vigilance officers
-
విజిలెన్స్ వలలో భూగర్భజల ప్రాజెక్టు అధికారి
జయపురం/మల్కన్గిరిMalkangiri: (Malkangiri) MalkangiriMalkangiriవిజిలెన్స్ అధికారుల(Vigilance Raids)Vigilance Raids వలలో భూగర్భజల (సోయిల్ కన్జర్వేషన్) విభాగ ప్రాజెక్టు డైరెక్టర్ సంతూన్ మహాపాత్రో చిక్కారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు వచ్చిన ఆరోపణలు నేపథ్యంలో సంతూన్ మహాపాత్రో ఇళ్లు, ఆస్తులపై బుధవారం ఉదయం నుంచి కొరాపుట్ విజిలెన్స్ డివిజన్, జయపురం అధికారులు దాడులు జరుపుతున్నారు. విజిలెన్స్ ఎస్పీ ప్రసన్న కుమార్ ద్వివేదీ ఆదేశం మేరకు విజిలెన్స్ డీఎస్పీ డీపీ పాణి నేతృత్వంలో 15 మంది విజిలెన్స్ సిబ్బంది మల్కనగిరిలో సోయిల్ కన్జర్వేషన్ ప్రాజెక్టు కార్యాలయం, జయపురం పవర్ హౌస్ కాలనీలో అతడి నివాస భవనంతోపాటు తొమ్మిది ప్రాంతాల్లో ఒకేసారి దాడులు కొనసాగించారు. సాయంత్రం వరకూ కోటిన్నర రూపాయలకు పైగా నగదు సీజ్ చేసినట్టు సమాచారం. అలాగే అధిక అక్రమ సంపద కనుగొన్నట్లు తెలిసింది. ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. అలాగే మల్కన్గిరిలోని భూగర్భజల కార్యాలంలో పని చేస్తున్న సహాయ ఇంజినీర్ మోహన్ మండాల్, డెటా ఏంట్రీ ఆపరేటర్ విశ్వజీత్ మండాల్, కాంట్రాక్టబేస్ ఉద్యోగి అలియా కుమార్ సాహు ఇళ్లలో కూడా విజిలెన్స్ అధికారులు దాడులు చేసి తనిఖీలు చేశారు. అయితే సంతూన్ మహాపాత్రో ఇళ్లలోనే కోటిన్నర రూపాయల నగదు, 350 గ్రాముల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. జయపురంలో మూడు అంతస్తుల ఇళ్లు, ఆరు వేల అడుగుల స్థలం, భువనేశ్వర్, జయపురంలో నాలుగు ఖరీదైన ఇళ్లు, భువనేశ్వర్ హంసపాల్లో 33 అడుగులు స్థలం ఉన్నట్టు గుర్తించారు. బ్యాంక్ పాస్బుక్లు, రెండు బైక్లు, ఓ కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
ఒకే ఒక్క రైస్ మిల్లు... రూ. వంద కోట్ల ధాన్యం దగా
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ సమీపంలోని కొమరబండంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్ యాజమాన్యం ప్రభుత్వం సరఫరా చేసిన రూ.100 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు అధికారులు గుర్తించారు. గడిచిన రెండేళ్లుగా సీఎంఆర్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న ఈ మిల్లుపై మంగళవారం రాష్ట్ర విజిలెన్స్, పౌరసరఫరాలశాఖ, రెవెన్యూ, పోలీస్శాఖల అధికారులు 30 మంది బృందంగా ఏర్పడి మూకుమ్మడి దాడి చేశారు. దాడి విషయాన్ని ముందుగానే పసిగట్టిన మిల్లు యజమాని నీలా సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు, మిల్లు భాగస్వాములు పరారైనట్లు అధికారులు తెలిపారు. దాడుల నిర్వహిస్తున్న టీమ్లకు జిల్లా అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ, పోలీస్ అధికారులు సహకారం అందించారు. 3 సీజన్ల నుంచి బియ్యం ఇవ్వడంలేదు. కొమరబండ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండ్రస్ట్రీస్ గత రెండేళ్లుగా, మూడు సీజన్లకు సంబంధించి సుమారు రూ.90 కోట్ల విలువ చేసే కస్టమ్ మిల్లింగ్ రైస్ ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉందని అధికారులు తెలిపారు. 2022–23 వానాకాలం సీజన్కు సంబంధించి 15,628 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా కేవలం 7,067 టన్నులు ఆ మిల్లు ఇచ్చిందనీ, 8,607 టన్నుల బియ్యం బకాయి పడిందని చెప్పారు. ఇక ఇదే సంవత్సరం యాసంగి సీజన్కు సంబంధించి 10,408 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా 202 టన్నుల బియ్యం మాత్రమే సదరు మిల్లు నుంచి వచ్చిందని, 10, 206 టన్నులు బకాయి పడిందని వివరించారు. దీంతో పాటు 2023–24 వానాకాలం సీజన్కు సంబంధించి 2748 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా 261 టన్నులు మాత్రమే వచ్చిందనీ, ఇంకా 2487 టన్నులు బకాయి ఉందని తెలిపారు. ఈ మూడు సీజన్లకు సంబంధించి మొత్తం 21,300 టన్నుల బియ్యం ఇవ్వాలని దీని విలువ రూ.90 కోట్ల వరకు ఉంటుందని, అపరాధ రుసుంతో కలిపితే దాదాపు రూ.100 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లర్ కోదాడకు చెందిన శ్రీ వెంకటేశ్వరరైస్ ఇండ్రస్ట్రీస్ యజమాని నీల సత్యనారాయణ కస్టమ్ మిల్లింగ్ రైస్ సక్రమంగా ఇవ్వకపోవడంతో 2022–23 యాసంగి సీజన్కు సంబంధించి మిల్లుకు కేటాయించిన 15,237 టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర స్థాయిలో వేలం వేశారు. వేలంలో ధాన్యం దక్కించుకున్న వారు మిల్లు వద్దకు ధాన్యం కోసం వెళితే అక్కడ ఆ ధాన్యం లేదని చెప్పి, దాన్ని మర పట్టించి ఆ బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్లు అధికారులు తెలిపారు. ఇలా ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్పై పూర్తి నివేదికను రాష్ట్ర కమిషనర్కు అందిస్తామని, ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. -
హైదరాబాద్ జలసౌధలో కొనసాగుతున్న విజిలెన్స్ అధికారుల సోదాలు
-
గడువు ముగిసిన ఆహార పదార్థాలు.. హోటల్స్కు భారీ జరిమానా..
కడప అర్బన్ : కడప రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి, అదనపు ఎస్పీ షేక్ మాసుంబాష ఆదేశాల మేరకు మంగళవారం విజిలెన్స్ అధికారులు, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం, కడప నగరపాలక సంస్థ శానిటరీ అధికారులు హోటళ్లపై విస్తృతంగా దాడులు నిర్వహించారు. కడప నగరంలోని ఐదు హోటళ్లలో గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006 కింద కేసులు నమోదు చేశారు. ఆయా హోటళ్లకు మొత్తం రూ.1,80,000 జరిమానా విధించారు. ఈ హోటళ్లలో రాజ్ మయూర గార్డెనియా యాజమాన్యానికి రూ.50,000, మయూర బేకరీకి రూ.60,000, ఆంధ్రరుచులుకు రూ.10,000, స్వప్న బార్ అండ్ రెస్టారెంట్కు రూ.40,000, రాయలసీమ స్పైస్కు రూ.20,000 జరిమానా విధించారు. ఈ మొ త్తాన్ని ఆయా హోటళ్ల యజమానులు కడప నగర పాలక సంస్థకు చెల్లించాలని ఆదేశించారు. ఈ తనిఖీలలో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ టి.రెడ్డెప్ప, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.విజయకిషోర్, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఎం.డి షంషీర్ఖాన్, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు సంయుక్తంగా పాల్గొన్నారు. రెస్టారెంట్లకు జరిమానా ప్రొద్దుటూరు : పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. కడప విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి షేక్ మాసుం బాషా, ఆఫీసర్ పూల రామకృష్ణ, సీఐ అశోక్కుమార్, ప్రొద్దుటూరు డివిజన్ ఫుడ్ సేప్టీ ఆఫీసర్ హరిత, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు కిరణ్, శ్రీనివాసరెడ్డి, గోవిందరెడ్డిలు తనిఖీల్లో పాల్గొన్నారు. పట్టణంలోని సాగర బార్ అండ్ రెస్టారెంట్, ఆంధ్ర కిచెన్, హైదరాబాద్ చెఫ్స్, సిప్ ఇన్ రెస్టారెంట్ అండ్ బార్ హోటల్లో తనిఖీలు చేశారు. కిచెన్లో పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత పరిమితులను అధికారులు పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటించని సాగర్ బార్ అండ్ రెస్టారెంట్పై రూ.50 వేలు జరిమానా విధించారు. ఆంధ్రకిచెన్ రెస్టారెంట్పై రూ.25 వేలు జరిమానా, హైదరాబాద్ చెఫ్స్ రెస్టారెంట్పై రూ.25 వేలు, సిప్ ఇన్ రెస్టారెంట్ అండ్ బార్పై రూ.50 వేలు జరిమానా విధించారు. ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరిశీలనకు స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీకి పంపించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి మాసుం బాషా మా ట్లాడుతూ హోటల్, రెస్టారెంట్ వారు విని యోగదారులకు నాణ్యమైన పదార్థాలు అందించాలని తెలిపారు. భారత ఆహార సంస్థ నిర్దేశించిన ప్రమాణాలతో వంటకాలను తయారు చేసి అమ్మాలని చెప్పారు. ఆహార పదార్థాల్లో చైనా సాల్ట్, ఫుడ్ కలర్ ఇతర నిషేధిత పదార్థాలు వాడరాదని, పార్సిల్ విషయంలో ప్లాస్టిక్ కవర్లు వాడరాదని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని సంస్థలపై భారీ ఎత్తున జరిమానా విధించడమే కాకుండా క్రిమినల్ కేసులు కూడా నమదు చేసి వ్యాపార సంస్థలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. -
సీఎంఆర్ ధాన్యం మాయం
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో మిల్లర్ల బాగోతం బయటపడింది. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మిల్లులకు ఇచ్చిన వడ్లను సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద మరాడించి ఇవ్వాల్సి ఉండగా, మిల్లర్లు బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్లు తేలింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం ఆరెపల్లెలో ఏఆర్ఎం ఆగ్రో ఇండస్ట్రీస్లో రూ.27.76కోట్ల విలువ చేసే 9,522 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఏఆర్ఎం ఆగ్రో ఇండస్ట్రీస్కు 2021–22 యాసంగిలో 5,989 మెట్రిక్ టన్నులు, 2022–23 వానాకాలంలో 5,437 మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 11,426 మెట్రిక్ టన్నుల (ఎంటీ) ధాన్యాన్ని సీఎంఆర్ కోసం కేటాయించారు. ఇప్పటివరకు 1,400 ఎంటీల ధాన్యం మరాడించి ఇవ్వగా ఇంకా 10,026 ఎంటీల ధాన్యం నిల్వ ఉండాలి. ఈ నెల 1న మిల్లులో విజిలెన్స్ దాడులు చేయగా 504 ఎంటీల ధాన్యం మాత్రమే ఉంది. యాసంగి ధాన్యం 4,135 మెట్రిక్ టన్నులు, వానాకాలం 5,387 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు తేల్చారు. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ హరీశ్ ఫిర్యాదుమేరకు పోలీసులు ఏఆర్ఎం ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని ఆనంద్దాస్ రాంమోహన్తోపాటు తిరుమల, అనురాధపై కేసు నమోదు చేశారు. యజమాని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం అధికారులు డబ్బులను రికవరీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ మిల్లు యజమానులు, కుటుంబసభ్యుల మీద ఎలాంటి ఆస్తులు ఉన్నాయో గుర్తించే పనిలో పడ్డారు. జిల్లా వ్యాప్తంగా దాడులు జిల్లా వ్యాప్తంగా రెండు బృందాలు విజిలెన్స్ దాడులు మంగళవారం తనిఖీలు నిర్వహించాయి. మరిన్ని మిల్లుల అక్రమాలు వెలుగులోకి రానున్నట్లు తెలుస్తోంది. 2021–22 యాసంగిలో 3,61,437 మెట్రిక్ టన్నుల ధాన్యం 133 మిల్లులకు కేటాయించారు. 2,44,943 మెట్రిక్ టన్నుల బియ్యం అందించాల్సి ఉండగా, 1,88,151 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే అప్పగించారు. ఇంకా 63 మిల్లుల నుంచి 56,792 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. క్వింటాల్ వడ్లకు రా రైస్ అయితే 67 కేజీలు, బాయిల్డ్ అయితే 68 కేజీలు సీఎంఆర్ చేసి అందించాలి. 2022–23 వానాకాలంలో 3,62,193 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి 146 మిల్లులకు అప్పగించారు. సీఎంఆర్ కింద 2,42,669 మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉండగా మిల్లర్లు 8,903 టన్నులు మాత్రమే అప్పగించారు. ఇంకా 2,33,766 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. అక్రమాలకు పాల్పడిన మిల్లర్లు తనిఖీలకు రాకముందే రేషన్ బియ్యం కొనుగోలు చేసి తెప్పించేందుకు తంటాలు పడుతున్నట్లు సమాచారం. భారీ మొత్తంలో ధాన్యం మాయమవుతున్నా జిల్లా అధికారులు గుర్తించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
టీటీడీ ఉద్యోగాల పేరుతో మోసం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తిని టీటీడీ విజిలెన్స్ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. టీటీడీ వింగ్ ఏవీఎస్వో పద్మనాభన్ తెలిపిన వివరాలు.. తిరుపతిలోని కొరమేను గుంటకు చెందిన బాలకృష్ణ టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేశాడు. ఈ విధంగా దాదాపు రూ.కోటికి పైగా వసూలు చేసినట్లు సమాచారం. డబ్బులు వసూలు చేసిన తర్వాత.. వారికి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలను కూడా ఇచ్చేవాడు. ఈ విషయం టీటీడీ విజిలెన్స్ అధికారుల దృష్టికి రావడంతో.. వారు ప్రధాన నిందితుడైన బాలకృష్ణతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి నకిలీ నియామక పత్రాలు, స్టాంపులు, ఫోర్జరీ సంతకాలతో కూడిన పత్రాలను స్వాదీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. -
విజిలెన్స్ విస్తృత దాడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్రమార్కులపై విజిలెన్స్ విభాగం కొరడా ఝళిపిస్తోంది. సామాన్యులు, అన్నదాతలకు అండగా నిలుస్తోంది. వంట నూనెలను అక్రమంగా నిల్వ చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నవారిపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. అలాగే కల్తీలకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా గత రెండు నెలల్లోనే 10,015 దాడులు నిర్వహించడంతోపాటు 2,891 కేసులను నమోదు చేసింది. ఇక వ్యవసాయ సీజన్ ప్రారంభం కానుండటంతో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాల్లో అక్రమాలు, నకిలీ దందాల కట్టడికి కూడా రంగంలోకి దిగింది. అంతర్జాతీయ పరిణామాలు, పంటల సీజన్ పరిస్థితులను సావకాశంగా తీసుకుని అక్రమార్కులు సామాన్యులు, రైతులను దోపిడీ చేయకుండా విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రత్యేక కార్యాచరణకు ఉపక్రమించింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధ పరిస్థితులను సాకుగా చూపించి.. వంట నూనెలను అక్రమంగా నిల్వ చేయడం, ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయించడాన్ని గుర్తించింది. రాష్ట్రంలో అందుకు అవకాశం లేకుండా కట్టడి చేసేందుకు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ కేసులు నమోదు చేస్తోంది. ఇక కల్తీ విత్తనాలు, ఎరువుల కట్టడికి విజిలెన్స్ అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. అక్రమాలకు పాల్పడినవారిని గుర్తించి నిత్యావసర వస్తువుల చట్టం, తూనికలు–కొలతల చట్టం, ఆహార భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. తీవ్ర నేరాలకు పాల్పడినవారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తుండటంతో అక్రమార్కులు హడలెత్తిపోతున్నారు. తిరుపతిలో వంటనూనెల దుకాణంలో విజిలెన్స్ అధికారుల తనిఖీ 10,015 దుకాణాలు, వ్యాపార సంస్థల్లో తనిఖీలు.. విజిలెన్స్ అధికారులు రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 6 నుంచి మే 17 వరకు ఏకంగా 10,015 దుకాణాలు, వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహించారు. అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించిన 2,891 దుకాణాలు, వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేశారు. వాటిలో తూనికలు–కొలతల చట్టం కింద 2,689 కేసులు, నిత్యావసర వస్తువుల చట్టం కింద 71 కేసులు, ఆహార భద్రతా చట్టం కింద 113 కేసులతోపాటు 18 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 515 కేసులు నమోదు కాగా అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 60 కేసులు నమోదయ్యాయి. అక్రమ రవాణా మార్గాలపై దృష్టి గతంలో లేని విధంగా నకిలీ విత్తనాల తయారీ కేంద్రాలు, అక్రమ రవాణా మార్గాలపై విజిలెన్స్ దృష్టి సారించింది. కర్ణాటకలో నకిలీ విత్తనాలు తయారుచేసే ముఠాలు వ్యవస్థీకృతమైనట్టు.. అక్కడి నుంచే రాష్ట్రంలోకి తరలిస్తున్నట్టుగా గుర్తించింది. దీంతో కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాలపై విజిలెన్స్ అధికారులు పటిష్ట నిఘా పెట్టారు. కర్ణాటక నుంచి విత్తనాలు కొనుగోలు చేసే వారిపై దృష్టిసారించారు. అదే రీతిలో రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల దుకాణాలపై రెండు రోజులుగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండురోజుల్లోనే 100 దుకాణాలపై దాడులు నిర్వహించారు. అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించిన 12 దుకాణాలపై కేసులు నమోదు చేశారు. ప్రత్యేక బృందాల ద్వారా రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా దాడులు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేస్తాం.. వంట నూనెలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాల్లో అక్రమాలను అడ్డుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. వంట నూనెలను అక్రమంగా నిల్వ చేస్తూ.. ధరలను అమాంతంగా పెంచేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇక వ్యవసాయ సీజన్ ప్రారంభం కానుండటంతో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను విక్రయించకుండా తనిఖీలు ముమ్మరం చేశాం. అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. – శంకబ్రత బాగ్చి, అదనపు డీజీ, విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా విజిలెన్స్– ఎన్ఫోర్స్మెంట్ తమ జిల్లా యూనిట్లను ఇంకా పునర్వ్యస్థీకరించలేదు. పాత 13 జిల్లాల యూనిట్ల వారీగా విజిలెన్స్ అధికారులు నిర్వహించిన దాడులు, నమోదు చేసిన కేసుల వివరాలు.. -
వంటనూనెల అక్రమ నిల్వలపై విజిలెన్స్ దాడులు
-
వంట నూనెల బ్లాక్ దందాపై విజిలెన్స్ కొరడా
సాక్షి, అమరావతి: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం పేరిట రాష్ట్రంలో నిత్యావసర సరుకులకు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచి విక్రయించే వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆహార, పౌర సరఫరాల చట్టం ప్రకారం పరిమితికి మించి వంట నూనెలు, పప్పు దినుసుల నిల్వలను కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వంట నూనెల ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న వైనంపై ‘ధరల దాడి’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. పామాయిల్తోపాటు పెరుగుతున్న ఇతర వంట నూనెల ధరలు, పప్పు దినుసుల ధరలను నియంత్రించడానికి విజిలెన్స్ అధికారులు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 126 చోట్ల తనిఖీలు నిర్వహించగా.. 16 చోట్ల పరిమితిని మించి నిల్వలు కలిగి ఉండటాన్ని గుర్తించి కేసులు నమోదు చేశారు. నెల్లూరులోని స్టోన్హౌస్పేటలో ఉన్న వంటనూనెల హోల్సేల్ వ్యాపార గోడౌన్లో అధికారుల తనిఖీలు అధిక ధరలకు విక్రయిస్తున్న 15 మందిపై లీగల్ మెట్రాలజీ యాక్ట్–2009 ప్రకారం కేసులు నమోదు చేశారు. కొన్నిచోట్ల వంట నూనెల నాణ్యతను పరిశీలించేందుకు శాంపిల్స్ సేకరించారు. హోల్సేల్, రిటైల్ వ్యాపారులతో పాటు సూపర్ మార్కెట్లు, తయారీ యూనిట్లు పరిమితిని మించి నిల్వలు కలిగి ఉన్నా, అధిక ధరలకు విక్రయించినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ హెచ్చరించింది. -
కంచే చేను మేసేస్తోంది!
