IT sector
-
ఐటీ షేర్ల అండ.. ఏడోరోజూ ముందడుగు
ముంబై: ఐటీ రంగ షేర్ల అండతో స్టాక్ సూచీల ర్యాలీ ఏడోరోజూ కొనసాగింది. అయితే లాభాల స్వీకరణతో ఆరంభ లాభాలు హరించుకుపోయాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే 757 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ చివరికి 33 పాయింట్లు పరిమిత లాభంతో 78 వేల స్థాయిపైన 78,017 వద్ద స్థిరపడింది. నిఫ్టీ పది పాయింట్ల స్వల్ప లాభంతో 23,669 వద్ద నిలిచింది. ఐటీ, ప్రైవేటు రంగ బ్యాంకు షేర్లు మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.ఇప్పటికీ అధిక విలువల వద్ద ట్రేడవుతున్న చిన్న, మధ్య తరహా కంపెనీల షేర్లలో విక్రయాలు చోటుచేసుకున్నాయి. బీఎస్ఈ స్మాల్ సూచీ 1.63%, మిడ్ క్యాప్ ఇండెక్సు 1.13 శాతం నష్టపోయాయి. ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రానున్న ప్రతీకార సుంకాల్లో మినహాయింపు ఉండొచ్చని ట్రంప్ సంకేతాలతో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ⇒ అధిక విలువ కలిగిన షేర్లలో ఇటీవల దిద్దుబాటు కారణంగా ఐటీ షేర్లకు డిమాండ్ నెలకొంది. పెర్సిస్టెంట్ 2.60%, కో ఫోర్జ్ 2.25% ర్యాలీ చేశాయి. ఎంఫసిస్, ఇన్ఫోసిస్ 1.50% పెరిగాయి. హెచ్సీఎల్ టెక్ 1%, టీసీఎస్, విప్రో షేర్లు అరశాతం మేర లాభపడ్డాయి. ⇒ ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు భారీ నష్టాలు చవిచూశాయి. సెంట్రల్ బ్యాంక్ ఇండియా, యూకో బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3–5% క్షీణించాయి. ⇒ వచ్చే ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ ఊపందుకుంటుందనే అంచనాలతో బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ సిమెంట్ రంగ షేర్లకు ‘బై’ కేటాయించింది. అ్రల్టాటెక్ 3.50%, ఏసీసీ, దాల్మియా భారత్, అంబుజా సిమెంట్స్ 3% పెరిగాయి. -
రూ.21.57 లక్షల కోట్లకు ఐటీ సర్వీసులు
దాదాపు మూడు దశాబ్దాల క్రితం కేవలం 20 మిలియన్ డాలర్లుగా ఉన్న ఐటీ, ఐటీ ఆధారిత సేవల ఆదాయం ప్రస్తుతం 250 బిలియన్ డాలర్ల(రూ.21.57 లక్షల కోట్లు) స్థాయిని అధిగమించినట్లు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్ తెలిపారు. ఇందులో 200 బిలియన్ డాలర్ల ఆదాయం ఎగుమతుల నుంచే వచ్చిందని పేర్కొన్నారు. 1992–93లో ఐటీ–ఐటీఈఎస్ రెవెన్యూ కేవలం 20 మిలియన్ డాలర్లని ఇండియాసాఫ్ట్ 2025, ఇండియా ఎల్రక్టానిక్స్ ఎక్స్పో కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వివరించారు.ఇదీ చదవండి: చమురుపై ఇక విండ్ఫాల్ ట్యాక్స్లు ఉండవుఎగుమతులను ప్రోత్సహించడంలో ఎల్రక్టానిక్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ కీలకంగా వ్యవహరిస్తోందని అరవింద్ కుమార్ వివరించారు. దేశీయంగా టెక్నాలజీ వ్యవస్థ చాలా వేగంగా వృద్ధి చెందుతోందన్నారు. 1,58,000 స్టార్టప్లు నమోదు చేసుకోగా, వీటిలో 78,000 అంకురాలు టెక్నాలజీ రంగానికి చెందినవేనని అరవింద్ కుమార్ వివరించారు. ఎస్టీపీఐతో పాటు వివిధ శాఖలు.. అంకుర సంస్థలను ప్రోత్సహిస్తున్నాయన్నారు. 50 శాతం పైగా స్టార్టప్లు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి ఉంటున్నాయని, అంకుర సంస్థల వ్యవస్థాపకు లు లేదా డైరెక్టర్లలో సగం మంది పైగా మహిళలు ఉంటున్నారని అరవింద్ వివరించారు. -
ఐటీలో వేతన పెంపు ఎంతంటే..
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సేవల రంగంలో ఈ ఏడాది (2024–25) వేతన పెంపు మోస్తరుగానే ఉండొచ్చని పరిశ్రమకు చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు. సగటున 4–8.5 శాతం మధ్య పెంపు ఉండొచ్చని భావిస్తున్నారు. అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే ఇది తక్కువ కావడం గమనార్హం. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యం, కృత్రిమ మేథ (ఏఐ) వినియోగం పెరుగుతుండడం, నైపుణ్యాలకు డిమాండ్ తదితర పరిస్థితులను ఇందుకు నిదర్శంగా ప్రస్తావిస్తున్నారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇంజనీరింగ్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, డేటా సైన్స్, బ్లాక్ చైన్ డెవలప్మెంట్ తదితర కీలక నైపుణ్యాలున్న వారికి మరింత అధికంగా వేతన పెంపులు లభించొచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. వేతన పెంపు విషయంలో ఐటీ కంపెనీలు అప్రమత్త ధోరణి అనుసరించొచ్చని టీమ్లీజ్ డిజిటల్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణవిజ్ అభిప్రాయపడ్డారు.‘ఐటీ కంపెనీల్లో వేతన పెంపు 4–8.5 శాతం మధ్య ఉండొచ్చు. క్రితం సంవత్సరాల కంటే తక్కువ. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సవాళ్లు, విచక్షణారహిత వ్యయాల తగ్గింపు, వ్యాపార ప్రాధాన్యతల్లో మార్పుతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో ఏప్రిల్–జూన్ మధ్య సాధారణంగా చేపట్టే వేతన పెంపును మరింత జాప్యం చేయొచ్చు’ అని వివరించారు. సంస్థలు వేతన పెంపునకు బదులు రిటెన్షన్ బోనస్ (కంపెనీతోనే కొనసాగితే), ఇ–సాప్లు, ప్రాజెక్ట్ ఆధారిత ఇన్సెంటివ్లు ఇవ్వొచ్చన్నారు. 5–8.5 శాతం..ఈ ఏడాది ఐటీలో వేతనాల పెంపు 5–8.5 శాతం మధ్య ఉండొచ్చని రీడ్ అండ్ విల్లో సీఈవో జానూ మోతియాని అంచనా వేశారు. ‘రెండంకెల వేతన పెంపులు ఇప్పటికైతే గతమే. పరిశ్రమ వ్యాప్తంగా అప్రమత్త ధోరణి నెలకొంది. టీసీఎస్ 4–8 శాతం మధ్య వేతన పెంపును (ఏప్రిల్ నుంచి) ప్రకటించడం ద్వారా మిగిలిన పరిశ్రమ వ్యాప్తంగా ఇదే తరహా పెంపునకు బాటలు వేసింది’ అని వివరించారు. ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా ఇంకా తుది ప్రకటనలు చేయలేదని, అవి రక్షణాత్మక ధోరణితో అడుగులు వేస్తున్నట్టుందన్నారు. ఏఐ ఆధారిత సామర్థ్యాలకు డిమాండ్ పెరుగుతుండడం, క్లయింట్ డిమాండ్లలో మార్పులు ఐటీ కంపెనీల వేతన బడ్జెట్ కేటాయింపులను ప్రభావితం చేస్తున్నట్టు చెప్పారు.ఇదీ చదవండి: పీఎస్యూ బ్యాంకుల్లో వాటా విక్రయంపై దృష్టివలసలూ తగ్గాయ్..ఐటీ రంగంలో వలసల రేటు (ఉద్యోగులు కంపెనీలను వీడడం) 2023లో 18.3 శాతం ఉంటే, 2024 చివరికి 17.7 శాతానికి తగ్గడం గమనించొచ్చు. వలసల రేటు నిదానించడంతో వారిని కాపాడుకునేందుకు రిటెన్షన్ బోనస్, దూకుడుగా పారితోషికాలు ఇవ్వాల్సిన అత్యవసర పరిస్థితి లేకపోవడాన్ని మోతియాని ప్రస్తావించారు. సగటు వేతన పెంపులు 6–10 శాతం మధ్య ఉండొచ్చని, ఏఐ తదితర డిమాండ్ నైపుణ్యాలు కలిగిన మధ్యస్థాయి నుంచి సీనియర్ ఉద్యోగులకు అధిక వేతన పెంపు లభించొచ్చని అడెకో ఇండియా అంచనా వేసింది. ‘ఫ్రెషర్లకు వేతన పెంపులు 2–4 శాతం మధ్య ఉండొచ్చు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ తదితర ప్రత్యేక నైపుణ్యాలున్న వారికి 10–12 శాతం వరకు కూడా వేతనాలు పెరగొచ్చు. సీనియర్ లెవల్ నిపుణులు, ముఖ్యంగా కీలకమైన టెక్నికల్ విధులు, నాయకత్వ బాధ్యతల్లో ఉన్న వారికి 12–15 శాతం మధ్య వేతన పెంపు ఉండొచ్చు’ అని అడెకో ఇండియా కంట్రీ మేనేజర్ సునీల్ చెమ్మన్కోటిల్ తెలిపారు. ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ (ఐబీఈఎఫ్) ప్రకారం దేశ జీడీపీలో ఐటీ రంగం వాటా 7 శాతంగా ఉంది. -
డిజిటల్ ఇన్ఫ్రాపై పెట్టుబడులు పెట్టాలి
న్యూఢిల్లీ: ఐటీ రంగంలో రిమోట్ పని విధానంతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ప్రొఫెషనల్స్కు అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ మౌలిక సదుపాయాలపై మరింతగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగే, అంతర్జాతీయ ప్రాజెక్టులను కూడా అందిపుచ్చుకునేలా ప్రొఫెషనల్స్ నైపుణ్యాలను మెరుగుపర్చడంపైనా, తగిన వేదికలను ఏర్పాటు చేయడంపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దేశ, విదేశ మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు జాతీయ స్థాయిలో అయిదు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. రిమోట్ ఐటీ వర్క్తో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని నిపుణులకు అవకాశాలు లభించడంతో ఆదాయ ఆర్జన సామర్థ్యాలు మెరుగుపడి, సమ్మిళిత వృద్ధికి దోహదపడుతుందని టెక్ మహీంద్రా సీవోవో అతుల్ సొనేజా తెలిపారు. సామర్థ్యాల వెలికితీతకు అవకాశం.. చిన్న పట్టణాల్లోని ప్రతిభావంతుల సామర్థ్యాలను వెలికి తీసేందుకు డిజిటల్ ఇన్ఫ్రా, విశ్వసించతగిన ఇంటర్నెట్ కనెక్టివిటీ, కొత్త నైపుణ్యాల్లో శిక్షణా కార్యక్రమాలు అవసరమని జ్ఞానిడాట్ఏఐ సీఈవో గణేష్ గోపాలన్ చెప్పారు. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను పటిష్టం చేయడం, పరిశ్రమలో భాగస్వామ్యాలను పెంపొందించడం మొదలైనవి చిన్న పట్టణాల్లోని ప్రొఫెషనల్స్ అంతర్జాతీయంగా పోటీపడేందుకు ఉపయోగపడగలవని వివరించారు. -
భారత్కు ట్రంప్ దెబ్బ.. ఐటీ, ఫార్మాకు బిగ్ షాక్!
ఢిల్లీ: డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత దూకుడు పెంచారు. ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని ఆచరణలో పెట్టే పనిలో పడ్డారు. ఇదే సమయంలో భారత్పై కూడా సుంకాలు విధించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో భారత్కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.అమెరికా ప్రపంచ దేశాలపై సుంకాల యుద్ధం ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ దేశంలో పర్యటిస్తున్న సమయంలోనే.. టారిఫ్లు తగ్గించేది లేదంటూ ట్రంప్ స్పష్టం చేశారు. మనదేశ ఎగుమతులు, దిగుమతుల్లో అత్యధిక వాటా అమెరికాదే. ప్రత్యేకించి ఎగుమతులనే తీసుకుంటే.. మన ఐటీ ఎగుమతులకు, ఫార్మా రంగానికి అమెరికా అతిపెద్ద మార్కెట్. మనదేశ మొత్తం ఎగుమతుల్లో సుమారు 18 శాతం అమెరికాకే వెళ్తున్నాయి. 2021-24 మధ్య కాలంలో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకునే చర్యల వల్ల భారతదేశంపై ఎంత ప్రభావం పడుతుందనేది ఆసక్తికరమైన విషయంగా మారింది.ట్రంప్ టారిఫ్లు ఎందుకు విధిస్తున్నట్లు?విదేశాల నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే వస్తువులపై ప్రతి దేశమూ పన్నులు/సుంకాలు (టారిఫ్/కస్టమ్స్ సుంకం) విధిస్తుంది. ఇది దేశీయ ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించడం, ఉద్యోగ సృష్టి మరియు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం కోసం చేస్తుంటారు. ప్రతీకార సుంకం అంటే, అమెరికా నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై ఇతర దేశాలు ఎంత టారిఫ్ విధిస్తే, అదే రకమైన వస్తువులపై అమెరికా కూడా టారిఫ్లు విధిస్తుంది.ఇక, 2023-24లో భారతదేశంతో కూడా అమెరికాకు 35.31 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉంది. భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై అమెరికా విధించే సగటు టారిఫ్ రేటు 3.3% అయితే, అమెరికా నుంచి భారతదేశానికి దిగుమతి అయ్యే వస్తువులపై భారత్ విధించే సగటు టారిఫ్ రేటు 17% ఉంది. ఈ వ్యత్యాసం కారణంగా ట్రంప్ ఇప్పుడు టారిఫ్లను పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు.ప్రపంచ వాణిజ్య సంస్థ గణాంకాల ప్రకారం అమెరికా ఈ కింది దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తోంది. డెయిరీ ఉత్పత్తులు: 188%, పండ్లు మరియు కూరగాయలు: 132%, తృణ ధాన్యాలు: 193%, నూనెగింజలు, కొవ్వులు, నూనెలు: 164%, పానీయాలు మరియు పొగాకు: 150%, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు: 53%, చేపల ఉత్పత్తులు, రసాయనాలు: 35% నుంచి 56%. -
ఈ ఏడాది వారికే ఎక్కువ జీతాలు: సర్వేలో కీలక విషయాలు
ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ.. జీతాలు ఎప్పుడెప్పుడు పెరుగుతాయా అని ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది ఉద్యోగులకు సగటున 9.4 శాతం పెంపు (హైక్) ఉండే అవకాశం ఉంటుందని, HR కన్సల్టింగ్ సంస్థ మెర్సెర్ టోటల్ రెమ్యూనరేషన్ సర్వే వెల్లడించింది. గత ఐదేళ్లుగా ఉద్యోగుల జీతాలు పెరుగుతూనే ఉన్నాయని పేర్కొంది.2020లో ఉద్యోగుల వేతనాలు 8 శాతం పెరిగాయి. ఈ ఏడాది 9.4 శాతం పెరగనున్నట్లు అంచనా. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, కన్స్యూమర్ గూడ్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమోటివ్, ఇంజినీరింగ్ వంటి విభిన్న పరిశ్రమలతో విస్తరించి ఉన్న భారతదేశంలోని 1,550 కంటే ఎక్కువ కంపెనీలను సర్వే చేసి.. జీతాల పెంపు గురించి మెర్సెర్ టోటల్ రెమ్యూనరేషన్ సర్వే ప్రస్తావించింది.ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదల, ప్రభుత్వం నేతృత్వంలోని 'మేక్ ఇన్ ఇండియా' చొరవ కారణంగా ఆటోమోటివ్ రంగం రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది. కాబట్టి ఈ రంగంలో జీతాలు 8.8 శాతం నుంచి 10 శాతం వరకు పెరగవచ్చు. ఆ తరువాత స్థానంలో మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్ విభాగాలు ఉన్నాయి. ఈ రంగాల్లోని ఉద్యోగులకు జీతాలు జీతాలు 8 శాతం నుంచి 9.7 శాతం వరకు పెరగవచ్చు.జీతాలను మాత్రమే కాకుండా.. ఈ ఏడాది 37 శాతం సంస్థలు విభిన్న రంగాలలో.. ఉద్యోగులను కూడా పెంచుకోవడానికి చూస్తున్నట్లు సమాచారం. వివిధ అంశాలలో నైపుణ్యం కలిగిన వారికే ఎక్కువగా ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో సుమారు 11.9 శాతం ఉద్యోగులు స్వచ్చందంగా ఉద్యోగాల నుంచి వైదొలిగే అవకాశం ఉందని చెబుతున్నారు.ఈ సంవత్సరం కొన్ని సంస్థలు ప్రతిభను ఆకర్షించడానికి, టర్నోవర్ను తగ్గించడానికి.. శ్రామికశక్తి డిమాండ్లను పరిష్కరించేందుకు కావలసిన ప్రయత్నాలను చేస్తున్నాయి. అదే సమయంలో కొన్ని సంస్థలు పనితీరు ఆధారంగా వేతనాలు చెల్లించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.కరోనా మహమ్మారి సమయంలో చాలామంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. అయితే ఆ తరువాత కొంతమంది ఉద్యాగాలను పొందినప్పటికీ.. ఇప్పుడు కూడా కొన్ని దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఈ జాబితాలో గూగుల్, మెటా వంటి కంపెనీలు కూడా ఉన్నాయి. కాగా ఈ ఏడాది చాలా కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకోనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఈ ఏడాది చాలామంది ఫ్రెషర్స్ ఉద్యోగాలను పొందనున్నారు.టీసీఎస్లో 40వేల ఉద్యోగాలుటాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS) ఈ ఏడాది 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోందని ఐటీ దిగ్గజం చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (CHRO) 'మిలింద్ లక్కడ్' తెలిపారు. టీసీఎస్ కార్యకలాపాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఏకీకృతం చేస్తోంది. కాబట్టి ఏఐ సంబంధిత నైపుణ్యాలను పొందేందుకు E0 నుంచి E3.. అంతకంటే ఎక్కువ స్థాయిలలోని అన్ని స్థాయిల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. -
ఐటీ ఉద్యోగుల జీతాలు ఇంత దారుణమా?
సాధారణంగా ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులకు (IT Employees) మంచి జీతాలు (Salary) ఉంటాయి. అయితే ఇక్కడ కూడా ఉన్నత స్థాయి అధికారులకు, ప్రారంభ స్థాయి ఉద్యోగులకు మధ్య వేతనాల పెంపు విషయంలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. ‘మనీకంట్రోల్’ విశ్లేషించిన డేటా ప్రకారం.. గత ఐదేళ్లలో దేశంలోని ఐదు ప్రముఖ ఐటీ కంపెనీల్లోని టాప్ ఎగ్జిక్యూటివ్ల వేతనాలు 160% పెరిగాయి. కానీ ఫ్రెషర్ల (Freshers) జీతాలు పెరిగింది కేవలం 4 శాతమే.2024 ఆర్థిక సంవత్సరంలో సీఈవోల (CEO) సగటు వార్షిక వేతనం రూ. 84 కోట్లకు చేరువగా ఉండగా, ఫ్రెషర్స్ జీతాలు రూ. 3.6 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెరిగాయి. డేటాలో చేర్చిన కంపెనీల్లో టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), హెచ్సీఎల్ టెక్ (HCLTech), విప్రో (Wipro), టెక్ మహీంద్ర (Tech Mahindra) ఉన్నాయి.ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్వో మోహన్దాస్ పాయ్తో సహా విమర్శకులు వేతన పెరుగుదలలో భారీ వ్యత్యాసంపై ఆందోళన వెలిబుచ్చారు. ఫ్రెషర్లకు తక్కువ జీతం ఇస్తున్నప్పుడు ఉన్నత స్థాయి అధికారులకు ఉదారంగా వేతన ప్యాకేజీలు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. పెరుగుతున్న అసమానతలు, ఆర్థిక వినియోగంపై దాని హానికరమైన ప్రభావాన్ని మోహన్దాస్ పాయ్ ఎత్తిచూపారు.ఈ ఐటీ కంపెనీల్లో సీఈవోలు, ఫ్రెషర్లు మధ్య వేతన వ్యత్యాసం తీవ్రంగా ఉంది. ఉదాహరణకు విప్రో నిష్పత్తి 1702:1 వద్ద ఉండగా, టీసీఎస్ నిష్పత్తి 192:1. ఐటీ పరిశ్రమలో పరిస్థితి ఇలా ఉంటే.. ఇంజనీరింగ్, తయారీ వంటి ఇతర రంగాలలో వేతన వృద్ధి మరింత దిగజారింది. 2019, 2023 మధ్య ఏటా వేతన వృద్ధి కేవలం 0.8% మాత్రమే.అధిక అట్రిషన్ రేట్లు, తక్కువ ఆన్-సైట్ అవకాశాలు వంటి సవాళ్లను ఐటీ (IT) రంగం ఎదుర్కొంటోంది. ఇది వేతన పరిహారాలపై ప్రభావం చూపుతోంది. సీఈవోల జీతాలు గ్లోబల్ బెంచ్మార్క్లకు అనుగుణంగా ఉన్నప్పటికీ, పెరుగుతున్న వ్యత్యాసం అసమానతలను మరింత పెంచుతోందని, పెరుగుతున్న జీవన వ్యయాలతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి ఉద్యోగులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫ్రెషర్ల జీతాలను కనీసం రూ. 5 లక్షలకు పెంచాలని, ఈ లాభదాయక సంస్థలకు ఇది సాధ్యమేనని విమర్శకులు పేర్కొంటున్నారు. -
ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? అయితే తీపి కబురు
ఐటీ రంగంలో 2025లో 15–20 శాతం మేర అధిక నియామకాలు నమోదవుతాయని ఎన్ఎల్బీ సర్వీసెస్ అంచనా వేసింది. ముఖ్యంగా ఈ ఏడాది ద్వితీయ ఆరు నెల్లలో ఈ రంగంలో కదలిక వచ్చిందని, దీంతో 2025లో ఈ పరిశ్రమలోని పలు విభాగాల్లో నియామకాలు ఆశావహంగా ఉంటాయని తెలిపింది.కీలక నైపుణ్యాలు కలిగిన.. కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలైటిక్స్, క్లౌడ్ టెక్నాలజీలకి డిమాండ్ 30–35 శాతం మేర పెరుగుతుందని అంచనా వేసింది. డిమాండ్లో పెరుగుదల కేవలం ఈ నైపుణ్యాలకు మాత్రమే పరిమితం కాదని, టెక్నాలజీ నైపుణ్యాలను పెంచుకోవడంపైనా దృష్టి సారించాలని పేర్కొంది.మారుతున్న టెక్నాలజీల నేపథ్యంలో తమ మానవవనరులను అవసరమైన నైపుణ్యాలపై తర్ఫీదు ఇవ్వడంపై కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నట్టు వివరించింది. పెద్ద కంపెనీలకు ఇప్పటికీ క్యాంపస్ నియామకాలు ప్రాధాన్యంగా కొనసాగుతాయని, 2024–25 ద్వీతీయ ఆరు నెలల్లో ఇవి చురుగ్గా నియామకాలు చేపట్టొచ్చని పేర్కొంది.ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్తో మాకు పోలికేంటి.. గూగుల్ సీఈవో కామెంట్స్ఏఐ, ఎంఎల్, డేటా అనలైటిక్స్, పైథాన్, క్లౌడ్ టెక్నాలజీలకు నెలకొన్న అధిక డిమాండ్ 2025లో ఐటీలో ఫ్రెషర్ల నియామకాలు పెరిగేందుకు దోహదం చేయనున్నట్టు తెలిపింది. గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లు (జీసీసీలు), తయారీ, బీఎఫ్ఎస్ఐ, హెల్త్కేర్ కంపెనీలు సైతం 30–35 శాతం అధికంగా ఐటీ నిపుణులను తీసుకోవచ్చని అంచనా వేసింది. -
ఇంటి పట్టు నుంచి ఐటీపై పట్టు
మహిళలకు కుటుంబ బాధ్యతలు కెరీర్ గ్యాప్కు కారణమవుతుంటాయి. కొంతమందిని పూర్తికాలం గృహిణిగానే ఉంచేస్తాయి. కానీ బిందు వినోష్ పడిలేచిన కెరటంలాగ సొంత కంపెనీ స్థాపించారు. బిందు స్థాపించిన వెబ్సికిల్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే దిశగా సాగుతోంది.కేరళకు చెందిన బిందు వినోష్ ఎంసీఏ చేసి కొంతకాలం ఐటీ రంగంలో ఉద్యోగం చేశారు. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతల్లో భాగంగా ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. దశాబ్దానికి పైగా ఇల్లే ప్రపంచంగా ఉండిపోయారామె. నలభై ఏళ్లు దాటేటప్పటికి ఐటీ రంగం మీదున్న ఇష్టం ఆమెను తిరిగి కెరీర్ వైపు అడుగులు వేయమని ప్రోత్సహించింది. 44 ఏళ్ల వయసులో ఓ పెద్ద ఐటీ కంపెనీ నుంచి ఫ్రాంచైజీ తీసుకున్నారు. ఫ్రాంచైజీకి, ఆఫీస్ ఏర్పాటు చేయడానికి 16 లక్షలతో ఎంటర్ప్రెన్యూర్గా మారారు. అనతికాలంలోనే సొంతంగా వెబ్సికిల్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీని ప్రారంభించారు. 2023లో ఇద్దరు వ్యక్తులతో మొదలైన ఆమె వ్యాపార సంస్థ ఇప్పుడు ఏడుగురు నిపుణులతో ఏడాదికి పాతిక లక్షలతో నడుస్తోంది. వెబ్సికిల్ ఐటీ రంగంలో వెబ్సైట్ డెవలప్మెంట్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్తోపాటు కస్టమ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కూడా అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వెబ్సికిల్ సేవలందుకుంటున్న క్లయింట్లలో ప్రతిష్ఠాత్మకమైన కంపెనీలు పాతిక వరకు ఉన్నాయి. నేడామె ఐటీ సంస్థకు యజమానిగా కొత్తగా కెరీర్ను ముందుకు తీసుకెళ్తున్నారు. -
ఐటీలో కొత్త ట్రెండ్.. మీరొస్తామంటే మేమొద్దంటామా?
ఐటీ పరిశ్రమలో కాగ్నిజెంట్ కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది. సంస్థను వీడి వెళ్లిన ఉద్యోగులు తిరిగి రావాలనుకుంటే వారికి ‘మీరొస్తామంటే మేమొద్దంటామా’ అంటూ సాదరంగా స్వాగతం పలుకుతోంది. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లొ 13,000 మంది మాజీ ఉద్యోగులను తిరిగి నియమించుకుని సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.ఒక కంపెనీలో పనిచేసి వ్యక్తిగత లేదా వృత్తిపరమైన కారణాలతో సంస్థను వీడి తిరిగి అదే కంపెనీలో చేరేవారిని ‘బూమరాంగ్ ఉద్యోగులు’ అని వ్యవహరిస్తారు. కాగ్నిజెంట్లో ఇలాంటి పునర్నియామకాలు గత రెండు సంవత్సరాలలో 40% పెరిగాయి.కాగ్నిజెంట్.. ఇతర కంపెనీల మాదిరిగా కేవలం ఉన్న ఉద్యోగులను నిలుపుకోవడంపైన మాత్రమే దృష్టి పెట్టకుండా సంస్థను వీడి వెళ్లిన మాజీ ఉద్యోగులను సైతం స్వాగతిస్తోంది. సాధారణంగా బూమరాంగ్ సంస్కృతి ఇతర రంగాలతో పోలిస్తే ఐటీ పరిశ్రమలో చాలా అరుదు.ఇదీ చదవండి: నో బోనస్.. ఉద్యోగులకు టీసీఎస్ ఝలక్!మాజీ ఉద్యోగులను తిరిగి ఆకర్షించడం అనేది ఇప్పుడు పెద్ద ట్రెండ్లో భాగం. దీనిలో కంపెనీలు ఉద్యోగి నిష్క్రమణలను దీర్ఘకాలిక సంబంధాలను కొనసాగించడానికి అవకాశాలుగా చూస్తాయి. సంస్థను వీడి వెళ్తున్న ఉద్యోగులతో మంచిగా వ్యవహరించడం, వారు తిరిగి రావడానికి తలుపులు తెరిచి ఉంచడం ద్వారా సరికొత్త సంస్కృతికి నాంది పలుకుతున్నాయి. డెలాయిట్ వంటి ప్రముఖ కంపెనీలు మాజీ ఉద్యోగుల కోసం ఆలుమ్నీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. -
పట్టణాల్లో ఐటీ వెలవెల!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి పట్టణాలు, నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐటీ హబ్లు వెలవెలబోతున్నాయి. లక్ష చదరపు అడుగుల నుంచి 1.75 లక్షల చదరపు అడుగుల్లో రూ. 50 కోట్ల నుంచి రూ. 90 కోట్ల వ్యయంతో నిర్మించిన భవనాలన్నీ కంపెనీలు పెద్దగా రాకపోవడంతో ఎక్కువ శాతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అట్టహాసంగా వాటిని ఏర్పాటు చేశారు. కానీ ఆ తరువాత సరైన నిర్వహణ లేదు. గతేడాది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఐటీ హబ్లపై దృష్టిపెట్టకపోవడంతో మొదట్లో కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీల్లో చాలా వరకు వివిధ కారణాలతో వెనక్కి వెళ్లిపోతున్నాయి.సంప్రదింపులు జరిపే వారేరీ? తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్్క) నేతృత్వంలో 2019 నుంచి ఒక్కో పట్టణంలో ఐటీ హబ్ను ఏర్పాటు చేసినా కంపెనీలతో సంప్రదింపులు జరిపే వారు లేక ప్రధాన కంపెనీలేవీ ముందుకు రావడం లేదు. నల్లగొండ, మహబూబ్నగర్, సిద్దిపేట, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, సూర్యాపేట పట్టణాల్లోని ఐటీ హబ్లకు చిన్నాచితక కంపెనీలు వచ్చినా యువతకు పెద్ద ఎత్తున వేతనాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో వాటిల్లో చేరే వారు కరువయ్యారు.ఇక హనుమకొండలోని మడికొండలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్లో దిగ్గజ ఐటీ సంస్థ టెక్ మహీంద్ర ఒక బ్రాంచీని ఏర్పాటు చేసినా ఆ తర్వాత అనివార్య కారణాలతో దాన్ని మూసేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొదట్లో కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీల్లో చాలా వరకు వెనక్కి వెళ్లిపోవడంతో ఐటీ హబ్లు అలంకారప్రాయంగా మారుతున్నాయి. ఫలితంగా జిల్లా కేంద్రాల్లో నివసించే యువతకు స్థానికంగానే ఐటీ కొలువులు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది.అడ్డగోలుగా అద్దెలు.. ప్రభుత్వ స్థలాల్లో, ప్రభుత్వ నిధులతో ఐటీ హబ్ల నిర్మాణం జరిగింది. వాటి నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించడంతో వారు ఇష్టానుసారంగా భవనాల అద్దెలను నిర్ణయిస్తున్నారు. దీంతో వాటిలో కార్యాలయాల ఏర్పాటుకు కంపెనీలు ముందుకు రావడం లేదు. నల్లగొండ తదితర పట్టణాల్లో నిర్మించిన ఐటీ హబ్లలో ఒక చదరవు అడుగుకు (ఎస్ఎఫ్టీ) అద్దె రూ. 1,400కుపైగా నిర్ణయించడంతో అప్పట్లో పలు కంపెనీలు ముందుకు రాలేదన్న విమర్శలు ఉన్నాయి. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లోనే ఎస్ఎఫ్టీకి రూ.2 వేలు మొదలు 7 వేల వరకు ఉండగా జిల్లాల్లోని ఐటీ హబ్లలో అంతమొత్తం వెచి్చంచేందుకు కంపెనీలు ముందుకురావట్లేదు. స్కిల్ సెంటర్లన్నా ఏర్పాటు చేయాలి.. ఐటీ హబ్ భవనాల్లో ఇప్పటివరకు సగం అంతస్తుల్లోనూ కంపెనీలు ఏర్పాటు కాలేదు. ఈ నేపథ్యంలో వాటిని సది్వనియోగపరచుకునేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం రూ. కోట్లు వెచి్చంచి స్కిల్ సెంటర్ల నిర్మాణానికి చర్యలు చేపడుతుండటంతో ఐటీ టవర్లను స్వాధీనం చేసుకొని స్కిల్ సెంటర్లకు వినియోగించుకోవాలని ప్రజాప్రతినిధులు సూచిస్తున్నారు.పేరొందిన కంపెనీలు రావాలియువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే పేరొందిన ఐటీ కంపెనీలను పట్టణాలకు తీసుకురావాలి. ప్రభుత్వం అందుకు కృషి చేయాలి. – దుర్గాప్రసాద్, కట్టంగూరు -
ఐటీ పరిశ్రమలో కొత్త చిగురులు.. చాన్నాళ్లకు మారిన పరిస్థితులు
దేశంలోని ఐటీ పరిశ్రమలో సన్నగిల్లిన నియామకాలకు మళ్లీ కొత్త చిగురులు వచ్చాయి. దాదాపు ఏడు త్రైమాసికాల తర్వాత భారతీయ ఐటీ పరిశ్రమలో క్షీణిస్తున్న హెడ్కౌంట్ ట్రెండ్ మారింది. టాప్ ఆరు ఐటీ కంపెనీలలో ఐదు కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య పెరిగింది.టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, ఎల్టీఐమైండ్ట్రీ సంస్థలు సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తంగా 17,500 మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నాయి. ఒక్క హెచ్సీఎల్ టెక్లో మాత్రమే పరిస్థితి మారలేదు. గత త్రైమాసికంలో ఈ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 780 తగ్గింది.దేశంలో ఐదవ అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టెక్ మహీంద్రా అత్యధికంగా సెప్టెంబర్ త్రైమాసికంలో 6,653 మంది ఉద్యోగులను చేర్చుకుని తాజా నియామకాలకు నాయకత్వం వహించింది. దీని తర్వాత దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన టీసీఎస్ తన 600,000 మంది ఉద్యోగులకు 5,726 మంది ఉద్యోగులను జోడించింది.ఇదీ చదవండి: ఇలా కూడా రిజెక్ట్ చేస్తారా? గూగుల్ టెకీ వింత అనుభవంరెండవ, నాల్గవ అతిపెద్ద ఐటీ సంస్థలైన ఇన్ఫోసిస్, విప్రో ఈ త్రైమాసికంలో వరుసగా 2,456, 978 మంది ఉద్యోగులను చేర్చుకున్నాయి. ఇన్ఫోసిస్ వరుసగా ఆరు త్రైమాసికాల తర్వాత తన వర్క్ఫోర్స్ను విస్తరించింది. పెండింగ్లో ఉన్న కాలేజీ రిక్రూట్లను కూడా ఆన్బోర్డింగ్ చేస్తామని ఇరు కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. -
సాఫ్ట్వేర్ సంస్థల ఎగుమతులు పెంపు
దేశీయ సాఫ్ట్వేర్ కంపెనీల ఎగుమతులు పెరుగుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.17.2 లక్షల కోట్ల విలువైన సాఫ్ట్వేర్ సేవలను ఇతర దేశాలకు ఎగుమతి చేశారు. దేశీయ కంపెనీలు విదేశాల్లోని వాటి అనుబంధ సంస్థలతో కలిసి ఈ ఘనత సాధించాయి. ఈమేరకు భారతీయ రిజర్వ్ బ్యాంకు వివరాలు వెల్లడించింది.ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం..2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశీయ సాఫ్ట్వేర్ కంపెనీల సేవల ఎగుమతులు రూ.200.6 బిలియన్ డాలర్లు(రూ.16.8 లక్షల కోట్లు)గా ఉన్నాయి. 2023-24లో అది రూ.17.2 లక్షల కోట్లుకు పెరిగింది. దేశీయ కంపెనీలు విదేశాల్లోని తమ అనుబంధ సంస్థలతో కలిసి ఈ ఘనత సాధించాయి. రూ.17.2 లక్షల కోట్ల నుంచి విదేశీ అనుబంధ సంస్థల సేవలను మినహాయిస్తే కేవలం దేశీయ కంపెనీలే రూ.16 లక్షల కోట్ల విలువైన సేవలను ఎగుమతి చేశాయి. ఇది గతేడాదితో పోలిస్తే 2.8 శాతం ఎక్కువ. భారత కంపెనీలు అధికంగా అమెరికాకు ఈ సేవలను ఎగుమతి చేస్తున్నాయి. మొత్తం భారత కంపెనీల ఎగుమతుల్లో అమెరికా వాటా 53 శాతం కాగా, యూరప్ వాటా 31 శాతంగా ఉంది.ఇదీ చదవండి: రెండేళ్లలో రూ.5 లక్షల కోట్ల ఆదాయంఅంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక అస్థిరతలు పెరగడం వల్ల యుద్ధ భయాలు నెలకొంటున్నాయి. దాంతో బ్యాంకింగ్ రంగ సంస్థలతోపాటు ఇతర కంపెనీలు సాఫ్ట్వేర్ సేవలను అప్డేట్ చేయడంలో కొంత వెనుకంజ వేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ద్రవ్యోల్బణం రేటు కొంత స్థిరంగా కదలాడుతోంది. దాంతో సెంట్రల్ బ్యాంకులు కీలక వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి. ఫలితంగా లోన్లు పెరిగి బ్యాంకింగ్ రంగ సంస్థలు తమ సాఫ్ట్వేర్ కేటాయింపులకు నిధులు పెంచే అవకాశం ఉంటుంది. దాంతో రానున్న రోజుల్లో సాఫ్ట్వేర్ ఎగమతులు మరింత పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ఐటీ కొలువులు.. చిగురిస్తున్న ఆశలు!
ఐటీ రంగం ఉద్యోగాల విషయంలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికం (2023–24, క్యూ1)లో వరుసగా ఏడో క్వార్టర్లోనూ టాప్–5 ఐటీ దిగ్గజాల మొత్తం సిబ్బంది సంఖ్య తగ్గింది. అయితే, గతంతో పోలిస్తే తగ్గుదల జోరుకు భారీగా అడ్డుకట్ట పడటం సానుకూలాంశం. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికల్లా మళ్లీ ఐటీ రంగం పెరిగిన ఉద్యోగులతో కళకళలాడే పరిస్థితి వస్తుందంటున్నారు పరిశ్రమ విశ్లేషకులు. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా... దేశీ ఐటీ రంగంలో ఇవి టాప్–5 కంపెనీలు. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో వీటి మొత్తం సిబ్బంది సంఖ్య సీక్వెన్షియల్గా (గతేడాది క్యూ4తో పోలిస్తే) 2,034 మంది తగ్గారు. అయితే, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా.. ఈ మూడు దిగ్గజాలు మాత్రం ఏప్రిల్–జూన్ క్వార్టర్లో నికరంగా ఉద్యోగులను జత చేసుకోవడం విశేషం.‘గడిచిన ఐదు క్వార్టర్లలో ఉద్యోగుల తగ్గుదల జోరుకు క్రమంగా అడ్డుకట్ట పడటం సానుకూల పరిణామం’ అని హైరింగ్ కంపెనీ ఎక్స్ఫెనో బిజినెస్ హెడ్ (టెక్నాలజీ సిబ్బంది నియామకాలు) దీప్తి ఎస్ పేర్కొన్నారు. టాప్–5లో మూడు దిగ్గజ సంస్థలు క్యూ1లో నికరంగా ఉద్యోగులను జత చేసుకోవడంతో నియామకాల రికవరీ ఆశలు చిగురిస్తున్నాయని, ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఐటీ పరిశ్రమ మళ్లీ కొత్త ఉద్యోగుల చేరికలతో కళకళలాడే అవకాశం ఉందని కూడా ఆమె అంచనా వేస్తున్నారు. హైరింగ్పై ఆర్థిక అనిశ్చితి ఎఫెక్ట్... దేశీ ఐటీ కంపెనీలకు ప్రధాన మార్కెట్లయిన అమెరికా, యూరప్లలో ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుండటంతో గత ఏడాదిన్నరగా హైరింగ్కు ముఖం చాటేస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగాల్లో కోతలకు కూడా తెరతీశాయి. అయితే, ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1 ఫలితాల్లో ఈ ప్రతికూల పరిస్థితులు సద్దుమణుగుతున్న సంకేతాలు వెలువడ్డాయి. టాప్–5 కంపెనీల మొత్తం సిబ్బంది సంఖ్య ఈ జూన్ నాటికి 15,23,742కు చేరింది. మార్చి చివరికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 15,25,776గా నమోదైంది. టీసీఎస్ సిబ్బంది 6,06,998కి చేరింది. కొత్తగా 5,452 మంది జతయ్యారు. ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంఖ్య 3.15 లక్షలకు చేరింది. 1,908 మంది తగ్గారు. హెచ్సీఎల్ టెక్లో దాదాపు 8,000 మంది తగ్గుదలతో మొత్తం సిబ్బంది 2.27 లక్షలకు చేరారు. విప్రోలో ఉద్యోగుల సంఖ్య క్యూ1లో స్వల్పంగా 337 మంది పెరిగి 2.34 లక్షలకు చేరింది. టెక్ మహీంద్రాకు నికరంగా 2,165 మంది జతకావడంతో మొత్తం ఉద్యోగులు 1.47 లక్షలకు పెరిగారు. అయితే, గతేడాది క్యూ1 నాటి సిబ్బంది సంఖ్యతో పోలిస్తే బిగ్–5 కంపెనీల్లో 46,325 మంది ఉద్యోగులు తగ్గారు. గడిచిన రెండేళ్లలో టాప్–5 కంపెనీల మొత్తం ఉద్యోగుల సంఖ్య 3 శాతం తగ్గగా... అంతక్రితం మూడేళ్ల కాలంతో పోలిస్తే 18 శాతం పెరిగారని దీప్తి తెలిపారు. ఐటీ హైరింగ్ విషయంలో సాధారణ స్థాయికి రావడానికి మరికొన్నాళ్లు పట్టే అవకాశం ఉన్నప్పటికీ, తాజా గణాంకాలు ఆశాజనకంగా ఉన్నాయని ఆమె చెబుతున్నారు. 2,034: టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా మొత్తం ఉద్యోగుల సంఖ్య క్యూ1లో సీక్వెన్షియల్గా తగ్గుదల.15,23,742: ఈ ఏడాది జూన్ (క్యూ1) చివరి నాటికి ఈ బిగ్5 కంపెనీల మొత్తం సిబ్బంది సంఖ్య 15,23,742. 5: గడిచిన ఐదు త్రైమాసికాలుగా సిబ్బంది తగ్గుదల క్రమంగా శాంతించడం సానుకూలాంశం. ఫ్రెషర్లకు చాన్స్.. ఐటీ రంగంలో ఫ్రెషర్ల హైరింగ్ భారీగా పుంజుకోనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 15,000–20,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే అవకాశం ఉందని ఇన్ఫోసిస్ క్యూ1 ఫలితాల సందర్భంగా ప్రకటించింది. విప్రో సైతం 10,000–12,000 మందికి ఈ ఏడాది ఉద్యోగావకాశాలు కల్పిస్తా మని పేర్కొంది. ప్రధానంగా జెనరేటివ్ ఏఐ, సైబర్సెక్యూరిటీ, క్లౌడ్ విభాగాల్లో కూడా అదనంగా ఉద్యోగులను తీసుకోనున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. క్యూ1లో 3,000 మంది ఫ్రెషర్లకు (న్యూ జెన్ అసోసియేట్స్) అవకాశం ఇచి్చనట్లు తెలిపింది. ఇక హెచ్సీఎల్ టెక్ కొత్తగా 10,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలిస్తామని ప్రకటించింది. టీసీఎస్ సైతం క్యాంపస్ హైరింగ్పై దృష్టిపెడుతోంది. మొత్తంమీద ఈ ఐటీ పరిశ్రమ ఫ్రెష్ హైరింగ్ 1,00,000–1,20,000 స్థాయిలో ఉండొచ్చని హెచ్ఆర్ కన్సల్టెన్సీ ఎక్స్ఫెనో అంచనా. గతేడాది 60,000 స్థాయితో పోలిస్తే ఇది భారీగానే లెక్క. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఐటీలో మళ్లీ నియామకాల సందడి
ముంబై: ఐటీ రంగంలో మళ్లీ నియామకాలు పుంజుకోనున్నాయి. వచ్చే ఏడాది నాటికి 8.5 శాతం మేర పెరుగుతాయని హైరింగ్ ప్లాట్ఫామ్ ‘ఇండీడ్’ అంచనా వేసింది. గత రెండేళ్లుగా ఐటీ రంగంలో నియామకాల పరంగా స్తబ్దత వాతావరణం చూస్తుండడం తెలిసిందే. గతేడాది వ్యాప్తంగా నిపుణులకు ఐటీ రంగంలో డిమాండ్ తగ్గగా.. ఇక మీదట ఇది పుంజుకోనున్నట్టు ఇండీడ్ తెలిపింది. ఇండీడ్ సంస్థకు చెందిన హైరింగ్ ట్రాకర్, ఇండీడ్ ప్లాట్ఫామ్ ఇండియా డేటా ఆధారంగా ఈ వివరాలు విడుదల చేసింది. ప్రస్తుతం ఇండీడ్ ప్లాట్ఫామ్పై నమోదయ్యే నియామకాల్లో 70 శాతం సాఫ్ట్వేర్ ఆధారితమేనని ఈ సంస్థ తెలిపింది. కంపెనీలు ఏఐ, మెషిన్ లెరి్నంగ్ (ఎంఎల్)బ్లాక్చైన్ వంటి సాంకేతికతలను వినియోగిస్తుండం ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగాలకు డిమాండ్ను పెంచుతున్నట్టు వివరించింది. స్టార్టప్ ఎకోసిస్టమ్ బలపడుతుండడాన్ని సైతం ప్రస్తావించింది. వీరికి డిమాండ్ ఎక్కువ.. అప్లికేషన్ డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఫుల్ స్టాక్ డెవలపర్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, పీహెచ్పీ డెవలపర్ నియామకాలకు కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు వెల్లడించింది. అలాగే, నెట్ డెవలపర్లు, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్, డెవ్ఆప్స్ ఇంజనీర్, డేటా ఇంజనీర్, ఫ్రంట్ ఎంట్ డెవలపర్లకు సైతం డిమాండ్ పెరుగుతున్నట్టు తెలిపింది. ఇప్పటికే ఉన్న సాఫ్ట్వేర్లో ఎప్పటికప్పుడు అప్డేట్లు, సెక్యూరిటీ ప్యాచ్లు, కొత్త ఫీచర్లు తీసుకురావాల్సిన అవసరం సైతం డిమాండ్కు మద్దతునిస్తున్నట్టు తెలిపింది. ‘‘ఐటీ రంగం ఎక్కువ మందికి ఉపాధి కలి్పస్తోంది. కాకపోతే ఇటీవలి త్రైమాసికాల్లో నియామకాలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ అనిశి్చతుల నేపథ్యంలో కంపెనీలు అప్రమత్త ధోరణితో వ్యవహరించాయి. ఇప్పుడు ఈ పరిస్థితిలో మార్పు చోటు చేసుకుంటోంది. కంపెనీలు నియామకాలు పెంచుకోవడంపై దృష్టి సారించాయి. గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లు (జీసీసీలు) ఈ నియామకాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి’’అని ఇండీడ్ ఇండియా సేల్స్ హెడ్ శశి కుమార్ తెలిపారు. -
కాగ్నిజెంట్ భారీ విస్తరణ!
సాక్షి, హైదరాబాద్: ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ హైదరాబాద్లో భారీ విస్తరణకు ముందుకు వచ్చింది. దాదాపు 15 వేల మంది ఉద్యోగు లకు పని కల్పించేలా, 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్ను ఏర్పాటు చేయనుంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కంపెనీ ఇతర ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరి గిన చర్చల అనంతరం కాగ్నిజెంట్ విస్తరణ ప్రణా ళికపై ఒప్పందం జరిగింది. వాస్తవానికి గత ఏడాది ముఖ్యమంత్రి బృందం దావోస్ పర్యటన సందర్భంగానే ఈ ఒప్పందానికి పునాదులు పడ్డాయి. సాంకేతికత, కొత్త ఆవిష్కరణలకు అభివృద్ధి కేంద్రంగా హైదరాబాద్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న నేపథ్యంలో కంపెనీ విస్తరణకు కాగ్నిజెంట్ ఈ నగరాన్ని ఎంచుకుంది. కాగా ఒప్పందం సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని చెప్పారు. కాగ్నిజెంట్ కంపెనీ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని అభిప్రాయపడ్డారు. కాగ్నిజెంట్కు తమ ప్రభుత్వం తగిన మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కొత్త సెంటర్ ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉద్యోగాలు లభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందని చెప్పారు. క్లయింట్లకు మెరుగైన సేవలుకాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ మాట్లాడుతూ.. టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్గా సత్తా చాటుకుంటున్న హైదరాబాద్లో తమ కంపెనీ విస్తరించటం సంతోషంగా ఉందని అన్నారు. హైదరాబాద్లో నెలకొల్పే కొత్త సెంటర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు మెరుగైన సేవలందించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఐటీ సేవలతో పాటు కన్సల్టింగ్లో అత్యాధునిక పరిష్కారాలను అందిస్తామని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని తెలిపారు. కాగా హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర టైర్–2 నగరాలలో కూడా ఐటీ సేవలను విస్తరించాలని ముఖ్యమంత్రి చేసిన సూచనపై కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే ప్రముఖ టెక్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయని, ఇక్కడ కొత్త కేంద్రాన్ని స్థాపించాలనే కాగ్నిజెంట్ నిర్ణయం హైదరాబాద్ అభివృద్ధికి దోహదపడుతుందని శ్రీధర్బాబు అభిప్రాయపడ్డారు. -
ఐటీ నిరుద్యోగుల కష్టాలు తీరినట్టే..!!
గతేడాదినియామకాల మందగమనం తర్వాత, భారతీయ ఐటీ రంగం 2025 ఆర్థిక సంవత్సరం కోసం నియామక ప్రణాళికలను పునరుద్ధరిస్తోంది. దాదాపు 3,50,000 ఉద్యోగాలను జోడించడానికి సిద్ధంగా ఉంది. ఈ రంగానికి డిమాండ్ వాతావరణం మెరుగుపడటంతో కంపెనీలు నియామకాలపై దృష్టి పెట్టాయని స్టాఫింగ్ సంస్థల నిపుణులు చెబుతున్నారు.గడిచిన సంవత్సరంలో స్థూల ఆర్థిక ఎదురుగాలుల కారణంగా నియామక కార్యకలాపాలు బాగా తగ్గిపోయాయి. నాస్కామ్ ప్రకారం, టెక్ పరిశ్రమ 2024 ఆర్థికేడాదిలో 60,000 కొత్త ఉద్యోగాలను మాత్రమే జోడించింది. ఇది అంతకుముందు సంవత్సరంలో వచ్చిన 2,70,000 ఉద్యోగాల కంటే చాలా తక్కువ. ఐటీ మేజర్లు గత ఏడాది మొత్తం ఉద్యోగుల సంఖ్య వృద్ధిలో పడిపోయాయి. అయితే, నియామక ఔట్లుక్ ఇప్పుడు సానుకూలంగా మారుతోంది.ఎన్డీటీవీ నివేదిక ప్రకారం.. “హెడ్కౌంట్ తగ్గుదలతో FY25ని ప్రారంభించినందున, భారతీయ అగ్రశ్రేణి ఐటీ సంస్థలు నికర హెడ్కౌంట్ జోడింపులను నమోదు చేయడానికి ముందు క్షీణతను భర్తీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టెక్ రంగం నికర వృద్ధి కోసం ప్రస్తుత ఔట్లుక్ FY24లో చూసినట్లుగా 2,00,000-2,50,000 మధ్య ఉంది. అయితే క్షీణత, విస్తరణ నియామకాల కోసం 3,25,000-3,50,000 కంటే ఎక్కువ నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ వృద్ధిలో 60% పైగా అగ్రశ్రేణి ఐటీ సంస్థల నుంచి రావచ్చు’’ ఎక్స్ఫెనో ఐటీ స్టాఫింగ్ బిజినెస్ హెడ్ సుందర్ ఈశ్వర్ పేర్కొన్నారు.ఆర్థిక అనిశ్చితులు, ఖర్చు-అవసరాల కారణంగా మొత్తం నియామకాల్లో ఫ్రెషర్లు గణనీయమైన భాగాన్ని కలిగి ఉండే అవకాశం ఉందని టీమ్లీజ్ డిజిటల్ బిజినెస్ హెడ్ కృష్ణ విజ్ తెలిపారు. పెద్ద ఐటీ సంస్థలు ఇప్పటికే ఫ్రెషర్ హైరింగ్లో గణనీయమైన పెరుగుదలను సూచించాయి. FY25లో టీసీఎస్ 40,000 మంది, హెచ్సీఎల్ టెక్ 10,000 మంది, ఇన్ఫోసిస్ లిమిటెడ్ 15,000-20,000 మంది విప్రో 12,000 మంది వరకు ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ప్రకటించాయి. -
ఐటీ పుంజుకోదా..? ఎకనామిక్ సర్వే ఏం చెప్పిందంటే..
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో నియామకాలు గణనీయంగా మందగించాయని, ఇవి మరింతగా తగ్గకపోయినప్పటికీ గణనీయంగా పుంజుకునే అవకాశం లేదని ఆర్థిక సర్వే పేర్కొంది.దశాబ్దాల తర్వాత తొలిసారిగా కొన్ని పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో హెడ్కౌంట్ క్షీణించిన తరుణంలో ఆర్థిక సర్వేలో ఐటీ రంగంపై ప్రస్తావించారు. ఫిబ్రవరిలో, టెక్ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం కేవలం 60,000 కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని పేర్కొంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం సృష్టించిన 2,70,000 ఉద్యోగాలతో పోలిస్తే చాలా తక్కువ.అయితే ప్రభుత్వం చేపట్టిన ప్రోత్సాహక కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవడం, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఎక్కడా లేని సామర్థ్యాన్ని సంగ్రహించడం ద్వారా వ్యాపార, కన్సల్టెన్సీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతులను విస్తరించవచ్చని ఆర్థిక సర్వే పేర్కొంది. -
ఐటీలో కోతల కాలం!
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఉద్యోగం.. ఒకప్పుడు ఉద్యోగార్థుల కలల ప్రపంచం.. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వస్తే చాలు రెండు చేతులా సంపాదన, వీకెండ్ పార్టీలు, అప్పుడప్పుడూ టూర్లు. ఇక కరోనా వచ్చాక వర్క్ ఫ్రం హోం సౌలభ్యం. ఆ కలలన్నీ ఇప్పుడు సన్నగిల్లుతున్నాయి.. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం, రాజకీయ సంక్షోభం వంటి కారణాలతో ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఎడాపెడా తొలగించేస్తున్నాయి. ఖర్చు తగ్గించుకునే నెపంతో పింక్ స్లిప్ ఇచ్చేసి ఇంటికి పంపేస్తున్నాయి. ఇక కొత్తగా ప్లేస్మెంట్స్ ఇచ్చే విషయంలోనూ మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఒకవేళ రిక్రూట్ చేసుకున్నా ఆఫర్ లెటర్ ఇవ్వడం లేదు. అన్ని కంపెనీలదీ అదే బాట.. కరోనా సంక్షోభం తర్వాత ఐటీ రంగంలో చాలా ఒడిదుడుకులు వచ్చాయి. 2022, 2023 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 వేల కంపెనీలు 4 లక్షల పైచిలుకు ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు https://layoffs.fyi అనే సంస్థ వెల్లడించింది. ఉద్యోగాల కోత 2024లోనూ కొనసాగుతోంది. 2024లోమే నాటికి 326 కంపెనీలు 98 వేల మందికి కత్తెరవేశాయి. పెద్ద కంపెనీలే కాదు స్టార్టప్స్ సైతం ఇదే బాట పట్టాయి. ఇక కొన్ని కంపెనీలైతే నష్టాలను భరించలేక ఏకంగా తమ కార్యకలాపాలను నిలిపేశాయి. డెల్ కంపెనీ గత ఏడాది 13వేల మందికి పింక్ స్లిప్ ఇవ్వగా, ఈ ఏడాది 6వేల మందిని సాగనంపింది. టెస్లా కంపెనీలో ఎలాన్ మస్క్ రాత్రికి రాత్రే తమ ఉద్యోగులను ఇంటికి పంపుతున్నట్టు మెయిల్స్ పంపారు. దీంతో వందలాది మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. మైక్రోసాఫ్ట్ 1,900 మందికి కోతపెట్టగా, తీవ్ర నష్టాల ఊబిలో కూరుకుపోయిన బైజూస్ 500 మందిని తొలగించింది. ఇంకా యాపిల్, డెల్, సోనీ, సిస్కో, స్విగ్గీ, యూట్యూబ్, గూగుల్, డుయోలింగో కంపెనీలు కూడా తమ సిబ్బందిని తగ్గించుకున్నాయి. ఇన్నొవేషన్ వల్లేనా.. ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెరి్నంగ్ (ఎంఎల్), ఆటోమేషన్ వల్ల ఉత్పాదకత పెరుగుతుందని అందరూ భావించారు. వీటి వాడకం వల్లే ఉద్యోగాల్లో కోత పడుతోందని లేఆఫ్స్ సంస్థ విశ్లేషించింది. ఇన్నొవేషన్ మూలంగా ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని అంటున్నారు. అయితే అందుకు అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకుంటే ఉద్యోగ భద్రత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఉద్యోగుల పనితీరును అంచనా వేసిన తర్వాతే అడ్జస్ట్మెంట్లో భాగంగా కంపెనీలు ఉద్యోగాల్లో కోత పెడతాయని అంటున్నారు. మంచి పర్ఫార్మెన్స్ చూపించినా.. కంపెనీకి క్లయింట్స్ లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులున్నా కూడా తొలగించేస్తారు. ప్రాజెక్టులు లేకపోవడం కూడా ఉద్యోగులపై ప్రభావం పడుతుంది. ఎంతగా పర్ఫార్మెన్స్ చూపించినా కూడా వారికి అవసరం లేకపోయినా.. బడ్జెట్ లేకపోయినా ఉద్వాసన పలుకుతారు. ఎప్పుడు ఉద్యోగం తొలగిస్తారోనన్న భయంతో ఉద్యోగం చేయాల్సి వస్తోంది. –మౌనిక, సాఫ్ట్వేర్ డెవలపర్, హైదరాబాద్ ఇద్దరి పని ఒక్కరిపైనే.. ఎజైల్ స్క్రమ్ మెథడాలజీ వ్యవస్థతో ఉద్యోగుల పనితీరును ప్రతి రోజూ అంచనా వేస్తుంటారు. ఇచి్చన టార్గెట్ను ఎప్పటికప్పుడు పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే అందుకు కారణాలను పై అధికారులకు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకటి రెండుసార్లు ఇలాగే జరిగితే చెప్పాపెట్టకుండా తొలగించేస్తారు. కంపెనీపై ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ఇద్దరి ముగ్గురి పని కూడా ఒకరిపైనే వేసి.. మిగిలిన వారికి పింక్ స్లిప్ ఇస్తున్నారు. ఐటీ రంగం ఇప్పుడు అంత ఆశాజనకంగా లేదు. –పల్లె నరేశ్, ప్రిన్సిపల్ ఇంజనీర్ తప్పని పరిస్థితుల్లోనే.. కాస్త ఇబ్బందికరమే అయినా కంపెనీ ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగుల పనితీరు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని లే ఆఫ్స్ ప్రకటిస్తుంటాం. ఆర్థిక మాంద్యం ప్రభావాలను తట్టుకోవడం మార్కెట్లో పోటీ, ఆర్థికంగా స్థిరంగా ఉండేందుకు తప్పని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తుంది. చాలా కంపెనీల్లో ఖాళీలు ఉన్నప్పటికీ నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కొరత చాలా ఉంది. సాంకేతికతకు అనుగుణంగా ఉద్యోగులు కూడా నైపుణ్యాలు నేర్చుకోకపోతే ఉద్యోగాలు కోల్పోక తప్పని పరిస్థితి ఉంది. –కీర్తి రెడ్డి, బోల్డ్ ఫ్యూజ్ కంపెనీ సీఈవో, వ్యవస్థాపకురాలు -
నాడు ఏడాదికి 2 లక్షలు.. ఇప్పుడు 60 వేలు
సాక్షి, హైదరాబాద్: భారత సాఫ్ట్వేర్ కంపెనీలు గత రెండు దశాబ్దాల్లోనే అత్యల్పంగా... 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఫ్రెషర్స్కు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, ఐటీ సేవల ఆర్డర్లు తగ్గుదలతో దేశీయ ఐటీ రంగం ఇప్పటికే ఇబ్బందుల్లో పడగా, తాజా పరిణామాలు మరింత ఆందోళన పరుస్తున్నాయి.కోవిడ్కు ముందు ఏడాదికి 2 లక్షల మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ను సాఫ్ట్వేర్ కంపెనీలు హైర్ చేయగా.. ఇప్పుడది 60–70 వేలకు పడిపోయింది. ఇదేకాకుండా వివిధ ఐటీ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన 10 వేల మందికి పైగా విద్యార్థులు ఆఫర్లెటర్స్తో ఉద్యోగాల్లో చేరేందుకు ఎదురుచూపులు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఐఐటీలతో సహా ప్రతిష్టాత్మక కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కు ప్లేస్మెంట్స్ గణనీయంగా తగ్గాయి. ఈ హైరింగ్లకు పెద్ద ఐటీ కంపెనీలు దూరంగా ఉండటంతో కాలేజీల యాజమాన్యాలు సైతం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అయితే, ఈ పరిస్థితుల్లోనూ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్, విద్యార్థులు ఐటీ వైపే మొగ్గు చూపడం ఓ చిక్కుముడిగా మారుతోంది. ఇదీ వాస్తవ పరిస్థితి... దేశంలో ఐటీ రంగంలో ఫ్రెషర్స్ అవకాశాల కల్పన తగ్గుదలకు సంబంధించి ఎక్స్–ఫెనో అనే హెచ్ఆర్ సంస్థ అధ్యయనం నిర్వహించింది. క్యాంపస్ ప్లేస్మెంట్లకు సంబంధించి గతేడాది నుంచి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు వివిధ కాలేజీల యాజమాన్యాలు చెప్పాయి. పెద్ద కంపెనీలు మార్చి, ఏప్రిల్లో ఫ్రెషర్స్ను రిక్రూట్ చేసుకునే ప్రక్రియలో భాగంగా అంతకు ముందు ఏడాది జూలై, ఆగస్టుల నుంచే డిగ్రీ పూర్తిచేయబోయే విద్యార్థులకు ట్రయల్స్ నిర్వహించడం ఆనవాయితీగా ఉంది. అయితే ఈసారి క్యాంపస్లకు వచ్చేందుకూ కంపెనీలు సుముఖతను వ్యక్తంచేయకపోవడం యాజమాన్యాలు, విద్యార్థులను కలవరపరుస్తోంది. దాదాపు 70 శాతం విద్యార్థులు ఐటీ ఉద్యోగాలనే కోరుకుంటున్నా.. అందుకు తగ్గట్లు రిక్రూట్మెంట్ జరగకపోవడం వారిని నిరాశకు గురిచేస్తోంది. 2023లో కోర్సులను పూర్తిచేసిన విద్యార్థులను కూడా కొన్ని కంపెనీలు ఇంకా ప్లేస్మెంట్స్కు పరిగణనలోకి తీసుకోలేదని అంటున్నారు. మొత్తంగా చూస్తే గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 70–80 శాతం దాకా ఆన్క్యాంపస్ హైరింగ్ తగ్గిపోయినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా వస్తున్న అవకాశాల్లో 85 శాతం దాకా ఏడాదికి రూ.3–6 లక్షల లోపు ప్యాకేజీల్లోనే వస్తున్నాయని చెబుతున్నారు. మరో 6 నెలలు ఇలాగే ఉండొచ్చు.. కనీసం వచ్చే ఆరునెలల దాకా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశాలున్నాయి. ఫ్రెషర్స్కు డిమాండ్ పెరిగే అవకాశాలపై ఇప్పుడే చెప్పలేం. కానీ రాబోయే రోజుల్లో పరిస్థితి మెరుగయ్యే అవకాశముంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగింపు, ఇజ్రాయెల్– హమాస్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగడం, వచ్చే నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు, యూఎస్, ఇతర దేశాల్లో వడ్డీరేట్లు ఎక్కువగా ఉండటం అనే అంశాలు ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. అదీగాక, ఉద్యోగాలపై కృత్రిమమేథ (ఏఐ) పాత్ర ఎలా ఉంటుందనే విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. 2008లోనూ ఇదే విధమైన గందరగోళ పరిస్థితులు ఎదురయ్యాయి. సాంకేతికంగా సమూలమార్పులు వస్తుండటంతో, అప్గ్రేడేషన్ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఆటోమేషన్ పెరుగుదలతో క్లౌడ్, అనలిటిక్స్ తదితరాలకు గణనీయంగా డిమాండ్ పెరిగింది. –వెంకారెడ్డి, వైస్ప్రెసిడెంట్, సీనియర్ హెచ్ఆర్ లీడర్, కో ఫోర్జ్ ఇప్పట్లో కొత్త ప్రాజెక్ట్లు కష్టమే.. ఫ్రెషర్స్, ఇంజనీరింగ్ విద్యార్థులు తమ సమయాన్ని వృథా చేసుకోకుండా నాన్ఐటీ ప్రాజెక్టులు, హెల్త్కేర్ సర్విసెస్, హాస్పిటల్ ఇన్సూరెన్స్ కలెక్షన్ వంటి వాటిపై దృష్టి పెట్టాలి. కంటెంట్ మోడరేషన్, మ్యాపింగ్ వంటి వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఫ్రెషర్స్ 2025 సంవత్సరమంతా కూడా లర్నింగ్ జాబ్గా చూసుకుని, ఇండియాలోనే ఎంబీఏ, డేటా/బిజినెస్ అనలిటిక్ వంటి కోర్సులు చేస్తే మంచి అవకాశాలు వస్తాయి.అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాక... వడ్డీరేట్లు తగ్గించడం మొదలుపెడితే అక్కడ ఆర్థిక మాంద్యం మొదలయ్యే సూచనలున్నాయి. అందువల్ల మరో 6 నుంచి 9 నెలల దాకా అక్కడి నుంచి కొత్త ప్రాజెక్టులు రాకపోవచ్చు. ప్రస్తుతం దేశీయ సర్విస్ ప్రొవెడర్ సంస్థలు ‘డేటా మైగ్రేషన్’ ప్రాజెక్ట్లపై ఆధారపడుతున్నాయి. రాబోయేరోజుల్లోనూ ఈ ప్రాజెక్ట్లు పెద్ద ఎత్తున రాబోతున్నాయి. –ఎన్.లావణ్యకుమార్, సహ వ్యవస్థాపకుడు, స్మార్ట్స్టెప్స్ -
ఫస్ట్టైమ్.. ఐటీని వెనక్కినెట్టిన బ్యాంకింగ్
దేశంలో ఐటీ రంగాన్ని వెనక్కి నెట్టి బ్యాంకింగ్ రంగం సరికొత్త మైలురాయిని సాధించింది. తొలిసారిగా 2024 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగం నికర లాభం రూ. 3 లక్షల కోట్లను అధిగమించింది. లిస్టెడ్ పబ్లిక్, ప్రైవేట్ రంగ బ్యాంకుల సంయుక్త నికర లాభం 2023 ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ. 2.2 లక్షల కోట్లతో పోలిస్తే 39 శాతం పెరిగి రూ. 3.1 లక్షల కోట్లకు చేరుకుందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.ఐటీ రంగాన్ని దాటి.. ఇటీవలి కాలంలో సాంప్రదాయకంగా అత్యంత లాభదాయక రంగంగా ఉన్న ఐటీ సేవల రంగాన్ని బ్యాంకుల లాభాలు అధిగమించాయి. 2024లో లిస్టెడ్ ఐటీ సేవల కంపెనీలు రూ. 1.1 లక్షల కోట్ల నికర లాభాన్ని నమోదు చేశాయి. ఇది బ్యాంకులు ఆర్జించిన లాభాల కంటే చాలా తక్కువ.ప్రభత్వ, ప్రైవేట్ బ్యాంకుల లాభాలు ఇలా.. ఏడాది కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు స్థాయిలో రూ.1.4 లక్షల కోట్ల నికర లాభాన్ని సాధించాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 34 శాతం పెరిగింది. ఇదిలా ఉండగా, ప్రైవేట్ రంగ బ్యాంకుల నికర లాభం 42 శాతం పెరిగి దాదాపు రూ.1.7 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది ఏడాది క్రితం రూ.1.2 లక్షల కోట్లుగా ఉంది.ప్రధాని ట్వీట్ దేశంలో బ్యాంకింగ్ రంగం రికార్డ్ స్థాయి లాభాలు సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘గత 10 సంవత్సరాలలో చెప్పుకోదగ్గ మలుపు. భారతదేశ బ్యాంకింగ్ రంగ నికర లాభం మొదటిసారిగా రూ. 3 లక్షల కోట్లు దాటింది. బ్యాంకుల లాభాలు మెరుగుపడటం పేదలు, రైతులు, ఎంఎస్ఎంఈలకు రుణ లభ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది’ అని పేర్కొన్నారు.In a remarkable turnaround in the last 10 years, India's banking sector net profit crosses Rs 3 lakh crore for the first time ever.When we came to power, our banks were reeling with losses and high NPAs due to the phone-banking policy of UPA. The doors of the banks were closed…— Narendra Modi (@narendramodi) May 20, 2024 -
హెచ్1–బీ వీసాదారులకు తీపికబురు
వాషింగ్టన్: అమెరికాలోని ఐటీ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. గూగుల్, మెటా, ఆపిల్, డెల్, ట్విటర్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రఖ్యాత కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. నాన్–ఇమ్మిగ్రెంట్లను తొలగిస్తున్నాయి. ఫలితంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా అమెరికాలో 237 ఐటీ కంపెనీలు 58,499 మందిని తొలగించాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. లే–ఆఫ్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ప్రధానంగా హెచ్–1బీ వీసాలతో అమెరికా ఐటీ కంపెనీల్లో పని చేస్తున్న భారతీయుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. కంపెనీ యాజమాన్యం జాబ్ నుంచి తొలగిస్తే 60 రోజుల్లోగా మరో ఉద్యోగం వెతుక్కోవాలి. లేకపోతే స్వదేశానికి వెళ్లిపోవాల్సిందే. ఇలాంటి వారికి యూఎస్ సిటిజెన్íÙప్ అండ్ ఇమిగ్రేషన్ సరీ్వసెస్(యూఎస్సీఐఎస్) తీపి కబురు అందించింది. హెచ్–1బీ వీసాదారులు ఉద్యోగం పోతే 60 రోజులు దాటినా కూడా అమెరికాలోనే చట్టబద్ధంగా ఉండొచ్చని వెల్లడించింది. అయితే, నాన్–ఇమిగ్రెంట్ వీసా స్టేటస్ మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికాలోనే ఉన్న జీవిత భాగస్వామిపై డిపెండెంట్గా మారొచ్చు. అంటే హెచ్–4, ఎల్–2 వీసా పొందొచ్చు. ఈ వీసాలు ఉన్నవారికి పని చేసుకొనేందుకు(వర్క్ ఆథరైజేషన్) అనుమతి లభిస్తుంది. స్టూడెంట్(ఎఫ్–1), విటిటర్ (బి–1/బి–2) స్టేటస్ కూడా పొందొచ్చు. కానీ, బి–1/బి–2 వీసా ఉన్నవారికి పని చేసుకొనేందుకు అనుమతి లేదు. 60 రోజుల గ్రేస్ పిరియడ్లోనే వీసా స్టేటస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలని యూఎస్సీఐఎస్ సూచించింది. -
నిస్సిగ్గుగా నిజాలను కాలదన్ని..
