she teams
-
ఖైరతాబాద్ గణేశుడి నవరాత్రి ఉత్సవాలు.. వెయ్యిమంది కీచకుల అరెస్ట్
సాక్షి,హైదరాబాద్ : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో కీచకులు రెచ్చిపోయారు. గణేష్ నవరాత్రల్లో మహిళలను తాకుతూ కీచకులు వేధించారు. ఖైరతాబాద్ గణేష్ వద్ద 11 రోజుల్లో సుమారు వెయ్యిమందిని కీచకుల్ని షీటీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కీచకులను పట్టుకునేందుకు పోలీసులు స్పై ఆపరేషన్ చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ పట్టుబడ్డారని, తదుపరి చట్టపరమైన చర్యల కోసం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, తగిన శిక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. -
ఖైరతాబాద్లో షీ టీమ్స్ ఫోకస్.. 285 మంది పోకిరీలు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గణపతి నవ రాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలిస్తున్నారు. ఈ క్రమంలో మహిళల పట్ల కొందరు ఆకతాయిలు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో, పోకిరీలకు షీ టీమ్స్ చెక్పెడుతున్నాయి. గణేష్ ఉత్సవాల్లో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన 285 మంది అకతాయిలను షీ టీమ్స్ పట్టుకున్నారు.కాగా, గణేష్ ఉత్సావాల సందర్భంగా ఖైరతాబాద్ బడా గణపతి వద్దకు వేలాది సంఖ్యలో మహిళలు, యువతులు హాజరయ్యారు. ఈ క్రమంలో వారి పట్ల కొందరు ఆకతాయిలు అనుచితంగా ప్రవర్తించారు. గడిచిన ఏడు రోజుల్లో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన 285 మందిని అరెస్ట్ చేసినట్టు షీ టీమ్స్ తెలిపాయి. ఇక, గణేష్ ఉత్సవాల్లో మహిళల భద్రతపై హైదరాబాద్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ సందర్భంగా మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఇది కూడా చదవండి: ఖైరతాబాద్లో కిక్కిరిసిన భక్త సందోహం -
అతివకు అండగా..
ఆడ బిడ్డ.. ఇంటి నుండి బయటికొస్తే అడుగడుగునా వంకరచూపులే. బస్టాపు మొదలు కాలేజీ, కార్యాలయం, కార్ఖానా.. ప్రదేశం ఏదైనా అవకాశం దొరికితే వెకిలి చేష్టలు, వేధింపులు.. డబుల్ మీనింగ్ డైలాగులతో టార్చర్. ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నా..సెల్ఫోన్కు అసభ్య సందేశాలు, ప్రేమ పేరుతో పలకరింపులు, వద్దని తిరస్కరిస్తే ఫొటోల మార్ఫింగ్లతో బ్లాక్మెయిలింగ్లు. ఇవీ.. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా నేటి మహిళను వెంటాడుతున్న అతిపెద్ద సమస్యలు. భయం, కుటుంబ పరువు ,ప్రతిష్ట, గౌరవం దృష్ట్యా అనేకమంది ఈ నిత్య వేధింపులను భరిస్తున్నారు. షీ టీమ్స్ లేదా పోలీసుల వద్దకు వచ్చి నిర్భయంగా ఫిర్యాదు చేస్తున్నవారు కొందరే. అందుకే ‘సాక్షి’ ఇక మీ నేస్తం అవుతోంది. ఇంటా బయట, చదివే చోట, పని ప్రదేశంలో, ప్రయాణంలో, చివరకు ‘నెట్’ఇంట్లో.. ఇలా ఎక్కడ, ఎలాంటి వేధింపులు ఎదురవుతున్నా 8977794588 నంబర్కు వాట్సాప్ ద్వారా తెలపండి. మీ సమస్యల్ని ‘సాక్షి’ తెలంగాణ మహిళా భద్రతా విభాగం డీజీ శిఖా గోయల్ దృష్టికి తీసుకెళ్తుంది. మూడో కంటికి తెలియకుండా మీ సమస్యకు పరిష్కారం చూపుతుంది. భయం వీడండి..ధైర్యంగా ముందుకు కదలండి. వేధింపుల నుంచి విముక్తి పొందండి. -
అతివకు అండగా..
ఆడ బిడ్డ.. ఇంటి నుండి బయటికొస్తే అడుగడుగునా వంకరచూపులే. బస్టాపు మొదలు కాలేజీ, కార్యాలయం, కార్ఖానా.. ప్రదేశం ఏదైనా అవకాశం దొరికితే వెకిలి చేష్టలు, వేధింపులు.. డబుల్ మీనింగ్ డైలాగులతో టార్చర్. ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నా..సెల్ఫోన్కు అసభ్య సందేశాలు, ప్రేమ పేరుతో పలకరింపులు, వద్దని తిరస్కరిస్తే ఫొటోల మార్ఫింగ్ లతో బ్లాక్మెయిలింగ్లు. ఇవీ.. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా నేటి మహిళను వెంటాడుతున్న అతిపెద్ద సమస్యలు. భయం, కుటుంబ పరువు ,ప్రతిష్ట, గౌరవం దృష్ట్యా అనేకమంది ఈ నిత్య వేధింపులను భరిస్తున్నారు. షీ టీమ్స్ లేదా పోలీసుల వద్దకు వచ్చి నిర్భయంగా ఫిర్యాదు చేస్తున్నవారు కొందరే. అందుకే ‘సాక్షి’ ఇక మీ నేస్తం అవుతోంది. ఇంటా బయట, చదివే చోట, పని ప్రదేశంలో, ప్రయాణంలో, చివరకు ‘నెట్’ఇంట్లో.. ఇలా ఎక్కడ, ఎలాంటి వేధింపులు ఎదురవుతున్నా 8977794588 నంబర్కు వాట్సాప్ ద్వారా తెలపండి. మీ సమస్యల్ని ‘సాక్షి’ తెలంగాణ మహిళా భద్రతా విభాగం డీజీ శిఖా గోయల్ దృష్టికి తీసుకెళ్తుంది. మూడో కంటికి తెలియకుండా మీ సమస్యకు పరిష్కారం చూపుతుంది. భయం వీడండి..ధైర్యంగా ముందుకు కదలండి. వేధింపుల నుంచి విముక్తి పొందండి.నోట్: పేరు, వివరాలు గోప్యంగా ఉంచాలని కోరితే..వారి అభిప్రాయాలను ‘సాక్షి’ గౌరవిస్తుంది -
ప్రత్యేక చట్టమూ లేదు... ఠాణా హోదా రాదు!
సాక్షి, హైదరాబాద్: యువతులు, మహిళలను వేధించే పోకిరీలకు చెక్ చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం 2014లో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన షీ–టీమ్స్ గత ఎనిమిదేళ్లుగా ఎనలేని సేవలు అందిస్తున్నా నేటికీ వాటికి ప్రత్యేక చట్టం, కనీసం పోలీసుస్టేషన్ హోదా లేకపోవడంతో బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగట్లేదు. నేరాల తీవ్రత ఎక్కువగా ఉండి, పక్కా ఆధారాలు ఉంటే తప్ప ఆకతాయిలపై ఐపీసీతోపాటు ఇతర చట్టాల కింద కేసులు నమోదు చేయడం సాధ్యం కావట్లేదు. గతేడాది రాజధానిలోని మూడు కమిషనరేట్లలో ఉన్న షీ–టీమ్స్కు అందిన ఫిర్యాదులు, పట్టుబడ్డ పోకిరీల సంఖ్య 2,322గా నమోదైనప్పటికీ వాటిలో 395 మాత్రమే ఎఫ్ఐఆర్లుగా నమోదయ్యాయి. మిగిలిన వాటిలో కొన్ని పెట్టీ కేసులు కాగా, మరో 1,798 మందికి కౌన్సెలింగ్తో సరిపెట్టాల్సి వచ్చింది. ఈవ్ టీజింగ్కు పాల్పడుతూ రెండోసారి చిక్కిన ఓ వ్యక్తితోపాటు తీవ్రస్థాయిలో రెచ్చిపోయిన వారిపైనే కేసులు నమోదు చేయగలిగారు. ప్రత్యేక చట్టం కోసం... ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు ఈవ్టీజర్లను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ప్రత్యేక చట్టం అవసరమని భావించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలను అధ్యయనం చేసి చివరకు తమిళనాడులో అమలవుతున్న ‘తమిళనాడు ప్రొహిబిషన్ ఆఫ్ ఈవ్ టీజింగ్ యాక్ట్’ఉపయుక్తంగా ఉందని తేల్చారు. అక్కడి చట్టంలోని అంశాలతోపాటు ఇతర అంశాలను చేరుస్తూ ఓ ముసాయిదాను రూపొందించి 2014లోనే ప్రభుత్వానికి పంపారు. అయితే ఈ ఫైలు న్యాయశాఖ వద్ద పెండింగ్లో ఉండిపోయింది. పోలీసుస్టేషన్ల మెట్లెక్కాల్సిందే... షీ–టీమ్స్ ఏర్పడి ఇన్నాళ్లైనా ఇప్పటికీ వాటికి పోలీసుస్టేషన్ హోదా ఇచ్చే అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు. తమ బాధలు, సమస్యలు పోలీసుస్టేషన్లో చెప్పుకోలేక చాలామంది అతివలు షీ–టీమ్స్ను ఆశ్రయిస్తున్నా కేసు నమోదు తప్పనిసరైతే ఆ పనిని ఠాణా హోదా లేని షీటీమ్స్ చేయలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా బాధితురాలు నివసించే పరిధిలో ఉండే మహిళా ఠాణా, సైబర్క్రైమ్ పోలీసుస్టేషన్... ఇలా ఏదో ఒక చోటకు బాధితురాలిని తీసుకెళ్లి షీ–టీమ్స్ కేసులు నమోదు చేయిస్తున్నాయి. అయితే అక్కడ అధికారులకు నిత్యం వస్తున్న అనేక కేసుల్లో ఇదీ ఒకటిగా మారిపోతోంది. దీంతో షీ–టీమ్స్పై ఉన్న నమ్మకం, ధైర్యంతో వచ్చిన బాధితురాళ్లకు నిరాశ తప్పట్లేదు. షీ–టీమ్స్కే ఠాణా హోదా ఇచ్చి అవసరమైన సిబ్బందిని కేటాయిస్తే వాటి లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ‘షీ–టీమ్స్’ ముసాయిదా చట్టంలోని కొన్ని అంశాలు బహిరంగ ప్రదేశాలతోపాటు పని చేసే ప్రాంతాలు, మాల్స్... ఇలా ఎక్కడైనా ఈవ్ టీజింగ్కు పాల్పడుతూ చిక్కిన పోకిరీలపై నేరం నిరూపణ అయితే ఏడాది జైలు లేదా రూ. 10 వేల జరిమానా లేదా రెండూ. ఈవ్ టీజింగ్ చేయడానికి పోకిరీలు వాహనాలను వినియోగిస్తే వాటిని స్వాధీనం చేసుకొనే వీలు. దేవాలయాలు, విద్యాసంస్థలు తదితర చోట్ల జరిగే ఈవ్ టీజింగ్లను నిరోధించాల్సిన బాధ్యత వాటి నిర్వాహకులదే. అలాంటి సమాచారాన్ని తక్షణం సంబంధిత పోలీసులకు చేరవేయాల్సిందే. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే ఆ నేరానికి యాజమాన్యాలనూ బాధ్యుల్ని చేయవచ్చు. వారికి న్యాయస్థానం జరిమానా విధించే అవకాశం. -
అతివలకు భరోసా.. హైదరాబాద్లో సైబర్ షీ–టీమ్స్ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు, యువతులకు మరింత భరోసా ఇవ్వడానికి హైదరాబాద్ నగర పోలీసు విభాగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కొత్తగా సైబర్ షీ–టీమ్స్ను ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. ఈ బృందాల్లో సాంకేతిక నిపుణులతోపాటు ఎథికల్ హ్యాకర్లు కూడా ఉండనున్నారు. ఈవ్టీజింగ్ సహా వివిధ రకాల వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు, యువతులు, బాలికల కోసం షీ–టీమ్స్ పని చేస్తున్నాయి. ఈవ్టీజర్లపై కన్నేసి రెడ్çహ్యాండెడ్గా పట్టుకోవడం దగ్గరి నుంచి కుటుంబ సమస్యల పరిష్కారం వరకు అనేక విధాలుగా అండగా నిలుస్తున్నాయి. కానీ ఇటీవల కాలంలో వేధింపుల తీరు మారింది. స్మార్ట్ఫోన్, సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ‘ఈ–పోకిరీ’లు పెరిగిపోయారు. వారు బాహ్య ప్రపంచంలో కాకుండా సోషల్ మీడియా ద్వారా రెచి్చపోతున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్.. ఇలా వివిధ రకాల ప్లాట్ఫామ్స్ కేంద్రంగా వేధింపులకు పాల్పడుతున్నారు. వారికి చెక్ చెప్పడానికే సైబర్ షీ–టీమ్స్ ఏర్పాటు చేయనున్నారు. బయటికి చెప్పుకోలేక భరిస్తూ.. ఆన్లైన్ వేధింపుల బారినపడుతున్న అతివల్లో అనేక మంది తమకు ఎదురైన ఇబ్బందులను బయటికి చెప్పుకోలేకపోతున్నారు. వేధింపులకు పాల్పడుతున్నవారి నుంచి వస్తున్న బెదిరింపులకు తోడు పరువు పోతుందనే ఉద్దేశంతో మిన్నకుండిపోతున్నారు. ఈ పరిస్థితిని అలుసుగా తీసుకుంటున్న మోసగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ షీ–టీమ్స్కు వస్తున్న ఫిర్యాదుల్లో 60శాతం దాకా ఆన్లైన్ వేధింపులకు సంబంధించినవే ఉంటున్నాయి. శాంతిభద్రతల విభాగం, సైబర్ క్రైమ్ ఠాణాలకు వస్తున్న సైబర్ కేసుల్లోనూ వేధింపులకు సంబంధించినవే అధికంగా ఉంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే.. 2022లో సైబర్ నేరాల కేసులు 9,815 నమోదుకాగా.. వీటిలో సైబర్ వేధింపులకు సంబంధించినవి 1,118, అశ్లీల సందేశాలు పంపడానికి సంబంధించినవి 141 ఉన్నాయి. ఈ వేధింపులు, అశ్లీల సందేశాల కేసుల్లో బాధితులు మహిళలు, యువతులే. దీనికితోడు ఇటీవలి కాలంలో ప్రేమ ముసుగులో జరిగే ‘ఈ–నేరాలు’ పెరిగిపోయాయి. వాటితో యువతులు, మహిళలు వ్యక్తిగతంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టపోతున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో.. సైబర్ వేధింపులు ఎదురైన బాధితులు నేరుగా షీ–టీమ్స్ వద్దకు రావాల్సిన అవసరం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫోన్, వాట్సాప్, ఫేస్బుక్.. ఇలాంటి మార్గాల్లోనూ ఫిర్యాదు చేయవచ్చని చెప్తున్నారు. బాధితుల వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సైబర్ షీ–టీమ్స్కు వచ్చే ఫిర్యాదులకు సంబంధించిన అంశాలను దర్యాప్తు చేయడం, నిందితులను గుర్తించి పట్టుకోవడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతోపాటు ప్రత్యేక టూల్స్ వినియోగించనున్నారు. ఆయా అంశాల్లో నిష్ణాతులైన వారిని బృందాల్లో నియమించనున్నారు. అవసరమైతే డార్క్నెట్ను కూడా ఛేదించే నైపుణ్యమున్న ఎథికల్ హ్యాకర్ల సేవలను వినియోగించుకుంటారు. ఇప్పటికే సిటీ పోలీసు విభాగం మహేశ్ బ్యాంకు కేసు సహా పలు సైబర్ నేరాల దర్యాప్తు కోసం ఎథికల్ హ్యాకర్ల సేవలు వినియోగించుకుంది. స్మార్ట్ఫోన్ కూడా చేటుకు కారణం! ఒకప్పుడు ఫోన్ విలాసవస్తువు. ఇప్పుడు స్మార్ట్ఫోన్ నిత్యావసరంగా మారిపోయింది. ఇవి వచ్చాక ఎవరికి వారికి ‘స్వేచ్ఛ’ పెరిగింది. ఆకర్షణను ప్రేమగా భావిస్తున్న యువతులు అపరిచితులతోనూ హద్దులు దాటుతున్నారు. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత అంశాలను రికార్డు చేయడాన్నీ పట్టించుకోవడం లేదు. ఓ దశలో ఇవే వారి పాలిట శాపంగా మారుతున్నాయి. ఏటా నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఈ తరహాకు చెందినవి పెద్ద సంఖ్యలో ఉంటున్నాయి. సైబర్ షీ–టీమ్స్ ఏర్పాటుతో పరిస్థితులు మారే అవకాశం ఉంది. – సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల షీ–టీమ్స్కు వచ్చిన ‘ఈ–కేసు’ల్లో కొన్ని... ► బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొంతకాలం హైదరాబాద్లోని ఓ మలీ్టనేషనల్ కంపెనీలో పనిచేశాడు. అప్పట్లో తన సహోద్యోగిని అయిన యువతిపై ఆన్లైన్లో వేధింపులకు పాల్పడ్డాడు. ఈ–మెయిల్స్, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ద్వారా అభ్యంతరకర ప్రచారానికి దిగాడు. పోలీసులు సదరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ను అరెస్టు చేశారు. ► హైదరాబాద్లోని బోయిన్పల్లికి చెందిన ఓ మరుగుజ్జు యువకుడు ఫేజ్బుక్లో తనదేనంటూ ఓ అందమైన యువకుడి ఫొటో పెట్టాడు. ఓ యువతి ‘ఫ్రెండ్’గా పరిచయం కావడంతో చాటింగ్ ప్రారంభించాడు. ప్రేమ పేరుతో వలవేసి.. అనేక కారణాలు చెప్పి ఆమె నుంచి రూ.3 లక్షల నగదు, 50 తులాల బంగారం స్వాహా చేశాడు. ► ఓ వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. గతంలో ప్రాజెక్టు వర్క్ నేపథ్యంలో పరిచయమైన యువతిని ప్రేమించాడు. ఆమె తిరస్కరించడంతో కక్షగట్టాడు. ఓ ల్యాప్టాప్, డేటాకార్డ్ కొనుగోలు చేసి.. సదరు యువతి మెయిల్ ఐడీని హ్యాక్ చేశాడు. ఆమె బంధువులు, స్నేహితులకు ఆమే పంపిస్తున్నట్టుగా అసభ్య చిత్రాలు, సందేశాలు పంపాడు. చదవండి: Telangana: గ్రూప్–4లో 8,039 పోస్టులే! -
Delhi Acid Attack: జాగ్రత్త... ప్రమాదం పొంచే ఉంది
యాసిడ్ అమ్మకాల మీద నిఘా పెట్టాం. మహిళల రక్షణకు చట్టాలు కఠినతరం చేశాం. షీ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి. యాప్స్ డెవలప్ అయ్యాయి. నిజమే. కాని ప్రమాదం పొంచే ఉంది. ఢిల్లీలో తాజా యాసిడ్ దాడి ఘటన ఈ విషయమే నిర్థరిస్తోంది. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ (ఎన్.సి.ఆర్.బి) నివేదిక ప్రకారం 2021లో దేశవ్యాప్తంగా 176 యాసిడ్ దాడులు నమోదయ్యాయి. మరో 73 అటెంప్ట్స్ జరిగాయి. అంటే ప్రమాదం పొంచే ఉంది. నిర్లక్ష్యం ఏ మాత్రం పనికి రాదు. వాస్తవాలు ఆందోళన కలిగిస్తున్నప్పుడు ఎవరి జాగ్రత్తలో వారు ఉండటం మంచిది. 2013లో సుప్రీం కోర్టు యాసిడ్ అమ్మకాల మీద జవాబుదారీ ఉండాలని చెప్పింది. రిజిస్టర్ మెయింటెయిన్ చేయాలని చెప్పింది. అంతే కాదు ఐ.డి.ప్రూఫ్ లేకుండా యాసిడ్ అమ్మకూడదు. అలా చేస్తే 50 వేల రూపాయల ఫైన్ ఉంది. అయితే 2016లో ఢిల్లీలో కొంతమంది పోలీసులు మఫ్టీలో యాసిడ్ కొన ప్రయత్నిస్తే 23 షాపులు ఎవరు ఏమిటి అనకుండా అమ్మారు. అప్పుడు గగ్గోలు అయ్యింది. తాజాగా ఢిల్లీలో జరిగిన యాసిడ్ దాడిలో నిందితుడు ఫ్లిప్కార్ట్ ద్వారా యాసిడ్ను కొన్నాడని పోలీసులు గుర్తించారు. ఇప్పుడు ఆన్లైన్ అమ్మకం దారులను యాసిడ్ అమ్మకాలపై జాగ్రత్త వహించవలసిందిగా తాకీదులు పంపుతున్నారు. అంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే. పరిస్థితి దారుణం కోవిడ్ కాలంలో తప్ప దేశంలో యాసిడ్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. స్త్రీలు బలవుతూనే ఉన్నారు. ప్రేమ వద్దన్నారని, ప్రేమలో ఉన్నాక బ్రేకప్ చెప్పారని, పెళ్లయ్యాక విడిపోయారని రకరకాల కారణాల వల్ల పురుషులు ద్వేషంతో యాసిడ్ దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. 2016 నుంచి 2021 మధ్య 1300 యాసిడ్ దాడులు జరిగాయి. విషాదం ఏమిటంటే ఈ యాసిడ్ దాడుల్లో నేరస్తులకు శిక్ష పడుతున్న శాతం అతి తక్కువగా ఉండటం. 400 కేసులు నమోదు అయితే 10 మందికి మాత్రమే శిక్ష పడుతోందంటే ఎన్ని విధాలుగా తప్పించుకుంటున్నారో, తప్పించుకోవచ్చులే అనే ధైర్యంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అప్రమత్తత అవసరం విద్యార్థినులు, యువతులు, స్త్రీలు తమకు తారసపడుతున్న ప్రేమ, వైవాహిక బంధాలలో పురుషుల ధోరణి పట్ల అప్రమత్తంగా ఉండాలి. బెదిరిస్తున్నవారిని, వద్దనుకున్నా వెంటపడుతున్నవారిని, ఒకవేళ బంధం నుంచి బయటపడాలనుకుంటే ఆ మగవారిని గమనించి వారి ధోరణి ప్రమాదకరంగా అనిపిస్తే ముందే కుటుంబ సభ్యుల, పోలీసుల మద్దతు తీసుకోవాలి. ముఖ్యంగా ఇష్టం లేని ప్రేమ ప్రతిపాదిస్తున్నప్పుడు, ప్రేమలో నుంచి బ్రేకప్ చెబుతున్నప్పుడు, విడాకుల సందర్భాలలో ఒంటరిగా తిరిగేటప్పుడు అప్రమత్తంగా ఉండటం, ఎవరైనా అపరిచితుడు లేదా పాత మిత్రుడు దగ్గరిగా వస్తుంటే జాగ్రత్త పడటం, అసలు వీలైనంత సామరస్యంగా, ఒప్పుదలతో బంధాల నుంచి బయటపడటం... ఇవన్నీ ముఖ్యమైనవే. దేశంలో యాసిడ్ దాడులను నిర్మూలించామని ఎవరూ హామీ ఇవ్వడం లేదు. కనుక మన రక్షణకు మనమే బాధ్యత వహించాలి. కుటుంబం, పోలీసుల వద్ద సమస్యను దాచకుండా సాయం పొందాలి. (క్లిక్ చేయండి: వరతమ్మా నీకు వందనాలమ్మా!) -
పాఠశాలల్లో ‘షీ’క్రెట్ ఏజెంట్స్.. గుడ్, బ్యాడ్ టచ్లపై శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ లోని పాఠశాలలు, వసతి గృహాల్లో మైనర్లపై అఘాయిత్యాలు పెరిగాయి. సెలవుల్లో ఇంటికి వెళ్లిన పిల్లలు ప్రవర్తన చూసి తల్లిదండ్రులు ఆరా తీస్తే తప్ప అక్కడేం జరిగిందో బయటపడటం లేదు. పోలీసులంటే పిల్లల్లో నెలకొన్న భయం, ఇతరత్రా కారణాలతో సంఘటన జరిగిన వెంటనే విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించడంలో జాప్యం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు సరికొత్త కార్యాచరణ రూపొందించారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేటు, ప్రభుత్వ వసతి గృహాలలో షీ టీమ్స్ గూఢచారులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటి పనేంటంటే? ప్రతి సంస్థలో వంద మంది విద్యార్థులకు 5–10 మంది ఆసక్తి ఉన్న వలంటీర్లను గూఢచారులుగా ఎంపిక చేసి వీరికి గుడ్, బ్యాడ్ టచ్లతో పాటు పోక్సో చట్టం, కేసులు, శిక్షలు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఆకతాయిలపై ఎలా నిఘా వేయాలి, పోలీసులను సంప్రదించే తీరు, ఏ సమస్యపై ఎలా స్పందించాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. దీంతో ఆయా విద్యా సంస్థలు, వసతి గృహాలలోని విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించిన వెంటనే బృందం సభ్యులు గుర్తించి, వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తారు. నివాసిత సంఘాల్లోనూ.. నివాసిత సంఘాలలో ఆత్మహత్యలు, గృహ హింస కేసులు పెరిగిపోతున్నాయి. వీటిని నివారించేంవదుకు గృహ కమ్యూనిటీలలోనూ స్వచ్ఛంద బృందాలను ఏర్పాటు చేయాలని సైబరాబాద్ షీ టీమ్స్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరిస్తే మేలని సైబరాబాద్ షీ టీమ్స్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అందుకే హౌసింగ్ కమ్యూనిటీలలో స్వచ్ఛంద గ్రూప్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ గ్రూపులో పోలీసులు, మనస్తత్వ నిపుణులు, న్యాయ సలహాదారులు, వైద్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు సభ్యులుగా ఉంటారు. సైబరాబాద్లోని ప్రతి కమ్యూనిటీల్లో ఈ సభ్యుల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంటాయని ఉన్నతాధికారి తెలిపారు. (క్లిక్: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కీలక ప్రకటన.. ఏడాదికి యాక్షన్ ప్లాన్) -
ముస్లిం మహిళల కోసం ‘షీ ఎరా’
సాక్షి, హైదరాబాద్: మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న రాచకొండ పోలీసులు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. షీ టీమ్స్ ఎంపవరింగ్ రూరల్ ఆస్పిరెంట్స్ (షీ ఎరా) అనే ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం కింద గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసం, స్వయం ఉపాధి కల్పించేందుకు కుట్టు మిషన్లో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ (ఆర్కేఎస్సీ) మహిళా విభాగం, రాచకొండ పోలీసు కమిషనరేట్ భాగస్వామ్యమయ్యారు. త్వరలోనే పహాడీషరీఫ్లో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ వంటి శిక్షణ ఇస్తారు. ఇందుకు వందల సంఖ్యలో దరఖాస్తులు రాగా.. తొలి విడతలో 50 మంది మహిళలను ఎంపిక చేశారు. వీరిని రెండు బ్యాచ్లుగా విభజించి, రోజుకు నాలుగు గంటల చొప్పున ఆరు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. వారికే ఎందుకంటే? ఇటీవలి కాలంలో పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికలను, పిల్లలను వ్యభిచార గృహ నిర్వాహకులకు విక్రయించడం, మానవ అక్రమ రవాణా తదితర కేసులు వెలుగు చూశాయి. ఆయా కేసులలో బాధితులను విచారించగా.. వ్యసనాలకు అలవాటు పడిన భర్తతో విసుగుచెంది, కన్న పిల్లలను పోషించే ఆరి్ధక స్థోమత లేకపోవడంతో పిల్లలను అమ్ముకుంటున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. చట్ట ప్రకారం వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నప్పటికీ.. నిరక్షరాస్యులైన మహిళలకు జీవనోపాధి కల్పిస్తే సమస్యను కొంత వరకు పరిష్కరించవచ్చని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. (చదవండి: భాద్యత నాది సమ్మె విరమించండి) -
నిమజ్జనంలో నికృష్ట పనులు.. 240 మంది పోకిరీల పట్టివేత
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకు జరిగిన నవరాత్రి ఉత్సవాలపై నగర షీ– టీమ్స్కు చెందిన ప్రత్యేక బృందాల డేగకన్ను ఫలితంగా 240 మంది పోకిరీలు చిక్కినట్లు అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ సోమవారం ప్రకటించారు. నిమజ్జనం రోజుతో పాటు విగ్రహాలను ఏర్పాటు చేసిన మండపాల దగ్గరా షీ–టీమ్స్ నిఘా వేశాయి. మఫ్టీల్లో, రహస్య కెమెరాలతో ఉన్న ఈ బృందాలకు మహిళలు, యువతులను వేధిస్తున్న 240 మంది పోకిరీలు చిక్కారు. వీరిని పక్కా సాక్ష్యాలతో సంబంధిత కోర్టుల్లో హాజరుపరిచినట్లు ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. పోకిరీలకు కనిష్టంగా రెండు నుంచి గరిష్టంగా పది రోజుల వరకు జైలు శిక్ష విధించినట్లు చెప్పారు. షీ–టీమ్స్ కృషిని కొత్వాల్ సీవీ ఆనంద్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థినులపై హెచ్ఎం అసభ్యకర ప్రవర్తన మహబూబాబాద్ రూరల్: విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ హెచ్ఎంను పాఠశాలకు రావద్దని.. విద్యార్థుల తల్లిదండ్రులు, తండావాసులు వెళ్లగొట్టారు. మహబూబాబాద్ దూదియ తండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం షేక్ సర్వర్ పాషా కొన్నిరోజులుగా తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఐదుగురు విద్యార్థినులు శుక్రవారం వారి తల్లిదండ్రులకు చెప్పారు. సోమవారం వారందరూ పాఠశాలకు చేరుకుని హెచ్ఎంను నిలదీశారు. పిల్లలకు విద్యాభోధన చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. అయితే, తనను క్షమించమని, ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా పనిచేస్తానని ఉపాధ్యాయుడు చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే.. కొన్ని రోజులుగా మద్యం తాగి పాఠశాలకు వచ్చి హెచ్ఎం తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని విద్యార్థినులు ఆరోపించారు. గతంలోనూ ఇలాగే ప్రవర్తించాడని, ఇంట్లో చెబుతామంటే వద్దన్నాడని తెలిపారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పర్వతగిరి జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం రాందాస్కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపించిన డీఈఓ.. ఉపాధ్యాయుడు సర్వర్ పాషాను సస్పెండ్ చేశారు. (చదవండి: హాస్టల్లో కామాంధుడు.. విద్యార్థులకు వీడియోలు చూపించి..) -
ఆర్టీసీ బస్సులో మహిళలతో కండక్టర్ అసభ్యకర ప్రవర్తన
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఓ మహిళా ప్రయాణికురాలి పట్ల కండక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో రంగంలోకి దిగిన షీ టీమ్స్.. అతడిని అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఘటన నాచారం పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నగరంలోని సిటీ ఆర్టీసీ బస్సుల్లో ఓ మహిళా ప్రయాణికురాలితో కండక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న సయీద్ అమీన్(40) బస్సులో మహిళా ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. బస్సు టికెట్స్ ఇచ్చే క్రమంలో మహిళా ప్రయాణీకులను తాకరాని చోట తాకుటుండటంతో వారు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఈ క్రమంలో ఓ మహిళా ప్రయాణీకురాలు ధైర్యం చేసి నాచారాం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఈ విషయాన్ని టీ షీమ్స్ దృష్టికి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన షీ టీమ్స్.. బస్సులో నిఘా ఉంచి కండక్టర్ అమీన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను.. ఇలా చేస్తాడని ఎవరు అనుకోరు -
ఇక వీకెండ్ షీ టీమ్స్.. ఈ ప్రాంతాల్లో ఫోకస్
సాక్షి, హైదరాబాద్: ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ నుంచి ఆఫీస్ వైపు క్రమంగా మొగ్గుచూపుతున్నాయి. దీంతో ఉద్యోగుల రాక పెరిగిపోయింది. ఇదే సమయంలో మహిళా ఉద్యోగులకు రక్షణ, భద్రత కల్పించేందుకు సైబరాబాద్ షీ టీమ్ బృందాలు సిద్ధమయ్యాయి. బృందాల సంఖ్యను పెంచడంతో పాటు, మఫ్టీలో గస్తీ కాస్తూ పోకిరీల ఆట కట్టిస్తున్నాయి. విదేశీ సంస్థలకు సేవలందించే చాలా వరకు ఐటీ కంపెనీలు 24 గంటలు పని చేస్తుంటాయి. దీంతో రాత్రి వేళలో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు రక్షణ కల్పించేందుకు షీ టీమ్ స్పెషల్ ఫోకస్ పెట్టాయి. కీలక ప్రాంతాల్లో తిష్ట వేసుకునే అల్లరి మూకల ఆగడాలను కట్టించేందుకు ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ విభాగం ప్రత్యేకంగా వీకెండ్ షీ టీమ్స్ను ఏర్పాటు చేసింది. పెరిగిన షీ టీమ్స్.. మహిళల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న సైబరాబాద్ పోలీసులు గతంలో నాలుగు షీ టీమ్స్ ఉండగా.. వాటి సంఖ్యను 11కు పెంచారు. ఆన్లైన్లో, ఆఫ్లైన్ ఫిర్యాదు అందిన క్షణాల్లోనే పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి చర్యలు తీసుకుంటున్నారు. జన సమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వీకెండ్ షీ టీమ్స్ మఫ్టీలో గస్తీ కాస్తున్నారు. మహిళలను కామెంట్ చేసినా, అసభ్యకరంగా ప్రవర్తించినా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని చర్యలు తీసుకుంటున్నారు. షీ టీమ్స్కు తోడుకు పెట్రోలింగ్ సిబ్బంది ఉంటూ అర్ధరాత్రి హల్చల్ చేసే పోకిరీల ఆటకట్టిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఫోకస్.. ఐటీ కారిడార్లో షీ టీమ్స్ ఎక్కువగా ఫోకస్ పెట్టాయి. గచ్చిబౌలి, రాయదుర్గం, కూకట్పల్లి, మియాపూర్, చందానగర్, మాదాపూర్ ప్రాంతాల్లోని ఫుడ్ కోర్ట్లు, లేడిస్ హాస్టల్స్, మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వంటి పలు ప్రాంతాలలో షీ టీమ్స్ ప్రత్యేక దృష్టిసారించాయి. (క్లిక్: ఆమ్నీషియా పబ్ కేసు.. మరో అమ్మాయిపైనా వేధింపులు!) -
పోకిరీ మైనర్!
సాక్షి, సిటీబ్యూరో: ఈవ్ టీజర్ల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మహిళలు, అమ్మాయిలను నడి రోడ్డు మీదే అసభ్య పదజాలంతో దూషించడం, ఫోన్, సోషల్ మీడియాలలో వేధిస్తున్నారు. 319 మంది ఈవ్ టీజర్లకు, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సైబరాబాద్ షీ టీమ్స్ కౌన్సెలింగ్ ఇచ్చాయి. వీరిలో 98 మంది మైనర్లే ఉన్నారు. 19–24 ఏళ్ల వయస్కులు 112 మంది ఉండగా.. 25–35 ఏళ్ల వాళ్లు 92 మంది, 36–50 ఏళ్ల వయస్సు వారు 17 మంది ఉన్నారు. గత రెండు నెలలో సైబరాబాద్ షీ టీమ్కు వివిధ మాధ్యమాల ద్వారా 355 ఫిర్యాదులు అందాయి. వీటిలో అత్యధికంగా 299 ఫిర్యాదుల వాట్సాప్ ద్వారా చేయగా.. ట్విటర్లో 8 మంది, హ్యాక్ ఐలో 7 మంది, ఈ–మెయిల్ ద్వారా 5 మంది, ఉమెన్ సేఫ్టీ వింగ్ ద్వారా 36 మంది, భౌతికంగా 30 మంది ఫిర్యాదు చేశారు. ఫోన్లో మహిళలను వేధించే ఆకతాయిలే ఎక్కువ. గత రెండు నెలలలో 141 పిటీషన్లు ఈ తరహావే కావటం గమనార్హం. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తున్నారని 34 మంది, సోషల్ మీడియాలో 33, బెదిరింపులు 33, స్టాల్కింగ్ 35 మంది, పెళ్లి చేసుకుంటానని మోసం పోయిన మహిళలు 19 మంది, అసభ్యప్రవర్తన 31, వాట్సాప్లో వేధింపులు 11, కామెంట్లు 7 మంది, రహస్యంగా మహిళల ఫొటోలు, వీడియోల చిత్రీకరణ 3, పని ప్రదేశాలలో వేధింపులు 3, ప్రేమ సమస్యలు 2, ఫ్లాషింగ్ 2 మంది మహిళా బాధితులున్నారు. 7 బాల్య వివాహాలకు చెక్.. గత రెండు నెలల వ్యవధిలో సైబరాబాద్ కమిషనరేట్లో 7 బాల్య వివాహాలను షీ టీమ్లు అడ్డుకున్నాయి. 81 కేసులను నమోదు చేశాయి. వీటిలో 18 క్రిమినల్ కేసులు కాగా.. 63 పెట్టీ కేసులున్నాయి. బస్టాప్స్, రైల్వే స్టేషన్లు, మాల్స్, కాలేజీలు వంటి బహిరంగ ప్రదేశాలలో 1,003 డెకాయ్ ఆపరేషన్లను నిర్వహించారు. ఆయా ప్రాంతాలలో 248 మంది రెడ్ హ్యాండెడ్గా పట్టుబడగా.. వీటిలో 117 పెట్టీ కేసులను నమోదు చేశారు. మిగిలిన ఆకతాయిలను కౌన్సెలింగ్కు పంపించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రాత్రి సమయాల్లో నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లలో 75 మంది రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్, సైబరాబాద్ షీ టీమ్ సంయుక్తంగా కలిసి కౌన్సెలింగ్ ఇచ్చాయి. -
నా భార్య విడాకులిమ్మని వేధిస్తోంది
సాక్షి, హైదరాబాద్: మహిళలకు, పిల్లలకు భద్రత, రక్షణ కల్పించేందుకు ఏర్పాటు చేసిన షీ టీమ్స్కు.. అదే మహిళలపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఏడాది వివిధ ప్రాంతాల్లోని అయిదుగురు పురుష బాధితులు మహిళలపై సైబరాబాద్ భరోసా సెంటర్లో ఫిర్యాదు చేశారు. ఇలా మహిళలపై గతేడాది 20 కేసులు నమోదు కాగా.. 2019లో 7 ఫిర్యాదులు అందాయి. తాజాగా మైలార్దేవ్పల్లికి చెందిన ఓ భర్త.. తన భార్య విడాకులు ఇవ్వమంటూ ఏడాది కాలంగా వేధిస్తోందని సైబరాబాద్ భరోసా కేంద్రాన్ని ఆశ్రయించాడు. సైబరాబాద్ పరిధిలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన బాధితుడు మద్యానికి బానిసగా మారి భార్యను మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. దీంతో భార్య అతని నుంచి దూరంగా జీవనం గడుపుతోంది. తన తప్పు తెలుసుకున్నానని, భార్యతో కలిసి ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతానని పోలీసులే న్యాయం చేయాలని కోరుతూ సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. తన భర్త మీద నమ్మకం లేకపోవటంతో సదరు మహిళ.. తాను భర్తతో కలిసి ఉండలేనని, కౌన్సెలింగ్కు ఇకపై రానంటూ పోలీసులకు తేల్చి చెప్పింది. పెద్దల సమక్షంలోనే తాడోపేడో తేల్చుకుంటానని తెలిపింది. గత నెలలో 73 కేసులు.. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సంయుక్తంగా కలిసి 2018 అక్టోబర్లో భరోసా సెంటర్ను ఏర్పాటు చేశాయి. సెప్టెంబర్ నెలలో సైబరాబాద్ భరోసా కేంద్రానికి 73 ఫిర్యాదులు అందాయి. ఇందులో 72 గృహ హింస, ఒకటి పోక్సో కేసు ఉంది. కాగా 35 జంటలను ఒక్కటి చేశారు. 13 ఫిర్యాదులను ఎఫ్ఐఆర్ నమోదు నిమిత్తం సంబంధిత పోలీస్ స్టేషన్లకు సూచించారు. అలాగే 12 మందికి టెలిఫోన్ ద్వారా కౌన్సెలింగ్ ఇచ్చారు. 10 ఫిర్యాదులను న్యాయపరమైన సూచన కోసం రిఫర్ చేశారు. 3 కేసులు పెండింగ్లో ఉన్నాయి. వాట్సాప్లో ఫిర్యాదు చేయండి ఫిర్యాదు అందిన తక్షణమే బాధితులు, ప్రతివాదులు ఇరువురికి కౌన్సెలింగ్ ఇస్తాం. వాట్సాప్ ద్వారా సైబరాబాద్ భరోసా కేంద్రం అందిస్తున్న సేవలపై బాధితుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. 94906 17261 వాట్సాప్ నంబర్ ద్వారా గానీ 040–29882977, డయల్ 100 నంబర్ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. – అనసూయ, డీసీసీ, సైబరాబాద్ షీ టీమ్స్ చదవండి: ఏమైందో.. ఏమో.. -
తెలంగాణ: మహిళలపై నేరాలు జరిగే ప్రాంతాల గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రతకు కీలక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర పోలీసు విభాగం దానికోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటోంది. ఇందులో భాగంగా అమలులోకి తీసుకువచ్చిన పోలీసు అంతర్గత యాప్ ‘షీ–టీమ్స్’లో కొత్త హంగులు చేర్చింది. యువతులు, మహిళలపై నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించి జియోట్యాగింగ్ చేస్తోంది. ఈ మ్యాప్స్ను అప్లికేషన్లో ఉంచడం ద్వారా ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రత్యేక పర్యవేక్షణకు మార్గం సుగమమైంది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు ఎక్కడైనా షీ–టీమ్స్ పనితీరు, స్పందన ఒకేలా ఉండేందుకు ఈ యాప్ వినియోగిస్తున్నారు. దీన్ని పోలీసు విభాగం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. నిఘా మూసధోరణిలో కాకుండా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 370 షీ–టీమ్స్ పనిచేస్తున్నాయి. ఈ బృందాలు మఫ్టీలో సంచరిస్తూ ఈవ్టీజర్లు, మహిళలపై వేధింపులకు పాల్పడే వారిపై నిఘా వేసి ఉంచుతున్నాయి. సాధారణంగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లతో పాటు ఇతర పబ్లిక్ ప్లేసుల్లో ఈ బృందాలు సంచరిస్తుంటాయి. అన్ని వేళలా, అన్ని ప్రాంతాల్లోనూ ఉండటం సాధ్యం కాకపోవడంతో కొన్ని సందర్భాల్లో షీ–టీమ్స్ నిఘా మూస ధోరణిలో సాగుతోంది. ఉదాహరణకు హైదరాబాద్లోని కోఠి ఉమెన్స్ కాలేజ్ బస్టాప్ వద్ద వీళ్లు ఎక్కువ నిఘా ఉంచితే... ముషీరాబాద్లో ఈవ్టీజింగ్ జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక నగరాలు, పట్టణాలు, జిల్లాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే షీ–టీమ్స్ యాప్లో జియోట్యాగింగ్ను చేర్చారు. మ్యాప్పై ఆ ప్రాంతాలు ప్రత్యక్షం హైదరాబాద్ కేంద్రంగా పని చేసే ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇలాంటి హాట్స్పాట్స్ను ఎప్పటికప్పుడు గుర్తిస్తుంటుంది. ఆయా ప్రాంతాల్లో నమోదైన కేసులు, వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా వీటిని గుర్తిస్తుంది. మ్యాప్పై ఆ వివరాలు పొందుపరుస్తూ జియోట్యాగింగ్ చేస్తుంది. రాష్ట్రంలోని అన్ని షీ–టీమ్స్ వద్ద ఈ యాప్ అందుబాటులో ఉంది. అందులోని మ్యాప్లో ఈవ్టీజింగ్ హాట్స్పాట్స్ను నిర్దేశిస్తుంటుంది. దీని ఆధారంగా ఆయా ప్రాంతాలను తెలుసుకునే సిబ్బంది వాటిపైనే ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. కాలమాన పరిస్థితులను బట్టి ఈ హాట్స్పాట్స్ మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఉమెన్ సేఫ్టీ వింగ్ ఈ మ్యాప్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ షీ–టీమ్స్ను సమాచారం అందేలా చేస్తుంటుంది. ఆ ఫిర్యాదులన్నీ ఈ యాప్లోకి.. ఈవ్టీజింగ్ తరహాలో మహిళలపై జరిగే నేరాలు, వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులనూ ఈ యాప్లోకి తీసుకువస్తున్నారు. షీ–టీమ్స్ కేంద్రాలు, భరోస కేంద్రాలు, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ వింగ్, సైబర్ క్రైమ్... ఇలా కేటగిరీల వారీగా మహిళలు, యువతులపై జరిగే నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు రాష్ట్రంలో ఎక్కడ వచ్చినా వాటిని షీ–టీమ్స్ యాప్లో పొందుపరుస్తారు. ఫిర్యాదులోని అంశాలను బట్టి ఆయా విభాగాలకు దీన్ని బదిలీ చేస్తారు. సదరు ఫిర్యాదుపై అధికారులు, సిబ్బంది స్పందించిన తీరు, సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలు, పరిష్కరించిన విధానాలను ఈ యాప్లో పొందుపరచాల్సి ఉంటుంది. పోకిరీల వివరాలు, వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన ప్రాంతాలు, సమయం, తేదీలు ఇందులో నిక్షిప్తం అవుతాయి. వీటి ఆధారంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ పదేపదే ఈ తరహా నేరాలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసుల నమోదుకు చర్యలు తీసుకుంటోంది. -
పోకిరీ మైనర్.. అమ్మాయిల్ని వేధిస్తున్న వారిలో 11.11% వీరే
సాక్షి, హైదరాబాద్: పబ్లిక్ ప్లేసుల్లోకి వస్తున్న అతివల్ని వేధిస్తున్న పోకిరీల్లో మైనర్లు పెద్ద సంఖ్యలోనే ఉంటున్నారు. ఈ ఏడాది ఆరున్నర నెలల కాలంలో నగర షీ టీమ్స్ బృందాలు పట్టుకున్న వారిలో 11.11 శాతం వీళ్లే ఉండటం ఆందోళనకర అంశం. లాక్డౌన్ పూర్తిగా తొలగిపోయి, సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో అతివలకు వేధింపులు పెరిగే ప్రమాదం ఉందని, ఈ నేపథ్యంలోనే నిఘా ముమ్మరం చేయాలని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఆదేశించారు. షీ టీమ్స్ పని తీరుపై ఆయన బుధవారం భరోసా కేంద్రంలో విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని వివరాలు వెల్లడించారు. ► ఈ ఏడాది జనవరి నుంచి జూలై 15 వరకు షీ టీమ్స్ను మొత్తం 889 మంది బాధితులు ఆశ్రయించారు. తీవ్రత ఆధారంగా వీటిలో 97 ఫిర్యాదులను ఎఫ్ఐఆర్లుగా నమోదు చేయగా మరో 22 పెట్టీ (చిన్న స్థాయి) కేసులుగా మారాయి. ►మొత్తం 288 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 201 మందిని మందలించి విడిచిపెట్టారు. మరో 87 మందిని మాత్రం ఆయా పోలీసుస్టేషన్లకు అప్పగించారు. మిగిలిన ఫిర్యాదులను దర్యాప్తు అనంతరం వెలుగులోకి వచి్చన అంశాల ఆధారంగా మూసేశారు. ►బహిరంగ ప్రదేశాల్లో రెచి్చపోయే పోకిరీలకు చెక్ చెప్పడానికి షీటీమ్స్కు చెందిన బృందాలు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. వీటిలో పట్టుబడిన 135 మందిలో 15 మంది (11.11 శాతం) మైనర్లే ఉన్నారు. వీరికి అధికారులు భరోసా కేంద్రంలో కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ►బాధితుల్లో 41 శాతం మంది నేరుగా భరోసా కేంద్రానికి వచ్చి షీటీమ్స్కు ఫిర్యాదు చేస్తున్నారు. మిగిలిన వారిలో 30 శాతం మంది వాట్సాప్ ద్వారా, 14 శాతం మంది మెయిల్ ద్వారా, 12 శాతం మంది క్యూ ఆర్ కోడ్స్ స్కాన్ చేయడం ద్వారా, మిగిలిన వారు హాక్ఐ యాప్, ఫేస్బుక్, 100 ద్వారా ఆశ్రయించారు. ►వీటిలో 21 శాతం కేసులు ఫోన్ ద్వారా వేధింపులకు సంబంధించినవే ఉన్నాయి. 17 శాతం కేసులు నేరుగా వెంటపడి వేధించడం, 9 శాతం కేసులు పెళ్లి పేరుతో మోసాలు, 14 శాతం కేసులు బ్లాక్ మెయిలింగ్, మిగిలినవి ఫొటోల మార్ఫింగ్, ప్రాంక్ కాల్స్ తదితరాలు ఉన్నాయి. ఆధునిక టెక్నాలజీ వాడండి మహిళలపై జరుగుతున్న వేధింపుల తరహా నేరాల్లో నిందితుల్ని పట్టుకోవడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించండి. చిక్కిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోండి. బాధితురాళ్లు సైతం ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసేలా అవగాహన పెంచండి. – షీ టీమ్స్తో నగర కొత్వాల్ -
ఈ తరంలో పుట్టడం నా అదృష్టం: మిస్ ఇండియా ఎర్త్
సనత్నగర్: వజ్ర సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం మహిళా పోలీసు అధికారులని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ కొనియాడారు. కరోనా లాక్డౌన్ సమయంలో మహిళా పోలీసు అధికారులు విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని స్ఫూర్తిగా నిలిచారన్నారు. ‘షీ’టీమ్, హైదరాబాద్ పోలీసు సంయుక్తంగా బేగంపేట ఎయిర్పోర్ట్లోని ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను రెండు రోజుల ముందుగానే శుక్రవారం నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన అంజనీకుమార్ మాట్లాడుతూ మహిళా శక్తి సామర్థ్యాలను సమాజానికి తెలియపర్చాలనే ఉద్దేశ్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రెండు రోజులు ముందుగానే నిర్వహించడం జరిగిందన్నారు. మహిళలు సహనానికి ప్రతీకగా అభివర్ణించారు. ఆర్మీ, నేవీ, పారామిలటరీ, పోలీసు వంటి విభాగాల్లో ప్రత్యేక యూనిఫాం వేసుకుని మహిళలు తమ సేవలను అందించడం గర్వకారణమన్నారు. నగర పోలీసు విభాగంలో 33 శాతం మంది మహిళలు ఉన్నారన్నారు. సిటీ పోలీసు కమిషనరేట్తో పాటు హెడ్ క్వార్టర్స్కు మహిళా పోలీసులు భద్రతగా నిలుస్తున్నారన్నారు. మహిళా పోలీసు అధికారులు అందించే ఈ రకమైన సేవలు దేశంలో మరే ఇతర నగరాల్లోనూ లేవన్నారు. షీ టీమ్స్, భరోసా సెంటర్, ఐటీ సెల్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయన్నారు. నగరంలోని అన్ని పోలీస్స్టేషన్లలో మహిళా పోలీసు అధికారుల కోసం ప్రత్యేకమైన విశ్రాంతి గదులు, వాష్రూమ్లు, ఛేంజింగ్ గదులను కేటాయించామన్నారు. 2020 ఏడాది పోలీసు అధికారులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారని, ఎందరో పోలీసు అధికారులు కరోనా బారిన పడ్డారన్నారు. అందులో మహిళా అధికారులు కూడా ఉన్నారన్నారు. కరోనా బారిన పడినప్పటికీ 14 రోజుల క్వారంటైన్లో ఉండి ఆ వెనువెంటనే విధుల్లోకి చేరడం వారి అంకితభావానికి నిదర్శనంగా నిలిచిందన్నారు. మహిళా పోలీసు అధికారులైతే ఇంట్లో చిన్న పిల్లలు, పెద్దలు ఉన్నప్పటికీ కరోనా సమయంలో ఏమాత్రం వెరవకుండా అర్ధరాత్రి సైతం సేవలు అందించారని, వారందరికీ నా సెల్యూట్ అన్నారు. మార్చి 8 ఒక్కరోజు మాత్రమే కాదని, ప్రతిరోజూ మహిళా దినోత్సవమేనన్నారు. మహిళలను గౌరవించడం ప్రధాన బాధ్యత అన్నారు. ప్రత్యేక అతిథిగా హాజరైన మిస్ ఇండియా ఎర్త్, ఆల్ ఇండియాస్ బెస్ట్ క్యాడెట్ డాక్టర్ తేజస్విని మనోజ్ఞ మాట్లాడుతూ తాను ఈ తరంలో జన్మించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. నిరంతరం ప్రజాభద్రత, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్న పోలీసులు అధికారులకు ఆమె సెల్యూట్ చేశారు. ‘ఆడ పిల్లగా పుట్టినందుకు మనమందరంగా గర్వపడదాం..మార్పు కోసం ప్రయత్నిద్దాం..దేశం కోసం పాటుపడదామని’ ఈ సందర్భంగా ఆమె నినదించారు. కార్యక్రమంలో ఆదాయపన్ను శాఖ చీఫ్ కమిషనర్, నగర పోలీసు కమిషనర్ సతీమణి వసుంధర సిన్హా, ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్కుమార్, పోలీసు అదనపు కమిషనర్లు డీఎస్ చౌహాన్, జాయింట్ కమిషనర్(ఎస్బీ) తరుణ్ జోషి, నార్త్జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగనవర్, శిరీష తదితరులు పాల్గొన్నారు. చదవండి: ‘అమ్మా నన్ను కన్నందుకు’.. మేడమ్ మీవల్లే (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
35 కంపెనీలు.. 3 వేల పోస్టులు
లక్డీకాపూల్ (హైదరాబాద్): నగర మహిళల భద్రతకే కాదు.. వారి ఆర్థిక పురోభివృద్ధికి షీటీమ్ పాటుపడుతోంది. షీ టీమ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ జి.రాంరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆవరణలో దేశంలోనే తొలిసారిగా ప్రత్యేకంగా నగరమహిళల కోసమే ఏర్పాటు చేసిన జాబ్కనెక్ట్ కార్యక్రమమే అందుకు తాజా ఉదాహరణ. ఈ కార్యక్రమంలో సుమారు నాలుగు వేలమంది నగర మహిళలు పాల్గొనగా 35 కంపెనీలలో మూడు వేలమంది నిరుద్యోగ మహిళలు ఉద్యోగాలు దక్కించుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీల ప్రతినిధులు, హెచ్ఆర్ మేనేజర్లు, రిక్రూటర్లు పాల్గొని ఇంటర్వ్యూ లు నిర్వహించారు. సుమారు 3 వేల ఉద్యోగాలకు జరిగిన ఇంటర్వ్యూలలో పలువురు ఆఫర్ లెటర్లు అందుకు న్నారు. పోలీసులు, ట్రైనింగ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (టీఎంఐఎస్) సంయుక్తంగా చేపట్టిన ఈ తొలి ప్రయత్నానికి నగర మహిళల నుంచి భారీ స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ఈస్ట్జోన్ జాయింట్ సీపీ రమేశ్, అదనపు సీపీ షికాగోయెల్, షీటీమ్ అదనపు డీసీపీ శిరీష ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జాబ్కనెక్ట్ ద్వారా ఉద్యోగులు పొందిన నిరుద్యోగ యువతులు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోబోతున్న తరుణంలో ఉద్యోగాలు పొందడం ద్వారా నిరుద్యోగుల ఆనందం రెట్టింపు అవుతుందన్నారు. చదవండి: టాప్గేర్లో హైదరాబాద్ మహిళలు! ఆదర్శం నుంచి అధోగతికి! -
పల్లెల్లో షీటీమ్స్!
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రత, రక్షణ కోసం ఆరేళ్ల కిందట హైదరాబాద్ నగరంలో ప్రారంభించిన ‘షీ టీమ్స్’ అద్భుత ఫలితాలు చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మరికొన్ని పట్టణాలకూ ‘షీ టీమ్స్’ సేవలు విస్తరించాయి. ఇప్పుడు ఇదే కోవలో పల్లెల్లోని మహిళల కోసమూ ప్రత్యేక కమిటీలు ఏర్పాటుకానున్నాయి. గ్రామ, జిల్లా స్థాయిలో సామాజిక కార్యాచరణ కమిటీ(సోషల్ యాక్షన్ టీమ్)లు ఏర్పడనున్నాయి. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో అంతర్భాగంగా ఉన్న గ్రామీణ దారిద్య్ర నిర్మూలన సొసైటీ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) ఆధ్వర్యంలో ఇవి ఏర్పడనున్నాయి. జిల్లా స్థాయి కమిటీలో కలెక్టర్, ఎస్పీ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి (డీఆర్డీఓ)కీ చోటు కల్పిస్తారు. గ్రామ, మండల మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా స్థాయి కమిటీలు పరిష్కరించనున్నాయి. శిక్షణ అనంతరం క్షేత్రస్థాయి కార్యాచరణలోకి... రాష్ట్రంలోని ప్రతీ మండలంలో ముగ్గురు స్వయంశక్తి మహిళా సంఘాల సభ్యులతో సహా ఎమ్మార్వో, సబ్–ఇన్స్పెక్టర్, ఇందిరా క్రాంతి పథం ఏపీఎం, అంగన్వాడీ సూపర్వైజర్లు సభ్యులుగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా మండలాల పరిధిలోని గ్రామాల్లో స్త్రీల సమస్యల పరిశీలన, తమ దృష్టికొచ్చే సమస్యల పూర్వాపరాలు తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలను ఈ కమిటీలు తీసుకుంటాయి. ఇప్పటికే వివిధ జిల్లాల పరిధిలో పలుచోట్ల సామాజిక కమిటీలు ఏర్పడగా, విడతల వారీ పూర్తి స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు చేపట్టాక క్షేత్రస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తాయి. ఈ కమిటీల సభ్యులకు న్యాయ, చట్ట, భద్రతా, రెవెన్యూ, ఇతరత్రా అంశాలపై ఆయా రంగాల నిపుణులతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా రెండు, మూడు దశలుగా శిక్షణ కార్యక్రమాలు పూర్తికాగా వేలాది సభ్యులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించినట్లు అధికారులు తెలిపారు. గతంలో ఏర్పాటుచేసిన జెండర్ కమిటీల్లో ఉన్నవారితోపాటు, గ్రామ, మండల సమాఖ్య పాల క మండళ్ల సభ్యులనూ ఈ కమిటీల్లోనూ నియమిస్తున్నారు. అలాగే కార్యాచరణ కమిటీకి గ్రామ స్థాయిలో ముగ్గురిని అనుబంధ సభ్యులుగా నియమిస్తారు. మహిళల సమస్యలను తక్షణం గుర్తించేందుకు వీరి నియామకం ద్వారా అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. గ్రామస్థాయి నుంచి ఆయా అంశాలకు సంబంధించిన బాధ్యతలను ఈ సోషల్ యాక్షన్ టీంలు నిర్వహించనున్నాయి. ఏయే బాధ్యతలు అప్పగించనున్నారంటే.. గ్రామీణ మహిళల సాధికారత సాధన దిశలో స్త్రీల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించడం. ఆర్థిక, సామాజిక, చట్టపరమైన అంశాల్లో అండగా ఉండడం. బాల్య వివాహాలు, వరకట్న, లైంగిక వేధింపులు, గృహ హింస, మహిళల అక్రమ రవాణా నివారణ, మూఢ నమ్మకాలు అరికట్టడం యుక్త వయసు దశ దాటే వరకు అమ్మాయిలు ఎదుర్కొనే వివిధ సమస్యలు అధిగమించేందుకు ఏం చేయాలనే దానిపై ప్రత్యేక అవగాహన కల్పించడం. కౌమార దశకు వచ్చే బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యపరంగా వచ్చే మార్పులపై అవగాహన కల్పించడం. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండా అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం. అనాథలు, వితంతువుల సమస్యలు అధ్యయనం చేసి, వాటి పరిష్కారానికి అవసరమైన సహాయం అందించడం. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకునే అధికారమూ కమిటీలకే ఇవ్వాలని భావిస్తున్నారు. గ్రామీణ మహిళల రక్షణకు సోషల్ యాక్షన్ టీమ్లు -
మహిళల భద్రతకు సీఎం ప్రత్యేక శ్రద్ధ
సాక్షి, యాదాద్రి : రాష్ట్రంలోని ప్రతి మహిళ భద్రతతో ఉండేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఐఏఎస్, ఐపీఎస్లతో కూడిన కోర్ గ్రూపు కమిటీ సమావేశంలో ఆమె మహిళా భద్రత చర్యలను సమీక్షించారు. డయల్ 100, 181 తదితర హెల్ప్లైన్ వ్యవస్థల పనితీరు గురించి కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు లైంగిక వేధింపులపై ఫిర్యాదులు చేస్తే కలెక్టర్లు తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే సునీతా మహేందర్రెడ్డి మాట్లాడుతూ ఫిర్యాదులపై మహిళా రక్షణ కమిటీలు తక్షణం స్పందించినప్పుడే న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్, సీఎంఓ హరితహారం ప్రత్యేక అధికారి ప్రియాంక వర్గీస్, ఐఏఎస్ అధికారి యోగితా రాణా, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖా కమిషనర్ వాకాటి కరుణ, హైదరాబాద్, నల్లగొండ, యాదాద్రి కలెక్టర్లు శ్వేతా మహంతి, ప్రశాంత్ జీవన్ పాటిల్, అనితా రామచంద్రన్, హైదరాబాద్ షీ టీం ఇన్చార్జి అనసూయ పాల్గొన్నారు. -
షీ టీమ్స్ పనితీరు భేష్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రతపై తెలంగాణ పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన షీ టీమ్స్ పనితీరుపై 96 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన 4 శాతం మంది తాము చేసిన ఫిర్యాదుపై తీసుకున్న చర్యలను తెలపకపోవడం, ఫిర్యాదు చేసేందుకు వెళితే సరిగ్గా స్పందించలేదని చెప్పారు. ఈ గణాంకాలను పోలీస్ శాఖ మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రా శుక్రవారం వెల్లడించారు. రాష్ట్రంలో షీ టీమ్స్ సంబంధిత నేరాలపై స్పందించిన అధికారులతో ఒక్క రోజు ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించారు. రాష్ట్రంలోని షీ టీమ్స్ అధికారులు, షీ టీమ్స్కు పట్టుబడ్డ దాదాపు 120 మంది నిందితులు ఈ కౌన్సెలింగ్లో పాల్గొన్నారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ టీమ్స్ మహిళల్లో ఆత్మస్థైర్యం నింపిందని స్వాతిలక్రా పేర్కొన్నారు. షీ టీమ్స్ పనితీరుపై ప్రముఖ సంస్థ ‘సెస్’ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలో సర్వే చేయించామని వెల్లడించారు. రాష్ట్రంలో మహిళలపై వేధింపుల కేసులు, ఈవ్ టీజింగ్లపై అధికంగా వాట్సాప్, ఫోన్ల ద్వారా ఫిర్యాదులు అందుతున్నాయని, వీటిని కేసులుగా నమోదు చేసి చర్యలు చేపట్టాలని ఆదేశించా రు. కౌన్సెలింగ్లో పాల్గొన్న డీఐజీ సుమతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో షీ టీమ్స్ పనితీరుపై ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్లో షీటీమ్స్కు పట్టుపడ్డ వారిలో అధికంగా విద్యావంతులు, మేజర్లే ఉన్నారన్నారు. తప్పు చేస్తే ఎవరినీ వది లేది లేదని.. సైబరాబాద్ పరిధిలో మహిళలను వేధించిన ఘటనలో 51 ఏళ్ల వ్యక్తిపై చర్యలు తీసుకోవడమే ఇం దుకు నిదర్శనమన్నారు. కాగా, మనో చేతనకు చెందిన గీతా చల్లా ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. నవంబర్లో అధికంగా ఫిర్యాదులు నవంబర్లో షీ టీమ్స్కు రాష్ట్రవ్యాప్తంగా 464 ఫిర్యాదులు అందాయి. ఇందులో నేరుగా 151, పరోక్షంగా (వాట్సాప్, ఈ–మెయిల్, ట్విటర్, హాక్–ఐ) 313 ఫిర్యాదులు అందాయి. ఇందులో ఫోన్ ద్వారా వేధింపులు కాగా, 246 ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా వేధింపులు తదితరాలు ఉన్నాయి. వీరిలో 90 మందిని హెచ్చరించి, 82 మందికి కౌన్సెలింగ్ చేసి పంపారు. 56 మందిపై కేసులు నమోదు కాగా, 52 మందిపై పెట్టీ కేసులు నమోదు చేశారు. -
మహిళలపై గౌరవం పెంచే బాధ్యత తల్లిదే: సాయిపల్లవి
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహిళలకు సురక్షితమైన నగరమని డీఆర్డీవో శాస్త్రవేత్త డాక్టర్ టెస్సీ థామస్ అన్నారు. 33 ఏళ్లుగా ఉన్న హైదరాబాద్లో ఉన్న తాను కొంతకాలం క్రితం బెంగళూరుకు వెళ్లానని, అక్కడికి ఇక్కడికి మహిళల భద్రతలో వ్యత్యాసాలను చూడగలిగానన్నారు. సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సెల్ (ఎస్సీఎస్సీ) సంయుక్త ఆధ్వర్యంలో హైటెక్స్లోని నోవాటెల్ హోటల్లో గురువారం నిర్వహించిన ‘షీ ఎం పవర్’ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టెస్సీ థామస్ మాట్లాడుతూ... జనాభాలో మహిళలు 50 శాతం ఉన్నా దురదృష్టవశాత్తు ప్రపంచ సంపదలో ఒక శాతం వాటా మాత్రమే దక్కించుకున్నారన్నారు. పురుషుల కంటే మహిళలు మెరుగ్గా రాణిస్తున్నా అన్ని రంగాల్లో సమానం కావడమనేది కలగానే మిగిలిందన్నారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను మహిళలు సమర్థంగా ఎదుర్కోవాలన్నారు. మల్టీ టాస్కింగ్, పట్టుదల, అంకితభావం, సృజనాత్మకత, అభిరుచి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తదితర లక్షణాలను కలిగి ఉన్న మహిళలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ‘సవాళ్లనే అవకాశంగా మలచుకోవాలని, విమర్శల నుంచి నేర్చుకోవాలని, వాటిని అభివృద్ధికి బాటలు వేసే దిశగా మార్చుకోవాలన్నారు.’ తెలంగాణ ఉమెన్ అండ్ సేఫ్టీ విభాగం ఐజీ ఇన్చార్జ్ స్వాతిలక్రా మాట్లాడుతూ...చట్టాన్ని ఉల్లంఘించిన వారిని శిక్షించడంతో పాటు మార్పు తీసుకురావల్సిన అవసరముందన్నారు. మహిళల రక్షణకు షీ టీమ్స్ సేవలు విస్తరించడంతో పాటు భద్రత కోసం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ...ఆరు లక్షలకుపైగా సీసీటీవీ కెమెరాలు ఉన్న భాగ్యనగరంలో పటిష్టమైన నిఘా వ్యవస్థ భద్రతకు భరోసా ఇంస్తుందన్నారు., సేఫ్ స్టే, మార్గదర్శక్, షీ షటిల్, బాలమిత్ర, భరోసా కేంద్రాల సేవలతో భద్రతపై మరింత నమ్మకం కల్పిస్తున్నామన్నారు. కుటుంబసభ్యుల్లా భావించాలి... ఇంట్లో అక్క చెల్లెళ్లను గౌరవించినట్లుగానే వీధుల్లో వెళ్లే మహిళలను గౌరవించేలా బాలురను తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిపైనే ఉందని సినీ నటి సాయిపల్లవి అన్నారు. మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. మార్పు ఇంటి నుంచే రావాలని ఆమె పేర్కొన్నారు. దేశంలోనే మొట్టమొదటి మహిళా కమాండో ట్రైనర్ డాక్టర్ సీమారావు మాట్లాడుతూ...మన ప్రతి ఒక్కరిలో యోధుడు ఉన్నారన్నారు. ‘జీవితంలో ఏదైనా సాధించడానికి భార్యభర్తలకు పరస్పర సహకారం అవసరం. నా భర్త నాకు భర్త కంటే ఎక్కువ. అంటే జీవితంలో అంత ప్రాధాన్యం ఇస్తా. అయితే నేను మాత్రం తేలికైన పనులను ఎంచుకోకుండా జీవితంలో కష్టమైన పనులను చేయడానికే ఇష్టపడతాన’ని అన్నారు. అనంతరం మహిళల భద్రత, సాధికారత కోసం కృషి చేసిన కార్పొరేట్ సంస్థలకు సీపీ అవార్డులను ప్రదానం చేశారు. ఎస్సీఎస్సీ సహకారంతో సరికొత్త ఫీచర్లతో రూపొందించిన ‘షీ సేఫ్’ యాప్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సినీ దర్శకుడు రాజమౌళి, హీరోయిన్ రష్మికా మండోనా, టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ సెక్రటరీ ప్రవీణ్కుమార్, సోషల్ రీసెర్చ్ సెంటర్ ఎండీ డాక్టర్ రజనాకుమారి, సైబరాబాద్ ఉమెన్ అండ్ సేఫ్టీ డీసీపీ అనసూయ, ఎస్సీఎస్సీవైస్ చైర్మన్ భరణి, ప్రధాన కార్యదర్శి కృష్ణ యెదుల, జాయింట్ సెక్రటరీ ప్రత్యూష శర్మ, షీ టీమ్ ఇన్స్పెక్టర్ సునీత పాల్గొన్నారు. -
వేధింపులపై చిందు ఎత్తిన చైతన్యం
ఓ కాలేజీ అమ్మాయిని కొందరు టీజ్ చేస్తున్నారు. అమ్మాయి బెదిరిపోతున్న కొద్దీ మరింత రెచ్చిపోతున్నారు. చూడగానే తెలిసిపోయే డైరెక్ట్ అటాక్ అది. ఆఫీస్లోని ఓ మేల్ కొలీగ్ హుందాగా.. చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నట్టే కనిపిస్తాడు. కానీ... ప్రతి మాట, ప్రతి చేష్ట వెనకాల హెరాస్మెంటే. నిరూపించలేని పరోక్ష దాడి. ఈ డైరెక్ట్ అటాక్లనూ, ఇన్డైరెక్ట్ వేధింపులనూ ఎలా ఎదుర్కోవాలో రంగస్థలం సాక్షిగా ప్రదర్శిస్తున్నారు ఇద్దరు కళాకారులు. ‘ఫోరమ్ థియేటర్’, ‘ప్లే బ్యాక్ థియేటర్’తో యువతలో చైతన్యాన్ని ‘చిందు’ ఎత్తిస్తున్న సబ్రీనా ఫ్రాన్సిస్, సురేష్లది మంచి ప్రయత్నం. హైదరాబాద్... గాంధీ మెడికల్ కాలేజ్ ఆవరణ.. ఒక అమ్మాయిని కొంతమంది అబ్బాయిలు వెంటాడుతున్నారు.. వేధిస్తున్నారు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. పాపం ఆ అమ్మాయి ఎదిరించలేక ఏడుస్తోంది. ఆమె నిస్సహాయత ఆ అబ్బాయిలు మరింత రెచ్చిపోయేలా చేసింది. ఇదంతా గమనిస్తూన్న ఓ గుంపులోంచి ఒక విద్యార్థిని ‘నువ్వు రియాక్ట్ కావాలి’ అంటూ ముందుకొచ్చింది. ‘ఎలా రియాక్ట్ కావాలో మీరు చూపించండి మరి’ అడిగారు ఎవరో. అంతే ఆ అమ్మాయి ఆ రౌడీమూక ను చేరి వాళ్ల చేష్టలను నిలువరించే ప్రయత్నం మొదలుపెట్టింది. ఆ ఆకతాయిలు కూడా ఎక్కడా తగ్గకుండా ప్రతివ్యూహాలు పన్నుతూ ఇబ్బంది పెడ్తున్నారు. కాసేపటికి ఇంకో అమ్మాయి వచ్చింది గుంపులోంచి.. తనదైన పద్ధతిలో ఆ అబ్బాయిల ఆట కట్టించేందుకు. ఇలా ఓ గంట గడిచింది. తర్వాత ప్రశంసలు. ఆ పరిస్థితికి తగ్గట్టుగా తమను తాము రక్షించుకున్న ఆ అమ్మాయిల సమయస్ఫూర్తికి... ధైర్యానికి.. తెగువకు. అవును.. ఇది నాటకమే. ఈ విధానాన్ని ‘ఫోరమ్ థియేటర్’ అంటారు. ఒక కాన్ఫరెన్స్ రూమ్... పాతికమంది వరకూ ఉన్నారు. నిశ్శబ్దంగా ఉంది వాతావరణం. ఒక ఉద్యోగిని తను అనుభవించిన వెతను వెళ్లబోసుకుంటోంది. ‘నేను సింగిల్ ఉమన్ను. పెళ్లయిన యేడాదిలోపే విడాకులయ్యాయి. నన్ను తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకొనే స్వాతంత్య్రం కాని, ఆర్థిక స్థోమత కానీ అమ్మానాన్నకు లేవు. దాంతో నా చదువుకి తగ్గ ఉద్యోగాన్ని వెదుక్కుని హైదరాబాద్ వచ్చాను. నా సీనియర్తో హెరాస్మెంట్ ఎదుర్కొంటున్నాను’ అని ఆగిపోయింది ఆమె. ‘జాయినై ఆఫీస్లోకి ఎంటర్ అవగానే’ అంటూ మళ్లీ మొదలుపెట్టింది.. ‘ముందు నా కాళ్లు చూశారు.. తర్వాత మెడ. మేల్ కొలీగ్స్ దగ్గర్నుంచి హయ్యర్ ఆఫీషియల్స్(పురుషులు)వరకు. దాన్నిబట్టి నా మ్యారిటల్ స్టేటస్ అంచనావేయడం.. మ్యారేజ్ కాలేదని తెలిసాక దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడం. అందులో నా సీనియర్ సిద్ధహస్తుడు. అది ఎలా ఉంటుందంటే దాన్ని వేధింపు అని నేను రుజువు చేయలేను. అలాగని భరించనూ లేను. అతని తీరును గమనించిన ఎవరికైనా అది నా పట్ల కన్సర్న్గా.. గౌరవంగానే కనిపిస్తుంది. కాని సదరు మనిషి వ్యక్తిగతంగా నాతో మాట్లాడేటప్పుడు, నా పని గురించి అతనితో చర్చించాల్సి వచ్చినప్పుడు మాత్రమే అతని వెకిలితనాన్ని బయటపెడ్తాడు. దీనివల్ల నేను ఫ్రస్టేట్ అయిపోయి అరిస్తే నన్నో గయ్యాళిగా.. మర్యాద తెలియని మనిషిలా ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఈ సమస్యను ఎవరితో చెప్పుకున్నా నమ్మని పరిస్థితిని క్రియేట్ చేశాడు. భరించలేకపోతున్నా. ఆత్మహత్య ఆలోచనదాకా కూడా వెళ్లా’ అంటూ రెండుచేతుల్లో మొహం దాచుకొని ఏడ్చేసింది ఆమె. అంతలోనే ఆడ, మగ కలిపి పదిమందిదాక ఉన్న ఓ బృందం పోడియం దగ్గరకు చేరింది. ఆ అమ్మాయి పంచుకున్న విషయాలతో అప్పటికప్పుడు నాటకాన్ని అల్లి ప్రదర్శించడం మొదలుపెట్టారు. తాము విన్న దంతా అలా కళ్లకు కడుతుంటే ఆ సమావేశంలో ఉన్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఆ నాటకాన్ని పది రకాల పరిష్కారాలతో ఎండ్ చేశారు. ఇదే ‘ప్లే బ్యాక్ థియేటర్ ’ విధానం. ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉంది. ప్రసిద్ధికెక్కుతోంది. ‘ఫోరమ్ థియేటర్’, ‘ప్లే బ్యాక్ థియేటర్’ ఈ రెండు విధానాల ద్వారా మహిళల్లో ఆత్మస్థయిర్యం, ఆత్మరక్షణా మెలకువలను బోధిస్తున్నారు.. సబ్రీనా ఫ్రాన్సిస్, సురేష్లు తమ గ్రూప్లోని దివ్యశ్రీ, తదితర కళాకారులతో కలిసి. ఫోరమ్ థియేటర్లో ప్రేక్షకులను భాగస్వామ్యం చేస్తే, ప్లే బ్యాక్ థియేటర్లో ప్రేక్షకులు మనసు విప్పి మాట్లాడే అవకాశాన్ని కల్పించి.. వాళ్ల బాధకు నాటకరూపమిచ్చి వాళ్లే పరిష్కారం వెదుక్కునేలా చేస్తున్నారు. ‘తమకు జరిగింది బయటకు చెప్పుకుంటే చులకనగా చూస్తారని, తల్లిదండ్రులకు చెబితే చదువు మాన్పిస్తారేమోనని, భర్తకు చెబితే ఉద్యోగం వద్దంటాడేమోననే భయంతో వ్యథను అణచుకుని క్షోభననుభవిస్తుంటారు. రేప్కి కారణం అమ్మాయి వస్త్రధారణను, ప్రవర్తనను తప్పు పట్టే .. వ్యాఖ్యలు చేసే దుస్థితిలో ఉన్నాం. అలాంటి వాళ్లకు ఊరటే కాదు.. జీవితాన్ని నెగ్గే మెలకువలను నేర్పించే మాధ్యమం ఫోరమ్ థియేటర్, ప్లే బ్యాక్ థియేటర్’ అని చెప్పడమే కాదు నిరూపిస్తున్నారు కూడా సబ్రీనా, సురేష్లు. వేధింపులు, వివక్ష, హింసను ఎదుర్కోవడంలో మహిళలను చైతన్యపరిచినట్టే అబ్బాయిలు, తల్లిదండ్రుల్లోనూ జెండర్ ఈక్వాలిటీ పట్ల స్పృహను పెంచుతున్నారు ఈ రెండు నాటక ప్రక్రియలతోనే. గ్రామాలు, పట్టణాలు, స్కూళ్లు, కాలేజీలు, కార్యలయాలు ఇలా ఎక్కడైనా ప్రభుత్వ సిబ్బంది, ప్రైవేట్ యాజమాన్యాల పిలుపు మేరకు వెళ్లి ప్రదర్శనలు ఇస్తున్నారు. ‘దీనివల్ల బెరుకు, భయం పోయి పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా స్పందించాలో తెలుస్తుంది. తమను తాము కాపాడుకోవడమే కాదు ఇతరులనూ రక్షించే ధైర్యం వస్తుంది’’ అని వివరిస్తారు సబ్రీనా, సురేష్లు. వాళ్లు నేర్చుకున్న, శిక్షణ పొందిన ఈ థియేటర్ ప్రక్రియలను ఇలా జెండర్ సమస్యలను వెలుగులోకి తేవడానికే ఉపయోగిస్తున్నారు. షీటీమ్స్తో కలిసి.. గత మూడేళ్లుగా తెలంగాణ షీటీమ్స్తో కలిసి పనిచేస్తున్నారు. అందులో భాగమే హైదరాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజ్ ప్రదర్శన. షీ టీమ్స్ సారథ్యంలో కాలేజ్లు, హాస్టల్స్లో ఫోరమ్ థియేటర్ మెథడ్లో అమ్మాయిలు సమయస్ఫూర్తితో వ్యవహరించి, ఆత్మరక్షణా నైపుణ్యాన్ని పెంచుకునేలా చేస్తున్నారు. దీంతోపాటు పిల్లలు, మహిళల రక్షణ, సాధికారత మీద ఆడియో ఆల్బమ్లు, డాక్యుమెంటరీలు, షార్ట్ఫిల్మ్స్ తీస్తున్నారు. ఇవన్నీ కూడా ‘చిందు’ అనే సాంస్కృతిక వ్యక్తిత్వ వికాస కేంద్రం కింద చేస్తున్నారు. దీన్ని ఇరవై ఏళ్ల కిందట స్థాపించారు వీళ్లు. సబ్రీనా, సురేష్ ఇద్దరూ కళాకారులే. డాన్స్, సంగీతం, డ్రామా.. ఈ మూడింటిలో నిపుణులు. ఒక వర్క్షాప్లో ఒకరికొకరు పరిచయమయ్యారు. ఇద్దరి అభిరుచులు, లక్ష్యాలు ఒకటే అని అర్థమయ్యాక కలిసి పనిచేస్తే బాగుంటుందని ‘చిందు’ను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఈశాన్య రాష్ట్రాలు సహా దేశమంతా ప్రదర్శనలిస్తుంటారు. విదేశీ వేదికల మీదా వీళ్ల ప్రతిభకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ప్లే బ్యాక్ థియేటర్లో పట్టభద్రులైన ఈ ఇద్దరు డ్రామా థెరపి, సైకోడ్రామా, థియేటర్ అప్రెస్డ్ అనే విధానల్లోనూ శిక్షణ పొందారు. అంతేకాదు యూకేలోని టావిస్టాక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్లోనూ ట్రైనింగ్ తీసుకున్నారు. జెండర్ సమస్యలు, జెండర్ స్పృహకు సంబంధించి వీరి కళాసహాయం కావాలనుకునే వారు ఈ నంబర్లో సంప్రదించవచ్చు.. 9849091717. -
రోమియోకు కటకటాలు!
సాక్షి, సిటీబ్యూరో: మహిళలు, యువతులకు ఎదురయ్యే వేధింపులను షీ–టీమ్స్ సీరియస్గా తీసుకుంటున్నాయి. ఓ రోడ్ సైడ్ రోమియోతో పాటు మరో పోకిరీని పట్టుకున్న షీ బృందాలు వారిని కోర్టులో హాజరుపరిచాయి. పూర్వాపరాలు పరిశీలించిన న్యాయస్థానం వీరికి జైలు శిక్ష విధించినట్లు అదనపు సీపీ షికా గోయల్ సోమవారం తెలిపారు. నిఘా విధుల్లో భాగంగా షీ–టీమ్స్ బృందాలు సంతోష్నగర్లోని ఓ జూనియర్ కాలేజీ వద్ద కాపుకాశాయి. అదే సమయంలో రెయిన్బజార్ పరిధిలోని యాకత్పుర కాలనీకి చెందిన మహ్మద్ ఖాజా మొయినుద్దీన్ ఆతిఫ్ తన బైక్పై అక్కడికి వచ్చి పదేపదే ఆ కళాశాల వద్ద రౌండ్లు వేయడం మొదలెట్టాడు. దీనిని గుర్తిచిన షీ–టీమ్స్ అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతడికి నాలుగు రోజుల జైలు, రూ.200 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. అలాగే ఓ మహిళను నేరుగా,ఫోన్ ద్వారా వేధిస్తున్న నాగోలు జైపురికాలనీకి చెందిన బి.వెంకటేష్ను సైతం షీ–టీమ్స్ పట్టుకున్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని కోర్టులో హాజరుపరిచాయి. ఇతడికి న్యాయస్థానం ఐదు రోజుల జైలు, రూ.200 జరిమానా విధించింది. -
మహిళా హాస్టళ్లకు మరింత భద్రత
సాక్షి, హైదరాబాద్: నగరంలో కుప్పలు తెప్పలుగా లేడీస్ హాస్టళ్లు వెలుస్తున్నాయి. వీటిలో అధికశాతం హాస్టళ్లకు సరైన అనుమతులు ఉండవు. ఎలాంటి భద్రతా ప్రమాణాలూ పాటించవు. పార్కింగ్, ఫైర్సేఫ్టీ, ఫుడ్ విషయంలోనూ మెజారిటీ యాజ మాన్యాలు నిబంధనలను అమలు చేయడం లేదు. చాలామంది యాజమాన్యాలకు తమ హాస్టళ్లలో ఉండే మహిళలు, విద్యార్థినుల సంఖ్య, వారి చిరు నామాలు కూడా తెలియవు. ఇలాంటి హాస్టళ్లలో ఉండే వారికి భద్రత పెంచాలన్న సంకల్పంతో తెలంగాణ విమెన్సేఫ్టీ వింగ్ సరికొత్త కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని లేడీస్ హాస్టళ్లపైనా దృష్టి సారించింది. అన్ని జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో కలిపి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 వేలకుపైగానే ఈ లేడీస్ హాస్టళ్లు ఉంటాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. కేసులైనప్పుడు ఇబ్బందులు.. లేడీస్ హాస్టళ్లలో వర్కింగ్ విమెన్స్, విద్యార్థినులు అదృశ్యమైనా, ఆత్మహత్యలకు పాల్పడినా.. వారిని ఎవరైనా వేధించినా, ఆ విషయం పోలీసుల దృష్టికి రావడంలో తీవ్రజాప్యం నెలకొంటోంది. నగలు, స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్టు వంటివి చోరీ అయినా.. చాలామంది తమ ఊరు కాదు కాబట్టి అస్సలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడంలేదు. ఇంట్లో వారి సంరక్షణ నుంచి హాస్టల్లోకి వచ్చాక సహజంగానే వారి సంరక్షణ యాజమాన్యాలు తీసుకోవాలి. కానీ చాలా తక్కువ హాస్టళ్లు మాత్రమే అలా చేస్తున్నాయి. చాలా హాస్టళ్లు డబ్బులు తీసుకున్నాక విద్యార్థుల బాగోగులు పట్టించుకోవడం లేదు. అందుకే ఇకపై అన్ని హాస్టల్ యాజమాన్యాలతో కలిపి ఓ రిజిస్టర్ను రూపొందించాలని విమెన్సేఫ్టీ వింగ్ నిర్ణయించింది. ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేసి, స్థానిక పోలీసుల సాయంతో దశలవారీగా ఈ రిజిస్టర్ రూపొందిస్తారు. అందులో హాస్టల్ యజమాని పేరు, అనుమతులున్నాయా? ఫైర్సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నారా? విద్యార్థుల చిరునామాలు సేకరించారా? సీసీ కెమెరాలు, పార్కింగ్ తదితర విషయాల్లో ప్రమాణాలకు లోబడి ఉన్నారా? లేదా? ఎలాంటి ఆహారం పెడుతున్నారు? అన్న విషయాలు పొందుపరుస్తారు. అంతేగాకుండా ఈ అన్ని హాస్టళ్ల విద్యార్థులకు ఆపదలు ఎదురైనపుడు ఎలా ఎదుర్కోవాలి? ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలి? పోకిరీ వేధింపులు, సైబర్ వేధింపులు ఎదురైనపుడు ఎలా వ్యవహరించాలి? తదితర విషయాలపై షీటీమ్స్ ఆధ్వర్యంలో పూర్తి అవగాహన కల్పిస్తారు. ముందుగా భాగ్యనగరంలోనే.. ఈ రిజిస్టర్ అమలు తొలుత హైదరాబాద్ కమిషనరేట్లోనే మొదలుకానుంది. ముందుగా అమీర్పేట, ఎస్సార్ నగర్ ఏరియాల్లో ప్రారంభించనున్నారు. ఈ రెండు ప్రాంతాల్లోనే దాదాపు 3 వేల హాస్టళ్లు ఉంటాయని పోలీసుల అంచనా. ఇక హైదరాబాద్ కమిషనరేట్, సైబరాబాద్, రాచకొండ ఏరియాలు కలిపితే 10 వేల వరకు హాస్టళ్లు ఉంటాయని సమాచారం. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి మరో 5 వేలు అంటే మొత్తం 15 వేల వరకు హాస్టళ్లు ఉంటాయని, అన్నింటి పూర్తి వివరాలు సేకరించాలని విమెన్సేఫ్టీ వింగ్ నిర్ణయించింది. దర్యాప్తులో ఇబ్బందులు తొలగించేందుకే: సుమతి, ఎస్పీ, విమెన్సేఫ్టీ వింగ్ చాలామంది హాస్టల్ నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదు. తమ హాస్టల్లో ఉండేవారి వివరాలు కూడా సరిగా నమోదు చేయడం లేదు. ఇలాంటి కారణాల వల్ల మిస్సింగ్ కేసులు, చోరీ కేసుల దర్యాప్తులో పోలీసులకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. తల్లిదండ్రులకు దూరంగా ఉన్న చాలామంది తమకు వేధింపులు ఎదురైనా మౌనంగా భరిస్తున్నారు. ఇకపై ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నదే మా లక్ష్యం. హాస్టల్లో ఉండే ఆడవారి రక్షణ మా ధ్యేయం: స్వాతి లక్రా, ఐజీ, విమెన్సేఫ్టీ వింగ్ తల్లిదండ్రులకు దూరంగా ఉన్న ఆడవారి భద్రతే మా ధ్యేయం. ఇలా హాస్టళ్లలో ఉండే చాలామంది వేధింపులు ఎదుర్కొంటున్నా.. వాటిని అటు ఇంట్లోనూ, ఇటు పోలీసులకూ తెలియపరచడం లేదు. దీన్ని అలుసుగా తీసుకుని పోకిరీలు మరింత చెలరేగుతున్నారు. అందుకే ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా షీటీమ్స్ని ఆశ్రయించేలా వారికి చట్టాలపై అవగాహన కల్పిస్తాం. అందుకే ఈ రిజిస్టర్ రూపొందించే ప్రయత్నాలు మొదలుపెట్టాం. -
8 రోజులు.. నిద్రలేని రాత్రులు
సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరును తలదన్నుతూ ఐటీ రంగంలో దూసుకుపోతోందనే పేరు... మహిళల భద్రత కోసం షీ–టీమ్స్తో పాటు ప్రత్యేక షటిల్స్ ఏర్పాటు చేసిన ఘనత... ఐటీ ఇండస్ట్రీకి హబ్గా ప్రఖ్యాతి... ఇలా సజావుగా సాగుతున్న సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ ఇమేజ్ను దిశ ఉదంతం డ్యామేజ్ చేసింది. గత నెల 28న ఈ ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కమిషనరేట్ పరిధిలోని పోలీసులందరూ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. తుండుపల్లి టోల్ప్లాజా సమీపం నుంచి దిశను ముష్కరులు కిడ్నాప్ చేయడం, అత్యాచారానికి ఒడిగట్టడంతో పాటు మృతదేహాన్ని తమ లారీలోనే దాదాపు 30 కిలోమీటర్లు తీసుకెళ్లడం, పెట్రోల్ బంక్కు వెళ్లిన ఓ నిందితుడు పెట్రోల్ ఖరీదు చేసుకుని వెళ్లడం, చటాన్పల్లి బ్రిడ్జి కింద మృతదేహాన్ని కాల్చేయడం తదితర సంఘటనలు చోటు చేసుకున్నాయి. గత నెల 29న పోలీసులు నిందితులను అరెస్టు చేసిన తర్వాత ఈ వివరాలన్నీ వారి విచారణలోనే వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రజల్లో తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఇది సైబరాబాద్ పోలీసులపై మరింత ఒత్తిడి పెరగడానికి కారణమైంది. దీనికితోడు గత నెల 27న అర్ధరాత్రి దిశ మిస్సింగ్ వ్యవహారానికి సంబంధించి ఆమె కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించగా వారికి చేదు అనుభవం ఎదురైంది. పరిధుల పంచాయితీ పెట్టిన రెండు ఠాణాల అధికారులు అటు ఇటు తిప్పి తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం సైబరాబాద్ ప్రతిష్టను మరింత దిగజార్చింది. ఈ డ్యామేజ్ను కవర్ చేసుకునేందుకు ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసినా ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో పోలీసు బాస్లతో సహా అంతా తీవ్ర నిరాశా నిస్ఫృహలకు లోనయ్యారు. నిందితులను అరెస్టు చేసినప్పటికీ ప్రజల నుంచి సానుకూల స్పందన రాకపోగా, వారిని తక్షణం శిక్షించాలని, వెంటనే ఎన్కౌంటర్ చేయాలంటూ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులు షాద్నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు తెలియడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని నిరసనలు తెలిపారు. ఓ దశలో పోలీసులు లాఠీచార్జ్ సైతం చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చివరకు పోలీసులు నిందితులను కోర్టుకు కూడా తరలించలేని పరిస్థితిలో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ను పోలీస్ స్టేషన్కే పిలిపించి ఆయన ముందు హాజరుపరచాల్సి వచ్చింది. వీటన్నింటికీ మించి దిశ హత్యాచారం కేసు దర్యాప్తు పోలీసులు పెద్ద సవాల్గా మారింది. సీసీ కెమెరాల ఫుటేజీలు, సాకు‡్ష్యల వాంగ్మూలాలు, పరిస్థితులను బట్టి నిర్ధారించే సర్కమ్స్టాన్సియల్ ఎడివెన్స్లు తప్ప ఈ కేసులో ఎలాంటి కీలక ఆధారాలు పోలీసులకు చిక్కలేదు. కిడ్నాప్, అత్యాచారం, హత్య.. ఇవి జరుగుతున్నప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షులు లేకపోవడం, హతురాలి శరీరం కాలిపోవడంతో స్వాబ్స్ వంటివి సేకరించే పరిస్థితి లేదు. ఈ పరిణామాలతో కేసు కోర్టులో ఎంత వరకు నిలుస్తుందనే సందేహం వచ్చింది. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకునేవదుకు కోర్టు అనుమతించినా... ఇతర కేసుల మాదిరిగా బహిరంగంగా తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఆద్యంతం ఫార్మాలిటీస్ను కూడా అత్యంత రహస్యంగా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పూర్తి చేయాల్సి వచ్చింది. ఇవన్నీ వెరసి గడిచిన ఎనిమిది రోజులు సైబరాబాద్ పోలీసులు నిద్రాహారాలు మరిచిపోయారు. ఎట్టకేలకు నిందితులను గురువారం అర్ధరాత్రి చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి తమ కస్టడీలోకి తీసుకున్నారు. హతురాలికి సంబంధించిన వస్తువులు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకునేందుకు శుక్రవారం తెల్లవారుజామున ఘటనాస్థలాలకు తీసుకెళ్లారు. చటాన్పల్లి వద్ద సెల్ఫోన్ కోసం గాలిస్తుండగా నిందితులు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల వద్ద ఉన్న తుపాకులు లాక్కుని కాల్పులకు యత్నించారు. ఈ పరిస్థితుల్లో జరగరానిది ఏదైనా జరిగితే సైబరాబాద్ ఇమేజ్ మరింతగా డ్యామేజ్ అవుతుందని భావించిన పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరపడంతో నలుగురు నిందితులూ అక్కడికక్కడే హతమయ్యారు. ఈ ఎన్కౌంటర్ స్పాట్ దిశ మృతదేహాన్ని కాల్చిన ప్రాంతానికి సమీపంలో ఉండటంతో ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఫలితంగా సైబరాబాద్ పోలీసులు గతానికి మించిన ఫైర్బ్రాండ్ ఇమేజ్ సొంతమైంది. -
పోకిరి మారట్లే!
సాక్షి,సిటీబ్యూరో: నూనూగు మీసాలు రాని కుర్రాడు బాలికను అటకాయిస్తున్నాడు..విచ్చలవిడిగా తిరుగుతూ కంటి చూపుతో ఇబ్బంది పెడుతున్నాడు. ఒకేచోట పనిచేస్తున్న సహోద్యోగినిని ఫాలో అవుతూ పురుషులు వేధిస్తున్నారు.. జుట్టు నెరిసి.. వయసు మళ్లిన ఇంకొందరు పెద్దమనుషులు మహిళల అవసరాలను ఆసరాగా చేసుకుని వికృతంగా ప్రవర్తిస్తున్నారు. భయపడి కొందరు.. ఎవరికీ చెప్పుకోలేక ఎందరో మహిళలు, యువతులు, బాలికలు వేధింపులను మౌనంగానే భరిస్తున్నారు. కొందరు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అలా ఈ ఏడాది 11 నెలల్లో సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో 1,247 మంది ఈవ్ టీజర్లను షీ బృందాలు పట్టుకున్నాయి. అంటే నెలకు సగటున 113 వేధింపుల కేసులు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఓవైపు ఆకతాయిల ఆట కట్టిస్తున్న షీ బృందాలు ఇటు బాలికలు, అటు బాలురకు అవగాహన సదస్సులు సైతం నిర్వహించి వారి ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాయి. ఆపద, వేధింపులు ఎదురైనప్పుడు ఏం చేయాలన్న దానిపై బాలికలు స్పష్టత ఇస్తూనే.. అమ్మాయిలను వేధిస్తే కుర్రాళ్ల కెరీర్ ఎలా పాడైపోతుందో.. సమాజంలో ఎంత చులకనగా మారిపోతారో చెబుతూ పోలీసులు సుతిమెత్తగా హెచ్చరిస్తున్నారు. ఇలా ఈ ఏడాది 11 నెలల్లో రెండు కమిషనరేట్లలో నాలుగు వేలకు పైగా శిబిరాలు ఏర్పాటు చేసి 6 లక్షల మందిని జాగృతి చేశారు. ఈవ్ టీజర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్న పోలీసులు ఫోన్తోనే పట్టించేస్తున్నారు.. బస్టాప్లు, ఆటో స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లతో పాటు, పనిచేసే ప్రాంతాలు, విద్యాసంస్థలు.. ఇలా ఏ ప్రాంతమైనా సరే బాలికలు, యువతులు, మహిళలను వేధిస్తే షీ బృందాలను ఆశ్రయించాలని చేస్తున్న విస్తృత ప్రచారం బాగానే పనిచేస్తోంది. పోలీసు స్టేషన్లలో నేరుగా వచ్చి ఫిర్యాదు చేసేందుకు ఇబ్బంది అనిపిస్తే వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, మెయిల్, హాక్ఐ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని యువతులను చైతన్యం చేస్తున్న తీరు బాగానే పనిచేస్తోంది. ఇందుకనుగుణంగా వాట్సాప్, ఫేస్బుక్, ఈ–మెయిల్, ట్విట్టర్, డయల్ 100 ద్వారా మహిళల ఫిర్యాదుల శాతం పెరిగింది. అయితే ఫిర్యాదు అందిన వెంటనే మఫ్టీలో రంగంలోకి దిగుతున్న షీ బృందాలు అక్కడికి చేరుకొని ఆకతాయిల వెకిలి చేష్టలను వీడియో తీసి సాక్ష్యాలతో కోర్టుకు సమర్పిస్తుండడంతో నిందితులు కటకటాలపాలవుతున్నారు. మేజర్లు, మైనర్లు కూడా.. జంట కమిషనరేట్లలో ఇప్పటి దాకా షీ బృందాలకు చిక్కివారిలో ఎక్కువగా 1,057 మంది మేజర్లుంటే, 190 మంది మైనర్లు ఉన్నారు. చిన్నప్పటి నుంచి సమాజంలోని స్త్రీల పట్ల గౌరవం పెంచేలా తలిదండ్రులు, గురువులు చొరవ చూపకపోవడం వల్లనే ఆకతాయిలుగా మారుతున్నారని షీ బృందం ఇచ్చే కౌన్సెలింగ్లో తేటతెల్లమవుతోంది. వయసుల వారీగా పరిశీలిస్తే ఎక్కువగా కౌమార దశలో ఉన్న విద్యార్థులు, యువకులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మనవడు, మనవరాళ్లతో హాయిగా గడపాల్సిన సీనియర్ సిటిజన్లు కూడా మహిళలను వేధించడం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోందని పోలీసులు, కౌన్సిలర్లు అంటున్నారు. ఆ కుటుంబాల పిల్లలే ఎక్కువ యువతులను వేధిస్తూ షీ బృందాలకు పట్టుబడుతున్నవారిలో ఎక్కువగా తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేసే కుటుంబాల్లోని పిల్లలే ఉంటున్నారు. పిల్లలపై వీరి పర్యవేక్షణ తక్కువగా ఉండడంతో దారి తప్పుతున్నారని కౌన్సిలింగ్లో గుర్తిస్తున్నారు. ఉదయం పిల్లలను స్కూలు, కాలేజీలకు పంపిన తర్వాత విధులకు వెళ్లే భార్యాభర్తలు.. తిరిగి వచ్చేసరికి రాత్రి దాటుతోంది. ఈ మధ్య పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు.. ఎక్కడెక్కడ తిరుగుతున్నారు.. సెల్ఫోన్తో ఏం చేస్తున్నారనే విషయాలు కన్నవారు దృష్టి పెట్టలేకపోతున్నారు. దీంతో ఆ తరహా పిల్లలు ఈవ్ టీజర్లుగా మారుతున్నారు. ఇటువంటి కుటుంబాలు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.– అనసూయ,సైబరాబాద్ షీ–టీమ్స్ ఇన్చార్జి -
భరించొద్దు.. చెప్పుకోండి
‘‘ఇటీవల ప్రభుత్వ పాఠశాలలో ఓ బాలిక గర్భం దాల్చడం తీవ్ర కలకలం రేపింది. ఆ బాలిక శరీరంలో వస్తున్న మార్పుల్ని గమనించిన ఉపాధ్యాయులు వైద్యపరీక్షలు చేయించడంతో ఈ విషయం వెలుగుచూసింది’’. ‘‘స్కూలుకు వెళ్లే దారిలో ఓ బాలికను రోజూ పోకిరీ వేధిస్తున్నాడు. ఇంట్లో చెబితే తల్లిదండ్రులు కూడా తననే తిట్టడంతో బాలిక లోలోన కుమిలిపోతోంది’’. సాక్షి, హైదరాబాద్: ఇలాంటి ఘటనలకు చరమగీతం పాడాలని తెలంగాణ పోలీసులు నిర్ణయించారు. త్వరలోనే ప్రభుత్వ పాఠశాలల్లోనూ షీ–టీమ్స్ కౌన్సెలర్లను నియమించాలని వుమెన్ సేఫ్టీ వింగ్ నిర్ణయించింది. ఐదేళ్లలో వేలాది కేసులను పరిష్కరించిన షీ–టీమ్స్ ఇప్పటిదాకా మహిళలు, ఉద్యోగినులు, వర్సిటీ విద్యార్థులకు మాత్రమే అవగాహన కల్పించింది. కానీ, విస్తరిస్తోన్న స్మార్ట్ఫోన్ల సంస్కృతి, సినిమాలు టీనేజీ పిల్లల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. వారు చేజేతులారా తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు తమకు జరుగుతున్న వేధింపులను ఎవరికి చెప్పాలో తెలియక మానసికంగా కుంగిపోతున్నారు. అలాంటి దుస్థితికి చెక్పెట్టాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. కౌన్సెలర్లు ఏం చేస్తారు? రాష్ట్రంలోని కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాల ఆధ్వర్యంలో ‘షీ–టీమ్స్’బృందా లు 300కుపైగా నిత్యం మహిళల రక్షణలో తలమునకలవుతున్నాయి. ఐదేళ్ల కాలంలో 33,687 కేసులను ఈ బృందాలు పరిష్కరించాయి. ఇక నుంచి వీరికి కౌన్సెలర్లు తోడు కానున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 17,75,409 మంది బా లికలు ఉన్నారు. వీరందరికీ సైబర్, ఫోన్స్, సోషల్మీడి యా తదితర వేధింపులు వ చ్చినపుడు ఎలా స్పందించా లి? షీ–టీమ్స్ను ఎలా సం ప్రదించాలో కౌన్సెలర్లు అవగాహన కల్పిస్తారు. మౌనం వీడితేనే.. బాలికలపై జరుగుతున్న వేధింపుల్లో చాలామటుకు వెలుగులోకి రావడం లేదు. విద్యార్థినులు మౌనం వీడాలి. వేధింపులను భరించాల్సిన అవసరం లేదు. టీనేజీలో పిల్లల మనసు సున్నితమైంది. ఈ సమయంలోనే వారికి ధైర్యంగా జీవించడం నేర్పాలి. మనోనిబ్బరం, ఆత్మస్థైర్యం, పెంచేందుకు మా కౌన్సెలర్లు కీలకపాత్ర పోషిస్తారు. – స్వాతి లక్రా, ఐజీ, వుమెన్స్ సేఫ్టీ వింగ్ -
ప్రజలకు చేరువైన ‘షీ–టీమ్స్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ఐదేళ్ల కిందట ఏర్పాటు చేసిన షీటీమ్స్ అద్భుత ఫలితాలు సాధిస్తూ ప్రజలకు చేరువైందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం హైదరా బాద్లోని శిల్పకళావేదికలో జరిగిన షీటీమ్స్ ఐదో వార్షికోత్సవం వేడు కలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మహమూద్ అలీ మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న నేరాల నివారణలో షీ–టీమ్స్ సాధించిన విజయాలు వారి పనితీరుకు నిదర్శనమన్నారు. మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. పాఠశాల, ఇంటర్ విద్యార్థులకు సైతం షీ టీమ్స్పై అవగాహన కల్పించాలని సూచించారు. మరో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. నేరాలను తగ్గిస్తూ.. నిందితుల్లో పరివర్తన కోసం కౌన్సెలింగ్ చేస్తోన్న షీ–టీ మ్స్ విధానాన్ని ప్రశంసించారు. డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. నేడు దేశంలోని పలు మెట్రో నగరాల్లో షీటీమ్స్ను స్ఫూర్తిగా ప్రత్యేకదళాలను ఏర్పాటు చేస్తుండటం ఆనందంగా ఉందన్నారు.షీ–టీమ్స్ అధిపతి, ఐజీ స్వాతి లక్రామాట్లాడుతూ.. చికిత్స కంటే నివారణ మేలన్న నినాదంతో తాము ముందుకెళ్తున్నామన్నారు. యువతను సన్మార్గంలో నడిపించడమే తమ ధ్యేయమన్నారు. -
అతివకు అండగా ఆమె సేన
ఆదిలాబాద్లోని మారుమూల ప్రాంతంలో పోకిరీల వేధింపులపై యువతి ఫోన్ చేయగానే.. 10 నిమిషాల్లో ఘటనాస్థంలో చేరుకుని ఆకతాయిల భరతం పట్టి ఆ యువతిని సురక్షితంగా ఇంటికి చేర్చింది ‘షీ టీమ్’. హైదరాబాద్లోని మాదాపూర్లో ఉత్తర భారతదేశానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తాను అర్ధరాత్రి 2 గంటలకు సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా ఇంటికి చేరుకోగలుతుంది. ఆ యువతి వెనుక ధైర్యం ‘షీ టీమ్’. సాక్షి, హైదరాబాద్: మహిళ అర్ధరాత్రి సమయంలోనూ స్వేచ్ఛగా రోడ్డుమీద నడిచే పరిస్థితి ఉన్నప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లన్న మహాత్మా గాంధీ మాటల స్ఫూర్తిగా ఆకతాయిల ఆటకట్టి అతివలకు అండగా ఉండేందుకు ఏర్పడిన షీ టీమ్ (ఆమె సేన) ఇప్పుడు ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ ఐదేళ్లలో ఎంతోమంది మహిళల్ని లైంగిక వేధింపుల నుంచి, యువతుల్ని ఈవ్టీజింగ్ నుంచి రక్షించింది. షీ టీమ్ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు ఈ ఐదేళ్లలో వచ్చి చేరాయి. వేయి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలుపెడతాం అన్నట్లుగా ఐదేళ్ల క్రితం నగరంలో మహిళల రక్షణకు మొదలుపెట్టిన ఆమె సేన.. నేడు రాష్ట్రవ్యాప్తంగా తన సేవలను విస్తరించింది. 33 జిల్లాల్లో 300 పైగా షీ టీమ్స్ మహిళలకు భద్రత కల్పిస్తున్నాయి. 2015, అక్టోబరు 24న అప్పటి డీజీపీ అనురాగ్శర్మ ఆధ్వర్యంలో తెలంగాణ పోలీసులు మహిళల రక్షణ కోసం హైదరాబాద్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన షీటీమ్స్ నేడు రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. నగరంలోని మూడు కమిషనరేట్లలో షీటీమ్స్ ఇచ్చిన ప్రేరణే ఇందుకు కారణం. ఇపుడు వేలాది కేసులు, ఫిర్యాదులతో ప్రజలకు ముఖ్యంగా విద్యార్దినులు, మహిళలకు చేరువైంది. అన్నివర్గాల ప్రశంసలు అందుకుంటోంది. పొరుగు రాష్ట్రాలకు స్ఫూర్తిగా.. మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా పనిచేసే షీటీమ్స్ కేవలం కేసుల నమోదుకే పరిమితమవలేదు. వేధింపులు జరిగినపుడు ఎలా ఎదుర్కోవాలి? ఆపద సమయాల్లో ఎలా వ్యవహరించాలి? అన్న విషయాలపై వివిధ కార్యక్రమాల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. రోజూ రాష్ట్రవ్యాప్తంగా కనీసం 70 నుంచి 80 అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండటం షీటీమ్స్ పనితీరుకు నిదర్శనం. ఈ ఫలితాలు చూసి పొరుగు రాష్ట్రం ఏపీ తరువాత దేశంలోని అన్ని మెట్రోనగరాల్లో షీటీమ్స్ సేవలు ప్రవేశపెట్టేలా స్ఫూర్తిగా నిలిచింది. ఇప్పుడు ప్రత్యేక సాఫ్ట్వేర్తో కేసులను నిరంతరం పర్యవేక్షిస్తుండటం గమనార్హం. వేధింపులు ఎక్కువగా జరిగే ప్రదేశాల(హాట్స్పాట్లు)ను గుర్తించి అందుకు అనుగుణంగా పోలీసుల మోహరింపు చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసు కళా బృందాలు షీటీమ్స్పైనా ప్రచారం చేస్తుండటంతో ఫిర్యాదులు పెరుగుతున్నాయి. మొత్తం ఫిర్యాదుల్లో సోషల్ మీడియా ద్వారానే అధికంగా వస్తుండటం గమనార్హం. ఆఫీస్లు, స్కూళ్లు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో పనిప్రదేశాల్లో చేస్తోన్న అవగాహన కార్యక్రమాలు మహిళలపై వేధింపుల సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు షీటీమ్స్ పోలీసులు నమోదు చేసే పెట్టీ కేసులను సైతం సీసీటీఎన్ఎస్ (క్రైమ్ అండ్ క్రిమినల్ నెట్వర్కింగ్ సిస్టమ్)తో అనుసంధానిస్తున్నారు. -
ఎక్కడికి పోతావు చిన్నవాడా!
సాక్షి, హైదరాబాద్: ‘చెరపకురా చెడేవు..’అనేది నానుడి. ‘ఏడిపించకురా ఏడిచేవు..’అన్నది ’న్యూ’నుడి. ఆడపిల్లలను వేధించే పోకిరీలకు షీ టీమ్స్ పరోక్షంగా ఇచ్చే సందేశం ఇదే. మఫ్టీలో సేఫ్టీ.. పెట్టీ కేసులు.. ఆనక ‘పిడి’కిలి.. ఇదీ షీటీమ్స్ వ్యూహం. మహిళారక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీ–టీమ్స్ నిఘా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. 2014లో హైదరాబాద్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ‘షీ–టీమ్స్’మంచి ఫలితాలు ఇస్తున్నాయి. మహిళలు, బాలికలు, యువతులు, విద్యార్థినులను వేధిస్తున్న ఘటనలపై 100కు డయల్, ఫోన్, వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదులకు నిమిషాల్లోనే స్పందిస్తున్నాయి. షీటీమ్స్ను క్రమంగా తెలంగాణలోని 33 జిల్లాలకు విజయవంతంగా విస్తరించారు. తొలిసారి తెలిసీ తెలియకుండా ఆడవారిని వేధించేవారిని హెచ్చరించి, కౌన్సెలింగ్ ఇచ్చి విడిచిపెడతారు. కావాలని ఏడిపించినవారిపై పెట్టీ కేసులు పెడుతున్నారు. మరింత తీవ్రమైన నేరం చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు పంపుతున్నారు. పదేపదే నేరాలను పునరావృతం చేసినవారిపై ప్రివెంటివ్ డిటెన్షన్(పి.డి.)యాక్ట్ అమలుకు సిద్ధమవుతున్నారు. కేసుల రికార్డు నిర్వహణకు షీ సాఫ్ట్వేర్ను రూపొందించారు. ప్రత్యేకంగా ఆన్లైన్లో సరి్టఫికెట్ కోర్సు కూడా నిర్వహిస్తున్నాయి. నివారణమార్గాలు వెతుకుతున్నాం ఆడవారిని ఏడిపించడం, ఇబ్బంది పెట్టడం అనే దానిని కేవలం సామాజిక సమస్యగానే కాదు, మానసిక, ఆరి్థక, సాంస్కృతిక కోణాల్లోనూ పరిగణిస్తున్నాం. సమస్య తలెత్తాక స్పందించడం కంటే నివారణ మార్గాలు వెతుకుతున్నాం. పకడ్బందీ నిఘావ్యవస్థను ఏర్పాటు చేశాం. ఎన్జీవోలు, మానసిక నిపుణులతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. – స్వాతి లక్రా, ఐజీ, విమెన్ సేఫ్టీ వింగ్ నిమిషాల్లో వాలిపోతాం 33 జిల్లాల్లో మా బృందాలు చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఆడవారిని ఏడిపించాలనుకున్న వారు ఎక్కడున్నా.. మా నిఘాను దాటిపోలేరు. కేసు నమోదు దగ్గర నుంచి నిందితులకు శిక్ష పడేంత వరకు నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది.– సుమతి, ఎస్పీ(సీఐడీ), విమెన్ సేఫ్టీ వింగ్ -
‘షీ టీమ్స్ ఆధ్వర్యంలో 8,055 కేసులు’
సాక్షి, హైదరాబాద్: మహిళలను వేధిస్తున్న వారిపై షీ టీమ్స్ ఆధ్వర్యంలో 8,055 కేసులు నమోదు చేసినట్లు హోం మంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. ఇందులో 2,554 ఎఫ్ఐఆర్ కేసులేనని శాసనసభకు తెలిపారు. టీఆర్ఎస్ సభ్యులు పద్మాదేవేందర్, గొంగిడి సునీత, రేఖా నాయక్లు ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో షీ టీమ్స్ పనిచేస్తున్నాయని, కొత్తగా ఏర్పడ్డ జిల్లా కేంద్రాలకు వాటిని విస్తరించినట్లు తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతికి సంబంధించి భట్టి విక్రమార్క ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. -
భరోసా!
సాక్షి, సిటీబ్యూరో: ‘ఓ యువతి ఒంటరిగా నడిచి వెళ్తుంటే వెకిలి చేష్టలతో వేధించే పోకిరీలు.. బస్టాపుల వద్ద కాపుకాసి అసభ్యంగా సైగలు చేసే ఆకతాయిలు.. అవకాశం కల్పించుకుని రెచ్చిపోయే మృగాళ్లు’.నగరంలోని మహిళలు ప్రతి రోజు ఎక్కడోచోట ఎదుర్కొనే సంఘటనలు. ఓ నేర దుర్ఘటనలో బాధితురాలు సహాయం కోసం పోలీస్ స్టేషన్, ఆస్పత్రి సహా అనేక ప్రాంతాల చుట్టూతిరుగుతూ విసిగి వేసారిపోవాల్సి వచ్చేది. లైంగిక వేధింపుల బారినపడిన బాల/బాలికలు తమకు న్యాయం జరిగే క్రమంలో పదేపదే అనేక బాధలు పడాల్సిన పరిస్థితి. నగరంలో ఇలాంటి అంశాలు ఇప్పుడు గతం మాత్రమే. పోకిరీల భరతం పట్టే ‘షీ’ బృందాలు, బాధిత మహిళలు/యువతులకు ఆసరాగా నిలిచే ‘భరోసా’ కేంద్రం, ‘పోక్సో’ చట్టం కింద నమోదైన కేసుల విచారణ కోసం ‘చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు’అందుబాటులోకి రావడంతో స్పందన,సహాయ సహకారాలు వెనువెంటనేఅందుతున్నాయి. ఫోన్ చేయాల్సిన అవసరం లేదు.. సోషల్ మీడియా సందేశం పంపినా షీ–టీమ్స్ వచ్చి వాలుతున్నాయి. మూడున్నరేళ్ల క్రితం అందుబాటులోకి.. దేశంలోనే తొలిసారి షీ–బృందాల కాన్సెప్ట్ 2014 అక్టోబరు 24న హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చింది. యువతులు, మహిళల రక్షణ కోసం సుశిక్షితమైన కొన్ని బృందాలను పోలీసు విభాగం ద్వారా ప్రభుత్వం రంగంలోకి దింపింది. మహిళల్ని వేధించే పోకిరీల భరతం పట్టడమే ఈ బృందాల పని. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు వీడియో ఎవిడెన్స్ విధానం ప్రవేశపెట్టారు. ఆయా ప్రాంతాల్లో మాటువేసే షీ–బృందాలు తొలుత ఆకతాయిల వ్యవహారాన్ని వీడియో రికార్డింగ్ చేసి తర్వాత పట్టుకుని స్టేషన్కు తరలించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ చేస్తున్నాయి. మహిళల భద్రతకు సంబంధించి హైదరాబాద్ నగరం దేశంలోనే ఉత్తమం అంటూ ‘నెస్ట్ అవే’ ఆన్లైన్ సంస్థ గతేడాది సర్వేలో తేల్చింది. ఈ ఘనత సాధించడం వెనుక షీ–టీమ్స్ పాత్ర అత్యంత కీలకం. ఇవి ఏర్పాటైన నాటి నుంచీ వాటి పనితీరు, స్పందన తదితరాలపై ప్రజల్లో అవగాహన ఎలా ఉందనే విషయాన్ని అధికారులు ప్రైవేట్ సంస్థలతో సర్వేలు చేయిస్తూ తెలుసుకుంటున్నారు. ఇలా వస్తున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా అవసరమైన మార్పు చేస్తున్నారు. వీటన్నింటి పైనా ఫిర్యాదులు ఈవ్ టీజింగే కాదు.. మహిళలు, యువతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా షీ–టీమ్స్ను ఆశ్రయించవచ్చు. ఫోన్, సోషల్మీడియా ద్వారా వేధింపు ఎదురైనా, పని చేస్తున్న ప్రాంతంలో వేధింపులు, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తాకాలని చూస్తున్నా/తాకుతున్నా, అనుమతి లేకుండా ఫొటోలు తీసినా, పబ్లిక్ ప్లేసులు/వాహనాలపై వెంబడిస్తూ వెకిలి చేష్టలు చేస్తున్నా షీ–టీమ్స్ను ఆశ్రయిస్తున్నారు. నేరం తీవ్రతను బట్టి బాధ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వడం నుంచి నిర్భయ కేసు సైతం నమోదు చేస్తున్నారు. నగరంలో షీ–టీమ్స్ రాకతో మహిళలపై జరిగే బహిరంగ వేధింపులు తగ్గాయి. దాంతో ఈ తరహా బృందాలను రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తెచ్చారు. ఇప్పుడు మహారాష్ట్ర, చత్తిస్ఘడ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ల్లోనూ అమలవుతున్నాయి. వాస్తవానికి షీ–టీమ్స్కు డయల్–100, నేరుగా వచ్చే ఫిర్యాదులతో పాటు ఈ మెయిల్, సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా వస్తున్నాయి. ఈ బాధితుల్లో అనేక మంది నిందితులపై లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నారు. ఈ టీమ్స్పై సోషల్ మీడియా, పోస్టర్స్, బ్యానర్స్, కరపత్రాలు, మూవీ స్లైడ్స్ తదితర మార్గాలలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కాలేజీలు, స్కూళ్లు, ఏరియాల్లోనూ అవగాహన చేపడుతున్నారు. మరోపక్క మహిళలు, యువతులకు స్వీయ రక్షణ కోసం మెళకువులు సైతం నేర్పిస్తున్నారు. క్యాబ్ డ్రైవర్స్, ఆర్టీసీ డ్రైవర్లు, మహిళా కండక్టర్లతో వేధింపులు, షీ టీమ్స్ గూర్చి అవగాహన కల్పిస్తున్నారు. భరోస సేవలు ఇలా.. ♦ బాధితుల నుంచి కాల్ అందుకున్న వెంటనే సంబంధిత విభాగానికి, కేంద్రానికి ఆ కేసును బదిలీ చేస్తారు. డయల్ 100, చైల్డ్ హెల్ప్ నంబర్ 1098కు ఫోన్ చేయవచ్చు. హాకా భవన్లోని కేంద్రంలో నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ♦ లైంగిక దాడులు, పోక్సో కేసులలో బాధితులకు అత్యవసరమైన సేవలు అందిస్తారు. తర్వాత ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో కేసు నమోదు చేసి, కేసు విచారణను భరోసా కేంద్రం నుంచి దర్యాప్తు చేస్తారు. బాధితుకుల అవసరమైన న్యాయ సహాయం, వైద్య సహాయం సైతం అందిస్తారు. ♦ అఘాయిత్యాల్లో తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న బాధితుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి తిరిగి కోలుకునేలా కౌన్సిలింగ్ను ఇస్తున్నారు. వారు కోలుకున్నాక ఉపాధిపై అంశాల్లో శిక్షణనిచ్చి పునరావస కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ♦ తర్వాత వారికి ఉద్యోగం, స్వయం ఉపాధికి సహాయం అందిస్తున్నారు. ♦ అఘాయిత్యాల బారిన పడి, ఆపదలో ఉన్న చిన్నారులు, యువతులు, మహిళలకు హైదరాబాద్ పోలీసులు మేమున్నాం అంటూ ‘భరోసా’ కల్పిస్తున్నారు. 2016 మే 7న నాంపల్లి హాకా భవన్లో ఏర్పాటైన ఈ కేంద్రం ఆధీనంలోనే ప్రస్తుతం షీ–టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి. అఘాయిత్యాలకు గురైన వారికి పోలీసు–న్యాయ–వైద్య సహాయాలతో పాటు పునరావాసం కూడా అందిస్తున్నారు. ఈ కేంద్రంలో పోలీసుల ప్రమేయం చాలా తక్కువ. గృహ హింసకు గురయ్యే మహిళలు కూడా ఇక్కడకు వస్తున్నారు. వారి కుటుంబాల్లో సమస్యను తెలుసుకొని, కుటుంబాన్ని కలిపేందుకు కౌన్సిలింగ్ వ్యవస్థ పనిచేస్తోంది. మద్యానికి బానిసలైన భర్తలు, భార్యలను వేధిస్తూ కుటుంబాలను చిన్నభిన్నం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో మార్పు తీసుకురావడం కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఇక్కడ భరోసా కేంద్రం 24 గంటలూ పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. కొందరు భరోసా కేంద్రానికి రాలేని వారుంటే వారివద్దకే వెళ్లి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. భరోసా కేంద్రానికి ప్రతి నెల వచ్చే అత్యవసర కాల్స్ పెరుగుతున్నాయి. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన అత్యాచారం, చిన్నారులపై అఘాయిత్యాల కేసులు ఇక్కడికే బదిలీ అవుతాయి. బాధితుల నుంచి మహిళా అధికారులే వాంగ్మూలం తీసుకుంటారు. బాధితుల్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచీ స్టేట్మెంట్ రికార్డు చేయిస్తారు. అది సాధ్యం కాకుంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేయిస్తారు. కొన్ని సందర్భాల్లో న్యాయమూర్తులే ఈ కేంద్రానికి వచ్చి వాంగ్మూలం నమోదు చేస్తున్నారు. చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టుతో మేలు దేశంలో తొలిసారిగా ‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్యువల్ అఫెన్సెస్’ (పోక్సో) యాక్ట్ కింద నమోదయ్యే కేసుల్ని విచారించడానికి హాకా భవన్లో చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టును ఏర్పాటు చేశారు. దీంతో పోక్సో యాక్ట్ కేసుల విచారణ వేగవంతమైంది. సరాసరిన కనిష్టంగా 85 రోజుల్లో ట్రయల్ పూర్తి చేస్తూ చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు రికార్డు సృష్టిస్తోంది. గతేడాది ఏప్రిల్లో భరోస కేంద్రానికి అనుబంధంగా దీన్ని ఏర్పాటు చేశారు. చిన్నారులపై జరిగే అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల విచారణ కోసం హైకోర్టు ఈ న్యాయస్థానం ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. అదనపు మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జీ నేతృత్వంలో ఏర్పాటు చేయడానికి హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టుగా ఉండే ఈ న్యాయస్థానం ద్వారా పోక్సో యాక్ట్ కేసుల విచారణ వేగవంతమైంది. ఫోన్: 100 వాట్సాప్: 94906 16555 ఫేస్బుక్: hydsheteam@gmail.com యాప్: HAWK EYE ట్విట్టర్: hydsheteams -
ఆమెకు ఆమే అభయం
సాక్షి, హైదరాబాద్: ఆమెకు ‘ఆమే’అభయం.. ఆమెను వేధిస్తే ఇక అంతే. వెకిలిచేష్టలు, మకిలి మనుషులపై కొరఢా ఝళిపిస్తోంది. పోకిరీలపై ప్రతాపం చూపుతోంది. ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తోంది. పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థినులు.. కార్యాలయాలకు వెళ్లే మహిళలు... షాపింగ్ కోసమని ఇంటి నుంచి బయటకు వచ్చే గృహిణులు... ఇలా ఎవరు ఏ పనిమీద వెళుతున్నా ఎవరైనా వేధిస్తే షీటీమ్లు ఇట్టే పట్టేస్తున్నాయి. బాధిత మహిళలకు మేమున్నామంటూ భరోసా ఇస్తున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ షీ బృందాలు గత మూడేళ్లలో 5,432 కేసులు నమోదు చేశాయి. అయితే, వీటిల్లో 4,830 కేసు లు మేజర్లపై, 602 కేసులు మైనర్లు నమోదయ్యాయి. మహిళలను వేధించేవారిలో కాలేజీల విద్యార్థులు, వివిధ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న మరికొందరు ఉన్నట్లు షీ బృందాలు సేకరించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పనిచేస్తున్న అవగాహన మంత్రం... బస్టాప్లు, ఆటోస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మెట్రోస్టేషన్లు, పనిచేసే ప్రాంతాలు, విద్యాసంస్థలు... ఇలా ఏ ప్రాంతమైనా సరే బాలికలు, యువతులు, మహిళలను వేధిస్తే షీ బృందాలను ఆశ్రయించాలని చేస్తున్న విస్తృత ప్రచారం బాగానే పనిచేస్తోంది. లైంగిక వేధింపులకు గురయ్యే యువతులకు మేమున్నామనే భరోసా ఇచ్చేందుకు గత మూడేళ్లలో దాదాపు ఐదువేల వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి దాదాపు పది లక్షల మందిలో మార్పు తీసుకురాగలిగాయి. ముఖ్యంగా పాఠశాలలు, కాలేజీలు, గ్రామాలు, మురికివాడ లు, పనిచేసేప్రాంతాల్లో విస్తృతంగా జాగృతి కార్యక్రమాలు నిర్వహించారు. మహిళాచట్టాల గురించి వివరించారు. పోలీసుస్టేషన్లే కాకుండా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఈమెయిల్, హాక్ ఐ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ప్రచారం చేయడం అమ్మాయిలకు, మహిళల్లో భరోసా కలిగించింది. ఫలితంగా వాట్సాప్, ఫేస్బుక్, ఈ–మెయిల్, ట్విట్టర్, డయల్ 100 ద్వారా ఫిర్యాదుల తాకిడి పెరిగింది. ఫిర్యాదు అందిన వెంటనే మఫ్టీ దుస్తుల్లో షీ బృందాలు అక్కడికి చేరుకొని వీడియో చిత్రీకరణ ద్వారా ఆకతాయిల వెకిలి చేష్టలను చిత్రీకరించి సాక్ష్యాలుగా కోర్టులో సమరి్పస్తున్నాయి. అతి గారాబంతో దారి తప్పి.. - చిన్నప్పటి నుంచి స్త్రీలపట్ల గౌరవం పెంచేలా తల్లిదండ్రులు, గురువులు చొరవ చూపకపోవడం - తల్లిదండ్రుల అతి గారాబం - షీ బృందాలకు చిక్కుతున్నవారిలో 19 నుంచి 55 ఏళ్ల వయసువారే ఎక్కువ నోరెళ్లబెడుతున్నారు... ‘మేమేమీ తప్పుచేయలేదంటూ చిలుకపలుకులు పలికే ఈవ్ టీజర్లకు తల్లిదండ్రుల సమక్షంలోనే వీడియో ప్రదర్శించడంతో కిమ్మనకుండా ఉండిపోతున్నారు. ‘మేం పట్టుకున్న ఈవ్టీజర్లలో 80 శాతం మంది రోజూ సిగరెట్లు తాగుతున్నారు. వారాంతాల్లో మద్యం పారీ్టలు చేసుకుంటున్నారు. హుక్కా కేంద్రాలకు వెళ్తూ మత్తును రుచిచూస్తున్నారు’ అని షీ టీమ్ సభ్యులు తెలిపారు. కౌన్సెలింగ్తో మార్పు కనబడుతోంది... షీ బృందాలకు చిక్కిన ఆకతాయిలకీ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. మార్పు వస్తోంది. పశ్చాత్తాపపడేలా చేయడంతోపాటు మరోమారు ఈవ్టీజింగ్ చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నాం. వేధింపులపై ఫిర్యాదు అందగానే రంగంలోకి దిగి మేమున్నామనే భరోసాను కల్పిస్తున్నాం. ఫలితంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. – అనసూయ, సైబరాబాద్ షీ టీమ్ ఇన్చార్జి మనస్తత్వం మంచిగా ఉండేలా చూడాలి పిల్లల ముందే ఇంట్లో తల్లిదండ్రులు గొడవపడటం కూడా ఎదుటివారంటే లెక్కలేనితనాన్ని పెంచుతుంది. మగపిల్లలకు ఇష్టానుసారంగా డబ్బులు, స్వేచ్ఛ ఇవ్వడం వల్ల దారి తప్పుతున్నారు. అమ్మాయి కనబడితే కామెంట్ చేయడం మామూలు విషయమేనని భావిస్తున్నారు. అందుకే చిన్నప్పుడే పిల్లల మనస్తత్వం బాగుండేలా చూడాలి.. – లావణ్య, క్లినికల్ సైకోథెరపిస్ట్ -
ఆమెకు అండగా ‘షీ టీమ్’
సాక్షి, మంచిర్యాల : సృష్టికి మూలమైన మహిళకు ఆత్మరక్షణ కరవైంది. మూడుముళ్లు.. ఏడడుగులు... వేదమంత్రాలు.. ఆగ్ని సాక్షిగా మనువాడిన భర్త అయినా... తోటి ఉద్యోగి అయినా... విద్యాబుద్ధులు చెప్పే గురువైనా... ప్రేమ పేరిటా నయవంచనకు గురిచేసే మగాల్లైనా బలయ్యేది మాత్రం అబలనే, మనకు జన్మనిచ్చిన అమ్మ... తోడ బుట్టిన చెల్లి... కట్టుకున్న భార్య ఆడదే అయినా... వారి పట్ల వేధింపులు ఆగడం లేదు.. పాఠశాల మొదలుకొని... ఇంటా.. బయటా... ఎక్కడా చూసిన మహిళలపై అభం శుభం తెలియని బాలికలపై అత్యాచారాలు ఆగడం లేదు... ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చిన తుడుచుకపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళలకు అండగా షీ టీమ్ ఉందిని మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ మంచిర్యాల డీసీపీ రక్షిత క్రిష్ణమూర్తి్త షీ టీమ్ పని విధానంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. దీనిపై ప్రత్యేక కథనం. షీ టీమ్ ఆవిర్భావం మహిళల ఆత్మరక్షణ కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 అక్టోబర్ 24న తెలంగాణ పోలీస్శాఖలో షీ టీమ్ పేరుతో ప్రత్యేక పోలీస్ బృందాలను హైదరాబాద్లో మొట్టమొదటిసారి షీటీమ్ బృందాలను నియమించింది. ఏడాది పాటు హైదరాబాద్ నగరంలో మంచి ఫలితాలు రావడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలో షీ టీమ్ బృందాలను ఏర్పాటు చేసింది. 2015 అక్టోబర్ 31న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 23 షీ టీమ్ బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దింపారు. మఫ్టీలో ఉంటు ఆకతాయిల భరతం çపడుతుండే వారు. ఇటీవల కొంత డీలా పడినట్లు ఆరోపనలు ఉన్నాయి. అయితే ఇటీవల రామగుండం పోలీస్ కమిషనర్గా వి.సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించిన అనంతం షీ టీమ్పై ప్రత్యేక దృష్టి సారించారు. గోదావరిఖనిలో ఏసీపీగా రక్షిత కే మూర్తి (ప్రస్తుతం మంచిర్యాల డీసీపీ)పని చేసిన సమయంలో పెద్దపెల్లి, మంచిర్యాల రెండు జిల్లాలకు షీ టీమ్ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో రక్షిత కే మూర్తి షీ టీమ్ కార్యకలపాలపై ప్రత్యేక దృష్టి సారించారు. షీ టీమ్స్ పని విధానం మహిళల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై షీ టీమ్ పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ భరోసా కల్పిస్తున్నారు. షీ టీమ్స్ పోలీసులు చేసిన ఆపరేషన్స్, అవగాహన సదస్సులు మహిళ భద్రతకు రక్షణ కవచంగా మారింది. రోజురోజుకు జిల్లా కేంద్రాల్లోనే కాకుండా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లి ఈవ్ టీజర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ, పార్కులు, బస్టాండ్, బస్ స్టాప్లు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల వద్ద షీ టీమ్ పోలీసులు మఫ్టీలో నిఘా వేసి ఉంటారు. వారి వద్ద స్పై కెమెరాలు సైతం ఉంటాయి. ర్యాగింగ్ నిరోధానికి పాటించాల్సిన నిబంధనలు విద్యార్థులకు కళాశాలల్లో అడ్మిషన్లును ఇచ్చే సమయంలో ర్యాగింగ్, ఈవ్టీజింగ్ వ్యతిరేక విధానాలపై అవగాహన కల్పించాలి. ప్రతి కళాశాలలో ర్యాగింగ్ వ్యతిరేక కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీలో విద్యార్థుల తరుపున కొందరు, అధ్యాపకుల తరుపున కొందరు ఉండాలి. కొంత మంది విద్యార్థుల నేరుగా చెప్పుకోలేని పరిస్థితి ఉంటే కళాశాలలో ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేయాలి. ప్రతి కళాశాలలో నోటీస్ బోర్డుపై పోలీసు అధికారుల ఫోన్ నెంబర్లు టోల్ఫ్రీ నెంబర్ 100ను విధిగా ఏర్పాటు చేయాలి. విద్యాసంస్థలు సైతం ర్యాగింగ్కు పాల్పడితే వారిపై చర్యలు తీసుకోని విద్యాసంస్థల యాజమాన్యాలు శిక్షార్హమవుతాయి. ర్యాగింగ్, ఈవ్టీజింగ్కు గురైన బాధిత విద్యార్థులు ఫిర్యాదు చేసినప్పటికీ ఉద్దేశపూర్వకంగా కళాశాల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తే ప్రోత్సహించినట్లవుతుంది. చట్ట ప్రకారం యాజమా¯న్యాలను సైతం శిక్షించే అవకాశం ఉంటుంది. సమాచారం ఇవ్వడం ఇలా... చాలామంది పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు భయపడుతారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని పోలీస్ శాఖ వాట్సాప్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక నెంబర్లను అందుబాటులో ఉంచారు. ఫోన్లో సమాచారం ఇచ్చేందుకు 100 నెంబరుకు డయల్ చేసి సమాచారం అందించవచ్చు. 100కు ఇచ్చిన సమాచారం హైదరాబాద్లోని పోలీస్ కంట్రోల్రూంకు వెళుతుంది. అక్కడికి సమాచారం అందిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లకు సెకన్లలో సమాచారం వెళ్తోంది. సదరు పోలీస్ అధికారులు షీటీమ్ బృందాలు ఘటన స్థలానికి రహస్యంగా చేరుకొని సమస్యలను పరిష్కరిస్తారు. అమలయ్యే శిక్షలు... విద్యార్థులు, మహిళలను వేధింపులకు గురిచేసినట్లు రుజువైతే చట్టపరమైన శిక్షలతో పాటు విద్యాపరంగా శిక్షలు ఉంటాయి. విద్యాలయాల నుంచి తాత్కాలికంగా లేదా శాశ్వతంగా తొలగించడానికి, మరే విద్యాలయంలో ప్రవేశాలు లేకుండా చేసేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత లేకుండా చేయడం, పాస్పోర్టు జారీచేయకుండా చర్యలు తీసుకోవచ్చు. యూజీసీ విధానాల ప్రకారం ర్యాగింగ్, ఈవ్టీజింగ్లకు పాల్పడిన వారి ఉపకారవేతనాలు నిలిపివేయడం, పోటీపరీక్షలకు హాజరుకాకుండా చేయడం, రూ.2.50లక్షల వరకు జరిమానా విధిస్తుంది. నిర్భయంగా సమాచారం ఇవ్వాలి ఎవరైన వేధించిన వెంటనే 100కు నిర్భయంగా సమాచారం ఇవ్వాలి. ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా షీటీమ్లను ఏర్పాటు చేసింది. కాలేజ్ విద్యార్థులు మహిళలపై ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా, ఈవ్టీజింగ్కు గురిచేసినా, సెల్ఫోన్ల ద్వారా వేధింపులకు గురి చేసిన వెంటనే 100 డయల్కు గాని, వాట్సాప్ నెంబర్ 6303923700కు సమాచారం అందిస్తే తక్షణమే రక్షణ చర్యలు చేపడుతాం. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగ ఉంచబడుతాయి. – రక్షిత కే మూర్తి డీసీపీ, మంచిర్యాల ధైర్యంగా వెళ్తున్నాం... షీటీమ్ వచ్చినప్పటి నుంచి ఎక్కడికైనా ధైర్యంగా వెళ్తున్నాం. మా కాలేజీలో ఇప్పటి వరకు షీ టీంపై ఐదుసార్లు అవగాహన సదస్సు నిర్వహించారు. షీటీం ఏర్పడినప్పటి నుంచి యువకులు ఆమ్మాయిలను ఈవ్టీజింగ్ చేసేందుకు బయపడుతున్నారు. ఇప్పుడు బయటకు వెళ్లే ముందు దైర్యంగా అనిపిస్తుంది. – డాలి, ఎంబీఏ విద్యార్థిని, మంచిర్యాల ఒక్క కాల్తో రక్షణ షీటీమ్ మహిళలకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. 100 నెంబర్కు ఒక కాల్చేస్తే చాలు పక్కనే ఉంటారు. ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి ఇంటికి రావాలంటే ఒకప్పుడు భయంగా ఉండేది. ఇప్పుడు ఎలాంటి భయం లేదు. సివిల్ డ్రెస్లో పోలీసులు ఎవరో తెలియకుండానే మన మధ్యన ఉంటూ రక్షణ కల్పిస్తున్నారు. – రత్నం రోజ, విద్యార్థిని, మంచిర్యాల -
అనంతలో కామాంధుడి వికృత చేష్టలు
-
మాటు వేసి పట్టేస్తారు..
సాక్షి, సిటీబ్యూరో: ఈవ్టీజింగ్ చేస్తున్నారని ఫిర్యాదు అందితే సంఘటనా స్థలానికి చేరుకొని నిఘా వేసి నిందితులను పట్టుకునే సైబరాబాద్, రాచకొండ షీ బృందాలు పంథా మార్చాయి. ఎక్కువగా ఈవ్టీజింగ్ జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో మాటు వేసి ఆకతాయిల ఆట కట్టిస్తున్నాయి. ఇటు అమ్మాయిలు, అటు ఈవ్టీజర్లకు తెలియకుండానే పోకిరీల వెకిలిచేష్టలు, వేధింపులను వీడియో రికార్డు చేసి సాక్ష్యాలతో సహా పట్టుకుంటున్నాయి. వారిపై కేసులు నమోదుచేసి న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నారు. వీరిలో కొందరికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి పరివర్తన తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. బస్టాప్లు, మల్టీప్లెక్స్లు, షాపింగ్మాల్స్, పర్యాటక ప్రాంతాల్లో యువతులు, విద్యార్థినులను వేధిస్తున్నారంటూ ఫిర్యాదులు అందుతుండటంతో సైబరాబాద్, రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. నెలరోజుల్లో రెండు కమిషనరేట్ల పరిధిలో 210 కేసులు నమోదు చేశారు. 80 మందిపై క్రిమినల్, పెట్టీ కేసులు పెట్టారు. ఆకతాయిలను వెంబడిస్తూ... వివిధ పనుల నిమిత్తం ఇల్లు, వసతి గృహాల నుం చి ఒంటరిగా బయటికి వస్తున్న విద్యార్థినులు, యువతులను టార్గెట్గా చేసుకుని పోకిరీలు వేధిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసులు, విచారణలు అంటూ ఠాణాల చుట్టూ తిరగాల్సి వస్తుందని బాధితులు వారి ఆగడాలను బరిస్తున్నారు. కొందరు పోకిరీలు గచ్చిబౌలి, కూకట్పల్లి, కేపీహెచ్బీ, ఎల్బీనగర్, ఉప్పల్, అల్వాల్ తదితర ప్రాంతాల్లో యువతులు, విద్యార్థినులను ప్రతిరోజూ వెంటపడి వేధిస్తున్నారు. బాధితులు భయపడుతుండడంతో వారు మరింత రెచ్చిపోతున్నారు. దీనిపై నిఘా వేసిన ‘షీ’ బృందాలు వెంటనే వారిని అదుపులోకి తీసుకుంటున్నాయి. ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా మఫ్టీలో ఉంటూ ఆకతాయిల ఆగడాలను వీడియో తీసి న్యాయస్థానంలో సాక్ష్యాలు సమర్పిస్తున్నారు. లేడీస్ హాస్టళ్లలోనూ ప్రత్యేక చర్యలు... బస్స్టాపులు, బహిరంగ ప్రదేశాల్లో వేధింపులను నియంత్రిస్తున్న పోలీసులు.. యువతులు, మహిళల హాస్టళ్లు పరిసర ప్రాంతాల్లో ఈవ్టీజింగ్ నివారించేందుకు చర్యలు చేపట్టారు. అపహరణలు.. అత్యాచారయత్నాలు.. వేధింపులు.. ఈవ్టీజింగ్ తదితర నేరాలను కట్టడి చేసేందుకు లా అండ్ అర్డర్ పోలీసులకూ సమాచారం ఇస్తున్నారు. హాస్టళ్ల నిర్వాహకులతో చర్చించి సీసీ కెమెరాలు, పరిసర ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఎస్సీఎస్సీ మార్గదర్శనంలో ‘సేఫ్ స్టే’ పకడ్బందీగా అమలు చేయాలని సూచిస్తున్నారు. హాస్టళ్లలో వైఫై సౌకర్యంతో పాటు బాధితులకు వేధింపుల ఫోన్లు రాగానే ‘షీ’ బృందం సాంకేతిక సభ్యులకు సమాచారం అందించాలని సూచించారు. బాధితుల్లో ఎక్కువ మంది స్టేషన్కు వచ్చేందుకు సందేహిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలకు ఉపక్రమించారు. అలాగే ఆకతాయిలకు ఎలా బుద్ధి చెప్పాలి, స్వీయ ఆత్మరక్షణ, పోలీసులకు ఎలాంటి సమాచారంఇవ్వాలన్న అంశాలపై వారికి అవగాహన కల్పిస్తున్నారు. -
‘ఆమె’కు ఆమే భద్రత
‘ఇబ్రహీంపట్నంలోని ఓ కాలేజీకి చెందిన విద్యార్థిని షీ ఫర్ హర్ వలంటీర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. శివగౌడ్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఫోన్లు చేసి వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఇబ్రహీం పట్నం పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.’ ‘అబ్దుల్లాపూర్మెట్లో ఓ కాలేజీ విద్యార్థినికి బనవత్ గణేశ్ అనే యువకుడితో పరిచయం ఉంది. ఆమె తన స్నేహితురాళ్లతో కలిసి సంఘీ గుడికి వెళ్లిన సమయంలో అక్కడికి వచ్చి న అతను ఆమెతో సెల్ఫీలు దిగాడు. అతని వైఖరి నచ్చక బాధితురాలు అతడితో మాట్లాడం మానేసింది. అయితే బాధితురాలికి వివాహం నిశ్చయమైనట్లు తెలుసుకున్న గణేశ్ కాలేజీకి వచ్చి ప్రేమించాలంటూ ఆమెపై ఒత్తిడి చేశాడు. గతంలో తీసుకున్న ఫొటోలను అందరికీ పంపిస్తానంటూ బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన బాధితురాలు ‘షీ ఫర్ హర్’ ద్వారా పోలీసులకు ఫిర్యాదుచేసింది. అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.’ సాక్షి, సిటీబ్యూరో: కళాశాలల్లో మహిళలు, యువతుల భద్రత కోసం రాచకొండ పోలీసులు మూడేళ్ల క్రితం ప్రారంభించిన ‘షీ ఫర్ హర్’ సత్ఫలితాలనిస్తోంది. తద్వారా ర్యాంగింగ్, వేధింపులు తగ్గుముఖం పట్టాయి. బహిరంగ ప్రాంతాల్లో అమ్మాయిలను అటకాయించి వేధించేవారి భరతం పట్టేందుకు షీ బృందాలు పనిచేస్తున్నా కాలేజీ లోపల జరిగే వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ దృష్టికి రావడంతో ‘షీ ఫర్ హర్’ను ప్రారంభించి వారి రక్షణకు అండగా నిలిచారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడకుండా వేధింపులపై ఫిర్యాదు చేసే ధైర్యం చేయని విద్యార్థినులకు మహిళా భద్రత చట్టాలపై అవగాహన కలిగించారు. ఈ షీ ఫర్ హర్ కార్యక్రమం కింద ఒక్కో కాలేజీ నుంచి ఇద్దరు సీనియర్ విద్యార్థినులను వలంటీర్లుగా ఎంపిక చేసి మహిళల చట్టాలపై చైతన్యం చేశారు. వీరు ఇక్కడ నేర్చుకున్న అంశాలను తోటి విద్యార్థినులకు సెమినార్ల ద్వారా వివరించారు. ఆయా కాలేజీల్లో వేధింపులు ఎదుర్కొనే విద్యార్థినుల సమస్యలు ‘షీ ఫర్ హర్’ దృష్టికి తీసుకు వస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. అయితే బాధితురాలి వివరాలు గోప్యంగా ఉంచి సదరు ఆకతాయిని తీవ్రతను బట్టి కేసు నమోదు చేస్తారు. లేదా కౌన్సెలింగ్ ఇచ్చి హెచ్చరిస్తారు. రాచ‘కొండ’ంత అండ... రాచకొండ పరిధిలో ‘షీ ఫర్ హర్’ వలంటీర్లుగా 625 ఉన్నారు. ఒక్కో కాలేజీ నుంచి ఇద్దరు సీనియర్ విద్యార్థినులకు షీ ఫర్ హర్ వలంటీర్లుగా ఎంపిక చేశారు. 2017లో 157 మంది, 2018లో 259 మంది, 2019లో 209 మంది షీ ఫర్ హర్ వలంటీర్లుగా చేరారు. వీరు ఆయా కళాశాలల్లో తోటి విద్యార్థినులకు ఎదురయ్యే వేధింపులను పోలీసుల దృష్టికి రావడంలో చురుగ్గా పనిచేస్తున్నారు. తద్వారా 2017లో 13 కేసులు, 2018లో ఆరు కేసులు, 2019లో మూడు కేసులు...మొత్తం మూడేళ్లలో 22 కేసులు నమోదయ్యాయి. అయితే చాలా వరకు ఫిర్యాదులు వచ్చినా ఆకతాయిలకు కౌన్సెలింగ్ చేసి ఈవ్టీజింగ్ ఎదురయ్యే అనర్థాలపై ముందస్తు హెచ్చరికలు చేశారు. దీనివల్ల చాలావరకు కాలేజీల్లో అమ్మాయిలకు వేధింపులు తగ్గుముఖం పట్టాయని షీ ఫర్ హర్ వలంటీర్లు పేర్కొంటున్నారు. రాచకొండ పోలీసుల అండతో భద్రత వాతావరణం నెలకొందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు అండగా ... కాలేజీల్లో ర్యాగింగ్ వల్ల గతంలో ఎన్నో గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో మహిళల రక్షణకు షీ బృందాలు పనిచేస్తున్నట్లుగానే కాలేజీల్లో విద్యార్థినుల కోసం విద్యార్థినులే పనిచేస్తే సత్పలితాలుంటాయన్న ఆలోచనతో మూడేళ్ల క్రితం ‘షీ ఫర్ హర్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అనుకున్నట్టుగానే కాలేజీ విద్యార్థినుల నుంచి మంచి స్పందన వచ్చింది. కేసులు తక్కువ ఉన్నా వీరి ప్రభావం కాలేజీల్లో ఎక్కువగా ఉంది. –మహేష్ భగవత్,రాచకొండ పోలీసు కమిషనర్ -
ఫోన్ చేస్తే చాలు క్షణాల్లో ప్రత్యక్షం..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలోని ప్రభుత్వ మహిళా కళాశాల పరిసరాలు ఆకతాయిలకు అడ్డాగా మారాయి. కళాశాలకు వచ్చే విద్యార్థినులనే కాదు ఆ రోడ్డుమార్గంలో వెళ్లే మహిళలను అసభ్య పదజాలంతో వేధించిన దాఖలాలు కోకొల్లలు! బాధితులు అవమానపడుతుంటే ఆనందం పొందడం ఆ ఆకతాయిలకు అలవాటుగా మారింది! శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్లో, పరిసరాల్లో జులాయిగాళ్ల బెడద ఎక్కువైంది. చేతిలో రెండు పుస్తకాలు లేదంటే భుజాన చిన్న బ్యాగు వేసుకొని ఫోజులిస్తూ ఆడపిల్లలు కనిపిస్తే చాలు వెకిలి చేష్టలతో ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈ బాధ మహిళా ప్రయాణికులకూ తప్పట్లేదు!కళాశాలలు, బస్టాప్లే కాదు సినిమా థియేటర్లు, పార్కులు, మార్కెట్లు, దుకాణ సముదాయాలు... ఇలా ప్రతి చోట ఆకతాయిలతో మహిళలు,యువతులు,బాలికలకు వేధింపులు తప్పట్లేదు. ఇక వారి ఆటలు చెల్లవు! బాధితులెవ్వరైనా 100 నంబరుకు లేదంటే 1098 నంబరుకు ఫోన్ చేస్తే చాలు... క్షణాల్లో ‘శక్తి’టీమ్ వాలిపోతుంది. అంతేకాదు ముందస్తుగా సమాచారం ఇచ్చినా ఆయా ప్రాంతాల్లో మాటువేసి ఆకతాయిల ఆట కట్టిస్తారు! ఇదేదో ఒక రోజు లేదంటే వారం రోజుల వ్యవహారం కాదు! పూర్తిస్థాయిలో అన్నివేళలా మహిళా రక్షణకు మేమున్నామంటూ పనిచేయడానికి ఏర్పాటైనదే ‘శక్తి’! అరాచకాల నిరోధమే లక్ష్యంగా పోలీసుశాఖలో కొత్తగా ఏర్పాటైన ప్రత్యేక విభాగం ఇది. గురువారం రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఈ విభాగాన్ని శ్రీకాకుళంలో ప్రారంభించారు. జిల్లాలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యల వంటి దారుణాలే గాకుండా ఇటీవల కాలంలో బాలికల మిస్సింగ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. వీటికి తోడు కళాశాలలు, బస్టాప్లు, వాణిజ్య సముదాయాలు వంటి రద్దీ ప్రాంతాల్లోనే కాదు రాత్రిపూట ఆటో ప్రయాణాల్లోను, నిర్జన ప్రదేశాల్లోనూ ఆకతాయిలు కాపుకాసి మహిళలను, యువతులను, బాలికలను వేధిస్తున్న దాఖలాలు అనేకంగా చోటుచేసుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా బాధితుల్లో చాలా మంది పోలీసుస్టేషన్కు వెళ్లట్లేదు. అవమానభారంతో లోలోనే కుమి లిపోతున్నారు. కొంతమంది విద్యార్థినులైతే అర్ధంతరంగా చదువే మానేసి ఇంటికే పరిమితమైపోతున్నారు. కలలు కల్లలైపోతున్నాయనే బాధనైనా ఓర్చుకుంటున్నారు కానీ ఆకతాయిల ఆగడాలను తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో తమను రక్షించేవారెవ్వరైనా ఉం డాలని కోరుకోవడం సహజం. ఇలాంటి సందర్భాల్లో స్పందించాల్సిన బాధ్యత పోలీసులదే అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో వారికి ఇతరత్రా కేసుల దర్యాప్తు, ప్రోటోకాల్, ట్రాఫిక్ వంటి పనులే సరిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలు, యువతుల రక్షణ కోసం ఒక ప్రత్యేక పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనకు ఆచరణ రూపమే ‘శక్తి’! తెలంగాణ ‘షి’ స్ఫూర్తిగా... ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ‘షి’ టీమ్స్ తమదైన పనివిధానంతో ప్రశంసలు అందుకుంటున్నాయి. రైల్వేస్టేషన్లు, బస్టాప్లు, కళాశాలలు ఇతరత్రా రద్దీ ప్రాంతాల్లో నిఘావేసి ఆకతాయిల ఆట కట్టించడంలో సఫలమవుతున్నాయి. దీంతో ఆకతాయిల ఈవ్టీజింగ్, ర్యాగింగ్ కేసులు చాలావరకూ తగ్గుముఖం పట్టాయి. ఈ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో కూడా ‘శక్తి’ పేరుతో ప్రత్యేక పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఆచరణలో భాగంగా జిల్లాలో 28 మంది మహిళా పోలీసులతో మూడు టీములు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, పాలకొండ, పలాస–కాశీబుగ్గ స్టేషన్ల పరిధిలో వారు పనిచేస్తారు. డీఎస్పీ పర్యవేక్షణలో... మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ ఎంవీవీఎస్ మూర్తి నోడల్ అధికారిగా ఉంటారు. ఆయన పర్యవేక్షణలో శక్తి టీమ్స్ పనిచేస్తాయి. ఈ టీమ్స్లోని మహిళా పోలీసులకు విజయనగరంలోని పోలీసు శిక్షణ కళాశాలలో ప్రత్యేక తర్ఫీదు ఇచ్చారు. ఇప్పుడు ప్రత్యేక యూనిఫాంతో పాటు ప్రత్యేక ద్విచక్ర వాహనాలు ఏర్పాటు చేశారు. ఈ వాహనాలకు జీపీఎస్ అనుసంధానం చేశారు. వాటికి ఏఆర్వీటీఎస్ను ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్ల సహాయంతో మహిళలు, యువతులపై వేధింపులు, ఈవ్టీజింగ్, విద్యార్థినులపై ర్యాగింగ్ వంటి ఘటనలు జరిగినట్లు ఎక్కడ నుంచి ఫోన్ వచ్చినా, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్లు సమాచారం వచ్చినా శక్తి టీమ్ అక్కడికి చేరుకుంటుంది. ఆకతాయిలను పట్టుకొని పోలీసుస్టేషన్కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ చేస్తారు. సంఘటనలో నేర తీవ్రతను బట్టి కేసు నమోదు చేస్తారు. -
సైబర్ ప్రపంచంలో అప్రమత్తతే శ్రీరామరక్ష
సాక్షి, హైదరాబాద్: సైబర్ ప్రపంచంలో అప్రమత్తతే శ్రీరామరక్ష అని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం డీజీపీ కార్యాలయంలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో సైబర్ రక్షక్ సైనికుల ప్రమాణస్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. నేటి ఆధునిక యుగంలో అన్నీ డిజిటలైజ్ అయ్యాయని, ప్రస్తుతం మనమంతా ప్రతీ పనికి ఇంటర్నెట్పై ఆధారపడుతున్నామని అన్నారు. సామాజిక మాధ్యమాల వినియోగంలో అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మహిళలు చిన్నారుల రక్షణకు నగరంలో ప్రారంభించిన షీ టీమ్స్ మంచి ఫలితాలనివ్వడంతో రాష్ట్రమంతా విస్తరించామని గుర్తుచేశారు. సైబర్ నేరాలపై ఎండ్ నౌ స్వచ్ఛంద సంస్థ సైబర్ రక్షక్ల చేత సమాజాన్ని చైతన్య పరచడం అభినందనీయమన్నారు. యువత, తల్లిదండ్రుల్లో మార్పు కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎండ్ నౌ వ్యవస్థాపకులు అనిల్ రాచమల్ల, ఇతర సభ్యులను అభినందించారు. అంతకుముందు జస్టిస్ ఈశ్వరయ్య, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ జితేంద్ర, ఐజీ స్వాతీ లక్రా, ఎస్పీ (సీఐడీ) సుమతి తదితరులు సైబర్ నేరాల నియంత్రణ, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రసంగించారు. అనంతరం సైబర్ రక్షక్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. -
‘షి’ ఈజ్ రన్
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని షీ టీమ్స్ ఆధ్వర్యంలో 10కే, 5కే, 2కే రన్ నిర్వహించారు.ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్డులో ‘వీఆర్1’ పేరుతో జరిగిన పరుగులో గవర్నర్ నరసింహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్రెడ్డి, సీపీ అంజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.సినీనటి పూజా హెగ్డే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీనగర్కాలనీ: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10కే, 5కే, 2కే రన్లను ఘనంగా నిర్వహించారు. ‘వీఆర్–1’ పేరుతో జరిగిన ఈ పరుగును నెక్లెస్ రోడ్డులో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి, డీజీపీ మహేందర్రెడ్డి ప్రారంభించారు. నగర సీపీ అంజనీకుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్, అడిషినల్ సీపీ (క్రైమ్స్) శిఖా గోయల్, రాష్ట్ర రవాణాశాఖ కార్యదర్శి సునీల్శర్మ, అమెరికన్ కాన్సులేట్ క్యాథరిన్ హడ్డా, హీరోయిన్స్ నిహారిక, పూజా హెగ్డే తదితరులు పాల్గొన్నారు. అతిథులంతా 2కే రన్లో పాల్గొని రన్లో పాల్గొన్న వారిని ఉత్సాహపరిచారు. పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన రన్ ప్రారంభ వేదిక వద్ద గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో దిగ్విజయంగా విజయాలు సాధిస్తున్నారని, నగరంలో మహిళలతో పాటు అందరికీ భద్రత ఉందన్నారు. పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ.. మహిళా భద్రతకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. హైదరాబాద్ సేప్టీ నగరమని, ఎవరైనా ఇక్కడ సంతోషంగా నిర్భయంగా జీవించవచ్చునన్నారు. శిఖా గోయల్ ‘ఉమెన్ సేఫ్టీ’తో పాటు పలు విభిన్న కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారని అభినందించారు. ఇటీవల ఓ అమెరికన్ సంస్థ సర్వేలో హైదరాబాద్ మహానగరం సేఫ్టీ సిటీగా నిలిచిందని గుర్తుచేశారు. లక్డీకాపూల్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ కాలేజీ విద్యార్థులు రన్లో పాల్గొని గాంధీజీ 150 జయంతోత్సవాల సందర్భంగా గాంధీజీ సూక్తుల బుక్లెట్లను పంపిణీ చేశారు. ఈ రన్లో విదేశీయులు, బ్లేడ్ రన్నర్లు, దివ్యాంగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
17న ‘వీఆర్–1’ రన్
సాక్షి, సిటీబ్యూరో: ‘మహిళల భద్రత మన అందరి బాధ్యత’ అనే నినాదంతో హైదరాబాద్ షీ టీమ్స్ నిర్వహించ తలపెట్టిన ‘వీఆర్–1’ రన్ ఈనెల 17న ఆదివారం పీపుల్స్ ప్లాజా కేంద్రంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్ షీ టీమ్స్ ఇంచార్జ్, అదనపు పోలీసు కమిషనర్ శిఖా గోయెల్ గురువారం కార్యక్రమ వివరాలు వెల్లడించారు. మహిళ భద్రతలో సిటీ పోలీసులు షీ టీమ్స్ తీసుకుంటున్న చర్యలతో దేశంలోనే హైదరాబాద్కు మహిళలకు రక్షణలో సురక్షితమైన నగరంగా గుర్తింపు వచ్చిందన్నారు. షీ టీమ్స్ 4వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వీఆర్–1 రన్తో మహిళల భద్రత మన అందరి బాధ్యత అని గుర్తుచేయడంతో పాటు జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటి వరకు 5 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. నగర వాసులు ఈ రన్లో పాల్గొనేందుకు భరోసా కేంద్రం, ఆన్లైన్లో శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ఆదివారం ఉదయం 6.30 గంటలకు నెక్లెస్ రోడ్డులో రన్ను రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రారంభిస్తారన్నారు. ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరికి రేసు కిట్ను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు సినీ నటులు, సెలబ్రిటీలు పాల్గొంటారన్నారు. -
మహిళల భద్రత కోసమే షీటీంలు
సాక్షి, కరీంనగర్ క్రైం: మహిళలు, విద్యార్థినుల భద్రత కోసమే షీటీంలు పని చేస్తున్నాయని మహిళ పోలీస్స్టేషన్ సీఐ సంతోష్కుమార్ అన్నారు. కరీంనగర్లోని పాలిటెక్నిక్ కళాశాలలో షీటీంల పనితీరుపై సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో సీఐ మాట్లాడారు. వేధింపులు ఎదుర్కొనే మహిళలు వాట్సప్, ఫేస్బుక్ ద్వారా సమాచారం అందించాలని తెలిపారు. షీటీంనకు చెందిన పోలీసులు మఫ్టీలో సంచరిస్తూ పోకిరీలను ఆధారాలతో పట్టుకుంటున్నారని అన్నారు. స్మార్ట్ఫోన్ కలిగిన ప్రతీపౌరుడు హాక్ఐ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలు నేరుగా పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు ఈయాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. ఈ సమావేశంలో సీఐతో మహిళ ఠాణా ఏఎస్సై విజయమణి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. -
ధైర్యంగా ముందుకొస్తున్నారు
సాక్షి, సిటీబ్యూరో: మహిళల రక్షణ కోసం సైబరాబాద్ షీ బృందాలు ఎంతో కృషి చేస్తున్నాయి. వేధింపులకు గురవుతున్న మహిళలు ఫిర్యాదు చేసేందుకు ధైర్యంగా ముందుకొస్తున్నారు. సామాజిక మాధ్యమాలతో పాటు నేరుగా బాధిత మహిళలు ఫిర్యాదు చేస్తుండటంతో వీరి అవసరాలకు అనుగుణంగా షీ బృందాలను ఆరు నుంచి ఎనిమిది బృందాలకు పెంచినట్లు షీ టీం ఇన్చార్జి అనసూయ తెలిపారు. ఏ సమయంలో ఫిర్యాదు వచ్చినా తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకుంటూ అతివల్లో ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తున్నామని ఆమె చెప్పారు. పాఠశాల, కళాశాలల విద్యార్థినులు, ఉద్యోగినులు.. ఇలా ప్రతి ఒక్కరూ వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేస్తున్నారని ఆమె చెప్పారు. అనసూయ మాటల్లోనే ఆ వివరాలు.. కౌన్సెలింగ్తో తప్పు తెలుసుకుంటున్నారు.. ముఖ్యంగా కళాశాలల ప్రాంగణాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మాల్స్లో ఆకతాయిల బారిన పడిన మహిళలు వాట్సాప్ ద్వారా షీ బృందాలకు ఫిర్యాదు చేస్తున్నారు. తక్షణమే సంబంధిత షీ బృందాలు మఫ్టీలో వెళ్లి ఈవ్టీజర్ల అకృత్యాలను పరిశీలించి లైవ్ రికార్డు చేస్తున్నారు. ఆ వెంటనే ఆకతాయిని పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగిస్తున్నాయి. మేజర్ అయితే పెట్టీ కేసులు, మైనర్ అయితే తల్లిదండ్రుల సమక్షంలోనే కౌన్సెలింగ్ ఇస్తున్నాం. తద్వారా 90 శాతం మంది తమ తప్పును తెలుసుకుంటున్నారు. షీ బృందాలకు చిక్కుతున్న వారిలో అన్ని వయసుల వారూ ఉన్నారు. ‘ఆమె’కు అవగాహన కలిగిస్తూ.. పాఠశాలలు, కాలేజీలు, ట్యుటోరియల్స్, రైల్వే స్టేషన్లు, మాల్స్, బస్తీ తదితర ప్రాంతాల్లో మహిళా చట్టాలపై షీ బృందాలు పూర్తి స్థాయిలో అవగాహన కలిగిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తూ భరోసా కల్పిస్తున్నాయి. తద్వారా అతివలు వేధింపులు ఎదురైతే వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. నేరుగా ఫోన్కాల్స్ కూడా చేస్తున్నారు. గతంలో ఠాణా గడప తొక్కేందుకు ఆలోచించిన మహిళలు ఇప్పుడూ అవే వేధింపులపై గళం విప్పుతుండటం శుభ పరిణామం. రేపు మహిళా సమాఖ్య రాష్ట్రస్థాయి సదస్సు హిమాయత్నగర్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ ఆధ్వర్యంలో ‘పెట్టుబడిదారుల ధోరణులు, ఫాసిస్ట్ శక్తులకు తిప్పికొడదాం– మహిళా సాధికారత సాధిద్దాం’ అంశంపై శుక్రవారం రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు సదస్సుకు సంబంధించిన పోస్టర్ను బుధవారం హిమాయత్నగర్లోని మఖ్దూం భవన్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో భారత జాతీయ మహిళా సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు పోటు కళావతి, తెలంగాణ శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేంపావని, ఛాయాదేవి, నండూరి కరుణకుమారి పాల్గొన్నారు. -
బాల్యానికి మూడుముళ్లు..!
సాక్షి, యాదాద్రి : అధికార యంత్రాంగం చర్యలెన్ని చేపట్టినా జిల్లాలో బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు వెరసి చిరుప్రాయంలోనే అమ్మాయిలు పెళ్లిపీటలెక్కుతున్నారు. అందుకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల కాలంలో రాచకొండ పోలీసులు, షీటీంలు, ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్న బాల్య వివాహాలే నిదర్శనం. గుట్టుచప్పుడు కాకుండా.. జిల్లాలో బాల్య వివాహాలు పెరిగిపోతున్నాయి. అమ్మాయిలకు 18 ఏళ్లు నిండిన తర్వాత చేయాల్సిన వివాహాలు 13ఏళ్లకే చేస్తున్నారు. అధికారులు అప్పుడప్పుడు అడ్డుకుంటున్నా గుట్టుచప్పుడు కాకుండా వివాహాలు జరుగుతున్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. కమిషనరేట్ పరిధిలో 51 బాల్య వివాహాలను పోలీసులు అడ్డుకోగా ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లాలోనే 41 ఉన్నాయి. తుర్కపల్లి, బొమ్మలరామారం, బీబీనగర్, రాజాపేట, ఆలేరు, ఆత్మకూర్(ఎం), భువనగిరి, సంస్థాన్నారాయణపురం, మోత్కూరు, చౌటుప్పల్, వలిగొండ ఇలా అన్ని మండలాల్లో నిత్యం ఏదో ఒక చోట బాల్య వివాహాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. బాల్య వివాహాలతో అనర్థాలు హైస్కూల్ స్థాయిలోనే బాలికలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. వివాహ వయస్సు రాకముందే పెళ్లి చేయడంవల్ల వారి చదువులు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. అంతేకాకుండా భార్య, భర్తల మధ్యన వివాదాలు తలెత్తి విడాకులకు దారితీస్తున్నాయి. బాల్యవివాహాలను తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధువులు వివిధ కారణాలతో ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. బాల్య వివాహాలకు కారణాలు.. బాల్య వివాహాలు జరుగడం వెనక పలు సామాజిక కారణాలు ఉన్నాయి. మేనరికం, సమాజంలో బాలికల పట్ల జరుగుతున్న లైంగిక దాడులు, ప్రేమ పేరుతో వివాహాలు, మంచి సంబంధాలు పోతే దొరకవన్న ఆతృత, పేదరికం, నిరక్షరాస్యత వంటి అంశాలు బాల్య వివాహాలకు దారి తీస్తున్నట్లు తెలుస్తోంది. బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలపై వివిధ శాఖల అధికారులు నిర్వహిస్తున్న ప్రచారం మొక్కుబడిగా కాకుండా విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. బాల్యవివా హాలకు సబంధించిన చట్టాలు, అతిక్రమిస్తే పడే శిక్షలు, చిన్నతనంలో పెళ్లి చేయడం వల్ల కలిగే అనర్థాలగురించి ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద బోర్డులపై రాయించాలి. 41 బాల్య వివాహాల అడ్డగింత రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 51బా ల్య వివాహాలను పోలీసులు అడ్డుకున్నారు. ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లాలోనే 41 ఉన్నాయి. 13ఏళ్ల నుంచి 17ఏళ్ల వయస్సు ఉన్న బాలికలకు వివాహాలు చేస్తుండగా అందిన సమాచారం మేరకు షీ టీం సభ్యులు, స్థానిక పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు తక్షణమే స్పందించి ఘటనా స్థలాలకు వెళ్లి అడ్డుకున్నారు. వారి కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలతోపాటు బాల్య వివాహాలు చేస్తే నేరమని ఇందుకు సహకరించిన కుటుంబ సభ్యులతోపాటు మధ్యవర్తులు అందరిపైన కేసులు నమోదవుతాయని వివరిస్తున్నారు. షీటీం రాకతో ఆగిన బాల్యవివాహం తుర్కపల్లి మండలం పెద్దతండాలో ఫిబ్రవరి 22న షీటీం పోలీసులు బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. 17 ఏళ్ల బాలికను 25ఏళ్ల వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించారు. 23న వివాహాం జరగాల్సి ఉండగా సమాచారం అందుకున్న షీటీం సభ్యులు స్థానిక పోలీసుల సహకారంతో ముందు రోజే వివాహాన్ని అడ్డుకున్నారు. ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. బాల్య వివాహాలు చేయడం వల్ల జరిగే నష్టాలను వివరించి పెళ్లిని అడ్డుకున్నారు. షీటీంలు అడ్డుకున్న బాల్య వివాహాలు ఇలా... రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో షీటీంలు ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో బాల్య వివాహాలను అడ్డుకున్నాయి. భువనగిరి షీటీం ఆధ్వర్యంలో 28, చౌటుప్పల్ షీటీం 13, ఇబ్రహీంపట్నం షీ టీం 5, మల్కాజ్గిరి షీ టీం 3, ఎల్బీనగర్ షీ టీం 1, కుషాయిగూడ షీటీం1 మొత్తం 51 బాల్యవివాహాలను ఇటీవల కాలంలోనే అడ్డుకున్నారు. ఇందులో 13 ఏళ్ల వయస్సున్న రెండు, 14 ఏళ్ల వయస్సు మూడు, 15 ఏళ్ల వయస్సు 7, 16 ఏళ్ల వయస్సు 19, 17 ఏళ్ల వయస్సు 20 వివాహాలను అడ్డుకుని వారి కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్య వివాహాలు నేరం బాల్య వివాహాలు చేయడం నేరం. అమ్మాయిల వయస్సు 18, అబ్బాయిల వయస్సు 21ఏళ్లు నిండిన తర్వాతే పెళ్లి చేయాలి. అంతకంటే లోపు వివాహాలు చేస్తే చట్టపరంగా కేసులు నమోదు చేస్తాం. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు. జరిమానా, జైలు శిక్ష రెండు విధించే అవకాశం ఉంది.వివాహం జరిపిన పెళ్లి పెద్ద నుంచి పురోహితుడు, పెళ్లికి హాజరైన వారందరిపైనా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మైనర్ బాల, బాలికలు కచ్చితంగా చదువుకోవాలి. బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే 100కు డయ ల్ చేయా లి. లేదా 9490617111 వాట్సాఫ్ నంబర్ 24గంటలు అందుబాటులో ఉంటుంది. –మహేశ్భగవత్, రాచకొండ సీపీ -
షీ ఇన్స్పెక్టర్
పోలీస్ ఉద్యోగం మగాడిదనుకుంటారు... మగాడు తనను తాను పోలీస్ అనుకుంటాడు..ఇంట్లో పోలీస్.. ఆఫీస్లో పోలీస్.. తండ్రిగా పోలీస్.. అన్నగా పోలీస్.. భర్తగా పోలీస్..అలాంటి సమాజంలో ఒక షీ పోలీస్ ఆఫీసర్ ఎంతటి ఒత్తిడికి గురవుతుందన్నదే సోనీ కథ! ఢిల్లీ...చలికాలం.. చీకటి పడింది. ఒక అమ్మాయి సైకిల్ మీద వెళ్తోంది. కాస్త దూరమే వెళ్లాక వెనక సైకిల్ మీదే ఒకతను వెంటాడటం మొదలుపెట్టాడు. ఆమె పట్టించుకోకుండా ఇంకా ముందుకు సాగుతూనే ఉంది. అతను ఆమెను కామెంట్ చేస్తూ సీరియస్గా ఫాలో అవుతున్నాడు. ఓ చిన్న అడ్డదారిలోకి వెళ్లి ఆగుతుంది. అతనూ ఆగుతాడు. సైకిల్ దిగి.. అతన్ని పట్టుకుని కొడ్తుంది ఆమె. ఇంతలోకి ఓ మహిళా నాయకత్వంలోని పోలీసుల బృందం వచ్చి ఆమెను ఆపుతుంది. తన వెంటపడ్తున్న వ్యక్తిని కొట్టిన అమ్మాయి కూడా పోలీసే. పేరు సోనీ. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. నాయకత్వం వహించిన మహిళ ఎస్.పి. కల్పన. సోనీ కూడా ఆమె దగ్గరే పనిచేస్తూంటుంది. నెట్ఫ్లిక్స్ ప్రొడక్షన్ ‘సోని’ అనే సినిమాలోనిది ఆ దృశ్యం. పోలీస్ వ్యవస్థలో వేర్వేరు కేడర్లో ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరు మహిళల కథ ఇది. ఐపీఎస్గా ఎంత ధీశాలి అయినా ఇల్లు, కుటుంబ విషయాలకు వచ్చేసరికి సగటు ఒత్తిళ్లను తప్పక భరించే సాధారణ స్త్రీ ఆమె. భర్త కూడా ఐపీఎస్ అయితే.. తన ఉద్యోగంలో ఆయన జోక్యాన్ని సహించాల్సిన సర్వసాధారణ భార్యే ఆమె. సబ్ ఇన్స్పెక్టర్ హోదాలో ఉన్న అమ్మాయికి ఈ భారం మరింత ఎక్కువ. పోలీస్ హైరార్కీలోని నిరంకుశత్వంతో పాటు అదనంగా మహిళా ఉద్యోగుల పట్ల ఉన్న వివక్ష, మధ్యతరగతి నివాసాల్లోని మోరల్ పోలీసింగ్, విలువల వల్లింపులు, వదిలించేసుకున్నా వీడని బంధాల బేడీలు.. ఆమె మోయాల్సిన బరువులు! రెండు జీవితాలు, రెండు నేపథ్యాలు, రెండు స్థాయిల మధ్య ఉన్న వ్యత్యాసాలు.. వీటన్నిటికీ స్థానం కల్పించిన సమాజపు బుద్ధి, తీరుకు ఫ్రేమే ‘సోనీ’ మూవీ. కథలోకి .. పైన చెప్పిన ఉపోద్ఘాతమే సినిమా స్టార్టింగ్ సీన్. అసలు ఈ కథకు ప్రేరణ.. 2012, నిర్భయ ఘటన. ఆ విషాదం తర్వాత ఢిల్లీలో మహిళా భద్రతను సవాల్గా తీసుకుని నేరం జరుగుతున్న, జరిగే ప్రమాదం ఉన్న పరిసరాలను గుర్తించే ఆపరేషన్ చేపడ్తుంది కల్పన. ఆ టాస్క్ కోసం ఓ టీమ్ను ఫామ్ చేస్తుంది. అందులో సోనీ కీలక వ్యక్తి. కల్పన ఆలోచనకు వేగంగా కార్యరూపం ఇవ్వగల సామర్థ్యం ఆమెది. అందులో భాగంగానే అలా రాత్రిపూట గస్తీకి వెళ్తారు. ఒకసారి ఒక నేవీ ఆఫీసర్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో సోనీ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే.. అతని దవడ పగలకొడ్తుంది సోనీ. ఆ వ్యక్తి రాజకీయంగా తనకున్న పలుకుబడితో సోనీ మీద క్రమశిక్షణ చర్య తీసుకునేలా ప్రెజర్ తెస్తాడు. దాంతో ఆమెను ఆ ఆపరేషన్ నుంచి తప్పించి రికార్డ్స్ రూమ్కి పరిమితం చేస్తారు. ఇది సోనీకే కాదు కల్పనకూ కష్టంగానే మారుతుంది. టాస్క్లో సోనీ రీ అప్పాయింట్మెంట్ కోసం కమిషనర్ అయిన తన భర్త సందీప్ సహాయం కోరుతుంది కల్పన. సాయమేమో కాని కింది ఉద్యోగులతో ఎలా ఉండాలో పాఠాలు చెప్తాడు. సబార్డినేట్స్ పట్ల అంత సానుభూతి అక్కర్లేదని క్లాస్ తీసుకుంటాడు. మౌనంగా వింటుంది. భర్త దగ్గర కల్పన పాత్ర అది. ఆమెకు పిల్లలు ఉండరు. అత్తగారు పిల్లల కోసం షంటుతూ ఉంటుంది. ఆడబిడ్డా తనకు మంచి గైనకాలజిస్ట్ తెలుసని, వెళ్లి కలవమని సలహా ఇస్తుంది. ఇక్కడా మౌనమే ఆమె ఆయుధం. ఆవేశం కల్పనకు వ్యతిరేకం సోనీ. అన్నిటికీ ఆవేశంగా రియాక్ట్ అవుతూంటుంది. సహనానికీ హద్దు ఉండాలి అన్నది ఆమె ఫిలాసఫి. కెరీర్లోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ అడ్డంకులను ఎదుర్కొంటుంది. భర్త నవీన్తో విడాకులైపోయి ఒంటరిగా ఉంటూంటుంది. అయినా రెండు రోజులకు ఒకసారి ఆమె ఉండే చోటికి వచ్చి ఇబ్బంది పెడ్తూంటాడు. చుట్టుపక్కల వాళ్లు సోనీ దగ్గర సొద పెడ్తూంటారు.. ఎన్నాళ్లు ఇలా ఒంటరిగా ఉంటావ్.. ఆడదానికి పెళ్లే పరమావధి ఎట్సెట్రా.. ఎట్సెట్రా అంటూ! నన్ను నేను చూసుకోగలను అని గట్టిగానే సమాధానమిస్తుంది సోనీ. ఆమె వ్యక్తిగత ఇబ్బందుల గురించి తెలుసుకున్న కల్పన సోనీ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపు తుంది. అంత ఆవేశం పనికిరాదని సుతిమెత్తగా హెచ్చరిస్తూంటుంది. లేడీస్ వాష్రూమ్లో.. ఒక రాత్రి.. పహారా కాస్తూ.. ఆకలిగా ఉంటే దార్లో ఉన్న హోటల్కి వెళ్తారు. టిఫిన్ ఆర్డర్ ఇచ్చాక వాష్ రూమ్కి వెళ్తుంది సోనీ. అప్పటికే అక్కడ తన అయిదేళ్ల కూతురితో ఓ అమ్మ ఉంటుంది క్యూలో. వాళ్లతో ఆ మాటా ఈ మాటా మాట్లాడ్తూండగానే ‘‘అమ్మా....అర్జంట్’’ అంటూ ఆ పాప ఇబ్బంది పడ్తుంది. అప్పుడు ఆ పాప తల్లి ‘‘చాలా సేపయింది. లోపల ఉన్నవాళ్లు బయటకే రాలేదు’’ అని చెప్తుంది సోనీతో. ‘‘అవునా?’’ అంటూ సోనీ వాష్రూమ్ తలుపు తడ్తుంది. రెస్పాన్స్ ఉండదు. మళ్లీ తడ్తుంది కొంచెం గట్టిగా. ఈసారీ నో రెస్పాన్స్. దబదబ బాదుతుంది సోనీ. ఒక్కసారిగా వాష్ రూమ్ తలుపు తెరుచుకుంటుంది. గుమ్మంలో జులపాలతో ఓ అబ్బాయి. లోపల మరో నలుగురు అబ్బాయిలు. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్తో. ‘‘లేడీస్ వాష్రూమ్లో ఏం చేస్తున్నారు?’’ అంటూ ప్రశ్నిస్తుంది సోనీ. గుమ్మంలో ఉన్న అబ్బాయి అమర్యాదగా మాట్లాడ్తాడు. లోపలున్న వాళ్లు నవ్వుతారు. ‘‘మర్యాదగా బయటకు రండి’’ అంటూ హెచ్చరిస్తుంది. హేళన చేస్తూ తలుపు వేయబోతాడు. అడ్డుకుంటుంది సోనీ. బూతులు మొదలుపెడ్తాడు. చెంప చెళ్లు మనిపిస్తుంది సోనీ. కోపంతో ఆ అబ్బాయి సోనీ జుట్టుపట్టుకొని లోపలికి ఈడుస్తాడు. గొడవ పెద్దదవుతుంది. ఈ వివాదమూ సోనీ కెరీర్కే చుట్టుకుంటుంది. ఎందుకంటే అవతలి అబ్బాయి సెంట్రల్ కేబినెట్లో ఉన్న ఓ మంత్రికి ఎలక్షన్ ఫండింగ్ చేస్తున్న వ్యక్తి కొడుకు. ఈ సంఘటనలోనూ కల్పన భర్త నుంచి కల్పనకు సుద్దులు, బుద్ధులు, చీవాట్లు, జాగ్రత్తలు యాజ్యూజ్వల్. మరుసటి రాత్రి.. సోనీ వాళ్లింటికి వస్తుంది కల్పన. సోనీ చేతికి ఉన్న కట్టును చూస్తూ ‘‘ఈ గాయం వాడు చేసిందేనా?’’ ప్రశ్నిస్తుంది కల్పన. సోనీకి చిర్రెత్తుకొస్తుంది. ‘‘అన్నీ తెలిసీ మీరూ అలాగే మాట్లాడుతున్నారా?’’ అంటూ బరస్ట్ అవుతుంది సోనీ. ‘‘నువ్వు వాడి మీద చేయి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? నేను అక్కడే ఉన్నా కదా? నాకు చెప్పి ఉంటే అరెస్ట్ చేసేవాళ్లం.ఈ గతి పట్టేది కాదు’’ అంటుంది కల్పన చాలా స్థిరంగా. ‘‘ఇప్పుడూ అరెస్టే కదా చేశాం’’ అని సోనీ అంటూండగానే ఆమె డైనింగ్ ఏరియా కిటికీ అద్దాలు భళ్లున పగుల్తాయి. కిటికీ వైపు దూసుకెళ్లి కిందకు చూస్తుంది. బైక్స్ మీద పారిపోతూ కనిపిస్తారు ఆకతాయిలు. నేను లేకపోతేనే.. ఇంట్లో దాడి జరిగిన రాత్రే సోనీ భర్త వస్తాడు. ‘‘నేనుంటే ఇలా జరిగేది కాదు’’ అంటాడు. తీక్షణంగా చూస్తుంది భర్తను. తల వంచుకుంటాడు. అప్పటిదాకా తను చేసిన తప్పులన్నిటినీ క్షమించి కలిసి ఉండటానికి ఒప్పుకోమని బతిమాలుతాడు సోనీని. ఇక నుంచి బాధ్యతగా ఉంటానని చెప్తాడు. అతనిని నమ్మక తప్పని పరిస్థితిని కల్పిస్తాడు. ఇటు ఉద్యోగంలో పై అధికారుల సపోర్ట్ లభించకపోయేసరికి రాజీనామా చేయాలని నిశ్చయించుకుంటుంది సోనీ. ఆ మర్నాడు కల్పన.. వాళ్ల ఆడపడచు ఇంటికి వెళ్తుంది. టెన్త్ క్లాస్ చదువుతున్న తన మేనకోడలు దిగులుగా తన గదిలో కూర్చుని ఉంటుంది. ఏమైంది అని అడిగితే.. పీరియడ్స్ వల్ల మాటిమాటికి వాష్రూమ్ వెళ్తుంటే క్లాస్లో బాయ్స్ ఏడిపించారని. తన ఫ్రెండ్స్ కూడా వంతపాడారని చెప్తుంది. ‘‘ఏడిస్తే ఎవరైనా ఏడిపిస్తారు. లెక్క చేయకపోతే ఎవరూ జోలికి రారు’’ అని ధైర్యం చెప్తుంది. తన మేనకోడలికి మోరల్ సపోర్ట్ ఇస్తూన్నప్పుడే సోనీ గుర్తొస్తుంది కల్పనకు. వెంటనే ఆమె దగ్గరకు బయలుదేరుతుంది.. ‘‘రసీదీ టికెట్’’ అనే అమృతా ప్రీతమ్ ఆటోబయోగ్రఫీ బుక్ తీసుకుని! దాన్ని సోనీకి ఇస్తుంది చదవమని. అలాగే రాజీనామా చేయొద్దనీ చెప్తుంది. ఆఫీస్లో.. లేడీస్ వాష్రూమ్లో చేరి సిగరెట్, మందు కొడ్తున్న వాళ్ల మీద బలమైన కేసులు పెట్టమని తన కింది అధికారులకు పురమాయిస్తుంది కల్పన.అన్ని ఒత్తిళ్లకూ ఫుల్స్టాప్ పెట్టి.. పని చేయడానికి సిద్ధ పడ్తుంది. టాస్క్ను ముందుకు సాగిస్తుంది. ఇక్కడితో ఎండ్ అయిన ఈ సినిమా అంతా దాదాపుగా సింగిల్ టేక్స్లో షూట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేని ‘సోనీ’ ఇప్పటికే చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్లింది. దర్శకుడు ఇవన్ అయ్యర్. సోనీగా.. గీతికా విద్యా ఒహ్లయాన్, కల్పనగా సలోనీ బాత్రా నటించారు. -
మహిళల భద్రతకు సై!
సైబరాబాద్ పరిధిలో మహిళా ఉద్యోగుల భద్రతకు పోలీసులు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఐటీ కారిడార్లో వందలాది ఐటీ కంపెనీల్లో లక్షలాది మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి రక్షణ కోసం పలు చర్యలు చేపడుతున్నారు. ఇందుకు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సహకారం తీసుకుంటున్నారు. ఉద్యోగులు షీ షటిల్స్లో ఉచితంగా ప్రయాణించొచ్చు. సాక్షి, సిటీబ్యూరో:ఐటీ కారిడార్లో మహిళల భద్రతకు సైబరాబాద్ పోలీసులు అత్యంత ప్రాధా న్యం ఇస్తున్నారు. వందల సంఖ్యలో వెలసిన ఐటీ కంపెనీల్లో పని చేస్తున్న నాలుగు లక్షల మంది మహిళలకు భరోసా కల్పించడమే కాకుండా, మహిళా హాస్టళ్లలో వారు సురక్షితంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు.ఇందుకుగాను సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సహకారంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎస్సీఎస్సీ సంస్థ మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యలపై మాదాపూర్లోని ఓ హోటల్లో ‘షీ ఎంపవర్’ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ సదస్సులో భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. సేఫ్ జర్నీ... ఐటీ కారిడార్లోని వివిధ కంపెనీల్లో పనిచేసే మహిళా ఉద్యోగిణులు కార్యాలయాలకు వెళ్లే సమయంలో బస్సుల్లో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ప్రత్యేకంగా షీ షటిల్ బస్సుల ద్వారా సేవలు అందిస్తున్నారు. మాదాపూర్, రాయదుర్గం, నార్సింగి, గచ్చిబౌలి ఠాణా పరిధిల్లో ఈ షీ షటిల్ బస్సులు నడుస్తున్నాయి. బస్టాండ్లు, బహిరంగ ప్రాంతాల్లో ఆకతాయిల వేధింపులను అడ్డుకునేందుకు షీ బృందాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. సేఫ్ స్టే... ఐటీ కారిడార్లోని మహిళా హాస్టళ్లలో ఉంటున్న ఉద్యోగిణుల భద్రత కోసం గత ఐదేళ్లుగా ‘సేఫ్ స్టే’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ‘ఆయా హాస్టల్ నిర్వాహకులు తప్పనిసరిగా హాస్టల్స్ ప్రాంగణంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రత్యేక రిజిష్టర్ను మెయిన్టెయిన్ చేయాలి. వచ్చిపోయే సందర్శకుల వివరాలను కూడా పొందుపరచాలి. వంటగాళ్లు, సెక్యూరిటీ గార్డుల పూర్తి వివరాలు తెలుసుకున్నాకే నియమించుకోవాలి. వీటితో పాటు హాస్టల్ నిర్వహణ కోసం పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల’నే నిబంధనలను పోలీసులు తప్పనిసరి చేసి భద్రతకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఏ ఘటన జరిగినా పోలీసులకు కూడా సమాచారం అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పనిచేసే ప్రాంతంలో ‘సేఫ్’గా... సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పది మంది, అంతకు మించి ఉద్యోగులు ఉన్న సంస్థల్లో తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదుల కమిటీ(ఐసీసీ) ఏర్పాట్లపై పోలీసులు దృష్టి సారించారు. ఎస్సీఎస్సీ సహకారంతో అన్ని సంస్థల్లో ఐసీసీలు నియమించుకునేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఐసీసీలో సగం మంది మహిళలే సభ్యులుగా ఉంటున్నారు. ఏదైనా ఎన్జీవో నుంచి ఒకరు న్యాయాధికారిగా ప్రాతినిథ్యం వహించేలా చొరవ తీసుకుంటున్నారు. పనిచేసే ప్రాంతంలో లైంగిక వేధింపులపై ఐసీసీకి ఫిర్యాదు చేసిన మూడు నెలల్లోగా పరిష్కారం చూపాలి. ఆ నిర్ణయం బాధితురాలికి సంతృప్తిగా లేకపోతే బాధితులు షీ బృందాలను ఆశ్రయించవచ్చు. ఇప్పటికే 34 పంస్థల్లో 110 మంది సభ్యులతో ఐసీసీలు పనిచేసేలా చొరవ తీసుకున్నారు. వీటితోపాటు మహిళల హక్కులు, చట్టాలపై వందల సంఖ్యలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్లో మరిన్ని చర్యలు ఎస్సీఎస్సీ సహకారంతో ఐటీ కారిడార్లో పనిచేస్తున్న మహిళల భద్రతకు చర్యలు తీసుకుంటున్నాం. పనిచేసే ప్రాంతంతో పాటు బహిరంగ ప్రాంతాల్లోనూ నిర్భయంగా ఉండేలా పనిచేస్తున్నాం. మహిళ ఉద్యోగిణిల సేఫ్ జర్నీ కోసం షీ షటిల్ సర్వీసులు నడుపుతున్నాం. సంస్థల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలను బలోపేతం చేస్తున్నాం. మహిళా హాస్టళ్లలో భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నాం. భవిష్యత్లోనూ మహిళల భద్రత కోసం మరిన్ని చర్యలు తీసుకుంటాం. – వీసీ సజ్జనార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ -
లాయర్ రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య
సాక్షి, హైదరాబాద్: న్యాయం తరుపున వాదించాల్సిన లాయరే దారి తప్పాడు. భార్య ఉండగానే మరో మహిళతో రహస్యంగా కాపురం పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఈ ఘటన ఓల్డ్ రామాంతపూర్లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉప్పల్కు చెందిన కృష్ణమాచారి అనే క్రిమినల్ లాయర్కు 2008లో వింధ్యారాణి అనే మహిళతో వివాహం అయింది. వింధ్యారాణి రాజస్థాన్లో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. భార్య పంపిస్తున్న డబ్బులతో జల్సాలకు అలవాటయిన కృష్ణమాచారి మరో మహిళతో ఓల్డ్ రామాంతపూర్లోని ఓ అపార్ట్మెంట్లో కాపురం పెట్టాడు. భర్తకు దూరంగా ఉండలేక స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొని వింధ్యారాణి నగరానికి వచ్చేసింది. గత కొద్ది రోజులుగా భర్త ప్రవర్తనలో మార్పులు గమనించిన వింధ్యా అతడిని ఫాలో అవడం ప్రారంభించారు. మరో మహిళతో అక్రమసంబంధ ఉందని పసిగట్టిన వింధ్య.. స్థానికులు, బంధువుల సహాయంతో శనివారం వీరిద్దరూ ఇంట్లో కలసి ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ క్రమంలో సంఘటనా స్థలానికి వచ్చిన మీడియాపై కృష్ణమాచారి దుర్భాషలాడారు. ఇక వీరిద్దరిని స్థానికులు సహాయంతో షీ టీమ్అధికారులకు అప్పగించారు. పోలీసుల విచారణలో లాయర్ కృష్ణమాచారి.. పెళ్లి పేరుతో అనేక మంది మహిళలను మోసం చేసినట్లు తెలిసింది. -
మహిళా భద్రతలో షీటీమ్స్ దూకుడు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న పోలీస్ శాఖ షీటీమ్స్తో మంచి విజయం సాధించింది. ఈవ్టీజింగ్, వేధింపుల నియంత్రణకు విశేష స్థాయిలో కృషిచేస్తున్న ఈ బృందాల వల్ల ఏటా వేధింపుల కేసులు తగ్గుతున్నాయని మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతిలక్రా శుక్రవారం విడుదలు చేసిన ఒక పత్రికా ప్రకటనలో స్పష్టంచేశారు.హైదరాబాద్ కమిషనరేట్లో ప్రవేశపెట్టిన షీటీమ్స్ గత రెండేళ్లుగా జిల్లాల్లోనూ ఏర్పాటు చేశామని, ఈ సందర్భంగా షీటీమ్స్ ఈ ఏడాది చేసిన కృషి, వార్షిక నివేదికను స్వాతిలక్రా విడుదల చేశారు. మొత్తంగా 320 నిర్భయ కేసులు... రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, వివిధ వేదికలు, సోషల్ మీడియాలో మహిళలు, యువతులను లైంగిక వేధింపులకు గురిచేయడం, ఈవ్టీజింగ్కు పాల్పడటం కింద 1,655 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు స్వాతిలక్రా వెల్లడించారు. వీటిలో 320 నిర్భయ యాక్ట్ కేసులు, 73 ఐటీ యాక్ట్ కేసులు, 104 పోక్సో యాక్ట్ కేసులున్నట్టు పేర్కొన్నారు. సాధారణంగా వేధింపులకు పాల్పడుతున్న వారిలో మార్పు కోసం అవకాశాలిస్తున్నామని, వీరిలో చాలా మంది మారినా కొంత మంది మాత్రం పదే పదే వేధింపులకు పాల్పడటంతో ఈ కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఇలాంటి వారిపై పీడీయాక్ట్కు సైతం వెనుకాడటం లేదని తేల్చిచెప్పారు. 3,876 పెట్టీ కేసులను నమోదు చేయగా, 10,644 మందికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు వారిపై నిఘా పెట్టినట్టు తెలిపారు. ఇకపోతే 4,008 మందికి కఠిన వైఖరితో వ్యవహరిస్తామని హెచ్చరించామని, మరోసారి వేధింపులకు పాల్పడితే ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలిస్తున్నామని తెలిపారు. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కళాశాలలు, వసతి గృహాలు ఇతర ప్రాంతాల్లో అవగాహన చేపట్టినట్టు తెలిపారు. ఇలా 7,354 అవగాహన సదస్సుల ద్వారా 40.12లక్షల మందికి షీటీమ్స్ ఉద్దేశం చేర్చినట్టు తెలిపారు. 2018లో 2,709 మంది నేరుగా షీటీమ్స్కు ఫిర్యాదు చేయగా, వాట్సాప్ ద్వారా 2,825మంది, డయల్ 100 ద్వారా 2,270మంది, ఫేస్బుక్ పేజీల ద్వారా 26మంది, ఈమెయిల్స్ ద్వారా 351మంది, హాక్ఐ ద్వారా 100 మంది ఫిర్యాదు చేసినట్టు స్వాతిలక్రా తెలిపారు. గడిచిన ఏడాదిలో 8,578మందిని పట్టుకున్నామని, వీరిలో 771మందిపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా, 1,351మందిపై పెట్టీ కేసులు, 3,379మందికి కౌన్సెలింగ్, 3,077మందిని హెచ్చరించినట్లు తెలిపారు. వేధింపులకు పాల్పడుతున్న వారిలో 18ఏళ్లలోపు 12శాతం మంది ఉండగా, 19–24 ఏళ్ల వారు 38.06శాతం, 25–35ఏళ్లలోపు వారు 36.02శాతం, 36–50ఏళ్ల లోపు 13శాతం, 50ఏళ్ల పైబడిన వారు 0.02శాతం ఉన్నట్టు తేలిందన్నారు. ఇక వేధింపులు సైతం రకరకాలుగా ఉన్నాయని, వీటిలో ఎక్కువ శాతం టీజింగ్, అసభ్యప్రవర్తన కిందే 38శాతం ఉన్నట్టు గుర్తించామన్నారు. ఫోన్లలో వేధింపులు 31శాతం, 10.5శాతం స్టాకింగ్కు గురి అవుతున్నట్టు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల ద్వారా 6శాతం మంది, అభ్యంతరకర సందేశాలతో 13శాతం మంది, అసంబద్ధ తాకడాల ద్వారా 1.5శాతం మంది వేధింపులకు పాల్పడ్డారని స్పష్టంచేశారు. ఆధారాలతో సహా... వేధింపులకు పాల్పడుతున్న వారిని పూర్తి స్థాయి వీడియో ఆధారాలతో సహా పట్టుకుంటున్నామని స్వాతిలక్రా తెలిపారు. ఇది ఒక పద్ధతి అయితే, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి డెకాయి ఆపరేషన్ ద్వారా కూడా వేధింపుల నియంత్రణకు కృషిచేస్తున్నామని తెలిపారు. షీటీమ్స్ పనితీరుతో ఏటా మహిళల వేధింపుల కేసులు భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టినట్టు స్పష్టంచేశారు. 2014–15లో 26శాతం మంది మైనర్లు లైంగిక వేధింపులకు పాల్పడగా, 2017–18లో 12శాతానికి తగ్గుముఖం పట్టినట్టు తెలిపారు. ఇదే రీతిలో మిగిలిన వారిలోనూ మార్పు వస్తుందని, రాష్ట్రంలో మహిళా భద్రత విషయంలో రాజీపడే సమస్యలేదని స్పష్టంచేశారు. -
తెలంగాణలో నేరాలు తగ్గాయి : డీజీపీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నేరాలు 5శాతం తగ్గాయని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులు పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రజలందరికి సేవలు అందిసుస్తున్నారని తెలిపారు. నేర రహిత తెలంగాణ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో హత్యలు 4శాతం, ఆస్తి తగాదాలు 8శాతం, మహిళలపై నేరాలు 7శాతం, సైబర్ నేరాలు 3శాతం తగ్గాయని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలు అదుపుచేస్తున్నామన్నారు. మహిళల భద్రత కోసం జిల్లా కేంద్రాల్లో భరోసా సెంటర్లతో పాటు, రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో షీ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 6012 మంది చిన్నారులను తెలంగాణ పోలీసులు కాపాడారని వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 5 లక్షల సీసీ కెమెరాలు అమర్చేలా చర్యలు తీసుకున్నామని డీజీపీ తెలిపారు. -
ఇడియట్స్
సాక్షి, వరంగల్ క్రైం: మహిళలు, యువతుల రక్షణకు చట్టసభల్లో ఎన్ని చట్టాలు చేసినా ఆకతాయిల ఆగడాలు ఆగడం లేదు. వారు ఇంట్లో, బయటా, ఆఫీసులో, కళాశాలలో, అడుగడుగునా వేధింపులకు గురవుతునే ఉన్నారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం కూడా వేధింపులకు మార్గం అవుతోంది. ఫోన్లలో యువతుల ఫొటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఒంటరిగా కళాశాలకు వెళ్లే యువతుల కోసం బస్టాండ్ల వద్ద కాచుకుకూర్చుంటున్నారు. పోకిరీలు చేసే హేళన, సూటిపోటి మాటలను విద్యార్థినులు మౌనంగా భరిస్తున్నా రు. ఏం చేయాలో తెలియక బాధను గుండెల్లోనే దాచుకుంటున్నారు. వేధింపులు శృతి మించితేనే ఫిర్యాదు వరకు వెళ్తున్నా యి. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మహిళలు, యువతులకు రక్షణ కల్పించడానికి మూడు షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. అయినప్పటికీ వేధింపులు ఆగడం లేదు. పరువు కోసం.. కళాశాలలు, పనిచేస్తున్న కార్యాలయాలు, బంధువులు ఇలా అనేక రూపాల్లో యువతులు వేధింపులకు గురవుతున్నారు. అయినా వాటిని మౌనంగా భరిస్తూనే ఉన్నారు. పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, పరువు పోతుందనే ఉద్దేశంతో ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఎవరైనా ముందుకు వచ్చి కేసులు పెడితే వారికి కుటుంబ సభ్యుల నుంచి, సమాజం నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు దొరకడం లేదు. దీంతో ఎన్ని వేధింపులు ఎదుర్కొన్నా మనసులో కుమిలిపోతున్నారే తప్పా బయటపడడం లేదు. ఈ పరిస్థితుల నుంచి మహిళలు, యువతులు బయటికి రావడానికి పోలీసు శాఖ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో.. గౌరవప్రదమైన ఉద్యోగాలు చేసే చోట కూడా తోటి పురుష ఉద్యోగులు మహిళా ఉద్యోగులను ద్వంద్వార్థాలతో వేధిస్తున్నారు. వారిని ప్రతిఘటిస్తే అది చేయడం లేదు.. ఇది చేయడం లేదు అంటూ కక్ష సాధింపునకు పాల్పడుతున్నారు. అర్బన్ జిల్లాలో ఇటీవల ఇద్దరు ఉన్నతాధికారులు మహిళ అధికారులను సూటిపోటి మాటలతో వేధించడంతో వారు ఏకంగా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న వేధింపులను మహిళా అధికారులు, కింది స్థాయి మహిళా ఉద్యోగులు విధిలేని పరిస్థితుల్లో మౌనంగా భరిస్తున్నారు. అయితే వారు ఫిర్యాదు చేస్తే చాలు చర్యలు తీసుకునేందుకు షీ టీమ్స్ అధికారులు సిద్ధంగా ఉన్నప్పటికీ తమ పరువు బజారుకెక్కుతుందనే భయంతో వెనుకడుగు వేస్తున్నారు. ఇలాంటి దుశ్శాసనుల పీచమణచాలంటే రావల్సిందల్లా మహిళల్లో చైతన్యమే. పెరుగుత్ను కేసులు... వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో రోజురోజుకు వేధింపులు పెరుగుతున్నాయి. మహిళలు, యువతులు ఇప్పుడిప్పుడే పోలీస్ స్టేషన్ వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయగలుగుతున్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2015లో 188 కేసులు నమోదు కాగా, 2016లో 208 కేసులు, 2017లో 185 కేసులు, 2018లో ఇప్పటి వరకు 169 కేసులు నమోదయ్యాయి. ఈవ్టీజింగ్ కేసుల్లో పట్టుబడిన బాలురపై పోలీసులు కేసులు పెట్టకుండా తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, చేతుల్లో వేలాది రూపాయల విలువ చేసే స్మార్ట్ఫోన్లు ఉండడం, ఇంటర్నెట్లో ఇష్టారాజ్యంగా లాగిన్ కావడం, వాట్సప్, ఫేస్బుక్ పేరిట పరిచయం లేని వ్యక్తులతో చనువుగా మాట్లాడడం, ప్రైవేట్ హాస్టళ్ల నిర్వాహకుల పర్యవేక్షణ లేకపోవడం తదితర కారణాలతో యువతులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈవ్టీజర్లపై కఠిన చర్యలు మహిళలు, యువతులను వేధింపులకు గురిచేసే ఈవ్టీజర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా వేధింపులకు గురైతే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలి. కమిషనరేట్ పరిధిలో మూడు బృందాలు, ఒక్కో బృందంలో నలుగురు సభ్యులు పనిచేస్తున్నారు. అందరు మఫ్టీలో ఉంటారు. కళాశాలలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్ వద్ద షీటీమ్స్ పోలీసులు మఫ్టీలో ఉండి అకతాయిలను అదుపులోకి తీసుకుంటారు. ప్రతి శనివారం కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. ఎవ్వరికైనా ఇబ్బందులు ఉంటే క్రైం ఏసీపీ 9491089112, కమిషనరేట్ వాట్సప్ నంబర్ 9491089257, షీటీమ్స్ ఇన్స్పెక్టర్ 7382294058 నంబర్లకు సమాచారమిస్తే వెంటనే స్పందిస్తాం. – శ్రీనివాస్రావు, షీ టీమ్స్ ఇన్స్పెక్టర్ -
ఆమె..శక్తిమంతం
షర్ట్పై కెమెరా.. చేతిలో వాకీటాకీ.. ఎల్లప్పుడు అందుబాటులో ఉండేందుకు ప్రత్యేక బ్యాటరీ సైకిల్.. నిరంతర గస్తీ.. అత్యవసర సమయాల్లో రయ్ మంటూ దూసుకెళ్లేందుకు ప్రత్యేకంగా కారు. ఇక ఈవ్ టీజింగ్కు నో చాన్స్.. మందుబాబుల అల్లర్లు జాన్తా నయ్.. ఎవరైనా కట్టుదాటారా.. ఊచలు లెక్కపెట్టాల్సిందే. అంతేమరి.. మహిళల రక్షణ, భద్రత లక్ష్యంగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ‘శక్తి’ టీం ఈ నెల 17 నుంచి చార్జ్ తీసుకోనుంది. సాక్షి, అమరావతిబ్యూరో : మహిళల రక్షణ, భద్రత కోసం ‘శక్తి’ టీమ్లు రాజధాని రహదారులపైకి రానున్నాయి. డీజీపీ ఠాకూర్ ఆదేశాల మేరకు బెజవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలో పైలెట్ ప్రాజెక్టుగా ఈ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ టీమ్ సభ్యులకు పోలీసు శాఖ ప్రత్యేక శిక్షణను ఇచ్చింది. ఇటీవలె శిక్షణ పూర్తి చేసుకున్న ఈ బృందాలు 17 నుంచి తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. ఐదు టీమ్లు.. నిరంతరం గస్తీ పోలీసు కమిషనరేట్లో కొత్తగా చేరిన 70 మంది మహిళా కానిస్టేబుళ్లతో మహిళా శక్తి బృందం ఏర్పాటు చేశారు. ఈ బృందం వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో విధులు నిర్వహిస్తారు. సమాజంలో పెరుగుతున్న వివిధ రకాల నేరాలు, వాటి నివారణ, జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు గురించి చేరువ వాహనం ద్వారా ప్రజలకు వివరిస్తారు. మేమున్నామంటూ భరోసా కల్పిస్తారు. దీని కోసం ఈ మహిళా శక్తి బృందానికి పలు అంశాల్లో శిక్షణ ఇచ్చారు. నగర కమిషనరేట్ పరిధిలోని ఐదు జోన్లలో ఐదు బృందాలను నియమించనున్నారు. ఒక్కొ బృందంలో ఏడుగురు ఒక్కో బృందంలో ఏడుగురు మహిళా పోలీసులు ఉంటారు. వీరికి శిక్షణలో యోగా, జూడో, కరాటే, స్విమ్మింగ్, డ్రైవింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్తోపాటు మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. నగర పోలీసు కమిషనర్ ద్వారకాతిరుమలరావు ఆధ్వర్యంలో పనిచేసే ‘శక్తి’ టీమ్ నగరంలో నిరంతరం ఈ–బైస్కిళ్లపై గస్తీ నిర్వహిస్తూ ఆకతాయిలపై నిఘా పెడతారు. మహిళల భద్రతే ధ్యేయం.. మహిళల భద్రత, రక్షణే లక్ష్యంగా ఈ బృందాలు పనిచేస్తాయి. ప్రత్యేక పోలీసు డ్రెస్లో ఉండే శక్తి టీమ్స్ సభ్యులు నగరంలో నిత్యం గస్తీ నిర్వహిస్తూ మహిళలకు రక్షణ కవచంలా ఉంటారు. మహిళలను ఎవరైనా వేధించినా.. వెకిలి చేష్టలకు పాల్పడినా తక్షణమే వారిని అదుపులోకి తీసుకుంటారు. అమ్మాయిల వెంటబడి ఏడిపించే ఆకతాయిలు.. బస్టాపుల్లో ఆడపిల్లల్ని వేధించేవారు.. మద్యం తాగి హడావుడి చేసేవారు.. ఇకపై ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే. కాదని కట్టుదాటారా.. ఇక ఊచలు లెక్కపెట్టాల్సిందే అంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు. పోకిరీలపై నిఘా.. ముఖ్యంగా విద్యార్థినులపై వేధింపులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకరీలను అరెస్టు చేసి చట్ట ప్రకాశం శిక్షించడం వీరి విధి. ఈవ్టీజర్ల తల్లిదండ్రులను పోలీసు స్టేషన్కు పిలిపించి వారి సమక్షంలో కౌన్సెలింగ్ ఇవ్వడం, మళ్లీ పట్టుబడితే నిర్భయ కేసును నమోదు చేయడం ‘శక్తి’ బృంద సభ్యుల ముఖ్య నిర్వహణ. చట్టాలపై అవగాహన.. సైబర్ నేరాలు, ఈవ్టీజింగ్ నిరోధక చట్టాలు, సమాజంలో జరిగే వివిధ తరహా నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తారు. బృంద సభ్యులు నగరంలో ఆకతాయిల ఆట కట్టించటమే కాకుండా కాలనీలు, రహదారులపై గస్తీ తిరుగుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ముఖ్యభూమిక పోషిస్తారు. -
పోకిరీలకు చెక్
కళాశాలలు.. విద్యాసంస్థలు.. బస్స్టాపులు.. రైల్వేస్టేషన్లు.. వాణిజ్య సముదాయాలు.. సినిమా థియేటర్ల వద్ద యువతులు, మహిళలను వేధిస్తున్న పోకిరీలకు మహిళా రక్షక్ బృందాలు బుద్ధి చెబుతున్నాయి. బృంద సభ్యులు మఫ్టీలో తిరుగుతూ ఈవ్టీజర్ల భరతం పడుతున్నారు. సాక్షి, నెల్లూరు(క్రైమ్): మహిళలు సమాజంలో ధైర్యంగా తిరిగే భరోసా ఇవ్వాలి. ఆకతాయిల ఆటలు ఇక సాగవనే నమ్మకం కలిగించాలి. తమ కోసం ఓ నిఘా వ్యవస్థ అండగా ఉందనే అవగాహన తేవాలి. అప్పుడు చక్కటి సమాజం ఆవిష్కృతమవుతుందనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఈ నెల 13వ తేదీన జిల్లా కేంద్రంలో తొలిసారిగా 10 మహిళా రక్షక్ టీంలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అవి సత్ఫలితాలిస్తున్నాయి. నగరంలో ఇప్పటి వరకు 145 మంది ఈవ్టీజర్లను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్కు తరలించారు. వారి పూర్తి వివరాలను సేకరించి రికార్డుల్లో నిక్షిప్తం చేస్తున్నారు. పోకిరీల తల్లిదండ్రులను స్టేషన్కు పిలిపించి వారి సమక్షంలో పోలీసు సిబ్బంది కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అనంతరం తల్లిదండ్రుల పూచీకత్తుపై వారిని బయటకు విడిచి పెడుతున్నారు. తొలిసారి కౌన్సెలింగ్తో సరి.. ఈవ్టీజింగ్కు పాల్పడుతూ పోలీసులకు చిక్కిన ఆకతాయిలకు తొలిసారిగా పోలీసులు తమదైన శైలిలో కౌన్సెలింగ్ చేస్తున్నారు. అతని గత చరిత్రను పరిశీలించి నేరచరిత్ర లేకపోతే తల్లిదండ్రుల పూచీకత్తుపై విడిచి పెడుతున్నారు. మరోసారి చిక్కితే కటకటాల లెక్కించాల్సిందేనని వారిని హెచ్చరిస్తున్నారు. పోలీసులు కౌన్సెలింగ్ చేసిన వారిలో అధిక శాతం మంది 20 నుంచి 30 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉన్నారు. సత్ఫలితాలు .. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన రక్షక్ బృందాలు సత్ఫలితాలిస్తున్నాయి. వేదాయపాళెం, హరనాథపురం తదితర ప్రాంతాల్లో పలువురు ఈవ్టీజర్లపై డయల్ 100కు ఫిర్యాదులు వెళ్లాయి. తక్షణమే స్పందించిన బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఈవ్టీజర్ల భరతం పట్టాయి. దీంతో ఆయా ప్రాంత వాసులు బృందాల పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి. త్వరలో అవగాహన సదస్సులు పోకిరీల ఆటలు కట్టిస్తున్న మహిళా రక్షక్ బృందాలు త్వరలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, విద్యాసంస్థలకు వెళ్లనున్నాయి. ఈవ్టీజింగ్కు వ్యతిరేకంగా విద్యార్థినులకు అవగాహన సదస్సులు నిర్వహించేందుకు పక్కాప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. విద్యార్థినుల మనోగతం, వేధించిన వారిపై చట్టపరంగా పోలీసులు చేపట్టే చర్యలను వివరించనున్నారు. షీ బృందం ఏం చేస్తుందంటే.. కళాళాలలు, బస్టాండ్, రైల్వేస్టేషన్, మార్కెట్ తదితర ప్రాంతాల్లో సంచరిస్తూ ఈవ్టీజర్లను గుర్తించి వారిని అరెస్ట్ చేస్తారు. ఒక్కో బృందంలో నలుగురు ఉంటారు. వీరు మఫ్టీలో తిరుగుతూ ఈవ్టీజర్ల భరతం పడుతారు. ఎలాంటి నేర ప్రవృత్తి లేకుండా తొలిసారిగా ఈవ్టీజింగ్ చేసిన వారికి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసి గట్టిగా మందలిస్తారు. కరుడుగట్టిన వారైతే కేసులు నమోదు చేస్తారు. ఎవరైనా మహిళలు తామెదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదు చేస్తే వారి పేరు బయటకు రానివ్వకుండా విచారిస్తారు. విద్యార్థినులు, మహిళలు ఏం చేయాలంటే.. మగవాళ్లు మాటలతో కానీ, చేష్టలతో కాని, అనుచిత రీతిలో తాకటం, అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు తీయడం వంటి చర్యలతో ఇబ్బంది పెడుతుంటే డయల్ 100కు కాల్ చేసి తామున్న ప్రదేశాన్ని తెలియజేయాలి. లేదా పబ్లిక్ ఐవాట్సప్ నంబర్ 9390777727కు సమాచారం (టైప్చేసి గానీ, ఫొటోల రూపంలో గాని) పంపితే వెంటనే మహిళా రక్షక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ఈవ్టీజర్ల భరతం పడుతాయి. ఈవ్టీజర్లే కాదు ఇంకా ఎవరైనా ఇబ్బందులకు గురి చేసినా పై నంబర్లకు ఫోను చేసి ఫిర్యాదు చేస్తే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదుదారుల వివరాలను బృందాలు గోప్యంగా ఉంచుతాయి. నిర్భయంగా ఫిర్యాదు చేయండి మహిళల రక్షణే ధ్యేయంగా మహిళా రక్షక్ టీంలను ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ప్రవేశ పెట్టారు. నగరంలోని ఆరు పోలీసుస్టేషన్లలో ఆరు బృందాలు, మహిళా పోలీసుస్టేషన్ పరిధిలో నాలుగు బృందాలు పని చేస్తున్నాయి. మఫ్టీలో తిరుగుతూ ఆకతాయిల భరతం పడుతున్నాం. మహిళలకు, విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటికే పలు ఫిర్యాదులు అందాయి. మహిళలు, విద్యార్థులు తామెదుర్కొంటున్న సమస్యలపై డయల్ 100, 9390777727, 94904 39561లకు ఫిర్యాదు చేయాలి. తగిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు సైతం సమాచారం అందించవచ్చు. – పి. శ్రీధర్, మహిళా రక్షక్టీమ్స్ నోడల్ అధికారి -
మహిళా రక్షక్
నెల్లూరు(క్రైమ్): మహిళలపై వేధింపులు, దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వారి రక్షణకోసం మహిళా రక్షక్ బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి వెల్లడించారు. తొలిసారిగా జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలోని ఆరు పోలీస్ స్టేషన్లు, నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్ల సిబ్బందితో 10 బృందాలు (ఒక్కో స్టేషన్కు ఒక్కో బృందం, మహిళా స్టేషన్లో మూడు బృందాలు)ను నియమించామని, వారిద్వారా పోకిరీల భరతం పడతామని ఎస్పీ చెప్పారు. మంగళవారం నెల్లూరులోని పోలీసు కవాతు మైదానంలో ఉన్న ఉమేష్చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్హాలులో బృందాలను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి ప్రయత్నంగా జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలో బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మహిళా డీఎస్పీ పి.శ్రీధర్ ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తాయన్నారు. ఒక్కో బృందంలో ఇద్దరు మహిళలు, ఇద్దరు మగ పోలీసు సిబ్బంది ఉంటారన్నారు. వీరు ఆయా ప్రాంత పోలీస్ స్టేషన్ల పరిధిలో మహిళలపై వేధింపులు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి మఫ్టీలో సంచరిస్తారన్నారు. ఈవ్టీజింగ్, మహిళలపై దాడులకు పాల్పడేవారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలిస్తారన్నారు. మొదటిసారి పట్టుబడిన వారికి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. పదేపదే నేరాలకు పాల్పడేవారిపై కేసులు నమోదుచేసి జైలుకు పంపుతామని చెప్పారు. నిఘా కెమెరాలతో పరిశీలన ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ కె.శ్రీనివాసాచారి పర్యవేక్షణలో కమాండ్ కంట్రోల్ సిబ్బంది అక్కడి నుంచే సీసీ కెమెరాల ద్వారా నగరంలో ఈవ్టీజింగ్, దాడులను గుర్తించి మహిళా రక్షక్ బృందాలకు సమాచారం అందిస్తారన్నారు. వెంటనే సిబ్బంది నిర్దేశిత ప్రాంతానికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకొంటారన్నారు. పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలకు ప్రజలు తమవంతు సహకారం అందించాలని కోరారు. తమ ప్రాంతాల్లో యువతులపై ఆకతాయిల వేధింపులు, మహిళలపై దాడులను గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధ్యతాయుతంగా పనిచేయండి మహిళా రక్షక్ బృందాల్లోని సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎస్పీ అన్నారు. మీరిచ్చే స్ఫూర్తితో జిల్లాలోని అన్నీ పట్టణాల్లో రక్షక్ బృందాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రత్యేక వాహనాలను త్వరలోనే సమకూరుస్తామన్నారు. అనంతరం ఆయన మహిళా రక్షక్ బృందాల ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో అడ్మిన్, క్రైమ్ ఏఎస్పీలు పి.పరమేశ్వరరెడ్డి, ఆంజనేయులు, ఏఆర్ ఏఎస్పీ వీరభద్రుడు, నెల్లూరు నగర, ఎస్సీ, ఎస్టీ సెల్–1, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీలు ఎన్బీఎం మురళీకృష్ణ, కె.శ్రీనివాసాచారి, పి.శ్రీధర్, నగర ఇన్స్పెక్టర్లు పాపారావు, వేణుగోపాల్రెడ్డి నరసింహారావు, పి.శ్రీనివాసులురెడ్డి, ఎస్సై తదితర సిబ్బంది పాల్గొన్నారు. సిబ్బందికి అభినందన ఆర్టీసీ బస్టాండ్ వద్ద కొందరిపై కత్తులతో దాడిచేయబోయిన వారిని చాకచక్యంగా పట్టుకున్న ట్రాఫిక్ ఆర్ఎస్సై కృష్ణయ్య, కానిõస్టేబుల్ శివకృష్ణలను ఎస్పీ రస్తోగి అభినందించారు. సిబ్బంది సకాలంలో స్పందించి నిందితులను పట్టుకోవడం వల్ల ప్రాణనష్టం జరగలేదన్నారు. అనంతరం వారికి నగదు రివార్డులను అందించారు. ఫోన్ నంబర్లు మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలిపేందుకు వీలులేని పక్షంలో డయల్ 100కు ఫోన్ చేయొచ్చు. లేదా 93907 77727, 94904 39561లకు ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వొచ్చు. -
జూనియర్ ఆర్టిస్ట్ వెకిలి చేష్టలు
సాక్షి, హైదరాబాద్: సామూహిక నిమజ్జనాన్ని తిలకించేందుకు వచ్చిన యువతులను సెల్ఫోన్ ద్వారా వీడియో రికార్డింగ్ చేసిన వ్యక్తి చర్యలను న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. సిటీ షీ–టీమ్స్కు చిక్కిన ఇతడికి కోర్టు 27 రోజుల జైలు శిక్ష విధించినట్లు అదనపు సీపీ (నేరాలు) షికాగోయల్ బుధవారం తెలిపారు. మరో ఇద్దరికి సామాజిక సేవ చేసే శిక్ష విధించగా... యువతిని వేధిస్తున్న మరో వ్యక్తికి జరిమానా విధించినట్లు ఆమె పేర్కొన్నారు. గత నెల 23న సామూహిక గణేష్ నిమజ్జనం జరిగింది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ఆదేశాల మేరకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా షీ–టీమ్స్ను రంగంలోకి దింపారు. ఈవ్ టీజర్లకు చెక్ పెట్టేందుకు 100 షీ–టీమ్ బృందాలను వివిధ ప్రాంతాల్లో మోహరించారు. ట్యాంక్బండ్ మీద ఉన్న క్రేన్ నెం.3 వద్ద మాటేసిన షీ–టీమ్స్కు సుశికాంత్ పాండ దొరికాడు. ఒడిస్సాకు చెందిన ఇతను నగరానికి వలసవచ్చి కుక్గా పని చేస్తున్నాడు. నిమజ్జనం నేపథ్యంలో ట్యాంక్బండ్ పైకి వచ్చిన ఇతను స్మార్ట్ఫోన్తో యువతులను వారి అనుమతి లేకుండా చిత్రీకరిస్తుండటాన్ని గుర్తించిన షీ–బృందాలు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాయి. పూర్తి ఆధారాలతో 16వ స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి సుశికాంత్కు 27 రోజుల జైలు, రూ.250 జరిమానా విధించారు. అదే రోజు ట్యాంక్బండ్పై యువతులను వెకిలి చేష్టలతో వేధిస్తున్న మీర్పేటకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ పి.కృష్ణ, మౌలాలీకి చెందిన బీకే దిలీప్లను సైతం పట్టుకుని కోర్టులో హాజరుపరిచాయి. వీరికి న్యాయస్థానం రెండు రోజుల పాటు సామాజిక సేవ చేసేలా శిక్షతో పాటు రూ.100 జరిమానా విధించింది. మరోపక్క ఓ యవతిని ఫోన్ ద్వారా వేధిస్తున్న కుషాయిగూడకు చెందిన వ్యాపారి కె. నాగరాజుకు షీ–టీమ్స్ చెక్ చెప్పాయి. ఇతడికి కోర్టు రూ.250 జరిమానా విధించినట్లు షికా గోయల్ పేర్కొన్నారు. -
ఆకతాయిలపై షీ బృందం కొరడా
సాక్షి, సిటీబ్యూరో: గణేశ్ నిమజ్జనం జరుగుతున్న ట్యాంక్బండ్పై అమ్మాయిలను వేధిస్తున్న ఈవ్టీజర్లపై నగర షీ బృందాలు కొరడా ఝుళిపిస్తున్నాయి. ట్యాంక్బండ్పై బాలికలను వీడియో తీస్తున్న ఇద్దరు ఆకతాయిలను శుక్రవారం రాత్రి రెడ్హ్యండెడ్గా పట్టుకున్నాయి. ఒడిశాకు చెందిన శశికాంత్ పాండ, జార్ఖండ్కు చెందిన నితీశ్ కుమార్లను షీ టీమ్ కార్యాలయానికి తీసుకొచ్చి కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. అలాగే నెక్లెస్రోడ్డులో అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యాప్రాల్ వాసి నాగేంద్రబాబు, సికింద్రాబాద్లోని వారాసిగూడ వాసులు రోహిత్, మహేందర్, రామకృష్ణలను షీ బృందాలు పట్టుకున్నామయని నగర క్రైమ్ అండ్ సిట్ అదనపు పోలీసు కమిషనర్ షిఖా గోయల్ తెలిపారు. -
నిమజ్జనంపై నిఘా
సాక్షి, హైదరాబాద్: వినాయక నిమజ్జన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు హైటెక్ పద్ధతిలో ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ మహేందర్రెడ్డి వెల్లడించారు. 31 జిల్లాల్లోని వినాయక మండపాలు, నిమజ్జన ప్రక్రియను పోలీస్ ముఖ్య కార్యాలయం నుంచి లైవ్లో వీక్షించేలా సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 74,809 మండపాలను జియో ట్యాగ్ చేసి ప్రతి జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్ నుంచి పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 65 వేల మంది పోలీసులు ప్రత్యక్షంగా, పరోక్షంగా విధుల్లో ఉంటారని.. సోషల్ మీడియాలో వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదివారం వినాయక నిమజ్జనం సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై డీజీపీ సమీక్ష నిర్వహించారు. అనుమానాస్పద వ్యకులను గుర్తించేందుకు ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు. జిల్లాల్లో లోతయిన చెరువుల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. మహిళలు, అమ్మాయిలను వేధించే పోకిరీలను గుర్తించేందుకు షీ టీమ్స్ను రంగంలోకి దింపిన ట్లు వెల్లడించారు. సున్నిత ప్రాంతాలు, గతం లో అల్లర్లు సృష్టించేందుకు యత్నించిన వారిపై నిఘా పెంచామన్నారు. గణేశ్ మండపాల నిర్వాహకులతో పోలీస్ అధికారులు సమన్వయం చేసుకోవాలని, వాళ్లను కలుపుకుంటూ వెళ్లి కార్యక్రమాలు ప్రశాంతంగా పూర్తయ్యేలా చూడాలని ఎస్పీలు, కమిషనర్లను ఆదేశించారు. 3 ఫీట్ల పైబడినవే..: రాష్ట్రవ్యాప్తంగా 3 ఫీట్ల పైబడి ఉన్న విగ్రహాల ఏర్పాటుకు పోలీస్ శాఖ అనుమతిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 74,809 విగ్రహాలు ఏర్పాటయినట్లు ఆ శాఖ నివేదిక రూ పొందించింది. ఇందులో 60% విగ్రహాల నిమజ్జనం ఇప్పటికే పూర్తయిందని డీజీపీ తెలిపారు. -
స్త్రీలోక సంచారం
చిన్నారులపై జరుగుతున్న లైంగిక అఘాయిత్యాలను నివారించే విషయమై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్లో ‘ఇనఫ్ ఈజ్ ఇనఫ్’ (జరిగింది చాలు) అంటూ ఒక వర్క్షాప్ జరిగింది. ప్రభుత్వ టీచర్ల కోసం ‘షీ’ టీమ్స్, భరోసా సెంటర్లు నిర్వహించిన ఈ వర్క్షాపులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, అడిషనల్ పోలీస్ కమిషనర్ (క్రైమ్స్ అండ్ సిట్) శిఖా గోయెల్ పాల్గొని సలహాలు, సూచనలు ఇచ్చారు. యు.ఎస్.లో నివాసం ఉంటున్న 9 ఏళ్ల సోహా నాజ్ అనే మూడో తరగతి బాలిక, ఎవరి సహాయమూ తీసుకోకుండా తనకై తనే తన ఇంటి ముందు కేక్స్, మిల్క్షేక్స్, మింట్ గ్రోన్ (పుదీనా) అమ్మి సంపాదించిన 300 డాలర్లను (సుమారు 21 వేల రూపాయలు) హైదరాబాద్ పాతబస్తీలోని దబీర్పురాలో ఉన్న ‘సానీ వెల్ఫేర్ ఫౌండేషన్’కు విరాళంగా అందజేసింది! తినేందుకు తిండే లేని నిరుపేదలకు ఉచితంగా భోజనం పెడుతున్న ధార్మిక సంస్థల వీడియోలను చూసి స్ఫూర్తి పొంది, కష్టపడి డబ్బు సంపాదించి సోహా నాజ్ పంపిన ఈ డబ్బుతో 21 బియ్యం బస్తాలు వచ్చాయని ఫౌండేషన్ ప్రకటించింది. వెనుకా ముందూ చూడకుండా బయోకాన్ కంపెనీ సి.ఎం.డి. కిరణ్ మజుందార్ షా ఆస్తిని జప్తు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి.) ను ‘ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, 2002’ ట్రిబ్యునల్ తప్పు పట్టింది. కిరణ్కు కనీస వివరణకు కూడా అవకాశం ఇవ్వకుండా.. బెంగళూరు కింగ్ఫిషర్ టవర్స్లో విజయ్ మాల్యా హౌసింగ్ ప్రాజెక్టు కింద కిరణ్ మజుందార్ షా 2012లో కొనుగోలు చేసిన ఫ్లాట్ను ఇ.డి.జప్తు చేయడంపై విస్మయాన్ని వ్యక్తం చేసిన ట్రిబ్యునల్.. ఫ్లాట్ను జప్తు నుంచి విడిపించింది. తలకొరివి పెట్టేందుకు, ఇతర అంత్యక్రియల్ని నిర్వహించేందుకు, కనీసం చితిస్థలికి వచ్చేందుకు మహిళల్ని అనుమతించని హైందవ సంప్రదాయంలో.. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కర్మకాండల సందర్భంగా కాస్త పట్టు విడుపు కనిపించింది. వాజ్పేయి పెంపుడు కూతురు నమితా కౌల్ భట్టాచార్య ఆయన చితికి నిప్పు పెట్టడాన్ని.. మహిళలపై సమాజంలో ఉన్న నిషేధాలు క్రమంగా తొలిగిపోతున్నాయనడానికి ఒక సంకేతంగా సామాజిక పోకడల పరిశీలకులు పరిగణిస్తున్నారు. శబరిమల ఆలయంలోకి మహిళల్ని అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందువల్లనే.. కేరళలో జలప్రళయం సంభవించిందని వ్యాఖ్యానించిన ఆర్.బి.ఐ. సలహాదారు, ఆర్.ఎస్.ఎస్. ఆర్థిక విభాగమైన ‘స్వదేశీ జాగరణ్ మంచ్’ కో కన్వీనర్ ఎస్.గురుమూర్తి ఇప్పుడు సోషల్ మీడియాలోని విమర్శల వరదల్లో చిక్కుకున్నారు. ప్రకృతి విలయాలకు, మానవ నిర్ణయాలకు ముడిపెట్టి ప్రజల్లో లేనిపోని అనుమానాలను కలిగించడం ద్వారా స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకోవడం మంచిది కాదని ట్విట్టర్లో కొందరు ఆయనకు హితవు చెప్పారు. యు.ఎస్. ఆరిజోనా రాష్ట్రంలోని మెసా పట్టణంలో ‘బ్యానర్ డెజర్ట్ మెడికల్ సెంటర్’ ఐ.సి.యు.లో సేవలు అందిస్తున్న మొత్తం 16 మంది నర్సులూ గర్భిణులేనన్న విషయం అనుకోకుండా బయటికి వచ్చింది. ఫేస్బుక్ గ్రూపులో ఉన్న ఈ నర్సులందరూ ఒకరి గురించి ఒకరు వ్యక్తిగతమైన విషయాలు షేర్ చేసుకుంటున్నప్పుడు వీళ్లంతా కూడా గర్భిణులేననీ, వచ్చే అక్టోబర్–జనవరి నెలల మధ్య వీరు ప్రసవించబోతున్నారని.. వీరిలోనే ఒకరైన రోషల్ షర్మన్ పట్టలేని ఆనందంతో బహిర్గతం చేయడంతో ఈ ఆసక్తికరమైన సంగతి వెలుగులోకి వచ్చింది. బ్రెస్ట్ క్యాన్సరో, లంగ్ క్యాన్సరో వైద్యులు నిర్థారించే క్రమంలోనే క్యాన్సర్కు చికిత్సను పొందుతూ 56 ఏళ్ల వయసులో 1974లో మరణించిన అమెరికన్ రచయిత్రి జాక్వెలీన్ సుసాన్ నూరవ జయంతి నేడు. 1918 ఆగస్టు 20న ఫిలడెల్ఫియాలో జన్మించిన సుసాన్ ‘వ్యాలీ ఆఫ్ ది డాల్స్’ (1966), ‘ది లవ్ మెషీన్ (1969), ‘వన్స్ ఈజ్ నాట్ ఇనఫ్’ (1973) పుస్తకాలతో విశేష పాఠకాదరణ పొందారు. 21 ఏళ్ల వయసులో జేమ్స్బాండ్ చిత్రం ‘డై అనదర్ డే’ (2002)తో సినీ రంగ ప్రవేశం చేసిన రోసామండ్ పైక్.. ఆ చిత్రంలోని బాండ్ గర్ల్ పాత్ర ఎంపిక కోసం అండర్వేర్ మినహా తన ఒంటి మీద బట్టలన్నీ విప్పమని అడిగారని, అందుకు తను తిర స్కరించినప్పటికీ చివరికి ఆ పాత్ర తననే వరించిందని ఇన్నేళ్ల మౌనం తర్వాత ఇప్పుడు బయటపడ్డారు! రెండు రోజుల క్రితం ‘అమెజాన్స్ ఆడిబుల్ సెషన్స్’కి వెళ్లినప్పుడు ఈ రహస్యోద్ఘాటన చేసిన రోసామండ్.. తన తిరస్కారానికి ముగ్ధులవడం వల్లనే ఆ పాత్రను తనకు ఇచ్చినట్లు ఆ తర్వాత నిర్మాతలు తనతో అన్నారని కూడా చెప్పారు. -
‘పాతికేళ్ల’ పోకిరీలు!
సాక్షి, సిటీబ్యూరో: కనిపిస్తే చాలు కామెంట్స్ చేసే వారు కొందరు... నెంబర్ దొరికితే చాలు అభ్యంతరకర సందేశాలు పంపేవారు ఇంకొందరు...అదును చూసుకుని తాకాలని ప్రయత్నించే వారు మరికొందరు.. ఇలా నగర షీ–టీమ్స్కు నిత్యం అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. నాలుగేళ్ల కాలంలో మొత్తం 4118 ఫిర్యాదులు రాగా... బాధ్యులైన వారిలో అత్యధికులు పాతికేళ్లు నిండిన వాళ్లే ఉన్నారు. మరోపక్క కౌన్సెలింగ్కే ప్రాధాన్యం ఇస్తున్న నగర పోలీసు షీ–టీమ్స్... అనంతరం వారిపై నిఘా కొనసాగిస్తున్నాయి. నగరంతోనే మొదలైన టీమ్స్... ఈవ్టీజింగ్ నుంచి ఫోన్ వేధింపుల వరకు వివిధ రకాలైన ఇబ్బందులు ఎదుర్కొనే యువతులు/మహిళలు గతంలో సాధారణ పోలీసుల్నే ఆశ్రయించి ఫిర్యాదు చేయాల్సి వచ్చేది. దీంతో అనేక మంది అసలు ఫిర్యాదులకే దూరంగా ఉండి వేధింపుల్ని మౌనంగా భరించేవారు. పోకిరీలు దీన్ని అలుసుగా తీసుకుని మరింత రెచ్చిపోయే వారు. ఒకప్పుడు సిటీలో కొన్ని ప్రాంతాలకు వెళ్లాలంటే యువతులు హడలిపోవాల్సిన పరిస్థితి. వీటిని గమనించిన ప్రభుత్వం 2014లో షీ–టీమ్స్కు రూపమిచ్చింది. రాష్ట్రంలోనే తొలిసారిగా నగరంలో ప్రారంభించిన ఈ విధానాన్ని ఆపై సైబరాబాద్, రాచకొండలకు విస్తరించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని కమిషనరేట్లు, జిల్లాల్లో షీ–టీమ్స్ ఏర్పాటు చేసి మహిళలు/యువతులకు రక్షణ కల్పిస్తున్నారు. పక్కా ఆధారాలతోనే పడతారు... భరోసా కేంద్రం ఆధీనంలో పనిచేసే ఈ షీ–బృందాలు ప్రధానంగా రెండు రకాలుగా విధులు నిర్వర్తిస్తాయి. ఎవరైనా ఇబ్బందులు, వేధింపులు ఎదుర్కొంటూ నేరుగా, ఫోన్ ద్వారా, సోషల్మీడియా ద్వారా ఫిర్యాదు చేసినప్పుడు తక్షణం స్పందించి బాధ్యతలను గుర్తించడంతో పాటు వారిపై చర్యలు తీసుకుంటాయి. ఈ పనితో పాటు నగరంలోని పబ్లిక్ ప్రదేశాలు, కాలేజీలు, పాఠశాలలు ఉన్న ప్రాంతాలు, వాణిజ్య కేంద్రాలు, పార్క్ల్లోనూ షీ–టీమ్స్ నిఘా వేసి ఉంచుతాయి. అక్కడ తిష్టవేసే పోకిరీలను పట్టుకుంటాయి. ఏ సందర్భంలో అయినా పక్కా ఆధారాలతోనే బాధ్యతలను అదుపులోకి తీసుకుంటారు. దీనికోసం డెకాయ్ ఆపరేషన్లు చేయడం, పోకిరీల వ్యవహారశైలిని రికార్డు చేయడంతో పాటు అవసరమైతే సాంకేతిక ఆధారాలను సైతం సేకరిస్తుంటారు. అయితే అత్యధికంగా ‘డయల్–100’ ద్వారా 1525 ఫిర్యాదులు వచ్చాయి. కేసుల నుంచి కౌన్సిలింగ్ వరకు... షీ–టీమ్స్ తమకు వచ్చిన ఫిర్యాదుల్లో బాధ్యులు, డెకాయ్ ఆపరేషన్స్లో దొరికిన వారు, నిఘాలో చిక్కిన వారిలో అందరిపై ఒకే విధంగా స్పందించదు. వారి వ్యవహారశైలి, నేర స్వభావం, కుటుంబ నేపథ్యం, లిఖిత పూర్వక ఫిర్యాదు విషయంలో బాధితులు చూపే ఆసక్తి తదితరాలను పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకుంటారు. భరోసా, షీ–టీమ్స్లు పోలీసుస్టేషన్లు కాకపోవడంతో కేసులు నమోదు చేసే అధికారం లేదు. ఈ నేపథ్యంలోనే తీవ్రమైన నేరం చేసిన వారిపై సైబర్ క్రైమ్ ఠాణాతో పాటు వివిధ పోలీసుస్టేషన్లలో ఎఫ్ఐఆర్లు నమోదు చేయిస్తున్నారు. అత్యధికులకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ చేస్తున్నారు. అలాంటి చర్యలు పునరావృతం కానీయవద్దంటూ హెచ్చరించి పంపిస్తున్నారు. చిక్కిన వారిలో 1872 మందికి కౌన్సిలింగ్ చేయడంతో పాటు వారి వ్యవహారశైలిపై కొన్నాళ్లు నిఘా ఉంచుతున్నారు. వెంటపడి అభ్యంతరకరంగాప్రవర్తిస్తున్నారు... వివిధ రకాలుగా, మాధ్యమాల ద్వారా షీ–టీమ్స్కు వస్తున్న ఫిర్యాదులు, డెకాయ్ ఆపరేషన్స్లో చిక్కుతున్న వారిలో యువతులు/మహిళల వెంటపడటంతో పాటు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్న కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. నాలుగేళ్లలో ఈ తరహాకు చెందినవి 606 నమోదయ్యాయి. సోషల్మీడియా ద్వారా వేధింపులు 122, ఫోన్ హెరాస్మెంట్ కేసులు 35, యువతులు/మహిళల్ని తాకిన ఉదంతాలకు సంబంధించి 82 నమోదయ్యాయి. వీటిలో కొన్నింటిలో ఎఫ్ఐఆర్లు కాగా మరికొన్నింటిలో కౌన్సిలింగ్, వార్నింగ్, పెట్టీ కేసులు నమోదయ్యాయి. బాధ్యుల్ని గుర్తించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న షీ–టీమ్స్ సాకేంతిక పరిజ్ఞానాన్నీ వినియోగిస్తున్నాయి. అవసరమైతే సైబర్ క్రైమ్తో పాటు స్థానిక పోలీసుల సహకారం తీసుకుని చర్యలు తీసుకుంటున్నాయి. హాక్–ఐ, ట్విటర్ ద్వారా వచ్చిన ఫిర్యాదులకూ స్పందించి రంగంలోకి దిగుతున్నాయి. పాతికేళ్లు దాటినా అదే పంథా... పోకిరీల పేరు చెప్పగానే సాధారణంగా టీనేజర్లు, మైనర్లే గుర్తుకువస్తారు. అయితే సిటీలో నమోదైన గణాంకాలను పరిశీలిస్తే 25 ఏళ్లు దాటిన...35 ఏళ్ళ లోపు వాళ్లే ఎక్కువగా నిందితులుగా షీ–టీమ్స్కు చిక్కారు. మొత్తం 1122 మందిని అదుపులోకి తీసుకోవడం, అరెస్టు చేయడం జరిగింది. వీరిలో 25–35 ఏళ్ళ మధ్య వయస్కులు అత్యధికంగా 384 మంది ఉన్నారు. 18 ఏళ్ల లోపు మైనర్లు 101 మంది, 19–24 ఏళ్ళ మధ్య వయస్కులు 362 మంది, 36–50 ఏళ్ళ మధ్య వయస్కులు 258 మంది, యాభై ఏళ్ళు దాటిన వారు 50 మంది ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందిస్తున్న షీ–టీమ్స్తో మహిళలు, యువతులకు భరోసా లభించిందని, ఎలాంటి ఫిర్యాదు వచ్చినా తక్షణం స్పందిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. -
సేఫ్ సిటీ కోసమే షీటీమ్స్
గన్ఫౌండ్రీ: హైదరాబాద్ను ప్రపంచంలోనే మహిళలకు అత్యంత భద్రతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని సిటీ షీటీమ్స్ అడిషనల్ సీపీ షికాగోయల్ అన్నారు. ప్రజారవాణ వ్యవస్థలో మహిళలపై జరుగుతున్న వివిధ రకాల వేధింపులపై అవగాహన కల్పించేందుకు సిటీ ట్రాఫిక్ పోలీస్, రేడియో మిర్చి సహకారంతో ‘నెక్ట్స్ స్టాప్’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలి పారు. ఇందుకు సంబంధించిన టీజర్ను శుక్రవా రం ఆదర్శ్నగర్ హాకా భవన్లోని భరోసా కేం ద్రంలో ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఈవ్టీజింగ్, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేధింపులు ఎదుర్కొంటున్న మహిళ లు, బాలికలు ధైర్యంగా తమకు సమాచారం అం దించాలని సూచించారు. ఇప్పటి వరకు షీటీమ్స్ బృందం 5వేల కేసులు నమోదు చేసిందన్నారు. ఇకపై మెట్రో రైల్, ఆర్టీసీ బస్సులలో సైతం ప్రత్యే క దృష్టిసారిస్తామన్నారు. ఈవ్టీజింగ్, వివిధ రకాల వేధింపులపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్, రేడియో మిర్చి సహకారంతో రేడియో జాకీలు శనివారం నుంచి వారం రోజుల పాటు ప్రజారవాణా వాహనాల్లో ప్రయాణిస్తారని చెప్పారు. కార్యక్రమంలో టీఎస్ ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ కంట్రోలర్ శ్రీధర్, ఆర్జే షేజీ తదితరులు పాల్గొన్నారు. -
పబ్లిక్ టాయ్లెట్ గోడపై యువతి సెల్ నంబర్
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): క్యాబ్ చార్జీ ఎక్కువ ఇవ్వనందుకు ప్రయాణికురాలి సెల్నంబర్ను పబ్లిక్ టాయ్లెట్ గోడపై రాసి వేధింపులకు కారణమైన డ్రైవర్ను సైబరాబాద్ షీ బృందాలు అరెస్టు చేశాయి. ఓ మహిళ కోకాపేట్ నుంచి మాదాపూర్కు క్యాబ్ బుక్ చేసిన సమయంలో ప్రయాణ చార్జీ రూ.200 చూపించగా డ్రైవర్ ఇతర మార్గాల్లో తిప్పి రూ.800 చార్జీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అందుకు అంగీకరించని ఆమె రూ.200 మాత్రమే ఇచ్చింది. దీనిని మనస్సులో పెట్టుకున్న డ్రైవర్ ఆమె సెల్ఫోన్ నంబర్ను పబ్లిక్టాయ్లెట్ గోడపై రాయడంతో బాధితురాలికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్కాల్స్ వచ్చాయి. దీంతో బాధితురాలు డ్రైవర్పై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అతను నేరం అంగీకరించాడు. కరాటే శిక్షణ కోసం వెళ్లిన తన కుమార్తెకు మాస్టర్ అశ్లీల దృశ్యాలు చూపించి అసభ్యంగా ప్రవర్తించాడంటూ వాట్సాప్ ద్వారా ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో షీ బృందాలు నిందితుడిని పట్టుకున్నాయి. గత రెండు వారాల్లో 47 మంది ఈవ్టీజర్లపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశాయి. సైబరాబాద్ షీ టీమ్ ఇన్చార్జ్ అనసూయ ఈవ్టీజర్లకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. సామాజిక మాధ్యమాల ద్వారా 64 ఫిర్యాదులు అందగా 47 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. -
ముగిసిన షీటీమ్స్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళల భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన షీటీమ్స్ నిర్వహణ, కేసుల్లో విచారణ, వేధింపుల నియంత్రణకు చేపట్టాల్సిన అంశాలపై పలు జిల్లాల అధికారులకు, సిబ్బందికి ఇస్తున్న శిక్షణ బుధవారంతో ముగిసింది. అన్ని జిల్లాల అధికారులకు శిక్షణ అందించేందుకు నెల రోజుల క్రితం పోలీసు శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి రెండు రోజులకొక బ్యాచ్ చొప్పున శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. కాగా, శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగియడంతో సంబంధిత అధికారులకు షీటీమ్స్ ఇన్చార్జి స్వాతి లక్రా సర్టిఫికెట్లు అందజేశారు. షీ టీమ్ సభ్యులు జెండర్ సెన్సిటైజేషన్, సమాజంలో మహిళల స్థాయి, మహిళలపై వేధింపులు, ఆధారాలను సేకరించడం, సాఫ్ట్స్కిల్స్, మైనర్లకు కౌన్సెలింగ్ ఇవ్వడం, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాల పట్ల శిక్షణ ఇచ్చారని స్వాతి లక్రా తెలిపారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్, హైదరాబాద్ జిల్లాల నుంచి షీటీమ్ అధికారులు పాల్గొన్నారని తెలిపారు. -
మహిళలపై దౌర్జన్యాలను సహించబోం
నిజామాబాద్రూరల్: రోజురోజుకు పెరిగిపోతున్న మహిళలపై అత్యాచారాలు, దౌర్జన్యాలను సహించబోమని, ఇలాంటి ఘటనలను అరికట్టడం కోసం పోలీస్ శాఖ ఎంతో కృషి చేస్తుందని సీపీ కార్తికేయ పేర్కొన్నారు. నేరాలను అదుపుచేసేందుకు ప్రజల సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు. గురువారం నగర శివారులోని మేఘన దంత వైద్య కళాశాలలో జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షీటీం సంయుక్త అవగాహన సదస్సులో ఆయన పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఫెండ్లీ పోలీస్ గురించి వివరించారు. విద్యార్థినులకు ఈవ్టీజింగ్, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై పోలీస్ డిపార్ట్మెంట్కు రిపోర్ట్ చేయాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రతాప్కుమార్ మాట్లాడుతూ నిజామాబాద్ పోలీస్ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలను కొనియాడారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు, వారికి కావాల్సిన భద్రత కల్పించడం సమాజంలో అందరి బాధ్యత అని చెప్పారు. మహిళలు తమపై జరుగుతున్న అన్యాయాలను సహించకుండా ముందుకువచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. షీ-టీం కానిస్టేబుల్ శ్రావణి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు.మేఘన దంతవైద్య కళాశాల విద్యార్థులు షీ-టీమ్ గురించి నాటిక ప్రదర్శించారు. అనంతరం కమిషనర్ కార్తికేయ, సీఐ వెంకటేశ్వర్లును కళాశాల యాజమాన్యం సత్కరించారు. కార్యక్రమంలో షీ-టీం ఎస్సై వెంకటయ్య, రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీధర్, డాక్టర్ సురేశ్కుమార్, డాక్టర్ శీనునాయక్, తదితరులు పాల్గొన్నారు. -
ఆకతాయిల ఆట కట్
సిద్దిపేటటౌన్: వినోద్(పేరు మార్చాం) కాలేజీకి వెళ్లకుండా జులాయిగా తిరుగుతుంటాడు. అతని గ్రామం మీదుగా రోజు సిద్దిపేటకు బస్సులో వేళ్లే కాలేజీ అమ్మాయిని ఆటపట్టించే వాడు. రోజురోజుకు వినోద్ అల్లరి ఎక్కువ కావడంతో బాధితురాలు భరించలేక.. ఓ రోజు ఇంట్లో వాళ్లకు విషయం చెప్పంది. వెంటనే సదరు అమ్మాయి వాళ్ల నాన్న తనకు తెలిసిన వాళ్ల ద్వారా షీ టీం బృందానికి విషయం చెప్పారు. వెంటనే రంగంలోకి దిగిన షీ టీం బృందం సాధారణ ప్రయాణికుల మాదిరిగా రెండు రోజులు బస్సులో ప్రయాణం చేసి.. వినోద్ ఆటపట్టించడాన్ని పూర్తిగా వీడియో తీశారు. ఆ తర్వాత అతడిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ కోసం పోలీస్ స్టేషన్కు తరలించారు. అతని తల్లిదండ్రులను పిలిపించి.. వారికి అమ్మాయిని ఆట పట్టించిన వీడియో చూపించారు. అనంతరం వారి తల్లిదండ్రుల సమక్షంలో సీఐ నేతృత్వంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. మొదటి అవకాశంగా కౌన్సెలింగ్ ఇచ్చి విడిచిపెడుతున్నామని, బుద్ధిగా ఉండాలని హెచ్చరించి వదిలేశారు. అప్పటి నుంచి వినోద్ బుద్ధిగా కాలేజీకి వెళ్లడం ప్రారంభించారు. ఈ ఒక్క సంఘటనలోనే కాదు.. అమ్మాయిలను, మహిళలను వేధించే వారిని వదిలిపెట్టకుండా కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది షీ టీం బృందం. సిద్దిపేటలో షీ టీం ఏర్పాటు తర్వాత అమ్మాయిలకు వేధింపులు చాలా వరకు తగ్గాయి. 2015లో షీ టీం ఏర్పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళలు, అమ్మాయిల భద్రత కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం షీ టీం బృందాలను ఏర్పాటు చేసింది. మొట్టమొదటి సారిగా ప్రయోగాత్మకంగా హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లో ఈ షీటీం బృందాలు విజయవంతంగా విధులు నిర్వహిస్తుండటంతో మిగతా జిల్లాల్లోనూ బృందాలను ఏర్పాటుచేశారు. అలా 2015 ఫిబ్రవరి 9న ఉమ్మడి మెదక్ జిల్లాలో అప్పటి ఎస్సీ సుమతి ఆధ్వర్యంలో సిద్దిపేటలో షీ టీం బృందం ఏర్పాటైంది. షీ టీం బృందం విధులు షీ టీం మహిళలు, అమ్మాయిలను ఆకతాయిల బారి నుంచి రక్షించి.. ఆటపట్టించే వారిని పట్టుకుని వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. పని ప్రదేశాలలో మహిళలు, కాలేజీ అమ్మాయిలు.. అబ్బాయిల నుంచి ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గిస్తారు. ఉపాధి పనులకు వెళ్లే మహిళలకు పని ప్రదేశాలలో ఎదురయ్యే వేధింపులను ఎలా ఎదుర్కొవాలి, వేధింపుల నుంచి ఎలా రక్షణ పొందాలి అనే అంశాలను వివరించనున్నారు. కాలేజీల్లో అమ్మాయిలకున్న రక్షణ చట్టాలపై అవగాహన కలిగించడం, కేసు తీవ్రత ఎక్కువగా ఉంటే ఆ కేసును సంబంధిత పోలీస్ స్టేషన్కు బదిలీ చేస్తారు. ఆట పట్టిస్తూ షీ టీం బృందానికి పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు మళ్లీ ఎలాంటి పొరపాటు చేయకుండా సంజాయిషీ లెటర్ తీసుకుని విడిచి పెడుతారు. అమ్మాయిలు, మహిళలపై జరిగే వేధింపుల రకాలను కళాజాత బృందాల ద్వారా గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కల్పిస్తారు. చైల్డ్ అబ్యూజింగ్ జరగకుండా చూడటం, మొబైల్ ఫోన్ ద్వారా అభ్యంతరకర మెసేజ్లు చేసే వారిని, రాంగ్ కాల్స్ చేసి ఇబ్బంది పెట్టే వారి గురించి కేసు పెడితే.. వెంటనే వారిని అరెస్టు చేసి, వారిని హెచ్చరిస్తారు. లేడీస్ హాస్టల్స్, మహిళలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో మహిళలకు, అమ్మాయిలకు అవగాహన కలిగిస్తారు. బస్టాండ్లలో గస్తీ షీ టీం బృందంలో ఒక కానిస్టేబుల్, ముగ్గురు లేడీ కానిస్టేబుల్స్ ఉంటారు. ఇలా రెండు టీంలు ఉదయం, సాయంత్రం బస్టాండ్, ప్రధాన చౌరస్తాల వద్ద గస్తీ ఉండి అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించేవారిని గుర్తించడంతో పాటు వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు ఒక టీం, సాయంత్రం 4 నుంచి 7.30 గంటల వరకు మరో టీం విధులు నిర్వహిస్తారు. సామాజిక మాధ్యమాల ద్వారా.. షీ టీం బృందాలు ఇకపై కమిషనరేట్ పరిధిలోని విద్యాసంస్థలు, ప్రయాణ ప్రాంగణాలు, ప్రధాన చౌరస్తాలలో విద్యార్థులను, యువతులను, మహిళలను అప్రమత్తం చేసేలా విస్తృత ప్రచారం చేస్తారు. ఆకతాయిలు మహిళలను, యువతులను వేధింపులకు గురి చేస్తే తక్షణమే 100 నెంబర్కు, ఫేస్బుక్, ఈమెయిల్, వాట్సాప్, ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసిన వెంటనే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. మహిళలు ఉన్న చోట అవగాహన కాలేజీలు, ఇతర సంస్థలు, స్థలాలలో మహిళలు, అమ్మాయిలు ఎక్కువ సంఖ్యలో ఒకే దగ్గర ఉండే అవకాశం ఉంది. అలాంటి చోట అభ్యంతరకర చర్యలను ఎలా ఎదుర్కొవాలి? వాటిని ఎలా తిప్పికొట్టాలి? అనే అంశాలను, చట్టాల ద్వారా ఎలా రక్షణ పొందాలి అనే విషయాలను నెలలో ఒకరోజు అవగాహన కల్పిస్తున్నాం. అమ్మాయిలు, మహిళలు, వృద్ధుల మీద హింస, అభ్యంతరకర ప్రవర్తన ఏ రూపంలో ఉన్నా చర్యలు తీసుకుంటున్నాం. – పద్మ, సీఐ, ఉమెన్ పోలీస్స్టేషన్, సిద్దిపేట సక్రమ మార్గంలో నడిచేలా.. అమ్మాయిలను చూసి అబ్బాయిలు, అబ్బాయిలను చూసి అమ్మాయిలు ఆకర్షితులు అవ్వడం యుక్త వయస్సులో సహజం. కానీ, దాని గురించి విడమరిచి చెప్పకపోతే అది తీవ్రరూపం దాల్చి విపరీత ధోరణికి దారితీస్తుంది. ఏది మంచి? ఏది చెడు? అనే విషయాలను వారికి తెలియజేయాలి. – ఉమాపతి, సైకాలజిస్ట్, ఉమెన్ పీఎస్, సిద్దిపేట అద్భుతంగా పని చేస్తున్నారు.. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో షీ టీం బృం దాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఉదయం, సా యంత్రం ప్రధాన చౌరస్తా వద్ద ఉంటూ ఆకతాయిలను పట్టుకుని వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. – జోయల్ డేవిస్, సిద్దిపేట పోలీస్ కమిషనర్ -
రెండేళ్లు పూర్తి చేసుకున్న రాచకొండ కమిషనరేట్
సాక్షి, హైదరాబాద్ : నాలుగున్నర కోట్లతో నూతన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్టు రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ తెలిపారు. రాచకొండ కమిషనరేట్ ఏర్పాటయి రెండేళ్లు పూరైనా సందర్భంగా కమిషనరేట్ పరిధిలో సాధించిన విజయాలను మహేశ్ భగవత్ వివరించారు. ‘రాచకొండ కమిషనరేట్ విస్తీర్ణంలో దేశంలోనే అతి పెద్దది. కమిషనరేట్ పరిధిలో 3,787 సిబ్బంది పనిచేస్తుండగా.. 3,119 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. త్వరలో పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకం చేపడుతాం. 2017 జూన్ నుంచి 2018 జూన్ వరకు 20, 817 కేసులు నమోదయ్యాయి. 4,243 ఆర్థిక నేరాలు జరిగాయి. కమిషనరేట్ పరిధిలో మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఏడాది కాలంలో షీ టీమ్ బృందాలు 591 కేసులు నమోదు చేశాయి. మరో 700 మందిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. 40కు పైగా బాల్య వివాహాలను అడ్డుకున్నాం. 760 కుటుంబ సమస్యలను పరిష్కరించాం. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 210 మంది చిన్నారులను రక్షించాం. మైనర్ నేరస్తులపై ప్రత్యేక దృష్టిపెట్టి తిరిగి నేరాలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. నాలుగున్నర కోట్లతో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశాం. మేడిపల్లిలో 56 ఎకరాల్లో కమిషనరేట్ భవన నిర్మాణం జరగనుంద’ని మహేశ్ భగవత్ తెలిపారు. -
సాంకేతికతతో నేరాల అదుపు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సాంకేతికతను ఉపయోగించుకుని జిల్లాలో నేరాల శాతాన్ని దాదాపుగా తగ్గించినట్లు జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు పేర్కొన్నారు. ఈ నెల 26కు జిల్లాలో ఏడాది పదవి కాలం పూర్తి చేసుకున్న ఎస్పీ మంగళవారం సాక్షితో మాట్లాడారు. జిల్లాలో గత ఏడాదిలో నేరాల శాతం బాగా తగ్గిందన్నారు. ముఖ్యంగా హత్యలు, దొంగతనాలు మరింతగా తగ్గాయన్నారు. సాంకేతికత సహకారంతో పోలీసులు మెరుగైన పనితీరును కనపరచడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. ఒంగోలు నగరంలో 92 కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు జిల్లాలో మొత్తం 300 కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. మ్యాట్రిక్ సంస్థ ద్వారా జిల్లాలోని ఒంగోలు, చీరాల, మార్కాపురం, కందుకూరు, అద్ధంకి, దరిశి, కనిగిరి, చీమకుర్తి ప్రాంతాల్లో 796 కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇందులో ఆటోమెటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాలు, రెడ్లైట్ వైలేషన్ డిటెక్షన్, పేషియల్ రికగ్నైజేషన్ కెమెరాలు 250 ఉంటాయన్నారు. ఇప్పటికే కేబుల్ వర్క్ పూర్తి చేసినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి రాజధాని అమరావతిలోని కమాండ్ కంట్రోల్కు అను సంధానం చేయనున్నట్లు వెల్లడించారు. రెండు నెలల్లో ఈ కార్యక్రమం పూర్తి అవుతుందన్నారు. దీని వల్ల నేరాల శాతం మరింత తగ్గుతుందన్నారు. డయల్ 100 కార్యక్రమాన్ని బలోపేతం చేస్తామన్నారు. ఒక్క కాల్ కూడా మిస్ కాకుండా ఎస్పీ కంట్రోల్లో మానిటరింగ్ ఉంటుందన్నారు. ఐ క్లిక్ మార్కాపురం, ఒంగోలులో మాత్రమే ఉందని, దీన్ని అందరికీ అందుబాటులోకి తెస్తామన్నారు. సైబర్ క్రైమ్స్ పెరుగుతున్న నేపథ్యంలో దీనిపై అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. సిబ్బందిలో నైపుణ్యం పెంచేందుకు శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. షీ టీమ్స్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ సత్ఫలితాలను ఇస్తుందని చెప్పారు. దాబాల్లో వాహనాలు ఆపి మద్యం తాగుతుండడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని దీన్ని అరికట్టేందుకు హైవేల్లో వాహనాలను నిలపకుండా అడ్డుకున్నామన్నారు. దీన్ని వల్ల ప్రమాదాలు తగ్గినట్లు ఎస్పీ చెప్పారు. జిల్లాలో ఫ్యాక్షన్ హత్యలు లేవన్నారు. అక్రమ సంబంధాలకు సంబంధించిన హత్యలు మాత్రమే అడపాదడపా జరుగుతున్నాయని ఎస్పీ చెప్పారు. దొంగతనాలు దాదాపు తగ్గిపోయాయన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టేందుకు తమవంతు కృషి చేస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. అటవీశాఖ అధికారులకు తమశాఖ నుంచి 20 మంది పోలీస్ కానిస్టేబుళ్లను అప్పగించినట్లు ఎస్పీ వెల్లడించారు. నెల్లూరు నుంచి 20 మంది వైఎస్సార్ కడప నుంచి 60 మంది కానిస్టేబుళ్లు చందనం అక్రమ రవాణాను అరికట్టే టీముల్లో పాలు పంచుకుంటున్నారన్నారు. ఏడాదిలో ఒకటి రెండు పెద్ద ఘటనలు మాత్రమే జరిగాయన్నారు. జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. ప్రజలు కూడా పోలీసు శాఖకు సహకారం అందిస్తున్నారని ఎస్పీ సత్య ఏసుబాబు తెలిపారు. -
టీచర్ వెంటపడిన ప్ర‘వృద్ధుడు’
సాక్షి, సిటీబ్యూరో: బతుకు తెరువు కోసం స్కూల్ టీచర్గా పని చేస్తున్న మహిళను వేధించాడో ప్ర‘వృద్ధుడు’. అతని వేధింపులు తాళలేక ఉద్యోగం మానేసినా అతడు మారలేదు. దాదాపు రెండేళ్ల పాటు ఈ హింసను భరించిన ఆమె ఇటీవల ‘షీ–టీమ్స్’ను ఆశ్రయించింది. ఆ వేధింపుల వృద్ధుడికి చెక్ చెప్పిన బృందాలు ఫలక్నుమ పోలీసుల ద్వారా కటకటాల్లోకి పంపాయి. పాతబస్తీకి చెందిన ఓ మహిళ స్కూల్లో టీచర్గా పని చేయడంతో పాటు ఇంటి వద్ద ట్యూషన్లు చెప్పేది. అదే ప్రాంతానికి చెందిన ఉస్మాన్ (52) తన ముగ్గురు పిల్లలను ట్యూషన్కు తీసుకువచ్చి, తీసుకువెళ్తుండేవాడు. ఈ వంకతో ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించేవాడు. కొన్నాళ్లకు ఇది వేధింపులుగా మారింది. ఓ దశలో శృతిమించడంతో బాధితురాలు ఉద్యోగం మానేయడంతో పాటు ఉస్మాన్ పిల్లలకు ట్యూషన్ చెప్పడాన్నీ విరమించుకుంది. అయినప్పటికీ మారని ఆ ప్ర‘వృద్ధుడు’ తన పంథా కొనసాగిస్తూ మరింత రెచ్చిపోయాడు. దాదాపు రెండేళ్ల పాటు ఈ హింస భరించిన బాధితురాలు ఎట్టకేలకు ఇటీవల షీ–టీమ్స్ను ఆశ్రయించింది. లోతుగా దర్యాప్తు చేసిన బృందాలు ఉస్మాన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం అంగీకరించాడు. దీంతో ఫలక్నుమ ఠాణాలో కేసు నమోదు చేయించిన బృందాలు ఉస్మాన్ను అరెస్టు చేసి స్థానిక పోలీసులకు అప్పగించాయి. ఫోన్లో సైకో వేధింపులు... తార్నాకలోని ఓ మాల్లో సెల్స్గర్ల్గా పని చేస్తున్న యువతికి సెల్ఫోన్ వేధింపులు ఎదురయ్యాయి. సదరు పోకిరీ సైకోగా మారి రెచ్చిపోవడంతో బాధితురాలు షీ–టీమ్స్ను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన బృందాలు కొండాపూర్కు చెందిన కె.కిరణ్బాబు బాధ్యుడిగా తేల్చి పట్టుకున్నాయి. బాధితురాలు పని చేసే మాల్కు కిరణ్ నిత్యం వచ్చేవాడు. ఆమెతో మాట కలుపుతూ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిందిగా బలవంతం చేసే వాడు. ఆమె తిరస్కరించినప్పటికీ అతడి ప్రవర్తన మారలేదు. కొన్నాళ్లకు మరో మార్గంలో ఆమె సెల్ఫోన్ నెంబర్ తెలుసుకున్న అతగాడు ఫోన్ చేశాడు. ఆ సమయంలో యువతి తన ఫోన్ను మాల్ సెక్యూరిటీ వద్ద డిపాజిట్ చేయడంతో మిస్డ్కాల్గా నమోదైంది. ఫోన్ తీసుకున్న ఆమె మిస్డ్కాల్స్ చూసి తన తల్లిదండ్రులు మరో నెంబర్ నుంచి ఫోన్ చేసి ఉంటారని భావించింది. కాల్ బ్యాక్ చేయగా... మొదలైన కిరణ్ వేధింపులు తారా స్థాయికి చేరాయి. గతంలో మాల్కు వచ్చి తన ఫోన్ నెంబర్ కోరిన వ్యక్తే ఈ పని చేస్తున్నట్లు ఆమె గుర్తించింది. ఫోన్ను తన బంధువుకు ఇచ్చి మాట్లాడమని కోరింది. సైకోగా మారిపోయిన కిరణ్ అత్యంత అభ్యంతరకరమైన రీతిలో మాట్లాడటంతో బాధితురాలు షీ–టీమ్స్కు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన బృందాలు కిరణ్ను పట్టుకుని ఉస్మానియా వర్శిటీ పోలీసులకు అప్పగించాయి. ఐదు నెలల్లో 310 ఫిర్యాదులు: నగర షీ–టీమ్స్ ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో 310 ఫిర్యాదులు వచ్చినట్లు అదనపు సీపీ షికా గోయల్ సోమవారం తెలిపారు. ఇందులో 45 మందిని రెడ్హ్యాండెడ్గా పట్టుకోవడంతో పాటు తదుపరి చర్యలు తీసుకున్నామన్నారు. వేధింపులు ఎదురైన మహిళలు, యువతులు 100, హాక్–ఐ, వాట్సాప్ నెం.9490616555, ఈ–మెయిల్ ఐడీ (hydsheteam@gmail.com), షీటీమ్స్ ఫేస్బుక్, ట్విటర్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. నాంపల్లిలోని హాకాభవన్లో ఉన్న భరోసా కేంద్రాన్ని నేరుగా సంప్రదించవచ్చని సూచించారు. -
ఆ వార్తలు నిజం కాదు
సాక్షి, కరీంనగర్ : గత కొద్ది రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాల్లో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు తిరుగుతున్నాయన్న పుకార్లే అందుకు కారణం. ‘సైకోలు వచ్చారు...పిల్లలను ఎత్తుకుపోతున్నారు, రాత్రివేళ ఎవరైనా తలుపు కొడితే తీయకండి.. చంపేసి డబ్బు, నగలు దోచుకుపోతారు..’ వంటి హెచ్చరికలతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ శాఖ స్పందించింది. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భద్రత కోసం పోలీస్ శాఖ ప్రతీక్షణం పనిచేస్తోందని వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడైనా 100కు కాల్ చేయాలని, దగ్గరలోని పోలీస్స్టేషన్కు సమాచారం ఇవ్వాలని సూచించారు . అయితే ఇవన్నీ వదంతులని, వీటిలో ఏమాత్రం వాస్తవం లేదని పోలీసు ఉన్నతాధికారులు చెప్పినా ప్రజలు ఏ మాత్రం లెక్క చేయకుండా మతిస్థితంలేని, వలస కూలీలను, తెలుగు భాష రాని వారిని పట్టుకుని పలుచోట్ల దాడులు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. దొంగల పేరుతో మహిళా పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఏడుగురిని షీ టీమ్ అరెస్ట్ చేసింది. వారిలో ముగ్గురిపై నిర్భయ కేసు, నలుగురిపై ఈవ్ టీజింగ్ కేసు నమోదు చేసి జరిమానా విధించామని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు ఉంటాయని, సీపీ కమలాసన్ తెలిపారు. -
మిన్నకుంటే మళ్లీ రెచ్చిపోయాడు
సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): బాధిత యువతులు/మహిళల మౌనమే నేరగాళ్లకు వరంగా మారుతోంది. వీరి భయాన్ని ఆసరాగా చేసుకున్న కామాంధులు పదేపదే రెచ్చిపోతున్నారు. ఇలాంటి ఉదంతమే రాజేంద్రనగర్ పరిధిలో చోటు చేసుకుంది. ఎట్టకేలకు బాధితురాలు ధైర్యం చేసి షీ–టీమ్స్కు ఫిర్యాదు చేయడంతో నిందితుడు కటకటాల్లోకి చేరాడు. గత నెలలో సైబరాబాద్ షీ–టీమ్స్కు 109 ఫిర్యాదులు రాగా... 29 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు 19 మంది నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు. రాజేంద్రనగర్కు చెందిన ఓ మహిళ బీటెక్ చదువుతున్న రోజుల్లో డిప్లమో చదివే విద్యార్థితో పరిచయం ఏర్పడింది. రెండు నెలల తర్వాత అతను ఆమె వద్ద ప్రేమ ప్రతిపాదన తేగా ఆమె తిరస్కరించింది. దీంతో ఫోన్ కాల్స్ ద్వారా వేధించడంతో పాటు అసభ్యపదజాలంతో దూషించడం మొదలెట్టాడు. ఓ దశలో ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. ఇంత జరిగినా సదరు యువతి ఎవరికీ చెప్పుకోకుండా మౌనంగా ఉండిపోయింది. దీనిని ఆసరాగా చేసుకున్న అతను గత జనవరి 24న చేవెళ్ల బస్టాప్ వద్ద ఉన్న ఆమె సెల్ఫోన్ లాక్కోవడంతో పాటు బలవంతంగా తన వాహనంపై ఎక్కించుకుని గోపన్పల్లి పరిసరాల్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి దాడి చేయడంతో స్ఫృహ కోల్పోయింది. అదే అవకాశంగా భావించిన అతను ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే ఆమెతో పాటు కుటుంబాన్నీ హతమారుస్తానంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు తన కుటుంబం పరువు పోతుందనే ఉద్దేశంతో తనలో తానే కుమిలిపోయింది. ఆమె మౌనాన్ని మరోసారి తనకు అనువుగా మార్చుకోవాలని భావించిన అతను మళ్లీ ఆమెకు ఫోన్లు చేయడం, సందేశాలు పంపడం చేస్తూ తనతో రావాల్సిందిగా బెదిరిస్తున్నాడు. ఈ చర్యలతో విసిగిపోయిన బాధితురాలు సైబరాబాద్ షీ–టీమ్స్ను సంప్రదించడంతో కేసు నమోదైంది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అలాగే ప్రేమ పేరుతో వేధింపులకు దిగిన, వాట్సాప్ కాల్స్ ద్వారా వేధించిన, ప్రేమ పేరుతో శారీరకంగా దగ్గరకావడంతో పాటు రూ.1.05 లక్షలు తీసుకుని మోసం చేసిన నిందితులపై కేసులు నమోదు చేశారు. గత నెలలో మొత్తం 109 ఫిర్యాదులు రాగా, 29 క్రిమినల్ కేసులు, మరో 20 పెట్టీ కేసులు నమోదు చేశారు. మిగిలిన వాటిలో నిందితులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బహిరంగం ప్రదేశాల్లో 9 వర్క్షాపులు నిర్వహించి 4108 మందికి అవగాహన కల్పించారు. బాధితులు 9490617444కు వాట్సాప్ చేసి, 100కు కాల్ చేసి తమకు సంప్రదించాలని సైబరాబాద్ షీ–టీమ్స్ అధికారులు కోరారు. -
వ్యభిచార ముఠా గుట్టురట్టు
కర్నూలు : నగర శివారులోని సంతోష్నగర్ టీజీవీ కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును షీటీమ్స్ రట్టు చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం ఉదయం షీ–టీమ్స్ ఎస్ఐ విజయలక్ష్మి నేతృత్వంలో సభ్యులు దాడులు జరిపారు. నిర్వాహకులు రాజగోపాల్ అలియాస్ గోపాల్, సైదా అలియాస్ రజిత, లక్ష్మీ, ఓ విటుడిని అరెస్టు చేసి వారి నుంచి రూ.3,200 నగదుతో పాటు 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బాధితులు కర్నూలుకు చెందిన పావని, అనంతపురానికి చెందిన మంజుల, నల్గొండకు చెందిన ఆండాల్కు కౌన్సెలింగ్ ఇచ్చి స్వగ్రామాలకు పంపించారు. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తులకు వాట్సాప్ ద్వారా అమ్మాయిల ఫొటోలను పంపి వారి అంగీకారంతో ఈ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పంచనామా చేసి నాలుగో పట్టణ పోలీస్స్టేషన్లో అప్పగించగా నిర్వాహకులతో పాటు విటుడు శివను పోలీసులు రిమాండ్కు పంపారు. రాజగోపాల్పై గతంలో కూడా కేసులు... ఆళ్లగడ్డకు చెందిన గోపాల్ రెండేళ్లుగా కర్నూలులో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నట్లు పోలీసు విచారణలో బయటపడింది. భార్య లక్ష్మీ, సహజీవనం చేస్తున్న మహిళ సైదాతో కలసి వేర్వేరు చోట్ల ఇళ్లను అద్దెకు తీసుకుని వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. గతంలో జంపాల అపార్ట్మెంట్, సిరినోబుల్ అపార్ట్మెంట్లలో ఇళ్లు అద్దెకు తీసుకుని కొంతకాలం వ్యభిచార గృహాలు నిర్వహించేవారని, షీ–టీమ్స్కు సమాచారం అందడంతో ఇళ్లు ఖాళీ చేసి పరారైనట్లు సమాచారం. ఈక్రమంలో గతేడాది గోపాల్ కుటుంబ సభ్యులపై రెండో పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలిసింది. ఇదిలా ఉండగా శరీన్నగర్కు చెందిన శేఖర్ కమీషన్పై వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను గోపాల్కు సరఫరా చేస్తుంటాడని, ఇతడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. దాడుల్లో షీ–టీమ్స్ సభ్యులు దామోదర్, యాగంటి, అన్వర్, వలి, సుజాత, శ్రీలక్ష్మి, రమాబాయి పాల్గొన్నారు. -
‘షీటీం’కు ద్విచక్రవాహనాలు
కరీంనగర్ క్రైం: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో షీటీంలకు చెందిన పోలీసులు గస్తీ నిర్వహించేందుకు ద్విచక్రవాహనాలు అందుబాటులోకి వచ్చాయి. కరీంనగర్ కమిషనరేట్లోని హెడ్ క్వార్టర్లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీరో మోటాకార్ప్ కంపెనీ రీజినల్ మేనేజర్ కమల్ కరమ్చందాని 20 డుయోట్ వాహనాల తాళాలను సీపీ కమలాసన్రెడ్డికి అందజేశారు. ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సీపీ మాట్లాడారు. రేయింబవళ్లు శ్రమిస్తున్న పోలీసులకు ప్రోత్సాహమందిస్తే మనోధైర్యం పెరుగుతుందని తెలిపారు. కమిషనరేట్వ్యాప్తంగా 14 షీటీంలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. మానేరు డ్యాం, జింకలు, ఉజ్వల పార్కుల సమీపంలో లేక్ పోలీసు ఏర్పాటు చేసిన తర్వాత అసాంఘిక కార్యకలాపాలు నియంత్రణలోకి వచ్చాయని అన్నారు. కమల్ కరమ్చందాని మాట్లాడుతూ పోలీసు శాఖకు తమవంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కరీంనగర్ షీటీం సభ్యులకు 20 ద్విచక్రవాహనాలు అందజేస్తున్నామని తెలిపారు. హీరో మోటాకార్స్ అందజేసిన 20 ద్విచక్రవాహనాలతో షీటీం సభ్యులు చేపట్టిన ర్యాలీని సీపీ జెండా ఊపి ప్రారంభించారు. అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు వెంకటరమణ, ఉషారాణి, హీరో ఆటోమోటాకార్స్ ప్రతినిధులు కష్యప్, కిరణ్కుమార్, ఇన్స్పెక్టర్లు మహేశ్గౌడ్, విజయకుమార్, సదానందం, సీతారెడ్డి, రవి, ఆర్ఐలు జానీమియా, మల్లేశం, శేఖర్, శాంతి సంక్షేమ కమిటీ సభ్యులు మధుసూదన్రెడ్డి, వసంత్కుమార్ ఓజా, గఫార్ పాల్గొన్నారు. -
మహిళా రక్షణ ‘ఏకతాటి’పైకి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళల భద్రత కోసం పోలీసుశాఖ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం వేర్వేరు విభాగాలు పనిచేస్తున్న షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లను కలిపి ఒక యూనిట్గా ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ప్రత్యేక యూనిట్ ఏర్పాటుకు ఉండాల్సిన అధికారం, తదితర వ్యవహారాలపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. షీ టీమ్స్ నమోదు చేసే కేసులు, భరోసా కేంద్రాల్లో ఇచ్చే కౌన్సెలింగ్, పునరావాస కార్యక్రమాలు, ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు తదితరాలన్నింటినీ పర్యవేక్షించేందుకు ప్రత్యేక భవనం ఉండేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. జిల్లాల్లో నమోదయ్యే అత్యాచార, హత్య కేసులను సైతం దర్యాప్తు చేసేందుకు ఈ యూనిట్కే అధికారాలు కల్పించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా మైనర్లపై లైంగిక వేధింపులు, ఆన్లైన్లో వేధింపులు, వరకట్న కేసులను పర్యవేక్షిస్తున్న సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ బా«ధ్యతలను కూడా ఈ విభాగమే చూసేలా మార్పులు చేయనున్నారు. ఒక్కో విభాగంలో ఒక్కో యూనిట్ ఉండేకన్నా మొత్తం మహిళల రక్షణ, భద్రతకు సంబంధించి ఒకే యూనిట్ ఉంటే బాగుంటుందని పోలీసుశాఖ భావిస్తోంది. ఐజీ స్వాతి లక్రా నేతృత్వంలోనే... హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన షీ టీమ్స్, భరోసా కేంద్రాలు సత్ఫలితాలివ్వడంతో వాటిని ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడాన్ని వేగవంతం చేశారు. డీజీపీ మహేందర్రెడ్డి హైదరాబాద్ పోలీసు కమిషనర్గా పనిచేసిన సమయంలో ఇవన్నీ ప్రారంభించగా నగర అదనపు కమిషనర్గా పని చేసిన స్వాతి లక్రా ఇటు షీ టీమ్స్, అటు భరోసా కేంద్రాలను లీడ్ చేస్తూ వచ్చారు. స్వాతి లక్రా ఇటీవలే శాంతిభద్రతల ఐజీగా బదిలీ అయినా ఆమెకే ఉమెన్ సేఫ్టీ, భరోసా కేంద్రాల బాధ్యతను అప్పగించారు. ప్రస్తుతం ఏర్పాటు చేయాలని భావిస్తున్న స్పెషల్ యూనిట్కు ఐజీ స్వాతి లక్రానే చీఫ్గా ఉంటారని పోలీసు ఉన్నతాధికారుల ద్వారా తెలిసింది. ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, త్వరలో చేపట్టబోయే కార్యక్రమాలను సైతం ఆమె విజయ వంతం చేయగలరన్న నమ్మకంతో పోలీసుశాఖ ఉంది. -
అతివలకు అండగా..
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు విభాగం మహిళా రక్షణకు పెద్దపీట వేస్తోంది. ఓ పక్క షీ–టీమ్స్ ద్వారా క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న అధికారులు... సామాజిక మాధ్యమాల ద్వారానూ సహాయసహకారాలు అందిస్తున్నారు. పోలీసు–ప్రజలకు వారధిగా ఏర్పాటు చేసిన మొబైల్ యాప్ ‘హాక్–ఐ’లోనూ ఇందుకు సంబంధించి ప్రత్యేక అంశాలను చేర్చారు. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎస్ఓఎస్... విపత్కర పరిస్థితుల్లో అతివలకు అండగా ఉండేందుకు ‘ఎస్ఓఎస్’ విభాగం ఏర్పాటైంది. ‘హాక్–ఐ’లోని ఈ విభాగంలోకి ప్రవేశించిన తర్వాత ప్రాథమికంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. హెల్ప్, డేంజర్ వంటి అంశాలను పొందుపరచడంతో పాటు సన్నిహితులు, స్నేహితులకు చెందిన ఐదు ఫోన్ నెంబర్లనూ ఫీడ్ చేయాలి. ‘క్రియేట్’ నొక్కడం ద్వారా దీని షార్ట్కట్ మెబైల్ స్క్రీన్పై వస్తుంది. అత్యవసర సమయాల్లో ఈ ‘ఎస్ఓఎస్’ను ప్రెస్ చేస్తే చాలు...జోనల్ డీసీపీ, డివిజనల్ ఏసీపీలతో పాటు సమీపంలో ఉన్న పెట్రోలింగ్ వాహనాలకు సెల్ఫోన్ వినియోగదారుల లోకేషన్ జీపీఎస్ వివరాలతో సహా చేరుతుంది. పొందుపరిచిన నెంబర్లకూ సమాచారం వెళ్తుంది. ఓసారి ‘ఎస్ఓఎస్’ను నొక్కిన తర్వాత 9 సెకండ్ల కౌంట్డౌన్ ఉంటుంది. ఎవరైనా పొరపాటున ప్రెస్ చేసి ఉంటే ఈ సమయంలో క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అధికారులు రంగంలోకి దిగి జీపీఎస్ ద్వారా బాధితురాలు ఉన్న ప్రాంతానికి చేరుకుంటారు. ఉమెన్ ట్రావెల్ మేడ్ ఈజీ... ప్రయాణాల్లో మహిళలకు ఉపకరించేందుకు ‘హాక్–ఐ’లో ఏర్పాటు చేసిన విభాగమే ఉమెన్ ట్రావెల్ మేడ్ ఈజీ. ప్రయాణం ప్రారంభానికి ముందు యాప్లోని ఈ విభాగంలోకి ప్రవేశించిన తర్వాత సదరు మహిళ/యువతి ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తున్నారో (డెస్టినేషన్) ఫీడ్ చేయాల్సి ఉంటుంది. వారు ఎక్కుతున్న బస్సు, ఆటో, క్యాబ్ నెంబర్లను ఫొటో లేదా మాన్యువల్గా నమోదు చేయాలి. జీపీఎస్ పరిజ్ఞానంతో పనిచేసే ఈ విభాగం ద్వారా ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి అది పూర్తయ్యే వరకు కమిషనరేట్లోని ఐటీ సెల్ పర్యవేక్షిస్తూ ఉంటుంది. నిర్దేశించిన డెస్టినేషన్ కాకుండా సదరు వాహనం వేరే మార్గంలో ప్రయాణిస్తే పోలీసులే గుర్తించి ప్రయాణికురాలిని సంప్రదిస్తారు. మార్గమధ్యంలో ఇబ్బంది ఎదురైనా క్షణాల్లో ఫిర్యాదు చేసేందుకు ఓ బటన్ ఏర్పాటు చేశారు. ప్రయాణికురాలు సురక్షితంగా గమ్యం చేరిన తర్వాత సమాచారం ఇచ్చే వరకు పర్యవేక్షణ కొనసాగుతుంది. ఈ మధ్యలో ఎప్పుడు అవసరమైనా నిమిషాల్లో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుంటారు. నిరంతర పర్యవేక్షణ పోలీసులకు సంబంధించిన అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులు, సలహాలు, సూ చనలను నిరంతరం పర్యవేక్షిస్తుంటాం. మహిళల కోస ం ఏర్పాటు చేసిన విభాగాలను ఐటీ సెల్లో ఉండే సిబ్బ ంది 24 గంటలూ గమనిస్తూ అందుబాటులో ఉంటారు. – ఐటీ సెల్ అధికారులు మూడున్నరేళ్లుగా ‘షీ’ సేవలు... దేశంలోనే తొలిసారిగా షీ–బృందాల కాన్సెప్ట్ 2014 అక్టోబర్ 24న హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చింది. యువతులు, మహిళల రక్షణ కోసం సుశిక్షితమైన కొన్ని బృందాలను పోలీసు విభాగం ద్వారా ప్రభుత్వం రంగంలోకి దింపింది. సాధారణంగా ఎవరైనా మహిళలను వేధిస్తూ దొరికినా అడ్డంగా బుకాయిస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు వీడియో ఎవిడెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆయా ప్రాంతాల్లో మాటువేసే షీ–బృందాలు తొలుత ఆకతాయిల వైఖరిపై వీడియో రికార్డింగ్ చేస్తాయి. ఆపైనే వారిని పట్టుకోవడంతో పాటు స్టేషన్కు తరలించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నాయి. మహిళల భద్రతకు సంబంధించి హైదరాబాద్ నగరం దేశంలోనే ఉత్తమం అంటూ ‘నెస్ట్ అవే అనే ఆన్లైన్’ సంస్థ గతేడాది నిర్వహించిన ఆన్లైన్ సర్వే తేల్చింది. ఈ ఘనత సాధించడం వెనుక షీ–టీమ్స్ పాత్ర ఎనలేనిది. వాటి పనితీరు, స్పందనపై అధికారులు ప్రైవేట్ సంస్థలతో సర్వేలు చేయిస్తూ ఫీడ్ బ్యాక్ ఆధారంగా అవసరమైన మార్పులు చేస్తున్నారు. -
మహిళల భద్రతలపై షీటీమ్స్ ఎక్స్పో
-
నెక్లెస్రోడ్లో షీటీమ్స్ ఆధ్వర్యంలో 10కె రన్
-
మహిళల భద్రత మాది
హైదరాబాద్: ‘మహిళల భద్రత తెలంగాణ ప్రభుత్వానిది. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ శాఖను అభివృద్ధి చేశాం. శాంతిభద్రతలు అదుపులో ఉంటే రాష్ట్రం మెరుగైన ఫలితాలు సాధించనట్లే’ అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని షీటీమ్స్ నేతృత్వంలో మహిళల భద్రతలపై అవగాహన కల్పించేందుకు ఇక్కడ నెక్లెస్రోడ్డులోని పీపుల్స్ప్లాజాలో రెండు రోజుల ఎక్స్పోను ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్పోను శనివారం ప్రముఖ నటి రాశీఖన్నా, తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీవీ శ్రీనివాసరావు, అదనపు కమిషనర్(నేరాలు) స్వాతిలక్రా తదితర అధికారులతో కలసి నాయిని ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన అతిథులందరికీ బెంగళూరు రోబో మిత్ర స్వాగతం పలికింది. అనంతరం అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు మిత్ర చెప్పిన సమాధానాలు ఆకట్టుకున్నాయి. పోలీస్శాఖకు సహకరిస్తాం.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలను తు.చ. తప్పకుండా పాటిస్తున్న అధికారి స్వాతిలక్రా అని నాయిని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళల భద్రత దృష్ట్యా షీటీమ్స్ను ఏర్పాటు చేశామన్నారు. షీటీమ్స్ సుదీర్ఘంగా పనిచేస్తూ అందరి మన్ననలను అందుకుంటున్నాయని చెప్పారు. పోలీస్ శాఖ వల్ల తమ ప్రభుత్వానికి మంచి పేరు, ప్రఖ్యాతులు వచ్చాయన్నారు. పోలీస్శాఖకు అన్నివిధాలుగా సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. షీటీమ్స్పై ప్రజల్లో విస్తృత ప్రచారాన్ని తెచ్చేందుకు ఈవిధమైన ఎక్స్పోలను నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశంలోని మెట్రోపాలిటన్ సిటీల్లో ఎక్కడా లేని విధంగా ఇక్కడ షీటీమ్స్ పనిచేస్తున్నాయని ప్రశంసించారు. నటి రాశీఖన్నా మాట్లాడుతూ.. మహిళలు, యువతులు లైంగిక వేధింపులను దైర్యంగా ఎదుర్కొని షీటీమ్స్కు ఫిర్యాదు చేయాలన్నారు. షీటీమ్స్ ఇంతటి మంచి కార్యక్రమం చేయడం అభినందనీయమన్నారు. అందరి నుంచి ప్రశంసలు: స్వాతిలక్రా షీటీమ్స్కు అన్ని వర్గాల నుంచి మంచి ప్రశంసలు అందుతున్నాయని షీటీమ్స్ ఇన్చార్జి స్వాతిలక్రా అన్నారు. మహిళలకు మరింత భరోసా కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 2వేల మందికి పైగా ఆకతాయిలను పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చామని, కొందరికి శిక్ష విధించామని వివరించారు. ఆఫీసుల్లో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న వారి సంఖ్య 4వేలకు మించి ఉందన్నారు. -
రాశీఖన్నాకు రోబో షేక్హ్యాండ్
-
రాశీఖన్నాకు రోబో షేక్హ్యాండ్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖ, షీ టీమ్స్ సంయుక్తంగా పోలీస్ ఎక్స్పోను ప్రారంభించారు. నగరంలోని పీపుల్స్ప్లాజాలో నిర్వహించిన ఈ ప్రదర్శనను రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ ఎక్స్పోలో పలు విషయాలపై అవగాహన కల్సించనున్నారు. ఈ కార్యక్రమానికి నటి రాశీఖన్నాతో పాటు, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, షీటీమ్స్ ఇన్చార్జ్ స్వాతి లక్రా తదితరులు పాల్గొన్నారు. ఎక్స్ పో ప్రారంభం అనంతరం నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ పోలీస్ ఎక్స్పో ఏర్పాటు చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. మహిళల భద్రతను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని తెలిపారు. స్వాతిలక్రా నేతృత్వంలో షీ టీమ్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయని.. షీ టీమ్స్ దేశానికే ఆదర్శమని కొనియాడారు. రోబో మిత్రా సందడి గతేడాది జరిగిన గ్లోబల్ ఎంటర్పెన్యూర్షిప్ సమ్మిట్లో(జీఈఎస్) ప్రారంభ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన మర మనిషి ' మిత్ర' ఈ ఎక్స్పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎక్స్పోకు వచ్చిన అతిథులకు స్వాగతం పలకడంతో పాటు స్వాగతోపన్యాసం కూడా చేసింది. కార్యక్రమంలో పాల్గొన్న రాశీఖన్నాకు రోబో షేక్హ్యాండ్ ఇచ్చి సందడి చేసింది. రెండు రోజుల పాటు స్టాల్స్ వద్దే ఉండి సందర్శకులతో మమేకం కానుంది. గంటకు 30 కిమీ వేగంతో పరుగెట్టే సామర్థ్యం కలిగిన మిత్ర ఆదివారం జరుగనున్న షీ టీమ్స్ రన్లోనూ పాల్గొననుంది. -
మార్చి 4న షీ టీమ్స్ రన్
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రత విషయంలో షీటీమ్స్ చేస్తున్న కృషిని దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రన్ నిర్వహిస్తున్నట్లు డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. ఈ నెల 4న పీపుల్స్ ప్లాజా వద్ద 10కే, 5కే, 2కే రన్ నిర్వహిస్తున్నామని, మార్చి 3, 4ల్లో షీటీమ్స్ ఎక్స్పో ఇక్కడే ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎక్స్పో కార్యక్రమాన్ని హోంమంత్రి నాయిని ప్రారంభిస్తారని చెప్పారు. మరుసటి రోజు జరిగే రన్ కార్యక్రమానికి అతిథులుగా క్రీడాకారిణి పీవీ సింధు, నటుడు దేవరకొండ విజయ్ హాజరవుతారని తెలిపారు. ఎక్స్పోలో షీటీమ్స్ చేపడుతున్న కార్యక్రమాలు, భరోసా కేంద్రం ద్వారా మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యలపై స్టాల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు www.events now.comలో ద్వారా లేదా షీటీమ్ ఫేస్బుక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. రన్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి మెడల్ అందజేస్తామని చెప్పారు. 4న ఉదయం 6 గంటలకు రన్ ప్రారంభమవుతుందని, పీపుల్స్ ప్లాజాలోని షీటీమ్స్ స్టాల్స్లో 3న టీషర్ట్ను తీసుకోవాలన్నారు. కాలేజీ స్టూడెంట్స్కు రిజిస్ట్రేషన్ చార్జీలు ఉండవని చెప్పారు. రన్కు సంబంధించిన టీషర్ట్, మెడల్స్, కరపత్రాలను డీజీపీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో శాంతి భద్రతల అదనపు డీజీపీ అంజనీకుమార్, హైదరాబాద్ ఇన్చార్జి కమిషనర్ శ్రీనివాస్రావు, అదనపు కమిషనర్ స్వాతిలక్రా పాల్గొన్నారు. -
మందేసి..చిందేసి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలులో ఆదివారం అర్ధరాత్రి రేవ్ పార్టీ కలకలం సృష్టించింది. నగరంలోని ఒక ప్రదేశంలో ఒక ఎరువుల కంపెనీ తమ డీలర్లకు విందును ఏర్పాటు చేసి ముగ్గురు యువతులతో ఆశ్లీల నృత్యాలు చేయించింది. ఈ పార్టీలో గతంలో నగరంలోని వన్ టౌన్ పోలీసు స్టేషన్లో పని చేసిన సీఐ, ఇద్దరు వ్యవసాయాధికారులు ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలుసుకున్న షీ టీమ్ పోలీసులు రాత్రి 11 గంటల సమయంలో దాడి చేశారు. అయితే సదరు సీఐతో సహా అధికారులు తప్పించుకొని పారిపోయారు. అక్కడ సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి దాడి.. గతంలో కర్నూలులో రేవ్ పార్టీలు, ఆశ్లీల నృత్యాలు చేసిన దాఖలాలు లేవు. అయితే ఒక్కసారిగా ఆదివారం అర్ధరాత్రి రేవ్ పార్టీపై షీటీమ్ పోలీసులు దాడి చేయడం కలకలం సృష్టిస్తోంది. నగరంలోని ఓ అపార్ట్మెంట్లో ఓ ఎరువుల కంపెనీ తమ డీలర్లకు విందు పార్టీని ఏర్పాటు చేసింది. ఇందులో నృత్యాలు చేయడానికి హైదరాబాద్కు చెందిన ముగ్గురు యువతులను తీసుకొచ్చింది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన పార్టీ రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. రాత్రి 9 గంటల నుంచి యువతులు ఆశ్లీలంతో నృత్యాలు చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. దాదాపు 25 మంది ఉన్న పార్టీలో అందరూ తాగి తూగుతూ ఆశ్లీలంగా యువతులతో కలసి నృత్యాలు చేస్తున్నారు. ఇంతలోనే విషయం షీ టీమ్ ఎస్ఐ విజయలక్ష్మీకి ఫోన్ ద్వారా చేరింది. వెంటనే ఆమె రాత్రి 11 గంటల ప్రాంతంలో దాడి చేయగా.. సీఐ, ఇద్దరు వ్యవసాయాధికారుల గుట్టు రట్టయింది. పోలీసులను చూడగానే ఆ సీఐ వారిపైనే దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. చివరకు పోలీసులను భయభ్రాంతులకు గురి చేసి వారిని తోచుకుంటూ సీఐతో సహా అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇంతలోనే టూ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సీఐ డేగల ప్రభాకర్ విందు పార్టీ చేసిన హాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ని స్వాధీనం చేసుకున్నారు.అంతేగాక ప్రసాదరెడ్డి, పాండు, భానుచందర్రెడ్డి, ఎస్కే షంషద్ బేగం, మహేందర్రెడ్డి, ఎరువుల కంపెనీ మేనేజర్లు సురేష్, సుబ్బారావు, పవన్ కల్యాణ్రెడ్డి, కొమ్ము వెంకటేశ్వర్లు, ముగ్గురు యువతులను అరెస్టు చేశారు. ఇందులో ముగ్గురు యువతులపై తప్ప మిగిలిన 9 మందిపై కేసులు నమోదు చేశారు. సీఐపై కేసుకు వెనుకాడుతున్న పోలీసులు రేవ్ పార్టీలో పోలీసులు సీసీ ఫుటేజిని స్వాధీనం చేసుకోవడం కీలకంగా మారింది. అరెస్టు చేసేందుకు వెళ్లిన షీ టీమ్ పోలీసులను పక్కకు తోచి పారిపోయిన సీఐతోసహా వ్యవసాయాధికారుల వ్యవహారం కీలకంగా మారింది. అయితే సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకొని దాదాపు 30 గంటలకుపైగా అయినా ఇంకా చూస్తున్నామని పోలీసులు చెబుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. సీఐను కేసు నుంచి తప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిస్తున్నాయి. సదరు సీఐ జిల్లాలోని ఓ ప్రముఖ ప్రజాప్రతినిధిని ఆశ్రయించి పోలీసులపై కేసు లేకుండా ఒత్తిడి చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో డిపార్టుమెంట్ పరువు వీధిన పడకుండా చూసేందుకు కొందరు పోలీసులు అధికారులు కూడా రంగంలోకి దిగి సీఐపై కేసు నమోదు కాకుండా చూస్తున్నట్లు సమాచారం. మరోవైపు సదరు సీఐ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా, ఎరువుల కంపెనీ పార్టీకి వీఆర్లో ఉన్న సీఐ ఎందుకెళ్లాడనేది అంతుచిక్కని ప్రశ్న. ఈ విషయంపై పోలీసులు లోతుగా విచారణ జరపాల్సి ఉంది.