National Testing Agency
-
భళా.. మనోజ్ఞ
సాక్షి, అమరావతి: జాతీయ సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ సెషన్–1 బీఈ/బీటెక్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని గుత్తికొండ సాయి మనోజ్ఞ 100 పర్సంటైల్ స్కోరుతో అదరగొట్టింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం ఈ ఫలితాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 14 మంది విద్యార్థులు 100 స్కోర్ సాధించగా, వారిలో మనోజ్ఞ ఒక్కరే మహిళ కావడం విశేషం. రాజస్థాన్ నుంచి అత్యధికంగా ఐదుగురు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ నుంచి ఇద్దరు చొప్పున, గుజరాత్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి ఒక్కొక్కరు 100 స్కోర్ సాధించారు. జనవరిలో ఐదు రోజులు నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్ వన్కు 13,11,544 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 12,58,136 (95.93శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 304 పట్టణాల్లోని 618 సెంటర్లలో పరీక్ష నిర్వహించినట్టు ఎన్టీఏ పేర్కొంది. ఇందులో దేశం వెలుపల 15 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపింది. 100 స్కోరు సాధించిన విద్యార్థుల్లో జనరల్ కేటగిరీ నుంచి 12 మంది టాపర్లుగా నిలిస్తే ఇందులో ఏపీకి చెందిన మనోజ్ఞ జనరల్ కేటగిరీతో పాటు మహిళల విభాగంలోనూ టాపర్గా నిలిచింది. జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ 99.99 పర్సంటైల్తో టాపర్గా నిలిచాడు. ఓబీసీ విభాగంలో ఢిల్లీకి చెందిన దక్ష్ (100), ఎస్సీ విభాగంలో ఉత్తరప్రదేశ్కు చెందిన శ్రేయస్ లోహియా (100), ఎస్టీ విభాగంలో రాజస్థాన్కు చెందిన పార్థ్ (99.97), దివ్యాంగుల కోటాలో చత్తీస్గఢ్కు చెందిన అర్షల్ గుప్తా (99.95) టాపర్లుగా నిలిచారు. మాల్ ప్రాక్టీస్కు ప్రయత్నించిన 39 మంది విద్యార్థుల ఫలితాలను నిలిపివేసినట్లు ఎన్టీఏ తెలిపింది. ఏప్రిల్లో జరిగే రెండో సెషన్ పరీక్షల తర్వాత ఇప్పుడు విద్యార్థులు సాధించిన ఉత్తమ స్కోరును కూడా పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు విడుదల చేయనుంది. 300 మార్కులకు 295 కైవసం చేసుకున్న మనోజ్ఞ గుంటూరు ఎడ్యుకేషన్: జేఈఈ మెయిన్ సెషన్–1 పరీక్షల్లో గుంటూరుకి చెందిన గుత్తికొండ సాయి మనోజ్ఞ 300 మార్కులకు 295 మార్కులు సాధించి విశేష ప్రతిభ చూపించింది. 100 పర్సంటైల్తో అఖిల భారతస్థాయిలో టాపర్గా నిలిచింది. మేథమెటిక్స్లో 100, కెమిస్ట్రీలో 100, ఫిజిక్స్లో 95 మార్కులు సాధించింది. గుత్తికొండ కిషోర్ చౌదరి, పద్మజ కుమార్తె అయిన సాయి మనోజ్ఞ టెన్త్ ఐసీఎస్ఈ సిలబస్లో చదివి 600 మార్కులకు గానూ 588 సాధించింది. జూనియర్ ఇంటర్లో 470 మార్కులకు 466 కైవసం చేసుకుంది. తండ్రి కిషోర్ చౌదరి ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్గా పని చేస్తుండగా, తల్లి పద్మజ ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మినిస్ట్రేటర్గా పని చేస్తున్నారు. ఏప్రిల్లో జరిగే జేఈఈ మెయిన్ రెండో సెషన్తో పాటు అడ్వాన్స్డ్కు మనోజ్ఞ సన్నద్ధమవుతోంది. అడ్వాన్స్డ్లో సాధించే ర్యాంకు ఆధారంగా ఐఐటీలో ఈసీఈ బ్రాంచ్లో చేరాలని భావిస్తోంది. గుంటూరు భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీలో అధ్యాపకులు ఇచ్చిన ప్రణాళికను అనుసరిస్తూ సమయపాలనతో సన్నద్ధం కావడం ద్వారా 100 పర్సంటైల్ సాధించినట్లు మనోజ్ఞ తెలిపింది. తెనాలి వివేక జూనియర్ కాలేజి విద్యార్థి తూనుగుంట్ల వెంకట పవన్కుమార్ జేఈఈ మెయిన్ (సెషన్–1)లో 99.37 పర్సెంటైల్ను సాధించాడు.100 స్కోర్ సాధించిన విద్యార్థులుఆయుష్ సింఘాల్ (రాజస్థాన్)కుషాగ్ర గుప్తా (కర్ణాటక) దక్ష్ (ఢిల్లీ) హర్ష్ ఝా (ఢిల్లీ) రజిత్ గుప్త (రాజస్థాన్) శ్రేయస్ లోహియా (ఉత్తర ప్రదేశ్) సాక్షం జిందాల్ (రాజస్థాన్) సౌరవ్ (ఉత్తర ప్రదేశ్) విషద్ జైన్ (మహారాష్ట్ర) అర్నవ్ సింగ్ (రాజస్థాన్) శివం వికాస్ తోహిని వాల్ (గుజరాత్) గుత్తికొండ సాయి మనోజ్ఞ (ఆంధ్రప్రదేశ్) ఓం ప్రకాష్ బహేరా (రాజస్థాన్) బని బ్రాతా మజీ (తెలంగాణ) -
ఈసారి ఇద్దరే!
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్)–2025 తొలి సెషన్ పరీక్షలో రాజస్తాన్కు చెందిన ఆయూస్ సింఘాల్ జాతీయ స్థాయిలో తొలి స్థానంలో నిలిచాడు. ఈ పరీక్షలో ఈసారి తెలుగు విద్యార్థులు పూర్తిగా వెనుకబడ్డారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో జాతీయ స్థాయిలో తొలి 14 స్థానాల్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మాత్రమే స్థానం సంపాదించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ 12వ స్థానంలో నిలవగా, తెలంగాణకు చెందిన బని బ్రాత మజీకి 14వ స్థానం దక్కింది. గత ఏడాది జేఈఈ మెయిన్లో తొలి 14 స్థానాల్లో 5, 6, 7, 8, 12, 13, 14 ర్యాంకులు తెలుగు విద్యార్థులు కైవసం చేసుకున్నారు. జేఈఈ మెయిన్–2025 తొలి సెషన్ పరీక్షలో కర్ణాటకకు చెందిన కుషార్గా గుప్తా ద్వితీయ స్థానం, ఢిల్లీకి చెందిన దక్ష, హరీస్ ఝా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. మొదటి 14 ర్యాంకుల్లో ఎక్కువగా రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ విద్యార్థులే ఉన్నారు. ఇద్దరు తెలుగువారికే వంద పర్సంటైల్ఈసారి జేఈఈ మెయిన్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మాత్రమే వంద పర్సంటైల్ సాధించారు. 99 స్కోర్ జాబితాలో తెలుగు పేర్లే లేవు. జనవరి 22 నుంచి 28 వరకు జేఈఈ మెయిన్ –2025 తొలి సెషన్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 13,11,544 మంది రిజిస్టర్ చేసుకోగా, 12,58,136 (95.93 శాతం) మంది పరీక్ష రాశారు. జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్కు చెందిన కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ 99 స్కోర్తో టాపర్గా నిలిచారు. మహిళా విభాగంలో సాయి మనోజ్ఞ గుత్తికొండ టాపర్గా నిలిచారు. ఏప్రిల్లో జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ జరుగుతాయి. రెండు విభాగాలను ప్రామాణికంగా తీసుకుని తుది ర్యాంకులు ప్రకటిస్తారు. -
31 నుంచి ఏప్రిల్ సెషన్ దరఖాస్తులు
సాక్షి, ఎడ్యుకేషన్: జేఈఈ–మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షలకు ఈ నెల 31 (శుక్రవారం) నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది. విద్యార్థులు ఫిబ్రవరి 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి 8 వరకు ప్రతి రోజు రెండు షిఫ్టులలో నిర్వహిస్తారు. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటన విడుదల చేసింది. జనవరి సెషన్ బీటెక్ ప్రవేశ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. వీటికి సంబంధించి రెస్పాన్స్ షీట్, ‘కీ’లను ఫిబ్రవరి 1 లేదా 2వ తేదీన ఎన్టీఏ విడుదల చేసే అవకాశం ఉంది. సులభమైన ప్రశ్నలే.. బుధవారం నిర్వహించిన జేఈఈ మెయిన్ మొదటి షిఫ్ట్ పరీక్ష సులభంగా ఉందని విద్యార్థులు చెప్పారు. ఫిజిక్స్లో గడిచిన నాలుగు రోజుల్లో నిర్వహించిన పరీక్షల్లో అడిగిన ప్రశ్నలే ఎక్కువగా అడగడం గమనార్హం. ఈ సబ్జెక్ట్లో అధిక శాతం ప్రశ్నలు కాన్సెప్ట్లు, ఫార్ములా ఆధారితంగా ఉన్నాయి. ఎక్కువ ప్రశ్నలు ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం సిలబస్ నుంచే వచ్చాయి. మ్యాథమెటిక్స్ ఓ మాదిరి క్లిష్టతతో ఉందని, కెమిస్ట్రీ విభాగం సులభంగా ఉందని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. ఈ విభాగంలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ టాపిక్స్ ప్రశ్నలు సులభంగా ఉన్నాయి. రెండో షిఫ్ట్లో ఫిజిక్స్ క్లిష్టంగా న్యుమరికల్ ఆధారిత ప్రశ్నలతో ఉందని, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీలో డైరెక్ట్ ప్రశ్నలు అడిగారని విద్యార్థులు చెప్పారు. మార్కుల మధ్య వ్యత్యాసం జేఈఈ మెయిన్ జనవరి సెషన్ పరీక్షల్లో క్లిష్టత స్థాయిని బట్టి విద్యార్థులు పొందే మార్కుల్లో 35 నుంచి 60 మార్కుల వరకు వ్యత్యాసం ఉండొచ్చు. ఉదాహరణకు 2024లో క్లిష్టంగా ఉన్న పేపర్లో 176 మార్కులు వచ్చిన విద్యార్థికి 99 పర్సంటైల్ రాగా, ఓ మాదిరి క్లిష్టంగా ఉన్న పేపర్లో 224 మార్కులకు 99 పర్సంటైల్ వచ్చింది.దీంతో జనవరి సెషన్లో క్లిష్టమైన పేపర్స్ విషయంలో 170 నుంచి 150 మార్కులతో 99 పర్సంటైల్, ఓ మోస్తరు పేపర్లో 180–195 మార్కులతో 99 పర్సంటైల్ పొందే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు రెస్పాన్స్ షీట్స్, ‘కీ’లను చూసి ఆందోళన చెందవద్దు. మొత్తం పది షిఫ్ట్లలో 25, 29 తేదీల్లో షిఫ్ట్–1 పేపర్లు, 28వ తేదీ షిఫ్ట్–2 పేపర్లు కఠినంగా ఉన్నాయి. – ఎం.ఎన్.రావు, జేఈఈ శిక్షణ నిపుణుడు -
నీట్ యూజీ–2025 పెన్,పేపర్తోనే..
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: పేపర్ లీకేజీలు, ఇతర వివాదాల నేపథ్యంలో నీట్ యూజీ–2025పై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక ప్రకటన చేసింది. దేశంలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ –2025 పరీక్షను ఆఫ్లైన్ మోడ్లో అంటే పెన్, పేపర్ (ఓఎంఆర్ విధానం) పద్ధతిలో నిర్వహించనున్నట్లు గురువారం ప్రకటించింది. పేపర్ లీక్, ఇతర అక్రమాలను నిరోధించేందుకు ఈసారి దేశవ్యాప్తంగా ‘ఒకే రోజు– ఒకే షిఫ్టు’లో ఈ పరీక్షను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఖరా రు చేసిన మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఎంబీబీఎస్తోపాటు బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్ఎంఎస్ కోర్సులకు యూనిఫామ్ నీట్ యూజీ పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. నీట్ యూజీ ఫలితాల ఆధారంగా నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి కింద బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో అడ్మి షన్లు నిర్వహిస్తారు. దీంతోపాటు సాయుధ దళాలకు వైద్య సేవలందించే ఆసుపత్రుల్లో బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో చేరాలనుకునే మిలిటరీ నర్సింగ్ సర్వీస్ అభ్యర్థులు కూడా నీట్ అర్హత సాధించాల్సి ఉంటుంది. నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సుకూ నీట్ యూజీ కోర్సులో అర్హత సాధించాల్సి ఉంటుందని ఎన్టీఏ తెలిపింది. ఆన్లైన్ పరీక్షపై మల్లగుల్లాలు గత సంవత్సరం నీట్–2024లో చోటు చేసుకున్న లీక్ వ్యవహారాల నేపథ్యంలో నీట్ యూజీ– 2025ని జేఈఈ మెయిన్ తరహాలో ఆన్లైన్ విధానంలో నిర్వహించాలనే డిమాండ్లు వచ్చాయి. దీంతో ఎన్టీఏ నిర్వహించే పరీక్షల్లో పారదర్శకతను పెంచే సూచనలు చేసేందుకు ఇస్రో మాజీ చైర్మన్ ఆర్ రాధాకృష్ణన్ నేతృత్వంలో కేంద్రం ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విస్తృత సమాలోచనలు జరిపి ‘మల్టీ సెషన్ టెస్టింగ్, మల్టీ స్టేజ్ టెస్టింగ్ ’విధానంలో నీట్ను.. ‘మల్టిట్యూడ్ సబ్జెక్ట్ స్టీమ్స్’విధానంలో ‘కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) పరీక్షలను నిర్వ హించాలంది. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయి ల్లో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపింది. తాజాగా కేంద్ర విద్య, ఆరోగ్యశాఖలు జరిపిన చర్చల్లో పాత ఓఎంఆర్ పద్ధతికే మొగ్గుచూపుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే అవకతవకలకు ఆస్కారం లేకుండా ఒకే రోజు– ఒకే షిఫ్టు విధానాన్ని అవలంబించాలని నిర్ణయించారు. ‘నీట్ యూజీ–2025ని ఆన్లైన్లో నిర్వహించాలా? పెన్, పేపర్ పద్ధతిలో నిర్వహించాలా? అనే అంశంపై కేంద్ర విద్య, ఆరోగ్యశాఖలు చర్చించాయి. ఆ తర్వాతే ఈ పరీక్షను ఓఎంఆర్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించాం. ఎన్ఎంసీ నిర్ణయం ప్రకారం, నీట్–యూజీ–2025ని పెన్, పేపర్ పద్ధతిలోనే నిర్వహిస్తాం. ఒకే రోజు, ఒకే షిఫ్టులో పరీక్ష ఉంటుంది’అని ఎన్టీఏ వర్గాలు చెప్పాయి.దేశంలోనే అతిపెద్ద పరీక్ష దేశంలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే పరీక్షగా నీట్కు పేరుంది. 2024లో ఏకంగా 24 లక్షల మందికిపైగా ఈ పరీక్ష రాశారు. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లోని దాదాపు 1.08 లక్షల ఎంబీబీఎస్ సీట్ల భర్తీ కోసం ఏటా నీట్ పరీక్షను ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఇందులో దాదాపు 56 వేల సీట్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉన్నాయి. నీట్లో సాధించే మార్కుల ఆధారంగా విద్యార్థులకు వివిధ కోర్సుల్లోనూ ప్రవేశాలు లభిస్తాయి.ఆధార్ ఆథెంటికేషన్ తప్పనిసరి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఓటీపీ ఆధారిత ధ్రువీకరణ కోసం మొబైల్ నంబర్తోపాటు ఆధార్ను లింక్ చేయాలని ఎన్టీఏ గతంలో కోరింది. అభ్య ర్థులు తమ పదోతరగతి సర్టిఫికెట్ ప్రకారం ఆధార్ క్రెడెన్షియల్స్ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సరళమైన దరఖాస్తు ప్రక్రియ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. ఆధార్లోని ఫేస్ అథెంటికేషన్ పద్ధతి వల్ల అభ్యర్థుల గుర్తింపు వేగవంతం, సులభతరమవుతుందని వెల్లడించింది. దీనివల్ల ప్రవేశ పరీక్షలోని అన్ని ప్రక్రియలు సునాయాసంగా పూర్తవుతాయని తెలిపింది. నీట్ యూజీ–2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. సిలబస్ను ఇప్పటికే అధికారిక వెబ్సైట్లో ఉంచారు. -
నీట్ యూజీ పరీక్షపై కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీ: నీట్ యూజీ పరీక్షలు నిర్వహణపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఓఎంఆర్ పద్దతిలో నీట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దేశమంతా ఒకే రోజు.. ఒకే షిఫ్టులో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. కేంద్ర విద్య-ఆరోగ్య శాఖల మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం చివరకు ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్రం పేర్కొంది. ‘‘నేషనల్ మెడికల్ కమిషన్ నిర్ణయం మేరకు నీట్ యూజీ పరీక్ష పెన్, పేపర్ పద్ధతిలో నిర్వహిస్తామని ఒకే రోజు, ఒకే షిఫ్టులో ఈ పరీక్ష ఉంటుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది.2024లో 24 లక్షల మంది విద్యార్థులు నీట్ యూజీ పరీక్ష రాయగా, జేఈఈ మెయిన్ తరహాలోనే ఈసారి కూడా నీట్ యూజీ పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని ఎన్టీఏ భావించింది. ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ ఛైర్మన్గా నియమించిన నిపుణుల కమిటీ సైతం ఆన్లైన్ విధానంలోనే నీట్ నిర్వహించాలంటూ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.. అయితే, తాజాగా కేంద్ర విద్య, ఆరోగ్యశాఖలు జరిపిన విస్తృత సర్వే, చర్చల్లో ఓఎంఆర్ పద్ధతికే మొగ్గుచూపడంతో ఈ నిర్ణయం అమలు చేయనున్నారు.నీట్ ఫలితాల ఆధారంగానే నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి కింద బీహెచ్ఎంఎస్ కోర్సు అడ్మిషన్లు చేపడతారు. దీంతో పాటుగా ఆర్మ్డ్ మెడికల్ సర్వీస్ హాస్పిటల్స్లో బీఎస్సీ నర్సింగ్ కోర్సు అడ్మిషన్లకు నీట్ యూజీ అర్హత సాధించాల్సి ఉంటుంది. నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు కూడా నీట్ యూజీ కోర్సులో అర్హత సాధించాల్సి ఉంటుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది.ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక -
ఉన్నత విద్య ఎంట్రన్స్లకే ఎన్టీఏ పరిమితం
న్యూఢిల్లీ: 2025 నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని ఉద్యోగ ఎంపిక పరీక్షల నిర్వహణ బాధ్య తల నుంచి తప్పిస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. కేవలం ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షలను మాత్రమే ఎన్టీఏ ఇకపై నిర్వహిస్తుందన్నారు. వచ్చే ఏడాదిలో ఈ మేరకు ఎన్టీఏను పునర్వ్యవస్థీకరించి, అవసరమైన కొత్త పోస్టులను సృష్టిస్తామని చెప్పారు. అంతేకాకుండా, నీట్ను సంప్రదాయ పెన్, పేపర్ విధానం బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)గా చేపట్టేందుకు ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి ప్రధాన్ మంగళవారం మీడియాకు చెప్పారు. వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ సహా పలు పరీక్షా పత్రాల లీకేజీలు, రద్దు వంటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇచ్చిన సిఫారసుల ఆధారంగా పునర్వ్యవస్థీకరణకు పలు చర్యలు తీసుకుంటోంది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (క్యూయెట్– యూజీ)ను ఇకపైనా ఏడాదిలో ఒక్క పర్యాయం మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఎన్టీఏను ప్రవేశ పరీక్షల బాధ్యతలను మాత్రమే అప్పగించాలి. దాని సామర్థాన్ని పెంచిన తర్వాత ఇతర పరీక్షల బాధ్యతలను అప్పగించే విషయం ఆలోచించాలి’అని ఇస్రో మాజీ చీఫ్ ఆర్. రాధాకృష్ణన్ సారథ్యంలోని కమిటీ సిఫారసు చేసింది. సంబంధిత కోర్సులో జాయినయ్యే విద్యార్థి మాత్రమే ఆన్లైన్ పరీక్ష రాసేలా డిజి–యాత్ర మాదిరిగానే డిజి–ఎగ్జామ్ విధానాన్ని తీసుకురావాలని కమిటీ పేర్కొంది. ఇందుకోసం, ఆధార్, బయో మెట్రిక్తోపాటు ఏఐ ఆధారిత డేటా అనలిటిక్స్ను వినియోగించుకోవాలని సూచించింది. పరీక్షల నిర్వహణ, భద్రత, నిఘా, సాంకేతికత వంటి అంశాలకు సంబంధించి డైరెక్టర్ స్థాయిలో 10 సిఫారసులను చేసిందిఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల ధర తగ్గింపు2025 నుంచి ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల ధరలను తగ్గించనున్నట్లు మంత్రి ప్రధాన్ వివరించారు. ప్రస్తుతం ఏడాదికి 5 కోట్ల టెక్ట్స్ బుక్స్ను మాత్రమే ప్రచురిస్తున్నారన్నారు. 2025 నుంచి ముద్రణ సామర్థ్యాన్ని 15 కోట్లకు పెంచుతామని, నాణ్యమైన పుస్తకాలను అందిస్తామని ప్రక టించారు. పాఠ్య పుస్తకాల ధరలను పెంచి, విద్యా ర్థుల తల్లిదండ్రులపై భారం పెంచబోమన్నారు. మారిన సిలబస్ ప్రకారం 2026–27 నుంచి 9 నుంచి 12వ తరగతి వరకు కొత్త పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెస్తామని మంత్రి వెల్లడించారు. -
జేఈఈ మెయిన్కు దరఖాస్తుల జోరు
సాక్షి, అమరావతి: దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీ వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్షకు ఈ ఏడాది కూడా దరఖాస్తుల జోరు కొనసాగింది. జేఈఈ మెయిన్–2025 జవనరి సెషన్ కోసం సుమారు 12 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. జవనరి 22 నుంచి 31వరకు తొలి సెషన్, ఏప్రిల్ 1 నుంచి 8 వరకు రెండో సెషన్ పరీక్షలకు షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. విద్యార్థులు జనవరి 19 నుంచి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం జనవరి సెషన్కు అక్టోబర్ 28 దరఖాస్తుల విండో ప్రారంభమైనా... మొదటి రెండు వారాల్లో కేవలం 5.10లక్షల మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. కొత్త విధానాలు, అర్హత ప్రమాణాల మార్పులు విద్యార్థులను గందరగోళానికి గురిచేసినట్లు నిపుణులు చెబుతున్నారు. దరఖాస్తు సమయంలో కొన్ని పత్రాలు ప్రత్యేకంగా అప్లోడ్ చేయాల్సి రావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అయినా చివరికి ఈ నెల 22వ తేదీన గడువు ముగిసే నాటికి 12లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. గత ఏడాది కంటే దరఖాస్తులు స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తున్నప్పటికీ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్టీఏ ప్రకటించాల్సి ఉంది.ఐచ్ఛిక ప్రశ్నలు, వయసు పరిమితి తొలగింపు..కోవిడ్ సమయంలో తీసుకొచ్చిన జేఈఈ మెయిన్ పరీక్షల్లో సెక్షన్–బీలోని ఐచ్ఛిక ప్రశ్నల విధానాన్ని ఎన్టీఏ తొలగించింది. ఇప్పుడు సెక్షన్–బీలోని ప్రతి సబ్జెక్టులో పది ప్రశ్నలకు బదులు ఐదు ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. మరోవైపు న్యూమరికల్ వాల్యూ ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్ పద్ధతిని తీసుకొచ్చింది. అంటే మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల మాదిరిగానే ప్రతి తప్పు సమాధానానికి మార్కులు కోల్పోవాల్సి ఉంటుంది. ఎన్టీఏ కొత్తగా వయోపరిమితిని సైతం సడలించింది. 12వ తరగతి విద్యా అర్హత కలిగిన ఎవరైనా ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.టై బ్రేక్ రూల్స్ మార్పు...– జేఈఈ మెయిన్–2025లో ఒకే మార్కులు వచ్చినప్పుడు అభ్యర్థుల ర్యాంకుల టై బ్రేక్ రూల్స్ను ఎన్టీఏ సవరించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం పరీక్ష రాసేవారి వయసు, దరఖాస్తు సంఖ్యను ర్యాంకింగ్ ప్రక్రియలో పరిగణనలోకి తీసుకోరు.– విద్యార్థులు ఒకే మొత్తం స్కోర్ను సాధిస్తే సబ్జెక్టులలో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తారు. – గణితంలో ఎక్కువ స్కోరు సాధించిన అభ్యర్థులు టై సమయంలో ఉన్నత ర్యాంక్ పొందుతారు.– గణితంలోను ఒకే మార్కులు వచ్చినప్పుడు ఫిజిక్స్లో ఎక్కువ స్కోర్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. అక్కడ కూడా ఒకే మార్కులు సాధిస్తే కెమిస్ట్రీ స్కోర్ను పరిగణనలోకి తీసుకుంటారు.– వీటి ద్వారా టై సమస్య కొలిక్కి రాకపోతే అన్ని సబ్జెక్ట్లలో సరైన సమాధానాలకు, సరికాని సమాధానాల నిష్పత్తి తక్కువగా ఉన్న అభ్యర్థులకు ఉన్నత ర్యాంక్ కేటాయిస్తారు. వీటిల్లోను నిష్పత్తి టై అయితే గణితం, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో వరుసగా సరికాని సమాధానాల నిష్పత్తులను గుర్తిస్తారు. – ఈ అన్ని దశల తర్వాత కూడా టై మిగిలి ఉంటే అభ్యర్థులకు అదే ర్యాంక్ కేటాయిస్తారు. దేశ, విదేశాల్లో తగ్గిన పరీక్ష కేంద్రాల నగరాలు..దేశంలో జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించే నగరాలను 300 నుంచి 284కి తగ్గించారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పరీక్షను నిర్వహించే నగరాలను 24 నుంచి 14 కుదించారు. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, హాంకాంగ్ వంటి దేశాల్లో ఎన్టీఏ పరీక్ష కేంద్రాలను తొలగించింది. కొత్తగా బహ్రెయిన్, జర్మనీ, ఇండోనేషియా, ఏయూఈలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఆంధ్రప్రదేశ్లో 11 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను తొలగించడంతోపాటు మరికొన్ని నగరాల్లో సెంటర్లను తగ్గించారు. తెలంగాణాలో రెండు కొత్తగా రెండు నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.ఏపీలో పరీక్షా కేంద్రాలు ఇవే...అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం, మచిలీపట్నం, నంద్యాల, తాడేపల్లిగూడెం.ఏపీలో పరీక్ష కేంద్రాలు తొలగించిన పట్టణాలుఅమలాపురం, బొబ్బిలి, చీరాల, గుత్తి, గుడ్లవల్లేరు, మదనపల్లె, మార్కాపురం, పుట్టపర్తి, పుత్తూరు, తాడిపత్రి, తిరువూరు. -
విద్యార్థులకు ఆధార్.. బాధార్..
ప్రభుత్వం నుంచి పొందే సేవలన్నింటినీ ఆధార్తో ముడిపెట్టడంతో అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్నత విద్య, ఉద్యోగ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసే సమయంలోను ఆధార్ కార్డునే పరిగణనలోకి తీసుకుంటుండడం అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. ఆధార్ కార్డును గుర్తింపు ధ్రువీకరణగా మాత్రమే చూడాలని కేంద్రం స్పష్టం చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. తాజాగా జేఈఈ మెయిన్ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను ఆధార్ సమస్య వేధిస్తోంది. జనవరిలో జరగనున్న జేఈఈ మెయిన్–2025 మొదటి సెషన్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు గడువు ఈనెల 22న ముగియనుంది. దరఖాస్తు చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిబంధనలు విద్యార్థులకు చెమటలు పట్టిస్తున్నాయి. ప్రధానంగా ఆధార్ కార్డులోను, టెన్త్ సర్టిఫికెట్లోను విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, చిరునామా ఒకే విధంగా ఉండాలనే నిబంధన చాలా ఇబ్బందిగా మారింది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి 20 వేలమందికిపైగా జేఈఈ మెయిన్కు దరఖాస్తు చేసుకుంటారు. ఆధార్కార్డు, టెన్త్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయగానే నేమ్స్ మిస్ మ్యాచ్ అని చూపిస్తోందని ఎక్కువశాతం మంది విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. –గుంటూరు ఎడ్యుకేషన్ఆధార్ కేంద్రాల వద్ద ఆలస్యం దీంతో జేఈఈ మెయిన్కు సిద్ధమయ్యే విద్యార్థులు ఆధార్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. ఒక్క గుంటూరు నగరంలోనే వందలమంది విద్యార్థులు నెలరోజులుగా ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. పేర్ల సవరణల కోసం ప్రయత్నిస్తున్నారు. పేరులో తప్పుల సవరణ, బయోమెట్రిక్ నమోదు, చిరునామా మార్పు ఒకేసారి చేయడం కుదరదని, మరోసారి రావాలని ఆయా కేంద్రాల సిబ్బంది చెబుతుండడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. దరఖాస్తుకు గడువు సమీపిస్తుండటం వారిని కలవరపరుస్తోంది. ఆధార్కార్డులో సవరణలకు 15 రోజుల నుంచి నెలరోజుల సమయం పట్టడం కూడా ఇబ్బందిగా మారింది. తగినన్నిఆధార్ కేంద్రాలేవి?జేఈఈ మెయిన్తోపాటు ఇంటర్మీడియెట్, అపార్ నమోదు కోసం ఆధార్లో సవరణలు విద్యార్థులను వేధిస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా తగినన్ని ఆధార్ కేంద్రాలు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. ఎంపిక చేసిన బ్యాంకులు, పోస్టాఫీసుల్లోనే ఉన్న ఆధార్ కేంద్రాలు ప్రస్తుతం కిటకిటలాడుతున్నాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చి గుంటూరులోని ప్రైవేటు జూనియర్ కళాశాలల హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆధార్ కార్డులో సవరణలు కోసం ఎక్కడో మారుమూల ఉన్న ఊర్ల నుంచి తల్లిదండ్రులు వచి్చ, పిల్లలను వెంటబెట్టుకుని ఆ«ధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. రోజుల తరబడి ఇక్కడే ఉండాలంటే వారికి కష్టంగా ఉంటోంది. పరీక్షలకు సన్నద్ధమవ్వాల్సిన విద్యార్థుల సమయం ఆధార్ కేంద్రాల వద్దే గడిచిపోతోంది. దీనికితోడు గుంటూరులో చంద్రమౌళీనగర్లోని పోస్టాఫీసులో ఉన్న ఆధార్ కేంద్రాన్ని ఇటీవల మూసేశారు. విద్యార్థుల కోసం ఆధార్ సవరణలకు ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన జిల్లా అధికారులు తరువాత పట్టించుకోలేదు. -
నెలాఖరుకు జేఈఈ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: జేఈఈ–2025 నోటిఫికేషన్ ఈ నెలాఖరులో వెలువడనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ దిశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. నవంబర్ మొదటి వారంలో ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించే వీలుందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. జనవరిలో మొదటి విడత జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఏప్రిల్ లేదా మే నెలలో రెండో విడత మెయిన్స్ను ఆన్లైన్ పద్ధతిలో చేపట్టనున్నారు. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ సంస్థల్లో ప్రవేశానికి ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ)ను నిర్వహిస్తారు. మెయిన్స్లో అర్హత సాధించిన వారిలో 2.5 లక్షల మందిని అడ్వాన్స్డ్కు పంపుతారు. అడ్వాన్స్డ్లో పొందిన ర్యాంకుల ఆధారంగా ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తారు. జేఈఈ మెయిన్స్ ర్యాంకు ద్వారా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ఇంజనీరింగ్ సీట్లు పొందే వీలుంది. ఈ పరీక్షను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలపై దృష్టి పెట్టారు. ఏయే కేంద్రాలను ఎంపిక చేయాలనే సమాచారాన్ని ఎన్టీఏ సేకరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మొదటినుంచీ తెలంగాణ వ్యాప్తంగా 21 పట్టణాల్లో జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తున్నారు. అయితే గత ఏడాది నుంచి పరీక్ష కేంద్రాలను కుదించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో పరీక్ష కేంద్రాలను 17 పట్టణాలకే పరిమితం చేశారు. కాగా, గత ఏడాది జేఈఈ రాసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ కారణంగా ఈ సంవత్సరం పరీక్ష కేంద్రాలను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నారు.సిలబస్పై కసరత్తు.. గత సంవత్సరం జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్కు కూడా పరీక్ష సిలబస్ను తగ్గించారు. 2020లో కరోనా కారణంగా 8 నుంచి 12వ తరగతి వరకూ కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్లో కొన్ని చాప్టర్లను తీసివేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సీబీఎస్ఈతో పాటు ఇతర జాతీయ సిలబస్ ఉండే విద్యార్థులకు జేఈఈలో ఆయా చాప్టర్లను తొలగించాలనే డిమాండ్ వచ్చింది. ఈ కారణంగా గత సంవత్సరం కొన్ని చాప్టర్లను ఇవ్వలేదు. అయితే, ఈ ఏడాది ఆ సమస్య లేదని అధికారులు భావిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పాత సిలబస్ను మళ్లీ కలపడమా? లేదా ఈ సంవత్సరం కూడా గత ఏడాది మాదిరిగానే నిర్వహించడమా? అనే దానిపై ఎన్టీఏ, ఇతర కేంద్ర సంస్థలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. -
ఎన్టీఏ ఛైర్మన్ రికార్డుపై సందేహాలు: కాంగ్రెస్
ఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లో ఏజెన్సీకి సబంధించి సమాచారం చాలా తక్కవగా ఉందని టీఎంసీ ఎంపీ సాగరికా ఘోష్ ప్రశ్నించిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎన్టీఏపై ఆరోపణలు చేసింది.‘‘ఎన్టీఏ ఏకైక పని అవుట్సోర్స్ చేయడం మాత్రమే. దీని ఛైర్మన్ ప్రదీప్ కుమార్ జోషీ.. మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్గా పనిచేసిన సమయంలో చాలా సందేహాస్పదమైన రికార్డును కలిగి ఉన్నారు’’ అని కాంగ్రెస్ నేత జైరాం రమేస్ ‘ఎక్స్’వేదికగా విమర్శలు చేశారు.The only job of NTA appears to be to outsource. Its Chairman has a very dubious record as Chairman of the Madhya Pradesh Public Service Commission. https://t.co/DhBa5KDSos— Jairam Ramesh (@Jairam_Ramesh) August 3, 2024ఇక.. నీట్తో సహా 17 ప్రధాన పరీక్షలకు బాధ్యత వహించే ఎన్టీఏ తన వెబ్సైట్లో ఏజెన్సీ గురించి చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంచిందని.. ఇలా ఎందుకు పరిమితమైన సమాచారం ఇస్తోందని అడుగుతూ శుక్రవారం టీఎంసీ ఎంపీ సాగరికా ఘోష్ విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు లేఖ రాశారు. ‘అధికారులు ఎవరు? ఏజెన్సీ వార్షిక నివేదికలు ఎక్కడ ఉన్నాయి? భవిష్యత్ పరీక్షల కోసం ప్రజల విశ్వాసాన్ని పెంచుకోవడానికి ఎన్టీఏ తన వెబ్సైట్లో ఏజెన్సీకి సంబంధించి మరింత సమాచారాన్ని అందించాలి’ అని లేఖలో పేర్కొన్నారు. -
లోపాల్ని సరిదిద్దుకోవాల్సిందే.. ఎన్టీఏకు సుప్రీం అక్షింతలు
న్యూఢిల్లీ: నీట్ యూజీ పరీక్ష విధానానికి సంబంధించిన లోపాలను (సరిదిద్దాలని) నివారించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ను సుప్రీంకోర్టు శుక్రవారం హెచ్చరించింది. మున్ముందు ఇలాంటి లీకేజీలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అటు కేంద్రంతోపాటు ఎన్టీఏను మందలించింది. ఈ మేరకు నీట్ యూజీ పేపర్లీక్పై దాఖలైన వివిధ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. శుక్రవారం తుది తీర్పు వెలువరించింది.పేపర్లీకేజీలో వ్యవస్థీకృత ఉల్లంఘన జరగలేదని, కేవలం పాట్నా, హజారీబాగ్కే పరిమితమని సుప్రీం వ్యాఖ్యానించింది. అందుకే నీట్ పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించేందుకు నిరాకరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ ధర్మాసంన సమగ్ర తీర్పు వెల్లడించింది.నీట్ వంటి జాతీయ పరీక్షలో ఇలాంటి 'ఫ్లిప్ ఫ్లాప్స్'ను నివారించాలని, ఇవి విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతిస్తాయని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నీట్ యూజీ పేపర్ లీక్పై ఆరోపణలు, ఇతర అవకతవకలపై వివాదం చెలరేగినప్పటికీ పరీక్షను రద్దు చేయకపోవడానికి గల కారణాలను వెలువరిస్తూ, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిందిపరీక్షా విధానంలో లోపాలను నిపుణుల కమిటీ సరిచేయాలని పేర్కొంది. ఎన్టీఏ స్ట్రక్చరల్ ప్రాసెస్లోని లోపాలన్నింటినీ తమ తీర్పులో ఎత్తిచూపినట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. విద్యార్థుల శ్రేయస్సు కోసం లోపాలను భరించలేమని స్పష్టం పేర్కొంది. తాజాగా తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా ఈ ఏడాదే కేంద్రం పరిష్కరించాలని సుప్రీంకోర్టు సూచించింది.ఈసందర్భంగా ఎన్టీఏ పనితీరు, పరీక్షల్లో సంస్కరణల కోసం కేంద్రం నియమించిన ఇస్రో మాజీ చీఫ్ కె.రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కమిటీకి సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది.కేంద్రం నియమించిన కమిటీ తన నివేదికను సెప్టెంబర్ 30 లోపు కోర్టుకు సమర్పించాలి. ఈ కమిటీ మొత్తం పరీక్ష ప్రక్రియను విశ్లేషించి, పరీక్ష విధానంలో లోపాలను సరిచేసి, ఎన్టీఏ మరింత సమర్థవంతంగా చేయడానికి అవసరమయ్యే మార్పులను సూచించాలి. పరీక్షా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ సాంకేతిక సంస్థల సాయం తీసుకోవాలని సూచించింది. ఈ నివేదిక అందిన తర్వాత అందులోని అంశాలను అమలుచేసే విషయంపై కేంద్రం, విద్యాశాఖ రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలి.అర్హత పరీక్షల నిర్వహణకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానం లేదా ప్రోటోకాల్ను రూపొందించడం,పరీక్షా కేంద్రాల కేటాయింపు, మార్పు ప్రక్రియను సమీక్షించాలి.అభ్యర్థుల గుర్తింపును ధృవీకరించడానికి కఠినమైన విధానాలను సిఫార్సు చేయాలి.అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను అంచనా వేయాలి.ట్యాంపరింగ్ ప్రూఫ్ ప్రశ్నపత్రాల కోసం యంత్రాంగాలను సమీక్షించాలి. సూచనలు ఇవ్వాలి.పరీక్షా కేంద్రాల్లో క్రమం తప్పకుండా ఆడిట్లు, తనిఖీలు నిర్వహించాలి. -
నీట్ యూజీ తుది ఫలితాల్లో గందరగోళం
న్యూఢిల్లీ: నీట్ యూజీ 2024 తుది ఫలితాల విడుదలో గందరగోళం నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తుది ఫలితాలను ప్రకటించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించగా.. కేంద్ర విద్యామంత్రిత్వశాఖ మాత్రం సవరించిన మర్కులకు సంబంధించిన ఫలితాలను తాము ఇంకా విడుదల చేయలేదని పేర్కొంది.విద్యార్ధులు ఫలితాలను ఇప్పుడే చూసుకోలేరని, తాము త్వరలో విడుదల చేస్తామని తెలిపింది. ఇప్పుడు వైరల్ అవుతున్న లింక్ పాతదని స్పష్టం చేసింది. కాగా నీట్ యూజీ-2024 తుది ఫలితాలు విడుదలయ్యాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సవరించిన ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసినట్లు వార్తలు వస్తున్నాయి.ఫిజిక్స్ విభాగంలో ఓ ప్రశ్నకు తప్పుడు సమాధానం ఎంచుకున్న కొంత మంది విద్యార్ధులకు కలిసిన గ్రేస్ మార్కులను తొలగించి.. తాజా ఫలితాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు తుది ఫలితాలను విడుదల చేసింది. దీని ఆధారంగా 4 లక్షల మంది అభ్యర్థులు 5 మార్కులను కోల్పోయారు. కాగా ఫిజిక్స్లోని ఓ ప్రశ్నకు 12వ తరగతి ఎన్సీఈఆర్టీ పాత సిలబస్ ప్రకారం తప్పుగా సమాధానం ఇచ్చిన కొంతమంది విద్యార్ధులకు ఎన్టీఏ అదనంగా మార్కులను కలిపింది. అయితే, కచ్చితమైన ఒక సమాధానాన్ని మాత్రమే అంగీకరించాలని, ఇతర సమాధానాలకు మార్కులు ఇవ్వరాదని సుప్రీంకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది. ఇప్పటికే ఇచ్చిన మార్కులను ఉపసంహరించుకోవాలని తెలిపింది.అయితే సుప్రీంకోర్టులో నీట్ వ్యవహారంపై విచారణ సందర్బంగా ఫిజిక్స్ విభాగంలో 29వ ప్రశ్నకు ఒకటి మాత్రమే సరైన సమాధానం అయినప్పుడు.. రెండు ఆప్షన్లు ఎంచుకున్న విద్యార్ధులకు ఎన్టీయే అదనపు మార్కులు కలిపిందని ఓ పిటిషనర్ లేవనెత్తాురు.దీనిపై స్పందించిన సుప్రీం దర్మాసనం.. ముగ్గురు నిపుణులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి మరుసటి రోజు మధ్యాహ్నానికి ఫిజిక్స్ ప్రశ్నకు సరైన సమాధానానికి సంబంధించిన నివేదికను సమర్పించాలని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ను ఆదేశించింది. అనంతరం ఐటీ ఢిల్లీ యొక్క నివేదిక ఆధారంగా ఆప్షన్ 4 మాత్రమే సరైన సమాధానం అని తెలిపింది. దీంతో ఆప్షన్ 4 ఎంపిక ేసిన విద్యార్ధులకు మాత్రమే మార్కులు ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది.ఇక ఈ ఏడాది మే నెలలో దేశవ్యాప్తంగా జరిగిన నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. మరోవైపు ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని పేర్కొంది. -
2018 నుంచి 16 పరీక్షలను వాయిదా వేసిన ఎన్టీఏ
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 16 పరీక్షలను వాయిదా వేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2018లో ఎన్టీఏ ఏర్పాటు కాగా.. వివిధ కారణాల వల్ల 16 పరీక్షలను వాయిదా వేసినట్లు విద్యా మంత్రిత్వ శాఖ సోమవారం లోక్సభలో పేర్కొంది. అయితే పరీక్షలను వాయిదా వేయడానికి కోవిడ్ 19 మహమ్మారి,సాంకేతిక, రవాణా, పరిపాలనా పరమైన సమస్యలను కారణాలుగా తెలిపింది. ఈ మేరకు డీఎంకే ఎంపీ కనిమొళి లోక్సభలో అడిగిన ప్రశ్నకు. విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.‘2018లో ఎన్టీఏ ఏర్పాటయ్యింది. 240 పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. 5.4 కోట్ల మందికి పైగా విద్యార్ధులు ఇందులో పాల్గొన్నారు. ఎన్టీఏ నిర్వహించే చాలా పరీక్షలు అనేక సబ్జెక్టులు, బహుళ-షిఫ్ట్లు, ఎక్కువ రోజుల వ్యవధిలో జరుగుతాయి. కాబట్టి కరోనా, లాజిస్టికల్, సాంకేతిక సమస్యలు, పరిపాలనాపరమైన సమస్యలు, చట్టపరమైన సమస్యలు వంటి కారణాల వల్ల పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. ముందు చెప్పిన తేదీలు, సమయాలకు పరీక్షలు నిర్వహించలేకపోయింది.’ అని పేర్కొన్నారు.కరోనా కారణంగా జేఈఈ-మెయిన్ (2020), నీట్-యూజీ (2020), JEE-మెయిన్ (2021) నీట్-యూజీ(2021) పరీక్షలు వాయిదా పడ్డాయి. వాయిదా పడిన మరిన్ని పరీక్షలు.. CSIR UGC-NET (2020), UGC-NET (డిసెంబర్ 2020),UGC-NET (మే 2021)ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) AIEEA (2020).. ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (DUET) 2020, GNOU PhDకామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (CMAT)-2021ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (AIAPGET)-2021 జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జిప్మ్యాట్)- 2021, GNOU PhD ఎంట్రన్స్ పరీక్షగ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బయోటెక్నాలజీ (GAT-B), 2023నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (NCET), 2024, CSIR-NET, 2024 -
ఒకే సెంటర్లో 85 శాతం మందికి అర్హత
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నీట్–యూజీ ఫలితాలను పరీక్షా కేంద్రాలు, నగరాల వారీగా శనివారం విడుదల చేసింది. ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో తీసుకొచి్చంది. ఈ ఫలితాలను పరిశీలిస్తే విస్మయకరమైన అంశాలు బయటపడుతున్నాయి. గుజరాత్లోని రాజ్కోట్లో ఒకే పరీక్షా కేంద్రంలో నీట్ రాసిన అభ్యర్థుల్లో ఏకంగా 85 శాతం మంది అర్హత సాధించినట్లు తెలుస్తోంది. రాజ్కోట్లోని యూనిట్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ సెంటర్లో 22,701 మంది నీట్ రాశారు. వీరిలో 85 శాతం అర్హత సాధించారు. ఈ సెంటర్లో 12 మంది 700కు పైగా, 115 మంది 650కిపైగా, 259 మంది 600కు పైగా, 403 మంది 550కిపైగా స్కోర్ సాధించారు. అలాగే రాజస్తాన్లోని విద్యాభారతి శిఖర్ సెంటర్లో పరీక్ష రాసినవారిలో కూడా చాలామందికి మెరుగైన స్కోర్ లభించింది. అక్కడ 8 మంది 700కు పైగా, 69 మంది 650కిపైగా, 155 మంది 600కుపైగా, 241 మంది 500కు పైగా స్కోర్ సాధించారు.హరియాణాలోని రోహ్తక్లో మోడల్ స్కూల్ సెంటర్లో పరీక్ష రాసిన వారిలో 45 మంది అభ్యర్థులకు 600కుపైగా స్కోర్ లభించింది. హరియాణాలోని ఝాజ్జర్లో హర్ద యాల్ పబ్లిక్ స్కూల్ సెంటర్లో ఇంతకముందు ఆరుగురు అభ్యర్థులకు 720కి 720 స్కోర్ దక్కింది. గ్రేసు మార్కులను తొలగించి, ఫలితాలను సవరించిన తర్వాత ఈ సెంటర్లో 13 మంది అభ్యర్థులు 600కుపైగా స్కోర్ సాధించారు. 682 స్కోర్ ఎవరికీ దాటలేదు. నీట్ కేసులో మరో ముగ్గురి అరెస్టు నీట్ పేపర్ లీక్ కేసులో సూత్రధారుల్లో ఒకరిగా భావిస్తున్న వ్యక్తిని సీబీఐ అధికారులు శనివారం అరెస్టు చేశారు. అతడిని ఎన్ఐటీ–జంòÙడ్పూర్ బీటెక్ గ్రాడ్యుయేట్ శశికాంత్ పాశ్వాన్ అలియాస్ శశిగా గుర్తించారు. అలాగే ఇదే కేసులో ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటిదాకా అరెస్టయిన వారి సంఖ్య 21కి చేరుకుంది. -
అప్పుడేమో నీట్ టాపర్లు, రీఎగ్జామ్ ఫలితాల్లో మాత్రం..
న్యూఢిల్లీ: ఆ సెంటర్లో నీట్ యూజీ రాసిన ఆరుగురికి 720కి 720 మార్కులు వచ్చాయి. అది ఫలితాలపై, మొత్తం పరీక్ష నిర్వహణపై అనుమానాలు రేకెత్తిస్తూ .. దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. అయితే గ్రేసు మార్కులు కలపవడం వల్లే అలా జరిగిందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వివరణ ఇచ్చుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో.. గ్రేస్ మార్కులు కలిపిన 1,563 మందికి రీటెస్ట్ నిర్వహించారు. ఇవాళ మధ్యాహ్నాం సెంటర్ల వారీగా ఫలితాలు విడుదల చేశారు. అయితే.. హర్యానాలో 720కి 720 ఆరుగురికి వచ్చిన సెంటర్లో ఈసారి ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. బహాదుర్ఘడ్లోని హర్దయాల్ పబ్లిక్ స్కూల్ సెంటర్లో మొత్తం 494 మంది పరీక్ష రాశారు. కానీ, ఆ సెంటర్లో రీఎగ్జామ్ రాసిన వాళ్లలో ఎవరికీ 700 దాటలేదు. ఆ సెంటర్లో హయ్యెస్ట్ మార్కులు 682 మాత్రమే. మరో పదమూడు మందికి 600కి పైగా మార్కులు వచ్చాయి. తొలుత వెల్లడైన ఫలితాలకు వీటికి మధ్య భారీ వ్యత్యాసం కనిపించింది.మే 5వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ పరీక్షలో.. హర్యానా సెంటర్లో రాసిన ఆరుగురికి ఫుల్స్కోర్, మరో ఇద్దరికి 719, 718 మార్కులు వచ్చాయి. అయితే.. రీటెస్ట్ తర్వాత నీట్ యూజీ పరీక్ష రాసిన అందరి ర్యాంకులు మారినట్లు ఫలితాల తర్వాత ఎన్టీఏ వెల్లడించడం తెలిసిందే. గతంలో జరిగిన నీట్ యూజీ పరీక్షలో 571 నగరాల్లోని 4,750 సెంటర్లలో 24 లక్షల మంది పరీక్ష రాశారు. అయితే షెడ్యూల్ కంటే ముందుగా జూన్ 4న ఫలితాలు ఇవ్వడం, అందులోనూ 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం అభ్యర్థుల్లో అనుమానాల్ని రేకెత్తించింది. రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు. ఈ అంశంపై రాజకీయ దుమారం సైతం చెలరేగడం, ఆపై వివాదం సుప్రీం కోర్టుకు చేరడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. చివరకు గ్రేస్ మార్కుల్ని రద్దు చేస్తూ రీటెస్ట్కు సుప్రీం కోర్టు ఆదేశించింది. జూన్ 24వ తేదీన నీట్ యూజీ రీటెస్ట్ నిర్వహించగా.. గ్రేస్ మార్కులు కలిపిన 1,563 మందికి 813 మంది మాత్రమే మళ్లీ పరీక్ష రాశారు.ఇక.. నీట్ పరీక్షలో పేపర్ లీక్ జరిగిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. మరోపక్క ఈ అవకతవకలపై సుప్రీంలో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే విచారణలో భాగంగా మిగతా కేంద్రాలతో పోలిస్తే అనుమానిత పరీక్ష కేంద్రాల్లో రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయా.. లేదా అని తెలుసుకోవడానికి కేంద్రాల వారీగా ఫలితాలు అందించాలని కోర్టు ఎన్టీఏను ఆదేశించింది. ఆ ఆదేశాల ప్రకారమే ఇవాళ ఎన్టీఏ తన వెబ్సైట్లో ఫలితాలు ఉంచింది. అయితే.. ఫలితాల వెల్లడి టైంలో విద్యార్థుల గుర్తింపు బయటపడకుండా చూడాలని సుప్రీం సూచనను టెస్టింగ్ ఏజెన్సీ పాటించింది. -
నీట్ యూజీ ఫలితాలు: సెంటర్ల వారీగా విడుదల
ఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీట్-యూజీ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి (NTA) విడుదల చేసింది. నగరాలు, కేంద్రాల వారీగా అందరి ఫలితాలను ఎన్టీఏ నీట్ అధికారిక వెబ్సైట్లో శనివారం ఈ ఫలితాలను అప్లోడ్ చేసింది. అభ్యర్థులు nta.ac.in/NEET/ లేదా neet.ntaonline.in. వెబ్సైట్లో తమ ఫలితాలను నగరాలు, కేంద్రాల వారిగా చూసుకోవచ్చని ఎన్టీఏ పేర్కొంది.నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జడ్జిలు జేబీ పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు నగరాల వారీగా, కేంద్రాల వారీగా అందరి ఫలితాలను విడుదల చేయాలని ఆదేశించింది. మరోవైపు.. అభ్యర్థుల వివరాలు బహిర్గతం కాకుండా గుర్తింపుపై మాస్క్ వేసి ప్రచురించాలని సుప్రీంకోర్టు నీట్ కమిటీకి స్పష్టం చేసింది. ఇక.. ఇలా ఫలితాలను విడుదల చేస్తే విద్యార్థుల వ్యక్తిగత వివరాలు బయటపడతాయని సొలిసిటర్ జనరల్ వాదించగా.. సీజేఐ చంద్రచూడ్ స్పందిస్తూ పరీక్ష కేంద్రాల వారీగా డమ్మీ రోల్ నంబర్లతో ఎందుకు ప్రకటించకూడదని ప్రశ్నించారు. -
Supreme Court: సెంటర్లవారీగా ఫలితాలు
సాక్షి, న్యూఢిల్లీ: పరీక్ష కేంద్రాలు, నగరాల వారీగా నీట్–యూజీ, 2024 ఫలితాలను ప్రకటించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. సమగ్ర ఫలితాలను శనివారం మధ్యాహ్నం 12 గంటలలోపు ఎన్టీఏ వెబ్సైట్లో పొందుపరచాలని తెలిపింది. నీట్–యూజీ పేపర్ లీక్, నిర్వహణలో అవకతవకలపై దాఖలైన వేర్వేరు పిటిషన్లను గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రల ధర్మాసనం విచారించింది. పరీక్షను రద్దుచేసి కొత్తగా నిర్వహించాలని, కోర్టు పర్యవేక్షణలో లీకేజీ ఉదంతంపై దర్యాప్తు జరగాలని వేర్వేరు పిటిషన్లు దాఖలైన విషయం తెల్సిందే. ‘‘ పరీక్షలో సెంటర్లవారీగా విద్యార్థులు పొందిన మార్కుల వివరాలను బహిర్గతంచేయండిగానీ అభ్యర్థుల ఐడెంటిటీ కనిపించకూడదు. గోప్యత పాటించండి. డమ్మీ రోల్ నంబర్లు వేసి అభ్యర్థుల మార్కుల వివరాలు ఇవ్వండి. ప్రశ్నాపత్రం సోషల్మీడియా ద్వారా ఎక్కువ మందికి షేర్ అయి, విస్తృతస్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతింటేనే పరీక్షను మరోమారు నిర్వహించేందుకు అనుమతిస్తాం. అంతేగానీ ఒకటి రెండు కేంద్రాలకు మాత్రమే లీకేజీ పరిమితమైతే రీటెస్ట్కు ఒప్పుకోం. కేసు సీబీఐ చేతికి వెళ్లకముందు బిహార్ పోలీసులు సేకరించిన ఆధారాలు, సమర్పించిన ఆర్థికనేరాల విభాగ నివేదికను రేపు సాయంత్రం ఐదింటికల్లా మాకు అందజేయండి’ అని కోర్టు ఆదేశించింది. తర్వాత కొందరు పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది నరేందర్హూడా వాదించారు. ‘‘ పరీక్షను రద్దుచేయాల్సిందే. ఎందుకంటే లీకేజీ వ్యవస్థీకృతంగా జరిగింది. హజారీబాగ్లో ప్రశ్నపత్రాలు ఆరురోజులపాటు ఒక ప్రైవేట్ కొరియర్ కంపెనీ అ«దీనంలో ఉండిపోయాయి. ఎగ్జామ్ సెంటర్కు ఒక సాధారణ ఈ–రిక్షాలో తరలించారు. ఈ ఉదంతంలో ఆ సెంటర్ ప్రిన్సిపల్ను ఇప్పటికే అరెస్ట్చేశారు’ అని అన్నారు. అయితే ప్రశ్నపత్రం లీక్ కాలేదని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. ‘ కేవలం 1.08 లక్షల మంది అడ్మిషన్ పొందే ఈ పరీక్ష కోసం 23.33 లక్షల మంది భవిష్యత్తును పణంగా పెట్టలేం. పటా్న, హజారీబాగ్ సెంటర్లలో మాత్రమే లీకేజీ అయినట్లు ప్రాథమిక సాక్ష్యాలను బట్టి తెలుస్తోంది. గుజరాత్లోని గోధ్రాలోనూ ఇది జరిగి ఉండొచ్చు. అయితే దేశవ్యాప్తంగా పేపర్ లీకేజీ అయిందనే బలమైన ఆధారాలు, సాక్ష్యాలు ఉంటేనే రీ టెస్ట్కు ఆదేశాలిస్తాం. అయినా పేపర్ లీకేజీకి, పరీక్ష ప్రారంభానికి మధ్య ఎంత సమయం ఉంది? ఎంత మందికి పేపర్ చేరవేశారు? అనేవి కీలక అంశాలపై స్పష్టత రావాలి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ 22వ తేదీకి వాయిదా వేసింది. -
‘సెంటర్లవారీగా ఫలితాలు వెల్లడించండి’.. సుప్రీంకోర్టులో నీట్ విచారణ వాయిదా
న్యూఢిల్లీ, సాక్షి: నీట్ పేపర్ లీక్పై సుప్రీం కోర్టులో విచారణ సోమవారానికి(జులై 22కి) వాయిదా పడింది. ఇవాళ్టి విచారణ ముగించే ముందు.. సెంటర్ల వారీగా ఫలితాలు విడుదల చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఆదేశించింది. శనివారం మధ్యాహ్నాం కల్లా ఫలితాల్ని వెబ్సైట్లో ఉంచాలన్న ధర్మాసనం.. విద్యార్థుల పేర్లు మాత్రం బయటపెట్టకూడదని స్పష్టం చేసింది. అలాగే తదుపరి విచారణలో ఇరుపక్షాలు రాతపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించింది. ఇక ఇవాళ్టి విచారణ టైంలోనూ సీజేఐ త్రిసభ్య న్యాయమూర్తుల బెంచ్.. విస్తృత స్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని గుర్తిస్తేనే రీటెస్ట్కు ఆదేశించగలమని మరోసారి స్పష్టం చేసింది. ‘‘సామాజిక పరిణామాల దృష్ట్యా నీట్ పరీక్షకు సంబంధించిన పిటిషన్ల విచారణకు మేం ప్రాముఖ్యత ఇస్తాం. ఈ వ్యవహారంలో కోర్టు నుంచి చివరకు ఎలాంటి తీర్పు వస్తుందోనని లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అలాగే పిటిషనర్లు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి మరింత సమాచారాన్ని అడిగారు. అలాగే.. మెడికల్ సీట్లు ఎన్ని ఉన్నాయి? పిటిషన్లు వేసిన విద్యార్థులు పొందిన కనీస మార్కులు ఎన్ని? అసలు ఎంతమంది విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు?అని న్యాయవాదుల్ని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు.‘‘పరీక్ష రాసిన 23 లక్షల మందిలో లక్ష మంది మాత్రమే వైద్య కళాశాలల్లో ప్రవేశం పొందుతారు. విస్తృతస్థాయిలో పేపర్ లీక్ జరిగిందని తేలితే.. రీ టెస్ట్ నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతోంది. మాకు దర్యాప్తు సంస్థ వెల్లడించిన వివరాలు బయటపెడితే.. దర్యాప్తుపై ప్రభావం పడుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఏడాది మే 5వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2024 పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్ష పేపర్ లీక్ అవడంతో పాటు పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు రావడంపైనా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. నీట్ అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం, ఓఎంఆర్ షీట్లు అందకపోవడం, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు సహా నీట్ను రద్దు చేయాలన్న డిమాండ్లతో సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక.. నీట్ ప్రశ్నపత్రం లీకైనమాట వాస్తవమని తేలడంతో ఇందులో అవకతవకలు జరిగాయనడంలో ఎటువంటి సందేహం లేదని సుప్రీంకోర్టు ఇటీవల పేర్కొన్న తెలిసిందే.ల -
పిల్లల భవితకు పెద్ద పరీక్ష!
సంస్కరణ అనుకొని తెచ్చినది తీరా సమస్యగా మారడమంటే ఇదే. వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం పదకొండేళ్ళ క్రితం అప్పటి యూపీఏ సర్కార్ తెచ్చిన జాతీయస్థాయి ప్రవేశపరీక్ష ‘నీట్’ వ్యవహారం చూస్తుంటే అదే అనిపిస్తోంది. పేపర్ లీకులు, ఇతర అక్రమాలు సహా అనేక వివాదాలు ముసురుకున్న తాజా ‘నీట్ – యూజీ 2024’ వ్యవహారమే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. అవకతవకలకు ఆలవాలమైన జాతీయ పరీక్షా ఏజెన్సీ (ఎన్టీఏ) – కొత్తగా పరీక్ష నిర్వహించాలని కోరుతున్న అభ్యర్థులు – అందుకు ససేమిరా అంటున్న కేంద్రం – సత్వర నిర్ణయానికి బదులు సన్నాయి నొక్కులు నొక్కుతున్న సుప్రీమ్ కోర్ట్... వీటన్నిటి మధ్య నీట్ ఓ అంతులేని కథ. మళ్ళీ పరీక్ష జరపాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను జూలై 18కి వాయిదా వేస్తున్నట్టు సుప్రీమ్ గురువారం ప్రకటించడంతో ఈ సీరియల్కు సశేషం కార్డు పడింది. ఈసారి వైద్యవిద్యలో ప్రవేశాలు ఆశించిన 24 లక్షలమందితో పాటు అర్హత సంపాదించిన 13 లక్షలమంది పరిస్థితి అగమ్య గోచరమైంది. లీక్ కథ బయటకొచ్చి ఇన్ని వారాలైనా, పునఃపరీక్ష మినహా మరో మార్గం కనబడట్లేదు. ఒకపక్క కోర్ట్ నిర్ణయం జాప్యమవుతుండగా... మరోపక్క రీ–టెస్ట్పై సంబంధిత పక్షాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. నిజానికి, ఉత్తరాదిన కొన్ని కేంద్రాల్లో ప్రశ్నపత్రం లీక్ సహా అనేక అక్రమాలు జరిగినట్టు ఇప్పటికే మీడియాలో బాహాటంగా వెల్లడైంది. సాక్షాత్తూ సుప్రీమ్ సైతం లీకేజీ నిజమేనని అభిప్రాయపడింది. కాకపోతే, వ్యవస్థీకృతంగా లీక్ జరిగిందా, ఏ మేరకు ఎలా జరిగింది, భవిష్యత్తులో కట్టుదిట్టంగా పరీక్షల నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారన్న వివరాలు ఇవ్వాలంటూ కేంద్రాన్నీ, ఎన్టీఏనూ జూలై 8న ఆదేశించింది. అందుకు జవాబిచ్చే క్రమంలో కేంద్ర సర్కార్ పాత పరీక్ష రద్దు చేసి కొత్త పరీక్ష పెట్టడం హేతుబద్ధం కాదు పొమ్మంటోంది. అదేమంటే, విస్తృత స్థాయిలో అవకతవకలు జరిగాయనడానికి ఆధారాలు లేవంటూ ఐఐటీ – మద్రాస్ తాజాగా ఇచ్చిన సమగ్ర నివేదికను వత్తాసు తెచ్చుకుంటోంది. సహజంగానే ఎన్టీఏ సైతం కేంద్ర సర్కార్ వాదననే సమర్థిస్తోంది. పైగా, నీట్ ప్రశ్నపత్రం సామాజిక మాధ్యమాల్లో లీకైనట్టు వచ్చిన వీడియోనే ఫేక్ అనేసింది.ఏ విషయంలోనైనా అనుమానాలు రాకూడదు. వస్తే సమూలంగా నివృత్తి చేయాలి. అంతేకానీ అనుమానం పెనుభూతమైన వేళ... పాలకులు, ప్రభుత్వ సంస్థలు భీష్మించుకు కూర్చుంటే ఎలా? పైగా, లక్షలాది విద్యార్థుల భవితతో, వారి కుటుంబాల మానసిక ఆరోగ్యంతో ముడిపడిన అంశాన్ని వారి దృక్కోణం నుంచి సానుభూతితో చూడకపోవడం మరీ ఘోరం. నీట్ ఫలితాల్లో ఏవైనా నగరాల్లో, కేంద్రాల్లో పెద్దయెత్తున విద్యార్థులకు అనుచిత లబ్ధి చేకూరిందా అని తేల్చడం కోసం ఉన్నత విద్యాశాఖ అభ్యర్థన మేరకు ఐఐటీ– మద్రాస్ డేటా ఎనాలసిస్ చేసింది. మంచిదే! 2023, 2024ల్లోని టాప్ లక్షా నలభై వేల ర్యాంకులను ఈ ఎనాలసిస్లో భాగంగా విశ్లేషించారట. ఎక్కడా ఏ అక్రమం జరగలేదనీ, టాప్ ర్యాంకులు అన్ని నగరాలకూ విస్తరించాయనీ ఐఐటీ మాట. ఇక్కడే తిరకాసుంది. ప్రత్యేకించి ఈ ఏటి పరీక్షలో కొన్ని కేంద్రాల్లో చేతులు మారిన డబ్బులు, ముందస్తు లీకులు, డబ్బులిచ్చిన పిల్లలకు జవాబుల ప్రత్యేక శిక్షణ జరిగినట్టు ఆరోపణలున్నాయి. ఆ నిర్ణీత కేసులు వదిలేసి సర్వసాధారణంగా నీట్ నిర్వహణలో అక్రమాలే లేవంటూ క్లీన్చిట్ ఇస్తే సరిపోతుందా? గోధ్రా, పాట్నా లాంటి కొన్ని కేంద్రాలకే లీక్ పరిమితమైందన్న ఎన్టీఏ వాదన సరైనది కాదు. భౌగోళిక సరిహద్దుల్ని చెరిపేసిన సోషల్ మీడియా శకంలో ఒకచోట లీకైన పేపర్ అక్కడికే ఆగుతుందనుకోవడం అజ్ఞానం. పైగా రాజస్థాన్, ఢిల్లీ, జార్ఖండ్, బెంగాల్లోనూ లీకువీరుల అరెస్టులే నిదర్శనం. సీబీఐ దర్యాప్తును బట్టి దోషులైన అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఏ హామీ ఇస్తోంది. అక్రమ ర్యాంకర్లపై చర్యలు సరే... వాళ్ళ నేరం వల్ల దేశవ్యాప్తంగా ఇబ్బంది పడి, ర్యాంకుల్లో వెనకబడ్డ లక్షలాది విద్యార్థుల మాటేమిటి? వారికి న్యాయం చేసేదెట్లా? ఇకపై పేపర్, పెన్ను వాడే ఓఎంఆర్ విధానం వదిలి కంప్యూటర్ ఆధారిత పరీక్షకు మారతారట. ప్రైవేట్ ఏజెన్సీలపై అతిగా ఆధారపడే ఆ పరీక్షలూ అంత నిర్దుష్టమేమీ కాదని ఎన్టీఏనే నిర్వహించే యూజీసీ నెట్ పరీక్ష రద్దుతో ఇటీవలే తేలిపోయింది. ఈ పరిస్థితుల్లో పరీక్షా విధానమే కాదు, ఎన్టీఏ సహా వ్యవస్థనే సమూలంగా ప్రక్షాళించడం అవసరం. రీ–టెస్ట్ పెట్టాలా వద్దా అన్న చర్చ కన్నా అది ఇంకా కీలకం. నిజానికి, ప్రతిభకు పెద్ద పీట వేయడానికి ఉద్దేశించిన పరీక్షా వ్యవస్థలు లోపభూయిష్ఠంగా మారుతున్న తీరు విచారకరం. చదువులు, ప్రవేశ పరీక్షల మొదలు ఉద్యోగాల పోటీ పరీక్షల దాకా అన్నిటి మీదా నీలినీడలే. ప్రశ్నపత్రాల లీకుల దగ్గర నుంచి జవాబు పత్రాల మూల్యాంకనంలో లోటుపాట్ల దాకా ప్రతి స్థాయిలోనూ నిత్యం వివాదమే. గత 7 ఏళ్ళలో, 15 రాష్ట్రాల్లో 70 లీకులతో 1.4 కోట్లమంది బాధితులే. వెరసి పరీక్షల ప్రాథమిక లక్ష్యమే దెబ్బతింటోంది. ఆగి, ఆలోచించాల్సిన తరుణమిది. మన పరీక్షల విధానం, వాటి ప్రాథమిక లక్ష్యం, ప్రయోజనాలపైన మథనం జరపాల్సి ఉంది. జ్ఞాపకశక్తిని పరీక్షించే పద్ధతుల నుంచి పక్కకు వచ్చి, జ్ఞానాన్ని పరిశీలించే మార్గాల వైపు ఇప్పటికైనా మన పరీక్షా వ్యవస్థలు మళ్ళాల్సి ఉంది. ప్రతి పరీక్షనూ వ్యాపారంగా మారుస్తూ, తప్పుడు మార్గాలు వెతుకుతున్న చీడపురుగుల్ని ఏరివేసేందుకు ప్రభుత్వాలు ఉపక్రమించాలి. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల నుంచి పాఠశాల బోర్డ్ దాకా పబ్లిక్ పరీక్షల్లో అక్రమాల నిరోధానికి జూన్ 21 నుంచి పార్లమెంట్ ఓ కొత్త చట్టం తెచ్చింది. అది ఏ మేరకు అవతవకల్ని అరికడుతుందో చూడాలి. ఏమైనా, పరీక్ష జ్ఞానానికి గీటురాయిగా ఉండాలే కానీ, ప్రతిసారీ పిల్లలకు శిక్షగా మారితేనే కష్టం. -
నీట్ పేపర్ లీక్ అయ్యింది, కానీ.. : NTA
ఢిల్లీ: నీట్-యూజీ 2024 పరీక్ష పేపర్ లీకేజీపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిన మాట వాస్తవమేనని.. కానీ, లీకేజీ ప్రభావం పెద్దగా లేదని అందులో పేర్కొంది. పాట్నా(బీహార్) సెంటర్లలో, గోద్రా(గుజరాత్) కొందరి ద్వారా మాత్రమే నీట్ పేపర్ లీక్ అయ్యింది. కానీ, పేపర్ లీక్ వ్యవహారం దేశం మొత్తం మీద పరీక్ష నిర్వహణ, ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపించలేదని ఎన్టీఏ ఆ అఫిడవిట్లో పేర్కొంది. ఇదిలా ఉంటే.. రేపు నీట్ రద్దు పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.నీట్ యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు ఆందోళనకు దిగడం.. దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ పరీక్షను రద్దు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. నీట్ పరీక్ష రద్దు చేసి చేసి తిరిగి నిర్వహించాలన్న 38 పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. నీట్ యూజీ పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ అయ్యిందనేది స్పష్టమైందని, అయితే రీ ఎగ్జామ్ నిర్వహణ చివరి ఆప్షన్గానే ఉండాలని.. పేపర్ లీకేజీతో నష్టం విస్తృత స్థాయిలో జరిగిందని విచారణలో తేలితే కచ్చితంగా మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఎన్టీఏను ఆదేశిస్తామని సీజేఐ బెంచ్ అభిప్రాయపడింది.National Testing Agency (NTA) files affidavit in the Supreme Court in relation to the NEET-UG 2024 exam. The NTA, having come to know about the malpractice by individuals at Godhra and few centers at Patna, has made an assessment of the performance of all the appeared… pic.twitter.com/PyHfzzC0Ih— ANI (@ANI) July 10, 2024 -
NEET(UG) రీ-టెస్ట్ ఫలితాలు విడుదల
ఢిల్లీ: నీట్ యూజీ రీ-టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలతో పాటు రివైజ్డ్ స్కోర్ కార్డులను కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది.నీట్ ఆందోళన నడుమ.. ఆపై సుప్రీంకోర్టు జోక్యంతో 1,563 మందికి గ్రేస్ మార్కుల్ని రద్దు చేసిన ఎన్టీఏ వాళ్లకు మళ్లీ పరీక్ష నిర్వహించింది. అయితే.. జూన్ 23వ తేదీన పరీక్ష నిర్వహించగా.. 813 మంది అభ్యర్థులు మాత్రం తిరిగి పరీక్ష రాశారు. వివాదాల నేపథ్యంలో ఈసారి ఫలితాల్ని పక్కాగా విడుదల చేసింది ఎన్టీఏ. పరీక్ష అనంతరం ఆన్సర్ కీ, ఓఎంఆర్ ఆన్షర్ షీట్లను పబ్లిక్ నోటీస్ ద్వారా అందుబాటులో ఉంచిన ఎన్టీఏ.. అభ్యర్థుల నుంచి అభ్యంతరాల్ని స్వీకరించింది. ఆ అభ్యంతరాలను నిపుణులు పరిశీలించిన అనంతరం.. తుది కీని విడుదల చేసింది. ఇప్పుడు ఆ అభ్యర్థుల ఫలితాల్ని వెబ్సైట్లో ఉంచింది. -
పరీక్షలు నీటుగా నిర్వహించాలంటే...
ఏ పరీక్ష అయినా వందలాది మంది వ్యక్తులు నిజాయితీగా ఉన్నప్పుడే లీకులు లేకుండా నిర్వహించడం సాధ్యమవుతుంది. వచ్చే ఆర్థిక లాభం ముందు తీసుకునే రిస్క్ తక్కువనిపించినప్పుడు, లీకులకు అవకాశం మరీ ఎక్కువ. పైగా ఏదోలా అడ్మిషన్ పొందితే కోర్సు దానికదే పూర్తవుతుంది అనే ధోరణి ఉన్నప్పుడు అడ్డదారులు తొక్కడం ఇంకా పెరుగుతుంది. అందుకే ‘నీట్’ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో అసలు దేశంలో పరీక్షల నిర్వహణ తీరును మార్చడమే దీనికి పరిష్కారం. దేశంలో ప్రస్తుతం కాగితం, పెన్నులతో నిర్వహిస్తున్న అన్ని పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్షలుగా మార్చడంతో పాటు, ప్రశ్నపత్రాల కూర్పు తీరు కూడా మారాలి.భారతదేశంలో ఐఐటీలు లేదా ప్రతిష్ఠాత్మక వైద్య కళాశాలల్లో ప్రవేశించడం, వాటి కోర్సులు పూర్తి చేయడం కంటే కష్టం. నాతోపాటు ఐఐటీ మద్రాస్లో చేరిన 200 మందిలో నాలుగేళ్ల కోర్సు పూర్తిచేయనివాళ్లు దాదాపుగా లేరు. అందుకే ప్రవేశ పరీక్ష పాసయ్యేందుకు అవసరమైతే అడ్డదారులు తొక్కేందుకూ వెనుకాడరు. అర్హత లేని వారు ఒకవేళ అడ్మిషన్ పొందినప్పటికీ సకాలంలో కోర్సు పూర్తి చేయడం అసాధ్యంగా మారేలా ఉంటే... వాళ్లు ప్రవేశ పరీక్ష గట్టెక్కితే అదే పదివేలనుకునే పరిస్థితి తప్పుతుంది.కాగితం, పెన్ను ఆధారంగా పరీక్షలు జరిగినప్పుడు కూడా పేపర్లు లీక్చేసే గ్యాంగ్లు ఉండేవి. అప్పటికి అత్యాధునిక టెక్నాలజీలతో వాళ్లు ప్రశ్న పత్రాల లీక్ చేసే వాళ్లు. అవసరమైన వాళ్లకు చేరవేసే వాళ్లు కూడా. పరీక్ష కేంద్రాల్లో లేదా ప్రశ్న పత్రాల ప్రింటింగ్ కేంద్రాల్లో కొందరితో కుమ్మక్కైతే చాలు. ఏ పరీక్ష అయినాసరే... లీకుల్లేకుండా నిర్వహించడం అనేది వందలాది మంది వ్యక్తులు నిజాయితీగా ఉన్నప్పుడు, అది కూడా భారీ మొత్తాలు ఆశచూపినా తట్టుకునే సామర్థ్యం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అందుకే కాగితం పెన్నుతోనైనా సరే... లీకుల్లేకుండా ఐఐటీ, నీట్ వంటి ప్రవేశ పరీక్షలను నిర్వహించడం అసాధ్యమే. వచ్చే ఆర్థిక లాభం ముందు తీసుకునే రిస్క్ తక్కువనిపిస్తుంది. మరి ఏమిటి చేయడం? దానికోసం నాలుగు సూచనలు:1. దేశంలో ప్రస్తుతం కాగితం, పెన్నులతో నిర్వహిస్తున్న అన్ని పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్షలుగా మార్చాలి. జేఈఈ (మెయిన్స్), ఇంకా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మూల్యాంకన పరీక్షలు ఇలాగే జరుగుతున్నాయి. హ్యాకర్లు కంప్యూటర్ ఆధారిత పరీక్షలపై దాడి చేసే అవకాశం ఉంది. అందుకని కంప్యూటర్లలో అనధికార సాఫ్ట్వేర్లను నియంత్రించాలి. ఎన్ క్రిప్షన్తో కూడిన ప్రశ్న పత్రాన్ని డౌన్ లోడ్ చేసుకునేందుకు తొలి పది నిమిషాలు, పరీక్ష పూర్తయిన తరువాత సమాధానాలను సింక్ చేసేందుకు మరో పది నిమిషాలు మాత్రమే ఇంటర్నెట్ ఇవ్వాలి. రోజురోజుకూ మెరుగవుతున్న కృత్రిమ మేధ సాయంతోనూ హ్యాకింగ్ సమస్యను అధిగమించే అవకాశముంది. 2. ప్రవేశ పరీక్షల్లో అక్రమాలను నిరోధించేందుకు ప్రశ్న పత్రాలను నాణ్యంగా కూర్చడమూ ఎంతో కీలకం. ఎక్కువమందికి టాప్ స్కోర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. మోసం చేసినా పాసవలేమన్న స్థాయిలో ప్రశ్న పత్రాలు ఉండాలి. భారత్లోని యూజీసీ లాంటి అత్యున్నత విద్యా వ్యవస్థల నాయకులతో సహా చాలామంది, పరీక్ష కఠినమైతే కోచింగ్ వంటివి మరింత విçస్తృత స్థాయికి చేరుకుంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూంటారు. పరీక్ష ఎంత కఠినమైనా... ఐఐటీ, ఎంబీబీఎస్ వంటి వాటికి కోచింగ్ ఎప్పటికప్పుడు పెరిగేదే కానీ తగ్గదు. ప్రశ్న పత్రాలను తేలికగా కూర్చడం లేదా తక్కువ పరిమితి ఉన్న సిలబస్ ఆధారంగా సిద్ధం చేయడం వల్ల మాత్రమే కోచింగ్కు తక్కువ ప్రాధాన్యం ఏర్పడుతుంది. కానీ అప్పుడు నాణ్యత తగ్గిపోతుంది. పరీక్ష స్థాయి ఆధారంగా ప్రశ్న పత్రం కఠినత్వం ఉండాలి. బోర్డు పరీక్షలైతే సగటు విద్యార్థులను వేరు చేయడమన్నది 50 పర్సంటైల్ వద్ద ఉండటం మంచిది. నీట్, జేఈఈ వంటి పరీక్షలైతే ఈ పర్సంటైల్ 90 – 95 మధ్య ఉంటే మంచిది. ఇందుకు పరీక్ష కఠినంగా ఉండటం అవసరం. అదే సమయంలో ప్రతిభావంతుడైన ఒక విద్యార్థి, ఆయా బోధనాంశాల్లో నైపుణ్యమున్నవారు ఇద్దరూ సరిగ్గా సమాధానాలు చెప్పేలా ఉండాలి. ఫ్యాక్చువల్ తప్పులపై ఆధారపడి ప్రశ్నలు రూపొందిస్తే (ఈ ఏడాది నీట్లో ఇలాగే జరిగింది) అది నాణ్యమైన ప్రశ్నపత్రం కాదు. 3. అర్థవంతమైన బహుళార్థక ప్రశ్నలు ఇవ్వాలి. ప్రవేశ పరీక్షల్లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సమాధానాలు అంచనా కట్టవచ్చుననీ, సమాధానం కచ్చితంగా తెలియకపోయినా కొన్ని మోసపు పద్ధతుల ద్వారా సరైన సమాధానం రాబట్టవచ్చుననీ అనుకుంటారు. ఇది వాస్తవం కాదు. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలంటే విషయంపై లోతైన అవగాహన అవసరం. విద్యార్థుల మేధకు పరీక్ష పెట్టేలా కొన్ని తప్పుడు సమాధానాలు కూడా ఉంటాయి. కాబట్టి నీట్, జేఈఈ వంటి పరీక్షలకు ఈ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు సరిగ్గా సరిపోతాయి. వివరణాత్మకమైన సమాధానాలు రాస్తే... ప్రశ్న పత్రాలు దిద్దేవారి తీరునుబట్టి మార్కుల్లో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉంది. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు విద్యార్థికి సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించే తత్వం ఉందా, లేదా అనేది తేల్చవు. కాబట్టి కొన్ని వివరణాత్మక ప్రశ్నలూ జోడించడం మేలు. వీటిని సెకెండ్ పేపర్లో పెట్టి తులన అనేది టాప్ 20 శాతం విద్యార్థులకే పరిమితం (టాప్ 10 శాతం విద్యార్థులను ఎంపిక చేయడం మన లక్ష్యమైనప్పుడు) చేస్తే దిద్దడంలో తేడాలు గణనీయంగా తగ్గుతాయి. 4. నీట్, జేఈఈ వంటి పరీక్షల నిర్వహణకు అత్యంత కీలకమైన మరో అంశం పారదర్శకత. అన్ని ప్రశ్నలను బహిరంగ పరచకపోయినా నమూనా లేదా మాదిరి ప్రశ్నలు కొన్నింటినైనా జన సామాన్యానికి అందుబాటులో ఉంచాలి. ఎంత శాతం మంది విద్యార్థులు ఏ ఆప్షన్ ఎంచుకున్నారు వంటి సమాచారం అందివ్వాలి. ఈ ఆప్షన్స్కూ, విద్యార్థి పరీక్షలో సాధించిన మార్కులకూ మధ్య సంబంధాలను వివరించాలి. ఈ ఏర్పాట్ల వల్ల ప్రధానంగా రెండు లాభాలు ఉంటాయి. ప్రశ్న పత్రాలు కూర్చేవారు ఏకాగ్రతతో ఆ పని చేస్తారు. రెండోది పరీక్ష, నిర్వహణ... రెండింటిపై నమ్మకం పెరుగుతుంది. ర్యాంకుల నిర్ధారణకు పర్సంటైల్స్, స్కేల్డ్ స్కోర్లను జాగ్రత్తగా వినియోగించడం అవసరం. కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్షల్లో ఒక్కో విద్యార్థికి ఒక్కో రకమైన ప్రశ్న పత్రం వస్తుంది కాబట్టి సమాధానాల ద్వారా వచ్చిన మార్కులు అర్థం లేనివిగా మారిపోతాయి. అందుకే వీటికి బదులుగా అందరికీ తెలిసిన సైకోమెట్రిక్ టెక్నిక్ల సాయంతో స్కేల్డ్ స్కోర్లను నిర్ధారించాల్సిన అవసరముంది. ఈ స్కేల్డ్ స్కోర్స్ ఆధారంగా పర్సంటైల్ మార్కులు సిద్ధమవుతాయి. మోసాలను పసిగట్టేందుకు నిరర్థక ప్రశ్నలు, సైకోమెట్రిక్ అనాలసిస్, స్టాటిస్టిక్స్ వంటివి ఎంతో ఉపయోగపడతాయి. ఒకవేళ ఏదైనా నిరర్థక ప్రశ్న వస్తే వాటిని పక్కనపెట్టాలి. తప్పుడు మార్గాల్లో సమాధానాలు చెప్పే ప్రయత్నం చేసిన వారిని డిస్క్వాలిఫై చేయాలి. జేఈఈ మెయిన్ ్స పరీక్ష నిర్వహణకు ప్రస్తుతం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రేవేట్ ఏజెన్సీలపై ఆధారపడుతోంది. నీట్ను మాత్రం స్వయంగా నిర్వహిస్తోంది. నాణ్యమైన, అందరికీ ఆమోదయోగ్యమైన ప్రశ్న పత్రం తయారీ ఎన్టీఏకు కష్టమేమీ కాబోదు. అయితే ఈ రకమైన ప్రశ్న పత్రం తయారీని చాలా శ్రద్ధతో, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో తయారు చేయాల్సి ఉంటుంది. బోధనాంశాలపై పట్టున్నవారు, ప్రత్యేకమైన ఏజెన్సీలు, ప్రశ్నల రూపకల్పన, సమాధానాల విశ్లేషణలకు అత్యాధునిక సైకోమెట్రిక్ పద్ధతులను ఉపయోగించడం అవసరమవుతుంది. ఎందుకంటే ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఎన్ టీఏ విశ్వసనీయతపై, అది నిర్వహించే పరీక్షలపై పెద్ద ప్రశ్న చిహ్నం పడింది కాబట్టి! సమాజం మొత్తం ఈ రకమైన స్థితికి చేరడం భవిష్యత్తులో వృత్తినిపుణులుగా ఎదగాల్సిన విద్యార్థులకు ఏమంత మంచిది కాదు.శ్రీధర్ రాజగోపాలన్ వ్యాసకర్త ‘ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సహ–వ్యవస్థాపకుడు (‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
లోతైన దర్యాప్తు అవసరం
తవ్వుతున్నకొద్దీ బయటపడుతున్న జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వాకాలు చూస్తుంటే దాని వాలకం ‘అయ్యవారిని చేయబోతే కోతి అయింద’న్న చందంగా మారిందని అందరికీ అర్థమైంది. జేఈఈ మెయిన్ మొదలుకొని నీట్, యూజీసీ నెట్ సహా తొమ్మిది ప్రవేశ పరీక్షలవరకూ నిర్వహిస్తున్న ఈ సంస్థ విడుదల చేసే ప్రశ్నపత్రాలు, వాటి జవాబులు గుజరాత్, హరియాణా, బిహార్, జార్ఖండ్, మహారాష్ట్ర వంటిచోట్ల ‘కావలసినవారికి’ బజారులో దొరికాయని సీబీఐ రంగ ప్రవేశం చేశాక తేటతెల్లమైంది. బిహార్ పోలీసులు అరెస్టు చేసిన 20 మంది నిందితులను విచారిస్తే మే 5న నిర్వహించిన నీట్–యూజీ ప్రశ్నపత్రం ఒకరోజు ముందే పీడీఎఫ్ రూపంలో వారికి వచ్చిందని తేలింది. ఎందుకో ఈ ప్రశ్నపత్రాల మాఫియా దక్షిణాది రాష్ట్రాలవైపు దృష్టి సారించినట్టు లేదు. గత పదిరోజుల వ్యవధిలో ఎన్టీఏ నిర్వహించాల్సిన నాలుగు పరీక్షలు రద్దుకావటం అసాధారణం. రెండు లక్షలమంది విద్యార్థులు రాయాల్సిన ఆదివారంనాటి నీట్ పీజీ పరీక్షను కేవలం 12 గంటల ముందు రద్దుచేశారు. ఎన్టీఏ చీఫ్ సుబోద్ కుమార్ సింగ్ దీనంతటికీ బాధ్యుడని తేలుస్తూ ఆయన్ను తొలగించారు. అంతేనా... దీంతో పాపప్రక్షాళన పూర్తయినట్టేనా? ‘ఒకే దేశం–ఒకే పరీక్ష’ పేరిట ఏమాత్రం పారదర్శకతలేని ఈ వ్యవస్థను సృష్టించిన పాలకుల మాటేమిటి? గత ఏడేళ్లలో దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, బెంగాల్, పంజాబ్, హరియాణాల్లో భిన్న సంస్థలు నిర్వహించిన 70కి పైగా పరీక్ష పత్రాలు లీకయ్యాయని మీడియా కథనాలు చెబుతున్నాయి. నిరుడు తెలంగాణలో పరీక్షపత్రాలు లీకవటంతో నిరుద్యోగులు భగ్గుమన్నారు. నిజాయితీగా అహోరాత్రాలూ చదివిన కోటిన్నరమంది విద్యార్థుల భవితవ్యం ఈ లీకుల పర్యవసానంగా దెబ్బతిన్నదని అంటున్నాయి. ఈ లీకుల బెడద లేకుండా అన్ని సంస్థలనూ తలదన్నేలా నెలకొల్పామని చెప్పిన ఎన్టీఏ తీరు సైతం సక్రమంగా లేదంటే ఇక ఏమనాలి?నిజమే... వైద్య విద్యలో దేశమంతా వర్తించే ఒకే పరీక్ష నిర్వహిస్తే వేలకు వేలు ఖర్చుపెట్టడం, వేర్వేరు పరీక్షలకు సంసిద్ధం కావటంవంటి విద్యార్థుల వెతలు తీరుతాయని సర్వోన్నత న్యాయస్థానం 2011లో భావించింది. లీకులను సమర్థవంతంగా అరికట్టడం సాధ్యమవుతుందనుకున్నది. కానీ ఆచరణలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. వైద్య విద్యకు ఒకే ప్రవేశ పరీక్ష ఉండేలా చర్యలు తీసుకోవాలని అప్పటి భారత వైద్య మండలి(ఎంసీఐ)కి చేసిన సూచన కాస్తా అనేక మలుపులు తిరిగి చివరకు ఇలాంటి ఉమ్మడి పరీక్ష నిర్వహణ రాజ్యాంగ విరుద్ధమని 2013లో సుప్రీంకోర్టే 2–1 మెజారిటీ తీర్పునిచ్చింది. కానీ తీర్పు ఇచ్చే ముందు ముగ్గురు న్యాయమూర్తుల మధ్యా ఎలాంటి చర్చా జరగలేదన్న కారణంతో 2016లో అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం మళ్లీ విచారించి నీట్ను అనుమతించింది. దేశంలో ఫెడరల్ వ్యవస్థ ఉన్నదని, ఉమ్మడి జాబితాలోని విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చేముందు రాష్ట్రాలతో, విద్యారంగ నిపుణులతో, ఇతర వర్గాలతో చర్చించాలని ఎవరూ అనుకోలేదు. ఒకపక్క హిందీ భాషాప్రాంత విద్యార్థులకు వారి భాషలో ప్రశ్నపత్రం ఇవ్వాలని నిర్ణయించిన ఎంసీఐ దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు స్థానిక భాషల్లో ఇవ్వటం కుదరదని మొరాయించింది. ఆ తర్వాత 2017లో ఎన్టీఏ ఆవిర్భవించాక 13 భాషల్లో ప్రశ్నపత్రాలు ఇస్తోంది. లీకులకు ఆస్కారంలేదని పెట్టిన వ్యవస్థ అందుకు తగ్గట్టుగా ఉందా అనేది ఉన్నతస్థాయిలో గమనించేవారే లేకపోయారు. కేంద్ర సిలబస్లు, ముఖ్యంగా సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగా నిర్వహించే ఈ పరీక్షల్లో రాష్ట్ర సిలబస్తో చదివినవారు రాణించగలరా అన్న సందేహమూ రాలేదు. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల్లో దశాబ్దాలుగా వర్ధిల్లుతున్న విద్యా మాఫియా జాతీయ స్థాయికి విస్తరించింది. తమిళనాడు ప్రభుత్వం నియమించిన 2021లో నియమించిన జస్టిస్ రాజన్ కమిటీ అధ్యయనం ప్రకారం నీట్కు ముందు ఇంగ్లిష్ మాధ్యమంలో చదివిన విద్యార్థులు ఎంబీబీఎస్ కోర్సులకు 80.2 శాతం నుంచి 85.12 శాతంవరకూ ఎంపికయ్యేవారు. తమిళ మాధ్యమంలో చదివిన వారి శాతం 14.88 శాతం ఉండేది. కానీ నీట్ మొదలైనాక ఇంగ్లిష్ మాధ్యమం విద్యార్థులు 97 శాతంవరకూ సీట్లు తెచ్చుకుంటుండగా, తమిళ మాధ్యమం విద్యార్థుల వాటా దాదాపు 3 శాతానికి పడిపోయింది. నీట్ సాధించేవారిలో అధికాదాయ కుటుంబాల పిల్లల సంఖ్య అంతక్రితంకన్నా పెరగ్గా, నిరుపేద వర్గాల పిల్లల సంఖ్య తగ్గిందని ఆ నివేదిక వివరించింది. నీట్వల్ల ప్రతిభావంతులకు సీట్లు వస్తున్నాయన్న వాదనను ఆ కమిటీ ఎండగట్టింది. నీట్కు ముందు హెచ్ఎస్సీ విద్యార్థుల సగటు స్కోరు 98.1 శాతం వుండగా, ఇప్పుడది 89.05 శాతం మాత్రమే.ఈసారి వివిధ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఒకపక్క, ఎన్టీఏ ప్రశ్నపత్రాల లీకు మరోపక్క మన వ్యవస్థలకున్న విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇందులో మొదటిది దేశ ప్రజానీకం ఆకాంక్షల్నీ, రెండోది లక్షలాదిమంది విద్యార్థుల ఆశలనూ తలకిందులు చేసింది. ఇందువల్ల ప్రపంచంలో మనం నగుబాటుపాలయ్యామని ఇప్పటికీ ఎన్డీఏ సర్కారు గ్రహించకపోవటం, దొంగను తేలుకుట్టినట్టు వ్యవహరించటం ఆశ్చర్యకరం. ఈ ప్రపంచంలో విద్యాధనాన్ని మాత్రమే ఎవరూ కొల్లగొట్టలేరని చిన్నప్పుడు అందరం చదువుకున్నాం. కళ్లు మూసుకున్న పాలకుల నిర్వాకం కారణంగా దాన్ని సైతం ఎగరేసుకుపోవచ్చని ప్రశ్నపత్రాల మాఫియా నిరూపించింది. అందుకే ఎన్టీఏ చీఫ్ను సాగనంపితే సరిపోదు. ఈ మొత్తం వ్యవహారంపై న్యాయవిచారణ జరిపించి, ఇలాంటి లీకులకు ఆస్కారం లేకుండా పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటుచేయాలి. -
‘నీట్’ నిందితులకు నార్కో బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టులు!