చంద్రబాబు హయాంలో ఏమీ సాధించలేకున్నా... ప్రగతి పరుగులు తీసిందంటూ తప్పుడు రాతలు. పరిస్థితులు దిగజారినా... రాష్ట్రం పురోగమిస్తుందంటూ అడ్డగోలు అబద్ధాలు. ఐటీ కంపెనీ ఒక్కటైనా తీసుకురాలేకపోయినా... ఏదో సాధించారంటూనిస్సిగ్గుగా కితాబులు. ఇదీ పచ్చముసుగు వేసుకున్న రామోజీ పత్రికలో నిత్యం అచ్చవుతున్న అసత్య కథనాల తీరు. అదే జగన్ హయాంలో ఎంత ఉన్నతంగా ఎదిగినా... ఏమీలేదంటూ కబోది వ్యాఖ్యానాలు. కళ్లముందే దానికి సంబంధించిన రుజువులున్నా... దాచిపెట్టి అడ్డగోలు రోతలు. అవాస్తవాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తూ... జనానికి ఏమీ తెలియదులే అన్న అహంకార ధోరణి. ఇదీ రోజూ ఈనాడులో వండివారుస్తున్న అబద్ధాలు. గడచిన ఐదేళ్లలో ఐటీరంగం రాష్ట్రంలో అభివృద్ధి సాధిస్తే ‘కల్పతరువును కాలదన్నారు’ అంటూ అభాండాలు వేసేశారు. వాస్తవాలేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం... సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా ఐటీ రంగం వేగంగా విస్తరిస్తోంది. కరోనా వంటి విపత్కర పరిస్ధితుల్లో అంతర్జాతీయంగా ఐటీ రంగం కుదేలైనా రాష్ట్రంలో ఆ సమస్య ఎదురుకాలేదు. బహుళజాతి సంస్థలైన ఇన్ఫోసిస్,విప్రో,భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్ వంటి సంస్థలు విశాఖలో డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయగా, రాండ్స్టాండ్ వంటి అంతర్జాతీయ సంస్థలు విశాఖ కేంద్రంగా కార్యకలాపాలను ప్రారంభించాయి. రాష్ట్రానికి 65కు పైగా కొత్త కంపెనీలు రాగా విశాఖలో డబ్ల్యూఎన్ఎస్, పల్సస్ గ్రూపులు భారీగా విస్తరించాయి. టెక్ మహీంద్రా విశాఖ నుంచి తన కార్యకలాపాలను విజయవాడకు విస్తరించింది. ‘ఐటీకి పితామహుడిని నేనే... సైబర్బాద్ను నేనే సృష్టించా...’ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు పాలనలో విశాఖకు వచ్చిన ఐటీ దిగ్గజం ఒక్కటంటే ఒక్కటైనా లేదు. ఆయన సీఎం పదవి ముగిసేనాటికి రాష్ట్రంలో ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 27,643 అయితే ఇప్పు డు ఆ సంఖ్య 75,551కు చేరింది. చంద్రబాబు దిగిపోయే నాటికి ఉన్న ఐటీ ఉద్యోగుల్లో సగంమందికి పైగా దివంగత నేత ముందుచూపుతో విశాఖ, కాకినాడ, విజయవాడల్లో అభివృద్ధి చేసిన∙ఐటీ పార్కుల్లో పనిచేస్తున్నవారే. కానీ ప్రస్తుత వైఎస్ జగన్ హయాంలో ఐటీ రంగంలో 47,908 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభించినా కళ్లకు గంతలు కట్టుకున్న రామోజీకి అవేవీ కనిపించడం లేదు. పైగా ప్రజలను తప్పుదారి పట్టించేలా ఐటీ పాలసీ తుస్ అంటూ గురువారం ఒక అబద్ధాన్ని వండివార్చారు. తెలంగాణతో పోలికెందుకు రామోజీ... 2014–19 మధ్య చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రానికి తీసుకువచ్చిన ఒక్క కంపెనీ పేరు కూడా ఆ కథనంలో రాసుకోలేకపోయారు. ఎంతసేపూ ప్రస్తుత ప్రభుత్వంపై విషం చిమ్మాలన్నదే వారి దుగ్ధ. అందుకే పొరుగు రాష్ట్రం తెలంగాణతో పోలుస్తూ అబద్దాలు అచ్చేశారు. బాబు పాలనలో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉంటే ఆయన ఎందుకు ఉద్ధరించడానికి కృషి చేయలేదు? ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబు నాయుడు వల్లే కదా విశాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కేవలం హైదరాబాద్ను మాత్రమే ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలువునా ముంచేసిన విషయం రాష్ట్ర ప్రజలు మరచిపోయారనుకుంటున్నారా? రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా కేవలం అమరావతి పేరుతో గ్రాఫిక్స్ చూపించి ఐటీ రంగాభివృద్ధిని గాలికి వదిలేసిన విషయం ఇక్కడి యువత గమనించలేదనుకుంటున్నారా? పైగా ఇప్పుడు ఐటీ రంగంలో విశాఖ పురోగమిస్తుంటే తప్పుడు కథనాలతో జనాన్ని ఏమార్చడానికి యత్నిస్తారా? నాడు ప్రచారం... నేడు ప్రోత్సాహం... చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఇంక్యుబేషన్ సెంటర్ పేరుతో ప్రచారానికే పరిమితం చేసి స్టార్టప్లలో రాష్ట్రం చతికిలబడితే వైఎస్ జగన్ ప్రభుత్వం స్టార్టప్ల ప్రోత్సాహానికి అనేక చర్యలు చేపట్టింది. స్టార్టప్లకు మెంటార్షిప్, ఫండింగ్, ఇండస్ట్రీ కనెక్ట్లతో పాటు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే విధంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలి నాలుగో తరం పారిశ్రామిక రంగం ఇండస్ట్రీ 4కు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ‘‘కల్పతరువు’’ పేరిట విశాఖలో ఏర్పాటు చేసింది. దీంతోపాటు నాస్కామ్ సహాయంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల స్టార్టప్ల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను కూడా విశాఖలో ఏర్పాటు చేసింది. ఆంధ్రా యూనివర్సిటీలో ఓ హబ్, ఓడల నిర్మాణంపైన, మెడ్టెక్ జోన్లోనూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేసింది. ఈ విధంగా ఐటీ రంగంలో విశాఖను కల్పతరువుగా మార్చేలా ప్రభు త్వం చర్యలు తీసుకుంటే యువతను నైరాశ్యంలో నెట్టివేసేలా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈనాడు రామోజీ రాస్తున్న తప్పుడు రాతలను ప్రజలు గమనిస్తున్నారు. మూడు రెట్లు పెరిగిన స్టార్టప్ల సంఖ్య నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకువస్తూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల ఏర్పాటుతో రాష్ట్రంలో స్టార్టప్ల సంఖ్య భారీగా పెరిగింది. వీటి ద్వారా సాంకేతిక నిపుణులైన యువత స్వయం ఉపాధి పొందడమే గాకుండా, వేలాది మందికి ఉద్యోగాలూ వస్తున్నాయి. గడచిన ఐదేళ్లలో రాష్ట్రంలో స్టార్టప్ల సంఖ్య మూడు రెట్లకు పైగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వరంగ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఆ సంస్థ తాజా గణాంకాల ప్రకారం.. 2019లో రాష్ట్రంలో 161 స్టార్టప్లు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 586కు పెరిగింది. వీటిలో పనిచేసే ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగింది. 2019లో 1,552 మంది పనిచేస్తుండగా, ఆ సంఖ్య ఇప్పుడు 5,669కు చేరింది. -
నేను సాధించగలను అనే పట్టుదల ఉన్న వారికి ఏ ఫీల్డ్ అయినా ఒకటే
ఫీల్డ్ మారడం అనేది మంచి నీళ్లు తాగినంత సులభం కాదు.కాస్త అటూ ఇటూ అయితే మూడు చెరువుల నీళ్లు తాగాల్సి ఉంటుంది.‘నేను సాధించగలను’ అనే పట్టుదల ఉన్న వారికి మాత్రం ఏ ఫీల్డ్ అయినా ఒకటే. అలాంటి ప్రతిభావంతులలో తేజ ఒకరు. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా పనిచేసిన తేజ ఐటీ రంగంలోకి అడుగుపెట్టి టెక్ లీడర్గా మంచి పేరు సంపాదించింది. కర్ణాటకలోని బెల్గాంలో పెరిగిన తేజ మనకమె డాక్టర్ అయిన తండ్రి నుంచి విజ్ఞానప్రపంచానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకునేది. డిఐవై (డూ ఇట్ యువర్ సెల్ఫ్) పాజెక్ట్స్ చేసేది. కర్ణాటక యూనివర్శిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కోర్సు చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తొలిసారిగా నాన్–మెడికల్ ఏరియాలలో మహిళల కోసం ద్వారాలు తెరుస్తున్న సమయం అది. తన సీనియర్స్ ఎయిర్ ఫోర్స్లో చేరిపోయారు. వారిని యూనిఫామ్లో చూడడం తేజాకు ఎగ్టయిటింగ్గా అనిపించింది. వారి స్ఫూర్తితోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి వచ్చింది. బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ కాలేజీలోప్రాథమిక శిక్షణ తరువాత మౌంట్ అబూలో పాస్టింగ్ ఇచ్చారు. మౌంట్ అబూ స్టేషన్లోని ఉద్యోగులలో ఇద్దరు మాత్రమే మహిళలు. అందులో తాను ఒకరు. మహిళల కోసం ప్రత్యేక వాష్ రూమ్స్ ఉండేవి కావు. ఇలాంటి సమస్యలు ఎన్ని ఉన్నా ఎప్పుడూ నిరాశపడేది కాదు తేజ,మౌంట్ అబూ తరువాత నాసిక్, బెంగళూరులలో కూడా పనిచేసింది. మన దేశాన్ని ఐటీ బూమ్ తాకిన సమయం అది.ఐటీ ఫీల్డ్లో ఉన్న సోదరుడు తేజాతో ఆ రంగానికి సంబంధించి ఎన్నో విషయాలు పంచుకునేవాడు. దీంతో ఐటీ రంగంపై తనకు ఆసక్తి పెరిగింది. అలా ఎయిర్ ఫోర్స్ను వదిలి ఐటీ రంగంలోకి అడుగు పెట్టింది. టీసీఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్)లో డెవలపర్గా చేరింది. ఫ్రెషర్గా ఐటీ రంగంలో కెరీర్ మొదలు పెట్టిన తేజ అక్కడ ఎన్నో విషయాలు నేర్చుకుంది. ఆ తరువాత టెక్నాలజీస్లో పనిచేసింది. 2005లో డెల్ టెక్నాలజీలో మేనేజర్గా చేరింది. ఒక్కోమెట్టు ఎక్కుతూ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (ఐటీ) స్థాయికి చేరింది. జెండర్ స్టీరియో టైప్స్ను బ్రేక్ చేస్తూ డెల్ ఐటీ–ఇండియాలో కీలక స్థానంలో చేరిన తొలి మహిళగా గుర్తింపు ΄పోందింది.డెల్ ఫౌండేషన్లో సేల్స్ అండ్ మార్కెటింగ్, సప్లై చైన్, డేటా సైన్స్... మొదలైన విభాగాల్లో పట్టు సాధించింది. సీఎస్ఆర్ యాక్టివిటీస్పై బాగా ఆసక్తి చూపేది. ‘టెక్నాలజీ సహాయంతో ఎన్నో మంచిపనులు చేయవచ్చు’ అంటున్న తేజ రకరకాల స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది. కోవిడ్ మహమ్మారి సమయంలో బుద్ద ఫౌండేషన్తో కలిసి వలస కార్మికులకు పునరావాసం కల్పించింది.‘ప్రతి మహిళకు ఒక రోల్మోడల్, మెంటర్ ఉండాలి. అప్పుడే ఎన్నో విజయాలు సాధించగలరు’ అంటున్న తేజ డెల్లో ‘మెంటర్ సర్కిల్ కాన్సెప్ట్’ను అమలు చేసింది. ప్రతి సర్కిల్లో కొందరు మహిళలు ఉంటారు. వారికో మెంటర్ ఉంటారు. ఈ సర్కిల్లో తమ సమస్యలను చర్చించుకోవచ్చు, సలహాలు తీసుకోవచ్చు. ఒకరికొకరు సహాయంగా నిలవచ్చు. ‘ఇంజినీరింగ్ కాలేజీలో క్లాసులో నలుగురు అమ్మాయిలు మాత్రమే ఉండేవాళ్లం. ఇప్పటి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మా కుటుంబంలో నేను ఫస్ట్ ఉమెన్ ఇంజనీర్ని. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు. ఒక ముక్కలో చెపాలంటే సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఇది ఆహ్వానించదగిన మార్పు. నేను నేర్చుకున్న విషయాల ద్వారా ఇతరులకు ఏ రకంగా సహాయం చేయగలను అని ఎప్పటికప్పుడు ఆలోచిస్తుంటాను. టైమ్ మేనేజ్మెంట్కు సంబంధించి ఎన్నో సమావేశాలు నిర్వహించాను’ అంటుంది తేజ. -
Fact Check: రాష్ట్ర ప్రగతికి ‘రామోజీ’ పొగ
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రగతికి రామోజీ పొగ పెడుతున్నారు. ఐటీ రంగంలో రాష్ట్రం అభివృద్ధి చెందకుండా విష ప్రచారంతో అడ్డుకుంటున్నారు. గత నాలుగు నెలలుగా ఈనాడులో నెలకో అసత్య కథనంతో ప్రగతికి ప్రతిబంధకంగా మారారు. శనివారమూ ఇలాగే ఓ విష కథనం ప్రచురించి యువతను, ఐటీ సంస్థలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు హయాంలో ఐటీ రంగం ఏమాత్రం అభివృద్ధి చెందకపోయినా ఒక్క ముక్కా రాయని రామోజీ.. ఇప్పుడు అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వచ్చినా తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారు. చంద్రబాబు హయాంలో హెచ్సీఎల్ తప్ప (అది కూడా 2020 మార్చిలో ప్రారంభమైంది) తప్ప పేరున్న ఒక్క ఐటీ సంస్థా రాలేదు. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించింది. విప్రో కూడా డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభిస్తోంది. అమెజాన్, బీఈఎల్, రాండ్ శాండ్, టెక్నోటాస్క్, ఐజెన్ అమెరికా సాఫ్ట్వేర్, టెక్బుల్, కాంప్లెక్స్ సిస్టమ్స్ వంటి అనేక సంస్థలు వచ్చాయి. అదో పెద్ద కుంభకోణం డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్స్ పథకాన్ని రద్దు చేశారంటూ ఈనాడు గోల పెట్టింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ఓ పెద్ద కుంభకోణం. ఎటువంటి కంపెనీలూ రాకపోయినా రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా పథకాన్ని రూపొందించారు. ఈ పథకం కింద నిర్మించిన భవనాల్లో కంపెనీలు రాకపోతే 70 శాతం అద్దెను, అది కూడా బిల్డర్ ఎంత నిర్ణయిస్తే అంత రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. అందుకే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. మూడు రెట్లు పెరిగిన అంకురాలు అంకుర సంస్థలు మూడు రెట్లు పెరిగాయని శుక్రవారమే రాజ్య సభలో కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి చెప్పినప్పటికీ.., కళ్లకు, చెవులకు గంతలు కట్టుకున్న రామోజీ రాష్ట్ర యువత మెదళ్లలోకి విషం ఎక్కించే ప్రయత్నం చేశారు. 2019లో రాష్ట్రంలో 161 స్టార్టప్లు ఉండగా ఇప్పుడు 586కు చేరాయి. వీటిలో ఉద్యోగుల సంఖ్య 1,552 నుంచి 55,669కు పెరిగింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా నాలుగో పారిశ్రామిక రంగం ఇండస్ట్రీ 4కు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని కల్పతరవు పేరిట విశాఖలో ఏర్పాటు చేశారు. అక్కడ పెద్ద ఎత్తున స్టార్టప్లు వస్తున్నాయి. అలాగే నాస్కామ్ సహాయంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల స్టార్టప్ల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఏ హబ్, ఓడల నిర్మాణంపైన, మెడ్టెక్ జోన్లోనూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేశారు. విశాఖ నుంచి హెస్ఎస్బీసీ వెళ్లిపోయిందంటూ ఈనాడు వాపోయింది. వాస్తవంగా చైనాకు చెందిన ఆ సంస్థ విశాఖే కాదు.. దేశంలోని అన్ని కార్యాలయాలను మూసివేసింది. ఆ భవనంలో డబ్ల్యూఎన్ఎస్ కార్యాలయం నడుస్తోంది. ఐబీఎం వెళ్లిపోయిందంటూ ఈనాడు మరో అబద్ధం అచ్చేసింది. వాస్తవానికి ఐబీఎం అనుబంధ సంస్థ ఐబీఎం దక్ష 2007లో విశాఖలో ఏర్పాటైంది. ఆ తర్వాత ఐబీఎం దానిని కన్సంట్రిక్స్ అనే సంస్థకు విక్రయించింది. కన్సంట్రిక్స్ విశాఖ వెలుపల కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఇప్పుడు ఆ బిల్డింగ్లో ఇన్ఫినిటీ అనే సంస్థ పనిచేస్తోంది. 65 కంపెనీలు 47,908 మందికి ఉద్యోగాలు గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో ఐటీ రంగంలో కొత్తగా 65 కంపెనీలు ఏర్పాటైనట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. వీటి ద్వారా కొత్తగా 47,908 మందికి ఉద్యోగాలొచ్చాయి. 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 27,643 కాగా, ఇప్పుడు 75,551 మందికి పెరిగింది. వైఎస్ జగన్ ప్రభుత్వ సహకారంతో దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి రావడంతోపాటు ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు విస్తరణ చేపట్టాయి. విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించిన టెక్ మహీంద్రా విజయవాడకు విస్తరించింది. హెచ్సీఎల్ విజయవాడ నుంచి తిరుపతికి విస్తరించింది. విశాఖలో ఉన్న డబ్ల్యూఎన్ఎస్, పల్సస్ ఐడీఏ వంటి 30కి పైగా ఐటీ కంపెనీలు విస్తరణ చేపట్టాయి. 2012లో 50 మందితో ప్రారంభమైన డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సరీ్వసెస్ ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 3,300 దాటింది. వీరిలో 2,000 మంది ఉద్యోగులు గత రెండేళ్లలోనే చేరినట్లు ఆ సంస్థ సీఈవో కేశవ్ ఆర్ మురుగేష్ స్వయంగా ప్రకటించారు. 2019లో 40 మందితో ప్రారంభించిన తమ సంస్థలో ఉద్యోగుల సంఖ్య 4,200 దాటినట్లు పల్సస్ సీఈవో గేదెల శ్రీనుబాబు తెలిపారు. రాష్ట్రంలో ఐటీ రంగం ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు కాన్సెప్ట్ సిటీలు ఏర్పాటు చేస్తోంది. ప్రైవేటు రంగంలో ఐటీ పార్కులనూ ప్రోత్సహిస్తోంది. రూ.21,844 కోట్లతో అదానీ డేటా సెంటర్, భారీ ఐటీ టవర్ను ఏర్పాటు చేస్తోంది. రహేజా గ్రూపు ఇనార్బిట్ మాల్తో పాటు ఐటీ టవర్ నిరి్మస్తోంది. ఏపీఐసీసీ రూ.2,300 కోట్లతో మధురవాడలో 19 ఎకరాల్లో ‘ఐ స్పేస్’ పేరుతో ఐటీ టవర్ నిరి్మస్తోంది. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఐటీ రంగానికి సంబంధించి 65 ఎంవోయూలు జరిగాయి. ఈ ఒప్పందాల ద్వారా రూ. 28,867 కోట్ల పెట్టుబడులతో పాటు 1.14,255 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. నిక్సీ వస్తే వెలుగులే విశాఖ కేంద్రంగా నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజి ఆఫ్ ఇండియా (నిక్సీ) ద్వారా ఇంటర్నెట్ ఎక్స్చేంజి కార్యకలాపాలు మొదలు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇటీవలే నిక్సీ బృందం విశాఖను సందర్శించింది. విశాఖలో ఈ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభించేందుకు అన్ని అవకాశాలూ పుష్కలంగా ఉన్నాయని నిర్ధారించింది. ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఏర్పాటైతే ఇతర రాష్ట్రాల నుంచి డేటా కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. తక్కువ ఖర్చుతో కూడిన నాణ్యమైన, వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందుతాయి. తద్వారా అనేక కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభిస్తాయి. -
ఎమ్మెస్.. టైమ్ పాస్!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం ఐటీ రంగాన్ని కుదిపివేస్తున్న నేపథ్యంలో భారతీయ విద్యార్థులు విదేశీ చదువులపై దృష్టి పెట్టారు. సాఫ్ట్వేర్ రంగం గాడిన పడే వరకూ ఎంఎస్ చేయడమే మేలని భావిస్తున్నారు. ఈ కారణంగా ఈ ఏడాది విదేశీ విద్యకు వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగింది. కరోనా నేపథ్యంలో 2021 విద్యా సంవత్సరంలో 4.44 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తే, 2022లో ఈ సంఖ్య ఏకంగా 6.84 లక్షలకు పెరిగింది. 2023 చివరి నాటికి ఈ సంఖ్య మరో 10 వేల వరకు పెరిగిందని అంచనా. అమెరికా వంటి దేశాల్లో ఐటీ సెక్టార్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని తెలిసినా.. ఈ ఒక్క దేశానికే 2023లో 2.80 లక్షల మంది భారతీయులు విద్య కోసం వెళ్ళారు. మరోవైపు కెనడా వీసా ఆంక్షలకు నిబంధనలు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు వార్తలొస్తున్నా, చదువు కోసం వెళ్ళేందుకే విద్యార్థులు ఇష్టపడుతున్నారు. ఎందుకీ పరిస్థితి..? దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 12 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మార్కెట్లోకి వస్తున్నారు. వీరిలో కేవలం 8 శాతం మందికి మాత్రమే నైపుణ్యం ఉన్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. బహుళజాతి కంపెనీల్లో మంచి వేతనంతో ఉద్యోగాలు పొందుతున్నది వీళ్ళే. మిగతా వాళ్ళు వచ్చిన ఉద్యోగంతో సంతృప్తి పడుతున్నారు. సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఏదో ఒక సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకుని సంబంధం లేని ఉద్యోగానికి వెళ్తున్నారు. ఇంతకాలం వీళ్ళ అవసరం ఉండేది. అవసరమైన శిక్షణ ఇచ్చి కంపెనీలు వారి సేవలను వినియోగించుకునేవి. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. అమెరికాలో వచ్చిన ఆర్థిక సంక్షోభం ప్రభావం భారత్ ఐటీ రంగంపైనా ప్రభావం చూపించింది. ప్రధాన కంపెనీలన్నీ వరుసగా లే ఆఫ్లు ప్రకటించడంతో ఐటీ విభాగం కుదేలైంది. క్యాంపస్ నియామకాలు తగ్గాయి. కొన్ని కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చినా ఉద్యోగాలుమాత్రం ఇవ్వలేదు. దీంతో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు ఆఫ్ క్యాంపస్ ఉద్యోగాలు వెతుక్కోవాల్సి వస్తోంది. పోటీ తీవ్రంగా ఉండటంతో ఫ్రెషర్స్ పోటీని తట్టుకుని నిలబడటం కష్టంగా ఉంది. ఈ కారణంగానే విదేశాల్లో విద్యాభ్యాసానికి వెళుతున్నారు. సమయం వృథా ఎందుకుని.. చాలా కంపెనీలు ఏడాది క్రితం ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కు ఆఫర్ లెటర్స్ ఇచ్చాయి. కానీ చాలా సంస్థలు ఇంత వరకూ నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. నాస్కామ్ తాజాగా జరిపిన ఓ సర్వేలో ఇలాంటి వాళ్ళు భారత్లో 2.5 లక్షలు ఉంటారని తేలింది. మన రాష్ట్రంలోనే 24 వేల మందికి పైగా ఉన్నట్టు స్పష్టమైంది. మరో వైపు అమెరికా ప్రాజెక్టులు తగ్గుతున్నా యని కంపెనీలు చెబుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో నియామక ఉత్తర్వులు వస్తాయన్న భరోసా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉండటం దేనికి? అని యువత భావిస్తోంది. ఒకవేళ ఖాళీగా ఉంటే ఆ తర్వాత జాబ్లోకి తీసుకోవడానికి కంపెనీలు అంతగా ఆసక్తి చూపవు. దీన్ని దృష్టిలో ఉంచుకునే పరిస్థితి చక్కబడే వరకూ ఎమ్మెస్ లాంటిది చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. లభించని బ్యాంకు రుణాలు విదేశీ విద్యకు గతంలో తేలికగా రుణాలు లభించేవి. కానీ గత ఏడాది కాలంగా బ్యాంకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదనిన విద్యార్థులు అంటున్నారు. బ్యాంకు రుణాల విధానాన్ని సవరించడమే దీనికి కారణమని బ్యాంకర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్ళేందుకు అవసరమైన సెక్యూరిటీ మొత్తం, అక్కడి ఖర్చుల కోసం ఒక్కో విద్యార్థి కనీసం రూ.40 లక్షల వరకూ అప్పు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని విదేశాల్లో చదివేటప్పుడు తీర్చేద్దామన్న ధీమాతో వెళ్తున్నారు. విదేశాల్లో ఏదైనా పార్ట్టైం జాబ్ చేయొచ్చనేది వారి ఆలోచన. కానీ గతేడాది డిసెంబర్లో వెళ్ళిన విద్యార్థులకు అమెరికాలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. పార్ట్ టైం ఉద్యోగాలు దొరకడం కూడా కష్టంగా ఉందని అక్కడి విద్యార్థులు చెబుతుండటం గమనార్హం. ఐటీ కోలుకోవడంపైనే ఆశలు బీటెక్ పూర్తయ్యాక ఇండియాలో ఏడాది పాటు ఉద్యోగం కోసంవిఫల ప్రయత్నం చేశా. చివరకు అమెరికా వెళ్ళి ఎమ్మెస్ చేయాలని నిర్ణయించుకున్నా. ఇంట్లో అర ఎకరం పొలం అమ్మి డబ్బులిచ్చారు. నేను కొంత అప్పు చేశా. డిసెంబర్లో అమెరికా వచ్చా. ఇక్కడ పార్ట్ టైం జాబ్ కష్టమని కన్సల్టెన్సీలు చెబుతున్నాయి. మళ్ళీ అప్పు చేయమని తల్లిదండ్రులకు చెప్పడం ఇబ్బందిగానేఉంది. ఐటీ కోలుకుంటే పరిస్థితి మారుతుందనే నమ్మకం ఉంది. –శశాంక్ (అమెరికా వెళ్ళిన వరంగల్ విద్యార్థి) ఏడాది క్రితం ఆఫర్ లెటర్ ఇచ్చారు బీటెక్ అవ్వగానే ఆఫ్ క్యాంపస్లో ఓ కంపెనీ ఉద్యోగం ఆఫర్ చేసింది. ఉద్యోగం వచ్చిందని నేను, మా వాళ్ళూ బంధువులందరికీ చెప్పుకున్నాం. ఆ లెటర్ పట్టుకుని ఏడాది నిరీక్షించా. ఎంతకీ అపాయింట్మెంట్ ఆర్డర్ రాలేదు. ఇప్పుడు చిన్నతనంగా ఉంది. అందుకే అప్పు చేసి మరీ అమెరికా వెళ్ళేందుకు సిద్ధమవుతున్నా. ఎమ్మెస్ అయిపోయే లోగా పరిస్థితి మారుతుందనే ఆశ ఉంది.– పి. నీలేశ్ కుమార్ (యూఎస్ వెళ్ళేందుకు సిద్ధమైన హైదరాబాద్ విద్యార్థి) -
కొత్త ఏడాదీ కోతలేనా?
ఆర్థిక మాంద్యంతో ఇబ్బందులు తప్పేలా లేవంటూ ఆందోళన.. ఉద్యోగాలు తొలగించేందుకు సిద్ధమవుతున్న కంపెనీలు మరోవైపు వ్యయాన్ని తగ్గించుకునేందుకు ఏఐ వైపు మొగ్గు.. 2023లో ప్రపంచ వ్యాప్తంగా 2.40 లక్షల మంది తొలగింపు (సాక్షి ప్రత్యేక ప్రతినిధి) కొత్త సంవత్సరంలోనూ ఐటీ రంగానికి గడ్డు పరిస్థితేనా? ఆశించిన మేరకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం లేదా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. పలు అంతర్జాతీయ సంస్థలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 2023లో దాదాపు 2.40 లక్షల మంది లే ఆఫ్ల పేరుతో, తొలగింపు పేరుతో ఉద్యోగాలు కోల్పోయారు. ఇక వచ్చే సంవత్సరంలోనూ పరిస్థితి ఆశాజనకంగా ఉండే అవకాశం కనిపించడం లేదని, ఆర్థిక మాంద్యం ప్రభా వం ఈ రంగంపై ఎక్కువగా కనిపిస్తుందని, కోతలు తప్ప వని అంటున్నారు. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగం ఎక్కువ ఉద్యోగా లను కల్పిస్తుందా? లేక ఉన్న ఉద్యోగాల తొలగింపునకు కారణం అవుతుందా అన్నది కూడా కొత్త సంవత్సరంలో తేలనుంది. తాజాగా మ్యూజిక్ స్పాటిఫై ఏకంగా 1,500 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఆ స్థానంలో ఏఐని ఉపయోగించనుంది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో వ్యయా లను సాధ్యమైనంతగా తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఉన్న ఉద్యో గాల తొలగింపు, కొత్త ఉద్యోగాల కల్ప నకు మొగ్గు చూపకపోవడం లాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఫ్రెషర్స్కు ఉద్యోగాలు రాని పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో మాదిరిగా క్యాంపస్ రిక్రూట్మెంట్లు కన్పించడం లేదు. గతంలో ప్రతి యేటా 40 నుంచి 80 శాతం వరకు కొత్త ఉద్యోగులను చేర్చుకోవడానికి సంస్థలు ముందుకు వచ్చేవని, కానీ ఇప్పుడు ఇది బాగా తగ్గిపోయినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏఐ నైపుణ్యాన్ని పెంచుకోవాలి.. వివిధ కంపెనీల పరిస్థితిని పరిశీలిస్తే.. ప్రముఖ స్టార్టప్ కంపెనీ, 4.1 బిలియన్ డాలర్ల విలువగల డేటామిర్ సంస్థ మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో తన సంస్థలోని 20 శాతం ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైంది. సంఖ్యాపరంగా పెద్దగా కనిపించక పోయినా పలు స్టార్టప్ కంపెనీలు క్యాష్ఫ్లో ఇబ్బందులను ఎదు ర్కొంటున్న నేపథ్యంలో.. మానవ వనరుల తగ్గింపునకే మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. క్లార్నా సీఈవో సెబాస్టియన్ సిమి యాకోవిస్కీ.. ‘డజన్ల కొద్దీ ఉద్యోగులను నియమించుకునే కంటే ఒక ఏఐతో పని కానియ్యొచ్చు’ అన్నారంటే దాని ప్రభావం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్లార్నా సంస్థ ‘పర్సనల్ ఫైనాన్స్ అసిస్టెంటెన్స్’ కార్యకలాపాలను అందిస్తోంది. తాజాగా వచ్చిన ‘రాన్స్టడ్ రైజ్స్మార్ట్ గ్లోబల్ సెవరెన్స్’ నివేదిక ప్రకారం.. ఈ ఏడాదిలో 96 శాతం సాఫ్ట్వేర్ సంస్థలు ఉద్యోగులను తగ్గించే కార్యక్రమాలు చేట్టాయి. ఏఐతో నిర్వహణప్రమాణాలు పెరిగా యని, కొత్త ఆవిష్కరణలకు అవకాశం ఏర్పడుతున్నదని నివేదిక వెల్లడించింది. అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏఐ నైపుణ్యాన్ని పెంచుకుంటే వారి ఉద్యోగాలకు ఢోకా ఉండదని తేల్చి చెప్పింది. 2023లో ఉద్యోగాలకు కోత పడగా, అదే సమయంలో ఏఐపై పెట్టుబడులు పెరిగాయని తెలిపింది. ‘ఐటీ కంపెనీలు ప్రధానంగా స్టాక్ మార్కెట్లపై, రుణాలపై ఆధారపడి ఉంటాయి. తెచ్చుకున్న రుణాలపై వడ్డీరేట్లు పెరిగితే భారం పెరుగుతుంది. అలాగే స్టాక్ మార్కెట్లో ఆ సంస్థ స్టాక్ పడిపోయినా ఆర్థిక ఇబ్బందులు వచ్చి పడతాయి. తద్వారా లే ఆఫ్లు అనివార్యం అవుతున్నాయి..’ అని రోమి గ్రూప్ ఎల్ఎల్సీ మేనేజింగ్ డైరెక్టర్ నిక్ గౌస్లింగ్ చెబుతున్నారు. భారతీయ కంపెనీలకు పురోగమనావకాశాలు ప్రస్తుతం ఐటీ రంగంలో ఇన్వెస్టర్లు ముందుకు రావడం లేదు. వారు పెట్టుబడులు పెట్టే ముందు ప్రధానంగా టెక్నాలజీ కొనడమో, అప్గ్రేడ్ చేయడమో చేస్తుంటారు. యూఎస్, ఐరోపాతో పాటు ఇతర దేశాల్లో మార్కెట్ను పరిశీలిస్తే సిలికాన్ వ్యాలీ బ్యాంక్, క్రెడిట్ సుయిజ్ బ్యాంక్ వంటివి క్షీణతకు గురయ్యాయి. ముఖ్యంగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ విషయానికొస్తే ప్రపంచవ్యాప్తంగా అనేక స్టార్టప్ కంపెనీలపై ఇన్వెస్ట్ చేసింది. ఐతే పెట్టుబడు లకు తగ్గట్టుగా ఈ కంపెనీల నుంచి రిటర్న్లు రాకపోవడంతో సంస్థ పడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సెకండ్, థర్డ్ స్టేజ్ పెట్టుబడులు ఆగిపోయి స్టార్టప్లపై తీవ్ర ప్రభావం పడింది. తదుపరి కార్యాచరణలు, ముందుకెళ్లడాలు నిలిచిపోయాయి. ఫండింగ్ నెమ్మదించి ఆయా స్టార్టప్లలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి తలెత్తింది. ఔట్సోర్సింగ్లో సపోర్టింగ్ ఉన్న యూఎస్లోని గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి సంస్థలపై కూడా ప్రభావం పడింది. ఇక ఏఐ, చాట్ జీపీటీ వల్ల కూడా ఖర్చు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే భారతీయ కంపెనీలు రాబోయే మూడు, నాలుగు నెలల్లో పరిస్థితులు మారి పురోగమనం వైపు అడుగులు వేసే అవకాశాలున్నాయి. ఇక గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్ (జీసీసీ) ద్వారా టార్గెటెడ్ టెక్నాలజీ వైపు మొగ్గు పెరుగుతోంది. వీటి విషయానికొస్తే మన దేశంలోని నగరాలు మరీ ముఖ్యంగా హైదరాబాద్ ఈ సెంటర్లకు హబ్గా మారనుంది. – వెంకారెడ్డి, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ హెచ్ఆర్ లీడర్, కోఫోర్జ్ ఏడాది చివర్లో స్లో డౌన్ సహజం ఏడాది చివర్లో ఐటీ రంగం కొంత స్లోడౌన్ కావడం సహజమే. వచ్చే ఏడాది కూడా ఐటీ పరిశ్రమ ఔట్ సోర్సింగ్పైనే అధికంగా ఆధారపడాల్సి ఉంటుంది. ఐటీ రంగంలో ఉద్యోగాలు లేకపోవడం అనే కంటే.. మారుతున్న అత్యాధునిక సాంకేతికతలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకుని సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేకపోవడమనేదే సమస్య. జనరేటివ్ ఏఐ, ఆటోమేషన్, క్లౌడ్ల ద్వారా వర్క్ఫోర్స్ తమ నైపుణ్యాలను మార్చు కునేలా చేయగలగడం ఐటీ సంస్థలకు పెద్దసవాల్. వీటి ద్వారా సంస్థలకు ప్రాజెక్ట్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. రాబోయే రోజుల్లో డేటా సెంటర్స్పై, ఏఐ వంటి సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్పై, ఐటీ సర్వీసెస్పై పెట్టుబడులు పెరుగుతాయి. 2024లో ఐటీ మార్కెట్ వృద్ధి ప్రపంచ వ్యాప్తంగా 8 శాతం, భారత్లో 10 శాతం ఉంటుందని ప్రతిష్టాత్మక గార్ట్నర్ సంస్థ తన నివేదికలో అంచనా వేసింది. – రమణ భూపతి, క్వాలిటీ థాట్గ్రూప్ చైర్మన్, ఎడ్టెక్ కంపెనీ -
ఐటీ ఉద్యోగులకు గుడ్న్యూస్.. కంపెనీల ఆటలు ఇక సాగవు!
ఏకపక్ష తొలగింపులు, ఐడీ బ్లాక్ చేయడం, సామూహిక ఉపసంహరణ, లైంగిక వేధింపులు, అధిక పని గంటలు వంటి ఇబ్బందలు ఎదుర్కొంటున్న ఐటీ ఉద్యోగులకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ బాసటగా నిలిచింది. ఉద్యోగులను వేధించే ఐటీ కంపెనీల ఆట కట్టిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-ఎనేబుల్డ్ సర్వీసెస్ (ఐటీఈఎస్) రంగంలో కంపెనీలు ఉద్యోగుల పట్ల అనుచిత విధానాలు అనుసరిస్తున్న నేపథ్యంలో వీటిని రాష్ట్ర కార్మిక శాఖ పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తోంది. చాలా ఐటీ కంపెనీల్లో ఏకపక్ష తొలగింపులు, ఐడీ బ్లాక్ చేయడం, సామూహిక ఉపసంహరణ, లైంగిక వేధింపులు, అధిక పని గంటల వంటి విషయాలు కార్మిక శాఖ దృష్టికి వచ్చాయని అదనపు లేబర్ కమిషనర్ డాక్టర్ జి.మంజునాథ్ తెలిపారు. వీటిలో కొన్నింటిని లేబర్, ఇండస్ట్రియల్ కోర్టులకు రిఫర్ చేసినట్లు చెప్పారు. ఇక మినహాయింపు లేదు! 'సన్రైజ్ ఇండస్ట్రీస్'గా పరిగణిస్తున్న ఐటీ కంపెనీలకు కర్ణాటక పారిశ్రామిక ఉపాధి (స్టాండింగ్ ఆర్డర్స్) చట్టం-1946 నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా మినహాయింపు ఇస్తూ వస్తోంది. చివరిసారిగా 2019 మే 21న ఐదేళ్లపాటు ఈ మినహాయింపును పొడిగించింది. కానీ ఈసారి మినహాయింపును పొడిగించకుండా ఆయా కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు ఆయా కంపెనీలను శాఖ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కర్ణాటకలో మొత్తం 8,785 ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు ఉన్నాయి. వీటిలో దాదాపు 18 లక్షల మంది పనిచేస్తున్నారు. కోవిడ్ తర్వాత, కంపెనీల వేధింపులపై అనేక ఫిర్యాదులు డిపార్ట్మెంట్లో నమోదయ్యాయి. ఈ ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించడానికి, ఈ రంగంలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించడానికి పారిశ్రామిక ఉపాధి (స్టాండింగ్ ఆర్డర్స్) చట్టం-1946ని ఆయా కంపెనీలకు వర్తింపజేయడం అవసరమని అదనపు లేబర్ కమిషనర్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: బెంగళూరులో యాక్సెంచర్ ఏఐ స్టూడియో.. ఏంటిది.. ఏం చేస్తుంది? -
విశాఖలో అమెరికా దిగ్గజ ఐటీ అనుబంధ సంస్థ
సాక్షి, విశాఖపట్నం : ఐటీ రంగంలో దూసుకుపోతున్న విశాఖ నగరంలో మరో దిగ్గజ సంస్థ కొలువుదీరనుంది. అమెరికాలోని ప్రముఖ ఐటీ కంపెనీ ట్రినిటీ సంస్థ హెల్త్రైజ్ పేరుతో విశాఖలో ఐటీ అనుబంధ సంస్థ ఏర్పాటుకు ముందుకొచ్చి ంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ విషయాన్ని శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. ఎపిటా, ఏసీఎన్ ఇన్ఫోటెక్ అనే బీపీవో సంస్థ సహకారంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ సుముఖత వ్యక్తం చేసిందని తెలిపారు. ఇక్కడ 5 వేల మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్పారు. రుషికొండ ఐటీ హిల్స్లో మంత్రి అమర్నాద్తో హెల్త్రైజ్ సంస్థ సీఈవో డేవిడ్ ఫార్బ్మెన్, ఏసీఎన్ ఇన్ఫోటెక్ ఎండీ చమన్బైద్, ఎపిటా సీఈవో కిరణ్కుమార్రెడ్డి, ఏపీ ఐటీ సలహాదారు శేషిరెడ్డి శుక్రవారం రాత్రి భేటీ అయ్యారు. సంస్థ అందించే సేవలు, కల్పించే ఉద్యోగావకాశాలపై చర్చించారు. ఏపీని అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేయడంతో అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని మంత్రి అమర్నాథ్ చెప్పారు. బీచ్ ఐటీ కారిడార్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఏపీలో 300 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయని, ఏటా 1,20,000 మంది వివిధ కోర్సులు పూర్తి చేసుకుని బయటికి వస్తున్నారని తెలిపారు. ఇక్కడ ఇంజినీరింగ్ కాలేజీల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారని చెప్పారు. అమెరికాలోని వివిధ టెక్ కంపెనీలలో పని చేస్తున్న ప్రతి నలుగురిలో ఒక తెలుగువాడు ఉంటాడని అమెరికా సంస్థ బృందానికి వివరించారు. స్టార్టప్స్లోనూ తెలుగు విద్యార్థులు బాగా రాణిస్తున్నారన్నారు. విశాఖలో మెడ్ టెక్ జోన్ మెడికల్ రీసెర్చ్కు, వైద్య రంగంలో సరికొత్త విప్లవాన్ని సృష్టించేందుకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. హెల్త్రైజ్ సంస్థ సీఈవో డేవిడ్ మాట్లాడుతూ తమ సంస్థ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడిచేందుకు హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్కు సహకారం అందిస్తుందన్నారు. రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్, హెల్త్ కోడింగ్, వైద్య సంస్థలకు ఐటీ సర్విసులు సైతం అందించేలా విశాఖ నుంచి సంస్థ పనిచేస్తుందని తెలిపారు. -
కష్టాల్లో ఐటీ రంగం: టెకీ ఉద్యోగాలపై సంచలన నివేదిక
White collar tech jobs take backseat: వైట్ కాలర్ జాబ్అంటే ముందుగా గుర్తొచ్చేది టెక్ ఉద్యోగమే. అయితే టెక్ ఉద్యోగాలకు సంబంధించిన సంచలన నివేదిక ఒకటి ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకు మరింత ఆజ్యం పోసింది. జాబ్ మార్కెట్లో ఐటీ రంగానికి ఎదురు గాలి తప్పడం లేదు. ప్రస్తుత టెక్ రంగాల్లో నెలకొన్న సంక్షోభం కారణంగా వెట్ కాలర్ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి భారతీయ జాబ్ మార్కెట్లు 2,835 స్కోర్ను నమోదు చేశాయి, ఇది గత నెలతో పోలిస్తే దాదాపు 6 శాతం గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. సెప్టెంబర్ 2023కి సంబంధించిన నౌకరీ జాబ్స్పీక్ ఇండెక్స్ ప్రకారం, భారతదేశంలో ఉపాధి ధోరణి నెలవారీగా మెరుగుపడుతున్నట్లు కనిపిస్తోంది. కానీ వార్షిక ప్రాతిపదికన ఇంకా బలహీన ధోరణే కనిపిస్తొంది. గత ఏడాదితో పోలిస్తే 8.6 శాతం క్షీణత నమోదు చేసింది. అయితే అనేక రంగాలు వృద్ధిని కనబరిచడం ఊరటనిస్తోంది. ముఖ్యంగా హాస్పిటాలిటీ , అండ్ ట్రావెల్ రంగం 22 శాతం వృద్ధిని సాధించి స్టార్ పెర్ఫార్మర్గా అవతరించింది. ఇటీవలి నెలల్లో నియామకాల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఐటీ రంగం వెలవెలబోయింది. కష్టాల్లో ఐటీరంగం ప్రపంచ ప్రకంపనల మధ్య ఐటీ రంగం కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇటీవలి నెలల్లో నియామకాల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో, అయినప్పటికీ, బిగ్ డేటా టెస్టింగ్ ఇంజనీర్, IT, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ IT ఆపరేషన్స్ మేనేజర్ లాంటి ఉద్యోగాలకు అధిక డిమాండ్ ఉంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే వంటి ఐటీ-కేంద్రీకృత నగరాల్లో సెప్టెంబర్ 2023లో కొత్త జాబ్ ఆఫర్లు భారీగా తగ్గాయి. ఇప్పటికే దిగ్గజ ఐటీ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేపనిలో వేలాది మందిని తొలగించాయి. మెటా, అమెజాన్ సంస్థల తాజాగా మరో రౌండ్ కోతల వార్తలు ప్రపంచవ్యాప్తంగా టెకీలను ఆందోళనలో పడేస్తున్నాయి. హాస్పిటాలిటీ అండ్ ట్రావెల్ సెక్టార్ హాస్పిటాలిటీ అండ్ ట్రావెల్ సెక్టార్ గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే సెప్టెంబర్ 2023లో 22 శాతం వృద్ధితో టాప్ ప్లేస్ను ఆక్రమించింది. ఈ సీజన్లో చేసుకునే కుటుంబాలు ,ఒంటరి ప్రయాణీకు టూర్లు ఈ వృద్ధికి దోహదపడినట్టు తెలుస్తోంది. రెస్టారెంట్ మేనేజర్ , గెస్ట్ సర్వీసెస్ రోల్స్ వంటి ఉద్యోగాలు డిమాండ్ నేపథ్యంలో ముంబై ఈ రంగంలో ఉద్యోగ ఆఫర్లలో ముందుంది. BFSI ,ఆరోగ్య సంరక్షణ రంగాలు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్ (BFSI) సెక్టార్ , హెల్త్కేర్ సెక్టార్ కూడా కొంత పురోగతి సాధించాయి. ప్రతి ఒక్కటి సెప్టెంబర్ 2023లో సంవత్సరానికి 7 శాతం వృద్ధిని నమోదు చేశాయి. BFSI రంగంలో, అహ్మదాబాద్, చండీగఢ్ , జైపూర్ వంటి నగరాలు బ్రాంచ్ మేనేజర్ అండ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ వంటి పాత్రలకు డిమాండ్ పెరిగింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, BFSIలోని బ్యాంకింగ్ సబ్ సెగ్మెంట్ ఇదే కాలంలో 40 శాతం వృద్ధిని సాధించింది. హెల్త్కేర్ సెక్టార్లో, ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ రికార్డ్/ఇన్ఫర్మేటిక్స్ మేనేజర్ వంటి స్థానాలకు అధిక డిమాండ్ ఉంది. ఈ సెక్టార్లో హైరింగ్ ఊపందుకోవడంలో అహ్మదాబాద్, కోల్కతా ముందున్నాయి. ఆయిల్ & గ్యాస్ , ఆటో రంగాలు ఆయిల్ & గ్యాస్ , ఆటో రంగాలు కూడా సానుకూల ఉపాధి ధోరణులకు దోహదపడ్డాయి, గత సంవత్సరంతో పోలిస్తే సెప్టెంబర్ 2023లో రెండూ 6 శాతం వృద్ధిని నమోదు చేశాయి. BPO/ITES , FMCG రంగాలలో సవాళ్లు: మరోవైపు BPO/ITES, FMCG రంగాలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే సెప్టెంబర్ 2023లో వరుసగా 25 శాతం మరియు 23 శాతం ప్రతికూల వృద్ధిని సాధించింది. నాన్-మెట్రోలు షైన్ ఉద్యోగాల కల్పలనో మెట్రోలతు పోలిస్తే నాన్మెట్రో నగరాలుల మెరుగ్గా ఉండటం విశేషం. 2023, సెప్టెంబరులో ఉద్యోగాల కల్పనలో నాన్-మెట్రో నగరాలు మెట్రోలను అధిగమించాయి. వడోదర, అహ్మదాబాద్, జైపూర్ వంటి నగరాలు అదే నెలతో పోలిస్తే నియామకంలో వరుసగా 4 శాతం, 3, 2 శాతం వృద్ధిని నమోదు చేశాయి. గత సంవత్సరం. వడోదర BPO/ITES,యు కన్స్ట్రక్షన్/ఇంజనీరింగ్ సెక్టార్ హైరింగ్లో రాణించింది. మరోవైపు నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ సోమవారం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వార్షిక నివేదిక 2022-2023 ప్రకారం, 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న నిరుద్యోగిత రేటు దేశంలో జులై 2022-జూన్ 2023 మధ్యకాలంలో ఆరేళ్ల కనిష్టం వద్ద 3.2 శాతంగా నమోదైంది. -
స్కిల్ పెంచండి బాబులూ..!
స్కిల్స్ పలు రకాలు.. ఏ ‘స్కిల్’ ప్రమాదకరమో మొన్నీమధ్యే చూశాం కదా, అలాంటివి కాదు. మనకూ జనానికీ ఉపయోగపడేవి. ఆ స్కిల్స్ చూడండి సరదాగా... సేల్స్.. స్కిల్ ఓ పెద్దమనిషి, అరవై ఏళ్లకు పైబడి ఉంటాడు. జోరు వర్షంలో గొడుగేసుకుని ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పుస్తకాలు అమ్ముతున్నాడు. అప్ప టికే బాగా చీకటి పడింది. ఇది ఆసక్తిగా అనిపించి ఓ యువకుడు కారులోనుంచే.. ‘పుస్తకం ఎంత’ అని అడిగాడు. ‘మూడువేల రూపాయలు. కానీ, నీకు అమ్మబోను. నీకు ఈ పుస్తకం చదివే ధైర్యం ఉన్నట్టు లేదు,’ అన్నాడు ‘‘నాకు చాలా ధైర్యం ఉంది. గంటలో లాగించేస్తాను.’ – అన్నాడా యువకుడు కాస్త రోషంతో. ‘‘..అయితే ఒక షరతు మీద ఈ పుస్తకం నీకు అమ్ముతా, అది ఓకే అయితే నీకు ఓ వంద డిస్కౌంట్ కూడా ఇస్తా..’’ అన్నాడా పెద్దమనిషి ‘‘ఏమిటా షరతు?’’ ‘‘నువ్వు జన్మలో చివరి పేజీ చదవనని ఒట్టు వెయ్యాలి. ఎందుకంటే అది చదివి నువ్వు తట్టుకోలేవు. చాలా బాధపడతావు.’’ ‘‘ఓకే ప్రామిస్!.. నేను ధైర్యవంతుడినే అయినా, చివరి పేజీ చదవను, ఇదిగో డిస్కౌంట్ పోను 2,900 రూపాయలు. పుస్తకం ఇవ్వు..’’ అంటూ మనీ పెద్దమనిషి చేతిలో పెట్టాడు. పెద్దమనిషి డబ్బులు తీసుకుని పుస్తకం ఇస్తూ షరతు గురించి మళ్లీ గుర్తు చేశాడు. పుస్తకం తీసుకున్న యువకుడు ఇంటికి వెళ్లి భయం, భయంగా పుస్తకం చదివేశాడు. క్రైమ్ థ్రిల్లర్ బుక్ అది.. కొంచెం క్రైమ్, కొంచెం సస్పెన్స్ ఉన్నా... మరీ అంత భయంకరంగా లేదు. చివరి పేజీ ఎందుకు చదవ వద్దన్నాడా పెద్దమనిషి? దానిలో అంత తట్టుకోలేని బాధ ఏముంటది? అని మనవాడికి డౌట్ వచ్చింది. చదువుదామని మనసు పీకింది. కాస్త భయం వేసింది. ప్రామిస్ను పక్కన పెట్టి... గుండె దిటవు చేసుకుని భయం భయంగా చివరి పేజీ చూస్తే నిజంగానే గుండె ఆగినంత పనైంది.. ఆ చివరి పేజీలో ఇలా ఉంది ‘పుస్తకం ఖరీదు 50 రూపాయలు...’ ఇదీ సేల్స్ స్కిల్... అంతే కదా? ... ఇక ఈ తరహా తెలివితేటలు చూడండి. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. మేడిన్ ఇండియా! ఒకసారి అమెరికా కంపెనీలో సబ్బుల ఫ్యాక్టరీలో ఒక పొరపాటు జరిగింది. కొన్ని కవర్లు ప్యాక్ అయ్యాయి కానీ, అందులో సబ్బుల్లేవు. డీలర్లు, కస్టమర్ల గొడవ.. పెద్దగోలయ్యింది. దానితో యాజమాన్యం కంపెనీలో ఇలాంటి సమస్యలు ఇంకెప్పుడూ రాకూడదనీ, పరువు పోకూడదనీ జాగ్రత్త కోసం ఆరు కోట్లు పెట్టి ఎక్స్రే మెషీన్ కొన్నదట. ప్యాకైన సబ్బులు వెళుతుంటే అందులో సబ్బు ఉన్నదీ లేనిదీ ఆ మెషీన్ ద్వారా కనుక్కుని తీసేయడానికి వీలయ్యింది. ఈ విషయం హైదరాబాద్ సబ్బుల కంపెనీలో మీటింగ్లో ప్రస్తావనకు వచ్చింది. ఆ అమెరికా కంపెనీలో పనిచేసి ఇక్కడికి వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఒకరు ఆ దేశ టెక్నాలజీని, వాళ్ల స్కిల్ను. శ్రద్ధను చిలవలు పలవలుగా వివరిస్తున్నాడు. ఆ మీటింగ్లో చాయ్ బిస్కట్ ఎంజాయ్ చేస్తున్న మనోడు లేచి,‘‘ఎందుకు సర్ 6 కోట్లు తగలేశారు. ఓ 3వేలు పెట్టి ‘పెడెస్టెల్ ఫ్యాన్’ కొని స్పీడ్గా తిప్పితే ఖాళీ ప్యాకెట్లు ఎగిరిపోతాయిగా. పొరపాటున ఖాళీగా వచ్చేవి ఒకటీ రెండేగా’’... అనేసి మళ్లీ చాయ్ బిస్కట్ మీద పడ్డాడు. దీనితో అమెరికా ఎగ్జిక్యూటివ్ అవాక్కయ్యాడు. చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి.. అన్న సామెత అన్నిచోట్లా వర్తించదు. ఎంత పాముకు అంత కర్ర.. అదీ సరైన సమయంలో. – ఇదీ ఓ రకమైన జాబ్ స్కిల్లే కదా! నో స్కిల్... 81 పర్సెంట్... ఇంతకీ స్కిల్లు గురించి ఎందుకీ సొల్లు అంటారా? అత్యుత్తమ ఔట్పుట్ ఇవ్వగల నైపుణ్యాలు ఉద్యోగుల్లో ఉండటం లేదట. ఒకటో, రెండో కాదు.. ఐటీ రంగంలో ఏకంగా 81 శాతం సంస్థలు నైపుణ్యమున్న ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నాయని ఈవై, ఐమోచా సంస్థల అధ్యయనంలో వెల్లడైంది. మంచి నైపుణ్యాలు ఉన్న ఉద్యోగుల కోసం డిమాండ్ పెరుగుతోందని తేలింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల ఉద్యోగుల్లో పని నైపుణ్యాలు, కొత్త టెక్నాలజీలపై అవగాహన అంశాలపై ఈవై, ఐమోచా సంస్థలు అధ్యయనం నిర్వహించాయి. ‘టెక్ స్కిల్స్లో మార్పులు – ఆ తర్వాత పని పరిస్థితులు’ పేరిట ఇటీవల నివేదికను విడుదల చేశాయి. – ప్రస్తుత డిజిటల్ యుగంలో పోటీలో నిలిచేందుకు వీలుగా కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకుంటున్నాయనీ.. కానీ వాటికి తగినట్టుగా నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులు దొరకడం కష్టమవుతోందనీ నివేదిక వెల్లడించింది. ఒక్క ఐటీ రంగం మాత్రమే కాకుండా... బ్యాంకింగ్, ఫైనాన్స్, టెలికాం, డేటా అనాలసిస్ వంటి ఇతర రంగాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని స్పష్టం చేసింది. – అప్లికేషన్ డెవలపర్లు, పవర్ యూజర్ స్కిల్స్ ఉన్నవారికి డిమాండ్ పెరగడం కూడా కొరత నెలకొనడానికి కారణమని నివేదిక పేర్కొంది. స్కిల్ ఉంటేనే జాబులు... – సర్వేలో పాల్గొన్న చాలా సంస్థలు డెవలపర్, పవర్ యూజర్ నైపుణ్యాల కొరతను ఎదుర్కొంటున్నట్టు తెలిపాయి. కొత్త టెక్నాలజీలు, అవసరాలకు అనుగుణంగా ఏ ఉద్యోగానికి ఏ నైపుణ్యాలు తప్పనిసరి అనే విభజనను అనుసరిస్తున్నామని 19 శాతం కంపెనీలు తెలిపాయి. 43 శాతం కంపెనీలు ఉద్యోగుల స్థాయిలో నైపుణ్యాల పరిశీలన చేపట్టామన్నాయి. ఈ విభజన/పరిశీలన క్రమంలో చాలా మంది ఉద్యోగుల్లో అవసరమైన నైపుణ్యాలు లేనట్టుగా గుర్తించామని వెల్లడించాయి. ఈ క్రమంలో ఓవైపు ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం, మరోవైపు మంచి స్కిల్స్ ఉన్నవారిని చేర్చుకోవడంపై దృష్టి పెడుతున్నట్టు వివరించాయి. స్కిల్స్ పెంచేద్దాం... ప్రస్తుతం ఉద్యోగులు నిర్వర్తించాల్సిన విధులు, అందుకు అవసరమైన నైపుణ్యాల్లో ఎన్నడూ లేనంత వేగంగా మార్పులు వస్తున్నాయని ఈ అధ్యయనం చెబుతోంది. 2025 నాటికి తమ సంస్థల్లోని మూడో వంతు ఉద్యోగుల్లో సాంకేతిక నైపుణ్యాలను గణనీయంగా పెంపొందించాల్సిన అవసరం ఉందని 28 శాతం సంస్థలు భావిస్తున్నాయనీ వివరిస్తోంది. మరో 62శాతం కంపెనీలు కనీసం 15 శాతం మంది ఉద్యోగుల్లో నైపుణ్యాల పెంపు తప్పనిసరి అని భావిస్తున్నట్టు తెలిపారు. ఇండియాలోనూ అంతే.. భారతదేశంలోని 60 శాతానికి పైగా కంపెనీలు నైపుణ్యమున్న ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నట్టు ఇటీవలి ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్’ నివేదికలో ప్రపంచ ఆర్థిక సంస్థ (డబ్ల్యూఈఎఫ్) కూడా పేర్కొంది. ముఖ్యంగా చదువు పూర్తిచేసుకుని కొత్తగా ఉద్యోగాల్లోకి వస్తున్నవారికి తగిన నైపుణ్యాలు ఏమాత్రం ఉండటం లేదని వెల్లడించింది. ఉద్యోగుల్లో నైపుణ్యాల కల్పనకు తోడ్పడే అప్రెంటిస్షిప్, ఇంటర్న్షిప్, ఆన్ జాబ్ ట్రైనింగ్ వంటి వాటిని భారత్లో ఉపేక్షిస్తున్నారని పేర్కొంది. ముఖ్యంగా కంపెనీలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన స్కిల్స్ కల్పించేలా విద్యా రంగంలో సంస్కరణలు రావాల్సి ఉందని అభిప్రాయపడింది. సరికొండ చలపతి -
అలా.. APకి బోలెడు అవకాశాలు
ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంతవరకు ఇది చాలా ఆశాజనకమైన వార్త. ఏపీలో ఐటీ రంగం వ్యాప్తికి అనువైన వాతావరణం ఏర్పడుతోంది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాలు టైర్-2 అంటే.. ద్వితీయ శ్రేణి నగరాలుగా ఈ రంగంలో అభివృద్ది చెందబోతున్నాయని డెలాయిట్, నాస్కామ్ నివేదిక వెల్లడించింది. తెలంగాణలో వరంగల్ నగరం కూడా ఈ జాబితాలో ఉంది. తెలంగాణకు హైదరాబాద్ ఎలాగూ ఐటీ ప్రముఖ కేంద్రంగా ఉంది కనుక ఇక్కడ అభివృద్ది పుంతలు తొక్కడంలో ఇబ్బంది ఉండదు. హైదరాబాద్తో పాటు, దక్షిణాదిలో చెన్నై,బెంగుళూరులు కూడా ఐటీ కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. కాని ఆయా నగరాలలో భూమి ధరలు బాగా పెరిగిపోవడం ఒక ఇబ్బందిగా ఉంది. అద్దెలు అధికంగా ఉంటున్నాయి. ఉద్యోగులకు నివాసాలు ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. అయినా ఇక్కడి వాతావరణం, వివిధ కంపెనీలు ఇక్కడే స్థాపితం అవడం వల్ల ఐటి రంగం ఈ నగరాలలోనే కేంద్రీకృతం అయింది.ఈ నేపధ్యంలో ఖర్చులు తగ్గించుకోవడానికి కూడా ఆయా సంస్థలు ఆలోచన సాగిస్తున్నాయి.ఆ క్రమంలో దేశంలోని రెండో శ్రేణి నగరాల వైపు ఈ సంస్థలు దృష్టి పెడుతున్నాయి. అది ఏపీకి పెద్ద అవకాశంగా మారవచ్చు. ✍️ డెలాయిట్ నివేదిక శుభవార్తను అందించింది. దాని ప్రకారం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలో ఐటీ సంస్థలు తమ శాఖలను విస్తరించవచ్చని, అలాగే కొత్త సంస్థలు ఏర్పాటు చేసే అవకాశాలు పెరుగుతున్నాయని నివేదిక అభిప్రాయపడింది. విశాఖలో ఇప్పటికే 250 టెక్ సంస్థలు ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో నెలకొల్పబోతున్న అదానీ డేటా సెంటర్ కనుక ఒక రూపానికి వచ్చిందంటే.. ఐటీ రంగంలో విశాఖ దశ మారినట్లే అవుతుందని భావించవచ్చు. ఎందుకంటే ఈ సెంటర్ ఒక్కదానిలోనే సుమారు 15 వేల మందికి ఉద్యోగావకాశాలు రావచ్చు. విశాఖలో ఐటీ సంస్థల కోసం ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారు. స్టార్టప్స్ కూడా అధిక సంఖ్యలోనే ఉన్నాయి. సుమారు 1,100 స్టార్టప్స్ ఉన్నాయని అంచనా. ఎనిమిది ఇంక్యుబేటర్లు ఏర్పాటయ్యాయి. విశాఖ నగరానికి మల్టీకల్చరల్, కాస్మోపాలిటన్ సిటీగా పేరొంది. ముఖ్యమంత్రి జగన్ ఆశిస్తున్నట్లు కార్యనిర్వాహక రాజధాని మొదలైతే.. ఇంకా వేగంగా అభివృద్ది చెందుతుంది. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు, అలాగే విశాఖ నుంచి అనకాపల్లి, పాయకరావు పేట వరకు విస్తరణకు అవకాశం ఉంది. విశాఖకు సముద్ర తీరం ఉండడం కలిసి వచ్చే పాయింట్. టూరిజం రంగంలో కూడా విశాఖకు మంచి గుర్తింపే ఉంది. భవిష్యత్తులో విశాఖ ఐటి రంగంలో మరింత ప్రగతి సాధించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి: అభివృద్ధిలో హవా.. ఏపీ నుంచి మూడు ✍️ ఇక విజయవాడ ప్రాంతంలో ఓ మోస్తరుగా ఐటీ సంస్థలు ఉన్నాయి. విజయవాడ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న గన్నవరం వద్ద ఇప్పటికే ఒక ఐటీ భవనం ఉంది. అందులో కొన్ని సంస్థలు నడుస్తున్నాయి. ఏలూరు వరకు దీనిని విస్తరించడానికి అవకాశం ఉంది. గన్నవరం పక్కనుంచే విజయవాడకు బైపాస్ రోడ్డు వెళుతుంది. హైదరాబాద్, చెన్నై నగరాలకు వెళ్లడానికి ఇది అనువుగా ఉంటుంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి టైమ్లో ఐటీ భవనాన్ని నిర్మించారు. ఇక్కడకు సమీపంలోనే అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడం.. ఐటీ రంగ నిపుణులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. మరో నగరం తిరుపతిలో వేగంగా ఐటీ అభివృద్ది చెందుతోందని ఈ నివేదిక తెలిపింది. చెన్నైకి దగ్గరగా ఉండడం, భూమి అందుబాటులో ఉండడం,ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతుండడం వంటి కారణాల వల్ల ఐటి సంస్థలు కూడా ఆకర్షితం అవుతాయని అంచనా వేస్తున్నారు. విశాఖలో ఆంధ్రా యూనివర్శిటీ. ఐఐఎం. పెట్రో యూనివర్శిటీ తదితర విద్యా సంస్థలు, విజయవాడకు సమీపంలోనే నాగార్జున యూనివర్శిటీ, తిరుపతిలో ఐఐటీ, ఎస్వీ యూనివర్శిటీ ఉన్నాయి. అలాగే ప్రైవేటు రంగంలో పలు ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలు రాణిస్తున్నాయి. హైదరాబాద్, బెంగుళూరు,చెన్నైలలో పనిచేసే ఐటీ సంస్థ లకు ఎపి కాలేజీల నుంచి అనేక మంది రిక్రూట్ అవుతుంటారు.రెండో శ్రేణి నగరాలలో ఐటీని విస్తరించడం వల్ల కనీసం 25 శాతం వ్యయం తగ్గుతుందని అంటున్నారు. అలాగే కేంద్రీకృత అభివృద్ధి కాకుండా వికేంద్రీకరణకు కూడా అవకాశం ఉంటుంది. ఏపీ ప్రభుత్వం విద్యా రంగానికి విశేష ప్రాధాన్యత ఇస్తోంది. ఆంగ్ల మీడియంతో పాటు, అంతర్జాతీయ సిలబస్ను కూడా ప్రవేశపెట్టడానికి కృషి చేస్తోంది. అవన్నీ సత్ఫలితాలు ఇస్తే.. అక్కడ మరింతగా మెరికల్లాంటి నిపుణులు తయారవుతారు. అది కూడా ఈ నగరాలలో ఐటీ విస్తరణకు ఉపయోగపడవచ్చు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్, ఓడరేవు ఆధారిత పరిశ్రమలు, కొత్త పారిశ్రామిక క్లస్టర్లపై దృష్టి సారించింది. ఫార్మా రంగంలో ఏపీకి మంచి స్థానం ఉంది. కొత్తగా వస్తున్న నాలుగు ఓడరేవులు కూడా అభివృద్దికి దోహదపడతాయి. ఈ రంగాలన్నీ ఒకదానికి ఒకటి సహకరించుకునేలా సమన్వయం చేసుకోగలిగితే చాలా మేలు కలుగుతుంది. ఏది ఏమైనా ద్వితీయ శ్రేణి నగరాలైన విశాఖ, విజయవాడ, తిరుపతిలలో కొత్త అభివృద్దికి ఐటీ రంగం దోహదపడితే అంతకన్నా కావల్సి ఏముంటుంది?. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
జీతాల పెంపు: దిగ్గజ ఐటీ కంపెనీల ఉద్యోగులకు షాక్!
దేశీయ ఐటీ దిగ్గజాలు ఉద్యోగుల వేతనాల పెంపు విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆదాయం, ఖర్చులు లాంటి పలు సవాళ్లను ఎదుర్కొంటున్న పలు ప్రముఖ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల జీతాల పెంపునకు సంబంధించి భిన్నమైన నిర్ణయాలు తీసుకున్నాయి. దీంతో ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ ఉద్యోగులకు తీవ్ర నిరాశ ఎదురు కానుంది. ఈమేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనాన్ని వెలువరించింది. దీని ప్రకారం ఇన్ఫోసిస్, HCLTech ఈసారి పెంపును నిలిపివేసినట్టు సమాచారం. సాధారణంగా ఇన్ఫోసిస్ జీతాల పెంపును జూన్/జూలైలో ప్రకటించడం,అవి ఏప్రిల్ నుండి అమలు కావడం జరుగుతూ ఉంటుంది. అయితే హెచ్సిఎల్టెక్ మధ్య నుండి సీనియర్ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లను దాటవేసిందట.అలాగే జూనియర్ స్థాయి ఉద్యోగుల జీతాల పెంపును వాయిదా వేసింది. ఇన్ఫోసిస్ 023-24 ఆర్థిక సంవత్సరానికి గాను తన వృద్ధి అంచనాను 4- 7శాతంనుంచి 1-3.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. (ప్రౌడ్ ఫాదర్ జస్ప్రీత్ బుమ్రా నెట్వర్త్, లగ్జరీ కార్లు, ఈ వివరాలు తెలుసా?) భిన్నంగా టీసీఎస్, విప్రో: ఉద్యోగులకు ఊరట అయితే మరో టెక్ దిగ్గజం విప్రో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. మునుపటి సంవత్సరం సెప్టెంబర్తో పోల్చితే మూడవ త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంచనా. టెక్ మహీంద్రా జూనియర్ , మిడ్-లెవల్ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లను ఇచ్చింది. అయితే సీనియర్ల్లో పావు వంతు వాయిదా వేసింది. అటు మరో ఐటీ దిగ్గజం టీసీఎస్ కూడా గత ఏడాది మాదిరిగానే తన ఉద్యోగులకు ఊరటనిచ్చింది. వారికి 6-8శాతం వరకు సగటు పెంపును, అత్యుత్తమంగా పనిచేసిన వారికి రెండంకెల పెంపు ప్రకటించింది. టీసీఎస్తో పాటు మధ్యతరహా ఐటి సంస్థలైన కోఫోర్జ్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఎల్టిఐ మైండ్ట్రీ తమ ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. -
ముడుపులివ్వకపోతే మూడినట్లే!..