సాక్షి, అమరావతి: కంచే చేను మేసిన చందాన ఉద్యోగులే సంస్థ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. ఉన్నతాధికారులు సైతం వారి అవినీతి వ్యవహారాలకు కొమ్ముకాస్తుండటం విశేషం. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్)కు రావాల్సిన ఆదాయానికి కొందరు ఉద్యోగులు గండికొడుతున్నారు. వారు చేసింది తప్పని పలు విచారణల్లో తేలినా చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ వ్యవహారాలపై ఏపీ ట్రాన్స్కో వరకూ ఫిర్యాదులు వెళ్లడంతో విజిలెన్స్ అధికారులు కూపీలాగే పనిలో పడ్డారు. ప్రతి డీడీకి సమర్పించుకోవాల్సిందే! ► విశాఖలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో సీజీఎం స్థాయి అధికారి ఒకరు సీఎండీ పేషీలోని ఒక అటెండర్ బంధువుకు చెందిన వాహనాన్ని అద్దెకు తీసుకుని వాడుకుంటున్నారు. నిజానికి ట్రావెల్ వాహనాన్ని వినియోగించాల్సి ఉన్నా.. అలా చేయలేదు. సంస్థ నుంచి బిల్లు రూపంలో నగదు తీసుకుంటూ అటెండర్ బంధువుకు ప్రయోజనం చేకూరుస్తున్నారు. ► ఏలూరు ఆపరేషన్ సర్కిల్లోని భీమవరం డివిజన్లో విద్యుత్ సర్వీస్ కోసం సంస్థ పేరు మీద వినియోగదారులు డీడీ తీయాలంటే తన సంతకం తప్పనిసరంటూ ఓ అధికారి నిబంధన విధించారు. ప్రతి డీడీకి కొంత మొత్తాన్ని తనకు లైన్మేన్లు చెల్లించడమన్నది ఆనవాయితీగా మార్చారు. ► తణుకు సబ్ డివిజన్లో భవనాలపై ఉన్న పెంట్ హౌస్కు విద్యుత్ సర్వీస్ ఇచ్చేందుకు ఇదే ప్రాంతంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు భారీగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ► నిడదవోలు డివిజన్ ఉండ్రాజవరం మండలంలో ఓ అధికారి.. అపార్ట్మెంట్లకు విద్యుత్ సర్వీస్ ఇవ్వడంలో అవినీతికి పాల్పడినట్టు ఫిర్యాదులు రావడంతో ఇటీవలే విజిలెన్స్ విచారణ జరిపించారు. ఇలా అనేక చోట్ల సంస్థకు రావాల్సిన ఆదాయాన్ని ఉద్యోగులు, అధికారులు పక్కదారి పట్టిస్తున్నట్టు ట్రాన్స్కో విజిలెన్స్కు సమాచారం అందింది. త్వరలోనే చర్యలు డిస్కంకు నష్టం చేకూర్చేలా ప్రవర్తించిన ఏ ఉద్యోగిపైనైనా సరే తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం అటువంటి వారిపై విచారణ జరుగుతోంది. కొందరు తప్పు చేసినట్టు రుజువైనప్పటికీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదు. వారి ప్రమేయం పైనా ఆరా తీస్తున్నాం. త్వరలోనే మా వైపు నుంచి చర్యలుంటాయి. –ఏపీ ట్రాన్స్ కో విజిలెన్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు. తప్పు చేశాడని తేలినా.. శ్రీకాకుళానికి చెందిన జి.సత్యవతి తన ఇంటికి విద్యుత్ కనెక్షన్ పొందేందుకు రూరల్ సెక్షన్ను సంప్రదించారు. ఆమె ఇంటికి విద్యుత్ సర్వీస్ ఇవ్వాలంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాలతో కలిపి మొత్తం రూ.1,04,000 ఖర్చవుతున్నా అక్కడి అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్(ఏఈఈ) బి.నాగేశ్వరరావు ఆమె నుంచి అనధికారికంగా రూ.లక్ష తీసుకుని కేవలం రూ.8,900కే ప్రతిపాదనలిచ్చారు. సంస్థ అవసరానికి వాడుకునేందుకు పక్కన ఉంచిన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాలతో పని పూర్తిచేశారు. ఈ వ్యవహారంపై శ్రీకాకుళం రూరల్ ఏడీఈ విచారణ జరిపి ఎస్ఈకి నివేదిక ఇచ్చారు. ఎస్ఈ మరోసారి డివిజనల్ ఇంజనీర్ స్థాయి అధికారితో విచారణ జరిపించారు. ఆయన విచారణలోనూ ఏఈఈ నేరం రుజువైంది. ఈ మొత్తం నివేదికను విశాఖలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ఉండే చీఫ్ జనరల్ మేనేజర్(సీజీఎం)కు ఎస్ఈ పంపించారు. తప్పు చేసిన ఇంజనీర్పై చర్యలు తీసుకుంటారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. సీజీఎం నుంచి ఎలాంటి ఆదేశాలూ వెలువడలేదు. -
లేటరైట్ గనుల్లో విజిలెన్స్ తనిఖీలు
సాక్షి, అమరావతి: ఆండ్రూ గ్రూప్ ఆఫ్ మినరల్స్కు చెందిన లేటరైట్ లీజుల్లో మైనింగ్ విజిలెన్స్ ప్రత్యేక బృందాలు భారీ ఎత్తున తనిఖీలు చేపట్టాయి. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం వంతాడ, అరలధార గ్రామాల పరిధిలో ఉన్న 8 లీజుల్లో జరిగిన తవ్వకాల తీరును అడుగడుగునా పరిశీలిస్తున్నాయి. వాటికి సంబంధించి కాకినాడ పోర్టులో ఉన్న 5 స్టాక్ యార్డులను సైతం విజిలెన్స్ అధికారులు తనిఖీ చేస్తున్నారు. మాన్యువల్, ఈటీఎస్, డీజీపీఎస్ సర్వేల ద్వారా తవ్వకాలు ఏ మేరకు జరిగాయో పరిశీలించారు. వీటిద్వారా స్టాక్ యార్డులకు సంబంధించిన లేటరైట్ లెక్కలు బేరీజు వేస్తున్నారు. క్వారీల్లో జరిగిన తవ్వకాల లెక్కల్ని ఈ సర్వేలతో చేయడం సాధ్యం కాకపోవడంతో డ్రోన్ సర్వే చేయడానికి గనుల శాఖ ప్రభుత్వ అనుమతి తీసుకుంది. బెంగళూరుకు చెందిన డ్రోన్ నిపుణులతో త్వరలో సర్వే చేసి ఎంత మేరకు తవ్వకాలు జరిగాయో నిర్థారించనున్నారు. సముద్ర మట్టానికి 400 అడుగుల ఎత్తులో లీజులున్న ఈ కొండ ఉండటం, భారీగా తవ్వకాలు జరపడంతో అక్కడ సాధారణ సర్వే చేయడం సాధ్యం కాలేదని సమాచారం. అందుకే డ్రోన్ల సాయంతో ఆధునిక పరికరాలు ఉపయోగించి ఏరియల్ సర్వే చేయనున్నారు. ఈ సర్వే ద్వారా తవ్వకాలను పూర్తిగా లెక్కించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ లీజుల్లో పెద్దఎత్తున ఉల్లంఘనలు జరిగినట్టు మైనింగ్ అధికారులు చెబుతున్నారు. వాటిని లెక్కించడానికి కొంత సమయం పడుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం స్టాక్ యార్డులకు వచ్చిన లేటరైట్, ప్రభుత్వానికి కట్టిన సీనరేజిని లెక్కిస్తున్నారు. ఇందులో వచ్చిన తేడాను బట్టి అక్రమ తవ్వకాలను నిర్థారిస్తారు. 200 ఎకరాల అటవీ భూమిలో తవ్వకాలు అరలధార, వంతాడ అటవీ ప్రాంతంలో ఆండ్రు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ టీడీపీ ప్రభుత్వ హయాంలో 8 లేటరైట్ లీజులు తీసుకుంది. ఒక్కో లీజులో పది హెక్టార్ల చొప్పున 8 లీజులకు 80 హెక్టార్ల (200 ఎకరాలు) భూమిని లీజుకు తీసుకుంది. ఈ అటవీ ప్రాంతాన్ని తీసుకున్నందుకు పరిహారంగా అనంతపురం జిల్లాలో అటవీ ప్రాంతాన్ని పెంచేందుకు అప్పట్లో ఆండ్రు కంపెనీకి అనుమతిచ్చారు. సాధారణంగా అటవీ ప్రాంతంలో మైనింగ్కు అనుమతులు తెచ్చుకోవడం సాధ్యమయ్యేపని కాదు. కానీ అప్పట్లో ఆండ్రు కంపెనీ పలుకుబడి ఉపయోగించి అనుమతులు తెచ్చుకున్నట్టు తెలిసింది. గనుల్లో అనుమతులకు మించి భారీగా లేటరైట్ను తవ్వి తరలించేసినట్టు ఫిర్యాదులు వచ్చాయి. తవ్వకాల కోసం మైనింగ్ నిబంధనలను సైతం ఉల్లంఘించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పలుమార్లు ఈ క్వారీల్లో తనిఖీలు జరిపారు. తాజాగా విజయనగరం మైనింగ్ విజిలెన్స్ అధికారులు సూర్యచంద్రరావు, ప్రతాప్రెడ్డి నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. తాజాగా అన్ని మైనింగ్ విజిలెన్స్ బృందాలు ప్రస్తుతం ఈ గనుల్లో తనిఖీలు జరుపుతున్నాయి. -
చంద్రబాబు హయాంలో అడ్డ‘దారి’ దోపీడి
సాక్షి, అమరావతి: అసెంబ్లీ ఎన్నికల ముందు ఉపాధి హామీ ద్వారా రాష్ట్రమంతటా పలు గ్రామాల్లో చేపట్టిన రూ.1,795.31 కోట్ల విలువైన సిమెంట్ రోడ్ల పనుల్లో పక్కా అవినీతి జరిగినట్లు స్పష్టమవుతోంది. సరిగ్గా ఎన్నికలకు 7 – 8 నెలల ముందు నిధులు అందుబాటులో లేకపోయినా గత సర్కారు టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులకు నామినేషన్ పద్ధతిలో పనులు కట్టబెట్టింది. సర్పంచ్ల పదవీ కాలం పూర్తయిన తరువాత 2018 అక్టోబరు – 2019 మే మధ్య ఈ పనులు జరిగాయి. విజిలెన్స్ విచారణలో ఈ అక్రమాలను విజిలెన్స్ శాఖ నిగ్గు తేల్చడంతో బిల్లుల చెల్లింపులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. 7,326 చోట్ల అక్రమాలే.. గత ఏడాదిన్నరగా కరోనా పరిస్థితులే నెలకొని ఉన్నందున లక్షల సంఖ్యలో జరిగిన రోడ్ల పనులపై విజిలెన్స్ తనిఖీలు చేపట్టడం ప్రభుత్వానికి సవాల్గా మారింది. అయినప్పటికీ ఇప్పటివరకు 11,573 పనులపై తనిఖీలు పూర్తి చేయగా 7,326 పనులలో వివిధ స్థాయిల్లో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయింది. ప్రతి మూడు పనుల్లో రెండింటిలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు వెల్లడైంది. 1,644 పనులను పూర్తి నాసిరకంగా నిర్థారిస్తూ ఆ రోడ్ల నిర్మాణానికి వెచ్చించిన ఖర్చును వంద శాతం సంబంధిత వ్యక్తులు, సంస్థల నుంచి రికవరీ చేయాలని, ఒకవేళ ఇంకా బిల్లులు చెల్లించకుంటే వెంటనే నిలిపివేయాలని విజిలెన్స్ సిఫార్సు చేసింది. ఎలా తేల్చారంటే... విజిలెన్స్ అధికారులు రెండు రకాల పరీక్షల ఆధారంగా సిమెంట్ రోడ్లకు నాణ్యత పరీక్షలు నిర్వహించారు. నిబంధనల ప్రకారం సిమెంట్ రోడ్డును తగినంత మందంతో నిర్మించారా? సిమెంట్, ఇసుక సమపాళ్లలో కలిపారా? అనే అంశాల ఆధారంగా రోడ్ల నాణ్యతను నిర్ధారించారు. నేల స్వభావం మేరకు నిబంధనలు మారుతుంటాయని అధికారులు చెప్పారు. రోడ్డు మందం ఆధారంగా.. ఇంజనీరింగ్ శాఖ అధికారుల ప్రమాణాల ప్రకారం.. నిర్ణయించిన పరిమాణం (రోడ్డు మందం)లో 20 శాతం కంటే అధికంగా నిబంధనల ఉల్లంఘన జరిగితే పూర్తి స్థాయి నాసిరకంగా నిర్ధారిస్తారు. ఉదాహరణకు సిమెంట్ రోడ్డు పది సెంటీమీటర్ల మందం మేర నిర్మించాల్సి ఉండగా 7.99 సెంటీమీటర్ల మేర మాత్రమే చేపడితే పూర్తి నాసిరకంగా నిర్ధారించి సంబంధిత ఖర్చును కాంట్రాక్టరు నుంచి రికవరీ లేదా బిల్లుల చెల్లింపు నిలిపివేత లాంటి చర్యలు చేపడతారు. ఒకవేళ 8 సెంటీమీటర్ల నుంచి 9.99 సెంటీ మీటర్ల మందంతో రోడ్డు నిర్మాణం చేపడితే ఆ పరిమాణం స్థాయిని బట్టి అక్రమాలను నిర్ధారించి తగినవిధంగా రికవరీకి సిఫారసు చేస్తారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు గుంటూరు జిల్లా నూజెండ్లలో రామిశెట్టి హనుమంతరావు ఇంటి నుంచి ఎస్కే బడే నివాసం వరకు ఉపాధి హామీ నిధులతో రూ.13.29 లక్షల ఖర్చుతో సిమెంట్ రోడ్డు వేశారు. ఇటీవల ఆ రోడ్డును పరిశీలించిన విజిలెన్స్ అధికారులు పూర్తి నాసిరకంగా నిర్మించినట్లు నిర్ధారించారు. ఆ పనులు చేసిన వారి నుంచి వందకు 100% రికవరీ చేయాలని సిఫార్సు చేశారు. విచిత్రం ఏమిటంటే అంత నాసిరకంగా రోడ్డు పనులు ఎవరు చేయించారన్నది ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా లేదు. గత అసెంబ్లీ ఎన్నికలకు అర్నెల్ల ముందు నూజెండ్ల మండలంలోని వివిధ గ్రామాల్లో హడావుడిగా రూ. 25.62 కోట్లతో మొత్తం 253 సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగింది. అందులో 213 రోడ్లను విజిలెన్స్ అధికారులు పరిశీలించగా 196 రోడ్లు నాసిరకమైనవని తేల్చారు. 17 రోడ్లు మాత్రమే నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. రోడ్లన్నీ పంచాయతీల పేర్లతోనే నిర్మాణం జరిగినట్లు చూపడం గమనార్హం. నూజెండ్ల మండలం పుచ్చనూతల పంచాయతీ పరిధిలోని పాతరెడ్డిపాలెం గ్రామంలో రూ.13.85 లక్షలతో చేపట్టిన సిమెంట్ రోడ్డుదీ అదే పరిస్థితి. ఆ రోడ్డు నిర్మాణ ఖర్చును 100% సంబంధిత వ్యక్తుల నుంచి రాబట్టాలని విజిలెన్స్ పేర్కొంది. ఇక్కడ కూడా గ్రామ పంచాయతీ పేరుతోనే పనులు కానిచ్చేశారు! నూజెండ్ల మండలం పువ్వాడ గ్రామ పంచాయతీ పరిధిలో రూ.6.96 లక్షలతో ఏ.వెంకట నరసయ్య ఇంటి నుంచి ఆంజనేయస్వామి గుడి దాకా నిర్మించిన సిమెంట్ రోడ్డు వ్యవహారం కూడా ఇంతే. అదే మండలం మక్కెళ్లపాడులో రూ.12.17 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డు కథ కూడా ఇదే బాపతు. మిక్సింగ్ ఎలా ఉంది? నిర్ణీత కాలం పాటు సిమెంట్ రోడ్డు మన్నికగా ఉండాలంటే సిమెంట్, ఇసుక, కంకరను తగిన నిష్పత్తుల మేరకు మేళవించాలి. నేల స్వభావాన్ని బట్టి దీన్ని నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఒక రకమైన నేలలు ఉన్న చోట బస్తా సిమెంట్కు రెండు బస్తాల ఇసుక, 4 బస్తాల కంకర కలపాల్సి ఉంటుందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. దీని ఆధారంగా సిమెంట్ రోడ్డు సామర్థ్యాన్ని నిర్ధా్దరిస్తారు. మూడింటి కలయిక ఆధారంగానే ఒక చదరపు మీటరు రోడ్డు ఎంత బరువును మోయగలదన్నది అంచనా వేస్తారు. నిర్దేశిత బరువులో కనీసం 75 % భారాన్ని రోడ్డు భరించాలి. అంతకంటే తక్కువ బరువు మోసే పరిస్థితిలో రోడ్డు ఉంటే పూర్తి నాసిరకమైనదిగా తేల్చి 100% రికవరీకి ఆదేశాలిస్తారు. 75–99.99 శాతం మధ్య బరువు భరించే స్థాయిలో రోడ్డు ఉంటే ఆ మేరకు నిర్ణీత స్థాయిలో రికవరీకి సిఫార్సు చేస్తారు. ఉదాహరణకు రోడ్డు 30 టన్నుల బరువు భరించాల్సి ఉండగా 22.5 టన్నుల కంటే తక్కువ మాత్రమే భరించేలా నిర్మాణం చేపడితే వంద శాతం డబ్బులు రికవరీకి సిఫార్సు చేస్తారు. సర్పంచులు లేని సమయంలో... ఉపాధి హామీ పథకంలో ఏ పనులు చేపట్టినా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనే జరగాలి. ఈ పథకంలో కాంట్రాక్టర్లకు తావులేదు. సాధారణంగా ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లో చేపట్టే సిమెంట్ రోడ్లు, ఇతర భవన నిర్మాణాల పనులు సర్పంచ్ల ఆధ్వర్యంలో జరుగుతుంటాయి. అయితే రాష్ట్రంలో 2018 ఆగస్టు నాటికి సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో గ్రామ పంచాయతీలలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. ఆ సమయంలో 2018 అక్టోబరు – 2019 మే నెలల మధ్య రూ.1,795 కోట్ల విలువైన సిమెంట్ రోడ్డు పనులు జరిగినట్లు బిల్లులు తయారు చేశారు. ఆ పనులన్నీ పంచాయతీల ఆధ్వర్యంలో జరిగాయని పేర్కొంటూ వాటి పేరుతోనే బిల్లులు సిద్ధం చేశారు. అప్పటి గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి నుంచి తీర్మానాలు తీసుకొని ఆయా పనులు చేశారు. అయితే పనులు ఎవరు చేశారు? ఆ వ్యక్తులు ఎవరు? అనే వివరాలను గ్రామ పంచాయతీల వద్ద గానీ చివరకు ఇంజనీరింగ్ అధికారుల వద్ద ఎలాంటి రికార్డులు లేకుండా గుట్టుగా వ్యవహరించారు. గ్రామాల్లో టీడీపీ నేతలే ఆ పనులన్నీ అనధికారికంగా చేశారని అధికారులు పేర్కొంటున్నారు. రికార్డుల్లో లేకున్నా కోర్టులో మాత్రం కేసులు.. రోడ్ల పనులు ఎవరు చేశారన్నది రికార్డుల్లో ఎక్కడా సమాచారం లేదు. అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ తనిఖీల్లో ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో బిల్లుల చెల్లింపులలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఒత్తిళ్లకు తలొగ్గి బిల్లులు చెల్లిస్తే తరువాత ఎవరి నుంచి రికవరీ చేయాలో అంతుబట్టక అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో గతంలో జరిగిన నాసిరకం పనులకు బిల్లులు చెల్లించాలంటూ కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించడం, రికార్డుల్లో వివరాలు ఏవీ లేకపోవడం గందరగోళానికి దారి తీస్తోంది. అప్పట్లో జరిగిన ఈ పనులకు సంబంధించి దాదాపు 50 వరకు హైకోర్టులో కేసులు దాఖలైనట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
దర్శనం టికెట్లతో వ్యాపారం చేస్తే కఠిన చర్యలు: టీటీడీ
తిరుమల: శ్రీవారి దర్శనం టికెట్లు, సేవా టికెట్ల పేరుతో వ్యాపారం చేసే దళారులు, ట్రావెల్స్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. రూ.300 టికెట్లతో పాటు కల్యాణోత్సవం లాంటి కొన్ని ఆర్జిత సేవా టికెట్లు రాబోయే నెల కోటా ప్రతి నెలా 20వ తేదీ ఆన్లైన్లో టీటీడీ విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది దళారులు, ట్రావెల్స్ సంస్థలు తాము దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని భక్తుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. చెన్నైకి చెందిన రేవతి పద్మావతి ట్రావెల్స్ సంస్థ భక్తుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ ఆన్లైన్లో దర్శనం టికెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో సదరు సంస్థపై టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు. భక్తులు www.tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే తమ ఆధార్ కార్డు నంబర్, చిరునామాతో టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. భక్తులు దళారులను ఆశ్రయించి నష్ట పోవద్దని కోరింది. -
వాటర్ ప్లాంట్లపై కొరడా
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో అనధికారికంగా నడుస్తున్న మినరల్ వాటర్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ‘మాయాజలం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై స్పందించిన ఫుడ్ సేఫ్టీ, విజిలెన్స్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్లాంట్లలో తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. బుధవారం రాష్ట్రంలోని 25 వాటర్ ప్లాంట్లపై దాడులు జరిపారు. అనంతపురం జిల్లాలో 6 (సాయి సవేరా, హనీ, ఎస్వీఆర్, సాయి సిరి ఆక్వా, అమృతబిందు, ఎస్వీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్) వాటర్ ప్లాంట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 1 (ఉమా ఆక్వా), విజయనగరం జిల్లాలో 2 (ఆదిత్య మినరల్ వాటర్, శ్రీవారి ఆక్వా ఇండస్ట్రీస్), చిత్తూరు జిల్లాలో 2 (శ్రీకృష్ణా మినరల్స్, కింగ్ ఆక్వా), విశాఖపట్నం జిల్లాలో 1 (లక్ష్మీ ఆక్వా ఇండస్ట్రీ), కృష్ణా జిల్లాలో 2 (ఎస్ఎస్ అల్ట్రా టెక్, కె–వాటర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్)లతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు, కర్నూలు జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 3, కడప జిల్లాలో 3 వాటర్ ప్లాంట్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఐఎస్ఐ గుర్తింపు లేకుండా.. విజయవాడ కృష్ణలంకలోని కె–వాటర్ ప్లాంట్లో ఈ–కామ్ పేరిట తెలంగాణలోని కీసర చిరునామాతో రిజిస్ట్రేషన్ చేసిన సర్టిఫికేషన్ ఉన్న పోస్టర్లు అతికించి ఉన్నాయి. ఈ ప్లాంట్కు ఐఎస్ఐ గుర్తింపు ఉన్నట్టు పోస్టర్లపై ఉంది. జోనల్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు ఆన్లైన్లో పరిశీలించడంతో అది బోగస్ అని తేలింది. చాలా ప్లాంట్లు ఐఎస్ఐ గుర్తింపు లేకుండా నడుస్తున్నట్టు గుర్తించారు. వాటర్ ప్లాంట్లపై దాడులు కొనసాగిస్తామని జాయింట్ ఫుడ్ కంట్రోలర్ స్వరూప్ ‘సాక్షి’కి చెప్పారు. అదే నీరు.. పేరే మారు! అధికారుల లెక్కల ప్రకారం విజయవాడ నగరంతోపాటు కృష్ణా జిల్లాలో అనుమతులు లేకుండా 1,200కు పైగా వాటర్ ప్లాంట్లు నడుస్తున్నాయి. వాస్తవానికి రిజిస్టరైన పేరుతోనే ప్లాంట్లో వాటర్ బాటిళ్లకు సీళ్లు వేసి మార్కెట్లో విక్రయించాలి. నగరంలో పలు ప్లాంట్లు అందుకు భిన్నంగా వివిధ రంగులు, మూడు నాలుగు ఆకర్షణీయమైన పేర్లతో లేబుళ్లను ముద్రిస్తున్నాయి. ఆ ప్లాంటులో నీటినే బాటిళ్లలోకి నింపి వేర్వేరు బ్రాండ్లతో అమ్మకాలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం అన్ని అనుమతులతో పాటు వాటర్ బాటిళ్లపై తయారీదారు పేరు, తయారీ తేదీ, తయారీ స్థలం చిరునామా వంటివి స్పష్టంగా ముద్రించి ఉండాలి. అలాంటివేమీ లేకుండా వాటర్ బాటిళ్లను నింపి విక్రయిస్తే మిస్ బ్రాండెడ్ కింద కేసు నమోదు చేసి రూ.3 లక్షల వరకు జరిమానా విధిస్తామని జోనల్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు ‘సాక్షి’కి చెప్పారు. -
‘మాయా జలం’పై కదిలిన యంత్రాంగం
