new policy
-
కొత్త టోల్ విధానం.. ముందుగా చెప్పిన నితిన్ గడ్కరీ
భారతదేశంలో జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా సాగుతోంది. అయితే రోడ్డుపై టోల్ ప్లాజాలు అధికమవుతున్నాయి. టోల్ వసూళ్లు కూడా పెరిగాయి. ఈ తరుణంలో కేంద్రమంత్రి 'నితిన్ గడ్కరీ' (Nithin Gadkari) 'ఏకరీతి టోల్ విధానం' గురించి ప్రస్తావించారు. ఇది వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని అన్నారు.వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఏకరీతి టోల్ విధానంపై కసరత్తు చేస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం తెలిపారు. ఇప్పుడు మనదేశంలోని రోడ్లు.. అమెరికాలోని రోడ్లకు సమానంగా ఉన్నాయని ఆయన అన్నారు.కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో రోడ్లు లేకపోవడం, అధిక టోల్ చార్జీల వసూలు వంటివి వాహనదారులలో అసంతృప్తిని నెలకొల్పాయి. కాబట్టి ఏకరీతి టోల్ ప్రవేశపెడితే.. ఇది అందరికి ప్రయోజనకారిగా ఉంటుందని నితిన్ గడ్కరీ అన్నారు. అయితే దీనికి సంబంధించిన చాలా వివరాలను ఆయన అధికారికంగా వెల్లడించలేదు. అంతకంటే ముందు GSS (గ్లోబల్ న్యావిగేషన్ శాటిలైట్ సిస్టం) ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.జాతీయ రహదారులపై గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్) ఆధారిత టోల్ వసూలు విధానం అమలు చేయడం ద్వారా ప్రయాణానికి ఎలాంటి అవరోధం ఉండదని ఆయన అన్నారు. అంతే కాకుండా.. సోషల్ మీడియాలో ప్రయాణికులు చేసే ఫిర్యాదులను చాలా సీరియస్గా తీసుకున్నామని.. దీనికి కారణమైన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని గడ్కరీ చెప్పారు.ప్రస్తుతం, జాతీయ రహదారులపై ఎక్కువగా ఉన్న ట్రాఫిక్లో 60 శాతం ప్రైవేట్ కార్ల వల్లనే ఏర్పడుతోంది. ఈ వాహనాల ద్వారా వచ్చే టోల్ ఆదాయం కేవలం 20-26 శాతం మాత్రమే. అయితే గత పదేళ్లలో టోల్ వసూళ్ల విషయంలో చాలా మార్పులు వచ్చాయి. కాబట్టి ఆదాయం కూడా పెరిగింది. 2023-24లో భారతదేశంలో మొత్తం టోల్ వసూళ్లు రూ. 64,809.86 కోట్లకు చేరాయి. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 35 శాతం ఎక్కువ. 2019-20లో ఈ వసూళ్లు రూ.27,503 కోట్లు.ఇదీ చదవండి: అలాంటి కార్లు టోల్ గేట్ దాటితే భారీ జరిమానా.. జైలు శిక్ష కూడా!జాతీయ రహదారులపై అన్ని టోల్ ప్లాజాలు జాతీయ రహదారుల నియమాలు, 2008 & సంబంధిత రాయితీ ఒప్పందం ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. హైవేల నిర్మాణం కూడా వేగంగా జరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రోజుకు 37 కి.మీ హైవేల నిర్మాణ జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు దాదాపు 7,000 కి.మీ హైవేల నిర్మాణం జరిగింది. ఫిబ్రవరి-మార్చి కాలంలో రహదారుల నిర్మాణ వేగం మరింత పెరుగుతుందని గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రపంచంలోనే భారతదేశం రెండవ అతిపెద్ద రహదారి నెట్వర్క్ను కలిగి ఉంది. దేశంలో జాతీయ రహదారులు మొత్తం 1,46,195 కి.మీ పొడవును కలిగి ఉన్నాయి. దేశంలో కనెక్టివిటీని మెరుగుపరచడానికి.. లాజిస్టిక్ ఖర్చులను తగ్గించడానికి 34,800 కి.మీ పొడవును కవర్ చేయడానికి 2017లో ప్రభుత్వం 'భారతమాల పరియోజన' (Bharatmala Pariyojana)ను ఆమోదించింది. -
కొత్త పన్ను విధానంలోకి ఇక భారీగా..!
న్యూఢిల్లీ: తాజా బడ్జెట్లో తెరతీసిన ఆదాయ పన్ను భారీ రిబేట్లు కారణంగా కొత్త విధానంలోకి మరింత మంది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు చేరతారని ప్రభుత్వం భావిస్తోంది. 90 శాతానికిపైగా పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్ని ఎంపిక చేసుకోనున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) చైర్మన్ రవి అగర్వాల్ ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 75 శాతంమంది కొత్త విధానంలో ఉన్నారు. ఆర్థిక మంత్రి సీతారామన్ రూ. 12 లక్షల వరకూ ఆదాయంపై పన్ను లేకుండా ప్రతిపాదించడంతో పలువురు కొత్త విధానంలోని మారనున్నట్లు తెలియజేశారు. పన్ను శ్లాబుల పునర్వ్యవస్థీకరణ సైతం ఇందుకు సహకరించనున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగాన్ని మరింత పెంచడం ద్వారా మానవ జోక్యం లేని పన్నుల నిర్వహణకు ప్రభుత్వం, ఆదాయ పన్ను శాఖలు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. ఆదాయాన్ని ప్రకటించడంలో సాధారణ పన్ను చెల్లింపుదారులకు సులభమైన పద్ధతులను అందుబాటులోకి తీసుకువచి్చనట్లు తెలియజేశారు. ఇందుకు ప్రవేశపెట్టిన సరళతర ఐటీఆర్–1, ముందస్తుగా నమోదయ్యే ఐటీ రిటర్నులు, మూలంవద్ద పన్ను(టీడీఎస్)లో ఆటోమాటిక్ మదింపు తదితరాలను ప్రస్తావించారు. మినహాయింపులు, తగ్గింపులవంటివి లేని నూతన పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు మదింపు మరింత సులభమవుతుందని పేర్కొన్నారు. వెరసి ఐటీ నిపుణుల అవసరంలేకుండానే ఐటీఆర్ను దాఖలు చేయవచ్చని తెలియజేశారు. -
సర్కార్ బడికి ఉరి!
-
‘క్వాలిటీ’ ర్యాంకులు
సాక్షి, అమరావతి: దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో నాణ్యతా ప్రమాణాలకు పెద్ద పీట వేస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొత్త మార్గదర్శకాలు తీసుకు వస్తోంది. ఇందులో జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) అమలుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో నాణ్యతను ధ్రువీకరిస్తూ ఇచ్చే న్యాక్ అక్రిడిటేషన్లో అదనపు ఫ్రేమ్వర్క్ను పరిచయం చేస్తోంది. ఈ ప్రక్రియలో రెండు దశల్లో విద్యా సంస్థల మదింపు చేసి ర్యాంకులు ఇవ్వనుంది. తొలి దశ ‘ఎలిజిబులిటీ క్వాలిఫైయర్’లో ప్రాథమిక అర్హతలను పరిశీలిస్తారు.ఇందులో ఎంపికైన విద్యా సంస్థలు రెండో దశ పరిశీలనకు వెళ్తాయి. తొలి దశలో విద్యా సంస్థ 11 రకాల అంశాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వీటిలో యూజీసీ గుర్తింపు, న్యాక్ అక్రిడిటేషన్, ఏఐఎస్హెచ్ఈ పోర్టల్ రిజిస్ట్రేషన్, విద్యార్థుల ఫిర్యాదు పరిష్కార కమిటీ, అంతర్గత ఫిర్యాదుల కమిటీ, అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ రిజిస్ట్రేషన్ తదితర అంశాలను ప్రాథమికంగా పాటించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉంటేనే రెండో దశకు అర్హత లభిస్తుంది. రెండో దశలో నాణ్యత ధ్రువీకరణ కోసం నిర్ణీత ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. విద్యా సంస్థలోని కనీసం 75 శాతం బోధనా పోస్టుల్లో శాశ్వత సిబ్బంది ఉండాలి. ఈ శాశ్వత సిబ్బంది మాలవీయ మిషన్ ద్వారా శిక్షణ పొంది ఉండాలి. అలాగే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, పర్యావరణ విద్యను ఆయా సంస్థలు బోధిస్తూ ఉండాలి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కనీసం 3 వేల మంది విద్యార్థులను చేర్చుకున్నారా? ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉందా? తదితర ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 49 ప్రశ్నలకు గానూ 30 ప్రశ్నలు అన్ని ఉన్నత విద్యా సంస్థలకూ వర్తిస్తాయి. మరో 13 ప్రశ్నలు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాలు, స్వయంప్రతిపత్తి సంస్థలకు సంబంధించినవి. ముఖ్యంగా వైస్ చాన్సలర్ల నియామకం యూజీసీ నిబంధనలకు అనుగుణంగా ఉందా, లేదో పరిశీలించనున్నారు. ఈ తాజా మార్గదర్శకాలపై 30 రోజుల్లోగా అభిప్రాయాలు తెలియజేయాలని యూజీసీ కోరింది. అయితే జాతీయ విద్యా విధానం అమలు ఆధారంగా ఉన్నత విద్యా సంస్థలకు ర్యాంకులు ఇవ్వడాన్ని తమిళనాడు, కర్ణాటక విశ్వవిద్యాలయాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎన్ఈపీని అమలు చేయని రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. -
హెల్త్ ఇన్సూరెన్స్ ‘పోర్టింగ్’.. తొందరొద్దు!
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి కుటుంబానికి అత్యంత ముఖ్యమైన ఆర్థిక సాధనం. రక్షణ కవచం కూడా. ఎప్పుడు ఏ రూపంలో అనారోగ్యం లేదా ప్రమాదం ఎదురవుతుందో ఊహించలేం. ఖరీదైన వైద్య వ్యయాల భారాన్ని మోయలేం. జీవితకాల కష్టార్జితాన్ని ఒకేసారి ఎత్తుకుపోయే కరోనా మాదిరి విపత్తులు ఎప్పుడు వస్తాయో తెలియదు. వీటన్నింటికీ పరిష్కారమే హెల్త్ ఇన్సూరెన్స్. విస్తృత ప్రచారం నేపథ్యంలో నేడు చాలా మంది ఆరోగ్య బీమా ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకుంటున్నారు. ప్రీమియం కష్టమైనా తీసుకుంటున్నారు. తీరా ప్లాన్ కొనుగోలు చేసిన తర్వాత.. కంపెనీ సేవలు నచ్చకపోవచ్చు. మంచి ఫీచర్లతో తక్కువ ప్రీమియానికే మరో బీమా కంపెనీ హెల్త్ప్లాన్ ఆకర్షించొచ్చు. అటువంటి సందర్భంలో కనిపించే ఏకైక ఆప్షన్ పోర్టింగ్. ఒక నెట్వర్క్ నుంచి మరో నెట్వర్క్కు మొబైల్ నంబర్ మార్చుకున్నంత సులభంగానే.. హెల్త్ ఇన్సూరెన్స్ను సైతం పోర్ట్ పెట్టుకుని మరో కంపెనీ ప్లాన్లో చేరిపోవచ్చు. పోర్టింగ్తో ఎన్నో ప్రయోజనాలున్నాయనడంలో సందేహం లేదు. అదే సమయంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. వీటి గురించి అవగాహన తప్పనిసరి. బలమైన కారణాలుంటేనే, అది కూడా సమగ్రమైన సమాచారం తెలుసుకున్న తర్వాతే ‘పోర్టింగ్’ను ఎంపిక చేసుకోవాలన్నది నిపుణుల సూచన. – సాక్షి, బిజినెస్ డెస్క్తమ కంపెనీ ప్లాన్లోకి ‘పోర్ట్’ పెట్టుకోవాలంటూ ఇటీవలి కాలంలో మార్కెటింగ్ కాల్స్ రావడం కొందరికి అనుభవమే. బీమా మార్కెట్లో పోటీ పెరిగిపోవడంతో ఈ ధోరణి ఏర్పడింది. కొత్త కస్టమర్ల కోసం మార్కెటింగ్ బృందాలు అన్ని మార్గాల్లోనూ జల్లెడ పడుతున్నాయి. అప్పటి వరకు అసలు ఆరోగ్య బీమా రక్షణ పరిధిలో లేని కస్టమర్లకు హెల్త్ ప్లాన్ ఇవ్వడం మంచిదే. కానీ, ఇతర బీమా కంపెనీల కస్టమర్లను సైతం ఆకర్షించేందుకు కొత్తదారులు వెతుక్కుంటున్నాయి.‘‘పోర్ట్ పెట్టేసుకుని, మా కంపెనీ ప్లాన్లోకి మారిపోండి. మంచి ఫీచర్లు, మెరుగైన కవరేజీతో బీమా రక్షణ పొందండి’’ అంటూ ఆఫర్లు ఇస్తున్న ధోరణి కనిపిస్తోంది. వ్యాపార వృద్ధి లక్ష్యాల్లో భాగంగా కొత్త కస్టమర్లను సంపాదించేందుకు కొందరు అనైతికంగానూ వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సహేతుక కారణాలు ఉన్నప్పుడే పోర్టింగ్ ఆప్షన్ను పరిశీలించాలి. చేదు అనుభవం..కేరళ రాష్ట్రానికి చెందిన అజిత్ కుమార్ (53)కు ఎదురైన అనుభవాన్ని ఈ సందర్భంగా చెప్పుకోవాలి. అప్పటికే ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్తో కానీ, బీమా కంపెనీతో కానీ అతడికి ఎలాంటి సమస్యల్లేవు. కానీ, ప్రముఖ ఆన్లైన్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్లాట్ఫామ్ నుంచి ఒకరోజు కాల్ వచ్చింది. పాలసీని పోర్ట్ పెట్టుకోవాలంటూ మార్కెటింగ్ సిబ్బంది సూచించారు. మెరుగైన సదుపాయాలున్న ప్లాన్ను పోర్టింగ్తో పొందొచ్చంటూ ఆయన్ను ప్రోత్సహించారు. ‘‘11 ఏళ్ల నుంచి నాకు హెచ్డీఎఫ్సీ ఎర్గో ఆప్టిమా సెక్యూర్ ప్లాన్ ఉంది. అన్నేళ్లలో ఒక్కసారి కూడా క్లెయిమ్ చేయలేదు.అయినా కానీ, పాలసీ ప్రీమియాన్ని గణనీయంగా పెంచేశారు. దీంతో మంచి ఫీచర్లున్న కొత్త పాలసీకి పోర్ట్ పెట్టుకోవాలంటూ పాలసీబజార్ కస్టమర్ కేర్ ప్రతినిధి నాకు సూచించారు’’అని కుమార్ తన అనుభవాన్ని పంచుకున్నారు. కానీ, జరిగిన నష్టం ఏంటో ఆ తర్వాత కానీ తెలియలేదు. పోర్టింగ్ నిర్ణయం పట్ల కుమార్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కుమార్ పూర్వపు పాలసీలో రూ.10 లక్షల సమ్ అష్యూరెన్స్ ఉంది. మరో రూ.10 లక్షలకు నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ) కూడా ఉంది. అంటే మొత్తం రూ.20 లక్షల బీమా రక్షణ ఉన్నట్టు. పాలసీ తీసుకుని 10–11 ఏళ్లు కావడంతో అన్ని రకాల వెయిటింగ్ పీరియడ్ నిబంధనలను కుమార్ అధిగమించేశారు. పాత పాలసీలోనే కొనసాగి ఉంటే ఎలాంటి క్లెయిమ్కు అయినా అర్హత కొనసాగేది. కానీ, పోర్టింగ్తో నో క్లెయిమ్ బోనస్ కొత్త పాలసీలోకి బదిలీ కాలేదు. పైగా ఒకే విడత మూడేళ్ల ప్రీమియంలను కుమార్తో కట్టించారు సదరు మార్కెటింగ్ సిబ్బంది. వారి సూచనతో సూపర్ టాపప్ ప్లాన్ కూడా కొనుగోలు చేశారు. పాలసీ కొనుగోలు తర్వాత సేవలు దారుణంగా ఉన్నాయని కుమార్ విచారించడం మినహా మరో మార్గం లేకపోయింది. నో క్లెయిమ్ బోనస్, వెయిటింగ్ పీరియడ్ ప్రయోజనాలు అన్ని పోర్టింగ్ కేసుల్లోనూ తప్పనిసరిగా బదిలీ కావాలని లేదు. ఈ విషయంలో బీమా సంస్థల షరతులను అర్థం చేసుకోవాలి. పోర్టింగ్ ప్రక్రియ ఇలా..పోర్టింగ్ పెట్టుకోవాలంటే ప్రస్తుత పాలసీ రెన్యువల్ ఇంకా కనిష్టంగా 30 రోజులు, గరిష్టంగా 60 రోజుల గడువు ఉందనగా ప్రక్రియ ప్రారంభించాలి. ఉదాహరణకు ఫిబ్రవరి 28న తదుపరి ప్రీమియం చెల్లించాల్సిన గడువు అనుకుంటే, మీరు రెండు నెలల ముందుగా డిసెంబర్ 31నుంచి ప్రారంభించొచ్చు. రెన్యువల్కు 30 రోజుల కంటే తక్కువ వ్యవధి ఉన్నా కానీ, బీమా సంస్థ తన విచక్షణ మేరకు పోర్టింగ్ దరఖాస్తును ఆమోదించొచ్చని ఐఆర్డీఏఐ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత బీమా కంపెనీకి ఎలాంటి సమాచారం ఇవ్వక్కర్లేదు. పోర్టింగ్తో ఏ కంపెనీ ప్లాన్లోకి వెళ్లాలనుకుంటున్నారో, ఆ కంపెనీని సంప్రదించాలి. పోర్టబులిటీ, ప్రపోజల్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.పోర్టింగ్ సమయంలో తాజా ఆరోగ్య సమాచారం మొత్తాన్ని వివరంగా వెల్లడించాల్సిందే. అప్పటి వరకు ఏదైనా అనారోగ్యంతో ఆస్పత్రి పాలైనా, లోగడ హెల్త్ క్లెయిమ్ల గురించి కూడా వెల్లడించాల్సి రావచ్చు. ఈ వివరాల ఆధారంగా రిస్క్ను మదింపు వేసి బీమా సంస్థ ప్రీమియంను నిర్ణయిస్తుంది. అవసరమైతే అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రీమియంను పెంచొచ్చు.పోర్టింగ్ దరఖాస్తును కొత్త సంస్థ ఆమోదించి, పాలసీ జారీ చేసే వరకు పాత పాలసీని రద్దు చేసుకోవద్దు. ఎందుకంటే పాలసీదారు ఆరోగ్య చరిత్ర, రిస్క్, ఇతర అంశాల ఆధారంగా కొత్త సంస్థ ప్రీమియంను గణనీయంగా పెంచేస్తే అది అంగీకారం కాకపోవచ్చు. నో క్లెయిమ్ బోనస్, వెయిటింగ్ పీరియడ్ ప్రయోజనాల విషయంలోనూ కొత్త సంస్థ నిబంధనలు నచ్చకపోతే, పోర్టింగ్ అభ్యర్థనను ఉపసంహరించుకుని పాత సంస్థలో కొనసాగొచ్చు. ఆచరణ వేరు..ప్రస్తుత హెల్త్ ప్లాన్లో రూ.10 లక్షల బేసిక్ సమ్ అష్యూరెన్స్ ఉందనుకోండి. దీనికి మరో రూ.10 లక్షలు నో క్లెయిమ్ బోనస్ తోడయ్యింది. అప్పుడు సదరు పాలసీదారు రూ.20 లక్షల క్లెయిమ్కు అర్హులు. పోర్టింగ్తో వేరే కంపెనీ ప్లాన్లోకి మారాలనుకుంటే.. అప్పుడు రూ.20 లక్షల సమ్ అష్యూరెన్స్ను ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ పాత ప్లాన్లో మాదిరే రూ.10 లక్షల బేసిక్ సమ్ అష్యూరెన్స్ను కొత్త సంస్థలోనూ ఎంపిక చేసుకుంటే.. రూ.10 లక్షల నో క్లెయిమ్ బోనస్ కోల్పోయినట్టు అవుతుంది.పోర్టింగ్తో రూ.20 లక్షల సమ్ అష్యూరెన్స్ ఎంపిక చేసుకుంటే అంత మొత్తానికి తాజా వెయిటింగ్ నిబంధన కొత్త సంస్థలోనూ అమలు కాదు. ముందస్తు వ్యాధులకు (పాలసీ తీసుకునే నాటికి) 3–4 ఏళ్ల పాటు వెయిటింగ్ పీరియడ్ క్లాజ్ ఉంటుంది. పాలసీ తీసుకుని అన్నేళ్ల పాటు రెన్యువల్ చేసుకున్న తర్వాతే, ఆయా వ్యాధుల తాలూకూ క్లెయిమ్లకు అర్హత లభిస్తుంది. కనుక ఒక ప్లాన్లో వెయిటింగ్ పీరియడ్ నిబంధనలు అన్నింటినీ పూర్తి చేసిన తర్వాత, మరో కంపెనీకి పోర్ట్ పెట్టుకునే ముందు సమ్ అష్యూరెన్స్ ఎంపికలో వివేకంతో వ్యవహరించాలి.ఐఆర్డీఏఐ ఉత్తర్వులు ఉన్నా...సమ్ అష్యూరెన్స్, నో క్లెయిమ్ బోనస్, నిర్దేశిత వెయిటింగ్ పీరియడ్, మారటోరియం పీరియడ్కు సంబంధించిన అర్హతలను పోర్టింగ్తోపాటు బదిలీ చేయాలంటూ ఈ ఏడాది ఆరంభంలో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ)తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. కానీ, బీమా సంస్థలు తెలివిగా ఈ నిబంధనలను అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఉదాహరణకు.. ప్రస్తుత ప్లాన్లో రూ.10 లక్షల బేసిక్ సమ్ అష్యూరెన్స్తో, అన్ని వెయిటింగ్ పీరియడ్ నిబంధనలు అధిగమించేసి ఉన్నారని అనుకుందాం.పోర్టింగ్ సమయంలో కొత్త సంస్థలో రూ.20 లక్షల సమ్ అష్యూరెన్స్ ఎంపిక చేసుకుంటే, అప్పుడు పాత ప్లాన్లో రూ.10 లక్షలకే వెయిటింగ్ పీరియడ్ను పూర్తి చేశారు కనుక, కొత్త సంస్థ కూడా అంతే మొత్తానికి ఆ ప్రయోజనాన్ని కొనసాగిస్తుంది. మరో రూ.10 లక్షల మొ త్తానికి అన్ని వెయిటింగ్ పీరియడ్లు తాజాగా అమల్లోకి వస్తాయని తెలుసుకోవాలి. దీనర్థం.. అప్పటికే ఉన్న వ్యాధులకు సంబంధించి క్లెయిమ్ మొత్తం రూ.10 లక్షలు మించిన సందర్భాల్లో రూ.10 లక్షలకే పరిహారం పరిమితమవుతుంది.కుమార్ విషయంలో ఈ తప్పిదమే చోటుచేసుకుంది. పాత ప్లాన్లో రూ.10 లక్షల బేసిక్ సమ్ అష్యూరెన్స్, రూ.10 లక్షల నో క్లెయిమ్ బోనస్ ఉన్నప్పటికీ.. పోర్ట్ తర్వాత రూ.10 లక్షలకే సమ్ అష్యూరెన్స్ను ఎంపిక చేసుకున్నారు. దీంతో నో క్లెయిమ్ బోనస్ కోల్పోవడమే కాకుండా, ఆ మొత్తానికి వెయిటింగ్ పీరియడ్ ప్రయోజనాన్ని కోల్పోయినట్టు అయింది. పోర్టింగ్ ఏ సందర్భాల్లో..?ముఖ్యమైన కారణాలుంటేనే పోర్టింగ్ను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘ఏజెంట్ల సూచన మేరకు పోర్టింగ్ చేసుకుంటే, ఇన్సూరెన్స్ పాలసీ ప్రపోజల్ పత్రంలో అన్ని వివరాలు సమగ్రంగా ఉన్నాయేమో ఒక్కసారి ధ్రువీకరించుకోవాలి. చాలా సందర్భాల్లో ఏజెంట్లు అధిక కమీషన్ కోసం పోర్టింగ్ పేరుతో, తాజాగా పాలసీలు అంటగడుతుంటారు’’ అని హోలిస్టిక్ వెల్త్ సహ వ్యవస్థాపకుడు నిషాంత్ బాత్రా తెలిపారు. ఒకటికి మించిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, ప్రీమియం తగ్గుతుందన్న ఆశతో పోర్టింగ్ పెట్టుకునే తప్పిదం చేయవద్దన్నది బాత్రా సూచన. పోర్టింగ్ ద్వారా వచి్చన పాలసీదారులను కొత్తవారిగానే బీమా సంస్థలు పరిగణిస్తాయి. పోర్టింగ్ చేసుకున్న తర్వాత తొలినాళ్లలో క్లెయిమ్కు వెళితే, అందులోని వాస్తవికతను అవి సందేహించే అవకాశం లేకపోలేదు. మరి పోర్టింగ్ ఏ సందర్భాల్లో పరిశీలించాలన్న సందేహం రావచ్చు. ప్రస్తుత ప్లాన్లో లేని మెరుగైన ఫీచర్లు కొత్త ప్లాన్లో వస్తుంటే, మరిన్ని వ్యాధులకు కవరేజీ లభిస్తుంటే, అవి తమకు ఎంతో ప్రయోజనకరమని భావిస్తే అప్పుడు పోర్టింగ్ను పరిశీలించొచ్చు.అలాగే, ప్రస్తుత ప్లాన్లో రూమ్ రెంట్ విషయంలో పరిమితులు ఉండి, పోర్టింగ్తో వెళ్లే ప్లాన్లో ఎలాంటి రూమ్ రెంట్ పరిమితులు లేనట్టయితే అప్పుడు కూడా ఈ ఆప్షన్ వినియోగించుకోవడం సరైనదేనని బాత్రా సూచించారు. ఇక ప్రస్తుత బీమా సంస్థ క్లెయిమ్ల పరంగా ఇబ్బందులు పెడుతుంటే, క్లెయిమ్ మొత్తంలో కోతలు పెడుతుంటే లేదా క్లెయిమ్ ఆమోదంలో చాలా జాప్యం చేస్తుంటే, కస్టమర్ సర్వీస్ విషయంలో సంతోషంగా లేకపోయినా కానీ పోర్టింగ్ సహేతుకమే. ఇవి తెలుసుకోవాలి..⇒ పోర్టింగ్తో పాత పాలసీలో పొందిన నో క్లెయిమ్, వెయిటింగ్ పీరియడ్ క్రెడిట్ ప్రయోజనాలను కొత్త సంస్థ కూడా నిబంధనల మేరకు అందిస్తుందా? లేదా అన్నది ముందే ధ్రువీకరించుకోవాలి. ⇒ పాత కంపెనీలో ముందస్తు వ్యాధులకు 3 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ నిబంధనను పూర్తి చేశారని అనుకుందాం. పోర్టింగ్ తర్వాత కొత్త సంస్థ ప్లాన్లో వెయిటింగ్ పీరియడ్ 4 ఏళ్లుగా ఉంటే.. అప్పుడు మరో ఏడాది తర్వాతే క్లెయిమ్ ప్రయోజనాలకు అర్హత లభిస్తుంది. ఒకవేళ పాత కంపెనీలో వెయిటింగ్ పీరియడ్ను సగమే పూర్తి చేసి ఉంటే, అప్పుడు కొత్త సంస్థలో నిబంధనల మేరకు మిగిలిన కాలానికి వెయిటింగ్ పీరియడ్ కొసాగుతుంది. ⇒ పోర్టింగ్కు ప్రీమియం ఒక్కదానినే ప్రామాణికంగా తీసుకోవద్దు. ఎందుకంటే వయసు, ఆరోగ్య చరిత్ర వివరాల ఆధారంగా ఈ ప్రీమియం మారిపోవచ్చు. అధిక రిస్్కలో ఉన్నారని భావిస్తే బీమా సంస్థలు అధిక ప్రీమియంను నిర్ణయిస్తాయి. ⇒ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ను నేరుగా బీమా సంస్థ నుంచి తీసుకున్నా, ఏజెంట్ సాయంతో తీసుకున్నా ప్రీమియంలో పెద్ద వ్యత్యాసం ఉండదు. కొన్ని కంపెనీలు ఏ రూపంలో పాలసీ తీసుకుంటున్నప్పటికీ ఒక్కటే ప్రీమియం అమలు చేస్తున్నాయి. ⇒ పోర్టింగ్ తర్వాత అధిక సమ్ అష్యూరెన్స్ను ఎంపిక చేసుకోవచ్చు. మరింత సమ్ అష్యూరెన్స్ ఇవ్వడమా? లేదా అన్న దానిని అండర్రైటింగ్ నిబంధనల మేరకు బీమా కంపెనీలు నిర్ణయిస్తాయి. ⇒ అన్ని వ్యక్తిగత, ఫ్యామిలీ ఫ్లోటర్ ఇండెమ్నిటీ పాలసీలకు పోర్టింగ్ అర్హత ఉంటుంది. ఇక గ్రూప్ హెల్త్ పాలసీల్లో కవరేజీ ఉన్న వ్యక్తులు, కుటుంబాలకు మాత్రం.. ఆ గ్రూప్ నుంచి తప్పుకున్నప్పుడు లేదా గ్రూప్ పాలసీలో మార్పులు చేసినప్పుడు (ప్రీమియం పెంపు సహా) లేదా గ్రూప్ పాలసీని ఉపసంహరించుకున్న సందర్భాల్లో పోర్టింగ్కు వీలు కల్పించాల్సి ఉంటుంది. ⇒ పోర్టింగ్ దరఖాస్తుపై 15 రోజుల్లో బీమా సంస్థ తన నిర్ణయాన్ని పాలసీదారునకు తెలియజేయాల్సి ఉంటుంది. పాత పాలసీలో ఉన్న కవరేజీకి తక్కువ కాకుండా బీమా రక్షణను కొత్త సంస్థ అందించాలి. -
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ నుంచి కొత్త పాలసీ
పెరిగే వ్యయాలను ఎదుర్కొనడంలో పదవీ విరమణ చేసిన వారికి కొంత తోడ్పాటు అందించేలా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ కొత్త పాలసీని ఆవిష్కరించింది. ఏటా అయిదు శాతం అధికంగా యాన్యుటీ చెల్లింపు ప్రయోజనాలను అందించే ఫీచరుతో గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్ ఫ్లెక్సీని ప్రవేశపెట్టింది. ఈ తరహా పాలసీల్లో ఇదే మొట్టమొదటిదని సంస్థ తెలిపింది.ద్రవ్యోల్బణం వల్ల కాలక్రమేణా కొనుగోలు శక్తి తగ్గినా, జీవన ప్రమాణాలను స్థిరంగా కొనసాగించుకోవడంలో కస్టమర్లకు ఈ పాలసీ ఉపయోగకరంగా ఉంటుందని సంస్థ చీఫ్ ప్రోడక్ట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ అమిత్ పల్టా తెలిపారు. ప్రస్తుతం అధిక వడ్డీ రేట్లు ఉన్న నేపథ్యంలో జీవితకాలం పాటు అధిక రాబడులను అందుకునేలా యాన్యుటీ పథకాన్ని కొనుగోలు చేసేందుకు ఇది సరైన తరుణమని ఆయన పేర్కొన్నారు. -
హైదరాబాద్కు ఢిల్లీ పరిస్థితి రావొద్దనే..: పొన్నం
హైదరాబాద్, సాక్షి: కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రజలు 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్వచ్చందంగా స్క్రాప్ చేపించాలని పిలుపు ఇచ్చారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ మేరకు ఈవీ వాహనాలు కొనాలంటూ కోరుతున్నారాయన.ఢిల్లీలో తీవ్ర వాయుకాలుష్యంతో స్కూల్స్కు బంద్ చేస్తున్నారని, అలాంటి పరిస్థితి తెలంగాణకు.. హైదరాబాద్కు రాకూడదనే ఈవీ పాలసీ తీసుకొచ్చామని చెప్పారాయన. ‘‘ఎలక్ట్రిక్ వాహనాలను విసృతంగా తెలంగాణ ప్రజలు వాడేలా ఈ పాలసీ ఉంది. ఈవీ వాహనాల పై రోడ్డు టాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు 100 శాతం మినహాయింపు ఇస్తున్నాం. ఇప్పటికే స్క్రాప్ పాలసీ తీసుకొచ్చాం.... హైబ్రిడ్ వాహనాల పై కూడా పన్ను రాయితీ పై ఆలోచిస్తున్నాం. ప్రజలు ఈవీ వాహనాల వైపు అడుగులేయండి. అలాగే.. కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలపై కఠినంగా వ్యవహరించాలని రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను ఆదేశించారాయన. -
Menstrual Leave: ఉద్యోగినులకు నెలసరి సెలవు?
ఉద్యోగినులకు నెలసరి సెలవు ఇవ్వాలనే డిమాండ్ ఇటీవల ఎక్కువైంది. సుప్రీంకోర్టు ఈ విషయంలో ఏ నిర్ణయమూ చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వాలతో, ఉపాధి సంస్థలతో చర్చించి కేంద్రం తీసుకోవాల్సిన పాలసీ నిర్ణయం అని తెలిపింది. నెలసరి సెలవును తప్పనిసరి చేస్తే సంస్థలు స్త్రీలను ఉద్యోగాల్లోకి తీసుకోకపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మరి మహిళలు ఏమంటున్నారు?సుజన సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఉదయం నుంచి పొత్తి కడుపులో నొప్పి, కూర్చోవడానికి వీలుకానంతగా నడుం నొప్పి. ప్రతి నెలా ఉండే సమస్యే ఇది. ఈ నెల మరీ ఎక్కువగా బాధిస్తోంది. ప్రాజెక్ట్ పూర్తయ్యేంత వరకు సెలవు పెట్టడానికి వీలు లేదని ఆఫీసులో ముందే హెచ్చరించిన విషయాన్ని గుర్తు తెచ్చుకుని బాధను పంటి బిగువున భరిస్తూనే ఆఫీసుకు బయల్దేరింది.మేరీ ప్రైమరీ స్కూల్ టీచర్. పిల్లలతో కలిసిపోతూ రోజంతా యాక్టివ్గా ఉండాలి. నెలసరి సమయం దగ్గర పడుతుందంటేనే లోలోపల భయపడుతూ ఉంటుంది. తీవ్రమైన నొప్పితో పాటు, అధిక రక్తస్రావం సమస్యతో ప్రతీసారీ ఇబ్బందే.కరుణ బట్టల షోరూమ్లో పనిచేస్తోంది. రోజంతా షాప్లో నిల్చొనే ఉండాలి. సేల్ సీజన్ కావడంతో సెలవులు పెట్టడానికి వీల్లేదని మేనేజర్ ముందే చెప్పారు. సెలవు అడిగితే ఉద్యోగం పోతుందేమో అని భయం. కానీ, నెలసరి సమయంలో విశ్రాంతి లేకుండా పని చేయడం అంటే మరింత అలసట కమ్ముకొచ్చేస్తుంది. నెలసరివేళ ఇబ్బందిపడే ఉద్యోగినులకు రుతుస్రావ సెలవులపై మోడల్ పాలసీని రూపొందించాలని ఈ నెల 9న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. ఈ విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన విధానానికి రూపకల్పన చేయాలని కూడా ఆదేశించింది. నెలసరి సెలవులు తీసుకుంటే ఉద్యోగినుల ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందా? అసౌకర్యం వేళ సెలవు దొరుకుతుందని భావిస్తే ఎక్కువ మంది ఉద్యోగాలు చేయడానికి మొగ్గు చూపుతారా? నెలసరి అవసరం గురించి మహిళలు స్పందన.అవసరం ఉన్నవారికే!దాదాపు తొంభై శాతం మందిలో ఒకేలాంటి సమస్య ఉండదు. కాబట్టి అందరికీ సెలవు అవసరం లేదు. నెలసరి సమయంలోనూ సమస్యలేమీ లేకపోతే సెలవు ఎందుకు తీసుకోవాలి? పైగా పని పట్ల ఇష్టం ఉన్న నాకు లీవ్ తీసుకొని ఇంటి వద్ద ఉండటం బోర్ అనిపిస్తుంది. అందుకే సమస్య ఉన్నవారు, మెడికేషన్లో ఉన్నవారు డాక్టర్ ప్రిస్కిప్షన్తో లీవ్ తీసుకోవచ్చు. స్కూల్ టైమ్లో నెలసరి వస్తే ఇంటికి వెళ్లే వీలు ఉండదు. çస్కూల్లోనే కొంత సమయం విశ్రాంతి తీసుకుంటాం. సమస్య తీవ్రతను బట్టి అవసరం ఉన్నవారు లీవ్ తీసుకుంటే సరిపోతుంది. – మృణాళిని, టీచర్ఉపయోగకరమైనదే! మహిళ ఇంటిని, ఆఫీస్ పనినీ బ్యాలెన్స్ చేసుకుంటూ తనని తాను నిరూపించుకుంటోంది. అయితే, పీరియడ్ సమయంలో అందరికీ అన్ని వేళలా ఆరోగ్యం సహకరించకపోవచ్చు. ఎవరికైతే అధిక రక్తస్రావం, పొత్తికడుపులో నొప్పి, మైగ్రెయిన్, వాంతులు... వంటి సమస్యలు ఉంటాయో వారికి విశ్రాంతి అవసరం అవుతుంది. భరించలేనంత నొప్పి ఉన్నప్పుడు ఎలాగూ పని మీద దృష్టి పెట్టలేరు. సమస్య ఉన్నవారికి సెలవు ఇవ్వడం మంచిదే. ఎందుకంటే నెలసరి నొప్పి భరించలేక ఉద్యోగాలు మానేసినవారూ ఉన్నారు. కొందరు ఉద్యోగినులు హెల్త్ చెకప్కి లీవ్ దొరకడం లేదని చెబుతుంటారు. అలాంటి వారికి ఈ లీవ్ అవకాశం ఉపయోగపడుతుంది. – డాక్టర్ శిరీషారెడ్డి, గైనకాలజిస్ట్విశ్రాంతి అవసరమే!మహిళలు కూర్చుని చేసే ఉద్యోగాల్లో సాధారణంగా నడుం నొప్పి ఉంటుంది. నెలసరి సమయంలో ఆ తీవ్రత ఇంకాస్త పెరుగుతుంది. కానీ, మాకు కేటాయించిన పనిని మరొకరికి అప్పగించలేం. సెలవు పెడితే పనిభారం పెరుగుతుందని భయం. అదీ సమస్యే. పిరియడ్ లీవ్ తప్పనిసరి చేస్తేæ వర్క్లోడ్ పెరగడం, ప్రమోషన్స్పై ప్రభావం చూపడం జరగవచ్చు. మా ఆఫీసులో వాష్రూమ్లలో ΄్యాడ్స్, విశ్రాంతి తీసుకోవడానికి ప్లేస్ ఉంటుంది. సమస్య ఉన్నప్పుడు ఈ తరహా అవకాశాలు ఉపయోగించుకొని, పనులను యధావిధిగా చేస్తుంటాం. పిరియడ్ లీవ్ అనేది అందరికీ అవసరం కాదు. సమస్య ఉన్నవారు యాజమాన్యం అనుమతితో సెలవు తీసుకోవచ్చు. – ఎస్.కె.బాజి, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్– నిర్మలా రెడ్డి -
రుతుస్రావ సెలవులపై మోడల్ పాలసీ
న్యూఢిల్లీ: నెలసరివేళ ఇబ్బందిపడే ఉద్యోగిను లకు రుతుస్రావ సెలవులపై మోడల్ పాలసీని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయంలో సంబంధిత వర్గాలు, రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన విధానానికి రూపకల్పన చేయాలని సోమవారం కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. అయితే విధాన నిర్ణేతల పరిధిలోని ఈ అంశాల్లో కోర్టులు జోక్యంచేసుకోబోవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా విద్యార్థినులు, ఉద్యోగినులకు ప్రతినెలా నెలసరి సెలవులు ఇవ్వాలంటూ లాయర్ శైలేంద్రమణి త్రిపాఠి వేసిన పిటిషన్ను కొట్టేస్తూ కోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. ‘‘రుతుస్రావ సెలవుపై కోర్టు నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగినుల ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. అసౌకర్యంవేళ సెలవు దొరుకుతుందని భావిస్తే ఎక్కువ మంది ఉద్యోగాలు చేసేందుకు మొగ్గుచూపుతారు. అయితే ఉద్యోగినులకు ఇలాంటి సెలవు ఇవ్వడం ఇష్టంలేని సంస్థలు, యాజమాన్యాలు మహిళలకు ఉద్యోగం ఇచ్చేందుకు విముఖత చూపే ప్రమాదం కూడా ఉంది. ఉన్న ఉద్యోగినులను కూడా తగ్గించుకునే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి విపరిణామాలకు మేం అవకాశం ఇవ్వదల్చుకోలేదు. వాస్తవానికి ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. ఇందులో కోర్టు జోక్యం ఉండకూడదు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. చైనా, బ్రిటన్, జపాన్, ఇండోనేసియా, స్పెయిన్, జాంబియా, దక్షిణకొరియాలో ఏదో ఒక కేటగిరీ కింద ఇలాంటి సెలవులు ఇస్తున్నాయంటూ లాయర్ చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ‘‘ఈ సెలవులు ఇవ్వాలని గత ఏడాది మే నెలలోనే పిటిషనర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రం నుంచి ఇంతవరకు స్పందన లేదు. విధానపర నిర్ణయమైన ఇలాంటి అంశంలో కోర్టులు జోక్యం చేసుకోలేవు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. -
కొత్త ఈవీలపై ఆటో కంపెనీల కసరత్తు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) సంబంధించి కేంద్రం కొత్త విధానం ప్రకటించిన నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు రాబోయే రోజుల్లో మరిన్ని విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టడంపై దృష్టి పెడుతున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్ మొదలైన దిగ్గజాలు డిమాండ్కి అనుగుణంగా కొత్త మోడల్స్పై కసరత్తు చేస్తున్నాయి. 2025 జనవరితో మొదలుపెట్టి.. రాబోయే రోజుల్లో అయిదు బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రవేశపెట్టనున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా సీఈవో (ఆటోమోటివ్ విభాగం) నళినికాంత్ గొల్లగుంట తెలిపారు. తమ వినూత్నమైన ఇన్గ్లో ప్లాట్ఫాంపై ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీలను తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. 2027 నాటికి తమ పోర్ట్ఫోలియోలో 20–30 శాతం వాటా విద్యుత్ వాహనాలదే ఉండగలదని నళినికాంత్ వివరించారు. మరోవైపు, తాము కూడా ఈవీలపై గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా ఈడీ (కార్పొరేట్ అఫైర్స్) రాహుల్ భారతి తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 550 కిలోమీటర్ల రేంజ్ ఉండే అధునాతన ఈవీ ఉత్పత్తిని ప్రారంభిస్తామని, 7–8 ఏళ్లలో ఆరు ఈవీ మోడల్స్ను ఆవిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలు, చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి భారత్లో హైబ్రీడ్–ఎలక్ట్రిక్, సీఎన్జీ, బయో–సీఎన్జీ, ఇథనాల్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వంటి మరెన్నో టెక్నాలజీలు అవసరమని రాహుల్ తెలిపారు. అటువంటి సాంకేతికతలపై కూడా తాము పని చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. పదేళ్లలో హ్యుందాయ్ రూ. 26 వేల కోట్లు .. 2030 నాటికి భారత ఆటోమోటివ్ మార్కెట్లో ఈవీల వాటా 20 శాతంగా ఉంటుందని పరిశ్రమ అంచనా వేస్తున్నట్లు హ్యుందాయ్ మోటర్ ఇండియా సీవోవో తరుణ్ గర్గ్ తెలిపారు. ఈవీలు క్రమంగా ప్రధాన స్థానాన్ని దక్కించుకోవచ్చన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే పదేళ్లలో తమిళనాడులో రూ. 26,000 కోట్ల మేర హ్యుందాయ్ ఇన్వెస్ట్ చేయనుంది. హ్యుందాయ్ ఇప్పటికే కోనా, అయోనిక్ 5 పేరిట ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది. 10 ఈవీలపై టాటా దృష్టి.. 2026 నాటికి పది ఎలక్ట్రిక వాహనాలను ప్రవేశపెట్టాలని నిర్దేశించుకున్నట్లు టాటా మోటర్స్ తెలిపింది. కర్వ్ ఈవీ, హ్యారియర్ ఈవీతో పాటు కంపెనీ ఈ ఏడాది మరో నాలుగు ఈవీలను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. మరోవైపు తాము ఈ ఏడాది 12 కొత్త వాహనాలను ప్రవేశపెట్టనుండగా, వాటిలో మూడు .. బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు ఉండనున్నట్లు మెర్సిడెస్ బెంజ్ తెలిపింది. 2030 నాటికి భారత్లో తమ ఆదాయంలో 50 శాతం భాగం ఎలక్ట్రిక్ వాహనాలదే ఉండగలదని అంచనా వేస్తున్నట్లు ఆడి ఇండియా తెలిపింది. ప్రస్తుతం కంపెనీ నాలుగు ఎలక్ట్రిక్ మోడల్స్ను దేశీయంగా విక్రయిస్తోంది. అమ్మకాల లక్ష్యాన్ని చేరుకునేందుకు మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. -
క్రిప్టోలను కరెన్సీగా గుర్తించం..
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలపై భారత్ విధానం మారబోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కరెన్సీలను ప్రభుత్వం లేదా సెంట్రల్ బ్యాంకులే జారీ చేయాలే తప్ప క్రిప్టోలను కరెన్సీగా గుర్తించే ప్రసక్తే లేదన్నారు. ఇటువంటి అసెట్స్ను నియంత్రించే దిశగా సమగ్రమైన ఫ్రేమ్వర్క్ రూపొందించే అంశాన్ని జీ20 కూటమి పరిశీలిస్తోందని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు, ప్రపంచ మార్కెట్లు అనేక ఒడిదుడుకులకు లోనవుతున్నా దేశీయంగా స్టాక్ మార్కెట్ స్థిరంగానే వ్యవహరిస్తోందని ఆమె పేర్కొన్నారు. కాబట్టి మార్కెట్ను దాని మానాన వదిలేయాలని అభిప్రాయపడ్డారు. స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్లో బబుల్ తరహా పరిస్థితులు ఉన్నాయని, వాటిపై చర్చాపత్రాన్ని తెచ్చే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్సన్ మాధవి పురి ఇటీవల తెలిపిన నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
కేంద్రం కీలక నిర్ణయం.. టెస్లాకు లైన్ క్లియర్!
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ తయారీదారుల పెట్టుబడులను ఆకర్షించడానికి, కేంద్రం ఈ-వెహికల్ పాలసీని తీసుకొచ్చినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీని వల్ల దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసువచ్చిన ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ.. దేశంలో అడుగుపెట్టడానికి ఉవ్విల్లూరుతున్న టెస్లా మార్గాన్ని మరింత సుగమం చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా టెస్లా భారతదేశంలో ప్లాంట్ నిర్మించడానికి కేంద్రంతో చర్చలు జరుపుతూనే ఉంది. నేటికి కొత్త పాలసీ రావడంతో త్వరలోనే టెస్లా మనదేశానికి వస్తుందని పలువురు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ కొత్త ఈవీ పాలసీ కింద.. ఏదైనా ఆటోమొబైల్ కంపెనీ సుమారు రూ. 4150 కోట్లు (5వేల మిలియన్ డాలర్స్) పెట్టుబడి పెడితే.. అనేక రాయితీలు లభిస్తాయి. ఈ పాలసీ వల్ల భారతీయులకు కొత్త తరహా టెక్నాలజీలు అందుబాటులోకి రావడంతో పాటు మేక్ ఇన్ ఇండియాకు ఊతం ఇచ్చినట్లవుతుందని వాణిజ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ కొత్త పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరిగితే.. ఫ్యూయెల్ దిగుమతులు తగ్గుతాయి. పర్యావరణంలో కాలుష్యం కూడా తగ్గుతుంది. ఆటోమొబైల్ కంపెనీ రూ. 4150 కోట్లు పెట్టుబడి పెడితే.. మూడు సంవత్సరాల్లో స్థానికంగా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంతే కాకుండా విడి భాగాల్లో 25 శాతం స్థానీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. భారతదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్ల ధరలను బట్టి 70 నుంచి 100 శాతం దిగుమతి సుంకాలు వర్తిస్తాయి. గతంలో ఇదే టెస్లా భారత్ ఎంట్రీకి సమస్యగా ఉండేది. ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల టెస్లా ఊపిరి పీల్చుకుంది. గత ఏడాది దేశంలోని మొత్తం కార్ల అమ్మకాల్లో ఈవీల శాతం కేవలం 2% మాత్రమే. ఇది 2030 నాటికి 30 శాతానికి పెంచడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇసుక విధానం అవినీతికి ఆలవాలంగా మారిందని.. అక్రమాలను అరికట్టేందుకు కొత్త విధానం తీసుకువస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చటంతోపాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త పాలసీని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. ఇసుక రవాణా, టీఎస్ఎండీసీ కార్యకలపాలపై విజిలెన్స్, ఏసీబీ విభాగాలతో తనిఖీలు చేయాలని ఆదేశించారు. గురువారం సచివాలయంలో భూగర్భ గనులు, ఖనిజ వనరుల శాఖపై మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ శాంతికుమారి, ఆ శాఖ అధికారులతో రేవంత్ సమీక్షించారు. అన్ని స్థాయిల్లో అవినీతి ఇసుక క్వారీయింగ్, రవాణాకు సంబంధించి అన్నిస్థాయిల్లో అక్రమాలు జరుగుతున్నాయని.. వాటిని వెంటనే అరికట్టాలని అధికారులను సీఎం హెచ్చరించారు. 48 గంటల్లోగా అన్నిస్థాయిల అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలన్నారు. రెండు రోజుల తర్వాత ఏసీబీ, విజిలెన్స్ విభాగాలను రంగంలోకి దింపాలని.. అన్ని జిల్లాల్లో వెంటనే తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అక్రమాలకు బాధ్యులైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టవద్దని స్పష్టం చేశారు. అన్నిరూట్లలో ఉన్న టోల్గేట్ల వద్ద నమోదైన డేటా ఆధారంగా లారీల్లో ఇసుక అక్రమ రవాణా వ్యవహారాన్ని బయటికి తీయాలని సూచించారు. ఇసుక రీచ్లు, డంపులను తనిఖీ చేయాలని.. అక్రమాలకు పాల్పడినవారికి జరిమానాలు విధిస్తే సరిపోదని, కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలు చేయించి..: ఇసుక రీచ్లన్నింటా సీసీ కెమెరాలు ఉన్నాయని అధికారులు చెప్పడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది మార్చి 1న తాను కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పాదయాత్ర చేసినప్పుడు మానేరు వాగులో తనుగుల ఇసుక క్వారీకి వెళ్లానని.. అక్కడ సీసీ కెమెరాలు లేవని చెప్పారు. ఈనెల 3న రవాణా విభాగంతో నిజామాబాద్, వరంగల్ రూట్లలో ఆకస్మిక తనిఖీలు చేయించామన్నారు. 83 ఇసుక లారీలను తనిఖీ చేస్తే.. అందులో 22 లారీలకు అనుమతి లేదని.. ఒకే పర్మిట్, ఒకే నంబర్తో నాలుగైదు లారీలు ఇసుక రవాణా చేస్తున్నాయని తేలిందని స్పష్టం చేశారు. అంటే 25శాతం ఇసుక అక్రమంగా తరలిపోతోందన్నారు. అనుమతిలేని క్రషర్స్ సీజ్ చేయండి హైదరాబాద్ చుట్టుపక్కల అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్లను సీజ్ చేయాలని సీఎం ఆదేశించారు. భారీ భవన సముదాయాలు నిర్మించేటప్పుడు రోడ్లపై కంకర, బిల్డింగ్ మెటీరియల్ వేయకుండా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. సెల్లార్ల కోసం ఆరు మీటర్ల కంటే లోతుగా తవ్వితే నిబంధనల ప్రకారం పన్ను వసూలు చేయాలని ఖనిజ వనరుల శాఖను ఆదేశించారు. అలాంటి భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేప్పుడే.. వాటి వివరాలు ఖనిజ వనరుల శాఖకు చేరేలా సమీకృత ఆన్లైన్ విధానం అమలు చేయాలన్నారు. గ్రానైట్, ఖనిజ తవ్వకాలు, అక్రమ రవాణాను అరికట్టేందుకు జియో ట్యాగింగ్, జీపీఆర్ఎస్ను వినియోగించాలని సూచించారు. గ్రానైట్తోపాటు ఇతర క్వారీలకు సంబంధించిన కేసులు ఏమేం ఉన్నాయి, ఏయే ఏజెన్సీల వద్ద ఉన్నాయి, వాటి పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. -
అదే రోజు సెటిల్మెంట్
న్యూఢిల్లీ: ట్రేడ్ చేసిన రోజే సెటిల్మెంట్ విధానాన్ని తీసుకొచ్చే దిశగా సెబీ కీలక అడుగు వేసింది. అదే రోజు సెటిల్మెంట్ (సేమ్డే), వెనువెంటనే (రియల్ టైమ్) సెటిల్మెంట్ను ఐచ్ఛికంగా ప్రవేశపెట్టడానికి సంబంధించి సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. స్టాక్ ఎక్సే్ఛంజ్లలో షేర్ల కొనుగోలు, విక్రయ లావాదేవీలకు ప్రస్తుతం టీప్లస్1 విధానం అమల్లో ఉంది. అంటే ట్రేడ్ చేసిన రోజు కాకుండా తదుపరి పని దినం రోజున ఆ షేర్ల సెటిల్మెంట్ (విక్రయించిన వారి నుంచి తీసుకుని, కొనుగోలు చేసిన వారికి జమ చేయడం) చేస్తున్నారు. టీప్లస్1 విధానాన్ని సెబీ 2021లో దశలవారీగా అమల్లోకి తీసుకొచి్చంది. అంతకుముందు వరకు టీప్లస్2 విధానం ఉండేది. టీప్లస్5 స్థానంలో టీప్లస్3ని 2002లో ప్రవేశపెట్టారు. 2003లో టీప్లస్2 అమల్లోకి వచి్చంది. అదే రోజు సెటిల్మెంట్ విధానం వల్ల షేర్లను విక్రయించిన వారికి ఆ రోజు ముగింపు లేదా మరుసటి రోజు ఉదయానికి నిధులు అందుబాటులోకి వస్తాయి. షేర్లను కొనుగోలు చేసిన వారికి ఖాతాల్లో అదే రోజు జమ అవుతాయి. దీనివల్ల మరింత లిక్విడిటీ, ఇన్వెస్టర్లకు సౌకర్యం లభిస్తుంది. ఈ సంప్రదింపుల పత్రంపై జనవరి 12 వరకు సూచనలు, సలహాలు తెలియజేయాలని ప్రజలను సెబీ కోరింది. ఐచ్ఛికంగా.. సెక్యూరిటీలు, నిధుల క్లియరింగ్, సెటిల్మెంట్కు టీప్లస్0, ఇన్స్టంట్ సెటిల్మెంట్ సైకిల్ను ప్రస్తుత టీప్లస్1 విధానంతోపాటు ఐచి్ఛకం అమలును ప్రతిపాదిస్తున్నట్టు సెబీ తన సంప్రదింపుల పత్రంలో పేర్కొంది. ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు, సెక్యూరిటీల మార్కెట్ల అభివృద్ధికి సెబీ వరుసగా పలు చర్యలు తీసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. తక్షణ సెటిల్మెంట్ సైకిల్ను అమల్లోకి తీసుకురావడమే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ఉద్దేశ్యంగా ఉంది. నిజానికి ఇన్వెస్టర్ షేర్లను కొనుగోలు చేయాలంటే, ముందుగా అందుకు సంబంధించిన నిధుల మొత్తాన్ని తన ఖాతాకు జోడించుకోవడం తప్పనిసరి. అప్పుడే కొనుగోలుకు అవకాశం ఉంటుంది. అలాగే, షేర్ల విక్రయానికి (డెలివరీ) సైతం ఆయా సెక్యూరిటీలను కలిగి ఉండాలి. అప్పుడే బ్రోకర్లు ట్రేడ్లను అనుమతిస్తారు. కనుక తక్షణ సెటిల్మెంట్ ఆచరణ సులభమేనని సెబీ భావిస్తోంది. దీనివల్ల సెక్యూరిటీలు, నిధులను తక్షణమే ఇన్వెస్టర్లు పొందడానికి వీలు పడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆందోళనలు.. ‘‘నూతన విధానం వల్ల లిక్విడిటీ తగ్గిపోతుందని, సమర్థమైన ధరల అన్వేషణపై ప్రభావం పడుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. అలాగే, ట్రేడ్లు చేయడానికి ముందే నిధులు, సెక్యూరిటీలు కలిగి ఉండాల్సి రావడం వల్ల ట్రేడింగ్ వ్యయం పెరిగిపోతుందని.. ఫలితంగా టీప్లస్1 సెటిల్మెంట్ సైకిల్తో పోలిస్తే టీప్లస్0 విధానంలో ధరల వ్యత్యాసానికి దారితీస్తుంద్న ఆందోళన ఉంది’’అని సెబీ పేర్కొంది. ఈ ఆందోళనలను తగ్గించేందుకు వీలుగా టీప్లస్0, టీప్లస్1నూ వినియోగించుకునే వెసులుబాటును కలి్పస్తున్నట్టు తెలిపింది. తద్వారా రెండు విధానాల మధ్య ధరల అంతరాన్ని తొలగించుకోవచ్చని పేర్కొంది. రెండింటి మధ్య సెక్యూరిటీ ధరల్లో అంతరం ఉంటే ఆర్బిట్రేజ్ ద్వారా ప్రయోజనం, లిక్విడిటీని పొందొచ్చని తెలిపింది. రెండు దశల్లో మొదటి దశలో టీప్లస్0 విధానాన్ని మధ్యా హ్నం 1.30 గంటల వరకు ఐచి్ఛకంగా అమలు చేయవచ్చు. ఈ వ్యవధిలోపు నమోదైన ట్రేడ్స్కు సంబంధించి నిధులు, సెక్యూరిటీల పరిష్కారాన్ని సాయంత్రం 4.30 గంటలకు పూర్తి చేస్తారు. రెండో దశలో ఇన్స్టంట్ ట్రేడ్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇది 3.30 గంటల వరకు ఉంటుందని సెబీ సంప్రదింపుల పత్రం స్పష్టం చేస్తోంది. -
మొదలైన కొత్త మద్యం పాలసీ.. అప్పుడే 171 కోట్ల ఆదాయం!
మహబూబ్నగర్ క్రైం: రెండేళ్ల పాటు కొనసాగిన మద్యం పాలసీ గురువారంతో ముగిసింది. శుక్రవారం నుంచి కొత్త మద్యం పాలసీ విధానం అమల్లోకి రానుంది. పాత మద్యం దుకాణాలు నిర్వహించే వ్యాపారులకు 75శాతం రాకపోవడంతో ఇకపై ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారు. కొత్తగా దుకాణాలను సొంతం చేసుకున్న వారితో కొందరు వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నారు. మరికొందరు తమ అనుచరులు, పనిచేసే వ్యక్తులతో టెండర్లు వేయించి దుకాణాలు దక్కేలా వేసిన ఎత్తుగడలు ఫలించాయి. మద్యం దుకాణాల్లో మళ్లీ లిక్కర్ కింగ్లదే పైచేయిగా మారింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆగస్టు 21న నిర్వహించిన టెండర్లలో మొత్తం 8,595 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.171.90కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి మద్యం దుకాణాలకు టెండర్లు రావడం ఆశ్చర్యం కల్గిస్తోంది. రోజురోజుకూ మద్యం వ్యాపారంపై చాలా మంది దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈసారి ఉమ్మడి జిల్లా వ్యాపారులతో పాటు ఆంధ్ర, కర్ణాటక నుంచి కూడా టెండర్లు దాఖలయ్యాయి. 2021 కంటే ఈసారి దరఖాస్తులు రెండింతలు పెరిగాయి. ప్రధానంగా మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాలో దరఖాస్తులు రెట్టింపయ్యాయి. బిజీబిజీ.. ఉమ్మడి జిల్లాలో కొత్త మద్యం దుకాణాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో గురువారం నుంచి హడావుడి మొదలైంది. 230 దుకాణాల్లో కొన్నింటిని అదే దుకాణాల్లో ఏర్పాటు చేసుకుంటుంటే.. మరికొన్ని దుకాణాలు కొత్తగా నిర్మాణం చేసుకుంటున్నారు. శుక్రవారం ఉదయం 10గంటల వరకు అన్నింటిని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వ్యాపారులు ఆయా దుకాణాల నిర్మాణ పనులు చేస్తూ బీజీబీజీగా కన్పించారు. లాభాలు ఉండటంతో.. మద్యం విక్రయాల వల్ల భారీగా లాభాలు ఉండటంతో మద్యం వ్యాపారులతో పాటు రాజకీయ నేతలు కూడా రంగప్రవేశం చేశారు. దుకాణం ఎవరి పేరుతో వచ్చినా అంతా కలిసే వ్యాపారం చేసుకోవాలని ముందుగానే ఒప్పందం చేసుకున్నారు. ఒక్కో దుకాణానికి ఒక్కొక్కరు 10మందికిపైగా బినామీ పేర్లతో దరఖాస్తు చేసుకున్నారు. వాళ్లలో ఏ ఒక్కరికి వచ్చినా అందరికీ లబ్ధి చేకూరేలా చేసుకున్నారు. మద్యం దుకాణాదారులే గ్రామాలు, వార్డుల్లో బెల్టు దుకాణాలకు మద్యం సరఫరా చేస్తుంటారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో రూ.4వేల కోట్ల వ్యాపారం సాగుతుండగా.. రానున్న రోజుల్లో విక్రయాలు మరింత పెరుగుతాయనే విశ్వాసంతో వ్యాపారులు ఉన్నారు. -
కార్లకు రిలయన్స్ ఇన్సూరెన్స్ కొత్త పాలసీ - తిరిగే దూరాన్ని బట్టి..
ముంబై: సాధారణ బీమా సంస్థ రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఆర్జీఐసీఎల్) తాజాగా కార్ల కోసం ’రిలయన్స్ లిమిట్ ష్యూర్ – పే యాజ్ యూ డ్రైవ్’ పేరిట కొత్త పాలసీని ప్రవేశపెట్టింది. వాహనం తిరిగే దూరానికి అనుగుణంగా ఈ పాలసీని తీసుకోవచ్చని సంస్థ సీఈవో రాకేశ్ జైన్ తెలిపారు. కనిష్టంగా 2,500 కిలోమీటర్ల శ్లాబ్తో మొదలుపెట్టి అవసరాన్ని బట్టి అదనంగా 1,000 కిలోమీటర్ల మేర పరిమితిని పెంచుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అలాగే తాము ఎంచుకున్న శ్లాబ్లో కిలోమీటర్లు మిగిలిపోతే, పాలసీని రెన్యువల్ చేసుకునేటప్పుడు వాటిపై డిస్కౌంటు కూడా పొందవచ్చని వివరించారు. ఇదీ చదవండి: 81.5 కోట్ల భారతీయుల ఆధార్ వివరాలు లీక్ - అమ్మడానికి సిద్దమైన హ్యాకర్! అటు తమ ప్లాన్లో కిలోమీటర్ల పరిమితిని దాటిపోయినప్పటికీ అగ్నిప్రమాదం, దొంగతనానికి సంబంధించి థర్డ్ పార్టీ కవరేజీని పొందవచ్చని తెలిపారు. 'రిలయన్స్ లిమిట్ ష్యూర్ - పే యాజ్ యు డ్రైవ్' అనేది పూర్తి థర్డ్-పార్టీ, ఓన్ డ్యామేజ్ ప్రొటెక్షన్తో సహా కన్వెన్షనల్ కార్ ఇన్సూరెన్స్ పాలసీకి సమానమైన అన్నింటిని కవర్ చేసే కవరేజీని అందిస్తుంది. -
ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలు
న్యూఢిల్లీ: జాతీయ విద్యావిధానంలో భాగంగా పరీక్షల విధానంలో కేంద్రం కొత్త మార్పులకు సిద్ధమైంది. ఇకపై ఇంటర్లో ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని, భారతీయ భాషలు తప్పనిసరిగా చదవాలని నూతన కరిక్యులమ్ ఫ్రేమ్వర్క్ (ఎన్సీఎఫ్) ప్రతిపాదనలు చేసింది. అలాగే, 9–12 తరగతుల విద్యార్థులకు కనీస సబ్జెక్టుల సంఖ్యను పెంచాలని చెప్పింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎన్సీఎఫ్ నివేదికను బుధవారం జాతీయ విద్య, పరిశోధన శిక్షణ మండలికి అందించారు. ఏటా రెండు సార్లు పరీక్షలు నిర్వహించడం వల్ల ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులు ఏ పరీక్షలో అయితే ఉత్తమ మార్కులు సాధిస్తారో వాటినే ఎంచుకునే అవకాశం ఉంటుందని కేంద్ర విద్యాశాఖ చెప్పింది. ఏటా రెండుసార్లు నిర్వహించడం వల్ల విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసే అవకాశం ఉంటుందని పేర్కొంది. క్రమక్రమంగా అన్ని బోర్డులు కూడా సెమిస్టర్ లేదా టర్మ్ బేస్డ్ వ్యవస్థకు మారతాయని కేంద్ర విద్యాశాఖ స్పష్టంచేసింది. దీనివల్ల విద్యార్థులు ఒక సబ్జెక్టును పూర్తిచేయగానే అతడు పరీక్ష రాయొచ్చని, ఇలా ఒక పరీక్ష పూర్తయినా విద్యార్థిపై కంటెంట్ భారం తగ్గుతుందని చెప్పింది. ఎన్సీఎఫ్ను ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరిరంగన్ నేతృత్వంలోని జాతీయ స్టీరింగ్ కమిటీ రూపొందించింది. బోర్డు పరీక్షల్లో ఇలాంటి సంస్కరణలు తొలిసారి కాదు. 2009లో పదో తరగతిలో ‘నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)’ విధానాన్ని ప్రవేశపెట్టగా, 2017లో రద్దుచేసి తిరిగి వార్షిక పరీక్షల విధానాన్ని తెచ్చారు. 9, 10 తరగతుల విద్యార్థులు ఇకపై కచ్చితంగా మూడు లాంగ్వేజ్ సబ్జెక్టులు చదవడం తప్పనిసరని ఎన్సీఎఫ్ సిఫార్సు చేసింది. వీరు మూడు లాంగ్వేజ్లతోపాటు మ్యాథ్స్, కంప్యూటేషనల్ థింకింగ్, సోషల్ సైన్స్, సైన్స్, ఆర్ట్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, వెల్–బియింగ్, వొకేషనల్ ఎడ్యుకేషన్ లాంటి వాటి నుంచి ఏడు సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. -
గూగుల్ అకౌంట్... వాడకుంటే డిలీటే!
మీ గూగుల్ అకౌంట్ను ఈ మధ్య అసలే వాడటం లేదా? దాని వంక కన్నెత్తి చూసి రెండేళ్లయిందా? అయితే అది ఇక శాశ్వతంగా డిలీట్ అయిపోతుంది. ఈ మేరకు కొత్త పాలసీని 2023 డిసెంబర్ 1 నుంచి గూగుల్ అందుబాటులోకి తెస్తోంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ తెలియజేస్తూ గూగుల్ ఈ వారమే తన యూజర్లందరికీ మెయిల్స్ పంపింది. తాను అందించే అన్ని సరీ్వసులు, ప్రొడక్టులకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ‘మా యూజర్లు అకౌంట్ను వాడటం మానేసినా వారి డేటా పూర్తిగా గోప్యంగా, సురక్షితంగా ఉండేలా చూడటమే మా లక్ష్యం. అకౌంట్ డిలీషన్ అందులో భాగమే’’ అని గూగుల్ ప్రకటించింది. వీటికి వర్తిస్తుంది ► గూగుల్ అకౌంట్ను రెండేళ్ల పాటు సైన్ ఇన్ చేయకపోతే, వాడకపోతే. ► ఒకసారి డిలీట్ చేసిన అకౌంట్ తాలూకు జీ మెయిల్ అడ్రస్ను ఇంకెవరికీ కేటాయించబోరు. ► సేఫ్టీ, సెక్యూరిటీ కారణాల రీత్యా తన పాలసీని ఇలా అప్డేట్ చేస్తున్నట్టు గూగుల్ తెలిపింది. ► అయితే అకౌంట్ను డిలీట్ చేసే ముందు గూగుల్ పలుమార్లు రిమైండర్ మెయిల్స్ పంపుతుంది. అవి సదరు అకౌంట్తోపాటు యూజర్ తాలూకు రికవరీ అకౌంట్కు కూడా వెళ్తాయి. ► ఏదైనా చర్య తీసుకోవడానికి కనీసం 8 నెలల ముందు నుంచే ఈ మెయిల్స్ రావడం మొదలవుతుంది. మీ గూగుల్ అకౌంట్ యాక్టివ్గా ఉండాలంటే... ► తరచూ లాగిన్ అవుతూ ఉన్నా... ► కనీసం రెండేళ్లకు ఒకసారైనా లాగిన్ అయినా... ► గూగుల్ డ్రైవ్ వాడినా... ► మెయిల్ పంపినా, చదివినా... ► యూట్యూబ్లో వీడియో చూసినా... ► ఏ గూగుల్ యాప్ డౌన్లోడ్ చేసినా... ► థర్డ్ పార్టీ యాప్, సరీ్వస్ లను గూగుల్ ద్వారా సైన్ ఇన్ చేసినా మీ గూగుల్ ఖాతాకు ఎలాంటి ఢోకా ఉండదు. మినహాయింపులున్నాయ్.. గూగుల్ అకౌంట్ డిలీషన్ పాలసీకి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. వాటి ప్రకారం రెండేళ్ల పాటు వాడకంలో లేని అకౌంట్లను డిలీట్ చేసే కొత్త విధానం ఈ కింది వాటికి వర్తించదు ► యూట్యూబ్ చానల్స్, ఖాతాకు, కామెంట్లున్న గూగుల్ అకౌంట్ ► డబ్బులతో కూడిన గిఫ్ట్ కార్డులున్న జీ మెయిల్ అకౌంట్ ► పబ్లిషిడ్ అప్లికేషన్ ఉన్న అకౌంట్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
యాంకర్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు
భారీ పరిశ్రమలను ఆకర్షించేలా యాంకర్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం 2023 – 27 విధివిధానాలను తాజాగా విడుదల చేసింది. 2023 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 30 వరకు నూతన పాలసీ అమల్లో ఉంటుంది. ఈ కాలపరిమితిలో ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లకు ప్రత్యేక రాయితీలు లభిస్తాయి. యాంకర్ యూనిట్లతో పాటు లార్జ్, మెగా, అల్ట్రా మెగా, ఎంఎస్ఎంఈలకు రాయితీలు, ప్రోత్సాహకాలపై స్పష్టమైన విధి విధానాలను ప్రభుత్వం విడుదల చేసింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేలా ప్రభుత్వం నూతన పాలసీ విధివిధానాలను రూపొందించింది. యాంకర్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు అందించాలని నిర్ణయించింది. దీని ప్రకారం.. యాంకర్ యూనిట్ రూ.500 కోట్లకు పైబడి పెట్టుబడితో ఏర్పాటవ్వాలి. కనీసం 1,000 మందికి ఉపాధి కల్పించాలి. ఈ యూనిట్ ఆధారంగా కనీసం మరో ఐదు యూనిట్లు ఏర్పాటవ్వాలి. ఇటువంటి యూనిట్లకు పారిశ్రామిక పాలసీ 2023 – 27లో పేర్కొన్న ప్రోత్సాహకాలతో పాటు అదనపు రాయితీలు కూడా లభిస్తాయి. యూనిట్ ఏర్పాటు వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కలిగే ప్రయోజనం, ఉపాధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ యూనిట్ ప్రతిపాదనలను బట్టి టైలర్ మేడ్ రాయితీలను ఇవ్వనున్నారు. తొలుత యాంకర్ యూనిట్ పూర్తి నివేదిక (డీపీఆర్)ను రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్కు సమర్పించాలి. వారు కోరుకొనే రాయితీలను ప్రజంటేషన్ రూపంలో చూపించాలి. ఆ రాయితీలు ఇవ్వడానికి సహేతుక కారణాలను వివరించాలి. ఈ ప్రతిపాదనలను ఎస్ఐపీసీ, ఎస్ఐపీబీ ముందుకు తేవాలి. వాటిని ఎస్ఐపీబీ పరిశీలించి భూమి ధరలు, ప్రత్యేక రాయితీలపై నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లు విస్తరణ చేపట్టినా, లేక వేరే రంగంలో పెట్టుబడులు పెట్టినా వాటికి కూడా నిబంధనలకు అనుగుణంగా రాయితీలు అందుతాయి. రాష్ట్రంలో ఉత్పత్తి ప్రారంభించిన ప్రతి పరిశ్రమకు ఆధార్ తప్పనిసరిగా తీసుకోవాలని, ఉద్యోగుల్లో 75 శాతం స్థానికులకే అవకాశం కల్పించాలని, అటువంటి సంస్థలకే ఈ రాయితీలు, ప్రోత్సాహకాలు లభిస్తాయని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఎస్సీ, ఎస్టీ, పారిశ్రామికవేత్తలు స్థాపించే పరిశ్రమలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం కింద ప్రత్యేక రాయితీలు ఇవ్వనుంది. ఇందులోనూ మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇందుకు విధివిధానాలను నూతన పాలసీలో పొందుపరిచింది. ఈ పరిశ్రమల్లో 100 శాతం పెట్టుబడి ఎస్సీలు, ఎస్టీల పేరు మీద ఉండాలి. 100 శాతం పెట్టుబడి ఎస్సీ, ఎస్టీ మహిళల పేరు మీద ఉంటే వాటిని ఎస్సీ, ఎస్టీ మహిళా యూనిట్లుగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ మహిళలను తొలి తరం పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేవలం ఆర్థిక ప్రోత్సాహకాలు మాత్రమే కాకుండా వారిని చేయిపట్టుకొని నడిపించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు నూతన పాలసీలో ప్రభుత్వం పేర్కొంది. జగనన్న కాలనీల్లో వాక్ టు వర్క్ విధానంలో పనిచేసుకునే విధంగా ఉమ్మడి వసతులతో కూడిన సూక్ష్మ యూనిట్లు ఏర్పాటు చేయడానికి క్లస్టర్లను ఏర్పాటు చేయనుంది. ఈ క్లస్టర్లలో ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఈ కాలనీల్లో యూనిట్లు ఏర్పాటు చేసేలా ఎస్సీ, ఎస్టీలను ప్రోత్సహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. -
‘బంగారు కొండ’లకు పోషకాహారం!
సాక్షి, రాజమహేంద్రవరం : చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించి, సంపూర్ణ పోషణ అందించేందుకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె.మాధవీలత వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ‘బంగారుకొండ’ పేరుతో నూతన విధానానికి బుధవారం నాంది పలికారు. వయసుకు తగ్గ బరువు, ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లల్ని బాల మిత్రల ద్వారా గుర్తించి సాధారణ స్థితికి తెచ్చే వరకూ 6 నెలల పాటు నెలకు రూ.300 విలువ చేసే 8 రకాల పోషక పదార్థాలను దాతల సాయంతో అందివ్వాలన్నదే కార్యక్రమ ఉద్దేశం. కలెక్టరేట్ వేదికగా వెబ్సైట్, ఆండ్రాయిడ్ యాప్ను హోం మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్రామ్, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావ్, కలెక్టర్ కె.మాధవీలతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే పిల్లల్లో పౌష్టికాహార సమస్యను దూరం చేయాలని సీఎం జగన్.. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ లాంటి పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి కనీసం ఇద్దరు ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుని వారి ఎదుగుదల, పౌష్టికాహార సమస్యను అధిగమించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం దాతలు నెలకు రూ.500 చొప్పున ఆరు నెలలకు రూ.3,000 వేలు చెల్లించి బాలమిత్రగా నమోదు కావాలని సూచించారు. పలువురు చిన్నారుల బాధ్యత తీసుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులు పౌష్టికాహార సమస్యతో బాధపడుతున్న పిల్లల్ని ఆరు నెలల పాటు పోషణ నిమిత్తం దత్తత తీసుకునేందుకు ప్రజా ప్రతినిధులు ఉత్సాహం చూపారు. హోం మంత్రి వనిత ఓ చిన్నారిని, ఎంపీ మార్గాని భరత్రామ్ ఇద్దరిని, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావ్లు ఇద్దరు చొప్పున, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, కమిషనర్ దినే‹Ùకుమార్లు చెరో చిన్నారిని దత్తత తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 85,700 మంది పిల్లలుంటే.. వారిలో తక్కువ బరువు ఉన్న పిల్లలు 368 మంది, వయస్సుకు తగ్గ ఎత్తు లేని వారు 506 మంది, బరువుకు తగ్గ ఎత్తు లేని వారు 409 మందిని గుర్తించినట్లు తెలిపారు. ఆ మేరకు 1,283 మంది పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేందుకు 1,283 మంది బాల మిత్రలుగా అధికారులు, ప్రజా ప్రతినిధులు పేర్లు నమోదు చేసుకున్నారు. -
మేలో కొత్త వ్యాపార ప్రీమియం రూ.23,448 కోట్లు
న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీల కొత్త వ్యాపార ప్రీమియం (కొత్త పాలసీల రూపంలో వచ్చేది) మే నెలలో 4.1 శాతం తగ్గి రూ.23,448 కోట్లకు పరిమితమైంది. 24 జీవిత బీమా కంపెనీలు క్రితం ఏడాది ఇదే నెలలో ఉమ్మడిగా రూ.24,480 కోట్లు ప్రీమియం ఆదాయం సంపాదించాయి. నూతన వ్యాపార ప్రీమియం పరంగా ఎల్ఐసీ 11.26 శాతం క్షీణతను నమోదు చేసింది. ఈ సంస్థకు నూతన పాలసీల రూపంలో మే నెలలో రూ.14,056 కోట్ల ప్రీమియం సమకూరింది. ఏడాది క్రితం ఇదే నెలలో ఎల్ఐసీకి వచ్చిన ఆదాయం రూ.15,840 కోట్లుగా ఉంది. ఈ గణాంకాలను బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ విడుదల చేసింది. ఎల్ఐసీ కాకుండా మిగిలిన 23 జీవిత బీమా సంస్థల ఉమ్మడి ప్రీమియం ఆదాయం 9 శాతం పెరిగి రూ.9,421 కోట్లుగా నమోదైంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో 24 జీవిత బీమా కంపెనీల నూతన వ్యాపార ప్రీమియం ఆదాయం రూ.36,043 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.42,420 కోట్లతో పోలిస్తే 15 శాతం తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో ఎల్ఐసీ నూతన వ్యాపార ప్రీమియం 28 శాతం క్షీణించి రూ.19,866 కోట్లకు పరిమితమైంది. -
ఈ మార్పులపై ఓ లుక్కేయండి!
ఆదాయపన్ను పరంగా ఏప్రిల్ 1 నుంచి కొన్ని కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. కొన్ని పన్ను మిహాయింపులు తొలగిపోగా.. కొన్ని సాధనాలకు సంబంధించి పెట్టుబడి పరిమితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. గతంతో పోలిస్తే ఆదాయపన్ను కొత్త విధానం మరింత ఆకర్షణీయంగా మారింది. ప్రధానంగా పన్నుల వ్యవస్థను మరింత సరళీకృతం చేయడం, పారదర్శకతను పెంచే లక్ష్యాలతో కేంద్ర సర్కారు ఎప్పటికప్పుడు కొత్త ప్రతిపాదనలు, సవరణలు తీసుకొస్తోంది. కనుక ఆదాయపన్ను పరిధిలోని ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన మార్పులను వివరించే కథనమిది... నూతన పన్ను విధానం... నూతన పన్ను విధానం ఎంపిక చేసుకునే వారికి వార్షిక ఆదాయం రూ.7 లక్షల వరకు ఉంటే రూపాయి పన్ను చెల్లించే పని లేకుండా పన్ను రాయితీని ప్రభుత్వం కల్పించింది. సెక్షన్ 87ఏ కింద గరిష్టంగా రూ.25,000 రాయితీని ప్రకటించింది. అంటే నికరంగా రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను భారం ఉండదు. తక్కువ ఆదాయం కలిగిన వారికి ఉపశమనం కల్పించడమే ఈ రాయితీ ఉద్దేశ్యమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022–23 ఆర్థి క సంవత్సరం నుంచే ఈ రాయితీ అమల్లోకి వచ్చింది. ఈ రాయితీ వల్ల ఎక్కువ మందికి ప్రయోజనం లభించనుంది. ఒకవేళ ఆదాయం రూ.7లక్షలకు పైన స్వల్పంగా ఉన్నప్పుడు భారీగా పన్ను చెల్లించాల్సి వస్తోంది. దీన్ని అర్థం చేసుకున్న కేంద్ర సర్కారు ఆర్థిక బిల్లు 2023లో కొన్ని సవరణలు చేసింది. ఉదాహరణకు రూ.7 లక్షలకు పైన మరో రూ.5 వేల ఆదాయం ఉంటే అప్పుడు నిబంధనల కింద రూ.26,500 పన్ను (సెస్సులతో) చెల్లించాల్సి ఉంది. దీని స్థానంలో.. రూ.7లక్షలకు పైన అదనంగా ఉన్న రూ.5వేలపైనే పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అలాగే, నూతన పన్ను విధానంలోనూ రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం కల్పించారు. దీంతో నికరంగా రూ.7.50 లక్షల వరకు పన్ను భారం పడదు. నూతన పన్ను విధానం కింద పన్ను రేట్లలోనూ మార్పులు చేశారు. 60 ఏళ్లలోపు వారికి రూ.3 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. రూ.3–6 లక్షల ఆదాయంపై 5 శాతం పన్ను, రూ.6–9 లక్షల ఆదాయంపై 10 శాతం పన్ను పడుతుంది. రూ.9–12 లక్షల ఆదాయంపై 15 శాతం, రూ.12–15 లక్షల ఆదాయంపై 20 శాతం, రూ.15 లక్షల ఆదాయంపై 30 శాతం పన్ను రేటు వర్తిస్తుంది. బీమాపైనా పన్ను జీవిత బీమా పాలసీలకు చెల్లించే ప్రీమియంపైనే కాదు, గడువు తీరిన తర్వాత అందుకునే మొత్తంపైనా పన్ను ఉండదనేది అందరికీ తెలిసిన విషయం. కానీ, 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన మార్పుల ప్రకారం.. జీవిత బీమా పాలసీలకు చెల్లించే వార్షిక ప్రీమియం రూ.5 లక్షలకు మించి ఉంటే.. పాలసీదారు జీవించి ఉన్న సందర్భాల్లో గడువు తీరిన తర్వాత అందుకునే మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది. అంటే అధిక ప్రీమియం పాలసీల మెచ్యూరిటీపై ఇప్పటి వరకు ఉన్న సున్నా పన్ను ప్రయోజనాన్ని సర్కారు తొలగించింది. వార్షిక ప్రీమియం రూ.5 లక్షల వరకు ఉండే పాలసీల మెచ్యూరిటీపై ఇక ముందూ పన్ను మినహాయింపు ప్రయోజనం కొనసాగుతుంది. అలాగే, 2023 మార్చి 31వరకు కొనుగోలు చేసిన జీవిత బీమా పాలసీలకు సంబంధించి వార్షిక ప్రీమియం రూ.5 లక్షలకు మించి ఉన్నా, చివర్లో అందుకునే మొత్తంపై పన్ను ఉండదు. అలాగే, పాలసీదారు మరణించిన సందర్భంలో చెల్లించే పరిహారంపైనా పన్ను ఉండదు. యులిప్ ప్లాన్ల ప్రీమియం ఎంత ఉన్నా కానీ, పన్ను పరిధిలోకి రావు. డెట్ ఫండ్స్పై కూడా... డెట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులను మూడేళ్లపాటు కొనసాగించినప్పుడు వచ్చిన లాభం దీర్ఘకాల మూలధన లాభం కిందకు వస్తుంది. వచ్చిన లాభం నుంచి పెట్టుబడి పెట్టిన కాలంలో సగటు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించి, మిగిలిన లాభంపైనే 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోయేది. ఇది గతంలో ఉన్న విధానం. కానీ, ఈ ప్రయోజనాన్ని తొలగించారు. 2023 ఏప్రిల్ 1 నుంచి డెట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడుల కాల వ్యవధి ఎంతైనా కానీయండి, వచ్చే లాభం మొత్తం వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఏ శ్లాబు రేటు పరిధిలో ఉంటే, ఆ మేరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. అంటే ప్రస్తుతం డెట్ ఫండ్స్లో అమల్లో ఉన్న స్వల్పకాల మూలధన లాభాల పన్ను విధానమే ఇక మీదట అన్ని రకాల డెట్ ఫండ్స్ లాభాలకు అమలవుతుంది. మొత్తానికి డెట్ ఫండ్స్లో పెట్టుబడులకు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ప్రయోజనాన్ని తొలగించారు. తద్వారా డెట్ ఫండ్స్లో దీర్ఘకాల పెట్టుబడులను నిరుత్సాహపరిచినట్టయింది. దీంతో దీర్ఘకాల పెట్టుబడులు జీవిత బీమా, ఈక్విటీ సాధనాల వైపు వెళతాయన్నది నిపుణుల అంచనాగా ఉంది. 2023 ఏప్రిల్ 1 నుంచి చేసే తాజా డెట్ పెట్టుబడులకు నూతన పన్ను విధానం అమలవుతుంది. 2023 మార్చి 31 వరకు చేసిన పెట్టుబడులకు కొత్త నిబంధన వర్తించదు. రిటర్నుల దాఖలు ఆదాయపన్ను రిటర్నులను దాఖలు చేసే వారు తప్పకుండా గమనించాల్సిన మార్పు ఒకటి ఉంది. పాత, కొత్త పన్ను విధానాలు ఉన్నప్పటికీ, నూతన పన్ను విధానమే డిఫాల్ట్గా కనిపిస్తుంది. పాత పన్ను విధానంలోనే కొనసాగాలని అనుకునేవారు రిటర్నులు దాఖలు చేసే ముందే దానిని ప్రత్యేకంగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. నూతన పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువ. కానీ, చాలా వరకు పన్ను మినహాయింపులు, పన్ను తగ్గింపు ప్రయోజనాల్లేవు. అన్ని రకాల మినహాయింపు ప్రయోజనాలను ఉపయోగించుకునే వారికి పాత విధానం అనుకూలం. కనుక ఎవరికి వారు తమ వార్షిక ఆదాయం, పెట్టుబడుల ఆధారంగా ఏ పన్ను విధానం అనుకూలం అనేది ఎంపిక చేసుకోవాలి. ఈ విషయంలో స్పష్టత రాకపోతే పన్ను నిపుణుల సాయం తీసుకోవాలి. ఎస్సీఎస్ఎస్ పదవీ విరమణ పొందిన వారికి క్రమం తప్పకుండా ఆదాయం తెచ్చి పెట్టే పెట్టుబడి పథకాల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) ఒకటి. ఈ పథకంలో పెట్టుబడిపై ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ ఆదాయం చెల్లిస్తారు. 60 ఏళ్లు నిండిన వ్యక్తులు ఎవరైనా ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు అయితే 55–60 ఏళ్ల మధ్యలో ఉన్నా పెట్టుబడికి అర్హులు. ఈ పథకంలో ఒక్కరు గరిష్టంగా రూ.15 లక్షల వరకే ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతి ఉండగా, ఏప్రిల్ 1 నుంచి దీన్ని రూ.30 లక్షలకు పెంచారు. నగదు ఉపసంహరణలపై టీడీఎస్ బ్యాంకు ఖాతా నుంచి భారీగా నగదు ఉపసంహరణలను నిరుత్సాహ పరిచేందుకు గాను కేంద్ర సర్కారు మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్ను) ప్రవేశపెట్టింది. ఒక ఆర్థి క సంవత్సరంలో ఒక బ్యాంక్ ఖాతా నుంచి నగదు ఉపసంహరణలు రూ.కోటి మించితే టీడీఎస్ కింద బ్యాంకులు 2 శాతాన్ని మినహాయిస్తాయి. వ్యక్తులు, వ్యాపార సంస్థలకూ ఇది అమలవుతుంది. ఎల్టీఏ ప్రభుత్వ ఉద్యోగులు కాని వారు సెలవులను నగదుగా మార్చుకునే మొత్తంపై పన్ను ప్రయోజనానికి పరిమితి ఉంది. 2002 నుంచి ఈ పరిమితి రూ.3 లక్షలుగా ఉంటే, దాన్ని రూ.25 లక్షలకు పెంచారు. అంటే సెలవులను నగదుగా మార్చుకునే మొత్తం రూ.25 లక్షలు ఉన్నా కానీ పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (పీవో ఎంఐఎస్) కూడా నెలవారీ ఆదాయం కోరుకునే వారికి ఉద్దేశించిన పథకం. ఈ పథకంలోనూ ఒక్కరు గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకునేందుకు అనుమతి ఉంటే, దీన్ని రూ.9 లక్షలకు పెంచారు. జాయింట్ అకౌంట్ కింద రూ.9 లక్షల పరిమితిని రూ.15 లక్షలు చేశారు. హెచ్ఎన్ఐలపై పన్ను భారం బడ్జెట్లో అధిక సంపద కలిగిన వ్యక్తులకు సర్చార్జీ భారాన్ని తగ్గించారు. వార్షికాదాయం రూ.5 కోట్లకు పైన ఉన్న వారికి సర్చార్జీ 37 శాతం నుంచి 25 శాతానికి దిగొచ్చింది. కాకపోతే నూతన పన్ను విధానాన్ని ఎంపిక చేసుకునే వారికే దీన్ని పరిమితం చేశారు. ఎన్పీఎస్ నుంచి వైదొలగాలంటే.. ఏప్రిల్ 1 నుంచి ఎన్పీఎస్ పథకం నుంచి వైదొలిగే లేదా యాన్యుటీ ఎంపిక చేసుకునే వారికి కేవైసీ డాక్యుమెంట్లు అప్లోడ్ చేయడం తప్పనిసరి చేశారు. పథకం నుంచి వైదొలిగిన సభ్యులకు వేగంగా యాన్యుటీ చెల్లింపుల చేసేందుకే ఈ ఆదేశాలు అమల్లోకి తెచ్చారు. ఎన్పీఎస్ ఎగ్జిట్ లేదా విత్ డ్రాయల్ ఫారమ్, గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ, బ్యాంక్ అకౌంట్ రుజువు, ప్రాన్ (పెన్షన్ అకౌంట్) కార్డ్ కాపీని సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ సిస్టమ్లోకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనారోగ్యం, వైకల్యం తదితర సందర్భాల్లో ఎన్పీఎస్ నుంచి 25 శాతం ఉపసంహరణకు అనుమతి ఉంది. ఆ సందర్భాల్లోనూ వీటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ–గోల్డ్ భౌతిక బంగారాన్ని ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీప్ట్ (ఈజీఆర్) రూపంలోకి మార్చుకుంటే ఎలాంటి మూలధన లాభాల పన్ను పడదు. ఆన్లైన్ గేమింగ్ ఆన్లైన్ గేమింగ్ ద్వారా గెలుచుకునే మొత్తంపై 30 శాతం టీడీఎస్ అమలు కానుంది. ఈపీఎఫ్ ఉపసంహరణపై టీడీఎస్ ఈపీఎఫ్ ఖాతాకు పాన్ లింక్ చేయకపోతే.. సభ్యులు ఉపసంహరించుకునే మొత్తంపై 20 శాతం టీడీఎస్ అమలు చేస్తారు. ఇంటి మూలధన లాభంలో మార్పులు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54, 54 ఎఫ్ కింద ఒక ఇంటిని విక్రయించగా వచ్చే మొత్తాన్ని తిరిగి ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను లేకుండా చూసుకోవచ్చు. ఈ సెక్షన్ల కింద తిరిగి పెట్టుబడి పెట్టే మూలధన లాభాలను రూ.10 కోట్లకు పరిమితం చేశారు. అంటే ఇంతకు మించి మూలధన లాభం ఉంటే దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ మహిళలకు 2023 బడ్జెట్లో కొత్తగా ప్రకటించిన పథకం ఇది. 2025 మార్చి వరకు ఈ పథకం ఉంటుంది. ఒక్కరు రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడిపై 7.5% వడ్డీ రేటు చెల్లిస్తారు. గరిష్టంగా రెండేళ్లు డిపాజిట్ చేసుకోవచ్చు. బంగారం విక్రయం ఇలా.. హాల్ మార్క్ ఆభరణాలు, బంగారం వస్తువులను ఏప్రిల్ 1 నుంచి 6 నంబర్ల ఆల్ఫాన్యూమరిక్ హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (హెచ్యూఐడీ)తోనే విక్రయించాల్సి ఉంటుంది. హాల్ మార్క్ జ్యుయలరీ పట్ల వినియోగదారుల్లో విశ్వాసాన్ని ఇది పెంచనుంది. హెచ్యూఐడీ లేకుండా విక్రయించడాన్ని బీఐఎస్ నిషేధించింది. -
న్యూ ఇండియా అష్యూరెన్స్ నుంచి డ్రోన్లకు బీమా..
ముంబై: డ్రోన్లకు కూడా బీమా కవరేజీ అందించేలా న్యూ ఇండియా అష్యూరెన్స్ (ఎన్ఐఏ) కొత్త పథకాన్ని ఆవిష్కరించింది. తద్వారా ఎన్ఐఏ ఈ తరహా పాలసీలను అందించే తొలి ప్రభుత్వ రంగ బీమా సంస్థగా నిల్చింది. పెద్ద ఎయిర్క్రాఫ్ట్ల నుంచి సోలో ఫ్లయింగ్ గ్లైడర్లు మొదలైన వాటికి ఈ పథకం వర్తిస్తుంది. డ్రోన్ ఓనర్లు, ఆపరేటర్లు, తయారీ సంస్థలకు కవరేజీ అందించనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 15 యాడ్ ఆన్ కవర్స్ కూడా అందిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ ఎర్గో, ఐసీఐసీఐ లాంబార్డ్, టాటా ఏఐజీ జనరల్ తదితర సంస్థలు డ్రోన్ పాలసీలను అందిస్తున్నాయి. -
తగ్గేదేలే: మస్క్ కొత్త పాలసీ, అలా చేస్తే అంతే!
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విటర్ టేకోవర్ తరువాత వరల్డ్ బిలియనీర్ ఎలాన్ మస్క్ కొత్త పాలసీ విధానాన్ని ప్రకటించారు. కంటెంట్ మోడరేషన్ ప్రణాళికలను వెల్లడించారు. ట్విటర్ పోస్ట్లకు భావప్రకటనా స్వేచ్ఛ ఉంటుంది కానీ నెగెటివ్ పోస్టులకు మాత్రం రీచ్ ఉండదని తేల్చి చెప్పారు. విద్వేష పూరిత కంటెంట్ ఉన్న పోస్టులను తాము ప్రోత్సహించమని స్పష్టం చేశారు. (గుడ్న్యూస్,తొలిసారి ట్విటర్లో...మస్క్ క్లారిటీ!) ఫ్రీడం ఆఫ్ స్పీచ్, బట్ నాట్ రీచ్: కొత్త పాలసీ తాజా పాలసీ అప్డేట్లో విద్వేషపూరిత ట్వీట్లు డీబూస్ట్, డీమోనిటైజ్ చేస్తామని మస్క్ తెలిపారు. నెగెటివ్, హేట్ పోస్ట్లను ప్రమోట్ చేయమని, వాటిని మోనిటైజ్ పరిధిలోకి రావని స్పస్టం చేశారు. అలాంటి పోస్టులపై యూజర్లకు ఎలాంటి రెవెన్యూ ఉండబోదని తేల్చారు. అంతేకాదు అడ్వర్టయిజ్మెంట్లను కూడా నియంత్రిస్తామన్నారు. నెగెటివిటీని విస్తరింపజేసే పోస్టులను గుర్తించడానికి ప్రత్యేక వ్యవస్థ ఉందని కూడా మస్క్ పేర్కొన్నారు. యూజర్లు అలాంటి ట్వీట్లను ప్రత్యేకంగా వెతికితే తప్ప దొరకవు అని వెల్లడించారు. New Twitter policy is freedom of speech, but not freedom of reach. Negative/hate tweets will be max deboosted & demonetized, so no ads or other revenue to Twitter. You won’t find the tweet unless you specifically seek it out, which is no different from rest of Internet. — Elon Musk (@elonmusk) November 18, 2022 మరోవైపు గతంలో ట్విటర్లో బ్యాన్ చేసిన కొన్ని ఖాతాలను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించారు మస్క్. అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక ట్విటర్ అకౌంట్ను పునరుద్ధరించాలా? వద్దా? అనే విషయంపై పోల్ పెట్టారు. అయితే ట్రంప్ ఖాతాపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ప్రకటించడం గమనార్హం. Kathie Griffin, Jorden Peterson & Babylon Bee have been reinstated. Trump decision has not yet been made. — Elon Musk (@elonmusk) November 18, 2022 అలాగే వర్క్ ఫ్రం హోం రద్దుతోపాటు, ఎక్కువ పనిగంటలు పనిచేసేందుకు సిద్ధపడతారా, రాజీనామా చేస్తారా అంటూ మస్క్ అల్టిమేటానికి సమాధానంగా తాజాగా 1200 మంది ఉద్యోగులు రాజీనామా చేశారు. సాఫ్ట్వేర్ కోడ్ రాసే ఉద్యోగులు ఎవరైనా మధ్యాహ్నం శాన్ఫ్రాన్సిస్కోలోని కార్యాలయంలోని 10వ అంతస్తులో తనను కలవాలని మస్క్ శుక్రవారం ట్విటర్ సిబ్బందికి మెయిల్ పంపారు. (ఉద్యోగుల ఝలక్, ఆఫీసుల మూత: మస్క్ షాకింగ్ రియాక్షన్) కాగా 44 బిలియన్ డాలర్ల ట్విటర్ డీల్ తరువాత సంచలన నిర్ణయాలతో అటు ఉద్యోగులను, ఇటు టెక్ వర్గాలను గందరగోళానికి గురిచేస్తూ విమర్శలు పాలవు తున్నా, మస్క్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ట్విటర్ పునరుద్ధరణ పేరుతో ఇప్పటికే వేలాది ఉద్యోగులను తొలగించడంపై అమెరికా కోర్టులో కేసులు కూడా నమోదైనాయి. అంతేకాదు మస్క్ అనాలోచిత నిర్ణయాలతో ట్విటర్ మూత పడనుందనే అంచనాలు వెల్లువెత్తాయి. అయితే ఆదివారం జరగనున్న వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ లైవ్ కవరేజీ, కమెంటరీని ఎంజాయ్ చేయమంటూ ప్రకటించి ఈ ఊహాగానాలకు చెక్ పెట్టారు. -
కల్లు గీత నూతన పాలసీతో లక్ష కుటుంబాలకు ప్రయోజనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కల్లు గీత నూతన పాలసీని అమలులోకి తేవడం వల్ల గీత కార్మికులకు చెందిన సుమారు లక్ష కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ స్పష్టం చేశారు. కల్లు గీత నూతన పాలసీని అమలులోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేయడంపై మంత్రి రమేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కల్లు గీత కార్మికుల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. నూతన పాలసీ అమలుతో గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, ఈత, శ్రిసయిన కులాలకు చెందిన కుటుంబాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కల్లు దుకాణాల అద్దెలను (కిస్తిలను) ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయడం, కల్లు గీచే వారికే చెట్టు పథకం, షెడ్యూల్డ్ ప్రాంతాలలో షెడ్యూల్డ్ జాతులు వారు కల్లు గీసుకోవడం కోసం ఐదు సంవత్సరాలు అనుమతి ఇవ్వడం వంటి నిర్ణయాలు బలహీన వర్గాల అభ్యున్నతికి దోహదపడుతుందని వివరించారు. అదే విధంగా ప్రమాదవశాత్తు చనిపోయిన కల్లుగీత కార్మికులకు చెల్లించే పరిహారాన్ని రూ.ఐదు లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచడం, ప్రమాదానికి గురై అంగ వైకల్యం చెందిన వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి చూపించడం, కల్లుగీత కార్మికుడు సహజంగా మరణిస్తే కుటుంబానికి రూ. 5 లక్షలు బీమా కింద అందచేయడం బాధిత కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన చేకూరుస్తుందని తెలిపారు. నదీతీరాలు, కాల్వగట్లు, మీద తాటి, ఈత చెట్ల పెంపకం ద్వారా కార్మికులకు మరింత ఆదాయం వచ్చే విధంగా ఐదు సంవత్సరాల పాలసీని తీసుకురావడం హర్షణీయమని మంత్రి రమేశ్ పేర్కొన్నారు. -
డిజిట్ ‘‘పే యాజ్ యు డ్రైవ్’’ యాడ్ ఆన్ ఫీచర్ ..
ముంబై: ప్రైవేట్ రంగ సాధారణ బీమా సంస్థ గో డిజిట్ తాజాగా వాహన బీమా పాలసీలకు సంబంధించి ‘‘పే యాజ్ యు డ్రైవ్’’ యాడ్–ఆన్ ఫీచర్ను ప్రవేశపెట్టింది. తక్కువగా డ్రైవింగ్ చేసే కస్టమర్లు ఈ యాడ్–ఆన్తో తక్కువ ప్రీమియం చెల్లించే వీలుంటుందని సంస్థ తెలిపింది. షోరూమ్ నుంచి కొనుగోలు చేసినప్పట్నుంచి సగటున సంవత్సరానికి 10,000 కిలోమీటర్ల కంటే తక్కువ డ్రైవింగ్ చేసే వారు ఎవరికైనా ఈ డిస్కౌంటు వర్తిస్తుందని పేర్కొంది. ఓడోమీటర్ రీడింగ్, టెలీమాటిక్స్ డేటా అలాగే వార్షిక కిలోమీటర్లు మొదలైన వివరాల ఆధారంగా డిస్కౌంటును డిజిట్ లెక్కిస్తుంది. ఓన్ డ్యామేజీ ప్రీమియంలో గరిష్టంగా 25 శాతం వరకూ డిస్కౌంటు పొందవచ్చు. టెక్నాలజీ ఆధారిత వీడియో ప్రీ ఇన్స్పెక్షన్ తర్వాత కేవలం 30 నిమిషాల్లోనే పాలసీ జారీ ప్రక్రియ పూర్తి కాగలదని సంస్థ తెలిపింది. కారును తక్కువగానే వినియోగిస్తున్నప్పటికీ .. ఎక్కువగా వినియోగించేవారితో సమానంగా అధిక ప్రీమియంలు చెల్లించే వారికి ఈ ఫీచర్ ప్రయోజనకరంగా ఉంటుందని వివరించింది. -
ఐసీఐసీఐ లాంబార్డ్ ‘నడిపిన మేరకు’ బీమా
ముంబై: ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపనీ.. ‘పే యాజ్ యూ డ్రైవ్’ పాలసీని కస్టమర్ల కోసం తీసుకొచ్చింది. ఈ ఫ్లోటర్ ప్లాన్ తీసుకున్న పాలసీదారు తన వాహనాన్ని నడిపినంత దూరం మేరకే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పైగా పాలసీదారుకు ఒకటికి మించిన వాహనాలు ఉంటే వాటన్నింటికీ ఈ ఒక్క ఫ్లోటర్ ప్లాన్ కవరేజీ ఆఫర్ చేస్తుంది. సంప్రదాయ మోటారు బీమా పాలసీలో ఉండే అన్ని కవరేజీలు.. ప్రమాద కవరేజీ, మూడో పక్షానికి నష్టం వాటిల్లితే పరిహారం, వాహనదారుకి వ్యక్తిగత ప్రమాద కవరేజీ ఇందులోనూ ఉంటాయి. ఈ ప్లాన్లో రెండు ఆప్షన్లు ఉన్నాయి. మొదటి ఆప్షన్లో పాలసీదారు వాహనాన్ని నడిపిన మేరకు కవరేజీ లభిస్తుంది. రెండో ఆప్షన్లో వాహనాన్ని ఏ విధంగా నడుపుతున్నారనే దాని ఆధారంగా ప్రీమియం ఉంటుంది. మంచి డ్రైవింగ్ చేసే వారికి ప్రీమియంలో తగ్గింపు లభిస్తుంది. ఇండింపెడెంట్ పాలసీలు కలిగి ఉన్న వారు ఈ ఫ్లోటర్ ప్లాన్లోకి మారిపోయే అవకాశాన్ని కూడా సంస్థ కల్పిస్తోంది. -
నవ్వుతూ సేవ చేయ్! లేదంటే జరిమాన: ప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశాలు
Smile Or Get Fined: ఫిలిప్పీన్స్ మేయర్ స్థానిక ప్రభుత్వం అందించే సేవల స్థాయిని మెరుగుపరిచే నిమిత్తం ఒక సరికొత్త పాలసీని తీసుకు వచ్చాడు. ఫిలిప్పీన్స్ ప్రధాన ద్వీపం లుజోన్లో క్యూజోన్ ప్రావిన్స్లోని ములానే పట్టణంలో అరిస్టాటిల్ అగ్యురే కొత్త మేయర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన అధికారం చేపట్టిన వెంటనే స్మైల్ పాలసీ అనే కొత్త పాలసీని ప్రవేశ పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవ చేస్తూనే ప్రశాంతంగా, స్నేహపూర్వక వాతావరణంలో వారి సమస్యలను విని సాయం అందించేలా చిత్తశుద్ధితో పనిచేసేందుకు ఈ స్మైల్ పాలసీ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. స్థానికులు, ఎక్కువగా కొబ్బరి వ్యాపారులు, మత్స్యకారులు తమ పన్నులు చెల్లించడానికి లేదా సహాయం కోరడానికి వెళ్ళినప్పుడు టౌన్ హాల్ సిబ్బంది తమతో అనుచితంగా వ్యవహరిస్తున్నారంటూ ...ఫిర్యాదులు రావడంతోనే ప్రతిస్పందనగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అగ్యురే తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల వైఖరి మార్చేందుకే ఈ పాలసీని తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ పాలసీని పాటించని ఉద్యోగులకు ఆరు నెలల జీతానికి సరిపడా మొత్తం జరిమానగా విధించబడటం లేదా విధుల నుంచి తొలగించడం వంటివి జరుగుతాయని స్పష్టం చేశారు. అగ్యురే ఎన్నికలలో పోటీ చేయడానికి ముందు ఆక్యుపేషనల్ థెరపిస్ట్గా పనిచేశారు. ఈ మేరకు అగ్యురే మాట్లాడుతూ... వ్యాపార అనుకూలమైన మున్సిపాలిటీగా ఉండేందుకే ఈ పాలసీని తీసుకువచ్చాం. తమ ప్రభుత్వ ఉద్యోగులు ఈ నిబంధనలు పాటిస్తారనే విశ్వసిస్తున్నానని చెప్పారు. (చదవండి: అగ్నిపర్వతం వద్ద సెల్ఫీ తీసుకోబోయి... అందులోనే పడిపోయాడు ఆ తర్వాత...) -
బజాజ్ అలియాంజ్ గ్లోబల్ హెల్త్ ప్లాన్
న్యూఢిల్లీ: ప్రపంచంలో ఎక్కడైనా హెల్త్ కవరేజీ పొందే ఫీచర్తో బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ‘గ్లోబల్ హెల్త్ కేర్’ పేరుతో ఒక పాలసీని ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ తీసుకున్న వారు ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో అయినా తమ ఆరోగ్య సమస్యకు చికిత్స తీసుకుని, కవరేజీ పొందొచ్చు. భారత్లోనూ కవరేజీ ఉంటుంది. ప్రపంచంలో అత్యుత్తమ వైద్య సదుపాయాలు ఎక్కడ ఉన్నా, వాటిని పొందే సదుపాయాన్ని కల్పించడమే ఈ ప్లాన్ ఉద్దేశ్యమని బజాజ్ అలియాంజ్ ప్రకటించింది. అలియాంజ్ పార్ట్నర్స్’ భాగస్వామ్యంతో బజాజ్ అలియాంజ్ ఈ పాలసీని తీసుకొచ్చింది. రూ.37.50 లక్షల నుంచి కవరేజీ (బీమా/సమ్ అష్యూర్డ్) ప్రారంభమై, రూ.3.75 కోట్ల వరకు అందుబాటులో ఉంటుంది. ఇంపీరియల్ ప్లాన్, ఇంపీరియల్ ప్లస్ ప్లాన్ అనే రెండు రకాలుగా ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుందని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రకటించింది. హాస్పిటల్లో చేరి తీసుకునే చికిత్సలు, చేరే అవసరం లేకుండా తీసుకునే డే కేర్ ప్రొసీజర్స్, మానసిక అనారోగ్యం, పాలియేటివ్ కేర్, ఎయిర్ అంబులెన్స్, అవయవదాతకు అయ్యే ఖర్చులు, ఆధునిక చికిత్సలకు ఈ ప్లాన్లో కవరేజీ ఉంటుంది. ప్రీమియం రూ.39,432తో ప్రారంభమవుతుంది. -
రిలయన్స్ జనరల్ కస్టమైజ్డ్ హెల్త్ ప్లాన్
ముంబై: కస్టమర్లు తమ ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా ఫీచర్లను ఎంపిక చేసుకునే స్వేచ్ఛతో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ‘రిలయన్స్ హెల్త్ గెయిన్’ పేరుతో పాలసీని విడుదల చేసింది. ఈ ప్లాన్లో ప్లస్, పవర్, ప్రైమ్ అనే మూడు రకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో ఫీచర్లు వేర్వేరుగా ఉంటాయి. రెట్టింపు కవరేజీ (ఒకసారి కవరేజీ అయిపోతే తిరిగి పునరుద్ధరించడం), గ్యారంటీడ్ క్యుములేటివ్ బోనస్ ఇలా పరిశ్రమలో 38 రకాల ప్రధాన ఫీచర్లు ఈ పాలసీలో అందుబాటులో ఉన్న ట్టు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రకటించింది. -
రిలయన్స్ నిప్పన్ లైఫ్.. నిశ్చిత్ సమృద్ధి
ముంబై: రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. నిశ్చిత్ సమృద్ధి పేరుతో నాన్ లింక్డ్ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ను ఆవిష్కరించింది. పన్ను రహిత, కచ్చితమైన రాబడులకు ఇందులో హామీ ఉంటుందని సంస్థ ప్రకటించింది. పిల్లలు పుట్టిన దగ్గర్నుంచి, రిటైర్మెంట్ వరకు జీవితంలో వివిధ దశల్లో అవసరాలకు ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుందని తెలిపింది. ఇందులో ఇన్కమ్, ఎండోమెంట్ అనే రెండు ఆప్షన్లు ఉన్నాయి. తమ అవసరా లకు అనుకూలమైనది ఎంపిక చేసుకోవచ్చు. అంటే రాబడులు, రక్షణ రెండింటి కలయికే ఈ బీమా ప్లాన్. పరిమిత కాలం పాటు అంటే ఏడాది, ఆరేళ్లు, ఏడేళ్లపాటే ప్రీమియం చెల్లించి.. ఎంపిక చేసుకున్నంత కాలం జీవితబీమా రక్షణ పొందొచ్చు. -
హైదరాబాద్లో ఐటీ బూమ్.. నూతన పాలసీతో జోష్
సాక్షి, హైదరాబాద్: హైటెక్సిటీగా పేరొందిన గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కొలువుల కల్పనలో ఐటీ రంగం అగ్రభాగాన నిలిచింది. ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాలకు కొంగు బంగారంగా నిలిచిన మహానగరం ఏటా ఫ్రెష్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు, నైపుణ్యం గల పట్టభద్రులకు నూతన కొలువులు సృష్టించడంలో ముందున్నట్లు.. టీంలీజ్ సంస్థ పలు మెట్రో నగరాలపై వివిధ రంగాలపై జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. ► ప్రధానంగా ఐటీ, అనుంబంధరంగాల్లో సుమారు 31 శాతం ఉద్యోగాల కల్పన జరుగుతున్నట్లు అంచనా వేసింది. ► ఇక దేశంలో బల్క్డ్రగ్ క్యాపిటల్గా పేరొందిన మన నగరంలో రెండోస్థానంలో నిలిచిన ఫార్మారంగంలో సుమారు 25 శాతం కొలువుల సృష్టి జరుగుతోందట. ► ఇక మూడోస్థానంలో ఉన్న టెలీ కమ్యూనికేషన్స్రంగంలో 23 శాతం, తయారీ రంగం 21 శాతం ఉద్యోగాలు కల్పిస్తున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. బల్క్డ్రగ్ రంగంలోనూ... మహానగరాన్ని ఆనుకొని సుమారు వెయ్యికి పైగా బల్క్డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్ కంపెనీలున్నాయి. ఇక్కడి నుంచి దేశ,విదేశాలకు ప్రాణాధార ఔషధాలు, వ్యాక్సీన్లు ఎగుమతి అవుతున్నాయి. ఏటా బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఈ రంగం ఆర్జిస్తోంది. నూతన ఔషధాలపై పరిశోధన, కొత్త మందుల సృష్టి,ఎగుమతుల విషయంలో ఖండాతరాల్లో గ్రేటర్ హైదరాబాద్ పేరు మార్మోగుతూనే ఉంది. ఈ రంగంలోనూ ఏటా సుమారు 25 శాతం నూతన ఉద్యోగాల సృష్టి జరుగుతోందని తాజా అధ్యయనం అంచనా వేయడం విశేషం. ప్రధానంగా సైన్స్ గ్రాడ్యుయేట్లతోపాటు పది,ఇంటర్ చదివిన వారికి హెల్పర్లు,నైపుణ్య కార్మికులకు ఈ రంగం భారీగా ఉపాధి కల్పిస్తుండడం విశేషం. నూతన పాలసీతో జోష్ రాష్ట్ర సర్కారు ఐటీ, హార్డ్వేర్ రంగాలను మరింత ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన నూతన ఐటీ పాలసీ రాకతో ఈ రంగాలు జెట్స్పీడ్తో దూసుకుపోనున్నాయి. రాబోయే ఐదేళ్లలో నూతనంగా మరో నాలుగు లక్షల కొలువుల సృష్టితో పాటు.. ఏటా ఐటీ ఎగుమతులు మూడు లక్షల కోట్ల మార్కును అధిగమించే అవకాశాలున్నట్లు ఐటీ రంగ నిపుణులు అంచనా వేస్తుండడం విశేషం. తాజాగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ 2021–26 మధ్య కాలానికి ప్రకటించిన నూతన పాలసీతో ఐటీ భూమ్ మరింత పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో సుమారు 1500 వరకు ఉన్న చిన్న,పెద్ద, కార్పొరేట్ కంపెనీల్లో సుమారు 6.25 లక్షల మంది ఉపాధి పొందుతున్న విషయం విదితమే. గ్రేటర్ పరిధిలో 2014 నుంచి ఐటీ భూమ్ క్రమంగా పెరుగుతోంది. విశ్వవ్యాప్తంగా పేరొందిన దిగ్గజ ఐటీ, బీపీఓ, హార్డ్వేర్, కేపీఓ సంస్థలు వెల్లువలా సిటీకి తరలివస్తున్న విషయం విదితమే. (చదవండి: ఏటా మూడు లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు.. 10 లక్షల ఉద్యోగాలు) -
ఎంఆర్వో సేవలకు హబ్గా భారత్!
న్యూఢిల్లీ: మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో పౌర విమానయాన శాఖ నూతన ఎంఆర్వో విధానాన్ని ప్రకటించింది. విమానాల నిర్వహణ, మరమ్మతులనే ఎంఆర్వోగా పేర్కొంటారు. ఎంఆర్వో సేవల కోసం భూ కేటాయింపులకు టెండర్ విధానాన్ని అనుసరించనుంది. ఇందుకోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వసూలు చేసే రాయలీ్టని రద్దు చేసింది. అదే విధంగా భూమిని ప్రస్తుతం 3–5ఏళ్ల కాలానికే కేటాయిస్తుండగా.. ఇక మీదట 30 ఏళ్ల కాలానికి లీజ్ తీసుకోవచ్చు. భారత్ను ఎంఆర్వో సేవల కేంద్రంగా (హబ్) తీర్చిదిద్దటమే ప్రభుత్వ ధ్యేయంగా పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు. నూతన విధానంలోని అంశాలు.. ► భూమికి ప్రస్తుతం ఎంత అద్దె వసూలు చేయాలన్నది ఏఏఐ ముందుగా నిర్ణయిస్తోంది. కొత్త విధానంలో బిడ్డింగ్ ద్వారా దీన్ని నిర్ణయించనున్నారు. ► అలాగే, భూమిని లీజుకు తీసుకున్న సంస్థలు ప్రతీ మూడేళ్లకు 7.5–10 శాతం స్థాయిలో 15 శాతం చొప్పున అద్దెను పెంచి చెల్లించాల్సి ఉంటుంది. ► దరఖాస్తు చేసుకుంటే భూమిని కేటాయించే విధానం స్థానంలో.. టెండర్ ద్వారా కేటాయించే విధానం అమల్లోకి వస్తోంది. ► ఇప్పటికే తీసుకున్న లీజును రెన్యువల్ చేసుకునే సమయంలో చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ► ప్రస్తుత లీజు కాంట్రాక్టు ముగిసిపోతే టెండర్ విధానంలో కేటాయింపు ఉంటుంది. గరిష్ట బిడ్డర్కు 15 శాతం సమీపంలోనే పాత ఎంఆర్వో సంస్థ బిడ్ నిలిస్తే.. గరిష్ట బిడ్డర్ ఆఫర్ చేసిన ధరను చెల్లించడం ద్వారా కాంట్రాక్టును సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. జాబితాలో బేగంపేట ఎయిర్పోర్ట్ విమానాలు, హెలికాప్టర్ల ఎంఆర్వో సేవలను మరింత విస్తరించే లక్ష్యంతో.. పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ఎనిమిది విమానాశ్రయాలను గుర్తించినట్టు మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు. అందులో హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంతోపాటు.. భోపాల్, చెన్నై, చండీగఢ్, ఢిల్లీ, జుహు, కోల్కతా, తిరుపతి ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఎనిమిది ఫ్లయిట్ శిక్షణ సంస్థలను తొలి దశలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) నమూనాలో ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఐదు విమానాశ్రయాలను ఉడాన్ పథకం కింద నిర్వహణలోకి తీసుకురానున్నట్టు చెప్పారు. ఇదే పథకం కింద ఆరు హెలిపోర్ట్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. -
నూతన పాలసీ ఎఫెక్టు.. 40 లక్షల వాహనాలు తుక్కేనా?
బెంగళూరు: పాత వాహనాలను తుక్కు చేసేయాలని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టంతో రాష్ట్రంలో లక్షలాది వాహనాలు గుజరీ దారి పట్టనున్నాయి. రాష్ట్రంలో ఉన్న 2.46 కోట్ల వాహనాల్లో 40 లక్షలకు పైగా వాహనాలు ఈ జాబితాలోకి వస్తాయి. కొత్త స్క్రాప్ చట్టం ప్రకారం 15 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కు కింద మారిస్తే కేంద్రం పలు ప్రోత్సాహకాలను అందించనుంది. అలా కొత్త వాహనాలను కొనుగోలు చేయడం, కాలుష్యాన్ని తగ్గించడం చట్టం ఉద్దేశం. 9 లక్షల పెద్ద వాహనాలు 31 లక్షల బైక్లు 15 ఏళ్లకు పైబడిన మ్యాక్సిక్యాబ్లు, కారు, ఆటోరిక్షా, బస్సు, లారీలతో పాటు 9 లక్షలకు పైగా వాహనాలు రాష్ట్రంలో తిరుగుతున్నాయి. 20 ఏళ్లు దాటిన 31 లక్షలకు పైగా ద్విచక్రవాహనాలు ఉన్నాయి. యజమానులు స్వయంప్రేరితంగా గుజరికి వేసేయవచ్చు. లేదా మూడు సార్లు ఫిట్నెస్ పరీక్ష విఫలమైతే రవాణా శాఖ వాటిని స్క్రాప్కి తరలిస్తుంది. ఒకవేళ ఎప్సీ పరీక్షలో పాసైనప్పటికీ గ్రీన్ ట్యాక్స్ చెల్లించడం యజమానికి ఆర్థిక భారమే. వ్యాపారులు, మెకానిక్లలో భయం ఈ చట్టంతో పాత కార్లు, లారీలు కలిగి ఉన్న వారిలో భయం నెలకొంది. పాత కార్ల వ్యాపారుల్లోనూ గుబులు ఏర్పడింది. లక్షలు పెట్టి కార్లు కొనలేనివారు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. వారు తక్కువ ధరతో పాత కార్లను కొని మోజుతీర్చుకుంటారు. ఇప్పుడు ఈ వ్యాపారం పడిపోయే ప్రమాదం ఉందని ఓ పాత కార్ల వ్యాపారి మధు తెలిపారు. పాత వాహనాలను నమ్ముకుని గ్యారేజ్లు నిర్వహిస్తున్న మెకానిక్లు జీవనానికి కొత్త చట్టంతో ఇబ్బందులే అన్నారు. అన్ని పాత వాహనాల్నీ గుజరీకి తరలిస్తే రిపేరి పనులు తగ్గిపోతాయని మెకానిక్ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ చట్టం వల్ల తమ కుటుంబాలు వీధిపాలవుతాయని లారీ యజమానుల సంఘాల ఒక్కోట అధ్యక్షుడు బి.చెన్నారెడ్డి అన్నారు. 10–11 ఏళ్లు దాటిన పాత లారీలు స్థానికంగా తిరుగుతూ ఎంతోకొంత ఉపాధినిస్తుంటాయి. అలాంటి లారీల యజమానులకు ఏమీ పాలు పోవడం లేదని అన్నారు. -
త్వరలో భూ సమీకరణకు కొత్త విధానం!
సాక్షి, హైదరాబాద్: నగర, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్ ) విధానాన్ని తీసుకురానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఉత్తమ భూ సమీకరణ విధానాలు, పద్ధతులపై రాష్ట్ర పురపాలక శాఖ అధ్యయనం చేపట్టింది. ఆ శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ నేతృత్వంలోని అధికారుల బృందం ఒకటి గుజరాత్లో, కార్యదర్శి సి.సుదర్శన్రెడ్డి నేతృత్వంలోని మరో బృందం మహారాష్ట్రలో పర్యటించింది. ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ల్యాండ్ పూలింగ్ విధానాలపై బృందాలు అధ్యయనం జరిపాయి. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు (ఉడాలు)/డీటీసీపీ (డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్)లు నిర్వహిస్తున్న పాత్రను పరిశీలించాయి. ఈనెల 15లోగా ఈ బృందాలు పురపాలక శాఖకు తమ నివేదికలు సమర్పించనున్నాయి. వీటిని పరిశీలించి, నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొత్త భూ సమీకరణ విధానాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. శాటిలైట్ టౌన్లు, పేద, బడుగు, బలహీన వర్గాలకు గృహ నిర్మాణ ప్రాజెక్టుల నిర్మాణం వంటి అవసరాల కోసం ఈ కొత్త పాలసీని ప్రభుత్వం తీసుకొస్తోందని అధికారవర్గాలు తెలిపాయి. పురపాలికలు, ఉడాల ఆధ్వర్యంలోనే.. భూ సమీకరణ ద్వారా సేకరించిన భూముల్లో మౌలిక వసతుల అభివృద్ధి పనులను పురపాలికలు/ఉడాల ఆధ్వర్యంలోనే చేపట్టాలనే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ప్రైవేటు డెవలపర్లు అభివృద్ధి చేస్తున్న నిర్మాణ రంగ ప్రాజెక్టుల్లో రోడ్లు, డ్రైనేజీలు, నీటి సరఫరా పైప్లైన్లు కొద్ది రోజుల్లోనే దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా పనులు పూర్తిగా పురపాలికలు/ఉడాల ఆధ్వర్యంలోనే చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
కొత్త పాలసీ: ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు ఓకే..
10,000 ఎకరాలు.. 25,000 కోట్ల పెట్టుబడులు 3.70 లక్షల మందికి ఉపాధి రాష్ట్రంలో తొలిదశ కింద ఒక్కొక్కటీ 500 నుంచి వెయ్యి ఎకరాల విస్తీర్ణం ఉండే 10 ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తారు. 2024-25 నాటికి మొత్తంగా 10 వేల ఎకరాలకు ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను విస్తరిస్తారు. రైస్మిల్లులు, బియ్యం ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, పూలు, కూరగాయలు, మాంసం, చేపలు, కోళ్లు, పాలు, డెయిరీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ఇస్తారు. విదేశాలకు నాణ్యమైన ఎగుమతులు చేసే స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తారు. జోన్లకు అవసరమైన భూమిని ప్రభుత్వమే సేకరించి, మౌలిక వసతులను అభివృద్ధి చేసి కేటాయిస్తుంది. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ప్రత్యేకంగా ‘ప్లగ్ అండ్ ప్లే’ పద్ధతిలో షెడ్లను ప్రభుత్వమే నిర్మించి ఇస్తుంది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులు పెరుగుతున్న నేపథ్యంలో ‘తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ’ని మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని, వాటిలో యూనిట్లు ఏర్పాటు చేసేవారికి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన మార్గదర్శకాలను ఆమోదించింది. దీనితోపాటు రాష్ట్రంలో భారీగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని, రైతులకు పెట్టుబడి ప్రోత్సాహకాలు ఇవ్వాలని తీర్మానించింది. పారిశ్రామిక, ఈ-కామర్స్, సేవా రంగాలకు తోడుగా ఉండేలా ‘తెలంగాణ లాజిస్టిక్స్ పాలసీ’కి కూడా ఓకే చెప్పింది. బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన ప్రగతిభవన్లో సమావేశమైన రాష్ట్ర కేబినెట్.. వ్యవసాయ రంగానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘‘వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా, అనేక కష్టాల కోర్చి నిర్మించిన ప్రాజెక్టులతో నదీ జలాలను చెరువులు, కుంటలు, బీడు భూములకు తరలించడంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది. రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి తేవడం వంటి రైతు సంక్షేమ కార్యక్రమాలతో గత ఏడాది తెలంగాణలో రికార్డు స్థాయిలో 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగింది. కరోనా కష్టకాలంలోనూ రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వమే గ్రామాలకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేసింది. వచ్చే ఏడాది ధాన్యం ఉత్పత్తి మరింత పెరిగే అవకాశాలు ఉన్నందున.. ధాన్యం నిల్వ, మార్కెటింగ్పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉంది..’’ అని మంత్రివర్గం తీర్మానించింది. ప్రస్తుత వానాకాలంలో 1.40 కోట్ల ఎకరాల్లో సేద్యం జరిగే అవకాశం ఉందని.. వరి, పత్తి పంటలు రికార్డు స్థాయిలో సాగవుతాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ధాన్యం నిల్వ, మిల్లింగ్ సామర్థ్యం పెంచుకోవాలని.. కొత్తగా రైస్ మిల్లులు, పారాబాయిల్డ్ మిల్లులు స్థాపించేందుకు పరిశ్రమల శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రైతులకు సమగ్ర శిక్షణ కోసం అవసరమయ్యే సౌకర్యాలను కల్పించి, నిరంతర శిక్షణ కొనసాగేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించింది. ఉద్యానవన శాఖను క్రియాశీలకంగా మార్చేందుకు అధికారులు, నిపుణుల సహకారం తీసుకుని రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించింది. పౌర సరఫరాల శాఖతో పాటు వ్యవసాయ శాఖలోనూ ఉద్యోగాల ఖాళీ లేకుండా అన్ని పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో సబ్ కమిటీ ఫుడ్ ప్రాసెసింగ్లో భాగంగా రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లింగ్ చేసి డిమాండ్ ఉన్న చోటికి సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం సంబంధిత రంగంలో నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలని.. కొత్తగా ముందుకొచ్చే అన్ని వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించాలని తీర్మానించింది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున.. నిల్వ, మిల్లింగ్, మార్కెటింగ్ సహా నూతన పరిశ్రమల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సబ్ కమిటీలో మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్రెడ్డి, జగదీశ్రెడ్డి సభ్యులుగా ఉంటారని తెలిపింది. ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. 2022-23 సంవత్సరంలో 20లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేపట్టేలా చర్యలు చేపట్టాలని తీర్మానించింది. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఎకరాకు తొలి ఏడాది రూ.26 వేలు, రెండో ఏడాది రూ.5 వేలు, మూడో ఏడాది రూ.5 వేల చొప్పున పెట్టుబడి ప్రోత్సాహకం కింద సబ్సిడీగా అందజేయాలని నిర్ణయించింది. అటవీశాఖ, అటవీ అభివృద్ధి కార్పొరేషన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సాయంతో ఆయిల్ పామ్ నర్సరీలు పెంచాలని ఆదేశించింది. ఆయిల్ పామ్ సాగు విధానం గురించి లోతుగా తెలుసుకునేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కూడిన బృందం కోస్టారికా, మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా దేశాల్లో పర్యటిస్తుందని తెలిపింది. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ‘రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, ఔత్సాహికులకు ప్రోత్సాహం, స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్’ల నిబంధనల ప్రకారం ప్రోత్సాహకాలు అందజేస్తామని వెల్లడించింది. ‘ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ’ మార్గదర్శకాలివీ.. రాష్ట్ర మంత్రివర్గం బుధవారం భేటీలో ‘తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ’కి ఆమోద ముద్ర వేసింది. ఉత్పత్తిదారులు, రైతు సంఘాలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా గ్రామీణ పారిశ్రామిక వ్యవస్థను సృష్టించడం సాధ్యమవుతుందని.. తద్వారా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధి జరుగుతుందని పేర్కొంది. ఈ మేరకు మార్గదర్శకాలను ఓకే చేసింది. రూ.25 వేలకోట్ల పెట్టుబడులు వస్తాయని, 70 వేల మందికి ప్రత్యక్షంగా, 3 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా వేసింది. వ్యవసాయ రంగంలో సాంకేతికత, నైపుణ్యం పెంచే దిశగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల విధానాన్ని అమలు చేయాలి. గ్రామీణ ఎస్సీ, ఎస్టీ మహిళలు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఈ జోన్లలో స్థాపించే యూనిట్లకు వివిధ రూపాల్లో రాయితీలు ఇస్తారు. కరెంటు ప్రతి యూనిట్కు రూ. రెండు సబ్సిడీని ఐదేళ్లపాటు అందజేస్తారు. పెట్టుబడి కోసం తీసుకున్న లోన్పై చెల్లించాల్సిన వడ్డీలో 75 శాతం (గరిష్టంగా రూ.2 కోట్లు) రీయింబర్స్ చేస్తారు. ఏడేళ్ల పాటు మార్కెట్ కమిటీ ఫీజును వంద శాతం రీయింబర్స్ చేస్తారు. ఆహార ఉత్పత్తులను కోల్డ్ స్టోరేజీకి తరలించడం లాంటి లాజిస్టిక్స్కు తోడ్పాటు అందిస్తారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 15 శాతం మూలధనం (రూ.20 లక్షలకు మించకుండా) సాయం చేస్తారు. జోన్లలో భూమి కొనుగోలు ధర మీద రూ.20లక్షలకు మించకుండా 33శాతం వరకు సబ్సిడీ అందజేస్తారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల చుట్టూ 500 మీటర్లను బఫర్ జోన్గా గుర్తించి జనావాసాలు, నిర్మాణాలకు అనుమతి ఇవ్వరు. ఫుడ్ ప్రాసెసింగ్పై ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31 వరకు గడువు ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 10 లాజిస్టిక్స్ పార్కులు పరిశ్రమలు, వాణిజ్య శాఖ రూపొందించిన ‘తెలంగాణ లాజిస్టిక్స్ పాలసీ’ని కూడా కేబినెట్ బుధవారం ఆమోదించింది. రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులను దేశ విదేశ వినియోగదారులకు చేర్చేదిశగా లాజిస్టిక్స్ రంగాన్ని ప్రోత్సహించడం తక్షణావసరమని అభిప్రాయపడింది. ఈ దిశగా దాదాపు రూ.10 వేల కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖను ఆదేశించింది. ఈ రంగం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి ప్రత్యక్షంగా, రెండు లక్షల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని అంచనా వేసింది. ఈ విధానం కింద కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో సుమారు 1400 ఎకరాల్లో భారీ డ్రైపోర్టును (మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కును) పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేస్తారు. ఎగుమతులను మరింతగా ప్రోత్సహించడానికి కస్టమ్స్ శాఖ అనుసంధానంతో సనత్ నగర్లో ప్రస్తుతమున్న కాంకర్ ఐసీడీ తరహాలో కొత్తగా మరో రెండు ఇంటిగ్రేటెడ్ కంటైనర్ డిపో (ఐసీడీ)లను స్థాపిస్తారు. బాటసింగారంలో ఉన్నట్టుగా రాష్ట్రవ్యాప్తంగా మరో 10 ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కులను నెలకొల్పుతారు. ఈ రంగంలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం కోసం అంతర్జాతీయ స్థాయిలో టాస్క్ సహాయంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను స్థాపిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేస్తారు. మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు, వేర్ హౌజ్లను ఏర్పాటు చేసే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పలు రకాల ప్రోత్సహకాలు అందిస్తారు. -
అధిక సంతానం ఉంటే అనర్హులే.. యూపీ నూతన చట్టం
లక్నో: ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయలేరు. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేరు. ఉద్యోగాలు చేస్తున్నవారికి పదోన్నతి సైతం దక్కదు. ప్రభుత్వం నుంచి ఏ రకమైన రాయితీలూ పొందలేరు. జనాభా విస్ఫోటనాన్ని నియంత్రించడమే లక్ష్యంగా బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న బిల్లు ముసాయిదాలోని ముఖ్యాంశాలివీ. జనాభా నియంత్రణ బిల్లును తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ఇద్దరు పిల్లల విధానాన్ని కఠినంగా అమలు చేయాలని యోచిస్తోంది. ఈ పాలసీని ఉల్లంఘిస్తే ప్రభుత్వం నుంచి ప్రయోజనాలను పొందడం అసాధ్యమే. ఈ మేరకు ‘ఉత్తరప్రదేశ్ జనాభా(నియంత్రణ, స్థిరీకరణ, సంక్షేమం) బిల్లు–2021’లో భాగంగా యూపీ లా కమిషన్(యూపీఎస్ఎల్సీ) ముసాయిదాను సిద్ధం చేస్తోంది. ఈ ముసాయిదాను మెరుగుపర్చేందుకు ప్రజల సలహాలు, సూచనలు, వినతులు, అభ్యంతరాలను స్వీకరిస్తున్నట్లు లా కమిషన్ వెల్లడించింది. జూలై 19లోగా ప్రజలు స్పందించాలని కోరింది. ముసాయిదాలో ఏముందంటే.. ► జనాభా నియంత్రణ చట్టాన్ని అమలు చేయడానికి రాష్ట్ర జనాభా నిధిని ఏర్పాటు చేస్తారు. ► ఇద్దరు పిల్లల విధానాన్ని పాటించే ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం సర్వీసు కాలంలో అదనంగా 2 ఇంక్రిమెంట్లు అందుకోవచ్చు. 12 నెలల పూర్తి వేతనం, భత్యాలతో మాతృత్వ, పితృత్వ సెలవులు తీసుకోవచ్చు. నేషనల్ పెన్షన్ స్కీమ్లో ప్రభుత్వ వాటాను 3 శాతం పెంచుతారు. ► అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెటర్నిటీ సెంటర్లు నెలకొల్పుతారు. ఇక్కడ గర్భనిరోధక మాత్రలు, కండోమ్లు సరఫరా చేస్తారు. ► ఫ్యామిలీ ప్లానింగ్ పద్ధతులపై ఆరోగ్య కార్యకర్తల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. ► గర్భధారణలు, ప్రసవాలు, జననాలు, మరణాలను కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయాలి. ► జనాభా నియంత్రణను అన్ని సెకండరీ పాఠశాలల్లో ఒక సబ్జెక్టుగా తప్పనిసరిగా బోధించాలి. ► పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో వనరులు పరిమితంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరికీ ఆహారం, సురక్షిత తాగునీరు, సరైన ఆవాసం, నాణ్యమైన విద్య, విద్యుత్ వంటి వసతులతోపాటు జీవనోపాధి తప్పనిసరిగా కల్పించాల్సి ఉంది. పరిమిత వనరులతో అందరికీ అన్ని వసతులు అందుబాటులోకి తీసుకురావడం కష్టం. అందుకే జనాభా నియంత్రణ, స్థిరీకరణ చర్యలు చేపట్టాలి. రాజకీయ అజెండాతోనే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జనాభా నియంత్రణ బిల్లు ముసాయిదాను బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని యూపీ కాంగ్రెస్ ప్రతినిధి అశోక్ సింగ్ ఆరోపించారు. ఇలాంటి బిల్లును తీసుకురావడం అంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్సీ అశుతోష్ సిన్హా ధ్వజమెత్తారు. దేశంలో దళితులు, గిరిజనుల కారణంగానే జనాభా పెరుగుతోందని సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే ఇక్బాల్ మహూమూద్ వ్యాఖ్యానించారు. జనాభా నియంత్రణ కోసం ఏ చట్టాన్ని తీసుకొచ్చినా అది ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగానే భావించాలన్నారు. -
మతిమాలిన ప్రతిపాదన
ఇద్దరికి మించి సంతానం వున్నవారికి ప్రభుత్వ పథకాలు నిలుపుదల చేయాలన్న రెండేళ్లనాటి ప్రతిపాదనను అస్సాం ప్రభుత్వం మళ్లీ ఎజెండాలోకి తీసుకొచ్చింది. పెరిగే జనాభాను అదుపు చేయాలని ప్రభుత్వాలు సంకల్పించటం మన దేశంలో కొత్తగాదు. ఇద్దరికన్నా ఎక్కువమంది సంతానం వున్నవారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులను చేసే నిబంధన పది రాష్ట్రాల్లో ఇప్పటికే అమల్లోవుంది. అయితే సంక్షేమ పథకాలకు స్వస్తి చెబుతామనటం, ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా అనర్హులను చేస్తామనటం అస్సాం ప్రతిపాదనల్లోని ప్రత్యేకత. గతంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా వున్నప్పుడే ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ ఈ ప్రతిపాదన తెచ్చారు. ఉద్యోగం సంపాదించేనాటికి ఇద్దరు పిల్లలున్న ఎవరైనా తమ సర్వీసు కాలంలో ఆ నిబంధననే పాటించాల్సివుంటుందని, లేని పక్షంలో వారి ఉద్యోగానికి ఎసరు తప్పదని అప్పట్లోనే ఆయన చెప్పారు. ఈ విధానం తేయాకు తోటల్లో పనిచేసేవారికి, ఎస్సీ, ఎస్టీలకూ వర్తించదని తాజాగా ఆయన అంటున్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్త క్లేశాలకూ అధిక జనాభాయే కారణమని అనుకునేవారు చాలామంది వున్నారు. 70వ దశకం వరకూ మన దేశంలో వున్న కుటుంబ నియం త్రణ విధానం అప్పటి యువ నాయకుడు సంజయ్ గాంధీ విపరీత పోకడల పర్యవసానంగా కుటుంబ సంక్షేమ విధానంగా పేరు మార్చుకోవాల్సివచ్చింది. భారత్ పన్ను చెల్లింపుదారుల సంఘం(టాక్సాబ్) అనే సంస్థ జనాభాను అరికట్టడానికి పకడ్బందీ చట్టం తీసుకురావాలని నాలు గేళ్లక్రితం డిమాండ్ చేసింది. అధిక జనాభా కారణంగా ప్రభుత్వాలు పేదరికాన్ని నిర్మూలించలేక పోతున్నాయని, మౌలిక సదుపాయాల కల్పన అసాధ్యమవుతున్నదని, నిరుద్యోగం పెరిగిందని, అందరికీ మంచి ఆహారం అసాధ్యమవుతున్నదని ఆ సంస్థ భావిస్తోంది. ఆఖరికి జనాభా పెరిగి పోవటం వల్లే కాలుష్యం ఎక్కువవుతున్నదని కూడా అది సెలవిచ్చింది. ఇప్పుడు అస్సాం ప్రభుత్వం చెబుతున్న కారణాలు కూడా ఆ మాదిరే వున్నాయి. అందరికీ అన్ని సంక్షేమ పథకాలనూ వర్తింప జేయాలంటే జనాభా నియంత్రణే మార్గమని హిమంతా బిశ్వ శర్మ అంటున్నారు. కానీ ఇద్దరు సంతానం మించటానికి వీల్లేదని ఆంక్షలు విధిస్తున్న రాష్ట్రాల్లో చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు ఎక్కువయ్యాయని స్వచ్ఛంద సంస్థల సర్వేల్లో వెల్లడైంది. మన దేశంలో జనాభా పెరుగుదల రేటు అందరూ భావిస్తున్నట్టు అడ్డూ ఆపూ లేకుండా పైపైకి ఎగబాకటం లేదు. 70, 80 దశకాల్లో ఏటా 2.3 శాతం చొప్పున వున్న జనాభా పెరుగుదల రేటు ఇప్పుడు 1.2 శాతానికొచ్చింది. 70వ దశకంలో ఒక మహిళ సగటున అయిదుగురికి జన్మనిస్తే 2015–16నాటికి ఆ సంఖ్య 2.2కి పడిపోయింది. అస్సాంలో అయితే ఇది 1.9 శాతం మాత్రమే. ఇక కుటుంబ నియంత్రణ సాధనాల వినియోగంలో సైతం ఎంతో మార్పు కనబడుతోంది. 70వ దశ కంలో అటువంటి సాధనాల వినియోగం కేవలం 13 శాతం వుంటే ఇప్పుడది 56 శాతానికి చేరింది. నగరాల్లో కిక్కిరిసిన జనాభాను చూస్తుంటే ఎవరికైనా జనాభా పెరిగిపోతున్నదన్న అభిప్రాయం కలగటం సహజమే. కానీ అన్ని ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేయటానికి బదులు, దాన్ని ఒకే చోట కేంద్రీకరించే ప్రభుత్వాల అస్తవ్యస్థ విధానాలు అందుకు దోహదపడుతున్నాయి. సాగు వ్యయం భారీగా పెరిగి, పంటలకు గిట్టుబాటు ధరలు పడిపోవటంతో అనేకులు వ్యవసాయం వదులుకోవటంవల్ల అక్కడ ఉపాధి కరువై వలసలు పెరిగి నగరాలు కిటకిటలాడుతున్నాయి. వీటికి తోడు ఆరోగ్యంగా జీవనం సాగించటంపై గతంతో పోలిస్తే అవగాహన ఏర్పడిన కారణంగా దేశంలో సగటు ఆయుర్దాయం పెరిగింది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకోవటానికి బదులు ఇద్ద రికి మించి పిల్లలున్న కుటుంబాలకు సంక్షేమ పథకాలు ఇవ్వబోమనటం అమానవీయం అవు తుంది. పురుషాధిక్యత రాజ్యమేలుతున్న మన దేశంలో పిల్లల్ని కనడం, కనకపోవడం అనేది మహిళల చేతుల్లో లేదు. కుమారుడు కావాలన్న కోరికతో భార్య అనారోగ్యాన్ని లెక్కచేయకుండా మూడో సంతానం కోసం లేదా నాలుగో సంతానం కోసం చూసే పురుషులకు కొదవలేదు. నిరుపేద వర్గాల్లో ఈ ధోరణి బాగా ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలను ఆపడం ద్వారా ఎవ రిని శిక్షిస్తున్నట్టు? ఇలాంటి నిర్ణయాలు నియంతృత్వ పోకడలుండేచోట చెల్లుబాటవుతాయి తప్ప ప్రజాస్వామ్యం రాజ్యమేలే చోట కాదు. జనాభా పెరిగిపోతున్నదని ఆందోళనపడి చైనా ప్రభుత్వం 80వ దశకంలో ఒకే సంతానం వుండాలని పౌరులపై ఆంక్షలు విధించింది. ఒకరిని మించి కంటే కఠినంగా శిక్షించిన సందర్భాలు కూడా వున్నాయి. కానీ ఈమధ్యే చైనా తెలివి తెచ్చుకుని, ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని కనొచ్చునంటూ చట్టాన్ని సవరించింది. అక్షరాస్యత బాగా పెరిగేలా చూడటం, కుటుంబంలో నిర్ణయాలు తీసుకోవటంలో మహిళలకు ప్రాముఖ్యతనివ్వటంపై పురుషులకు నచ్చజెప్పటం చాలా అవసరం. తల్లిదండ్రులు కాదల్చుకున్న జంటలకు పునరుత్పత్తి, ఆరోగ్యకరమైన లైంగిక జీవనంవంటి అంశాల్లో అవగాహన కలిగించ టమూ ముఖ్యమే. మగవాళ్లలో అవిద్యనూ, అజ్ఞానాన్ని పోగొట్టగలిగితే పిల్లల్ని ఎప్పుడు, ఎంత మందిని కనాలన్న విషయాల్లో వారిలో కాస్తయినా మార్పు వస్తుంది. అందుకు భిన్నంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఎగ్గొట్టి, సంక్షేమ పథకాలకు స్వస్తి చెప్పి నిరుపేద వర్గాలను శిక్షించ బూనుకుంటే ఇప్ప టికే కరోనా మహమ్మారి కారణంగా పెరిగిన అసమానతలు మరింతగా ముదురుతాయి. నిరుపేద వర్గాలు నిస్సహాయ స్థితిలో పడతాయి. ఈ ప్రతిపాదనకు అస్సాం తక్షణం స్వస్తి చెప్పడం ఉత్తమం. -
కేంద్రం కొత్త నిబంధనలపై వాట్సాప్ న్యాయపోరాటం
-
WhatsAp: కొత్త ఐటీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అమల్లోకి తీసుకొచ్చిన నూతన డిజిటల్ (ఐటీ) నిబంధనలను సవాలు చేస్తూ వాట్సాప్ యాజమాన్యం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. వినియోగదారుల గోప్యతను కాపాడేందుకు తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు తెలియజేసింది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్ల సదుపాయం తమ ఖాతాదారులకు ఉందని గుర్తుచేసింది. సందేశం పంపినవారు, స్వీకరించిన వారు తప్ప ఇతరులు ఆ మెసేజ్లను చదివే అవకాశం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం కోరినపుడు లేదా కోర్టులు అడిగినపుడు తొలుత సందేశాన్ని సృష్టించిన వారిని గుర్తించాలని నూతన ఐటీ నిబంధనలు చెబుతున్నాయని, ఇది సరైన విధానం కాదని వెల్లడించింది. దీనివల్ల ఖాతాదారుల గోప్యతకు భంగం కలుగుతుందని వాట్సాప్ ఆందోళన వ్యక్తం చేసింది. వాట్సాప్లో ఒక సందేశం మొదట ఎక్కడ పుట్టింది, దాన్ని మొదట ఎవరు సృష్టించారు అనేది గుర్తించి, ధ్రువీకరించాలని ఆదేశించడం... గోప్యత హక్కుకు భంగకరమని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. పౌర సమాజంతో కలిసి పనిచేస్తాం: వాట్సాప్ కొత్త ఐటీ నిబంధనలకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో తాము వ్యాజ్యం దాఖలు చేయడం నిజమేనని వాట్సాప్ అధికార ప్రతినిధి తెలియజేశారు. ‘‘కొత్త డిజిటల్ నిబంధనలు అనుచితంగా ఉన్నాయి. వాట్సాప్లో ఒకరికొకరు పంపుకొనే మెసేజ్లను ట్రేస్ చేయాలని, వాటిపై నిఘా పెట్టాలని ప్రభుత్వం చెబుతోంది. ఇలా చేయడం అంటే వాట్సాప్లో షేర్ అయ్యే ప్రతి ఒక్క మెసేజ్ తాలూకు సమాచారాన్ని భద్రపర్చమని కోరడమే. అలాగే ఇది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ను బ్రేక్ చేసినట్లు అవుతుంది. కోట్లాది మంది ప్రజల గోప్యత హక్కును కూడా పణంగా పెట్టినట్లే. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులైన... గోప్యత హక్కు, స్వేచ్ఛగా అభిప్రాయాలను వెల్లడించే హక్కును ఉల్లంఘించడమే’ అని బుధవారం వాట్సాప్ పేర్కొంది. డాక్టర్లు– పేషెంట్లు, లాయర్లు– కక్షిదారులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్థిక సంస్థలు... ఇలా ఎందరో వాట్సాప్ ద్వారా వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని పంచుకుంటారంది. తమ ఖాతాదారుల ప్రైవసీని కాపాడడానికి పౌర సమాజంతో, ప్రపంచవ్యాప్తంగా నిపుణులతో కలిసి పని చేస్తామని తెలిపింది. 36 గంటల్లోగా తొలగించాల్సిందే.. సామాజిక మాధ్యమాల కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 25న కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ నిబంధనలు–2021ను ప్రకటించింది. కొత్త రూల్స్ ప్రకారం.. ఏదైనా కంటెంట్ను తొలగించాలని ప్రభుత్వం ఆదేశిస్తే సోషల్ మీడియా కంపెనీలు 36 గంటల్లోగా తొలగించాలి. ఫిర్యాదులను స్వీకరించడానికి, వాటిపై స్పందించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలి.చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, నోడల్ కాంటాక్టు ఆఫీసర్, రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ను నియమించుకోవాలి. అభ్యంతరకరమైన సందేశాలు, అశ్లీల ఫొటోలు, వీడియోలను (పోర్నోగ్రఫీ) తొలగించడానికి ఆటోమేటెడ్ ప్రాసెస్ వాడాలి. ఏదైనా సందేశాన్ని/ సమాచారాన్ని మొదట ఎవరు సృష్టించారనేది గుర్తించే ఏర్పాటు ఉండాలని కొత్త నిబంధనల్లోని రూల్ 4(2) చెబుతోంది. దీనినే వాట్సాప్ కోర్టులో సవాల్ చేసింది. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటివి నూతన ఐటీ నిబంధనలను అంగీకరించడానికి కేంద్రం 3నెలల గడువిచ్చింది. ఇది మంగళవారంతో ముగిసింది. సోషల్ మీడియా సంస్థలకు ఇదివరకు ‘మధ్యవర్తి హోదా’తో రక్షణ ఉండేది. తమ ఖాతాదారులు పోస్ట్ చేసే కంటెంట్కు సంబంధించి వీటిపై క్రిమినల్ కేసులు, నష్టపరిహారం కేసులకు వీల్లేకుండా ఈ మధ్యవర్తి హోదా కాపాడేది. కొత్త ఐటీ నిబంధనలను అంగీకరించకపోతే ఈ ‘మధ్యవర్తి హోదా’ను కోల్పోతాయి. ఫలితంగా ఎవరు, ఏది పోస్ట్ చేసినా దానికి ఈ సామాజిక మాధ్యమాలు బాధ్యత వహించాల్సి వస్తుంది. అత్యంత తీవ్ర నేరాలను అడ్డుకునేందుకే! కొత్త నిబంధనలన్న ఐటీ శాఖ న్యూఢిల్లీ: దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే అత్యంత తీవ్ర నేరాలకు సంబంధించిన విషయాల్లో సోషల్ మీడియాలో ప్రచారమైన సందేశాల మూలం తెలుసుకునేందుకే కొత్త డిజిటల్ నిబంధనలను తీసుకువచ్చామని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. వ్యక్తుల వ్యక్తిగత సమాచార పరిరక్షణకు తాము వ్యతిరేకం కాదని కేంద్ర ఐటీ శాఖ పేర్కొంది. విదేశాలతో సత్సంబంధాలు, దేశ రక్షణ, దేశంలో శాంతి భద్రతలు మొదలైనవాటికి విఘాతం కలిగించే అవకాశమున్న నేరాలు, లైంగిక నేరాలు, చిన్నారులపై లైంగిక దాడులు తదితరాలను అడ్డుకోవడానికి, అలాంటి తీవ్ర నేరాల విచారణకు సంబంధిత సోషల్ మీడియా సందేశాలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయో, ఎలా వ్యాప్తి చెందాయో తెల్సుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అలాంటి సందేశాల వివరాలు వాట్సాప్ ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో పంచుకోవాల్సి ఉంటుందని వివరించింది. డిజిటల్ నిబంధనలను ‘వాట్సాప్’ చివరి నిమిషంలో కోర్టులో సవాలు చేయడం దురదృష్టకర పరిణామమని వ్యాఖ్యానించింది. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా తదితర దేశాల్లో అమల్లో ఉన్న నిబంధనలతో పోలిస్తే.. భారత్ ప్రతిపాదిస్తున్న నిబంధనలు అంత తీవ్రమైనవి కావని వెల్లడించింది. ప్రైవసీ హక్కును ప్రాథమిక హక్కుగా తమ ప్రభుత్వం గుర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన నిబంధనలతో వాట్సాప్ సాధారణ కార్యకలాపాలకు, వాట్సాప్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగదని ఐటీ మంత్రి రవిశంకర్ తెలిపారు. వారి కాంటాక్ట్ వివరాలు ఇవ్వండి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఐటీ నిబంధనలను పాటించే విషయంలో తాజా పరిస్థితిని తక్షణమే తమకు తెలియజేయాలని కేంద్ర ఐటీ శాఖ ప్రధాన సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. అప్రమత్తతతో వ్యవహరించాలంది. తాజా సోషల్ మీడియా నిబంధనల్లో పేర్కొన్న మేరకు.. భారత్లోని తమ చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్, నోడల్ కాంటాక్ట్ ఆఫీసర్ల వివరాలను తమకు అందించాలని ఆయా సంస్థలను ఆదేశించింది. సంబంధిత సామాజిక మాధ్యమానికి చెందిన యాప్ పేరు, వెబ్సైట్ పేరు, అందించే సేవలు వివరాలను తెలియజేయాలంది. ఒకవేళ తాము ఈ నిబంధనల పరిధిలోకి రామని భావిస్తే అందుకు కారణాలను వెల్లడించాలి. సాధ్యమైనంత త్వరగా, వీలైతే ఈ రోజే తాము కోరిన వివరాలను అందించాలని బుధవారం ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ తదితర ప్రధాన సోషల్ మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేసింది. ఈ ఆదేశాలను పాటించని పక్షంలో అవి ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌలభ్యాలను కోల్పోవడంతో పాటు, వాటిపై వచ్చే ఫిర్యాదులపై చట్టబద్ధంగా క్రిమినల్ చర్యలు చేపట్టేందుకు అవకాశం కలుగుతుందని హెచ్చరించింది. ఇదీ ‘సోషల్ పవర్’ సోషల్ మీడియా వేదికలకు భారత్ అతిపెద్ద మార్కెట్గా మారింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దేశంలో వివిధ సంస్థలకు ఉన్న వినియోగదారుల సంఖ్య ఇలా ఉంది. వాట్సాప్ 53 కోట్లు ఫేస్బుక్ 41 కోట్లు యూట్యూబ్ 44.8 కోట్లు ఇన్స్టాగ్రామ్ 21 కోట్లు ట్విట్టర్ 1.75 కోట్లు -
Corona Vaccine: ఆపకుండా అందరికీ..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అర్హులైన అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కోవిడ్–19 పాలసీని రూపొందించడంపై కసరత్తు చేస్తోంది. టీకాల నిల్వలు అందుబాటులో ఉన్న కొద్దీ, స్టాకు వచ్చిన కొద్దీ పంపిణీ చేస్తూ.. కొరత అనే సమస్య తలెత్తకుండా వ్యూహాత్మకంగా వ్యాక్సినేషన్ కొనసాగించాలని భావిస్తోంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమాలోచనలు జరిపినట్టు సమాచారం. ఇందులో భాగంగా ఎక్కువగా జనం మధ్య ఉండేవారిని కేటగిరీలుగా విభజించి టీకాలు వేయాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో సూపర్ స్ప్రెడర్లుగా ఉండేవారిని గుర్తించి, ప్రత్యేక వ్యాక్సినేషన్ చేపట్టాలని సీఎం కేసీఆర్ సోమవారం నాటి సమీక్షలో పేర్కొన్నారని అధికారవర్గాలు చెప్తున్నాయి. మాటిమాటికి ఆపే పని లేకుండా.. కోవిడ్ చికిత్స, నివారణలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ముందువరుసలో ఉంది. వ్యాక్సినేషన్ విషయంలోనూ ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని, ఇందుకు ప్రత్యేక విధానం రూపొందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వాస్తవానికి ఈ నెల 1వ తేదీ నుంచే 18–45 ఏళ్ల మధ్య వారికి కూడా వ్యాక్సినేషన్ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినా.. టీకాల కొరతతో చాలా రాష్ట్రాల్లో ఈ వయసు వారికి టీకాల పంపిణీ జరగడం లేదు. అప్పుడప్పుడు కొద్దికొద్దిగా వస్తున్న టీకాల స్టాకుతో వ్యాక్సినేషన్ కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇలా మాటిమాటికి టీకాల పంపిణీ ఆపడం సరికాదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. కొత్త విధానాన్ని అమలు చేయడంపై దృష్టి పెట్టింది. కొద్దిరోజుల పాటు పంపిణీ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ప్రస్తుతం స్టాకు ఉన్న మేరకు క్రమపద్ధతిలో టీకాలు ఇస్తూ.. నిరంతరాయంగా కొనసాగించేలా కార్యాచరణ రూపొందిస్తోంది. కేటగిరీలుగా చేసి.. ప్రస్తుతం 45 ఏళ్లు నిండిన వారికి రెండో డోసు టీకాలు వేస్తున్నారు. దీనితోపాటు 45 ఏళ్లు నిండిన వారందరికీ తొలి డోసు మొదలుపెట్టాలని.. 30 ఏళ్లు నిండిన వారిని కేటగిరీలుగా గుర్తించి టీకాలు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో తప్పనిసరిగా బయటికి రావాల్సి ఉన్న రంగాల వారికి తొలుత వ్యాక్సిన్ ఇస్తారు. పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేసేవారు, రవాణా, గ్యాస్ పంపిణీ, పెట్రోల్ బంకుల సిబ్బంది.. వివిధ కేటగిరీలుగా విభజించి ప్రాధాన్యతా క్రమంలో టీకాలు వేస్తారు. ఇదేగాకుండా వ్యాక్సినేషన్కు సంబంధించి వైద్యారోగ్య శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనుంది. రెగ్యులర్గా నిర్వహించే కేంద్రాలతోపాటు మొబైల్ కేంద్రాలనూ సిద్ధం చేయనుంది. ఈ మొత్తం ప్రణాళిక సిద్ధంకాగానే.. సీఎం ఆమోదంతో అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు సమాచారం. నిల్వలు.. 4.53 లక్షల డోసులు రాష్ట్రంలో జనవరి 16న కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రి య ప్రారంభమైంది. తొలుత ఫ్రంట్లైన్ వారియర్స్కు టీకాలు వేసిన ప్రభుత్వం.. తర్వాత 60 ఏండ్లు నిండిన వారికి, ఆ తర్వాత 45 ఏళ్లుపైబడిన వారికి పంపిణీ మొదలుపెట్టింది. ఈ నెల 1వ తేదీ నుంచే 18 ఏళ్లు నిండిన అందరికీ టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినా.. కొరత కారణంగా ఇప్పటికీ ప్రారంభం కాలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తంగా 55,26,985 డోసులు పంపిణీ చేశారు. ఇందులో మొదటి డోసు వేసుకున్నవారు 44,53,573 మంది ఉండగా... రెండు డోసులూ పూర్తయిన వారు 10,73,412 మంది ఉన్నారు. రాష్ట్రానికి సోమవారం 2.54 లక్షల డోసుల కోవిషీల్డ్ టీకాలు వచ్చాయి. వీటితో కలిపి సుమారు 4లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ నిల్వఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇక కోవాగ్జిన్ డోసులు 53 వేలు నిల్వ ఉండగా.. మంగళవారం మరో 50 వేల డోసులు రానున్నాయని వివరించారు. కాగా.. ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల మందికి కోవాగ్జిన్ రెండో డోసు ఇవ్వాల్సి ఉందని అధికారవర్గాలు చెప్తున్నాయి. -
స్క్రాపేజ్ పాలసీతో కొత్త వాహనాలకు డిమాండ్
న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమకు వాహన స్క్రాపేజ్ పాలసీ కలిసొస్తుందని.. దీంతో కొత్త వాహనాలకు డిమాండ్ పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. 2021–22 కేంద్ర బడ్జెట్లో స్వచ్ఛంధ వాహన స్క్రాపింగ్ పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పాలసీలో వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్లు, కమర్షియల్ వెహికిల్స్కు 15 ఏళ్ల ఫిట్నెస్ టెస్ట్లను నిర్వహిస్తారు. భారీ వాణిజ్య వాహనాలకు 2023 ఏప్రిల్ నుంచి, ఇతర వాహనాలకు 2024 జూన్ నుంచి పరీక్షలు ఉంటాయి. ఈ నేపథ్యంలో అనర్హమైన వాహనాలు తొలగిపోతాయని.. దీంతో కొత్త వాహనాలకు డిమాండ్ పెరగడంతో పాటు వాహన పరిశ్రమ స్థిరపడుతుందని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ శంషేర్ దేవాన్ తెలిపారు. దీంతో పాటు కాలుష్యం, చమురు ఉత్పత్తుల దిగుమతులను తగ్గించడం, మెటల్ రీసైక్లింగ్, ముడి పదార్థాల వ్యయాలను తగ్గించడం వంటి ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే స్క్రాపింగ్ పాలసీ విజయవంతం కావాలంటే మౌలిక వసతుల ఏర్పాటు, స్క్రాప్ విలువల మదింపుపై మరింత స్పష్టత, స్క్రాప్ సర్టిఫికెట్ సామర్థ్యం వంటివి కీలకమని అభిప్రాయపడ్డారు. 2024 ఆర్ధిక సంవత్సరం నాటికి 15 ఏళ్ల కంటే పాత వాహనాలు 1.1 మిలియన్ యూనిట్లు ఉంటాయని ఇక్రా అంచనా వేసింది. అయితే ఆయా వాహనాల వినియోగం, స్వభావాలను బట్టి వాస్తవిక స్క్రాపేజీ సంభావ్యత కొంత మేర తగ్గొచ్చని తెలిపింది. -
వాట్సాప్తో బతుకు బహిరంగమేనా..?
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ వాట్సాప్.. తన వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే నిర్ణయం తీసుకుంది. వినియోగదారులంతా తమ వివరాలు ఇస్తేనే యాప్లో కొనసాగాలని.. లేకుంటే నిరభ్యంతరంగా బయటకు వెళ్లిపోవచ్చని స్పష్టంచేసింది. ఈ మేరకు నవీకరించిన నిబంధనలు, గోప్యత విధానానికి వచ్చేనెల 8వ తేదీలోగా అంగీకారం తెలపాలని షరతు విధించింది. ఈ మేరకు తమ కొత్త ప్రైవసీ పాలసీకి సమ్మతి తెలపాలని కోరుతూ పాప్–అప్ మెసేజ్లు పంపిస్తోంది. దీనికి అంగీకరిస్తేనే ఫిబ్రవరి 8 తర్వాత వాట్సాప్ ఖాతా పనిచేస్తుంది. బతుకు బహిరంగమేనా..? వాట్సాప్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామి అయిపోయింది. వ్యక్తిగత చాట్స్తో పాటు ఫోటోలు, వీడియోలు, వాయిస్ మెసేజ్లు, ఫైల్స్, షేర్ లొకేషన్ మెసేజ్లను పంపడానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మందికి పైగా దీనిని వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా వాట్సాప్ తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీతో వాట్సాప్ సేవలతో పాటు వినియోగదారుల డేటా ప్రాసెసింగ్ ప్రక్రియలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ పాలసీకి ఆమోదం తెలిపిన తర్వాత వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్బుక్, ఇతర అనుబంధ కంపెనీల వ్యాపారాభివృద్ధికి ఉపయోగించుకుంటుంది. ఈ–కామర్స్ సంస్థలకు వినియోగదారుల డేటాను అమ్ముకుంటుంది. తొలుత ఈ విధానాన్ని బ్రిటన్, యూరోపియన్ యూనియన్ దేశాల్లో ప్రవేశపెట్టింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమలు చేయబోతోంది. గోప్యతకు ప్రమాదం లేదంటూనే... వాట్సాప్లో సందేశాలన్నీ సంకేతభాష (ఎన్క్రిప్టెడ్)లోకి తర్జుమా అవుతాయని, ఆ డేటాను తాము కూడా చూడలేమని సంస్థ అంటోంది. సందేశాలు డెలివరీ అయ్యాక, తమ సర్వర్ నుంచి డిలీట్ అయిపోతాయని పేర్కొంటోంది. ఏదైనా పాపులర్ ఫోటో, వీడియోను ఎక్కువ మంది షేర్ చేస్తే దాన్ని మాత్రమే సర్వర్లో దీర్ఘకాలం స్టోర్ చేస్తామని అంటోంది. తాము కానీ, థర్డ్ పార్టీలు కానీ వినియోగదారుల సమాచారాన్ని చదవలేరని స్పష్టంచేస్తోంది. తమ వినియోగదారులు, వ్యాపార సంస్థలు వాట్సాప్ను వినియోగించుకుని మెరుగైన పద్ధతిలో కమ్యూనికేట్ కావడానికి మాత్రమే కొత్త దారులు వెతుకుతున్నామని, ఈ క్రమంలోనే కొత్త ప్రైవసీ పాలసీ తీసుకొచ్చామని చెబుతోంది. వినియోగదారుల మొబైల్ ఫోన్ నంబర్, ఫోన్ కాంటాక్స్, ప్రొఫైల్ పేరు, ప్రొఫైల్ పిక్చర్, స్టేటస్ మెసేజ్ వంటి సమాచారాన్ని వారి సమ్మతి ద్వారా తీసుకుంటామని అంటోంది. ఫేస్బుక్కు ఏమేం ఇస్తుంది? వాట్సాప్ వినియోగదారుల అకౌంట్ రిజిస్ట్రేషన్ సమాచారం(ఫోన్ నంబర్), వాట్సాప్తో జరిపే ఆర్థిక లావాదేవీలు, సేవల సంబంధిత సమాచారం, ఇతరులతో మీరు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు? మీ మొబైల్ఫోన్ హార్డ్వేర్ సమాచారం, ఐపీ అడ్రస్, లొకేషన్, మీరు సందర్శించిన వెబ్సైట్లు వంటి వివరాల ను ఫేస్బుక్, ఇతర అనుబంధ కంపెనీలకు ఇవ్వనుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారులంతా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వాట్సాప్ తాజా నిర్ణయం నేపథ్యంలో టెలిగ్రాం, సిగ్నల్ వంటి ప్రత్యామ్నాయ యాప్లు వినియోగించుకోవాలని పలువురు సూచిస్తున్నారు. -
టర్మ్ ప్లాన్లకు డిమాండ్ జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా వైరస్ మహమ్మారి, లాక్డౌన్ అంశాలు జీవిత బీమా రంగంపైనా ప్రతికూల ప్రభావాలు చూపించాయి. అయితే, దీని వల్ల ఆర్ధిక భద్రతపై అవగాహన పెరిగిందని, టర్మ్ ప్లాన్లకు డిమాండ్ పెరుగుతోందని చెబుతున్నారు ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ రాహుల్ అగర్వాల్. పాలసీదారులకు మరింత మెరుగైన సర్వీసులు అందించేందుకు డిజిటల్ మాధ్యమాన్ని మెరుగుపర్చుకుంటున్నామని సాక్షి బిజినెస్ బ్యూరోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ వివరాలు.. మీ వ్యాపారంపై కరోనా వైరస్ ప్రభావమేంటి? కరోనా వైరస్ మహమ్మారి, దాని కట్టడికి విధించిన లాక్డౌన్లతో ఇతర రంగాల్లాగానే జీవిత బీమా రంగంపైనా ప్రతికూల ప్రభావం పడింది. మార్చి, ఏప్రిల్లో కస్టమర్లతో సంప్రదింపులు లేకపోవడం లేదా పాలసీలు తీసుకుందామనుకున్న వారు కూడా వాయిదా వేసుకోవడమో జరిగింది. మేం ప్రధానంగా కరోనా సమయంలో ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిచ్చాం. సరిగ్గా లాక్డౌన్కు ముందు ప్రవేశపెట్టిన వర్చువల్, యాప్ ఆధారిత శిక్షణా కార్యక్రమాలు మా సేల్స్ సిబ్బందికి ఉపయోగపడ్డాయి. దీనితో పరిస్థితులు కొంత మెరుగుపడ్డాక అత్యంత వేగంగా మా కార్యకలాపాలు సాధారణ స్థాయికి రాగలిగాయి. తొలి త్రైమాసికంలో మా ఏజెన్సీ శాఖల్లో 99 శాతం శాఖలు తెరిచే ఉన్నాయి. బ్రాంచీ ఉత్పాదకతలో కూడా మెరుగుదల కనిపించింది. మీ వృద్ధి ప్రణాళికలపై ఎలాంటి ప్రభావం పడింది? పరిశ్రమకు రెట్టింపు స్థాయిలో వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కరోనా వైరస్, లాక్డౌన్ అంశాల కారణంగా మా అంచనాలు మార్చుకోవాల్సి వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎకాయెకిన భారీ వృద్ధిని ఆశించడం లేదు. అయితే, కరోనా నేపథ్యంలో ఆర్థిక భద్రతపై అవగాహన పెరిగింది. జీవిత బీమా ప్లాన్లకు.. ముఖ్యంగా టర్మ్ ప్లాన్లకు డిమాండ్ పెరిగింది. ఈ కష్టకాలంలో హామీతో కూడిన రాబడులను కస్టమర్లు కోరుకుంటున్నారు. కాబట్టి మా సాంప్రదాయ ప్లాన్లపై మరింతగా దృష్టి పెడుతున్నాం. డిజిటల్ సర్వీసులు మెరుగుపర్చుకునే ప్రక్రియ కొనసాగిస్తాం. కోవిడ్–19 సంబంధ క్లెయిమ్స్ ఏమైనా వచ్చాయా? జూలై మధ్య నాటి దాకా రెండు క్లెయిమ్స్ వచ్చాయి. అవసరమైన పత్రాలన్నీ అందిన వెంటనే సెటిల్ కూడా చేశాం. పాలసీదారులకు తోడ్పాటుగా ఉండేందుకు మా వెబ్సైట్లో ప్రత్యేకంగా కోవిడ్–19 సెక్షన్ కూడా ఏర్పాటు చేశాం. ఆయా క్లెయిమ్స్కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇందులో పొందుపర్చాం. కొత్త పాలసీలేవైనా ప్రవేశపెడుతున్నారా? సవరించిన ప్రీమియంలకు అనుగుణంగా రెండు టర్మ్ ప్లాన్ల కోసం బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ)కి దరఖాస్తు చేసుకున్నాం. స్మార్ట్ టర్మ్ ప్లాన్, స్మార్ట్ టర్మ్ ప్లస్ ప్లాన్ వీటిలో ఉన్నాయి. ఐఆర్డీఏఐ తుది అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం. బీమా తీసుకునేవారి సంఖ్య తక్కువగానే ఉన్న తరుణంలో ప్రీమియంల పెంపు వల్ల ప్రతికూల పరిస్థితులు ఎదురైతే పరిశ్రమ ఎలా వ్యవహరించబోతోంది? టర్మ్ ప్లాన్ల ప్రీమియంలలో పెంపు చాలా స్వల్పమే. ఆర్థిక ప్రణాళిలకలపై క్రమంగా అవగాహన పెరుగుతోంది. కరోనా పరిణామాలతో ఇది వేగవంతమైంది. గతానికి భిన్నంగా జీవిత బీమాను తప్పనిసరైన సాధనంగా కస్టమర్లు పరిగణిస్తున్నారు. కనిపిస్తున్న ట్రెండ్స్ను బట్టి చూస్తే టర్మ్ పాలసీల విభాగం ఈ ఏడాది మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రస్తుత వ్యాపార పరిమాణమెంత? ప్రస్తుతం 15 లక్షల పైచిలుకు కస్టమర్లు, 44,000 పైచిలుకు అడ్వైజర్లు (మార్చి 31 నాటికి) ఉన్నారు. వీరితో పాటు బిజినెస్ పార్ట్నర్స్ మొదలైన వారు ఉన్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 98.15 శాతం క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి నమోదు చేశాం. గడిచిన ఎనిమిదేళ్లుగా లాభసాటిగానే ఉంటున్నాం. ప్రస్తుతం రూ. 15,795 కోట్ల ఆస్తులు నిర్వహణలో (ఏయూఎం) ఉన్నాయి. కస్టమర్ల పెట్టుబడులకు భద్రతనిచ్చేలా డెట్ పోర్ట్ఫోలియోలోని 99 శాతం సాధనాలకు సార్వభౌమ లేదా ట్రిపుల్ ఏ రేటింగ్ ఉన్నాయి. కొత్తగా నియామకాల విషయానికొస్తే.. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల కారణంగా కాస్త నెమ్మదిగానే అయినా దేశవ్యాప్తంగా అడ్వైజర్లను నియమించుకుంటున్నాం. కొత్త ప్రాంతాలకు విస్తరించే క్రమంలో రిలేషన్షిప్ మేనేజర్లు, సూపర్వైజర్ స్థాయి సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటున్నాం. -
ఉద్యోగాల కల్పనకు పెద్దపీట
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం కల్పిస్తూ పెద్దసంఖ్యలో ఉద్యోగాలను అందుబాటులోకి తెచ్చేలా నూతన ఎలక్ర్టిక్ వాహన విధానాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఆవిష్కరించారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని నియంత్రించే లక్ష్యంతోనూ నూతన విధానానికి రూపకల్పన చేశారు. తాము చేపట్టిన నూతన ఎలక్ర్టిక్ వాహన విధానంతో ఉద్యోగ అవకాశాలను అందుబాటులోకి తేవడమే కాకుండా, ఢిల్లీ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేస్తామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశ రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇది ఉపకరిస్తుందని అన్నారు. ఈ విధానం కింద రానున్న ఐదేళ్లలో 5 లక్షల ఎలక్ర్టిక్ వాహనాలను రిజిస్టర్ చేస్తామని అంచనా వేస్తున్నామని కేజ్రీవాల్ వెల్లడించారు. ఎలక్ర్టిక్ వాహన విధానం కింద ద్విచక్రవాహనాలు, ఆటోలు, ఈ -రిక్షాలకు కు రూ 30,000, కార్లకు రూ 1.5 లక్షల వరకూ ప్రోత్సాహకాన్ని ఆయన ప్రకటించారు. ఈ విధానం కింద ఎలక్ర్టిక్ వాహనాలను కొనుగోలు చేసేవారికి ఈ ప్రోత్సాహకాలు అందిస్తామని స్పష్టం చేశారు. నూతన విధానాన్ని అమలు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం త్వరలో రాష్ట్ర ఎలక్ర్టిక్ వాహన బోర్డును ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. ఈ-వాహనదారుల సౌకర్యం కోసం ఏడాదిలోనే 200 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని కేజ్రీవాల్ తెలిపారు. ఎలక్ర్టిక్ వాహన విధానం కింద రిజిస్ర్టేషన్ ఫీజు, రోడ్డు పన్నును ఎత్తివేస్తామని ప్రకటించారు. ఎలక్ర్టిక్ కమర్షియల్ వాహనాల కొనుగోలుకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తామని చెప్పారు. చదవండి : నిరుద్యోగులకు కేజ్రీవాల్ బంపర్ ఆఫర్ -
‘సోషల్’ ఖాతాల వివరాలివ్వండి
న్యూఢిల్లీ: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) తమ 1.62 లక్షల మంది సైనికులకు సోషల్ మీడియా వాడకంపై మార్గదర్శకాలను ఇచ్చింది. అంతేగాక సైనికులు వాడుతున్న ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వాటి యూజర్ ఐడీలు వెల్లడించాలని కోరింది. ఆన్లైన్ ప్రపంచంలో ఉన్న ప్రమాదాల రీత్యా, భారత్ పై ఇతర దేశాల నుంచి ఉన్న ముప్పు రీత్యా ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దేశంలోని 63 విమానాశ్రయాల్లో సీఐఎస్ఎఫ్ జవాన్లు సేవలందిస్తున్నారు. వాటితో పాటు కొన్ని ఏరోస్పేస్, న్యూక్లియర్ డొమన్ తో పాటు పలు మంత్రిత్వ శాఖల భవనాల వద్ద వీరు పనిచేస్తున్నారు. సైనికులు ఉపయోగిస్తున్న ఐడీల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా పోస్టులు వస్తున్నాయేమో గమనించనున్నారు. తప్పుడు ఐడీలు సమర్పించడంగానీ, కొత్త ఐడీలు క్రియేట్ చేయడంగానీ చేస్తే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
అందరి కోసం.. ఆరోగ్య సంజీవని!
ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం అన్నది ఎన్నో జాగ్రత్తలు, పరిశీలనలతో.. కాస్తంత శ్రమతో కూడుకున్నది. పాలసీలో కవరేజీ వేటికి లభిస్తుంది, వేటికి మినహాయింపులు, షరతులు, నియమ నిబంధనలు.. చూడాల్సిన జాబితా పెద్దదే. పైగా అందరికీ ఇవి అర్థమవుతాయని చెప్పలేము. దీంతో బీమా కంపెనీల వందలాది పాలసీల్లో ఏది మెరుగైనది అని తేల్చుకోవడం అంత ఈజీ కాదు. బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఈ విషయాన్ని అర్థం చేసుకుని.. అన్ని రకాల సాధారణ కవరేజీ సదుపాయాలతో ఒకే ప్రామాణిక పాలసీని ‘ఆరోగ్య సంజీవని’ పేరుతో 2020 ఏప్రిల్ నాటికి తీసుకురావాలని బీమా సంస్థలను ఆదేశించింది. దీంతో అన్ని సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు ఆరోగ్య సంజీవని పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చాయి. వైద్య సేవల ఖర్చులు ఏటేటా పెరిగిపోతున్న తరుణంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా కవరేజీ అవసరం ఎంతో ఉంది. ‘ఆరోగ్య సంజీవని’ అందరికీ అనుకూలమేనా..? గరిష్టంగా రూ. 5 లక్షల వరకు హెల్త్ కవరేజీని ఆరోగ్య సంజీవని పాలసీ కింద అందించాలన్నది తొలుత ఐఆర్డీఏఐ నిర్దేశించిన షరతు. రూ.5లక్షలకు మించి కూడా ఆఫర్ చేయవచ్చంటూ ఐఆర్డీఏఐ ఇటీవలే సవరణలు తెచ్చింది. ఈ ప్లాన్లో క్లెయిమ్ చేసుకోని ప్రతీ సంవత్సరానికి గాను సమ్ ఇన్సూర్డ్ (బీమా రక్షణ) 5 శాతం పెరుగుతూ వెళుతుంది. గరిష్టంగా 50 శాతం వరకు ఇలా బీమా రక్షణ కవరేజీ పెరిగేందుకు అవకాశం ఉంది. మోస్తరు ప్రీమియానికే విస్తృతమైన కవరేజీనిచ్చే ఈ ప్లాన్ను మొదటిసారి తీసుకునే వారు ఎంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘పరిమిత బడ్జెట్ ఉన్న వారికి ఇది మంచి ఎంపికే అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం పట్ల అవగాహన పెరుగుతున్నా కానీ, తీసుకుంటున్న వారి సంఖ్య మన దేశంలో ఇప్పటికీ చాలా తక్కువగానే ఉంటోంది. అర్థం చేసుకునేందుకు సంక్లిష్టతలు, ప్రీమియం భరించలేనంత ఉండడం సగటు గృహస్తుడు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయకుండా అడ్డుపడుతోంది. కానీ, ఆరోగ్య సంజీవని పాలసీ సులభంగా, సమంజసమైన ప్రీమియంతో ఉండడం అనుకూలత’’ అని ఫిన్ఫిక్స్ రీసెర్చ్ అండ్ అనలైటిక్స్ మేనేజింగ్ పార్ట్నర్ ప్రబ్లీన్ బాజ్పాయ్ పేర్కొన్నారు. ఆర్జన ఆరంభమై, తనపై ఆధారపడిన వారు లేకుంటే (అవివాహితులు) ఈ ప్లాన్ను తప్పకుండా పరిశీలించొచ్చని ఆయన సూచించారు. ‘‘ఆరోగ్య సంజీవని పాలసీ సమగ్ర కవరేజీ కోరుకునే యువతీయువకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇతర పాలసీల కంటే ప్రీమియం తక్కువగా ఉండడంతోపాటు రోజువారీ చికిత్సలు సహా కవరేజీ విస్తృతంగా ఉంటుంది’’ అని ఫిన్సేఫ్ వ్యవస్థాపక డైరెక్టర్ మృణ్ అగర్వాల్ తెలిపారు. ‘‘ఆరోగ్య సంజీవని పాలసీ అన్నది సులభమైన ప్రాథమిక పాలసీ. పైగా చౌక అయినది. కాకపోతే ఇందులో 5 శాతం కోపేమెంట్ (ఆస్పత్రి బిల్లులో 5 శాతాన్ని పాలసీదారు భరించడం) షరతు ఉండగా, పూర్తి స్థాయి ఆరోగ్య బీమా ప్లాన్లలో ఇది ఉండదు’’ అని పాలసీఎక్స్ డాట్కామ్ సీఈవో నావల్ గోయల్ తెలిపారు. వీటిని చూసి తీసుకుంటే మంచిది.. అనుకూలమేనా..? రూ.5 లక్షల గరిష్ట కవరేజీకే ప్రస్తుతం అవకాశం ఉంది. కాకపోతే అంతకుమించి ఆఫర్ చేయవచ్చని ఐఆర్డీఏఐ తాజాగా అనుమతించడం సానుకూలం. పెరిగిపోతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చుల దృష్ట్యా రూ.5 లక్షల కవరేజీ అందరికీ, అన్ని వయసుల వారికీ, ముఖ్యంగా పెద్ద పట్టణాల్లో నివసించే వారికి సరిపోకపోవచ్చు. కనుక రూ.5 లక్షలకు మించి కవరేజీ పెంచుకునే అవకాశం ఉంటే ఈ పాలసీని పరిశీలించొచ్చు. పెంచుకునేందుకు అవకాశం లేకపోతే మధ్య వయసు నుంచి వృద్ధాప్యంలో ఉన్న వారికి ఈ పా లసీ అంత అనుకూలం కాదనే చెప్పుకోవాలి. ‘‘అధిక ప్రీమియం చెల్లించే సామర్థ్యం ఉండి, మెట్రోల్లో నివసిస్తున్న వారు అయితే ఆరోగ్య సంజీవని పాలసీ కాకుండా సమగ్ర కవరేజీనిచ్చే ఇతర ప్లాన్లను పరిశీలించొచ్చు’’ అని బాజ్పాయ్ సూచిం చారు. ‘‘తనపై పిల్లలు, తల్లిదండ్రులు ఆధారపడి ఉంటే అధిక కవరేజీ అవసరమవుతుంది. సరిపడా కవరేజీనిచ్చే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని ఎంచుకోవాలి’’ అని మృణ్ అగర్వాల్ సూచించారు. ఒకవేళ ఇప్పటికే సమగ్ర కవరేజీతో కూడిన ఆరోగ్య బీమా ప్లాన్ కలిగిన వారు ఆరోగ్య సంజీవనిని పరిశీలించాల్సిన అవసరం లేదు. ప్రీమియంలో వ్యత్యాసం..: ‘‘ఎన్ని క్లెయిమ్లు రావచ్చన్న అంచనా రేషియోల ఆధారంగా బీమా సంస్థలు ప్రీమియం నిర్ణయిస్తుంటాయి. ప్రతీ బీమా సంస్థకు యాక్చుయేరియల్ బృందం ఉంటుంది. వారి అంచనాలు వేర్వేరుగా ఉండడం వల్లే ప్రీమియం రేట్లలో వ్యత్యాసం ఉంటుంది. అలాగే, అన్ని బీమా సంస్థ సేవల నాణ్యత ఒకే విధంగా ఉండదు. ప్రీమియంలో వ్యత్యాసానికి ఇది కూడా ఒక కారణం’’అని నావల్ గోయల్ వివరించారు. ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో ఒక బీమా కంపెనీ ఒక ఏడాదిలో పాలసీల ప్రీమియం రూపేణా ఆర్జించిన ప్రతీ రూ.100 నుంచి ఎంత మొత్తాన్ని క్లెయిమ్లకు చెల్లింపులు చేసిందో తెలియజేస్తుంది. ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో ఎక్కువగా ఉంటే అది పాలసీదారులకు ప్రయోజనం. కానీ, ఇది నూరు శాతం మించితే అది బీమా కంపెనీకి నష్టం. ఎందుకంటే ప్రీమియం ఆదాయానికి మించి క్లెయిమ్లు వస్తే బీమా సంస్థ నష్టపోవాల్సి వస్తుంది. దాంతో ప్రీమియంలు భారీగా పెంచేయాల్సి వస్తుంది. లేదంటే క్లెయిమ్లకు కొర్రీలు వేయాల్సి వస్తుంది. ఈ రేషియో 60 శాతానికి తక్కువ కాకుండా ఉన్న కంపెనీని ఎంచుకోవాలి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో తనకు వచ్చిన మొత్తం క్లెయిమ్ దరఖాస్తులలో ఎన్నింటికి కంపెనీ చెల్లింపులు చేసిందో దీన్ని చూసి తెలుసుకోవచ్చు. ఈ రేషియో 90 శాతానికి పైన ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. వేగం, సేవలు క్లెయిమ్లను వేగంగా పరిష్కరించే సంస్థ నుంచి పాలసీ తీసుకోవడం సౌకర్యాన్నిస్తుంది. అలాగే, కస్టమర్ సేవలు మెరుగ్గా ఉండే కంపెనీని ఎంచుకోవాలి. నెట్వర్క్ ఆస్పత్రులు బీమా కంపెనీ నెట్వర్క్ ఆస్పత్రుల జాబితాలో మీరు నివసించే ప్రాంతాలకు సమీపంలోని ఆస్పత్రులు ఉన్నాయేమో చూసుకోవాలి. దీనివల్ల నగదు రహిత సేవలను ఆయా ఆస్పత్రుల్లో పొందొచ్చు. ప్రీ, పోస్ట్ హాస్పిటలైజేషన్ అనారోగ్యానికి సంబంధించి ఆస్పత్రి లో చేరడానికి ముందు వ్యాధి నిర్ధారణ తదితర ఖర్చులు ఎదురవుతాయి. ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా కొంత కాలం పాటు ఖర్చులు ఎదురవుతాయి. కనుక ప్రీ, పోస్ట్ హాస్పిటలైజేషన్ కింద ఎక్కువ రోజులకు కవరేజీనిచ్చే పాలసీని ఎంపిక చేసుకోవాలి. రూమ్ రెంట్ ఆస్పత్రిలో చేరిన తర్వాత ఐసీయూ నుంచి వార్డుకు లేదా షేరింగ్ రూమ్కు లేదా ప్రైవేటు రూమ్కు షిఫ్ట్ చేస్తుంటారు. ఏ రూమ్ అయినా సరే అన్న నిబంధన ఉండే పాలసీని ఎంచుకోవాలి. అలా కాకుండా పాలసీలో రూమ్ రెంట్ పరిమితి ఉంటే.. అంతకుమించిన చార్జీలతో కూడిన రూమ్ తీసుకుంటే.. ఆయా ఖరీదైన స్టేయింగ్ వద్ద చేసే వైద్య ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో బీమా కంపెనీ పూర్తి స్థాయి చార్జీలను చెల్లించదు. సబ్ లిమిట్స్ కొన్ని రోజువారీ చికిత్సలు, కొన్ని రకాల వ్యాధులకు సంబంధిం చి ఇంతే పరిహారం చెల్లిస్తామనే నిబంధనలు ఉంటాయి. వాటి ని కూడా పరిశీలించి సమ్మతం అనుకుంటేనే ముందుకు వెళ్లాలి. రీస్టోరేషన్ సదుపాయం ఉదాహరణకు రూ.5 లక్షలకు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకున్నారనుకోండి. ఒక ఏడాదిలో ఎవరైనా ఆస్పత్రి పాలై బిల్లు రూ.5 లక్షలకు మించితే అప్పుడు మరో రూ.5 లక్షలు ఆటోమేటిక్గా కవర్ను బీమా సంస్థ విడుదల చేస్తుంది. ఇదే రీస్టోరేషన్ బెనిఫిట్. ఒకరికి మించి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చి బిల్లు సమ్ ఇన్సూర్డ్ మొత్తం దాటిపోయిన సందర్భాల్లోనూ ఇది ఆదుకుంటుంది. అయితే ఈ రీస్టోరేషన్ బెనిఫిట్ను ఒక ఏడాదిలో అప్పటికే చికిత్స పొందిన సమస్య కోసం చాలా బీమా సంస్థలు అందించడం లేదు. అంటే పాలసీదారు వేరొక సమస్య కోసం రీస్టోరేషన్ను పొందొచ్చు. ఏ సమ స్య అయిన రీస్టోరేషన్ను అనుమతించే పాలసీ మంచి ఎంపిక. కోపే ఆప్షన్ ఆస్పత్రి బిల్లులో పాలసీదారు ఎంత పెట్టుకోవాలన్నది ఇందులో ఉంటుంది. కొన్ని పాలసీల్లో కోపే షరతు ఉంటోంది. ఇలా ఉన్న పాలసీల ప్రీమియం కొంత తక్కువగా ఉంటుంది. సూపర్ టాపప్..: హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని పెంచుకునేందుకు సూపర్ టాపప్ లేదా టాపప్ పేరుతో ఉండే ప్లాన్ను కొనుగోలు చేసుకోవచ్చని నిపుణుల సూచన. బేసిక్ హెల్త్ కవరేజీకి యాడాన్గా (జోడింపుగా) ఈ ప్లాన్ తక్కువ ప్రీమియానికే లభిస్తుంది. -
త్వరలో జాతీయ సైబర్ సెక్యూరిటీ పాలసీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది. సైబర్ నేరాలను అరికట్టాలనే ఉద్దేశంతో నూతన సైబర్ సెక్యూరిటీ పాలసీను రూపొందిస్తున్నట్లు జాతీయ సైబర్ సెక్యూరిటీ కోఆర్డీనేటర్ రాజేష్ పంత్ తెలిపారు. సైబర్ సెక్యూరిటీ సమ్మిట్ 2020లో రాజేష్ పంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మూడు నెలల్లో సైబర్ పాలసీకి చెందిన విధానాల రూపకల్పన పూర్తవుతుందని తెలిపారు. సైబర్ నేరాలు జరిగే అవకాశాలు ఉన్న దేశాలలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. సైబర్ నేరాలు ఎక్కువయితే జీడీపీపై వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలోని ప్రజలకు మెరుగైన సేవలందిస్తు సమాచారాన్ని భద్రపరచడం అంత సులువు కాదని రైల్వే ఉన్నతాధికారి విజయ్ దేవ్నాథ్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని రక్షణశాఖ సలహాదారు అమిత్ శర్మ పేర్కొన్నారు. -
సింహాల గణనకు కొత్త విధానం
డెహ్రడూన్: దేశంలో సింహాల సంఖ్యను లెక్కించేందుకు శాస్త్రవేత్తలు కొత్త విధానాన్ని కనుగొన్నారు. దీంతో వాటి సంరక్షణ చర్యలు సమర్థంగా చేపట్టొచ్చని చెబుతున్నారు. సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా గుజరాత్లోని గిర్ అడవుల్లో ఉన్న 50 ఆసియా సింహాల సంఖ్య ప్రస్తుతం 500 వరకు పెరిగినట్లు వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన కేశబ్ వివరించారు. ప్రస్తుతం ఉన్న లెక్కింపు విధానాల వల్ల కొన్ని సింహాలను లెక్కించకపోవచ్చు. లేదా డబుల్ కౌంటింగ్ జరగొచ్చు.. దీనివల్ల వాటి సంఖ్య వివరాలు పరిమితంగానే తెలుస్తాయి. అందుకే ఆయన సహచరులు కలసి కంప్యూటర్ ప్రోగ్రాం ఉపయోగించి లెక్కించే కొత్త విధానాన్ని రూపొందించారు. ఈ విధానంలో సింహం ముఖంపై ఉన్న మీసాలు, శరీరంపై ఉన్న మచ్చల ఆధారంగా గుర్తిస్తారు. సింహాల ఆహార లభ్యత, ఇతర కారకాలు సింహాల సంఖ్యను ప్రభావితం చేసే అవకాశం ఉందని కేశబ్ చెప్పారు. తాజా అధ్యయనంలో గిర్ అడవుల్లో 368 సింహాల్లో 67 సింహాలను 725 చదరపు కి.మీ.ల విస్తీర్ణంలో గుర్తించారు. -
కొత్త అధ్యయానికి కేసీఆర్ తెర
-
ఒక ఆవరణలో ఒకటే బడి!
సాక్షి, హైదరాబాద్: ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒకే స్కూల్. ఎక్కువ మంది విద్యార్థులు.. సరిపడా టీచర్లు.. మౌలిక వసతుల సద్వినియోగం.. తద్వారా మెరుగైన విద్యా బోధన అనే కొత్త ప్రణాళికపై విద్యా శాఖ దృష్టి సారించింది. అమలు సాధ్యాసాధ్యాలపై ఆలోచనలు చేస్తోంది. అయితే అన్ని స్కూళ్లలో కాకుండా కనీసం ఒకే ఆవరణలో (50 మీటర్లలోపు) ఒకటికి మించి ఉన్న స్కూళ్లను కలిపేసి ఒకే స్కూల్గా చేయొచ్చా..? సాంకేతిక సమస్యలేమైనా వస్తాయా..? ఉపాధ్యాయ సంఘాల నుంచి ఎలాంటి వాదన వస్తుందన్న కోణంలోనూ ఆలోచనలు చేస్తోంది. ఇది కనుక కార్యరూపం దాల్చితే దాదాపు 3 వేల ప్రభుత్వ పాఠశాలలు తగ్గి, 23 వేలకు పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఒకే ఆవరణలో రెండు, మూడు.. ప్రస్తుతం రాష్ట్రంలో 26,050 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో ఒకే ఆవరణలో రెండు మూడు స్కూళ్లు కొనసాగుతున్న పాఠశాలలు 7,077 ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఆవరణల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, మరికొన్నింటిలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు వేర్వేరు స్కూళ్లు కొనసాగుతున్నాయి. దీంతో ఆయా స్కూళ్లలో ఇద్దరు ముగ్గురు ప్రధానోపాధ్యాయులు, ఇద్దరు ముగ్గురు పీఈటీలు ఉండటంతో మానవ వనరులు వృథా అవుతున్నట్లు విద్యా శాఖ దృష్టికి వచ్చింది. అయితే ఒకే ఆవరణలో ఉన్న అలాంటి స్కూళ్లను ఒకే స్కూల్గా (1 నుంచి 10 వరకు) మార్చేస్తే ఒకరే హెడ్ మాస్టర్.. ఒకరే పీఈటీ/పీడీ ఉంటారు. తద్వారా మిగతా వారి సేవలను అవసరమైన వేరే స్కూళ్లలో సద్వినియోగపరచుకునే వీలు కలుగుతుందని అధికారులు యోచిస్తున్నారు. విధానం మార్పు కుదిరేనా? ప్రస్తుతం రాష్ట్రంలో ప్రాథమిక (ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు), ప్రాథమికోన్నత (1 నుంచి 7వ తరగతి వరకు), ఉన్నత (6 తరగతి నుంచి 10వ తరగతి వరకు) మూడంచెల పాఠశాలల విధానం ఉంది. అయితే జాతీయ స్థాయిలో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ విధానం, 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సెకండరీ ఎడ్యుకేషన్ విధానం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎలిమెంటరీ, సెకండరీ విద్యా విధానం ఉండాలని గతంలో చెప్పింది. ఈ నేపథ్యంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒకే స్కూల్ విధానం సాధ్యం అవుతుందీ లేనిదీ పరిశీలించి ముందుకు వెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఒకే ఆవరణలో ఒకటికి మించి ఎక్కువ పాఠశాలలు ఉన్నవి హైదరాబాద్ జిల్లాలోనే అత్యధికంగా ఉన్నాయి. ఆ తర్వాత సంగారెడ్డి, నిజామాబాద్లో ఎక్కువగా ఉన్నట్లు విద్యాశాఖ లెక్కలు తేల్చింది. -
నూతన విధానం
-
కంపెనీ పెట్టండి..రాయితీ పట్టండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2016లో ‘ఎలక్ట్రానిక్స్ పాలసీ’ని రూపొందించింది.దీని అమలులో అనుసరించాల్సిన విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.ఎలక్ట్రానిక్స్ పాలసీ మార్గదర్శకాల ముసాయిదాను ఇటీవల సిద్ధం చేసిన ఐటీ శాఖ..త్వరలో ప్రభుత్వ ఆమోదానికి పంపనుంది. పాలసీ అమలు తేదీ.. ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ‘ఈ–పాలసీ’కి ప్రభుత్వం ఆమోదం తెలిపితే రాష్ట్రంలో ‘ఈ– పరిశ్రమల’స్థాపన వేగం కానుందని ఐటీ శాఖ అంచనా. ఇది అమల్లోకి వస్తే ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ రంగంలోని సూక్ష్మ, చిన్న, మధ్య, పెద్ద, భారీ పరిశ్రమలకు లబ్ధి చేకూరుతుంది. స్టాంప్ డ్యూటీ చెల్లింపు, సరసమైన ధరల్లో భూ కేటాయింపు, నాలా నిబంధనల సడలింపు, గరిష్టంగా రూ.50 లక్షలకు మించకుండా పెట్టుబడి రాయితీ వంటి అంశాలు మార్గదర్శకాల్లో పొందుపరిచారు. కంపెనీ ఏర్పాటుకు భూమి కొంటే... ఎలక్ట్రానిక్స్ కంపెనీల ఏర్పాటుకు భూమి కొనుగోలు చేసే సంస్థకు వంద శాతం స్టాంప్ డ్యూటీతో పాటు, బదలాయింపు పన్ను,, రిజిస్ట్రేషన్ ఫీజును ప్రభుత్వం రీయంబర్స్ చేస్తుంది. ఒక వేళ అది రెండో లావాదేవీ అయ్యే పక్షంలో పైన పేర్కొన్న వాటిలో 50శాతం ప్రభుత్వం చెల్లిస్తుంది. అలాగే షెడ్లు, భవనాలు తదితరాలపైనా స్టాంప్ డ్యూటీని పూర్తిగా మినహాయిస్తారు.పరిశ్రమల స్థాపనకు వీలుగా భూములు అందుబాటు ధరల్లో లభించేలా చూడటంతో పాటు, లీజుకు తీసుకుని ఏర్పాటు చేసే సంస్థలకు పదేళ్ల పాటు 25% లీజ్ రెంటల్ సబ్సిడీ ఇస్తారు. మహేశ్వరంలోని ‘ఈ– సిటీ’లో ఏర్పాటయ్యే తొలి 30 పరిశ్రమలకు భూమి కొనుగోలుపై 60% సబ్సిడీ లభించనుంది. ఎలక్ట్రానిక్స్ కంపెనీలు స్థాపించే ప్రైవేటు సంస్థలకు వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకునేందుకు అవసరమైన ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. పెట్టుబడిపై గరిష్టంగా రూ.50 లక్షల రాయితీ సూక్ష్మ, చిన్న తరహా కేటగిరీలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు ఏర్పాటు చేసే తొలి 50 సంస్థలకు 20శాతం పెట్టుబడి రాయితీ లేదా గరిష్టంగా 50లక్షల రాయితీ ఇవ్వాలని ముసాయిదాలో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 35%, మహిళా పారిశ్రామికవేత్తలకు 45% వరకు పెట్టుబడి రాయితీ కల్పిస్తారు. మధ్య, పెద్ద, భారీ తరహా పరిశ్రమల కేటగిరీలో అర్హత కలిగిన తొలి 25 పరిశ్రమలకు 20 % రాయితీ లేదా గరిష్టంగా రూ.2 కోట్ల మేర రాయితీ లభిస్తుంది. భవనం, యంత్రాలపై పెట్టుబడికి గాను ఆయా పరిశ్రమలు వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించింది మొదలు ఐదు నుంచి ఏడేళ్ల వరకు కేటగిరీ ఆధారంగా ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం రాయితీ ఇస్తారు. సూక్ష్మ పరిశ్రమలు యంత్రాలపై పెట్టే మొత్తంలో 10% సాయాన్ని ప్రభుత్వమే అందజేయనుంది. నాణ్యత సర్టిఫికెట్ల వ్యయంపైనా సబ్సిడీ ఉత్పత్తులకు గాను చైనా కంపల్సరీ సర్టిఫికెట్, కన్ఫర్మిటీ యూరోపియన్, యూఎల్ సర్టిఫికెషన్, ఐఎస్ఓ తదితర అంతర్జాతీయ నాణ్యత సర్టిఫికెట్ల కోసం ఈ పరిశ్రమలు పెట్టే ఖర్చులో 50శాతం లేదా గరిష్టంగా రూ.2లక్షలను ప్రభుత్వమే భరిస్తుంది. క్లీన్ ఎనర్జీ వినియోగించే పరిశ్రమలకు గరిష్టంగా రూ.2లక్షలు రాయితీ ఇవ్వడంతో పాటు, వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించిన నాటి నుంచి ఐదేళ్ల పాటు వంద శాతం విద్యుత్ సుంకంపై మినహాయింపు ఇస్తారు. తెలంగాణ కేంద్రంగా ఉండే ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు పేటెంట్ల సాధన కోసం ఖర్చులో 50% లేదా గరిష్టంగా రూ.2లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది. విడి భాగాల రవాణాకు అయ్యే వ్యయంపైనా ఐదేళ్ల పాటు గరిష్టంగా 60% నుంచి 20% వరకు సబ్సిడీ కల్పిస్తారు. 50 మందికి ఉపాధి కల్పించే ‘ఈ పరిశ్రమలకు’రూ.5లక్షలను రిక్రూట్మెంట్ అసిస్టెన్స్గా ఐటీ శాఖ అందజేయనుంది -
మాకో వైన్స్ కావాలి..!
సిరిసిల్ల: మరో పన్నెండు రోజుల్లో మద్యం లైసెన్స్ల గడువు ముగియనుంది. ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీ ఏవిధంగా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొందరు వ్యాపారులు, యువకులు సైతం ఈసారి మద్యం లైసెన్స్లు పొందేందుకు జతకడుతున్నారు. జిల్లాలో 42 మద్యం దుకాణాలు ఉండగా.. వీటికి 2017 సెప్టెంబరులో లైసెన్స్ జారీచేశారు. అదే ఏడాది అక్టోబరు ఒకటే తేదీన వైన్స్లు తెరిచారు. కలిసొచ్చిన ఎన్నికలు.. మద్యం వ్యాపారులకు గతరెండేళ్లు కలిసి వచ్చింది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలతో పాటు, గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పార్ల మెంట్ ఎన్నికలు వరుసగా రావడంతో మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. జిల్లాలో 42 దుకాణాలు ఉండగా.. రెండేళ్లలో రూ.560. 50 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో 8,29,882 ఐఎంఎల్ బాక్స్లు, 17,27,113 బీర్ బ్యాక్స్లు అమ్ముడుపోయాయి. సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సర్కిళ్లు ఉన్నాయి. ఊరూరా కిక్కు.. జిల్లాలోని 42 మద్యం దుకాణాలకు అనుబంధంగా అనేక గ్రామాల్లో బెల్ట్ షాపులు తెరిచారు. సుమారు వెయ్యికిపైగా బెల్ట్షాపులు ఉన్నాయని తెలుస్తోంది. ఎల్లారెడ్డిపేటలోని ఓ వైన్స్లో రెండేళ్లలో రూ.23.05 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 25.1 శాతం అమ్మకాలతో టాప్లో నిలిచింది. ఎల్లారెడ్డిపేట, రాచర్ల గొల్లపల్లి వైన్స్ షాపుల్లోనూ వరుసగా రూ.18.80కోట్లు, రూ.18.77 కోట్లతో రెండు, మూడు స్థానంలో నిలిచాయి. ఇల్లంతకుంటలోని ఓ వైన్స్ షాప్లో రూ.17.54కోట్ల మద్యం విక్రయించి నాలుగో స్థానం దక్కించుకుంది. సిరిసిల్ల, తంగళ్లపల్లి, గంభీరావుపేట వైన్స్ షాపులు వరుసగా పదో స్థానం వరకు ఉన్నాయి. వేములవాడలో ఓ వైన్స్ షాపు రూ.14.50 కోట్ల మద్యం విక్రయించి 11వ స్థానంలో ఉండగా రెండేళ్లలో రూ.10 కోట్లలోపు మద్యం విక్రయించి వేములవాడలోని ఓ మూడు వైన్స్ షాపులు చివరిస్థానంలో నిలిచాయి. కొత్త పాలసీపై కోటి ఆశలు వచ్చే అక్టోబర్ ఒకటి నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానుంది. దరఖాస్తు ఫీజు, ఈఎండీలో ఏమైనా మార్పులు ఉంటాయా అనే ఉత్కంఠ లిక్కర్ వ్యాపారుల్లో నెలకొంది. ఇప్పటికే మద్యం వ్యాపారులు సన్నిహితులతో జతకడుతూ సిండికేట్గా మారుతున్నారు. 10 మంది జతగా ఉండి దరఖాస్తు చేసుకుని ఏ ఒక్కరికి లక్కీ డ్రాలో మద్యం షాపు వచ్చినా అందరూ పంచుకునేలా ఒప్పందాలు చేసు కుంటున్నారు. రెండేళ్ల క్రితం ఆబ్కారీ పాలసీ దరఖాస్తు ఫీజు రూ.లక్ష ఉండగా, ఈఎండీ లైసె న్స్ ఫీజులో 10 శాతం ఉంది. అంటే మండల కేంద్రాల్లో రూ.4.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.50లక్షలు నిర్దేశించారు. జనాభా ప్రాతిపదికన ఆబ్కారీ విధానం రూపొందించారు. గతంలో జిల్లాలోని 42 వైన్స్ షాపులకు 672 దర ఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.6.72 కోట్ల ఆదాయం సమకూరింది. లిక్కర్కు ‘రియల్’ ఎఫెక్ట్... జిల్లాలో మద్యం వ్యాపారంపై రియల్ ఎస్టేట్ భూం ప్రభావం ప్రధానంగా ఉంటుంది. సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ దందా ఎక్కువగా ఉంది. భూముల ధరలు పదింతలు అవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీ ఎత్తున లిక్కర్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం గా ఉన్నారు. కొత్త ఎక్సైజ్ పాలసీ రాగానే రూ. కోట్లు కుమ్మరించేందుకు సిద్ధమవుతున్నారు. రెండు, మూడు రోజుల్లో కొత్త ఆబ్కారీ విధానానికి నోటిఫికేషన్ వెలువడుతుందని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. ఈసారి అన్ని వైన్స్ లకు భారీగా పోటీ ఉంటుందని భావిస్తున్నారు. -
బేటీ, జల్ ఔర్ వన్..
పట్నా: ‘అన్నిటి కంటే పెద్ద ఆస్తులు– కూతురు, నీరు, అడవి’(సబ్సే బడా ధన్..బేటీ, జల్ ఔర్ వన్)..ఇది బీజేపీ కొత్త నినాదం. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా దేశ మంతటా బీజేపీ దీనిని వారం పాటు అమలు చేయనుంది. ‘బేటీ బచావో, బేటీ పఢావో’ కార్యక్రమం బీజేపీ జాతీయ కన్వీనర్ రాజేంద్ర ఫడ్కే పట్నాలో మాట్లాడుతూ..ప్రభుత్వం చేపట్టిన ‘బేటీ బచావో, బేటీ పఢావో’కార్యక్రమానికి ప్రోత్సాహం ఇచ్చేందుకు ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా దీనిని అమలు చేయనున్నామన్నారు. ప్రధాని జన్మదినం ఈ నెల 17వ తేదీ కాగా, ఈ కార్యక్రమం ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు సేవా సప్తాహంగా చేపడతామన్నారు. ‘ఇందులో భాగంగా ఆడపిల్ల పుట్టిన ప్రాంతంలో, ముఖ్యంగా నిరుపేదలుండే చోట బీజేపీ కార్యకర్తలు స్వీట్లు పంచి, ఒక మొక్కను నాటుతారు. నీటి సంరక్షణ ప్రాధాన్యం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరిస్తారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించరాదని అవగాహన కల్పిస్తారు. ఈ ప్రచార కార్యక్రమం దేశంలోని అన్ని జిల్లాలు, అన్ని బ్లాకుల్లోనూ జరుగుతుంది’ అని వివరించారు. గత ఐదేళ్లలో ‘బేటీ బచావో, బేటీ పఢావో’కార్యక్రమం వల్ల బిహార్ వంటి రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి మెరుగైందన్నారు. -
ఇళ్ల స్థలాల కేటాయింపుపై మంత్రుల కమిటీ
సాక్షి, అమరావతి : ప్రభుత్వ ఉద్యోగులు, అడ్వకేట్లు, జర్నలిస్టులతో పాటు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించే అంశంపై ఏపీ ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్గా డిప్యూటీ సీఎం పల్లి సుభాష్ చంద్రబోస్ను నియమించింది. సభ్యులుగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వం జోవో జారీ చేసింది. పుజారులు, ఇమామ్లు, పాస్టర్లకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు విధివిధానాలను రూపొందించి నివేదిక అందించాల్సిందిగా ఉపసంఘానికి ప్రభుత్వం ఆదేశించింది. -
పెళ్లి వేడుకకూ పరిమితులు
‘నా పెళ్లి.. నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను’అంటే కుదరదంటోంది ఢిల్లీ ప్రభుత్వం. పెళ్లి ఎక్కడ చేసుకోవాలో, ఎంత మందిని పిలవాలో, అతిథులకు ఏం పెట్టాలో.. .మిగిలిన ఆహారాన్ని ఏం చెయ్యాలో... అన్ని తామే చెబుతామంటోంది. తమ మాట పాటించకపోతే భారీగా జరిమానా కూడా వసూలు చేస్తామని స్పష్టం చేస్తోంది. ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వం ఒక ముసాయిదా విధానాన్ని కూడా తయారు చేసింది. కోట్లు ఖర్చు పెట్టి అట్టహాసంగా, ఆడంబరంగా పెళ్లి తదితర వేడుకలు జరుపుకోవడం ఈ మధ్య మామూలైంది. వీటివల్ల యజమానులకు కలిగే సంతోషాన్ని పక్కన పెడితే బోలెడు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లిళ్లలో బోలెడు ఆహారం వృథా అవుతోందని, వేడుకల్లో వాడే వస్తువులు, పదార్థాల వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని, ఇరుగుపొరుగులకు ఇబ్బందులు కలుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. దాంతో సుప్రీంకోర్టు రాజధానిలో వేడుకల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు రూపొందిం చాలని ఆదేశించింది. ఆ మేరకు ఢిల్లీ సర్కారు ఈ ముసాయిదాను తయారు చేసింది. ‘పాలసీ ఫర్ హోల్డింగ్ సోషల్ ఫంక్షన్స్ ఇన్ హోటల్స్, మోటల్స్ అండ్ లో డెన్సిటీ రెసిడెన్షియల్ ఏరియా (ఎల్డీఆర్ఏ) ఇన్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ’పేరుతో రూపొందించిన ఈ ముసాయిదాను సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆమోదించింది కూడా. దాని ప్రకారం.. ► పెళ్లిళ్లు, వేడుకల్లో మిగిలిపోయే, వృథా అయ్యే ఆహారాన్ని ఏదైనా స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో)ద్వారా అన్నార్థులకు పంచిపెట్టాలి. ఇందుకోసం కేటరర్లు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్ల యాజమాన్యాలు ఎన్జీవోల దగ్గర తమ పేర్లు నమోదు చేసుకోవాలి. ఆహారాన్ని ఎలాపడితే అలా కాకుండా చక్కగా, పార్సిళ్లలోనో, డబ్బాల్లోనో ఎన్జీవోలకు అందజేయాలి. ► హోటళ్లు, ఫంక్షన్ హాళ్ల యాజమాన్యాలు, కేటరర్లు,నిర్వాహకులు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఆహార భద్రత విభాగం నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి.అలాంటి వారే వేడుకలకు భోజనాలు తయారు చేయడం, సరఫరా చేయడం వంటివి చేయాలి. ► వేడుక నిర్వహించే ప్రాంతం విస్తీర్ణాన్ని బట్టి అతిథులను పిలవాలి. ఎక్కడ ఎంత మందిని పిలవాలన్నది సంబంధిత పట్టణ స్థానిక సంస్థ నిర్ణయిస్తుంది. ఆ పరిమితికి మించి అతిథులను పిలవడానికి వీల్లేదు. ► ఎంత మంది అతిథులను పిలుస్తామో వారికి సరిపడేంత ఆహారం మాత్రమే సిద్ధం చేయాలి. పిలిచిన వాళ్లంతా రాకపోవడం లేదా ఇతరేతర కారణాల వల్ల ఆహారం మిగిలితే వేడుక పూర్తయిన వెంటనే మిగులు ఆహారాన్ని వెంటనే ఫంక్షన్ హాలు నుంచి తొలగించాలి. ఆ బాధ్యత హాలు యాజమాన్యానిదే. ► ఫంక్షన్ హాలులో పార్కింగ్ ప్రదేశంలో ఎన్ని కార్లు నిలపవచ్చో ఆ సంఖ్యను నాలుగుతో గుణిస్తే ఎంత వస్తుందో అంత మంది అతిథులను మాత్రమే ఆహ్వానించాలి. అంటే 20 కార్లు పట్టేంత స్థలం ఉంటే 80 మందినే పిలవాలన్నమాట. లేదా హాలు విస్తీర్ణాన్ని 1.5 చదరపు మీటర్లతో భాగిస్తే ఎంత వస్తుందో అంత మందినే పిలవాలి. ఈ రెండింటిలో ఏది తక్కువయితే దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ► రెండున్నర అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో కట్టిన హాళ్లలోనే ఇలాంటి వేడుకలు నిర్వహించుకోవాలి. ఈ హాళ్లు రోడ్డు చివర(డెడ్ ఎండ్) ఉండకూడదు. ఈ భవనాలకు ప్రధాన రహదారితో కలుపుతూ 60 అడుగుల రోడ్డు సదుపాయం ఉండాలి. ► పర్యావరణానికి ఏ విధంగానూ ముప్పు వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వేడుకల కోసం పాక్షిక శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. హాలు బయట వాహనాలు నిలపకూడదు. నీటిని పొదుపుగా వాడాలి.చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారేయొద్దు. పెద్ద శబ్దాలు చేయకూడదు. ► ఈ నిబంధనలను పాటించాలి. లేనిపక్షంలో 15 లక్షల వరకు జరిమానా కట్టాలి. మొత్తం జరిమానాను కేవలం హాళ్ల యాజమాన్యం కట్టాలి. వేడుకలు జరుపుకునే వారికి సంబంధం లేదు. -
చెప్పిన మాట ప్రకారమే పెన్షన్
సాక్షి, అమరావతి: చెప్పిన మాట ప్రకారం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా పెన్షన్ను సోమవారం నుంచి రూ.2,250కు పెంచుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం పింఛన్దారులకు లేఖ రాశారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఈ లేఖ ప్రతులను పింఛన్దారులకు అందజేయనున్నారు. పెంచిన పింఛన్ను అర్హులందరికీ అందజేస్తామని వైఎస్ జగన్ ఉద్ఘాటించారు. లేఖలోని వివరాలు... ప్రియమైన అవ్వాతాతలకు, అక్కాచెల్లెళ్లకు, దివ్యాంగ సోదర సోదరీమణులకు.. మీ కష్టాలు చూశాను. మీ బాధలు విన్నాను. మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నా. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అని చెప్పిన మాట ప్రకారం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు(సోమవారం) నుంచి మీ పెన్షన్ను రూ.2,250కు పెంచుతున్నాం. పెంచిన పెన్షన్లను వైఎస్సార్ పెన్షన్ కానుక కింద అందిస్తున్నాం. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధి బాధితులకు ఈ పెంపు వర్తిస్తుంది. నాలుగు నెలల క్రితం వరకు రూ.1,000 మాత్రమే అందిన పెన్షన్ను రూ.3,000 వరకు పెంచుకుంటూ పోతాం. దివ్యాంగులకు నెలకు రూ.3,000 చొప్పున పంపిణీ చేస్తున్నాం. కిడ్నీ బాధితులకు పెన్షన్ మొత్తాన్ని నెలకు రూ.10,000కు పెంచాం. ఈ సందర్భంగా అవ్వాతాతలకు, అక్కా చెల్లెళ్లకు, దివ్యాంగ సోదర సోదరీమణులందరికీ హామీ ఇస్తున్నా. ఇకపై మీకు జన్మభూమి కమిటీల వేధింపులు ఉండవు. పెన్షన్ మంజూరుకు గానీ, పెన్షన్ ప్రతినెలా ఇచ్చేటప్పుడు గానీ గతంలో మాదిరిగా లంచాల బాధ ఉండదు. మీ పెన్షన్ నేరుగా మీ ఇంటికే వచ్చి మీ చేతికే అందుతుంది. అంతేకాదు పెన్షన్ పొందే వయస్సును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించాం. పెన్షన్ల మంజూరు విషయంలో కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, మీరు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారని కూడా చూడం. పెంచిన పెన్షన్ను అర్హులందరికీ ఇస్తాం. ఈ పెన్షన్ను రూ.3,000 వరకూ తీసుకుపోతాం.’’ -
గజం వందనే..!
సాక్షి,ఆదిలాబాద్: టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు కోసం అప్పట్లో రెవన్యూ అధికారులు నిర్ధారించిన ధర కోట్ల నుంచి లక్షల రూపాయలకు దిగొచ్చింది. గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీలు అన్నీ జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి చదరపు గజానికి రూ.100 చొప్పున ఎకరంలోపు స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీ కారణంగా ఈ ధర దిగి వచ్చింది. ఎకరంలోపు.. అధికార పార్టీ టీఆర్ఎస్ అన్ని జిల్లాల్లో సొంత పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని గతేడాదే నిర్ణయించింది. జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేసి కనీసం ఎకరం స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మించుకోవాలని గతేడాది పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఇందుకు అనుగుణంగా టీఆర్ఎస్ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు జీఓ నెం.571 ప్రకారం ఆదిలాబాద్ జిల్లా రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. గుర్తించిన భూమి... ఆదిలాబాద్ అర్బన్ పరిధిలోకి వచ్చే సర్వే నెం.346లో 36 గుంటల స్థలాన్ని గుర్తించారు. ఇది ఎకరానికి నాలుగు గుంటల స్థలం తక్కువగా ఉంది. పట్టణంలోని గాంధీ పార్కు, పాలశీతలీకరణ కేంద్రానికి ఎదురుగా కైలాస్నగర్లో వైట్ క్వార్టర్స్లో ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేశారు. ఇది వరకు ఈ స్థలంలో దూరదర్శన్ రిలే కేంద్రం ఈ స్థలంలో ఉండేది. ప్రస్తుతం న్యాక్ శిక్షణ కేంద్రం కొనసాగుతోంది. శిథిలావస్థలో చిన్న భవనం మాత్రమే ఉంది. దీనిని ఆనుకొని వైట్ క్వార్టర్స్ ఉన్న స్థలం కలుపుకొని మొత్తం 36 గుంటల స్థలాన్ని గతేడాది గుర్తించారు. జెడ్పీ చైర్మన్ క్యాంప్ కార్యాలయం తర్వాత ప్రస్తుతం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కూడా ఇదే దారిలో కడుతున్నారు. కలెక్టర్, ఎస్పీ, జేసీ, న్యాయమూర్తుల క్వార్టర్స్, డీఆర్వో, ఇతరత్ర ముఖ్యమైన ఉన్నతాధికారుల భవనాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. పార్టీ కార్యాలయం కోసం అనువుగా ఉంటుందని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఈ స్థలాన్ని ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. అప్పుడు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి, ప్రస్తుత ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, డెయిరీ డెవలప్మెంట్ రాష్ట్ర చైర్మన్ లోక భూమారెడ్డిలు ఈ స్థలాన్ని ఎంపిక చేశారు. అప్పట్లో ఆదిలాబాద్అర్బన్ తహసీల్దార్ నుంచి ఆర్డీఓ ద్వారా కలెక్టర్ కార్యాలయానికి దీనికి సంబంధించిన పత్రాలను పంపించారు. కలెక్టర్ నుంచి సీసీఎల్ఏకు వెళ్లిన ఫైల్ చివరిగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడంతో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భూమి కేటాయింపు జరిగింది. అప్పట్లో ధర వివాదం.. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గుర్తించిన స్థలం కేటాయింపునకు సంబంధించి రెవెన్యూ యంత్రాంగం 2018లో ప్రభుత్వానికి పంపించిన ఓపెన్ మార్కెట్ ధర అప్పట్లో చర్చనీయాంశమైంది. అప్పట్లో గుంటకు రూ.10లక్షల చొప్పున మొత్తం 36గుంటలకు రూ.3.65 కోట్లు నిర్ధారించి పంపడం వివాదానికి కారణమైంది. ధర విషయంలో రెవెన్యూ అధికారులపై టీఆర్ఎస్ వర్గాలు భగ్గుమన్నాయి. అయితే ప్రభుత్వ బేసిక్ విలువపై ఎన్నో స్థాయిల రెట్టింపులో ఈ ధరను నిర్ధారించినట్లు పార్టీ వర్గాలు మండిపడ్డాయి. అంత ధరనా.. అని టీఆర్ఎస్ ముఖ్యనేతలు రెవెన్యూ అధికారులపై ఫైర్ అయ్యారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పట్టణంలో ముఖ్యమైన కూడలిలోని ఈ స్థలం అంశం అప్పట్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదిలా ఉంటే అప్పట్లో జేసీగా ఉన్న కృష్ణారెడ్డి బదిలీ అయ్యే ముందు ధర విషయంలో ఓపెన్ మార్కెట్ ధరను ప్రభుత్వానికి పంపించారు. దీంతో ఈ వివాదానికి అప్పట్లో కారణమైంది. ఆ తర్వాత ఆయన బదిలీపై వెళ్లిపోయిన విషయం విధితమే. తాజాగా ఉత్తర్వులు.. జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల ఏర్పాటుకు ఒక్కో ఎకరం చొప్పున స్థలాలు కేటాయిస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేష్ తివారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీలు అన్ని జిల్లాకేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి చదరపు గజానికి రూ.100 చొప్పున ఎకరంలోపు స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం ఈ కొత్త పాలసీ తీసుకొచ్చింది. దాని ప్రకారం తాజాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 36 గుంటల స్థలాన్ని రూ.4,35,600 లకు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేటాయించారు. నేడు భూమిపూజ.. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి గుర్తించిన స్థలంలో సోమవారం భూమిపూజ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు కేటాయించిన స్థలంలో భూమిపూజ జరగనుండడం విశేషం. ఆదిలాబాద్లో జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే జోగురామన్న, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ లోక భూమారెడ్డిలతో పాటు ఇటీవల ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. -
ఏపీ ఇసుక విధానం ఖరారు
-
‘డాలర్’ డ్రీమ్ ఇక చౌకే!!
అమ్మబోతే అడవి. కొనబోతే కొరివి!!. ఈ సామెత బ్యాంకుల్లో డాలర్ లావాదేవీలు జరిపే రిటైల్ కస్టమర్లకు అనుభవంలోకి వస్తుంటుంది. బ్యాంకులు విదేశీ కరెన్సీని కస్టమర్కు అమ్మేరేటుకు, వారి నుంచి కొనే రేటుకు మధ్య బోలెడు వ్యత్యాసం ఉంటుంది. ఇకపై బ్యాంకుల ఈ భారీ బాదుడుకు ఆర్బీఐ చెక్ చెబుతోంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఫారిన్ కరెన్సీ (ఫారెక్స్) లావాదేవీలు జరిపే వీలును రిటైల్ కస్టమర్లకు ఆర్బీఐ కల్పించనుంది. టూరిస్టు వీసా వచ్చిందని, చదువులకని, ఉద్యోగాలకని ఏటా ఇండియా, అమెరికా మధ్య లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ఇలా అమెరికా యాత్ర పెట్టుకున్నవాళ్లంతా రూపాయలను డాలర్లలోకి మార్చుకోవడం, అక్కడ నుంచి వచ్చాక డాలర్లను రూపాయల్లోకి మార్చుకోవడం తప్పని సరి కార్యక్రమమనే చెప్పాలి. అమెరికాయే కాదు. విదేశాల్లో దాదాపు ఎక్కడికెళ్లినా అంతర్జాతీయ కరెన్సీగా డాలర్ చెల్లుతుంది కనుక... అక్కడ లోకల్ కరెన్సీని తీసుకోవాలన్నా డాలర్తో ఈజీ కనుక అంతా డాలర్లవైపే మొగ్గుతారు. ఈ డాలర్లకున్న క్రేజ్ దృష్టిలో ఉంచుకొని బ్యాంకులు ఇలాంటి కస్టమర్లకు డాలర్లు అమ్మేటప్పుడు భారీ ప్రీమియంలు వసూలు చేస్తుంటాయి. కస్టమర్లు డాలర్లు కొనుగోలు చేసే సమయంలో ఎక్చేంజ్ రేట్పై దాదాపు 2 శాతం ప్రీమియంతో విక్రయించడం, అదే కస్టమర్లు డాలర్లను విక్రయించడానికి వచ్చినప్పుడు ఎక్చేంజ్ రేటుపై దాదాపు 2 శాతం డిస్కౌంట్తో కొనుగోలు చేయడం బ్యాంకులకు పరిపాటిగా మారింది. ఒకవేళ కస్టమరు క్రెడిట్కార్డు ద్వారా డాలర్ కొనాలంటే మరో 3 శాతం ప్రీమియం చెల్లించుకోవాల్సి వస్తుంటుంది. ఇలాంటి కస్టమర్ కష్టాలకు త్వరలో విముక్తి లభించనుంది. ఫారెక్స్ మార్పిడి విషయంలో బ్యాంకులు విధించే భారీ మార్జిన్ల కారణంగా నష్టపోతున్న కస్టమర్లకు త్వరలో ఊరట కలగనుంది. వచ్చే ఆగస్టు నుంచి రిటైల్ కస్టమర్లకు దాదాపు ఎక్చేంజ్ రేటుకు సమానంగానే బ్యాంకులు డాలర్లను అమ్మడం, కొనడం చేయాల్సి ఉంటుంది. అంతేకాక బ్యాంకులన్నీ ఈ అమ్మకాలు, కొనుగోళ్లను ఒకే ఉమ్మడి ఆన్లైన్ ప్లాట్ఫామ్పై చేయాల్సి ఉంటుంది. రెండేళ్లకు కార్యరూపం రిటైల్ కస్టమర్లకు బ్యాంకులు వసూలు చేసే భారీ మార్జిన్ల నుంచి ఊరట కలిగించాలని 2017లోనే ఆర్బీఐ నిర్ణయించింది. 2017 అక్టోబర్లో దీనికి సంబంధించి చర్చాపత్రం విడుదల చేసింది కూడా. తరవాత క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో (సీసీఐఎల్) కలిసి రిటైల్ ఇన్వెస్టర్లకు ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ను రూపొందించింది. తొలుత ఆరంభంలో వెయ్యి డాలర్లు, తర్వాత ప్రతిసారీ 500 డాలర్ల చొప్పున ఈ ప్లాట్ఫామ్పై అమ్మకాలు, కొనుగోళ్లకు అవకాశం కల్పించాలని ఆర్బీఐ భావించింది. కానీ ఎంత మొత్తాన్నయినా ఈ ప్లాట్ఫామ్పై అనుమతించాలని ఆర్బీఐ తాజాగా భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్లాట్ఫామ్పై గరిష్ఠ పరిమితి 5 లక్షల డాలర్లు. తొలుత డాలర్ల అమ్మకాలు, కొనుగోళ్లకు మాత్రమే ఈ ప్లాట్ఫామ్ ఉపయుక్తంగా ఉంటుంది. ఆ తర్వాతి దశల్లో ఇతర కరెన్సీలకు దీన్ని విస్తరిస్తారు. ఈ ప్లాట్ఫామ్పై వచ్చే రిటైల్ ఆర్డర్లన్నింటినీ కలిపి మార్కెటబుల్ లాట్స్గా మార్చి ఇంటర్బ్యాంక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తారు. దీంతో కస్టమర్లకు బ్యాంకుల మధ్యన జరిగే ఎక్చేంజ్ రేటే వర్తిస్తుంది. జూలై 1న రిజిస్ట్రేషన్లు ఆరంభం ప్లాట్ఫామ్పై కస్టమర్ల రిజిస్ట్రేషన్లు జూలై 1 నుంచి ఆరంభమవుతాయని భారత ఫారిన్ ఎక్చేంజ్ డీలర్ల సమాఖ్య తెలిపింది. ఆగస్టు 5 నుంచి ప్లాట్ఫామ్పై ట్రేడింగ్ ప్రారంభమవుతుందని సంబంధిత వర్గాల సమాచారం. ఆన్లైన్ ప్లాట్ఫామ్పై ఎక్కువమంది కస్టమర్లు పాల్గొనేందుకు ఒక నెల ముందే రిజిస్ట్రేషన్లను ఆర్బీఐ ఆరంభించిందని, ఎంత మొత్తంలో లావాదేవీలు జరపవచ్చనే విషయం ఆర్బీఐ త్వరలో నిర్ణయిస్తుందని, ఒక్క రూపాయి లావాదేవీనైనా సరే సీసీఐఎల్ సెటిల్ చేస్తుందని ఫారెక్స్ నిపుణులు చెబుతున్నారు. త్వరలో ఈ ప్లాట్ఫామ్కు సంబంధించిన యాప్ను విడుదల చేస్తారు. రిజిస్ట్రేషన్ సమయంలో కస్టమర్లు బేసిక్ సమాచారం అం దించాల్సి ఉంటుంది. సదరు కస్టమర్కు తన బ్యాంకు ట్రేడింగ్ లిమిట్ నిర్ధారిస్తుంది. ఈ పరిమితికి అనుమతి వచ్చాక కస్టమర్కు సీసీఐఎల్ లాగిన్ వివరాలు పంపుతుంది. ఈ వివరాలతో లాగినై కస్టమర్ ఆర్డర్లను ఉంచడం, కాన్సిల్ చేయడం చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఇంటర్ బ్యాంక్ ఎక్చేంజ్రేట్లు ప్లాట్ఫామ్పై కనిపిస్తుంటాయి. కస్టమర్ నేరుగా ఆ రేట్లు పొందలేడు, కొందరు కస్టమర్ల ఆర్డర్లన్నింటినీ కలిపి ఒక లాట్గా మార్చి లావాదేవీ నిర్వహిస్తారు. అందువల్ల స్పాట్ రేటుతో పోలిస్తే కస్టమర్కు వచ్చే రేటులో స్వల్పతేడా ఉండొచ్చు. దీనికితోడు కస్టమర్కు చెందిన బ్యాంకు స్వల్ప రుసుమును సదరు లావాదేవీకి వసూలు చేస్తుంది. అనంతరం కస్టమ ర్ లావాదేవీకి వచ్చిన రసీదు తీసుకొని తన బ్యాం కుకు వెళ్లి డాలర్లను తీసుకోవడం, లేదా జమ చేయడం చేస్తారు. ప్లాట్ఫామ్ను స్పెక్యులేషన్కు వినియోగించకుండా జాగ్రత్తలు చేపడతారు. -
తగ్గుతున్న ఎల్ఐసీ ఆధిపత్యం!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ మార్కెట్ వాటా 70 శాతం లోపునకు పడిపోయింది. 2018 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఎల్ఐసీ వాటా అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 71.81 శాతం నుంచి 69.36 శాతానికి తగ్గింది. ఈ వివరాలను ఐఆర్డీఏ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు బీమా సంస్థల మార్కెట్ వాటా 30.64 శాతానికి పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు బీమా కంపెనీల వాటా 28.19 శాతంతో పోలిస్తే రెండు శాతానికి పైగా ఇవి వాటాను పెంచుకున్నాయి. నూతన వ్యాపార ప్రీమియం (కొత్త పాలసీల నుంచి) విభాగంలోనూ ప్రైవేటు కంపెనీలు వృద్ధిని నమోదు చేశాయి. నూతన పాలసీల్లో 8.47 శాతం వృద్ధి నమోదు చేశాయి. అదే సమయంలో ఎల్ఐసీ కొత్త పాలసీల వృద్ధి 5.99%గా ఉంది. పాత పాలసీల రెన్యువల్ ప్రీమియంలో ఎల్ఐసీ వాటా 72.31 శాతం నుంచి క్రితం ఆర్థిక సంవత్సరంలో 69.35 శాతానికి తగ్గింది. ఎల్ఐసీ ఓపెన్ ఆఫర్కు పరిమిత స్పందన ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీ ఇచ్చిన ఓపెన్ ఆఫర్ (వాటాల కొనుగోలు) ను మైనారిటీ వాటాదారుల్లో 22 శాతం మంది వినియోగించుకున్నారు. మెజారిటీ వాటాదారులు మాత్రం ఎల్ఐసీ యాజమాన్యంపై నమ్మకంతో ఆఫర్కు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. -
త్వరలో కొత్త పసిడి విధానం
న్యూఢిల్లీ: పసిడిపై కేంద్రం ఒక సమగ్ర విధానాన్ని రూపొందిస్తోంది. త్వరలో బంగారంపై కొత్త విధానం ప్రకటించే అవకాశం ఉందని వాణిజ్యశాఖ మంత్రి సురేశ్ ప్రభు గురువారమిక్కడ తెలియజేశారు. పసిడి పరిశ్రమ వృద్ధి, ఆభరణాల ఎగుమతుల వృద్ధి ప్రధాన లక్ష్యాలతో తాజా విధాన రూపకల్పన ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం మొత్తం భారత ఎగుమతుల్లో రత్నాలు, ఆభరణాల వాటా 15 శాతంగా ఉంది. విధాన రూపకల్పనలో భాగంగా సంబంధిత వర్గాలతో రానున్న కొద్ది రోజుల్లో సమావేశం కానున్నట్లు ప్రభు తెలిపారు. పసిడిపై ప్రస్తుతం 10 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలన్న పరిశ్రమ డిమాండ్ను కూడా పరిశీలిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 100 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు లక్ష్యం.. భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) ఆకర్షించడానికి కేంద్రం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్లు మంత్రి ప్రభు తెలిపారు. వచ్చే రెండేళ్లలో 100 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు రప్పించటమనేది కేంద్రం లక్ష్యమని తెలిపారు. భారత్లో ఏ రంగాలు భారీ పెట్టుబడులను కోరుతున్నాయి? ఇందుకు ఏ దేశాల నుంచి పెట్టుబడులను పొందే అవకాశం ఉంటుంది? వంటి అంశాలపై వాణిజ్య, పరిశ్రమల పరిశ్రమల మంత్రిత్వశాఖ దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ దిశగా విదేశాలతో చర్చలకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. స్టార్టప్స్ పన్ను సమస్యల పరిష్కారం స్టార్టప్స్ పురోగతికి కేంద్రం తగిన చర్యలన్నీ తీసుకుంటుందని సురేశ్ ప్రభు తెలిపారు. ప్రత్యేకించి ఏంజిల్ ఫండ్స్ నుంచి నిధుల సమీకరణలో స్టార్టప్స్ ఎదుర్కొంటున్న పన్ను సంబంధ సమస్యలు పరిష్కరించాలని ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీని కోరినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. స్టార్టప్స్, ఏంజిల్ ఇన్వెస్టర్స్ ఎదుర్కొంటున్న పన్ను సమస్యల పరిష్కార మార్గాలను సూచించడానికి గత వారం కేంద్రం ఒక నిపుణుల కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. -
మందు కావాలా బాబూ!
ముంబై: మద్యం కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలకు, డ్రంకెన్ డ్రైవ్లకు చెక్ పెట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఓ కొత్త విధానాన్ని అమల్లోకి తేనుంది. ‘డ్రంకెన్ డ్రైవ్ ఘటనలను తగ్గించాలని నిర్ణయించాం. దీనికోసం మద్యాన్ని హోం డెలివరీ చేయాలని నిర్ణయించాం’ అని ఎక్సైజ్ శాఖ మంత్రి చంద్రశేఖర్ బవన్కులే ఆదివారం తెలిపారు. ఈ విధానం ఎప్పటి నుంచి అమలవుతుందనే విషయం వెల్లడించలేదు. దీనిపై ఓ అధికారి మాట్లాడుతూ..‘సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలోని జాతీయ రహదారుల పక్కనున్న 3వేల లిక్కర్ దుకాణాలు మూతబడ్డాయి. ఇటీవల ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడంతో ఆ ప్రభావం కూడా ఖజానాపై పడింది. దీంతో ఆదాయాన్ని పెంచుకు నేందుకు మద్యం ఆన్లైన్ విక్రయాలు, హోం డెలివరీ విధానం అమలు చేయాలని నిర్ణయించింది’ అని తెలిపారు. అయితే, మద్యపాన వ్యతిరేక ఉద్యమకారులు, ప్రతిపక్షాల తీవ్ర విమర్శలతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. మద్యాన్ని ఆన్లైన్లో విక్రయించాలనేది ఓ ప్రతిపాదన మాత్రమేనని తెలిపింది. -
న్యాయమూర్తులకు ‘నో లీవ్’ పాలసీ
సాక్షి, న్యూఢిల్లీ : పెండింగ్ కేసులు పేరుకుపోవడంతో భారత ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జస్టిస్ రంజన్ గగోయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. న్యాయమూర్తులకు పనిదినాల్లో ‘నో లీవ్’ పాలసీని ముందుకుతెచ్చారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈనెల 3న ప్రమాణ స్వీకారం చేసిన రోజే జస్టిస్ గగోయ్ న్యాయమూర్తులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ కోర్టు పెండింగ్ కేసుల క్లియరెన్స్ కోసం పనిదినాల్లో సెలవులు తీసుకోరాదనే విధాన నిర్ణయంపై సంకేతాలు పంపినట్టు సమాచారం. హైకోర్టుల్లో న్యాయమూర్తులు పనిదినాల్లో సెలవులు తీసుకోకుండా, కోర్టు రూముల్లో విధిగా హాజరుకావాలని జస్టిస్ గగోయ్ విస్పష్టంగా చెప్పినట్టు ఓ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెల్లడించినట్టు హిందుస్తాన్ టైమ్స్ పేర్కొంది. ఇక సుప్రీంలో వివిధ బెంచ్లకు కేసుల కేటాయింపు కోసం జస్టిస్ గగోయ్ నూతన రోస్టర్ను తీసుకువచ్చారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను తనతో పాటుగా తన తర్వాత సీనియర్ అయిన మదన్ బీ లోకూర్ నేతృత్వంలోని బెంచ్లు విచారణ చేపట్టాలని జస్టిస్ గగోయ్ నిర్ణయించారు. ప్రాధాన్యత, తక్షణ అవసరాలకు అనుగుణంగా కేసుల విచారణకు నూతన ప్రమాణాలను అనుసరించాలని జస్టిస్ గగోయ్ న్యాయవాదులకు సంకేతాలు పంపారు. నిర్ధిష్ట ప్రమాణాలకు అనుగుణంగా లేకుంటే కేసుల తక్షణ విచారణకు ముందుకు రావద్దని ఆయన కోరారు. -
36 క్లిష్ట ఆరోగ్య సమస్యలకు పాలసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీమా రంగ సంస్థ బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్... సోమవారం కొత్తపాలసీని ప్రవేశపెట్టింది. బజాజ్ అలయంజ్ లైఫ్ హెల్త్ కేర్ గోల్ పేరుతో రూపొందిన ఈ పాలసీ 36 రకాల క్లిష్ట ఆరోగ్య సమస్యలను కవర్ చేస్తుంది. ఒక ప్రీమియంతో ఒకే పాలసీ కింద ఆరుగురు సభ్యులున్న కుటుంబం లబ్ధి పొందవచ్చు. రూ.5 లక్షల పాలసీ తీసుకుంటే ఒక్కొక్కరికి రూ.5 లక్షల కవరేజ్ ఉంటుంది. సంప్రదాయ హెల్త్ పాలసీలతో పోలిస్తే ఇది చాలా భిన్నం. సమస్యను గుర్తిస్తూ డయాగ్నస్టిక్ సెంటర్ ఇచ్చే రిపోర్ట్ ఉంటే చాలు. బీమా మొత్తాన్ని పాలసీదారు ఖాతాలో జమ చేయడం ఈ పాలసీ ప్రత్యేకత. క్లెయిమ్ చేయనట్టయితే.. పిల్లల క్లిష్ట ఆరోగ్య సమస్యలను సైతం కవర్ చేసిన లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తమదేనని సంస్థ ఎండీ తరుణ్ చుగ్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. 36 రకాల్లో పాలసీదారుకు ఇప్పటికే ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నట్టయితే 90 రోజుల తర్వాత కవరేజ్ లభిస్తుందని చెప్పారు. 32–35 ఏళ్ల వయసున్న పాలసీదారు, ఆయన భార్య, ఇద్దరు పిల్లల కోసం రూ.6,477 చెల్లిస్తే రూ.5 లక్షల పాలసీ లభిస్తుంది. 10, 15, 20 ఏళ్ల కాలానికి పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో క్లెయిమ్ చేయనట్టయితే చెల్లించిన ప్రీమియం వెనక్కి వస్తుంది. ఈ ఫీచర్ కావాల్సినవారు సుమారు రెండింతల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. -
యూజీసీ రద్దుకు కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ: దేశంలోని ఉన్నత విద్యాసంస్థలకు నిధుల్ని అందజేస్తున్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)ను రద్దుచేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి జవదేకర్ చెప్పారు. దీనిస్థానంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(హెచ్ఈసీఐ)ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం యూజీసీ చట్టం–1951ను రద్దు చేస్తామన్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న హెచ్ఈసీఐ కోసం ముసాయిదా బిల్లును రూపొందించామన్నారు. జూలై 18 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు వర్షకాల సమావేశాల్లో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లు–2018ను ప్రవేశపెడతామన్నారు. తాజా బిల్లు ప్రకారం హెచ్ఈసీఐ కేవలం విద్యా సంబంధమైన విషయాలపై దృష్టి సారిస్తుందనీ, విద్యాసంస్థలకు గ్రాంట్లు జారీచేసే అధికారం మానవవనరుల శాఖకు దక్కుతుందని వెల్లడించారు. అలాగే, విద్యా సంస్థల స్థాపనకు అనుమతులు, నిబంధనలు పాటించని వర్సిటీలు, కళాశాలల గుర్తింపును రద్దుచేసే అధికారం హెచ్ఈసీఐకి ఉంటుందన్నారు. విద్యా ప్రమాణాల్ని మెరుగుపర్చడంలో భాగంగా హెచ్ఈసీఐ సూచనలు ఇచ్చేందుకు సలహా మండలిని ఏర్పాటు చేస్తారు. సలహా మండలిలో అన్ని రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్ల చైర్మన్లు, వైస్ చైర్మన్లు సభ్యులుగా ఉంటారని తెలిపారు. నియంత్రణ యంత్రాంగాన్ని సంస్కరించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. -
ఎక్కడి నుంచైనా పాస్పోర్ట్ దరఖాస్తు
న్యూఢిల్లీ: నివసిస్తున్న ప్రదేశంలోనే కాకుండా దేశంలో ఎక్కడి నుంచైనా పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవడానికి కేంద్రం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆరో పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం దీన్ని ప్రారంభించారు. పాస్పోర్టు దరఖాస్తు, ఫీజు చెల్లింపు, అపాయింట్మెంట్ షెడ్యూల్ తదితర సౌకర్యాలతో కూడిన ‘ఎంపాస్పోర్ట్ సేవా యాప్’ అనే మొబైల్ యాప్ను కూడా మంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ విధానం కింద.. పాస్పోర్ట్ దరఖాస్తు సమర్పించేందుకు రీజినల్ పాస్పోర్ట్ కార్యాలయం(ఆర్పీఓ), పాస్పోర్ట్ సేవా కేంద్ర(పీఎస్కే) లేదా పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్ర(పీఓపీఎస్కే)లలో దేన్నైనా ఎంచుకోవచ్చు. ఎంచుకున్న ఆర్పీఓ పరిధిలో దరఖాస్తుదారుడి నివాస స్థలం లేకున్నా కూడా అప్లికేషన్ పంపొచ్చు. దరఖాస్తు ఫారంలో పేర్కొన్న చిరునామాలోనే పోలీసు ధ్రువీకరణ జరుగుతుంది. పాస్పోర్టు మంజూరు అయిన తరువాత..సదరు ఆర్పీఓనే దరఖాస్తులోని చిరునామాకు దాన్ని పంపుతుంది. తాను విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పాస్పోర్ట్ దరఖాస్తు విధానంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, అనవసర నిబంధనలు చాలా వాటిని తొలగించామని తెలిపారు. గత 48 ఏళ్లలో 77 పాస్పోర్ట్ సేవా కేంద్రాలే ఉండగా, తాము అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో కొత్తగా 231 కేంద్రాల్ని ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 307 పీఎస్కే కేంద్రాలు పనిచేస్తున్నాయని, ప్రతి లోక్సభ నియోజకవర్గంలో కనీసం ఒక పీఎస్కే లేదా పీఓపీఎస్కేను ఏర్పాటుచేస్తామని చెప్పారు. -
ఐఏఎస్ల పనితీరు అంచనాకు కొత్త విధానం
న్యూఢిల్లీ: సీనియర్ ఐఏఎస్ల పనితీరు మదింపునకు కేంద్రం త్వరలో కొత్త విధానాన్ని తీసుకురానుంది. దీనిపై రూపొందించిన ముసాయిదాను కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులకు పంపించింది. దీని ప్రకారం.. కార్యదర్శులు, అదనపు కార్యదర్శుల స్థాయి అధికారుల పనితీరు అంచనాకు ఇతర అంశాలతోపాటు సమాజంలోని బలహీన వర్గాల ప్రజలతో వ్యవహరించేటప్పుడు వారి వైఖరిని కూడా పరిగణనలోకి తీసుకోనుంది. సమయానుకూలంగా, ప్రభావవంతంగా నిర్ణయాలు తీసుకోవటంలో వారి సామర్థ్యాన్ని లెక్కలోకి తీసుకోనుంది. విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించటం, నమ్మిన అంశాలకు ధైర్యంగా కట్టుబడి ఉండటం, వినూత్నంగా ఆలోచించటం, నాయకత్వ లక్షణాలు, సహకారం, సమన్వయం అంశాలకు సంబంధించి 50 పదాలకు మించకుండా వారి నుంచి అభిప్రాయాల్ని సేకరించనుంది. -
మెట్రోలో ప్రమాణాలకు కమిటీ
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న మెట్రోరైల్ వ్యవస్థలకు కొన్ని ప్రమాణాలను నిర్దేశించేందుకు ఓ కమిటీని ఏర్పాటుచేసే ప్రతిపాదనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు. ‘మెట్రోమ్యాన్’ శ్రీధరన్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. ఢిల్లీ మెట్రో విస్తరణలో భాగంగా బహదూర్గఢ్–ముండ్కా మార్గాన్ని మోదీ ఆదివారం ప్రారంభించారు. పట్టణాల్లో సౌకర్యవంతమైన, అందుబాటు ధరల్లో లభించే రవాణా వ్యవస్థలను నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ‘మెట్రోరైళ్లకు సంబంధించి మా ప్రభుత్వం ఓ విధానం తీసుకొచ్చింది. మెట్రో వ్యవస్థల మధ్య సమన్వయం ఉండాలనీ, కొన్ని ప్రాథమిక ప్రమాణాల ప్రకారమే అవి పనిచేయాలని మేం భావిస్తున్నాం’ అని మోదీ చెప్పారు. ‘దేశంలో వివిధ నగరాల్లోని మెట్రోరైల్ నెట్వర్క్లను నిర్మించేందుకు ఇతర దేశాలు మనకు సాయం చేశాయి. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆయా దేశాల్లోని మెట్రో రైళ్లకు బోగీలను మన దేశంలో తయారుచేయడం ద్వారా వారికి మనం సాయం చేస్తున్నాం’ అని మోదీ తెలిపారు. -
త్వరలో ఎలక్ట్రానిక్ ద్రావణాలు
లండన్: వ్యాధి నిర్ధారణకు త్వరలోనే ఓ వినూత్నమైన విధానం అందుబాటులోకి రానుంది. బ్యాక్టీరియా రూపంలో ఉండే చిన్న చిన్న ఎలక్ట్రానిక్ సెన్సర్లు కలిగిన ద్రావణాన్ని తాగడం ద్వారా అనారోగ్యానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఎలక్ట్రానిక్ సెన్సర్లు పరిమాణంలో ఎర్ర రక్త కణాల కంటే తక్కువగా ఉండటం గమనార్హం. బ్రిటన్లోని ఇంపీరియల్ కాలేజ్ లండన్, ఫ్రాన్స్లోని ఈపీఎఫ్ఎల్కు చెందిన పరిశోధకులు దీన్ని తయారు చేశారు ఇది అందుబాటులోకి వస్తే కేన్సర్తోపాటు ఇతర ప్రాణాంతక వ్యాధుల నిర్ధారణా పద్ధతులు సులువవుతాయని పేర్కొన్నారు. -
మీ పాలసీ బాలేదు
వాషింగ్టన్: అమెరికా సరిహద్దుల్లో వలసదారుల నుంచి వారి పిల్లల్ని వేరుచేయడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ‘జీరో టాలరెన్స్’ ఇమిగ్రేషన్ పాలసీగా అమెరికా పేర్కొంటున్న ఈ విధానాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియాతో పాటు మాజీ ప్రథమ మహిళలు కూడా తప్పుపట్టారు. వేలాది మంది చిన్నారుల్ని తల్లిదండ్రుల నుంచి విడదీయడం అమానుషమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.‘జీరో టాలరెన్స్’ వలస విధానం అమల్లో భాగంగా.. అమెరికా–మెక్సికో సరిహద్దుల్లోని అక్రమ వలసదారుల నుంచి చిన్నారుల్ని బలవంతంగా వేరు చేసి వివిధ వసతి కేంద్రాల్లో ఉంచారని అమెరికా హోంల్యాండ్ భద్రతా విభాగమే స్వయంగా వెల్లడించింది. అయితే ట్రంప్ వివాదాస్పద వలస విధానానికి చిన్నారుల్ని బలిపశువుల్ని చేయడం అన్యాయమని మానవతావాదులు మండిపడుతున్నారు. పసివారిని వేరు చేయొద్దు పిల్లల హక్కులకు భంగం కలిగించే ‘జీరో టాలరెన్స్’ వలస విధానాన్ని ట్రంప్ భార్య మెలానియా సైతం తప్పుపట్టారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తోన్న మెక్సికన్ల నుంచి వారి పిల్లలను వేరుచేయడంపై ఆమె స్పందించారు. ‘చట్టప్రకారం వ్యవహరించండి, కానీ మానవత్వంతో వ్యవహరించండి’ అని అమెరికా అనుసరిస్తున్న కఠిన వైఖరిని పరోక్షంగా తప్పుపట్టారు. తల్లిదండ్రుల నుంచి పసివారిని వేరు చేయడాన్ని సహించలేనని మెలానియా వ్యాఖ్యానించారని, రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ఏకమై ఉన్నతమైన వలస సంస్కరణల్ని సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారని మెలానియా ప్రతినిధి స్టిఫాని గ్రీషం వెల్లడించారు. మెలానియా కూడా అమెరికాకు వలస వచ్చి ఆ దేశ పౌరసత్వం పొందడం గమనార్హం. జీరో టాలరెన్స్ దారుణం: లారా బుష్ అదే సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ భార్య లారా బుష్ స్పందిస్తూ.. ‘ఈ జీరో టాలరెన్స్ విధానం అమానుషం. అనైతికం. ఇది విన్నాక నా గుండె బద్దలైంది’ అని వాషింగ్టన్ పోస్టు పత్రికలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘నేను కూడా సరిహద్దు రాష్ట్రంలోనే నివసిస్తున్నాను. మన అంతర్జాతీయ సరిహద్దుల్ని కాపాడాల్సిన అవసరాన్ని, ప్రయత్నాల్ని నేను అభినందిస్తున్నాను. అయితే ఈ జీరో టాలరెన్స్ విధానం దారుణం’ అని పేర్కొన్నారు. పిల్లల్ని వేరుగా ఉంచడం వంటి చర్యలకు అమెరికా ప్రభుత్వం పాల్పడకూడదని లారా బుష్ చెప్పారు. పిల్లల పట్ల అలాంటి చర్యలకు పాల్పడడం అనైతికమని ఐరాస మానవ హక్కుల కౌన్సిల్ హై కమిషనర్ జైద్ రాద్ అల్ హుస్సేన్ అన్నారు. అనుమతించేది లేదు: ట్రంప్ అయితే జీరో టాలరెన్స్ విధానాన్ని ట్రంప్ సమర్ధించుకున్నారు. ఇకపై అమెరికా వలసదారుల శిబిరంగా, శరణార్థుల కేంద్రంగా ఉండబోదని తేల్చి చెప్పారు. యూరప్, ఇతర దేశాల్లో వల్లే అమెరికాలో జరిగేందుకు అనుమతించమని స్పష్టం చేశారు. తల్లిదండ్రులకు దూరంగా... అమెరికా సరిహద్దుల నుంచి మెక్సికో చొరబాటుదారుల్ని నిలువరించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలను కట్టుదిట్టం చేస్తూ ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. అమెరికాలోకి అక్రమంగా చొరబడిన తల్లిదండ్రులతోపాటు ఉన్న పిల్లల్ని వేరుచేసి వేర్వేరు కేంద్రాల్లో ఉంచారు. ఎలాంటి సంరక్షణా లేకుండా తాత్కాలికంగా తయారుచేసిన కేజ్ల్లో ఐదారేళ్ల పసివారిని నిర్బంధిస్తూ ప్రతికూల పరిస్థితుల్లో వారిని ఉంచుతున్నారని అమెరికా మహిళా శరణార్థుల కమిషన్ డైరెక్టర్ మైఖేల్ బ్రేన్ తెలిపారు. ఈ అమానుషంపై అమెరికా వెలుపల, లోపల తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అమెరికా ప్రతినిధి జాన్తన్ హాఫ్మాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికా నూతన వలస విధానం అమలులోకి వచ్చాక.. ఏప్రిల్ 19 నుంచి మే 31 వరకు 2వేల మంది పసివారు తల్లిదండ్రులకు దూరమయ్యారు. అయితే ట్రంప్ మాత్రం తన విధానాన్ని సమర్థించారని అమెరికా అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ మే 7న ప్రకటించారు. మెక్సికన్ చొరబాటుదారుల పిల్లల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్న అమెరికాపైనా, ఆ దేశ భద్రతా దళాల విధానాలపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఇరు దేశాల్లోనూ ఉద్యమాలు పెల్లుబికాయి. -
హెచ్1బీ వీసా కొత్త పాలసీపై క్లారిటీ
వాషింగ్టన్: అమెరికన్లు, వలసేతర కార్మికుల వేతనాలు, పరిస్థితుల్ని మెరుగుపర్చేందుకే ట్రంప్ యంత్రాంగం కొత్త హెచ్1బీ వీసా పాలసీని తీసుకొచ్చిందని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) శనివారం తెలిపింది. అమెరికాలో కొన్ని సంస్థలు ఉద్యోగులకు ఇవ్వాల్సిన దానికన్న తక్కువ వేతనాలు చెల్లించడం, ఖాళీగా కూర్చోబెట్టడం, నైపుణ్యానికి సంబంధంలేని పనుల్ని అప్పగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని యూఎస్సీఐఎస్ వెల్లడించింది. ఇలాంటి మోసాలను అరికట్టేందుకే కొత్త హెచ్1బీ విధానాన్ని తీసుకొచ్చామని వివరించింది. ఫిబ్రవరి 22 నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానం ప్రకారం థర్డ్ పార్టీ వర్క్సైట్లలో కాంట్రాక్ట్ కాలపరిమితి మేరకే హెచ్1బీ వీసాను జారీచేస్తారు. పని ఉన్నంత కాలానికే.. అమెరికన్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) గురువారం జారీ చేసిన ఏడు పేజీల తాజా పాలసీ ప్రకారం థర్డ్ పార్టీ వర్క్సైట్లో ఎంత కాలం పనుంటే అంత కాలానికే హెచ్–1బీ వీసాలు జారీ చేస్తారు. ఇప్పటిదాకా మూడేళ్ల కాలానికి హెచ్–1బీ వీసాల్ని జారీచేస్తుండగా... ఇక నుంచి అంతకంటే తక్కువ కాలానికే జారీ చేయనున్నారు. 2019 ఆర్థిక సంవత్సరానికి హెచ్–1బీ వీసా దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం కానుందన్న వార్తల నేపథ్యంలో ఈ పాలసీని కొత్తగా అమెరికా తెరపైకి తెచ్చింది. -
ఇక సాండ్ ట్యాక్సీ !
జిల్లాలో ఇసుకను నదులు, వాగులు తేడా లేకుండా తోడేస్తున్నారు. ఇసుకాసురులు అధికార పార్టీ నేతల అనుచరులే కావడంతో అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ఈ అక్రమ దందాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సాండ్ ట్యాక్సీ విధానం అమలు చేయనుంది. ఇసుక అవసరం ఉన్న వారు ఆన్లైన్లో డబ్బులు చెల్లిస్తే ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇసుకను నేరుగా ఇంటికే సరఫరా చేస్తారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో ఇసుక దందా అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. నదులు, వాగులు అన్న తేడా లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుకను తోడేస్తున్నారు. అధికారిక క్వారీల్లో ఒక్కో పర్మిట్పై పదుల సంఖ్యలో ట్రిప్పులు తరలించడం పరిపాటిగా మారింది. ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతల ప్రధాన అనుచరులే ఇసుకాసురులు కావడంతో.. రెవెన్యూ, పోలీసు అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. దీంతో జిల్లాలో విచ్చల విడిగా ఇసుక అక్రమ దందా కొనసాగుతోంది. సొం తింటి కలను సాకారం చేసుకునేందుకు సామాన్యులు కొనుగోలు చేయలేనంతగా ఇసుక ధరలు పెరిగి పోయాయి. ఈ నేపథ్యంలో ఈ అక్రమ దందాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం మరో ఇసుక విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. సాండ్ ట్యాక్సీ పేరుతో అమలు చేస్తున్న ఈ విధానంలో ఇసుక అవసరం ఉన్న వారు ఆన్లైన్లో డబ్బులు చెల్లిస్తే ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇసుకను నేరుగా ఇంటికే సరఫరా చేస్తారు. ఈ సాండ్ ట్యాక్సీని అమలు చేసేందుకు భూగర్భ గనుల శాఖ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం సుమారు 30–40 మంది సిబ్బందిని ఈ ప్రక్రియకు వినియోగించాల్సి ఉంటుంది. 23 ఇసుక రీచ్ల మ్యాపింగ్ సిద్ధం.. నూతన పాలసీ అమలులో భాగంగా జిల్లాలో ఇప్పటికే గుర్తించిన 23 ఇసుక పాయింట్లను ఎంపిక చేశారు. జిల్లాలోని అన్ని మండలాలకు ఈ పాయింట్ల నుంచి ఇసుకను సరఫరా చేయాలని నిర్ణయించారు. మంజీర, పెద్దవాగు, నీలవాగు, గోదావరి, నాళేశ్వర్వాగు, జన్నెపల్లివాగు, పులాంగ్ వాగు, కప్పల వాగు, కలిగోట్ వాగు, మైలారం వాగు, ఒన్నాజీపేట తదితర వాగులు, నదుల్లో ఉన్న 23 పాయింట్లను గుర్తించారు. ఈ పాయింట్ల నుంచి ఆయా మండలాలకు ఇసుక సరఫరా చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు గనుల శాఖ మ్యాపింగ్ను సిద్ధం చేసింది. ఆయా రీచ్ల నుంచి గ్రామాలు ఎంత దూరంలో ఉన్నాయి.. ఎన్ని కిలోమీటర్లు రవాణా చేయాల్సి ఉంటుంది.. అనే అంశాలపై కసరత్తు పూర్తి చేశారు. కలెక్టర్ నేతృత్వంలో కమిటీ నూతన విధానం అమలు కోసం జిల్లా స్థాయిలో సాండ్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీకి కలెక్టర్ నేతృత్వం వహించనున్నారు. కమిటీ ఆయా రీచ్ల నుంచి ఇసుకను రవాణా చేసేందుకు ట్రాక్టర్ల యజమానులతో ఒప్పందం చేసుకుంటుంది. ఇలా ఇసుక రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ పరికరాలు అమర్చుతారు. ఒక్కో రీచ్కు రీచ్ ఆఫీసర్ బాధ్యులుగా ఉంటారు. జిల్లా ఉన్నతాధికారిని నోడల్ అధికారిగా నియమిస్తారు. సాఫ్ట్వేర్ కంపెనీతో ఒప్పందం.. ఈ విధానాన్ని ఆన్లైన్లో నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ సాఫ్ట్వేర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. వెర్టోనిక్స్ అనే కంపెనీతో ఎంఓయూ చేసుకుంది. ఆన్లైన్లో ఇసుక కోసం దరఖాస్తు చేసుకుని.. సంబంధిత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తంలో గనుల శాఖకు చెందాల్సిన సీనరేజీ, ట్రాక్టర్ యజమానికి చెల్లించాల్సిన రవాణా చార్జీలు, ఇలా ఎవరి వాటా మొత్తాన్ని వారికి వెళ్లేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించారు. ప్రభుత్వం ఇప్పటికే పలు కొత్త కొత్త ఇసుక విధానాలను అమలు చేస్తూ వచ్చింది.. అయితే, అవేవి అక్రమ దందాకు అడ్డుకట్ట వేయలేక పోయాయి. తాజా విధానంతోనైనా ఇసుక దందాకు చెక్ పడుతుందా.. లేక నూతన విధానాన్ని కూడా ఇసుకాసురులు తమకు అనుకూలంగా మార్చుకుని యథేచ్చగా దోపిడీ కొనసాగిస్తారా..? అనేది వేచి చూడాలి. జిల్లా స్థాయి సాండ్ కమిటీ నియామకం కోసం చర్యలు తీసుకుంటున్నామని భూగర్భ గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.సత్యనారాయణ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ల యజమానుల నుంచి కూడా దరఖాస్తులు తీసుకుంటామని ఆయన చెప్పారు. -
‘అణు’ ఆధునీకరణకు అమెరికా కొత్త విధానం
వాషింగ్టన్: అణ్వస్త్రాలను ఆధునీకరించేందుకు, చిన్నస్థాయి అణ్వాయుధాల తయారీకి వీలుగా అమెరికా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. 100 పేజీలతో న్యూక్లియర్ పోస్టర్ రివ్యూ(ఎన్పీఆర్)–2018 పేరిట తీసుకొచ్చిన ఈ విధానం ద్వారా అమెరికా, దాని మిత్రదేశాలపై జరిగే అణు దాడుల్ని నిరోధించవచ్చని ట్రంప్ యంత్రాంగం తెలిపింది. ఈ విధానంపై పెంటగాన్లో ట్రంప్ మాట్లాడుతూ.. ‘21వ శతాబ్దంలో అమెరికాకు ఎదురవుతున్న అనేక రకాల ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఈ విధానం చాలా అనువైనది. అణ్వాయుధ కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్ విభాగాలతో పాటు సంప్రదాయ, అణ్వాయుధాలు ప్రయోగించే విమానాలు, భూ,సముద్ర, వాయు మార్గాల నుంచి దాడిచేసే సామర్థ్యం ఆధునీకరణకు ఈ విధానం దోహదం చేస్తుంది. అమెరికా అణ్వాస్త్రాలను వాడాల్సిన అవసరం కూడా తగ్గిపోతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ విధానం అణువ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్పీటీ), అణ్వాయుధాల నియంత్రణతో పాటు అణు పరీక్షల నిషేధంపై అమెరికా నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది అని వెల్లడించారు. -
ట్రంప్ కొత్త పాలసీతో భారత్కు చిక్కులే!
వాషింగ్టన్: అమెరికాలో డాక్టరు చీటిపై దొరికే మందుల ధరలు దిగొచ్చేలా కొత్త పాలసీని తీసుకొస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. డ్రగ్ కంపెనీలు తమ మందుల్ని ఇతర దేశాల్లో తక్కువకు అమ్ముతూ అమెరికాలో మాత్రం ఎక్కువ వసూలు చేస్తున్నాయని ఆయన తప్పుపట్టారు. అమెరికా ఇస్తున్న సబ్సిడీలతో కంపెనీలు విదేశాల్లో తక్కువ ధరలకు మందుల్ని అమ్ముతున్నాయని, ఇక నుంచి అలా జరగనివ్వమని ఆయన పేర్కొన్నారు. ఒక వేళ ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే భారత్ వంటి దేశాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు.వైట్ హౌస్లో కేబినెట్ సహాచరులతో ట్రంప్ మాట్లాడుతూ.. ఇతర దేశాల్లో అమ్మే మందుల ధరల్ని అమెరికా ప్రభుత్వం కాకుండా కంపెనీలు నిర్ణయిస్తున్నాయని, ఈ విధానం మారాలని చెప్పారు. -
కొత్త మద్యం పాలసీ వచ్చేసింది
► జిల్లాలో 430 దుకాణాలకు నోటిఫికేషన్ ► 75 శాతం తగ్గిన లైసెన్సు ఫీజులు ► లాభాల్లో 6 శాతం కుదింపు ► 30 ఆఖరు.. 31న లాటరీలో దుకాణాలు నూతన మద్యం పాలసీ విడుదలైంది. మొత్తం ప్రక్రియ సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి రూపొందించారు. జిల్లాలో 430 దుకాణాలకు రెండు స్లాబ్లుగా విభజన చేసి జిల్లా ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ ఎన్.వెంకటశివ ప్రసాద్ శుక్రవారం విడుదల చేశారు. చిత్తూరు నగరంలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో 2017–19 మద్యం పాలసీకి సంబంధించిన విధివిధానాలు ప్రకటించారు. చిత్తూరు: ఇప్పటి వరకు జిల్లాలో మద్యం దుకాణాలు వార్డుల వారీగా ఏర్పాటు చేశారు. అయితే జాతీయ, రాష్ట్ర రహదారులపై 500 మీటర్లకు లోపు మద్యం దుకాణాలు ఈ నెలాఖరుకు మూసేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో కొత్త పాలసీలో మండలం, మున్సిపాలిటీ, కార్పొరేషన్ను యూనిట్గా తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో పాటు గుడి, బడిలాంటి నిబంధనల్ని అమలు చేస్తూ రెండు స్లాబ్లుగా నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటికే జిల్లాలో ఉన్న 183 మద్యం దుకాణాలకు సుప్రీం తీర్పు వర్తించదు. వీళ్లకు జూలై 1వ తేదీ నుంచి మార్చి 30, 2019 వరకు(24 నెలలు) కొత్త పాలసీ అమలు చేస్తారు. ఇక సుప్రీం తీర్పు అమలు చేస్తే జిల్లాలో 247 దుకాణాలు ఇతర ప్రాంతాలకు మార్చుకోవాలి. ఈ దుకాణాలు నిబంధనలకు లోబడి ఏప్రిల్ 1 నుంచి జూన్ 30, 2019 (27 నెలలు) వరకు లైసెన్సులు జారీ చేస్తారు. ఇవీ ఫీజులు మద్యం దుకాణాల లైసెన్సుల ఫీజులు ప్రభుత్వం భారీగా తగ్గించేసింది. గత పాలసీతో పోలిస్తే 75 శాతం లైసెన్సు ఫీజు తగ్గించారు. అయితే వ్యాపారులకు వచ్చే లాభాల్లో అదనపు ఎక్సైజ్ డ్యూటీ చెల్లించాలనే నిబంధన అమలు చేశారు. దీంతో ఇప్పటి వరకు సగటు వ్యాపారికి వస్తున్న 18 శాతం లాభాన్ని ఏకంగా 6 శాతం తగ్గించి, 12 శాతానికి కుదించారు. ఇక దరఖాస్తులు చేసే ముందు వ్యాపారులు వాళ్ల పాన్ వివరాలు, ఐటీ వివరాలు, ఇతర వివరాలన్నింటినీ www.appic-ationr.exirehpfr.ap.gov.in అనే వెబ్సైట్లో నమోదు చేయాలి. దీన్ని ప్రింట్ తీసుకుని చిత్తూరులోని ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు అందజేయాలి. లైసెన్సు ఫీజును 5 వేల జనాభాలోపు ఉంటే రూ.7.05 లక్షలు, 10 వేల వరకు రూ.8.05 లక్షలు, 25 వేల వరకు రూ.9.25 లక్షలు, 50 వేల వరకు రూ.10 లక్షలు, 3 లక్షల వరకు రూ.11.25 లక్షలు, 5 లక్షల జనాభా వరకు రూ.12.50 లక్షలు లైసెన్సు ఫీజుగా నిర్ణయించారు. దీంతో పాటు దరఖాస్తుతో రుసుము రూ.5 వేలు, రిజిస్ట్రేషన్ ఫీజు మండలంలో రూ.50 వేలు, మున్సిపాలిటీల్లో రూ.75 వేలు, కార్పొరేషన్లో రూ.లక్ష, ఈఎండీగా రూ.3 లక్షలు(రీఫండబుల్) జత చేయాలి. వ్యాపారులకు టోకెన్లు అందజేసి ఈ నెల 31న ఉదయం 10 గంటలకు చిత్తూరులోని సాంబయ్యకండ్రిగ వద్ద ఉన్న ఆర్ఎల్ కల్యాణ మండపంలో కలెక్టర్ సమక్షంలో లాటరీ విధానంలో దుకాణాల లైసెన్సులు కేటాయిస్తారు. జిల్లాలో మొత్తం 430 దుకాణాలకు నోటిఫికేషన్ జారీ చేయగా.. చిత్తూరు ఎక్సైజ్ పరిధిలో 206 దుకాణాలు, తిరుపతి పరిధిలో 224 దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. దరఖాస్తు, రిజిస్ట్రేషన్ ఫీజుల కింద జిల్లా నుంచి ప్రభుత్వానికి రూ.6 కోట్ల ఆదాయం లభించే అవకాశాలున్నాయి. లైసెన్సుల ద్వారా రూ.50 కోట్లు సమకూరనుంది. నిబంధనలు ఒక వ్యక్తికి ఒక్క దుకాణం మాత్రమే కేటాయిస్తారు. లాటరీ విధానంలో ఒకే వ్యక్తికి మరో దుకాణం వచ్చినా లైసెన్సు జారీ చేయరు. ఇక తిరుపతి నగరంలోని అలిపిరి రోడ్డు, టీటీడీ భవనాల పరిసరాల్లో మద్యం దుకాణాలు పెట్టడానికి వీల్లేదు. -
నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ విడుదల
– నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ – చివరి తేదీ ఈనెల 30 – 31న జెడ్పీ హాల్లో లక్కీడిప్ కర్నూలు(టౌన్): నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ విడుదలైంది. శుక్రవారం ఇన్చార్జి కలెక్టర్ హరికిరణ్ నోటిఫికేషన్ను విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి మద్యం షాపులకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈనెల 30వ తేదీ గడువు ముగుస్తుంది. 31న స్థానిక జిల్లాపరిషత్ సమావేశ భవనంలో లక్కీడ్రా ద్వారా మద్యం షాపులను కేటాయిస్తామని ఇన్చార్జి కలెక్టర్ హరికిరణ్ వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మద్యం షాపుల కేటాయింపు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జాతీయ రహదారులపై 500 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఉండాలన్న నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని రూపొందించిందన్నారు. జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న 163 షాపులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 203 మద్యం షాపులు ఉన్నాయన్నారు. 500 మీటర్ల లోపు కర్నూలు డివిజన్ పరిధిలో 86, నంద్యాల డివిజన్ పరిధిలో 77 షాపులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వీటిపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. టెండర్ల ప్రక్రియను పకడ్బందీగా చేపట్టండి... – ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యుటీ కమిషనర్ శ్రీరాములు టెండర్ల ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యుటీ కమిషనర్ శ్రీరాములు ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ప్రొహిబిషన్ ఎక్సైజ్ కార్యాలయంలో నంద్యాల, ఆదోని ప్రాంతాలకు చెందిన ఎక్సైజ్ అధికారులు, సీఐలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాలు, నగర పంచాయతీలు, మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో జనాభా ప్రాతిపదికన ఏడు స్లాబ్లలో లైసెన్సులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జనాభా లైసెన్స్ ఫీజు లక్షల రూపాయల్లో 5 వేల లోపు 7.5 10 వేలు.. 8.5 25 వేలు 9.25 50 వేలు 10 3 లక్షలు 11.25 5 లక్షలు 12.5 ఆపైన 16.25 -
ఫేస్బుక్ రూల్స్ మార్పు.. నిఘాకు చెల్లుచీటీ
ఫేస్బుక్ తన నిబంధనలను కఠినతరం చేసింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో ఉన్న సమాచారాన్ని సేకరించి, దాని ఆధారంగా నిఘా పెట్టడానికి సంస్థలకు వీలు లేకుండా నిషేధించింది. సోషల్ మీడియా మానిటరింగ్ కంపెనీలు తాము సేకరించిన సమాచారాన్ని చట్ట సంస్థలకు అమ్ముకుంటున్నాయని.. వాటి ద్వారా వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారని ఇటీవల గుర్తించారు. ప్రధానంగా కొన్ని దేశాల్లో వర్ణవివక్షతో కూడా ఇలా కొంతమందిని టార్గెట్ చేస్తున్నట్లు తెలిసింది. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పేందుకు ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలను విస్తృతంగా ఉపయోగించుకునేవాళ్లకు ఈ సోషల్ మీడియా నిఘా అనేది పెనుముప్పుగా పరిణమించింది. కొన్ని చట్ట సంస్థలు కూడా ఈ సమాచారాన్ని ఉపయోగించుకుని వ్యక్తుల మీద కేసులు పెడుతున్నాయని ఏసీఎల్యూ తరఫు న్యాయవాది మాట్ కాగిల్ తెలిపారు. అయితే ఇప్పుడు ఇలా ఫేస్బుక్ ద్వారా సమాచారాన్ని నిఘా అవసరాల కోసం వాడుకోడాన్ని పూర్తిగా నిషేధించినట్లు ఆ సంస్థ వివరించింది. అయితే 'నిఘా' అంటే ఏంటన్న విషయాన్ని మాత్రం పూర్తిగా వివరించలేదు. ఫేస్బుక్ పోస్టింగులను మానిటర్ చేసేందుకు కొన్ని రకాల టూల్స్ ఉంటాయి. వీటిని ఉపయోగించి ఎవరెవరు ఎలాంటి పోస్టింగులు చేస్తున్నారో పరిశీలించవచ్చు. అమెరికా లాంటి దేశాల్లో నిఘా సంస్థలు ఈ టూల్స్ను విస్తృతంగా వాడుతున్నాయి. ఇందుకోసం 2010 నుంచి ఇప్పటివరకు సుమారు రూ. 40 కోట్లు వెచ్చించాయి. అయితే, తాము పోస్ట్ చేస్తున్న సమాచారమే తమ పీకకు చుట్టుకుంటోందన్న విషయం చాలామందికి తెలియదు. దాంతో ఇప్పుడు సామాన్య ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను ఫేస్బుక్ తన పాలసీని పూర్తిగా మార్చింది. అందులోఉ సమాచారాన్ని నిఘా అవసరాల కోసం ఉపయోగించకుండా నిబంధనలు విధించింది. తన ప్లాట్ఫాంను నిఘా కోసం ఉపయోగించే టూల్స్ తయారుచేసే డెవలపర్లపై తాము ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నట్లు ఫేస్బుక్ ఒక బ్లాగ్ పోస్టులో తెలిపింది. -
అక్రమ పార్కింగ్లకు షాకివ్వబోతున్న ప్రభుత్వం
రోడ్లపై వాహనాల అక్రమ పార్కింగ్లపై భారీ మొత్తంలో కొరడా ఝళిపించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధమవుతోంది. జరిమానాలు పెంచేందుకు ఓ కొత్త విధానంతో ముందుకు రాబోతుంది. ప్రస్తుతమున్న రూ.200 అక్రమ పార్కింగ్ పెనాల్టీలను రూ.1000కి పెంచనున్నట్టు కేంద్ర రోడ్డు, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారి తెలిపారు. నాగపూర్లోని స్మార్ట్సిటీ వర్క్షాపులో ప్రసంగించిన ఆయన, వాహనాల అక్రమ పార్కింగ్ల నుంచి రోడ్లను బయటపడేయనున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసుతో కలిసి అక్రమ పార్కింగ్లను సమర్థవంతంగా గుర్తిస్తామని చెప్పారు. కొత్త పాలసీతో అక్రమ పార్కింగ్లకు వెయ్యి రూపాయల వరకు జరిమానా విధించనున్నట్టు పేర్కొన్నారు. అడ్డదిడ్డంగా రోడ్లపై వాహనాలు పార్క్ చేసిన వారి సమాచారం తమకు అందించిన ఫిర్యాదుదారునికీ రూ.200 వరకు రివార్డు అందించనున్నట్టు తెలిపారు. రోడ్లపై అక్రమంగా పార్క్ చేసిన వాహనాల ఫోటో తీసి, ట్రాఫిక్ పోలీసు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సిస్టమ్లో పెట్టగలరని సూచించారు. జరిమానాల రూపంలో సేకరించిన నగదును రోడ్ల అభివృద్ధిపై ఖర్చుచేస్తామని గడ్కారి చెప్పారు. స్మార్ట్సిటీ ప్రాజెక్ట్లో నగరాలను అత్యంత ఉన్నంతంగా తీర్చిదిద్దేందుకు సరైన ప్రణాళిక తమకు అవసరమన్నారు. పార్కింగ్ స్థలం లేనిది బిల్డింగ్ల కట్టడాలకు అనుమతించకూడదని అధికారులను ఆదేశించారు. -
భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు నూతన విధానం
అనంతపురం అర్బన్ : భూముల రిజిస్ట్రేషన్లలో వివాదాలకు చెక్ పెట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం నూతన విధానానికి శ్రీకారం చుడుతోంది. రిజిస్ట్రేషన్ కు ముందే భూములను సబ్డివిజన్ చేయడం ఇందులో కీలకాంశం. ఈ విధానం అమలుకు తొలిదశగా జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఒక్కొక్క మండలాన్ని ఎంపిక చేశారు. ఈ విధానం ఇక్కడ తీసుకొస్తే రాష్ట్రంలోనే ప్రప్రథమంగా అమలు చేసిన జిల్లాగా అనంతపురం నిలుస్తుంది. రిజిస్ట్రేషన్ కన్నా ముందే సబ్డివిజన్ నూతన విధానం కర్ణాటక తరహాలో ఉంటుంది. రిజిస్ట్రేషన్ కు ముందే రెవెన్యూ యంత్రాంగం భూమికి సంబంధించి సబ్డివిజన్ పూర్తి చేస్తుంది. విక్రయదారులు ఇద్దరూ సర్టిఫైడ్ స్కెచ్ పొందిన తరువాతే భూమి రిజిస్ట్రేషన్ అవుతుంది. సర్వే చేయడం ద్వారా విక్రయించే వ్యక్తికి క్షేత్ర స్థాయిలో ఎంత భూమి ఉంది.. తనకు ఉన్నదానినే విక్రయించేందుకు సిద్ధపడ్డాడా, లేదా అనేది స్కెచ్ ద్వారా తెలుస్తుంది. భూమి విస్తీర్ణం, దాని హద్దులు (చెక్బందీ) సర్టిఫైడ్ స్కెచ్లో ఉంటాయి. ప్రస్తుతం భూ విస్తీర్ణం, చెక్బందీతో సంబంధం లేకుండా డాక్యుమెంట్ల ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. విక్రయదారుడు చూపిన విస్తీర్ణం క్షేత్ర స్థాయిలో లేకపోతే వివాదం తలెత్తుతోంది. ప్రధానంగా భాగపరిష్కార ఆస్తులను లేదా ఉన్న భూమిలో కొంత భాగాన్ని అప్పటికే విక్రయించిన సందర్భాల్లో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొనుగోలు చేసిన వారు క్షేత స్థాయిలోకి వెళ్లి భూమిని స్వాధీనం చేసుకునే క్రమంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు.ఇలాంటి వివాదాలు కోర్టుల పరిధిలో చాలానే ఉన్నాయి. మొదటి విడతగా ఐదు మండలాల్లో... నూతన విధానాన్ని మొదటి విడతగా ఐదు మండలాల్లో ప్రారంభించనున్నారు. అనంతపురం రెవెన్యూ డివిజన్లో శింగనమల మండలం, ధర్మవరం డివిజన్లో చెన్నే కొత్తపల్లి, పెనుకొండ డివిజన్లో మడకశిర, కళ్యాణదుర్గం డివిజన్లో రాయదుర్గం, కదిరి రెవెన్యూ డివిజన్లో బుక్కపట్నం మండలాలను ఎంపిక చేశారు. -
15 ఏళ్లకు పైబడిన వాహానాలకు చెక్
-
విమాన ప్రయాణికులకు భారీ ఊరట
-
విమాన ప్రయాణికులకు భారీ ఊరట
న్యూఢిల్లీ: త్వరలోనే అమల్లోకి రానున్న ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ కొత్త నిబంధనలు దేశీయ విమాన యాన సంస్థలకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతుండగా విమాన ప్రయాణికులకు భారీ పరిహారం కోసం లభించనుంది. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త పాలసీలో ప్రయాణికుల లగేజీ ఛార్జీలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న మంత్రిత్వ శాఖ ఒకవేళ విమానం క్యాన్సిల్ అయితే టికెట్ ధరతో పాటు అదనపు పన్నుల రూపంలో వసూలు చేసే ఛార్జీలు కూడా చెల్లించాలని చెప్పింది. ఇకపై విమానం ఆలస్యమైనా....రద్దయినా ఆయా విమానయాన సంస్థ సదరు ప్రయాణికులకు భారీ పరిహారం చెల్లించాల్సి వస్తుంది. రెండుగంటల లోపు విమానం రద్దయితే 10వేల రూపాయలు చెల్లించాలి. దీంతోపాటుగా 24 గంటల లోపు వేరే విమానాన్ని సమకూర్చలేకపోతే మరో రూ.20వేలు పరిహారం చెల్లించాల్సిందేనని విమానాయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. టికెట్ క్యాన్సిల్ అయితే అదనపు పన్నులతో సహా చార్జీలను ప్రయాణికులకు రీఫండ్ చేయాలని చెప్పింది.ఈ రీఫండ్ కూడా దేశీయ ప్రయాణాలకైతే 15 రోజుల్లోగా, అంతర్జాతీయంగా అయితే 30 రోజుల్లోగా చెల్లించాలని స్పష్టం చేసింది. అయితే ఈచెల్లింపుల ప్రక్రియలో ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయనీ, వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం వుందని ఎయిర్ పాసింజర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డి. సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ విధానం పారదర్శకంగా లేదనీ, కొన్ని అంశాలపై తమకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయన్నారు. నిజాలను నిర్ధారించిన బాధ్యత ఆయా విమాన సంస్థలపై పెట్టడం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. కాగా ఇటీవల విమానాయాన మంత్రిత్వ శాఖ ఆమోదించిన కొత్త విధానం విమాన ప్రయాణికులకు శుభవార్త అందించింది. లగేజీ చార్జీల తగ్గింపు తోపాటు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. -
ఇక రుణ రేట్లపై బ్యాంకుల కొత్త విధానం
♦ ఏడాదికి ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ 9.2 శాతం ♦ బేస్రేటు కన్నా 10 బేసిస్ పాయింట్లు తక్కువ... ♦ ఇదే బాటలో ఇతర బ్యాంకులు... న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలకు అనుగుణంగా బ్యాంకింగ్ రుణ రేటుపై శుక్రవారం నుంచీ కొత్త విధానం అమల్లోకి వస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ, ప్రైవేటు బ్యాంకు హెచ్డీఎఫ్సీ సహా పలు బ్యాంకులు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్ఆర్) గురువారం ప్రకటించాయి. ఎస్బీఐ తాజా రేటు చూస్తే... ♦ ప్రస్తుతం బ్యాంక్ కనీస రుణ రేటు 9.30 శాతంగా ఉంది. తాజా విధానం ప్రకారం... ఏడాది రేటు 9.20 శాతంగా బ్యాంక్ నిర్ణయించింది. ఇది బేస్ రేటు కన్నా 10 బేసిస్ పాయింట్లు తక్కువ. ఇందులో ఓవర్నైట్ (8.95 శాతం), నెల (9.05 శాతం), మూడు నెలలు (9.10 శాతం), ఆరు నెలలు (9.15 శాతం), రెండేళ్లు (9.30 శాతం), మూడేళ్లు (9.35 శాతం) ఉన్నాయి. ♦ హెచ్డీఎఫ్సీ బ్యాంక్: ఏడాది కాలానికి రుణ రేటు రుణ రేటు 9.20 శాతంగా ఉంటుంది. రెండేళ్లకు 9.3 శాతం. మూడేళ్ల కాలానికి 9.35 శాతం. ప్రస్తుతం బ్యాంక్ బేస్ రేటు 9.3 శాతం. ♦ బ్యాంక్ ఆఫ్ బరోడా...: ఐదేళ్ల రుణానికి బ్యాంక్ స్థిర వడ్డీ రేటును 9.65 శాతంగా నిర్ణయించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ రేటుతో పోల్చితే బ్యాంక్ రుణ రేటు 0.35 శాతం అధికంగా ఉంటుందని తెలిపింది. ♦ పీఎన్బీ..: ఏడాది రేటు 9.40 శాతం. మూడేళ్లకు 9.55 శాతం. ఐదేళ్లకు 9.70 శాతం. ఇదీ నేపథ్యం... ప్రయోజనం! ఇప్పటివరకూ బ్యాంకులు వాటి పాత డిపాజిట్ వ్యయాలు, ఇతర నిధుల సేకరణ వ్యయాలన్నింటినీ పరిగణన లోకి తీసుకుని రుణాలపై రేట్లను నిర్ణయిస్తున్నాయి. దాంతో ఆర్బీఐ రెపో రేటును తగ్గిం చినంత మేర బ్యాంకులు రుణాల రేట్లను తగ్గించడం లేదు. దాంతో ఏప్రిల్ 1 నుంచీ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్) విధానాన్ని అనుసరించాలంటూ గత డిసెంబర్లో ఆర్బీఐ మార్గదర్శకాలు జారీచేసింది. దీనితో ఇకపై డిపాజిట్, రుణ రేటు ప్రాతిపదికన బ్యాంకు వడ్డీ రేటు వుంటుంది. ఒకవేళ ఆర్బీఐ కీలక రేట్లలో మార్పుచేస్తే... వెంటనే ఆ ఫలితం బ్యాంకుల రుణ రేటుపై కనిపిస్తుంది. -
28న నాలుగు కొత్త పాలసీల ప్రకటన
హైదరాబాద్: ఈ నెల 28న నాలుగు కొత్త పాలసీలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించనున్నట్టు ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు. శనివారం విలేకరులతో మాట్లాడిన ఆయన సాప్ట్వేర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి ఇమేజ్ సెంటర్ను ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఐటీ, ఇన్నోవేషన్, హార్డ్ వేర్, ఇమేజ్ పాలసీలను ప్రభుత్వం ప్రకటించనున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు. స్టార్టప్ యానిమేషన్ కంపెనీలకు ఈ ఇమేజ్ సెంటర్ చాలా ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
వచ్చేస్తున్నాయ్!
5 ఎఫ్ఓబీలు.. 103 బస్బేలు రూ. 9.18 కోట్లతో నిర్మాణం టెండర్ల ఆహ్వానం త్వరలో పనులు ప్రారంభం సిటీబ్యూరో: విశ్వనగరంలో భాగంగా జీహెచ్ఎంసీ 103 బస్బేలు, 5 ఎఫ్ఓబీ (ఫుట్ఓవర్బ్రిడ్జి)ల నిర్మాణానికి సిద్ధ మవుతోంది. తాజాగా దీనికి టెం డర్లు పిలిచింది. మొత్తం రూ.9.18 కోట్లతో ఐదు ఎఫ్ఓబీ/సబ్వేలు, 103 బస్బేల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. త్వరలోనే నూతన విధానంలో వీటిని నిర్మించనుంది. ప్రస్తుతం ఉన్న బస్బేలు రోడ్డుపైకొంతభాగాన్ని ఆక్రమించడంతో బస్సులు రహదారిపైఆగుతున్నాయి. రెండు మూడు బస్సులు ఒకేసారి వస్తే వెనుకనున్న దాన్ని ప్రయాణికులు చూసే లోపునే అక్కడి నుంచి కదిలిపోతోంది. రోడ్డుపైనే బస్సులు ఆగుతుండటంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని పరిష్కరించేందుకు రోడ్డుపైనే కాకుండా... ప్రభుత్వ స్థలాలు ఉన్న చోట ప్రధాన రహదారికి కొంత దూరంగా... దాదాపు అర్థవలయాకారంలో వీటిని నిర్మించనున్నారు. దీని కోసం మొత్తం 340 ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. 103 ప్రాంతాల్లో తొలిదశలో నిర్మిస్తారు. ఇందుకు గాను రూ.5.15 కోట్లు ఖర్చు చేయనున్నారు. పాదచారులు రోడ్డు దాటేందుకు లిఫ్టులతో కూడిన 150 ఎఫ్ఓబీలను నిర్మించాలనేది యోచన. ఐదు ఎఫ్ఓబీలకు ఇదివరకే టెండర్లు పూర్తయ్యాయి. కొత్తగా మరో 5 ఎఫ్ఓబీలకు టెండర్లు పిలిచారు. వీటి అంచనా వ్యయం రూ.4.03 కోట్లు. ఈ లిఫ్టుల నిర్వహణ బాధ్యతను వికలాంగులకు అప్పగిస్తారు. తద్వారా వారికి ఉపాధి లభిస్తుందని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ యోచిస్తున్నారు. సిగ్నల్ రహిత ప్రయాణానికి త్వరలోఎస్సార్డీపీ కింద రూ.2,631 కోట్లతో ఫ్లై ఓవర్లు తదితరమైన వాటికి టెండర్లు పిలవనున్నారు. ఈ పనులను ఒక్కొక్కటిగా ప్రారంభించనున్నారు. ఎఫ్ఓబీలు నిర్మించే ప్రాంతాలు 1. ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజి 2. శంషాబాద్ బస్ స్టాప్ 3. ఐఎస్ సదన్, సంతోష్ నగర్ 4. నెహ్రూ జూలాజికల్ పార్కు 5. నేషనల్ పోలీస్ అకాడ మీ (శివరాంపల్లి) బస్బేలు నిర్మించే ప్రదేశాలు కాప్రా సర్కిల్లో.. 1.శ్రీరాంనగర్కాలనీ 2.రాధికా జంక్షన్ 3. తిరుమల నగర్ రోడ్ 4. హౌసింగ్ బోర్డు కాలనీ 5. నాచారం 6.చక్రిపురం చౌరస్తా(కుషాయిగూడ). ఉప్పల్ సర్కిల్లో.. 7. గాంధీ విగ్రహం 8. ఉప్పల్ చౌరస్తా (ఉప్పల్-నాగోల్) 9. కుమ్మరిబస్తీ 10. ఉప్పల్ చౌరస్తా (ఉప్పల్-హబ్సిగూడ) 11. నాగోల్(ఎల్బీనగర్-ఉప్పల్) . ఎల్బీనగర్ సర్కిల్లో.. 12. కర్మాన్ఘాట్ (భూపేశ్గుప్తా నగర్) 13. వీఎంహోమ్(సరూర్నగర్). సర్కిల్-4లో.. 14. సైదాబాద్ (ప్రింటింగ్ప్రెస్ రోడ్డు) 15. గడ్డిఅన్నారం 16. టీవీ టవర్ 17. సైదాబాద్ (సరూర్నగర్-సైదాబాద్)18. దోబీఘాట్ 19. సైదాబాద్ (సరూర్నగర్ చెరువు-ఏసీపీ కార్యాలయం) 20. చాదర్ఘాట్ 21. బార్కాస్ 22. చాంద్రాయణగుట్ట 23 నుంచి 25 వరకు డీఆర్డీ ల్ వద్ద 26.మిథాని బస్ డిపో(మిథాని-చాంద్రాయణగుట్ట) 27. కేంద్రీయ విద్యాలయ సర్కిల్- 5లో .. 29, 30. జుమ్మేరాత్ బజార్ 31. గోడేకి ఖబర్ 32. మోతిగల్లి రాజేంద్రనగర్ సర్కిల్లో.. 33, 34 రాజేంద్రనగర్ 35.మైలార్దేవ్పల్లి 36, 37. బుద్వేల్ ఎక్స్టెన్షన్ బస్ స్టాప్ 38. దుర్గానగర్ చౌరస్తా 39, 40 ఆరాంఘర్ చౌరస్తా 41. శివారంపల్లి (ఎన్పీఏ). సర్కిల్ -7లో.. 42. టీఎన్జీవో భవనం(మాసాబ్ ట్యాంక్ రోడ్డు) 43.నానల్నగర్ చౌరస్తా 44.దిల్షాద్నగర్ కాలనీ. సర్కిల్-8లో.. 45. ఇంటర్మీడియట్ బోర్డు పక్కన 46. నిజాం కాలేజి 47. హజ్హౌస్ 48. ఎన్ఎస్రోడ్(అబిడ్స్) 49. బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ (జీపీవో పక్కన). సర్కిల్-9లో.. 50. ఆర్టీసీ క్రాస్రోడ్స్ 51. సీపీఎల్ రోడ్ 52. వైఎంసీఏ చౌరస్తా 53. విజ్ఞాన్పురి (ఓయూ రోడ్డు) 54.బాగ్లింగంపల్లి రోడ్డు 55. నల్లకుంట 56. ఎస్వీఎస్ స్కూల్ 57. ముషీరాబాద్ 58. విద్యానగర్ 59.ఓయూ క్యాంపస్ 60. ఫీవర్ హాస్పిటల్ రోడ్ 61, 62, 63. నారాయణగూడ 64. విజయనగర్ కాలనీ 65.అంబర్పేట 66. ఆర్టీసీ క్రాస్రోడ్డు (ముషీరాబాద్) 67. శివం రోడ్డు. సర్కిల్-10లో.. 68. సనత్నగర్ 69. ధరంకరణ్ రోడ్డు శేరిలింగంపల్లి-1 సర్కిల్లో.. 70. కొండాపూర్ 71 నుంచి 78 వరకు గచ్చిబౌలి జాతీయ రహదారి శేరిలింగంపల్లి-2 సర్కిల్లో... 79.కొత్తగూడ 80.మాదాపూర్ ఖైరతాబాద్ సర్కిల్లో... 81 నుంచి 86 వరకు నేషనల్ హైవే, కూకపట్పల్లి రోడ్డు కుత్బుల్లాపూర్ సర్కిల్లో... 87.ఐడీపీఎల్కాలనీ 88. సూరారం 89. షాపూర్ నగర్ చౌరస్తా 90, 91. చింతల్ 92.సుచిత్ర జంక్షన్ 93. జీడిమెట్ల. అల్వాల్ సర్కిల్లో.. 94. అల్వాల్ మెయిన్ రోడ్డు 95. కౌకూరు 96. యాప్రాల్ 97. కౌకూర్విలేజ్ సికింద్రాబాద్ సర్కిల్లో.. 98.మినిస్టర్ రోడ్ 99. తార్నాక 100. లాలాపేట 101.బోయిగూడ రోడ్డు 102. చిలకలగూడ రోడ్డు 103. నార్త్లాలాగూడ రోడ్డు. ఇది వరకే టెండర్లు ఆహ్వానించిన ఎఫ్ఓబీలు 1. టిప్పుఖాన్ బ్రిడ్జి, లంగర్హౌస్ 2. సరోజినిదేవి కంటి ఆస్పత్రి, మెహదీపట్నం 3. మహావీర్ హాస్పిటల్, మాసాబ్ట్యాంక్ 4. కేర్ హాస్పిటల్, బంజారాహిల్స్ 5. గ్రీన్ల్యాండ్స్ గెస్ట్హౌస్, గ్రీన్హౌస్. -
కిక్కు దిగింది
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఓ వైపు మద్యం పాలసీ గడువు ముగుస్తోంది... కొత్త పాలసీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది... పెద్ద మొత్తాలతో షాపులు దక్కించుకున్న మద్యం వ్యాపారుల్లో అలజడి రేగుతోంది. వ్యాపారం ప్రారంభించింది మొదలు ప్రతికూల పరిస్థితులు తలెత్తడంతో ఆశించిన స్థాయిలో పెట్టుబడి దక్కించుకోలేకపోయారు. గడువు దగ్గరపడుతున్నకొద్దీ ఎమ్మార్పీని పక్కన పెట్టి మేం చెప్పిందే రేటు అన్నట్టు అమ్మకాలు సాగించారు. విస్తృతంగా బెల్టు షాపులు ఏర్పాటు చేసి తమ దందా సాగించారు. ఒక విధంగా చెప్పాలంటే వీరికి అధికారులు సైతం ఇతోధికంగా సాయపడ్డారు. వీరి ఆగడాలను అడ్డుకునేందుకు సాహసించలేదు. అయితే రాష్ట్ర స్థాయి నిఘా అధికారులు ఇప్పుడు జిల్లాపై కన్నేయడంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారులు స్థానికంగా ఉండడంతో దాడులపైనే దృష్టిసారించారు. ఇన్నాళ్లూ చూసీచూడనట్టు వ్యవహరించినా మద్యం చట్టం ప్రకారం కేసుల నమోదు, లక్ష్య సాధన విషయమై స్థానిక ఉద్యోగులు తనిఖీల్ని ముమ్మరం చేశారు. లెసైన్సీలకు తెలియకుండా అక్రమాలు జరగవన్న ఉద్దేశ్యంతో ఉన్నతాధికారులకు రహస్యంగా సమాచారాన్ని చేరవేస్తున్నారు. దుకాణాల్లోని గుమాస్తాల్ని తీసుకువచ్చి అక్రమాలపై ప్రశ్నిస్తున్నారు. ‘టాస్క్ఫోర్స్ అధికారులు జిల్లాలో ఉన్నప్పుడు కూడా వ్యాపారులు జాగ్రత్త వహించడం లేదు. మా పని మేం చేసుకోక తప్పదు కదా’అని ఎక్సైజ్శాఖలోని ఓ అధికారులు తెలిపారు. ఈ తనిఖీలతో వ్యాపారుల్లో అలజడి మొదలైంది. ఏడాదిపొడవునా వచ్చిన కష్టాలతో తాము పూర్తిగా నష్టపోయామనీ, ఇప్పుడు అధికారులు చేసిన ఒత్తిళ్లతో ఇబ్బందులు పడుతున్నామని వారు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారుల విలవిల పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి షాపులు దక్కించుకుని అమ్మకాలు చేపట్టాక వరుసగా తమకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని వ్యాపారులు వాపోతున్నారు. హుద్హుద్ తుపాను ప్రభావంతో కొంత నష్టపోగా... ఎచ్చెర్లలో మద్యం డిపోను ఐటీ శాఖ అధికారులు సీజ్ చేయడం, మధ్యలో ఆమదాలవలస గోదాములనుంచి మద్యం సరఫరా చేయడంవల్ల సరకు సక్రమంగా సరఫరా కాక అమ్మకాలు చేయలేకపోయామని వారు చెబుతున్నారు. తమకు నష్టాలొస్తున్నాయని, అధికారుల దాడులతో విసిగిపోతున్నామని, మామూళ్లు ఇస్తున్నా సోదాల పేరిట ఇబ్బందులు సృష్టిస్తున్నారంటూ వ్యాపారులు గగ్గోలు పెట్టారు. గడువు సమీపిస్తుండడంతో ఎమ్మార్పీ ఉల్లంఘనలపై చూసీ చూడనట్టు వ్యవహరించాలని కోరుతున్నారు. ఈ వ్యవహారం జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారుల చేతుల్లో లేకపోవడంతో టీడీపీ నాయకుల వెంట పడుతున్నారు. కఠినంగా వ్యవహరిస్తున్న ఎస్టీఎఫ్ ఈ నేపథ్యంలో రాష్ట్ర టాస్క్ఫోర్స్ (ఎస్టీఎఫ్) అధికారులు కఠినంగానే వ్యవహరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారుల్ని గుర్తించి తాజా నివేదికను హైదరాబాద్ పంపించినట్టు తెలిసింది. వాస్తవానికి గతంలో వ్యాపారులు హోలోగ్రామ్, కంప్యూటర్ పరికరాల సహాయంతోనే వ్యాపారం సాగించాలని ప్రభుత్వం ఆదేశించింది. అది ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఎక్కడా అమలు కాలేదు. ఇప్పుడు ఎక్కడ వ్యాపారులు దొరికినా కేసులు పెట్టేందుకు టాస్క్ఫోర్స్ వెనుకాడటంలేదని తెలుస్తోంది. -
కొత్త పాలసీ.. పాత పద్ధతి!
జూలై నుంచి రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ విధానం స్వల్ప మార్పులతో పాత పద్ధతిలోనే మద్యం అమ్మకాలు ఇతర రాష్ట్రాల్లోని ఎక్సైజ్ పాలసీపై అధికారులతో అధ్యయనం అధికారులతో సమాలోచనలు జరిపిన కమిషనర్ చంద్రవదన్ హైదరాబాద్: రాష్ర్టంలో మద్యం అమ్మకాలు స్వల్ప మార్పులతో పాత పద్ధతిలోనే సాగించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీలో ఉన్న కొన్ని లోటుపాట్లను సవరించి, ఆదాయాన్ని మరింతగా పెంచుకునేలా కొత్తపాలసీని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎక్సైజ్ శాఖ 2013-14 ఆర్థిక సంవత్సరం కన్నా 2014-15లో పదిశాతం మేర అదనపు రెవెన్యూ సాధించి రూ. 10,230 కోట్లు ఖజానాకు జమ చేసింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయాన్ని 20 శాతం మేర పెంచుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సంవత్సరం జూన్30తో ముగుస్తుండగా, జూలై 1 నుంచి కొత్త మద్యం విధానం అమలు చేయాల్సి ఉంది. తమిళనాడు తరహాలో రిటైల్(వైన్స్) వ్యాపారాన్ని ఎక్సైజ్శాఖ ద్వారా నిర్వహించాలని ఏపీ నిర్ణయించి న నేపథ్యంలో తెలంగాణలో మద్యం విధానం ఎలా ఉండాలనే అంశంపై ప్రభుత్వం ఆలోచనలు చేసింది. ఈ నేపథ్యంలో చండీగఢ్, హరియాణా, పంజాబ్, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రలకు వెళ్లిన అధికారులు అక్కడ అమలవుతున్న మద్యం విధానంపై అధ్యయనం చేసి నివేదికను అందజేశారు. ఆయా రాష్ట్రాల్లో రిటైల్ వైన్షాపుల నిర్వహణ, లెసైన్స్ ఫీజు, ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ బై ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంటు తీరు, సారా, చీప్ లిక్కర్ పరిస్థితితో పాటు వస్తున్న రెవెన్యూ, ఆదాయపు పన్ను చెల్లింపు తదితర అంశాలను నివేదికలో పొందుపరిచారు. ఇటీవలే రాష్ట్రంలోని 10 జిల్లాలకు చెందిన అధికారులు, టీఎస్బీసీఎల్ అధికారులతో సమావేశమైన కమిషనర్ చంద్రవదన్ కొత్త మద్యం విధానం ఎలా ఉండాలనే దానిపై చర్చించి, ప్రభుత్వానికి నివేదిక పంపించారు. సొంతంగా రిటైల్ వ్యాపారం... తక్కువ ధర మద్యంతో నష్టం: తమిళనాడులో ప్రభుత్వమే మద్యం రిటైల్ వ్యాపారం నిర్వహిస్తున్నా, మూడు విభాగాల ద్వారా అది సాగుతుంది. ఏపీ ప్రభుత్వం ఇదే విధానాన్ని అవలంబించాలని భావించినా... అక్కడ కూడా జూలై నుంచి అమ్మకాలు సాధ్యం కాదని భావిస్తున్నారు. అలాగే తెలంగాణలోనూ సాధ్యం కాదని, ప్రభుత్వానికి నష్టమని అధికారులు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక తక్కువ ధరలో మద్యం (చీపెస్ట్ లిక్కర్) అమ్మకాల వల్ల రిటైల్ మద్యం దుకాణాల్లో రెవెన్యూ పడిపోతుందని ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన అధికారులు తేల్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో లెసైన్స్ ఫీజుల్లో మార్పులు, ప్రివిలేజ్ ఫీజు తొలగింపు వంటి అందరికీ ఆమోదమైన స్వల్ప మార్పులతో ఇప్పుడున్న మద్యం విధానాన్నే కొనసాగించాలని అధికారులు సూచించినట్లు సమాచారం. -
ఈ ప్రయోగం ఫెయిల్
ఈ-పాస్ విధానంతో ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికడతామని ప్రకటించిన ప్రభుత్వం ప్రయోగ పరీక్షలోనే ఫెయిలైంది. ఆధునిక సాంకేతిక విధానంతో అనుసంధానించి తొలివిడతగా జిల్లాలోని 245 రేషన్ షాపుల్లో ఈ నెల నుంచి ఈ పాస్ అమలు ప్రారంభించారు. అయితే సాంకేతిక, ఇతరత్రా లోపాలతో కొత్త విధానంలో రేషన్ అందజేయడంలో అధికారులు విఫలమయ్యారు. సరుకులు అందక లబ్ధిదారులు గగ్గోలు పెడుతుండటంతో చివరికి ఈ పాస్ పని చేస్తున్న 50 డిపోలు మినహా మిగిలిన వాటిలో పాత విధానంలోనే ఈ నెల సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. పాలకొండ: జిల్లాలో అన్ని రకాలు కలిపి సుమారు 11 లక్షల రేషన్కార్డులు ఉన్నాయి. ఈ కార్డుదారులకు సరుకులు అందజేసేందుకు సుమారు 2వేల రేషన్ డిపోలు పని చేస్తున్నాయి. వీటి ద్వారా గత నెల వరకు సాధారణ తూనిక పద్ధతుల్లోనే సరుకులు అందించేవారు. దీని వల్ల డిపోల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. దీంతో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని జీపీఎస్ విధానంలో ప్రజాపంపిణీ అనుసంధానించి బయోమెట్రిక్ కూడా జోడించి సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ-పాస్ యంత్రాలు, ఎలక్ట్రానిక్ కాటాలను వినియోగంలోకి తీసుకువచ్చారు. తొలి విడతగా జిల్లాలో 245 రేషన్ డిపోల్లో వీటిని ఏర్పాటు చేసి, ఏప్రిల్ కోటా వీటి ద్వారానే పంపిణీ చేయాలని ఆదేశించారు. మొదట్లో రేషన్ డీలర్లు ఈ విధానంలో ఎదురయ్యే ఇబ్బందులను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద సరుకులను తూకం వేసి ఇస్తేనే తీసుకెళ్తామని తేల్చి చెప్పారు. అలా తూకం వేస్తే ప్రతి బస్తాలో 2 నుంచి 3 కేజీల వరకు సరుకులు తక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. దీనిపై జాయింట్ కలెక్టర్ స్పందించి వేబ్రిడ్జిల్లో సరుకులు తూకం వేయించిన తర్వాతే డీలర్లకు అందించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి 5వ తేదీ దాటిపోయింది. అనంతరం రేషన్ పంపిణీకి ఈ-పాస్ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఆది నుంచీ అవి మొరాయించడం ప్రారంభించాయి. చాలా వరకు ఈ-పాస్ యంత్రాలు ఆన్ కాకపోవడం, ఆన్ అయినా సర్వర్ డౌన్ అని చూపించటం వంటి సాంకేతిక కారణాలతో సరుకుల పంపిణీ నిలిచిపోయింది. ఉన్నతాధికారులు పరిశీలించి యంత్రాలకు మరమ్మతులు చేయించినా అవి తాత్కాలికంగానే పని చేశాయి. మరో వైపు ఈ నెల 15లోగా సరుకుల పంపిణీ పూర్తి చేయాల్సి ఉండటంతో లబ్ధిదారుల నుంచి డీలర్లపై తీవ్ర ఒత్తిడి మొదలైంది. సక్రమంగా పనిచేసిన యంత్రాల ద్వారా కూడా రోజుకు 10 మంది కార్డుదారులకు మించి సరుకులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రేషన్ సరుకుల కోసం రాత్రుళ్లు కూడా లబ్ధిదారులు వేచి ఉండాల్సి పరిస్థితి ఏర్పడింది. 50 డిపోలకు పరిమితం ఈ-పాస్ యంత్రాల ద్వారా సరుకుల పంపిణీలో విఫలమైన అధికారులు ప్రస్తుతానికి ఈ విధానాన్ని పక్కన పెట్టేందుకు సిద్ధమయ్యారు. జిల్లా వ్యాప్తంగా సక్రమంగా పని చేస్తున్న 50 పరికరాలున్న డిపోల్లోనే ఈ పాస్ విధానం కొనసాగించాలని, మిగిలిన డిపోల్లో వాటిని పక్కన పెట్టాలని జాయింట్ కలెక్టర్ వివేకయాద్ రెవెన్యూ అధికారులకు సూచించారు. పాతపద్ధతిలో సరుకులు పంపిణీ చేయాలని ఆదేశిస్తూ.. దీనికి గడువును ఈ నెల 20 వరకు పొడిగించారు. చిత్తశుద్ధి లోపం ఈ పాస్ పరికరాల ఏర్పాటులో అత్యాత్సుహం చూపిన అధికారులు ఈ విధానం అమలులో మాత్రం చిత్తశుది ్ధ చూపకపోవడమే ఇది విఫలం కావడానికి ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. ఈ-పాస్ విధానం ద్వారా బోగస్ లబ్ధిదారుల గుర్తింపు జరుగుతున్న సమయంలో సాంకేతిక లోపాలను సకాలంలో పరిష్కరించడంలో అధికారులు ఎందుకు శ్రద్ధ చూపించటం లేదన్నది ప్రశ్నగా మారింది. 50 కేంద్రాల్లో ఈ విధానం కొనసాగించాలని అనుకున్నా అది కూడా సాధ్యం కాదని తెలుస్తోంది. మిగిలిన కేంద్రాల్లో పాత పద్ధతిలో సరుకులు పంపిణీ చేసి 50 కేంద్రాల్లో యంత్రాల ద్వారా పంపిణీ చేసేందుకు డీలర్లు సుముఖంగా లేరు. ఈ సమస్యలన్నింటిని ముందుగానే అంచనా వేసి విధానం అమలు చేసి ఉంటూ అభాసుపాలయ్యేది కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కొత్త పాలసీ: మంత్రి రావెల
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కొత్త పారిశ్రామిక విధానం అమలులోకి తేస్తున్నట్టు మంత్రి రావెల కిశోర్ బాబు తెలిపారు. గురువారం ఆయన హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడారు. బ్యాంకులు రుణాలివ్వడానికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే పూచీకత్తుగా నిలిచేలా కొత్త పాలసీని తయారు చేశామని ఆయన అన్నారు. మార్జిన్ మనీ స్కీం కింద ఎస్టీలకు రూ. 200 కోట్లు, ఎస్సీలకు 100 కోట్లు కేటాయించామని చెప్పారు. క్రెడిట్ గ్యారంటీ స్కీం కింద ఎస్టీలకు రూ. 100 కోట్లు, ఎస్సీలకు రూ. 50 కోట్లు కేటాయించామని రావెల తెలిపారు. ఇప్పటివరకు సేవారంగంలోనే అధికంగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలున్నారని ఆయన చెప్పారు. ఇప్పుడు తయారీ రంగంలో ప్రోత్సహించేందుకు కొత్త పాలసీ దోహదపడుతుందని మంత్రి రావెల ఆశాభావం వ్యక్తం చేశారు. -
టెన్త్ తరహాలో 9లోనూ 11 పేపర్లు
ఈ వార్షిక పరీక్షల నుంచే అమలు ఏప్రిల్ 1 నుంచి 11 వరకు పరీక్షలు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పరీక్షల షెడ్యూలు ఖరారు సాక్షి, హైదరాబాద్: నిరంతర సమగ్ర మూల్యాంకనంలో (సీసీఈ) భాగంగా పదో తరగతి తరహాలోనే ఈసారి 9వ తరగతిలోనూ 11 పేపర్ల పరీక్ష విధానాన్ని విద్యాశాఖ ప్రవేశ పెట్టింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగే వార్షిక పరీక్షలను కొత్త విధానంలోనే నిర్వహించనున్నారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:45 వరకు నిర్వహిస్తారు. ఆయా స్కూళ్లలో పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్నందున ఈ పరీక్షలను మధ్యాహ్నం నుంచి నిర్వహించనున్నారు. 9, 10 తేదీల్లో జరిగే తొమ్మిదో తరగతి ప్రథమ, తృతీయ భాషల పేపర్-1 పరీక్షలను ఉదయం 8:30 గంటల నుంచి 11:15 గంటల వరకు, ప్రథమ, తృతీయ భాషల పేపరు-2 పరీక్షలను మధ్యాహ్నం 12 గంటల నుంచి 2:45 గంటలవరకు నిర్వహిస్తారు. (ఒకే రోజు రెండు పరీక్షలు) 11వ తేదీన ద్వితీయ భాష పరీక్ష ఉదయం 8:30 గంటల నుంచి 11:45 గంటల వరకు ఉంటుంది. ఇక ఒకటో తర గతి నుంచి 5వ తరగతి వరకు పరీక్షలు ఉదయం 9:00 గంటల నుంచి 11:30 వరకు జరుగుతాయి. ఈ మేరకు వార్షిక పరీక్షల నిర్వహణ షెడ్యూలును విద్యాశాఖ అన్ని జిల్లాల డీఈఓలకు జారీ చేసింది. మొదటి రోజు ప్రథమ భాష పరీక్ష కాదు.. ప్రధానంగా 8, 9వ తరగతుల్లో మొదటి రోజు ప్రథమ భాష పరీక్ష నిర్వహించడం లేదు. మొదటి రోజు గణితం పేపరు-1తో పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఇక ఇందులోనూ పాఠం వెనుక ప్రశ్నలు లేవు కాబట్టి విద్యార్థులు సొంతంగా ఆలోచించి జవాబులు రాయాల్సి ఉంటుంది. టెన్త్ తరువాతే నిర్వహించాలి: పీఆర్టీయూ-టీఎస్ ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలను టెన్త్ పరీక్షల తరువాత ఉదయం వేళల్లోనే నిర్వహించాలని పీఆర్టీయూ-టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్రెడ్డి, సరోత్తంరెడ్డి పేర్కొన్నారు. 6 నుంచి 9వ తరగతి వరకు మధాహ్నం పరీక్షలు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయడం సరైంది కాదని అన్నారు. మే 1వ తేదీ నుంచి 31 వరకు చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్న ఆలోచన సరికాదని, పాఠశాలలు ప్రారంభం అయ్యాక ఆ తరగతులను నిర్వహిస్తే బాగుంటుందన్నారు. -
రక్షణరంగ కొనుగోళ్లపై కొత్త విధానం
రక్షణమంత్రి మనోహర్ పారికర్ అవినీతికి తావులేని వ్యవస్థ .. దేశ ప్రయోజనాలకు పెద్దపీట ప్రైవేట్ కంపెనీల సమస్యలూ తీరుస్తాం ‘స్వావలంబన’ సదస్సుకు ముఖ్యఅతిథిగా వచ్చిన పారికర్ సాక్షి, హైదరాబాద్: రక్షణ రంగ కొనుగోళ్లకు సంబంధించిన అడ్డంకులను తొలగించే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. అవినీతి రహిత, దేశీయ కంపెనీలకు సమాన అవకాశాలు కల్పించే సరికొత్త విధానానికి మూడు, నాలుగు నెలల్లోనే తుది రూపునిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఫోరమ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ నేషనల్ సెక్యూరిటీ (ఫిన్స్) ఆధ్వర్యంలో ‘సెల్ఫ్ రిలయన్స్ ఇన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్’ అన్న అంశంపై శనివారం జాతీయ సదస్సు ప్రారంభమైంది. హైదరాబాద్లో రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సుకు రక్షణ శాఖ మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మనోహర్ పారికర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు అన్న పేరు భారత్కు గర్వకారణం కాదని, దేశ రక్షణకు సంబంధించిన కీలక అంశాలపై ఇతర దేశాలపై ఆధారపడటం మన విదేశాంగ విధానాన్ని కూడా ప్రభావితం చేస్తుందన్నారు. అందుకే మన అవసరాల కోసం మనమే రక్షణ రంగ ఉత్పత్తులను తయారు చేసుకోవాలని చెప్పారు. భారత్లో తయారైన రక్షణ రంగ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు అనేక దేశాలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. అయితే స్వావలంబన సాధించేందుకు విధానాలపరంగా మనకు మనమే అనేక అడ్డంకులు, చిక్కుముళ్లను ఏర్పరచుకున్నామని అభిప్రాయపడ్డారు. నిషేధమొక్కటే మార్గం కాదు... అవకతవకలకు పాల్పడ్డారనో... మరో కార ణం చేతనో రక్షణ రంగానికి పరికరాలను సరఫరా చేసే కంపెనీలపై విచక్షణా రహితంగా నిషేధం విధించడం సరికాదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో టాట్రా ట్రక్కుల కంపెనీపై నిషేధం విధించడాన్ని ప్రస్తావిస్తూ... త్రివి ద దళాల్లో దాదాపు 7,000 టాట్రా ట్రక్కులుం టే.. నిషేధం ఫలితంగా కీలకమైన ఆయుధ వ్యవస్థలను మోసుకెళ్లే దాదాపు పదిశాతం ట్రక్కులు మూలనపడ్డాయని తెలిపారు. కంపెనీలు చేసే తప్పుల కన్నా దేశ ప్రయోజనాలకే తాను ఓటు వేస్తానని అన్నారు. టాట్రా ట్రక్కులకు అవసరమైన విడి భాగాలు, సరికొత్త వాహనాల తయారీకి దేశీయంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ ద్వారా రక్షణ రంగ ఉత్పత్తులు దేశీయంగానే తయారు కావాలని రక్షణశాఖ భావిస్తోందన్నారు. రక్షణ రంగ పరి కరాలు తయారీ కంపెనీల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అంతకుముందు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సత్వర పారిశ్రామికీకరణ రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ రక్షణ రంగంలో స్వావలంబన సాధించడమే కాకుండా... మేక్ ఇన్ ఇండియా స్థాయి నుంచి మేడ్ బై ఇండియా స్థాయికి భారత్ ఎదగాలని అందుకు ఇదే సరైన తరుణమని ఫిన్స్ అధ్యక్షుడు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) బి.షేకట్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిన్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షుడు మేజర్ జనరల్ ఎ.బి.గోర్తి, జనరల్ సెక్రటరీ వి.శ్రీనివాసరావు, ఫిన్స్ సెక్రటరీ జనరల్ బాల్దేశాయి, లెఫ్టినెంట్ జనరల్ వి.ఎం.పాటిల్, ఎయిర్ మార్షల్ ఆర్.సి.బాజ్పాయి, సదస్సు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఏకే మహంతి, కె.రామచంద్రమూర్తి (సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్) తదితరులు పాల్గొన్నారు. -
‘మీ సేవ’లో ఇసుక!
చవకగా అందించేలా నూతన ఇసుక పాలసీ: హరీశ్రావు ఆన్లైన్ ద్వారా ఇంటికే ఇసుక విధానాన్ని అమలు చేస్తాం టన్నుకు రూ. 400లే.. రవాణా చార్జీలు అదనం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు మేలు చేసేలా, చవకగా ఇసుకను అందుబాటులోకి తెచ్చేలా నూతన ఇసుక పాలసీని తీసుకొస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇసుక మాఫియాకు కళ్లెం వేస్తామని... పారదర్శకత కోసం ఆన్లైన్ విధానం ద్వారా నేరుగా ఇంటికే ఇసుక డెలివరీ జరిగేలా చూస్తామని ఆయన వెల్లడించారు. మార్కెట్ ధరకన్నా 50 నుంచి 60 శాతం తక్కువ ధరకే ఇసుకను అందించడం, ఓవర్లోడ్ రవాణాను నివారించడం, ఇసుక ట్రాక్టర్లు, లారీల కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణ తదితర లక్ష్యాలతో ఈ పాలసీని మరో రెండు నెలల్లో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. శుక్రవారం హరీశ్రావు సచివాలయంలో ఇసుక పాలసీ అంశంపై అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం ప్రజా అవసరాల దృష్ట్యా పట్టా భూముల్లో మరో రెండు నెలల పాటు ఇసుక తవ్వకాలకు అనుమతించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే సీజ్ చేసిన రెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను వేలం వేయనుందని తెలిపారు. టన్ను ఇసుకను కేవలం రూ. 400లకే అందిస్తామని, దీనికి అదనంగా రవాణా చార్జీలు ఉంటాయని తెలిపారు. హైదరాబాద్లో ప్రస్తుతం టన్ను ఇసుక ధర రూ. 1,400 వరకు ఉందని.. అదే కొత్త విధానంతో రూ. 900 నుంచి రూ. 1,100 లోపే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. ప్రజలు సైతం నేరుగా వచ్చి ఇసుక కొనుగోలు చేసేలా స్టాక్యార్డ్లు, మీసేవ కేంద్రాల్లో ఆన్లైన్ అమ్మకాలను చేపడతామని పేర్కొన్నారు. ఈ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా ఇసుక విక్రయాలు జరుగుతాయన్నారు. ఇసుక తరలించే వాహనాలకు జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేయడం, రాష్ట్ర విజిలెన్స్తో పాటు కలెక్టర్ నేతృత్వంలో జిల్లా విజిలెన్స్ల ఏర్పాటు, కాల్సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కింద చేపట్టాల్సిన భూసేకరణపైనా మంత్రి నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. త్వరితగతిన భూసేకరణ జరిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ఈపీసీ స్థానంలో కొత్త విధానం: తుమ్మల
రోడ్డు కాంట్రాక్టుల్లో ఇప్పటి వరకు ఉన్న ఈపీసీ విధానాన్ని రద్దు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలియజేశారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు ఉన్న కమిషన్ ఆఫ్ టెండర్స్ నియామకాల్లో మార్పులు చేసి తదుపరి విధివిధానాలు పటిష్ఠం చేయనున్నట్లు తెలిపారు. ఈ కొత్త విధానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు నివేదిక సమర్పిస్తామని ఆయన పేర్కొన్నారు. -
ఇసుక మాఫియాకు చెక్
*అక్రమ తవ్వకాలకు కాలం చెల్లినట్లే *పట్టాభూములలో తవ్వకాలు కఠినతరం *నిబంధనలు ఉల్లంఘిస్తే డిపాజిట్లు జప్తు *కలెక్టర్ చైర్మన్గా కమిటీ నియామకం *అమలులోకి రానున్న కొత్త ఇసుక విధానం *ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం నిజామాబాద్: ఇసుక మాఫియాను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను అమలులోకి తేనుంది. పట్టాభూములలో ఇసుక తవ్వకాలకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేయనుంది. ఈ మేరకు కొత్త ఇసుక విధానం (న్యూ స్యాండ్ పాలసీ)ని విడుదల చేస్తూ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ కె.ప్రదీప్చంద్ర గురువారం ఉత్తర్వులు జారీచేశారు. పట్టాభూములలో ఇసుక మేటల తొలగింపు, ఇసుక రీచ్ల గుర్తింపు, కేటాయింపు, టీఎస్ఎండీసీ పాత్ర, ఇసుక రవాణాకు సంబంధించిన మార్గదర్శకాలను ఇందులో పేర్కొన్నారు. ఇసుక లభ్యమయ్యే ప్రాంతాలను గుర్తించి, తెలంగాణ గనుల శాఖ టెండర్లు నిర్వహించి రీచ్లను కేటాయించనుంది. నదుల మధ్యలో పట్టా భూముల్లో ఇసుక తీసే బాధ్యతలను తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎండీసీ) నిర్వహిస్తుంది. ఈ భూముల్లో ఇసుక మేటలు తొలగించేందుకు గతంలో వ్యవసాయశాఖకు దరఖాస్తు చేసుకునే రైతులు ఇకపై నేరుగా గనులు, భూగర్భ శాఖ కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఇసుక మేటలను తొలగించేందుకు గతంలో జాయింట్ కలెక్టర్ అనుమతి ఇచ్చేవారు. కొత్త విధానంలో కలెక్టర్ చైర్మన్గా జిల్లాస్థాయి స్యాండ్ కమిటీ (డీఎల్ఎస్సీ)లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీకి జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మన్గా వ్యవహరించనుండగా, డీపీఓ, డీడీ (గ్రౌండ్వాటర్), ఈఈ (ఆర్డబ్ల్యూఎస్), ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ (పొల్యూషన్ కంట్రోల్ బోర్డు), టీఎస్ఎండీసీ నామినేటెడ్ సభ్యుడు, అసిస్టెంట్ డైరక్టర్ (గనులు, భూగర్భశాఖ) సభ్యులుగా ఉంటారు. గిరిజన ప్రాంతాలైతే ఐటీడీఏ పీఓ కూడా ఉంటారు. అక్రమ ఇసుక రవాణా నియంత్రణకు కూడ పోలీసు, రెవెన్యూ, రవాణా, గనుల శాఖలకు సర్వాధికారాలు ఇచ్చారు. కలకలం రేపుతున్న ఉత్తర్వులు పట్టాభూములలో ఇసుక మేటల తొలగింపు పేరిట ఇసుక అక్రమ వ్యాపారం చేస్తున్న ‘మాఫియా’ దూకుడుకు ప్రభుత్వం కళ్లెం వేయనుంది. ఇసుక మేటల తొలగింపునకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ జారీ అయిన ఉత్తర్వులు కలకలం రేపుతున్నాయి. వాల్టా నిబంధనలకు తోడు కొత్త మార్గదర్శకాలు అక్రమ ఇసుక వ్యాపారానికి చెక్ పెట్టనున్నాయి. ప్రధానంగా పట్టాభూములలో ఇసుక మేటల తొలగింపు పేరిట అనుమతులు పొందిన బడా వ్యాపారులకు ఈ కొత్త విధానం మింగుడు పడని అంశం. గతంలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వగా, తాజా ఉత్తర్వుల ప్రకారం ఆ అధికారం ఇక జిల్లా స్థాయి కమిటీకి ఉంటుంది. రైతులు ఇక ముందు గనుల శాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కమిటీ పరిశీలించిన మీదటే తవ్వకాలకు అనుమతి లభిస్తుంది. అనుమతి లభిస్తే, ఆ మొత్తం ఇసుకకు సంబంధించిన రాయల్టీ, అంతే నగదును సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించాలి. ఆ తర్వాత నిబంధనలను ఉల్లంఘిస్తే డిపాజిట్ జప్తు చేయడంతోపాటు కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం, ప్రజల అవసరాల కోసం మైనింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇసుక రీచ్లను గుర్తించి, అక్కడ నుంచి తీసిన ఇసుకతో డిపోలు ఏర్పాటు చేసి నిర్ణయించిన చౌకధరలకు ఇసుకను సరఫరా చేస్తారు. జిల్లాలో తీసిన ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించడాన్ని కూడా నిషేధించిన ప్రభుత్వం దానిని నేరంగా పరిగణించనుంది. అక్రమ రవాణాకు దరఖాస్తుల పరంపర మంజీరా నది పరీవాహక ప్రాంతం నుంచి ఇసుక తోడేందుకు ‘మాఫియా’ పట్టా భూములున్న రైతులను ఎంచుకుంది. అక్రమ ధనార్జనే లక్ష్యంగా తెరవెనుక భాగోతం నడుపుతున్న వ్యాపారులు రైతుల పేరిట దరఖాస్తులు చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వం ఇసుక తవ్వకాలను కఠినతరం చేయడం ‘మాఫియా’కు ఇబ్బందికరంగా మారినా, అనుమతుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టాభూములలో ఇసుక మేటల తొలగింపు పేరిట బిచ్కుంద, మద్నూరు, కోటగిరి, బీర్కూరు మండలాలకు చెందిన ఆరుగురు రైతులు వ్యవసాయశాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే 15 వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉండగా, వాటి సంఖ్య మొత్తం 21కి చేరింది. పట్టా భూముల పేరిట అనుమతులు పొంది, మంజీరా నుంచి తవ్వకాలు జరపడం ఇసుక ‘మాఫియా’కు పరిపాటిగా మారిందన్న విమర్శలున్నాయి. టీఎస్ఎండీసీ పర్యవేక్షణలో బిడ్డింగ్ల ద్వారా జరిపే ఇసుక తవ్వకాలు, రవాణాను జీపీఎస్ పద్ధతిలో పర్యవేక్షించాలని ప్రభుత్వం పేర్కొంది. పట్టాభూములు, టెండర్ల ద్వారా కేటాయించిన రీచ్ల నుంచి ఇసుక తరలింపులో నిబంధనలను ఉల్లంఘించకుండా డివిజన్ స్థాయిలో సబ్కలెక్టర్/ఆర్డీఓల ఆధ్వర్యంలో కమిటీలకు మరిన్ని అధికారాలను అప్పగించారు. -
కొత్త విధానంతో కోటి తిప్పలు
కోదాడటౌన్ : మార్చి నెలలో నిర్వహించాల్సిన పదవ తరగతి పరీక్షలు ఈ సంవత్సరం విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను, జిల్లా అధికారులను ఇప్పటి నుంచే టెన్షన్కు గురిచేస్తున్నాయి. కొత్త సిలబస్తో పాటు మారిన పరీక్ష విధానంలో మొదటిసారిగా జరగనున్న ఈ పరీక్షలు, తదనంతరం పరీ క్షా ఫలితాలు ఏవిధంగా ఉండబోతున్నాయోననే ఆందోళన ఇప్పుటి నుంచే మొదలైంది. డిసెంబర్ నాటికే సిలబస్ పూర్తి చేసి జనవరి నెల నుంచి పునశ్చరణ తరగతులు నిర్వహిం చాల్సి ఉండగా ఇప్పటి వరకు 70 నుంచి 80 శాతం సిలబస్ మాత్రమే పూర్తి కావొచ్చిందని, మిగిలిన సిలబస్ పూర్తి చేయడానికి మరో నెల రోజులకు పైగా పడుతుందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. జనవరి చివరి వరకైనా సిలబ స్ను పూర్తి చేయాలని ఉన్నతాధికారులు జిల్లాలోని ప్రధానోపాధ్యాయులకు మౌఖిక ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తుం ది. మార్చి25 నుంచి పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ జారీ కావడంతో విద్యార్ధులను నూతన విధానంలో పరీక్షకు సిద్ధం చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. చిక్కులు తెచ్చిన నూతన విధానం ఈ విద్యాసంవత్సరం నుంచి 10వ తరగతి పరీక్షలను నూతన విధానంలో నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ప్రశ్న, జ వాబులను బట్టీ పడుతున్నారని దీనిని సమూలంగా మా ర్చాలని భావించిన విద్యావేత్తలు ఈ సంవత్సరం నుంచి నిరంతరం సమగ్ర మూల్యాంకన పద్ధతి(సీసీఎల్) ని అమ లు చేస్తున్నారు. దీని ప్రకారం వివిధ సబ్జెక్టులలో పాఠ్యాం శాల వెనుక ఉన్న ప్రశ్నలు కాకుండా పాఠ్యాంశములోని ఎ క్కడి నుంచైనా ప్రశ్నలు అడగవచ్చు. దీనికి విద్యార్థి ము ఖ్యాంశాలనే గాక పాఠం మొత్తం చదవాల్సి ఉంటుంది. గ తంలో ముఖ్యమైన పాఠ్యాంశాలను విద్యార్థులచే బట్టీ ప ట్టించి ఎలాగోలా గట్టెక్కించేవారు. కాని ఈ సారి ఉపాధ్యాయులకు కూడా పరీక్ష రోజు వరకు ప్రశ్న ఎలా ఉంటుంది? ఎక్కడ నుంచి అడుగుతారు? దాని సమాధానం ఏమిటి? అన్నది తెలియదు. దీంతో విద్యార్థులకు, ఆయా పాఠ్యాంశాలను బోధించే ఉపాధ్యాయులకు టెన్షన్ పట్టుకుంది. ఈ సారి 80 మార్కులకు మాత్రమే ఫైనల్ పరీక్ష నిర్వహిస్తున్నారు. మిగిలిన 20 మార్కులను విద్యార్థి తరగతిలో ప్రదర్శించిన వివిధ నైపుణ్యాలను పరిశీలించి ఇంటర్నల్ మార్కులుగా ఇవ్వాలి. వీటిని పబ్లిక్ పరీక్షలో సాధించిన మార్కులతో కలిపి ఫైనల్ గ్రేడ్ నిర్ణయిస్తారు. చివరిలో మొక్కుబడిగా శిక్షణ..!! మారిన సిలబస్, కొత్త పరీక్షా విధానంపై ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇవ్వాల్సి ఉండగా ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఈ విషయంలో తాత్సారం చేశారు. జూన్లో పాఠశాలలు మొదలు కాగా డిసెంబర్ నెలలో కొత్త విధానంపై ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. అప్పటికే సమ యం మించిపోయింది. ఇక పదవ తరగతి పరీక్షలు రాస్తున్న వారిలో 60 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. వారికి బోధించే ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని పాఠశాలలు ఇప్పటికీ పాత పద్ధతిలోనే విద్యార్థులకు బోధన చేస్తూ విద్యార్థు చేత గైడ్లు, టెస్టు పేపర్లు చదివిస్తున్నారు. వెనుబడిన విద్యార్థులను గుర్తించే సమయం ఏది? సంవత్సరం చివరలో పరీక్షలు పెట్టి ఇబ్బంది పెట్టకుండా నిరంతర సమగ్ర మూల్యాంకనం ద్వారా ప్రారంభం నుంచే విద్యార్థిని పరీక్షించి తద్వార వెనుక బడిన అంశాలలో వారిని మెరుగు పర్చాల్సి ఉంది. కాని కొత్త విధానంపై ఉపాధ్యాయులకే సరైన అవగాహన కల్పించకపోవడంతో ఇప్పటి వరకు వెనుక బడిన విద్యార్థులను గుర్తించే అవకాశం రాలేదు. సోమవారం నుంచి అర్ధ వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ తరువాత సంక్రాంతి సెలవులు. తిరిగి పాఠశాలలకు వచ్చే సరికి జనవరి నెల పూర్తవుతుంది. ఇక వారిలో వెనుక బడిన విద్యార్థులను గుర్తించడం, వారికి తిరిగి శిక్షణ ఇవ్వడం సాధ్యమయ్యే పని కాదని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు. వెనుక బడిన విద్యార్థులను గుర్తించడానికి ప్రతి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఒక సబ్జెక్టును బోధించాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఎక్కడ ఇవి అమలు కావడం లేదు. దీంతో వెనుకబడిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆందోళన అవసరం లేదు : విశ్వనాథరావు, డీఈఓ బట్టీ విధానానికి స్వస్తి చెప్పి విద్యార్థులను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి నూతన విధానం ఉపయోగపడుతుంది. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చాం. జనవరి చివరి వరకు సిలబస్ పూర్తి చేస్తాం. ప్రధానోపాధ్యాయులు కూడా పాఠాలు బోధించాలని ఆదేశాలు ఇచ్చాం. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమిలేదు. -
సంఘాల మాటునా దొంగలే
సాక్షి, కాకినాడ :రేణువంత ఇసుక చుట్టూ మేరువంత మాయ, మాఫియా అల్లుకుపోయాయన్నది ఏటా ఈ జిల్లాలో రుజువవుతున్న యథార్థమే. తత్ఫలితంగా వినియోగదారులకు ‘ఇసుకే బంగారమంత’ ప్రియమైపోతోందన్నదీ అంతకన్నా పచ్చి నిజమే. ఇసుకాసురుల ఇష్టారాజ్యానికి అరికట్టడానికి సర్కార్లు చిత్తశుద్ధితోనో లేక మొక్కుబడిగానో ఏ విధానాన్ని అవంబించినా; కొన్ని సందర్భాల్లో న్యాయస్థానాలు కొరడా ఝుళిపించినా ఏ మాత్రం అడ్డుకట్ట పడడం లేదన్నది మరింత కఠిన సత్యం. ఇసుక రీచ్లకు సంబంధించి వేలం పాటలైపోయాయి. లాటరీ విధానం అటకెక్కింది. ఇప్పుడు కొత్తగా డ్వాక్రా సంఘాలకు ఇసుక రీచ్లు కట్టబెట్టాలని తెలుగుదేశం సర్కారు తీసుకున్న నిర్ణయమూ ఇసుకాసురుల పాలిట వరంగా పరిణమించనుంది. వేలంపాటలో అయితే సిండికేట్ అవతారమెత్తాలి. లాటరీ విధానంలో ఎవరిని అదృష్టం వరిస్తుందో తెలియదు. కానీ ఈ కొత్త విధానంలో అధికారులను మచ్చిక చేసుకుంటే చాలు.. కోరుకున్న సంఘాన్ని ఎంపిక చేసుకుని, ఆ సంఘం మాటున గోదావరి ఇసుకను దండుకోవచ్చు. ఆ ఇసుక నుంచి షరామామూలుగానే కోట్లు పిండుకోవచ్చు. దీంతో గతంలో ఇసుక మాఫియాలో చక్రం తిప్పిన వారు (ఇలాంటి వారిలో కొందరు గతం నుంచీ టీడీపీలో ఉన్న వారే కాగా, కొందరు తాజాగా పచ్చచొక్కాలు ధరించిన వారున్నారు) ఇసుక రీచ్లను దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. వీరితో చేయి కలిపి, రెండు చేతులా సంపాదించేందుకు పలువురు ‘దేశం’ ప్రజాప్రతినిధులు కూడా సిద్ధమవుతున్నారు. అధికార పార్టీ నేతలు సూచించిన వారికే రీచ్లు దక్కనుండడంలో విశేషమేముంటుంది? తొలిసారిగా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ.. ఇప్పటి వరకు జిల్లాస్థాయి ఇసుక కమిటీకి జాయింట్ కలెక్టర్ చైర్మన్గా వ్యవహరించేవారు. తొలిసారిగా కలెక్టర్కు ఈ కమిటీ బాధ్యతలు అప్పగించారు. కలెక్టర్ చైర్మన్గా ఏర్పడే జిల్లాస్థాయి ఇసుక కమిటీ ఎంపిక చేసిన రీచ్లను కేటాయించే బాధ్యతను గనులశాఖకు అప్పగిస్తారు. వారు ఆయా రీచ్లను ఎంపిక చేసిన మహిళా సంఘాలకు జిల్లాస్థాయి కమిటీ అనుమతితో అప్పగిస్తారు. ఇందుకు అవసరమైన పెట్టుబడులు సమకూర్చడం, యంత్రాల కొనుగోలు, ఇసుక రవాణా, లోడింగ్, అన్లోడింగ్, భద్రత తదితర అంశాల్లో మహిళా సంఘాలకు తగిన సహకారాన్ని అందించే బాధ్యతను కలెక్టర్, ఎస్పీలకు అప్పగించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ తమ పరిధిలోని సంఘాలకు ఈ మేరకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇసుక విక్రయించడానికి వీలుగా మినరల్ డీలర్ లెసైన్స్ను మహిళా సమాఖ్యలకు ఇప్పించడానికి జిల్లాస్థాయి ఇసుక కమిటీ సహకరిస్తుంది. చక్రం తిప్పుతున్న ‘సైకిల్’ పార్టీ ప్రజాప్రతినిధులు జిల్లాలో 27 ఇసుక రీచ్లుండగా అన్నింటికీ గనుల శాఖ అనుమతులు వచ్చాయి. ఆ అనుమతులు వచ్చిన వాటికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ)పరిధిలో ఉన్న స్టేట్ ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ ఎసెస్మెంట్ అథారిటీ నుంచి పర్యావరణ అనుమతులు రావాల్సి ఉంది. అన్ని అనుమతులతో ఇప్పటికే కేటాయించేందుకు సిద్ధంగా ఇసుకరీచ్లను డ్వాక్రా సంఘాలను అడ్డం పెట్టుకొని చేజిక్కించుకోవాలని ఇసుకాసురులు అన్ని దారుల్నీ అనుసరిస్తున్నారు. రీచ్లున్న ప్రాంతాల్లో మహిళా సమాఖ్యలకు ఆర్థికపరమైన వనరులు సమకూర్చేందుకు, యంత్రసహకారాన్ని అందించేందుకు ముందుకొస్తునారు. అయితే తొలుత ఏ రీచ్ను ఎవరు దక్కించుకోవాలన్న దానిపై గతంలో మాదిరిగానే అంతర్గతంగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని, సిండికేట్గా ఏర్పడ్డాకే సంఘాల మాటున రీచ్లను దక్కించుకోవాలని చూస్తున్నారు. తొలుత కేటాయించే అవకాశాలున్న కడియం, వేమగిరి, వంగలపూడి, సీతానగరం, కోరుమిల్లి రీచ్లను చేజిక్కించుకోవాలని ఆయా ప్రాంత అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు చక్రం తిప్పుతున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ ఏర్పాటు కానుందని గనుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కమిటీ ఏర్పాటు అనంతరం రీచ్ల కేటాయింపుపై కసరత్తు మొదలు కానుంది. -
ఇసుక.. తొలగింది మసక
ఏలూరు : కొద్ది నెలలుగా ఇసుక విధానంపై నెలకొన్న సందిగ్ధత ఎట్టకేలకు వీడిపోయింది. ఈ అంశంపై ప్రభుత్వం చేసిన కసరత్తు కొలిక్కి వచ్చింది. నూతన ఇసుక విధానాన్ని ఖరారు చేస్తూ ప్రభుత్వం గురువారం జీవో జారీ చేసింది. ఇసుక రీచ్లను మహిళా స్వయం సహాయక సంఘాలకు కేటాయించాలని.. తద్వారా వచ్చే ఆదాయంతో డ్వాక్రా రుణాలను మాఫీ చేయాలని తొలినుంచీ ప్రభుత్వం భావిస్తున్న విషయం విది తమే. ఈ నేపథ్యంలోనే ఇసుక రీచ్లను మహిళా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెం బర్ 1 నుంచి జిల్లాలోని 16 రీచ్లను వారికి అప్పగించనున్నారు. ఇందుకోసం ఇటీవలే వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ కమిటీ వేశారు. ప్రభుత్వం జీవో జారీ చేయడంతో రీచ్లను మహిళా సంఘాలకు అప్పగించేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. కమిటీ చైర్మన్గా కలెక్టర్ నూతన ఇసుక విధానంపై జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ చైర్మన్గా ఏర్పాటు చేసిన కమిటీలో స్వల్ప మార్పు చేశారు. ఇకపై ఆ కమిటీకి చైర్మన్గా కలెక్టర్ వ్యవహరిస్తారు. గనుల శాఖ అసిస్టెంట్ డెరైక్టర్, అదే శాఖకు చెందిన విజిలెన్స్ అసిస్టెంట్ డెరైక్టర్, భూగర్భ జలశాఖ డెప్యూటీ డెరైక్టర్, డీఆర్డీఏ పీడీ, జిల్లా పంచాయతీ అధికారి, ఇరిగేషన్ ఎస్ఈ, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, డ్వామా పీడీ, ఏపీఎండీసీ అధికారి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీఇసుక రీచ్ల స్థితిగతుల్ని పరిశీలించి మహిళా సంఘాలకు వాటి నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తుంది. క్యూబిక్ మీటర్ ఇసుకను ఎంతకు విక్రయించాలనే విషయంపైనా జిల్లా కమిటీయే నిర్ణయం తీసుకుంటుంది. వే బిల్లు తప్పనిసరి భూగర్భ జలాలకు ఇబ్బంది లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇసుక రీచ్ల పర్యవేక్షణను ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అప్పగించారు. ఇకపై వే బిల్లు లేకుండా ఇసుకను తరలిస్తే సంబంధిత వ్యక్తుల నుంచి భారీగా జరిమానా వసూలు చేస్తారు. జిల్లా నుంచి సరిహద్దులు దాటించి ఇసుక తరలించడాన్ని నిషేధించారు. ఇసుక అమ్మకాలు, ఇతర అంశాలను సమీక్షించేందుకు నెలకొకసారి రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశం అవుతుంది. -
ఓపెనైతే అంతే!
పబ్లిక్గా తాగితే కేసులు మందుబాబుల వీరంగాలకు చెక్ నేటి నుంచి కొత్త విధానం అమలు : సీపీ సాక్షి, సిటీబ్యూరో:బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే మందుబాబుల భరతం పట్టేందుకు నగర పోలీసులు సిద్ధమయ్యారు. వైన్షాప్లు, నిర్మానుష్య ప్రదేశాలు, కమ్యూనిటీ హాళ్లు తదితర బహిరంగ ప్రదేశాల్లో మందు తాగి పోలీసులకు చిక్కితే గతంలో సిటీ పోలీసు చట్టం కింద చిన్నపాటి శిక్షతో వదిలి పెట్టేవారు. ఇకపై ఏకంగా ఐపీసీ 188 కింద కేసు నమోదు చేసి కోర్టుకు పంపనున్నారు. ఈ కొత్త పద్ధతిని శనివారం నుంచి అమలు చేయనున్నారు. ఇందుకుగాను నగరంలోని అన్ని ఠాణాల ఎస్హెచ్ఓలకు పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మందుబాబుల ఆగడాలు అరికట్టేందుకు శనివారం నుంచి ఏడో తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు. మద్యం తాగి వాహ నం నడిపిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి కోర్టుకు అప్పగిస్తున్న విషయం తెలిసిందే. ఇక బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి పట్టుబడిన వారిని ఉపేక్షించకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు పంపనున్నారు. ఇలా చేయడంతో రహదారులపై వెళ్లే మిహ ళలు, చిన్న పిల్లలకు రక్షణ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. బాబుల వీరంగంపై గత పక్షం రోజులుగా ఆయా కాలనీలు, బస్తీ సంఘాల నేతలు కమిషనర్ మహేందర్రెడ్డిని కలిసి మహిళలు పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించారు. వారి విజ్ఞప్తుల మేరకు కమిషనర్ మందుబాబులపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. -
టెన్త్ పరీక్షల విధానంలో మార్పు లేనట్టే
హైదరాబాద్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలను కొత్త విధానంలో నిర్వహించాలన్న ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదికి విరమించుకున్నట్టు సమాచారం. టెన్త్ పరీక్షలకు ఇప్పటి వరకూ 11 పేపర్లు ఉండగా.. ఈ ఏడాది నుంచి ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహించాలని, ప్రతి సబ్జెక్టులో 20% మార్కులకు అంతర్గత మూల్యాం కనం, 80% మార్కులకు రాతపరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం మొదట భావించింది. ఇందుకనుగుణంగా ఇప్పటికే ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలను చేపట్టింది. అయితే విద్యారంగంలో పలువురు నిపుణులు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అందిన విజ్ఞప్తుల కారణంగా కొత్త విధానాన్ని ఏడాది పాటు వాయిదా వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త విధానాన్ని ఈ ఏడాది 9వ తరగతి విద్యార్థులకు ప్రయోగాత్మకంగా అమలు జరిపి.. వచ్చే సంవత్సరం నుంచి 10వ తరగతి పరీక్షలను కొత్త పద్ధతిలో నిర్వహించాలని భావిస్తోంది. -
ఆదాయమే ధ్యేయంగా కొత్త మద్యం పాలసీ
-
ఏడాదికి 1000 కోట్లు
మద్యంపై భారీ ఆదాయమే లక్ష్యం జిల్లాలో 234 వైన్ షాపుల ఏర్పాటుకు నిర్ణయం గత ఏడాది కంటే మూడు షాపులు అదనం నాలుగు కేటగిరీలుగా లెసైన్స ఫీజులు ఏజెన్సీలో ప్రత్యేక మార్గదర్శకాలతో 19 దుకాణాలు సాక్షి ప్రతినిధి, వరంగల్ : మద్యం అమ్మకాల ద్వారా ఈ సంవత్సరం(2014-15)లో ప్రభుత్వం జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లా వ్యాప్తంగా 234 మద్యం దుకాణాలు (వైన్ షాపులు) ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. రెండేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలోని విధానానికి మార్పులు చేస్తూ కొత్త విధానం రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం... జిల్లాకు సంబంధించి ప్రత్యేక గెజిట్ను విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా కొత్త షాపులను కేటాయించింది. గత ఏడాది జిల్లాలో 231 వైన్ షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయిరచగా... ఈ సారి మూడు షాపులు అదనంగా ఏర్పాటు చేయనున్నారు. కరీంనగర్ జిల్లాలో గత సంవత్సరం వైన్ షాపుల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మూడు షాపులు మిగిలిపోయూయి. వాటిని ఈ ఏడాది మన జిల్లాకు కేటాయించారు. జిల్లాలో గత ఏడాది దరఖాస్తులు రాకుండా మిగిలిపోయిన భూపాలపల్లిలోని మూడు షాపులను కేసముద్రం, తొర్రూరు, మరిపెడకు... పరకాల షాపును వర్ధన్నపేటకు కేటాయించారు. లెసైన్స్ ఫీజు ద్వారా రూ.93 కోట్లు జనాభా ప్రాతిపదికన జిల్లాలో ఏర్పాటు చేయనున్న వైన్ షాపులను నాలుగు కేటగిరీలుగా విభజించారు. రూ.32.5 లక్షల లెసైన్స్ ఫీజు మద్యం దుకాణాలు 86, రూ.34 లక్షలు లెసైన్స్ ఫీజు దుకాణాలు 84, రూ.42 లక్షల ఫీజు దుకాణాలు 24, రూ.68 లక్షల చొప్పున లెసైన్స్ పీజుల చెల్లించే మద్యం దుకాణాలు 40 ఉన్నాయి. జిల్లాలో ఏర్పాటు చేయనున్న 234 వైన్ షాపులకు లెసైన్స్ రూపంలోనే రూ.93.59 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రానుంది. ఈ వైన్ షాపుల లెసైన్స్ కోసం చేసే దరఖాస్తు ఫీజు రూ.25 వేలు ఉంది. భారీగా రానున్న దరఖాస్తులతో ఈ మొత్తం కూడా భారీగానే ఉండనుంది. ఈ షాపుల ఏర్పాటు తర్వాత విక్రయించే మద్యంతో ఏడాదిలో రూ.వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆదాయం తీరు చూసినా... ఇదే పరిస్థితి కనిస్తోంది. 2013-14 ఎక్సైజ్ సంవత్సరంలో మద్యం విక్రయాలపై నెలకు సగటున రూ.75 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఏడాదిలో రూ.900 కోట్లు వచ్చినట్లు అధికాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఇది వెయ్యి కోట్ల రూపాయలు దాటుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఏజెన్సీలో 19 షాపులు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలోకి వచ్చే ఏజెన్సీ ప్రాంతాల్లో వైన్ షాపుల ఏర్పాటుకు ప్రత్యేక మార్గదర్శకాలు ఉన్నాయి. మన జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో 19 వైన్ షాపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏటూరునాగారం, ములుగు, గూడూరు ఎక్సైజ్ విభాగాల పరి ధిలోకి వచ్చే మండలాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాల్లో వైన్ షాపు ఏర్పాటు చేసేందుకు గ్రామసభల తీర్మానం తప్పనిసరి. మద్యం దుకాణం ఏర్పాటుకు ఇబ్బంది లేదని గ్రామసభ తీర్మానం చేస్తేనే అక్కడ వైన్ షాపు ఏర్పాటుకు అనుమతి ఉంటుంది. ఏజెన్సీలో వైన్ షాపు ల లెసైన్స్లను అక్కడి స్థానికలకే ఇస్తారు. ఐటీడీఏ పరిధిలో వైన్ షాపుల లెసైన్స్ కోసం దరఖాస్తు చేసే వారు స్థానికత, కులం సర్టిఫికెట్లు జత చేయాలి. వీటిని ప్రమాణికంగా తీసుకుని లాటరీలో దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రభుత్వ గెజిట్ ప్రకారం ప్రకారం జిల్లాలో మొత్తం 234 వైన్ షాపుల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ టెండర్ల ప్రక్రియను మొదలు పెట్టింది. కొత్త విధానంలోనూ మద్యం దుకాణాల కేటాయింపునకు లాటరీ పద్ధతినే అవలంబించనున్నారు. మద్యం దుకాణాల లెసైన్స్ పొందాలనుకునే వారు ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.25 వేలుగా నిర్ణయించారు. దరఖాస్తుతో పాటు ఫొటోలు, లెసైన్స్ ఫీజులో 10 శాతం ఈఎండీగా చెల్లించాలి. ఇది గరిష్టంగా రూ.5 లక్షలుగా నిర్ణయించారు. ఈ నెల 23వ తేదీన హన్మకొండలోని రెడ్డి మ్యారేజ్ హాల్లో లాటరీ విధానం ద్వారా వైన్ షాపులను కేటాయించనున్నారు. ఒకరు ఎన్ని షాపులకు... ఎన్ని దరఖాస్తులు చేసుకున్నా... లాటరీలో ఒక షాపు దక్కితే అక్కడితోనే సరిపెడతారు. మిగిలిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు. లాటరీలో వైన్ షాపు దక్కిన వారు వెంటనే లెసైన్స్ ఫీజులో మూడో వంతు చెల్లించాలి. -
మద్యం విక్రయాలకు 11 రోజులే గడువు!
- ఈ నెలతో ముగియనున్న మద్యం దుకాణాల కాంట్రాక్ట్ - జూలై 1నుంచి కొత్త పాలసీ - దుకాణాల దరఖాస్తులకు ఈ నెల 21 చివరి తేదీ - ఆదాయం పెంపునకు పట్టణంలో అదనపు దుకాణం తాండూరు : ప్రస్తుతం నడుస్తున్న మద్యం దుకాణాల కాంట్రాక్టు ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. జూలై 1వ తేదీ నుంచి 2014-15 సంవత్సరానికి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానున్నది. ఈ నేపథ్యంలో పాత మద్యం నిల్వలు విక్రయించుకోవడానికి మరో పన్నెండు రోజుల గడువు మాత్రమే ఉంది. కొత్త పాలసీ అమల్లోకి వచ్చే లోపు తాండూరు నియోజకవర్గంలోని 12 మద్యం దుకాణాల్లో ఉన్న నిల్వలను విక్రయించడంపై వ్యాపారులు దృష్టిసారించారు. పట్టణంలో ప్రభుత్వం లెసైన్స్ ఫీజు రూ.42లక్షలపై గత ఏడాది నిర్దేశించిన ఏడు రెట్ల ప్రకారం ఒక దుకాణంలో రూ.2కోట్ల 92లక్షల 50వేల మద్యం అమ్మకాలకుగాను ఇప్పటి వరకు సగటున రూ.4.62కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని అంచనా. ఈ లెక్కన ఒక దుకాణంలో రూ.1.70కోట్ల మద్యం అమ్మకాలు పెరిగాయి. అదనపు అమ్మకాలపై సర్కారుకు 14శాతం ఆదాయం లభించింది. ఇదిలా ఉంటే, ఈ నెల 31వ తేదీ నాటికి పాత కాంట్రాక్ట్ ప్రకారం మిగిలిన మద్యం నిల్వలను సీజ్ చేయాలని ఎక్సైజ్ అధికారులు యోచిస్తున్నారు. పట్టణంలో రూ.32.34 కోట్ల మద్యం అమ్మకాలు... పట్టణంలోని మొత్తం ఏడు మద్యం దుకాణాల్లో రూ.4.62 కోట్ల లెక్కన సగటున రూ.32.34కోట్ల అమ్మకాలు జరిగాయి. ఈ కారణంతోనే పట్టణంలో అదనంగా మద్యం దుకాణం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇక బషీరాబాద్లో రెండు మద్యం దుకాణాల్లో ఒక దుకాణాన్ని ప్రభుత్వం తగ్గించింది. రూరల్లో రూ.17.87కోట్ల విక్రయాలు... తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, తాండూరు మండలాల్లో ఒక్కో దుకాణంలో రూ.32.50లక్షల లెసైన్స్ ఫీజుపై ఏడు రెట్ల ప్రకారం రూ.2కోట్ల 27లక్షల 50వేల అమ్మకాలు జరగాలి. కాగా ఇప్పటివరకు సగటున ఒక్కో దుకాణంలో రూ.3కోట్ల 57లక్షల 50వేల మద్యం అమ్మకాలు జరిగాయి. అదనంగా రూ.1.30కోట్ల అమ్మకాలు జరిగాయి. 11రెట్ల ప్రకారం మొత్తం రూరల్లోని ఐదు దుకాణాల్లో రూ.17కోట్ల 87లక్షల 50వేల మద్యం విక్రయాలు జరిగాయి. 30వ తేదీ వరకే నిల్వ మద్యం అమ్మకాలు.. పాత పాలసీ ప్రకారం మద్యాన్ని దుకాణాలకు తరలించుకోవడానికి మరో వారం రోజులు మాత్రమే అధికారులు గడువు విధించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఉన్న మద్యం నిల్వలను ఈ నెల 30వ తేదీ వరకు విక్రయించుకోవాల్సి ఉంటుంది. కాగా, కొత్త మద్యం పాలసీలో దుకాణాల లెసైన్స్లు దక్కించుకోవడానికి పాత వ్యాపారులతోపాటు కొత్త వారూ ఉత్సాహం చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తాండూరు నియోజకవర్గంలోని 14 మద్యం దుకాణాల లెసైన్స్ల కోసం పెద్దఎత్తున దరఖాస్తు ఫారాలు తీసుకువెళుతున్నట్టు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. పట్టణంలోని ఏడు దుకాణాలకు 13, రూరల్లో 6 దుకాణాలకు ఇప్పటి వరకు 9 దరఖాస్తు ఫారాలు తీసుకువెళ్లినట్టు అధికారులు చెప్పారు. ఈ నెల 21వ తేదీ దుకాణాల లెసైన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అని తాండూరు ఎక్సైజ్ సీఐ భరత్భూషణ్ బుధవారం తెలిపారు.