సాక్షి, అమరావతి: ‘‘అమరావతిలో రాజధాని భవనాల నిర్మాణ పనుల సమయంలో షాపూర్జీ పల్లోంజీ సంస్థ తరఫున నేను చాలాసార్లు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యేవాడిని. ఇలా కలుస్తున్న సమయంలో ఒకసారి ఆయన తన పీఏ పెండ్యాల శ్రీనివాస్ను పరిచయం చేశారు. ఇక నుంచి శ్రీనివాస్ చెప్పినట్లుగా నడుచుకోవాలని నన్ను ఆదేశించారు’’ అని ఆదాయపు పన్ను శాఖకు ఇచ్చిన స్టేట్మెంట్లో మనోజ్ వాసుదేవ్ పార్థసాని వెల్లడించాడు. తదనంతరం పీఏ శ్రీనివాస్ చంద్రబాబు నాయుడికి ముడుపులు ఏ రూపంలో ఎలా ఇవ్వాలో చెప్పేవారని, లేకపోతే తమ బిల్లులు పాస్ చెయ్యకుండా పెండింగ్లో పెట్టేవారని, చేసేదేమీ లేక చంద్రబాబుకు వందల కోట్ల రూపాయలు ముడుపులుగా ఇచ్చామని మనోజ్ పార్థసాని ఐటీ శాఖకు స్పష్టంగా చెప్పటంతో... రాజధానిలో తాత్కాలిక భవనాలను నిర్మిస్తున్నామనే ముసుగులో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాగించిన ముడుపుల దందా స్పష్టంగా బయటపడింది. కాంట్రాక్టు సంస్థలను బెదిరించి వాటి నుంచి వందల కోట్ల ముడుపులను షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు నాయుడు ఎలా తన జేబులో వేసుకున్నారో ఐటీ శాఖ సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది. మనోజ్ పార్థసానికి చెందిన కార్యాలయాలపై 2019లో సోదాలు జరిపిన ఐటీ శాఖ.... అదే ఏడాది నవంబరు 1, 5 తేదీల్లో ఆయన్ను విచారించి ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసింది. తదనంతరం ఆయన చెప్పిన వివరాల ఆధారంగా 2020లో చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ ఇల్లు, కార్యాలయాల్లో కూడా సోదాలు జరిపింది. అందులో చంద్రబాబు పాత్రను నిర్ధారించే పలు కీలక డాక్యుమెంట్లు దొరకటంతో... అలా ముడుపుల రూపంలో అందిన మొత్తాన్ని బయటకు వెల్లడించకుండా దాచిన అక్రమ ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలంటూ చంద్రబాబు నాయుడుకు నోటీసులిచ్చింది. నాకు నోటీసులిచ్చే అధికారం మీకు లేదంటూ చంద్రబాబు ఎదురు తిరగటంతో... ఐటీ శాఖ తాజాగా వివిధ చట్టాలను ఉటంకిస్తూ చంద్రబాబుకు మళ్లీ నోటీసులిచ్చింది. ఆ నోటీసులతో పాటు మనోజ్ పార్థసాని ఇచ్చిన స్టేట్మెంట్ను కూడా జత చేయటంతో చంద్రబాబు సాగించిన ముడుపుల దందా కళ్లకు కట్టినట్లు బయటపడింది. దీంతోపాటు అక్రమంగా రూ.118.98 కోట్లు చంద్రబాబు సొంత ఖాతాల్లోకి ఎలా చేరాయన్న విషయాన్ని ఐటీ శాఖ స్పష్టంగా ఓ పట్టిక రూపంలో వివరించింది. ఇంత స్పష్టమైన ఆధారాలున్నాయి కనక దీన్ని చంద్రబాబు సంపాదించిన అక్రమ ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. మనోజ్ పార్థసాని ఏం చెప్పారంటే... మనోజ్ పార్థసాని కార్యాలయంలో సోదాల అనంతరం ఆయన్ను ఐటీ శాఖ కొన్ని ప్రశ్నలడిగింది. దానికి ఆయనిచ్చిన సమాధానాలను రికార్డు చేసింది. ఆ ప్రశ్న జవాబులు ఎలా సాగాయంటే... ఐటీ శాఖ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మీరు తరచూ కలిసేవారా? ఎక్కడ? ఏం మాట్లాడుకునేవారు? ఎంవీపీ రాజధాని తాత్కాలిక భవనాల నిర్మాణ పనులు షాపుర్జీ పల్లోంజీ సంస్థకు దక్కాయి. ఆ సమయంలో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిని పలు సమావేశాలు, ప్రజంటేషన్ల సమయంలో కలిశాను. ఏపీ టిడ్కో ఇళ్ల నిర్మాణం (2017లో షాపూర్జీ పల్లోంజీ 1.40 లక్షల ఇళ్లను నిర్మించే కాంట్రాక్టును దక్కించుకుంటే 2019 మార్చి నాటికి కేవలం 23వేల ఇళ్ల నిర్మాణాన్నే పూర్తి చేసింది) ఈడబ్ల్యూఎస్ హౌసింగ్, హైకోర్టు నిర్మాణం, అమరావతి రాజధాని ప్రాంతంలో ఇతర విభాగాధిపతులు కార్యాలయాల నిర్మాణాల సమయంలో చంద్రబాబును పలు సందర్భాల్లో కలిశా. ఇవి పూర్తిగా ప్రభుత్వం నిర్వహించిన సమావేశాలు. ఏపీటిడ్కో, ఏపీ సీఆర్డీఏ వాళ్లు నిర్వహించే ఈ సమావేశాలకు షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధులతో కలిసి నేను హాజరయ్యాను.చంద్రబాబు నాయుడిని తొలిసారిగా వ్యక్తిగతంగా కలిసినప్పుడు... ఆయన 2019, ఫిబ్రవరిలో విజయవాడలోని తన ఇంటికి వచ్చి కలవాలని చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారం ఆయన ఇంటికి వెళ్లా. అక్కడకు వెళ్లి కలిసినపుడు రాజధానిలో జరుగుతున్న వివిధ నిర్మాణ పనుల స్థితి గతులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ను నాకు పరిచయం చేశారు. ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలని ఆదేశించారు. రూ.118 కోట్లకు లెక్కల్లేవని చంద్రబాబుకు ఐటీ జారీ చేసిన నోటీసుల్లో ఒక భాగం ఐటీ శాఖ చంద్రబాబు నాయుడు తరఫున శ్రీనివాస్ మీకు ఎలాంటి సూచనలిచ్చారు? ఎంవీపీ శ్రీనివాస్ నాకు కొన్ని కంపెనీల జాబితాను పంపిస్తానని చెప్పాడు. ఆ కంపెనీల ద్వారా ముడుపులు తరలించాలని చెప్పారు. శ్రీనివాస్ ఆదేశాల మేరకు సబ్ కాంట్రాక్టు పనులు పొందిన విక్కీజైన్ అనే వ్యక్తి టచ్లోకి వచ్చారు. విక్కీ జైన్ నయోలిన్, ఎవరెట్ అనే కంపెనీల పేర్లను ఇచ్చారు. శ్రీనివాస్ ఆదేశాల మేరకు మార్చి, 2019లో నన్ను విజయ్ నంగాలియా అనే వ్యక్తి కలిశారు. ముంబై కొలాబాలో ఉన్న షాపూర్జీ పల్లోంజీ ఆఫీసు బయట ఆయన నన్ను కలిశారు. నంగాలియా, హయగ్రీవ, అన్నై, షలాక కంపెనీలకు సబ్ కాంట్రాక్టు రూపంలో వర్క్ ఆర్డర్ల పేరిట ముడుపుల నగదు తరలించాల్సిందిగా సూచించారు. ఇలా తరలించిన నగదును విక్కి, వినయ్ నంగాలియాలు చంద్రబాబు నాయుడు ఎక్కడకు చేరవేయమంటే అక్కడకు చేరవేసేవారు. ఈ కంపెనీల్లోకి ఇంకా బోలెడంత నగదు వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? దాన్ని ఎక్కడకు తరలించారన్న సంగతులు నాకు తెలియవు. ఎందుకంటే కేవలం షాపూర్జీ పల్లోంజీ కంపెనీ నుంచి జరిగిన చెల్లింపుల వరకే నాకు తెలుసు. ఆ విషయం నాకు తెలుసు కనక దాన్ని శ్రీనివాస్కు చెప్పి... ఆ మొత్తం చంద్రబాబుకు చేరిందా లేదా అన్న విషయాన్ని కనుక్కునేవాడిని. ఐటీ శాఖ చంద్రబాబు నాయుడు, శ్రీనివాస్ చెప్పినంత మాత్రాన బోగస్ ఇన్వాయిస్ల ద్వారా నగదు తరలించడం తప్పు కదా? దాన్ని మీరు ఎందుకు వ్యతిరేకించలేదు? ఎంవీపీ శ్రీనివాస్ ఈ కంపెనీల ద్వారా బోగస్ బిల్లులతో నగదు తరలించాలని చేసిన ప్రతిపాదనను మొదట్లో నేను వ్యతిరేకించాను. షాపూర్జీ పల్లోంజి అనేది అతిపెద్ద కార్పొరేట్ సంస్థ అని, అవసరమైతే వాళ్లు అడిగిన మొత్తాన్ని నేరుగా పార్టీ ఫండ్ రూపంలోనే చెల్లిస్తుందని చెప్పాను. అప్పుడు వాళ్లు చాలా స్పష్టంగా చెప్పారు... ‘‘ఇది పార్టీ ఫండ్ కాదు. ఈ కంపెనీల ద్వారా మేం చెప్పిన వ్యక్తులకు నేరుగా నగదును తరలించాల్సిందే. ఒకవేళ మీరు గనక మా ఆదేశాలు పాటించకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని. నిజానికి అప్పటికే మేం రాజధానిలో చాలా ప్రాజెక్టుల్లో ఇరుక్కుపోయి ఉన్నాం. నడుస్తున్న అనేక ప్రాజెక్టులతో భారీగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లు చెప్పినట్లుగా వినటం తప్ప మాకు వేరే దారి కనిపించలేదు. -
ఫ్రెషర్లకు పెరిగిన ఉద్యోగ అవకాశాలు
హైదరాబాద్: ఫ్రెషర్లకు ఉద్యోగ అవకాశాలు గతేడాది ద్వితీయ ఆరు నెలల (జూలై–డిసెంబర్) కాలంలో 3 శాతం పెరిగాయి. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో ఫ్రెషర్ల నియామకాలు 62 శాతంగా ఉంటే, తర్వాతి ఆరు నెలల్లో 65 శాతంగా ఉన్నట్టు టీమ్లీజ్ ఎడ్టెక్ తెలిపింది. కెరీర్ అవుట్లుక్ రిపోర్ట్ హెచ్వై2, 2023 నివేదికను విడుదల చేసింది. అలాగే అన్ని విభాగాల్లోనూ నియామకాల ఉద్దేశ్యం కూడా 68 శాతం నుంచి 73 శాతానికి పెరిగింది. ఈ స్థిరమైన వృద్ది రానున్న నెలల్లో ఉద్యోగ మార్కెట్ వృద్ధికి, ఫ్రెషర్ల ఉపాధికి దారితీస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది. ఫ్రెషర్లకు (విద్య అనంతం ఉపాధి మార్కెట్లోకి వచ్చిన వారు) సంబంధించి అత్యధికంగా నియామకాల ఉద్దేశ్యం ఈ కామర్స్, టెక్నాలజీ స్టార్టప్లలో 59 శాతం, టెలీ కమ్యూనికేషన్స్లో 53 శాతం, ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాలో 50 శాతం చొప్పున నమోదైంది. కానీ, ఐటీ పరిశ్రమలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. ఫ్రెషర్ల నియామక ఉద్దేశ్యం 2023 మొదటి ఆరు నెలల్లో 67 శాతంగా ఉంటే, ద్వితీయ ఆరు నెలల్లో 49 శాతానికి తగ్గింది. అంటే 18 శాతం క్షీణత కనిపించింది. ట్రావెల్, హాస్పిటాలిటీ రంగంలో నియామకాల ధోరణి 5 శాతం పెరిగింది. వీరికి డిమాండ్.. డెవలప్మెంట్ ఆపరేషన్స్ ఇంజనీర్, చార్టర్ అకౌంటెంట్, ఎస్ఈవో అనలిస్ట్, యూఎక్స్ డిజైనర్లకు డిమాండ్ ఎక్కువగా కనిపించింది. ఇతర పట్టణాల కంటే బెంగళూరు ఫ్రెషర్ల నియామకాల పరంగా ముందుంది. నియామకాల ఉద్దేశ్యం 65 శాతంగా నమోదైంది. 2023 మొదటి ఆరు నెలలతో పోలిస్తే ద్వితీయ ఆరు నెలల్లో 10 శాతం తగ్గినప్పుటికీ ముందు స్థానంలో ఉంది. ఆ తర్వాత ముంబైలో 61 శాతం, చెన్నైలో 47 శాతం, ఢిల్లీలో 43 శాతం చొప్పున నమోదైంది. కొత్త నిపుణులకు డిమాండ్ స్వల్పంగా పెరిగింది. వీటిపై దృష్టి పెట్టాలి.. ఫ్రెషర్లు తమ ఉద్యోగార్హతలు పెంచుకునేందుకు వీలుగా కొన్ని కోర్సులకు డిమాండ్ ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ కమ్యూనికేషన్, డేటా సైన్స్, బ్లాక్చైన్లో సర్టిఫికేషన్, ఆర్టిఫీషియల్ లెన్నింగ్ (ఏఐ), మెషిన్ లెన్నింగ్ (ఎంఎల్)లో పీజీ కోర్స్లకు డిమాండ్ ఉందని పేర్కొంది. డిగ్రీ అప్రెంటిస్లను నియమించుకునే విషయంలో తయారీ, ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా, విద్యుత్, ఇంధన రంగాలు టాప్–3గా ఉన్నాయి. -
హైదరాబాద్ లో ఐటీ రంగం మరింత వృద్ధి
-
దేశంలోనే ఐటీలో మేటి హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఐటీ నగరంగా హైదరాబాద్ ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక నెలకొన్న సందేహాలను పటాపంచలు చేస్తూ హైదరాబాద్ను ప్రపంచ ఐటీ పటంలో నిలబెట్టినట్లు చెప్పారు. ఐటీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఐటీ పాలసీలపై 3 రోజులపాటు అధ్యయనం చేసేందుకు గురువారం హైదరాబాద్ విచ్చేసిన తమిళనాడు ఐటీ శాఖ మంత్రి పలనివేల్ త్యాగరాజన్ (పీటీఆర్) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం మంత్రి కేటీఆర్తో సచివాలయంలో సమావేశమైంది. ఐటీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, ఐటీ పాలసీ, అనుబంధ పాలసీలు, పరిశ్రమ బలోపేతం కోసం తీసుకున్న నిర్ణయాలను ఈ సందర్భంగా కేటీఆర్ తమిళనాడు ప్రతినిధి బృందానికి పవర్పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో వివరించారు. ఐటీ శాఖ ద్వారా రాష్ట్రంలోని యువతకు అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తూనే మరోవైపు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేసినట్లు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆన్లైన్ , మొబైల్, డిజిటల్ తదితర సేవల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. హైదరాబాద్తోపాటు ద్వితీయశ్రేణి నగరాలకు కూడా ఐటీ పరిశ్రమను విస్తరించాలన్న లక్ష్యంతో కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట లాంటి పట్టణాలలో ఐటీ టవర్లను ఏర్పాటు చేశామని, ఈ టవర్లలో టాస్క్, టీ–హబ్, వీ–హబ్ వంటి ఉప కార్యాలయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమిళనాడు ఐటీ శాఖ ప్రశంసలు తెలంగాణలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చేసిన కృషిపట్ల తమిళనాడు మంత్రి పీటీఆర్ బృందం హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పాలసీలపట్ల ప్రశంసలు కురిపించింది. తమిళనాడు ఐటీ మంత్రిగా నూతన బాధ్యతలు చేపట్టిన తనకు ఈ పర్యటన ఉపయుక్తంగా ఉంటుందన్న నమ్మకాన్ని పీటీఆర్ వ్యక్తం చేశారు. ఇక్కడి ఆదర్శవంతమైన విధానాలను తమిళనాడులో అమలు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. -
దేశంలోనే వేగంగా హైదరాబాద్ ప్రగతి
మాదాపూర్: భారతదేశంలో వేగంగా అభివృద్ధి సాధిస్తున్న నగరంగా హైదరాబాద్ గు ర్తింపు సాధించిందని, భవి ష్యత్తులో మరింత ప్రగతిని సాధిస్తుందనే నమ్మకం ఉందని మంత్రి కేటీ రామారావు అన్నారు. మాదా పూర్లోని హెచ్ఐసీసీలో గురువారం రాత్రి టీహబ్ ఆధ్వర్యంలో టీ–ఇన్నోవేషన్ సమ్మిట్ ‘గ్లాడియేటర్స్ ఆఫ్ మైండ్’ అనే అంశంపై రెండవ ఎడిషన్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మంత్రి కేటీరామారావు మాట్లాడుతూ కేవలం ఒక్క ఐటీ రంగంలోనే కాకుండా వ్యవసాయం, ఇతర రంగాలలో అనూహ్య ప్రగతిని సాధించిన రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపును సాధించిందన్నారు. 2014లో ఐటీ ఎగుమతులు రూ.56వేల కోట్లు ఉండగా 2023 మే నాటికి రూ.2.41 లక్షలకు పెరిగాయని, అదే విధంగా ఐటీ ఉద్యోగాల కల్పనలోనూ ఎంతో ప్రగతిని సాధించామన్నారు. తెలంగాణ రాష్ట్ర జనాభా ప్రకారం మలేషియా దేశంతో సమానం కాగా, విస్తీర్ణంలో సౌత్కొరియాతో సమానమని మంత్రి పేర్కొన్నారు. యాట కూర తిన్నాక....తోట కూర తింటే.. సోషల్ మీడియా స్టార్ మంత్రి మల్లారెడ్డి మా ట్లాడాక ఇక మాకు మాట్లాడేందుకు ఏమి ఉంటుందని.. ‘యాట కూర తిన్నాక తోటకూరన్న ప్రాధాన్యత లాగా ఉంటుందని. అదేవిధంగా క్రికెట్లో సూర్యకుమార్యాదవ్ బ్యాటింగ్ చేశాక స్లో ఆడే ఇండియన్ క్రికెటర్ ఆడితే ఎలా ఉంటుందో నేను మాట్లాడితే అలా ఉంటుందని కేటీఆర్ చలోక్తి విసురుతూ అందరినీ నవ్వించారు. కార్యక్రమంలో కార్మిక శాఖామంత్రి మల్లారెడ్డి, ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి, టీహబ్ సీఈఓ శ్రీనివాసరావు, సైయింట్ అధినేత బీవీమోహన్రెడ్డి పాల్గొన్నారు. -
నియామకాలపై ఆశావహ అంచనాలు
ఉద్యోగాల్లో కోతలు, అంతర్జాతీయంగా ఆర్థిక మందగమన అవకాశాలు మొదలైన ఆందోళనకర పరిస్థితి నెలకొన్నప్పటికీ జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో మాత్రం నియామకాలు ఆశావహంగా కనిపిస్తున్నాయి. ఐటీ రంగంలో అత్యధికంగా రిక్రూట్మెంట్ ఉండనున్నట్లుగా తెలుస్తోంది. మ్యాన్పవర్గ్రూప్ నిర్వహించిన ఉపాధి అంచనాల సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 3,020 పైచిలుకు సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. ఇందులో 49 శాతం సంస్థలు హైరింగ్పై అత్యధికంగా ఆసక్తి వ్యక్తం చేయగా, 13 శాతం మాత్రం నియామకాల యోచన లేదని పేర్కొన్నాయి. దీంతో నికరంగా 36 శాతం సంస్థలు రిక్రూట్మెంట్ విషయంలో సానుకూలంగా ఉన్నట్లు సర్వే తెలిపింది. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే హైరింగ్ సెంటిమెంటు 15 శాతం క్షీణిచగా, క్రితం క్వార్టర్తో పోలిస్తే మాత్రం 6 పర్సంటేజీ పాయింట్లు మెరుగుపడింది. సర్వేలోని మరిన్ని వివరాలు.. ► అంతర్జాతీయంగా 41 దేశాలు హైరింగ్ విషయంలో సానుకూలంగా ఉన్నాయి. కోస్టారికాలో నికర నియామకాల అంచనాలు 43 శాతంగా ఉండగా, నెదర్లాండ్స్ (39 శాతం), పెరూ (38 శాతం), తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఆస్ట్రేలియా తర్వాత 36 శాతంతో భారత్ అయిదో ర్యాంకులో నిల్చింది. ► రంగాలవారీగా చూస్తే ఐటీ, టెక్నాలజీ, టెలికం, కమ్యూనికేషన్స్, మీడియా సంస్థల హైరింగ్ అంచనాలు 47 శాతంగా ఉన్నాయి. పర్యావరణ అనుకూల విధానాలను అమలు చేయాల్సిన విధులు నిర్వర్తించే ఉద్యోగులను తీసుకోవడంపై (గ్రీన్ జాబ్స్) కంపెనీలు మరింతగా దృష్టి పెడుతున్నాయి. ► రీజియన్లవారీగా చూస్తే పశ్చిమ రాష్ట్రాల్లో నికర హైరింగ్ అంచనాలు 42 శాతంగా ఉండగా, ఉత్తరాదిలో 39 శాతంగా, దక్షిణాదిలో 39 శాతంగా, తూర్పు రాష్ట్రాల్లో 29 శాతంగా ఉన్నాయి. -
దేశానికే ఆదర్శంగా తెలంగాణ మోడల్
రాయదుర్గం (హైదరాబాద్): తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శంగా మారిందని, సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య మోడల్ ఎంతో గుర్తింపు సాధించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు పారిశ్రామిక ప్రగతితో పాటు ఆర్థిక, సామాజిక ప్రగతిని సమాంతరంగా ముందుకు తీసుకెళుతోందని పే ర్కొన్నారు. ఐటీ రంగం నుంచి మొదలుకుని వ్యవసాయం రంగం దాకా అన్ని రంగాల్లోనూ తెలంగాణ తన ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తోందని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా పేద, మధ్య తరగతి, ధనిక వర్గాలు అనే వ్యత్యాసం లేకుండా అందరి ప్రగతికీ ప్రభుత్వం పాటుపడుతోందని అన్నారు. మంగళవారం హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీ హబ్ ప్రాంగణంలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో కేటీఆర్ మాట్లాడారు. భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణ రాష్ట్రంలో ఉందని, ప్రస్తుతం మూడు లక్షల 17 వేల రూపాయల తలసరి ఆదాయం కలిగి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి చెప్పారు. రాష్ట్ర జీఎస్డీపీ 2014లో రూ.5 లక్షల కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ.13.27 లక్షల కోట్లకు చేరిందన్నారు. 2014లో జరిగిన సమావేశంలో ఇన్నోవేషన్ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పామని, ఆ మాట మేరకు ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద టీ హబ్, టీవర్క్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్..: ప్రపంచ దేశాలతో పోటీ పడి పెట్టుబడులు రప్పించాలంటే భారీ ఎత్తున మౌలిక వసతుల కల్పన చేపట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం తగిన ప్రణాళికలు రూపొందించిందని కేటీఆర్ చెప్పారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుతో పాటు ప్రపంచంలోనే ఏకైక అతిపెద్ద ఫార్మా క్లస్టర్.. హైదరాబాద్ ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైసెస్ పార్కును సుల్తాన్పూర్లో ఏర్పాటు చేశామని, ప్రపంచంలోనే అతిపెద్ద స్టెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ తయారీ యూనిట్ కూడా తెలంగాణలోనే ఉందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్గా మారిందన్నారు. వచ్చే సంవత్సరం నాటికి ప్రపంచంలో సగానికి పైగా వ్యాక్సిన్లు హైద రాబాద్ నగరంలోనే తయారు అవుతాయన్నారు. పారిశ్రామిక ప్రగతితో ఆర్థిక వ్యవస్థ బలోపేతం రాష్ట్రంలో సాధించిన పారిశ్రామిక ప్రగతి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, రియల్ ఎస్టేట్ వంటి ఇతర రంగాల బలోపేతానికి దోహదం చేసిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలోని చిన్న రాష్ట్రం ప్ర పంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (కాళేశ్వరం)ను నిర్మించిందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తోందని చెప్పా రు. రాష్ట్ర ప్రజలు 2014లో ఉన్న పరిస్థితులు, ప్రస్తు తం ఉన్న రాష్ట్ర ప్రగతిని బేరీజు వేసుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, పారిశ్రామిక రంగానికి చెందినవారు పాల్గొన్నారు. -
ఐటీ రంగంలో తగ్గనున్న నియామకాలు
ముంబై: భారత ఐటీ కంపెనీల ఆదాయంలో వృద్ధి మరింత తగ్గి, మధ్య స్థాయి సింగిల్ డిజిట్కు (4–6) పరిమితం అవుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఈ రంగంలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నందున నియామకాలపై ప్రభావం పడుతుందని పేర్కొంది. దీంతో కంపెనీలు సమీప కాలంలో కొత్త నియామకాలను తక్కువకు పరిమితం చేసుకోవచ్చని తెలిపింది. 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి రెండు త్రైమాసికాల్లో (2022 అక్టోబర్ నుంచి 2023 మార్చి వరకు) నికర నియామకాలు ప్రతికూలంగా ఉన్న విషయాన్ని ఇక్రా తన నివేదికలో ప్రస్తావించింది. ఐటీ కంపెనీల అసోసియేషన్ నాస్కామ్ మార్చిలో విడుదల చేసిన నివేదికను పరిశీలించినప్పుడు 2022–23లో వృద్ధి 8.4 శాతానికి తగ్గిపోయినట్టు తెలుస్తోంది. 2021–22లో ఇది 15 శాతంగా ఉండడం గమనార్హం. ఆర్డర్ బుక్, డీల్స్ బలంగానే ఉనప్పటికీ 2023–24లో ఆదాయం వృద్ధి 4–6 శాతం మించకపోవచ్చని ఇక్రా అంచనా వేసింది. ఈ రంగంలోని కంపెనీల పట్ల స్థిరమైన దృక్పథాన్ని కొనసాగిస్తున్నట్టు తెలిపింది. రుణాలకు సంబంధించి ఇవి మెరుగైన స్థితిలో ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. అమెరికా, యూరప్లో స్థూల ఆర్థిక సమస్యలు ఉండడంతో గత రెండు త్రైమాసికాల్లో వృద్ధి ధోరణి తగ్గుముఖం పట్టినట్టు ఇక్రా తెలిపింది. భారత ఐటీ కంపెనీల ఆదాయంలో 90 శాతం యూఎస్, యూరప్ నుంచే వస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవలు, ఇన్సూరెన్స్ విభాగం నుంచే మూడింట ఒకటో వంతు ఆదాయం ఐటీ కంపెనీలకు వస్తుంటుంది. అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం నేపథ్యంలో ఈ రంగాల నుంచి వచ్చే ఆదాయం తగ్గొచ్చని.. కస్టమర్లు నిర్ణయాలను జాప్యం చేయవచ్చని ఇక్రా తెలిపింది. మార్జిన్లు స్థిరం.. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీల మార్జిన్లు 1.90 శాతం తగ్గి 22.9 శాతానికి పరిమితమైనట్టు ఇక్రా తెలిపింది. ఆదాయంలో వృద్ధి నిదానించినా, నిర్వహణ మార్జిన్లు ఇదే స్థాయిలో కొనసాగొచ్చని అంచనా వేసింది. ఐటీ రంగంలోని టాప్–5 కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో 83,906 మందిని నియమించుకున్నట్టు ప్రస్తావించింది. స్థూల ఆర్థిక అనిశ్చితులు కొనసాగినంత కాలం నియామకాలు తక్కువగానే ఉండొచ్చని పేర్కొంది. -
రోబో పార్కు రాష్ట్రంగా తెలంగాణ
రాయదుర్గం: దేశంలో రోబోటిక్ టెక్నాలజీ గేమ్ చేంజర్ అవుతుందని ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. తెలంగాణ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్ (టీఆర్ఐసీ)ను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రోబోటిక్స్ రంగంలో అగ్రగామిగా నిలుస్తామని, రోబో పార్కు రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందడం ఖాయమన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడానికి వచ్చే జూలైలో ‘గ్లోబల్ రోబోటిక్స్ సమ్మిట్’ను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. మంగళవారం హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీహబ్లో ‘తెలంగాణ రోబోటిక్ ఫ్రేమ్వర్క్ను ఆవిష్కరించిన అనంతరం కేటీఆర్ మాట్లా డారు. ఇది ఫ్రేమ్వర్క్ కింద అన్ని కార్యక్రమాలకు నాయకత్వం వహించడానికి నోడల్ బాడీగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో స్థిరమైన రోబోటిక్స్ పర్యావరణ వ్యవస్థను సృష్టించడం, ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధిలో రాష్ట్రాన్ని కేంద్రంగా చేయడం వంటి లక్ష్యాలతో ‘స్టేట్ రోబోటిక్స్ ఫ్రేమ్వర్క్’ను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, పారిశ్రామిక ఆటోమేషన్, కన్సూ్యమర్ రంగాల్లో మరింత అభివృద్ధిని సాధించడానికి ఈ ఫ్రేమ్వర్క్ దోహదపడుతుందని చెప్పారు. రాష్ట్రంలోని స్టార్టప్లకు అవసరమైన ఇంక్యుబేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆథరైజేషన్ సపోర్ట్, మార్కెట్ ఇన్సైట్లు, ఇన్వెస్టర్ కనెక్షన్లు తదితరాల కోసం ప్రపంచస్థాయి రోబోటిక్స్ యాక్సిలరేటర్ను ఏర్పాటు చేస్తుందన్నారు. రోబోటిక్ టెక్నాలజీ వినియోగంలో చైనా, జపాన్, అమెరికా తర్వాత పదో దేశంగా భారత్ గుర్తింపు పొందుతోందన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడానికి, వివిధరంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా ఐఐటీ హైదరాబాద్, ఆర్ట్ పార్కు ఐఐఎస్సీ, జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఏజీహబ్, ఆలిండియా రోబోటిక్స్ అసోసియేషన్ వంటి సంస్థలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్ రమాదేవిలంకా, పలుసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఐటీలో నియామకాలకు 6 నెలలు బ్రేక్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఐటీ కంపెనీలు నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఆరు నెలల పాటు హైరింగ్కు కాస్త విరామం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఆర్థిక ఫలితాలను చూస్తే ప్రతి త్రైమాసికంలోనూ నికర నియామకాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయని, రాబోయే రోజుల్లోనూ కొన్నాళ్ల పాటు ఇదే ధోరణి కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అంతక్రితం ఏడాది జోరుగా రిక్రూట్ చేసుకున్నప్పటికీ ప్రస్తుతం డిమాండ్ మాత్రమే కీలకాంశంగా మారిందని పేర్కొన్నాయి. మూడో త్రైమాసికంలోనే నియామకాలు తక్కువ స్థాయిలో ఉండగా.. నాలుగో త్రైమాసికంలోనూ దాదాపు అదే రకమైన ట్రెండ్ నెలకొందని టీమ్లీజ్ డిజిటల్ వర్గాలు వివరించాయి. చాలామటుకు కంపెనీలు వేచి చూసే ధోరణిలో ఉన్నాయని పేర్కొన్నాయి. ఎక్స్ఫెనో జాబ్ రిపోర్ట్ ప్రకారం మార్చి త్రైమాసికంలో ఉద్యోగావకాశాలు గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 56 శాతం క్షీణించాయి. మరికొద్ది రోజుల్లో కంపెనీలు నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించడం మొదలుపెట్టనున్న నేపథ్యంలో ఈ అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బ్యాంకింగ్ కష్టాలు. అంతర్జాతీయంగా బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు కూడా ఐటీ రంగంలో నియామకాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఎక్కువగా బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) సంస్థలకు సేవలు అందించే దేశీ ఐటీ కంపెనీల్లో హైరింగ్ మందగించింది. ఈ పరిస్థితి నెమ్మదిగా మారనున్నప్పటికీ, కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నాళ్లలో మాత్రం ఆ ప్రభావాలు అలాగే కొనసాగవచ్చని ఎక్స్ఫెనో సహవ్యవస్థాపకుడు అనిల్ ఎథనూర్ పేర్కొన్నారు. గత రెండు త్రైమాసికాలుగా హైరింగ్పై కాస్త సానుకూలంగా ఉన్నా, ఇంటర్వ్యూ చేసిన అభ్యర్ధులను తీసుకునే విషయంలో మాత్రం కంపెనీలు ముందుకు వెళ్లడం లేదని టీమ్లీజ్ డిజిటల్ సీఈవో సునీల్ చెమ్మన్కొటిల్ తెలిపారు. ఆయా సంస్థలు వేచి, చూసే ధోరణి పాటిస్తున్నాయని, ఈ త్రైమాసికంలో నియామకాల పరిస్థితి ఆశావహంగా ఉండకపోవచ్చని పేర్కొన్నారు. తొలి ఆరు నెలల్లో నికరంగా నియామకాలు 40% తగ్గొచ్చని భావిస్తున్నట్లు వివరించారు. బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా క్యూ4లో కంపెనీల ప్రణాళికలు మారిపోయాయని, హైరింగ్పై దాని ప్రభావం పడిందని కెరియర్నెట్ సీఈవో అన్షుమన్ దాస్ చెప్పారు. వాస్తవానికి అంతక్రితం త్రైమాసికంలో ఐటీ కంపెనీలు హైరింగ్ను ప్రారంభించడంపై సానుకూల యోచనల్లోనే ఉన్నప్పటికీ .. బ్యాంకింగ్ సంక్షోభంతో పెద్దగా రిక్రూట్మెంట్ తలపెట్టలేదని వివరించారు. ఈ నేపథ్యంలో తొలి ఆరు నెలలు హైరింగ్ అంత ఆశావహంగా కనిపించడం లేదన్నారు. పరిస్థితులపై ఇంకా స్పష్టత రానందున కంపెనీలు వేచి చూసే ధోరణే కొనసాగించవచ్చని.. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం కాస్త మెరుగ్గా ఉండవచ్చని దాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2.5 లక్షలకు పరిమితం కావచ్చు.. దేశీ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా క్యూ1లో 59,704, క్యూ2లో 34,713 మందిని రిక్రూట్ చేసుకోగా క్యూ3లో ఇది ఏకంగా 4,904కి పడిపోయింది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఐటీ, బీపీవో సర్వీసుల విభాగంలో నికరంగా 4.80 లక్షల నియామకాలు జరగ్గా, 2023 ఆర్థిక సంవత్సరంలో ఇది 2.80 లక్షల స్థాయిలో ఉండొచ్చని హాన్ డిజిటల్ సీఈవో శరణ్ బాలసుందరమ్ తెలిపారు. ప్రస్తుత ధోరణులను బట్టి చూస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో నికర నియామకాలు సుమారు 2.5 లక్షల స్థాయిలో ఉండొచ్చని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొన్ని కంపెనీలు తాము ఇచ్చిన ఆఫర్లకు కట్టుబడి ఉండొచ్చని, మరికొన్ని వాటిని రద్దు చేసుకునే అవకాశం ఉందని బాలసుందరమ్ చెప్పారు. 2021 ఆర్థిక సంవత్సరంలో హైరింగ్ అంతగా జరగకపోవడం, కోవిడ్ పరిస్థితులపరమైన డిమాండు కారణంగా 2022 ఆర్థిక సంవత్సరంలో నియామకాలు భారీగా జరిగాయని ఆయన చెప్పారు. ఆ ఒక్క సంవత్సరాన్ని పక్కన పెడితే ఐటీలో ఏటా 2–3 లక్షల మంది హైరింగ్ సాధారణంగానే ఉంటుందని పేర్కొన్నారు. -
ఐటీ ఆదాయాలకు సవాళ్లు..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా స్థూలఆర్థిక పరిస్థితులు, ఫైనాన్షియల్ రంగంలో సవాళ్లు మొదలైనవి దేశీ ఐటీ కంపెనీల ఆదాయాలకు కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రతికూలంగా పరిణమించవచ్చని క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ వృద్ధి దాదాపు 20 శాతంగా ఉండనుండగా .. 2024 ఆర్థిక సంవత్సరంలో 10–12 శాతం స్థాయికి పడిపోవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించింది. ‘అమెరికా, యూరప్ వంటి కీలక మార్కెట్లలో.. ముఖ్యంగా బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) విభాగంలో ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. ఇవి దేశీ ఐటీ సేవల కంపెనీల ఆదాయాల వృద్ధిపై ప్రభావం చూపనున్నాయి’ అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేఠి తెలిపారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభం తర్వాత బీఎఫ్ఎస్ఐ సెగ్మెంట్లో కొంత ఒత్తిడి నెలకొందని పేర్కొన్నారు. ఫలితంగా ఈ విభాగం ఆదాయ వృద్ధి సింగిల్ డిజిట్ మధ్య స్థాయికి పడిపోవచ్చని వివరించారు. అయితే, తయారీ రంగంలో 12–14 శాతం, ఇతర సెగ్మెంట్లలో 9–11 శాతం వృద్ధి నమోదు కావచ్చని.. తత్ఫలితంగా బీఎఫ్ఎస్ఐ విభాగంలో క్షీణత ప్రభావం కొంత తగ్గవచ్చని వివరించారు. దాదాపు రూ. 10.2 లక్షల కోట్ల భారతీయ ఐటీ రంగంలో 71 శాతం వాటా ఉన్న 17 కంపెనీల డేటాను విశ్లేషించి క్రిసిల్ ఈ నివేదిక రూపొందించింది. నివేదికలోని మరిన్ని అంశాలు.. ► క్లయింట్లు ఐటీపై ఇష్టారీతిగా ఖర్చు చేయకుండా, ప్రతి రూపాయికి గరిష్టమైన ప్రయోజనాలను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అటువంటి డీల్స్నే కుదుర్చుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. దీనితో పాటు డిజిటల్ సొల్యూషన్స్, క్లౌడ్, ఆటోమేషన్ సామరŠాధ్యలు మొదలైనవి డిమాండ్కి దన్నుగా ఉండనున్నాయి. ► ఐటీ రంగం ఆదాయాల్లో బీఎఫ్ఎస్ఐ వాటా 30 శాతం వరకు ఉంటోంది. తలో 15 శాతం వాటాతో రిటైల్, కన్జూమర్ ప్యాకేజ్డ్ గూడ్స్ విభాగాలు ఉంటున్నాయి. మిగతా వాటా లైఫ్ సైన్సెస్ .. హెల్త్కేర్, తయారీ, టెక్నాలజీ.. సర్వీసెస్, కమ్యూనికేషన్.. మీడియా మొదలైన వాటిది ఉంటోంది. ► ఐటీ సంస్థలు కొత్తగా నియామకాలు .. ఉద్యోగులపై వ్యయాలను తగ్గించుకోనుండటంతో 2024 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభదాయకత స్వల్పంగా 0.50–0.60 శాతం మెరుగుపడి 23 శాతంగా ఉండొచ్చు. ► ఉద్యోగులపై వ్యయాలు పెరగడం వల్ల 2023 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభాల మార్జిన్లు 1.50–1.75 శాతం మందగించి దశాబ్ద కనిష్ట స్థాయి అయిన 22–22.5 శాతానికి తగ్గవచ్చు. ► అట్రిషన్లు (ఉద్యోగుల వలసలు) ఇటీవల కొద్ది త్రైమాసికాలుగా తగ్గుముఖం పడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి మరింత తగ్గవచ్చు. ఆన్షోర్, ఆఫ్షోర్ ఉద్యోగులను సమర్ధంగా ఉపయోగించుకోవడం, సిబ్బందికి శిక్షణనిస్తుండటం, రూపాయి క్షీణత ప్రయోజనాలు మొదలైన సానుకూల అంశాల కారణంగా 2024 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభాల మార్జిన్లు 0.50–60 శాతం మెరుగుపడి 23 శాతానికి చేరవచ్చు. అయినప్పటికీ కరోనా పూర్వం 2016–20 ఆర్థిక సంవత్సరాల మధ్య నమోదైన సగటు 24 శాతానికన్నా ఇంకా దిగువనే ఉండొచ్చు. ► దేశీ ఐటీ కంపెనీల రుణ నాణ్యత స్థిరంగానే ఉంది. రూపాయి మారకం విలువ గణనీయంగా పెరగడం, మాంద్యం ధోరణులు ఒక్కసారిగా ముంచుకురావడం వంటి రిస్కులపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. -
ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. ఇక పదేళ్లూ అంతంతే!
ఐటీ రంగంలో పని చేసే ఉద్యోగులు ప్రస్తుతం గడ్డు పరిస్థతిని ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో అయినా పరిస్థితులు మెరుగుపడతాయని ఆశా భావంతో ఉన్న ఉద్యోగులకు ఇప్పట్లో ఉపశమనం కనిపించేలా లేదు. జీతాల పెంపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతూ వచ్చే పదేళ్లు జీతాల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుందని ఓ అధ్యయనం పేర్కొంటోంది. (రియల్మీ సి–55.. ఎంట్రీ లెవెల్ విభాగంలో సంచలనం!) ఆడిట్ అండ్ కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ అధ్యయనం ప్రకారం.. భారతీయ కంపెనీలలో జీతాల సగటు పెంపుదల 2022లో ఉన్న 9.4 శాతం నుంచి 2023లో 9.1 శాతానికి తగ్గుతుందని అంచనా. క్లయింట్ల ఖర్చుల కోతలను ఎదుర్కొంటున్న ఐటీ రంగం దశాబ్దంలో ఎన్నడూ లేనంత దారుణమైన పెంపుదలని చూడనుందని ఈ అధ్యయనం చెబుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో మాంద్యం ప్రభావంతో ఐటీ పరిశ్రమలో అట్రీషన్ (ఉద్యోగుల తొలగింపు) రేటు గత ఏడాది 19.7 శాతం ఉండగా రానున్న రోజుల్లో మరింత పడిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. (మోటరోలా జీ13 వచ్చేసింది.. ధర తక్కువే!) ఐటీ ప్రొడక్ట్ కంపెనీలు, డిజిటల్ ఇ-కామర్స్ కంపెనీల నేతృత్వంలో ఐటీ రంగం ఈ దశాబ్దంలో ఉద్యోగుల జీతాల్లో అత్యంత తక్కువ పెంపుదల ఉంటుందని అంచనా వేస్తున్నట్లు డెలాయిట్ ఇండియా భాగస్వామి ఆనందోరుప్ ఘోస్ తెలిపారు. మొండి ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్, మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం ఐటీ కంపెనీలను మరింత పొదుపుగా ఉండేలా చేసే అవకాశం ఉంది. ఈ కారణాలను దృష్టిలో పెట్టుకుని 2023లో ఇంక్రిమెంట్లు, అట్రిషన్ పరిమాణాలు క్షీణిస్తాయని భావిస్తున్నామన్నారు. గత సంవత్సాల్లో విపరీతంగా నియామకాలు చేపట్టిన ఐటీ కంపెనీలు ప్రస్తుతం క్లయింట్ల దగ్గర నుంచి ఆశించిన మేర ప్రాజెక్టులు లేకపోవడంతో ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీనికితోడు ప్రస్తుతం తలెత్తిన బ్యాంకింగ్ సంక్షోభం మరింత కుంగదీస్తోంది. ఇప్పటికే అనేక ఎంఎన్సీ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఈ ప్రభావం భారతీయ టెక్ రంగంపై కూడా ఉంది. (మారుతీ సుజుకీ రికార్డ్.. విదేశాలకు 25 లక్షల కార్లు..) 25 రంగాల్లోని 300 కంపెనీల హెచ్ఆర్ హెడ్ల నుంచి డేటాను సేకరించి డెలాయిట్ ఈ అధ్యయనం చేపట్టింది. దీని ప్రకారం.. లైఫ్ సైన్సెస్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాలు 2023లో అత్యధిక ఇంక్రిమెంట్లను చూస్తాయి. గత ఏడాది 9.7 శాతం ఉన్న వాస్తవిక పెంపుతో పోలిస్తే రెండు రంగల్లోనూ 9.5 శాతం పెంపుదల ఉంటుందని అంచనా. -
ఐటీ.. వృద్ధి మందగమనం!
న్యూఢిల్లీ: దేశీ ఐటీ రంగం వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మందగించనుంది. 8.4 శాతానికి పరిమితమై 245 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదు కానుంది. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ఈ మేరకు అంచనాలు వెలువరించింది. గత ఆర్థిక సంవత్సరంలో టెక్ పరిశ్రమ 15.5 శాతం పెరిగి 226 బిలియన్ డాలర్లకు చేరింది. దశాబ్దకాలంలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. కోవిడ్ మహమ్మారిపరమైన మార్పులతో కంపెనీలు టెక్నాలజీపై మరింతగా వ్యయాలు చేయడం ఇందుకు దోహదపడింది. అయితే, తాజాగా రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు భౌగోళికరాజకీయ సవాళ్లు విసురుతుండటం, ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తుండటం, ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరుగుతుండటం తదితర అంశాలు టెక్నాలజీ పరిశ్రమకు ప్రతికూలంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నాస్కామ్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న సీఈవోలు భవిష్యత్పై ’జాగరూకతతో కూడిన ఆశావహ’ అభిప్రాయం వ్యక్తం చేశారు. నిర్ణయాల్లో జాప్యం.. భౌగోళికరాజకీయ ఆందోళనల వల్ల ఐటీ కాంట్రాక్టులు ఇవ్వడంపై కంపెనీలు నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని, కొన్ని మార్కెట్లలో డిమాండ్ కూడా తగ్గుతోందని నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్ తెలిపారు. కొన్ని కంపెనీలకు మాత్రమే పటిష్టమైన ఆర్డర్లు ఉన్నాయని, పరిశ్రమకు ఇదే కాస్త ఊతంగా ఉంటోందని ఆమె వివరించారు. టాప్ 5 కంపెనీల ఆర్డర్ బుక్ 18 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండటం, నిర్దిష్ట కంపెనీల క్లయింట్ల సంఖ్య 10 శాతం మేర పెరగడం, సామరŠాధ్యల వినియోగం 6–7 శాతం పెంచుకోగలగడం వంటి సానుకూల అంశాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఉద్యోగార్థుల్లో ఉద్యోగ సామర్థ్యాల కొరత ఉంటోందని ఘోష్ చెప్పారు. మన విద్యావ్యవస్థలోనే దీనికి మూలం ఉందని, ఫలితంగా సరైన నైపుణ్యాలున్న తాజా గ్రాడ్యుయేట్లు పరిశ్రమకు లభించడం లేదని ఆమె పేర్కొన్నారు. దీంతో తమ క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా వారికి శిక్షణనిచ్చేందుకు కంపెనీలు భారీగా వెచ్చించాల్సి వస్తోందని ఘోష్ వివరించారు. చాట్జీపీటీ లాంటి జనరేటివ్ కృత్రిమ మేథ (ఏఐ) ప్లాట్ఫాంల ప్రభావం ఉద్యోగాలపై పరిమితంగానే ఉంటుందని, వాస్తవానికి ఏఐతో ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆమె చెప్పారు. 54 లక్షలకు ఐటీ సిబ్బంది.. : మార్చి 31తో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీలో ఉద్యోగుల సంఖ్య 2.90 లక్షలు పెరిగి మొత్తం 54 లక్షలకు చేరనుంది. వీరిలో 20 లక్షల మంది మహిళలు ఉండగా, 36 శాతం మందికి డిజిటల్ నైపుణ్యాలు ఉన్నట్లు నాస్కామ్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే (4.5 లక్షల వృద్ధి) తక్కువే అయినప్పటికీ కోవిడ్ పూర్వ స్థాయితో పోలిస్తే ఇది ఎక్కువేనని పేర్కొంది. గత రెండు ఆర్థిక సంవత్సరాలు అసాధారణమైనవని వివరించింది. ఐటీ కంపెనీలకు ఇటీవల సమస్యగా మారిన అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) రేటు జూన్ క్వార్టర్తో పోలిస్తే (25.7 శాతం) డిసెంబర్ త్రైమాసికంలో కాస్త నెమ్మదించి 21.8 శాతానికి చేరింది. ఇక భారత ఐటీ ఎగుమతులు 9.4 శాతం పెరిగి 194 బిలియన్ డాలర్లకు చేరగలవని నాస్కామ్ పేర్కొంది. 2030 నాటికి దేశీ ఐటీ రంగం 500 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. -
త్వరలోనే భారత్లో సెమీకండక్టర్ల తయారీ
న్యూఢిల్లీ: దేశీయంగా సెమీకండక్టర్ల తయారీ త్వరలోనే ప్రారంభం కాగలదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి అల్కేశ్ కుమార్ శర్మ తెలిపారు. చిప్ల తయారీలో టాప్ 6–7 భాగస్వాముల్లో ఒకటిగా ఉండగలదని ఆయన పేర్కొన్నారు. తిరువనంతపురంలోని సీ–డీఏసీ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా శర్మ ఈ విషయాలు చెప్పారు. భారతీయ ప్రమాణాలకు, అధునాతన మీటరింగ్ విధానానికి అనుగుణంగా ఉండే స్మార్ట్ ఎనర్జీ మీటర్ను సీ–డీఏసీ తయారు చేసింది. వీటితో విద్యుత్ వినియోగం తగ్గుతుందని, బిల్లింగ్ సక్రమంగా ఉండటంతో పాటు విద్యుత్ పంపిణీ సంస్థలకు ప్రయోజనకరంగా ఉంటుందని శర్మ వివరించారు. -
ఆఫీస్ స్పేస్ లీజింగ్ పెరిగింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో 2023 జనవరిలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 32 లక్షల చదరపు అడుగులు నమోదైంది. 2022 జనవరితో పోలిస్తే ఇది 93 శాతం అధికం అని ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా నివేదిక తెలిపింది. ‘హైదరాబాద్సహా ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, పుణే, కోల్కతలో 2022 డిసెంబర్తో పోలిస్తే గత నెలలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 56 శాతం తగ్గింది. గ్లోబల్ కార్పొరేట్లకు సెలవు కాలం కాబట్టి జనవరి నెల సాధారణంగా నెమ్మదిగా ఉంటుంది. ఐటీ రంగంలో నియామకాలు నెమ్మదించాయి. వృద్ధి అంచనాలూ మందకొడిగా ఉన్నాయి. దీంతో ఆఫీస్ స్పేస్ లీజింగ్ విషయంలో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అయినప్పటికీ జనవరి నెల ఆఫీస్ స్పేస్ లీజింగ్లో ఐటీ, ఐటీఈఎస్ విభాగం అత్యధికంగా 28 శాతం వాటా కైవసం చేసుకుంది. జనవరిలో ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నై, ముంబై టాప్–3లో నిలిచాయి. ఈ మూడు నగరాల వాటా 77 శాతం’ అని జేఎల్ఎల్ వివరించింది. 2022 మార్చి నాటికి ప్రీమియం గ్రేడ్ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 73.2 కోట్ల చదరపు అడుగులుగా ఉంది. అలాగే ఇతర గ్రేడ్స్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 37 కోట్ల చదరపు అడుగులు నమోదైంది. -
ఐటీ సేవల జోరు.. నెమ్మది
న్యూఢిల్లీ: దేశీ ఐటీ సేవల పరిశ్రమ వృద్ధి వేగం.. స్వల్పకాలికం నుంచి మధ్యకాలికంగా మందగించనుంది. ప్రతికూల స్థూలఆర్థిక పరిస్థితుల కారణంగా కంపెనీలు ఐటీపరంగా అవసరమైనవైతే తప్ప మిగతా వ్యయాలను తగ్గించుకోనుండటమే ఇందుకు కారణం. రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు అధిక స్థాయిలో రిక్రూట్ చేసుకున్నందున సమీప భవిష్యత్తులో హైరింగ్ కూడా తగ్గవచ్చని పేర్కొంది. స్థూలఆర్థిక ప్రతికూలతల కారణంగా గత ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే డిమాండ్ ఒక మోస్తరు స్థాయికి పరిమితం కావచ్చని వివరించింది. బేస్ ఎఫెక్ట్, కీలకమైన అమెరికా, యూరప్ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితుల వల్ల దేశీ ఐటీ సరీ్వసుల సంస్థల వృద్ధి కొంత నెమ్మదించింది. ఇక్రా ప్రకారం.. ► వేతనాల ఖర్చులు పెరగడం తదితర అంశాల వల్ల నిర్వహణ లాభాల మార్జిన్లు ఒక మోస్తరు స్థాయికి పరిమితం కానున్నాయి. ► ఐటీకి కీలకమైన విభాగాల్లో ఒకటైన .. బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా) సెగ్మెంట్ ఇటీవలి కాలంలో మిగతా విభాగాలతో పోలిస్తే కాస్త మందగించింది. రుణ లావాదేవీలు నెమ్మదించడం ఇందుకు కొంత కారణం. స్థూలఆర్థిక సవాళ్లు కొనసాగిన పక్షంలో తయారీ, హెల్త్కేర్ సెగ్మెంట్లతో పోలిస్తే తనఖా రుణాలు, రిటైల్ సెగ్మెంట్లలో వృద్ధి మరింతగా నెమ్మదించవచ్చు. ► కొన్నాళ్లుగా భారీ అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) రేటుతో పరిశ్రమ సతమతమవుతోంది. ప్రధానంగా డిజిటల్ టెక్నాలజీ నిపుణులు డిమాండ్కు తగ్గ స్థాయిలో దొరకడం లేదు. అయితే, గత రెండు త్రైమాసికాలుగా అట్రిషన్ తగ్గుముఖం పడుతోంది. వచ్చే రెండు–మూడు క్వార్టర్లు ఇదే ధోరణి కొనసాగవచ్చని, ఆ తర్వాత కాస్త స్థిరపడవచ్చని ఇక్రా అంచనా వేసింది. ► వృద్ధి వేగం మందగించవచ్చని భావిస్తున్నప్పటికీ దేశీ ఐటీ సర్వీసుల పరిశ్రమ అంచనాలపై ఇక్రా స్టేబుల్ అవుట్లుక్ను కొనసాగిస్తోంది. డిజిటల్..క్లౌడ్ సేవలు సహా ఐటీ సరీ్వసులకు డిమాండ్ పెరుగుతుండటం, మన కంపెనీలు దీటుగా పోటీపడగలగడం, కంపెనీల ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణం. -
నాన్ టెక్.. ఉద్యోగాలు భర్తీలో బెస్ట్
సాక్షి, అమరావతి: ఐటీ రంగంలో ఉద్యోగాల కోత పరంపర కొనసాగుతోంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను ఇటీవల తొలగించాయి. మరికొన్ని కంపెనీలు ఇదే బాటలో నడుస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా టెక్కీలు భయంభయంగా కాలం వెళ్లదీసే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే నాన్–టెక్ రంగాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. మన దేశంలో కరోనా కష్టకాలం అనంతరం నాన్–టెక్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ రంగంలో ఏకంగా 30శాతానికి పైగా ఉద్యోగాలు పెరిగినట్లు ప్రముఖ గ్లోబల్ జాబ్సైట్ ఇండీడ్ ఇటీవల తెలిపింది. నిర్మాణ, ఆర్కిటెక్చర్, ఇతర నాన్ టెక్ రంగాల్లోనూ ఉద్యోగ అవకాశాలు పెరిగినట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2021, 2022 సంవత్సరాల్లో డిసెంబర్ నెలల్లో వెలువడిన ఉద్యోగ ప్రకటనలపై ‘ఇండీడ్’ నిర్వహించిన అధ్యయనంలో 2021తో పోలిస్తే 2022లో నాన్–టెక్ రంగాల్లో ఉద్యోగాల భర్తీ పెరిగినట్లు తేలింది. ఈ మేరకు ‘ఇండీడ్’ సంస్థ తమ అధ్యయనంలో గుర్తించిన పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ‘ఇండీడ్’ నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు ► ఆరోగ్య సంరక్షణ రంగంలో అత్యధికంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి 30.8 శాతంపెరుగుదల నమోదైంది. డెంటిస్ట్, నర్సింగ్ సిబ్బంది, ఇతర ఉద్యోగాలు పెద్ద ఎత్తున భర్తీ అయ్యాయి. ► అనంతరం ఆహార సేవల రంగంలో 8.8 శాతం, నిర్మాణ రంగంలో 8.3 శాతం, ఆర్కిటెక్చర్ 7.2, విద్యా రంగంలో 7.1, మార్కెటింగ్ రంగంలో 6.1 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. ► కరోనా కాలంలో నిర్మాణ, మార్కెటింగ్ వంటి రంగాల్లో కార్యకలాపాలు మందగించి ఉద్యోగులను తొలగించారు. కానీ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిన అనంతరం నిర్మాణ, మార్కెటింగ్ రంగాల్లో మునుపటి పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా రంగాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి. ► నాన్–టెక్ రంగాల్లో నియామకాల్లో బెంగళూరు నగరం 16.5 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో ముంబై (8.23 శాతం), పూణే (6.33 శాతం), చెన్నై (6.1శాతం) ఉన్నాయి. అహ్మదాబాద్, కొచ్చి, కోయంబత్తూర్, జైపూర్, మొహాలీ వంటి టైర్–2 నగరాలు 6.9 శాతం వాటాను కలిగి ఉన్నాయి. -
పరిశ్రమకు ‘ప్రోత్సాహం’
సాక్షి, హైదరాబాద్: పారిశ్రా మికాభివృద్ధి ప్రోత్సాహకాల కు పెద్దపీట వేస్తూ పారిశ్రా మిక రంగానికి 2023–24 రాష్ట్ర వార్షిక బడ్జెట్లో రూ.4,037 కోట్లు ప్రతిపాదించారు. ప్రస్తుత (2022–23) బడ్జెట్తో పోలిస్తే రూ.817 కోట్లు అదనంగా కేటాయించారు. నిర్వహణ పద్దు కింద రూ.254.77 కోట్లు, ప్రగతి పద్దు కింద వివిధ అవసరాల కోసం రూ.2,235.29 కోట్లు కేటాయించారు. వీటితో పాటు ఎస్సీ అభివృద్ధి నిధి నుంచి రూ.834.67 కోట్లు, ఎస్టీ అభివృద్ధి నిధి నుంచి రూ.717.25 కోట్లు కేటాయించారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రూ.2,937.20 కోట్లు (సుమారు 72 శాతం) కేటాయించారు. విద్యుత్ సబ్సిడీకి రూ.316.39 కోట్లు, చిన్న, సూక్ష్మ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు పావలావడ్డీని వర్తింప చేస్తూ రూ.266.20 కోట్లు ప్రతిపాదించారు. నేత కార్మికుల బీమాకు రూ.50 కోట్లు నేత కార్మికుల బీమాకు రూ.50 కోట్లు, పరిశ్రమల శాఖకు అనుబంధంగా ఉన్న చేనేత, జౌళి పరిశ్రమల అభివృద్ధి కోసం రూ.2 కోట్లు చొప్పున కేటాయించారు. ఇసుక తవ్వకానికి టీఎస్ఎండీసీ వెచ్చిస్తున్న ఖర్చులను తిరిగి చెల్లించేందుకు రూ.120 కోట్లు ప్రతిపాదించారు. వాణిజ్యం, ఎగుమతులు, చెరుకు, గనులు, భూగర్భ వనరులు, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్, టీఎస్ లిప్కో తదితరాలకు నామమాత్ర కేటాయింపులే దక్కాయి. ఐటీ రంగానికి రూ.366 కోట్లు ఐటీ రంగానికి నిర్వహణ, ప్రగతి పద్దులను కలుపుకుని రూ.366 కోట్లను తాజా బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత ఏడాదితో పోలిస్తే ప్రగతిపద్దు కింద రూ.6 కోట్ల మేర స్వల్ప పెంపుదల కనిపించింది. టీ హబ్ ఫౌండేషన్కు రూ.177.61 కోట్లు, వీ హబ్కు రూ.7.95 కోట్లు కేటాయించింది. ఓఎఫ్సీ టెక్నాలజీతో అన్ని మండలాల్లోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల్లో వీడియో సమావేశ సదుపాయాల కోసం రూ.18.14 కోట్లు కేటాయించారు. స్టేట్ ఇన్నోవేషన్ సెల్కు రూ.8.88 కోట్లు, టీ ఎలక్ట్రానిక్స్కు రూ.8 కోట్లు కేటాయించింది. -
రోజుకు 1,600 మంది! ఐటీ కొలువుపై మాంద్యం వేటు
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం నేపథ్యంలో టెకీలకు ‘డేంజర్ బెల్స్’మోగుతున్నాయి. ఐటీ రంగానికి సంబంధించి 2022లోనే ప్రారంభమైన ప్రతికూల పరిస్థితులు 2023 లోనూ కొనసాగే సూచనలు కన్పిస్తున్నాయి. ఖర్చు తగ్గించుకునేందుకు మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు లే ఆఫ్లు కొనసాగిస్తున్నాయి. గత ఏడాది (2022) కాలంలో ప్రపంచంలోని వెయ్యికి పైగా కంపెనీలు మొత్తం 1,54,336 మందికి ఉద్వాసన పలికాయి. ఇక కోటి ఆశలతో కొత్త ఏడాది మొదలైన తొలి పదిహేను రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 91 కంపెనీలు లే ఆఫ్లు ప్రకటించాయి. దీంతో 25 వేల దాకా ఐటీ ఉద్యోగులు అంటే.. రోజుకు సగటున 1,600 మందికి పైగా టెకీలు లే ఆఫ్ల బారిన పడ్డారు. గతేడాది నుంచి లేఆఫ్లు ప్రకటించిన వాటిలో అనేక భారతీయ కంపెనీలతో పాటు పలు స్టార్టప్లు కూడా ఉన్నట్టు తేలింది. లే ఆఫ్స్ ట్రాకింగ్ సైట్ ‘లే ఆఫ్స్.ఎఫ్వైఐ’ తన తాజా నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. తొలి ప్రభావం ఐటీ రంగంపైనే..! ఆర్థిక రంగం ఒడిదుడుకులకు గురవుతున్నప్పుడు, ఆర్థికమాంద్యం పరిస్థితులు తలెత్తుతున్నప్పుడు మొదటగా ప్రభావం పడేది ఐటీ రంగం పైనే. ఐటీ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించడానికి ఇదే కారణం. ఆర్థికరంగ స్లోడౌన్కు సూచికగా ప్రస్తుత పరిణామాలను పరిగణించాలి. 2001లోనూ ఇలాంటి పరిస్థితులు సంభవించాయి. ఇండియన్ ఐటీ కంపెనీలకు ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్లు తగ్గిపోతాయి కాబట్టి ఖర్చు తగ్గించుకునేందుకు లేఆఫ్ల వైపు మొగ్గు చూపుతాయి. ఆర్థికమాంద్యం ఏర్పడుతుందనే సంకేతాలు రాగానే ఐటీ కంపెనీలు ముందుగా ఉద్యోగుల భారాన్ని తగ్గించుకుంటాయి. అలాగే ఇప్పుడు కూడా లాభాల మార్జిన్లు తగ్గిపోయే కొద్దీ ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా అధిక జీతాలిచ్చే ఉద్యోగుల సంఖ్యను కంపెనీలు కుదించుకుంటున్నాయి. క్యాంపస్ సెలక్షన్లలో భాగంగా ఎంపిక చేసుకున్నవారి నియామక ఉత్తర్వులను సైతం కొన్ని సంస్థలు రద్దు (క్యాన్సిల్) చేస్తున్నాయి. ఓలా నుంచి అమెజాన్ వరకు.. అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల కారణంగా స్వదేశీ సామాజిక మాధ్యమ కంపెనీ షేర్చాట్ 20 శాతం వర్క్ఫోర్స్ను లేఆఫ్ చేసింది. దాదాపు 500 మంది ఉద్యోగులపై దీని ప్రభావం పడింది. ట్విట్టర్, గూగుల్, స్నాప్, టైగర్ గ్లోబల్ కంపెనీలు 2,300 మంది ఉద్యోగుల్ని తొలగించాయి. ఓలా (200 మంది తొలగింపు) వంటి కంపెనీలు కూడా ఉద్యోగుల్ని తొలగించగా, వాయిస్ ఆటోమేటెడ్ స్టార్టప్ స్కిట్.ఏఐ ఈ నెలలో చాలా మందిని తొలగించింది. నిత్యావసర సరుకుల డెలివరీ సంస్థ ‘డంజో’తన కాస్ట్ కట్టింగ్ (ఖర్చు తగ్గింపు) చర్యల్లో భాగంగా 3 శాతం వర్క్ఫోర్స్ను తొలగించింది. అమెజాన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 18 వేల మందిని (భారత్లో వెయ్యి మంది) లే ఆఫ్ చేసింది. 6 నెలల దాకా లేఆఫ్ల ట్రెండ్ ఆర్థిక మాంద్యం, సమస్యలు ఎదురైనప్పుడు పెద్ద కంపెనీలతో పాటు స్టార్టప్ కంపెనీలు కూడా పెద్ద కుదుపునకు గురవుతాయి. ఈ నేపథ్యంలో వీటిల్లో లే ఆఫ్ల ట్రెండ్ మూడు నుంచి ఆరునెలల దాకా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. గత 3, 4 ఏళ్లుగా ఐటీ కంపెనీల్లో సరైన పద్ధతులు, విధానాల్లో హైరింగ్ జరగనందున ఉద్యోగులపై అధిక ప్రభావం పడనుంది. రిక్రూట్మెంట్ సవ్యంగా జరగకపోవడం, భారీ ప్యాకేజీలు ఆఫర్ చేయడం వంటివి జరిగినపుడు రెండేళ్లకోసారి దిద్దుబాట్లు జరుగుతుంటాయి. మరోవైపు ఆశించిన మేర ఇతర దేశాల నుంచి ఔట్సోర్సింగ్ బిజినెస్, బ్యాకెండ్ సపోర్ట్ వంటివి రాకపోవడం మన దేశంపై ప్రభావం చూపిస్తుంది. – డా.బి.అపర్ణా రెడ్డి,హెచ్ఆర్ నిపుణురాలు -
బెంగుళూరుతో పోల్చితే హైదరాబాద్ ఐటీ దూసుకుపోతుంది: మంత్రి కేటీఆర్
-
ఫలితాలు, ఆర్థిక గణాంకాలే దిక్సూచి
న్యూఢిల్లీ: ఈ వారం ప్రధానంగా ఐటీ దిగ్గజాల క్యూ3(అక్టోబర్– డిసెంబర్) ఫలితాలు ఈక్విటీ మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీటితోపాటు ఆర్థిక గణాంకాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసిక(క్యూ3) ఫలితాల సీజన్ ఈ నెల 9నుంచి ప్రారంభంకానుంది. గత వారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) అత్యధిక శాతం నికర అమ్మకందారులుగా నిలిచిన నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు వెనకడుగు వేశాయి. దీంతో విదేశీ పెట్టుడి పరిస్థితులు కీలకంగా నిలవనున్నట్లు నిపుణులు తెలియజేశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సైతం నేడు(సోమవారం) సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఈ ఏడాది క్యూ3 ఫలితాలు విడుదల చేయనుంది. ఈ బాటలో ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 12న, విప్రో 13న క్యూ3 పనితీరును ప్రకటించనున్నాయి. ఇక బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ 14న ఆర్థిక ఫలితాలు వెల్లడించనుంది. ఇక మరోవైపు ప్రభుత్వం 12న నవంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు విడుదల చేయనుంది. ఇదే రోజు డిసెంబర్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) వివరాలు సైతం ప్రకటించనుంది. వెరసి ఈ వారం పలు అంశాలు దేశీ స్టాక్ మార్కెట్ల నడకను ప్రభావితం చేయనున్నట్లు పలువురు నిపుణులు తెలియజేశారు. ఇతర అంశాలకూ ప్రాధాన్యం ఈ వారం యూఎస్, చైనా ద్రవ్యోల్బణ గణాంకాలు సైతం ఈ నెల 12నే విడుదలకానున్నాయి. రష్యా– ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఇవికాకుండా ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు సైతం సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు నిపుణులు ప్రస్తావించారు. గత వారం విడుదలైన మినిట్స్ ప్రకారం యూఎస్ ఫెడ్ 2023లోనూ వడ్డీ రేట్ల పెంపువైపు మొగ్గు చూపనున్నట్లు వెల్లడికావడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కొంతమేర బలహీనపడ్డాయి. దేశీయంగా సెన్సెక్స్ 940 పాయింట్లు(1.55 శాతం), నిఫ్టీ 246 పాయింట్లు(1.4 శాతం) చొప్పున క్షీణించాయి. ఇక డాలరుతో మారకంలో రూపాయి సైతం 82–83 మధ్య కదులుతోంది. వెరసి ఈ వారం ఇన్వెస్టర్లు పలు అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఎఫ్పీఐల వెనకడుగు గత వారం దేశీ స్టాక్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) అత్యధిక శాతం అమ్మకాలకే మొగ్గు చూపారు. దీంతో కొత్త కేలండర్ ఏడాది(2023) తొలి వారంలో నికర అమ్మకందారులుగా నిలిచారు. ఈ నెల 2–6 మధ్య ఎఫ్పీఐలు నికరంగా రూ. 5,872 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. పలు దేశాలలో మరోసారి కోవిడ్–19 సమస్య తలెత్తడం, ఫెడ్ వడ్డీ పెంపు, రష్యా– ఉక్రెయిన్ మధ్య యుద్ధ భయాలు వంటి అంశాలు ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. యూఎస్లో ఈ ఏడాది ఆర్థిక మాంద్యం ఏర్పడనున్న అంచనాలు సైతం ఆందోళనలు పెంచుతున్నట్లు తెలియజేశారు. ఇకపై క్యూ3 ఫలితాలు, ద్రవ్యోల్బణం, జీడీపీ గణాంకాలు వంటి అంశాలు విదేశీ పెట్టుబడులను ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు వివరించారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం నిజానికి గత 11 ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్పీఐలు నికరంగా రూ. 14,300 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. అయితే డిసెంబర్ నెలలో నికరంగా రూ. 11,119 కోట్లు ఇన్వెస్ట్ చేయగా.. నవంబర్లో రూ. 36,239 కోట్ల విలువైన స్టాక్స్ జత చేసుకోవడం గమనార్హం! పూర్తి ఏడాది(2022)లో మాత్రం దేశీ ఈక్విటీల నుంచి నికరంగా రూ. 1.21 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అంతకుముందు మూడేళ్లుగా ఇన్వెస్ట్ చేస్తూ వచ్చిన ఎఫ్పీఐలు పలు ప్రపంచవ్యాప్త ప్రతికూలతల నడుమ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. -
వైజాగ్ టెక్ సమ్మిట్ 2023కు కేంద్రం మద్దతు
సాక్షి, అమరావతి: ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైజాగ్ టెక్ సమ్మిట్ 2023కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మద్దతు ప్రకటించారు. ఫిబ్రవరి 16–17 తేదీల్లో జరిగే సమ్మిట్కు కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆర్థికమంత్రి హామీ ఇచ్చినట్లు సమ్మిట్ నిర్వాహకులు పరల్స్ గ్రూప్ సీఈవో శ్రీనుబాబు గేదెల ప్రకటించారు. గురువారం పార్లమెంట్ ఆవరణలో నిర్మలా సీతారామన్ను కలిసి సమ్మిట్ వివరాలను తెలియచేసినట్లు తెలిపారు. జీ20 అధ్యక్ష దేశంగా భారత్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో గ్లోబల్ టెక్ సమ్మిట్ విజయవంతానికి సహకారం అందిస్తామని, సమ్మిట్ ద్వారా జీ–20 విజన్ను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరినట్లు శ్రీనుబాబు తెలిపారు. జీ20 సదస్సులకు మద్దతుగా న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో గ్లోబల్ టెక్ సమ్మిట్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమ్మిట్ ద్వారా రూ.3,000 కోట్లకుపైగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. -
ఊహించని షాక్లు, ఉద్యోగులను వణికిస్తున్న ఐటీ కంపెనీలు.. టెక్కీల తక్షణ కర్తవ్యం?
సాఫ్ట్వేర్ రంగంలో.. మరోసారి సంక్షోభం! 2008 తర్వాత.. దాదాపు ఆ స్థాయిలో.. మాంద్యం పరిస్థితులు! అగ్రరాజ్యం అమెరికా కేంద్రంగా.. కార్యకలా΄ాలు నిర్వహిస్తున్న దిగ్గజ ఐటీ సంస్థల ఆదాయాల్లో తిరోగమనం! పర్యవసానం.. భారీ సంఖ్యలో కొలువుల కోతలను ప్రారంభించిన సంస్థలు!! మూడు నెలలుగా సంకేతాలు ఇస్తున్న సంస్థలు.. తాజాగా దశల వారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ లే అఫ్స్ ఎక్కువగా భారతీయులపై ప్రభావం చూపుతోందన్న వార్తల నేపథ్యంలో.. ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపు, తక్షణ కర్తవ్యం ఏమిటి, భవితకు భరోసా ఇచ్చే నైపుణ్యాలపై దృష్టి పెట్టడం ఎలా.. తదితర వివరాలతో సమగ్ర కథనం.. అమెరికాలో ఆర్థిక మాంద్యం సంకేతాల ప్రభావం జాబ్ మార్కెట్పై పడింది. ప్రముఖ ఐటీ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో హెచ్–1బీ వీసాపై యూఎస్లోని సంస్థల్లో పని చేస్తున్న మన దేశ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. కారణం.. వారు ఉద్యోగం కోల్పోయిన 60 రోజుల లోపు కొత్త ఉద్యోగం దక్కించుకోకుంటే.. స్వదేశానికి తిరిగొచ్చేయాల్సి ఉంటుంది. ఫాంగ్ మొదలు స్టార్టప్స్ వరకు ఫాంగ్ (ఎఫ్ఏఏఎన్జీ) సంస్థలుగా గుర్తింపు ΄÷ందిన ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్ఫ్లిక్స్, గూగుల్ మొదలు వందల సంఖ్యలోని స్టార్టప్ సంస్థల వరకూ.. ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మొదలైంది. ఫేస్బుక్లో 11 వేలు, అమెజాన్లో పది వేలు, గూగుల్లో పది వేలు, నెట్ఫ్లిక్స్ సంస్థలో మొత్తం ఉద్యోగుల్లో 4 శాతం మేరకు కొలువుల కోతలు ్ర΄ారంభమయ్యాయి. ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ కూడా ఇదే బాటలో నడుస్తోంది. చైనాలో కోవిడ్ ఆంక్షలు, ఐఫోన్14 ్ర΄ో తయారీలో ఇబ్బందులు తదితర కారణాలతో రాబడులు తగ్గడంతో యాపిల్ సంస్థ లేఅఫ్స్కు సిద్ధమైనట్లు బ్లూమ్బర్గ్ నివేదిక స్పష్టం చేసింది. మైక్రోబ్లాగింగ్ వేదిక ట్విటర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాన్ మస్క్ చేతిలోకి రాగానే భారీ సంఖ్యలో ఉద్యోగాల కోత పడింది. ట్విటర్ ఇండియా ఆఫీస్లో 90 శాతం మంది తొలగింపునకు గురయ్యారు. వీటితో΄ాటు ఇంటెల్ సంస్థలో రానున్న రెండేళ్లలో దశల వారీగా 20 వేల ఉద్యోగాలు, హెచ్పీలో ఆరు వేల మంది, సిస్కోలో నాలుగు వేల మందికిపైగా తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఐటీ రంగ సంస్థల్లోనే కాకుండా.. సర్వీసెస్ విభాగంగా పరిగణించే ఉబెర్, జొమాటో, బుకింగ్ డాట్ కామ్, బైజూస్, గ్రూప్ ఆన్ తదితర కంపెనీల్లో కూడా కోతలు మొదలయ్యాయి. మాంద్యం.. ముందు జాగ్రత్త ప్రస్తుతం సంస్థలు ఉద్యోగులను తొలగించడానికి రానున్న కొద్ది నెలల్లో అమెరికాలో ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందనే సంకేతాలే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇది వాస్తవ పరిస్థితుల్లో ఇప్పటికే ఆయా సంస్థల ఆర్థిక రాబడుల్లో ప్రతిబింబించింది. దాదాపు అన్ని సంస్థల రెండో త్రైమాసిక ఫలితాల్లో నికర ఆదాయం తగ్గింది. దీంతో.. సదరు సంస్థలు వ్యయ నియంత్రణలో భాగంగా, ముందు జాగ్రత్త చర్యగా.. మానవ వనరులపై చేసే వ్యయాలను తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగులను తొలగిస్తున్నాయనే అభి్ర΄ాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడేం చేయాలి ఇప్పటికే దాదాపు లక్షన్నర మంది వరకు ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాంటి వారు ‘ఇప్పుడేం చేయాలి?’ అనే ప్రశ్న ఎదురవుతుంది. సంస్థలు.. పనితీరు, సామర్థ్యం ఆధారంగా తొలగిస్తున్నాం అని చెబుతుండటంతో.. ఉద్యోగాలు కోల్పోయిన వారు ‘తమ పనితీరు బాగా లేదా’ అనే ఆవేదనకు గురవుతున్నారు. అదే విధంగా.. కొత్త రిక్రూట్మెంట్లపైనా సంస్థలు కొంత కాలం నిషేధం విధించే అవకాశముంది. దీంతో తమ పరిస్థితి ఏంటి? అని చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారు ఆందోళన చెందకుండా.. ప్రత్యామ్నాయ అవకాశాలను అన్వేషించాలి. ఫ్రెషర్స్, మిడిల్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ తమ ్ర΄÷ఫైల్కు అనుగుణంగా స్కిల్స్ను అప్గ్రేడ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. స్కిల్ గ్యాప్ తగ్గించుకోవడమే ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోయిన వారు తక్షణం తమ స్కిల్ గ్యాప్ను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకు ్ర΄÷ఫెషనల్ నెట్వర్కింగ్ సైట్స్ను ఆసరగా తీసుకోవాలి. అందులోని జాబ్ లిస్టింగ్స్లో పేర్కొన్న డిమాండింగ్ స్కిల్స్ను పరిశీలించాలి. తమ అర్హతలకు అనుగుణంగా మెరుగుపరచుకోవాల్సిన నైపుణ్యాలపై స్పష్టత తెచ్చుకోవాలి. ఉదాహరణకు లింక్డ్ఇన్ జాబ్ ΄ోస్టింగ్స్ను పరిగణనలోకి తీసుకుంటే.. మీరు ΄ోస్ట్ చేసిన రెజ్యుమే ఆధారంగా మీ డొమైన్కు సంబంధించి కొత్త జాబ్ ΄ోస్టింగ్ను తెలియజేయడంతో΄ాటు.. మీరు పెంచుకోవాల్సిన స్కిల్స్ ఏంటి అనే విషయాన్ని గురించి కూడా వివరించేలా ఉంటుంది. దీంతో మీరు ఇంకా పెంచుకోవాల్సిన స్కిల్స్ను స్పష్టంగా తెలుసుకునే వీలుంటుంది. ఇలా స్పష్టత తెచ్చుకున్నాక..సదరు నూతన నైపుణ్యాల సాధనకు కృషి చేయాలి. లింక్డ్ఇన్తో΄ాటు షైన్డాట్ కామ్, మాన్స్టర్ ఇండియా, నౌకరీ డాట్ కామ్ వంటి వాటి ద్వారా మీ డొమైన్, జాబ్ ్ర΄÷ఫైల్కు అనుగుణంగా అవసరమవుతున్న స్కిల్స్ గురించి తెలుసుకొని.. వాటిపై పట్టు సాధించాలి. స్పెషలైజ్డ్ నైపుణ్యాలు స్కిల్ గ్యాప్ను తగ్గించుకుని కొత్త ఉద్యోగాల వేటలో ముందంజలో నిలిచేందుకు వీలుగా స్పెషలైజ్డ్ నైపుణ్యాలు సొంతం చేసుకునే దిశగా అడుగులు వేయాలి. మీ అకడమిక్ డొమైన్కు సరితూగే ప్రత్యేక స్కిల్స్పై పట్టు సాధించాలి. ఉదాహరణకు మీరు ఐటీ విభాగంలో ఉంటే.. కొత్తగా ఆటోమేషన్ స్కిల్స్ను పెంచుకోవడానికి కృషి చేయాలి. అదే విధంగా మీరు సంప్రదాయ డిగ్రీ నేపథ్యం గల వారైతే.. ఇప్పటివరకు చేసిన ఉద్యోగానికి సంబంధించి కొత్తగా వచ్చిన నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి. డేటాసైన్స్, ఈఆర్పీ సొల్యూషన్స్ వంటి కోర్సులు ఎంతో ఉపయోగపడతాయి. సర్టిఫికేషన్స్పై దృష్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా విభాగాల్లో సర్టిఫికేషన్స్ పూర్తి చేయడం కూడా ఉద్యోగాన్వేషణలో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీ 4.0 స్కిల్స్గా జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉన్న ఏఐ–ఎంఎల్, రోబోటిక్స్, ఐఓటీ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి వాటిపై ఆన్లైన్ సర్టిఫికేషన్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిని రెండు నెలలలోపు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన 5జీ టెక్నాలజీస్పైనా దృష్టి పెడితే అవకాశాలు మరింత విస్తృతమవుతాయి. ముఖ్యంగా కోడింగ్, ్ర΄ోగ్రామింగ్, ఇండస్ట్రీ 4.0 వంటి ఐటీ స్కిల్స్పై మైక్రోసాఫ్ట్, ఐబీఎం, గూగుల్, హెచ్పీ, ఏడబ్ల్యూఎస్, సిస్కో, వీఎంవేర్, ఒరాకిల్ వంటి పలు సాఫ్ట్వేర్ సంస్థలు నేరుగా ఆన్లైన్ విధానంలో సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్నాయి. ఖాళీగా ఉండకుండా ఉద్యోగం కోల్పోయిన వారు ఎక్కువ రోజులు ఖాళీగా ఉండటం సరికాదు. తమ అర్హతలకు సరితూగే ఫ్రీలాన్సింగ్, ఆన్లైన్ జాబ్స్ అవకాశాలను అన్వేషించి.. వాటిని సొంతం చేసుకునేలా అడుగులు వేయాలి. పలు జాబ్ ΄ోర్టల్స్, సంస్థల వెబ్సైట్స్లో ఈ అవకాశాల వివరాలు తెలుసుకోవచ్చు. సంస్థ, వేతనాల గురించి ఎక్కువగా పట్టించుకోకుండా కొలువులో చేరి.. మెరుగైన అవకాశం లభించే దాకా కొనసాగాలి. కొన్ని సందర్భాల్లో చిన్న΄ాటి స్టార్టప్ సంస్థల్లో ΄÷ందిన అనుభవమే భవిష్యత్తులో మంచి సంస్థల్లో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు దోహదం చేస్తుందని గుర్తించాలి. మిడ్ లెవల్ ఎగ్జిక్యూటివ్స్ 12 నుంచి 15ఏళ్ల అనుభవమున్న వారిని మిడ్ లెవల్, సీనియర్ లెవల్ ఉద్యోగులుగా పరిగణిస్తారు. వారిని కూడా సంస్థలు తొలగిస్తున్నాయంటే.. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నాలెడ్జ్ అప్డేట్ చేసుకోక΄ోవడం కూడా ఒక కారణమై ఉంటుందనే వాదన వినిపిస్తోంది. ఇలాంటి సీనియర్ ఉద్యోగులు తాము ఇప్పటివరకు బాధ్యతలు నిర్వర్తించిన విభాగాలు, వాటికి సంబంధించి మార్కెట్లో ఆవిష్కృతమవుతున్న కొత్త నైపుణ్యాలను తెలుసుకుని.. వాటిని సొంతం చేసుకునే దిశగా అడుగులు వేయాలి. సోషల్ నెట్వర్కింగ్ ఉద్యోగాలు కోల్పోయిన వారు.. నూతన ఉద్యోగ సాధనలో భాగంగా..సోషల్ నెట్వర్కింగ్ను విస్తృతంగా వినియోగించుకోవాలి. సదరు నెట్వర్కింగ్ ద్వారా ఆయా రంగాల్లోని నిపుణులతో సంప్రదింపులు చేయాలి. ఇప్పటి వరకు తమ ఉద్యోగ జీవితంలో సాధించిన విజయాలు, అవి సంస్థ అభివృద్ధికి తోడ్పడిన తీరు వంటి వాటిని వారిని మెప్పించే రీతిలో వివరించాలి. కొత్త ఉద్యోగాలకు తమను సిఫార్సు చేసే విధంగా ఆయా రంగాల్లోని నిపుణులను ఒప్పించాలి. సాఫ్ట్ స్కిల్స్ ప్రస్తుతం పనితీరు ఆధారంగా తొలగింపులు అని ప్రకటిస్తున్న సంస్థలు.. ఉద్యోగుల్లోని సాఫ్ట్స్కిల్స్ను కూడా మదింపు చేస్తున్నాయి. కాబట్టి సాఫ్ట్స్కిల్స్లో కీలకంగా భావించే కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియరల్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి నైపుణ్యాలు పెంచుకునే దిశగా అడుగులు వేయాలి. అదే విధంగా వీలైతే తమను తొలగించడానికి గల నిర్దిష్ట కారణాన్ని తమ టీమ్ హెడ్ లేదా ప్రాజెక్ట్ హెడ్ ద్వారా తెలుసుకుని లో΄ాలను అధిగమించే ప్రయత్నం చేయాలి. ఆత్మ విశ్వాసం ఉద్యోగ తొలగింపునకు గురైనవారు ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఉండాలి. ఆందోళన నుంచి బయటపడాలి. సాధించగలమనే మనో ధైర్యంతో కొత్త అవకాశాలను దక్కించుకోవాలి. చదవండి: అలర్ట్: అమలులోకి వచ్చే కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాలండోయ్! -
కంపెనీలపై మాకు నమ్మకం లేదు దొర.. సంచలన విషయాలు బయటపెట్టిన ఉద్యోగులు
తాము చేస్తున్న పనికి తగ్గ జీతం తీసుకుంటున్నట్లు కేవలం 32 శాతం ఉద్యోగులు మాత్రమే అభిప్రాయపడుతున్నారట. కన్సల్టింగ్ సంస్థ గార్ట్నర్ జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఇటీవల దాదాపు 3500 మందికిపైగా ఉద్యోగులపై ఈ సర్వే నిర్వహించారు. అందులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పని, వ్యక్తిగత జీవితానికి మధ్య బ్యాలెన్స్ దెబ్బతినడం, వర్కింగ్ కల్చర్ సరిగా లేకపోవడం, ఆఫీస్లో ఉద్యోగులకు ఎదురయ్యే పలు అనుభవాలే దీనికి ప్రధాన కారణంగా అభిప్రాయపడుతున్నారు. గతంలో రాజీనామాల పర్వం ఎక్కువగా ఉండడంతో కంపెనీలు కొత్త సిబ్బందిని తీసుకునేవి. ముఖ్యంగా ఈ తరహా ఐటీ రంగంలో ఇలాంటివి చూడవచ్చు. అయితే ఇక్కడ సంస్థలు ఎంతో కాలంగా పని చేస్తున్న సిబ్బంది వేతనం కంటే కొత్తవారికి ఎక్కువ వేతనాలు చెల్లించి ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి. ఇది అక్కడ ఉంటున్న ఉద్యోగుల్లో కాస్త అసహనాన్ని రగిలిస్తోందట. వీటితో పాటు ప్రతి ఏటా ఉద్యోగులకు ఇచ్చే ఇంక్రిమెంట్ల విషయంలో కొందరికి తక్కువగా చెల్లించడం వంటి కారణాలతో సంస్థపై వారికున్న నమ్మకం సన్నగిల్లుతోంది. వీటితో పాటు ఆర్థిక వ్యవస్థ స్తంభించడం, ఆర్థిక సంక్షోభం ఎదురుకానున్న నేపథ్యంలో కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో బిజీగా ఉన్నాయి. అందుకే మెటా, ట్విట్టర్ వంటి దిగ్గజ సంస్థలు కూడా తమ సిబ్బంది ఇంటికి పంపుతున్నాయి. ఇదే దారిలో ప్రస్తుతం చాలా కంపెనీలు పాటిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు కంపెనీలపై ఉండే నమ్మకం క్రమక్రమంగా దెబ్బతింటున్నట్లు సర్వే పేర్కొంది. చదవండి: హైదరాబాద్: ఫుల్ డిమాండ్.. అందులో స్టార్టప్ల ఏర్పాటు కోసం ఎగబడుతున్న సంస్థలు! -
ఇండియా గేమింగ్ స్టడీ 2022.. లేడీ ‘గేమ్స్’బాండ్స్
వేగంగా విస్తరిస్తున్న ఆన్లైన్ గేమింగ్ను ఉపాధి మార్గంగా ఎంచుకుంటోంది యువత. ఆన్లైన్ గేమింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, యానిమేషన్ను వృత్తిగా మార్చుకుని డబ్బులు సంపాదించుకుంటున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ విషయంలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉంటున్నారు. ప్రముఖ కంప్యూటర్ సంస్థ ‘హెచ్పీ ఇండియా’ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సాక్షి, అమరావతి: కేవలం మానసిక ఉల్లాసానికి.. ఆలోచన శక్తి పెంచుకోవడానికి మాత్రమే ఆన్లైన్ గేమింగ్ను పరిమితం చేయకుండా.. దీనిని ఓ వృత్తిగా మలుచుకుంటోంది నేటి యువత. కొందరు గేమింగ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్గా మారుతుండగా.. మరి కొందరు గేమింగ్ యానిమేటర్స్గా మారుతున్నారు. ఈ రంగంలో పురుషుల కంటే.. మహిళల శాతమే అధికంగా ఉంటోంది. ఈ రంగంలో 56 శాతం మంది మహిళలు ఉండగా.. 44 శాతం మంది మాత్రమే పురుషులు. ఆన్లైన్ గేమింగ్ను పూర్తిస్థాయిలో కొందరు, పాక్షికంగా మరికొందరు.. గిగ్ వర్కర్గా ఇంకొందరు సంపాదన మార్గంగా ఎంచుకుంటున్నట్టు హెచ్పీ ఇండియా ‘ఇండియా గేమింగ్ స్టడీ 2022’ పేరిట విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మరో విషయం ఏమిటంటే.. మిగిలిన ఐటీ జాబ్స్తో పోలిస్తే గేమింగ్ రంగంలోని ఉద్యోగులకు 25 శాతానికి పైగా అధికంగా జీతాలు లభిస్తున్నాయి. ఎందుకంటే.. గేమింగ్ రంగంలో ఆలోచనశక్తి అధికంగా ఉన్నవారు మాత్రమే నిలబడగలుగుతారని, అందుకే వారికి జీతాలు అధికంగా ఇస్తున్నారని ఐటీ రంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో రూ.68,800 కోట్లకు చేరనున్న మార్కెట్ భారత్లో ఆన్లైన్ గేమింగ్ వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం 50.70 కోట్ల మంది ఆన్లైన్ గేమింగ్ ఆడుతున్నట్టు ఋఇంటరాక్టివ్ మీడియా వెంచర్ క్యాపిటల్ ఫండ్ లుమికియా’ వెల్లడించింది. ప్రస్తుతం దేశీయ ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ విలువ రూ.20,800 కోట్లు ఉండగా.. వచ్చే ఐదేళ్లలో మూడు రెట్లు పెరిగి రూ.68,800 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇందులో ఉపాధి అవకాశాలపై యువత ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. సాఫ్ట్వేర్ రంగంలోనే 18 శాతం మంది గేమింగ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్గా మారుతుండగా.. మరో 2 శాతం మంది గేమింగ్ యానిమేటర్స్గా ఉపాధి పొందుతున్నారు. కాగా, ఆన్లైన్ గేమింగ్ ఆడుతున్న వారిలో అత్యధికంగా 92 శాతం మంది వినోదం, మానసిక ఉల్లాసం కోసం ఆడుతున్నట్టు సర్వేలో తేలింది. మొబైల్ ఫోన్లో కంటే కంప్యూటర్లోనే గేమింగ్ ఆడేవారి సంఖ్య క్రమేపీ పెరుగుతోందంట. మొబైల్ కంటే పర్సనల్ కంప్యూటర్లోనే ఆటలు ఆడటానికి 68 శాతం మంది మొగ్గు చూపుతున్నారు. మొబైల్ కంటే కంప్యూటర్లో ఆడితే అనుభూతి అధికంగా ఉంటోందని, అందుకనే ఈ మధ్య కాలంలో 39 శాతం మంది మొబైల్ నుంచి కంప్యూటర్లోకి ఆటలు ఆడటానికి మారినట్టు సర్వేలో వెల్లడైంది. పీసీ గేమింగ్పై దృష్టి మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ పీసీ గేమింగ్లో మరిన్ని ఆవిష్కరణలు తీసుకువచ్చే దిశగా కృషి చేస్తున్నట్టు హెచ్పీ ఇండియా సీనియర్ డైరెక్టర్ విక్రమ్బేడి తెలిపారు. రాష్ట్రంలో కూడా ఆన్లైన్ గేమింగ్ అవకాశాలను అందిపుచ్చుకుంటూ పలు ఐటీ సంస్థలు ఏర్పాటవుతున్నాయని, విజయవాడ, రాజమండ్రి, విశాఖ కేంద్రంగా 8కి పైగా ఐటీ సంస్థలు ఆన్లైన్ గేమింగ్లకు వివిధ సేవలను అందిస్తున్నాయని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) ప్రెసిడెంట్ శ్రీధర్ కోసరాజు ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పుడు లెర్నింగ్ ఆధారిత గేమ్స్కు బాగా డిమాండ్ ఉండటంతో ఈ రంగంలో అవకాశాలను యువత అందిపుచ్చుకుంటోందన్నారు. వీఎఫ్ఎక్స్ యానిమేటర్స్, మెటావర్క్స్లో ఏఆర్, వీఆర్, ఎక్స్ఆర్ వంటి టెక్నాలజీలకు డిమాండ్ అధికంగా ఉందన్నారు. ఆన్లైన్ గేమ్స్తోనే పిల్లల్లో చురుకు ఈ కాలంలో పిల్లలు బయటకు వెళ్లి ఆడుకోలేని పరిస్థితి ఉండటంతో వారి మెదడు చురుకుగా పనిచేయడానికి కనీసం రోజుకు గంట లేదా గంటన్నర ఆన్లైన్ గేమ్స్ ఆడుకోనివ్వాలి. ఇందుకోసం నీతిఆయోగ్ ఏర్పాటు చేసిన అటల్ థింకరింగ్ ల్యాబ్స్ (ఏటీఎల్) చక్కటి ఫలితాలను అందిస్తున్నాయి. విశాఖలోని శ్రీశారద విద్యాలయంలో గల ఏటీఎల్లో పిల్లలను 3, 4 వారాలపాటు ఆన్లైన్ గేమ్స్ ఆడుకోవడానికి వదిలేసి పరిశీలిస్తున్నారు. ఎవరైతే ముందుకు వెళ్లలేకపోతున్నారో గుర్తించి వాళ్లకు అనుగుణంగా గేమింగ్లో కోడింగ్ మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్ వంటి సబ్జెక్టులను గేమింగ్ రూపంలో చెప్పడం వల్ల పిల్లలకు సులభంగా అర్థమవుతోంది. – రాజశేఖర్ వాసా, ఫౌండర్, స్కెచ్ ఈఏ ఐటీ, వైజాగ్ -
Moonlighting: రెండు పనులు చేయడం తప్పేనా?
ఒకచోట ఉద్యోగం చేస్తూనే రహస్యంగా మరొక ఉద్యోగం కూడా చేస్తుండటాన్ని ‘మూన్లైటింగ్’ అంటారు. మనదేశంలో వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల అప్రమేయంగా ఒనగూడుతున్న సమయ సదుపాయంతో ప్రస్తుతానికి కొన్ని ఐటీ కంపెనీల ఉద్యోగులు మాత్రమే ‘మూన్లైటింగ్’ చేస్తుండవచ్చు గానీ, భవిష్యత్తులో ఈ ధోరణి మరింతగా వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదు. ఒకే సమయంలో అనేక అసైన్మెంట్లపై పని చేయడం అన్నది ఉద్యోగ ఒప్పందాల సాంప్రదాయ ప్రమాణాలకు భిన్నమైనదిగా పరిగణన పొందవచ్చు. కానీ కోవిడ్ మహమ్మారి తరువాత మారిన పరిస్థితులలో కార్యస్థానాన్ని అనువైనదిగా మార్చుకున్నప్పుడు, మూన్లైటింగ్ అనే సమస్యపై దృక్కోణాన్ని మార్చుకోవడం కూడా అవసరమే. ‘మూన్లైటింగ్’ అన్నది పాతమాటే. అయితే ప్రసిద్ధ ఐటీ కంపెనీ ‘విప్రో’ ఇటీవల అనూహ్యంగా 300 మంది ఉద్యోగులను తొలగించడంతో ఈ మాట మళ్లీ కొత్తగా వినిపించడం మొదలైంది. ఒకచోట ఉద్యోగం చేస్తూనే రహస్యంగా మరొక ఉద్యోగం కూడా చేస్తుండటాన్ని ‘మూన్లైటింగ్’ అంటారు. పూర్వపు నానుడిగా చెప్పాలంటే... ‘పగలొక ఉద్యోగం, రాత్రొక ఉద్యోగం’. వాస్తవానికి కూడా ‘మూన్లైటింగ్’ అనే మాట అలా పుట్టిందే. అయితే ఐటీ కంపెనీలు విస్తరించాక, ఐటీ ఉద్యో గాలకు పగలూ రాత్రీ లేకుండా పోయాక మూన్లైటింగ్ అనే మాట ‘రహస్యంగా రెండో ఉద్యోగం’ అనే అర్థానికి పర్యాయ పదం అయింది. కంపెనీల చట్టం ప్రకారం దొంగచాటుగా ఇంకో ఉద్యోగం చేయకూడదన్నది నిబంధన. ఆ నిబంధనను ఉల్లంఘించారన్న కారణంతోనే విప్రో తన ఉద్యోగులను తొలగించిందని అనుకోవాలి. అనూహ్యమైన ఆ చర్య భారతదేశంలోని 227 బిలియన్ డాలర్ల విలువైన ఐటీ పరిశ్రమల రంగంలో ప్రకంపనలు పుట్టించి, ఆ ఐటీ దిగ్గజం చేసిన పని సమంజసమేనా అనే చర్చకు దారి తీసింది. ఈ విషయంలో కొన్ని ఐటీ కంపెనీల యజమానులు విప్రో వైపు ఉండగా, మరికొన్ని కంపెనీలు ‘‘చెప్పి చేస్తే తప్పు కాదు’’ అనే సర్దుబాటుతో మూన్లైటింగ్ను అంగీకరించేందుకు సైతం సిద్ధంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి చెందుతున్న ఉద్యోగ సంస్కృతిని పరిశీలించి చూస్తే కనుక మూన్లైటింగ్ అన్నది భిన్నమైన కోణాన్ని కలిగి ఉన్న ఒక పని నమూనాగా అవతరిస్తోంది. నిపుణులకు, నైపు ణ్యానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే కంపెనీలకు మూన్లైటింగ్ అప్రధానమైన విషయమే. ‘ఇంటి నుండి పని’ (వర్క్ ఫ్రమ్ హోమ్) విధానంలో ఆమోదం పొందిన విధి నిబంధనలకు అనుగుణంగానే మూన్లైటింగ్ అనే దానికి అప్రకటిత ఆమోదం ఉంటుంది. ఎక్కడి నుంచైనా పని చేసే అవకాశం లభించాక యువ నిపుణులు తమ కార్యస్థావరాలను బీచ్లకు, పర్వతాలకు సైతం మార్చుకుని సమ ర్థంగా తమ కంపెనీ విధులను నిర్వహిస్తున్నప్పుడు పనిలో పనిగా బయటి కార్పొరేట్ కంపెనీల నుంచి ప్రాజెక్టులు స్వీకరించడానికి ఉన్న వెసులుబాటును ఉపయోగించుకోవడం వల్ల ఎవరికి నష్టం? మనదేశంలో వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల అప్రమేయంగా ఒనగూడు తున్న సమయ సదుపాయంతో ప్రస్తుతానికి కొన్ని ఐటీ కంపెనీల ఉద్యోగులు మాత్రమే మూన్లైటింగ్ చేస్తుండవచ్చుగానీ, భవి ష్యత్తులో ఈ ధోరణి మరింతగా వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదు. అక్కడితో ఆగకుండా, వర్క్ ఫ్రమ్ హోమ్కి మూన్లైటింగ్ ఒక విజయ వంతమైన ప్రత్యామ్నాయ చోదకశక్తిగా కూడా యాజమాన్యాలకు, ఉద్యోగులకు కనిపించవచ్చు. అంటే మున్ముందు ఐటీ కంపెనీలలో మూన్లైటింగ్ ఒక అంగీకారయోగ్యమైన పని విధానం కావచ్చు! జూనియర్ ఐటీ ఉద్యోగులకు జీతాలను పెంచే విషయంలో ఏమాత్రం ఔదార్యాన్ని ప్రదర్శించని ప్రముఖ టెక్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లకు, కంపెనీ వ్యవస్థాపకులకైతే ఇది తప్పక ఆమోదయోగ్యం అవుతుంది. ఉద్యోగులకు వారు ఆశించిన స్థాయి జీతాలను పెంచలేనప్పుడు మూన్లైటింగ్కు కంపెనీలు చెప్పే అభ్యంతరం ఏముంటుంది? ఐబీఎం, ఇన్ఫోసిస్ వంటి ఐటీ దిగ్గజాలు మూన్లైటింగ్ను పని సంప్రదాయానికి వ్యతిరేకమైన చట్టవిరుద్ధ చర్యగా పరిగణించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆ కంపెనీల ఉద్యోగులు పూర్తి సమయం కంపెనీ పని మీదే ఉండాలి. కంపెనీల వ్యవహారాల పట్ల గోప్యత లేకుంటే పోటీ కంపెనీలు పైచేయి సాధించే ప్రమాదం ఉంటుందన్న ఆందోళన సహజమే కనుక నిస్సందేహంగా వారు మూన్లైటింగ్ను ఆమోదించరు. అయితే మూన్లైటింగ్ను ఆమోదించడం ద్వారా సమాచార గోప్యతకు సంబంధించిన ఆందోళనలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది! ఉద్యోగులు తమ మూన్లైటింగ్ ప్రాజెక్ట్లు లేదా అసైన్మెంట్ల గురించిన సమాచారాన్ని దాచకుండా పంచుకుంటారు కనుక వారిపై అనుమానాలకు తావుండదు. పని విధానాల వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి ఒక సంఘంగా ఏర్పడిన ఐటీ పరిశ్రమ ఉద్యోగులు కూడా మూన్లైటింగ్ కొత్తదేమీ కాదనీ, దశాబ్దాలుగా ఇది లాభదాయకమైన అంకుర సంస్థల ఆవిర్భావానికి దారి తీసిందనీ అంటున్నారు. ఈమాట నిజం. ఎందుకంటే చాలామంది అంకుర సంస్థల వ్యవస్థాపకులు కొత్త వెంచర్లను నెలకొల్పే అవకాశాలను అన్వేషించేటప్పుడు తమ ‘పూర్తి సమయ’ ఉద్యోగాలలో ఉన్నవారే. అంతమాత్రాన యాజమాన్యాలు తమ ఉద్యోగుల వల్ల తమకు భవిష్యత్తులో పోటీగా అవతరించబోయే స్టార్ట్–అప్ల గురించి కలత చెందనవసరం లేదు. వాస్తవానికి ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాలకు అదనంగా బయటి నుంచి అసైన్మెంట్లను తీసుకోవడానికి ప్రధాన కారణా లలో ఒకటి.. పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు అవసరమైన నైపుణ్యా లకు మెరుగు పరచుకోవడమేనని ఇప్పటికే పలు నివేదికలలో వెల్లడ యింది. ఈ రంగంలో సాంకేతికత త్వరత్వరగా పాతబడిపోతుం టుంది. అలాంటప్పుడు కొత్త నైపుణ్యాలతో ముందుకు వెళ్లడం అత్యవసరం. పైపెచ్చు ఈ మూన్లైటింగ్... కృత్రిమ మేధస్సు లేదా ఇతర హైటెక్ రంగాలలో ఉద్యోగాల పరంగా అయినా, దీర్ఘకాలంలో మరింత లాభదాయకమైన రంగాల్లో ఉపాధి పొందేందుకైనా వీలు కల్పిస్తుంది కాబట్టి, ఎక్కువ సంపాదించడం ముఖ్యం అయినప్పటికీ, ఇది కేవలం సంపాదించడానికే కాదు. ఈ మొత్తం మూన్లైటింగ్ కథను గ్లోబల్ గిగ్ ఎకానమీ (స్వల్ప కాలిక ఉపాధికి ప్రాధాన్య ఇచ్చే ఆర్థిక వ్యవస్థ) నేపథ్యంలో ప్రాధాన్యం పొందుతున్న విధానంగా భావించాలి. ఉద్యోగులు తమను తాము సంప్రదాయ 9–5 ఉద్యోగాలతో ముడిపెట్టుకోకుండా బహుళ క్లయిం ట్ల కోసం స్వల్పకాలిక ఆర్జన విధులు చేపడతారనే వాస్తవమే మూన్ లైటింగ్కు పునాది. అదే సమయంలో, అదే గిగ్ ఎకానమీ భారతీయ వ్యవస్థలోకి మారి నప్పుడు చాలా భిన్నంగా ఉంటుందని గుర్తించాలి. ఉదాహరణకు, విదేశాలలో ఊబర్ డ్రైవర్లు తమ సొంత వాహనాలను రోజుకు కొన్ని గంటలపాటు టాక్సీలుగా ఉపయోగించే వ్యక్తులు కావచ్చు. మన దేశంలో, ఊబర్ను నడపడం పూర్తి కాలపు ఉపాధి. ఐటీ పరిశ్రమ విషయానికొస్తే, ప్రపంచ పరిస్థితులతో ఇక్కడ ఎక్కువ సారూప్యం ఉంది. భారతీయ టెక్ కార్మికులు విదేశాలలో ఉన్న వారి మాదిరిగానే ఎక్కువ లేదా తక్కువ పని చేస్తున్నారు. అంతే కాదు, ఇక్కడ చాలామంది విదేశీ అసైన్మెంట్లతో వ్యవహరించ డంలో అనుభవజ్ఞులు. అయితే, ఈ రంగానికి సంబంధించిన సమ స్యలు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నందున వాటిని సున్నితంగా పరిష్కరించాలి. మెకిన్సే అధ్యయనం ప్రకారం, భార తీయ ఐటీ పరిశ్రమ వచ్చే ఐదేళ్లలో దాదాపు 10 శాతం వృద్ధి రేటుతో 300–350 బిలియన్ల మార్కును చేరుకోగలదని అంచనా. ప్రస్తుత చట్టాలు వ్యక్తులు ఒకే సమయంలో అనేక ప్రదేశాలలో పనిచేయడానికి అనుమతించనందున ఈ ద్వంద్వ ఉపాధి సమస్య ఉండనే ఉంటుంది. కార్యాలయాలలో మారుతున్న వాస్తవికతకు అను గుణంగా దీనిని సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఐటీ పరిశ్రమలో... పనిచేస్తున్న వారు తమ నైపుణ్యాలను మరింతగా పెంపొందించు కోకుంటే లేదా నవీన సామర్థ్యాలను మెరుగుపరచుకోలేకపోతే, దేశీయ ఐటీ రంగం భారీగా నష్టపోతుంది. ఒకే సమయంలో అనేక అసైన్మెంట్లపై పని చేయడం అన్నది ఉద్యోగ ఒప్పందాల సంప్ర దాయ ప్రమాణాలకు భిన్నమైనదిగా పరిగణన పొందవచ్చు. కానీ కోవిడ్ మహమ్మారి తరువాత మారిన పరిస్థితులలో కార్యస్థానాన్ని అనువైనదిగా మార్చుకున్నప్పుడు, మూన్లైటింగ్ అనే సమస్యపై దృక్కోణాన్ని మార్చుకోవడం కూడా అవసరమే. అనువైన పని గంటలు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు పని చేసే రంగానికి ఆమోద యోగ్యమైన విధానం. మూన్లైటింగ్కి కూడా అంతే సమానమైన ఆమోదం ఇవ్వాల్సిన సమయమిది. వ్యాసకర్త: సుష్మా రామచంద్రన్, సీనియర్ జర్నలిస్ట్ (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మళ్లీ ఐటీలోకి వచ్చేది లేదు..
న్యూఢిల్లీ: వ్యాపారాల్లో కీలకంగా వ్యవహరించే ప్రతిభావంతులైన ఉద్యోగులను అట్టే పెట్టుకోవడం ఐటీ రంగంలో చాలా కష్టంగా మారుతోంది. గత రెండేళ్లుగా ఇది మరింత తీవ్రమవుతోంది. ప్రొఫెష నల్స్లో చాలా మంది భవిష్యత్తులో ఈ రంగానికి తిరిగి రావద్దు అని భావిస్తుండటమే ఇందుకు కార ణం. ఐటీ రంగానికి నియామకాల సర్వీసులు అందించే టీమ్లీజ్ డిజిటల్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఉద్యోగుల అవసరాలు, ప్రాధాన్యతలు మారిపోయాయి. వారు ఉద్యోగ నిబంధనల్లో సరళత్వం, కెరియర్లో వృద్ధి అవకాశాలు, ఉద్యోగులకు దక్కే ప్రయోజనాలు మొదలైన వాటి ఆధారంగా తమ కెరియర్లను మదింపు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ రంగంలో రెండంకెల స్థాయిలో 25 శాతం మేర అట్రిషన్ నమోదవుతోంది. 100 మంది పైగా నిపుణులు, ఐటీ రంగానికి సంబంధించిన వారితో చేసిన ఇంటర్వ్యూల ఆధారంగా టీమ్లీజ్ ఈ నివేదిక రూపొందించింది. ‘గత దశాబ్దకాలంలో దేశీ ఐటీ రంగం గణనీయంగా విస్తరించింది. అత్యంత వేగంగా 15.5 శాతం మేర వృద్ధితో 227 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. 2022 ఆర్థిక సంవత్సరంలోనే అదనంగా 5.5 లక్షల ఉద్యోగాలను కల్పించింది‘ అని టీమ్లీజ్ డిజిటల్ సీఈవో సునీల్ చెమ్మన్కోటిల్ తెలిపారు. మారుతున్న ట్రెండ్.. : అయితే, కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఐటీ నియామకాల ధోరణిలో పెను మార్పులు వచ్చా యి. వ్యాపారాలకు కీలకమైన ప్రతిభావంతులను అట్టే పెట్టుకోవడం ఐటీ కంపెనీలకు గత రెండేళ్లుగా కష్టంగా మారుతోంది. సర్వే ప్రకారం 57 శాతం మంది ప్రొఫెషనల్స్ భవిష్యత్తులో ఐటీ సర్వీసుల రంగానికి తిరిగి వచ్చే యోచన లేదని తెలిపారు. జీతాల పెంపు, ఇతర ప్రయోజనాలు ఎలాగూ ఉండేవే అయినా ఉద్యోగాలు మారడంలో కొత్త సంస్థల అంతర్గత విధానాలు కూడా ఉద్యోగులకు ఆకర్షణీయంగా ఉంటున్నాయని సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో పని, వ్యక్తిగత జీవితం గురించి ఉద్యోగుల అభిప్రాయాల్లో వస్తున్న మార్పులను కూడా దృష్టి లో పెట్టుకుని కంపెనీలు తమ విధానాలను రూపొందించుకోవాల్సి ఉంటోందని తెలిపింది. ఉద్యోగులు, వారి అభ్యున్నతి లక్ష్యంగా కంపెనీల నియామక ప్రణళికలు వ్యూహాత్మకంగా ఉండాలని పేర్కొంది. -
సాఫ్ట్వేర్ ఉద్యోగులకు చల్లని కబురు.. ఒత్తిడిని దూరం చేసేందుకు ప్లాన్స్!
సాక్షి, హైదరాబాద్: నూతన ప్రాజెక్టులు, తీరిక లేకుండా సదస్సులు, సమావేశాలు, కొత్త ప్రోగ్రాంలతో కుస్తీ పట్టే ఐటీ ఉద్యోగులకు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించేందుకు పలు ఐటీ కంపెనీలు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. ఒత్తిడితో సతమతమవుతున్న ఐటీ ఉద్యోగుల శాతం ఏటా పెరుగుతోందని.. గతేడాది సుమారు 79 శాతం మంది ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నట్లు ఐటీ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్, సెమినార్లు, మోటివేషనల్ తరగతులు నిర్వహించేందుకు పలు ఐటీ కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేస్తుండడం విశేషం. నగరంలో చిన్న, మధ్యతరహా, కార్పొరేట్ ఐటీ కంపెనీలు 1500 వరకు ఉన్నాయి. వీటిలో సుమారు 80 శాతం కంపెనీలు ఈ శిక్షణ తరగతుల నిర్వహణకు శ్రీకారం చుట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. నియామకాల్లోనూ నయా పద్ధతి.. ► గ్రేటర్ సిటీకి ఐటీ కంపెనీల వెల్లువ మొదలైంది. దీంతో ఉద్యోగుల పని విధానంలో సమూల మార్పులు చేయడంతోపాటు.. సమీప భవిష్యత్లో నియామకాల్లో సైతం సాంకేతికతను విరివిగా వినియోగించేందుకు ఐటీ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నట్లు ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగుల నియామకాలు, తొలగింపులు, ఇంటర్వ్యూలు, పదోన్నతులు అన్నీ వర్చువల్ విధానంలో జరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. కృత్రిమ మేధ (ఏఐ), బ్లాక్చైన్ టెక్నాలజీతో ఉద్యోగార్థుల బయోడేటాలను తనిఖీ చేయనున్నారు. ► వీడియో స్ట్రీమింగ్ ద్వారా అభ్యర్థి భావోద్వేగాలు, ఆలోచనలు,వ్యక్తిత్వాన్ని అంచనా వేయనున్నారు. కాగా కోవిడ్ తరుణంలోనూ గతంలో నగరంలో పలు కంపెనీలు వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూలు నిర్వహించి వేలాదిమందికి ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొంటున్నారు. నగరంలోని కంపెనీలు 54 శాతం మందిని,విదేశీ కంపెనీలు 49 శాతం మందిని ఈ విధానంలో నియమించుకున్నట్లు హైసియా వర్గాలు తెలిపాయి. ► ఐటీ రంగంలో నూతన సాంకేతికతకు అధిక ప్రాధాన్యం దక్కుతోంది. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్పీఏ), కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్తో పని విధానం సమూలంగా మారనుందని అభిప్రాయపడుతున్నారు. ఏఐ వినియోగం భారీగా పెరిగిన నేపథ్యంలో భవిష్యత్లో ఉద్యోగాల కల్పనకు మరింత ఊతమిచ్చే అవకాశాలుంటాయని అంచనా వేస్తున్నారు. (క్లిక్: ఓయూలో అడోబ్ పరిశోధనాకేంద్రం) -
ఐటీ ఆఫీసుల్లో ‘డ్రగ్స్’ నిఘా
సాక్షి, హైదరాబాద్: ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు పలువురు డ్రగ్స్ సరఫరాదారులు, వినియోగదారులుగా మారుతున్న నేపథ్యంలో.. సైబరాబాద్ పోలీసులు దీనిపై దృష్టి సారించారు. డ్రగ్స్ కట్టడికి ప్రణాళిక రచించారు. క్షేత్రస్థాయిలో డ్రగ్స్కు డిమాండ్ను తగ్గిస్తే పై స్థాయిలో సరఫరా తగ్గుతుందని భావిస్తున్న సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర.. విద్యా, ఉద్యోగ సంస్థల్లో మాదకద్రవ్యాలు నియంత్రించాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రంలోనే తొలిసారిగా విద్యా సంస్థలలో డ్రగ్స్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేసిన సీపీ.. ఐటీ ఆఫీసుల్లోనూ ఈ దిశగా చర్యలకు సిద్ధమయ్యారు. మాదకద్రవ్యాల వైపు మొగ్గు చూపకుండా.. కరోనా ఆంక్షలు సడలించిన నేపథ్యంలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. ఇప్పటివరకు వర్క్ఫ్రమ్ హోం చేసిన ఉద్యోగులు నగరానికి చేరుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో, పని ఒత్తిడి, వీకెండ్ పార్టీలతో ఉద్యోగులెవరూ మాదకద్రవ్యాల వైపు మొగ్గుచూపకుండా నియంత్రించే ఉద్దేశంతో ‘డ్రగ్స్ ఫ్రీ వర్క్ ప్లేస్’ (డ్రగ్స్కు తావులేని పని ప్రదేశం) నినాదంతో డ్రగ్స్ నిరోధక కమిటీలను పోలీసులు ఏర్పాటు చేయనున్నారు. సైబరాబాద్ ఐటీ కారిడార్లో చిన్న పెద్ద ఐటీ కంపెనీలు సుమారు వెయ్యి వరకు ఉంటాయి. వీటిలో దాదాపు 4 లక్షల మంది పురుష, 2.50 లక్షల మంది మహిళా ఉద్యోగులు ఉంటారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులున్న పని ప్రదేశాల్లో డ్రగ్స్ నిరోధక కమిటీలు ఏర్పాటు చేస్తే హైదరాబాద్ ఐటీ బ్రాండ్కు మచ్చపడకుండా ఉంటుందని, ఉద్యోగుల ఉజ్వల భవిష్యత్తు మత్తుకు చిత్తుకాకుండా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కమిటీలో సభ్యులు ఎవరెవరు? డ్రగ్స్ నిరోధక కమిటీలో స్థానిక పోలీసులతో పాటు కంపెనీ మేనేజ్మెంట్, మానవ వనరుల విభాగం (హెచ్ఆర్), సెక్యూరిటీ, ఎంపిక చేసిన కొందరు ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థ, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. త్వరలోనే కమిటీల విధివిధానాలను సైబరాబాద్ కమిషనరేట్ పోలీసు ఉన్నతాధికారులు ఖరారు చేయనున్నారు. ఈనెలాఖరు నుంచి ఆయా కమిటీలు కార్యరూపంలోకి రానున్నాయి. కమిటీలు ఏం చేస్తాయి? డ్రగ్స్ నిరోధక కమిటీలు ప్రధానంగా మూడు అంశాలపై దృష్టిసారిస్తాయి. 1. ఎవరైనా డ్రగ్స్ను ఆఫర్ చేస్తే ప్రలోభాలకు గురికాకుండా మనల్ని మనం ఎలా నియంత్రించుకోవాలో సూచనలు ఇస్తారు. ఆఫర్ చేసిన స్నేహితుడు, సహోద్యోగిని నొప్పించకుండా సున్నితంగా ఎలా తిరస్కరించాలో నేర్పిస్తారు. 2. డ్రగ్స్కు అలవాటు పడినవారిని కమిటీలు గుర్తించినా లేదా ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నవారు స్వచ్ఛందంగా కమిటీ ముందుకొచ్చినా.. వారు అలవాటును ఎలా మానుకోవాలో శిక్షణ ఇస్తారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతారు. ఎన్జీవో, మానసిక నిపుణుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తారు. పూర్తిగా కోలుకునే వరకు పర్యవేక్షిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తారు. 3. కంపెనీలు, విద్యా సంస్థలలో గుట్టుచప్పుడు కాకుండా మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న వారిపై కమిటీలు నిఘా పెడతాయి. విక్రయ, కొనుగోలుదారుల వివరాలను రహస్యంగా సేకరించి వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు. మేనేజ్మెంట్ తరఫున కూడా చర్యలు ఉంటాయి. 150కి పైగా విద్యా సంస్థల్లో ఏర్పాటు రాష్ట్రంలోనే తొలిసారిగా మాదాపూర్ జోన్లో 150కి పైగా స్కూళ్లు, కాలేజీల్లో ఈ విధంగా డ్రగ్స్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేశారు. త్వరలోనే శంషాబాద్, బాలానగర్ జోన్లలోని విద్యా సంస్థలలో కూడా ఏర్పాటు చేయనున్నారు. జూలై నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభం అయ్యాక ఆయా కమిటీలు కార్యరూపంలోకి వస్తాయని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. త్వరలోనే హెచ్సీయూ, సీబీఐటీ, వీఎన్ఆర్ వంటి ప్రధాన విద్యా సంస్థల్లో సైబరాబాద్ కమిషనరేట్, మాదాపూర్ డివిజన్లోని పలువురు పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. డ్రగ్స్కు సంబంధించి ఫిర్యాదులు, సమాచారం కోసం 94920 99100 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
ఆప్టిమ్హైర్లో నియామకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ రంగానికి నియామక సేవలు అందిస్తున్న హైదరాబాద్ కంపెనీ ఆప్టిమ్హైర్ ఈ ఏడాది చివరికల్లా ఉద్యోగుల సంఖ్యను 300లకు చేర్చనుంది. ప్రస్తుతం కంపెనీలో 120 మంది సిబ్బంది ఉన్నారు. మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఈ కంపెనీకి 120కి పైచిలుకు క్లయింట్లు ఉన్నారు. ఇప్పటి వరకు ఆరు లక్షల మంది అభ్యర్థుల ముందస్తు ఇంటర్వ్యూలు పూర్తి చేశామని ఆప్టిమ్హైర్ ఫౌండర్, సీఈవో లక్ష్మి ఎం కొడాలి తెలిపారు. కో–ఫౌండర్ సీహెచ్.పవన్ కుమార్ రావు, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అశుతోష్ వ్యాస్తో కలిసి గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మిడ్, సీనియర్ లెవెల్ ఉద్యోగి నియామకానికి కంపెనీలకు ఆరు నెలల దాకా సమయం పడుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ సాయంతో ఈ సమయాన్ని 12 రోజులకు కుదించగలిగాం. రెండు, మూడు ఇంటర్వ్యూ దశలను తగ్గించేలా అభ్యర్థులను వడపోస్తాం. మా వేదిక ద్వారా 5,700 మందికి ఉద్యోగాలు లభించాయి. వీరి గరిష్ట వేతనం భారత్లో రూ.80 లక్షలు, యూఎస్లో రూ.3 కోట్ల వరకు ఉంది. రెఫరల్ పార్ట్నర్స్ 2,000 మంది ఉన్నారు. అభ్యర్థులను రెఫర్ చేయడం ద్వారా వీరు నెలకు రూ.6 లక్షల వరకు సంపాదిస్తున్నారు’ అని వివరించారు. -
ఐటీ బాట పట్టిన హైదరాబాద్: కొత్తగా వందలాది కంపెనీలు.. వేలాదీ కొలువులు
సాక్షి, హైదరాబాద్: ముత్యాల నగరం (సిటీ ఆఫ్ పెరల్స్) ఐటీ బాట పట్టింది. మహానగరంలో గత ఏడేళ్లుగా ఐటీ, అనుంబంధ రంగ కార్యకలాపాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నగరం నలుచెరుగులా ఐటీ రంగాన్ని విస్తరించేందుకు కంకణం కట్టుకోవడంతో వందలాదిగా నూతన కంపెనీలు..వేలాది కొలువులు సిటీజన్లకు వరంగా మారాయి. తాజాగా కండ్లకోయలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఐటీ పార్క్తోపాటు.. ఇటీవలే జెన్పాక్ సంస్థ తమ గ్రిడ్ పాలసీలో భాగంగా ఉప్పల్లోని తమ క్యాంపస్ను 20 లక్షల చదరపు అడుగుల వాణిజ్య కార్యాలయాన్ని విస్తరించిన విషయం విదితమే. ఈ సంస్థ రాకతో కేవలం ఉప్పల్ ప్రాంతంలోనే ఏకంగా 15 వేలకుపైగా కొత్త ఉద్యోగాలు రానుండడం విశేషం. నగర ఐటీ సెక్టార్లో ప్రస్తుతం ఉన్న 6 లక్షల కొలువులకు అదనంగా రాబోయే రోజుల్లో మరో లక్ష ఉద్యోగాల కల్పన సాధ్యపడుతుందని ఆశాఖ వర్గాలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి. వేగంగా విస్తరణ.. ► నార్త్ హైదరాబాద్ కింద పరిగణించే కండ్లకోయ పరిధిలో 35 ఇంజినీరింగ్, 50 ట్రెడిషనల్ డిగ్రీ కాలేజీలు 30 ఎంబీఏ కాలేజీలతో పాటు పలు ఫార్మసీ, మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. ► ప్రతి ఏడాది 15 నుంచి 20 వేల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. ► వెస్ట్ హైదరాబాద్కు వెళ్లి ఐటీ ఉద్యోగాలు చేయడం కంటే.. నార్త్ హైదరాబాద్లోనే ఐటీ ఉద్యోగాలు చేసేలా నగరానికి నలువైపులా ఐటీ పార్కులు నిర్మించేందుకు నూతన ఐటీ పాలసీ దోహదం చేస్తుందని ఐటీ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ► నార్త్సిటీ పరిధిలో మంచి యూనివర్సిటీలు, సమీపంలోనే ఎంఎంటీఎస్, జాతీయ రహదారులు,అర్భన్పార్క్లు ఉండడం ఈప్రాంతంలో ఐటీ విస్తరణ వేగం పుంజుకుంది. అగ్రశ్రేణి కంపెనీలకు కేరాఫ్.. ► ప్రపంచంలోనే టాప్ 5 కంపెనీలతో పాటు అనేక కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాయి. యాపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించిన విషయం విదితమే. ► అమెజాన్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ను హైదరాబాద్లో నెలకొల్పింది. 31 లక్షల చదరపు అడుగుల్లో దీన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో సుమారు 1500 వరకు ఉన్న చిన్న, పెద్ద, కార్పొరేట్ కంపెనీల్లో సుమారు 6.28 లక్షల మంది ఉపాధి పొందుతున్న విషయం విదితమే. హై..హై..ఐటీ.. గ్రేటర్ పరిధిలో 2014 నుంచి ఐటీ భూమ్ క్రమంగా పెరుగుతోంది. విశ్వవ్యాప్తంగా పేరొందిన దిగ్గజ ఐటీ, బీపీఓ, హార్డ్వేర్, కేపీఓ సంస్థలు నగరానికి క్యూ కడుతున్నాయి. కరోనా కష్టకాలంలోనూ నగరంలో ఐటీ కంపెనీల కార్యకలాపాలు, నూతన కంపెనీల వెల్లువ తగ్గకపోవడం విశేషం. ప్రస్తుతం ఏటా రూ.1.45 లక్షల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు 2026 నాటికి ఏటా రూ.3 లక్షల కోట్ల మార్కును దాటుతాయని ఐటీ వర్గాలు లెక్కలు వేస్తుండడం విశేషం. -
ఐటీ కారిడార్తో లక్ష ఉద్యోగాలు
ఉప్పల్ (హైదరాబాద్): హైదరాబాద్లోని పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా కేంద్రీకృతమైన ఉన్న ఐటీ రంగాన్ని గ్రిడ్ పాలసీలో భాగంగా నగరం దశదిశలా విస్తరించేందుకు కృషి జరుగుతోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. పశ్చిమ ప్రాంతానికి దీటుగా తూర్పు ప్రాంత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఐటీ కారిడార్ పూర్తయితే లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. జెన్ ప్యాక్ట్, రాంకీ ఎస్టేట్స్ సంస్థల సంయుక్తాధ్వర్యంలో ఉప్పల్ జెన్ ప్యాక్ట్ ఆవరణలో జరుగుతున్న జెన్నెక్ట్స్ స్క్వేర్ ప్రాజెక్ట్కు ఆదివారం కేటీఆర్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో నూతన ప్రాజెక్టు రావడం అద్భుతమని అన్నారు. ఉప్పల్ ప్రాంతంలో లక్షమంది ఐటీ ఉద్యోగులకు వసతి కల్పించేలా నివాస మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు పశ్చిమ హైదరాబాద్లోని సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ తరహాలో రాచకొండ ప్రాంతంలో మరో సెక్యూరిటీ కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పలువురు జెన్ప్యాక్ట్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. -
జూనియర్లకు లక్షల్లో జీతాలు.. నెంబర్ వన్ స్థానానికి పోటీ పడుతున్న హైదరాబాద్
చారిత్రాత్మక కాస్మోపాలిటన్ నగరం హైదరాబాద్ వేలాది మంది నిరుద్యోగుల కలల స్వప్నం. దేశం నలుమూలల నుంచి ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి చాలా మంది వస్తుంటారు. ఇందులో చాలా మంది లక్ష్యం ఐటీ సెక్టార్లో కొలువు సంపాదించడమే. ఇలా ఉద్యోగన్వేషలో వచ్చే వారికి పెద్ద మొత్తంలో జీతాలు ఆఫర్ చేస్తున్నాయి నగరంలో కోలువైన కంపెనీలు. జీతాలు ఎలా ఉన్నాయి ఐటీ, ఫార్మా, హెల్త్కేర్ సెక్టార్లలో సీనియర్, మిడ్ లెవల్, జూనియర్ కేటగిరీల్లో జీతాలు ఎలా ఉన్నాయమనే అంశంపై రాండ్స్టాండ్ సంస్థ ఇటీవల సర్వే చేపట్టింది. రాండ్స్టాండ్ నివేదికను పరిశీలిస్తే.. ఐటీ సెక్టార్లో హైదరాబాద్ నగరం నంబర్ వన్ స్థానం కోసం పోటీ పడుతోందని తెలుస్తోంది. దేశంలో ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నై, కోలక్కతా, బెంగళూరు, హైదరాబాద్, పూనే నగరాల్లో ఐటీ పరిశ్రమ ఎక్కువగా నిలదొక్కుకుంది. ఈ నగరాల డేటాను పరిశీలిస్తే ఐటీ ఎంప్లాయిస్కి ఎక్కువ జీతాలు ఇవ్వడంలో బెంగళూరు ప్రథమ స్థానంలో ఉండగా హైదరాబాద్ సెకండ్ పొజిషన్లో ఉంది. జీతాల తీరు ఇలా ఇక ఐటీ సెక్టార్లో సీనియర్, మిడ్ లెవల్, జూనియర్ కేటగిరీల్లో జీతాలను పరిశీలిస్తే.. ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరుకి హైదరాబాద్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఐదేళ్ల అనుభవం ఉన్న జూనియర్ లెవల్కి సంబంధించిన ఉద్యోగులకు హైదరాబాద్లో వార్షిక వేతనం రూ.5.93 లక్షలుగా ఉండగా బెంగళూరులో ఇది రూ. 6.71 లక్షలుగా ఉంది. 6 నుంచి 14 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న మిడ్ లెవల్ కేటగిరిలో హైదరాబాద్లో వార్షిక వేతనం 17.71 లక్షలు ఉండగా బెంగళూరులో రూ.18.06 లక్షలుగా ఉంది. 15 ఏళ్లకు పైగా ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ ప్రొఫెషనల్స్ కేటగిరిలో హైదారాబాద్లో యాన్యువల్ శాలరీ రూ. 29.78 లక్షలు ఉండగా బెంగళూరులో రూ. 34.47 శాతంగా ఉంది. స్వల్ప తేడా ఐటీ సెక్టార్లో మొదటి రెండు స్థానాల్లో ఉన్న బెంగళూరు, హైదరాబాద్లలో చెల్లిస్తున్న జీతాలను పరిశీలిస్తే.. జూనియర్ కేటగిరికి సంబంధించి బెంగళూరు, హైదరాబాద్ల మధ్య వ్యత్యాసం 11.6 శాతం ఉండగా మిడ్ లెవల్ కేటగిరిలో ఇది 2 శాతానికే పరిమితమైంది. సీనియర్ కేటగిరిలో మాత్రం హైదరాబాద్ కంటే బెంగళూరులో ఉన్న ఉద్యోగికి 16 శాతం అధికంగా వేతనం అందుతోంది. నవంబర్ వన్ రేసులో గడిచిన పదేళ్లుగా భారీ కంపెనీలను ఆకర్షించడంలో బెంగళూరుతో పోటీ పడుతోంది హైదరాబాద్. అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలకు గమ్యస్థానంగా హైదరాబాద్ మారింది. అంతేకాదు ఇటీవల కాలంలో స్టార్టప్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ విధానం ఖరారైంది. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే జూనియర్, మిడ్ కేటగిరిల్లో బెంగళూనును హైదరాబాద్ దాటవచ్చనే అంచనాలు ఉన్నాయి. చదవండి: ఎక్సెల్లో కొత్త ఫీచర్లు.. చిరకాల డిమాండ్ నెరవేర్చిన మైక్రోసాఫ్ట్ -
ఫ్రెషర్లవైపే కంపెనీల మొగ్గు.. మార్చిదాకా నియామకాల జోరు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా జనవరి–మార్చిలో నియామకాల జోరు ఉంటుందని టీమ్లీజ్ వెల్లడించింది. వ్యాపార కార్యకలాపాలపై కఠినమైన ఆంక్షలు లేనట్టయితే కార్పొరేట్ కంపెనీల నియామకాల్లో గణనీయమైన వృద్ధి ఉంటుందని తెలిపింది. 21 రంగాల వారీగా 14 నగరాల్లోని 829 చిన్న, మధ్య, భారీ స్థాయి కంపెనీల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందిన టీమ్లీజ్ ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ రిపోర్ట్ ప్రకారం.. నియామకాలు చేపట్టాలన్న కంపెనీల ఆలోచన ప్రస్తుత త్రైమాసికంలో 9 శాతం పాయింట్ల వరకు పెరగవచ్చు. కోవిడ్ వ్యాప్తి చెందినప్పటి నుండి నియామక ఉద్దేశంలో నమోదయ్యే అత్యధిక వృద్ధి ఇదే. సమీక్షించిన 21 రంగాల్లో ఏడు 10 శాతంపైగా పాయింట్లు సాధించే అవకాశం ఉంది. 17 రంగాలు 5 శాతంపైగా పాయింట్లను దక్కించుకోనున్నాయి. క్రితం త్రైమాసికంతో పోలిస్తే 11 రంగాలు రికవరీని ప్రదర్శిస్తాయి. ఐటీ కంపెనీలే ముందంజ.. మహమ్మారి కారణంగా ఏర్పడిన సరఫరా అంతరాయాలను ఎదుర్కోవడానికి మెరుగైన సామర్థ్య వినియోగం, ప్రైవేట్ పెట్టుబడుల పెరుగుదల, అధికమవుతున్న ఎగుమతులు.. వెరశి ఉద్యోగాల జోరును వేగవంతం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఐటీ పనితీరు, సాంకేతికత అనుసంధాన సంస్థలు ఉద్యోగ కల్పనలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తాయి. 89 శాతం ఐటీ కంపెనీలు నిపుణులను చేర్చుకునేందుకు ఆసక్తిగా ఉన్నాయి. విద్యా రంగంలో 80 శాతం, ఆరోగ్య, ఫార్మా 71, ఈ–కామర్స్, టెక్నాలజీ స్టార్టప్స్లో 69 శాతం కంపెనీలు కొత్తగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సుముఖంగా ఉన్నాయి. తదుపరి లాక్డౌన్లు విధించకపోతే ఇతర రంగాలు సైతం నియామకాలను చేపడతాయి. ఇదే సరైన సమయం.. నిపుణులైన మానవ వనరులకు ఇది సరైన సమయం. ప్రస్తుత త్రైమాసికంలో 2–5 సంవత్సరాల అనుభవం ఉన్న జూనియర్ స్థాయి నిపుణులకు బదులుగా ఫ్రెషర్లను నియమించుకోవడంపై కంపెనీలు దృష్టి సారించనున్నాయి. జూనియర్ టాలెంట్ను రిక్రూట్ చేసుకోవడానికి 46 శాతం కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే జనవరి–మార్చిలో అట్రిషన్ వేగంగా పెరగనుంది. ఐటీ, విద్య సేవలు, హెల్త్కేర్, ఫార్మా, నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ రంగాల్లో 8 శాతంపైగా అట్రిషన్ నమోదు కానుంది. అన్ని రంగాలు క్రితం త్రైమాసికంలో కంటే అధిక అట్రిషన్ రేట్లను కలిగి ఉండనున్నాయి. ఉద్యోగి దృక్పథం, పని విధానంలో మార్పు దీనికి కారణాలు అని టాలెంట్ అక్విజిషన్ అనలిస్ట్ రేచల్ స్టెల్లా రాజ్ తెలిపారు. చదవండి: సీఎంఎస్ ఇన్ఫోలో మహిళా డైరెక్టర్లు -
ఏపీలో మెగా ఐటీ జాబ్ఫెయిర్
సాక్షి, అమరావతి: ఐటీ రంగంలో హైఎండ్ ఉద్యోగాలు కల్పించే విధంగా మెగా జాబ్ ఫెయిర్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపీఎస్ఎస్డీసీ), ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ (అపిటా), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(ఐటాప్) సంయుక్తంగా ఇండస్ట్రీ స్పెసిఫిక్ ట్రైనింగ్ ప్రోగ్రాం పేరుతో వర్చువల్ మెగా జాబ్ఫెయిర్ నిర్వహిస్తున్నాయి. 30కి పైగా కంపెనీల్లో ఫుల్స్టాక్ డెవలపర్, బిజినెస్ ప్రాసెసింగ్ మేనేజ్మెంట్ అసోసియేట్ (బీపీఎం) విభాగాల్లో ఉద్యోగాలకు సంబంధించి ఈ జాబ్ఫెయిర్ ఏర్పాటు చేశాయి. ఆసక్తిగల విద్యార్థులు డిసెంబర్ 25లోగా preciouscareers.com/istp అనే వెబ్ లింక్ ద్వారా నమోదు చేసుకోవాలని ఏపీఎస్ఎస్డీసీ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో సూచించింది. ఆ ప్రకటన మేరకు.. 2018 నుంచి 2021 వరకు ఇంజనీరింగ్ (ఐటీ/సీఎస్ఈ/ఈఈఈ/ఈసీఈ), ఎంసీఏ/ఎంఎస్సీ 55 శాతం మార్కులతో పూర్తిచేసినవారు ఫుల్స్టాక్ డెవలపర్ ఉద్యోగాలకు, 2017 నుంచి 2021 వరకు డిగ్రీ పూర్తిచేసినవారు బీపీఎం ఉద్యోగాలకు అర్హులు. నమోదు చేసుకున్న వారికి 27వ తేదీ నుంచి ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేస్తారు. వీరికి ఆయా కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసుకుంటాయి. స్క్రీన్టెస్ట్ తుదిజాబితాలో ఉండి ఉద్యోగం పొందలేని విద్యార్థులకు విశాఖలో జనవరి 19 నుంచి 35 రోజులు ఫుల్స్టాక్ డెవలపర్, బీపీఎం కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తిచేసుకున్నవారికి కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి మంచి వేతనంతో ఉద్యోగాలిస్తాయి. మరిన్ని వివరాలకు ఎపీఎస్ఎస్డీసీ టోల్ ఫ్రీ నంబరు 9988853335లో సంప్రదించవచ్చు. -
నిరుద్యోగులకు గుడ్న్యూస్..!
Indian IT Services to hire about 450,000 people in H2FY22 UnearthInsight: నిరుద్యోగులకు గుడ్న్యూస్..! వచ్చే ఏడాది ఐటీ కంపెనీల్లో కొలువుల జాతర మొదలుకానుంది. కోవిడ్-19 ఉదృత్తి తగ్గడంతో ఐటీ కంపెనీలు భారీ సంఖ్యలో నియామకాలను చేపట్టనున్నట్లు మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ అన్ఎర్త్ ఇన్సైట్ ఒక నివేదికలో పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఐటీ కంపెనీలు సుమారు 4.5 లక్షల నియామకాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఐటీ ఉద్యోగుల అట్రిషన్ రేట్ కూడా అధికంగానే ఉంది. దీంతో వారి స్థానంలో సుమారు 1.75 లక్షల ఉద్యోగాలను ఐటీ కంపెనీలు భర్తీ చేయనున్నట్లు అన్ఎర్త్ ఇన్సైట్ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్లోని టాప్-30 కంపెనీలు ఇప్పటికే 2.5 లక్షల ఫ్రెషర్స్కు అవకాశాలను కల్పించినట్లు అన్ఎర్త్ ఇన్సైట్ పేర్కొంది. వీటిలో ఫ్రెషర్లను నియమించిన టాప్ కంపెనీలలో టీసీఎస్ 77వేలు, ఇన్ఫోసిస్ 45వేలు, కాగ్నిజెంట్ 45వేలు,హెచ్సీఎల్ టెక్ 22వేల ఉద్యోగాలను కల్పించాయి. భారత టెక్ కంపెనీలు ముఖ్యంగా ఉద్యోగుల నైపుణ్యాలను పెంచే ప్రోగ్రామ్పై దృష్టిసారించినట్లుగా తెలుస్తోంది. చదవండి: ఉద్యోగుల కోసం క్యాబిన్లు, ఇకపై ట్రైన్లలో ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు అట్రిషన్ రేట్ కూడా ఎక్కువే...! FY22లో అట్రిషన్ రేట్ 17-19 శాతంగా ఉండగా..అది వచ్చే FY23లో 16-18 శాతం ఉంటుందని అన్ఎర్త్ ఇన్సైట్ అభిప్రాయపడింది. కాగా ఐటీ కంపెనీలు వీరి స్ధానాల్లో కొత్త నియాకాలను భర్తీ చేసే అవకాశం లేకపోలేదని తన నివేదికలో పేర్కొంది. క్లౌడ్ సర్వీసులకే అధిక ప్రాధాన్యం..! పలు దిగ్గజ ఐటీ కంపెనీలు క్లౌడ్ సర్వీస్లపై ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. 2030 నాటికి క్లౌడ్ ఆధారిత సర్వీసుల విలువ ఏకంగా 80-100 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉన్నట్లు అన్ఎర్త్ ఇన్సైట్ వెల్లడించింది. క్లౌడ్ ఇండస్ట్రీ, సెక్యూరిటీలో చాలా బలమైన రెండంకెల వృద్ధిని నమోదు చేసిన యాక్సెంచర్ వంటి కంపెనీలు భవిష్యత్తులో క్లౌడ్ ఆధారిత సేవలకు నాయకత్వం వహించనున్నట్లు పేర్కొంది. ఫ్రెంచ్ ఐటీ దిగ్గజం క్యాప్జెమిని కూడా ప్రాథమికంగా డిజిటల్, క్లౌడ్ సేవలపై పనిచేయనున్నట్లు తెలుస్తోంది. హెచ్సీఎల్ టెక్నాలజీస్... అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఎడబ్ల్యుఎస్) బిజినెస్ యూనిట్ కోసం ఏకంగా పదివేల నియామకాలను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. చదవండి: వ్యాక్సినేషన్ మస్ట్! నో చెప్తున్న ఉద్యోగులు.. వర్క్ఫ్రమ్హోం పొడగింపునకు డిమాండ్! -
నిపుణుల వేటలో టాప్ 5 కంపెనీలు.. మొదటి 9 నెలల కాలంలో..
న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల్లో కొలువుల సందడి నెలకొంది. కంపెనీలు భారీగా నియామకాలను చేపడుతున్నాయి. కరోనా తర్వాత ఐటీ, డీజిటల్ సేవలకు డిమాండ్ అధికమైంది. భారీగా కాంట్రాక్టులు వస్తుండడంతో వాటిని సకాలంలో పూర్తి చేసేందుకు వీలుగా కంపెనీలు నిపుణుల వేటలో పడ్డాయి. అగ్రగామి ఐదు ఐటీ కంపెనీలు.. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా 2021 మొదటి తొమ్మిది నెలల్లో (జనవరి–సెప్టెంబర్) 1.7 లక్షల మంది ఉద్యోగులను కొత్తగా తీసుకున్నాయి. ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్) ఎక్కువగా ఉండడం కూడా కంపెనీలకు సౌకర్యంగా లేదు. అదే సమయంలో సేవలకు డిమాండ్ అద్భుతంగా ఉండడం .. ఈ రంగంలో ఉపాధి కల్పనకు దారితీస్తోంది. 2020 మొదటి తొమ్మిది నెలల కాలంలో టాప్–5 ఐటీ కంపెనీల ఉద్యోగుల సంఖ్య 1,125 మేర తగ్గడం గమనార్హం. గతేడాది మార్చి నుంచి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున లాక్డౌన్లు అమలు కావడం తెలిసిందే. దీంతో కంపెనీలు కొత్త ఉద్యోగులను తీసుకోవడాన్ని తాత్కాలికంగా నిలిపివేశాయి. కానీ, గతేడాదికి పూర్తి భిన్నమైన వాతావారణం ఐటీ పరిశ్రమలో ప్రస్తుతం నెలకొందని చెప్పుకోవచ్చు. కరోనాకు ముందు సంవత్సరం 2019 మొదటి తొమ్మిది నెలల్లో అగ్రగామి ఐదు ఐటీ కంపెనీలు 77,000 మందిని నియమించుకోగా.. వీటితో పోల్చి చూసినా ఈ ఏడాది నియామకాలు రెట్టింపునకుపైగా పెరిగినట్టు స్పష్టమవుతోంది. డిమాండ్ ఆల్టైమ్ గరిష్టానికి చేరుకోగా.. అదే సమయంలో సరఫరా పరమైన సవాళ్లను కంపెనీలు ఎదుర్కొంటున్నాయి. అట్టిపెట్టుకోవడం సవాలే పరిశ్రమ వ్యాప్తంగా ఉద్యోగుల వలసలు పెరిగిపోయాయి. ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా కంపెనీలు సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో అట్రిషన్ రేటు 20 శాతానికి పైనే ఉన్నట్టు ప్రకటించాయి. ఇదే స్థాయిలో వలసలు మరికొన్ని త్రైమాసికాల పాటు కొనసాగొచ్చని విప్రో చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్గోవిల్ ఫలితాల సందర్భంగా ప్రకటించడం గమనార్హం. మధ్యస్థాయి ఐటీ కంపెనీలు సైతం ఇదే సమస్యతో సతమతం అవుతున్నాయి. సరిపడా నిపుణులు అందుబాటులో లేకపోవడం కూడా అధిక వలసలకు కారణంగా ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ సీఈవో సంజయ్ జలోనా పేర్కొన్నారు. ‘‘మా క్లయింట్లు రెండంకెల అట్రిషన్ను ఎదుర్కొంటున్నారు. సరిపడా ఉద్యో గులు లభించని పరిస్థితుల్లో ఎన్నో కార్యకలాపాలను ఆటోమేషన్ చేస్తున్నారు’’ అని ఆయన చెప్పారు. ఈ సంస్థ 19.6% అట్రిషన్ రేటును ప్రకటించింది. సెప్టెంబర్ త్రైమాసికంలోనూ.. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలోనే టాప్–5 ఐటీ కంపెనీలు 70,000 మందికి నూతనంగా ఉపాధి కల్పించాయి. 2020 ఇదే కాలంలో 18,000 మందిని తీసుకోగా, 2019లో నియామకాలు 37,000గా ఉన్నాయి. కనీసం మరో రెండు త్రైమాసికాల పాటు అయినా ఈ స్థాయిలో డిమాండ్ కొనసాగుతుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. 2021–22 సంవత్సరానికి కొత్తగా 40,000 మందిని తీసుకుంటామన్న టీసీఎస్.. దీన్ని కాస్తా 78,000కు పెంచింది. ఇన్ఫోసిస్ సైతం 26,000 మందికి తీసుకుంటామని, ఈ సంఖ్య ను 45,000కు సవరించింది. విప్రో కూడా 12,000 అంచనాను 26,000కు సవరించింది. -
ఐటీ సెక్టార్లో అతివల నాయకత్వం ఎక్కడ?
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో హైదరాబాద్ నగరం దూసుకుపోతుంది. అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ తమ కార్యాలయాలు తెరిచేందుకు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఉన్న కంపెనీలు విస్తరణ బాట పట్టాయి. ఇంతలా అభివృద్ధి జరుగుతూ కాస్మోపాలిటన్ సిటీగా ఎదిగినా.. ఐటీలో అతివల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఐటీలో అవకాశాలు హైదరాబాద్లో ఐటీ సెక్టార్ దూసుకుపోతుంది. గడిచిన ఏడేళ్లలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 3.23 లక్షల నుంచి 6.22 లక్షలకు పెరిగింది. భారీ స్థాయిలో ఐటీ రంగంలో ఉద్యోగాలు నగరంలో లభిస్తున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన గ్రాడ్యుయేట్లను హైదరాబాద్ నగరం అక్కున చేర్చకుంటుంది. ఇందులో లేడీ ఎప్లాంయిస్ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇలా ఐటీ సెక్టార్లో ఎంప్లాయిస్గా చేరుతున్న వారిలో టాప్ పొజిషన్కి చేరుతున్న అతివల సంఖ్య మేల్ ఎంప్లాయిస్తో పోల్చినప్పుడు చాలా తక్కువగా ఉంటోంది. టాప్లో లేరు హైదరాబాద్ స్టాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హెచ్వైఎస్ఈఏ) వెల్లడించిన వివరాల ప్రకారం ఐటీ సెక్టార్లో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు ఉద్యోగులందరి డేటాను పరిశీలిస్తే మహిళలు 40 నుంచి 45 శాతం వరకు ఉన్నట్టు తేలింది. ఈ గణంకాలు చూడటానికి బాగానే ఉన్నా.. టాప్ పొజిషన్కి వెళ్లేకొద్ది ఈ సంఖ్య సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యిందంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రచురించింది. రాబోయే ఐదేళ్లలో హెచ్వైఎస్ఈఏ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నగరంలో ఐటీ ప్రొఫెషనల్స్లో మొత్తంగా చూస్తే మహిళలు 34 శాతం వరకు ఉన్నారు. కానీ ఇందులో ఎగ్జిక్యూటివ్ లెవల్, టీమ్ లీడర్ తదితర లీడింగ్ పొజిషన్లలో పని చేస్తున్నవారి శాతం 4 నుంచి 5 శాతానికే పరిమితం అయ్యింది. రాబోయే ఐదేళ్లలో లీడింగ్ పొషిజన్లోకి కనీసం 20 శాతం మహిళలు చేరుకునేలా ఐటీ సెక్టార్లో మార్పులు తీసుకురాబోతున్నట్టు హెచ్వైఎస్ఈఏ అధ్యక్షుడు భరణి వెల్లడించారు. పరిమితులే కారణం ఐటీ సెక్టార్లో ఉన్నత స్థానాల్లోకి చేరుకోవాలంటే శ్రమించడంతో పాటు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. సాధారణంగా పురుషులతో పోల్చితే మహిళలకు ఆఫీస్కు కేటాయించే సమయం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారు ఇంట్లో పనులతో పాటు పిల్లల పెంపకం తదితర అంశాలకు టైం కేటాయించాల్సి ఉంటుంది. అందువల్లే ప్రస్తుతం టాప్ పొజిషన్కి చేరకుంటున్న స్త్రీల సంఖ్య తక్కువగా ఉందని వెస్ట్రన్ డిజిటల్ కార్పోరేషన్ హెచ్ఆర్ కిరణ్మయి అంటున్నారు. ఈ తరహా పరిస్థితి ఒక్క హైదరాబాద్కే పరిమితం కాలేదని దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు. మొదలైన చర్యలు ఐటీ సెక్టార్లో మహిళలకు అవకాశాలు మెరుగయ్యాయి. ఈ సెక్టార్లో కొత్తగా ఉద్యోగాలు పొందుతున్న వారిలో మహిళల వాటా 2015లో 11.4 శాతం ఉండగా 2021లో 17.3 శాతానికి చేరుకుంది. దీనికి తగ్గట్టే టాప్ పొజిషన్లో మహిళలకు ప్రాధాన్యత దక్కేలా ప్రత్యేక కార్యక్రమాలు అనేక కంపెనీలు నిర్వహిస్తున్నాయి. చదవండి: సేవల రంగంలో పెరిగిన ఉపాధి కల్పన -
కాసులు కురిపిస్తున్న ఐటీ స్టాక్స్ ?
ముంబై: ఈ ఏడాది విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు)ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) సర్వీసుల రంగం అత్యధికంగా ఆకట్టుకుంటోంది. దీంతో సాఫ్ట్వేర్ రంగ కంపెనీలలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఆగస్ట్ చివరికల్లా ఎఫ్పీఐ పెట్టుబడులు 1.3 శాతం పెరిగి 14.67 శాతానికి చేరాయి. ఇదే సమయంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగంలో అమ్మకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. నిజానికి ఈ రంగంలోని స్టాక్స్లో ఎఫ్పీఐలు సంప్రదాయంగా ఇన్వెస్ట్ చేసే సంగతి తెలిసిందే. అయితే జులైనెలాఖరుకల్లా ఈ రంగంలోని బ్యాంకులు, కంపెనీలలో పెట్టుబడులు 3.05 శాతంపైగా క్షీణించి 31.8 శాతానికి పరిమితమయ్యాయి. ప్రయివేట్ రంగ సంస్థ ఐఐఎఫ్ఎల్ ఆల్టర్నేటివ్ రీసెర్చ్ రూపొందించిన గణాంకాలివి. సాఫ్ట్వేర్ జోరు ఎఫ్పీఐల ఆసక్తి నేపథ్యంలో ఐటీ రంగం జోరు చూపుతోంది. స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ.. ఐటీ ఇండెక్స్ ఈ ఏడాది ఆగస్ట్వరకూ 45 శాతం జంప్చేసింది. ఇదే కాలంలో ప్రామాణిక ఇండెక్స్ బీఎస్ఈ సెన్సెక్స్ 22 శాతమే పుంజుకోవడం గమనార్హం! గత రెండు నెలలుగా ఐటీ రంగ స్పీడ్ బుల్ ఆపరేటర్లకుసైతం గందరగోళాన్ని సృష్టిస్తున్నట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఐటీ స్టాక్స్ అత్యంత ఖరీదుగా ట్రేడవుతున్నట్లు జేఎం ఫైనాన్షియల్ నిపుణులు మానిక్ తనేజా, కేజీ విష్ణు తెలియజేశారు. కొన్ని కంపెనీల షేర్లు ఐదేళ్ల గరిష్టాలను సైతం దాటి అంటే ప్లస్–3 స్టాండర్డ్ డీవియేషన్లో కదులుతున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు ప్రధానంగా కోవిడ్–19 తదుపరి ఐటీ సేవలపై వ్యయాలు పెరగడం కారణమవుతున్నట్లు వివరించారు. ఇది సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు తెలియజేశారు. 2004–07లో.. సాఫ్ట్వేర్ సర్వీసుల రంగం 2004–07 మధ్య కాలంలో నమోదైన బుల్లిష్ దశలో ప్రవేశిస్తున్నట్లు మానిక్, విష్ణు అభిప్రాయపడ్డారు. అమ్మకాల పరిమాణం, ధరలపై అజమాయిషీ చేయగల సామర్థ్యం, సరఫరాలో సవాళ్లున్నప్పటికీ మార్జిన్లను నిలుపుకోగలగడం వంటి అంశాలు సానుకూలతను కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ఫలితంగా ఐటీ రంగం అధిక వృద్ధి బాటలో సాగనున్నట్లు అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసిక (జులై–సెప్టెంబర్) ఫలితాలు స్వల్ప, మధ్యకాలంలో ఈ ట్రెండ్ కొనసాగవచ్చన్న అంశాన్ని స్పష్టం చేయగలవని వివరించారు. కాగా.. ఈ ఏడాది ఐటీ రంగ లాభాలు సగటున 20 శాతం పుంజుకోగలవని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ బాటలో వచ్చే ఆర్థిక సంవత్సరం(2022–23)లోనూ 18 శాతం వృద్ధి నమోదుకాగలదని ఊహిస్తున్నాయి. అంచనాలు ఓకే సాఫ్ట్వేర్ రంగ కంపెనీలు ఈ ఏడాది అంచనాలను అందుకునే వీలున్నట్లు విదేశీ బ్రోకరేజీ జెఫరీస్ ఇటీవల నిర్వహించిన ఐటీ సదస్సులో పేర్కొంది. ఐటీ రంగంలో నెలకొన్న సానుకూల పరిస్థితులు ఇందుకు సహకరించగలవని విశ్లేషించింది. డిమాండ్ బలంగా ఉన్నట్లు తెలియజేసింది. దీంతో రానున్న మూడు నుంచి ఐదేళ్ల కాలంలో అన్ని సాఫ్ట్వేర్ రంగ కంపెనీలూ మెరుగైన ఫలితాలను సాధించే వీలున్నట్లు అభిప్రాయపడింది. డీల్ పైప్లైన్ చరిత్రాత్మక గరిష్టాలకు చేరువలో ఉన్నట్లు తెలియజేసింది. ఇందుకు ప్రధానంగా మధ్యస్థాయి డీల్స్ దోహదపడుతున్నట్లు పేర్కొంది. వచ్చే ఏడాదిలో మెగా డీల్స్ జోరందుకోగలవని అంచనా వేసింది. అయితే వచ్చే రెండు మూడు క్వార్టర్లలో పలు కంపెనీలు సరఫరా సమస్యలను ఎదుర్కొనే వీలున్నట్లు అభిప్రాయపడింది. దీంతో మార్జిన్లపై ఒత్తిడి కనిపించవచ్చని తెలియజేసింది. ఆరు కారణాలు దేశీ ఐటీ రంగం జోష్ కొనసాగనున్నట్లు గత వారం ఫిలిప్ క్యాపిటల్ పేర్కొంది. ఇందుకు ఆరు కారణాలను ప్రస్తావించింది. ఐటీ రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ వేసిన సానుకూల అంచనాలు, గ్లోబల్ మార్కెట్లలో బలపడనున్న వాటా, పటిష్ట డీల్ పైప్లైన్, ధరలపై పట్టు, యూరోపియన్ మార్కెట్లలో పెరుగుతున్న అవకాశాలు, మానవ వనరుల లభ్యతను పేర్కొంది. ఇలాంటి పలు సానుకూల అంశాలతో దేశీ ఐటీ రంగ మూలాలు పటిష్టంగా ఉన్నట్లు తెలియజేసింది. ఇందువల్లనే గత ఏడాది కాలంలో ఐటీ రంగ రేటింగ్ మెరుగుపడినట్లు వివరించింది. వెరసి సమీప భవిష్యత్లో సాఫ్ట్వేర్ రంగంలో నెలకొన్న జోష్ కొనసాగే వీలున్నట్లు అభిప్రాయపడింది. ఐటీ స్టాక్స్ జోరు(షేర్ల ధరలు రూ.లలో) కంపెనీ పేరు జనవరిలో ప్రస్తుతం ఇన్ఫోసిస్ 1,240 1,679 విప్రో 418 640 టెక్మహీంద్రా 962 1,399 హెచ్సీఎల్ టెక్ 915 1,279 మైండ్ట్రీ 1,643 4,252 కోఫోర్జ్ 2,398 5,336 ఎల్అండ్టీ ఇన్ఫో 3,960 5,731 ఎల్అండ్టీ టెక్ 2,429 4,627 చదవండి : మళ్లీ లాభాల్లోకి మార్కెట్ -
అన్ని రంగాల్లో అసాధారణ పురోగతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన స్వల్ప కాలంలోనే అబ్బురపరిచే ప్రగతిని సాధిస్తూ అన్ని రంగాల్లో అసాధారణ పురోగతి సాధిస్తోందని అసెంబ్లీలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్పై ప్రశంసల జల్లు కురిపించారు. అసెంబ్లీలో సోమవారం ఐటీ, పరిశ్రమల రంగంలో ప్రగతిపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్బంగా ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నీటిపారుదల వ్యవస్థను పటిష్టం చేయడం, మిషన్ కాకతీయతో చెరువుల్ని పునరుద్ధరించటం ద్వారా పంటలు సమృద్ధిగా పండుతుండటం తో రైతులు సుఖంగా ఉన్నారని అక్బరుద్దీన్ చెప్పా రు. దేశమంతా ముక్కున వేలేసుకునే విధంగా 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న కేసీఆర్కు అభినందనలు తెలిపారు. కేసీఆర్ ఒకవైపు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తూనే, పారిశ్రామిక రంగా నికి అంతే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. పరిశ్ర మలు, ఐటీ రంగంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారినందుకు హైదరాబాదీగా గర్వపడుతున్నానన్నారు. ఈ అభివృద్ధిలో హైదరాబాద్ పాతబస్తీని కూడా భాగస్వామ్యం చేయాలని కోరారు. కేటీఆర్ కృషి అసామాన్యం ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థలు తమ ద్వితీయ క్షేత్రం గా హైదరాబాద్ను ఎంచుకోవటం వెనుక మంత్రి కేటీఆర్ కృషి అసామాన్యమైందని అక్బరుద్దీన్ ప్రశంసించారు. గతంలో ఐటీ అంటే బెంగళూరుగా స్థిరపడిపోయిన స్థితిని తిరగరాసి రాష్ట్రం నంబర్ వన్గా నిలబడిందని చెప్పారు. ఐటీ టవర్ నిర్మించండి శంషాబాద్ విమానాశ్రయాన్ని ఆనుకుని ఉన్న 50 ఎకరాల వక్ఫ్బోర్డు స్థలం కబ్జాదారుల ఆగడాలకు పరాధీనం కాబోతోందని అక్బరుద్దీన్ తెలిపారు. వెంటనే ప్రభుత్వం స్పందించి మైనారిటీ యువత కోసం అందులో ఐటీ టవర్ నిర్మించాలని కోరారు. కాగా, ఎస్సీ, ఎస్టీలకు టి ప్రైడ్ కింద ఇన్సెంటివ్స్ ఇస్తున్నట్టే మైనార్టీ ఎంటర్ప్రెన్యూర్లకు సహకరించాలని అక్బరుద్దీన్ కోరారు. హైదరాబాద్లో ఫ్రీ వైఫై అన్నారని, కరోనా టైంలో పేద విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు వినేం దుకు నాలుగైదు గంటలు ఫ్రీ వైఫై ఇవ్వాలన్నారు. తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లో ఇక్కడి యువతకే 50 శాతం ఉద్యోగాలు వచ్చేలా చేయా లని సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు పాతబస్దీలో కూడా నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటుచేయాలని కోరారు. భారీ పెట్టుబడులు వస్తున్నాయ్: వివేకానంద రాష్ట్రంలోని సుస్థిర ప్రభుత్వం, శాంతియుత వాతావరణం వల్ల భారీ పెట్టుబడులు వస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద చెప్పారు. పరిశ్రమలు, అంతకుముందు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై చర్చ కోసం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని, రాజాసింగ్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. గృహనిర్మాణ సంస్థ, ఉద్యాన వర్సిటీ, పంచాయతీరాజ్, నల్సార్ చట్ట సవరణల బిల్లులను మం త్రులు ప్రశాంత్రెడ్డి, నిరంజన్రెడ్డి ప్రవేశపెట్టారు. -
హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నది ఈ సంస్థలోనే
TCS largest IT Sector employer in Hyderabad: గడిచిన రెండు దశాబ్ధాలుగా హైదరాబాద్ నగరం ఐటీకి కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. స్టార్టప్లు మొదలు పెడితే అంతర్జాతీయ సంస్థల వరకు ఇక్కడ తమ సంస్థలను నెలకొల్పాయి. అయితే ఇందులో అత్యధిక మంది ఐటీ ఉద్యోగులు ఉన్న సంస్థగా టీసీఎస్ నిలిచింది. టీసీఎస్ దేశంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీగా పేరొందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థ హైదరాబాద్లో మరో మైలురాయిని దాటింది. భాగ్యనగరం కేంద్రంగా ఐటీ సేవలు అందిస్తున్న సంస్థలను వెనక్కి నెట్టింది. ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు ఉన్న సంస్థగా మొదటి స్థానంలో నిలిచింది. 62,000 మంది టీసీఎస్ సంస్థకు హైదరాబాద్లో ఉన్న కార్యాలయాల్లో పని చేస్తున్న మొత్తం ఉద్యోగుల సంస్థ 62,000 దాటింది. దీంతో అత్యధికమంది ఐటీ ఉద్యోగులు ఉన్న సంస్థగా టీసీఎస్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని టీసీఎస్ రీజనల్ హెడ్, వైస్ ప్రెసిడెంట్ రాజన్న వెల్లడించారు. ఇటీవల ప్రభుత్వ ఆస్పత్రుల్లో వెంటిలేటర్ల కొనుగోలుకు సంబంధించి రూ. 2.2 కోట్ల చెక్కును ప్రభుత్వానికి ఆయన అందచేశారు. బెంగళూరుకి ధీటుగా బెంగళూరు తర్వాత ఐటీ రంగంలో హైదరాబాద్ ద్వితీయ స్థానంలో ఉంది. బడా ఐటీ కంపెనీలు, స్టార్టప్లు అన్నీ బెంగళూరు ప్రథాన స్థానంగా చేసుకుని కార్యకలపాలు సాగిస్తున్నాయి. అయితే బెంగళూరు తర్వాత స్థానం కోసం ఇటు పూనే, అటు నోయిడా నుంచి గట్టి పోటీ ఉన్నా హైదరాబాద్ ఐటీలో వాటికి అందకుండా దూసుకుపోతుంది. తాజాగా టీసీఎస్ ప్రకటించిన వివరాలతో ఈ విషయం మరోసారి రూఢీ అయ్యింది. చదవండి : టీసీఎస్లో భారీగా ఫ్రెషర్ల నియామకాలు -
లాభాలు అందించిన బ్యాంకింగ్ షేర్లు
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలను కళ్ల జూశాయి.ఇన్వెస్టర్లు మార్కెట్పై ఆసక్తి చూపించడంతో దేశీ స్టాక్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు లాభపడ్డాయి. బ్యాంకింగ్ రంగ సంస్థలు ముందుండి మార్కెట్ను నడిపించాయి. ఈ రోజు సెన్సెక్స్ 52,694 పాయింట్ల వద్ద ప్రారంభమై పైకి ఎగిసింది. ఒక దశలో గరిష్టంగా 5,806 పాయింట్లను టచ్ చేసింది. మార్కెట్ ముగిసే సమయానికి 52,769 పాయింట్ల వద్ద క్లోజ్ అయ్యింది. మొత్తానికి సెన్సెక్స్ 397 పాయింట్లు లాభపడింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ ఈ రోజు ఉదయం 15,794 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత గరిష్టంగా 15,820 పాయింట్లను చేరుకుంది. చివరకు 119 పాయింట్లు లాభపడి 15,812 వద్ద ముగిసింది. ఈ రోజు ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్బ్యాంక్, సన్ ఫార్మాస్యూటికల్స్, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. హెచ్సీఎల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, మారూతి సుజూకి, టెక్ మహీంద్రా, హెచ్యూఎల్, టీసీఎస్ సంస్థల షేర్లు నష్టపోయాయి. -
నియామకాల జోరు: ఐటీ టాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో నియామకాల జోరు మొదలైంది. మే నెలతో పోలిస్తే జూన్లో రిక్రూట్మెంట్ 15 శాతం పెరిగిందని నౌకరీ జాబ్ స్పీక్ నివేదిక వెల్లడించింది. నౌకరీ.కామ్లో మే నెలలో జాబ్ పోస్టింగ్స్ 2,049 నమోదైతే, జూన్లో ఇది 2,350 ఉందని తెలిపింది. ‘ఐటీ-సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ సర్వీసెస్ రంగాల కారణంగా ఈ స్థాయి వృద్ధి నమోదైంది. ఏప్రిల్లో 15 శాతం తిరోగమనం చెందిన నేపథ్యంలో మార్కెట్ నిలదొక్కుకోవడంతోపాటు రికవరీకి ఇది నిదర్శనం. సవాళ్ల నుంచి బయటపడేందుకు కంపెనీలకు ఐటీ వినియోగానికి డిమాండ్ పెరిగింది. ఐటీ సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ సర్వీసుల రంగం జూన్లో 5 శాతం దూసుకెళ్లింది. కోవిడ్-19 ముందస్తు కాలం 2019 జూన్తో పోలిస్తే ఈ రంగం అత్యధికంగా గత నెలలో 52 శాతం వృద్ధి సాధించింది. రిటైల్, యాత్రలు, ఆతిథ్య రంగం సైతం మెరుగ్గా పనితీరు కనబరుస్తోంది. హోటల్స్, రెస్టారెంట్స్, ఎయిర్లైన్స్, ట్రావెల్ విభాగాలు 87 శాతం, రిటైల్లో 57, బీమా 38, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవలు 29, ఫార్మా, బయోటెక్ 22, ఎఫ్ఎంసీజీ 22, విద్యా బోధన 15, బీపీవో, ఐటీఈఎస్లో 14 శాతం నియామకాలు అధికమయ్యాయి. రిక్రూట్మెంట్ హైదరాబాద్, పుణే 10 శాతం, బెంగళూరు 4 శాతం పెరిగింది. మె నెలలో తిరోగమన బాట పట్టిన ఢిల్లీ/ఎన్సీఆర్ 26 శాతం, కోల్కత 24 శాతం వృద్ధి నమోదు చేశాయి’ అని నివేదిక వివరించింది. -
Hyderabad: ఐటీకారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్స్లో తగ్గనున్న ట్రాఫిక్ సమస్య
-
ఐటీ కారిడార్లో 4 కొత్త లింకు రోడ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
సాక్షి, రాయదుర్గం: ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను దూరం చేసేందుకు లింకురోడ్ల నిర్మాణం వేగవంతం చేశారు. ఇప్పటికే అనేక లింకురోడ్లు అందుబాటులోకి తీసుకురాగా, కొత్తగా మరో నాలుగు రోడ్లు సోమవారం అందుబాటులోకి వచ్చాయి. వీటిని రాష్ట్ర ఐటీ శాఖమంత్రి కె. తారకరామారావు, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాందీతో కలిసి ప్రారంభించారు. రూ.23.43 కోట్ల వ్యయంతో హెచ్ఆర్డీసీఎల్ సంస్థ నాలుగు లింకురోడ్లను నిర్మించింది. నాలుగు లేన్ల రోడ్లు, సెంట్రల్ లైటింగ్, గ్రీనరీతో తీర్చిదిద్దారు. ఈ నాలుగు లింకురోడ్ల నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య చాలా వరకు పరిష్కారం కానుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతోందన్నారు. నగర అభివృద్ధికి రహాదారులు చాలా ముఖ్యమని, ఇప్పటికే 16 లింక్ రోడ్లు పూర్తి చేశామని వెల్లడించారు. లింక్ రోడ్ల వల్ల ప్రధాన రహదారులపై భారం తగ్గుతుందని తెలిపారు. హైదరాబాద్ను చూసి ఇతర రాష్ట్రాల వాళ్ళు అడుగుతున్నారని పేర్కొన్నన్నా. దశల వారీగా 133 లింక్ రోడ్లను నిర్మిస్తున్నామన్నారు. శేరిలింగంపల్లిలో జనసాంద్రత ఎక్కువని, అందుకే ఇక్కడ పనులు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. నేడు ప్రారంభించిన రోడ్లు ఇవే.. ► రూ.5.58 కోట్లతో నిర్మించిన 0.600 కిలో మీటర్ల బీటీ లింకురోడ్డు– నోవాటెల్ హోటల్ నుంచి కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం వరకు. ►రూ.2.87 కోట్లతో నిర్మించిన 0.460 కిలో మీటర్ల బీటీ లింకురోడ్డు– మియాపూర్ మెట్రో డిపో నుంచి కొండాపూర్ మసీద్బండ జంక్షన్ వరకు. ►రూ.7.41 కోట్లతో 0.750 కిలోమీటర్ల బీటీ లింకురోడ్డు – వసంతసిటీ నుంచి న్యాక్ వరకు. ►రూ.7.57 కోట్లతో 1.010 కిలోమీటర్ల బీటీ లింకురోడ్డు– జేవీ హిల్స్ పార్కు నుంచి మసీదుబండ వరకు వయా ప్రభుపాద లేఅవుట్ హైటెన్షన్ లైన్. తగ్గనున్న దూరం... ► కొత్తగా అందుబాటులోకి వచ్చే రోడ్లతో దూరభారం తగ్గనుంది. ► కొత్త లింకురోడ్డులన్నీ నాలుగులేన్ల, మధ్యలో డివైడర్, సెంట్రల్ లైటింగ్, గ్రీనరీతో ఉండడంతో గతంలో కన్నా విశాలంగా రోడ్లు మారడం, లింకు కలుపడంతో చాలా వరకు ప్రధాన రోడ్లకు కనెక్టివిటీ పెరగనుంది. ►ట్రాఫిక్ సమస్యతోపాటు, వాహనదారులకు సమయం, ఇంధనం ఆదా అయ్యే అవకాశం కలుగుతుంది. ►నోవాటెల్–ఆర్టీఏ ఆఫీస్ లింకురోడ్డుతో హఫీజ్పేట్, కొండాపూర్, మియాపూర్, గచ్చిబౌలి వాసులకు హైటెక్సిటీ ఎంఎటీఎస్ స్టేషన్, హైటెక్స్, నోవాటెల్ను తక్కువ సమయంలో చేరుకోవచ్చు. ►అంతేకాకుండా మూడు లింకురోడ్లతో మియాపూ ర్, సర్దార్పటేల్నగర్, వసంతనగర్, కేపీహెచ్బీ, 6,9 ఫేజ్ నుంచి హైటెక్సిటీ ప్రాంతానికి మరింత దగ్గరవుతుంది. ►జాతీయ రహదారి నుంచి ప్రారంభమయ్యే లింకురోడ్డు ద్వారా డైమండ్హిల్స్ కాలనీ, ఐడీపీఎల్ ఎంప్లాయీస్కాలనీ, శిల్పాఎవెన్యూ కాలనీ, నోవాటెల్ హోటల్ రోడ్డు సర్కిల్ నుంచి కొండాపూర్ మజీదుబండ జంక్షన్ వరకు సులువగా చేరుకోవచ్చు. ►జేవీహిల్స్ పార్కు నుంచి మసీద్బండ రోడ్డు నిర్మాణంలో మాధవహిల్స్ ఎస్టేట్, ప్రభుపాద లేఅవుట్, మారుతీనగర్కాలనీ వారికి నేరుగా గచి్చ»ౌలికి వయా మసీదుబండ రోడ్డు ద్వారా వెళ్లే అవకాశం కలుగుతుంది. -
టాప్-5 ఐటీ కంపెనీల్లోనే 96 వేల ఉద్యోగాలు: నాస్కామ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంతో ఐటీ నిపుణులకు అవకాశాలు మెండుగా వచ్చి పడుతున్నాయని ఐటీ పరిశ్రమ వాదిస్తోంది. ఆటోమేషన్వల్ల ఐటీ రంగంలో ఉద్యోగులకు భారీ ఎత్తున నష్టం ఏర్పడుతోందన్న తాజా వాదనపై స్పందించిన ఐటీ పరిశ్రమ బాడీ నాస్కామ్ ప్రస్తుతం ఐటీ పప్రొఫెషనల్స్కు భారీ డిమాండ్ కనిపిస్తోందని గురువారం పేర్కొంది. ముఖ్యంగా దేశంలోని టాప్-5 ఐటీ సంస్థలు 2021-22లో 96వేలమంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నాయని తెలిపింది. 2022 సంవత్సరం నాటికి భారతీయ సాఫ్ట్వేర్ సంస్థలు 30 లక్షల ఉద్యోగాలను తొలగించబోతున్నాయని, తద్వారా సంవత్సరానికి 100 బిలియన్ డాలర్లను ఆదా చేసుకోవాలని భావిస్తున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదించిన తర్వాత నాస్కామ్ ప్రకటన రావడం గమనార్హం. దేశీయ ఐటీ రంగంలో 2021-22 సంవత్సరంలో నియామకాలు పుంజుకోనున్నాయని నాస్కామ వాదించింది.ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాలకు ముప్పు ఉందన్న బీఓఏ వ్యాఖ్యలపై స్పందిస్తూ సాంకేతిక పరిజ్ఞానంతో, పెరుగుతున్న ఆటోమేషన్ కారణంగా సాంప్రదాయ ఐటీ ఉద్యోగాలు, పాత్రల స్వభావం మారనుందని, ఫలితంగా కొత్త ఉద్యోగాల కల్పనకు దారితీస్తుందని వ్యాఖ్యానించింది. నిపుణులకు, ప్రతిభావంతులకు డిమాండ్ బాగుందని, 2021 ఏడాదిలో 1,38,000 ఉద్యోగులను చేర్చుకుందని నాస్కామ్ అధికారిక ప్రకటనలో తెలిపింది. టాప్-5 సంస్థలే సుమారు 96 వేల మందిని రిక్రూట్ చేసుకోబోతున్నాయని పేర్కొంది. దీంతోపాటు 2 లక్షల 50వేల మందికి పైగా ఉద్యోగుల్లో డిజిటల్ నైపుణ్యాలను పెంపొందిస్తోందని, అలాగే 40 వేలమందిని డిజిటల్ ప్రతిభావంతులను నియమించిందని తెలిపింది. దేశంలో బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (బీపీఎం) రంగంలో1.4 మిలియన్ల మంది ఉద్యోగులున్నారని నాస్కామ్ తెలిపింది. ఆటోమేషన్లో కీలకమైన ఐటీ-బీపీఎంలో మార్చి 2021నాటికి ఐటీ-బీపీఎంలోరంగంలో మొత్తం 4.5 మిలియన్ల మంది ఉద్యోగులున్నారని పేర్కొంది. గత 3 సంవత్సరాల్లో ఆటోమేషన్, ఆర్పిఎ (రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్) బీపీఎం రంగంలో ఉద్యోగాల సృష్టికి దారితీసిందని అసోసియేషన్ వివరించింది. చదవండి: కరోనా సంక్షోభం: గూగుల్ మరోసారి భారీ సాయం Edible oil: వినియోగదారులకు భారీ ఊరట -
విప్రో సీఈఓకే వేతనం ఎక్కువ.. ఎంతంటే?
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజ సంస్థ విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) థియరీ డెలాపోర్ట్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.64.3 కోట్ల (దాదాపు 8.7 మిలియన్ డాలర్లు) వేతన ప్యాకేజ్ అందుకున్నారు. 2020 జూలై 6 నుంచి 2021 మార్చి 31వ తేదీ మధ్య కాలానికి డెలాపోర్ట్ ఈ వేతనాన్ని అందుకున్నట్లు సంస్థ ఒక రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. ఇందులో ఒన్టైమ్ క్యాష్, స్టాక్ గ్రాంట్, ఆర్ఎస్యూ (రిస్ట్రక్టెడ్ స్టాక్ యూనిట్స్) ఒన్టైమ్ గ్రాంట్ కలిసి ఉన్నాయని తెలిపింది. అబిదాలి నీముచ్వాలా వారసునిగా జూలై 6వ తేదీన విప్రోలో చేరారు. అంతకుముందు ఆయన క్యాప్జెమినీ ఎగ్జిక్యూటవ్గా పనిచేశారు. భారత్ ఐటీ సేవల రంగంలో అత్యధిక వేతనం అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్గా నిలిచారు. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ వార్షిక వేతనం 2020-21లో రూ.49.68 కోట్లు. 2019-20లో ఈ ప్యాకేజ్ రూ.34.27 కోట్లు. ఇక టీసీఎస్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపాలన్ వేతనం 2020-21లో రూ.20.36 కోట్లు. కాగా, విప్రో చైర్మన్ రషీద్ ప్రేమ్జీ 2020-21 ఆర్థిక సంవత్సరానికి 1.61 మిలియన్ డాలర్ల వేతనం తీసుకుంటే, ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అందుకున్న మొత్తం 1.01 మిలియన్ డాలర్లు. చదవండి: కోవిడ్ పోరులో భారీగా ఖర్చు చేసిన టాటా గ్రూప్ -
ఐటీ నిపుణులకు శుభవార్త: భారీ జీతాలు, ప్రోత్సాహకాలు
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ కాలంలో ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతున్నాయి. తాజా అంచనాల ప్రకారం ఐటీనిపుణులు ఒక్కొక్కరికీ మూడు నుంచి నాలుగు ఆఫర్లు వస్తున్నాయట. అంతేకాదు 50-70 శాతం మంది జీతాల పెంపుతో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. కోవిడ్-19 కారణంగా డిజిటల్ నైపుణ్యాలకు డిమాండ్ భారీగా పుంజుకుందని రిక్రూటింగ్ సంస్థలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఫుల్ స్టాక్ డెవలపర్లు, బిగ్ డేటా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డెవలరపర్లు, క్లౌడ్ ఇంజనీర్లు, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఆటోమేషన్ అధిక డిమాండ్ ఉన్నవిభాగాలుగా రిక్రూటర్లు పేర్కొంటున్నారు. ఈ రంగాల్లో నియమాకాల్లో దాదాపు 30-35శాతం పెరుగుదల, 50-70 శాతం వరకు జీతాల పెంపు కనిపిస్తోందని తెలిపారు. గత ఏడాదిలాక్డౌన్ కారణంగా ఐటీ మినహా ఇతర రంగాల్లో లక్షలాదిమంది ఉపాధిని కోల్పోయారు. ఐటీరంగంలో డిజిటల్ రంగంలో ఉద్యోగాలకు భారీ డిమాండ్ పెరిగింది. ఐటీ డిజటల్ విభాగంగా బోలెడన్ని అవకాశాలున్నాయి.ఈ రంగంలో నిపుణులకు పెద్ద మొత్తంలో చెల్లించేందుకు ఐటీ కంపెనీలు సిద్ధంగా ఉన్నారని రాండ్స్టాడ్ ఇండియా యెషాబ్ గిరి అన్నారు.డిమాండ్ ఎక్కువ సరఫరా తక్కువ ఉన్న నేపథ్యంలో ప్రధాన ఐటీ సంస్థలమధ్య ప్రతిభావంతులకోపం పెద్ద పోటీ నెలకొందన్నారు. భారతీయ ఐటీ పరిశ్రమలో ప్రతిభావంతుల కోసం యుద్ధం జరుగుతోంది. ప్రధాన ఐటీ కంపెనీల క్యూ4 ఫలితాలు ఆదాయాలు, ఆట్రిషన్ (కంపెనీనుంచి వలసలు) భారీ ఒప్పందాలే దీనికి తార్కాణమని వెల్లడించారు. వారికి ఆకర్షణీయ జీతాలు, బోనస్లు ,ప్రోత్సాహకాలు భారీగా లభించనున్నాయని ఏబీసీ కన్సల్టింగ్ సీనియర్ డైరెక్టర్ (టెక్నాలజీ) రత్న గుప్తా అన్నారు. డ్రాప్-అవుట్ రేట్లు కూడా గణనీయంగా పెరిగింది. ప్రతి 10 జాబ్ ఆఫర్లకు, వాటిలో 4-5 ఆఫర్లను తిరస్కరిస్తున్నారు. అంటే దాదాపు 40-50 శాతంగా ఉంది. దీంతో అభ్యర్థులను ఎంపిక చేయడం అటు కంపెనీలకు, ఇటు నియామక సంస్థలకు సవాలుగా మారిందని గిరి తెలిపారు. అట్రిషన్ రేటు ఐటీ మేజర్ టీసీఎస్లో 7.2 శాతంగా ఉండగా, తమవద్ద 15 శాతంగా ఉందని ఇన్ఫోసిస్ క్యూ 4 ఫలితాల సందర్భంగా తెలిపింది. రానున్న రెండు త్రైమాసికాలలో కూడా ఇది కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే విప్రో, 12.1 శాతం, హెచ్సిఎల్ టెక్ 9.9 శాతం అట్రిషన్ను నమోదు చేసింది, రానున్న ఆర్థిక సంవత్సరంలో ఇది మరింత పెరగవచ్చని అంచనా. గతేడాది అట్రిషన్ 10-12శాతం మాత్రమే. కాగా 2021-22లో లక్షకు పైగా ఫ్రెషర్లను తీసుకోనున్నామని టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో హెచ్సిఎల్ టెక్ ఇప్పటికే ప్రకటించాయి. -
నైపుణ్య శిక్షణకు మైక్రోసాఫ్ట్
సాక్షి, అమరావతి: విద్యార్థి దశ నుంచే నైపుణ్య శిక్షణను అందించాలన్న సీఎం వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా అందులో భాగస్వామ్యం కావడానికి ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ సంస్థతో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్యాశాఖ) సతీష్చంద్ర వెల్లడించారు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సీఎక్స్వో రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నైపుణ్య శిక్షణకు సంబంధించి ఇప్పటికే మైక్రోసాఫ్ట్తో పలుమార్లు చర్చలు జరిపామని.. శిక్షణ అందించే కోర్సులను కూడా గుర్తించినట్లు తెలిపారు. సాధారణ రుసుముతో ఏటా 1.60 లక్షల మంది డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనురులను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకోసమే డిగ్రీ సిలబస్ను నాలుగేళ్లకు మార్చడమే కాక 10 నెలల ఇంటర్న్షిప్ను తప్పనిసరి చేసినట్లు సతీష్చంద్ర తెలిపారు. ప్రధాన రంగాలతో ఐటీ అనుసంధానం అంతకుముందు.. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర ఐటి శాఖ కార్యదర్శి జి. జయలక్ష్మి మాట్లాడుతూ.. వ్యవసాయం, విద్య, వైద్య, స్మార్ట్ సిటీ వంటి ఆరు ప్రధాన రంగాలతో ఐటి అనుసంధానం ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు పెంచుకోగలుగుతామన్నారు. అలాగే, కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం పెరుగుతోందని, ఈ అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఈ సమ్మేళనం ద్వారా వ్యక్తమయ్యే అభిప్రాయాలతో కొత్త పాలసీ రూపొందించుకుని ముందుకు వెళ్తామన్నారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రధాన ఆదాయ వనరు అయిన వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఐటీ వినియోగాన్ని పెంచామని చెప్పారు. రాష్ట్రంలోని 10 వేలకు పైగా రైతుభరోసా కేంద్రాల్లో ఏర్పాటుచేసిన కియోస్క్లే ఇందుకు ఉదాహరణ అన్నారు. ఈ–క్రాపింగ్, మార్కెటింగ్ వంటి వాటిల్లో టెక్నాలజీని వినియోగించడం ద్వారా ఖర్చులను తగ్గిస్తున్నామని.. డ్రోన్ టెక్నాలజీ ద్వారా వ్యయం తగ్గి రైతులకు లాభాలు పెరిగే అవకాశం ఉందన్నారు. కాంటాక్ట్లెస్ టెక్నాలజీపై అందరి దృష్టి ఇదిలా ఉంటే.. కరోనాతో కాంటాక్ట్ లెస్ టెక్నాలజీపై అందరి దృష్టిపడిందని, ఆఫీసుకు వెళ్లకుండానే ఐటి టెక్నాలజీతో ఎక్కడి నుంచైనా పనిచేసే వెసులుబాటుకు అందరూ ఆకర్షితులవుతున్నారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి అన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వున్న మానవ వనరులను వినియోగించుకుని సాంకేతికంగా వారిలో నైపుణ్యాన్ని పెంచగలిగితే ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆమె తెలిపారు. ఇందులో భాగంగా అనంతపురం, తిరుపతి, విశాఖల్లో ఐటీ కాన్సెప్ట్ సిటీలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అబ్బయ్యచౌదరి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా ప్రసంగించగా.. 63 కంపెనీల సీఈవోలు, ఎండీలు పాల్గొన్నారు. -
పల్లెలకూ ఐటీ ఫలాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని.. ఇందులో భాగంగా ఐటీ ఫలాలను గ్రామీణ స్థాయికి తీసుకువెళ్లేలా పటిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రతీ గ్రామానికీ ఇంటర్నెట్ కనెక్షన్ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు గ్రామ సచివాలయాల్లో డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటుచేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతీ గ్రామ సచివాలయంలో కనీసం 5–6 వర్క్ స్టేషన్లు (కంప్యూటర్లు) చొప్పున 2024 నాటికి 90,000 పైగా వర్క్ స్టేషన్లు ఏర్పాటుచేయనున్నామన్నారు. కోవిడ్–19 తర్వాత ఐటీ రంగంలో వచ్చిన మార్పులు, రాష్ట్రంలో పెట్టుబడుల అవసరాలు వివరించడంలో భాగంగా రాష్ట్ర ఐటీ శాఖ సీఎక్స్వో పేరుతో శుక్రవారం విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ విద్య, వైద్యం, వ్యవసాయం, స్మార్ట్ సిటీ, స్కిల్ డెవలప్మెంట్ వంటి ఆరు కీలక రంగాల్లో టెక్నాలజీ వినియోగం పెంపుపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. టెక్నాలజీ ద్వారానే కరోనాను ఎదుర్కొన్నట్లు తెలిపారు. విశాఖలో అంతర్జాతీయ సదస్సు సదస్సును 25 కంపెనీల సీఈవోలతో నిర్వహిద్దామని ఆహ్వానాలు పంపగా 75 కంపెనీలు సానుకూలత వ్యక్తం చేశాయని.. ఇందులో, కోవిడ్ సమయంలోనూ 53 కంపెనీల సీఈవోలు, ఎండీలు ప్రత్యక్షంగా హాజరుకావడంతో పాటు, 10కి పైగా కంపెనీ ప్రతినిధులు వర్చువల్గా హాజరైనట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మేలో విశాఖలో నీతిఆయోగ్, నాస్కామ్లతో కలిసి అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. 5జీ టెక్నాలజీ, రోబోటిక్స్, జెనిటిక్స్, ఏఐ వంటి హైఎండ్ టెక్నాలజీ హబ్గా విశాఖను తీర్చిదిద్దుతామన్నారు. దేశీయ ఐటీ రంగంలో ఐదు శాతం ఉన్న రాష్ట్ర వాటాను మూడేళ్ల లో 10శాతానికి పెంచాలన్నదే లక్ష్యమన్నారు. ఆరు అంశాలపై సమావేశాలు స్కిల్లింగ్, ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీస్, స్మార్ట్ సిటీస్, స్టార్టప్స్, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్, ఎల్రక్టానిక్స్ అంశాలపై ప్రధానంగా చర్చించారు. సదస్సులో సెయింట్ సంస్థ ఎండీ సీఈవో కృష్ణ బోధనపు, శామ్సంగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్రావు, ఫేస్బుక్ ఎక్స్ప్రెస్ వైఫై హెడ్ సతీష్ మిట్టల్, గూగుల్ క్లౌడ్ హెడ్ ప్రతిక్ మోహతా, ఎ్రఫ్టానిక్స్ ఎండీ డి.రామకృష్ణ, మైక్రోమాక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భారత్ మాలిక్, అవేరా ఎనర్జీ సీఈవో వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తాం
-
రేపు విజయవాడలో ఐటీ సీటీవో కాన్క్లేవ్
సాక్షి, అమరావతి: కరోనా అనంతరం ఐటీ రంగంలో పరిస్థితులు, పరిణామాలను అధిగమించడానికి చేపట్టవలసిన చర్యలపై చర్చించేందుకు విజయవాడలో శుక్రవారం ఐటీ, ఎల్రక్టానిక్స్ సంస్థల సీఈవోలతో ఐటీ సీటీవో కాన్క్లేవ్ నిర్వహించనున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి చెప్పారు. ఈ సమావేశానికి 50కి పైగా కంపెనీల సీఈవోలు, ఎండీ స్థాయి అధికారులు హాజరు కానున్నారని తెలిపారు. అమెజాన్, ఫేస్బుక్, సామ్సంగ్, గూగుల్ క్లౌడ్, ఫ్లాక్స్కాన్, హెచ్టీసీ, ఫుజి, మోర్గాన్ స్టాన్లీ వంటి అనేక బహుళజాతి సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నట్లు చెప్పారు. విజయవాడ నోవాటెల్ హోటల్లో సదస్సు ప్రారంభం అనంతరం వివిధ అంశాలపై రెండు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా చేపట్టాల్సిన అవసరాలు, రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలు, ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను ఈ సదస్సు సందర్భంగా వివరించనున్నారు. ఐటీ, ఎల్రక్టానిక్స్ సంస్థలతో జరిగే ఈ సమావేశంలో వర్క్ ఫ్రమ్ హోమ్, నైపుణ్యం, ఉపాధి, కాన్సెప్ట్ సిటీలు, ఇంటర్నెట్ లైబ్రరీ అంశాలపై చర్చించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఐటీ రంగంలో కరోనా ప్రభావం చూపని విధంగా వినూత్నమైన కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఉపాధి ఆధారంగా రాయితీలు అంతకుముందు మంత్రి మేకపాటి ఐటీ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి ఆధారంగా రాయితీలు ఇచ్చే విధంగా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వ ప్రోత్సాహక బకాయిలు 207 క్లెయిమ్లకు రూ.49 కోట్లు ఉన్నాయని మంత్రికి ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్ వివరించారు. అదికాకుండా గత రెండేళ్ల బకాయిలు 67 క్లెయిమ్లకు మరో రూ.11 కోట్లు ఉన్నట్లు మంత్రికి తెలిపారు. సమావేశంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ప్రత్యేక కార్యదర్శి సుందర్ తదితరులు పాల్గొన్నారు. గడువులోగా కడప స్టీల్ ప్లాంట్ పూర్తి వైఎస్సార్ జిల్లాలో నిర్మించ తలపెట్టిన స్టీల్ ప్లాంట్ను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మిస్తున్న ఈ ఉక్కు కర్మాగారం పనులు వేగంగా చేస్తూనే భాగస్వామ్య కంపెనీ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా పిలిచిన అంతర్జాతీయ టెండర్లలో బ్రిటన్కు చెందిన లిబర్టీ స్టీల్ ఎల్1గా నిలిచిందని, కానీ ఇంకా ఆ కంపెనీతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖలతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్1గా నిలిచిన తర్వాత లిబర్టీ స్టీల్తో కేవలం చర్చలు, ప్రతిపాదనలు మాత్రమే జరిగాయన్నారు. ఇంతలో ఆ సంస్థకు ఆరి్థక సాయం అందించే మరో సంస్థ కష్టాల్లో చిక్కుకుందని తెలిసిందన్నారు. -
ప్రజల సమాచార భద్రతకే మొదటి ప్రాధాన్యత
సాక్షి, అమరావతి: ప్రజల సమాచార భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ విభాగాలు వినియోగిస్తున్న ఐటీ అప్లికేషన్లు, వెబ్సైట్లను రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ పరిధిలోకి తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి అన్ని ప్రభుత్వ శాఖల సేవలు, కొనుగోళ్లు ఐటీ శాఖ ద్వారా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముందుగా ఐటీ శాఖ నుంచే ఈ పని మొదలుపెట్టాలని, 48 గంటల్లోగా ఐటీ శాఖ వెబ్సైట్ను ప్రక్షాళన చేయాలని సూచించారు. శుక్రవారం విజయవాడలో ఐటీ శాఖ పనితీరుపై మంత్రి గౌతమ్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత భద్రంగా నిర్వహించాల్సిన ప్రభుత్వ డేటా బాధ్యతలను గత ప్రభుత్వం కన్సల్టెంట్లు, పొరుగు సేవల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిందని విమర్శించారు. త్వరితగతిన పారిశ్రామిక సర్వే పూర్తి చేయాలి ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి విశాఖలో ఐకానిక్ ఐటీ టవర్ల నిర్మాణంతోపాటు మూడు చోట్ల ఐటీ కాన్సెప్ట్ సిటీల నిర్మాణ పనుల వేగం పెంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కేవలం బీపీవో ఉద్యోగాలు మాత్రమే కాకుండా టెక్నాలజీ సంబంధిత ఉద్యోగాల కల్పనపై కూడా దృష్టి సారించాలన్నారు. త్వరితగతిన పారిశ్రామిక సర్వే పూర్తి చేయాలని సూచించారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్ జె.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇప్పటివరకు నైపుణ్యాభివృద్ధి సంస్థ జాబ్ ఫెయిర్, స్కిల్ కనెక్ట్ డ్రైవ్ కార్యక్రమాల ద్వారా 23,490 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 30 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు ఒక్కటి మినహా అన్నిచోట్ల భూసేకరణ పూర్తయ్యిందన్నారు. రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీలు ఏర్పాటు చేయడానికి 10 సంస్థలు ముందుకొచ్చాయన్నారు. మొత్తం 30 కాలేజీల్లో వీటిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి గౌతమ్రెడ్డి ఆదేశించారు. ఈ సమీక్షలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ చల్లా మధుసూదన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఐటీకి కలిసొచ్చిన కరోనా : ఎక్కువ జీతాలు ఎక్కడో తెలుసా?
సాక్షి,ముంబై: కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి దేశీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఉద్యోగ నియామకాల్లో కోలాహలం మొదలైంది. ప్రతి నెలా జాబ్స్ రిక్రూట్మెంట్లో వృద్ధిని నమోదవుతూనే ఉంది. క్రితం నెలతో పోలిస్తే జనవరి నెలలో జాబ్స్ పోస్టింగ్స్లో 39 శాతం పెరుగుదల కనబరిచిందని జాబ్స్, బిజినెస్ సొల్యూషన్స్ ఫ్లాట్ఫామ్ సైకి తెలిపింది. ఐటీ తర్వాత అత్యధిక వృద్ధి నమోదవుతున్న విభాగం బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ (బీపీఓ). 10 శాతం పెరుగుదలతో బీపీఓ, 6 శాతంతో బ్యాంకింగ్ రంగాలు ఉన్నాయని సైకి పేర్కొంది. బెంగళూరు, హైదరాబాద్, పుణే, ఢిల్లీ వంటి మెట్రో నగరాలలో జాబ్ పోస్టింగ్లు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది జనవరిలో ఈ రంగంలో 50 శాతానికి పైగా ఉద్యోగాలున్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా సుమారు 15 వేలకు పైగా జాబ్ పోస్టింగ్ డేటాను విశ్లేషించింది. (రిలయన్స్ సంచలన నిర్ణయం) ఎక్కువ జీతాలు హైదరాబాద్, బెంగళూరులోనే.. అత్యధిక వేతనాలను అందించే నగరాల జాబితాలో హైదరాబాద్, బెంగళూరు ఉన్నాయి. ఐటీ ఉద్యోగాలకు రూ.25 లక్షలు, అంతకంటే ఎక్కువ పారితోషకాలను ఇచ్చే నగరాలివేనని తెలిపింది. ఐటీ రంగంలో 47 శాతం ప్రాజెక్ట్ మేనేజర్లకు డిమాండ్ ఉంది. ఆ తర్వాత కన్స్ట్రక్షన్లో 6 శాతం, బ్యాంకింగ్లో 4 శాతం, రిక్రూట్మెంట్లో 3 శాతం డిమాండ్ ఉన్నాయి. ఇతర పరిశ్రమలతో పోలిస్తే డిజిటల్ మార్కెటింగ్ 30 శాతం నియామకాలతో అగ్రస్థానంలో ఉంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో కోల్పోయిన ఉద్యోగాలను తిరిగి పొందండంలో ఐటీ రంగం అసాధరణమైన పురోగతిని సాధించింది. డిజిటల్ పరివర్తనం, రిమోట్ వర్క్ వంటి వాటితో అనేక రంగాల ఆర్ధిక కార్యకలాపాల నిర్వహణలో ఐటీ ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారని సైకి కో-ఫౌండర్ అక్షయ్ శర్మ తెలిపారు. చదవండి: జూమ్ కితకితలు : ప్యాంట్ లేకుండానే -
వర్క్ ఫ్రం హోంను ప్రోత్సహించాలి: సీఎం జగన్
విశాఖ, తిరుపతి, బెంగళూరు సమీపంలో ఏర్పాటు కానున్న ఐటీ కాన్సెప్ట్ సిటీల్లో అత్యున్నత ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పించాలి. ప్రతి కాన్సెప్ట్ సిటీకి సంబంధించి ఒక ప్రత్యేకమైన మాస్టర్ ప్లాన్ ఉండాలి. ఆర్కిటెక్చర్ యునిక్గా నిర్మాణం కొనసాగించాలి. ఐటీ రంగం అభివృద్ధి చెందేలా వీటిని తీర్చిదిద్దాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు సమీపంలోని ఏపీకి చెందిన ప్రాంతంలో మూడు ఐటీ కాన్సెప్ట్ సిటీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. మూడు చోట్ల కనీసం 2 వేల ఎకరాల చొప్పున ఇవి ఏర్పాటయ్యేలా అడుగులు ముందుకు వేయాలని చెప్పారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం చాలా ముఖ్యమని, ఆ లక్ష్య సాధనతో పని చేయాలన్నారు. ఇదంతా ఐటీ రంగం అభివృద్ధికి ఎంతగానో దోహద పడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధి, ఈ రంగాల పాలసీ ఎలా ఉండాలనే అంశంపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐటీ, ఎలక్ట్రానిక్స్ పాలసీలో ఉండాల్సిన అంశాలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. అన్ని సదుపాయాలు, అత్యున్నత ప్రమాణాలతో కాన్సెప్ట్ సిటీలను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటర్నెట్ నెట్వర్క్ బలంగా లేకపోతే, అనుకున్న లక్ష్యాలు సాధించలేమని వివరించారు. రాష్ట్రంలో ఇంటర్నెట్ నెట్వర్క్ విస్తృతి, ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్, గ్రామాల్లో ఇంటర్నెట్ లైబ్రరీ, కొత్తగా వస్తున్న ఐటీ, ఇతర టెక్నాలజీ అంశాల్లో నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవడంపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఐటీ, ఎలక్ట్రానిక్స్ పాలసీపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్, మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తదితరులు వర్క్ ఫ్రం హోంను ప్రోత్సహించాలి – కోవిడ్ లాంటి మహమ్మారి నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం పెరిగింది. ఇకపై కూడా దీనిని ప్రోత్సహించాలి. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఏరకంగా ఐటీ రంగానికి ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందిస్తామో పరిశీలించి, దాన్ని పాలసీలో పెట్టాలి. – గ్రామంలోని సచివాలయాలు, ఆర్బీకేలు అన్నీ ఇంటర్నెట్తో అనుసంధానం కావాలి. దీంతో పాటు అవసరమైన గృహాలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలి. – వైఎస్సార్ జిల్లాలోని కొప్పర్తి ఎలక్ట్రానిక్ పార్క్పై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఈ పార్కులోకి వీలైనన్ని పరిశ్రమలను తీసుకురావాలి. తద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పించడంపై అధికారులు దృష్టి పెట్టాలి. రాయితీలు ఉద్యోగాల కల్పనకూ దోహద పడాలి – ఐటీ, ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు పెట్టుబడులతో పాటు ఉద్యోగాల కల్పనకు దోహదపడాలి. రాయితీల దుర్వినియోగానికి అసలు ఆస్కారం ఉండరాదు. – ఐటీ, ఎలక్ట్రానిక్ పాలసీలో ప్రతి అంశం పారదర్శకంగా ఉండాలి. ఇది ఐటీ ప్రగతికి దోహదపడాలి. రాష్ట్రాభివృద్ధికి సహాయ పడాలి. అన్ని అంశాలపై ఆలోచించి మంచి పాలసీ తీసుకు రావాలి. – ఈ సమీక్షలో ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశాఖలో ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్క్, ఎమర్జింగ్ టెక్నాలజీ వర్సిటీ – విశాఖపట్నంలో ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్కుతో పాటు ఎమర్జింగ్ టెక్నాలజీ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. – ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్కులో హై ఎండ్ స్కిల్స్ యూనివర్సిటీ, ఇన్క్యుబేషన్ సెంటర్, ల్యాబ్స్, సీఓఈఎస్, ఐటీ, ఈసీ డిపార్ట్మెంట్ ఆఫీసు, స్టేట్ డేటా సెంటర్, ఐటీ టవర్స్.. తదితరాలు ఉండాలని స్పష్టం చేశారు. – దేశంలోని ప్రఖ్యాత ఐఐటీ సహా వివిధ సాంకేతిక సంస్థల్లోని నిపుణులు దీనిపై త్వరలోనే నివేదిక సమర్పిస్తారని అధికారులు వెల్లడించారు. ఇంజనీరింగ్ సహా.. ఇతరత్రా సాంకేతిక విద్యను అభ్యసించిన వారికి నైపుణ్యాలను మెరుగు పరిచేందుకు ఈ యూనివర్సిటీ ఉపయోగ పడాలని సీఎం స్పష్టం చేశారు. యూనివర్సిటీ సహా ఐటీ సంబంధిత విభాగాలన్నీ ఒకే చోట ఉండాలని సూచించారు. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించడంతో పాటు ఇంటర్నెట్ లైబ్రరీ ఏర్పాటు చేయాలి. ఇందు కోసం భవనం కూడా నిర్మించాలి. గ్రామంలో ఎవరైనా సరే ఈ సదుపాయాన్ని వినియోగించుకునేలా వసతులు కల్పించాలి. తద్వారా ఇంటి నుంచి పని చేసుకునే (వర్క్ ఫ్రం హోం) సదుపాయం మెరుగవుతుంది. దీనిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. రోబోటిక్స్, ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీస్, డేటా అనలిటిక్స్ సైన్సెస్, అడ్వాన్స్డ్ ఎల్రక్టానిక్స్, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటి వనరులు తదితర రంగాల్లో ఐటీ అప్లికేషన్లపై బోధన, పరిశోధన లక్ష్యంగా విశాఖపట్నంలో ఎమర్జింగ్ టెక్నాలజీ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. -
మూడోరోజూ అమ్మకాలే..!
ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఇంధన, ఐటీ రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 531 పాయింట్లను కోల్పోయి 48,348 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 133 పాయింట్లు పతనమైన 14,238 వద్ద నిలిచింది. సూచీలకిది వరుసగా మూడోరోజూ నష్టాల ముగింపు. ఈ మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1444 పాయింట్లకు పైగా పతనమవగా, నిఫ్టీ 407 పాయింట్లు నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు, అధిక వెయిటేజీ షేర్లలో లాభాల స్వీకరణతో పాటు సిక్కిం సరిహద్దుల్లో భారత్– చైనా సైనిక బలగాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం మన మార్కెట్ సెంటిమెంట్ను బలహీనపరిచాయి. నష్టాల మార్కెట్లోనూ మెటల్ షేర్లు మెరిశాయి. ఫార్మా షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. సూచీల ఒకశాతం పతనంతో రూ.2.1 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. వెరసి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.192.3 లక్షల కోట్లకు దిగివచ్చింది. దేశీయ ఇన్వెస్టర్ల(డీఐఐ)తో పాటు విదేశీ ఇన్వెస్టర్లూ నికర అమ్మకందారులుగా మారి మొత్తం రూ.765 కోట్ల షేర్లన విక్రయించారు. రిపబ్లిక్ డే సందర్భంగా నేడు (మంగళవారం) మార్కెట్లకు సెలవు. ఇంట్రాడేలో 988 పాయింట్ల పరిధిలో సెన్సెక్స్..! ఆసియా మార్కెట్ల నుంచి అందిన సానుకూల పరిణామాలతో సూచీలు భారీ లాభాలతో మొదలయ్యాయి. ప్రారంభంలో కొంత షార్ట్ కవరింగ్ జరగడంతో సెన్సెక్స్ 385 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు లాభపడ్డాయి. అయితే దేశీయ మార్కెట్లో నెలకొన్న అంతర్గత బలహీనతలు సూచీల లాభాలకు అడ్డువేశాయి. మిడ్సెషన్లో యూరప్ మార్కెట్ల నష్టాల ప్రారంభం ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. నేడు మార్కెట్కు సెలవు, ఎల్లుండి జనవరి ఎఫ్అండ్ఓ ముగింపు తేది కావడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. చివరి అరగంటలో అమ్మకాల తీవ్రత మరింత పెరగడంతో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం నుంచి(49,263) 988 పాయింట్లను కోల్పోయి 48,275 వద్దకు వచ్చింది. నిఫ్టీ సైతం డే హై(14,491) నుంచి 274 పాయింట్లు నష్టపోయి 14,491 స్థాయిని తాకింది. రిలయన్స్ను అధిగమించిన టీసీఎస్ రిలయన్స్ షేరు పతనం టీసీఎస్ కంపెనీకి కలిసొచ్చింది. మార్కెట్ క్యాప్ విషయంలో రిలయన్స్ను అధిగమించి టీసీఎస్ దేశంలోనే అత్యంత విలువ కలిగిన కంపెనీగా అవతరించింది. టీసీఎస్ షేరు ఇంట్రాడేలో రూ.3,345 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకి చివరికి 0.36% స్వల్ప నష్టంతో రూ.3,291 వద్ద స్థిరపడింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ క్యాప్ 12.34 లక్షల కోట్లకు చేరింది. ఇక 5.36% పతనమైన రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.12.29 లక్షల కోట్ల వద్ద ముగిసింది. ఒక్కరోజులో ముకేశ్ అంబానీకి రూ. 38వేల కోట్ల నష్టం రిలయన్స్ షేరు భారీ పతనంతో ఈ కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ ఒక్కరోజులోనే రూ.38 వేల కోట్ల సంపదను కోల్పోయారు. రిలయన్స్ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక గణాంకాలు ఇన్వెస్టర్లు మెప్పించలేకపోయాయి. దీంతో షేరు ఇంట్రాడేలో 5.71% నష్టపోయి రూ.1932 స్థాయికి చేరుకుంది. కంపెనీ మార్కెట్ క్యాప్ భారీగా క్షీణించింది. ఫలితంగా కంపెనీలో సగానికి పైగా వాటా కలిగిన ముకేశ్ ఏకంగా రూ.38 వేల కోట్ల నష్టాన్ని చవిచూశారు. దీంతో బ్లూమ్బర్గ్ బిలినియర్ ఇండెక్స్లో అంబానీ 11వ స్థానం నుంచి 12వ స్థానానికి తగ్గింది. -
లండన్ను వెనక్కినెట్టిన బెంగళూరు
సాక్షి, బెంగళూరు : బెంగళూరు.. భారతదేశ ఐటీ రాజధాని. ఈ పేరును ఉద్యాన నగరి మరోసారి సార్థకం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఐటీ రంగం వృద్ధి చెందుతున్న నగరాల్లో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. అయితే, ఐటీ రంగం అభివృద్ధి విషయంలో యూరోపియన్ నగరాలు లండన్, మ్యూనిచ్, బెర్లిన్లను సైతం వెనక్కి నెట్టి బెంగళూరు అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. బెంగళూరు తర్వాత దేశీ నగరాల్లో ముంబై ఆరోస్థానంలో ఉంది. డీల్రూమ్.సీవో సమాచారాన్ని ది మేయర్ ఆఫ్ లండన్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్, పెట్టుబడుల ఏజెన్సీ సంస్థ లండన్ అండ్ పార్టనర్స్ విశ్లేషించి ఈ ర్యాంకింగులను ప్రకటించింది. 2016 నుంచి ఉన్న సమాచారాన్ని విశ్లేషించి బెంగళూరుకు అగ్రస్థానాన్ని కట్టబెట్టారు. 2016–2020 మధ్య కాలంలో బెంగళూరులో ఐటీ పెట్టుబడులు 5.4 రెట్లు పెరిగాయి. 2016లో 1.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఉండగా 2020 నాటికి 7.2 బిలియన్ డాలర్లకు పెరిగాయి. చదవండి: ఇద్దరు సీఎంల మధ్య భూవివాదం మహారాష్ట్ర ముంబైలో 1.7 రెట్లు మేర పెట్టుబడులు పెరిగాయి. 2016లో 0.7 బిలియన్ డాలర్లు ఉన్న పెట్టుబడులు ఆ తర్వాత 2020 నాటికి 1.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇక లండన్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. 2016లో 3.5 బిలియన్ డాలర్లు ఉండగా 2020లో 10.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. లండన్లో వృద్ధి రేటు మూడు రెట్లుగా ఉంది. ప్రపంచ సాంకేతికత వెంచర్ క్యాపిటలిస్టు (వీసీ) పెట్టుబడుల్లో కూడా బెంగళూరు దూసుకుపోతుండడం విశేషం. వీసీ పెట్టుబడుల్లో బెంగళూరులో ప్రపంచంలోనే ఆరోస్థానంలో నిలిచింది. అయితే వీసీ పెట్టుబడుల ర్యాంకింగుల్లో బీజింగ్, శాన్ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, షాంఘై, లండన్ నగరాలు బెంగళూరు కన్నా ముందుగా ఉన్నాయి. ఇక ముంబై ఈ విషయంలో 21వ స్థానంలో ఉంది. -
ఐటీ జాబ్స్కు అదే జోష్!
సాక్షి, ముంబై: కోవిడ్-19 వైరస్తో దేశంలోని అన్ని పరిశ్రమలల్లో ఉద్యోగుల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంటే.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో మాత్రం జోష్ తగ్గలేదు. బెంగళూరు, పుణే వంటి నగరాల్లోని ఐటీ ఉద్యోగులకు ఆర్ధిక భరోసా అందిందని జాబ్ ఫ్లాట్ఫామ్ స్కైకీ మార్కెట్ నెట్వర్క్ తెలిపింది. నవంబర్ నెలలో ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్, సాఫ్ట్వేర్ డెవలపర్, టెస్టర్, కన్సల్టెంట్, డిజిటల్ మార్కెటింగ్ విభాగాల్లోని ఉద్యోగాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని పేర్కొంది. కరోనా వైరస్తో అన్ని వ్యాపారాలకు డిజిటల్లోకి మారుతుండటం, సాంకేతిక వినియోగం పెరగడం వంటివి ఐటీ రంగం, ఉద్యోగుల వృద్ధికి కారణమని తెలిపింది. 2020 నాటికి దేశీయ ఐటీ రంగంలో 43.6 లక్షల మంది ఉద్యోగులున్నారు. నవంబర్లో 50 శాతానికి పైగా కొత్త ఉద్యోగ నియామకాలు బెంగళూరు, పుణే, హైదరాబాద్, ఢిల్లీ నగరాల నుంచి వచ్చాయి. ఐటీ రంగంలో ఏటా రూ.25 లక్షల ఎక్కువ వేతనం పొందుతున్న నగరాల్లో బెంగళూరు, పుణేలున్నాయని స్కైకీ కో–ఫౌండర్ కరుంజిత్ కుమార్ ధీర్ తెలిపారు. -
మూడేళ్లలో మరో 16వేల మంది నియామకం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) హైదరాబాద్ వరుసగా రెండు పర్యాయాలు రూ.14,000 కోట్ల ఆదాయాన్ని అధిగమించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే స్థాయిలో ఆర్జిస్తామని.. దీంతో దేశంలోని టీసీఎస్ క్యాంపస్లలో హైదరాబాద్ మూడో స్థానానికి చేరుకుంటుందని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, టెక్నాలజీ బిజినెస్ యూనిట్ గ్లోబల్ హెడ్ వి.రాజన్న తెలిపారు. టీసీఎస్ హైదరాబాద్ ఆదాయంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) వాటా 45% వరకు ఉంటుందన్నారు. తయారీ, టెక్నాలజీ, గవర్నమెంట్, హెల్త్కేర్, కమర్షియల్ ప్రొడక్ట్ గూడ్స్ (సీపీజీ) రంగాల్లో టీసీఎస్ సాంకేతిక సేవలందిస్తోందని వివరించారు.ఆయనింకా ఏమన్నారంటే.. మూడేళ్లలో కొత్తగా 16,000 మంది.. రానున్న మూడేళ్లలో 16 వేల మందిని కొత్తగా నియమించుకోవాలని లక్ష్యంగా చేసుకున్నాం. గతంలో అక్రెడిటేషన్ ఉన్న కాలేజీల్లో మాత్రమే క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించేవాళ్లం. ఇప్పుటి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కళాశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. హైదరాబాద్తో పాటు వరంగల్, కరీంనగర్, విజయవాడ, విశాఖపట్నం వంటి ద్వితీయ శ్రేణి పట్టణాల నుంచి కూడా విద్యార్థులను నియమించుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాల నుంచి 45% మహిళలు క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక అవుతున్నారు. వచ్చే ఏడాది జూన్ వరకు..: టీసీఎస్ హైదరాబాద్ 2007లో 4 వేల మంది ఉద్యోగులతో మొదలైంది. నేడు 12 రెట్ల వృద్ధితో 50 వేలకు చేరింది. ఆదిభట్లలో 23 వేల మంది సీటింగ్ ఉన్న క్యాంపస్ ఉంది. ప్రస్తుతం ఇందులో 14 వేల మంది ఉన్నారు. 6 నెలల నుంచి వర్క్ ఫ్రం హోం విధానం లో కార్యకలాపాలు సాగిస్తున్నాం. 45 వేల ల్యాప్ట్యాప్స్ ఉద్యోగుల ఇంటికి పంపించాం. 2021 జూన్ వరకూ వర్క్ ఫ్రం హోం కొనసాగుతుంది. టీసీఎస్ హైదరాబాద్లో ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, కర్ణాటక ఉద్యోగులూ ఉన్నారు. (చదవండి: టీసీఎస్ అరుదైన ఘనత) ప్రధాన మార్కెట్ అమెరికా.. ఐటీ పరిశ్రమ 2019–20లో రూ.14.3 లక్షల కోట్లు సాధించింది. ఇందులో ఎగుమతులు 77%, దేశీయ మార్కెట్ 23% నమోదైంది. ఎగుమతుల్లో 8.1%, దేశీయంగా 6.5% వృద్ధి పొందింది. భారత ఐటీ పరిశ్రమకు అతిపెద్ద మార్కెట్ అయిన అమెరికా వాటా 55%. యూరప్, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలు 30%, ఆసియా పసిఫిక్ దేశాలు 15% సమకూరుస్తున్నాయి. స్థూల జాతీయోత్పత్తిలో ఐటీ వాటా 8%, ఎగుమతుల్లో 45 శాతం వాటా ఉంది. మహిళలు 15 లక్షల మంది.. దేశీయ ఐటీ పరిశ్రమలో 43.6 లక్షల మంది ఉద్యోగులున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 41.6 లక్షలు. నికరంగా ఏటా 2 లక్షల మంది ఈ రంగంలో చేరుతున్నారు. ఐటీలో మహిళా ఉద్యోగుల సంఖ్య సుమారు 15 లక్షలు ఉంది. దేశంలోని ఇతర రంగాల్లోని మొత్తం ఉద్యోగుల్లో మహిళల వాటా 26% ఉంటే.. ఐటీ పరిశ్రమలో వీరి వాటా 35 శాతంగా ఉంది. -
ఐటీ.. మేడిన్ ఖమ్మం!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ హబ్లను విస్తృతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఇందులో భాగంగా ఖమ్మం ఐటీ హబ్ను అన్ని హంగులతో నిర్మించి హైదరాబాద్, బెంగళూరు నగరాలకు దీటుగా ఐటీ సేవలు అందించనున్నామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తెలిపారు. ఖమ్మంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐటీ హబ్ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడారు. ఐటీ హబ్కు ప్రఖ్యాతి గాంచిన కంపెనీలు రావడంతో ఇక్కడి నుంచి ఉత్పత్తి అయ్యే వాటికి మేడిన్ ఖమ్మంగా పేరొచ్చే అవకాశం కనుచూపు మేరల్లోనే ఉందన్నారు. సర్వీసు కంపెనీలకన్నా ఐటీ రంగంలో ప్రోడక్ట్ కంపెనీలు ఖమ్మం వైపు దృష్టి సారించడంతో ఇది సాధ్యం కానుందన్నారు. ఐటీ హబ్ రెండో దశ తక్షణ నిర్మాణం కోసం రూ. 20 కోట్లను మంజూరు చేస్తున్నామని, తద్వారా అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి లభించే అవకాశం కలుగుతుందన్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్(టాస్క్) ఆధ్వర్యంలో నిరంతరం వృత్తి నైపుణ్య శిక్షణ కొనసాగాలని, దీంతో ఉద్యో గావకాశాలు ఏ రూపంలో ఉన్నా ఖమ్మం యువత అందిపుచ్చుకొనే అవకాశం ఉందన్నారు. అభివృద్ధిలో ఖమ్మం దూసుకెళ్తోంది: అభివృద్ధిలో ఖమ్మం దూసుకుపోతోందని, నగరాన్ని ఎలా సుందరీకరించుకోవాలో.. ప్రభుత్వం నుంచి నిధులు ఎలా రాబట్టుకోవాలో మంత్రి అజయ్ నుంచి తెలుసుకొని ప్రజాప్రతినిధులు స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉందన్నారు. స్థానికంగా ఉన్న వనరులను వినియోగించుకోవడంలో ఖమ్మం ప్రజలు ముందంజలో ఉన్నారని, దీనికి ఉదాహరణే.. ఎన్నెస్పీ కాల్వపై వాకింగ్ ట్రాక్, పలుచోట్ల పార్కుల నిర్మాణమని, వైకుంఠధామాన్ని సైతం అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం మంత్రి పువ్వాడకే సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి పోలీస్ కమిషనరేట్ను ఖమ్మంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఐటీ రంగం కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా.. ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు. ఆయన ఆలోచనల మేరకు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్, సిద్దిపేట వంటి ప్రాంతాల్లో ఐటీ హబ్లు ఏర్పాటయ్యాయని వివరించారు. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి... మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నిరంతర విద్యార్థి అని.. 70 ఏళ్లు పైబడిన తర్వాత కూడా కంప్యూటర్ నేర్చుకున్నారని, 14 భాషలు నేర్చుకున్నారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. పీవీకి కేంద్రం భారతరత్న ప్రకటించాలని కోరారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కరణ వాది అయిన పీవీకి భారతరత్న ప్రకటించడం ఎంతైనా సమంజసమన్నారు. ప్రవాస భారతీయులు, తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని కోరుకుంటున్నారన్నారు. ఖమ్మంలో పీవీ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం విశేషమన్నారు. అభివృద్ధిలో రాజకీయాలు చూడం... అభివృద్ధిలో రాజకీయాలు ఉండవని, ఇందుకు ఉదాహరణే.. నగరంలోని సుందరయ్య నగర్లో ఏర్పాటు చేసిన పార్కును ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వామపక్ష కార్పొరేటర్ ద్వారా ప్రారంభింపజేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో.. పనులు ఎంత వేగంగా కొనసాగుతున్నాయో ఖమ్మంను స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల చైర్మన్లను, నగరపాలక సంస్థ మేయర్లను కోరుతున్నానని, త్వరలో వారందరినీ ఖమ్మంలో పర్యటించాలని కోరతానన్నారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్రెడ్డి, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్, టాస్క్ సీఈఓ శ్రీకాంత్సిన్హా, కలెక్టర్ ఆర్వీ.కర్ణన్, టెక్నోజెన్ సీఈఓ లాక్స్ చేకూరి పాల్గొన్నారు. -
ద్వైపాక్షిక బంధాలు బలపడతాయ్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ఎన్నికవడాన్ని భారత పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఇది తోడ్పడగలదని ఆకాంక్షించాయి. ‘రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడుల బంధాలు పెరుగుతున్నాయి. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన, చిన్న వ్యాపారాలకు ఊతమివ్వడం వంటి ఉమ్మడి ఎజెండా అమలుకు ఇరు పక్షాలు కలిసి పనిచేయాలి‘ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్ ఉదయ్ కొటక్ తెలిపారు. ‘బైడెన్–కమలా సారథ్యంలో భారత్–అమెరికా ఆర్థిక సంబంధాలు మరింతగా బలపడగలవు. అధునాతన శాస్త్రీయ పరిశోధనలు.. అభివృద్ధి కార్యకలాపాలు, వ్యూహాత్మక రంగాల్లో వ్యాపార వర్గాల మధ్య సహకారం పెరగగలదు‘ అని అసోచాం సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా మధ్య పటిష్టమైన సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలు ఉన్నాయని .. ఇవి మరింత బలోపేతం కాగలవని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ సంజయ్ అగర్వాల్ చెప్పారు. నాయకత్వం అంటే విధానాలతో పాటు వ్యక్తిత్వం కూడా అన్న పాఠాన్ని అమెరికా ఎన్నికలు తెలియజేశాయని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. 2019లో భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 150 బిలియన్ డాలర్లుగా నమోదైంది. పరస్పర ఆర్థిక సహకారంతో దీన్ని 500 బిలియన్ డాలర్ల లక్ష్యానికి చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవచ్చని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. స్వాగతించిన ఐటీ పరిశ్రమ..: జో బైడెన్ ఎన్నికపై దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ హర్షం వ్యక్తం చేసింది. ‘స్థానికంగా పెట్టుబడులు, ఉపాధి కల్పన వంటి చర్యల ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు భార త టెక్నాలజీ రంగం కీలక తోడ్పాటు అందిస్తోంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో నైపుణ్యాలను మెరుగుపర్చడం, మరిన్ని ఉద్యోగాలు కల్పించడం వంటి అంశాల్లో అమెరికా కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడంపై నాస్కామ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది‘ అని పేర్కొంది. ‘ఇది చారిత్రకమైన రోజు. అవరోధాలన్నీ తొలగిపోవడం హర్షించతగ్గ పరిణామం. ఏకత్వానికి, సమిష్టి తత్వానికి ఇది గెలుపు‘ అని సైయంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘ప్రజాస్వామ్యం గెలిచింది‘ అని టెక్ మహీంద్రా ఎండీ సీపీ గుర్ణానీ ట్వీట్ చేశారు. -
మార్కెట్ల పోల్వాల్ట్- 835 పాయింట్లు అప్
ఆరు రోజుల వరుస నష్టాలకు చెక్ పెడుతూ దేశీ స్టాక్ మార్కెట్లు అనూహ్య బౌన్స్బ్యాక్ను సాధించాయి. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ ట్రిపుల్ సెంచరీతోనూ, నిఫ్టీ సెంచరీతోనూ ప్రారంభమయ్యాయి. ట్రేడర్లు షార్ట్ కవరింగ్కు దిగడంతో ఆపై మరింత ఊపందుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 835 పాయింట్లు దూసుకెళ్లి 37,389 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 245 పాయింట్లు జంప్చేసి 11,050 వద్ద స్థిరపడింది. వెరసి ఇంట్రాడే గరిష్టాలకు సమీపంలోనే మార్కెట్లు ముగిశాయి. ఆటో, ఐటీ జోరు ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ 3.5-2 శాతం మధ్య బలపడ్డాయి. ఆటో, ఐటీ, మీడియా, మెటల్, బ్యాంకింగ్, ఫార్మా, రియల్టీ, ఎఫ్ఎంసీజీ 3.5-2 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్ ఫిన్, హెచ్సీఎల్ టెక్, సిప్లా, ఎయిర్టెల్, ఎల్అండ్టీ, ఇండస్ఇండ్, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్, ఐషర్, టీసీఎస్, ఐసీఐసీఐ, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, మారుతీ 6.7-3 శాతం మధ్య జంప్చేశాయి. బ్లూచిప్స్లో ఎస్బీఐ లైఫ్, బీపీసీఎల్, యూపీఎల్ మాత్రమే అదికూడా 1-0.6 శాతం మధ్య వెనకడుగు వేశాయి. ఎఫ్అండ్వోలో డెరివేటివ్ కౌంటర్లలో అశోక్ లేలాండ్, ఐడియా, జీఎంఆర్, కోఫోర్జ్, ఐడీఎఫ్సీ ఫస్ట్, మణప్పురం, ముత్తూట్, జిందాల్ స్టీల్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, గ్లెన్మార్క్, ఎక్సైడ్, మదర్సన్, నాల్కో, టాటా పవర్, ఐబీ హౌసింగ్, బయోకాన్, ఎన్ఎండీసీ, కెనరా బ్యాంక్, బీవోబీ, శ్రీరామ్ ట్రాన్స్ 13.5- 4.7 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. ఈ విభాగంలో హావెల్స్, సీమెన్స్ మాత్రమే అదికూడా 1-0.4 శాతం చొప్పున డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 3-2.3 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,984 లాభపడగా.. కేవలం 664 నష్టాలతో ముగిశాయి. ఎఫ్పీఐల అమ్మకాలు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దాదాపు రూ. 1,886 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) స్వల్పంగా రూ. 189 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. బుధవారం ఎఫ్పీఐలు రూ. 3,912 కోట్లకు మించి అమ్మకాలు చేపట్టగా.. డీఐఐలు రూ. 1,629 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. -
38,000 దిగువకు సెన్సెక్స్- ఐటీ, ఫార్మా అప్
తొలుత సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ తదుపరి అమ్మకాలు ఊపందుకోవడంతో రెండో రోజూ దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో నిలిచాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు క్షీణించి 37,734 వద్ద ముగిసింది. వెరసి 38,000 పాయింట్ల దిగువన స్థిరపడింది. ఇక నిఫ్టీ 97 పాయింట్ల నష్టంతో 11,154 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,210- 37,531 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11,302- 11,085 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. గ్లోబల్ బ్యాంకులలో అవకతవకల ఆరోపణలు, కోవిడ్-19 కేసులు పెరగడంతో యూరప్లో తిరిగి లాక్డవున్లు ప్రకటించడం వంటి పలు ప్రతికూల అంశాలు సెంటిమెంటును బలహీనపరచినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆదుకున్న ఐటీ ఎన్ఎస్ఈలో ప్రధానంగా మీడియా, ఆటో, పీఎస్యూ బ్యాంక్స్, రియల్టీ, మెటల్, రంగాలు 2.6-1.25 శాతం మధ్య క్షీణించగా.. ఐటీ, ఫార్మా 0.7 శాతం చొప్పున బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ 7 శాతం కుప్పకూలగా.. అదానీ పోర్ట్స్, ఇన్ఫ్రాటెల్, గెయిల్, మారుతీ, ఇండస్ఇండ్, టాటా మోటార్స్, యాక్సిస్, బీపీసీఎల్, ఎల్అండ్టీ, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, ఐవోసీ, హెచ్డీఎఫ్సీ, హీరో మోటో, హిందాల్కో, ఐషర్, ఆర్ఐఎల్ 4.7-1.6 శాతం మధ్య నష్టపోయాయి. అయితే ఇతర బ్లూచిప్స్లో హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, గ్రాసిమ్, అల్ట్రాటెక్, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ, సిప్లా, ఎస్బీఐ, ఎయిర్టెల్ 3-0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. నష్టాలలో.. డెరివేటివ్ కౌంటర్లలో కెనరా బ్యాంక్, మణప్పురం, ఎంఅండ్ఎం ఫైనాన్స్, జీఎంఆర్, ఇండిగో, భెల్, హెచ్పీసీఎల్, బాష్, ఎంజీఎల్, బీఈఎల్, నాల్కో, బంధన్ బ్యాంక్, గ్లెన్మార్క్, ఐడీఎఫ్సీ ఫస్ట్ 6-2.7 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు దివీస్, కోఫోర్జ్, మైండ్ట్రీ, అదానీ ఎంటర్, అరబిందో, సన్ టీవీ 3.4-1.2 శాతం మధ్య ఎగశాయి. .బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.6 శాతం చొప్పున క్షీణించాయి. ట్రేడైన షేర్లలో 1,874 నష్టపోగా.. 753 మాత్రమే లాభాలతో ముగిశాయి. అమ్మకాలవైపు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 540 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 518 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. కాగా.. వారాంతాన ఎఫ్పీఐలు రూ. 205 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 101 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
చివర్లో పతనం- ఐటీ షేర్ల హవా
హుషారుగా మొదలైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి డీలాపడ్డాయి. చివరి గంటన్నర సమయంలో ఊపందుకున్న అమ్మకాలు ఇండెక్సులను దెబ్బతీశాయి. వెరసి సెన్సెక్స్ 98 పాయింట్లు క్షీణించి 38,757 వద్ద ముగిసింది. నిఫ్టీ 24 పాయింట్లు తక్కువగా 11,440 వద్ద స్థిరపడింది. ప్రారంభంలోనే ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ క్వాడ్రపుల్ సెంచరీ సాధించగా.. నిఫ్టీ సైతం సెంచరీ చేసింది. దీంతో తొలిసెషన్లో సెన్సెక్స్ 400 పాయింట్లవరకూ జంప్చేసి 39,230ను తాకింది. నిఫ్టీ సైతం 96 పాయింట్లు పురోగమించి 11,569కు చేరింది. అయితే ఉన్నట్టుండి అమ్మకాలు పెరగడంతో మార్కెట్లు పతన బాట పట్టాయి. ఫలితంగా సెన్సెక్స్ 38,573 వద్ద కనిష్టానికి చేరింది. అంటే ఇంట్రాడే గరిష్టం నుంచి 650 పాయింట్లు పడిపోయింది. ఈ బాటలో నిఫ్టీ 11,384 దిగువకు పతనమైంది. ఐటీ జూమ్ ఎన్ఎస్ఈలో ఐటీ 4.5 శాతం, రియల్టీ 3.7 శాతం చొప్పున జంప్చేశాయి. అయితే బ్యాంక్ నిఫ్టీ దాదాపు 2 శాతం నష్టపోగా.. ఎఫ్ఎంసీజీ, ఫార్మా 0.8 శాతం స్థాయిలో నీరసించాయి. క్యూ2లో పటిష్ట ఫలితాలు సాధించే వీలున్నట్లు తాజాగా పేర్కొనడంతో నిఫ్టీ దిగ్గజాలలో హెచ్సీఎల్ టెక్ 11 శాతం దూసుకెళ్లింది. మరోపక్క యూరోపియన్ కంపెనీ గైడ్విజన్ను కొనుగోలు చేస్తున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించడంతో ఇతర ఐటీ కౌంటర్లు సైతం జోరందుకున్నాయి. వెరసి టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ 5-3 శాతం మధ్య జంప్చేశాయి. టీసీఎస్ మార్కెట్ విలువ రూ. 9 లక్షల కోట్లను దాటింది. బ్లూచిప్స్ తీరిలా నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, టైటన్, హీరో మోటో, శ్రీ సిమెంట్ 3-1.2 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్లో ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, బీపీసీఎల్, పవర్గ్రిడ్, ఎస్బీఐ, గ్రాసిమ్, హిందాల్కో, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, కొటక్ బ్యాంక్, యాక్సిస్, హెచ్యూఎల్, ఐసీఐసీఐ 4-2 శాతం మధ్య డీలాపడ్డాయి. అశోక్ లేలాండ్ ప్లస్ డెరివేటివ్ కౌంటర్లలో అశోక్ లేలాండ్, అపోలో టైర్స్, బాలకృష్ణ, బీఈఎల్, బాటా, వోల్టాస్, పీవీఆర్, మ్యాక్స్ ఫైనాన్స్, మదర్సన్, ఎస్కార్ట్స్, ఏసీసీ, ఐడియా 10-3.6 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోపక్క ఐబీ హౌసింగ్, బంధన్ బ్యాంక్, ఐసీఐసీఐ ప్రు, భెల్ 5-2 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.6-4 శాతం చొప్పున జంప్చేశాయి. ట్రేడైన షేర్లలో 1829 లాభపడగా., 927 మాత్రమే నష్టాలతో ముగిశాయి. మల్టీక్యాప్ ఫండ్స్ ఈక్విటీ పెట్టుబడుల నిబంధనలను సెబీ సరళతరం చేయడంతో మధ్య, చిన్నతరహా కౌంటర్లకు భారీ డిమాండ్ నెలకొన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఎఫ్పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,176 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 724 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. గురువారం ఎఫ్పీఐలు రూ. 838 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 317 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. -
చివరికి 39,000కు- ఆటో, ఐటీ దన్ను
వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 185 పాయింట్లు బలపడి 39,086 వద్ద నిలవగా.. నిఫ్టీ 65 పాయింట్లు పుంజుకుని 11,535 వద్ద స్థిరపడింది. సోమవారంనాటి భారీ పతనం నుంచి మార్కెట్లు మంగళవారం కోలుకున్నప్పటికీ తీవ్ర ఆటుపోట్లను చవిచూసిన సంగతి తెలిసిందే. ఇదే విధంగా నేటి ట్రేడింగ్లోనూ ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,142 వద్ద గరిష్టాన్ని తాకగా.. 38,736 వద్ద కనిష్టానికీ చేరింది. ఇక నిఫ్టీ సైతం 11,555- 11,430 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైంది. చైనాతో సరిహద్దు వద్ద వివాదాల నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రభుత్వ బ్యాంక్స్ వీక్ ఎన్ఎస్ఈలో మీడియా, మెటల్, ఐటీ, ఆటో 3.3-1.5 శాతం మధ్య ఎగశాయి. ఫార్మా, ప్రయివేట్ బ్యాంక్స్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ సైతం 0.8-0.4 శాతం మధ్య పుంజుకోగా.. పీఎస్యూ బ్యాంక్స్ 0.2 శాతం నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, ఇన్ఫ్రాటెల్, అదానీ పోర్ట్స్, పవర్గ్రిడ్, టాటా స్టీల్, ఇండస్ఇండ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, ఆర్ఐఎల్, ఐషర్, బీపీసీఎల్, హెచ్సీఎల్ టెక్ 7.5-2 శాతం మధ్య జంప్చేశాయి. ఇతర బ్లూచిప్స్లో బజాజ్ ఆటో, హీరో మోటో, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ, నెస్లే, సన్ ఫార్మా, హెచ్యూఎల్, కొటక్ బ్యాంక్, ఎస్బీఐ, గ్రాసిమ్, ఎన్టీపీసీ, యూపీఎల్ 2.4-0.6 శాతం మధ్య డీలాపడ్దాయి. ఐడియా జోరు ఎఫ్అండ్వో కౌంటర్లలో ఐడియా 12.5 శాతం దూసుకెళ్లగా.. ఎస్కార్ట్స్, యూబీఎల్, నౌకరీ, మైండ్ట్రీ, బాష్, సెయిల్, బంధన్ బ్యాంక్, జూబిలెంట్ ఫుడ్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఇండిగో, జీఎంఆర్, సీఫోర్జ్ 10-3.5 శాతం మధ్య దూకుడు చూపాయి. కాగా.. మరోపక్క శ్రీరామ్ ట్రాన్స్, కంకార్, పెట్రోనెట్, మ్యాక్స్ ఫైనాన్స్, ముత్తూట్, బాలకృష్ణ, ఐబీ హౌసింగ్, పీఎఫ్సీ, గోద్రెజ్ ప్రాపర్టీస్ 2-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 1.25-1.7 శాతం చొప్పున ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1631 లాభపడగా.. 1051 నష్టాలతో నిలిచాయి. ఎఫ్పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 486 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 775 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్పీఐలు రూ. 3,395 కోట్లకుపైగా అమ్మకాలు చేపట్టగా.. డీఐఐలు రూ. 681 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. -
సానుకూల విధానాలతోనే పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: దేశంలోకి పెట్టుబడులు రప్పించేందుకు సానుకూల విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటీవల ఎలక్ట్రానిక్ వాహన పాలసీని ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఆధ్వర్యంలో శనివారం ‘ఇండియా ఎట్ 75’ సదస్సులో ‘స్థానిక, ప్రపంచ స్థాయి నైపుణ్యాలు, ఆవిష్కరణలు, పెట్టుబడుల మేళవింపు– భారత్లో సాంకేతిక పునరుద్ధరణ’అనే అంశంపై కేటీఆర్ కీలకోపన్యాసం చేశారు. కోవిడ్ మహ మ్మారి సృష్టించిన విధ్వంసం నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇంటి నుంచి పనిచేయడం, డిజిటల్ సొల్యూషన్ తదితరాలను ఆచరించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. సాంకేతిక రంగంలో భారత్ ప్రముఖ పాత్ర భారత్లో ప్రపంచంలోనే అత్యధిక సాంకేతిక మానవ వనరులు ఉండటంతో రెండు దశాబ్దాలుగా ప్రముఖపాత్ర పోషిస్తోందని కేటీఆర్ అన్నారు. సాంకేతికంగా మన స్థానాన్ని పటిష్టం చేసేందుకు కోవిడ్ సంక్షోభం సరైన వేదికగా పనిచేస్తుందన్నారు. 28.6 ఏళ్ల సగటు ఆయుర్దాయువు ఉన్న మానవ వనరుల్లో భారత్లో ఎక్కువగా ఉండటం అనుకూలించే అంశమని పేర్కొన్నారు. ఆవిష్కరణలు, మౌలిక వసతులు, సమగ్రాభివృద్ధి ఆవశ్యకతను నొక్కి చెప్తూ వ్యవసాయం, డిజిటల్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ రిటైల్, రోబో డెలివరీ రంగాల్లో సాంకేతిక వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. 5జీ సాంకేతికత భారత్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడంతోపాటు టెక్నాలజీ రంగంలో భారత్ నాయకత్వ స్థాయికి ఎదిగేందుకు దోహదం చేస్తుందన్నారు. రాష్ట్రంలో కృత్రిమ మేధస్సు(ఏఐ), బ్లాక్ చెయిన్, డ్రోన్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీ ఆధారంగా తెలంగాణ అనేక ప్రాజెక్టులు రూపొందిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించా రు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
ఐటీ వద్దు.. సివిల్సే ముద్దు
సాక్షి, అమరావతి: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత సర్వీసు కేడర్ పోస్టులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల వైపు ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువత ఎక్కువ దృష్టి సారిస్తోంది. గతంలో హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్లలో డిగ్రీ చేసిన వారు సివిల్స్కు ఎక్కువగా హాజరయ్యేవారు. బీఈ, బీటెక్ చేసిన వారు ఐటీ, తదితర తమ కోర్ గ్రూపు పోస్టుల వైపు వెళ్లేవారు. కానీ గత కొంతకాలంగా ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ అభ్యర్థులతోపాటు బీఈ, బీటెక్ పూర్తిచేసిన వారు సివిల్స్వైపు మొగ్గుచూపుతుండడమే కాకుండా మంచి ఫలితాలను సాధిస్తున్నారు. నిపుణులు ఏమంటున్నారంటే.. ► ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్లలో పట్టు ఉండడంతో సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ► అభ్యర్థుల్లో లాజికల్ రీజనింగ్, ఎనలిటికల్ ఎబిలిటీ, ఆంగ్ల నైపుణ్యం పరిశీలనకు సీశాట్ పెట్టారు. ఈ మూడింటిలోనూ ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఎక్కువ పరిజ్ఞానం ఉంటోంది. ► ఐటీ రంగంలో మంచి అవకాశాలు దక్కుతున్నా ప్రైవేటు రంగంలో అనిశ్చిత పరిస్థితులు, ప్రతికూల పరిణామాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం, జీతాల్లో కోత తదితర కారణాలతో సివిల్స్ వైపు దృష్టి సారిస్తున్నారు. ► అంతేకాకుండా ఈ అభ్యర్థులు సివిల్స్ మెయిన్స్ పరీక్షల్లో తమ కోర్ గ్రూప్ సబ్జెక్టులను కాకుండా హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ సబ్జెక్టు (ఆంత్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, హిస్టరీ తదితర)లను ఎంచుకుని విజయం సాధిస్తున్నారు. ► జేఈఈ మెయిన్స్, అడ్వాన్సులతోపాటు బిట్స్ పిలానీ వంటి వాటి ప్రవేశ పరీక్షల్లో విజయం సాధించిన అనుభవం సివిల్స్ సన్నద్ధతకు బాగా ఉపయుక్తంగా ఉంటోంది. ► 2011 నుంచి ఇప్పటివరకు జరిగిన సివిల్స్ పరీక్షల ఫలితాల్లో 70 శాతానికి పైగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారే ఉన్నారని.. తమ సంస్థ నుంచి 10 మంది ఎంపికయ్యారని సివిల్స్ శిక్షణ సంస్థ మెంటార్ ఒకరు వివరించారు. ► సివిల్స్–2019లో విజయం సాధించిన మొత్తం 829 మందిలో కూడా ఇంజనీరింగ్ అభ్యర్థులే అత్యధికమని విశ్లేషిస్తున్నారు. ► ఇక తెలుగు రాష్ట్రాల నుంచి విజయం సాధించిన అభ్యర్థులలో కూడా 90 శాతం మంది వీరేనని పేర్కొంటున్నారు. -
ఐటీ షేర్ల లాభాల హవా- భారీ ట్రేడింగ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజాలు విప్రో, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ సాధించిన ఫలితాలు ఐటీ రంగానికి జోష్నిస్తున్నాయి. దీంతో మధ్యస్థాయి ఐటీ కంపెనీల షేర్లకు సైతం డిమాండ్ కనిపిస్తోంది. కోవిడ్-19 విసురుతున్న సవాళ్ల నేపథ్యంలోనూ క్యూ1(ఏప్రిల్-జూన్)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో బుధవారం విప్రో కౌంటర్ 15 శాతం దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ బాటలో ఇన్ఫోసిస్, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ ఆకర్షణీయ పనితీరు చూపడంతో పలు ఐటీ కౌంటర్లు నేటి ట్రేడింగ్లో భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. జాబితాలో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, ఎంఫసిస్, మాస్టెక్, సొనాటా సాఫ్ట్వేర్ చోటు సాధించాయి. ఇతర వివరాలు చూద్దాం.. ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ఎన్ఎస్ఈలో ఇన్ఫోసిస్ షేరు ప్రస్తుతం 9.2 శాతం జంప్చేసి రూ. 907 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 955ను అధిగమించింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 7.9 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఎన్ఎస్ఈలో గత రెండు వారాల సగటు ట్రేడింగ్ పరిమాణం కేవలం 1.18 కోట్ల షేర్లు కావడం గమనార్హం! ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ షేరు 4.6 శాతం జంప్చేసి రూ. 2291 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 2336ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ట్రేడింగ్ ప్రారంభమైన తొలి అర్ధగంటలోనే ఈ కౌంటర్లో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో కలిపి 1.7 లక్షల షేర్లు చేతులు మారడం గమనార్హం! ఎంఫసిస్ లిమిటెడ్ ఎన్ఎస్ఈలో ఎంఫసిస్ లిమిటెడ్ షేరు ప్రస్తుతం 4 శాతం జంప్చేసి రూ. 1035 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1099ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ఎన్ఎస్ఈలో మధ్యాహ్నానికల్లా 13.8 లక్షల షేర్లు చేతులు మారాయి. ఈ కౌంటర్లో గత రెండు వారాల సగటు ట్రేడింగ్ పరిమాణం 2.54 లక్షల షేర్లు మాత్రమే! మాస్టెక్ లిమిటెడ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం మాస్టెక్ లిమిటెడ్ షేరు 9.2 శాతం జంప్చేసి రూ. 907 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 955ను అధిగమించింది. బీఎస్ఈలో మధ్యాహ్నానికల్లా 42,000 షేర్లు చేతులు మారాయి. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 15,000 షేర్లు మాత్రమే కావడం గమనార్హం! సొనాటా సాఫ్ట్వేర్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం సొనాటా సాఫ్ట్వేర్ షేరు 4 శాతం లాభపడి రూ. 245 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 252ను తాకింది. ఎన్ఎస్ఈలో మధ్యాహ్నానికల్లా 13.4 లక్షల షేర్లు చేతులు మారాయి.ఈ కౌంటర్లో గత రెండు వారాల సగటు ట్రేడింగ్ పరిమాణం 2.6 లక్షల షేర్లు మాత్రమే! -
హైదరాబాద్ నలుమూలలా ఐటీ కంపెనీలు
సాక్షి, హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగాన్ని హైదరాబాద్లోని అన్ని మూలలకూ విస్తరించేందుకు త్వరలో గ్రిడ్ విధానాన్ని తీసుకొస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. హైదరాబాద్కు తూర్పున ఉప్పల్ వైపు ప్రస్తుతమున్న ఐటీ కంపెనీలకు తోడు మరిన్ని ఐటీ, అనుబంధ కంపెనీల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహకాలు, మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. హైదరాబాద్ గ్రోత్ ఇన్ డిస్పెర్షన్ (గ్రిడ్) కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ బుధవారం ఉప్పల్ ఎన్ఎస్ఎల్ ఎరెనాలో ఐటీ కంపెనీల ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈస్ట్ హైదరాబాద్లో ఐటీ రంగం స్థితిగతులు, భవిష్యత్తు పెట్టుబడులపై మంత్రి ఈ సమావేశంలో చర్చించారు. గ్రిడ్ ద్వారా ఐటీ రంగం విస్తరణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చే గ్రిడ్ వి«ధానం ద్వారా ఐటీ పరిశ్రమలు హైదరాబాద్లోని ఇతర ప్రాంతాలకు తరలివస్తాయనే ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. ఈస్ట్ హైదరాబాద్లో ఇప్పటికే మెట్రో, శిల్పారామం, మూసీ నది అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మౌలిక వసతులు మెరుగవుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఉప్పల్ నుంచి ఘట్కేసర్ వైపు, అంబర్ పేట్ రామాంతాపూర్ ఫ్లై ఓవర్ల ద్వారా రోడ్లు, మౌలిక వసతులు మరింత మెరుగవుతాయన్నారు. హైదరాబాద్ నలువైపులా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, మెడికల్ డివైజెస్ వంటి పరిశ్రమలు విస్తరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఔటర్ రింగు రోడ్డు వెలుపలకు కాలుష్య కారక పరిశ్రమలు తరలివెళ్తే, వాటి స్థలాలను ఐటీ రంగ కార్యాలయాల అభివృద్ధికి అనుమతినిచ్చే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. ఐదు కంపెనీలకు కన్వర్షన్ పత్రాలు పారిశ్రామిక స్థలాలను ఐటీ పార్కులుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన కన్వర్షన్ పత్రాలను ఐదు ఐటీ కంపెనీల ప్రతినిధులకు కేటీఆర్ బుధవారం అందజేశారు. ఐదు కంపెనీల ద్వారా సుమారు 25 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అభివృద్ధి చేస్తామన్నారు. తద్వారా ఉప్పల్ ప్రాంతంలో మరో 30వేల మంది ఐటీ ఉద్యోగులకు అవకాశాలు లభిస్తున్నాయన్నారు. రాచకొండ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ రూపొందించిన సమాచార సంచికను మంత్రి ఆవిష్కరించారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, రాచకొండ కమీషనర్ మహేశ్ భగవత్, వివిధ ప్రభుత్వ శాఖల అ«ధికారులతో పాటు ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఎఫ్పీఐలను మెప్పిస్తున్న ఐటీ షేర్లు
దేశీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగ షేర్లపై విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) సానుకూల వైఖరినే కలిగి ఉన్నారు. ఎఫ్పీఐలు ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో జరిపిన క్రయ, విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం అవగతం అవుతుంది. ఈ క్యూ1లో వారు టీసీఎస్, ఎల్అండ్ టెక్నాలజీస్, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ షేర్లకు కొనుగోలు చేశారు. హెచ్సీఎల్, విప్రో కంపెనీల షేర్లను విక్రయించారు. అలాగే మైండ్ట్రీ, పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఈ కార్లెక్స్ సర్వీసెస్, సోనాటా సాఫ్ట్వేర్, ఎన్ఐఐటీ టెక్నాలజీస్ కంపెనీల్లో 2శాతం వరకు తమ వాటాలను తగ్గించుకున్నాయి. ఇన్ఫోసిస్కు షేర్ల విషయంలో ఎఫ్పీఐల వైఖరీ ఎలా ఉందో అనే విషయం నేడు(క్యూ1 ఫలితాలు విడుదల)తెలిస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 6.7శాతం లాభపడింది. అయితే బీఎస్ఈలో సెన్సెక్స్ మాత్రం 10.9శాతం నష్టపోయింది. ఇదే క్యూ1లో టీసీఎస్లో ఇన్వెస్టర్లు 0.11శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. ఫలితంగా కంపెనీలో ఎఫ్పీఐల మొత్తం వాటా 15.85శాతానికి చేరుకుంది. ఇదే తొలి త్రైమాసికంలో మ్యూచువల్ ఫండ్స్ టీసీఎస్లో తమ వాటాను 2.55శాతం నుంచి 2.51శాతానికి తగ్గించుకున్నారు. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ రంగాల్లో ఎఫ్పీఐల వాటా జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. లాక్డౌన్ విధింపుతో వ్యవస్థ అంతా స్తంభించుకుపోయింది. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా టెక్నాలజీ రంగం మిగతా అన్ని రంగాల కంటే ఎక్కువ లాభపడింది. ఈ అంశం ఇన్వెస్టర్లను ఆకర్షించగలిగింది. క్లౌడ్ కంప్యూటింగ్, నెట్వర్కింగ్లో అవకాశాలు కొంతమందికి కొత్త అవకాశాలను అందించాయి. ఇప్పటివరకు ఐటీ షేర్లు బాగుందని ఇక ముందు ఈ రంగ షేర్ల ఎంపిక పట్ల జాగ్రత అవసరం. యూఎస్ అమెరికా ఆర్థిక వ్యవస్థలు రికవరీకి మరింత సమయం పడుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇది ఐటీ కంపెనీల ఖర్చు, డిమాండ్ ప్రభావితం చేయగలవు.’’ అని ఈక్వినామిక్స్ రీసెర్చ్ ఫౌండ్ జి జొక్కాలింగం తెలిపారు. -
మహిళకు.. వెల్కమ్!
న్యూఢిల్లీ: పనివేళలు సౌకర్యంగా లేకపోవడం.. ఇంటి నుంచి పని చేసే అవకాశాలు తక్కువగా ఉండడం.. ఇటువంటి సమస్యలు ఇంతకాలం ఉద్యోగ రంగంలో మహిళల పాత్రను పరిమితం చేశాయి. కానీ, ఇప్పుడు కరోనాతో ఇది మారిపోనుంది. దీని కారణంగా పలు రంగాల్లో.. ముఖ్యంగా ఐటీ రంగంలో 75–90 శాతం మంది ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుంచే కార్యాలయ పని).. విధానంలోనే పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మార్పులతో మరింత మంది మహిళలు కెరీర్ వైపు అడుగులు వేసే అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ‘‘ప్రతిభావంతులైన ఎంతో మంది మహిళలు, ఎన్నో నైపుణ్యాలు ఉండి కూడా వ్యక్తిగత కారణాల రీత్యా ఇంటికే పరిమితం కావాల్సి వస్తోంది. కానీ, ఇప్పుడు వారు తిరిగి ఐటీ రంగంలోకి బలంగా వచ్చే అవకాశం ఉంది’’ అని ఎస్సార్ గ్రూపు హెచ్ఆర్ ప్రెసిడెంట్ కౌస్తుభ్ సోనాల్కర్ పేర్కొన్నారు. ఇంటి నుంచే పని విధానంతో మహిళలు తిరిగి ఉద్యోగాన్ని ప్రారంభించేందుకు, పార్ట్టైమ్ (పరిమిత సమయం) ఉద్యోగాలు చేసుకునేందుకు చక్కని అవకాశం ఏర్పడిందన్నారు. మహిళలకు ప్రాధాన్యం.. క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో పనిచేసే సేల్స్ఫోర్స్ కంపెనీకి భారత్లో 2,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరింత మంది మహిళలను నియమించుకునేందుకు కట్టుబడి ఉన్నట్టు ఈ సంస్థ ప్రకటించింది. తద్వారా ఉద్యోగుల విషయంలో మరింత సమతుల్యతను తీసుకురానున్నట్టు తెలిపింది. ‘‘ఉద్యోగులు ఇంటి నుంచే శాశ్వతంగా పనిచేసేందుకు మరిన్ని కంపెనీలు అనుమతించనున్నాయి. ఇది మహిళలకు అనుకూలమైన పరిస్థితులను, అవకాశాలను కల్పించనుంది. వ్యక్తిగత బాధ్యతలను నెరవేరుస్తూనే వారు తమ కెరీర్ను తిరిగి ప్రారంభించేందుకు వీలు కలుగుతుంది’’ అని ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా డైరెక్టర్ నిధి అరోరా అభిప్రాయపడ్డారు. ‘‘భారత్లో భద్రతా కారణాల రీత్యా రాత్రి షిఫ్ట్లకు మహిళలను అంతగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. కరోనా కారణంగా భిన్నమైన ధోరణులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు అన్ని రకాల ఉద్యోగాలకు వారు అర్హులే. మరింత మంది మహిళలు ఉపాధి అవకాశాలను సొంతం చేసుకుంటారని భావిస్తున్నాను’’ అని అమెరికా కేంద్రంగా పనిచేసే ‘వర్కింగ్ మదర్ మీడియా’ ప్రెసిడెంట్ సుభ వి బ్యారీ తెలిపారు. ‘బ్యాలెన్స్’ అవకాశం పనిచేసే చోట సాధారణంగా స్త్రీ/పురుష ఉద్యోగుల విషయంలో సంఖ్యా పరంగా ఎంతో అంతరం కనిపిస్తుంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ఇప్పుడు ఈ అంతరాన్ని సరిచేసే అవకాశం కానుందా..? అన్నదానికి ఏడీపీ ఇండియా హెచ్ఆర్ హెడ్ విపుల్సింగ్ స్పందిస్తూ.. ‘‘కార్యాలయాలకు వెళ్లే అవకాశం ఇవ్వనందుకే మహిళలు ఉద్యోగాల నుంచి తప్పుకోవడం లేదు. సామాజికంగా, మానసికంగా, వ్యక్తిగత అవసరాల కోసం వారి జీవితంలో కొంత వ్యవధి కావాలి. అందుకే వారు ఉద్యోగాల విషయంలో రాజీపడాల్సి వస్తోంది. కానీ, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో అన్నింటిని సమతుల్యం చేసుకోగలరు’’ అంటూ భవిష్యత్తు ధోరణి గురించి వివరించారు. గత రెండేళ్లలో మహిళా ఉద్యోగుల శాతం 35% నుంచి 25%కి పడిపోయిందని.. ఇప్పుడు మళ్లీ పుంజుకోనుందని యాక్సెంట్ హెచ్ఆర్ సీఈవో సుబ్రమణ్యమ్ చెప్పారు. వేతనాల్లో అం తరం ఉండడం కూడా మహిళా ఉద్యోగుల సంఖ్య పెరిగేందుకు సానుకూలించే అంశంగా పేర్కొన్నారు. వేతనాలదీ కీలకపాత్రే... ‘‘పని పరంగా పురుషులకు ఏ మాత్రం తక్కువ కాకపోయినా.. పారితోషికాల విషయంలో మహిళలకు 20% తక్కువే చెల్లిస్తున్నాయి కంపెనీలు. ఇది మహిళలకు ప్రతికూలమే అయినా, పరిశ్రమకు లాభదాయకం. సౌకర్యమైన పనివేళలు లేదా ఉత్పత్తి ఆధారిత చెల్లింపుల దిశగా పరిశ్రమలు అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. ఇలా చేస్తే మహిళలకు ఉపాధి పరంగా మరిన్ని అవకాశాలకు ద్వారాలు తెరుచుకున్నట్టే. ఎందుకంటే ఈ విషయంలో పరిశ్రమలకు కనీస వేతనాల తలనొప్పి కూడా ఉండదు’’ అని సుబ్రమణ్యమ్ వివరించారు. రెండో విడత కెరీర్ ప్రారంభించాలనుకునే మహిళలకు వర్క్ హోమ్ హోమ్తో భారీ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తుండడం గమనార్హం. -
భారత ఐటీపై హెచ్1బీ వీసాల రద్దు ప్రభావం?
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయులకు ఇతర వీసాలతోపాటు హెచ్1బీ వీసాలను అమెరికా రెండేళ్లపాటు రద్దు చేయడంతో భారత్కు చెందిన 200 బిలియన్ డాలర్ల ఐటీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురయింది. భారత ఐటీ పరిశ్రమకు 70 శాతం రెవెన్యూ ఒక్క ఉత్తర అమెరికా ప్రాంతం నుంచే రావడం అందుకు కారణం. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వలస కార్మికుల వీసాలపై కొనసాగిన అనిశ్చిత పరిస్థితుల్లో భారతీయ పరిశ్రమ చిన్న చిన్న ప్రత్యమ్నాయాలను అనుసరించిందని, ఇప్పుడు అలాంటి ప్రత్యమ్నాయాలే పరిశ్రమను రక్షించగలవని కొన్ని దిగ్గజ ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. భారత ఐటీ పరిశ్రమ ‘స్వీయలంబన’ సాధించాల్సిందేనని టెక్ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ వ్యాఖ్యానించారు. ప్రధానంగా హెచ్1బీ వీసాలపైనే ఆధారపడే పరిస్థితి నుంచి భారతీయ పరిశ్రమ క్రమంగా బయట పడేందుకు ప్రయత్నిస్తోంది. అమెరికాలో అత్యధిక ఉద్యోగులను కలిగిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, అమెరికాలో పది వేల మంది ఉద్యోగులను కలిగిన రెండో పెద్ద సంస్థ ఇన్ఫోసిస్, అజీమ్ ప్రేమ్జీ నాయకత్వంలోని విప్రో కంపెనీలు అట్లాంటా, మిచిగాన్ రాష్ట్రాల్లో యూనివర్సిటీల నుంచే క్యాంపస్ సెలక్షన్లను చేపడుతున్నాయి. (హెచ్ 1బీ: భవిష్యత్తుపై మనోళ్ల బెంగ!) ఒక్క టెక్ మహేంద్రనే 2017 సంవత్సరంలోనే దాదాపు రెండువేల మంది అమెరికన్లను నియమించుకుంది. స్థానిక నియామకాలకే ఇప్పుడు కూడా ఆ కంపెనీ ప్రాధాన్యత ఇస్తోంది. భారతీయులకు అమెరికా వీసాలు ఇవ్వడం వల్ల స్వల్పకాలికంగా భారత ఐటీ కంపెనీలు లబ్ది పొందవచ్చునేమోగానీ దీర్ఘకాలికంగా మాత్రం అమెరికా ఆర్థిక వ్యవస్థకే లాభదాయకమని, ఈ విషయాన్ని ఆ దేశం కూడా ఏదో ఒక రోజున గ్రహించక పోదని గుర్నాని అభిప్రాయపడ్డారు. ఒక్క అమెరికాలోనే కాకుండా అమెరికాతో ‘బిజినెస్ ఫ్రెండ్లీ’గా ఉంటోన్న ఇరుగు పొరుగు దేశాలకు కూడా భారత ఐటీ కంపెనీలు విస్తరించాయి. అలా మెక్సికోలో టీసీఎస్, విప్రో కంపెనీలు తమ యూనిట్లను ఏర్పాటు చేయగా, ఇన్ఫోసిస్ కూడా అదే మార్గాన్ని అనుసరించింది. మెక్సికోలో దాదాపు పది ఐటీ దిగ్గజ కంపెనీలు ఉన్నట్లు భారత్లోని మెక్సికో రాయబారి మెల్బాప్రియా తెలిపారు. గిగ్ ఎకానమీ బాగా విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలోకి ఐటీ కంపెనీలకు అవసరమైన నిపుణులు స్థానికంగానే దొరకుతారు. భారత్లో కూడా ఐటీ పరిశ్రమ వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో ఐటీ నిపుణులు అమెరికా వీసాలపైనే ఎక్కువగా ఆశ పెట్టుకోవాల్సిన అవసరం లేదని ‘టాలెంట్ 500 ఏఎన్ఎస్ఆర్’ లాంటి సంస్థలు కూడా అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో జాత్యాహంకార గొడవలు పెరుగుతున్న సమయంలో భారత ఐటీ నిపుణులు వెనక్కి వచ్చేందుకు కూడా ఇష్టపడవచ్చని ఐటీ పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. అమెరికా వీసాల రద్దు పట్ల భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, స్వావలంబన సాధించగలమని వారంటున్నారు. -
ఐటీ జోష్- 35,000కు సెన్సెక్స్
సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం యాక్సెంచర్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఐటీ దిగ్గజాలు జోరందుకోవడంతో దేశీ స్టాక్ మార్కెట్లు రెండు రోజుల నష్టాలకు చెక్ పెట్టాయి. మరోపక్క అంతర్జాతీయ సంకేతాలు హుషారునివ్వడంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడ్డారు. వెరసి ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ తిరిగి 35,000 పాయింట్ల కీలక మార్క్ ఎగువన ముగిసింది. సెన్సెక్స్ 329 పాయింట్లు జంప్చేసి 35,171 వద్ద నిలిచింది. నిఫ్టీ 94 పాయింట్లు ఎగసి 10,383 వద్ద స్థిరపడింది. కాగా.. సెన్సెక్స్ 35,145 వద్ద ప్రారంభమై 35,255వరకూ బలపడింది. అయితే మిడ్సెషన్లో 34,910 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఇక నిఫ్టీ 10,405- 10,311 పాయింట్ల మధ్య గరిష్ట కనిష్టాలకు చేరింది. మెటల్, బ్యాంకింగ్ ఓకే ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఐటీ ఇండెక్స్ 4 శాతం జంప్చేయగా.. మెటల్, బ్యాంకింగ్ 1-0.5 శాతం చొప్పున బలపడ్డాయి. అయితే ఎఫ్ఎంసీజీ, రియల్టీ, ఫార్మా రంగాలు 1-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్ఫోసిస్, బీపీసీఎల్, టీసీఎస్, ఐవోసీ, ఇండస్ఇండ్, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఓఎన్జీసీ, హిందాల్కో, శ్రీసిమెంట్ 7-3 శాతం మధ్య జంప్చేశాయి. ఇతర బ్లూచిప్స్లో బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, ఇన్ఫ్రాటెల్, కొటక్ బ్యాంక్, టాటా మోటర్స్, సన్ ఫార్మా, ఎంఅండ్ఎం, హెచ్యూఎల్, వేదాంతా, టైటన్ 3-1 శాతం మధ్య నీరసించాయి. నిట్ టెక్ అప్ డెరివేటివ్స్లో నిట్ టెక్, ఉజ్జీవన్, టాటా పవర్, ఐడియా, హెచ్పీసీఎల్ 6.5-4 శాతం మధ్య పురోగమించాయి. కాగా.. మ్యాక్స్ ఫైనాన్స్, పీవీఆర్, అపోలో హాస్పిటల్స్, యూబీఎల్, ఎన్సీసీ, అశోక్ లేలాండ్, ఎల్అండ్టీ ఫైనాన్స్ 3.6-2.6 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.2 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1656 లాభపడగా.. 1062 నష్టపోయాయి. ఎఫ్పీఐలు భేష్ నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1051 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 256 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్ఫీఐలు రూ. 1767 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1525 కోట్ల అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
ఇకపై ఐటీ కంపెనీల డివిడెండ్లలో కోత.!
కార్పోరేట్ వ్యవస్థలో మిగతా రంగాలతో పోలిస్తే ఐటీ రంగంలో డివిడెండ్ చెల్లింపులు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఐటీ కంపెనీల డివిడెండ్ చెల్లింపుల్లో భారీ కోత ఉండవచ్చని మార్కెట్ పండితులు అంచనా వేస్తున్నారు. కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో అదనపు వ్యయాలు పెరగడం, నికర లాభం తగ్గడంతో నగదు ప్రవాహం క్షీణించడం, భవిష్యత్తు అవసరాలకు కంపెనీలు నగదు నిల్వలను అట్టిపెట్టికోవడం లాంటి చర్యలతో మునుపటిలా డివిడెండ్ చెల్లింపులు ఉండకపోవచ్చని వారు చెబుతున్నారు. ‘‘ఈ ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్ చెల్లింపు పాలసీని మార్పు చేయవలసి ఉంటుంది. ప్రతికూల వృద్ధిని అధిగమించే ప్రక్రియలో భాగంగా కంపెనీలు నగదు నిల్వలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది.’’ అని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ, బోర్డు సభ్యుడు బాలకృష్ణన్ తెలిపారు. అధిక నగదును కలిగిన పరిశ్రమలో ఐటీ అగ్రస్థానంలో ఉంటుంది. ఐటీ సంస్థలు మిగులు నగదును తమ షేర్ హోల్డర్లకు మధ్యంతర, వార్షిక డివిడెండ్ల రూపంలో చెల్లిస్తుంటాయి. రెగ్యూలర్గా డివిడెండ్ చెల్లింపులతో పాటు షేరు ధర ఆకర్షణీయ విలువల వద్ద ట్రేడ్ అవుతుండటంతో స్టాక్ మార్కెట్ ఇన్వెసర్లు ధీర్ఘకాలిక దృష్టా్య ఈ రంగ షేర్ల కొనుగోళ్లకు ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. గత ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ మందగించడంతో ఒక్క టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మినహా ఐటీ కంపెనీలు డివిడెండ్ చెల్లింపులో కోత పెట్టాయి. టీసీఎస్ ఆర్థిక సంవత్సరం 2019-20లో తన షేర్హోల్డర్లకు రూ.31,895 కోట్ల నిధులను డివిడెండ్ రూపంలో చెల్లించింది. ఈ మొత్తం విలువ కంపెనీ ఫ్రీ క్యాష్ ఫ్లోలో 108.9శాతంగా ఉంది. అలాగే ఎఫ్వై 19, ఎఫ్వై 18లో డివిడెండ్ చెల్లింపు నిష్పత్తి వరుసగా 110.2శాతం, 106శాతంగా ఉంది. "టీసీఎస్ మినహా, ఆర్థిక సంవత్సరం 2019, 2020లో అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు బైబ్యాక్లతో సహా తమ చెల్లింపుల నిష్పత్తిని తగ్గించాయి. కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా చెల్లింపు నిష్పత్తి భారీగా తగ్గేందుకు అవకాశం ఉంది. ఐటీ కంపెనీలు వ్యయాలను భరించేందుకు నగదు పరిరక్షణ చర్యలకు పూనుకోవచ్చు.’’ అని షేర్ఖాన్ బ్రోకరేజ్ సంస్థ హెడ్ రీసెర్చ్ సంజీవ్ హోతా తెలిపారు. ‘‘ సాధ్యమైనంత వరకు ఐటీ కంపెనీలు మూలధన కేటాయింపు పాలసీను మార్చుకోవు. అయితే వారి సంప్రదాయ విధానాలకు కోవిడ్-19 గండికొట్టింది. ఇదే సందర్భంలో వ్యవస్థలో నెలకొన్న సంక్షోభంతో విలీన అవకాశాలను కల్పిస్తున్నాయి. కాబట్టి సాధ్యనమైంత వరకు ఐటీ కంపెనీలు నగదు నిల్వలకే మొగ్గు చూపాయి.’’ ప్రముఖ ఐటీ అవుట్సోర్సింగ్ అడ్వైజర్ పరీఖ్ తెలిపారు. -
51 రోజుల తర్వాత..
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్తో మూతపడిన ఐటీ కారి డార్లోని కంపెనీలు 51 రోజుల తర్వాత తెరుచుకున్నాయి. మాదాపూర్, కొండాపూర్, గచ్చి బౌలి, నానక్రాంగూడ ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం నాలెడ్జి సిటీ తదితర ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు సోమవారం తెరిచారు. దీంతో 10% ట్రాఫిక్ పెరి గినా ఎక్కడా రద్దీ కనిపించలేదు. కరోనా వైరస్ కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 22న జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఐటీ కంపెనీలకు మార్చి 20 చివరి వర్కింగ్ డే కాగా మార్చి 21 వీకెండ్ సెలవు వచ్చింది. జనతా కర్ఫ్యూ అనంతరం లాక్డౌన్ విధిం చడంతో ఐటీ కంపెనీలు మూసివేశారు. లాక్డౌన్ నేపథ్యంలో వర్క్ ఫ్రం హోమ్కు అవకాశం కల్పించారు. కోవిడ్–19 జాగ్రత్తలు పాటిస్తూ, శానిటైజేషన్ చేస్తూ, భౌతిక దూరం పాటిస్తూ 33% మంది ఐటీ ఉద్యోగులు పని చేయవచ్చని ప్రభుత్వం తాజాగా ఆదేశాలివ్వడంతో కంపెనీలు తెరిచారు. సోమవారం అత్యవసర విభాగాల్లో పని చేసే కొందరు ఐటీ ఉద్యోగులు సొంత వాహనాలు, కంపెనీ బస్సుల్లో విధులకు వచ్చారు. దీంతో ప్రధాన కూడళ్లలోనూ ట్రాఫిక్ రద్దీ పెద్దగా కనిపించలేదు. కంపెనీలో 33% ఉద్యోగులు హాజరయ్యేందుకు మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. -
దీర్ఘకాల లాక్డౌన్తో ఐటీ ఉద్యోగాలకు ముప్పు
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్డౌన్ .. దేశీయంగా ఐటీ రంగంలో ఉద్యోగాల కోతకు దారితీయొచ్చని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ మాజీ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ చెప్పారు. పరిస్థితి మరింతగా దిగజారితే.. వెంచర్ క్యాపిటలిస్టుల పెట్టుబడులతో మనుగడ సాగిస్తున్న స్టార్టప్ సంస్థలు.. ఇంకా గడ్డుకాలం ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు. ‘పెద్ద కంపెనీలు రెండు కారణాలతో ఉద్యోగాలను తక్షణమే తీయకపోవచ్చు. ఉద్యోగులను పోగొట్టుకోవడం ఇష్టం లేకపోవడం ఒకటి కాగా.. వాటి దగ్గర జీతాల చెల్లింపునకు పుష్కలంగా నిధులు ఉండటం మరో కారణం. ఒకవేళ తగ్గించుకుంటే తాత్కాలిక సిబ్బంది, ఇంటర్న్షిప్ చేస్తున్న వారు ఉండొచ్చు. అయితే, ఒక స్థాయికి మించి.. రెండు మూడు నెలలు దాటేస్తే ఆ కంపెనీలు కూడా ఒత్తిడి తట్టుకోలేవు’ అని అన్నారు. -
ఐటీ రంగానికి కరోనా కాటు
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి ఐటీ రంగానికి శాపంగా మారింది. ఏటా సుమారు లక్ష కోట్లకుపైగా ఐటీ ఎగుమతులు సాధిస్తున్న పలు సంస్థలకు తాము పూర్తి చేయాల్సిన ఒప్పందాలకు సంబంధించిన క్లయింట్లతో సమావేశాలు వాయిదాపడ్డాయి. ఆయా దేశాల్లో తమ కంపెనీలు చేజిక్కించుకున్న ప్రాజెక్టుల పూర్తికి పలు ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడి నుంచి తమ సంస్థల టెకీలను ఆయా దేశాలకు పంపించేందుకు బ్రేకులు పడ్డాయి. లాక్డౌన్ నేపథ్యంలో మహానగరం పరిధిలోని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రం హోంకే పరిమితం చేశాయి. దీంతో ఉత్పాదకత గతంతో పోలిస్తే మోస్తరుగా తగ్గిందని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి కారణంగా ఇప్పటికే తమ సంస్థలు చేపట్టిన ప్రాజెక్టులు పూర్తిచేయడం మరింత ఆలస్యమవుతాయని పలు సంస్థల నిపుణులు చెబుతున్నారు. లాక్డౌన్ అనంతరం దాదాపు అన్ని కంపెనీలు ఉద్యోగులను ఇంటికే పరిమితం చేసి వర్క్ ఫ్రం హోంకు అనుమతించిన విషయం విదితమే. అయితే, ప్రస్తుత తరుణంలో ఐటీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, జరిగిన నష్టంపై నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్) ఆధ్వర్యంలో అధ్యయనం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ‘సాక్షి’కి తెలిపారు. త్వరలో ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఐటీ రంగానికి కొంగు బంగారంగా నిలిచిన హైదరాబాద్లో ఈ రంగం నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఐటీ, హార్డ్వేర్ పాలసీ రాకతో ఈ రంగం గణనీయంగా పురోగమిస్తుందని తెలిపారు. కొన్నిరోజుల పాటు అనిశ్చితి నెలకొన్నప్పటికీ త్వరలో పరిస్థితులు చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, గడిచిన ఆర్థిక సంవత్సరంలో 2019–2020 మార్చిలో సుమారు రూ.1.07 లక్షల కోట్లు ఐటీ ఎగుమతులు జరిగినట్లు అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఐటీ రంగ సమస్యలివే.. గ్రేటర్ పరిధిలో సుమారు 900 ఐటీ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటిలో సుమారు 6 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఈ కంపెనీల్లో సుమారు వంద వరకు మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి బహుళజాతి కంపెనీలున్నాయి. ప్రస్తుతం కరోనా కలకలం, లాక్డౌన్ నేపథ్యంలో తాము చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయలేకపోతున్నట్లు మెజారిటీ ఐటీ కంపెనీలు చెబుతున్నాయి. దీంతో తమకు మోస్తరుగా నష్టాలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నట్లు తెలిపాయి. నష్టాలను ఇప్పుడే అంచనా వేయలేమని, ఇందుకు రెండు వారాల సమయం పడుతుందని పేర్కొంటున్నాయి. ఔట్సోర్సింగ్ ప్రాజెక్టులు పెరుగుతాయి ‘అమెరికాలో లక్షల మంది మంది ఐటీ ఉద్యోగులను తొలగించే ప్రక్రియ మొదలుకావడం, హెచ్1బీ వీసాల రద్దుపై అమెరికా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో.. పలు అమెరికా బహుళ జాతి కంపెనీలు మన నగరంలోని ఐటీ కంపెనీలతో పాటు పలు దేశీయ కంపెనీలకు ఔట్ సోర్సింగ్ విధానంలో భారీగా ఐటీ ప్రాజెక్టుల కాంట్రాక్టులు అప్పజెప్పే అవకాశాలున్నాయి. ఇప్పటికే అమెరికాలో చిన్న కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను భారీగా చేపట్టాయి. ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ తదితర కంపెనీలదీ ఇదే ప్రక్రియకు శ్రీకారం చుడతాయని ఆశిస్తున్నాం. ఇలా జరిగితే ఇక్కడ ఉపాధి కల్పన మరింత పెరగనుంది. లాక్డౌన్ నేపథ్యంలో ఈ రంగం స్వల్ప ఒడిదొడుకులు ఎదుర్కొన్నా ఐటీ రంగం నిలకడ గల వృద్ధిని తప్పక సాధిస్తుంది. ఈ విషయంలో త్వరలో స్పష్టత రానుంది’ – మురళి, హైసియా అధ్యక్షుడు -
హెచ్సీఎల్ టెక్నాలజీస్... ఆదాయం 18,135 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో 13 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.2,605 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ క్యూ3లో రూ.2,944 కోట్లకు పెరిగిందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.15,699 కోట్ల నుంచి 16 శాతం వృద్ధితో రూ.18,135 కోట్లకు పెరిగిందని కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ సి. విజయకుమార్ పేర్కొన్నారు. ఒక్కో ఈక్విటీ షేర్కు రూ.2 డివిడెండ్ను ఇవ్వనున్నామని తెలిపారు. డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 17 శాతం వృద్ధితో 43 కోట్ల డాలర్లకు, ఆదాయం 16 శాతం వృద్ధితో 250 కోట్ల డాలర్లకు పెరిగాయని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయ అంచనాలను సవరిస్తున్నామని విజయకుమార్ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 16.5–17 శాతం రేంజ్లో పెరగగలదని గతంలో అంచనా వేశామని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ అంచనాలను 15–17 శాతంగా సవరిస్తున్నామని వివరించారు. ఈ క్యూ3లో స్థూలంగా 11,502 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1.49,173కు పెరిగిందని విజయకుమార్ చెప్పా రు. ఆట్రీషన్ రేటు (ఉద్యోగుల వలస) 16.8%గా ఉందని వివరించారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ఆర్థిక ఫలితాలపై సానుకూల అంచనాలతో బీఎస్ఈలో హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్ స్వల్పంగా లాభపడి రూ.599 వద్ద ముగిసింది. పటిష్ట పనితీరు... గత కొన్నేళ్లుగా మంచి పనితీరు సాధించడాన్ని కొనసాగిస్తున్నాం. ఈ క్వార్టర్లో 1,000 కోట్ల డాలర్ల ఆదాయ మైలురాయిని దాటేశాం. ఆదాయం 16 శాతం వృద్ధి సాధించగా, ఎబిట్ 20 శాతం మేర పెరిగింది. లాభదాయకత, వృద్ధి, ఇన్వెస్ట్మెంట్ వ్యూహాలు పటిష్టంగా ఉన్నాయనే విషయాన్ని ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి. –సి. విజయకుమార్, సీఈఓ, హెచ్సీఎల్ టెక్నాలజీస్ -
బెంగళూరులో ఎక్కువ వేతనాలు
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత వేతన చెల్లింపులకు రాజధానిగా బెంగళూరు తన స్థానాన్ని కాపాడుకుంది. అలాగే, అత్యధిక పారితోషికాలు ఐటీ రంగంలో ఉన్నట్టు రాండ్స్టాడ్ ‘ఇన్సైట్స్ శాలరీ ట్రెండ్స్ 2019’ నివేదిక వెల్లడించింది. బెంగళూరులో జూనియర్ స్థాయి ఉద్యోగిపై కంపెనీ వార్షికంగా చేస్తున్న సగటు వ్యయం (సీటూసీ) రూ.5.27 లక్షలుగా ఉంటే, మధ్య స్థాయి ఉద్యోగిపై ఇది రూ.16.45 లక్షలు, సీనియర్ లెవల్ ఉద్యోగిపై రూ.35.45 లక్షలుగా ఉంది. ఈ సంస్థ రూపొందించిన 2018, 2017 నివేదికల్లోనూ అత్యధిక వేతనాలున్న నగరంగా బెంగళూరు మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. జూనియర్ లెవల్ ఉద్యోగులకు అధికంగా చెల్లింపులున్న రెండో నగరంగా హైదరాబాద్ చోటు సంపాదించింది. ఇక్కడ సగటు సీటూసీ రూ.5లక్షలు. రూ.4.59 లక్షలతో మూడో స్థానంలో ముంబై నగరం ఉంది. మధ్య స్థాయి ఉద్యోగులకు అధికంగా చెల్లిస్తున్న నగరాల్లో ముంబై రూ.15.07 లక్షలతో రెండో స్థానంలో, దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) రూ.14.5 లక్షలతో మూడో స్థానంలో ఉన్నాయి. -
ఐటీ కొలువుల వెలుగులు
సాక్షి ప్రతినిధి, అమరావతి: ఐటీ ఉద్యోగార్థులకు శుభవార్త. దేశంలో ఆర్థిక మందగమనం కొనసాగుతున్నప్పటికీ.. ఐటీ రంగంలో మాత్రం అవకాశాలు క్రమంగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు లాభిస్తుందని పేర్కొంటున్నారు. దేశ విదేశాల్లో ఐటీ, డిజిటలైజేషన్పై వివిధ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలకు ఆర్డర్లు మరింత పెరగడం ఖాయమని అంటున్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో దేశంలో వివిధ ఐటీ కంపెనీలు 1.8 లక్షల మందిని ఎంట్రీ స్థాయి ఉద్యోగాల్లోకి తీసుకున్నట్లు అంచనా. అందుకు అనుగుణంగా వ్యాపారమూ పెరిగిందని ఐటీ పారిశ్రామిక వర్గాలు తెలిపాయి. 2020–21 ఆరి్థక సంవత్సరంలో ఉద్యోగాల సంఖ్యలో కనీసం 10 శాతం వృద్ధి ఉంటుందని, వచ్చే సంవత్సరం భారత ఐటీ కంపెనీలు కనీసం 2 లక్షల మందిని కొలువుల్లోకి తీసుకుంటాయని నియామక సంస్థలు అంచనా వేస్తున్నాయి. టాప్–5 కంపెనీల్లోనే 40 శాతం నియామకాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్), ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహీంద్ర దేశంలో టాప్–5 కంపెనీలు. దేశంలోని మొత్తం నియామకాల్లో 40 శాతం ఈ 5 కంపెనీల్లోనే ఉంటాయి. 2019–20 ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలల్లో ఈ 5 కంపెనీల్లో 64,442 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వీరిలో ఎక్కువ మంది ఎంట్రీ స్థాయిలోనే ఉద్యోగాల్లో చేరారు. మిడిల్–సీనియర్ మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాల అవసరం పెద్దగా ఉండదని నియామక సంస్థలు చెబుతున్నాయి. రానున్న ఆరి్థక సంవత్సరంలో కనీసం 80 వేల ఎంట్రీ స్థాయి ఉద్యోగాలు ఈ 5 కంపెనీల్లో వస్తాయని అంచనా వేస్తున్నారు. నియామకాల్లో టీసీఎస్ టాప్ అత్యధిక మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్న కంపెనీల్లో టీసీఎస్ సంస్థ తొలిస్థానంలో నిలిచింది. ఈ కంపెనీ ప్రస్తుత ఆరి్థక సంవత్సరం తొలి ఆరు నెలల వ్యవధిలో 30 వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంది. వచ్చే ఏడాది ఈ సంఖ్య పెరుగుతుందని నియామక సంస్థలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది భారీగా రిక్రూట్మెంట్ జరిగే అవకాశాలున్నాయని టీసీఎస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. పెరగనున్న క్యాంపస్ రిక్రూట్మెంట్లు దేశంలో జరిగే మొత్తం ఐటీ నియామకాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాటా కనీసం 20 శాతం ఉంటుందని టీసీఎస్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. ఈ మేరకు క్యాంపస్ రిక్రూంట్మెంట్లు పెరుగుతాయన్నారు. టాప్ కాలేజీలకే కాకుండా.. ద్వితీయ, తృతీయ శ్రేణి కళాశాలలకు సైతం వెళ్లి నియామకాలు చేపట్టాలనే యోచన ఉందన్నారు. కేవలం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మాత్రమే కాకుండా డిగ్రీ విద్యార్థులనూ ఉద్యోగాల్లో చేర్చుకోనున్నామని వివరించారు. ఐటీ ఒక్కటే ప్రత్నామ్నాయం.. కోర్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఉత్పత్తి రంగంలోని కంపెనీలు నియామకాలు తగ్గించాయి. ఫలితంగా ప్రత్యామ్నాయాల కోసం విద్యార్థులు అన్వేíÙస్తారు. వారి ముందు ఉన్న ప్రత్యామ్నాయం ఐటీ రంగం. ఐటీ కంపెనీలకు సైతం కొత్త ఉద్యోగుల అవసరం ఉంది. ఈ రంగంలో నియామకాలు పెరగడం వారికి కొంత ఊరట. ఐటీ రంగంలో వృద్ధిరేటు ఆశాజనకంగా ఉండటం ఇప్పుడు కలిసొచ్చే అంశం. – మహేష్ పెరి, చైర్మన్, ‘కెరీర్ 360’ ఐటీ ఉద్యోగాల సంఖ్య పెరుగుతుంది ఐటీ రంగంలో బాగా నైపుణ్యం ఉన్న సిబ్బంది భారత్లో సులభంగా దొరుకుతారు. అందువల్ల వివిధ గ్లోబల్ కార్పొరేట్ కంపెనీలు మన దేశంలో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయి. గత రెండేళ్లుగా ఈ ట్రెండ్ పెరిగింది. వచ్చే రెండు మూడేళ్లలో చాలా కంపెనీలు ఇక్కడ సెంటర్లు ఏర్పాటు చేయనున్నాయి. ఫలితంగా ఉద్యోగాల సంఖ్య పెరుగుతుంది. ఎంట్రీ స్థాయిలో ఎక్కువ మందిని తీసుకుంటున్నారు. మిడిల్, సీనియర్ స్థాయి ఉద్యోగాల అవసరం కొంత తక్కువగానే ఉంటుంది’’ – కల్పన, హెచ్ఆర్ హెడ్, ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ -
ఐటీ సేవలే కాదు.. అంతకుమించి
సాక్షి, హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల రంగంలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ.. ఐటీ రంగంలో వస్తున్న నూతన సాంకేతికతల పరిశోధన, అభివృద్ధి రంగాలకు కూడా చిరునామాగా మారుతోంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్చెయిన్ వంటి కొత్త సాంకేతికతలపై జరిగే పరిశోధన, అభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ ఐటీ కంపెనీలు రాష్ట్రానికి తరలివస్తున్నాయి. మరోవైపు ఐటీ అనుబంధ రంగాలతో పాటు, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావి స్తోంది. ఐటీ రంగంలో ఆఫీసు వసతి, ఉద్యోగాల కల్పన విషయంలో వచ్చే ఐదేళ్లలో బెంగళూరుపై పైచేయి సాధిస్తామని ఐటీ శాఖ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా, ఐటీ రంగంతో పాటు అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో ఎలక్ట్రానిక్స్ పరిశోధన, అభివృద్ధి, తయారీ వాతావరణాన్ని హైదరాబాద్లో కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో గత ఐదేళ్లలో 30 వేల ఉద్యోగాలు సృష్టించగా, వచ్చే నాలుగేళ్లలో 3 లక్షల ఉద్యోగాలు ఈ రంగంలో సాధించాలని భావి స్తోంది. ఇటీవల చైనాకు చెందిన స్కైవర్త్ కంపెనీ 50 ఎకరాల్లో రూ.700 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ పార్కు ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ తయారీ రంగంలో పరిశోధన, అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వాతావరణం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏఐ, బ్లాక్ చెయిన్ టెక్నాలజీలు కృత్రిమ మేధస్సుకు సంబంధించి జాతీయ స్థాయిలో పరిశోధన, అభివృద్ధి కోసం దేశంలో 5 సెంటర్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్సలెన్స్ (కోర్), 20 ఇంటర్నేషనల్ సెంటర్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఇక్టయ్) ఏర్పాటుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించే బాధ్యతను కేంద్రం తెలంగాణకు అప్పగించింది. మరోవైపు వ్యవసాయం, పట్టణీకరణ, రవాణా, ఆరోగ్య రంగాల్లో కీలక సవాళ్ల పరిష్కారానికి ఏఐ సాంకేతికత అమలును రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారంగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో సంబంధిత రంగాల్లో ఏఐ సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2020ను ’ఇయర్ ఆఫ్ ఏఐ’ (కృత్రిమ మేధో సంవత్సరం)గా ప్రకటించింది. రాష్ట్రంలో నకిలీ సర్టిఫికెట్ల నివారణకు ’బ్లాక్చెయిన్’ ఐటీ సాంకేతికతను పరిష్కారమని భావిస్తూ ఎస్సెస్సీ బోర్డు, బాసర ట్రిపుల్ ఐటీలో ఈ టెక్నాలజీని ఐటీ శాఖ ప్రయోగాత్మకంగా పరిశీలించింది. త్వరలో జేఎన్టీయూ ద్వారా జారీ అయ్యే సర్టిఫికెట్ల వివరాలు కూడా బ్లాక్చెయిన్ టెక్నాలజీతో అనుసంధానించనున్నారు. గేమింగ్, వినోద రంగాలకూ గేమింగ్, టెక్నాలజీ, వినోద రంగాల్లో దక్షిణాసియాకు తెలంగాణను కేంద్ర బిందువుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని 150కి పైగా వీఎఫ్ఎక్స్ స్టూడియోలు, 2డీ, త్రీడీ యానిమేషన్, గేమింగ్ కంపెనీలు సుమారు 30 వేల మందికి ప్రత్యక్ష, 90 వేల మందికి పరోక్ష ఉపాధి ఉపాధి కల్పిస్తున్నాయి. 2020–25 నాటికి గేమిగ్ రంగం 300 బిలియన్ డాలర్ల పరిశ్రమగా వృద్ధి చెందే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో వీఎఫ్ఎక్స్, గేమింగ్, యానిమేషన్ రంగాల్లో లక్షలకొద్ది ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని అంచనా వేస్తోంది. అత్యాధునిక స్టూడియోలు, సదుపాయాలతో కూడిన ఇమేజ్ టవర్స్ 2022 నాటికి అందుబాటులోకి రానుంది. డిజైనర్స్, ఎంట్రప్రెన్యూర్స్, స్టార్టప్లకు ఉపయోగపడేలా ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్ ప్రొటోటైపింగ్, మెకానికల్ డిజైనింగ్ రంగంలో భారత్లోనే తొలి ప్రోటోటైప్ సౌకర్యం కలిగిన ’టీ వర్క్స్’ మూడు నాలుగు నెలల్లో అందుబాటులో రానుంది. నైపుణ్య శిక్షణ, నూతన ఆవిష్కరణలకు సంబంధించి టీహబ్, వీహబ్లు ఐఐటీ, ట్రిపుల్ ఐటీతో పాటు పలు ప్రైవేటు ఐటీ సంస్థలు భాగస్వామ్యంతో పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో ఐటీ ఘనత.. 2018–19లో ఐటీ ఎగుమతులు రూ.1.09 లక్షల కోట్లు 2017–18తో పోలిస్తే ఐటీ ఎగుమతుల్లో 9 శాతం వృద్ధి రేటు నమోదు కాగా, తెలంగాణ 17 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. 2017–18లో ఐటీ రంగంంలో 4.85 లక్షల ఉద్యోగాలు ఉండగా, 2018–19లో 5.5 లక్షలకు చేరింది. వచ్చే నాలుగేళ్లలో ఈ సంఖ్య 10 లక్షలకు చేరుతుందని అంచనా. ఏఐ, మెషీన్ లెర్నింగ్, బ్లాక్చెయిన్, డేటా ఎనలిటిక్స్ రంగంలో కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని అంచనా. 2019 తొలి అర్ధభాగం నాటికి 38.5 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్పేస్ అందుబాటులో ఉండగా, వచ్చే ఐదేళ్లలో 50 లక్షల చదరపు అడుగులకు చేరుతుందని అంచనా. -
ఇతర మెట్రోలతో పోలిస్తే హైదరాబాద్ బెస్ట్
ఢిల్లీ.. ఊపిరి కూడా పీల్చుకోలేని అత్యంత కాలుష్య నగరం. ముంబై, చెన్నైలలో వరదలు, సునామీ.. బెంగళూరులో రాజకీయ అస్థిరత. కోల్కతా, పుణే, అహ్మదాబాద్లో కొరవడిన స్థలాల లభ్యత, అధిక ధరలు. ఇక, మిగిలింది హైదరాబాదే! మెట్రో, ఓఆర్ఆర్లతో కనెక్టివిటీ, మెరుగైన మౌలిక వసతులు, అందుబాటు ధరలు, కట్టుదిట్టమైన భద్రత, కాస్మోపాలిటన్ కల్చర్.. అన్నింటికీ మించి స్థిరమైన ప్రభుత్వం.. ఇదీ సింపుల్గా హైదరాబాద్ అడ్వాంటేజెస్! సాక్షి, హైదరాబాద్: 2019 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో నగరంలో 40 లక్షల గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయి. ఆఫీస్ అద్దెలు 9 శాతం మేర పెరిగాయి. సుమారు 13,361 గృహాలు విక్రయమయ్యాయి. 190 మిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులొచ్చాయి. ఏ నగరం అభివృద్ధికైనా సరే కావాల్సింది ఉద్యోగ అవకాశాలే. ఇప్పటివరకు కంపెనీలు, ఉద్యోగాలు, పెట్టుబడులు అన్నీ గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ ప్రాంతాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. అందుకే గత కొంత కాలంగా ప్రభుత్వం నగరం నలువైపులా సమాంతర అభివృద్ధి చర్యలు చేపడుతుంది. శ్రీశైలం, వరంగల్, విజయవాడ జాతీయ రహదారులపై ప్రత్యేక దృష్టిసారించింది. ఐటీ, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, ఎయిరోస్పేస్, ఎలక్ట్రానిక్, ఆటోమోబైల్ రంగాల్లో ప్రత్యేక పార్క్ల ఏర్పాటుకు ప్రణాళికలు చేస్తుంది. ఆదిభట్లలో ఎయిరోస్పేస్, ముచ్చర్లలో ఫార్మా సిటీ, చౌటుప్పల్లోని దండుమల్కాపూర్లో ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్లను ప్రారంభించింది కూడా. ఈస్ట్ జోన్ అభివృద్ధికి త్వరలోనే లుక్ ఈస్ట్ పాలసీని తీసుకురానుంది. వినూత్న నిర్మాణాలతో స్వాగతం.. కాస్మోపాలిటన్ సిటీకి తగ్గట్టుగానే ఇక్కడి డెవలపర్లు కూడా వినూత్న ఆర్కిటెక్చర్లతో భవనాలను నిర్మిస్తున్నారు. బిల్డింగ్ సైజ్, స్ట్రక్చర్, ఆర్కిటెక్చర్ అన్నింట్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నారని సుచిరిండియా సీఈఓ డాక్టర్ లయన్ కిరణ్ చెప్పారు. సరికొత్త టెక్నాలజీ వినియోగంతో ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్లతో సిటీకి అదనపు అందాన్ని తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా తమ వంతుగా మెట్రో కనెక్టివిటీని పెంచడంతో పాటూ ట్రామ్స్, డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్లు, హ్యాంగింగ్ బ్రిడ్జ్లతో మరింత ఆకట్టుకోవాలని సూచించారు. ఫార్మా సిటీ, ఐటీ హబ్లను సరిగ్గా వినియోగించుకుంటే 10–15 లక్షల అదనపు ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. రెండేళ్లలో బెంగళూరు బీట్.. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం, బ్యాంకింగ్, ఆటో రంగాల్లో సంక్షోభం, ఐటీ ఉద్యోగుల తొలగింపులతో రియల్టీ మందగమనంలో ఉంది. అయితే ఇది తాత్కాలికమేనని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలతో మళ్లీ అభివృద్ధి పరుగులు పెడుతుంది. కొత్త జిల్లాల్లో పరిపాలన భవనాల ఏర్పాటు, మిషన్ భగీరథ వంటి వాటితో జిల్లాల్లో పొలాలకు, స్థలాలకు డిమాండ్ పెరిగిందని, గతేడాదితో పోలిస్తే 10–15 శాతం ధరలు పెరిగాయని ఏషియా పసిఫిక్ ఎండీ ఎస్ రాధాకృష్ణ తెలిపారు. మెట్రో విస్తరణతో పాటూ త్రిబుల్ ఆర్, ఫార్మా సిటీ, ఐటీఐఆర్లను పట్టాలెక్కించగలిగితే.. వచ్చే రెండేళ్లలో బెంగళూరును బీట్ చేయడం ఖాయమని పేర్కొన్నారు. -
ఐటీ రంగంలో 30 లక్షల ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న ఐదున్నర ఏళ్లలో, అంటే 2025 సంవత్సరం నాటికి ఐటీ రంగంలో మరో 30 లక్షల కొత్త ఉద్యోగాలు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేయగా, ఏయే రంగాల్లో పెరుగుతాయో పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్క నైపుణ్యం ఉన్న సాంకేతిక సిబ్బందే కాకాండా రెండు భాషలు, మూడు భాషలు వచ్చి, వాటిపై సరైన పట్టు ఉన్నవారికి కూడా ఉద్యోగాలు లభిస్తాయని, ఈ భాషా ప్రవీణుల్లో మహిళలే ఎక్కువ చేరే అవకాశం ఉందని భారత ఐటీ రంగానికి చెందిన ‘నాస్కామ్’ అధ్యక్షులు దేబ్జాని ఘోష్ చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చెయిన్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా విశ్లేషకులు, మొబైల్ టెక్, రోబోటిక్, వర్చువల్ రియాలిటీ, త్రీ డీ రంగాల్లో కొత్త ఉద్యోగాలు ఉంటాయని ఘోష్ అంచనా వేస్తున్నారు. ఈ రంగాల్లో ఉద్యోగులు వివిధ పాత్రలు పోషించాల్సి ఉన్నందున, వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగిన అభ్యర్థులు అవసరం అవుతుందని ఆమె అన్నారు. అయితే ఈ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఏడు కోట్ల మంది ఉద్యోగులు అవసరం అవుతారని, అయితే నైపుణ్యం కలిగిన వారు అంతమంది అందుబాటులోని లేరని ప్రపంచ ఆర్థిక ఫోరమ్ అభిప్రాయపడింది. పది టెక్నాలజీ సంస్థల్లో 55 రకాల జాబులు నిర్వహించాల్సి ఉంటుందని, కొరతను ముందుగానే ఊహించిన భారత్, ఆ దిశగా కొత్త నైపుణ్యాభివద్ధికి కషి చేస్తోందని కూడా ఫోరమ్ ప్రశంసించింది. -
ఉపాధి కల్పనలో ‘ఐటీ’ మేటి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఐదేళ్లుగా సాధించిన పురోగతి నివేదికను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరిశ్రమలు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ శనివారం విడుదల చేశారు. రాష్ట్ర ఐటీ విభాగం వివిధ రంగాల్లో మెరుగైన సేవల కోసం చేపట్టిన కార్యక్రమాల పురోగతిని ఈ నివేదికలో వివరించారు. ‘రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులను రెండేళ్లలో రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. గత నాలుగేళ్లలో జాతీయ స్థాయిలో 170 శాతం వృద్ధి కనిపించగా రాష్ట్రంలో 190 శాతం మేర వృద్ధి నమోదైంది. ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య త్వరలో 10 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నాం. ఐటీ రంగానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన టీ–హబ్, టాస్క్, టీ–సాట్, టీ–ఫైబర్, స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటు లక్ష్యాలకు మించి ఫలితాన్ని ఇస్తున్నాయి. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత (సీఎస్సార్) మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి టీ–సిగ్ (తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్)ను ఐటీ విభాగానికి అనుబంధంగా ఏర్పాటు చేస్తాం’అని జయేశ్ రంజన్ పేర్కొన్నారు. ఐటీ రంగంలో 5.43 లక్షల ఉద్యోగాలను సృష్టించగా గతేడాది ఏకంగా 67,725 మంది వృత్తి నిపుణులకు కొత్తగా అవకాశం లభించిందన్నారు. ఐటీ పురోగతి నివేదికలో పేర్కొన్న అంశాలివీ - మెరుగైన పౌర సేవలు అందించేందుకు ‘మీ సేవ’అధునాతన వెర్షన్ను సిద్ధం చేశాం. ఆధార్ అనుసంధాన చెల్లింపుల విధానం (ఏఈపీఎస్)లో మీ సేవ కేంద్రాల్లో నగదు డ్రా చేసుకునే వీలుంటుంది. ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ (ఈఎస్డీ)లో భాగంగా రూపొందించిన రియల్ టైమ్ డిజిటల్ అథెంటికేషన్ ఆఫ్ ఐడెంటిటీ ద్వారా పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించే విధానం సత్ఫలితాలిస్తోంది. - నాస్కామ్ ఫౌండేషన్ రూపొందించిన టెక్నాలజీ ఎంపవరింగ్ గర్ల్స్ (టెగ్) ద్వారా 66 మంది బాలికలకు డిజిటల్ ఆర్థిక అక్షరాస్యతపై శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ విభాగాలు ఐటీ సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్ భాగస్వామ్యంతో ఒప్పందం కుదుర్చుకుంది. - ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రో మెకానికల్, మెకానికల్ స్టార్టప్స్కు సంబంధించి 78 వేల చదరపు అడుగుల్లో దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైప్ సెంటర్ (టీ–వర్క్స్)ను ఐటీ విభాగం గతేడాది ప్రారంభించింది. - రాష్ట్ర ప్రభుత్వ శాటిలైట్ నెట్వర్క్ ‘టీ–శాట్’ద్వారా 4,612 కార్యక్రమాలను ప్రసారం చేయగా 2.39 లక్షల మంది వీక్షించారు. టీ–శాట్ యూట్యూబ్ చానల్కు 3 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. - ప్రభుత్వ అధికారిక సామాజిక మాధ్యమ వేదిక ‘టీ–వెబ్’ద్వారా సగటున ప్రతి నెలా 3 కోట్ల మందిని చేరుతోంది. - తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ద్వారా టైర్–2, టైర్–3 పట్టణాల్లో ఐటీలో ఔత్సాహికులను ప్రోత్సహిస్తుండగా ఇప్పటివరకు 12 జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. - కార్మిక, పోలీసులు, స్త్రీ నిధి, ఆర్టీసీ, డెయిరీ, పౌర సరఫరాలు, జేఎన్టీయూ తదితర విభాగాల సేవలను ఒకేచోటకు తెస్తూ గతేడాది ప్రారంభించిన ‘టీ–వ్యాలెట్‘ద్వారా 2018–19లో రూ. 1,202 కోట్ల విలువ చేసే 28.8 లక్షల లావాదేవీలు జరిగాయి. 1.72 లక్షల మంది తమ వివరాలను వ్యాలెట్లో నమోదు చేసుకున్నారు. - నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ‘టీ–హబ్’కొత్త ఆవిష్కరణలు, కొత్త వ్యాపార నమూనాలు రూపొందించడంలో విజయవంతమైంది. - ‘టాస్క్’ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది యువత ఏడాది కాలంలో వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ పొందారు. - ఆవిష్కరణ రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు ‘వీ హబ్’ద్వారా శిక్షణ, అవకాశాల కల్పన తదితరాలపై మద్దతు ఇస్తుండగా 245 మంది వారి ఆలోచనలు పంపారు. వాటిలోంచి 26 వినూత్న ఆలోచనలను ఎంపిక చేశారు. మహిళా ఆవిష్కర్తలను ప్రోత్సహించేందుకు యూఎస్ ఇండియా కౌన్సిల్, ప్రాక్టర్ అండ్ గాంబుల్ సహకారంతో ‘బిజ్ అరెనా’పేరిట పోటీ నిర్వహించింది. -
పుంజుకున్న ఐటీ : లక్షకు పైగా ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ : గత కొద్దికాలంగా స్తబ్దుగా ఉన్న ఐటీ రంగం మళ్లీ పుంజుకుంది. 2018-19 సంవత్సరంలో ఈ రంగంలో ఉద్యోగ నియామకాల్లో పురోగతిని సాధించాయి. ప్రధానంగా ఐటీ కంపెనీలు లక్షకు పైగా ఉద్యోగ అవకాశాలను కల్పించాయని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. గత మూడేళ్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ముఖ్యంగా డిమానిటైజేషన్ తరువాత ఇంత భారీ ఎత్తున ఉద్యోగులను నియమించుకోవడం ఇదే తొలిసారి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, విప్రో, టెక్ మహీంద్ర, కాగ్నిజెంట్ మొత్తం 6 ఐటీ కంపెనీలు 1,04,820 మంది టెకీలను రిక్రూట్ చేసుకున్నాయి. ఈ ధోరణి రాబోయే త్రైమాసికాల్లో కొనసాగే అవకాశం ఉందని పరిశ్రమ పెద్దలు భావిస్తున్నారు. దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ , రెండవ అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఈ ఏడాదిలో 53వేల ఉద్యోగాలనుకల్పించాయి. మార్చి 31 తో క్యూ4 ఫలితాల్లో టీసీఎస్ ఈ ఏడాది సుమారు 29, 287మందిని కొత్తగా నియమించుకున్నట్టు వెల్లడించింది. దీంతో కంపెనీలో మొత్త ఉద్యోగుల సంఖ్య 4,24,285గా టీసీఎస్ ప్రకటించింది. అలాగే ఇన్ఫోసిస కొత్త 24వేల 16మందిని నియమించుకోగా 2019, మార్చి నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,28123గా పేర్కొంది. అయితే హెచ్సీఎల్, విప్రో ఫలితాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. అంతకు ముందు ఏడాది ఉద్యోగ నియమకాల విషయంలో ఐటీ సంస్థలు పేలవంగా ఉన్నాయి. ప్రధాన ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, విప్రో, టెక్ మహీంద్ర, కాగ్నిజెంట్ మొత్తం కలిపి 1,01,900 జాబ్స్ను మాత్రమే క్రియేట్ చేసాయి. ఇందులో టీసీఎస్ 7770 మందిని, ఇన్ఫోసిస్ 3740 మందిని మాత్రమే నియమించుకుంది. -
బాబోరూ! పులిగోరు!!
బాలనాగమ్మ అనే జానపద కథ తెలిసిన తరంవారికి ఆ కథలోని బాలవర్ధిరాజు అనే బాలవీరుని పాత్ర, తిప్పడు అనే దురాశ పరు డైన విదూషకుని పాత్ర గుర్తుండే వుంటుంది. బాలనాగమ్మ సౌందర్యానికి వివశుడైన మాయల పకీరు అనే మాంత్రికుడు ఆమెను అపహరించి తన గుహలో బంధిస్తాడు. యుద్ధా నికి వచ్చిన ఆమె భర్త కారంపూడి పాలకుడు కార్యవర్ధిని శిలగా మారుస్తాడు. వారి కుమారు డైన బాలవర్ధిరాజు తల్లిదండ్రులను వెతుక్కుంటూ బయల్దేరు తాడు. దారిలోని అడవి ప్రాంతంలో ఒక పెద్దపులి సంచరిస్తుం టుంది. పరిసర గ్రామాల ప్రజలు భయంతో ఆ ప్రాంతపు రాజుగారి శరణు వేడుతారు. ఆ పులిని చంపి దాని గోళ్లను ఆనవాళ్లుగా తెచ్చి చూపిన వీరునికి అర్ధ రాజ్యం బహుమతిగా ఇస్తాననీ, తన కుమా ర్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని రాజుగారు చాటింపు వేయించి ఉంటాడు. అడవి మార్గాన వెళుతున్న బాలవర్ధికి పులి ఎదురవుతుంది. ఆ యువకుడు భీకరంగా పోరాడి పులిని హతమారుస్తాడు. అలసి పోయి ఒక చెట్టుకింద నిద్రపోతాడు. దూరంగా ఇదంతా గమని స్తున్న తిప్పడు అనే పొరుగూరి సాధారణ వ్యక్తి మదిలో దురాశ పుడుతుంది. నిశ్శబ్దంగా ఆ పులిగోళ్లను కత్తిరించుకొని రాజాస్థానా నికి చేరుకుంటాడు. ఇలాంటి జానపద కథలన్నింటిలాగే ఈ కథ లోనూ వీరుడెవరో.. విదూషకుడెవరో తెలిసిపోతుంది. ఈ కథతో మన సంబంధం ఇక్కడి వరకే. ఇప్పుడిక్కడ ప్రస్తావించబోయే ఆధునిక పులిగోటి వీరుడు మాత్రం తనను తాను హీరోగా అభివర్ణించుకుంటారు. ఎవ్వరడి గినా అడక్క పోయినా, సందర్భమైనా అసందర్భమైనా సరే... తన అవక్ర విక్రమ పరాక్రమ వీరత్వాన్ని తన్మయత్వంలో రంగరించి చెప్పుకోవడం ఆయనకు అలవాటు. అది ఎటువంటి బంధమో తెలి యదు కానీ, గంటల తరబడి సాగే ఆయన స్వోత్కర్షను మెజారిటీ చానళ్లు లైవ్ టెలికాస్టు చేయాల్సిందే. కొన్ని పత్రికలు రోజూ మోయా ల్సిందే. ఆయన కథానాయకుడా, ప్రతినాయకుడా, విదూషకుడా, విదూషకత్వంతో కూడిన ప్రతినాయకుడా అన్నదానిపై భిన్నాభి ప్రాయాలు ఉన్నాయి. అయితే, పులిగోరు విద్యల్లో ఆయనంత ఆరి తేరిన రాజకీయ నేత మరెవ్వరూ లేరని మాత్రం అందరూ అంగీ కరిస్తారు. పీవీ నరసింహారావుగారు ప్రధానిగా వున్న సమయంలో ఎంతో దూరదృష్టితో హైదరాబాద్ను కంప్యూటర్ రంగానికి కేంద్రంగా చేయడానికి పునాదులు వేశారు. ఆ రంగంలో హైదరాబాద్ నగరం చేత తొలి అడుగును ఆయనే వేయించారు. తొలి అడుగు వేసిన ఈ నగరం ఐటీలో అగ్రస్థానంలో ఉండాల్సింది. కానీ, కథ ఇక్కడే మలుపు తిరి గింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయింది. ఎన్నికల చరిత్రను తిరగరాస్తూ ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారు. అనతికాలంలోనే, మీడియా రంగాన్ని శాసిస్తున్న గురువులు–లఘువుల సహకారంతో చంద్రబాబు ఓ కోటరీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కోటరీ సాయంతో కత్తి వాడకుండానే, నెత్తురు కారకుండానే పూర్తి అహింసా పద్ధతుల్లో ఎన్టీఆర్ గుండెకాయను కోసేయడం, అధికారాన్ని హస్తగతం చేసుకోవ డం జరిగిపోయింది. చంద్రబాబు తొమ్మిదేళ్లు పరిపాలించారు. భారత దేశంలో గుప్తుల స్వర్ణయుగాన్ని తలదన్నే ఆంధ్రుల స్వర్ణయుగంగా ఓ వర్గం వారు ఈ కాలాన్ని పేర్కొంటారు. అందుకు తందానాగా మీడి యాలోని గురువులూ, లఘువులూ దరువులేసి మరీ ప్రచారంలో పెట్టారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో పక్కనున్న కర్ణాటకలో ముగ్గురు ముఖ్య మంత్రులు మారిపోయారు. దేవెగౌడ రెండేళ్లు, హెచ్జే పటేల్ రెండేళ్లు, ఎస్.ఎమ్. కృష్ణ ఐదేళ్లు అధికారంలో వున్నారు. అదేం చిత్రమో గాని ఇక్కడ మన స్వర్ణయుగం ముగిసేనాటికి (అక్కడ ముగ్గురు మారిన ప్పటికీ) హైదరాబాద్ అందుకోలేనంత దూరం ఐటీ రంగంలో బెంగ ళూరు పరిగెత్తింది. కానీ, సైబర్ టవర్స్ అనే బిల్డింగ్ ఆకారంలో ఓ పులిగోరు చంద్రబాబు మెడలో చేరిపోయింది. భారతదేశంలో ఐటీ రంగానికి ఆద్యుడెవరు? కంప్యూటర్ను ప్రవేశపెట్టిందెవరు?... ఇంకె వరు!... భజంత్రీలూ వాయించండర్రా...! వాయించేశారు. గురువులు, లఘువులూ స్తోత్రకైవారాలు గావించారు. భారతదేశంలో మరే నగరానికీ లేని ప్రత్యేకత హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎనిమిది వరుసలలో రూపొందిన ఈ రహదారి మౌలిక వసతుల రంగంలో హైదరాబాద్ను అగ్రస్థానానికి చేర్చింది. ఈ రహదారి ప్లానింగూ, భూసేకరణ, నిర్మాణం అంతా వైఎస్ హయాంలోనే జరిగింది. అప్పుడు జరిపిన భూసేకరణకు వ్యతిరేకంగా తెలుగుదేశం భజన బృందం పెద్ద దుమారాన్నే లేవ దీసింది. అయినాసరే దీన్ని కూడా ‘స్వర్ణయుగం కోటరీ’ బాబు ఖాతా లోనే వేసింది. బాబు కూడా సిగ్గుపడకుండా, భయపడకుండా తన ఘన తగానే మరో పులిగోరు మెడలో వేసుకున్నారు. వాయిద్యాలూ మోగాయి. స్తోత్ర పఠనం కూడా జరిగింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కథ కూడా ‘షేమ్ టు షేమ్’. ఆ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన జరిగింది వై.ఎస్. హయాంలోనే. ప్రారంభోత్సవం జరిగిందీ ఆయన ఆధ్వర్యంలోనే. అయినా సరే దాని పేరుతో కూడా ఓ పులిగోరు బాబుగారి దగ్గరుంది. విమానాశ్రయాన్ని కట్టింది చంద్రబాబేనంటూ ‘స్వర్ణయుగ’ చరిత్రకారులు రాసి పెట్టారు. ఎల్లో సిండికేట్ ఆధ్వర్యంలో యధాశక్తి వాద్యం! యథాశక్తి స్తోత్రం!! ఇలా చెప్పుకుంటూపోతే ఈ పులిగోళ్ల పురాణం ఓ గ్రంథమవు తుంది. అందుకని, వ్యాస విస్తరణ భీతివల్ల ఇంతటితో ముగించి, తాజా పరిపాలనాకాలం ముగుస్తున్న వేళ ఉన్న పరిస్థితిని పలకరిద్దాం. అధి కారాంతమున ఆయన ఆర్డర్ చేసిన పులిగోళ్లు మరీ ముచ్చటగా ఉన్నాయి. ఎన్నికల రణరంగంలో అలంకరించుకునేందుకు బంగారు తొడుగుల పులిగోళ్లను ఆయన సిద్ధం చేశారు. ఐదేళ్ల కింద జరిగిన ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పారు. ఆయనిచ్చిన డబ్బులు వడ్డీకి కూడా సరిపోలేదని ఓ పక్క రైతులంతా గగ్గోలుపెడుతున్నా ఆయ నకు పట్టలేదు. సరిగ్గా మళ్లీ ఎన్నికలొచ్చేసరికి ‘అన్నదాతా సుఖీభవ’ అంటూ మరో పులిగోరు ఆభరణం తగిలించుకున్నారు. మోడల్ కూడా తన తెలివికాదు. రెండేళ్ల కింద ప్రతిపక్ష నేత ప్రకటించిన రైతు భరోసాను లేపేశాడు. అదీ వెంటనే లేపలేదు. ఆయన ఉద్దేశం ఎన్నికల ముందు అలంకరించుకోవడమే కనుక రెండు నెలల ముచ్చటకో సమే ఈ మురిపెం. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఎగనామం పెట్టారు. మామూలు మనిషన్నవాడైతే చేసిన తప్పుకు క్షమాపణ చెబుతాడు. కానీ, ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చి, పసుపు– కుంకుమ అనే సెంటిమెంటు పులిగోళ్లను బయటకు తీశాడు. రక్త సంబంధం సినిమాలో ఎన్టీఆర్–సావిత్రి మధ్య నడిచిన సిస్టర్ సెంటిమెంట్కు దీటుగా ఈ రెండు నెలలు పసుపు కుంకుమ అనే నాటకాన్ని నడిపించేందుకు తైనాతీలు య«థాశక్తి తాపత్రయపడు తున్నారు. నిరుద్యోగ సమస్యపైనా అదే డ్రామా. ఇంటికో ఉద్యోగం ఇస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. మండలానికో ఉద్యోగం కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి చివరిదాకా ఇవ్వలేదు. రెండు నెలల ఎన్నికల వేషంకోసం ఇప్పుడా పులిగోరు కూడా సిద్ధమైంది. పూర్వం రాజులు యుద్ధాల్లో గెలిచినప్పుడు విజయసూచ కంగా శిలాశాసనాలను ప్రతిష్ఠించే వాళ్లు. కానీ బాబుగారు ఎక్కడా గెలవకుండానే గెలిచినట్టు ప్రచారం చేసుకునే విద్యలో రాటుదే లారు. బతికి వున్న పులి దగ్గరికే పోకుండా చచ్చిన తర్వాత గోళ్లు ఎత్తుకొచ్చి అమ్ముకునేవాళ్ల మాదిరిగా. వ్యక్తిత్వ వికాస పాఠాల్లోని ఓ ప్రాథమిక సూత్రాన్ని చంద్రబాబు ఎప్పుడూ చెబుతుంటారు. అది ‘సంక్షోభాలను అవకాశాలుగా మలచుకోవాల’ని! కానీ ఈ సూత్రాన్ని కొంత భిన్నమైన రీతిలో ఆయన ఆచరించారు. వైఫ ల్యాలను కూడా విజయాలుగా ప్రచారం చేసుకోవడం చంద్రబాబు ఉనికి రహస్యం. కొసమెరుపు చివరి పులిగోరు కొంచెం తేడా. ఇంతకుముందు తాను చేయని పనులను చేసినట్టుగా చూపించుకునే పులిగోళ్లు. తాజాగా తాను చేసిన పాపానికి ఒప్పుకోలు పులిగోరు. వై.ఎస్. రాజశేఖ రరెడ్డి దురదృష్టకర మరణం తర్వాత ఆయన కుమారుడిని పార్టీ నుంచి బయటకు పంపి తప్పుడు కేసులు పెట్టిన కాంగ్రెస్ అధిష్టానంతో చంద్రబాబు స్నేహం ముసుగు జారి బహిరంగమయింది. జగన్కు వ్యతి రేకంగా కుట్రలు నడపడంలో తోడ్పడిన కిరణ్కుమార్రెడ్డిని మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేర్పించింది బాబే. ఆయన తమ్ముడికి అసెంబ్లీ టికెట్ కూడా టీడీపీ తరఫునే ఖాయం చేశారు. కిరణ్ను కూడా పార్లమెంట్ బరిలో నిలపాలనే ముచ్చట కూడా వుందట బాబుకు. కానీ, ఆ వీరుడికి కత్తిపట్టడం చాతనవుద్దో, కాదోనన్న సందేహం పీడిస్తోందట. కాంగ్రెస్ పార్టీ సహకారంతో తాను, తన ఎల్లో సిండికేట్ రచించి దర్శకత్వం వహించిన జగన్ కేసుల నాటకంలో కీలక పాత్ర పోషించిన అప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు టీడీపీ టికెట్ కేటాయించడానికి సిద్ధపడి కథను చంద్రబాబు క్లైమాక్స్కు చేర్చారు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ తప్పుడు కేసుల వ్యవహారం తన మెడకు చుట్టుకుంటుందని జేడీ మొర పెట్టుకున్నందువల్లనే పదవీ విరమణ చేయించి రాజకీయ ప్రవేశం చేయించారని లోకం కోడై కూస్తోంది. చంద్రబాబు మెడలో తాజా ముద్దుల పులిగోరు జేడీ లక్ష్మీ నారాయణ. వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
ఐటీలో 5లక్షల ఉద్యోగాలు
దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సర్వీసుల రంగం, స్టార్టప్లు వచ్చే ఏడాది భారీ స్థాయిలో నియామకాలు చేపట్టనున్నాయి. 2019లో దాదాపు 5 లక్షల మందిని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉందని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్వో, మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ చైర్మన్ టి.వి.మోహన్దాస్ పాయ్ తెలియజేశారు. ఫ్రెషర్లకు డిమాండ్ పెరుగుతోందని చెప్పారాయన. దాదాపు ఏడేళ్ల పాటు స్థిరంగా ఉండిపోయిన ఎంట్రీ స్థాయి ఉద్యోగుల జీతభత్యాల ప్యాకేజీలు గతేడాది సుమారు 20 శాతం మేర పెరిగాయని తెలిపారు. 2018 సమీక్ష, 2019 అంచనాల మీద మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు చెప్పారు. "2018లో హెచ్1బీ వీసాల నిబంధనలు కఠినతరమయ్యాయి. దీంతో భారత ఐటీ కంపెనీలు జపాన్, ఆగ్నేయాసియా దేశాలపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ ఐటీ సేవల రంగం మళ్లీ వృద్ధి బాట పడుతోంది. మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ మంత్రి కేటీఆర్ మార్కెటింగ్ నైపుణ్యాలతో మరిన్ని కొత్త కంపెనీలు హైదరాబాద్కి వస్తున్నాయి. హైదరాబాద్ హాట్ డెస్టినేషన్గా మారింది" అని పాయ్ పేర్కొన్నారు. స్టార్టప్లలో 2 లక్షల ఉద్యోగాలు దేశీ స్టార్టప్ సంస్థలు వచ్చే ఏడాది సుమారు 2,00,000 మంది ఉద్యోగులను తీసుకునే అవకాశం ఉందని పాయ్ తెలిపారు. స్టార్టప్స్ గతేడాది 1,50,000 మందిని నియమించుకున్నాయని.. ప్రస్తుతం వీటిల్లో ఉద్యోగుల సంఖ్య 6,00,000 పైచిలుకు ఉంటుందని ఆయన తెలిపారు. ఐటీ సర్వీసులు, స్టార్టప్స్ కలిస్తే 4.5 లక్షలు - 5 లక్షల దాకా నియామకాలు ఉండొచ్చన్నారు. 2018లో ఇవి రెండూ కలిపి సుమారు 3.5 లక్షల నుంచి 4 లక్షల మంది దాకా ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నట్లు వివరించారు. "స్టార్టప్లు కూడా పెద్ద కంపెనీలుగా ఎదుగుతున్నాయి. ప్రస్తుతం దేశీయంగా 39,000 పైచిలుకు స్టార్టప్స్ ఉన్నాయి. ప్రతీ సంవత్సరం కొత్తగా 5,000 ఏర్పడుతున్నాయి. ఇవి హైరింగ్ చేపట్టినప్పుడు ఇంజినీర్లే కాకుండా వివిధ రకాల ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటూ ఉంటాయి. ఆ రకంగా వీటిల్లోనూ ఉద్యోగావకాశాలు గణనీయంగా ఉన్నాయి" అని పాయ్ తెలిపారు. ఎంట్రీ లెవల్లో రూ.5 లక్షలు? ఐటీ సేవల సంస్థల్లో ఉద్యోగులు కొత్త నైపుణ్యాల్లో శిక్షణ పొందుతుండటం రెట్టింపు స్థాయిలో జరుగుతోందని, ఐటీ కంపెనీల్లో డిజిటల్ విభాగాల ఆదాయాలు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందుతోందని పాయ్ చెప్పారు. ‘‘ఫ్రెషర్స్ జీతభత్యాల ప్యాకేజీ చాలా కాలం తర్వాత 20 శాతం మేర పెరగడం మంచి పరిణామం. మరింత సుశిక్షితులైన నిపుణులను ఆకర్షించేందుకు కంపెనీలు మరింత ఎక్కువ జీతభత్యాలు ఆఫర్ చేస్తున్నాయి. దీంతో ఎంట్రీ లెవెల్ ప్యాకేజీలు ప్రస్తుతం వార్షికంగా రూ. 4.5 - 5 లక్షల దాకా ఉంటున్నాయి. నిజానికి చాలా కాలం పాటు ఎంట్రీ లెవెల్లో జీతాలు పెరగకుండా స్థిరంగా ఉండిపోయాయి. దీంతో ఉద్యోగులు నిరాశలో మునిగారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లతో పోలిస్తే పెద్ద నగరాల్లో డెలివరీ బాయ్స్ కూడా నెలకు రూ.50,000 సంపాదిస్తున్నారు. ఇది చాలా హాస్యాస్పదమైన విషయం" అని పాయ్ వ్యాఖ్యానించారు. డిజిటైజేషన్తో వ్యాపార అవకాశాలు వచ్చే ఏడాది డిజిటైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, అమెరికా బ్యాంకింగ్.. ఫైనాన్షియల్ సర్వీసెస్.. ఇన్సూరెన్స్ కంపెనీలు భారీగా ఐటీపై వెచ్చించనుండటం తదితర అంశాలు భారత ఐటీ కంపెనీలకు వృద్ధి అవకాశాలు కల్పించగలవని పాయ్ చెప్పారు. యూరప్, ఆసియా మార్కెట్లలోకి కూడా చొచ్చుకుపోయేందుకు అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అయితే, అమెరికాలో లోకలైజేషన్ ప్రధాన సవాలుగా ఉండవచ్చని చెప్పారు. ప్రస్తుతం అమెరికా విధానాలకు అనుగుణంగా స్థానికంగా నియామకాలు చేపట్టడం, కార్యకలాపాలు విస్తరించడం వంటి అంశాలపై దేశీ ఐటీ కంపెనీలు దృష్టి సారిస్తున్నాయన్నారు. అయితే, ఎక్కువగా చిన్న పట్టణాల్లో విస్తరిస్తుండటం వల్ల.. వాస్తవంగా ఖర్చులు పెరగడం కన్నా తగ్గగలవని పాయ్ పేర్కొన్నారు. -
బెంగళూరు: ఐటీకి ఏటా 24 వేల కోట్ల నష్టం
సాక్షి, న్యూఢిల్లీ : ఉద్యోగుల శారీరక అనారోగ్యం, శారీరక శ్రమ రాహిత్యం, మానసిక ఉద్వేగం తగ్గిపోయి మానసిక ఒత్తిడి పెరడగం, క్రమశిక్షణలేని జీవన శైలి తదితర కారణాల వల్ల భారత సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన బెంగళూరులో ఏటా ఐటీ పరిశ్రమకు 24 వేల కోట్ల రూపాయల రాబడి తగ్గుతోందట. రెడ్సీర్ కన్సల్టింగ్ సంస్థ బెంగళూరులోని పది పెద్ద ఐటీ కంపెనీలలోని 500 మంది ఉద్యోగులను ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఈ అధ్యయనం జరిపింది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ట్రీ లాంటి భారతీయ కంపెనీలకు ప్రపంచ హెడ్ క్వాటర్స్ ఇక్కడ ఉండగా, ఐబీఎం, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలకు ఇక్కడ భారతీయ హెడ్ క్వాటర్స్ ఇక్కడ ఉన్నాయి. భారత దేశం మొత్తం మీద ఐటీ పరిశ్రమలో 165 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుండగా, ఒక్క బెంగళూరు నగరంలోనే ఏటా 50 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోంది. ఉద్యోగుల శారీరక, మానసిక అనారోగ్యం, అపసవ్య జీవన శైలి తదితర కారణాల వల్ల నగరంలోని మొత్తం రెవెన్యూలో ఏడు శాతం నష్టపోతున్నారు. 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులకే ఎక్కువగా అనారోగ్య అలవాట్లు, అనారోగ్య జీవన శైలి ఉందని, నష్టపోతున్న రెవెన్యూలో 42 శాతం వాటా వీళ్ల కారణంగానే జరుగుతోందని అధ్యయనం తేల్చింది. యువతీ యువకులకు వేళకు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల శారీరక బలహీనత సమస్యలు తలెత్తుతుంటే పెద్ద వారికి సరైన వ్యాయామం లేదా శారీరక శ్రమ లేకపోవడం వల్ల బలహీనత సమస్యలకు గురవుతున్నారు. ఇదివరకు ఉద్యోగుల్లో శారీరక, మానసిక ఉల్లాసానికి అట పాటలకు క్యాంపస్లోనే సౌకర్యాలు ఉండేవి. ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశమ్రలో మాంద్యం లాంటి పరిస్థితులు ఏర్పడడంతో ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా కంపెనీల యాజమాన్యాలు ఇలాంటి సౌకర్యాలను తొలగించింది. ఇదివరకు ఉద్యోగుల కోసం ‘ఫిజికల్ ఫిట్నెస్’ సిబ్బంది కూడా ఉండేవారట. వారంతా కూడా కాలక్రమంలో కనిపించకుండా పోయారు. ఉద్యోగులే వారంతట వారే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ‘మెడిటేషన్’ లాంటి విద్యలు ప్రాక్టీస్ చేస్తున్నారట! -
రూ.700 కోట్ల పెట్టుబడికి రూ.2,223.9 కోట్ల రాయితీలు
సాక్షి, అమరావతి: ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ‘చారాణా కోడికి బారాణా మసాలా’ తరహాలో ఉందని అధికారులు, పారిశ్రామిక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. హెచ్సీఎల్ కంపెనీపై చూపుతున్న వల్లమాలిన ప్రేమే అందుకు నిదర్శనమంటున్నారు. 12 ఏళ్లలో రూ.700 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన ఈ సంస్థకు సర్కారు రూ.2,223.9 కోట్ల దాకా రాయితీలు ప్రకటించడం గమనార్హం. పోనీ ఒప్పందం ప్రకారం 7,500 మందికి ఉపాధి కల్పిసుదని చెబుతున్నారు. పెట్టుబడికి మూడు రెట్లు అదనంగా ఐటీ కంపెనీలను ఆకర్షించడానికి ఐటీ పాలసీ 2014–20 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలను ప్రకటించింది. ఇప్పుడు వీటికి అదనంగా హెచ్సీఎల్కు భారీ రాయితీలను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. హెచ్సీఎల్ టెక్నాలజీస్ రూ.700 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే దానికి మూడు రెట్లు కంటే ఎక్కువగా రూ.2,223.9 కోట్ల రాయితీలను ప్రభుత్వం కల్పించనుండటం గమనార్హం. ఇదంతా చూస్తుంటే హెచ్సీఎల్ పూర్తిగా ప్రభుత్వ సొమ్ముతో నడిచే సంస్థలా ఉందటూ ఐటీ శాఖలోని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. భూమి ద్వారానే రూ.728.9 కోట్ల లబ్ధి విజయవాడకు సమీపంలో గన్నవరం ఎయిర్పోర్టుకు ఎదురుగా హెచ్సీఎల్కు 49.86 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో మొదటి దశలో ఎకరా రూ.30 లక్షలు చొప్పున 29.86 ఎకరాలు, రెండోదశలో రూ.50 లక్షలు చొప్పున మరో 20 ఎకరాలను ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎల్అండ్టీ మేధా టవర్స్ పక్కనే ఉన్న స్థలం కావడంతో ఇప్పుడు అక్కడ బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.15 కోట్లు పైనే పలుకుతోంది. అంటే 49.86 ఎకరాల భూమి విలువ రూ.747.9 కోట్లు ఉంటుంది. కానీ ఇంత ఖరీదైన భూమిని కేవలం రూ.19 కోట్లకే కేటాయిచడం ద్వారా హెచ్సీఎల్ కంపెనీకి ప్రభుత్వం రూ.728.9 కోట్ల మేర ప్రయోజనాన్ని కల్పించింది. ఇతర చోట్ల పనిచేసే సంస్థ ఉద్యోగులే విజయవాడకు తరలింపు హెచ్సీఎల్ టెక్నాలజీస్ రెండు దశల్లో 7,500 మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపింది. మొదటి దశలో ఏడేళ్లల్లో రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టి 4,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఆ తర్వాత వచ్చే ఐదేళ్లలో రూ.300 కోట్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా 3,500కి ఉపాధి కల్పించనుంది. ఉపాధి కల్పించిన ప్రతి ఉద్యోగికి లక్ష రూపాయల చొప్పున ఈ కంపెనీకి ప్రభుత్వం ఒకేసారి రాయితీగా చెల్లించనుంది. అంటే 7,500 మందికి లక్ష రూపాయల చొప్పున లెక్కిస్తే రూ.75 కోట్లు కంపెనీకి రాయితీ రూపంలో అందనున్నాయి. కానీ ఇక్కడ కూడా ఓ మతలబు ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న తమ కేంద్రాల్లో పనిచేస్తున్న వారిని ఇక్కడకు తరలిస్తామని హెచ్సీఎల్ పేర్కొంది. హెచ్సీఎల్ కేంద్రాల్లో 6,700 మంది తెలుగువారు పని చేస్తుండగా 627 మంది విజయవాడ వచ్చేందుకు ఆసక్తి చూపినట్లు సంస్థ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అధికారి వి.వి.అప్పారావు తెలిపారు. అంటే ఇప్పటికే వివిధ చోట్ల పనిచేస్తున్న సంస్థ ఉద్యోగులను విజయవాడ తరలించి కొత్త ఉద్యోగాల కల్పన పేరుతో రాయితీలను కంపెనీ అప్పనంగా పొందనున్నట్లు తేలిపోతోంది. శిక్షణ రాయితీలు రూ.144 కోట్లు.. ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఎంపిక చేసుకున్న తర్వాత అంతర్గత శిక్షణ ఇవ్వడం పరిపాటి. కానీ హెచ్సీఎల్లో ఇలా శిక్షణ ఇస్తున్నందుకుగాను ప్రతి ఉద్యోగికి నెలకు రూ.5,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కంపెనీకి చెల్లించనుంది. ఇందుకోసం 1,000 సీట్ల సామర్థ్యంతో హెచ్సీఎల్ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. శిక్షణ ఆర్నెళ్లు ఉంటుందనుకున్నా ఏటా కనీసం రెండు వేల మంది ఈ కేంద్రంలో శిక్షణ పొందనున్నారు. అంటే 12 ఏళ్లలో 24,000 మంది చొప్పున లెక్కిస్తే సుమారు రూ.144 కోట్లు హెచ్సీఎల్కు శిక్షణ రాయితీలు కింద లభించనున్నాయి. తమ సంస్థలోకి తీసుకున్న వారికి మాత్రమే ఇందులో శిక్షణ ఇవ్వనున్నట్లు హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్ తెలిపారు. ఇతర రాయితీల కింద మరో వంద కోట్లు ఇవికాకుండా బ్యాంకుల నుంచి తీసుకునే రుణంపై 5% వడ్డీ రాయితీ చొప్పున మొత్తం 12 ఏళ్లలో గరిష్టంగా రూ.76 కోట్లు ప్రభుత్వం ఇవ్వనుంది. ఐటీ పాలసీ 2014–015 కింద స్టాంప్ డ్యూ.టీ, రిజిస్ట్రేషన్ ఫీ, వ్యాట్, సీఎస్టీ, జీఎస్టీల నుంచి 100% మినహాయింపు, 24 గంటల విద్యుత్ సరఫరా కోసం 33 కేవీ–133 కేవీ ప్రత్యేక ట్రాన్స్మిషన్ ఏర్పాటు, తక్కువ ధరకు యుటిలిటీ సర్వీసులు, రవాణా వంటి అదనపు సదుపాయాలను పరిగణనలోకి తీసుకుంటే హెచ్సీఎల్కు ఏటా కనీసం రూ.100 కోట్ల వరకు ప్రయోజనం కలగనుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన 12 ఏళ్లకు రూ.1,200 కోట్ల మేర ప్రయోజనం దక్కనుంది. మొత్తంగా రాయితీలు, ఇతర ప్రయోజనాల కింద హెచ్సీఎల్ రూ.2,223.9 కోట్ల మేర లబ్ధిపొందే అవకాశముందని అంచనా వేస్తున్నారు. -
కంపెనీలకు 'భాగ్య'నగరం!
సాక్షి, హైదరాబాద్: ఐటీ రంగంలో దూసుకుపోతున్న రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు మరిన్ని అంతర్జాతీయ సంస్థలు క్యూ కట్టాయి. కొత్తగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు, దేశంలో ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న సంస్థలను విస్తరించేందుకు మరో 10 కంపెనీలు భాగ్యనగర బాట పట్టాయి. ఈ జాబితాలో ఎక్కువగా ఐటీ/ఐటీ ఆధారిత సేవల కంపెనీలు ఉన్నాయి. అమెరికాకు చెందిన ష్యూర్, మైక్రాన్ టెక్నాలజీ, ఎఫ్5 నెట్వర్క్స్, మ్యాథ్వర్క్స్, క్లీన్ హార్బర్స్, కాండ్యూయెంట్, లెగాతో హెల్త్ టెక్నాలజీస్, త్రైవ్ డిజిటల్, బాంబార్డియర్ వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అలాగే చైనాకు చెందిన థండర్ సాఫ్ట్వేర్ టెక్ సంస్థ గత సోమవారం లాంఛనంగా కార్యకలాపాలు ప్రారంభించింది. నగరంలో ఐటీ కంపెనీల కార్యకలాపాలు, విస్తరణకు అనుకూలంగా ఉండటం, సాంకేతిక నిపుణులు, మౌలిక వసతులు అందుబాటులో ఉండటంతోపాటు నూతన ఐటీ పాలసీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రం ఉత్తమ ర్యాంకు సాధించడం ఈ కంపెనీలు హైదరాబాద్పై ఆసక్తి చూపడానికి ప్రధాన కారణమని ఐటీరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పలు అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన చిన్న కంపెనీలు సైతం ఇక్కడ కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు ప్రభుత్వ వర్గాలను సంప్రదిస్తున్నాయని పేర్కొన్నాయి. ఆయా కంపెనీలు కార్యకలాపాలు సాగించేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఐటీశాఖ అధికారులు తెలిపారు. 3 ఏళ్లలో మారిన సీన్... భారత్లో సాఫ్ట్వేర్ కంపెనీలను నెలకొల్పాలనుకునే కంపెనీలు మూడేళ్ల క్రితం వరకు బెంగళూ రునే ఎంపిక చేసుకునేవి. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో హైదరాబాద్లో కంపెనీలు ఏర్పాటు చేసుకొని ఇక్కడి నుంచే కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఐటీశాఖ వర్గాలు తెలిపాయి. గత మూడేళ్లుగా ఇదే ట్రెండ్ కొనసాగుతోందని పేర్కొన్నాయి. ప్రధానంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐటీ, హార్డ్వేర్ పాలసీలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రం ఉత్తమ ర్యాంకు సాధించడం వంటి అంశాలు పలు బహుళజాతి కంపెనీలు హైదరాబాద్ను తమ గమ్యస్థానంగా ఎంచుకోవడానికి కారణమని పేర్కొన్నాయి. ఉపాధి, నిర్మాణ రంగానికి ఊతం... ఒక్కో నూతన అంతర్జాతీయ కంపెనీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,000 నుంచి 3,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలున్నట్లు ఐటీశాఖ అంచనా వేస్తోంది. అలాగే ఆయా కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో సుమారు 50 వేల నుంచి 3 లక్షల చదరపు అడుగుల మేర వాణిజ్య స్థలాలను లీజు ప్రాతిపదికన తీసుకోవడంతో నిర్మాణ రంగానికి సైతం ఊతమిచ్చినట్లు అయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గ్రేటర్ ఐటీ కంపెనీల్లో ఉపాధి ఇలా... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం హైదరాబాద్లో సుమారు 100 చిన్న, పెద్ద ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఆయా కంపెనీల్లో కొత్తగా 50 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించినట్లు ఐటీశాఖ వర్గాలు తెలిపాయి. టీఎస్ ఐపాస్ రాకతో గత రెండేళ్లుగా బుద్వేల్ తదితర ప్రాంతాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు సుమారు 30 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయన్నారు. భాగ్యనగరంలో ఇప్పటికే సుమారు 647 బహుళజాతి, దేశీయ దిగ్గజ సంస్థలకు చెందిన ఐటీ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఆయా కంపెనీల్లో సుమారు 5 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. భాగ్యనగర బాటపట్టిన కంపెనీలివే.. 1. ష్యూర్ 2. మైక్రాన్ టెక్నాలజీ 3. ఎఫ్5 నెట్వర్క్స్ 4. మ్యాథ్వర్క్స్ 5. క్లీన్ హార్బర్స్ 6. కాండ్యూయెంట్ 7. లెగాతో హెల్త్ టెక్నాలజీస్ 8. త్రైవ్ డిజిటల్ 9. బాంబార్డియర్ 10. థండర్ సాఫ్ట్వేర్ టెక్ -
నావల్లే మీరంతా అమెరికా వచ్చారు : చంద్రబాబు
సాక్షి, అమరావతి : నాడు ఐటీ రంగంపై తాను శ్రద్ధ పెట్టడంవల్లే ఈరోజు ఇంతమంది అమెరికా రాగలిగారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. నాలెడ్జి ఎకానమీకి చిహ్నంగా సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం ఇదే రోజున హైదరాబాద్లో సైబర్ టవర్స్ను ప్రారంభించానని గుర్తుచేశారు. టెక్నాలజీ వినియోగంలో అమెరికా కంటే ఏపీ అనేక రంగాల్లో ముందుందన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సీలోని ‘న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్ సెనేట్’లో ఏర్పాటైన సభలో ప్రవాస తెలుగు వారిని ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. తెలుగు వారంతా వ్యవసాయ రంగంలోనే కాదు, నాలెడ్జి ఎకానమీలోనూ ముందుకు రావాలన్నారు. దూరం అనేది సమస్య కాదని, రాష్ట్రంలో నివసిస్తున్న తెలుగువారు ప్రభుత్వానికి ఎలా సహకరిస్తున్నారో ప్రవాసులు కూడా అదే తరహాలో సహకారం అందించవచ్చని చెప్పారు. ప్రవాసులు సొంత గ్రామానికి ఏం చేయాలో ఆలోచించాలని సూచించిన సీఎం.. ఆ ఆలోచనలను గ్రామస్తులతో పంచుకోవాలని, ‘గ్రామదర్శిని, వార్డు దర్శని’కి చేయూతనివ్వాలని కోరారు. ఓటు, ప్రచారం రెండూ కావాలి ఈ ఏడాది ప్రవాసులకు ఓటు హక్కు వస్తుందని ఇప్పటికే ఇందుకు సంబంధించిన బిల్లు లోక్సభలో ఆమోదం పొందిందని, రాజ్యసభ ముందుకు త్వరలోనే రానుందని సీఎం వెల్లడించారు. ఉన్న చోటు నుంచే ఓటు వేసే అవకాశం ప్రవాసులకు వుంటుందని చెప్పిన సీఎం.. టీడీపీకి ఓటు వేయడంతో పాటు ప్రచారం కూడా చేయాలని కోరారు. త్వరలోనే ఎన్ఆర్ఐ టీడీపీ సేవా కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని ఆయన ప్రకటించారు. కిడారి, సివేరి హత్య దుర్మార్గం: ప్రజాస్వామ్యంలో హత్యలకు, విధ్వంసానికి తావులేదని, ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి హత్యలను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. ఈ దుశ్చర్యలను అందరూ ఖండించాలన్నారు. కాగా, వీరిద్దరితోపాటు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నందమూరి హరికృష్ణకు న్యూజెర్సీ టీడీపీ విభాగం నిర్వహించిన సంతాప సభలో సీఎం ప్రసగించారు. -
ఇళ్ల అమ్మకాల్లో ‘హై’దరాబాద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్లో మొదటిసారి తొలి అర్ధ సంవత్సరం(హెచ్–1)లో ఇళ్ల అమ్మకాలు బాగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) హైదరాబాద్ రియల్టీ మార్కెట్కు బ్రేకులు వేస్తున్నా.. ఈ ఏడాది హెచ్1లో 3,706 యూనిట్లు కొత్తగా ప్రారంభమయ్యాయని, ఇది గతేడాది తొలి అర్ధ సంవత్సరంతో పోలిస్తే దాదాపు 44 శాతం ఎక్కువని నైట్ఫ్రాంక్ హైదరాబాద్ డైరెక్టర్ సామ్సన్ ఆర్థర్ చెప్పారు. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ), రెరా ఇవన్నీ గతేడాది బాగా ప్రభావం చూపాయని, ప్రస్తుతం వృద్ధి కనిపిస్తోందని వెల్లడించారు. ‘2018 తొలి అర్ధ సంవత్సరం: ఇండియన్ రియల్ ఎస్టేట్’9వ నివేదికను విడుదల చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. నివేదికలోని ముఖ్యాంశాలివే.. రూ.25లక్షల లోపు గృహాల్లేవ్.. ఈ ఏడాది హెచ్1లో హైదరాబాద్లో 3,706 కొత్త గృహాలు ప్రారంభమయ్యాయి. ఇందులో 2,628 యూనిట్లు(71 శాతం) పశ్చిమ హైదరాబాద్లోనే ఉన్నాయి. కొత్త గృహాల్లో 47 శాతం యూనిట్లు రూ.75 లక్షల నుంచి కోటి రూపాయల మధ్య ఉన్నవే. రూ.2–4 కోట్ల ధర ఉన్న గృహాలు 3 శాతం పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి. ఇక, రూ.25 లక్షల లోపు ధర ఉన్న అందుబాటు గృహాలు ఒక్కటంటే ఒక్కటీ ప్రారంభం కాలేదు. తొలిసారి 8 వేల ఇళ్ల విక్రయం.. నగరంలో తొలి అర్ధభాగం ఇళ్ల అమ్మకాల్లో 5 శాతం వృద్ధి నమోదైంది. మొత్తంగా 8,313 ఇళ్లు విక్రయమయ్యాయి. ఇందులో 5,766 యూనిట్లు పశ్చిమ హైదరాబాద్లోనే కావటం గమనార్హం. రాష్ట్రం విడిపోయాక హైదరాబాద్లో 8 వేలకు పైగా గృహాలు విక్రయం కావటం ఇదే తొలిసారి. కార్యాలయాల మార్కెట్ ఆశాజనకంగా ఉండటమే నివాస విభాగం వృద్ధికి కారణమని నైట్ఫ్రాంక్ తెలిపింది. మౌలిక వసతులు మెరుగ్గా ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, కొండాపూర్, నానక్రాంగూడ వంటి పశ్చిమ ప్రాంతాల్లోనే 69 శాతం విక్రయాలు జరిగాయి. ఇక్కడ 8 శాతం ధర వృద్ధి.. ఆసక్తికరమైన విషయమేంటంటే.. ఈ ఏడాది హెచ్1లో హైదరాబాద్లో మినహా మిగిలిన అన్ని ప్రధాన నగరాల్లో స్థిరాస్తి ధరలు తగ్గాయి. హైదరాబాద్లో గృహాల సప్లయి, డిమాండ్కు మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో ఏడాది కాలంలో 8 శాతం ధర వృద్ధి చెందింది. ఇక, ఎన్సీఆర్లో 10 శాతం, ముంబైలో 9 శాతం, పుణె, కోల్కత్తాలో 8 శాతం ధరలు తగ్గాయి. బెంగళూరు, అహ్మదాబాద్లో స్థిరంగా ఉన్నాయి. నగరంలో ఇంకా 12,749 ఇళ్లు అమ్ముడుపోకుండా ఇన్వెంటరీగా ఉన్నాయి. వీటిల్లో పశ్చిమంలో 7,397, ఉత్తరంలో 2,099, దక్షిణంలో 1,704, సెంట్రల్లో 788, తూర్పు హైదరాబాద్లో 762 యూనిట్లున్నాయి. వీటి అమ్మకాలకు మరో ఏడాదిన్నర సమయం పడుతుంది. తగ్గిన ఐటీ ఆఫీస్ మార్కెట్ హవా.. హెచ్1లో హైదరాబాద్ నగరంలో 17 లక్షల చ.అ. కొత్త ఆఫీస్ స్పేస్ నిర్మాణం, 27 లక్షల చ.అ.ల్లో లావాదేవీలు జరిగాయి. ఇది గత ఏడాది కాలంతో పోలిస్తే నిర్మాణంలో 14 శాతం క్షీణత, లావాదేవీల్లో 15 శాతం వృద్ధి. అద్దె నెలకు సుమారు చ.అ.కు రూ.53గా ఉంది. ఇంకా, నగరంలో 6.2 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ స్టాక్ ఉంది. సాధారణంగా ఆఫీ స్ స్పేస్ మార్కెట్లో ఐటీ, బీఎఫ్ఎస్ఐ రంగాలదే హవా. అయినా, ఈ ఏడాది హెచ్1లో ఈ రంగాల లావాదేవీల్లో క్షీణత నమోదైంది. గతేడాది హెచ్1లో ఐటీ వాటా 51 శాతం ఉంటే.. ఈసారి 36 శాతానికి, బీఎఫ్ఎస్ఐ 21 శాతం నుంచి 7 శాతానికి పడిపోయింది. మరోవైపు కంపెనీల విభాగం 5 నుంచి 15 శాతానికి, సర్వీస్ సెక్టార్ 23 నుంచి 43 శాతానికి పెరిగాయి. గతేడాది హెచ్1లో 126 డీల్స్ జరగ్గా.. ఈ ఏడాది హెచ్1లో 120 డీల్స్ జరిగాయి. -
భవిష్యత్ ఐటీకి సన్నద్ధం కావాలి
న్యూయార్క్: పరిశ్రమలు, సంస్థలు, వాటిని నడిపించేవారికి వేచి చూసేందుకు తగినంత సమయం లేదని, ఐటీ రంగం ఆధునికీకరణ సంతరించుకోవడానికి ముందే భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సన్నద్ధం కావాలని నాస్కామ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీ సూచించారు. ఆధునికీకరణ అంటే అది కేవలం ఆర్టి ఫీషియల్ టెక్నాలజీ, బ్లాక్ చెయిన్ తరహా టెక్నాలజీలకే పరిమితం కాదని, యాజమాన్యం, నైపుణ్యాల మార్పూ అవసరమేనన్నారు. మారే టెక్నాలజీ తీరుతెన్నులే ఆధునికీకరణను నిర్దేశిస్తాయని అభిప్రాయపడ్డారు. ఇందుకు అనుగుణంగా నడుచుకోవడమే మన ఎంపికగా పేర్కొన్నారు. ఈ రోజు ఇదే నాయకత్వ సవాలుగా అభివర్ణించారు. అమెరికాలో జరిగిన నాస్కామ్ ఈ సమ్మిట్లో ప్రేమ్జీ పాల్గొని మాట్లాడారు. పరిశ్రమకు చెందిన ఎగ్జిక్యూటివ్లు, అనలిస్ట్లు, కంపనీల అధినేతలు పాల్గొన్న ఈ సదస్సులో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్చెయిన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ అన్నవి పనిని, కస్టమర్ల అనుభవాన్ని ఏ విధంగా మార్చేస్తున్నాయన్న అంశంపై చర్చ జరిగింది. డిజిటైజేషన్ అన్నది ఇంకా చాలా ముందస్తు దశలోనే ఉందని, ఈ విషయంలో కంపెనీలు, పరిశ్రమలు మరింత పరిపూర్ణత సాధించాల్సి ఉందని రిషద్ ప్రేమ్జీ అన్నారు. డేటా, టెక్నాలజీ ప్రయోజనాలను, కస్టమర్ల అవసరాలను పూర్తిగా అర్థం చేసుకుంటే వృద్ధి చెందేందుకు అవకాశాలు అపరిమితమని సూచించారు. రిషద్ ప్రేమ్జీ విప్రో కంపెనీ బోర్డు మెంబర్, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్గా ఉన్నారు. వాస్తవాలను చూడాలి... హెచ్1బీ వర్క్ వీసాల విషయంలో ట్రంప్ సర్కారు కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో, ఐటీ ఉద్యోగుల్లో అనిశ్చితి నెలకొనడంతో దీనిపై రిషద్ ప్రేమ్జీ స్పందిస్తూ... వాస్తవం నుంచి మనోభావాన్ని వేరు చేసి చూడాలన్నారు. ‘‘ఏటా 65,000 హెచ్1బీ వీసాలను జారీ చేస్తున్నారు. ఇందులో భారత ఐటీ రంగం 10,000లోపే వాడుకుంటోంది. 70 శాతం వీసాలు భారతీయులకే వెళుతున్నాగానీ, అవి భారత కంపెనీలకు కాదు. ఇది చాలా చాలా ముఖ్యమైన అభినందించాల్సిన అంశం. అమెరికాలో 2020 నాటికి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్లో 24 లక్షల మంది నిపుణుల కొరత ఉంటుందని కార్మిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో సగం కంప్యూటర్, ఐటీ అనుబంధ సేవల్లోనే ఉండనున్నాయి’’ అని ప్రేమ్జీ వివరించారు. అమెరికాలో టెక్నాలజీ రంగంలో 70 లక్షల మంది పనిచేస్తుంటే మనం కేవలం 10,000 మంది గురించి మాట్లాడుతున్నామని, సెంటిమెంట్ను పక్కన పెట్టి వాస్తవాన్ని చూడాలన్నారు. చైనాలో రెండో ‘భారత ఐటీ కారిడార్’ బీజింగ్: చైనా సాఫ్ట్వేర్ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు గాను భారత్ ఐటీ పరిశ్రమల సంఘం నాస్కామ్ రెండో ఐటీ కారిడార్ను ఏర్పాటు చేసింది. అతిపెద్ద చైనా మార్కెట్లో భారత కంపెనీలకు అవకాశాలు కల్పించేందుకు గాను గుయాంగ్ పట్టణంలో ‘డిజిటల్ కొల్లాబరేటివ్ అపార్చునిటీస్ ప్లాజా’ (సిడ్కాప్) పేరుతో కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. చైనా గుయాంగ్ మున్సిపల్ చీఫ్, నాస్కామ్ కలసి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు ఆరు మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు భారత ఐటీ కంపెనీలు, చైనా కస్టమర్ల మధ్య జరిగాయి. గతేడాది డిసెంబర్లో నాస్కామ్ చైనాలోని డాలియన్ పట్టణంలో మొదటి కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయం గమనార్హం. 50 లక్షల ఉద్యోగాలు న్యూఢిల్లీ: టెక్నాలజీ రంగంలో డిజిటల్ పరిణామం వేగాన్ని సంతరించుకుందని, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, డేటా అనలైటిక్స్ విభాగాల్లో ప్రత్యేక నైపుణ్యాలున్న వారికి 2027 నాటికి ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల ఉద్యోగాలు ఏర్పడతాయని ఐడీసీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ విభాగాల్లో నైపుణ్యాల కొరత గణనీయంగా ఉందని, ప్రత్యేక నైపుణ్యాలున్న వారికి అవకాశాలు బలంగా ఉన్నాయని సర్వే పేర్కొంది. డేటా మేనేజ్మెంట్, అనలైటిక్స్, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ డెవలప్మెంట్, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ అన్నవి కీలకమైనవిగా మారతాయని తెలిపింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 29 లక్షల ఉద్యోగాలు, ఉత్తర అమెరికాలో 12 లక్షలు, లాటిన్ అమెరికాలో 6 లక్షల ఉద్యోగాలు కొత్తగా వస్తాయని పేర్కొంది. -
ఐటీ బేజార్..!
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ), బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్(బీపీవో), నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్(కేపీవో) రంగాలకు కొంగుబంగారంగా నిలిచిన హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఉద్యోగాల కల్పనలో ఐటీ రంగం వెనుకబడింది. తాజాగా ఐటీ రంగంలో వృద్ధిరేటు మైనస్ 6 శాతంగా నమోదైనట్లు నౌకరి డాట్కామ్ తాజా సర్వేలో వెల్లడైంది. ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య కాలంలో వివిధ రంగాల్లో ఉద్యోగాల కల్పన ట్రెండ్పై జరిపిన అధ్యయనానికి సంబంధించిన వివరాలను నౌకరీ డాట్కామ్ ఇటీవల వెల్లడించింది. గ్రేటర్లో తగ్గుతున్న ఐటీ కొలువులు.. బహుళ జాతి, దేశీయ దిగ్గజ సంస్థలకు చెందిన సుమారు వెయ్యి సాఫ్ట్వేర్ కంపెనీల బ్రాంచీలు గ్రేటర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఆయా కంపెనీల్లో సుమారు 6 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అయితే కంపెనీల విస్తరణ ప్రణాళికలు ఏటా ఆశించిన మేరకు అమలు కాకపోవడం.. కొత్త ప్రాజెక్టులు చేజిక్కకపోవడం.. అంతర్జాతీయంగా మార్కెట్ ఆశించిన స్థాయిలో లేకపోవడం తదితర కారణాలతో కొలువుల్లో మందగమనం నమోదైనట్లు ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో గ్రేటర్ పరిధిలో నిర్మించ తలపెట్టిన ఐటీఐఆర్ ప్రాజెక్టు నాలుగేళ్లుగా సాకారం కాకపోవడం.. దీనికి కేంద్రం తాజా బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం కూడా ఐటీ రంగం వృద్ధికి ప్రతిబంధకంగా మారిందని అంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఐటీ, హార్డ్వేర్ పాలసీ, టీఎస్ఐపాస్ రాకతో ఐటీ రంగంతోపాటు పారిశ్రామిక రంగాలు ఇప్పుడిప్పుడే పురోగమిస్తున్నాయని, త్వరలోనే ఆయా రంగాల్లో క్రమంగా వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. గ్రేటర్లో ఇతర రంగాల దూకుడు.. గ్రేటర్ పరిధిలో ఐటీ రంగంతో పోలిస్తే ఇన్సూరెన్స్ రంగంలో గణనీయమైన వృద్ధి నమోదైంది. బీమా రంగంలో 73 శాతం వృద్ధి నమోదవడం విశేషం. దేశ, విదేశాలకు చెందిన ఇన్సూరెన్స్ సంస్థలు నగరంలో వాహన, వ్యక్తిగత, ఆరోగ్య బీమా రంగంలో విభిన్న పాలసీలను ప్రవేశపెడుతున్నాయి. ఈ పాలసీలను వినియోగదారుల వద్దకు చేర్చేందుకు పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్కు శ్రీకారం చుట్టినట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక ఆటోమొబైల్ రంగంలో 44 శాతం, నిర్మాణ రంగంలో 41 శాతం, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్లో 40 శాతం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమల్లో 34 శాతం, ఫార్మా రంగంలో 14 శాతం, బీపీవో రంగంలో 9 శాతం వృద్ధి నమోదైనట్లు నౌకరీ డాట్కామ్ సర్వేలో తేలింది. మెట్రో నగరాల్లో ఉద్యోగాల కల్పనలో వృద్ధి శాతం ఇలా.. నగరం ర్యాంకు వృద్ధి శాతం కోల్కతా 1 34 ఢిల్లీ 2 20 ముంబై 3 18 హైదరాబాద్ 4 06 బెంగళూరు 5 05 చెన్నై 5 05 పుణే 6 01 సేవా, పారిశ్రామిక రంగాల్లో గణనీయ వృద్ధి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లో మెరుగైన స్థానం సాధించడంతో హైదరాబాద్లో పరిశ్రమల స్థాపనకు బీమా కంపెనీలతో పాటు తయారీ రంగ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. టీఎస్ఐపాస్, ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్, ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆయా రంగాల్లో వృద్ధిరేటు శరవేగంగా పెరుగుతోంది. – శ్రీనివాస్, ఫ్యాప్సీ అధ్యక్షుడు -
హైదరాబాద్లో డేటా సైన్స్ కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ రంగంలో దూసుకెళ్తున్న భాగ్యనగరి మరో రికార్డు నమోదు చేయబోతోంది. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో పరిశోధన, ఆవిష్కరణలకై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ముందడుగు పడింది. మంగళవారం ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, నాస్కామ్ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇక్కడి హెచ్ఐసీసీలో జరుగుతున్న నాస్కామ్ ఇండియా లీడర్షిప్ ఫోరం–2018లో భాగంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కె.తారక రామారావు సమక్షంలో నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, నాస్కామ్ సంయుక్తంగా ఈ సెంటర్కు తొలుత రూ.40 కోట్లు వ్యయం చేస్తాయి. ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో తాత్కాలికంగా సెంటర్ ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ సమీపంలోని బుద్వేల్ వద్ద రానున్న ప్రతిపాదిత డేటా అనలిటిక్స్ పార్క్లో శాశ్వత కేంద్రాన్ని నెలకొల్పుతారు. లక్షన్నర మందికి: డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం భారత్లో 2025 నాటికి రూ.1,00,800 కోట్లు నమోదు చేయనుంది. 1,50,000 మందికి కొత్తగా ఉపాధి లభిస్తుందని కె.తారక రామారావు వెల్లడించారు. భవిష్యత్ను మార్చనున్న ఎనిమిది రకాల టెక్నాలజీల్లో డేటా సైన్స్, ఏఐ ఉన్నాయని చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఐటీ పాలసీలో భాగంగా ప్రోత్సహించనున్న 10 విభాగాల్లో ఈ రెండు కూడా చోటు దక్కించుకున్నాయని జయేశ్ రంజన్ చెప్పారు. -
ఐటీ @10 లక్షల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం దూకుడుగా ముందుకెళుతోంది. వార్షికాదాయం ఏకంగా రూ.10 లక్షల కోట్లను మించిపోయింది. ఎగుమతుల్లో 24 శాతం వాటాతో దేశానికి అత్యధిక ఆదాయం తెచ్చిపెడుతోంది. దేశంలో ఐటీ రంగం పురోగతిపై ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్)’రూపొందించిన నివేదికను మంగళవారం ప్రపంచ ఐటీ కాంగ్రెస్ వేదికపై విడుదల చేసింది. దేశ ఐటీ రంగం 2015–16లో 143 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.28 లక్షల కోట్లు) ఆదాయాన్ని ఆర్జించగా.. 2016–17లో 154 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.98 లక్షల కోట్లు)కు పెంచుకుందని నాస్కామ్ తెలిపింది. ఇది 2017–18లో 167 బిలియన్ డాలర్ల (10.8 లక్షల కోట్లు)కు పెరుగుతుందని అంచనా వేసింది. డిజిటల్, ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, బీపీఎం వంటి ప్రధాన సేవలు సహా మొత్తంగా ఐటీ రంగానికి ఈ ఆదాయం సమకూరిందని తెలిపింది. లక్షకుపైగా కొత్త ఉద్యోగాలు వచ్చాయని పేర్కొంది. 2017–18లో ఐటీ రంగ వృద్ధి సూచీలివీ.. - విదేశీ ఎగుమతుల ఆదాయంలో 13 బిలియన్ డాలర్ల (7.8 శాతం) వృద్ధి. - ఐటీ ఉత్పత్తుల ఆదాయంలో 20 శాతం (22–25 బిలియన్ డాలర్ల మేర) వృద్ధి. ఏటా 30 శాతం వృద్ధి రేటు నమోదు. - ఈ–కామర్స్లో 17 శాతం వృద్ధి. ఆన్లైన్లో హోటల్ బుకింగ్, కిరాణా సరుకులు, ఆహార కొనుగోళ్లకు పెరిగిన డిమాండ్. - దేశీయంగా సాంకేతిక సేవల వినియోగంలో 10 శాతానికి పైగా పెరుగుదల. ఇవీ ప్రతికూల పరిస్థితులు - స్వదేశీ వస్తు రక్షణ విధానం (ప్రొటెక్షనిజం), బ్రెగ్జిట్, కార్మికుల వలస సమస్యలతో ఐటీ రంగంపై ప్రభావం. - అమెరికా పన్నుల సంస్కరణలతో అస్థిరత - అమెరికా బ్యాంకింగ్, ఆర్థిక రంగ సంస్థల వృద్ధి క్షీణత - స్మార్ట్ సిటీలు, ప్రొక్యూర్మెంట్ సంస్కరణలు వంటి ప్రభుత్వ డిజిటల్ కార్యక్రమాలు ఇంకా ప్రారంభ దశలోనే ఉండటం. - సరైన సాంకేతిక పరిజ్ఞానం లేక ఈ–కామర్స్ రంగం కేవలం ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాలకే పరిమితం కావడం. కొత్త శకంలో ఐటీ రంగం - దేశంలో స్టార్టప్ ఐటీ పరిశ్రమలు 5,200. - 2017లో కొత్తగా ఏర్పాటైన ఐటీ స్టార్టప్లు 1000కిపైగానే.. - స్టార్టప్ల విలువ 4000 కోట్ల డాలర్లు (సుమారు రూ. 2.59 లక్షల కోట్లు) - దేశంలో ఈ–కామర్స్ విలువ 3,850 కోట్ల డాలర్లు (సుమారురూ.2.49 లక్షల కోట్లు). ఈ రంగంలో ఏటా 17 శాతం వృద్ధి.. 700 కోట్ల డాలర్ల (సుమారు రూ.45 వేల కోట్లు) ఆదాయం. పెట్టుబడులు 180 శాతం పెరిగాయి. - డిజిటల్ చెల్లింపులు 14,500 కోట్ల డాలర్లు (సుమారు రూ.9.41 లక్షల కోట్లు). ఇది జీడీపీలో 6 శాతం - మొబైల్ వ్యాలెట్ చెల్లింపులు రూ.53,200 కోట్ల నుంచి రూ.79,300 కోట్లకు పెరిగాయి. - 90 శాతానికి పైగా భారతీయ ఐటీ పరిశ్రమలు విదేశాల్లో విక్రయాలు జరుపుతున్నాయి. - 50 శాతానికిపైగా ఐటీ పరిశ్రమలు తమ కార్యకలాపాల్లో కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్)ను వినియోగిస్తున్నాయి. - దేశంలో 700కిపైగా ఐటీ స్టార్టప్లు 25–30 శాతం వృద్ధి సాధించాయి. - హెల్త్ టెక్, ఫైనాన్షియల్ టెక్ రంగాలు, కృత్రిమ మేధస్సు, బ్లాక్ చైన్ సాంకేతికత శరవేగంగా వృద్ధి సాధిస్తున్నాయి. వేళ్లూనుకుంటున్న డిజిటల్ వ్యవస్థ - ప్రపంచవ్యాప్తంగా 320 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులుండగా.. దేశంలో 46.5 కోట్ల మంది ఉన్నారు. దేశంలో ఇంటర్నెట్ వినియోగం 8 శాతం వృద్ధి సాధించింది. - ప్రపంచంలో స్మార్ట్ఫోన్ వినియోగదారులు 330 కోట్లుకాగా.. దేశంలో 30 కోట్లకుపైగా ఉన్నారు. 2020 నాటికి 80 కోట్లకు చేరుతారని అంచనా. - దేశంలో మొబైల్ డేటా వినియోగం గత ఏడాదిన్నరలో ఏడు రెట్లు పెరిగింది. స్థానిక భాషల్లో డేటా వినియోగం 10 రెట్లు పెరిగింది. ప్రతి నెలా 22.5 కోట్ల మంది యూట్యూబ్లో వీడియోలు వీక్షిస్తున్నారు. గూగుల్ ప్లే నుంచి యాప్లను డౌన్లోడ్ చేసుకోవడంలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉంది. -
హైదరాబాద్లో అడోబ్ కార్యాలయం
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కేంద్రంగా కొనసాగుతున్న హైదరాబాద్లో మరో ఐటీ దిగ్గజ సంస్థ ఏర్పాటు కానుంది. ప్రముఖ ఐటీ సంస్థ అడోబ్ తమ కార్యాలయాన్ని హైదరాబాద్ పరిసరాల్లో ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సందర్భంగా ఐటీ దిగ్గజం అడోబ్ చైర్మన్, సీఈఓ శంతన్ నారాయణ్తో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అడోబ్ కార్యాలయాన్ని నెలకొల్పాల్సిందిగా కేటీఆర్ కోరారు. 2015, మే నెలలో శాన్ఫ్రాన్సిస్కో నగరంలో శంతన్ నారాయణ్తో తొలిసారి సమావేశమైన కేటీఆర్, తర్వాత పలుమార్లు ఆయన్ను కలిశారు. ఈ క్రమంలో హైదరాబాద్లో అడోబ్ కార్యకలాపాలను విస్తరించాల్సిందిగా కోరిన విషయాన్ని ఐటీ కాంగ్రెస్ సమావేశంలో గుర్తుచేశారు. దీనికి స్పందించిన శంతన్ నారాయణ్ అడోబ్ కంపెనీ విస్తరణ ప్రణాళికల్లో హైదరాబాద్కు ప్రత్యేక స్థానమిస్తున్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే అడోబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని ఇక్కడ నెలకొల్పుతామని తెలిపారు. గత మూడున్నరేళ్లలో హైదరాబాద్లో ఐటీ రంగం గణనీయమైన ప్రగతి సాధించిందని, నూతన టెక్నాలజీపై ఇక్కడ సుశిక్షితులైన యువతరం అందుబాటులో ఉందని శంతన్ అభిప్రాయపడ్డారు. త్వరలోనే అడోబ్ కేంద్రానికి సంబంధించిన పెట్టుబడి, ఉద్యోగ అవకాశాలు, సంస్థ విస్తరణ వంటి అంశాలపై సంస్థ తరఫున ఒక ప్రకటన చేస్తామని వివరించారు. ఈ నిర్ణయం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అడోబ్ సంస్థకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇప్పటికే అనేక దిగ్గజ సంస్థలు వినూత్న టెక్నాలజీలపై ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయన్నారు. అడోబ్ నిర్ణయంతో ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి వీలుకలుగుతుందని అన్నారు. -
ఐటీకి ఇదేమీ కలిసొచ్చే ఏడాది కాదు: నాస్కామ్
హైదరాబాద్: దేశీ ఐటీ రంగం 2018లో ఆందోళనకరంగానే ఉండొచ్చని నాస్కామ్ అంచనా వేసింది. గ్లోబల్ ఐటీ వ్యయాలు పెరగడం, అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటం వంటి సానుకూలతల నడుమ ఇంకా సవాళ్లు పొంచి ఉన్నాయని పేర్కొంది. 2018 ఐటీకి కమ్బ్యాక్ ఇయర్ అనే ఊహాగానాలను కొట్టిపారేసింది. ‘అదే సమస్య. వారు పునరుద్ధరణ చాలా వేగంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ ఏడాది ఊహించిన క్షీణత కానీ ఆకస్మిక మెరుగుదల కానీ ఉండదు’ అని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ పేర్కొన్నారు. ‘గ్లోబల్ ఎకానమీ, అమెరికా ఆర్థిక వ్యవస్థ, ఇతర అంశాలు సానుకూలంగా ఉన్నాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే వీటి వల్ల ఇప్పటికిప్పుడు పరిశ్రమకు పెద్దగా అవకాశాలేమీ అందుబాటులోకి రావు’ అని హెచ్చరించారు. సవాళ్లు లేవని అనుకోవడం ఇప్పుడు కరెక్ట్ కాదన్నారు. పాత సవాళ్లు కొనసాగుతున్నాయని, అవి సమసిపోలేదన్నారు. అలాగే అమెరికాలోని పాలన చర్యలు వంటి కొత్తవీ ఉన్నాయని చెప్పారు. -
బడా ఐటీ కంపెనీల ఆదాయం అంతంతే!
