Reservoirs
-
గంగ కంటే కృష్ణ మిన్న
సాక్షి, అమరావతి: దేశంలో అతి పెద్ద, పొడవైన నది గంగ. నీటి లభ్యతలోనూ గంగదే ప్రథమ స్థానం. గంగ నదీ పరివాహక ప్రాంతం(బేసిన్)లో 75 శాతం లభ్యత ఆధారంగా 17,940.20 టీఎంసీలు గంగా నదీ పరివాహక ప్రాంతం(బేసిన్)లో లభిస్తాయి. కానీ..ఆ గంగా బేసిన్లో రిజర్వాయర్ల నీటి నిల్వ(లైవ్) సామర్థ్యం 1,713.58 టీఎంసీలే. కృష్ణాలో ఏటా 75 శాతం లభ్యత ఆధారంగా లభించేది 3,157.29 టీఎంసీలు. కృష్ణా బేసిన్లో 1,783.43 టీఎంసీలు నిల్వ (లైవ్) సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లున్నాయి. వీటిని బట్టి చూస్తే దేశంలో అత్యధిక నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లలో కృష్ణా బేసిన్ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో జలవనరులపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సమగ్రంగా అధ్యయనం చేసింది. ఆ అధ్యయనంలో వెల్లడైన అంశాల ఆధారంగా ఇటీవల నివేదికను రూపొందించింది. అందులో ప్రధానాంశాలు ఇవీ..దేశంలో ఉత్తరాన హిమాలయ నది సింధూ నుంచి.. దక్షిణాన ద్వీపకల్ప నది కావేరి వరకూ నదుల్లో ఏటా సగటున 75 శాతం లభ్యత ఆధారంగా 70,391.84 టీఎంసీలు లభిస్తాయి. నీటి లభ్యతలో బ్రహ్మపుత్ర(18,565.53 టీఎంసీలు) మొదటి స్థానంలో ఉండగా.. గంగా(17,940.20 టీఎంసీలు) రెండో స్థానంలోనూ.. గోదావరి(4,145.66 టీఎంసీలు) మూడో స్థానంలో ఉంది. ఇక నీటి లభ్యతలో కృష్ణా (3,157.29 టీఎంసీలు) నాలుగో స్థానంలో నిలిచింది.దేశంలో అన్ని నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మించిన రిజర్వాయర్లలో నీటి నిల్వ (లైవ్) సామర్థ్యం 10,724.16 టీఎంసీలు. నీటి లభ్యతలో అగ్రస్థానంలో ఉన్న బ్రహ్మపుత్ర..రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యంలో అట్టడుగున నిలిచింది.గోదావరి బేసిన్లో 1,233.75 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు ఉండగా.. పెన్నా బేసిన్లో 178.84 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు ఉన్నాయి. -
అడుగంటిన రిజర్వాయర్లు.. మంత్రి ఉత్తమ్కు హరీష్రావు లేఖ
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ (అంతగిరి) రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ లు పూర్తి గా నీళ్లు లేక రిజర్వాయర్లు అడుగంటి పోయే పరిస్థితికి చేరుకున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ హరీశ్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. ‘‘గత సంవత్సరం ఇదే ఆగస్టు నెలలో అనంతగిరి రిజర్వాయర్లో 3.32 టీఎంసీల నీళ్ళు ఉంటే ప్రస్తుతం 0.75 టీఎంసీలు, రంగనాయక సాగర్లో 2.38 టీఎంసీలకు గాను ప్రస్తుతం 0.67 టీఎంసీలు, మల్లన్న సాగర్ 18 టీఎంసీలకు గాను ప్రస్తుతం 8.5 టీఎంసీలు, కొండ పోచమ్మ సాగర్ 10 టీఎంసీలకు గాను ప్రస్తుతం 4.5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఒకవైపు రిజర్వాయర్లలో నీళ్లు లేక, మరోవైపు వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. .. పంటలు వేయాలా వద్దా అనే అయోమయంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే జిల్లాల పంటల సాగు విస్తీర్ణం కూడ తగ్గి పోయింది. కాబట్టి రాజకీయాలు పక్కనబెట్టి మిడ్ మానెర్ నుండి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్లకు నీటిని పంపింగ్ చేసేలా ఇరిగేషన్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నా. అదేవిధంగా కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఆయకట్టుకు నీళ్లందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రైతాంగం పక్షాన కోరుతున్నాను’’ అని లేఖలో అన్నారు. -
వరద హోరు.. ప్రాజెక్టులకు జలకళ
-
AP Rains: వరదలతో రిజర్వాయర్లకు జలకళ
-
దేశంలో పెరిగిన ప్రధాన రిజర్వాయర్ల నీటిమట్టం
దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) శుభవార్త చెప్పింది. గత ఏడాది సెప్టెంబర్ తర్వాత దేశంలోని ప్రధాన జలాశయాల నీటిమట్టం తొలిసారిగా పెరిగిందని సీడబ్ల్యూసీ పేర్కొంది. అయితే స్వల్పంగానే నీటిమట్టం పెరగడంతో జలమండలి ఆందోళన వ్యక్తం చేస్తోంది.భారతదేశంలోని 150 రిజర్వాయర్లను పర్యవేక్షించే సీడబ్ల్యూసీ తాజా సమాచారాన్ని మీడియాకు వెల్లడించింది. 150 రిజర్వాయర్లలో 20 జలవిద్యుత్ ప్రాజెక్టులకు ఉపయుక్తమవుతున్నాయి. వీటి మొత్తం నిల్వ సామర్థ్యం 35.30 బిలియన్ క్యూబిక్ మీటర్లు (బీసీఎం. గత సంవత్సరం ఇదే కాలంలో అందుబాటులో ఉన్న నిల్వ 44.06 బీసీఎం. సాధారణ నిల్వ స్థాయి 50.422 బీసీఎం. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్లలో మొత్తం 19.663 బీసీఎం నిల్వ సామర్థ్యంతో 10 రిజర్వాయర్లు ఉన్నాయి. ఇవి సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో ఉన్నాయి.అసోం, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, త్రిపుర, నాగాలాండ్, బీహార్లతో సహా తూర్పు ప్రాంతంలో 23 రిజర్వాయర్లు ఉన్నాయి. వీటి మొత్తం నిల్వ సామర్థ్యం 20.430 బీసీఎం. ప్రస్తుత నిల్వ 3.979 బీసీఎం (19 శాతం). ఇది గత సంవత్సరం కంటే 20 శాతం తక్కువ. గుజరాత్, మహారాష్ట్రలోని పశ్చిమ ప్రాంతంలో 49 రిజర్వాయర్లు ఉన్నాయి. వీటి మొత్తం నిల్వ సామర్థ్యం 37.130 బీసీఎం. ప్రస్తుతం నిల్వ 7.949 బీసీఎం (21 శాతం). గత సంవత్సరం ఇది 27 శాతం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ సహా మధ్య ప్రాంతంలో 26 రిజర్వాయర్లు ఉన్నాయి. వీటిలో 48.227 బీసీఎం నిల్వ సామర్థ్యం ఉంది. ప్రస్తుత నిల్వ 12.26 బీసీఎం(25 శాతం). గత సంవత్సరం ఇది 35 శాతం.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడుతో సహా దక్షిణ ప్రాంతంలో 42 రిజర్వాయర్లు ఉన్నాయి. మొత్తం నిల్వ సామర్థ్యం 53.334 బీసీఎం. నిల్వ ఇప్పుడు 10.152 బీసీఎం (19.03 శాతం) వద్ద ఉంది. గత సంవత్సరం 19.43 శాతం. తాద్రీ నుంచి కన్యాకుమారి వరకు బ్రహ్మపుత్ర, సబర్మతి, పశ్చిమాన ప్రవహించే నదులలో సాధారణ నీటి నిల్వ కంటే మెరుగ్గా ఉన్నాయి. సింధు, సువర్ణరేఖ, మహి తదితర నదుల్లో నీటి నిల్వలు సాధారణ స్థాయికి చేరువలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మహానది, కావేరి, బ్రాహ్మణి, వైతరణి నదులో తక్కువ నీటి నిల్వలు నమోదయ్యాయి. -
111 జీవో రద్దు అమలుపై స్తబ్ధత
సాక్షి, హైదరాబాద్: జీవో 111 రద్దు అమలుపై స్తబ్ధ త నెలకొంది. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన 111 జీవోను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్లో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో కొన్ని అభ్యంతరాలు రావడంతో ప్రభుత్వం నిబంధనల సడలింపులపై అధ్యయనం చేసేందుకు జీవో 69ను జారీ చేస్తూ, ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక అందించే దాకా 111 జీవో పరిధిలోని ప్రాంతాల్లో నిబంధనలు కొనసాగుతాయని ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. దీంతో 111జీవో పరిధిలోని 84 గ్రామాల్లో మళ్లీ స్తబ్ధత నెలకొంది. అయితే ప్రభుత్వం విధించిన ఆంక్షలు కేవలం సామాన్యులకే పరిమితమవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల చేయి తడిపే అక్రమార్కుల నిర్మాణాలు మాత్రం జోరుగా సాగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. కాలయాపన కమిటీ.. హైదరాబాద్కు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జంట జలాశయాల పరిధిలో సుమారు 1.32 లక్షల ఎకరాలలో భూమి ఉంది. ఇక్కడ 84 గ్రామాలకు కొత్త మాస్టర్ ప్లాన్ను రూపొందించి ప్రణాళిక ప్రకారం హరిత నగరాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే 111 జీవోను రద్దు చేసింది. అయితే ఈ జలాశయాల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. మున్సిపల్, ఆర్థిక, నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, జలమండలి ఎండీ, కాలుష్య నియంత్రణ బోర్డు సభ్య కార్యదర్శి, హెచ్ఎండీఏ డైరెక్టర్ (ప్లానింగ్) సభ్యులుగా ఉండే ఈ కమిటీలో.. ఏయే అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలన్న దానిపై విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. అయితే కమిటీ ఏర్పాటై నెలలు గడుస్తున్నా నేటికీ ఎలాంటి విధానాలను రూపొందించకపోవడం గమనార్హం. ఆగని నిర్మాణాలు.. ఇప్పటికే 111 జీవో పరిధిలోని భూముల్లో సంపన్న వర్గాలు, పారిశ్రామికవేత్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు, బ్యూరోక్రాట్స్ తక్కువ ధరకే పెద్ద ఎత్తున స్థలాలను కొనుగోలు చేసి, ఫామ్హౌస్లు, రిసార్ట్లను నిర్మించుకున్నారు. శంషాబాద్, మెయినాబాద్, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాబాద్, కొత్తూరు శంకర్పల్లి మండలాల పరిధిలో అక్రమంగా లగ్జరీ విల్లాలు, హైరైజ్ నిర్మాణాలు జరుగుతున్నాయి. 111 జీవో ఎత్తివేశాక ఒక్క శంషాబాద్ పట్టణంలో దాదాపు 400 అక్రమ నిర్మాణాలు చేపట్టారని అంచనా. మొయినాబాద్ మండలంలో కొందరు రియల్టర్లు భూములను 10, 25 గుంటల చొప్పున ఫామ్ ల్యాండ్లుగా విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసిన చాలా మంది ఆయా ఫామ్ ల్యాండ్లలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని తెలుస్తోంది. వీటిని ఫామ్ హౌస్, వీకెండ్ హోమ్స్గా మార్చేసి అద్దెకు ఇస్తున్నారని స్థానికులు చెపుతున్నారు. రేటు పెట్టి మరీ వసూళ్లు.. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తే నోటీసులు జారీ, క్షేత్ర స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా.. అవి అంతంతమాత్రమేనని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే 111 జీవో పరిధిలో చాలా వరకు అక్రమ నిర్మాణాలు నేతలు, ప్రముఖులవే కావడంతో అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు స్థానిక మున్సిపల్ అధికారుల చేతులు తడపడంతో వారూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఒక్కో భవనానికి రూ.2–5 లక్షల వరకు మున్సిపల్ అధికారులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. జీవో రద్దు తర్వాత రియల్ బూమ్.. జీవో111 పరిధిలోని పాత వెంచర్లలో గజం ధర రూ.3–4 వేల వరకు ఉండేది. కాగా, ఈ జీవోను రద్దు చేశాక ధరలు ఒక్కసారిగా గజానికి రూ.12 వేలకు పైగానే చెబుతున్నారు. శంషాబాద్ మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న భూములు ఎకరం ధర రూ.8 కోట్లకు పైగానే చెబుతున్నారు. విమానాశ్రయానికి దగ్గర్లోని గ్రామాల్లో ఎకరం రూ.3–5 కోట్ల వరకు పలుకుతున్నాయని చెపుతున్నారు. సాంకేతికతను వినియోగించుకోవాలి నీటి వనరుల సంరక్షణ పేరుతో అభివృద్ధికి అడ్డుకట్ట వేయకూడదు. జలాశయాల ఆక్రమణలు, కాలుష్య నియంత్రణకు సాంకేతికతను వినియోగించుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినచర్యలు తీసుకుంటే వ్యవస్థ బాగుంటుంది. – కంచర్ల సంతోష్ రెడ్డి, సీఎండీ, డ్రీమ్ వ్యాలీ గ్రూప్ -
ఉధృతంగా ఈసీ, మూసీ వాగులు.. ఆ రోడ్డు మూసివేత
సాక్షి, రంగారెడ్డి: కుండపోత వర్షాలతో హైదరాబాద్ శివారులోని జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మూసీ పరివాహక ప్రాంత వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. ఈసీ,మూసీ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాజేంద్రనగర్ నుంచి పోలీస్ అకాడమీ వైపు వెళ్లే ఔటర్ సర్వీసు రోడ్డును పోలీసులు మూసివేశారు. నార్సింగి నుంచి మంచిరేవులకు వెళ్తే దారిని నార్సింగి పోలీసులు మూసేశారు. ప్రత్నామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు వరద భారీగా చేరుతోంది. వికారాబాద్, తాండూర్, శంకర్పల్లి, షాబాద్, షాద్ నగర్, పరిగితో పాటు పలు గ్రామాలకు నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. చదవండి: మూసీలో కొట్టుకొచ్చిన లక్ష్మీ మృతదేహం? -
ఇంకా మొదలుకాని వరదలు.. జలాశయాలు వెలవెల
సాక్షి, హైదరాబాద్: తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని జలాశయాలు వెలవెలబోతున్నాయి. ప్రధాన జలాశయాల్లో నిల్వలు అడుగంటి పోయాయి. గతేడాది సరిగ్గా ఇదే సమయానికి కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని ప్రధాన ప్రాజెక్టుల్లో మొత్తం 386.8 టీఎంసీల నిల్వలుండగా, ప్రస్తుతం 285.21 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి. కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ఆల్మట్టి డ్యాంలో గతేడాది సరిగ్గా ఇదే సమయానికి 91.35 టీఎంసీల నిల్వలుండగా, ప్రస్తుతం 21 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఎట్టకేలకు డ్యాంకు గత మంగళవారం నుంచి వరద ప్రవాహం ప్రారంభమైంది. ప్రస్తుతం 19,172 క్యూసెక్కుల ఇన్ఫ్లో డ్యాంలోకి వచ్చి చేరుతోంది. రోజుకు 1.66 టీఎంసీల వరద ఆల్మట్టిలో చేరుతుండగా, మరో 108 టీఎంసీల వరద వచ్చిచేరితేనే డ్యాం నిండనుంది. ఇక నారాయణపూర్ జలాశయంలో 17 టీఎంసీలు, తుంగభద్ర డ్యాంలో 6.89 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి. జూరాలకు ఇంకా మొదలుకాని ఇన్ఫ్లో నారాయణపూర్, జూరాలకు ఇప్పటివరకు ఎలాంటి ఇన్ఫ్లో ప్రారంభం కాలేదు. శ్రీశైలంకు 126 క్యూసెక్కుల నామమాత్రపు వరద వస్తోంది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యాంలు పూర్తిగా నిండితేనే దిగువన ఉన్న జూరాల, శ్రీశైలం జలాశయాలకు వరద నీరు రానుంది. నైరుతి రుతుపవనాలు ప్రారంభమై నెలన్నర గడుస్తున్నా చెప్పుకోదగ్గ వర్షాలు లేకపోవడం, ఇంకా వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండడంతో ఈ డ్యాంలు ఇప్పట్లో నిండే సూచనలు కనపడటం లేదు. ప్రాణహితకి స్వల్పంగా పెరిగిన వరద.. గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రాణహిత నదికి స్వల్పంగా వరద ప్రవాహం పెరుగుతుండటంతో లక్ష్మి(మేడిగడ్డ) బ్యారేజీకి ప్రస్తుతం 1,23,800 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 1,19,878 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. సమ్మక్క బ్యారేజీకి వస్తున్న 83,945 క్యూసెక్కులను వచ్చినట్టు కిందికి పంపిస్తున్నారు. -
ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: జీవో 111 రద్దు అనంతర పరిణామాలను రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. జీవో ఎత్తివేత తర్వాత ఎదురయ్యే పర్యావరణ సమస్యలను అంచనా వేస్తూ దానికి తగ్గట్టుగా మార్గదర్శకాల జారీకి కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా జీవో రద్దుతో ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జంట జలాశయాల మనుగడ ప్రశ్నార్థకమవుతుందనే పర్యావరణ వేత్తల ఆందోళనను పరిగణనలోకి తీసుకుంటూ అచితూచి అడుగులేస్తోంది. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా.. జలాశయాల ఉనికికి భంగం కలుగకుండా ప్రణాళికా బద్ధమైన అభివృద్ధికి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. భారీ నిర్మాణాలు, పరిశ్రమలతో జంట జలాశయాలు కలుషితం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోనుంది. స్థిరాస్తి వ్యాపారం, నిర్మాణాలకు ఎడాపెడా అనుమతులు ఇచ్చేసి చేతులు దులుపుకోకుండా.. మురుగు నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు, వరద కాల్వల నిర్మాణం, గ్రీన్బెల్ట్, బఫర్ జోన్ పరిధుల నిర్ధారణ తదితర అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది. సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ల నుంచి అభ్యంతరాలు రాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అత్యున్నత స్థాయి అధికారులు, నిపుణుల కమిటీ కొత్త నిబంధనల రూపకల్పనలో తలమునకలైంది. జీవో 111 పరిధిలోని ఏడు మండలాల్లో 84 గ్రామాలుండగా వీటిల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కలుపుకొని సుమారు 1.35 లక్షల ఎకరాల భూమి ఉంది. జెడ్ఎల్డీ ప్రాంతాల్లో నివాస సముదాయాలు వర్షపాతాన్ని అధ్యయన నివేదిక ఆధారంగా తక్కువ వర్షపాతం ఉండి, జలాశయాల మనుగడకు ఇబ్బంది లేని ప్రాంతాన్ని జీరో లెవల్ డిశ్చార్జి (జెడ్ఎల్డీ)గా గుర్తించనున్నారు. ఈ ప్రాంతంలో హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారమే నివాస సముదాయాల నిర్మాణాలకు అనుమతి ఇస్తారు. వాణిజ్య కార్యకలాపాలకు అస్సలు అనుమతులు ఉండవు. ఇక ఈ ప్రాంతాల్లోని నివాసాల నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాలను శుద్ధి చేసి, తిరిగి ఆ నీటిని అక్కడే వివిధ ఇతర అవసరాలకు వినియోగించుకునే విధంగా తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. శాటిలైట్ మ్యాపుల ద్వారా గ్రీన్ చానళ్ల గుర్తింపు.. మురుగు, వర్షపు నీరు జంట జలాశయాలకు చేరితే వాటి ఉనికికే ప్రమాదమనేది పర్యావరణవేత్తల ప్రధాన అభ్యంతరం. దీనికి పరిష్కారం చూపించగలిగితే సమస్య ఉండదని భావించిన నిపుణులు కమిటీ.. అసలు వరద నీరు జలశయాలకు ఏ ప్రాంతం నుంచి చేరుతుందో అధ్యయనం చేయాలని నిర్ణయించారు. గత 50 ఏళ్ల వర్షపాతాన్ని అధ్యయనం చేసి నీటి ప్రవాహ మార్గాన్ని శాటిలైట్ మ్యాపుల ద్వారా గుర్తించనున్నారు. జలాశయాల ఎగువ నుంచి వచ్చే ఈ నీరు జీవో 111 పరిధిలోని 84 గ్రామాల గుండా ఎలా ప్రవహిస్తుందో నిర్ధారిస్తారు. ఈ ప్రవాహ మార్గాన్ని గ్రీన్ ఛానల్గా గుర్తిస్తారు. ఈ చానల్స్ వద్ద వరద కాలువలను నిర్మిస్తారు. ఒకవేళ కాలువల నిర్మాణం కోసం భూములు తీసుకోవాల్సి వస్తే గనక ప్రస్తుత మార్కెట్ రేటు కట్టి ఇవ్వాలని, అప్పుడే భూ యజమానులు ముందుకొస్తారని అధికారులు ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. బఫర్ జోన్ 500 మీటర్లే! ప్రస్తుతం జంట జలాశయాల చుట్టూరా 10 కిలో మీటర్ల ప్రాంతాన్ని చెరువు పూర్తి స్థాయి సామర్థ్యం (ఎఫ్టీఎల్)గా పరిగణిస్తున్నారు. ఈ ప్రాంతంలో కేవలం పదిశాతం విస్తీర్ణంలో మాత్రమే నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు. అయితే కొత్త నిబంధనలలో ఎఫ్టీఎల్ స్థానంలో 500 మీటర్ల వరకే బఫర్ జోన్ ఉండనుంది. ఈ జోన్ పరిధిలో నిర్మాణాలపై ఆంక్షలుంటాయి. కాగా 300 చదరపు మీటర్లకు పైన ఉన్న ప్లాట్లకు కనిష్టంగా మీటరు వెడల్పుతో ఒకవైపున గ్రీన్ బెల్ట్ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
ఏకాభిప్రాయానికి చివరి యత్నం
సాక్షి, హైదరాబాద్: రిజర్వాయర్ల నిర్వహణ కమిటీ (ఆర్ఎంసీ) సిఫారసులపై ఏకాభిప్రాయానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) తుది ప్రయత్నం చేయనుంది. ఈ నెల 24వ తేదీ ఉద యం 11 గంటలకు హైదరాబాద్లోని జలసౌధలో ఆర్ఎంసీ చివరి సమావేశాన్ని నిర్వ హించనుంది. ఈ మేరకు తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేఆర్ఎంబీ గురువారం లేఖ రాసింది. ఈ సమావే శానికి ఏ ఒక్క రాష్ట్రం ప్రతినిధులు గైర్హాజరైనా లేక కమిటీ సిఫారసులపై రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదరక పోయినా.. తన కార్యాచరణలో ఆర్ఎంసీ విఫలమైనట్టు నివేదిస్తామని స్పష్టం చేసింది. గతంలో కొన్ని ఆర్ఎంసీ సమావేశాలకు తెలంగాణ, ఏపీలు గైర్హాజరైన నేపథ్యంలో ఈ నిబంధనను పొందుపర్చింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్ల నిర్వ హణకు సంబంధించిన విధివిధానాలను (రూల్ కర్వ్) సిఫారసు చేసేందుకు గతంలో ఆర్ఎంసీని కృష్ణా బోర్డు ఏర్పాటు చేసింది. ఈ సిఫారసులకు తుది రూపమివ్వడంతో పాటు సంతకాల స్వీకరణ కోసం చివరిసారిగా 24న ఆర్ఎంసీ సమావేశాన్ని తలపెట్టింది. గత సమావేశాల్లో ఏకాభిప్రాయం కుదిరిన పలు అంశాలపై సైతం ప్రస్తుత భేటీలో పునః సమీక్ష కోరవచ్చని తెలిపింది. ఏకాభిప్రాయం కష్టమేనా? శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో ఎంతమేర నీటి నిల్వలున్నప్పుడు, ఎంత మేర నీళ్లను సాగునీరు, జలవిద్యుదుత్పత్తి అవసరాలకు విని యోగించాలి అన్న అంశంపై ఆర్ఎంసీ సిఫారసు లు చేయాల్సి ఉంది. ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో తాత్కాలికంగా కృష్ణాజలాల పంపిణీని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. శ్రీశైలం జలాశయం నుంచి 34 టీఎంసీలకు మించి నీళ్లను ఏపీ తరలించరాదని.. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాలను 50:50 నిష్పత్తిలో పంచేలా రూల్ కర్వ్లో పొందుపర్చాలని డిమాండ్ చేస్తోంది. శ్రీశైలం జలాశయం నుంచి నీళ్లను తరలించుకోవడానికి ఉండాల్సిన కనీస నిల్వ మట్టం 834 అడుగులు మాత్రమేనని తెలంగాణ అంటుండగా, 854 అడుగులుండాలని ఏపీ వాదిస్తోంది. శ్రీశైలం జలాలు పూర్తిగా జలవిద్యుదుత్పత్తి కోసమేనని తెలంగాణ అంటుండగా, సాగు, తాగునీటి అవస రాలకే ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీ పేర్కొంటోంది. వరద జలాల వినియోగాన్ని సైతం లెక్కించి సంబంధిత రాష్ట్రం ఖాతాలో జమ చేయాలని తెలంగాణ కోరుతుండగా, ఏపీ వ్యతిరేకిస్తోంది. ఆయా అంశాలపై రెండు రాష్ట్రాల సమ్మతితో రూల్కర్వ్కు తుది రూపు ఇవ్వడం సవాలుగా మారింది. ఈ నేపథ్యంలోనే చివరి సమావేశంలోనూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏకభిప్రాయం కుదిరే అవకాశాలు లేవని, లక్ష్య సాధనలో ఆర్ఎంసీ విఫలమయ్యే సూచనలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
జలాశయాలపై భారీగా సౌర విద్యుత్ ప్రాజెక్టులు!
