్లు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆస్పత్రుల్లో నిరంతరం సేవలందిస్తున్నారు. గత నాలుగు నెలల నుంచి మాకు జీతాలు అందడం లేదు. కోవిడ్ డ్యూటీలకు హాజరైన వారికి ఇతర రాష్ట్రాల్లో ప్రోత్సహకాలు ఇస్తున్నారు. మాకు ఇలాంటివి ఏం అందడం లేదు. మా ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మేం ఎలా వర్క్ చేయగలం సార్’’ అంటూ ట్వీట్ చేశారు. We have brought this issue to Hon’ble CM’s notice and he has issued orders to Health secretary to enhance stipends of house surgeons and PGs by 15% GOs being issued today https://t.co/A88ptZfbut — KTR (@KTRTRS) May 18, 2021 ఈ ట్వీట్పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘‘హౌస్ సర్జన్లు, పీజీ వైద్యుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాం. వారికి 15 శాతం స్టైఫండ్ పెంచాలని హెల్త్ సెక్రటరీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ జీవో విడుదల అవుతుందని’’ కేటీఆర్ రీట్వీట్ చేశారు. మొత్తంగా ఇవాళ మధ్యాహ్నం 15 శాతం స్టైఫండ్ పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. చదవండి: డెత్ సర్టిఫికెట్ కోసం ‘యుద్ధం’: స్పందించిన మంత్రి కేటీఆర్ -
Telangana: వారంలో టెన్త్ ఫలితాలు!
సాక్షి, హైదరాబాద్: వచ్చే వారం రోజుల్లో విద్యార్థులందరికీ గ్రేడ్లను, గ్రేడ్ పాయింట్లను, జీపీఏను కేటాయించి ఫలితాలు విడుదల చేసేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. కాగా, పదో తరగతి విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్–1 (ఎఫ్ఏ) ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వనుంది. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా మంగళవారం మెమో జారీ చేశారు. రాష్ట్ర సిలబస్ కలిగిన ప్రభుత్వ, జిల్లా పరిషత్, ప్రైవేటు, ఎయిడెడ్ తదితర అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల పదో తరగతి విద్యార్థులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొన్నారు. 2020–21 విద్యా సంవత్సరంలో కరోనా కారణంగా నాలుగు ఫార్మేటివ్ అసెస్మెంట్లకు బదులు రెండు ఎఫ్ఏలను నిర్వహించాలని విద్యా శాఖ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటే ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఇంటర్నల్ అసెస్మెంట్) నిర్వహించారని పేర్కొన్నారు. 20 శాతం మార్కులతో నిర్వహించిన ఆ ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగానే విద్యార్థులకు వచ్చిన మార్కులను బట్టి గ్రేడింగ్ ఇవ్వాలని స్పష్టం చేశారు. 20 శాతం మార్కులను 100 శాతానికి లెక్కించి గ్రేడ్లు ఖరారు చేయాలని స్పష్టం చేశారు. ఒక విద్యార్థికి ఎఫ్ఏ–1 ఒక సబ్జెక్టులో 20 మార్కులకు వచ్చిన మార్కులకు ఐదింతలు చేసి కేటాయిస్తారు. దీని ప్రకారం ఒక సబ్జెక్టులో 20 మార్కులు వస్తే ఆ విద్యార్థికి ఆ సబ్జెక్టులో 100 మార్కులు వచ్చినట్లు పరిగణనలోకి తీసుకుంటారు. ఇలా ప్రతి సబ్జెక్టులో వచ్చిన మార్కుల పరిధి ఆధారంగా ఆ విద్యార్థికి ఆ సబ్జెక్టులో వచ్చిన గ్రేడ్ను, ఆ గ్రేడ్కు ఇచ్చే గ్రేడ్ పాయింట్ను కేటాయిస్తారు. చివరకు అన్నీ కలిపి జీపీఏ ఇస్తారు. హిందీ సబ్జెక్టులో పాస్ మార్కులు తక్కువ కాబట్టి మార్కుల పరిధి మిగతా సబ్జెక్టుల కంటే వేరుగా ఉంటుంది. చదవండి: Lockdown: సిటీలో ‘పరిధి’ దాటొద్దు! -
Telangana High Court: ప్రైవేటు దోపిడీని అడ్డుకోండి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగుల నుంచి లక్షలాది రూపాయలు ఫీజులుగా వసూలు చేస్తుండడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వైద్య చికిత్సలు, సీటీ స్కాన్లాంటి పరీ క్షలు, ఆక్సిజన్ సిలిండర్లు, రెమిడెసివిర్ లాంటి మం దులకు గరిష్ట ధరలు నిర్ణయిస్తూ తాజా మార్గదర్శకాలను జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నియంత్రణ ఆంక్షలను మరింత కఠి నతరం చేయాలని, అనూహ్యంగా పెరుగుతున్న కేసులు, మరణాలను దృష్టిలో ఉంచుకొని వారాం తపు లాక్డౌన్ పెట్టే విషయంపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అలాగే రాత్రి కర్ఫ్యూను కొనసాగించే విషయంపై ఈనెల 8వ తేదీ కంటే ముందే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఈ సం దర్భంగా డీజీపీ మహేందర్రెడ్డి, ప్రజా ఆరోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. సమృద్ధిగా కరోనా పరీక్షల కిట్లు: డాక్టర్ శ్రీనివాసరావు గతంలో ప్రజలు పరీక్షలు చేయించుకునేందుకు పెద్ద సంఖ్యలో వచ్చేవారని, అయితే ప్రస్తుతం లక్షణాలు ఉన్న వారు మాత్రమే పరీక్షలు చేయించుకునేందుకు వస్తున్నారని డాక్టర్ శ్రీనివాసరావు నివేదించారు. ఈ కారణంగానే పరీక్షల సంఖ్య తగ్గుతోందని, పరీక్ష కిట్లు సమృద్ధిగా ఉన్నాయని వివరించారు. ఈ వివరణతో సంతృప్తి చెందని కోర్టు.. ప్రజల దగ్గరికే వెళ్లి పరీక్షలు చేయాలని సూచించింది. పాజిటివ్ వచ్చిన వారితో కాంటాక్టులో ఉన్న వారికి పరీక్షలు చేయాలని ఆదేశించింది. అలాగే ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలను 24 గంటల్లో ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. వివాహ శుభకార్యాల్లో, అంత్యక్రియల్లో పాల్గొనేవారి సంఖ్యను తగ్గించకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు గత ఏడాది ఇచ్చిన జీవోను సవరిస్తూ 24 గంటల్లో కొత్త మార్గదర్శకాలతో మరో జీవో జారీ చేయాలని ఆదేశించింది. ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజెక్షన్లు రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు సరఫరా చేయడం లేదని డాక్టర్ శ్రీనివాసరావు నివేదించారు. రాష్ట్రంలో 18–44 మధ్య వయస్సు గలవారి కోసం 3.5 కోట్ల వ్యాక్సిన్ డోసులు కావాలని, వీరికి వ్యాక్సిన్ ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. కాగా కేంద్రం కేటాయించిన ఆక్సిజన్, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు సహా ఇతర మందులు నిర్ణీత సమయంలోగా రాష్ట్రానికి చేరేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. అలాగే తమిళనాడు నుంచి ఆక్సిజన్ రానందున ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ అందించాలని కూడా ఆదేశించింది. కాల్ సెంటర్లకు అనూహ్య స్పందన: ఏజీ కరోనా రోగుల కోసం హితం యాప్ అందుబాటులోకి తెచ్చామని, అలాగే కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేశామని, వీటికి అనూహ్య స్పందన లభిస్తోందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. అయితే కరోనా చికిత్సలకు సంబంధించిన సమాచారం తెలియజేసేలా అన్ని జిల్లాల్లో టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలని, అలాగే వీటిని అనుసంధానిస్తూ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ధర్మాసనం సూచించింది. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో మొబైల్ వ్యాన్ల ద్వారా పరీక్షలు చేయాలని ఆదేశించింది. ఆస్పత్రుల సిబ్బంది బ్లాక్మార్కెటింగ్ చేస్తున్నారు: డీజీపీ కరోనా నియంత్రణ ఆంక్షలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా 859 పెట్రోలింగ్ వాహనాలు, 1,523 ద్విచక్ర వాహనాలతో నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నామని డీజీపీ మహేందర్రెడ్డి నివేదించారు. కరోనా నియంత్రణ మందులను అక్రమంగా విక్రయిస్తున్న 39 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. ఆసుపత్రుల సిబ్బందే ఎక్కువగా మందులను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని తెలిపారు. దీంతో మందులను బ్లాక్మార్కెట్లో విక్రయిస్తున్న వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి హైకోర్టు స్పష్టం చేసింది. మాస్కు లేకుండా వెళ్తున్న వారి వాహనాలను సీజ్ చేసే విషయాన్ని పరిశీలించాలని, ఈ మేరకు పోలీసులకు అధికారాలను కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆసుపత్రుల వద్ద హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేయాలి భౌతికదూరం పాటింపు విషయంలో రెవెన్యూ, స్థానిక సంస్థల అధికారులతో కలిసి ఫంక్షన్ హాల్స్, పార్కులు, మైదానాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని కోర్టు సూచించింది. అలాగే ఆసుపత్రుల దగ్గర రోగులు, వారి సహాయకులు అయోమయానికి గురవుతున్నారని, వారి కోసం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డీజీపీని ఆదేశించింది. అంత్యక్రియల కోసం ఎన్ని స్మశానాలు ఏర్పాటు చేశారు? అందులో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి? జైళ్ళలో ఉన్న ఖైదీలు, వృద్ధులు, వికలాంగులు తదితరులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ? తదితర వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది. లక్ష టెస్టులు చేసేలా చర్యలు తీసుకోండి గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు, కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై రెండురోజుల్లో నిపుణులతో కమిటీ వేయాలని, కమిటీ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన మినిట్స్ సమర్పించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేశామని, ఆన్లైన్లో సమావేశమవుతోందన్న ప్రభుత్వ వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రోజూ లక్ష కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలన్న తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. పరీక్షలు పెంచాలని పదేపదే ఆదేశించినా తగ్గిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షల సంఖ్య తగ్గించడం ద్వారా వాస్తవ కేసుల సంఖ్య ఎలా తెలుస్తుందని, రోజూ లక్ష పరీక్షలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. చదవండి: విషాదం: కరోనాతో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి మృతి శ్మశానానికి దారి చూపుతూ నాయకుల ఫ్లెక్సీలు.. సిగ్గుందా మీకు! -
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు
-
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు
సాక్షి, హైదరాబాద్: కీలకమైన పదో తరగతి, ఇంటర్ పరీక్షలపై ఉత్కంఠకు ప్రభుత్వం ముగింపు పలికింది. రాష్ట్రంలో మే 17వ తేదీ నుంచి నిర్వహించాల్సిన పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షల రద్దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే మే 1వ తేదీ నుంచి నిర్వహించాల్సిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలనూ ఇప్పుడు నిర్వహించే పరిస్థితి లేనందున రద్దు చేసి విద్యార్థులందరినీ ప్రమోట్ చేసింది. మే 2వ తేదీ నుంచి నిర్వహించాల్సిన ద్వితీయ సంవత్సర పరీక్షలను వాయిదా వేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ద్వితీయ సంవత్సర పరీక్షల నిర్వహణకు సంబంధించి జూన్ మొదటి వారంలో కరోనా కేసుల పరిస్థితిని సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటామని, 15 రోజుల ముందుగా పరీక్షల తేదీలను తెలియజేస్తామని వెల్లడించారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే జూన్ చివరి వారంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంటుంది. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై గురువారం ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సత్యనారాయణరెడ్డితో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పరిస్థితిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆమోదంతో తుది నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలు ఉంటాయా? ఉండవా? అనేది తెలియక కొద్దిరోజులుగా తీవ్ర అయోమయానికి గురైన విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎట్టకేలకు స్పష్టత రావడం ఊరటనిచ్చింది. కేంద్రం నిర్ణయం మేరకు రాష్ట్రంలోనూ.. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదో తరగతి పరీక్షలను రద్దు చేసి, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ బుధవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అదే విధంగా పదో తరగతి పరీక్షలను, ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చిత్రా రామచంద్రన్ జారీ చేసిన ఉత్తర్వుల్లో వెల్లడించారు. సెకండియర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఏమైనా బ్యాక్లాగ్స్ (ఫస్టియర్లో ఫెయిల్ అయిన సబ్జెక్టులు) ఉంటే వారికి ఆయా సబ్జెక్టుల్లో కనీస పాస్ మార్కులు ఇస్తామని పేర్కొన్నారు. టెన్త్లో ఎఫ్ఏ–1 మార్కుల ఆధారంగా గ్రేడ్లు! ప్రస్తుతం రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యేందుకు 5,21,000 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. అందులో రెగ్యులర్ విద్యార్థులతో పాటు గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఉన్నారు. గతంలో ఫెయిల్ అయిన వారికి ఆయా సబ్జెక్టుల్లో కనీస మార్కులతో పాస్ చేయనున్నారు. ఇక రెగ్యులర్ విద్యార్థుల విషయంలో ఫార్మేటివ్ అసెస్మెంట్–1 (ఎఫ్ఏ) మార్కుల ఆధారంగా గ్రేడ్స్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం నాలుగు ఎఫ్ఏలకు బదులు రెండు ఎఫ్ఏలను నిర్వహించాలనుకున్నా ఒక ఎఫ్ఏ పరీక్షలే జరిగాయి. వాటిల్లో ఒక్కో సబ్జెక్టులో వచ్చిన మార్కులనే 100 శాతానికి లెక్కించి వచ్చే మార్కుల ఆధారంగా గ్రేడ్లను ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే కనీస మార్కులతో అందరినీ పాస్ చేసేలా చర్యలు చేపట్టే అవకాశం కూడా ఉంది. అయితే సీబీఎస్ఈ, ఇతర రాష్ట్రాల పదో తరగతి పరీక్షల విభాగాలు తీసుకునే నిర్ణయాలను పరిశీలించిన తరువాతే టెన్త్ విద్యార్థులకు మార్కులను కేటాయించే అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది. గతేడాది కూడా టెన్త్ పరీక్షలు రద్దయ్యాయి. అయితే ఆ విద్యా సంవత్సరంలో నాలుగు ఎఫ్ఏ పరీక్షలు జరిగాయి. వాటి ఆధారంగా విద్యార్థులకు మార్కులను కేటాయించడం సులభమైంది. అయితే ఈసారి ఎఫ్ఏ–1 మార్కులతోపాటు సీబీఎస్ఈ, ఇతర రాష్ట్రాల్లో విధానాలను అన్నింటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆ నిర్ణయం మేరకు విద్యార్థులకు మార్కులను కేటాయించనున్నారు. ఇంటర్ విద్యార్థులు 11,31,994 మంది ఇంటర్మీడియట్ పరీక్షల కోసం ఎదురుచూసిన విద్యార్థులు 11,31,994 మంది ఉన్నారు. వారిలో ప్రథమ సంవత్సర రెగ్యులర్, వొకేషనల్ విద్యార్థులు 4,59,008 మంది ఉన్నారు. ఇప్పుడు వీరందరిని పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేయనున్నారు. వారితోపాటు గతేడాది రెగ్యులర్, వొకేషనల్, ప్రైవేటు విద్యార్థులు 1,99,019 మంది ప్రథమ సంవత్సరంలో ఫెయిల్ అయ్యారు. వారిని కూడా ఇప్పుడు ప్రమోట్ చేయనున్నారు. కరోనా కారణంగా గతేడాది ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించలేదు. దీంతో ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకొని వెళ్లిపోయే దాదాపు 1.47 లక్షల మంది విద్యార్థులను కనీస మార్కులతో పాస్ చేసి పంపించారు. గతేడాది మార్చిలో జరిగిన వార్షిక పరీక్షల్లో ప్రథమ సంవత్సరంలో ఫెయిల్ అయిన 1,99,019 మందిని అప్పుడు పాస్ చేయలేదు. ఇపుడు ప్రథమ సంవత్సర పరీక్షలను రద్దు చేసినందున వారిని కూడా ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక 4,73,967 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థుల పరీక్షలను వాయిదా వేసింది. జూన్ మొదటివారంలో పరిస్థితి సమీక్షించి వారికి పరీక్షలు నిర్వహించే తేదీలను ఖరారు చేయనుంది. స్వాగతించిన ఇంటర్ విద్యా జేఏసీ ప్రథమ సంవత్సర పరీక్షలు రద్దు చేసి, ద్వితీయ సంవత్సర పరీక్షలను వాయిదా వేయడాన్ని ఇంటర్ విద్యా జేఏసీ ఛైర్మన్ డాక్టర్ పి.మధుసూదన్రెడ్డి, సెక్రటరీ జనరల్ డాక్టర్ కళింగ కృష్ణ కుమార్ స్వాగతించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో గతేడాది ప్రథమ సంవత్సరంలో ఫెయిల్ అయిన వారందరికి ఉపశమనమని, వారు ఇక ద్వితీయ సంవత్సర పరీక్షలు రాస్తే సరిపోతోందని వివరించారు. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. టెన్త్లో ‘ఎఫ్ఏ–1’ ఆధారంగా... పదో తరగతి రెగ్యులర్ విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్–1 (ఎఫ్ఏ) మార్కుల ఆధారంగా గ్రేడ్స్ ఇచ్చే చాన్స్ ఉంది. ప్రస్తుతం ఒక ఎఫ్ఏ పరీక్షలే జరిగాయి. వాటిల్లో ఒక్కో సబ్జెక్టులో వచ్చిన మార్కులనే 100 శాతానికి లెక్కించి గ్రేడ్లను ఇచ్చే అవకాశం ఉంది. ఇంటర్ వెయిటేజీ ఉండదు.. ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులకు ఇచ్చే 25% వెయిటేజీని ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఈసారి అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ కీలకం కానుంది. ఆ మార్కుల ఆధారంగా ఎంసెట్ కమిటీ ర్యాంకులను కేటాయించనుంది. ప్రమోట్ చేస్తున్నాం... కానీ ప్రథమ సంవత్సర విద్యార్థులను పరీక్షలు లేకుం డానే ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్ చేయనున్నారు. ఫస్టియర్ విద్యార్థులు మరో సంవత్సరం పాటు ఉంటారు కనుక భవిష్యత్తులో సాధారణ పరిస్థితులు వస్తే పరీక్షలు నిర్వహించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. చదవండి: CBSE పదో తరగతి పరీక్షలు రద్దు -
తెలంగాణలో రైతు రుణమాఫీకి సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీకి సర్వం సిద్ధమైంది. రూ. లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేస్తామన్న ప్రభుత్వ హామీ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం 36.80 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులని తేలగా అందులో గతేడాది 2.96 లక్షల మంది రైతులకు చెందిన రూ. 25 వేల వరకు రుణాలపై రూ. 408 కోట్లను ప్రభుత్వం మాఫీ చేసింది. 2021–22 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో రుణమాఫీ కోసం ప్రభుత్వం రూ. 5,225 కోట్లు కేటాయించింది. అయితే ఈసారి ఏ రకంగా రుణమాఫీ సొమ్ము విడుదల చేయాలన్న దానిపై వ్యవసాయ శాఖ కసరత్తు చేసింది. అందుకోసం రెండు రకాల ఆప్షన్లను ప్రభుత్వం ముందుంచింది. గతంలో రూ. 25 వేల వరకు రుణాలు మాఫీ చేసినందున ఈసారి రూ. 25 వేల నుంచి రూ. 50 వేల మధ్య ఉన్న రైతుల పంట రుణాలను మాఫీ చేయాలన్నది ఒక ఆప్షన్. ఈ కేటగిరీలో 8.02 లక్షల మంది రైతులు అర్హులుగా తేలారు. వారి కోసం రూ. 4,900 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. ఇక రెండోది ప్రతి ఒక్కరికీ రూ. 25 వేలు మాఫీ చేయాలన్న ఆప్షన్ను తయారు చేశారు. అంటే రూ. 25 వేల నుంచి రూ. లక్షలోపు రుణాలున్న వారందరికీ రూ. 25 వేలు మాఫీ అవుతాయన్నమాట. ఈ ఆప్షన్ ప్రకారం చూస్తే 13.45 లక్షల మంది రైతులు అర్హులుగా తేలారు. అందుకోసం రూ. 5,100 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం మాత్రం రెండో ఆప్షన్ వైపే మొగ్గుచూపుతోందని వ్యవసాయ అధికారి ఒకరు తెలిపారు. వాస్తవంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం ప్రతి ఒక్కరికీ ఊరటనిచ్చే విధంగానే రుణమాఫీ సొమ్ము విడుదల చేయాలి. కాబట్టి ఆ ప్రకారమే సర్కారు నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. రుణమాఫీకి సంబంధించి ఈ రెండు ఆప్షన్ల ప్రకారం రైతుల జాబితాను సిద్ధంగా ఉంచామని, ఆ మేరకు వివరాలను సర్కారుకు పంపించామని అధికారులు తెలిపారు. వీలైనంత త్వరలో సొమ్ము విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. చదవండి: రుణమాఫీ నిధులు విడుదల చేయాలి -
ఓటేసి గెలిపించండి: తెలంగాణ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసులు మరో ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ఉన్నారు. తాజాగా టెక్నాలజీ అమ లు విభాగంలో స్కోచ్ సంస్థ పలు దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ రేసులో ఉన్న తమను ఓటేసి గెలిపించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మహిళల రక్షణకు పోలీసు శాఖ పలు క్యాబ్సరీ్వసులతో కలిసి వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. రాత్రిపూట పనిచేసే మహిళా ఉద్యోగినుల కోసం హాక్ఐ యాప్ను అందిస్తోంది. దాన్ని డౌన్లోడ్ చేసుకున్నవారు క్యాబ్లలో ప్రయాణించేటప్పుడు ఏదైనా ఆపద ఎదురైతే ఎస్ఓఎస్ బటన్ నొక్కగానే ఏసీపీ, సీఐ, కంట్రోల్రూమ్, పెట్రోలింగ్ వాహనాలతోపాటు మొత్తం ఏడు విభాగాలకు ఎమర్జెన్సీ సందేశం వెళ్తుంది. ఈ సేవలు అందిస్తున్న పోలీసులకు ప్రజలు స్కోచ్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని ఓటేయాలని పోలీసుశాఖ కోరుతోంది. చదవండి: ఆర్బీకేలకు ‘స్కోచ్ గోల్డ్’ అవార్డు -
45 ఏళ్లు దాటితే కరోనా టీకా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కోటి మందికి కరోనా టీకాలు వేయాలని వైద్య, ఆరోగ్య శాఖ లక్ష్యంగా నిర్దేశించింది. 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45–59 ఏళ్ల మధ్య ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మాత్రమే టీకాలు వేస్తున్నారు. అయితే 45–59 ఏళ్ల మధ్య వయసున్న వారిలో సాధారణ వ్యక్తులందరికీ కూడా వ్యాక్సిన్ వేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ఆ వయసు వారిలో కొత్తగా 30 లక్షల మంది వ్యాక్సిన్కు అర్హులవుతారు. వారందరూ కలిపి కోటి మంది అవుతారని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. 45–59 ఏళ్ల వయసులోని అందరికీ టీకా వేయాలన్న విషయంపై కేంద్రానికి ప్రతిపాదనలు చేసినట్లు ఓ ఉన్నతస్థాయి అధికారి తెలిపారు. ఇటీవల కేంద్రంతో జరిగిన సమావేశంలో ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ప్రతిపాదనను ముందుపెట్టింది. త్వరలో దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. కేసులు విస్తరిస్తుండటంతో.. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జనవరి 16న ప్రారంభమైంది. మొదట వైద్య సిబ్బందికి, తర్వాత ఫ్రంట్లైన్ వర్కర్లకు టీకావేశారు. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45–59 ఏళ్ల మధ్య ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా వేస్తున్నారు. ఇప్పటివరకు 8.75 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో టీకా వేస్తున్నారు. వాస్తవంగా ఈ నాలుగు కేటగిరీలతో కలిపి రాష్ట్రంలో మొత్తం 60 లక్షల మందికి టీకా వేయాలనుకున్నారు. అందులో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లు దాదాపు 6 లక్షలు కాగా, 10 లక్షల మంది 45–59 ఏళ్ల మధ్య ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నారు. 60 ఏళ్లు పైబడిన వారు 54 లక్షల మంది ఉన్నారు. వీరుకాక 45–59 ఏళ్ల మధ్య వయసున్న వారు సుమారు 30 లక్షల మంది ఉంటారని అంచనా వేశారు. దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు విస్తృతంగా పెరుగుతున్నాయి. మరో 2 నెలల్లో పరిస్థితి చేయి దాటిపోతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో విస్తృతంగా టీకాలు వేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. 45 ఏళ్లు పైబడిన వారందరికీ వేస్తే వైరస్ వ్యాప్తి అరికట్టొచ్చని కేంద్రానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విన్నవించింది. అందుకు కేంద్రం కూడా సుముఖంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిరంతరాయంగా వ్యాక్సిన్ వేసేలా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 20 పడకలకు పైగా ఉన్న అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ జరగనున్నట్లు చెబుతున్నారు. -
సర్పంచ్లకు శుభవార్త.. ఇక నుంచి నేరుగా!