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్) ఫలితాల సీజన్ ప్రారంభం అవుతుండగా, కీలకమైన ఐటీ, బ్యాంకింగ్ రంగంలోని కంపెనీల నుంచి పెద్దగా ఆశించేదేమీ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్యాంకులు అధిక మొండి బకాయిలకు చేసే కేటాయింపులతో బలహీనమైన ఫలితాలను ప్రకటించనున్నాయని అంచనా. అదే సమయంలో తక్కువ పనిదినాలు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సేవల (బీఎఫ్ఎస్) విభాగం ఆదాయాలు చల్లబడినందున ఐటీ కంపెనీల ఫలితాలు గతం కంటే మెరుగ్గా ఉండకపోవచ్చని భావిస్తున్నారు. టీసీఎస్ డైరెక్షన్! టీసీఎస్, ఇన్ఫోసిస్ కంపెనీల యాజమాన్యాలు డిమాండ్ గురించి ఏం వ్యాఖ్యానించనున్నాయనే అంశంపై ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తితో ఉన్నారు. అమెరికాలో పన్ను సంస్కరణలకు తోడు, వీసా నిబంధనల్లో ట్రంప్ సర్కారు చేయదలిచిన మార్పులు ఆందోళన కలిగించేవిగా విశ్లేషకులు భావిస్తున్నారు. మూడో క్వార్టర్ ఫలితాలను టీసీఎస్ ఈ నెల 11న విడుదల చేయనుంది. ఆ తర్వాత రోజు తర్వాత ఇన్ఫోసిస్, 19న విప్రో ఫలితాలను ప్రకటిస్తాయి. ‘‘టైర్–1 భారత ఐటీ కంపెనీల కరెన్సీ ఆదాయ అంచనా 1–1.8 శాతం మధ్య ఉంటుందని మా అంచనా. సంవత్సరాంతం సెలవులు, బీఎఫ్ఎస్ విభాగం నుంచి వచ్చే ఆదాయం పుంజుకోకపోవడం వంటి అంశాలతో ఆదాయాల్లో వృద్ధి ఉండకపోచ్చు’’ అని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ తన నివేదికలో పేర్కొంది. మధ్య స్థాయి కంపెనీలు మాత్రం అధిక వృద్ధిని నమోదు చేస్తాయని పేర్కొంది. 2018 బడ్జెట్లో ఐటీ రంగంపై చేసే ప్రకటనలు, వీసా ఆధారిత సవాళ్లను ఎదుర్కోవడంపై సన్నద్ధత, బీఎఫ్ఎస్ విభాగం తీరు అన్నవి ఇన్వెస్టర్లు పరిశీలించాల్సిన కీలకమైన అంశాలుగా మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. మరోవైపు ఇన్ఫోసిస్ కొత్త సీఈవో సలిల్ పారిఖ్ కంపెనీ అభివృద్ధికి సంబంధించి ఏ విధానాన్ని ప్రకటించనున్నారనే అంశంపైనా ఆసక్తి నెలకొంది. అమెరికా కంపెనీలు విదేశాల్లోని తమ అనుబంధ కంపెనీలకు చేసే చెల్లింపులపై బేస్ ఎరోజన్ అండ్ యాంటీ అబ్యూజ్ ట్యాక్స్(బీట్)ను అమలు చేయడం వల్ల కొన్ని భారత కంపెనీలపై ప్రభావం ఉంటుందని కోటక్ పేర్కొంది. బ్యాంకింగ్ నిరాశాజనకం దేశ బ్యాంకింగ్ రంగం డిసెంబర్ క్వార్టర్లో బలహీన ఫలితాలను ప్రకటించొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీ నివేదిక ప్రకారం... ట్రెజరీల నుంచి వచ్చే ఆదాయం తగ్గడం, ఎన్పీఏలకు కేటాయింపులతో ఈ రంగం పనితీరు బలహీనంగా ఉంటుంది. అదే సమయంలో డిమాండ్ ఆశాజనకంగా ఉండడంతో ఎన్బీఎఫ్సీ కంపెనీలు మాత్రం బలమైన ఫలితాలు ప్రకటించొచ్చని కోటక్ అంచనా వేసింది. ఎన్బీఎఫ్సీల ఫలితాలు 30–50 శాతం స్థాయిలో వృద్ధి నమోదు చేయవచ్చని పేర్కొంది. పండుగల డిమాండ్ పుంజుకోవడం, రెరా/జీఎస్టీ అమలుతో ఇళ్లకు రుణాల జారీ స్వల్పంగా మెరుగుపడడం, రుణాల వ్యయాలు తగ్గడం నిర్వహణ పరంగా ఎన్బీఎఫ్సీ కంపెనీలు బలమైన ఫలితాలు వెల్లడించడానికి తోడ్పడతాయని అంచనా వేసింది. బ్యాంకింగ్ రంగంలో రుణాల వృద్ధి 2016–17లో ఉన్న 4–5 శాతం నుంచి 7 శాతానికి మెరుగుపడినప్పటికీ, ఇంకా డీమోనిటైజేషన్ ముందు నాటి వృద్ధి రేటు 9–10 కంటే దిగువనే ఉందని పేర్కొంది. కార్పొరేట్ రంగానికి రుణాల మంజూరు గణనీయంగా తగ్గిపోవడం, తాజా పెట్టుబడుల్లో మందగమనం అనేవి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మారకపోవచ్చని కోటక్ పేర్కొంది. కార్పొరేట్ రంగానికి 50 శాతానికి పైగా రుణాలిచ్చిన ప్రభుత్వరంగ బ్యాంకులను ఇది నిరాశపరిచేదేనని అభిప్రాయపడింది. రుణాల వృద్ధి 10.65 శాతానికి ముంబై: చాలా కాలం తర్వాత డిసెంబర్లో రుణాల వృద్ధి మెరుగైన స్థాయికి చేరుకుంది. డిసెంబర్ 22తో ముగిసిన 15 రోజుల కాలానికి ఇది 10.65 శాతం, రూ.80,96,727 కోట్లుగా నమోదైంది. బేస్ ప్రభావమే దీనికి కారణమని ఆర్బీఐ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. బేస్ ప్రభావమే రుణాల వృద్ధికి కారణమని, గతేడాది డీమోనిటైజేషన్ వల్ల బేస్ గణాంకాలను సవరించడం జరిగిందని, అందుకే వృద్ధి ఈ స్థాయిలో కనిపిస్తోందని ఎస్బీఐ రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ హెడ్ పేకే గుప్తా వివరించారు. రిటైల్ రుణాలకు డిమాండ్ పుంజుకోగా, కార్పొరేట్ రంగ రుణాల్లో మాత్రం ఎలాంటి పురోగతి లేదని గుప్తా స్పష్టం చేశారు. డిసెంబర్లో రిటైల్, ఆటో రుణాల జారీ పరంగా తాము అధిక గణాంకాలను నమోదు చేసినట్టు చెప్పారు. -
కరీంనగర్లో ఐటీ టవర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పుణే వంటి నగరాలకే పరిమితమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) పరిశ్రమ ఇప్పుడు కరీంనగర్కూ వస్తోంది. ఇప్పటికే స్మార్ట్సిటీ హోదా దక్కించుకుని దేశంలోని 100 నగరాల సరసన నిలిచిన కరీంనగర్ ఇప్పుడు ఐటీ పరిశ్రమల ఏర్పాటుతో ప్రపంచస్థాయి గుర్తింపును అందుకోనుంది. ప్రతిపాదిత ఐటీ టవర్ నిర్మాణం పూర్తయితే కరీంనగర్కు మహర్దశ పట్టనుంది. ద్వితీయ శ్రేణి నగరమైన కరీంనగర్ ఐటీతో కొత్త ఖ్యాతి సంపాదించుకోనుంది. మంత్రి కేటీఆర్చే శంకుస్థాపన.. 50 వేల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మాణం తలపెట్టిన ఐటీ టవర్కు సోమవారం ఉదయం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడే భారీ బ హిరంగ సభ నిర్వహించనున్నారు. నగరంలోని అన్ని డివిజన్ల కార్పొరేటర్లతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్సింగ్లు సమావేశమై ప్రజ లను పెద్ద సంఖ్యలో తరలించే బాధ్యతలను అప్పగించారు. అదే విధంగా కళాశాలల విద్యార్థులను కూడా పెద్ద సంఖ్యలో బహిరంగ సభకు తరలించి విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐటీ హబ్గా ఏర్పాటు... ప్రధాన నగరాలకే పరిమితమైన ఐటీ సెక్టార్ను ద్వితీయశ్రేణి నగరాలకు కూడా విస్తరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నగరాన్ని ఐటీ హబ్గా మార్చేందుకు ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. 9 నెలల్లో దీనిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఐటీ టవర్లో 10కి పైగా అమెరికా, ఆస్ట్రేలియాలకు చెందిన బడా కంపెనీల శాఖలను ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా రాయితీలు ఇవ్వనున్నారు. ఉత్తర తెలంగాణ నిరుద్యోగులకు ఐటీ ఉద్యోగాలే లక్ష్యంగా ఏర్పాటుచేస్తున్న ఈ ఐటీ టవర్స్తో సుమారు 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఉత్తర తెలంగాణ కేంద్ర బిందువు... ఉత్తర తెలంగాణకు కేంద్ర బిందువుగా ఉన్న కరీంనగర్ విద్య, వైద్యం, ప్రాజెక్టుల రంగాల్లో దూసుకుపోతోంది. మానేరు డ్యామ్ ఒడ్డున ప్రకృతి ఒడిలో ప్రశాంత వాతావరణంలో బైపాస్ రోడ్డును ఆనుకొని 3 ఎకరాల స్థలాన్ని ఐటీ టవర్కు కేటాయించారు. రూ.25 కోట్లతో జీ+5 అంతస్తులతో భవనాన్ని నిర్మించేందుకు డిజైన్లు సిద్ధం చేశారు. టవర్ నిర్మాణానికి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) టెండర్ల ప్రక్రియను పూర్తిచేసింది. హైదరాబాద్కు చెందిన కాంట్రాక్టు ఎజెన్సీకి పనులు అప్పగించారు. 50 వేల చదరపు అడుగుల వైశాల్యంతో అత్యాధునిక హంగులతో భవన నిర్మాణం పూర్తయితే ప్లగ్ అండ్ ప్లే విధానంతో నిరంతర విద్యుత్ సరఫరా, హైరేంజ్ వైఫై సేవలు, ఇతర సౌకర్యాలన్నీ కల్పించనున్నారు. పెద్ద ఐటీ కంపెనీలను ఆకర్షించేలా రాష్ట్రంలో ఎక్కడా లేనన్ని సౌకర్యాలతో నిర్మాణం చేయనున్నారు. -
ఐటీలో 2 లక్షల ఉద్యోగాలు!!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది ఐటీ రంగం ఉద్యోగాలతో కళకళలాడనుంది. ఈ పరిశ్రమలో దాదాపు 2 లక్షల మందికి ఉపాధి లభించనుందని అంచనాలున్నాయి. ‘ఫైనాన్షియల్ సర్వీసెస్, డిజిటల్ బిజినెస్లలో మెరుగుదల.. ప్రత్యేకించి డిజిటైజేషన్, ఆటోమేషన్లలో ఇన్వెస్ట్మెంట్ల పెరుగుదల.. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం వంటి అంశాలు వ్యాపార వృద్ధికి దోహదపడతాయి’ అని టీమ్లీజ్ సర్వీసెస్ ఐటీ స్టాఫింగ్ జనరల్ మేనేజర్ ఆల్కా ధింగ్రా వివరించారు. కొత్త కంపెనీల వల్ల కూడా నియామకాలు పెరగొచ్చని, దాదాపు 20 శాతానికిపైగా ఎక్కువ కంపెనీలు ఈ ఏడాది నియామకాలు చేపట్టే అవకాశముందని పేర్కొన్నారు. 2018లో దేశీ ఐటీ పరిశ్రమలో దాదాపు 1.8–2 లక్షల కొత్త ఉద్యోగాలు ఉంటాయని అంచనా వేశారు. దేశం డిజిటల్ ఇండియా దిశగా పరుగులు పెడుతోన్న తరుణంలో ఈ పరిశ్రమకు డిజిటల్ నైపుణ్యాలు కలిగిన 50 శాతం ఎక్కువ మంది ఉద్యోగులు అవసరమౌతారని తెలిపారు. డిజిటల్ ఇండియా వల్ల డిజిటల్ టెక్నాలజీస్, ఏఐ, రోబోటిక్స్లలో ఉద్యోగాలు పెరగొచ్చన్నారు. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి పలు అంశాల కారణంగా ఇండియన్ జాబ్ మార్కెట్ మార్పు దిశగా పయనిస్తోంది. ఈ మార్పును అధిగమించి మనుగడ సాగించాలంటే నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ఒక్కటే మార్గం’ అని నిపుణులు హెచ్చరించారు. టీమ్లీజ్ అంచనా -
ఐటీలో కొత్త కెరటాలు!
న్యూఢిల్లీ: భారత ఐటీ రంగం వేగంగా మారుతోంది. దిగ్గజాలు ఆపసోపాలు పడుతుండగా... ఐటీ రంగంలో కొత్త ఆశాకిరణాలుగా మధ్య స్థాయి కంపెనీలు దూసుకొస్తున్నాయి. దిగ్గజ సంస్థలు వ్యాపార వృద్ధిలో సింగిల్ డిజిట్ వృద్ధిని నమోదు చేయడానికే నానా తంటాలూ పడుతున్నాయి. కానీ, ఇదే రంగంలోని మధ్య స్థాయి సంస్థలు మాత్రం వేగంగా అడుగులు వేస్తున్నాయి. టాప్ కంపెనీలకు మించి ఆదాయం, లాభాల్లో బలమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయి. భవిష్యత్ లీడర్లుగా, డార్క్ హార్స్లుగా ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, హెక్సావేర్ టెక్నాలజీస్, మైండ్ట్రీ కంపెనీలను విశ్లేషకులు వర్ణిస్తున్నారు. టాప్ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్ గత కొన్ని త్రైమాసికాలుగా ఆదాయం, లాభాల్లో ఒకే అంకె వృద్ధికి పరిమితమయ్యాయని వాటి ఫలితాలను పరిశీలిస్తే తెలుస్తుంది. బొమ్మ– బొరుసు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాల (ఏప్రిల్–జూన్, జూలై–సెప్టెంబర్) కాలంలో బలమైన వృద్ధిని నమోదు చేసిన హెక్సావేర్ టెక్నాలజీస్... 2017 సంవత్సరానికి డాలర్ ఆదాయం వృద్ధి అంచనాలను 14– 15%కి పెంచడం విశేషం. అంతక్రితం ఈ అంచనాలు 10–12 శాతమే. ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ మిడ్సైజు కంపెనీల్లో 1.1 బిలియన్ డాలర్ల ఆదాయంతో అతిపెద్ద కంపెనీగా ఉంది. సెప్టెంబర్ క్వార్టర్లో స్థిరమైన వృద్ధిని ప్రదర్శించింది. అధిక ఆన్షోర్, ఆఫ్షోర్ వ్యాల్యూమ్ అండతో 270.6 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. కానీ, ఇన్ఫోసిస్ విషయం మాత్రం భిన్నం. 2017–18 ఆర్థిక సంవత్సరానికి తన వృద్ధి అంచనాలను ఏకంగా 2 శాతం తగ్గించింది. విప్రో సైతం త్రైమాసిక వారీ అంచనాల పట్ల అప్రమత్తత వ్యక్తం చేసింది. ఐటీ కంపెనీ సంఘమైన నాస్కామ్ కూడా ఈ ఏడాది ఐటీ ఎగుమతులు 7–8 శాతంగా ఉండొచ్చని ప్రకటించింది. దీంతో ఐటీ రంగం మరో ఏడాది కూడా ఒకే అంకె వృద్ధికి పరిమితం కానుంది. డిజిటల్ దన్ను... ‘‘మధ్య స్థాయి ఐటీ కంపెనీల్లో హెక్సావేర్, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, సైయంట్ తదితర సంస్థలు భారీ కంపెనీల కంటే అధిక వృద్ధిని సాధిస్తున్నాయి. డిజిటల్ విధానాలపై దృష్టి సారిస్తూ డిజిటల్ టెక్నాలజీ పరంగా ఒప్పందాలను దక్కించుకుంటున్నాయి. వీటి వృద్ధి అవకాశాలు వాటి షేర్ల ధరల ప్రీమియం రూపంలో ప్రతిఫలిస్తున్నాయి’’ అని ప్రభుదాస్ లీలాధర్ అనలిస్ట్ మధుబాబు పేర్కొన్నారు. స్వతహాగా వచ్చే సాఫ్ట్వేర్ సర్వీసుల కాంట్రాక్టులు తగ్గిపోయే ప్రభావం పెద్ద, మధ్య స్థాయి కంపెనీలపై మిశ్రమంగా ఉంది. ఒకవైపు సాఫ్ట్వేర్ నిర్వహణ వంటి సంప్రదాయ సేవల ప్రాధాన్యత గణనీయంగా తగ్గిపోతుంటే, మరోవైపు డిజటల్ టెక్నాలజీ సేవలు ఇంకా సంప్రదాయ సేవల వాటా స్థాయికి చేరకపోవడం కంపెనీల వృద్ధి అవకాశాలను పరిమితం చేస్తోందంటున్నారు విశ్లేషకులు. అయితే, మధ్య స్థాయి ఐటీ కంపెనీలు మాత్రం డిజిటల్ కాంట్రాక్టుల విషయంలో పెద్ద కంపెనీలతో పోలిస్తే మెరుగ్గానే ఉన్నాయి. ఇవి డిజిటల్పై తమ ఫోకస్ పెట్టడంతో అధిక వృద్ధికి అవకాశాలను కల్పిస్తోంది. హెక్సావేర్ విధానాన్నే పరిశీలించి చూస్తే ఈ కంపెనీ ఆటోమేషన్ను ఉపయోగిస్తూ కొత్త కాంట్రాక్టులను సంపాదిస్తోంది. అదే సమయంలో ఈ రంగంలోని ఇతర మధ్య స్థాయి కంపెనీలైన మైండ్ట్రీ, కేపీఐటీ టెక్నాలజీస్ మాత్రం సంప్రదాయ విభాగాలపైనే ఇప్పటికీ ఆధారపడి కొనసాగుతున్నాయి. దీంతో పరిశ్రమలో ఉన్న వృద్ధి మందగమన ప్రభావం వాటి ఫలితాల్లో కనిపిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. చిన్న కాంట్రాక్టులతో మొదలుపెట్టి... మధ్య స్థాయి ఐటీ కంపెనీలు డిజిటల్ టెక్నాలజీ రంగంలో రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తదితర విభాగాల్లో బలమైన వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రారంభంలో ఇవి 2,00,000 డాలర్ల విలువైన చిన్న ప్రాజెక్టులను స్వీకరించడం ద్వారా డిజిటల్ టెక్నాలజీ విభాగంలో తమ సామర్థ్యాలను బలోపేతం చేసుకున్నాయి. వీటి ఫలితంగా ఆయా విభాగాల్లో నైపుణ్యాలకు తగిన కాంట్రాక్టులను సంపాదిస్తున్నాయి. పెద్ద కంపెనీల దృష్టంతా ప్రధానంగా భారీ కాంట్రాక్టులపైనే ఉంది. – మలయ్షా, అల్వారెజ్ అండ్ మార్సల్ ఇండియా సీనియర్ డైరెక్టర్ -
మాదక ద్రవ్యాల మత్తులో చిత్తవుతున్న టెకీలు
-
ఐటీ కోటకూ డ్రగ్స్ మరకలు
► మాదక ద్రవ్యాల మత్తులో చిత్తవుతున్న టెకీలు ► పదుల కంపెనీల్లో వందలాది మంది సిబ్బంది ► గుర్తించిన ఎక్సైజ్ సిట్.. ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్కు జాబితా ► కంపెనీల్లోని కెఫెటేరియాలే డ్రగ్స్కు అడ్డా ► మేం సినీ రంగాన్ని టార్గెట్ చేయడం లేదు: అకున్ సబర్వాల్ ► విచారణకు వస్తున్న సినీ ప్రముఖులు తెలివిగా వ్యవహరిస్తున్నారు ► ఆనవాళ్లు దొరక్కుండా అలోవేరా జ్యూస్ తీసుకుంటున్నారని వెల్లడి సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ మహమ్మారి ఐటీ రంగానికి కూడా విస్తరించిందా? టెకీలు సైతం మత్తులో చిత్తవుతున్నారా? సాఫ్ట్వేర్ కంపెనీల్లోని కెఫెటేరియాలే డ్రగ్స్కు అడ్డాలుగా మారాయా? అవుననే అంటున్నారు ఎక్సైజ్ అధికారులు! సిట్ దర్యాప్తులో మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల జాతకాలు బయటపడ్డట్టు తెలిసింది. డ్రగ్స్ ముఠా సభ్యులు కెల్విన్, ఖుదూస్, నిఖిల్ శెట్టి, విలియమ్స్, జీశాన్ల విచారణలో ఈ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పదుల కంపెనీల్లోని వందలాది మంది సిబ్బంది మత్తుకు బానిసయ్యారని స్వయంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వెల్లడించారు. వారి జాబితా రూపొందించి ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్కు సమర్పించినట్టు పేర్కొన్నారు. తాము కేవలం సినీ పరిశ్రమనే టార్గెట్ చేస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని, డ్రగ్స్కు అలవాటు పడ్డవారందని విచారిస్తున్నామని స్పష్టంచేశారు. ఇప్పటిదాకా 27 మందికి నోటీసులు జారీ చేశామని, 12 మందిని సిట్ కార్యాలయంలో విచారిస్తుండగా.. మిగతా వారిని వివిధ ప్రాంతాల్లో సిట్ బృందాలు విచారిస్తున్నాయని అకున్ తెలిపారు. మంగళ«వారం సచివాలయంలో హరితహారం, గుడుంబా రహిత రాష్ట్రం తదితర అంశాలపై జరిగిన సమీక్షలో ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, డైరెక్టర్ అకున్ సబర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో జరిపిన చిట్చాట్లో అనేక విషయాలు వెల్లడించారు. అలోవేరా జ్యూస్ తాగి వస్తున్నారు.. డ్రగ్స్ కేసులో విచారణకు హాజరవుతున్న సినీ ప్రముఖులంతా చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని అకున్ అభిప్రాయపడ్డారు. డ్రగ్స్ తీసుకుంటున్నట్టు బయటపడకుండా ఉండేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు నీళ్లకు బదులు అలోవేరా జ్యూసులు, విలువైన హోమియోపతి డ్రింక్స్ సేవిస్తున్నారని తెలిపారు. ఇక్కడ దొరకని డ్రింక్స్ను విదేశాల నుంచి ఆగమేఘాల మీద తెప్పించుకొని మరీ వాడుతున్నారని చెప్పారు. రక్త పరీక్షల్లో డ్రగ్స్ ఆనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు ఇలా చేస్తున్నారన్నారు. ఇక వెంట్రుకల ద్వారా బయటపడకుండా ఉండేందుకు ఖరీదైన షాంపులతో తలస్నానం విచారణకు హాజరవతున్నారని తెలిపారు. పవర్ఫుల్ షాంపులు వాడితే డ్రగ్స్ ఆనవాళ్లు అంత పక్కాగా రావన్న అభిప్రాయం ఉండటంతో ఇలా చేస్తున్నట్టు వివరించారు. పాఠశాలల్లో సీరియస్ రియాక్షన్ డ్రగ్స్కు బానిసైన విద్యార్థులను డీఅడిక్షన్ చేయడంతోపాటు భారీ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అకున్ తెలిపారు. ఇప్పటికే అనేక పాఠశాలలు, కాలేజీల్లో ఆయా యాజమాన్యాలు డ్రగ్స్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నాయన్నారు. అందులో భాగంగా స్కూల్ లోపలికి సెల్ఫోన్లను నిషేధించారన్నారు. అలాగే కాల్డేటాపై కూడా తమ నిఘా ఉండటంతో ఏమాత్రం డ్రగ్స్ వైపు ఆలోచించడం లేదన్నారు. తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చామని, ప్యాకెట్ మనీకి కోత విధించేలా చర్యలు తీసుకున్నామన్నారు. పాఠశాలలు, కాలేజీల్లోని బాత్రూమ్ల్లో యాజమన్యాలు తనిఖీలు చేస్తున్నాయన్నారు. రోజుకు 400 కేజీల గంజాయి రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి రాగానే తమ విభాగం, పోలీసు శాఖ వరుస దాడులు నిర్వహిస్తున్నాయని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ తెలిపారు. దీంతో ప్రతిరోజు 300 నుంచి 400 కేజీల గంజాయి పట్టుబడుతోందని పేర్కొన్నారు. ఎగువ సీలేరు, దిగువ సీలేరు ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో రాష్ట్రంలోకి గంజాయి సరఫరా అవుతోందని చెప్పారు. పరోక్షంగా నిందితురాలని ఒప్పుకున్నట్టయింది.. తాము చార్మిని నిందితురాలిగా భావించలేదని, కేవలం వివరాలు సేకరించేందుకు రావాలని కోరినట్లు చంద్రవదన్ తెలిపారు. కానీ ఇప్పుడు ఆమె కోర్టుకు వెళ్లి పరోక్షంగా తాను నిందితురాలని ఒప్పుకున్నట్టయిందని అభిప్రాయపడ్డారు. చార్మిని తనకు నచ్చిన ప్రాంతంలోనే విచారిస్తామని చెప్పామన్నారు. కానీ కోర్టుకు వెళ్లడంతో సిట్ కార్యాలయంలోనే విచారణకు రావాల్సి ఉంటుందన్నారు. చార్మి, ముమైత్ఖాన్ను విచారించేందుకు మహిళా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నేతృత్వంలో ముగ్గురు మహిళా సీఐలను నియమించినట్టు తెలిపారు. ప్రముఖ హీరోలు, బడా నిర్మాతలు విచారణ ఎదుర్కొంటున్నవారు.. ప్రముఖ హీరోలు, హీరోయిన్ల పేర్లు చెబుతున్నారని, ఇండస్ట్రీలోని బడా నిర్మాతలు కూడా డ్రగ్స్ వాడుతున్నారని వెల్లడిస్తున్నట్టు చంద్రవదన్ తెలిపారు. అయితే వారు చెబుతున్న అంశాల ఆధారంగా వెంటనే నోటీసులు ఇవ్వలేమని, వారు చెప్పే అంశాలకు బలం చేకూర్చే ఆధారాలను సంపాదించే పనిలో సిట్ ఉందన్నారు. సినీ ఇండస్ట్రీలో చీలిక ఏర్పడినట్టు వార్తలు వస్తున్నాయని, విచారణ ఎదుర్కొంటున్నవారు ఇంకో గ్రూపు వారి గురించి చెబుతున్నట్టు కనిపిస్తోందన్నారు. తెలంగాణ–ఆంధ్రా అన్న భావనను కూడా తెరపైకి తెచ్చే యత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. డ్రగ్ తీసుకున్న వారిని సులభంగా గుర్తించేందుకు అథ్లెటిక్స్కు ఉపయోగించే డోపింగ్ టెస్ట్ మిషన్ను ఢిల్లీ నుంచి తెప్పించాలని ప్రభుత్వాన్ని కోరామని, అయితే కొన్ని న్యాయపరమైన చిక్కుల వల్ల అది కుదరలేదని చంద్రవదన్ చెప్పారు. డ్రగ్ కేసులో ప్రతిరోజు ప్రభుత్వానికి నివేదిక పంపిస్తున్నామన్నారు. నటి గౌతమి ఆధ్వర్యంలో డీ అడిక్షన్ సెంటర్! ప్రస్తుతం డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల పేర్లు ఎక్కువగా వినిపిస్తుండటంతో ఎక్సైజ్ శాఖ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. నటి గౌతమి హాసన్ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వచ్ఛంద సంస్థ ద్వారా త్వరలో పెద్దఎత్తున డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు యత్నాలు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. దీనిద్వారా డ్రగ్స్ బాధితులందరికీ విముక్తి కల్పించే ప్రయత్నం చేస్తున్నట్టు వారు తెలిపారు. -
ఐటీ లైఫ్.. కల చెదిరిందా?
- సాఫ్ట్వేర్ కొలువులపై మెత్తని కత్తి - ఉద్యోగ భద్రత లేక అల్లాడుతున్న ఐటీ ఉద్యోగులు - ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళన.. ఇల్లు, వాహనాల కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్న ఉద్యోగులు - నగరంలో గృహ నిర్మాణ కార్యకలాపాలు తగ్గుముఖం - అమ్మకాలు తగ్గుతున్నాయంటున్న బిల్డర్లు - కార్ల అమ్మకాల్లోనూ మందగమనం - అమెరికాలోనూ అదే పరిస్థితి.. ఒక్క కొలువుకు పది మంది పోటీ - కనుమరుగవుతున్న కన్సల్టెన్సీలు ⇒4,000 నగరంలో గత మూడు నెలల్లో వేటు పడిన ఉద్యోగుల సంఖ్య ⇒65% అమెరికాలో తగ్గిన క్యాంపస్ రిక్రూట్మెంట్లు సాక్షి, హైదరాబాద్: ⇒ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో టెక్నికల్ కన్స ల్టెంట్గా పని చేస్తున్న విక్రమ్రెడ్డి హైటెక్ సిటీ ప్రాంతంలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేయడానికి బిల్డర్తో అగ్రిమెంట్ చేసుకున్నాడు. బ్యాంక్ రుణానికి దరఖాస్తు చేయడం, బ్యాంక్ ఆ మొత్తాన్ని మంజూరు చేయడం చకచకా జరిగి పోయింది. ఇంకేముంది.. సొంతింటి కల నెర వేరుతుందని ఆశపడ్డాడు. అంతలోనే ఆయన పని చేస్తున్న ఆఫీసులో ఒకేరోజు 25 మందిని ఉద్యోగాల్లోంచి తొలగించడంతో అభద్రతాభా వానికి లోనయ్యాడు. బిల్డర్ వద్దకు వెళ్లి తాను చెల్లించిన అడ్వాన్స్లో 10 శాతం వదులుకుని మిగిలిన మొత్తాన్ని వెనక్కి తీసుకున్నాడు. ⇒ ఇంజనీరింగ్ కాగానే ప్రముఖ ఐటీ కంపె నీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరి ఐదేళ్లుగా పని చేస్తున్న అరవింద్కు తల్లిదండ్రులు పెళ్లి సంబం« దం చూశారు. ముహూర్తం కూడా నిర్ణయిం చారు. పెళ్లికి సరిగ్గా మూడు వారాల ముందు ఉద్యోగానికి రాజీనామా చేయాలంటూ కంపెనీ నుంచి అరవింద్కు ఆదేశం అందింది. దీంతో దిక్కుతోచని ఆయన కుదుర్చుకున్న పెళ్లిని రద్దు చేసుకున్నాడు. ప్రముఖ ఐటీ కంపెనీలు ఎడాపెడా ఉద్యో గాలు తొలగిస్తుండటంతో వాటిలో పని చేస్తు న్న వేలాది మంది అభద్రతాభావంతో బిక్కు బిక్కుమంటున్నారు. గడచిన మూడు నెలల్లోనే హైదరాబాద్లోని ఐటీ కంపెనీలు 4 వేల మం ది ఉద్యోగులను తొలగించాయి. 23 చిన్నాచి తక సాఫ్ట్వేర్ సంస్థలు మూతపడ్డాయి. కళ్ల ముందే సహచరులు ఉద్యోగాలను కోల్పోతుం డటంతో మిగతావారు భవిష్యత్పై బెంగ పెట్టుకుంటున్నారు. ఎప్పుడేమవుతుందో తెలి యక కొందరు.. ఇల్లు కొనుగోలుకు ఇచ్చిన అడ్వాన్స్ను వెనక్కి తీసుకుంటున్నారు. సైబరా బాద్ ఏరియాలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ బహుళ అంతస్తుల సముదాయంలో ఫ్లాట్ బుక్ చేసుకున్న ఐటీ ఉద్యోగుల్లో మూడొంతుల మంది ఇలా డబ్బులు వెనక్కి తీసుకున్నారు. ఉద్యోగ భద్రత లేకపోవడంతో సొమ్ము వెనక్కి తీసుకుంటున్నామన్న వారి ఆవేదనను అర్థం చేసుకున్న సదరు సంస్థ అడ్వాన్స్ బుకింగ్ నగదులో 10% కోత పెట్టకుండానే వెనక్కి ఇచ్చేసింది. మరికొన్ని సంస్థలు మాత్రం కొత్త బుకింగ్ వస్తేనే డబ్బులు వాపస్ చేస్తామని మొండికేస్తున్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలపై ఆధారపడ్డ స్టార్టప్ కంపెనీలు కూడా ప్రాజెక్టు ల్లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ‘‘రూ.48 వేల నెలసరి వాయిదాతో ఇల్లు కొనుగోలు చేయవచ్చు. కానీ ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియనప్పుడు అంత రిస్క్ తీసుకోవడం అవసరమా? అందుకే నేను ఇల్లు కొనుగోలు చేయాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకున్నా..’’అని మాదాపూర్లోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్న శ్రీనివాస్ వాపో యాడు. తన లాంటి వారు వందలాది మంది ఇప్పుడు ఉద్యోగ భద్రత లేక అయోమయంలో పడ్డారని, కొందరైతే పెళ్లిళ్లు కూడా రద్దు చేసుకున్నారని చెప్పాడు. మాదాపూర్లో కార్ల డీలర్లు.. గడచిన ఏడాది విక్రయించిన కార్లలో ఈసారి సగం కూడా అమ్మడం లేదు. ‘అమ్మకాల సంగతెలా ఉన్నా... కనీసం ఎంక్వైరీలు కూడా రావడం లేదు. కారు బుక్చేసి డెలివరీ అయ్యే సమయానికి రద్దు చేసుకుంటున్నార’ని ప్రముఖ కార్ల డీలర్ ఎగ్జిక్యూటివ్ సోమసుందర్ పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టులు లేకపోవడం వల్లే.. గడచిన ఏడాది నుంచి కొత్తగా ప్రాజెక్టులు లేకపోవడం వల్లే సీనియర్ ఉద్యోగులను వదులుకోవాల్సి వస్తోందని బెంగళూరు ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ఐటీ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఓ వెబ్సైట్లో పేర్కొన్నారు. ‘‘2012–2014 సంవత్సరాలతో పోలిస్తే 2014–2016లో దాదాపు అన్ని కంపెనీలకు 26 నుంచి 40 శాతం మేర కొత్త ఆర్డర్లు తగ్గిపోయాయి. ఆ మేరకు మేం ఖర్చులు తగ్గించుకుంటేనే మా ఆదాయాన్ని స్థిరంగా కాపాడుకోగలుగుతాం. అప్పుడే మా ఇన్వెస్టర్లకు మాపై విశ్వాసం సడలకుండా ఉంటుంది. అందుకు.. అవసరం లేని ఉద్యోగులను వదులుకోవడం తప్ప మరో మార్గం లేదు’’అని ఆయన వివరించారు. వృత్తి నైపుణ్యం లేనివారిని వదిలించుకుంటే సమస్య ఏమిటి? దానికి అంతగా గగ్గోలు పెట్టాల్సిన అవసరం ఉందా అంటూ ముంబై ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ సీనియర్ అధికారి ఒకరు అదే వెబ్సైట్లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అదే నిజమైతే నైపుణ్యం లేని వీరికి ఐదారేళ్లలో వారి వేతనాలను 300 నుంచి 400 శాతం ఎందుకు పెంచాల్సి వచ్చిందని ఐటీ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. వారికి కేవలం వారి కంపెనీల బాగు తప్ప సామాజిక బాధ్యత లేదని మండిపడుతున్నారు. సీనియర్లను వదిలించుకుంటూ.. ఓవైపు సీనియర్ ఉద్యోగులను వదిలించుకుంటున్న కంపెనీలు మరోవైపు ఈ ఏడాది జోరుగా క్యాంపస్ నియామకాలకు సిద్ధమవుతున్నాయి. వివిధ కాలేజీల నుంచి అందిన సమాచారం ప్రకారం.. గడచిన ఏడాది కంటే ఈ ఏడాది కంపెనీలు 10 శాతం ఎక్కువగా ఉద్యోగులను నియమించుకోబోతున్నాయి. ‘‘మా కాలేజీకి వచ్చే దాదాపు అన్ని కంపెనీలు ఈ ఏడాది 10 శాతం ఎక్కువకు ఇండెంట్ ఇచ్చాయి. వాటిలో దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీలతో పాటు బహుళజాతి కంపెనీలు కూడా ఉన్నాయి’’అని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ ప్లేస్మెంట్ అధికారి ఒకరు చెప్పారు. గతేడాది క్యాంపస్ రిక్రూట్మెంట్కు రాని సంస్థలు కూడా ఈసారి నియామకాలకు ముందుకొస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రారంభ స్థాయి ఉద్యోగులకు తక్కువ వేతనం ఇచ్చి ఎక్కువ పని చేయించుకునేందుకు ఐటీ సంస్థలు ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే నాస్కామ్ వీటిని తిప్పి కొడుతోంది. కొత్తగా ప్రాజెక్టులు లేనప్పుడు కొత్త ఉద్యోగులతో 75 శాతం పనులు చేసుకోగలుగుతామని చెబుతోంది. అమెరికాలోనూ ఇదే పరిస్థితి అమెరికాలోనూ పరిస్థితులు ఇందుకు భిన్నంగా లేవు. ఐటీ ఉద్యోగాల కోసమే ఎంఎస్ చేసేందుకు అక్కడికి లక్షల సంఖ్యలో వెళ్లిన విద్యార్థులకు ఉద్యోగం దొరకడం గగనమైంది. గడచిన నాలుగేళ్లలో అమెరికా విశ్వవిద్యాలయాల నుంచి ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన వారు 2.75 లక్షల మంది ఉన్నారంటేనే ఉద్యోగాల కోసం పోటీ ఎంత తీవ్రస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ ఏడాది 1.25 లక్షల మంది ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం వేట మొదలుపెట్టారు. రెండేళ్ల క్రితం కన్సల్టెన్సీ సంస్థల ద్వారా తేలిగ్గా ఉద్యోగం సాధించిన వారికి ఇప్పుడు అది అంత ఈజీగా లేదు. కన్సల్టెన్సీ సంస్థలు దొంగ సర్వీసు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని యూఎస్ లేబర్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. దీంతో ఈ ఏడాది 13 శాతం కన్సల్టెన్సీలు మూతపడ్డాయి. దానికి తోడు ఐటీ వృత్తి నిపుణులు ఏటా లక్షల సంఖ్యలో యూనివర్సిటీల నుంచి బయటకు వస్తుండటం కూడా ఉద్యోగాలు దొరకకపోవడానికి ప్రధాన కారణమని న్యూయార్క్ టైమ్స్ ఇటీవల ప్రత్యేక కథనంలో విశ్లేషించింది. ‘ఇప్పుడు అమెరికాలో ఒక వృత్తి నిపుణుడు అవసరం ఉంటే పది మంది పోటీ పడే పరిస్థితి ఉంది. ఇది మున్ముందు మరింత పెరిగే అవకాశాన్ని ఇక్కడి విశ్వవిద్యాలయాలు పెంచి పోషిస్తున్నాయి. కంప్యూటర్ సైన్స్ కోర్సులకు ప్రాచుర్యం కల్పించి విదేశీ విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేసే పనిలో బిజీగా ఉన్నాయి’’అని విరుచుకుపడింది. దానికి తోడు కనీస వార్షిక వేతనం 80 వేల డాలర్లు చేయడంతో ఐటీ సంస్థలు నియామకాలను తగ్గించుకుంటున్నాయి. గతేడాది అమెరికాలో విశ్వవిద్యాలయాల నుంచి జరిపిన రిక్రూట్మెంట్లతో పోల్చి చూస్తే ఈ ఏడాది 65 శాతం నియామకాలు తగ్గాయి. (చదవండి: పుణెలో తెలుగు టెకీ ఆత్మహత్య) -
ఐటీ సెక్టార్కు మరింత బ్యాడ్ న్యూస్
ముంబై : ఐటీ రంగానికి మరింత బ్యాడ్ న్యూస్. గ్లోబల్ ఐటీ రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ మరోసారి ఐటీ వ్యయాల వృద్ధి అంచనాలను తగ్గించింది. డిజిటైజేషన్ ఆందోళనతో 2.7 శాతంగా అంచనావేసిన వ్యయాల వృద్ధిని 2017లో 2.4 శాతానికి తగ్గిస్తున్నట్టు పేర్కొంది. తొలుత ప్రపంచవ్యాప్తంగా ఐటీ వ్యయాల వృద్ధి 3 శాతంగా గార్ట్నర్ అంచనావేసింది. తర్వాత దీన్ని ఈ ఏడాది జనవరి సమీక్షలో 2.7 శాతానికి కుదించింది. భవిష్యత్తు ఐటీ ఇండస్ట్రీ వృద్ధిపై ఆందోళనకర పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో గార్ట్నర్ రెండోసారి ఈ ఏడాదిలో వ్యయాల వృద్ధి అంచనాలను తగ్గించేసింది. అదేవిధంగా వ్యయాల వృద్ధి అంచనాలు పడిపోవడంతోపాటు ఆటోమేషన్ పెనుముప్పులా ముంచుకొస్తుడటం, రక్షణాత్మక ధోరణి భారత్లో ఉద్యోగాల కోతపై భయాందోళనను కూడా కలిగిస్తున్నాయి. 155 బిలియన్ డాలర్ల మన దేశీయ ఐటీ సెక్టార్ ఎక్కువగా ఎగుమతులపైనే ఆధారపడి ఉంది. నాస్కామ్ కూడా గత నెలలో 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల వృద్ధిని తక్కువగా 7-8 శాతంగానే అంచనావేసింది. ప్రస్తుత వ్యాపారాలకు డిజిటల్ బిజినెస్లు లోతైన ప్రభావం చూపుతున్నాయని గార్ట్నర్ వైస్ ప్రెసిడెంట్ జాన్-డేవిడ్ లవ్లాక్ ప్రకటనలో తెలిపారు. డిజిటల్ బిజినెస్లు, కొత్త కేటగిరీలు సాఫ్ట్వేర్ ప్లస్ సర్వీసెస్, మేధోసంపత్తి హక్కుల్లో వృద్ధికి దోహదం చేస్తాయన్నారు. అయితే గార్ట్నర్ ప్రస్తుతం అంచనావేసిన వ్యయాల వృద్ధి అంచనాలు 2016లో సాధించిన దానికంటే 0.3 శాతం వేగవంతంగానే ఉన్నాయి. ఇది ఇండస్ట్రీని 3.477 ట్రిలియన్ డాలర్ల డాలర్లకు తీసుకెళ్తుందని గార్ట్నర్ భావిస్తోంది. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కొత్తగా పెళ్లి కష్టాలు
ముంబై : ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకున్న డిమాండ్ అంతాఇంతా కాదు. ఇక అబ్బాయి తల్లిదండ్రులైతే, తమ కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పిలిచి మరీ పిల్లను ఇస్తారంటూ తెగ భరోసాతో ఉండేవారు. అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఎక్కువగా తమ అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే బాగుండును అనుకుంటూ జల్లెడ వేసి మరీ సాఫ్ట్వేర్లను వెతికి పట్టుకుని తమ కూతురికిచ్చి కట్టబెట్టేవారు. అయితే తాజాగా ఐటీ ఇండస్ట్రీలో నెలకొన్న లేఆఫ్స్ బెడద, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కొత్తగా పెళ్లి కష్టాలు తెచ్చిపెడుతోంది. మ్యారేజ్ మార్కెట్లో వారికి ఉన్న పాపులారిటీ అంతకంతకు పడిపోతుందని మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ట్రెండ్లు వెల్లడిస్తున్నాయి. ఐటీ ఇండస్ట్రీలో నెలకొన్న భారీగా ఉద్యోగాల కోత, ఆటోమేషన్ ప్రభావం, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవిలోకి వచ్చిన తర్వాత కల్లలవుతున్న డాలర్ కలలు వీరి డిమాండ్కు గండికొడుతున్నాయి. ముఖ్యంగా అరేంజ్ మ్యారేజ్ల విషయంలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందట. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే కూతురి తల్లిదండ్రులు వెనుకాడుతున్నారని తెలుస్తోంది. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్నే అల్లుడిగా కోరుకునేవారు, ఇప్పుడు ఉద్యోగంఎప్పుడు ఊడుతుందో తెలియని వారికి పిల్లను ఎలా ఇచ్చేది అంటూ వెనుకకు జంకుతున్నారని మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లు పేర్కొంటున్నాయి. ఇటీవల ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, బిజినెస్ అల్లుళ్ల కోసం అమ్మాయి తల్లిదండ్రులు ఎక్కువగా కాల్ చేస్తున్నారని తెలిసింది. 2017 ప్రారంభం నుంచి ఐటీ ప్రొఫిషనల్స్ ను అమ్మాయిలు తక్కువగా కోరుకుంటున్నారని షాదీ.కామ్ సీఈవో గౌరవ్ రక్షిత్ తెలిపారు. భారత్లో అతిపెద్ద మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో షాదీ.కామ్ కూడా ఒకటి. ఇక అమెరికాలో సెటిలైన జీవిత భాగస్వాములను కూడా అమ్మాయిలు తక్కువగా చూస్తున్నారని చెప్పారు. ఈ ట్రెండ్ నవంబర్ నుంచి కొనసాగుతుందన్నారు. ఈ తగ్గింపు నవంబర్లో 11 శాతముంటే, ఫిబ్రవరికి వచ్చే సరికి ఇదీ మరింత తగ్గి 15 శాతానికి చేరుకుందని గౌరవ్ తెలిపారు. ట్రంప్ అనుసరిస్తున్న విధానాలతో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలు ఊడుతున్నాయి. అమెరికాలో ఉద్యోగాలు చేసే వారు స్వదేశ బాటపడుతున్నారు. షాదీ.కామ్లోనే కాక, జీవన్సాథి.కామ్లో కూడా ఇదే ట్రెండ్. దీంతో ఐటీ ప్రొఫిషనల్స్కు లేఆఫ్స్ ఇబ్బందులు మాత్రమేకాక, కొత్త కష్టాలు వస్తున్నట్టు తెలిసింది. -
ఐటీ వృద్ధి మందగించింది
♦ అందుకే కొత్త నియామకాలు, ప్రమోషన్ల అవకాశాల తగ్గుదల ♦ భారీగా ఉద్యోగాల కోతలేమీ లేవు ♦ ఇన్ఫీ క్రిస్ గోపాలకృష్ణన్ వ్యాఖ్యలు హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కొత్తగా నియామకాలు, ప్రమోషన్ల అవకాశాలు తగ్గడానికి ఐటీ రంగం వృద్ధి మందగించడమే కారణమని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ చెప్పారు. ఐటీలో భారీగా ఉద్యోగాల కోతల వార్తలను ఆయన కొట్టిపారేశారు. ‘వృద్ధి రేటు తగ్గినప్పుడు.. కొత్తగా ఉద్యోగులను తీసుకోవాల్సిన అవసరం కూడా తక్కువగా ఉంటుంది. రెండోదేమిటంటే.. మరింత ఎక్కువ మంది ఉద్యోగులు అవసరం లేనందువల్ల ప్రమోషన్ అవకాశాలూ కూడా తగ్గుతాయి‘ అని పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వూ్యలో క్రిస్ పేర్కొన్నారు. ‘భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడాన్ని నేనైతే చూడలేదు.. వినలేదు. సాధారణంగా ప్రమోషన్ల ప్రక్రియ ఎప్పుడూ కఠినతరం అవుతూనే ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా జరిగిపోతుంది‘ అని ఆయన వివరించారు. ఇకపైనా ప్రమోషన్ల ప్రక్రియ కఠినతరంగా ఉంటుందని, మదింపు ప్రక్రియ మరింత కఠినతరం అవుతుందని క్రిస్ చెప్పారు. అయితే ఐటీ రంగంలో ఇది సర్వసాధారణమని.. గతంలో 2001లో, 2008లోనూ ఇలాంటివే చోటుచేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ఐటీ రంగ వృద్ధిపై ప్రస్తుతం పలు అంశాలు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయన్నారు. భారత ఐటీ ఎక్కువగా ఆధారపడే అమెరికా, యూరప్లో వృద్ధి మందగించడం ఒక కారణం కాగా, ప్రస్తుతం కూడా మెరుగైన వృద్ధి సాధిస్తున్నప్పటికీ.. ఇప్పటికే దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం భారీగా పెరగడంతో ’బేస్ ఎఫెక్ట్’ వల్ల అది నామమాత్రంగానే కనిపిస్తుండవచ్చని క్రిస్ చెప్పారు. ఐటీ ఉద్యోగుల యూనియన్ అనవసరం.. ఐటీ రంగ ఉద్యోగులు యూనియన్ ఏర్పాటు ప్రతిపాదనపై స్పందిస్తూ.. ఇది సరైన యోచన కాదని క్రిస్ వ్యాఖ్యానించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగ ఉద్యోగులు భారీ జీతాలే అందుకుంటున్నారని, కంపెనీలూ వారిని బాగానే చూసుకుంటున్నాయని, పైగా ఉద్యోగాలు మారేందుకు వారికి అనేక అవకాశాలూ ఉన్నాయన్నారు. ‘ఐటీలో యూనియన్ ఏర్పాటు ఆలోచన సరికాదు. ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న వారికైతే అది అర్థవంతంగా ఉంటుంది. కానీ, ఐటీ రంగం అలాంటిది కాదు. ఉద్యోగులకు మంచి జీతాలు ఉంటాయి. అలాగే ప్రత్యామ్నాయంగా అవకాశాలూ ఉంటాయి’ అని క్రిస్ చెప్పారు. ఐటీలో ఇప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మొదలైన కీలక విభాగాల్లో ఇప్పటికీ సిబ్బంది అవసరమన్నారు. సరైన నిపుణులు దొరకని అమెరికా కంపెనీలు.. భారత్ వైపు మొగ్గు చూపొచ్చని క్రిస్ పేర్కొన్నారు. -
ఐదేళ్లలో 8 లక్షల ఐటీ ఉద్యోగాలు..
-
ఐదేళ్లలో 8 లక్షల ఐటీ ఉద్యోగాలు
-
ఐదేళ్లలో 8 లక్షల ఐటీ ఉద్యోగాలు
ఐటీ రంగం పురోగతి నివేదిక ఆవిష్కరణలో కేటీఆర్ - 2022 నాటికి ఏటా రూ.1.20 లక్షల కోట్ల ఐటీ ఉత్పత్తులు - 2016–17లో 13.85 శాతం వృద్ధితో ఈ రంగం దూకుడు - 24,506 కొత్త ఉద్యోగులతో 4,31,891కి పెరిగిన ఉద్యోగుల సంఖ్య - నగదు రహిత లావాదేవీల కోసం టీ–వాలెట్ను ఆవిష్కరించిన మంత్రి సాక్షి, హైదరాబాద్: మూడేళ్ల కింద ఎన్నో అనుమానాలతో ప్రారంభమైన తెలంగాణ పారిశ్రామిక, ఐటీ రంగ ప్రస్థానం.. దిగ్విజయంగా, అప్రతిహతంగా ముందుకు సాగుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. 2022 నాటికి రాష్ట్ర ఐటీ ఉత్పత్తుల ఎగుమతులను రూ.1.20 లక్షల కోట్లకు పెంచుతామని.. 8 లక్షల కొత్త ఐటీ కొలువులు సృష్టిస్తామని ప్రకటించారు. మూడేళ్ల కిందే తాను ఈ లక్ష్యాన్ని ప్రకటించానని.. ఆ దిశగా రాష్ట్ర ఐటీ రంగం పురోగమిస్తోందని తెలిపారు. గురు వారం హైదరాబాద్లోని ఒక హోటల్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ రంగ పురోగతి వార్షిక నివేదికను కేటీఆర్ విడుదల చేశారు. అనంతరం నగదు రహిత లావాదేవీ లను ప్రోత్సహించేందుకు రూపొందించిన ‘టీ–వ్యాలెట్’ మొబైల్ యాప్ను ఆవిష్కరించి, ప్రసంగించారు. జాతీయ సగటును మించి.. 2013–14లో రూ.57,258 కోట్లుగా ఐటీ ఉత్పత్తుల ఎగుమతులు 2014–15లో రూ.66, 276 కోట్లకు, 2015–16లో రూ.75,070 కోట్లకు చేరాయని కేటీఆర్ చెప్పారు. 2016– 17లో రూ.85,470 కోట్లకు పెరిగి, 13.85 శాతం వృద్ధి సాధించిందని.. ఇది జాతీయ సగటు కంటే 4% అధికమని చెప్పారు. మూడే ళ్లుగా రాష్ట్రం ఐటీ దిగుమతుల్లో జాతీయ వృద్ధి రేటును మించిన గణాంకాలు సాధిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో గతేడాది కొత్తగా 24,506 మందికి ఐటీ కొలువులు లభించాయని, దీంతో రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 4,31,891కు పెరిగిందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకు ఐటీ ఐటీ, అనుబంధ రంగాలను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరింపజేసేందుకు గ్రామీణ సాంకేతిక విధానాన్ని ప్రకటించామని కేటీఆర్ తెలిపారు. వరంగల్, జనగామ, హుజూరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో ఐటీ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటు న్నామని చెప్పారు. త్వరలో ఖమ్మంలో ఐటీ పార్కును ప్రారంభిస్తామన్నారు.టీ–హబ్ విజయగాథ నీతి ఆయోగ్తోపాటు 12 రాష్ట్రాల ప్రభుత్వాలు, ఉబర్ సీఈవో, ఆస్కార్ అవార్డు గ్రహీతలు ఏఆర్ రహ్మాన్, రసూల్ ఫుకుట్టీ తదితర ప్రముఖుల నుంచి ప్రశంసలు అందాయని కేటీఆర్ పేర్కొన్నారు. టీ–హబ్లో ప్రస్తుతం 250 స్టార్టప్స్ ఉన్నాయని, ఏడాదిన్నర కాలంలో రూ.100 కోట్ల ఆదాయాన్ని గడించాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీలు బాల్క సుమన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఐటీ–పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో కంపెనీల క్యూ ఏడాది కాలంలో అమెజాన్, సేల్ఫోర్స్, జేఎఫ్, సింక్రోనీ ఫైనాన్షియల్, ఉబర్, డీబీఎస్, ఫ్లైదుబాయ్, నావిజ్ అనాలిక్స్ వంటి పెద్ద కంపెనీలు హైదరాబాద్కు వచ్చాయని కేటీఆర్ చెప్పారు. మహేశ్వరం, శంషాబాద్లలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పార్కులను ఏర్పాటు చేస్తున్నామని.. ఎల్ఈడీలు, స్మార్ట్ఫోన్ల తయారీ పరిశ్రమలను రాష్ట్రానికి తీసు కొస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో హవా కొనసాగిస్తున్న డేటా అనాలి టిక్స్, ఓపెన్ డేటా రంగాలను ప్రోత్సహించేం దుకు ప్రత్యేక పాలసీలు తీసుకొచ్చామన్నారు. టీ–ఫైబర్ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని కోటి ఇళ్లకు ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. జూన్ నాటికి హైదరాబాద్లోని 1,000 ప్రాంతాల్లో వైఫై సదుపాయం కల్పించామని, మరో 2,500 హాట్స్పాట్లను గుర్తించామని చెప్పారు. ట్వీటర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలతో అనుసంధానమై సమస్యలు పరిష్కారించాలని జిల్లా కలెక్టర్లకు సూచించామన్నారు. చార్జీల భారం లేకుండా ‘టీ–వాలెట్’ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘టీ–వాలెట్’ను రూపొందించిందని.. దాని ద్వారా లావాదేవీలకు చార్జీలూ ఉండవని కేటీఆర్ తెలిపారు. ఈ– గవర్నెన్స్, ఎం– గవర్నెన్స్ (మొబైల్– గవర్నెన్స్)ను ప్రోత్సహిం చేందుకు ఈ యాప్ను ప్రవేశపెట్టామ న్నారు. అన్నిరకాలుగా పరీక్షించిన అనంతరం టీ–వాలెట్ యాప్ను ఆవిష్కరించామని, ఇందులో ఎలాంటి భద్రతా లోపాలకు తావు లేదని చెప్పారు. ప్రభుత్వం–ప్రజల మధ్య పరస్పర లావాదేవీల కోసం ఈ యాప్ ఉపయోగపడుతుందని.. పెన్షన్లు, స్కాలర్షిప్లు, పన్నుల చెల్లింపు వంటి వాటికి ఉపయోగకరమని తెలిపారు. -
ట్రంప్ విధానాలతో ఐటీ వృద్ధికి విఘాతం
టెక్ మహీంద్రా వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ వీసా విధానాలు దేశీ ఐటీ రంగ వృద్ధిని తీసే ప్రమాదముందని టెక్ మహీంద్రా వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ వ్యాఖ్యానించారు. అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే నినాదంతో హెచ్1బీ వీసాల నిబంధనలు కఠినతరం చేయడం ఐటీపై ప్రతికూల ప్రభావం చూపనుందని ఆయన పేర్కొన్నారు. వీసా కోటాలు, కేటాయింపులు మొదలైన విధానాల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకోవచ్చని, అమెరికాలో నిష్ణాతుల సేవలను వినియోగించుకోవాలనుకునే భారత ఐటీ కంపెనీల వ్యయాల భారం పెరగనుందని ఇన్వెస్టర్లతో కాన్ఫరెన్స్ కాల్లో నయ్యర్ చెప్పారు. మార్చి త్రైమాసికంలో టెక్ మహీంద్రా లాభం 31 శాతం క్షీణించి రూ. 588 కోట్లకు పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ఆర్థిక సేవల సంస్థలు కంపెనీ షేరు ధర టార్గెట్లను రూ. 380 స్థాయి దాకా తగ్గించాయి. -
ఐటీ లేఆఫ్స్: గోరంతైతే, కొండంత చేస్తున్నారు
ఐటీ పరిశ్రమలో ఇటీవల నెలకొన్న లేఆఫ్స్ ఆందోళన తెలిసిందే. భారీ ఎత్తున్న కంపెనీలు ఉద్యోగాలు పీకేస్తున్నారంటూ పలు రిపోర్టులు టెకీల గుండెల్లో దడలు పుట్టిస్తున్నాయి. అయితే ఐటీ పరిశ్రమలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి అతిశయోక్తిగా ఉందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ''పర్ ఫార్మెన్స్ ఆధారంగా సాధారణంగా ఉద్యోగులపై వేటు వేయడం ప్రతి ఇండస్ట్రిలో ఓ అంతర్గత భాగం. దీన్ని మరీ అతిశయోక్తి చేయడం అంత మంచిది కాదు. ఆందోళన చెందడానికి ఎలాంటి కారణాలు లేవు. సాధారణంగా జరిగే ప్రక్రియను కొండంత చేసి చూస్తున్నారు'' అని మంత్రి చెప్పారు. తమ మంత్రిత్వశాఖ లేఆఫ్స్ పరిస్థితిపై ఎప్పడికప్పుడూ దేశీయ ఐటీ సీఈవోలతో సంప్రదిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఐటీ పరిశ్రమలో ప్రత్యక్షంగా 40 లక్షల మందికి, పరోక్షంగా 1.6 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని చెప్పారు. సాఫ్ట్ బ్యాంకు, అమెజాన్, అలీబాబాలతో దేశీయ స్టార్టప్ స్పేస్ రన్ అవడంలో ఎలాంటి తప్పు లేదని స్పష్టంచేశారు. ఇంటర్నెట్ స్పేస్ లో విదేశీ నగదు ఫండింగ్ కు వ్యతిరేకంగా భారత్ ఎలాంటి పక్షపాతం చూపించదని పేర్కొన్నారు. -
'ఐటీ సెక్టార్ లో 20-25 లక్షల ఉద్యోగాలు'
న్యూఢిల్లీ : ఐటీ ఇండస్ట్రి ఇంకేముంది? భారీ ఎత్తున్న కుప్పకూలిపోతుంది.. ఓ వైపు అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్, మరోవైపు ముంచుకొస్తున్న ఆటోమేషన్ ప్రభావంతో భారీగా ఉద్యోగాల కోత ఉంటుందంటూ రిపోర్టులు వస్తున్నాయి. కానీ ఈ రిపోర్టులన్నీ అసత్యమేనని ఇప్పటికే ఐటీ ఇండస్ట్రి బాడీ నాస్కామ్ ప్రకటించగా.. తాజాగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా ఆ రిపోర్టులను కొట్టిపారేస్తున్నారు. వచ్చే నాలుగు నుంచి ఐదేళ్లలో ఐటీ సెక్టార్ లో 20 లక్షల నుంచి 25 లక్షల అదనపు ఉద్యోగాల కల్పన ఉంటుందని హామీ ఇచ్చారు. ఐటీ రంగంలో ఉద్యోగవకాశాలు పడిపోతున్నాయనే రిపోర్టులను తాను పూర్తిగా ఖండిస్తున్నానని, ఒక్కసారి డిజిటల్ టెక్నాలజీ వచ్చాక, ఏమేర ఉద్యోగవకాశాలు పెరుగుతాయో మీరే చూస్తారంటూ మంత్రి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 200 నగరాల్లో, 80 దేశాల్లో భారతీయ ఐటీ ఇండస్ట్రి విస్తరించి ఉందని, ప్రత్యక్షంగా 40 లక్షలమందికి, పరోక్షంగా 1.3 కోట్ల మందికి ఇది ఎంప్లాయీమెంట్ కల్పిస్తుందని పేర్కొన్నారు. నాస్కామ్ అంచనాల ప్రకారం వచ్చే నాలుగు నుంచి ఐదేళ్లలో ఐటీ పరిశ్రమలో సుమారు 20-25 లక్షల అదనపు ఉద్యోగాలు ఖాయమని తెలిపారు. వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో దేశీయ డిజిటల్ ఎకానమీ 1 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంటే 600 లక్షల కోట్లని పేర్కొన్నారు. గత మూడేళ్లలో దేశీయ ఐటీ రంగంలో సుమారు ఆరు లక్షల మందికి ఉద్యోగవకాశాలు లభించినట్టు తెలిపారు. 2016-17లో 1.7 లక్షల మంది ఉద్యోగాలు పొందారని చెప్పారు. -
ఐటీ పరిశ్రమకు ఢోకా లేదు: నాస్కామ్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీయుల వలసలపై కఠిన ఆంక్షలు విధించడం, ఆటోమేషన్ ఊహించని దానికన్నా వేగంగా విస్తరిస్తుండడం, మూకుమ్మడి లేఆఫ్లంటూ వదంతులు వ్యాపించడంతో 15,000 కోట్ల డాలర్ల భారతీయ ఐటి పరిశ్రమ వణుకుతోంది. దీనిపై అపోహలు తొలగించేందుకు నాస్కామ్ ప్రయత్నిస్తోంది. ఆటోమేషన్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు నైపుణ్యాన్ని పెంచుకున్నట్లయితే ఐటీ పరిశ్రమకు కూడా ఢోకా ఏమీ లేదని చైర్మన్ రామన్ రాయ్ తెలిపారు. 2018 ఆర్థిక సంవత్సరాని భారత్లో కొత్తగా 1,50,000 ఐటీ ఉద్యోగులు పెరుగుతారని నాస్కామ్ అంచనా వేసింది. గతేడాది 1,70,000 ఐటీ ఉద్యోగులు పెరిగారని, దానితో పోలిస్తే తగ్గే ఉద్యోగాలు 20 వేలు మాత్రమేనని తెలిపింది. 2025 సంవత్సరం నాటికి ఐటీ పరిశ్రమ 35,000 కోట్ల డాలర్లకు కూడా పెరుగుతుందన్నది అంచనా. వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగ లక్ష్యాలను సవరించుకుంటే ఐటీ పరిశ్రమలో లేఆఫ్లు ఉండవని బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్తో కలసి పనిచేస్తున్న నాస్కామ్ తెలిపింది. ఏ కంపెనీ కూడా అనుభవజ్ఞులైన ఉద్యోగులను వదులుకోదని ఐటీలో ఐదవ పెద్ద కంపెనీ అయిన టెక్ మహేంద్ర సీఈవో సీపీ గుర్నానీ కూడా స్పష్టం చేశారు. పనితీరు, సామర్థ్యంలేని కారణంగా ఉద్యోగాలు పోయే వారి సంఖ్య కూడా రానున్న సంవత్సరంలో 0.5 శాతం నుంచి 3 శాతానికి మధ్యనే ఉంటుందని నాస్కామ్ తెలిపింది. -
రాష్ట్రాభివృద్ధికి కలసి రండి
తెలంగాణ ఎన్నారైలకు మంత్రి కేటీఆర్ పిలుపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాభివృద్ధికి తెలంగాణ ఎన్నారైలు కలసి రావాలని ఎన్నారైల శాఖ మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. తెలంగాణ సాధనకు సహకరించిన ఎన్నారైలు, సాధించుకున్న సొంత రాష్ట్రాభివృద్ధిలో అదే స్ఫూర్తితో భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం చేస్తు న్న ప్రయత్నాలతో కలసి రావాలని, ఇందుకోసం తాము పుట్టిన గ్రామాల అవసరాలను తీర్చేందుకు సహకరించాలన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఇండి యా డెవలప్మెంట్ ఫండ్(ఐడీఎఫ్) ద్వారా ప్రవా సులు ఇచ్చే ప్రతి రూపాయి నేరుగా అభివృద్ధి కార్యక్రమాలకు పోతుందన్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పలువురు ఎన్నారైలు ఐడీఎఫ్ ద్వారా తమ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. గ్రామాల్లోని పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాలు, లైబ్రరీల అభివృద్ధికి ఎన్నారైలు ముందుకు రావాలన్నారు. ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా సహకారం అందిస్తామన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా కేటీఆర్ సోమవారం కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాక్రమెంటో పట్టణంలో రాష్ట్ర ఎన్నారైలతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను ఎన్నారైలకు వివరించారు. అనంతరం ఎన్నారైలతో ముఖాముఖిగా మాట్లాడి పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతాయని, సంక్షేమం, అభివృద్ధి రంగాలకు ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి శీల, పురోగమన శీల రాష్ట్రంగా మారిందని, ఇతర రాష్ట్రాలు, నీతి ఆయోగ్ వంటి సంస్థలు పలు సందర్భాల్లో రాష్ట్రాన్ని మెచ్చుకున్నాయన్నారు. విపక్షాలవి అడ్డగోలు విమర్శలు.. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు జాతీ య స్థాయి గుర్తింపు లభించిందని, విద్యుత్, సాగునీటి రంగాల్లో దీర్ఘకాలిక ప్రాజెక్టులు చేపట్టామన్నా రు. ఇవి పూర్తయితే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన పథకాలతో ఏం చేయాలో పాలుపోని ప్రతిపక్షాలు అడ్డగోలు విమర్శలు చేస్తున్నాయన్నారు. 60 ఏళ్లు ఏలిన ప్రతిపక్షాలు సాధించలేనిది,తమ ప్రభుత్వం మూడేళ్లలో సాధించిందన్నారు. ఖమ్మంలో ఐటీ టవర్ పురపాలక శాఖ మంత్రిగా హైదరాబాద్ నగరాభివృద్ధికి చేస్తున్న కృషిని మంత్రి కేటీఆర్ ఎన్నారైలకు వివరించారు. హైదరాబాద్ కేంద్రంగా ఐటీ పరిశ్రమ సాధిస్తున్న ప్రగతిని.. ఐటీ రంగంలోని డాటా అనలిటిక్స్, డాటా సెక్యూరిటీస్ వంటి నూతన రంగాల్లోని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ చొరవతో పలువురు ఎన్నారైలు ఖమ్మంలో ఐటీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చారని, ఇలాంటి ప్రయత్నానికి మద్దతు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐటీ టవర్ నిర్మించబోతోందని తెలిపారు. ఐటీ రంగ విస్తరణలో ప్రవాసులు చొరవ చూపాలని కోరారు. -
కేటరింగ్పై 18 శాతం జీఎస్టీ