volunteer
-
ఉద్యోగం పోవడం, ఫైనాన్స్ వేధింపులతో మహిళా వాలంటీర్ సూసైడ్
-
యూటర్న్ బాబు.. వాలంటీర్ల వినూత్న నిరసన
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్పై వాలంటీర్ల(Volunteers) పోరాటం కొనసాగుతోంది. తాజాగా విజయవాడ(Vijayawada)లో వాలంటీర్ల నిరసన ఉధృతంగా మారింది. రోడ్డుపై వెనక్కి నడుస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ యూటర్న్ విధానానికి వ్యతిరేకంగా బ్యాక్ వాక్ చేశారు. ఈ సందర్భంగా బాబు వచ్చారు.. జాబ్ తీశారంటూ నినాదాలు చేశారు. అలాగే, పెండింగ్ జీతాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.ఏపీలో వాలంటీర్ల(Volunteers) పోరాటం ఉధృతంగా కొనసాగుతోంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ప్రాధాన్యత ఇస్తామని, వేతనాన్ని కూడా పెంచుతామని కూటమి నాయకులు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల సేవలను చంద్రబాబు ప్రభుత్వం వినియోగించుకోలేదు. ఈ నేపథ్యంలో కూటమి మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి నెలకు రూ.10వేలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, విశాఖలోనూ వాలంటీర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. నిరసనల్లో వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమను విధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిలించాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తూ నిరనసలు చేపట్టారు. చంద్రబాబు సర్కార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతే అమరావతిలో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. -
కార్పొరేట్ వలంటీర్లు.. సేవా కార్యక్రమాలు
సమాజం నుంచి తీసుకోవడమే కాదు.. ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలనే స్ఫూర్తితో పలు కార్పొరేట్ కంపెనీలు(Corporate Cos) సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ తదితర రంగాల్లో ప్రజలకు సాయమందించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వాటిలో వలంటీర్లు(Corporate volunteering)గా పాలుపంచుకునేలా ఉద్యోగులను కూడా ప్రోత్సహిస్తున్నాయి. ఇందుకోసం, పెయిడ్ లీవ్ ఇవ్వడమే కాకుండా తగు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. దీంతో ఉద్యోగులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరింత సమయం సైతం వెచ్చించేందుకు ముందుకు వస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేలా ఉద్యోగులను ప్రోత్సహిస్తున్న వాటిల్లో ఇన్ఫోసిస్, పీఅండ్జీ, క్యాప్జెమిని(Cap Gemini), స్టాండర్డ్ చార్టర్డ్, హెచ్యూఎల్, నెట్యాప్ తదితర కంపెనీలు ఉన్నాయి.వివిధ కంపెనీలు నిర్వహిస్తున్న ప్రాజెక్టుల్లో కొన్ని..ఇన్ఫోసిస్జీవవైవిధ్యానికి తోడ్పడేలా ప్రాంతీయంగా వృక్ష సంపదను పెంపొందించేందుకు కంపెనీ నడుం కట్టింది. ఉద్యోగులంతా కలిసి ఇటీవలే 2,00,000కు పైగా సీడ్బాల్స్ను తయారు చేశారు. వీటిని దేశవ్యాప్తంగా దాదాపు 20 ప్రాంతాల్లో అడవుల పెంపకం ప్రాజెక్టుల్లో ఉపయోగించనున్నారు. ఇక ఇన్ఫీ(Infosys)కి చెందిన బీపీఎం విభాగం ప్రాజెక్ట్ జెనిసిస్ పేరిట మరో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలను అందిపుచ్చుకునేందుకు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ కల్పిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇలా 78,000 మందికి పైగా విద్యార్థులకు తోడ్పాటు అందించింది. పీఅండ్జీఅంతగా విద్యా సేవలు అందని ప్రాంతాల్లోని బాలలకు చదువును అందుబాటులోకి తెచ్చే దిశగా శిక్షా ప్రోగ్రాంను నిర్వహిస్తోంది. దీనితో దాదాపు యాభై లక్షల మందికి పైగా చిన్నారులు లబ్ధి పొందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.క్యాప్జెమినివిద్య, సస్టైనబిలిటీ, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాల అభివృద్ధి మొదలైన కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. వీటిలో 90,000 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. మొత్తం 2,43,000 పైగా గంటల సమయం వెచ్చించారు. గత కొన్నాళ్లుగా ఉద్యోగులు స్వచ్ఛందంగా ఇలాంటి కార్యక్రమాల కోసం వెచ్చించే సమయం వార్షికంగా 20 శాతం మేర పెరుగుతోందని సంస్థ వర్గాలు తెలిపాయి. ఉద్యోగులు మాక్ ఇంటర్వ్యూలు .. రెజ్యూమె బిల్డింగ్ వర్క్షాప్లు నిర్వహించడం, కెరియర్ విషయంలో మార్గనిర్దేశనం చేయడం మొదలైన మార్గాల్లో ఉద్యోగార్థులకు సహాయం చేస్తున్నారు. జాబ్ మార్కెట్కి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకుని, అవకాశాలను అందిపుచ్చుకునేలా వారికి తోడ్పాటు అందిస్తున్నారు.ఇదీ చదవండి: విల్మర్ నుంచి అదానీ ఔట్స్టాండర్డ్ చార్టర్డ్నైపుణ్యాలను బట్టి వివిధ సామాజిక సేవా ప్రాజెక్టుల్లో పాలుపంచుకునేలా ఉద్యోగులను ప్రోత్సహిస్తోంది. విద్యార్థులకు మార్గనిర్దేశనం చేయడం, కెరియర్పరంగా గైడెన్స్ ఇవ్వడం వంటి కార్యక్రమాలను చేపడుతోంది. వాటిలో పాల్గొనే ఉద్యోగులకు మూడు రోజుల పాటు పెయిడ్ లీవ్ కూడా ఇస్తోంది. ఇలాంటి కార్యక్రమాలపై ఉద్యోగులంతా కలిసి మొత్తం 1,17,376 గంటల సమయాన్ని వెచ్చించారు. -
తిన్న కంచాన్ని కాళ్ళతో తన్నినట్టు...బాబు,పవన్ పై గుంటూరు వాలంటీర్లు ఫైర్
-
చందాలేసుకుని విద్యా వలంటీర్ నియామకం!
గూడెంకొత్తవీధి (అల్లూరి సీతారామరాజు జిల్లా): తమ పిల్లలకు చదువు చెప్పేందుకు.. విద్యార్థుల తల్లిదండ్రులు సొంతంగా డబ్బులు పోగుచేసి వలంటీరును నియమించుకున్న ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. గూడెంకొత్తవీధి మండలంలోని అమ్మవారి దారకొండ పంచాయతీ తడకపల్లి జీపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడిని కూటమి ప్రభుత్వం ఆగస్టులో బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు.అప్పటినుంచి విద్యార్థులు బోధనకు దూరమయ్యారు. విషయాన్ని తల్లిదండ్రులు అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా వారినుంచి స్పందన లేకుండాపోయింది. దీంతో విసిగిపోయిన వారు చివరకు డబ్బులు పోగు చేసుకుని చదువుకున్న ఒక యువకుడిని వలంటీర్గా నియమించుకున్నారు. కనీసం ఇప్పటికైనా కలెక్టర్, ఐటీడీఏ పీవోలు స్పందించి తమ పాఠశాలకు శాశ్వత ప్రాతిపదికన ఉపాధ్యాయుడిని నియమించాలని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
9న వలంటీర్ల ఆవేదనా సదస్సు
సాక్షి, విజయవాడ: ఈ నెల 9న వలంటీర్ల ఆవేదనా సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీ స్టేట్ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గుజ్జుల ఈశ్వరయ్య వెల్లడించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు వాలంటీర్లకు ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.ఎనిమిది కేబినెట్ మీటింగ్లు జరిగినా వాలంటీర్ల గురించి ఆలోచన చేయకపోవడం బాధాకరమన్నారు. నవంబర్ 6వ తేదీన జరగనున్న క్యాబినెట్లో వాలంటీర్లకు న్యాయం చేయాలన్నారు. ఎన్నికల హామీ ప్రకారం 10 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని, బకాయిపడ్డ ఐదు నెలల గౌరవ వేతనం చెల్లించాలని ఈశ్వరయ్య విజ్ఞప్తి చేశారు. -
దళితుడిపై ‘దేశం’ నేతల దాడి
సాక్షి టాస్్కఫోర్స్: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలం గాజుల మల్లాపురం గ్రామంలో ఆదివారం టీడీపీ నాయకులు రెచ్చి పోయారు. మాజీ వలంటీర్ దళితుడైన నాగరాజును కులం పేరుతో దూషించి దాడిచేశారు. అతడు కౌలుకు సాగుచేసిన మొక్కజొన్న పంట పొలాన్ని దౌర్జన్యంగా దున్నేశారు. బాధితుడు తెలిపిన మేరకు.. కూటమి ప్రభుత్వం వచ్చి న తర్వాత నాగరాజు వలంటీర్ ఉద్యోగం పోయింది. దీంతో వ్యవసాయం చేసుకుందామనుకున్న నాగరాజు గ్రామంలోని కొత్తింటి రామ్మోహన్, రుద్రగౌడులకు చెందిన ఎనిమిదెకరాలను కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగుచేశాడు. ఎకరాకు రూ.30 వేల చొప్పున మొత్తం రూ.2.40 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆదివారం అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు గాజుల పెద్ద ఎర్రిస్వామి, చిన్న ఎర్రిస్వామి, వారి కుమారులు.. అనంతపురం నుంచి మరికొందరిని తీసుకొచ్చి నాగరాజు సాగు చేసిన మొక్కజొన్న పంటను హొన్నూరు అలియాస్ హరి అనే వ్యక్తికి చెందిన ట్రాక్టర్తో దున్నేశారు. పంటను నాశనం చేయవద్దని బాధితుడు కాళ్లావేళ్లాపడినా కరుణించలేదు. పొలంలోనే తీవ్రంగా కొట్టారు. పొలం తగాదాలుంటే మీరూమీరూ చూసుకోవాలని, పంటను నాశనం చేయవద్దని వేడుకున్నా వినలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం మాది.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ దాడిచేశారని తెలిపాడు. తనకు జరిగిన అన్యాయంపై పాల్తూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని చెప్పాడు. అట్రాసిటీ కేసు నమోదు చేయాలి నాగరాజును కులం పేరుతో దూషించి, దాడిచేసిన వారిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ జిల్లా నాయకుడు కెంగూరి ఎర్రిస్వామి డిమాండ్ చేశారు. దళితుడి పంటను దౌర్జన్యంగా దున్నేయడం దారుణమని పేర్కొన్నారు. బాధితుడికి న్యాయం చేయాలని కోరారు. -
చంద్రబాబు మార్క్ వెన్నుపోటు
-
మహిళా వలంటీర్పై దాడి
వేమూరు: గ్రామ వలంటీర్పై టీడీపీ కార్యకర్తలు మహిళలతో దాడి చేయించి కొట్టిన ఘటన బాపట్ల జిల్లా వేమూరు మండలం చంపాడులో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎస్సీ మాదిగ వర్గానికి చెందిన పమిడిపాగుల జ్యోతి అనే మహిళ గ్రామ వలంటీర్గా పని చేస్తోంది. వలంటీర్లపై కూటమి నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎన్నికల ముందు ఆమె రాజీనామా చేశారు. కాగా.. ఎన్నికల్లో గెలిచాక టీడీపీ కార్యకర్తలు జ్యోతిని లక్ష్యంగా చేసుకుని వేధించటం మొదలుపెట్టారు. నాలుగు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటిపై ఇటుక రాళ్లతో దాడి చేశారు. ‘మీ వైఎస్సార్సీపీ పార్టీ గెలవాలని ఓట్లు వేయించి తెగపాకులాడావుగా గొప్ప వాలంటీరు. ఇప్పుడు మాది రాజ్యం. నీ అంతు చూస్తాం. జై టీడీపీ, జై కూటమి’ అంటూ ఆ ఇంటి గోడపై పోస్టర్ అతికించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. మరుసటి రోజునుంచి స్కూల్కెళ్తున్న జ్యోతి పిల్లలను దూషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం బజారు నుంచి ఇంటికెళ్తున్న జ్యోతిపై కొందరు మహిళలతో టీడీపీ నాయకులు దాడి చేయించి కొట్టించారు. కిందపడిపోయిన జ్యోతిని వేమూరు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ ఆమె స్పృహ కోల్పోవటంతో 108 అంబులెన్స్లో తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ వేమూరు ఇన్చార్జి వరికూటి అశోక్బాబు హుటాహుటిన వేమూరు పోలీస్ స్టేషన్కు వెళ్లి జ్యోతిని పరామర్శించారు. నాలుగు రోజుల క్రితం ఆమె ఇంటిపై రాళ్లురువ్వి పోస్టర్ అతికించినట్టు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోవటంపై పోలీసులను ప్రశ్నించారు. ఆ కేసుతో పాటు ఆదివారం జరిగిన దాడిపై కేసులోనూ ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తేనే పోలీస్ స్టేషన్ నుంచి వెళతానని పట్టుబట్టారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటిపై జరిగిన రాళ్ల దాడిపై ఎఫ్ఐఆర్ తర్వాత ఇస్తామని ఎస్ఐ నాగరాజు వెల్లడించారు. వరికూటి అశోక్బాబు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎక్కడైనా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులకు పాల్పడితే సహించబోమన్నారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, తనతోపాటు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. వైఎస్సార్సీపీ నేతపై దాడి.. వేటపాలెం: బాపట్ల జిల్లా వేటపాలెం మండల పరిధిలోని బచ్చులవారిపాలెంలో వైఎస్సార్సీపీ నేత బచ్చుల బంగారు బాబు పై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు..గ్రామంలో శనివారం రాత్రి గంగమ్మ తల్లి కొలుపులు జరుగుతున్నాయి. అదే అదునుగా గ్రామంలో టీడీపీకి చెందిన ప్రధాన నాయకుడు వారి అనుచరులు నలుగురికి మద్యం తాగించి బంగారుబాబుపై దాడికి తెగబడ్డారు. దీంతో బంగారుబాబు తలకు తీవ్రగాయం అయ్యింది. అక్కడే ఉన్న కొంతమంది మహిళలు దాడిని అడ్డుకోవడంతో అతడిని వదిలేశారు. కాగా, బంగారుబాబు వైఎస్సార్సీపీ తరఫున గ్రామంలో ప్రచారం చేసి ఓట్లు వేయించాడు. టీడీపీ చెందిన ఒక నాయకుడు గ్రామంలో టీడీపీ తరఫున పోటీ చేసిన మన సామాజిక వర్గం నాయకుడు కొండయ్యకు గ్రామం మొత్తం ఓట్లు వేద్దామని బంగారు బాబును అడిగారు. అందుకు అతను ఒప్పుకోకపోగా వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పాడు. దాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామంలో టీడీపీ ఓట్లు చీలుస్తావా అని చెప్పి వారికి సంబంధించిన కొంత మందికి మద్యం తాగించి బంగారు బాబుపై దాడి చేయించాడు. తనను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు వాపోయాడు. తనకు, తన వర్గం వారికి రక్షణ కల్పించాలని కోరుతూ వేటపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
గుమ్మం వద్దకే పెంచిన పింఛన్లు
సాక్షి, అమరావతి: జూలై ఒకటో తేదీ ఉదయాన్నే సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారుల గుమ్మం వద్దే అందజేస్తామని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపుతో పాటు, డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, అన్నా క్యాంటిన్లు, స్కిల్ సెన్సెస్ ఫైళ్లపై సీఎం చంద్రబాబు సంతకాలు చేశారని వివరించారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ.. వృద్ధులు, వితంతు, ఇతర పింఛన్లను రూ.మూడు వేల నుంచి రూ.నాలుగు వేలకు, దివ్యాంగుల పింఛన్లను రూ. మూడు వేల నుంచి రూ.ఆరు వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ క్రమంలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు రూ.వెయ్యి చొప్పున జూలై నెల పింఛన్తో కలిపి వృద్ధులు, వితంతు మహిళలకు జూలై ఒకటో తేదీ ఉదయాన్నే ఒక్కొక్కరికీ రూ.7 వేలు చొప్పున అందజేస్తామని చెప్పారు. అదే విధంగా దివ్యాంగులకు సైతం పెంచిన పింఛన్లను అరియర్స్తో ఇస్తామన్నారు. 16,347 పోస్టులతో డీఎస్సీని నిర్వహించనున్నామన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు చట్టాలను ఆ పార్టీ పాలిస్తున్న కొన్ని రాష్ట్రాల్లో సైతం అమలు చేయడం లేదని, అదే తరహాలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తాము వ్యతిరేకించినట్లు వివరించారు. గ్రామ, వార్డు వలంటీర్ వ్యవస్థ రద్దు కాలేదని, ఈసీఐ ఆదేశాల మేరకు వలంటీర్లు విధులకు దూరంగా ఉన్నారన్నారు. అయితే పలువురు వలంటీర్లు రాజీనామాలు చేశారని, త్వరలో శాఖాపరమైన రివ్యూ నిర్వహించి ఈ వ్యవస్థపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. త్వరలోనే వివిధ శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయనున్నామన్నారు. తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, వంటి కీలక పథకాల అమలుపైనా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి, మద్యం, డ్రగ్స్ వినియోగంతో రాష్ట్రంలో నిర్విర్యమైన యువతలో నైపుణ్యాలు పెంపునకు చంద్రబాబు శ్రీకారం చుట్టారని మరో మంత్రి డోలా తెలిపారు. ఒక్క చాన్స్ అని మాజీ సీఎం జగన్ ప్రజలను మోసం చేశారని మంత్రి ఎస్.సవిత విమర్శించారు. -
శ్రీకాళహస్తిలో టీడీపీ నేతల అరాచకం
సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తిలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. వాలంటీర్లు మహేశ్వరి, పృథ్వీ ఇళ్లపై దాడులకు పాల్పడిన టీడీపీ నేతలు.. వారిని నిర్బంధించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వాలంటీర్ల కుటుంబాన్ని రక్షించారు.వైఎస్సార్ విగ్రహాలను కూల్చడం అప్రజాస్వామికం: తోపుదుర్తిఅనంతపురం: టీడీపీ నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని.. రాప్తాడులో టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ విగ్రహాలను టీడీపీ నేతలను కూల్చడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనకు ఆరు నెలలు సమయం ఇస్తాం. హామీలు నెరవేర్చకుంటే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని తోపుదుర్తి హెచ్చరించారు.టీడీపీ దాడులపై ఎస్పీ గౌతమి శాలి సీరియస్టీడీపీ దాడులపై అనంతపురం ఎస్పీ గౌతమి శాలి సీరియస్ అయ్యారు. దాడులకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హింసకు పాల్పడే వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ నేత ఇంటిపై దాడి చేసిన వారి కోసం గాలింపు చర్యలు చేపడతామన్నారు. -
ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల
అనంతపురం: ఇంజినీరింగ్, బీ–ఫార్మసీ రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ ద్వారా అడ్మిషన్లు పొందడానికి నిర్వహించిన ఏపీ ఈసెట్–2024 ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రా రెడ్డి గురువారం విడుదల చేశారు. ఏపీ ఈసెట్ నిర్వహించిన జేఎన్టీయూ(అనంతపురం)లో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. 8 దఫాలుగా ఏపీ ఈసెట్ను విజయవంతంగా నిర్వహించిన జేఎన్టీయూ(ఏ) ఈసెట్ నిర్వహణ కమిటీని ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి అభినందించారు.ఏపీ ఈసెట్కు రాష్ట్రవ్యాప్తంగా 37,767 మంది దరఖాస్తు చేసుకోగా.. 36,369 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 32,881 మంది(90.41 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అబ్బాయిలు 27,787 మంది దరఖాస్తు చేసుకోగా 26,693 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 23,849(91.68 శాతం) మంది అర్హత సాధించారు. అమ్మాయిలు 9,980 మంది దరఖాస్తు చేసుకోగా, 9,676 మంది హాజరయ్యారు. వీరిలో 9,032(93.34 శాతం) మంది ఉత్తీర్ణలుయ్యారు. ఈసెట్ ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 1,071 మంది పరీక్ష రాయగా 1,002 (93.56 శాతం) మంది అర్హత సాధించారు. ఉదయం సెషన్లో మొత్తం 145 ప్రశ్నలకు గాను 272 అభ్యంతరాలు రాగా.. నాలుగు ఆమోదం పొందాయి.మధ్యాహ్నం సెషన్లో మొత్తం 171 ప్రశ్నలకు గాను 444 అభ్యంతరాలు రాగా 19 ఆమోదం పొందాయి. ఈ ప్రశ్నలకు జవాబు రాసిన వారికి మార్కులు లభించాయి. ఫలితాల విడుదల కార్యక్రమంలో ఏపీ సెట్స్ స్పెషల్ ఆఫీసర్ ఎం.సుధీర్రెడ్డి, ఏపీ ఈసెట్ చైర్మన్ జీవీఆర్ శ్రీనివాసరావు, కన్వీనర్ పీఆర్ భానుమూర్తి, జేఎన్టీయూ(ఏ) రెక్టార్ ఎం.విజయకుమార్, రిజిస్ట్రార్ సి.శశిధర్, పాలకమండలి సభ్యులు బి.దుర్గాప్రసాద్, డాక్టర్ ఎం.రామశేఖర్రెడ్డి పాల్గొన్నారు.వలంటీర్ శిల్ప స్టేట్ ఫస్ట్రణస్థలం: సీఎం జగన్ ఏర్పాటు చేసిన వలంటీర్ వ్యవస్థలో చేరి ప్రజలకు సేవ చేస్తున్న ఓ యువతి ఏపీ ఈసెట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడలో వలంటీర్గా సేవలందిస్తున్న మైలపల్లి శిల్ప రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. శిల్ప ప్రస్తుతం శ్రీకాకుళం మహిళా పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలలో డీ–ఫార్మసీ రెండో సంవత్సరం చదువుతోంది.ఇంజనీరింగ్ చదవాలనే ఆశయంతో ఆమె ఈసెట్ రాయగా.. బయో టెక్నాలజీ విభాగంలో ఫస్ట్ ర్యాంకు వచ్చిందని ఆమె తెలిపింది. ఆమె తండ్రి పేరు పోలీసు.. టైలర్గా పనిచేస్తుండగా.. తల్లి లక్ష్మి గృహిణి. కుమార్తెకు స్టేట్ ఫస్ట్ ర్యాంకు రావడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. గ్రామస్తులు శిల్పను అభినందించారు. శిల్ప మాట్లాడుతూ.. బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్ చేసి అత్యుత్తమంగా రాణించాలని అనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. -
టీడీపీ దాష్టీకానికి పరాకాష్ట
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేశారనే ఆరోపణలతో టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదు ఓ మహిళా వలంటీర్ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఊళ్లో అందరికీ తలలో నాలుకలా వ్యవహరించిన ఓ సేవకురాలిని టీడీపీ స్వార్థ రాజకీయాల కోసం పొట్టన పెట్టుకోవడం దిగ్భ్రాంతి పరుస్తోంది. తప్పుడు ఆరోపణలతో వేధింపులు, ఫిర్యాదు, పోలీసుల విచారణతో తీవ్ర భయాందోళనలకు గురై విజయనగరం రూరల్ మండలం దుప్పాడ గ్రామంలో వలంటీరు బొబ్బాది సంతోషి (36) గుండె ఆగిపోయింది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సంతోషి భర్త బొబ్బాది కృష్ణ విజయనగరం కూరగాయల మార్కెట్లో పని చేస్తుంటారు. వీరికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి జయదీప్ ఇటీవలే పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. అమ్మాయి లహరి ఎనిమిదో తరగతి చదువుతోంది. సంతోషి వలంటీరుగా చేరిన తర్వాత గ్రామంలో తనకు అప్పగించిన 50 కుటుంబాలకు నిత్యం అందుబాటులో ఉండేది. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పథకాన్ని అర్హులకు చేర్చుతూ వారి మన్ననలు అందుకుంది. తనది పేద కుటుంబమే అయినా గ్రామంలో ఏ పేద వారూ ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో సేవలందించింది. ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజామునే అవ్వాతాతలకు పింఛన్ అందించడంలో పోటీ పడేది. సీఎం జగన్ అంటే అభిమానం. ఇవన్నీ అదే గ్రామంలోని టీడీపీ నాయకులకు కంటగింపుగా మారాయి. ఏదో విధంగా వలంటీర్లపై కక్ష సాధింపు లక్ష్యంతో ఉన్న టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్ను అడ్డు పెట్టుకుని కుట్రలు, కుతంత్రాలకు తెర లేపారు. టీడీపీ నేతల బెదిరింపులుటీడీపీ ప్రభుత్వం వస్తే వలంటీర్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ స్థానిక టీడీపీ నేతలు గ్రామంలో 50 మంది యువకులను మభ్యపెట్టి ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారంటూ వలంటీర్లు బొబ్బాది సంతోషి, నారాయణమ్మ, రామలక్ష్మి, స్వాతి, కృష్ణవేణి, కోటమ్మలపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. పూర్వాపరాలు సరిగా విచారించకుండానే టీడీపీ నేతల ఒత్తిళ్లతో అధికారులు ఆగమేఘాలపై ఆ ఆరుగురు వలంటీర్లను సస్పెండ్ చేశారు. పోలీసులతో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. పుట్టుమచ్చలు, తదితర వివరాలు చెప్పాలని పోలీసులు మూడు రోజుల కిందట సంతోషికి ఫోన్ చేసి అడిగారు. అంతకు ముందు గ్రామంలో నిర్వహించిన టీడీపీ ప్రచార సభలో కూడా ఆ నాయకులు వలంటీర్ల ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పుడు ఉద్యోగాలు ఊడగొట్టి కేసులు పెట్టించామని, తమ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వదిలి పెట్టబోమని హెచ్చరించారు. పోలీసులు గ్రామంలోకి వచ్చి ఇంటింటి విచారణ చేశారు. ఇవన్నీ సంతోషినిని ఆందోళనకు గురి చేశాయి. ఇదిలా ఉండగా పుట్టుమచ్చలు తదితర వివరాలు చెప్పాలని పోలీసులు మూడ్రోజుల కిందట ఆమెకు ఫోన్ చేయడంతో తీవ్రంగా భయాందోళనకు గురైంది. గురువారం ఛాతీలో పట్టేసినట్టు ఉండటంతో తొలుత గ్యాస్ తాలూకు నొప్పిగా భావించింది. కొంత సేపటి తర్వాత గుండెల్లో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు విజయనగరంలో డాక్టర్లకు చూపించారు. వారి సూచనలతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యం అందిస్తుండగా పరిస్థితి విషమించి శుక్రవారం ఆ పేదరాలి గుండె ఆగిపోయింది. సంతోషి హఠాన్మరణం ఆమె కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నింపింది. గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజలు ఆమె అంతిమ యాత్రలో పాల్గొని కంట నీరు పెట్టారు. కాగా, ఇంత జరిగినా టీడీపీ నాయకులకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడటానికి ఆ కుటుంబం భయపడిపోతోంది. తోటి వలంటీర్లంతా లోలోన కుమిలిపోతున్నారు. -
వాలంటీర్ గా పని చేయడం గర్వంగా ఉంది
-
ఓటుకు 5-10 వేలు.. టీడీపీ ఎరను తిప్పికొట్టిన వాలంటీర్..
-
వాలంటీర్ల సేవలపై టాలీవుడ్లో సినిమా!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ ఎంత అద్భుతంగా పని చేస్తుందో అందరికి తెలిసిందే. ఎక్కడ అవినీతి జరగకుండా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ నేరుగా లబ్దిదారులకు అందిచడంలో వాలంటీర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వృద్దులకు, వికలాంగులకు నెల నెల వారి గడపవవద్దకే వెళ్లి ఫించన్లు అందిస్తున్నారు. గతంలో ప్రభుత్వ పథకాలు పొందాలి అంటే.. స్థానిక రాజకీయనేతలు, ప్రజాప్రతినిధుల చుట్టు తిరిగాల్సి అవసరం వచ్చేది. కానీ ఇప్పుడు అర్హత ఉంటే చాలు.. వాలంటీర్లు మీ ఇంటి వద్దకే వచ్చి ఆయా పథకాలను అందిస్తున్నారు. ఈ వ్యవస్థపై అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా ‘వాలంటీర్’ వ్యవస్థ గురించి చర్చ జరుగుతోంది. త్వరలోనే ఈ వ్యవస్థపై టాలీవుడ్లో ‘వాలంటీర్’ అనే సినిమా కూడా రాబోతుంది. ఈ చిత్రంలో సూర్య కిరణ్ హీరోగా నటించగా.. ప్రసిద్ధి దర్శకత్వం వహిస్తున్నారు. రాకేష్ రెడ్డి నిర్మాత. ఈ రోజు(ఏప్రిల్ 12) తిరుపతిలో ఈ సినిమా టైటిల్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడుతూ.. ‘వాలంటీర్ల సేవలపై వస్తున్న ‘వాలంటీర్’ మూవీ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. వాలంటీర్లు స్వచ్ఛందంగా సేవ చేస్తూ ప్రభుత్వానికి తోడుగా ఉంటున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ సర్వీస్ చేస్తున్నాడు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం వాలంటీర్ వ్యవస్థను సమర్థించారు. నిజాయితీగా సేవ చేస్తున్న వాలంటీర్ వ్యవస్థను లేకుండా చేయాలని చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నాడు. నిమ్మగడ్డ రమేశ్తో ఈసీకి ఫిర్యాదు చేయించి వాలంటీర్ సేవలను నిలిపివేశారు. చంద్రబాబు చేసిన కుట్ర వల్ల ఇప్పటికే 33 మంది వృద్ధులు, వితంతువులు చనిపోయారు.పేద ప్రజలకు సీఎం జగన్ చేస్తున్న సేవలను చూసి ఓర్వలేకనే చంద్రబాబు ఇలాంటి కుట్రలు చేస్తున్నాడు’ అని విమర్శించాడు. నిర్మాత, వైఎస్సార్సీపీ నేత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘వాలంటీర్లు రియల్ హీరోలు. తమిళనాడు, కర్ణాటకతో పాటు దేశం మొత్తం ఈ వ్యవస్థపై ప్రశంసలు కురిపిస్తుంది. అలాంటి గొప్ప వ్యవస్థపై సినిమా నిర్మించడం సంతోషంగా ఉంది. త్వరలోనే వాలంటీర్ చేస్తున్న సేవలను వెండితెరపై చూస్తారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన.. సినిమాను మాత్రం విడుదల చేసి తీరుతాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వామీజీ శ్రీకృష్ణమా చార్యులు, సుమతీ రెడ్డి, సాహితీవేత్త శ్రీదేవి తదితరులు హాజరయ్యారు. -
వాలంటీర్లపై జనసేన గూండాల అమానుషం.. గదిలో బంధించి!
సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లాలో వాలంటీర్లపై జనసేన గూండాల అమానుషంగా ప్రవర్తించారు. ఆరుగురు వాలంటీర్లను రెండు గంటల పాటు ఓ గదిలో నిర్భంధించి తాళం వేశారు. గదిలో ఫర్నిఛర్ ధ్వంసం చేసి వాలంటీర్లపై దౌర్జన్యం చేశారు. వాలంటీర్లలో ఏడు నెలల గర్భవతి ఉన్నా జనసేన గూండాలు కనికరించలేదు. తమ తోటి వాలంటీర్ పుట్టిన రోజు సందర్భంగా రమణయ్యపేట మోక్షిత ఫైనాన్స్ కంపెనీలో వీరంతా కలుసుకున్నారు. స్వీట్స్, కూల్ డ్రీంక్స్ తీసుకొని ఆనందంగా మాట్లాడుకున్నారు. అయితే ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న నెపంతో లోపలికి చొరబడిన కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీ, తన కార్యకర్తలతో కలసి వాలంటీర్లపై దాడికి దిగారు. రెండు గంటల పాటు వాలంటీర్లను నిర్బంధించి నానా హంగామా చేశారు. జనసేన దౌర్జన్యానికి గర్భంతో ఉన్న వాలంటీర్ సొమ్మసిల్లి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్నికల అధికారులు గదిలోకి వెళ్లి చూడగా అక్కడ కూల్ డ్రింక్స్, స్వీట్స్ గుర్తించారు. కాగా పంతం నానాజీ తీరుపై వాలంటీర్లు మండిపడుతున్నారు. జనసేన గుండాలపై పోలీసు ఫిర్యాదుకు భాధిత వాలంటీర్లు సిద్ధమవుతున్నారు. చదవండి: పవన్కు వీళ్లా స్టార్ క్యాంపెయినర్లు! -
‘పచ్చ’కుట్రలు పటాపంచలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రతి నెలా ఠంచనుగా ఒకటో తేదీన లబ్ధిదారుల ఇంటి తలుపుతట్టి ఐదేళ్లుగా పింఛను అందిస్తున్న వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ‘పచ్చ’కుట్రలు పటాపంచలయ్యాయని వైఎస్సార్సీపీ డిప్యూటీ రిజినల్ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. వలంటీర్ల వ్యవస్థను అడ్డకున్నా సామాజిక పింఛన్లను సకాలంలో అందించి సచివాలయ వ్యవస్థ విజయం సాధించిందని ప్రశంసించారు. ‘వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు సామాజిక పింఛన్ల పంపిణీని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. వలంటీర్ల వ్యవస్థ, సచివాలయాల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంచనుగా పింఛనుగా అందిస్తూ వస్తోంది. వారి జీవనానికి ఒక భరోసా కల్పించింది. ఈ విధానం అనేక దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా పరిశీలించింది. కొన్ని రాష్ట్రాల్లో అమలుచేయడానికి సాధ్యాసాధ్యాలపై ప్రత్యేక బృందాలొచ్చి అధ్యయనం చేశాయి. ఇదెక్కడ జగన్మోహన్రెడ్డికి పేరొస్తుందోనన్న అసూయతో చంద్రబాబు కుతంత్రాలకు ఆదిలోనే తెరలేపారు. వలంటీర్ల వ్యవస్థపై బురదజల్లారు. కించపరిచేలా దుర్భాషలాడారు. ఇవేవీ పట్టించుకోకుండా వలంటీర్లు సేవాదృక్ఫథంతో ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువచేయడానికి కష్టపడ్డారు. కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు ఇదే చంద్రబాబు హైదరాబాద్ ప్యాలెస్లో తాళాలేసుకొని కూర్చుంటే వలంటీర్లు ఇక్కడ ప్రభుత్వానికి, అటు ప్రజలకు వారధిగా నిలిచారు. వైద్యసేవలు సత్వరమే అందించడానికి తమ వంతు సహాయసహకారాలు అందిస్తూ ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రినని, విజనరీనని చెప్పుకునే చంద్రబాబు గత టీడీపీ ప్రభుత్వంలో సృష్టించిన జన్మభూమి కమిటీలు ప్రభుత్వ సేవలందించే ముసుగులో తమ ప్రాణాలు ఎలా తోడేశాయో ప్రజలకు బాగా తెలుసు. అందుకే 2019 సంవత్సరంలో టీడీపీని తరిమికొట్టారు. జన్మభూమి కమిటీలకు ఎంతో భిన్నంగా ఉన్న వలంటీర్లను చూసి చంద్రబాబు కక్ష కట్టారు. నిమ్మగడ్డ రమేష్తో కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించారు. వృద్ధులకు, దివ్యాంగులకు పింఛను అందించకుండా వలంటీర్లను దూరం చేశారు. ఇలా ఒక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని కుట్రకు తెరలేపారు. ఇది దురదృష్టకరం. చంద్రబాబు చేష్టలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మరోసారి కచ్చితంగా బుద్ధి చెబుతారు. జగన్ విజన్కు నిదర్శనం... వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజన్కు నిదర్శనం. ప్రతి సచివాలయంలో 11 మంది ఉద్యోగులను, గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలకు, పట్టణాల్లో ప్రతి వంద కుటుంబాలకు ఒకరు చొప్పున వలంటీర్లను పెట్టారు. ప్రభుత్వ సేవలను, పథకాలను పైసా అవినీతికి ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా అందించిన వ్యవస్థగా పేరొందింది. దీన్ని చెడగొట్టడానికి చంద్రబాబు కుట్రలకు తెరలేపారు. వృద్ధులు, దివ్యాంగులకు వలంటీర్ల ద్వారా పింఛను ఇంటివద్దనే అందుకోకుండా సైంధవుడిలా అడ్డుపడ్డారు. మండుటెండల్లో రోడ్లపైకి లాగి చంద్రబాబు తనలోనున్న సైకో మనస్తత్వత్వాన్ని బయటపెట్టుకున్నారు. ఏదిఏమైనా సచివాలయాల ద్వారా పింఛన్ల పంపిణీని ప్రభుత్వం పూర్తి చేయడం హర్షణీయం. సచివాలయ ఉద్యోగులకు అభినందనలు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సచివాలయాల్లో కల్పించిన దాదాపు 1.30 లక్షల ఉద్యోగాలను ఇన్నాళ్లూ గుర్తించని చంద్రబాబే ఇప్పుడు ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలన్నారంటేనే ప్రజాసేవ పట్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో చాటిచెబుతోంది. వలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్న చంద్రబాబే తమ తప్పు నుంచి తప్పించుకోవడానికి ఖజానాలో డబ్బుల్లేవని, అందుకే పింఛన్ల పంపిణీ ఆలస్యమవుతోందని దుష్ప్రచారం చేశారు. కానీ లబ్ధిదారులందరికీ సచివాలయ వ్యవస్థ ద్వారా పింఛన్లు అందజేసి జగన్మోహన్రెడ్డి భరోసా కల్పించారు. -
వెన్నులో వణుకు చంద్రబాబుకు అన్నీ రివర్స్
-
పేదలపై పంతం
సాక్షి, అమరావతి: చరిత్రను సమాజం ఎన్నటికీ మరువదు! మానవత్వం లేని మనిషిని నాయకుడిగా ఎన్నడూ అంగీకరించదు! దేశంలోనే తొలిసారిగా సంక్షేమ ఫలాలను ఇంటింటికీ చేరవేసి ప్రజాభిమానం పొందిన వలంటీర్ వ్యవస్థపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అక్కసు అంతాఇంతా కాదు. ఆవిర్భావం నుంచి దీనిపై చంద్రబాబు అండ్ కో విషం చిమ్ముతూనే ఉంది. ఇక జనసేన అధినేత పవన్కళ్యాణ్ వలంటీర్లను సంఘ విద్రోహ శక్తులుగా, మహిళలను అక్రమ రవాణా చేసే కిరాతకులుగా చిత్రీకరించి ఆ వ్యవస్థను విచ్ఛినం చేసే కుట్రకు తెరదీశారు. ప్రభుత్వానికి మంచి పేరు రావడంతో వలంటీర్లను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో ఎన్నికల వేళ వలంటీర్ల సేవలు నిలిచిపోయేలా చంద్రబాబు కుట్ర రాజకీయాలకు తెగబడ్డారు. తన సన్నిహితుడు, మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ సంస్థ ద్వారా వలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి పదేపదే ఫిర్యాదు చేయించారు. వలంటీర్లను విధుల నుంచి తప్పించడంతో నాలుగున్నరేళ్లకుపైగా సజావుగా సాగిన ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఆగిపోయింది. దీంతో లక్షల మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతు అక్కచెల్లెమ్మలు మండుటెండల్లో రోడ్లపై నిలబడాల్సి వచ్చింది. ఈ ఉదంతంతో పేదలంటే చంద్రబాబుకు ఎంత వ్యతిరేకత ఉందో మరోసారి స్పష్టమైంది. కోవిడ్ సంక్షోభంలోనూ ఆగని పింఛన్ల పంపిణీ చంద్రబాబు కారణంగా నిలిచిపోవడం తీవ్ర ప్రజా వ్యతిరేకతకు దారితీస్తోంది. దీంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు తన రివర్స్ డ్రామా మొదలెట్టారు. వలంటీర్ల సేవలను తానే అడ్డుకుని.. మళ్లీ ఇంటింటికీ పింఛన్లు పంచాలంటూ ఎన్నికల కమిషన్కు, ప్రభుత్వానికి దొంగ లేఖలు రాస్తూ డ్రామాను రక్తి కట్టిస్తున్నారు. యూటర్న్ తీసుకోవడంలో చంద్రబాబుకు ఏమాత్రం మొహమాటాలు ఉండవని అనేకసార్లు రుజువైంది. వాటిల్లో కొన్ని మచ్చుతునకలు ఇవే..! ♦ 2019 సెప్టెంబర్ 27: టీడీపీ కేంద్ర కార్యాలయం వేదికగా చంద్రబాబు వలంటీర్లను అత్యంత దారుణంగా కించపరిస్తూ వ్యాఖ్యలు చేశారు. ‘వలంటీర్లతో ఏంటి లాభం? 5 వేల రూపాయలతో ఏం ఉద్యోగం అది..? గోనె సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోస్తూ ఎప్పుడంటే అప్పుడు ఇళ్లకు వెళ్లడం డిస్ట్రబ్ చేయడం. డే టైం మగవాళ్లు ఉండరు.. వీళ్లు (వలంటీర్లు)పోయి తలుపులు కొట్టడం... ఎంత నీచం...’ అంటూ వలంటీర్లపై తన అక్కసు వెళ్లగక్కారు. ♦ 2021, అక్టోబర్ 30న కుప్పం రోడ్షోలోనూ చంద్రబాబు వలంటీర్లనే టార్గెట్ చేశారు. ‘ఊర్లలో వలంటీర్లు పెద్ద న్యూసెన్స్ అయ్యారు. బ్రిటీష్ వాళ్లకు ఏజెంట్లులా వీరు ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారారు. ప్రజలను బెదిరిస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. రేపు ఎన్నికలకు కూడా వీరే వస్తారు’ అంటూ వలంటీర్ల సేవలను నిలిపివేసేలా కుట్రలకు అప్పుడే బీజం వేశారు. ఉత్తమ వలంటీర్లను గుర్తించి ప్రభుత్వం ప్రోత్సహిస్తే కూడా ఓర్వలేకపోయారు. 2022 ఏప్రిల్ 07న ‘వలంటీర్లు సాధించింది ఏంటి? సన్మానం పేరుతో కోట్లు తగలేస్తున్నారు’ అంటూ పెత్తందారీ కుళ్లును వెళ్లగక్కారు. ♦ టీడీపీ మహిళా నాయకులు వలంటీర్లను ఇష్టానుసారంగా తూలనాడారు. 2023, జూలై 14న టీడీపీ మహిళా సదస్సులో ‘వలంటీర్లు కొంపలు కూల్చే పనులు చేస్తున్నారు. ఇంటి లోపలికి వస్తున్నారు. వీళ్లు ఎవరండీ ఇళ్లలోకి రావడానికి? వచ్చి మీ వివరాలు కనుక్కొంటున్నారు. మీ ఆయనకు ఏమైనా వేరే సంబంధాలు ఉన్నాయా? ఏమైనా అనుమానం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. అంటే కొంపల్ని కూల్చే మార్గం ఇది. మగవాళ్ల దగ్గరకు వెళ్లి మీ ఆడబిడ్డలు ఏమైనా బయట తిరుగుతున్నారా? అని అడుగుతున్నారు. చెప్పుతో కొట్టేవారు లేకపోతే సరి. ఈ వివరాలతో వలంటీర్ల కేంటి సంబంధం’ అంటూ నోటికొచ్చిన అబద్ధాలను ఆపాదించి పైశాచిక ఆనందాన్ని పొందారు. సేవకులపై ఉన్మాదం.. వలంటీర్లను అవమానించడంతో పాటు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా జనసేన అధినేత పవన్కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అన్నీఇన్నీ కావు. 2023, అక్టోబర్ 7న వారాహి యాత్రలో భాగంగా ఏలూరు పాత బస్టాండ్ వద్ద నిర్వహించిన రోడ్ షోలో మహిళల అదృశ్యానికి వలంటీర్లే కారణం అంటూ హేయంగా మాట్లాడారు. ‘ వలంటీర్లు ఒంటరి అతివల సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారు. ప్రతి గ్రామంలో వలంటీర్లు కుటుంబంలో ఎంత మంది ఉన్నారు? వారిలో మహిళలు ఎందరు? వితంతువులున్నారా? అని ఆరా తీస్తున్నారు. మహిళల అదృశ్యం వెనుక వలంటీర్ల హస్తం ఉంది’ అంటూ ఉన్మాదాన్ని ప్రదర్శించారు. ♦ 2023 జూలై 11న ఏలూరులో పార్టీ నాయకులతో సమావేశంలోనూ వలంటీర్లే అజెండాగా పవన్ బురద రాజకీయం చేశారు. ‘ప్రజాసేవ కోసం పంచాయతీరాజ్, రెవెన్యూతో పాటు కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు ఉన్నప్పటికీ.. వలంటీర్లు అనే మరో సమాంతర వ్యవస్థ ఎందుకు? ప్రజలను నియంత్రించడం.. ఎవరైనా ఎదురు తిరిగితే భయపెట్టడానికి, సోషల్ మీడియాలో టీడీపీ వాళ్లు విమర్శిస్తే ఇబ్బందులు పెట్టడానికి వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. జనసైనికులు, నాయకులు వలంటీర్లపై ఓకన్నేసి ఉంచండి. ఆడబిడ్డలున్న తల్లిదండ్రులు, ఒంటరి, వితంతువులు అప్రమత్తంగా ఉండండి. వలంటీర్లకు సమాచారం ఇవ్వకండి’ అని వలంటీర్ వ్యవస్థను ఉగ్రవాద చర్యలతో పోల్చారు. ♦ సినిమా డైలాగులతో రాజకీయ ప్రసంగాలు చేసే పవన్కళ్యాణ్ వలంటీర్ల నడుం విరగొట్టి తీరుతాం అంటూ 2023, జూలై 12న వారాహి రెండో విడత యాత్రలో ఊగిపోయారు. ‘వలంటీర్ వ్యవస్థ లేనప్పుడు దేశం ఆగిందా? ఇప్పుడు ప్రజల వ్యక్తిగత సమాచారమంతా వారి వద్దే ఉంది. ఓ ప్రభుత్వ ఉద్యోగి వల్ల సమాచారం దుర్వినియోగమైతే నిలదీయవచ్చు. వలంటీర్ వ్యవస్థ తొండ ముదిరి ఊసరవెల్లిలా మారింది. బ్రిటీష్ వాళ్లు మన దేశాన్ని ఆక్రమిస్తే ఆరు కోట్ల మందిని వలంటీర్లు నియంత్రిస్తున్నారు. సేవ చేయడానికి వచ్చిన వలంటీర్లకు దాడి చేసే హక్కు ఉందా? వలంటీర్లు బాలికలపై అఘాయిత్యాలు చేస్తున్నారు’ అంటూ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అదేరోజు తన ట్విట్టర్లోనూ ‘వలంటీర్లు జగన్ అధికారిక పెగాసస్. ప్రభుత్వ నిధులను వలంటీర్ల కోసం దుబారాగా ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ యాప్లో ప్రజల సమాచారాన్ని తీసుకుని వారి భద్రతకు భంగం కలిగిస్తున్నారు’ అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. బెదిరించి.. నాలుక మడత 2021 మార్చి 29న తిరుపతిలో టీడీపీ ఆవిర్భావ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు వలంటీర్ల కథ చూస్తామని బెదిరింపులకు దిగారు. ‘వలంటీర్ల వ్యవస్థ దండగ. వలంటీర్ల లోపాలను గుర్తించి టీడీపీ కార్యకర్తలు సమాచారం ఇస్తే వారి కథ చూసుకుంటాం. రూ.10వేల పారితోషికం ఇస్తాం’ అంటూ ప్రకటించారు. ఎల్లో మీడియాలో వలంటీర్లను దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ కథనాలు వండి వర్చేశారు. కానీ ప్రజల్లో వలంటీర్లపై, ప్రభుత్వంపై బలంగా నాటుకుపోయిన నమ్మకాన్ని చూసి చంద్రబాబు అండ్ కో కంగుతిన్నారు. వలంటీర్ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ ఉంటే.. ఆ ఇంటి సభ్యుల్లోని వ్యక్తే వలంటీర్గా సేవలందిస్తున్నారు. నిత్యం తమ కళ్లముందు తిరిగే తమ బిడ్డలనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు నోటికొచ్చినట్టు తూలనాడుతుంటే ప్రజలు ఆగ్రహంతో రగిలిపోయారు. ఇది గ్రహించిన బాబు అండ్కో తమకు రాజకీయంగా పుట్టగతులు ఉండవని భావించి వలంటీర్ల సేవలు గొప్పవంటూ కొత్త పల్లవి అందుకున్నారు. వలంటీర్ ఉద్యోగం దండగ అన్న చంద్రబాబే ఇప్పుడు మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామంటూ కపట హామీలు గుప్పిస్తున్నారు. వలంటీర్ వ్యవస్థ ఎందుకని ప్రశ్నించిన పవన్కళ్యాణ్ వారి పొట్ట కొట్టాలని అనుకోవట్లేదని నాలిక మడతేశారు. ఇప్పుడు గుర్తొచ్చిందా? చంద్రబాబు ఒక్క వలంటీర్ వ్యవస్థపైనే కాదు.. దానికి కీలకమైన, గ్రామ స్వరాజ్యానికి ప్రతీకగా నిలిచిన సచివాలయ వ్యవస్థపైనా ముప్పేట దాడి చేశారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఊడతాయంటూ గద్దించారు. అదే చంద్రబాబు ఇప్పుడు వలంటీర్లకు బదులు.. సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయాలంటూ ఉచిత సలహాలు ఇవ్వడం గమనార్హం. స్వత్రంత్ర భారతంలో ఇంటింటికీ ప్రభుత్వ సేవలను తీసుకెళ్లిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. పంచాయ తీరాజ్, రెవెన్యూ, కలెక్టర్లు వ్యవస్థలు దశాబ్దాలుగా పని చేస్తున్నా చిట్టచివరి వ్యక్తికి లబ్ధి చేకూర్చడంలో తీవ్ర జాప్యం జరిగేది. ఇది గమనించిన సీఎం జగన్ సచివాలయ వ్యవస్థతో పాటు అనుబంధంగా వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు. దాదాపు నాలుగు లక్షల మంది యువతకు సొంత గ్రామాల్లోనే ప్రభుత్వ సేవకులుగా ఉద్యోగ, ఉపాధి అవకాశం కల్పించారు. అందుకే సమర్థవంతంగా, అవినీతికి తావులేకుండా పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఆ దుస్థితిని తొలగించి.. వలంటీర్ వ్యవస్థ రాకమునుపు వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు కాళ్లు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి అరకొర పింఛన్ తెచ్చుకునేవారు. ప్రభుత్వ పథకాలు వాల్పోస్టర్ల రూపంలో గోడలపై కనిపించేవి కానీ అర్హులైన లబ్ధిదారులకు అందేవి కాదు. నాడు ప్రభుత్వ సాయం అందాలంటే జన్మభూమి కమిటీలను దేహీ అనాల్సిన దుస్థితి. సచివాలయాలు, వలంటీర్లు వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలే పేదల ఇళ్లకు నడుచుకుంటూ వెళ్తున్నాయి. అలాంటిది నాలుగున్నరేళ్ల తర్వాత వలంటీర్ల సేవలు నిలిచిపోవడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. మళ్లీ మండుటెండల్లో రోడ్లపై నిలబడి పింఛన్ తీసుకోవాల్సి రావడం చంద్రబాబు దుర్మార్గ చర్యలకు ప్రతీకగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు స్వతంత్ర సంస్థ ముసుగులో.. మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వతంత్ర సంస్థ ముసుగులో చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారన్నది స్పష్టమైంది. ‘సిటిజన్ ఫర్ డెమోక్రసీ’ సంస్థ ముసుగులో కుహనా మేధావులతో టీడీపీకి అనుంగు సంస్థగా వ్యవహరిస్తూ వలంటీర్ల వ్యవస్థను అడ్డుకుని పేదలను పరోక్షంగా దెబ్బకొట్టారు. నిమ్మగడ్డ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి 23, 25న వలంటీర్లను పింఛన్ల పంపిణీ నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రెండుసార్లు ఫిర్యాదు చేసింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకూడదంటూ ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రత్యక్షంగా ఇంత దారుణానికి ఒడిగట్టిన చంద్రబాబు ఇప్పుడు తమకేమీ సంబంధం లేదని, ఇంటింటికీ వెళ్లి పింఛన్ పంచాల్సిందేనంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. గతంలోనూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టుల్లో ఆయన కేసులు వేయించడంతోపాటు సెంటు స్థలం సమాధికి కూడా సరిపోదంటూ అనుచిత వ్యాఖ్యలతో తన పెత్తందారీ అహంకారాన్ని చాటుకున్నారు. -
సైంధవుడుచంద్రబాబే..
సాక్షి, నెట్వర్క్: పింఛన్కోసం సోమవారం సాయంత్రం వరకూ ఎదురు చూసిన వృద్దులకు నిరాశ తప్పలేదు. కనీసం మంగళవారం అయినా ఇస్తారని ఆశగా చూసి చివరికి ఎప్పుడిస్తారో తెలియక తల్లడిల్లిపోతున్నారు. ఆ సొమ్ముతోనే అత్యవసర మందులు కొనుగోలు, ఇతర నిత్యావసరాల కోసం వినియోగించాల్సి ఉండగా చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న వారికి చంద్రబాబు పన్నాగం అవరోధంగా మారింది. దీంతో ఆయన వ్యవహారశైలిపై రాష్ట్రవ్యాప్తంగా పెన్షనర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. నోటికాడ కూడును లాగేసుకున్న చంద్రబాబు విధానంపై ప్రజలు అక్రోశం చెందుతున్నారు. వృద్దులు, వితంతువులు, దివ్యాంగులకు అన్ని రంగాల ప్రజల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. ప్రతి నెలా ఇంటివద్దకే వచ్చి వలంటీర్ కుశలప్రశ్నలు అడిగి సొమ్ము చేతిలో పెట్టే సమయంలో వృద్దులు తడారని కళ్లతో వాటిని సంతోషంగా తీసుకునేవారు. ఇప్పుడు మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయని వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలో దూర ప్రాంతానికి వెళ్లి ఎలా తెచ్చుకోవాలని ఆందోళన చెందుతున్నారు. సచివాలయానికి ఎలా వెళ్లాలి ? నా వయస్సు 72ఏళ్లు. అనారోగ్యంతో పాటు లేవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాను. ఇంట్లో వాళ్ల సహాయంతో ఊపిరి పట్టుకుని ఉన్నాను. పింఛన్ ప్రతి నెల ఒకటో తేదీ తెల్లవారుజామునే వలంటీర్ మా ఇంటికి తెచ్చి నా చేతిలో పెట్టేది. ఈ నెల ఇంకా రాలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వలంటీర్ల మీద ఫిర్యాదు చేశారని తెలిసింది. వలంటీరు లేకుంటే నా లాంటి ఎంతోమంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయేవారు. కరోనాలో ఆపద్బాంధవులుగా ఆదుకున్నారు. ముసలి వారితో రాజకీయ క్రీడలు ఆడడం ఎంతవరకు సమంజసం. ఈ ఎండలో సచివాలయానికి ఏ విధంగా వెళ్లాలి. మానవత్వం లేని టీడీపీ, జనసేన నాయకులు ప్రజలకు ఏం మేలు చేస్తారు? – ఎస్.గోపాల్, కొర్లగుంట, తిరుపతి జిల్లా చంద్రబాబు చూపు పడితే కష్టాలే నాకు 90 ఏళ్ల పైనే ఉంటాయి. అనారోగ్యంతో కొన్నేళ్లుగా మంచంలోనే ఉంటున్నా. ఎక్కడికీ పోలేను. ప్రతినెలా వలంటీరు ఇంటి వద్దకే వచ్చి జీతం ఇచ్చినట్లు పింఛను ఇచ్చేవారు. వేలి గుర్తులు పడకపోయినా ఓపిక పట్టి ఇచ్చేవారు. ఆ డబ్బులు మందులకు, ఖర్చులకు సరిపోయేవి. ఇప్పుడు వలంటీరును రాకుండా చేసినారు ఎక్కడికో పోయి తెచ్చుకోవాలంట. ఇన్ని ఇబ్బందులు పెట్టిన చంద్రబాబుకు మా ఉసురు తగులుతుంది. ఆయన చూపు పడితే అన్నీ కష్టాలే. – బోయ బతుకమ్మ, సోమలగూడ, నందవరం మండలం, కర్నూలు జిల్లా. ఆ రోజులు తలచుకుంటే భయమేస్తుంది నా వయస్సు 70 సంవత్సరాలు. ప్రభుత్వం ఇచ్చే పింఛనే నాకు జీవనాధారం. జగన్మోహన్రెడ్డి వచ్చాక ఒకటో తేదీన ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేకుండా ఇంటికే వచ్చి పింఛన్ ఇస్తుంటే చాలా ఆనందంగా ఉండేది. ఇప్పుడు పింఛన్ సొమ్ముల కోసం గతంలోలా పంచాయతీ కార్యాలయానికి వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడతాం. అప్పటి ఇబ్బంది తలచుకుంటేనే చాలా భయమేస్తోంది. ఇంటి దగ్గరకి వచ్చి పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేయాలి. – మాముడూరి సూరమ్మ, పెనుగొండ, ప శ్చిమగోదావరి జిల్లా మా ఉసురు తగులుతుంది రోడ్డు ప్రమాదంలో కాలుకు దెబ్బతగలడం వల్ల చేతికర్ర ఉంటే తప్ప నడవలేను. రెండేళ్లుగా పింఛన్ అందుకుంటున్నాను. ప్రతి నెల 1న 6 గంటలకు నా తలుపు తట్టి రూ. 3000లు పింఛన్ అందజేసేవాడు. నాకు షుగర్, బీపీ ఉండడం వలన ఎక్కువ సేపు నిలబడలేను. పింఛన్ డబ్బులు అందితేనే నాకు పూట గడిచేది. టీడీపీ వలంటీర్లపై కోర్టులో కేసు వేసింది. ఈనెల పింఛన్ ఇప్పటికి ఇవ్వలేదు. మాలాంటి వికలాంగుల ఉసురు తెలుగుదేశం పార్టీకి తగులుతుంది. ఇప్పటి వరకు పింఛన్ ఇంటికే వస్తుందనే ధైర్యంతో ఉన్నాను. – దియ్యా రాంబాబు, రాజుపాలెం గ్రామం, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా. ఈ దుస్థితి ఎవరికీ రాకూడదు ఈ చిత్రంలో కనిపిస్తున్న ఆమె పేరు మంజుల. భర్త వెంకటేష్ చిరువ్యాపారి. చిత్తూరు నగరంలోని తేనెబండ కాలనీలో నివాసముంటారు. వీరికి 23 సంవత్సరాల వయస్సు ఉన్న భరత్ (విభిన్న ప్రతిభావంతుడు) ఉన్నాడు. 11 సంవత్సరాల క్రితం ఇంటి దగ్గర ఆడుకుంటూ మెట్ల మీద నుంచి పడడంతో కాలుకు తీవ్ర గాయమైంది. అప్పటి నుంచి నడవడానికి వీలుకాని పరిస్థితి. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేదు. తల్లి తోడు ఉంటేనే కాలకృత్యాలు తీర్చుకునే పరిస్థితి. బయట ప్రపంచమే తెలియని భరత్ ఇంటికే పరిమితమయ్యాడు. గత పాలనలో పింఛను కూడా వచ్చేది కాదు. వైఎస్ఆర్సీపీ వచ్చాక గత ఐదు సంవత్సరాలుగా పింఛను అందుకుంటున్నాడు. ప్రతి నెలా ఒకటవ తేదీన వలంటీర్ ఇంటి వద్దకు వచ్చి పింఛను అందజేసేవారు. ప్రతి నెలా వచ్చే రూ.3 వేలు పింఛను డబ్బును భరత్ చికిత్సకు ఉపయోగపడేవి. టీడీపీ చేసిన కుట్రతో వలంటీర్లు పింఛను ఇవ్వరనే వార్త తెలియగానే భరత్ తల్లి తల్లడిల్లిపోయింది. భరత్ను వార్డు సచివాలయానికి ఎలా తీసుకెళ్లాలని ఆవేదన చెందుతోంది. ఇటువంటి నీచమైన పనులు చేయడం చంద్రబాబుకు సబబు కాదని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. – కుమారుడు భరత్తో తల్లి మంజుల, తేనెబండ, చిత్తూరు జిల్లా నిస్సహాయులను శిక్షించడమేమిటి? ఈ ఫోటోలో కనిపిస్తున్న అభాగ్యుడి పేరు పిప్పళ్ల రామలక్ష్మయ్య. కృష్ణాజిల్లా బందరు మండలం పోతేపల్లి గ్రామం. వ్యవసాయ కూలీ. 15 ఏళ్ల క్రితం పక్షవాతం వచ్చి మంచానపడ్డాడు. ఇంటి పెద్ద దిక్కు మూలన పడిపోవడంతో కుటుంబం ఆర్థికంగా నలిగిపోయింది. గత ప్రభుత్వంలోనూ పింఛను అందుకున్నప్పటికీ దయనీయ స్థితిలో దూర ప్రాంతానికి వెళ్లి డబ్బులు అందుకోవాల్సి వచ్చేది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతినెలా ఒకటో తేదీన వలంటీర్ తలుపు తట్టి పింఛను అందించేవారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు వలంటీర్ వ్యవస్థపై కక్షగట్టి కోర్టు ద్వారా ఆంక్షలు విధించడంతో ఈనెల లేవలేని స్థితిలో మంచాన ఉన్న అభాగ్యుడికి పెన్షన్ అందలేదు. పెన్షన్ అందితే తప్ప అతనికి జీవనాధారం లేదు. ప్రభుత్వం నుంచి అందుకునే నగదుతోనే మందులు వాడేది. అడుగు తీసివేయలేని తనకు అన్ని విధాల అండగా ఉన్న వలంటీర్ను విధుల నుంచి తొలగించాలని కోర్టు నిర్ణయించడం తనలాంటి నిస్సహాయులను శిక్షించడమేనని ఆవేదన చెందుతున్నాడు. – పిప్పళ్ల రామలక్ష్మయ్య, పోతేపల్లి, బందరు మండలం, కృష్ణా జిల్లా, -
పెన్షన్లు ఆపింది చంద్రబాబే: సీఎం జగన్
అరుంధతి సినిమాలో సమాధి నుంచి లేచి వచ్చే పశుపతి లాగా అధికారం కోసం ఐదేళ్ల తర్వాత ‘పసుపు’పతి చంద్రబాబు వస్తున్నాడు. వదల బొమ్మాళి వదలా.. అంటూ పేదల రక్తం పీల్చేందుకు వస్తున్నాడు. కుర్చీ కోసం ఈ ‘పసుపు’పతి నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతాడు. పొరపాటున నమ్మారంటే సంక్షేమాభివృద్ధికి వ్యతిరేకంగా ఓటేసినట్లే. ఇప్పుడున్న సంక్షేమ పథకాల రద్దుకు అంగీకరించినట్లే. కుట్రలు, కుతంత్రాలతో జెండాలతో జత కట్టిన తోడేళ్లు ఒక్కటై వస్తున్నాయి. మోసపోకూడదని ఇంటింటా చెప్పాలి. – సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, కడప : ‘చంద్రబాబుకు పేదలంటే గిట్టదు. వారికి మేలు చేస్తున్న మన వలంటీర్ల వ్యవస్థ అంటే అసలే గిట్టదు. మొదటి నుంచీ ఈ వ్యవస్థపై ఏడుపే. ఈ ఏడుపులో భాగంగా మూడు రోజుల క్రితం ఏం జరిగిందో మీరందరూ చూశారు. లక్షల మంది అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతు అక్కచెల్లెమ్మలకు, ఇంకా తమను తాము పోషించుకోలేని అభాగ్యుల ఇంటికి వలంటీర్లు వెళ్లి పింఛన్ ఇవ్వడాన్ని అడ్డుకున్నారు. ఈ పెన్షన్ డబ్బులు అందితే తప్ప జీవితాలు గడవని వారికి నెలనెలా 1వ తారీఖున ఇంటికే వచ్చి, సూర్యోదయానికంటే మునుపే చిక్కటి చిరునవ్వులతో పెన్షన్ ఇచ్చిపోతున్న వలంటీర్లపై తన మనిషి నిమ్మగడ్డ రమేష్ చేత ఫిర్యాదు చేయించాడు. వారు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వటానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ ద్వారా ఆదేశాలు ఇప్పించారు. జగన్ను నేరుగా దెబ్బ కొట్టలేక ముసలి వాళ్లపై కక్ష తీర్చుకుంటున్నారు. ఇలాంటి మనిషిని ఏమనాలి?’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా 6వ రోజు మంగళవారం సాయంత్రం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 66 లక్షల మంది పేదలకు నష్టం కలిగిస్తున్నానన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు వ్యవహరించారని మండిపడ్డారు. నడవలేని వయసులో ఉన్న అవ్వాతాతలు, వికలాంగులకు తోడుగా నిలిచిన వలంటీర్ వ్యవస్థను ప్రశంసించాల్సింది పోయి.. ఏకంగా ఆ వ్యవస్థను రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో ఈ పెద్దమనిషి గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియంను కూడా ఇలానే వ్యతిరేకించాడని, పేద పిల్లలకు ట్యాబులిస్తుంటే కూడా వ్యతిరేకించారని చెప్పారు. పేదలకు మీ బిడ్డ ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టుల్లో కేసులు వేయించిన చంద్రబాబుది పెత్తందారీ భావజాలం కాదా? అని ప్రశ్నించారు. ఇలాంటి పెత్తందార్లకు, ఇలాంటి పేదల వ్యతిరేకులకు పొరపాటున ఓటు వేస్తే.. తమ పెన్షన్లు, తమకు అందే స్కీములు, ఇంటింటికీ వచ్చి సేవలందించే వలంటీర్ వ్యవస్థను రద్దు చేసేందుకు మనమే గ్రీన్న్ సిగ్నల్ ఇచ్చినట్లవుతుందని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని పిలుపునిచ్చారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. మెరిట్ విద్యార్థి పరీక్షలకు భయపడతాడా? ► ఇవాళ ఎన్నికలు వస్తున్నాయంటే ప్రతిపక్షంలో ఉన్న వారంతా విడివిడిగా రాలేకపోతున్నారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికీ లేదు.అధికారం కోసం గుంపులుగా, తోడేళ్లుగా జెండాలు జత కట్టి.. అబద్ధాలతో వస్తున్నారు. జెండాలు జత కట్టడమే వారి పని. ఇంత మంచి జరిగింది కాబట్టే మీ జగన్ ప్రజల గుండెల్లో గుడి కట్టాడు. అందుకే ఈరోజున ఒక్కడి మీద ఇంత మంది దాడి చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్.. వీళ్లందరూ కుట్రలు, కుతంత్రాలతో ఏకమవుతున్నారు. ► ఇంత మంది జతకట్టి వచ్చినా వాళ్లందరికీ తెలియని విషయం ఒకటి ఉంది. 99 మార్కులు తెచ్చుకున్న మెరిట్ స్టూడెంట్ పరీక్షలకు భయపడతాడా? అటువైపు గతంలో వాళ్లు పరీక్షలు రాసినప్పుడు 10 మార్కులు కూడా తెచ్చుకోని స్టూడెంట్.. పరీక్ష పాసవుతాడా? ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99 శాతం వాగ్దానాలు నెరవేర్చిన మన విశ్వసనీయత ముందు 10 శాతం వాగ్దానాలు కూడా తన హయాంలో నెరవేర్చకుండా మోసం చేసిన చంద్రబాబు, ఆయన కూటమి నిలబడగలుగుతుందా? ► విలువలు, విశ్వసనీయత లేని ఇలాంటి వారితో 30 పార్టీలు కలిసి వచ్చినా మన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, వలంటీర్లు, పేద వర్గాలు భయపడరు. పైగా పెత్తందారులతో సమరానికి మేమంతా సిద్ధం.. అని చెబుతున్నారు. ► ‘175 అసెంబ్లీ స్థానాలకు 175, 25 ఎంపీ సీట్లుకు 25 మొత్తం రెండు వందల సీట్లు.. ఎక్కడా తగ్గేందుకు వీల్లేదు. డబుల్ సెంచరీ కొట్టేందుకు నేను సిద్ధం.. మీరంతా సిద్ధమేనా.. మళ్లీ మనందరి ప్రభుత్వమే ఉండాలన్న ఆకాంక్షతో పేదల వ్యతిరేకులను, పెత్తందార్లను ప్రతిపక్ష కూటమిని ఓడించాలన్న సంకల్పంతో తరలి వచ్చిన సమరయోధుల సముద్రంలా మదనపల్లె కనిపిస్తోంది. టీడీపీకి ఓటు వేసిన వారికీ మంచి చేశాం ► ఈ ఐదేళ్లలో రూ.2.70 లక్షల కోట్లు ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో జమ చేశాం. ఇందులో 75 శాతం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారున్నారు. నాన్ డీబీటీ కూడా కలిపితే, అంటే నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి స్థలాలు, వారి పిల్లలకు పెట్టే గోరుముద్ద, ట్యాబులు, విద్యా కానుక లాంటివి కలుపుకొంటే అది రూ.లక్ష కోట్లు అదనం. మొత్తంగా రూ.3.70 లక్షల కోట్ల పైచిలుకు పంపించాం. ఇదీ మన ట్రాక్ రికార్డు. ► చంద్రబాబు పేరు చెబితే.. ఆయన చేసిన ఏ మంచీ గుర్తుకు రాదు. అదే మీ జగన్ పేరు చెబితే గ్రామ, వార్డు సచివాలయాలు, అందులో 10 మంది శాశ్వత ఉద్యోగులు, ఇంటికే వచ్చి పింఛన్ ఇచ్చే, ఇతర సేవలు అందించే వలంటీర్లు, విలేజ్ క్లినిక్, మీ ఇంటి వద్దకే వైద్య సేవలు, ఉచితంగా మందులు, ట్యాబ్లెట్లు, ఉచితంగా టెస్టులు.. ఇంగ్లిష్ మీడియం, ట్యాబులు, డిజిటల్ బోధన, ఆర్బీకేలు, రైతన్నలకు సున్నా వడ్డీ, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, ఉచిత పంటల బీమా, సమయానికే రైతన్నకు ఇన్న్పుట్ సబ్సిడీ గుర్తుకొస్తాయి. ► 35 లక్షల ఎకరాల మీద శాశ్వత హక్కులు ఇచ్చాం. మనం వచ్చేటప్పటికి 4 లక్షల ఉద్యోగాలుంటే, ఏకంగా మరో 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది మీ జగనే. ఇందులో 80 శాతం ఉద్యోగాలు నేను నా.. నా.. నా.. నా.. అని పిలుచుకునే వర్గాల వారే ఉన్నారు. ► అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ, ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, కళ్యాణమస్తు, షాదీ తోఫా.. ఈ పథకాలంటే గుర్తుకొచ్చేది మీ జగన్. మహిళా సాధికారత, దిశ యాప్, ప్రతి గ్రామంలో మహిళా పోలీసు ఉందంటే.. గుర్తుకొచ్చేది మీ జగనే. 17 కొత్త మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాలోనూ వేగంగా నిర్మాణం జరుగుతున్నాయి. ► కొత్తగా 4 సీ పోర్టులు కడుతున్నాం. మరో 10 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం. ఎయిర్ పోర్టులు, వాటి విస్తరణ వేగంగా జరుగుతోంది. పారిశ్రామిక కారిడార్లలో ఎప్పుడూ ఎవరూ వినని కంపెనీలు ఈరోజు రాష్ట్రంలోకి అడుగులు వేస్తున్నాయి. నిజమైన సామాజిక న్యాయానికి జైకొడదాం ► నిజమైన సామాజిక న్యాయానికి జై కొట్టండి. రాబోయే రోజుల్లో పేదలకు, పెత్తందార్లకు మధ్య జరగబోయే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో జరగబోయేదేమిటో తెలుసా? ప్రజలకు మంచి చేసిన ఫ్యాను.. మీ ఇంట్లోనే ఉంటుంది. అంటే అధికారంలోనే ఉంటుంది. ప్రజలను పదే పదే మోసం చేసిన సైకిల్ ఇంటి బయటే ఉంటుంది. బాబు ప్యాకేజీని గటగటా తాగేసి తన వారిని తాకట్టుపెట్టిన గ్లాసు సింక్లోనే ఉంటుంది. ఇది ప్రజల మాట. ► ఆ పొత్తుల, ఎత్తుల, జిత్తుల ముఠా ఎన్ని చేసినా, ఏమిచెప్పినా ఎంత ప్రయత్నించినా మన ప్రజలకు మనం చెప్పాల్సింది ఒక్కటే. మనం వేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే కాదు. మన భవిష్యత్తు, మన తల రాతలు ఈ ఓటు మీద ఆధారపడి ఉన్నాయని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మళ్లీ అన్నను తెచ్చుకుందాం.. అన్నే రావాలి. ఈ ఐదేళ్లుగా జరిగిన మంచిని కొనసాగించేందుకు, పేదవాడి భవిష్యత్ బాగు పడటానికి, మనందరి ప్రభుత్వానికి తోడుగా నిలబడటానికి, మళ్లీ అన్నే రావాలని ప్రతి ఒక్కరికీ, ప్రతి గడపకూ వెళ్లి చెప్పండి. పేదల రక్తం పీల్చే పసుపుపతి చంద్రబాబు ► మోసాలే అలవాటుగా, అబద్ధాలే పునాదులుగా చేసుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నాం. ఆ ముఠా నాయకుడు నారా చంద్రబాబునాయుడు. నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతున్న ఈ పసుపుపతి 2014లోనూ ఇదే మాదిరి పొత్తులు పెట్టుకున్నాడు. ఈ మూడు పార్టీలూ కలిసి ఇంటింటికీ ముఖ్యమైన హామీలు అంటూ పాంప్లెట్ పంపించారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, మోడీ ఫొటోలు.. కింద చంద్రబాబు నాయుడు సంతకంతో ఈ పాంప్లేట్ (చూపిస్తూ) పంపించాడు. ► ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లో అడ్వర్ టైజ్మెంట్లతో హోరెత్తించారు. రైతులకు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. రూ.87,612 కోట్లు రుణ మాఫీ చేశాడా? పొదుపు సంఘాల డ్వాక్రా రుణాలు రూ.14,205 కోట్లు మాఫీ చేశాడా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేశాడా? ఇంటింటికీ ఉద్యోగం.. లేదా నెలనెలా రూ.2 వేల నిరుద్యోగభృతి ఇస్తామ న్నాడు. ఐదేళ్లు.. అంటే 60 నెలలకు నెలకు రూ.2000 చొప్పున లెక్కిస్తే.. ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు ఇచ్చారా? అర్హులైన వాళ్లందరికీ 3 సెంట్ల స్థలం ఇచ్చారా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు.. చేశాడా? ► మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు జరిగిందా? రాష్ట్రాన్ని సింగపూర్ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి మన మదనపల్లెలో ఏమన్నా కనిపించిందా? ఇలా 650 హామీలు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ అదే మోసం. అవే పొత్తులు. ఇప్పుడు సూపర్ సిక్సు, సూపర్ సెవెన్ అంటూ మళ్లీ మోసం చేయడానికి వస్తున్నాడు. ఈ ముగ్గురూ కలిసి ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు. ఇంటింటికీ బెంజ్ కారు కొనిస్తామంటున్నారు. ► గవర్నమెంట్ బడిలో ఇంగ్లిష్ మీడియం వద్దన్న వారికి బుద్ధి చెప్పాలా వద్దా? పేదలకు ఇళ్ల స్థలాలిస్తుంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బ తింటుందని ఏకంగా కోర్టుకు వెళ్లి కేసులు వేసిన పార్టీలకు సమాధి కట్టాలా.. వద్దా? ఎస్సీలుగా పుట్టాలని ఎవరనుకుంటారని ఆ పుట్టుకనే అవమానించిన వారి రాజకీయాలకు చరమగీతం పాడుదాం. బీసీల తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబు తోకను, ఆ బాబును వెనకేసుకొస్తున్న తోకలను.. కత్తిరించే కార్యక్రమానికి శ్రీకారం చుడదామని కోరుతున్నా. నాన్న గారు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్తో, మైనార్టీల మనోభావాలతో గత 30 ఏళ్లుగా చెలగాటం ఆడుతున్న ఈ చంద్రబాబుకు, కూటమికి ఈసారి ఎన్నికల్లో 30 చెరువుల నీళ్లు తాగించండి. మన అభ్యర్థులకు దీవెనలు అందించండి మన పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలుచున్న అభ్యర్థులపై మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు ఉండాలి. రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్రెడ్డి, రైల్వేకోడూరు నుంచి కొరుముట్ల శ్రీనివాసులు, రాయచోటి నుంచి శ్రీకాంత్రెడ్డి, రాజంపేట నుంచి అమర్నాథ్రెడ్డి, తంబళ్లపల్లె నుంచి ద్వారకనాథ్రెడ్డి, మదనపల్లె నుంచి నిస్సార్ అహ్మద్, పీలేరు నుంచి రామచంద్రారెడ్డి, పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను గెలిపించాలి. మన గుర్తు ఫ్యాను అని అందరూ గుర్తుపెట్టుకోవాలి. చాలా కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. వాటన్నింటినీ తిప్పికొట్టాలి. రెండు బటన్లు నొక్కాలి.. ► పేదలకు అందాల్సిన ప్రతి రూపాయి ఆగకూడదంటే, మీ పెన్షన్ మీకు హక్కుగా నేరుగా మీ ఇంటికే రావాలి అంటే బాబు లాంటి సైంధవులు ఎప్పటికీ అడ్డు పడే అవకాశం ఇవ్వకూడదు. అది జరగాలి అంటే ప్రతి పేదవాడు మరో 40 రోజుల్లో రెండు బటన్లు నొక్కాలి. ఆ పేదవాళ్ల కోసం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల కోసం మీ బిడ్డ 130 సార్లు బటన్లు నొక్కాడు. ఆ పేదవాళ్లందరూ, అక్కచెల్లెమ్మలందరూ ఏకమై కేవలం రెండే రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కాలి. అప్పుడు ఈ వదల బొమ్మాళీ ఇక మన రక్తం పీల్చడానికి ముందుకు రాని పరిస్థితి ఉంటుంది. ► జగనన్నను మళ్లీ తెచ్చుకుందాం. అన్న మళ్లీ భారీ మెజార్టీతో వస్తే, జరుగుతున్న ఈ మంచి అంతా మళ్లీ కొనసాగుతుంది. మళ్లీ వలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి నేరుగా ఆత్మగౌరవాన్ని కాపాడుతూ అక్కచెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా ఉంటానని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఎన్నికల సంగ్రామంలో అబద్ధాన్ని, మోసాన్ని మట్టి కరిపించడానికి నేను సిద్ధం. మరి మీరంతా కూడా సిద్ధమా.. (సిద్ధమే అని కేకలు). అలాగైతే సెల్ ఫోన్లు బయటకు తీసి.. టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి. (ప్రజలందరూ సెల్లో టార్చ్ లైట్ ఆన్ చేసి పైకి ఎత్తి చూపించారు). ► ఓటు అడిగే నైతికత ఇంటింటికీ మంచి చేసిన మనకు మాత్రమే ఉందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని.. ఒక బైబిల్, ఖురాన్న్, భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చాకే ప్రజల ముందుకు వచ్చి ఓటు అడుగుతున్నాం. ఈ 58 నెలల్లో ఇంటింటికీ మేలు జరిగి ఉంటే మీ జగన్కు, మీ బిడ్డకు, మీ వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి తోడుగా నిలవాలి. -
మా ఉసురు తగులుద్ది..
మూడుచక్రాల సైకిల్పై ఉన్న ఈ దివ్యాంగుడి పేరు షేక్ పాచ్ఛా. పొదిలికి చెందిన ఇతను టీడీపీ ప్రభుత్వంలో పింఛను కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇవ్వలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక వికలాంగ పింఛన్ మంజూరైంది. ఠంఛనుగా ప్రతినెలా వలంటీర్ ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చేవాడు. ఇప్పుడు టీడీపీ నాయకుల కుట్రలతో వలంటీర్లు పింఛన్ పంపిణీ చేయడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడటంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ‘‘ఎండలో సచివాలయాలకు వెళ్లి క్యూలో ఉండి అధికారుల కోసం పడిగాపులు కాసి పింఛను తీసుకోవాల్సిన దుస్థితి కలి్పంచారు.. మా పింఛన్లు ఇంటికి వచ్చి ఇవ్వకుండా అడ్డుకున్న వారు బాగుపడరు. మాలాంటి వృద్ధులు, వికలాంగుల ఉసురు తప్పక తగులుతుంది’’ అంటూ మండిపడ్డాడు. ఈ వృద్ధురాలి పేరు అల్లు తిరుపతమ్మ. వయస్సు 80 సంవత్సరాలు. తర్లుపాడు మండలం జగన్నాథపురానికి చెందిన ఈమెకు వృద్ధాప్య పింఛన్ వస్తోంది. కాస్త దూరం కూడా నడవలేని స్థితిలో ఉన్న ఈమెకు వలంటీరే ఇంటికి వచ్చి ప్రతినెలా పింఛన్ అందించేవారు. చంద్రబాబు కుతంత్రంతో ఇప్పుడు వలంటీర్లు పింఛను ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో సుమారు 3 కిలోమీటర్లు నడిచి వెళ్లి సచివాలయం దగ్గర పింఛన్ తీసుకోవాల్సి వస్తోంది. ‘‘1వ తేదీ అయినా వలంటీరు రాకపోవడంతో వాకబుచేస్తే వలంటీర్లు పింఛన్ ఇవ్వకూడదంటూ టీడీపీ నేతలు కేసులు వేశారని.. అందుకే వారు రాలేదని తెలిసింది. ఎండలు మండిపోతున్నాయి. సచివాలయం దాకా నడిచి వెళ్లి పింఛను తీసుకోలేను. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. మంచి చేసే వాళ్ల మీద కేసులు పెట్టడం ఏందయ్యా..’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒకటో తేదీ వచ్చిందంటే అవ్వాతాతల మోముల్లో చిరునవ్వులు చిందేవి. దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఇలా అందరి ఇళ్ల ముందు సూర్యోదయానికి ముందే వలంటీర్లు ఇళ్ల ముందుకు వచ్చేవాళ్లు. ఏమవ్వా బాగున్నావా... ఏం తాతా ఎలా ఉన్నావంటూ కుశల సమాచారాలు అడిగి ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ డబ్బులు వారి చేతుల్లో పెట్టేవారు. అవి అందుకున్న వాళ్ల కళ్లల్లో మెరుపులు చూసి వలంటీరు సంతృప్తి పడేవారు. ఎండైనా, వానైనా లెక్కచేయకుండా అవ్వా తాతలకు పింఛన్లు అందజేసేవారు. ఒకవేళ ఏదైనా పనిమీద వేరే ఊర్లకు వెళ్లి ఉన్నా, ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నా అక్కడికి వెళ్లి అందజేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇలా అభాగ్యులకు అండగా ఉండే వలంటీరుపై పచ్చదండు కక్ష గట్టింది. రోజుకో రకమైన కథనాలు పచ్చమీడియా వండివార్చేది. అయినా రెట్టించిన ఉత్సాహంతో వలంటీర్లు ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందేలా శ్రమిస్తూ వస్తున్నారు. కరోనా లాంటి కష్ట కాలంలో తెలుగుదేశం పార్టీ అధినేత దగ్గర నుంచి నాయకులు ఇళ్లకు పరిమితమైతే తన ప్రాణాలకు లెక్కచేయకుండా వలంటీరు సాయం అందించాడు. ఎన్నో మంచి పనులు చేసిన వారి సేవలు ఎల్లో మీడియాకు పట్టలేదు. ఎన్నికల పేరు చెప్పి వారిని అభాసుపాలు చేసేలా రోజుకో రకంగా అసత్య కథనాలు వండివార్చింది. కోర్టులకు ఎక్కింది. తాజాగా ఎన్నికల పేరు చెప్పి కొత్త కుట్రలకు తెరతీసింది. తన అనుకూలుర ద్వారా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు మీద ఫిర్యాదులు చేయించింది. ఎన్నికల సంఘాన్ని సైతం తప్పుదోవ పట్టించింది. ఫలితంగా వలంటీరు ఇంటికి వెళ్లి పింఛన్ ఇవ్వరాదన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. దీనికి కారణమైన పచ్చదండుపై అవ్వాతాతలు, అభాగ్యులు మండిపడుతున్నారు. ప్రజల నుంచి సైతం పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేము ఏమన్యాయం చేశామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో ప్రభుత్వం, అధికార పారీ్టపై ఆ అపవాదు తోసే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పత్రికా ప్రకటన. చేసిన తప్పును ఇలా కప్పిపుచ్చుకునేలా ప్రకటనలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 2 లక్షల 95 వేల మందిపై ప్రభావం తెలుగుదేశం పార్టీ దుష్ట కూటమి కుట్రలతో జిల్లాలో 2 లక్షల 95 వేల మంది పింఛన్దారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వీరందరికీ ప్రతి నెలా ఇంటి వద్దకు వచ్చి తలుపుతట్టి మరీ పెన్షన్లు ఇచ్చేవారు వలంటీర్లు. ప్రతి నెలా ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్లు క్రమం తప్పకుండా పెన్షన్ వచ్చేది. ఇందుకోసం నెలకు రూ.88.21 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఇంటి నుంచి బయటకు రాలేని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తెలుగుదేశం చేసిన కుట్రల వలన ఈ నెల చేతిలో చిల్లిగవ్వలేక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి వచ్చింది. సహజంగానే వృద్ధాప్యంలో ఉన్న అనేక మంది ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటు¯ంటారు. ఇందులో ఎంతో మంది ప్రతినెలా వచ్చే పెన్షన్ డబ్బులు చేతికి అందగానే వైద్యశాలకు వెళ్లి చికిత్స పొందుతుంటారు. అవసరమైన ఔషధాలను కొనుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రతినెలా వచ్చే పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియక కొందరు వృద్ధులు, వితంతవులు, దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారు. పెన్షన్లు రాకుండా అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులపై మండిపడుతున్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు గట్టి గుణపాఠం చెబుతామంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు పోయేకాలం దాపురించిందని విమర్శిస్తున్నారు. చంద్రబాబు పాలనలో నరకయాతన చంద్రబాబు పాలనలో పెన్షన్లు తీసుకోవాలంటే నరకయాతన లాగా ఉండేది. అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు పెన్షన్ కోసం పెన్షన్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నానా అగచాట్లు పడాల్సి వచ్చేది. ఏ రోజు పెన్షన్ ఇస్తారో తెలియక రోజుల తరబడి ఎంపీడీఓ కార్యాలయం, పంచాయతీ కార్యాలయాల వద్ద పడిగాపులు పడాల్సిన దుస్థితి ఉండేది. పైగా జన్మభూమి కమిటీలకు లంచాలు ముట్టచెప్పిన వాళ్లకు త్వరగా పెన్షన్లు అందేవి. ఒకరు చనిపోతే గానీ కొత్తవి వచ్చేవి కావు. ఇంతటి దారుణ పరిస్థితులు చవిచూసిన అభాగ్యులు నేడు ఎలాంటి కష్టం లేకుండా ఇంటికే డబ్బులు వస్తుండడంతో ఆనందంగా ఉన్నారు. రూ.3 వేల వరకు పింఛన్ జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఎంతో మంది అవ్వాతాతలను కలిశారు. స్వయంగా వారి ఇబ్బందులను గమనించిన ఆయన చలించిపోయారు. తాను అధికారంలోకి వచ్చాక రూ.2 వేల వరకూ ఇస్తానని ప్రకటించారు. అప్పటి వరకు కేవలం వేయి రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తున్న ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు బెంబేలెత్తిపోయారు. ఎన్నికలకు ముందు రూ.2 వేలు ఇవ్వడం మొదలు పెట్టాడు. అది కూడా కొందరికే ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.2 వేలు ఉన్న దానిని పెంచుకుంటూ రూ.3 వేలు చేశారు సీఎం జగన్. అర్హులందరికీ కొత్త పింఛన్లు సైతం అందేలా చేశారు. మంచంలో ఉన్న ఈ వృద్ధురాలి పేరు శగబండి మస్తానమ్మ. కురిచేడుకు చెందిన ఈమెకు వృద్ధాప్య పింఛన్ వస్తోంది. వలంటీరు ఇంటికి వచ్చి ప్రతినెలా పింఛన్ ఇచ్చేవారు. వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ ఆపేయడంతో ఆ వృద్ధురాలికి కష్టం వచ్చిపడింది. ఈనెల పింఛన్ అందలేదు. సచివాలయానికి వెళ్లి పింఛను తెచ్చుకోవాలని చెప్పడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లే స్థితిలో లేని ఆమె ఆవేదన వర్ణనాతీతం. ‘‘ఉద్యోగులు లాగే మా ఇళ్లకు వచ్చి పింఛన్లు ఇచ్చేవాళ్లు. ఏ దిక్కూ లేని మాకు జగన్బాబే దిక్కయ్యాడు. ఆయన ఇస్తున్న పింఛన్కు అడ్డుపడుతున్న వాళ్లు మా ఇళ్లకు వచ్చి పింఛన్ ఇస్తారా.. మంచి చేయడం చేతకాకపోయినా చేసేవాళ్లను చెడగొట్టడం నీచమైన పని’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. -
వలంటీర్పై టీడీపీ నాయకుల దాడి
హిందూపురం అర్బన్: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని 28వ వార్డు వలంటీరు సంధ్యపై సోమవారం రాత్రి టీడీపీ నాయకులు దాడిచేశారు. స్థానిక సూరççప్ప కట్టకింద (బోయపేట) ప్రాంతంలోని వలంటీర్ సంధ్య ఇంటివద్దకు సోమవారం రాత్రి కొందరు అవ్వాతాతలు వచ్చి పింఛన్ విషయమై ఆరాతీశారు. ఈ నెల 3వ తేదీ నుంచి వార్డు సచివాలయంలో ఇస్తారని ఆమె చెబుతుండగా.. సమీపంలోనే ఉన్న టీడీపీ నాయకులు నవీన్, అనిల్, అశోక్, విజి తదితరులు ఆమెపై దాడిచేశారు. గర్భిణి అని కూడా చూడకుండా దాడిచేయడంతో ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. టీడీపీ వర్గీయులు అక్కడికి కూడా వెళ్లి గొడవ చేశారు. తరువాత సంధ్య స్థానిక రెండో పట్టణ పోలీస్స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారిస్తున్నామని సీఐ రియాజ్ అహమ్మద్ తెలిపారు. -
కుట్ర కనిపింఛన్
టీడీపీ కుట్ర బయటపడింది.. అవ్వాతాతలు, దివ్యాంగులకు మళ్లీ కష్టాలు మొదలు కానున్నాయి.. ఇంటి వద్దనే పింఛన్ అందుకోవాల్సిన వారు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాల్సిందే! వలంటీర్ వ్యవస్థతో వైఎస్సార్సీపీకి మంచి పేరొస్తుందని తెలుగుదేశం పార్టీ కుయుక్తులకు పాల్పడింది.. తన అనుబంధ సంస్థ ద్వారా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. తాము అధికారంలోకి వచ్చినా వలంటీర్లు ఉంటారని టీడీపీ అధినేత చంద్రబాబు ఒక వైపు చెబుతూనే మరో వైపు కుతంత్రాలకు పాల్పడటంపై పింఛన్దారులు మండిపడుతున్నారు. కర్నూలు(అగ్రికల్చర్)/నంద్యాల(న్యూటౌన్): ఇంటి వద్దనే నిశ్చింతగా పింఛన్ తీసుకుంటున్న అవ్వాతాతలు, దివ్యాంగులు టీడీపీ కుట్రలతో నేడు గడపదాటాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 16 రకాల పింఛన్లు ఇస్తోంది. ఉమ్మడి జిల్లాలో 4.73 లక్షల మంది వివిధ కేటగిరీ పింఛన్లు తీసుకుంటున్నారు. వీరిలో 70 శాతం మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, వివిధ వ్యాధులతో బాధపడేవారు ఉన్నారు. వీరిలో 10 శాతం మంది మంచానికే పరిమితం అయ్యారు. డయాలసిస్, కిడ్నీ రోగులు... ఇలా వేలాది మంది అడుగుతీసి అడుగు వేయలేరు. ఇటువంటి వారందరూ ఏప్రిల్ నుంచి జూన్ వరకు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి పింఛన్లు అందుకోవాల్సిందే. సచివాలయాలకు వచ్చి పింఛన్లు పొందాలంటే వీరందరూ నరకం చూడాల్సిందే! వేలాది మందిని సచివాలయాలకు ఎత్తుకొని రావాల్సి ఉంది. వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేయొద్దంటూ తెలుగుదేశం పార్టీ తన అనుబంధ సంస్థ అయిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ద్వారా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో ఈ దుస్థితి నెలకొంది. టీడీపీ హయాంలో పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా ఉండేది. లబ్ధిదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ కష్టాలను తొలగించింది. వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అధికార పార్టీకి మంచి పేరొస్తాందనే టీడీపీ కుట్రపన్ని వలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరం చేశారు. మళ్లీ కష్టాలు మొదలు.. టీడీపీ హయాంలో పింఛన్ పొందడంలో అవ్వాతాతలు, దివ్యాంగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పాఠశాల ప్రాంగణాలు, రచ్చబండల దగ్గర పడిగాపులు కాసేవారు. డబ్బులు రాలేదు.. రేపు..మాపు అంటూ తిప్పుకునేవారు. ఎంత మంది అర్హులు ఉన్నా మండలానికి ఇన్నే పింఛన్లు అని కోటా పెట్టేవారు. ఒక్కో గ్రామానికి 10–15 వరకు పింఛన్లు మాత్రమే వచ్చేవి. జన్మభూమి కమిటీలను ప్రసన్నం చేసుకుంటే లబ్ధిదారులుగా ఎంపిక చేసేవారు. ఇందుకోసం నాలుగైదు నెలల పింఛన్ మొత్తాన్ని లంచంగా ముట్టచెప్పాల్సి వచ్చేది. ప్రతి నెలా ఇచ్చే పింఛన్లోనూ రూ.100, 200 కోత పెట్టేవారు. మరణించిన వారిస్థానంలోనే కొత్త పింఛన్ వచ్చేది. వైఎస్సార్సీపీ పాలనలో పింఛన్దారుల కష్టాలకు ఫుల్స్టాప్ పడింది. అర్హతే ప్రామాణికంగా తీసుకొని రాజకీయాలకు అతీతంగా పింఛన్లు మంజూరు చేస్తున్నారు. ప్రతి 50 ఇళ్లకు గ్రామ, వర్డు వలంటీర్లను నియమించి... వారి ద్వారా నేరుగా ఇంటికే పింఛన్ పంపే ఏర్పాటు చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీ పండుగ ఉన్నా.. సెలవైనా... వానొచ్చినా.. ఇంటికే వెళ్లి పింఛన్ సొమ్ము అందజేస్తున్నారు. దీంతో అవ్వాతాతలు, దివ్యాంగుల కష్టాలు తొలగిపోయాయి. ఆసుపత్రిల్లో చికిత్స పొందుతుంటే అక్కడికే వెళ్లి పింఛన్ అందచేస్తున్నారు. వలంటీర్లు కేవలం సేవాభావంతో నిస్వార్థంగా పనిచేస్తున్నారు. చంద్రబాబు, కుట్రలు, కుతంత్రాలతో అవ్వాతాతలకు మళ్లీ కష్టాలు ప్రారంభం కానున్నాయి. ఇంటిదగ్గరే పించన్ పంపిణీ చేస్తున్న వలంటీరు(పైల్) ఇందుకే కక్ష.. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు ప్రజల రక్త మాంసాలను పీల్చివేశాయి. జన్మభూమి కమిటీలకు చంద్రబాబు అపారమైన అధికారాలు ఇచ్చారు. దీనిని అవకాశంగా తీసుకొని జన్మభూమి కమిటీలోని సభ్యులు చెలరేగిపోయాయి. అవినీతి అక్రమాలతో లక్షాధికారులయ్యారు. జన్మభూమి కమిటీల మాదిరి లంచాలు పిండకపోయినప్పటికీ వలంటీర్ల పట్ల అపారమైన ద్వేషం పెరగడానికి వారి వల్ల అన్ని వర్గాల ప్రజలకు మంచి జరుగుతుండటం.. తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తు వస్తుండటమే కారణమని తెలుస్తోంది. పింఛన్ల పంపిణీ మార్గదర్శకాలు ఇవీ.. గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్ల పంపిణీకి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. లబ్ధిదారులు ఏప్రిల్ నెల గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చి వేలిముద్ర వేసి పింఛన్లు పొందాల్సి ఉంది. ఇందుకు సచివాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు సెర్ప్ ఆదివారం సాయంత్రం మార్గదర్శకాలు జారీ చేసింది. వార్డు, గ్రామ సచివాలయాల్లో పింఛన్ల పంపిణీని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షిస్తారు. ఏప్రిల్ 1వ తేదీ బ్యాంకులకు సెలవు. 2వ తేదీన పింఛన్ల సంబంధించిన మొత్తం ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేస్తుంది. అదే రోజున గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, అర్బన్ ప్రాంతాల్లో వార్డు ఆడ్మిన్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు బ్యాంకుల నుంచి నగదు డ్రా చేస్తారు. మూడో నుంచి 5 రోజుల పాటు సచివాలయాల్లో పింఛన్లు పంపిణీ చేస్తారు. పింఛన్లు పంపిణీ చేసే సచివాలయ ఉద్యోగులు, ఆర్బీకే ఇన్చార్జీలందరి దగ్గర ఎంపీడీవోలు/ మున్సిపల్ కమిషనర్లు జారీ చేసిన ధ్రువపత్రాలు ఉంటాయి. అనుకున్నట్టే చేశారు.. వలంటీర్ వ్యవస్థతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండటంతో టీడీపీకి తీవ్ర ఇబ్బందిగా మారింది. ఏదో విధంగా వలంటీర్ వ్యవస్థను దెబ్బతీయడానికి కొన్నేళ్లుగా ఆ పార్టీ నేతలు చేయని ప్రయత్నం లేదు. అనేక రకాల అభాండాలు వేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వలంటీర్లపై కక్షసాధింపు చర్యకు పాల్పడ్డారు. పింఛన్ల పంపిణీతో పాటు సంక్షేమ పథకాల అమలులో ఎన్నికల కోడ్ ముగిసే వరకు వలంటీర్లను పక్కన పేట్టే విధంగా చేయగలిగారు. ప్రజలతో మమేకమైన వలంటీర్లపై ఇంత దారుణంగా పగపట్టడంపై అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, ఇతర పింఛన్దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటుతో బుద్ధి చెబుతాం టీడీపీ హయాంలో పింఛన్ వచ్చే వరకు ప్రతి రోజూ కన్నీళ్లు వచ్చేవి. ఎప్పుడిస్తారో తెలిసేది కాదు. ప్రతి రోజూ పంచాయతీ కార్యాలయం దగ్గర పడిగాపులు కాయాల్సి వచ్చేది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కష్టాలు తొలగిపోయాయి. వలంటీర్లు ప్రతి నెలా 1వ తేదీనే మా ఇంటికే వచ్చి పింఛన్ ఇస్తున్నారు. ఇప్పుడు మళ్లీ సచివాలయాలకు వెళ్లి పింఛన్ తీసుకునే పరిస్థితులు ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది. టీడీపీ నేతల కుట్రలు, కుతంత్రాలకు ఓటుతో బుద్ధి చెబుతాం. – రమావత్ నాగమ్మ, మీటేతాండ, తుగ్గలి మండలం మళ్లీ ఎదురు చూపులే టీడీపీ హయాంలో పింఛన్ పొందాలంటే నానా యాతన పడేవాళ్లం. అలాంటి పరిస్థితి లేకుండా వలంటీర్లు ప్రతి నెలా ఠంఛన్గా 1వ తేదీనే ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చేవారు. ఆ డబ్బులు ఆసుపత్రికి, సొంత ఖర్చులకు ఎంతగానో ఉపయోగపడేవి. టీడీపీ కుట్రలు పన్ని వలంటీర్లను పింఛన్ల పంపిణీ విధుల నుంచి తప్పించింది. మళ్లీ పింఛన్ కోసం ఎదురు చూడాల్సి వస్తుందేమో! – మాబున్నిసా, గడివేముల ఇబ్బందులు తప్పవు వలంటీర్లు ఉంటే ఇంటికి వచ్చి మా అమ్మాయి తని్వకకు పింఛన్ సొమ్ము ఇచ్చి వెళ్లేవారు. వికలాంగురాలైన చిన్నారిని తీసుకొని సచివాలయానికి వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏ సమయానికి సి బ్బంది పింఛన్ ఇస్తారో తెలియని పరిస్థితి. వలంటీర్ వ్యవస్థ లేకపోతే దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు పడాల్సిందే. – చిన్నారి తని్వకతో తల్లి, నూనెపల్లె టీడీపీ హయాంలో అన్నీ కష్టాలే మోకాళ్ల నొప్పులతో ఎక్కడికి తిరగలేని పరిస్థితిలో ఉన్నా. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుణ్యాన ఇంటి వద్దనే పింఛన్ తీసుకుంటున్నా. ఎన్నికల సమయంలో వలంటీర్లను విధుల నుంచి పక్కనబెట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడికో వెళ్లి పింఛన్ తీసుకోవాలంటే ఎన్ని ఇబ్బందులో టీడీపీ హయాంలో చూశాను. మళ్లీ వలంటీర్ల ద్వారానే పింఛన్ సొమ్ము ఇంటి వద్దకు వచ్చి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. – రత్నమ్మ, మిట్నాల గ్రామం -
వలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు.. వైఎస్సార్సీపీ నేతల స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో వలంటీర్లపై శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ అభ్యర్ధి బొజ్జల సుధీర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నేతలు, వలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వలంటీర్లను టెర్రరిస్ట్లంటూ బొజ్జల సుధీర్ వ్యాఖ్యలను మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఖండించారు. వలంటీర్ల సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారని ప్రస్తావించారు. ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేస్తున్నరనే వలంటీర్లపై టీడీపీ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వలంటీర్లు తమ విధులు నిర్వహించారని పేర్కొన్నారు. వారి ఆత్మవిశ్వాసం దెబ్బ తినే విధంగా టీడీపీ నేతలుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ వలంటీర్లను కించపరిచే విధంగా మాట్లాడారని అన్నారు. టీడీపీ నేతలు వలంటీర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి: వలంటరీ వ్యవస్థపై బొజ్జల సుధీర్ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బొజ్జల సుధీర్ తండ్రి మంత్రిగా పనిచేసినప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్లో కోట్ల రూపాయలు సంపాదించారని విమర్శించారు. బొజ్జల సుధీర్కు బుద్ది లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాన్ని ప్రజలకు అందించే వ్యవస్థ వలంటరీ వ్యవస్థ.. ఒక్క రూపాయి అవినీతి లేకుండా పనిచేస్తుందన్నారు. ‘2 లక్షల 50 వేల మంది వలంటీర్లు అంటే ఎవరు, వాళ్లంతా మన ఇంట్లో పిల్లలు, ఇరుగు పొరుగు పిల్లలు కాదా? కేరళ రాష్ట్రంలో వలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు అధ్యయనం చేస్తున్నారు. ఆనాడు పవన్ కల్యాణ్ వలంటరీ వ్యవస్థను విమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అని పిచ్చి కూతలు కూశాడు. వలంటీర్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్, పచ్చ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి. వలంటరీ వ్యవస్థతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తప్పుడు తెలుగుదేశం నాయకులు రాజకీయాలు చేస్తున్నారు.’ అని మండిపడ్డారు. వలంటీర్లపై విషం అవ్వతాతాలు గడప దాటకుండా ఒకటో తారీఖున టంచన్గా పింఛన్ ఇస్తున్న వాలంటరీలపై కాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుదీర్ రెడ్డి విషం కక్కుతున్నాడని మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే ఆదర్శంగా నిలిచినా వాలంటరీ వ్యవస్థను స్లీపర్ సెల్స్తో పోల్చిన బొజ్జల సుదీర్ రెడ్డి అసలు మనిషేనా అని ప్రశ్నించారు. వలంటరీలను తమ సొంత బిడ్డల్లా ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. అలాంటి వాళ్ళను టెర్రరిస్టులు ఉగ్రవాదులు జిహాదీలతో పోల్చిన బొజ్జలపై ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు , పవన్లు వలంటరీలపై విషం కక్కి అబాసు పాలయ్యారపి. వంలంటరీ వ్యవస్థపై పడి ఏడుస్తున్న వీరందరికి త్వరలో ప్రజలు బుద్ది చెప్తారని అన్నారు కృష్ణా జిల్లా: వలంటీర్లను తీవ్రవాదులుగా పోల్చి మాట్లాడడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట వెంకయ్య. చంద్రబాబు సన్నిహితుడు బొజ్జల సుధీర్ రెడ్డి వలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. గతంలో చంద్రబాబు ఇళ్లదగ్గర మగవాళ్ళు లేని సమయంలో వలంటీర్లు తలుపులు కొడతారని అన్నడం విన్నామని. దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ ఒంటరి మహిళలను వలంటీర్లు ట్రాప్ చేస్తున్నారని అన్నారని గుర్తు చేశారు. టీడీపీ నాయకులు అధికార దాహంతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో 2.50 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం జగన్ది. 2006 నుంచి గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా సొంత ఖర్చులతో మోటార్లు ఏర్పాటు చేసి పట్టిసీమ నీరు రైతులకు అందిస్తున్నారు. అదే క్రమంలో ప్రస్తుత రైతుల అవసరాల కోసం మోటార్లు ఏర్పాటు చేసి నీరు అందిస్తున్నారు. వంశీ రైతులకు మేలు చేస్తుంటే టీడీపీ నాయకులకు కళ్ళు కుడుతున్నాయి. కావాలని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకులు రైతుల పొట్టలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ నాయకుల కుయుక్తులు నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో టీడీపీని ప్రజలు తరిమి కొట్టడం ఖాయం.’ అని పేర్కొన్నారు. కాగా వలంటీర్లు శ్రీకాళహస్తి నియోజకవర్గం టిడిపి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వలంటీర్లు టెర్రరిస్టులతో సమానమని, స్లీపర్ సేల్స్లాగా మారి శ్రీకాళహస్తిని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక వలంటీర్ల అంతు చూస్తామని అన్నారు. -
శభాష్...రేణుక!
పుట్లూరు: రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్ను గమనించక చాలా మంది వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రెండు రోజుల క్రితం యల్లనూరుకు వెళ్తున్న ఓ మహిళ బైక్పై నుంచి జారి పడి మృతి చెందింది. తాడిపత్రి–యల్లనూరు ప్రధాన రోడ్డుపై శనగలగూడూరు వద్ద స్పీడ్ బ్రేకర్ వల్ల వాహనదారులు పడుతున్న ఇబ్బందులను ఆ గ్రామ వలంటీర్ రేణుక గమనించింది. ప్రమాదాలను నివారించడానికి తనవంతు ప్రయత్నం చేసింది. తెల్ల పెయింట్తో స్లో అని ఆంగ్లంలో అక్షరాలు రాయడంతో పాటు స్పీడ్ బ్రేకర్ కనిపించేలా సూచిక ఏర్పాటు చేసింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు శభాష్ రేణుక అని అభినందిస్తున్నారు. -
మీ సేవకు నా సెల్యూట్ సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
-
మీరే భావి లీడర్లు .. మీరే నా యువ సైన్యం.. : సీఎం జగన్
మన జెండా, అజెండాపై మమకారంతో, మన మేనిఫెస్టోపై నమ్మకంతో, నవరత్నాల పథకాలు – పాలనా సంస్కరణలను ప్రజలకు చేరువచేసే బాధ్యత తీసుకున్న యువసైన్యమే మన వలంటీర్ల వ్యవస్థ. ప్రతి నిరుపేద బతుకులు మారాలని, భావి తరం పేదరికం సంకెళ్లు తెంచుకోవాలన్న తపనతో తెచ్చిన విప్లవాత్మక పథకాలను ఒక్క రూపాయి కూడా లంచాలు, వివక్ష లేకుండా అందించాలన్న మీ జగనన్న అజెండాను త్రికరణశుద్ధిగా అమలు చేస్తున్న భావి లీడర్లు వలంటీర్లు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. లీడర్ అనేవాడు ఎలా ఉండాలంటే తన నోటి నుంచి ఒక మాట వస్తే కష్టమైనా, నష్టమైనా ఆ మనిషి మాటమీద నిలబడతాడనే నమ్మకం ప్రతి పేదవాడిలోనూ కలగాలి. ఆ విశ్వసనీయతను ఏ రోజైతే కల్పించగలుగుతాడో అప్పుడు అతడిని నమ్ముకున్న ప్రతి కార్యకర్త, అభిమాని కాలర్ ఎగరేసి అదిగో మా లీడర్.. ఆయనే మా స్ఫూర్తి అని చెప్పే పరిస్థితి వస్తుంది. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, గుంటూరు: మీరు చేస్తున్నది ఉద్యోగాలు కాదని, రాబోయే రోజుల్లో మీరు లీడర్లు కాబోతున్నారని తాను మొట్ట మొదటిరోజే చెప్పానని వలంటీర్లనుద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మీ దగ్గర నుంచి మొదలుపెడితే తన వరకూ 58 నెలలుగా అలసిపోకుండా పేదలకు సేవ చేశామన్నారు. ఇంకా రెండు నెలలు సేవ చేసేందుకు, పేదవాడి భవిష్యత్ మార్చేందుకు యుద్ధానికి సిద్ధమా? అని ప్రశ్నించారు. 2.60 లక్షల మంది నా సైన్యం.. నా వలంటీర్ల సైన్యం అని చెప్పడానికి గర్వపడుతున్నానన్నారు. ఈ సైన్యం గుండెలు టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల మాదిరిగా దోపిడీ గుండెలు కావని, ఇవి సేవా హృదయాలని వ్యాఖ్యానించారు. ‘వలంటీర్లకు వందనం’లో భాగంగా వరుసగా నాలుగో ఏడాదీ పురస్కారాలు అందజేసే కార్యక్రమాన్ని గురువారం గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి జగన్ ప్రతిభ కనబరిచిన వలంటీర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం జగన్ ఏమన్నారంటే.. నాడు దోపిడీ వ్యవస్థ.. నేడు సేవా సైన్యం చంద్రబాబు హయాంలో ఏర్పాటైన జన్మభూమి కమిటీలు ప్రజలు టీడీపీని అధికారం నుంచి దించేందుకు కారణమైతే మీ అన్న తెచ్చిన సేవా సైన్యం సచివాలయాల వ్యవస్థతో అనుసంధానమై పేదలకు ప్రతి అవసరంలోనూ వారధిగా మారింది. 2019 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ మీ బిడ్డ ప్రభుత్వం ఘన విజయానికి వలంటీర్లు కారకులయ్యాయని గర్వంగా చెబుతున్నా. పరిపాలనను మార్చిన ఈ ప్రజా వ్యవస్థలే 2024 ఎన్నికల్లోనూ మన ప్రభుత్వ జైత్రయాత్రకు దారులు వేస్తాయి. మన వ్యవస్థలు , మన ప్రభుత్వం, మన మేనిఫెస్టో, మన నవరత్నాలు, మన అజెండా ప్రకారం సేవ చేయడానికి పుట్టాయి. ప్రతి గ్రామంలో బడి, ఆసుపత్రి పరిస్థితులను సమూలంగా మార్చాయి. పౌర సేవలను ఇంటివద్దే అందిస్తున్నాం. కళ్లకు కట్టినట్టుగా మీరు గమనిస్తున్న ఈ తేడాను ప్రతి రైతన్నకు, ప్రతి అక్కచెల్లెమ్మకు తెలియచేయాలి. 2019 కంటే ముందు ఏ సేవ కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వారాలు, నెలల తరబడి కాళ్లు అరిగేలా తిరగాల్సిన దుస్థితి నెలకొంది. జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తే కానీ అడుగు ముందుకు పడని పరిస్థితి. అవ్వాతాతలు, కదలలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు, అక్కచెల్లెమ్మలు పెన్షన్ అందుకోవాలన్నా, రైతులు ఎరువులు కావాలన్నా ఎండనకా వాననకా చాంతాడంత క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చేది. చివరికి మరుగుదొడ్లు కావాలన్నా లంచం ఇవ్వాల్సిన దుస్థితి. జన్మభూమి కమిటీల నుంచి చంద్రబాబు నాయుడు దాకా లంచాల పాలనే సాగింది. ఇప్పుడు మీ అన్న ప్రభుత్వంలో నెలకు రూ.3 వేలు చొప్పున 66 లక్షల మందికి పింఛన్లు ఇస్తుంటే గత ప్రభుత్వ పాలనలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే అది కూడా ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ కేవలం రూ.వెయ్యి ముష్టి వేసినట్లు పెన్షన్ ఇచ్చేవారు. నాడు వివక్ష కారణంగా లక్షల మందికి పెన్షన్ అందలేదు. చంద్రబాబు పాలనలో స్కీంలు లేవు, బటన్లూ లేవు. జన్మభూమి కమిటీలు గంజాయి మొక్కలు చంద్రబాబు తెచ్చిన జన్మభూమి కమిటీలు గంజాయి మొక్కలు లాంటివైతే మన సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ తులసి మొక్కలు లాంటివి. చంద్రబాబు పాలన ఓ విష వృక్షమైతే మన పాలన కల్పవృక్షం లాంటిది. రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే గొప్ప కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ గౌరవ వేతనంతో మన ప్రభుత్వ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన వలంటీర్ల సేవాభావానికి మీ అన్న సెల్యూట్ చేస్తున్నాడు. డీబీటీ, నాన్ డీబీటీతో రూ.4.31 లక్షల కోట్లు దేశ చరిత్రలో మరే రాష్ట్రంలోనైనా ఇలాంటి లంచాలు లేని, వివక్షలేని వ్యవస్థను ఎక్కడైనా చూశారా? ప్రతి ఇంటికీ వెళ్లి అడగండి. ప్రతి అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, రైతన్నలకు చెప్పండి. లంచాలు, వివక్ష లేకుండా ఇప్పటివరకూ రూ.2.55 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేశాం. వీటికి తోడు ఇళ్ల పట్టాలు, సంపూర్ణ పోషణ, గోరుముద్ద, ట్యాబ్లు, విద్యాకానుక లాంటి నాన్ డీబీటీ పథకాలు కూడా తీసుకుంటే మరో రూ.1.07 లక్షల కోట్లు ఇచ్చాం. ఇంటి స్థలాలకు సంబంధించి వాటి మార్కెట్ విలువ కూడా తీసుకుంటే అది రూ.1.76 లక్షల కోట్లు అవుతుంది. ఇంత సొమ్ము పేదల చేతుల్లోకి నేరుగా వెళ్లింది కాబట్టే కోవిడ్ లాంటి సంక్షోభాలను కూడా సమర్థంగా ఎదుర్కోగలిగాం. కేంద్రం నుంచి రావాల్సిన ఆదాయం తగ్గినా కూడా తట్టుకోగలిగాం. రాష్ట్రవ్యాప్తంగా 84 శాతం ఇళ్లకు మంచి జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 95 శాతం ఇళ్లకు మేలు జరిగింది. అప్పుడూ ఇప్పుడూ అదే రాష్ట్రం, అదే బడ్జెట్. కానీ అప్పటి కన్నా మన ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేటు చాలా తక్కువ. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. ఇవాళ రాష్ట్ర ప్రజల చేతుల్లో ఇన్ని లక్షల కోట్లు కనిపిస్తున్నాయి. గతంలో కనిపించకపోవటానికి కారణం ఏమిటని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. కాపీ కొట్టి కిచిడీ మేనిఫెస్టో.. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల వైపు ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంటే చంద్రబాబు మాత్రం హైదరాబాద్లోని ఇంట్లో కూర్చుని వేరే రాష్ట్రాల ఎన్నికల మేనిఫెస్టోలు కాపీ కొట్టి కిచిడీ రూపంలో తెచ్చారు. ప్రజల కష్టాలను చూసి మన మేనిఫెస్టో పుడితే చంద్రబాబు మేనిఫెస్టో హైదరాబాద్లో పుట్టింది. తానిచ్చి న హామీలన్నీ నిజంగా అమలు చేసే పరిస్థితి, అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అన్న ఆలోచన కూడా చంద్రబాబుకి ఉండదు. ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి అబద్ధాలు ఆడటంలో భావదారిద్య్రం ఎందుకనే ధోరణి ఆయనది. నమ్మినవాడు మునుగుతాడు, నమ్మించినవాడు దోచుకోగలుగుతాడనే తత్వం చంద్రబాబుది. ఎలాగూ ప్రజలు అధికారం ఇవ్వరని పసిగట్టి చంద్రబాబు తన మార్కు గ్యాంబ్లింగ్ మొదలు పెట్టారు. మొన్నటివరకు జగన్లాగా బటన్ నొక్కితే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని విమర్శించి ఇప్పుడు అదే నోటితో ఆరు వాగ్దానాలంటున్నారు. పైగా ఇది శాంపిల్ మాత్రమే, దీనికి మరో ఆరు జమ అవుతాయని చెబుతున్నారు. వాటిని టచ్ కూడా చేయలేరు... మీ బిడ్డ కష్టపడి ఎప్పుడూ జరగని విధంగా సంవత్సరానికి రూ.70 వేల కోట్లు సంక్షేమానికి ఖర్చు చేస్తున్నాడు. ఇందులో కొన్ని కార్యక్రమాలను టచ్ చేయడానికి కూడా ఎవరికీ ధైర్యం సరిపోదు. నెలకు రూ.3 వేల చొప్పున సామాజిక పెన్షన్లు, వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, ప్రతి పేదవాడికీ సబ్సిడీ బియ్యం, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 108, 104 కార్యక్రమాలు, గోరుముద్ద, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో ఇచ్చే విద్యాదీవెన, వసతి దీవెన, సంపూర్ణ పోషణ కింద బాలింతలు, గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారం లాంటి ఎనిమిది పథకాలకు రూ.52,700 కోట్లు అవుతుంది. వీటిని ఎవరైనా రద్దు చేయాలనుకున్నా చెయ్యి కూడా వేయటానికి సాహసించలేని పథకాలు అవి. మరి రూ.52,700 కోట్లు వెచ్చి ంచాల్సిన ఈ తప్పనిసరి పథకాలకు తోడు చంద్రబాబు చెప్పిన ఆరు పథకాలకు రూ.73 వేల కోట్లు కూడా కలిపితే మొత్తంగా రూ.1,26,140 కోట్లు వరకు లెక్క తేలుతోంది. గతంలో ఏమీ చేయకుండా మోసాలకే పరిమితమైన ఆ వ్యక్తి ఏకంగా రూ.1.26 లక్షల కోట్లు ఇస్తానని నమ్మబలుకుతున్నాడంటే అంతా ఒక్కసారి ఆలోచన చేయాలి. బాబు మేనిఫెస్టో.. రంగుల మాయాజాలం 1994, 1999, 2014.. చంద్రబాబు పాలనను ఎప్పుడు తీసుకున్నా అధికారంలోకి రాక ముందు మేనిఫెస్టో రంగురంగులతో ఉంటుంది. 650 పేజీలు.. 650 హామీలంటూ , ఎన్నికలు ముగిశాక చెత్తబుట్టలో వేస్తాడు. వెబ్సైట్లో కూడా మేనిఫెస్టోను మాయం చేస్తారు. ప్రజలు మోసపోకుండా బాబు రంగుల మాయలను ప్రజలకు వివరించాలి. చంద్రబాబు మేనిఫెస్టోను నమ్మడం అంటే బంగారు కడియం ఇస్తానన్న పులిని నమ్మడమేనని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి. వారం పాటు ఉత్సవాలు వలంటీర్లను రాష్ట్రవ్యాప్తంగా అభినందించే కార్యక్రమాన్ని ఇవాళ ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. వారం రోజుల పాటు ప్రతి మండలంలోనూ ఉత్సవాల మాదిరిగా ప్రభుత్వం వీటిని నిర్వహిస్తుంది. వరుసగా నాలుగో ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వలంటీర్లకు ఇప్పటివరకు ఇస్తున్న నగదు బహుమతిని 50 శాతం పెంచాం. మీరంతా గత ప్రభుత్వ హయాంలోని లంచాలు, వివక్షతో కూడిన వ్యవస్థను బద్ధలుగొట్టి త్రికరణశుద్ధితో నిజాయితీ చాటుకున్నందుకు గుర్తింపుగా బహుమతిని పెంచుతున్నాం. సేవావజ్రాలకు రూ.45 వేలు, సేవారత్నాలకు రూ.30 వేలు, సేవా మిత్రలకు రూ.15 వేలు చొప్పున అందచేస్తాం. ఈ ఏడాది కూడా ప్రతి నియోజకవర్గం నుంచి ఐదుగురు చొప్పున 875 మంది వలంటీర్లను సేవావజ్ర అవార్డులతో సత్కరిస్తున్నాం. ప్రతి మండలం, ప్రతి మున్సిపాల్టీ పరిధి నుంచి కనీసం ఐదు మంది, ప్రతి కార్పొరేషన్ పరిధి నుంచి పదిమంది చొప్పున 4,150 మంది వలంటీర్లను సేవారత్న అవార్డులతో గౌరవిస్తున్నాం. ఇలా 2,55,464 మంది వలంటీర్లను అభినందిస్తూ నగదు బహుమతిగా రూ.392 కోట్లను అందచేస్తున్నాం. చొక్కా మడతబెడదాం.. ఇక అబద్ధాలను మట్టి కరిపించేందుకు చొక్కా స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చి ంది. మంచి చేస్తున్న ఈ ప్రభుత్వానికి మీరంతా అండగా ఉండాలి. ప్రతి ఇంటి నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతన్నలకు తీసుకురావాలి. పేదల పక్షాన ఈ ప్రభుత్వం పెత్తందార్ల మీద చేస్తున్న యుద్ధంలో చంద్రబాబుకు ఓటు వేయడం అంటే మీకు అందుతున్న పథకాల రద్దుకు ఆమోదం తెలపడమేనని ప్రజలకు తెలియచేయాలి. 2004లో చంద్రబాబు చేసిన మోసాలను ప్రతి ఇంటికీ గుర్తు చేయాలి. నాడు వ్యవసాయ రుణమాఫీ, డ్వాక్రా రుణాలమాఫీ, రూ.2 వేల నిరుద్యోగ భృతి లాంటి హామీలను ఎగ్గొట్టడం, కోటయ్య కమిటీ అంటూ కోతల కమిటీని నియమించిన వైనాన్ని మరోసారి వివరించాలి. బాబును నమ్మడమంటే... చంద్రబాబును నమ్మడం అంటే ఇంగ్లిషు మీడియం బడుల్ని, సీబీఎస్ఈ నుంచి ఐబీ ప్రయాణాన్ని, నాడు–నేడు, అమ్మ ఒడి, గోరుముద్ద, పిల్లలకిచ్చే ట్యాబులు, ప్రతి క్లాస్ రూమును డిజిటలైజ్ చేస్తూ ఐఎఫ్పీ ప్యానల్స్ పెడుతున్న మన స్కూళ్లను, మన క్లాస్ రూముల్ని వీటన్నింటికీ రద్దు చేసి మన పిల్లల బంగారు భవిష్యత్ను తాకట్టు పెట్టడమేనని ప్రజలకు తెలియచేయాలి. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని ఎన్నికల తర్వాత నిలువునా దగా చేసిన బాబును మళ్లీ నమ్మవచ్చా? అని అడగండి. బాబుకు ఓటేయడం అంటే ఇంటింటికీ వచ్చి సేవలందిస్తున్న వలంటీర్ వ్యవస్థను కాదనుకుని జన్మభూమి కమిటీలను ఆహా్వనించడమేనని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి. చంద్రముఖిని తెచ్చుకోవడమే.. చంద్రబాబు ఓటు వేయడం అంటే ఐదేళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్లీ వారి ఇంట్లోకి తీసుకొని రావడమే అని చెప్పాలి. బాబుకు ఓటు వేస్తే ఈ సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నీ రద్దై జన్మభూమి కమిటీలు, చంద్రముఖిలు వస్తాయి. వలంటీర్ చెల్లెమ్మలంతా కొంగు బిగించి ఈ పేదల వ్యతిరేకుల మీద, పెత్తందార్ల మీద, మోసగాళ్ల మీద, ఎల్లో మీడియా అసత్య ప్రచారాల మీద యుద్ధానికి సిద్ధమేనని ఎలుగెత్తాలి. దడ పుట్టిస్తున్నాం.. వలంటీర్లను చూస్తే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. దత్తపుత్రుడి నోటి నుంచి కించపరిచే వ్యాఖ్యలు వినిపిస్తాయి. మహిళల అదృశ్యానికి వలంటీర్లు కారణమని ఒకడంటాడు. వలంటీర్ల దెబ్బకు ప్రజలు గద్ద కాళ్ల కింద కోడిపిల్లల్లా అల్లాడిపోతున్నారంటాడు. తనకు అధికారం ఇస్తే వలంటీర్ల వ్యవస్థ నడుం విరగ్గొడతానంటాడు. తాము అధికారంలోకి వచ్చి న తర్వాత వారి కథ తేలుస్తాం అంటారు. ఇంత మందికి మనం దడ ఎలా పుట్టిస్తున్నామో తెలుసా? ఈరోజు మన ప్రభుత్వం ప్రతి పేదవాడికీ సంక్షేమాన్ని డెలివర్ చేసింది కాబట్టే వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. విపక్షాల కడుపులు ఎందుకు మండుతున్నాయంటే వారి కడుపులు కాకుండా పేదవాడి కడుపులు నిండుతున్నాయి కాబట్టే. విపక్షాల కడుపు నింపేది అవినీతి ఆకలి మాత్రమే. ఇలాంటి విషవృక్షాలు ఉన్న వ్యవస్థతో మనం యుద్ధం చేస్తున్నాం. 58 నెలలు దాటాం. మీ బిడ్డ ఇంకో 10–15 సంవత్సరాలు ఇదే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే పేదవాడి ఇంట్లో ఒకటో తరగతి చదువుతున్న చిన్న పిల్లాడు అనర్గళంగా ఇంగ్లిషు మాట్లాడతాడు. పేదల తలరాతలు శాశ్వతంగా మారిపోతాయి. రాజధానిలో భూమిలేని నిరుపేదలకు రూ.5 వేలు పింఛన్ ‘‘తాడికొండ, మంగళగిరి రాజధాని ప్రాంతంలో భూమిలేని 17 వేల మంది నిరుపేదలకు జీవనభృతి పింఛన్ రూ.2,500 నుంచి రూ.ఐదు వేలు చేయాలని ఎమ్మెల్యే సుచరిత కోరారు. వచ్చే నెల నుంచే దీన్ని అమలు చేస్తాం. ఫిరంగిపురంలోని కార్మెల్ మాత గుడికి ఘాట్ రోడ్డు కోసం రూ.39 కోట్లు మంజూరు చేస్తున్నాం’’ అని సీఎం జగన్ ప్రకటించారు. సమావేశంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బూడి ముత్యాలనాయుడు, ఆదిమూలపు సురేష్, అంబటి రాంబాబు, విడదల రజని, ఎంపీలు నందిగం సురేష్, ఆయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, పోతుల సునీత, కల్పలతా రెడ్డి, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కిలారు రోశయ్య, కాసు మహేష్ రెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, బొల్లా బ్రహ్మనాయుడు, సమన్వయకర్తలు ఉమ్మారెడ్డి వెంకటరమణ, నూరీ ఫాతిమా, బలసాని కిరణ్కుమార్, గుంటూరు మేయర్ కావటి మనోహర్నాయుడు పాల్గొన్నారు. ఉద్యోగ విప్లవం సీఎం జగన్ దాదాపు 2,55,000 మందికిపైగా వలంటీర్ల ద్వారా అందిస్తున్న సేవలు ప్రపంచానికే ఆదర్శం. చంద్రబాబు ఎన్నో హామీలిచ్చి తుంగలోకి తొక్కారు. వలంటీర్ వ్యవస్థ తెచ్చి నప్పుడు విమర్శించిన వారు ఇప్పుడు పొగుడుతున్నారు. మన దేశం హరిత విప్లవం, శ్వేత విప్లవం చూసింది. సీఎం జగన్ ఉద్యోగ విప్లవం తెచ్చారు. ఒకే నోటిఫికేషన్తో 1,35,000 సచివాలయ ఉద్యోగాలిచ్చారు. – మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే, ప్రత్తిపాడు,తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం.. నాకు కేటాయించిన 64 కుటుంబాలలో అర్హులను గుర్తించి పథకాలు అందిస్తున్నప్పుడు వారి చిరునవ్వు ఎంతో సంతోషం కలిగిస్తుంది. ప్రతి నెలా పింఛన్ ఇచ్చేటప్పుడు అవ్వాతాతలు మా పెద్దకొడుకుకు దీవెనలు ఉంటాయంటూ మా చేతులను తాకినప్పుడు ఆ అనుభూతిని మరిచిపోలేం. ఆసుపత్రిలో ఉన్న ఓ తాతకు ఒకటో తారీఖు రాత్రి 12 గంటలకు పింఛన్ ఇచ్చా. దురదృష్టవశాత్తూ తరువాత కొద్దిసేపటికే ఆయన చనిపోయారు. ఆయన భార్య నన్ను హత్తుకుంటే ఇది కదా సేవ అని అనిపించింది. తల్లి గర్భంలోని శిశువు నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించే సీఎంను ఎవరు వదులుకుంటారు? మేం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని వలంటీర్ల తరపున హామీ ఇస్తున్నా. ప్రజలు మీ కోసం సిద్ధంగా ఉన్నారన్నా. మళ్లీ మీ పాలన కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. – దాసరి జ్యోత్సా్న దేవి, వలంటీర్, గొల్లపాలెం, ఫిరంగిపురం మీ చిరునవ్వుతో ఆత్మస్థైర్యం నా క్లస్టర్ లో 62 కుటుంబాలు ఉన్నాయి. అన్ని కుటుంబాలకు మీ పథకాలు అందాయి. మీ ఆశయాలను నిలబెట్టేలా పనిచేశాం. గతంలో సంక్షేమ పథకాలు అందని ద్రాక్షలా ఉండేవి. ఇప్పుడు ప్రతి గడపనూ పలుకరిస్తున్నాయి. కూలి పనులకు వెళ్లిన 22 ఏళ్ల యువకుడు నాలుగో అంతస్తు నుంచి కిందపడి చావు అంచులవరకూ వెళితే ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల ఉచిత వైద్యం సంజీవనిలా పని చేసింది. ఆ కుటుంబానికి ఆరోగ్య ఆసరా నెలకు రూ.5,000 చొప్పున రెండు నెలలకు రూ. 10 వేలు ఇచ్చాం. వలంటీర్ వ్యవస్థను మొదట్లో చాలా మంది కించపరిచారు. మీరు అండగా నిలిచి ధైర్యాన్నిచ్చారు. మీ చిరునవ్వు మాకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందన్నా. మీరు నా వలంటీర్లు అని ఆప్యాయంగా పలుకరిస్తుంటే రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తున్నాం. మా సేవాగుణాన్ని గుర్తించి మాకు ఇచ్చే అవార్డు మొత్తాన్ని పెంచడం చాలా సంతోషంగా ఉందన్నా. –షేక్ జుబేర్, వలంటీర్, బేతపూడి, ఫిరంగిపురం -
యువకుడి ప్రాణాలను కాపాడిన వలంటీర్
బల్లికురవ: ఆత్మహత్యాయ్నతం చేసిన ఓ యువకుడి ప్రాణాలను వలంటీర్ కాపాడాడు. ప్రాథమిక చికిత్స చేసి సకాలంలో ఆస్పత్రికి తరలించాడు. ఈ ఘటన బాపట్ల జిల్లా బల్లికురవ మండలం రామాంజనేయపురంలో శనివారం జరిగింది. కుంచాల సుభాషిణి, కనకారావు దంపతుల కుమారుడు గోపీచంద్ (17) ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాడు. కనకారావు ఐదేళ్లుగా గ్రామంలో లేడు. సుభాషిణి తన తండ్రి వెంకటేశ్వర్లు వద్ద ఉంటూ తనకున్న పొలంతోపాటు కుమారుని సాయంతో గొర్రెలను మేపుతోంది. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు అనారోగ్యం బారిన పడ్డాడు. గోపీచంద్ గొర్రెల కాపలాకు వెళ్లకుండా జులాయిగా తిరుగుతుండడంతో అతడిని సుభాషిణి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన గోపీచంద్ ఇంట్లోనే పురుగుమందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న కుమారుడిని గమనించిన తల్లి వెంటనే ఇరుగుపొరుగు వారిని పిలిచింది. అక్కడే ఉన్న సీ వన్ క్లస్టర్ వలంటీర్ బత్తుల రమేశ్బాబు..గోపీచంద్ పురుగుమందు తాగినట్లు గుర్తించాడు. బీఎస్సీ నర్సింగ్ చదివిన వలంటీర్.. గోపీచంద్కు ప్రాథమిక చికిత్స చేసి తాగిన పురుగు మందును కక్కించాడు. మెరుగైన చికిత్స కోసం 35 కి.మీ దూరంలో ఉన్న నరసరావుపేట వైద్యశాలకు తీసుకెళ్లేందుకు అంబులెన్స్ రావడం ఆలస్యమవుతుందని భావించి మరొకరి సహాయంతో బైక్పైనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సకాలంలో వైద్యం అందడంతో గోపీచంద్ ప్రాణాపాయస్థితి నుంచి బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. యువకుడి ప్రాణాలను కాపాడిన వలంటీర్ను గ్రామ సచివాలయ కార్యదర్శి షేక్.బాజీ, ఎంపీడీవో హనుమారెడ్డి, ఈవోఆర్డీ దాసరి సుమతి అభినందించారు. -
ఆత్మీయ సేవకులపై రాకాసి రాతలు
-
మాధవీ..మర్యాదగా మసలుకో!