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో అనధికారికంగా నడుస్తున్న వాటర్ ప్లాంట్లపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. సోమవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘మాయా జలం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా, తగిన అనుమతులు లేకుండా నడుపుతున్న వాటర్ ప్లాంట్లను తనిఖీ చేయాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ మంజరి సంబంధిత అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కృష్ణా జిల్లాలో అనధికార ప్లాంట్లపై ఫుడ్ సేఫ్టీ, రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. విజయవాడ పటమటలోని బ్లూ వాటర్ ప్లాంట్, సూర్యారావుపేటలోని శ్రీగంగా వాటర్ ప్లాంట్లను జోనల్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు నేతృత్వంలో అధికారులు తనిఖీ చేశారు. ప్లాంట్ల సీజ్: బ్లూ వాటర్ ప్లాంట్కు బీఐఎస్/ఐఎస్ఐ లైసెన్స్లతో పాటు ఇతర అనుమతులు లేవని, వాటర్ ప్రాసెసింగ్, ప్యాకింగ్ యూనిట్లలో అపరిశుభ్రత తాండవిస్తోందని అధికారులు గుర్తించారు. ఇంకా వివిధ కంపెనీల (బ్లూ, వేగా, శ్రీరాం) పేర్లతో లేబుళ్లను ముద్రించి పావు లీటరు, అర లీటరు, లీటరు బాటిళ్లకు అతికించి అక్రమంగా విక్రయిస్తున్నట్టు కనుగొన్నారు. సిబ్బంది కోవిడ్ జాగ్రత్తలు పాటించకపోవడాన్ని గుర్తించారు. రోజుకు 4 వేల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం గల ఈ ప్లాంట్ను ఎనిమిదేళ్ల క్రితం ఐఎస్ఐ గుర్తింపుతో ప్రారంభించి, ఆ తర్వాత నాలుగేళ్లుగా రెన్యువల్ చేయించకుండా, ఇతర అనుమతులు తీసుకోకుండా నడుపుతున్నట్టు తనిఖీల్లో తేలిందని జోనల్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు ‘సాక్షి’కి చెప్పారు. విజయవాడ పటమటలోని బ్లూ వాటర్ ప్లాంట్లో అధికారుల తనిఖీలు ఈ ప్లాంట్లో ఉన్న 6,125 సీల్డ్ వాటర్ బాటిళ్లను సీజ్ చేశామన్నారు. మరోవైపు అనుమతుల్లేకుండా నడుస్తున్న శ్రీగంగా వాటర్ ప్లాంట్లోనూ తనిఖీలు నిర్వహించామని, అక్కడ 90 ప్యాకెట్ల చొప్పున ఉండే 103 బ్యాగులను సీజ్ చేశామని చెప్పారు. ఈ రెండు ప్లాంట్లను సీజ్ చేసి నిర్వాహకులపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేస్తూ ఉన్నతాధికారులకు నివేదిస్తున్నట్టు చెప్పారు. తనిఖీల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లు శేఖర్రెడ్డి శ్రీకాంత్, గోపాల్, విజిలెన్స్ సీఐ అశోక్రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. బుధవారం కూడా తనిఖీలు కొనసాగుతాయని జాయింట్ కలెక్టర్ మాధవీలత చెప్పారు. కాగా, బుధవారం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ అనధికార వాటర్ ప్లాంట్లపై నిరంతరాయంగా దాడులు నిర్వహిస్తామని జాయింట్ ఫుడ్ కంట్రోలర్ స్వరూప్ చెప్పారు. -
విజిలెన్స్ పట్టించినా.. ఆర్టీసీ వదిలేసింది
సాక్షి, హైదరాబాద్: టికెట్ డబ్బుల లెక్కల్లో తేడాలతో కండక్టర్లు, నిర్లక్ష్యపు డ్రైవింగ్తో డ్రైవర్లు సస్పెండయ్యారు. వారు అప్పీళ్లకు వెళ్తే కేసులవారీగా పరీక్షించి తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. అంతా బాగానే ఉంది. కానీ వారి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని కేసులు మాఫీ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి, విచారణ జరిపి ఆర్టీసీకి నివేదిక ఇచ్చారు. దాదాపు 70 మందికి సంబంధించి విచారణ జరిపితే.. 39 మందిదాకా తమ దగ్గర ఉన్నతాధికారి లంచం తీసుకున్నట్టుగా స్పష్టమైన సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఈ నివేదిక ఆర్టీసీకి అందింది. అయినా బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇక ఓ డిపోలో కొందరు తాత్కాలిక సిబ్బంది పనిచేశారు. వారు విధుల్లో ఉండగానే.. కనీస వేతనాల మొత్తం పెరిగింది. ఈ మేరకు సొమ్ము విడిగా మంజూరైంది. కానీ ఈ సొమ్మును తాత్కాలిక కార్మికులకు చెల్లించకుండా పెండింగ్లో పెట్టారు. తర్వాత చెల్లించేసినట్టు లెక్కలు చూపారు. దీనిపై ఆరోపణలు రావటంతో విజిలెన్సు విచారణ జరిగింది. పెరిగిన మేర సొమ్ము తమకు అందలేదని కార్మికులు చెప్పినట్టు సమాచారం. ఈ నివేదిక కూడా ఉన్నతాధికారులకు చేరినా.. ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. ఈ వ్యవహారంపై ఆర్టీసీ సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే అధికారులు మరింతగా వసూళ్లకు పాల్పడతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగింది? ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లే కీలకం. అయినా వారి విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం కనిపించినా సస్పెన్షన్ వేటు వేస్తుంటారు. ఇలా ఏటా వంద మంది వరకు సస్పెండ్ అవుతున్నారు. చిన చిన్న కారణాలతోనే సస్పెండ్ చేస్తున్నారని, తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని డ్రైవర్లు, కండక్టర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో సీఎం కేసీఆర్ స్పందించి నిబంధనల్లో మార్పునకు ఆదేశించారు. ఈ మేరకు కొత్త నియమావళి ఇటీవలే విడుదలైంది. అయితే ఈ కొత్త నియమావళి కూడా సరిగా లేదంటూ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. డిపోల ముందు నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా సస్పెన్షన్ వేటు పడుతుండటమే దీనికి కారణం. అయితే చిన్న ఉద్యోగుల విషయంలో కఠినంగా ఉంటున్న యాజమాన్యం.. అధికారుల విషయంలో మాత్రం చూసీచూడనట్టు ఉంటోందన్న చర్చ ఆర్టీసీలో వినిపిస్తోంది. సస్పెండైన కండక్టర్లు, డ్రైవర్లను తిరిగి విధుల్లోకి తీసుకునే విషయంలో భారీగా వసూళ్లకు పాల్పడ్డట్టు తేలినా సదరు అధికారులను ఎందుకు వదిలేస్తున్నారని కార్మికులు మండిపడుతున్నారు. ఇతర అధికారులు దీనిని అలుసుగా తీసుకుని వసూళ్ల పర్వం ప్రారంభిస్తారని వాపోతున్నారు. అంతర్గత విచారణ ఏదీ? కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడ్డట్టు విజిలెన్సు నివేదిక జనవరి చివరి వారంలోనే అందినా ఆర్టీసీ యాజమాన్యం స్పందించడం లేదని కార్మికులు మండిపడుతున్నారు. సాధారణంగా విజిలెన్సు నివేదికలు అందిన తర్వాత ఆర్టీసీ అధికారులు అంతర్గత విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు. ఇటీవల వరంగల్లో ఓ డిపో మేనేజర్ను ఇలాగే సస్పెండ్ చేశారు. కానీ మరో రెండు కేసుల విషయంలో అంతర్గత విచారణ కూడా చేపట్టలేదు. ఇది ఆర్టీసీలో కార్మిక సంఘాలు తిరిగి బలోపేతం అవ్వాలన్న డిమాండ్కు తెరలేపుతోంది. చిన్న ఉద్యోగుల విషయంలో ఓ రకంగా, అధికారుల విషయంలో మరో రకంగా వ్యవహరిస్తున్నందున.. మళ్లీ కార్మిక సంఘాలకు అవకాశం కల్పించి ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ మొదలవుతోంది. -
భారీగా నకిలీ విత్తనాలు స్వాధీనం
సాక్షి, మేడ్చల్: జిల్లాలోని మేడ్చల్ మండలం కండ్లకోయలో ఉన్న ఎకో ఆగ్రో సీడ్స్ గోదాముపై విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు చేశారు. రూ.31 లక్షల విలువైన భారీ నకిలీ విత్తనాలతో పాటు, పొద్దు తిరుగుడు, మొక్కజొన్న, జొన్న విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న విత్తనాల ప్యాకెట్లపై టెస్టింగ్ చేసిన తేదీ, ప్యాకింగ్ చేసిన తేదీల్లో వ్యత్యాసం ఉందని తెలిపారు. సరైన పరీక్షలు నిర్వహించకుండా విత్తనాల విక్రయిస్తున్నారని విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. ఈ దాడుల్లో రూ.12.24 లక్షల విలువైన 1529 మొక్క జొన్న విత్తనాల ప్యాకెట్లను, రూ.18. 76లక్షల విలువైన 1210 పొద్దు తిరుగుడు విత్తనాల ప్యాకెట్లు స్వాదీనం చేసుకున్న అధికారులు తెలిపారు. నకిలీ విత్తనాలతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోతారని అధికారులు అన్నారు. సీజ్ చేసిన విత్తనాలను స్థానిక వ్యవసాయ అధికారికి అప్పగించి, వారిపై విత్తన చట్టం, ఐ.పీ.సీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. -
హెచ్టీ పత్తి విత్తనాల గుట్టు రట్టు
సాక్షి, అమరావతి: కలుపును తట్టుకునే హెచ్టీ (హెర్బిసైడ్ టాలరెంట్) పత్తి విత్తనాల గుట్టు రట్టయింది. నిషేధించిన ఈ పత్తి విత్తనాలను రాష్ట్రంలోని కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 15 మందితో కూడిన ఓ ముఠా అనధికారికంగా విక్రయిస్తున్నట్టు వ్యవసాయ శాఖ గుర్తించింది. ఇప్పటికే 8 మందిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. వెల్దుర్తి కేంద్రంగా.. ► హెచ్టీ కాటన్ విత్తనాలకు రాష్ట్రంలో అనుమతి లేదు. అయినా అనధికారికంగా విక్రయిస్తున్నట్టు వరుసగా మూడో ఏడాది కూడా ఆరోపణలు రావడంతో వ్యవసాయ శాఖ ఇటీవల కర్నూలు, గుంటూరు పరిసర ప్రాంతాల్లోని గిడ్డంగుల్లో తనిఖీలు చేపట్టింది. ► ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోనే రూ.2 కోట్ల విలువైన హెచ్టీ విత్తనాలు దొరికాయి. ► అక్కడ లభించిన సమాచారం ఆధారంగా కర్నూలులోని ఓ శీతల గిడ్డంగిపై, పత్తికొండ ప్రాంతాల్లో దాడులు నిర్వహించగా.. పెద్దఎత్తున హెచ్టీ విత్తనాల నిల్వలు దొరికాయి. ► కర్నూలు జిల్లాలోని చాలా గిడ్డంగుల్లో హెచ్టీ పత్తి ఉన్నట్టు గుర్తించారు. విత్తన వ్యాపారులకు వ్యవసాయ అధికారి, పర్యవేక్షణాధికారి అయిన ఏడీఆర్ కుమ్మక్కై ఎవరిపైనా కేసులు పెట్టలేదని తేలింది. ఏమిటీ.. హెచ్టీ కాటన్! ► కలుపు మొక్కలను నివారించే మందుల్ని పిచికారీ చేసినా తట్టుకోగలిగిన అంతర్గత శక్తి హెచ్టీ పత్తి మొక్కలకు ఉండటం ప్రత్యేకత. ► అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జన్యు మార్పిడి చేసి రూపొందించిన ఈ విత్తనాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు. ► ఈ విత్తనాన్ని నేరుగా అమ్మినా.. మరేదైనా రకంతో కలిపి అమ్మినా నేరమే. ► గుంటూరు జిల్లాలోని కొందరు విత్తన వ్యాపారులు, కర్నూలు జిల్లాలోని కొందరు రైతులు ఈ ముఠాకు సహకరిస్తున్నారని గుంటూరు జిల్లా వ్యవసాయాధికారి వ్యవసాయ శాఖ కమిషనర్కు ఆదివారం ఫిర్యాదు చేశారు. క్రిమినల్ కేసులు తప్పవు నకిలీ, అనుమతి లేని విత్తనాలు విక్రయించే వారిపైన, సహకరించే వారిపైనా పీడీ చట్టం కింద క్రిమినల్ కేసులు దాఖలు చేయాలని ఆదేశాలిచ్చాం. తప్పు చేస్తే వ్యవసాయ శాఖలోని ఉద్యోగులు, అధికారులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
నగరంలో విజిలెన్స్ అధికారుల దాడులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్రమ నీటి కనెక్షన్ల పై విజిలెన్స్ అధికారులు కొరడా ఝుళిపించారు. ముందస్తు సమాచారం మేరకు హైదరాబాద్ జలమండలి విజిలెన్స్ అధికారులు గురువారం పలు చోట్ల దాడులు నిర్వహించారు. అక్రమంగా నీటి కనెక్షన్లు, నీటి మోటార్లు, మీటర్లు కలిగి ఉన్నవారిని అధికారులు గుర్తించారు. ఈ దాడుల్లో స్టాలియన్ టైర్స్ కంపెనీకు చెందిన వి.ఎమ్.ఎన్ వెంకటేష్ 40 మిల్లీ మీటర్ల నీటి కనెక్షన్లను అక్రమంగా వాడుతున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. 2016లో నీటి బిల్లులు చెల్లించని కారణంగా వెంకటేశ్ రూ. 29.42లక్షలు బకాయి పడ్డాడని, అందువల్ల అతని కనెక్షన్ను రద్దు చేశామని అధికారులు తెలిపారు. బిల్లులు చెల్లించకపోగా, అక్రమ కనెక్షన్ ద్వారా దాదాపు 25వేలకు పైగా కిలో లీటర్ల నీటిని వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. అంటే మొత్తంగా 40 లక్షల రూపాయల నీటిని అక్రమంగా వినియోగించారని, దీనిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు విజిలెన్స్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
ఎస్వీబీసీ చైర్మన్ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా
తిరుపతి సెంట్రల్/సాక్షి, హైదరాబాద్: శ్రీవేంకటేశ్వర భక్తి చానల్(ఎస్వీబీసీ) చైర్మన్ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా చేశారు. ఓ మహిళతో పృథ్వీరాజ్ అసభ్యంగా మాట్లాడినట్లు కొన్ని ప్రసార మాధ్యమాల్లో ఆడియో ప్రసారాలు రావడంతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెంటనే స్పందించి, ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. సదరు ఆడియో టేపుల్లోని వాయిస్ శాంపిల్ను టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఈ విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పరమ పవిత్రమైన తిరుమల తిరుపతిలో అనుచిత ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. శ్రీవారి క్షేత్రం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. పృథ్వీరాజ్ను రాజీనామా చేయాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ఆదేశించినట్లు తెలిసింది. తప్పు చేశానని తెలిస్తే చెప్పుతో కొట్టండి: పృథ్వీ తనపై వచ్చిన ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదని ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన పృథ్వీ చెప్పారు. తప్పు చేశానని తెలిస్తే తన చెప్పుతో తనను కొట్టండని అన్నారు. ఆయన ఆదివారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. మహిళా ఉద్యోగితో తాను అసభ్యంగా మాట్లాడినట్టుగా ప్రచారమవుతున్న ఆడియోలో వాయిస్ తనది కాదన్నారు. శ్రీవారిపై ఒట్టేసి చెపుతున్నానని, తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో తన వాయిస్ లేకుండా చేయాలనే ఇంత పెద్ద కుట్రపన్నారని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలపై తానే విజిలెన్స్ విచారణ వేసుకున్నట్టు చెప్పారు. వైఎస్సార్సీపీ సిద్ధాంతాలకు కట్టుబడి, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని గౌరవించి తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజధాని రైతులను ఉద్దేశించి తాను పెయిడ్ ఆర్టిస్టులని అనలేదన్నారు. తన వ్యాఖ్యలు రైతుల మనస్సులను నొప్పించి ఉంటే క్షమాపణ చెçపుతున్నానని అన్నారు. -
ఉల్లి అక్రమార్కులపై.. ‘విజిలెన్స్’ కొరడా!
సాక్షి, అమరావతి: ఉల్లి ధరలను అదుపుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని రంగంలోకి దించింది. పలు రాష్ట్రాల్లో వీటి దిగుబడి తగ్గడం.. వరదల కారణంగా మార్కెట్లో ఉల్లిపాయలకు కొద్దిరోజులుగా కొరత ఏర్పడింది. దీనిని అధిగమించేందుకు కేంద్రం ఇతర దేశాల నుంచి దిగుమతికి అనుమతించింది. అయితే, వాటి ధరల్లో పెద్దఎత్తున చోటుచేసుకుంటున్న హెచ్చుతగ్గుల కారణంగా రాష్ట్రంలోని వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అక్రమంగా నిల్వ ఉంచుతున్న వారిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి నేతృత్వంలో దాడులు ప్రారంభించారు. గడిచిన రెండ్రోజులుగా రాష్ట్రంలోని 10 జిల్లాల్లో పెద్దఎత్తున వీటిని నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో ఉల్లిపాయలను అక్రమంగా నిల్వ ఉంచడం.. కృత్రిమంగా కొరత సృష్టించి ధర పెంచి విక్రయించడం.. ఎటువంటి అనుమతులు లేకుండా హోల్సేల్, రిటైల్ షాపులు నిర్వహించడాన్ని అధికారులు గుర్తించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 70 మంది వ్యాపారులపై ‘విజిలెన్స్’ దాడులు నిర్వహించగా 47మంది అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారించారు. వారి నుంచి రూ.27,06,200 విలువచేసే 603.50 క్వింటాళ్ల ఉల్లిపాయలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నిల్వలు ఉంచిన 37 మందికి జరిమానాలు విధించారు. మిగిలిన 10 మందిపై కేసులు నమోదు చేశారు. నిబంధనలకు మించి నిల్వలు వద్దు ఇదిలా ఉంటే.. హోల్సేల్, రిటైల్ వ్యాపారుల వద్ద నిబంధనలకు మించి ఉల్లిపాయల నిల్వలు ఉంచుకోకూడదని కేవీ రాజేంద్రనాథ్రెడ్డి స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 30 వరకు హోల్సేల్ వ్యాపారులు 50 మెట్రిక్ టన్నులు, రిటైలర్లు 10 మెట్రిక్ టన్నులు మాత్రమే నిల్వలు ఉంచుకోవాలన్నారు. మరోవైపు.. కొందరు వ్యాపారులు అగ్రికల్చర్ మార్కెటింగ్ సెస్ ఎగవేశారని ఆయన తెలిపారు. ఆదుకున్న కర్నూలు ఉల్లి కాగా, మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయలు రాకపోవడంతో ఆ కొరతను కర్నూలు ఉల్లిపాయలు కొంతమేర తీర్చాయి. ప్రస్తుతం రైతుబజార్లలో కర్నూలు ఉల్లిపాయలు కిలో రూ.36కు విక్రయిస్తున్నారు. దీన్ని మరింతగా తగ్గించి వినియోగదారులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. బ్లాక్ మార్కెట్కు ఇలా.. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో దిగుబడి తగ్గడం.. వరదల ప్రభావంతో ఉల్లిపాయల రవాణపై ప్రభావం పడింది. దీన్ని గమనించిన వ్యాపారులు బ్లాక్ మార్కెట్కు తెరలేపారు. అందుబాటులో ఉన్న ఉల్లిపాయలను మహారాష్ట్ర, కార్ణాటక నుంచి తక్కువ ధరకు ముందుగానే సేకరించుకుని తమ గిడ్డంగుల్లో పెద్దఎత్తున నిల్వచేశారు. వాటిని ఉద్దేశపూర్వకంగానే రోజువారీగా కొంతమేర విక్రయాలు జరుపుతూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో బహిరంగ మార్కెట్లో ఒక్కసారిగా కొరత ఏర్పడింది. వ్యాపారులు ఒక పథకం ప్రకారమే మార్కెట్ను ప్రభావితం చేస్తూ అక్రమార్జన చేస్తున్నారని విజిలెన్స్ పరిశీలనలో వెల్లడైంది. నిబంధనలు.. ►ఉల్లి వ్యాపారులు మార్కెట్ కమిటీ లైసెన్సులు తీసుకుని విధిగా పన్ను చెల్లించాలి. ►ఖచ్చితంగా లైసెన్స్ పొంది ఉండాలి. ►స్టాక్ నిల్వచేయడం.. విక్రయించే ధర అన్నీ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే ఉండాలి. ►ఎంత స్టాకు దిగుమతి చేసుకుంటున్నారు.. ఎంత విక్రయించారో లెక్కలు చూపాలి ►హోల్సేల్ వ్యాపారులు 50 మెట్రిక్ టన్నులు, రిటైలర్లు 10 మెట్రిక్ టన్నులకు మంచి ఉంచుకోకూడదు అక్రమంగా నిల్వచేస్తే క్రిమినల్ చర్యలు ఉల్లిపాయలను అక్రమంగా నిల్వచేసుకుని అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై క్రియమినల్ చర్యలు తీసుకుంటాం. దేశవ్యాప్తంగా ఉన్న ఉల్లి కొరతను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. హోల్సేల్ వ్యాపారులు తమ వద్ద 50 మెట్రిక్ టన్నులు మించి ఉల్లిపాయలను ఉంచుకోకూడదు. అదే రిటైల్ వ్యాపారుల వద్ద 10 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ ఉండకూడదు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ షాపుల లైసెన్సులను రద్దు చేయడంతోపాటు అక్రమ నిల్వలను సీజ్ చేస్తాం. – పి. జాషువా, గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ -
హద్దులు దాటి తవ్విన ఎమ్మెల్సీ సోదరుల క్వారీలపై దాడులు
సాక్షి, మడకశిర: ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సోదరులు జయప్ప, సుభాష్ నిర్వహిస్తున్న మెటల్ క్వారీలపై బుధవారం కర్నూలుకు చెందిన గనుల శాఖ విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. గనుల శాఖ డీడీ రాజశేఖర్ అదేశాల మేరకు ఇన్స్పెక్టర్లు కొండారెడ్డి, వెంకటకృష్ణప్రసాద్లు మడకశిర మండల పరిధిలోని మెళవాయి పంచాయతీలోని సర్వే నంబర్ 622లోని ఎమ్మెల్సీ సోదరుల క్వారీల్లో తనిఖీ చేశారు. ఎమ్మెల్సీ సోదరులు హద్దులు దాటి భారీగా తవ్వకాలు చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన క్వారీ నిర్వాహకుల నుంచి అపరాధరుసుం వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు మాట్లాడుతూ, మడకశిర నియోజకవర్గంలోని చాలా ప్రాంతాల్లో అక్రమంగా క్వారీలు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో తనిఖీలు నిర్వహించామన్నారు. నియోజవర్గంలోని అన్ని మెటల్, గ్రానైట్ క్వారీలను తనిఖీ చేస్తామన్నారు. రాయల్టీ చెల్లించకుండా, నిబంధనలకు విరుద్ధంగా క్వారీలు నడుపుతున్న క్వారీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
తిరుమలలో మరో ఇద్దరు దళారుల అరెస్ట్
-
తిరుమలలో మరో ఇద్దరు దళారుల అరెస్ట్
సాక్షి, తిరుమల: తిరుమలలో మరో ఇద్దరు దళారులను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. 17 వేల రూపాయలకు రెండు సుప్రభాతం సేవా టిక్కెట్లను విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. దళారులలో ఒకరు టీటీడీ ఉద్యోగి మధుసూదన్ కాగా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అటెండర్గా పనిచేస్తున్నాడు. ప్రజా ప్రతినిధులు సిఫార్సు లేఖలతో టిక్కెట్లు పొంది భక్తులకు విక్రయిస్తున్నారని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. టిక్కెట్లు లేకుండానే భక్తులను విఐపి బ్రేక్ దర్శనాలకు అనుమతిస్తునట్లు పోలీసులు గుర్తించారు. -
నామినేషన్పై మందుల కొను‘గోల్మాల్’
సాక్షి, అమరావతి : కార్మిక రాజ్య బీమా (ఈఎస్ఐ) పరిధిలోని ఆస్పత్రుల్లో మరో భారీ కుంభకోణానికి అధికారులు తెరతీశారు. గత ప్రభుత్వ హయాంలో మందుల కొనుగోళ్లలో విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలు జరిగాయని తేలడంతో ఓ వైపు విజిలెన్స్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తుంటే మరోవైపు ఈఎస్ఐ పరిధిలోని ఆస్పత్రుల్లో కనీస మందులు లేక కార్మికులు, వారి కుటుంబ సభ్యులు నానా అవస్థలు పడుతున్నారు. ఇవన్నీ ఏమీ పట్టని అధికారులు తాము అనుకున్నదే రూలు అన్నట్టు వందల కోట్ల రూపాయల విలువైన మందుల కొనుగోళ్ల విషయంలో అక్రమాలకు మార్గం సుగమం చేశారు. పారదర్శకంగా మందుల కొనుగోలు జరగాలంటే ఇ–ప్రొక్యూర్మెంట్ పద్ధతి సరైనదని భావించిన అధికారులు కొత్త సర్కారు రాగానే ఈ విధానాన్ని అమలులోకి తెచ్చారు. అప్పటి కార్మిక శాఖ అధికారిగా ఉన్న ఐఏఎస్ అధికారి మాధవీలత ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రక్రియ మొదలు పెట్టారు. అయితే కొద్ది రోజులకే ఆమె కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్గా బదిలీ అయ్యారు. ఆ తర్వాత లావణ్యవేణి అనే మరో అధికారి ఈ శాఖకు వచ్చారు. ఈమె ఆధ్వర్యంలో టెండర్లు పూర్తి చేసి, ఎల్1గా నిలిచిన కంపెనీల నుంచి మందులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. తీరా ఎల్1గా నిలిచిన కంపెనీలపై ఫిర్యాదులున్నాయని, మామూలు ధరల కంటే ఎక్కువ రేటు ఉందని ఇ–ప్రొక్యూర్మెంట్ విధానాన్ని నిలిపివేశారు. నామినేషన్ కింద మందుల సరఫరాకు అనుమతి ఇచ్చేందుకు ఈఎస్ఐ డైరెక్టరే కొన్ని కంపెనీలను ఎంపిక చేశారు. నామినేషన్ కింద అయితే భారీగా డబ్బులొస్తాయని భావించిన అధికార వర్గాలు ఈ విధానానికి తెరలేపాయని సమాచారం. ఇదే సమయంలో తక్కువ ధరకు మందులు ఇస్తామని చెప్పిన కంపెనీలు ఎందుకు ఇ–ప్రొక్యూర్మెంట్ టెండర్లలో పాల్గొన లేదన్నదానికి అధికారుల నుంచి జవాబు లేదు. దీంతో రెండు మాసాల పాటు ఇద్దరు ఐఏఎస్ అధికారులు కసరత్తు చేసిన ఇ–ప్రొక్యూర్మెంట్ టెండర్ల విధానం మొత్తం బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. ధరలు మామూలుగా ఉన్నాయన్న కమిటీ ఇ–ప్రొక్యూర్మెంట్ పూర్తయ్యాక రేట్లు ఎక్కువగా ఉన్నాయన్న విమర్శలు రాగానే రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) కొనుగోలు చేసే మందుల ధరకూ, ఈఎస్ఐ ఇప్రొక్యూర్మెంట్లో కోట్ చేసిన ధరలకూ బేరీజు వేయాలని ఉన్నతాధికారులు ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు. చంద్రశేఖర్, రామకృష్ణ, గాంధి అనే ముగ్గురు వైద్యులతో కూడిన కమిటీ సుమారు 265 రకాల మందుల ధరలను పరిశీలించింది. ఈఎస్ఐ టెండర్లలో పాల్గొన్న కంపెనీలు వేసిన ధరలకూ, ఏపీఎంఎస్ఐడీసీ ధరలకూ తేడా లేదని తేల్చింది. ఇలాంటప్పుడు ఇ–ప్రొక్యూర్మెంట్ ద్వారా కొనుగోలు చేయవచ్చని నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను అమలు చేయాలని కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి కూడా ఆదేశాలు జారీ చేశారు. వీటన్నింటినీ పట్టించుకోకుండా నామినేషన్ ద్వారా కొనుగోళ్లవైపే మొగ్గు చూపారు. ఇప్పటికే ఏఏ కంపెనీకి ఆర్డర్లు ఇవ్వాలో కూడా నిర్ణయించి వారికి జిల్లాల వారీగా మందుల ఇండెంట్ ఇచ్చారు. తొలి దశలో సుమారు రూ.40 కోట్లతో మందులు కొనుగోలు చేయనున్నారు. ధరలు ఎక్కువని ఇస్తున్నాం ఇ–ప్రొక్యూర్మెంట్ టెండరులో ధరలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్లే నామినేషన్ కింద ఇస్తున్నాం. ఏపీఎంఎస్ఐడీసీ సరఫరా చేసే మందులు అదే ధరకు వచ్చినా వాటినెవరైనా తింటారా? మా రోగులు అలాంటి మాత్రలు తినరు. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందులు లేని విషయం వాస్తవమే. అందుకే నామినేషన్ కింద ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తున్నాం. పైగా ఈఎస్ఐ మందుల టెండర్లలో పాల్గొన్న కంపెనీల ద్వారా మందులు కొంటే రూ.230 కోట్లు నష్టం వస్తుంది. – సామ్రాజ్యం, ఈఎస్ఐ డైరెక్టర్ -
ఈఎస్ఐ ‘డైరెక్టరేట్’పై విజిలెన్స్ దాడులు
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలోని ఈఎస్ఐ డైరెక్టరేట్ కార్యాలయంలో సోమవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గుంటూరు విజిలెన్స్ ఎస్పీ జాషువా, విజయవాడ విజిలెన్స్ ఎస్పీ వెంకటరెడ్డి, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ వరదరాజులు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఆస్పత్రి వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు.. దాదాపు ఏడు గంటలకు పైగా విజిలెన్స్ ఎస్పీలు డైరెక్టరేట్ అధికారులను ప్రశ్నించినట్టు తెలిసింది. మందులు, ఫర్నిచర్, సర్జికల్ ఐటమ్స్, రీయోజన్స్ల కొనుగోలులో భారీ ఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నట్టు తెలిసింది. ఈఎస్ఐ డిస్పెన్సరీలు ఆస్పత్రిలో డాక్టర్లు పంపిన ఇండెంట్లకు బదులుగా అధిక కమిషన్లు ఇచ్చే మందులను బలవంతంగా కొనుగోలుచేసి.. భారీ మొత్తంలో నిల్వ ఉంచినట్టు సమాచారం. ఈఎస్ఐ బడ్జెట్ ఎంత? ఎన్ని కొనుగోలు చేస్తారు? వాటిని ఎలా వినియోగిస్తారని విజిలెన్స్ అధికారులు ఆస్పత్రి డైరెక్టరేట్ కార్యాలయ సిబ్బందిని ప్రశ్నించినట్టు సమాచారం. ఈ మందులను ఏ స్థాయి అధికారి కొనుగోలు చేస్తారన్నదానిపై ఆరా తీశారు. చక్రం తిప్పిన ‘ఆమె’ గత ప్రభుత్వ హయాంలో ఓ ప్రధాన సామాజికవర్గానికి చెందిన మహిళకు చెందిన ఫార్మాస్యూటికల్కే మందుల కొనుగోళ్లు ఇచ్చినట్టు విజిలెన్స్ తనిఖీల్లో కనుగొన్నారు. రాష్ట్రంలో 16 కంపెనీలున్నా.. ఈ కంపెనీకే ఎందుకు మందుల కొనుగోలు ఇచ్చారనే విషయంపై ఆరా తీశారు. అన్ని సర్జికల్ ఐటమ్స్ ఒకే ఫార్మాస్యూటికల్ కంపెనీకి ఎలా ఇచ్చారనే దానిపై ప్రధానంగా విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. రూ.10 విలువ చేసే మందును రూ.50కి కొనుగోలు చేయాల్సి వచ్చిన విషయాలపై సిబ్బందిని ప్రశ్నించారు. పైగా ఆ ఫార్మా కంపెనీకి తక్షణమే పేమెంట్లు చెల్లించడంపై కూడా ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. సిరంజిలు వంటివి సైతం నాసిరకమైనవి సరఫరా చేసినట్టు తెలుస్తోంది. వినియోగంలో లేని మందులను ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు. టెలికేర్ అనే సంస్థకు ఒక్కో ఈసీజీకి రూ.450 నుంచి రూ.500 వరకు ప్రభుత్వం నుంచి వసూలు చేసినట్టు తెలుస్తోంది. బయట ఈసీజీని కేవలం రూ.100 నుంచి రూ.120కే తీస్తారు. విజిలెన్స్ డీజీ రాజేంద్రనాథ్రెడ్డి ఆధ్వర్యంలో ఈఎస్ఐ ఆస్పత్రులపై ఈ దాడులు జరుగుతున్నాయి. డైరెక్టరేట్ కార్యాలయం నుంచి 8 వేల పేజీల సమాచారాన్ని తీసుకుని.. దానిని అధ్యయనం చేసేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్టు తెలుస్తోంది. 2014 నుంచి ఇప్పటి వరకు ఎంతమంది డైరెక్టర్లు పనిచేశారు.. వారి వివరాలు సైతం సేకరించినట్టు తెలిసింది. మొత్తం మీద ఈఎస్ఐలో రూ.కోట్ల కుంభకోణం జరిగినట్లు స్పష్టమవుతోంది. -
ఈఎస్ఐ డైరెక్టరేట్లో విజిలెన్స్ అధికారుల దాడులు
సాక్షి, విజయవాడ : విజయవాడ ఈఎస్ఐ డైరెక్టరేట్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈఎస్ఐ రికార్డ్స్, అకౌంట్స్లో అవకతవకలు జరిగాయన్న అనుమానంతో మంగళవారం తనిఖీలు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఇఏస్ఐ సిబ్బందిని విచారిస్తున్నామని, సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగుతాయని విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. -
సంక్షోభం దిశగా కరీంనగర్ గ్రానైట్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దాదాపు లక్ష కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న కరీంనగర్ గ్రానైట్ పరిశ్రమ సంక్షోభం దిశగా సాగుతోంది. ఇప్పటికే చైనాకు ఎగుమతులు తగ్గడంతో సగానికిపైగా క్వారీలు మూతపడ్డాయి. 2011 నాటి సీనరేజీ ఫీజు, రూ.749 కోట్ల పెనాల్టీ బకాయిలు తాజాగా కరీంనగర్ గ్రానైట్ పరిశ్రమను అతలాకుతలం చేస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో రాజకీయ వైరం కూడా ఇప్పుడు గ్రానైట్ పరిశ్రమకు శాపంగా మారినట్లు కనిపిస్తోంది. బకాయిలు చెల్లించాలంటూ ఇటీవల 125 మంది క్వారీ యజమానులకు గనుల శాఖ డిమాండ్ నోటీసులు జారీ చేసింది. దీంతో క్వారీల యజమానులు పరిశ్రమను 3 రోజులు మూసే యాలని నిర్ణయించుకున్నారు. శనివారం నుంచి బంద్ మొదలైంది. కరీంనగర్ రూరల్, గంగాధర, హుజురాబాద్, కేశవపట్నం, వీణవంక మండ లాల్లోని క్వారీల్లో శనివారం కార్యకలాపాలు నిలిచిపోయాయి. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల పరిధిలో కూడా క్వారీలను మూసేశారు. గ్రానైట్ కట్టింగ్ యూనిట్లు కూడా మూతపడ్డాయి. ఆదివారం నుంచి గ్రానైట్ ఫ్యాక్టరీలు, ట్రాన్స్పోర్ట్ కంపెనీలు కూడా బంద్ పాటించనున్నాయి. రూ.624 పెనాల్టీ 2011లో కరీంనగర్ నుంచి 8 రైల్వే యార్డుల (ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు) ద్వారా గ్రానైట్ బ్లాకులు కాకినాడ పోర్టుకు చేరాయి. సముద్ర మార్గంలో గ్రానైట్ను రవాణా చేసే క్రమంలో విజిలెన్స్ అధికారులు దాడి చేసి, సీనరేజీ ఫీజు రూపంలో ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా ఎగుమతి చేస్తున్నారని కేసు నమోదు చేశారు. ఈ మేరకు సీనరేజీ ఫీజును రూ.125 కోట్లుగా అప్పట్లో నిర్ణయించారు. దీనిపై 5 రెట్ల అపరాధ రుసుము విధించడంతో రూ.749 కోట్ల మొత్తాన్ని కరీంనగర్ వ్యాపారులు చెల్లించాల్సిందిగా లెక్కగట్టారు. సుమారు 200 క్వారీల నుంచి రవాణా అయినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు మైనింగ్ అధికారులు నోటీసులు ఇవ్వడంతోపాటు క్వారీల అనుమతులు నిలిపేశారు. దీంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతోపాటు మైనింగ్ చట్టప్రకారం అప్పీలేట్ అధికారికి అప్పీల్ చేయగా, సీనరేజీ ఫీజును 1+5 బదులు 1+1గా మార్పు చేస్తూ జీవో జారీ చేశారు. ఈ మేరకు కొందరు క్వారీ యజమానులు చెల్లింపులు చేశారు. అయితే ఈ ప్రక్రియ గనుల శాఖలో ఏళ్ల తరబడి సాగుతుండగా, కోర్టుల సహాయంతో మరికొందరు క్వారీలు నడుపుతున్నారు. వ్యాపారులను వేధిస్తున్న ఎంపీ సంజయ్.. కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ వ్యాపారం ద్వారా లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న వారిని మాఫియాగా చిత్రీకరించి ఎంపీ బండి సంజయ్ వేధింపులకు గురి చేస్తున్నారని కరీంనగర్ జిల్లా గ్రానైట్ క్వారీఓనర్స్ అసోసియేషన్ ఆరోపించింది. బ్లాక్మెయిల్ రాజకీయాలతో పరిశ్రమ మనుగడకే ముప్పు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని, ఆయన చర్యలకు నిరసనగా మూడు రోజుల బంద్ పాటిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు శ్రీధర్, మాజీ అధ్యక్షుడు టి.తిరుపతిగౌడ్, ఉపాధ్యక్షుడు రంగారావు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, కార్యదర్శి మహేందర్రావు తెలిపారు. నెల రోజుల కింద మళ్లీ తెరపైకి.. సీనరేజీ ఫీజు, పెనాల్టీ బకాయిల అంశాన్ని ఎంపీ బండి సంజయ్ మరోసారి తెరపైకి తెచ్చారు. గ్రానైట్ వ్యాపారుల నుంచి సీనరేజీ ఫీజు, పెనాల్టీ వసూలు చేయట్లేదని కేంద్ర గనుల శాఖ మంత్రి, కార్యదర్శులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఇటీవల గవర్నర్ తమిళిసై సుందరరాజన్ను కలసి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో 2011లో 8 ట్రాన్స్పోర్టు ఏజెన్సీల ద్వారా గ్రానైట్ రవాణా చేసిన క్వారీల యజమానులకు గనుల శాఖ నోటీసులు జారీ చేయనుంది. వరంగల్లోని గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూధన్రెడ్డి ఈ అంశాన్ని పర్యవేక్షిస్తున్నారు. -
అక్రమార్కుల్లో బడా బాబులు?
సాక్షి, ప్రకాశం(మార్టూరు) : నకిలీ వేబిల్లులతో గ్రానైట్ రాయిని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఎనిమిది వాహనాలను విజిలెన్స్ అండ్ మైనింగ్ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ సంఘటన మండల కేంద్రం మార్టూరులో ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. విజిలెన్స్ డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు, సీఐ భూషణం కథనం ప్రకారం.. మార్టూరు కేంద్రంగా నకిలీ వేబిల్లుల వ్యాపారం జోరుగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ముందస్తు సమాచారంతో ఒంగోలు, విజయవాడకు చెందిన విజిలెన్స్ అధికారులు 16 మంది నాలుగు బృందాలుగా ఏర్పడి శనివారం అర్ధరాత్రి మార్టూరులో నలుమూలలా నిఘా పెట్టారు. అర్ధరాత్రి 2 గంటల నుంచి నాలుగు గంటల వరకు అధికారుల నిర్వహించిన తనిఖీల్లో గ్రానైట్ రాయిని అక్రమంగా తరలిస్తున్న లారీలను పట్టుకున్నారు. నాగరాజుపల్లి రోడ్డు నుంచి జాతీయ రహదారి వైపు వస్తున్న 8 లారీలకు ఎలాంటి వే బిల్లులు లేకపోవడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని స్థానిక పోలీసుస్టేషన్కు తరలించారు. తెల్లవారే సరికి విషయం గుప్పుమనడంతో ఏడు లారీల్లోని సరుకుకు చెందిన అసలు యజమానులు తమ వద్ద సంబంధింత వే బిల్లులు ఉన్నాయంటూ పోలీసుస్టేషన్కు వచ్చి అధికారులతో అన్ని రకాల సంప్రదింపులు జరిపారు. ఎనిమిదో వాహనానికి ఎలాంటి బిల్లు లేనట్లు అధికారులు ధ్రువీకరించారు. ఏడు వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించిన అధికారుల దృష్టికి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వే బిల్లులు ఒరిజినల్ అయినప్పటికీ ఆ బిల్లులు ఆదివారం తరలిస్తున్న గ్రానైట్ వాహనాలకు సంబంధించినవి కావని అధికారులు గుర్తించారు. అంతేగాక రవాణా జరిగే సరుకుకు సంబంధించిన ఎలాంటి బిల్లులైనా సంబంధిత వాహనంలో సిబ్బందితో ఉండాల్సి ఉంది. వాహనాల తనిఖీ అనంతరం యజమానులు ఇవిగో బిల్లులు అంటూ తీసుకొచ్చి అధికారులకు చూపడం పలు అనుమానాలకు తావిస్తోంది. యజమానులు అధికారులకు చూపించిన వే బిల్లులు పాతవని తెలుస్తోంది. గతంలో ఒకసారి వాహనాలను అవే వే బిల్లులతో విడిపించుకెళ్లినట్లు సమాచారం. ఇప్పుడు అవే బిల్లులను రెండోసారి గ్రానైట్ రాయిని తరలించేందుకు ఉపయోగిస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. అంటే ఒకసారి జనరేటైన బిల్లులతో యజమానులు పలుమార్లు గ్రానైట్ రాయిని రవాణా చేసేందుకు ఉపయోగిస్తున్నారన్నమాట. ఈ క్రమంలో గ్రానైట్ రాయి యజమానులు అధికారులను రకరకాల ప్రలోభాల ద్వారా లొంగదీసుకునేందుకు పైరవీలు జరపడం విశేషం. ఎనిమిది వాహనాల్లోని ముడిరాయి విలువ 16 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఒంగోలు మైనింగ్ శాఖ ఆర్ఐ నాగిరెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ కృష్ణారెడ్డి తెలిపారు. అధికారులు చిత్తశుద్ధితో దర్యాప్తు చేస్తే పెద్ద మనుషుల్లా చలామణి అయ్యే బడా బాబుల జాతకాలు వెలుగు చూసే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. విజిలెన్స్ సీఐలు ఎం.శ్రీనివాసరావు, బి.నాయక్, ఎస్ఐలు మహ్మద్ జానీ, కోటేశ్వరరావు, అసిస్టెంట్ జియాలజిస్ట్ సుధాకర్, ఏఓ ఉమాపతి, సిబ్బంది ప్రసాద్, వెంకట్, నరసయ్య పాల్గొన్నారు. పోలీసుస్టేషన్ వద్ద ఆందోళన మార్టూరు: పోలీసులు తమ కాలనీకి చెందిన యువకుడిని వేధించారంటూ స్థానిక సంపత్నగర్ వాసులు ఆదివారం రాత్రి స్థానిక పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇంతలో స్థానిక గొట్టిపాటి హనుమంతురావు కాలనీకి చెందిన మరొక కేసుకు సంబంధించిన వారు రావడంతో పోలీసుస్టేషన్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాలు.. నకిలీ వేబిల్లుల కేసులో విచారణలో భాగంగా స్థానిక సంపత్నగర్ కాలనీకి చెందిన కుంచాల వంశీకృష్ణను ఎస్ఐ కె.మల్లికార్జున గత శనివారం పోలీసుస్టేషన్కు పిలిపించి విచారించారు. విచారణలో భాగంగా తనను పోలీసులు తీవ్రంగా కొట్టడమేగాక చెవుల వద్ద కరెంట్షాక్ పెట్టారనేది వంశీకృష్ణ ఫిర్యాదు. జిల్లా వడ్డెర సంఘ అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులు ఆధ్వర్యంలో 70 మంది మహిళలు ఇదేమని ప్రశ్నించేందుకు 7 గంటల ప్రాంతంలో పోలీసుస్టేషన్కు వచ్చారు. అదే సమయానికి రేణింగివరం ఎస్ఐ మహేష్ తన సిబ్బందితో స్టేషన్కు చేరుకున్నారు. విలేకరులతో మాట్లాడుతూ కేసులో నిందితుడిగా ఉంటే ప్రశ్నించాలేగానీ థర్డ్ డిగ్రీ ప్రయోగించడం సరికాదన్నారు. ఎస్ఐపై మంత్రి బాలినేని, కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఈ విషయమై ఎస్ఐ మల్లికార్జునను వివరణ కోరగా వం«శీకృష్ణ నకిలీ వేబిల్లుల వ్యాపారంలో నిందితుడని, కొన్నేళ్లుగా ఈ వ్యాపారం సాగిస్తున్నాడని, ఓ కేసులో భాగంగా అతడిని స్టేషన్కు పిలిచి విచారించామేగానీ కరెంట్ పెట్టడం వంటి చర్యలకు పాల్పడలేదని చెప్పారు. ఇదే సమయంలో ఇటీవల గొట్టిపాటి హనుమంతురావు కాలనీలో మూడేళ్ల బాలుడిపై 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిని అరెస్టు చేయాలంటూ కాలనీకి చెందిన 30 మంది స్టేషన్ వద్దకు చేరడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
‘సదావర్తి’లో అక్రమాలపై విజి‘లెన్స్’
సాక్షి, అమరావతి: గత తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి అధికార పార్టీ నేతలకు సదావర్తి సత్రం భూములను కారుచౌకగా కట్టబెట్టేందుకు జరిగిన ప్రయత్నాలపై వైఎస్ జగన్ ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సత్రం పేరిట చెన్నై సమీపంలో ఉన్న 83.11 ఎకరాలను అతి తక్కువ ధరకు కొందరు టీడీపీ నేతలకు కట్టబెట్టేందుకు చేసిన ప్రయత్నాలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడం, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయ పోరాటం చేయడంతో భూముల అమ్మకం ప్రక్రియ నిలిచిపోయింది. అప్పట్లో జరిగిన వేలం ప్రక్రియలో అవకతవకలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ ద్వారా విచారణ జరిపిస్తామని ప్రస్తుత ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో హామీ ఇచ్చింది. ఈ మేరకు విచారణకు ఆదేశిస్తూ దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్సింగ్ జీవో జారీ చేశారు. భూముల అమ్మకానికి అప్పట్లో ప్రభుత్వ పరంగా, దేవదాయ శాఖ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన పూర్తి వివరాలను విజిలెన్స్ అధికారులకు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
మెడ్టెక్ మాయ
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక మెడ్టెక్ జోన్లో రూ.20 కోట్ల వ్యయంతో పరిపాలనా భవనం నిర్మించారు. అది ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికే లోపల ఫ్లోరింగ్ 3 అడుగుల మేర కుంగిపోయింది. దీంతో మొత్తం తవ్వేసి, మళ్లీ కాంక్రీట్తో ఫ్లోరింగ్ వేశారు. (విశాఖ జిల్లా మెడ్టెక్ జోన్ నుంచి గుండం రామచంద్రారెడ్డి): విశాఖపట్నం మెడ్టెక్ జోన్లో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. వైద్య ఉపకరణాల తయారీ కోసం ప్రారంభించిన ఈ జోన్లో రెండున్నరేళ్లుగా ఉత్పత్తులేవీ బయటకు రాలేదు. ఇప్పటిదాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రూ.450 కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేకుండాపోయింది. భవనాలు సైతం నాసిరకంగా ఉండటంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మెడ్టెక్ జోన్ ద్వారా రూ.5,000 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నామని, 20,000 మందికి ఉద్యోగాలిస్తామని టీడీపీ ప్రభుత్వం నమ్మబలికింది. రూ.వందల కోట్ల విలువైన 270 ఎకరాల భూమిని ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీకి అప్పగించింది. నాలుగు భవనాలు నిర్మించి, అరచేతిలో స్వర్గం చూపింది. కానీ, ఇప్పటికీ పట్టుమని పది ఉద్యోగాలు కూడా రాలేదు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటివరకూ వచ్చింది కేవలం 10 కంపెనీలే. అవికూడా చిన్నచిన్న అంకుర సంస్థలే. ఇక్కడి పరిస్థితులను తట్టుకోలేక కొన్ని కంపెనీలు ఒప్పందాలు రద్దు చేసుకుని, వెనక్కి వెళ్లిపోయాయి. ఓక్సిల్ గ్రిడ్స్, ఎస్ఎస్ మేజర్, ఫీనిక్స్ వంటి కంపెనీలు ఒప్పందం చేసుకున్నా పనులు చేపట్టే పరిస్థితి లేక నిస్సహాయంగా మిగిలాయి. టీడీపీ సర్కారు హయాంలో ప్రారంభమైన మెడ్టెక్ జోన్ అనేది పెద్ద కుంభకోణమన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ జోన్ ముసుగులో అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు భారీగా నిధులు కొల్లగొట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మెడ్టెక్ జోన్లో చోటుచేసుకున్న అవినీతిపై విచారణకు అక్కడి ప్రతినిధులు తమకు సహకరించడం లేదని విజిలెన్స్ విభాగం అధికారులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, పరిస్థితిని చక్కదిద్దితే తప్ప తాము ఇక్కడ ఉండలేమని పెట్టుబడిదారులు తేల్చిచెబుతున్నారు. తనను మెడ్టెక్ జోన్ సీఈవో మోసం చేశాడని తమిళనాడు పారిశ్రామిక వేత్త రాసిన లేఖలోని భాగం విడి భాగాల తయారీ బోగస్ ఎంఆర్ఐ, సీటీ స్కాన్ యంత్రాల విడిభాగాలను ఇకపై మెడ్టెక్ జోన్లో తయారు చేస్తారని, ఫలితంగా వాటి ధర భారీగా తగ్గుతుందని టీడీపీ ప్రభుత్వం పేర్కొంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తే అంతా బోగస్ అని తేటతెల్లమైంది. విడిభాగాల తయారీ కోసం రూ.10 కోట్ల వ్యయంతో నిరి్మంచిన భవనం ఖాళీగా ఉంది. ఇప్పటివరకూ ఎలాంటి ఉత్పత్తులూ లేవు. అప్పట్లో క్యూరా హెల్త్కేర్ అనే సంస్థ టెండర్లు దక్కించుకుంది. ఇప్పుడు అడ్రస్ లేకుండాపోయింది. రూ.15 కోట్ల వరకూ వెచ్చించి మెడ్టెక్ జోన్లో ల్యాబొరేటరీ పరికరాలు ఏర్పాటు చేశారు. వాటిని వినియోగించుకోవడానికి కంపెనీలు లేకపోవడంతో వృథాగా పడి ఉన్నాయి. పరిశ్రమల శాఖ ప్రమేయం లేకుండా... రాష్ట్ర ప్రభుత్వం, పరిశ్రమల శాఖతో సంబంధం లేకుండా మెడ్టెక్ జోన్లో ఓ సమాంతర వ్యవస్థ రాజ్యమేలుతోంది. సాధారణంగా ప్రభుత్వం, పరిశ్రమల శాఖ అనుమతితోనే కొత్త పరిశ్రమలు వస్తుంటాయి. మెడ్టెక్ జోన్లో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహారం సాగుతోంది. ఇక్కడ ఏం జరుగుతోందో ప్రభుత్వానికి సమాచారమే ఉండడం లేదు. పరిశ్రమల శాఖ ఇచ్చే రాయితీలు తమకు అందడం లేదని మెడ్టెక్ జోన్లోని పెట్టుబడిదారులు వాపోతున్నారు. ప్రోత్సాహమా? రియల్ ఎస్టేట్ వ్యాపారమా? మెడ్టెక్ జోన్లో జరుగుతున్నది పరిశ్రమలకు ప్రోత్సాహమో, రియల్ ఎస్టేట్ వ్యాపారమో అర్థం కావడం లేదు. ఈ జోన్లో పరిశ్రమ స్థాపించడానికి ముందుకొచ్చా. రూ.11 లక్షలు చెల్లించి, నేను చేసుకున్న ఒప్పందాన్ని అర్ధంతరంగా ఎలాంటి కారణం చూపకుండానే రద్దు చేశారు. నేను చెల్లించిన సొమ్ము తిరిగి ఇవ్వాలని అడిగినందుకు నాకు ఇతర రాష్ట్రాల్లో ఉన్న నా కంపెనీపై దు్రష్పచారం చేశారు. అందుకే రూ.50 కోట్ల పరువు నష్టం దావా వేస్తా. – గోపీనాథ్, డైరెక్టర్, ఆన్లైన్ సర్జికల్స్, చెన్నై మెడ్టెక్ జోన్లోకి అనుమతించలేదు మెడ్టెక్ జోన్ విషయంలో వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలపై విచారణ చేస్తున్నాం. నన్ను ప్రశ్నించే స్థాయి మీకు లేదని మెడ్టెక్ జోన్ సీఈవో అంటున్నారు. విచారణకు కిందిస్థాయి సిబ్బందిని పంపిస్తున్నారు. మాకేమీ తెలియదు అని వారు చెబుతున్నారు. విచారణ చేపట్టడానికి మెడ్టెక్ జోన్లోకి మమ్మల్ని అనుమతించలేదు. కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదు. – విజిలెన్స్ అధికారుల బృందం, ఆంధ్రప్రదేశ్ -
విశాఖలో భారీగా గంజాయి పట్టివేత
సాక్షి, విశాఖపట్నం: నగరంలో భారీగా గంజాయిపట్టుబడింది. డీఆర్ఐ ఇంటెలిజెన్స్ అధికారులు వెయ్యి కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చెన్నై- శ్రీకాకుళం జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రక్ని డీఆర్ఐ ఇంటెలిజన్స్ అధికారులు తనిఖీ చేయగా.. రూ.1.52 కోట్ల విలువ చేసే గంజాయి బయటపడింది. డ్రైవర్ కాబిన్లో పెట్టి గంజాయిను తరలిస్తున్నారని అధికారులు తెలిపారు. వాహనం డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి మధ్యప్రదేశ్కు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. -
తిరుమలలో దళారీల దండయాత్ర
సాక్షి, తిరుమల: తిరుమలలో దళారీ వ్యవస్థ నిర్మూలించడానికి టీటీడీ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. విజిలెన్స్ అధికారులకు మరో బడా దళారీ చిక్కారు. తిరుమలలో మూడు సిఫార్సు లేఖలపై 18 మంది భక్తులను దర్శనానికి పంపించిన దళారీ.. ఒక్కో వ్యక్తి నుంచి రూ.5,500 వసూళ్లు చేశారు. ఇతడు బెంగుళూరు,చెన్నైకు చెందిన భక్తులకు దర్శనం చేయించినట్లు తెలుస్తోంది. దళారీపై భక్తులే ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఈ సంఘటనపై విజిలెన్స్ అధికారులు గోప్యంగా విచారిస్తున్నారు. గత వారం భక్తుల నుంచి నగదు వసూలు చేసి కల్యాణోత్సవ టికెట్లు ఇవ్వడానికి ప్రయత్నించిన దళారీని తిరుమల టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తిరుమలలో దళారుల అరెస్ట్ తిరుమల : శ్రీవారి దర్శనం కలి్పంచేందుకు భక్తుల వద్ద అధిక మొత్తంలో డబ్బులు తీసుకుంటున్న దళారులను తిరుమల వన్టౌన్ పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. నగరంలో నివాసముంటున్న వెంకటరమణ, శ్రీనివాసులు, శశికుమార్, ప్రేమ్కుమార్లు కొంతకాలంగా దళారుల అవతారమెత్తి భక్తుల వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. శనివారం రాత్రి రాంబగీచా సమీపంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
‘నీరు– చెట్టు’ అక్రమాలపై విజిలెన్స్ విచారణ ప్రారంభం
సాక్షి, అమరావతి: నీరు– చెట్టు కార్యక్రమం పేరుతో గత టీడీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అక్రమాలు, అవినీతిపై విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. నీరు– చెట్టు పేరుతో టీడీపీ ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా ఒకే రకమైన పనులను మంజూరు చేసింది. ఉపాధి హామీ పథకంలో భాగంగా చెరువులు, వాగుల్లో కూలీలతో చేపట్టిన పూడికతీత పనులను నీరు– చెట్టు కార్యక్రమాల్లో కూడా చేసినట్టు చూపి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఇటీవల శాసనసభ సమావేశాల్లోనూ పలువురు ఎమ్మెల్యేలు నీరు– చెట్టు పథకంలో జరిగిన అవినీతిపై విచారణకు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీంతో విజిలెన్స్ అధికారులు నీరు– చెట్టు కార్యక్రమంతో సంబంధం ఉండి వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనుల వివరాలను సేకరించడం మొదలుపెట్టారు. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా నీరు – చెట్టు కార్యక్రమానికి అనుబంధంగా చేపట్టిన అన్ని పనుల వివరాలు కావాలంటూ విజిలెన్స్ అధికారులు ఆయా జిల్లాల్లోని డ్వామా పీడీలకు లేఖలు రాశారు. కాగా, ఉపాధి హామీ పథకం నిర్వహణకు గత నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ.19,816 కోట్లు రాష్ట్రానికి విడుదల చేసింది. క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్న అధికారులు 2015–19 మధ్య కాలంలో ఉపాధి హామీ పథకంలో 37.44 లక్షల పనులు పూర్తయినట్టు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. మరో 20 లక్షల వరకు పనులు పురోగతిలో ఉన్నాయని అంటున్నారు. వీటిలో 80 శాతం వరకు నీరు– చెట్టు కార్యక్రమానికి అనుబంధంగా చేపట్టిన పనులకే ఖర్చు చేసినట్టు టీడీపీ నేతలు బిల్లులు చేసుకున్నారు. దీంతోపాటు జలవనరుల శాఖ, అటవీ శాఖల ద్వారా కూడా వేల కోట్ల రూపాయల విలువైన పనులు చేసినట్టు బిల్లులు పెట్టుకుని స్వాహా చేశారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు మొదట అన్ని శాఖల్లో ‘నీరు–చెట్టు’లో భాగంగా మంజూరు చేసిన పనుల వివరాలను తెప్పిస్తారు. ఒకే పని రెండు, మూడు శాఖల ద్వారా మంజూరైందో, లేదో పోల్చి చూస్తారు. తర్వాత జరిగిన పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్న విజిలెన్స్
పశ్చిమగోదావరి , ద్వారకాతిరుమల: అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. అనంతరం వాహనంతో పాటు రూ.3.68 లక్షల విలువైన 16 టన్నుల రేషన్ బియ్యాన్ని వారు స్వాధీనం చేసుకుని ద్వారకాతిరుమల పోలీస్టేషన్కు తరలించారు. ఈ ఘటన తిమ్మాపురంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. విజిలెన్స్ సీఐ ఎన్వీ.భాస్కర్ కథనం ప్రకారం ఖమ్మం నుంచి తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంకు అక్రమంగా రేషన్ బియ్యం తరలివెళుతుందన్న సమాచారాన్ని అందుకున్న విజిలెన్స్ అధికారులు మండలంలోని తిమ్మాపురం వద్ద కాపు కాశారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా మంగలగూడెంకు చెందిన శ్రీరంగం సత్యం, శివనాగుల శ్రీనులకు చెందిన రేషన్ బియ్యం లోడు లారీని ఆపి విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 16 టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా తరలి వెళుతుండడాన్ని గుర్తించిన విజిలెన్స్ అధికారులు వాహనంతో సహా సరుకును సీజ్ చేశారు. అనంతరం లారీ డ్రైవర్ వేముల ఎల్లయ్యను అరెస్ట్ చేసి, క్రిమినల్ కేసు నమోదు చేశారు.ఆ తరువాత కామవరపుకోట డెప్యూటీ తహసీల్దార్ ఆర్వీ.మురళీకృష్ణ, వీఆర్వో లక్ష్మీపతి ద్వారకాతిరుమల పోలీస్టేషన్లో అప్పగించారు. దీనిపై విజిలెన్స్ సీఐ భాస్కర్ మాట్లాడుతూ లారీ డ్రైవర్ ఎల్లయ్య రెండు నెలల క్రితం రేషన్ బియ్యాన్ని తరలిస్తూ దేవరపల్లిలో తమ చేతికి చిక్కాడన్నారు. మళ్లీ ఇప్పుడు దొరికాడన్నారు. ఈ దాడిలో విజిలెన్స్ ఎస్సై కె.సీతారాము తదితరులు పాల్గొన్నారు. -
దళారులకు టీటీడీ అధికారులే సహకరం
-
తిరుమలలో నకిలీ టికెట్ల దళారీ అరెస్టు
తిరుమల : టీటీడీ ఆన్లైన్లో రిలీజ్ చేసే శ్రీవారి సేవల టికెట్లను అధిక ధరకు విక్రయిస్తున్న దళారీని టీటీడీ విజిలెన్స్ వింగ్ ఏవీఎస్వో రామ్కిశోర్ శుక్రవారం అరెస్టు చేశారు. విలేకరులకు ఆయన వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర సోలాపూర్కు చెందిన ప్రభాకర్ (30) ఆన్లైన్ షాపు నిర్వహిస్తున్నాడు. షాపునకు వచ్చిన వారి ఆధార్ కార్డుల జిరాక్సులను వారికి తెలియకుండానే తన వద్ద ఉంచుకునేవాడు. నెలలో మొదటి శుక్రవారం టీటీడీ ఆన్లైన్లో సుప్రభాతం, నిజపాద దర్శనం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన తదితర సేవలను విడుదల చేస్తుంది. ఆ సమయంలో అతను సుమారు 1,000 సేవలకు డిప్ వేసేవాడు. ఇందుకోసం 600 నుంచి 700 వరకు నకిలీ మెయిల్స్ను, కస్టమర్ల వద్ద తీసుకున్న ఆధార్ కార్డులను వినియోగించేవాడు. అతనికి సుమారు 100 నుంచి 150 వరకు టికెట్లు లక్కీడిప్లో మంజూరయ్యేవి. వాటిని తన వద్దకు వచ్చిన వారికి రూ.250 టికెట్ను రూ.1,250కు విక్రయించేవాడు. వారికి ఆ టికెట్ ఎవరి పేరుతో ఉందో ఆ పేరు, ఫొటో మార్ఫింగ్ చేసి నకిలీ ఆధార్ను సృష్టించి శ్రీవారి దర్శనానికి పంపేవాడు. దీనిపై విజిలెన్స్ అధికారులు రెండు నెలలపాటు నిఘా పెట్టారు. శుక్రవారం తెల్లవారుజామున కొందరు సుప్రభాతం నకిలీ టికెట్లతో దర్శనానికి వెళుతుండగా గుర్తించారు. విచారణలో తేలిన వివరాల మేరకు నకిలీ టికెట్లు తయారు చేసే ప్రభాకర్ను విజిలెన్స్ వింగ్ ఏవీఎస్వో, వీఐ లక్ష్మీకాంత్, సిబ్బంది ప్రకాష్ అదుపులోకి తీసుకుని వన్టౌన్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శీతల పానీయాల కేంద్రంపై విజిలెన్స్ దాడులు..
సాక్షి, విశాఖపట్నం : శీతల పానీయాల తయారీ కేంద్రంపై(ఖార్కాన్) బుధవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అంతేకాక డ్రింక్స్ తయారీలో నాణ్యత పాటించలేదని అధికారులు గుర్తించారు. దీంతో కూల్ పాయింట్ నిర్వహకులపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు కేసు నమోదు చేశారు. వివరాలివి.. జీవీఎంసీ పాయి మాధవ నగర్ పరిధిలో కృప ఏజెన్సీస్ పేరుతో పిల్లా శ్రీనివాస్ కూల్ పాయింట్ నిర్వహిస్తున్నాడు. వివిధ రకాల డ్రింక్స్ తయారు చేసి విక్రయిస్తున్నాడు. నాణ్యత ప్రమాణాలకు పాటించకుండా.. హానికరమైన రసాయనాలు వినియోగిస్తున్నారన్న సమాచారం మేరకు విశాఖ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు, జీవీఎంసీ ఆహార భద్రత అధికారులు సంయుక్తంగా దాడి చేశారు. కూల్ పాయింట్లో శాంపిల్స్ను కూడా అధికారులు సేకరించారు. కూల్ డ్రింక్స్ తయారీలో నాణ్యత ప్రమాణాలను పాటించడంలేదని అధికారులు వెల్లడించారు. వాస్తవానికి కూల్ డ్రింక్స్ తయారీలో శుద్ధి చేసిన మంచినీరు వినియోగించాల్సి ఉంది, అయితే అతను నేరుగా బోర్ నీటిని వినియోగిస్తున్నాడని అధికారుల చెప్పారు. అలాగే ప్రజలకు హాని కలిగించే మ్యాంగో, గ్రేప్స్, సాల్ట్ ప్లేవర్స్తో పాటుగా ఎసెన్స్.. కూల్ డ్రింక్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు ప్రిజవేట్యు అనే రసాయనాలు కలిపి ఈ పానీయాలను తయారు చేస్తున్నట్టు ఈ దాడుల్లో బయటపడ్డాయి. ఏ విధమైన ఫిల్టరైజేషన్ నీరు వాడకుండా కలుషితమైన దోమలు, ఈగలు వాలిని నీటిని వాడుతూ కూల్ డ్రింక్స్ తయారు చేసి వ్యాపారం చేస్తున్నారని అధికారులు తెలిపారు. శీతల పానీయాలు తయారీ కేంద్రం నుంచి సేకరించిన శ్యాంపిల్స్ను హైదరాబాద్ స్టేట్ ఫుడ్ ల్యాబ్ రేటరీ పంపించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుటామని అధికారులు చెప్పారు. కూల్ పాయింట్ నిర్వహకుడు పిల్లా శ్రీనివాస్ పై కేసు నమోదు చేసినట్లు డీఎస్సీ సీఎం నాయుడు తెలిపారు. -
విజిలెన్సు నివేదికలో వందల కోట్ల విలువైన డైమండ్
-
నంద్యాలలో విజిలెన్స్ అధికారుల దాడులు
-
అందుబాటులో లేని ‘పేట’ ఆర్డీవో, ఎమ్మార్వో
సాక్షి, గుంటూరు: నరసరావుపేట కిడ్నీ రాకెట్ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ మంగళవారం ప్రారంభమైంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కిడ్నీ మార్పిడికి సంబంధించిన రికార్టులను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై నరసరావుపేట ఎమ్మార్వో, ఆర్డీవోలను విచారించేందుకు విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ శోభామంజరి, అధికారులు వారి కార్యాలయాలకు వెళ్లారు. అయితే ఆయా కార్యాలయాల్లో ఆ అధికారులు లేకపోవడంతో గుంటూరు తిరిగి వచ్చారు. -
రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు..
సాక్షి, నిజామాబాద్: జిల్లాలోని కోటగిరి మండల కేంద్రంలోని రెండు రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారులు దాడులు జరిపారు. మిల్లులో అక్రమంగా నిల్వ ఉన్న 10, 630 క్వింటాళ్ల ధాన్యంను సీజ్ చేశారు. ఒకే అనుమతితోనే రెండు రైస్ మిల్లులు నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. రైతుల నుంచి భారీ మొత్తంలో ధాన్యం సేకరించి ఎఫ్సీఐకి(ప్రభుత్వానికి) తరలించకుండా అమ్ముకున్నట్లు వారు తెలిపారు. కేసు నమోదు చేసిన అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. -
పూర్ణ మార్కెట్లో 'విజిలెన్స్ 'దాడులు
-
బీ‘టెక్కు’ డాక్టర్!
- కర్నూలు, ఆదోనిలలో నకిలీ ఆస్పత్రులు - ఇంటర్, డిగ్రీ, బీటెక్ అర్హతతో రోగులకు చికిత్స - విజిలెన్స్ విచారణలో వెల్లడి కర్నూలు (హాస్పిటల్)/ఆదోని: వారు చదివింది ఇంటర్, డిగ్రీ, బీటెక్. కానీ పేరు ముందు డాక్టర్ తగిలించుకున్నారు. పేరు చివరన ఎంబీబీఎస్తోపాటు స్పెషాలిటీ కోర్సులనూ జత చేశారు. అంతేనా.. కర్నూలు, ఆదోని పట్టణాల్లో దర్జాగా వైద్యం చేసేస్తున్నారు. వీరిచ్చే మామూళ్ల మత్తులో పడి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆస్పత్రికి తాత్కాలిక అనుమతి కూడా ఇచ్చేశారు. అయితే తాజాగా ఆ ఆస్పత్రిని ఒక చోట నుంచి మరో చోటికి మార్పు చేయడంతో వారి బండారం బయటపడింది. విజిలెన్స్ అధికారులు రెక్కీ నిర్వహించి ఏక కాలంలో కర్నూలు, ఆదోనిలలోని ఆస్పత్రుల్లో దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కర్నూలుకు చెందిన నరేంద్ర అలియాస్ డాక్టర్ నాగేంద్రప్రసాద్ బీటెక్ చదివి గతంలో హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ కార్యాలయంలో పనిచేశాడు. అక్కడ ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చే నగదు చూసి బాగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. కర్నూలులో జేపీ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఏర్పాటు చేసి తాను డాక్టర్ నాగేంద్రప్రసాద్ అని, ఇంటర్ చదివిని తన భార్య జ్యోతిని ఎంబీబీఎస్, డీసీహెచ్ అని పేర్కొన్నాడు. కర్నూలులో మరో చోట, ఆదోనిలో విజయగౌరి పేరుతో ఆస్పత్రులు ప్రారంభించాడు. ఒకదానిలో డిగ్రీ చదివిన తన బావమరిది రఘుని డాక్టర్ రాఘవేంద్ర ఎంబీబీఎస్, ఎండీగా మార్చాడు. జిల్లాలో కొందరు ఆర్ఎంపీలతో కుమ్మక్కై, వారి ద్వారా తమ ఆస్పత్రులకు రోగులను రప్పించి దోచుకునేవాళ్లు. ఆర్ఎంపీ ఒక రోగిని వీరి ఆస్పత్రికి రిఫర్ చేస్తే 60% కమీషన్లు ముట్టచెప్పేవారు. రెక్కీ నిర్వహించి విజిలెన్స్ దాడులు ఈ ఆస్పత్రులపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ అధికారులు నిఘా ఉంచారు. మంగళవారం కర్నూలులో హోంగార్డులు శ్రీకాంత్, తిప్పయ్య విజయగౌరి హాస్పిటల్ కు వెళ్లారు. శ్రీకాంత్ తనకు తల తిరుగుతోందని.. రూ.150 కట్టి ఓపీ తీసుకు న్నాడు. నర్సు వచ్చి బీపీ చెక్ చేసి నార్మల్గా ఉందని చెప్పింది. శ్రీకాంత్ మణికట్టు పట్టుకుని డాక్టర్ రాఘవేంద్ర పరీక్షించాడు. కడుపునొప్పిగా ఉందనగానే స్కానింగ్తోపాటు రక్తపరీక్షలు చేయాలని చెప్పాడు. డబ్బులు తెచ్చుకోలేదని చెప్పడంతో మందులు రాసిచ్చి పంపించారు. అలాగే ఆదోనిలో డాక్టర్ నాగేంద్రప్రసాద్ వద్దకు హోంగార్డు నాగరాజు వెళ్లాడు. కళ్లు తిరుగుతున్నాయి, కడుపునొప్పి ఉందని చెబితే అతనికి సెలైన్ పెట్టి డబ్బులు గుంజారు. హోంగార్డులకు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మధ్యాహ్నం నుంచి విజిలెన్స్ అధికారులు, స్థానిక పోలీసుల సహకారంతో దాడులు చేపట్టి ఆస్పత్రులను సీజ్ చేసి నిందితులను అరెస్ట్ చేశారు. వేటికీ అనుమతులు లేవు కర్నూలు, ఆదోనిలోని ఆస్పత్రులకు తాత్కాలిక అనుమతులే తప్ప ఎలాంటి అనుమతులూ లేవు. అయినా అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్తోపాటు ఎక్స్రే, డయాగ్నస్టిక్ ల్యాబ్లను ఏర్పాటు చేసుకున్నారు. రోగులకు అన్ని పరీక్షలు చేసినట్లు నివేదికలు ఇచ్చి నొప్పి నివారణ మందులు, యాంటీబయాటిక్స్, విటమిన్స్ మందులు ఇచ్చి డబ్బు వసూలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వై.నరసింహులు విచారణలో తేలింది. -
రైస్మిల్లుపై విజిలెన్స్ దాడులు..
► భారీగా ధాన్యం పట్టివేత ఖమ్మం జిల్లా : జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారులు ముమ్మర దాడులు నిర్వహిస్తున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన వేలాది బస్తాల ధాన్యం, బియ్యంను సీజ్ చేస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురంలో ప్రసాద్ మోడ్రన్ రైస్ మిల్ పై సివిల్ సప్లై అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు. సుమారు 6 వేల బస్తాల ధాన్యం, 278 క్వింటాల బియ్యం, 16 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మిల్లింగ్ ఆపేసి మిల్లుకు మూతవేశారు. -
రేషన్ షాపుల్లో ‘విజిలెన్స్’ తనిఖీలు
మిర్యాలగూడ : పట్టణంలోని రేషన్ దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. షాపుల్లోని రికార్డులకు, ఉన్న నిల్వలకు తేడాలు ఉన్నట్లు సమాచారం మేరకు దాడులు నిర్వహిం చారు. రేషన్ షాపుల్లో పక్కదారి పడుతున్న బియ్యం, సరుకులపై ‘బినామీ డీలర్లు’ శీర్షికన ఈ నెల 15వ తేదీన ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. స్పందించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టణంలోని బంగారుగడ్డలోని 37వ రేషన్షాపు, గాంధీనగర్లోని 3వ రేషన్షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ నర్సింహారావు మాట్లాడుతూ పట్టణంలోని బంగారుగడ్డలోని 37వ రేషన్ షాపు డీలర్ సుదర్శన్ వద్ద రికార్డుల్లో 23.12 క్వింటాళ్ల బియ్యం నిల్వ ఉండాల్సి ఉండగా 36.50 క్వింటాళ్ల బియ్యం ఉన్నాయని పేర్కొన్నారు. షాపులో అదనంగా 13.38 క్వింటాళ్ల బియ్యం, చెక్కర 16.50 కిలోలు తక్కువగా ఉండడంతో పాటు 110 లీటర్ల కిరోసిన్ తక్కువగా ఉందని చెప్పారు. దీంతో డీలర్పై సివిల్ సప్లయీస్ యాక్డ్ 6 (ఏ) కేసు నమోదు చేసి షాపు సీజ్ చేసినట్లు తెలి పారు. గాంధీనగర్లోని షాపులో రికార్డుల్లో ఉన్న ప్రకారం ఉన్నాయని తెలిపారు. దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏఈ శివకృష్ణ, నర్సింహారెడ్డి, సివిల్ సప్లయీస్ డీటీ రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. -
భక్తుడిపై టీటీడీ విజిలెన్స్ సిబ్బంది దాడి
స్విమ్స్లో చికిత్స పొందుతున్న బాధితుడి పరిస్థితి విషమం సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుడిపై టీటీడీ విజిలెన్స్ సిబ్బంది దాష్టీకం ప్రదర్శించారు. పిడిగుద్దులు గుద్దడంతో కుప్ప కూలిన ఆ భక్తుడు ప్రస్తుతం స్విమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన పద్మనాభం(65) కుటుంబసభ్యులతో కలసి ఈ నెల 20న రాత్రి 9.30 గంటలకు శ్రీవారి దర్శన క్యూలైన్లలోకి వెళ్లారు. పొరపాటున మహిళా భక్తులు వెళ్లే స్కానింగ్ కేంద్రం నుంచి వెళ్లబోతుండగా.. అక్కడి విధుల్లోని మహిళా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారిమధ్య వాగ్వాదం జరిగింది. పద్మనాభంపై ఇద్దరు మహిళా సిబ్బంది తోపాటు మరో ఎస్పీఎఫ్ సెక్యూరిటీ గార్డు దాడిచేసి తీవ్రంగా కొట్టారు. దీంతో కుప్పకూలిన పద్మనాభాన్ని అంబులెన్స్లో స్థానిక ఆస్పత్రికి, అక్కడి నుంచి తిరుపతిలోని స్విమ్స్ కి తీసుకెళ్లారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. పద్మనాభం బంధువుల ఫిర్యాదు మేరకు తిరుమల వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి జరగలేదు: టీటీడీ విజిలెన్స్ అధికారులు శ్రీవారి దర్శనానికి వచ్చిన పద్మనాభంపై ఎలాంటి దాడి జరగలేదని టీటీడీ విజిలెన్స్ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళా క్యూలైన్లలోకి రావటంతో అడ్డుకున్న మహిళా సెక్యూరిటీకి, పద్మనాభానికి వాగ్వాదం జరిగిందని తెలిపారు. ఆ సందర్భంగా అతడికి తీవ్ర రక్తపోటు రావటంతో ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ నెల 20వ తేదీన భక్తుడు పద్మనాభం శ్రీవారి దర్శనానికి వెళ్లే సీసీ కెమెరా దశ్యాలను టీటీడీ అధికారులు బుధవారం రాత్రి విడుదల చేశారు. వీటిలో భక్తుడిపై దాడిచేసిన దశ్యం కనిపించలేదు. దాడిచేసిన దశ్యాలను ఎడిట్ చేసి విడుదల చేశారని బాధితుడి బంధువులు ఆరోపించారు. -
విజిలెన్స్ అధికారులమంటూ నగలు చోరీ
లబోదిబోమన్న బాధితురాలు నాయుడుపేటటౌన్ (సూళ్లూరుపేట): విజిలెన్స్ అధికారులమని, బంగారు నగలకు ఖచ్చితంగా బిల్లులు ఉండాలని చెప్పి భయబ్రాంతులకు గురి చేసి ఓ మహిళ వద్ద నుంచి 38 గ్రాముల బంగారు నగలను తస్కరించారు. ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం నాయుడుపేట పట్టణంలో జరిగింది. బాధితురాలి వివరాల మేరకు పట్టణంలోని అమరాగార్డెన్ వీధిలో నివాసముంటున్న చేని దాసరి మస్తానమ్మ ఓ టిఫిన్ అంగట్లో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో దుకాణం నుంచి ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యంలో మోటార్బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను రోడ్డుపై నిలిపారు. మేము విజిలెన్స్ అధికారులమని మోదీ కొత్తగా విడుదల చేసిన జీఓ ప్రకారం బంగారు నగలకు రసీదులు ఉండాలన్నారు. మహిళ వేసుకున్న బంగారు నగలకు రసీదులు ఉన్నాయా అంటూ ఆరా తీశారు. దీంతో ఆమె కంగారుపడిపోయింది. అప్పుడే ఓ యువకుడు బ్యాగ్తో వస్తుండడంతో ఆతనిని కూడా ఆ ఇద్దరు వ్యక్తులు పిలిచారు. ఆ యువకుడు మెడలో వేసుకున్న చైన్, ఉంగరాలను చూసి వీటికి రశీదులు ఉన్నాయంటూ నిలదీశారు. దీంతో ఆ యువకుడు కొంత నగదు ముట్టచెప్పడంతో బంగారు నగలను తీసి భద్ర పరుచుకోవాలని ఓ కాగితంలో చుట్టు యువకుడికి ఇచ్చేశారు. ఆ మహిళ మెడలో ఉన్న మంగళసూత్రంతోపాటు బంగారు చైన్ను తీసి ఇచ్చింది. ఆ ఇద్దరు వ్యక్తులు ఓ కాగితంలో చుట్టి ఆమెకు ఇచ్చారు. కొద్ది దూరం వెళ్లి చూసుకునే సరికి అందులో చిన్నపాటి రాళ్లు ఉండడంతో గగ్గోలు పెట్టింది. అయితే అప్పటికే ఆ ఇద్దరు వ్యక్తులు బ్యాగ్తో వచ్చిన యువకుడితో కలిసి మోటార్బైక్పై ఉడాయించారు. మహిళ ఈ సంఘటనతో అస్వస్థతకు గురైంది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు బాధితురాలికి వైద్యశాలలో చికిత్సలు చేయించి స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు విచారిస్తున్నారు. -
తవ్వేకొద్దీ అక్రమాలు
ఉదయగిరి : దుత్తలూరు మండలంలో ఉపాధి అక్రమాలకు అంతులేదు. తవ్వే కొద్దీ ఈ అక్రమాల జాబితా చాంతాడు లా బయటపడుతూనే ఉన్నాయి. పనులు చేయకుండానే చేసినట్లుగా కాగితాల్లో రికార్డ్ చేసి జేబులు నింపు కుంటున్నారు. ఉపాధి అక్రమాలపై జిల్లా విజిలెన్స్ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. అనేక పనులకు సంబంధించి అవినీతి చోటుచేసుకున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. పెద్దమొత్తంలో అవినీతి జరిగిందని ఓ అంచనాకు వచ్చిన అధికారులు వివిధ బృందాలను మండలంలో నియమించి అన్ని పనులకు సంబంధించి తనిఖీలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. మంగళ, బుధవారం నుంచి మండలంలో విజిలెన్స్ తనిఖీలు విస్తృతంగా జరగనున్నాయి. చెక్డ్యాం పనుల్లోనే కాకుండా మట్టిరోడ్ల నిర్మా ణం, నాడెప్లు, ఇంకుడుగుంతలు, మరుగుదొడ్లు, ఫాం పాండ్స్లలో పను లు చేయకుండానే లక్షల్లో నిధులు స్వా హా చేశారు. ఇంతవరకు వెలుగుచూసిన అక్రమాలు చాలా స్వల్పమని, పూర్తిస్థాయిలో విచారణ జరిపితే ఈ అవినీతి రూ.కోట్లలో ఉంటుం దని అధికార పార్టీకి చెందినవారే వ్యాఖ్యానిస్తున్నారు. రోడ్లు వేయకుండానే నిధుల స్వాహా మండలంలో 26 మట్టిరోడ్లకు రూ.79 లక్షలు, 37 చెక్డ్యాంలకు రూ.1 కోటి, 350 ఫాంపాండ్స్కు రూ.3.60 కోట్లు, 18 చెక్డ్యాంల మరమ్మతులకు రూ.30 లక్షలు ఖర్చుచేసినట్లుగా అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికే చెక్డ్యాంలకు సంబంధించి పనులు చేయకుండానే పెద్దమొత్తం నిధులు స్వాహా చేసిన విషయం ఆధారాలతో సహా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ పరంపరలో మట్టిరోడ్లకు సంబంధించి కూడా అనేక పనులు జరగకుండానే నిధులు స్వాహా చేసినట్లు సాక్షి క్షేత్రపరిశీలనలో వెలుగులోకొచ్చింది. పలు గ్రామాలలో జరిగిన ఫాంపాండ్స్ పనుల్లో కూడా తీవ్ర అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయి. మండలంలో జరిగిన ఫాంపాండ్స్ తవ్వకాలలో తొంభై శాతం పనులు యంత్రాలతో చేయించారని ఆయా గ్రామస్తులు బహిరంగంగానే చెబుతున్నారు. కొన్ని గ్రామాలలో ఫాంపాండ్స్ తవ్వకుండానే తవ్వినట్లుగా బినామీ మస్టర్లు వేసుకొని లక్షల రూపాయలు అధికార పార్టీ నేతలు దిగమింగారు. మరుగుదొడ్ల నిర్మాణంలో కూడా తీవ్ర అవినీతి, ఆరోపణలున్నాయి గతంలో ఎప్పుడో నిర్మించిన పాత మరుగుదొడ్లు చూపించి కొత్తగా నిర్మించినట్లు రికార్డులు నమోదుచేసి నిధులు కాజేశారు. నాడెప్ల నిర్మాణంలో కూడా నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా గాలికొదిలేశారు. ఫాంపాండ్స్ తవ్వకాలలో దుత్తలూరు మండలం జిల్లా స్థాయిలోనే మొదటిస్థానంలో ఉండటం గమనార్హం. దుత్తలూరు మండలంలో ప్రతి ఏడాదీ రూ.4కోట్ల నుంచి రూ.5 కోట్ల మధ్య పనులు జరుగుతాయి. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా రూ.11 కోట్లు పైగా పనులు జరగడం చూస్తే పెద్దస్థాయిలో అవినీతి జరిగిందని తెలుస్తోంది. మండలంలో పథకం ప్రారంభించినప్పటి నుంచి ఉన్న గ్రూపులు అనేకం పనిచేయలేదు. కానీ ఈ ఏడాది అన్ని గ్రూపులు పనులు చేయ టమే కాకుండా ఎక్కువ పనిదినాలు చేసినట్లుగా రికార్డుల ప్రకారం నమోదై ఉంది. అంతేకాకుండా కొత్తగా అనేక గ్రూపులు ఏర్పాటయ్యాయి. అయితే కేవలం కొంతమంది నేతలు ఉపాధి నగదును స్వాహా చేయడానికి రచించిన వ్యూహంలో భాగంగానే ఇవి ఏర్పాటయ్యాయనే ఆరోపణలున్నాయి. అధికారుల పర్యవేక్షణ ఏమైంది? మండలంలో భారీస్థాయిలో ఉపాధి పనులు జరుగుతున్నాయి. పైగా పనుల్లో జరుగుతున్న అవినీతిపై అనేక గ్రామాల ఉపాధి కూలీ లు, ప్రతిపక్ష పార్టీలు మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నాలు కూడా నిర్వహించాయి. జరుగుతున్న అవినీతిపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు కూడా చేశారు. కానీ పథకాన్ని పర్యవేక్షించాల్సిన ఎంపీడీవో, ఏపీవో పట్టించుకోకకపోవడం అక్రమార్కులకు మరింత ఊతమిచ్చినట్లయింది. కమీషన్ల వలలో పడి జేబులు నింపుకునే పనిలో నిమగ్నమయ్యారే తప్ప పర్యవేక్షణ పూర్తిగా వదిలేశారు. కోట్లాది రూపాయల సామగ్రి బిల్లుల చెల్లింపులో కీలక పాత్ర ఉన్న ఎంపీడీవో పనులు పర్యవేక్షణ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అవినీతి వ్యవహారం బయటపడిన వెంటనే తనపై ఎక్కడ వేటు పడుతుందన్న భయంతో మండలంలో జరిగిన అనేక పనులు అవినీతి వ్యవహారం గురించి తమ పైస్థాయి అధికారులకు నివేదిక అందజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మొత్తమ్మీద ఈ ఉపాధి అవినీతి, అక్రమాలలో భాగస్వామ్యం ఉన్న కొంతమంది ఉపాధి సిబ్బందిని సస్పెండ్ చేసినప్పటికీ పై స్థాయిలోవున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. మరి జిల్లా అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో వేచిచూడాలి. -
కూలీ వద్ద 9 కిలోల బంగారం!
విచారణ చేపడుతున్న విజిలెన్స్ అధికారులు ఉరవకొండ : విడపనకల్లు మండలం వి.కొత్తకోటకు చెందిన ఒక కూలీ వద్ద ఏకంగా తొమ్మిది కిలోల బంగారం ఉన్నట్లు విజిలెన్స్ అధికారుల విచారణలో తేలినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గ్రామానికి చెందిన కొంతమంది కూలీలు ప్రతి ఏటా పనులకోసం ముంబై వెళుతుంటారు. వీరిలో ఒక కూలీ ప్రతి ఏటా కిలో చొప్పున అలా తొమ్మిది కిలోల బంగారం పోగు చేసినట్లు సమాచారం. పెద్దనోట్ల రద్దు అయిన సమయంలో గుంతకల్లు, ఉరవకొండ ప్రాంతాల్లో గల తన 8 బ్యాంకు ఖాతాల్లో ఈ బంగారాన్ని భద్రపరిచాడు. రెండు నెలల క్రితం విజిలెన్స్ అధికారులు చేపట్టిన విచారణలో వి.కొత్తకోట గ్రామానికి చెందిన వ్యక్తి ఖాతాల్లో తొమ్మిది కిలోల బంగారం ఉన్నట్లు తెలుసుకుని అవాక్కయ్యారు. నెల క్రితం వి.కొత్తకోట గ్రామానికి ఇద్దరు విజిలెన్స్ అధికారులు వచ్చి విచారణ చేసి వెళ్ళినట్లు తెలిసింది. దీనిపై విడపనకల్లు ఎస్ఐ రత్నంను వివరణ కోరగా.. తమకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని తెలిపారు. -
అక్రమార్కులపై విజిలెన్స్ కొరడా
ఈ ఏడాది రూ.319.28 కోట్ల ఆదాయం జిల్లా విజిలెన్స్ అధికారి రామప్రసాదరావు రాజమహేంద్రవరం క్రైం : విజిలె¯Œ్స అండ్ ఎ¯ŒSఫోర్స్మెంట్ శాఖ ఈ ఏడాది రూ.319.28 కోట్లు అక్రమార్కుల చేతుల్లోకి పోకుండా కాపాడగలిగారు. జిల్లా విజిలె¯Œ్స, ఎ¯ŒSఫోర్స్మెంట్ అధికారి టి.రామప్రసాదరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో ఈ ఏడాది అక్రమ లేఅవుట్లు, అక్రమ ఎరువులు, పురుగుమందులు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, విద్యాసంస్థల ప్రాపర్టీ టాక్స్ బకాయిలు, గుట్కా నిల్వలు తదితర వాటిపై దాడులు జరిపి, రూ.115.28 కోట్లను ప్రభుత్వానికి సమకూర్చారు. ఎఫ్సీఐ, ఏపీ సివిల్ సప్లయీస్ కార్పొరేష¯ŒS వారి బియ్యం, ధాన్యం కొనుగోళ్లపై అగ్రికల్చరల్ మార్కెట్ ఫీజు, రైస్ మిల్లులో వ్యాట్ ఎగవేత, రుచి సోయా పరిశ్రమ(కాకినాడ), అందాని, లోహియా ఆయిల్ పరిశ్రమలో వ్యాట్, కలప డిపోల్లో, జీడిపిక్కల పరిశ్రమల్లో, హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలు ఎగవేసిన పన్నులు రూ.130.72 కోట్లు గుర్తించి, ప్రభుత్వానికి నివేదిక పంపారు. గుజ్జనపూడిలో నిబంధనలకు విరుద్ధంగా లాటరైట్ మైనింగ్ను గుర్తించారు. అర్లధార, రావికంపాడు, ధవళేశ్వరం నుంచి లాటరైట్ స్టాక్ యార్డ్లను తనిఖీలు చేసి, అపరాధ రుసుముపై నివేదిక పంపారు. గ్రావెల్ క్వారీల అక్రమాలను గుర్తించి, ప్రభుత్వానికి రావలసిన రూ.73.79 కోట్లు వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలకు సిఫారసు చేశారు. ప్రజాపంపిణీలో అవకతవకలు జిల్లాలో రేష¯ŒS సరఫరాలో అవకతవకలపై తనిఖీలు చేసి, రూ.14,05,984 విలువైన పీడీఎస్ బియ్యం, రూ.22,83,55,258 విలువైన బియ్యం, ఇతర సరుకులు, రూ.39,86,653 విలువైన ఎల్పీజీ, ఆయిల్, కిరోసిన్, రూ.1,47,477 విలువైన పప్పులు, వంటనూనె, నిత్యావసరాలు.. మొత్తం రూ.23.52 కోట్ల విలువైన సరుకులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 74 కేసులు నమోదు చేశారు. నాణ్యత లోపాలు ఇంజనీరింగ్ పనుల్లో అవకతవకలు, నాణ్యత లోపాలపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు నివేదిక పంపించారు. పోలవరం ప్రాజెక్టు ప్ర«ధాన ఎడమ కాలువ ప్యాకేజీ–5, గోదావరి పుష్కరాలు, గోదావరి గట్టు పటిష్టత తదితర పనుల బిల్లుల చెల్లింపుల్లో అవకతవకలు, గోదావరి డెల్టాలోని ఉభయ గోదావరి జిల్లాల్లో రబీ సాగుకు ఎత్తిపోతల ద్వారా నీటి సరఫరా పనులు తదితర వాటిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. -
రూ.18లక్షల విలువైన గుట్కాలు దహనం
రెవెన్యూకు రూ. 2.83 లక్షల యంత్రాల అప్పగిత తుని రూరల్ : తుని మండలం కేఓ మల్లవరంలో పట్టబడ్డ రూ.18లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు, ముడిసరుకును దహనం చేశారు. గురువారం విజిలెన్సు సీఐ రామ్మోహనరావు, ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజన్న సమక్షంలో ముడిసరుకు, గుట్కాలను దహనం చేసి రూ.2.83లక్షలు విలువ చేసే యంత్రాలను రెవెన్యూశాఖ అధికారులకు అప్పగించారు. నకిలీ గుట్కాలు అక్రమంగా తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఆగస్టు ఆరో తేదీన విజిలెన్సు ఎస్పీ టి.రాంప్రసాద్ ఆదేశాల మేరకు డీఎస్పీ పీఆర్ రాజేంద్రకుమార్, సీఐ వి.భాస్కరరావు, ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం కేఓ మల్లవరంలో ఆకస్మిక దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. దాడుల్లో రూ.20లక్షల విలువైన ముడిసరుకు, గుట్కా ప్యాకెట్లు, యంత్రాలను సీజ్ చేశారు. ఆ ముడి సరుకు, గుట్కాలను దహనం చేసి, యంత్రాలను వేలం వేయాలని రెవెన్యూశాఖకు అప్పగించారు. వర్షం కారణంగా యంత్రాలను కార్యాలయానికి తరలించలేదని, వాతావరణం అనుకూలించిన వెంటనే యంత్రాలను తుని తరలిస్తామన్నారు. అప్పటి వరకు వీఆర్వో ఆధ్వర్యంలో రక్షణ కల్పించామని తెలిపారు. -
ఎరువుల షాపులపై విజిలెన్స్ దాడులు
రూ.9 లక్షల పురుగు మందుల అమ్మకాలు నిలిపివేత రూ.3 లక్షల ఎరువుల స్వాధీనం గొల్లప్రోలు : మండలంలోని దుర్గాడ, వన్నెపూడి గ్రామాల్లోని ఎరువులు, పురుగు మందుల షాపులపై మంగళవారం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెండు బృందాలుగా దాడులు చేశారు. సుమారు రూ.9.14 లక్షల విలువైన పురుగు మందుల అమ్మకాలను నిలిపివేశారు. రూ.3 లక్షల విలువైన ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. వన్నెపూడిలోని విజిలెన్స్ సీఐ గౌస్బేగ్ ఆధ్వర్యంలో స్థానిక కేవీఆర్ ఏజెన్సీలోని నిల్వలు, స్టాకు రికార్డులను పరిశీలించారు. షాపు నిర్వహణకు సరైన పత్రాలు లేకపోవడం, అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడంతో రూ.7.20 లక్షల విలువైన పురుగు మందుల అమ్మకాలు నిలుపుదల చేసినట్టు ఆయన తెలిపారు. స్టాకు రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకపోవడం తదితర కారణాలతో రూ.1.82 లక్షల విలువైన ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. మైన్స్ ఏజీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దుర్గాడలో... దుర్గాడలో విజిలెన్స్ సీఐ ఎన్వీ భాస్కరరావు, ఏఓ జి.శ్రీనివాస్ తదితరులు షాపుల్లో తనిఖీలు చేశారు. వేగులమ్మ గుడి సమీపంలో అనుమతి లేకుండా షాపు నిర్వహిస్తున్న గుండ్ర తమ్మయ్య షాపును తనిఖీ చేశారు. ఆ షాపులో రూ.85 వేల విలువైన 144 బస్తాల ఎరువులు, రూ.53 వేల విలువైన పురుగు మందులు స్వాధీనం చేసుకున్నట్టు ఏఓ శ్రీనివాస్ తెలిపారు. సూర్యాఏజన్సీలో రూ.1.41 లక్షల విలువైన పురుగు మందులు అమ్మకాలను నిలుపుదల చేశామని, రూ.19 వేల విలువైన ఎరువులను సీజŒ æచేసినట్టు తెలిపారు. ఈ షాపులపై చట్ట ప్రకారం చర్యలకు ఆదేశించామన్నారు. తనిఖీల్లో సిబ్బంది కోటి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ రహదారిపై విజిలెన్స్ తనిఖీలు
14 వాహనాలపై కేసులు వెంకటాచలం : వెంకటాచలం సమీపంలో జాతీయ రహదారిపై విజిలెన్స్ అధికారులు బుధవారం తెల్లవారు జామున నుంచి ముమ్మరంగా తనిఖీలు చేశారు. వెంకటాచలం టోల్ప్లాజా నుంచి కృష్ణపట్నంపోర్టు రోడ్డు వరకు రెండు బృందాలుగా ఏర్పడి రాకపోకలు కొనసాగించే వాహనాలను తనిఖీ చేశారు. విజిలెన్స్ డీఎస్పీ వెంకటనాథ్రెడ్డి మాట్లాడుతూ విజిలెన్స్ ఎస్పీ రమేషయ్య ఆదేశాల మేరకు తనిఖీ నిర్వహించామన్నారు.14వాహనాలు అధిక లోడుతో వెళ్తున్నట్లు గుర్తించామన్నారు. వాటిలో 9 బొగ్గు రవాణా చేస్తున్న లారీలు, రెండు గ్రానైట్, రెండు పార్శిల్, ఒక కంకర లోడు లారీ ఉన్నట్లు చెప్పారు. వీటిపై కేసులు నమోదు చేసి ట్యాక్స్, అధిక లోడుతో వెళ్లినందుకు పన్ను వసూలు చేస్తామని తెలియజేశారు. ఆయన వెంట సీఐలు శ్రీనివాసరావు, ఉప్పల సత్యనారాయణ, బీటీ నాయక్, డీసీటీఓ రవికుమార్, ఎఫ్ఆర్ఓ ఉమామహేశ్వరరెడ్డి, ఏజీ రాము తదితరులు ఉన్నారు. -
రేషన్ బియ్యాన్ని సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు
ఉండూరు (సామర్లకోట) : ఎంఎస్ పాయింట్ నుంచి రేషన్ షాపులకు చేరాల్సిన బియ్యాన్ని రైసు మిల్లుకు తరలించడంతో విజిలెన్స్ ఎస్పీ టి.రామప్రసాదరావు ఆధ్వర్యంలో అధికారులు దాడులు చేశారు. విజిలెన్స్ ఎస్పీ కథనం ప్రకారం.. శుక్రవారం రాత్రి ఏడీబీ రోడ్డులోని ఉండూరుకు చెందిన తేజ రైస్ మిల్లుకు రేషన్ బియ్యం చేరింది. పెద్దాపురం మండలం దివిలిలో ఉన్న గోదాముల నుంచి సామర్లకోట మండలం వీకే రాయపురం గ్రామంలోని మూడు రేషన్ షాపులకు ఈ బియ్యం చేరాలి. విజిలెన్స్ అధికారులు దాడి చేసే సమయంలో ట్రాక్టర్లో 198 బస్తాలు ఉండాలి. అప్పటికే మిల్లులోకి 34 బస్తాలు దింపారు. జిల్లాలోనే తొలిసారిగా ఎంఎస్ పాయింట్ నుంచి మిల్లుకు బియ్యం చేరిన సంఘటన ఇది. మిల్లులో దింపిన బియ్యం బస్తాలు రేషన్ బియ్యం సంచులతో ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఎంఎస్ పాయింట్ సిబ్బందితో పాటు రెవెన్యూ అధికారులు, రేషన్ డీలర్ల పాత్ర ఉంటుందని ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు. విజిలెన్స్ అధికారులు.. ట్రాక్టర్ డ్రైవర్, వీఆర్ఏ, మిల్లు యజమానుల నుంచి సమాచారం సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. ఈ దాడిలో విజిలెన్స్ డీఎస్పీ పి.రాజేంద్రకుమార్, సీఐలు గౌస్బేగ్, రామ్మోహన్రెడ్డి, సీటీఓ రత్నకుమార్, విజిలెన్స్ తహసీల్దార్ గోపాలరావు, డిప్యుటీ తహసీల్దార్ తాతారావు తదితరులు పాల్గొన్నారు. -
200 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం గోపవరం గ్రామంలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 400 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
5 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
నెక్కొండ మండలం గుండ్రపల్లిలోని రేషన్ షాపుపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు. -
విద్యుత్ చౌర్యంపై విజిలెన్స్ తనిఖీలు
62 కేసులు నమోదు సబ్స్టేషన్లో మొక్కలు నాటిన అధికారులు కందుకూరు: మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో శనివారం చంపాపేట, రాజేంద్రనగర్ డివిజన్ల విజిలెన్స అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 19 బృందాలు పాల్గొని 62 కేసులు నమోదు చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా కందుకూరు సబ్ స్టేషన్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విజిలెన్స డీఈలు సోమిరెడ్డి, కృష్ణారావు మాట్లాడారు. తమ పరిధిలో 2500 మొక్కలు నాటాలని నిర్ధేశించుకున్నట్లు తెలిపారు. ఇకపై తప్పనిసరిగా అన్ని జీపీల్లో పంచాయతీ భవనాలు, వీధి దీపాలకు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. లేకపోతే సరఫరాను నిలిపివేయాల్సి వస్తుందని హెచ్చరించారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడితే చర్యలు తప్పవన్నారు. పశువుల షెడ్లకు పది హెచ్పీకి మించకుండా ఉంటే క్యాటగిరి-4 కింద విద్యుత్ బిల్లులు వేస్తామన్నారు. వెరుు్య కోళ్లు పెంపకం ఉన్న షెడ్లకు ఈ విధానం వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి, వనస్థలిపురం, చంపాపేట, గగన్పహాడ్ ఏడీఈలు హన్మంత్రెడ్డి, రాజేందర్, వినోద్రెడ్డి, దశరథ, స్థానిక ఏఈ చక్రపాణితో పాటు 27 మంది ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. -
దళితులపై విద్యుత్ చౌర్యం కేసులు
► ఎల్లుట్ల ఎస్సీకాలనీలో విజిలెన్స్ అధికారుల నిర్వాకం ► తీవ్ర ఆందోళన చెందుతున్న బాధితులు పుట్లూరు : పుట్లూరు మండలం ఎల్లుట్ల ఎస్సీకాలనీలో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. విద్యుత్ చౌర్యం చేస్తున్నారంటూ 42 మందిపై కేసులు నమోదు చేశారు. ఒక్కో కుటుంబంపై రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు అపరాధ రుసుం విధించారు. డబ్బు చెల్లించకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో ఎస్సీ కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు అప్పుచేసి మరీ అపరాధ రుసుం చెల్లించారు. సీపీఎం నాయకుల నిరసన దళితుల ఇళ్లకు విద్యుత్ మీటర్లు లేవని అపరాధ రుసుం వేయడంపై సీపీఎం మండల కార్యదర్శి రామాంజినేయులు అధికారుల ముందు నిరసన తెలిపారు. వెంటనే కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
40 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
మాచర్ల: పట్టణ శివారులోని రాయవరం జంక్షన్లో ఆదివారం ఉదయం జిల్లా విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి రెండు టాటా ఏసీ వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీన పర్చుకున్నారు. మాచర్లకు చెందిన ఇద్దరు రేషన్ బియ్యం వ్యాపారులు అక్రమంగా తరలించేందుకు వెల్దుర్తి మండలంలోని మండాది, ఉప్పలపాడు గ్రామాల నుంచి రేషన్ బియ్యాన్ని వాహనాల్లో తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న విజిలెన్స్ సీఐ వంశీధర్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. రెండు వాహనాల్లో తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహన డ్రైవర్లను అదుపులోకి తీసుకొని విచారించగా బియ్యాన్ని ఓరుగంటి మోహన్రెడ్డి, జమ్మలమడకకు చెందిన గంగనబోయిన శ్రీనివాసరావు తరలిస్తున్నారని సమాధానమిచ్చారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని అధికారులు తెలిపారు. వాహనాలను రూరల్ పోలీసులకు అప్పగించి, బియ్యాన్ని ఆర్.ఐ శ్రీధర్కుమార్, వీఆర్వోలకు అప్పగించామన్నారు. దాడిలో విజిలెన్స్ హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
రేషన్డీలర్లపై విజి‘లెన్స్’
► హైదరాబాద్లో పట్టుబడిన కిరోసిన్ ట్యాంకర్ ► కూపి లాగిన అధికారులు ► పంపిణీ చేయకుండానే చేసినట్లు రికార్డులు ► 11 మందిని విచారించిన అధికారులు గట్టు : మండలంలోని రేషన్ డీలర్లపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. తీగ లాగితే డొంక కదలినట్లు హైదరాబాదులో రెండు రోజుల క్రితం పట్టుబడిన కిరోసిన్ వ్యవహారంపై గురువారం రాష్ట్ర విజిలెన్స్ అధికారులు గట్టులో విచారణ నిర్వహించారు. రాష్ట్ర విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ శ్రీధర్, నారాయణపేట ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్ఓ వనజాక్షి, గద్వాల ఏఎస్ఓ ఓం ప్రకాష్ గట్టు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్ ఎల్లయ్య సమక్షంలో 11 మంది రేషన్ డీలర్లను విచారించారు. వివరాల్లోకి వెళితే.. రేషన్ షాపుల ద్వారా రాయితీపై అందజేసే కిరోషన్ను సరఫరా చేయకుండానే చేసినట్లుగా రికార్డుల్లో నమోదు చేశారు. మండలంలోని ఆరగిద్ద-2, చింతలకుంట-2, తుమ్మలచెరువు, రాయాపురం, కుచినేర్ల, యర్సన్దొడ్డి,యల్లందొడ్డి, మల్లాపురం, మల్లాపురంతండాల్లో 11 రేషన్ దుకాణాలకు మొత్తం 9199 లీటర్లను సరఫరా చేసినట్లు రికార్డులను సృష్టించినట్లు వారి దృష్టికి వచ్చింది. హైదరాబాదులో విజిలెన్స్ అధికారులు పట్టుకున్న కిరోసిన్ ట్యాంకర్ వ్యవహరంపై కూపి లాగగా గట్టు, మల్దకల్ మండలాలకు చెందిన రేషన్ షాపులకు సరఫరా చేసే కిరోసిన్గా గుర్తించినట్లు సమాచారం. 11 రేషన్ షాపులకు కిరోసిన్ సరఫరా చేసినట్లు రికార్డులో నమోదు చేసినట్లు విజిలెన్స అధికారులు గుర్తించారు. అయితే 11 మంది రేషన్ డీలర్లను స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించి విచారణ చేశారు. ఆయా షాపులకు పంపిణీ చేసిన సరుకుల వివరాల రికార్డులను పరిశీలించారు. ఏప్రిల్ నెల కోటా కిరోసిన్ను రేషన్ దుకాణాలకు సరఫరా చేయలేదని సదరు డీలర్లు అధికారులకు తెలియజేశారు. వీటిపై పూర్తి విచారణ కొనసాగుతుందని, పూర్తి నివేదిక ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు ఇన్స్సెక్టర్ శ్రీధర్ సాక్షికి తెలిపారు. 32వేల లీటర్ల కిరోసిన్ దుర్వినియోగం గద్వాల : నియోజకవర్గంలోని పలు మండలాల్లో మొత్తం 32వేల లీటర్ల కిరోసిన్ దుర్వినియోగం అయినట్లు విజిలెన్స అధికారులు ధ్రువీకరించారు. గురువారం గద్వాలలో వారు విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో విజిలెన్స అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. 20 వేల లీటర్ల కిరోసిన్ సరఫరా చేసినట్లు బోగస్ రికార్డులు సృష్టించినట్లు తెలిపారు. మిగతా 12వేల లీటర్ల కిరోసిన్ స్టాక్ ఉన్నట్లు రికార్డులు సృష్టించారని తెలిపారు. స్టాక్ ఎక్కడ ఉందో తెలిజేయడం లేదన్నారు. సమావేశంలో విజిలెన్స సీఐ శ్రీధర్ భూపాల్, అధికారులు రాజేష్ చైతన్య, ఖురేష్ ఉన్నారు. మల్దకల్లో.. మండలంలోని పలు గ్రామాల్లో విజిలెన్స అధికారులు దాడులు చేశారు. పెద్దపల్లి, బిజ్వారం, ఉలిగేపల్లి, మేకలసోంపల్లి, సద్దలోనిపల్లి, అడవిరావుల్చెర్వు, నేతువానిపల్లి, మద్దెలబండ, తాటికుంట, కుర్తిరావుల్చెర్వు, నాగర్దొడ్డి, విఠలాపురం గ్రామాలలోని రేషన్ షాపులను తనిఖీ చేశారు. రేషన్ డీలర్లకు పంపిణీ చేసిన కిరోసిన్ బిల్లులను పరిశీలించారు. 14మంది డీలర్లకు కిరోసిన్ పంపిణీ చేయకుండానే హోల్సేల్ డీలర్ బిల్లులు పంపిణీ చేసినట్లు విచారణలో బయటపడినట్లు అధికారులు తెలి పారు. దాడుల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రాజేష్, సురేష్, రేవతిలతోపాటు రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
► అక్రమంగా తరలిస్తున్న 126 బస్తాల బియ్యం స్వాధీనం ఎమ్మిగనూరురూరల్: ఆదోని నుంచి ఎమ్మిగనూరుకు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాలను ఆదివారం సాయంత్రం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఏపీ 21 టీయూ 2619, ఏపీ 21 టీఎక్స్ 2149 నంబర్ గల రెండు బొలెరో జీపులను పట్టణంలోని అన్నమయ్య సర్కిల్ దగ్గర విజిలెన్స్ కానిస్టేబుల్ మధు తనిఖీ చేశారు. వాటిలో 126 బస్తాలలో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అక్రమంగా వాటిని తరలిస్తుండడంతో జిల్లా విజిలెన్స్ అధికారులకు కానిస్టేబుల్ సమాచారం అందించారు. వెంటనే కర్నూలు నుంచి విజిలెన్స్ సీఐ శ్రీనివాసరెడ్డి, స్పెషల్ తహసీల్దార్ రామకృష్ణ ఆదోనికి చేరుకున్నారు. వారు మాట్లాడుతూ ఆదోని నుంచి పట్టణంలో ముగతి రోడ్డులో ఉండే లక్ష్మీనరసింహ స్వామి రైస్ మిల్లుకు ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్లు చెప్పారు. పట్టుకున్న బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించామని తెలిపారు. ఈ బియ్యం ఏ రేషన్ షాప్ నుంచి వచ్చాయి.. ఎన్ని రోజులుగా ఈ తతంగం సాగుతోంది అనే విషయంపై విచారణ చేపట్టినట్లు చెప్పారు. విజిలెన్స్ అధికారులతో పాటు సీఎస్డీటీ మల్లేష్, వీఆర్వో స్నేహలత, కానిస్టేబుల్ శేఖర్ తదితరులు ఉన్నారు. -
మట్టినీ మింగేస్తున్నారు
అధికార పార్టీ నాయకులు కళ్లు మూసుకున్న అధికారులు కోట్లకు పడగలెత్తుతున్న అధికారపార్టీకి చెందిన మాఫియా మట్టిని కూడా వదలడం లేదు. మట్టిని అమ్ముకుని కోట్లకు పడగలెత్తుతోంది. అధికారపార్టీ నాయకుల ఒత్తిడితో విజిలెన్స్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. నూజివీడు: నూజివీడు మండలం పల్లెర్లమూడి దగ్గర నుంచి ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణాలో కుడి కాల్వ కలిసే వరకు పనులు జరుగుతున్నాయి. 80మీటర్ల వెడల్పు తవ్వాల్సిన కాలువను గతేడాది ఆగస్టులో 40మీటర్లు మాత్రమే తవ్వి నీటిని వదిలారు. మిగిలిన వెడల్పు తవ్వే పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. తవ్విన మట్టిని కాల్వకట్టలపైనే పక్కగా పోయాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా అధికారపార్టీకి చెందిన మట్టి మాఫియా గుడివాడ, గన్నవరం, ఉయ్యూరు, పామ ర్రు, పశ్చిమగోదావరి తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికారులెవ్వరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మట్టిమాఫియా కొంతమంది రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఆమ్యామ్యాలు సమర్పించుకుంటున్నట్లు సమాచారం. పలు గ్రామాల పరిధిలో ఉన్న క్వారీ గోతులు పూడ్చటానికి మట్టిని తరలిస్తున్నారు. పల్లెర్లమూడి వద్ద నుంచి మర్రిబంధం వరకు పోలవరం కాలువను తవ్వగా 8.30 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వచ్చింది. అందులో దాదాపు 5లక్షల క్యూబిక్మీటర్ల మట్టిని గతంలోనే అమ్మేసుకున్నారు. క్యూబిక్ మీటరు మట్టికి ప్రభుత్వం రూ.30 ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే తరలిపోయిన మట్టి విలువ రూ.1.50కోట్లు ఉంటుంది. నూజివీడు రూరల్ పోలీస్స్టేషన్లో సీతారామపురం గ్రామస్తులు గతేడాది సెప్టెంబరులో ఫిర్యాదుచేశారు. మట్టితో వెళుతున్న గ్రావెల్ టిప్పర్లను పోలీసులకు పట్టిస్తే వాటిని ఆర్డీవో రూ.5వేలు జరిమానా విధించారు. అధికారులపై మంత్రి ఒత్తిళ్లు మట్టి తరలింపును పట్టించుకోవద్దని జిల్లాకు చెందిన మంత్రి విజిలెన్స్ ఉన్నతాధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. నూజివీడు డివిజన్లోని అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు విజిలెన్స్ అధికారులు వస్తే పశ్చిమగోదావరి జిల్లాలో అడ్డగోలుగా మట్టిని తరలించి అమ్ముకుంటుంటే అక్కడ ఎందుకు ఆపడంలేదని ప్రశ్నించడంతో వెనుదిరిగి వెళ్లినట్లు తెలిసింది. తహశీల్దార్లకు ఫిర్యాదు చేస్తున్నాం మట్టి బయటకు పోవడానికి వీల్లేదని, పనులు చేస్తున్న ఏజన్సీకి తెలియజేశాం. మట్టి తరలిపోతున్న విషయం మా దృష్టికి వచ్చినప్పుడల్లా తహశీల్దార్లకు ఫిర్యాదు చేస్తున్నాం. వారు చర్యలు తీసుకోవాల్సి ఉంది.-పద్మిని, పోలవరం కాలువ డీఈ మట్టిని దోచేస్తున్నారు పోలవరం కాలువ మట్టిని యథేచ్చగా దోచేస్తున్నారు. పగలు కంటే రాత్రిపూట మట్టిని ట్రాక్టర్లు, లారీల్లో తరలించేస్తున్నారు. పోలీసులు గాని, రెవెన్యూ అధికారులు గాని ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారపార్టీ నాయకులకు తొత్తులుగా పనిచేస్తున్నారు.-దేవరకొండ మధు, వైఎస్సార్సీపీ యువజన విభాగం మండల అధ్యక్షుడు -
365 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు భారీగా బియ్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కృష్ణాజిల్లా చంద్రలపాడు మండలం బొబిళ్లపాడు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. బియ్యం అక్రమంగా లోడ్ చేస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు 365 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
గరిడేపల్లిలో 50 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
గరిడేపల్లి మండలంలోని కేతవారిగూడంలో ఓ ఇంట్లో అక్రమంగా నిలువ చేసిన 50 క్వింటాల రేషన్ బియ్యాన్ని గురువారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ అధికారి రాధా మాట్లాడుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
దాల్ మిల్లర్ల టెండ‘రింగ్’
♦ రూ.123కు టెండర్ దాఖలు చేసిన వైనం ♦ ఆమోదించిన పౌరసరఫరాల శాఖ ♦ సీఎంవో, ఓ ఎంపీ ఒత్తిడే కారణం! ♦ ‘సాక్షి’ చెప్పిందే నిజమైంది! సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కందులకు మద్దతుధర లేక రైతులు అల్లాడుతున్నారు. క్వింటాలుకు రూ.7 వేలు కూడా గిట్టుబాటు కావడం లేదంటూ రోడ్డెక్కుతున్నారు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధరలు కూడా తగ్గాయి. సాధారణ కందిపప్పు కిలో రూ.వంద పలుకుతోంది. హైక్వాలిటీ పప్పు సైతం రూ.115 మించడం లేదు. కానీ రేషన్ దుకాణాలకు పౌర సరఫరాల శాఖ సరఫరా చేసే కందిపప్పు ధరను మాత్రం దాల్మిల్లర్లు అమాంతం పెంచేశారు. కిలో కందిపప్పు రూ.123.50 చొప్పున సరఫరా చేస్తామంటూ టెండర్ దాఖలు చేశారు. గురువారం సాయంత్రం టెండర్లను తెరిచిన పౌర సరఫరాల శాఖ అధికారులు షరా మామూలుగానే అతి తక్కువధరను (రూ.123.50) పేర్కొన్న టెండర్ను ఆమోదించారు. రేషన్ దుకాణాలకు పౌర సరఫరాల శాఖ సరఫరా చేసే కందిపప్పు సరఫరా అంశంపై దాల్మిల్లర్లు కుమ్మక్కయ్యారని ‘కందిపప్పుకు టెండరింగ్’ శీర్షికన ‘సాక్షి’లో ఈ నెల 21న కథనం ప్రచురించింది. ఈ అంశంపై విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నా దాల్మిల్లర్లంతా ఖమ్మంలోని ఓ ప్రేవేటు హోట ల్లో సమావేశమై రూ.115 నుంచి 120 వరకు టెండర్ దాఖలు చేయాలని నిర్ణయించిన అంశాన్ని గత మంగళవారం ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి కార్యాలయ పేషీలో పనిచేస్తున్న ఓ వ్యక్తితోపాటు, దక్షిణ తెలంగాణకు చెందిన ఓ ఎంపీ, పౌర సరఫరాల శాఖలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి సహకారంతో మిల్లర్లు టెండర్ దాఖలు చేసి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టేందుకు ప్లాన్ వేశారు. ఇందుకు అనుకూలంగానే పౌరసరఫరాల శాఖ అధికారులు సైతం సదరు టెండర్ను ఆమోదించడం గమనార్హం. ఈసారి వేసిన టెండర్లలో కూడా పాత కాంట్రాక్టర్లే పాల్గొన్నారు. మొత్తం 10 మంది కాంట్రాక్టర్లు టెండర్లు వేయగా, అందులో 9 మంది పాతవారేనని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రతినెలా 5 వేల మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరమవుతోంది. లబ్ధిదారునికి కిలో రూ.50 చొప్పున ప్రభుత్వం రాయితీపై అందిస్తోంది. వీటికి ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది. అయితే గత ఏడాది నవంబర్లో తుది విడత టెండర్లు ముగిశాక మళ్లీ కొత్త వాటిని పిలవలేదు. అప్పటి నుంచి ప్రభుత్వమే కందిపప్పు సేకరించి సరఫరా చేస్తోంది. ప్రస్తుతం కంది ధరలు దిగిరావడంతో ఈ నెల 19న కేవలం మార్చి నెల నిమిత్తం కందిపప్పు సరఫరా చేసేందుకు టెండర్లను పిలిచింది. -
తిరుమలలో అనుమానితుల అరెస్ట్
తిరుమలలో ముగ్గురు అనుమానితులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. రథసప్తమి సందర్భంగా కొంత మంది యువకులు అత్యాధునిక కెమెరాలతో ఊరేగింపు దృశ్యాలను చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ఇది గమనించి.. వెంటనే అప్రమత్తమైన విజిలెన్స్ అధికారులు వీరిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా.. ఓ ప్రముఖ హీరో నటిస్తున్న సినిమా కోసం షూటింగ్ లో భాగంగా వీడియో తీస్తున్నట్లు సదరు వ్యక్తులు తెలిపారు. పట్టుబడిన వారిలో ఒకరు విజయవాడ ప్రాంతానికి చెందిన.. నిషాంత్ గా పోలీసులు గుర్తించారు. ఇతను చిత్ర పరిశ్రమలో అసిస్టెంట్ కెమెరా మెన్ గా పనిచేస్తున్నాడు. అయితే.. తిరుమలలో సినిమా షూటింగ్ లను నిషేదిస్తూ.. గతంలోనే జీవో విడుల చేశారు. దీంతో పోలీసులు.. ఎదైనా సినిమా కోసం ప్రత్యేకంగా అనుమతి తీసుకున్నారా.. లేదా.. చిత్రీకరణ వెనక ఏదైనా కుట్ర కోణం ఉందా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
రైస్ మిల్లుపై విజిలెన్స్ అధికారుల దాడి
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలోలని రైస్ మిల్లుపై మంగళవారం విజిలెన్స్ అధికారులు దాడి చేశారు. ఈ సందర్భంగా 26 రేషన్ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం రైస్ మిల్లు యజమానిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని... ప్రశ్నిస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయాల్సిన బియ్యం బస్తాలు సదరు మిల్లులో ఉన్నాయని విజిలెన్స్ అధికారులకు ఆగంతకులు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు దాడి చేశారు. -
నిద్దరోతున్న నిఘా
సాక్షి ప్రతినిధి, విజయనగరం: రైతులు, వినియోగదారులు, ప్రభుత్వానికి చెందిన ఆస్తులు కానీ..మరే ఇతర ఉత్పత్తులు కానీ అడ్డగోలుగా తరలుతున్నా లేదా అక్రమ వ్యాపారాలు జరుగుతున్నా విజిలెన్స్ అధికారులు దాడులు చేసి వాటిని సీజ్ చేయాల్సి ఉంటుంది. అధికారులు దృష్టి సారించలేకపోయిన ప్రాంతాల్లో విజిలెన్స్ నిఘా ఉంటుంది.అయితే జిల్లాలో ప్రస్తుతం పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోళ్లలో పలు అక్రమాలు జరుగుతున్నట్లు బయటపడుతున్నప్పటికీ విజిలెన్స్ మొద్దు నిద్ర పోతోందనే విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. ప్రతి రోజూ దళారులతో కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను వ్యాపారులు ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. జిల్లాలో పౌరసరఫరాల శాఖ ద్వారా 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ జిల్లా వ్యాప్తంగా మిల్లర్ల మధ్య ఉన్న విభేదాల కారణంగా ధాన్యం కొనుగోళ్లు ఇటీవల కాలం వరకూ ఊపందుకోలేదు. దీంతో పీపీసీ కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. అవే సమయంలో ఇతర జిల్లాల నుంచి కొనుగోలు దారులు వచ్చి ధాన్యాన్ని తరలించుకుపోతున్నారు. వాస్తవానికి రైతుకు కనీస మద్దతు ధర క్వింటాకు రూ.1410లు చెల్లించాల్సి ఉన్నప్పటికీ కేవలం రూ.వెయ్యి నుంచి రూ.1200 మాత్రమే చెల్లించి రైతులను మోసం చేస్తూ దీంతో దళారులు, ఇతర జిల్లాల వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. రైతు మాత్రం ఒక క్వింటా వద్ద రూ.150 నుంచి రూ.200 వరకూ మోసపోతున్నాడు. జిల్లా వ్యాప్తంగా ఈ విధమైన కొనుగోళ్ల వల్ల రైతుల కష్టం దళారుల పాలవుతోంది. దీనిపై కనీసం అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో రైతులు అష్టకష్టాలూ పడుతున్నారు. ముఖ్యంగా ప్రమాణాలు పాటించని కొనుగోళ్ల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులు 82 కిలోల ధాన్యం కొనుగోలు చేసి బస్తాల్లో నింపుతున్నారు. రైతులకు వెంటనే చెల్లింపులు చేయడంతో వీరికే ధాన్యం విక్రయించేందుకు వారు మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల ఇక్కడి ధాన్యం ఇతర జిల్లాలకు వెళ్లిపోతోంది. జిల్లానుంచి ప్రతి రోజూ కనీసం 500 లారీలు రాజమండ్రి, అమలాపురం, తదితర ప్రాంతాలకు వెళ్లిపోతున్నాయి. దీని వల్ల జిల్లాలోని రైతులు కనీస మద్దతు ధర పొందకపోవడంతో పాటు జిల్లాలోని ఇతర రంగాలైన కార్మిక, వర్తక, వినియోగ దారులు కూడా పరోక్షంగా మోసపోతు న్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ విజిలెన్స్ శాఖ ఏం చేస్తోందోనని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ విధమైన తరలింపు కలెక్టర్ కార్యా లయం ముందు నుంచి జరుగుతున్నా అధికారులు చొరవ తీసుకోవట్లేదనీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరో పక్క మిల్లర్లు మాత్రం బ్యాంకు గ్యారంటీలను చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. నేరుగా జిల్లాలోని పలు ప్రాంతాలకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తూ అధికారుల డొల్ల తనాన్ని ఎద్దేవా చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ధాన్యం ఇతర జిల్లాలకు తరలడంతో పాటు కనీస మద్దతు ధర కల్పించక పోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం జేసీ శ్రీకేశ్ బి లఠ్కర్ ఐటీడీఏ పీఓగా కూడా అదనపు బాధ్యతలు చూస్తుండడంతో ధాన్యం కొనుగోళ్లు, ఇతర జిల్లాలకు తరలింపుపై సరైన దృష్టి సారించలేక పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే విజిలెన్స్ అధికారులు మాత్రం గత నెలన్నర రోజులుగా జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లు, తరలింపు వంటివాటిపై దృష్టి సారించకపోవడంతో ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. -
భారీగా ఇసుక నిల్వలు సీజ్
పశ్చిమగోదావరి జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను అధికారులు సీజ్ చేశారు. చింతలపూడి మండలం నాగారెడ్డిగూడెం గ్రామంలో అనుమతి లేకుండా నిల్వ ఉంచిన సుమారు 150 ట్రాక్టర్ల ఇసుకను బుధవారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు ఒకరిపై కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ ప్రత్యేక అధికారి ఆసిఫా బేగం, తహశీల్దార్ మైఖేల్ రాజు పాల్గొన్నారు. -
అందల‘మెక్కి’స్తున్నారు!
♦ ఆర్టీసీలో అవినీతి అధికారులకు పట్టం ♦ దుకాణాల అద్దెలు మింగిన అధికారికి ఉన్నత పోస్టు ♦ అద్దె బస్సు నిధులు గోల్మాల్ చేసిన వ్యక్తికి డిపో మేనేజర్ పదవి ♦ రికవరీ నిధులు తిన్నా చర్యలు శూన్యం సాక్షి, హైదరాబాద్: ఇంట్లో ఎలుకలు ఉంటే ఏం చేస్తారు.. వాటికి మందుపెడతారు.. కలుగుల న్నింటిని మూసేస్తారు. కానీ మరిన్ని ఎలుకలు లోనికి చేరేలా కొత్త కలుగులు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం ఆర్టీసీలో యాజమాన్యం తీరు ఇలాగే ఉంది. రోజురోజుకు పెరుగుతున్న నష్టాలతో దివాలా దిశగా సాగుతున్న సంస్థను సరిదిద్దాల్సిందిపోయి.. తిన్నింటికే కన్నం వేస్తున్న అధికారులను అందలమెక్కిస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా మంచి పోస్టింగులు ఇస్తూ పరోక్షంగా అవినీతిని ప్రోత్సహిస్తున్నారు. ఆర్టీసీకి వివిధ డిపోల పరిధిలో సొంత దుకాణాలున్నాయి. వాటి నుంచి వసూలయ్యే అద్దెలను ఆర్టీసీ ఖజానాకు జమ చేయాలి. ఈ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు గతంలో రిటైర్డ్ సిబ్బందిని నియమించారు. 2006 నుంచి 2013 వరకు వివిధ డిపోల పరిధిలో దాదాపు రూ.2 కోట్లు బ్యాంకుల్లో జమకాలేదు. ఇది 2013లో వెలుగుచూడటంతో నాటి ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు విచారణకు ఆదేశించారు. రిటైర్డ్ సిబ్బందిపై వేటు వేయటంతోపాటు దాదాపు 15 మంది అధికారులు, సిబ్బందిపై అభియోగాలు నమోదు చేశారు. ఆ మొత్తాన్ని వారి నుంచి రికవరీ చేయాలని కూడా ఆదేశించారు. రికవరీ దేవుడెరుగు.. అభియోగాల జాబితాలో ఉన్న అధికారుల పేర్లు తొలగించి వారికి మంచి పోస్టింగులు ఇచ్చారు. రిటైర్డ్ సిబ్బందిని తొలగించి రూ.2 కోట్ల కుంభకోణానికి తెరలేపిన అధికారులకు క్లీన్చిట్ ఇచ్చేశారు. అద్దె బస్సుల కుంభకోణంలో... ఇటీవల పలు జిల్లాల్లో అద్దె బస్సు నిర్వాహకులతో అధికారులు కుమ్మక్కై నిధులు స్వాహా చేశారు. వరంగల్ జిల్లాలో స్వయంగా విజిలెన్స్ అధికారులు ఆధారాలతోసహా బట్టబయలు చేశారు. పాత బస్సులకు తక్కువ అద్దె చెల్లించాల్సి ఉన్నప్పటికీ... వాటికీ ఎక్కువ అద్దె చెల్లించి రూ.కోటి వరకు పక్కదారి పట్టించారు. ఇందులో క్లర్క్ స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకున్న యాజమాన్యం పెద్ద అధికారులను మాత్రం కాపాడింది. ఈ కుంభకోణంలో వాటా ఉన్నట్టు తొలుత పేరు నమోదైన ఓ అధికారిని మరో జిల్లాలో డిపో మేనేజర్గా నియమించారు. ఇప్పుడా అధికారి దర్జాగా డీఎం హోదాలో తనదైన ‘శైలి’లో పనిచేసుకుపోతున్నారు. డ్రైవర్ల రికవరీ నిధులు భోంచేసినా.. టికెట్ల లెక్కల్లో రూ.5 తేడా వచ్చినా కండక్టర్లను సస్పెండ్ చేసిన దాఖలాలున్నాయి. అలాగే చిన్నచిన్న ప్రమాదాలతో బస్సులకు నష్టం చేసిన డ్రైవర్ల నుంచి వసూలు చేసిన నష్టపరిహారాన్ని స్వాహా చేసిన అధికారులకు మాత్రం పట్టం కడుతున్నారు. ఇటీవల వరంగల్ జిల్లాలో లైట్లు, అద్దాలు పగిలిన బస్సులకు సంబంధిత డ్రైవర్ల నుంచి నష్టాన్ని రికవరీ చేశారు. ఈ మొత్తాన్ని సంస్థకు చెల్లించకుండా ఓ అధికారి జేబులో వేసుకున్నాడు. దీనిపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేసి నివేదిక సమర్పించారు. కానీ ఆ అధికారిని కాపాడేందుకు హైదరాబాద్లోని ఉన్నతాధికారులు రంగంలోకి దిగి విజిలెన్స్ నివేదిక సరిగాలేదంటూ మరో విచారణను తెరపైకి తెచ్చారు. చివరకు కేసును నీరుగార్చి ఆ అధికారికి కనీసం చార్జిమెమో కూడా ఇవ్వకుండా కాపాడారు. త్వరలో ఆ అధికారికి పదోన్నతి కల్పించే పనుల్లో ఉండటం కొసమెరుపు. -
మళ్లీ కూలిన కొండ చరియలు
సాక్షి, తిరుమల: తిరుమలకు కొండ చరియల ముప్పు కొనసాగుతోంది. ఇప్పటికే రెండో ఘాట్రోడ్డు ధ్వంసమైంది. ఆదివారం కురిసిన వర్షానికి ఈ రోడ్డుతోపాటు శ్రీవారి మెట్ల మార్గం (శ్రీనివాస మంగాపురం నుంచి తిరుమల కాలిబాట) లోనూ భారీకొండ చరియలు కూలాయి. రాళ్ల ధాటికి నడకదారి షెడ్లు ధ్వంసమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తిరుమలలో ఆదివారం భారీ వర్షం కురిసింది. శ్రీవారి మెట్టు నడకమార్గంలోని 1700 మెట్ల నుంచి 1800 వరకు మధ్యలో భారీగా కొండ చరియలు కూలాయి. పై నుంచి రాళ్లు పడడంతో షెడ్లు కూలిపోయాయి. మెట్ల మార్గం మొత్తం బండరాళ్లతో నిండిపోయింది. టీటీడీ అధికారులు ముందుజాగ్రత్తగా మెట్లమార్గాన్ని మూసివేయడంతో భక్తులకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. తాజా ఘటనతో శ్రీవారి మెట్టు మార్గం పునరుద్ధరణకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. రెండోఘాట్లోనూ .. రెండో ఘాట్రోడ్డులో 8 నుంచి 16వ కిలోమీటరు వరకు కొండ చరియలు కూలాయి. 12వ కిలోమీటరు వద్ద, 13వ కిలోమీటరు నుంచి 16వ కిలోమీటరు వరకు భారీ సంఖ్యలో రాళ్లు కూలాయి. సోమ, మంగళవారాల్లో వర్షం తీవ్రత మరింతగా ఉంటే దాని ప్రభావం కొండచరియలపై ఉండే అవకాశం ఉంది. భారీ వర్షాలకుతోడు కొండచరియలు విరిగి పడుతున్న నేపథ్యంలో ఆదివారం రాత్రి పదిన్నర గంటలకే తిరుమల రెండు ఘాట్రోడ్లను మూసివేశారు. సాధారణంగా రోజూ రాత్రి 12 గంటల నుంచి 3 గంటల మధ్య రెండు ఘాట్రోడ్లను మూసివేస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా ముందు జాగ్రత్తచర్యగా పదిన్నర గంటలకే రెండు ఘాట్రోడ్లను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా తిరుమల-తిరుపతి, తిరుపతి-తిరుమల మధ్య ఆగిపోయిన రాకపోకలను సోమవారం వేకువజామున 4.30 గంటలకు పునఃప్రారంభించాలని నిర్ణయించారు. సోమ, మంగళవారాల్లో కూడా ఇదేవిధంగా రెండు ఘాట్రోడ్లను మూసివేస్తామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఈ విధంగా తిరుమల చరిత్రలో ఒకేసారి రెండు ఘాట్రోడ్లను రాత్రి పదిన్నర గంటలకే మూసివేయడం ఇదే ప్రథమం. -
700లీటర్ల డీజిల్ అక్రమ నిల్వలు స్వాధీనం
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో శనివారం విజిలెన్స్ అధికారులు దాడులు చేసి, అక్రమంగా నిల్వ ఉంచిన డీజిల్ను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక హనుమాన్ సర్కిల్లో ఉన్న ఓ గోదాముపై విజిలెన్స్ సీఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ అనధికారికంగా నిల్వ ఉంచిన 700 లీటర్ల డీజిల్ను సీజ్ చేశారు. ఈ మేరకు కేసును రెవెన్యూ అధికారులకు అప్పగించనున్నట్లు సీఐ తెలిపారు. -
అదిరేట్లు
♦ ఏం కొనాలన్నా అందుబాటులో లేని ధరలు ♦ కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు ♦ పట్టించుకోని విజిలెన్స్ అధికారులు సత్తెనపల్లి : బహిరంగ మార్కెట్లో నిత్యావసరాల ధరలు అడ్డూ, అదుపూ లేకుండా పెరిగి పోతున్నాయి. ఆ మేరకు సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆదాయ వనరులు పెరగక పోవడంతో సగటు జీవి నెలబడ్జెట్ తలకిందులైంది. పెరిగిన నిత్యావసరాల ధరలతో వంటింటి బడ్జెట్ దాదాపు రెట్టింపు అయింది. సాధారణ, ఇంధన ధరలు అన్ని భారంగా మారుతున్నాయి. నలుగురు సభ్యులు ఉన్న చిన్న కుటుంబానికి గత ఏడాది వంటింటి బడ్జెట్ సగటున రూ. 5వేలు ఉంటే... ప్రస్తుతం పెరిగిన నిత్యావసర ధరలతో అది రూ. 9వేలకు పెరిగింది. గత ఏడాది కిలో కంది పప్పు రూ. 75 కాగా... ఇప్పుడు అది రూ. 145కు పెరిగింది. మినపప్పు రూ. 80 నుంచి రూ. 125కు చేరుకుంది. ఇలా అన్ని రకాల నిత్యవసరాల ధరలు పెరిగి సగటు జీవి కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. విజిలెన్స్ ఎక్కడ?.. మార్కెట్లో ధరల పెరుగుదలకు కారణాలు ఏమిటో తెలుసుకుని నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గోదాముల్లో స్థాయికి మించి అధికంగా నిల్వలు చేస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్న విజిలెన్స్ అధికారులు ఆదిశగా కన్నెత్తి కూడా చూడడం లేదు. బియ్యం ధరలూ అంతే.. జిల్లాలో ఎక్కువగా సన్నరకం బియ్యాన్ని వాడతారు. బీపీటీ బియ్యం విరివిగా వాడుతు న్నారు. సంవత్సర కాలంగా బియ్యం ధరలు కూడా సామాన్యులకు అందన్నంత స్థాయిలో పెరిగాయి. మరీ వారం రోజులుగా విపరీతంగా పెరిగాయి. గత ఏడాది కిలో రూ.25 నుంచి రూ.28 వరకు పలికిన బియ్యం ధరలు ప్రస్తుతం రూ. 40 నుంచి రూ. 45ల వరకు పెరిగిపోయాయి. మేలు రకం బియ్యం ఇతర రాష్ట్రాలకు తరలి పోతుండటం, స్థానికంగా బియ్యం ధరలపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే నిత్యవసరాల ధరలు రెట్టింపు అయ్యాయి. బడ్జెట్ సరిపోవడం లేదు.. పెరిగిన నిత్యవసర ధరలతో గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం బడ్జెట్ సరిపోవడం లేదు. ఉద్యోగులకే కష్టంగా ఉంది.ఇక పేద, మధ్యతరగతి ప్రజలు జీవించడం కష్టం. ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. -కె.లక్ష్మీ, ఉపాధ్యాయురాలు ధరలు తగ్గించాలి.. పప్పుల ధరలు విపరీతంగా పెరిగాయి. నిత్యావసర ధరలు తగ్గించాలి. పెరిగిన ధరల కనుగుణంగా ఆదాయ వనరులు పెరగడం లేదు. దీంతో ఎంత కష్టపడుతున్నా పూటగడవని పరిస్థితి. కూరగాయల ధరలు సైతం బాగా పెరిగి పోయాయి. బియ్యం కొనాలన్నా చాలా కష్టంగా ఉంది. - జి.రోజారాణి, అంగన్వాడీ కార్యకర్త -
15 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
తూర్పుగోదావరి(కపిలేశ్వరపురం): కపిలేశ్వరపురం మండల కేంద్రంలో ఓ ఆటో నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో 15 బస్తాల రేషన్ బియ్యం పట్టుబడింది. అధికారులు ఆటోను సీజ్ను స్టేషన్కు తరలించారు. -
కోడికొండ చెక్పోస్టుపై విజిలెన్స్ దాడులు
అనంతపురం (చిలమత్తూరు) : అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడికొండ చెక్పోస్ట్పై విజిలెన్స్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1400 లీటర్ల కిరోసిన్ను సీజ్ చేశారు. అవినీతికి పాల్పడుతున్న నర్సింహులు, రసూల్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బంగారం దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు
పార్వతీపురం : విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని బంగారం దుకాణాలపై గురువారం 50 మంది ఇన్కమ్టాక్స్, విజిలెన్స్ అధికారులు బృందాలుగా ఏర్పడి మూకుమ్మడిగా దాడులు జరుపుతున్నారు. కాగా ఈ తనిఖీలకు అధికారులు విలేకరులను అనుమతించలేదు. పట్టణంలో ఉన్న అన్ని బంగారం దుకాణాలపై ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మార్కెట్ యార్డులో విజిలెన్స్ తనిఖీలు
సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో విజిలెన్స్ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. మార్కెట్ యార్డులో జరిగిన పత్తి కొనుగోళ్లు ఎన్ని, బయట మిల్లుల్లో జరిగిన కొనుగోళ్లు ఎన్ని? అనే వివరాలను పరిశీలిస్తున్నారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ విభాగం నుంచి రమణకుమార్, వెంకట్రావు పాల్గొన్నారు. -
హైవేపై విజిలెన్స్ తనిఖీలు
తునిరూరల్ : తుని మండలం తేటగుంట ఆర్టీఏ చెక్పోస్టు వద్ద జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. సోమవారం ఆర్టీఏ, అగ్రికల్చరల్ మార్కెట్, రెవెన్యూశాఖ అధికారులతో కలిసి విజిలెన్సు అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహించారు. వాహనాల రికార్డులు, వేబిల్లులు, ఎగుమతి, దిగమతి చేసే సరుకులను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమ రవాణా చేస్తున్న వాహనదారులకు జరిమానాలు విధించారు. జరిమానాల రూపంలో రూ.రెండు లక్షల ఆదాయం లభించిందని విజిలెన్స్ అధికారులు తెలిపారు. -
శ్రీవారి ప్రసాదాలు అక్రమ రవాణా
తిరుమల: శ్రీవారి ప్రసాదాలు అక్రమంగా తరలిస్తున్న ఆలయంలో ప్రసాదాల విభాగానికి పర్యవేక్షకుడిగా ఉండే యర్రంరెడ్డిని టీటీడీ విజెలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఈయన బెంగళూరుకు చెందిన ఓ కార్పొరేట్ కన్స్ట్రక్షన్ కంపెనీతో వెయ్యి చిన్న లడ్డూలు, 50 కల్యాణోత్సవం లడ్డూలు, మరో 50 వడలు ఇచ్చేందుకు ఒప్పందం కుదురుకున్నాడు. ఆ మేరకు గురువారం 270 చిన్న లడ్డూలు, 15 కల్యాణోత్సవం లడ్డూలు, 16 వడలను బెంగళూరుకు తరలిస్తుండగా వేంకటేశ్వర విశ్వ విద్యాలయం ఆవరణలో విజిలెన్స్ విభాగం దాడులు చేసి, అతన్ని పట్టుకున్నారు. లడ్డూలు, వడలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై టీ టీడీ ఈవో సాంబశివరావు తీవ్రంగా పరిగణిస్తూ.. వాస్తవాలు వెలికి తీయాలని విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు.