cricket betting
-
క్రికెట్ బెట్టింగ్లో ఒకరి అరెస్ట్.. స్పందించిన వైజయంతి మూవీస్
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ నిలేశ్ చోప్రా అనే వ్యక్తి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు పట్టుపడ్డాడు. అయితే, తాను వైజయంతీ మూవీస్ మేనేజర్గా పనిచేస్తున్నట్లు నిలేశ్ చోప్రా చెప్పారని వార్తలు రావడంతో సోషల్మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలో తాజాగా వైజయంతీ మూవీస్ ఎక్స్ పేజీ ద్వారా స్పందించింది. నిలేశ్ చోప్రా ఎవరో తమకు తెలియదని , అలాంటి పేరుతో ఉన్న వ్యక్తి తమ వద్ద ఎప్పుడు కూడా పనిచేయలేదని పేర్కొంది.'ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆడుతున్నందుకు నీలేష్ చోప్రా అనే వ్యక్తిని ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. అలా చెప్పబడుతున్న వ్యక్తి వైజయంతి మూవీస్ ఆఫీస్లో ఎప్పుడూ పని చేయలేదు. అతనితో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయం గురించి ఎస్ఆర్ నగర్ సంబంధిత పోలీసు అధికారులతో మేము ఇప్పటికే మాట్లాడాం. వాస్తవాలను వారికి వివరించాం. ఏదైనా సమాచారాన్ని ప్రచురించే ముందు తమను సంప్రదించి వాస్తవాలను ధృవీకరించవలసిందిగా మీడియాను మేము హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాము' అని పేర్కొంది.It has come to our notice that a person named Nilesh Chopra had been arrested by SR Nagar Police for online gambling.THE SAID INDIVIDUAL HAS NEVER WORKED WITH US AT VYJAYANTHI MOVIES OFFICE AND WE ARE UNAWARE OF ANY ASSOCIATION WITH HIM IN ANY OTHER FORM.We have formally…— Vyjayanthi Movies (@VyjayanthiFilms) February 6, 2025 -
పందెం కోళ్లతో ఖాకీల కష్టాలు
ఒక చోట క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంటుంది. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి, బుకీలతో పాటు అక్కడ దొరికిన సామగ్రిని స్వాధీనం చేసుకుంటారు. ఒక ఇంట్లో కొందరు పేకాట ఆడుతూ ఉంటారు. పోలీసులు పేకతో పాటు నగదు, తదితరాలను కూడా స్వాధీనం చేసుకుంటారు. సంక్రాంతి రోజుల్లో కోడి పందేలు జరుగుతుంటాయి. పోలీసులు దొరికిన పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద దొరికిన నగదుతో పాటు కోళ్లనూ స్వాధీనం చేసుకుంటారు..సాధారణంగా ఏ కేసులో అయినా పోలీసులు తాము అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపరచే సమయంలో వారి నుంచి స్వాధీనం చేసుకున్న నగదును, వస్తువులను కోర్టుకు అప్పగిస్తారు. కోడి పందేల కేసుల్లో కోళ్లను ఏం చేస్తారనేది ఆసక్తికర అంశం. ఈ కోళ్లను కొన్నాళ్ల వరకు కాచుకోవాల్సి ఉంటుంది. సంక్రాంతి రోజుల్లో జరిగే కోడి పందేలన్నీ రాజకీయ నాయకులు, పోలీసుల కనుసన్నల్లోనే జరుగుతాయి. న్యాయస్థానాలు ప్రశ్నించినప్పుడో, మరేదైనా జరగరానిది జరిగినప్పుడో చూపించుకోవడానికి రికార్డుల కోసం పోలీసులు అప్పుడప్పుడు కొన్నిచోట్ల దాడులు చేస్తుంటారు. కోడి పందేలు ఆడుతున్న వారిని, పందేలకు సిద్ధమవుతున్న వారిని అరెస్టు చేసి, వారి నుంచి కత్తులు, నగదుతో పాటు కోళ్లను స్వాధీనం చేసుకుంటుంటారు. . పందెంరాయుళ్లను కోర్టులో హాజరుపరచే పోలీసులు కోళ్లను స్వాధీనం చేసుకున్న విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లి, దానికి ఆధారంగా కొన్ని ఫొటోలను సమర్పిస్తారు. న్యాయస్థానం నిందితులను బెయిల్పై వదలడమో, రిమాండ్కు పంపడమో చేస్తుంది. ఆపై విషయం కోళ్ల దగ్గరకు వస్తుంది. ఆ కోళ్లను గతంలో సేఫ్ కస్టడీలో ఉంచాలంటూ పోలీసులనే ఆదేశించేది. దీంతో పోలీసులు వాటిని ఠాణాల్లోనో లేదా సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశాల్లోనే కట్టేసి మేపుతుండే వాళ్లు. అక్కడే కొన్ని రోజుల పాటు తమ సంరక్షణలో ఈ కోళ్లు ఉండాల్సి రావడం, అవి కోర్టు ప్రాపర్టీ కావడంతో తాత్కాలిక భద్రత ఏర్పాట్లు చేసేవాళ్లు.ప్రతి రోజూ వాటికి తిండి గింజలు, నీళ్లు తదితరాలు అందిస్తూ జాగ్రత్తగా కాచుకునేవారు. ఈ విధానంలో అనేక ఇబ్బందులు వస్తుండటంతో కోర్టు కొన్నాళ్లుగా ఈ విధానాన్ని మార్చింది. కోళ్లను స్వాధీనం చేసుకున్న వెంటనే, వాటిని విక్రయించడానికి అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఆ కోళ్లను స్థానికంగా ఉండే పెంపకందారులకు, చికెన్ షాపుల నిర్వాహకులకు అప్పగించి ఎన్ని, ఏ రకానికి చెందినవో సూచిస్తూ రసీదు తీసుకుంటారు. వారి నుంచి వాంగ్మూలం కూడా నమోదు చేసుకుని, కోర్టుకు సమర్పిస్తారు. అలా ఓ సంరక్షకుడికి అప్పగిస్తున్న సమయంలో ఆ కోళ్లను తిరిగి పందేలకు వినియోగించకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఆ కోణంలో మరికొన్ని చర్యలు కూడా తీసుకుంటారు. గేమింగ్ యాక్ట్ ప్రకారం నమోదయ్యే ఈ కేసు దర్యాప్తు పూర్తయ్యాక న్యాయస్థానంలో నిందితులపై అభియోగపత్రాలు దాఖలు చేస్తారు. ఆ సమయంలోనే కోళ్ల విక్రయానికి అనుమతిచ్చే న్యాయస్థానం ఓ రేటును ఖరారు చేస్తుంది. ఈ ధరకు కోళ్లను అప్పటి వరకు వాటి సంరక్షణ చూసిన వారికే అమ్మేసి, అలా వచ్చిన మొత్తాన్ని కోర్టులో జమ చేస్తారు. ఈ క్రతువులోనూ ఇటీవల కాలంలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇలా కోర్టులో జమ చేసిన మొత్తం కేసు విచారణ ముగిసి, ఫలితం తేలే వరకు బ్యాంకు ఖాతాలోనే ఉంటుంది. సరైన సాక్ష్యాధారాలు లేకనో, మరో కారణంగానో కేసు వీగిపోతే ఆ మొత్తం ఆరోపణలు ఎదుర్కొన్న నిందితులకు, కేసు నిరూపితమై వారికి శిక్షపడితే కోర్టుకు వెళ్లిపోతుంది. ఇక్కడే కొన్ని సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. కేసు వీగిపోయినప్పుడు కొందరు పందెంరాయళ్లు పోలీసుల వద్ద కొత్త మెలికలు పెడుతున్నారు. తమ కోళ్లు తమకు కావాలంటూ వాదిస్తున్నారు. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానాలు ఇటీవల ఒక కొత్త విధానాన్ని మొదలెట్టాయి. స్వాధీనం చేసుకున్న కోళ్లను మళ్లీ పందేలకు ఉపయోగించకుండా షరతులు వి«ధిస్తూ, నిందితులకే అప్పగించాలని చెబుతున్నాయి. కేసు విచారణ ముగిసి, వారిపై నేరం నిరూపణ అయితే మాత్రం అప్పుడు న్యాయస్థానం ఆ కోళ్లకు రేటు కట్టి, నిర్దేశిత మొత్తాన్ని వారి నుంచి వసూలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాయి.ఈ పందెం కోళ్లు తమ స్వాధీనంలో ఉన్నన్నాళ్లూ పోలీసులు ఒక రకంగా కంటిమీద కునుకు లేకుండా గడిపాల్సిన పరిస్థితే! ఈ కేసులో అరెస్టు చేసిన నిందితులను మరుసటి రోజు కోర్టులో హాజరుపరచడంతో పాటు కోళ్లను సంరక్షకుడికి అప్పగించే వరకు పోలీసులదే బాధ్యత. ఆలోపు ఆ కోళ్లకు ఏమైనా జరిగితే పోలీసులకు కొత్త పని వచ్చిపడుతుంది. వారి అధీనంలో ఉండగా అనారోగ్య, అనివార్య కారణాలతో ఒక్క కోడిపుంజు చనిపోయినా లేదా తప్పించుకుని పోయినా, దానికి సంబంధించి మరో కేసు నమోదు చేయాలి. చనిపోయిన కోడి కళేబరానికి ప్రభుత్వ పశువైద్యుడితో పోస్టుమార్టం చేయించాలి. తర్వాత అధికారికంగా ఖననమో, దహనమో చేయించడమూ అనివార్యం. ఈ తంతులు పక్కాగా చేయడంతో పాటు ఆ రికార్డులను కోర్టులో దాఖలు చేయడం తప్పనిసరి. ఈ వ్యవహారంలో కొసమెరుపు ఏమిటంటే, ఇలాంటి పందెం కోళ్లను కోర్టు అనుమతి తర్వాత సంరక్షకులు ఎక్కువగా చికెన్ పకోడీ సెంటర్లకు విక్రయించడం లేదా తామే పకోడీ చేసుకోవడం చేస్తుంటారు. డ్రైఫ్రూట్స్, పళ్లు వంటి పౌష్టికాహారం తిని పెరిగే ఈ కోళ్లతో చేసే కూర కంటే పకోడీనే బాగుంటుందని వాళ్లు చెబుతుంటారు. -
క్రికెట్ బెట్టింగ్ 140 కోట్లు!.. కూటమి ఎమ్మెల్యేల సహకారం?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: క్రికెట్ బెట్టింగ్ ముఠా వ్యవహారంలో కూటమి నేతలదే కీలకపాత్ర అని తెలుస్తోంది. ప్రధాన నిందితులు లగుడు రవితో పాటు ప్రముఖ పాత్ర పోషిస్తున్న బొబ్బిలి రవి పరారీలో ఉన్నారు. వీరిద్దరూ జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో విచారణ చేస్తున్న విశాఖ సిటీ పోలీసులు ఇప్పటి వరకు జరిగిన 80 బ్యాంకు అకౌంట్లను పరిశీలిస్తే కేవలం ఏడాది కాలంలోనే రూ.140 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. అయితే ఇంకా వందల్లో గుర్తించిన బ్యాంకు అకౌంట్లను పరిశీలించాల్సి ఉందని సమాచారం. వీటి లావాదేవీలను గమనిస్తే ఇంకా ఎన్ని వందల కోట్లకు చేరుతుందనేది ఊహకు కూడా అందడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.క్రికెట్ బెట్టింగ్లో కీలకంగా ఉన్న లగుడు రవితో పాటు బొబ్బిలి రవి జనసేన పార్టీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఇందులో బొబ్బిలి రవిని స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్తో పాటు నాగబాబు సమక్షంలో కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. వీరిని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ చేర్చడం గమనార్హం. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్గా మారాయి. ఇక లగుడు రవి కూడా జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఇప్పటివరకు కేవలం లగుడు రవి ద్వారా వచ్చిన సమాచారంతో ఐదుగురిపై కేసులు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు.. తాజాగా మరో నలుగురిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. వీరి బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తే.. రూ.140 కోట్ల ఉండగా..ఇంకా మొత్తం అకౌంట్లు పరిశీలిస్తే ఇంకా ఎన్ని వందల కోట్లకు చేరుతుందోనని చర్చ సాగుతోంది.ఇంకా లెక్కతేలాల్సిందే..!వాస్తవానికి కొద్దిరోజుల క్రితం ఇసుకతోట, శివాజీపాలెం వద్ద జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంపై వచ్చిన సమాచారం మేరకు ఈ నెల ఆరో తేదీన టాస్క్ఫోర్స్ పోలీసులు జరిపిన దాడిలో లగుడు రవి కుమార్ను అదుపులో తీసుకున్నారు. అనంతరం జరిపిన విచారణలో ఇందులో మరో వ్యక్తి బొబ్బిలి రవి, త్రినాథ్, జిలానీ, కాకినాడకు చెందిన కార్తీక్ల పాత్ర కూడా తేలింది. ఇందులో ఇప్పటికీ బొబ్బిలి రవితో పాటు మిగిలిన వ్యక్తులు అందరూ పరారీలోనే ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులు కూడా ఇళ్లు వదిలి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు లగుడు రవిని విచారించిన తర్వాత 80 బ్యాంకు అకౌంట్లను పరిశీలించగా... ఏడాది కాలంలోనే ఈ అకౌంట్ల ద్వారా రూ. 140 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు విశాఖ సిటీ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. అయితే బొబ్బిలి రవిని, కాకినాడకు చెందిన కార్తీక్ను కూడా అదుపులోకి తీసుకుంటే ఇంకా ఎన్ని వందల సంఖ్యలో బ్యాంకు అకౌంట్లు ఉన్నాయో తెలిసే అవకాశం ఉంది. ఇదే జరిగితే మొత్తం క్రికెట్ బెట్టింగ్ ముఠా జరిపిన ఒక్క ఏడాది లావాదేవీలే మరిన్ని వందల కోట్లు ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.అదుపులోకి తీసుకోకుండా..!సుమారు 10 రోజుల క్రితం జరిగిన సంఘటనలో బొబ్బిలి రవి, త్రినాథ్లను అదుపులోనికి తీసుకోకుండా ఉండేందుకు కూటమి ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేసినట్టు విమర్శలున్నాయి. కూటమికి చెందిన ఎమ్మెల్యేతో పాటు పీఏలు కూడా అరెస్టు చేయవద్దంటూ సిఫారసులు చేశారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే బొబ్బిలి రవి పరారీలో ఉన్నారు. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులను కూడా ఇంట్లో ఉండకుండా జాగ్రత్తపడినట్టు తెలుస్తోంది.మరోవైపు వీరికి ముందస్తు బెయిల్ కోసం కూడా కూటమి ఎమ్మెల్యేలు కొందరు ప్రయత్నిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారని.. దుకోసం ఒక ఎమ్మెల్యే పీఏ ఒక్కో వ్యక్తి నుంచి రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ వసూలు చేశారనే ప్రచారం ఆ పార్టీల్లోనే జరుగుతోంది. ఇదిలాఉండగా తెర వెనుక కూటమి ఎమ్మెల్యే చేస్తున్న వ్యవహారం నగర పోలీసు కమిషనర్ దృష్టికి వెళ్లడంతో వారి ఆటలు సాగడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ సాధ్యం కాదని, వారిని కచ్చితంగా అదుపులో తీసుకుంటామని విశాఖ సిటీ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.ఎవరీ కాకినాడ కార్తీక్!ఈ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో కీలకంగా ఉన్న కాకినాడ కార్తీక్ ఆచూకీ లభ్యం కాలేదు. కాకినాడకు వెళ్లి విచారించిన పోలీసులకు కార్తీక్ ఎవరనే విషయం మాత్రం బోధపడలేదని తెలుస్తోంది. కార్తీక్కు కాకినాడలో అనేక పేర్లతో వ్యవహారంలో ఉన్నాడని సమాచారం. ఒక్కొక్కరికి ఒక్కో పేరుతో కార్తీక్ పరిచయం కావడం గమనార్హం. అంతేకాకుండా పోలీసులు దర్యాప్తు కోసం వెళ్లే సమయానికే కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యారు. కార్తీక్కు విశాఖపట్నంతో పాటు హైదరాబాద్లో కూడా బెట్టింగ్ ముఠాతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. కార్తీక్ను కదిపితే బెట్టింగ్ మాఫియా వివరాలు మరిన్ని తెలిసే అవకాశం ఉంది. -
హైదరాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
-
క్రికెట్ బెట్టింగ్ కేసులో టీడీపీ నేత బీటెక్ రవి అరెస్ట్
-
బీటెక్ రవి అరెస్టు
సాక్షి ప్రతినిధి, కడప: క్రికెట్ బెట్టింగ్ సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జి మారెడ్డి రవీంద్రనాథరెడ్డి అలియాస్ బీటెక్ రవిని మంగళవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. రవిపై వల్లూరు పోలీసుస్టేషన్లో ఓ కేసు పెండింగ్లో ఉంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన నేపధ్యంలో డ్యూటీలో ఉన్న ఓ పోలీసుపై దురుసుగా ప్రవర్తించి, కాలు ఫ్యాక్చర్ కావడానికి బీటెక్ రవి కారకుడైనట్లు అప్పట్లో కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి రవిని అరెస్టు చేసిన పోలీసులు... రిమ్స్లో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం కడప ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేటు ఎదుట హాజరు పర్చారు. మళ్ళీ బుధవారం ఉదయం హాజరు పరచాలని ఆదేశించారు. నిజానికి ఈ మధ్యే పోరుమామిళ్ల కేంద్రంగా భారీ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం చోటు చేసుకున్నట్లు వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయటంతో.. తీగలాగితే డొంక కదిలినట్లు మొత్తం వ్యవహారం బీటెక్ రవి చుట్టూనే చేరింది. క్రికెట్ బెట్టింగ్ విషయాల్లో వైఎస్సార్ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సీరియస్గా ఉండటంతో... స్థానికంగా పేరున్న లాడ్జిలను ఆయనే స్వయంగా తనిఖీలు సైతం చేశారు. బెట్టింగ్ అణిచివేతలో భాగంగా మూలాలపై దృష్టి సారించిన క్రమంలో పోరుమామిళ్ల బెట్టింగ్ రాకెట్ మొత్తం బీటెక్ రవి కనుసన్నుల్లో నడిచినట్లు రూఢీ అయ్యింది. పోలీసులకు పక్కా ఆధారాలు దొరకటంతో... బీటెక్ రవి తప్పించుకొని తిరుగుతున్నట్లుగా తెలియవచ్చింది. ఈ క్రమంలోనే యోగివేమన యూనివర్శిటీ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో బీటెక్ రవి ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంపై నోటీసులు జారీ చేసి, విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నా బ్లడ్లోనే జూదం ఉంది.. బీటెక్ రవి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన తర్వాత విజయోత్సవ ర్యాలీలో సింహాద్రిపురం కేంద్రంగా ‘జూదం మా బడ్ల్లోనే ఉంది’ అంటూ మరోసారి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు పలుసార్లు వివిధ సందర్భాల్లో ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు. చిన్నప్పటి నుంచి జూదం అలవాటు ఉన్నట్లుగా అప్పట్లో వచ్చిన ఆరోపణలపై స్వయంగా వివరణ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతుండటంతో పోలీసులు బెట్టింగ్ను సీరియస్గా తీసుకుని తనిఖీలు చేశారు. జిల్లాలో పెద్ద ఎత్తున బెట్టింగ్కు పాల్పడే అలవాటున్న బెట్టింగ్ రాయుళ్లందరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. పాత నేరస్థులను పిలిపించి, క్రికెట్ బెట్టింగ్ ఎక్కడా నిర్వహించరాదని హెచ్చరికలు చేశారు. ఈ క్రమంలోనే పోరుమామిళ్ల కేంద్రంగా బెట్టింగ్ జరుగుతోందని, ఇదంతా బీటెక్ రవి కనుసన్నల్లోనే నడుస్తోందని బయటపడినట్లు సమాచారం. ఆ మేరకు పోలీసులు నోటీసులు జారీ చేసి విచారణ చేస్తున్నట్లు తెలియవచ్చింది. కిడ్నాప్ అంటూ హైడ్రామా.... పోలీసులు క్రికెట్ బెట్టింగ్లో బీటెక్ రవిని అదుపులోకి తీసుకోగానే టీడీపీ ఎమ్మెల్సీ రామగోపాల్రెడ్డి.. బీటెక్ రవిని కిడ్నాప్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. అంతే!! వాస్తవాలు ఏమాత్రం తెలుసుకోకుండా ‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అన్నట్లుగా ఎల్లో మీడియా కిడ్నాప్ కలకలం అంటూ కాసేపు ఊదరగొట్టింది. చివరకు పోలీసులు అరెస్టును ధ్రువీకరించటంతో ఈ గాసిప్లకు తెరపడింది. -
ఆన్లైన్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
దొండపర్తి : ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాకు విశాఖ పోలీసులు చెక్ పెట్టారు. బెట్టింగ్ వేసే వారిని నిలువునా ముంచుతున్న బుకీ గ్యాంగ్లో 11 మందిని అరెస్ట్ చేశారు. పోలీస్ కమిషనరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం డీసీపీ–1 కె.శ్రీనివాసరావు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. క్రికెట్ బెట్టింగ్ పేరుతో రూ.8 లక్షల వరకు తనను మోసం చేశారని నగరానికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల పోలీస్ స్పందనలో ఫిర్యాదు చేశాడు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయంలో తీగ లాగితే డొంక కదిలింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలానికి చెందిన మెరుపురెడ్డి సూరిబాబు ఈ ముఠాలో ప్రధాన సూత్రధారుల్లో ఒకరుగా పోలీసులు గుర్తించారు. అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో 20 నుంచి 30 మంది మంది నుంచి డబ్బులు వసూలు చేసి ఒక్కో మ్యాచ్కు రూ.4 లక్షల వరకు బెట్టింగ్ చేసేవాడు. ఇలా ఏడాదికి రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్లు బిజినెస్ టర్నోవర్ చేసేవాడు. ఇలా సేకరించిన మొత్తాన్ని నగరంలోని సూర్యాబాగ్ ప్రాంతంలో టూర్స్ అండ్ ట్రావెల్స్ నడిపిస్తున్న దినేష్కుమార్ అనే వ్యక్తికి పంపేవాడు. ఇందుకు అతడికి 2 శాతం కమీషన్ ఇచ్చేవాడు. ఇలా తనకు తెలిసిన వ్యక్తులను కూడా బుకీలుగా మార్చి బెట్టింగ్ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈ బుకీ గ్యాంగ్ గుట్టుగా బెట్టింగ్ నిర్వహించడంతో పాటు.. బెట్టింగ్ వేసే వారికి డబ్బులు నష్టపోయేలా సాఫ్ట్వేర్లను రూపొందించారు. సాధారణంగా గెలిచే అవకాశమున్న జట్టుకు తక్కువ పర్సెంట్, ఓడిపోయే అవకాశాలున్న జట్టుకు ఎక్కువ శాతం డబ్బును ఆఫర్ చేస్తుంటారు. ఆ విధంగా జట్టు మీద బెట్టింగ్ వేశాక కొంత సమయం వరకు వాటిని వేరొక జట్టుకు మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ వీరు అలా మార్చడానికి అవకాశం లేకుండా ఆ సమయంలో సర్వర్ను ఆఫ్ చేసేవారు. ప్రధానంగా గేమ్ విన్నర్, లాస్ ఆప్షన్స్.. హ్యాండ్లర్ చేతిలో ఉండడంతో ఒకవేళ గెలిచినప్పటికీ నష్టం వచ్చిందని చెప్పి వారి ఐడీని బ్లాక్ చేస్తారు. ఆ డబ్బును తమ కరెంట్ అకౌంట్లలోకి జమ చేసి వాటి నుంచి కార్పొరేట్ ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నట్టు పోలీసుల విచారణలో నిర్ధారౖణెంది. ఈ గ్యాంగ్కు సంబంధించిన 63 బ్యాంక్ ఖాతాలను గుర్తించి ఫ్రీజ్ చేయగా.. అందులో 36 ఖాతాల ద్వారా ఇప్పటి వరకు రూ.367.62 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. వాటిలో 13 అకౌంట్లలో ఉన్న రూ.75 లక్షలు స్తంభింపచేసినట్లు పోలీసులు చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో సూరిబాబు, విశాఖకు చెందిన హండ దినే‹Ùకుమార్, బర్రి శ్రీను, గుర్రం శివ, కిల్లాడి శ్రీనివాసరావు, ఉరిటి కొండబాబు, ఉరిటి వెంకటేశ్వర్లు, సుందరాపు గణేష్, దూలి నూకరాజు, అల్లు నూకరాజు అవినాష్, ఉప్పు వాసుదేవరావులున్నారు. ఈ రాకెట్ వెనుక ప్రధాన సూత్రదారి కోసం గాలిస్తున్నట్టు డీసీపీ–1 శ్రీనివాస్ తెలిపారు. సమావేశంలో ఏడీసీపీ(ఎస్బీ) నాగేంద్రుడు, సైబర్ క్రైం సీఐ భవాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో రూ. 350 కోట్ల క్రికెట్ బెట్టింగ్ దందా గుట్టురట్టు
సాక్షి, విశాఖపట్నం: నగరంలో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా పట్టుబడింది. విశాఖ వేదికగా జరుగుతున్న రూ. 350 కోట్ల క్రికెట్ బెట్టింగ్ దందాను సైబర్ పోలీసులు గుట్టురట్టు చేశారు, అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్ చేస్తున్న కింగ్ మోను అలియాస్ దినేష్, వాసుదేవ్, సూరి బాబులతోపాటు 11 మందిని పోలీసులు అరెస్ట్ చే శారు. కాగా ఒక్క కింగ్ మోను అకౌంట్స్ నుంచే రూ. 145 కోట్ల లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తదించారు. ఈ బెట్టింగ్ ఉచ్చులో విశాఖ పరిసర ప్రాంతాల్లోని వందలాది మంది అమాయక యువకులు చిక్కుకున్నట్లు తెలిపారు. ఈ కేసును సీపీ రవిశంకర్ స్వయంగా విచారణ చేస్తున్నారు. చదవండి: బాలిక హత్య.. బాబాయే హంతకుడు? -
రంగారెడ్డి: ప్రాణం తీసిన ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్
సాక్షి, రంగారెడ్డి: జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో డబ్బులు పందాలు కాచి పలువురు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని గిరాయి గుట్ట తండా పరిధిలోని నార్లగూడ తండాలో అంగోతు ప్రకాష్ (19) అనే యువకుడు బెట్టింగ్లో డబ్బులు కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి జరిగిన ఢిల్లీ వర్సెస్ పంజాబ్ క్రికెట్ మ్యాచ్లో పంజాబ్ గెలుస్తుందని ప్రకాష్ కొంతమంది మిత్రులతో బెట్టింగ్ వేశాడు. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓడిపోయింది. దీంతో బెట్టింగ్ మాఫియా డబ్బులు ఇవ్వాలని బలవంతం చేశారు. బెట్టింగ్ డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్న ప్రకాష్ ఏం చేయాలో తెలియక మానసిక ఒత్తిడికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని గ్రామస్థులు తెలిపారు. చదవండి: ఆ పేద బతుకులపై విధి కన్నెర్రచేసిందో ఏమో.. -
బెట్టింగ్లో భారీ నష్టం.. అయ్యో మధు!
అనకాపల్లిటౌన్: క్రికెట్ బెట్టింగ్లో నష్టపోయిన విద్యార్థి పి.మధు ఆత్మహత్యకు పాల్పడగా విశాఖ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్టు రూరల్ ఎస్ఐ అంజిబాబు చెప్పారు. ఎస్ఐ కథనం మేరకు వివరాలివి. మండలంలో దిబ్బపాలెం గ్రామానికి చెందిన పి.మధు క్రికెట్ బెట్టింగ్లో నష్టం వచ్చిందని ఆవేదన చెందుతూ ఈనెల 23వ తేదీన గ్రామ సమీపంలో పొలాల్లో గులుకులు సేవించాడు. హుటాహుటిన కుటుంబ సభ్యులు విశాఖ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. (టీడీపీ నేత వినోద్కుమార్ జైన్కు జీవితకాల జైలుశిక్ష) -
అశోక్రెడ్డి బెట్టింగ్ కథ.. అక్షరాలా వందకోట్ల రూపాయలు.. ఐపీఎల్–2023 లోనూ
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల కిందట బెట్టింగ్లోకి అడుగుపెట్టాడు. అడ్డదారిలో డబ్బు సంపాదనపై ఆసక్తి ఉన్నవాళ్లతో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు. అది మొదలు క్రమంగా బెట్టింగ్కు బానిసై క్రికెట్ మొదలు హార్స్రైడింగ్వరకు అన్ని క్రీడలపై పందేలు నిర్వహించాడు. ఈ క్రమంలో రూ.100 కోట్లు పోగొట్టుకున్నాడు. ఇటీవల ఐపీఎల్–2023లోనూ బెట్టింగ్కు పాల్పడి.. నగదు వసూలుకు వెళ్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఇది శుక్రవారం రాచకొండ పోలీసులు అరెస్టు చేసిన జక్కిరెడ్డి అశోక్రెడ్డి కథ. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్టు చేసిన పోలీసులు.. మీడియాకు శనివారం వివరాలు వెల్లడించారు. ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) డీసీపీ మురళీధర్, రాచకొండ సీపీ దేవేంద్రసింగ్ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘నేషనల్ ఎక్స్ఛేంజ్9’ పేరుతో.. శ్రీ వెంకటరమణ కాలనీకి చెందిన అశోక్ రెడ్డి రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఈజీ మనీకోసం బెట్టింగ్లోకి ప్రవేశించాడు. నాగోల్లోని బండ్లగూడలో ఉంటున్న మిర్యాలగూడకు చెందిన ఏడుకుళ్ల జగదీష్ తో అతనికి పరిచయం ఏర్పడింది. అశోక్, జగదీష్ ఇరువురు కలిసి సులువైన మార్గంలో డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తనకు ముందే పరిచయం ఉన్న, ప్రధాన బుకీలైన ఏపీకి చెందిన పలాస శ్రీనివాసరావు, సురేష్ మైలబాతుల అలియాస్ శివ, హరియాణకు చెందిన విపుల్ మోంగాలను జగదీష్ కు అశోక్ రెడ్డి పరిచ యం చేశాడు. కూకట్పల్లిలోని భక్తినగర్కు చెందిన ఐటీ ఉద్యోగి వొడుపు చరణ్ను కలెక్షన్ ఏజెంట్గా నియమించుకొని ఒక ముఠాగా ఏర్పడ్డారు. ముగ్గురు కలిసి ‘నేషనల్ ఎక్స్ఛేంజ్9’ ద్వారా క్రికెట్ బెట్టింగ్లను నిర్వహిస్తున్నారు. బెట్టింగ్లో పాల్గొనేవారికి యూజర్ ఐడీ, పాస్వర్డ్లను ఇస్తారు. నగదు వసూలుకు వెళ్తూ.. ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్కు ఈ ముఠా నిర్వహించిన బెట్టింగ్లో పంటర్ల నుంచి నగదు వసూలు చేసేందుకు వెళ్తున్నట్లు ఎల్బీనగర్ ఎస్ఓటీ, చైతన్యపురి పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు శుక్రవారం వాసవికాలనీ రోడ్నంబర్–9లోని బసంతి బొటిక్ వద్ద అశోక్, జగదీష్, చరణ్లను పట్టుకున్నారు. శ్రీనివాసరావు, సురేష్ , విపుల్ మోంగాలు పరారీలో ఉన్నారు. ఐపీఎల్లో రూ.3 కోట్లు బెట్టింగ్.. పట్టుబడిన ముగ్గురు నిందితులకు చెందిన ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ ఖాతాలను పోలీసులు పరిశీలించగా.. ఐపీఎల్–2023 సీజన్లో ఇప్పటివరకు రూ.3 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. నిందితుల నుంచి రూ.20 లక్షల నగదుతో పాటు బ్యాంకు అకౌంట్లలో ఉన్న రూ. 1.42 కోట్ల నగదును సీజ్ చేశారు. ఒక కారు, ఏడు సెల్ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. -
బయటపడ్డ బండారం: అత్యాశకు పోయి.. ఆస్తి మొత్తం పోగొట్టుకుని..