సాక్షి ప్రతినిధి, కడప: శాంతిభద్రతలకు నిలయంగా, మత సామరస్యానికి ప్రతీకగా.. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న జిల్లా కేంద్రమైన కడపలో దౌర్జన్యకర ఘటనలు జరుగుతున్నాయి. ఏదో ఒకచోట టీడీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. రెండు నెలల తర్వాత అధికారం మాదే, మేమేంటో చూపిస్తామంటూ అధికారులను సైతం బ్లాక్మెయిల్ చేస్తున్నారు.ఒక్కమాటలో చెప్పాలంటే టీడీపీ శ్రేణులు గూండారాజ్ను మరిపిస్తున్నారు. ఇదివరకు ఎన్నడు లేనివిధంగా టీడీపీ ఇన్చార్జిగా ఆర్ మాధవీరెడ్డి నియామకమయ్యాక ప్రత్యక్ష ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కార్పొరేటర్ షబానా కుమారుడు పీరుల్లా(26)పై హత్యాయత్నానికి పాల్పడ్డారు. కడప నగరం మోచంపేట 39వ డివిజన్ టీడీపీ ఇన్చార్జి అరీఫ్ మరికొంతమంది కలిసి పీరుల్లాపై గురువారం హత్యాయత్నానికి పాల్పడ్డారు. మొన్న మృత్యుంజయకుంట సమీపంలో మాధవీరెడ్డి ‘బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ’కార్యక్రమంలో భాగంగా ప్రచారానికి వెళ్లింది. ఇంటింటా టీడీపీ స్టిక్కర్లు గృహస్తుల అనుమతి లేకుండా అతికించారు. గమనించిన వలంటీర్ ఆంజనేయులు తన ఇంటికి టీడీపీ స్టిక్కర్ అతికిస్తుంటే అభ్యంతరం చెప్పారు. నా అనుమతి లేకుండా ఇలా చేయొద్దన్నందుకు టీడీపీ నేతలు దేరంగుల శివ, శివశంకర్ వాదనకు దిగారు. వలంటీర్పై దాడి చేశారు. అంతటితో ఆగకుండా మాధవీరెడ్డి తన ప్రైవేటు సైన్యంతో అక్కడికి వెళ్లి రచ్చ చేశారు. ఈవ్యవహారం చిన్నచౌక్ పోలీసుస్టేషన్కు చేరింది. పోలీసుస్టేషన్లో సైతం పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి రెండు నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది, తర్వాత నేనేంటో చూపిస్తానంటూ బెదిరింపులకు దిగారు. కలెక్టర్ విజయ్రామరాజు బుధవారం ఓటర్ల తొలగింపులు, చేర్పులు వ్యవహారంపై రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న శ్రీనివాసులరెడ్డి అదే పదజాలన్నీ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ అయిన విజయరామరాజు ఎదుట సైతం ఉపయోగించడం విశేషం. క్రమం తప్పకుండా దౌర్జన్యాలు.... ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్లలో పర్యటిస్తున్న మాధవీరెడ్డి ఇటీవల దౌర్జన్య కర ఘటనలకు పాల్పడుతున్నారు. మొన్న టీడీపీ బృందం ప్రచారం చేసుకుంటూ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నేత వినోద్కుమార్ ఇంటికి వెళ్లారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే అభ్యంతరం చెప్పారు. వెంటనే వినోద్కుమార్ను టార్గెట్ చేసి, స్వయంగా మాధవీరెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. శ్రీనివాసులరెడ్డి దంపతులు డిప్యూటీ సీఎం అంజద్బాషాను సైతం ఏకవచనంతో సంబోధించడం పరిపాటిగా పెట్టుకున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. సోషల్ మీడియా కేంద్రంగా ఏకవచనంతో సంభోదిస్తూ కావాలనే సామాజికంగా ఎక్స్ఫోజ్ చేస్తున్నారని పలువురు భావిస్తున్నారు. మాధవీ..మర్యాదగా మసలుకో! కడప రూరల్ /కడప అర్బన్: ప్రశాంతంగా ఉన్న కడపకు వచ్చి విద్వేషాలను నింపుతున్న కడప నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి మాధవిరెడ్డి మర్యాదగా మసలుకుని ప్రవర్తించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కడప నగర మహిళా నేతలు హితవు పలికారు. గురువారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో విలేకరులతో పార్టీ కడప సోషల్మీడియా కన్వీనర్ సునీతరెడ్డి మాట్లాడుతూ మాధవిరెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్నారు. దీంతో ఆమె మతిస్థిమితం లేని వ్యక్తిలా ప్రవర్తించడమే కాకుండా డిప్యూటీ సీఎం అంజద్బాషతోపాటు వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బుధవారం రాత్రి 10–12 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఫోన్ చేసి తనను బెదిరించడమే కాకుండా ఇష్టానుసారంగా దూషించారన్నారు. కడప టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాధవిరెడ్డి నియమితులైనప్పటి నుంచి ఆ పార్టీ కార్యకర్తల ఆగడాలు, బెదిరింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. ఈ విషయమై జిల్లా ఎస్పీకి, కడప డీఎస్పీకి ఫిర్యాదు చేశామని సోషల్ మీడీయా కన్వీనర్లు సునీతారెడ్డి, నిశాంత్లు తెలిపారు. పార్టీ మహిళా విభాగం కడప నగర అధ్యక్షురాలు వెంకటసుబ్బమ్మ మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న కడపకు మాధవిరెడ్డి శూర్పనఖలా వచ్చారని అన్నారు. పార్టీ నాయకులు పద్మావతి, మరియలు, సుశీల, తులశమ్మ, నారాయణ, నిర్మల పాల్గొన్నారు. కడపను కలుషితం చేస్తే సహించం టీడీపీ ఇన్చార్జి మాధవీరెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులరెడ్డి కడపలో శాంతిభద్రతలకు భంగం కల్గిస్తున్నారు. వైఎస్సార్సీపీ యువజన నేత పీరుల్లాపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజామెప్పుతో నాయకుడిగా ఎదగాలని సూచిస్తున్నారు. టీడీపీ నేతలు రౌడీయిజంతో రాజకీయం చేయాలని చూస్తున్నారు.శాంతియుత వాతావరణంలో ఉన్న కడపను కలుషితం చేస్తే సహించం. –అంజద్బాషా, డిప్యూటీ సీఎం కవ్వింపు చర్యలు మానుకోండి టీడీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.వీటిని మానుకోవాలి. అకారణంగా వైఎస్సార్సీపీ శ్రేణులను టార్గెట్ చేస్తున్నారు. లక్కిరెడ్డిపల్లె, చక్రాయపేట, రామాపురం ప్రాంతాలకు చెందిన ప్రైవేటు సైన్యంతో శ్రీనివాసులరెడ్డి, మాధవీరెడి జిల్లా కేంద్రంలో దౌర్జన్యకర ఘటనలకు పాల్పడుతున్నారు. ఇలాంటివి పునరావృతమెతే టీడీపీ నేతలు తగిన మూల్యం చె ల్లించుకోవాల్సి వస్తోంది. – సురేష్బాబు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
వలంటీర్ మానవత్వం..
రొంపిచర్ల: ప్రతి లబ్ది దారుని ఇంటికి సంక్షేమ పథకాలు అందాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాన్ని నిండు గర్భిణితో ఉన్న మహిళా వలంటీరు నెరవేర్చింది. నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల క్లస్టర్లో మేకతోటి జయంతి వలంటీర్గా పనిచేస్తుంది. రెండేళ్ల కిందట మగ బిడ్డకు జన్మనిచ్చిన జయంతి.. మరోసారి గర్భం దాల్చి నవమాసాలతో మరో బిడ్డకు జన్మనిచ్చేందుకు నేడో రేపో అనే దశలో ఉంది. తన పరిధిలో నివాసం ఉండే మానసిక వికలాంగుడు సోర ప్రసన్న గత రెండు నెలలుగా తెనాలి సమీపంలోని ఎరుకలపూడిలోని ఆయుర్వేద వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. గత నెలలో అతను ఫించన్ తీసుకోలేదు. ఈ నెల కూడా తీసుకోకుంటే, తనకు సీజేరియన్ ద్వారా ప్రసవం జరిగితే వచ్చే నెల కూడా అతనికి అందజేయగలనో లేదోననే సంచయం ఆమెను వెంటాడింది. వరుసగా మూడు నెలలపాటు పింఛన్ తీసుకోకుంటే లబ్ధిదారునికి పింఛన్ ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది. తొమ్మిదో నెల గర్భిణి అయిన జయంతి.. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఒకటో తేదీనే వెంటనే తన కుటుంబ సభ్యులను ఒప్పించి భర్త సాగర్ సాయంతో బైక్పై రొంపిచర్ల నుంచి ఎరుకలపాలెం వెళ్లింది. అక్కడ జయంతిని చూడగానే.. అక్కా.. అక్కా అంటూ ప్రసన్న వడివడిగా పైకి లేచాడు. వేలిముద్ర వేసి రూ.3,000 తీసుకుని ఆనందంతో మా వలంటీర్ అక్క చాలా మంచిది.. అంటూ లోపలికి వెళ్లాడు. అప్పటి వరకు 102 కిలోమీటర్ల దూరం బైక్పై వస్తుంటే.. పొత్తి కడుపులో అప్పుడప్పుడూ పుట్టిన నొప్పి సోరన్న చిరునవ్వును చూడగానే మాయమైంది. అదే వాహనంపై తిరిగి 102 కిలోమీటర్ల ప్రయాణించి వచ్చింది. మరుసటి రోజు(ఫిబ్రవరి 2న ) గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరి సీజేరియన్ ఆపరేషన్ ద్వారా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. -
అనకాపల్లి: పెన్షన్ పంపిణీకి వెళున్న వాలంటీర్ దారుణ హత్య
సాక్షి, అనకాపల్లి జిల్లా: మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెంలో దారుణం జరిగింది. పెన్షన్ పంపిణీకి వెళున్న వాలంటీర్ను దారుణంగా హత్య చేశారు. గ్రామ సమీపంలో కాలువ వద్ద వాలంటీర్ నడింపల్లి హరిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. -
AP: నేటి నుంచి కుల గణన
సాక్షి, అమరావతి: నేటి నుంచి ఏపీలో కుల గణన కార్యక్రమం ప్రారంభమైంది. సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లు శుక్రవారం నుంచి ఉమ్మడిగా వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి పది రోజులు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంబంధించిన వివరాలను కులాల వారీగా ఈనెల 28వతేదీ వరకు పది రోజుల పాటు సేకరించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ గతంలో వలంటీర్ల ద్వారా సేకరించిన డేటా ప్రకారం రాష్ట్రంలో గ్రామాల్లో 1,23,40,422 కుటుంబాలకు చెందిన 3,56,62,251 మంది నివాసం ఉంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో 44,44,887 కుటుంబాలలో 1,33,16,091 మంది నివసిస్తున్నారు. మొత్తం 1.67 కోట్ల కుటుంబాలకు సంబంధించి 4.89 కోట్ల మంది ఉన్నారు. సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లు శుక్రవారం నుంచి ఉమ్మడిగా వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి పది రోజులు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంబంధించిన వివరాలను కులాల వారీగా ఈనెల 28వతేదీ వరకు పది రోజుల పాటు సేకరించనున్నారు. జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు.. ఇంటింటి కులగణన ప్రక్రియలో వివిధ కారణాలతో నమోదు చేసుకోకుండా మిగిలిన వారి కోసం ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు సంబంధిత కుటుంబాలకు చెందిన వారు ఎవరైనా ఒకరు వెళ్లి వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తారు. రాష్ట్ర ప్రణాళిక శాఖ, బీసీ, సాంఘిక సంక్షేమ శాఖలతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల శాఖలు ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కులగణన కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నాయి. కులగణనకు సంబంధించి ఇప్పటికే వివిధ కుల సంఘాల ప్రతినిధులతో జిల్లాల వారీగా ప్రభుత్వం ప్రత్యేకంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది. 7 సచివాలయాల పరిధిలో పైలట్ ప్రాజెక్టు పూర్తి రాష్ట్ర స్థాయి కులగణన నేపథ్యంలో ఆరు జిల్లాల్లో 7 సచివాలయాల పరిధిలో పైలట్గా కులగణన ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. 3,323 కుటుంబాలకు సంబంధించి 7,195 మంది వివరాలను నమోదు చేశారు. శ్రీకాకుళం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఎనీ్టఆర్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడపతోపాటు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని సచివాలయాల పరిధిలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. గిరిజన, మారుమూల ప్రాంతాల్లో యాప్లో వివరాల నమోదుకు సిగ్నళ్లు లేనిచోట్ల ఆఫ్లైన్ విధానంలో సేకరించారు. రాష్ట్రవ్యాప్తంగా 300–400 వరకు మారుమూల ప్రాంతాల్లో ఇలా సేకరించాల్సి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. 726 కులాలు.. ప్రత్యేక యాప్ కులగణన ప్రక్రియను ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా నిర్వహించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ను సిద్ధం చేసింది. దాదాపు 723 కులాల జాబితాలను ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీల వారీగా వర్గీకరించి మొబైల్ యాప్లో అనుసంధానించారు. ఇంటింటికీ వెళ్లి వివరాల సేకరణ సమయంలో ఆయా కుటుంబం ఏ కేటగిరిలోకి వస్తుందో యాప్లో సెలెక్ట్ చేయగానే కులాల జాబితా కనిపిస్తుంది. వారు వెల్లడించే వివరాల ప్రకారం కులగణన సిబ్బంది దాన్ని నమోదు చేస్తారు. ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ కేటగిరీలో పేర్కొన్న 723 కులాలకు అదనంగా మరో మూడు కులాలు బేడ జంగం లేదా బుడగ జంగం, పిరమలై కల్లర్ (తేవర్), యలవ కులాలకు సంబంధించిన వారి వివరాలను వేరుగా అదర్స్ కేటగిరిలో సేకరించనున్నారు. వీటితో పాటు నో– క్యాస్ట్ కేటగిరీని కూడ కులగణన ప్రక్రియలో ఉపయోగించనున్నారు. కులగణన ప్రక్రియలో అత్యంత పారదర్శకంగా వివరాల నమోదు అనంతరం ఆ కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి నుంచి ఆధార్తో కూడిన ఈ –కేవైసీ తీసుకోనున్నారు. ఈ ప్రక్రియలో బయోమెట్రిక్, ఐరిస్ తదితర విధానాలకు అవకాశం కల్పించారు. -
Volunteer Jobs: ఏపీ బాటలో తెలంగాణ!