పాట్నా/దేవగఢ్: నీట్–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బిహార్ పోలీసు శాఖ ఆర్థిక నేరాల విభాగం అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నీట్ అసలైన ప్రశ్నపత్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎనీ్టఏ) నుంచి సేకరించారు. పేపర్ లీకేజీకి సంబంధించి గత నెలలో పాటా్నలోని ఓ ఇంట్లో సోదాల్లో స్వాధీనం చేసుకున్న ప్రశ్నపత్రాలతో ఈ ప్రశ్నపత్రాలను సరిపోల్చనున్నారు. ఫోరెన్సిక్ టెస్టు తర్వాత సరిపోల్చే ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు చెప్పారు. మరోవైపు ఈ కేసులో అరెస్టయిన నిందితులకు నార్కో అనాలిసిస్, బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టులు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. నీట్ పరీక్షలో చోటుచేసుకున్న అక్రమాల్లో మనీ లాండరింగ్ కోణం కూడా ఉండడంతో ఈడీ సైతం దర్యాప్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
‘పరీక్ష’ల సంస్కరణలపై కమిటీ
ఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్షలు పారదర్శకంగా, న్యాయంగా, సాఫీగా నిర్వహించేందుకు ఏడుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర విద్యా శాఖ శనివారం ప్రకటించింది. ఈ నిపుణుల కమిటీకి ఇస్రో మాజీ చైర్మన్ కె.రాధాకృష్ణన్ నేతృత్వం వహిస్తారు. పరీక్షల నిర్వహణ ప్రక్రియ, డాటా భద్రతకు చేపట్టాల్సిన చర్యలు, ఎన్టీఏ నిర్మాణం, పనితీరుకు సంబంధించి చేపట్టాల్సిన సంస్కరణలను ఈ కమిటీ సిఫారసు చేస్తుంది. రెండు నెలల్లో ఈ కమిటీ తమ నివేదికకు విద్యాశాఖకు సమర్పిస్తుంది. నీట్, యూజీసీ– నెట్ పరీక్షల్లో అవకతవకలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. కమిటీ సభ్యులు: 1. కె.రాధాకృష్ణన్ (ఇస్రో మాజీ చైర్మన్) 2. డాక్టర్ రణదీప్ గులేరియా (ఎయిమ్స్ మాజీ డైరెక్టర్) 3. ప్రొఫెసర్ బీజే రావు (వైస్ చాన్సలర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్)4. ప్రొఫెసర్ రామమూర్తి కె. (ఐఐటీ మద్రాస్) 5. పంకజ్ బన్సల్ (పీపుల్స్ స్ట్రాంగ్ సహా వ్యవస్థాపకుడు)6. ఆదిత్య మిట్టల్ (డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్, ఐఐటీ ఢిల్లీ) 7. గోవింద్ జైస్వాల్ (జాయింట్ సెక్రటరీ, కేంద్ర విద్యాశాఖ) -
ఎన్టీఏ డీజీ సుబోద్పై వేటు
న్యూఢిల్లీ: కీలకమైన నీట్, నెట్ పరీక్షల్లో పేపర్ లీకేజీ ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్, నెట్ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్పై శనివారం వేటు వేసింది. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్, ఎండీ ప్రదీప్సింగ్ ఖరోలాకు ఎన్టీఏ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. యూజీసీ–నెట్ పరీక్ష నిర్వహించిన మరుసటి రోజే, ఈనెల 19న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. పరీక్షల సమగ్రతకు భంగం వాటిల్లిందని హోంశాఖ తెలుపడంతో యూజీసీ– నెట్ను రద్దు చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్డీల ప్రవేశానికి నెట్ పరీక్షను ఏడాదికి రెండుసార్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. -
సీఎస్ఐఆర్–యూజీసీ నెట్ పరీక్ష వాయిదా
న్యూఢిల్లీ: సీఎస్ఐఆర్–యూజీసీ–నెట్ ఉమ్మడి పరీక్ష వాయిదా పడింది. వచ్చే వారం జరగాల్సిన ఈ పరీక్షను అనివార్య పరిస్థితులు, రవాణాపరమైన ఇబ్బందుల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం తెలిపింది. పరీక్ష తదుపరి తేదీని వెబ్సైట్లో ప్రకటిస్తామని వివరించింది. అయితే, పేపర్ లీకైందంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలోనే పరీక్షను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. సీఎస్ఐఆర్–యూజీసీ–నీట్ పరీక్షను జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, లెక్చరర్íÙప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తారు. మంగళవారం నిర్వహించిన యూజీసీ నెట్ను కూడా అవకతవకల ఆరోపణల నేపథ్యంలో రద్దు చేయడం తెల్సిందే. -
సుప్రీం కోర్టులో NTAకు ఊరట
న్యూఢిల్లీ, సాక్షి: సుప్రీం కోర్టులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి మళ్లీ ఊరట లభించింది. నీట్ కౌన్సెలింగ్ను రద్దు చేయలేమని స్పష్టం చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. నీట్ వ్యవహారంపై వివిధ రాష్ట్రాల హైకోర్టులో దాఖలైన పిటిషన్ల బదిలీ పిటిషన్పై సానుకూలంగా స్పందించింది. గురువారం నీట్-యూజీ 2024 పరీక్షలకు సంబంధించిన 14 పిటిషన్లపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇందులో 49 మంది విద్యార్థులు 10 పిటిషన్లను.. అలాగే ఎన్టీఏ నాలుగు పిటిషన్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా నీట్ అవకతవకలపై పలు హైకోర్టులలో పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే వాటన్నింటినీ సుప్రీం కోర్టుకు బదిలీ చేసేలా ఆదేశాలివ్వాలని ఎన్టీఏ కోరింది. దీనికి సుప్రీం బెంచ్ సానుకూలంగా స్పందించింది. ప్రతివాదులకు గురువారం నోటీసులు జారీ చేసింది. అలాగే.. కేసులకు సంబంధించి హైకోర్టులో జరిగే విచారణలపై స్టే విధించింది. మరోవైపు వివిధ విద్యార్థులు ఎన్టీయే కౌన్సెలింగ్ రద్దు చేయాలని చేసిన విజ్ఞప్తికి సుప్రీం నిరాకరించింది. అయితే వాళ్లు వేసిన పిటిషన్పై విచారణకు మాత్రం అంగీకరించింది. ఈ క్రమంలో పిటిషన్లపై స్పందన తెలియజేయాలని కేంద్రానికి, ఎన్టీఏకు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై జులై 8న విచారణ జరపనుంది. అదే రోజు గతంలో నీట్ పై దాఖలైన పలు పిటిషన్ల విచారణ జరగాల్సి ఉంది. -
NEET UG Result 2024: నీట్లో ఆరుగురి ఫస్ట్ ర్యాంకు గల్లంతు!
న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష–అండర్ గ్రాడ్యుయేట్(నీట్–యూజీ)లో కొందరు అభ్యర్థులకు కేటాయించిన గ్రేసు మార్కులను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) సుప్రీంకోర్టుకు తెలియజేసిన నేపథ్యంలో టాప్ ర్యాంకర్లపై ప్రభావం పడబోతోంది. టాపర్లలో కొందరు 60 నుంచి 70 శాతం పాయింట్లు కోల్పోతారని అంచనా. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఏకంగా 67 మంది ఫస్ట్ ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. వీరిలో గ్రేసు మార్కులతో ఫస్ట్ ర్యాంకు పొందినవారు ఆరుగురు ఉన్నారు. గ్రేసు మార్కులను రద్దు చేస్తుండడంతో వీరు ఫస్టు ర్యాంకును కోల్పోనున్నట్లు సమాచారం. అంటే టాపర్ల సంఖ్య 61కి పరిమితం కానుందని అంచనా వేస్తున్నట్లు ఎన్టీఏ వర్గాలు వెల్లడించాయి. నీట్–యూజీలో అక్రమాలు జరిగాయని, 1,563 మందికి ఉద్దేశపూర్వకంగా గ్రేసు మార్కులు కేటాయించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అభ్యర్థుల మార్కులను ఎన్టీఏ పునర్ మూల్యాంకనం చేస్తోంది. గ్రేసు మార్కులను రద్దు చేసి, మళ్లీ ర్యాంకులు కేటాయించబోతున్నారు. గ్రేసు మార్కులు రద్దయిన వారికి ఈ నెల 23న మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా, నీట్ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఎన్ఏటీ స్పష్టంచేసింది. యథాతథంగా కౌన్సెలింగ్! నీట్ కౌన్సెలింగ్ను నిలిపివేయాలని, అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. షెడ్యూల్ ప్రకారం వచ్చేనెల 6వ తేదీ నుంచి జరగాల్సిన కౌన్సిలింగ్ నిలిపివేసేందుకు నిరాకరించింది. -
యూజీసీ–నెట్ రద్దు
న్యూఢిల్లీ: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు చేపట్టిన నీట్ పరీక్షలో బయల్పడిన అవకతవకల నీలినీడలు యూజీసీ–నెట్ పరీక్ష పైనా పడ్డాయి. దీంతో మంగళవారం నిర్వహించిన యూజీసీ–నెట్ పరీక్షను రద్దుచేస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గతానికి భిన్నంగా ఈసారి ఒక్కరోజులోనే ఆఫ్లైన్లో పెన్, పేపర్(ఓఎంఆర్) విధానంలో దేశవ్యాప్తంగా 317 నగరాలు, పట్టణాల్లోని 1,205 పరీక్షా కేంద్రాల్లో యూజీసీ–నెట్ పరీక్ష మంగళవారం జరిగిన విషయం తెల్సిందే. త్వరలో మళ్లీ నెట్ పరీక్షను నిర్వహిస్తారని, త్వరలోనే సంబంధిత వివరాలు వెల్లడిస్తామని కేంద్ర విద్యా శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ‘‘ నెట్ పరీక్ష విధానంలో అత్యంత పారదర్శకత, సమగ్రత, గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకూడదు. పరీక్షలో అక్రమాలు జరిగి ఉండొచ్చన్న విశ్వసనీయ సమాచారం మేరకు ‘యూజీసీ–నెట్ జూన్ 2024’ను రద్దుచేస్తున్నాం’’ అని ఆ అధికారి వివరించారు. ఈ ఏడాది నెట్ పరీక్షకు 11,21,225 మంది దరఖాస్తు చేసుకోగా మంగళవారం పూర్తయిన ఈ పరీక్షను 9,08,580 మంది అభ్యర్థులు రాశారు. నెట్ పరీక్షలో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు కోసం ఈ అంశాన్ని సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ తెలిపింది. నెట్ పరీక్షలో అక్రమాలు జరిగి ఉంటాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)కు ప్రభుత్వ సైబర్ నిఘా సంస్థల సమాచారం అందడంతో ఆ మేరకు పరీక్షకు రద్దుచేస్తున్నట్లు తెలిపింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) ఈ వివరాలను యూజీసీకి పంపింది. ఐ4సీలోని నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలైటిక్స్ విభాగం సంబంధిత సమాచారాన్ని క్రోడీకరించి యూజీసీకి అందజేసింది. ఈ విభాగం దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాల దాడులపై సమాచారం ఇవ్వడంతోపాటు అప్రమత్తంగా ఉండాలని ముందస్తుగా హెచ్చరిస్తుంది. ఐ4సీ అనేది కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఇది పరీక్షల సంబంధ వ్యవహారాలను చూస్తుంది. నీట్ను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీయే ఈ నెట్ పరీక్షనూ చేపట్టింది. యూజీసీ–నెట్ ఎందుకు రాస్తారు? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్– నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్( యూజీసీ–నెట్) పరీక్షలో ఉత్తీర్ణులైతే సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనకు అవకాశం లభిస్తుంది. పరిశోధన వైపు వెళ్లొచ్చు లేదంటే అసిస్టెంట్ ప్రొఫెసర్గా బోధనారంగం వైపూ వెళ్లొచ్చు. దేశంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరొచ్చు. శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి(సీఎస్ఐఆర్) ఆధ్వర్యంలో నడిచే ప్రయోగ, పరిశోధనాశాలల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోగా చేరొచ్చు. జూనియర్ రీసెర్చ్ ఫెలోగా, ఆ తర్వాత సీనియర్ రీసెర్చ్ ఫెలోగా అవకాశం లభిస్తుంది. ఇలా శాస్త్రవేత్తగా ఎదగొచ్చు. పీహెచ్డీ చేసేందుకు అర్హత లభిస్తుంది. ప్రభుత్వరంగ ఓఎన్జీసీ వంటి సంస్థల్లోనూ ఉద్యోగాలు పొందొచ్చు. నెట్కు క్వాలిఫై అయిన వారికి విదేశాల్లోనూ చక్కటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నెట్ పరీక్షను ఏటా రెండు సార్లు నిర్వహిస్తారు. 80కిపైగా సబ్జెక్టుల్లో పరీక్ష రాసుకోవచ్చు. -
సుప్రీం కోర్టులో ‘నీట్’ పిటిషన్ తిరస్కరణ
న్యూఢిల్లీ, సాక్షి: నీట్ యూజీ పరీక్షపై దేశవ్యాప్తంగా ఆందోళనలకు కొనసాగుతున్న వేళ.. కౌన్సెలింగ్ ప్రక్రియ నిలిపివేయాలని కోర్టును ఆశ్రయిస్తున్నారు కొందరు. ఈ క్రమంలో దాఖలైన ఓ పిటిషన్ను ఇవాళ సుప్రీం కోర్టు కొట్టేసింది. అంతేకాదు.. నీట్ అవకతవకలను సీబీఐతో విచారణ చేయించాలని సదరు పిటిషనర్ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఆ అభ్యర్థనలకు కోర్టు నిరాకరించింది. ఇంకోవైపు ఫిజిక్స్ వాలా విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలఖ్ పాండే కూడా నీట్ కౌన్సెలింగ్ వాయిదా వేయాలంటూ ఇంతకు ముందు ఓ పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరుపుతున్న న్యాయస్థానం.. కౌన్సెలింగ్పై స్టే విధించేందుకు నిరాకరించింది.ఇక.. వివాదాస్పదంగా మారిన గ్రేస్ మార్కుల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA).. 1,563 మందికి తిరిగి పరీక్ష నిర్వహిస్తామని సుప్రీం కోర్టుకు నివేదించింది. అంతేకాదు.. విద్యార్థులు అకడమిక్ ఇయర్ నష్టపోకుండా చూస్తామని తెలిపింది. దీంతో.. వాళ్లకు ఈ నెల 23న మళ్లీ పరీక్ష నిర్వహించన్నారు. ఆ ఫలితాలను 30న వెల్లడించి.. షెడ్యూల్ ప్రకారం యథాతధంగా జులై 6వ తేదీనే కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఎన్టీయే ఏర్పాట్లు చేసుకుంటోంది. -
0.001 శాతం నిర్లక్ష్యమున్నా పరిష్కరించాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం చేపట్టిన నీట్–యూజీ 2024 పరీక్ష విధానం, నిర్వహణలో 0.001 శాతం లోపం తలెత్తినా సరే సకాలంలో పరిష్కరించాలని సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం వ్యాఖ్యానించింది. మే ఐదో తేదీన నిర్వహించిన నీట్యూజీలో కొందరు విద్యార్థులకు సమయాభావం, ఇతరత్రా కారణాలతో గ్రేస్ మార్కులు ఇవ్వడాన్ని సవాల్చేస్తూ దాఖలైన వేర్వేరు పిటిషన్లను విచారించిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిల సెలవుకాల ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) చేపట్టిన విషయం విదితమే. ‘‘ అత్యంత కఠినమైన ఇలాంటి ప్రవేశ పరీక్ష కోసం విద్యార్థులు ఎంతగా శ్రమిస్తారో మనందరికీ తెలుసు. వైద్యుడే సమాజంలో అవినీతికి పాల్పడితే సమాజానికి ఎంతటి నష్టం చేకూరుతుందో ఊహించండి. ప్రవేశపరీక్షలు నిర్వహించే ఒక బాధ్యతాయుత సంస్థగా ఒకే మాట మీద నిలబడాలి. మీ వైపు ఏదైనా తప్పు జరిగితే నిజాయతీగా ఒప్పుకోవాలి. సరిదిద్దేందుకు చేపట్టిన చర్యలనూ వివరించాలి. కనీసం ఆ దిశగా చర్యలకు సమాయత్తం అయ్యామని అయినా నిరూపించుకోవాలి. అప్పుడే మీ పనితీరుపై విశ్వాసం పెరుగుతుంది’’ అని ఎన్టీఏ తరఫున వాదించిన లాయర్లకు కోర్టు చీవాట్లు పెట్టింది.రెండు వారాల్లో స్పందన తెలపండికేసుల తదుపరి విచారణ జరిగే జూలై 8వ తేదీలోపు ఏమేం చర్యలు చేపట్టారో నివేదించాలని కోర్టు సూచించింది. మళ్లీ పరీక్షను నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్లపై రెండు వారాల్లోపు మీ స్పందన తెలపాలంటూ ఎన్టీఏ, కేంద్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. పరీక్షలో అడిగిన ఒక ప్రశ్నను పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ప్రస్తావించగా ‘‘దానికి ఎన్టీఏ, కేంద్రం సమాధానం చెప్తాయి. మీరెందుకు పిటిషన్లు వేశారో మమ్మల్ని అర్థంచేసుకోనివ్వండి.మీ వాదనలను సావధానంగా వినేందుకు సాయంత్రందాకా కూర్చుంటాం’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. పేపర్ లీకేజీపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్నూ కోర్టు విచారించింది. గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది అభ్యర్థులకు ఆ మార్కులను తీసేశామని కేంద్రం, ఎన్టీఏ జూన్ 13వ తేదీన కోర్టుకు నివేదించిన విషయం విదితమే. ఆ మార్కులు పోను మిగి లిన మార్కులతో ఆ విద్యార్థు లు కౌన్సెలింగ్కు వెళ్లొచ్చు లేదంటే మరో సారి పరీక్ష రాసు కోవ చ్చు అని ఎన్టీఏ తెలిపింది. 4,750 కేంద్రాల్లో 24 లక్షల మంది అభ్యర్థులుమే ఐదున 4,750 కేంద్రాల్లో దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు నీట్యూజీ–2024 రాశారు. హరియాణాలోని ఫరీదాబాద్ కేంద్రంలో రాసిన వారిలో ఆరుగురికి సహా దేశవ్యాప్తంగా 67 మందికి 720కిగాను 720 మార్కులు పొంది టాప్ర్యాంక్ సాధించడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎక్కువ మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపడమే ఈ అనూహ్య టాప్ర్యాంకుల పర్వానికి అసలు కారణమని వెల్లడైంది. వ్యవహారం కోర్టుకు చేరడంతో వారందరికీ గ్రేస్ మార్కులు తొలగిస్తున్నామని ఎన్టీఏ ప్రకటించినప్పటికీ అసలు ఈ విధానాన్ని ఎందుకు అనుసరిస్తున్నారని, గోప్యత ఎందుకు పాటించారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.సమయం వృథా అయితే ఆ మేరకు అదనపు సమయం పరీక్ష రాయించాలిగానీ విద్యార్థికి ఏ ప్రామాణిక ప్రాతిపదికన గ్రేస్ మార్కులు ఇస్తారని విద్యావేత్తలు సైతం విస్మయం వ్యక్తంచేస్తున్నారు. నీట్యూజీ కౌన్సెలింగ్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. -
NEET NTA: తప్పు జరిగితే ఒప్పుకోండి
న్యూఢిల్లీ, సాక్షి: NEET- 2024 పరీక్ష అవకతవకలపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) తీరును సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. బాధ్యత గల సంస్థగా NTA పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, తప్పు జరిగితే ఒప్పుకుని వెంటనే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.నీట్ పిటిషన్పై మంగళవారం విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా.. ‘‘నీట్పరీక్షలో ఏమాత్రం నిర్లక్ష్యం జరగదు. పిల్లలు పరీక్షలకు సిద్ధం అయ్యారు. వాళ్ల కఠోర శ్రమను మనం వృథా చేయొద్దు. పరీక్షను నిర్వహించే సంస్థగా.. మీరు పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ తప్పు జరిగితే.. ‘అవును తప్పు జరిగింది’ అని చెప్పండి. అప్పుడు మేం చర్యలు తీసుకుంటాం. కనీసం ఇలాగైనా పని తీరు మెరుగుపడేందుకు కావాల్సిన ఆత్మవిశ్వాసం మీలో పెరుగుతుందేమో’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. .. అలాగే విద్యార్థుల ఫిర్యాదుల్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఏదైనా తప్పిదం ఉంటే వెంటనే సరిచేయాలి. నీట్ పరీక్ష వ్యవహారంలో 0.001 శాతం నిర్లక్ష్యం వహించినా దాన్ని పూర్తిగా పరిష్కరించాలి’’ అని ఎన్టీయేకు సుప్రీం బెంచ్ సూచించింది. ఈ క్రమంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)తో పాటు కేంద్రానికి మరోసారి నోటీసులు జారీ చేస్తూ.. విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు నీట్ వ్యవహారంలో ‘ఫిజిక్స్ వాలా’ విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలఖ్ పాండే వేసిన పిటిషన్పైనా జూన్ 13వ తేదీన విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. కౌన్సెలింగ్పై స్టే విధించేందుకు నిరాకరించింది. అయితే ఆ పిటిషన్ను విచారణకు స్వీకరిస్తూ.. కేంద్రం, ఎన్టీయేలకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ తదుపరి విచారణను జులై 8వ తేదీకే వాయిదా వేసింది. -
30 లక్షలకు నీట్ ప్రశ్నాపత్రం!
పట్నా: దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష–అండర్ గ్రాడ్యుయేట్(నీట్–యూజీ)లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశ్నపత్రం లీక్ అయ్యిందని, పరీక్షలో రిగ్గింగ్ జరిగిందని కొందరు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కోర్టులను సైతం ఆశ్రయించారు. నీట్–యూజీని రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గ్రేసు మార్కుల వ్యవహారం తీవ్ర దుమారం సృష్టించింది. బిహార్లో నీట్ అక్రమాలపై జరగుతున్న దర్యాప్తులో సంచలనాత్మక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నీట్ అక్రమాలకు సంబంధించి బిహార్ పోలీసులు ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేశారు. వీరిలో ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ కూడా ఉండడం గమనార్హం. రూ.30 లక్షలు ఇచ్చి నీట్ ప్రశ్నపత్రం కొనుగోలు చేశామని ప్రాథమిక విచారణలో పలువురు అభ్యర్థులు అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. పకడ్బందీగా స్కెచ్ బిహార్లో పేపర్ లీక్ చేసి, అభ్యర్థులకు విక్రయించి సొమ్ము చేసుకున్న వ్యక్తులు తెలివిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. లీకేజీ వ్యవహారం బయటకు పొక్కకుండా పకడ్బందీగా వ్యవహరించారు. తమకు డబ్బులు ముట్టజెప్పిన అభ్యర్థులను తొలుత సురక్షిత స్థావరాలకు తరలించారు. వారికి అక్కడే ప్రశ్నపత్రం అప్పగించారు. జవాబులు సైతం చెప్పేశారు. తర్వాత నేరుగా పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లారు. మధ్యలో ఎవరినీ కలవనివ్వలేదు. ఇదంతా ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది. నీట్ పేపర్ లీకేజీపై బిహార్ పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం(ఈఓయూ) దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులను, అనుమానితులను ప్రశ్నించింది. శనివారం మరో 9 మంది అభ్యర్థులకు నోటీసులు జారీ చేసింది. సోమవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వీరంతా బిహార్లో వేర్వేరు జిల్లాలకు చెందినవారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి అభ్యర్థుల వివరాలు తెలుసుకొని, నోటీసులు ఇచ్చామని ఈఓయూ డీఐజీ మనవ్జీత్ సింగ్ థిల్లాన్ చెప్పారు. కన్సల్టెన్సీలు, కోచింగ్ సెంటర్ల ముసుగులో.. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదులు రాగానే బిహార్ పోలీసులు వేగంగా స్పందించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు. అనుమానిత అభ్యర్థులు, పేపర్ లీక్ చేసిన బ్రోకర్లను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో అభ్యర్థులు నోరు విప్పారు. బ్రోకర్లకు రూ.30 లక్షలకుపైగా ఇచ్చి నీట్ ప్రశ్నాపత్రం కొనుగోలు చేశామని ఒప్పుకున్నారు. బిహార్ ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ సికిందర్ కుమార్ యాదవేందు(56)ను పోలీసులు అరెస్టు చేసి, ప్రశ్నించారు. పేపర్ లీక్ ముఠాతో తాను చేతులు కలిపినట్లు అంగీకరించాడు. కొందరు అభ్యర్థుల కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపానని చెప్పాడు. ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంస్థను నడిపిస్తున్న నితీశ్, అమిత్ ఆనంద్ అనే వ్యక్తులను తన ఆఫీసులో∙కలిశానని, వారు మే 4వ తేదీన నీట్ ప్రశ్నాపత్రం తీసుకొచ్చారని వెల్లడించారు. పట్నాలోని రామకృష్ణానగర్లో అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేశామని, బేరసారాలు అక్కడే జరిగాయని పేర్కొన్నాడు. నితీశ్, అమిత్ ఆనంద్ అరెస్టయ్యారు. అభ్యర్థుల నుంచి రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షల దాకా వసూలు చేశామని పోలీసుల విచారణలో వెల్లడించారు. బిహార్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ టీచర్ రిక్రూట్మెంట్ పరీక్ష కుంభకోణంలో నితీశ్ కుమార్ ఇప్పటికే ఒకసారి జైలుకు వెళ్లొచ్చాడు. పేపర్ లీకేజీలో ఆరితేరాడు. లీకేజీ ముఠా సభ్యులు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు, కోచింగ్ సెంటర్ల ముసుగులో అభ్యర్థులను సంప్రదించి, ప్రశ్నాపత్రాలు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిజానికి ఇలాంటి కన్సల్టెన్సీలు, కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వ నుంచి ఎలాంటి గుర్తింపు ఉండదు. ఇదిలా ఉండగా, బిహార్లో బయటపడిన నీట్ అక్రమాలపై కేంద్ర విద్యా శాఖ గానీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గానీ ఇంతవరకు స్పందించలేదు. -
NEET-UG 2024: ‘నీట్’పై కేంద్రం, ఎన్టీఏకు సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: నీట్–యూజీలో చోటుచేసుకున్న అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు స్పందించింది. కేంద్ర ప్రభుత్వానికి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కి నోటీసులు జారీ చేసింది. హతేన్సింగ్ కాశ్యప్తోపాటు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ కేంద్రానికి, ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. రాజస్తాన్లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు జరిగాయని ప్రస్తావించారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. అనవసరమైన భావోద్వేగపూరిత వాదనలు చేయొద్దని హితవు పలికింది. -
NEET-UG 2024: లీక్ కాలేదు, రిగ్గింగ్ జరగలేదు: ప్రధాన్
న్యూఢిల్లీ: నీట్–యూజీ పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ అయ్యిందంటూ వచి్చన ఆరోపణలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖండించారు. అందుకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని అన్నారు. పేపర్ లీక్గానీ, రిగ్గింగ్ గానీ జరగలేదని చెప్పారు. పేపర్ లీక్ అయ్యే అవకాశమే లేదని పేర్కొన్నారు. ఏ ఒక్క అభ్యరి్థకీ అన్యాయం జరగకూడదన్నదే తమ ఉద్దేశమని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. నీట్ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కు ఎంతో విశ్వసనీయత ఉందని తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. -
NEET UG 2024: ‘నీట్’ గ్రేసు మార్కులు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ఎంబీబీఎస్తోపాటు ఇతర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష–అండర్ గ్రాడ్యుయేట్(నీట్–యూజీ)–2024లో 1,563 మంది అభ్యర్థులకు కేటాయించిన గ్రేసు మార్కులను రద్దుచేసి, వారికి మళ్లీ పరీక్ష నిర్వహించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నియమించిన కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ఆయా అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్రం చెప్పిన విషయాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. 1,563 మంది అభ్యర్థుల ప్రస్తుత స్కోరు కార్డు రద్దుచేసి, వాస్తవ మార్కులు కేటాయించి, జూన్ 23న వారికి మళ్లీ పరీక్ష నిర్వహించి, జూన్ 30లోగా ఫలితాలు వెల్లడిస్తామన్న ఎన్టీఏ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్టీఏ కమిటీ చేసిన సిఫార్సులు న్యాయమైనవి, సహేతుకమైనవి, సమర్థనీయమైనవి అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మే 5న నిర్వహించిన నీట్–యూజీ పరీక్షలో వివిధ కారణాలతో 1,563 మందికి గ్రేసు మార్కులు ఇవ్వడాన్ని సవాలు చేయడంతోపాటు నీట్–యూజీ–2024ను మొత్తంగా రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించాలని కోరుతూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది కనూ అగర్వాల్ వాదనలు వినిపించారు. 1,563 మందికి ఇచ్చిన గ్రేసు మార్కులు రద్దుచేసి, వారికి మరోసారి పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. నీట్కు హాజరైన అభ్యర్థుల్లో భయాందోళన తొలగించడానికి ఎన్టీఏ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. 1,563 మంది అభ్యర్థుల స్కోరు కార్డును రద్దు చేయాలంటూ కమిటీ సిఫార్సు చేసిందన్నారు. గ్రేసు మార్కులు రద్దయిన అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించి, జూన్ 30లోగా ఫలితాలు వెల్లడిస్తామని ఎన్టీఏ తరఫు సీనియర్ న్యాయవాది నరేష్ కౌశిక్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే కౌన్సెలింగ్ జూలై 6 నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించారు. గ్రేసు మార్కులు రద్దయినవారికి రెండు ఐచి్ఛకాలు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వారు మరోసారి పరీక్ష రాయవచ్చు లేదా గ్రేసు మార్కులు రద్దయిన తర్వాత వచ్చిన వాస్తవ మార్కులతో కౌన్సిలింగ్కు హాజరు కావొచ్చని వెల్లడించింది. జూలై 6న ప్రారంభం కానున్న కౌన్సెలింగ్ను నిలిపివేసేందుకు ప్రభుత్వం నిరాకరించింది. పిటిషన్లపై విచారణ ముగిస్తున్నాం.. ‘‘కోర్టు ముందుంచిన అన్ని అంశాలనూ పరిశీలించాం. జూన్ 12న ఎన్టీఏ కమిటీ చేసిన సిఫార్సులు న్యాయబద్ధంగా, సహేతుకంగా, సమర్థనీయంగా ఉన్నాయి. 1,563 మందికి మళ్లీ నీట్ నిర్వహించడానికి ఎన్టీఏకు అనుమతిస్తున్నాం. ఈ పిటిషన్లపై విచారణ ముగిస్తున్నాం. పరిహార మార్కులకు సంబంధించి అన్ని అంశాలను మూసివేసినట్లే. ఇతర సమస్యలకు సంబంధించి ప్రతివాదుల స్పందనకు రెండు వారాల గడువు ఇస్తున్నాం. తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేస్తున్నాం’’ అని ధర్మాసనం తీర్పు వెలువరించింది. అసలు ఏమిటీ వివాదం? ఈ ఏడాది నీట్–యూజీ పరీక్షకు దేశవ్యాప్తంగా 24 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాలు మారడంతోపాటు మేఘాలయా, హరియాణా, ఛత్తీస్గఢ్, సూరత్, చండీగఢ్లోని మొత్తం ఆరు ఎగ్జామ్ సెంటర్లలో ఓఎంఆర్ షీట్లు చిరిగిపోవడం, ఒక పేపర్కు బదులు మరో పేపర్ ఇవ్వడం, తద్వారా పరీక్ష నిర్వహణలో జాప్యం వంటి కారణాలతో 1,563 మంది అభ్యర్థులకు నష్టపరిహారం కింద గ్రేసు మార్కులు ఇచ్చారు. ఈ ఏడాది మొత్తం 67 మంది ఫస్ట్ ర్యాంకు సాధించారు. వీరందరికీ 720కి 720 మార్కులు రావడం గమనార్హం. ఇలా జరగడం ఎన్టీఏ చరిత్రలో ఇదే మొదటిసారి. గత ఏడాది కేవలం ఇద్దరికే ఫస్టు ర్యాంకు వచ్చింది. ఈసారి ఫస్ట్ట్ ర్యాంకు సాధించిన 67 మందిలో గ్రేసు మార్కులతో ఫస్టు ర్యాంకు కొట్టినవారు 50 మంది ఉన్నారు. ఫిజిక్స్ ఆన్సర్ కీలో మార్పుల వల్ల 44 మంది, ఎగ్జామ్లో సమయం కోల్పోవడం వల్ల ఆరుగురు గ్రేసు మార్కులు పొందారు. కొందరికి ఇచ్చిన గ్రేసు మార్కుల వల్ల తాము నష్టపోతున్నామని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. ఈ మార్కుల కేటాయింపులో డబ్బు చేతులు మారిందని విమర్శించారు. కోర్టును ఆశ్రయించారు. అలాగే పరీక్ష పేపర్ లీక్ అయ్యిందని, ఎగ్జామ్లో రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. చివరకు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. నీట్ను రద్దు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే, సుప్రీంకోర్టు 2018లో ఇచ్చిన తీర్పులో నిర్దేశించిన ఫార్ములా ప్రకారమే అభ్యర్థులకు గ్రేసు మార్కులు ఇచ్చామని, ఇందులో తమ సొంత నిర్ణయం ఏమీ లేదని నీట్ను నిర్వహించి, ఫలితాలు ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెబుతోంది. అభ్యర్థుల్లో పోటీతత్వం పెరగడం వల్లే ఈసారి ఎక్కువ మందికి ఫస్టు ర్యాంకు వచ్చిందని, ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని పేర్కొంటోంది. మరోవైపు, అభ్యర్థులకు ఇచ్చిన గ్రేసు మార్కులను పునఃసమీక్షించడానికి కేంద్ర విద్యా శాఖ యూపీఎస్సీ మాజీ చైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది. -
నీట్ కౌన్సెలింగ్పై స్టే ఇవ్వలేం: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ను నిలిపివేయాలంటూ దాఖలైన అభ్యర్థనను సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ తోసిపుచ్చింది. కౌన్సెలింగ్పై స్టే విధించేందుకు నిరాకరించింది. అయితే ఈ పిటిషన్పై విచారణలో భాగంగా.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)తోపాటు కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. మరోవైపు వివాదాస్పదంగా మారిన గ్రేస్ మార్కుల అంశంలో కేంద్రం యూటర్న్ తీసుకుంది. ఎంబీబీఎస్, బీడీఎస్.. ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) యూజీ 2024ను సవాల్ చేస్తూ దాఖలైన మూడు పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. నీట్ కౌన్సెలింగ్ను ఆపేది లేదని.. కొనసాగుతుందని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ‘‘కౌన్సెలింగ్ కొనసాగుతుంది. మేము దానిని ఆపబోం. పరీక్ష పూర్తైంది కాబట్టి మిగతాది అంతా సజావుగా సాగుతుంది. కాబట్టి భయపడాల్సిన పనిలేదు’’ అని వెకేషన్ బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలంటూ కేంద్రం, ఎన్టీఏకు నోటీసులు జారీ చేస్తూ.. పిటిషన్పై తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది. జులై 6వ తేదీ నుంచి నీట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. మరోవైపు వివాదాస్పద గ్రేస్ మార్కుల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకుంది. అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న 1,563 మంది ఫలితాలను నిలిపివేశామని, వాళ్లకు ఈ నెల 23న మళ్లీ పరీక్ష విధిస్తామని.. 30న ఫలితాలు వెల్లడిస్తామని, ఆ తర్వాతే కౌన్సెలింగ్ చేపడతామని(జులై 6లోపు పూర్తి చేస్తామని) ఎన్టీఏ కోర్టుకు నివేదించింది. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా చూస్తామని ఈ సందర్భంగా ఎన్టీఏ కోర్టుకు తెలిపింది.Supreme Court reiterates that it will not stay the counselling of NEET-UG, 2024.“Counselling will go on and we will not stop it. If the exam goes then everything goes in totality so nothing to fear,” says Supreme Court. pic.twitter.com/ACAB1dmyt5— ANI (@ANI) June 13, 2024ఈ ఏడాది నీట్ ప్రవేశ పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు రాశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 67 మంది విద్యార్ధులు 720కి 720 మార్కులు సాధించారు. హరియాణాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు తొలి ర్యాంక్ రావడంతో అనుమానాలు తలెత్తాయి. ఇంత మంది టాప్ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్ మార్కులు కారణమని ఇటీవల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మరోవైపు ఎన్నికల ఫలితాలకు ముందురోజు హడావిడిగా ఫలితాలు విడుదల చేయడంపైనా రాజకీయపరమైన విమర్శలు సైతం చెలరేగాయి. దీంతో నీట్లో అవినీతి, అక్రమాలు చోటు ఉండబోదని చెబుతూ ఎన్టీఏ మీడియా ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే ‘ఫిజిక్స్ వాలా’ విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలఖ్ పాండే దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ విద్యార్థులకు ర్యాండమ్గా 70 నుంచి 80 మార్కులు కలిపారని అన్నారు. పరీక్ష నిర్వహణపై ఒక స్వతంత్ర ఉన్నత స్థాయి కమిటీతో దర్యాప్తు చేయించాలని కోరారు. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఏ పాలసీ ప్రకారం గ్రేస్ మార్కులు ఇచ్చారో ఎన్టీఏ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంకోవైపు విద్యాశాఖ నీట్ గ్రేస్ మార్కుల పునఃసమీక్ష కోసం ఓ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా గ్రేస్ మార్క్ల నిర్ణయాన్ని వెక్కి తీసుకోవడం, ఆ 1500 మందికి మళ్లీ పరీక్ష నిర్వహించాలన్న నిర్ణయంతో ఆ కమిటీ భవితవ్యం ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.#WATCH | On the Supreme Court's hearing on the NEET-UG 2024 exam, Education Minister Dharmendra Pradhan says "There is no corruption. In connection with the NEET examination, 24 lakh students appear in the examination. A hearing in the Supreme Court is underway today and this… pic.twitter.com/xpS9v55ptY— ANI (@ANI) June 13, 2024 -
పిల్లల భవితకు పరీక్షా?
పరీక్షల్లో విద్యార్థులు పాసవడం, ఫెయిలవడం సహజం. కానీ వ్యవస్థే ఫెయిలవడం, తత్కారణంగా విద్యార్థులు గురి తప్పడం ఎప్పుడన్నా చూస్తామా? వైద్య విద్యాలయాల్లో ప్రవేశానికై జరిపే అఖిల భారత పరీక్ష నేషనల్ ఎలిజబిలిటీ– కమ్– ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) విషయంలో అదే జరిగింది. పేపర్ లీకులు, గ్రేస్ మార్కులు, పలువురికి నూరుశాతం మార్కులు, కటాఫ్ మార్కుల్లో గణనీయంగా పెరుగుదల... ఇలా ఈ ఏటి ‘నీట్’ పరీక్షలో వివాదాలు అనేకం. ఈ అవకతవకలన్నీ విద్యార్థుల్లో ఆవేదన, ఆందోళన, నిరాశ రేపుతున్నాయి. ఈసారి పరీక్ష జరిగిన కంగాళీ వ్యవహారంపై కోచింగ్ సంస్థలు, డాక్టర్లు, ప్రతిపక్ష నేతలు గొంతెత్తేలా చేశాయి. చివరకిలాంటి దేశవ్యాప్త పరీక్షలు నిర్వహించే జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)పై పిల్లలకూ, తల్లితండ్రులకూ నమ్మకమే పోయే పరిస్థితి వచ్చింది. కొన్నిచోట్ల పేపర్ లీకైందన్న వార్తల్ని ఎన్టీఏ కొట్టిపారేసినా, విద్యార్థులు, కోచింగ్ సంస్థల వారు కోర్టు కెక్కారు. ఫలితాలను రద్దు చేయాలన్న వారి పిటిషన్పై కేంద్రానికీ, ఎన్టీఏకీ సుప్రీం కోర్ట్ మంగళవారం నోటీసులు జారీ చేసింది. పరీక్ష పవిత్రతే దెబ్బతిన్నదంటూ జవాబు కోరింది. వెరసి కొన్నేళ్ళు గా రచ్చ రేపుతున్న ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ విశ్వసనీయతకు ఇప్పుడు అగ్నిపరీక్ష ఎదురైంది. దేశంలోని 700 పైచిలుకు విద్యాలయాల్లో లక్షా 8 వేల చిల్లర ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఎంబీబీఎస్ చదివేందుకు ఏటా కొన్ని లక్షల మంది ‘నీట్’కు హాజరవుతారు. 2017లో 12 లక్షల మంది హాజరుకాగా, ఏడేళ్ళలో ఆ సంఖ్య రెట్టింపైంది. ఈ ఏడాది ‘నీట్’కు 24 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మే 5న పరీక్ష జరగగా, తర్వాత నెలరోజులకే, నిర్ణయించిన తేదీ కన్నా పది రోజుల ముందరే జూన్ 4న ఫలితాలను ప్రకటించారు. దేశమంతా ఎన్నికల ఫలితాల హడావిడిలో ఉండగా సందట్లో సడేమియాగా ఈ ఫలితాల వెల్లడి అనుమానాలు రేపింది. పైగా, ఏటా ఈ ప్రవేశపరీక్షలో ఏ ఒక్కరో నూరు శాతం మార్కులు సాధిస్తారు. ఆ మాటకొస్తే, అసలీ పరీక్షలో 650, ఆ పైన మార్కులు సంపాదించడం సైతం కష్టం. కఠోరసాధనతోనే సాధ్యం. అలాంటిది... ఈసారి ఏకంగా 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు వచ్చాయి. ఫలితంగా... గతంలో 650 మార్కుల స్కోరుకు సైతం విద్యార్థులకు పదివేలల్లో ర్యాంకులొస్తే, ఈసారి ఆ మార్కులకు ముప్ఫై, నలభై వేల మధ్య ర్యాంకులే దక్కడంతో విద్యార్థులు, తల్లితండ్రుల ఆవేదన అంతా ఇంతా కాదు. ఆన్లైన్ పరీక్ష ‘క్లాట్’కూ, ఆఫ్లైన్లో జరిగే ‘నీట్’కూ విధానాల్లో తేడాలున్నాయి. కానీ, క్లాట్లో లాగా ఇక్కడా 1563 మంది విద్యార్థులకు ఎన్టీఏ గ్రేస్ మార్కులు కలిపింది. అదేమంటే కొన్నిచోట్ల ప్రశ్నపత్రాలు ఆలస్యంగా ఇవ్వడం వల్ల విద్యార్థులకు సమయం వృథా అయిందనీ, వారు చదివిన పాత – కొత్త పాఠ్యపుస్తకాల్లో తేడాలున్నాయనీ, అందుకే అదనపు మార్కులు కలిపామనీ చెప్పింది. కాంపిటీటివ్ పరీక్షల్లో కనీవినీ ఎరుగని గ్రేస్ మార్కులు, ఈ వివరణలు హాస్యాస్పదం. పైగా, సరైన జవాబుకు 4 మార్కులు – తప్పితే ఒక మార్కు మైనస్ గనక, ఏ లెక్కన చూసినా అసంభవమైన 717, 718 లాంటి స్కోర్లు రావడమేమిటో దేవుడికే తెలియాలి. పాట్నాలో పేపర్ లీకైందనీ, రాజస్థాన్, జార్ఖండ్, ఢిల్లీ, గుజరాత్లలో ఒకరి బదులు మరొకరు పరీక్షలు రాశారనీ ఫిర్యాదులున్నాయి. హర్యానాలో ఒకే సెంటర్లో పరీక్ష రాసిన ఆరుగురికి ఫస్ట్ ర్యాంక్ రావడం, పైగా వారి దరఖాస్తులు ఆరోహణ క్రమంలో ఒకరి తర్వాత మరొకరివి కావడం విడ్డూరం. నీట్లో 715 మార్కులొచ్చిన విద్యార్థి తీరా ఇంటరే పాసవని విచిత్రం సరేసరి. అందుకే, అసలు నిజాలను ఎన్టీఏ దాచిపెడుతోందని అనుమానాలొస్తున్నాయి. లీకులు, వివాదాలు కొత్త కాకున్నా ఈసారి జరిగింది పక్కా స్కామ్ అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరీక్ష రద్దు చేసి, మళ్ళీ జరపాలనే డిమాండ్లూ వస్తున్నాయి. ఇప్పుడు నీట్లో మంచి మార్కులొచ్చి కూడా ఎప్పటిలా మంచి ర్యాంక్, కోరుకున్న కాలేజీలో సీటు రాని విచిత్రపరిస్థితి విద్యార్థులది. నిస్పృహతో కొందరు పిల్లలు ఇప్పటికే ఆత్మహత్యలకు పాల్పడడం విషాదం. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పేదలకూ, సామాజిక న్యాయానికీ ఈ నీట్ నిర్వహణ పూర్తిగా వ్యతిరేకమని తమిళనాడు ఎప్పటి నుంచో వాదిస్తోంది. 2021లో వచ్చిన స్టాలిన్ సర్కార్ జస్టిస్ రాజన్ సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీ వేసింది. కమిటీ సిఫార్సుల మేరకు లోపభూయిష్ఠమైన నీట్ నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలంటూ, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. దీర్ఘకాలంగా రాష్ట్రపతి ముద్ర కోసం వేచి చూస్తోంది. ఎన్టీఏ మాత్రం తప్పులు ఒప్పుకొని, దిద్దుబాటుకు సిద్ధం కావట్లేదు. తాజా పరీక్షలో జవాబులు గుర్తుపెట్టే ఓఎంఆర్ షీట్ చినిగిపోయిందంటూ ఎన్టీఏ ఒకరి ఫలితం ఆపేసింది. తీరా చూస్తే ఆ విద్యార్థినికి 715 మార్కులు రావడం గమనార్హం. ఇలాంటి విచిత్ర విన్యాసాలు చూశాకనైనా... మన పరీక్షా వ్యవస్థలో, ఉపయోగించే సాంకేతికతలో పారదర్శకత తీసుకురాక తప్పదు. అవసరమైతే వైద్య విద్యాలయాల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ను వాయిదా వేసి, కూలంకషంగా దర్యాప్తు చేయాలి. అవకతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలను పరిశీలిస్తున్న ఉన్నతస్థాయి ప్యానెల్ మరో వారంలో తన నివేదిక ఇవ్వనుంది. అది చేసే సిఫార్సుల మాట అటుంచితే, ఇంత జరుగుతున్నా ప్రభుత్వ పెద్దలు ఈ వివాదంపై ఇప్పటి దాకా నోరు విప్పకపోవడం విషాదం. చదువుల నుంచి ఉద్యోగాల దాకా మన దేశంలో సమస్త పరీక్షలకూ లీకుల జాడ్యం, అవకతవకల మకిలి అంటుకుంది. గత అయిదేళ్ళలో 15 రాష్ట్రాల్లో మొత్తం 41 పేపర్ లీకుల వల్ల 1.4 కోట్ల మంది ఉద్యోగార్థులకు కష్టం, నష్టం కలిగాయి. ఇది మన వ్యవస్థకే సిగ్గుచేటు. బాగా చదువుకోవాలనుకున్న పసివారి భవిష్యత్తుకు సైతం ఈ పీడ తప్పకపోవడమే మరీ బాధాకరం. సమూల ప్రక్షాళనతో ఇలాంటి పరీక్షలను లోపరహితంగా మార్చడమే మార్గం. -
‘నీట్’పై టెన్షన్
సాక్షి, హైదరాబాద్: వైద్యవిద్య ప్రవేశాలకు నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్ష ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించిన విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. ప్రవేశ పరీక్ష సందర్భంగా లోపాలు తలెత్తడం... ఫలితాల వెల్లడి సమయంలో మార్కుల్లో అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలు రావడంతో ఏం జరుగుతుందా అన్న చర్చ జరుగుతోంది. అవకతవకలు జరిగినట్లు భావిస్తున్న అనేకమంది విద్యార్థులు, తల్లిదండ్రులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు.దేశవ్యాప్తంగా వందలాది మంది కోర్టుల్లో పిటిషన్లు వేశారు. దీంతో అసలు నీట్ ఫలితాలు ఇవే ఉంటాయా? వాటిని రద్దు చేస్తారా? మళ్లీ నీట్ పరీక్ష ఏమైనా పెడతారా? అన్న ఆందోళనలు విద్యార్థుల్లో నెలకొన్నాయి. మరోవైపు నీట్ ఫలితాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఒక కమిటీని ఏర్పాటు చేయడంతో సందిగ్ధ పరిస్థితి నెలకొంది. రద్దు ఉండకపోవచ్చని... దానివల్ల విద్యార్థులు మరింత నష్టపోతారని అధికారులు అంటున్నారు. ఎన్టీఏపై విమర్శల వెల్లువ మే 5న నీట్ పరీక్ష జరగ్గా, ఫలితాలను జూన్ 14న ప్రకటిస్తామని ఎన్టీఏ ముందుగానే ప్రకటించింది. కానీ జూన్ 4న దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తుంటే... అదే రోజు చడీచప్పుడు కాకుండా నీట్ ఫలితాలను ఎన్టీఏ ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది. అంత హడావుడిగా ప్రకటించాల్సిన అవసరం ఏమొచి్చందనే విమర్శలు వస్తున్నాయి. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, పక్కదారి పట్టించేందుకు ఆరోజు విడుదల చేశారన్న చర్చ జరుగుతోంది. అలాగే ఫలితాలను చూసుకునేందుకు విద్యార్థులకు ముందే అవకాశం కలి్పంచారు. అయితే, ఆలిండియా ర్యాంకులు.. మార్కులు.. ఫలితాల సమగ్ర సమాచారాన్ని మాత్రం ఆరోజు మరింత ఆలస్యం చేసి ఇచ్చారు. ఇలా అనుమానాలకు తావిచ్చేలా ఎన్టీఏ వ్యవహరించిందన్న చర్చ జరుగుతోంది. హైదరాబాద్లోనూ ఆలస్యం ఇక పలువురు విద్యార్థులకు ఎన్టీఏ గ్రేస్ మార్కులు ఇచి్చన అంశంపైనా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నీట్ పరీక్ష సమయం 3 గంటల 20 నిమిషాలు. కొన్ని కేంద్రాల్లో ప్రశ్నాపత్రాల అందజేతలో ఆలస్యం, చిరిగిన ఓఎంఆర్ పత్రాలు తదితర కారణాల నేపథ్యంలో సమయం వృథా అయ్యిందంటూ కొందరు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా పంజాబ్, ఢిల్లీ, ఛతీస్గఢ్, హరియాణ న్యాయస్థానాల్లో రిట్ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. దీంతో సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాలను ఎన్టీఏ సమీక్షించి వారికి గ్రేస్ మార్కులు ఇచ్చినట్లు తెలిపింది. అలాగైతే దేశంలో అనేకచోట్ల విద్యార్థులకు ఆలస్యంగా పరీక్ష పేపర్ ఇచ్చారు. వారిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి.హైదరాబాద్ మాదాపూర్లోని మెరీడియన్ స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలోని ఒక రూంలో ప్రశ్నపత్రాన్ని 20 నిమిషాలు ఆలస్యంగా ఇచ్చారు. ఆ గదిలో గడియారం ఆగిపోవడం... తప్పుగా చూపించడకపోవడంతో ఆలస్యం చేశారు. తప్పు సిబ్బందిదే అయినా కానీ విద్యార్థులకు అదనపు సమయం ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు అనేకమంది ప్రశ్నలు రాయలేకపోయారు. అంత సమయం పోవడం వల్ల తమకు మార్కులు తగ్గుతాయని, రావాల్సిన సీటు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. మరి వారికెందుకు గ్రేస్ మార్కులు కలపలేదని ప్రశి్నస్తున్నారు. -
‘నీట్’పై ఉన్నత కమిటీ
న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్)–అండర్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశ పరీక్షలో ఈ ఏడాది పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏకంగా 67 మంది అభ్యర్థులకు మొదటి ర్యాంకు రావడంపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరిలో ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన ఆరుగురు అభ్యర్థులున్నారు. అందుకే నీట్–2024ను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 1,500 మందికిపైగా విద్యార్థులకు కేటాయించిన గ్రేసు మార్కులపై పునఃసమీక్ష చేయడానికి యూజీసీ మాజీ చైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కేంద్ర విద్యా శాఖ ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్ సుబో«ద్కుమార్ సింగ్ శనివారం వెల్లడించారు. కమిటీ వారంలోగా ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుందని అన్నారు. గ్రేసు మార్కులతో అర్హత ప్రమాణాలపై ప్రభావం ఉండదన్నారు. కొందరు అభ్యర్థుల ఫలితాలను పునఃసమీక్ష చేయడం వల్ల ప్రవేశాల ప్రక్రియకు ఎలాంటి విఘాతం కలగదని స్పష్టం చేశారు. నీట్ పరీక్షలో అవకతవకలు జరగలేదన్నారు. ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల్లో మార్పులు, కొన్ని సెంటర్లలో ఇచి్చన గ్రేసు మార్కుల కారణంగానే అభ్యర్థులకు ఈ ఏడాది ఎక్కువ మార్కులొచ్చాయని వివరించారు. ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలా వద్దా అనేది కమిటీ తేలుస్తుందన్నారు. పేపరు లీక్ కాలేదన్నారు. నీట్ విషయంలో తాము రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. గ్రేసు మార్కుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, అందుకే చాలామందికి ఫస్టు ర్యాంకు వచి్చందని తల్లిదండ్రులు ఆరోపిస్తుండటం తెలిసిందే. ఆరు సెంటర్లలో పరీక్ష నిర్వహణలో జాప్యం జరగడంతో అక్కడ రాసిన విద్యార్థులకు గ్రేసు మార్కులు ఇచ్చారు. మేఘాలయా, హరియాణాలోని బహదూర్గఢ్, ఛత్తీస్గఢ్లోని దంతేవాడ, బాలోద్, గుజరాత్లోని సూరత్తోపాటు చండీగఢ్లో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈసారి దేశవ్యాప్తంగా 24 లక్షల మంది నీట్ రాశారు. ఈ నెల 4న ఫలితాలు వెల్లడయ్యాయి. -
NEET Row: గ్రేస్ మార్కులపై ఎన్డీఏ కీలక ప్రకటన
న్యూఢిల్లీ, సాక్షి: నీట్ యూజీ 2024 ఫలితాలపై రగడ కొనసాగుతున్న వేళ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) డ్యామేజ్ కంట్రోల్కు దిగింది. విద్యార్థులకు అదనంగా కలిపామని చెబుతున్న గ్రేస్ మార్క్లను సమీక్షించడానికి అంగీకరించింది. ఇందుకోసం విద్యాశాఖ ఓ కమిటీ వేసిందని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ శనివారం మీడియాకు తెలిపారు.నీట్ యూజీ పరీక్ష నిర్వహణ.. ఫలితాల వెల్లడిపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఎన్టీఏ డైరెక్టర్ సుబోధ్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ‘‘సుమారు 1,500 మందికి ఇచ్చిన గ్రేస్మార్క్ల్ని సమీక్షించేందుకు విద్యాశాఖ నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అధ్యయనం తర్వాతఘ ఆ 1,500 మంది ఫలితాలను సవరించే అవకాశం ఉంటుంది. అయితే.. గ్రేస్ మార్కులు ఇవ్వడం వల్ల పరీక్ష అర్హత ప్రమాణాలపై ప్రభావం పడబోదు. ప్రభావిత అభ్యర్థుల ఫలితాల సమీక్ష అడ్మిషన్ ప్రక్రియపై ప్రభావం చూపించదు’’ అని అన్నారాయన. అలాగే.. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల్ని ఆయన ఖండించారు. పేపర్ లీక్ కాలేదని, అవకతవకలేమీ జరగలేదన్న ఆయన దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష సమగ్రతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని స్పష్టంచేశారు.ఇక.. NCERT పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో ఇచ్చిన గ్రేస్ మార్కుల వల్లే ఆ విద్యార్థులు అధిక మార్కులు సాధించడానికి కారణాలని వివరించారు. అయితే, సమీక్ష అనంతరం ఆ విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించే నిర్ణయం కూడా కమిటీ సిఫారసులను బట్టి ఉంటుందన్నారు.‘‘ప్రతి విషయాన్ని పారదర్శకంగా విశ్లేషించి నీట్ యూజీ 2024 ఫలితాలను ప్రకటించాం. మొత్తం 4,750 కేంద్రాల్లో 6 కేంద్రాలకే ఈ సమస్య పరిమితం అయింది. అలాగే, 24 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కాగా, అందులో 1,600 మంది విషయంలోనే సమస్య ఉంది. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష సమగ్రతకు భంగం వాటిల్లలేదు. ఏ పరీక్ష కేంద్రంలో కూడా పేపర్ లీకేజీ జరగలేదు’’ అని ఎన్ టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు.విమర్శలు ఇలా.. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం నీట్ పరీక్షల్లో 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించటం అనుమానాలకు తావిచ్చింది. దీనితో తోడు ఈసారి చాలామంది విద్యార్థులు 718, 719 మార్కులు సాధించారు. నీట్లో (+4, -1) మార్కింగ్ విధానం ఉంది. ఈ లెక్కన 718, 719 మార్కులు రావడం సాధ్యమయ్యే పని కాదన్నది చాలామంది వాదన. దీని గురించి ఎన్ఈటీని ప్రశ్నిస్తే 'గ్రేస్ మార్కులు' ఇచ్చామని చెబుతోంది. కొంతమంది విద్యార్థులకైతే 100 వరకు గ్రేస్ మార్కులు ఇచ్చామని అంటోంది. ఇప్పుడు విమర్శల నేపథ్యంలో ఆ మార్కులనే సమీక్షించబోతోంది. ఇక పరీక్ష నాడు ప్రశ్నాపత్రాలు సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో వందల మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. తాము తక్కువ టైంలో పరీక్ష రాయాల్సి వచ్చిందని కొందరు వాపోయారు. అయితే కేవలం ఆరు సెంటర్లలో మాత్రమే ఈ ఇబ్బంది ఎదురైందని ఎన్ఈటీ ఇప్పుడు అంటోంది. మరోవైపు గ్రేస్ మార్కుల కోసం ఏ విధానం అవలంభించారన్నది NTA చెప్పకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అలాగే.. నీట్ ఫలితాలను ప్రిపోన్ చేసి ఎన్నికల ఫలితాల రోజే హడావుడిగా విడుదల చేయటం కూడా రాజకీయ విమర్శలకు తావిచ్చింది. -
‘నీట్’గా గోల్మాల్?
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీయూఎంఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో చేరేందుకు దేశవ్యాప్తంగా గత నెల 5న జరిగిన నీట్ ఎంట్రన్స్లో పలుచోట్ల గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్షా కేంద్రాల్లో కాపీయింగ్ జరిగినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు అనేక కార్పొరేట్ కాలేజీలు కూడా కాపీయింగ్ జరిగిందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో నీట్ పరీక్ష సందర్భంగా పెద్ద ఎత్తున కాపీయింగ్ జరిగిందని పేర్కొంటున్నాయి. కొన్ని కాలేజీల్లో ఒకే విధమైన టాప్ మార్కులు పలువురికి రావడంపట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిసారీ తెలుగు రాష్ట్రాలకు జాతీయ స్థాయిలో టాప్ ర్యాంకులు వచ్చేవి. కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసిన ఫలితాల ప్రకారం ఈసారి టాప్ ర్యాంకులు పెద్దగా రాలేదు. గతేడాది దేశవ్యాప్తంగా నీట్లో 720కి 720 మార్కులు సాధించిన విద్యార్థులు ఇద్దరు ఉండగా ఈసారి 67 మంది ఉన్నారు. ఇంత మందికి నూరు శాతం మార్కులు రావడంపట్ల కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాదిలో ఒక సెంటర్లో ఒకే రూమ్లో రాసిన విద్యార్థుల్లో పక్కపక్కనే కూర్చున్న వారిలో 8 మందికి 720 మార్కులు రావడంపై విమర్శలు వస్తున్నాయి. ఇదేమీ యాదృచ్ఛికం కాదని అంటున్నారు. ఏదో గోల్మాల్ జరిగిందని అంటున్నారు. 720కి 717, 718, 719 మార్కులు ఎలా? గతేడాది దేశవ్యాప్తంగా నీట్ పరీక్షకు 20.38 లక్షల మంది హాజరవగా ఈసారి 23.33 లక్షల మంది హాజరయ్యారు. గతేడాది 11.45 లక్షల మంది అర్హత సాధించగా ఈసారి 13.16 లక్షల మంది అర్హత సాధించడం విశేషం. తెలంగాణ నుంచి గతేడాది 72,842 మంది నీట్ రాయగా 42,654 మంది అర్హత సాధించారు. ఈసారి 77,849 మంది పరీక్ష రాస్తే 47,371 మంది అర్హత సాధించారు. తెలంగాణలో ఈసారి ఎవరికీ 720కి 720 మార్కులు రాలేదు. ఇక కొందరికి 720 మార్కులకుగాను 717, 718, 719 వంటి మార్కులు వచ్చాయి. కానీ ఈ పద్ధతిలో రావడం సాధ్యం కానేకాదు. ఉదాహరణకు ఒక విద్యార్థి 720 మార్కులకు పరీక్ష రాస్తే అందులో ఒక ప్రశ్న తప్పయితే ఐదు మైనస్ మార్కులు పడతాయి. అంటే ఆ విద్యారి్థకి 715 మార్కులే వస్తాయి. ఒకవేళ ఒక ప్రశ్న రాయకుంటే 4 మార్కులు తగ్గి 716 మార్కులు వస్తాయి. కానీ 717, 718, 719 మార్కులు ఎలా వస్తాయని పలు కార్పొరేట్ కాలేజీల అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి మార్కులు వచ్చినట్లు తాము గుర్తించలేదని.. ఉత్తరాది రాష్ట్రాల్లో వెలుగు చూశాయంటున్నారు. కొన్ని పత్రికల ప్రకటనల్లోనూ వాటిని చూసినట్లు చెబుతున్నారు. గ్రేస్ మార్కులు కలిపారంటూ ప్రచారం... 720కి 717, 718, 719... ఇలా సాధ్యంకాని మార్కులు ఏ పరిస్థితుల్లోనూ రాకూడదని అంటున్న నేపథ్యంలో ఎన్టీఏ గ్రేస్ మార్కులు కలిపిందన్న ప్రచారం జరుగుతోంది. రెండు గ్రేస్ మార్కులు కలిపారని అంటున్నారు. కానీ ఎన్టీఏ అధికారికంగా ప్రకటన జారీ చేయలేదు. కాబట్టి ఇది ఏ మేరకు వాస్తవమనేది తెలియదు. ఇలా కలిపితే తెలుగు రాష్ట్రాల నీట్ విద్యార్థులకు కూడా కలపాలి కదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులందరినీ చెక్ చేశామని, ఎక్కడా తెలుగు రాష్ట్రాల్లో గ్రేస్ మార్కులు కలవలేదంటున్నారు. కాపీయింగ్, గ్రేస్ మార్కుల ప్రచారంపై కొందరు తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. -
ఎంబీబీఎస్లో ఏ ర్యాంక్కు ఎక్కడ సీటొస్తుంది?
సాక్షి, అమరావతి: 2024–25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య విద్య యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ–2024 ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఏడాది జాతీయ స్థాయిలో 23.33 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా 13.16 లక్షల మంది అర్హత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే అర్హులైన విద్యార్థుల సంఖ్య 1.70 లక్షలు పెరిగింది. రాష్ట్రంలో 64,931 మంది పరీక్ష రాయగా, 43,858 మంది అర్హత సాధించారు. కాగా, జాతీయ స్థాయిలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా రాష్ట్ర స్థాయిలో ఏ ర్యాంక్ వస్తుంది? గత ఏడాది ఏ ర్యాంకుకు ఏ కళాశాలలో సీటు వచ్చిందో పోల్చుకొని, ఈసారి ఏ కళాశాలలో సీటు వచ్చే అవకాశాలున్నాయో విద్యార్థులు అంచనా వేసుకుంటున్నారు. ఆన్లైన్ కౌన్సెలింగ్కు కళాశాలల ప్రాధాన్యతక్రమం ఏ విధంగా ఉండాలో కసరత్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 16 ప్రైవేటు, రెండు మైనారిటీ, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఉన్నాయి. వీటిలో 5,360 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇందులో 2,935 సీట్లు 16 ప్రభుత్వ వైద్య కళాశాలలకు సంబంధించినవి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 శాతం సీట్లు ఆల్ ఇండియా కోటా కింద భర్తీ చేస్తారు. మిగిలినవి రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తారు. మరోవైపు బీ కేటగిరిలో 85 శాతం సీట్లలో మన విద్యార్థులకే అవకాశం కల్పిస్తోంది. అందరి చాయిస్ ఆంధ్ర కళాశాల రాష్ట్రంలో వైద్య విద్య అభ్యసించే విద్యార్థుల మొదటి చాయిస్ ఆంధ్ర వైద్య కళాశాలే. ఈ కళాశాలలో సీటు రావడమే అదృష్టంగా భావిస్తారు. ఈ కళాశాలలో గత ఏడాది ఎస్టీ విభాగంలో 490 స్కోర్తో 118377 ర్యాంక్ సాధించిన విద్యారి్థకి చివరి సీటు వచ్చింది. ఎస్సీ విభాగంలో 545తో 67614 ర్యాంక్, బీసీ–ఏలో 596తో 31456, బీసీ–బి 612తో 22315, బీసీ–సిలో 591తో 34134, బీసీ–ఈలో 548తో 24384, ఓసీ కేటగిరీలో 621తో 17976, ఈడబ్ల్యూఎస్లో 608తో 24384 ర్యాంకు వరకు సీట్లు పొందారు. -
‘నీట్’ మాల్ ప్రాక్టీస్కు చెక్!
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్ తదితర యూజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం నిర్వహించే నీట్ పరీక్షకు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎనీ్టఏ) కఠిన నిబంధనలు విధించింది. మాల్ ప్రాక్టీస్ జరగకుండా కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఎగ్జామ్ ప్రారంభమైన మొదటి గంట, అదే విధంగా ఎగ్జామ్ ముగియడానికి చివరి అర్ధగంట కనీసం వాష్ రూమ్కు కూడా అనుమతించొద్దని నిర్ణయం తీసుకుంది. ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులు సరికొత్త టెక్నాలజీ, గాడ్జెట్స్ ఉపయోగించి మాల్ ప్రాక్టీస్ చేయకుండా అడ్డుకునేందుకు ఈ రూల్స్ తీసుకొచ్చినట్టు తెలిసింది. నిబంధనలు ఏంటంటే..: నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నియమ నిబంధనలు పక్కాగా పాటించాల్సిందే. విద్యార్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫొటో తీసుకెళ్లాలి. నీట్ పరీక్షకు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలి. పొడవాటి దుస్తులు, షూస్ లాంటివాటిని అనుమతించరు. కేవలం స్లిప్పర్స్, శాండిల్స్ లాంటివి మాత్రమే ధరించాలి. పేపర్లు, ప్లాస్టిక్ వాచీలు, పెన్ డ్రైవ్స్, వాలెట్లు, హ్యాండ్ బ్యాగ్, బ్లూటూత్, మొబైల్, స్మార్ట్ వాచ్ లాంటి వాటికి అనుమతి లేదు. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ లాంటి వస్తువులను కూడా అనుమతించరు. పరీక్ష రాసే విద్యార్థులకు హాలులోనే బాల్ పాయింట్ పెన్నును అందిస్తారు. రాష్ట్రం నుంచి 80 వేల మంది విద్యార్థులు... తెలంగాణ నుంచి 80 వేల మంది విద్యార్థులు నీట్ పరీక్షను రాస్తున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది 70 వేల మంది ఈ పరీక్ష రాయగా, ఈసారి మరో 10 వేల మంది అదనంగా నీట్ పరీక్ష రాస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. పరీక్షకు దేశం నలుమూలల నుంచి 18 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా 499 పట్టణాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గంట ముందే చేరుకోవాలి: పెన్ను, పేపర్ ద్వారానే నీట్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల వరకు జరగబోయే ఈ పరీక్షకు విద్యార్థులు అన్ని నియమాలు పాటిస్తూ, పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందే రావాలని అధికారులు సూచిస్తున్నారు. కొన్ని పట్టణాలలో ఒకే పేరు మీద డిగ్రీ, పీజీ లాంటి కాలేజీలు చాలా ఉంటాయి. దీంతో ఒకటికి రెండుసార్లు పరీక్షా కేంద్రాన్ని చెక్ చేసుకోవాలి. మధ్యాహ్నం 1.15 కల్లా పరీక్షా కేంద్రం దగ్గరకు చేరుకోవాలి. 1.30 గంటల తర్వాత విద్యార్థులను హాల్లోకి అనుమతించరు. 1.45కి బుక్ లెట్ పేపర్లు ఇస్తారు. 1.50 నుంచి 2 గంటల వరకు విద్యార్థులు తమ వివరాలను బుక్ లెట్లో నింపాల్సి ఉంటుంది. 2 గంటలకి ప్రశ్నపత్రాన్ని ఇవ్వడంతో పరీక్ష మొదలవుతుంది. నీట్ ఫలితాలు జూన్ 14న వెలువడనున్నాయి. అదే నెలలో రెండో వారం తర్వాత నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుందని అధికారులు చెబుతున్నారు. -
మెయిన్లోనూ మనోళ్లు టాప్ గేర్లో
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్)లో ఈ ఏడాది కూడా తెలుగు విద్యార్థుల హవా కొనసాగింది. మొదటి 11 జాతీయ ర్యాంకుల్లో మూడింటిని తెలంగాణ విద్యార్థులు దక్కించుకున్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన హందేకర్ విదిత్ ఐదో ర్యాంకు, ముత్తవరపు అనూప్ 6వ ర్యాంకు, వెంకట సాయితేజ మాదినేని 7వ ర్యాంకు దక్కించుకున్నారు. అలాగే, దేశంలో 56 మందికి వందశాతం పర్సంటైల్ వస్తే, వీరిలో 22 మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులున్నారు. అందులో తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి ఏడుగురు ఉన్నారు. జేఈఈ అడ్వాన్స్డ్కు దేశవ్యాప్తంగా 2.5 లక్షల మంది అర్హత సాధించగా, తెలుగు రాష్ట్రాల నుంచి 49,532 మంది ఆ జాబితాలో ఉన్నారు. జేఈఈ మెయిన్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జనవరి, ఏప్రిల్లో రెండు సెషన్లుగా నిర్వహించింది. ఈ రెండు సెషన్లకు కలిపి 9,24,636 మంది దరఖాస్తు చేస్తే, 8,22,899 మంది పరీక్ష రాశారు. ఈ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి వెల్లడించింది. కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు, తుది మెరిట్ జాబితాను విడుదల చేసింది. ఫలితాల్లో మూడో స్థానంలో తెలంగాణజేఈఈ మెయిన్లో అత్యుత్తమ పర్సంటైల్ సాధించిన 2,50,284 మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించినట్టు ఎన్టీఏ ప్రకటించింది. వీరిలో ఉత్తరప్రదేశ్ విద్యార్థులు అత్యధికంగా ఉన్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర, తెలంగాణ నిలిచాయి. ఈ ఏడాది ఎక్కువ మంది జేఈఈ మెయిన్ రాయడంతో అన్ని కేటగిరీల్లో గత ఏడాదితో పోలిస్తే కటాఫ్ పెరిగింది. జేఈఈ అడ్వాన్స్డ్కు ఏప్రిల్ 27 నుంచి మే 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అపరాధ రుసుముతో మే 10 వరకు గడువు ఉంది. మే 17 నుంచి 26 మధ్య అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంటాయి. మే 26న అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహిస్తారు. ఫలితాలను జూన్ రెండో వారంలో విడుదల చేయనున్నట్టు సమాచారం. జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ ద్వారా ఎన్ఐటీల్లో దాదాపు 24 వేల సీట్లు, ఐఐటీల్లో 17,385, ట్రిపుల్ ఐటీల్లో మరో 16వేల సీట్లను భర్తీ చేస్తారు. వంద పర్సంటైల్ సాధించిన తెలుగు విద్యార్థులు.. వారి ర్యాంకులుతెలంగాణ: హందేకర్ విదిత్(5), ముత్తవరపు అనూప్(6), వెంకట సాయితేజ మాదినేని(7), రెడ్డి అనిల్(9), రోహన్ సాయిబాబా(12), శ్రీయాశస్ మోహన్ కల్లూరి(13), కేసం చెన్నబసవరెడ్డి(14), మురికినాటి సాయి దివ్య తేజరెడ్డి(15), రిషి శేఖర్ శుక్లా(19), తవ్వ దినేశ్ రెడ్డి(24), గంగ శ్రేయాస్(35), పొలిశెట్టి రితిష్ బాలాజీ(39), తమటం జయదేవ్ రెడ్డి(43), మావూరు జస్విత్(49), దొరిసాల శ్రీనివాసరెడ్డి (52). ఆంధ్రప్రదేశ్: చింటు సతీష్ కుమార్ (8), షేక్ సూరజ్ (17), మాకినేని జిష్ణు సాయి(18), తోటంశెట్టి నిఖిలేష్(20), అన్నరెడ్డి వెంకట తనిష్ రెడ్డి(21), తోట సాయికార్తీక్ (23), మురసాని సాయి యశ్వంత్ రెడ్డి(36). ♦ ఈడబ్యూఎస్ విభాగంలో తొలి 6 స్థానాల్లో ఇద్దరు ఆంధ్రా, నలుగురు తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. తెలంగాణకు చెందిన కేసం చెన్నబసవరెడ్డి మొదటిస్థానంలో నిలవగా, తోటంశెట్టి నిఖిలేష్ మూడో స్థానంలో నిలిచాడు.♦ తెలంగాణ నుంచి ఓబీసీ కోటాలో మరువూరి జస్వంత్ వందశాతం, ఎస్టీ కోటాలో జగన్నాధం మోహిత్ 99 శాతం పర్సంటైల్ సాధించారు. పీడబ్ల్యూడీ కోటాలో చుంకిచర్ల శ్రీచరణ్ జాతీయ ర్యాంకర్గా నిలిచారు. ఐఐటీ–బాంబేలో చదవాలనుంది: హందేకర్ విదిత్జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. మా తండ్రి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా, తల్లి ప్రభుత్వ టీచర్. వారి చేయూతతోనే నేను ముందుకెళ్లాను. నాకు ఐఐటీ–బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదవాలని ఉంది. ఆ తర్వాత స్టార్టప్ పెట్టి పదిమందికి ఉపాధి కల్పించాలన్నది నా ఆశయం. క్రమశిక్షణ, పట్టుదల, ప్రణాళికబద్ధమైన ప్రిపరేషన్తోనే ఈ ర్యాంకు సాధించాను. -
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం
-
నేటి నుంచి జేఈఈ మెయిన్స్
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశపరీక్ష జేఈఈ మెయిన్స్–2024 తొలి విడత దేశవ్యాప్తంగా బుధ వారం నుంచి మొదలవుతుంది. జాతీయ స్థాయిలో ఈ పరీక్షకు 12.3 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, ఇప్పటికే అడ్మిట్ కార్డులు ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని పేర్కొంది. తొలి మూడు రోజులు బీఆర్క్ (పేపర్–1) నిర్వహిస్తారు. తర్వాత రోజుల్లో ఇంజనీరింగ్ విభాగానికి పరీక్ష ఉంటుంది. ఈసారి పరీక్ష కేంద్రాల వివరాలను ముందే వెల్లడించారు. దీంతో విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకుంటే బాగుంటుందని ఎన్టీఏ సూచించింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు మరో సెషన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష చేపడుతున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రానికి అనుమతించరు. ప్రతి కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశా రు. బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అనుసరిస్తు న్నారు. మధ్యలో బయటకు వెళ్లి వచ్చినా ఇది తప్పనిసరి. విద్యార్థులు ముందే డిజి లాకర్లో రిజి స్టర్ అవ్వాలి. ఈ సందర్భంగా ఎన్టీఏ విద్యార్థుల కోసం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ♦ ఎ–4 సైజ్లో అడ్మిట్ కార్డును కలర్లో డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్లో అంటించిన పాస్పోర్టు ఫొటో ఒకటి పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి. పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాస్పోర్టు, రేషనల్ కార్డు, ఆధార్, గుర్తింపు పొందిన విద్యాసంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డుతో పరీక్ష కేంద్రానికి వెళ్లాలి. గుర్తింపు కార్డు లేకుంటే కేంద్రంలోకి అనుమతించరు. దివ్యాంగులు విధిగా సంబంధిత అధికారి జారీ చేసిన పత్రాలను వెంట తెచ్చుకోవాలి. వీరికి అదనంగా 20 నిమిషాలు పరీక్ష రాసేందుకు కేటాయిస్తారు. ♦ మీడియం, సబ్జెక్టుతో కూడిన ప్రశ్నపత్రంలో తప్పులుంటే తక్షణమే ఇన్విజిలేటర్ దృష్టికి తేవా లి. బీఆర్క్ పరీక్ష రాసే వారు అవసరమైన జామె ట్రీ బాక్స్, పెన్సిల్స్, ఎరేజర్, కలర్ పెన్సిల్స్, క్రెయాన్స్ను సొంతంగా సమకూర్చుకోవాలి. ♦ ఎలాంటి టెక్ట్స్ మెటీరియల్, పెన్సిల్స్ను భద్ర పరిచే బాక్సులు, హ్యాండ్బ్యాగ్, పర్సు, తెల్ల పేపర్లు అనుమతించరు. సెల్ఫోన్లు, మైక్రో ఫోన్లు, ఇయర్ ఫోన్లు, క్యాలిక్యులేటర్, వాచీలను హాళ్లలోకి తీసుకెళ్లే వీల్లేదు. పరీక్ష గదిలో అవ సరమైన తెల్ల పేపర్ను కేంద్రం నిర్వహకులే అందజేస్తారు. దీనిపై అభ్యర్థి రోల్ నంబర్ వేయాలి. పరీక్ష పూర్తయిన తర్వాత దీన్ని చెత్త బుట్టలో పడేయాల్సి ఉంటుంది. డయాబెటిక్ సహా అత్యవసర వైద్యానికి వాడే మందులను వెంట తెచ్చుకొనేందుకు మాత్రం అనుమతి ఉంది. -
జేఈఈ మెయిన్స్కు దరఖాస్తు గడువు రేపే
సాక్షి, హైదరాబాద్: ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్రప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష(జేఈఈ మెయిన్స్)కు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 30వ తేదీతో ముగుస్తుంది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 1వ తేదీన మొదలైంది. జేఈఈ మెయిన్స్ తొలివిడత పరీక్ష దేశవ్యాప్తంగా 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకూ జరుగుతుంది. రెండోవిడత ఏప్రిల్లో జరుగుతుంది. ఫిబ్రవరి 12న మెయిన్స్ ఫలితాలు వెల్లడిస్తారు. కోవిడ్కాలంలో ఎన్సీఈఆర్టీ, సీబీఎస్ఈ సిలబస్ తగ్గించారు. దీంతో ఈసారి కొన్ని టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఇవ్వడాన్ని మినహాయించినట్టు ఎన్టీఏ ప్రక టించింది. ఇందుకు సంబంధించిన సిలబస్నూ విడుదల చేసింది. మ్యాథ్స్లో కూడా సుదీర్ఘ జవాబులు రాబట్టే విధానానికి సడలింపు ఇచ్చారు. ఫలితంగా ఈసారి ఎక్కువమంది మెయిన్స్ రాసే వీలుందని అంచనా వేస్తున్నారు. -
వీలైనంత దగ్గరగా జేఈఈ పరీక్ష కేంద్రం
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్ పరీక్ష కేంద్రా లను ఈసారి శాస్త్రీయంగా ఏర్పాటు చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయించింది. సాధ్యమైనంత వరకూ అభ్యర్థి నివాసానికి సమీపంలో ఉండే కేంద్రాన్ని కేటాయించేందుకు వీలుగా కసరత్తు చేపట్టింది. దరఖాస్తులో పేర్కొన్న స్థానికతను ఇందుకు కొలమానంగా తీసుకుంటున్నారు. గూగుల్ మ్యాప్ ఆధారంగా అక్కడికి సమీపంలోని పరీక్ష కేంద్రాన్ని గుర్తిస్తున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి పరీక్షా కేంద్రాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు. ఒక కేంద్రంలోనే ఎక్కువ మందికి అవకాశం జేఈఈ మెయిన్స్ పరీక్ష జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య ఉంటుంది. తొలి విడత పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 30తో ముగుస్తుంది. తుది గడువు నాటికి ఎన్ని దరఖాస్తు లు అందు తాయి? ఎన్ని పరీక్ష కేంద్రాలుంటాయి? ఎన్ని సెషన్లుగా పరీక్ష పెట్టాలనేదానిపై డిసెంబర్ మొదటి వారంలో ఓ స్పష్టత వస్తుంది. అయితే ఈసారి ఒక్కో పరీక్ష కేంద్రంలో ఎక్కువ మంది పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు అదనపు గదుల ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఎన్టీఏ వర్గాలు తెలిపాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో 18 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసే వీలుంది. హైదరాబాద్లో ఎక్కువ కేంద్రాలు ఉంటాయి. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక కేంద్రం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ముందుగా దరఖాస్తు చేసే వారికి పరీక్ష కేంద్రం కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్టీఏ భావిస్తోంది. సాధారణంగా హైదరాబాద్లోని పలు పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో వీరిని రంగారెడ్డి, హైదరాబాద్లోని కేంద్రాలకు కేటాయించి, ఇంకా మిగిలితే సమీపంలోని జిల్లా కేంద్రాల్లో సర్దుబాటు చేయాలని భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం మారుమూల జిల్లా కేంద్రంలోని అభ్యర్థులకు కూడా హైదరాబాద్ వంటి దూర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించే వాళ్ళు. దీనివల్ల అసౌకర్యంగా ఉంటోందని అన్ని జిల్లాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇబ్బందుల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం జేఈఈ పరీక్ష సమయంలో ఎదురయ్యే ఇబ్బందులపై ఈసారి దృష్టి పెట్టబోతున్నారు. పలు కేంద్రా ల్లో కంప్యూటర్లు ఆగిపోవడం, లేదా ఇతర సాంకేతిక సమస్యలు ఎదురవుతున్న ఉదంతాలున్నాయి. దీనివల్ల గంటల తరబడి పరీక్ష ఆలస్యమవుతోంది. అప్పటికే ఇతర కేంద్రాల్లో పరీక్ష పూర్తవుతుంది. దీనిపై పరీక్ష కేంద్రం అధికారులు నిర్ణయం తీసుకో లేని పరిస్థితి ఉంటోంది. గత ఏడాది మూడు చోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తాయి. విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అధికారులు ఎన్టీఏను సంప్రదించి, నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఈ టెన్షన్ కారణంగా విద్యార్థులు సరిగా పరీక్ష రాయలేదనే విమర్శలున్నాయి. దీన్ని దూరం చేసేందుకు ఈసారి జిల్లా స్థాయిలో యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో పాటు అవసరమైతే పరీక్ష వాయిదా వేసే అధికారం జిల్లా అధికారులకే ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. -
‘అడ్వాన్స్డ్’ మోతాదూ తగ్గింపు!
సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష సిలబస్ తగ్గింపుపై కసరత్తు జరుగుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దీనిపై త్వరలో స్పష్టత ఇచ్చే వీలుంది. ఇప్పటికే జేఈఈ మెయిన్స్ సిలబస్ ను తగ్గించారు. మేథ్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో పది టాపిక్ల వరకూ తీసేశారు. ఇదే తరహాలో అడ్వాన్స్డ్లోనూ నిర్ణయం తీసుకోవాలనే ఒత్తిడి పె రుగుతోంది. అన్ని రాష్ట్రాలూ సిలబస్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్టీఏ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. నిపుణు ల నుంచి సలహాలు తీసుకున్నారు. సిలబస్లో ఏ తరహా మార్పులు చేయాలనే అంశంపై పలు దఫా ల చర్చలు జరిగినట్లు ఎన్టీఏ వర్గాల ద్వారా తెలిసింది. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా 2020 నుంచి 2022 మధ్య బోధన పూర్తిస్థాయిలో సాధ్యపడనందున టె న్త్, ఇంటర్ సబ్జెక్టుల్లో సిలబస్ తగ్గించారు. 2024లో జరిగే జేఈఈ పరీక్షకు ఈ విద్యార్థులే హాజరు కా నుండటంతో జేఈఈ మెయిన్స్ సబ్జెక్టుల్లో సిలబస్ తగ్గిస్తున్నట్లు ఎన్టీఏ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. విద్యార్థుల్లో ‘అడ్వాన్స్డ్’ఆందోళన... గత కొన్నేళ్లుగా జేఈఈ అడ్వాన్స్డ్పై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జేఈఈ మెయిన్స్ అర్హు ల్లో టాప్లో నిలిచిన 2.5 లక్షల మందికే అడ్వాన్స్డ్ రాసే అవకాశం కల్పిస్తున్నారు. కానీ ఐదేళ్లుగా అ డ్వాన్స్డ్ రాస్తున్న వారి సంఖ్య 1.60 లక్షలు దాట డం లేదు. దరఖాస్తు చేసిన వారిలో 15 శాతం మంది పరీక్షకే హాజరు కావట్లేదని ఎన్టీఏ గుర్తించింది. అడ్వాన్స్డ్లో ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు ఐఐటీల్లో సీట్లు లభిస్తున్నా అన్ని ఐఐటీలలో కలిపి సీట్లు 16 వేలకు మించి లేవు. ఇందులోనూ టాప్–100 ర్యాంకుల్లో నిలిచిన వరకే అగ్రశ్రేణి ఐఐటీల్లో సీట్లు వస్తున్నాయి. అడ్వాన్స్డ్ పేపర్ కొన్నేళ్లుగా కష్టంగా ఉండటంతో విద్యార్థులు పోటీ పడేందుకు భయపడుతున్నారు. జేఈఈ ర్యాంకుతో ఎన్ఐటీల్లో సీటు తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సిలబస్లో మార్పులు తేవాలని వివిధ రాష్ట్రా లు అడ్వాన్స్డ్ నిర్వాహక ఐఐటీలను డిమాండ్ చేస్తున్నాయి. కాగా, ఈ ఏడాది జేఈఈ మెయిన్స్లో తొలగించిన టాపిక్స్ అడ్వాన్స్డ్లో కొనసాగించే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. మేథ్స్లో ఆ టాపిక్స్ ఉండకపోవచ్చు నిపుణుల కమిటీ ఇటీవల ఎన్టీఏకు అందించిన నివేదిక ప్రకారం గణితంలో కొన్ని టాపిక్స్ను తొలగించే వీలుందని తెలుస్తోంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ మేథమెటికల్ ఇండక్షన్, టాన్జంట్స్ అండ్ నార్మల్స్, ప్లాన్ ఇన్ డిఫరెంట్ ఫామ్స్, మేథమెటికల్ రీజనింగ్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్ వంటి టాపిక్స్ ఉండకపోవచ్చని సమాచారం. -
జేఈఈ మెయిన్స్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. గురువారం ఉదయం నుంచి మొదలైన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 30వ తేదీ వరకూ కొనసాగుతుంది. పరీక్ష కేంద్రాలను జనవరి రెండో వారంలో వెల్లడిస్తామని ఎన్టీఏ తెలిపింది. అభ్యర్థుల హాల్ టికెట్లు పరీక్షకు మూడు రోజుల ముందు డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ప్రవేశానికి రెండు దశల ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్స్లో అర్హత సాధించిన వారిలో 2.5 లక్షల మందిని అడ్వాన్స్డ్కు అర్హత కల్పిస్తారు. అడ్వాన్స్డ్లో ర్యాంకును బట్టి ఐఐటీల్లో సీట్లు వస్తాయి. మిగతా జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో జేఈఈ మెయిన్స్ ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. తొలి దశ పరీక్ష వచ్చే ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకూ ఉంటుంది. రెండో దశ ఏప్రిల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు ఏ సెషన్కైనా, లేదా రెండింటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష పలితాలను ఫిబ్రవరి 12వ తేదీన వెల్లడిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. తెలుగు సహా మొత్తం 13 భాషల్లో జేఈఈ మెయిన్స్ ఉంటుంది. ప్రతీ సబ్జెక్టులోనూ 10 టాపిక్స్, ఫిజిక్స్లో 12 టాపిక్స్ తీసివేత కోవిడ్ సమయంలో ఎన్సీఈఆర్టీ, సీబీఎస్ఈ సిలబస్ను కుదించారు. దీంతో కొన్ని టాపిక్స్లో బోధన జరగలేదు. ఇది దృష్టిలో ఉంచుకుని జేఈఈ మెయిన్స్ సిలబస్లోనూ ఈసారి భారీ మార్పులు చేశారు. మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ల్లో పది చొప్పున, ఫిజిక్స్లో 12 చొప్పున టాపిక్స్ను జేఈఈ మెయిన్స్లో ఇవ్వకూడదని నిర్ణయించారు. జేఈఈ పరీక్ష కఠినంగా ఉంటోందనే సంకేతాలు రావడంతో ఈసారి పరీక్ష పేపర్ కూర్పులోనూ మార్పులు చేశారు. ముఖ్యంగా గణితంలో సుదీర్ఘ పద్ధతిలో సమాధానాలు రాబట్టే ప్రశ్నల నుంచి కొంత వెసులుబాటు ఇచ్చారు. మాథ్స్లో కఠినంగా భావిస్తున్న ట్రిగా్నమెట్రిక్స్ ఈక్వేషన్స్, మేథమెటికల్ రీజనింగ్ను తొలగించారు. దీనివల్ల సమాధానాలు రాబట్టేందుకు సమయం కలిసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. -
జేఈఈ మెయిన్స్ తేదీలు ఖరారు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలు, ట్రిపుల్ ఐటీ ల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్ష తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ కాలంలో 4 దఫాలుగా నిర్వహించిన ఈ పరీక్షను 2024– 25లో మాత్రం రెండు విడతలుగానే నిర్వహిస్తున్నట్టు తెలిపింది. తొలి విడతను 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ మధ్య చేపట్టాలని నిర్ణయించింది. రెండో దఫా జేఈఈ మెయిన్స్ ను ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ మధ్య నిర్వహించబోతున్నట్టు వెల్లడించింది. దీంతో పాటే మే 5న నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ (నీట్–యూజీ), మే 15–31 తేదీల మధ్య కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ), మార్చి 11–28 మధ్య సీయూఈటీ–పీజీ, జూన్ 10–21 మధ్య యూజీసీ–నెట్ పరీక్షలను నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేసింది. ఈ పరీక్షలన్నీ కంప్యూటర్ ఆధారంగానే ఉంటాయని పేర్కొంది. అయితే, సమగ్ర వివరాలతో కూడిన షెడ్యూల్ను ఎన్టీఏ విడుదల చేయాల్సి ఉంది. 2021 నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్ష కోవిడ్ కారణంగా ఆలస్యమవుతూ వస్తోంది. గత ఏడాది మాత్రం జనవరి, ఏప్రిల్ నెలల్లోనే నిర్వహించారు. అయితే, తేదీల ఖరారులో మాత్రం ఆలస్యమైంది. ఈ సంవత్సరం కోవిడ్ కన్నా ముందు మాదిరిగానే మూడు నెలల ముందే తేదీలను వెల్లడించారు. మెయిన్స్ దరఖాస్తులు పెరిగేనా? కోవిడ్ తర్వాత దేశవ్యాప్తంగా జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల వైపు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో జేఈఈ మెయిన్స్ రాసే వారి సంఖ్య ప్రతీ సంవత్సరం తగ్గుతోంది. ఈ స్థానంలో రాష్ట్ర ఎంసెట్కు దరఖాస్తులు పెరుగుతున్నాయి. 2014లో జేఈఈ మెయిన్స్ రాసినవారి సంఖ్య 12.90 లక్షలుంటే, 2022లో ఈ సంఖ్య 9.05 లక్షలకు తగ్గింది. 2023లో మాత్రం ఈ సంఖ్య 11 లక్షలకు పెరిగింది. కోవిడ్ సమయంలో టెన్త్ పరీక్షలు లేకుండా ఉత్తీర్ణులైన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం కూడా దీనికి కారణంగా చెబుతున్నారు. వాస్తవానికి మన రాష్ట్రం నుంచి 2014లో జేఈఈ రాసిన వారి సంఖ్య 2 లక్షల వరకూ ఉంటే, ఇప్పుడు 1.30 లక్షలకు పడిపోయింది. రాష్ట్రంలో ఎంసెట్ రాసేవారి సంఖ్య 2018లో 1.47 లక్షలుంటే, 2022లో ఇది 1.61 లక్షలకు పెరిగింది. కాగా, గత రెండేళ్లుగా రాష్ట్రంలో హాస్టళ్లు పూర్తిస్థాయిలో తెరుచుకోవడం, జేఈఈపై దృష్టి పెడుతున్న వారి సంఖ్య పెరగడంతో ఈ సంవత్సరం కూడా జేఈఈ రాసే వారి సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
నాలుగేళ్లలోనే డిగ్రీ+బీఈడీ
సాక్షి, అమరావతి: సైన్సు, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ కోర్సుల్లో అందుబాటులో ఉన్న ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఇప్పుడు బోధన రంగంలోనూ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఉన్న రెండేళ్ల బీఈడీ కోర్సు స్థానంలో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ–బీఈడీ, బీఏ–బీఈడీ కోర్సులను దేశంలో 42 ఐఐటీలు, ఐఐఎస్సీ, ఎన్ఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలు ప్రారంభించాయి. మనరాష్ట్రంలో శ్రీకాకుళంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గత నెలలో నిర్వహించిన జాతీయ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–(ఎన్సెట్)–2023కు 16,004 మంది దరఖాస్తు చేసుకోగా 10,136 మంది పరీక్షకు హాజరయ్యారు. మరో రెండు మూడు రోజుల్లో ఫలితాలు వెల్లడించి, ఈ నెలలో ప్రవేశ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం ప్రకారం.. ఫౌండేషన్(1 నుంచి 2 తరగతులు), ప్రిపరేటరీ (3–5), మిడిల్ స్టేజ్ (6–8), సెకండరీ స్టేజ్ (9–12 తరగతులు)కు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులను అందిస్తున్నారు. రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సెకండరీ స్టేజ్ (9 నుంచి 12వ తరగతి)కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సును ప్రవేశపెట్టారు. ఇంటిగ్రేటెడ్ బీఈడీతో ఉన్నత అవకాశాలు ఎన్టీఏ నిర్వహించిన ఎన్సెట్ ద్వారా ఈ కోర్సుల్లో ప్రవేశం పొందినవారు మూడేళ్ల తర్వాత నాలుగో ఏడాది చదవడం ఇష్టం లేకపోతే కోర్సు నుంచి బయటకు వచ్చేసే అవకాశం ఉంది. ఇలాంటి వారికి మూడేళ్ల డిగ్రీ పట్టాను అందిస్తారు. నాలుగేళ్ల కోర్సు పూర్తి చేస్తే పీజీ కోర్సులు చదువుకోవచ్చు. బోధన రంగాన్ని ఎంచుకునేవారికి మంచి అవకాశాలు.. శ్రీకాకుళంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ–బీఈడీ, బీఏ–బీఈడీల్లో 50 చొప్పున సీట్లు ఉన్నాయి. బీఎస్సీ–బీఈడీకి 1,988 మంది, బీఏ–బీఈడీకి 1,020 మంది దరఖాస్తు చేసుకున్నారు. బోధనకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం టీచింగ్ పోస్టులను కూడా మంజూరు చేసింది. నైపుణ్యం గల టీచింగ్ ఫ్యాకల్టీకి అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. ఇప్పటివరకు ఉపాధి కోర్సుగా మాత్రమే ఉన్న బీఈడీ కోర్సు బోధన రంగాన్ని ప్రొఫెషన్గా తీసుకునేవారికి మంచి అవకాశాలను అందిస్తుంది. – ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు, వైస్ చాన్సలర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ -
AP: నాలుగేళ్లలోనే డిగ్రీ ప్లస్ బీఈడీ.. ప్రవేశ పరీక్ష ఇలా..
సాక్షి, అమరావతి: సమీకృత బీఈడీ కోర్సులు ఈ ఏడాది నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ తర్వాత నాలుగేళ్లలోనే డిగ్రీతో పాటు బీఈడీ పూర్తి చేయవచ్చు. సాధారణంగా బీఈడీ చేయాలంటే మూడేళ్ల డిగ్రీ పూర్తి చేసి, రెండేళ్ల బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సు చేయాలి. దీనికి మొత్తం ఐదేళ్లు పడుతుంది. కొత్త విధానం వల్ల నాలుగేళ్లలోనే పూర్తి చేసే వీలుంది. జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా తీసుకొచ్చిన ఈ కోర్సును జాతీయ స్థాయిలో పలు కళాశాలల్లో ప్రవేశపెడుతున్నారు. వీటిలో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దేశ వ్యాప్తంగా 178 పట్టణాల్లో 13 మాధ్యమాల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్టు (సీబీటీ) నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను సోమవారం అర్ధరాత్రి ఎన్టీఏ విడుదల చేసింది. తద్వారా ఆంధ్రప్రదేశ్లో రెండు వర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఈడీ, బీఏ బీఈడీ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఎన్టీఏ 2023–24 విద్యా సంవత్సరానికి తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, ఎచ్చెర్లలోని బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో మొత్తం 150 సీట్లలో ప్రవేశాలు కలి్పంచనున్నారు. ఆధునిక విద్యా బోధనకు అనుగుణంగా సమీకృత బీఈడీ కోర్సును ఎన్సీఈఆర్టీ రూపొందించింది. విద్యార్థి మానసిక ధోరణి, ఆన్లైన్, డిజిటల్ విద్యా బోధనతో పాటు సరికొత్త మెలకువలతో ఎలా బోధించాలన్న అంశానికి ఈ కోర్సులో అత్యధిక ప్రాధాన్యమిస్తారు. తరగతి గదిలో పాఠాల కన్నా, అనుభవం ద్వారా నేర్చుకునే రీతిలో పాఠ్య ప్రణాళిక రూపొందించినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రవేశ పరీక్ష ఇలా : ఇంటర్ ఉత్తీర్ణులు ఈ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. పన్నెండో తరగతి, ఇంటర్ సిలబస్లోంచి ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 160 బహుళ ఐచి్ఛక ప్రశ్నలుంటాయి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్, టీచింగ్ అప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఎన్సీఈఆర్టీ ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తుంది. - ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 19.7.2023 - డేటా కరెక్షన్కు చివరి తేదీ 20.7.2023 - పరీక్ష తేదీ తర్వాత ప్రకటిస్తారు - హాల్ టికెట్ల డౌన్లోడ్ పరీక్షకు మూడు రోజుల ముందు - దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్సైట్లు: www.nta.ac.in, https://neet. samarth.ac.in/ ఇది కూడా చదవండి: గ్రీన్ ఎనర్జీకి స్టార్ రేటింగ్ -
నీట్లో ఏపీ విజయకేతనం
సాక్షి, అమరావతి: ప్రవేశ పరీక్ష ఏదైనా టాప్ ర్యాంకులు కొల్లగొట్టడమే పనిగా పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు నీట్లోనూ ప్రభంజనం సృష్టించారు. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ–2023 ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ విజయకేతనం ఎగురవేసింది. రాష్ట్రానికి చెందిన బోర వరుణ్ చక్రవర్తి అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి రికార్డు సృష్టించాడు. నీట్లో 720కి 720 మార్కులతో సత్తా చాటాడు. 99.99 పర్సంటైల్తో దుమ్ము లేపాడు. అలాగే తమిళనాడుకు చెందిన ప్రభంజన్ కూడా 720 మార్కులు సాధించి మొదటి ర్యాంకులో నిలిచాడు. ఈ విద్యార్థికి కూడా 99.99 పర్సంటైల్ వచ్చింది. మొత్తం మీద నీట్లో ఏపీ విద్యార్థులు అధికంగా ర్యాంకులను కొల్లగొట్టారని ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన వైఎల్ ప్రవర్థన్రెడ్డి అఖిల భారత స్థాయిలో 25వ ర్యాంక్ సాధించి ఈడబ్ల్యూఎస్ విభాగంలో దేశంలోనే తొలి స్థానంలో నిలిచాడు. ఆల్ ఇండియా 40వ ర్యాంక్తో ఎస్సీ విభాగంలో ఏపీకి చెందిన కె.యశశ్రీ రెండో స్థానం దక్కించుకుంది. అలాగే 119వ ర్యాంక్ సాధించిన ఏపీ విద్యార్థి ఎం.జ్యోతిలాల్ చావన్ ఎస్టీ విభాగంలో దేశంలో మొదటి ర్యాంకును కొల్లగొట్టాడు. ఈ మేరకు 2023–24 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ–2023 ఫలితాలు మంగళవారం రాత్రి వెలువడ్డాయి. నీట్ యూజీ పరీక్షను దేశవ్యాప్తంగా గత నెలలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా దేశవ్యాప్తంగా ఈ ఏడాది 20,87,462 మంది విద్యార్థులు నీట్కు దరఖాస్తు చేసుకోగా 20,38,596 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 11,45,976 మంది (56.21 శాతం) నీట్లో అర్హత సాధించారు. అర్హత పొందిన వారిలో 4,90,374 మంది అబ్బాయిలు, 6,55,599 మంది అమ్మాయిలు, ముగ్గురు ట్రాన్స్జెండర్లు ఉన్నారు. కాగా, తమిళనాడుకు చెందిన కౌస్తవ్ బౌరి 716 మార్కులతో మూడో ర్యాంక్, పంజాబ్కు చెందిన ప్రాంజల్ అగర్వాల్ 715 మార్కులతో నాలుగో ర్యాంక్, కర్ణాటకకు చెందిన ధ్రువ్ అద్వానీ ఐదో ర్యాంక్ కైవసం చేసుకున్నారు. ఆల్ ఇండియా టాప్ 50 ర్యాంకుల్లో ఏడుగురు తెలుగు విద్యార్థులు ఉండగా.. ఇందులో ఐదుగురు ఏపీ విద్యార్థులే కావడం విశేషం. మరో ఇద్దరు తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. ఏపీ నుంచి 42,836 మంది కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ఏడాది 69,690 మంది నీట్కు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 68,578 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 62.46 శాతం అంటే 42,836 మంది అర్హత సాధించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి అర్హత శాతం కొంత మేర పెరిగింది. 2022లో 65,305 మంది పరీక్ష రాయగా 61.77 శాతం 40,344 మంది అర్హత సాధించారు. తెలంగాణలో 72,842 మంది పరీక్ష రాశారు. వీరిలో 58.55 శాతం అంటే 42,654 మంది అర్హత సాధించారు. కాగా ఆల్ ఇండియా కోటాలో 15 శాతం సీట్లకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(డీజీసీఏ) కౌన్సెలింగ్ నిర్వహిస్తుందని ఎన్టీఏ స్పష్టం చేసింది. డీజీసీఏ సూచనల మేరకు అభ్యర్థులు కౌన్సెలింగ్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన సీట్లకు రాష్ట్రాల్లో భర్తీ చేపడతారు. ఢిల్లీ ఎయిమ్స్లో ఎంబీబీఎస్ చేస్తా మాది పోలాకి మండలం తోటాడా గ్రామం. నాన్న బోర రాజేంద్ర నాయుడు నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, అమ్మ రాజ్యలక్ష్మి తోటాడలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. నీట్లో మంచి ర్యాంకు వస్తుందనుకున్నా. అయితే నంబర్వన్ స్థానాన్ని కైవసం చేసుకుంటానని అనుకోలేదు. నా ప్రాథమిక విద్యాభ్యాసం నరసన్నపేటలోని పూర్తి చేశా. 8వ తరగతి నుంచి కార్పొరేట్ స్కూల్, కళాశాలల్లో చదివాను. ఇంటర్మీడియెట్లో 987 మార్కులు వచ్చాయి. న్యూఢిల్లీ ఎయిమ్స్లో ఎంబీబీఎస్ చదువుతా. –బోర వరుణ్ చక్రవర్తి, నీట్ ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్ -
లోదుస్తులు విప్పమన్నారు.. నీట్ విద్యార్థినుల ఆవేదన! ఎలా పరీక్ష రాసేది?
న్యూఢిల్లీ: నీట్ పరీక్ష జరిగిన ప్రతిసారి నేషనల్ టెస్డింగ్ ఏజెన్సీ కఠిన నిబంధనలపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈసారి కూడా పలువురు విద్యార్థులు పరీక్ష కేంద్రంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వివరించి కన్నీటి పర్యంతమయ్యారు. తమ బ్రా స్టాప్లు చెక్ చేశారని, లో దుస్తులు కూడా విప్పమన్నారని పలువురు అమ్మాయిలు వాపోయారు. పరీక్షకు ముందు సున్నిత విషయాల్లో తమను ఇలా ఇబ్బంది పెడితే ఎగ్జామ్ ప్రశాంతంగా ఎలా రాస్తామని ప్రశ్నిస్తున్నారు. పలు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థుల దుస్తులను విప్పించి తిప్పి వేసుకోమని సిబ్బంది చెప్పారని పరీక్షకు హాజరైన స్టూడెంట్ తెలిపింది. అలాగే మరికొంత మందిని జీన్స్ ప్యాంట్లు ధరించవద్దని చెబితే వారు వెళ్లి తమ తల్లుల లెగ్గింగ్స్ను మార్చుకుని వచ్చారని పేర్కొంది. మరికొందరేమో సమీప దుకాణాల్లోకి వెళ్లి అప్పటికప్పుడు కొత్త దుస్తులు కొనుగోలు చేసి పరీక్ష కేంద్రానికి తిరిగి వచ్చారని వివరించింది. ఎన్టీఏ నిబంధనలకు అనుగుణమైన దుస్తుల కోసం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పింది. దీంతో ఈ రూల్స్పై తల్లిదండ్రులతో పాటు ఇతరుల నుంచి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. పరీక్షకు ముందు విద్యార్థులను ఇలా మానసికంగా ఇబ్బందిపెట్టడం సరికాదని ఓ డాక్టర్ జంట అసహనం వ్యక్తం చేసింది. విద్యార్థులను ఇలా ట్రీట్ చేయడమేంటని మండిపడింది. అవసరమైతే నిబంధనలు మార్చి వారికి వస్త్రధారణలో ఉపశమనం కల్పించాలని సూచించింది. కాగా.. బెంగాల్లోని హెచ్ఎంసీ ఎడ్యుకేషన్ సెంటర్లో కొందరు విద్యార్థులు లోదుస్తుల్లోనే పరీక్ష రాశారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ప్రిన్సిపల్ మాత్రం వీటిని ఖండించారు. అలాంటి ఘటనలేవీ జరగలేదని చెప్పారు. కొంతమంది విద్యార్థులు డ్రస్ కోడ్ పాటించకపోతే మార్చుకొని రావాలని సూచించినట్లు వివరించారు. అయితే నిబంధనలపై సరిగ్గా అవగాహన లేని వారిని సిబ్బందిగా పెట్టడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తల్లిదండ్రులు తెలిపారు. నీట్ యూజీ పరీక్ష ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 499 కేంద్రాల్లో ఈ వైద్య విద్య ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఎంబీబీఎస్ చేయాలనుకునే లక్షలాది మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. చదవండి: హైదరాబాద్లో నీడ మాయం.. రెండు నిమిషాల పాటు కన్పించని షాడో.. -
జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల
ఢిల్లీ: జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు విడుదల అయ్యాయి. శనివారం ఉదయం ఫలితాల్ని రిలీజ్ చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) తన అఫీషియల్ వెబ్సైట్లో ప్రకటించింది. ఏప్రిల్ 6 నుంచి 15 వరకు జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక జేఈఈ మెయిన్ ఫలితల కోసం రీవాల్యూయేషన్, రీ చెకింగ్ లాంటివి ఉండవని, కాబట్టి అభ్యర్థులు సంప్రదించేందుకు ప్రయత్నించకూడదని సూచించింది ఎన్టీఏ. రిజల్ట్ చెక్ చేసుకునేందుకు.. స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకునేందుకు.. https://jeemain.nta.nic.in/ వీక్షించొచ్చు. జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్ష జనవరిలో జరిగింది. ఏప్రిల్ 6 నుంచి 15 రెండో విడత జరిగాయి. మొదటి విడత పరీక్షకు 8.24 లక్షల మంది, రెండో విడత పరీక్షకు దాదాపు 9 లక్షల మంది హాజరయ్యారు. ఈ రెండుసార్లు పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన అభ్యర్థుల ఉత్తమ స్కోర్ ఆధారంగానే ఎన్టీఏ ర్యాంకులు ప్రకటించింది. జేఈఈ మెయిన్స్లో కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు నిర్ణయించి.. మొత్తం 2.50 లక్షల మందిని అడ్వాన్స్డ్ రాయడానికి అర్హత కల్పిస్తారు. ఈ నెల 30వ తేదీ నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి. మే 7వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. అప్లికేషన్ ఫీజును మే 8వ తేదీ వరకు చెల్లించవచ్చు. మే 29 నుంచి జూన్ 4వ తేదీ వరకు అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జూన్ 4వ తేదీన ఉంటుంది. ఉదయం 9-12గం. పేపర్ 1, మధ్యాహ్నం 2.30-5.30 మధ్య రెండో పేపర్ ఉంటుంది. -
నేటి నుంచి జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ, తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ పరీక్షలు గురువారం (నేడు) ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 9.4 లక్షల మంది హాజరయ్యే అవకాశముంది. ఏపీ నుంచి 1.5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దేశంలోని 330 పట్టణాలు, విదేశాల్లోని 15 పట్టణాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏపీలోని 25 పట్టణాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు. ఈ పరీక్షలు గురువారంతో పాటు 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో జరుగుతాయి. ఇంతకు ముందు షెడ్యూల్లో 6 వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నప్పటికీ, అభ్యర్థుల సంఖ్య పెరగడంతో 13, 15 తేదీల్లో కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్ష నిర్వహిస్తోంది. రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు బ్యాచ్లుగా పరీక్ష జరుగుతుంది. జేఈఈ మెయిన్ తొలి సెషన్కు 8.2 లక్షల మంది హాజరు కాగా, ఈసారి ఈ సంఖ్య పెరుగుతోంది, అభ్యర్ధులు పరీక్ష కేంద్రానికి అడ్మిట్ కార్డు కాపీలతో పాటు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును కూడా తీసుకురావాలని ఎన్టీఏ సూచించింది. -
జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్కు 9.4లక్షల మంది
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ అడ్మిట్కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం రాత్రి విడుదల చేసింది. www.nta.ac.in లేదా https://jeemain.nta.nic.in/వెబ్సైట్ల నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్టీఏ సూచించింది. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 9.4 లక్షల మంది హాజరయ్యే అవకాశముందని పేర్కొంది. దేశంలో 330 పట్టణాలు, విదేశాల్లోని 15 పట్టణాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో 25 పట్టణాల్లో ఈ పరీక్షలకు ఎన్టీఏ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 6వ తేదీనుంచి 15వ తేదీవరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇంతకుముందు ఈ పరీక్షల షెడ్యూల్లో 6వ తేదీనుంచి 12వ తేదీవరకు నిర్వహిస్తామని పేర్కొన్నా.. అభ్యర్థుల సంఖ్య పెరగడంతో 13, 15 తేదీల్లో కూడా పరీక్ష నిర్వహించనున్నట్లు అడ్మిట్కార్డుల్లో పొందుపరిచింది. ప్రస్తుతం తొలిరోజు పరీక్ష రాసేవారి అడ్మిట్కార్డులను ఎన్టీఏ విడుదల చేసింది. తదుపరి రోజులకు సంబంధించి పరీక్షరాసే వారి అడ్మిట్కార్డులను వరుసగా ముందు రోజుల్లో ఇవే వెబ్సైట్లలో ఉంచనుంది. పుట్టిన తేదీ, అప్లికేషన్ నంబరు నమోదు చేయడం ద్వారా అభ్యర్థులు అడ్మిట్కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చునని ఎన్టీఏ తెలిపింది. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి అడ్మిట్కార్డు కాపీలతో పాటు చెల్లుబాటయ్యే ఫొటో గుర్తింపుకార్డు కూడా తీసుకురావాలని సూచించింది. తొలి సెషన్ కన్నా ఎక్కువమంది అభ్యర్థులు జనవరిలో నిర్వహించిన మొదటి సెషన్ పరీక్షకన్నా రెండో సెషన్కు ఎక్కువమంది హాజరుకానున్నారని ఎన్టీఏ అడ్మిట్కార్డుల నోట్లో తెలిపింది. తొలి సెషన్లో 8.6 లక్షల మంది హాజరుకాగా ఈసారి 9.4 లక్షల మంది పరీక్ష రాయనున్నట్లు పేర్కొంది. జనవరి సెషన్ సమయంలో ఇంటర్ పరీక్షల సన్నద్ధతతో పాటు ప్రాక్టికల్ పరీక్షలు కూడా ఉండడంతో ఈ పరీక్ష రాసిన విద్యార్థుల సంఖ్య తక్కువే. అప్పుడు పరీక్ష రాయని వారితోపాటు రాసినవారు కూడా రెండో సెషన్లో పరీక్ష రాయనున్నారు. ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు ముగియడంతో విద్యార్థులకు జేఈఈ పరీక్షకు వెసులుబాటు కలిగింది. తొలిసెషన్ పరీక్షకు 8,60,064 మంది పేపర్–1కు, 46,465 మంది పేపర్–2కు రిజిస్టరయ్యారు. వీరిలో పేపర్–1కి 8,23,967 (95.80 శాతం) మంది, పేపర్–2కి 95 శాతానికిపైగా హాజరయ్యారు. 2.5 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్డ్కు ఎంపిక జేఈఈ మెయిన్స్ రెండు విడతల పరీక్షలకు సంబందించిన తుది ర్యాంకులతో ఫలితాలు ఈనెలాఖరునాటికి విడుదల కానున్నాయి. రెండు సెషన్లలో సాధించిన మార్కుల్లో ఎక్కువ మార్కులను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ప్రకటిస్తారు. ఏప్రిల్ 30 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్కు దరఖాస్తు ప్రక్రియ మొదలు కానున్నందున అంతకు ముందే ఈ ఫలితాలు వెలువడనున్నాయి. జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన తొలి 2.5 లక్షల మందికి అడ్వాన్స్డ్లో దరఖాస్తుకు అవకాశమిస్తారు. కటాఫ్ 87 నుంచి 90 మార్కుల వరకు జేఈఈ మెయిన్ నుంచి అడ్వాన్స్డ్కు అర్హత సాధించడానికి కటాఫ్ మార్కులు జనరల్ కేటగిరీలో 87 నుంచి 90 వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కటాఫ్ మార్కులు పెరుగుతాయని భావిస్తున్నారు. గతేడాది జనరల్ కటాఫ్ మార్కులు 88. గత అయిదేళ్ల కటాఫ్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటే ఈ సారి కటాఫ్ ఇంచుమించు 90 వరకు ఉంటుందని తెలుస్తోంది. ఏపీలో 25 సెంటర్లు ఇవే.. అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం, అమరావతి, గూడూరు, మచిలీపట్నం, నంద్యాల, తాడేపల్లిగూడెం. -
జేఈఈ మెయిన్ సిటీ ఇంటిమేషన్ లెటర్లు విడుదల
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ –2023 సెకండ్ సెషన్ పరీక్షలకు సిటీ ఇంటిమేషన్ లెటర్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. విద్యార్థులు ఎన్టీఏ వెబ్సైట్ https:// jee main. nta.nic.in/' నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. మెయిన్ సెకండ్ సెషన్ ఆన్లైన్ పరీక్షలు ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు జరుగుతాయి. దేశవ్యాప్తంగా 290 పట్టణాలతో పాటు విదేశాల్లోని 24 పట్టణాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ఏపీలో 25 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఎన్టీఏ ఏర్పాటుచేసింది. విద్యార్థులు ఏ పట్టణంలో పరీక్ష రాయాలో తెలియజేసేలా ఎన్టీఏ ఈ సిటీ ఇంటిమేషన్ లెటర్లను ముందుగా విడుదల చేస్తుంది. విద్యార్థులు ముందుగా ఆయా కేంద్రాలను సందర్శించి, పరీక్షల రోజున ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమయానికి చేరుకోవడానికి వీలుగా ఈ ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు వారి దరఖాస్తు నంబరు, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా సిటీ ఇంటిమేషన్ లెటర్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లెటర్లతో పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశానికి అడ్మిట్ కార్డులు జారీ చేస్తారు. వీటిని కూడా త్వరలోనే ఎన్టీఏ విడుదల చేయనుంది. డౌన్లోడ్లో సమస్యలు ఏర్పడితే 011–40759000 ఫోన్ నెంబర్లో లేదా "jeemain@nta.ac.in.' ఈమెయిల్ ద్వారా సంప్రదించాలని ఎన్టీఏ సూచించింది. విద్యార్థులు ఎన్టీఏ అధికారక వెబ్సైట్లలో వచ్చే సూచనలను అనుసరించాలని సూచించింది. -
సోషల్ మీడియా సమాచారాన్ని నమ్మొద్దు
సాక్షి, అమరావతి: జేఈఈ పరీక్షలపై సోషల్ మీడియాలో వచ్చే ‘ఇన్ సైడర్’ (ఎన్టీఏ వర్గాల నుంచి అందిన సమాచారం) పేరుతో వచ్చే సమాచారాన్ని నమ్మొద్దని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విద్యార్థులకు సూచించింది. పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ తదితర అంశాలపై తప్పుడు సమాచారం ఇస్తున్నాయని పేర్కొంది. ‘జేఈఈ (మెయిన్) 2023 సెషన్ 2కు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్, అడ్మిట్ కార్డ్ విడుదల తేదీపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వీడియోలు ప్రసారం అవుతున్నాయని మా దృష్టికి వచ్చింది. అవి ఫేక్. విద్యార్థులను తప్పుదారి పట్టించేలా ఉన్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇలాంటి వీడియోలను నమ్మొద్దు. ఈ వీడియోలను హోస్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ల బారిన పడొద్దు’ అని గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. జేఈఈ (మెయిన్) పరీక్షకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం ఎన్టీఏ వెబ్సైట్ను చూడాలని సూచించింది. సిటీ ఇంటిమేషన్ స్లిప్, అడ్మిట్ కార్డ్ విడుదల తేదీలు ఎన్టీఏ వెబ్సైట్లో, పబ్లిక్ నోటీసు ద్వారా మాత్రమే ప్రకటిస్తామని స్పష్టం చేసింది. మరింత స్పష్టత కోసం 011–40759000 నంబరులో సంప్రదించవచ్చని తెలిపింది. లేదా jeemain@nta.ac.in కు మెయిల్ చేయవచ్చని వివరించింది. -
JEE Mains 2023 Result: జేఈఈ మెయిన్ తొలిసెషన్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ తొలివిడత పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల చేశారు. ఎన్టీఏ వెబ్సైట్లో ఫలితాలను ఉంచారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీవరకు జరిగిన ఈ పరీక్షలకు 9 లక్షల మందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిలో పేపర్–1 (బీఈ, బీటెక్) పరీక్షకు 8.6 లక్షల మంది, పేపర్–2 (బీఆర్క్, బీప్లానింగ్) పరీక్షకు 46 వేల మంది హాజరయ్యారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. దాదాపు 95.8 శాతం మంది పరీక్షకు హాజరవడం ఇదే తొలిసారని చెబుతున్నారు. జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ పరీక్షలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నందున తొలిసెషన్ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. జేఈఈ తొలిసెషన్ పరీక్షల ప్రాథమిక కీని ఎన్టీఏ ఫిబ్రవరి 1వ తేదీనే విడుదల చేయగా, ఫిబ్రవరి 2 నుంచి 4వ తేదీవరకు అభ్యర్థుల అభ్యంతరాలను స్వీకరించింది. ఏప్రిల్ 6 నుంచి జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు ఎన్టీఏ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ వరకు జేఈఈ మెయిన్ రెండోవిడత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. మార్చి 7వ తేదీవరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. సెకండ్ సెషన్కు సంబంధించిన అప్లికేషన్ ఫారం " https:// jeemain. nta. nic. in' వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని ఎన్టీఏ తెలిపింది. జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షల సిటీ స్లిప్లను మార్చి 3వ వారంలో విడుదల చేయనున్నారు. మార్చి చివరి వారంలో రెండోసెషన్ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్టీఏ విడుదల చేయనుంది. -
జేఈఈ అర్హతలో స్వల్ప మార్పులు
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్ అర్హత నిబంధనల్లో స్వల్ప మార్పులు చేశారు. ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. జేఈఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ప్రవేశాలు పొందేప్పుడు ఇంటర్లో 75 శాతం మార్కులు పొంది ఉండాలని ఎన్టీఏ తొలుత పేర్కొంది. దీనివల్ల ఈశాన్య రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో వివాదం చెలరేగింది. ఆయా రాష్ట్రాల్లో ఇంటర్, 10 ప్లస్టులో గరిష్టంగా 60 శాతం పర్సంటైల్ మాత్రమే వస్తోంది. దీంతో కొంతమంది కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఇంటర్, ప్లస్ టులోని సబ్జెక్టుల్లో 75 మార్కులు లేదా టాప్ 20 పర్సంటైల్ ఉన్నవారు జాతీయ సీట్ల కేటాయింపునకు అర్హులని ఎన్టీఏ మార్పు చేసింది. ఎస్సీ, ఎస్టీలు ఇంటర్, ప్లస్టులో 65 మార్కులు పొంది ఉంటే సరిపోతుందని నిర్ణయించింది. -
జేఈఈ పరీక్ష కేంద్రాల కుదింపు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 24 నుంచి జరిగే జేఈఈ మెయిన్స్ పరీక్ష కేంద్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) కుదించింది. గతంలో 21 పట్టణాల్లో నిర్వహించే ఈ పరీక్షను ఈసారి 17 పట్టణాలకే పరిమితం చేసినట్టు స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో గతంలో భౌతికదూరం పాటించాల్సి వచ్చిందని, అభ్యర్థులు గుంపులుగా ఉండకుండా ఉండేందుకు పరీక్ష కేంద్రాలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఈసారి ఆ తీవ్రత లేకపోవడంతో పరీక్ష కేంద్రాలను తగ్గించినట్టు పేర్కొన్నారు. కోవిడ్ కాలంలో నాలుగు దఫాలుగా నిర్వహించిన పరీక్షను ఈసారి రెండు దఫాలకు తగ్గించిన విషయం తెలిసిందే. పరీక్ష కేంద్రాల విషయంలో విద్యార్థుల వెసులుబాటు, పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనను ప్రామాణికంగా తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే పరీక్ష కేంద్రాల తగ్గింపు వల్ల పలు జిల్లాల్లో విద్యార్థులు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఆదిలాబాద్లో పరీక్ష రాసే విద్యార్థులు నిజామాబాద్కుగానీ, హైదరా బాద్కుగానీ వెళ్లాల్సి ఉంటుంది. వికారాబాద్ అభ్యర్థులు హైదరాబాద్లోగానీ, సంగారెడ్డిలోగా నీ రాయాల్సి ఉంటుంది. గద్వాల విద్యార్థులు మహబూబ్నగర్ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసేందుకు 95 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఆదిలాబాద్, గద్వాల, వికారాబాద్, మంచిర్యాలలో ఉన్న కేంద్రాలను ఈసారి తీసేశారు. పరీక్ష కేంద్రాలు ఇవే. జేఈఈ మెయిన్స్ పరీక్ష కేంద్రాల జాబితాను ఎన్టీఏ ప్రకటించింది. ఇందులో హయత్నగర్, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్నగర్, మేడ్చల్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ ఉన్నాయి. -
జేఈఈ మెయిన్ తొలివిడత సాధ్యమేనా?
సాక్షి,అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లు వంటి జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2023 జనవరి సెషన్ పరీక్షల షెడ్యూల్ను మార్చాలని అభ్యర్థుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కొందరు బాంబే హైకోర్టులో పరీక్ష వాయిదాను కోరుతూ పిటిషన్ కూడా దాఖలు చేశారు. మరోవైపు అభ్యర్థులు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్)కు సైతం ఫిర్యాదు చేశారు. దీంతో అభ్యర్థులు లేవనెత్తుతున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్సీపీసీఆర్ పరీక్షల షెడ్యూల్ మార్పు అంశాన్ని పరిశీలించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ జేఈఈ మెయిన్–2023 జనవరి సెషన్ పరీక్షల నిర్వహణపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అభ్యర్థుల అభ్యంతరాలు ఇవే.. జేఈఈ మెయిన్–2023ని రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ డిసెంబర్ 15న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. తొలి సెషన్ పరీక్షలు జనవరి 24 నుంచి 31 వరకు, రెండో సెషన్ను ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో జనవరి సెషన్ పరీక్షలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కూడా ప్రారంభించింది. అయితే జనవరిలో సీబీఎస్ఈ సహా పలు రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ బోర్డుల ప్రీ ఫైనల్ పరీక్షలు, ప్రాక్టికల్ పరీక్షలు ఉన్నాయి. దీనివల్ల జేఈఈ మెయిన్ పరీక్షలకు హాజరయ్యే అవకాశాన్ని తాము కోల్పోవలసి వస్తుందని అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2021, 2022లో జేఈఈ మెయిన్లో విజయం సాధించినా అవకాశం అందుకోలేక డ్రాపర్లుగా మిగిలిపోయిన అభ్యర్థులు కూడా పరీక్ష సన్నద్ధతకు తమకు సమయం లేకుండా పోతోందని అంటున్నారు. దీనివల్ల తాము మళ్లీ నష్టపోతామని పేర్కొంటున్నారు. ఇవే కాకుండా జేఈఈ మెయిన్కు ఎన్టీఏ పేర్కొన్న అర్హతల్లోనూ కొన్ని సడలింపులు ఇవ్వాలని కొందరు తొలి నుంచి కోరుతున్నారు. ఈ అర్హతలపైన కూడా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇంటర్లో 75 శాతం ఉత్తీర్ణత నిబంధనపైనా.. ఇంకోవైపు జేఈఈ అభ్యర్థులు ఇంటర్మీడియెట్లో 75 శాతం మార్కులు సాధించి ఉండాలన్న నిబంధనను ఎన్టీఏ గత మూడేళ్లుగా రద్దు చేసింది. కోవిడ్ కారణంగా తరగతులు, పరీక్షలు జరగకపోవడంతో ఈ మేరకు వెసులుబాటు ఇచ్చింది. అయితే కోవిడ్ తగ్గుముఖం పట్టడం, కళాశాలలు రెగ్యులర్గా నడుస్తుండటంతో ఈసారి మళ్లీ 75 శాతం మార్కుల నిబంధనను పునరుద్ధరించింది. జేఈఈ మెయిన్లో మంచి స్కోరు సాధించిన అభ్యర్థులు ఎన్ఐటీలు, ఐఐఐటీలు తదితర సంస్థల్లో ప్రవేశాలు పొందాలంటే ఇంటర్లో 75 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 65 శాతం) మార్కులు సాధించాల్సి ఉంటుంది. దీంతో తాము జేఈఈ మెయిన్లో మంచి స్కోరు సాధించినా.. ఇంటర్లో 75 శాతం మార్కులు సాధించి ఉండాలన్న నిబంధన తమ అవకాశాలకు గండి కొడుతుందని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. కాబట్టి ఈ నిబంధనను ఈసారి కూడా మినహాయించాలని కోరుతున్నారు. ఈ అంశాలన్నిటిపైనా ఎన్టీఏ ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువరించలేదు. -
మార్చి 15 నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్–2023 పబ్లిక్ పరీక్షలు మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు సోమవారం షెడ్యూల్ను విడుదల చేశారు. మార్చి 15 నుంచి ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు, మార్చి 16 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. నైతికత, మానవ విలువలు పరీక్షను ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు, పర్యావరణ విద్య పరీక్షను ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమవుతాయి. వీటిని ఏప్రిల్ 15 నుంచి 25 వరకు, ఏప్రిల్ 30, మే 10వ తేదీలలో రోజుకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఆదివారాలతో కలుపుకొని ఆయా రోజుల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి. జనరల్, వొకేషనల్ గ్రూపుల విద్యార్థులందరికీ ఇదే షెడ్యూల్లో ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ప్రాక్టికల్స్కు జంబ్లింగ్ విధానం: ప్రాక్టికల్ పరీక్షలను ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులలో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. దీనిలో జంబ్లింగ్ విధానాన్ని అనుసరిస్తారు. జేఈఈ మెయిన్ పరీక్షల కారణంగా ఏప్రిల్లో ప్రాక్టికల్స్ ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు సాధారణంగా జనవరి ఆఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి నెలాఖరులోపు పూర్తి చేసేవారు. ఈ ఏడాది జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఇంటర్ ప్రాక్టికల్స్ను ఏప్రిల్ రెండో వారంలో నిర్వహించాలని నిర్ణయించారు. జేఈఈ మెయిన్ తొలి సెషన్ పరీక్షలు జనవరి 24 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ షెడ్యూల్ ప్రకటించింది. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలను రిజర్వుగా కేటాయించింది. రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించడంతోపాటు 13, 15 తేదీలను రిజర్వులో ఉంచింది. జేఈఈ మెయిన్ పరీక్షల తేదీలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఇంటర్మీడియెట్బోర్డు ఈసారి ప్రాక్టికల్, ఇతర పరీక్షల షెడ్యూల్ను రూపొందించింది. -
జూన్ 4న జేఈఈ అడ్వాన్స్డ్
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను వచ్చే ఏడాది జూన్ 4న నిర్వహిస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ పేపర్–2 ఉంటుందని పేర్కొంది. జేఈఈ మెయిన్స్లో ఉత్తీర్ణులైన వారిని ర్యాంకుల ప్రకారం 2.50 లక్షల మందిని అడ్వాన్స్డ్కు అనుమతిస్తారు. ఇందులో వచ్చే ర్యాంకుల ఆధారంగా ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తారు. -
వచ్చే ఏడాది మే 7న ‘నీట్’
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ, ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) యూజీ–2023 తేదీ ఖరారైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నీట్ యూజీ–2023 క్యాలెండర్ను శుక్రవారం ప్రకటించింది. వచ్చే ఏడాది మే 7న దేశ వ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. పరీక్ష రాయడానికి దరఖాస్తుల ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నట్లు పేర్కొంది. 17 ఏళ్ల వయసు కలిగి, గుర్తింపు కలిగిన బోర్డుల్లో బయోలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ కోర్ సబ్జెక్టులుగా ఇంటర్ లేదా సమానమైన డిప్లమో కోర్సులు చేసిన విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. దేశ వ్యాప్తంగా 645 మెడికల్, 318 డెంటల్, 914 ఆయుష్, ఇతర కళాశాలల్లో నీట్–యూజీ అర్హత ఆధారంగా ప్రవేశాలుంటాయి. నీట్ యూజీ–2022ను ఈ ఏడాది జూలై 17న దేశ వ్యాప్తంగా నిర్వహించారు. ఈ పరీక్షకు ఏపీలో 65,305 మంది హాజరు కాగా 40,344 మంది అర్హులుగా నిలిచారు. దేశవ్యాప్తంగా 17,64,571 మంది పరీక్ష రాశారు. వీరిలో 9.93 లక్షల మంది అర్హత సాధించారు. రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 16 ప్రైవేట్, 2 మైనారిటీ, శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాలలున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో 2,185, ప్రైవేట్, మైనారిటీ కళాశాలల్లో 3,175 ఎంబీబీఎస్ సీట్లు కలిపి రాష్ట్రంలో 5,360 ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం 5 వైద్య కళాశాలల్లో 2023 నుంచి అకడమిక్ కార్యకలాపాలు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. 2023 నుంచి ఒక్కో చోట 150 చొప్పున 750 సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చే అవకాశముంది. -
ఇంటర్లో 75 శాతం సాధిస్తేనే జేఈఈ మెయిన్కు అర్హత
సాక్షి, అమరావతి: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2023లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈసారి పలు మార్పులు చేసింది. కరోనా సమయంలో సడలింపులిచ్చిన అంశాలను పునరుద్ధరించింది. కొన్ని కొత్త సడలింపులను ప్రకటించింది. జేఈఈ మెయిన్కు హాజరయ్యే అభ్యర్థులకు ఇంటర్మీడియెట్లో 75 శాతం మార్కులు సాధించి ఉండటం సహా పలు నిబంధనలను పెట్టింది. సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు నిబంధనల ప్రకారం ఎన్ఐటీ, ఐఐఐటీ, సీఎఫ్ఐటీ తదితర సంస్థల్లో ప్రవేశానికి అభ్యర్థులు జేఈఈలో ఆలిండియా ర్యాంకుతో పాటు ఇంటర్మీడియెట్లో 75 శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే ఇంటర్మీడియెట్లోని ప్రతి సబ్జెక్టులోనూ అభ్యర్థి నిర్ణీత అర్హత మార్కులను సాధించాలి. అందువల్ల మెయిన్కు 75 శాతం మార్కులు తప్పనిసరి చేసింది. మరికొన్ని నిబంధనలు జేఈఈ మెయిన్ తొలి దశ పరీక్షలు జనవరి 24 నుంచి 31 వరకు, రెండో దశ ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయి. తొలి దశ పరీక్షలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. రెండో దశ రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరి 7న ప్రారంభమవుతాయి. అభ్యర్ధులు రెండు విడతల పరీక్షలకు వేర్వేరుగా దరఖాస్తు చేయాలి. ఒక సెషన్కు ఒక్క దరఖాస్తే సమర్పించాలి. ఒకటికి మించి దరఖాస్తులు ఇస్తే.. ఆ తరువాత ఎప్పుడు దాన్ని గుర్తించినా ఆ అభ్యర్థిపై కఠిన చర్యలు తీసుకుంటారని ఎన్టీఏ స్పష్టంచేసింది. 2021, 2022 సంవత్సరాల్లో ఇంటర్మీడియెట్, తత్సమాన బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈసారి వయోపరిమితిని విధించకుండా బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణతను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటోంది. అయితే, అడ్మిషన్ల సమయంలో విద్యా సంస్థలు నిర్ణయించే వయోపరిమితి నిబంధనలను అభ్యర్థులు అనుసరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే డ్రాపర్ల (గత ఏడాది మెయిన్లో ఫెయిలై, మళ్లీ ఈ ఏడాది రాసే వారు, ఇంటర్మీడియెట్ పూర్తి చేసి కొన్ని సంవత్సరాలు వ్యవధి ఇచ్చి జేఈఈకి దరఖాస్తు చేసేవారు)కు వయోపరిమితిని సడలించి వరుసగా మూడుసార్లు మెయిన్కు అవకాశం కల్పించింది. ముందుగానే రిజర్వు తేదీల ప్రకటన రెండు దశల పరీక్షల తేదీల్లో మార్పులు చేయాల్సి వచ్చినా, ఇతర పరీక్షలకు ఆటంకం లేకుండా కొన్ని రిజర్వు తేదీలను కూడా ఎన్టీఏ ఈసారి ముందుగానే ప్రకటించింది. తొలివిడత పరీక్షలకు ఫిబ్రవరి 1, 2, 3 తేదీలను రిజర్వుగా ప్రకటించింది. రెండో విడతకు ఏప్రిల్ 13, 15 తేదీలను రిజర్వు తేదీలుగా పేర్కొంది. తగ్గిన పరీక్ష కేంద్రాలు కరోనా సమయంలో భౌతిక దూరం పాటించడం, ఇతర నిబంధనల కారణంగా మెయిన్ పరీక్షలను ఎక్కువ నగరాల్లో నిర్వహించింది. గత ఏడాది కూడా దేశవ్యాప్తంగా 514 నగరాలు, పట్టణాల్లో నిర్వహించింది. ఈసారి వాటిని 399కు కుదించింది. ఇతర దేశాల్లో పరీక్షల కేంద్రాలు గత ఏడాది 24 కాగా ఈసారి 13కు తగ్గించింది. రిజిస్ట్రేషన్ల ఫీజు పెంపు రిజిస్ట్రేషన్ల ఫీజులను కూడా ఎన్టీఏ పెంచింది. జనరల్ కేటగిరీ అభ్యర్థుల ఫీజు రూ.650 నుంచి రూ.1,000కి పెంచింది. మహిళలకు రూ.800 చేసింది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు ఫీజును రూ.325 నుంచి రూ.500కు పెంచింది. ఇతర దేశాల అభ్యర్థుల ఫీజును రూ.3 వేల నుంచి రూ.5 వేలకు, మహిళల ఫీజును రూ.1500 నుంచి రూ.3 వేలకు పెంచింది. అభ్యర్థులు జేఈఈ మెయిన్ ఆన్లైన్ దరఖాస్తులో తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఈమెయిల్, మొబైల్ నంబర్లు తదితర వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలని, లేదంటే రిజిస్ట్రేషన్ పూర్తి కాదని ఎన్టీఏ స్పష్టంచేసింది. ఇదిలా ఉండగా కరోనా పరిస్థితులు సద్దుమణిగినా గతంలోని పరిస్థితుల ప్రభావం ఇంకా ఉన్నందున, ఇంటర్మీడియెట్లో 75% మార్కుల నిబంధనను ఈసారి కూడా మినహాయించాలని అభ్యర్థులు కోరుతున్నారు. తొలివిడత సెషన్ పరీక్షలకు వ్యవధి తక్కువగా ఉందని, దీనినీ పునఃపరిశీలన చేయాలని అభ్యర్థిస్తున్నారు. -
నీట్ యూజీ-2023 ప్రవేశ పరీక్ష తేదీ ఖరారు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నీట్ యూజీ- 2023 తేదీలు ఖరారయ్యాయి. నీట్ యూజీ ప్రవేశ పరీక్షల క్యాలెండర్ను విడుదల చేసింది జాతీయ పరీక్షల మండలి(ఎన్టీఏ). మే 7వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. నీట్ యూజీ 2023 దరఖాస్తు ఫారమ్ ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ nta.ac.in, neet.nta.nic.inలలో లభిస్తాయి. ప్రక్రియ ప్రారంభం కాగానే అర్హులైన విద్యార్థులు నిర్ణీత పరీక్ష ఫీజు చెల్లించి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే.. నీట్ యూజీ ఎగ్జామ్ విధానం, సిలబస్, దరఖాస్తు వివరాలు, అర్హత, విద్యార్హతల వంటి వివరాలను విడుదల చేయనుంది ఎన్టీఏ. ఈ పరీక్ష రాసేందుకు 17 ఏళ్లు ఆపైబడిన వారు మాత్రమే అర్హులు. ఇంటర్మీడియెట్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు నీట్ పరీక్ష రాయవచ్చు. దేశవ్యాప్తంగా 645 మెడికల్, 318 డెంటల్, 914 ఆయూష్, 47 బీవీఎస్సీ, ఏహెచ్ కళాశాలలు నీట్ స్కోర్ను అనుమతిస్తున్నాయి. మరోవైపు.. ఉమ్మడి విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్ష క్యూట్-2023 తేదీలను సైతం ఎన్టీఏ ప్రకటించింది. మే 21 నుంచి 23 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. క్యూట్ పరీక్షలకు సంబంధించి రిజర్వ్ తేదీ జూన్ 1 నుంచి జూన్ 7 వరకు ఉంటాయని ప్రకటించింది ఎన్టీఏ. ఇదీ చదవండి: కొత్త వైద్య కళాశాలల దరఖాస్తుకు గడువు పెంపు -
JEE Main 2023: వచ్చే నెలలో జేఈఈ మెయిన్స్
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ సంస్థల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశపరీక్ష (జేఈఈ మెయిన్–2023) నోటిఫికేషన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసింది. రెండు విడతలుగా ఈ పరీక్షలు జరుగుతాయి. తొలి విడత వచ్చే ఏడాది జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో ఉంటుంది. రెండో విడత జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ వరకు ఉంటాయి. పరీక్ష ఎప్పటిలాగే ఆన్లైన్ విధానంలో ఉంటుందని, ఇంగ్లిష్, హిందీ, తెలుగు సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తామని ఎన్టీఏ వెల్లడించింది. దరఖాస్తుల స్వీకరణ షురూ.. జేఈఈ మెయిన్ మొదటి విడతకు దరఖాస్తులు గురువారం రాత్రి నుంచే మొదలయ్యాయి. జనవరి 12వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్లో జరిగే రెండో విడత పరీక్షలకు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జేఈఈ మెయిన్స్లో అర్హత సాధించిన వారికి అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహిస్తారు. అందులో వచ్చే ర్యాంకు ఆధారంగా ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తారు. విద్యార్థులు పూర్తి వివరాల కోసం ఎన్టీఏ వెబ్సైట్ చూడాలని, లేదా 011 40759000/ 011 69227700 నంబర్లకు ఫోన్ చేయవచ్చని ఎన్టీఏ తెలిపింది. రెండు నెలల్లోనే.. 2019 వరకు జేఈఈ మెయిన్స్ జనవరి, ఏప్రిల్ నెలల్లోనే నిర్వహించారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లు నాలుగు విడతలుగా మే, జూలై నెలల్లోనూ నిర్వహించారు. ఈ ఏడాది అక్టోబర్లో ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. అయితే 2 నెలల్లోనే మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వడం విశేషం. 2022 జేఈఈ మెయిన్స్కు 10.26 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 9,05,590 మంది పరీక్ష రాశారు. తొలి విడత షెడ్యూల్ ఇదీ.. దరఖాస్తుల స్వీకరణ: ఈ నెల 16 (గురువారం) నుంచి జనవరి 12 వరకు.. అడ్మిట్ కార్డుల విడుదల: 2023 జనవరి మూడో వారంలో. పరీక్షలు: 2023 జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 -
JEE Main Exam: జేఈఈ మెయిన్.. ఇక రెండుసార్లే
సాక్షి, అమరావతి: ఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు మాత్రమే నిర్వహించనుంది. గతంలో కరోనా సమయంలో నాలుగుసార్లు నిర్వహించిన ఎన్టీఏను ఏటా అలాగే అవకాశం కల్పించాలని విద్యార్థుల నుంచి డిమాండ్ ఉన్నా కేవలం రెండుసార్లు మాత్రమే ఈ పరీక్షను చేపట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో.. 2023–24 విద్యాసంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్ పరీక్ష షెడ్యూళ్లను వచ్చే వారం విడుదల చేయనుంది. బోర్డుల పరీక్షలతో సమస్య రాకుండా ఉండేందుకు ఆయా రాష్ట్రాలతో కూడా ఎన్టీఏ సంప్రదిస్తోంది. బోర్డు పరీక్షలు, జేఈఈ పరీక్షలు ఒకే తేదీల్లో కాకుండా వేర్వేరుగా కొంత వ్యవధిలో నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. కరోనా వేళలో నాలుగుసార్లు నిర్వహణ గతంలో జేఈఈ మెయిన్ను ఏడాదికి ఒకసారి మాత్రమే నిర్వహిస్తుండగా 2019 నుంచి రెండుసార్లకు పెంచారు. ఒకే దఫా కారణంగా విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని నష్టపోతున్నారని భావించి ఏడాదికి రెండుసార్లు జనవరి, ఏప్రిల్ నెలల్లో నిర్వహిస్తున్నారు. అయితే, కరోనా సమయంలో పరీక్షలకు తీవ్ర ఆటంకం ఏర్పడడంతో 2021లో మెయిన్ను నాలుగు దఫాలుగా నిర్వహించారు. విద్యార్థులు ఈ నాలుగు దఫాల్లో దేనిలోనైనా పాల్గొని జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందేలా అవకాశమిచ్చారు. 2022లో కూడా రెండుసార్లే నిర్వహించినా అవి చాలా ఆలస్యం కావడం, బోర్డు పరీక్షల సమయంలో వాటిని నిర్వహించేలా ముందు షెడ్యూళ్లు ఇవ్వడంతో గందరగోళం ఏర్పడింది. పైగా.. కరోనా అనంతరం రెగ్యులర్ తరగతులు ఆ ఏడాది చాలా ఆలస్యంగా ప్రారంభమైనందున తాము మరోసారి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని విద్యార్థులు కోరారు. అయితే, జనవరి, ఏప్రిల్ మాసాల్లో నిర్వహించాల్సిన ఆ పరీక్షలు జూన్, జూలైకు వాయిదా పడడం, ఫలితాల విడుదల కూడా చాలా జాప్యం కావడంతో ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ కూడా ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో.. విద్యాసంవత్సరం నష్టపోకుండా కొనసాగాలంటే ఇకపై జనవరి, ఏప్రిల్ మాసాల్లో ఏడాదికి రెండుసార్లు మాత్రమే నిర్వహించి అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుకెళ్లేలా ప్రవేశ పరీక్షలను నిర్ణీత సమయంలో పూర్తిచేయాలని ఎన్టీఏ భావిస్తోంది. అందుకనుగుణంగా ఇంటర్మీడియెట్ బోర్డులు, సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూళ్లకు ఇబ్బంది రాకుండా చూసేందుకు ఎన్టీఏ కసరత్తు చేస్తోందని వివిధ కోచింగ్ సంస్థల అధ్యాపకులు చెబుతున్నారు. ఏటా 10 లక్షలకు పైగా అభ్యర్థులు.. మరోవైపు.. జేఈఈ పరీక్షలకు ఏటా పది లక్షల మందికి పైగా అభ్యర్థులు రిజిస్టర్ అవుతున్నారు. ఈ పరీక్షల్లో అర్హత మార్కులు సాధించి మెరిట్లో ఉన్న టాప్ 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్కు ఎంపిక చేస్తున్నారు. గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే 2019లో అత్యధికంగా 12.37 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు రిజిస్టరయ్యారు. చదవండి: సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం.. వారికి తీపి కబురు.. -
ఫిబ్రవరిలో జేఈఈ మెయిన్స్!
సాక్షి, హైదరాబాద్: ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ జేఈఈ మెయిన్స్ (2023) ఫిబ్రవరిలో నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్ మొదటి వారంలో పరీక్ష షెడ్యూల్ను వెలువరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ బోర్డుల అభిప్రాయాలను కోరింది. ఫిబ్రవరిలో నిర్వహణకు సమ్మతమేనా? ఇతర అభ్యంతరాలు ఏవైనా ఉన్నాయా? అనే అంశాలపై వివరణ కోరినట్టు తెలిసింది. దీనిపై కొన్ని రాష్ట్రాలు సానుకూలంగా స్పందించినట్టు ఎన్టీఏ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది సకాలంలోనే తరగతులు 2022కు సంబంధించిన జేఈఈ మెయిన్స్ పరీక్షను మే, జూలై నెలల్లో నిర్వహించారు. ఆ తర్వాత అడ్వాన్స్డ్ కూడా నిర్వహించి ప్రవేశాల ప్రక్రియ ముగించారు. ఈ మొత్తం వ్యవహారం అక్టోబర్లో పూర్తయింది. వాస్తవానికి జేఈఈ మెయిన్స్ 2019 వరకు జనవరి నెలలోనే నిర్వహించారు. కోవిడ్ నేపథ్యంలో మూడేళ్లుగా ఆలస్యం జరుగుతోంది. అయితే ఈ ఏడాది తరగతులు సకాలంలోనే మొదలవ్వడంతో మెయిన్స్ త్వరగా నిర్వహించాలని ఎన్టీఏ సంకల్పించింది. రెండు విడతలుగానే.. కరోనా సమయంలో నాలుగు విడతలుగా జేఈఈ మెయిన్స్ నిర్వహించారు. ఈసారి 2 విడతలుగానే చేపట్టాలని నిర్ణయించారు. ఫిబ్రవరిలో తొలి విడత ఉంటే, ఏప్రిల్లో రెండో విడత ఉండొచ్చన్న సంకేతాలు ఎన్టీఏ వర్గాల నుంచి వస్తున్నాయి. ఏప్రిల్లో రాష్ట్రాల పరిధిలోని ఇంటర్ బోర్డులు పరీక్షలు నిర్వహిస్తే మాత్రం ఈ ప్రక్రియను మే నెలలో చేపట్టాలని భావిస్తోంది. జూన్ లేదా జూలైలో అడ్వాన్స్డ్ చేపట్టి, సెప్టెంబర్ నాటికి ప్రవేశాల ప్రక్రియను ముగించాలనే యోచనలో ఉంది. ఇందుకు సంబంధించి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి కూడా 2023–24 సంవత్సరం షెడ్యూల్ను విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మండలి అభిప్రాయాన్ని కూడా ఎన్టీఏ కోరినట్టు తెలిసింది. మరోవైపు పరీక్ష విధానంపైనా ఎన్టీఏ స్పష్టమైన వైఖరి తీసుకున్నట్టు తెలిసింది. పార్ట్–1కు మాత్రమే కరోనా కాలంలో నెగెటివ్ మార్కింగ్ అమలు చేశారు. 360 మార్కులతో 90 ప్రశ్నల విధానాన్నే అనుసరించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఫిబ్రవరి మొదటి వారమేనా? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఫిబ్రవరి రెండో వారంలో ప్లస్ టు పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ను ప్రకటించింది. ఈ సమయంలో జేఈఈ వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గుర య్యే అవకాశం ఉందని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి మొదటి వారంలో తొలి విడత పరీక్ష చేపట్టాలనే యో చనలో ఎన్టీఏ ఉంది. రెండో వారం పరీక్షలపై సీబీఎస్ఈతో పాటు తెలంగాణ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. రెండో వారంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఉండటమే కారణం. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి మొదటి వారంలో తొలి విడత, ఏప్రిల్ మూడో వారం లేదా మే మొదటి వారంలో జేఈఈ మెయిన్స్ ఉంటే బాగుంటుందని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి ఎన్టీఏకి సూచించే ఆలోచనలో ఉన్నారు. మొదటి వారమైతే అభ్యంతరం లేదు జేఈఈ మెయిన్స్ తొలి విడత ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహిస్తే ఎలాంటి సమస్య ఉండదు. రెండో విడత పరీక్షల ఖరారులోనూ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షల తేదీలను, విద్యార్థులు సన్నద్ధమయ్యేందుకు ఉన్న అవకాశాలను పరిగణనలోనికి తీసుకోవాలి. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యామండలి చైర్మన్) -
కారణాలేంటో తెలియజేయండి
సాక్షి, హైదరాబాద్: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్)–2022కు హాజరైన విద్యార్థి జోత్స్నకు తొలుత ఓ మార్కులు(482), తర్వాత మరో మార్కుల(294)ను వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి గల కారణాలను తెలిపాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ను హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 11వ తేదీలోపు కారణాల నివేదికను కోర్టు ముందుంచాలని స్పష్టం చేసింది. కారణం చూపించకుండా ఎన్టీఏ తన మార్కులను 482 నుంచి 294కు తగ్గించడాన్ని సవాల్ చేస్తూ జీఎస్ జోత్స్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ సీహెచ్ సుమలతతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎన్.ఎస్.అర్జున్ కుమార్ వాదనలు వినిపించారు. నీట్(యూజీ)కు హాజరైన జోత్స ్నకు తొలుత 482 మార్కులు వచ్చాయన్నారు. ఆలిండియాస్థాయిలో 1,00,456 ర్యాంక్, ఓబీసీ కేటగిరీలో 50,567 ర్యాంక్ వచ్చిందన్నారు. ఈ మేరకు ఫలితాలు వచ్చిన సెప్టెంబర్ 7న ఎన్టీఏ ఫలితాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేసిందన్నారు. తర్వాత కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ అప్లోడ్ చేసిన జాబితా చూసి పిటిషనర్ షాక్కు గురయ్యారని చెప్పారు. మార్కులను 294కు తగ్గించారని, ఎన్టీఏ వెబ్సైట్ను తెరిచి చూడగా.. ఇదే మార్కులను చూపించిందన్నారు. దీంతో ర్యాంక్ ఆలిండియా స్థాయిలో 3,32,143కి, ఓబీసీ స్థాయిలో 1,44,313కి పెరిగిందన్నారు. దీనిపై ఎన్టీఏకు ఎన్నిసార్లు ఈ–మెయిల్ పంపినా స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. ఎన్టీఏ తరఫున న్యాయవాది బి.కవిత యాదవ్, కాళోజీ వర్సిటీ తరఫున న్యాయవాది ఎ. ప్రభాకర్రావు హాజరయ్యారు. వాదనలు విన్న ధర్మానసం తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. -
‘నీట్’లో ఏపీ విద్యార్థులు 61.77% ఉత్తీర్ణత
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ–2022 ఫలితాలు బుధవారం రాత్రి విడుదలయ్యాయి. నీట్ యూజీ పరీక్షలను దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూలై 17న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించింది. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 17.64 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 9,93,069 మంది (56.27 శాతం) అర్హత సాధించారు. ఏపీ నుంచి 61.77 శాతం విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తం 65,305 మంది పరీక్షకు హాజరు కాగా, 40,344 మంది అర్హత సాధించారు. రాజస్థాన్కు చెందిన విద్యార్థిని తనిష్క 715 స్కోర్ సాధించి, 99.99 పర్సంటైల్తో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఢిల్లీకి చెందిన వి. ఆశిష్బాత్రా రెండో ర్యాంకు, కర్ణాటకకు చెందిన హృషికేష్ నాగభూషణ్ మూడో ర్యాంకు, రూచ పవాషే నాలుగో ర్యాంకు సాధించారు. తెలంగాణకు చెందిన ఇ.సిద్దార్థ్ రావు ఐదో ర్యాంక్ సాధించారు. ఏపీకి చెందిన ఎం. దుర్గ సాయి కీర్తి తేజ 12వ ర్యాంక్, ఎన్.వెంకటసాయి వైష్ణవి 15వ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. జి.హర్షవర్ధన్ నాయుడు 25వ ర్యాంకు సాధించాడు. చదవండి: (‘నీట్–యూజీ’ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల) ఆంధ్రప్రదేశ్లో 11 ప్రభుత్వ, 15 ప్రైవేటు, 2 మైనార్టీ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో కన్వీనర్, యాజమాన్య, ఎన్ఆర్ఐ ఇలా కోటాలు కలిపి 5,060 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185 సీట్లు (ఈడబ్ల్యూఎస్ అదనపు సీట్లు కలిపి) ఉన్నాయి. అత్యధికంగా ఆంధ్రా వైద్య కళాశాల, గుంటూరు వైద్య కళాశాల, కర్నూలు వైద్య కళాశాల, రంగరాయ (కాకినాడ) కళాశాలల్లో 250 చొప్పున సీట్లున్నాయి. అత్యల్పంగా ఒంగోలు రిమ్స్లో 120 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లలో ఆల్ ఇండియా కోటా 325 సీట్లు, రాష్ట్ర కోటాలో 1,890 సీట్లు భర్తీ చేస్తారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో 175 సీట్లు ఉన్నాయి. కాగా 2 ప్రభుత్వ డెంటల్ కాలేజీల్లో 140 సీట్లు, 14 ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో 1400కు పైగా బీడీఎస్ సీట్లు ఉన్నాయి. -
‘నీట్–యూజీ’ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: నీట్–అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) మెడికల్ ప్రవేశ పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 9.93 లక్షల మంది అర్హత సాధించారు. రాజస్తాన్కు చెందిన తనిష్క టాప్ ర్యాంకు దక్కించుకున్నారు. ఢిల్లీకి చెందిన వత్స ఆశిష్ బాత్రా రెండో ర్యాంకు, కర్ణాటకకు చెందిన హృషికేశ్ నాగభూషణ్ గంగూలీ మూడో ర్యాంకు సాధించారు. ఈ ఏడాది నీట్–యూజీ మెడికల్ ప్రవేశ పరీక్షకు 17.64 లక్షల మంది హాజరయ్యారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 1.17 లక్షల మంది, మహారాష్ట్ర నుంచి 1.13 లక్షల మంది, రాజస్తాన్ నుంచి 82,548 మంది అర్హత పొందారు. నీట్ యూజీ-2022 ఫలితాల కోసం క్లిక్ చేయండి -
NEET: లోదుస్తుల వివాదం.. బాధిత అమ్మాయిలకు మళ్లీ ‘నీట్’ పరీక్ష
న్యూఢిల్లీ: కేరళలో నీట్ పరీక్షకు హాజరైన సందర్భంగా ఓ పరీక్షా కేంద్రంలో విద్యార్థినులతో లోదుస్తులు విప్పించి.. ఆ తర్వాతే పరీక్ష రాయడానికి వెళ్లాలని సిబ్బంది ఆదేశించిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ వివాదంలో జాతీయ పరీక్షల మండలి(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా కేంద్రం వద్ద అవమానం ఎదుర్కొన్న బాధిత అమ్మాయిలు మరోసారి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది ఎన్టీఏ. వారికి సెప్టెంబరు 4న నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి విద్యార్థినులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం చేరవేసినట్లు స్పష్టం చేసింది. ఈ ఏడాది జులై 17న నీట్ పరీక్ష సమయంలో తనిఖీల పేరుతో తమను లోదుస్తులు విప్పాలని సిబ్బంది బలవంతం చేసినట్లు కొందరు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దాంతో అది పెను దుమారం రేపింది. కేరళలోని కొల్లం జిల్లా ఆయుర్లో గల మార్థోమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఈ ఘటన జరిగింది. లోదుస్తులకు ఉన్న హుక్స్ కారణంగా సౌండ్ వచ్చిందని దీంతో దాన్ని తీసేసి తన కుమార్తెను పరీక్షా కేంద్రంలోకి వెళ్లాలని సిబ్బంది ఆదేశించారని ఓ విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పలువురు విద్యార్థినులు కూడా ఇదే తరహా ఫిర్యాదులు చేశారు. విద్యార్థినుల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన కళాశాల సిబ్బందిపై చర్యలకు డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. ఘటనపై నిజ నిర్ధారణ కమిటీని నియమించింది ఎన్టీఏ. ఈ కేసులో కేరళ పోలీసులు తనిఖీలు చేపట్టిన ఐదుగురు మహిళలను అరెస్టు చేశారు. ఇదీ చదవండి: NEET Dress Code Controversy: ఇదంత ‘నీట్’ కాదేమో!? -
6న జేఈఈ మెయిన్ తుది ఫలితాలు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు (ఐఐటీలు), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2022 తుది ఫలితాలు ఈ నెల 6న వెలువడనున్నాయి. అభ్యర్థుల స్కోరుతోపాటు ర్యాంకులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేయనుంది. జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలను జూలై 25 నుంచి 30 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు 6.29 లక్షల మంది హాజరయ్యారు. కంప్యూటరాధారితంగా నిర్వహించిన ఈ పరీక్షల ప్రాథమిక కీని ఎన్టీఏ బుధవారం రాత్రి విడుదల చేసింది. ఈ ప్రాథమిక కీపై అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఈ నెల 5 (శుక్రవారం) సాయంత్రం 5 గంటల వరకు నమోదు చేయడానికి అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఒక్కొక్క ప్రశ్నకు ఇచ్చిన కీపై ఆధారాలతో రూ.200 చొప్పున ఫీజు చెల్లించి చాలెంజ్ చేయొచ్చని వెల్లడించింది. పేపర్–1.. బీఈ, బీటెక్, పేపర్ 2ఏ.. బీఆర్క్, పేపర్ 2బీ.. బీప్లానింగ్ పరీక్షల ప్రాథమిక కీలను వేర్వేరుగా ఎన్టీఏ https://jeemain.nta.nic.in లో పొందుపరిచింది. ఈ పోర్టల్ ద్వారా అభ్యర్థులు తమ అభ్యంతరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. వీటిని నిపుణుల కమిటీతో పరిశీలన చేయించి ఎన్టీఏ తుది నిర్ణయం తీసుకోనుంది. అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలు సరైనవి అయితే ప్రాథమిక కీని సవరించి తుది కీని విడుదల చేస్తుంది. కాగా తుది కీ అనంతరం ఈ నెల 5 అర్ధరాత్రి లేదా 6న జేఈఈ మెయిన్ స్కోరు, ర్యాంకుల వారీగా తుది ఫలితాలను విడుదల చేయనుంది. 7 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్లు కాగా జేఈఈ మెయిన్లో టాప్ 2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ అభ్యర్థులు ఈ నెల 7 నుంచి 11లోపు అడ్వాన్స్డ్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 28న అడ్వాన్స్డ్ పేపర్–1 పరీక్షను ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, పేపర్–2ను మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ తుది ఫలితాలను సెప్టెంబర్ 11న ప్రకటించనున్నారు. -
జేఈఈ మెయిన్కు 6,29,778 మంది
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్ఐటీ సహా జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం నుంచి తుది విడత జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ నిర్వహిస్తోంది. పరీక్ష కేంద్రానికి కనీసం గంట ముందే చేరుకోవాలని ఎన్టీఏ సూచించింది. పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు ఉంటుందని తెలిపింది. నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించే అవకాశం లేదని స్పష్టం చేసింది. కోవిడ్ సమయంలో నాలుగు విడతలుగా పరీక్ష నిర్వహించారు. ఈ సంవత్సరం మాత్రం రెండు విడతలుగానే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మొదటి విడత పరీక్షను నిర్వహించిన ఎన్టీఏ అభ్యర్థుల పర్సంటైల్ కూడా ప్రకటించింది. రెండో విడత జరగబోయే పరీక్షకు దేశవ్యాప్తంగా 6,29,778 మంది రిజిస్టర్ చేసుకున్నట్టు ఎన్టీఏ పేర్కొంది. సిలబస్ కుదించకుండా చాయిస్ జేఈఈ మెయిన్స్ పరీక్ష విధానాన్ని ఈ సంవత్సరం పూర్తిగా మార్చారు. గతంలో సెక్షన్–ఏ లోని బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలకు మాత్రమే నెగెటివ్ మార్కులుండేవి. ఈసారి సెక్షన్–బీ లోని న్యూమరికల్ వేల్యూ ప్రశ్నలకు కూడా నెగెటివ్ మార్కులుంటాయని ఎన్టీఏ తెలిపింది. బీఈ, బీటెక్తో పాటు బీఆర్క్కు సంబంధించిన పేపర్–2ఏ లోని సెక్షన్–బీ లో ప్రతి ప్రశ్నకూ నెగెటివ్ మార్కు ఉంటుంది. కరోనాతో 2021–22లోనూ పలు రాష్ట్రాల ఇంటర్ బోర్డులు సిలబస్ను కుదించినా ఎన్టీఏ మాత్రం కుదించలేదు. కాకపోతే కొన్ని మినహాయింపులను ప్రకటించింది. పేపర్–1, పేపర్–2ఏ, 2–బీ విభాగాల్లో పార్టు1లలోని ప్రశ్నల్లో చాయిస్ను ఇచ్చింది. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ, తెలుగు, ఉర్దూ సహా పలు ప్రాంతీయ భాషల్లో కూడా ఉంటాయి. ఏపీ, తెలంగాణల్లో ఇంగ్లిష్తో పాటు తెలుగు మాధ్యమ ప్రశ్నపత్రాలు ఇస్తారు. తుది విడత మెయిన్ పరీక్ష ముగిసిన కొద్ది రోజులకే ప్రాథమిక కీ విడుదల చేసేందుకు ఎన్టీఏ సన్నాహాలు చేస్తోంది. ఆ మర్నాడే పూర్తిస్థాయి పర్సంటైల్ వెలువడే వీలుంది. ఆగస్టు రెండో వారంలో జేఈఈ అడ్వాన్స్డ్కు సంబంధించిన ప్రక్రియ మొదలవ్వనుంది. అదేనెల 28న పరీక్ష నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది. టై బ్రేకర్లోనూ మార్పులు ఈసారి టై బ్రేకర్ నిబంధనల్లోనూ మార్పులు జరిగాయి. సమానమైన స్కోరు సాధించిన వారి విషయంలో వయసును కూడా ప్రమాణంగా తీసుకోవాలని నిర్ణయించింది. 2021లో ఈ పద్ధతిని రద్దు చేసిన ఎన్టీఏ మళ్లీ అమల్లోకి తెచ్చింది. సమాన మార్కులు వచ్చిన విద్యార్థులుంటే మొదట స్కోర్ల వారీగా వరుసగా గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అనంతరం తప్పుడు సమాధానాల నిష్పత్తిని అవే సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తారు. అప్పటికీ సమాన స్థాయిలో ఉంటే వయసును కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అప్పటికీ సాధ్యం కాకుంటే ముందుగా దరఖాస్తు చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. మొదటి విడత రాసినవారికి సులువే తొలి విడత జేఈఈ మెయిన్స్ రాసిన వాళ్లకు ఈ పరీక్ష కొంత తేలికగానే ఉండే వీలుంది. జూన్లో జరిగిన పరీక్ష తాలూకూ ప్రశ్నపత్రం ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి. దాదాపు అవే చాప్టర్స్ వచ్చే వీలుంది. మేథ్స్లో సుదీర్ఘంగా ప్రశ్నలుంటే కంగారు పడకూడదు. నెగెటివ్ మార్కింగ్ను దృష్టిలో పెట్టుకుని జవాబులివ్వాలి. – ఎంఎన్ రావు (గణిత శాస్త్ర బోధకుడు) పాత పేపర్లు తిరగేస్తే మంచిది జూన్లో జరిగిన జేఈఈలో ఫిజిక్స్ పేపర్ మధ్యస్తంగానే ఉంది. ఈసారీ ఇంచుమించు ఇదే మాదిరిగా ఉండే వీలుంది. ఇవే చాప్టర్స్ను చదువుకుని, పాత పేపర్లు ఒక్కసారి తిరగేస్తే తేలికగా సమాధానం ఇవ్వొచ్చు. తెలియని ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. దీనివల్ల నెగెటివ్ మార్కుల బాధ నుంచి తప్పించుకోవచ్చు. – జీకే రావు (ఫిజిక్స్ బోధకుడు)