ఒంగోలు(ప్రకాశం జిల్లా): బెట్టింగ్ భూతం ఓ యువకుడ్ని నిండా ముంచింది. అత్యాశకు పోయి ఉన్న సొత్తును కోల్పోవడంతో పాటు చివరకు నేరాల బాట పట్టి కటకటాల పాలైన ఉదంతాన్ని జిల్లా అదనపు ఎస్పీ(క్రైమ్స్) వి.శ్రీధరరావు స్థానిక తాలూకా పోలీసుస్టేషన్లో విలేకరుల సమావేశంలో మీడియాకు వివరించారు. జిల్లా ఎస్పీ మలికాగర్గ్ క్రైమ్స్ అదనపు ఎస్పీగా ప్రత్యేకంగా ఒక పోస్టును కేటాయించడంతోపాటు చాలెంజింగ్గా మారిన పలు కేసులను అప్పగించారు. ఈ నేపథ్యంలో వాటిపై ప్రత్యేక నిఘా కొనసాగించగా గత నెలలో జరిగిన చోరీ కేసుతో ఓ నిందితుడి బండారం బయటపడింది. చదవండి: ఆ రోజు టీడీపీ నాయకులు అడ్డురాకుంటే.. యువతి బతికేది కదా! ఆ కేసుతోపాటు గతంలో అదే తరహాలో చోటుచేసుకున్న కేసులను సరిపోల్చగా ఒంగోలు పట్టణ పరిధిలోనే 11 కేసుల్లో నిందితునిగా వెల్లడైంది. దీంతో పోలీసులు నిఘా పెట్టి గురువారం నిందితుడు రాయవరపు శ్రీనివాసరావును స్థానిక కర్నూలు రోడ్డులోని పవర్ ఆఫీసు సమీపంలో అరెస్టు చేశారు. అతనిని విచారించగా 2021 మార్చి నుంచి 2022 జూన్ వరకు మొత్తం 11 చోరీ కేసుల్లో అతని పాత్ర రూఢీ అయింది. ఒంగోలు తాలూకా పోలీసుస్టేషన్ పరిధిలో 2, ఒంగోలు వన్టౌన్ పరిధిలో 9 వెరసి మొత్తం 11 దొంగతనం కేసులకుగాను 5 సెల్ఫోన్లు, ఒక ట్యాబ్, ఒక మంగళసూత్రం, ఒక బంగారపు కాసు, రూ.500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు వెల్లడించిన విషయాలు పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురిచేశాయి. కొంపముంచిన అత్యాశ పామూరు మండలం పుట్టనాయుడుపల్లికి చెందిన రాయవరపు శ్రీనివాసరావు ఇంటర్ వరకు విద్యనభ్యసించాడు. ఇతని సోదరి అనకాపల్లిలో, తల్లిదండ్రులు పూణేలో ఉంటున్నారు. తల్లిదండ్రుల వద్దకు అంటూ పూణే వెళ్లిన సమయంలో అతనికి బెట్టింగ్ భూతం ఆవహించింది. ఆన్లైన్లో వన్ ఎక్స్బెట్, బెట్ వే, వూల్ఫ్ 777, 22 బెట్, ఐపీఎల్ విన్ అనే యాప్లలో బెట్టింగ్ ఆడి చేతిలో ఉన్న సొత్తును పోగొట్టుకున్నాడు. చివరకు తల్లి ద్వారా తెలిసిన వారి వద్ద కొంత అప్పు తీసుకుని ఆ మొత్తం పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న చోటే సొమ్ము తిరిగి పొందాలనే ఉద్దేశంతో ఉన్న ఇంటిని సైతం రూ.20 లక్షలకు విక్రయించాడు. ఆ డబ్బును సైతం బెట్టింగ్లో అర్పించాడు. అనకాపల్లిలో ఉంటున్న అక్క వద్దకు వెళ్లి వారి లారీలను విక్రయించడం ద్వారా వచ్చిన రూ.20 లక్షలను కూడా బెట్టింగ్లో పోగొట్టుకున్నాడు. ఒక వైపు సొంత ఇల్లు కోల్పోయి, తోబుట్టువుకు చెందిన సొమ్మును సైతం బెట్టింగ్లో సమర్పించుకుని, తల్లిదండ్రులకు ఇబ్బందులు తెచ్చి పెట్టి చివరకు నేరాల బాట పట్టాడు. ఒంగోలు లాడ్జిలో మకాం వేసి రాత్రిపూట షాపులను ఎంచుకుని చోరీలు చేయడం మొదలెట్టాడు. దాదాపు 16 నెలలపాటు చోరీలు కొనసాగించాడు. ఈ క్రమంలోనే పోలీసులకు దొరికిపోయి కటకటాలపాలయ్యాడు. చోరీ చేసిన సొత్తును సైతం బెట్టింగ్లోనే పోగొట్టినట్లు నిర్ధారించుకున్నామని క్రైమ్స్ అదనపు ఎస్పీ వి.శ్రీధరరావు వివరించారు. కేసులను ఛేదించేందుకు కృషి చేసిన క్రైమ్స్ అదనపు ఎస్పీతోపాటు డీఎస్పీ నాగరాజు, తాలూకా సీఐ వి.శ్రీనివాసరెడ్డి, ఎస్సైలు ఎం.దేవకుమార్, ఎం.సైదుబాబు, సిబ్బందిని ఎస్పీ మలికాగర్గ్ ప్రత్యేకంగా అభినందించారు. -
రూ.80 వేల జీతం, అయినా సరిపోలే.. భార్యను నిత్యం అనుమానిస్తూ..
బెంగళూరు: పుట్టించి నుంచి డబ్బు తేవాలని వేధిస్తూ భార్యను హత్య చేశాడో కిరాతక భర్త. హాసన్ తాలూకా దొడ్డమండిగనహళ్లికి చెందిన మంజునాథ్ బెంగళూరులో ఒక ఆటోమొబైల్ సంస్థలో పని చేస్తున్నాడు. ఇతనికి రూ.80 వేల జీతం వస్తుంది. కానీ క్రికెట్ బెట్టింగ్కు బానిసైన అతడు భారీగా డబ్బు పోగొట్టుకున్నాడు. పుట్టింటికెళ్లి డబ్బు తేవాలని భార్య తేజస్వినిని వేధించేవాడు. పెద్ద మనుషులు అనేకసార్లు రాజీ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఇక బెంగళూరులో జీవించలేని మంజునాథ్ సంసారాన్ని హాసన్కు మార్చాడు. అక్కడ తేజస్విని చిన్న ఉద్యోగానికి వెళ్లేది. ఆమెను అనుమానిస్తూ వేధించేవాడు. చివరకు సోమవారం ఆమెను బండరాయితో కొట్టి చంపాడు. పోలీసులు మంజునాథ్తో పాటు అతని తల్లిదండ్రులు సరోజమ్మ, బసవేగౌడలను అరెస్ట్ చేశారు. చదవండి: (షట్టర్ పగలగొట్టి.. గ్యాస్ కట్టర్తో లాకర్ తెరిచి..) -
రూ.100కి 20 రూపాయల వడ్డీ.. దిక్కుతోచని స్థితిలో..
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): క్రికెట్ బెట్టింగ్ ఓ వ్యక్తి ప్రాణాలను తీసింది. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితికి చేరుకుంది. చేసిన అప్పులకు వందకు రూ.20 వడ్డీ చెల్లించలేక ఏం చేయాలో పాలుపోని ఆ వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్టినగర్ సొరంగం వద్ద జరిగింది. ఘటనపై మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. చదవండి: కూర విషయంలో భార్యతో గొడవ.. స్నేహితుడి ఇంటికి వచ్చి.. పోలీసుల కథనం ప్రకారం చిట్టినగర్ సొరంగం సమీపంలోని కటికల మస్తాన్ వీధికి చెందిన జొన్నలగడ్డ బాలస్వాతి, శ్రీనివాసరావు(42) భార్యాభర్తలు. వీరికి అన్నపూర్ణ, అజయ్కుమార్ సంతానం. శ్రీనివాసరావు పెయింటింగ్ పని చేస్తూ క్రికెట్ బెట్టింగులు ఆడుతుంటాడు. బాలస్వాతి పంజా సెంటర్లో ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తుంటుంది. గత కొద్ది రోజులుగా పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న శ్రీనివాసరావుకు అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. వందకు రూ.20 చొప్పున వడ్డీలు చెల్లించాల్సి రావడంతో ఏం చేయాలో అర్ధం కాక మానసికంగా కుంగిపోయాడు. గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ హుక్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు తండ్రిని చూసి భయంతో కేకలు వేశారు. వెంటనే తేరుకుని కిందకు దింపి ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు శుక్రవారం ఉదయం మృతుని నివాసానికి చేరుకుని వివరాలను నమోదు చేసుకున్నారు. మృతుని భార్య నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. -
ఎలిమినేటర్ మ్యాచ్.. ఈడెన్ గార్డెన్ స్టేడియంలో ఐదుగురు అరెస్ట్
ఐపీఎల్ 2022లో భాగంగా బుధవారం లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్కు క్రికెట్ బెట్టింగ్ ముఠా హాజరైనట్లు సమాచారం అందింది. లైవ్ మ్యాచ్ చూస్తూనే ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ నిర్వహించినట్లు తేలింది. దీంతో మఫ్టీలో వచ్చిన యాంటీ రౌడీ స్క్వాడ్(ఏఆర్ఎస్) పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన ఐదుగురు బిహార్కు చెందిన సునీల్ కుమార్, అజయ్ కుమార్, అమర్ కుమార్, ఒబేదా ఖలీల్, అనికెత్ కుమార్లుగా గుర్తించారు. ఈ ఐదుగురు స్టేడియంలోని ఎఫ్-1 బ్లాక్లో ఎవరికి అనుమానం రాకుండా సామాన్య ప్రేక్షకుల్లాగా వచ్చి మ్యాచ్ చూడకుండా మొబైల్ ఫోన్స్లో మునిగిపోయారు. అనుమానం వచ్చి తోటి ప్రేక్షకులు స్టేడియం సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో మఫ్టీలో వచ్చిన యాంటీ రౌడీ స్వ్కాడ్ వారిని అరెస్ట్ చేసి మొబైల్ ఫోన్స్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా వారు ఇచ్చిన సమాచారం మేరకు సెంట్రల్ కోల్కతాలోని న్యూ మార్కెట్ ఏరియాలో ఉన్న ప్రైవేట్ గెస్ట్ హౌస్లో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పలు సంఖ్యలో మొబైల్ ఫోన్లు, పోర్టబుల్ రూటర్ చార్జర్లు, డబ్బులను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. వీరి వెనుక పెద్ద హస్తం ఎవరిదైనా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రజత్ పాటిదార్ సూపర్ సెంచరీతో ఆర్సీబీ క్వాలిఫయర్-2కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 193 పరుగులు మాత్రమే చేసి 14 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మే 27(శుక్రవారం) రాజస్తాన్ రాయల్స్తో ఆర్సీబీ క్వాలిఫయర్-2లో అమితుమీ తేల్చుకోనుంది. చదవండి: 'వడ్ల బస్తా మోసుకెళ్లినట్లు సింపుల్గా'.. కోహ్లి రియాక్షన్ వైరల్ డెత్ ఓవర్లంటే చాలా భయం.. కానీ అదే నాకిష్టం -
తెలుగుయువత నేత ఇంట్లో క్రికెట్ బెట్టింగ్
అనపర్తి: యువతనే లక్ష్యంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్న ఐదుగురిని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పోలీసులు అరెస్టు చేశారు. తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి సబ్బెళ్ల సత్యనారాయణరెడ్డి (సత్య) ఇంట్లోనే నిర్వహిస్తున్న ఈ బెట్టింగ్లకు ఆయనే సూత్రధారి అని పోలీసులు తెలిపారు. అనపర్తి సీఐ జె.వి.రమణ గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. అనపర్తి మండలం రామవరంలో ఓ ముఠా క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్టు వచ్చిన సమాచారంతో పోలీసులు సబ్బెళ్ల సత్యనారాయణరెడ్డి ఇంటిపై బుధవారం రాత్రి దాడిచేశారు. ఆ సమయంలో అక్కడ సత్య, మరో నలుగురు యువకులు ఐపీఎల్ మ్యాచ్పై బెట్టింగ్ నిర్వహిస్తూ పట్టుబడ్డారు. సత్యతో పాటు తేతలి కృష్ణారెడ్డి, కర్రి రమాకాంతరెడ్డి, కర్రి వీరవెంకటసత్యనారాయణరెడ్డి, తమలంపూడి వెంకటరెడ్డిలను అరెస్టు చేసి.. రూ.2.50 లక్షల నగదు, 8 సెల్ఫోన్లు, ల్యాప్టాప్, టీవీ, బెట్టింగ్ లావాదేవీలు, బెట్టింగ్ ఆడుతున్నవారి వివరాలతో ఉన్న పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. సత్య ఆధ్వర్యంలోనే బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రధాన బుకీలు, పంటర్లు ఎవరనే దానిపై లోతైన విచారణ నిర్వహించి, దీంతో సంబంధమున్న వారందర్నీ అరెస్ట్ చేస్తామని సీఐ వెల్లడించారు. -
క్రికెట్ బెట్టింగ్ డాన్ అమిత్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ డాన్ అమీత్ గుజరాతీని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న అమిత్.. గత కొన్నేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. అంతేకాదు.. క్రికెట్ బెట్టింగ్తో కోట్ల రూపాయలను కొల్లగొట్టాడు. ఈ నేపథ్యంలో అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు.. పీటీ వారెంట్పై అమిత్ను పోలీసులు హైదరాబాద్కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఆపై మీడియా ముందు, కోర్టులోనూ ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. దేశ వ్యాప్తంగా బూకీలను ఏర్పాటు చేసి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్స్ కు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు అయ్యింది. దేశవ్యాప్తంగా బుకీలను ఏర్పాటు చేసుకుని బెట్టింగులకు పాల్పడుతున్నాడని అమిత్ గురించి పక్కా ఇన్ఫర్మేషన్ సేకరించారు హైదరాబాద్ పోలీసులు. అంతేకాదు.. క్రికెట్ బెట్టింగుల కోసం వాడే లైవ్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: విశాఖలో ఐపీఎల్ బెట్టింగ్ ముఠాల గుట్టు రట్టు -
‘స్మార్ట్’ బెట్టింగ్.. ఐపీఎల్ మ్యాచ్లపై పందేల జోరు
పలమనేరు(చిత్తూరు జిల్లా): ఐపీఎల్ మ్యాచ్లను చిన్నాపెద్దా తేడా లేకుండా వీక్షిస్తున్నారు. ఫలితం తేలే వరకు టీవీలు, స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఈ తరుణంలోనే జిల్లావ్యాప్తంగా బెట్టింగ్ రాయుళ్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఆయాచిత సొమ్ముకు ఆశపడి పందేలు కాస్తున్నారు. బెట్టింగ్ మాఫియా వలలో సులువుగా చిక్కుకుంటున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ గెలవడం నుంచి బాల్ బై బాల్, ఓవర్ బై ఓవర్ అంటూ తుది విజేత తెలిసే వరకు వివిధ రకాలుగా బెట్టింగ్కు దిగుతున్నారు. దీనికితోడు సెల్ఫోన్లలో అందుబాటులోకి వచ్చిన క్రికెట్ బెట్టింగ్ యాప్ల ద్వారా మరికొందరు యథేచ్ఛగా జూదాలకు పాల్పడుతున్నారు. సులువైన సంపాదనే లక్ష్యంగా పందేలకు అలవాటు పడి చేతి చమురు వదిలించుకుంటున్నారు. చివరకు తమ కుటుంబాలను వీధిన పడేయడమే కాకుండా, ప్రాణాలు తీసుకునే దుస్థితి చేరుకుంటున్నారు. చదవండి: ఆ కోర్సులకు గిరాకీ.. ‘డిగ్రీ’ వైపు మళ్లీ చూపు.. ♦మూడేళ్ల క్రితం బైరెడ్డిపల్లె మండలంలో ఓ యువకుడు బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ♦పెద్దపంజాణి మండలంలో ఓ యువకుడు ఆన్లైన్ యాప్ బెట్టింగ్ ద్వారా తీవ్రంగా నష్టపోయి ఉరేసుకొని ప్రాణం తీసుకున్నాడు. ♦పుంగనూరుకు చెందిన ఓ విద్యార్థి బెట్టింగులో డబ్బు పోగొట్టుకుని ఊరు నుంచి పరారై బెంగళూరులో కూలి పనులు చేసుకుంటున్నాడు ♦కుప్పంలో ఓ ఆటోడ్రైవర్ క్రికెట్ బెట్టింగుల్లో ఓడి తనకు జీవనాధారమైన ఆటోను తెగనమ్ముకోవాల్సి వచ్చింది. ♦కాలేజీలో ఫీజు కట్టాలంటూ తల్లిదండ్రుల వద్ద డబ్బు తీసుకున్న పలువురు విద్యార్థులు బెట్టింగ్ మోజులో సొమ్ము పోగొట్టుకొని ఇబ్బంది పడుతున్నారు. ♦జిల్లాలో ఇలాంటి ఘటనలు అధిక సంఖ్యలో జరుగుతున్నా పోలీసుల వరకు వచ్చేవి కొన్నే.. పల్లె.. పట్టణం తేడా లేకుండా జనం ఐపీఎల్ మ్యాచ్లను చూసేందుకు ఎగబడుతున్నారు. ప్రజల్లో ఆసక్తిని అనుకూలంగా మలుచుకొని కొన్ని ముఠాలు బెట్టింగ్కు తెరతీశాయి. మ్యాచ్ ప్రారంభం నుంచి ముగిసే వరకు ప్రతి నిముషానికి పందేలు కట్టించుకుంటున్నారు. బెట్టింగ్ ఆట కట్టించేందుకు పోలీసులు శతవిధాలా ప్రయతిస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. ముఖ్యంగా యువత బెట్టింగ్కు బానిసలుగా మారి ఉజ్వల భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారు. వీరికి తోడు ఆటో డ్రైవర్లు, రోజువారీ కూలి పనులు చేసుకునేవారు సైతం పందేల మోజులో కొట్టుమిట్టాడుతున్నారు. మార్చి 26వ తేదీన ప్రారంభమైన ఐపీఎల్ మ్యాచ్లు మే 22 వరకు కొనసాగనున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టంగా నిఘా పెట్టినా ఫలితం శూన్యంగా మారుతోంది. పందేల రూపంలో రూ.కోట్లు చేతులు మారుతున్నా చూస్తూ ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది. హిడెన్ యాప్లే కీలకం ప్రస్తుతం స్మార్ట్ఫోన్లలో క్రికెట్ బెట్టింగ్ యాప్లు ఉన్నాయి. వీటిలో రూ.10వేల నుంచి బెట్టింగ్ చేసే వెసులుబాటు ఉంది. ఇవి చాలా వరకు హిడెన్ మోడ్లోనే ఉంటాయి. పోలీసులు తనిఖీ చేసినా ఈ యాప్లు కనిపించవు. ఒకప్పుడు పెద్ద నగరాలకు మాత్రమే బెట్టింగ్ విధానం ఉండేది. ఇప్పుడు స్మార్ట్ఫోన్ల పుణ్యమా అని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ముఖ్యంగా జిల్లాలోని కుప్పం, పలమనేరు, చిత్తూరు, పుంగనూరు నియోజకవర్గాల్లో బెట్టింగులు అధికంగా సాగుతున్నట్లు సమాచారం. ఆయా పట్టణాల్లోని శివారు ప్రాంతాలు, పొలాల వద్ద ఫామ్హౌస్లతోపాటు పందెంరాయుళ్లు కొన్ని లాడ్జీల్లో రూములు, అపార్ట్మెంట్లలో ప్లాట్లు అద్దెకు తీసుకుని యథేచ్ఛగా బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు తెలిసింది. హైవేల్లో దాభాల్లో సైతం పందెంరాయుళ్లు మకాం వేస్తున్నట్లు వినిపిస్తోంది. ఇక గ్రామాల్లో అయితే పొలాలు, చెరువు గట్లు, కొందరు ఇళ్లలోనే కాయ్ రాజా కాయ్ అంటున్నట్టు తెలుస్తోంది. కోడ్లతో లావాదేవీలు ఐపీఎల్ మ్యాచ్లు రోజూ సాయంత్రం 7 నుంచి రాత్రి 11 గంటల వరకు జరుగుతుంటాయి. శని, ఆదివారాల్లో రెండేసి మ్యాచ్లు ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం నుంచే బెట్టింగ్లు ప్రారంభమవుతుంటాయి. చాలా వరకు పందేలు కోడ్లతోనే నిర్వహిస్తుంటారు. గెలిచే జట్టును ఫ్లయింగ్ , ఓడిన జట్టును ఈటింగ్ , రూ.వెయ్యిని ఫింగర్ , రూ.10 వేలను బోన్, రూ.లక్షను లెగ్ అని పిలుస్తుంటారు. ఫోన్ పే, గూగు ల్ పే ద్వారా నగదు లావాదేవీలు సాగిస్తుంటారు. కర్ణాటక ముఠాలదే హవా కర్ణాటకలోని శ్రీనివాసపుర, ముళబాగల్, నంగళి, కోలార్, కేజీఎఫ్, హోసకోట్లకు చెందిన కొన్ని బెట్టింగు గ్యాంగుల హవాలే జిల్లాలో నడుస్తోంది. వీరు కేవలం స్మార్ట్ఫోన్ల ద్వారా బెట్టింగులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. మ్యాచ్కు ముందు బెట్టింగ్ రేట్ నిర్ణయించి ఆన్లైన్లో సొమ్మ జమచేయించుకుంటారు. అనంతరం గెలిచిన వారికి డబ్బు చెల్లిస్తారు. ఇందులో 10 నుంచి 15శాతం కమీషన్లు వసూలు చేస్తుంటారు. పలమనేరులో పందేల జోరు పలమనేరులోని రొంటకుంట్ల రోడ్డు, డిగ్రీ కళాశాలకు వెనుకవైపు, నీళ్లకుంట, గొబ్బిళ్లకోటూరు చెరువలు, వారపుసంత, నాగమంగళం, రంగాపు రం, మార్కెట్ యార్డు గదులు, ఆర్టీసీ డిపో వెనుక బెట్టింగ్కు అడ్డాలుగా మారినట్లు సమాచారం. ప్రత్యేకంగా నిఘా పెట్టాం పలమనేరు సబ్డివిజన్పరిధిలో బెట్టింగులపై ఇప్పటికే బ్లూకోల్ట్స్ ద్వారా నిఘా పెట్టాం. అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నాం. బెట్టింగులకు పాల్పడితే కేసులు తప్పవు. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు దీనిపై దృష్టి పెట్టాలి. చిన్న క్లూ దొరికినా ప్రధాన ముఠాను పట్టుకుంటాం. బెట్టింగ్ మాఫియా ఆటకట్టించేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టాం. – గంగయ్య, డీఎస్పీ, పలమనేరు -
క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ క్రికెట్ సీజన్లో ప్రతి మ్యాచ్లో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్లు పట్టుబడుతూనే ఉన్నాయి. ఇటీవలే రాచకొండలో 7 మందిని, సైబరాబాద్ పోలీసులు 18 మంది అంతర్రాష్ట్ర నిందితులను పట్టుకోగా.. తాజాగా మరో ముఠా ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులకు చిక్కింది. ఇన్స్పెక్టర్ బీ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం ఆటోనగర్కు చెందిన దేవినేని చక్రవర్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి. బెట్టింగ్లకు బానిసగా మారాడు. ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో ఆన్లైన్లో క్రికెట్ పందేలు వేసి సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. భీమవరానికి చెందిన అప్పల రాజు, తన బావమరిది అయిన తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలోని ముగ్గువుల్లాకి చెందిన నిడదవోలు శ్రీనివాస్ ఉదయ్ కుమార్ల నుంచి క్రికెట్ బెట్టింగ్ నిర్వహణకు అవసరమైన లైన్లను తీసుకునేవాడు. మన్సూరాబాద్లోని చండీశ్వర్ కాలనీకి చెందిన వేములపర్తి హరీష్ను సబ్– బుకీగా ఏర్పాటు చేసుకొని వనస్థలిపురంలోని మెడోస్ లోటస్ అపార్ట్మెంట్లో బెట్టింగ్ సెటప్ను ఏర్పాటు చేసుకుని ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం రాత్రి లోటస్ దాడులు చేసి మెయిన్ ఆర్గనైజర్ దేవినేని చక్రవర్తి, సబ్ బుకీ హరీష్లతో పాటు ముగ్గురు పంటర్లు చెన్రెడ్డి సురేశ్ రెడ్డి, సామ జైపాల్ రెడ్డి, షేక్ ఆసిఫ్ పాషాలను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.1,20 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అప్పల రాజు, శ్రీనివాస్ ఉదయ్ కుమార్ పరారీలో ఉన్నారు. (చదవండి: లాఠీ లాక్కుని మరీ పోలీసునే చితక్కొట్టిన ఘనుడు...వైరల్ వీడియో) -
క్రికెట్ బెట్టింగ్...ఏడుగురు అంతరాష్ట్ర నిందితులు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: పుదుచ్చేరిలోని యానాం కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును రాచకొండ పోలీసులు బట్టబయలు చేశారు. ప్రధాన బుకీ సీహెచ్ సాయిరామ్ వర్మ పరారీలో ఉండగా.. ఏడుగురు అంతర్రాష్ట్ర నిందితులను ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.56 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాచకొండ ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, ఇన్స్పెక్టర్ బీ అంజిరెడ్డిలతో కలిసి రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లాకు చెందిన తన్నీరు నాగరాజు 2016లో క్రికెట్ బెట్టింగ్ కేసులో వనస్థలిపురం పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా తన వైఖరి మార్చుకోలేదు. తాజాగా ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో.. మెయిన్ బుకీ సాయిరామ్ వర్మతో చేతులు కలిపి హైదరాబాద్ కేంద్రంగా బెట్టింగ్స్ మొదలుపెట్టాడు. తన స్నేహితుడైన కృష్ణా జిల్లా, చింతకుంటపాలెం గ్రామానికి చెందిన గుండు కిశోర్ను రెండు నెలల పాటు కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేయాలని ఇందుకు నెలకు రూ.50వేల కమీషన్ ఇస్తానని చెప్పి నగరానికి తీసుకొచ్చాడు. తన బంధువులైన ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన తన్నీరు అశోక్, చెమ్మేటి వినోద్లను సబ్ బుకీలుగా ఏర్పాటు చేసుకొని వనస్థలిపురంలో వినోద్ ఇంట్లో బెట్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. మ్యాచ్ మొదలు మూడు లైన్ల ద్వారా సబ్ బుకీలు పందేలు కాసే పంటర్లకు ఆన్లైన్లో లింక్లు పంపేవారు. మ్యాచ్ పరిస్థితిని బట్టి పంటర్లు రూ.10–50 వేల మధ్య పందేలు కాస్తుంటారు. ప్రతి బెట్టింగ్కు సబ్ బుకీలు రేటింగ్స్ ఇస్తుంటారు. మ్యాచ్ పూర్తయ్యాక.. ఏ పంటర్ల నుంచి ఎంత సొమ్ము వసూలు చేయాలి, ఎంత చెల్లించాలో బుకీలు ఏజెంట్లకు సూచిస్తారు. మొత్తం లాభంలో సబ్ బుకీలకు 3 శాతం కమీషన్గా ఇచ్చేవారు. ఆన్లైన్లో పందేలు కాసేవారి కోసం సాయిరామ్ వర్మ ‘రోమన్ క్యాథలిస్ట్ కులమదై స్వామి’ అనే పేరుతో ఐసీఐసీఐ బ్యాంక్లో నకిలీ ఖాతాను తెరిచాడు. గురువారం జరిగిన రాజస్థాన్ రాయల్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్పై క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు.. సత్యానగర్ కాలనీలోని స్థావరంపై దాడులు చేసి నిందితులను పట్టుకున్నారు. సబ్ బుకీలు నాగరాజు, కిశోర్, అశోక్, వినోద్లతో పాటు పంటర్లు చైతన్యపురీకి చెందిన కోట్ల దినేష్ భార్గవ్, కొత్తపేటకు చెందిన మేడిశెట్టి కిశోర్, శంకర్పల్లికి చెందిన బోజన రాజులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.11.80 లక్షల నగదు, బ్యాంక్ ఖాతాల్లోని రూ.31,17,576 సొమ్ముతో పాటు 9 ఫోన్లు, కారు, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: తుపాకీ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు) -
భారత్లో బెట్టింగ్.. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Calls For Legalisation Of Sports Betting: టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి బెట్టింగ్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్లో స్పోర్ట్స్ బెట్టింగ్ను చట్ట బద్ధం చేస్తే దేశ ఖజానాకు భారీ ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నాడు. ఇలా చేయడం వల్ల బెట్టింగ్పై నిఘా పెట్టే వీలు కూడా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. తాజాగా జరిగిన మీడియా కార్యక్రమంలో ఆయన మాట్లడుతూ.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు బెట్టింగ్కు చట్ట బద్ధత కల్పించాయని.. భారత్లో కూడా అలా చేస్తే పన్ను రూపేనా భారీ మొత్తంలో ఆదాయం సమకూరుతుందని అన్నాడు. దేశంలో స్పోర్ట్స్ బెట్టింగ్ చాలా కాలంగా జోరుగా సాగుతుందని, ముఖ్యంగా క్రికెట్పై భారీ స్థాయిలో బెట్టింగ్లు నడుస్తాయని, మరి ముఖ్యంగా ఐపీఎల్ సీజన్లో వందల కోట్లలో చేతులు మారుతుంటాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బెట్టింగ్ను అణచివేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగముండదని, ఇందుకు చట్ట బద్ధత కల్పించడమే ఉత్తమమైన మార్గమని అభిప్రాయపడ్డాడు. రవి చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మరోసారి హాట్ టాపిక్గా మారాయి. రవిశాస్త్రి కంటే ముందు పలువురు ప్రముఖులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంపై విచారణ జరిపిన కమిటీకి నేతృత్వం వహించిన విశ్రాంత జస్టిస్ ముకుల్ ముద్గల్ కూడా ఇదే విషయాన్ని కేంద్రానికి సూచించారు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్-2021 అనంతరం కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగిన రవిశాస్త్రి.. త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్-2022లో ఓ ప్రముఖ జట్టు తరఫన కీలక బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. చదవండి: IPL 2022: ఆర్సీబీ కెప్టెన్గా మనీశ్ పాండే..? -
భారీగా డబ్బుల కట్టలు స్వాధీనం.. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ బుకీ అరెస్ట్
వరంగల్ క్రైం: అతను చదివింది నాలుగో తరగతి. ఆన్లైన్లో అందెవేసిన చేయి. ముంబై బుకీతోపాటు స్నేహితులతో కలసి ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్, మూడు ముక్కలాట నిర్వహణతో రూ.కోట్లు గడించాడు. వీరి చేతిలో మోసపోయిన వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముఠా గుట్టు రట్టయ్యింది. ముంబై కేంద్రంగా సాగుతున్న ఈ దందాకు సంబంధించి కాకతీయ యూనివర్సిటీ పోలీసులు ఇద్దరు బుకీలను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.2 కోట్లకు పైగా నగదు, 7 సెల్ఫోన్లు, వివిధ బ్యాంకులకు సంబంధించిన 43 పాస్బుక్లు, ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి సోమవారం మీడియా సమావేశంలో ఈ ముఠా అరెస్టుకు సంబంధించిన వివరాలు తెలిపారు. హనుమకొండ జిల్లా విజయ్నగర్ కాలనీకి చెందిన మాడిశెట్టి ప్రసాద్ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లి రెడీమేడ్ దుస్తుల వ్యాపారం ప్రారంభించాడు. కానీ వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణ కష్టం కావడంతో సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో కొద్ది మంది స్నేహితులతో కలసి 2016లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ దందా ప్రారంభించాడు. దీని ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించడంతోపాటు 2018లో స్నేహితులతో కలసి ఆన్లైన్లో మూడు ముక్కలాటను ప్రారంభించాడు. ఈ క్రమంలో ప్రసాద్కు ముంబై కేంద్రంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే అభయ్తో పరిచయం ఏర్పడింది. దీంతో ప్రసాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో బుకీగా మారాడు. భారీగా డబ్బులు సంపాదించాడు. ఈ క్రమంలో అటు బెట్టింగ్, ఇటు మూడు ముక్కలాటలో పలువురు వ్యక్తులు ఈ ముఠా చేతిలో మోసపోయారు. చదవండి: Swiggy Delivery Boys: స్విగ్గీ డెలివరీ బాయ్స్ హెచ్చరిక.. వారంలో డిమాండ్లు పరిష్కరించాలి, లేదంటే.. లాభాల పంపకంలో ఉండగా.. 2019లో బెట్టింగ్ నేరంపై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురం పోలీసులు ప్రసాద్ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. బయటికి వచ్చాక హైదరాబాద్లో తిరిగి ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తే పోలీసులు సులభంగా గుర్తిస్తారని, మళ్లీ హనుమకొండకు మకాం మార్చాడు. అప్పటి నుంచి యథేచ్ఛగా ఆన్లైన్లో బెట్టింగ్, మూడుముక్కలాట నిర్వహణతో భారీగా డబ్బులు సంపాదించి బినామీ పేర్లతో బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమచేశాడు. చదవండి: Mariamma Lockup Death Case: మరియమ్మ లాకప్ డెత్పై తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు ఆ డబ్బుతో స్థిరాస్తులు కూడా కొనుగోలు చేశాడు. కాగా, ఇటీవల బెట్టింగ్లో మోసపోయిన కొందరు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదులతో ఈ ముఠాపై కేయూ పోలీస్స్టేషన్లో రెండు, హనుమకొండ పోలీస్స్టేషన్లో ఒక కేసు నమోదు అయింది. దీంతో సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి, హనుమకొండ ఏసీపీ జితేందర్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఒకడైన ముంబై బుకీ అభయ్ ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా వచ్చిన లాభాన్ని పంచుకునేందుకు ప్రసాద్ ఇంటికి రాగా, కేయూ ఇన్స్పెక్టర్ జనార్దన్రెడ్డి తన సిబ్బందితో వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: Ameerpet: ఎమ్మెల్యేతో మహిళ ఫొటో.. మార్ఫింగ్ చేసి ఆడియోలో అసభ్యకరంగా.. -
క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 12 మంది అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.2,29,700తో పాటు, కర్ణాటక మద్యం ప్యాకెట్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ ప్రసాద్రావు గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతుండటంతో బెట్టింగ్ నిర్వహించే ప్రాంతాలు, నిర్వాహకుల కదిలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ప్రొద్దుటూరులోని ఆర్టీపీపీ రోడ్డు, రామేశ్వరం నీళ్ల ట్యాంకు ఆవరణలో పందేలు నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో వన్టౌన్ సీఐ నాగరాజు, ఏఎస్ఐ ఇబ్రహీంలు సిబ్బందితో కలిసి గురువారం దాడులు నిర్వహించి బెట్టింగ్ రాయుళ్లను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో మల్లెల వెంకటనారాయణరెడ్డి, కరుమూరు యుగంధర్, అచ్చుకట్ల జిలాన్బాషా, తులబండి బాలసుబ్రహ్మణ్యం, మోపూరి శ్రీధర్, బైసాని సుధాకర్, ధర్మవరం దస్తగిరి, పాలెం ఇమాంషా, వెంకటసుబ్బయ్య, శ్రీధర్కుమార్, వెంకటసుదర్శన్రెడ్డి, మైనగారి నాగేంద్రప్రసాద్ ఉన్నారు. వారి వద్ద నుంచి నగదుతో పాటు 4 సెల్ఫోన్లు, 6 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు, బెట్టింగ్ స్లిప్పులను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్టు డీఎస్పీ ప్రసాద్రావు వివరించారు. -
Hyderabad: క్రికెట్ బెట్టింగ్ రాకెట్ బ్లాస్ట్: రూ.2.21 కోట్ల సొత్తు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ రాకెట్ను సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా అతిపెద్ద బెట్టింగ్ ముఠాను పట్టుకున్నారు. మాదాపూర్ జోన్ పరిధిలోని ఏడు ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు మియాపూర్, బాచుపల్లి, గచి్చ»ౌలి, మైలార్దేవ్పల్లిలోని ఏడుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించి 23 మంది బూకీలను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.93 లక్షల నగదు, 14 బెట్టింగ్ బోర్డ్లు, 8 ల్యాప్టాప్స్, 247 సెల్ఫోన్లు, 28 స్మార్ట్ఫోన్లు, 4 ట్యాబ్స్, 4 టీవీలు, 2 రూటర్స్, ప్రింటర్, 5 కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.2.21 కోట్లు. పరారీలో ఉన్న మెయిన్ బూకీ విజయవాడకు చెందిన మహా అలియాస్ సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం ఇతను బెంగళూరులో ఉన్నట్లు సమాచారం. వివరాలను మాదాపూర్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు, స్పెషల్ ఆపరేషన్ టీం(ఎస్ఓటీ) డీసీపీ సందీప్లతో కలిసి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర బుధవారం మీడియాకు వివరించారు. విజయవాడకు చెందిన మెయిన్ బూకీ మహా నుంచి లీడ్స్ తీసుకొని పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన చింత వేణు(35), కర్నాటకలోని రాయచూర్కు చెందిన గోదవర్తి వెంకటేష్ (32) ఇద్దరు బూకీలుగా అవతారమెత్తి ఏడేళ్లుగా హైదరాబాద్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్–2021లో మంగళవారం నాటి ముంబై–పంజాబ్ మ్యాచ్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు ఫ్యాన్సీ లైఫ్, లైవ్ లైన్ గురు, క్రికెట్ మజా, లోటస్, బెట్ 365, బెట్ ఫెయిర్ వంటి యాప్స్ ద్వారా క్రికెట్ బెట్టింగ్, లావాదేవీలను నిర్వహిస్తున్నారు. రెండు నెలలుగా నిఘా పెట్టిన పోలీసులు బెట్టింగ్ నిర్వాహకులను మంగళవారం పట్టుకున్నారు. పశ్చిమ గోదావరి ఆకువీడుకు చెందిన జెళ్ల సురేష్ (33), తిరుమణి మణికంఠ(23), కొల్లాటి మణికంఠ(21), పీ.శ్రీనివాస్(35), దుర్గాప్రసాద్ కొల్లాటి(22), జమ్ము నాగరాజు(36), ఈదర రవి(36), భీమవరం వడువు అజయ్ కుమార్ (27), అట్లూరి రంజిత్ కుమార్(35), జగన్నాథపురంకు చెందిన జయశ్రీనివాస్(29), నల్లజర్లకు చెందిన తూరెళ్ల సాయి(24), గుంటూరు జిల్లా మంత్రిపాలెం రేపల్లె నాగళ్ల రాకేష్(37), తూర్పు గోదావరి మొగిలి కూడురుకు చెందిన సుందర రామరాజు(34), విజయవాడకు చెందిన కునప్పరెడ్డి దుర్గా పవన్ కుమార్(32), కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన కోట సాయి నవీన్(25), భద్రాచలం గౌరిదేవిపేట్కు చెందిన రవితేజ(37), బాచుపల్లికి చెందిన కామగాని సతీష్(39), మైలార్దేవ్పల్లికి చెందిన మల్లిఖార్జున చారీ(38), కర్నాటకలోని రాయచూర్కు చెందిన బొప్ప వెంకటేష్ (30), గన్ని కల్యాణ్ కుమార్ (30), పత్తిపాటి రాము (32)లను అరెస్ట్ చేశారు. వీరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 7 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెయిన్ బూకీ మహాతో పాటు చెన్ను భాస్కర్రెడ్డి, గుంటూరుకు చెందిన సురేష్, కేపీహెచ్బీకి చెందిన పవన్ అలియాస్ ప్రవీణ్, రాయచూర్కు చెందిన కే.సుమన్, రామాంజనేయ, ముంబైకి చెందిన నందలాల్ గోరీ పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ముఠా కార్యకలాపాలు ముంబై, గోవా, బెంగళూరు, దుబాయ్లో కూడా ఉన్నాయని దర్యాప్తులో తేలిందని చెప్పారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అంతర్రాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ రాకెట్ బ్లాస్ట్: రూ.2.21 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం ఫోటోలు
-
క్రికెట్ బెట్టింగ్ తో అప్పులు.. తీర్చేందుకు వేరే దారి లేక..