హైదరాబాద్, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి.. విజయవంతంగా ప్రజల వద్దకే పాలన అందిస్తున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా.. వలంటీర్ల వ్యవస్థ రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టనున్నది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. ఇందిరమ్మ కమిటీలను ఊరు వాడ ఏర్పాటు చేయాలని ప్రకటించిన నేపథ్యంలో.. తెలంగాణలో దాదాపు 80,000 వాలంటీర్ ఉద్యోగాలు నియామకం చేపట్టనున్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందు కూడా రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చే యోచన ఉన్నట్లు తెలిపారు. తాము అధికారంలోకి వస్తే కార్యకర్తలను వలంటీర్లుగా నియమిస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు దీనిని అమలు చేయబోతున్నట్టు తెలుస్తున్నది ఇందులో భాగంగానే ‘ఇందిరమ్మ కమిటీ’లను ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్తున్నారు. ఆరు గ్యారెంటీలకు వాలంటీర్ల వ్యవస్థ ఎంతో ఉపయోగం.. ఆరు గ్యారెంటీల అమలు, కార్యకర్తలకు ఉపాధి కల్పన, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి వాటికి సంబంధించి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది. వలంటీర్ల నియామకంలో భాగంగానే ‘ఇందిరమ్మ కమిటీ’లను తెరపైకి తీసుకొచ్చారన్న ప్రచారం జరుగుతున్నది. ఆరు గ్యారెంటీల అమలు కోసం గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని బుధవారం జరిగిన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ సీనియర్ నేత మల్లు రవి స్వయంగా ప్రకటించారు. అలాగే ఆరు గ్యారెంటీల అమలుకు వాలంటీర్ల వ్యవస్థ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. దీనిపై ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైనట్టు సమాచారం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతోపాటు.. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ కమిటీలో ఐదు నుంచి ఆరుగురు సభ్యులుంటారు. వీరంతా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులేనని కూడా ప్రకటించారు. దీనిని బట్టి చూస్తే ఇది పక్కాగా వలంటీర్ వ్యవస్థేనని తేలిపోయింది. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు, 142 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ లెక్కన దాదాపు 80 వేలమంది వలంటీర్లను నియమించాల్సి ఉంటుంది. ఇక ఏపీ గ్రామ, వార్డు వలంటీర్లకు ప్రతి నెలా గౌరవ వేతనంగా చెల్లిస్తున్న రూ.5,000కు అదనంగా మరో రూ.750ను ప్రోత్సాహకంగా ఇస్తున్న విషయం తెల్సిందే. ఇక తెలంగాణలో కొత్తగా రానున్న వలంటీర్లకు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత ఇస్తుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. వీరికి కూడా దాదాపు రూ.5000 నుంచి రూ.10,000 మధ్యలో ఇచ్చే అవకాశం ఉంది. ఇదీ చదవండి: లబ్ధిదారులు ఎవ్వరూ సంక్షేమ పథకాలు మిస్ కావొద్దు: సీఎం జగన్ -
ఎస్సైగా ఎంపికై న వలంటీర్కు సన్మానం
మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని ఎస్సీ బీసీ కాలనీ 6వ సచివాలయంలో వలంటీరుగా సేవలందిస్తూ ఖాళీ సమయంలో ఎస్సై ఉద్యోగానికి సిద్ధమై విజయం సాధించిన వలంటీరు జి.యోగీశ్వరిని శుక్రవారం ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ బాలమురళీకృష్ణ ఘనంగా సన్మానించారు. కష్టపడితే మంచి ఉద్యోగం సాధించవచ్చని యోగీశ్వరి నిరూపించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వలంటీర్గా అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, సహకారం అందించిన ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, ప్రోత్సహించిన సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ, బత్తుల లక్ష్మీనారాయణ, సచివాలయ సిబ్బందికి యోగీశ్వరి ధన్యవాదాలు తెలిపారు. -
ఇదీ.. జగన్ కమిట్మెంట్
ఒకపక్క.. రోజుకు వంద రూపాయల సంపాదన కూడా లేక.. కనీస అవసరాలని చెప్పే తిండి, ఇల్లు, దుస్తులకు కూడా నోచుకోని జనం లెక్కించలేనంత మంది. మరోపక్క.. రోజుకు లక్ష రూపాయలు సైతం గ్యాంబ్లింగ్లో పోగొట్టుకుని చింతలేకుండా గడిపేసే శ్రీమంతులూ లెక్క లేనంతమంది. ఇదీ.. మన సమాజంలో ఉన్న విభజన. నానాటికీ పెద్దదవుతున్న ఈ రేఖ చెరిగేంతవరకూ అభివృద్ధి చెందిన దేశంగానో, రాష్ట్రంగానో మారటం అసాధ్యం. కనీస అవసరాలు తీర్చుకోలేని కోట్లాది మందిని విడిచిపెట్టేస్తే ఆ అభివృద్ధికి అర్థం ఉండదు. ఆ అభివృద్ధిలో వాళ్లకూ వాటా ఉండాలి. ఆ స్థాయికి వాళ్లను తీసుకురావాలి. వాస్తవానికి సంక్షేమ పథకాల పరమార్థం ఇదే. ఇపుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నది ఆ అభివృద్ధే. చదువుతోనే తలరాత మారుతుంది దీన్ని మనసావాచా నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కాబట్టే తన పిల్లలిద్దరినీ టాపర్లుగా నిలబెట్టగలిగారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకూ సరైన విద్యనందించాలన్న ఉద్దేశంతోనే మేనిఫెస్టోలో ‘అమ్మ ఒడి’ని ప్రతిపాదించారు. చేతిలో డబ్బుల్లేక చిన్న పిల్లల్ని సైతం కూలికి పంపే పరిస్థితిని మార్చాలన్నదే దీనివెనకున్న ఆలోచన. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దీన్ని ఆచరణలోకి తెచ్చారు. ఆశించినట్టే ‘అమ్మ ఒడి’ ఊతంతో పిల్లలు బడి బాట పట్టారు. మరి ఇది సరిపోతుందా? ఇదిగో.. ఈ ఆలోచనే విద్యారంగంలో పెను సంస్కరణలకు బీజం వేసింది. స్కూళ్లకొచ్చే పిల్లల కడుపు నిండితేనే చదువు ఒంట బడుతుందన్న ఆలోచన.. పౌష్టికాహారంతో కూడిన ‘గోరుముద్ద’కు ప్రాణం పోసింది. బళ్లు తెరిచిన ఆరు నెలలకు కూడా పుస్తకాలు అందకపోతే పిల్లలెలా చదువుతారు? ఎవరి స్థాయిని బట్టి వారు దుస్తులు, బ్యాగులతో వస్తే.. ఒకరు షూ వేసుకుని, మరొకరు చెప్పులు లేకుండా వస్తే అంతా ఒక్కటేనన్న భావన ఎందుకొస్తుంది? వీటన్నిటికీ సమాధానమే.. స్కూళ్లు తెరవటానికి ముందే ప్రతి విద్యార్థికీ అందుతున్న ‘విద్యా కానుక’. సరే! మరి స్కూళ్లో? తమ వారి ప్రయివేటు ప్రయోజనాల కోసం గత ప్రభుత్వాలు వాటిని చిత్రవధ చేసి చంపేశాయిగా? ఆడపిల్లలు టాయిలెట్ కోసం ఇంటికెళ్లాలి. సరైన గదుల్లేవు. బెంచీలు, బ్లాక్ బోర్డులు అన్నీ అంతంతే! ఎందుకెళ్లాలి?... అనిపించేలా ఉన్నాయి మన బడులు. వీటిని మార్చాలనుకున్నారు జగన్. అందుకే.. ‘నాడు–నేడు’ పేరిట ఓ యజ్ఞాన్ని ఆరంభించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలనూ కార్పొరేట్ స్కూలుకు దీటుగా సౌకర్యాలతో తీర్చిదిద్దారు. వేల కోట్లు ఖర్చు చేయాల్సి రావటంతో.. దశల వారీగా ఈ యజ్ఞాన్ని పూర్తి చేస్తున్నారు. స్కూళ్లకు వస్తున్నారు. భోజనం, దుస్తులు ఓకే. స్కూళ్లూ మారాయి. మరి చదువో! మన పిల్లలు పోటీ పడాలంటే ఇంగ్లిష్ రావాలి. వస్తేనే రాణించగలరు. అంతర్జాతీయంగానూ పోటీ పడగలరు. అందుకే ప్రయివేటు స్కూళ్లకు మల్లే ప్రీప్రయిమరీ–1,2 తరగతులు వచ్చాయి. ఆది నుంచే ఇంగ్లిష్ మీడియంలో బోధన మొదలయింది. ఇలాగైతే ప్రయివేటు స్కూళ్లకు ఎవరూ రారు కనక.. మాతృభాషపై మమకారం లేదంటూ, ఇంగ్లీషు చదువులు వద్దంటూ మాఫియా గాళ్లంతా కలిసి మాయా యుద్ధానికి దిగారు. కేసులు వేశారు. అయినా సరే.. జగన్ సంకల్పం గట్టిది కావటంతో ఇంగ్లీషు మీడియం వచ్చింది. ఇప్పుడు చాలా మంది పిల్లలు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడుతుండటం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అక్కడితో ఆగలేదు జగన్.అగ్రశ్రేణి కార్పొరేట్ స్కూళ్లలోనే దొరికే ఎడ్యుటెక్ కంటెంట్ను దిగ్గజ సంస్థ ‘బైజూస్’ ద్వారా మన పిల్లలకూ అందుబాటులోకి తెచ్చారు. ఏటా 8వ తరగతి పిల్లలకు శాంసంగ్ ట్యాబ్లనూ అందజేస్తున్నారు. మిగిలిన తరగతుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ను (ఐఎఫ్పీ) ఏర్పాటు చేస్తున్నారు. డిజిటల్ క్లాస్రూమ్లనూ అందుబాటులోకి తెస్తున్నారు. దీన్ని బట్టి తెలిసేది ఒక్కటే. పిల్లల చదువుపై సీఎం జగన్కు అంతులేని నిబద్ధత ఉంది. చదివించటం ద్వారా వారి రాతలను మార్చాలన్న తపనతో.. యావత్తు విద్యా రంగాన్ని సమూలంగా సంస్కరించటం మొదలెట్టారు. ఇదంతా చేసింది జస్ట్ నాలుగున్నరేళ్ల వ్యవధిలోనే! వైద్యం.. ప్రతి ఒక్కరి హక్కు.. చదువుకైనా.. సరైన వైద్యం చేయించుకోవటానికైనా పేదరికం అడ్డు కాకూడదని, వైద్యం కోసం అప్పులపాలు కాకూడదని జగన్ భావించారు. అందుకే.. వెయ్యి రూపాయలు దాటిన ఏ వైద్యానికైనా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తానని మేనిఫెస్టోలో చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక దాన్ని అమల్లోకి తెచ్చారు. ఆరోగ్య సేవలకు అదొక బీజం మాత్రమే. అక్కడి నుంచి మొదలుపెడితే.. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ అంచెలంచెలుగా విస్తరిస్తూ పోయింది. ఆసుపత్రులన్నీ స్కూళ్ల మాదిరే ‘నాడు–నేడు’ కింద కొత్త రూపాన్ని, కొత్త సౌకర్యాలను సంతరించుకున్నాయి. ఎక్కడా ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా వైద్యులు, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు... ఇలా ప్రతి పోస్టూ భర్తీ చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యుల భర్తీతో పాటు.. అత్యాధునిక పరికరాలనూ తీసుకొచ్చారు.యావత్తు ప్రపంచంతో పాటు రాష్ట్రాన్ని కూడా కోవిడ్ వణికించినపుడు వీళ్లంతా కలిసి వలంటీర్ల సాయంతో ఎంత అద్భుతం చేశారన్నది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇతర రాష్ట్రాల్లో ఆసుపత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితుల్లో పొరుగు రాష్ట్రాల నుంచి సైతం ఇక్కడికి వచ్చి, సంరక్షణ కేంద్రాల్లో ఉచితంగా చికిత్స తీసుకుని వెళ్లారంటే.. అది రాష్ట్రంలో వైఎస్ జగన్ అమల్లోకి తెచ్చిన పక్కా వ్యవస్థ వల్లేనన్నది కాదనలేని నిజం. అంతేకాదు.. గ్రామ స్థాయి నుంచీ వైద్య వ్యవస్థను బలోపేతం చేస్తూ వచ్చారు. ఏకంగా 1,405 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏర్పడ్డాయి. ప్రతి చోటా వైద్యులొచ్చారు. ఉచిత మందులు అందుబాటులోకి వచ్చాయి. వీటన్నిటికీ తోడు విదేశాల్లోనే కనిపించే ‘ఫ్యామిలీ డాక్టర్’... మన ఊళ్లలో ప్రతి ఇంటికీ అందుబాటులోకి వచ్చారు.రాష్ట్రంలో ఇపుడు నిరుపేదలందరికీ కావాలనుకున్న వెంటనే సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అపాయింట్మెంట్.. అదీ ఉచితంగా దొరుకుతోందంటే.. అదే వైఎస్ జగన్ విజన్. పరిస్థితులు మారి... కొన్ని చికిత్సలకు వ్యయం ఎక్కువవుతోందని గ్రహించటంతో ఇపుడు ఆరోగ్య శ్రీ చికిత్సకయ్యే ఖర్చును ఏకంగా రూ.25 లక్షల వరకూ ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రతి చికిత్సా ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చేలా చికిత్స ప్రకిరయలను సైతం 1,059 నుంచి 3,257కి పెంచారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించే నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్యను 820 నుంచి 2,513కి పెంచారు. నాలుగున్నరేళ్లలో ఇవన్నీ చేయాలంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి మరి! ఇదీ వ్యవ‘సాయం’ అంటే.. దేశానికి రైతే వెన్నెముక. వైఎస్సార్ వారసుడిగా దీన్ని బలంగా నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఏడాదికి రెండుసార్లు పంట వేసే ముందు రైతుకు పెట్టుబడిగా రూ.12,500 చొప్పున ఇస్తామని భరోసా ఇచ్చారు. దాన్ని మరో రూ.వెయ్యి పెంచి కోవిడ్ కష్టకాలంలోనూ ఆపకుండా మరీ అమల్లోకి తెచ్చారు. నిజానికి రైతుకు ఏం చేసినా తక్కువే. ఎంత చేసినా తక్కువే. అందుకే గ్రామ స్థాయిలోనే రైతులకు అన్ని సేవలూ అందించే ఓ బలమైన వ్యవస్థను సృష్టించాలని సంకల్పించారు. రైతు భరోసా కేంద్రాలకు ప్రాణం పోశారు. రైతు ఎదుర్కొంటున్న కష్టాలన్నిటికీ ఇది వన్స్టాప్ పరిష్కారంగా ఉండాలని భావించారు.నకిలీ విత్తనాల బారిన పడకుండా ఇక్కడే సర్టిఫైడ్ విత్తనాలు, పురుగు మందులు దొరుకుతాయి. భూసార పరీక్ష కేంద్రాల నుంచి పండిన పంటను నిల్వ చేసుకునే గిడ్డంగులు, ఆఖరికి ఖాతాలో పడ్డ నగదును డ్రా చేసుకునేందుకు ఏటీఎంలు కూడా కొన్నిచోట్ల ఆర్బీకేలలోనే అందుబాటులోకి వచ్చాయి. ఇపుడు ఆర్బీకే అనేది ఓ బలమైన ప్రభుత్వ వ్యవస్థ. రైతును విత్తు నుంచి పండిన పంటను విక్రయించుకునేదాకా చేయిపట్టి నడిపించే అమ్మ, నాన్న.. అన్నీ. మనసు మంచిదైతే ప్రకృతి కూడా సహకరిస్తుందనేది ఎంత నిజమో ఈ నాలుగున్నరేళ్ల వైఎస్ జగన్ పాలనలో ప్రస్ఫుటమైంది. సువిశాల కోస్తా తీరం కారణంగా కొన్నిసార్లు తుపాన్లు దెబ్బతీసినా.. తట్టుకుని రోజుల వ్యవధిలోనే బయటపడే వ్యవస్థను ఏర్పాటు చేశారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికీ అతివేగంగా సాయం అందించటంతో పాటు ప్రతి ఎకరాకూ ఉచితంగా ప్రభుత్వమే బీమా చేయించటం, ఒక సీజన్లో జరిగిన నష్టానికి మళ్లీ ఆ సీజన్ రాకముందే పరిహారాన్ని అందించటం.. ఏ సీజన్లో జరిగిన నష్టానికి ఆ సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీని అందించటం.. ఇలా ప్రతిదీ నెరవేర్చేలా ‘ఈ–క్రాప్’ ద్వారా ఆర్బీకేల చుట్టూ ఓ బలమైన వ్యవస్థను సృష్టించారు. ఇదీ విజన్ అంటే. వికేంద్రీకరణకు కొత్త అర్థం వృద్ధులకు, దివ్యాంగులకు ప్రభుత్వమిచ్చే పింఛన్లంటే ఇదివరకు ఓ మహా ప్రహసనం. పట్టణాల్లోనైతే బ్యాంకుల ముందు పడిగాపులు. పల్లెల్లోనైతే ఇచ్చే వ్యక్తి ఏ రోజున వస్తాడో తెలియని దైన్యం. అసలే వాళ్లు వృద్ధులు, దివ్యాంగులు. అలాంటి వారికిచ్చే సాయమేదైనా వారికి సాంత్వన కలిగించాలి తప్ప ఇబ్బంది పెట్టకూడదు కదా? ఇదిగో.. ఈ ఆలోచనతోనే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ వలంటీర్ల సైన్యాన్ని సృష్టించారు. ప్రతినెలా ఒకటవ తేదీన ఠంచనుగా ఇళ్లకు వెళ్లి సామాజిక పింఛన్లు అందజేయటం ఈ సైన్యం బాధ్యత. ఆ తరవాత..! ఆ వలంటీర్లు మరిన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగమయ్యారు.పథకాలను లబ్ధిదారులకు చేరువ చేశారు. ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీరు. ప్రభుత్వానికి – ఆ గడపలకు తనే సంధానకర్త. సూక్ష్మ స్థాయిలో వికేంద్రీకరణ ఫలితాలను కళ్లకు కట్టిన వలంటీర్ల మాదిరే... గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు చేరువ చేయడానికి వలంటీర్లయితే... ప్రభుత్వాన్ని గ్రామ స్థాయికి చేర్చేది గ్రామ సచివాలయాలు. అవసరమైన సర్టిఫికెట్ల నుంచి స్థానికంగా కావాల్సిన సేవలూ అక్కడే. ఈ వ్యవస్థ ఆలోచనతో ఏకంగా లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయి. అవినీతికి, లంచాలకు ఆస్కారం లేకుండా యువత ఉన్న ఊళ్లోనే ఉద్యోగాలు తెచ్చుకుని కొలువుల్లో స్థిరపడింది. అక్కడితో ఆగకుండా గ్రామాల్లో రైతుల కోసం ఆర్బీకేలు, వైద్య సేవల కోసం పీహెచ్సీలు నిర్మించి, యావత్తు గ్రామ వ్యవస్థను బలోపేతం చేశారు జగన్. అందుకే ఇపుడు పల్లెల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయి. పల్లెల నుంచి వలసలు తగ్గాయి. ఒక బలమైన ఆలోచన... దాని ద్వారా మరింత మంచి చేయాలన్న తపన... ఈ రెండూ ఉంటే ఎంతటి అద్భుతమైన వ్యవస్థలను నిర్మించవచ్చో చేసి చూపించారు జగన్. అందుకే ప్రతి రాష్ట్రం ఇప్పుడు మన రాష్ట్రం వైపు చూస్తోంది. ♦ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.2,43,958.04 కోట్లు♦ లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి రెండు మూడు పథకాల ద్వారా లబ్ధి) 8,29,81,601♦ డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.4,11,488.99 కోట్లు♦ నాన్ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.1,67,530.95 కోట్లు♦ లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి రెండు మూడు పథకాల ద్వారా లబ్ధి) 4,44,04,251♦ డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి 2, 3 పథకాల ద్వారా లబ్ధి) 12,73,85,852-రమణమూర్తి మంథా -
సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ ద్వారా.. సమర్థంగా రేషన్ పంపిణీ
సాక్షి, అమరావతి: తుపాను బాధితులకు రేషన్ పంపిణీని గ్రామ, వార్డు సచివాలయ, వలంటీర్ల వ్యవస్థల ద్వారా సమర్థవంతంగా చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి. సాయిప్రసాద్, సీసీఎల్ఏ సెక్రటరీ ఇంతియాజ్, సీఎంఓ అధికారులతో సీఎం జగన్ భేటీ అయి తుపాను పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నెల్లూరు–కావలి మధ్య సగం ల్యాండ్ ఫాల్, సగం సముద్రంలో తుపాను గమనం ఉందని అధికారులు తెలిపారు. చీరాల–బాపట్ల మధ్య పయనించి అక్కడ పూర్తిగా తీరం దాటనుందని ముఖ్యమంత్రికి వారు వివరించారు. తిరుపతి, నెల్లూరు జిలాల్లో తుపాను ప్రభావం ఈ ఉదయం నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతోందని తెలిపారు. ఇక తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో సహాయ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయని.. ప్రకాశం, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల కలెక్టర్లనూ అప్రమత్తం చేశామన్నారు. ఇప్పటివరకూ 211 సహాయ శిబిరాల్లో సుమారు 9,500 మంది ఉన్నారని వెల్లడించారు. వారందరికీ మంచి సదుపాయాలు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. సౌకర్యాల కల్పనలో ఎలాంటి పొరపాట్లు రాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. యుద్ధప్రాతిపదికన కరెంటు పునరుద్ధరణ నెల్లూరు, తిరుపతి సహా తుపానువల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన కరెంటు సరఫరా వ్యవస్థను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాణ, పశు నష్టం జరిగినట్లు సమాచారం అందితే 48 గంటల్లోగా పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. తుపాను తగ్గిన వెంటనే ఎన్యూమరేషన్ కూడా ప్రారంభం కావాలన్నారు. రైతులకు కలెక్టర్ల భరోసా.. మరోవైపు.. సీఎం జగన్ ఆదేశాలతో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు జిల్లా కలెక్టర్ల నుంచి అధికార యంత్రాంగం అంతా క్షేత్రస్థాయికి వెళ్లింది. దగ్గరుండి సహాయక చర్యలను చేపట్టింది. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు కల్లాల్లో ధాన్యం గుట్టలను సందర్శించి అవి తడవకుండా టార్పాలిన్లు కప్పేలా చర్యలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధైర్యపడాల్సిన అవసరంలేదని, మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు కలెక్టర్లు భరోసా ఇచ్చారు. -
'భారత వాలంటీర్లతో ఇజ్రాయెల్కు మరో ఆర్మీ '
ఢిల్లీ: హమాస్తో జరుగుతున్న యుద్ధంలో భారత్ తమకు మద్దతు తెలుపుతున్నందుకు ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలోన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసిన తరుణంలో ప్రధాని మోదీ ఇజ్రాయెల్కు మద్దతు తెలిపారు. హమాస్ను ఉగ్రదాడిగా పేర్కొంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మద్దతును తాము ఎప్పటికీ మర్చిపోబోమని నౌర్ గిలోన్ అన్నారు. తమకు మద్దతు తెలుపుతున్న వాలంటీర్లతో మరో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ను తయారు చేయవచ్చని నౌర్ గిలోన్ అన్నారు. యుద్ధంలో పోరాడుతున్న తమకు మద్దతుగా మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నట్లు పేర్కొన్నారు. 'ఇజ్రాయెల్ ఎంబసీ సోషల్ మీడియాను చూడండి. మద్దతు తెలుపుతున్న భారత వాలంటీర్లతో మరో రక్షణ దళాన్ని తయారు చేయవచ్చు. ఇజ్రాయెల్ తరుపున పోరాడటానికి మేమంతా ఉన్నామంటూ పోస్టులు పెడుతున్నారు.' అని నౌర్ గిలోన్ తెలిపారు. భారత్-ఇజ్రాయెల్ స్నేహసంబంధాలు ఎంత ప్రత్యేకమో ఇంతకంటే ఎక్కువ చెప్పలేమని అన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత శనివారం ప్రారంభమైన యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరుపక్షాల వైపు రాకెట్ దాడులు, బాంబుల మోతలతో మారణోమాన్ని సృష్టిస్తున్నారు. ఇరుదేశాల్లో కలిపి దాదాపు 3200 మంది మరణించారు. ఇజ్రాయెల్ వైపు 1300 మంది మరణించగా.. పాలస్తీనాలో 1900 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజాను ఖాలీ చేయాలని ఇజ్రాయెల్ దళాలు ఆదేశాలు జారీ చేశాయి. వరుసదాడులతో ఇరుపక్షాలు చెలరేగిపోతున్నాయి. ఇదీ చదవండి: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. భారత్ వ్యూహాత్మక వైఖరి -
తల్లి కడుపు చీల్చి మరీ.. వెలుగులోకి హమాస్ అరాచకాలు
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్, ఇజ్రాయెల్ సైన్యం మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. వారం రోజులుగా ఇరు వర్గాల మధ్య భయంకరమైన పోరు కొనసాగుతోంది. బాంబులు, వైమానిక దాడులతో నువ్వా-నేనా అనే రీతిలో ఇరు వర్గాలు విరుచుకుపడుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 1,417 మంది మృత్యువాడినట్లు పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మహాస్ ఉగ్రవాదులకు చెందిన 1500 మృతదేహాలను ఇజ్రాయెల్లో గుర్తించారు, మరోవైపు హమాస్ మిలిటెంట్ల దాడుల్లో ఇజ్రాయెల్కు చంఎదిన 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 150 మందిని బంధీలుగా పట్టుకొని గాజాకు తరలించారు. గాజా సరిహద్దుల్లో హమాస్ దాడుల్లో మరణించిన ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలు రోడ్లపై, వీధుల్లో కుప్పలుకుప్పలుగా పడి ఉండిపోయాయి. ఈ మృతదేహాలను వివిధ స్వచ్చంద సంస్థలకు చెందిన వాలంటీర్లు సేకరిస్తున్నారు. అష్దోద్ ప్రాంతానికి చెందిన యోసి లాండౌ.. జాకా అనే సంస్థలో గత 33 ఏళ్లుగా వాలంటీర్గా పనిచేస్తున్నాడు. ఈ సంస్థ ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల సమయంలో అసహజ మరణాలు సంభవించినప్పుడు అక్కడి మృతదేహాలను సేకరిస్తుంటుంది. దశాబ్ధాలుగా ఇదే పని చేస్తున్న యోసి.. తాజాగా హమాస్తో జరుగుతున్న యుద్ధంలోనూ ఈ విధులే నిర్వర్తిస్తున్నారు. చదవండి: ఇజ్రాయెల్ దాడుల్లో బందీల మృతి ఈ క్రమంలో గాజా సరిహిద్దులో మరణించిన వారి మృతదేహాలను సేకరించే పనిలో పడ్డ యోసి.. హమాస్ మరణహోమంలో బలైన వారి శవాలను చూసి అతని గుండె తరుక్కుపోయింది. రోడ్డుపై శవాల కుప్పల, అత్యంత ఘోర స్థితిలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను చూసి అతడికి కన్నీళ్లు ఆగలేదు. గర్భిణి అయిన మహిళ పొట్టను చీల్చి మరీ లోపలున్న శిశువును చంపడం చూసి తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. ఒళ్లు గగుర్పొడిచే ఆ భయానక దృశ్యాల అనుభవాలను అతను ఓ మీడియాతో పంచుకున్నాడు. ‘రాకెట్ దాడులు జరుగుతున్నట్లు శనివారం ఉదయం నేను సైరన్ శబ్ధాలు రావడంతో క్షణాల్లోనే షెల్టర్లలోకి వెళ్లిపోయాం. అప్పటికే ప్రధాన భూభాగంలోకి హమాస్ మిలిటెంట్లు చొచ్చుకొచ్చారని మాకు తెలిసింది. అనంతరం మృతదేహాలను సేకరించేందుకు మా బృందంతో కలిసి గాజా సరిహద్దుకు బయల్దేరాం. ఆ దారిలో మేం చూసిన దృశ్యాలు అత్యంత భయంకరంగా ఉన్నాయి. గాజా సరిహద్దులోని అనేక ప్రాంతాల్లో కార్లు బోల్తా పడి ఉన్నాయి. వీధుల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఇదే విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ ఇంత దారుణ విధ్వంసాన్ని ఎప్పుడూ చూడలేదు. ఒక రోడ్డుపై పడి ఉన్న మృతదేహాలను సేకరించేందుకు మేం వెళ్లాం. సాధారణంగా ఆ రోడ్డును దాటాలంటే 15 నిమిషాలు పడుతుంది. కానీ ప్రతి మృతదేహాన్ని సేకరించి బ్యాగుల్లో పెడుతూ ఆ రోడ్డు దాటేసరికి 11 గంటలు పట్టింది. బుల్లెట్లు దిగి, ధ్వంసమైన అనేక కార్లు ఇప్పటికీ దక్షిణ ఇజ్రాయెల్లో చెత్తకుప్పల్లా పడి ఉన్నాయి. పదుల సంఖ్యలో మృతదేహాలను గుర్తించి ట్రక్కులో ఎక్కించాం. అక్కడి నుంచి కిబ్బుట్జ్లోని బీరీ ప్రాంతానికి చేరుకున్నాం. ఈ ప్రాంతం గాజాకు కేవలం 5 కి.మీల దూరంలోనే ఉంటుంది. అక్కడ మొదట ఓ మహిళ మృతదేహాన్ని చూడగానే నాతో పాటు మా బృందం మొత్తానికీ స్పృహ కోల్పోయి కళ్లు తిరిగి పడిపోయినంత పనైంది. గర్భవతైన మహిళ పొట్టను చీల్చి శిశువును బయటకు తీసి చంపారు. ఆ బిడ్డకు బొడ్డుతాడు ఇంకా అలానే ఉంది’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: ఇక విధ్వంసమే.. 'వైట్ పాస్పరస్ ఆయుధాలతో ఇజ్రాయెల్ దాడి' 20 మంది చిన్నారులతో సహా కొందరు పౌరుల చేతులను వెనక్కి కట్టి వారిని కాల్చి చంపిన ఆనవాళ్లు కూడా ఉన్నాయని లాండౌ తెలిపారు. కొందరు యువతలపై లైంగిక దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ కిబ్బుట్జ్ ప్రాంతంలో 100 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతానికి సమీపంలోనే సూపర్నోవా మ్యూజిక్ ఫెస్టివల్పై హమాస్ జరిపిన మారణహోమంలో 270 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
వీడిన వలంటీర్ హత్య కేసు మిస్టరీ
ఆదోనిఅర్బన్: గతనెలలో పట్టణంలో జరిగిన వలంటీర్ హరిబాబు హత్య కేసును ఆదోని టూటౌన్ పోలీసులు ఛేదించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. మంగళవారం డీఎస్పీ శివనారాయణస్వామి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని రాజీవ్గాంధీనగర్లో నివాసముంటున్న ఈరమ్మ కుమారుడు హరిబాబు భరత్నగర్ సచివాలయంలో వలంటీర్గా పనిచేస్తున్నాడు. అదే కాలనీలో ఉన్న భీమన్న భార్యను మృతుడు వేధించేవాడు. మహిళ కుటుంబసభ్యులు పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోకపోగా గణపతి వేడుకల్లో కూడా ఆమెను వేధించాడు. గమనించిన భర్త భీమన్న హత్యకు పథకం రచించాడు. ఈ నెల 20వ తేదీ అర్ధరాత్రి హరిబాబును మాయమాటలు చెప్పి బహిర్భూమికి తీసుకెళ్లి గొడ్డలితో నరికి చంపేశాడు. అదే రోజు రాత్రి ఇంటికి వెళ్లి తండ్రి ఈరన్నకు విషయం చెప్పాడు. ఆయన సలహా మేరకు ఆధారాలు దొరకకుండా హత్య సమయంలో వేసుకున్న దుస్తులను కాల్చివేశాడు. 21వ తేదీ ఉదయం కుమారుడి హత్య విషయం తెలుసుకున్న తల్లి ఈరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు హతుడి ఫోన్ కాల్స్, సీసీ ఫుటేజీ ఆధారంగా హంతకులను గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న భీమన్న, అతని తండ్రి ఈరన్న మండిగిరి వీఆర్వో రాజశేఖర్ ముందు లొంగిపోయారు. వారు హత్యకు వినియోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. కేసు ఛేదించిన టూటౌన్ సీఐ శ్రీనివాసనాయక్, వన్టౌన్ సీఐ విక్రమసింహ, హెడ్కానిస్టేబుల్ సుదర్శన్, కానిస్టేబుల్ ఆంజనేయులు, హోంగార్డు గోవర్ధన్ను ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు. -
రామ్మా పింఛన్ తీసుకో..
ఆశ్రయం అన్నది లేకుండా ఓ చోట తింటూ, మరో చోట ఉంటూ బతుకుతున్న ఓ యాచకురాలికి ప్రతి నెలా పింఛన్ మాత్రం ఠంచన్గా అందిస్తున్నా రు. వలంటీర్ వ్యవస్థ చేసిన మేలు ఇది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 28వ వార్డుకు చెందిన బొచ్చ కాంతమ్మకు మతిస్థిమితం లేక, అనారోగ్యంతో బాధ పడుతుండడంతో జంట పట్టణాల్లో తిరుగుతూ ఎవరైనా భోజనం పెడితే తింటూ ఉండేది. ఇప్పుడు పింఛన్ డబ్బుతో కడుపు నింపుకుంటోంది. మంగళవా రం పలాస ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా వలంటీర్ పట్ట చైతన్య, గొడగలవీధి కార్యదర్శి పాలక మినర్వా సమక్షంలో వేలిముద్రలు తీసుకుని పింఛన్ అందించారు. – కాశీబుగ్గ -
పవన్ కళ్యాణ్పై చర్యలు తీసుకోండి: వలంటీర్ ఫిర్యాదు
విజయవాడ: ఒంటరి మహిళల సమాచారాన్ని వలంటీర్లు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించాయని విజయవాడ శాంతినగర్కు చెందిన వలంటీర్ రంగవల్లి న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో వలంటీర్లనుద్దేశించి ఏలూరులో పవన్ చేసిన వ్యాఖ్యలపై విజయవాడలోని పలువురు వలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు పట్టించుకోకపోవడంతో వలంటీర్ రంగవల్లి నేరుగా విజయవాడ మెట్రోపాలిటన్ మేజ్రిస్టేట్ కోర్టు న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ఆమె వాంగ్మూలాన్ని న్యాయమూర్తి శుక్రవారం రికార్డు చేశారు. ఆమె తరఫు న్యాయవాది ఒగ్గు గవాస్కర్, మరో 25 మంది న్యాయవాదుల సమక్షంలో కోర్టు హాల్లో గంటన్నరపాటు ఆమె వాంగ్మూలాన్ని న్యాయమూర్తి సేకరించారు. ‘పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు అన్ని దినపత్రికలు, వార్తా చానళ్లు, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్ట్రాగాం, ట్విట్టర్లలో వచ్చాయి. పవన్ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని నేను నివాసం ఉంటున్న, విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతంలో కొందరు సూటిపోటి మాటలతో మనసు గాయపరుస్తున్నారు. నా పిల్లలను స్కూలుకు తీసుకెళ్లేటప్పుడు∙కొందరు యువకులు వేధిస్తున్నారు’ అని ఆమె వాపోయింది. తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించి సమాజంలో మర్యాద లేకుండా చేసిన పవన్ కళ్యాణ్పై చర్యలు తీసుకోవాలని వేడుకుంది. ఆమె నుంచి పూర్తి సమాచారం సేకరించిన న్యాయమూర్తి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేశారు. ఆ రోజు మిగిలిన సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించారు. -
పవన్పై క్రిమినల్ డిఫమేషన్ కేసు.. వలంటీర్ స్టేట్మెంట్ రికార్డ్
సాక్షి, విజయవాడ: వలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై విజయవాడ సివిల్ కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ కేసు దాఖలైన సంగతి తెలిసిందే. వలంటీర్ పిటీషన్ను న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. పవన్ కేసు ఫైల్ చేసిన వలంటీర్ స్టేట్మెంట్ను శుక్రవారం.. జడ్జి రికార్డు చేశారు. వలంటీర్లపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మానసిక వేదనకు గురైయానని, న్యాయం చేయాలని మహిళా వలంటీర్ కోర్టుని ఆశ్రయించారు. వలంటీర్ తరఫున లాయర్లు కేసు దాఖలు చేశారు. సెక్షన్ 499, 500, 504, 505 ప్రకారం కేసు దాఖలు చేశారు. విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరింది. చదవండి: అజేయ కల్లం పిటిషన్ విచారణకు స్వీకరణ -
మా వలంటీర్ వెంకటేష్ కాదు.. విజయలక్ష్మి
విశాఖపట్నం: వెంకటేష్ వలంటీర్గా పనిచేస్తున్నాడనే సంగతి తమకు తెలియదని జీవీఎంసీ 95వ వార్డు సుజాతనగర్లోని 80 ఫీట్ రోడ్డులో ఇటీవల హత్యకు గురైన వృద్ధురాలు కోటగిరి వరలక్ష్మి భర్త గోపాలకృష్ణమూర్తి తెలిపారు. వరలక్ష్మిని వలంటీర్ వెంకటేష్ హత్య చేశాడని పదేపదే కూస్తున్న ఎల్లో మీడియాతోపాటు కొన్ని అనుబంధ మీడియా సంస్థలకు కనువిప్పు కలిగే నిజాలను ఆయన తెలిపారు. ఆదివారం ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ... గత నెల 31న సుజాతనగర్ 80 ఫీట్ రోడ్డులోని ఒక అపార్ట్మెంట్లో వృద్ధురాలు వరలక్ష్మి హత్య జరిగిన విషయం తెలిసిందే. ఆమె భర్త, కుమారుడు నడుపుతున్న మొబైల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేసే వెంకటేష్ వృద్ధురాలిని హత్య చేశాడు. అయితే వెంకటేష్ వలంటీర్ అని ఎల్లో మీడియాతోపాటు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ కొద్ది రోజుల క్రితమే వెంకటేష్ని వలంటీర్గా తొలగించామని జీవీఎంసీ జోన్ – 8 కమిషనర్ మల్లయ్యనాయుడు తెలిపారు. అయినప్పటికీ పదేపదే వలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్కల్యాణ్ విమర్శలు చేయడం, గత శుక్రవారం సుజాతనగర్లోని వృద్ధురాలి ఇంటికి వెళ్లి పవన్ పరామర్శించిన క్రమంలో మృతురాలి భర్త గోపాలకృష్ణమూర్తి మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అసలు వెంకటేష్ తమ ఏరియాకి... తమ అపార్ట్మెంట్కు వచ్చే వలంటీర్ కాదని, అతను వలంటీర్ అన్న విషయమే తనకు తెలియదంటున్నారు. తమ ఇంటికి వచ్చే వలంటీర్ విజయలక్ష్మి అని, ఆమె సమయానికి సమాచారం, పింఛన్ల నగదు అందిస్తోందని పేర్కొన్నారు. -
వలంటీర్లు దండుపాళ్యం బ్యాచ్!