సాక్షి, నల్లగొండ : సర్పంచ్లకు ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం ఇకనుంచి నేరుగా వారి ఖాతాల్లోనే జమ కానుంది. ఇప్పటివరకు గ్రామపంచాయతీ ఖాతాల్లో జమ చేయడం.. వాటిని డ్రా చేసే సందర్భంలో కొన్ని పంచాయతీల్లో ఇబ్బందులు తలెత్తుతుండడంతో సర్పంచ్లంతా నేరుగా తమ ఖాతాల్లోనే జమ చేయాలని చేసిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత జనవరి మాసం నుంచి వేతనాలు బకాయిలు ఉన్నాయి. ఒకేసారి మార్చి వరకు మూడు మాసాల వేతనాన్ని విడుదల చేసి వాటిని నేరుగా సర్పంచ్ల వ్యక్తిగత ఖాతాల్లోనే జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లా పంచాయతీ అధికారి ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 844 గ్రామపంచాయతీలు ఉన్నాయి. అందులో 7 గ్రామపంచాయతీలు నకిరేకల్ మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో అక్కడ సర్పంచ్లు లేరు. ఐదుగురు సర్పంచ్లు సస్పెన్షన్కు గురికాగా అక్కడ ఉప సర్పంచ్లకు బాధ్యతలను అప్పగించారు. ఇద్దరు సర్పంచ్లు జెడ్పీటీసీలుగా ఎన్నిక కావడంతో అక్కడ కూడా ఉప సర్పంచ్లు బాధ్యతుల నిర్వహిస్తున్నారు. ఈ ఏడుగురికి కూడా గౌరవ వేతనం పొందే అవకాశం కల్పించారు. కొన్ని గ్రామాల్లో ఇబ్బందులు నూతన పంచాయతీ చట్టం ప్రకారం సర్పంచ్, ఉప సర్పంచ్లకు ప్రభుత్వ చెక్ పవర్ ఇచ్చింది. గ్రామ పంచాయతీ ఖాతాల్లో నిధులు డ్రా చేయాలంటే ఉప సర్పంచ్ సంతకం తప్పనిసరి. ఈ సందర్భంలో కొన్ని చోట్ల సర్పంచ్, ఉప సర్పంచ్ల మధ్య రాజకీయ విభేదాలు ఏర్పడడంతో సర్పంచ్లు గౌరవ వేతనం తీసుకునే సందర్భంలో ఉప సర్పంచ్లు సంతకం పెట్టని సంఘటనలు చోటు చేసుకున్నాయి. తమకు గౌరవంగా ఇచ్చే వేతనాన్ని పొందేందుకు కూడా ఉప సర్పంచ్ల సంతకం వల్ల చిన్నచూపు చూస్తున్నారన్న ఉద్దేశంతో సర్పంచ్లు పదే పదే ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. ఈ నెల నుంచి నేరుగానే వేతనాలు ఇప్పటినుంచి నేరుగానే సర్పంచ్ల గౌరవవేతనాన్ని వారి సొంత ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత జనవరి మాసం వేతన బకాయితోపాటు నడుస్తున్న ఫిబ్రవరి, మార్చితో కలిపి 3 నెలల గౌరవవేతనాన్ని ఒకేసారి 1,25,55,000 రూపాయలను ప్రభుత్వం విడుదల చేసి డీపీఓ అకౌంట్లలో జమ చేసింది. రెండు మూడు రోజుల్లో ఆయా సర్పంచ్ల ఖాతాల్లో నేరుగా వేతనాలు జమ కానున్నాయి. మూడు మాసాల వేతనం ఒకేసారి.. సర్పంచ్లకు జనవరి నుంచి వచ్చే మార్చి మాసం వరకు మూడు మాసాల గౌరవ వేతనాన్ని 5వేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఒకేసారి విడుదల చేసింది. గతంలో పంచాయతీ ఖాతాల్లో జమ చేసేవాళ్లం. ప్రస్తుతం నేరుగా సర్పంచ్ల ఖాతాల్లోనే జమ చేయాలని ఆదేశాలు అందాయి. రెండు మూడు రోజుల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. – డీపీఓ విష్ణువర్ధన్రెడ్డి -
‘దుమ్ము’ దులపండి..!
సాక్షి, హైదరాబాద్: విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గతేడాది మార్చి రెండో వారం నుంచి మూతబడ్డ విద్యా సంస్థలు... వచ్చేనెల ఒకటో తేదీ నుంచి తెరుచుకోనున్నాయి. సుదీర్ఘకాలం మూతబడి ఉండటంతో చెట్లు, పొదలు పెరిగాయి. తరగతి గదులు, బెంచీలు దుమ్ముపట్టాయి. అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో స్వచ్ఛత కార్యక్రమాన్ని స్థానిక సంస్థలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. పాఠశాల/ కళాశాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్ వినతికి తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలన్నీ కలిపి 30 వేల వరకు ఉన్నాయి. ఇవన్నీ దాదాపు పది నెలలకు పైగా మూతబడి ఉన్నాయి. ఆన్లైన్ బోధన సాగుతున్న క్రమంలో విద్యా సంస్థలను తెరిచి ఉపాధ్యాయుల హాజరుకు అనుమతిచ్చినప్పటికీ పారిశుధ్యంపై స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో బోధన సిబ్బంది కూర్చునే హాల్, రెస్ట్రూమ్ వరకు శుభ్రం చేశారు. విద్యార్థుల తరగతి గదులు, ప్లేగ్రౌండ్ శానిటైజేషన్ను పట్టించుకోలేదు. చదవండి: పాతపంట.. కొత్త సంబురం 20లోగా క్లీన్ చేయాలి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విద్యా సంస్థల్లో పారిశుధ్య కార్యక్రమాలు ఈనెల 20వ తేదీలోగా పూర్తి చేయాలి. ఈమేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కళాశాల ప్రిన్సిపాళ్లు... సంబంధిత పం చాయతీ, మున్సిపాలిటీలకు లేఖలు సమర్పిస్తే వెంటనే సిబ్బంది వచ్చి విద్యా సంస్థల ప్రాంగణాలను శుభ్రం చేయాలి. బుష్ కటింగ్, పిచ్చిమొక్కల తొలగింపుతో పాటు నీటి సరఫరా వ్యవస్థ, మురుగునీటి పారుదల వ్యవస్థను పరిశీలిం చి ఆమేరకు మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా స్థాయి విద్యా పర్యవేక్షణ కమిటీ(డీఎల్ఈఎంసీ)లో సభ్యులుగా ఉన్న జిల్లా పంచాయ తీ అధికారి, మున్సిపల్ కమిషనర్లకు శానిటైజేషన్ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని సూచించింది. -
‘మిషన్’ఇన్కంప్లీట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పల్లెకు ఆయువుపట్టు చెరువు. ఆ చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించి చేపట్టిన మిషన్ కాకతీయ మొదట్లో ఒక ఉద్యమంలా సాగినా... చివరకు వచ్చేసరికి నిధుల కొరతతో నీరసించింది. మొదటి రెండు విడతలుగా చేపట్టిన పనులు ఉధృతంగా సాగగా, చివరి రెండు విడతల పనులు పూర్తిగా చతికిలబడ్డాయి. ప్రభుత్వం నుంచి సమగ్రంగా నిధుల కేటాయింపు లేకపోవడం, పెండింగ్ బిల్లుల నేపథ్యంలో 5 వేలకు పైగా చెరువుల పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. 22 వేల చెరువులకు తిరిగి జీవం పోసినా... ఆఖర్లో ప్రభుత్వం నుంచి మునుపటి చొరవ లేకపోవడంతో మిగిలిపోయిన 5 వేల చెరువుల పనులను ఎలా పూర్తిచేయాలో ఇరిగేషన్ శాఖకు పాలుపోవడం లేదు. బిల్లుల బకాయిలు500కోట్లు రాష్ట్రంలో నాలుగు విడతలుగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం కింద 27,625 చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయించగా, అందులో 26,989 చెరువుల పనులు ఆరంభించారు. ఇప్పటి వరకు 22 వేల చెరువుల పనులు పూర్తయ్యాయి. మూడో దశలో 5,958 పనులు చేపట్టగా 2,040 చెరువుల పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. వీటిని రెండేళ్ల కిందట జూన్ నాటికే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టినా అవి ముందుకు సాగడం లేదు. ఇక 4వ విడతలో 4,214 చెరువుల పనుల్లో మరో 2,472 పనులు పూర్తి కాలేదు. ఇలా నాలుగు విడతల్లో కలిపి మొత్తం 5,553 పనులు పెండింగ్లో ఉన్నాయి. భారీ ప్రాజెక్టుల అవసరాలకే నిధుల మళ్లింపు జరగడంతో ఈ పనులకు అనుకున్న మేర నిధుల ఖర్చు జరగలేదు. దీంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. బిల్లుల చెల్లింపుపై ఆర్థిక శాఖకు పదేపదే విన్నవిస్తున్నా, అరకొర నిధులను విదిల్చి చేతులు దులుపుకుంటోంది. దీంతో ఇటీవలే కల్పించుకున్న ఇరిగేషన్ శాఖ రూ.25 లక్షల కన్నా తక్కువ బిల్లులున్న వాటికి నిధులు ఇప్పించడంలో చొరవ చూపడంతో 260 చెరువులకు సంబంధించిన బిల్లులు చెల్లించారు. అయినప్పటికీ మరో రూ.500 కోట్ల మేర బిల్లులు పెండింగ్లో ఉండటంతో ఈ పనులు ఎప్పటికి పూర్తవుతాయన్న దానిపై స్పష్టత లేదు. ఇరిగేషన్ పునర్ వ్యవస్థీకరణతో వీటిపై దృష్టి పెట్టేదెపుడో? ఇక శాఖ పునర్వ్యవస్థీకరణతో మైనర్ ఇరిగేషన్ విభాగం పూర్తిగా రద్దయింది. అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తేవడంతో మైనర్ ఆయా డివిజన్ల సీఈల పర్యవేక్షణలోకి వెళ్లింది. ఈ పునర్వ్యవస్థీకరణ మేరకు చెరువుల ఒప్పందాల పైళ్ల విభజన, పని విభజన జరగాల్సి ఉంది. అనంతరం డివిజన్ల వారీగా వీటి పురోగతిని సీఈలు పరిశీలించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చెక్డ్యామ్ల టెండర్లు, వాటి ఒప్పందాలు, పనుల కొనసాగింపు ప్రక్రియ జరుగుతోంది. ఈ తరుణంలో పెండింగ్ చెరువుల పనులపై వీరెంత దృష్టి సారిస్తారన్నది చూడాలి. -
మీకిది సబబేనా సారూ!
సాక్షి, హైదరాబాద్: ఆయిల్ఫెడ్– సర్కారుకు మధ్య వివాదం తలెత్తింది. ఆయిల్పాం నోటిఫై ఏరియాను ప్రైవేటుకు ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సర్కారుకే ఆయిల్ఫెడ్ లేఖ రాయడం సంచలనం రేపుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేసే సహకార సంస్థ... ప్రభుత్వ నిర్ణయాన్నే సవాల్ చేయడం గమనార్హం. ఇప్పటివరకు రాష్ట్రంలో ఆయిల్ఫెడ్ చేతిలోనే ఉన్న ఆయిల్పాం సాగు, కొత్త ఏరియాల్లో ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడంతో వివాదం మొదలైంది. రాష్ట్రంలో కొత్తగా 25 జిల్లాల్లో 8,24,162 ఎకరాలు ఆయిల్పాం సాగుకు అనువైన ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. అందులో దాదాపు 8 లక్షల ఎకరాలను 13 ప్రైవేటు కంపెనీల పరిధిలోకి తీసుకురావడం, ఆయిల్ఫెడ్కు కేవలం 24,500 ఎకరాలు (2.97 శాతం) కేటాయిస్తూ వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్థన్రెడ్డి ఇటీవల ఉత్తర్వులు జారీచేయడం... ఆయిల్ఫెడ్ అధికారులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. దీనిపై ఆయిల్ఫెడ్ నేరుగా ప్రభుత్వానికే లేఖాస్త్రం సంధించడం కలకలం రేపుతోంది. ఆయిల్ఫెడ్ అధికారులకు, ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 3.07 లక్షల ఎకరాలకు దరఖాస్తు చేస్తే ‘కేంద్రం 25 జిల్లాల్లో 8.24 లక్షల ఎకరాలను నోటిఫై చేసింది. అందులో భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో 99,985 ఎకరాలు, గద్వాల, మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్కర్నూలు, వనపర్తి జిల్లాల్లో 50 వేల ఎకరాలు, మంచిర్యాల, కొమురంభీం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో 1.57 లక్షల ఎకరాలు మాకు కేటాయించాలని కోరాం. మొత్తంగా 12 జిల్లాల్లో 3.07 లక్షల ఎకరాలు కోరుతూ ఉద్యానశాఖకు దరఖాస్తు చేశాం. కానీ ప్రభుత్వం 22 జిల్లాల్లోని 7,99,662 ఎకరాలను 13 ప్రైవేట్ కంపెనీలకు కేటాయించింది. ఆయిల్ఫెడ్కు మాత్రం కేవలం 24,500 ఎకరాలే ఇచ్చింది’అని ఆయిల్ఫెడ్ ప్రభుత్వానికి రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. అందులో గద్వాల, నారాయణపేట జిల్లాల్లో కొత్తగా 20 వేల ఎకరాలు కేటాయించగా, ఇప్పటికే తమ పరిధిలోని కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో 4,500 ఎకరాలు కేటాయించినట్లు పేర్కొంది. 1993 నుంచి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో 41,232 ఎకరాలు ఆయిల్ఫెడ్ పరిధిలో ఉందని, అందుకోసం రెండు అధునాతన ఫ్యాక్టరీలను నెలకొల్పామని పేర్కొంది. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా, ఇప్పటికే తమ పరిధిలో ఉన్న ఆయిల్పాంను కూడా ప్రైవేటుకు కేటాయించడంపై విస్మయం వ్యక్తం చేసింది. కోట్లు ఖర్చుచేస్తే ప్రైవేటుకు ఇవ్వడమేంటి? ఈ ఏడాది జనవరిలో పూర్వ మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఆయిల్పాం సాగును ప్రోత్సహించే ఉద్దేశంతో పైలెట్ ప్రాజెక్టు కింద నర్సరీలు చేపేట్టేందుకు ఆయిల్ఫెడ్కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2020–21లో గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లిలో, మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోనూ ఆయిల్పాం నర్సరీని ఆయిల్ఫెడ్ నెలకొల్పింది. ఈ రెండింటి పరిధిలో 7 వేల ఎకరాలు కేటాయించారు. అందుకోసం ఆయిల్ఫెడ్ రూ. 6 కోట్లు కూడా కేటాయించింది. ఇంతటి కృషిచేస్తే గద్వాల, నారాయణపేట జిల్లాలను మినహా మిగిలిన ఏరియాలను ఆయిల్ఫెడ్కు బదులు ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం ఏమాత్రం సమంజసం కాదని లేఖలో ఆయిల్ఫెడ్ పేర్కొంది. 30 ఏళ్ల అనుభవం ఉన్న ఆయిల్ఫెడ్కు అన్యాయం జరిగిందని తెలిపింది. కాబట్టి ఇప్పటికైనా 15 శాతం ఆయిల్పాం నోటిఫై ఏరియాను తమకు కేటాయించాలని విన్నవించింది. నేను కూడా లేఖ రాస్తా: కంచర్ల రామకృష్ణారెడ్డి, ఛైర్మన్, ఆయిల్ఫెడ్ అనుకున్నంత ఏరియా ఆయిల్ఫెడ్కు రాలేదనేదే నా ఆవేదన. రైతులకు న్యాయం జరగాలంటే అన్ని ప్రాంతాల్లోనూ ఆయిల్ఫెడ్కు కొంతమేరకు ఆయిల్పాం సాగు పరిధిని పెంచాలి. ఈ విషయంపై ఇప్పటికే ఆయిల్ఫెడ్ ప్రభుత్వ ఉన్నతాధికారులకు లేఖ రాసింది. నేను కూడా లేఖ రాస్తాను. అవసరమైతే సీఎంకు విన్నవిస్తాను. -
కొలిక్కి వస్తున్న లెక్కలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలపై లెక్క దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. ఈ లెక్కల కోసం గత మూడు రోజులుగా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ), ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, అధిపతులతో భేటీ అయి ఖాళీల వివరాలను సేకరించారు. దాదాపు 50 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించిన నేపథ్యంలో సీఎస్ సోమేశ్కుమార్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ సమావేశాలు జరిగాయి. గురు, శుక్ర, శనివారాల్లో జరిగిన ఈ సమావేశాల్లో భాగంగా కొన్ని శాఖల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం రాలేదని, దాదాపు 40 వేలకుపైగా పోస్టుల లెక్క తేలిందని తెలుస్తోంది. మిగిలిన శాఖల నుంచి పూర్తి స్థాయిలో లెక్కలు వస్తే ఆ సంఖ్య 50 వేలు దాటుతుందని అంచనా. కాగా, వివిధ శాఖల్లోని ఖాళీ పోస్టులను ప్రాధాన్యతల వారీగా భర్తీ చేయాలని, అన్నీ ఒకేసారి కాకుండా అత్యవసర ఖాళీలను ముందు భర్తీ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శాఖల వారీగా వచ్చే ఖాళీల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను త్వరలోనే జీఏడీ అధికారులు సీఎం కేసీఆర్కు సమర్పించనున్నారు. ఈ నివేదిక ప్రకారం వారం రోజుల్లో సమీక్షించనున్న సీఎం కేసీఆర్.. ఉద్యోగ ఖాళీల విషయంలో అనుసరించాల్సిన విధానంపై తుది నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, మరికొన్ని శాఖలకు సంబంధించిన కసరత్తు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. పాఠశాల విద్యకు సంబంధించిన లెక్కలు సోమ, మంగళ వారాల్లో జీఏడీ, ఆర్థిక శాఖలకు అందించనున్నట్లు సమాచారం. ఈ సమాచారం మేరకు టీచర్ పోస్టుల ఖాళీలపై ఓ స్పష్టత రానుంది. -
తెలంగాణలో పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పాత పద్ధతిలోనే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. సోమవారం నుంచి యథావిధిగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుంది.ప్రస్తుతానికి కార్డు (CARD) పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ముందస్తు స్లాట్ బుకింగ్ నిలిపివేశారు. ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి కేటాయించిన తేదీల్లో రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. స్లాట్ బుకింగ్లు ఎవరూ అడగవద్దని.. కార్డు పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగంగా కొనసాగాలని ఆదేశించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకూడదని ఆదేశించారు. కాగా, వ్యవసాయేతర లావాదేవీల నమోదు 2020 డిసెంబర్ 14 న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆధార్ వివరాలు అడగకుండా మాన్యువల్కు మార్పులు చేసే దాకా స్లాట్ బుకింగ్ను ఆపాలని గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో పాత పద్దతిలో రిజిస్ట్రేషన్లు జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. కరోనా నిర్ధారణ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కరణ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు ఉత్తర్వులు సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్.సుభాష్రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ఎన్కే కౌల్ వాదనలు వినిపిస్తూ.. కరోనా కట్టడికి అవసరమైన అన్ని పరీక్షలు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. రోజుకు 50 వేల పరీక్షలు చేయడం కష్టమని వివరించారు. అనంతరం 2020 నవంబర్ 19న హైకోర్టు జారీ చేసిన ఆదేశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఫిర్యాదు రాలేదని, హైకోర్టు సుమోటో ధిక్కార చర్యలకు సంబంధించి మాత్రమే ఫిర్యాదు ఉందని కౌల్ వివరించారు. ప్రతివాదులు ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. సుమోటో ధిక్కార చర్యల కేసుకు సంబంధించి హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తున్నామని పేర్కొంది. రోజుకు 50 వేలు, వారానికోసారి లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్న ఆదేశాలు పాటించడం లేదని తెలంగాణ హైకోర్టు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. 21న కలెక్టరేట్ల వద్ద ప్రభుత్వోద్యోగుల ధర్నా సాక్షి, హైదరాబాద్: పీఆర్సీ అమలు, బకాయి ఉన్న రెండు డీఏలను విడుదల చేయాలనే డిమాండ్పై ఈనెల 21వ తేదీన ఆందోళనలు చేపడతామని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు సంపత్కుమారస్వామి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులంతా పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
నో డ్యూ ఉంటేనే రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం ధరణి పోర్టల్ ద్వారా సబ్ రిజిస్ట్రార్కు దరఖాస్తు చేసుకోవడానికి ముందు తప్పనిసరిగా సంబంధిత మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్తో పాటు సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) నుంచి ‘నో డ్యూ’సర్టిఫికెట్ పొందాలని రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొ చ్చింది. రిజిస్ట్రేషన్ దస్తావేజు ద్వారా వ్యవసాయేతర ఆస్తి యాజమాన్య హక్కుల బదిలీ చేయాలని కోరుకున్నా, విక్రయం, కానుక, తనఖా, బదిలీ చేయాలనుకున్నా ఈ నిబంధన వర్తి స్తుందని స్పష్టం చేసింది. దరఖాస్తు దారుడు తన వీలును బట్టి అందు బాటులో ఉన్న తేదీ, సమయం కోసం ధరణి పోర్టల్ ద్వారా సబ్ రిజిస్ట్రార్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆస్తి పన్నులు, ఇతర బకాయిలేవీ లేవని మున్సిపాలిటీ/కార్పొరేషన్ నుంచి, విద్యుత్ బిల్లుల బకాయిలు ఏవీ లేవని డిస్కంల నుంచి నో డ్యూ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకున్న 4 రోజుల్లోగా పురపాలికలు, డిస్కంలు నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వడంలో విఫలమైతే.. జారీ చేసినట్లే పరిగణిస్తారు. ధరణి పోర్టల్ ద్వారా మున్సిపాలిటీలు/మున్సిపల్ కార్పొరేషన్లలో వ్యవసాయేతర ఆస్తుల మ్యూటేషన్ ప్రక్రియకు సంబంధించిన నిబంధనలు–2020ను ప్రకటిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు.. ► వ్యవసాయేతర ఆస్తుల విక్రయం, తనఖా, గిఫ్టు, మార్పిడి (ఎక్స్చేంజ్)కి జరిపే రిజిస్ట్రేషన్, హక్కుల రికార్డు(రికార్డ్స్ ఆఫ్ రైట్స్)ల్లో యాజమాన్య మార్పుల ప్రక్రియ చేపట్టాలి. ► రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి సబ్ రిజిస్ట్రార్ తేదీ, సమయం కేటాయించి, ఈ వివరాలను అతడికి తెలపాలి. ఇందుకు సంబంధించిన వివరాలను నిర్దేశిత నమూనాలో రిజిస్టర్లో పొందుపర్చాలి. ► దస్తావేజు రిజిస్ట్రేషన్ రోజు సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ నిర్వహించి, నిర్దేశిత మ్యుటేషన్ చార్జీలు తీసుకున్న తర్వాత ఈ మేరకు సంబంధిత మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన హక్కుల రిజిస్టర్లో తక్షణమే యాజమాన్య హక్కులు మార్పు చేయాలి. విక్రయం, గిఫ్టు, ఎక్స్చేంజీ ద్వారా ఆస్తి బదిలీ చేస్తున్న వ్యక్తి ఖాతా నుంచి ఆస్తిని తొలగించి, బదిలీ చేయించుకున్న వ్యక్తి ఖాతాలో జమ చేయడం ద్వారా తక్షణ మ్యుటేషన్ పూర్తి చేయాలి. ► తనఖా అయితే, ధరణిలో తనఖా లావాదేవీ వివరాలను రికార్డు చేయాలి. ► ఆస్తి రిజిస్ట్రేషన్లో భాగంగానే మ్యుటేషన్ జరగాలి. హక్కుల రికార్డుల్లోని వివరాలు.. ► మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని వ్యవసాయేతర ఆస్తులపై హక్కుల రికార్డులను ధరణి పోర్టల్లో డిజిటల్ రూపంలో తయారు చేసి నిర్వహిస్తారు. ఈ రికార్డుల్లో ఈ వివరాలుంటాయి. ► మున్సిపాలిటీలు/మున్సిపల్ కార్పొరేషన్లు నిర్వహించే ఆస్తుల రిజిస్టర్ ప్రకారం ఆస్తి యజమాని పేరు, సదరు ఆస్తిపై వారసత్వం కలిగిన కుటుంబ సభ్యుల పేర్లు. ► ప్రాంతం (లొకేషన్) వివరాలు, రకం, వినియోగం, విస్తీర్ణం ► ఆస్తి యజమాని, కుటుంబసభ్యుల గుర్తింపును రుజువు చేసేందుకు అవసరమైన ఇతర వివరాలు. ► ప్రతి మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్ తన అధీనంలోని వ్యవసాయేతర ఆస్తుల వివరాలను నిర్దేశిత ఫార్మాట్లో ధరణి పోర్టల్లో పొందుపర్చాలి. ఇందుకు ఒకేసారి అవకాశం ఉంటుంది. ► ప్రతి మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసే ప్రతి భవన నిర్మాణ అనుమతి, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, లేఅవుట్, ప్లాట్ల అనుమతులను నిర్దేశిత ఫార్మాట్లో ధరణి పోర్టల్లో పొందుపర్చాలి. ప్రభుత్వ ఆస్తులకు వర్తించదు... ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన లేదా వీటి నియంత్రణ పరిధిలో ఉన్న వ్యవసాయేతర ఆస్తులకు ఈ నిబంధనలు వర్తించవు. -
చిన్న నిర్మాతలకు అన్యాయం చేశారు
‘‘తెలంగాణ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీకి వరాలు కురిపించిందని ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారు. కానీ చిన్న చిత్రాలకు న్యాయం జరిగినట్లు అనిపించడంలేదు’’ అన్నారు ‘తెలుగు ఫిలిం చాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్’ చైర్మన్ యేలూరు సురేందర్ రెడ్డి. శుక్రవారం ఆయన మాట్లాడుతూ– ‘‘ఓ ఏడాదిలో వచ్చే 200 సినిమాల్లో పెద్ద సినిమాలు 20 నుంచి 30 వరకు ఉంటాయి. మిగిలినవి చిన్నవే. కొత్త నటీనటుల్ని, సాంకేతిక నిపుణులను తీసుకువచ్చేది, సామాజిక స్పృహ ఉన్న చిత్రాలని తీసేది చిన్న నిర్మాతలే. 30 వేల మంది కార్మికులకు పని ఇచ్చేది ఈ నిర్మాతలే. థియేటర్స్లో మధ్యాహ్నం 2 గంటల షో కచ్చితంగా చిన్న సినిమా ప్రదర్శించాలని, షూటింగ్కి ఫ్రీగా లొకేషన్స్ ఇవ్వమని అడిగాం. థియేటర్స్లో సినిమా ప్రదర్శనకు డిజిటల్ ప్రొవైడర్స్ అన్యాయంగా వారానికి 12,000 వేలు వసూలు చేస్తున్నారు. మేమడిగిన ఈ మూడే మూడు డిమాండ్లను పక్కన పడేశారు. సంవత్సరంలో 180 చిత్రాలను తీస్తున్న చిన్న నిర్మాతలకి అన్యాయం చేశారు’’ అన్నారు. -
కరోనా: ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
సాక్షి, హైదరాబాద్ : కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ సర్కారుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వ తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా వైరస్ పరీక్షలపై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు రోజుకు 50 వేల పరీక్షలు చేయాలన్న కోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా అమలు చేయడం లేదని మండిపడింది. అవసరం ఉన్నప్పుడు రోజుకు 50వేల పరీక్షలు చేస్తామని నివేదికలో పేర్కొనడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. యశోద, కిమ్స్, కేర్, సన్ షైన్ ఆస్పత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న హైకోర్టు.. జీహెచ్ఎంసీ ఫలితాలేమో కానీ, ఎన్నికలయ్యాక కరోనా రెండో దశ ఫలితాలు వస్తాయని చురకలంటించింది. రెండో దశ కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు కనిపించడం లేదని మొట్టికాయ వేసింది. తదుపరి విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది. కేసులు ఉన్నపుడే పెంచుతారా: హైకోర్టు ఈ క్రమంలో ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస రావుకు హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని శ్రీనివాస్ రావును హైకోర్టు ఆదేశించింది. రోజుకు 50వేలు, వారానికోసారి లక్ష కరోనా పరీక్షలు చేయాలని ఇటీవల హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రోజుకు 50 వేల పరీక్షలు అవసరం ఉన్నప్పుడు చేస్తామని శ్రీనివాస రావు నివేదికలో పేర్కొనగా.. రోజుకు 50 వేలు, వారానికో రోజు లక్ష కరోనా పరీక్షలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి ఆదేశించింది. కరోనా పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని రాజకీయ సమావేశాలకు అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, ఐసీఎంఆర్ మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. చదవండి: డేటా ఎంతమేరకు భద్రం? జీఎచ్ఎంసీలో మాస్కులు, భౌతిక దూరం వంటి నిబంధనలు సరిగా అమలు కావడం లేదని హైకోర్టు మండిపడింది. కరోనా జాగ్రత్తలకు సంబంధించిన జీవో 64 అమలు బాధ్యత జీహీచ్ఎంసీకి అప్పగించడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జీవో 64 అమలు అధికారం పోలీసులకు అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రైవేట్ ఆస్పత్రుల ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా మరణాలపై ఆడిట్ కమిటీ ఏర్పాటును పరిశీలించాలని తెలిపింది. కరోనా బాధితులకు ధైర్యం కలిగించేలా మానసిక కేంద్రం ఏర్పాటు చేయాలని పేర్కొంది. డిసెంబరు 15లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 17కి వాయిదా వేసింది. -
50 ఏళ్లు దాటిన వారికే తొలి టీకా
సాక్షి, హైదరాబాద్: కరోనా టీకాను మొదటి విడతలో యాభై ఏళ్లు దాటిన వారందరికీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. కరోనా టీకా అందుబాటులోకి వచ్చిన వెంటనే ఎలా పంపిణీ చేయాలనే దానిపై వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం నుంచి కార్యాచరణను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా కరోనా టీకాను వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో ఇచ్చే అవకాశముందని అంచనా. ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం కరోనా వ్యాక్సిన్పై రాష్ట్రాల సీఎంలతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఇందులో ఎవరెవరికి తొలుత టీకా ఇవ్వాలనే దానిపై చర్చ జరిగింది. అలాగే టీకా నిల్వ, పంపిణీ అంశాలపైనా చర్చించారు. టీకా అందరికీ ఉచితంగానే వేస్తారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ టీకాను అందుబాటులో ఉంచుతారని, వాటిల్లో టీకాకు ధర ఉండదని, వేసినందుకు చార్జి వసూలు చేస్తారని అంటున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. వీరికి టీకా లేదు! 75 ఏళ్లు పైబడినవారికి, ఏడాదిలోపు పిల్లలకు మాత్రం కరోనా టీకా ఇచ్చే అవకాశం లేదు. వీరికి టీకా ఇవ్వడం వల్ల దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉందన్న భావనతో ఇవ్వకూడదని భావిస్తున్నారు. దీనిపై నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. టీకా వేసేది వీరే.. కరోనా టీకా వేసే బాధ్యత పూర్తిగా నర్సులు, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలదేనని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపా యి. వారికి టీకాలు వేయడంపై అవగాహన ఉన్నందున ఇబ్బందులుండవని అంటున్నారు. అయినా, వీరికి శిక్షణ ఇవ్వనున్నారు. టీకా వేశాక ఎక్కడైనా ఎవరికైనా సమస్యలు తలెత్తితే చర్యలు తీసుకునేందుకు వీలుగా యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తారు. అందుకోసం ప్రత్యేక వైద్యదళాన్ని ఏర్పాటుచేస్తారు. నిల్వ, పంపిణీ, రవాణా ఇలా.. టీకాను తయారుచేసే కంపెనీల నుంచి దాన్ని తెచ్చి నిల్వ ఉంచాలంటే ప్రత్యేక జాగ్రత్తలు తప్పనిసరి. కొన్ని కంపెనీలు తయారుచేస్తున్న టీకా మైనస్ 70 డిగ్రీల వద్ద నిల్వ ఉంటే, కొన్ని టీకాలు మైనస్ 20 డిగ్రీల వద్ద నిల్వ ఉంచవచ్చు. అయి తే, ఏ కంపెనీల టీకాలు మన వద్దకు వస్తాయన్న దానిపై స్పష్టత లేదు. అయితే టీకాల నిల్వకు కోల్డ్చైన్ వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని వైద్య,ఆరోగ్యశాఖ టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులను ఆదేశించింది. తొలి విడతలో వీరికే.. తొలి విడతలో యాభై ఏళ్లు దాటిన వారందరికీ ఇవ్వాలని తెలంగాణ సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లోని వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది సహా పారిశుద్ధ్య కార్మికులకూ ఇవ్వనుంది. కరోనాపై ముందుండి పోరాడుతున్న పోలీసులు, జర్నలిస్టులు, మున్సిపల్ సిబ్బంది సహా పలు శాఖల్లోని వారికీ తొలి విడతలోనే ఇవ్వనున్నారు. ఇంకా, వివిధ రకాల అనారోగ్యాలతో బాధపడుతున్న యాభై ఏళ్లలోపు వారికీ తొలి విడతలోనే ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. రెండో విడతలో అందరికీ.. మొదటి విడతలో టీకా ఇచ్చిన తర్వాత మిగిలిన వారందరికీ రెండో విడతలో ఇస్తారు. మరోవైపు మొదటి విడతలో మనకంటే ముందు టీకాను తీసుకునే దేశాల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా మార్పుచేర్పులు జరిగే అవకాశం ఉంది. ఇక దేశవ్యాప్తంగా మొదటి విడతలో 30 కోట్ల మందికి టీకా వేస్తారు. తెలంగాణలో దాదాపు 70 నుంచి 75 లక్షల మందికి మొదటి విడతలో వేసే అవకాశాలున్నాయి. ప్రతి ఒక్కరికీ రెండు డోసుల టీకా వేస్తారు. ఒకసారి వేసిన తర్వాత సరిగ్గా నాలుగు వారాలకు అంటే నెలకు మరో డోస్ వేస్తారు. దీన్ని ఇంజక్షన్ రూపంలోనే ఇస్తారు. ఆ వయసు వారికి ఇవ్వకపోవడమే మంచిది.. ఇప్పటికే ఉన్న సమాచారం ప్రకారం ట్రయల్స్లో ఉన్న పలు కోవిడ్ వ్యాక్సిన్ల సామర్థ్యం ఎక్కువే అయినా.. ప్రతి వ్యాక్సిన్కు ఉండే ప్రాణాంతక రియాక్షన్లు దీనికీ ఉండొచ్చు. కాబట్టి వివిధ శారీరక సామర్థ్యాలు తక్కువుండే ఏడాదిలోపు పిల్లలు, 75 ఏళ్లు పైబడిన వృద్ధులకు తొలిదశలో వ్యాక్సిన్ ఇవ్వకపోవడం ఉత్తమం. అందులోనూ వీరిలో చాలామంది ఇంటికే పరిమితమై ఉంటారు కనుక వైరస్ సోకే అవకాశమూ తక్కువే. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల టీకా ఏ కంపెనీదో తెలిస్తే.. కరోనా వ్యాక్సిన్ ఏ కంపెనీది వస్తుందనే స్పష్టత ఉంటే అప్పుడు ఎలాంటి కోల్డ్చైన్ వ్యవస్థ అవసరమో అర్థమవుతుంది. కొన్ని వ్యాక్సిన్లను తక్కువ శీతలీకరణలో భద్రపరచవచ్చు. కొన్నింటిని ఎక్కువ శీతలీకరణలో భద్రపరచాలి. ఆ స్పష్టత కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్పటికే వివిధ రకాల టీకాలను భద్రపరిచే శీతలీకరణ వ్యవస్థ మన వద్ద ఉంది. వాటిలో కూడా కరోనా వ్యాక్సిన్ను నిల్వ ఉంచడానికి అవకాశం ఉండొచ్చు. వ్యాక్సిన్ నిల్వ, రవాణాకు సంబంధించి ఏం చేయాలనే దానిపై కసరత్తు జరుగుతోంది. వీటికి సంబంధించి మాకు ఆదేశాలొచ్చాయి. – చంద్రశేఖర్రెడ్డి, ఎండీ, టీఎస్ఎంఎస్ఐడీసీ -
టపాసులు అమ్మటం, కాల్చటం నిషేధం
సాక్షి, హైదరాబాద్ : హైకోర్టు ఆదేశాలతో తెలంగాణలో టపాసులపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్వర్వులు జారీ చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో టపాసుల అమ్మకాలపై నిషేధం ఉందని తెలిపారు. టపాసుల అమ్మకాలతో పాటు కాల్చడం కూడా నిషేధమన్నారు. క్రాకర్స్ షాపులను మూసివేయాలని ఆదేశించారు. కాగా, పండుగల కన్నా ప్రజల ప్రాణాలే తమకు ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. బాణసంచా కాల్చకుండా, విక్రయించ కుండా నిషేధం విధించాలని, రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా విక్రయ దుకాణాలను వెంటనే మూసేయించాలని గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా నేపథ్యంలో ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. బాణసంచా కాల్చరాదంటూ ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, తమ ఆదేశాల అమలుపై తీసుకున్న చర్యలను 19న వివరించాలని ఆదేశించింది. -
సాదా బైనామాల క్రమబద్ధీకరణపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చాక అందిన దరఖాస్తులు పరిశీలించవద్దని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సాదా బైనామాల క్రమబద్ధీకరణకు సంబంధించి నిర్మల్ జిల్లాకు చెందిన రైతు షిండే వేసిన పిల్పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రాక ముందు అందిన దరఖాస్తులు మాత్రమే పరిశీలించవచ్చని తెలిపింది. కొత్త రెవెన్యూ చట్టం అక్టోబరు 29 నుంచి అమల్లోకి వచ్చిందన్న ఏజీ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. అక్టోబరు 10 నుంచి 29 వరకు 2,26,693 దరఖాస్తులు అందాయని వెల్లడించారు. అక్టోబరు 29 నుంచి మంగళవారం వరకు 6,74,201 దరఖాస్తులు వచ్చాయని ఏజీ కోర్టు దృష్టి తీసుకువచ్చారు. ఈ క్రమంలో రద్దయిన చట్టం ప్రకారం ఎలా క్రమబద్ధీకరణ చేస్తారని హైకోర్టు ఏజీని ప్రశ్నించింది. దీంతో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు రెండు వారాల గడువు కావాలని అడ్వకేట్ జనరల్ ప్రసాద్ హైకోర్టును కోరారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు 6,74,201 దరఖాస్తులను కూడా పరిశీలించవద్దని హైకోర్టు ఆదేశించింది. 2,26,693 దరఖాస్తులపై నిర్ణయం కూడా తుది తీర్పునకు లోబడి ఉండాలన్న హైకోర్టు సూచించింది. -
‘అక్కినేని’కి రూ.5 వేలకు ఎకరా చొప్పున ఇచ్చారు
సాక్షి, హైదరాబాద్: సినీ స్టూడియోలకు నామమాత్రపు ధరకే ప్రభుత్వాలు గతంలో కూడా భూమిని కేటాయించాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. మంత్రిమండలి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే దర్శకుడు శంకర్కు భూ కేటాయింపుపై ఆమోదం తెలిపిందని పేర్కొంది. సినీ దర్శకుడు ఎన్.శంకర్కు రూ.5 లక్షల చొప్పున మోకిల్లలో 5 ఎకరాల భూమిని కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కరీంనగర్ జిల్లాకు చెందిన జె.శంకర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్కుమార్ ఇటీవల ఈ కౌంటర్ను దాఖలు చేశారు. దర్శకుడు శంకర్ వెనుకబడిన నల్లగొండ జిల్లా నుంచి వచ్చిన బడుగు వర్గాలకు చెందిన వ్యక్తని, సినీ పరిశ్రమలో ఆయనకు 36 ఏళ్ల అనుభవం ఉందని తెలిపారు. రూ.50 కోట్లతో ప్రపంచ స్థాయి స్టూడియో నిర్మిస్తానని, తనకు రాయితీ పద్ధతిలో భూమి కేటాయించాలని శంకర్ ప్రభుత్వానికి 2016లో దరఖాస్తు చేసుకున్నారని వివరిం చారు. స్థానిక ప్రతిభావంతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో శంకర్కు భూమి కేటాయించే అంశాన్ని పరిశీలించాలని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిఫార్సు చేసిందన్నారు. ‘‘అక్కినేని నాగేశ్వర్రావుకు అప్పటి ప్రభుత్వం అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం కోసం 1975లో రూ.5 వేల చొప్పున 22 ఎకరాలను కేటాయించింది. పద్మాలయ స్టూడియో కోసం 1983లో రూ.8,500 చొప్పున 9.5 ఎకరాలను కేటాయించింది’’అని అరవింద్కుమార్ తెలిపారు. 1984లో సురేశ్ ప్రొడక్షన్కు నామమాత్రపు ధరకే అప్పటి ప్రభుత్వం 5 ఎకరాలను కేటాయించింది. 1984లో దర్శకుడు రాఘవేందర్రావు, చక్రవర్తి, కృష్ణమోహన్కు రూ.8,500 ప్రకారం అర ఎకరం చొప్పున కేటాయించారు. శంకర్కు నార్సింగి, శంకర్పల్లి రహదారి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఎటువంటి అభివృద్ధి చేయని భూమి కేటాయించాం. అక్కడ మార్కెట్ విలువ ఎకరా రూ.20 లక్షలుగా ఉంది. సినీపరిశ్రమ అభివృద్ధి, ఉద్యోగ కల్పన చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున 5 ఎకరాలను కేటాయించింది. ఇందులో కోసం శంకర్ రూ.4.4 కోట్లు డిపాజిట్ చేశారు. స్టూడియో నిర్మాణంతో 100 మంది శాశ్వత, 200 మంది తాత్కాలిక కార్మికులకు ఉపాధి కల్పించడంతోపాటు, మరో వెయ్యి మంది కళాకారులకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు’’అని వివరించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యాన్ని కొట్టివేయాలని కోరారు. -
హైదరాబాద్ సిటీ చుట్టూ టౌన్షిప్లు
సాక్షి, హైదరాబాద్: పట్టణీకరణతో హైదరాబాద్ మహా నగరం శరవేగంగా విస్తరిస్తోంది. జనాభా పెరుగుదలకు తగ్గట్టు మౌలిక సదుపాయాల్లేక తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో నగరం చుట్టూ కొత్త పట్టణాలను నిర్మించి పట్టణీకరణను వికేంద్రీ కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ కాంప్రెహెన్సివ్ ఇంటి గ్రేటెడ్ టౌన్షిప్పుల పాలసీ’ని తీసుకొచ్చింది. ఇంటి నుంచి పని (వాక్ టు వర్క్) ప్రదేశానికి కాలి నడకన వెళ్లాలనే నినా దంతో.. నివాస/ వాణిజ్య/ సంస్థ/వ్యాపార/ కార్యాల యాల సమ్మిళితంగా అచ్చమైన కొత్త నగరాల నిర్మాణా నికి నడుం బిగించింది. నగరంలో ఎక్కడో మూలన నివాసముంటూ.. ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం మరో మూలకు వెళ్లే క్రమంలో రోజూ లక్షల మంది ట్రాఫిక్ను ఎదురీదుతూ నరకాన్ని అనుభవిస్తు న్నారు. గంటల సమయం వృథా అవుతోంది. ఈ సమస్య లకు పరిష్కారంగా టౌన్షిప్పుల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, పాఠశాల, వైద్యం, ఖాళీ స్థలాలు, పచ్చదనం వంటి సదుపాయాలు, అత్యున్నత జీవన ప్రమా ణాలతో వీటి నిర్మాణానికి సమగ్ర విధానాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్య దర్శి అరవింద్కుమార్ ఈ నెల 3న ఉత్తర్వులు జారీచేశారు. ఓఆర్ఆర్కు 5 కి.మీల ఆవల.. ఓఆర్ఆర్కు 5 కి.మీ. వెలుపల (నిషేధిత ప్రాం తాలు మినహా) కొత్త టౌన్షిప్ల నిర్మాణానికే ఈ పాలసీ వర్తిస్తుంది. ప్రస్తుత లేఅవుట్ రూల్స్ వీటికి వర్తించవు. పాలసీలోని నిబంధనలకు లోబడి టౌన్షిప్పులకు టీఎస్–బీపాస్ విధానం కింద హెచ్ఎండీఏ అనుమతులనిస్తుంది. వచ్చే ఐదేళ్ల పాటు అమల్లో ఉండే ఈ పాలసీని అవసరమైతే సవరణలతో గడువు పొడిగిస్తారు. పదేళ్లలో టౌన్షిప్ నిర్మాణం ముసాయిదా అనుమతి నాటి నుంచి పదేళ్లలోపు టౌన్షిప్పుల నిర్మాణాన్ని పూర్తిచేయాలి. అవస రాన్ని బట్టి ప్రాజెక్టు గడువును పొడిగిస్తారు. టౌన్షిప్పులను నిర్మించదలచిన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలు/ప్రైవేటు డెవలపర్లు/ కంపెనీలు/స్పెషల్ పర్పస్ వెహికల్స్/సంస్థలకు ఈ పాలసీ వర్తించనుంది. వంద ఎకరాలు, ఆపై విస్తీర్ణంలో టౌన్షిప్ నిర్మాణానికి ఎంపికచేసే స్థలం కనీసం 30 మీటర్ల రహదారితో అనుసంధా నమై ఉండాలి. 300 ఎకరాలు, ఆపై స్థలాలకు 36 మీటర్ల రహదారి అవసరం. టౌన్షిప్ గరిష్ట నిర్మిత స్థలంపై ఎలాంటి పరిమితుల్లేవు. టౌన్షిప్ స్థలాన్ని దగ్గర్లోని 30 మీటర్ల రహదారితో అనుసంధానిస్తూ డెవలపర్లు 30 మీటర్ల రహదారిని నిర్మించాలి. మొత్తం సైట్ ఒకేచోట ఉండాలి. అయితే, జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులు సైట్ మధ్య నుంచి వెళ్తుంటే గనుక మినహాయింపునిస్తారు. సమీకృత వర్క్స్టేషన్ రోడ్లు, ఖాళీ స్థలాలు, పచ్చదనం వంటి మౌలిక సదుపాయాలకు కేటాయింపులుపోగా, మిగిలిన స్థలంలో కనీసం నాలుగో వంతు నుంచి రెండో వంతు వరకు స్థలాన్ని ‘వర్క్స్టేషన్’ ఏర్పాటుకు కేటాయించాలి. వాణిజ్య కార్యాలయాలు, మార్కెట్, ఐటీ, ఐటీఈఎస్, చిన్నతరహా పరిశ్రమలు, సేవారంగ పరిశ్రమలు, రవాణా కేంద్రం ఇతర ఆహ్లాదకర కార్యకలాపాలతో వర్క్స్టేషన్ ఏర్పాటుచేయాలి. 300 ఎకరాలు, ఆపై భారీ విస్తీర్ణంలో నిర్మించే టౌన్షిప్పుల్లో కనీసం ఎనిమిదో వంతు స్థలాన్ని వర్క్స్టేషన్కు కేటాయించాలి. మిగిలిన స్థలంలో సగభాగాన్ని నివాస అవసరాలకు కేటాయించాలి. ప్రధాన వాణిజ్య కేంద్రం, షాపింగ్ ఏరియా, క్లబ్హౌస్, కమ్యూనిటీ కేంద్రాలు, లైబ్రరీ.. ఈ ప్రాధాన్య క్రమంలో వాణిజ్య స్థలాన్ని వినియోగించాలి. ఉన్నతవిద్య సదుపాయాన్ని వర్క్సెంటర్లో కల్పించవచ్చు. టౌన్షిప్లో అంతర్గతంగా, వెలుపల సమీపంలోని రవాణా సదుపాయం వరకు ప్రజారవాణా (ఎలక్ట్రిక్ వాహనాలు) సదుపాయం కల్పించాలి. నిర్దేశించిన మేరకు ఎల్ఐజీ/ ఈడబ్ల్యూఎస్ గృహాలు, రోడ్లు, లే అవుట్లో చూపిన మేరకు పచ్చదనం అభివృద్ధి చేయాలి. మొత్తం ప్రాంతంలో 10 శాతాన్ని పచ్చదనానికి కేటాయించాలి. సబ్ స్టేషన్, నీటి సరఫరా సంపులు, మురుగునీటి వ్యవస్థ, వ్యర్థాల నిర్వహణ, పోలీస్స్టేషన్/ ఫైర్స్టేషన్ ఔట్ పోస్టులు, పబ్లిక్ పార్కింగ్ లాట్స్, శ్మశానవాటికలు, బస్స్టేషన్, ఇతర సదుపాయాలను వర్క్ సెంటర్లో భాగంగా స్థలం కేటాయించి అభివృద్ధి చేయాలి. పేదలకు 10 శాతం కోటా ఆర్థికంగా బలహీనవర్గాలు (ఈడబ్ల్యూఎస్), తక్కువ ఆదాయం వర్గాల (ఎల్ఈజీ)కు 10 శాతం ఇళ్లను కేటాయించాలి. అయితే, వీటిని ప్రత్యేక బ్లాకులు/సెక్టార్లుగా నిర్మించవచ్చు. ప్రణాళికాబద్ధ అభివృద్ధి నీరు, విద్యుత్ పొదుపు, ఘణ వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ వంటి పర్యావరణ అంశాలతో పాటు టౌన్షిప్ను ప్రణాళికాబద్ధంగా, ఆకర్షణీయంగా అభివృద్ధి చేయాలి. జీరో ఘన వ్యర్థాలు, జీరో వృథా నీరు కాన్సెప్ట్తో రీసైక్లింగ్ ప్లాంట్లు నెలకొల్పాలి. బ్లాకులు, సెక్టార్లవారీగా నివాస సముదాయాల్ని నిర్మించాలి. విద్యుత్ పొదుపు భవన నిబంధనలు (ఈసీబీసీ)ను అమలుచేయాలి. భూగర్భ కేబుల్ వ్యవస్థ, అధునాతన పరికరాలతో భద్రత వ్యవస్థ, గ్యాస్ పైప్లైన్ వంటి సదుపాయాలుండాలి. పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలి. సత్వర అనుమతులు ప్రాథమిక వివరాలతో టీఎస్–బీపాస్ ద్వారా దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోగా తాత్కాలిక అనుమతులు జారీ చేస్తారు. అనంతరం 90 రోజుల్లోగా సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమర్పించాలి. 30 రోజుల్లోగా తుది అనుమతులు జారీ కానున్నాయి. అనుమతులొచ్చిన 6 నెలల్లోగా పనులు ప్రారంభించాలి. అసోసియేషన్లకే టౌన్షిప్పుల నిర్వహణ టౌన్షిప్ రెసిడెంట్స్, యూజర్స్ అసోసియేషన్ పేరుతో అన్ని టౌన్షిప్పులు సలహామండలిని ఏర్పాటు చేసుకోవాలి. పచ్చదనంతో పాటు ఇతర మౌలిక సదుపాయాల నిర్వహణను ఇవి పర్యవేక్షించాలి. డెవలపర్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన ప్రతినిధులూ దీనిలో ఉండాలి. టౌన్షిప్పుల నిర్మాణానికి ఇవీ ప్రోత్సాహకాలు – ఫీజు చెల్లిస్తే ఆటోమేటిక్గా భూవినియోగ మార్పిడి. గ్రీన్ ఏరియా పది శాతానికి మించితే ఆపై స్థలానికి ఈ ఫీజు మినహాయింపు. – భూములపై 90 శాతం అభివృద్ధి చార్జీల మినహాయింపు. టౌన్షిప్పులో సకల సదుపాయాలను డెవలపరే కల్పించాలి. ప్రభుత్వ ప్రధాన నీటి సరఫరా లైన్కు టౌన్షిప్ను అనుసంధానించడం, మురుగు కాల్వలు, సబ్స్టేషన్లు వంటివి డెవలపర్లు అభివృద్ధి చేయాలి. డెవలపర్ డబ్బులు చెల్లిస్తే స్థానిక అర్బన్ అథారిటీ ఈ ఏర్పాట్లు చేసిపెడుతుంది. – సైట్ ఏరియాలో 10 శాతం (గరిష్టంగా 10 ఎకరాలకు మించకుండా)లోపు ప్రభుత్వ/అసైన్డ్ భూములు వస్తుంటే, ప్రభుత్వం అంత మొత్తంలోని స్థలాన్ని ఇతర చోట తీసుకుని సదరు స్థలాన్ని డెవలపర్కు కేటాయిస్తుంది. – ప్లాన్ మంజూరు సమయంలో చెల్లించాల్సిన ఇంపాక్ట్ ఫీజును ఐదేళ్లకు వాయిదావేస్తారు. – ఈడబ్ల్యూఎస్/ఎల్ఐజీ ఇళ్ల నిర్మిత స్థలంపై 10 శాతం డెవలప్మెంట్ చార్జీలు మాఫీ. మధ్యతరహా ఆదాయ వర్గాలు (ఎంఐజీ) గృహాల నిర్మిత స్థలంపై 75 శాతం, ఉన్నత ఆదాయ వర్గాల (హెచ్ఐజీ) గృహాల నిర్మిత స్థలంపై 50 శాతం డెవలప్మెంట్ చార్జీలు మినహాయింపు. – టౌన్షిప్ నిర్వహణను రెసిడెంట్స్, యూజర్స్ అసోసియేషన్లు పర్యవేక్షించనున్న నేపథ్యంలో క్లబ్హౌస్ వంటి మౌలిక సదుపాయాలపై వంద శాతం ఆస్తిపన్నును, ఇతర అన్ని రకాల ఆస్తులపై 50% ఆస్తిపన్నులను ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీచేసిన తొలి ఐదేళ్ల పాటు రాయితీ కల్పిస్తారు. – స్టార్ కేటగిరీ హోటళ్లు/ఆస్పత్రులు, మల్టీప్లెక్సులకు రాయితీ, ప్రోత్సాహకాలను అమల్లో ఉన్న ప్రభుత్వ విధానాలకు లోబడి అందిస్తారు. – అనుమతుల జారీ కోసం స్థలం తనఖా రిజిస్ట్రేషన్ను రూ.100 స్టాంప్ పైపర్పై నామమాత్రపు ఫీజుతో నిర్వహిస్తారు. – నాలా చార్జీలను నిబంధనల ప్రకారం చెల్లించాలి. – క్యాపిటలైజేషన్ చార్జీలు వంద శాతం మినహాయింపు. – సింగిల్ విండో పాలసీ కింద సమర్పించే అన్ని రకాల దరఖాస్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ 60 రోజుల్లోగా పరిష్కరిస్తారు. – వర్క్స్టేషన్లో వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల ఏర్పాటుకు పెట్టుబడులను ఆకర్షించడానికి పరిశ్రమలు, ఐటీ శాఖలు, టీఎస్–ఐఐసీ వంటి ప్రభుత్వ విభాగాలు సహకరిస్తాయి. -
పద్దు.. పొడిచేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై మధ్యంతర సమీక్షకు ఆర్థిక శాఖ సిద్ధమవుతోంది. కరోనా ప్రభావంతో ప్రభుత్వం ఆశించిన మేరకు ఈ ఏడాది రాబడులు రాని కార ణంగా బడ్జెట్ను సమీక్షించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో శాఖల వారీగా అంచనాలు, రాబడులు,ఖర్చులు, తప్పనిసరిగా చేయాల్సిన ఖర్చు పద్దులపై అంచనాలను సవరిం చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. తొలి ఆరు నెలల ఆర్థిక పరిస్థితులు, రాబోయే 6 నెలల అంచనాలను విశ్లేషి స్తున్న ఆర్థిక శాఖ అధికారులు.. 2020–21 బడ్జెట్ ప్రతిపాదనల్లో 15–20% రాబడి రాకపోవచ్చన్న అంచనాలతో శాఖల వారీ సవరణ ప్రతిపాదనలను రూపొం దించే పనిలో పడ్డారు. ఈ మేరకు త్వరలోనే అన్ని శాఖలకు నోట్ పంపి ఆయా శాఖల కచ్చిత ప్రతి పాదనలకు అనుగుణంగా సవరించిన అంచనాల బడ్జెట్ తయారీకి రంగం సిద్ధం చేస్తున్నారు. రూ.1.30 లక్షల కోట్ల వరకు.. వాస్తవానికి 2020–21 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.1,76,393 కోట్ల అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలు చేసింది. ఆనవాయితీ ప్రకారం బడ్జెట్ ప్రతిపాదించిన దానికి కొంచెం అటుఇటుగా రాబడులు, ఖర్చులు ఉంటాయి. ఇంతకుముందు మూడేళ్ల బడ్జెట్ను పరిశీలిస్తే 2019–20లో 96 శాతం, 2018–19లో 75 శాతం, 2017–18లో 79 శాతం మాత్రమే ప్రభుత్వ ఖజానాకు సమకూరింది. ఈసారి కరోనా ప్రభావంతో ఇది మరికొంత తగ్గి 75 శాతానికి పరిమితమయ్యే అవకాశాలున్నాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. తొలి ఆరు నెలల్లో వచ్చిన రూ.63,970 కోట్లకు తోడు మరో 70 వేల కోట్లు కలిపి రూ.1.30 లక్షల కోట్లు రావచ్చని భావిస్తోంది. ఇందులో రూ.40 వేల కోట్లకు పైగా పన్ను ఆదాయం, రూ.20 వేల కోట్ల వరకు రుణాలు, మరో రూ.5 వేల కోట్లకు పైగా ఇతర ఆదాయం కలిపి ఆ మేరకు సమకూరుతుందని ఆర్థిక శాఖ అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఇటు గత మూడేళ్ల రాబడులు పరిశీలించినా చివరి ఆరు నెలల ఆదాయం రూ.70 వేల కోట్లు దాటలేదు. ఖర్చులు కూడా ఆ మేరకు.. ఆదాయ పరిస్థితి అలా ఉంటే.. రానున్న ఆరు నెలల్లో ప్రభుత్వం రూ.60 వేల కోట్ల వరకు అనివార్య చెల్లింపులు జరపాల్సి ఉంది. ఇందులో రెవెన్యూ ఖర్చు రూ.25 వేల కోట్లు, అప్పుల వడ్డీ లేకుండా రూ.7 వేల కోట్లు, ఉద్యోగుల జీతాలకు రూ.14 వేల కోట్లు, పింఛన్లకు రూ.8 వేల కోట్లు, సబ్సిడీల కింద రూ.6 వేల కోట్ల వరకు అవసరమవుతాయి. ఇందులో సబ్సిడీ ఖర్చులు తగ్గించుకున్నా రూ.3 వేల నుంచి 4 వేల కోట్లే మిగులుతాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేతిలో పెద్దగా నిధులు మిగిలే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లోనే బడ్జెట్ అంచనాలను సవరించాలన్న సీఎం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. ఆదాయ మార్గాలను అన్వేషిస్తారా? ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులు గణనీయంగా పెంచుకోవాలని ఆర్థిక శాఖ ప్రభుత్వానికి సూచిస్తోంది. ఇందులో భూముల అమ్మకాలకు ప్రభుత్వం సిద్ధపడితే రూ.10–15 వేల కోట్లు అదనంగా వచ్చే అవకాశముంది. ఇక ఆరేళ్లుగా ప్రభుత్వం ప్రజలపై పన్ను భారం వేయలేదు. కొంతమేరకు పన్నులు పెంచడం, భూముల మార్కెట్ విలువలను సవరించి రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంచుకోవడం ద్వారా నిధుల వెసులుబాటు కలగనుంది. మరి, ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది.. రాబడులు పెంచుకునే దిశలో ముందుకు వెళ్లేందుకు సీఎం కేసీఆర్ అంగీకరిస్తారా..? వచ్చిన ఆదాయంతో సరిపెట్టుకుని ప్రభుత్వ శాఖల అదనపు ఖర్చులను తగ్గించుకునే దిశలో బడ్జెట్ అంచనాలను సవరిస్తారా అన్నది భవిష్యత్ అవసరాలను తేల్చనున్నాయి. -
పంచాయతీలకు ‘పవర్ షాక్’
సాక్షి, హైదరాబాద్: పంచాయతీలకు ప్రభుత్వం ‘పవర్’షాక్ ఇచ్చింది. వీధి దీపాల నిర్వహణ బాధ్యతల నుంచి గ్రామ పంచాయతీలను తప్పించింది. ఈ నిర్ణయంతో స్థానిక పాలకవర్గాలు.. ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతున్నాయి. పంచాయతీల నిర్ణయాధికారాలపై ప్రభుత్వ పెత్తనమేంటని మండిపడుతున్నాయి. కరెంట్ బిల్లుల భారం తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించిన పంచాయతీరాజ్ శాఖ.. మున్సిపాలిటీల మాదిరి పంచాయతీల్లోనూ ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఎల్ఈడీ దీపాల సరఫరా, నిర్వహణలో సమర్థంగా పనిచేస్తున్న ఇంధన పొదుపు సేవా సంస్థ (ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీస్ లిమిటెడ్)తో ఒప్పందం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 12,753 గ్రామపంచాయతీల్లో ఏడేళ్ల పాటు వీధి దీపాల నిర్వహణ బాధ్యతలను ఆ సంస్థకు అప్పగించింది. ఈ మేరకు ఈఈఎస్ఎల్ సంస్థతో త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించింది. జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో), గ్రామ పంచాయతీలు, ఈఈఎస్ ఎల్ సంస్థల మధ్య త్రైపాక్షిక ఒప్పందం చేసుకునేందుకు అంగీకరించింది. బల్బు మొదలు టైమర్ వరకు ఒప్పంద కాలంలో ఎల్ఈడీ లైట్ల నిర్వహణ బాధ్యత పూర్తిగా సంస్థదే. బల్బుల బిగింపు, నిర్వహణ, ఇంధన పొదుపులో భాగంగా టైమర్లను కూడా సంస్థనే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే కరెంట్ బిల్లులను మాత్రం స్థానిక పంచాయతీలు చెల్లించాలి. నిధుల కొరతతో బిల్లులు చెల్లించలేని పరిస్థితుల్లో గ్రామపంచాయతీ ఉంటే బిల్లులను డీపీవో సర్దుబాటు చేయాలి. ఈఈఎస్ఎల్ సంస్థ పనితీరును క్రమం తప్పకుండా గ్రామపంచాయతీలు మదింపు చేయాలని, నేషనల్ లైట్స్ కోడ్ ప్రమాణాలకు అనుగుణంగా వీధి దీపాలను ఏర్పాటు చేశారో లేదో పరిశీలించాలని స్పష్టం చేసింది. పంచాయతీల్లో వీధి దీపాల నిర్వహణ పరిశీలనకు పంచాయతీరాజ్ కమిషనరేట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సర్పంచ్లు.. ఈఈఎస్ఎల్ సంస్థకు పంచాయతీల్లోని వీధి దీపాల బాధ్యతలను కట్టబెట్టడాన్ని గ్రామపంచాయతీలు తప్పుపడుతున్నాయి. పంచాయతీరాజ్ చట్టం సెక్షన్–32 ప్రకారం పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ అధికారాలు సర్పంచ్లకు ఉంటాయని, ఆ అధికారాలకు కత్తెర పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ఈఈఎస్ఎల్ సంస్థ ఈ పనులు అప్పగించేందుకు అంగీకారం తెలుపుతూ తీర్మానాలు చేసేందుకు పంచాయతీలు ససేమిరా అంటున్నాయి. దీంతో తీర్మానాల కోసం సర్పంచ్లకు నచ్చజెప్పడం అధికారులకు తలనొప్పిగా మారింది. కాగా, ఈ నెల 28లోపు ఒప్పందాలు చేసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ డెడ్లైన్ విధించింది. అయితే ఇప్పటివరకు సిద్దిపేట, రంగారెడ్డి, నారాయణపేట, జనగామ జిల్లాలు మాత్రమే ఈ మేరకు ఒప్పంద పత్రాలు పంపాయి. మిగతా జిల్లాల్లో ఇప్పటికీ పంచాయతీల్లో తీర్మానాల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పంచాయతీరాజ్ అధికారులు తలపట్టుకుంటున్నారు. -
బీఎస్ఈతో తెలంగాణ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(ఎంఎస్ఎంఈ) కంపెనీల వ్యాపారం పెంపు లక్ష్యంగా పనిచేస్తున్న గ్లోబల్ లింకర్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా స్టాక్ ఎక్సే్ఛంజ్ బీఎస్ఈతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆర్థిక వనరుల లభ్యత, కంపెనీల విశ్వసనీయతను పెంచే కీలక సవాల్ను పరిష్కరించేందుకు ఈ ఒప్పందం దోహదం చేయనుంది. అలాగే లిస్టింగ్ ప్రాముఖ్యత, ప్రయోజనాల గురించి కంపెనీలకు అవగాహన కల్పించేందుకు బీఎస్ఈ సాయం చేస్తుంది. ప్రత్యామ్నాయ ఆర్థిక వనరుల లభ్యత ఎంఎస్ఎంఈలకు పరిమితంగా ఉంటోంది. ఇది కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటని బీఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిశ్ కుమార్ చౌహాన్ అన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా విస్తరణ మొదలుకుని కొనుగోళ్ల స్థాయికి వ్యాపారం ఎదిగేందుకు ఎంఎస్ఎంఈలకు నిధుల సమీకరణకు తోడ్పాటు లభిస్తుందన్నారు. ప్రస్తు తం స్టాక్ ఎక్సే్ఛంజీల్లో రాష్ట్రానికి చెందిన కొన్ని ఎంఎస్ఎంఈలు మాత్రమే నమోదయ్యాయని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు. ఈ సంఖ్య త్వరలో పెరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. -
తెరుచుకోని సినిమా హాళ్లు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ లాక్డౌన్తో మూతపడ్డ సినిమా థియేటర్లను ఈనెల 15 నుంచి పలు నిబంధనలతో తెరుచుకోవచ్చని కేంద్రం ఆదేశాలు ఇచ్చినా, రాష్ట్రంలో మాత్రం తెరుచుకోలేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. దీనికి తోడు తమ సమస్యలు తీర్చాకే థియేటర్లు ఓపెన్ చేయాలని సినీ ఎగ్జిబిటర్స్ నిర్ణయించారు. ఇందులో లాక్డౌన్ సమయంలో విద్యుత్ బిల్లుల చెల్లింపు వాయిదాతో పాటు థియేటర్ నిర్వహణ చార్జీల పెంపు, సింగిల్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునే అనుమతులు ఇవ్వాలన్న ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచారు. ఈ మూడు అంశాలపై స్పష్టత వచ్చాకే ముందుకు వెళ్లాలని తెలంగాణ సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే కర్ణాటక, గుజరాత్, బెంగాల్, యూపీ, బిహార్, ఢిల్లీ తదితర 14 రాష్ట్రాల్లో గురువారం నుంచి థియేటర్లు ప్రారంభించారు. ఈ విషయమై తెలంగాణ సినిమా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కార్యదర్శి గోవింద్రాజ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ, వీలైనంత త్వరగా తమ ప్రతిపాదనలపై ప్రభుత్వం స్పందిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. -
ఆస్తుల ఆన్లైన్ 62 శాతం..
సాక్షి, హైదరాబాద్, నల్లగొండ: గ్రామ పంచాయతీల్లో ఆస్తుల నమోదు మెల్లిగా ఊపందుకుంటోంది. గ్రామీణ ప్రాం తాల్లో 62,51,990 ఆస్తులు ఉండగా.. ఇందులో సోమవారం నాటికి 38,83,165 ఆస్తుల వివరా లను ఆన్లైన్లో పొందుపరిచారు. అంటే 62% ఆస్తులను ఆన్లైన్లోకి ఎక్కించారు. సాగు, వ్యవ సాయేతర ఆస్తుల నమోదుకు ధరణి పోర్టల్ను వేర్వేరుగా నిర్వహించాలని నిర్ణయించిన సర్కారు.. ఈ దసరా నుంచి వీటిని అందుబాటు లోకి తేవాలని ముహూర్తం ఖరారు చేసింది. సాగు భూములను తహసీళ్లలో... వ్యవసాయేతర ఆస్తులను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజి స్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది.ఈ నేపథ్యంలో ఆస్తుల రికార్డులను పకడ్బందీగా నిర్వహించా లని భావించి.. వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్ కలర్ పాస్పుస్తకాలను జారీ చేయాలని సంకల్పించింది. ఈ క్రమంలోనే ప్రతి ఆస్తిని ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తున్న పంచాయతీరాజ్ శాఖ.. ఇప్పటికే ఈ–పంచాయతీ వెబ్సైట్లో ఉన్న వివరాలతో సరిపోల్చుకుంటూ ఇంటింటికి వెళ్లి నిర్మాణ వైశాల్యం, ఖాళీ స్థలం వివరాలను సేకరిస్తోంది. ఇంటి యజమాని ఫొటో, ఆధార్, ఫోన్ నంబర్ తదితర సమాచారాన్ని ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో నమోదు చేస్తోంది. ఇలా సేకరించిన సమాచారాన్ని ధరణి పోర్టల్తో అనుసంధానించనుంది. సాంకేతిక సమస్యలతో సతమతం సాంకేతిక సమస్యలతో ఆస్తుల నమోదు ముం దుకు సాగడంలేదు. మొబైల్ సిగ్నల్స్ బలహీ నంగా ఉండడం.. సర్వర్ ప్రాబ్లమ్ ఆన్లైన్కు అడ్డంకిగా మారాయి. దీనికితోడు సేకరించాల్సిన డేటా చాంతాడంత ఉండడం... కొన్నింటికి ఆధార్ వివరాలు తప్పనిసరి కావడం కార్య దర్శులకు ముచ్చెమటలు పట్టించింది. ఒక్కో ఇంటి వద్ద ఆస్తుల నమోదుకు కనీసం నలభై నిమిషాల నుంచి గంట దాకా సమయం పడు తోంది. ఏకంగా 30 అంశాలు ఉండటంతో పూర్తి చేయడానికి సమయం పడుతోంది. ఈలోగా ఏదన్నా సాంకేతిక సమస్య వస్తే మళ్లీ మొదటి నుంచీ చేయాల్సి వస్తోంది. అటవీ ప్రాంతాల్లోని మండలాలు, గ్రామాల్లో నెట్వర్క్ సమస్య మరింత తీవ్రంగా ఉందని చెబుతున్నారు. గత రెండు రోజులుగా కొంతమేరకు సాంకేతిక సమస్యలు అధిగమించినా.. ప్రభుత్వం తొలుత నిర్ణయించిన గడువు (10వ తేదీకి) కల్లా 55.01 శాతం ఆస్తుల వివరాలను మాత్రమే ఆన్లైన్ చేయగలిగారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరో పది రోజుల గడువు (ఈనెల 20 దాకా) పెంచింది. ఆన్లైన్ నమోదులో స్పీడు పెంచిన పంచాయతీరాజ్శాఖ సోమవారం నాటికి 62.11 శాతం కట్టడాల డేటాను ఆన్లైన్లోకి ఎక్కిం చింది. మరోవైపు గడువులోపు మిగతా వాటిని ఆన్లైన్లో నమోదు చేసేందుకు వీలుగా అదనపు సిబ్బందిని రంగంలోకి దించుతోంది. అనుమానాలు... భయాలు ఆస్తుల నమోదుకు గ్రామాలకు వెళుతున్న పం చాయతీ సిబ్బందికి ఆస్తుల యజమానులు అం తగా సహకరించడం లేదని అంటున్నారు. వ్యవ సాయ సీజన్ పనులు జోరుగా జరుగు తుండ డం, జనాలు కూలి పనులకు వెళ్తుండడంతో ఇళ్ల యజమానులను వెతుక్కోవాల్సి వస్తోంది. పన్నుల భారం పడుతుందేమోనన్న ఆందోళన తో కొందరు యజమానులు ఆస్తుల నమోదుకు ముందుకు రావడం లేదు. ఆస్తుల వివరాలిస్తే సంక్షేమ పథకాలకు అనర్హులు అవుతామేమో నని భయపడుతున్నారు. పూర్తి వివరాలు చెబితే ఏమవుతుందోనన్న అనుమానంతో అసంపూర్తి వివరాలు చెబుతున్నారని కార్యదర్శులు అంటు న్నారు. ఇక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన కుటుంబాల ఇళ్లకు తాళాలు వేసి ఉంటున్నాయి. కుటుంబ యజమానిని ఇంటి ఎదుట నిలబెట్టి ఫొటో తీసి అప్లోడ్ చేయాలనే నిబంధన సమ స్యగా మారుతోంది. ఇంకో వైపు గత కొన్నేళ్లుగా ఇంటి పన్నులు భారీ మొత్తంలో పెండింగ్లో ఉండటంతో ఆస్తుల వివరాల నమోదుకు యజ మానులు ముందుకు రావడంలేదని పంచా యతీ కార్యదర్శులు చెబుతున్నారు. ఎందుకు నమోదు చేయించుకోవాలి? ఆస్తుల నమోదు ఎందుకు చేయించుకోవాలి. గతంలో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర సర్వే చేసినప్పుడు అన్ని వివరాలు చెప్పాం. ఏం ప్రయోజనం కలిగింది? గ్రామ పంచాయతీ అనుమతితోనే ఇండ్లు కట్టుకున్నాం. అన్ని వివరాలు పంచాయతీ ఆఫీసులో ఉన్నాయి. మళ్లీ ఎందుకు? – కొనకళ్ళ హన్మంత్ రావు, దామరచర్ల, నల్లగొండ జిల్లా ఆస్తుల వివరాలు ఇవ్వడం లేదు ప్రజల ఆస్తుల నమోదు ప్రక్రియలో కొందరు వివరాలు ఇవ్వడం లేదు. కొంతమంది వ్యవసాయ భూముల పట్టాపాస్ పుస్తకాలు ఇవ్వడం లేదు. కొంతమందికి నచ్చజెబితే ఇస్తున్నారు. ఇవ్వని వారి వివరాలు నమోదు చేయడం లేదు. అంతేకాకుండా 30 అంశాల వివరాలు నెట్లో నమోదు చేసే వరకు సిగ్నల్ ప్రాబ్లం అవుతోంది. దాని వల్ల ఒక్కొక్క ఇంటి వద్ద అరగంటకు పైగా సమయం పడుతోంది. – శ్రవణ్కుమార్, కార్యదర్శి, వేములపల్లి, నల్లగొండ జిల్లా -
డాక్టర్లపై నిఘా..
సాక్షి, హైదరాబాద్: వైద్య సిబ్బందిపై నిఘా పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది సకాలంలో ఆసుపత్రులకు వెళ్లేలా, రోగు లకు వైద్యం చేసేలా పర్యవేక్షణ చేయాలని భావిస్తోంది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (యూపీ హెచ్సీ) సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. తద్వారా హైదరాబాద్ నుంచే సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించ డానికి మార్గం ఏర్పడనుంది. వైద్య సిబ్బంది సకాలంలో ఆసుపత్రికి వస్తు న్నారా లేదా అని పర్యవేక్షించి, అవసరమైతే అప్ర మత్తం చేయడానికి వీలు కలగనుంది. ఇవే కీలకం.. రాష్ట్రంలో వెయ్యి పీహెచ్సీలు, యూపీ హెచ్సీలున్నాయి. ప్రజలకు అవసరమైన వ్యాక్సిన్లు వేయడానికి, ఇతర సాధారణ వైద్యం అందజేయడానికి ఇవి ఎంతో కీలకం. దాదాపు ప్రతీ మండలానికో పీహెచ్సీ ఉంటుంది. పెద్ద మండలాలైతే 2 పీహెచ్సీలు ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పీహెచ్సీల్లో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. సీజనల్ వ్యాధుల కాలంలో పీహెచ్సీలు కీలకపాత్ర పోషిస్తాయి. అంటువ్యాధులు తీవ్రమైన సందర్భంలో తక్షణ మే స్పందించేలా పీహెచ్సీలు వ్యవహరిస్తాయి. ఒక్కో పీహెచ్సీల్లో ఒకరు లేదా ఇద్దరు డాక్టర్లుం టారు. నర్సులు, ఇతర సిబ్బంది ఉంటారు. వైద్యుల గైర్హాజరు.. పీహెచ్సీల్లో పనిచేసే డాక్టర్లు, నర్సులు స్థానికం గా ఉండటం లేదన్న విమర్శలున్నాయి. సమీప పట్టణాల్లో నివాసముంటూ పీహెచ్సీలకు వస్తూ పోతూ ఉంటారు. వారానికి రెండు, మూడు సార్లు మాత్రమే వచ్చేవారు ఎక్కువగా ఉంటా రని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కొందరు డాక్ట ర్లయితే దాదాపు రోజుకు వంద కిలోమీటర్లకు పైగా వెళ్లే వారుంటున్నారు. హైదరాబాద్లో ఉం టూ నిజామాబాద్ జిల్లాలోని పీహెచ్సీలకు వెళ్లే వైద్యులూ ఉన్నారని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాల సమాచారం. వీరు పట్టణాల్లో ప్రైవేట్ ప్రాక్టీసు చేస్తుండటంతో పీహెచ్సీలకు రావడంలేదన్న విమర్శలున్నాయి. ఒకవేళ వచ్చినా ఉద యం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకే వెళ్లిపో తున్నారన్న ఫిర్యాదులు గ్రామాల నుంచి ప్రభు త్వానికి అందాయి. అందుకే వారి కదలికలపైనా ఎప్పటికప్పుడు నిఘా పెట్టేందుకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు.. ఇక హైదరాబాద్ కోఠిలోని ప్రజారోగ్య కార్యాల యంలో అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన కమాండ్ కంట్రోల్ రూమ్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచే అన్ని పీహెచ్సీలకు అను సంధానం చేశారు. కంట్రోల్ రూంలో భారీ స్క్రీన్ను ఏర్పాటు చేశారు. ఒకేసారి అన్ని పీహెచ్ సీల వైద్యులతో నేరుగా మాట్లాడి అవసరమైన ఆదేశాలివ్వొచ్చు. ఎక్కడైనా అంటు వ్యాధుల వం టివి తీవ్రంగా విజృంభిస్తే ఇక్కడి నుంచే వైద్యు లకు సూచనలిస్తారు. ఆశ వర్కర్లు, ఏఎన్ఎం లతోనూ మాట్లాడే వీలు కల్పించారు. అవసర మైతే జూమ్ మీటింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిస్థాయి కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పా టు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే ప్రజారోగ్య కార్యాలయాన్ని అన్ని రకాల హైటెక్ హంగులతో సిద్ధం చేశారు. నిత్యం వచ్చే విజిట ర్లను డైరెక్టర్ నేరుగా కలవకుండానే బయట నుంచే వీడియోకాల్ ద్వారా మాట్లాడే సదుపా యం ఏర్పాటు చేశారు. కరోనా కాలంలో కార్యా లయం లోపలికి వచ్చి జనం గుమిగూడకుండా ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రజారోగ్య కార్యాలయం ప్రవేశ ద్వారం వద్ద లాకింగ్ సిస్ట మ్ను ఏర్పాటు చేశారు. డైరెక్టర్ ఆదేశాల మేరకే ఎవరినైనా పంపడానికి వీలుంది. -
అదనంగా 8,000 ఆక్సిజన్ బెడ్స్
సాక్షి, హైదరాబాద్: కరోనా కారణంగా ఆగమేఘాల మీద ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సి వచ్చింది. వైరస్ వచ్చి ఆరు నెలలు గడిచింది. ఈ కాలంలో వైద్య మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయి. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న లక్ష మందికి వైద్యం అందించే వెసులుబాటు ఇప్పుడు రాష్ట్రంలో నెలకొంది. మార్చి నుంచి ఆగస్టు మధ్య ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనంగా 8 వేల పడకలకు ఆక్సిజన్ సదుపాయం ఏర్పాటు చేశారు. దీంతో ప్రస్తుతం ఆక్సిజన్ పడకల సంఖ్య రాష్ట్రంలో 10,010కి చేరింది. అంటే వైరస్ వచ్చాకే 80 శాతం ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి వచ్చాయి. ఏళ్లుగా అందుబాటులోకి రాని వైద్య వసతులెన్నో కరోనా కారణంగా సమకూరినట్లు వైద్య,ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఎటువంటి వైరస్ మున్ముందు దాడి చేసినా తక్షణమే అప్రమత్తం అయ్యేలా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో సమకూరిన మౌలిక సదుపాయాలపై వైద్య, ఆరోగ్యశాఖ ఒక సమగ్ర నివేదికను సర్కారుకు నివేదించింది. పెరిగిన టెస్టింగ్ సామర్థ్యం కరోనా ప్రారంభ దశలో పరీక్షల కోసం పుణేలోని వైరాలజీ లేబొరేటరీకి రోడ్డు మార్గంలో నమూనాలను పంపాల్సి వచ్చింది. తర్వాత గాంధీ మెడికల్ కాలేజీలో మొదటి టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 17 ప్రభుత్వ ఆర్టీ పీసీఆర్ లేబొరేటరీలు పనిచేస్తున్నాయి. మరో 6 ల్యాబ్లు త్వరలో ప్రారంభమవుతాయి. నిమ్స్లో రోజుకు 4వేల టెస్ట్లు చేసే లేబొరేటరీని విదేశాల నుంచి కొనుగోలు చేశారు. అలాగే ప్రైవేట్లో 43 ఆర్టీపీసీఆర్ లేబొరేటరీలు అందుబాటులో ఉన్నాయి. ఆర్టీపీసీఆర్ లేబొరేటరీల పరీక్షల సామర్థ్యం రోజుకు 20,771. ఇక పీహెచ్సీలు మొదలు పైస్థాయి వరకు 1,076 ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంతో గ్రామ స్థాయి వరకు టెస్టింగ్ చేసే సామర్థ్యం ఏర్పడింది. యుద్ధప్రాతిపదికన ‘టిమ్స్’ గాంధీ ఆసుపత్రిని ప్రత్యేకమైన కోవిడ్ ఆసుపత్రిగా ఏర్పాటు చేశారు. అలాగే కొత్తగా కోవిడ్ చికిత్స కోసం తక్కువ సమయంలో గచ్చిబౌలిలో టిమ్స్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. టిమ్స్లో మొత్తం 1,224 పడకలున్నాయి. అందులో 980 ఆక్సిజన్ పడకలు, 50 ఐసీయూ పడకలున్నాయి. అలాగే 62 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స కోసం 8,840 పడకలు ఏర్పాటు చేశారు. ఇక 225 ప్రైవేట్ ఆసుపత్రులలో కోవిడ్ చికిత్సకు 9,454 పడకలను సిద్ధంచేశారు. ప్రస్తుతం లక్ష యాక్టివ్ కేసులు వచ్చినా చికిత్స చేసే సదుపాయం రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చింది. అందుబాటులోకి వచ్చిన సదుపాయాలు ఇవే... ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరునెలల్లో కొత్తగా 8 వేల ఆక్సిజన్ పడకల ఏర్పాటు. 100 పడకలకు మించి ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ లిక్విడ్ ఆక్సిజన్ యూనిట్లను ఏర్పాటు చేశారు. దీంతో నిరంతరాయంగా ఆక్సిజన్ను వాడుకోవచ్చు. కరోనా చికిత్స కోసం ప్రత్యేకంగా 5,209 వైద్య సిబ్బంది పోస్టులు మంజూరు చేశారు. అందులో డాక్టర్లు 1,899, నర్సులు 2,125, పారామెడికల్, సహాయక సిబ్బంది 1,185 మంది ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు కరోనా కోసం ప్రత్యేకంగా రూ. 912 కోట్లు మంజూరు చేసింది. 1,259 వెంటిలేటర్లు ఏర్పాటు. 200 హై ఫ్లో నాసల్ ఆక్సిజన్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. 27,264 పల్స్ ఆక్సీమీటర్లు, 13,570 ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్లను సమకూర్చారు. ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు కొత్తగా 40 బస్తీ దవాఖానాల ఏర్పాటు. ఇక బస్తీ దవాఖానాల్లో గతేడాది మార్చి నుంచి ఆగస్టు వరకు ఓపీ 6.2 లక్షలు కాగా, ఈ ఏడాది అదే కాలంలో 12 లక్షల ఓపీ రోగులు వచ్చినట్లు నివేదిక వెల్లడించింది. -
ఆక్సిజన్ బెడ్స్ వెంటనే పెంచండి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ చికిత్స అందిస్తున్న ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్స్ తక్కువగా ఉండడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్తో ఊపిరితిత్తులు దెబ్బతిన్న రోగులకు ఆక్సిజన్ అత్యవసరమని, ఆక్సిజన్ బెడ్స్ కొరత కారణంగా వారి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆక్సిజన్ బెడ్స్ సంఖ్యను వెంటనే పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోవిడ్ చికిత్సలకు సంబంధించి దాఖలైన 20 ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ప్రజా ఆరోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తండ్రి ఈ నెల 7న చనిపోయారని, దీంతో ఆయన సెలవులో ఉన్నారని... గతంలో ఇచ్చిన ఆదేశాలపై నివేదిక సమర్పించేందుకు మరో రెండు వారాలు గడువు ఇవ్వాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ అభ్యర్థించారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న దానికి వాస్తవ పరిస్థితికి తేడా ఉంది. మహారాష్ట్రలో రోజుకు 1.5 లక్షల పరీక్షలు చేస్తున్నారు. రాష్ట్రంలో రోజుకు 40 వేల పరీక్షలు చేస్తామని గతంలో ధర్మాసనానికి హామీ ఇచ్చారు. అయినా అప్పుడప్పుడు పరీక్షల సంఖ్య తగ్గుతోంది. కొన్నిసార్లు పరీక్షలు పూర్తిగా ఆపినట్లుగా పత్రికల్లో చదివాం. పరీక్షల సంఖ్య పెంచాల్సి ఉన్నా ఎందుకు తగ్గిస్తున్నారు? పరీక్షలు పెంచాలని ఇప్పటికి అనేక పర్యాయాలు ఆదేశించాం. కరోనా చికిత్స అందిస్తున్న ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్స్ కొరత తీవ్రంగా ఉంది. ఈ మేరకు పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. అనేక మంది ద్వారానూ మాకు ఇదే సమాచారం వస్తోంది. ఆక్సిజన్ బెడ్స్ పెంచేందుకు సంబంధించిన ప్రణాళిక ఏమైనా ఉందా?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ బెడ్స్ను ఆక్సిజన్ బెడ్స్గా మారుస్తున్నామని, త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని ఏజీ వివరించారు. పరీక్షల సంఖ్య ఎందుకు తగ్గించారో తదుపరి విచారణకు డాక్టర్ శ్రీనివాసరావు వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. రోగులు, ఆక్సిజన్ బెడ్స్ నిష్పత్తి పెంచాలి ‘‘ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) మార్గదర్శకాల మేరకు ప్రతి వెయ్యి మంది రోగులకు 5 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉండాలి. ఇతర రాష్ట్రాల్లో ప్రతి 1,000 మంది రోగులకు 3 అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి వెయ్యి మందికి 1 బెడ్ మాత్రమే అందుబాటులో ఉంటోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బెడ్స్ సంఖ్య చాలా తక్కువ. గతంలో ఇచ్చిన ఆదేశాల అమలుకు సంబంధించి పూర్తి వివరాలు అక్టోబర్ 6లోగా సమర్పించండి’’ అని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది. -
స్లమ్స్లో రూ.5కే క్రమబద్దీకరణ
సాక్షి, హైదరాబాద్: మురికివాడల్లోని అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు కేవలం రూ.5 రుసుం చెల్లిస్తే సరిపోనుంది. లేఅవుట్లో 10 శాతం ఖాళీ స్థలం లేకుంటే రిజిస్ట్రేషన్ తేదీ నాటి మార్కెట్ విలువ ఆధారంగా 14 శాతం ప్లాట్ ధరను చార్జీలుగా చెల్లించాలి. అయితే మురికి వాడల్లోని ప్లాట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చార్జీల నుంచి మినహాయింపు కల్పించనుంది. గత నెల 31న జారీ చేసిన లేఅవుట్ల క్రమబద్ధీకరణ జీవో 131లో ఈ మేరకు మరింత స్పష్టతనిస్తూ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. మురికివాడల్లోని పేద, మధ్యతరగతి ప్రజ లకు ఈ నిర్ణయం వరంగా మారనుంది. లేనిపక్షంలో ప్లాటు విస్తీర్ణం, రిజిస్ట్రేషన్ నాటి మార్కెట్ విలువ ఆధారంగా రూ.వేల నుంచి రూ.లక్షల వరకు రుసుం చెల్లించాల్సి వచ్చేది. జీవోలో ప్రస్తావన లేక ఆందోళన: అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీ్ధకరణను ప్రభుత్వం తప్పనిసరిచేసింది. లేనిపక్షంలో సదరు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరపమని, భవన నిర్మాణాలకు అనుమతులు జారీ చేయమని లేఅవుట్ల క్రమబద్ధీకరణ రూల్స్–2020లో స్పష్టం చేసింది. మురికివాడల్లోని ప్లాట్ల విషయంలో ప్లాటు విస్తీర్ణం, మార్కెట్ విలువతో సంబంధం లేకుండా నామమాత్రంగా రూ.5ను ‘క్రమబద్ధీకణ రుసుం’గా చెల్లిస్తే సరిపోతుందని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. అయితే, లేఅవుట్లో 10 శాతం ఖాళీ స్థలం లేనందుకు చెల్లించాల్సిన 14 శాతం ప్లాట్ ధర చార్జీలు మురికివాడల్లోని ప్లాట్లకు వర్తిస్తాయా? లేదా ? అన్న విషయంపై రాష్ట్ర ప్రభుత్వం జీవోలో స్పష్టత ఇవ్వలేదు. దీంతో మురికివాడల్లో స్థలాలు కలిగి ఉన్న పేద, మధ్యతరగతి ప్రజలు 14శాతం ప్లాటు ధరను చార్జీలుగా చెల్లించాల్సి వస్తుందని ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ‘సాక్షి’పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్కుమార్ను సంప్రదించగా, మురికివాడల్లోని ప్లాట్ల క్రమబద్ధీకరణ విషయంలో 14 శాతం ప్లాటు ధర చార్జీలు వర్తించవని, దీనిపై త్వరలో క్లారిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన వివరణ ఇచ్చారు. దస్తావేజులో స్లమ్ పేరు ఉండాలి జీహెచ్ఎంసీ పరిధిలో 1,179 నోటిఫైడ్ స్లమ్స్, 297 నాన్ నోటిఫైడ్ స్లమ్స్ కలిపి మొత్తం 1,476 మురికివాడలు ఉన్నాయి. రాష్ట్రంలోని ఇతర పురపాలికల్లో మరో 700కి పైగా మురికివాడలు ఉన్నాయి. వీటికి సంబందించిన జాబితా స్థానిక పురపాలికతో పాటు మెప్మా అధికారుల వద్ద లభిస్తుంది. ప్లాట్లు రిజిస్ట్రేషన్ దస్తావేజులో మురికివాడ పేరు ఉంటే ఈ మేరకు 14శాతం ప్లాటు ధరను ఫీజుగా చెల్లించకుండా మినహాయింపు పొందడానికి వీలుకలగనుంది. ప్లాటు మురికివాడలో ఉన్నా కొన్నిసార్లు దస్తావేజుల్లో సదరు మురికివాడ పేరుకు బదులు వేరే పేర్లు ఉండే అవకాశముంది. ఇలాంటి సందర్భాల్లో సదరు ప్లాట్లకు సంబంధించిన గత 20, 30 ఏళ్ల కాలానికి సంబంధించిన పహాణీలను స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి తీస్తే అందులో మురికివాడ పేరు ఉండే అవకాశలుంటాయి. దీని ఆధారంగా రిజిస్ట్రేషన్ దస్తావేజులో ఆ మేరకు కాలనీ పేరు సవరణ చేయించుకుంటే ఎల్ఆర్ఎస్ ఫీజుల చెల్లింపు నుంచి రాయితీ పొందడానికి అవకాశం ఉంటుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
గ్రేటర్ బయట ఇళ్లను చూపిస్తే ఎలా?
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయిందని కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క విమర్శించారు. లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు చూపిస్తామని చెప్పి మంత్రి, నగర మేయర్ పారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. ‘డబుల్’ ఇళ్ల పరిశీలనలో భాగంగా తుక్కుగూడలోని మంకల్లో వారంతా శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా భట్టీ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇళ్లు చూపిస్తామని 3428 ఇళ్లు మాత్రమే చూపించారని చెప్పారు. జీహెచ్ఎంసీలో కట్టిన ఇళ్లను మాత్రమే చూపించాలని అన్నారు. గ్రేటర్ బయట కట్టిన ఇళ్లను కూడా చూపిస్తే ఎలా? అని ప్రశ్నించారు. (చదవండి: ప్రగతి భవన్: ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం) మరోవైపు లక్ష ఇళ్ల జాబితా ఇస్తాం.. మీరే చూసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు. నగర శివారులో కట్టిన ఇళ్లు కూడా నగర వాసుల కోసమేనని మంత్రి తెలిపారు. దీంతో స్థలాలు చూపిస్తాం.. నగరంలోనే ఇళ్లు నిర్మించాలని భట్టి మరోసారి సవాల్ విసిరారు. స్థలాలు చూపిస్తే ఇళ్లు నిర్మించి ఇస్తామన్న మంత్రి తలసాని జవాబిచ్చారు. ప్రభుత్వం పద్ధతి ప్రకారం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసిందని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లనే కాదు.. హైదరాబాద్లో అభివృద్ధిని కూడా చూపిస్తామని తెలిపారు. అభివృద్ధిని చూపించే దమ్ము, ధైర్యం తమకున్నాయని మంత్రి తలసాని మీడియాతో పేర్కొన్నారు. (చదవండి: బస్తీమే.. సవాల్!) -
ఎల్ఆర్ఎస్పై హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎల్ఆర్ఎస్ అంశంపై ‘ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్’ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఎల్ఆర్ఎస్ పలు చట్టాలకు విరుద్ధంగా ఉందని పిటిషనర్ కోర్టుకు తన వాదన వినిపించాడు. తుది తీర్పునకు లోబడి ఉండేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ కోర్టును కోరారు. అయితే ప్రభుత్వ వైఖరి తెలుసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను కోర్టు అక్టోబర్ 8కి వాయిదా వేసింది. ఎల్ఆర్ఎస్పై జీవో 131ని సవరిస్తూ ఉత్తర్వులు పేద, మధ్య తరగతి వర్గాలపై ఆర్థిక భారం పడకుండా రిజిస్ట్రేషన్ నాటి మార్కెట్ విలువ ఆధారంగానే భూముల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) చేసే విధంగా జీవో 131ని సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగానే ఎల్ఆర్ఎస్ చార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపింది. అసెంబ్లీలో కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు రిజిస్ట్రేషన్ జరిగిన సమయం నాటి మార్కెట్ విలువను వర్తింపజేయనున్నారు. క్రమబద్ధీకరణ చార్జీలను స్వల్పంగా తగ్గిస్తూ సీఎస్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పాత ఎల్ఆర్ఎస్ స్కీం 2015 కి సమానంగా చార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపారు. (చదవండి: ఎల్ఆర్ఎస్కు భారీ స్పందన) దీని ప్రకారం.. గజం మూడు వేల గజాల లోపు ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ వ్యాల్యూలో 20 శాతం చెల్లించాలి. ఇక గజం 3 వేల నుంచి 5 వేల వరకు ఉన్న వాళ్లు రిజిస్ట్రేషన్ వ్యాల్యూలో 30 శాతం చెల్లించాల్సి ఉండగా.. 5వేల నుంచి 10 వేల గజాలు వరకు ఉన్న వారు రిజిస్ట్రేషన్ వ్యాల్యూలో 40 శాతం చెల్లించాలని తెలిపింది. 10 వేల నుంచి 20 వేల గజాలు వరకు ఉంటే రిజిస్ట్రేషన్ వ్యాల్యూలో 50 శాతం.. 20 వేల నుంచి 30 వేల గజాల వరకు ఉన్న వారు రిజిస్ట్రేషన్ వ్యాల్యూలో 60 శాతం.. 30 వేల నుంచి 50 వేల గజాల వరకు ఉన్న వారు రిజిస్ట్రేషన్ వ్యాల్యూలో 80 శాతం.. 50 వేల గజాలపైన ఉన్న వారు రిజిస్ట్రేషన్లో 100 శాతం చెల్లించాలని తెలిపింది. -
భూ నిర్ణయాలు వద్దు
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నెల ఏడో తేదీ నుంచే ఆంక్షలు అమలులోకి వస్తాయని తెలిపింది. రెవెన్యూ వివాదాలపై నిర్ణయాలు తీసుకుంటే తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. కొత్తగా భూమి హక్కులు, పట్టదారు పాసుపుస్తకాలు చట్టం–2020 మనుగడలోకి వస్తున్న తరుణంలో భూ వివాదాలు, ఇతరత్రా వ్యవహారాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేస్తూ భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో రాజధాని శివారు జిల్లాలోని ఓ అధికారి పాత తేదీతో ఉత్తర్వులు ఇవ్వడం..దీనిపై ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొత్త చట్టంలో రెవెన్యూ వ్యవహారాల్లో అధికారుల పాత్రను పరిమితం చేయడంతో పాటు రెవెన్యూ కోర్టులను రద్దు చేశారు. దీంతో ఇప్పటివరకు తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్ల కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసుల విచారణ బాధ్యతలను త్వరలో ఏర్పాటు చేయబోయే ఫాస్ట్ట్రాక్ ట్రిబ్యునళ్లకు బదలాయించనున్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్ కేసులు, ఇతర భూ వివాదాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సీసీఎల్ఏ స్పష్టం చేశారు. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. నాయబ్ తహసీల్దార్లకు ప్రోటోకాల్ విధులు తహసీల్దార్లకు ప్రోటోకాల్ విధుల నుంచి విముక్తి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు ప్రముఖుల పర్యటనలను దగ్గరుండి చూసుకునే తహసీల్దార్లు ఇకపై కేవ లం రిజిస్ట్రేషన్ల వ్యవహారాలు, ప్రభుత్వ భూ ముల పరిరక్షణకే పరిమితం కానున్నారు. ఇక పై ప్రోటోకాల్ బాధ్యతలను నయాబ్ తహసీల్దార్లు(డిప్యూటీ తహసీల్దార్లు) చూసుకోనున్నారు. ఇదిలావుండగా, వీఆర్వో వ్యవస్థ రద్దు కావడంతో గ్రామాల్లోని ప్రభుత్వ భూములను కాపాడే విధులను వీఆర్ఏలకు కట్టబెడతారు. అయితే ప్రస్తుతం ఉన్నట్లుగాకుండా ఒకరినే ఈ సేవలకు వాడుకొని మిగతావారిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేయనున్నారు. రిజిస్ట్రేషన్లపై వారం రోజుల్లో స్పష్టత రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా తహసీల్దార్ల అధికారాలకు కత్తెర పెట్టిన సర్కారు కేవలం సాగు భూముల రిజిస్ట్రేషన్లకే పరిమితం చేసింది. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు మాత్రం ప్రస్తుతం ఉన్న సబ్ రిజిస్ట్రార్లే చేస్తారు. అయితే, ఎప్పటి నుంచి ఈ విధానం అమలు చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్స..ప్యాకేజీపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో వైద్య, ఆరోగ్యశాఖ ఆ పనిలో నిమగ్నమైంది. సోమవారం వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు ఉన్నత స్థాయిలో దీనిపై చర్చించాయి. ప్రైవేట్, కార్పొ రేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్యం చాలా ఖరీదైన వ్యవహారంగా మారిన నేపథ్యంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. డబ్బులు చెల్లించనిదే కొన్నిచోట్ల మృతదేహాలను కూడా ఇవ్వకపోవడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. దాంతో సీఎం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ కోసం ఎదురుచూపు... కరోనా రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పుడు నగ రాలు, పట్టణాలను దాటి పల్లెలపై పంజా విసురుతోంది. దీంతో పేదలు అనేకమంది కరోనా బారినపడుతున్నారు. బాధితులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి లక్షలకు లక్షలు ఫీజులు చెల్లించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే కరోనా వచ్చి సీరియస్ అయి ఆసుపత్రుల్లో చేరి ఆస్తులు అమ్ముకున్నవారు అనేకమంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీలోకి కరోనాను ఎప్పుడు తీసుకొస్తారా అని రాష్ట్రంలోని పేదలు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో 338 నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందిస్తున్నాయి. అలాగే ఆరోగ్యశ్రీ కార్డుదారులు 77.19 లక్షల మంది ఉన్నారు. ఆరోగ్యశ్రీలోకి కరోనాను తీసుకొస్తే పేద బాధితులు ప్రయోజనం పొందుతారు. ఇదిలావుంటే ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్ఎస్) పరిధిలోకి కూడా కరోనా చికిత్సను తీసుకురావాలని ఉద్యోగులు, పింఛన్దారులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. ప్యాకేజీ ఖరారే కీలకం... కరోనా సాధారణ వైద్య చికిత్స మాత్రమే. ఇదేమీ ప్రత్యేకంగా నిర్దేశిత ఆపరేషన్ ప్రక్రియ కాదు. కాబట్టి ప్యాకేజీని ఆసుపత్రులు దుర్వినియోగం చేయకుండా చూడడమే ఇక్కడ ప్రభుత్వానికి ఉన్న పెద్ద సవాల్. అందుకే ఇప్పుడు వైద్య ఆరోగ్యశాఖ రెండు అంశాల ఆధారంగా ప్యాకేజీ ఖరారుపై దృష్టిసారించింది. ఒకటి ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆరోగ్య పథకాల కింద కరోనా ప్యాకేజీని అధ్యయనం చేసి ఒక నిర్ణయానికి రావడం. రెండోది ఇప్పటికే ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కరోనాకు ఎంత ఫీజులు వసూలు చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దాని ఆధారంగా ప్యాకేజీ ఖరారు చేయడం. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు రాష్ట్రంలో సర్కారు నిర్దేశించిన ఫీజు సాధారణ వార్డులో చికిత్స పొందితే రోజుకు రూ. 4 వేలు, ఆక్సిజన్ వార్డులో రూ. 7,500, ఐసీయూలో రూ. 9 వేల చొప్పున ఉంది. పీపీఈ కిట్లు, మందులు, ఇతరత్రా వాటికి అదనంగా వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. కానీ ఇవి ఆచరణలో అమలు కాలేదు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే పేదలందరికీ ఈ ఫీజుల ఆధారంగానే ప్యాకేజీ ఖరారు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంటున్నాయి. అవసరమైతే పీపీఈ కిట్లు, మందుల ధరలు కొంత కలిపి ఒక నిర్దేశిత ప్యాకేజీ ఖరారు చేస్తామని చెబుతున్నాయి. చేరేవారు లేక ఖాళీగా పడకలు... అయితే ప్రస్తుతం సర్కారు నిర్దేశించిన ఫీజుల ప్రకారమే ఆరోగ్యశ్రీలో కరోనా ప్యాకేజీ ప్రకటిస్తే ఏంచేయాలన్న దానిపై ఆసుపత్రి వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఎందుకంటే 14 రోజులకు సాధారణ వార్డుల్లో ఉండే వ్యక్తి నుంచి రూ. 56 వేలు, ఆక్సిజన్పై ఉంటే రూ. 1.05 లక్షలు, ఐసీయూలో చికిత్స చేస్తే రూ. 1.26 లక్షలు వసూలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పీపీఈ కిట్లు, మందులు, ఇతరత్రా సేవలకు కలిపినా కొంతవరకు పెరిగే అవకాశం ఉంది. ఇది తమకు గిట్టుబాటు కాదని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు గతంలో ప్రభుత్వానికి విన్నవించిన సంగతి తెలిసిందే. ఇక ఇతర నెట్వర్క్ ఆసుపత్రులు ఎలా వ్యవహరిస్తాయన్న చర్చ కూడా నడుస్తోంది. అయితే ప్రస్తుతం 203 ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్యం అందుబాటులోకి వచ్చింది. అందులో 10,660 పడకలు కరోనాకు కేటాయించారు. అయితే వాటిల్లో 4,248 పడకలే నిండగా, ఇంకా 6,412 పడకలు ఖాళీగా ఉన్నాయి. భారీగా పడకలు ఖాళీగా ఉన్నందున ప్రభుత్వం నిర్దేశించిన ప్యాకేజీనే ఆసుపత్రులు ఒప్పుకోకతప్పదని వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఒకవేళ ఏ ప్యాకేజీ ఖరారు చేసినా దుర్వినియోగం కాకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సర్కారు యోచిస్తోంది. -
అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ !
సాక్షి, హైదరాబాద్: అన్యాక్రాంతమైన అసైన్డ్భూములను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నిరుపేదల జీవనోపాధి నిమిత్తం పంపిణీ చేసిన భూములు చేతులు మారితే.. వారికి యాజమాన్య హక్కులు కల్పించేదిశగా యోచిస్తోంది. ఈ మేరకు చట్ట సవరణ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే, అసైన్డ్దారు నుంచి పరాధీనమైన భూములను పీవోటీ చట్టం కింద వెనక్కి తీసుకున్న తర్వాతే భూముల ను క్రమబద్ధీకరించనుంది. అసైన్మెంట్ నిబంధనల ప్రకారం అసైన్డ్ భూముల క్రయ విక్రయాలు చెల్లవు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 24 లక్షల ఎకరాల మేర భూములను పేదలకు పంపిణీ చేయగా.. ఇందులో సుమారు 2.41 లక్షల ఎకరాల వరకు ఇతరుల గుప్పిట్లోకి వెళ్లినట్లు రెవెన్యూశాఖ తేల్చింది. పట్టణీకరణతో అసైన్డ్ భూముల్లో ఇళ్లు వెలిశాయి. కొన్ని చోట్ల బడాబాబులు, సంపన్నవర్గాల చేతుల్లోకి వెళ్లి ఫాంహౌస్, విలాసకేంద్రాలుగా మారిపోయాయి. అర్హులుగా తేలితేనే రీఅసైన్ అసైన్డ్దారుల నుంచి కొనుగోలు చేసినవారిలో అసైన్మెంట్ చట్ట ప్రకారం అర్హులుగా తేలితే(భూమిలేని పేదలైతే) వారికి రీఅసైన్ చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) పరిధిలో గాకుండా ఇతరచోట్ల 2017 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తోంది. అయితే, అసైన్డ్దారుల నుంచి కొనుగోలు చేసినవారు దారిద్య్రరేఖకు ఎగువన ఉంటే వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ఒకవేళ ఆర్థిక సమస్యలతో భూములను అమ్ముకున్న అసైనీలు భూమిలేని పేదలైతే మాత్రం పీవోటీ చట్టం కింద స్వాధీనం చేసుకున్న భూమిని తిరిగివారికే కేటాయిస్తారు. ఒకవేళ కొనుగోలు చేసిన వారు ఈ చట్టానికి అర్హులుగా లేకపోతే మాత్రం రుసుం చెల్లించి క్రమబద్ధీకరించుకోవాల్సివుంటుంది. అది కూడా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటేనే. కాలనీలు.. కాసులు! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలను 20 ఏళ్ల తర్వాత విక్రయించుకునే అవకాశం కల్పించింది. ఇదే తరహాలోనే మన రాష్ట్రంలోనూ ఇతరుల చెరలో ఉన్న భూముల క్రమబద్ధీకరించడం ద్వారా భారీగా ఆదాయం రాబట్టుకోవడమేగాకుండా.. భూమి యజమాన్యహక్కులను కల్పించవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ జీవోల ద్వారా ఆక్రమిత ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరిస్తున్న సర్కారు అసైన్డ్ భూముల్లో వెలిసిన స్థలాలను రెగ్యులరైజ్ చేయడం లేదు. ఇన్నాళ్లూ రిజిస్ట్రేషన్లు జరిగినా.. కొత్త చట్టం ప్రకారం ఎల్ఆర్ఎస్ తప్పనిసరి చేయడం, ప్రభుత్వ భూముల జాబితాలో ఉండడంతో మరింత కష్టంగా మారనుంది. ఈ నేపథ్యంలో కాలనీలుగా వెలిసిన అసైన్డ్ భూములను క్రమబద్ధీకరిస్తే ఖజానాకు కాసుల వర్షం, ప్రజలకు ఊరట లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మేరకు త్వరలోనే చట్ట సవరణ చేయాలని భావిస్తున్నట్లు రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
బోధనాస్పత్రుల అధ్యాపకులకు యూజీసీ వేతనాలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్య విద్య బోధనాస్పత్రుల్లోని అధ్యాపకులకు యూజీసీ వేతనాలను అమలుచేస్తూ సర్కారు బుధవారం జీఓ జారీ చేసింది. వైద్య కళాశాలల్లోనూ అర్హులైన అధ్యాపకులందరికీ, విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లోని అధ్యాపకులతో సమానంగా ఈ పీఆర్సీ వర్తిస్తుందని తెలిపింది. పెంచిన వేతన సవరణ 1 జనవరి 2016 నుంచి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వు లతో రాష్ట్రంలో 9 ప్రభుత్వ బోధనాస్పత్రుల్లోని 230 ట్యూటర్లు, 1561 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 614 అసో సియేట్ ప్రొఫెసర్లు, 461 ప్రొఫెసర్స్ లబ్ధి పొందనున్నారు. కాగా పీఆర్సీ ఎరియర్స్ వస్తాయనుకుంటే తమకు భంగపాటు ఎదురైందని తెలంగాణ ప్రభు త్వ వైద్యుల సంఘం ఒక ప్రకటనలో అసంతృప్తి వ్య క్తం చేసింది. త్వరలోనే ఎరియర్స్ జీఓతో పాటు ఏడో వేతన సవరణకు అనుగుణంగా రవాణా భత్యం మంజూరు చేయాలని సంఘం కోరింది. కాగా అధ్యాపకులందరికీ ఎరియర్స్ కింద రూ.525 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని గుర్తుచేసింది. -
కొత్త చట్టానికి ఆమోదం
సాక్షి, హైదరాబాద్ : గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్వో) పోస్టులను రద్దు చేసేందుకు రూపొందించిన ‘ద తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్–2020’ను ఆమోదిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ‘ద తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్స్ బిల్ –2020’ పేరుతో రూపకల్పన చేసిన కొత్త రెవెన్యూ చట్టానికి కూడా ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన ప్రగతి భవన్లో సోమవారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన కేబినెట్ భేటీలో పరిపాలనలో కీలక సంస్కరణలకు సంబంధించిన బిల్లులు, ఆర్డినెన్స్లకు ఆమోదం తెలిపారు. కేబినెట్ ఆమోదించిన బిల్లులు, ఆర్డినెన్స్లను త్వరలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. భూములపై రైతులు, భూ యజమానుల హక్కులను పరిరక్షించడం.. రెవెన్యూ శాఖలో విపరీతంగా పెరిగిన అవినీతి, అక్రమాలను రూపుమాపడం కోసం వీఆర్వో పోస్టుల రద్దుతో పాటు కొత్త రెవెన్యూ చట్టం బిల్లులను తీసుకురావాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వీఆర్వోల కారణంగానే గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డులు భ్రష్టుపట్టాయని, ఎవరు డబ్బులిస్తే వారికి అనుకూలంగా రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారని సర్వత్రా ఆరోపణలు ఉండటంతో ఈ పోస్టులను రద్దు చేయాలని మంత్రివర్గం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. సాదా బైనామాలు చెల్లవు.. తెలంగాణ మున్సిపాలిటీ యాక్టు –2019లోని సవరణ బిల్లు, పంచాయతీరాజ్–రూరల్ డెవలప్మెంట్–గ్రామ పంచాయత్స్–ట్రాన్స్ఫర్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీ యాక్టు–2018 సవరణ బిల్లులను కేబినెట్ ఆమోదించింది. కొత్త రెవెన్యూ చట్టానికి అనుబంధంగా పురపాలక, పంచాయతీరాజ్ చట్టాల్లో తీసుకురావాల్సిన మార్పుల కోసం ఈ బిల్లులను ప్రభుత్వం తెచ్చింది. ఖాళీ స్థలాలను సాదా బైనామా ద్వారా క్రయావిక్రయాలు చేస్తే ఇకపై చెల్లదని కొత్త నిబంధనలను ఈ బిల్లుల ద్వారా తీసుకురాబోతోంది. సాదాబైనామాలతో భూకబ్జాలు, అక్రమ లావాదేవీలు చోటు చేసుకుంటుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. లే–అవుట్ అనుమతి/ఎల్ఆర్ఎస్ కలిగి ఉండటం, రిజిస్ట్రేషన్ చేయించడాన్ని తప్పనిసరి చేయనుంది. భవనాలు, లే–అవుట్ల అనుమతులను పారదర్శకంగా జారీ చేసేందుకు రూపొందించిన టీఎస్ బీపాస్ బిల్ను ఆమోదించింది. జీతాల్లో కోత బిల్లుకు ఆమోదం.. ద తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ బిల్–2002ని కేబినెట్ ఆమోదించింది. విపత్తులు, అత్యయిక పరిస్థితుల్లో జీతాలు, పెన్షన్లలో కొత విధించేందుకు ఈ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొస్తోంది. అలాగే ద తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ –2020కు కేబినెట్ ఓకే చెప్పింది. ఆయుష్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని పెంచే ఆర్డినెన్సు్క కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వయోపరిమితి 65 ఏళ్లకు పెరగనుంది. బీసీ జాబితాలో 17 కొత్త కులాలు.. బీసీల జాబితాలో 17 కులాలను చేర్చాలని బీసీ కమిషన్ చేసిన సిఫారసులను కేబినెట్ ఆమోదించింది. అద్దపువారు, బాగోతులు, బైల్ కమ్మర, ఏనూటి, గంజికూటివారు, గౌడజెట్టి, కాకిపడగల, మాసయ్యలు/పటంవారు, ఒడ్, సన్నాయోల్లు, శ్రీక్షత్రియ రామజోగి, తెరచీరలు, తోలుబొమ్మలవారు/బొప్పల కులాలను బీసీ–ఏలో.. అహీర్ యాదవ్, గొవిలి, కుల్లకడగి, సారోళ్లు కులాలను బీసీ–డీలో చేర్చాలని బీసీ కమిషన్ సిఫారసు చేసింది. కేబినెట్ ఇతర నిర్ణయాలు... తెలంగాణ జీఎస్టీ యాక్టు –2017లో సవరణ బిల్లుకు ఆమోదం తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్టు అమెండ్మెంట్ ఆర్డినెన్స్–2020కి గ్రీన్సిగ్నల్ తెలంగాణ కోర్ట్ ఫీజ్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్టు –1956 సవరణ బిల్లుకు, ద తెలంగాణ సివిల్ కోర్ట్స్ యాక్టు –1972 కు సవరణ బిల్లుకు అనుమతి. రూ.400 కోట్ల అంచనా వ్యయంతో కొత్త సెక్రటేరియట్ నిర్మాణం, పాత సెక్రటేరియట్ కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించిన పరిపాలనా అనుమతులకు కేబినెట్ ఓకే. కొత్తగా నిర్మించే ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్స్ ఆఫీస్ కాంప్లెక్సులకు నిధుల కేటాయింపు కోసం సవరించిన పరిపాలనా అనుమతులకు ఆమోదమిచ్చింది. -
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దు
సాక్షి, హైదరాబాద్ : రెవెన్యూ శాఖ ప్రక్షాళనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో పనిచేసే గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) వ్యవస్థను రద్దు చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 7,039 వీఆర్వో పోస్టులు రద్దయ్యాయి. మరోవైపు కాలం చెల్లిన చట్టాలకు స్వస్తిచెప్పి కొత్త రెవెన్యూ చట్టం తేనుందనే ప్రచారం జరిగినా ప్రస్తుతం అమల్లో ఉన్న భూ యాజమాన్య హక్కులు–1971 చట్టం స్థానే.. తెలంగాణ భూ యాజమాన్య హక్కులు–పట్టాదార్ పాస్పుస్తకాల బిల్లు–2020’కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లు బుధవారం అసెంబ్లీ ముందుకు రానుంది. రెవెన్యూ సిబ్బందికి అధికారాల కత్తెర, హోదాల మార్పు, కొత్త విభాగాల కూర్పుతో ఈ చట్టానికి రూపకల్పన చేసిన సర్కారు.. వీఆర్వో వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ వీఆర్వో పోస్టుల రద్దు బిల్లును కూడా కేబినెట్ ఆమోదించింది. మొదట్నుంచి ఈ వ్యవస్థపై గుర్రుగా ఉన్న ప్రభుత్వం వీఆర్వోలపై వేటు వేసింది. అందులో భాగంగా సోమ వారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వీఆర్వోల వద్ద ఉన్న రికార్డులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో వీఆర్వోలపై మెడపై కత్తివేలాడుతున్నట్లు తేటతెల్లమైంది. రిజిస్ట్రేషన్ల శాఖతో అనుసంధానం! అవినీతి రహితంగా, వివాదాలకు తావివ్వకుండా రెవెన్యూ సేవలను సులభతరం చేయాలనే ఆలోచనతో ఉన్న ప్రభుత్వం.. కోర్ బ్యాంకింగ్ తరహాలో రెవెన్యూ రికార్డుల్లో మార్పుచేర్పులు చేయాలని భావిస్తోంది. భూమి రిజిస్ట్రేషన్ జరిగిన మరుక్షణమే మ్యుటేషన్, పట్టాదార్ పుస్తకం జారీ అయ్యేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ప్రస్తుత విధానం వల్ల అవినీతి, వివాదాలకు ఆజ్యం పోస్తుందని భావించిన సర్కారు.. నోటీసులు, విచారణలు, రికార్డుల అప్డేషన్, ఆన్లైన్ పేరిట కాలయాపన చేయకుండా అదే రోజు పాస్పుస్తకం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖను అనుసంధానం చేయడం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది. అధికారాల బదలాయింపు, వికేంద్రీకరణతో ఇరుశాఖలు ఏకీకృతం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి మండలంలో తహసీల్దార్ కమ్ సబ్ రిజిస్ట్రార్ ఒకరే ఉండనున్నారు. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు, ఇతర సేవలపై ఇరు శాఖల అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇదిలావుండగా, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లను సబ్ రిజిస్ట్రార్లు, వ్యవసాయభూముల రిజిస్ట్రేషన్లను తహసీల్దార్ చేస్తారనే మరో ప్రచారం కూడా ఉంది. వీఆర్వో ఎందుకొద్దంటే.. గ్రామస్థాయిలో వీఆర్వో, వీఆర్ఏల వ్యవస్థకు స్వస్తి పలకాలని నిర్ణయించిన సర్కారు.. అధికారాల కూర్పు, పేర్ల మార్పుపై కసరత్తు చేసింది. తహసీల్దార్ మొదలు కలెక్టర్ వరకు రెవెన్యూ అధికారాల్లో సాధ్యమైనంత వరకు తగ్గించాలని నిర్ణయించింది. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా పహాణీలో కాస్తు కాలమ్ ఎత్తివేసిందున.. కాస్తు కాలమ్ను గ్రామస్థాయిలో నమోదు చేసే వీఆర్వో వ్యవస్థ అవసరంలేదనే అంచనాకు ప్రభుత్వం వచ్చింది. దీంట్లో భాగంగా 1985, 1991ల్లో తీసుకువచ్చిన చట్ట సవరణలకు కొనసాగింపుగా వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలను రద్దు చేయాలని నిర్ణయించింది. మరోవైపు వీఆర్వోలు, వీఆర్ఏ (గ్రామ రెవెన్యూ సహాయకులు)లను పురపాలక, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల్లో విలీనం చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే, వీఆర్ఏలలో కొందరిని మాత్రం కొనసాగించాలని సర్కారు భావిస్తోంది. తహసీల్దార్తో లింకు తెగిపోకుండా కొనసాగించడమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్ : కొత్త రెవెన్యూ చట్టానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులను కలెక్టర్లు స్వాధీనం చేసుకునే పని వేగవంతంగా సాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోలంతా రెవెన్యూ రికార్డులను కలెక్టర్లకు అప్పగించే పనిలో బిజీగా ఉన్నారు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా సాగుతున్న కేసీఆర్ సర్కార్ వీఆర్వో వ్యవస్థ రద్దుకు యోచిస్తుంది. రాష్ట్రంలోని వీఆర్వోల వద్దనున్న రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నిన్న స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకల్లా రికార్డులను స్వాధీనం చేసుకోవాలని, సాయత్రం 5 గంటల వరకు రికార్డుల స్వాధీనం ఏ మేరకు పూర్తయిందో నివేదికలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ అయినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. (తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!) ఈ నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోల వద్ద నుంచి రికార్డులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లాలో మధ్యాహ్నం వరకు 60 శాతం రెవెన్యూ రికార్డులు కలెక్టరేట్కు చేరాయి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, వీఆర్వోలు, వీఆర్ఏలు ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయకుండా, స్వచ్ఛందంగా రెవెన్యూ రికార్డులను అప్పగిస్తున్నారని కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ స్పష్టం చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టానికి శ్రీకారం చుట్టడంతో ఒకింత ఆందోళన, మరికొంత ఆనందం నెలకొంది. వీఆర్వోలు, వీఆర్ఏలు బాధపడుతుండగా ప్రజలు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని బాధతో వీఆర్ఏ, వీఆర్వోలు స్వాగతిస్తూనే తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండేందుకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. మాతృసంస్థ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వేరే శాఖకు వెళ్లమంటే తమకు ఇబ్బందేనని అభిప్రాయపడుతున్నారు. -
తెలంగాణలో అన్ని రిజిస్ట్రేషన్లు బంద్
-
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రంలో అన్ని రిజిస్ట్రేషన్లు బంద్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులిచ్చింది. కొత్త రెవెన్యూ చట్టం రానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈరోజు రాత్రి జరిగే కేబినెట్ భేటీలో నూతన రెవెన్యూ చట్టానికి మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. ఇక ముందు నుంచీ అనుకుంటున్నట్టుగా గ్రామ అధికారుల వ్యవస్థ రద్దు దిశగా కేసీఆర్ సర్కార్ యోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. కొత్త రెవెన్యూ చట్టం రానున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం సాయంత్రం కేబినెట్లో ఆమోదం పొందనున్న కొత్త చట్టం ఇక ముందు రిజిస్ట్రేషన్లు ఎలా ఉండాలో నిర్ణయించనున్న ప్రభుత్వం రిజిస్ట్రేషన్లలో తహశీల్దార్ అధికారాలను సమీక్షించనున్న ప్రభుత్వం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ను తహశీల్దార్లకు అప్పగించే యోచన గృహ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను సబ్ రిజిస్ట్రార్లకు అప్పగించే యోచన తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కొన్ని కార్యాలయాలు తగ్గించి, మరికొన్ని చోట్ల కొత్తగా ఏర్పాటు చేసే యోచన పట్టణ ప్రాంతాల్లో కొత్తగా 20కి పైగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఏర్పాటు! గ్రామీణ ప్రాంతాల్లో 20కి పైగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తగ్గించే యోచన ఇక నుంచి ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు లేని మండలాలు 443 తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర భూరికార్డుల ప్రక్షాళనకు ఏర్పాట్లు ధరణి వెబ్సైట్లో ఇక పూర్తి పారదర్శకంగా భూముల వివరాలు అక్రమాలకు అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్ల వ్యవస్థను తీర్చిదిద్దే యత్నం వీఆర్వోల వద్ద రికార్డులను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు ఆదేశం రికార్డుల స్వాధీనం ఏ మేరకు వచ్చిందో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు కాగా, అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటించి సభ్యులంతా సమావేశాలకు హాజరయ్యారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని, నెగటివ్ వచ్చినవారినే సభలోకి అనుమతించారు. సోమవారం నాటి సమావేశంలో ఇటీవల మృతి చెందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మొదలగు వారికి శాసన సభ సంతాపం ప్రకటించింది. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది. (చదవండి: వీఆర్వో వ్యవస్థ రద్దుకు అంతా సిద్ధమైనట్టేనా!) -
వీఆర్వో వ్యవస్థ రద్దుకు అంతా సిద్ధమైనట్టేనా!
సాక్షి, హైదరాబాద్: పాలనలో ఇప్పటికే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులేస్తోంది. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా సాగుతున్న కేసీఆర్ సర్కార్ వీఆర్వో వ్యవస్థ రద్దుకు యోచిస్తున్నట్టుగా సమాచారం. రాష్ట్రంలోని వీఆర్వోల వద్దనున్న రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్లుగా పభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకల్లా రికార్డులను స్వాధీనం చేసుకోవాలని, సాయత్రం 5 గంటల వరకు రికార్డుల స్వాధీనం ఏ మేరకు పూర్తయిందో నివేదికలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ అయినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ వైఖరిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం తగదని హితవు పలుకుతున్నాయి. కాగా, కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పన చేస్తున్నట్లు గత అసెంబ్లీ సమావేశాల్లోనే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోనే కొత్తచట్టాన్ని ప్రకటిస్తారని తెలిసింది. దానికి అనుగుణంగానే గ్రామాధికారుల వ్యవస్థ రద్దుకు అంతా సిద్ధం చేసినట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, వీఆర్వోలను ఉద్యోగాల నుంచి తొలగించకుండా వేరే శాఖలో సర్దుబాటు చేసే విధంగా సీఎం కేసీఆర్ ఇదివరకే అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లుగా తెలిసింది. గ్రామీణ ప్రాంతంలో రెవెన్యూ శాఖలో కీలకంగా వారికి ఉద్యోగ భద్రత సైతం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించినట్లు సమాచారం. (చదవండి: ‘పునర్వ్యవస్థీకరణ’పై ప్రకటన ) -
తెలంగాణలో అవినీతి పెరిగిపోయింది: సంజయ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్యను తగ్గించి చూపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో అవినీతి పెరిగిపోయిందని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లకతప్పదన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులతో ప్రభుత్వం కుమ్మక్కైందని ఆరోపించారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవడంలేదని మండిపడ్డారు. ఉపాధ్యాయ, ఉద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో పీఆర్సీ ఇచ్చినా ఇంకా అమలు కాలేదన్నారు. (రాజాసింగ్ వర్సెస్ సిటీ పోలీసు కమిషనర్: ‘సెక్యూరిటీ’ వార్!) -
క్వారంటైన్ నిబంధనలు: టీ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: వందేభారత్ లేదా ‘ఎయిర్ ట్రాన్స్పోర్ట్ బబుల్’ విమానాల ద్వారా భారతదేశానికి తిరిగి వస్తున్న ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం క్వారంటైన్ నిబంధనలను సడలించింది. ఇకపై హైదరాబాద్కు వస్తున్న వ్యాధి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) ప్రయాణికులు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పేర్కొన్న నిబంధనలకు లోబడి ఇప్పుడు సరాసరి తమ ఇళ్లకు వెళ్లిపోవచ్చు. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల శాఖ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, విదేశాల నుంచి వస్తున్న వ్యాధి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) ప్రయాణికులకు పలు సడలింపులు ఇచ్చారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు ఇచ్చిన సడలింపులు 4 రోజుల్లోపు రిటర్న్ టిక్కెట్లతో వ్యాపానిమిత్తం తెలంగాణకు వచ్చే ప్రయాణీకులు, వారు బయలుదేరడానికి ముందు 96 గంటలలోపు నిర్వహించిన నెగటివ్ RT-PCR పరీక్ష నివేదికను చూపిస్తే వారికి ఎలాంటి క్వారంటైన్ ఉండదు. బయలుదేరడానికి 96 గంటల ముందు నిర్వహించిన నెగిటివ్ RT- PCR పరీక్ష రిపోర్టుతో ప్రయాణిస్తున్న వ్యాధి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) ప్రయాణికులను సంస్థాగత క్వారంటైన్ నుంచి మినహాయించారు. వారు కేవలం 14 రోజుల హోమ్ క్వారంటైన్లో ఉండాలి. నెగిటివ్ RT- PCR పరీక్ష రిపోర్టు లేకుండా ప్రయాణిస్తూ, వ్యాధి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) ప్రయాణికులలోని కొన్ని విభాగాలకు సంస్థాగత క్వారంటైన్ నుంచి మినహాయించారు. వీరు కేవలం 14 రోజుల హోం క్వారంటైన్లో ఉండాలి. వీరిలో గర్భిణులు, 10 లేదా అంతకన్నా తక్కువ వయసున్న పిల్లలతో ప్రయాణిస్తున్న వాళ్లు లేదా వైద్య అవసరాల నిమిత్తం ప్రయాణిస్తున్న వాళ్లు ఉన్నారు. అయితే నెగిటివ్ RT- PCR పరీక్ష రిపోర్టు లేకుండా ప్రయాణిస్తున్న వ్యాధి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) మిగతా ప్రయాణికులు మాత్రం తప్పనిసరిగా 7 రోజుల సంస్థాగత క్వారంటైన్, దాని తర్వాత హోం క్వారంటైన్ నిబంధనలకు లోబడి ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ‘ఎయిర్ బబుల్ ఒప్పందాల’ ద్వారా యూకే, యూఏఈ దేశాలతో కనెక్ట్ అయి ఉంది. బ్రిటిష్ ఎయిర్వేస్ హైదరాబాద్, లండన్ల మధ్య వారానికి నాలుగు సర్వీసులు నడుపుతోంది. హైదరాబాద్- యూఏఈల మధ్య నడిచే ఇతర ఎయిర్లైన్స్– ఎతిహాద్, ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్లు కూడా త్వరలో తమ సేవలను ప్రారంభించనున్నాయి. ఇవి కాకుండా హైదరాబాద్ విమానాశ్రయానికి ‘వందే భారత్ మిషన్’ కింద ఛార్టర్ విమానాలు (వీటిలో ఎయిర్ ఇండియా విమానాలు కూడా ఉన్నాయి), ఇతర విదేశీ విమాన సర్వీసులు కూడా (నిబంధనలకు లోబడి) వస్తున్నాయి. లాక్డౌన్ మొదలైన నాటి నుంచి విదేశాల్లో చిక్కుకుపోయిన 55,000 మందికి పైగా భారతీయులు నగరానికి రాగా, 10,000 మందికి పైగా వివిధ దేశాలకు చెందిన వారు హైదరాబాద్ నుంచి తమ దేశాలకు తరలి వెళ్లారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇంటర్నేషనల్ డిపార్చర్స్ను పూర్తిగా శానిటైజ్ చేసి, అక్కడ థర్మల్ స్క్రీనింగ్, సామాజిక దూరం నిబంధనలను కఠినంగా పాటిస్తున్నారు. విమానం దిగే ప్రయాణికులు, వైమానిక సిబ్బందిని విమానం నుంచి 20-25 మందిని ఒక బృందంగా తీసుకువస్తున్నారు. ఇమిగ్రేషన్ నిబంధనలు పూర్తి చేయడానికి ముందు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల ప్రకారం, ప్రతి ప్రయాణికుడు/వైమానిక సిబ్బందిని ఎయిర్పోర్ట్ హెల్త్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఎయిరోబ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన థర్మల్ కెమెరాలతో స్ర్కీనింగ్ చేస్తున్నారు. ప్రతి ఇమిగ్రేషన్ కౌంటరు వద్ద ప్రయాణికులు, ఇమిగ్రేషన్ అధికారులు ఒకరినొకరు తాకకుండా ఉండేందుకు గాజు అద్దాలను బిగిందారు. ప్రతి బ్యాగేజీని బ్యాగేజ్ బెల్టుతో అనుసంధానం చేసిన డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్ ద్వారా శానిటైజ్ చేస్తున్నారు. పూర్తిగా శానిటైజ్ చేసిన ట్రాలీలను ప్రయాణికుల కోసం సిద్ధంగా ఉంచారు. -
ఇక రెవె‘న్యూ’ కదలిక!
సాక్షి, హైదరాబాద్: కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపై చర్యలను సర్కారు వేగవంతం చేసింది. సెప్టెంబర్ ఏడో తేదీ నుంచి మొదలయ్యే శాసనసభ సమావేశాల్లో దీనికి ఆమోదముద్ర వేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రెవెన్యూ చట్టాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ కాలం చెల్లినవాటికి మంగళం పాడాలని నిర్ణయించింది. నూతన చట్టంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా, బలంగా ఉన్న చట్టాలు/ రూల్స్నే పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తోంది. తలనొప్పిని వదిలించుకోవాలని.. అవినీతి, వివాదరహిత పాలన అందించడానికి రెవెన్యూ శాఖ పనితీరు తలనొప్పిగా మారిందని ప్రభుత్వం భావిస్తోంది. కొందరు అధికారుల అవినీతి, పనితీరు సర్కారుకు చెడ్డపేరు తెస్తోందనే భావనలో ప్రభుత్వం ఉంది. మ్యుటేషన్లు, పాస్ పుస్తకాల కోసం తహసీళ్ల చుట్టూ తిప్పించుకుంటున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇటీవల కీసర తహసీల్దార్ నాగరాజు ఏకంగా రూ.1.10 కోట్ల నగదుతో ఏసీబీ చిక్కడంతో అవాక్కయిన ప్రభుత్వం నయా రెవెన్యూ చట్టానికి వేగంగా పదునుపెడుతోంది. ఇబ్బడిముబ్బడిగా ఉన్న చట్టాల ఏకీకృతం.. కొత్త చట్టంలో పొందుపరచాల్సిన సంస్కరణలౖపై కలెక్టర్లు, న్యాయ నిపుణులతో సేకరించిన అభిప్రాయాలను క్రోడీకరిస్తోంది. ఒకే గొడుగు కిందకు.. కాలం చెల్లిన చట్టాలకు చరమగీతం పాడటం, గజిబిజిగా ఉన్న చట్టాలను సులభతరం చేస్తూ కొత్తచట్టానికి తుదిరూపునిస్తోంది. టైటిల్ గ్యారంటీ చట్టం ఆలోచనను దాదాపుగా విరమించుకున్న సర్కారు రెవెన్యూ కోడ్ను అమలు చేసే అంశాన్నిమాత్రం పరిశీలిస్తోంది. గతంలో 1999లోనే ఈ కోడ్కు అసెంబ్లీ ఆమోద ముద్ర వేసినా కేంద్రం ఓకే చెప్పకుండా 44 ప్రశ్నలు సంధిస్తూ తిప్పిపంపింది. దీనికే కొన్ని మార్పులు, చేర్పులు చేసి తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ కోడ్–2020ను ప్రవేశపెడితే ఎలా ఉంటుందని రాష్ట్ర సర్కారు ఆలోచిస్తోంది. ఇబ్బడిముబ్బడిగా ఉన్న చట్టాల స్థానే ఈ కోడ్తో ఒకే చట్టం మనుగడలోకి రానుంది. అయితే, దీనికి కేంద్రం ఆమోదం తప్పనిసరి కావడంతో కాలయాపన జరిగే అవకాశమూ లేకపోలేదని అధికారవర్గాలు అంటున్నాయి. మరోవైపు భూ పరిపాలనకు మూలాధారంగా భావించే ల్యాండ్ రెవెన్యూ చట్టం–1907ను ప్రామాణికంగా తీసుకొని తెలంగాణ భూ నిర్వహణ చట్టం–2020 ప్రవేశపెట్టే అంశంపై ప్రభుత్వం కుస్తీ పడుతోంది. భూ పరిపాలనకు సంబంధించిన ప్రతి అంశాన్ని స్పృశించే ఈ పాత చట్టంస్ఫూర్తి దెబ్బతినకుండా కొత్త చట్టానికి తుదిరూపు ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో 124 చట్టాలు/నియమాలకు బదులు రెవెన్యూచట్టం–1907, భూ ఆక్రమణ చట్టం, అసైన్మెంట్, రెవెన్యూ రికవరీ, ల్యాండ్ గ్రాబింగ్, సర్వే, సరిహద్దులు, రక్షిత కౌలుదారు తదితర చట్టాలతో ముసాయిదా రెవెన్యూ చట్టాన్ని రూపకల్పన చేస్తోంది. అదే రోజు మ్యుటేషన్ కొత్త చట్టంలో తహసీల్దార్లు, ఆర్డీవోల అధికారాల కత్తెర, వీఆర్వోల విలీనం, హోదాల మార్పుపై కసరత్తు చేస్తున్న సర్కారు.. సబ్ రిజిస్ట్రార్లకు కీలక బాధ్యతలు అప్పగించనుందని ప్రచారం జరుగుతోంది. దీంట్లో భాగంగా భూముల రిజిస్ట్రేషన్ జరిగిన మరుక్షణమే మ్యుటేషన్, ఇన్స్టంట్ పాస్పుస్తకాన్ని జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ భూములపై వివాదాలు, ఇతరత్రా వ్యాజ్యాల పరిష్కారానికి జిల్లా స్థాయిలో అధీకృత అధికారి/ట్రిబ్యునల్ను నియమించే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న కలెక్టర్, అదనపు కలెక్టర్(రెవెన్యూ)కు ప్రత్యామ్నాయంగా ఈయన రెవెన్యూ వివాదాలను పరిష్కరిస్తారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం రెవెన్యూ వ్యవస్థలో ఉన్న ఏడంచెల అధికార వ్యవస్థను కుదించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసే ట్రిబ్యునల్కు రిటైర్డ్ జడ్జీలను నియమించే అవకాశమున్నట్లు ప్రభుత్వవర్గాల్లో చర్చ జరుగుతోంది. -
7 నుంచి అసెంబ్లీ..
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను వచ్చే నెల 7 నుంచి నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సోమవారం ప్రగతి భవన్లో ఈ అంశంపై పలువురు మంత్రులతో ఆయన చర్చించారు. రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైన అంశాలపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నందున సెప్టెంబర్లో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం వల్ల ముఖ్యమైన అంశాలపై సమగ్ర చర్చ జరిపే అవకాశముంటుందని సీఎం, మంత్రులు అభిప్రాయపడ్డారు. 15 రోజుల పనిదినాలైనా ఉండేలా చూడాలన్నారు. (వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష) పలు బిల్లులు, తీర్మానాలు ప్రవేశపెట్టడంతో పాటు విధాన నిర్ణయాలకు సంబంధించిన ప్రకటనలు కూడా చేయాల్సి ఉంటుందని, అన్నివిధాలుగా సిద్ధం కావాలని మంత్రులు, అధికారులకు సీఎం సూచించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా, సభ్యులు భౌతిక దూరం పాటించేందుకు ఏర్పాట్లు చేయాలని శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహా చార్యులను సీఎం ఆదేశించారు. -
డైరెక్టర్ శంకర్కు భూమి, హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: దర్శకుడు ఎన్.శంకర్కు తెలంగాణ ప్రభుత్వం భూమిని కేంటాయించడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్పై నేడు మరోసారి విచారణ జరిగింది. శంకర్పల్లిలోని మోకిల్లాలో దర్శకుడు శంకర్కు ఎకరాకు రూ.5 లక్షల చొప్పున 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే, కారు చౌకగా భూమిని కేటాయించారని పేర్కొంటూ కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన జె.శంకర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వం కేటాయించిన భూమిలో రూ.50 కోట్లతో స్టూడియో నిర్మించనున్నట్టు శంకర్ ఈ సందర్భంగా హైకోర్టుకు తెలిపారు. స్టూడియో ద్వారా 300 మందికి ఉపాధికి లభిస్తుందని పేర్కొన్నారు. (‘దర్యాప్తు చేసే అధికారం ప్రజా ప్రతినిధులకు లేదు’) అయితే, ప్రభుత్వం కేటాయించిన భూమి ధర ఎంత ఉంటుందని హైకోర్టు ప్రశ్నించగా.. మార్కెట్ విలువ ప్రకారం రూ.2.50 కోట్లు ఉంటుందని హెచ్ఎండీఏ పేర్కొంది. మరి రూ.2.50 కోట్ల భూమిని ఏ ప్రతిపదికన రూ.5లక్షలకు ఎకరా చొప్పున కేటాయించారని హైకోర్టు ప్రశ్నించింది. కేబినెట్ నిర్ణయానికి కూడా ఓ ప్రాతిపదిక ఉండాలి కదా అని వ్యాఖ్యానించింది. భూకేటాయింపులు ఓ పద్ధతిలో జరగాలని గతంలో సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ క్వారంటైన్లో ఉన్న నేపథ్యంలో కొంత గడువు కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు విన్నవించగా.. తదుపరి విచారణ ఈనెల 27కి హైకోర్టు వాయిదా వేసింది. (ఏవిధంగా సమర్థించుకుంటారు..? ) -
ఏపీ ప్రాజెక్టులను నిలువరించండి
సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 203, జీవో 388ల ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు విస్తరణ, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ సామర్థ్యం పెంపు పనులను ఏకపక్షంగా ప్రతిపాదించిందని, ఈ జీవోల అమలును నిలువరించాలని తెలంగాణ ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరపున సీనియర్ న్యా యవాది వి.రవీందర్రావు ఈ పిటిషన్ దాఖ లు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 203, జీవో 388ల ద్వారా ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోకుండా నిలువరించాలని పిటిషన్లో తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థించింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 84, 85 ప్రకారం ఏదేని కొత్త ప్రాజెక్టును చేపట్టాలంటే కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిశీలన చేసిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి అని నివేదించింది. ట్రిబ్యునల్ జరిపిన నీటి కేటా యింపుల ఉల్లంఘన జరగకుండా చూసేందు కు ఇది అవసరమని తెలిపింది. చట్టబద్ధమైన వ్యవస్థ ఉన్నా కూడా దీన్ని పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా కొత్తగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించిందని పేర్కొంది. ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని తీసుకునేందుకు, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా నీటి మళ్లింపు సామర్థ్యం 80 వేల క్యూసెక్కులకు పెంచేందుకు చూస్తోందని నివేదించింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి తమ వద్ద ఉన్న సమాచారంతో కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశామని, ఈ అంశాన్ని కృష్ణా బోర్డు కూడా రెండుసార్లు ఏపీ ప్రభుత్వానికి గుర్తు చేసి ప్రా జెక్టు డీపీఆర్ పంపాలని, అంతవరకు జీవో 203 అమలును నిలిపివేయాలని ఆదేశించిం దని వివరించింది. బోర్డు ఆదేశాలను బేఖాత రు చేసి టెండర్లు పిలవడం విభజన చట్టాన్ని ఉల్లంఘించడమే అని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఆయా అంశాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ కూడా చొరవ తీసుకుందని, అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిందని వివరించింది. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీ సూచనలను, జలశక్తి శాఖ సూచనలను గానీ పట్టించుకోలేదని పేర్కొంది. ఏపీ ప్రభుత్వం జూలై 15న టెండర్ నోటిఫికేషన్ కూడా జారీచేసిందని నివేదించింది. వెంటనే టెండర్ల ప్రక్రియను నిలిపివేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయాలని కోరింది.