సాక్షి, బంజారాహిల్స్ ( హైదరాబద్): అప్పులు తీర్చేందుకు చోరీకి పాల్పడ్డ యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. వరంగల్ పట్టణానికి చెందిన జన్నా రమేష్ మూడేళ్ల క్రితం నగరానికి వచ్చి కార్మికనగర్లో నివాసం ఉంటున్నాడు. టైల్స్ వర్క్ చేస్తున్న రమేష్ కొంతకాలంగా క్రికెట్ బెట్టింగ్లకు అలవాటుపడ్డాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ టోర్నీ సందర్భంగా అప్పులు చేసి బెట్టింగ్లు కట్టాడు. వాటిని తీర్చకపోవడంతో అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి తెచ్చారు. ఎలాగైనా డబ్బులు సంపాదించి అప్పులు తీర్చాలన్న లక్ష్యంతో ఈ నెల 15న రెహ్మత్నగర్లో నివాసం ఉంటున్న చేపల వ్యాపారి ఆంజనేయులు ఇంట్లో చొరబడి అల్మారాలోంచి రూ.25,500 నగదు, ఆరున్నర తులాల బంగారం చోరీ చేశాడు. ఆంజనేయులు భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. మంగళవారం జన్నా రమేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతని వద్ద నుంచి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. -
ఖాకీ అసాంఘిక దోస్తీ..
సాక్షిప్రతినిధి, కర్నూలు: జిల్లాలో మట్కా, క్రికెట్ బెట్టింగ్, పేకాట జోరుగా సాగుతోంది. అక్రమార్జన కోసం కొందరు పోలీసులు అసాంఘిక కార్యకలాపాలకు సహకారం అందిస్తున్నారు. ఈ విషయంపై గతంలో నేరుగా ఎస్పీకి ఫిర్యాదులు అందాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వీఆర్కు పంపినా పరిస్థితిలో మార్పు లేదు. నెలవారీ మామూళ్లు ఇస్తూ కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో జూద కేంద్రాలను బహిరంగంగానే నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మట్కా రాయుళ్ల నుంచి ఒక్కో పోలీస్స్టేషన్కు నెలకు రూ. 50వేల నుంచి రూ.లక్ష వరకు మామూళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. నంద్యాల కేంద్రంగా.. నంద్యాల కేంద్రంగా మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్ సాగుతోంది. మట్కా శీను అంతా తానై నడిపిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. చాంద్బాషా కూడా కొన్ని ప్రాంతాల్లో మాట్కా నడుపుతున్నాడు. ఇతని సోదరి ఏకంగా పోలీసుల వాట్సప్ గ్రూపులో చేరి సమాచారాన్ని సేకరిస్తున్నారంటే విషయం అర్థం చేసుకోవచ్చు. కొన్ని నెలల కిందట పట్టణంలోని ఎన్జీవో కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని పేకాట నిర్వహిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు దాడులు చేసి రూ.9 లక్షల నగదు, కారు, బైకులు సీజ్ చేశారు. ఆ తర్వాత కూడా ఈ ప్రాంతంలో యథేచ్ఛగా పేకాట ఆడుతున్నారు. అయినా పోలీసులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గాజులపల్లెకు చెందిన ఓ వ్యక్తి నంద్యాల కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. ఇండియా మ్యాచ్లే కాకుండా స్పోర్ట్స్ చానెల్లో ఏ దేశం క్రికెట్ మ్యాచ్లు జరిగినా, ఏ లీగ్ లైవ్ జరిగినా బెట్టింగ్ నిర్వహిస్తూ యువకుల జేబులు కొల్లగొడుతున్నాడు. బెట్టింగ్ ఊబిలో విద్యార్థులు.. క్రికెట్ బెట్టింగ్ అంటే గతంలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పేరు వినిపించేది. ఇప్పుడు కర్నూలు, నంద్యాలలో కూడా జోరుగా నడుస్తోంది. బడా వ్యాపారుల నుంచి బార్బర్ షాపు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకుల వరకూ అంతా బెట్టింగ్ ఊబిలో చిక్కుకునిపోయారు. ఇటీవల విద్యార్థులు కూడా దీనికి బానిసవుతున్నారు. ప్రభుత్వం జాబ్ కేలండర్ ప్రకటించడంతో సర్కారు కొలువు దక్కించుకోవాలని చాలామంది హాస్టళ్లలో ఉండి కోచింగ్ తీసుకుంటున్నారు. తల్లిదండ్రుల కష్టపడి పిల్లల చదువు కోసం డబ్బులు పంపిస్తే, తెలిసీతెలియక వ్యసనాలకు వారు బానిసవుతున్నారు. పర్యాటక ప్రాంతాల్లో పేకాట క్లబ్ల్లో పేకాట నిషేధించడంతో పేకాట రాయుళ్లు ఇళ్లను అద్దెకు తీసుకుని ఆడుతున్నారు. జిల్లా నుంచి రాయచూరు క్లబ్కు వెళ్లేవారు కూడా అధికంగా ఉన్నారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాలైన సుంకేసుల, ఓర్వకల్లు రాక్గార్డెన్, అవుకు రిజర్వాయర్ సమీపంలో పేకాట ఆడుతున్నారు. ఇటీవలే జిల్లా ఎస్పీగా సుధీర్కుమార్రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించిన అధికారిగా ఈయనకు పేరు ఉంది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. -
PSL: క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్..
మేడ్చల్(హైదరాబాద్) : బాచుపల్లిలో క్రికెట్ బెట్టింగ్కి పాల్పడుతున్న ముఠాపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు తెలిపారు. పోలీసుల ప్రకారం.. ఈ ముఠా పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లపై ఒక్కో రేటు ఫిక్స్ చేసుకుని బెట్టింగ్కు పాల్పడుతున్నారని అన్నారు. ఈ గ్యాంగ్ బెట్టింగ్ను కొత్త తరహాలో చేస్తున్నారని తెలిపారు. ఆన్లైన్తో.. ప్రత్యేకంగా రూపొందించిన యాప్ల ద్వారా బెట్టింగులు జరుగుతున్నాయని అన్నారు. కాగా ఈ ముఠా నుంచి రూ.21 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు తెలిపారు. చదవండి: ఇన్స్టా పరిచయం.. ప్రేమ అంగీకరించలేదని ప్రియుడి ఆత్మహత్య -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
పీఎంపాలెం (భీమిలి): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ముఠాను శనివారం రాత్రి విశాఖ పోలీసులు పట్టుకున్నారు. బెట్టింగ్ల ప్రక్రియ సూత్రధారి పరారు కాగా నలుగురిని అరెస్టు చేశారు. వారివద్ద నుంచి సుమారు రూ.3 లక్షలు విలువైన ఎల్రక్టానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను పీఎంపాలెం సీఐ రవికుమార్ తెలిపారు. ఆయన తెలిపిన మేరకు.. ఈ నెల 9 నుంచి జరుగుతున్న పాకిస్తాన్ సూపర్లీగ్ టీ–20 క్రికెట్ మ్యాచ్లపై వీరు బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. రుషికొండ పనోరమాహిల్స్ సెలబ్రిటీ టవర్స్ 15వ అంతస్తులోని ఫ్లట్ను చేబోలు శ్రీనివాస్ ఎలియాస్ కేబుల్ శ్రీను అద్దెకు తీసుకున్నాడు. అక్కడ క్రికెట్ బెట్టింగ్లు నిర్వహించేందుకు ఎల్రక్టానిక్ పరికరాలు సిద్ధం చేశాడు. విశాఖలోని అక్కయ్యపాలేనికి చెందిన కుంచంగి రవికుమార్ (29), సుజాతానగర్కు చెందిన తమ్మారెడ్డి ధనుంజయ్ (34), శ్రీకాకుళం జిల్లా నరసయ్యపేట మండలం బుచ్చిపేట మండలానికి చెందిన మార్పు శివాజీ (29), విశాఖ ఎంవీపీ కాలనీకి చెందిన వీరపునేని రాంబాబు (43)లను ఉద్యోగులుగా నియమించాడు. క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు ఒకేసారి 30 మందితో 30 సెల్ఫోన్ల ద్వారా మాట్లాడగల సామర్థ్యం ఉన్న సెటప్ బాక్సు ఏర్పాటు చేసి బెట్టింగ్లు నిర్వహిస్తున్నాడు. తప్పుడు రేటింగ్లు చెబుతూ.. పాకిస్తాన్ సూపర్లీగ్ టీ–20 మ్యాచ్లలో శనివారం రాత్రి 9.30 గంటలకు కెట్ట గ్లాడియర్స్–పెషావర్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. క్రికెట్ లైవ్ గ్రూపులో చూస్తూ మ్యాచ్ గెలుపోటములపై కోడ్ ద్వారా అసలు రేటింగ్కు బదులు తప్పుడు రేటింగ్లు చెబుతూ బెట్టింగులు కాసేవారిని తప్పు దోవ పట్టిస్తూ బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. టాస్క్ ఫోర్సు పోలీసులకు సమాచారం అందడంతో పీఎంపాలెం సీఐ రవికుమార్ నేతృత్వంలో పోలీసులు శనివారం రాత్రి దాడిచేసి నలుగురు నిందితులను అరెస్టుచేసి వారివద్ద నుంచి పలు పరికరాలు, రూ.1,500 నగదు స్వాదీనం చేసుకున్నారు. అప్పటికే ప్రధాన నిందితుడు శ్రీనివాస్ పరారయ్యాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవికుమార్ తెలిపారు. -
క్రికెట్ బెట్టింగ్కు ఇంజనీరింగ్ విద్యార్థి బలి
సాక్షి, చిత్తూరు : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. క్రికెట్ బెట్టింగ్ వ్యసనం ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రాణం బలితీసుకుంది. ఈ సంఘటన కుప్పంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుప్పానికి చెందిన కిరణ్ అనే విద్యార్థి కేఈసీ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. కిరణ్కు క్రికెట్ బెట్టింగ్ వ్యసనంగా మారింది. దీంతో లక్షల రూపాయలు బెట్టింగ్ కాసి పోగొట్టుకుని, తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. చనిపోయే ముందు ఇన్స్టాగ్రామ్లో ‘ఎవ్వరూ బెట్టింగులు పెట్టి మోసపోవద్దు’ అని హెచ్చరించాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. చదవండి : కిలేడీ.. మేకప్ వేసుకుంటే కనుక్కోలేం!.. దారుణం: ఎంగిలి పల్లెం విసిరాడని చిన్నాన్నను.. -
సీఐ జగదీశ్ కేసు: రోజుకో విషయం వెలుగులోకి
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి సీఐ జగదీశ్ అక్రమాల వ్యవహారంలో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. జగదీశ్ అక్రమాస్తులకు సంబంధించి వారం రోజులుగా ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే నిజామాబాద్ కంఠేశ్వర్లోని యాక్సిస్ బ్యాంక్ లాకర్లో ఉన్న రూ.34 లక్షల నగదు, 9 లక్షల విలువ చేసే బంగారంతో పాటు ఇతర విలువైన ఆస్తులకు సంబంధించిన విలువైన డాక్యుమెంట్స్ను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఐపీఎల్ క్రికెట్ ప్రారంభం నుంచే బెట్టింగ్ నిర్వాహకులతో సీఐ జగదీశ్ టచ్లో ఉన్నట్లు ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది. కాగా, జగదీశ్కు బెట్టింగ్ వ్యవహారంలోనే కాకుండా ఓ వివాహిత హత్య కేసుతో, ఓ పెళ్లి సంబంధం విషయంలో పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగదీశ్కు సంబంధించిన బాధితుల నుంచి ఏసీబీ అధికారులు వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఐపీఎల్ క్రికెట్కు సంబందించి బెట్టింగ్ నిర్వాహకుల నుంచి సీఐతో పాటు జిల్లాకు చెందిన పలువురు సీఐలు, ఏఎస్సైలు పెద్ద ఏత్తున మాముళ్లు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఏసీబీ అధికారులు క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ఇతర పోలీస్ అధికారుల ప్రమేయంపై కూడా ఆరా తీస్తున్నారు. చదవండి: (బెయిల్ కోసం కామారెడ్డి సీఐ చేతివాటం) -
కట్టలు కట్టలుగా డబ్బు..
సాక్షి, నిజామాబాద్ : క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయి సస్పెండ్ అయిన కామారెడ్డి సీఐ జగదీశ్కు సంబంధించి ఏసీబీ అధికారులు భారీగా అక్రమ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ కంటేశ్వర్ యాక్సిస్ బ్యాంకులో జగదీశ్కి సంబంధించిన లాకర్ ఓపెన్ చేసి.. 34,40,000 రూపాయల నగదుతో పాటు 9 లక్షల రూపాయల విలువచేసే బంగారు నగలను సీజ్ చేసినట్లు ఏసీబీ డైరెక్టర్ జనరల్ పూర్ణచందర్ రావుతెలిపారు. సస్పెండైన సీఐ జగదీశ్కు సంబంధించి అక్రమాస్తులను గుర్తించే పనిలో లోతుగా వివరాలు సేకరిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. బినామీ పేర్లతో పలు చోట్ల పెద్ద ఎత్తున జగదీష్ భూములు కొన్నట్లు ఏసీబీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: కామారెడ్డి సీఐ జగదీశ్ అరెస్టు) -
కామారెడ్డి సీఐ జగదీశ్ అరెస్టు
సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి క్రైం: క్రికెట్ బెట్టింగ్ కేసులో అవినీతికి పాల్పడిన కామారెడ్డి పట్టణ సీఐ జగదీశ్ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. శుక్రవారం ఏకకాలంలో పలు చోట్ల తనిఖీలు జరిగాయి. బాన్సువాడ కు చెందిన సుధాకర్ను కామారెడ్డి పోలీసులు బెట్టింగ్ వ్యవహారంలో 15 రోజుల క్రితం అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ నెల 6న అతనికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం సీఐ జగదీశ్ రూ. 5 లక్షలు డిమాండ్ చేశాడు. ముందుగా రూ.1,39,500లను సుధాకర్ సీఐకి ఇచ్చాడు. మిగతా డబ్బులను సైతం వెంటనే చెల్లించాలని సీఐ పలుసార్లు సుధాకర్ ఒత్తిడి పెంచ డంతో అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ నెల 19న ఏసీబీ అధికారులు సీఐ జగదీశ్తో పాటు ఈ వ్యవహా రంలో మధ్యవర్తిత్వం చేసిన సుజయ్పై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం కామారెడ్డిలోని సీఐ జగదీశ్ ఇంటిపై అధికారులు దాడులు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు సోదాలు జరిగాయి. సీఐ ఇంట్లో విలువైన డాక్యుమెంట్లు, లాకర్ కీలు స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నట్టు డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపారు. మధ్యవర్తి సుజయ్ను సైతం విచారిస్తున్నామని, సీఐని ఏసీబీ కోర్టులో శనివారం ప్రవేశపెడుతామని చెప్పారు. -
విషాదం నింపిన క్రికెట్ బెట్టింగ్
సాక్షి, గుంటూరు : క్రికెట్ బెట్టింగ్ ఇద్దరు యువకుల ప్రాణాలను బలితీసుకుంది. జిల్లాలోని బెల్లంకొండలో విషాదాన్ని నింపింది. బెట్టింగ్ నిర్వహించి అప్పులపాలవ్వడంతో ఇద్దరు యువకుల ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఈనెల 9న ఇద్దరు యువకులు సురేష్, కొమరయ్య పురుగుల మందు సేవించగా.. తొలుత 10న సురేష్ మృతి చెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొమరయ్య శనివారం మృతి చెందాడు. ఇద్దరి మరణంతో బెల్లంకొండలో విషాదఛయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బెల్లంకొండ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. (ప్రాణం తీసిన క్రికెట్ బెట్టింగ్.. సెల్ఫీ వీడియోతో!) అయితే గ్రామస్థుల సమాచార ప్రకారం.. పెదకూరుపాడు మండలానికి చెందిన ఊర సురేష్, బెల్లంకొండ బుడగజంగాల కాలనీకి చెందిన కొమురయ్య ఇద్దరూ క్రికెట్ బెట్టింగ్లో లక్షల రూపాయలు పొగొట్టుకున్నారు. బెట్టింగ్ నిర్వాహకుడికి రూ. 30వేలు చెల్లించగా.. మరో రూ.80 వేల కోసం నిర్వాహకుడు పట్టుబట్టాడు. దీంతో బాకీలు తీర్చలేక మనస్తాపంతో బెల్లంకొండ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెట్టింగ్ డబ్బులు కట్టాలంటూ బుకీ ఒత్తిడి తెవడంతోనే ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అంతేగాక తాము చనిపోతున్నామంటూ సెల్ఫీ వీడియో తీసి బంధువులకు పంపారు. -
గుంటూరు: బలికోరిన క్రికెట్ బెట్టింగ్
-
అమ్మా, నాన్నా.. మేం పోతున్నాం
సాక్షి, గుంటూరు : క్రికెట్ బెట్టింగ్ కారణంగా ఓ యువకుడు ప్రాణం కోల్పోగా.. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పెదకూరుపాడు మండలానికి చెందిన ఊర సురేష్, బెల్లంకొండ బుడగజంగాల కాలనీకి చెందిన కొమురయ్య ఇద్దరూ క్రికెట్ బెట్టింగ్లో లక్షల రూపాయలు పొగొట్టుకున్నారు. బెట్టింగ్ నిర్వాహకుడికి రూ. 30వేలు చెల్లించగా.. మరో రూ.80 వేల కోసం నిర్వాహకుడు పట్టుబట్టాడు. దీంతో బాకీలు తీర్చలేక మనస్తాపంతో బెల్లంకొండ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చదవండి: గోల్మాల్ గేమ్! అంతేగాక తాము చనిపోతున్నామంటూ సెల్ఫీ వీడియో తీసి బంధువులకు పంపారు. విషయం తెలుసుకున్న బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని ఇద్దరిని గుంటూరు ప్రైవేటు అస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందగా, కొమురయ్య పరిస్థితి విషయంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బెల్లంకొండ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
గోల్మాల్ గేమ్!
సాక్షి, కరీంనగర్: ఆన్లైన్ గేమ్స్, క్రికెట్ బెట్టింగ్లు ఇల్లు గుల్ల చేస్తున్నాయి. యువకులు జూదానికి ఆకర్షితులవుతూ డబ్బులు పోగొట్టుకుని బజారున పడుతున్నారు. అప్పులు చేసి మరీ ఆడడంతో జీవితాలు రోడ్డుపాలు అవుతున్నాయి. పల్లె, పట్టణం అని తేడా లేకుండా ఇష్టారాజ్యంగా ఆన్లైన్ రమ్మీ ఆడుతూ, క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతూ లక్షల రూపాయలు నష్టపోయి కుటుంబాలను బజారున పడేస్తున్నారు. లాక్డౌన్ కాలంలో యువతకు మరింత ఖాళీ సమయం దొరకడంతో ఆన్లైన్లో గడపడం ఈ పరిస్థితులకు దారితీసిందని పలువురు పేర్కొంటున్నారు. పిల్లలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచితే నష్టపోకుండా చూసుకోవచ్చని పోలీసులు సూచిస్తున్నారు. ఆటల్లో పొగొట్టుకున్న డబ్బులను రికవరీ చేయడానికి అవకాశముండదని పేర్కొంటున్నారు. ఆశతో అడుగు పెడుతూ.. ఆన్లైన్ రమ్మీ ఆడుతూ చాలా మంది గుడ్డిగా మోసపోతున్నారు. వీరివైపు నుంచి డబ్బులు పెడుతూ ఆడుతున్నా ఇంకో వైపు ఎవరూ, ఎలా ఆడుతున్నారో కూడా తెలియకుండా గుడ్డిగా ఆడుస్తున్నారు. డబ్బు సంపాదించవచ్చేనే ఆశతో మొదలైన ఆన్లైన్ రమ్మీ ఆడుతూ డబ్బు పోగొట్టుకున్న తర్వాత తిరిగి రాబట్టుకోవాలని ఆడుతూ లక్షల్లో నష్టపోతున్నారు. చాలా మంది ఆన్లైన్ గేమ్స్తో అప్పుల పాలవడంతోపాటు భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారు. జోరుగా ఐపీఎల్ బెట్టింగ్లు.. ఐపీఎల్ ప్రారంభమైన రోజు నుంచి క్రికెట్ బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. సాయంత్రమైందంటే చాలు లక్షల రూ పాయలు ఆన్లైన్లో ఖాతాలు మారుతున్నాయి. సెప్టెంబర్ 19న ప్రారంభమైన ఐపీఎల్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఐపీఎల్ బెట్టింగ్లో ఇటీవల పోలీసులకు పట్టుబడిన వారిలో ఎక్కువ మంది యువకులే. ఈజీ మనీ కోసం బుకీలు వాట్సాప్, ఆన్లైన్లోనే బెట్టింగ్ నిర్వహిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. యువకులు కూడా డబ్బులు బెట్టింగ్ పెట్టి నష్టపోతున్నారు. పోలీసులు బెట్టింగ్ను కట్టడి చేస్తున్నారు. పట్టుబడినవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. లాక్డౌన్.. లాస్ కరోనాతో విధించిన లాక్డౌన్తో అందరూ ఇళ్లకే పరిమితమవడం, అత్యవసరమయితే తప్ప బయటకు వచ్చే పరిస్థితులు లేకుండా ఉండేవి. ఇలాంటి సమయంలో టైంపాస్ కోసం ఆన్లైన్ రమ్మీకి అలవాటుపడ్డారు. ఆ అలవాటు కాస్తా వ్యసనంగా మారి అప్పులు, ఆర్థిక సమస్యలను తెచ్చిపెట్టడంతో తల పట్టుకుంటున్నారు. స్నేహితులు, బంధువుల వద్ద చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. బానిస కావద్దు.. యువత క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్ రమ్మీ ఆడి అనవసరంగా డబ్బులు నష్టపోకూడదు. చెడు అలవాట్లకు బానిస కావద్దు. ఆన్లైన్ మోసాలు జరిగిన కేసుల్లో డబ్బులు రికవరీ చేయడం కష్టం. యువత సన్మార్గంలో పయనిస్తూ ఆదర్శంగా నిలవాలి. తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టిసారించాలి. –వీబీ.కమలాసన్రెడ్డి, కరీంనగర్ సీపీ -
బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు
అనంతపురం : క్రికెట్ బెట్టింగులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు అన్నారు. ఆన్లైన్ బెట్టింగులకు పాల్పడుతూ యువత పెడదోవ పడుతోందన్నారు. బెట్టింగులపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, విద్యార్ధుల కదలికలపై జాగ్రత్త వహించాలని కోరారు. క్రికెట్ బెట్టింగ్ వెనుక అంతర్జాతీయ రాకెట్ ప్రమేయం ఉందని ఇప్పటివరకు 151 మంది అరెస్ట్ చేసి 8,34,320 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇక మరోవైపు ద్విచక్ర వాహనాలు చోరీ ముఠా గుట్టును రట్టుచేశారు. ఈ కేసులో ఇద్దరు దుండగులను అరెస్ట్ చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 32 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : కరోనా సీజన్లోనూ ఐపీఎల్ బెట్టింగ్లు జోరుగానే కొనసాగుతున్నాయి. బెట్టింగ్లకు పాల్పడొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా బేఖాతరు చేయడం లేదు. తాజాగా హైదరాబాద్ దూల్పేట్కు చెందిన శివశంకర్ సింగ్ అనే వ్యక్తి బెట్టింగ్లకు పాల్పడుతున్నాడని టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా శివశంకర్ వద్ద నుంచి రూ. 56వేల నగదు, సెల్ ఫోన్, టీవీ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. (చదవండి : ఐపీఎల్ బెట్టింగ్: రూ.16 కోట్లు స్వాధీనం) -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. భారీగా నగదు స్వాధీనం
సాక్షి, అల్వాల్: ఐపీఎల్పై బెట్టింగ్ రాయుళ్లు జోరు ఓ వైపు కొనసాగుతుంటే.. మరో వైపు వారి ఆటలకు కళ్లెం వేసేందుకు పోలీసులు నిఘా నేత్రాలతో బెట్టింగ్ నిర్వాహకుల సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. తాజాగా.. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూదేవి నగర్లో నిన్న జరిగిన హైదరాబాద్ పంజాబ్ మ్యాచ్ లో భారీగా బెట్టింగ్ జరుగుతుందన్న సమాచారంతో ఎస్ఓటీ బాలనగర్ పోలీసులు దాడులు నిర్వహించారు. భూదేవి నగర్లోని ఓ ఇంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను బాలనగర్ ఎస్ఓటీ పోలీసులు 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు తప్పించుకున్నారు. అరెస్ట్ చేసిన వారి వద్ద నుంచి 9 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వీరిని ఎస్ఓటీ పోలీసులు అల్వాల్ పోలీసులకు అప్పగించారు. -
డిన్నర్లో మత్తు మందు ఇచ్చి.. భారీ చోరీ
సాక్షి, గచ్చిబౌలి: కూర, గ్రీన్ టీలో మత్తు మందు కలిపిన నేపాల్ గ్యాంగ్ భారీ చోరీకి పాల్పడింది. రూ.15.10 లక్షల నగదు, రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులతో ఉడాయించింది. మత్తు నుంచి 11 గంటల తర్వాత తేరుకున్న ఐదేళ్ల బాలుడు అయాన్ నాన్నమ్మకు కట్టిన తాళ్లను కత్తిరించడంతో ఆ కుటుంబం ప్రాణాపాయం నుంచి బయటపడింది. సోమవారం రాత్రి రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని బీఎన్ రెడ్డి హిల్స్లో చోటుచేసుకున్న ఘటన వివరాలను మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. చౌటుప్పల్కు చెందిన బోర్వెల్ వ్యాపారి గూడూరు మధుసూదన్ రెడ్డి, శైలజ దంపతులు కుమారుడు నితీష్రెడ్డి, కోడలు దీప్తి, అయిదేళ్ల మనవడు అయాన్ రెడ్డితో కలిసి బీఎన్ రెడ్డి హిల్స్లో నివసిస్తున్నారు. రెండేళ్ల క్రితం నవీన్ అనే మధ్యవర్తి ద్వారా నేపాల్కు చెందిన రవి అలియాస్ రాజేందర్, అతని చెల్లెలు సీతతో కలిసి మధుసూధన్రెడ్డి ఇంట్లో హౌస్కీపింగ్ పనుల్లో చేరారు. రవి ద్వారా 15 రోజుల క్రితం నేపాల్కు చెందిన మనోజ్ క్లీనింగ్, అతని భార్య జానకి వంట మనిషిగా చేరారు. అక్కడే సెల్లార్లోని సర్వెంట్ క్వార్టర్స్లో నివాసం ఉంటున్నారు. పప్పులో కలిపి.. సోమవారం రాత్రి డిన్నర్ కోసం రైస్, చపాతి, పప్పు రెడీ చేశారు. పప్పులో మత్తు మందు కలిపారు. రాత్రి 8 గంటలకు మధుసూదన్ రెడ్డి, నితీష్, దీప్తి, అయాన్ పప్పుతో రైస్, చపాతి తిన్నారు. శైలజ మాత్రం ఉదయం వండిన కూరతో చపాతి తిన్నారు. దీంతో శైలజకు నిందితులు గ్రీన్ టీలో మత్తు మందు కలిపి ఇచ్చారు. అరగంట తర్వాత అందరూ స్పృహ తప్పారు. మధుసూదన్రెడ్డి బాత్రూంలో పడిపోయారు. ఆయన కుమారుడు, కోడలు, మనవడు బెడ్రూంలో పడిపోయారు. శైలజ హాల్లోని కుర్చీలోనే కూర్చుని స్వల్పంగా స్పృహ తప్పారు. ఆమెను నిందితులు కుర్చీకి తాళ్లతో కట్టి, బెదిరించి వివరాలు తెలుసుకుని రూ.15.10 లక్షల నగదు, రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రెండు సెల్ఫోన్లు చోరీ చేశారు. సెల్లార్లో ఉన్న శునకానికికూడా పెరుగన్నంలో మత్తు మందు కలిపిపెట్టారు. సర్వెంట్ క్వార్టర్ వద్ద ఓ లాకర్ను పగలగొట్టడంతో పాటు సీసీ టీవీ ఫుటేజీని తీసుకొని ఉడాయించారు. ఈ ఘటన రాత్రి 9 నుంచి 10 గంటలలోపే చోరీ జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయాన్ తేరుకుని.. మంగళవారం ఉదయం 7 గంటలకు అయాన్ తేరుకొని నాన్నమ్మ శైలజ వద్దకు వచ్చాడు. ఆమెకు ఉన్న తాళ్లను నాన్నమ్మ చెప్పినవిధంగా కత్తిరించాడు. వారు బయటికొచ్చి సమీపంలోని సైట్ వద్ద ఉన్న వాచ్మన్ రాములును పిలిచి విషయం చెప్పారు. అతను.. శైలజ బంధువులు సూర్యారెడ్డి, ఆనంద్రెడ్డిలను తీసుకొచ్చాడు. అనంతరం 100కు కాల్ చేసి సమాచారమిచ్చారు. మధుసూదన్ రెడ్డితో పాటు కొడుకు, కోడలు, మనవడిని కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ఆస్పత్రికి తరలించారు. మధుసూదన్రెడ్డి ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని, మిగతావారు కోలుకుంటున్నట్లు డీసీపీ చెప్పారు. నిందితులు ఏడుగురు.. పక్కా ప్లాన్నే నేపాల్ గ్యాంగ్ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. మొదట పనిలో చేసిన రవి ఆ తర్వాత సీతను పనిలో పెట్టించాడు. చోరీ చేయాలని ప్లాన్ చేసుకున్న తర్వాత మనోజ్, జానకిలను చేర్పించాడు. చోరీ సమయంలో వీరితో పాటు మరో ముగ్గురు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. సమీప రోడ్లపై ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ట్యాబ్లెట్ల పౌడర్ కలిపి ఉండొచ్చు.. నిందితులు మత్తునిచ్చే ట్యాబ్లెట్ల పౌడర్.. కూర, గ్రీన్ టీలో కలిపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత నిందితులు వేర్వేరుగా నడుచుకుంటూ వెళ్లినట్లు వారు నిర్ధారణకు వచ్చారు. సెల్ఫోన్ నంబర్ల లొకేషన్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 44, 45 వరకు చూపించిందని పోలీసులు తెలిపారు. సంవత్సరం క్రితం శామీర్పేట్ పీఎస్ పరిధిలో, గత జనవరిలో నార్సింగి పీఎస్ పరిధిలో నేపాల్ గ్యాంగ్ ఇదే తరహాలో చోరీ పాల్పడినట్లుగా పోలీసులు పేర్కొంటున్నారు. తాజా చోరీ కేసులోనూ పాత నేరస్తులు ఉండే అవకాశం ఉందనే కోణంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ముమైత్ ఖాన్పై పోలీసులకు ఫిర్యాదు పంజగుట్ట: సినీ నటి మొమైత్ ఖాన్ ఒప్పందం ప్రకారం తనకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిందని ఓ క్యాబ్ డ్రైవర్ మంగళవారం పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి .. గత నెల 16న సినీ నటి మొమైత్ ఖాన్ కొంపల్లికి చెందిన రాజును సంప్రదించి గోవాకు వెళ్లాలని నాలుగు రోజులకు గాను రూ.22 వేలు చెల్లించేలా, రూ. 1500 బత్తా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఒప్పందం ప్రకారం నాలుగు రోజులు కాకుండా మరో నాలుగు రోజులు అదనంగా ఉందని, అదనంగా ఉన్న రోజులకు డబ్బులు చెల్లించాలని కోరగా ఇవ్వకపోగా తనను బెదిరిస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. గోవా అడ్డాగా ఐపీఎల్ బెట్టింగ్! సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్స్పై రాజధానిలో పోలీసుల నిఘా పెరిగింది. నగరంలో టాస్క్ఫోర్స్, సైబరాబాద్, రాచకొండల్లో స్పెషల్ ఆపరేషన్ టీమ్ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన బుకీలు ఇతర మెట్రో నగరాలను అడ్డాగా చేసుకుని తమ దందా కొనసాగిస్తున్నారు. గోవా కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్న ముగ్గురు హైదరాబాదీలను అక్కడి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. మోర్జిమ్ ప్రాంతంలోని ఓ హోటల్పై సోమవారం దాడి చేసిన ప్రత్యేక బృందం వీరిని అదుపులోకి తీసుకుంది. ప్రత్యేక యాప్తో బెట్టింగ్స్ ఈ త్రయం బెట్టింగ్స్ నిర్వహణకు ప్రత్యేక సాఫ్ట్వేర్తో కూడిన యాప్ వినియోగిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన సందీప్ పటేల్, కృష్ణకాంత్, భోజ భూపాల్ యాదవ్ క్రికెట్ బుకీలుగా మారారు. కొన్నేళ్లుగా ఈ దందా చేస్తున్న వీరు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ, ఎలాంటి మ్యాచ్లు జరుగుతున్నా తమ ‘పని’ ప్రారంభిస్తూ ఉంటారు. అయితే పోలీసుల నిఘా తప్పించుకునేందుకు వివిధ నగరాల్లో అడ్డాలు ఏర్పాటు చేసుకునే వీరికి దేశ వ్యాప్తంగా అనేక మంది పంటర్లతో (పందాలు కాసేవారు) సంబంధాలు ఉన్నాయి. లావాదేవీలను ప్రత్యేక సాఫ్ట్వేర్ కూడిన బెట్టింగ్ యాప్ ద్వారా నిర్వహిస్తున్నారు. పంటర్లకు యూజర్ ఐడీ ఆన్లైన్ ద్వారానే పరిచయమైన పంటర్లకు ప్రత్యేక యూజర్ ఐడీ, పాస్వర్డ్ కేటాయిస్తున్న వీరు అతడితో ఆన్లైన్లోనే బెట్టింగ్ కాయిస్తున్నారు. నగదు లావాదేవీలను వివిధ ఈ–వాలెట్స్ ద్వారా నిర్వహిస్తున్నారు. ప్రతి బాల్కు సంబంధించిన మ్యాచ్ వివరాలు, బెట్టింగ్ రేష్యో తదితరాలను ఆ యాప్ వీరికి అందిస్తూ ఉంటుంది. ఈ వ్యవహారాల్లో తమకు సహకరించడానికి వివిధ ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. నెల రోజులుగా గోవాలో మకాం నెల రోజుల క్రితం గోవా వెళ్లిన వీరు మోర్జిమ్ ప్రాంతంలోని ఓ హోటల్లో టూరిస్టుల ముసుగులో బస చేశారు. ఐపీఎల్ మొదలైన నాటి నుంచి పందాలు నిర్వహిస్తున్నారు. దీనిపై అక్కడి క్రైమ్ బ్రాంచ్ అధికారులకు సోమవారం సమాచారం అందడంతో దాడి చేసిన అధికారులు ముగ్గురినీ అరెస్టు చేసి, సాఫ్ట్వేర్, యాప్లతో కూడిన సెల్ఫోన్లు, ల్యాప్టాప్, ఎల్ఈడీ స్క్రీన్లతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. గోవాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న హోటళ్లు, లాడ్జిల్లో ఇలాంటి ముఠాలు మరికొన్ని మకాం వేశాయని అక్కడి అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారాలపై కన్నేసి ఉంచడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. గోవాలో హైదరాబాద్కు చెందిన సందీప్ పటేల్, కృష్ణకాంత్, భోజ భూపాల్ యాదవ్ అరెస్టు అయిన విషయాన్ని తెలుసుకున్న ఇక్కడి పోలీసులు స్థానికంగా వీరి వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు. బహుమతులిస్తాడు...ఆ తర్వాత దోచేస్తాడు సాక్షి, హైదరాబాద్: వ్యాపారవేత్తగా పరిచయం చేసుకుని అమ్మాయిలను నమ్మించి బహూమతులతో వారిని మెప్పించి...అవసరమైతే వివాహేతర సంబంధం కొనసాగించి మరీ ఆ తర్వాత బంగారు ఆభరణాలతో ఉడాయిస్తున్న కరుడుగట్టిన నేరగాడిని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఇతడి అరెస్టుతో సైబరాబాద్తో పాటు ఏపీ, తమిళనాడు, గోవా రాష్ట్రాల్లో 12 కేసులు ఛేదించినట్లయ్యింది. ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ సందీప్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా, టంగుటూరు శివాలయం వీధికి చెందిన అబ్దూరి సోమయ్య అలియాస్ సోమయ్య చౌదరి అలియాస్ అక్కినేని కార్తీక్ దారి మళ్లించి సొత్తు దోచుకోవడంలో దిట్ట. సైబరాబాద్తో పాటు, ఏపీ, గోవా, తమిళనాడు ప్రాంతాల్లో 12 దొంగతనాలు చేశాడు. లగ్జరీ హోటల్స్లో మకాం.. తరచూ హైదరాబాద్కు వచ్చి వెళ్లే సోమయ్య మాదాపూర్, గచ్చిబౌలిలోని లగ్జరీహోటల్స్, గెస్ట్ హౌస్లలో బస చేసేవాడు ఉండేవాడు. అక్కడికి వచ్చే యువతులతో వ్యాపారవేత్తగా పరిచయం చేసుకునేవాడు. అనంతరం వారితో సన్నిహితంగా ఉంటూ బహుమతులు ఇచ్చేవాడు. కొన్నిసార్లు వివాహేతర సంబంధం కూడా కొనసాగించేవాడు. అనంతరం అదను చూసుకుని వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలతో పాటు ల్యాప్టాప్లు, సెల్ఫోన్లను కొట్టేసేవాడు. సొంతూరికెళ్లి జల్సాలు తన సొంతూరుకు వెళ్లి చోరీ సొత్తును విక్రయించగా వచ్చిన డబ్బుతో జల్సా చేసేవాడు. ఇతని నేరాలపై మాదాపూర్ ఠాణాలో ఫిర్యాదు అందడంతో ఎస్ఓటీ బృందం రంగంలోకి దిగింది. టెక్నికల్ డాటాతో అతనిపై నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు మంగళవారం నగరానికి వచ్చిన అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 12 కేసులకు సంబంధించి రూ.36 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. సోమయ్యపై గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 80 కేసులు ఉన్నాయి. ఆయా కేసుల్లో స్థానిక పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయినా అతని బుద్ధి కూడా మారలేదని, మళ్లీ దొంగతనాల బాట పట్టినట్లు అదనపు డీసీపీ తెలిపారు. అతడిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. నిందితుడిని అరెస్టు చేసిన ఇన్స్పెక్టర్ సుధీర్తో పాటు సిబ్బందిని రివార్డులతో సత్కరించారు. సెల్ఫోన్ స్నాచింగ్ గ్యాంగ్కు చెక్ సాక్షి, హైదరాబాద్: నగరంలోని రద్దీ మార్కెట్లను టార్గెట్గా చేసుకుని సెల్ఫోన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ముఠాకు మొఘల్పుర పోలీసులు చెక్ చెప్పారు. ఈ గ్యాంగ్ సూత్రధారి పరారీలో ఉండగా పాత్రధారులైన ఐదుగురిని పట్టుకున్నామని, వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. దక్షిణ మండల డీసీపీ గజరావ్ భూపాల్తో కలిసి మంగళవారం కేసు వివరాలు వెల్లడించారు. అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతానికి చెందిన ప్రశాంత్ నగరంతో పాటు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన బండి రాము, అక్షింతల కళ్యాణ్, మేకల జగపతి బాబు, తోట పోతురాజు, రామ్ చంద్ర ప్రధాన్, సహా ఇద్దరు మైనర్లతో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. ప్రశాంత్ ఆదేశాల మేరకు వీరు రద్దీగా ఉన్న మార్కెట్లు, ఇతర ప్రాంతాలకు వెళతారు. టార్గెట్గా చేసుకున్న వ్యక్తి చుట్టూ చేరే ఈ ముఠా అతడి దృష్టిని మళ్లిస్తుంది. మిగిలిన వారు అదును చూసుకుని అతడి జేబులోని సెల్ఫోన్ తస్కరిస్తారు. దొంగతనం చేసిన ఫోన్ను వీరు నేరుగా ప్రశాంత్కు అప్పగిస్తారు. అతగాడు దానిని విక్రయించగా వచ్చిన సొమ్ములో కొంత మొత్తం ముఠా సభ్యులకు ఇచ్చేవాడు. వీరు ఇదే పంథాలో నగర వ్యాప్తంగా 26 చోరీలు చేశారు. ఈ గ్యాంగ్ వ్యవహారాలపై పాతబస్తీలోని మొఘల్పుర పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన అధికారులు సూత్రధారి మినహా మిగిలిన వారిని పట్టుకున్నారు. -
అవతార్ యాప్తో క్రికెట్ బెట్టింగ్
సాక్షి, కృష్ణా: బెజవాడ నగరం కేంద్రగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టైంది. ఆన్లైన్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మ్యాచ్పై భారీగా బెట్టింగ్లు నిర్వహించిన ముఠాను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. అన్లైన్ బెట్టింగ్కు సంబంధించిన సెటప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెజవాడలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నరని, ఈ మూఠా తూర్పు గోదావరి జిల్లా చెందిందిగా పోలీసులు వెల్లడించారు. డీసీపీ హర్షవర్ధన్ రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మొగల్రాజపురంలో ఆచార్య ప్లే స్కూలులో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్టు సమాచారం అందిందని తెలిపారు. దీంతో అక్కడికి చేరుకొని బెట్టింగ్ సామాగ్రి మొత్తం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అవతార్ అనే యాప్ ద్వారా ఈ బెట్టింగ్ నడిపిస్తున్నారని వెల్లడించారు. బాగా తెలిసిన వాళ్ల ద్వారానే ఈ బెట్టింగ్ యాప్లో బెట్టింగ్ కాస్తున్నారని చెప్పారు. రూ.12 లక్షల వరకూ బెట్టింగ్ జరుగుతోందని సమాచారం వచ్చిందన్నారు. ఇక ఈ ముఠాకు చెందిన ప్రధాన సూత్రధారి నవీన్ను త్వరలో అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. ఐపీఎల్ రోజుల్లో పోలీసులకు బెట్టింగ్పై సమాచారం ఇచ్చి సహకరించాలని ప్రజలను కోరారు. ఈ వ్యాలెట్ ద్వారా నగదు లావాదేవీలు చేస్తున్నారని చెప్పారు. విద్యార్ధులు ఇలాంటి బెట్టింగ్లకు ఆకర్షితులు కావద్దని విజ్ఞప్తి చేశారు. -
కాయ్ రాజా కాయ్.. భారీగా బెట్టింగ్లకు పావులు
అసలే కరోనాకాలం. అందరి పరిస్థితులు ఆర్థికంగా చితికిపోయాయి. ఇదే సమయంలో సులభంగా డబ్బు సంపాదించడానికి కొందరు దారులు వెతుకుతున్నారు. ఇలాంటివారికి ఐపీఎల్ సీజన్ కలిసొచ్చింది. ఇంకేముంది టీవీ ఆన్ చేయడం.. బంతి బంతికీ బెట్టింగ్ కట్టడం, ఫోన్లలోనే లావాదేవీలు జరపడం ఇట్టే జరిగిపోతోంది. బెట్టింగుల సంస్కృతిని కట్టడిచేయడానికి పోలీసులు సైతం రహస్యంగా నిఘా ఉంచడం విశేషం. చిత్తూరు అర్బన్: ఐపీఎల్.. పరిచయం అక్కర్లేనిపేరు. క్రికెట్ గురించి తెలియనివాళ్లు కూడా ఐపీఎల్ ఉన్న మజాను ఆస్వాదిస్తారు. ఎప్పుడో వేసవిలో జరగాల్సిన మ్యాచ్లు కరోనా కారణంగా వాయిదాపడుతూ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. స్టేడియంలో ప్రేక్షకులు లేకున్నా, ఛీర్ గర్ల్స్ కనిపించకున్నా.. ప్రతి మ్యాచ్లో బెట్టింగులు నిర్వహించడానికి మాత్రం కొన్ని ముఠాలు సిద్ధమైపోయాయి. మ్యాచ్ మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు సెల్ఫోన్లలో బేరాలు నడుస్తుంటాయి. ఈ సీజన్లో జిల్లా నుంచి రోజుకు రూ.30 కోట్లు బెట్టింగులు జర గొచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. కానీ బెట్టింగ్ వ్యవహారాన్ని పసిగట్టడానికి నిఘా వ్యవస్థను పటిష్టం చేసినట్టు తెలుస్తోంది. వాటి మూలాల్లోకి వెళ్లి చట్టరీత్యా ఆటకట్టిస్తామంటుని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. బంతి బంతికో లెక్క పొట్టి క్రికెట్ మ్యాచ్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందూలోనూ స్వదేశీ, విదేశీ ఆటగాళ్లంతా కలిసి జట్లుగా ఆడేసే ఐపీఎల్పై ప్రతీ ఏటా జిల్లాలో పెద్ద మొత్తంలో బెట్టింగులు జరుగుతుంటాయి. ప్రతీ ఓవర్లో వేసే బంతి బంతికీ బెట్టింగులు నడుస్తుంటాయి. అన్నీ కూడా సెల్ఫోన్లలోనే జరుగుతుంటాయి. ఇదివరకులాగా ఫోన్లు చేసి బేరసారాలు చేయకుండా.. వాట్సాప్కాల్స్, మెసెంజర్ కాల్స్, వాయిస్ మెసేజ్ల రూపంలో బెట్టింగులు పెడుతున్నారు. ఒకప్పుడు మహా నగరాలకే పరిమితమైన జాడ్యం జిల్లాలోని పల్లెలకు పాకిపోయింది. తిరుపతి, చిత్తూరు, మదనపల్లె లాంటి ఓ మోస్తరు ప్రాంతాల నుంచి కుప్పం, పలమనేరు, బి.కొత్తకోట లాంటి మారుమూల ప్రాంతాలకు విస్తరించింది. పుట్టగొడుగుల్లా బుకీలు ఐపీఎల్ మ్యాచ్ల్లో బెట్టింగులుచేసే వాళ్లు ఎవరికివాళ్లు బుకీలు, సబ్ బుకీల అవతారం ఎత్తుతున్నారు. ఎదుటివ్యక్తి బలహీనత, అత్యాశే పెట్టుబడిగా రంగంలోకి దిగుతున్నారు. తమ ప్రధాన కేంద్రం బెంగళూరు, చెన్నైలో ఉందని చెబుతూ.. గెలిచిన డబ్బుకు ఎలాంటి ఢోకాలేదని హామీలు ఇస్తున్నారు. పందెంకాచే డబ్బును ఇపుడంతా డిజిటల్ మనీ యాప్స్ ద్వారా మొబైల్ఫోన్లు, బ్యాంకు ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. గెలిచినవాళ్లకు సైతం ఇదే పద్ధతిలో నగదు ముట్టజెబుతున్నారు. ఈ గోతిలో ఎక్కువగా చదువుకున్న విద్యావంతులు చిక్కుకుంటుండడం ఆందోళనకు గురిచేస్తోంది. తక్కువ సమయంలో కష్టం లేకుండా ఎక్కువ సంపాధించాలనే అత్యాశాపరులు ఐపీఎల్ పందాలకోసం కాచుక్కూర్చున్నారు. గతంలో పట్టుబడ్డా.. గతంలో జిల్లాలో ఐపీఎల్ బెట్టింగులపై పోలీసులు కన్నెర్రజేయడంతో పాటు పెద్ద సంఖ్యలో కేసులు నమోదుచేసి, నగదు సీజ్ చేశారు. తిరుపతిలో ఓ వ్యక్తిపై పీడీ యాక్టు పెట్టడానికి కూడా వెనుకాడలేదు. చిత్తూరులో నాటి టీడీపీ యువ నాయకుడు క్రికెట్ పందెంలో అడ్డంగా దొరికిపోయినా, ఓ కార్పొరేటర్ ప్రమేయం ఉందని సాక్ష్యాలు లభించినా ప్ర త్యేక పోలీసుల సాయంతో తప్పించుకున్నాడు. కు ప్పం నియోజకవర్గంలో ఓ సర్పంచ్ వద్ద 12 సెల్ఫోన్లతోపాటు పెద్ద మొత్తంలో నగదు పట్టుకున్నారు. నాలుగేళ్లలో జిల్లాలో బెట్టింగ్ కేసులు మొత్తం కేసులు -15 అరెస్టయిన వ్యక్తులు -75 పట్టుబడిన నగదు - రూ.6.06 లక్షలు -
ఐపీఎల్ షురూ: పోలీసుల చేతిలో బుకీల చిట్టా
ప్రొద్దుటూరు క్రైం: ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఐపీఎల్–2020 సీజన్ రానే వచ్చింది. చిన్నా..పెద్దా ఎవరి నోట విన్నా ఐపీఎల్ మ్యాచ్ గురించే. కరోనా నేపథ్యంలో ఇంటికే పరిమితమైన వారికి.. ఐపీఎల్ మస్త్ కాలక్షేపాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. క్రికెట్ అభిమానులకు ఇక 53 రోజుల పాటు పండగే అని చెప్పవచ్చు. దుబాయ్ వేదికగా శనివారం ముంబై ఇండియన్– చెన్నై సూపర్కింగ్ జట్ల మ్యాచ్లతో క్రికెట్ సమరం గ్రాండ్గా ప్రారంభం కానుంది. ఈ నెల 19 నుంచి నవంబర్ 10 వరకు పోటీలు జరగనున్నాయి. అయితే క్రీడా స్ఫూర్తిని పొందాల్సిన యువత.. జూదంగా చూస్తోంది. ఈ పరిణామం బుకీలకు కాసుల పంటగా మారింది. కరోనా దెబ్బకు ఇన్నాళ్లు పందెం రాయుళ్లు తోకముడిచారు. ఇప్పుడు మళ్లీ వారి ఆశలకు రెక్కలొచ్చినట్లు అయింది. జిల్లాలో ప్రొద్దుటూరు, కడప, జమ్మలమడుగు, దువ్వూరు, మైదుకూరు, ఎర్రగుంట్ల, రాజంపేట, రాయచోటితోపాటు అనేక ప్రాంతాల్లో క్రికెట్ పందాలు జోరుగా నిర్వహిస్తారు. గతంలో పట్టణాలకే పరిమితమైన బెట్టింగ్ జాడ్యం పల్లెలకు పాకింది. ఫ్యాన్సీ పందాలే ఎక్కువ గతంలో గెలుపోటములపై మాత్రమే పందెం కాసేవారు. కానీ ప్రస్తుతం టాస్ వేసినప్పటి నుంచి బంతి బంతికి కడుతున్నారు. బుకీలు వారి పరిభాషలో దీన్ని ఫ్యాన్సీ బెట్టింగ్ అని పిలుచుకుంటారు. ఫ్యాన్సీ బెట్టింగ్ నిర్వహించే వారు క్రికెట్ మ్యాచ్లో ప్రతి బాల్ను చూడాల్సి వస్తుంది. ప్రతి ఓవర్లో కొట్టే సిక్స్లు, ఫోర్లపై బెట్టింగ్ హోరు కొనసాగుతుంది. బ్యాట్స్మన్ కొట్టే పరుగులపై కూడా పందెం కాస్తారు. ప్రారంభ ఓవర్ నుంచి చివరి వరకు మ్యాచ్ అనేక మలుపులు తిరుగుతుంది. పందెం కాసిన జట్టు పరుగులు కొడుతున్న సేపు ఫంటర్ల (పందెం కాసేవాళ్లు)లో ఆశలు చిగురిస్తుంటాయి. అయితే టప టపా వికెట్లు పడితే మాత్రం వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. ఇలాంటి ఒత్తిళ్ల నడుమ కొందరు ఫంటర్లు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు జిల్లాలో గతంలో చోటు చేసుకున్నాయి. బెట్టింగ్లో యువత, విద్యార్థులు క్రికెట్ బెట్టింగ్లో ఎక్కువగా యువత, విద్యార్థులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులు సైతం ఆకర్షితులవుతున్నారు. తల్లిదండ్రులు ఇచ్చే ప్యాకెట్ మనీతో రహస్యంగా బెట్టింగ్ ఆడుతున్నారు. క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు ఇంట్లో టీవీ ముందు కూర్చొని సెల్ఫోన్ ద్వారా డబ్బు పెడుతున్నారు. తమ పిల్లలు క్రికెట్ పందాలు ఆడే విషయం తల్లిదండ్రులకు తెలిసే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఈ విషయం బయట తెలిస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో.. తమ పిల్లలు బాకీ పడ్డ డబ్బును వారు తీర్చేస్తున్నారు. యువకులు, విద్యార్థులను కొందరు బుకీలు కలెక్షన్ బాయ్లుగా ఉపయోగించుకుంటున్నారు. వారికి బైక్తో పాటు రోజు వారి ఖర్చుకు డబ్బు, ఆకర్షణీయమైన జీతం ఇస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు కొరియర్లుగా, సబ్బుకీలుగా పని చేస్తున్నారు. గుట్టుగా సాగుతున్న దందా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో క్రికెట్ దందా గుట్టుగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా మ్యాచ్ల సమయాల్లో రోజూ రూ.కోట్లు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ సీజన్లో అయితే మరింత ఎక్కువగా నడుస్తుంది. కష్టం లేకుండా అడ్డదారిలో, సులభంగా డబ్బు సంపాదించవచ్చని అనేక మంది బెట్టింగ్ ఫీవర్కు బలైపోతున్నారు. బెట్టింగ్కు పాల్పడిన వారి నుంచి బుకీలు వెంటపడి డబ్బు వసూలు చేస్తున్నారు. డబ్బులు లేక కొందరైతే బైక్లు, బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు. జిల్లాకు చెందిన అనేక మంది బుకీలు ఇతర ప్రాంతాల్లో ఉంటూ దందా కొనసాగిస్తున్నారు. వీరు ఇతర రాష్ట్రాలకు చెందిన షేఠ్లతో సంబంధాలు పెట్టుకొని రూ.కోట్లు గడిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులకు చిక్కకుండా సాగిస్తున్నారు. మొబైల్ ఫోన్ల ద్వారానే ఎక్కువ మంది బెట్టింగ్ జూదం నిర్వహిస్తుండటంతో.. వారిని గుర్తించడం కష్టంగా మారిందని పోలీసు అధికారులు చెబుతున్నారు. కదలికలపై నిఘా.. జిల్లా వ్యాప్తంగా ఉన్న బుకీల చిట్టా పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. వారి కదలికలపై నిఘా పెట్టాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఐపీఎల్ నేపథ్యంలో పోలీసులు గతంలో కేసులు నమోదైన వారిని పిలిపించి బైండోవర్ చేస్తున్నారు. బెట్టింగ్ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కౌన్సెలింగ్ ఇస్తున్నారు. బెట్టింగ్ ఊబిలో పడి అనేక కుటుంబాలు చితికి పోతున్నాయి. పోలీసులు గట్టి చర్యలు తీసుకొని అలాంటి వారిని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. -
వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు గొడవ
పశ్చిమగోదావరి ,తాడేపల్లిగూడెంరూరల్: క్రికెట్ బెట్టింగ్ సొమ్ముల కోసం విద్యార్థులు గొడవ పడిన సంఘటన మండలంలోని పెదతాడేపల్లిలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో జరిగింది. మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సివిల్ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెంకు చెందిన విద్యార్థులు, తేతలి సమీపంలోని వడ్లూరుకు చెందిన మరో విద్యార్థి మధ్య క్రికెట్ బెట్టింగ్ జరిగింది. వడ్లూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి క్రికెట్ బెట్టింగ్ సొమ్ము విషయంలో వన్ టైమ్ సెటిల్మెంట్ చేసుకున్నాడు. అయితే తమకు ఇంకా సొమ్ములు రావాలంటూ ఆ విద్యార్థిపై సహచర విద్యార్థులు కొట్లాటకు దిగారు. ఆ విద్యార్థిని కొడుతున్న దృశ్యాలను మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియోలు మంగళవారం వాట్సప్లో హల్ చల్ చేయడంతో విషయం బయటకు పొక్కింది. -
ఖాకీలకు చిక్కని బుకీలు
సాక్షి, ఒంగోలు: సప్త వ్యసనాల్లో లేని కొత్త వ్యసనం ఒకటి దశాబ్ద కాలంగా రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంత యువతను పెడదోవ పట్టిస్తూ పీల్చిపిప్పి చేస్తోంది. ఆ వ్యసనం పేరే క్రికెట్ బెట్టింగ్. గత 15 ఏళ్ల క్రితం మొదలైన ఈ బెట్టింగ్ వ్యసనం మొదట్లో ఇండియా జట్టు ఆడే మ్యాచ్లకు మాత్రమే ఉండేది. రాను రాను ఇది మరింత ముదిరి పాకాన పడింది. ఆడేది వన్డే, టెస్ట్మ్యాచ్ అనే బేధం లేకుండా, ఆడేది మన జట్టా, విదేశీ జట్లా అనేది చూసుకోకుండా బెట్టింగ్ నిర్వహిస్తూనే ఉన్నారు. టి–20 మ్యాచ్లు ప్రారంభమైనప్పటి నుంచి బెట్టింగ్ జాఢ్యం బాగా ఊపందుకుంది. దీనికితోడు ఐపీఎల్ అంటూ ఒక సీజన్లో వరుసగా 90 నుంచి 100 మ్యాచ్లు జరుగుతుండటంతో బెట్టింగ్ జాఢ్యం మరింత ముదిరి పాకాన పడినట్లయింది. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతుండటంతో జిల్లాలో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఎక్కడో ముంబై, కోల్కతా, ఢిల్లీ వంటి నగరాల్లో ఉండే బుకీలు ఆన్లైన్ ద్వారా తమ కార్యకలాపాలను దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తమ తమ ఏజంట్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తూ ఈ వ్యసనాన్ని దేశవ్యాప్తం చేశారు. విచారణలో జాప్యం.. అజ్ఞాతంలోకి కీలక బుకీలు.. ఒంగోలు నగరంలో క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్నారనే సమాచారంతో సుమారు 15 రోజుల క్రితం పోలీసులు ఓ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ ఆదేశాలతో రెండు విభాగాలకు చెందిన పోలీసులు సంయుక్తంగా విచారణ ప్రారంభించారు. అయితే పోలీస్ అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల విచారణ ముందుకు సాగలేదు. దీంతో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కేసును సీసీఎస్కు బదిలీ చేసి విచారణ వేగవంతం చేయాలని ఆదేశించారు. విచారణలో జరిగిన జాప్యం వల్ల కీలక బుకీలు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. బెట్టింగ్ ముఠా దొరగ్గానే వారి నుంచి సమాచారం సేకరించి దర్యాప్తు వేగవంతం చేసి ఉంటే కీలక బుకీలు దొరికే అవకాశం ఉండేది. ఇప్పటికైనా పోలీసులు క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న కీలక బుకీలను పట్టి అత్యాశతో జీవితాలు కోల్పోతున్న యువతను రక్షించాలని పలువురు కోరుతున్నారు. కీలక బుకీలను పట్టలేక పోతున్నారు... ఎక్కడెక్కడో ఉంటూ గ్రామీణ ప్రాంతాలకు సైతం తమ బెట్టింగ్ను విస్తరించి కోట్లు గడిస్తున్న బుకీలను పోలీసు వ్యవస్థ ఏమి చేయలేకపోవడం శోచనీయం. ఆన్లైన్ ద్వారా అనేక మంది ఏజంట్లను పెట్టుకొని దేశవ్యాప్తంగా తమ బెట్టింగ్ దందాను నడుపుతున్న బుకీలను మాత్రం పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పోలీసు అధికారులు బుకీల నుంచి మామూళ్లు తీసుకుంటూ బెట్టింగ్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెట్టింగ్కు పాల్పడే బుకీల మూలాలను కనిపెట్టి ఆటకట్టించాల్సిన పోలీసులు లాడ్జిలు, హోటళ్లు, టీస్టాల్స్, రెస్టారెంట్లలో చిన్న చిన్న బెట్టింగ్లు నిర్వహించే యువకులను అదుపులోకి తీసుకొని వారిపై తూతూమంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో భారీగా బెట్టింగ్ నిర్వహించే ఏజంట్లను అదుపులోకి తీసుకొని వారిని విచారించి వారు ఎవరి వద్ద నుంచి లైన్ తీసుకొని బెట్టింగ్ నిర్వహిస్తున్నారో కనుగొని తద్వారా తీగలాగుతూ డొంకను కదిలించాల్సిన పోలీసు అధికారులు మాకేం పట్టిందిలే అనుకుంటూ దొరికిన వారిపై చోటా మోటా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై పోలీసు, ఇంటిలిజెన్స్ రాష్ట్ర ఉన్నతాధికారులు దృష్టి సారించి బెట్టింగ్ మహమ్మారిని కూకటి వేళ్ళతో పెకిలించకపోతే ఎందరో యువకులు బలి కావడంతోపాటు వారి కుటుంబాలు రోడ్డునపడే ప్రమాదం ఉంది. గ్రామీణ ప్రాంతాలకూ పాకిన జాఢ్యం.. మొదట్లో నగరాలు, పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఈ బెట్టింగ్ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు సైతం పాకడంతో, ఈ వ్యసనానికి బానిసలైన యువత భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతుంది. క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే బుకీల వద్ద నుంచి వారి ఏజంట్లు, క్రికెట్ బెట్టింగ్లాడే యువత వరకు వీరందరిలో క్రికెట్ అంటే తెలిసిన వారు చాలా తక్కువ మంది ఉన్నారనేది ఆశ్చర్యం కలిగించే విషయం. క్రికెట్ బెట్టింగ్లు ఆడేవారిలో బడా వ్యాపారుల కుమారులే కాకుండా ప్రైవేట్ కంపెనీలు, చిన్నచిన్న షాపుల్లో గుమస్తాలుగా పనిచేస్తున్న యువకులు, విద్యార్థులు, చివరకు పొలం పనులు చేసుకునే యువ రైతులు సైతం ఈ బెట్టింగ్ మహమ్మారి బారిన పడి తమ జీవితాలను చిధ్రం చేసుకుంటున్నారు. విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం వంటి నగరాల్లో నుంచి క్రికెట్ బుకీలు ఆన్లైన్లో బెట్టింగ్లు నిర్వహిస్తూ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల యువతను ఆకర్షిస్తూ బెట్టింగ్ మహమ్మారిని విస్తరిస్తున్నారు. ఈ బెట్టింగ్ మహమ్మారికి ఎంతో మంది యువకులు తీవ్రంగా నష్టపోయి కొందరు ఆత్మహత్యలకు పాల్పడగా, మరికొందరు బెట్టింగ్ల్లో సర్వం కోల్పొయి ఉన్న అప్పులు చెల్లించలేక ఊరు వదిలి పరారై అజ్ఞాతంలో జీవనం సాగిస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. -
క్రికెట్ బెట్టింగ్తో.. బ్యాంక్కు క్యాషియర్ కన్నం
సాక్షి, కోవూరు: ‘అతను బ్యాంక్లో క్యాషియర్. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డాడు. క్రికెట్ బెట్టింగ్ కారణంగా అప్పులపాలయ్యాడు. ఈక్రమంలో పనిచేస్తున్న బ్యాంక్కే కన్నం వేశాడు. ఈ వ్యవహారం బయటపడటంతో కటకటాలపాలయ్యాడు. వివరాలను బుధవారం కోవూరు సీఐ జీఎల్ శ్రీనివాసులు స్థానిక సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్ల డించారు. మండల కేంద్రమైన అల్లూరులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దోసరి నాగబాబు సుమారు మూడేళ్లుగా క్యాషియర్గా పనిచేస్తున్నాడు. అల్లూరులోనే నివాసం ఉంటున్నాడు. అతడికి క్రికెట్ బెట్టింగ్ అలవాటు ఉంది. పెద్ద మొత్తంలో నగదు పోయింది. ఈక్రమంలో అప్పులపాలయ్యాడు. నగదు ఇచ్చిన వారు ఒత్తిడి చేస్తుండటంతో బ్యాంక్కే కన్నం వేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రతిరోజూ నాగబాబు, కస్టోడియన్ మునిస్వామిలు సాయంత్రం లెక్క చూసి లాకర్లో డబ్బు పెట్టాలి. లాకర్ నుంచే నగదు చోరీ చేయాలని భావించిన నాగబాబు మునిస్వామిని నమ్మించడం ప్రారంభించాడు. నగదు పెట్టే సమయంలో కస్టోడియన్ను ఏమార్చి లెక్క మొత్తం సరిపోయిందని చెప్పేవాడు. అదే సమయంలో కొంత నగదు, బంగారు ఆభరణాలు తీసి బ్యాంక్లో దాచిపెట్టేవాడు. ఈవిధంగా కొద్దిరోజులపాటు జరిగింది. ఈనెల 16వ తేదీన కస్టోడియన్ బ్యాంక్కు వెళ్లి నగదు లావాదేవీలకు సంబంధించిన వివరాలు చూడగా తేడా వచ్చింది. ఈక్రమంలో మేనేజర్ రవించంద్రకు చెప్పాడు. వారు సీసీ టీవీ ఫుటేజీ చూశారు. అందులో నాగబాబు పలుమార్లు నగదు, ఆభరణాలు తీసుకెళ్లినట్లుగా రికార్డైంది. దీంతో మేనేజర్ అల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై రఘునాథ్ కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. నాగబాబు కస్టోడియన్ను ఏమార్చి రూ.5.40 లక్షలు, కొంత బంగారు ఆభరణాలు (మొత్తం కలిపి రూ.6.32 లక్షలు) చోరీ చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. బుధవారం నిందితుడు నాగబాబు అల్లూరు పాత బస్టాండ్ సెంటర్లో ఉండగా అరెస్ట్ చేశారు. అతని వద్ద ఉన్న నగదు, బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. ఇందులో కస్టోడియన్ పాత్ర లేదని, అతడిని నమ్మించి నాగబాబు నగదు, ఆభరణాలు అపహరించాడని పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును త్వరగా ఛేదించిన పోలీస్ సిబ్బంది యానాదయ్య, మురళి, వేణు, గౌస్బాషా, తిరుపతిస్వామి, దశరథ్, చంద్రలను సీఐ అభినందించారు. కేసును జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి, కేవీ రాఘవారెడ్డి పర్యవేక్షణలో ఛేదించామన్నారు. -
తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు అరెస్ట్
సాక్షి, గుంటూరు : పోలీసుల కళ్లుగప్పి పరారై తిరుగుతున్న అంతర్ రాష్ట్ర క్రికెట్ బుకీ, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు, క్రికెట్ బూకీ శాకమూరి మారుతీ చౌదరిని నరసరావుపేట పోలీసులు నిన్న (శుక్రవారం) అదుపులోకి తీసుకున్నారు. అతడిని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. బెట్టింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి అజ్ఞాతంలో ఉన్న మారుతి తిరిగి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ పట్టుబడినట్లు తెలిపింది. గత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారాన్ని అడ్డుపెట్టుకుని శాకమూరి మారుతి క్రికెట్ బెట్టింగ్లు నిర్వహించేవాడు. కోడెల శివరామ్ అండదండలతో యథేచ్ఛగా తన అనుచరులతో బెట్టింగ్ నిర్వహింపచేయడం, సమయానికి డబ్బులు ఇవ్వని వారిపై గూండాలతో దాడులు చేయటం వంటి చర్యలకు పాల్పడేవాడు. మాజీ స్పీకర్ కోడెల అండ పుష్కలంగా ఉండటంతో స్థానిక పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరించేవారు. రెండేళ్ల క్రితం రూరల్ ఎస్పీగా పనిచేసిన వెంకటప్పలనాయుడు మారుతి, అతని అనుచరులను అరెస్ట్ కేసు నమోదు చేశారు. విచారణలో మారుతికి అంతర్జాతీయ బుకీలతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. అయినప్పటికీ పద్ధతి మార్చుకోకుండా క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తూ తన అక్రమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. అతడి వద్ద పందేలు ఆడి నష్టపోయిన బాధితులు గత నెలరోజుల క్రితం రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అక్కడ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు టూటౌన్ పోలీసులు వలపన్ని బీసీ కాలనీలో ఓ గృహంలో బెట్టింగ్లు నిర్వహిస్తుండగా దాడులు చేశారు. అయితే పోలీసుల రాకను ముందే పసిగట్టిన మారుతి పరారీ అవగా, అతని అనుచరులు ఖాజా, నాగూర్లను అరెస్ట్ చేశారు. -
కాయ్ రాజా కాయ్!
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచకప్లోకి భారత జట్టు సెమీ ఫైనల్స్కు ప్రవేశించడంతో క్రికెట్ అభిమానుల్లోనే కాదు.. బెట్టింగ్రాయుళ్లల్లోనూ జోష్ పెంచింది. ఈ క్రేజ్కు క్యాష్ చేసుకోవడానికి బుకీలు కొత్త ‘అవతారాల్లో’ రంగంలోకి దిగినట్లు పోలీసులు గుర్తించారు. వీరికి చెక్ చెప్పడానికి నిఘా ముమ్మరం చేశారు. గతంలో బెట్టింగ్ కేసుల్లో అరెస్టయిన వారి వివరాలు, కదలికలనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. నగరానికి చెందిన అనేక మంది బుకీలు ఇటీవల తమ పంథా మార్చినట్లు పోలీసులు గుర్తించారు. ఒకప్పుడు వీరంతా నగరంలోనే ఉండి నేరుగా పందేలు కాసేవాళ్లతో (పంటర్లు) సంబంధాలు ఏర్పాటు చేసుకునే వాళ్లు. ఇలా చేయడంతో పోలీసులు దాడి చేసినప్పుడు పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. దీంతో కొందరు కీలక బుకీలు ఇటీవల కాలంలో తమ పంథా మార్చారు. ముంబై, గోవా తదితర ప్రాంతాల్లో వాళ్లు మకాం వేశారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్స్తో పాటు వాట్సాప్, టెలిగ్రామ్ తదితర సోషల్ మీడియా గ్రూపుల ద్వారా బెట్టింగ్స్ను పర్యవేక్షిస్తున్నారు. వీరివద్ద పందేలు కాసే పంటర్లు సుపరిచితులే. దీంతో ఫోన్ల ద్వారా పందేలను అంగీకరిస్తున్నారు. ఓడిన వారి నుంచి డబ్బు వసూలు చేయడం, గెలిచిన వారికి అప్పగించడానికి ప్రత్యేకంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వీరు మాత్రమే నగరంలో ఉంటూ ప్రధాన బుకీలకు సహకరిస్తుంటారు. పోలీసులకు వీళ్లు చిక్కుతున్నా అనేక సందర్భాల్లో సూత్రధారులు పట్టుబడట్లేదు. క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో ముందస్తు పందాల కంటే ఇటీవల కాలంలో లైవ్ బెట్టింగ్లు పెరిగాయని పోలీసులు చెబుతున్నారు. మ్యాచ్లో ఫలానా జట్టు గెలుస్తుందని, ఇన్ని పరుగులు చేస్తుందని, ఓడిపోయే జట్టు ఇన్ని పరుగులకే కట్టడి అవుతుందని.. ఈ పంథాలో జరిగేవి ముందస్తు పందేల కిందికి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత రేషియో ఆధారంగా బంతి బంతికీ జరిగే పందేలను లైవ్ బెట్టింగ్లుగా పరిగణిస్తుంటారు. యాప్స్ ఆధారంగా బెట్టింగ్ దందా నిర్వహించే బుకీలు ఈ తరహాకే ఎక్కువ ప్రాధాన్యమస్తారని చెబుతున్నారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న నగర టాస్క్ఫోర్స్ పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. నగరంలో బెట్టింగ్ నిర్వహణకు, ఏజెంట్ల కదలికలను ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బందిని మోహరించారు. గతంలో బెట్టింగ్ కేసుల్లో అరెస్టయిన వ్యక్తులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఎవరితో సంబంధాలు కలిగి ఉన్నారు? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. -
క్రికెట్ బెట్టింగ్రాయుళ్ల అరెస్ట్
సాక్షి, శ్రీకాకుళం: ప్రస్తుత క్రికెట్ వరల్డ్కప్ నేపథ్యంలో యువత బలహీనతను సొమ్ము చేసుకుంటున్న బెట్టింగ్ ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ మేరకు నగరంలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి న్యూకాలనీలోని క్లాసిక్ మెడికల్ ఏజెన్సీపై నిఘా పెట్టి క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు పక్కా సమాచారంతో దాడి చేశారు. మొత్తం 17 మంది నిందితుల్లో 9 మందిని అరెస్టు చేశారు. మిగతావారు పరారయ్యారు. వీరి నుంచి రూ.5,91,360 నగదు, 9 సెల్ఫోన్లు, 3 ఏటీఎం కార్డులు, ఒక చెక్ బుక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం నగరంలో ఎస్పీ అమ్మిరెడ్డి వివరాలు వెల్లడించారు. బెట్టింగ్ వ్యవహారంలో బుగత దేవీప్రసాద్, పెల్లూరి రాజేష్, పళ్లా గణేష్, మరడాన సురేష్కుమార్, అల్లు ఉమామహేశ్వరరావు, పెళ్లూరి విజయ, బుడ్డి గురునాథరావు, శిమ్మ భాస్కరరావు, కడిమి ఉమామహేష్, సర్వేశ్వరరావులను అరెస్టు చేసినట్లు వివరించారు. నాగరాజు, అప్పన్న, రవిశంకర్, రాజేష్, వెంకటరమణ, రామినాయుడు, బరంపురం శ్రీను, మయూరి పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రధానంగా జిల్లాలో జూదం, బెట్టింగ్, బైక్ రేసింగ్, గంజాయి తదితర మాదకద్రవ్యాల విక్రయం వంటి అనైతిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా శ్రీకాకుళం నగరం, రాజాం పట్టణ క్లబ్ల్లో జూదం ఆడుతున్నట్లు సమాచారం ఉందని, దీనిపైనా దృష్టి పెట్టామన్నారు. ఇటీవల జాతీయ రహదారిపై రాత్రిళ్లు బైక్ రేసింగ్ చేస్తున్నట్లు సమాచారం ఉందని, దీనిపైనా నిఘా పెట్టి అరెస్టు చేస్తామన్నారు. గంజాయిపై ప్రత్యేక దృష్టి సారించడం వల్ల ఇప్పటికే పెద్ద ఎత్తున పట్టుకున్నామని, ఎవరికైనా మాదకద్రవ్యాల విషయంలో సమాచారం ఉంటే తెలియజేయాలన్నారు. బెట్టింగ్ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన ఏఎస్ చక్రవర్తి, పీవీ కృష్ణవర్మ, ఎస్ శంకరరావు, ఎం పారినాయుడు, కే ముకుందరావు, వై ప్రసాదరావు, ఎల్ జగన్మోహనరావు, వీ మోహనరావు, బీ సత్యనారాయణ, ఈ రామకృష్ణ, పీ శివ, ఎస్ ఉషాకిరణ్లను అభినందించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ మంగరాజు, డీఎస్పీ చక్రవర్తి పాల్గొన్నారు. -
బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
సుల్తాన్బజార్: వేర్వేరు ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు బుకీలను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 1.52 లక్షల నగదును స్వాధీనం చేసుకుని నిందితులను సుల్తాన్బజార్, ఆప్జల్గంజ్ పోలీసులకు అప్పగించారు. నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె. నాగేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజస్థాన్కు చెందిన దినేశ్ వరల్డ్ కప్ సిరీస్ మ్యాచ్లకు గాను బెట్టింగ్లు నిర్వహిస్తున్నాడు. నగరంలో సైతం పంటర్లను ఆకర్శిస్తూ వారి నుంచి తెలిసిన వారితో డబ్బులు వసూల చేయిస్తున్నాడు. అదే రాష్ట్రానికి చెందిన రవినారాయణ్ రామ్కోఠిలోని సుమతి రెసిడెన్సీలో ఉంటూ దినేశ్ వద్ద కమీషన్ తీసుకుంటూ పంటర్ల నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. జవార్ వేణుగోపాల్ అలియాస్ ఆంథోని అనే వ్యక్తి వీరి వద్ద పందాలు కాసేవాడు. బెట్టింగ్ ముఠాపై సమాచారం అందడంతో మంగళవారం నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఇద్దరు బూకీల ఇళ్లపై దాడులు నిర్వహించారు. జావార్ వేణుగోపాల్ వద్ద రూ. 1.31 లక్షల నగదు, ఒక టీవీ, రిమోట్లు, సెటప్బాక్స్లను స్వాధీనం చేసుకున్నారు. వేణుగోపాల్పై గేమింగ్ యాక్ట్ సెక్షన్లకు కింద మంగళ్హాట్, నల్లకుంట, ఆప్జల్గంజ్ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు. రవినారాయణ్ నుంచి రూ. 21 వేల నగదు, ఓ సెల్ఫోన్, ఒక టీవి, సెట్అప్బాక్స్, రిమోట్ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ. 1.52 లక్షల నగదును స్వాధీనం చేసుకుని నిందితులను సుల్తాన్బజార్, ఆప్జల్గంజ్ పోలీసులకు అప్పగించారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ జగద్గిరిగుట్ట: బాచుపల్లిలో పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాగుట్టు రట్టు చేశారు.. కౌసా ల్య కాలనీలోని టిఅండ్పాన్ షాపులో అదే కాలనీ కి చెందిన భూపతి రాజు కిశోర్, శ్రీనివాస్రావు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. మొబైల్ ఫోన్ ప్లే స్టోర్ నుంచి క్రికెట్ లైవ్ లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ యాప్ నుంచి లైవ్ మ్యాచ్ చూస్తూ మ్యాచ్కు కొంత నగదు చొప్పున (వేలల్లో) బెట్టింగ్కు పాల్పడ్డారు. భూపతి రాజు బూకీగా ఉంటూ శ్రీనివాస్రావు హంటర్గా వరల్డ్ కప్ ప్రారంభం నుంచి రేటింగ్ను బట్టి బెట్టింగ్కు పాల్పడ్డారు.మంగళవారం ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్పై బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడం తో దాడి చేసిన బాచుపల్లి పోలీసులు నిందితుల ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.73 వేల నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
బుకీ ఫారెన్లో... పంటర్లు సిటీలో!
సాక్షి, సిటీబ్యూరో/ సనత్ నగర్: క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహణలో ఇదో హైటెక్ పంథా... పోలీసు నిఘాకు చిక్కకుండా ఆద్యంతం అనేక జాగ్రత్తలు తీసుకున్నారు... విజిట్ వీసాపై వెళ్ళి అమెరికాలో తిష్టవేశాడు ప్రధాన బుకీ... పందేల కోసమే ప్రత్యేకంగా యాప్ను తయారు చేయించాడు. సబ్–బుకీలకు గోవాలో సకల సౌకర్యాలతో బస ఏర్పాటు చేశాడు. వీళ్ళు దళారుల సాయంతో నగరంలోని పందెంరాయుళ్ళ (పంటర్లు) ద్వారా దందా నడిపిస్తున్నారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభంతో మొదలై, వరల్డ్ కప్ నేపథ్యంలో కొనసాగుతున్న ఈ వ్యవహారం గుట్టును దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. వీరి నుంచి రూ.8 లక్షల నగదు, కారు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ బుధవారం వెల్లడించారు. అమెరికాను అడ్డాగా చేసుకుని... నగరంలోని సింధికాలనీ ప్రాంతానికి చెందిన బర్కత్ లలానీ పాఠశాల స్థాయిలోనే చదువుకు స్వస్తి చెప్పాడు. జల్సాలకు అలవాటుపడిన ఇతగాడు దానికి అవసరమైన ఖర్చుల కోసం తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గాలు అన్వేషించాడు. ఈ నేపథ్యంలోనే ఇతడి దృష్టి క్రికెట్ బెట్టింగ్స్పై పడింది. హైదరాబాద్ కేంద్రంగా కొన్నాళ్ళు నిర్వహించినప్పటికీ ఆపై పోలీసుల నిఘాకు భయపడ్డాడు. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభంకావడానికి ముందే విజిట్ వీసాపై అమెరికా వెళ్ళాడు. అక్కడ ఉంటూనే బెట్టింగ్స్ నిర్వహణకు ప్రత్యేకంగా ‘మ్యాచ్బాక్స్9.కామ్’ పేరుతో యాప్ తయారు చేయించాడు. బెట్టింగ్స్ నిర్వహణకు అవసరమైన రికార్డులు, స్లిప్స్, పత్రాలు, మ్యాచ్ చూడటానికి టీవీ, రెష్యో తెలుసుకోవడానికి ఫోన్... ఇలా ఏదీ అవసరం లేకుండా కేవలం స్మార్ట్ఫోన్ ఆధారంగా అటు పంటర్లు, ఇటు బుకీ దందా నిర్వహించడానికి ఉపయుక్తంగా దీన్ని రూపొందించాడు. దీని అడ్మిన్గా అతడే ఉండి సకల లావాదేవీలు అనునిత్యం పరిశీలించుకునే ఏర్పాట్లు చేసుకున్నాడు. డిపాజిట్ చేస్తేనే లింకు పంపేది... తనకు పరిచయస్తులైన దానిష్, సోహైల్, సాహిల్లను ప్రధాన అనుచరులుగా మార్చుకున్నాడు. మ్యాచ్లకు చెందిన సిరీస్ ప్రారంభంకావడానికి ముందు సింధికాలనీకి చెందిన ఈ ముగ్గురినీ గోవాకు పంపిస్తాడు. అక్కడ వీరికి సకలసౌకర్యాలతో బస ఏర్పాటు చేస్తాడు. బెట్టింగ్ యాప్నకు సంబంధించిన లింకు వీరి వద్ద మాత్రమే ఉంటుంది. ఈ ముగ్గురూ నగరానికి చెందిన మోహిత్ జైన్, నిఖార్ మహేశ్వరి, రాహుల్జైన్, వైభవ్ సాల్విలను సబ్–బుకీలుగా నియమించుకున్నారు. స్థానికంగా ఉన్న పంటర్లలో నమ్మకమైన వారిని గుర్తించే వీళ్ళు వారికి ఈ యాప్, బెట్టింగ్స్ దందాలను వివరిస్తారు. పంటర్లుగా మారడానికి ఆసక్తిచూపిన వారితో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు డిపాజిట్గా గోవాలోని వారికి చెల్లించేలా చేస్తాడు. ఈ డబ్బు ముట్టిన వెంటనే వాళ్ళు యాప్నకు సంబంధించి లింకును వాట్సాప్ ద్వారా పంటర్లకు పంపిస్తారు. యాప్ ద్వారా పందేలు కాస్తూ డిపాజిట్ మొత్తం ఖాళీ అయ్యే వరకు వీళ్ళు పాలుపంచుకోవచ్చు. ఆపై మళ్ళీ డిపాజిట్ చేసి కొనసాగాల్సి ఉంటుంది. కొందరు పంటర్ల నుంచి డబ్బు వసూలు చేయడానికి జయానీ రూపానీ, నిజాం గిలానీలను కలెక్షన్ ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకున్నారు. మూడు శాతం కమీషన్ తీసుకుంటూ... గోవాలో కూర్చున్న ముగ్గురూ ఈ యాప్కు సంబంధించిన లైన్ను నిర్వహిస్తూ బెట్టింగ్ రేష్యోలు తెలుసుకుని అప్డేట్ చేస్తుంటారు. ఈ పంథాలో బర్కత్ ఒక్కో మ్యాచ్కు గరిష్టంగా రూ.50 లక్షల వరకు టర్నోవర్ చేస్తున్నాడు. నగరంలో ఉన్న సబ్–బుకీలు, కలెక్షన్ ఏజెంట్లు ఈ మొత్తంలో మూడు శాతం కమీషన్గా తీసుకుని మిగిలింది గోవాలోని వారికి పంపిస్తారు. వాళ్ళు తమకు రావాల్సింది మినహాయించుకుని మిగిలిన మొత్తం బర్కత్కు చేరవేస్తుంటారు. ఈ లావాదేవీలు అన్నీ హవాలా మార్గంలోనే నడిపిపోతున్నాయి. ప్రపంచ కప్ మ్యాచ్లు జరుగుతుండటంతో బర్కత్ జోరుగా బెట్టింగ్స్ నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.మధుమోహన్రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు కేఎన్ ప్రసాద్వర్మ, ఎన్.శ్రీశైలం,వి.నరేందర్, తర్ఖుద్దీన్లు సింధికాలనీలోని ఓ ప్రాంతంపై దాడి చేశారు. బర్కత్,డానష్, సోహైల్, సాహిల్ మినహా మిగిలిన ఆరుగురినీ పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును రామ్గోపాల్పేట పోలీసులకు అప్పగించారు. -
బెట్టింగ్ వేస్తే బ్యాటింగే!
సాక్షి, హైదరాబాద్: ఏ దేశంలో క్రికెట్ మ్యాచ్ జరిగినా హైదరాబాద్లో బుకీలు సిద్ధమైపోతారు.. ఏ జట్లు ఆడుతున్నా సరే పంటర్లు ఎగబడి మరీ పందేలు కాస్తుంటారు. పార్లమెంట్ నుంచి పంచాయితీ ఎన్నికల వరకు ఏం జరిగినా పందెం రాయుళ్లు పడగ విప్పుతారు.. గెలుపోటములపై బెట్టింగ్స్ నిర్వహిస్తుంటారు. తాజాగా రాష్ట్రంలోని పార్లమెంట్ స్థానాలతో పాటు గతంలో ఎన్నడూ లేని ఉత్కంఠ మధ్య పూర్తయిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై భారీ బెట్టింగ్ జరుగుతోంది. ఇరుగు పొరుగు రాష్ట్రాల బుకీలు, పంటర్లు రంగంలోకి దిగారు. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న బెట్టింగ్లపై పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు బుకీలపై (పందేలు అంగీకరించే వారు) మాత్రమే కాదు.. పంటర్లనూ (పందేలు కాసే వ్యక్తులు) నిందితులుగా కేసు నమోదు చేయాలని భావిస్తున్నారు. ఇక్కడ పట్టు బిగిస్తే.. బుకీలు, పంటర్లకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. కొత్తగా బుకీలుగా మారే వారు గతంలో ప్రధాన బుకీల వద్ద పని చేసిన వారై ఉంటారు. తమ యజమానికి చెందిన కొందరు కస్టమర్లను తమ వైపునకు లాక్కొంటున్నారు. వీరిద్వారా పరిచయమైన వారినే కొత్త పంటర్లను కస్టమర్లుగా చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఉక్కుపాదం మోపితే బయటి ప్రాంతాలకు వెళ్లిపోతున్న బుకీలు తమ రెగ్యులర్ పంటర్ల సాయంతో యథేచ్ఛగా ‘ఆన్లైన్ దందా’ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంటర్లకు చెక్ చెబితే తప్ప బెట్టింగ్ దందాను పూర్తి స్థాయిలో కట్టడి చేయడం సాధ్యం కాదని పోలీసులు నిర్ణయించారు. పందెం కాసేవాళ్లే లేకపోతే అంగీకరించే వారు కూడా ఉండరని భావిస్తున్నారు. దీనికోసం కొన్ని కఠిన చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు. నోటీసుల జారీకి అవకాశం.. ఈ పందాలు కాసే వారిలో యువత ఎక్కువగా ఉంటున్నారు. వీరి బెట్టింగ్స్కు బానిసలుగా మారారనే విషయం చాలామంది తల్లిదండ్రులకు తెలీదు. వీరిని కట్టడి చేస్తేనే బుకీలకు అడ్డుకట్ట వేయొచ్చు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు పంటర్లనూ నిందితుల జాబితాలో చేర్చాలని భావిస్తున్నారు. వీరిని అరెస్టు చేసే ఆస్కారం లేకపోయినా నోటీసులు పంపాలని యోచిస్తున్నారు. ఫోన్ నంబర్ల ఆధారంగా చిరునామాలు గుర్తించే అవకాశాలు పరిశీలిస్తున్నారు. ఆపై నేర నిరూపణకు అవసరమైన ఆధారాలు లభిస్తే వారిపై న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే వారి కుటుంబీకులకూ విషయం తెలియడంతో పాటు వీరి ఆగడాలకు అడ్డుపడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఓ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘పందాలు కాసే వారు ఉన్నంత కాలం బుకీలు పుట్టుకు వస్తూనే ఉంటారు. ఇక్కడ దాడులు చేస్తే గోవా, ముంబై వంటి ప్రాంతాలకు వెళ్లి వ్యవహారం నడుపుతున్నారు. పంటర్లను కట్టడి చేస్తే ఆటోమేటిక్గా బుకీల వ్యవహారాలకు అడ్డుకట్ట పడుతుంది. అందుకే కొన్ని కఠిన చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని అన్నారు. పక్కాగా దొరుకుతున్న ఆధారాలు బెట్టింగ్ గ్యాంగ్స్ను టాస్క్ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ టీమ్ వంటి ప్రత్యేక బృందాలతో పాటు స్థానిక పోలీసులూ పట్టుకుంటున్నారు. ఇలాంటి గ్యాంగ్స్/వ్యక్తుల నుంచి పోలీసులు నగదుతో పాటు టీవీ, సెల్ఫోన్లు, ల్యాప్టాప్స్, బెట్టింగ్ స్లిప్స్ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో అధికారులు పంటర్ల రికార్డులూ గుర్తిస్తుంటారు. పంటర్ల వద్ద దొరికిన ల్యాప్టాప్స్ విశ్లేషిస్తే మరికొందరు పంటర్ల పేర్లూ బయటికొస్తాయి. ఓ బుకీలను అరెస్టు చేస్తే పంటర్లు మరో బుకీ వద్ద పందాలు కాసే అవకాశం ఉందని భావించిన పోలీసులు పంటర్ల పైనా కఠిన చర్యలకు నిర్ణయించారు. -
క్రికెట్ బెట్టింగ్కు యువకుడు బలి
ఇబ్రహీంపట్నం రూరల్: క్రికెట్ బెట్టింగ్కు ఓ యువకుడు బలయ్యాడు. బెట్టింగ్లో ఓడిపోయి డబ్బులు చెల్లించలేనిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీసుస్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. తుర్కయంజాల్ గ్రామానికి చెందిన పలుస దాసుగౌడ్ కుమారుడు అఖిల్గౌడ్(21) నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అయితే, అతను వారంరోజులుగా కళాశాలకు వెళ్లి వచ్చి ఏకాంతంగా ఉంటున్నాడు. రెండురోజుల నుంచి అఖిల్గౌడ్ వద్ద ఉన్న ఫోన్ పోయింది. పోన్ ఎక్కడ పోయింది.. ఎవరికి ఇచ్చావని తండ్రి మందలించడంతో ఫ్రెండ్ దగ్గర ఉందని చెప్పాడు. మంగళవారం ఉదయం తండ్రి మరోమారు మందలించి ఫోన్ తీసుకురావాలని చెప్పాడు. దీంతో అఖిల్గౌడ్ ఇంట్లో మొదటి అంతస్తులో గల షట్టర్లోకి వెళ్లి చీరతో ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. కుమారుడి మృతికి గల కారణాలపై తండ్రి ఆరా తీయగా ఇటీవల అఖిల్గౌడ్ ఐపీఎల్ బెట్టింగ్లో పాల్గొని డబ్బులు పోగొట్టుకున్నాడు. డబ్బు చెల్లించకపోవడంతో ఫోన్ లాక్కున్నారని అతని స్నేహితుల ద్వారా తెలిసింది. దీంతో మనస్తాపానికిగురై అత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తన కుమారుడి మృతి పట్ల పూర్తి విచారణ జరిపి న్యాయం చేయాలని దాసుగౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
క్రికెట్ బెట్టింగ్రాయుళ్ల అరెస్ట్
అనంతపురం సెంట్రల్: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్పై జోరుగా బెట్టింగ్ ఆడుతున్న 14 మందిని అనంతపురం వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 4.21 లక్షల నగదు, మూడుసెల్ఫోన్లు, 150 గ్రాముల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. సోమవారం వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారి వివరాలను సీఐ యుగంధర్ వెల్లడించారు. ఆదివారం ఐపీఎల్ ఫైనల్లో చైన్నె సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయయి. నగరంలోని సైఫుల్లా హిందూ శ్మశాన వాటిక సమీపంలో, హౌసింగ్బోర్డు కాలనీ శివారులోని క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై దాడులు చేసినట్లు సీఐ తెలిపారు. నవోదయ కాలనీకి చెందిన ఉద్దల కిష్టప్ప, రాప్తాడు మండల కేంద్రానికి చెందిన చిరుతల శివయ్య, నగరంలో గౌసల్వరావీధికి చెందిన తపాలా సర్దార్ అనే క్రికెట్ బుకీలను అరెస్ట్ చేశామన్నారు. వీరితో పాటునగరంలో ఆముదాలవీధికి చెందిన పసుపులేటి సాయికుమార్, లక్ష్మీనగర్కు చెందిన అచల సల్మాన్ఖాన్, రహమత్నగర్కు చెందిన సాదిక్, అశోక్నగర్కు చెందిన మంజునాథ్, మారుతీనగర్కు చెందిన షేక్బాషా, రాజమ్మవీదికి చెందిన హాజీషఫీ, గుంతకల్లు చెందిన శ్రీనివాసులు, నగరంలో పాన్వాలీవీధికి చెందిన షాకీర్, వేణుగోపాల్కు చెందిన ఓంకార్, బళ్లారి రోడ్డుకు చెందిన సోమశేఖర్, భవానీనగర్కు చెందిన షేక్బాబాఫకృద్దీన్లను అరెస్ట్ చేశామన్నారు. వీరి నుంచి రూ. 4.21 లక్షల నగదు, మూడు సెల్ఫోన్లు, 150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. క్రికెట్బుకీలు బెట్టింగ్తో పాటు గంజాయి కూడా విక్రయిస్తున్నట్లు తేలిందని తెలిపారు. -
క్రికెట్ బెట్టింగ్ డబ్బులు ఇవ్వలేదని..
సాక్షి, నిజమాబాద్ : ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్తో గొడవ తలెత్తి ఓ యువకుడిని బంధించిన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్లో కలకలం రేపింది. బోధన్కు చెందిన యువకులు, రెంజల్ మండలం కందకుర్తి చెందిన యువకులు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ కాశారు. ఈ బెట్టింగ్లో కందకుర్తి గ్రామానికి చెందిన యువకులు ఓడిపోయారు. డబ్బు కోసం బోధన్ యువకులు కందకుర్తికి వెళ్లారు. అక్కడే ఇరువర్గాల మధ్య గొడవ తలెత్తింది. దీంతో స్థానికులు వీరిని అక్కడి నుంచి పంపించారు. ఆ తర్వాత కందకుర్తికి చెందిన యువకుడు పనిపై బోధన్ వెళ్లాడు. అప్పుడే కందకుర్తి యువకుడిని బోధన్ యువకులు బంధించారు. డబ్బులు ఇవ్వమని యువకుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో భయందోళనకు చెందిన యువకుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు బోధన్ యువకులు, ఇద్దరు కందకుర్తి యువకులను అదుపులోకి తీసుకున్నారు. -
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడి అరెస్టు
గుంటూరు: ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని గుంటూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం గుంటూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎస్వి రాజశేఖరబాబు వివరాలు వెల్లడించారు. ఇటీవల గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం బీరవల్లిపాలెం గ్రామానికి చెందిన బుకీ పసుపులేటి నాగరాజుతో పాటు భోపాల్కు చెందిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి ద్వారా వెబ్సైట్ యజమానిని పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన అభీర్ చందగా గుర్తించారు. అతను ఆ రాష్ట్రంలోని కూచ్బిహార్ జిల్లా దిన్లాటా గ్రామంలో ఉన్నట్లు తెలుసుకుని శనివారం అదుపులోకి తీసుకున్నారు. అక్కడ కోర్టులో హాజరు పరిచి గుంటూరుకు తరలించారు. కోల్కత్తాకు చెందిన సాఫ్ట్వేర్ డిజైనర్ సాయన్ గోష్కు సోమవారం గుంటూరులో విచారణకు హాజరుకావాలని నోటీసు జారీ చేశారు. నిందితుడు అభీర్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మొత్తం 12 మంది మాస్టర్ బుకీలు ఉన్నారు. వారి పరిధిలో 50 మంది మాస్టర్ డిస్ట్రిబ్యూటర్లు, 60 మంది ప్రధాన బుకీలు, 400 మంది సబ్ బుకీలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇక పంటర్స్ దేశవ్యాప్తంగా వేలాది మంది ఉన్నారు. ఇతర దేశాల్లో అధికారికంగా బెట్టింగ్కు లైసెన్సులు ఉన్నందున అక్కడ నుంచి సాఫ్ట్వేర్ కొని వివిధ క్రీడల బెట్టింగ్కు అనుకూలంగా రూపొందించారు. వాటిలో మన దేశంలో ప్రధానంగా 6 రకాల క్రీడల్లో బెట్టింగ్లు జరుగుతున్నట్లు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి రెండు ల్యాప్టాప్లు, ఐదు సెల్ఫోన్లు, బంగారు చైను, బ్రేస్లెట్తో పాటు బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 7 లక్షల నగదును సీజ్ చేశారు. గేమింగ్ యాక్ట్, ఐటీ యాక్ట్తో పాటు సెక్షన్ 420 ప్రకారం కేసు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న బుకీలను అరెస్టు చేసేందుకు ఏఎస్పీ ఎస్ వరదరాజు ఆధ్వర్యంలో 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించనున్నారు. జిల్లాకు చెందిన బుకీలు కొందరిని ఇప్పటికే గుర్తించారు. వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది. నిందితుడిని అరెస్టు చేసిన బృందం సభ్యులను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ ఎస్.వరదరాజు, డీఎస్పీ యు కాలేషావలి, సిబ్బంది పాల్గొన్నారు. -
జోరుగా ఆన్లైన్ బెట్టింగ్లు
క్రికెట్కు యువతలో ఉన్న క్రేజ్ను ఆసరాగా చేసుకున్న బుకీలు ఆన్లైన్లో బెట్టింగులను ప్రోత్సహిస్తూ తమ జేబులు నింపుకొంటున్నారు. బెట్టింగ్లకు డీలర్షిప్లు తీసుకుని, కమీషన్లపై పనిచేసేలా సబ్డీలర్లను నియమించుకుని చెలరేగిపోతున్నారు. ఈజీ మనీ కోసం యువకులు, ఉద్యోగులు, దినసరి కూలీలు వేలు, లక్షలాది రూపాయలు బెట్టింగుల్లో పెట్టి నష్టపోతున్నారు. సాక్షి, గుంటూరు: జిల్లాలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లు విచ్చలవిడిగా సాగుతున్నాయి. జిల్లా కేంద్రంగా మాఫియా రూ.కోట్లలో బెట్టింగ్లకు పాల్పడుతోంది. దినసరి కూలీలు, యువత ఈజీ మని కోసం వేలల్లో పందేలు కాస్తుంటే.. వారిని మాయ చేస్తున్న బుకీలు రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. సాధారణ క్రికెట్ మ్యాచ్లకే బెట్టింగ్లు భారీగా నడుస్తుంటాయి. ఇక టీ–20, ఐపీఎల్ మ్యాచ్ల సీజన్లో బెట్టింగ్లు ఏ స్థాయిలో జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో ఒక్కరోజులోనే జిల్లాలో రూ.5 నుంచి 10కోట్ల వరకు బెట్టింగ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ సీజన్–12 ఫైనల్ మ్యాచ్ జరిగే మే 12వ తేదీలో బెట్టింగ్లు రూ.30కోట్లు దాటే అవకాశాలున్నాయని బెట్టర్లు చర్చించుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల వ్యక్తుల ద్వారా బుకీల దందా ఆన్¯Œలైన్ క్రికెట్ బెట్టింగ్ కొన్ని విదేశాల్లో అధికారికంగా కొనసాగుతోంది. ఆయా దేశాల వ్యక్తులతో పరిచయాలు చేసుకున్న మధ్యప్రదేశ్, కర్ణాటక, పశ్చిమబెంగాళ్ వంటి రాష్ట్రాల్లోని వ్యక్తులతో జిల్లాకు చెందిన బుకీలు పరిచయాలు చేసుకుని ఈ దందా నడుపుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఆన్లైన్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న జాతీయ బుకీలతో సంబంధాలున్న జిల్లాకు చెందిన క్రికెట్ బుకీలు ఆన్¯Œలైన్ బెట్టింగ్లో డీలర్ షిప్ తీసుకుని సబ్ డీలర్స్ను సైతం నియమించుకున్నారు. ముందస్తుగా ఫండర్ల నుంచి బుకీలు (డీలర్ షీప్ తీసుకున్న నిర్వాహకులు) కొంత సొమ్ము తీసుకుని బెట్టింగ్ చేయడానికి అవకాశం కల్పిస్తూ, ఆన్లైన్ లింక్లు షేర్ చేస్తారు. వెబ్ పేజీ, లైన్, నేరుగా ఫోన్లో మాట్లాడే విధంగా మొత్తంగా మూడు దశల్లో పెద్దఎత్తున ఈ దందా కొనసాగుతోంది. ఇదే తరహాలో బెట్టింగ్లకు పాల్పడుతున్న ఓ భారీ ముఠాను గుంటూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్కు చెందిన బుకీల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులకు బిత్తరపోయే వివరాలు తెలిశాయి. జిల్లాకు చెందిన 36 మందితో సహా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న జాతీయస్థాయి బెట్టింగ్ బుకీల వివరాలు వెలుగు చూశాయి. ప్రత్యేకమైన యాప్లు ఐపీఎల్, ఇతర క్రికెట్ బెట్టింగ్ల కోసం నిర్వాహకులు హైటెక్ పద్ధతిని వినియోగిస్తున్నారు. సెల్ఫో¯Œన్లలో బెట్ –365, బెట్వీ, స్పోర్ట్స్ బెట్టింగ్, బెట్ ప్లేయర్, డ్రీమ్ 11, మై టీమ్, ఇండస్ గేమ్స్, మై టీమ్ 11 వంటి యాప్ల నుంచి బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. ఐపీఎల్తో పాటు వాలీబాల్, టెన్నిస్, ఫుట్బాల్ వంటి క్రీడలపై కూడా ఈ యాప్ల ద్వారా బెట్టింగ్లు కాస్తున్నట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించి లావాదేవీలు గూగుల్ పే, మై మనీ, భీమ్, ఫోన్ పే వంటి ఆన్లైన్ నగదు బదిలీ యాప్ల ద్వారా బెట్టింగ్ రాయుళ్లు చేపడుతున్నారు. జిల్లాలోని గుంటూరు, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల వంటి ప్రాంతాల్లో కొన్ని పెద్దపెద్ద హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, లాడ్జీలు, శివారు ప్రాంతాల్లోని ఫ్లాట్లు అడ్డాలుగా చేసుకుని బుకీలు దందా కొనసాగిస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నంత సేపు బెట్టింగ్లలో మార్పులు చోటు చేసుకుంటాయి. వేసిన బాళ్లు, క్యాచ్లు, వికెట్లు, ఫోర్లు, సిక్స్లను బట్టి బెట్టింగ్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. చిత్తవుతున్న యువత జల్సాలకు అలవాటుపడిన యువత తమ అవసరాలను తీర్చుకోవడం కోసం ఈజీ మనీ సంపాదన బాట పడుతున్నారు. ఇలాంటి వారిని గుర్తించి బుకీలు తమవైపుకు ఆకర్షించుకుని యువతను ఆర్థికంగా గుల్ల చేస్తున్నారు. జిల్లాలోని పలు పేరు మోసిన కాలేజీలు, యూనివర్సిటీల్లో సైతం కొందరు విద్యార్థులు సహ బుకీలుగా ఉంటూ తోటి విద్యార్థులతో బెట్టింగ్లు వేయిస్తున్నారు. చదువులు, హాస్టళ్ల అవసరాల కోసం తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బును బెట్టింగ్ల్లో పెట్టి పోగొట్టుకుంటున్న విద్యార్థులు వచ్చే మ్యాచ్లో డబ్బు వస్తుందని ఆశతో మరింత అప్పుల్లోకి కూరుకుపోతున్నారు. చాలా సందర్భాల్లో బుకీలే విద్యార్థులకు డబ్బు అప్పుగా ఇచ్చి తిరిగి వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. తెలిసో తెలియకో ఈ కూపంలోకి దిగి బుకీలకు డబ్బు కట్టలేక, ఇంట్లో తల్లిదండ్రులకు విషయం తెలుస్తుందని విద్యార్థులు సతమవుతూ చదువుపై శ్రద్ధ పెట్టలేక బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. -
తీగలాగితే డొంక కదిలింది
క్రికెట్ బెట్టింగ్ అనేక మంది జీవితాలను నాశనం చేసింది. ఎందరో యువకులు సర్వం కోల్పోయి ఆత్మహత్యాయత్నాలకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు పట్టుబడిన మధ్యప్రదేశ్ యువకులను విచారిస్తే కంగుతినే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశ వ్యాప్తంగా 220 మందికిపైగా బుకీలు ఉన్నట్లు గుర్తించారు. బుకీలను అరెస్టు చేసేందుకు రూరల్ ఎస్పీ ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశారు. మిగిలిన రాష్ట్రాల పోలీసులతో సంప్రదించి బెట్టింగ్ ముఠాల గుట్టురట్టు చేసేందుకు సిద్ధమయ్యారు. గుంటూరు: యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తూ ఆన్లైన్లో ఘరానా మోసాలకు పాల్పడుతున్న జిల్లాకు చెందిన బుకీతో పాటు మధ్యప్రదేశ్కు చెందిన ముగ్గురు యువకులను గుంటూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 4న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అంకిత్ ద్వివేది, అవదీష్ ప్రతాప్సింగ్, దివ్యాంషు సింగ్లను అదుపులోకి తీసుకొని, 5న రాజపాలెం మండలం బీరవల్లిపాలెం గ్రామానికి చెందిన పసుపులేటి నాగార్జునలను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఐపీఎల్ క్రికెట్ ప్రారంభం నుంచి జిల్లాలో బెట్టింగ్లు కొనసాగుతున్న సంఘటనలు ఎస్పీ రాజశేఖరబాబు దృష్టికి వెళ్లడంతో ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని బుకీలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. పరారీలో ఉన్న కలకత్తాకు చెందిన ప్రధాన బుకీ వద్ద నుంచి నాగార్జున ప్రత్యేకంగా వెబ్సైట్లో లింక్లను తీసుకొని వాటిని బెట్టింగ్ రాయుళ్లకు షేర్ చేస్తూ వాటి ద్వారా బెట్టింగ్లు నిర్వహించాడు. రంగంలోకి టాస్క్ఫోర్స్ బృందం... సత్తెనపల్లి కేంద్రంగా కొనసాగుతున్న క్రికెట్ బెట్టింగ్ల్లో నాగార్జున బెట్టింగ్లో తనకు ఇవ్వాల్సి ఉన్న రూ 6 వేలు ఇవ్వలేదంటూ సత్తెనపల్లికి చెందిన అంకళ్ల ఉదయభాను ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు బాధ్యతను టాస్క్ఫోర్స్ బృందానికి అప్పగించారు. దీంతో వరుసగా నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి దైన శైలిలో విచారణ చేపట్టడంతో పలు ఆసక్తి కర విషయాలు వెలుగు చూడటంతో అవాక్కవడం వారి వంతైంది. ఖాకీ సినిమాను తలపించేలా దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో 226 మంది బెట్టింగ్లో పాల్గొన్నట్లు తేల్చారు. వెంటనే ప్రధాన నిందుతుడైన నాగరాజు బ్యాంక్ అకౌంట్లను పరిశీలించి అతని ఖాతాలో ఉన్న రూ. 22,16 లక్షల నగదును సీజ్ చేశారు. విడివిడిగా విచారణలో.... విచారణలో భాగంగా మధ్యప్రదేశ్కు చెందిన ముగ్గురు యువకులను విడివిడిగా విచారణ చేపట్టడంతో పొంతన లేని సమాదానాలు చెప్పడంతో మరింత లోతుగా విచారణ జరిపారు. దీంతో అసలు విషయాలు రాబట్టారు. ముగ్గురు నిందితుల వాట్సాప్, ఫేస్బుక్ లను పరిశీలించి వారి వద్ద ఉన్న బుకీల ఫోను నెంబర్లను వారి అడ్రస్లను పరిశీలిస్తే దాదాపుగా దేశ వ్యాప్తంగా బుకీలు వీరి పరిధిలో ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. గుంటూరు జిల్లాలోని నాగార్జునతో పాటు ఇంకా బుకీలు ఉండటంతో పాటు దేశ వ్యాప్తంగా 220 మంది ప్రధాన బుకీలు ఉన్నట్లు తేలడంతో పోలీసులు కంగుతిన్నారు. బెట్టింగ్ రాయుళ్ల సంగతికి వస్తే వేలాదిగా ఉన్నట్లు గుర్తించారు. డీజీపీ దృష్టికి తీసుకు వెళ్లిన ఎస్పీ... క్రికెట్ బెట్టింగ్ మహమ్మారి పునాదులను జిల్లాలో కూడా పోలీసులు గుర్తించడంతో జిల్లాలో ఉన్న బుకీలందరూ విషయం బయటకు పొక్కడంతో ఒక్కసారిగా అండర్గ్రౌండ్కు వెళ్లారు. వారి వద్ద ఉన్న ఫోన్ నంబర్ల ప్రకారం బుకీలను గుర్తించేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. టాస్క్ఫోర్స్ బృందాలతో ప్రత్యేకంగా గాలింపు చర్యలు ప్రారంబించారు. విచారణలో తీగ లాగితే డొంక కదలడంతో దేశ వ్యాప్తంగా బుకీలు ఉన్నట్లు గుర్తించిన ఎస్పీ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకు వెళ్లారు. మిగిలిన రాష్ట్రాల ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారని తెలిసింది. మరోసారి జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నలుగురి పోలీస్ కష్టడీకి తీసుకొని విచారణ చేపట్టేందుకు సిద్దం అయ్యారు. టాస్క్ఫోర్స్ బృందం సభ్యులు బుకీల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. సాధ్యం అయ్యేనా... ఖాకీ సినిమాను తలపించేలా దేశ వ్యాప్తంగా ఉన్న బుకీలను గుర్తించి వారిని అరెస్టు చేయడం రాష్ట్ర పోలీసులకు సవాలుగా నిలిచింది. పక్క రాష్ట్రం నుంచి నిందితులను అరెస్టు చేయాలంటే డీజీపీ అనుమతితో ఎస్పీ ఫారన్ పాస్పోర్టు జారీ చేయాల్సి ఉంటుంది. విడతల వారీగా చేపట్టినా అందరినీ అరెస్టు చేయాలంటే దాదాపుగా ఏడాది సమయం పడుతుందని పోలీసు అధికారులు అంటున్నారు. ఇదంతా సాధ్యం అవుతుందా? లేక పోతే మమ అనిపిస్తారా? అనే సందేహాలు పోలీస్శాఖలో ఉన్నాయి. ఏదిఏమైనా పోలీస్బాస్ ప్రత్యేక దృష్టి సారిస్తేనే సాధ్యం అవుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్టు
అనంతపురం, పెనుకొండ రూరల్: క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను అరెస్టు చేసినట్లు పెనుకొండ సీఐ బి.రామకృష్ణ, ఎస్ఐ సుధాకర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం మీడియాకు వెల్లడించారు. మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.4,17,800 నగదు, ఒక ఎల్ఈడీ టీవీ, ఎనిమిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మునిమడుగు గ్రామానికి చెందిన వెంకటరాముడు, తుపాకుల నరసింహ, గుట్టూరుకు చెందిన చిన్న ఆంజనేయులు, ఎరికల శివ, కురుబవాండ్లపల్లికి చెందిన లింగమయ్య, పెనుకొండకు చెందిన అబ్దుల్లా, లక్ష్మీనారాయణ, శ్రీనాథ్లు అందరూ కలసి ఐపీఎల్ మ్యాచ్లు జరిగే సమయంలో ఫోన్ల ద్వారా ప్రతి బాల్కు సిక్స్, ఫోర్, వికెట్ అంటూ పందెం కాస్తున్నారన్నారు. మ్యాచ్లో ఫలానా జట్టు గెలుస్తుంది, ఓడుతుందని బెట్టింగ్ ఆడుతూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. ఒక వేళ ఎవరైనా బెట్టింగ్లో గెలిస్తే వారికి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తూ ఉన్నారన్నారు. తమకందిన సమాచారంతో డీఎస్పీ ఐ.రామకృష్ణ ద్వారా సర్చ్ వారంట్ తీసు కుని మ్యాచ్ జరుగుతున్న సమయంలో సదరు ఇంటిని సోదా చేశామన్నారు. ఆధారాలు లభించడంతో వారిని అరెస్టు చేశామని తెలిపారు. కార్యక్రమంలో హెచ్సీ గంగాధర్, కానిస్టేబుళ్లు నాగరాజు, రమేష్, నాగేంద్రప్రసాద్, లక్ష్మి పాల్గొన్నారు. -
ఇద్దరు క్రికెట్ బుకీల అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఇద్దరు బుకీలను నెల్లూరులోని పప్పులవీధిలో నవాబుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.35 వేల నగదు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నగర డీఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి బుకీల వివరాలను వెల్లడించారు. పప్పులవీధిలో నివాసం ఉంటున్న వెంకట రమేష్ అలియాస్ డీటీఎస్, సంతపేట ఈద్గామిట్టకు చెందిన షేక్ ఖాదర్నవాజ్లు క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. గతంలో పలుమార్లు వీరు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యారు. బెయిల్పై బయటకు వచ్చిన ఇద్దరూ మరికొందరితో కలిసి ఐపీఎల్ ప్రారంభం నుంచి బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. వీరి కదలికలపై నిఘా ఉంచిన నవాబుపేట ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్సై వీరప్రతాప్, సిబ్బంది ఈనెల 6వ తేదీ రాత్రి నిందితులు ఓ కల్యాణ మండపం సమీపంలో బెట్టింగ్లు నిర్వహిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించి తమదైన శైలిలో విచారించి బుకీలకు సంబంధించి కీలక సమాచారాన్ని రాబట్టారు. గతంలో క్రికెట్ బెట్టింగ్లో కీలక సూత్రధారిగా వ్యవహరించిన వ్యక్తి బావమరిది ప్రస్తుతం బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతనితోపాటు మరో 13 మంది బెట్టింగ్ వ్యవహారంలో ఉన్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. దీంతో ప్రస్తుతం చిక్కిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రూ.35 వేల నగదు, సెల్ఫోనును స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు నగర డీఎస్పీ వెల్లడించారు. బెట్టింగ్కు పాల్పడే వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఫంటర్లపై సైతం కేసులు నమోదు చేస్తామన్నారు. సమావేశంలో నవాబుపేట ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, ఎస్సై వీరపత్రాప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఐపీఎల్ హోరు.. బెట్టింగ్ల జోరు
గుంటూరు, సత్తెనపల్లి: చిన్నా, పెద్దా అందరూ క్రికెట్ అంటే అభిమానం చూపడం సాధారణ విషయమే.మ్యాచ్ వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కు పోతుంటారు కొందరు. మూడు గంటల్లో అయిపోయే ఐపీఎల్ మ్యాచ్లకైతే ఆ క్రేజే వేరు. ఇదే అదునుగా ఆ జట్టు గెలుస్తుంది.. ఈ జట్టు గెలుస్తుందంటూ బెట్టింగ్లు జోరందుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ చూడని విధంగా పాఠశాల విద్యార్థులు సైతం బెట్టింగ్లలో మునిగి పోతున్నారు. ఇంట్లో డబ్బులు తీసుకు వచ్చి మ్యాచ్లపై తోటి స్నేహితులు, పెద్ద వారితో బెట్టింగ్లు కాస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఈ సంస్కృతి విద్యార్థులు, యువతలో పెద్ద వ్యసనంగా మారింది. గతంలో పేకాట జోరుగా సాగుతుండేది. రానురాను దానిపై యువతకు మోజు లేకుండా పోయింది. ఈ స్థానంలో ఐపీఎల్ బెట్టింగ్ పెద్ద వ్యసనంగా మారింది. పరిస్థితులు ఇలానే కొనసాగితే తీవ్ర పరిణామాలు సమాజంలో చోటు చేసుకంటాయని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుకాణాలే కేంద్రాలు ఐపీఎల్ మ్యాచ్ల బెట్టింగ్లకు సత్తెనపల్లి కేంద్రంగా మారింది. పట్టణం తోపాటు నియోజకవర్గంలోని గ్రామాల్లో ముఖ్యంగా దుకాణాలే కేంద్రాలుగా మారి పోతున్నాయి. వాటి వద్దకు చేరే వ్యసనపరులు గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్లు కాస్తున్నారు. మ్యాచ్ ఫలితాలపైనే కాకుండా ఓవర్కు ఎన్ని పరుగులు వస్తాయని బంతి, బంతికి పందేలే వేస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్లు, బుకీలు ఎక్కడో ముంబై వంటి నగరాల్లో హోటళ్లలో కూర్చొని అన్నీ నడిపిస్తారు. కానీ ప్రస్తుతం చిన్నస్థాయి బుకీలు తయారయ్యారు. ఓడిపోతే డబ్బులు బెదిరించి మరీ తీసుకుంటున్నారు. గెలిస్తే మాత్రం చాలాచోట్ల డబ్బులు ఇవ్వడం లేదు. విద్యార్థులు చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేస్తే సమస్యలు వస్తాయని భయపడి తమలో తాము మథనపడి వెళ్లిపోతున్నారు. భారీ స్థాయి బెట్టింగ్లు పల్నాడు ముఖద్వారమైన సత్తెనపల్లి నియోజకవర్గంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. చేతిలో డబ్బు లేకపోయినా అప్పులు చేసి మరీ హోటళ్లు, స్నేహితుల గదుల్లో మకాం వేసి బెట్టింగ్లు కాస్తున్నారు. ఐపీఎల్ పందేల్లో సింహ భాగం పల్నాడులోని సత్తెనపల్లి వాసులదే. పోలీసుల నిఘా మరింత పటిష్టం కావాలని, ఈ బెట్టింగ్ల సంస్కృతిని సంపూర్ణంగా అరికట్టాలని పురప్రజలు కోరుతున్నారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): కొత్తపాలెం సాయి గణేష్ మెడికల్ షాపులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురు యువకులను టాస్క్ఫోర్స్ పోలీసులు, గోపాలపట్నం పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొత్తపాలెం సాయి గణేష్ మెడికల్ షాపులో అల్లిపురానికి చెందిన అల్ల్రూ? రామచంద్ర రెడ్డి, గోపాలపట్నానికి చెందిన షేక్ ఇషాక్, శ్రీరామ్నగర్కు చెం దిన బొడ్డేపల్లి కిషోర్ కుమార్, చంద్రనగర్కు చెందిన తుంపల బుజ్జి, నాగేంద్ర కాలనీకి చెందిన అమరపల్లి మహాలక్ష్మి, కొత్తపాలెంకు చెందిన మళ్ల దుర్గాప్రసాద్లను అదుపులోకి తీసుకున్నారు. వీరు ముంబయి ఇండియన్స్, కింగ్స్ లెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్పై ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తుండగా పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీరి నుంచి రూ.32 వేలు నగదు, మొబైల్ బెట్టింగ్ల వివరాలతో కూడిన మూడు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. -
బంతి బంతికి బెట్టింగ్
టేక్మాల్(మెదక్): ఐపీఎల్.. బెట్టింగ్కు పర్యాయపదంగా మారింది. టోర్నీ పై యువతలో ఉన్న వివపరీతమైన క్రేజ్ను బెట్టింగ్ రాయుళ్లు క్యాష్ చేసుకుకుంటున్నారు. ప్రతీ మ్యాచ్లో టాస్ను మొదలుకొని బంతి బంతికి పందేలు కాస్తున్నారు. వ్యవహారమంతా ఆన్లైన్లలో, సెల్ఫోన్ల ద్వారా సాగుస్తున్నారు. మ్యాచ్ మొదలవ్వడానికి రెండు మూడు గంటల ముందే వాట్సప్, మెసేజ్, ఫోన్ కాల్స్, ఇంటర్నెట్లలో యువత బెట్టింగ్ను హోరెత్తిస్తుంది. ప్రస్తుతం ఐపిఎల్ నాకౌట్ దశకు చేరుకోవడంతో జూదం తారాస్థాయికి చేరింది. సాయంత్రం అయితే చాలు యువకులంతా గుమిగూడి ఫోన్లలో బీజిబీజిగా గడుపుతున్నారు. బెట్టింగ్ సాగుతుందిలా.. బెట్టింగ్ నిర్వహిస్తున్న వారు ఆ రోజు నిర్వహించే ఐపిఎల్ మ్యాచ్కు సంబంధించిన సమాచారాన్ని యువతకు ముందుగానే చేరవేస్తారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్దేశిత ప్రాంతానికి చేరకున్న యువత ముందుగా పోటీలో ఉన్న జట్ల బలబలాలను బేరీజు వేసుకొని బెట్టింగ్కు దిగుతున్నారు. టాస్ ఎవరు గెలుస్తారు, టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగా? బౌలింగా? పవర్ ప్లే ఆరు ఓటర్లలో ఎంత స్కోరు చేస్తారు? 20ఓటర్లలో ఎంత స్కోరు చేస్తారు? ఎవరు ఎన్ని వికెట్లు తీస్తారు? అనే అంశాలపై బెట్టింగ్ సాగిస్తున్నారు. వీటితో పాట ఆయా జట్లలోని ప్రధాన బ్యాట్స్మెన్ల వ్యక్తిగత స్కోరు ఎంత చేస్తారనే దానిపై కూడా బెట్టింగ్లు సాగుతున్నాయి. చోరీలకు పాల్పడుతున్న యువత.. బెట్టింగ్ పేరుతో పెద్ద సంఖ్యలో యువకులు సొమ్ములు పోగొట్టుకుంటున్నారు. తల్లిదండ్రులు పాకెట్ మనీకోసం ఇచ్చిన సొమ్మును బెట్టింగ్లో పోగొట్టుకుంటున్నారు. తిరిగి డబ్బుల కోసం సొంత ఇళ్లతో పాటూ వేరే ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లు కూడా తెలుస్తోంది. బెట్టింగ్లో డబ్బులు పొగొట్టుకుంటున్న యువత ఏమి తోచని పరిస్థితిలో అఘాయిత్యాలకు పాల్పడే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఈ బెట్టింగ్ వ్యవహరంపై పోలీసులు దృష్టి సారించి బెట్టింగ్ ఆగడాలను అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. బెట్టింగ్ వ్యసనానికి దూరంగా ఉండాలి ఐపిఎల్ బెట్టింగ్ వ్యసనానికి యువకులు, విద్యార్థులు దూరంగా ఉండాలి. డబ్బులను వృథా చేసుకోకూడదు. ఇంట్లో అవసరాలకు ఇచ్చిన డబ్బులను బెట్టింగ్లలో పెట్టరాదు. బెట్టింగ్లు పెట్టి అప్పుల పాలుకావొద్దు. ఇటువంటి బెట్టింగ్లు చట్టరీత్యా నేరం. బెట్టింగ్లు పెట్టినట్లు మాకు తెలిసినా, సమాచారం అందినా, అనుమానితులైన వారిని విచారిస్తాం. బెట్టింగ్ రాయుళ్లపై కేసులు పెడతాం.–విజయరావ్, ఎస్ఐ, టేక్మాల్. -
కలుగులో క్రికెట్ బు‘కీ’లు..!
సాక్షి, గుంటూరు:క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. క్రికెట్ బుకీల ఆట కట్టించి మరికొందరు ఈ వ్యసనానికి బలికాకుండా చూడాలనే ఉద్దేశంతో గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వేట కొనసాగిస్తున్నారు. అయితే జిల్లాకు చెందిన కీలక క్రికెట్ బుకీలంతా సెల్ఫోన్లు పక్కన పడేసి గత వారం రోజులుగా కుటుంబ సభ్యులతో సైతం సంబంధాలు లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. జిల్లాలోని గుంటూరు, నరసరావుపేట, కారంపూడి, సత్తెనపల్లి, చిలకలూరిపేట ప్రాంతాలకు చెందిన క్రికెట్ బుకీలంతా వైజాగ్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో స్నేహితులు, బంధువుల ఇళ్ల వద్ద తలదాచుకుంటూ క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నరసరావుపేట, గుంటూరుకు చెందిన పలువురు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకుని వీరి నుంచి బుకీల సమాచారంతో పాటు, వీరికి సహకరిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది పేర్లను సైతం వారి నుంచి సేకరించినట్టు తెలిసింది. ముఖ్యంగా గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో కీలక క్రికెట్ బుకీలంతా టీడీపీ నేతల అండతో పోలీసుల కంటపడకుండా కలుగులోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతల కనుసన్నల్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న కొందరు కీలక బుకీలు మాత్రం పోలీసులు తమ జోలికి రాకుండా కొందరు టీడీపీ ముఖ్యనేతలు, పోలీసు అధికారులకు సైతం భారీ మొత్తంలో ఆఫర్లు పెడుతున్నారు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని ఇద్దరు టీడీపీ ముఖ్య నేతలు, రాజధాని ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే, డెల్టా ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ మంత్రి సైతం క్రికెట్ బుకీలకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెట్ బుకీల కోసం టాస్క్ఫోర్స్ బృందాల గాలింపు జిల్లాలో రూరల్ ఎస్పీ ఎస్.వి. రాజశేఖర్బాబు ఇద్దరు సీఐలతో ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి క్రికెట్బుకీల కోసం వేట కొనసాగిస్తున్నారు. అయితే ఈ సమాచారం తెలుసుకున్న సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరు, చిలకలూరిపేట, పిడుగురాళ్ళ తదితర ప్రాంతాలకు చెందిన మరికొందరు కీలక బుకీలంతా రహస్య ప్రాంతాల్లో తలదాచుకుంటున్నట్లు తెలిసింది. సెల్ఫోన్లు ఉంటే టెక్నాలజీ ద్వారా, ఎక్కడ పోలీసులు తమ ఆచూకీ తెలుసుకుంటారోననే భయంతో వాటిని సైతం పక్కన పడేసి కుటుంబం సభ్యులతో సైతం మాట్లాడకుండా వారం రోజులుగా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ వ్యవహారంలో ఎవరిని నమ్మాలో తెలియని ఎస్పీలు కొందరు పోలీసు అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బుకీల కోసం వేట సాగిస్తున్నారు. ఇవి కొంతమేరకు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పవచ్చు. ఈ వ్యవహారంతో సంబంధాలు ఉన్న ఇంటి దొంగలపై రూరల్ ఎస్పీ సీరియస్గా దృష్టి సారించినట్లు తెలిసింది. క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకుని బెట్టర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న అధికారులు, సిబ్బంది పనిపట్టేందుకు రూరల్ ఎస్పీ సంకల్పించారు. జిల్లాలో క్రికెట్ బెట్టర్ల నుంచి నెలవారి మామూళ్లు తీసుకుంటున్న పోలీసు అధికారుల సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. అవినీతి పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు క్రికెట్ బుకీల నుంచి భారీ మొత్తంలో మామూళ్లు వసూలు చేస్తున్న అవినీతి పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఐపీఎల్ మ్యాచ్లు మొదలైనప్పటి నుంచి క్రికెట్ బుకీల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేస్తూ వారికి సహకరిస్తున్న పోలీసు అధికారులు టాస్క్ఫోర్స్ బృందాల ఏర్పాటుతో వణికిపోతున్నారు. ఇప్పటికే గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో గుట్కా మాఫియా నుంచి డబ్బులు వసూలు చేసిన పోలీసు అధికారులపై రూరల్ ఎస్పీ రాజశేఖరబాబు చర్యలకు సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో సైతం అవినీతి పోలీసు అధికారులపై చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరికలు జారీ చేస్తుండటంతో ఎవరిపై వేటు పడుతుందోననే భయాందోళనలో కొందరు పోలీసు అధికారులు ఉన్నారు. తమకు మామూళ్లు ఇచ్చిన క్రికెట్ బుకీలను అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలంటూ సదరు పోలీసు అధికారులే సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు. -
క్రికెట్ బెట్టింగ్ గుట్టురట్టు
కర్నూలు: కర్నూలు నగరంలో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల గుట్టు రట్టయ్యింది. మొబైల్ యాప్ చూస్తూ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్కు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో మూడవ పట్టణ సీఐ హనుమంతనాయక్, ఎస్ఐ శ్రీనివాసులు, ఏఎస్ఐ విశ్వనాథ్రెడ్డి, సిబ్బంది పాండునాయక్, లక్ష్మీనారాయణ, మహేష్తో కలిసి బుధవారపేటలోని భవానీ దేవాలయం వద్ద బెట్టింగ్ రాయుళ్లను ఆదివారం సాయంత్రం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారి నుంచి రూ.1.5 లక్షల నగదు, ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు నగరం పెద్దరంగరాజు వీధికి చెందిన గద్దెల రాజేశ్వరరావు... ప్రొద్దుటూరుకు చెందిన సుబ్బారెడ్డి, ఇర్ఫాన్ అనే వ్యక్తులకు బుకీగా వ్యవహరిస్తూ ఆటగాళ్లతో డబ్బులు వసూలు చేస్తూ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. రాజేశ్వరరావుతో పాటు పెద్దరంగరాజు వీధికి చెందిన సాయికుమార్, అభిలాష్, మేదరవీధికి చెందిన కమలాపురం శివకోటి, తెలుగువీ«ధిలో నివాసం ఉంటున్న జీతూరి వెంకటేష్ ను అరెస్ట్ చేశారు. ప్రధాన నిర్వాహకుడు సుబ్బారెడ్డి, ఇర్ఫాన్ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఐ హనుమంతనాయక్ తెలిపారు. పోలీసులపై టీజీ భరత్ ఒత్తిడి క్రికెట్ బెట్టింగ్లో బుకీతో పాటు నలుగురు ఆటగాళ్లను అరెస్ట్ చేసినట్లు సమాచారం అందడంతో బెట్టింగ్ రాయుళ్లను విడిపించేందుకు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కుమారుడు, కర్నూలు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ పోలీసులపై తీవ్ర ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఎన్నికల్లో తనకు యువకులు సహకరించినందున ఎలాగైనా వదిలిపెట్టాలని పోలీసులపై ఆయన ఒత్తిడి తీసుకు వచ్చినట్లు సిబ్బందిలో చర్చ జరుగుతోంది. బెట్టింగ్ నిర్వాహకుల వద్ద భారీ మొత్తంలో నగదు లభించినప్పటికీ టీజీ భరత్ ఒత్తిడి మేరకు తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి, తక్కువ మొత్తంతోనే అరెస్ట్ చూపినట్లు పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. -
జోరుగా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్
సాయంత్రం ఆరు గంటలైంది... చింతూరు మెయిన్రోడ్ సెంటర్లోని ఓ దుకాణం వద్ద పదుల సంఖ్యలో యువత గుంపులుగా ఫోన్లలో మాట్లాడుకుంటూ ఇన్ని వేలు, అన్ని వేలు అంటూ బిజీ బిజీగా మాట్లాడుకుంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన అటుగా వెళ్లేవారు యువకులు కదా.. ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటున్నారని అనుకుంటూ వెళ్లిపోతున్నారు. అయితే ఆ ఫోన్ల సంభాషణ.. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కోసమని తెలిసేది అతి కొద్ది మందికే. తూర్పుగోదావరి, చింతూరు (రంపచోడవరం): చింతూరు ప్రధాన కేంద్రంగా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. చింతూరు మెయిన్రోడ్డులోని ఓ దుకాణం వద్ద ఈ దందా సాగుతున్నట్టు సమాచారం. రూ.5 వేల నుంచి రూ.10 వేలు.. ఆపైన బెట్టింగ్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఫోన్లు, ఆన్లైన్ ద్వారా రూ.లక్షల్లో బెట్టింగ్లు నడుస్తున్నట్టు పలువురు చెబుతున్నారు. బెట్టింగ్ కోసం యువకులందరూ కలసి ఓ మధ్యవర్తిని ఏర్పాటు చేసుకుని.. బెట్టింగ్ వేసిన సొమ్ములో అతనికి 10 శాతం కమీషన్గా ముట్టచెబుతున్నట్లు తెలిసింది. ఈ బెట్టింగ్లో ప్రధానంగా చింతూరుకు చెందిన యువకులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇతర మండలాలతో పాటు పొరుగునే వున్న ఛత్తీస్గఢ్కు చెందిన యువత కూడా ఇక్కడికి వచ్చి బెట్టింగ్లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. బెట్టింగ్ జరుగుతోందిలా... బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా ఆ రోజు నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్కు సంబంధించిన సమాచారాన్ని యువతకు ముందుగానే చేరవేస్తున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్దేశిత ప్రాంతానికి చేరుకున్న యువత ముందుగా పోటీలో ఉన్న జట్ల బలాబలాలను బేరీజువేసుకుని బెట్టింగ్కు దిగుతున్నారు. టాస్ ఎవరు గెలుస్తారు, టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగా? బౌలింగా? పవర్ ప్లే ఆరు ఓవర్లలో ఎంత స్కోరు చేస్తారు? 20 ఓవర్లలో ఎంత స్కోరు చేస్తారు? ఎవరు ఎన్ని వికెట్లు తీస్తారు? అనే అంశాలపై బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలిసింది. వీటితో పాటు ఆయా జట్లలోని ప్రధాన బ్యాట్స్మెన్ల వ్యక్తిగతంగా ఎంత స్కోరు చేస్తారనే దానిపై కూడా బెట్టింగ్లు సాగుతున్నాయి. పెడదోవ పడుతున్న యువత బెట్టింగ్ల పేరుతో పెద్ద సంఖ్యలో యువకులు సొమ్ములు పోగొట్టుకుంటున్నారు. తిరిగి బెట్టింగ్ కాసేందుకు సొమ్ము కోసం పెడదోవ పడుతున్నారు. తల్లిదండ్రులు పాకెట్ మనీ కోసం ఇచ్చిన సొమ్మును బెట్టింగ్లో పోగొట్టుకుంటున్నారు. తిరిగి సొమ్ముల కోసం సొంత ఇళ్లతో పాటు వేరే ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తోంది. బెట్టింగుల్లో సొమ్ములు పోగొట్టుకుంటున్న యువతకు బెట్టింగ్ ముఠా అధిక వడ్డీలకు సొమ్మును అప్పుగా ఇచ్చి తిరిగి ఆ సొమ్మును బలవంతంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి ఒత్తిడిని తట్టుకోలేని యువత అఘాయిత్యాలకు పాల్పడే అవకాశముందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఈ బెట్టింగ్ వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించి బెట్టింగ్ ముఠా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని వారు కోరుతున్నారు. -
కాయ్ రాజా కాయ్
శ్రీకాకుళం న్యూకాలనీ: ఎచ్చెర్ల మండలానికి చెందిన సీతారాం(పేరు మార్చాం) డిగ్రీ చదువుతున్నాడు. క్రికెటర్ విరాట్ కోహ్లీకి వీరాభిమాని. ఇతనికి అదే మండలానికి చెందిన శ్రీనివాస్(పేరు మార్చాం)తో పరిచయం ఏర్పడింది. గతేడాది ఐపీఎల్ సీజన్లో చెన్నైపై బెంగళూరు గెలుస్తుం దని సీతారాం రూ.50 వేలు బెట్టింగ్ కాశాడు. అప్పటికే అప్పుల్లో ఉండటంతో ఈ మ్యాచ్ గెలిస్తే బాకీ తీర్చేయవచ్చని భావించాడు. అయితే అనూహ్యంగా బెంగళూరు ఓటమితో ఈయన ఆశలు గల్లంతయ్యాయి. ఆ అప్పులు తీర్చేందుకు కంపె నీలో ఉద్యోగం వచ్చిందని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లి కూలీ పని చేసుకుంటూ వడ్డీలు కడుతున్నాడు. జిల్లాలో ఇలాంటి యువకులు ఎందరో.. జూదం.. ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది మూడు ముక్కలాట, పేకాట లాంటివి. ప్రస్తుతం వీటికన్నా ప్రమాదకరమైన జూదం క్రికెట్ బెట్టింగ్ తయారైంది. ఇన్నాళ్లు నగరానికే పరిమితమైన ఈ భూతం ఇప్పుడు పల్లెకు సైతం పాకింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ కొంతమంది చేతుల్లో నడుస్తున్న వికృత పోకడ ఇది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్ ఫీవర్ ఈ స్థాయిలో ఉంటే, రానున్న ప్రపంచకప్కు ఏ స్థాయిలో ఉంటుందో ఊహిస్తేనే భయపడాల్సిన పరిస్థితి దాపురించింది. యువత, విద్యార్థులు బలి.. గతంలో ఒకేచోట కూర్చుని బెట్టింగులు చేస్తుంటే పోలీసులు నిఘాపెట్టి పట్టుకునేవారు. దీంతో బెట్టింగుబాబులు రూటు మార్చారు. బెట్ 385, సీబీ, క్రిక్బజ్, క్రికెట్ మజా అనే ఆన్లైన్ యాప్లు డౌన్లోడ్ చేసి.. టీవీలో ఒక బంతి కంటే ముందే వచ్చే సమాచారాన్ని చూస్తూ.. ఫోన్ల ద్వారానే బెట్టింగులు నిర్వహిస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ బుకీ ఏజెంట్లు.. బెట్టింగ్ రాయళ్లతో పందాలు కాయిస్తున్నారు. రాత్రికి రాత్రే డబ్బు సంపాదించాలనే అత్యాసతో వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు, స్థితిమంతులు, ఆటోడ్రైవర్లు బెట్టింగు ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ వ్యవహారంలో చివరకు బుకీ మాత్రం పెద్దమొత్తంలో జేబులు నింపుకుంటుండగా.. బెట్టింగురాయుళ్లు మాత్రం బికారులుగా మారిపోతున్నారు. బంతి బంతికి బెట్టింగే.. సాధారణంగా క్రికెట్ మ్యాచ్ అంటే 50 ఓవర్లు చొప్పున ఉండేది. రోజంతా ఆటసాగి.. సాయంత్రం ఫలితం వచ్చేది. ఆట చివర్లో ఉత్కంఠ ఉండేది. ఈ నేపథ్యంలో టీ–20, ఐపీఎల్ మ్యాచ్లు వచ్చాక బంతి బంతికి రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది. ఈ బంతి సిక్స్.. ఈ బంతి ఫోర్ అంటూ.. బెట్టింగులు కడుతున్నారు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు బెట్టింగురాయళ్ల చేతుల్లో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. తమ ఫేవరేట్ జట్లపై బెట్టింగ్.. మరికొంతమంది తమ ఫేవరేట్ ఐపీఎల్ జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై, బెంగళూరు, కోల్కత్తా, రాజస్థాన్ ఆడే మ్యాచ్ల ఫలితంపై బెట్టింగులు కాస్తున్నారు. ఇందుకోసం దొంగతనాలు, దోపిడీలకు వెనుకాడటం లేదు. ఇంట్లో విలువైన వస్తువులను గోప్యంగా తరలిస్తున్నారు. కుటుంబాలకు తీరని అన్యాయం చేస్తున్నారు. పోలీసులు నిఘా పెట్టి యువతను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఐపీఎల్తో ముదిరిన బెట్టింగ్.. బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టీ–20 మ్యాచ్లతో బెట్టింగ్ భూతం మరింత ముదిరింది. ఐపీఎల్ మ్యాచ్ల బెట్టింగులతో భరించలేని టెన్షన్, నరాలు తెగే ఉత్కంఠతో మద్యం, సిగరెట్లకు బానిసలుగా మారుతూ జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంతోపాటు ఆమదాలవలస, నరసన్నపేట, ఇచ్ఛాపురం, టెక్కలి, పలాస, పాలకొండ, సీతంపేట, ఆమదాలవలస, ఎచ్చెర్ల, రణస్థలం, రాజాం తదితర ప్రాంతాల్లో బెట్టింగులు జోరుగా సాగుతున్నట్లు సమాచారం. -
కాయ్ రాజా కాయ్..
ఏప్రిల్ ఆరంభంలోనే ఎండలు హీట్ పుట్టిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ఒక వైపు.. మరోవైపు ఎన్నికల ఫలితాలు మరింత కాక పుట్టిస్తున్నాయి. సాధారణంగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు మొదలైతే పందెం రాయుళ్లకు పండగే. బుకీలు, సబ్ బుకీలే కాకుండా అన్ని వర్గాల వారు క్రికెట్ మ్యాచ్లపై పందెం కాస్తారు. సాధారణ మ్యాచ్లకు భిన్నంగా బెట్టింగ్ కోసమే నిర్వహిస్తున్నట్లు ఐపీఎల్ మ్యాచ్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు జిల్లాలో ఎన్నికల ఫలితాలు కూడా తోడు కావడంతో పందేలు జాతరను తలపిస్తున్నాయి. వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. కౌంటింగ్ మే 23న నిర్వహించనున్నారు. ఫలితాలు వెలువడటా నికి ఎక్కువ వ్యవధి ఉండటంతో పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలు కూడా ఫలితాల గురించే చర్చించుకుంటున్నారు. ఏ నలుగురు కలిసినా ఎన్నికల ఫలితాలపై మాట్లాడుకోవడం, సవాళ్లు విసురుకోవడం, కొందరు మరో అడుగు ముందుకేసి వారి శక్తి మేరకు గెలుపోటములపై పందేలు కాస్తున్నారు. చాలా మంది పార్టీలపై అభిమానాన్ని పక్కన పెట్టి డబ్బు సంపాదనే ధ్యేయంగా పందేలు పెట్టుకుంటున్నారు. గ్రామాల్లోని రచ్చబండలు, చావిడులతో పాటు పట్టణాల్లో టీ బంకులు, పార్కులు ఫలితాల విశ్లేషణ కేంద్రాలుగా మారాయి. అభ్యర్థుల మాటేమోగానీ సాధారణ ప్రజలకు మాత్రం ఈ ఫలితాలు నరాలు తెగే ఉత్కంఠను రేకిస్తున్నాయి. ప్రొద్దుటూరు కేంద్రంగా బెట్టింగ్.. ప్రొద్దుటూరు అంటేనే ఒకప్పుడు క్రికెట్ బెట్టింగ్కు పెట్టింది పేరు. క్రికెట్ పందేలకు రాష్ట్రంలోనే ప్రొద్దుటూరుకు రికార్డు ఉంది. జిల్లాతో పాటు రాయలసీమలోని అనేక ప్రాంతాలకు ఇక్కడి బుకీలే బెట్టింగ్ పాఠాలు నేర్పారంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో క్రికెట్ బుకీలు పోలీసులకు పట్టుబడ్డా వారిలో ప్రొద్దుటూరుకు చెందిన వారు ఉంటారు. అందుకే క్రికెట్ పందేలతో పాటు ఏ పందేలు ఆడటంలో అయినా ఇక్కడి బుకీలు ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్లతో బిజీగా ఉన్న బుకీల చూపు ఎన్నికల ఫలితాలపై పడింది. నిత్యం రూ. కోట్లు చేతులు మారుతున్నాయి. గ్రూపులుగా ఏర్పడి చాలా మంది పందేలు కాస్తున్నారు. 5 శాతం కమీషన్ తీసుకొని ఇరువురి మధ్య దళారులు పందేలు కుదుర్చుతున్నారు. క్రికెట్ బెట్టింగ్ అవగాహన ఉన్నవారు మాత్రమే నిర్వహిస్తుండగా, ఎన్నికల ఫలితాలపై అన్ని వర్గాల వారు పందేలకు దిగుతున్నారు. క్రికెట్ బెట్టింగ్ తరహాలోనే ఎన్నికల ఫలితాలపై అంశాల వారిగా పందేలు కాస్తున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం కైవసం చేసుకుంటుంది..? అధికారంలోకి వస్తే ఎన్ని సీట్లు వస్తాయి? ప్రొద్దుటూరులో మెజారిటీ ఎంత వస్తుంది..? మంగళగిరిలో గెలుపెవరిది..? జిల్లాలో వైఎస్సార్సీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? జమ్మలమడుగులో ఏ పార్టీ జెండా ఎగురుతుంది? ఇలా అనేక విధాలుగా పందేలు కాస్తున్నారు. బెట్టింగ్లో రకరకాల పద్దతులు ఉన్నాయి. పందెం కాసి రూపాయికి రూపాయి ఇవ్వడం ఒక పద్దతి. ఒకటికి ఒకటినర్ర.. ఒకటికి రెండు ఇలా రకరకాలుగా పందెం కాస్తున్నారు. ఫలితాలు వెలువడటానికి ఇంకా ఎక్కువ సమయం ఉండటంతో ప్రస్తుతానికైతే ఒకటికి ఒకటి చొప్పున పందెం కాస్తున్నారు. ప్రొద్దుటూరుతో పాటు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో బెట్టింగ్గే జీవనంగా సాగించే పెద్ద పెద్ద బుకీలు ఉన్నారు. వారు ఇంకా రంగంలోకి దిగలేదు. -
బంతి పోలీసుల చేతిలో..
ఐపీఎల్ బెట్టింగ్ ఖాకీల కనుసన్నల్లోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారికి గతంలో గన్మ్యాన్గా ఉన్న ఓ కానిస్టేబుల్ అనంతపురం కేంద్రంగా ఐపీఎల్ బెట్టింగ్ నడిపిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం నగరంలోని బళ్లారి బైపాస్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అందులో యువకులను ఉంచి.. వారి ద్వారా బెట్టింగ్ దందా నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. గుంతకల్లు, ధర్మవరంలోనూ ఖాకీల కనుసన్నల్లోనే ఈ బెట్టింగ్ దందా నడుస్తున్నట్లు సమాచారం. అందుకే బెట్టింగ్ దందా ఎవరు నిర్వహిస్తున్నారు? ఎవరి ఆధ్వర్యంలో నడుస్తోంది.. జిల్లా వ్యాప్తంగా ఎంత మంది బెట్టింగ్ రాయుళ్లు ఉన్నారనే సమాచారం ఇంటెలిజెన్స్, ఎస్బీ సిబ్బందికి తెలిసినా.. ఖాకీల ప్రమేయం ఉండటంతో మౌనం దాలుస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఈట్ క్రికెట్... స్లీప్ క్రికెట్ అంటూ ఊగిపోయే ఇండియాలో ఏడాదికి ఒకసారి వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఎందరో జీవితాలను తారుమారు చేస్తోంది. గల్లీ క్రికెటర్ను ఒక్క మ్యాచ్తో స్టార్గా మార్చేస్తున్న పొట్టి ఫార్మాట్ మ్యాచ్లు.. బెట్టింగ్ బారిన పడిన ఎందరో జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. కొన్ని సందర్భాల్లో ఒక్క బంతికే బతుకు బస్టాండై పోతోంది. బెట్టింగ్ నడిపిస్తున్న బుకీలకు మాత్రం రూ.కోట్లు కుమ్మరిస్తోంది. 45 రోజుల పాటు జరిగే ఈ ఐపీఎల్–12 సీజన్ మార్చి 23న ప్రారంభం కాగా.. మే 12 వరకు కొనసాగనుంది. రూ.కోట్లలో బెట్టింగ్ ఐపీఎల్ వచ్చిందంటే చాలు బుకీలకు పండగే. అనంతపురాన్ని కేంద్రంగా చేసుకుని జిల్లా వ్యాప్తంగా సబ్ బ్రాంచ్లు ఏర్పాటు చేసి బెట్టింగ్ నడిపిస్తున్నారు. మన జిల్లాలో ఒక్క సీజన్కే రూ.100 కోట్లు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా యువతే బెట్టింగ్ మాయాజాలంలో చిక్కి అప్పుల పాలవుతున్నట్లు సమాచారం. ఐపీఎల్ ప్రారంభమై 25 రోజులు పూర్తి కాగా బెట్టింగ్ కూడా భారీగా సాగినట్లు తెలుస్తోంది. ఏటా ఐపీఎల్ బెట్టింగ్పై నిఘా ఉంచే పోలీసులు...ఈ సారి ఎన్నికల విధుల్లో బిజీగా ఉండగా...బెట్టింగ్ రాయుళ్లు బహిరంగంగానే రెచ్చిపోతున్నారు. ఒక్కో మ్యాచ్కు జిల్లాలో రూ. 5 కోట్లకు పైగా బెట్టింగ్లు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో ఇండియన్ ్రíపీమియర్ లీగ్(ఐపీఎల్) కాస్తా బెట్టింగ్ లీగ్గా మారుతోంది. ప్రతి బంతీ కీలకమే ఫ్యాన్సీ పేరుతో జరిగే పందేలలో మ్యాచ్ ఎవరు గెలుస్తారని ఒకరు పందెం కాస్తే, మరొకరు ఈ ఓవర్లో ఇన్ని పరుగుల కొడతారని బెట్టింగ్ వేస్తున్నారు. అలాగే ఈ బాల్కు వికెట్ పడుతుందని, ఈ ఓవర్లో సిక్సర్ కొడతారని, 20 ఓవర్లకు ఇన్ని పరుగులు వస్తాయని పందెలు కాస్తున్నారు. మ్యాచ్ మొదలయ్యే ముందు నుంచి ఈ బెట్టింగ్ తంతు కొనసాగుతుంది. ప్రధానంగా టాస్ ఏ జట్టు గెలుస్తుంది అన్న దానిపై మొదలయ్యే బెట్టింగ్ జట్టు విజయంలో చివరి బంతి వరకు కూడా కొనసాగుతుంది. అత్యుత్తమ జట్టుకు అత్యధిక రేటింగ్ పలుకుతూ పెద్ద ఎత్తున బెట్టింగ్ను కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకూ ఐపీఎల్ విజేతగా నిలిచిన చెన్నై, ముంబయి, బెంగళూరు జట్ల మ్యాచ్లపై ఎక్కువగా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆయా జట్లు ప్రాతినిథ్యం వహించే మ్యాచుల్లో అధిక సంఖ్యలో బూకీలు వాటి రేటింగ్ను పెద్ద ఎత్తున పెంచేస్తున్నారు. ఆయా జట్లు ఆడుతున్న సమయంలో ఒకటికి రెండు, మూడింతలు అధికంగా అందించి బెట్టింగ్లో యువతను దాసోహం చేస్తున్నారు. ఆత్మహత్యలే శరణ్యం క్రికెట్ బెట్టింగ్ వ్యసనంలో పడిన అనేక మంది తీవ్రంగా నష్టపోయారు. అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయి. వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న వారంతా ఎక్కువగా జిల్లాకేంద్రంలోని కళాశాలల్లో విద్యనభ్యసిస్తుండగా...వారికి బెట్టింగ్ అలవాటు చేసేందుకు ఆయా కళాశాలల్లోని విద్యార్థుల ద్వారానే బెట్టింగ్ దందా నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా మంది విద్యార్థులు డబ్బుపై ఆశతో బెట్టింగ్ ఉచ్చు పడి.. అప్పుల పాలై...అవి తీర్చే మార్గం లేక ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్లో నష్టపోయి బలవన్మరణాలకు పాల్పడిన వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది. మరోవైపు అప్పుల వాళ్లకు భయపడి ఇళ్లు వదిలి వెళ్లిన యువకులు కూడా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల విధుల్లో బిజీగా పోలీసులు ఎన్నికల విధుల్లో పోలీసులు బిజీబిజీగా ఉండటంతో గత నెల ప్రారంభమైన ఐపీఎల్ సీజన్ క్రికెట్ పోటీలు బూకీల పాలిట కల్పతరువుగా మారాయి. ఎన్నికల నేపథ్యంలో వీటిపై పోలీసులు దృష్టి సారించకపోవడం...మరికొందరు ఖాకీలూ బెట్టింగ్కు సహకరించడంతో బూకీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందువల్లే సీజన్ మొదలై 25 రోజుల గడుస్తున్నా.. నేటికీ ఒక్కకేసు నమోదు కావడం లేదు. నగరంలో సోమనాథ్నగర్కు చెందిన షేక్ గౌస్పీర్ (27) తపోవనం సమీపంలో వాటర్ సర్వీసింగ్ సెంటర్ నడిపేవాడు. క్రికెట్ బెట్టింగ్కు అలవాటు పడిన గౌస్పీర్ రూ.లక్షల్లో పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రులు కొంత మేర చెల్లించినా..ఇంకా భారీమొత్తం బాకీ పడ్డాడు. ఓవైపు రుణదాతలు...మరోవైపు బుకీల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో 2018 మే 5న ఇంట్లోనే ఉరివేసుకుని ఊపిరితీసుకున్నాడు. ఇలాంటి ఘటనలు జిల్లాలో అనేకం ఉన్నాయి. ముంబయి కేంద్రంగా... ఐపీఎల్ బెట్టింగ్ ముంబయి కేంద్రంగా నడుస్తున్నట్లు గతంలో తేలింది. వీటికి సబ్ బ్రాంచ్ బెంగళూరులో ఉండగా కీలకమైన వ్యక్తులు వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరు ఉన్నారు. ఈ ముఠా సభ్యులు అనంతపురం జిల్లాలోని గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం, కదిరి, గుత్తిలలో క్రికెట్ బెట్టింగ్లకు అడ్డాగా మార్చుకున్నారు. బెట్టింగ్ రాయుళ్లు బుకీల వద్ద డిపాజిట్లు పెట్టి మొబైల్ ఫోన్ల ద్వారా పందేలు ఆడుతున్నారు. మధ్యతరగతి ప్రజలు, విద్యార్థులు, యువకులు, రోజు కూలీలు బెట్టింగ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకొని అప్పులపాలవుతున్నారు. ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఈ బెట్టింగ్ మాఫియాను నిర్వహిస్తూ... ప్రతి మ్యాచ్ ద్వారా రూ.లక్షల ఆదాయం గడిస్తున్నారు. తాడిపత్రిలో కొన్ని రోజుల క్రితం బుకీలను పోలీసులు అరెస్టు చేశారు. -
జోరుగా ఐపీఎల్ బెట్టింగ్లు
సాక్షి, గుంటూరు: ఫ్రాంచైజీలు, ఆటగాళ్లకు కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ మధ్యతరగతి కటుంబాలను మాత్రం రోడ్డు పాలు చేస్తోంది. క్రికెట్ బుకీల మాయ మాటలు నమ్మి సాధారణ, మధ్యతరగతి యువకులు, విద్యార్థులు సర్వం కోల్పోయి రోడ్డున పడుతుంటే, కొందరు పోలీసులకు పట్టుబడి జైలు పాలవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గత ఐపీఎల్ సీజన్లో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతూ పట్టుబడిన వారిలో ఎక్కువ శాతం మంది హోటళ్లలో పని చేసే వారు, కూలీ పనులు, చిరు వ్యాపారులే ఉన్నారు. వీరంతా క్రికెట్ బెట్టింగ్ బుకీల మాయ మాటలు నమ్మి పందేలు కాస్తూ సర్వం కోల్పోయారు. ఎవరిని కదిలించినా బెట్టింగ్లకు పాల్పడి అప్పుల పాలయ్యాం అని చెప్పేవారే. మ్యాచ్ ఏదైన పందేం కాసేది ఏవైపైనా, ఎన్ని పందేలు కట్టినా ఓడిపోయేది మాత్రం బెట్టింగ్ రాయుళ్లే ఈ విషయం తెలుసుకోలేని మధ్య తరగతి, సాధారణ ప్రజలు అప్పులపాలై, పోలీసులకు పట్టుబడి జైళ్లకు వెళ్తున్నారు. బెట్టింగ్ల్లో సర్వం కోల్పోయి పలువురు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు సైతం జిల్లాలో అనేకం ఉన్నాయి. అయినప్పటికీ బెట్టింగ్ రాయుళ్లలో ఎలాంటి మార్పు రావడం లేదు. జోరుగా బెట్టింగ్లు.. ప్రస్తుతం ఐపీఎల్ 2019 నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలో బెట్టింగ్ రాయుళ్లు జోరుగా పందేలు కాస్తున్నారు. సీజన్ ప్రారంభంలోనే గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు భారీ బెట్టింగ్ ముఠాను అరెస్టు చేశారు. పోలీసులు సార్వత్రిక ఎన్నికల హడావుడిలో మల్లగుల్లాలు పడుతుంటే, బెట్టింగ్ రాయుళ్లు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న బుకీలకు పోలీస్ శాఖలో కొందరి సహాయం ఉండటంతో వారు రెచ్చిపోతున్నారు. బుకీల నుంచి పలువురు పోలీస్ అధికారులకు మామూళ్లు సైతం ముడుతున్నాయి. టీడీపీ కీలక నేతల అండదండలతో క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న ముఠాలు మాఫియాగా ఏర్పడ్డాయి. ఈ మాఫియాలోని బుకీలు అమాయకులను మోసం చేస్తూ కోట్లు గడిస్తున్నారు. అమాయకులు మాత్రం సర్వం కోల్పోయి రోడ్డున పడుతున్నారు. బుకీల మోసం ఇలా.. సాధారణంగా క్రికెట్ మ్యాచ్ టాస్ నుంచి మ్యాచ్ గెలుపు, ఓటముల వరకు బెట్టింగ్లు నడుస్తుంటాయి. అయితే బెట్టింగ్ రాయుళ్లందరూ టీవీల్లో, ఆన్లైన్ లైవ్లో చూస్తూ ఫండర్లు పందేలు కాస్తుంటారు. ఈ బెట్టింగ్లు బుకీలు నిర్వహిస్తుంటారు. వివిధ రాష్ట్రాల్లో ఉండే ప్రధాన క్రికెట్ బూకీలు ఇతర ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని కమీషన్ల మీద వారిని నియమించుకుంటారు. దీని కోసం ఓ ప్రత్యేక ఫోన్లైన్ సెటప్ చేసుకుని, వాటి ద్వారా ఎప్పటికప్పుడు మ్యాచ్లో చోటు చేసుకునే అంశాల మీద పందెం «ధరలను నిర్ణయిస్తూ ఫండర్లను ఆకర్షిస్తుంటారు. ఇందులో టాస్ ఎవరు గెలుస్తారు.. సెషన్స్ ప్రతి ఐదు ఓవర్లలో స్కోరు ఎంత వరకు వస్తుంది, బాల్ టూ బాల్, తర్వాత బాల్లో వికెట్ పడుతుందా, సిక్స్ కొడతారా అంటూ బుకీలు వారికి అనుగుణంగా ధరలు పెంచుతుంటారు. ఈ విషయం తెలియని పందెం రాయుళ్లు టీవీల్లో మ్యాచ్లు తిలకిస్తూ ఊహించని బెట్టింగ్లు కడుతుంటారు. అయితే 90 శాతం బెట్టింగ్ ఫలితాలు ఫండర్ల ఊహకు భిన్నంగా ఉంటాయి. అబ్బ జస్ట్ మిస్ నెక్టŠస్ టైం కచ్చితంగా గెలుస్తాం.. అంటూ డబ్బు పోగొట్టుకుంటున్నారు అమాయక ప్రజలు. బుకీలందరూ తెలుగు తమ్ముళ్లే రాజధాని ప్రాంతంలో అమాయక ప్రజలను క్రికెట్ బెట్టింగ్ల పేరుతో మోసం చేస్తున్న వారిలో తెలుగు తమ్ముళ్లే అధికంగా ఉండటం గమనార్హం. గత ఐపీఎల్ సీజన్లో పిడుగురాళ్ల మున్సిపల్ కౌన్సిలర్ బెట్టింగ్ నిర్వహిస్తూ అరెస్టు అయిన విషయం తెలిసిందే. అదే సీజన్లో చిలకలూరిపేటలో పట్టుబడిన బుకీలు తన్నీరు వెంకటేశ్వర్లు, గొట్టిపాడు సదాశివరావు, కామినేని ప్రధీప్ కుమార్ టీడీపీకి చెందిన వారు కావడం గమనార్హం. కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరామ్, పెదకూరపాడు తాజా మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అనుచరులు బెట్టింగ్లు నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. జిల్లాలో తెలుగు తమ్ముళ్లు తెగబడి క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న ఘటన జిల్లా ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది. క్రికెట్ బెట్టింగ్కు పాల్పడితే మిగిలేది విషాదమే క్రికెట్ బెట్టింగ్ల ద్వారా వచ్చే డబ్బుతో స్వల్ప కాలం మాత్రమే ఆనందం ఉంటుంది. ఆ తర్వతా దుఖఃమే మిగులుతుంది. బుకీల మాయ మాటలు నమ్మి ఎవరూ బెట్టింగ్లలో డబ్బులు పెట్టి నష్టపోవద్దు. కష్టాలు కొనితెచ్చుకోవద్దు. ఎక్కువ శాతం మధ్య తరగతి, సాధారణ యువకులు, విద్యార్థులను టార్గెట్ చేస్తూ బుకీలు మోసం చేస్తుంటారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో క్రికెట్ బెంట్టింగ్లపై ప్రత్యేక నిఘా ఉంచాం. బెట్టింగ్లకు పాల్పడి అరెస్టు అయిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – సీహెచ్.విజయారావు, అర్బన్ ఎస్పీ -
పాఠశాల విద్యార్థుల పందేలు!
శంషాబాద్: శంషాబాద్లో ఐపీఎల్ పందేలు జోరుగా సాగుతున్నాయి. పాఠశాల విద్యార్థులు కూడా ఐపీఎల్ పందేలు కాస్తున్నారు. డబ్బుల విషయంలో తేడాలు వస్తే ఘర్షణకు దిగుతున్నారు. తాజాగా మధురానగర్, ఆర్బీనగర్కు చెందిన కొందరు విద్యార్థులు ఐపీఎల్ పందెం డబ్బుల విషయమై గొడవలకు దిగారు. ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా కొట్టుకున్నారు. ఇదే విషయమై తాజాగా గురువారం కూడా మరో ఇద్దరు విద్యార్థులు గొడవపడ్డారు. విషయం తెలుసుకున్న కాలనీలో కొందరు వ్యక్తులు ఆ విద్యార్థులను మందలించి సర్దిచెప్పారు. పందేలుకాసే విద్యార్థులంతా ఏడో తరగతి నుంచి పదోతరగతి లోపు విద్యార్థులే. స్థానికంగా ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ తీరుగా ఐపీఎల్ పందేల ఉచ్చులో చిక్కుకుపోతున్న తీరుతో తల్లిదండ్రులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. మొహిన్ మహల్లాలో.. పట్టణంలో మొహిన్ మహల్లా బస్తీ ఐపీఎల్తో పాటు సాధారణ క్రికెట్ పోటీల పందెలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. గతంలో పలుమార్లు ఇక్కడ ఐపీఎల్ పందెం రాయుళ్లను స్థానిక పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ నిఘా కొరవడడడంతో ప్రతిరోజు లక్షల రూపాయల బెట్టింగ్లు జరుగుతున్నాయి. బెట్టింగ్ల ఉచ్చులో చిక్కుకుపోయిన కొందరు యువకులు ఇప్పటికే లక్షల రూపాయల్లో అప్పుల పాలయ్యారు. గతంలో ఐపీఎల్ పందెలుకాసి ఏకంగా ఆస్తులు అమ్ముకుని రోడ్డుపాలైన వ్యక్తులు స్థానికంగా పదుల సంఖ్యల్లోనే ఉన్నారు. ఇటీవల ఐపీఎల్ ప్రారంభం కావడంతో స్థానికంగా పందేల జోరు కొనసాగుతోంది. రెండురోజుల కిందట పందెంలో డబ్బులు కాసి ఓడిపోయిన వ్యక్తి దళారీకి డబ్బులు చెల్లించకపోవడంతో ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటన కూడా చోటు చేసుకుంది. ఐపీఎల్ బెట్టింగ్లలో స్థానికంగా కొందరు యువకులు దళారులుగా ఉండి నగరంలో బెట్టింగ్ నిర్వహించే వారితో అనుసంధానంగా దందా నడిపిస్తున్నారు. పందెం కాసే వారికి వీరే డబ్బు సమకూర్చుతున్నారు. తీరా డబ్బులు చెల్లించలేని పరిస్థితులు వచ్చే సమయానికి దాడులు కూడా చేస్తున్నారు. బెట్టింగ్లపై పోలీసుల నిఘాను పటిష్టం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
బెట్టింగ్ ముఠా అరెస్ట్
చాంద్రాయణగుట్ట: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠాను ఫలక్నుమా పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫలక్నుమా, ముస్తఫానగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ అక్రం, సుల్తాన్ఖాన్, మహ్మద్ అక్తర్, పర్వేజ్ ముఠాగా ఏర్పడి ఐపీఎల్ బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. సోమవారం రాత్రి జరిగిన కింగ్స్–11 పంజాబ్, ఢిల్లీ క్యాపిట్స్ ఐపీఎల్ మ్యాచ్కు సెల్ఫోన్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో ఎస్సై రమేష్ నాయక్ నేతృత్వంలోని బృందం దాడులు నిర్వహించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాగా ఫర్వేజ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి నుంచి రూ.1,00,500 నగదు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
సాక్షి, నల్లగొండ క్రైం : మిర్యాలగూడ కేంద్రంగా ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా సభ్యుల గుట్టును జిల్లా పోలీసులు రట్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.ఐదు లక్షల 18 వేల 500 నగదు, 15 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోగా ఆరుగురిని అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. ఈ మేరకు శనివారం జిల్లా ఎస్పీ రంగనాథ్ తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న ప్రధానసూత్రధారి వేముల పుల్లారావుతో పాటు అతడి అనుచరులు ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వేముల పుల్లారావు గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పుల గ్రామం నుంచి 20 ఏళ్ల క్రితం త్రిపురారం వచ్చి కిరాణ వ్యాపారం చేసుకుంటూ స్థిరపడ్డాడని, మూడేళ్ల నుంచి స్నేహితులతో కలిసి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో కొంత నష్టం రావడంతో తానే సొంతంగా బొంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఓ సంస్థ నుంచి యాప్ను ఇన్స్టాల్ చేసుకొని నెలకు రూ.15 వేలు యాప్ సంస్థకు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. పరిచయం ఉన్న స్నేహితుల నుంచి సులభంగా డబ్బును సంపాదించాలనే ఉద్దేశంతో క్రికెట్ యాప్తో పాయింట్స్ ఆధారంగా, ఒక పాయింట్కు రూ.100 వసూలు చేస్తాడని, బెట్టింగ్ విస్తరణకు కొందరిని డిస్టిబ్యూటర్లుగా నియమించుకున్నాడని వివరించారు.బెట్టింగ్లో కస్టమర్ గెలిస్తే గెలిసిన డబ్బులో 5 శాతం డబ్బును తీసుకొని మిగతాది చెల్లించేవాడని, ఓడిపోతే వచ్చిన డబ్బును డిస్టిబ్యూటర్లతో కలిసి పంచుకునేవాడని తెలిపారు. నష్టం వచ్చే పరిస్థితి నెలకొంటే పాయింట్స్ అమ్మే వాడుకాదని, లేకుంటే మ్యాచ్ అయిపోయే వరకు పాయింట్స్ విక్రయించే వాడని చెప్పారు. డిస్టిబ్యూటర్లు వీరే... కాగా పుల్లారావు డిస్టిబ్యూటర్లుగా షేక్సాదీక్, శ్రీకాంత్రెడ్డి, అనిల్, కోటి, భగత్ అలియాస్ కన్న, ఉపేందర్, సుమన్ను నియమించుకున్నాడు. వీరికి ప్రతి నెలా ఔరా 24 బెట్ సంస్థ వాళ్లు 3000 పాయింట్లు విక్రయిన్నారు. వీటిని డిస్టిబ్యూటర్లకు అమ్మగా వారు ప్రజలకు అధిక ధరకు విక్రయించేవారు. కీలక వ్యక్తుల అరెస్ట్ మిర్యాలగూడ అశోక్నగర్కు చెందిన వేముల పుల్లారా వు త్రిపురారంలో ఐదేళ్లపాటు చిట్టీలను నడిపాడు. మిర్యాలగూడలో ఉంటూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించాడు. చైతన్యనగర్కు చెందిన గోలి శ్రీనివాస్, శాంతినగర్కు చెందిన బోలిగొర్ల కోటేశ్వరావు, మోబైల్ షాపు నిర్వహిస్తున్న షేక్ ఇదయతుల్లా, శరణ్య గ్రీన్హోంకు చెందిన కనగంటి ఉపేందర్, అశోక్నగర్కు చెందిన కంబాల సుమన్ మొబైల్ షాపులు నిర్వహిస్తున్నారు. అశోక్నగర్లో పుల్లారావు ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులు చేసి అరెస్ట్ చేశారు. షేక్ సాదీక్, శ్రీకాంత్రెడ్డి, అనిల్, భగత్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
మొబైల్ గాంబ్లింగ్ మత్తులో యువత
పేకాట తదితర జూదాలకు ఇప్పుడు కాలం చెల్లింది. సాంకేతిక పుణ్యమా అని స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ఎలాంటి జూదమైనా సాఫీగా ఆడుకోవచ్చు. ఇన్నాళ్లు క్యాండీక్రష్లాంటి గేమ్స్ ఆడుతున్న యువత మనసు ఇప్పుడు బెట్టింగ్ గేమ్లపై పడింది. జిల్లాలో ఎటుచూసినా యువతనోట ఎంజీ మాటే. ఈ జూదానికి బానిసైనవారిలో కళాశాలల విద్యార్థులుండడం బాధాకరం. కొన్నాళ్లుగా జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో మాత్రమే ఇది జరిగేది. నేడు మండల కేంద్రాలకు ఇది వ్యాపించింది. రూ.10 నుంచి వేలల్లో సాగే ఈ బెట్టింగులతో నిత్యం లక్షలాది రూపాయలు చేతులు మారుతోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చిత్తూరు :గతంలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగేది. ఇప్పుడు ట్రెండ్మారింది. ప్రస్తుతం హల్చల్ చేస్తున్న కొత్త మొబైల్ గ్యాంబ్లింగ్ గేమ్లు వందల సంఖ్యలో ఉన్నాయి. స్మార్ట్ కాíసినోస్, ప్లే కార్డ్ ఎక్స్ప్రెస్, రమ్మీ, రియల్ మనీ క్యాసినో, ఫాస్ట్ బెట్టింగ్, ఈజీటు ఎర్న్, క్యాండీక్రష్ బెట్టింగ్ ఇలా రకరకాల బెట్టింగ్లు ఉన్నాయి. ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకునే గ్యాంబ్లిగ్ యాప్స్ వందల్లో ఉన్నాయి. ఇందులో బిగ్టైమ్, రాలెట్ రాయల్, బ్లాక్ జాక్, స్లాట్ మిషీన్, లకీడే,స్పిన్టు విన్, హార్స్ బెట్టింగ్, సూపర్ స్నేక్, జాక్పాట్ రాజా, టీన్పతి గోల్డ్,బింగో లాంటి గేమ్స్లో నిమిషాల్లో బెట్టింగ్ జరుగుతోంది. నలుగురు కలిస్తే బెట్టింగ్లే మామూలుగా క్రికెట్ ఆడుకోవడానికి వెళ్లే యూత్ ఎక్కువగా వీటికి బానిసలవుతున్నారు. క్రికెట్ బెట్టింగ్ల కంటే చాలా సులభంగా నిమిషాల్లోనే ఫలితం ఉంటుంది కాబట్టి వీటిని ఎక్కువగా ఆడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు కళాశాలలకు కూడా వెళ్లకుండా ఈ మత్తులోనే వేలకు వేలు పోగొట్టుకుంటున్నారు. బంగారు ఆభరణాలు, మొబైల్ఫోన్లు, బైక్లు సైతం బెట్టింగ్లలో పోగొట్టుకుంటున్నారు. బెట్టింగుల కారణంగా చదువులు కొండెక్కడంతోపాటు మంచి భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. రైళ్లలో, బస్సుల్లో కూడా రాత్రుళ్లు మేలుకుని కూడా ఈ గేమ్స్ ఆడుతున్నారు. పోలీసులు కనుక్కోలేరు జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, మదనపల్లె,పలమనేరులో యూత్ బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. పోలీసులు ఈ ప్రాంతాలకు వెళ్లినా క్రికెట్ ఆడుతున్నామనో, స్మార్ట్ ఫోన్లో గేమ్స్ అనో చెబుతున్నారు. వీరి వద్ద జూదానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు ఉండవు కాబట్టి పోలీసులు సైతం ఏం చేయలేక పోతున్నారు. జూదానికి బానిసలుగా మారిన తమ పిల్లలను ఎలా దారినపెట్టాలో అర్థంగాక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. ఏదేమైనా కొత్తగా వచ్చిన రకరకాల జూదాలతో పలు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. -
బెట్టింగ్ గుట్టు రట్టు
నెల్లూరు(క్రైమ్): ఓ ఫైనాన్షియర్ కొంతకాలంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. అతని కదలికలపై నిఘా ఉంచిన వేదాయపాళెం పోలీసులు బెట్టింగ్ స్థావరంపై దాడిచేసి బుకీతోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం వేదాయపాళెం పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక ఇన్స్పెక్టర్ కె.నరసింహారావు నిందితుల వివరాలను వెల్లడించారు. చంద్రమౌళినగర్కు చెందిన బి.సురేంద్ర ఫైనాన్స్ వ్యాపారి. అతను తన స్నేహితులైన భక్తవత్సనగర్లో నివాసం ఉంటున్న కారు డ్రైవర్ పి.శ్రీకాంత్, చంద్రమౌళినగర్లో ఉంటున్న కిరాణా వ్యాపారి రాజేష్, వేదాయపాళెంకు చెందిన కిరణ్లతో కలిసి కొంతకాలంగా క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్నాడు. వేదాయపాళెంలోని ఓ ఫ్యాన్సీ షాపు మిద్దెపైన గదిలో ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్నారు. వీరు మొబైల్ ఫోన్లో ప్లే 365 యాప్ను వినియోగించి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై సమాచారం తెలియడంతో వేదాయపాళెం పోలీసులు కొంతకాలంగా నిఘా ఉంచారు. గురువారం న్యూజిలాండ్ – ఇండియా వన్డే మ్యాచ్కు బెట్టింగ్లు నిర్వహిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో ఇ¯Œన్స్పెక్టర్ కె.నరసింహారావు తన సిబ్బందితో కలిసి కేంద్రంపై దాడిచేశారు. పోలీసుల రాకను గమనించిన కిరణ్ అక్కడినుంచి పరారవగా సురేంద్ర, శ్రీకాంత్, రాజేష్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.50 లక్షలు నగదు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు. అనంతరం పోలీసులు నిందితులను తమదైన శైలిలో విచారించగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించడంతో నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న కిరణ్ కోసం గాలిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. సమాచారం అందించండి బెట్టింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ కె.నరసింహారావు వెల్లడించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో బెట్టింగ్ కార్యకలాపాలు సాగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే డయల్ 100 లేదా పోలీసులకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఎస్సైలు సీహెచ్ కొండయ్య, మస్తానయ్య, క్రైమ్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. -
క్రికెట్ బెట్టింగ్ కేసులో నిందితుడి అరెస్ట్
సాక్షి, సిటీబ్యూరో:సెల్ఫోన్ల ద్వారా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఆస్ట్రేలియాలోని మార్వెల్ స్టేడియంలో జరుగుతున్న రెనీగ్రేడ్స్, సిడ్నీ థండర్ టీ–20 మ్యాచ్పై, కేఎఫ్సీ బిగ్బాష్ లీగ్ 2018–19పై బెట్టింగ్ నిర్వహిస్తున్న ఫీల్ఖానా వాసి సూరజ్ వ్యాస్ను షాహినాయత్గంజ్ ఠాణా పరిధిలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.5,38,000 నగదు, రెండు సెల్ఫోన్లు, ఒక ఎల్ఈడీ టీవీ, ఒక ల్యాప్టాప్, రెండు ప్యాకెట్ డైరీలను స్వాధీనం చేసుకున్నారు.డిగ్రీ పూర్తి చేసి మూడు కంపెనీల్లో అకౌంటెంట్గా పనిచేసిన సూరజ్ వ్యాస్ జల్సాలకు అలవాటుపడి ఈజీమనీ కోసం 2017 నుంచి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. తదుపరి విచారణ కోసం షాహినాయత్గంజ్ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్ రావు తెలిపారు. పరారీలో ఉన్న విశాల్ కోసం గాలిస్తున్నామన్నారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
కర్నూలు : కర్నూలు కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. పోలీసులకు చిక్కిన వారంతా ఎంబీఏ, ఎంసీఏ, పోస్ట్గ్రా డ్యుయేట్ వంటి ఉన్నత చదువులు చదివిన వారు కావడం గమనార్హం. కర్నూలు నగరం ఎఫ్సీఐ కాలనీలోని కేఎంసీ పార్కు వద్ద బుధవారం క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠాను మూడో పట్టణ పోలీసులతో కలసి స్పెషల్ పార్టీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. దాడుల్లో 15 మందిని అరెస్టు చేయగా మరో 11 మంది పరారీలో ఉన్నారు. పట్టబడిన వారి వద్ద నుంచి రూ.5.58 లక్షల నగదు, రూ.92 లక్షల విలువ చేసే చెక్కులు, రూ.2.21 కోట్ల విలువ చేసే ప్రామిసరీ నోట్లు, 30 సెల్ఫోన్లు, రెండు కాలిక్యులేటర్లు, 5 బ్యాంక్ పాస్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. మూడో పట్టణ పోలీస్స్టేషన్లో బుధవారం సాయంత్రం కర్నూలు డీఎస్పీ డి.శ్రీనివాసులుతో కలసి ట్రైనీ ఐపీఎస్ అధికారి విద్యాసాగర్ నాయుడు వివరాలు వెల్లడించారు. రెండు గ్రూపులుగా.. కర్నూలు మండలం భూపాల్నగర్కు చెందిన పాలకుర్తి విశ్వనాథ్రెడ్డి ప్రధాన సూత్రధారిగా కర్నూలు నగరం లక్ష్మీనగర్కు చెందిన మొగలి యల్లగౌడ్, కృష్ణానగర్కు చెందిన బవనాసి అనిల్కుమార్, బుధవారపేటకు చెందిన పాషావలి, అరోరా నగర్కు చెందిన పేరుమల సాగర్, పత్తికొండ పట్టణానికి చెందిన బండ సందీప్, కర్నూలు నాగిరెడ్డి రెవెన్యూ కాలనీకి చెందిన కట్టుబడి శ్రీధర్, ముచ్చుమర్రి గ్రామానికి చెందిన కరణం ప్రభాకర్, తాండ్రపాడుకు చెందిన ప్రకాష్ గౌడ్, అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి చెందిన జిట్టా నరేష్, పాములపాడు మండలం వేంపెంట గ్రామానికి చెందిన పట్నం శ్యాంబాబు, కర్నూలు నగరం సంతోష్నగర్కు చందిన షేక్ సద్దాం, భూపాల్నగర్కు చెందిన బత్తిన సురేంద్ర ఒక గ్రూపు, మరో ప్రధాన సూత్రధారి కర్నూలు నగరం బి.క్యాంప్లో నివాసముంటున్న ఫషీవుల్లా అలియాస్ జానకిరామ్ నేతృత్వంలో మరో గ్రూపు కొంతకాలంగా కర్నూలు కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. పరారీలో 11 మంది... పై రెండు గ్రూపులతో అనుసంధానంగా పనిచేస్తూ క్రికెట్ బుకీలకు లాభాలు ఆర్జించిపెడుతున్న మరో 11 మంది పరారీలో ఉన్నారు. మొదటి గ్రూపులో జానకిరామ్ అలియాస్ జేడీ, శివశంకర్, తిమ్మయ్య, రాజశేఖర్రెడ్డి, విశ్వనాథరెడ్డి, పుల్లయ్య గౌడ్, రెండో గ్రూపులో షఫీవుల్లా కింద పనిచేస్తున్న కర్ణాటక రాష్ట్రం బళ్లారి ప్రాంతానికి చెందిన సయ్యద్ ఇనాయతుల్లా ఖాద్రి, సుదర్శన్రెడ్డి, శ్రీకాంత్, అశోక్, నాగరాజు తదితరులు పరారీలో ఉన్నారు. నిందితులపై మూడో పట్టణ పోలీస్స్టేషన్లో అండర్ సెక్షన్ 420 ఐపీసీ, సెక్షన్ 9(1) ఏపీ గేమింగ్ యాక్ట్ (క్రికెట్ బెట్టింగ్) కింద కేసు నమోదయ్యింది. రూ. కోట్లలో లావాదేవీలు... షఫీవుల్లా వివిధ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తూ కోట్లాది రూపాయలు లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు విచారణలో బయటపడింది. సంపాదించిన ఆస్తులకు ప్రభుత్వానికి ఎటువంటి పన్ను చెల్లించకపోగా పేదరికంలో మగ్గుతున్నట్లు ప్రభుత్వం నుంచి రేషన్ కార్డు, అనేక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందాడు. ఇతని నుంచి స్వాధీనం చేసుకున్న లక్షలు విలువ చేసే ప్రామిసరీ నోట్లు, చెక్కులు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు అప్పగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మట్కా, బెట్టింగ్ రాయుళ్ల ఆస్తులనుకోర్టుకు అటాచ్ చేయిస్తాం.. మట్కా, బెట్టింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాలను నడిపించేవారి ఆస్తులను జప్తు చేసి, కోర్టుకు అటాచ్ చేయిస్తామని ట్రైనీ ఐపీఎస్ అధికారి విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. మట్కా, క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై టెక్నాలజీ ద్వారా నిఘా పెట్టామన్నారు. ఎక్కడైనా ఇటువంటి కార్యకలాపాలకు ఆశ్రయం కల్పించినట్లయితే (లాడ్జిలైనా సరే) వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసుల వాట్సాప్ నంబర్ 77778 77722కు సమాచారమందించాలని విజ్ఞప్తి చేశారు. మూడో పట్టణ సీఐ హనుమంత నాయక్, ఎస్ఐ తిరుపాల్ బాబు, ఏఎస్ఐ విశ్వనాథ్రెడ్డి తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. -
బెట్టింగే వీరి ప్రొఫెషన్
శంషాబాద్: క్రికెట్ బెట్టింగ్ ప్రొఫెషన్గా మార్చుకొన్న ఇద్దరు సోదరులతో పాటు వారికి సహకరించిన ఓ ఏజెంట్, ఓ గ్యాంబ్లర్ను శంషాబాద్ ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్రెడ్డి ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో పాతనగరంలోని ఘాన్సీబజార్కు చెందిన అకింత్ అగర్వాల్(28), మోహిత్ అగర్వాల్(25) క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో నిరంతరంగా బిగ్బాష్ లీగ్ క్రికెట్ మ్యాచ్ల సందర్భంగా శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు బెట్టింగ్లపై నిఘా పెంచారు. రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఆరాంఘర్ చౌరస్తాలో ఉన్న ఓ హోటల్ ఓ గదిని అకింత్ అగర్వాల్, మొహిత్ అగర్వాల్తో పాటు జిడిమెట్ల ప్రాంతానికి చెందిన యాసిమిన్ మహేష్(44) కలెక్షన్ ఏజెంట్, బెట్టింగ్ సబ్ ఆర్గనైజర్గా వ్యవహరిస్తున్న చార్కమాన్ బస్తీకి చెందిన రోహిత్ అగర్వాల్ (27) అద్దెకు తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం రాత్రి ఎస్ఓటీ పోలీసులు, రాజేంద్రనగర్ పోలీసులు ఈ ముఠాను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 5 లక్షల నగదుతో పాటు ఎనిమిది సెల్ఫోన్లు, ఓ క్యాలికులేటర్, స్కోరింగ్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా అంకిత్, మొహిత్ అగర్వాల్లు 2016 క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుత సుల్తాన్బజార్ పోలీసులకు చిక్కి జైలుశిక్ష సైతం అనుభవించారు. అదే తరహాలో 2018 ఐపీఎల్ క్రికెట్ సందర్భంలో రాజేంద్రనగర్, వెస్ట్మారేడ్పల్లి పోలీసులు వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ లావాదేవీలన్నింటినీ వీరు కొనసాగిస్తున్నారని డీసీపీ ప్రకాష్రెడ్డి తెలిపారు. యువత క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడకూడదని డీసీపీ సూచించారు. ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా చాలామంది యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, బెట్టింగ్లపై సైబరాబాద్ పోలీసులు గట్టి నిఘా వేసి ఉంచారని చెప్పారు. బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేసి ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులను డీసీపీ అభినందించారు. -
బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు
సాక్షి,హైదరాబాద్: హైటెక్ పంథాలో ప్రత్యేక యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును నగర టాస్క్ఫోర్స్ బృందం రట్టు చేసింది. నార్త్జోన్ టాస్క్ఫోర్స్ బృందం నిర్వహించిన దాడుల్లో ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి పోలీసులు రూ.41లక్షలు స్వాధీనం చేసుకున్నారు. గురువారం టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావుతో కలిసి కొత్వాల్ అంజనీకుమార్ తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. పంటర్గా మొదలై బుకీగా..: హిమాయత్నగర్కు చెందిన వ్యాపారి అలోక్ జైన్ ముందు పంటర్గా పందాలు కాసి నష్టపోయాడు. దీంతో తన సోదరుడు అభిషేక్ జైన్, స్నేహితుడు మేహుల్ కే మార్జారియాలతో కలి సి బుకీగా మారాడు. చిక్కడపల్లిలో ఓ ఫ్లాట్ తీసుకుని బెట్టింగ్స్ నిర్వహిస్తున్నారు. పరిచయస్తులైన పంటర్ల నుంచి పందాలు అంగీకరి స్తూ ఆ లెక్కల్ని రికార్డుల్లో నోట్ చేసుకునే వారు. మ్యాచ్ ముగిశాక పందెం ఓడిన వారి నుంచి డబ్బు వసూలు, గెలిచిన వారికి చెల్లింపులు చేసేవారు. అప్పట్లో మ్యాచ్ వివరాలను టీవీలో చూస్తూ, బెట్టింగ్ నిష్పత్తిని సూత్రధారుల నుంచి ఫోన్లో తెలుసుకునే వారు. యాప్ తయారు చేయించిన సుభాష్ దేశంలోనే ప్రముఖ బుకీగా పేరున్న రాజస్థాన్ వాసి సులేమాన్ సురానీ అలియాస్ సుభాష్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. బెట్టింగ్స్ నిర్వహణకు సుభాష్ వెబ్సైట్, యాప్ రూపొందించాడు. వీటిల్లోకి లాగిన్ కావాలం టే యూజర్ ఐడీ, పాస్వర్డ్స్ తప్పనిసరి. గత ఐపీఎల్లో అలోక్ ఇందులో భాగస్వామిగా చేరాడు. అలోక్ వద్ద బెట్టింగ్కు పాల్పడే పంటర్లకూ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చేందుకు ఒక్క క్కరి నుంచి రూ.30 వేలు వసూలు చేస్తూ కొంత సుభాష్కు పంపిస్తున్నాడు. ఆ సైట్, యాప్స్లోకి ప్రవేశించిన పంటర్లకు మ్యాచ్ వివరాలు, బెట్టింగ్ నిష్పత్తి అన్నీ అక్కడే కనిపిస్తాయి. క్రికెట్కే కాకుండా ఏ క్రీడకైనా ఈ యాప్ ద్వారా పందాలు కాసుకోవచ్చు. హవాలా మార్గంలో నగదు లావాదేవీలు ఈ యాప్లోకి ప్రవేశించిన పంటర్ల వివరాలు, ఏ జట్టుపై ఎంత పందెం కాశారనేది రికార్డు అయిపోతాయి. గెలిచిన, ఓడిన వారు హవా లా మార్గంలో డబ్బు చెల్లించడం, తీసుకోవడం చేస్తుంటారు. సమస్యలుంటే వాట్సాప్ ద్వారా నే సంప్రదింపులు జరపాలి. అనేక మ్యాచ్లకు బెట్టింగ్ నిర్వహించిన అలోక్ గ్యాంగ్ ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఇండియా–ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్పై బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న నార్త్జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు నేతృత్వంలో బృందం దాడి చేసి అలోక్, అభిషేక్, మార్జారియాలను అరెస్టు చేశారు. వీరి అరెస్టుతో సైట్, యాప్లను సుభాష్ బ్లాక్ చేశాడు. సుభాష్పై ఎల్ఓసీ జారీ చేయించాలని నిర్ణయించారు. ఈ అంశాల్లోనే బెట్టింగ్.. 1. టాస్ ఏ జట్టు గెలుస్తుంది? 2. ఫేవరేట్ టీమ్ ఏది? 3. ఓ బ్యాట్స్మెన్ ఎన్ని రన్స్ దాటతారు? 4. ఏ బౌలర్ ఎన్ని వికెట్లు తీస్తారు? 5. మొదటి సెషన్లో (6 ఓవర్లు) ఎన్ని రన్స్ చేస్తారు? 6. రెండు, మూడు, నాలుగు సెషన్స్లో ఎన్నేసి నమోదవుతాయి?