సాక్షి, విశాఖపట్నం: వలంటీర్లపై కత్తి కట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి నోరు పారేసుకున్నారు. ఈసారి వలంటీర్లను దండుపాళ్యం బ్యాచ్తో పోల్చారు. ఇటీవల ఆయన మహిళల కిడ్నాప్లకు సహకరించే సంఘ విద్రోహశక్తులంటూ అభివర్ణించిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లు ఆగ్రహోదగ్రులయ్యారు. రోడ్లెక్కి నిరసన తెలియజేశారు. పవన్ దిష్టి»ొమ్మలను దహనం చేసి ఆయన వైఖరిని దుమ్మెత్తి పోశారు. ఊహించని ఈ పరిణామానికి దిగివచ్చిన పవన్.. తాను వలంటీర్లందరినీ అలా అనలేదని, కొందరిని ఉద్దేశించే అలా అన్నానని ఆ తర్వాత వివరణ ఇచ్చుకున్నారు. పవన్ గత వ్యాఖ్యల దుమారం ఇంకా చల్లారకముందే తాజాగా మరోసారి వలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత నెలలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాతనగర్లో బంగారం కోసం ఓ వృద్ధురాలిని వెంకటేష్ అనే వ్యక్తి హత్య చేశాడు. గతంలో ఇతను వలంటీర్గా పని చేస్తున్నప్పుడు ఫిర్యాదులు రావడంతో అధికారులు తొలగించారు. ఇది వృద్ధురాలి హత్యకు ముందే జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖలో ఉన్న పవన్ శనివారం వరలక్ష్మి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతటితో ఆగకుండా అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘వలంటీర్లు దండుపాళ్యం బ్యాచ్లా తయారయ్యారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నవరత్నాల కోసం నియమించిన వలంటరీ వ్యవస్థ ఈ రోజు ప్రజల ప్రాణాలు తీస్తోంది. వీరు అసాంఘిక శక్తుల్లా మారి నేరాలకు తెగబడుతున్నారు. పోలీస్ వెరిఫికేషన్ లేకుండా వలంటీరు ఉద్యోగాలిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. జనసేన అద్భుతాలు చేయదు.. జనసేన అధికారంలోకి వస్తే అద్భుతాలు చేస్తుందని తాను చెప్పడం లేదని, వ్యవస్థలను బలోపేతం చేసి, శాంతిభద్రతలను కాపాడతామని పవన్ చెప్పారు. విశాఖ ఎంపీ కుటుంబాన్ని రౌడీషీటర్లు కిడ్నాప్ చేస్తే.. అదే ఎంపీ వారినే వెనకేసుకొస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తానన్నారు. -
అయ్యా పవనూ.. మరీ ఇంత ఘోరంగా దిగజారాలా?
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ శవ రాజకీయానికి తెరలేపారు. మొన్నటికి మొన్న వలంటీర్ వ్యవస్థపై విషాన్ని కక్కిన పవన్.. ఇప్పుడు విశాఖలో హత్యకు గురైన వృద్ధురాలి కుటుంబాన్ని పరామర్శించిన వంకతో శవ రాజకీయాలు మొదలు పెట్టారు. వరలక్ష్మీ అనే వృద్ధురాలిని వాలంటీర్ చంపేశాడంటూ అసత్య ప్రచారం చేస్తున్న పవన్.. రాజకీయ లబ్ది కోసం ఇప్పుడు ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లడం చూసి అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పొలిటికల్ మైలేజ్ కోసమే పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘కుత్తుకలు కోసే దండుపాళ్యం బ్యాచ్’ అంటూ వాలంటీర్లను అభివర్ణించడం.. పవన్లో నిండుకుపోయిన విషానికి నిదర్శనమంటున్నారు. కాగా వరలక్ష్మిని చంపడానికి వారం రోజులు ముందే వెంకటేష్ అనే యువకున్ని వాలంటీర్గా తొలగించారు. విధులు సరిగా నిర్వహించడం లేదని జులై మూడో తేదీన వెంకటేట్పై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జులై 24వ తేదీన వెంకటేష్ వాలంటీరుగా తొలగించారు. వాలంటీరుగా తొలగించిన తరువాత వరలక్ష్మికి చెందిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో సర్వర్గా వెంకటేష్ చేరాడు. ఈ క్రమంలో జులై 30వ తేదీ అర్ధరాత్రి నగల కోసం వరలక్ష్మిని వెంకటేశ్ హత్య చేశాడు. అయితే రాజకీయ లబ్ధి కోసం వాలంటీర్ హత్య చేశాడంటూ పవన్ తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పటికే వాలంటరీ వ్యవస్థ వల్ల 30 వేల మహిళలు అదృశ్యం అయ్యారని పవన్ దుష్ప్రచారం చేశారు. ఇంట్లో పని చేసే వ్యక్తి చంపేస్తే వలంటీర్ చంపేశారంటూ పవన్ విష ప్రచారం చేశారు. ఎంత చంద్రబాబు డైరెక్ట్ చేయించినా.. మరీ ఇంత ఘోరంగా దిగజారాలా? అని పవన్ తీరును ప్రశ్నిస్తున్నారు పలువురు. వ్యవస్థలో ఒకరో, ఇద్దరో చేసిన తప్పుకు మొత్తం అందరిపై నిందలు వేయడం, విషం జిమ్మడం సరికాదని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను సంఘ విద్రోహశక్తులుగా చిత్రీకరించడం సరికాదని, చుట్టున్న ప్రజల సమస్యల పరిష్కారానికి పాటు పడుతున్నామని అంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ వల్ల 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారన్నది పూర్తిగా దుష్ప్రచారమని, ఇటీవల కేంద్రం కూడా పార్లమెంటులో ఈ ఆరోపణలను తిప్పికొడుతూ ప్రకటన చేసిందని గుర్తు చేస్తున్నారు, చదవండి: బాలికపై చిరుత దాడి ఘటన.. టీటీడీ ఈవో ధర్మారెడ్డి అత్యవసర సమావేశం -
రోడ్డు ప్రమాదంలో వలంటీరు మృతి
శ్రీకాళహస్తి: రోడ్డు ప్రమాదంలో వలంటీరు మల్లెంబాకం శ్రీనివాసులురెడ్డి(29) మృతి చెందిన ఘటన శ్రీకాళహస్తిలో బుధవారం చోటుచేసుకుంది. రెండవ పట్టణ పోలీసుల కథనం మేరకు.. శ్రీకాళహస్తి పట్టణం, ముత్తరాశిపాళెంకు చెందిన మల్లెంబాకం శ్రీనివాసులురెడ్డి 4వ వార్డు సచివాలయ పరిధిలో వలంటీరుగా పనిచేస్తున్నారు. బుధవారం సొంత పనుల నిమిత్తం తన స్నేహితుడు సురేష్ను వెంటబెట్టుకుని బసవయ్యపాళెంకు బయలుదేరాడు. తెట్టు కూడలి వద్ద వీరి ద్విచక్ర వాహనం అదుపుతప్పి గంగమ్మ హద్దురాయి మండపాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీనివాసులురెడ్డి, సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో 108 వాహనం ద్వారా శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శ్రీనివాసులురెడ్డి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన సురేష్ను తిరుపతి రుయాకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. -
సాహస వలంటీర్కు నగదు పురస్కారం
వైఎస్సార్: రైల్వేకోడూరు మండలం ఓ.కొత్తపల్లెలో శనివారం రాత్రి పీర్ల చావిడి వద్ద ఏర్పాటు చేసిన గుండంలో కల్లూరి బాషా అనే వ్యక్తి ప్రమాదవశాత్తు పడిపోగా వలంటీర్ చాపల సురేష్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కాపాడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వవిప్ కొరముట్ల శ్రీనివాసులు సోమవారం వలంటీర్ ఇంటికి వెళ్లి సన్మానించి నగదు పురస్కారం అందజేశారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థ ప్రజలకు ఎంతో మేలు చేస్తోందనేందుకు ఈ సంఘటన నిదర్శనమన్నారు. కాగా పీర్లగుండంలో పడి తీవ్రగాయాలైన బాషాకు మెరుగైన వైద్యం అందించాలని రుయా ఆసుపత్రిలోని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం డైరెక్టర్ సుధాకర్రాజు, ప్రముఖ న్యాయవాది ఆర్సీ సురేష్బాబు, ఎంపీటీసీ జనార్దన్రాజు, ప్రతాప్రెడ్డి, సుంకేసుల బాషా, తొండం రాజేంద్ర, ధనుంజయ, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
కోటికి చేరువలో ‘జగనన్న సురక్ష’
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం ద్వారా నెల రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.38 కోట్ల కుటుంబాలను ఇంటివద్ద కలుసుకోవడం ద్వారా పెండింగ్ సమస్యలు లేకుండా అధికార యంత్రాంగం ప్రతి ఇంటినీ జల్లెడ పట్టింది. జూన్ 23వ తేదీన సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం నేటితో (జూలై 31వ తేదీ) ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా శనివారం నాటికే 15,002 సచివాలయాల వద్ద మండల స్థాయి అధికారుల స్థాయిలో ప్రత్యేక వినతుల పరిష్కార క్యాంపులు పూర్తయ్యాయి. సోమవారం మిగిలిన రెండు సచివాలయాల వద్ద క్యాంపులు కొనసాగుతాయని సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోరాదనే లక్ష్యంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. విద్యాసంస్థల్లో అడ్మిషన్లు జరుగుతున్న తరుణంలో విద్యార్ధులకు అవసరమయ్యే ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు మొత్తం 11 రకాల ధ్రువీకరణ పత్రాలను ఈ క్యాంపుల ద్వారా ఎలాంటి సర్విసు చార్జీలు లేకుండా ఉచితంగా అందజేశారు. ప్రతి సచివాలయం పరిధిలో తొలుత వారం రోజుల పాటు వలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజల అవసరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయం వద్ద మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపు నిర్వహించి వినతులను అక్కడికక్కడే పరిష్కరించేలా నెల రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగింది. 59 లక్షల కుటుంబాలకు ప్రయోజనం.. వివిధ కారణాలతో ఎక్కడైనా మిగిలిపోయిన అర్హులకు మేలు చేయడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 59 లక్షల కుటుంబాలకు చెందిన దాదాపు కోటి మందికి జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రయోజనం చేకూర్చారు. 99.80 లక్షల టోకెన్లు జారీ కాగా క్యాంపులు జరిగిన రోజు అధికారుల వద్దకు 95.96 లక్షల వినతులు ప్రస్తావనకు వచ్చాయి. ఇందులో 92.97 లక్షల వినతులను అధికారులు అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలినవి వివిధ దశల్లో పరిశీలన కొనసాగుతోంది. ఒకేరోజు 7,37,638 వినతుల పరిష్కారం.. జగనన్న సురక్ష ద్వారా అత్యధికంగా 40.52 లక్షల మంది కుల ధ్రువీకరణ పత్రాలను పొందగా 38.52 లక్షల మందికి ఆదాయ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. 2,70,073 మంది తమ వ్యవసాయ భూములకు సంబంధించి 1 బీ ధ్రువీకరణ పత్రాలను పొందగా మరో 139,971 మంది కంప్యూటరైజ్డ్ అడంగల్ సర్టిఫికెట్లు పొందారు. ఈ నెల 18వ తేదీన జరిగిన క్యాంపులో ఒక్క రోజులో అత్యధికంగా 7,37,638 వినతులను అక్కడికక్కడే పరిష్కరించారు. అల్లూరి జిల్లాలో అత్యధికం జగనన్న సురక్ష కార్యక్రమం కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలకు సంబంధించి పలు ధ్రువీకరణ పత్రాలు వేగంగా మంజూరయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా 57.4 శాతం కుటుంబాలు ప్రత్యేక క్యాంపుల ద్వారా ప్రయోజనం పొందాయి. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 53.51 శాతం కుటుంబాలు, తూర్పు గోదావరి జిల్లాలో 51.01 శాతం కుటుంబాలకు వివిధ ధ్రువీకరణ పత్రాలతో పాటు సమస్యలు పరిష్కారమయ్యాయి. ఈ కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తుల్లో దాదాపు 77 శాతం గ్రామీణ ప్రజలకు సంబంధించినవే ఉన్నాయి. – లక్ష్మీ శా, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ -
‘పవన్ మానసికంగా వేధించాడు’
సాక్షి, విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల వలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ మహిళా వలంటీర్.. విజయవాడ సివిల్ కోర్టులో పవన్పై డిఫమేషన్ కేసు వేశారు. కాగా, వలంటీర్ ఇచ్చిన కేసును న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. ఈ సందర్బంగా తమపై పవన్ అనుచిత వ్యాఖ్యల పట్ల మానసిక వేదనకు గురైనట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమకు న్యాయం చేయాలని మహిళా వలంటీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ఈ కేసుపై మహిళా వలంటీర్ తరఫున న్యాయవాదులు కేసు దాఖలు చేశారు. సెక్షన్ 499, 500, 504, 505 ప్రకారం కేసు దాఖలు చేశారు. పవన్ వ్యాఖ్యలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రాఫికింగ్ ఆధారాలు కోర్టుకు ఇవ్వాలి.. అనంతరం.. న్యాయవాదులు మీడియాతో మాట్లాడుతూ.. ‘బాధితురాలు పవన్ వ్యాఖ్యల పట్ల మనోవేదనకు గురైంది. కోర్టును ఆశ్రయించిన తర్వాత కచ్చితంగా విచారణ జరుగుతుంది. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పవన్కు కోర్టు నోటీసులు ఇస్తుంది. పవన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. విచారణ జరిపి చట్టపరమైన చర్యలు కోర్టు తీసుకుంటుంది. పవన్ వ్యాఖ్యలు కుట్ర పూరితంగా ఉన్నాయి. వలంటీర్లలో అధిక శాతం మహిళలు ఉన్నారు. ఉమెన్ ట్రాఫికింగ్కు సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు పవన్కు చెప్పి ఉంటే ఆ ఆధారాలు కోర్టుకు వెల్లడించాలి. ప్రభుత్వానికి సహాయకులుగా ఉన్న వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరికాదు. పవన్ వ్యాఖ్యల్లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఉంది. పవన్ వెనుక ఎవరున్నారో స్పష్టం చేయాలి. అబద్ధపు వదంతులు, వ్యాఖ్యలు చేసి ప్రజలను రెచ్చగొట్టి వలంటీర్లపై తిరగబడేలా వ్యాఖ్యలు చేసిన పవన్పై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తిని కోరాం’ అని తెలిపారు. పవన్ వ్యాఖ్యలు బాధించాయి.. ఈ సందర్బంగా మహిళా వలంటీర్ మాట్లాడుతూ.. పవన్పై చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించాం. పవన్ వ్యాఖ్యలు నన్ను బాధించాయి. ఆయన తప్పుడు ఆరోపణలు చేశారు. ఉమెన్ ట్రాఫికింగ్ ఆరోపణలు అవాస్తవం. నేను భర్త చనిపోయి పిల్లలతో జీవిస్తున్నాను. పవన్ వ్యాఖ్యల తర్వాత నన్ను చుట్టుపక్కల వారు ప్రశ్నించారు. ట్రాఫికింగ్ అంశాలపై కొందరు నన్ను ప్రశ్నించారు. నిస్వార్ధంగా సేవ చేస్తున్న మాపై నిందలు వేసి పవన్ తప్పు చేశారు. పవన్ను చట్టపరంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: ‘పేదల ఇళ్లకు చంద్రబాబు, దత్తపుత్రుడు అడుగడుగునా అడ్డుపడ్డారు’ -
AP: విషం తాగిన మహిళను రక్షించిన వలంటీర్
పెనుకొండ(శ్రీసత్యసాయి జిల్లా): విషం తాగిన మహిళను వార్డు వలంటీర్ దిశ పోలీసుల సాయంతో రక్షించిన ఉదంతం శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనుకొండకు చెందిన ఓ మహిళకు ఏడేళ్ల క్రితం నరేష్తో వివాహమైంది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం కూడా ఘర్షణ జరిగింది. దీంతో భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. అదే సమయంలో ఆ ఇంటికి వెళ్లిన వార్డు వలంటీర్ అశ్విని వెంటనే అప్రమత్తమై దిశ ఎస్వోఎస్కు కాల్ చేసింది. నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకున్న దిశ టీం బాధితురాలిని వలంటీర్ సాయంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం వివాహితకు ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. చదవండి: శభాష్ వలంటీర్.. వెన్నుచూపలేదు.. వెనక్కి తగ్గలేదు.. -
పవన్ పై మండిపడుతున్న వలంటీర్లు
-
మహిళా వలంటీర్ పాదాలు కడిగిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఈమనిలో గ్రామస్తులకు ఉత్తమ సేవలు అందించిన దళిత గ్రామ వలంటీర్ జె.రజిత పాదాలను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) మంగళవారం కడిగారు. పూలమాల వేసి, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. వలంటీర్ల సేవలు వెలకట్టలేనివని తెలియజేశారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు వలంటీర్లపై జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ చేసిన విమర్శలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. చదవండి: పవన్కు వాలంటీర్ల బహిరంగ లేఖ.. పది ప్రశ్నలు -
బురద చల్లుతూనే ఉంటారు.. పట్టించుకోవద్దు: అంబటి రాయుడు
సాక్షి, గుంటూరు: స్వచ్ఛందంగా సేవలందించే వలంటీర్లను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంఘ విద్రోహ శక్తులతో పోల్చటాన్ని ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు తప్పుబట్టారు. వలంటీర్లకు దురుద్దేశాలను ఆపాదించడంపై ఆయన స్పందిస్తూ.. ‘‘వలంటరీ వ్యవస్థ గురించి ఎంత గొప్పగా చెప్పినా తక్కువే. మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద చల్లుతూనే ఉంటారు. వాటిని మనం పట్టించుకోకూడదు. వలంటీర్లు అందరూ ధైర్యంతో ముందుకు వెళ్లాలి’’ అంటూ అంబటి రాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో వలంటరీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని అంబటి అన్నారు. వలంటరీ వ్యవస్థ మన రాష్ట్రానికి ఫ్లాగ్ షిప్. దేశంలో 70 సంవత్సరాల నుంచి జరగనది మన రాష్ట్రంలో వలంటరీ వ్యవస్థ ద్వారా జరుగుతోంది. ప్రతి మనిషికి ఏది అందాలో అది వలంటరీ ద్వారా అందుతుందన్నారు. చదవండి: పవన్ అడ్డంగా దొరికిపోయాడు.. తన బట్టలు తానే ఊడదీసుకుని.. ‘‘వలంటరీ వ్యవస్థ ఏర్పాటు ఒక గొప్ప ఆలోచన. వలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎంతో మంచి జరుగుతుంది. ప్రజలకు మంచిగా సేవలందించే వలంటరీ వ్యవస్థ మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా లేదు. కరోనా సమయంలో వలంటీర్లు తమ ప్రాణాన్ని ఫలంగా పెట్టి అందరికీ సేవలందించారు. జీవితాంతం ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తుపెట్టుకోవాలి’’ అని అంబటి రాయుడు పేర్కొన్నారు. చదవండి: పవన్ వ్యాఖ్యలపై వలంటీర్ల ఆగ్రహ జ్వాల -
పవన్పై చర్యలు తీసుకోండి.. డీజీపీకి ఫిర్యాదు
సాక్షి, గుంటూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వాలంటీర్లపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం డీజీపీ రాజేంద్రనాథ్ను కలిశారు. ఈ సందర్భంగా వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. పవన్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీని వారు కోరారు. డీజీపీని కలిసిన వారిలో ఎమ్మెల్సీ పోతుల సునీత, వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రతినిధులు ఉన్నారు. అనంతరం, ఎమ్మెల్సీ పోతుల సునీత మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ వ్యాఖ్యలు హేయమైనవి. చంద్రబాబు, నారా లోకేశ్లకు రాజకీయాలు చేసే దమ్ములేక పవన్ను అడ్డుపెట్టుకుంటున్నారు. పవన్ వారి కోసమే రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు, లోకేశ్ల జేబు సంస్థగా పవన్ పనిచేస్తున్నాడు. పవన్కు మహిళలంటే గౌరవం లేదు. వ్యక్తిగత జీవితంలో మహిళలను మోసం చేసిన మోసగాడు పవన్. అందుకే వాలంటీర్ల పట్ల పవన్ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. పవన్ను రెండు చెప్పులతో కొట్టడానికి వాలంటీర్లంతా సిద్ధంగా ఉన్నారు. పవన్కు ఇదే మా హెచ్చరిక. మేం చాటలు, చెప్పులు ఎత్తితే నీ గతేంటో తెలుసుకో పవన్. మహిళలు, వాలంటీర్లకు పవన్ తక్షణమే సమాధానం చెప్పాలి. పవన్.. చంద్రబాబేనా నీ కేంద్ర నిఘా సంస్థ. చంద్రబాబు నీ చెవిలో ఊదితేనే ఇవన్నీ మాట్లాడుతున్నావ్. పవన్ వంటి వ్యక్తులు రాష్ట్రంలో యాత్రలు చేయడానికి లేదు. పవన్ను అరెస్ట్ చేయమని డీజీపీని కోరాం అని తెలిపారు. ఇది కూడా చదవండి: ఇంతకు దిగజారుతారా.. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతారా?: పేర్ని నాని ఫైర్ -
పవన్ ఎందుకు ఎమ్మెల్యే కాలేకపోయాడు?: మంత్రి అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: నిత్యం ప్రభుత్వాన్ని నిందించడమే పవన్ కల్యాణ్ పనా అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. రాజకీయ పార్టీ నాయకునిగా అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తానో చెప్పాలి కానీ ప్రతిసారీ సీఎంను విమర్శించడమే పనిగా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు.పవన్ తీరు మార్చుకోకుంటే ప్రజలే చెప్పులు చూపిస్తారని విమర్శించారు. పవన్ కల్యాణ్ కాకి లెక్కలను ప్రజలను విశ్వసించరని అన్నారు. ఎన్సీపీ, ఎన్సీఆర్బీకి తేడా తెలియని వ్యక్తి పవన్ అని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ సైకోలా మాట్లాడుతున్నాడని, ఆయన హావభావాలు ఉన్మాదిలా ఉన్నాయని ధ్వజమెత్తారు. ‘వాలంటీర్లపై పవన్ మాట్లాడిన తీరు బాధాకరం. వాలంటీర్లలో 60 శాతం మహిళలు ఉన్నారు. వాలంటీర్లపై నిందలు వేయడానికి పవన్కు బుద్ధి ఉందా? కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు చేశారు. వాలంటీర్లు పవన్ క్షమాపణలు చెప్పాలి. పదేళ్లైనా పవన్ రాజకీయాల్లో ఎదగలేదు. అవసరాలకు తల్లి, రాజకీయాల కోసం భార్య పేరు ఉపయోగిస్తున్నారు. పవన్ తల్లిని అవమానించింది టీడీపీ నేతలే కదా. వారిని కాకుండా మమ్మల్ని విమర్శించడం దేనికి?. వైఎస్సార్ సీపీ నాయకులు ఎప్పుడైనా మీ తల్లి, భార్య గురించి మాట్లాడారా? కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఎమ్మెల్యేలు అయ్యారు. పవన్ ఎందుకు ఎమ్మెల్యే అవ్వలేదు. జనసేన పార్టీ ఎందుకు. డబ్బులు తీసుకొని ఖర్చు చేయడం ఎందుకు. టీడీపీలో విలీనం చేసేయొచ్చు కదా? విలీనం చేస్తే విడతలుగా డబ్బు రాదని ఆలోచిస్తున్నావా ? ‘వారాహి పార్ట్ 2లో భాగంగా పొలిటికల్ సైడ్ హీరో రాజకీయాలు మాట్లాడారు. సంసారం గురించి ఓ తిరుగుబోతు మాట్లాడినట్లు పవన్ మాట్లాడారు. పవన్ను చూసి అమ్మాయిలు భయపడుతున్నారు. మీకు ధైర్యం వుంటే అమ్మ ఒడి, వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తున్నట్టు చెప్పగలవా’ అని ప్రశ్నించారు. చదవండి: ప్రశ్నిస్తే బూతు ‘కూన’ల బరితెగింపు.. విద్యుత్తు శాఖ ఏఈకి బెదిరింపులు -
చికిత్స పొందుతూ వలంటీర్ మృతి
ఏలూరు: వాహనంపై వెళుతూ అనారోగ్యంతో అకస్మాత్తుగా కుప్పకూలిన వలంటీర్ రాజమహేంద్రవరంలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. పంగిడిగూడెం గ్రామ వలంటీర్ కుక్కల రామాంజనేయులు (29) ఈనెల 14న జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం నుంచి పంగిడిగూడెకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. పంగిడిగూడెం హైస్కూల్ వద్దకు వచ్చే సరికి వాహనం నుంచి ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి అతనిని జంగారెడ్డిగూడెం తీసుకువెళ్లారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. బీపీ ఎక్కువైందని వైద్యులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపినట్లు వీఆర్వో తెలిపారు. -
ఆమె వికలాంగురాలు అయినప్పటికీ వాలంటీరుగా పనిచేస్తూ తన బాధ్యతలను నెరవేరుస్తుంది
-
టీసీఎస్ ఉద్యోగుల సరికొత్త రికార్డ్..
టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (TCS) ఉద్యోగులు సరికొత్త రికార్డు సృష్టించారు. జీతాలు, బోనస్లు కాదు.. సామాజిక సేవలో. ఐటీ ఉద్యోగులు అంటే ఎప్పుడూ లక్షల్లో జీతాలు.. పని ఒత్తిడి.. ఇవే కాదు.. టీసీఎస్ ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందున్నారు. 22 లక్షల గంటలు టీసీఎస్ ‘హోప్’ పేరిట ఉద్యోగులతో ప్రపంచవ్యాప్తంగా అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం కింద 2023 ఆర్థిక సంవత్సరంలో 2.2 మిలియన్ గంటలు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారి సహకారంతో టీసీఎస్ వాలంటీర్ల పరంగా ప్రపంచంలోనే నంబర్ వన్ కంపెనీ హోదాను సాధించిందని కంపెనీ పేర్కొంది. హోప్ చొరవలో భాగంగా టీసీఎస్ తన ఉద్యోగులు ప్రతి త్రైమాసికంలో 1 మిలియన్ గంటలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా #millionhoursofpurpose అనే కార్యక్రామాన్ని ప్రారంభించింది. ఉద్యోగులు కూడా ఈ సవాల్ను స్వీకరించి లక్ష్యాన్ని గణనీయమైన తేడాతో అధిగమించారు. ఒక్క నాలుగో త్రైమాసికంలోనే 2 మిలియన్ గంటల పాటు సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొని కొత్త రికార్డును సృష్టించారు. సేవా కార్యక్రమాలు ఇవే.. సామాజిక సేవాకార్యక్రమాల్లో భాగంగా వాతావరణ సంబంధమైన మొక్కల పెంపకం, ఇంధన సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ, క్లీనప్ డ్రైవ్లు, ఆరోగ్యానికి సంబంధించి మానసిక ఆరోగ్య అవగాహన, రక్తదానం, రోడ్డు భద్రత డ్రైవ్లను టీసీఎస్ ఉద్యోగులు నిర్వహిస్తుంటారు. అలాగే పేదరిక నిర్మూలనలో భాగంగా ఆహారం, దుస్తలు, పుస్తకాలు, బొమ్మల పంపిణీ, నైపుణ్యాలను పెంపొందించేలా వయోజన అక్షరాస్యత, నైపుణ్యం, యువత ఉపాధికి మార్గదర్శనం వంటివి చేస్తున్నారు. ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా 1.25 మిలియన్ల మంది జీవితాలను ప్రభావితం చేశాయని కంపెనీ పేర్కొంది. ఇదీ చదవండి: No Work From Home: ఇన్ఫోసిస్ మొదలుపెట్టేసింది.. ఉద్యోగులు ఇక ఇల్లు వదలకతప్పదు! -
జగనన్న నాకు ఇచ్చిన గొప్ప వరం..!
-
శభాష్ వాలంటీర్ నువ్వు సేవా వారియర్..!
-
థాంక్యూ జగనన్న.. వాలంటీర్ సోంబాబు కృతజ్ఞతలు
సాక్షి, ఎన్టీఆర్: సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు.. ఈ నినాదం మాటేమోగానీ దానిని చేతల్లో చూపిస్తున్న నేత మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ‘‘మీరే నా కుటుంబం, మీకు అండగా నేను ఉన్నాను. మీ జీవితాలకు నాదీ భరోసా. మీ బాధలను నేను చెరిపేస్తా’’ అంటూ సహాయం కోసం అర్థించిన కుటుంబాల్లో స్వయంగా వెలుగులు నింపుతున్నారాయన. సహయం కోసం వచ్చేవాళ్లతో ఫొటోలకు ఫోజులు ఇచ్చే బాపతి కాదు ఆయన. సావధానంగా వాళ్ల సమస్యలను విని.. అప్పటికప్పుడే అధికారులతో ఆ సమస్య గురించి చర్చించి.. గంటల వ్యవధిలోనే సహయం అందేలా చూస్తున్నారు కూడా. తాజాగా.. అలా సాయం అందుకున్న వాలంటీర్ జక్కుల సోంబాబు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలియజేశాడు. పెనమలూరు మండలం కానూరు మురళి నగర్, 20వ వార్డులో ఐదవ నెంబర్ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్నాడతను. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన సోంబాబుకి.. పెద్ద ఆపదే వచ్చిపడింది. అతని రెండు కిడ్నీలు చెడిపోయాయి. అయినా ఆ సమస్యను లెక్కచేయకుండా వాలంటీర్గా చిత్తశుద్ధితో పని చేస్తున్నాడతను. అందుకే సీఎం జగన్పై ఉన్న అభిమానం కూడా ఓ కారణమని చెబుతున్నాడతను. కిడ్నీలు పూర్తిగా చెడిపోయి.. డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి అతనిది. తల్లి సాధారణ కూలీ కావడంతో ఆర్థికంగా ఇబ్బందిగా మారుతూ వస్తోంది. అయినా కూడా వాలంటీర్ బాధ్యతలను ఏమాత్రం విస్మరించలేదతను. ఈలోపు అతని సమస్య సీఎం వైఎస్ జగన్ దృష్టికి వెళ్లింది. శుక్రవారం ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమంలో పాల్గొని సభ ముగించుకొని బయలుదేరిన సీఎం జగన్ను.. సోంబాబు, అతని తల్లి కలిశారు. అతని సమస్య తెలుసుకున్న సీఎం జగన్ చలించిపోయారు. జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావుని పిలిచి సోంబాబుకు తక్షణసాయంగా రెండు లక్షల రూపాయలు అందించాలని ఆదేశించారు. ఈ సాయంతో పాటుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సాయం అక్కడితోనే ఆగలేదు.. డయాలసిస్ పేషెంట్లకు ప్రభుత్వం ఇస్తున్న పదివేల రూపాయల పెన్షన్ కూడా అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక కిడ్నీ మార్పిడికి అవసరమైన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా తక్షణమే పూర్తిచేయాలని చెప్పారు. ఆ సర్జరీకి అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని సోంబాబు కుటుంబానికి హామీ ఇచ్చారు సీఎం జగన్. ఆ సహాయం తన జీవితంలో మర్చిపోలేనని చెబుతూ సోంబాబు సంతోషంగా సీఎం జగన్కు పాదాభివందనం చేయబోగా.. ఆయన వద్దని వారించారు. తన ప్రభుత్వంలో వాలంటీర్లకు ఎటువంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని సీఎం జగన్ ప్రకటించారు. రెండు లక్షల చెక్కు అందజేత ఒక వాలంటీర్కు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేసి చూపించారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు. గంట లోపే సోంబాబు కుటుంబాన్ని తన కార్యాలయానికి పిలిపించుకుని సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల చెక్ అందించారు. అలాగే సోంబాబుకు సీఎం జగన్ ప్రకటించిన ఇతర సహాయాలనూ కలెక్టర్ కార్యాలయం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని తెలిపారాయన. ఇదీ చదవండి: సీఎం జగన్ ‘సూత్రం’.. వారికి గుణపాఠం అవుతుందా? -
తుంగభద్ర డ్రెయిన్లో పడి మహిళా వలంటీర్ మృతి
మన్నవ(చేబ్రోలు): పొన్నూరు రూరల్ మండల పరిధిలోని మన్నవ గ్రామంలో మహిళా వలంటీర్ ప్రమాదవశాత్తూ కాలువలో పడి మరణించిన ఘటన గురువారం జరిగింది. అన్నవరపు మానస(26) గ్రామ వలంటీర్గా పనిచేస్తోంది. ఉదయం స్థానికంగా ఉన్న తుంగభద్ర డ్రెయిన్లో దుస్తులు ఉతకటానికి వెళ్లి ప్రమాదవశాత్తూ పడిపోయింది. నీటి ప్రవాహ వేగానికి కొట్టుకుపోతున్న మానసను స్థానికులు కాపాడటానికి యత్నించినా ఫలితం లేకపోయింది. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టిన అనంతనం వలంటీర్ మృతదేహాన్ని బయటకు తీశారు. కుటుంసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొన్నూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై పొన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య వలంటీర్ మానస మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
పరిమళించిన మానవత్వం: అప్పుడు తమిళ తంబి, ఇప్పుడు రామకృష్ణారెడ్డి
వైఎస్సార్: మండల కేంద్రమైన కలసపాడులోని ఆర్టీసీ బస్టాండులో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ అనాథ వృద్ధుడిని వివేకానంద ఆశ్రమం చేరదీసింది. వివరాలు.. అనాథ అయిన ఇతను గాలికి తిరుగుతూ.. దొరికింది తింటూ నెల్లూరు నగరం చేరాడు అరవై ఏళ్ల క్రితం. అప్పటికి తనకు పదహారేళ్లు. అక్కడ హోటల్ నడుపుతున్న తమిళ తంబి రమ్మని పిలిచాడు. అన్నం పెట్టాడు. ఆశ్రయం ఇచ్చాడు. అమ్మానాన్న, గురువు అన్నీ తానే అయ్యాడు. హోటల్ యజమాని తొలిసారి తనను కుమార్ అని పిలిచాడు. అదే పేరుగా మారిపోయింది. కుమార్కు హోటల్ యజమానే వివాహం చేశాడు. కాలక్రమంలో హోటల్ యజమాని చైన్నెకి వెళ్లడంతో హోటల్ మూతపడింది. కుమార్ భార్య కూడా కాన్యర్తో మృతిచెందింది. దీంతో అనాథ అయిన కుమార్ నెల్లూరు నగరాన్ని వదిలి పాదచారిగా ప్రయాణం ప్రారంభించాడు. ఓపిక ఉన్నంత కాలం తిరిగాడు. అలసిపోయి మూడు రోజుల కిందట కలసపాడుకు చేరుకున్నాడు. ఆర్టీసీ బస్టాండులో ఉన్న అనాథ పరిస్థితిని గమనించిన స్థానిక వలంటీర్ శ్రావణ్కుమార్ వివేకానంద సేవాశ్రమం వ్యవస్థాపకులు పాపిజెన్నిరామకృష్ణారెడ్డికి సమాచారం ఇచ్చారు. బుధవారం ఆయన, ఆయన సతీమణి రామతులసితో వచ్చి అనాథకు స్నానం చేయించారు. ఫలహారం అందించారు. అనంతరం వివేకానంద సేవాశ్రమానికి తీసుకెళ్లి ఆశ్రయం కల్పించారు. మానవత్వంతో కూడిన వీరి సేవలను స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. -
ప్రేమజంట హడావుడి.. గుడిలోకి వెళ్లి తలుపులు మూసివేసి..