సాక్షి, హైదరాబాద్: ‘తప్పనిసరి పునరుత్పాదక విద్యుత్ (ఆర్పీవో) కొనుగోళ్ల’ విషయంగా కేంద్రం భారీ లక్ష్యాలు పెట్టిన నేపథ్యంలో.. సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని వివిధ రిజర్వాయర్లపై ఐదు వేల మెగావాట్ల సామర్థ్యంతో ‘ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ల’ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు, లోయర్ మానేరు వంటి జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్రెడ్కో), నీటిపారుదల శాఖ చర్చలు జరుపుతున్నాయి. అయితే ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని నీటిపారుదల శాఖ అధికారవర్గాలు తెలిపాయి. రామగుండంలో ఫ్లోటింగ్ ప్రాజెక్టు రాష్ట్రంలో ఇప్పటికే రామగుండంలో ఎన్టీపీసీ, జైపూర్లో సింగరేణి సంస్థలు తమ థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు నీటిని సరఫరా చేసే జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్లను నిర్మించాయి. రామగుండంలోని 500 ఎకరాల జలాశయంపై ఎన్టీపీసీ 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను నిర్మించింది. అదే మల్లన్నసాగర్ జలాశయం 22 వేల ఎకరాల్లో ఉంటుంది. మిగతా జలాశయాలూ భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని రిజర్వాయర్లపై 5 వేల మెగావాట్ల మేర సౌర విద్యుత్ ప్లాంట్లను స్థాపించవచ్చని నీటి పారుదల శాఖ వర్గాలు భావిస్తున్నాయి. వీటి ఏర్పాటుతో స్థలం అద్దె రూపంలో నీటి పారుదల శాఖకు ఆదాయం కూడా వస్తుందని పేర్కొంటున్నాయి. మరోవైపు కాళేశ్వరం వంటి భారీ లిఫ్టులకు చౌకగా విద్యుత్ లభిస్తుందన్న భావన వ్యక్తమవుతోంది. భూసేకరణ సమస్య తప్పుతుంది! భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు వేల ఎకరాల భూములు అవసరం. రాష్ట్రంలో భూముల కొరత తీవ్రంగా ఉంది. ధరలూ భారీగా పెరిగిపోయాయి. సౌర విద్యుత్ ప్రాజెక్టులకు భారీగా భూసేకరణ జరపడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమయ్యే పనికాదు. భారీ వ్యయంతో భూములు కొని సోలార్ ప్లాంట్లు పెట్టినా దానివల్ల పెట్టుబడి వ్యయం పెరిగి.. విద్యుత్ ధరలు భారీగా పెరిగిపోతాయి. అదే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లతో భూసేకరణ సమస్య తప్పుతుందని, విద్యుత్ ధర తక్కువగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో టెండర్లు ఆహ్వానించి ప్లాంట్ల ఏర్పాటు బాధ్యతను ప్రైవేటు డెవలపర్లకు అప్పగించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. -
Andhra Pradesh: ప్రాజెక్టుల భద్రతకు ప్రత్యేక చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ నీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రత, నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం తన కార్యాలయ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రత, నిర్వహణపై సమగ్ర పరిశీలన చేయాలని చెప్పారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వద్ద నిర్వహణ పరిస్థితులను సరిదిద్దాలని, రాష్ట్ర విభజన నాటి నుంచి దీని గురించి పట్టించుకోలేదని అన్నారు. దీనివల్ల ముప్పు ఏర్పడే పరిస్థితులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వారీగా నిర్వహణ కోసం తగినంత సిబ్బంది ఉన్నారా? లేదా? అన్న దానిపై లెక్కలు తీయాలని, అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాలని ఆదేశించారు. గత సమీక్షా సమావేశంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ దిశగా ప్రభుత్వ యంత్రాంగం కొన్ని చర్యలు చేపట్టిందని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్కు వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ► ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రెవిన్యూ–విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి, జల వనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్లతో కమిటీ ఏర్పాటు చేశాం. ► ఐఐటీ, జేఎన్టీయూ నిపుణుల కమిటీకి జల వనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ చైర్మన్గా ఉన్నారు. తీసుకోవాల్సిన చర్యలను అత్యున్నత కమిటీకి తెలియజేస్తున్నారు. ► వివిధ ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్వహణపై గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చిన నివేదికలను కూడా అత్యున్నత స్థాయి కమిటీ పరిశీలిస్తోంది. ఇటీవలి వరదలు, కుంభవృష్టిని పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు తగిన సూచనలు చేస్తుంది. ► ఆటోమేషన్ రియల్ టైం డేటాకు, కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానించే వ్యవస్థపై కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూడిన అత్యున్నత బృందం దృష్టి సారించింది. ► అన్ని మేజర్, మీడియం రిజర్వాయర్లు, బ్యారేజీల నిర్వహణకు అదనపు సిబ్బంది నియామకం, వాటర్ రెగ్యులేషన్ కోసం సిబ్బంది నియామకంపై ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ► పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేసిన పక్షంలో ఆస్తి, ప్రాణనష్టానికి ఆస్కారమున్న లోతట్టు ప్రాంతాలను గుర్తించే పని కూడా ఈ కమిటీ చేస్తోంది. -
CM YS Jagan: నీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ నీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రత, నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గురువారం ఉదయం తన కార్యాలయ సంబంధిత అధికారులతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వద్ద సమగ్ర పరిశీలనచేయాలన్నారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వద్ద నిర్వహణా పరిస్థితులు సరిదిద్దాలని, రాష్ట్ర విభజన నాటినుంచి దీనిగురించి పట్టించుకోలేదన్నారు. దీనివల్ల ముప్పు ఏర్పడే పరిస్థితులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వారీగా నిర్వహణకోసం తగినంత సిబ్బంది ఉన్నారా? లేదా? అన్నదానిపై లెక్కలు తీయాలన్నారు. అవసరమైన సిబ్బందిని నియమించాలని ఆదేశాలు జారీచేశారు. గత సమీక్షా సమావేశంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ దిశగా ప్రభుత్వ యంత్రాంగం కొన్ని చర్యలు చేపట్టిందని అధికారులు సీఎంకు వివరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జవనరులశాఖ స్పెషల్చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ–విపత్తు నిర్వహణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జలవనరులశాఖ ఇంజినీర్ఇన్ ఛీఫ్లతో కమిటీని ఏర్పాటుచేసిన విషయాన్ని ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఐఐటీ, జేఎన్టీయూ నిపుణుల కమిటీకి జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఛైర్మన్గా ఉన్నారని, తీసుకోవాల్సిన చర్యలను అత్యున్నత కమిటీకి తెలియజేస్తున్నారని వివరించారు. చదవండి: (Andhra Pradesh: పేదలకు నిశ్చింత) సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు వివిధ ప్రాజెక్టుల నిర్వహణపై గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చిన నివేదికలను కూడా అత్యున్నతస్థాయి కమిటీ పరిశీలిస్తోందన్నారు. తాజా వచ్చిన వరదలను, కుంభవృష్టిని పరిగణలోకి తీసుకుని ఆమేరకు తగిన సూచనలు చేస్తుందన్నారు. ఆటోమేషన్ రియల్ టైం డేటాకు కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానించే వ్యవస్థపైన కూడా చీఫ్ సెక్రటరీతో కూడిన అత్యున్నత బృందం దృష్టిసారించిదని ముఖ్యమంత్రికి వివరించారు. అన్ని మేజర్, మీడియం రిజర్వాయర్లు, బ్యారేజీల నిర్వహణకు అదనపు సిబ్బంది నియామకం, అలాగే వాటర్ రెగ్యులేషన్కోసం కూడా సిబ్బంది నియామకంపై ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని అధికారులు తెలియజేశారు. వీరి నియామకానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పెద్దమొత్తంలో నీటిని విడుదల చేసిన పక్షంలో ఆస్తినష్టం, ప్రాణనష్టానికి ఆస్కారమున్న లోతట్టుప్రాంతాలను గుర్తించే పనినికూడా కమిటీ చేస్తోందని కూడా అధికారులు తెలిపారు. -
మల్లన్నసాగర్ను పరిశీలించిన నిపుణుల కమిటీ
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ రిజర్వాయర్ను నిపుణుల కమిటీ శనివారం పరిశీలించింది. ప్రాజెక్టులో నీటిని నింపడంపై పలు సూచనలు చేసింది. రిజర్వాయర్ నిర్మాణ డిజైన్స్, డ్రాయింగ్స్, జియాలజిస్టులు ఇచ్చిన టెస్టు రిపోర్టులు, వివిధ ల్యాబ్ల నుంచి వచ్చిన రిపోర్టులు, నిర్మాణంలో అనుసరించిన టెక్నికల్ ప్రొసీజర్స్ను అధ్యయనం చేసి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. దీనిలో ఈఎన్సీ (జనరల్) మురళీధర్, ఈఎన్సీ (గజ్వేల్) హరిరాం, ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్ శ్రీధర్, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్లు ఉమాశంకర్, శశిధర్ సభ్యులుగా ఉన్నారు. వీరు రిజర్వాయర్ నిర్మాణ పద్ధతులు, సీవోటీ కట్టింగ్, ప్రాజెక్టు నింపే టైంలో చేయాల్సిన టెస్టులు తదితర అంశాలను పరిశీలించారు. ఇప్పటికే రిజర్వాయర్లో 4.90 టీఎంసీలను నింపారు. ప్రాజెక్టు మినిమం డ్రా లెవల్ వరకు నెమ్మదిగా నీటిని నింపాలని వారు సూచించారు. కమిటీ వెంట ప్రాజెక్టు సీఈ చంద్రశేఖర్, ఎస్ఈ వేణు, ఇంజనీర్లు ఉన్నారు. -
రిజర్వాయర్లకు నయా లుక్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాలు పర్యాటకంగా వెనుకబడే ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలు ఉన్నా సౌకర్యాలు లేకపోవడం, పర్యాటకానికి అనువుగా లేకపోవడమే దీనికి కారణం. ఇలాంటి సమయంలో గోదావరి జలాలతో నిండుతున్న రిజర్వాయర్లు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఆయా ప్రాజెక్టులు పర్యాటకానికి ఆస్కారమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కసరత్తు ప్రారంభించింది. గతంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు చేసిన ప్రతిపాదనల ఆధారంగా రిజర్వాయర్లు, ప్రాజెక్టుల వద్ద అభివృద్ధి చర్యలు చేపడుతోంది. రంగనాయకసాగర్ రిజర్వాయర్ నాలుగు రిజర్వాయర్ల వద్ద.. పర్యాటక అభివృద్ధి కోసం ప్రభుత్వం నాలుగు రిజర్వాయర్లపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో కీలక పట్టణంగా ఎదుగుతున్న సిద్దిపేటకు సమీపంలోని రంగనాయకసాగర్ రిజర్వాయర్, సిరిసిల్ల శివార్లలోని అన్నపూర్ణ రిజర్వాయర్, అవకాశాలు ఉండీ ఇన్నాళ్లూ అభివృద్ధికి నోచుకోని అప్పర్, మిడ్మానేరు రిజర్వాయర్లను ఎంపిక చేసింది. ఆయా చోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి ఇటీవలే పర్యాటకాభివృద్ధి సంస్థ ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన ఇచ్చింది. జాతీయ స్థాయిలో సంస్థలు కాన్సెప్టు, డీపీఆర్లతో ఈ నెల 15 నాటికి ప్రతిపాదనలు ఇవ్వాలని కోరింది. పనులు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని పేర్కొంది. వచ్చిన ప్రతిపాదనల్లో మేలైన దాన్ని ఎంపిక చేసి ఆ ఇతివృత్తానికి తగ్గట్టు రిజర్వాయర్లను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో రంగనాయకసాగర్ను తొలిదశలో రూ.100 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అనంతగిరి రిజర్వాయర్లోని ప్రకృతి అందాలు రివర్ ఫ్రంట్గా లోయర్ మానేరు.. లోయర్ మానేరు డ్యామ్ బ్యాక్వాటర్ ప్రాంతాన్ని రివర్ఫ్రంట్ పేరుతో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం నీటిపారుదల శాఖకు రూ.350 కోట్లు కేటాయించింది. ఆ ప్రాంతంలో పర్యాటకులకు వసతులు, ఆకర్షణీయ పనులు చేసేందుకు పర్యా టక శాఖకు రూ.వంద కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టుకు కన్సల్టెంటు నియామక ప్రక్రియ జరుగుతోంది. దీనితో కలిపి ఐదు ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి. అయితే పర్యాటక అభివృద్ధి పనులు నిధుల కొరతతో చతికిలబడుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. తాజా ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందన్నది తేలాల్సి ఉంది. -
మరో ఎన్నికల హామీ అమలుకు రంగం సిద్ధం
వర్గపోరు.. రక్తపుటేరులు.. ఆధిపత్యం కోసం సాగించిన మారణహోమంలో ఎంతో మంది బలయ్యారు. ఎన్నో కుటుంబాలు వీధినపడ్డాయి. అంతా ఓ కుటుంబం కనుసన్నల్లోనే.. చెప్పినట్టు వినాలి.. కాదన్న వారి తలలు తెగిపడ్డాయి. ఇదంతా గతంలో రాప్తాడు నియోజక వర్గంలోని గ్రామాల పరిస్థితి. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఫ్యాక్షన్ కు చరమగీతం పాడారు. అభివృద్ధి దిశగా అడుగులు వేయించారు. కరువు సీమలో కృష్ణమ్మ పరవళ్లకు అహరహం కృషి చేశారు. తాజాగా వైఎస్సార్ తనయుడు, సీఎం జగన్మోహన్రెడ్డి రక్తపుటేరులు పారిన ప్రాంతాల్లో కృష్ణా జలాలను పారించి కొత్త వెలుగులకు శ్రీకారం చుట్టారు. సీఎం అడుగుజాడల్లో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ‘లక్ష ఎకరాలకు సాగునీరు’ యజ్ఞం చేపట్టారు. సాక్షి, కనగానపల్లి: రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలాలు 2009 వరకు పెనుకొండ నియోజకవర్గంలో ఉండేవి. రాజకీయ పెత్తనం, గ్రామాల్లో ఆధిపత్యం కోసం ఓ వర్గం ఈ మండలాల్లో ఫ్యాక్షన్ను పెంచి పోషించింది. పేదలు వ్యవసాయం చేసుకుంటే తమ పెత్తనానికి బ్రేక్ పడుతుందని కుట్ర చేసింది. గ్రామీణులు సాగువైపు వెళ్లకుండా ఆధిపత్య పోరుకు ఉసిగొలిపింది. తమ మాట కాదన్న వారిని వేటాడి అంతమొందిస్తూ వచ్చింది. ఫలితంగా కనగానపల్లి మండలంలో 8, రామగిరిలో ఐదు, చెన్నేకొత్తపల్లిలో ఆరు గ్రామాల్లో ఫ్యాక్షన్ తారస్థాయికి చేరింది. ఇందులో కనగానపల్లి మండలంలోని మద్దెలచెరువు, తగరకుంట, భానుకోట, రామగిరి మండలంలోని కుంటిమద్ది, గంతిమర్రి, నసనకోట, చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురం, కనుముక్కల, నాగసముద్రం గ్రామాలు అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా మారిపోయాయి.. దౌర్జన్యం.. దుర్మార్గం ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో కళకళలాడిన కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలాల్లో కరుడుకట్టిన ఫ్యాక్షనిస్టు కనుసన్నల్లో నియంతృత్వ ధోరణి రాజ్యమేలింది. రక్తపుటేరులు ప్రవహించాయి. నక్సలైట్ల కదలికలు, పోలీసుల కూంబింగ్లు.. ఫ్యాక్షనిస్టుల దౌర్జన్యం.. దుర్మార్గాలతో జనం కంటి మీద కునుకు దూరమైంది. పచ్చని పంట పొలాలు బీళ్లుగా మారాయి. 1994 నుంచి 2004 వరకూ సుమారు 120 మంది ఫ్యాక్షన్కు బలైనట్లు పోలీసుల లెక్కలు చెబుతున్నా.. అనధికారికంగా ఈ సంఖ్య రెట్టింపేనని స్థానికులు అంటున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో కొన్ని ఫ్యాక్షన్ హత్యలు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. చదవండి: (వైఎస్ జగన్ మాట ఇస్తే తప్పరు: తోపుదుర్తి) ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డి, ఎంపీ మాధవ్ ఒక్కసారిగా మారిన పరిస్థితి రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వ్యవసాయానికి పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా హంద్రీ–నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలతో చెరువులను నింపడమే కాక, పంటల సాగుకూ నీటిని వదలడంతో గ్రామాల్లో ప్రజలు వ్యవసాయంపై దృష్టి పెట్టారు. నాటి ఫ్యాక్షన్ రాజకీయంతో విసిగిపోయి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు తిరిగి స్వగ్రామాలకు చేరుకున్నారు. వర్గ కక్షలకు దూరంగా.. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అందువల్లే 2019 తర్వాత ఫ్యాక్షన్ హత్యల ప్రస్తావనే లేకుండా పోయింది. ‘హంద్రీ–నీవా’ నీటితో సస్యశ్యామలం రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు, కనగానపల్లి, రామగిరి, రాప్తాడు, చెన్నేకొత్తపల్లి మండలాల మీదుగా హంద్రీ–నీవా కాలువ గుండా కృష్ణా జలాలు ప్రవహిస్తున్నాయి. కాలువ సరిహద్దు గ్రామాలైన కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాల్లోని సుమారు 12 చెరువులు, 15 కుంటలను కృష్ణా జలాలతో నింపారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి చొరవతో కాలువ దిగువన వేల ఎకరాల్లో పంటల సాగుకు నీరు అందింది. కనగానపల్లి మండలంలోని తగరకుంట, తూంచర్ల, బద్దలాపురం, యలకుంట్ల, గుంతపల్లి గ్రామాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో వరి, 500 ఎకరాల్లో పండ్ల తోటలు సాగులోకి వచ్చాయి. రామగిరి మండలంలోని కుంటిమద్ది, పోలేపల్లి, గంతిమర్రి గ్రామాల్లోనూ రైతులు విస్తారంగా పంటలు సాగు చేపట్టారు. ఒక్క కుంటిమద్ది చెరువు కింద 500 ఎకరాల్లో వరిసాగులోకి రావడం గమనార్హం. మేడాపురం, కనుముక్కల, ఒంటికొండ తదితర గ్రామాల్లో వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో ఫ్యాక్షన్ అనే పదం వినిపించకుండా పోయింది. వేదికను సిద్ధం చేస్తున్న దృశ్యం ఆశలకు జీవం.. చెన్నేకొత్తపల్లి: రాప్తాడు నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సారునీరందించే లక్ష్యంతో నిర్మిస్తున్న దేవరకొండ, ముట్టాల, తోపుదుర్తి రిజర్వాయర్ల నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేయనున్నారు. చెన్నేకొత్తపల్లి మండలం వెంకటంపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన పైలాన్, మూడు రిజర్వాయర్ల భూమి పూజ పనులను ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడిపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. అనంతరం నిర్వహించే భారీ బహిరంగ సభకు జిల్లా ఇన్చార్జి మంత్రి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజుతో పాటు ఎంపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మూడు రోజులుగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మంగళవారం నాటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేయించారు. ఏర్పాట్ల పరిశీలన చెన్నేకొత్తపల్లి మండలం వెంకటంపల్లి గ్రామం వద్ద నిర్వహిస్తున్న మూడు రిజర్వాయర్ల భూమిపూజ పనులకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సభాస్థలి, రిజర్వాయర్ల పైలాన్, వాహనాల పార్కింగ్, భోజన కౌంటర్లు, ఎల్ఈడీ స్క్రీన్స్ వంటి ఏర్పాట్లను మంగళవారం పూర్తి చేశారు. కలెక్టర్ గంధం చంద్రుడు, జేసీ నిశాంత్కుమార్, ఆర్డీఓ మధుసూదన్లు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. లక్ష ఎకరాలకు సాగునీరే లక్ష్యం రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం. ‘ప్రజాసంకల్ప’ యాత్రలో నియోజకవర్గ సమస్యలను స్వయంగా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. జగన్ అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే ప్రజలకిచ్చిన హామీని ముఖ్యమంత్రి నెరవేర్చారు. రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లి మండలంలో దేవరకొండ రిజర్వాయర్, ముట్టాల, తోపుదుర్తి రిజర్వాయర్ల నిర్మాణాల ద్వారా రైతాంగానికి సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. – తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే -
నెరవేరనున్న సీఎం జగన్ మరో ఎన్నికల హామీ..
సాక్షి, అనంతపురం: మరో ఎన్నికల హామీ నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సన్నద్ధమవుతున్నారు. అనంతపురం జిల్లాలో రేపు(బుధవారం) 3 రిజర్వాయర్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లిలో పైలాన్ ఏర్పాటు చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్లు నిర్మాణం కానున్నాయి. హంద్రీనీవా నుంచి పేరూరు డ్యాంకు నీటి తరలింపు కోసం ప్రణాళికలు సిద్ధమయ్యాయి. (చదవండి: బీసీల కార్పొరేషన్ల ఏర్పాటు ఓ చారిత్రక నిర్ణయం) రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందనుంది. ఏడు మండలాల్లోని 35 గ్రామాలకు లబ్ధి చేకూరనుంది. మొత్తం నాలుగు రిజర్వాయర్లు, ప్రధాన కాలువ కోసం రూ.800 కోట్లను ఏపీ ప్రభుత్వం వెచ్చిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజన్ ఉన్న నాయకుడని, రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు లక్ష ఎకరాలకు నీరిస్తానన్న హామీని నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి అన్నారు. తమకు రైతు ప్రయోజనాలే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. (చదవండి: ఆ రాతలపై అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్) -
వైఎస్ జగన్ మాట ఇస్తే తప్పరు: తోపుదుర్తి
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి మాట ఇస్తే తప్పరని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, ఇప్పటికే పేరూరు డ్యాంకు కృష్ణా జలాలను అందించాం. నియోజక వర్గ పరిధిలో కొత్తగా నాలుగు రిజర్వాయర్ల నిర్మాణానికి చేసిన ప్రతిపాదనలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం ఆమోదం తెలిపార’ని అన్నారు. చదవండి: (ఎంపీ మాధవ్ చొరవ.. అనంత మీదుగా ప్రత్యేక రైలు) ఈ నెల 9న ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ గ్రామాల్లో నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్ పనులకు బుధవారం సీఎం జగన్ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. ‘గతంలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారు. హంద్రీనీవా నుంచి పేరూరు డ్యామ్కు నీటి తరలింపు కోసం 803 కోట్ల రూపాయలతో టీడీపీ సర్కారు అంచనాలు రూపొందించింది. అదే డబ్బుతో నాలుగు రిజర్వాయర్లు, ప్రత్యేక కాలువ ద్వారా పేరూరు డ్యామ్కు నీరు తరలిస్తాం. తాజా ప్రతిప్రాదనల ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ. 300 కోట్లు ఆదా కానుంద’ని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు. చదవండి: (ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్ద మనసు) కాగా, ‘బంగారం’లాంటి భూములు.. సిరులు పండే నేలలు.. అయితేనేం.. నీరులేక నోరెళ్లబెట్టాయి! పచ్చని పంటలు పండే పొలాలన్నీ బీళ్లుగా మారాయి. ఏడాదికి మూడు పంటలు పండించే సత్తా ఉన్న రైతులు ఉన్నా.. జల సిరి లేకపోవడంతో వ్యవసాయం నిర్వీర్యమవుతూ వచ్చింది. సీజన్ వస్తే ఆకాశం వైపు ఆశగా చూడడం తప్ప మరేమీ చేయలేని అసహాయ స్థితిలో అన్నదాతలు కొట్టుమిట్టాడారు. ఇదంతా గతం. ‘నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందిస్తా’ అనే నినాదంతో ప్రజాభిమానాన్ని చూరగొని ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అహర్నిశం శ్రమించారు. ఇప్పటికే హంద్రీ–నీవా ద్వారా పేరూరు డ్యాంకు కృష్ణా జలాలు అందించారు. అంతటితో ఆగిపోకుండా మరో నాలుగు రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసి, ప్రభుత్వ ఆమోదం కూడా పొందారు. ఈ నెల 9న ఈ రిజర్వాయర్ల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రాప్తాడు నియోజకవర్గానికి ప్రధాన సాగునీటి వనరుగా ఉన్న అప్పర్ పెన్నార్ డ్యాం (పేరూరు డ్యాం) దశాబ్దాలుగా నీటి చుక్క లేక బోసిపోయింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు నీటిని అందించేందుకు రూ.810 కోట్లు మంజూరయ్యాయి. అయితే పనులు ముందుకు సాగలేదు. కేటాయించిన నిధులు దుర్వినియోగమయ్యాయి. అదే సమయంలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పేరూరు డ్యాంను నీటితో నింపవచ్చునంటూ అప్పటి వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త హోదాలో తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పలు సూచనలు చేస్తూ వచ్చారు. తన వాదనలోని వాస్తవాలేమిటో ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలోనే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆచరణలో నిజం చేసి చూపించారు. పేరూరు డ్యాంకు కృష్ణా జలాలను అందించి, తానిచ్చిన మాటను నిలుపుకున్నారు. అంతేకాక జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నేరుగా పేరూరు డ్యాంకు నీరు మళ్లించేలా రూ.264.54 కోట్లతో 53.45 కిలోమీటర్ల మేర కాలువ పనులు చేపట్టారు. దీని ద్వారా పేరూరు డ్యాం దిగువన ఉన్న 10 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. డ్యాంకు సమీపంలో ఉన్న రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల్లో భూగర్భజలాలూ పెరిగి పరోక్షంగా మరో 25 వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి. ‘హంద్రీనీవా’ నుంచి ప్రత్యేక కాలువ ద్వారా పేరూరు డ్యాంకు నీరు తరలించే మార్గంలోనే మరో నాలుగు సాగునీటి రిజర్వాయర్ల నిర్మాణానికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం పేరూరు డ్యాంకు నీటిని తరలించేందుకు కేటాయించిన రూ.810 కోట్ల నిధుల కన్నా తక్కువతో వీటి నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలను ప్రకాష్రెడ్డి సిద్ధం చేశారు. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.244 కోట్లకుపైగా మిగులు చూపించారు. -
పంటలకు సమృద్ధిగా నీరందిస్తాం: అనిల్
సాక్షి, నెల్లూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా రెండోసారి జలాశయాలకు నిండుదనం వచ్చిందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని జలాశయాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నింపుతామన్నారు. (చదవండి: ఏపీలో కొత్త జిల్లాల ప్రక్రియ ప్రారంభం) ‘‘గతంలో దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో భారీగా వర్షాలు కురిశాయి. మళ్ళీ జగనన్న పాలనలోనే ఈ జలాశయాలకు నీళ్లు వస్తున్నాయి. సోమశిల చరిత్రలో గత ఏడాది మొదటి సారి పూర్తి సామర్థ్యం 78 టీఎంసీల మేర నీటిని నింపాం. ఈ ఏడాది కూడా 78 టీఎంసీల మేర నీటిని నింపుతాం. కండలేరు జలాశయానికి కూడా నీటిని విడుదల చేస్తున్నాం. ఈ ఏడాది పంటలకు సమృద్ధిగా నీటిని అందిస్తామని’’ మంత్రి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకే రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. వర్షాలు కురుస్తుండటంతో రంగు మారే అవకాశం ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి అనిల్కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. -
కుందూపై మూడు జలాశయాలు
సాక్షి, అమరావతి: కుందూ నదిపై మూడు జలాశయాలను నిర్మించి కేసీ (కర్నూలు–కడప) కెనాల్, తెలుగుగంగ ఆయకట్టు స్థిరీకరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కుందూ నదిపై కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం జోలదరాశి వద్ద 0.8 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ను రూ.312.3 కోట్లతో నిరి్మంచనున్నారు. చాగలమర్రి మండలం రాజోలి ఆనకట్టకు ఎగువన 2.95 టీఎంసీల సామర్థ్యం కలిగిన మరో రిజర్వాయర్ను రూ.1357.10 కోట్లతో నిరి్మంచనున్నారు. వీటికి పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ జలాశయాల ద్వారా కేసీ కెనాల్ ఆయకట్టును స్థిరీకరించనున్నారు. మరోవైపు కుందూనది నుంచి ఎనిమిది టీఎంసీలను తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన అనుబంధ జలాశయం(ఎస్సార్)–1 జలవిస్తరణ ప్రాంతం వద్దకు ఎత్తిపోసి ఆయకట్టు స్థిరీకరించే పనులకు కూడా రూ.564.60 కోట్లతో పరిపాలనా అనుమతి మంజూరైంది. కేసీ కెనాల్ ఆయకట్టుకు మంచి రోజులు.. ►తుంగభద్ర–పెన్నా నదులపై కర్నూలు జిల్లా సుంకేశుల వద్ద డచ్ సంస్థ 1873లో ఆనకట్ట నిర్మించింది. అక్కడి నుంచి పెన్నా వరకు కాలువ తవ్వకం పనులను 1880 నాటికి పూర్తి చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం అదే ఏడాది దీన్ని రూ.3.02 కోట్లకు కొనుగోలు చేసింది. 1933 నుంచి ఈ కాలువ సాగునీటి ప్రాజెక్టుగా మారింది. 140 ఏళ్ల చరిత్ర కలిగిన కేసీ కెనాల్ ఆయకట్టు కింద 2,65,628 ఎకరాల ఆయకట్టు ఉంది. కర్నూలు జిల్లాలో 1,73,627 ఎకరాలు, వైఎస్సార్ జిల్లాలో 92,001 ఎకరాల ఆయకట్టు ఉంది. ►బచావత్ ట్రిబ్యునల్ కేసీ కెనాల్కు 39.9 టీఎంసీలను కేటాయించింది. సుంకేశుల బ్యారేజీ వద్ద 29.9 టీఎంసీలు లభ్యమవుతాయని, మిగతా పది టీఎంసీలు తుంగభద్ర జలాశయం నుంచి విడుదల చేయాలని పేర్కొంది. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు తుంగభద్రలో సుంకేశుల వద్ద నీటి లభ్యత కనిష్ట స్థాయికి పడిపోవటంతో కేసీ కెనాల్ ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందని దుస్థితి నెలకొంది. ►కుందూ వరద ప్రవాహాన్ని ఒడిసిపట్టడం ద్వారా కేసీ కెనాల్ ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులను అధిగమించాలని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా ►నిర్ణయించారు. ఆ క్రమంలో కుందూ నదిపై రాజోలి, జోలదరాశి జలాశయాల నిర్మాణానికి 2008 డిసెంబర్ 23న పరిపాలన అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాజోలి ఆనకట్టకు దిగువన 84,686 ఎకరాలకు కుందూ వరద ద్వారా నీళ్లందించి మిగతా 1,80,942 ఎకరాలకు సుంకేశుల బ్యారేజీ నుంచి తుంగభద్ర జలాలను అందించడం ద్వారా కేసీ కెనాల్ ఆయకట్టును సస్యశ్యామలం చేయాలని భావించారు. వైఎస్సార్ హఠాన్మరణంతో రాజోలి, జోలదరాశి జలాశయాలకు గ్రహణం పట్టింది. ►కేసీ కెనాల్ ఆయకట్టును సస్యశ్యామలం చేసేందుకు ఆ రెండు జలాశయాల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. రిజర్వాయర్ల నిర్మాణంతో రాజోలి జలాశయంలో 6 గ్రామాలు, 9,938 ఎకరాలు ముంపునకు గురవుతాయి. జోలదరాశి జలాశయంలో ఒక గ్రామం, 2,157 ఎకరాల భూమి ముంపునకు గురవుతుంది. బ్రహ్మం సాగర్కు కుందూ జలాలు ►తెలుగుగంగ ప్రాజెక్టులో బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ సామర్థ్యం 17.73 టీఎంసీలు. కానీ నీటిని సరఫరా చేసే లింక్ కెనాల్ సక్రమంగా లేకపోవడంతో బ్రహ్మంసాగర్ను నింపలేని దుస్థితి నెలకొంది. ఫలితంగా తెలుగుగంగ ఆయకట్టుకు సరిగా నీళ్లందడం లేదు. మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల్లో తాగునీటి అవసరాలకు కూడా నీటిని సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది. ►ఈ పరిస్థితిని అధిగమించేందుకు కుందూ నదిపై వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం జొన్నవరం వద్ద ఆనకట్ట నిరి్మస్తారు. నదికి వరదలు వచ్చే 65 రోజుల్లో నిత్యం 1,425 క్యూసెక్కుల చొప్పున ఎనిమిది టీఎంసీలను దువ్వూరు చెరువులోకి ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి తెలుగుగంగ ప్రధాన కాలువ 107 కి.మీ వద్ద అనుబంధ జలాశయం–1 (ఎస్సార్–1) జల విస్తరణ ప్రాంతం వద్దకు ఎత్తిపోస్తారు. ఆ జలాశయాన్ని నింపి బ్రహ్మంసాగర్కు తరలించి తెలుగుగంగ ఆయకట్టుకు నీళ్లందించే పనులకు రూ.564.60 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచి్చంది. ►దీనిద్వారా తెలుగుగంగ ఆయకట్టు స్థిరీకరణతోపాటు మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల ప్రజల దాహార్తి తీరనుంది. -
నిండు కుండల్లా..
రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. సీలేరు విద్యుత్ కాంప్లెక్సు పరిధిలోని రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయి. రెండురోజులపాటు కురిసిన వర్షాలకు రిజర్వాయర్లన్నీ నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. జోలాపుట్ మొదలుకుని తూర్పుగోదావరి జిల్లా పొల్లూరు రిజర్వాయర్ వరకు ప్రస్తుతం నీటి మట్టాలు గరిష్టస్థాయికి చేరుకున్నాయి. అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయాయి. సాక్షి, సీలేరు: విద్యుత్ను నిరంతరం ఉత్పత్తి చేసే జలాశయాల్లో భారీగా నీరు చేరడంతో జెన్కో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డొంకరాయి జలవిద్యుత్ కేంద్రం మినహా అన్నింటిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు జోలాపుట్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 2,750 అడుగులు కాగా శనివారం సాయంత్రానికి 2,749.25 అడుగుల్లో ప్రమాదస్థాయికి చేరుకుంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో మరింత నీరు చేరితే రిజర్వాయర్ నిండిపోతుంది. దీంతో అధికారులు అప్రమత్తమై 20 వేల క్యూసెక్కుల నీటిని బలిమెల రిజర్వాయర్లోకి వదులుతున్నారు. బలిమెల జలాశయంలోకి కూడా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మెల్లమెల్లగా నీరు చేరుతుంది. గత 15 రోజుల కిందట కురిసిన వర్షాలకు రిజర్వాయర్లో భారీగా నీరు చేరింది. దీంతో ఇరు రాష్ట్రాల విద్యుత్ ఉత్పత్తికి నీటిని వాడుకున్నారు. 1516 అడుగుల నీటి మట్టానికి గాను 1497.01 అడుగుల్లో నీటిమట్టం ఉంది. 19 అడుగుల తేడాతో ఉన్న నీటిమట్టం జోలాపుట్ నుంచి రోజుకు 20 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. ఇరు రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తికి నీటిని వాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా సీలేరు (గుంటవాడ) రిజర్వాయర్ 1360 పూర్తిస్థాయి నీటిమట్టానికి గాను 1348 అడుగులకు నీరు చేరింది. దీనికి ఉపనదులైన పిల్లిగెడ్డ నుంచి ప్రస్తుతం వర్షపునీరు చేరుతుంది. దీని దిగువున ఉన్న సీలేరు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. గరిష్టస్థాయికి ‘డొంకరాయి’ సీలేరు విద్యుత్ కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జలాశయం నీటిమట్టం గరిష్టస్థాయికి చేరింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పాలగెడ్డ, వలసగెడ్డ, మంగంపాడు ఉపనదుల నుంచి వస్తున్న వర్షపు నీటితో పూర్తిగా నిండిపోయింది. 1037 పూర్తిస్థాయి నీటి మట్టానికి గాను శనివారం సాయంత్రానికి పూర్తిగా నిండిపోయింది. దీంతో అధికారులు మెయిన్ డ్యాం నుంచి శబరినదిలోకి 10 వేల క్యూసెక్కులును రెండు గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు. ఇంకా భారీగా వర్షాలు కురుస్తుండడంతో నీటి విడుదల కొనసాగుతుంది. తూర్పు గోదావరి జిల్లా మోతుగూడెం (ఫోర్బై) జలవిద్యుత్ కేంద్రంలో మొన్నటి వరకు డొంకరాయి పవర్ కెనాల్ గండి పడడంతో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు నీరు లేక జెన్కో అధికారులు ఇబ్బందులు పడేవారు. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఏవీపీ డ్యాం 930 అడుగుల సామర్ధ్యం అయినప్పటికీ శనివారం పూర్తిగా నిండిపోవడంతో గేట్లను ఎత్తి పవర్ కెనాల్ ద్వారా పొల్లూరు డ్యాంలోకి నీటిని మళ్లిస్తున్నారు. వర్షాలకు అలిమేరు వాగు నుంచి కూడా నీరు ప్రవహిస్తుంది. దీంతో ఫోర్బై జలవిద్యుత్కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు నీటి కొరత లేదని, పీక్లోడ్ అవర్స్లో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సరిపడిన నీరు ఉందని ఏపీ జెన్కో ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్ వి.ఎల్ రమేష్ తెలిపారు. కురుస్తున్న వర్షాల కారణంగా నీరు ఎప్పటికప్పుడు చేరుతుండడంతో అప్రమత్తంగా ఉన్నామని ఆయన తెలిపారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. జలకళాంధ్ర..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సరిగ్గా దశాబ్దం తర్వాత కృష్ణా, గోదావరి, వంశధార నదులు పోటాపోటీగా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఆగస్టు 11వ తేదీ నాటికే నదీ పరీవాహక ప్రాంతంలో ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. కృష్ణా, వంశధార నదుల్లో సెప్టెంబరు వరకూ.. గోదావరి నదిలో అక్టోబర్ వరకూ వరద ప్రవాహం ఉంటుంది. రుతుపవనాల వల్ల సమృద్ధిగా వర్షాలు కురిస్తే పెన్నా నది కూడా పొంగుతుంది. వర్షాలు ఇలాగే కొనసాగితే మధ్య తరహా ప్రాజెక్టులు సైతం నిండుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 2009 తర్వాత జీవనదులు పూర్తిస్థాయిలో జలకళను సంతరించుకోవడంతో సింహభాగం ప్రాజెక్టుల కింద ఆయకట్టులో ఖరీఫ్, రబీ పంటల సాగుకు అవకాశం ఏర్పడిందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఇప్పటికే గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాలకు నీటిని విడుదల చేశారు. కృష్ణా డెల్టాలో 13.09 లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేశారు. వంశధార నది పోటెత్తుతుండటంతో గొట్టా బ్యారేజీ నుంచి 2.31 లక్షల ఎకరాలకు నీటిని విడుదల చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 25.53 లక్షల ఎకరాల్లో వరి పంట సాగులో రైతులు నిమగ్నమయ్యారు. ఉత్తరాంధ్రలో నాగావళి నది ఉధృతంగా ప్రవహించడంతో తోటపల్లి జలాశయం నిండిపోయింది. తోటపల్లి జలాశయం కింద ఉన్న ఆయకట్టు 1.18 లక్షల ఎకరాలకు నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువ కింద 11.74 లక్షల ఎకరాలకు, ఎడమ కాలువ కింద ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 10.38 లక్షల ఎకరాలకు ఆదివారం ఆంధ్రపదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్, తెలంగాణ మంత్రి జగదీష్రెడ్డి నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ ఆయకట్టుకు ఆగస్టు రెండో వారంలోగా నీటిని విడుదల చేయడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ఆనందోత్సాహాలు కృష్ణా, తుంగభద్ర నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండడం, ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తుండడంతో రాయలసీమ, నెల్లూరు జిల్లాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీటితో శ్రీశైలం కుడిగట్టు కాలువ (ఎస్ఆర్బీసీ) కింద 1.54 లక్షల ఎకరాల్లో పంటల సాగులో రైతులు నిమగ్నమయ్యారు. తెలుగుగంగ ప్రాజెక్టు కింద కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల్లో 4.36 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టులో పంటల సాగుకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుగంగ ప్రధాన కాలువ ద్వారా సోమశిల, కండలేరు జలాశయాలను నింపనున్నారు. దీనివల్ల పెన్నా డెల్టా పరిధిలోని 2.47 లక్షల ఎకరాలు, సోమశిల ప్రాజెక్టు కింద 1.56 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి ప్రణాళిక రచించారు. తుంగభద్ర నది పరవళ్లు తొక్కుతుండడంతో ఇప్పటికే తుంగభద్ర జలాశయం నిండిపోయింది. ఈ ఏడాది తుంగభద్రలో నీటి లభ్యత పెరిగే అవకాశం ఉంది. తుంగభద్ర నదిపై ఆధారపడిన కర్నూలు–కడప(కేసీ) కెనాల్కు ఇప్పటికే నీటిని విడుదల చేశారు. ఈ కెనాల్ కింద 2.66 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి ఎగువ కాలువ(హెచ్చెల్సీ), దిగువ కాలువలకు(ఎల్లెల్సీ) సోమవారం నుంచి నీటిని విడుదల చేయనున్నారు. హెచ్చెల్సీ కింద 2.2 లక్షల ఎకరాలు, ఎల్లెల్సీ కింద 1.51 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నారు. ఈ ఏడాది గాలేరు–నగరి, హంద్రీ–నీవా తొలి దశ ఆయకట్టుకు నీళ్లందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. మధ్యతరహా ప్రాజెక్టుల ఆయకట్టులోనూ... భూపతిపాలెం, ముసురుమిల్లి వంటి మధ్య తరహా ప్రాజెక్టులు నిండిపోయాయి. దాంతో ఆయా ప్రాజెక్టుల కింద ఆయకట్టులో పంటల సాగును రైతులు ప్రారంభించారు. కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదీ పరివాహక ప్రాంతాల్లోని ఎత్తిపోతల పథకాల కింద ఆయకట్టుకు సైతం అధికారులు నీటిని విడుదల చేశారు. చిన్న తరహా ప్రాజెక్టులు, చెరువులు కొంతవరకు నిండాయి. నీటి లభ్యత ఆధారంగా వాటి ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో గోదావరి డెల్టాతోపాటు నీటి లభ్యత ఆధారంగా మరిన్ని ప్రాజెక్టుల కింద ఈ ఏడాది రబీ పంటకు కూడా సాగునీరందించే అవకాశాలు ఉండటంతో రైతన్నల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు సాగుకు నీటి విడుదలిలా - ధవళేశ్వరం నుంచి గోదావరి డెల్టాలోని 10.13 లక్షల ఎకరాలకు - కృష్ణా డెల్టాలోని 13.09 లక్షల ఎకరాలకు - గొట్టా బ్యారేజీ నుంచి 2.31 లక్షల ఎకరాలకు - తోటపల్లి జలాశయం కింద ఉన్న 1.18 లక్షల ఎకరాలకు - సాగర్ ప్రాజెక్టు కుడి కాలువ కింద 11.74 లక్షల ఎకరాలకు, ఎడమ కాలువ కింద ఏపీ, తెలంగాణలోని 10.38 లక్షల ఎకరాలకు -
వాన కురిసే.. సాగు మెరిసే..
సాక్షి, అమరావతి: చినుకు జాడ కోసం గత కొంత కాలంగా ఎదురుచూస్తున్న రైతుల్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఖరీఫ్ పనులు ముమ్మరం చేశారు. మెట్ట పంటలతో పాటు మాగాణుల్లో నాట్లు వేయడం మొదలైంది. అడుగంటిన జలాశయాలకు ఇప్పుడిప్పుడే నీరు చేరుతుండటంతో నీటి కొరత ఉండదని రైతులు భావిస్తున్నారు. దీనికితోడు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో వచ్చే వారంలో మంచి వానలు పడే అవకాశం ఉండటం కూడా రైతుల్లో భరోసా నింపుతోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమలో రుతుపవనాలు విస్తరించి ఉండడం కలిసివచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అన్ని జిల్లాల్లో విత్తన పంపిణీ నిరాటంకంగా సాగుతోంది. వర్షాధారిత పంటలు వేయడం ఊపందుకుంది. జొన్న, మొక్కజొన్న, అపరాలు, నూనె గింజల పంటల సాగు సైతం పుంజుకుంది. మొత్తం సాగు విస్తీర్ణం 42,04,218 హెక్టార్లు కాగా.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ను 38,30,466 హెక్టార్లుగా ఖరారు చేశారు. ఇందులో ఇప్పటికి 19,73,041 హెక్టార్లలో విత్తనాలు పడాల్సి ఉంటే సుమారు 13.84 లక్షల హెక్టార్లలో విత్తినట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది. వరి, మొక్కజొన్న, రాగి, కంది, వేరుశనగ, ఆముదం, పత్తి, మిరప వంటి పంటలు 26 శాతం నుంచి 50 శాతం వరకు వేయడం పూర్తయింది. చెరకు నాటు దాదాపు 75 శాతం పూర్తయింది. డెల్టాలో ముమ్మరంగా నాట్లు... కృష్ణా, గోదావరి డెల్టాలో వరి నాట్లు ఊపందుకున్నాయి. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నాట్లు నాట్లు వేస్తున్నారు. ప్రస్తుత సీజన్లో 16.25 లక్షల హెక్టార్లలో వరి సాగు లక్ష్యంగా వ్యవసాయ శాఖ పెట్టుకుంది. ఈ సీజన్లో ఇప్పటికి 6.27 లక్షల హెక్టార్లలో నాట్లు పడాల్సి ఉంది. అయితే వర్షాభావ పరిస్థితుల వల్ల ఇప్పటికి 4.81 లక్షల హెక్టార్లలో నాట్లు పడ్డాయి. ప్రస్తుతం కృష్ణా, గోదావరి నదులకు వరద నీరు పెరుగుతుండటంతో అనుకున్న లక్ష్యం మేరకు వరి సాగయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. వేరుశనగ పరిస్థితి ఇలా... వేరుశనగను ఈ సీజన్లో 9.16 లక్షల హెక్టార్లలో సాగు చేయించాలని లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ 7.53 లక్షల హెక్టార్లలో సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఇందులో ఇప్పటికి 5.13 లక్షల హెక్టార్లలో వేరుశనగ విత్తనాలు పడాల్సి ఉంటే 2.43 లక్షల హెక్టార్లలో మాత్రమే విత్తనాలు వేశారు. మంచి వర్షాలు పడితే వేరుశనగ సాగు విస్తీర్ణం పెరుగుతుందని భావిస్తున్నారు. మెట్టపంటలు, ఇతర ఆహార ధాన్యాల సాగు అనుకున్న లక్ష్యం మేరకు సాగుతోందని అధికారులు చెబుతున్నారు. త్వరలో సాధారణ స్థితికి వర్షపాతం.. గత వారంలో 36 శాతంగా ఉన్న లోటు వర్షపాతం ఈ వారానికి 27 శాతానికి చేరింది. మున్ముందు ఇది మరింత తగ్గి సాధారణ స్థితికి చేరుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. జూన్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్లో నైరుతీ రుతుపవనాల వల్ల రాష్ట్రంలో 556 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కావాలి. ఇందులో ఇప్పటికి 245 మిల్లీమీటర్లు కురవాలి. కానీ ఇప్పటికి 178.4 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఈ సీజన్లో జూలై 31 వరకు ఏ జిల్లాలోనూ అధిక వర్షపాతం నమోదవలేదు. ఉత్తర కోస్తాలోని 5 జిల్లాల్లో విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలు మినహా మిగతా మూడు శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాలు సాధారణ స్థితిలో ఉన్నాయి. దక్షిణ కోస్తాలోని గుంటూరు, ప్రకాశం మినహా కృష్ణా, నెల్లూరు జిల్లాలు లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటున్నాయి. రాయలసీమలో చిత్తూరు మినహా వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాలు లోటు వర్షపాతంలో ఉన్నాయి. వరి రైతులకు సూచనలు ప్రస్తుతం వరి నాట్లు వేస్తున్న రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం పలు సూచనలు చేసింది. ఆయా మండలాలకు సిఫార్సు చేసిన భాస్వరాన్ని ఆఖరి దమ్ములో వేసుకోవాలి. దీర్ఘకాలిక, మధ్య కాలిక రకాలైతే 25, 30 రోజుల వయసున్న నారును నాటుకోవాలి. స్వల్పకాలిక రకాలు సాగు చేస్తుంటే 20 నుంచి 25 రోజుల నారు నాటుకోవాలి. ప్రతి 2, 3 మీటర్లకు 30 సెంటీమీటర్ల వెడల్పున కాలిబాటలు తీసుకోవాలి. సిఫార్సు చేసిన నత్రజనిని మూడు సమభాగాలు చేసి నాటుకు ముందు ఒకసారి, పిలకల దశలో రెండో సారి, అంకురం దశలో మూడో సారి వేసుకోవాలి. పొటాష్లో సగభాగాన్ని మొదటి దశలో, మిగతా సగాన్ని అంకురం ఏర్పడే దశలో వేసుకోవాలి. కలుపు నివారణకు నాట్లు వేసిన 3, 5 రోజులలోపు పల్చగా నీరు పెట్టి ఎకరానికి ఒకటిన్నర లీటర్ల బుటాక్లోర్ లేదా 500 మిల్లీలీటర్ల ప్రిటిలాక్లోర్ లేదా ఆక్సాడయార్జిల్ 35– 50 గ్రాములు లేదా బెన్సల్ఫూరాన్ మిథైల్ గుళికలు ఎకరానికి నాలుగు కిలోలను 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలని సూచించింది. -
కృష్ణమ్మ వస్తోంది!
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురిస్తున్నాయి.. ఆల్మట్టి నిండింది. నారాయణపూర్ నీటిమట్టం పెరిగింది.. ఇక మన పాలమూరులోని జూరాలకు పారాలా..! వానాకాలంలో తొలిసారి కర్ణాటక నుంచి దిగువన తెలంగాణకు కృష్ణానది ప్రవాహం మొదలైంది. మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురవడం, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండలను తలపిస్తుండటంతో దిగువ జూరాలకు నీటి విడుదల మొదలైంది. వానాకాలంలో తొలిసారి కర్ణాటక నుంచి దిగువన తెలంగాణకు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. వచ్చింది వచ్చినట్లు దిగువకే.. భారీగా కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టికి వరద ఉధృతి పెరుగుతోంది. శనివారం ప్రాజెక్టులోకి 22 వేల క్యూసెక్కుల ప్రవాహాలు రాగా, ఆదివారం రాత్రి లక్ష క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టు నిండటంతో 18 గేట్లు ఎత్తారు. లక్షా రెండు వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం ఉదయానికే 129 టీఎంసీలకుగానూ 124 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులో నీటినిల్వలు ఖాళీ చేయాలని కేంద్ర జల సంఘం కర్ణాటకను హెచ్చరించడంతో ఉదయం నుంచే విద్యుదుత్పత్తి ద్వారా 28 వేల క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేయడం మొదలు పెట్టారు. దీన్ని క్రమంగా 40 వేల క్యూసెక్కుల వరకు పెంచుతూ పోయారు. నారాయణపూర్లో... నారాయణపూర్కు 30 వేల క్యూసెక్కుల మేర నీరు వస్తోంది. వరద పోటెత్తే అవకాశాల నేపథ్యంలో నారాయణపూర్ నుంచి నీటివిడుదల మొదలు పెట్టారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు 10 వేల క్యూసెక్కుల నీటిని విద్యుదుత్పత్తి ద్వారా నదిలోకి వదిలారు. అర్ధరాత్రి వరకు గేట్లెత్తి క్రమంగా లక్ష క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తూ వెళతామని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని నారాయణపూర్ ఇంజనీర్లు జూరాల ప్రాజెక్టు అధికారులకు సమాచారమిచ్చారు. ప్రస్తుతం నారాయణపూర్లో 37 టీఎంసీలకు గానూ 28 టీఎంసీల నిల్వలున్నాయి. జూరాలా.. ఇక పారాలా.. ఎగువ నుంచి వరద ఉధృతిని బట్టి సోమవారం రాత్రికి లేక మంగళవారం ఉదయానికి కృష్ణాజలాలు పాలమూరులోని జూరాల ప్రాజెక్టును చేరనున్నాయి. తుంగభద్ర ప్రాజెక్టులోకి 15 వేల క్యూసెక్కుల మేర వరద వస్తోంది. ఇందులో 100 టీఎంసీలకుగానూ 24 టీఎంసీల నిల్వ ఉంది. మహారాష్ట్రలోని ఉజ్జయినికి వరద ఉధృతి పెరిగింది. నిన్న మొన్నటి వరకు 10 వేల నుంచి 12 వేల క్యూసెక్కుల వరద రాగా, ఆదివారం సాయంత్రానికి 60 వేలకు పెరిగింది. దీంతో ప్రాజెక్టులో నిల్వ 117 టీఎంసీలకు గానూ 53 టీఎంసీలకు చేరింది. వరదను ఒడిసిపట్టండి: సీఎం జూరాలపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోతలకు అంతా సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం పాలమూరు జిల్లా ఇంజనీర్లను ఆదేశించారు. పాలమూరు జిల్లా చీఫ్ ఇంజనీర్ ఖగేందర్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండేతో ఫోన్లో మాట్లాడారు. ఎగువ నుంచి భారీ వరద వచ్చే అవకాశాలుండటంతో జూరా ల కింది ఆయకట్టుకు నీటి విడుదలతోపాటు జూరాలపై ఆధారపడ్డ భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టుల పంపులను తిప్పాలని, మోటార్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. వచ్చిన వరదను వచ్చినట్లుగా ఎత్తిపోసి చెరువులకు నీటిని తరలించాలని, ఈ ప్రాజెక్టుల కింద గరిష్టంగా 4.50 లక్షల ఎకరాలకు నీరందించేలా చూడాలని సూచించారు. -
జలాశయాలన్నీ ఖాళీ!
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోయాయి. చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు నీళ్లు లేక నోరెళ్లబెట్టాయి. సాగునీటి మాట దేవుడెరుగు.. గుక్కెడు తాగునీటి కోసం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం జలాశయాల్లో అందుబాటులో ఉన్న అరకొర జలాలు మే నెలాఖరు నాటికి మరింత తగ్గిపోనున్నాయి. ఆగస్టు వరకూ జలాశయాల్లోకి వరద నీరు చేరే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మే, జూన్, జూలై నెలల్లో తాగునీటి సమస్య విషమించడం ఖాయమని అధికార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్రంలో అధిక శాతం మంది ప్రజలు సాగునీరు, తాగునీటి అవసరాలకు కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార నదీ జలాలపై ఆధారపడతారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం జలాశయంలో పూర్తిస్థాయి నీటి మట్టం(ఎఫ్ఆర్ఎల్) 885 అడుగులు. నీటి నిల్వ 215.87 టీఎంసీలు. కనీస స్థాయి నీటి మట్టం(ఎంఎండీఎల్) 854 అడుగులు. ప్రస్తుతం గేట్ల కంటే దిగువ స్థాయికి అంటే.. 808.3 అడుగులకు నీటిమట్టం పడిపోయింది. శ్రీశైలం రిజర్వాయిర్లో ప్రస్తుతం 33.34 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. డెడ్ స్టోరేజీకి శ్రీశైలం జలాశయం నీటి నిల్వలు అడుగంటిపోయినా ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు గత రెండు రోజులుగా 2.24 టీఎంసీలను విడుదల చేశారు. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. పూర్తి నీటి నిల్వ 312.04 టీఎంసీలు. కనీస స్థాయి నీటి మట్టం 510 అడుగులు. ప్రస్తుతం సాగర్లో 514.5 అడుగుల్లో 139.44 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం కుడి, ఎడమ కాలువలకు 7,912 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. తుంగభద్ర, కండలేరు, సోమశిల రిజర్వాయర్లలోనూ నిల్వలు కనీ స నీటిమట్టం కంటే దిగువకు చేరాయి. చిత్రావతి బ్యా లెన్సింగ్ రిజర్వాయర్(సీబీఆర్), పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లోనూ అదే పరిస్థితి. తాగునీటి ఎద్దడి మరింత తీవ్రం ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి విడుదల చేస్తున్న జలాలతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు నింపినా.. ఆ నిల్వలు ఏప్రిల్, మే నెలలకే సరిపోతాయని అంచనా వేస్తున్నారు. కండలేరు, సోమశిల రిజర్వాయర్లలో ఉన్న జలాలను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం సరఫరా చేస్తున్నారు. ఏలేరులో ఉన్న జలాలను విశాఖపట్నం తాగునీటి అవసరాలు, ఉక్కు కర్మాగారం అవసరాలకు విడుదల చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం బోరుబావులపైనే ఆధారపడుతున్నారు. రాయలసీమలో అనంతపురం, వైఎస్సార్ జిల్లాల తాగునీటి అవసరాలు తీర్చే పీఏబీఆర్, సీబీఆర్లలో ఉన్న జలాలు రెండు నెలలకు మాత్రమే సరిపోతాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల సకాలంలో వర్షాలు కురిసినా ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు నిండి.. శ్రీశైలం రిజర్వాయర్కు వరద జలాలు చేరాలంటే ఆగస్టు వరకూ వేచిచూడాల్సిందే. తుంగభద్ర జలాశయానికి జూలై నాటికి వరద జలాలు చేరే అవకాశం ఉంది. ఎగువ నుంచి వరద జలాలు వచ్చే వరకూ అంటే మే, జూన్, జూలై నెలల్లో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు తప్పవని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని మున్నేరు, వైరా ఉపనదులతోపాటు కృష్ణానదిలో నీటిచుక్క కనిపించడం లేదు. ప్రతి గ్రామంలోనూ తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. తాగునీటి కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సమస్య పరిష్కారానికి అధికారులు ఎటువంటి ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. -
కాళేశ్వరం టు పాలమూరు!
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాల గరిష్ట నీటి వినియోగం లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం మరోకొత్త ప్రతిపాదనకు నాంది పలికింది. నీటి లభ్యత ఎక్కువగా ఉన్న గోదావరి బేసిన్ నుంచి లభ్యత అంతం తమాత్రంగా ఉన్న కృష్ణా బేసిన్కు నీటిని తరలించే ప్రణాళికను రూపొందిస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా తరలిస్తున్న గోదా వరి నీటిని మరో ఎత్తిపోతల పథకం పాల మూరు–రంగారెడ్డితో అనుసంధానించే ప్రణాళికను సిద్ధం చేస్తోంది. బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి పాలమూరు–రంగారెడ్డిలోని ఉద్దండాపూర్ రిజర్వాయర్కు నీటిని తరలించేలా ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. పాలమూరుకు భరోసా.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 11.39 టీఎంసీల సామర్థ్యమున్న బస్వాపూర్ రిజర్వాయర్ వరకు నీటిని తరలిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడి చేరుతున్న నీటిని పాలమూరులో భాగంగా జడ్చర్ల వద్ద నిర్మిస్తున్న ఉద్దండాపూర్ రిజర్వాయర్కు తరలించాలన్నది ప్రణాళిక. అయితే ఎంత నీటిని, ఎంత సామర్థ్యంతో తరలించాలన్న దానిపై ఇంకా స్పష్టత లేకున్నా, ఏ విధంగా నీటిని తరలించవచ్చన్న దానిపై ప్రణాళిక సిద్ధం చేయాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశాల నేపథ్యంలో అధికారులు ప్రణాళిక రూపొందించారు. నీటిపారుదల శాఖ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు.. బస్వాపూర్నుంచి హై లెవల్ కెనాల్ద్వారా 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న చండూరు మండలం తుమ్మలపల్లి వద్ద నిర్మించే రిజర్వాయర్కు నీటిని తరలిస్తారు. బస్వాపూర్ 490 మీటర్ల ఎత్తులో ఉండగా, తుమ్మలపల్లి 385 మీటర్ల ఎత్తున ఉండటంతో గ్రావిటీ ద్వారానే ఇక్కడికి నీటిని తరలించవచ్చు. ఇటు నుంచి 34 కి.మీ దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం చెరువుకు నీటిని తరలించాలంటే 155 మీటర్ల మేర లిఫ్ట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇబ్రహీంపట్నంకు వచ్చే నీటిని 131 కి.మీల దూరంలో ఉన్న ఉద్దండాపూర్ రిజర్వాయర్కు నీటిని తరలించాలంటే మధ్యలో 130 మీటర్ల మరో లిఫ్ట్ నిర్మాణం అవసరమవుతోంది. మొత్తంగా బస్వాపూర్ నుంచి ఉద్దండాపూర్కు 210 కిలోమీటర్లు నీటిని తరలించేందుకు సుమారుగా 280 మీటర్ల ఎత్తుకు నీటిని తరలించాల్సి వస్తుందని నీటిపారుదల శాఖ అంచనా వేసింది. ఈ నీటి తరలింపులో భాగంగా కాల్వలు శ్రీశైలం, బెంగళూరు, విజయవాడ జాతీయ రహదారులను దాటి రావాల్సిఉంది. ఇక ఎంత సామర్థ్యం నీటిని బస్వాపూర్ నుంచి తరలించాలన్నది తేలలేదు. ఇది తేలితేనే పంపులు, మోటార్ల సామర్థ్యం, వాటి సంఖ్య, కాల్వల డిశ్చార్జి సామర్ధ్యం ఎంతుండాలన్న స్పష్టత వస్తుంది. కనిష్టంగా బస్వాపూర్ నుంచి రోజుకు 2వేల క్యూసెక్కుల నీటిని 120 రోజులపాటు తరలించగలిగినా, 21 టీఎంసీల నీటిని ఉద్దండాపూర్కు తరలించే అవకాశం ఉంటుందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ఈ మాదిరి తరలింపు జరిగిన పక్షంలో కనిష్టంగా రూ.5వేల కోట్ల నుంచి రూ.6వేల కోట్లు ఖర్చయ్యే అవ కాశం ఉందని ఆ వర్గాలు స్పష్టం చేశాయి . ఉస్మాన్సాగర్పై ఇప్పటికే ప్రణాళిక ఇక కాళేశ్వరంలో భాగంగా ఉన్న కొండపోచమ్మ సాగర్ నుంచి, సింగూరుకు నీటిని తరలించే సంగారెడ్డి కాల్వ నుంచి ఉస్మాన్సాగర్కు నీటిని తరలించే ప్రతిపాదన ఇదివరకే సిద్ధమైన విషయం తెలిసిందే. సంగారెడ్డి కాల్వ 27వ కిలోమీటర్ వద్ద స్లూయిస్ నిర్మాణం చేసి, అటు నుంచి ప్రత్యేక పైప్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసి 50 కిలోమీటర్ల దూరాన ఉండే ఉస్మాన్సాగర్కు నీటిని తరలించేలా ప్రతిపాదించారు. ఈ వ్యవస్థ నిర్మాణానికి రూ.300 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. అయితే దీనికి ప్రభుత్వ ఆమోదం రావాల్సి ఉంది. -
కొత్త పనులకు బ్రేక్..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాగునీటి శాఖ పరిధిలో కొత్తగా చేపట్టాల్సిన ప్రాజెక్టుల పనులకు తాత్కాలిక బ్రేక్ పడింది. రాష్ట్ర ప్రాధాన్యతలు, ఆర్థిక పరిస్థితి, రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సాగునీటి శాఖ పరిధిలో ఇప్పటికే పరిపాలనా అనుమతులు ఇచ్చిన పనులకు సంబంధించి కొత్తగా ఎలాంటి టెండర్లు పిలవరాదని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల అనంతరం టీఆర్ఎస్కు అనుకూల ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉన్న దృష్ట్యా, ఆరు నెలల తర్వాత ప్రవేశపెట్టే పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్ అనంతరం ఈ పనులను గాడిలో పెట్టే యోచనలో ఉంది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు రావడంతో టెండర్ల ప్రక్రియకు అధికారులు ఫుల్స్టాప్ పెట్టారు. కేంద్ర నిధులపై స్పష్టత వచ్చాకే.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఖరీఫ్లోనే కాళేశ్వరం ద్వారా కనిష్టంగా 6 లక్షల ఎకరాలకు ఆయకట్టునివ్వాలని భావిస్తోంది. ఈ దృష్ట్యా ఆ ప్రాజెక్టుకు అధిక నిధులు వెచ్చిస్తోంది. దీంతోపాటే ఈ ఏడాది నుంచి సీతారామ, పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలకు అధిక నిధులు వెచ్చించాలని నిర్ణయించింది. ఇప్పటికే శాఖ పరిధిలో సుమారు రూ.8వేల కోట్ల మేర బిల్లులు పెండింగ్లో ఉండటంతో, ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా నిధుల సేకరణచేసే పనిలో పడింది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ గడువు ముగుస్తుండటం, ఏప్రిల్లో లోక్సభకు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఓట్ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఇందులో రాష్ట్రానికి ఇచ్చే నిధులపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగాక పూర్తి స్థాయిలో పెట్టే బడ్జెట్లో రాష్ట్ర కేటాయింపులపై స్పష్టత రానుంది. వచ్చే కొత్త ప్రభుత్వంలో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి సాగునీటి ప్రాజెక్టులకు రూ.30 వేల నుంచి రూ.40వేల కోట్ల మేరకు నిధులు రాబట్టుకోవచ్చని ఇటీవల తన సమీక్షల సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుత నిధుల కొరత, కేంద్ర బడ్జెట్ నుంచి అందే ఆర్థిక సాయంపై ఓ స్పష్టత వచ్చేవరకు కొత్తగా ఎలాంటి పనులకు టెండర్లు పిలవవద్దని ఇటీవలే అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. నాలుగు రిజర్వాయర్లపై ప్రభావం.. ఈ ఆదేశాల ప్రభావం నాలుగు రిజర్వాయర్ పనులపై పడనుంది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి పరిధిలో ఉద్దండాపూర్ నుంచి కేపీ లక్ష్మీదేవునిపల్లి వరకు నీటిని తరలించే పనులను మూడు ప్యాకేజీలుగా విభజించి రూ.4,268 కోట్ల పనులకు టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. ఆ పనులకు ప్రస్తుతం బ్రేక్ పడింది. ఇందులో రూ.915 కోట్లతో చేపట్టనున్న కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ పనులూ ఉన్నాయి. ఇక కడెం ప్రాజెక్టు కింది ఆయకట్టు స్థిరీకరణతో పాటు అవసరమైనప్పుడు కుంటాల జలపాతానికి నీరు విడుదల చేసేలా కుఫ్టి ఎత్తిపోతలకు ప్రభుత్వం గత ఏడాది ఆమోదం తెలిపింది. 5.32 టీఎంసీల సామర్థ్యంతో రూ.744 కోట్లతో రిజర్వాయర్ నిర్మించేందుకు అనుమతించగా, దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టేందుకు ఇటీవల అధికారులు ప్రభుత్వ అనుమతి కోరగా, పెండింగ్ లో పెట్టమని తెలిపింది. వీటితో పాటే పెన్గంగ ప్రాజెక్టు పిప్పల్కోఠి దగ్గర 1.42 టీఎంసీల సామర్థ్యం రిజర్వాయర్, 0.7 టీఎంసీలతో గోమూత్రి రిజర్వాయర్ నిర్మాణానికి రూ.583.78 కోట్లతో అనుమతినిచ్చారు. ఈ పనులకూ టెం డర్లు పిలవాల్సి ఉండగా ఆరు నెలలపాటు బ్రేక్ వేసింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిన దేవాదులలోని మల్కాపూర్ పనుల ఒప్పందాలను ఆపాలని ఇదివరకే ఆదేశాలు వెళ్లాయి. వీటితోపాటే నిజాంసాగర్ కింద మంజీరా నదిపై పిట్లం, బిచ్కుంద మండలాల పరిధిలోని 21 గ్రామాల్లో 30,646 ఎకరాలకు నీరిచ్చేలా.. నిజాంసాగర్ మండలం మల్లూర్ సమీపంలో రూ.456 కోట్లతో మంజీరా ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని ప్రభు త్వం నిర్ణయించింది. 2.90 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టే ఈ పథకానికి టెండర్లు పిలవాల్సి ఉన్నా ఆ పనులకూ బ్రేకులు పడ్డాయి. -
జలాశయాల వద్ద ఇక విందు, వినోదాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రకృతి వనరులు, సహజసిద్ధ అందాలున్నా పర్యాటకానికి ఆశించినస్థాయిలో గుర్తింపు రాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. భారీ ఈవెంట్లు నిర్వహించడంతో సరిపెట్టుకోవద్దని, ఏడాది పొడవునా ఏదో ఒక కార్యక్రమం నిర్వహించినపుడే ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. సచివాలయంలోని తన కార్యాలయంలో మంగళవారం ఏపీ టూరిజం కల్చర్ అండ్ హెరిటేజ్ బోర్డ్ (ఏపీటీసీహెచ్బీ) ఆరో సమావేశంలో ఆయన మాట్లాడారు. కేరళలో బ్యాక్ వాటర్ అంతా మురికిమయమని, ఇక్కడ కొల్లేరు, పులికాట్ వంటి సరస్సుల్లో స్వచ్ఛమైన నీళ్లుంటాయని తెలిపారు. అక్కడ హౌస్ బోటింగ్ ముఖ్య పరిశ్రమగా వర్ధిల్లుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆలంబనగా ఉందని, ఇక్కడా అలాంటి కృషి జరగాలన్నారు. ఇకపై జలాశయాలను విందు, వినోదాలకు కేంద్రాలు చేయాలని నిర్ణయించారు. ఈవెంట్లే..ఈవెంటు: రాష్ట్రంలోని ముఖ్య జలాశయాలలో ప్రత్యేకంగా రూపొందించిన బోట్లు, షిప్లలో విందు వినోదాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తొలుత కృష్ణానదిలో, విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం ఓడరేవు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. డిన్నర్ పార్టీలు, వేడుకలు నిర్వహించడానికి వీలుగా ప్రత్యేకంగా తయారుచేసిన క్రూయిజ్ బోట్లు, షిప్లను ప్రవేశపెడతామన్నారు. ఈ సంవత్సరంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరుపతలపెట్టిన 18 ఈవెంట్ల క్యాలెండర్ను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. విశాఖలో డిసెంబర్ 28, 29, 30 తేదీల్లో విశాఖ ఉత్సవ్, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ‘ద ట్రైన్ స్టోరీ వైజాగ్’ ఈవెంట్, 2019 జనవరి 18, 19, 20 తేదీల్లో అరకు బెలూన్ ఫెస్టివల్ జరుపనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ 22, 23 తేదీలలో అమరావతి గ్లోబల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్, విజయవాడలోనే ఈ డిసెంబర్ 6 నుంచి నాలుగు రోజుల పాటు అమరావతి రెగట్టా పేరుతో పడవ పందేలు, జనవరి 12, 13 తేదీల్లో ‘గ్లోబల్ శాంతి’ పేరుతో బుద్ధిస్ట్ ఫెస్టివల్ జరుపుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 21, 22 తేదీల్లో ‘అమరావతి అడ్వెంచర్ స్పోర్ట్స్’, తిరుపతిలో ఈ నెల 25 నుంచి నాలుగు రోజుల పాటు ఏపీ క్రాఫ్టŠస్ మేళా, విజయవాడలో నవంబరు 9, 10 తేదీల్లో సోషల్ మీడియా సమ్మిట్ అండ్ అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహించనున్నట్లు చెప్పారు. తిరుపతిలో జనవరి 11, 12, 13 తేదీల్లో వరల్డ్ స్పిరŠుచ్యవల్ ఫెస్ట్, కర్నూలులో నవంబర్ 29, 30 తేదీల్లో పౌరాణిక నాటకోత్సవం, సూర్యలంక, చీరాల, కొత్తపట్నంలో బీచ్ ఒలింపియాడ్, నవంబరు 10 నుంచి 18 వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రైడ్ ఏపీ పేరుతో మరో ఈవెంట్ జరుపనున్నట్లు తెలిపారు. కాకినాడలో డిసెంబర్ 22, 23 తేదీల్లో ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్, జనవరి 15న కొవ్వూరులో హార్వెస్ట్ ఫెస్టివల్ జరపాలని నిర్ణయించినట్లు చెప్పారు. -
47 రిజర్వాయర్లు.. 16 టీఎంసీలు!
సాక్షి, హైదరాబాద్: పాత మహబూబ్నగర్ జిల్లాలో 4 లక్షలకు పైగా ఎకరాలకు ఆయకట్టునిచ్చే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో అదనపు నీటి నిల్వలకు అనుగుణంగా కొత్త రిజర్వాయర్లు నిర్మించనున్నారు. కల్వకుర్తి కింద పెరిగిన నీటి కేటాయింపులకు అనుగుణంగా గరిష్ట నీటి నిల్వలకు వీలుగా 47 రిజర్వాయర్లు నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 16 టీఎంసీల సామర్థ్యంతో వీటిని నిర్మించేలా ప్రణాళిక సిద్ధమవ్వగా ఇందుకు రూ.4,175.28 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. 4 టీఎంసీల నుంచి 16 టీఎంసీలకు.. శ్రీశైలం బ్యాక్వాటర్ నుంచి 25 టీఎంసీల మిగులు జలాల ను తీసుకుంటూ 3.4 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని 2005లో చేపట్టారు. ఇం దులో భాగంగానే 4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లను నిర్మించారు. ఎల్లూరు రిజర్వాయర్లో 0.35 టీఎంసీ, సింగోటం 0.55, జొన్నలబొగుడలో 2.18, గుడిపల్లి గట్టు రిజర్వాయర్లో 0.967 టీఎంసీల నీటి నిల్వ రిజర్వాయర్లున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టు నీటి వాటాను 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచారు. నీటిని తీసుకునే రోజులను 90 నుంచి 120 రోజులకు పొడగించారు. ఆయకట్టును సైతం 4,23,416 ఎకరాలకు పెంచారు. పెంచిన ఆయకట్టు, పెరిగిన నీటి కేటాయింపులకు అనుగుణంగా రిజర్వాయర్లు పెరగాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం తొలినుంచీ చెబుతూ వస్తోంది. వరద వచ్చినపుడు లిఫ్టు చేసి నిల్వ చేసుకునేందుకు అవకాశం లేకపోవటంతో కొత్త రిజర్వాయర్లపై సర్వే చేయించింది. మొత్తంగా 20 టీఎంసీలతో 53 రిజర్వాయర్లకు సర్వే నిర్వహించాలని భావించినా, 6 చోట్ల ప్రజా వ్యతిరేకతతో అది సాధ్యం కాలేదు. ఇక మిగతా 47 చోట్ల మాత్రం మొత్తంగా 16.11 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణానికి అనుకూలంగా ఉందని తేల్చింది. ఇందులో 13.064 టీఎంసీల సామర్థ్యమున్న 38 రిజర్వాయర్లను వనపర్తి, నాగర్ కర్నూల్, రంగారెడ్డిలో ప్రతిపాదించింది. ఇక ఆయకట్టు లేకున్నా నిల్వల కోసం మరో 9 రిజర్వాయర్లను 3.055 టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదిం చింది. గొల్లపల్లి రిజర్వాయర్లో గరిష్టంగా 2.81 టీఎం సీలు ప్రతిపాదించగా, మిగతావన్నీ 0.50 టీఎంసీ కన్నా చిన్నవే. భూసేకరణకే రూ.1,276 కోట్లు.. ఇక ఈ 47 రిజర్వాయర్ల నిర్మాణంతో ఏకంగా 22,332 ఎకరాల మేర ముంపు ప్రభావం ఉండనుంది. అలాగే భూసేకరణ అవసరాలకు రూ.1,276 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు లెక్కగట్టారు. రిజర్వాయర్ల మట్టికట్టల నిర్మాణానికి రూ.2,371కోట్లు, సర్ప్లస్ వియర్స్ నిర్మాణానికి మరో రూ.237 కోట్లు, లింకు కాల్వల నిర్మాణానికి మరో రూ.49కోట్లు ఖర్చవుతుందని తేల్చారు. మొత్తంగా వీటి నిర్మాణానికి రూ.4,175 కోట్లు వ్యయం అవుతుందని తేల్చారు. -
దేవరకొండ ఆదర్శంగా నిలుస్తుంది
కొండమల్లేపల్లి(దేవరకొండ) : రానున్న రోజుల్లో రిజర్వాయర్ల నిర్మాణాలతో రాష్ట్రంలోనే దేవరకొండ నియోజకవర్గం ఆదర్శంగా నిలుస్తుందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా దేవరకొండ మండల పరిధిలోని కొండభీమనపల్లి వద్ద పద్మనాయక వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న దొంతినేని సంపతమ్మ కల్యాణ మండప నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తయితే 1లక్షా 60 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ప్రసుతం డిండి ప్రాజెక్టు నుంచి సాగు నీరందిస్తున్నామన్నారు. వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేద పిల్లలకు సహయ సహకారాలు అందించాలని సూ చించారు. ట్రస్ట్ ఏర్పాటు చేసి సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఖిల్లా అభివృద్ధికి సహకరించాలని మంత్రిని కోరగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నిధులు కేటాయించేలా చూస్తానని çహామీ ఇచ్చారు. అనంతరం నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, జెడ్పీ చైర్మన్ బాలూనాయక్, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం సకాలంలో వానలు పడకపోవడంతో రైతులు ఇబ్బందులు పడకుండా ఉం డేందుకు గాను కల్వకుర్తి నుంచి నీటిని విడుదల చేయాలన్నారు. అంతకు ముందు మంత్రి హరీశ్రావుకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘ నంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎ మ్మెల్సీ భానుప్రసాద్రావు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, నోముల న ర్సింహ్మయ్య, రవీందర్రావు, ఉజ్జిని యాదగిరి రావు, బాబూ రావు ,శ్రీనివాసరావు, శ్రీకాంత్రావు, రవీందర్రావు, జగన్మోహన్రావు, ప్రభాకర్రావు, రామ్మోహన్రావు, వెంకటేశ్వరరా వు, నరేం దర్రావు, వెంకటేశ్వరరావు, రామేశ్వరరావు, నరేందర్రావు, రాంచందర్నాయక్, మా ర్కెట్ చైర్మన్ బాలనర్సింహ, ఎంపీపీ శ్రీని వాస్యాదవ్, జెడ్పీటీసీ నర్సింహ, మున్సిపల్ చైర్మన్ దేవేందర్, జనార్దన్రావు, కృష్ణ కిశోర్రావు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యత విషయంలో రాజీ వద్దు
సాక్షి, హైదరాబాద్: రిజర్వాయర్ల పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని ఇంజనీర్లను నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. కనీసం 200 ఏళ్ల పాటు ప్రజా అవసరాలు తీర్చేవిగా రిజర్వాయర్లు ఉండాలన్నారు. క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు, ప్రాజెక్టు ఇంజనీర్లు పనులను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. నాణ్యత విషయంలో అలక్ష్యం వహిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. సోమవారం జలసౌధలో డిండి ఎత్తిపోతల పథకం పనులు, ఇతర ప్రాజెక్టులు, రిజర్వాయర్ల పురోగతిపై సమీక్షించారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగమైన సింగరాజు పల్లి, గొట్టి ముక్కల రిజర్వాయర్ పనుల వేగం పెంచి ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని ఆదేశించారు. సింగరాజు పల్లి రిజర్వాయర్ ద్వారా చెరువులు నింపేందుకు డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ పనులు పూర్తి చేయాలని సూచించారు. గొట్టి ముక్కల రిజర్వాయర్ పనులు 70 శాతం పూర్తయ్యాయని మిగతా పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ రిజర్వాయర్ పరిధిలో భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పనులకు రూ.32 కోట్లు అవసరమవుతాయని ప్రాజెక్టు ఇంజనీర్లు తెలపగా ఆ నిధులు విడుదల చేస్తామన్నారు. సింగరాజు పల్లి రిజర్వాయర్, గొట్టిముక్కల రిజర్వాయర్ పనులకు మరో రూ.పది కోట్లు విడుదల చేయనున్నట్లు చెప్పారు. కిష్టరాంపల్లి రిజర్వాయర్ పనులకు రూ.పది కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించారు. ప్యాకేజీ–6లోని శివన్న గూడెం రిజర్వాయర్ను వేగంగా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఇంజనీర్లకు సూచించారు. పనుల్లో జాప్యాన్ని సహించం పూర్వపు మహబూబ్నగర్ జిల్లాలోని తుమ్మిళ్ల, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్సాగర్, బీమా ప్రాజెక్టు లకు నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని హరీశ్రావు తెలిపారు. పూర్వపు మహబూబ్నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల పురోగతిపై ఆయన సమీక్షించారు. ఈ పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. తుమ్మిళ్ల ప్రాజెక్టు పరిధిలో సర్వీస్ బే కంట్రోల్ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆగస్టు 31లోగా ఒక పంపును రన్ చేసేలా పనులు చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో 300 ఎకరాల వరకు, కోయిల్ సాగర్ ప్రాజెక్టు పరిధిలో దాదాపు 200 ఎకరాల వరకు భూ సేకరణ జరపాలని మంత్రికి ఇంజనీర్లు తెలపగా,జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్తో హరీశ్ ఫోన్లో మాట్లాడారు. మంగళవారం సమావేశం నిర్వహించి భూ సేకరణ పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫీల్డ్ చానల్స్ తవ్వే విషయంలో గ్రామస్తులు సహకరించడం లేదని ఇంజనీర్లు మంత్రి దృష్టికి తేవడంతో, వెంటనే జిల్లా కలెక్టర్లు, రైతు సమితి సభ్యులు, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఆల్మట్టి, తుంగభద్రల నుంచి నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరిన వెంటనే కల్వకుర్తి మోటార్ ఆన్ చేయాలన్నారు. భూ సేకరణపై దృష్టి పెట్టండి డిండి ప్రాజెక్టుకు సంబంధించి అటవీ శాఖ పరిధిలో ఉన్న భూముల సేకరణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని హరీశ్ సూచించారు. జిల్లా కలెక్టర్లు, అటవీ సమస్యల పరిష్కారం కోసం నియమించిన సలహాదారు సుధాకర్తో చర్చించి వెంటనే పరిష్కరించాలని ఇంజనీర్లను మంత్రి ఆదేశించారు. అటవీ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుకు ప్రత్యేకంగా చీఫ్ ఇంజనీర్ను ఏర్పాటు చేయాలని ఈఎన్సీలు మురళీధర్, నాగేందర్రావులకు సూచించారు. -
నిండుకుండల్లా జలాశయాలు
ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జలాశయాలు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. సరిహద్దుల్లోని ప్రాణహిత, పెన్గంగ నదులు ఉరకలేస్తుండటంతో వరద ప్రవాహం మరింత పెరిగింది. ఆసిఫాబాద్ మండలం కుమురంభీమ్ ప్రాజెక్టులో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. గరిష్ట స్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా, గురువారం 240.750 మీటర్లకు చేరింది. ఇదే మండలంలోని వట్టివాగు ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 239.50 మీటర్లు కాగా, 233.750 మీటర్లకు చేరింది. దహెగాం మండలం పాల్వాయి పురుషోత్తంరావు ప్రాజెక్టులో నీటి మట్టం 147.550 మీటర్లుకు చేరింది. సాత్నాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 286.50 మీటర్లు కాగా.. ప్రస్తుతం 285.50 మీటర్లు ఉంది. మత్తడివాగు ప్రాజెక్టు నీటిమట్టం 277.50 మీటర్లు కాగా.. 276.400 మీటర్లకు చేరింది. కడెం ప్రాజెక్ట్కు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 697.050 అడుగులు ఉంది. ఆల్మట్టికి పెరిగిన వరద సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లోని ఆల్మట్టి ప్రాజెక్టులోకి నీటి ప్రవాహాలు పుంజుకున్నాయి. గురువారానికి 6 టీఎం సీల చొప్పున 63,465 క్యూసెక్కుల మేర నీరు వచ్చి చేరు తోంది. ప్రస్తుతం నీటి నిల్వ 129 టీఎంసీలకు గానూ 69.80 టీఎంసీలకు చేరింది. తుంగభద్రలోకి 49,790 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ఇక్కడ 10 టీఎంసీల నిల్వలకు గానూ 54.34 టీఎంసీల నిల్వలున్నాయి. నాగార్జునసాగర్లోకి 1,558 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ఇక్కడ 312 టీఎంసీల నిల్వకు గానూ 133.37 టీఎంసీల నిల్వ ఉంది. ఎస్సారెస్పీకి 1,200 క్యూసెక్కులు వస్తుండగా అక్కడ 90 టీఎంసీలకు గానూ 12.33 టీఎంసీలు, కడెంలోకి 7,886 క్యూసెక్కులు వస్తుండగా 7.60 టీఎంసీలకు గానూ 7.12 క్యూసెక్కుల నిల్వ ఉంది. ఎల్లంపల్లికి 3,932 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా అక్కడ 20 టీఎంసీలకు 8.88 టీఎంసీల నిల్వలున్నాయి. -
అభయారణ్యంలో 64 నీటితొట్ల ఏర్పాటు
పాల్వంచరూరల్: వేసవిలో అటవీ ప్రాంతంలో జంతువులకు తాగునీటి సౌకర్యం కోసం రూ.2.24లక్షల వ్యయంతో నీటి తోట్లను ఏర్పాటు చేసినట్లు ఎఫ్డీఓ ఎం.నాగభూషణం తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కిన్నెరసాని అభయారణ్యంలోని యానంబైల్, చాతకొండ, అళ్లపల్లి, కరగూడెం రేంజ్ పరిధిలోని 74 బీట్లలో నీటి సౌకర్యంలేని ప్రాంతాలను గుర్తించి 64 నీటి తోట్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఒక్కో నీటితొట్టికి రూ.3500ను ఖర్చు చేసినట్లు వివరించారు. వాటిని ఒక ఫీట్ఎత్తులో నిర్మించి ఎప్పటికీ తొట్లలో నీరు ఉండే లా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. అళ్లపల్లి ఏరియాలో సోలార్ పంప్సెట్ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రూ.4లక్షల వ్య యంతో అటవీలో నిప్పు అంటుకోకుండా ముందస్తుగా ఫైర్లైన్స్ ఏర్పా టు చేసినట్లు చెప్పారు. 54 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫైర్లైన్స్ ఉంటాయన్నారు. ఎవరైనా అటవీలో నిప్పు పెడితే వారిపై చట్ట రీత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటవీగుండా ప్రయాణించే వారు.. గొర్రెలు, మేకలు, పశువుల కాపర్లు అగ్గిపెట్ట లేదా లైటర్తో తిరుగొద్దన్నారు. -
జీవో 111పై సమగ్ర విచారణ చేస్తాం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర వాసుల దాహార్తిని తీర్చే జంట జలాశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లకు పది కిలోమీటర్ల పరిధిలో నిర్మాణాలను నిషేధిస్తూ జారీ చేసిన జీవో 111ను సవాల్ చేసిన వ్యాజ్యాలు, సమర్థిస్తూ దాఖలైన వ్యాజ్యాలపై సమగ్ర విచారణ జరుపుతామని హైకోర్టు ప్రకటించింది. ఈ కేసుల్లో ప్రతివాదులందరూ తమ వాదనలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్లతో కూడిన ధర్మాసనం గురువారం నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులందరూ మార్చి మొదటి వారంలోగా కౌంటర్లు దాఖలు చేస్తే ఆ తర్వాతి వారంలో తుది విచారణ జరుపుతామని ప్రకటించింది. విచారణ మార్చి రెండో వారానికి వాయిదా నిపుణుల సూచనలు, శాస్త్రీయ ప్రతిపాదనలు లేకుండా ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లకు పది కిలోమీటర్ల పరిధి వరకూ నిర్మాణాలు నిషేధిస్తూ 1996లో ప్రభుత్వం జీవో 111ను జారీ చేయడం చెల్లదని పిటిషనర్ల న్యాయవాది వాదించారు. ఆ ప్రాంతంలో పలు ఇంజనీరింగ్ కాలేజీల నిర్మాణాలు జీవో 111ను ఉల్లంఘించే జరిగాయని జీవోను సమర్థిస్తూ దాఖలైన వ్యాజ్యాల తరఫు న్యాయవాది ప్రతివాదన చేశారు. జీవో అమలు, వాస్తవ పరిస్థితులపై శాస్త్రీయ సర్వే కోసం నియమించిన అధికారిక కమిటీ నివేదిక అందాల్సివుందని హెచ్ఎండీఏ తరఫు న్యాయవాది రామారావు చెప్పారు. ఈ కేసులో ప్రభుత్వ వాదనలు వినిపించేందుకు అడ్వొకేట్ జనరల్ హాజరవుతారని, అందుకు సమయం కావాలని ఆయన కోరారు. ఇరుపక్షాల వాదనల అనంతరం విచారణ మార్చి రెండో వారానికి వాయిదా పడింది. -
జలాశయాలుగా రైల్వే స్టేషన్లు, బస్సు స్టాండ్లు
-
రిజర్వాయర్లలో పడిపోతున్న నీటిమట్టం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 91 ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు మొత్తం సామర్థ్యంలో 19 శాతానికే పరిమితమైనట్లు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ తెలిపింది. నాగార్జున సాగర్, ఇందిరా సాగర్, భాక్రానంగల్ తదితర రిజర్వాయర్లలో ఈ వారాంతంలో 29.665 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు ఉన్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, ఒడిశా, ఉత్తరాఖండ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో గతేడాది కంటే నీటి నిల్వలు తక్కువగా నమోదైనట్లు వెల్లడించింది. పంజాబ్, పశ్చిమబెంగాల్, తెలంగాణ, త్రిపుర, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల్లో గత ఏడాది కంటే నీటి నిల్వలు పెరిగినట్లు జలవనరుల శాఖ పేర్కొంది. -
‘డిండి’లో మళ్లీ మార్పులు!
- అలైన్మెంట్ మార్చేలా ప్రతిపాదనలు - కొత్తగా 2.5 టీఎంసీలతో రిజర్వాయర్లు - మరో 20 వేల ఎకరాలకు నీరిచ్చేలా అధికారుల ప్రణాళిక సాక్షి, హైదరాబాద్: మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టు అలైన్మెంట్లో మళ్లీ మార్పులు జరుగుతున్నాయి. గతంలో నిర్ణయించిన అలైన్మెంట్ను పక్కనపెట్టి కొత్తగా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో 20 వేల ఎకరాలకు అదనంగా నీరిచ్చేలా కొత్త ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. మార్పుల్లో భాగంగా అదనంగా 2.5 టీఎంసీల సామర్థ్యంతో మూడు అదనపు రిజర్వాయర్లు రానున్నాయి. దీనిపై మరో 10ృ15 రోజుల్లో స్పష్టతనిచ్చేలా నీటిపారుదలశాఖ కసరత్తు చేస్తోంది. డిండికి ముందే మలుపు.. శ్రీశైలానికి వరద ఉండే 60 రోజుల్లో రోజుకు 0.5 టీఎంసీ చొప్పున 30 టీఎంసీల నీటిని పాలమూరుృరంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భా గంగా ఉండే నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి డిండికి తరలించాలని గతంలో నిర్ణయిం చారు. అయితే నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తరలించే అలైన్మెంట్తో కల్వకుర్తి ప్రాజెక్టు కింద 90 వేల ఎకరాల ఆయకట్టు దెబ్బతినే అవకాశం ఉంటుందని మహబూబ్ నగర్ జిల్లా నేతలు అభ్యంతరాలు లేవనెత్తారు. కానీ ప్రాజెక్టు అధికారులు మాత్రం 27,551 ఎకరాల నష్టమే ఉంటుందని తేల్చారు. ఈ నేపథ్యంలో సర్కారు ‘వ్యాప్కోస్’ ద్వారా సర్వే చేయించగా ఆ సంస్థ ఐదు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తరలించే ప్రణాళికకు ఓకే చెబుతూనే రంగాయపల్లి పంప్హౌస్లో పంపింగ్ మెయిన్ తగ్గిం చాలని, గ్రావిటీ టన్నెల్ ఏర్పాటు చేయాలని సూచించింది. దీనికి రూ. 3,384.47 కోట్లు అవుతుందని తెలిపింది. ఈ ప్రతిపాదన ప్రకారం నార్లాపూర్ నుంచి డిండికి సుమారు 50 కిలోమీటర్ల దూరంపాటు కాల్వలను, సుమారు 7 వేల క్యూసెక్కుల నీటిని తరలించాల్సి ఉంది. ఈ ప్రతిపాదనను అధికారులు పరిశీలించగా 5వ కిలోమీటర్ నుంచి 20వ కిలోమీటర్ వరకు ఉన్న అలైన్మెంట్, రంగాయపల్లి వద్ద నిర్మించే పంపింగ్ మెయిన్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉందని వెల్లడైంది. దీన్ని ఎలా తప్పించాలన్న చర్చలు జరుగుతున్న సమయంలోనే కొత్త ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఈ ప్రతిపాదనల ప్రకారం నార్లపూర్ నుంచి వచ్చే నీటిని నేరుగా డిండికి తరలించకుండా దానికి ఎగువనే 10వ కిలోమీటర్ పాయింట్ వద్ద 410 మీటర్ల కాంటూర్లో ఉల్పర అనే గ్రామం వద్ద ఒక టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తారు. అక్కడి నుంచి నేరుగా డిండి దిగువన 10 కిలోమీటర్ల దూరంలోని ప్రధాన కాల్వలోకి నీటిని తరలించి ముందుగా నిర్ణయించిన ఆయకట్టుకు నీరిచ్చేలా ప్రణాళిక వేశారు. ఈ క్రమంలో ఉల్పర దిగువన గోకారం, ఎర్రవల్లి జంట చెరువులను కలిపేసి 0.75 టీఎంసీతో ఒక రిజర్వాయర్, ఇర్విన్ వద్ద 0.75 టీఎంసీతో మరో రిజర్వాయర్ నిర్మించే ప్రతిపాదనలు చేస్తున్నారు. దీని ద్వారా డిండి దిగువన 10వ కిలోమీటర్ వరకు ఉన్న టన్నెల్ నిర్మాణాన్ని పూర్తిగా తప్పించవచ్చు. అదీగాక ఉల్పర నుంచి పూర్తిగా గ్రావిటీ మార్గాన నీటిని తరలించవచ్చు. కొత్తగా 20 వేల ఎకరాలకు ఆయకట్టు వస్తుంది. -
తాగునీరు తగ్గుతోంది!
► జలాశయాల్లో అడుగంటుతున్న నీటి మట్టాలు ► నగర శివారు కాలనీల్లో నల్లాలకు నీళ్లు బంద్ ► నీటి సరఫరాపై దృష్టిసారించని పాలక, అధికార వర్గాలు ► నెల రోజుల వరకు ఢోకా లేదంటున్న గ్రేటర్ ఇంజనీర్లు వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ దాహార్తిని తీర్చే జలాశయాల్లో నీరు తగ్గిపోతోంది. ఎండల తీవ్రతతో ఆయా జలాశయాల్లో నీటి మట్టం పడిపోతోంది. నాలుగైదు రోజులకోమారు అరకొరగా నీరు సరఫరా చేస్తుండటంతో శివారు కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలో ధర్మసాగర్, వడ్డేపల్లి, భద్రకాళి జలాశయాలున్నాయి. నగర పరిధిలో, విలీన గ్రామాల్లో కలిపి 80వేల నల్లాలకు నీళుసరఫరా చేయాల్సి ఉంది. ఈ దశలో ధర్మసాగర్ చెరువు మరో పక్షం రోజుల్లో డెడ్ స్టోరేజీకి చేరనుంది. భద్రకాళి, వడ్డేపల్లి చెరువుల్లో కూడా నీటి మట్టాలు అడుగంటిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వతో మరో నెల రోజుల పాటు సరఫరా చేస్తామని ఇంజనీర్లు చెబుతున్నారు. గత ఏడాది రూ.15 కోట్లు వెచ్చించి ప్రత్యామ్నాయంగా దేవాదుల ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా చేపట్టారు. ఈ ఏడాది అటుపై దృష్టిసారించడం లేదు. నీటి సరఫరాలో కోత.. మూడు రిజర్వాయర్లలో నీరు అడుగంటిపోవడంతో నీటి సరఫరాలో కోతలు మొదలు పెట్టారు. వరంగల్ ప్రాంతంలోని వ్యవసాయ మార్కెట్ రోడ్డులోని మధురానగర్ కాలనీ, లక్ష్మి గణపతి కాలనీ, మర్రి చెన్నారెడ్డి కాలనీ, వీవర్స్ కాలనీ, తుమ్మలకుంట, ఎన్టీఆర్ నగర్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, ఎస్ఆర్టీ, టీఆర్టీ, గరీబ్ నగర్, ఎస్ఆర్ నగర్, రైల్వే గేట్ ప్రాంతంలోని రంగశాయిపేట, నాగేంద్ర నగర్, ఖిలా వరంగల్, చంద్రవద కాలనీ, కాశికుంట, హన్మకొండలోని న్యూశాయంపేట, పద్మాక్ష్మి కాలనీ, లక్ష్మిపురం, ప్రకాశ్రెడ్డి పేట, స్నే హనగర్, పరిమళ కాలనీ, భీమారం, గుండ్ల సింగారం, సమ్మ య్య నగర్, సగర వీధి, కాజీపేటలోని బాపూజీ నగర్, సోమిడి తదితర కాలనీల్లో రెండు, మూడు రోజు లకోసారి నీటి సరఫరా చేస్తున్నారు. మొన్నటి వరకు వర కు నల్లాలకు గంట పాటు నీళ్లు వచ్చేవి. ఇప్పడు అరగంటకు తగ్గించారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రంగుమారుతున్న నీళ్లు.. గత వారం రోజులుగా నల్లాల ద్వారా రంగుమారిన నీళ్లు వస్తున్నాయి. వడ్డేపల్లి, భద్రకాళి చెరువుల్లో ఉన్న నీళ్లు పచ్చరంగుగా మారాయి. వీటిని సరిగ్గా శుద్ధి చేయకపోవడంతో దుర్వాసన వస్తున్నాయని నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా తాగునీటి నిల్వలు తగ్గుతున్నప్పడు నీళ్లు బురదతో వస్తాయని ఇంజనీర్లే అంటున్నాయి. అయినా వాటివల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా, రసాయనాలు వాడుతున్నామని చెబుతున్నారు. కాలనీల్లో ప్రజలు మాత్రం నల్లా నీళ్లను తాగేందుకు జంకుతున్నారు. ఒండ్రు మట్టి, పచ్చరంగు, నాచు వస్తోందని వాపోతున్నారు. దీంతో మినరల్ వాటర్ కొనుగోలు చేసి దాహర్తిని తీర్చుకుంటున్నారు. ఎల్ఎండీ నీళ్లే దిక్కు.. కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యాం(ఎల్ఎండీ) నుంచి కెనాల్ ద్వారా గ్రేటర్ వరంగల్కు నీళ్లు విడుదల చేయాలి. అందుకోసం కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులు చొరవ చూపాలి. ఎల్ఎండీలో నీళ్లు ఆశాజనంగా ఉన్నాయి. సమ్మర్ జలశయాలు అడుగంటుతున్నందున ఇంజనీర్లు మేల్కోవాల్సిన అవసరం ఉంది. జలాశయాల్లో తాగునీటి నిల్వలు ఇలా.. నగరానికి రోజు ఐదు ఎంసీఎఫ్టీల నీళ్లు అవసరం. మూడు జలాశయాల్లో ఉన్న నిల్వలు మరో 30 రోజులకు సరిపోతాయని ఇంజనీర్లు చెబుతున్నారు. ధర్మసాగర్ చెరువు సామర్థ్యం 839 ఎంసీఎఫ్టీలు. ప్రస్తుతం 200 ఎంసీఎఫ్టీల వరకు నీళ్లున్నాయి. అందులో డెడ్ స్టోరేజీ 60 ఎంసీఎఫ్టీలు. ఆవిరిగా 30 శాతం అంటే 42 ఎంసీఎఫ్టీల నీళ్లు పోగా 98 ఎంసీఎఫ్టీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వడ్డేపల్లి చెరువు సామర్థ్యం 139 ఎంసీఎఫ్టీలు. ప్రస్తుత నీటి నిల్వలు 113 ఎంసీఎఫ్టీలు. డెడ్ స్టోరేజీ 20 ఎంసీఎఫ్టీలు. ఆవిరిగా 30 శాతం అంటే 28 ఎంసీఎఫ్టీలు పోగా 65 ఎంసీఎఫ్టీ నిల్వ ఉంది. భద్రకాళి చెరువు సామర్థ్యం 150 ఎంసీఎఫ్టీలు కాగా ప్రస్తుత నిల్వలు 130 ఎంసీఎఫ్టీలు. అందులో డెడ్ స్టోరేజీ 20 ఎంసీఎఫ్టీలు ఉండగా, నీటి ఆవిరిగా 33 ఎంసీఎఫ్టీలు 77 ఎంసీఎఫ్టీలు మాత్రమే. -
మలిదశకు ‘పాలమూరు’!
♦ ఉద్ధండాపూర్– కేపీ లక్ష్మీదేవునిపల్లి అనుసంధానానికి ప్రణాళిక సిద్ధం ♦ రూ. 3,020 కోట్లతో రిజర్వాయర్, టన్నెళ్లు, ♦ కాల్వల తవ్వకానికి కార్యాచరణ ♦ మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవనున్న నీటిపారుదల శాఖ సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మిగిలిన పనులను సైతం చేపట్టేందుకు నీటి పారుదల శాఖ నడుం బిగించింది. ఉద్ధండాపూర్ రిజర్వాయర్ నుంచి కేపీ లక్ష్మీదేవునిపల్లి వరకు చేపట్టిన పనులను మొదలు పెట్టేందుకు సిద్ధమైంది. మలిదశలో భాగంగా ఉద్ధండాపూర్ నుంచి కేపీ లక్ష్మీదేవునిపల్లి వరకు ఓపెన్చానల్, టన్నెళ్లు, పంప్హౌస్, రిజర్వాయర్ల నిర్మాణాలకు రూ. 3,020 కోట్లతో వ్యయ అంచనాలను సిద్ధం చేసిన నీటి పారుదల శాఖ ఈ పనులను మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచేందుకు సన్నద్ధమవుతోంది. వాస్తవానికి పాలమూరు ప్రాజెక్టుతో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ నగరానికి తాగునీరు, పరిశ్రమలకు నీటి వసతిని కల్పించే ఉద్దేశంతో రూ. 35,200 కోట్ల వ్యయంతో చేపట్టారు. ఈ పథకం ద్వారా శ్రీశైలం నుంచి 60 రోజుల్లో 120 టీఎంసీల నీటిని, వరద జలాలను తీసుకొని ఆయకట్టుకు మళ్లించేందుకు మొత్తంగా 6 రిజర్వాయర్లు, 5 లిఫ్టులను ప్రతిపాదించారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్ధండాపూర్, కేపీ లక్ష్మీదేవునిపల్లి వద్ద రిజర్వాయర్లు నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందులో రంగారెడ్డిలో నిర్మించే కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా ప్రాజెక్టులోని ఐదు రిజర్వాయర్లు, వాటికి అనుసంధానంగా నిర్మించే టన్నెల్, కాల్వల పనులను 18 ప్యాకేజీలుగా విభజించారు. మొత్తంగా రూ. 30 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి గత ఏడాదిలోనే పనులు ఆరంభించారు. అయితే ఉద్ధండాపూర్ నుంచి కేపీ లక్ష్మీదేవుని పల్లి మధ్యలో కొత్త ప్రతిపాదనలు రావడంతో ఈ పనులు చేపట్టలేదు. అయితే ప్రస్తుతం అవన్నీ కొలిక్కి వస్తుండటంతో ఈ పనులకు టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. రూ. 3 వేల కోట్లు.. 3 ప్యాకేజీలు.. ఉద్ధండాపూర్ నుంచి కేపీ లక్ష్మీదేవుని పల్లి అనుసంధాన ప్రక్రియను ప్యాకేజీ–19లో చేర్చిన అధికారులు.. ఇక్కడ 18 కిలోమీటర్ల మేర ఓపెన్ చానల్, 14 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మించాల్సి ఉంటుందని తేల్చారు. ఇందుకోసం టన్నెల్ నిర్మాణానికి రూ. 541కోట్లు, ఓపెన్ చానల్కు రూ. 592 కోట్లు అంచనా వేశారు. భూసేకరణ, ఇతర అవసరాలతో కలిపి మొత్తంగా ఈ ప్యాకేజీకి రూ. 1372.20 కోట్లు వ్యయం కానుంది. ఇక ప్యాకేజీ–20లో స్టేజ్–5 పంప్హౌస్ను చేర్చగా, దీనికి మరో రూ. 876.70 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు. ఇక 2.80 టీఎంసీల సామర్థ్యంతో లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి రూ. 751.50 కోట్లు అంచనా వేశారు. ఈ రిజర్వాయర్ కింద ఏకంగా 4.13 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉండగా, రిజర్వాయర్ కింద 1,340 ఎకరాల మేర ముంపు ఉండనుంది. మొత్తంగా మూడు ప్యాకేజీలకు రూ. 3,020.40 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయగా, వీటిని ఆమోదించి, టెండర్లు పిలిచేందుకు అనుమతి కోసం ప్రాజెక్టు అధికారులు ఉన్నతాధికారులకు పంపారు. అక్కడ ఆమోదం దక్కితే వెంటనే ఈ మూడు ప్యాకేజీలకు టెండర్లు పిలవనున్నారు. -
రిజర్వాయర్లు, వాగులకు 2,226 ఎకరాలు
భూసేకరణకు ప్రభుత్వం అనుమతి సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రతిపాదిస్తున్న మూడు రిజర్వాయర్లు, వాగుల విస్తరణకు అవసరమైన 2,226 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సీఆర్డీఏ కార్యకలాపాలపై సీఎం చంద్రబాబు బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ వివరాలను మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మీడియాకు వివరించా రు. కొండవీటి వాగు సుందరీకరణ, వరద మళ్లింపుపై నెదర్లాండ్కు చెందిన బ్లూ కన్సల్టెంట్ ఆర్కాడిస్ ఇచ్చిన సవివర నివేదికకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. కొండవీటి వాగు వెడల్పునకు 885 ఎకరాలు, పాలవాగు వెడల్పునకు 433 ఎకరాలు, గ్రావిటీ కాలువలు వెడల్పు చేయడానికి 218 ఎకరాలు.. మొత్తం 1,536 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని నివేదికలో పేర్కొనట్లు స్పష్టం చేశారు. ఈ భూసేకరణను వెంటనే పూర్తిచేసి, ఈ వాగులకు సంబంధించి పనులను వర్షాకాలం రాకముందే పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు వెల్లడించారు. బైపాస్ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం అందంగా కనిపించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్డీఏ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని పక్కనే కృష్ణా నదిలో ఉన్న ఏడు ద్వీపాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు తెలిపారు. రాజధానిలో చేపట్టిన ఏడు ముఖ్యమైన రహదారుల నిర్మాణ పనులు నిర్దిష్ట వ్యవధిలో పూర్తి కావాలంటే తగిన యంత్రాంగాన్ని సమకూర్చుకోవాలని సూచించారు. -
రిజర్వాయర్లకు రూ.2,611 కోట్లు
సాక్షి, యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు సాగు నీరందించేందుకు చేపట్టిన బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్ల నిర్మాణానికి రూ.2611.25 కోట్లు విడుదయ్యాయి. గత నెలలోనే ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేయగా.. తాజాగా నిధులు విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా మల్లన్నసాగర్ పరిధిలో బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్లను చేపట్టారు. గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో చేపట్టిన ఐదు రిజర్వాయర్లలో రెండు యాదాద్రిభువనగిరి జిల్లాలో ఉన్నాయి. పూర్తిగా సాగునీటి ప్రాజెక్టులు లేని ఈజిల్లాకు రెండు రిజర్వాయర్లను నిర్మించి సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వ లక్ష్యం. భువనగిరి మండలం బస్వాపురం రిజర్వాయర్ను 11.39, తుర్కపల్లి మండలం గంధమల్ల రిజర్వాయర్ను 9.86 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్నారు. ఈ రెండు రిజర్వాయర్ల సామర్థ్యం పెంపుతో యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 2,43,500 ఎకరాలకు సాగునీరు అందనుంది. దీంతోపాటు హైదరాబాద్లోని కొంత ప్రాంతానికి తాగు నీరివ్వాలని నిర్ణయించారు. ఇదీ సామర్థ్యం.. ముందుగా ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్లో భాగంగా బస్వాపురం రిజర్వాయర్ను .08 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని 14.69 టీఎంసీలుగా నిర్ణయించారు. దీంతో భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో ఆరు గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది. ముందుగా పెంచిన రిజర్వాయర్ సామర్థ్యాన్ని ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో 11.39 టీఎంసీలుగా తగ్గించారు. అలాగే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు 15,16 ప్యాకేజీల్లో కాల్వల పనులు పురోగతిలో ఉన్నాయి. బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్ల ద్వారా హైదరాబాద్ నగర ప్రజల దాహా ర్తిని తీర్చడంతోపాటు పాటు జి ల్లాలోని భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాలకు సాగు నీరందనుంది. గంధమల్ల రిజర్వాయర్ వల్ల ఆలేరు నియోజకవర్గంలోని రాజాపే ట, యాదగిరిగుట్ట మండలాల్లో కొంతభాగం, ఆలేరు, గుండాల మండలాల రైతులకు సాగు నీరందనుంది. నిధుల కేటాయింపు ఇలా.. జిల్లాలో నిర్మించే బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్ల నిర్మాణ నిధులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గంధమల్ల రిజర్వాయర్ కోసం రూ.860.25కోట్లు, బస్వాపురం రిజర్వాయర్ కోసం రూ.1751 కోట్లు కేటాయించి ఖర్చు చేస్తారు. కేబినెట్లో అనుమతి రావడంతో ఇక టెండర్ల ప్రక్రియ ప్రారంభించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. -
నీటి లభ్యతపై దేశవ్యాప్త మదింపు
► ‘సాక్షి’తో కేంద్ర జల సంఘం చైర్మన్ జీఎస్ ఝా ► 1993 తరువాత మదింపు ఇదే తొలిసారి ►వచ్చే ఏడాదికల్లా పూర్తయ్యే అవకాశం ► రైతులు పొదుపుగా నీటిని వాడాలని సూచన సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న నీటి వనరుల మదింపు కోసం కేంద్ర జల సంఘం చేస్తున్న ప్రయత్నాలు తుదిదశలో ఉన్నాయని సంస్థ చైర్మన్ జీఎస్ ఝా వెల్లడించారు. అత్యాధునిక సాఫ్ట్వేర్ సాయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాదికల్లా పూర్తవుతుందని చెప్పారు. 1993 తరువాత ఇలాంటి కార్యక్రమం చేపట్టడం ఇదే మొదటిసారని తెలిపారు. గత అంచనాల ప్రకారం దేశంలో మొత్తం 4,000 బీసీఎం (శతకోటి ఘనపు మీటర్లు) నీటి వనరులు అందుబాటులో ఉండగా.. అందులో 1,860 బీసీఎం నీరు ఆవిరిగా మారుతున్నట్లు లెక్కించారని చెప్పారు. వాతావరణ మార్పులపై జరిగిన ఒక సదస్సులో పాల్గొనేందుకు బుధవారం హైదరాబాద్ వచ్చిన జీఎస్ ఝా ‘సాక్షి’తో మాట్లాడారు. రెండేళ్ల వర్షాభావం తరువాత ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్లలో సంతృప్తికరమైన స్థాయిలో నీరు అందుబాటులో ఉందని ఆయన చెప్పారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే రెట్టింపుగా, గత పదేళ్ల సగటు స్థాయికి సమానంగా జలాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. వాతావరణ మార్పుల ప్రభావం వ్యవసాయంపై తీవ్రంగా ఉండబోతోందన్న అంచనాల నేపథ్యంలో... రైతులు నీటిని వీలైనంత పొదుపుగా, సమర్థవంతంగా వాడుకోవాలని సూచించారు. భవిష్యత్తులో నీటి లభ్యత తగ్గే పరిస్థితులు వస్తే.. సముద్రపు నీటిని మంచినీటిగా మార్చి సాగుకు వాడుకోవచ్చునని... ఇజ్రాయెల్, మధ్యప్రాచ్య దేశాలు ఇప్పటికే ఆ దిశగా ప్రగతి సాధించాయని తెలిపారు. పూడిక చేరకుండా చర్యలు శ్రీశైలం, తుంగభద్రలతోపాటు అనేక రిజర్వాయర్లలో పేరుకుపోయిన పూడికను తీయడం పెద్ద సమస్య కాకపోయినా.. తీసిన మట్టిని ఏం చేయాలన్నది కూడా చూడాలని జీఎస్ ఝా పేర్కొన్నారు. చాలా రిజర్వాయర్లలోని పూడిక సారవంతమైన మట్టి ఉన్నా.. కొన్నింటిలో ఇసుక మాత్రమే ఉందన్నారు. అయితే భవిష్యత్తులో రిజర్వాయర్లలో పూడిక చేరకుండా కొన్ని చర్యలు చేపట్టామని చెప్పారు. వాతావరణ మార్పు ల కారణంగా హిమనీ నదాల (గ్లేసియర్స్) పరిమాణం తగ్గిపోతోందన్న వార్తల నేపథ్యంలో తాము హిమాలయాల్లోని దాదాపు 500 హిమనీనదాలపై అధ్యయనం చేశామన్నారు. గత కొన్నేళ్లలో వాటిలో కొన్నింటి పరిమాణం తగ్గగా.. కొన్నింటి పరిమాణం 15 శాతం నుంచి 20 శాతం వరకూ పెరిగిందని చెప్పారు. దీని ఫలితంగా హిమనీనదాల పరిమాణం తగ్గుదలకు, వాతావరణ మార్పులకు ప్రత్యక్ష సంబంధం ఉందని కచ్చితంగా చెప్పలేకపోతున్నామని అన్నారు. -
రిజర్వాయర్ల నిర్మాణంపై జేసీ సమీక్ష
డిండి: పాలమూరు-డిండి ప్రాజెక్టులో భాగంగా నిర్మించే రిజర్వాయర్లపై నల్లగొండ జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి సమీక్ష జరిపారు. శనివారం ఆయన డిండి ప్రాజెక్టు అతిథిగృహంలో డీఈ, ఈఈలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సింగరాజుపల్లి, గొట్టిముక్కల, చింతపల్లి, శివన్నగూడెం, కిష్టారంపల్లిలలో చేపట్టాల్సిన పనుల పురోగతి, అవరోధాలపై చర్చించారు. పనుల వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. -
జల విద్యుత్పై ఆశలు...
సాక్షి, హైదరాబాద్: జల విద్యుదుత్పత్తి ఆశలు రేకెత్తిస్తోంది. భారీ వర్షాలు కురిసి రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు నిండడంతో ఈ ఏడాది పెద్దెత్తున జల విద్యుదుత్పత్తిపై ఆశలు చిగురించాయి. గతేడాది తీవ్ర వర్షాభావం వల్ల జలాశయాలు వెలవెలబోవడంతో నామమాత్రంగా విద్యుదుత్పత్తి జరిగింది. ఈ సారి జూరాల, దిగువ జూరాల, శ్రీశైలం ఎడమ గట్టు, సింగూరు, నిజాంసాగర్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. గతేడాది 2015-16లో 290 మిలియన్ యూనిట్ల(ఎంయూ) జల విద్యుదుత్పత్తి మాత్రమే జరగగా.. ఈ ఏడాది 2016-17లో ఇప్పటి వరకు 718 ఎంయూల ఉత్పత్తి జరిగింది. 2014-15లో మాత్రం అత్యధికంగా 3128.69 ఎంయూల జల విద్యుదుత్పత్తి జరిగింది. జల విద్యుత్కు ఢోకా లేదు... జూరాల, దిగువ జూరాల, శ్రీశైలం ఎడమగట్టు, నాగార్జున సాగర్, నాగార్జునసాగర్ ఎడమగట్టుతో సహా రాష్ట్రంలో 2321.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలున్నాయి. సాగర్ మినహా మిగిలిన ప్రధాన జల విద్యుత్ కేంద్రాల్లో గత కొన్నిరోజులుగా నిరంతర విద్యుదుత్పత్తి జరుగుతోంది. 2015 ఏప్రిల్- సెప్టెంబర్ మధ్యకాలంలో 63 ఎంయూల ఉత్పత్తి జరిగితే ...సరిగ్గా అదే వ్యవధిలో అంటే, 2016 ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య కాలంలో 701 ఎంయూల ఉత్పత్తి జరిగింది. ఈ ఏడాది 2016-17లో 3420 ఎంయూల జలవిద్యుదుత్పత్తి జరగవచ్చని డిస్కంలు ఆశపెట్టుకున్నాయి. అయితే, ఇంతకు మించి 3841 ఎంయూల ఉత్పత్తి జరిగే అవకాశముందని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) టారీఫ్ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నాగార్జున సాగర్ జలవిద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 1119 ఎంయూలు, శ్రీశైలం ఎడమగట్టు నుంచి 1350 ఎంయూలు, దిగువ జూరాల నుంచి 534 ఎంయూలు, జూరాల నుంచి 109 ఎంయూలు, ఇతరాత్రా జల విద్యుత్ కేంద్రాలు కలుపుకుని మొత్తం 3841 ఎంయూల వార్షిక ఉత్పత్తికి అవకాశముందని స్పష్టం చేసింది. ఇప్పటికే 718 ఎంయూల ఉత్పత్తి జరిగింది. మరోవైపు జలాశయాల నిండా నిల్వలు ఉండడంతో వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోపు ఈఆర్సీ అంచనాలకు మించి విద్యుదుత్పత్తికి అవకాశాలున్నాయి. 2016-17లో రాష్ట్ర విద్యుత్ అవసరాలు 52,063 ఎంయూలు కాగా అందులో జల విద్యుత్ వాటా 3841 ఎంయూలు కావడం విశేషం. -
పీసీబీ వర్సెస్ జలమండలి
► మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణంలో జాప్యం ► నిధులివ్వడం లేదని పీసీబీపై జలమండలి ఫిర్యాదు ► రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ.. సాక్షి, సిటీబ్యూరో: జలాశయాల చుట్టూ ఎస్టీపీల (మురుగు శుద్ధి కేంద్రాలు) నిర్మాణం విషయంలో జలమండలికి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) మధ్య సమన్వయ లోపం తలెత్తింది. చివరకు ఈ వివాదం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దకు చేరుకుంది. ఎస్టీపీల నిర్మాణానికి నిధుల విడుదల చేయడంలో పీసీబీ జాప్యం చేస్తోందని జలమండలి ఆరోపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే...గ్రేటర్ వరదాయినిలు ఉస్మాన్సాగర్(గండిపేట్), హిమాయత్సాగర్ జలాశయాలు కాలుష్య కాసారాలు కాకుండా కాపాడేందుకు పలుచోట్ల ఎస్టీపీలను నిర్మించాలని నిర్ణయించారు. ఈమేరకు పీసీబీ రూ.13 కోట్లు నిధులు మంజూరు చేయాల్సి ఉంది. అయితే మొదట నిధుల విడుదలకు అంగీకరించి, తర్వాత పీసీబీ వెనక్కి తగ్గినట్లు తెలియడంతో ఈ అంశంపై జలమండలి అధికారులు సీఎస్కు ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించాలని లేఖ రాశారు. ఈ వ్యవహారంపై త్వరలో సీఎస్ సమక్షంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగితేనే ఈ పంచాయతీకి ఫుల్స్టాప్ పడనున్నట్లు సమాచారం. మురుగు శుద్ధి కేంద్రాలు ఎందుకంటే.. జంట జలాశయాలకు కాలుష్య విషం నుంచి విముక్తి కల్పించేందుకు 11 గ్రామాల పరిధిలో మురుగు శుద్ధి కేంద్రాలు(ఎస్టీపీ)లను నిర్మించాలని ఏడాది క్రితం జలమండలి సంకల్పించింది. సుమారు రూ.40.50 కోట్ల అంచనా వ్యయంతో వీటిని నిర్మించాలని ప్రతిపాదించింది. ఉస్మాన్సాగర్(గండిపేట్)కు ఆనుకొని ఉన్న ఖానాపూర్,వట్టినాగులపల్లి, జన్వాడ, అప్పోజిగూడా, చిలుకూరు, బాలాజీ దేవాలయం, హిమాయత్నగర్ గ్రామాల పరిధిలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక హిమాయత్సాగర్ పరిధిలో హిమాయత్సాగర్, అజీజ్నగర్, ఫిరంగినాలా, కొత్వాల్గూడా పరిధిలో ఎస్టీపీలు నిర్మించాలని తలపెట్టింది. వీటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను పీబీఎస్ సంస్థ సిద్ధంచేసింది. వీటి నిర్మాణానికి అయ్యే వ్యయంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రూ.13 కోట్లు, పంచాయతీరాజ్శాఖ రూ.27.50 కోట్లు వ్యయం చేయాలని గతంలో నిర్ణయించారు. వీటి నిర్మాణం, నిర్వహణ పనులను జలమండలి పర్యవేక్షించనుంది. ఆయా గ్రామాల నుంచి రోజువారీగా వెలువడే వ్యర్థజలాలను మురుగు శుద్ధి కేంద్రాలకు తరలిస్తారు. రోజువారీగా ఇక్కడికి వచ్చే గృహ, పారిశ్రామిక, వాణిజ్య వ్యర్థజలాలను శుద్ధిచేసిన అనంతరం స్థానికంగా ఆయా గ్రామాల పరిధిలో గార్డెనింగ్, వనసంరక్షణకు వినియోగించనున్నట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఇన్ఫ్లో చానల్స్నూ ప్రక్షాళన చేయాల్సిందే..! జంటజలాశయాల ఎగువ ప్రాంతాల్లో ఉన్న సుమారు 84 గ్రామాల పరిధినుంచి జలాశయాలకు వరదనీటిని చేర్చే కాల్వలు(ఇన్ఫ్లోఛానల్స్)కబ్జాకు గురవడం,ఇటుకబట్టీలు, ఇసుక మాఫియాకు అడ్డాలుగా మారడం, ఫాంహౌజ్లు, ఇంజినీరింగ్ కళాశాలలు, గోడౌన్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు నిలయంగా మారడంతో జలాశయాలు రోజురోజుకూ చిన్నబోతున్నాయి. ప్రస్తుతం ఈ జలాశయాలు చుక్క నీరు లేక చిన్నబోయి కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఆయా ఇన్ఫ్లో చానల్స్ను యుద్ధప్రాతిపదికన ప్రక్షాళన చేయాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఎస్టీపీలు నిర్మించాల్సిన గ్రామాలు..వాటి సామర్థ్యం ఇలా... ♦ ఉస్మాన్సాగర్(గండిపేట్ జలాశయం పరిధిలో) ఖానాపూర్–0.6 మిలియన్ లీటర్లు వట్టినాగులపల్లి–0.8 మిలియన్ లీటర్లు జన్వాడ–0.6 మిలియన్ లీటర్లు అప్పోజిగూడా–0.1 మిలియన్ లీటర్లు చిలుకూరు–0.7 మిలియన్ లీటర్లు బాలాజీ దేవాలయం–0.1 మిలియన్ లీటర్లు హిమాయత్నగర్–0.3 మిలియన్ లీటర్లు ♦హిమాయత్సాగర్ పరిధిలో... హిమాయత్సాగర్–0.25 మిలియన్ లీటర్లు అజీజ్నగర్–0.9 మిలియన్ లీటర్లు ఫిరంగినాలా–2.9 మిలియన్ లీటర్లు కొత్వాల్గూడా–0.3 మిలియన్ లీటర్లు -
5 రిజర్వాయర్లు.. రూ.5,200 కోట్లు!
డిండి ప్రాజెక్టు కింద నల్లగొండ జిల్లాలో నిర్మాణం 3.14 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా ప్రణాళిక ఆమోదముద్ర వేసిన సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టు డిజైన్ను ప్రభుత్వం ఓ కొలిక్కి తెచ్చింది. నీటి వినియోగం, నిర్మించే రిజర్వాయర్లు, వాటి సామర్థ్యాలపై కసరత్తు పూర్తి చేసింది. రూ.5,200 కోట్లతో ఐదు రిజర్వాయర్లను నిర్మించాలనే అభిప్రాయానికి వచ్చింది. కృష్ణాలో వరద ఉండే రోజుల్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉండే నార్లాపూర్ నుంచి 60 రోజుల్లో రోజుకు అర టీఎంసీ చొప్పున 30 టీఎంసీలు తీసుకునేందుకు నిర్ణయించింది. శనివారం రాత్రి జరిగిన సమావేశంలో ప్రాజెక్టులో నిర్మించే రిజర్వాయర్లకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆమోదముద్ర వేశారు. డిండి కింద మొత్తంగా 3.41 లక్షల ఎకరాలకు సాగునీటిని ఇచ్చేలా ప్రణాళిక ఖరారు చేశారు. నార్లపూర్ నుంచి డిండికి అక్కడి నుంచి 3 ఆఫ్లైన్, 2 ఆన్లైన్ రిజర్వాయర్ల ద్వారా నీటిని తరలించనున్నారు. 22 టీఎంసీల సామర్థ్యంతో వీటిని నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఆఫ్లైన్లో సింగరాజుపల్లి (0.81 టీఎంసీ), గొట్టిముక్కల (1.76 టీఎంసీ), చింతపల్లి (0.9 టీఎంసీ) రిజర్వాయర్లు, ఆన్లైన్లో కిష్టరాంపల్లి (6.78 టీఎంసీ), శివన్నగూడెం (11.96 టీఎంసీ) రిజర్వాయర్లు ఉండనున్నాయి. 59 కిలోమీటర్ల మేర కెనాల్, ఇందులో 2.5 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించనున్నారు. వీటికి మొత్తంగా రూ.5,200 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. కిష్టరాంపల్లిలో చిన్నపాటి మార్పులు జరిగే అవకాశం ఉందని, అది మినహా మిగతా రిజర్వాయర్లు అన్నీ కొలిక్కి వచ్చినట్లేనని నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు. వీలైనంత త్వరగా వీటికి టెండర్లు పిలుస్తామని స్పష్టం చేశారు. -
‘భగీరథ’లో వేగం
♦ చురుగ్గా ఓవర్హెడ్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ♦ పైపుల సరఫరా.. ఊపందుకున్న నిర్మాణాలు ♦ నీటి సరఫరాకు రూ.240 కోట్లు ♦ 218 గ్రామాలకు రక్షిత తాగునీటి సరఫరా లక్ష్యం ‘మిషన్ భగీరథ’ వేగం పుంజుకుంది. ఇంటింటికీ తాగునీటిని అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం మరికొన్ని నెలల్లో సాకారం కానుంది. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు భారీ నీటి సంప్లు, నీటి ట్యాంకులు నిర్మించే పనులను వేగవంతం చేశారు. ఇప్పటికే ప్రధాన పైప్లైన్లు పనులు పూర్తి కాగా.. మండల కేంద్రాలు, గ్రామాలకు పైప్ల వేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన పనులు చేస్తుండడంతో పురోగతి కొట్టొచ్చినట్లు కనపడుతోంది. - చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లోని 214 గ్రామాలతో పాటుగా రాజేంద్రనగర్ మండలంలోని గండిపేట, కోకాపేట్, హిమాయత్సాగర్, ఖానాపూర్ గ్రామాలకు నీటిని అందించడానికి ప్రభుత్వం రూ.240 కోట్లు కేటాయించింది. కాగా నియోజకవర్గ పరిధిలోని నవాబుపేట మండలంలోని గ్రామాలకు నీటి సరఫరా మాత్రం వికారాబాద్ మిషన్ భగీరథ పరిధిలోకి చేర్చారు. దీంతో ఇప్పటికే మండలాల్లోని ప్రధాన పైపులైను పనులు వేగవంతంగా నడుస్తున్నాయి. నీటి సరఫరా పైపులను కూడా సరఫరా చేశారు. 30 నెలల్లో పూర్తి.. 2015 డిసెంబరు నుంచి 2018 జూన్ వరకు అంటే 30 నెలల కాల వ్యవధిలో ఈ పనులను పూర్తిచేసి ఇంటింటికీ తాగునీటిని అందించాలని ప్రభుత్వం ఆదేశించడంతో పనుల్లో పురోగతి కనిపిస్తోంది. నియోజవర్గంలో మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేయడానికి ఏడు ఓహెచ్బీఆర్ (ఓవర్హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్) అవసరం ఉండగా సింగాపూర్ వద్ద లక్ష లీటర్ల ట్యాంకు ఇప్పటికే ఉంది. కాగా.. మిగతా ఆరు రిజర్వాయర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. బెంచ్ మార్క్కు (భూమి ఉపరితలానికి) 280 మీటర్ల ఎత్తులో షాబాద్ మండలం అంతారం వద్ద ఎత్తై ప్రదేశం ఉండడంతో అక్కడనే 40 ఎంఎల్డీ ట్రీట్మెంట్ ప్లాంట్ను నిర్మిస్తున్నారు. ఇక్కడ నుంచే నియోజకవర్గంలోని మండలాలకు తాగునీటిని సరఫరా చేయనున్నారు. నీటి సరఫరా ఇలా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ‘డ్రా వాటర్’ (శుద్ధిలేని నీరు)ను మొదటగా మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ వద్ద గల ఎలికట్ట చౌరస్తాలో నిర్మించనున్న భారీ సంపులోకి సరఫరా చేస్తారు. అక్కడి నుంచి షాబాద్ మండలం అంతారం వద్ద రెండు ఎకరాల్లో నిర్మించనున్న 40 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ ఫర్ డే) ట్రీట్ఫ్లాంట్లోకి చేరుస్తారు. అనంతరం అక్కడే నిర్మించనున్న 10 లక్షల లీటర్ల ఓహెచ్బీఆర్ (ఓవర్హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్) నుంచి పలు ప్రాంతాలకు నీటిని సరఫరా చేయనున్నారు. ఇందులో భాగంగా షాబాద్ మండల కేంద్రంలో నిర్మించనున్న లక్ష 20 వేల లీటర్ల ఓహెచ్బీఆర్ ద్వారా 56 గ్రామాలకు రక్షిత తాగునీటిని సరఫరా చేస్తారు. అంతారం వద్ద నిర్మించే పది లక్షల లీటర్ల ట్యాంకు ద్వారా మరో 25 గ్రామాలకు సరఫరా చేస్తారు.చేవెళ్ల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట గల ప్రభుత్వ ఖాళీ స్థలంలో నిర్మిస్తున్న రెండు లక్షల ఓహెచ్బీఆర్ ద్వారా 38 గ్రామాలకు నీటి సరఫరా చేయాలని నిర్ణయించారు. మండలంలోని దామరగిద్ద వద్ద నిర్మిస్తున్న లక్ష లీటర్ల ట్యాంకు ద్వారా మరో 25 గ్రామాలకు నీటిని అందిస్తారు. చేవెళ్లలో నిర్మిస్తున్న ఓహెచ్బీఆర్ ద్వారా 4 లక్షల లీటర్ల నీటిని శంకర్పల్లి, మొయినాబాద్ మండలాల్లోని 74 గ్రామాలకు నీటిని అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. శంకర్పల్లి మండలం సింగాపూర్ వద్ద ఇప్పటికే ఉన్న లక్ష లీటర్ల ఓహెచ్బీఆర్ ద్వారా కూడా వివిధ గ్రామాలకు నీటిని సరఫరా చేయనున్నారు. వేగంగా పనులు మిషన్ భగీరథ పనుల వేగంగా కొనసాగుతోంది. 2015 డిసెం బరు నుంచి 30 నెల లలోగా ఈ పనులు పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకు అనుగుణంగానే ఓహెచ్బీఆర్, పైపులైన్లు వేసే పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన కాలపరిమితి లోగా పనులు పూర్తిచేసేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నాం. -వీ నరేందర్, మిషన్ భగీరథ పథకం డీఈఈ, చేవెళ్ల -
అడియాశలు
► అన్ని జలాశయాలు ఖాళీ ఖాళీ...... అడుగంటుతున్న నీటిమట్టం ► జూన్ మొదటి వారానికి డెడ్స్టోరేజ్కు ► రెండో పంటకు నీళ్లివ్వక పోవడం వల్లే ఈ మాత్రమైనా నీరుంది ► మంత్రి ఎం.బి.పాటిల్ సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలోని జలాశయాలన్నీ అడుగంటిపోతున్నాయి. రాష్ట్ర ప్రజలకు జీవజలాన్ని అందిస్తూ వచ్చిన ప్రముఖ జలాశయాల్లో సైతం నీటిమట్టం డెడ్స్టోరేజ్కు సమీపంలో ఉందంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాస్తంత పొదుపుగా వాడుకుంటే ఈ నీళ్లు జూన్ మొదటి వారం వరకు రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చగలవని అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఆ తరువాత మాత్రం డెడ్స్టోరేజ్లోని నీటిని సైతం తోడేసి శుద్ధి చేసి అందజేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడింది. అయితే జూన్ వరకు కూడా వర్షాలు లేకపోతే అప్పుడేం చేయాలన్న భయం ప్రభుత్వ యంత్రాంగాన్నీ, ప్రజలను కూడా వేధిస్తోంది. బెంగళూరుకు తాగునీటిని అందజేసే కేఆర్ఎస్ డ్యామ్లో నీటిమట్టం ఇప్పటికే డెడ్స్టోరేజ్ సమీపానికి చేరుకోవడంతో బెంగళూరు నగరంలో వారానికి రెండు సార్లు మాత్రమే నీటిని సరఫరా చేసే పరిస్థితి తలెత్తింది. రానున్న రోజుల్లో వారానికి ఒకేసారి నీటిని సరఫరా చేయాలని, తద్వారా కాస్తంత నీటిని పొదుపు చేయాలని ఇప్పటికే రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి అధికారులు బెంగళూరు జలమండలి అధికారులను ఆదేశించారు. దీంతో బెంగళూరులోని ప్రజలు ప్రస్తుతం నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనక తప్పేలా లేదు. గురువారం నాటికి కేఆర్ఎస్ జలాశయంలో 10.92టీఎంసీల నీటిమట్టం నమోదైంది. ఇక ఇదే సందర్భంలో రాష్ట్రంలోని అన్ని జలాశయాల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలైన కబినిలో శుక్రవారం నాటికి 4.41టీఎంసీలు, ఆలమట్టిలో 13.61టీఎంసీలు, నారాయణ్పూర్లో 13.34టీఎంసీలు, హారంగిలో 1టీఎంసీల నీటిమట్టం నమోదైంది. నీటిని పొదుపుగా వాడుకోవాలి...... రాష్ట్రంలో పరిస్థితిని ముందుగానే ఊహించి నవంబర్లో రెండో పంటకు నీరివ్వబోమని ప్రకటించాము. రైతు సంఘాల నుండి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నందుకే ఇప్పటికీ రాష్ట్ర ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడగలుగుతున్నాం. ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న నీరు జూన్ మొదటి వారం వరకు రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చేందుకు సరిపోతుంది. అప్పటికీ వర్షాలు కురవకపోతే ఇక డెడ్స్టోరేజ్లో ఉన్న నీటిని సైతం శుద్ధి చేసి ప్రజలకు అందజేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ప్రజలు నీటిని చాలా పొదుపుగా వినియోగించుకోవాలని కోరుతున్నాం. లేదంటే కర్ణాటకలో సైతం రైళ్ల ద్వారా నీటిని అందజేయాల్సిన పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది. - ఎం.బి.పాటిల్, రాష్ట్ర భారీ, మధ్యతరహా నీటిపారుదల శాఖ మంత్రి -
డెడ్ స్టోరేజీ !
అడుగంటిన జలాశయాలు రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి కష్టాలు తక్కువ వర్షపాతంతో తగ్గిన భూగర్భ జలాలు బెంగళూరు: రాష్ట్రంలో జలాశయాలు అడుగంటాయి. ఎప్పుడూ లేనంతగా కృష్ణ, కావేరి నది పరివాహక ప్రాంతంలోని జలాశయాల్లో డెడ్ స్టోరేజీ కంటే నీటి మట్టం కిందకు పడిపోయింది. దీంతో ఈసారి బెంగళూరుతో సహా రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటిని ఎలా సరఫరా చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో కృష్ణ, కావేరి నదీ పరివాహక ప్రాంతంలోని ప్రధానంగా పదమూడు జలాశయాలు ఉన్నాయి. వీటి ద్వారానే రాష్ట్రంలో మెజారిటీ ప్రాంతాలకు తాగు, సాగునీటిని వదలుతారు. అయితే ఈ ఏడాది రాష్ట్రంలో రెండు వ్యవసాయ సీజన్లు అయిన ఖరీఫ్, రబీలో 17 శాతం తక్కువ వర్షపాతం కురిసింది. అంతేకాకుండా రాష్ట్రంలో అంతకు ముందు గత రెండేళ్లు కూడా వర్షం సరిగా పడలేదు. దీంతో రాష్ట్రంలోని నదుల్లో నీటి ప్రవాహం తగ్గిపోవడంతో జలాశయాల్లో కూడా నీటి నిల్వలు అడుగంటి పోతున్నాయి. కృష్ణ నదీపరివాహక జలాశయాలైన భద్ర, ఘటప్రభ, మలప్రభ, అల్మట్టి, నారాయణపుర జలాశయాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ విషయమై కర్ణాటక స్టేట్ న్యాచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్ (కేఎస్ఎన్డీఎంసీ) డెరైక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ...‘కావేరి నదీ పరివాహక ప్రాంతంలో నిర్మించిన కేఆర్ఎస్ వంటి జలాశయాల్లో డెడ్ స్టోరేజీ కంటే తక్కువకు నీటి మట్టం పడిపోవడం గమనించాం. అయితే కృష్ణ పరివాహక ప్రాంతంలో ఈ పరిస్థితి ఎప్పుడూ తలెత్తలేదు. ఈ ఏడాది మాత్రం కావేరితో పాటు కృష్ణ నదీపరివాహక ప్రాంతంలోని జలాశయాలు కూడా డెడ్స్టోరేజీ కంటే దిగువన నీటి మట్టాన్ని కలిగి ఉన్నాయి.’ అని పేర్కొన్నారు. ఇక బెంగళూరు తాగునీటి అవసరాలు తీర్చే కే.ఆర్.ఎస్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఈ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 49.45 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.31 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది ఇదే సమాయానికి (ఏప్రిల్-11) కేఆర్ఎస్లో 11.59 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. దీంతో ఈ వేసవిలో తాగు నీటి కోసం ఎప్పుడూ లేనంతగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. -
ఒట్టిపోయిన ఆశలు
జలాశయాల్లో అడుగంటిన నీరు మృత్యువాత పడుతున్న జలచరాలు ఉరుముతున్న నీటి ఎద్దడి బెంగళూరు: రాష్ట్రంలో జలాశయాలు అడుగంటాయి. ఎప్పుడూ లేనంతగా కృష్ణ, కావేరి నది పరివాహక ప్రాంతంలోని జలాశయాల్లో డెడ్ స్టోరీజీ కంటే నీటి మట్టం కిందకు పడిపోయింది. ఈసారి వేసవిలో బెంగళూరుతో సహా రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటిని ఎలా సరఫరా చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అంతేకాకుండా ఆయా నదుల్లో నీటి మట్టం తగ్గిపోతుండటంతో అందులోని జలచరాలు మృత్యువాత పడుతున్నాయి. రాష్ట్రంలో కృష్ణ, కావేరి నదీ పరివాహక ప్రాంతంలో జలాశయాల నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ తాగు, సాగు నీరు అందుతుండేది. పరిశ్రమల అవసరాలకు ఈ నీరే శరణ్యం. అయితే రాష్ట్రంలో రెండు వ్యవసాయ సీజన్లలోనూ (ఖరీఫ్, రబీ) తక్కువ వర్షపాతం నమోదైంది. అంతేకాకుండాఅంతకు ముందు రెండేళ్లు కూడా వర్షం సరిగా పడలేదు. దీంతో రాష్ట్రంలోని నదుల్లో నీటి ప్రవాహనం తగ్గిపోవడంతో జలాశయాల్లో కూడా నీటి నిల్వలు అడుగంటి పోతున్నాయి. కావేరి నదీతీరంలోని కేఆర్ఎస్, హారంగి, హేమావతి, కబిని జలాశయాల్లో ప్రస్తుతం 19.34 టీఎంసీల నీరు నిల్వ ఉండగా గత ఏడాది ఇదే సమయానికి 38.75 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. బెంగళూరుకు తాగునీటిని అందించే కే.ఆర్.ఎస్లో ప్రస్తుతం 10.88 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గత ఏడాదితో పోలిస్తే నీటి పరిమాణం సగాని కంటే తక్కువ. ఉత్తర కర్ణాటక ప్రాంతంల్లోని జిల్లాలకు తాగు,సాగు నీటిని అందించే కృష్ణ నదీపరివాహక ప్రాంతంలోని భద్ర, తుంగభద్ర, ఘటప్రభ, మలప్రభ, ఆల్మట్టి, నారాయణపుర జలాశయాల్లో గత ఏడాది ఈ సమయానికి 119.77 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 64.41 టీఎంసీలకు పడిపోయింది. వీటిలో కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ భాగాలకు సాగునీటిని అందించే తుంగభద్ర డ్యాం మరీ ఘోరం. ఈ డ్యాంలో ప్రస్తుతం 7.40 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది ఇదే సమాయానికి తుంగభద్ర డ్యాంలో 18.52 టీఎంసీల నీరు ఉండటం గమనార్హం. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల 98 తాలూకాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించగా ఈ ఏడాది 137 తాలూకాల్లో కరువు తాండవిస్తోంది. ఈ విషయమై రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఎం.బీ పాటిల్ మాట్లాడుతూ...‘జలాశయాల్లో నీరు లేక పోవడం వల్ల రాష్ట్రంలోని ప్రజలకు తాగు నీటిని అందించడమే గగనమవుతోంది. అందువల్లే రబీ పంటల కోసం కాలువలకు నీటి విడుదలను ఇప్పటికే నిలిపివేశాం. పరిశ్రమల అవసరాలకు నీటిని ఇవ్వకూడదని కూడా సంబంధితఅధికారులకు సూచించాం. అయినా ప్రజల దాహార్తిని తీరుస్తామని చెప్పలేం. వర్షం కోసం దేవుడిని ప్రార్థించాల్సిందే.’ అని పేర్కొన్నారు. -
వట్టిపోయిన రాజోళిబండ
3 రాష్ట్రాలకు తాగునీటి కష్టాలు జలాశయంలో 10 అడుగుల మేర చేరుకున్న పూడిక వట్టిపోయిన రాజోళిబండ జలాశయం మళ్లింపు పథకం రాయచూరు రూరల్ : ఆశించినంతగా ఈ ఏడాది వర్షాలు కురవక పోవడంతో జలాశయాలు వెలవెలబోతున్నాయి. దీనికి తోడు వేసవి ఎండలు అధికం కావడంతో నీటి కొరత అధికమైంది. దీంతో ప్రజలు, పశువులకు తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాయచూరు జిల్లాలోని మాన్వి తాలూకా రాజోళిబండ గ్రామం వద్ద తుంగభద్ర నదికి అడ్డంగానిర్మించిన రాజోళిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) జలాశయం నీరు లేక వట్టిపోయింది. రాజోళిబండ జలాశయంలో 10 అడుగుల మేర పూడిక పేరుకు పోయింది. రాజోళి బండ జలాశయం నీరు లేక వట్టిపోవడంతో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు వేసవిలో తాగునీటి ఇబ్బందులు ఎదురు కానున్నాయి. తుంగభద్ర నది తీర ప్రాంతంలోని రాయచూరు మాన్వి తాలూకా రాజోళిబండ, తిమ్మాపుర , రాజోళి, కాతరకి, దద్దల, రాయచూరు తాలూకా కుటక నూరు, ఆయనూరు, అరనళ్లి, ఎలెబిచ్చాలి, గట్టుబిచ్చాలి, హనుమాపుర, గోరకల్, జుకూర, కంబాలనత్తి, తెలంగాణలోని గద్వాల, శాంతినగర్, ఐజ, ఆంధ్రప్రదేశ్లోని మాధవరం, మంత్రాలయం ప్రాంతాలోని వేలాది గ్రామాల ప్రజలు తాగునీటి కోసం నానాయాతన పడుతున్నారు. -
గ్రేటర్కు నీళ్ల గండం
అడుగంటుతున్న జలాశయాలు మేల్కొనకపోతే తిప్పలే {పజా ప్రతినిధులపైనే బాధ్యత వరంగల్ : వరంగల్ నగర ప్రజలకు తాగునీటి కష్టాలు పొంచి ఉన్నాయి. ముందుచూపు లేని ప్రజాప్రతినిధులు, దీర్ఘకాలిక ప్రణాళికలు లేని అధికార యంత్రాంగం వైఖరితో గ్రేటర్ వరంగల్ ప్రజలు వేసవిలో తాగునీటి కోసం ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తున్నాయి. ఫిబ్రవరిలోనే మూడు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. ఇదే స్థాయిలో ఎండలు పెరిగితే మే, జూన్ నెలల్లో నీటి సరఫరా ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళనచెందుతున్నారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్కు నీటి సరఫరా చేసే జలాశయాలు అడుగంటిపోతున్నాయి. మరోవైపు జూలై వరకు వర్షాలు కురిసే పరిస్థితి లేదని వాతావరణ అంచనా నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వర్షాకాలం వచ్చే వరకు గ్రేటర్ వరంగల్ ప్రజల నీటి అవసరాలు తీర్చే విషయంలో ప్రజాప్రతినిధులు ఆశించిన మేరకు చొరవ తీసుకోవడం లేదు. మహా నగరర పాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ) అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తెలియడం లేదు. గ్రేటర్ వరంగల్ జనాభా తొమ్మిది లక్షలు కాగా, ప్రతిరోజూ నగరానికి వచ్చిపోయే వారితో కలిపితే సగటున పది లక్షల జనాభా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి వ్యక్తికి రోజుకు 160 లీటర్ల నీరు అవసరం. హైదరాబాద్ మహానగరంలో ఇదే తరహాలో నీటి సరఫరా చేస్తున్నారు. వరంగల్ నగరంలో మూడు రోజులకోసారి 90 లీటర్లే సరఫరా చేస్తున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో 75,446 నల్లా కనెక్షన్లు, 2067 చేతిపంపులు, 34 వాటర్ ట్యాంకర్లు ఉన్నా యి. నగర ప్రజలకు 365 రోజులు తాగునీరు ఇవ్వాలంటే నాలుగు టీఎంసీల నీరు అవసరం. వేసవిలో వరంగల్ ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన ధర్మసాగర్, వడ్డేపల్లి, భధ్రకాళి జలాశయాల నుంచి ఒకటిన్నర టీఎంసీల నీరే లభ్యమవుతోంది. మరో రెండున్నర టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాలు ఉండాల్సిన అవసరం ఉంది. వేసవిలో తాగునీటి అవసరాలను తీర్చేందుకు దేవాదుల, లోయర్ మానేరు ప్రాజెక్టు(ఎల్ఎండీ)లే ప్రధాన వనరులుగా ఉన్నాయి. వర్షాభావంతో దేవాదులలో నీటిని పంపింగ్ చేసే పరిస్థితి లేకపోగా, కరీంనగర్ జిల్లా ఎల్ఎండీలోనూ నీటి నిల్వ లేదు. ప్రత్యామ్నాయంగా చలివాగు, భీం ఘన్పూర్ జలాశయాల నుంచి నీటిని వరంగల్కు తరలించాలని జీడబ్ల్యూఎంసీ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇదే చేస్తే రెండు జలాశయాల కింద ఆయకట్టు రైతులు ఆందోళనలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తాగునీటి ఇబ్బందులను గట్టిక్కించే విషయంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. దీర్ఘకాలిక ప్రణాళికలు లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ధర్మసాగర్, వడ్డేపల్లి, భద్రకాళి జలాశయాల్లో 430 మిలియన్ క్యూబిక్ ఫీట్(ఎంసీఎఫ్టీ)ల నీటి నిల్వలున్నాయి. తాగునీటి సరఫరా ప్రక్రియలో భాగంగా మూడు ఫిల్టర్ బెడ్లతో ప్రస్తుతం 3.5 మిలియన్ క్యూబిక్ ఫీట్ నీటి శుద్ధి జరుగుతోంది. 123 రోజుల వరకు అంటే జూన్ 13వరకు నీటి సరఫరా చేస్తామని ఇంజనీర్లు చెబుతున్నారు. వేసవి తీవ్రత పెరిగి తే ఆలోపే నీళ్లు పూర్తిగా అయిపోతాయి. అధికారులు చెప్పిన గడువు వరకు వ ర్షాలు రాకుంటే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. ఈ కష్టాలను అధిగంచేం దుకు భీంఘన్పూర్, చలివాగు జలాశయాలను వినియోగించుకోవాలని అధికారు లు సూచిస్తున్నారు. ఈ ప్రతిపాదన అమలు చేయడం సవాల్గా మారనుంది. అదృశ్యమైన బాలిక తల్లికి అప్పగింత గూడూరు : ఈనెల 4న అదృశ్యమైన ఇంటర్ విద్యార్థిని బోడ సరితను గురువారం తహశీల్దార్ లక్ష్మి ముందు హాజరుపరిచి, తల్లి జమ్కు అప్పగించినట్లు ఎస్సై వై. సతీష్ తెలిపారు. మండలంలోని చిన్నఎల్లాపురం శివారు కోబల్తండాకు చెందిన సరిత ఇంటి నుంచి వెళ్లిన విషయం తెలిసిందే. సంగెం మండలం తీగరాజ్పల్లికి చెందిన బాలిక పెద్దమ్మ అమ్కు గురువారం సరితతో పీఎస్కు వచ్చింది. తన ఇం టికి వచ్చిన సరిత ఇష్టం లేని పెళ్లి చేయాలని చూస్తున్నందున ఇక్కడే ఉంటానని చెప్పినట్లు తెలిసింది. దీంతో పోలీసులు ఆమెను తల్లికి అప్పగించారు. -
విడిపోవడం వల్లే అభివృద్ధి సాధించాం
* మంత్రి కేటీఆర్ వెల్లడి * హైదరాబాద్లో రూ.760 కోట్లతో జలాశయాలు హైదరాబాద్: ఎంతో మంది హైదరాబాద్ను అభివృద్ధి చేశామంటూ చెప్పుకుంటున్నా, ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో మౌలిక వసతులు కల్పించలేదన్న విషయాన్ని గుర్తించాలని మంత్రి కేటీఆర్ చెప్పారు. నగరానికి రాబోయే రోజుల్లో తాగునీటి కొరత ఉండకూడదనే లక్ష్యంతో రూ.760 కోట్లతో రెండు జలాశయాల నిర్మిస్తామని, రెండువేల కోట్లతో నగర శివార్లలో విద్యుత్ ఐల్యాండ్లు ఏర్పాటు చేస్తామన్నారు. రెండు రాష్ట్రాలుగా వేరుపడటం వల్లే అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. హైదరాబాద్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. ఆదివారమిక్కడి జలవిహార్లో ఆల్ ఇండియా క్షత్రియ ఫెడరేషన్ ముఖాముఖి కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. 18 నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసిన వారు రానున్న ఎన్నికల్లో తాము మద్దతిస్తామని ముందుకొస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే నగరంలో రక్షణ ఉండదని, వివక్ష తప్పదని వచ్చిన వదంతులకు తమ పరిపాలనే నిదర్శనమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో గన్నవరంకు అంతర్జాతీయ విమానాశ్రయం, ఓడరేవులకు గుర్తింపు, వివిధ ఐటీ కంపెనీల రాక, అమరావతి లాంటి కొత్త నగరం రూపకల్పన వంటి అభివృద్ధి.. విడిపోవడం వల్లే జరిగిందనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. విడిపోకుండా ఉంటే మరో 25 సంవత్సరాలైనా అక్కడ అభివృద్ధి జరిగేదికాదు. సీఎం కేసీఆర్ పరిపాలనాపరమైన సంస్కరణలు చేపట్టినందున గూగుల్, ఆమెజాన్, ఉబెర్ వంటి సంస్థలు హైదరాబాద్ను ఎంచుకున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించే కాంగ్రెస్ పార్టీలో అందరూ నాయకులే అని, ఎవరి మాటా ఎవరు వినరని ఎద్దేవా చేశారు. 60 సంవత్సరాల దారిద్య్రం 18 నెలల్లో పోతుందా అని ప్రశ్నించారు. సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ముందుకు సాగుతోందని అందులో భాగంగానే 25 వేల కోట్లతో 54 సిగ్నల్ ఫ్రీ జంక్షన్లు, 11 స్కైవేల ఏర్పాటుకు త్వరలో టెండర్లను పిలుస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. మంత్రి తలసాని మాట్లాడుతూ, పేదల ఆకలి తెలిసిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటం గొప్ప వరమన్నారు. గంగాధర శాస్త్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మదన్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డిలతోపాటు అఖిల భారత క్షత్రియ సమాఖ్య అధ్యక్షుడు రాఘవరాజు, జలవిహార్ ఎండీ ఎన్.వి.రామరాజు, పూర్వ అధ్యక్షులు చినస్వామి, రాఘవేందర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్ఎన్ రాజ సీఎం సహాయ నిధికి రూ.25 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. -
ఏది నీటి చుక్కాని?
నెలాఖరుకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, సింగూరు జలాశయాలు ఖాళీ వట్టిపోయిన మంజీర ఈ నెల 29 నుంచి నిలిచిపోనున్న నీటి సేకరణ గ్రేటర్ ప్రజలకు తప్పని కష్టాలు కుత్బుల్లాపూర్: గ్రేటర్ శివార్లను నీటి కష్టాలు వేధిస్తున్నాయి. ఈ కష్టాల నుంచి ఒడ్డున పడేసే చుక్కాని కోసం శివారు జనాలు ఆశగా ఎదురు చూస్తున్నారు. మహా నగర దాహార్తిని తీరుస్తున్న సింగూరు, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలు ఈ నెలాఖరుకు పూర్తిగా వట్టిపోనున్నాయి. ప్రస్తుతం మంజీర జలాశయం నుంచి నీటి సరఫరా నిలిచిపోవడంతో శివారు మున్సిపల్ సర్కిళ్లలో తీవ్ర ఎద్దడి నెలకొంది. కుత్బుల్లాపూర్ సర్కిల్లో మంగళవారం నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో వందలాది కాలనీలు, బస్తీలు తీవ్ర దాహార్తితో విలవిల్లాడాయి. సింగూరు, మంజీర జలశయాల ద్వారా సరఫరా చేసే నీటిలో సగానికి కోత విధించారు. ఎస్.ఆర్నగర్ , కూకట్పల్లి, శేరిలింగంపల్లి మున్సిపల్ సర్కిళ్లకు సరఫరా అవుతున్న నీటిలో 50 శాతం కోత పడింది. ప్రస్తుతం సింగూరు నుంచి తరలిస్తున్న 50 మిలియన్ గ్యాలన్ల నీటిని వివిధ ప్రాంతాలకు పొదుపుగా (రేషన్) సరఫరా చేస్తుండడంతో జనం అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. డిసెంబరు రెండో వారంలో సరఫరా చేసే 85 ఎంజీడీల గోదావరి జలాలతో నగర దాహార్తిని తీరుస్తామని జలమండలి అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. కుత్బుల్లాపూర్లో యుద్ధాలు కుత్బుల్లాపూర్ సర్కిల్కు వారం రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లుజలమండలి జీఎం ప్రవీణ్కుమార్ ప్రకటించడం కలకలం రేపింది. గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు, అపార్టుమెంట్లు, కాలనీలు, మురికివాడలకు మంగళ వారం 36 ట్యాంకర్లతో అరకొరగా నీటి సరఫరా చేశారు. దీంతో ఈ సర్కిల్లోని వివిధ ప్రాంతాల్లో ట్యాంకర్ల వద్ద నీటి కోసం స్థానికులు యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రసూన నగర్లో గొడవ చోటు చేసుకోగా ఓ మహిళ ముక్కు పగిలి గాయమైంది. మాణిక్యనగర్లోని ప్రతి వీధిలో జనం ట్యాంకర్ల కోసం పడిగాపులు కాశారు. వాణీ నగర్, వసంత కెమికల్స్, షాపూర్ నగర్, జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో రిజర్వాయర్ల వద్ద కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు క్యూ కట్టి ట్యాంకర్లు తెచ్చుకునే పరిస్థితి నెలకొంది. మొత్తం సర్కిల్లో 58 వేలకు పైగా ఉన్న కనెక్షన్లకు వారం రోజులుగా నీళ్లు లేవు. చింతల్ డివిజన్కు 18 ఎంజీడీల నీరు రావాల్సి ఉండగా కేవలం 8 ఎంజీడీలు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవ సరఫరా 3 ఎంజీడీలకు మించి లేకపోవడం గమనార్హం. ముందుకు సాగని రిజర్వాయర్ నిర్మాణం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాది మార్చి 2న ఇక్కడ 5 ఎంఎల్ రిజర్వాయర్కు రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ఫిబ్రవరి 21న టెండర్లు పిలిచారు. రిజర్వాయర్ నిర్మాణానికి రూ.7 కోట్ల వ్యయమే అవుతుండగా... మరో రూ.3 కోట్ల మేరకు అంచనాలు పెరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. టెండర్లు రద్దు చేయడంతో రిజర్వాయర్ నిర్మాణం అటకెక్కింది. నీటి కోసం ఆందోళనలు... మంచినీటి ఎద్దడి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ మంగళవారం వివిధ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి భారీ ఆందోళన చేపట్టారు. ఐడీపీఎల్ చౌరస్తా వద్ద ఆందోళన చేసి.. అక్కడి నుంచి ర్యాలీగా కుత్బుల్లాపూర్ వాటర్ వర్క్స్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. గోదావరి జలాలతో కొరత తీరుస్తాం ప్రస్తుతం మంజీర జలాశయం నుంచి నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సింగూరు నుంచి అరకొరగా సరఫరా అవుతోంది. ఈ నెలాఖరుకు ఇదీ నిలిచిపోనుంది. డిసెంబరు ద్వితీయ వారంలో నగరానికి తరలించనున్న 85 ఎంజీడీల నీటితో వివిధ ప్రాంతాల దాహార్తిని తీరుస్తాం. -విజయ్ కుమార్ రెడ్డి, జలమండలి ట్రాన్స్మిషన్ విభాగం సీజీఎం -
‘నీళ్ల’ వంతెనలు!
* నీటి నిల్వకు ఉపయోగపడేలా బ్రిడ్జీల నిర్మాణానికి సర్కారు నిర్ణయం * బహుళ ప్రయోజనకరంగా నమూనాల రూపకల్పన * నిలిచే నీరు సాగు, తాగు అవసరాలకు వినియోగం * మహారాష్ట్ర, కర్ణాటక తరహాలో అమలు సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఆనకట్టలు (రిజర్వాయర్లు) నీటిని నిల్వచేస్తాయి.. వాగులు, వంకల్లో చెక్డ్యాంలు ఆ పనిచేస్తాయి. కానీ ఇక ముందు రాష్ట్రంలోని సాధారణ వంతెనలూ నీటిని నిల్వ చేయనున్నాయి.. వానలు పడినప్పుడు నిలిచిన నీటితో సమీపంలోని సాగు, తాగు అవసరాలను తీర్చనున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకల్లో విజయవంతంగా అమలవుతున్న ఈ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో నీటి ఎద్దడిని తీర్చేందుకు ఇది దోహదపడగలదని భావిస్తోంది. ఈ మేరకు కొత్తగా నిర్మించనున్న అన్ని వంతెనల డిజైన్లను ఇందుకు అనుగుణంగా మార్చాలని రోడ్లు, భవనాల శాఖ(ఆర్ అండ్ బీ)ను ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 360 వంతెనలను కొత్తగా నిర్మించేపనిలో ఉన్న ఆర్ అండ్ బీ శాఖ... వాటి డిజైన్లను మార్చే పని మొదలుపెట్టింది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం నుంచి పిలవబోయే టెండర్లను ఆపి కొత్త డిజైన్ సిద్ధం చేసి టెండర్లు పిలవాలని సూచించారు. మంజీరా నదిపై ఓ వంతెన నిర్మాణానికి సోమవారం పిలవాల్సిన టెండర్ను కూడా నిలిపివేయించారు. ప్రయోజనాలెన్నో.. జోరు వానలప్పుడు నిండుగా కనిపించే చిన్న నదీపాయలు, వాగులు, వంకలు ఆ తర్వాత వట్టిపోయి ఎడారిని తలపిస్తాయి. దాంతో దగ్గరలో నీటి నిల్వ ఉండదు, భూగర్భ జలాలూ తగ్గిపోతాయి. ఇది తీవ్ర నీటి ఎద్దడికి కారణమవుతోంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి మహారాష్ట్ర, కర్ణాటకల్లో వంతెనలను నీటి నిల్వ నమూనాలో నిర్మిస్తున్నారు. దానివల్ల ఆయా ప్రాంతాల్లో నీళ్లు నిలిచి కొంత కాలంపాటు ఐదారు గ్రామాలకు సాగునీరు, తాగునీటిని సరఫరా చేసే అవకాశం ఉంటుంది. భూగర్భజలాలు పెరిగి బోర్లు వట్టిపోయే ప్రమాదమూ తప్పుతుంది. ఇదే తరహాలో రాష్ట్రంలో కృష్ణా, గోదావరి మినహా అన్ని ఉప నదులు, ప్రధాన వాగులపై నిర్మించే వంతెనలను బహుళ ప్రయోజనకరంగా నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. అయితే డిజైన్ మార్పు వల్ల వంతెనల నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఈ మేరకు అదనంగా అయ్యే నిధులను అవసరమైతే నీటిపారుదల శాఖ నుంచి మళ్లించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. సీఎంతో మంత్రి తుమ్మల భేటీ సందర్భంగా ఈ మేరకు హామీ ఇవ్వడంతో వంతెనల డిజైన్ల మార్పునకు రోడ్లు భవనాల శాఖ చకచకా ఏర్పాట్లు చేస్తోంది. కనీసం 500 మీటర్ల మేర చెక్డ్యాంలు లేని ప్రాంతాల్లో నిర్మించే వంతెనలన్నింటిని ఈ నమూనాలోకి మార్చనున్నారు. పంచాయతీరాజ్ శాఖ చేపట్టే వంతెనలకు కూడా దీన్ని వర్తింపజేయనున్నారు. వీలైనన్ని చోట్ల.. రోడ్డు అనుసంధానాన్ని మెరుగుపర్చడంతో పాటు నదులు, వాగులపై వీలైనన్ని ఎక్కువ వంతెనలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా రాష్ట్రవ్యాప్తంగా 360 వంతెనలకు అనుమతినిచ్చింది. వీటికి దాదాపు రూ. 2 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. అందులో ఈ ఏడాది రూ.400 కోట్లతో 61 వంతెనల నిర్మాణం మొదలైంది. ఈ వంతెనలను ప్రస్తుత అంచనా వ్యయానికి 30 శాతం అదనపు వ్యయంతో బహుళ ప్రయోజనకరంగా మార్చవచ్చు. ఈ లెక్కన రూ.400 కోట్లతో చేపట్టిన వంతెనలకు దాదాపు రూ.520 కోట్లు అవుతాయి. కానీ కొత్తగా చెక్డ్యాంలు కట్టే అవసరం ఉండదు. నీటి నిల్వ, ఇతర ప్రయోజనాలూ ఎక్కువ. -
73 రిజర్వాయర్లలో తగ్గిన నీటి పరిమాణం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సెంట్రల్ వాటర్ కమిషన్ పర్యవేక్షించే 73 ప్రధాన రిజర్వాయర్లలో గతేడాదితో పోలిస్తే నీటి పరిమాణం తగ్గింది. అయితే ఉత్తర, మధ్య భారతంలోని మరో 18 రిజర్వాయర్లలో నీటి పరిమాణం పెరిగింది. జల వనరుల శాఖ వివరాల ప్రకారం జార్ఖండ్, ఒడిశా, బెంగాల్, త్రిపురలోని 15 రిజర్వాయర్లలో సెప్టెంబర్ 3 నాటికి 10.98 బీసీఎం(బిలియన్ క్యూబిక్ మీటర్లు) నీరు ఉంది. వాటి మొత్తం నీటి నిల్వ సామర్థ్యంలో ఇది 58 శాతం. గుజరాత్, మహారాష్ట్రలో 27 ప్రధాన రిజర్వాయర్లలో మొత్తం నీటి నిల్వ సామర్థ్యంలో 59 శాతం నీరు ఉంది. దక్షిణ భారతంలో 31 ప్రధాన రిజర్వాయర్లలోని మొత్తం నీటి నిల్వ సామర్థ్యంలో 33 శాతం మాత్రమే నీటి పరిమాణం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడులలో నీటి నిల్వ గతేడాది ఇదే సమయానికి 75 శాతం నీరు ఉంది. -
ప్లాస్టిక్ బాల్స్తో వాటర్ సేవింగ్
-
ప్లాస్టిక్ బాల్స్తో వాటర్ సేవింగ్
-
ప్లాస్టిక్ బాల్స్తో వాటర్ సేవింగ్
లాస్ ఏంజెలిస్: ఈసారి కరవు కాటకాలతో అల్లాడిపోతున్న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో మంచినీటి వనరులను రక్షించుకునేందుకు వినూత్న ప్రక్రియను చేపట్టారు. 75 ఎకరాల్లో విస్తరించివున్న లాస్ ఏంజెలిస్ మంచినీటి రిజర్వాయర్లో తీవ్రమైన ఎండల కారణంగా నీరు ఆవిరైపోకుండా ఉండేందుకు ప్లాస్టిక్ బాల్స్ను వాటిల్లోకి వదిలారు. పెద్ద పరిమాణంలోని ఆపిల్ అంతా ఉండే ప్లాస్టిక్ బాల్స్ను దాదాపు పదికోట్లు వదిలినట్లు లాస్ ఏంజెలిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ పవర్ అధికారులు తెలిపారు. ఎండకు నీరు ఆవిరికాకుండా ఉండడంతోపాటు రసాయనిక చర్యలవల్ల నీరు కలుషితం కాకుండా ఉంటుందని, నల్ల రంగు బాల్స్ను వాడడంవల్ల సూర్యుడి అల్ట్రా వాయిలెట్ కిరణాలు కూడా నీటిపై ప్రభావం చూపవని అధికారులు వివరించారు. అంతేకాకుండా పక్షులు, ఇతర జంతువులు కూడా రిజర్వాయర్లోకి ప్రవేశించకుండా ఈ ప్లాస్టిక్ బాల్స్ అడ్డుకుంటాయని వారు చెప్పారు. తాము తీసుకున్న ఈ చర్య వల్ల ఏడాదికి 30 కోట్ల గ్యాలన్ల నీటిని పరిరక్షించుకోవచ్చని, ఈ నీటితో 8100 మంది ప్రజలకు ఏడాదిపాటు మంచినీటిని సరఫరా చేయొచ్చని వివరించారు. పైగా ఈ తరహా విధానం ద్వారా తమకు ఏడాదికి రూ.2,500 కోట్లు కలిసొస్తాయని చెబుతున్నారు. కానీ, పర్యావరణ సమతౌల్యం మాత్రం వారు విస్మరిస్తున్నారు. పశు పక్షాదుల దాహార్తిని తీర్చే తరుణోపాయం గురించి కూడా ఆలోచించడం లేదు. -
గ్రేటర్కు జలగండం
- నగరంలో తీవ్ర వర్షాభావం - అడుగంటుతున్న భూగర్భ జలం - జలాశయాల్లోనూ పడిపోతున్న నీటిమట్టం సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా మహా నగర దాహార్తిని తీరుస్తున్న జలాశయాలతో పాటు భూగర్భ జలమట్టాలు శరవేగంగా అడుగంటుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే సెప్టెంబర్ నెలలో గ్రేటర్ పరిధిలో తాగునీటికి కటకట తప్పదని జలమండలి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు గత ఏడాదితో పోలిస్తే ప్రతి మండలంలోనూ భూగర్భ జల మట్టాలు ఆందోళన కలిగించే స్థాయిలో పడిపోయాయి. జలమండలి మంచినీటి సరఫరా నెట్వర్క్ లేని శివారు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో బోరుబావులు వట్టిపోయి.. ప్రైవేటు నీటి ట్యాంకర్లు, ఫిల్టర్ప్లాంట్లను ఆశ్రయించి జనం జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలో గత ఏడాది జూలై చివరి నాటికి సగటున 9.59 మీటర్ల లోతున పాతాళ గంగ దొరకగా.. ఈసారి 11.21 మీటర్ల లోతునకు వెళితే గానీ నీటిజాడ కనిపించడం లేదు. గ త సంవత్సరం కంటే సుమారు 1.63 మీటర్ల లోతున భూగర్భ జలాలు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ‘బోరు’మంటున్నాయ్... నగరంలో సుమారు 23 లక్షల బోరుబావులు ఉన్నాయి. ఇళ్లలో ఉన్న వీటికి ఆనుకొని ఇంకుడు గుంతలు లేకపోవడంతోనే నీటి సమస్య ఉత్పన్నమవుతోంది. గతజూలైతో పోలిస్తే ప్రస్తుత ఏడాది జూలై చివరి నాటికి నాంపల్లి మండలంలో అత్యధికంగా 6.75 మీటర్ల మేర భూగర్భ జలమట్టాలు తగ్గుముఖం పట్టాయి. మారేడ్పల్లి మండలంలో 4.25 మీటర్లు, ఖైరతాబాద్లో 1.55 మీటర్లు, ఆసిఫ్నగర్లో 4.37 మీటర్లు, బండ్లగూడలో 0.30 మీటర్లు, బహదూర్పురాలో 0.48 మీటర్లు, హయత్నగర్లో 0.58 మీటర్లు, మహేశ్వరంలో 3.15 మీటర్లు, ఉప్పల్లో 0.55 మీటర్లు, బాలానగర్లో 0.80 మీటర్ల మేర నీటిమట్టాలు తగ్గాయి. దీంతో ఆ ప్రాంతాల ప్రజలు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. జలాశయాల్లోనూ అదే దుస్థితి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో గ్రేటర్ దాహార్తిని తీరుస్తున్న జలాశయాల్లోనూ నీటి మట్టాలు అనూహ్యంగా పడిపోతున్నాయి. ఉస్మాన్ సాగర్ (గండిపేట్) గరిష్ట మట్టం 1790 అడుగులకు గాను ప్రస్తుతం 1756.800 అడుగుల మేరకు నిల్వలు ఉన్నాయి. ఈ జలాశయం నుంచి నిత్యం 5 మిలియన్ గ్యాలన్ల నీటిని జలమండలి సేకరిస్తోంది. ఇదే రీతిన సేకరిస్తే మరో 24 రోజుల పాటు మాత్రమే ఈ నిల్వలు సరిపోతాయని జలమండలి వర్గాలు తెలిపాయి. ఇక హిమాయత్సాగర్ గరిష్ట మట్టం 1763.500 అడుగులు. ప్రస్తుతం 1742.110 అడుగుల మేర నీళ్లున్నాయి. ఈ జలాశయం నుంచి జలమండలి నిత్యం 16.90 మిలియన్ గ్యాలన్ల నీటిని సేకరిస్తోంది. ఈ నిల్వలు మరో 117 రోజుల పాటు నగర అవసరాలకు సరిపోతాయని అంచనా. ఇక సింగూరు గరిష్ట మట్టం 1717.932 అడుగులు కాగా.. ప్రస్తుతం 1686.509 అడుగుల మేర నిల్వలు ఉన్నాయి. ఈ జలాశయం నుంచి నిత్యం 75 ఎంజీడీల జలాలను సేకరిస్తున్నారు. ఈ నిల్వలు 365 రోజుల అవసరాలకు సరిపోనున్నాయి. మంజీర జలాశయం గరిష్ట మట్టం 1651.750 అడుగులకు..ప్రస్తుతం 1644.900 అడుగుల మేర నిల్వలు ఉన్నాయి. ఈ జలాశయం నుంచి నిత్యం 45 ఎంజీడీల నీటిని సేకరిస్తున్నారు. ఈ నిల్వలు 365 రోజుల పాటు నగర తాగునీటి అవసరాలకు సరిపోనున్నాయి. ఇక అక్కంపల్లి (కృష్ణా) జలాశయం గరిష్టమట్టం 245 మీటర్లకు ప్రస్తుతం 244.400 మీటర్ల మేర నిల్వలున్నాయి. ఇవి మరో 365 రోజులపాటు నగర అవసరాలకు సరిపోనున్నాయి. నాగార్జునసాగర్(కృష్ణా) గరిష్ట మట్టం 590 అడుగులకు ప్రస్తుతం 510.600 అడుగుల మేర నిల్వలున్నాయి. ఇవి మరో ఏడాది పాటు నగర అవసరాలకు సరిపోతాయని జలమండలి ప్రకటించింది. మొత్తంగా అన్ని జలాశయాల నుంచి రోజువారీ 366.90 ఎంజీడీల నీటిని సేకరించి... శుద్ధిచేసి 8.64 లక్షల నల్లాలకు సరిపెడుతున్నట్లు తెలిపింది. ఈ నెలలోనూ వర్షాభావ పరిస్థితులు కొనసాగితే సెప్టెంబర్లో నీటి కటకట తప్పదని జలమండలి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
పొంచి ఉన్న ముప్పు
- రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం - ఎండిపోతున్న 11 జలాశయాలు సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో గత ఐదేళ్లలో లేనంత కరువు ఛాయలు నెలకొన్నాయి. వాన నీటితో తొణికిసలాడాల్సిన జలాశయాలన్నీ నీటి బొట్టు కోసం ఆకాశం వైపు చూస్తున్నాయి. గత ఏడాది కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా అంతకు ముందు ఏడాది కురిసిన వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల జలాశయాల్లో కొంత వరకు నీరు ఉండేది. దీంతో వ్యవసాయం, జల విద్యుత్, తాగునీటి అవసరాలకు చెప్పుకోదగ్గ ఇబ్బందులు ఏర్పడలేదు. అయితే ఈసారి రాష్ట్రంలోని 13 ప్రముఖ జలాశయాల్లో వరాహి, కబిని డ్యాంల్లో మాత్రం గత ఏడాది ఇదే సమయానికి పోలిస్తే దాదాపు 5 శాతం నీటి నిల్వ ఎక్కువగా ఉంది. మిగిలిన 11 జలాశయాల్లో గత ఏడాది కంటే తక్కువ నీటి పరిమాణం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. లింగనమక్కి, సూపా, వరాహి, హారంగి, హేమావతి, కేఆర్ఎస్, భద్రా, తుంగభద్రా, ఘటప్రభా, మలప్రభా, ఆల్మట్టి, నారాయణపుర జలాశయాల్లో మొత్తం నీటి నిల్వ సామార్థ్యం 860.29 టీఎంసీలు కాగా ఇప్పటి వరకూ కేవలం 447 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. గత ఏడాది ఇదే సమాయానికి వీటన్నింటిలో కలిపి 596.82 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. అంటే గత ఏడాది కంటే దాదాపు 150 టీఎంసీల నీరు తక్కువగా ఉంది. రాష్ట్రంతో పాటు ఎగువ ప్రాంతాల్లో కూడా వర్షం పడక పోవడంతో జలాశయాల్లోకి నీరు చేరడం లేదు. ప రిస్థితి ఇలాగే కొనసాగితే సా గుకు కాదుకదా కనీసం తా గునీటి కూడా కటాకటా అనాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర నీటిపారుదాల శాఖ గణాంకాల ప్రకారం సాధారణం కంటే లింగనమక్కి జలాశయంలో 92 టీఎంసీల నీరు తక్కువగా ఉంది. అదేవిధంగా సూపా-85 టీఎంసీలు, వరాహి-16 టీఎంసీ, హారంగి-1 టీఎంసీ, హేమావతి-8 టీఎంసీలు, కబిని-1 టీఎంసీ, తుంగభద్రా-37 టీఎంసీ, ఘటప్రభా-34, మలప్రభా-27, ఆల్మట్టి-61 టీఎంసీ, నారాయణపుర-7 టీఎంసీల నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. -
పంటలకు ప్రాణం
ఊపిరిపోస్తున్న వర్షం ఇన్నాళ్లూ లోటు వర్షపాతం ఏజెన్సీలో వరినాట్లు ప్రారంభం అన్నదాతల్లో ఆనందం విశాఖపట్నం: దాదాపు నెల రోజుల నుంచి వాన చినుకు కునుకేసింది. సమృద్ధిగా కురవాల్సిన తరుణంలో ముఖం చాటేసింది. ఆరంభంలో ఆనందాన్ని పంచి ఆ తర్వాత జాడ లేకుండా పోయింది. అంతేకాదు మండే ఎండలతో వరి నారుమళ్లు, చెరకు, ఇతర పంటలు ఎండిపోయే స్థితికి చేరుకున్నాయి. ఈ నెల లోని 23 రోజుల్లో ఏకంగా వారం రోజుల పాటు ఒక్క చినుకూ కురవలేదు. మిగిలిన రోజుల్లో అరకొర జల్లులే పడ్డాయి. అయితే ఇవేమీ పంటలకు మేలు చేయలేదు. మరోవైపు జలాశయాల్లోనూ నీరు ఆశాజనకంగా లేదు. ఈ పరిస్థితుల్లో రైతన్నల్లో ఆందోళన నెలకొంది. వర్షం ఎప్పుడు కురుస్తుందా? అని రోజూ కొండంత ఆశతో ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల నుంచి జిల్లాలో చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 20న కొయ్యూరు, రాంబిల్లిల్లో 3 సెంటీమీటర్లు , డుంబ్రిగుడ, జి.మాడుగుల, కోటఉరట్ల, నక్కపల్లి, ఎస్.రాయవరంలలో 2 సెంటీమీటర్లు, 21న యలమంచిలిలో 9 సెంటీమీటర్లు, చింతపల్లిలో 5, విశాఖపట్నం, కొయ్యూరు, జీకే వీధిల్లో 3, నర్సీపట్నంలో 2 సెంటీమీటర్లు, 22న చింతపల్లిలో 12, గొలుగొండ, పాయకరావుపేట, నక్కపల్లిల్లో 4, నర్సీపట్నం, భీమిలిల్లో 3, అరకు, విశాఖపట్నం, పాడేరు, రోలుగుంట, చోడవరంలలో 2 సెంటీమీటర్లు, అనకాపల్లి, యలమంచిలిల్లో ఒక్కో సెంటీమీటరు చొప్పున వర్షపాతం నమోదయింది. గురువారం కూడా జిల్లాలో కొన్నిచోట్ల వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు ఇప్పుడు పంటలకు ప్రాణం పోస్తుండడంతో అన్నదాతల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యంగా ఎదుగుదలలో ఉన్న వరినారు ఊపిరి పోసుకుంటోంది. ఇప్పటికే మన్యంలో వరినాట్లు ప్రారంభమయ్యాయి. అలాగే అపరాల సాగుకు, వేరుశనగ పంట తీయడానికి పనికొస్తుంది. మరింతగా వర్షాలు సమృద్ధిగా కురిస్తే చాలాచోట్ల వరినాట్లు వేసుకోవడానికి వీలుపడుతుంది. ఇంకా లోటు వర్షపాతమే.. ఇలావుండగా జిల్లాలో ఇంకా లోటు వర్షపాతమే నమోదవుతోంది. దాదాపు మూడు వారాల పాటు ఎండల ధాటిగా కొనసాగడం ఈ పరిస్థితికి దారితీసింది. ఈ నెల23వ తేదీ వరకు జిల్లా సగటు వర్షపాతాన్ని పరిశీలిస్తే.. 197 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం 115 మిల్లీమీటర్లే కురిసింది. అంటే 41 శాతం లోటు వర్షపాతమన్న మాట. ఈ నెలలో హుకుంపేట (-87శాతం), పాడేరు -83శాతం), మాడుగుల (-76శాతం) పెదబయలు, చోడవరం, అరకు, అనంతగిరి, చీడికాడ, జి.మాడుగుల, ముంచంగిపుట్టు (10 మండలాలు)ల్లో అతి తక్కువ వర్షపాతం నమోదయింది. గొలుగొండ, చింతపల్లి, గాజువాక, విశాఖపట్నం, పెదగంట్యాడ, పరవాడ, అనకాపల్లి, మునగపాక, కశింకోట, పాయకరావుపేట, నక్కపల్లి (11 మండలాలు)ల్లో సాధారణ వర్షపాతం రికార్డయింది. మిగిలిన డుంబ్రిగుడ, దేవరాపల్లి, జీకేవీధి, కొయ్యూరు, నాతవరం, నర్సీపట్నం, రోలుగుంట, రావికమతం, బుచ్చయ్యపేట, కోట ఉరట్ల, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం, పద్మనాభం, భీమిలి, విశాఖ అర్బన్, మాకవరపాలెం, ఎస్.రాయవరం, యలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం (22) మండలాల్లోనూ లోటు వర్షపాతమే నమోదయింది. మూడు రోజులుగా కురుస్తున్న వానలతోనే ఈ మాత్రం వర్షపాతమైనా పెరగడానికి దోహదపడింది. -
వరుణుడే దిక్కు
- జలాశయాల్లో అడుగంటిన సాగునీటి నిల్వలు - ఖరీఫ్కు 32 టీఎంసీలు అవసరం - రిజర్వాయర్లు, చెరువుల్లో ఉన్నది కేవలం 4 టీఎంసీలు - జూలై నెలాఖరుకు నిండితేనే నీరు విడుదల - లేదంటే కష్టమేనంటున్న అధికారులు సాక్షి, విశాఖపట్నం: ఖరీఫ్ సీజన్...ఆరంభంలోనే రైతులను కలవరపెడుతోంది. మునుపెన్నడూ లేని విధంగా అడుగంటిన సాగునీటి నిల్వలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. జిల్లాలో వరిసాగు విస్తీర్ణంలో సగం వర్షాధార ప్రాంతమే. జలాశయాల్లో పుష్కలంగా నీరు లేదు. వచ్చే నెలాఖరుకు అవి నిండితేనే సాగునీరు విడుదల చేస్తామని, లేదంటే కష్టమేనని నీటిపారుదలశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో భారమంతా వరుణుడిపైనే వేసి అన్నదాతలు కాడి నెత్తుకుంటున్నారు. జిల్లాలో సాగు లక్ష్యం 2,08,988 హెక్టార్లు. ఇందులో వరి లక్షా ఆరువేల హెక్టార్లు. ప్రాజెక్టులు, కాలువలు, ఇతర సాగునీటి వనరుల కింద 1.99లక్షల ఎకరాలు, వర్షాధారంగా మరో 65,233 ఎకరాల సాగవుతాయి. ఇందుకు 32 టీఎంసీల నీరు అవసరం. వర్షాధార ప్రాంతాలు మినహాయిస్తే కనీసం 26 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. ప్రస్తుతం కేవలం 3.66 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ముఖ్యంగా తాండవ, రైవాడ, కోనం, పెద్దేరు జలాశయాల పరిధిలో అత్యధికంగా 92వేల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి 11.6 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. ప్రస్తుతం వీటిల్లో 2.66 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. వంద ఎకరాలకు పైబడి 232 సాగునీటి చెరువులున్నాయి. వీటి పరిధిలో 59వేల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి 6.5 టీఎంసీల నీరు అవసరం ఉండగా, ప్రస్తుతం ఒక టీఎంసీ నీరు మాత్రమే వీటిల్లో అందుబాటులో ఉంది. ఇక మిగిలిన సాగునీటి వనరుల్లో చుక్కనీరులేని దుస్థితి. సీజన్ ప్రారంభంలో ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని నీటిపారుదలశాఖ అధికారులే అంగీకరిస్తున్నారు. ఈసారి పూర్తిగా వర్షాలపైనే సాగునీటి వనరుల కింద ఆయకట్టు కూడా ఆధారపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రుతుపవనాల ప్రవేశంతో వారం రోజుల నుంచి అడపా దడపా వర్షాలు కురుస్తున్నప్పటికీ క్యాచ్మెంట్ ఏరియాలో మాత్రం సింగిల్ సెంటీమీటర్ వర్షపాతం నమోదు కాలేదు. ఒకటి రెండు రిజర్వాయర్ల ఎగువ ప్రాంతాల్లో మాత్రమే అత్యల్ప వర్షపాతం నమోదుతో ఈ ప్రాజెక్టుల్లో నీటిమట్టం కేవలం అడుగులోపేఉంది. మిగిలిన ప్రాజెక్టుల్లో ఆ పరిస్థితీ లేదు. గతేడాది ఇదే సమయంలో జలాశయాల్లో సమృద్ధిగా నీటి నిల్వలున్నాయి. ఉదాహరణకు గతేడాది తాండవలో 3 టీఎంసీల నీరు ఉండగా, ప్రస్తుతం కేవలం ఒకే ఒక్క టీఎంసీ నీరు ఉంది. దీంతో రానున్న నెలరోజులు క్యాచ్మెంట్ ఏరియాలో కుంభవృష్టి ఉంటే తప్ప ప్రాజెక్టులు నిండే పరిస్థితి లేదు. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు మొదటి వారం నుంచి ఈ ప్రాజెక్టుల నుంచి నీరు వదలాల్సిఉంటుంది. అంటే జూలై నెలాఖరులోగా ప్రాజెక్టులు, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్(చెరువులు) నిండాలి. ఏమాత్రం వరుణుడు ముఖం చాటేసినా అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరమే. ప్రాజెక్టులు నిండితేనే నీరు విడుదల జిల్లాలో తాండవ, రైవాడ, కోనాం పెద్దేరు జలాశయాల్లో నీటి మట్టాలు ఆందోళనకరంగానే ఉన్నాయి. పంటలకు ఆగస్టు రెండోవారం నుంచి నీరు అవసరం ఉంటుంది. ఈలోగా ఈ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో వాటి సామర్ధ్ద్యానికి తగ్గట్టుగా నిండితేనా పంటలకు నీరు విడుదల చేయగలం. లేకుంటే కష్టమే. వర్షాలు మైదాన ప్రాంతాల్లో కాకుండా క్యాచ్మెంట్ ఏరియాలో పడితేనే ప్రాజెక్టులకు..రైతులకు ఉపయోగం.. నాగేశ్వరరావు, ఎస్ఈ, నీటిపారుదల శాఖ -
జలాశయాలకు మంచి రోజులు
శుభ్రతపై హెచ్ఎండీఏ దృష్టి కలుషితం కాకుండా చర్యలు సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని కొన్ని జలాశయాలకు మంచి రోజులు వస్తున్నాయి. ఇన్నాళ్లూ నిర్వహణ కొరవడి...చెట్లూపుట్టలతో అడవిని తలపిస్తున్న వీటిని శుభ్రం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. చెరువుల నిర్వహణ, పరిరక్షణ ఏ విభాగం పరిధిలోకి వస్తుందన్న దానిపై స్పష్టత లేకపోవడంతో ఇవి తూటికాడ, ముళ్లచెట్లతో నిండిపోయి చిట్టడవిని తలపిస్తున్నాయి. ఇటీవల దుర్గంచెరువు, రంగథామిని చెరువు, హుస్సేన్ సాగర్ వద్ద గల ఎస్టీపీలు (సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్ల)ను సందర్శించిన హెచ్ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా... ఆ జలాశయాల ను చూసి విస్తుపోయారు. వాటి దుస్థితికి కారణాలను ఆరా తీశారు. అక్కడ కేవలం ఎస్టీపీలను మాత్రమే హెచ్ఎండీఏ నిర్వహిస్తోందని, శుభ్రత వ్యవహారాలను జీహెచ్ఎంసీ చూస్తోందని వారు ఆమె దృష్టికి తెచ్చారు. కూకట్పల్లిలోని రంగథామిని చెరువులో ఏపుగా పెరిగిన గుర్రపుడెక్క, ముళ్లకంపలను వెంటనే తొలగించి జలాశయాన్ని శుభ్రంగా తీర్చిదిద్దాలని ఆమె ఆదేశించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు దుర్గం చెరువు, రంగథామిని చెరువు, హుస్సేన్ సాగర్లను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. రంగథామిని చెరువులో తూటికాడ తొలగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ జలాశయం షోర్ లేన్ను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టారు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పనులను జీహెచ్ఎంసీ చేపట్టిందన్న సాకుతో నాలాల నుంచి వచ్చే ఫ్లోటింగ్ మెటీరియల్ను తొలగించే పనులను ఇటీవల హెచ్ఎండీఏ అధికారులు నిలిపివేశారు. దీంతో సాగర్ షోర్ లేన్ దుర్భరంగా తయారైంది. నెక్లెస్ రోడ్లో దుర్గంధం వెదజల్లుతుండటంతో పరిస్థితిని గమనించిన కమిషనర్ సాగర్లో ఫ్లోటింగ్ మెటీరియల్ను ఎప్పటికప్పుడు తొలగించేందుకు పాత విధానాన్నే అనుసరించాలని ఆదేశించారు. దీంతో మళ్లీ డీయూసీలతో పాటు ప్రత్యేకంగా కూలీలను పెట్టి శుభ్రత పనులను ఇంజినీరింగ్ అధికారులు ప్రారంభించారు. దుర్గం చెరువు దుస్థితి.... దుర్గం చెరువును సందర్శించిన కమిషనర్ శాలిని మిశ్రా అక్కడి దృశ్యాలను చూసి కంగుతిన్నారు. ఎంతో శ్రమకోర్చి మురుగు నీటిని శుద్ధి చేశాక చెరువులో నింపే క్రమంలో మళ్లీ దారుణంగా కలుషితమవుతున్న తీరు కమిషనర్ కంటపడింది. ఎస్టీపీ ఔట్లెట్ నుంచి చెరువులోకి వచ్చే పరిశుభ్రమైన నీటిలో స్థానికులు బట్టలు ఉతుక్కుంటూ, స్నానాలు చేస్తూ కనిపించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి మురుగునీటిని శుద్ధి చేస్తున్నా... మళ్లీ కలుషితమై చెరువులో కలుస్తున్న తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఇలా జరగడానికి వీల్లేదని... చెరువుల వద్ద నిఘా ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులు పెట్టాలని ఆమె సూచించారు. ఇదే సందర్భంగా హుస్సేన్ సాగర్ వద్ద గల 30 ఎంఎల్డీ, 20 ఎంఎల్డీ ఎస్టీపీలను కమిషనర్ సందర్శించి పరిసరాలను పరికించారు. ఎస్టీపీల నుంచి శుద్ధి చేసిన నీరు వెలుపలకు వస్తున్నా... నాలాల్లోకి చేరేసరికి అవి మళ్లీ మురుగుమయంగా మారుతున్న తీరును గమనించారు. ఎస్టీపీల వద్ద నాలాలను సైతం పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొసమెరుపు : నాలాల ఎగువ (అప్పర్ స్ట్రీం) ప్రాంతంలో శుభ్రం చేయకుండా... కేవలం జలాశయాల ఎస్టీపీల వద్ద (డౌన్ స్ట్రీంలో) పనులు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటన్నది అధికారులకే తెలియాలి మరి. -
కలిసిరాని కాలం
- మొదట్లో నీరందక ఎండాయి - ప్రస్తుతం అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలు - తీవ్రంగా నష్టపోతున్న రైతన్నలు - పంట నష్టం అంచనాలో అధికారుల నిర్లక్ష్యం - పూర్తిగా నష్టపోయినా జాబితాలో కనిపించని పేర్లు - వర్షాలకు దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేయని వైనం సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ప్రకృతి వైపరీత్యాలతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. జిల్లాలోని రిజర్వాయర్ల కింద సాగు నీరందక సుమారు లక్ష ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. అందులో కనుపూరు, బ్రాహ్మణకాక, బండిపల్లి, వెంకటాచలం, మనుబోలు, గూడూరు తదితర ప్రాంతాల్లో వరి చేలు ఎండిపోయాయి. అయితే మంత్రులు దేవినేని ఉమ, నారాయణలు మాత్రం ఒక్క ఎకరా కూడా పంట ఎండిపోలేదని ప్రకటనలు చేసి చేతులు దులుపుకొన్నారు. అదేవిధంగా వర్షాభావ పరిస్థితుల కారణంగా వెంకటగిరి, ఉదయగిరి ప్రాంతాల్లో బోర్లు, బావుల కింద సాగవుతున్న పంటలు ఎండిపోయాయి. ఇందులో ఉద్యానపంటలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలతో చేతికొచ్చే దశలో ఉన్న పంటలూ దెబ్బతింటున్నాయి. ఇది అన్నదాతలకు శరఘాతంలా మారింది. అధికారుల నిర్లక్ష్యంతో పంటలు నష్టపోయినా.. ప్రభుత్వం ఇచ్చే పరిహారానికీ అనర్హులుగా మిగిలిపోతున్నారు. వర్షాలకు దెబ్బతిన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉన్నా అటువైపు కన్నెత్తై చూడటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో నాలుగు పర్యాయాలు అకాల వర్షాలు పడ్డాయి. కురిసిన ప్రతిసారి చేతికొచ్చిన పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. గత నెల 12 నుంచి 17వరకు జిల్లాలో ఉన్నట్లుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. ఆ వర్షాలకు జిల్లావ్యాప్తంగా 17 మండలాల పరిధిలో సుమారు 12 వేల హెక్టార్లలో వరి, వేరుశనగ పంట దెబ్బతింది. అందులో సోమశిల, గూడూరు, ఆత్మకూరు, వెంకటాచలం, విడవలూరు తదితర మండలాల పరిధిలో పంట నష్టం అధికంగా ఉందని అంచనా. అయితే అధికారులు మాత్రం 11 మండలాల్లో 2,184 హెక్టార్లలో మాత్రం పంటలు దెబ్బతిన్నాయని తేల్చారు. మిగిలిన ఆరు మండలాల సంగతి పట్టించుకోకపోవటం గమనార్హం. తాజాగా శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఫలితంగా ఆత్మకూరు, కలువాయి, చేజర్ల, అనంతసాగరం, పొదలకూరు, సైదాపురం, వరికుంటపాడు, ముత్తుకూరు తదితర మండలాల పరిధిలో వరి పంటతో పాటు ఉద్యాన పంటలైన మామిడి, నిమ్మ, బొప్పాయి, అరటి పంటలు కూడా భారీగా దెబ్బతిన్నాయి. రైతులను కలవని అధికారులు ఇటీవల వరుసగా అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సి ఉంది. అందుకు ప్రభుత్వం 14 బృందాలను నియమించింది. వీరు బృందాలుగా విడిపోయి గ్రామాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంది. అయితే కొందరు అధికారులు పంటలు దెబ్బతిన్న గ్రామాల్లో పర్యటించనే లేదని రైతులు చెబుతున్నారు. అందుకు నిదర్శనం గూడూరు మండలమే. చెన్నూరు గ్రామానికి చెందిన పెద్దరమణయ్య 13 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగుచేశారు. ఎకరాకు రూ.25వేల వరకు వెచ్చించి అతికష్టంపై పంటను గట్టెక్కించారు. ఒకటి రెండురోజుల్లో పంటను కోసి ధాన్యాన్ని విక్రయించాలని భావించారు. అయితే అకాల వర్షంతో పంటంతా నీట మునిగింది. ధాన్యం మొలకలు వచ్చాయి. నీటమునిగిన పంటను కోసి తడిసిన ధాన్యాన్ని నివాసానికి తెచ్చారు. అదే గ్రామానికి చెందిన నెల్లూరు వీర రాగయ్యకు చేతికొచ్చే 14 ఎకరాల్లోని వరి పంట అకాల వర్షంతో నీటమునిగింది. ధాన్యం మొలకులు వచ్చాయి. తీవ్రంగా నష్టపోయిన ఈ ఇద్దరు రైతులను అధికారులు వచ్చి పంట నష్టం గురించి వివరాలు అడిగి తెలుసుకున్న పాపాన పోలేదు. మొలకలు వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనైనా విక్రయించాలని భావించారు. అయితే కొనుగోలు కేంద్రాలకు వెళితే పట్టించుకునే నాధుడే కరువయ్యారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా సూళ్లూరుపేట, పెళ్లకూరు, గూడూరు, ఏఎస్పేట మండలాల పరిధిలో అనేక మంది రైతులు అకాల వర్షంతో పంటలు పోగొట్టుకున్న రైతులు ఉన్నారు. వారిని గుర్తించి పంట నష్ట పరిహారం జాబితాలో చేర్చాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. -
అడుగంటిన పాతాళ‘గంగ’
సాక్షి ప్రతినిధి, ఒంగోలు :జిల్లాలో కరువు తన ప్రతాపాన్ని చూపుతోంది. ఈ ఏడాది జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోయాయి. శీతాకాలంలోనే బోర్లు ఎండిపోయాయి, బావుల్లో నీరు అడుగంటాయి. పశ్చిమ కృష్ణాలో ఇప్పటికే తాగునీటి సమస్య ఏర్పడింది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో భానుడి తీవ్రతకు జిల్లావాసుల గొంతుతడి ఆరిపోవడం ఖాయం. మళ్లీ వర్షాలు పడితేగాని భూగర్భ జలాలు పెరిగే అవకాశం లేదు. వర్షాల కోసం జూన్ వరకూ ఎదురుచూడక తప్పదని నిపుణులు చెబుతున్నారు. గత ఐదేరేళ్లలో మునుపెన్నడూ లేనివిధంగా భూగర్భజల మట్టం అడుగంటిపోతోంది. జిల్లావ్యాప్తంగా సర్వేజరిపి పరిశీలిస్తే జనవరి చివరినాటికే భూగర్భ జలాలు భారీగా అడుగంటాయి. జిల్లాలో 56 మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో జలాశయాలకు సమీపాననున్న ప్రాంతాలను గుర్తించి 49 ప్రదే శాల్లో భూగర్భజల మట్టం పరీక్షా యంత్రాలను ఏర్పాటు చేశారు. అన్నిచోట్లా సగటున నీటిమట్టం ఐదున్నర మీటర్ల మేర లోతుల్లోకి పడిపోయింది. గత ఏడాది జనవరినాటికి 8.31 మీటర్ల లోతున భూగర్భ జలాలుంటే ఈ ఏడాది ఇప్పటికే 13.40 మీటర్లకు పడిపోయాయి. ఈ ఏడాది మే నెలలో 10.92 మీటర్లు ఉంటే డిసెంబర్కు 12.15 మీటర్లు, జనవరికి 13.40 మీటర్లకు పడిపోయాయి. పశ్చిమ కృష్ణాలో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి దత్తత తీసుకున్న కొమరవోలు మండలం దద్దవాడ గ్రామంలో 56.04 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఇక్కడ ప్రభుత్వం వేసిన బోరు రోజుకు పది నుంచి 15 బిందెల నీటికి మించి రావడం లేదు. ఇదే గ్రామంలో మరో ప్రైవేటు వ్యక్తి వేయించిన బోరులో కొద్దిగా నీరు వస్తున్నాయి. దీంతో అక్కడే రోజు నీటి కోసం ఎదురుచూస్తూ మహిళలు కాలం గడుపుతున్న పరిస్థితి ఉంది. సాగర్ జోన్ -2 పరిధిలో మాత్రమే భూగర్భ జలాల పరిస్థితి ఆశాజనకంగా ఉండగా, మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా మారుతోంది. దద్దవాడ తర్వాత బేస్తవారిపేట మండలం పిటకాయలగుల్ల 45.17 మీటర్లు, తర్లుపాడు మండలం తాడివారిపల్లిలో 40.67, బేస్తవారిపేట బసనేపల్లిలో 39.51, మార్కాపురం మండలం సీతానాగులవరంలో 38.66, రాచర్లలో 35.48, మార్కాపురం మండలం నికరంపల్లిలో 34.25, పుల్లల చెరువు మండలం యెండ్రపల్లిలో 33.40, గిద్దలూరులో 32.95, యర్రగొండపాలెం మండలం బోయలపల్లిలో 31.75, కొమరవోలు మండలం బదినేనిపల్లిలో 25.84, రాచర్ల మండలం చొల్లవీడులో 25.64, వేజెండ్లలో 25.18, పెదారవీడులో 24.75, దోర్నాలలో 23.6, దొనకొండ మండలం కొచ్చెర్ల కోటలో 21.75, వెలిగండ్ల మండలం కె ఆగ్రహారంలో 21.03, పుల్లలచెరువులో 20.75, కనిగిరిలో 20.73 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు చేరుకున్నాయి. ఈ ప్రాంతాలలో ప్రజలు తాగునీటికి వెంపర్లాడుతున్నారు. పశ్చిమ కృష్ణాలో ఎక్కడ చూసినా చెరువులు, బావులు ఎండిపోయాయి. బోర్లు చుక్క నీటికీ ఆధారంగా నిలవలేకపోతున్నాయి. మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని చెరువులు నింపడంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం నీరు - చెట్టు పేరుతో మరో ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టింది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పశ్చిమ కృష్ణాలో చెరువులు నింపకపోతే మరో ఒకటి రెండు నెలల్లో నీటి యుద్ధాలు తప్పని పరిస్థితి ఏర్పడనుంది. నేడు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఒంగోలు టౌన్: శుక్రవారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో జరగనున్న జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో నీటి ఎద్దడి తీవ్రతను సభ్యులు ప్రస్తావించేందుకు సిద్ధమయ్యారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్న ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కూడా మంచినీటి ఎద్దడిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ప్రజల దాహార్తిని తీర్చే విషయమై అధికారులకు దిశా నిర్ధేశం చేయనున్నారు. -
జలసిరి... ఆవిరి
శీతాకాలంలోనే నీటి ఎద్దడి * శివార్లలో వట్టిపోతున్న బోరుబావులు * జలాశయాల్లో తగ్గుతున్న మట్టాలు * వేసవి నాటికి సంక్షోభం * ఆందోళనలో ప్రజలు, అధికారులు సాక్షి, సిటీబ్యూరో: ఎముకలు కొరికే చలిలోనూ గ్రేటర్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. నీటి మట్టాలు గణనీయంగా పడిపోతున్నాయి. బోరు బావుల్లో నీళ్లు పాతాళానికి చేరుకుంటున్నాయి. శివారు ప్రాంతాల వారు ట్యాంకర్లను ఆశ్రయిస్తోండడంతో జేబులకు చిల్లులు పడుతున్నాయి. జనవరిలోనే ఇలా ఉంటే వచ్చే వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని నగర వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు మహానగర దాహార్తిని తీరుస్తోన్న జలాశయాల్లోనూ నీటిమట్టాలు బాగా తగ్గడంతో వేసవిలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నగరంలో గతేడాది కంటే ఈసారి భూగర్భ జల మట్టాలు బాగా పడిపోయాయి. హయత్నగర్ మండలంలో అత్యధికంగా 8.95 మీటర్ల మేర నీటి మట్టం పడిపోయింది. నాంపల్లి మండలంలో గతేడాది కంటే 8 మీటర్ల లోతునకు భూగర్భ నీటి నిల్వలు పడిపోయాయి. సరూర్నగర్లోనూ 6.90 మీటర్ల మేర తగ్గాయి. ఉప్పల్ మండలంలో 5.55 మీటర్లు తగ్గాయి. చార్మినార్లో 4.30 మీటర్లు, సైదాబాద్లో 3.20 మీటర్ల మేర నీటినిల్వలు తగ్గాయి. ఇక అమీర్పేట్, ఆసిఫ్నగర్, బండ్లగూడ, చార్మినార్, ఖైరతాబాద్, మారేడ్పల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి మండలాల్లోనూ గతేడాదితో పోలిస్తే భూగర్భ జలమట్టాలు తగ్గడం గమనార్హం. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించే ఇంకుడు గుంతలు లేకపోవడం, నగరం కాంక్రీట్ జంగిల్గా మారడం, బోర్ల వినియోగం పెరగడం, ప్రతి ఇంట్లోనూ బోరుబావికి ఆనుకొని రీచార్జింగ్ పిట్ లేకపోవడంతో నీటి మట్టాలు అనూహ్యంగా పడిపోయినట్టు భూగర్భ జలశాఖ అధికారులు తెలిపారు. -
జల గండం
భారీగా పడిపోతున్న భూగర్భ జలమట్టాలు వేసవికి ముందే పరిస్థితి ఆందోళనకరం నగరంలో సగటున 3.58 మీటర్ల లోతునకు పడిపోయిన వైనం అన్ని మండలాల్లోనూ తగ్గిన నీటి నిల్వలు ‘మహా’నగరానికి మంచినీటి కష్టాలు తప్పవా? సమీప భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవాల్సిందేనా? నిపుణులను తొలిచేస్తున్న ప్రశ్నలివి. వానలు కురుస్తున్నాయి... జలాశయాలు నిండుగా కనిపిస్తున్నాయి కదా అనుకుంటున్నారా? ఇదంతా పైపైనే. భూగర్భ జలమట్టాలు భారీగా పడిపోతున్నాయి. ఏడాది కాలంలోనే ఈ తేడా స్పష్టంగా వెల్లడైంది. నీటి చుక్కను ఒడిసి పట్టే మార్గం లేక...ఉన్నా...ఆచరించే ఓపిక లేని యంత్రాంగం నిర్లక్ష్యం సాక్షిగా ఇప్పుడు గ్రేటర్ జలగండం ముంగిట నిలిచింది. సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో భూగర్భ జలమట్టాలు శరవేగంగా పడిపోతున్నాయి. మేలుకోకుంటే రాబోయే ముప్పు ఎలా ఉంటుందో ముందే హెచ్చరిస్తున్నాయి.మహా నగరంపై వరుణుడు కరుణిస్తున్నా... వాన చుక్క భూమిలోకి ఇంకే పరిస్థితులు లేవు. నీటి మట్టం తగ్గడానికి ఇదో ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నవంబరు నెలలో నగరంలో ఏకంగా 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం (80 మిల్లీమీటర్లు) కంటే 40 మిల్లీమీటర్లు అధికం. కానీ విలువైన వర్షపునీటిని భద్రపరిచే ఇంకుడు గుంతలు తగినన్ని లేకపోవడంతో భూగర్భ జలమట్టాలు ఆశించిన మేర పెరగడం లేదు. దీనిపై భూగర్భ జలనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది నగరంలో సగటున 5.79 మీటర్ల లోతున జలమట్టాలు ఉండగా... ఈసారి 9.37 మీటర్ల లోతునకు పడిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే 3.58 మీటర్ల మేర నీటిమట్టాలు పడిపోవడం గమనార్హం. శీతాకాలంలోనే ఈ పరిస్థితి ఉంటే... రాబోయే వేసవిలో ఎలా ఉండబోతోందో ఈ సంకేతాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. కాంక్రీట్ మహారణ్యంలా మారిన గ్రేటర్లో 60 శాతంవర్షపునీరు వృథాగా పోతుండడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు వరద రూపంలో 40 శాతం వృథా కావడం సర్వసాధారణం. కానీ నగరంలో దీనికి అదనంగా మరో 20 శాతం వృథాగాపోతోంది. ఈ నీటిని భూగర్భంలోకి మళ్లిస్తే జలమట్టాలు మరో మూడు మీటర్లు పెరిగే అవకాశం ఉంది. కానీ జీహెచ్ఎంసీ, జలమండలి విభాగాలు దీనిపై దృష్టి పెట్టిన పాపాన పోవడం లేదు. ఎంత తవ్వినా అంతే... గ్రేటర్ పరిధిలోని అనేక మండలాల్లో గతఏడాది నవంబరునెలాఖరుతో పోలిస్తే ఈ ఏడాది నవంబరుచివరి నాటికి భూగర్భ జలమట్టాలు మరింత లోతుకు పడిపోయాయి. చార్మినార్మండలంలో గత ఏడాది 5.60 మీటర్ల లోతున భూగర్భ జలాల ఆనవాళ్లు కనిపించగా... ఈసారి 11.27 మీటర్ల లోతునకు తవ్వితే గానీ నీటిచుక్క కనిపించని దుస్థితి నెలకొంది. అమీర్పేట్, మారేడ్పల్లి,నాంపల్లి, ఉప్పల్, హయత్నగర్,కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి మండలాల్లోనూ భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోవడం గమనార్హం. గ్రేటర్ పరిధిలో దాదాపు అన్ని మండలాల్లోనూ ఇదే దుస్థితి తాండవిస్తోంది. కారణాలివే... మహా నగర పరిధిలో అపార్ట్మెంట్లు, భవనాల సంఖ్య సుమారు 22 లక్షలు. కానీ ఇంకుడు గుంతలు 35 వేలకు మించి లేవు. ఈ కారణంగా వర్షపు నీటిని సంరక్షించలేకపోతున్నాం. దీంతో 60 శాతం నీరు వృథా అవుతోంది. { Vేటర్ పరిధిలో భూగర్భ జలమట్టాలు పెంచేందుకు గత ఏడాది జీహెచ్ఎంసీ 10 వేలు, జలమండలి 22 వేల ఇంకుడు గుంతల ఏర్పాటుకు వినియోగదారుల నుంచి రూ.64 కోట్ల మేర రాబట్టాయి. కానీ తవ్వింది ఐదు వేల ఇంకుడు గుంతలే. దీన్నిబట్టి వారి శ్రద్ధ ఏపాటిదో తెలుస్తోంది.మహానగరంలో ఇళ్లు, కార్యాలయాల్లో ఇంకుడు గుంతలు లేవు. దీంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఇంకుడు గుంతలతో సమస్యకు పరిష్కారం.. మధ్య తరగతి ప్రజలు 200 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఖాళీ స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న పక్షంలో.. బోరుబావికి మీటరు లేదా రెండు మీటర్ల దూరంలో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలి. దీని పొడవు, వెడల్పులు 2 మీటర్ల మేర ఉండాలి. 1.5 మీటర్ల లోతున గుంత తీసి ఇందులో 50 శాతం 40ఎంఎం పరిమాణంలో ఉండే పలుగు రాళ్లు, 25 శాతం 20 ఎంఎం సైజులో ఉండే రాళ్లను నింపాలి. మరో 15 శాతం బఠానీగింజ పరిమాణంలో ఉండే ఇసుకను నింపాలి. మరో పదిశాతం ఖాళీగా ఉంచాలి. భవనం పైకప్పు నుంచి పడిన వర్షపునీరు ఈ గుంతపై కొద్దిసేపు నిలిచేలా ఏర్పాటు చేసుకోవాలి. దీంతో భూగర్భజలాల రీచార్జి సులువవుతుంది. బోరుబావి పది కాలాల పాటు ఎండిపోకుండా ఉంటుందని భూగర్భ జలశాఖ నిపుణులు సూచిస్తున్నారు. ఇళ్లు, కార్యాలయాల విస్తీర్ణాన్ని బట్టి వీటి సైజు పెరుగుతుందని చెబుతున్నారు. -
రబీ రందీ..
ఆదిలాబాద్ : ఈ ఏడాది వర్షాభావంతో జిల్లాలోని జలాశయాలు అడుగంటాయి. గతేడాది ఇదే సమయానికి నిండుకుండలను తలపించిన ప్రాజెక్టులు ప్రస్తుతం డెడ్స్టోరేజీకి చేరువలో ఉన్నాయి. కాలువ మట్టానికి కూడా నీళ్లు లేక ఆయకట్టుకు నీళ్లంద ని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురువలేదు. రబీలో ప్రాజెక్టుల కింద సాగుపై ఆశలు పెట్టుకున్న రైతులు ఆందోళకు గురవుతున్నారు. జూన్ 1 నుంచి ఇప్పటివరకు జిల్లా సాధారణ వర్షపాతం 1088.6 మిల్లీ మీటర్లు కాగా కేవలం 734.9 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. దీంతో ఈ ఏడాది -33 శాతం వర్షాభావ పరిస్థితి నెలకొంది. ఖరీఫ్ పంటల పరంగా ప్రధానంగా పత్తి, సోయా, వరి దిగుబడులు అమాంతంగా పడిపోయి రైతన్నలు తీవ్ర దిగాలులో ఉన్నారు. నిరాశే.. గతేడాది భారీ వర్షాలతో లక్షల క్యూసెక్కుల నీటిని ప్రా జెక్టు గేట్లు ఎత్తి దిగువకు వదిలారు. ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధానంగా ఎస్సారెస్పీ, కడెం, స్వర్ణ నీటి మట్టాలు అడుగంటాయి. శ్రీరాంసాగర్ నుంచి సరస్వతీ కాలువ కింద నిర్మల్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్లో సుమారు 35 వేల ఆయకట్టు ఉంది. రబీలో సరస్వతీ ఆయకట్టుకు నీరందించలేమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. స్వర్ణ కింద సారంగాపూర్, నిర్మల్ మండలాల్లో 8,945 ఎకరాల ఆయకట్టు ఉంది. రబీలో స్వర్ణ నుంచి నీళ్లందించడం సాధ్యం కాద ని తేల్చిచెపుతున్నారు. కడెం ప్రాజెక్టు కింద జన్నారం, కడెం, లక్సెట్టిపేట, దండేపల్లి, మంచిర్యాల మండలాల్లో 68,158 ఎకరాల ఆ యకట్టు ఉంది. ప్రధానంగా వరి సాగు చేస్తారు. ఈ ఏడాది కడెంలో నీటి సామర్థ్యం ఆందోళన కలిగిస్తోంది. సాగునీరు అందేది కష్టంగా నే కనిపిస్తోంది. సాత్నాల కింద జైనథ్, బేల, ఆదిలాబాద్ మండలాల్లోని 24 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఖరీఫ్లో 14 వేల ఎకరాల వరకు నీరందుతుంది. టేల్ ఎండ్ వరకు నీరందని పరిస్థితి ఉంది. కేవలం ఖరీఫ్ పంటలకు మాత్రమే సాత్నాల సాగు నీరందిస్తుంది. రబీ పంటలు అంతంత మాత్రంగానే ఉండడంతో సాత్నాల నుంచి నీటి విడుదల లేదు. మత్తడివాగు కింద తాంసి, తలమడుగులోని 8,500 ఎకరాల ఆయకట్టుకు ఖరీఫ్లో మాత్రమే నీరందుతుంది. -
జిల్లాకు జలకళ
{పాజెక్టులు, రిజర్వాయర్లు, నదుల అనుసంధానం తాగునీటికి 18 టీఎంసీల నీరు రూ.8 వేల కోట్లతో వాటర్ గ్రిడ్కు తాజా ప్రతిపాదనలు జిల్లాకు తాగునీటి కష్టాలు తీరనున్నాయా? నదులు, రిజర్వాయర్లు అనుసంధానం చేస్తున్నారా? పడమటి మండలాలకు కూడా తాగునీరు అందించే దిశగా అడుగులేస్తున్నారా? తాగునీటితోపాటు వ్యవసాయానికి, పరిశ్రమలకు అవసరమైన 18 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుందా?.. ఇందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకం ద్వారా జిల్లాలో నీటి సమస్య తీర్చేందుకు అధికారులు క సరత్తు చేస్తున్నారు. కిరణ్ ప్రభుత్వ హయాంలో 7,200 కోట్లతో ఈ పథకానికి శంకుస్థాపన చేస్తే ప్రస్తుతం ఈ వ్యయం రూ.8 వేల కోట్లకు చేరింది. తిరుపతి సిటీ: చిత్తూరు జిల్లాలో శాశ్వత మంచినీటి పథకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రిజర్వాయర్లు, నదులు, చెరువులు అనుసంధానం చేసేం దుకు తెలుగుగంగ, ఇరిగేషన్ అధికారులతో పాటు పబ్లిక్ హెల్త్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. జిల్లా దాహార్తికి, ఇతర అవసరాలకు కావాల్సిన నీళ్లను ఎలా సమకూర్చుకోవాలనే దానిపై అభిప్రాయసేకరణ చేస్తున్నారు. జిల్లాలోని తెలుగుగంగ, తెలుగుగంగ కాలువలు, సోమశిల-స్వర్ణముఖి, గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులను ఒకే వేదికమీదకు తీసుకురావడంతో పాటు జిల్లాలోని కల్యాణి రిజర్వాయర్, కాళంగి రిజర్వాయర్, అరణియార్, బహుదా ప్రాజక్టు, పింఛా ప్రాజెక్టు, పెద్దేరు, ఉబ్బలమడుగు, మల్లిమడుగు ప్రాజెక్టులను కూడా ఇందు లో చేర్చుతున్నారు. వీటితో పాటు అతిపెద్ద ఆయకట్టు ఉన్న తొండమనాడు, కందుకూరు వ్యాసరాయ చెరువులను కూడా అనుసంధానంలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. త ద్వారా జిల్లాకు అవసరమైన నీటిని అందించాలనే లక్ష్యంతోనే ఈపథకాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. నీటిని ఈ రిజర్వాయర్లకు తీసుకొచ్చి పైపుల ద్వారా అన్ని గ్రామాలకు పంపింగ్ చేయాలని భావిస్తున్నారు. తాగేందుకు గుక్కెడు నీరూ కరువే.. మూడేళ్లుగా జిల్లాలో సరైన వర్షపాతం నమోదు కావ డం లేదు. ముఖ్యంగా వేసవిలో అయితే పరిస్థితి దా రుణంగా ఉంటోంది. పడమటి మండలాల్లో కనీసం తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకడం లేదు. ఇక తిరుపతి విషయానికి వస్తే కల్యాణి డ్యాంలో నీరు ఎప్పుడూ డెడ్ స్టోరేజీలోనే ఉంది. తిరుపతి తాగునీటి అవసరాలకు ఎక్కువ భాగం తెలుగుగంగ మీదనే ఆధారపడాల్సి వస్తోంది. ఎన్టీఆర్ జలాశయానికి నీటిని పంపింగ్ చేసి చిత్తూరు ప్రాంతానికి నీటిని ఇవ్వాలని ప్రతిపాదించారు. సాగుకూ కష్టమే.. ఇక వ్యవసాయ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తూర్పు మండలాల్లో కాస్తోకూస్తో భూగ ర్భ జలాలు ఉన్నాయి. పడమటి మండలాల్లో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. ఇదే పరిస్థితి మరికొంతకాలం కొనసాగితే ప్రజలు ఊళ్లు వదిలి పోయే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదకర పరిస్థితుల నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా చిత్తూరు జిల్లాకు వాటర్గ్రిడ్ పథకాన్ని తీసుకొచ్చే పనిలో పడింది. అందుకోసం ఇరిగేషన్, ప్రాజెక్టుల అధికారులను ప్రణాళికలు తయారుచేసేందుకు పురమాయిం చింది. జిల్లాకు తాగునీరుతో పాటు, సాగుకు, పరిశ్రమలకు సంవత్సరానికి ఎంత నీరు అవసరమవుతుందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావ్, జిల్లామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా యుద్ధప్రాతిపదికన పనులు డిజైన్స్ తయారు చేయాలని అదేశించినట్లు అధికారులు చెప్పారు. పెరుగుతున్న అంచనా వ్యయం కిరణ్ హయాంలోనే జిల్లా తాగునీటి శాశ్వత పరిష్కానికి పురుడు పోసుకుంది. అన్ని ప్రాంతాలకు తాగునీటి అవసరాల నిమిత్తం రూ.7,200 కోట్లు కేటాయించారు. అయితే ఆ ప్రాజెక్టు శంకుస్థాపనకే పరిమితమైంది. ఆ తరువాత తెలుగుదేశం ప్రభుత్వం వాటర్గ్రిడ్ను తెరపైకి తెచ్చింది. కండలేరు నుంచి డెరైక్టుగా నీళ్లను ప్రాజెక్టుల్లోకి తీసుకొచ్చి తద్వారా పట్టణాలకు, గ్రామాలకు అందించాలనే లక్ష్యంతో ఉంది. అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టుకు రూ.8 వేలకోట్లు ఖర్చవుతాయని భావి స్తోంది. గతంతో పోల్చితే దాదాపు రూ.800 కోట్లు అంచనా వ్యయం పెరిగినట్లు తెలుస్తోంది. నివేదికలు ఇచ్చాం.. జిల్లాలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి అవసరమైన నివేదికలు ప్రభుత్వానికి అందజేసినట్లు తెలుగుగంగ ఎస్సీ సుబ్బారావు మంగళవారం ‘సాక్షి’కి వివరించారు. వాటర్గ్రిడ్ రాష్ట్ర కన్సల్టెంట్ కొండలరావ్ దీనిపై పూర్తి నివేదిక తీసుకొన్నట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన తరువాత ప్రాజెక్టు వివరాలు ప్రకటిస్తామని అన్నారు. -
నిండిన జలాశయాలు:లోతట్టు ప్రాంతాలు నీట మునక
విజయవాడ: ఏపిలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జలాశయాలకు వరద నీటి తాకిడి ఎక్కువైంది. చెరువులకు గండ్లు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తుంగభద్ర డ్యామ్లో వరద నీటి ఉధృతి కర్నూలు: తుంగభద్ర డ్యామ్కు వరద నీటి ఉధృతి పెరిగింది. ప్రస్తుత నీటి మట్టం 1632 అడుగులు ఉంది. ఇన్ఫ్లో 11వేల 33 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 6 వేల 484 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 98 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సుంకేసుల ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్ఫ్లో 16 వేల క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 13వేల క్యూసెక్కులు ఉంది. 18 గేట్లు ఎత్తివేశారు. 80వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైల జలాశయానికి విడుదల చేశారు. నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు నెల్లూరు: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెరువులకు గండ్లుపడి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉదయగిరి, సీతారామపురం, వరికుంటపాడు మండలాలలో భారీగా వర్షం కురిసింది. ఉదయగిరిలో రికార్డు స్థాయిలో 214.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సీతారామపురం మండలం చిన్ననాగంపల్లి, అప్పసముద్రం చెరువులకు గండ్లు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పులిచింతల రిజర్వాయర్కు వరద నీరు గుంటూరు: పులిచింతల రిజర్వాయర్కు భారీగా వరద నీరు చేరుతోంది. దాంతో అధికారులు తొమ్మిది గేట్లను 2 మీటర్ల మేర ఎత్తివేశారు. 90,740 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుత నీటిమట్టం 11.67 టీఎంసీలు ఉంది. మరోవైపు ప్రాజెక్ట్ పరిధిలోని ముంపు గ్రామాలకు నీటి ప్రవాహం రోజు రోజుకు పెరుగుతోంది. జక్కల్ చెరువుకు గండి అనంతపురం: జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. శెట్టూరులో 16 సెంటీమీటర్లు, బొమ్మనహళ్, బ్రహ్మసముద్రంలో 11, కంబదూరు, హీరేహెరాళ్లలో 9, గుత్తి, గుమ్మగట్టలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా వరి, వేరుశనగ పంట పొలాలు దెబ్బతిన్నాయి. గుత్తి మండలంలో జక్కల్ చెరువుకు గండిపడింది. ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. ** -
నిండుకుండలు
సరిహద్దు జలాశయాల్లో పుష్కలంగా నీరు బలిమెలలోకి 24 టీఎంసీలు కొత్తగా చేరిక ఏపీవాటాగా 72 టీఎంసీలు నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాల అధికారుల సమీక్ష సీలేరు/ముంచంగిపుట్టు : జిల్లాను అతలాకుతలం చేసిన హుదూద్ ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లోని జలాశయాలకు మాత్రం మేలు చేసింది. తుపాను కారణంగా జోలాపుట్టు, బలిమెల, సీలేరు, డొంకరాయి, మోతుగూడెం రిజర్వాయర్లలో పుష్కలంగా నీరు చేరింది. ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల జలవిద్యుత్ కేంద్రాలకు నీరందించే బలిమెల జలాశయంలోకి 24 టీఎంసీల వరదనీరు చేరిందని ఏపీజెన్కో సీలేరు ఇన్చార్జి సూపరింటెండెంట్ టీఎల్ రమేష్బాబు తెలిపారు. ఆంధ్ర,ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు ప్రధాన రిజర్వాయర్, డుడుమ(డైవర్షన్) డ్యామ్లోకి భారీగా వరద నీరు చేరింది. తుపాను అనంతరం తొలిసారిగా ఒడిశా బలిమెలలో సరిహద్దు నీటి వినియోగంపై రెండు రాష్ట్రాల అధికారులు శుక్రవారం సమీక్షించారు. నీటి వినియోగంపై లెక్కలు కట్టారు. ప్రస్తుతం బలిమెల జలాశయంలో 124 టీఎంసీల నీరు ఉండగా ఇందులో ఏపీకి 72.8564 టీఎంసీలు, ఒడిశాకు కేవలం 51.4136 టీఎంసీలు నీరు ఉన్నట్టు నిర్ధారించారు. తుపానుకు ముందు 100 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం అదనంగా 24 టీఎంసీలు పెరిగినట్టు లెక్కలు కట్టారు. ఈ నీటితో రానున్న 4 నెలలపాటు విద్యుదుత్పత్తికి ఎటువంటి ఢోకా లేదని జెన్కో అధికారులు వెల్లడించారు. అదే విధంగా మాచ్ఖండ్, సీలేరు, డొంకరాయి, మోతుగూడెం విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తికి డిమాండ్ లేదని, 6మిలియన్యూనిట్లు(ఎంయూ) విద్యుదుత్పత్తి అవుతోందని పేర్కొన్నారు. ప్రమాద స్థాయిలో బలిమెల : బలిమెల జలాశయం నిండుగా ఉంది. తుపానుకు ప్రమాదస్థాయికి చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టానికి అడుగు తేడాతో ప్రస్తుతం కళకళలాడుతుంది. దీని పూర్తిస్థాయి నీటిమట్టం 1516 అడుగులు. శుక్రవారం సాయంత్రానికి 1515 అడుగులకు చేరుకొంది. మరో అడుగు నీరు చేరితే నీటిని విడిచి పెట్టాల్సిందే. అదే విధంగా జోలాపుట్టు పూర్తిస్థాయి నీటిమట్టం 2750అడుగులు. ప్రస్తుతం 2749.45 అడుగుల నీరుంది. సీలేరులో 1360 అడుగులకు1352.1 అడుగుల నీరు చేరింది. డొంకరాయి 1037 అడుగులకు 1035.4 అడుగుల నీరుంది. స్పిల్వే డ్యాం నుంచి డుడుమ(డైవర్షన్) డ్యాంకు ప్రస్తుతం 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. డుడుమ డ్యాంలో 2585.9 అడుగుల నీటి మట్టం నమోదైంది. జలవిద్యుత్ కేంద్రంలోని ఆరుజనరేటర్లతో 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలి. 1,2,3 జనరేటర్లతో 50 మెగావాట్ల మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. జోలాపుట్టుకు నీరందించే మత్స్యగెడ్డలు నీటితో కళకళలాడుతున్నాయి. ఈ సమావేశంలో ఏపీ జెన్కో సూపరిండెంట్ ఇంజినీర్ ఈఎల్ రమేష్, ఏడీ భీమశంకరం, ఏడీటీ సురేష్తోపాటు ఒడిశా బలిమెల హైడ్రో ప్రాజెక్టు జనరల్ మేనేజర్ పిఎన్ పాండా, డిప్యూటీ మేనేజర్ (ఎలక్రికల్) జ్యోతిబసు, నీటి వనరుల విభాగం ముఖ్య నిర్వహణ ఇంజినీర్ మహంతిదాస్ పాల్గొన్నారు. -
‘పాలమూరు’పై 3 రిజర్వాయర్లు
కోయిల్కొండ, గండేడ్, కేపీ లక్ష్మీదేవునిపల్లి వద్ద నిర్మాణం {పభుత్వానికి సర్వే ప్రాథమిక నివేదిక 41 గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం.. ఎత్తిపోతలకయ్యే విద్యుత్కోసం ఏడాదికి 1,250 కోట్ల ఖర్చు హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు సమగ్ర స్వరూపంపై క్రమేపీ స్పష్టత వస్తోంది. ఈ పథకం సర్వే పనులను చేపట్టిన ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ, వివిధ కీలక అంశాలపై ఇప్పటికే సర్వే పూర్తి చేసి ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. జూరాల నుంచి 70 టీఎంసీల నీటిని తరలించేందుకు మహబూబ్నగర్ నుంచి రంగారెడ్డి మీదుగా నల్లగొండ వరకు మధ్యలో మూడు భారీ రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉంటుందని ప్రాథమిక సర్వేలో తేల్చారు. మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ వద్ద 70 టీఎంసీలు, రంగారెడ్డి జిల్లా గండేడు వద్ద 45 టీఎంసీలు, ఇదే జిల్లాలోని కేపీ లక్ష్మీదేవునిపల్లి వద్ద మరో 10 టీఎంసీలతో రిజర్వాయర్లు నిర్మించాల్సి వస్తుందని తేల్చారు. ఈ రిజర్వాయర్ల నిర్మాణానికి సుమారు 44వేల ఎకరాలు అవసరం ఉంటుందని, 41 గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని తేల్చారు. అరుుతే వీటి నిర్మాణానికి అవసరమయ్యే నిధుల వివరాలపై మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టతకు రాలేదు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా మూడు జిల్లాల పరిధిలోని సుమారు 10లక్షల ఎకరాలకు సాగునీటిని ఇవ్వాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం గత జూలై నెలలోనే ప్రాజెక్టు సమగ్ర నివేదిక తయారీకి రూ.5.73కోట్లను విడుదల చేసింది. ఆగస్టు తొలివారం నుంచి సర్వే పనులను చేపట్టిన ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఇప్పటికి రిజర్వాయర్లు, ప్రధాన కాలువలు, ముంపు ప్రాంతాలకు సంబంధించిన సర్వే పూర్తి చేసింది. వీటిల్లో పైప్లైన్, ఓపెన్ చానల్, టన్నెల్ అలైన్మెంట్, రిజర్వాయర్ల గుర్తింపు, పంపింగ్ స్టేషన్లు, ముంపు గ్రామాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. మిగతా డిస్ట్రిబ్యూటర్ల సర్వే పనులను డిసెంబర్లోగా పూర్తిచేసి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించాలని సంస్థ నిర్ణయించింది. మొదటి రిజర్వాయర్ ..కోయిల్కొండ సర్వే వివరాల ప్రకారం మొదటి రిజర్వాయర్ను కోయిల్కొండ వద్ద 70 టీఎంసీల నిల్వ సామర్ధ్యంతో నిర్మిస్తారు. ఈ రిజర్వాయర్ నుంచి ఒక ప్రధాన కాల్వ ఉంటుంది. కాల్వల అలైన్మెంట్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఇక్కడి పంపింగ్ స్టేషన్ వద్ద 160 మెగావాట్ల సావుర్థ్యం గలిగిన 14 పంపులను వాడాల్సి ఉంటుంది. ఈ రిజర్వాయర్ కింద మొత్తంగా 31 గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండగా 27వేల ఎకరాలు ముంపునకు గురవుతారుు. ఈ రిజర్వాయర్ ప్రధాన కాల్వ ద్వారా 75వేల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందిస్తారు. రెండో రిజర్వాయర్..గండేడు రెండో రిజర్వాయర్ను రంగారెడ్డి జిల్లా గండేడు వద్ద 45 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించాలని ప్రతిపాదించారు. రిజర్వాయర్ నుంచి రెండు ప్రధాన కాల్వ కింద మొత్తంగా 5.2లక్షల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించారు. ఇక్కడి పంపింగ్ స్టేషన్ వద్ద 160 మెగావాట్ల సావుర్థ్యం కలిగిన 5 పంపులను ప్రతిపాదించారు. రిజర్వాయర్ కింద 8 గ్రామాలు, 12,283 ఎకరాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని తేల్చారు. మూడో రిజర్వాయర్..కేపీ లక్షీదేవునిపల్లి రంగారెడ్డి జిల్లాలోని లక్ష్మీదేవునిపల్లి వద్ద 10 టీఎంసీల కెపాసిటీతో మూడో రిజర్వాయర్ను ప్రతిపాదించారు. దీని నుంచి మూడు ప్రధాన కాల్వలను ప్రతిపాదించిన సర్వే సంస్థ, సుమారు 4.05లక్షల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చని పేర్కొంది. ఇక్కడ 70 మెగావాట్ల సావుర్థ్యం కలిగిన4 పంపులను ప్రతిపాదించారు. దీని కింద 2 గ్రామాలు, 4,100 ఎకరాల భూమి ముంపునకు గురౌతోంది. విద్యుత్ అవసరం 2,255 మిలియన్ యూనిట్లు.. రిజర్వాయర్ల నుంచి నీటిని పంపింగ్ చేసేందుకు ఏటా 2,255 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంటుందని లెక్కకట్టారు. యూనిట్కు రూ.5.40పైసల చొప్పున రూ.1,250 కోట్ల ఖర్చవుతుందని నివేదికలో స్పష్టం చేశారు. -
జలాశయాలు కళకళ.. అయినా నీటి కోసం విలవిల
గజ్వేల్: సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు కళకళలాడుతున్నా.. వాటిని సరైన విధంగా వినియోగించుకోలేని దుస్థితి నెలకొనడంతో గజ్వేల్ నియోజకవర్గంలో సాగునీటి కష్టాలు తప్పడం లేదు. పూర్వకాలం నుంచి వ్యవసాయానికి ప్రధాన ఆధారంగా ఉన్నా గొలుసు చెరువుల అభివృద్ధిపై నిర్లక్ష్యం అలుముకోవడం, వాగుల నుంచి వచ్చే వరదనీటిని చెరువులు, కుంటల వైపు మళ్లించుకోలేకపోవడం వల్ల ఈ దుస్థితి నెలకొంది. ఫలితంగా రైతులకు కష్టాలు తప్పడం లేదు. చెరువుల అనుసంధాన ప్రక్రియ కూడా అమలుకు నోచుకోవడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెరువుల అభివృద్ధికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని చేసిన ప్రకటన కొత్త ఆశలను రేపుతోంది. చెరువులను అభివృద్ధి చేస్తే భూగర్భజలాల గణనీయంగా పెరిగి వ్యవసాయరంగం సంక్షోభం నుంచి బయటపడే అవకాశముంది. జలాశయాలు లేని గజ్వేల్ నియోజకవర్గంలో దశాబ్దాల కిందట నిర్మించిన చెరువులు, కుంటలు ప్రధానవనరులుగా ఉన్నాయి. ఈ వనరులను పరిరక్షించే విషయంలో చెప్పుకోదగ్గ కృషి జరగకపోవడం వల్ల అవన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. మరోపక్క కొన్ని చెరువులైతే ఏళ్లతరబడి పూడికతీతకు నోచుకోలేక పల్లంగా మారి చిన్నపాటి వర్షాలకే నిండిపోయి మిగతా నీరంతా వృథాగా పోతున్నాయి. చెరువుల్లో నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోవడం వల్ల భూగర్భ జలమట్టం పడిపోతుండగా బోరుబావుల ఆధారంగా సాగుతున్న ఇక్కడి వ్యవసాయం సహజంగానే సంక్షోభం దిశగా పయనిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చెరువు, కుంటల పరిరక్షణ అత్యవసరంగా మారింది. ప్రధానంగా గజ్వేల్ నియోజకవర్గంలోని గొ లుసు చెరువులను అభివృద్ధి చేసి వాటిని వాగులతో అనుసంధానం చేసినట్లయితే బీడు భూ ములకు నీరందించవచ్చు. నియోజకవర్గంలోని కుడ్లేరు వాగుతో చెరువులు నింపే అవకాశముంది. గజ్వేల్ మండలంలో కుడ్లేరు వాగులో ప్రవహించే నీటిని కొడకండ్ల వద్ద దారి మళ్లించి కొడకండ్ల చెరువు, కొండపాక మండలంలోని తిప్పారం, సింగారం, వేములగాట్ తదితర గ్రామాల్లోని చెరువుల్లో నీటిని నింపవచ్చు. వర్గల్ మండలంలో ప్రవహించే హల్దీవాగు ద్వారా చెరువులను నింపే అవకాశముంది. ఈ వాగుపై అంబర్పేట వద్ద నిర్మించిన ఖాన్చెరువు నిండిన తర్వాత వాగులోని వరద నీటిని శాఖారం వద్ద ఫీడర్ ఛానెల్ నిర్మించి శాఖారం, గుంటిపల్లి, వర్గల్ చెరువుల్లో నీటిని నింపవచ్చు. మరో ఫీడర్ ఛానెల్ ద్వారా గోవిందాపూర్, గిర్మాపూర్, మాదారం, నెంటూర్, జబ్బాపూర్, మైలారం, కొమటిబండ చెరువుల్లోకి నీటిని చేర్చవచ్చు. తూప్రాన్ మండలం పా లాట, లింగారెడ్డిపేట, రావెళ్లి, బ్రహ్మణపల్లి, తూప్రాన్ గొలుసు చెరువులను అభివృద్ధి చేసినట్లయితే ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినట్లవుతుంది. ములుగు మండలం మర్కుక్లో ఉ న్న పెద్ద చెరువును రంగారెడ్డి జిల్లా నారాయణపూర్ ప్రాంతం నుంచి ఉన్న పరివాహక ప్రాం తం ఫీడర్ఛానల్ను మెరుగుపరచడం ద్వారా నీళ్లతో నింపి ఈ చెరువు నుంచి పాములపర్తి, పాతూరు, ఇప్పలగూడ చెరువులకు నీళ్లను తరలించే అవకాశముంది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ ప్రాంతంలో ప్రవహించే వాగు నుంచి నీళ్లను దారి మళ్లించే విధంగా ఫీడర్ఛానళ్లను నిర్మిం చడం ద్వారా ములుగు మండలం కొత్తూరు, సింగన్నగూడ, కొక్కొండ, నర్సాపూర్, తున్కిబొల్లారం, తున్కిఖాల్సా చెరువులను నింపే అవకాశముంది. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ చెరువుల అభివృద్ధికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడతామని ప్రకటించిన వేళ..ఇక్కడి రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. -
సాగు నీరో రామచంద్రా..
మరమ్మతులకు నోచుకోని గ్రోయిన్లు సముద్రంలోకి వృథాగా ఉప్పొంగే జలాలు వేలాది ఎకరాలకు అందని సాగునీరు అన్నదాతలకు అవస్థలు ఉప్పొంగే జలాలు ఉప్పునీటి పాలవుతున్నాయి. వర్షాలప్పుడు నీటిని ఒడిసి పట్టుకునే పరిస్థితి కానరావడం లేదు. జిల్లాలో సుమారు ఐదు లక్షల ఎకరాలకు బోర్లు, వర్షమే ఆధారం. నదుల్లోని నీటిని పొలాలకు మళ్లించడానికి ఏర్పాటు చేసిన గ్రోయిన్లు శిథిలమవ్వడంతో సాగునీరందక అన్నదాతలు అవస్థల పాలవుతున్నారు. వీటిని బాగు చేయడానికి ప్రతిపాదనలు పంపామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నా.. ఆ పని కానరావడం లేదు. చోడవరం : జిల్లాలో రైవాడ, కోనాం, పెద్దేరు,కల్యాణపులోవ, తాండవతోపాటు మరో ఐదు మినీ రిజర్వాయర్లు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు లక్ష ఎకరాలు సాగు భూమి ఉంది. ఇక మిగిలిన భూములన్నీ వర్షాధారమే. వర్షాలప్పుడు నీరు వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత పాలకులు, అధికారులదే. కానీ వారు పట్టనట్టు వ్యవహరించడంతో నీరో రామచంద్రా అంటూ రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రధానంగా ఎగువ నుంచి వివిధ నదుల్లోకి వస్తున్న నీటిని నిల్వ ఉంచే గ్రోయిన్లు దెబ్బతినడంతో వేలాది కూసెక్కుల నీరు వృథాగా సముద్రంపాలవుతోంది. శారద, పెద్దేరు, బొడ్డేరు, తాండవ, తాచేరు నదులు జిల్లాలో ప్రధానమైనవి. వీటితోపాటు సుమారు 60కి పైగా ప్రధాన కొండగెడ్డలు ఉన్నాయి. పెద్దనదులపై సుమారు 25 వరకు గ్రోయిన్లు ఉన్నాయి. శారదానదిలోని కశింకోట కాశీమదుం, అనకాపల్లి గొడారి ఆనకట్ట, చెర్లోపల్లి, సీతానగరం, నర్సాపురం గ్రోయిన్లు, పెద్దేరు నదిలోని గౌరీపట్నం, శ్రీరాంపట్నం, చాకిపల్లి, భోగాపురం, పి.ఎస్.పేట, బెన్నవోలు గ్రోయిన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటికి మరమ్మతులు చేపట్టకపోవడంతో భారీ వర్షాలప్పుడు నదుల్లోని నీరు వృథాగా దిగువకు పోతోంది. చాకిపల్లి గ్రోయిన్కింద 250 ఎకరాలు, భోగాపురం కింద 350, శ్రీరాంపట్నం 200, పిఎస్పేట 250, బెన్నవోలు 275, గౌరీపట్నం గ్రొయిన్కింద వెయ్యి ఎకరాలు సాగుభూములున్నాయి. పెద్ద గ్రోయిన్ల పరిధిలో వేలాది ఎకరాల ఆయకట్టు ఉంది. ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా శిథిలమై ఉన్నాయి. ఐదేళ్లుగా వీటిని నీటిపారుదలశాఖ అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. గౌరీపట్నం గ్రోయిన్కు నాలుగేళ్ల కిందట రూ.లక్షతో మరమ్మతులు చేపట్టినా నాణ్యతా లోపంతో రెండేళ్లకే కొట్టుకుపోయింది. మిగతా గ్రోయిన్ల పరిస్థితి దయనీయం. అసలే వర్షాధార భూములకు గ్రోయిన్లు కూడా ఉపయోగపడకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కాగా వీటికి అనుసంధానంగా ఉండే స్లూయీస్లు కూడా పూర్తిగా దెబ్బతినడంతో నదుల్లోని నీరు పంటకాలువలకు పారడం లేదు. పరిస్థితిని ఇరిగేషన్ అధికారుల దృష్టికి రైతులు తీసుకెళ్లినా ఫలితం శూన్యం. జిల్లా కలెక్టర్ దీనిపై చర్యలు తీసుకొని గ్రోయిన్లకు మరమ్మతులు చేపట్టి సాగునీరందేలా చూడాలని రైతులు కోరుతున్నారు. -
కొనసాగుతున్న నీటి బెంగ
కరుణించని వరుణుడు నిండని రిజర్వాయర్లు ఆయకట్టు భూములకు నీటి కష్టాలు జిల్లా రైతాంగాన్ని సాగునీటి బెంగ వెంటాడుతోంది. ఖరీఫ్ తొలి దశలో వరుణుడు కరుణించకపోవడంతో డీలాపడినా.. ఆ తర్వాత చినుకు రాలడంతో ఒడిసిపట్టి ఎలాగోలా నాట్లు పూర్తిచేసింది. తర్వాతైనా వర్షాలు కురిసి రిజర్వాయర్లు నిండితే ఖరీఫ్ ఆసాంతం సాగునీటికి ఢోకా ఉండదని భావిస్తే పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. విశాఖ రూరల్ : వర్షాభావ పరిస్థితులు పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఆయకట్టు భూములకు సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. వర్షాలు పడుతున్నా.. రిజర్వాయర్లలో నీటి మట్టాలు పెరగలేదు. ప్రధాన జలాశయాల్లో 50 శాతం కూడా నీటి నిల్వలు లేవు. ఫలితంగా పంటలకు అవసరమైన నీటిని విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. ఫలితం.. ఖరీఫ్ రైతులకు బెంగ పట్టుకుంది. వర్షాధారం కావడంవల్లే ఆందోళన జిల్లాలో 90 శాతం పంటలు వర్షాధారమైనవి. అయితే ఏటా మాదిరిగానే ఈ ఖరీఫ్లో కూడా అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వారాల క్రితం వరకు వర్షాలు లేక వేసిన పంటలు ఎండిపోయాయి. పది రోజులుగా వర్షాలతో పుంజుకున్నాయి. భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో రైతుల్లో ఉత్సాహం కనిపించింది. కానీ ఆ పరిస్థితి లేకపోవడంతో మళ్లీ డీలా పడ్డారు. కనీసం ఆయకట్టు భూముల కింద ఉన్న పంటలకైనా సక్రమంగా నీరందే అవకాశం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. నీటి విడుదల అంతంతమాత్రమే! జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోవడంతో ఆయకట్టు భూములకు సక్రమంగా నీరు విడుదల చేసే పరిస్థితి లేదని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. తాండవ జలాశయం కింద అత్యధికంగా 51 వేల ఎకరాలు ఆయకట్టు ఉంది. దీనికి 40 శాతం తక్కువగా 500 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. రైవాడ కింద 15 వేల ఎకరాలుండగా, ప్రస్తుతం 150 క్యూసెక్కులు, కోనాం పరిధిలో 12,500 ఎకరాలు ఉండగా 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తక్కువ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న పెద్దేరు రిజర్వాయర్ కింద మాత్రం 19,900 ఎకరాలు ఆయకట్టు ఉంది. దీనికి కేవలం 60 క్యూసెక్కుల నీటిని మాత్రమే వదులుతున్నారు. పెద్దేరు సామర్థ్యం తక్కువ కనుక 9 సార్లు నిండితే తప్ప ఆ ఆయకట్టుకు సరిపడా నీరందే అవకాశం లేదు. ప్రత్యామ్నాయంపై అధికారుల ప్రచారం రిజర్వాయర్ల నుంచి నీరు విడుదల చేయకపోవడానికి గల కారణాలపై రైతుల్లో అవగాహన కలిగించేందుకు నీటిపారుదల శాఖ అధికారులు ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారు. గ్రామాలకు స్వయంగా వెళ్లి రిజర్వాయర్లలో నీటి మట్టాల పరిస్థితి వివరించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. వరద ముప్పు తక్కువే ప్రస్తుత పరిస్థితుల్లో భారీ వర్షాలు కురిసినా వరద ముప్పు తక్కువేనని అధికారులు చెబుతున్నారు. పెద్దేరు మినహా మిగిలిన జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉండడంతో వర్షాలు అవశ్యమని పేర్కొంటున్నారు. గడచిన మూడేళ్లుగా సెప్టెంబర్ తర్వాత నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉండవచ్చని వారు అంచనావేస్తున్నారు. అతి భారీ వర్షాలు కురిస్తే తప్ప ఎలాంటి ప్రమాదం లేదంటున్నారు. -
నిండిన జలాశయాలు
కడెం : ఖరీఫ్లో వర్షాభావ పరిస్థితుల్లో మండలంలో వేలాది ఎకరాలు బీడుగా మారాయి. కొందరు రైతులు మొండి ధైర్యంతో వరి నార్లు పోయగా అవి ఎండలకు ఎండిపోయాయి. ఇదీ.. మొన్నటి వరకు కడెం ప్రాజెక్టు, సదర్మాట్ ఆయకట్టుల కింద ఉన్న పరిస్థితి. ప్రస్తుతం వారం రోజులుగా వరుసగా ముసుర్లు పడుతుండడంతో కడెం ప్రాజెక్ట్తోపాటు గ్రామాల్లోని చెరువులు, కుంటలు, బావులు జలకళను సంతరించుకున్నాయి. పొలం పనుల్లో రైతులు బిజీ.. కడెం ప్రాజెక్టు, సదర్మాట్లు నిండడంతో అధికారులు ఇదివరకే కాలువల ద్వారా నీటిని వదిలారు. ఈ నీరు పంటలకు కాదు.. చెరువులకు మాత్రమే అని కూడా వారు ప్రకటించారు. కానీ చెరువులు, బావుల కింద మాత్రం రైతులు ఇప్పటికే మండలంలోని చాలా గ్రామాల్లో వరినార్లు పోసుకున్నారు. కష్టపడి వరినార్లను కాపాడిన రైతులకు ఈ వర్షం చాలా ఆదుకున్నట్లయింది. వారంతా ఇపుడు వరినాట్లు వేసుకుంటున్నారు. వారిలో కొత్త ఆశలు చిగురించాయి. తమ పంట సాగు విజయవంతంగా జరుగుతుందన్న ధీమా వారిలో వ్యక్తమవుతోంది. మండలంలో ఎక్కడ చూసినా వరినాట్లు వేసుకోవడంలో రైతులు బిజీగా కనిపిస్తున్నారు. 15 రోజుల కిందట కురిస్తే.. వర్షాలున్నట్టుండి ఎటూ కాని సమయంలో కురుస్తుండడంతో కొందరు రైతులు సంతోషంతో ఉండగా మరి కొందరు అయ్యో ఇంకో 15 రోజుల కిందట పడితే తమ వరినారు దక్కేదని బాధ పడుతున్నారు. ఆయకట్టు కింద చాలా మంది రైతుల వరినార్లు ఇప్పటికే ఎండలకు ఎండిపోయాయి. కొందరు తెలిసిన తోటి రైతుల నుంచి, పరిచయం ఉన్న వారి నుంచి డబ్బులకు వరినార్లు కొనుక్కుంటున్నారు. వరినారు దొరకనివారు బాధపడుతున్నారు. ప్రస్తుతం మండలంలో కొద్దిరోజులుగా పంట భూములు రైతులతో కళకళలాడుతున్నాయి. -
జలాశయాలలో కొనసాగుతున్న వరద ఉధృతి
హైదరాబాద్: ఏపిలోని జలాశయాలు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ జలాశయం నీటిమట్టం 884.90 అడుగులుగా ఉంది. ఇన్ఫ్లో 1,04,126, ఔట్ ఫ్లో 1,40,244 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి కూడా వరద నీరు వచ్చి చేరుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 574.70 అడుగులుగా ఉంది. ఈ ప్రాజెక్టులో ఇన్ఫ్లో 1,32,446, ఔట్ఫ్లో 32 వేల క్యూసెక్కులుగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దహేగాం మండలంలో ఎర్రవాగు, నల్లవాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలుగ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లిలోని పెదవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 4,300 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. పాల్వంచ మండలం కిన్నెరసాని రిజర్వాయర్కు వరద నీరు వచ్చి చేరింది. నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. 392 అడుగుల గరిష్ట సామర్థ్యానికి వరదనీరు చేరుకుంది. భద్రాచంల ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కంకలవాగు,రాచపల్లివాగు, పాలెంవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. చర్ల మండలం తాలిపేరు రిజర్వాయర్కు భారీగా వరద నీరు చేరింది. 18 గేట్లను ఎత్తి 38 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార జలాశయంలో వరద ఉధృతి నిలకడగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజీ వద్ద 84 వేల క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. అధికారులు 22 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ** -
నిర్లక్ష్యం మేట
గట్లు, కరకట్టల నిర్మాణాలకునిధులివ్వని ప్రభుత్వం రూ.100 కోట్ల ప్రతిపాదనలు బుట్టదాఖలు వణుకుతున్న నది పరివాహక ప్రాంతీయులు నిధుల మంజూరులో సర్కారు నిర్లక్ష్యం వల్ల ఏటిగట్లు మరమ్మతులకు నోచుకోవడంలేదు. వరదల కారణంగా గండ్లు పడిన కాలువ గట్లను పట్టించుకోకపోవడంతో నది పరివాహక ప్రాంత జనం భయం గుప్పెట్లో బతుకుతున్నారు. ఆలస్యంగానైనా కురుస్తున్న వర్షాలు ఖరీఫ్ రైతుల్లో ఆశలు రేకెత్తిస్తున్నా.. అతివృష్టి పంటలను ముంచుతుందన్న భయం అన్నదాతలను పట్టి పీడిస్తోంది. విశాఖ రూరల్ : గత ఏడాది తుపాన్లు, అల్పపీడనం కారణంగా వచ్చిన వరదలకు జిల్లాలో రిజర్వాయర్లు దెబ్బతిన్నాయి. చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయి. భవిష్యత్తులో వరదలు వచ్చినా ముంపు భయం లేకుండా ఉండేందుకు కాలువలు, గట్లు, కరకట్టల నిర్మాణాలకు అధికారులు రూ.114 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ఏడాది కావస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు శారదనది గట్లు పలుచోట్ల బలహీనపడ్డాయి. జలాశయాలన్నీ నీటితో నిండి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నది పరివాహక ప్రాంతాల వారు వణికిపోతున్నారు. భూ సేకరణకు నిధులు లేవు : గట్ల నిర్మాణం కోసం అధికారులు భూములను సేకరించాలని నిర్ణయించారు. శారదా, వరాహ, తాండవ నదుల పరివాహక ప్రాంతాల్లో ప్రైవేటు భూములు ఉన్నాయి. ఈ స్థలాల్లో కొంతమంది సరుగుడు, ఇతర తోటలు వేశారు. వర్షాల సమయంలో నదుల నుంచి వరద నీరు పొంగిన సందర్భంలో ఈ తోటల కారణంగా నీరు పాయలుగా విడిపోయి గ్రామాల్లోకి చేరుతోంది. వరద నీరు పోటెత్తుతుండడంతో మట్టి గట్లకు గండ్లు పడుతున్నాయి. ఏటా ఇదే పరిస్థితి తలెత్తుతుండడంతో గట్లు పటిష్టంగా నిర్మించాలని నిర్ణయించారు. అలాగే కొట్టుకుపోతున్న ప్రాంతాల్లో పెద్ద గట్లు నిర్మించేందుకు సమీపంలో ఉన్న ప్రైవేటు స్థలాలు మొత్తం 645 ఎకరాల్లో భూ సేకరణ చేపట్టాలని గుర్తించారు. ఇందుకు రూ.14 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించారు. అయితే భూ సేకరణకు నిధులు లేవని కేవలం మరమ్మతుల కోసం ప్రణాళిక రూపొందించి పంపించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపాదనలు బుట్టదాఖలు గట్లు, కరకట్టల నిర్మాణాలకు అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి గతేడాది ప్రభుత్వానికి పంపించారు. వీటి నిర్మాణాలకు సుమారు రూ.114 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. అయితే అంచనాలు తగ్గించాలని ప్రభుత్వం ఆదేశించడంతో భూసేకరణకు ప్రతిపాదించిన రూ.14 కోట్లు మినహా రూ.100 కోట్లతో కొత్త ప్రతిపాదనలను గతేడాదే పంపించారు. శారదా, తాండవ, వరాహ రిజర్వాయర్లకు సంబంధించి రూ.26 కోట్లు మంజూరు చేస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కొత్త ప్రభుత్వం కొలువుతీరాక ఈ ప్రతిపాదనలకు కదలిక వస్తుందని అధికారులు భావించినప్పటికీ అసలు ఇప్పటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదు. గత వరదల సమయంలో పొలాల్లో వేసిన ఇసుక మేటలు ఇప్పటికీ తీయలేదు. ప్రస్తుతం జిల్లాలో నదీ, జలాశయాల కాలువల పరిస్థితి దారుణంగా ఉంది. నదీ పరివాహక ప్రాంతాల్లో రెండువైపులా ఎత్తుగా గట్లు నిర్మించాల్సిన అవసరముంది. శాశ్వత ప్రాతిపదికన కాంక్రీట్తో కాలువలను నిర్మించాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో వరద నష్టాన్ని తగ్గించి గ్రామాలు, పొలాల్లోకి వరద నీరు చేరకుండా ఉండాలంటే తప్పకుండా శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. -
నిండు కుండలా జలాశయాలు
తగ్గిన వరద ఉధృతి.. పెరిగిన సందర్శకుల తాకిడి తెరుచుకోని గేట్లు సాక్షి,సిటీబ్యూరో,రాజేంద్రనగర్/మణికొండ: కురుస్తున్న వర్షాలకు భారీగా నీరు చేరడంతో నిండు కుండలా తొణికిస లాడుతున్న హిమాయత్సాగర్ జలాశయానికి సోమవారం వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. గత రెండు రోజులుగా నిత్యం 11,500 క్యూసెక్కుల వరదనీరు జలాశయంలోకి చేరగా.. సోమవారం వరద ప్రవాహం 1100 క్యూసెక్కులకు తగ్గిందని జలమండలి ట్రాన్స్మిషన్ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్ విజయ్కుమార్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. తాండూరు, పరిగి ప్రాంతాల్లో వర్షపాతం తగ్గడంతోనే వరద తగ్గిందని చెప్పారు. దీంతో గేట్లు ఎత్తాలన్న యోచనను విరమించుకున్నామన్నారు. ఈసీ వాగు నీటి చేరికతో సాగర్ నీటిమట్టం 11 అడుగుల మేర పెరిగిందని తెలిపారు. జలాశయం గరిష్ట నీటిమట్టం 1763.500 అడుగులకు గాను సోమవారం నాటికి 1755 అడుగులకు చేరిందన్నారు. గండిపేట్కు మూడు అడుగులు.. ఉస్మాన్సాగర్ (గండిపేట్) జలాశయం గరిష్ట నీటి మట్టం 1790 అడుగులకు కాగా, సోమవారం నాటికి 1772 అడుగులకు చేరింది. మూడు రోజులుగా ఈ జలాశయంలో మూసీ వాగు నీరు చేరుతుండటంతో నీటి మట్టం మూడు అడుగుల మేర పెరిగింది. చేవేళ్ల, వికారాబాద్ పరిధిలో ఆశించిన స్థాయిలో వర్షపాతం లేకపోవడంతో ఈ జలాశయానికి వరద అంతగా లేదు. కాగా గండిపేట్ జలాశయం ఎగువన అక్రమార్కులు ఇసుక ఫిల్టర్ల ఏర్పాటు, కందకాలు తవ్వడం, ఫాంహౌస్లు, కళాశాలల రక్షణ గోడలు ఏర్పాటు కారణంగా వరద ఉధృతి తగ్గినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. సింగూరు, మంజీరాకూ జలకళ కురుస్తున్న వర్షాలకు గ్రేటర్ దాహార్తిని తీరుస్తున్న మెదక్ జిల్లాలోని సింగూరు, మంజీరా జలాశయాలు సైతం జలకళ సంతరించుకున్నాయి. గ తేడాదితో పోలిస్తే జలాశయాల్లో నీటి నిల్వలు భారీగా పెరిగాయి. సింగూరులో 1717.932 అడుగులకు గాను సోమవారం నాటికి 1703.167 అడుగుల మేర నీరు చేరింది. మంజీరా గరిష్ట మట్టం 1651.750 అడుగులకు గాను 1646.400 అడుగుల మేర నిల్వలున్నాయి. అక్కంపల్లి (కృష్ణా) జలాశయంలో 245 మీటర్ల గరిష్ట మట్టానికి 243.100 మీటర్ల మేర నిల్వలున్నాయి. నాగార్జున సాగర్ (నల్లగొండ) జలాశయంలో 590 అడుగుల నీటి మట్టానికి 552.700 అడుగుల మేర ఉన్నాయని జలమండలి తెలిపింది. భారీగా పెరిగిన సందర్శకులు జంట జలాశయాల గేట్లు తెరుస్తారన్న సమాచారంతో సోమవారం జంట నగరాల నుంచి భారీగా సందర్శకులు తరలి వచ్చారు. నిండు కుండల్లా మారిన జలాశయాల వద్ద సోమవారం ఆట విడుపుతో సందడి చేశారు. హిమాయత్ సాగర్లో సందర్శకులు పెరగటంతో కట్టపైకి వాహనాలను అనుమతించకుండా గేట్ల వద్దనే నిలిపివేశారు. దీంతో పర్యాటకులు నడుచుకుంటూ వెళ్లి జలాశయం అందాలను వీక్షించారు.