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ఆమె సచివాలయంలో అగ్రికల్చరల్ అసిస్టెంట్. అతను అదే సచివాలయ పరిధిలో వలంటీర్. ఉద్యోగరీత్యా వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. పెద్దలకు తెలిస్తే పెళ్లికి ఒప్పుకోరనే భయంతో గ్రామంలోని గుడిలో పెళ్లి చేసుకుని అనంతరం గుడి తలుపులు మూసేసి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ హడావుడి సృష్టించారు. సంచలనం కలిగించిన ఈ సంఘటన బందరు మండలం బుద్దాలపాలెం గ్రామంలో సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. బుద్దాలపాలెంకు చెందిన కొక్కు నాగరాజు అదే గ్రామంలో వలంటీర్గా పని చేస్తున్నాడు. మచిలీపట్నంకు చెందిన గాయత్రి రెండేళ్ల కిందట సచివాలయ అగ్రికల్చరల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైంది. ఆమెకు బుద్దాలపాలెం సచివాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. విధి నిర్వహణలో భాగంగా నాగరాజు గాయత్రిల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. అయితే ఇరువురికీ వేర్వేరు కులాలు. దీంతో తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరనే భయంతో సోమవారం వారు గ్రామంలోని రామాలయంలోకి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. అనంతరం తమకు పెద్దల నుంచి రక్షణ కల్పించాలంటూ గుడి లోపలే ఉండి తలుపులు వేసుకున్నారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ రవికుమార్, ఎస్ఐ చాణక్య గ్రామ పెద్దల సహకారంతో ఇద్దరినీ బయటికి తీసుకువచ్చి పోలీస్స్టేషన్కు తరలించారు. ఇరువురి తరపు బంధువులు స్టేషన్కు వచ్చేందుకు నిరాకరించారు. ప్రేమికులు ఇరువురూ మేజర్లు కావటంతో పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి గ్రామ పెద్దల సమక్షంలో వారిని పంపించారు. -
వలంటీర్పై టీడీపీ కార్యకర్తల దాడి..
వినుకొండ (నూజెండ్ల): ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడని కక్షగట్టిన టీడీపీ కార్యకర్తలు వలంటీర్పై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో అప్రమత్తంగా ఉండటంతో వలంటీర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా వినుకొండలో జరిగింది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినుకొండ 5వ వార్డులో వలంటీర్ షేక్ అష్రాఫ్ æరాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. దీన్ని సహించలేని టీడీపీ కార్యకర్తలు సీఎంను కించపరుస్తూ పోస్టులు పెట్టారు. ఇలా చేయడం మంచి పద్ధతి కాదని వలంటీర్ అష్రాఫ్ టీడీపీ కార్యకర్తలకు సూచించాడు. దీంతో టీడీపీ కార్యకర్తలు అతడితో సోషల్ మీడియాలోనే వాగ్వాదానికి దిగారు. ఆదివారం రాత్రి వలంటీర్ అష్రాఫ్, అతడి మిత్రుడు ఇమ్రాన్ఖాన్ మసీదుకు వెళ్లి వస్తుండగా టీడీపీ కార్యకర్తలు.. ఇమ్రాన్, షఫీ, సిద్ధు, ఫారూఖ్, ఫరీద్, ఖాజాలు అష్రాఫ్æపై దాడికి దిగారు. షఫీ కత్తితో దాడి చేయడంతో వలంటీర్కు గాయాలయ్యాయి. అతడి మిత్రులు అష్రాఫ్ను వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. -
AP: రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. మార్చి 31వ తేదీతో ఆర్థిక సంవత్సరం ముగింపు, ఆ తర్వాత వరుసగా రెండు రోజులు బ్యాంకులకు సెలవుల కారణంగా ఈ నెలలో పింఛన్ల పంపిణీ మూడో తేదీ నుంచి మొదలు పెట్టనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 63,42,805 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ, వివిధ చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యా«ధిగ్రస్తులకు పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం రూ. 1747.88 కోట్లను విడుదల చేసింది. సోమవారం ఉదయం బ్యాంకు తెరిచే సమయానికల్లా ఈ నిధులను ఆయా గ్రామ, వార్డు సచివాలయాల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఈ డబ్బును గ్రామ సచివాలయాల సిబ్బంది బ్యాంకుల నుంచి డ్రా చేసి, వలంటీర్లకు అందించారు. అనంతరం మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీ మొదలైనట్టు అధికారులు వెల్లడించారు. పలు చోట్ల సోమవారం రాత్రి పొద్దుపోయాక కూడా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తూనే ఉన్నారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు చెప్పారు. మరో నాలుగు రోజులు పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని తెలిపారు. -
ఉద్యోగాలిచ్చిన ప్రభుత్వమిది.. సీఎం జగన్ చేసిన మేలును మరువం
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఒకే విడతలో తమలాంటి 1.34 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలిచ్చిన ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే నిరసనలు, ఆందోళనల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులం పాల్గొనం’ అని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్పష్టంచేసింది. ఈ మేరకు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జానిపాషా బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన వెంటనే ఎవరూ ఊహించని విధంగా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో బృహత్తర ఆలోచనతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 1.34 లక్షల మంది యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఈ 1.34 లక్షల కుటుంబాలకు సీఎం జగన్మోహన్రెడ్డి చేసిన మేలును మా ఉద్యోగులెవరూ ఎప్పటికీ మరువలేరు. రాష్ట్రంలో కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు వారి స్వార్ధ ప్రయోజనాల కోసం ఉద్యోగ వ్యవస్థలో సింహ భాగంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను తప్పుదోవ పట్టించేలా రెచ్చగొడుతూ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడేలా చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సచివాలయ ఉద్యోగులు ఎవ్వరూ ఎటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, ఆందోళనల్లో పాల్గొనవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. రెచ్చగొట్టే ఉద్యోగ నాయకులు ఎవ్వరూ మనకు ఉద్యోగాలు కల్పించలేదనే విషయం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. -
క్యాన్సర్ను జయించిన వలంటీర్ మహమ్మద్
క్రోసూరు: క్యాన్సర్ బారిన పడిన వలంటీర్కు ప్రభుత్వం సాయం చేయడంతో అతడు పూర్తిగా కోలుకుని తిరిగి విధుల్లో చేరాడు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం నాగవరం గ్రామానికి చెందిన షేక్ ఉమ్మర్ ఖయ్యుం ఆటో నడుపుతుంటాడు. వారి పెద్ద కుమారుడు షేక్ మహమ్మద్ డిగ్రీ పూర్తి చేసి వలంటీర్గా పనిచేస్తున్నాడు. మహమ్మద్ 2021లో బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డాడు. ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదు. సమాచారం తెలుసుకున్న పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అతని ఇంటికి వెళ్లి పరామర్శించి వెంటనే ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పించారు. సీఎం వైఎస్ జగన్కి వినతి పెట్టారు. వెంటనే స్పందించిన సీఎం జగన్..మహమ్మద్కు ఎంత ఖర్చు అవుతుందో అంతా ప్రభుత్వమే భరాయించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహమ్మద్కు ప్రభుత్వం రూ.78 లక్షలు మంజూరు చేసింది. పూర్తిస్థాయిలో చికిత్స పొంది మహమ్మద్ ఇంటికి చేరుకున్నాడు. వైఎస్సార్ ఆసరా ద్వారా నెలకు రూ.5,000 చొప్పున 6 నెలల పాటు అందించి మందులను కూడా ఉచితంగా అందజేసింది. సీఎం జగన్ లాంటి నేత ఉండటంతోనే తాము ఈ సమస్య నుంచి బయటపడ్డామని, ఆయనకు తాము ఎంతగానో రుణపడి ఉన్నామని ఖయ్యుం కుటుంబసభ్యులు తెలిపారు. మహమ్మద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు చొరవతో సీఎం జగన్ వెంటనే స్పందించి తనను ఆదుకున్నారని, జీవితంలో ఒక్కసారి సీఎం జగన్ని కలిసి కృతజ్ఞతలు తెలపాలని తన కోరిక అని చెప్పాడు. -
గ్రామ వలంటీర్పై టీడీపీ నేతల హత్యాయత్నం
శ్రీకాళహస్తి రూరల్(తిరుపతి జిల్లా): గ్రామ వలంటీర్పై టీడీపీ నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో వలంటీర్కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం రాత్రి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని ఇనగలూరులో జరిగింది. వివరాలు.. ఇనగలూరుకు చెందిన అంతటి రామరాఘవేంద్ర గ్రామ వలంటీర్గా సేవలందిస్తున్నాడు. అతను చురుగ్గా వ్యవహరిస్తూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలకందిస్తుండటం స్థానిక టీడీపీ నాయకులకు నచ్చేది కాదు. ‘ఎందుకు అంతా నీదే అన్నట్లు చేస్తున్నావ్.. జాగ్రత్త’ అంటూ పలుమార్లు అతన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు చెలికం మోహన్రెడ్డి, జడపల్లి రాఘవ, నడవాలి చిరంజీవి శనివారం రాత్రి వలంటీర్ ఇంటి ముందుకు వచ్చి టపాసులు కాల్చారు. నిప్పు రవ్వలు ఎగిరి వలంటీర్ రాఘవేంద్ర పిల్లల మీద పడ్డాయి. దీంతో కొంచెం దూరం వెళ్లి టపాసులు కాల్చుకోవాలని వలంటీర్ చెప్పడంతో.. టీడీపీ నాయకులు ముగ్గురూ కలిసి విచక్షణారహితంగా దాడి చేశారు. రాఘవేంద్ర భయపడిపోయి పరిగెత్తగా.. వెంటపడి కత్తితో దాడి చేశారు. ఇంతలో స్థానికులు అక్కడికి రావడంతో.. టీడీపీ నాయకులు ముగ్గురూ పారిపోయారు. తీవ్రంగా గాయపడిన వలంటీర్ను చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఆస్పత్రికి తరలించారు. -
నకిలీ నోట్ల వ్యవహారం పై సమగ్ర దర్యాప్తు
-
వాలంటీర్ వ్యవస్థను కించపరుస్తున్నారు : మంత్రి ఆదిమూలపు సురేష్
-
AP: వలంటీర్ మారినా ఫోన్ నంబర్ మారదు
సాక్షి, అమరావతి: ఏదైనా కారణంతో వలంటీర్ మారినా.. సమాచారం విషయంలో ఆ క్లస్టర్ పరిధిలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామాలు, పట్టణాలు, నగర కార్పొరేషన్లలో క్లస్టర్ వారీగా శాశ్వత ఫోన్ నంబర్ను కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడే ప్రభుత్వం ప్రతి వలంటీర్కు మొబైల్ ఫోన్తో పాటు సిమ్ను కూడా అందజేసింది. అయితే ఏ కారణంతోనైనా ఏదైనా ప్రాంతంలో వలంటీర్ విధుల నుంచి తప్పుకొని తనకు కేటాయించిన ఫోన్ నంబర్ తిరిగి ఇవ్వనప్పుడు ఆ క్లస్టర్ పరిధిలోని ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇలాంటి ఇబ్బంది ఇకపై తలెత్తకుండా విధుల నుంచి తప్పుకొన్న వలంటీర్కు కేటాయించిన సిమ్ను బ్లాక్ చేసి, అదే నంబర్తో కొత్త సిమ్ తీసుకొని కొత్త వలంటీర్కు అధికారులు అందజేయనున్నారు. ఇందుకోసం వలంటీర్లకు ప్రభుత్వం కేటాయించిన ఫోను నంబర్ల వివరాలను రాష్ట్ర స్థాయి ఆన్లైన్ డేటా బేస్ సెంటర్లో నమోదు చేస్తున్నారు. ఈ నెల పదో తేదీ కల్లా ప్రతి వలంటీర్ తమ మొబైల్ నంబర్ వివరాలతో పాటు సిమ్ కార్డు వివరాలు రాష్ట్ర స్థాయి డేటా బేస్ పోర్టల్లో నమోదు చేయాలని ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైనా సరైన సిగ్నల్ లేక ప్రభుత్వం కేటాయించిన సిమ్ కాకుండా వలంటీర్లు తమ సొంత ఫోన్ నంబర్ వాడుతుంటే.. అలాంటి చోట్ల సరైన సిగ్నల్ ఉండే కంపెనీలకు చెందిన ఫోన్ నంబర్లనే వలంటీర్లకు కేటాయించేందుకు చర్యలు చేపట్టారు. (క్లిక్ చేయండి: వైద్య శాఖలో కొలువుల జాతర) -
శభాష్ చందన!
మచిలీపట్నం టౌన్: ఆమె నిండు గర్భిణి. పేరు జోగి చందన. కృష్ణాజిల్లా మచిలీపట్నం నగరంలోని రెండో డివిజన్ సీ–5 వలంటీర్గా పనిచేస్తోంది. నవంబర్ 1వ తేదీన సామాజిక పెన్షన్లను పంపిణీ చేయాల్సి ఉంది. ఆమె సోమవారం అర్ధరాత్రి 12 గంటల తరువాత పెన్షన్ల పంపిణీ ప్రారంభించి 1.14 గంటలకు పూర్తి చేసింది. తన పరిధిలోని 90 మందికి పింఛన్ అందజేసింది. -
రైతు సేవలో మరో ముందడుగు
కడప అగ్రికల్చర్: రైతు దేశానికి వెన్నెముక. రైతు సుభిక్షంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న నానుడిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజం చేస్తున్నారు. రైతన్నలకు అడుగడుగునా అండగా నిలుస్తూ వ్యవసాయానికి కావాల్సిన అన్ని రకాల సేవలను అందిస్తూ ఆదుకుంటున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అన్నదాతల ఆధునిక దేవాలయాలుగా పేరుగాంచిన ఆర్బీకే లలో నిరంతరాయంగా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ప్రతి ఆర్బీకేకు ఒక వలంటీర్ను నియమించింది. ప్రస్తు తం రైతు భరోసా కేంద్రాలలో వ్యవసాయ పంటలసాగు ఆధారంగా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ పనిచేస్తున్నారు. వీరే ఆర్బీకే ఇన్చార్జులుగా వ్యవహరిస్తారు. అయితే వీరంతా ఎక్కువ సమయాన్ని క్షేత్రస్థాయిలో గడపాల్సి వస్తోంది. ప్రధానంగా పంటలసాగు సమయంలో ఈ క్రాపు బుకింగ్ ప్రక్రియ కోసం రోజుల తరబడి పంట పొలాల్లో ఉండాల్సి వస్తోంది. దీంతోపాటు వారంలో ఒక రోజు పొలంబడి కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుంది. వీటితోపాటు మండల, సబ్ డివిజన్, జిల్లాస్థాయిలో నిర్వహించే సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలకు వీరంతా హాజరు కావాలి. ఇలాంటి సమయాల్లో రైతు భరోసా కేంద్రాలను మూసివేయాల్సి వస్తుంది. దీంతో రైతులు అత్యవసర సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు.అలాంటి పరిస్థితిలో వ్యవ ప్రయాసాలతో మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలకు పరుగులు తీయాల్సి వస్తుంది. ఈ సమస్యను తెలుసుకున్న ముఖ్యమంత్రి మరో అడుగు ముందుకేసి రైతులకు ఈ సమస్య కూడా ఉండకూడదని భావించి సమస్య పరిష్కారానికి ప్రతి ఆర్బీకేకు ఒక వలంటీర్ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి చొరవతో ఇక రైతు భరోసా కేంద్రాలలో రైతులకు నిరంతర సేవలు అందే అవకాశం ఏర్పడింది. దేశానికే ఆదర్శంగా ఆర్బీకేలు.. గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కావడంతో రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. విత్తన ఎంపిక, ఎరువులు, పురుగు మందులు, పంట విక్రయాలు వంటి అన్ని రకాల సేవలు ఉన్న ఊర్లోనే అందుతున్నాయి. దీంతోపాటు ప్రైవేటు ఎరువులు, రసాయనిక మందుల డీలర్లు అడ్డుగోలుగా అధిక ధరలకు విక్రయించేవారు. ఎమ్మార్పీపై బస్తాకు రూ.50 నుంచి రూ.100 అధికంగా వసూలు చేసేవారు. ఆర్బీకేలు ఏర్పాటు అయిన తర్వాత వారి ఆగడాలకు మరింత అడ్డుకట్ట పడింది. తాజాగా వలంటీర్ల నియామకంతో మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టినట్లయింది. రైతులకు మరింత చేరువలో ఆర్బీకేలు.. జిల్లాలో 432 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 414 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ప్రతి ఆర్బీకేకు ఒక వలంటీర్ నియామక ప్రక్రియ కూడా పూర్తి అయింది. ఇది వరకే ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ను నియమించి వీరి ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల చెంతకు చేరుస్తున్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన 414 మంది వలంటీర్లకు ఆయా మండల కేంద్రాలలో శిక్షణ తరగతులను ప్రారంభించారు. డిజటల్ కియోస్క్ ద్వారా ఎరువులు, విత్తనాల, పురుగు మందులు ఆర్డర్ పెట్టడం, పంపిణీ చేయడం వంటి అన్ని కార్యక్రమాలు ఆర్బీకే ఇన్చార్జుల పర్యవేక్షణలో వలంటీర్లు చేపడతారు. చాలా సంతోషం రైతు భరోసా కేంద్రాల ద్వారా మాకు అన్ని రకాల సేవలు అందుతున్నాయి. అయితే ప్రస్తుతం పనిచేస్తున్న అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లు ఏదైనా పనిమీద బయటకు వెళితే ఆర్బీకేలను మూసివేయాల్సి వస్తోంది. అత్యవసర సమయాల్లో ఇబ్బందులు పడకతప్పడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి వలంటీర్ను నియమించడం సంతోషంగా ఉంది. –ఎస్. శ్రీనివాసులరెడ్డి, గోపులాపురం, రాజుపాలెం మండలం వలంటీర్లకు సమ్రగ శిక్షణ జిల్లాలోని ప్రతి రైతు భరోసా కేంద్రానికి ఒక వలంటీర్ను నియమించాం. వీరికి ఆర్బీకే నిర్వహణపై శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తాం. ప్రస్తుతం ఈ శిక్షణ ప్రారంభమైంది. ఆర్బీకే ఇన్చార్జులు క్షేత్రస్థాయిలోకి వెళ్లిన సందర్భంలో రైతులకు వీరు అన్ని రకాల సేవలు అందించాల్సి ఉంది. – అయితా నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి -
రాష్ట్రపతి చేతుల మీదుగా ఎన్ఎస్ఎస్ అవార్డుల ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ/వెంకటాచలం(శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్–2020–21) అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్కు మూడు, తెలంగాణకు రెండు అవార్డులు లభించాయి. ప్రోగ్రామ్ ఆఫీసర్ కేటగిరీలో జేఎన్టీయూ అనంతపురానికి చెందిన జితేంద్రగౌడ్, వలంటీర్ కేటగిరీలో నెల్లూరులోని కృష్ణచైతన్య డిగ్రీ కాలేజీకి చెందిన చుక్కల పార్థసారథి, అనంతపురానికి చెందిన దేవనపల్లి సిరి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. -
ప్రతీ ఆర్బీకేలో ఓ వలంటీర్
సాక్షి, అమరావతి: గ్రామస్థాయిలో అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం మరింత నాణ్యమైన సేవలను అందించనుంది. ఇందుకోసం ప్రతీ ఆర్బీకేకు ప్రత్యేకంగా ఒక వలంటీర్ను నియమిస్తోంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీచేసింది. గ్రామాల్లో చురుగ్గా పనిచేసే వలంటీర్లను ఎంపికచేసి వారికి ఆర్బీకే కార్యకలాపాలపై ప్రత్యేక శిక్షణనిచ్చి ఈ నెల 20 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లుచేస్తోంది. సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం 10,778 ఆర్బీకేలను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలను వీటి ద్వారా గ్రామస్థాయిలోనే అందిస్తోంది. ఆర్బీకేల్లో 14,435 మంది సేవలు ప్రతీ ఆర్బీకేకు ఒక వ్యవసాయ, దాని అనుబంధ శాఖలకు సంబంధించిన సహాయకులను నియమించింది. వీటిల్లో ప్రస్తుతం 14,435 మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. వీరిలో 6,321 మంది గ్రామ వ్యవసాయ, 2,356 మంది ఉద్యాన, 4,652 మంది పశుసంవర్థక, 731 మంది మత్స్య, 375 మంది పట్టు సహాయకులు ఉన్నారు. వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా సాగు విస్తీర్ణం, రైతుల సంఖ్యను బట్టి ప్రతీ ఆర్బీకేలో ఒక వ్యవసాయ, ఉద్యాన, మత్స్య సహాయకుల్లో ఒకరు ఇన్చార్జిగా ఉంటారు. స్థానికంగా ఉన్న పాడి, పట్టు విస్తీర్ణాన్ని బట్టి ఆయా సహాయకులు కూడా సేవలు అందిస్తున్నారు. ఇలా మెజార్టీ ఆర్బీకేల్లో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతీ ఆర్బీకేకు ఒక బ్యాంకింగ్ కరస్పాండెం ట్ను కూడా అనుసంధానించారు. సిబ్బందిలేని వేళ ఇబ్బంది లేకుండా.. సాధారణంగా ప్రతిరోజు ఉ.7 నుంచి 9 గంటల వరకు, తిరిగి సా.3 నుంచి 6 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. మిగిలిన సమయాల్లో పంటల నమోదు (ఈ–క్రాప్)తో పాటు రైతులకు అందించే వివిధ రకాల సేవల కోసం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తుంటారు. దీంతో ఆయా సమయాల్లో సిబ్బంది అందుబాటులో లేక ఆర్బీకేలకు వచ్చే రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆర్బీకేలు తెరిచి ఉంచడమే కాదు.. రైతులు ఎప్పుడు ఏ అవసరం కోసం వచ్చినా ఎవరో ఒకరు అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో ప్రతీ ఆర్బీకేకు ఓ వలంటీర్ను అనుసంధానం చేయాలని నిర్ణయించింది. గత నెలలో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. దీంతో ఆర్బీకేకి ఒకరు చొప్పున వలంటీర్లను అనుసంధానం చేస్తూ గ్రామ, వార్డు సచివాలయాల విభాగం డైరెక్టర్ సగిలి షాన్మోహన్ ఉత్తర్వులు జారీచేశారు. వ్యవసాయ శాఖ అభ్యర్థన మేరకు గ్రామాల్లో చురుగ్గా పనిచేస్తూ సేవాతత్పరత కలిగిన వలంటీర్ను ఎంపిక చేయాలన్నారు. ఆర్బీకే కార్యకలాపాలపై ప్రత్యేక శిక్షణ ఎంపికైన వలంటీర్లకు మండల వ్యవసాయ శాఖాధికారులు, జిల్లా రిసోర్స్ సెంటర్ సిబ్బంది ద్వారా ఆర్బీకే కార్యకలాపాలపై శిక్షణ ఇస్తారు. సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లినప్పుడు ఆర్బీకేలకు వచ్చే రైతులతో మర్యాదగా నడుచుకోవడం, వారికి అవసరమైన ఇన్పుట్స్ను కియోస్క్ ద్వారా బుక్ చేయించడం, గోడౌన్ల నుంచి వచ్చే ఇన్పుట్స్ను తీసుకుని స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయడం, సాగు సలహాలకు సంబంధించిన వీడియోలను రైతులకు స్మార్ట్ టీవీల్లో ప్రదర్శించడం, ఇతర సేవలపై తర్ఫీదు ఇస్తారు. నిరంతర సేవలే లక్ష్యంగా.. అన్నదాతలు ఎప్పుడు ఏ అవసరం కోసం వచ్చినా ఆర్బీకేలు తెరిచే ఉండాలి. సిబ్బంది లేని పక్షంలో ఎవరో ఒకరు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రతి ఆర్బీకేకు ఒక గ్రామ వలంటీర్ను అనుసంధానం చేస్తున్నాం. వారికి ఆర్బీకే కార్యకలాపాలపై ప్రత్యేక శిక్షణను ఇవ్వనున్నాం. ఈ నెల 20 నుంచి వారి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – వి.శ్రీధర్, జాయింట్ డైరెక్టర్ (అగ్రికల్చర్), ఆర్బీకేల ఇన్చార్జి -
తైవాన్లో పెరుగుతున్న టెన్షన్... ఉక్రెయిన్లా పోరు సాగించలేం
Taiwan's previous government reduced compulsory service from one year: అమెరికా సభ ప్రతినిధుల స్పీకర్ నాన్సీ తైవాన్ పర్యటన ఎంతటి ఉద్రిక్తలకు దారితీసిందో తెలిసిందే. నాన్సీ పర్యటనతో చైనా యుద్ధానికి సై అంటూ వార్నింగ్లు ఇస్తూ.. తైవాన్ సరిహద్దు, జలసంధిలో పెద్ద ఎత్తున్న సైనిక కసరత్తులు, సైనిక విన్యాసాలు చేపట్టింది. ప్రపంచ దేశాలకు మరో యుద్ధం మొదలవుతుందేమో అన్నంత భయాన్ని కలిగించింది చైనా. సాక్షాత్తు అమెరికానే ఇది తమ వ్యక్తిగత సందర్శనని చెబుతున్నప్పటికీ చైనా శాంతించ లేదు. పైగా అక్కడ తైవాన్ సరిహద్దుల వెంబడి తమ సైనికులను మోహరింపచేసి.... అన్ని పనులు పూర్తి చేశాం, ఏ క్షణమైన యుద్ధానికి రెడీ అంటూ పెద్ద బాంబు పేల్చింది. దీంతో తైవాన్లో సర్వత్ర భయాలు, ఆందోళనలు మొదలయ్యాయి. వాస్తవానికి ఎప్పటికైన చైనా తమ దేశంపై దండయాత్ర చేసి లాగేసుకుంటుందని భయపుడుతూనే ఉంది తైవాన్. కానీ ఇప్పుడూ చైనా తైవాన్ సరిహద్దుల్లో సాగిస్తున్న తాజా పరిణామాలతో ఆ భయాలు మరింత అధికమయ్యాయి. గతంలో తైవాన్ స్వచ్ఛంద దళాన్ని సృష్టించే లక్ష్యంతో ఒక ఏడాది నిర్బంధ సేవను అమలు చేసింది. కానీ ఇప్పుడు ఆ నిర్బంధ సేవను నాలుగు నెలలకు తగ్గించింది. వాస్తవానికి ఈ నాలుగు నెలల సమయం నిర్బంధ సైనిక శిక్షణకు సరిపోదు. ఈ మేరకు ఒక హెన్నీ చెంగ్ ఇన్సూరెన్స్ పాలసీ ఏంజెంట్ మాట్లాడుతూ..తాను నాలుగు నెలల సైనిక శిక్షణ పూర్తి చేశాను కానీ ఎక్కువ కాలం రాత పనిలోనే గడిపినట్లు చెబుతున్నాడు. తమ పని యుద్ధం చేయడం కాబట్టి తుపాకి పట్టుకుని కాల్చడం నేర్పిస్తే సరిపోతుంది కానీ ఆ శిక్షణ ఇవ్వలేదని వాపోయాడు. అదీగాక ప్రస్తుతం తైవాన్లో సైనిక బలగం కూడా తక్కువగానే ఉంది. దీంతో తైవాన్ అధ్యక్షురాలు యంత్రాంగం త్సాయ్ ఇంగ్-వెన్ సైనిక సేవనను పునరుద్ధరించాలా లేదా అనేదానిపై తీవ్ర సందిగ్ధంలో ఉంది. తైవాన్ నేషనల్ డిఫెన్స్ ప్రకారం సైనిక శిక్షణను పెంచడం తోపాటు జెట్ విమానాలు, యాంటీ షిప్ క్షిపణులు పెద్ద మొత్తంలో ఇప్పటికే తైవాన్ కొనుగోలు చేసింది కానీ అవి ఏ మాత్రం సరిపోవని తేల్చి చెప్పింది. అదీగాక ఉక్రెయన్లా యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు తైవాన్ ప్రజలు సిద్ధంగా లేరని తైపీ రిటైర్డ్ ఆర్మీ కల్నల్ చెబుతున్నారు. అంతేకాదు రైఫిల్ పట్టుకోవడమే కాదు, శిక్షణ ద్వారా సముహంగా యుద్ధ పరిస్థితులను ఎలా నిర్వహించాలో నేర్చుకోవాలి అప్పుడే వారికి భవిష్యత్తులో ప్రతిఘటించాలనే ఆశ ఉంటుందన్నారు. ఏది ఏదీమైన చైనా తైవాన్ని తీవ్ర భయాందోళనలు గురిచేసి సంకటస్థితిలోకి నెట్టేసింది, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలయడం లేదని తైవాన్ ఆర్మీ ఆవేదనగా పేర్కొంది. (చదవండి: