Transport Department
-
హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ) లేకున్నా చూసీచూడనట్టు వెళ్లిన యంత్రాంగం ఇకపై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది. 2019 ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాత తయారైన వాహనాలకు మాత్రమే ఈ హెచ్ఎస్ఆర్పీ ఏర్పాటు నిబంధన అమలులో ఉండగా, ఇక నుంచి 2019 ఏప్రిల్ ఒకటికి ముందు తయారైన వాహనాలకు కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశిస్తూ రవాణాశాఖ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. అంటే, అన్ని వాహనాలకు ఇకపై కచ్చితంగా హెచ్ఎస్ఆర్పీ ఉండాల్సిందేనన్నమాట. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల ఏర్పాటు ప్రక్రియ సుప్రీంకోర్టు ఆదేశాలతోనే అప్పట్లో అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. కానీ, దాని అమలులో యంత్రాంగం ఉదాసీనంగా ఉండటం, పాత వాహనాలకు ఆ నంబర్ ప్లేట్లు లేకపోవటాన్ని తీవ్రంగా పరిగణించిన సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల కీలక సూచనలు చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు రాష్ట్ర రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 2019 ఏప్రిల్ ఒకటికి ముందు తయారైన అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు అమర్చు కోవాల్సిందేనని అందులో స్పష్టం చేసింది. ఇందుకు ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు గడువు ఇచ్చింది. ఆలోపు హెచ్ఎస్ఆర్పీలను ఏర్పాటు చేసుకోవాలని, వాటిని ఏర్పాటు చేసుకోని వాహనాలు గడువు తర్వాత రోడ్డెక్కితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని అందులో హెచ్చరించింది. ఫిట్నెస్ టెస్ట్ సహా వాహనాలకు సంబంధించి రవాణాశాఖ ద్వారా ఏ సేవ పొందాలన్నా ఈ నంబర్ ప్లేట్ ఉంటేనే సాధ్యమని, ఆ నంబర్ ప్లేటు లేని వాహనాలకు రవాణాశాఖలో ఎలాంటి సేవలు ఇవ్వబోమని. వాహనాలకు ఇన్సూరెన్స్ చేయటం కుదరదని తేల్చి చెప్పటం విశేషం. కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేసిన సమయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియతోపాటే హెచ్ఎస్ఆర్పీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. పాత వాహనదారులు ఈ నంబర్ ప్లేట్ కోసం www.siam.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని రవాణాశాఖ సూచించింది. పంపిణీ ఎలా సాధ్యం?హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల ఏర్పాటు విషయంలో ముందునుంచి ప్రభుత్వం పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తోంది. వాహనాలు కొంటున్న వారిలో 75 శాతం మంది వాటిని కాకుండా, నచ్చిన తరహాలో ఉండే సాధారణ నంబర్ ప్లేట్లనే ఏర్పాటు చేసుకుంటున్నా ఎలాంటి చర్యలు లేవు. వాహనాలను తనిఖీ చేసేప్పుడు హెచ్ఎస్ఆర్పీ లేకుంటే ఫైన్ కూడా విధించటం లేదు. దీంతో వాటి విషయంలో వాహనదారుల్లో శ్రద్ధే లేకుండా పోయింది. ఇక, రిజిస్ట్రేషన్ అవుతున్న వాహనాల సంఖ్యకు తగ్గట్టుగా రాష్ట్రంలో హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల సరఫరా ఉండటం లేదు. ముందునుంచీ వీటి తయారీ, సరఫరా తీవ్ర గందరగోళంగా మారింది. ఇప్పటికీ అది అలాగే ఉంది. ఇప్పుడు ఒకేసారి పాత వాహనాలకు కూడా ఆ నంబర్ ప్లేట్లను అమర్చాలని ఆదేశాలివ్వటంతో వాటిని ఎలా సరఫరా చేస్తారో అధికారులకే తెలియాలి. తాజా ఆదేశం మేరకు దాదాపు 90 లక్షల వరకు నంబర్ ప్లేట్లను సరఫరా చేయాల్సి ఉంటుందని అంచనా. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేంద్ర రవాణాశాఖ స్పష్టంగా ఆదేశించటంతో, దీనిని కచ్చితంగా అమలు చేయకతప్పని పరిస్థితి నెలకొంది. కానీ నంబర్ ప్లేట్ల తయారీ, సరఫరా అంశం అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో, ఇది అధికారులకు కత్తిమీద సామే కానుంది. -
‘రింగు’ 6 వరుసలు!
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తొలిదశలో నాలుగు వరుసలుగానే నిర్మించాలని నిర్ణయించి అందుకు వీలుగా ఇటీవల టెండర్లు పిలిచిన కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఇప్పుడు మనసు మార్చుకుంది. ఆర్ఆర్ఆర్ను ఏకకాలంలో ఆరు వరుసలుగా నిర్మించాలనుకుంటోంది. ఈ మేరకు ఎన్హెచ్ఏఐ చర్యలు ప్రారంభించి డిజైన్లు మారుస్తోంది. ప్రస్తుతం ప్రతిపాదిత అలైన్మెంట్ను ఆనుకొని ఉన్న రాష్ట్ర, జాతీయ రహదారులపై రోజుకు ఎన్ని వాహనాలు తిరుగుతు న్నాయో తేల్చే వాహన అధ్యయనం పూర్తిచేసి ఎన్హెచ్ఏఐ కేంద్రానికి నివేదించనుంది. దీని ఆధా రంగా ఆర్ఆర్ఆర్పై రానున్న 20 ఏళ్లలో వాహనాల సంఖ్య ఏ మేరకు పెరుగుతుందో అంచనా వేసి కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుంది. ఆరు వరుసలుగా రోడ్డు నిర్మాణంతో ప్రధాన క్యారేజ్ వే మాత్రమే కాకుండా జాతీయ, రాష్ట్ర రహదారులను క్రాస్ చేసే 11 ప్రాంతాల్లో నిర్మించనున్న ఇంటర్ఛేంజ్ స్ట్రక్చర్ల డిజైన్లను కూడా ఎన్హెచ్ఏఐ మారుస్తోంది. దీంతో ఇంటర్ఛేంజ్ కూడళ్లను మరింత భారీగా నిర్మించాల్సి రానుంది. ఫలితంగా రోడ్డు నిర్మాణ వ్యయం సుమారు రూ. 2,500 కోట్ల మేర పెరగనుంది. ఒక్క ఉత్తరభాగం నిర్మాణానికే దాదాపు రూ. 19 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.వెంటనే విస్తరణ పరిస్థితి రావద్దని..ఏడేళ్ల క్రితం రీజినల్ రింగురోడ్డును ప్రతిపాదించాక దానిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2008లో ఔటర్ రింగురోడ్డు నిర్మించాక హైదరాబాద్ రూపు రేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. పురోగతి వేగం పుంజుకుంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అంతకు మించిన ప్రభావం చూపుతుందన్న అంచనా నెలకొంది. దీంతో రీజినల్ రింగురోడ్డు అలైన్మెంట్ను ఆసరాగా చేసుకొని ప్రత్యేక ఆర్థిక మండళ్లు (ఎస్ఈజెడ్), శాటిలైట్ టౌన్షిష్ల ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అక్కడ పెట్టుబడులకు బహుళ జాతి సంస్థలు ముందుకొస్తున్నాయి. దీంతో ఆర్ఆర్ఆర్ చుట్టూ జనావాసాలు, సంస్థలు పెరిగి వాహనాల రద్దీ తీవ్రమవుతుందని కేంద్రం తాజాగా అంచనాకొచ్చింది. 2021–22లో ప్రతిపాదిత రింగు ప్రాంతంలోని రోడ్లపై నిత్యం సగటున 14,850 ప్యాసింజర్ కార్ యూనిట్ల (పీసీయూ) చొప్పున వాహనాలు తిరుగుతున్నాయని తేలింది. తాజాగా ఓ ప్రైవేటు సంస్థతో నిర్వహిస్తున్న అధ్యయనంలో ఇందులో పెరుగుదల నమోదైంది. ఓఆర్ఆర్ నిర్మాణానికి ముందున్న అంచనాకు.. రోడ్డు నిర్మించాక వాస్తవంగా తిరుగుతున్న వాహనాల సంఖ్యకు పొంతన లేకుండా పోయింది. ఆర్ఆర్ఆర్ను నాలుగు వరుసల్లో నిర్మించి మరో 15–20 ఏళ్ల తర్వాత దాన్ని 8 వరుసలకు విస్తరించాలనేది ఇప్పటివరకు ఉన్న ప్రణాళిక. కానీ కేవలం ఐదేళ్లలోనే ఆర్ఆర్ఆర్పై రద్దీ రెట్టింపై నాలుగు వరుసల రోడ్డు ఇరుకుగా మారి దాన్ని వెంటనే విస్తరించాల్సిన పరిస్థితి వస్తుందన్న అభిప్రాయం నెలకొంది. ఒకవేళ ఐదేళ్లలోనే ఆర్ఆర్ఆర్ను విస్తరించాల్సి వస్తే నిర్మాణ వ్యయం పెరగనుంది. ఈ నేపథ్యంలో ఒకేసారి 6 వరుసలుగా ఆర్ఆర్ఆర్ను నిర్మిస్తే కనీసం 15 ఏళ్ల వరకు దాన్ని విస్తరించాల్సిన అవసరం ఉండదన్నది కేంద్రం ఆలోచన. వాహనాల రాకపోకలు 30 వేల పీసీయూల లోపు ఉంటే 4 వరుసలు సరిపోతాయని... అంతకంటే పెరిగితే రోడ్డు ఇరుకు అవుతుందని నిర్ధారిత ప్రమాణాలు చెబుతున్నాయి. కానీ ఐదేళ్లలోనే ఈ సంఖ్య 40 వేలను మించుతుందని కేంద్రం తాజాగా అంచనా వేసింది.రోడ్డు నిర్మాణానికి రూ. 8,800 కోట్లు!నాలుగు వరుసల రోడ్డు నిర్మాణానికి రూ. 6,300 కోట్ల వరకు ఖర్చవుతుందని టెండర్ నోటిఫికేషన్లో ఎన్హెచ్ఏఐ అంచనా వేసింది. ఇప్పుడు దాన్ని 6 వరుసలుగా నిర్మిస్తే ఆ మొత్తం రూ. 8,800 కోట్ల వరకు అవుతుందని భావిస్తోంది. అయితే ఒకేసారి 8 వరుసలకు సరిపడా భూసేకరణ జరుగుతున్నందున దాని వ్యయంలో ఎలాంటి మార్పు ఉండదు.తొలుత రెండు వరుసలు చాలనుకొని..రీజనల్ రింగురోడ్డును ప్రతిపాదించాక నాలుగు వరుసల రోడ్డుకు సరిపడా ట్రాఫిక్ ఉండదని భావించి కేంద్రం తొలుత రెండు వరుసలకే పరిమితమవుదామని పేర్కొంది. కానీ కనీసం నాలుగు వరుసలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఒప్పించింది. అయినప్పటికీ ఈ విషయంలో అనుమానం తీరకపోవడంతో ఉత్తర–దక్షిణ భాగాలను ఏకకాలంలో చేపట్టకుండా తొలుత ఉత్తర భాగాన్ని నిర్మించి తర్వాత దక్షిణ భాగం సంగతి చూద్దామనుకుంది. అలాంటి స్థితి నుంచి కేంద్రం ఏకకాలంలో ఆరు వరుసలను నిర్మించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా తాజాగా ఆదేశించడం విశేషం. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ట్రాఫిక్ స్టడీ నివేదిక అందాక దాన్ని నిపుణుల సమక్షంలో విశ్లేషించి కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుంది. తుది నిర్ణయం ఆధారంగా ఎన్హెచ్ఏఐ అధికారులు అప్పటికప్పుడు నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ఇప్పటికే పలిచిన టెండర్లను త్వరలో తెరిచి నిర్మాణ సంస్థను ఖరారు చేయనున్నారు. -
బటన్తో భద్రతకు భరోసా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ వంటి నగరాల్లో ఉద్యోగాలు చేసే మహిళలు రాత్రుళ్లు కూడా క్యాబ్లు, ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించాల్సి వస్తోంది. ఇలాంటి సమయాల్లో వారి భద్రత ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంటోంది. త్వరలో ఈ పరిస్థితి మారిపోనుంది. మహిళలు క్యాబో.. ప్రైవేటు బస్సో ఎక్కినప్పుడు వేధింపులు ఎదురైతే అందులో ఉండే ఒక్క బటన్ నొక్కితే చాలు.. పోలీసులు క్షణాల్లో అక్కడ వాలిపోతారు. ఇలాంటి వ్యవస్థ ఏర్పాటుపై రవాణాశాఖ దృష్టి సారించింది. ప్రైవేటు ప్రజా రవాణా బస్సులు, క్యాబ్లు, మ్యాక్సీ క్యాబ్లలో ‘వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్’లను తప్పనిసరి చేసింది. నిర్భయ చట్టం ప్రకారం కొత్తగా నమోదయ్యే వాహనాలతో పాటు, పాత వాటిలోనూ ఈ పరికరాలు ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. వీటికి అదనంగా ప్రతి వాహనంలో ‘ప్యానిక్ బటన్’ను కూడా తప్పనిసరి చేయనుంది. మహిళలకు వేధింపులు ఎదురైనప్పుడు ఆ బటన్ నొక్కితే చాలు.. వెంటనే పోలీస్ కంట్రోల్ రూంకు సందేశం వెళ్లిపోతుంది. వాహనం లొకేషన్ ఆధారంగా పోలీసులు వాహనం వద్దకు చేరుకుంటారు. ఆర్టీసీ బస్సుల్లో వెహికల్ ట్రాకింగ్ విధానం ఇప్పటికే అమలవుతోంది. త్వరలో ప్రైవేట్ ప్రజా రవాణా వాహనాల్లో కూడా అందుబాటులోకి రానుంది. ఇలాంటి వ్యవస్థ ఏర్పాటుచేయాలని నిర్భయ చట్టంలోనే స్పష్టంగా ప్రతిపాదించినా అమల్లోకి రాలేదు. కొన్ని క్యాబ్ సంస్థలు వేటికి అవే స్వయంగా ఏర్పాటు చేసుకున్నా మహిళా ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ క్రమంలో తాజాగా ట్రాకింగ్ పరికరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. రెండు లక్షల వాహనాల్లో.. – గ్రేటర్ హైదరాబాద్లో సుమారు 8,000 లకు పైగా ప్రవేట్ బస్సులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల మధ్య స్టేజీ క్యారేజీలుగా నడిచే బస్సులతో పాటు నేషనల్ పర్మిట్లపై టూరిస్టు్ట బస్సులుగా వివిధ రాష్ట్రాలకు మరికొన్ని రాకపోకలు సాగిస్తున్నాయి. – బస్సులకు అదనంగా 1.2 లక్షల క్యాబ్లు, సుమారు 30 వేల మ్యాక్సీ క్యాబ్లు, మినీ బస్సులు, ట్యాక్సీలు సేవలందిస్తున్నాయి. మొత్తంగా దాదాపు రెండు లక్షల ప్రైవేటు ప్రజా రవాణా వాహనాలు తిరుగుతున్నాయి. – కొవిడ్ అనంతరం నగరంలో రకరకాల క్యాబ్ అగ్రిగేటర్లు అందుబాటులోకి వచ్చాయి. కొన్నిసార్లు వాహనాన్ని ఆన్లైన్లో బుక్ చేసుకొన్న సమయంలో నమోదయ్యే వాహనం నంబర్కు, అందుబాటులోకి వచ్చే వాహనానికి సంబంధం ఉండడం లేదు. చివరకు ఏ క్యాబ్ వినియోగంలోకి వస్తుందో తెలియని గందరగోళం నెలకొంటోంది. – శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రాకపోకలు సాగించే క్యాబ్లలోనూ డ్రైవర్ల తీరుపై మహిళా ప్రయాణికులు తరచుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ బస్సుల్లో కూడా డ్రైవర్లు, సిబ్బంది తరచుగా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ క్రమంలో వెహికిల్ ట్రాకింగ్ అనివార్యంగా మారింది.ఎలా పనిచేస్తుందంటే.. -
ఏజెంట్లపై ఆర్టీఏ 'ఐ'!
సాక్షి, హైదరాబాద్: ఏజెంట్లు, దళారుల ఆట కట్టించేందుకు రవాణాశాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అస్త్రాన్ని ప్రయోగించింది. ఏఐ ఆధారిత సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ నిఘా కెమెరాలు క్లిక్మనిపించే ప్రతి వ్యక్తికి ఒక కోడ్ నమోదవుతుంది. ఆ కోడ్ ఆధారంగా సదరు వ్యక్తి ఒక రోజులో ఎన్నిసార్లు ఆర్టీఏ కార్యాలయానికి వచ్చాడు? ఏ పని కోసం వచ్చాడనేది ఇట్టే తెలిసిపోతుంది. సాధారణంగా ఏజెంట్లు, దళారులు మాత్రమే ఆర్టీఏ కార్యాలయాల వద్ద తిష్ట వేస్తారు. నిఘా కెమెరాల్లో వాళ్లకు సంబంధించిన కోడ్ నంబర్లు పదేపదే నమోదవుతాయి. ఒక రోజులో, ఒకవారంలో ఒక కోడ్ ఎన్నిసార్లు కనిపించింది అనే విశ్లేషణ ఆధారంగా దళారులను అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఖైరతాబాద్లోని ఆర్టీఏ కేంద్ర కార్యాలయంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ సీసీ కెమెరాలు విజయవంతంగా పని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థను దశలవారీగా రాష్ట్రంలోని అన్ని రవాణా కార్యాలయాలకు విస్తరించనున్నారు. చెక్పోస్టుల్లోనూ వీటిని ఏర్పాటుచేసి రవాణా శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఒక అధికారి చెప్పారు. వారంలోనే 45 మందిని పసిగట్టిన ఏఐ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏఐ కెమెరాలు వారం రోజుల్లో 45 మంది పదేపదే ఆఫీసుకు వచ్చినట్లు పసిగట్టాయి. ఆర్టీఏ ప్రాంగణంలోనే ఉన్నఈ సేవా కేంద్రంలో పనిచేసే కొందరు ఉద్యోగులు మినహాయించి మిగతావాళ్లంతా ఏజెంట్లుగా తేలింది. దీంతో ఏజెంట్లను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ఆర్టీఏ సేవల కోసం వచ్చేవాళ్లు మినహా ఇతరులు లోపలికి ప్రవేశించకుండా పోలీసులతో ఆంక్షలు విధించారు. ఆ తరువాత రెండు వారాల్లోనే దళారుల రాకపోకలు చాలా వరకు తగ్గుముఖం పట్టినట్లు అధికారులు చెప్పారు. ఈ నిఘా వ్యవస్థను త్వరలో సికింద్రాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నట్లు ఒక అధికారి చెప్పారు. ఆ తర్వాత మెహిదీపట్నం, ఉప్పల్, బండ్లగూడ, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, కొండాపూర్, మణికొండ, కూకట్పల్లి, మలక్పేట, నాగోల్ తదితర ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు, డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్లకు విస్తరించనున్నారు. ఆ తదుపరి అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఏజెంట్లదే హవాకొన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ఏజెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు, సిబ్బంది సహాయంతో అన్ని రకాల పౌరసేవల్లో హవా కొనసాగిస్తున్నారు. క్లర్క్లు, అసిస్టెంట్లుగా పనులు చక్కబెడుతున్నారు. వీరు అధికారుల వద్ద కీలకంగా మారటంతో డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజి్రస్టేషన్లు, తదితర పనుల కోసం వచ్చేవారు ఈ ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. కొన్నిచోట్ల కార్యాలయాల వెలుపల బాహాటంగానే దుకాణాలు తెరుచుకొని పని చేస్తున్నారు. డ్రైవింగ్ స్కూళ్ల నిర్వాహకులు కూడా ఏజెంట్లుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో పౌరసేవలపై ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే రెండు రెట్లు అధికంగా సమరి్పంచుకోవలసి వస్తోంది. ఏజెంట్లను అరికట్టేందుకు ఇప్పటివరకు 17 రకాల సేవలను ఆన్లైన్లోకి మార్చారు. కానీ తరచూ సాంకేతిక సమస్యలు వస్తుండటంతో అవి పారదర్శకంగా అమలు కావడం లేదు. చెక్పోస్టుల్లో ఏఐ నిఘా రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ చెక్పోస్టులకు కూడా ఏఐ నిఘా వ్యవస్థను విస్తరించనున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించే వాహనాలను తనిఖీ చేసేందుకు భైంసా, కామారెడ్డి, జహీరాబాద్, అలంపూర్, క్రిష్ణా, విష్ణుపురం, నాగార్జునసాగర్, కోదాడ, మద్దునూరు, సాలూరు, వాంకిడి, కల్లూరు, అశ్వారావుపేట, పాల్వంచలో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. నిజానికి దేశవ్యాప్తంగా నేషనల్ పరి్మట్ విధానం, జీఎస్టీ అమల్లోకి వచి్చన తరువాత ఈ చెక్పోస్టుల అవసరం లేకుండా పోయింది. ఏపీ సహా పలు రాష్ట్రాల్లో చెక్పోస్టులను ఎత్తేసినా తెలంగాణలో మాత్రం కొనసాగుతున్నాయి. -
ఎలివేటెడ్ బదులు.. కేబుల్ కార్ మార్గం..!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ – శ్రీశైలం పుణ్యక్షేత్రం మధ్య రోడ్డు విస్తరణలో భాగంగా నల్లమల అటవీ ప్రాంతంలో నిర్మించతలపెట్టిన భారీ ఎలివేటెడ్ కారిడార్కు ప్రత్యామ్నాయాలపై కేంద్ర ఉపరితల రవాణాశాఖ దృష్టి పెట్టింది. దాదాపు 45.42 కి.మీ. నిడివితో ఈ మార్గంలో భారీ ఎలివేటెడ్ కారిడార్ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీని నిర్మాణానికి రూ.7,690 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇంత భారీ వ్యయంతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించే బదులు రూ.2,270 కోట్లతో పూర్తయ్యే కేబుల్ కార్ కారిడార్ నిర్మాణ సాధ్యాసాధ్యాలపై నివేదిక అందజేయాలని ఆ శాఖ కార్యదర్శి ఉమాశంకర్ తాజాగా అధికారులను ఆదేశించారు. దీనిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా ఇంత భారీ నిడివితో కేబుల్ కార్ మార్గం లేదు. దాని నిర్మాణం, నిర్వహణ సవాళ్లతో కూడుకున్నది కావటంతో ఆచితూచి పరిశీలించి నివేదిక అందించాలని అధికారులు నిర్ణయించారు. జంతువులకు ఇబ్బంది లేకుండా.. హైదరాబాద్ – శ్రీశైలం రహదారిని గతంలోనే నాలుగు వరసలకు విస్తరించారు. కానీ, శ్రీశైలం మార్గంలోని మన్ననూరు వరకే ఆ విస్తరణ కొనసాగింది. మన్ననూరు నుంచి దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం మొదలవుతుంది. మధ్యలో అమ్రాబాద్ పులుల అభయారణ్యం ఉంటుంది. ఇక్కడ పెద్ద పులులతోపాటు చాలా రకాల వణ్యప్రాణులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. వాటికి అంతరాయం కలగకూడదన్న ఉద్దేశంతో మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు రోడ్డును విస్తరించలేదు. అక్కడి నుంచి సాధారణ డబుల్ రోడ్డు మాత్రమే ఉంది. ఆ రోడ్డుమీద ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. మన్ననూరు నుంచి శ్రీశైలం వైపు రాత్రి 9 గంటల నుంచి తిరిగి ఉదయం 6 గంటల వరకు వాహనాలను అనుమతించరు. పగటిపూట మాత్రమే వాహనాలను అనుమతిస్తారు. శ్రీశైలం పుణ్య క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఈ ప్రాంతంలో వాహనాల రద్దీ పెరిగి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కొంతకాలంగా రోడ్డును విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, వణ్యప్రాణులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో అటవీ శాఖ అందుకు అనుమతించటం లేదు. ఈ నేపథ్యంలో ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన తెరపైకి వచి్చంది. మన్ననూరు నుంచి తెలంగాణ పరిధి ఉన్న పాతాళగంగ వరకు 62.40 కి.మీ. మేర రోడ్డును విస్తరించాలని.. ఇందులో జంతువుల సంచారం ఉండే 45.42 కి.మీ. మేర ఎలివేటెడ్ (వంతెన తరహా) పద్ధతిలో రోడ్డు నిర్మించాలన్నది ప్రతిపాదన. దీనిని గతేడాది నవంబర్లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ అధికారికంగా ప్రతిపాదించింది. ఇది పూర్తయితే దేశంలో అతి పొడవైన ఎలివేటెడ్ కారిడార్లలో ఒకటిగా నిలవనుంది. ఖర్చు తగ్గించేందుకు.. ఎలివేటెడ్ కారిడార్ భారీ వ్యయంతో కూడిన ప్రాజెక్టు కావటంతో దానికి ప్రత్యామ్నాయం ఆలోచించాలని తాజాగా కేంద్ర ఉపరితల రవాణాశాఖ కార్యదర్శి ఉమాశంకర్ భావించారు. దీనిపై అధ్యయనం చేయాలని జాతీయ రహదారుల విభాగాన్ని ఆదేశించారు. ఎలివేటెడ్ పద్ధతిలోనే నిర్మించాల్సి వస్తే, తక్కువ నిడివి ఉండే ప్రత్యామ్నాయ అలైన్మెంటును సిద్ధం చేయాలని పేర్కొన్నారు. కుదరని పక్షంలో ఎలివేటెడ్కు బదులు కేబుల్ కార్ మార్గాన్ని నిర్మించే సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కిలోమీటర్కు రూ.170 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. కేబుల్ కార్ మార్గానికి కిలోమీటర్కు రూ.50 కోట్లు ఖర్చవుతుందని తేల్చారు. -
ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీలు కొనసాగిస్తాం
సాక్షి, హైదరాబాద్: కాలుష్యరహితమైన, పర్యావరణహితమైన రవాణా సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు అందజేసే రాయితీలను కొనసాగిస్తామని, ప్రజారవాణా రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. ఫ్లిక్స్ బస్ ఇండియా హైదరాబాద్ నుంచి విజయవాడకు బస్ సర్వీసులను ప్రారంభించనుంది. ఈ మేరకు గురువారం నగరంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫ్లిక్స్బస్, ఈటీవో మోటర్స్ సంస్థలు కలిసి పర్యావరణహిత బస్సులను ప్రారంభించడాన్ని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఈ–బస్సుల విస్తరణకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహాన్ని అందజేస్తుందన్నారు. బస్సుల నిర్వహణ, చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుపైన ఫ్లిక్స్బస్ ఇండియా–ఈటీవో మోటర్స్ సంస్థలు పరస్పరం ఒప్పందం చేసుకున్నాయి. -
రోజుకు 71 రోడ్డు ప్రమాదాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో 2024లో సగటున రోజుకు 71 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆయా ఘటనల్లో రోజూ సగటున 18 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగిన మొదటి పది రాష్ట్రాల్లో తెలంగాణ సైతం ఉంది. రాష్ట్ర రవాణాశాఖ ఈ వివరాలను వెల్లడించింది. 2024లో రాష్ట్రంలో సుమారు 26,000 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో మొత్తం 7,700 మంది మరణించగా, కనీసం 20 వేల మంది గాయపడినట్లు రవాణాశాఖ తాజా గణాంకాలు వెల్లడించాయి. రహదారి భద్రతపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం, అపరిమిత వేగంతో వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్, రోడ్డు ఇంజినీరింగ్లో లోపాలు తదితర కారణాల వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. రవాణాశాఖ జనవరి నెలను జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్కూళ్లు, కళాశాలల్లో రోడ్డు భద్రతపైన ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాంగా శుక్రవారం (జనవరి 31) నెక్లెస్రోడ్డులో రోడ్డు భద్రతా వాకథాన్ నిర్వహించనున్నారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మానవ తప్పిదాలే కారణం.. గత మూడేళ్లలో నమోదైన రోడ్డు ప్రమాదాల్లో 80 శాతం మానవ తప్పిదాల వల్లనే జరిగినట్లు రవాణాశాఖ తెలిపింది. సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, ఓవర్ స్పీడ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, విశ్రాంతి లేకుండా డ్రైవింగ్ చేయడం వంటి కారణాల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రమాదాల నియంత్రణకు రవాణాశాఖ పలు చర్యలు చేపట్టింది. వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు ‘4ఈస్’ (ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్, ఎమర్జెన్సీ కేర్)పై దృష్టి సారించింది. మరోవైపు రహదారులపై బ్లాక్స్పాట్స్ను గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ట్రాఫిక్ చిల్డ్రన్స్ పార్క్.. నెల రోజుల పాటు చేపట్టిన రోడ్డు భద్రతా కార్యక్రమాల్లో భాగంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ట్రాఫిక్ చిల్డ్రన్స్ పార్కును ఏర్పాటు చేశారు. స్కూల్ విద్యార్థుల్లో అవగాహనకు ఇది దోహదం చేస్తుంది. గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ఈ పార్కును ప్రారంభించారు. అలాగే హెల్మెట్ల పంపిణీ, వైద్య, ఆరోగ్య శిబిరాలు, విద్యార్థులకు క్విజ్ పోటీలు వంటివి నిర్వహించారు. -
హెల్మెట్ లేకపోతే పెట్రోల్ పోయొద్దు
లక్నో: ద్విచక్ర వాహనాల ప్రమాదాలు తగ్గించేందుకు ఉత్తరప్రదేశ్ రవాణా శాఖ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. హెల్మెట్ లేకుండా వచ్చిన వారికి ఇంధనం పోయొద్దని పెట్రోల్ బంకు నిర్వాహకులకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలో 75 జిల్లాల కలెక్టర్లకు రవాణాశాఖ కమిషనర్ బ్రజేష్ నారాయణ సింగ్ లేఖలు పంపారు. వాహనం నడిపేవారితోపాటు వెనుక కూర్చున్నవారు సైతం కచ్చితంగా హెల్మెట్ ధరించి ఉండాలని పేర్కొన్నారు. వాహనదారులకు అవగాహన కల్పించేందుకు పెట్రోల్ బంకుల బయట ‘నో హెల్మెట్, నో ఫ్యూయెల్’బోర్డులను ప్రదర్శించాలని సూచించారు. ద్విచక్ర వాహన ప్రమాదాల్లో బాధితులు హెల్మెట్ ధరించడం లేదన్న గణాంకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రాణాలను కాపాడటం, రోడ్డు భద్రతను నిర్ధారించడమే రవాణా శాఖ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గౌతమ్బుద్ధ నగర్ జిల్లాలో 2019లో ప్రవేశపెట్టినా అమలులో నిర్లక్ష్యం జరిగింది. గత అనుభవాల దృష్ట్యా ఆదేశాల అమలుపై పర్యవేక్షణ అవసరమని, దీనికోసం అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల ప్రమాదాల్లో ఏటా దాదాపు 26వేల మంది చనిపోతున్నారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే వీరిలో అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇటీవల రవాణాశాఖ సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ప్రమాదాలను నివారించేందుకు చర్యలు పేపట్టాలని ఆదేశించారు. -
స్టాపేజ్ రిపోర్ట్ ఇవ్వకుంటే వాహన పన్ను కట్టాల్సిందే
సాక్షి, అమరావతి: మోటారు వాహన చట్టంలో నిర్దేశించిన మోటారు వాహనం లేదా వాణిజ్య వాహనాలను వాటి యజమానులు రోడ్లపై తిప్పకూడదనుకున్నప్పుడు ఆ విషయాన్ని రాతపూర్వకంగా రవాణా శాఖ అధికారులకు తెలియచేసి తీరాలని హైకోర్టు తేల్చి చెప్పింది. అప్పుడు మాత్రమే ఆ వాహనానికి పన్ను మినహాయింపు కోరడానికి వీలవుతుందని స్పష్టం చేసింది. తమ వాహనం లేదా వాహనాలు రోడ్డుపై తిరగడం లేదని, పన్ను చెల్లింపు త్రైమాసిక గడువు ముగిసిన తరువాత ఆ వాహనాలను రోడ్లపై తిప్పబోమంటూ వాహన యజమానులు ‘స్టాపేజ్ రిపోర్ట్ లేదా నాన్ యూజ్ రిపోర్ట్’ ఇవ్వకుంటే.. వాహనాలు రోడ్లపై తిరుగుతున్నట్టుగానే భావించి పన్ను విధించే అధికారం రవాణా అధికారులకు ఉందని పేర్కొంది. ఒకవేళ రవాణాయేతర వాహన యజమాని స్టాపేజ్ రిపోర్ట్ సమర్పించడంలో విఫలమైనప్పటికీ, ఆ తరువాత వాహనాన్ని తిప్పడం లేదని అధికారులకు అన్ని ఆధారాలను ఇస్తే, ఆ వాహనం తిరగడం లేదనే భావించాల్సి ఉంటుందని తెలిపింది. తమ వాహనాలు విశాఖ స్టీల్ప్లాంట్ లోపల సెంట్రల్ డిస్పాచ్ యార్డ్ (సీడీవై)లో తిరుగుతున్నాయని, సీడీవై ‘బహిరంగ ప్రదేశం’ కిందకు రాదని, అందువల్ల తమ వాహనాలకు మోటారు వాహన పన్ను మినహాయింపు వర్తిస్తుందన్న తారాచంద్ లాసిజ్టిక్ సొల్యూషన్స్ లిమిటెడ్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ వాదన ఏపీ మోటారు వాహన పన్నుల చట్టంలోని సెక్షన్ 12ఏకి విరుద్ధమని తేల్చిచెప్పింది. సీడీవై బహిరంగ ప్రదేశం కిందకు రాదు కాబట్టి, తారాచంద్ కంపెనీ చెల్లించిన రూ.22.71 లక్షల పన్నును తిరిగి వారికి వెనక్కి ఇవ్వాలని రవాణా అధికారులను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సీజే ధర్మాసనం రద్దు చేసింది. సెక్షన్ 12ఏ ప్రకారం స్టాపేజ్ రిపోర్ట్కు బహిరంగ ప్రదేశం, ప్రైవేటు ప్రదేశం అన్న తేడా ఏమీ ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించింది. రూ.22.71 లక్షలు వెనక్కి ఇవ్వాలన్న సింగిల్ జడ్జితారాచంద్ లాసిజ్టిక్ సొల్యూషన్స్ కంపెనీ విశాఖ స్టీల్ప్లాంట్లో ఐరన్ స్టోరేజీ, హ్యాండ్లింగ్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ పనులకు 36 వాహనాలను వినియోగిస్తోంది. ఈ వాహనాలు అప్పటివరకు రోడ్లపై తిరిగినందుకు కాంట్రాక్ట్ పొందడానికి ముందే సదరు కంపెనీ ఆ వాహనాలకు మోటారు వాహన పన్ను చెల్లించింది. పన్ను చెల్లించిన కాల పరిమితి ముగియడంతో అధికారులు ఆ వాహనాలకు రూ.22.71 లక్షల మేర పన్ను చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. దీనిపై తారాచంద్ కంపెనీ తమ వాహనాలు రోడ్లపై తిరగడం లేదని, సీడీవైలోనే తిరుగుతున్నందున పన్ను మినహాయింపు ఇవ్వాలంటూనే రూ.22.71 లక్షల పన్ను చెల్లించింది. ఆ తరువాత తమ వాహనాలకు పన్ను విధించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో 2022లో పిటిషన్ దాఖలు చేసింది.దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి తారాచంద్ కంపెనీ తన వాహనాలను రోడ్లపై తిప్పలేదని, స్టీల్ ప్లాంట్ లోపల ఉన్న సీడీవైలోనే తిప్పిందని, అందువల్ల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చారు. ఆ కంపెనీ చెల్లించిన రూ.22.71 లక్షల పన్ను మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని రవాణా అధికారులను ఆదేశిస్తూ తీర్పునిచ్చారు.ప్రభుత్వం అప్పీల్ చేయడంతో..ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సీజే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం వాహనదారు పన్ను మినహాయింపు కావాలంటే.. పన్ను చెల్లించాల్సిన త్రైమాసికం మొదలు కావడానికి ముందే సదరు వాహనం తిరగడం లేదంటూ స్టాపేజ్ రిపోర్ట్ను రాతపూర్వకంగా రవాణా శాఖ అధికారులకు తెలియజేసి తీరాల్సిందేనని స్పష్టం చేసింది.వాస్తవానికి మోటారు వాహన పన్ను అనేది పరిహార స్వభావంతో కూడుకున్నదని, పన్నుల ద్వారా వచ్చే మొత్తాలతోనే అన్ని వాహన రాకపోకలు సజావుగా సాగేందుకు వీలుగా రోడ్లను నిర్వహించడమన్నది ప్రభుత్వ బాధ్యత అని తెలిపింది. తారాచంద్ కంపెనీకి రూ.22.71 లక్షలు వెనక్కి ఇవ్వాలంటూ సింగిల్జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. -
ఇకపై మరింత మందిని కోల్పోనివ్వం
సాక్షి, అమరావతి: హెల్మెట్ లేకపోవడం వల్ల చోటు చేసుకుంటున్న మరణాలపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు హెల్మెట్ లేకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 667 మంది చనిపోవడం చిన్న విషయం కాదని.. నిబంధనల అమలులో పోలీసుల అలసత్వం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై తాము ఈ విధంగా మరింత మందిని కోల్పోనివ్వబోమని హైకోర్టు తేల్చి చెప్పింది.ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్న భయాన్ని ప్రజల్లో కలిగించాలని స్పష్టం చేసింది. చలాన్లు చెల్లించని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రాష్ట్రంలో మోటారు వాహన చట్ట నిబంధనల అమలు విషయంలో పోలీసులు, ఆర్టీఏ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు హాజరవ్వాలని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జనరల్ను హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో రవాణా శాఖ కమిషనర్ను ప్రతివాదిగా చేర్చింది. రాష్ట్రంలో మోటారు వాహన చట్ట నిబంధనల అమలుకు ముఖ్యంగా హెల్మెట్లు ధరించని వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీల భర్తీకి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? రాష్ట్రవ్యాప్తంగా 8,770 మంది ట్రాఫిక్ పోలీసులు ఉండాలి కానీ.. కేవలం 1,994 మందే ఉన్నారని ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించింది. ఏపీ నుంచి హైదరాబాద్కు వెళ్లే వాళ్లు తెలంగాణ సరిహద్దు రాగానే సీటు బెల్టులు పెట్టుకుంటున్నారని.. ఇందుకు పోలీసులు చర్యలు తీసుకుంటారన్న భయమే కారణమని పేర్కొంది. కుటుంబానికి అండగా ఉండే వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే.. ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని సూచించింది. ప్రణతి జోక్యం చేసుకుంటూ.. మొత్తం బాధ్యత పోలీసులదే అంటే సరికాదని, ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ప్రజలను తప్పు పట్టొద్దని, అవగాహన కల్పించడం పోలీసుల బాధ్యత అని హితవు పలికింది. మోటారు వాహన చట్ట నిబంధనల అమలు, హెల్మెట్ ధరించడాన్ని తప్పనిసరి చేసే విషయంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. జరిమానాలు కఠినంగా వసూలు చేయాలి.. రాష్ట్రంలో కేంద్ర మోటారు వాహన సవరణ చట్ట నిబంధనలను అమలు చేయట్లేదని.. ఉల్లంఘనలకు పాల్పడిన వారికి జరిమానాలు విధించడం లేదని, దీంతో పెద్ద సంఖ్యలో వాహన ప్రమాదాలు, మరణాలు చోటుచేసుకుంటున్నాయని న్యాయవాది తాండవ యోగేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. యోగేశ్ వాదనలు వినిపిస్తూ.. హెల్మెట్ ధారణ తప్పనిసరి చేయాలని గత విచారణ సమయంలో ఇచ్చిన ఆదేశాల అమలుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. హెల్మెట్ ధారణ నిబంధన అమలుకు చర్యలు తీసుకోవాలని తాము జూన్లో ఆదేశాలిచి్చనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత మంది చనిపోయారని ప్రశ్నించింది. జూన్ నుంచి సెపె్టంబర్ వరకు 667 మంది చనిపోయారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి తెలిపారు. ఇది చిన్న విషయం కాదని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రణతి స్పందిస్తూ, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో 5,62,492 చలాన్లు విధించామని చెప్పారు. కృష్ణా జిల్లాలో 20,824 చలాన్లు విధించి రూ.4.63 లక్షలు జరిమానా వసూలు చేశామన్నారు. ఇది చాలా తక్కువ మొత్తమన్న ధర్మాసనం.. నిబంధనలను అమలు చేసే విషయంలో ప్రభుత్వం ఎందుకు నిస్సహాయంగా ఉందని ప్రశ్నించింది. ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయన్న భయాన్ని ప్రజల్లో కలిగించాలని సూచించింది. చలాన్లు కట్టని వారి విద్యుత్ సరఫరా, నీటి సరఫరా ఆపేయడం వంటి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. చలాన్లు చెల్లించకపోతే సదరు వాహనాన్ని ఎందుకు జప్తు చేయట్లేదని పోలీసులను, ఆర్టీఏ అధికారులను ప్రశ్నించింది. భారీ జరిమానాలు విధించే బదులు.. ఇప్పటికే ఉన్న జరిమానాలను కఠినంగా వసూలు చేస్తే ఫలితం ఉంటుందని అభిప్రాయపడింది. -
అలైన్మెంట్లో టింక‘రింగ్’!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగు రోడ్డు దక్షిణ భాగాన్ని ఓపక్క రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా చేపట్టేందుకు సిద్ధమవుతుండగా, మరోపక్క ఉత్తర భాగం అలైన్మెంటులో మార్పులు చేయాలనే ఒత్తిడి మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో ప్రజల వ్యతిరేకతను ఆసరాగా చేసుకుని కొందరు నేతలు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రజలకు మద్దతు ముసుగులో తమకు అనుకూలమైనవారి కోసం పావులు కదుపుతున్నారు. ఢిల్లీ స్థాయిలో మంత్రాంగం నడుపుతున్నారు. ఉత్తర భాగానికి సంబంధించి అన్ని రకాల గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయి, భూ పరిహారానికి అవార్డులు పాస్ చేసే సమయంలో ఇప్పుడు ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. అలైన్మెంటు ఖరారై, టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నందున మార్పులు సాధ్యం కాదని ఎన్హెచ్ఏఐ అధికారులు చెబుతుండగా, కొందరు నేతలు ఈ విషయమై కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఒత్తిడి పెంచుతుండటం గమనార్హం. ఎక్కడెక్కడ మార్పులు – సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్ వద్ద ట్రిపుల్ ఆర్ ప్రారంభమవుతుంది. ఇక్కడ జాతీయ రహదారి మీద భారీ ఇంటర్ఛేంజ్ స్ట్రక్చర్ నిర్మించాల్సి ఉంది. అయితే ఈ ప్రాంతంలో భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు నిరాకరిస్తున్నారు. గతంలో పబ్లిక్ హియరింగ్, సర్వే జరగకుండా అడ్డుకున్నారు. ఇదే ప్రాంతంలో దక్షిణ రింగు ప్రారంభం కావాల్సి ఉంటుంది. దాన్ని ఉత్తర రింగులో భాగంగా నిర్మించే ఇంటర్ఛేంజ్ స్ట్రక్చర్తో అనుసంధానించాల్సి ఉంది. దక్షిణ రింగును మరింత దూరంగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో, కొందరు నేతలు దీన్ని ఆసరా చేసుకుని ఉత్తర రింగు కూడలిని మరోచోట నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. రైతుల వ్యతిరేకిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. తమకు అనుకూల ప్రాంతానికి చేరువగా రింగురోడ్డు ఉండాలన్న ఉద్దేశంతో కొందరు నేతలు మార్పు కోరుతుండగా, ప్రస్తుత అలైన్మెంటు తమకు చెందినవారి భూముల్లోంచి ఉండటంతో వాటిని కాపాడే ప్రయత్నంలో భాగంగా కొందరు మార్పు కోరుతున్నారు. – యాదాద్రి జిల్లాలో రింగురోడ్డు విషయంలో స్థానికుల వ్యతిరేకత ఎక్కువగా ఉంది. గతంలో జాతీయ రహదారి కోసం కొందరు, సాగునీటి ప్రాజెక్టు కాలువల కోసం కొందరు.. ఇలా పలు సందర్భాల్లో భూములు కోల్పోయారు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కోసం మరోసారి భూసేకరణ జరగటాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ కొందరు వ్యాపారుల భూములు కూడా అలైన్మెంటు పరిధిలో ఉన్నాయి. దీంతో వారు బడా నేతలను ఆశ్రయించారు. స్థానికుల అభ్యర్థనలను ఆసరాగా తీసుకుని అలైన్మెంటును మార్చాలని నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ఇంటర్ఛేంజ్ స్ట్రక్చర్ రాయగిరి హైవే వద్ద కాకుండా ఎగువన నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. – ఉత్తర రింగు చౌటుప్పల్ వద్ద ముగుస్తుంది. చౌటుప్పల్ పట్టణ శివారులోనే ఇంటర్ఛేంజ్ స్ట్రక్చర్ నిర్మించాల్సి ఉంది. ఇది పట్టణానికి మరీ చేరువగా ఉందని, దీనివల్ల విలువైన భూములును స్థానికులు కోల్పోవాల్సి వస్తుందని, పరిహారంగా వారికి న్యాయమైన మొత్తం దక్కదంటూ కొందరు నేతలు వకాల్తా పుచ్చుకుని గడ్కరీ కార్యాలయంలో ఒత్తిడి పెంచారు. పట్టణానికి దూరంగా ఉండేలా అలైన్మెంటు మార్చాలని కోరుతున్నారు. ఇతర ప్రాంతాల రైతుల్లో ఆందోళన అలైన్మెంటు మారుస్తున్నారంటూ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రచారం ప్రారంభమైంది. ఉన్నతస్థాయిలో ఒత్తిళ్ల వల్ల రింగురోడ్డును ప్రస్తుత ప్రాంతానికి దూరంగా మారుస్తున్నారంటూ స్థానికుల్లో తప్పుడు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇతర ప్రాంతాల్లోని రైతుల్లో ఆందోళ వ్యక్తమవుతోంది. తమ భూములకు ఎక్కడ ఇబ్బంది కలుతుందోనన్న భయంతో ఎన్హెచ్ఏఐ అధికారులను సంప్రదిస్తున్నారు. అయితే అలాంటిదేమీ లేదని అధికారులు చెబుతుండటంతో ..ఏది నిజమో తెలియని అయోమయంలో ఉన్నారు. చిన్న మార్పుతో భారీ తేడా! రింగురోడ్డు అలైన్మెంటులో ఓ ప్రాంతంలో చిన్న మార్పు చేస్తే దాని ప్రభావం ఇటు రెండు కిలోమీటర్లు, అటు రెండు కిలోమీటర్ల మేర ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇది ఎక్స్ప్రెస్ వే అయినందున ఉన్నఫళంగా రోడ్డును మలుపు తిప్పే వీలుండదు. రెండు కిలోమీటర్ల దూరం నుంచి మొదలుపెట్టి క్రమంగా మలుపు తిప్పాల్సి ఉంటుంది. ఇక మార్పు ఎక్కువగా ఉంటే, అలైన్మెంటులో కూడా భారీ మార్పు చోటు చేసుకుంటుంది. ప్రస్తుతం ఊరికి ఒకవైపు ఉందనుకుంటే, మార్పు వల్ల మరో వైపునకు మారే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే ప్రజల్లో తీవ్ర అలజడికి కారణమవుతుంది. కాబట్టి ఇలాంటి మార్పులకు అవకాశమే లేదని అధికారులు చెబుతున్నారు. అయితే నేతలు మాత్రం ఢిల్లీ స్థాయిలో తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు సమాచారం. -
రవాణాలో భారీగా రామప్రసాదం
‘అయ్యవారికి చాలు ఐదు వరహాలు..! పిల్లలకు చాలు పప్పు బెల్లాలు..!’ అంటూ దసరా పాట ఒకప్పుడు వినిపించేది. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకున్నా రవాణా శాఖలో కొత్త పాట వినిపిస్తోంది. ‘అయ్యగారికి చాలు 10 కోట్ల రూపాయలు..!’ అని అంటున్నారు!! అన్నట్టుగానే బదిలీలకు ముడుపులు వసూలు చేసి కీలక నేతకు సమర్పించారు. రవాణా శాఖ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఏకంగా కీలక నేతే స్వయంగా ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి మరీ మీ పోస్టులు ఉండాలంటే ముడుపులు చెల్లించాలని హుకుం జారీ చేయడం.. వసూళ్ల కోసం ఏకంగా ముగ్గురు అధికారులను వినియోగించడం విభ్రాంతి కలిగిస్తోంది. – సాక్షి, అమరావతిపోస్టు ఉండాలంటే ముడుపులు చెల్లించాల్సిందే రవాణా శాఖలో ఉన్నతాధికారుల బదిలీల్లో భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. ప్రధానంగా జిల్లా రవాణా శాఖ అధికారులు (డీటీసీ), ఆర్టీవోల బదిలీల్లో భారీ దందా సాగింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రవాణా శాఖలో కీలక నేత ఉన్నతాధికారుల బదిలీల పేరిట హైడ్రామాకు తెరతీశారు. ప్రాధాన్యమున్న కేంద్రాల్లో పోస్టులు కావాలంటే భారీగా సమర్పించుకోవాలని తేల్చి చెప్పారు.ప్రస్తుతం ఉన్న పోస్టుల్లో కొనసాగాలన్నా... ప్రాధాన్యత పోస్టులకు బదిలీ కావాలన్నా పేషీకి ముడుపులు సమర్పించుకోవల్సిందేనని.. లేదంటే శంకరగిరి మాన్యాలు తప్పవని సెలవిచ్చారు. అందుకోసం రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలోని ముగ్గురు అధికారులకు బాధ్యతలు అప్పగించారు. పోస్టింగ్ కేంద్రాన్ని బట్టి డీటీసీ పోస్టుకు రూ.25 లక్షలు, ఆర్టీవో పోస్టుకు రూ.10 లక్షల చొప్పున వసూలు చేసి మొత్తంగా రూ.10 కోట్లు వరకు కీలక నేత పేషీకి సమర్పించారు. ముడుపులు ఇవ్వని ముగ్గురిపై వేటు కీలక నేత పేషీ నుంచి ఫోన్లు చేసినా ముగ్గురు డీటీసీలు ముడుపులు ఇచ్చేందుకు నిరాకరించారు. తమకు ఎక్కడ పోస్టింగు ఇచ్చినా విధులు నిర్వహిస్తామని, ముడుపులు ఇవ్వలేమని డీటీసీలు పురేంద్ర, రాజారత్నం, మీరా ప్రసాద్ చెప్పినట్టు సమాచారం. దాంతో ఆ ముగ్గురిపై బదిలీ వేటు వేశారు. వారికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా రవాణా శాఖ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేయడం గమనార్హం. సీనియర్ అధికారిపై కక్ష సాధింపు.. రవాణా శాఖలో కమిషనర్ తరువాత అత్యంత కీలకమైన అదనపు కమిషనర్ పోస్టు ప్రస్తుతం ఖాళీగా ఉంది. నిబంధనల ప్రకారం సీనియారిటీలో మొదటి స్థానంలో ఉన్న జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్(జేటీసీ) రమాశ్రీకి ఆ పోస్టు ఇవ్వాలి. సర్వీసు రికార్డులో ఆమెపై ఎలాంటి ఫిర్యాదులు కూడా లేవు. అయితే ఆమెను అదనపు కమిషనర్గా నియమించేందుకు మంత్రి పేషీ ససేమిరా అంది. నిబంధనల మేరకు వ్యవహరించే ఆమె కీలక స్థానంలో ఉంటే తమ అక్రమాలకు సాగవని భావించింది. ఈ నేపథ్యంలో రమాశ్రీని హఠాత్తుగా విశాఖ జేటీసీగా బదిలీ చేసి ఆమె కంటే జూనియర్ అధికారి వద్ద రిపోర్ట్ చేయాలని ఆదేశించడం గమనార్హం. భారీ అవినీతికి రంగం సిద్ధం చేస్తున్న కీలక నేత అందుకు వత్తాసు పలికే అధికారులను ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంటున్నారని రవాణా శాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
స్క్రాప్ స్వచ్ఛందమే: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదిహేనేళ్లు దాటిన వాహనాలను తప్పనిసరిగా తుక్కుగా మార్చాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ‘వలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ’ని అమల్లోకి తెచ్చింది. వాహనాన్ని తుక్కుగా మార్చాలా, వద్దా అన్నదానిపై యజమానులే నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించింది. వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకుని, గ్రీన్ట్యాక్స్ చెల్లించి మరో ఐదేళ్లపాటు వినియోగించుకునే ప్రస్తుత విధానం కొనసాగుతుందని ప్రకటించింది. అయితే ఎవరైనా తమ వాహనాన్ని తుక్కుగా మార్చి, అదే కోవకు చెందిన కొత్త వాహనాన్ని కొంటే.. జీవితకాల పన్ను (లైఫ్ ట్యాక్స్)లో కొంతమొత్తం రాయితీగా ఇస్తామని తెలిపింది. కొన్నినెలల పాటు వివిధ రాష్ట్రాల్లోని వెహికల్ స్క్రాపింగ్ పాలసీలను అధ్యయనం చేశాక.. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను మిళితం చేసి అధికారులు ఈ విధానాన్ని రూపొందించారు. మంగళవారం రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ శాఖ అధికారులతో కలసి ఈ వివరాలను వెల్లడించారు. ఏ వాహనాలకు ఏ విధానం? ఎవరైనా 15 ఏళ్లు దాటిన తమ వాహనాన్ని తుక్కుగా మార్చాలని భావిస్తే.. దీనిపై రవాణా శాఖకు సమాచారమిచ్చి, అదీకృత తుక్కు కేంద్రానికి వెళ్లి స్క్రాప్ చేయించుకోవాలి. ఆ కేంద్రం సంబంధిత వాహనానికి నిర్ధారిత స్క్రాప్ విలువను చెల్లిస్తుంది. ఈ మేరకు సర్టిఫికెట్ ఇస్తుంది. యజమానులు అదే కేటగిరీకి చెందిన కొత్త వాహనం కొన్నప్పుడు.. ఈ సర్టిఫికెట్ చూపితే కొత్త వాహనానికి సంబంధించిన జీవితకాల పన్నులో నిర్ధారిత మొత్తాన్ని రాయితీగా తగ్గిస్తారు.రవాణా వాహనాలను ఎనిమిదేళ్లకే స్క్రాప్కు ఇవ్వవచ్చు. వీటికి సంబంధించి ఎంపీ ట్యాక్స్లో 10% రాయితీ ఉంటుంది. మిగతా నిబంధనలు నాన్ ట్రాన్స్పోర్టు వాహనాల తరహాలోనే వర్తిస్తాయి. – ప్రభుత్వ వాహనాల విషయంలో మాత్రం నిర్బంధ స్క్రాప్ విధానమే వర్తిస్తుంది. పదిహేనేళ్లు దాటిన ప్రతి ప్రభుత్వ వాహనాన్ని ఈ–ఆక్షన్ పద్ధతిలో తుక్కు కింద తొలగించాల్సిందే. అవి రోడ్డెక్కడానికి వీలు లేదు. – ఏ కేటగిరీ వాహనాన్ని స్క్రాప్గా మారిస్తే.. అదే కేటగిరీ కొత్త వాహనంపై మాత్రమే రాయితీ వర్తిస్తుంది. ఉదాహరణకు ద్విచక్రవాహనాన్ని తుక్కుగా మారిస్తే.. మళ్లీ ద్విచక్రవాహనం కొంటేనే రాయితీ వర్తిస్తుంది. అంతేకాదు వాహనాన్ని తుక్కుగా మార్చిన రెండేళ్లలోపే ఈ రాయితీ పొందాల్సి ఉంటుంది. కేంద్రం చట్టం చేసిన మూడేళ్ల తర్వాత.. దేశవ్యాప్తంగా వాహన కాలుష్యం పెరుగుతోందంటూ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టానికి సవరణ చేసింది. 15 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కుగా మార్చాలన్న విధాన నిర్ణయం తీసుకుంది. దీనిపై 2021లో రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ చట్టం అమలుపై రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పించింది. చాలా రాష్ట్రాలు దశలవారీగా దీని అమలు ప్రారంభించాయి. కానీ నిర్బంధంగా తుక్కు చేయకుండా.. స్వచ్ఛంద విధానానికే మొగ్గు చూపాయి. తెలంగాణలో మూడేళ్ల తర్వాత ఇప్పుడు పాలసీని అమల్లోకి తెచ్చారు. – ‘రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (ఆర్వీఎ‹స్ఎఫ్)’ కేంద్రాల్లో వాహనాలను తుక్కుగా మారుస్తారు. ఈ కేంద్రాల ఏర్పాటు కోసం గత ఆగస్టులో నోటిఫికేషన్ జారీ చేయగా.. మహీంద్రా కంపెనీ సహా నాలుగు సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఆ కేంద్రాలు నిబంధనల ప్రకారం ఉన్నాయా, లేదా అన్నది పరిశీలించి అనుమతిస్తారు. యజమానులు ఈ కేంద్రాల్లోనే వాహనాలను అప్పగించి, సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. వాహనాల ‘ఫిట్నెస్’ పక్కాగా తేల్చేందుకు... 15 ఏళ్లు దాటిన వాహనాలను మరికొంతకాలం నడుపుకొనేందుకు ఫిట్నెస్ తనిఖీ తప్పనిసరి. ఇప్పటివరకు మ్యాన్యువల్గానే టెస్ట్ చేసి సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఇది సరిగా జరగడం లేదని, అవినీతి చోటుచేసుకుంటోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో.. ఆటోమేటెడ్ స్టేషన్లలో కంప్యూటరైజ్డ్ పద్ధతిలో ఫిట్నెస్ టెస్టులు చేయించాలని కేంద్రం ఆదేశించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ఏర్పాటుకు రూ.293 కోట్లు అవుతాయని అంచనా వేశారు. అందులో కేంద్రం రూ.133 కోట్లను భరించనుంది. ఇక వాహనాల విక్రయానికి సంబంధించిన ఎన్ఓసీలు, లైసెన్సులు ఇతర సేవలను అన్ని రాష్ట్రాలతో అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం వాహన్, సారథి పోర్టల్లను ఏర్పాటు చేసింది. చాలా రాష్ట్రాలు వీటితో అనుసంధానమయ్యాయి. తాజాగా తెలంగాణ కూడా అందులో చేరుతున్నట్టు ప్రకటించింది. దీనిని తొలుత సికింద్రాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో ప్రారంభిస్తున్నారు. భద్రతపై దృష్టి సారించాం దేశవ్యాప్తంగా ఏటా 1.6 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. తెలంగాణలో కూడా ఆ సంఖ్య ఆందోళనకరంగానే ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో రోడ్డు భద్రతపై దృష్టి సారించాం. నిబంధనల విషయంలో కచ్చితంగా ఉండాలని నిర్ణయించాం. రవాణా శాఖకు సంబంధించి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకున్నాం. రాష్ట్రంలో ఇప్పటివరకు వాహనాల తుక్కు విధానం లేదు. దాన్ని ప్రారంభించాలని నిర్ణయించాం. జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాలు ఎలా అమలు చేస్తున్నాయో పరిశీలించి మంచి విధానాన్ని తెచ్చాం. జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాలతో రవాణాశాఖకు సంబంధించిన సమాచార మార్పిడికి వీలుగా సారథి, వాహన్ పోర్టల్లో తెలంగాణ చేరాలని నిర్ణయించింది. ఏడాదిలో అన్ని విభాగాలను అనుసంధానం చేస్తాం. – రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రీన్ట్యాక్స్ మాఫీ..15 ఏళ్లుదాటిన వాహనాలు ఇంకా ఫిట్గా ఉన్నాయని భావిస్తే, వాటిని ఇక ముందు కూడా నడుపుకోవచ్చు. రూ.5 వేల గ్రీన్ట్యాక్స్ చెల్లించి తదుపరి ఐదేళ్లు, ఆ తర్వాత రూ.10 వేలు చెల్లించి మరో ఐదేళ్లు నడు పుకొనే వెసులుబాటు ఉంది. అయితే ఇప్ప టికే 15ఏళ్లు దాటేసిన వాహనాలను తుక్కుగా మార్పిస్తే.. వాటికి గ్రీన్ట్యాక్స్ బకాయి ఉన్నట్టుగా పరిగణించాల్సి వస్తుంది. దీంతో కొత్త పాలసీలో ఆ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేకుండా స్క్రాప్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అదే వాణిజ్య వాహనాలకు త్రైమాసిక పన్ను వంటి బకాయిలు ఉంటే.. ఆ బకాయిలపై పెనాల్టిని మాఫీ చేస్తారు. -
రవాణాశాఖ సేవలకు ఇక ‘వాహన్ సారథి’
సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖ అందజేసే వివిధ రకాల పౌరసేవలు మరింత పారదర్శకం కానున్నాయి. ఇప్పటికే ఆన్లైన్లో స్లాట్ నమోదు ద్వారా కొన్ని సేవలు నేరుగా, మరికొన్ని పరోక్షంగా లభిస్తున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ల రెన్యువల్స్, వాహనాల నమోదు బదిలీ వంటి పౌరసేవలను వాహన వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు ఆర్టీఏ సన్నాహాలు చేపట్టింది. దేశవ్యాప్తంగా రవాణా సేవలన్నింటిపైన ఏకీకృత విధానాన్ని అమలు చేసేందుకు ప్రవేశపెట్టిన వాహన్ సారథిని గ్రేటర్ హైదరాబాద్లో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. ప్రస్తుతం టీ–యాప్ ఫొలియో వంటి మొబైల్ యాప్ల ద్వారా ప్రత్యక్ష సేవలను పొందేందుకు అవకాశం ఉండగా త్వరలో వాహన్ సారథిని వినియోగించుకొనే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు వాహనాల వివరాలన్నింటినీ వాహన్లోనూ, వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్ల వివరాలను సారథిలోనూ నిక్షిప్తం చేయనున్నాయి. కేంద్రం కొత్తగా ఏర్పాటు చేసిన జాతీయ సమాచారం కేంద్రం (నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ) ద్వారా ఈ వివరాలన్నింటినీ నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మొదట లైసెన్స్ల డేటా నమోదు సికింద్రాబాద్ ఆర్టీఏ కార్యాలయం నుంచి త్వరలోనే సారథి సేవలు ప్రయోగాత్మకంగా ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా సారథి కార్యకలాపాలు సాగిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన డ్రైవింగ్ లైసెన్స్ల వివరాలు సారథిలో నమోదయ్యాయి. ఇటీవల తెలంగాణ కూడా ఈ జాబితాలో చేరింది. దీంతో కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్లు తీసుకొనే అభ్యర్థులు మినహాయించి పాతవి రెన్యువల్స్ చేసుకోవడం, చిరునామా బదిలీ చేసుకోవడం వంటి సేవలను సారథి నుంచి పొందవచ్చు. ప్రస్తుతం ఉద్యోగ, వ్యాపార అవసరాల రీత్యా ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు లేదా, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ అయినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్లను బదిలీ చేసుకోవాలంటే సంబంధిత ఆర్టీఏ అధికారుల నుంచి నిరభ్యంతర పత్రాన్ని (ఎన్ఓసీ) పొందాల్సి ఉంటుంది. కానీ కొత్తగా అందుబాటులోకి వచ్చిన సారథి వల్ల ఆ ఇబ్బంది ఉండదు. లైసెన్స్ల మొత్తం డేటా సారథిలో నిక్షిప్తమై ఉంటుంది. దీంతో వాహనదారులు తమ డేటాను ఎక్కడి నుంచి ఎక్కడికైనా మార్చుకోవచ్చు. ఆన్లైన్లోనే ఈ సర్విసులను పొందే అవకాశం ఉంటుంది. కానీ అధికారుల పర్యవేక్షణ, ఆమోదంతోనే సర్విసుల బదిలీ సదుపాయం లభించనుంది. ఇందుకోసం ఆన్లైన్లోనే నిరీ్ణత ఫీజు చెల్లించి డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతంగ్రేటర్ హైదరాబాద్లోని 3 జిల్లాల పరిధిలో 62,7056 లైసెన్స్లు ఉన్నాయి. సుమారు 83 లక్షల వాహనాలు నమోదై ఉన్నాయి. వాహనాల నమోదుకు ‘వాహన్’ ఇప్పటికే దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు వాహనాల వివరాలను ‘వాహన్’లో నమోదు చేశాయి. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న ‘వాహన్’లో ఇటీవల తెలంగాణ కూడా చేరేందుకు చర్యలు చేపట్టింది. మొత్తం వాహనాల డేటాను వాహన్లో నిక్షిప్తం చేయనున్నారు. దీనిద్వారా వాహనం కొనుగోలు చేసిన వెంటనే షోరూమ్లలో శాశ్వత రిజి్రస్టేషన్ సదుపాయం లభించనుంది. ప్రస్తుతం ఆటోమొబైల్ డీలర్లు తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాలను (టీఆర్) ఇస్తున్నారు. అనంతరం ఆర్టీఏ అధికారులు శాశ్వత రిజిస్ట్రేషన్ (ఆర్సీ) చేస్తున్నారు. మరోవైపు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వాహనాన్ని బదిలీ చేసేందుకు ఎన్ఓసీల అవసరం ఉండదు. సదరు వాహనం వివరాలను ‘వాహన్’లో ధ్రువీకరించుకుని బదిలీ చేయవచ్చు. అలాగే ప్రమాద బీమా సదుపాయం కూడా తేలిగ్గా లభిస్తుందని అధికారులు చెప్పారు. వాహనాల సామర్థ్య పరీక్షలను కూడా ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ల ద్వారా నిర్వహించడంతో పాటు ఆటోమేటిక్ డ్రైవింగ్ ట్రాక్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఆన్లైన్లోనే లెరి్నంగ్ పరీక్షలు ప్రస్తుతం అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్న లెర్నింగ్ లైసెన్స్ పరీక్షలను కూడా ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. కర్ణాటకలో ఈ తరహా పద్ధతి విజయవంతంగా అమలవుతున్న దృష్ట్యా హైదరాబాద్లోనూ ఆన్లైన్ టెస్టింగ్ పద్ధతిని అమలు చేయాలనే రవాణా అధికారులు ప్రతిపాదిస్తున్నారు. దీనివల్ల విని యోగదారులు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవస రం ఉండదు. ఇంటి నుంచి ఎల్ఎల్ఆర్ (లెర్నింగ్ లైసె న్స్) పొందవచ్చు. ఇది 6 నెలల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఆ తర్వాత మరో నెల వరకు పొడిగించుకొనే సదుపాయం ఉంటుంది. లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్న నెల రోజుల నుంచి 6 నెలల్లోపు అందజేసే శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ కోసం మాత్రం టెస్ట్ట్రాక్లలో అధికారులు నిర్వ హించే ప్రత్యక్ష పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. -
డ్రైవింగ్.. ట్రాక్లో పడేలా
డ్రైవింగ్ లైసెన్స్ కావాలి.. మొదట లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్నారు..ఏదో డ్రైవింగ్ స్కూల్లో చేరి కొన్ని రోజులు నేర్చుకున్నారు.. డ్రైవింగ్ టెస్టులో పాసయ్యేంత నైపుణ్యం లేకున్నా..ఎవరో ఏజెంట్నో, దళారీనో పట్టుకుని లైసెన్స్ సంపాదించేశారు. ఇదంతా బాగానే ఉంది..మరి వచ్చిరాని డ్రైవింగ్తో బండి వేసుకుని రోడ్డెక్కితే? ఏదైనా ప్రమాదానికి కారణమైతే? ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు రవాణా శాఖ చర్యలు చేపట్టింది. సిటీలోని నాగోల్లో ఆధునిక డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ను అందుబాటులోకి తెచ్చింది. డ్రైవింగ్ సరిగ్గా నేర్చుకుని, ట్రాక్పై నిరీ్ణత ప్రమాణాల మేరకు నడిపితేనే.. లైసెన్స్ చేతికి వస్తుంది. లేకుంటే ఫెయిలే మరి.సాక్షి, హైదరాబాద్డ్రైవింగ్ లైసెన్స్ల కోసం వచ్చేవారికి రవాణా శాఖ తనిఖీ అధికారులే పరీక్షలు నిర్వహించి లైసెన్స్లను అందజేసే పద్ధతి చాలాకాలం నుంచి కొనసాగుతోంది. మాన్యువల్గా సాగుతున్న ఈ పద్ధతికి స్వస్తి చెప్పి.. మోటారు వాహన చట్టం నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ల ఆధునీకరణకు రవాణాశాఖ సిద్ధమైంది. ఆటోమేటిక్ పద్ధతిలో ట్రాక్ల నిర్వహణ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో నిరీ్ణత ప్రమాణాల మేరకు వాహనం నడిపితేనే డ్రైవింగ్ లైసెన్స్ లభించనుంది. ఈ క్రమంలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం టెస్టుకు వచ్చేవారు ఎలాంటి దొడ్డిదారి మార్గాలను అన్వేíÙంచకుండా.. బాగా శిక్షణ తీసుకుని డ్రైవింగ్లో నైపుణ్యం సంపాదించాలని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సి.రమేశ్ స్పష్టం చేస్తున్నారు. వాహనాల వినియోగం పెరుగుతూ.. ఇప్పుడు చాలా మందికి బైక్ లేదా కారు నిత్యావసరంగా మారింది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, మహిళలు అన్ని వర్గాల వారు వ్యక్తిగత వాహనాలను వినియోగిస్తున్నారు. ఏటా వేలాది మంది కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుని, వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. రవాణా రంగంలో డ్రైవర్లుగా చేరుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత మూడేళ్లలో సుమారు 62 లక్షల మంది డ్రైవింగ్ లైసెన్స్లు తీసుకోవడం విశేషం. అయితే చాలా మంది ఎలాంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండా వచ్చేస్తే బాగుంటుందని భావిస్తుంటారు. ఇందుకోసం ఏజెంట్లను, మధ్యవర్తులను ఆశ్రయిస్తారు. సరిగా నేర్చుకోకుండా, టెస్టుకు హాజరుకాకుండా తప్పుడు పద్ధతుల్లో లైసెన్సు తీసుకుని.. అరకొర అనుభవంతో బండి నడిపితే ప్రమాదాల బారినపడే అవకాశం ఉంటుంది.⇒ ఇన్నాళ్లూ కొనసాగిన మొక్కుబడి డ్రైవింగ్ టెస్టులకు చెల్లుచీటీ ⇒ రహదారులపై ఉండే ఇబ్బందులను తలపించేలా ట్రాక్లో ఏర్పాట్లు ⇒ లైసెన్స్ కోసం వచ్చేవారు ఎలా నడపగలుగుతున్నారో పరిశీలన ⇒ఆటోమేటిక్ పద్ధతిలో ట్రాక్ల నిర్వహణ⇒ టెస్ట్ వివరాలన్నీ కంఫ్యూటర్లో నిక్షిప్తం ⇒ ప్రమాణాల మేరకు డ్రైవింగ్ చేయకుంటే ఫెయిలేట్రాక్లో టెస్టు ఇలా..వాహనదారుల డ్రైవింగ్ నైపుణ్యాన్ని పరీక్షించేందుకు రకరకాల ట్రాక్లను ఏర్పాటు చేశారు. కారు నడిపేవారు ఈ అన్ని ట్రాక్లలో తమ నైపుణ్యాన్ని చూపాల్సి ఉంటుంది. అలాగే ద్విచక్ర వాహన దారులు, భారీ వాహనాలు నడిపే డ్రైవర్లకు కూడా ప్రత్యేక ట్రాక్లు ఉన్నాయి.ట్రాక్ ‘హెచ్’: వాహనం ముందుకు వెళ్లిన తరువాత రివర్స్ చేయాల్సి వస్తే.. ఎలా తీసుకొంటారో తెలుసుకొనేందుకే ఈ ట్రాక్. ట్రాక్ ‘ఎస్’: ఒక మూల నుంచి మరో మూలకు టర్న్ చేయాల్సి వచి్చనప్పుడు ఎలాంటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారో ఈ ట్రాక్లో తెలుస్తుంది. ట్రాక్ ‘8’: బాగా మలుపులున్న రోడ్డుపై ఎలా ముందుకు వెళ్తున్నారో తెలుసుకొనేందుకు ఇది దోహదం చేస్తుంది. ఎత్తుపల్లాల ట్రాక్:⇒ ఎత్తైన ప్రదేశాలు, చిన్న లోయ వంటి ప్రాంతాల్లో ఎలా నడపగలరో పరిశీలించేందుకు ఇవి ఏర్పాటు చేశారు. ⇒చివరగా బండి పార్కింగ్ చేసే పద్ధతిని కూడా పరీక్షిస్తారు. ⇒టెస్ట్కు హాజరయ్యే సమయంలో ఫోర్ వీలర్ అయితే సీట్ బెల్ట్,ద్విచక్రవాహనమైతే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. లేకుంటే ఫెయిల్ చేస్తారు. ⇒ ట్రాక్లలో నడిపేటప్పుడు ఎలాంటి తప్పిదాలు చేసినా ఫెయిల్ అయినట్టుగా నిర్ధారిస్తారు. ఇలా ఫెయిలైన వారు మరోనెల పాటుశిక్షణ తీసుకొని హాజరుకావాల్సి ఉంటుంది.రోజూ వందలాది మందికి డ్రైవింగ్ టెస్టులు..గ్రేటర్ హైదరాబాద్లో నాగోల్, ఉప్పల్, కొండాపూర్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, బండ్లగూడలలో ఏర్పాటు చేసిన డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ల ద్వారా రవాణా శాఖ డ్రైవింగ్ పరీక్షలను నిర్వహిస్తోంది. రోజూ వందలాది మంది ఈ టెస్టులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో దేశంలోనే అత్యాధునిక డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ను నాగోల్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న 12 ట్రాక్లలో రోజూ వందల మందికి డ్రైవింగ్ టెస్టు చేస్తున్నారు. కార్లు, ద్విచక్ర వాహనాలు నడిపేందుకు వేర్వేరు ట్రాక్లు ఉన్నాయి. అలాగే బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలను నడిపేవారికి టెస్టుల కోసం ప్రత్యేకంగా ట్రాక్లను ఏర్పాటు చేశారు. అనంతరం దశలవారీగా కొండాపూర్, ఉప్పల్, మేడ్చల్ తదితర ఆర్టీఏలలోనూ ట్రాక్లను విస్తరించారు. నెలరోజులకే ‘టెస్టు’కు వస్తూ.. : అభ్యర్థులు తొలుత లెర్నింగ్ లైసెన్సు తీసుకుని డ్రైవింగ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెల రోజుల నుంచి 6 నెలలలోపు ఎప్పుడైనా డ్రైవింగ్ టెస్టు పాసై.. హాజరై శాశ్వత డ్రైవింగ్ లైసెన్సు పొందవచ్చు. డ్రైవింగ్లో పట్టుసాధించాకే లైసెన్సు అందేలా ఈ నిబంధన అమలవుతోంది. కానీ చాలా మంది తూతూమంత్రంగా డ్రైవింగ్ నేర్చుకుని.. నెల రోజులకే టెస్టుకు హాజరవుతున్నారు. డ్రైవింగ్ పూర్తిగా రాకపోయినా, అడ్డదారిలో లైసెన్స్ పొందేందుకు ప్రయతి్నస్తున్నారు. ఇకపై అలాంటి వాళ్లు టెస్టులో చిక్కులు ఎదుర్కోక తప్పదని నాగోల్ ప్రాంతీయ రవాణా అధికారి రవీందర్ తెలిపారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా డ్రైవింగ్ టెస్ట్కు హాజరుకావాలని.. ఆ టెస్ట్ వివరాలను కంఫ్యూటర్లో నమోదు చేసి, ఉత్తీర్ణులుగా నిర్ధారణ అయితేనే లైసెన్స్ ఇస్తారని వెల్లడించారు.నైపుణ్యం ఉంటే కష్టమేమీ కాదు ప్రస్తుతం ప్రతి ఒక్కరికి వాహనం తప్పనిసరి అవసరంగా మారింది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చేవారు ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రత, వాహనం నడపడంలో కచి్చతమైన నైపుణ్యం కలిగి ఉండాలి. డ్రైవింగ్లో ప్రావీణ్యం ఉన్నవారు ఆర్టీఏ టెస్ట్ ట్రాక్లలో నిర్వహించే పరీక్షల్లో తేలిగ్గా ఉత్తీర్ణులవుతారు. డ్రైవింగ్ ఎంతో కీలకమైంది. నాణ్యమైన శిక్షణ తీసుకొని, పూర్తి నమ్మకం కలిగాకే.. డ్రైవింగ్ టెస్ట్కు హాజరుకావాలి. మొక్కుబడిగా నేర్చుకుని లైసెన్సుల కోసం రావడం వల్ల ప్రయోజనం ఉండదు. టెస్ట్కు రావడానికి ముందే ఒకసారి ట్రాక్పైన అవగాహన పెంచుకోవడం మంచిది. – సి.రమేశ్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, హైదరాబాద్పూర్తిగా నేర్చుకుని వచ్చాను సాధారణంగా డ్రైవింగ్ స్కూల్లో నెల రోజులు మాత్రమే శిక్షణ ఇస్తారు. నైపుణ్యం పెంచుకునేందుకు అది ఏ మాత్రం చాలదు. కనీసం3 నెలల పాటు డ్రైవింగ్ మెళకువలు నేర్చుకోవాలి. ఎలాంటి రోడ్లపై అయినా సరే బండి నడపగలమనే ధైర్యం, నమ్మకం వచి్చన తర్వాత టెస్ట్కు రావడం వల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఈజీగా పాస్ కావొచ్చు. – పూరి్ణమ, టెస్ట్కు హాజరైన మహిళరోడ్లపై నడిపినట్లుగానే ఉంది ఈ ట్రాక్లో రోడ్డు మీద నడిపినట్టుగానే ఉంది. మూల మలుపులు, ఎత్తుపల్లాలు, స్పీడ్ బ్రేకర్లు అన్నీ ఉన్నాయి. బండి నడిపే సమయంలో ఏ రోడ్డుపైన ఎలా నడపాలోస్పష్టమైన అవగాహన ఉంటేనే ఇక్కడ టెస్ట్ను ఎదుర్కోగలుగుతాం. ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నడిపితే డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లలో నిర్వహించే పరీక్షలు ఏ మాత్రం ఇబ్బంది కాదు. – శ్రీధర్, టెస్ట్కు హాజరైన యువకుడు -
టీడీపీ ఎంపీగారి బస్సులా.. అయితే ఓకే!
సాక్షి, అమరావతి: ఆయనో టీడీపీ ఎంపీ. ఉమ్మడి గుంటూరు జిల్లాలో విద్యా సంస్థల టైకూన్గా గుర్తింపు పొందారు. అంతకంటే అర్హత ఏముంటుందని రవాణా శాఖ అధికారులు భావించారు. అందుకే ఆయన విద్యా సంస్థకు చెందిన వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. విద్యా సంస్థల బస్సుల్లో భద్రతా ప్రమాణాల కోసం విద్యార్థుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం 2023లో చేసిన మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలను ఏమాత్రం పాటించకపోయినా సరే నిరభ్యంతరంగా రిజిస్ట్రేషన్లు చేసేస్తూ స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు. విద్యార్థుల భద్రతతో ముడిపడిన వ్యవహారం అయినప్పటికీ ఎంపీ ఒత్తిడికి తలొగ్గి ఆయన చెప్పినట్లు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కేంద్ర మోటారు వాహనాల చట్టం ఏం చెబుతోందంటే..విద్యా సంస్థల బస్సుల్లో భద్రతా ప్రమాణాలను నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం 2023లో ప్రత్యేక చట్టం రూపొందించింది. ప్రధానంగా అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ఉండేందుకు.. పొరపాటున అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే నివారణ చర్యలు చేపట్టేందుకు స్పష్టమైన విధివిధానాలను నిర్దేశించింది. ఫైర్ డిటెక్షన్, అలార్మ్ సిస్టం, ఫైర్ సప్రెషన్ సిస్టం, ఫైర్ ప్రొటెక్షన్ సిస్టంలకు సంబంధించిన పరికరాలు, ఉపకరణాలు కచ్చితంగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.రూల్స్, గీల్స్ ఏమీలేవు..ఉమ్మడి గుంటూరు జిల్లాలో పదేళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్న ఆయన కుటుంబం దశాబ్దాలుగా ఉన్నత విద్యా సంస్థలను నిర్వహిస్తోంది. ఆ విద్యా సంస్థ కోసం ఇటీవల కొత్తగా 50 బస్సులను కొనుగోలు చేశారు. అందుకోసం చెన్నై నుంచి వాహనాల ఛాసీస్లను కొనుగోలు చేసి బస్సుల బాడీ బిల్డింగ్ పనులు చేయించారు. కానీ కేంద్ర ప్రభుత్వం చేసిన మోటారు వాహనాల చట్టాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. అగ్నిమాపక పరికరాలు, ఉపకరణాలు ఏర్పాటు చేయలేదు. కానీ తమ విద్యా సంస్థల ట్రస్ట్ తరఫున కొనుగోలు చేసిన ఆ బస్సులను రిజిస్ట్రేషన్ చేయాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక పరికరాలు పొందుపరచలేదని కొందరు అధికారులు చెప్పినా సరే ఆ ప్రజాప్రతినిధి పట్టించుకోలేదు. ‘మా బస్సులను రిజిస్ట్రేషన్ చేయండి.. మిగిలిన విషయాలు ఎత్తొద్దు.. 40 ఏళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్నాం.. మాకు కొత్తగా రూల్స్ చెప్పొద్దు’ అని ఆయన గదమాయించారు. దాంతో రవాణా శాఖ అధికారులు గప్చుప్గా ఆ విద్యా సంస్థ బస్సులకు రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. గడిచిన రెండు రోజుల్లో 17 బస్సులకు రిజిస్ట్రేషన్లు చేసినట్టు సమాచారం. మిగిలిన బస్సులకు కూడా త్వరగా రిజిస్ట్రేషన్లు చేసేయడానికి అధికారులు దస్త్రాలు వేగంగా కదుపుతున్నారని తెలిసింది. -
రేపే ‘సాక్షి’ని మూసేయిస్తా
అనంతపురం క్రైం: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి మరోసారి నోటికి పనిచెప్పారు. బుధవారం మీడియా సమక్షంలో రవాణా శాఖ అధికారులను బెదిరించిన ఆయన.. ఆ వార్తను ప్రచురించిన, ప్రసారం చేసిన ‘సాక్షి’ మీడియాపై గురువారం నోరుపారేసుకున్నారు. సాక్షి ఆఫీసుకు రేపు ఉదయం 10 గంటలకు మూతేయకపోతే చూడండ్రా.. ఎవరూ అడ్డుకోలేరంటూ బెదిరించారు. గురువారం అనంతపురంలోని ఆయన స్వగృహంలో మీడియా సమావేశం పేరిట కొందరు పాత్రికేయులను పిలిపించి సాక్షిపై అక్కసు వెళ్లగక్కారు. ‘వాళ్లని, వీళ్లని కాదు. మిమ్మల్నే (సాక్షి) బెదిరిస్తున్నా. ఏం పీకుతారు’ అంటూ బరితెగించి మాట్లాడారు. బ్రేక్ ఇన్స్పెక్టర్లను కాదు.. నేరుగా మీకే చెబుతున్నా.. సాక్షిని మూతేయిస్తా. నేను బంద్ చేయించేందుకు వస్తే పోలీసులు కూడా అడ్డుకోలేరు’ అంటూ బెదిరింపులకు దిగారు. ‘మీ కార్యాలయంపై దాడి చేస్తే దిక్కొచ్చే వారెవరున్నారు? నోరు మూసుకుని ఉండాలి. దర్బేష్.. నా కొ.. ల్లారా’ అంటూ అసభ్య పదజాలంతో దూషిస్తూ ఊగిపోయారు. ‘ఆయమ్మను బెదిరించాడు.. ఈయమ్మను బెదిరించాడు అన్నారు కదా.. ఇప్పుడు మిమ్మల్నే అంటున్నా.. మీకెవరు దిక్కున్నారు? మీ సీతారామాంజనేయులు, మీ పేర్ని నాని, మా ఎమ్మెల్యే (పెద్దారెడ్డి) వస్తారా? వాళ్లెవరూ రారు. నేను ఎవరికీ భయపడను. అంతకు ముందు కూడా నేను ‘సాక్షి’ ముందే కూర్చున్నా. మీకు వెనకాల, ముందు ఏముంది? నేను అనుకుంటే అనంతపురం సాక్షి ఆఫీసు మూసేయిస్తా’ అంటూ రెచ్చిపోయారు. ‘వాన్నీ.. వీన్ని బెదిరించను. నేరుగా మిమ్మల్నే బెదిరిస్తున్నా. అప్పట్లో మాకు ఎవరూ ప్రొటెక్షన్ రాలేదు. ఈ రోజు మీపైకి వస్తే మీకు అండగా ఎవరూ రారు. మేమొస్తే ఎవడూ అడ్డుకోలేరు. లక్షలాది మంది జనం మీ కార్యాలయంపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మీకు ఎవడూ లేడు. నాకు జన బలం ఉంది’ అంటూ బెదిరించారు. -
నా కొ..ల్లారా.. నరుకుతా..
అనంతపురం క్రైం: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకరరెడ్డి అధికారులపై విరుచుకుపడ్డారు. ‘నా కొ..ల్లారా.. ఒక్కొక్కరినీ నరుకుతా’ అంటూ బుధవారం అనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనే బండబూతులతో చెలరేగిపోయారు. రవాణా శాఖ అధికారులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పాటు తాడిపత్రి మునిసిపల్ అధికారులకు, పోలీసులకు, వైఎస్సార్సీపీ నేతలకు బహిరంగంగానే వారి్నంగ్ ఇచ్చారు. ప్రధానంగా గతంలో రవాణా శాఖ కమిషనర్గా చేసిన ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులుతో పాటు అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, డీటీసీ శివరాంప్రసాద్, మహిళా అధికారిణి అత్తికానాజ్లను దుర్భాషలాడారు. ‘మీరెక్కడ దాక్కున్నా వదలను. గత ప్రభుత్వ హయాంలో నా బస్సులు, లారీలను అన్యాయంగా సీజ్ చేశారు. మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించారు. నన్ను, నా కొడుకును జైలుకు పంపారు. నిబంధనల మేరకే మేము బీఎస్–4 వాహనాలు కొన్నాం. బీఎస్–4 వాహనాలు అమ్మిన వాళ్లదే తప్పు అని సుప్రీం కోర్టు చెప్పింది. పంజాబ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో అమ్మిన వాహనాలను సరెండర్ చేశారు. అక్కడ రిజి్రస్టేషన్ చేసిన అధికారుల ఉద్యోగాలు పోయాయి. ఏపీలో మాత్రం వాహనాలు కొన్న మాపై కేసులు పెట్టారు. జైళ్లకు కూడా పంపారు. అందరిపై ప్రతీకారం తీర్చుకుంటా. సీజ్ చేసిన మా బస్సులు, లారీలన్నీ తుప్పు పట్టిపోయాయి. వాటిని మీరే (అధికారులే) రిపేరు చేయించి తిరిగి రోడ్డుపైకి తేవాలి. ఇందుకు పది రోజులు గడువిస్తున్నా. లేదంటే భార్య, పిల్లలతో కలసి డీటీసీ, ఎస్పీ కార్యాలయాల ముందు నిరాహార దీక్ష చేస్తా. తాడిపత్రి మునిసిపల్ ఆఫీసులో కూడా చాలా ఇబ్బంది పెట్టారు. రేయ్.. కమిషనర్లూ మిమ్మల్ని వదలను. ‘నా కొ..ల్లారా నరికేస్తా. ఏమవుతుంది మీతో’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. అధికారులను దుర్భాషలాడారు. ‘నా ఫ్యామిలీకి 620 ఏళ్ల చరిత్ర ఉంది. నా గడ్డం ఎందుకు వదిలాననుకుంటున్నారు? చంద్రబాబు సీఎం కావాలని వదల్లేదు. ఒక్కో వెంట్రుకకు ఒక్కో కథ ఉంది. అత్తికానాజ్ ఆడదంట.. ఏమ్మా అన్నా వినలేదు. ఇంట్లో తను ఎలా ఉంటుందో తెలుసా?’ అంటూ రాయలేని భాషలో దూషించారు. వైఎస్సార్సీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నానీలను కూడా దూషించారు. బస్సులు, లారీల వ్యవహారం పూర్తిగా తన వ్యక్తిగత సమస్య అని, చంద్రబాబుకు, ఈ ప్రభుత్వానికి సంబంధం లేదని అన్నారు. తాను సొంతంగానే పరిష్కరించుకుంటానన్నారు. అవసరమైతే పార్టీకి కూడా రాజీనామా చేస్తానని చెప్పారు. తాను ఊ అంటే చాలు తనకున్న జనం మరెవరికీ లేరని అన్నారు. -
ఆర్టీఏ 2 శాతం దోపిడీ
సాక్షి, హైదరాబాద్: ఒక వ్యక్తి అప్పటికే ఓ కారును కలిగి ఉండి మరో కారును కొనుగోలు చేసినప్పుడు మాత్రమే 2 శాతం పన్ను రవాణాశాఖకు అదనంగా చెల్లించాలి. అంటే కొత్త వాహనంపై విధించే 18 శాతం పన్నుతో పాటు మొదటి కారుపై 2 శాతం వసూలు చేయాలనేది నిబంధన. కానీ ఆర్టీఏ అధికారులు ద్విచక్రవాహనం ఉన్నప్పటికీ రెండు శాతం పన్ను విధించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం కార్లకే ఆ నిబంధన కానీ.. సాధారణంగా ఒక వ్యక్తికి లేదా ఒక కుటుంబ అవసరాలకు ఒక కారు సరిపోతుందనే భావనతో ఈ అదనపు పన్ను నిబంధనను అప్పట్లో తెరపైకి తెచ్చారు. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ కార్లను కలిగి ఉండడం వల్ల రహదారులపై భారం పెరుగుతుందని, అదనపు వాహనాలపై పన్నులు విధిస్తే ఆ కొనుగోళ్లను ఒకింత తగ్గించాలని భావించి గతంలో రవాణాశాఖ అధికారులు ఆ నిబంధనను అమలు చేస్తూ వచ్చారు. కానీ.. దీన్ని కేవలం కార్లకు మాత్రమే పరిమితం చేయాల్సి ఉండగా.. ద్విచక్ర వాహనాలను కూడా ఈ నిబంధన పరిధిలోకి తేవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ద్విచక్ర వాహనం కలిగిన వ్యక్తి కొత్తగా కారును కొనుగోలు చేస్తే ఆ కారు ధరలో 18 శాతం జీవితకాల పన్నుతో పాటు మరో 2 శాతం అదనంగా చెల్లించాలని పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ద్విచక్ర వాహనంఉన్నవారు కారు కొనుగోలు చేస్తే రూ.వేలల్లో అదనపు పన్ను చెల్లించాల్సివస్తోంది. ఈ అడ్డగోలు నిబంధన వల్ల 2010 నుంచి ఇప్పటి వరకు లక్షలాది మంది నష్టపోయారు. పైగా.. కాలం చెల్లి, తుప్పు పట్టి, వినియోగానికి పనికి రాని వాహనాలపై, చోరీకి గురైన వాహనాలపైనా రవాణాశాఖ నిర్దాక్షిణ్యంగా అదనపు పన్ను వసూళ్లకు పాల్పడడం గమనార్హం. కారు.. బైక్ ఒకటేనా? నలుగురు ప్రయాణం చేసే కారును.. ఇద్దరు మాత్రమే వెళ్లగలిగే బైక్ను ఒకే రకమైన వాహనంగా ముద్రవేసి పన్ను విధించడం వివాదాస్పదమవుతోంది. ‘2010లో రెండో వాహనంపై 2 శాతం అదనపు పన్ను విధించాలనే ప్రతిపాదన వచ్చింది. ఇది కార్లకే పరిమితం చేయాలని నిర్ణయించాం. కానీ నిబంధనల్లో ఈ విషయం స్పష్టంగా లేకపోవడం వల్ల ద్విక్ర వాహనాలకు కూడా అమలవుతోంది’అని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పుకొచ్చారు. ఏపీలో ఎత్తేసినా.. ఇక్కడ మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో అమల్లోకి తెచి్చన రెండు శాతం అదనపు పన్ను నిబంధనను గత ఏపీ ప్రభుత్వం తొలగించింది. ‘రెండో వాహనం’తో నిమిత్తం లేకుండా కొత్త వాహనాలపై 18 శాతం జీవితకాల పన్ను వసూలు చేస్తోంది. 2021లోనే ఈ రెండో వాహనం నిబంధనను తొలగించడంతో లక్షలాది మంది వాహనదారులకు పెద్ద ఎత్తున ఊరటనిచ్చినట్లయింది. మరోవైపు వాహనం శాశ్వత రిజి్రస్టేషన్ కోసం వాహన యజమానులు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా షోరూమ్ల్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించారు. అంటే కొత్తగా బైక్, కారు తదితర వాహనాలను కొనుగోలు చేసిన వారు వాటి నమోదు కోసం ప్రత్యేకంగా ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. నంబర్ ప్లేట్తో సహా షోరూమ్లోనే అన్ని పనులు పూర్తవుతాయి.‘బాదుడు’కథనంపై చర్చ.. ‘బండి ఉన్నా లేకున్నా బాదుడే’అనే శీర్షికన రెండు రోజుల క్రితం ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమైన కథనం రవాణా శాఖలో చర్చకు తెరలేపింది. వినియోగంలో లేని వాహనాలను సైతం రెండో బండిగా పరిగణించి వాహనదారులపై అదనపు భారం మోపడంపై ఈ కథనంలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఒక వాహనదారు తన బండి చోరీకి గురైందని పేర్కొంటూ పోలీసుల ధ్రువీకరణతో సహా ఆర్టీఏకు సమర్పించినప్పటికీ దాన్ని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా అడ్డగోలు నిబంధనలతో అదనపు వడ్డనకు పాల్పడుతున్న వైనాన్ని ఆ కథనంలో ప్రస్తావించడంతో చర్చ జరుగుతోంది. రెండో వాహనం కొనుగోలు చేసినప్పుడు జీవితకాల పన్నుపై మినహాయింపునివ్వాలని, ఈ మేరకు ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. -
‘లైఫ్ ట్యాక్స్’కు ఎగనామం!
గోపాలపట్నం: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, నాలుగు రాష్ట్రాల్లో కంటే ఎక్కువ రాష్ట్రాల్లో కంపెనీలు ఉన్న ప్రయివేటు సంస్థల ఉద్యోగులకు మాత్రమే వర్తించే బీహెచ్ రిజిస్ట్రేషన్ వాహనాల అమ్మకాల్లో పలువురు డీలర్లు మోసాలకు పాల్పడిన ఘటన వెలుగులోకొచ్చింది. ఇటీవల లైఫ్ టాక్స్ కట్టాల్సిన వాహనాల వివరాలు సేకరించే క్రమంలో ఇది బయటపడింది. విశాఖలో వాహనాలు కొనుగోలు చేసి అరుణాచల్ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని లైఫ్ టాక్స్ ఎగ్గొట్టేందుకు చేసిన ప్రయత్నాలు బయటపడ్డాయి. ఇందులో ప్రధానంగా కార్లు ఉన్నాయి.కేంద్ర ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల ఉద్యోగులమంటూ పలువురు ఫేక్ డాక్యుమెంట్లతో కార్లు కొనుగోలు చేసినట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. విశాఖలో 16 మంది కార్ల డీలర్లు 400పైగా కార్లను ఈ విధంగా అమ్మినట్లు తెలుస్తోంది. దీని వల్ల రవాణా శాఖకు సుమారు రూ.4 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. ఈ అమ్మకాల్లో కొన్ని నిజమైనవి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు ఎన్ని జరిగాయో పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అదే అదనుగా.. గతంలో అమ్మకాలపై రవాణా శాఖకు నిరంతరం సమాచారం ఉండేది. కానీ ఇప్పుడు డీలర్ల రిజిస్ట్రేషన్ వల్ల వాటిపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో డీలర్లు ఇష్టానుసారంగా మోసాలకు పాల్పడుతున్నారు. నెలలో ఎన్ని వాహనాలు అమ్ముతున్నారు? ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి? లైఫ్ టాక్స్లు ఎన్ని వస్తున్నాయన్న సమాచారం అధికారులకు ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి మోసాలకు జరుగుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. కాగా, పలు రాష్ట్రాల్లో పని చేసే ఉద్యోగులకు వెసులుబాటు కలిగించేందుకు భారత్ రిజిస్ట్రేషన్ సదుపాయం కలిగించింది.అయితే అందుకు తగిన పత్రాలు అందించాలి. కేంద్ర ప్రభుత్వంలో పని చేస్తూ ఇతర రాష్ట్రాలకు బదిలీపై వెళ్లే వారికి, నాలుగు రాష్ట్రాల్లో కంటే ఎక్కువ రాష్ట్రాల్లో కంపెనీలు ఉన్న ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగులు, బదిలీలపై వెళ్లే వారికి భారత్ రిజిస్ట్రేషన్ వర్తిస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ వాహనాలు ఏ రాష్ట్రంలోనైనా తిరగొచ్చు. రాష్ట్రం మారాక ఆ రాష్ట్రంలో మళ్లీ రిజిస్ట్రేషన్ మార్చుకునే పని ఉండదు. దీని ద్వారా లైఫ్ ట్యాక్స్ తగ్గుతుంది. ఇది అదునుగా చేసుకుని కొందరు డీలర్లు బీహెచ్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు ఇక్కడ వాహనాలను అమ్మి, అరుణాచల్ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. దీంతో ఇక్కడి కొనుగోలు చేసిన వాహనాలకు ఇక్కడి లైఫ్ ట్యాక్స్లు కట్టే పరిస్థితి లేకపోయింది. నలుగురు డీలర్లపై చర్యలు, 10 మందికి నోటీసులు400 కార్ల బీహెచ్ రిజిస్ట్రేషన్పై ఉప రవాణా కమిషనర్ రాజారత్నం చర్యలు తీసుకున్నారు. కొద్ది రోజులుగా బీహెచ్ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టి అందులో జరిగిన అవకతవకలను గుర్తించారు. లైఫ్ ట్యాక్స్లు తగిన స్థాయిలో రాక పోవడం వల్ల అనుమానాలకు దారి తీసిందన్నారు. ఫేక్ ధ్రువపత్రాలతో బీహెచ్ రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు నలుగురు డీలర్ల ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలు ఉండడంతో వీరిపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. మరో 10 మంది డీలర్లకు నోటీసులిచ్చామన్నారు. దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని తెలిపారు. -
కొత్తగా దక్షిణ ‘రింగ్’!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగురోడ్డులో దక్షిణ భాగాన్ని కూడా పూర్తి కొత్తగా నిర్మించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉన్న రోడ్ల అనుసంధానం, విస్తరణ వంటివేమీ లేకుండా.. మొత్తంగా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేగా రూపుదిద్దుకోనుంది. దీనితో ముందు భావించిన దానికన్నా రోడ్డు పొడవు పెరిగి.. 189.4 కిలోమీటర్ల నిడివికి చేరనుంది. సంగారెడ్డి నుంచి ఆమన్గల్ మీదుగా చౌటుప్పల్ వరకు నిర్మితం కానుంది. ఇప్పటికే కన్సల్టెన్సీ సంస్థ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు సమర్పించిన ఈ అలైన్మెంటుకు.. జూన్లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే ఆమోదముద్ర పడే అవకాశం ఉంది. ఆ వెంటనే భూసేకరణ సర్వే పనులు మొదలవుతాయి. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం 158.65 కిలోమీటర్ల రోడ్డుకు ఇప్పటికే భూసేకరణ కూడా జరుగుతోంది. త్వరలోనే దక్షిణ భాగంపై స్పష్టత రానుంది. తొలుత కొన్ని పాతరోడ్లతో కలపాలనుకున్నా.. సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్ నుంచి గజ్వేల్ మీదుగా చౌటుప్పల్ వరకు ఉత్తర భాగానికి కేంద్రం మూడేళ్ల క్రితమే గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఉత్తర భాగాన్ని పూర్తి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేగా నిర్మిస్తున్నారు. దక్షిణ భాగాన్ని మాత్రం ఇప్పటికే ఉన్న కొన్ని పాత రోడ్లను అనుసంధానిస్తూ నిర్మించాలని తొలుత భావించారు. ఉత్తర భాగంలోని ప్రాంతాలతో పోలిస్తే.. దక్షిణ భాగంలోని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు తక్కువగా ఉన్నాయని కేంద్రం గుర్తించింది. అలాంటప్పుడు భారీ వ్యయంతో నాలుగు వరుసల ఎక్స్ప్రెస్వేగా నిర్మించాల్సిన అవసరం ఉందా? అన్న సందేహం వ్యక్తం చేసింది. ఉత్తర భాగాన్ని నాలుగు వరుసల ఎక్స్ప్రెస్వేగా నిర్మించి.. దక్షిణ భాగాన్ని ప్రస్తుత రోడ్ల అనుసంధానంతో సాధారణ హైవేగా నిర్మిస్తే సరిపోతుందని భావించింది. కానీ రింగు రోడ్డుగా పూర్తి రూపం రావాలంటే.. దక్షిణ భాగాన్ని కూడా నాలుగు వరుసల ఎక్స్ప్రెస్ హైవేగా నిర్మించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కోరటంతో.. చివరికి కేంద్రం సరేనంది. ఆలోపే కన్సల్టెన్సీ సంస్థ మూడు అలైన్మెంట్లను రూపొందించింది. అందులో రెండు అలైన్మెంట్లు ప్రస్తుత రోడ్లను అనుసంధానిస్తూ రూపొందించగా.. ఒకదాన్ని పూర్తి కొత్త రోడ్డుగా ప్రతిపాదించారు. ఈ మూడో అలైన్మెంట్నే ఖరారు చేయాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించినట్టు తెలిసింది. ఆ ఒక్క రోడ్డును కలుపుదామనుకున్నా.. షాద్నగర్ నుంచి చేవెళ్ల, శంకర్పల్లి మీదుగా కంది వరకు ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించిన రోడ్డును.. దక్షిణ ‘రింగ్’ అలైన్మెంట్లో భాగం చేయాలని తొలుత భావించారు. కానీ ఆ రోడ్డు కొనసాగే ప్రాంతాల్లో వాణిజ్యపర కార్యక్రమాలు బాగా పెరిగాయి. కొత్తగా జనావాసాలు వేగంగా విస్తరించాయి. భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. అక్కడ భూసేకరణ కూడా కష్టంగా మారింది. దాంతో ఈ రోడ్డును కలపకుండా.. దానికి దూరంగా రూపొందించిన అలైన్మెంట్ వైపే మొగ్గుచూపినట్టు తెలిసింది. దీనితో రోడ్డు ప్రతిపాదిత పొడవు కూడా పెరిగిపోయింది. భారీగా పెరుగుతున్న అంచనా వ్యయం.. రీజనల్ రింగురోడ్డును తొలుత ప్రతిపాదించినప్పుడు మొత్తంగా రూ.19 వేల కోట్లతో పూర్తి చేయవచ్చనే అంచనా వేశారు. కానీ ప్రాజెక్టు జాప్యం అవుతున్న కొద్దీ.. ఆ మార్గం వెంట ఉన్న ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెంది, భూముల ధరలు విపరీతంగా పెరగటంతో ఖర్చు రెట్టింపవుతోంది. ఏడాదిన్నర క్రితం ఉత్తర భాగానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ బడ్జెట్ను ఖరారు చేసింది. ఈ భాగం 158.65 కిలోమీటర్ల నిడివికి రూ.13,200 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. కానీ ప్రక్రియ ముందుకు సాగలేదు. నిర్మాణ పనులు మరో ఏడాది తర్వాత గానీ ప్రారంభమయ్యే సూచనలు కనిపించటం లేదు. అప్పటికి ఉత్తర భాగం వ్యయ అంచనా రూ.16 వేల కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. ఇక తాజాగా అలైన్మెంట్ ఖరారు దశకు చేరిన దక్షిణ భాగానికి నిర్మాణ వ్యయం రూ.18 వేల కోట్లుగా అంచనా వేశారు. జాప్యం జరిగితే ఇది కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. అంటే మొత్తంగా రీజనల్ రింగురోడ్డు నిర్మాణ వ్యయం రూ.35 వేల కోట్లను దాటుతుందని అధికారవర్గాలు అంటున్నాయి. మొత్తం రీజనల్ రింగ్ రోడ్డు లెక్క ఇదీ.. ఉత్తర భాగం 158.65 కిలోమీటర్లు (ఖరారైనది) దక్షిణ భాగం 189.43 కిలోమీటర్లు (అంచనా) మొత్తం పొడవు 348.08 కిలోమీటర్లు (అంచనా) సేకరించే భూమి సుమారు 4,500 హెక్టార్లు భూసేకరణ వ్యయం అంచనా రూ.14,500 కోట్లు (భూముల ధరలు పెరిగేకొద్దీ మారుతుంది) నిర్మాణ పనులకు అయ్యే వ్యయ అంచనా రూ.19,500 కోట్లు (జాప్యం జరిగినకొద్దీ పెరిగే అవకాశం ఉంది) -
చెక్ పోస్టుల వద్ద అవినీతికి అడ్డుకట్ట
సాక్షి, అమరావతి: ‘సరుకు రవాణా వాహనాలు రాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవేశిస్తే చాలు.. అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద నిలపాలి.. అనుమతులు తీసుకోవాలి.. అందుకోసం లంచాలు ఇవ్వాలి’. ఇదీ దశాబ్దాలుగా సరిహద్దుల్లో కనిపించే సాధారణ దృశ్యం. ఇటువంటివాటికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద లంచాల బెడదను శాశ్వతంగా నిర్మూలించింది. రవాణా శాఖ అందించే అన్ని రకాల సేవలు, అనుమతుల జారీని ఆన్లైన్ విధానంలోకి మార్చింది. అంతేకాదు రాష్ట్రంలోని 15 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను శాశ్వతంగా తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. అనుమతులన్నీ ఆన్లైన్లోనే.. రాష్ట్రంలో దశాబ్దాల నుంచి 15 రవాణా శాఖ చెక్ పోస్టులున్నాయి. వాటిలో 13 రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నాయి. మిగిలిన రెండింటిలో ఒకటి తిరుపతి జిల్లా రేణిగుంటలోనూ, మరొకటి కాకినాడ జిల్లా తేటగుంటలోను ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి ప్రవేశించే వాహనాల నుంచి పన్ను వసూలు, తాత్కాలిక పర్మిట్ జారీలతోపాటు మోటారు వాహనాల చట్టం ఉల్లంఘనలను అరికట్టేందుకు వీటిని ఏర్పాటు చేశారు. ఈ అనుమతుల జారీ పేరుతో అక్కడి సిబ్బంది లంచాలు డిమాండ్ చేయడం సర్వసాధారణంగా మారింది. దీంతో ఈ విధానాన్ని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద అందించే సేవలు, అనుమతులను గతేడాది జూలై నుంచి ఆన్లైన్ ద్వారా జారీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టడంతో రవాణా శాఖ కార్యాలయాలు, అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్దకు వచ్చే వాహనదారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. సులభంగా, పారదర్శకంగా అనుమతులు జారీ అవుతున్నాయి. ఆన్లైన్ విధానం లేని 2022–23లో వివిధ అనుమతుల జారీ కింద మొత్తం రూ.51.64 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టాక 2023 జూలై నుంచి 2024 ఫిబ్రవరి వరకు వివిధ అనుమతుల జారీ కింద రూ.62.82 కోట్లు రావడం గమనార్హం. గతంలో అధికారిక అనుమతులు లేకుండా లంచాలు తీసుకుని మరీ వాహనాల ప్రవేశానికి అనుమతించేవారన్నది స్పష్టమవుతోంది. ఆన్లైన్ విధానం సరుకు రవాణా వాహనదారులకు సౌలభ్యంగా ఉండటంతోపాటు ప్రభుత్వ ఖజానాకు రాబడిని పెంచింది. ప్రయోజనాలు ఇవీ... ♦ సరుకు రవాణా వాహనాలను ఇక రాష్ట్ర సరిహద్దుల్లో అనుమతుల కోసం నిలపాల్సిన అవసరం లేదు. దీంతో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ♦ ప్రస్తుతం సరుకు రవాణా వాహనాలు సగటున గంటకు 35 కి.మీ.మేర ప్రయాణిస్తున్నాయి. అంతర్రాష్ట్ర చెక్పోస్టులు తొలగించడంతో సగటున గంటకు 55 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి. ♦ ప్రస్తుతం దేశంలో సరుకు రవాణా వాహనాలు రోజుకు సగటున 360 కి.మీ. ప్రయాణిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో రోజుకు సగటున 1,200 కి.మీ. ప్రయాణిస్తున్నాయి. ప్రస్తుతం అంతర్రాష్ట్ర చెక్పోస్టులు తొలగించడంతో రాష్ట్రంలో రోజుకు సగటున 550 కి.మీ. దూరం ప్రయాణించేందుకు అవకాశం కలుగుతుంది. దీంతో త్వరగా గమ్యస్థానానికి చేరుకోవడంతోపాటు సరుకు రవాణా వ్యయం తగ్గుతుంది. -
ఏడుగురు డీటీసీలను బదిలీ చేసిన ప్రభుత్వం
-
రవాణా శాఖ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఆదాయానికి మించి ఆస్తులు?
కర్నూలు: రవాణా శాఖ నంద్యాల కార్యాలయ పరిపాలన అధికారి(ఏఓ) సువర్ణ కుమారి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకకాలంలో ఆరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. కర్నూలు కేంద్రీయ విద్యాలయానికి ఎదురుగా ఉన్న ధనలక్ష్మి నగర్లో ఆమె నివాసం ఉంటున్నారు. ఈమె సోదరుడు వరప్రసాద్ హైదరాబాద్, చెల్లెలు సుభాషిణి కర్నూలులోని రాగమయూరి, మరో సోదరి మార్కాపురంలో నివసిస్తున్నారు. వీరి ఇళ్లతో పాటు నంద్యాల ఆఫీసు, బనగానపల్లె (ఆర్టీఓ ఏజెంట్ రాజేంద్ర) ఇంట్లో ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి గురువారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి నేతృత్వంలో సీఐలు తేజేశ్వరరావు, కృష్ణారెడ్డి, వంశీనాథ్, శ్రీనివాసరెడ్డి, ఇంతియాజ్, అపర్ణ, కృష్ణయ్య తదితరులు తనిఖీల్లో పాల్గొన్నారు. ఆమె నివాసముంటున్న ఇంట్లో దాదాపు రూ.10 లక్షల నగదు, 15 బ్యాంకు ఖాతాలు, భారీగా బంగారు, వెండి ఆభరణాలు బయటపడ్డాయి. ధనలక్ష్మి నగర్లో జి 1 ఇంటితో పాటు కర్నూలు ఆంధ్రా బ్యాంకులో లాకర్, ఆరు ప్రాంతాల్లో విలువైన ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. 2005లో రవాణా శాఖలో ఈమె స్టెనోగా విధుల్లో చేరారు. ఎక్కువ కాలం కర్నూలు డీటీసీ కార్యాలయంలో పనిచేశారు. ఈమెకు ఉన్న ఆస్తులు సక్రమమైనవా, అక్రమంగా సంపాదించారా అనే కోణంలో అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. శుక్రవారం కూడా తనిఖీలు కొనసాగే అవకాశం ఉన్నట్లు డీఎస్పీ వెంకటాద్రి తెలిపారు. -
కార్ల అమ్మకాలు రయ్ రయ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, ఆటోల విక్రయాల్లోనూ వృద్ధి నెలకొంది. తద్వారా గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు పోల్చి చూస్తే.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో రవాణా రంగం ద్వారా వచ్చే ఆదాయంలో 8.40 శాతం వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారీగా తగ్గగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు చూస్తే జాతీయ సగటును మించి రాష్ట్రంలో వృద్ధి చోటు చేసుకుంది. అలాగే ఇదే కాలానికి జాతీయ సగటును మించి రాష్ట్రంలో కార్ల విక్రయాల్లో వృద్ధి నమోదైంది. ఇక ఆటోల అమ్మకాల్లో ఏకంగా 795.28 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు రవాణా ఆదాయం రూ.1,448.35 కోట్లు రాగా ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.1,570.07 కోట్లు ఆదాయం వచ్చింది. ఇక దేశవ్యాప్తంగా గూడ్స్ వాహనాల అమ్మకాలు పడిపోగా రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇతర రాష్ట్రాల్లో విధానాలపై అధ్యయనం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రవాణా రంగం ద్వారా ఆదాయం పెంచుకోవడానికి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో బాగుంటే వాటిని రాష్ట్రంలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. వాహనాల పన్నుల విషయంలో కొత్త విధానాలను అన్వేíÙస్తున్నాం. కొనుగోలుదారులను ప్రోత్సహించేలా సంస్కరణలపై దృష్టి సారించాం. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ద్విచక్ర వాహనాలతో పాటు కార్ల కొనుగోళ్లు పెరిగాయి. రవాణా ఆదాయంలోనూ వృద్ధి నమోదవుతోంది. – ప్రసాదరావు, అదనపు కమిషనర్, రవాణా శాఖ -
బస్సు నడిపిన పువ్వాడ..
ఇల్లెందు: రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కాసేపు ఆర్టీసీ బస్సు డ్రైవర్గా మారారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్ డిపోను మంత్రి ప్రారంభించారు. అనంతరం డ్రైవర్ సీట్లో కూర్చుని బస్సును కాసేపు నడిపారు. అంతకుముందు జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం ఖమ్మం సభలో రైతుల గురించి మాట్లాడారని, ఆయనకు ఆ అర్హత లేదన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల రైతులు దేశ రాజధానిలో ఎన్నో రోజులు ఆందోళన చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, అలాంటి వారు రైతుల గురించి మాట్లాడడమా? అని ప్రశ్నించారు. ఆ ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఇక డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్లు, ఆర్సీ కార్డులు
సాక్షి, అమరావతి: ఇక నుంచి పేపర్ డ్రైవింగ్ లైసెన్స్లు, పేపర్ ఆర్సీ కార్డులుండవు. పేపర్ రహిత డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్లు, డిజిటల్ ఆర్సీ కార్డుల దిశగా రాష్ట్ర రవాణా శాఖ ముందడుగు వేసింది. డ్రైవింగ్ లైసెన్స్లు, ఆర్సీ కార్డులను ప్రింట్ చేసి జారీ చేసే పాత విధానానికి స్వస్తి పలికింది. దేశంలోనే తొలిసారిగా డిజిటల్ కార్డుల జారీ విధానానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా రవాణా శాఖ కీలక విధాన నిర్ణయం తీసుకుంది. డిజి లాకర్ /ఎం–పరివాహన్లోఇవి అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో దశాబ్దాలుగా రవాణా శాఖ ప్రింటింగ్ డ్రైవింగ్ లైసెన్స్లు, ఆర్సీ కార్డులను అందిస్తోంది. ఇందుకోసం దరఖాస్తుతో పాటు ఒక్కో కార్డుకు రూ.200 ఫీజు, రూ.35 పోస్టల్ చార్జీలు వసూలు చేస్తోంది. అయితే ఈ విధానానికి శుక్రవారం నుంచి రవాణా శాఖ ముగింపు పలికింది. దాదాపు ఏడాదిగా పెండింగ్లో ఉన్న 25 లక్షలకు పైగా డ్రైవింగ్ లైసెన్స్లు, ఆర్సీ కార్డులను ప్రింటింగ్లో జారీ చేస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం ఇటీవలే రూ.33.39 కోట్లు కేటాయించింది. ఇక శనివారం నుంచి డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్లు, డిజిటల్ ఆర్సీ కార్డుల విధానం అమల్లోకి రానుంది. ఇక నుంచి దరఖాస్తుతో కార్డు కోసం రూ.200, పోస్టల్ చార్జీలకు రూ.35 వసూలు చేయరు. దరఖాస్తులను పరిశీలించి తగిన ప్రక్రియ అనంతరం డిజిటల్ విధానంలోనే వీటిని జారీ చేస్తారు. ప్రత్యేకంగా ఎం–పరివాహన్, డిజి లాకర్లో అందుబాటులో ఉంచుతారు. వాహనదారులు, దరఖాస్తుదారులు వాటిని డౌన్లోడ్ చేసుకుని తమ మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉంచుకోవాలి. ఎక్కడైనా ట్రాఫిక్ పోలీస్, రవాణా శాఖ అధికారులు అడిగితే ఆ డిజిటల్ ఫార్మాట్లో ఉన్న కార్డులను చూపితే సరిపోతుంది. మొబైల్ ఫోన్లు వాడనివారు ఆ కార్డులను ప్రింట్ తీసుకుని కూడా తమతో ఉంచుకోవచ్చు. వాటిని చూపినా అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు. ఇక నుంచి రవాణా శాఖ జారీ చేసే అన్ని డ్రైవింగ్ లైసెన్స్లు, ఆర్సీ కార్డులను ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంచుతారు. వాహనదారులకు సౌలభ్యం డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్లు, డిజిటల్ ఆర్సీ కార్డుల జారీ విధానం వాహనదారులకు సౌలభ్యంగా ఉంటుంది. వారి నుంచి కార్డుల కోసం ఫీజులు కూడా వసూలు చేయం. అవసరమైన అన్ని కార్డులు డిజిలాకర్ విధానంలో మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉంచుకుంటే చాలు. – ఎంకే సిన్హా, రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ -
నికర ఇన్వాయిస్ ధరను బట్టే లైఫ్ ట్యాక్స్
సాక్షి, అమరావతి: మోటారు కార్ల కొనుగోలు సమయంలో విధించే జీవితకాల పన్ను (లైఫ్ ట్యాక్స్).. వాహన నికర ఇన్వాయిస్ ధర (పన్నులు కలపక ముందు నిర్ణయించిన ధర) ఆధారంగానే ఉండాలని హైకోర్టు తెలిపింది. అంతేకానీ.. వాహన ఎక్స్ షోరూమ్ ధర (పన్నులన్నీ కలిపి నిర్ణయించిన ధర) ఆధారంగా కాదని స్పష్టం చేసింది. ఏపీ మోటారు వాహనాల ట్యాక్సేషన్ చట్టంలోని 6వ షెడ్యూల్ ప్రకారం లైఫ్ ట్యాక్స్ను వాహన ధర ఆధారంగానే వసూలు చేయాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. ఇద్దరు వాహనదారుల నుంచి అధికంగా వసూలు చేసిన లైఫ్ ట్యాక్స్ మొత్తాన్ని నాలుగు వారాల్లో వారికి వాపసు ఇవ్వాలని రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వడ్డిబోయన సుజాత ఇటీవల కీలక తీర్పు వెలువరించారు. తాను కొనుగోలు చేసిన హ్యుందాయ్ వెన్యూ కారుకు వాహన ధర మీద కాకుండా నికర ఇన్వాయిస్ ధర మీద 14 శాతం పన్నును చట్టవిరుద్ధంగా వసూలు చేశారని విజయవాడకు చెందిన తలశిల సౌజన్య 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన నుంచి అదనంగా వసూలు చేసిన రూ.52,168 తిరిగి వాపసు ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని విన్నవించారు. అలాగే ఇదే రీతిలో తన నుంచి అదనంగా వసూలు చేసిన రూ.1.16 లక్షలను వాపసు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ విజయవాడకు చెందిన వల్లూరు పవన్ చంద్ 2021లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ సుజాత ఇటీవల తుది విచారణ జరిపారు. వాహన ధరపైనే లైఫ్ ట్యాక్స్.. రవాణా శాఖ తరఫు న్యాయవాది కోనపల్లి నర్సిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. లైఫ్ ట్యాక్స్ను వాహన ధరపైనే నిర్ణయిస్తారన్నారు. వాహన ధర అంటే డీలర్కు వాహన కొనుగోలుదారు చెల్లించే మొత్తమని.. ఇందులో జీఎస్టీ, సెస్ వంటివి కలిపి ఉంటాయని తెలిపారు. అందువల్ల పన్నులు కలిపిన మొత్తం మీదనే లైఫ్ ట్యాక్స్ విధించామన్నారు. ఇలా చేయడం ఎంత మాత్రం చట్టవిరుద్ధం కాదన్నారు. అంతేకాకుండా 1994లో రవాణా శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం వాహన ధర అంటే అన్ని పన్నులతో కలిపి చెల్లించే మొత్తమన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్ల తరఫు న్యాయవాది చక్రవర్తి వాదనలతో ఏకీభవించారు. లైఫ్ ట్యాక్స్ను వాహన నికర ఇన్వాయిస్ ధర ఆధారంగానే వసూలు చేయాలని తేల్చిచెప్పారు. ఎక్స్షోరూం ధర వాహన ధర కాదు.. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎమ్మార్కే చక్రవర్తి వాదనలు వినిపిస్తూ.. వాహన ధర అంటే వాహనదారు డీలర్కు చెల్లించే మొత్తమన్నారు. ఈ ధర ఆధారంగానే డీలర్.. వాహనదారుకు వాహనాన్ని బదలాయిస్తారని తెలిపారు. అంతేతప్ప పన్నులన్నింటితో కలిపి చెల్లించే ఎక్స్ షోరూం ధర ఎంతమాత్రం వాహన ధర కాదన్నారు. హ్యుందాయ్ వెన్యూ ఇన్వాయిస్ ధర రూ.8,60,853 అని తెలిపారు. నిబంధనల ప్రకారం.. రూ.10 లక్షలకన్నా తక్కువ విలువ చేసే వాహనానికి 12 శాతం మాత్రమే లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీని ప్రకారం రూ.8.60 లక్షలకు 12 శాతం లెక్కన రూ.1,03,302 లైఫ్ ట్యాక్స్ చెల్లిస్తే సరిపోతుందని నివేదించారు. అయితే రిజిస్ట్రేషన్ సమయంలో ఎక్స్షోరూం ధరను రూ.11,10,500గా పేర్కొంటూ.. వాహన ధర రూ.10 లక్షలకు మించింది కాబట్టి 14 శాతం పన్ను చెల్లించాలని పిటిషనర్తో బలవంతంగా రూ.1,55,470ను లైఫ్ ట్యాక్గా కట్టించుకున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. తద్వారా రూ.52168 అదనంగా వసూలు చేశారన్నారు. అలాగే రెండో పిటిషనర్ వల్లూరు పవన్ చంద్కు చెందిన బీఎండబ్ల్యూ కారు విషయంలో కూడా ఇలాగే జరిగిందన్నారు. ఇన్వాయిస్ ధరపై కాకుండా ఎక్స్షోరూమ్ ధరపై 14 శాతం పన్ను వసూలు చేశారని తెలిపారు. ఇలా పవన్ చంద్ నుంచి రూ.1.16 లక్షలు అదనంగా పన్ను కట్టించుకున్నారని వివరించారు. -
అవినీతికి తావివ్వద్దు
పౌరులకు సేవలు అందించడంలో అత్యంత పారదర్శకత ఉండాలి. అవినీతిపై ఎవరికి ఫిర్యాదు చేయాలన్న దానిపై ఏసీబీ నంబర్లను ఆయా కార్యాలయాల్లో ప్రముఖంగా కనిపించేలా హోర్డింగ్స్ తరహాలో ప్రదర్శించాలి. మానవ ప్రమేయాన్ని తగ్గించి, పారదర్శకతను పెంచే సాంకేతిక విధానాలపై అధ్యయనం చేసి.. వాటిని అమల్లోకి తీసుకు రావడంపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. అప్పుడే ప్రజలకు సత్వరం మంచి సేవలు అందుతాయి. ఉద్యోగుల్లో సమర్థత పెరగడంతోపాటు ప్రభుత్వానికి ఆదాయమూ పెరుగుతుంది. వచ్చే సమీక్షా సమావేశం నాటికి మంచి మార్పులు కనిపించాలి. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: ఏ ప్రభుత్వ శాఖ లోనూ అవినీతికి తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రిజిస్ట్రేషన్లు, టౌన్ ప్లానింగ్ విభాగాలు, మండల కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాలు సహా అన్ని చోట్ల కూడా అవినీతికి ఆస్కారం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అవినీతి నిరోధక శాఖను మరింత క్రియాశీలకంగా ఉంచాలని సూచించారు. ఆదాయార్జన శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆదాయాలనుఆర్జించే శాఖల యంత్రాంగంలో మెరుగైన విధానాలు అమలు చేయడం ద్వారా సమర్థత పెంచాలని ఆదేశించారు. మానవ ప్రమేయాన్ని తగ్గించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలందించే విధానాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పారు. తద్వారా లీకేజీలు అరికట్టడమే కాకుండా పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యంగా చక్కటి సేవలు అందుతాయని, ఆదాయాలు పెరుగుతాయని తెలిపారు. వీటన్నింటిపై అధ్యయనం చేసి, వచ్చే సమీక్షా సమావేశంలో తనకు నివేదించాలన్నారు. డ్రగ్స్, మత్తు పదార్థాలను నివారించడానికి, వాటి పంపిణీని అడ్డుకోవడానికి అధికారులు మరింతగా దృష్టి సారించాలని చెప్పారు. ఇందులో భాగంగా యూనివర్సిటీలు, కాలేజీలు, విద్యా సంస్థల వద్ద కచ్చితంగా టోల్ ఫ్రీ నంబర్ ఉండేలా హోర్డింగ్స్ ఉంచాలని, డ్రగ్స్ నివారణ కార్యక్రమాలు, టోల్ ఫ్రీ నంబర్ పనితీరుపై ప్రతి జిల్లాలో ప్రతి 15 రోజులకోసారి మాక్ డ్రిల్ చేపట్టాలని ఆదేశించారు. రవాణా శాఖలో మెరుగైన విధానాలు తీసుకు వచ్చేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పారు. ఈ సందర్భంగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎంత మేర లక్ష్యాలు చేరుకున్నామనే విషయాన్ని, ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్ధేశించుకున్న లక్ష్యాలను వివిధ శాఖలకు చెందిన అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయంలో వృద్ధి ♦ గత ఏడాదితో పోలిస్తే వాణిజ్య పన్నుల ఆదాయ వృద్ధిలో ఏపీ మెరుగైన పనితీరు కనపరిచిందని ఆ శాఖ అధికారులు తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్రల కంటే మెరుగైన స్థానంలో ఏపీ ఉందన్నారు. కర్ణాటకలో 27.51 శాతం, మహారాష్ట్రలో 24.4 శాతం, ఆంధ్రప్రదేశ్లో 25.29 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు. ♦ 2022–23లో రాష్ట్రంలో వాణిజ్య పన్నుల ఆదాయం రూ.51,481 కోట్లుగా 93.24 శాతం లక్ష్యాన్ని చేరుకుందని, ఈ ఆర్థిక సంవత్సరంలో (2023–24) రూ.60,191 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ♦ లీకేజీలను అరికట్టి, సమగ్ర పర్యవేక్షణ ద్వారా లక్ష్యాన్ని చేరుకునే మార్గాలపై దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు డేటా అనలిటిక్స్, ఆటోమేషన్, శాఖలతో సమన్వయం, ఎగవేతల పట్ల అప్రమత్తత, సమర్థతను పెంచుకునే పద్ధతుల ద్వారా పని తీరును మెరుగు పరుచుకుంటున్నామన్నారు. ♦ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం వృద్ధి చెందినట్టుగా ఆ శాఖ అధికారులు తెలిపారు. ఏడాదికేడాది స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరుగుతూ వస్తోందన్నారు. 2018–19లో ఈ శాఖ ఆదాయం రూ.4,725 కోట్లు కాగా, 202–223 నాటికి రూ.8071 కోట్లకు చేరిందని తెలిపారు. గనుల ఆదాయంలో 26 శాతం వృద్ధి ♦ గత ఏడాదితో పోల్చితే గనుల ఆదాయంలో 26 శాతం వృద్ధి నమోదైనట్లు అధికారులు వివరించారు. గనులు ఖనిజాల శాఖలో 2022–23లో రూ.4,500 కోట్లు లక్ష్యం కాగా, రూ.4,756 కోట్ల ఆదాయం వచ్చిందని, ఈ ఆర్థిక ఏడాది రూ.6 వేల కోట్ల మేరకు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. తగ్గిన లిక్కర్, బీరు వినియోగం 2018–19తో పోలిస్తే 2022–23లో లిక్కర్, బీరు వినియోగం 12.61 శాతం తగ్గుముఖం. 2018–19లో 384.3 లక్షల కేసుల లిక్కర్ వినియోగం. 2022–2౩లో 335.9 లక్షల కేసుల లిక్కర్ వినియోగం. 2018–19లో 277.1 లక్షల కేసుల బీరు వినియోగం. 2022–23లో 116.7 లక్షల కేసులు బీరు వినియోగం. 2018–19తో పోలిస్తే 2022–23లో 57.87 శాతం తక్కువగా బీరు వినియోగం. ♦ రవాణా శాఖలో 2022–23లో ఆదాయం రూ.4,294.12 కోట్లు వచ్చిందని, తద్వారా 95.42 శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. 2018–19లో రూ.3,224.98 కోట్ల ఆదాయం ఉండగా, 2023–24 లో రూ.6,999.42 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ♦ ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం (ఎక్సైజ్) నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, స్పెషల్ సీఎస్లు నీరబ్కుమార్ ప్రసాద్, రజత్ భార్గవ, భూగర్భ గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్కుమార్ గుప్తా, రవాణా శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, పీసీసీఎఫ్ వై.మధుసూదన్రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి గుల్జార్, రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, పురపాలక శాఖ కమిషనర్ కోటేశ్వరరావు, స్టాంప్, రిజిస్ట్రేషన్స్ కమిషనర్ రామకృష్ణ, సేల్స్ టాక్స్ స్పెషల్ కమిషనర్ అభిషిక్త్ కిషోర్, అడిషనల్ డీజీలు ఎన్.సంజయ్, రవిశంకర్ అయ్యన్నార్, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, మైన్స్ డైరెక్టర్ వి.జి.వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
స్క్రాప్గా మార్చి.. కొత్త ఆటోలు తెచ్చి..!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో కాలంచెల్లిన ఆటోరిక్షాలను స్క్రాప్గా మార్చి ఆ పర్మిట్లపై కొత్త ఆటోలను తీసుకొనే విధానంపై ప్రస్తుతం కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తేసేందుకు రవాణాశాఖ సిద్ధమైంది. పాత పర్మిట్లపై కొత్త ఆటోలు పొందే విషయంలో భారీ అక్రమాలు జరిగాయంటూ గతంలో ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆ విధానం అమలును నిలిపివేస్తూ గతేడాది డిసెంబర్లో రవాణాశాఖ సర్క్యులర్ జారీ చేసింది. కానీ ఇప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలతో మళ్లీ పాత పద్ధతిని అమల్లోకి తెస్తున్నట్లు మరో ఆదేశాన్ని జారీచేసి దాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. వేలల్లో అక్రమాలు... కాలంచెల్లిన ఆటో రిక్షాలను తుక్కుగా మార్చి ఆ పర్మిట్ల ఆధారంగా కొత్త ఆటోలు తీసుకొనే పద్ధతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విధాన నిర్ణయాన్ని తీసుకోకపోవడాన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేటు బ్రోకర్లు, రవాణా శాఖ అధికారుల అండదండలతో భారీ అక్రమాలకు తెరలేపారన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నిజానికి తుక్కుగా మార్చిన ఆటోరిక్షా ఛాసిస్ను మూడు ముక్కలు చేయాల్సి ఉంటుంది. కానీ దాన్ని తుక్కుగా మార్చినట్లు రికార్డుల్లో చూపుతూ తక్కువ ధరలకు ఆ ఆటోను మరొకరికి విక్రయించే వారన్నది ఆరోపణ. అటు పాత ఆటో పర్మిట్ లేకుండా తిరుగుతుండగా దాని పర్మిట్తో మరో కొత్త ఆటో రోడ్డెక్కేదని ఫిర్యాదుల సారాంశం. అలా దాదాపు 8 వేల వరకు ఆటోలు అక్రమంగా తిరుగుతున్నాయంటూ కొన్ని ఆటో సంఘాలు కూడా ఫిర్యాదు చేశాయి. ఆ ఫిర్యాదుల ఒత్తిడితో అధికారులు ఆ పద్ధతిని నిలిపేశారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన స్క్రాప్ పాలసీని అమలులోకి తెస్తామంటూ అప్పట్లో అధికారులు చెప్పారని యూనియన్ నేతలు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఆ విధానమంటూ లేకుండానే పాత పద్ధతిని పునరుద్ధరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో వేల సంఖ్యలో ఆటోరిక్షాలు అక్రమంగా తిరిగేందుకు అవకాశం కల్పించిన అధికారులపై చర్యలు తీసుకోకుండా పాత పద్ధతిని పునరుద్ధరిస్తున్నారంటూ ఆటోరిక్షా యూనియన్ నేత దయానంద్ తాజాగా లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. అయితే ‘పాత పద్ధతినే పునరుద్ధరిస్తున్నప్పటికీ తుక్కుగా మార్చిన ఆటోరిక్షా ఫొటోలను తీయాలని, ఆటో ఛాసీస్ను మూడు ముక్కలు చేయాలని, ఆ వివరాలు పొందుపరచాలని నిబంధన లు విధించాము, వాటిని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశాము’ అంటూ ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. -
సిబిల్ స్కోర్ తరహాలోనే.. డ్రైవింగ్కూ స్కోర్! కేంద్రం కీలక నిర్ణయం?
సిబిల్ స్కోర్ తరహాలోనే డ్రైవింగ్కూ స్కోరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే బ్యాంకులు అంత సులువుగా రుణాలు ఇస్తాయి. అలాగే డ్రైవింగ్ స్కోర్ ఎక్కువ ఉంటే వాహనాల బీమా, కొత్త వాహనాల కొనుగోలులో రాయితీ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. రహదారి భద్రతలో భాగంగా కేంద్రం ఈ వినూత్న విధానాన్ని తెరపైకి తెచ్చింది. త్వరలోనే దీనిని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించింది. – సాక్షి, అమరావతి ప్రమాదాలను తగ్గించేలా.. దేశంలో రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదిక ప్రకారం 2021లో దేశంలో 4.12 లక్షల రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 1.53 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 3.84 లక్షల మంది గాయపడ్డారు. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే 70 శాతం ప్రమాదాలు జరిగాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రహదారి భద్రత లక్ష్యాలు సాధించాలంటే డ్రైవర్లకు తగిన అవగాహన కల్పించడం.. వారిని నియంత్రించడం ప్రధానమని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ క్రమశిక్షణను ఎప్పటికప్పుడు అంచనా వేసే వ్యవస్థను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. ‘రహదారి భద్రతా ప్రణాళిక 2.0’ కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. దేశంలో డ్రైవింగ్ లైసెన్సు ఉన్న వారంతా దీని పరిధిలోకి వస్తారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర భారీ వాహనాల డ్రైవర్ల క్రమశిక్షణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ట్రాఫిక్ పోలీసులు విధించిన చలానాలు, రోడ్డు ప్రమాదాలకు కారణమైన సందర్భాలు, పోలీసులు నమోదు చేసిన కేసులు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటారు. వాటి ఆధారంగా డ్రైవింగ్ క్రమశిక్షణకు స్కోర్ ఇస్తారు. స్కోర్ ఆధారంగా ప్రోత్సాహకాలు డ్రైవింగ్ క్రమశిక్షణ స్కోర్ బాగున్నవారికి వాహన బీమాలో రాయితీలిస్తారు. స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే బీమా ప్రీమియం అంత తక్కువగా ఉంటుంది. అలాగే కొత్త వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా ధరలో రాయితీ ఇస్తారు. వీటిపై కేంద్ర రవాణా శాఖ వాహనాల తయారీ కంపెనీలు, బీమా కంపెనీలతో చర్చలు జరుపుతోంది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని ఢిల్లీలో అమలు చేయాలని భావిస్తున్నారు. లోటుపాట్లను సరిదిద్దుకుని 2025 నాటికి దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఏడీఏఎస్ ఏర్పాటు.. రెండో దశలో కార్లు, ఎస్యూవీలు, ఇతర భారీ వాహనాల్లో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం(ఏడీఏఎస్)ను ఏర్పాటు చేస్తారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసేటప్పుడే ఏడీఏఎస్ వ్యవస్థ కోసం కాస్త అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే కొనుగోలు చేసిన వాహనాల యజమానులు కూడా ఏడీఏఎస్ను తమ వాహనాల్లో ఏర్పాటు చేసుకోవాలి. ఇది డ్రైవర్ నావిగేషన్కు సహకరిస్తుంది. అలాగే డ్రైవింగ్ సీటులో ఎవరు ఉన్నారో రికార్డు చేస్తుంది. తద్వారా క్రమశిక్షణారహితంగా వాహనం నడిపినప్పుడు, ప్రమాదానికి గురైనప్పుడు ఎవరు డ్రైవింగ్ చేస్తున్నారన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఏడీఏఎస్ను ఇప్పటికే విద్యుత్ వాహనాల్లో ప్రవేశపెట్టారు. త్వరలో పెట్రోల్, డీజీల్ వాహనాల్లో కూడా ఏర్పాటు చేయనున్నారు. ఏడీఏఎస్ సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని డ్రైవింగ్ క్రమశిక్షణ స్కోర్ను నిర్ణయిస్తారు. -
వాహనాల ఫ్యాన్సీ నంబర్లకు భలే క్రేజ్.. ఒక్కరోజే 31 లక్షల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: వాహనాల ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్ పెరిగింది. వాహనదారులకు ఇష్టమైన నంబర్తో పాటు, లక్కీ నంబర్, పుట్టిన తేదీ, కలిసి వచ్చే నంబర్తో గుర్తింపు దక్కాలని చూస్తున్నారు. లక్షల రూపాయలు పెట్టి తమకు కావాల్సిన నంబర్లను వేలం ద్వారా దక్కించుకుంటున్నారు. సాధార ణంగా వాహనాల రిజిస్ట్రేషన్ల ద్వారా రవాణా శాఖకు ఏటా కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంటే.. ఫాన్సీ నంబర్ల ద్వారా అదనపు ఆదాయం వస్తుంది. తాజాగా ఆర్టీఏ ప్రత్యేక నెంబర్లపై వాహనదారులు మరోసారి తమ క్రేజ్ను చాటుకున్నారు. ప్రతి సిరీస్లో ఎంతో డిమాండ్ ఉండే ఆల్నైన్ ఈసారి కూడా అ‘ధర’హో అనిపించింది. శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ప్రత్యేక నెంబర్లకు నిర్వహించిన ఆన్లైన్ వేలంలో ‘టీఎస్ 09 ఎఫ్జడ్ 9999’ నెంబర్కు ప్రీమియర్ ఇన్ఫోసిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ రూ.9,50,999 చెల్లించి సొంతం చేసుకుంది. అలాగే ‘టీఎస్ 09 జీఏ 0001’ నెంబర్ కోసం రాజేశ్వరి స్కిన్ అండ్ ఎయిర్క్యూర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆన్లైన్ వేలంలో రూ.7,25,199 చెల్లించి సొంతం చేసుకుంది. ‘టీఎస్09 జీఏ 0009’ నెంబర్ కోసం ఎం.వెంకట్రావు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2.20,111 చెలించింది. ‘టీఎస్09 జీఏ 0007’ నెంబర్ కోసం స్నేహ కైనెటిక్ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,35,007 చెల్లించి నెంబర్ను దక్కించుకుంది. ‘టీఎస్ 09 జీఏ 0003’ నెంబర్ కోసం ధని కన్సల్టేషన్స్ ఎల్ఎల్పీ రూ.1,35,000 చెల్లించి సొంతం చేసుకుంది. ప్రత్యేక నెంబర్లపైన శుక్రవారం ఒక్క రోజే రూ.31,66,464 లభించినట్లు హైదరాబాద్ జేటీసీ పాండురంగ్నాయక్ తెలిపారు. -
త్వరలో ఆర్టీసీ ‘జీవా’జలం!
సాక్షి, హైదరాబాద్: సొంతంగా మంచినీటిని తయారు చేసి బస్టాండ్లలో విక్రయించడంతోపాటు మార్కెట్లోకి కూడా విడుదల చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఆకట్టుకునే రీతిలో మంచినీటి సీసా డిజైన్ను రూపొందించింది. దీనికి ప్రకాశం, కాంతి అన్న అర్ధంలో వినియోగించే జీవా (జెడ్ఐవీఏ) అన్న పేరును ఖరారు చేసింది. దీనికి జీవం అన్న మరో అర్థం కూడా ఉండటం విశేషం. ‘స్ప్రింగ్ ఆఫ్ లైఫ్’అన్న ట్యాగ్ను దీనికి జతచేసింది. మరో వారం పది రోజుల్లో ఈ బ్రాండ్ మంచినీటిని ఆర్టీసీ విడుదల చేస్తోంది. తొలుత అన్ని ఆర్టీసీ బస్టాండ్లలో వీటిని అందుబాటులో ఉంచుతారు. ఆ తర్వాత క్రమంగా విస్తరించాలని నిర్ణయించింది. నకిలీలను నియంత్రించి.. ఆర్టీసీ బస్టాండ్లలో ఉండే దుకాణాల్లో మంచినీటి సీసాల విక్రయం విరివిగా సాగుతుంది. అదే వేసవిలో అయితే వాటి వినియోగం చాలా ఎక్కువ. దీంతో దుకాణదారులు రూ.20కి విక్రయించాల్సిన లీటరు నీటి సీసాను రూ.25–30కి అమ్ముతుంటారు. బ్రాండెడ్ పేర్లను పోలిన ‘నకిలీ’కంపెనీ నీళ్లు విక్రయిస్తుంటారు. ఇటీవలే వీటిని నియంత్రించిన ఆర్టీసీ ఇప్పుడు బ్రాండెడ్, ఐఎస్ఐ అధీకృత లోకల్ కంపెనీ నీళ్లు మాత్రమే అందుబాటులో ఉండేలా చేయగలిగింది. ఈ తరుణంలోనే తనే సొంతంగా నీటి విక్రయాలను ప్రారంభించాలన్న ఆలోచనను సాకారం చేసుకుంటోంది. పేటెంట్ కోసం దరఖాస్తు ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు ఉచితంగా అరలీటరు నీటి సీసాలను అందిస్తోంది. ఇందుకోసం ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక కార్యాలయాలు, ఇతర అవసరాలకు కూడా భారీగా ప్యాకేజ్డ్ నీటిని కొంటోంది. ఇందుకు సాలీనా రూ.5.15 కోట్ల ఖర్చును చూపుతోంది. ఇంత భారీ ఖర్చును తనే పెట్టుబడిగా మార్చుకుంటే సొంతంగా నీటిని మార్కెట్లోకి తేవచ్చన్న యోచనతో రెండు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ కంపెనీలు ఆకర్షణీయ సీసాల్లో నాణ్యమైన నీటిని నింపి ఆర్టీసీకి అందజేస్తాయి. వాటిని ఆర్టీసీ మార్కెటింగ్ చేసుకుంటుంది. ఇలా ఇతర కంపెనీల ధరలతో సమంగా లీటరు నీటికి రూ.20 ధరను ఖరారు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు ఉచితంగా అందించేందుకు అర లీటరు సీసాలను అందుబాటులో ఉంచుతారు. బస్టాండ్లలోని దుకాణాల్లో మాత్రం లీటరు పరిమాణంలోని నీటి సీసాలను ఉంచుతారు. కాగా జీవా పేరుతో తెస్తున్న ఈ బాటిళ్లకు ‘స్ప్రింగ్ ఆఫ్ లైఫ్’అన్న ట్యాగ్లను పెట్టింది. పేరుకు, బాటిల్ డిజైన్కు ఆర్టీసీ పేటెంట్ కోసం దరఖాస్తు చేసినట్టు తెలిసింది. ఆర్టీసీ బస్టాండ్లతోపాటు మార్కెట్లోనూ ఈ సీసాలను అందుబాటులోకి తేవాలని సంస్థ నిర్ణయించింది. ఇప్పుడు ఒప్పందం మేరకు వేరే కంపెనీ నీటిని కొనేందుకు చేస్తున్న రూ.5 కోట్ల ఖర్చును లేకుండా చేసుకోవటంతోపాటు సాలీనా కనీసం రూ.20 నుంచి రూ.25 కోట్ల వరకు ఆదాయం పొందాలని భావిస్తోంది. -
జేసీ బ్రదర్స్కు ఈడీ షాక్
సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్రెడ్డి కుటుంబానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. బీఎస్ 3 వాహనాలను బీఎస్4 వాహనాలుగా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన కేసులో జేసీ బ్రదర్స్కు చెందిన రూ.22.10 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. జేసీ దివాకర్రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్రెడ్డికి చెందిన దివాకర్ రోడ్లైన్స్, జటాధర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆయన వ్యాపార భాగస్వామి సి.గోపాల్రెడ్డి కుటుంబానికి చెందిన సి.గోపాల్రెడ్డి అండ్ కంపెనీ ఆస్తులను జప్తు చేసినట్టు ఈడీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. రూ.6.31 కోట్ల నగదు, బ్యాంకులో మరికొంత నగదు, బంగారు ఆభరణాలతోపాటు రూ.15.79 కోట్ల విలువైన స్థిరాస్తులను జప్తు చేసింది. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. టీడీపీ సీనియర్ నేతలు జేసీ దివాకర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి కుటుంబాలు సుప్రీం కోర్టు తీర్పును కూడా పట్టించుకోకుండా దర్జాగా అక్రమ దందాకు పాల్పడ్డాయి. బీఎస్ 3 వాహనాలను సుప్రీం కోర్టు నిషేధించింది. అయినా జేసీ కుటుంబం అశోక్ లేలాండ్ కంపెనీకి చెందిన 154 బీఎస్ 3 మోడల్ బస్సులు, లారీలను తుక్కు పేరుతో కొన్నది. జటాధర ఇండస్ట్రీస్ పేరున 50 వాహనాలు, సి.గోపాల్ రెడ్డి అండ్ కో పేరున 104 వాహనాలను కొన్నారు. నిబంధనల ప్రకారం బీఎస్ 3 వాహనాలను రిజిస్ట్రేషన్ చేయరు. దాంతో ఫోర్జరీ పత్రాలు సృష్టించి, వాటిని బీఎస్ 4 వాహనాలుగా ఆ పత్రాల్లో పేర్కొన్నారు. అనంతరం ఫోర్జరీ పత్రాలతో నాగాలాండ్ రాజధాని కోహిమాలో రిజిస్ట్రేషన్ చేయించి, ఎన్వోసీ పొందారు. ఆ తర్వాత 15 రోజుల్లోనే ఆ బస్సులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్లలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆంధ్రప్రదేశ్లో 101 వాహనాలు, తెలంగాణలో 33, కర్ణాటకలో 15, తమిళనాడులో ఒకటి, ఛత్తీస్గఢ్లో ఒక బస్సు సర్వీసులు నిర్వహిస్తున్నారు. మరో మూడు వాహనాలు ఎక్కడ ఉన్నాయన్నది తెలియలేదు. ఆ వాహనాల లైసెన్సులకు కూడా ఫోర్జరీ పత్రాలు సమర్పించారు. అంతేకాదు ఆ వాహనాల్లో కొన్నింటిని అక్రమంగా ఇతర రాష్ట్రాల్లోని వారికి విక్రయించేశారు. అలా విక్రయించాలంటే పోలీసుల నుంచి ఎన్వోసీ పొందాలి. కానీ స్థానిక పోలీసు అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి ఎన్వోసీలు సృష్టించి మరీ అమ్మేశారు. వాటిని కొన్న వారు తాము మోసపోయామని గుర్తించి అనంతపురంలోని రవాణా శాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై విచారించిన అనంతపురం డిప్యూటీ రవాణా శాఖ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు 2020 జూన్లో జేసీ ప్రభాకర్రెడ్డి, అస్మిత్రెడ్డితో పాటు 23 మందిపై వివిధ సెక్షన్ల కింద 35 కేసులు నమోదు చేశారు. ప్రభాకర్రెడ్డి, అస్మిత్రెడ్డిలను అరెస్టు చేశారు. అనంతరం వారు బెయిల్పై విడుదల అయ్యారు. వాహనాల బీమాలోనూ ఫోర్జరీకి పాల్పడ్డట్టు దర్యాప్తులో వెల్లడైంది. సమగ్ర సమాచారం కోసం పోలీసులు ‘నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎన్ఐసీ)’ రికార్డులను పరిశీలించగా, బీమా పత్రాలన్నీ నకిలీవని వెల్లడైంది. జేసీ కుటుంబం అక్రమాలపై ప్రత్యేకంగా దర్యాప్తు జరపాలని సూచిస్తూ రాష్ట్ర రవాణా శాఖ కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం కూడా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. సమగ్ర దర్యాప్తు కోసం ఈడీని రంగంలోకి దింపింది. కొన్ని నెలల క్రితం ఈడీ అధికారులు అనంతపురం రవాణా శాఖ అధికారుల నుంచి ఆధారాలు, కీలక పత్రాలను తీసుకున్నారు. అనంతరం ప్రభాకర్రెడ్డి, అస్మిత్ రెడ్డి, సి.గోపాల్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో, అనంతపురం జిల్లా తాడిపత్రితోపాటు హైదరాబాద్, బెంగళూరు తదితర చోట్ల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మరిన్ని కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. ప్రభాకర్రెడ్డి, అస్మిత్ రెడ్డి ఫోన్లను కూడా జప్తు చేశారు. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు, ఫోర్జరీ ఎన్వోసీలతో వాహనాల కొనుగోలు, అమ్మకాల వెనుక భారీగా నల్లధనం చేతులు మారినట్టు ఈడీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. మనీ లాండరింగ్ చట్టాలను ఉల్లంఘించిన కేసులో జేసీ ప్రభాకర్రెడ్డి, అస్మిత్ రెడ్డిలను ఈడీ అధికారులు హైదరాబాద్లో ఇటీవల విచారించారు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసిన ఈడీ అధికారులు జేసీ బ్రదర్స్ కుటుంబానికి చెందిన రూ.22.10కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అశోక్ లేలాండ్లో కొందరి పాత్రపైనా ఈడీ ఆరా బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేయడం వెనుక అశోక్ లేలాండ్ కంపెనీ పాత్ర ఉండొచ్చని ఈడీ భావిస్తోంది. ఆ కంపెనీకి చెందిన కొందరి సహకారంతోనే ఈ దందా సాగించినట్టు ప్రాథమికంగా గుర్తించింది. దాంతో అశోక్ లేలాండ్ కంపెనీ ప్రతినిధులను కూడా విచారించాలని ఈడీ నిర్ణయించింది. -
గ్రానైట్ దందాపై కన్నెర్ర
అధిక లోడుతో గ్రానైట్ను రవాణా చేస్తున్న వాహనాలపై రవాణా శాఖ అధికారులు కన్నెర్ర చేశారు. జిల్లా వ్యాప్తంగా కొద్దిరోజులుగా పోలీస్, విజిలెన్స్ శాఖల అధికారుల సమన్వయంతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొందరు వ్యక్తులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గ్రానైట్ను తరలిస్తూ ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. దీంతో అధికారులు పలు వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.20 లక్షలకు పైగా అపరాధ రుసుం వసూలు చేశారు. తనిఖీల్లో కొన్ని వాహనాలు మాత్రమే పట్టుబడుతుండగా అధికారుల కళ్లుగప్పి వెళ్లిపోతున్న పరిస్థితి కూడా ఉంది. నెల్లూరు(టౌన్): మన రాష్ట్రంలో లభించే గ్రానైట్కు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా చీమకుర్తి, గురుజేపల్లి, బల్లికురువ, శ్రీకాకుళం టెక్కలి, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి నెల్లూరు మీదుగా కృష్ణపట్నం, చెన్నై, హొసూరు, బెంగళూరు ప్రాంతాలకు నిత్యం 200కు పైగా గ్రానైట్ వాహనాలు వెళ్తుంటాయి. వాటిలో అధికశాతం ఓవర్ లోడుతో ఉంటాయి. గ్రానైట్ను ఎక్కువగా 22 చక్రాల లారీలు రవాణా చేస్తుంటాయి. ఒక్కో దాంట్లో 57.750 టన్నుల సరుకు మాత్రమే రవాణా చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు యజమానులు 90 నుంచి 100 టన్నుల వరకు రవాణా చేయిస్తుంటారు. అధిక లోడు కారణంగా వాహనం అదుపులో ఉండదని అధికారులు చెబుతున్నారు. కాగా తనిఖీల్లో ఓవర్ లోడు ఉన్నట్లు గుర్తిస్తే ప్రాథమికంగా రూ.20 వేలు, దీంతోపాటు వాహన పరిమితికి మించి అధికంగా ఉంటే ఒక్కో టన్నుకు రూ.2,000 చొప్పున అపరాధ రుసుం విధిస్తున్నారు. తనిఖీల సమయంలో రోడ్డుపై వాహనాన్ని ఆపి డ్రైవర్ కనిపించకుండా వెళ్తే దానికి రూ.40 వేలు ఫైన్ వేస్తున్నారు. ఆ వాహనాన్ని ఫొటో తీసి రవాణా శాఖ వెబ్సైట్లో ఉంచుతారు. అక్కడే కేసులు రాస్తే.. అధిక లోడుతో వస్తున్న వాహనాలు అవి మొదలయ్యే పాయింట్లలోనే కేసులు నమోదు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నెల్లూరులో ఆపి తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తుండడంతో యజమానులు దుర్భాషలాడుతున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఫొటోలు, వీడియోలు తీసి బెదిరిస్తున్నారని చెబుతున్నారు. కాగా అధిక లోడుతో తిరుగుతున్న గ్రావెల్, మట్టి, ఇసుక తదితర వాహనాలపై కూడా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. వాటిపై కూడా కేసులు నమోదు చేస్తే ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుంది. దెబ్బతింటున్న రోడ్లు అధిక లోడుతో వాహనాలు వెళ్తుండడంతో జాతీయ, రాష్ట్ర రహదారులు దెబ్బతింటున్నాయి. దీనికితోడు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని రవాణా శాఖ అధికారులే చెబుతున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలపై నేషనల్ హైవే అధికారులు సర్వే నిర్వహించారు. ఇందులో అధిక లోడు గ్రానైట్ వాహనాల వల్లే రహదారులు దెబ్బతినడంతోపాటు ప్రమాదాలు జరుగుతున్నాయని కేంద్రానికి నివేదిక పంపించారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి నెల్లూరు జిల్లా వరకు యాక్సిడెంట్ జోన్గా ప్రకటించారు. ఇక్కడ అధిక లోడు వాహనాలను అరికడితే ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అధికారులు నివేదించారు. తనిఖీలు ముమ్మరం జిల్లా మీదుగా అధిక లోడుతో వెళ్తున్న వాహనాలపై కొద్దిరోజులుగా రవాణా శాఖ, పోలీసు, విజిలెన్స్ శాఖ అధికారులు సమన్వయంతో తనిఖీలను ముమ్మరం చేశారు. అయితే పట్టుబడుతున్న వాహనాల సంఖ్య బాగా తక్కువగా ఉంటోంది. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో 234 వాహనాలను పట్టుకుని రూ.కోటికి పైగా అపరాధ రుసుము విధించి వసూలు చేశారు. వాటిలో అధిక శాతం గ్రానైట్ లారీలే ఉన్నాయి. అధిక లోడు వాహనాల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించి కేసులు నమోదు చేస్తే సర్కారుకి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకుంటాం ఓవర్లోడుతో వెళ్లే వా హనాలపై ప్రత్యేక దృష్టి సారించాం. జిల్లాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.1.38 కోట్ల లక్ష్యాన్ని విధించింది. దీనిని చేరుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నాం. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు మా వంతు కృషి చేస్తాం. – బి.చందర్, ఉపరవాణా కమిషనర్, నెల్లూరు -
అన్న హత్యకు సుపారీ ఇచ్చిన ఘనుడు.. మన డీటీఓ సార్ భద్రునాయక్
ఆయన జీవితం ఆద్యంతం వివాదాస్పదమే.. వృత్తిలో.. నిజ జీవితంలో.. పుట్టి పెరిగిన ప్రదేశంలో.. పనిచేసే చోట ఎక్కడైనా తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ వస్తున్న అతని నేర ప్రవృత్తి తార స్థాయికి చేరింది. పాపం పండటంతో తను పన్నిన కుట్రలన్నీ బయటపడ్డాయి. సొంత అన్నను హత్య చేసేందుకు కిరాయి హంతక ముఠాతో ఒప్పందం కుదుర్చుకుని, ఓ యువకుడి హత్యకు కారణమైన అతను పోలీసులకు దొరికిపోయాడు. ఇదంతా చేసింది ఓ రౌడీ షీటరో.. పాత నేరస్తుడో కాదు.. ఈ ఘనతలన్నీ మన డీటీఓ సార్ భద్రునాయక్వే.. వికారాబాద్: రెండేళ్ల క్రితం వికారాబాద్ డీటీఓగా విధులు చేపట్టిన భద్రునాయక్కు వివాదాస్పదమైన వ్యక్తిగా పేరుంది. జిల్లాలో లారీల్లో ఓవర్ లోడ్ (కెపాసిటీకి రెండింతలు) వేసేందుకు ఓనర్ల నుంచి నెలనెలా మూమూళ్లు తీసుకుంటాడనే ఆరోపణలున్నాయి. ఓవర్లోడ్ కారణంగా.. వేసిన కొద్ది రోజులకే రోడ్లన్నీ ధ్వంసమవుతున్నాయి. ఈ విషయాన్ని ఆర్అండ్బీ, పీఆర్ ఇంజనీరింగ్ అధికారులు బాహాటంగా చెబుతున్నారు. ఇక లైసెన్సులు, ఫిట్నెస్, ప్రధానంగా వ్యవసాయ ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ల సమయంలో అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పరిమిత రుసుముకు మూడు నుంచి పది రెట్లు ఎక్కువ మొత్తం వసూలు చేస్తాడని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఇతని తీరును నిరసిస్తూ ఏకంగా డీటీఓ ఆఫీసు ఎదుట ఆందోళన చేపట్టారు. వాహనదారులతో దురుసు ప్రవర్తన, దుర్భాషలాడటం వంటి కారణాలతో వివాదాస్పదమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఎఫ్ఐఆర్ చేయని పోలీసులు డీటీఓ భద్రునాయక్ తనను దుర్భాషలాడారని ఇటీవల ఓ వ్యక్తి చన్గొముల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పత్రాలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ వాహనాన్ని అడ్డుకుని సీజ్ చేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ సమయంలో పలువురు వాహనదారులు, ప్రజలు బాధితుడికి అండగా వచ్చారు. భద్రునాయక్ ఆగడాలపై మండిపడుతూ నిరసన వ్యక్తంచేశారు. ఇంత జరిగినా.. డీటీఓపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఇందులో కొందరు నేతలు, పోలీసు ఉన్నతాధికారులు కల్పించుకుని పీఎస్లోనే పంచాయితీ పెట్టి.. బాధితుడు ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా ఒప్పించారనే ఆరోపణలు వచ్చాయి. ఇలా ఆయనపై కేసు నమోదు కాకుండా జిల్లా పోలీసులే గట్టెక్కించారని తెలిసింది. జిల్లా రవాణాధికారిని సూర్యాపేట పోలీసులు అరెస్టు చేశారనే వార్తలు శుక్రవారం సంచలనంగా మారాయి. పోలీసులు అతన్ని ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే విషయాలపై శనివారం ఉదయం వరకు స్పష్టత లేకపోవడంతో ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగింది. వసూళ్లకు ముఠా ఏర్పాటు రెండేళ్లుగా వికారాబాద్ డీటీఓగా విధులు నిర్వహిస్తు న్న భద్రునాయక్ అనేక వివాదాలకు తెరతీసినప్పటికీ ఆ శాఖ ఉన్నతాధికారులు నోరు మెదపక పోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆదాయ వనరు లు సమకూర్చుకునేందుకు తన కార్యాలయానికి చెందిన కొందరు కింది స్థాయి ఉద్యోగులు, కానిస్టేబుళ్లు, ఆర్టీఏ బ్రోకర్లతో ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నా యి. ఈయన క్యాడర్ ఎంవీఐ అయినప్పటికీ తన పలుకుబడితో డీటీఓగా పోస్టింగ్ వేయించుకుని రెండేళ్లుగా వికారాబాద్లో తిష్ట వేయడం గమనార్హం. విచారణలో కొత్త కోణాలు సొంత అన్నను హత్య చేయించేందుకు రూ.కోటితో పాటు ఎకరం పొలం ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్తో ఒప్పందం చేసుకున్న భద్రునాయక్ను అరెస్టు చేసిన సూర్యాపేట పోలీసులు అతన్ని రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. విచారణలో ఆయన పనిచేస్తున్న రవాణా శాఖతో పాటు అవినీతి నిరోధక శాఖల పనితీరుపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. అన్నను హత్య చేసేందుకు భారీ మొత్తంలో డబ్బులు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకోవడం, భద్రునాయక్ అక్రమాస్తుల చిట్టాను ఏసీబీకి చెబుతానని సొంత అన్నే అతన్ని బెదిరిస్తూ రావడం, భద్రునాయక్ అనేక చోట్ల అక్రమ ఆస్తులు కలిగి ఉండటం అవినీతి నిరోధక, ఇన్కమ్ ట్యాక్స్ శాఖల నిఘా వైఫల్యాలను సూచిస్తోంది. తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఆయన ఆగడాలను ఉపేక్షిస్తుండటం ఆర్టీఏ ఉన్నతాధికారుల డొల్లతనం, లోపాయికారీ ఒప్పందాలను ప్రస్ఫుటం చేస్తోంది. ప్రవీణ్ హత్య కేసును విచారణ చేస్తున్న సూర్యాపేట పోలీసులు భద్రునాయక్ అసలు స్వరూపాన్ని బట్టబయలు చేయగా.. అతనిపై చేసిన ఫిర్యాదును బుట్టదాఖలు చేయించి, ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా చేసిన మన జిల్లా పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది. -
Telangana: ‘ఫిట్నెస్’ పెనాల్టీ మినహాయింపు.. వాహన యజమానులకు భారీ ఊరట!
సాక్షి, హైదరాబాద్: రవాణా వాహన యజమానులకు పెద్ద ఊరట. ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు తీరిపోతే రోజుకు రూ. 50 చొప్పున అపరాధ రుసుము విధింపు నుంచి మినహాయింపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది దాదాపు రెండు మూడు లక్షల వాహన యజమానులకు ఉపశమనం కలిగిస్తుంది. దాదాపు మూడునాలుగేళ్లుగా వారు వాహనాలకు ఫిట్నెస్ రెన్యువల్ చేయించటం లేదు. దీంతో ఒక్కో వాహనానికి రూ.30 వేల నుంచి రూ. 70 వేల వరకు పెనాల్టీలు పేరుకుపోయాయి. కొన్ని వాహ నాలకు ఏడేళ్లుగా కూడా ఫిట్నెస్ రెన్యువల్ లేకపోవటంతో రూ.లక్షకుపైగా పెనాల్టీలున్నాయి. దీంతో రోడ్డెక్కితే పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుందనే భయంతో వేల సంఖ్యలో వాహనాలను వాటి యజమానులు ఇళ్లకే పరిమితం చేశారు. ఫలితంగా వాటి రూపంలో ఆదాయం రాక ఆ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఫిట్నెస్ గడువు తీరిన వాహనాలపై పెనాల్టీ లేకుండా మినహాయింపు ఇచ్చింది. కోవిడ్ సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున, 2020 ఫిబ్రవరి నుంచి అక్టోబర్ 2021 వరకు పెనాల్టీ నుంచి మినహాయింపు వెసులుబాటును కేంద్రమే కల్పించింది. దాన్ని పరిశీలించిన రాష్ట్రప్రభుత్వం, రోజుకు రూ.50 పెనాల్టీ నుంచి పూర్తి మినహాయింపు ఇస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు రూ.650 కోట్ల బకాయిలు ఆటోలు, క్యాబ్లు, ఇతర సరుకు రవాణా వాహనాలు.. ఇలా అన్ని రకాల రవాణా వాహనాల యజమానులు చాలాకాలంగా ఫిట్నెస్ రెన్యువల్ చేయించడం లేదు. వాటికి నిబంధన ప్రకారం రోజుకు రూ.50 చొప్పున పెనాల్టీ విధిస్తే రవాణా శాఖకు రూ.650 కోట్ల వరకు సమకూరుతుందని అంచనా. ఇప్పుడు ఈ పెనాల్టీ నుంచి మినహాయింపునివ్వడంతో అంతమేర ఆయా వాహనాల యజమానులకు వెసులుబాటు కలగగా, రవాణాశాఖ అంతమేర ఆదాయం కోల్పోయినట్టయింది. ఇక మళ్లీ రోడ్లపై ఆటోలు, క్యాబ్ల సందడి ఈ పెనాల్టీ బకాయిలకు భయపడి వాటి యజమానులు ఆ వాహనాలను ఇళ్ల వద్దనే ఉంచేశారు. ఫలితంగా కొంతకాలంగా రోడ్లపై ఆటోలు, క్యాబ్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఒక్క హైదరాబాద్లోనే దాదాపు 35 వేల నుంచి 40 వేల ఆటోలు, 50 వేల క్యాబ్లు అందుబాటులో లేకుండా పోయాయి. కోవిడ్ సంక్షోభంతో మరో 30 వేల దాకా మాయమయ్యాయి. వెరసి లక్షకు పైగా ఆటోలు, క్యాబ్లు లేకపోయేసరికి నగరంలో క్యాబ్ బుక్ చేస్తే గతంలోలాగా వెంటనే వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆ వాహనాలు తిరిగి రోడ్డెక్కే అవకాశం ఉంది. ఇకనైనా నిర్లక్ష్యం వీడతారా.. రవాణా శాఖ నిఘా లేకపోవటాన్ని రవాణా వాహన యజమానులు చక్కగా వినియోగించుకుంటున్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకున్నా పట్టుకునేవారే లేకపోవడంతో కొన్నేళ్లుగా వారు దానిమీద దృష్టిపెట్టడం లేదు. ఏడాదికి రూ.735 ఫీజు చెల్లిస్తే సరిపోయే ఫిట్నెస్ సర్టిఫికెట్ రెన్యువల్ను పట్టించుకోవటం లేదు. వాహనాలు ఫిట్నెస్ తప్పి తీవ్ర వాయు కాలుష్యానికి కారణమవుతున్నా రవాణాశాఖ పట్టించుకోవటం లేదు. ఇది వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. దీన్ని అరికట్టే ఉద్దేశంతోనే, వాహన యజమానుల్లో భయం వచ్చేలా రోజుకు రూ.50 పెనాల్టీ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఆ భయంతో మిగతా వాహనాల యజమానులు ఠంఛన్గా ఫిట్నెస్ రెన్యువల్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఆ పెనాల్టీ నుంచి మినహాయింపు ఇవ్వడంతో రవాణా వాహన యజమానుల్లో మళ్లీ నిర్లక్ష్యం వస్తుందన్న మాట వినిపిస్తోంది. దీన్ని నివారించాలంటే రవాణాశాఖ కఠినంగా ఉండాలని సీనియర్ న్యాయవాది ఒకరు పేర్కొన్నారు. -
ఇక ఆటోమేటెడ్ డ్రైవింగ్ ట్రాక్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్సుల జారీ విధానంలో సమూల మార్పులకు రవాణా శాఖ సన్నద్ధమవుతోంది. లైసెన్సుల జారీకి ప్రస్తుతం ఉన్న విధానం స్థానంలో కొత్తగా ఆటోమేటెడ్ వ్యవస్థను నెలకొల్పనుంది. కేంద్ర ఉపరితల రవాణా శాఖ, రాష్ట్ర రవాణా శాఖ సంయుక్తంగా రాష్ట్రంలోని 9 ఆటోమేటెడ్ డ్రైవింగ్ ట్రాక్లను నెలకొల్పాలని నిర్ణయించాయి. తద్వారా పూర్తిస్థాయిలో డ్రైవింగ్ నైపుణ్య పరీక్షలు నిర్వహించిన అనంతరమే లైసెన్సులు జారీ చేయనున్నారు. దాంతో లైసెన్సుల జారీలో సమగ్రత, కాలయాపన లేకుండా ఉంటుంది. మొదటి దశలో రాష్ట్రంలో చిత్తూరు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళంలో ఈ ఆటోమేటెడ్ డ్రైవింగ్ ట్రాక్లను నెలకొల్పాలని నిర్ణయించారు. ఇప్పటికే చిత్తూరులోని డ్రైవింగ్ ట్రాక్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. మిగిలిన 8 కేంద్రాల్లోనూ త్వరలోనే ట్రాక్ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. సమగ్ర పరీక్షల అనంతరమే.. ప్రస్తుతం లైసెన్సుల జారీకి నాలుగంచెల్లో డ్రైవింగ్ నైపుణ్యాన్ని పరీక్షిస్తున్నారు. మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్లు పర్యవేక్షించి లెర్నింగ్ లైసెన్స్ (ఎల్ఎల్ఆర్), పర్మనెంట్ లైసెన్స్ జారీ చేస్తున్నారు. కాగా ఈ విధానం లోపభూయిష్టంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. తూతూ మంత్రంగా నైపుణ్య పరీక్షలు నిర్వహించి లైసెన్సులు జారీ చేసేస్తున్నారన్న విమర్శలున్నాయి. మరోవైపు లైసెన్సుల జారీలో తీవ్ర కాలయాపన జరుగుతోంది. రోజుకు సగటున 10 వేల వరకు దరఖాస్తులు వస్తున్నాయి. దాంతో పరీక్షల నిర్వహణ, లైసెన్సుల జారీకి ఎక్కువ సమయం పడుతోంది. దీనికి పరిష్కార మార్గంగా డ్రైవింగ్ లైసెన్సుల జారీకి ఆటోమేటెడ్ వ్యవస్థను నెలకొల్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. 24 రకాల నైపుణ్య పరీక్షలు.. ఆటోమేటెడ్ డ్రైవింగ్ ట్రాక్ల డిజైన్ను జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) రూపొందించింది. దాంతో ఆధునిక రీతిలో డ్రైవింగ్ ట్రాక్ను ఏర్పాటు చేస్తారు. 24 కేటగిరీలుగా డ్రైవింగ్ నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. వాహనాన్ని ముందుకు నడిపించడంలో 8 రకాలుగా పరీక్షిస్తారు. ఇక రివర్స్, ఎస్ టైప్ రివర్స్, ట్రాఫిక్ జంక్షన్లు, ఓవర్ టేక్ చేయడం, క్రాసింగ్, పార్కింగ్ ఇలా వివిధ రీతుల్లో డ్రైవింగ్ నైపుణ్యాన్ని పరీక్షిస్తూ మొత్తం ప్రక్రియను వీడియో తీస్తారు. డ్రైవింగ్ ట్రాక్లలో సెన్సార్లు అమరుస్తారు. వాటిని కంప్యూటర్ గదికి అనుసంధానిస్తారు. డ్రైవింగ్ నైపుణ్య పరీక్షల సమయంలో తప్పు చేస్తే వెంటనే బీప్ శబ్ధం వస్తుంది. ఆ ట్రాక్పై డ్రైవింగ్ పరీక్ష పూర్తయ్యేసరికి ఆ విధంగా ఎన్ని బీప్లు వచ్చాయో లెక్కించి పాయింట్లు వేస్తారు. అర్హత పాయింట్లు వస్తే ఆటోమెటిక్గా లైసెన్సు జారీ చేస్తారు. లేకపోతే ఆటోమెటిక్గా లైసెన్సు తిరస్కరిస్తారు. ఆ తరువాత నిర్ణీత గడువు తరువాతే మళ్లీ పరీక్షకు హాజరుకావాలి. తమ డ్రైవింగ్ తీరును అభ్యర్థులు వీడియో ద్వారా చూసి లోటుపాట్లు తెలుసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. రాష్ట్రంలో 9 ఆటోమేటెడ్ డ్రైవింగ్ ట్రాక్ల ఏర్పాటును ఏడాదిలోగా పూర్తి చేయాలని రవాణా శాఖ భావిస్తోంది. సమాధానం ఇచ్చారు. -
వాహనదారులకు భారీ షాక్..ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోతే రూ.10వేలు జరిమానా, జైలుశిక్ష!
వాహనదారులకు ఢిల్లీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని ప్రైవేట్, ప్రభుత్వ వాహనాల యజమానులకు రూ.10వేలు జరిమానా, జైలుశిక్ష విధిస్తున్నట్లు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్కే పరిమితమైన ఉద్యోగులు కార్యాలయాలకు తిరిగి వస్తున్నారు. అదే సమయంలో వాహనాల రాకపోకళ్లు పెరిగి రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఢిల్లీ - గురుగ్రావ్ మార్గాల్లో 2020లో 347 మంది, 2021లో 10శాతం పెరిగి 389 మంది రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 2020లో 375 మంది తీవ్రంగా గాయపడగా.. 2021లో 409 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే ఈ వరుస ప్రమాదాల నుంచి వాహనదారుల్ని కాపాడేందుకు ఢిల్లీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఇటీవల రోడ్డు రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ లేని వాహనాల్ని గుర్తించేందుకు ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్లో "ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇది మోటారు వాహనాల (ఎంవీ) చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని రవాణా శాఖ జారీ చేసిన పబ్లిక్ నోటీస్లో పేర్కొంది. అందుకే ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త నిబంధనల్ని అమలు చేస్తున్నట్లు ఢిల్లీ రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సరైన ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా వాహనాల్ని నడిపే వాహనదారులకు మొదటి తప్పుకు రూ. 2,000-5,000, రెండవ, మూడవ నేరం కింద రూ.5,000-10,000 జరిమానా విధిస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో యజమాని లేదా డ్రైవర్కు జైలు శిక్ష విధించే నిబంధన కూడా అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు విడుదల చేసిన నోటీస్లో హైలెట్ చేశారు. ఇ-రిక్షాలు, ఇ-కార్ట్స్కు ఫిట్నెస్ సర్టిఫికెట్ మూడేళ్ల పాటు చెల్లుబాటులో ఉంటుంది. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ ప్రకారం, ఫిటెనెస్ సర్టిఫికెట్ గడువు ముగిసిన తర్వాత నుంచి రోజుకు 50 రూపాయల చొప్పున అదనంగా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. చదవండి👉 ద్విచక్ర వాహన దారులకు అలర్ట్.. కేంద్రం మరో కొత్త రూల్! -
రహదారులకు సహకారం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో కీలక రోడ్డు వ్యవస్థల నిర్మాణం, రహదారుల అనుసంధానానికి సహకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ చేరుకున్న ఆయన బుధవారం ఉదయం జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక రోడ్డు ప్రాజెక్టులపై చర్చించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి జ్ఞాపిక అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ► విశాఖ– భోగాపురం బీచ్ కారిడార్ ప్రాజెక్ట్కు సంబంధించి మరింత మెరుగైన ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర పర్యటన సందర్భంగా గడ్కరీ సూచించిన నేపథ్యంలో అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సీఎం వివరించారు. విశాఖ నుంచి వేగంగా భోగాపురం చేరుకునేలా సౌకర్యవంతమైన రోడ్డుతోపాటు పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ప్రాజెక్టును తీర్చిదిద్దేందుకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ► విజయవాడ వెస్ట్రన్ బైపాస్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీనికి సీఆర్డీఏ గ్రిడ్ రోడ్డును అనుసంధానించి పనులు ముందుకుసాగేలా చర్యలు తీసుకోవాలి. ► విజయవాడ వెస్ట్రన్ బైపాస్కు సంబంధించి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్కు భూములు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వెంటనే డీపీఆర్ సిద్ధం చేసి పనులు ముందుకు తీసుకెళ్లాలి. ► విజయవాడ ఈస్ట్రన్ బైపాస్కు సంబంధించి కూడా డీపీఆర్ సిద్ధం చేసి పనులు వేగంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. ► రాష్ట్రంలో 20 ఆర్వోబీలను కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఇప్పటికే మంజూరు చేయగా మిగిలిన 17 ఆర్వోబీలనూ మంజూరు చేయాలి. ► రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలు, పారిశ్రామిక నోడళ్లు, స్పెషల్ ఎకనమిక్ జోన్లను కలుపుతూ 1,723 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి. కొత్తగా ఏర్పడ్డ జిల్లాల కేంద్రాలను కలుపుతూ ఈ రోడ్ల నిర్మాణం చేపట్టాలి. ► రాష్ట్రంలో దాదాపు 14 ప్రాంతాల్లో రోప్ వే నిర్మాణానికి పర్యాటక శాఖ ప్రతిపాదనలు పంపింది. ఇప్పటికే రెండు చోట్ల నిర్మాణానికి ఆమోదం లభించగా మిగిలిన ప్రతిపాదనలకూ అనుమతి మంజూరు చేయాలి. -
రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకుంటే.. నగదు, ‘ప్రశంస’లు
సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్యసాయం అందించి ప్రాణాపాయం నుంచి తప్పించేందుకు ఉద్దేశించిన ‘గుడ్ సమారిటన్’ అవార్డుల కోసం ఎంపిక కమిటీలను ప్రభుత్వం నియమించింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్గా ఉండే రాష్ట్ర స్థాయి కమిటీలో రవాణా శాఖ కమిషనర్, వైద్యారోగ్య శాఖ కమిషనర్, అదనపు డీజీ(రోడ్డు భద్రత) సభ్యులుగా ఉంటారు. జిల్లా కలెక్టర్/జిల్లా జడ్జి చైర్మన్గా ఉండే జిల్లా స్థాయి కమిటీలో జిల్లా ఎస్పీ, రవాణా శాఖ ఉప కమిషనర్, జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ సభ్యులుగా వ్యవహరిస్తారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మొదటి గంట(గోల్డెన్ అవర్)లోగా బాధితులను ఆస్పత్రికి తీసుకొచ్చిన వారికి రూ.5 వేల ప్రోత్సాహంతో పాటు ప్రశంస పత్రం అందించారు. రోడ్డు ప్రమాదం గురించి పోలీసులకు తక్షణ సమాచారం అందిస్తే.. ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తికి పోలీసులు ‘గుడ్ సమారిటన్’ రశీదు ఇస్తారు. అనంతరం సంబంధిత పోలీస్స్టేషన్ నుంచి ఆయన వివరాలు జిల్లా స్థాయి కమిటీకి పంపుతారు. జాతీయ స్థాయిలోనూ నగదు, ప్రశంస పత్రం రోడ్డు ప్రమాద బాధితులను నేరుగా ఆస్పత్రికే తీసుకొస్తే.. ఆస్పత్రి అధికారులు ‘గుడ్ సమారిటన్’ రశీదు ఇచ్చి ఆ వివరాలను పోలీస్స్టేషన్కు పంపుతారు. అక్కడ నుంచి జిల్లా కమిటీకి ప్రతిపాదిస్తారు. ఆ విధంగా వచ్చిన ప్రతిపాదనలను జిల్లా స్థాయి కమిటీ పరిశీలించి నగదు బహుమతి, ప్రశంస పత్రాన్ని నెల రోజుల్లోగా అందిస్తాయి. ఏడాదిలో వచ్చిన ‘గుడ్ సమారిటన్’లలో అత్యంత విలువైన మూడు ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి కమిటీ ఎంపిక చేసి జాతీయ స్థాయి అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ఆ విధంగా ఏడాదికి ఒకసారి దేశ వ్యాప్తంగా 10 అత్యుత్తమ ‘గుడ్ సమారిటన్’లను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసి రూ.లక్ష చొప్పున పోత్సాహం, ప్రశంస పత్రం ఇస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ‘గుడ్ సమారిటన్’ అవార్డుల ప్రక్రియను 2026, మార్చి 31 వరకూ కొనసాగించాలని కేంద్రం ప్రాథమికంగా నిర్ణయించింది. అందుకోసం జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలను నియమించినట్టు డీజీపీ గౌతం సవాంగ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 5న 10కె, 5కె మారథాన్ తాడేపల్లిరూరల్: ఈనెల 5వ తేదీన నిర్వహించనున్న 10కె, 5కె రన్ పోస్టర్లను డీజీపీ గౌతమ్ సవాంగ్, అదనపు డీజీపీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్లు బుధవారం డీజీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. మణిపాల్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి, అమరావతి రన్నర్స్, రెడ్ ఎఫ్ఎం ప్రతినిధులు మాట్లాడుతూ అమరావతి రన్నర్స్, రెడ్ ఎఫ్ఎం, డాక్టర్ రెడ్డీస్ వారి సహకారంతో మణిపాల్ హాస్పిటల్ 15వ వార్షికోత్సవం సందర్భంగా సమాజంలో ఆరోగ్య అవగాహన పెంపొందించడానికి డిసెంబర్ 5న విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. పోటీలో గెలుపొందిన వారికి భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ చేతుల మీదుగా నగదు బహుమతి ప్రదానం చేస్తామన్నారు. పోటీలో పాల్గొనదలచిన వారు 9618558989, 7569304232 నంబర్లకు ఫోన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. -
RRR: తెలంగాణ రూపురేఖలు మార్చేస్తుందా?!
►దాదాపు రూ.18 వేల కోట్లకుపైగా ఖర్చు కానున్న ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు కన్సల్టెన్సీ బాధ్యతలను నాగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న కే అండ్ జే ప్రాజెక్ట్సు ప్రైవేట్ లిమిటెడ్కు కేంద్ర ఉపరితల రవాణా శాఖ అప్పగించింది. ►ఇంతకు ముందు ప్రాథమికంగా రూపొందించిన అలైన్మెంటును కే అండ్ జే సంస్థ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుంది. అవసరమైన మార్పులుచేర్పులతో తుది అలైన్మెంటును ఖరారు చేయడంతోపాటు డీపీఆర్ను తయారు చేస్తుంది. సాక్షి, హైదరాబాద్: హైదరాబాదే కాకుండా యావత్ తెలంగాణ రూపురేఖలు మార్చేస్తుందని భావిస్తున్న హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టు క్షేత్రస్థాయి కార్యకలాపాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అలైన్మెంటును ఖరారు చేసేందుకు కన్సల్టెన్సీ సంస్థ మరో పది రోజుల్లో రంగంలోకి దిగనుంది. కన్సల్టెన్సీ సంస్థ ఎంపిక కోసం ఎన్హెచ్ఏఐ గత నెలలో టెండర్లు పిలిచింది. 20 సంస్థలు బిడ్లు దాఖలు చేయగా.. చివరకు కే అండ్ జే సంస్థ ఎంపికైంది. ఈ సంస్థ మరో నాలుగు రోజుల్లో కేంద్ర ఉపరితల రవాణా శాఖతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆర్ఆర్ఆర్ క్షేత్రస్థాయి కార్యకలాపాలను ఆ సంస్థ ప్రారంభించనుంది. ఇప్పటికే తెలంగాణలోని కొన్ని ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టులకు కన్సల్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సంస్థ.. హైదరాబాద్లో తమ ప్రాంతీయ కార్యాలయం కూడా ప్రారంభించింది. అలైన్మెంటు ఖరారు తర్వాత డీపీఆర్ గతంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థను కన్సల్టెంటుగా నియమించారు. ఆ సంస్థ అప్పట్లో గూగుల్ మ్యాపు ఆధారంగా ప్రాథమిక అలైన్మెంటును ఖరారు చేసింది. ఆర్ఆర్ఆర్ అక్షాంశ రేఖాంశాలను నిర్ధారించింది. ఆ తర్వాత ప్రాజెక్టు విషయంలో తీవ్ర జాప్యం జరిగింది. ఈలోగా కన్సల్టెన్సీ గడువు తీరిపోయింది. తాజాగా కొత్త సంస్థను నియమించుకోవాల్సి రావటంతో టెండర్లు పిలిచిన ఎన్హెచ్ఏఐ నాగపూర్ కంపెనీని ఎంపిక చేసింది. ఈ సంస్థ తొలుత అలైన్మెంటును ఖరారు చేసిన తర్వాత ఏయే ప్రాంతాల్లో ఎంత భూమిని సేకరించాలో తేల్చనుంది. దాని ఆధారంగా ప్రాజెక్టు వ్యయాన్ని అంచనా వేసి డీపీఆర్ తయారు చేయనుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు దాదాపు పది నెలలు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు రూ.17 వేల కోట్లు అవసరమవుతాయన్న అంచనా ఉంది. అయితే తాజా పరిస్థితుల్లో అంచనా వ్యయం వెయ్యి, రెండు వేల కోట్లు పెరగవచ్చని భావిస్తున్నారు. భారత్మాల కింద ఉత్తర భాగం హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్)కు 50–70 కి.మీ. ఆవల నగరం చుట్టూ 339 (ఇందులో మార్పు ఉండొచ్చు) కి.మీ మేర ఆర్ఆర్ఆర్ను నిర్మించనున్నారు. ప్రస్తుతానికి నాలుగు వరసలుగా నిర్మించనున్న ఈ ఎక్స్ప్రెస్వే ఉత్తర భాగం అయిన సంగారెడ్డి– నర్సాపూర్– తూప్రాన్– గజ్వేల్– ప్రజ్ఞాపూర్– జగదేవ్పూర్– యాదగిరిగుట్ట–భువనగిరి–చౌటుప్పల్ వరకు ఉండే 164 కి.మీ. పరిధిని కేంద్రం ప్రస్తుతానికి భారత్మాల పరియోజన ప్రాజెక్టులో చేర్చింది. ఈ భాగం నిర్మాణానికి రూ.9,500 కోట్లు ఖర్చవుతాయన్నది ప్రస్తుతానికి ఉన్న అంచనా. ఇక దక్షిణ భాగంలోని చౌటుప్పల్– ఇబ్రహీంపట్నం– కందుకూరు– ఆమన్గల్– చేవెళ్ల–శంకర్పల్లి–కంది–సంగారెడ్డి వరకు ఉండే మిగతా భాగం విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ మార్గంలో ఎన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తాయో వివరాలు కావాలని కేంద్రం కోరింది. ప్రస్తుతం జాతీయ రహదారుల విభాగం దీనిపై అధ్యయనం చేసింది. దాని ఆధారంగా కేంద్రం ఈ భాగాన్ని కూడా భారత్మాల పరియోజనలో చేర్చనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
ఫ్యాన్సీ నెంబర్ డిమాండ్ మాములుగా లేదుగా.. ‘9999’ కోసం ఏకంగా..
1,2,3,4,5,6,7,8,9 వంటి ప్రతి సింగిల్ అంకెకు ఓ లక్షణం ఉంటుందని వాహనదారుల విశ్వాసం. ఉదాహరణకు ‘1’ నాయకత్వానికి, ‘2’ శాంత స్వభావానికి నిదర్శనం. గురుగ్రహంతో పోల్చే ‘3’ వల్ల చక్కటి తెలివి తేటలు, జ్ఞానం లభిస్తాయని నమ్మకం. ‘5’ను బుధుడికి ప్రతిబింబంగా భావిస్తారు. ఈ సంఖ్య వల్ల వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం. ఇక ప్రతి ఒక్కరూ ఇష్టపడే అంకె ‘9’. కుజగ్రహానికి ప్రతీకగా భావిస్తారు. జీవితంలో విజేతలుగా, తిరుగులేని నాయకులుగా ఎదగాలని కోరుకునేవాళ్లు, పోటీమనస్తత్వం, పోరాడే తత్వం ఉన్నవాళ్లు ఈ నంబర్ను ఇష్టపడతారు. సాక్షి, హైదరాబాద్: ‘టీఎస్ 09 ఎఫ్ఆర్ 9999’.. కోవిడ్ కాలంలోనూ తాజాగా ఈ సంఖ్య కోసం చాలామంది పోటీపడ్డారు. చివరకు ఓ వాహనదారు రూ.7.6 లక్షలతో సొంతం చేసుకున్నారు. ఆల్నైన్ నంబర్ మరోసారి ఆల్టైమ్స్ రికార్డును సొంతం చేసుకుంది. సాధారణంగా అయితే ఈ సంఖ్య కోసం పెద్ద ఎత్తున పోటీ ఉంటుంది. గతంలో రూ. 9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు కూడా వేలంలో పోటీపడ్డ సందర్భాలూ ఉన్నాయి. ‘టీఎస్09ఎఫ్ఎస్ 0009’ అనే మరో సంఖ్యకు సైతం లాక్డౌన్ తర్వాత మొదటిసారి అనూహ్యమైన డిమాండ్ లభించింది. మేఘా ఇంజినీరింగ్ సంస్థ రూ.6.5 లక్షలకుపైగా వేలంలో పోటీ పడి నంబర్ను దక్కించుకోవడం గమనార్హం. తాజాగా నిర్వహించిన వేలంలో రవాణా శాఖకు ప్రత్యేక అంకెలపై ఒక్క రోజే సుమారు రూ.30 లక్షల మేర ఆదాయం లభించింది. కరోనా కారణంగా నగరంలో హై ఎండ్ వాహనాల కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. దీంతో సహజంగానే ప్రత్యేక సంఖ్యలకు డిమాండ్ కూడా తగ్గింది. చాలా రోజుల తర్వాత ప్రత్యేక అంకెల కోసం పోటీ పెరిగిందని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్ నాయక్ తెలిపారు. పోటీ ఆన్లైన్లోనే.. వాహనాల నంబర్ల కోసం రెండేళ్ల క్రితం ఆన్లైన్ పోటీలను ప్రవేశపెట్టారు. వాహనదారులు నేరుగా ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే వేలంలో పాల్గొనవచ్చు. నంబర్ దక్కించుకోలేని వాహనదారులు చెల్లించిన డబ్బులు వారం రోజుల్లో తిరిగి వాళ్ల ఖాతాల్లో జమ అవుతాయి. దీంతో ఆన్లైన్ పోటీలకు సైతం క్రమంగా డిమాండ్ పెరిగింది. మొదటి సంవత్సరం గ్రేటర్లో సుమారు రూ.50 కోట్లకు పైగా ఆదాయం లభించింది. గతేడాది నుంచి కోవిడ్ విజృంభించడంతో ప్రత్యేక నంబర్లకు డిమాండ్ తగ్గింది. ఆదాయం కూడా తగ్గుముఖం పట్టింది. తిరిగి వాహనాల కొనుగోళ్లు పెరగడంతో నచి్చన నంబర్ల కోసం వాహనదారులు ఆసక్తిగా ముందుకొస్తున్నారని అధికారులు చెబుతున్నారు. అదే క్రేజ్.. ► ఆల్నైన్ నంబర్కే కాదు.నాలుగైదేళ్ల క్రితం పెద్దగా ఆదరణ లేని నంబర్లకు సైతం ఇప్పుడు అనూహ్యమైన డిమాండ్ కనిపిస్తోంది. ►‘టీఎస్ 09 ఎఫ్సీ 0001’ నంబర్ కోసం ఒక సంస్థ గతంలో ఏకంగా రూ.6.66 లక్షలు చెల్లించింది. ‘టీఎస్ 09 ఎఫ్సీ 0005’ నంబర్ కోసం మరో సంస్థ రూ.5.06 లక్షలు చెల్లించి గెలుచుకుంది. ► సంఖ్యాశాస్త్రం, జ్యోతిషంపై ఉండే విశ్వాసం, కొన్ని నంబర్ల వల్ల అదృష్టం కలిసి వస్తుందనే నమ్మకం వాహనదారుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ నంబర్లలంటే ఎంతో ఇష్టం.. ► 9, 1, 999, 9999, 786, 6, 666, 1111 వంటి అంకెలకు ఎక్కువ డిమాండ్ ఉంది. బీఎండబ్ల్యూ, ల్యాండ్రోవర్, ల్యాండ్ క్రూజర్, ఆడి వంటి ఖరీదైన వాహనాలే కాదు, బైక్ల కోసం కూడా వాహనదారులు పోటీకి దిగుతున్నారు. అదృష్ట జాతకంగా భావించే నంబరల కోసం కొందరు పోటీకి దిగితే సామాజిక హోదా కోసం, పేరు ప్రతిష్టల కోసం మరికొందరు ఫ్యాన్సీ నంబర్లకు పోటీ పడుతున్నారు. కేవలం ఫ్యాన్సీ కోసం కాకుండా కొన్ని సంఖ్యల వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుందనే నమ్మకం కూడా ఈ క్రేజీకి కారణమే. నంబర్లే బహుమతులు.. ► కొంతమంది తమ కుటుంబ సభ్యులకు వాహనాలను బహుమానంగా అందజేయడమే కాదు. వారి పుట్టిన రోజు కలిసొచ్చేలా రిజిస్ట్రేషన్ నంబర్లను ఎంపిక చేసుకొంటున్నారు. ► ‘1313’ (తేరా తేరా) అంటే పంజాబీలకు ఎంతో ఇష్టం. దీనిని వాళ్లు అదృష్ట సంఖ్యగా భావిస్తారు. ► ‘5121’ నంబర్ను ఆంగ్ల అక్షరాల్లో ‘సిరి’గా భావిస్తారు. ► ‘143’, ‘214’, ‘8045’ వంటి వాటికీ ఎంతో క్రేజీ ఉంది. ప్రత్యేక నంబర్లకు అదే డిమాండ్.. కోవిడ్ కారణంగా కొంత స్తబ్ధత వచ్చినా ప్రత్యేక అంకెలకు డిమాండ్ అలాగే ఉంది. ప్రత్యేకించి ‘9’ తో మొదలయ్యే ఖైరతాబాద్ పరిధిలో చాలామంది వాహనదారులు నచ్చిన నంబర్ల కోసం పోటీ పడతారు. ఇటీవల కాలంలో నగర శివార్లలోనూ డిమాండ్ పెరిగింది. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ఒకే రోజు ప్రత్యేక నంబర్లపై రూ.30 లక్షల వరకు ఆదాయం లభించింది. – పాండురంగ్ నాయక్, జేటీసీ, హైదరాబాద్ చదవండి: ఓసారి బ్రిజా, మరోసారి డిజైర్, ఇంకోసారి క్రెటా... -
బిగిస్తున్న ‘ఎన్ఓసీ’ ఉచ్చు
డబ్బులకోసం గడ్డి తిన్నారు.. కాసులు కనిపించగానే కళ్లుమూసుకుని సంతకాలు పెట్టేశారు. ఇప్పుడు తిప్పలు పడుతున్నారు. కర్ణాటక నుంచి నకిలీ ఎన్ఓసీలు తెచ్చి కార్లు విక్రయించిన కేసులో విచారణ ముమ్మరం కావడంతో.. కొందరు ఆర్టీఏ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సాక్షి, అనంతపురం: కర్ణాటక వాహనాలకు నకిలీ ఎన్ఓసీలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసిన కార్ల కుంభకోణం కేసు విచారణ వేగవంతమైంది. ఇప్పటికే అభియోగాలు ఎదుర్కొన్న కొంతమంది రిమాండ్కు వెళ్లి బయటకు వచ్చారు. అయితే ప్రస్తుతం ఈ కేసు ఆర్టీఏ అధికారుల మెడకు చుట్టుకుంటోంది. నకిలీ ఎన్ఓసీలతో వాహనాలు రిజిస్ట్రేషన్ చేసిన ఘటనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధమున్న అధికారుల్లో కలవరం మొదలైంది. అధికారుల సహకారంతోనే.. గతేడాది సెప్టెంబర్లో రవాణాశాఖలో అతి పెద్ద కుంభకోణం వెలుగుచూసింది. నాగాలాండ్లో బీఎస్–3 వాహనాలను తుక్కు కింద కొనుగోలు చేసి తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో బీఎస్–4గా రిజిస్ట్రేషన్ చేసిన కుంభకోణాన్ని అధికారులు బయటపెట్టారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్రెడ్డి రిమాండ్కు వెళ్లి వచ్చారు. సెప్టెంబర్లోనే మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తక్కువ ధరకు కర్ణాటక వాహనాలను కొనుగోలు చేసి నకిలీ ఎన్ఓసీలను సృష్టించడం.. జిల్లాలో రిజిస్ట్రేషన్ చేయించి వాటిని ఎక్కువ మొత్తానికి అమాయకులకు అంటగట్టిన ముఠా ఆగడాలు బయటపడ్డాయి. అయితే వ్యవహారంలో ప్రైవేటు వ్యక్తులే కాకుండా.. కొందరు అధికారుల హస్తం కూడా ఉన్నట్లు ముందునుంచీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. రంగంలోకి కర్ణాటక పోలీసులు నకిలీ ఎన్ఓసీలు సృష్టించి కార్లను రిజిస్ట్రేషన్ చేసిన కేసును కర్ణాటక పోలీసులు ఛాలెంజింగ్గా తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే కొంతమంది ప్రైవేటు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఎన్ఓసీలతో జిల్లాకు వచ్చిన వాహనాలను ఆ రాష్ట్ర పోలీసులు సీజ్ చేసి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులపై చర్యలకు సమాయత్తమైనట్లు సమాచారం. ఇప్పటికే ఫైల్స్ను అప్రూవల్ చేసిన ఆర్టీఓ కార్యాలయ క్లర్క్, ఏఓలపై సస్పెన్షన్ వేటు పడింది. త్వరలో మరికొంతమంది అధికారులపై వేటు పడనున్నట్లు తేలింది. దాదాపు 80 వాహనాల వరకూ నకిలీ ఎన్ఓసీలతో అక్రమంగా రిజస్ట్రేషన్ అయినట్లు గుర్తించిన పోలీసులు.. వాటికి రిజిస్ట్రేషన్ చేసిన బాధ్యులెవరన్నది కూడా నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల కొంతమంది ఆర్టీఏ అధికారులు బెంగళూరు పోలీసుల విచారణకు హాజరై వచ్చినట్లు తెలిసింది. త్వరలోనే మరికొందరిపై వేటు పడే అవకాశముండటంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. -
తెలంగాణ రవాణాశాఖ దొంగదెబ్బ!
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ వెసులుబాటు వాహనదారుల నడ్డి విరిచింది. వాహనాల రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్సులు, పర్మిట్లు, పన్ను చెల్లింపులు వంటి వాటి కోసం రవాణా శాఖ మొదట గత ఏడాది డిసెంబర్ వరకు వెసులుబాటునిచ్చింది. అనంతరం ఈ గడువును వచ్చే మార్చి వరకు పొడిగించింది. ఈ అవకాశం ఇవ్వడంతో వాహనదారులు తమ కార్యకలాపాలను వాయిదా వేసుకున్నారు. మార్చి తర్వాత పునరుద్ధరించుకోవచ్చని భావించారు. కానీ ఈ సడలింపే ఇప్పుడు వాహనదారుల కొంప ముంచింది. సకాలంలో వాహనాల రిజిస్ట్రేషన్లను రెన్యువల్ చేసుకోలేని వారికి భారీగా పెనాల్టీలు విధిస్తోంది. దీంతో సుమారు ఏడాది పాటు తమకు వెసులుబాటు లభించిందనుకున్న వాహనదారులు ఇప్పుడు ఏడాది పెనాల్టీలను చెల్లించాల్సిరావడంతో లబోదిబోమంటున్నారు. రవాణాశాఖ దొంగదెబ్బ తీస్తోందంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రూ.వేలల్లో వడ్డింపులు.. బంజారాహిల్స్కు చెందిన సామ శ్రీకాంత్రెడ్డి తన మారుతీ 800 కారు (ఏపీ 28ఏఎల్3736) రిజిస్ట్రేషన్ రెన్యువల్ కోసం ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకున్నారు. సాధారణంగా అయితే అప్లికేషన్ ఫీజు రూ.900, స్మార్ట్కార్డు కోసం రూ.200, సర్వీస్ చార్జీ రూ.400, పోస్టల్ చార్జీ రూ.35 చొప్పున మొత్తం రూ.1,535 చెల్లించాలి. 15 ఏళ్లు దాటిన వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ రూపంలో మరో రూ.500 అదనపు భారం పడుతుంది. కానీ లేట్ ఫీజు రూపంలో రూ.10 వేల జరిమానా విధించడంతో ఆయన ఒక్కసారిగా షాక్ తిన్నారు. మోహన్రెడ్డి అనే మరో వాహనదారు రూ.7000కుపైగా పెనాల్టీ చెల్లించి రెన్యువల్ చేసుకోవాల్సి వచ్చింది. గడువు ముగిసిన బండ్లు లక్షల్లో.. ► మోటారు వాహన నిబంధనల ప్రకారం 15 ఏళ్ల గడువు ముగిసిన వాహనాల సామర్థాన్ని రవాణా అధికారులు మరోసారి అంచనా వేసి వాటిని వినియోగించేందుకు అనుమతినివ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం వాహనం పాత ఆర్సీ, ఇన్సూరెన్స్, అడ్రస్ తదితర డాక్యుమెంట్లతో పాటు గ్రీన్ట్యాక్స్ చెల్లించాలి. ► నమోదు చేసుకున్న స్లాట్ ప్రకారం మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు వాహనం సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. అనంతరం మరో అయిదేళ్ల పాటు ఆ బండిని వినియోగించుకొనేందుకు అనుమతినిస్తారు. ఇలా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవలసి ఉంటుంది. గ్రేటర్ పరిధిలో గడువు ముగిసిన వాహనాలు సుమారు 13 లక్షల వరకు ఉంటాయి. ► వీటిలో 5 లక్షల వరకు కార్లు ఉండగా, మిగతావి బైక్లు, క్యాబ్లు, రవాణా వాహనాలు ఉన్నాయి. కోవిడ్ వెసులు బాటు కారణంగా ఈ వాహనాల్లో 70 శాతం వరకు రెన్యువల్స్ లేకుండానే తిరుగుతున్నాయి. రవాణా శాఖ లెక్కల ప్రకారం ఈ వాహనదారులు భారీ ఎత్తున జరిమానా చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇది చాలా దారుణం కోవిడ్ సమయంలో వెసులుబాటు ఇచ్చినట్లే ఇచ్చి ఇప్పుడు పెనాల్టీ వసూలు చేయడం దారుణం. వెసులుబాటు సమయంలోనే ఆ విషయం స్పష్టంగా చెప్పాల్సింది. అయినా కోవిడ్ ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో ఎలా వెళ్తాం. అప్పుడు ఆర్టీఏ కూడా పని చేయలేదు కదా. – సామ శ్రీకాంత్రెడ్డి పెనాల్టీ చెల్లించాల్సిందే.. గడువు ముగిసిన వాహనాలు, డ్రైవింగ్ లైసెన్సులకు గడువు మాత్రమే పొడిగించాం. పెనాల్టీల నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పలేదు. నిబంధనల ప్రకారం ఫీజులు, పెనాల్టీలు చెల్లించాల్సిందే. – పాండురంగ్ నాయక్, జేటీసీ, హైదరాబాద్ -
5 బస్సులు ఆపిన తమిళనాడు.. 24 బస్సుల్ని పట్టుకున్న ఏపీ
సాక్షి, అమరావతి: పండుగ సమయంలో తమిళనాడు రవాణాశాఖ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్ని నిలిపేసింది. వెంటనే మన రాష్ట్ర రవాణాశాఖ తమిళనాడు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులపై పట్టు బిగించింది. చివరకు తమిళనాడు అధికారులు దిగొచ్చారు. రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య చర్చలు సఫలం కావడంతో వివాదం ముగిసింది. రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం ఉన్నా.. చిన్న కారణాలతో తమిళనాడు అధికారులు ఏపీఎస్ఆర్టీసీ బస్సులను ఆ రాష్ట్రంలో నిలిపేశారు. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ తమిళనాడుకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్న సంగతి తెలిసిందే. బస్సులో పర్మిట్ లేదనే కారణంతో తిరుపతి డిపోకు చెందిన మూడు, చిత్తూరు డిపోకి చెందిన రెండు ఆర్టీసీ బస్సులను తమిళనాడు ఆర్టీఏ అధికారులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులు చెప్పడంతో తమిళనాడు అధికారులతో చర్చలు జరపాలని రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సూచించారు. మన ఆర్టీసీ బస్సులను అడ్డుకోవడం వెనుక ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా ప్రమేయం ఉందని భావించిన రవాణాశాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి తమిళనాడుకు చెందిన ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్పై తనిఖీలు ముమ్మరం చేసి 24 బస్సులను సరైన పర్మిట్లు లేవని నిలిపేశారు. ఈలోగా రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలప్రదం అయ్యాయి. దీంతో రెండు రాష్ట్రాల అధికారులు ఆర్టీసీ బస్సులను వదిలేశారు. -
విద్యార్థి కోసం.. బస్టైమింగ్స్లో మార్పు..!
బాగా చదువుకోవాలనే జిజ్ఞాస, కష్టపడి చదివే మనస్తత్వం ఉన్న విద్యార్థులకు ఏ సాయం కావాలన్నా తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వాల వరకు అందరు సాయం చేసేవారే. స్కూల్ విద్యార్థి కోసం జపాన్ ప్రభుత్వం ఏకంగా స్పెషల్ ట్రైన్ను నడిపిన సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఒడిషాలోనూ ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. భువనేశ్వర్లోని స్థానిక ఎంబీఎస్ పబ్లిక్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్న సాయి అన్వేష్ అమృతం ప్రధాన్ రోజూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే స్కూల్కు వెళ్తుంటాడు. తన స్కూలు ఉదయం 7:30 నిమిషాలకే ప్రారంభం అవుతుంది. కానీ సాయి అన్వేష్ వెళ్లే బస్ మాత్రం 7:40 నిమిషాలకు వస్తుండడంతో డైలీ స్కూలుకు లేట్గా వెళ్లాల్సి వస్తోంది. ఫలితంగా టీచర్లతో చివాట్లు తినడంతోపాటు క్లాసులుకూడా మిస్ అవుతున్నాడు. దీంతో విసిగిపోయిన సాయి అన్వేష్ ట్విట్టర్ వేదికగా క్యాపిటల్ రీజియన్ అర్బన్ ట్రాన్స్పోర్ట్(సీఆర్యూటీ) సంస్థ ఎండీ, ఐపీఎస్ అధికారి అరుణ్ బొత్రాను ట్యాగ్ చేస్తూ ‘‘బస్టైమింగ్స్ వల్ల పాఠశాలకు రోజూ లేటుగా వెళ్తున్నానీ.. మీరు దయతో నా ఇబ్బందిని అర్థం చేసుకుని,స్కూలుకు టైముకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని విన్నవించాడు’’. అతను సందేశం పంపిన కొన్నిగంటల్లోనే ఆ ఐఏఎస్ అధికారితోపాటు సీఆర్యూటీ స్పందించి త్వరలోనే బస్ టైమింగ్స్ మారుస్తామని హామీ ఇచ్చారు. దీంతో బస్ టైమింగ్ మారి సాయి అన్వేష్ స్కూల్కు టైముకు వెళ్లగలుగుతున్నాడు. తన మనవిని మన్నించినందుకు ట్రాన్స్పోర్ట్ ,ఐఏఎస్ అధికారికి అతను ధన్యవాదాలు తెలిపాడు. ఈ విషయం ఆనోటా ఈనోటా విన్నవారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఫాస్టాగ్ ఉంటేనే రాయితీలు
సాక్షి, హైదరాబాద్: టోల్ప్లాజాల వద్ద నగదు చెల్లించే విధానాన్ని త్వరలోనే పూర్తిగా నిలిపివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. టోల్ రుసుము మొత్తం ఫాస్టాగ్ విధానంలో చెల్లించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫాస్టాగ్ మొదలైన తర్వాత కూడా ఇంకా 40 శాతం మంది వాహనదారులు టోల్ ఫీజును నగదు రూపంలో చెల్లిస్తున్నారు. దీన్ని పూర్తిగా నియంత్రించి క్రమంగా వాహనదారులంతా ఫాస్టాగ్ పొందేలా కొన్ని నెలలుగా ముమ్మ రంగా ప్రచారం చేస్తోంది. అయినప్పటికీ వాహనదారుల్లో ఇంకా ఆశించిన స్థాయి స్పందన ఉండడం లేదని భావిస్తున్న కేంద్రం ఉపరితల రవాణా శాఖ క్రమంగా నగదు చెల్లించేవారిని నియంత్రించేందుకు కొత్త మార్గాలు ఎంచుకుంటోంది. ఈ క్రమంలోనే టోల్ చెల్లింపులో ఉన్న రాయితీలన్నింటినీ కేవలం ఫాస్టాగ్ చెల్లింపుదారులకే పరిమితం చేయాలని నిర్ణయించించింది. వాస్తవానికి ఈ నిర్ణయం లాక్డౌన్ కంటే ముందే తీసుకున్నా దాని అమలు పూర్తిస్థాయిలో ప్రారంభించలేదు. తాజాగా దీనికి సంబంధించి కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఓ గెజిట్ విడుదల చేసింది. దీన్ని కచ్చితంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాల్లోని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులను కేంద్రం ఆదేశించింది. రాయితీలు ఇవే.. ⇒ 24 గంటల్లో వస్తే తగ్గింపు హుళక్కే టోల్గేట్ దాటిన ఇరవై నాలుగు గంటల్లోనే తిరుగుప్రయాణంలో వస్తే రాయితీ ఉంది. తిరుగు ప్రయాణపు టోల్ చార్జీలో 50 శాతం రాయితీ ఉంటుంది. ఇప్పటివరకు వాహనదారులంతా ఇది పొందుతున్నారు. ఇక నుంచి ఫాస్టాగ్ ఉన్న వాహనదారులు మాత్రమే దీన్ని పొందే అవకాశం ఉంది. ఫాస్టాగ్ లేకుండా నగదు ద్వారా టోల్ ఫీజు చెల్లించే వాహనదారులు పూర్తి చార్జీని భరించాల్సిందే. ⇒ లోకల్ డిస్కౌంట్ కూడా.. టోల్గేట్కు 10 కిలోమీటర్ల పరిధిలో ఉండే వాహనదారులకు ప్రత్యేక లోకల్ డిస్కౌంట్ వసతి ఉంది. టోల్ రుసుములో నిర్ధారిత మొత్తం రాయితీ రూపంలో తగ్గింపు లభిస్తుంది. దాన్ని స్థానికులు పొందుతున్నారు. ఇప్పుడు ఇది కూడా ఫాస్టాగ్ ఉంటేనే పొందే అవకాశం ఉంది. ⇒ నెలవారీ పాస్కు ఫాస్టాగ్ క్రమంగా టోల్ గేట్లు ఉన్న రోడ్లపై ప్రయాణించేవారు నెలవారీ పాస్లు పొందు తుంటారు. ఒకేసారి నెల చార్జీ చెల్లిస్తుండడంతో టోల్లో కొంత తగ్గుదల ఉంది. ఇప్పుడు ఆ పాస్లను కేవలం ఫాస్టాగ్ ఉన్నవారికి మాత్రమే ఇస్తారు. మిగతా వారు ఏరోజుకారోజు చెల్లించాల్సిందే. దీంతో వారికి టోల్ భారం పెరుగుతుంది. ⇒ త్వరలో అన్ని గేట్లూ ఫాస్టాగ్కే నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం రహదారులపై టోల్ ఫీజు విషయంలోనూ దాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతోపాటు రోడ్లపై నగదు రూపంలో టోల్ చెల్లించాల్సి రావడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీన్ని నియంత్రించి గేట్ల వద్ద వాహనాలు నిలపాల్సిన పని లేకుండా ఫాస్టాగ్ విధానం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే -
రాయితీలతో ‘ఎలక్ట్రిక్’ సవారీ!
సాక్షి, హైదరాబాద్: రోడ్లపైకి విపరీతంగా వచ్చి చేరుతున్న వాహనాలతో చుట్టుముడుతున్న కాలుష్యానికి కళ్లెం వేసే క్రమంలో ఎక్కువ సంఖ్యలో బ్యాటరీతో కూడిన ఎలక్ట్రిక్ వాహనాలను అనుమతించేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కాలుష్యాన్ని తగ్గించటంతోపాటు ఉద్యోగావకాశాలు కూడా కల్పించేందుకు బ్యాటరీ వాహనాల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. వాహనదారులు పెట్రోల్, డీజిల్ వాహనాలవైపే మక్కువ చూపుతున్న నేపథ్యంలో వారి దృష్టిని ఆకర్షించేలా ఈ–వాహనాలు కొంటే ప్రత్యేక తాయిలాలు ఇచ్చేందుకు ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని రూపొందిస్తోంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం ఈ మేరకు ప్రకటించ డంతో ఇప్పుడు పాలసీ రూపొందించే బాధ్య తను పరిశ్రమల శాఖ చేపట్టింది. రవాణాశాఖ తో కలసి కసరత్తు చేస్తోంది. వారం రోజుల్లో పాలసీని ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నవి 10 వేలే... రాష్ట్రంలో ప్రస్తుతం నామమాత్రంగానే ఎలక్ట్రిక్ వాహనాలున్నాయి. ఆ సంఖ్య కూడా ఇటీవలి కాలంలోనే పెరిగింది. గత రెండేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య రాష్ట్రంలో దాదాపు 23 శాతం పెరిగింది. ప్రస్తుతం అన్ని రకాల మోడళ్లు కలుపుకొని 10 వేల వరకు బ్యాటరీ వాహనాలు ఉన్నాయి. వచ్చే ఐదారేళ్లలో ఈ సంఖ్యను భారీగా పెంచేందుకు వీలుగా ప్రభుత్వం కొత్త పాలసీకి రూపకల్పన చేస్తోంది. రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు, త్రైమాసిక పన్ను, లైఫ్ ట్యాక్స్లలో రాయితీలు ఇవ్వడం ద్వారా ఈ వాహనాలు కొనేందుకు కొనుగోలుదారులను ప్రోత్సహించనుంది. పెట్టుబడిదారులకూ ఆఫర్లు... రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టే వారిని ఆకట్టుకొనేలా రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. వాహనాల తయారీ, బ్యాటరీల తయారీ, చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు.. ఇలా వివిధ రకాల సంస్థలను ప్రోత్సహించనుంది. నిర్ధారిత కాలానికి, ముందుగా పెట్టుబడి పెట్టే నిర్ధారిత సంఖ్యలోని సంస్థలకు 20 శాతం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ, పవర్ టారిఫ్ డిస్కౌంట్ 25 శాతం, ఎస్జీఎస్టీలో రీయింబర్స్మెంట్ సౌకర్యం, స్టాంప్ డ్యూటీ మినహాయింపు తదితరాలు అందించనుంది. ఇక ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సంబంధించి కొంత స్థలాన్ని కూడా కేటాయించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ రంగంలో లక్షన్నర మందికి ప్రత్యక్షంగా, రెండున్నర లక్షల మందికి పరోక్షంగా ఉపాధి దొరికే అవకాశం ఉందని అంచనా. రాయితీలు.. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర పెద్ద వాహనాలకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజును పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే తొలుత దీన్ని నిర్ధారిత సంఖ్యలో వాహనాలకు మాత్రమే పరిమితం చేయాలనుకుంటోంది. ముందుగా కొనే 2 లక్షల ద్విచక్ర వాహనాలు, 5 వేల కార్లు, ఇతర పెద్ద వాహనాలకు దీన్ని వర్తింపచేయాలనుకుంటోంది. ఆ తర్వాత కొనే వాహనాలకు ఆ పన్నును పరిమిత మొత్తంలో వేయాలా లేక రాయితీని కొనసాగించాలా అనే విషయంపై తర్వాత నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం మారుమూల పల్లెటూళ్లలోనూ ఆటోరిక్షాలు విపరీతంగా కనిపిస్తున్నాయి. ఆ కేటగిరీలో కూడా ఢిల్లీ తరహాలో బ్యాటరీ వాహనాలను ప్రోత్సహించనుంది. రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులో నూరు శాతం రాయితీలను తొలి 20 వేల ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలకు వర్తింపజేయాలని నిర్ణయించినట్టు సమాచారం. త్రైమాసిక పన్ను, లైఫ్ ట్యాక్స్ విషయంలోనూ ఇదే తరహా పరిమితులు వర్తించనున్నాయి. -
ప్రైవేట్ రైళ్ల నిర్వహణకు 21 కంపెనీలు ఆసక్తి
న్యూఢిల్లీ : ప్రైవేట్ రైళ్ల నిర్వహణకు 21 కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఆల్స్టోమ్ ట్రాన్స్పోర్ట్ ఇండియా లిమిటెడ్, బొంబార్డియర్ ట్రాన్స్పోర్టేషన్ ఇండియా లిమిటెడ్, సిమెన్స్ లిమిటెడ్, జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మరికొన్ని ప్రభుత్వరంగ కంపెనీలు ఇందులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 12 క్లస్టర్లలో, 109 రూట్లలో 151 ప్రైవేటు రైళ్లు నడిపేందుకు మొదలైన సన్నాహాల్లో భాగంగా మొదటి దశగా భావించే ప్రీ–అప్లికేషన్ సమావేశానికి ఆసక్తి చూపుతున్న ఈ కంపెనీలు హాజరైనట్లు రైల్వేశాఖ తెలిపింది. ఈ సమావేశంలో కంపెనీలు క్లస్టర్ల ఆవశ్యత, అర్హత ప్రమాణాలు, బిడ్డింగ్ ప్రక్రియ, రైళ్ల సేకరణ, ఛార్జీలు, కార్యకలాపాలు నిర్వహణ, రైళ్ల సమయం, రాకపోకలు వంటి అనేక ప్రశ్నలను రైల్వేశాఖ ముందుంచారు. రైల్వే, నీతిఆయోగ్ అధికారులు ఈ ప్రశ్నలకు వివరణలు ఇచ్చినట్లు జాతీయ రవాణశాఖ తెలిపింది. -
సెల్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే 10 వేలు ఫైన్
లక్నో: ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రోడ్డు భద్రతా నిబంధనల్ని మరింత కఠినతరం చేసింది. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే వాహనదారులకు రూ.10 వేలు జరిమానా విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భారీగా జరిమానాలు విధిస్తేనే పౌరుల్లో బాధ్యత పెరుగుతుందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం గత ఏడాదిగా మద్యం మత్తులో డ్రైవ్ చేసినా, అంబులెన్స్లకు దారి ఇవ్వకపోయినా చోదకుల నుంచి 10 వేల రూపాయల వరకు జరిమానా వసూలు చేస్తున్నారు. ఇప్పుడు మొబైల్ మాట్లాడటం కూడా అందులో చేరింది. -
సచివాలయం ఇక కూల్చివేతే!
-
మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్
అనంతపురం: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం హైదరాబాద్లోని తన నివాసంలో ఆయనతో పాటు కుమారుడు జేసీ అస్మిత్రెడ్డిని అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం వీరిని హైదరాబాద్ నుంచి అనంతపురానికి తరలిస్తున్నారు. బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు సాగించినట్లు తేలడంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాల కొనుగోలుకు సంబంధించి సుమారు మూడు గంటల పాటు విచారణ చేపట్టారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ వ్యవహారంపై కూపీ లాగగా నకిలీ పత్రాలు సృష్టించి ఇప్పటివరకు 154 వాహనాలు నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించారు. వాటికి సంబంధించిన ఫేక్ ఎన్ఓసీ, ఫేక్ ఇన్సూరెన్స్ల కేసుల్లో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి జేసీ ట్రావెల్స్పై 24 కేసులు నమోదయ్యాయి. కాగా.. అనంతపురం, తాడిపత్రి పోలీసు స్టేషన్లలో జేసీ ట్రావెల్స్పై ఇప్పటిదాకా 27 కేసులు నమోదయ్యాయి. చదవండి: జేసీ బ్రదర్స్ చాతుర్యం: స్క్రాప్లోనూ స్కాం -
నోలైన్.. అన్నీ ఆన్లైన్
సాక్షి, హైదరాబాద్ : రవాణా శాఖ అందజేసే పౌర సేవలు మరింత సులభతరం కానున్నాయి. వాహన వినియోగదారులు ఆర్టీఏ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. నేరుగా ఇంటి నుంచే కొన్ని రకాల పౌర సేవలను పొందొచ్చు. ఇందుకు ఆర్టీఏ ప్రణాళికలను రూపొందించింది. మరో వారం, పది రోజుల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. వాహనదారులు తమకు కావాల్సిన పౌరసేవల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మొబైల్ ఫోన్ నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత డాక్యుమెంట్లను ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాలి. ఈ డాక్యుమెంట్లతో పాటు వినియోగదారుల సెల్ఫీ, డిజిటల్ సంతకాన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో వెంటనే వినియోగదారుల మొబైల్ ఫోన్కు ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారం అందుతుంది. వినియోగదారుల దరఖాస్తులను, డాక్యుమెంట్లను పరిశీలించిన వారం రోజుల వ్యవధిలో స్మార్ట్ కార్డులను స్పీడ్ పోస్టు ద్వారా ఇళ్లకు పంపిస్తారు. దరఖాస్తు చేసుకొనే సమయంలోనే ఫీజులు కూడా ఆన్లైన్లో చెల్లించాలి. లెర్నింగ్ లైసెన్సులు, శాశ్వత డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల క్రయ విక్రయాలు వంటి వినియోగదారులు స్వయంగా రావాల్సిన పౌరసేవలు మినహాయించి సుమారు 17 రకాల సేవలను ఆన్లైన్ ద్వారా నేరుగా వినియోగదారులకు అందజేసేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. ఇందుకు సంబంధించిన అన్ని రకాల ట్రయల్స్ సైతం పూర్తయ్యాయి. కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రానున్నాయి. ధ్రువీకరణ కోసమే సెల్ఫీ.. సాధారణంగా ప్రస్తుతం వివిధ రకాల పౌరసేవల కోసం వినియోగదారులు మొదట ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకోవాలి. ఆన్లైన్లో, ఈ–సేవా కేంద్రాల ద్వారా నెట్బ్యాంకింగ్ ద్వారా ఫీజులు చెల్లించాలి. స్లాట్లో నమోదైన తేదీ, సమయం ప్రకారం ఆర్టీఏకు వెళ్లి పత్రాలను అధికారులకు అందజేయాలి. అక్కడే ఫొటో దిగి, డిజిటల్ సంతకం చేయాలి. దీంతో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత వారం, 10 రోజులకు వినియోగదారుల ఇళ్లకే స్పీడ్ పోస్టు ద్వారా ధ్రువపత్రాలు అందజేస్తారు. వినియోగదారుల నిర్ధారణ కోసం ఫొటోలు, డిజిటల్ సంతకాలే కీలకం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ సేవల్లో వినియోగదారుల సెల్ఫీ, డిజిటల్ సంతకాన్ని తప్పనిసరి చేశారు. దళారులు, మధ్యవర్తుల ప్రమేయాన్ని నియంత్రించేందుకు కూడా ఇది దోహదం చేస్తుంది. మరోవైపు నకిలీ డాక్యుమెంట్లను అరికట్టేందుకు కూడా కీలకం కానున్నాయి. దరఖాస్తు చేసుకున్న వారికి ఎస్సెమ్మెస్ ద్వారా అందజేసే సమాచారంలో వినియోగదారులు కోరుకున్న సేవలను ధ్రువీకరిస్తూ ఒక నంబర్ కేటాయిస్తారు. ఒకవేళ ఆర్టీఏ ఆన్లైన్ సేవల్లో జాప్యం చోటు చేసుకున్నా, సాంకేతిక సమస్యలు తలెత్తినా ఈ నంబర్ ఆధారంగా వివరాలు పొందొచ్చు. ఏయే సేవలకు ఆన్లైన్.. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, 6 నెలల గడువు ముగిసిన లెర్నింగ్ లైసెన్సు కాలపరిమితి పొడిగింపు, లెర్నింగ్ లైసెన్స్లో ఒకటి కంటే ఎక్కువ వాహనాలకు అనుమతి కోరడం, వాహన రిజిస్ట్రేషన్ డూప్లికేట్ పత్రాలు, గడువు ముగిసిన వాటి రెన్యువల్స్, వివిధ రకాల డాక్యుమెంట్ల చిరునామాలో మార్పు, అంతర్రాష్ట్ర సేవలపైన తీసుకోవాల్సిసిన నిరభ్యంతర పత్రాలు (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్), రవాణా వాహనాల పర్మిట్లు, త్రైమాసిక పన్ను చెల్లింపులు వంటి 17 రకాల సేవలను ఆన్లైన్ పరిధిలోకి తేనున్నారు. వాహనాల ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలు వంటి వాటికి మాత్రం వినియోగదారులు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. -
తెలుగు రాష్ట్రాల సరిహద్దులు మూసివేత
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ విస్తరణ నిరోధక చర్యల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల మధ్య సరిహద్దులను మూసివేశారు. అత్యవసర వాహనాలు మినహా వేటినీ అనుమతించడం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రజా, ప్రైవేట్ రవాణాను ఇప్పటికే నిలిపివేశారు. మూడు రోజుల క్రితమే తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్ని మూసివేశారు. ఏపీ, తెలంగాణ సరిహద్దులో ఉన్న గరికపాడు చెక్పోస్టు వద్ద సోమవారం భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని రవాణా, పోలీస్ అధికారులు తేల్చి చెప్పడంతో వాహనదారులు వెనుదిరిగారు. సరిహద్దుల్లోని చెక్పోస్టుల్లో పోలీసులు, రవాణా అధికారులు, వైద్య సిబ్బంది షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తున్నారు. లాక్డౌన్తో ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి కదల్లేదు. అత్యవసర సర్వీసుల కోసం ఆర్టీసీ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఆటోలు, క్యాబ్లను నిలిపివేసిన రవాణా శాఖ ఆస్పత్రులకు వెళ్లేందుకు మాత్రం మినహాయింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. - లాక్డౌన్ నేపథ్యంలో స్వగ్రామాలకు వెళ్లేందుకు సొంత వాహనాల్లో బయలుదేరిన వారిని చెక్ పోస్టుల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. - కోదాడ, భద్రాచలం, నాగార్జున సాగర్, అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఇరువైపులా వాహనాలను నిలిపివేస్తున్నారు. కర్ణాట క, మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాల ను అనుమతించడం లేదు. కోదాడ వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. - పాలు, కూరగాయలు, ఔషధాల వాహనాలను మాత్రమే రాష్ట్రం నుంచి బయటకు వెళ్లనిస్తామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. - సరుకు రవాణా వాహనాల డ్రైవర్లకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన అనంతరం ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతించాలని లారీ యజమానుల సంఘం కోరింది. -
బీఎస్–4 వాహనం పట్టుబడితే భారీ జరిమానా
సాక్షి, అమరావతి: ఈ నెలాఖరులోగా బీఎస్–4 వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించకపోతే యజమానులు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఆ వాహనాలను స్క్రాప్గా పరిగణించాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి వాహన తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలని ఆ శాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు ఆదేశాలు జారీ చేశారు. ఫ్యాన్సీ నంబర్ కోసం ఎదురు చూస్తూ మార్చి 31లోగా రిజిస్ట్రేషన్ చేయించని బీఎస్–4 వాహనం పట్టుబడితే భారీగా జరిమానా విధించాలని, ఆ వాహనాన్ని స్క్రాప్గా పరిగణించాలన్నారు. - ఈ నెల 25లోగా బీఎస్–4 వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఇప్పటికే రవాణా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. - ఏప్రిల్ 1 నుంచి బీఎస్–6 వాహనాలకే రిజిస్ట్రేషన్లు చేస్తారు. - యజమానులు తమ పేరిట ఉన్న రెండో వాహనానికి అదనపు ట్యాక్స్ కట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని రవాణా అధికారులు గుర్తించారు. - అలాంటి యజమానులకు వాహన డీలర్లు కూడా సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. - దీంతో వాహన డీలర్లతో కూడా సమావేశాలు నిర్వహించాలని కమిషనర్ అధికారులకు ఆదేశాలిచ్చారు. - రెండో వాహనం ఉన్న యజమానులు ఈ నెల 25లోగా అదనపు ట్యాక్స్ చెల్లించాలన్నారు. -
తీగలాగితే డొంక కదిలింది!
అనంతపురం సెంట్రల్: దివాకర్ ట్రావెల్స్ ముసుగులో మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి పాల్పడిన అక్రమాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వులు బేఖాతరు చేస్తూ కారుచౌకగా 68 లారీలను అక్రమంగా కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నకిలీ ఎన్ఓసీలతో వీటికి రిజిస్ట్రేషన్ చేయించారు. రవాణాశాఖ అధికారులు కూపీ లాగడంతో వీరి అక్రమాలు బట్టబయలయ్యాయి. ఈ వ్యవహారంలో అక్రమంగా వాహనాలను విక్రయించిన కంపెనీలపై రూ.100కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం కనిపిస్తోంది. అనంతపురంలోని డిప్యూటీ ట్రాన్స్పోర్టు కార్యాలయంలో జాయింట్ డిప్యూటీ కమిషనర్ ఏఎస్బీ ప్రసాదరావు శనివారం మీడియాకు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జిల్లాలో అక్రమంగా వాహనాలు తిరుగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని ఆయన చెప్పారు. 2017 మార్చిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం బీఎస్–3 వాహనాలు రిజిస్ట్రేషన్ చేయరని, అలాంటిది బీఎస్–3 వాహనాలకు బీఎస్–4గా రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలిందన్నారు. దీనిపై కూపీ లాగగా నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ అయిన 68 వాహనాలు అనంతపురానికి ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించామన్నారు. ప్రత్యేక బృందం నాగాలాండ్కు వెళ్లి రికార్డులు ఇవ్వాలని కోరగా ఆరు వాహనాలకు సంబంధించిన రికార్డులు లభ్యమయ్యాయన్నారు. స్క్రాప్ వాహనాలు కొనుగోలు‘జేసి’.. పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా సుప్రీంకోర్టు కాలుష్యం వెదజల్లే బీఎస్–3 వాహనాలపై నిషేధం విధించిందని ప్రసాదరావు తెలిపారు. అయితే, అప్పటివరకూ ఉన్న వాహనాలను సదరు కంపెనీలు విక్రయించుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇదే అదనుగా భావించి జేసీ బ్రదర్స్ 68 వాహనాలను స్క్రాప్గా కొనుగోలు చేశారన్నారు. కొనుగోలు చేసిన రెండు రోజుల నుంచి రెండు వారాల్లోపు మొత్తం వాహనాలు ఎన్ఓసీలతో జిల్లాకు వచ్చాయన్నారు. ఈ వాహనాల్లో కొన్ని తాడిపత్రికి చెందిన జేసీ ఉమారెడ్డి, వారి సమీప బంధువు సి.గోపాల్రెడ్డి పేర్ల మీద ఉన్నాయన్నారు. అడ్రస్ కూడా తాడిపత్రి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యాయని ప్రసాదరావు తెలిపారు. ఆఘమేఘాలపై బదిలీతో అనుమానం కాగా, నాగాలాండ్లో కొనుగోలు చేసిన వాహనాలు రెండు రోజుల్లో ట్రాన్స్ఫర్ కావడంతో తమకు అనుమానం వచ్చిందన్నారు. సదరు అశోక్లేలాండ్ కంపెనీ నుంచి రికార్డులు స్వీకరించగా 68 వాహనాలు బీఎస్–3 వాహనాలేనని రికార్డుల్లో తేలిందన్నారు. ప్రస్తుతం ఆ వాహనాల రికార్డులు పరిశీలిస్తే నాలుగు వాహనాలు (ఎన్సీ 01ఏసీ–3680, ఎన్సీ01ఏసీ–3676, ఎన్సి01ఏసీ–3679, ఎన్సి01ఏసీ–1011) జేసీ ఉమారెడ్డి పేరు మీద, మరో రెండు వాహనాలు (ఎన్సి01ఏసీ–1087, ఎన్సీ01ఏసీ–1077) సి.గోపాల్రెడ్డి పేరు మీద ఉన్నట్లు గుర్తించామన్నారు. క్రిమినల్ కేసులకు సిఫార్సు పర్యావరణ పరిరక్షణలో భాగంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులను అతిక్రమించిన వారిపై రవాణా చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ప్రసాదరావు తెలిపారు. సదరు వాహనాలను సీజ్ చేసే అధికారం రవాణా శాఖాధికారులకు ఉంటుందన్నారు. అక్రమంగా కొనుగోలు చేసిన వారికి ఒకనెల జైలుశిక్ష, 2 వేలు జరిమానా.. రోడ్డు భద్రతా, కాలుష్య నియంత్రణ చట్టం ప్రకారం 3–6 నెలల వరకూ జైలుశిక్ష, 10 వేల జరిమానా.. అక్రమంగా విక్రయించిన కంపెనీలపై దాదాపు రూ.100 కోట్ల్ల వరకు జరిమానా, ఏడాది పాటు జైలుశిక్ష విధించే అవకాశముందని చెప్పారు. కాగా, నకిలీ ఎన్ఓసీలతో చీటింగ్కు పాల్పడిన జేసీ ఉమారెడ్డి, సి.గోపాల్రెడ్డిలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నగరంలోని వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశామని జాయింట్ డిప్యూటీ కమిషనర్ ఏఎస్బీ ప్రసాద్రావు వివరించారు. ఉపరవాణా కమిషనర్ శివరామప్రసాద్ ఫిర్యాదు మేరకు 33/2020 కింద కేసు నమోదైంది. -
ఒక్క కార్మికుడిని సస్పెండ్ చేయలేదు: మంత్రి పువ్వాడ
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ ఉద్యోగులుకు మార్చి 31 లోపు సమ్మె కాలానికి వేతనాలు చెల్లిస్తామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖైరతాబాద్లోని రవాణా శాఖ కార్యాలయంలో కొత్త ఛాంబర్ను బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శర్మ, సందీప్ కుమార్ సుల్తానీయ, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్ కోసం ఈ-బిడ్డింగ్ విధానం ప్రారంభించామని తెలిపారు. ఫాన్సీ నంబర్స్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, వాహనాలకు నెంబర్ ఫోర్ట్ బులిటీకి ప్రయత్నిస్తున్నామన్నారు. రవాణా శాఖ 59 ఆన్లైన్ సర్వీస్లు అందిస్తుందన్నారు. ఆర్టీసీకి ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని, కేసీఆర్ ఫోటోలతో త్వరలో కొత్త స్లొగన్స్ అవిష్కరిస్తామని మంత్రి తెలిపారు. కార్గో సేవలు ఫిబ్రవరి 10 లోపు ప్రారంభిస్తామని, కార్గో సేవల ధరలను ఇంకా నిర్ణయించలేదని అన్నారు. అలాగే ఒక్కో ఆర్టీసీ డిపోని ఒక్కో అధికారి దత్తత తీసుకుంటారని తెలిపారు. సంక్రాంతి ఒక్క రోజే ఆర్టీసీ రూ. 16.8 కోట్ల ఆదాయం వచ్చిందని, మేడారం జాతరకు 4 వేల బస్సులు నడుపుతున్నామని పేర్కొన్నారు. జనవరి 31న రోడ్డు భద్రత వారోత్సవాలు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకుని రోడ్డు ప్రమాదాలు నివారించాలని సూచించారు. ఈసారి బడ్జెట్లో రూ. 1500 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి కోరుతున్నట్లు వెల్లడించారు. చదవండి : ఆర్టీసీలో సంక్షేమ బోర్డులు ఆర్టీసీ ఉద్యోగ భద్రతే తమకు ప్రధానమన్నారు. మూడు మాసాలుగా ఏ ఒక్క కార్మికుడిని సస్పెండ్ చెయ్యలేదని పువ్వాడ అజయ్ తెలిపారు. ఆర్టీసీలో అనేక సంస్కరణలు తీసుకొచ్చమని, ఆర్టీసీ సిబ్బందికి సొంతగా యాజమాన్యం వేతనాలు ఇచ్చిందన్నారు. వాహనాల కొనుగోలు సంఖ్య తగ్గడంతో టాక్స్ రెవెన్యూ పడిపోయిందని పేర్కొన్నారు. మాంద్యం ప్రభావం రవాణా శాఖపై కూడా ఉంటుందన్నారు. ప్రభుత్వానికి రవాణా శాఖ ద్వారా రూ. 3 వేల కోట్ల ఆదాయము వస్తుందని, రవాణా శాఖ ఖర్చు రూ.180 కోట్లు మాత్రనని, ఇంకా ఖర్చులను తగ్గించుకుంటామని చెప్పారు. ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్లు పెంచలేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. -
ఆర్టీసీ బస్సులు కళకళ
సాక్షి, అమరావతి: సంక్రాంతి పండుగ అన్ని వర్గాల్లో ఆనందాన్ని నింపింది. ఆనందోత్సాహాలతో కుటుంబ సభ్యుల మధ్య పండగ జరుపుకున్నవారంతా స్వస్థలాల నుంచి తిరిగి పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. కాగా, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నేడు (శనివారం), రేపు (ఆదివారం) ఆర్టీసీ 2 వేలకు పైగా ప్రత్యేక సర్వీసులు నడపనుంది. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల డిమాండ్కు తగ్గట్లు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండ్రోజుల పాటు ఆర్టీసీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులకు ప్రత్యేక సర్వీసులు నడపనుంది. మొత్తం పండగ సీజన్లో ఈ నెల 15 నుంచి 19 వరకు 4,200 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ప్రణాళికలు రూపొందించింది. దీని ప్రకారం పండగ ముందు 2,200 ప్రత్యేక సర్వీసులను నడపడంతో ప్రయాణికులు ఆదరించారు. ప్రైవేటు బస్సుల్ని రవాణా శాఖ కట్టడి చేయడంతో ఈ దఫా రాష్ట్ర ప్రజలకు ప్రయాణంలో ఇబ్బందులు తప్పాయి. ఇటు రైల్వే శాఖ నర్సాపూర్, కాకినాడ, విశాఖ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. 40 శాతం రాయితీతో బస్సులు కళకళ.. ఆర్టీసీ పండగ సీజన్లలో నడిపే ప్రత్యేక సర్వీసులకు అదనంగా 50 శాతం చార్జీలు వసూలు చేస్తుంది. తిరుగు ప్రయాణంలో సరిగా ఆక్యుపెన్సీ ఉండదని, డీజిల్ ఖర్చులకైనా బస్సు నడిపినందుకు రావాలని ఈ విధంగా 50 శాతం చార్జీలు పెంచుతారు. అయితే ఈ దఫా ఆర్టీసీ వినూత్న ప్రయోగం చేసింది. తిరిగి వచ్చేటప్పుడు ఆర్టీసీ నడిపే ప్రత్యేక బస్సులో 40 శాతం రాయితీ ప్రకటించింది. దీంతో ప్రత్యేక బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగి బస్సులు ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ చేస్తే 8309887955కు ఫిర్యాదులు ఈనెల 2వ తేదీ నుంచి 16 వరకు ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ 3,132 కేసులు నమోదు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 546 బస్సులను సీజ్ చేశారు. తిరుగు ప్రయాణంలో ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు అధిక చార్జీలు వసూలు చేస్తే 8309887955 నంబర్కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని రవాణా శాఖ తెలిపింది. -
‘పవన్ కల్యాణ్ అలా చేసి ఉండాల్సింది’
సాక్షి, తాడేపల్లి : బీజేపీతో దోస్తీ కట్టిన పవన్ కల్యాణ్పై రవాణా మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. ఈ భూమ్మీద పచ్చి అవకాశవాద రాజకీయ నేత ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కల్యాణేనని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు అంబాసిడర్గా ఉండేవారని.. బాబు కోరిక మేరకు పవన్ కూడా అలానే చేస్తున్నారని మండిపడ్డారు. అవకాశవాద రాజకీయాలకు కొత్త చిరునామాగా పవన్ నాయుడు తయారయ్యారని చురకలంటించారు. (చదవండి : పవన్ డాన్స్లు, డ్రామాలు వేస్తే పెట్టుబడులు రావు: కేఏ పాల్) ఆయన మాట్లాడుతూ.. ‘బేషరతుగా పవన్ కల్యాణ్ ఎందుకు బీజేపీకి మద్దతు తెలిపారు. షరతులు పెట్టి.. హోదా అడిగి.. బీజేపీకి మద్దతు తెలపొచ్చు కదా. మోదీని, అమిత్షాను ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ఎందుకు అడగలేదు. బేషరతుగా బీజేపీకి మద్దతు తెలుపుతున్నాని చెప్పడానికి సిగ్గు లేదా. ఎందుకు బేషరతుగా మద్దతు అంటున్నారు. మీ మీద ఏం కేసులు ఉన్నాయి. ఓఎల్ఎక్స్ వెబ్సైట్లో పార్టీని అమ్మకానికి పెట్టుకోవచ్చు అనే విధంగా పవన్ తయారయ్యారు. ఓఎల్ఎక్స్ తత్వవేత్తగా మారాడు’అని పేర్ని నాని పేర్కొన్నారు. (చదవండి : చస్తే చస్తాం గానీ.. బీజేపీలో విలీనం చేయబోం) అధిక చార్జీలపై కేసులు నమోదు చేశాం అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని ప్రైవేట్ యాజమాన్యాలను హెచ్చరించామని మంత్రి పేర్ని నాని చెప్పారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే చర్యలు తీసుకున్నామని తెలిపారు. జనవరి 2 నుంచి 16 వ వరకు 3132 కేసులు నమోదు చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా 552 బస్సులను సీజ్ చేశామని చెప్పారు. పండగ సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా 3 వేల స్పెషల్ బస్సులను నడిపామని తెలిపారు. ఈ రోజు (శుక్రవారం) నుంచి 20 తేదీ వరకు ప్రైవేటు ట్రావెల్స్పై రైడ్స్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
ప్రైవేట్ ట్రావెల్స్పై ఫిర్యాదుల వెల్లువ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్ సంస్థల ఆగడాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ట్రావెల్స్ అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 9542800800 వాట్సాప్ నెంబరును ప్రకటించింది. ఈ నెంబరుకు గత వారం రోజుల వ్యవధిలో 1,702 ఫిర్యాదులు అందాయి. ఇందులో అధిక శాతం ఫిర్యాదులు టిక్కెట్లు రేట్లు పెంచి దోచుకుంటున్నారనే ఉన్నాయి. రవాణా శాఖ దాడులు చేస్తున్నా ప్రైవేటు ట్రావెల్స్ దందా మాత్రం ఆగడం లేదు. ప్రస్తుత సంక్రాంతి సీజన్లో బస్సు చార్జీలను రెండు మూడు రెట్లు పెంచేశాయి. పండుగ రద్దీని సొమ్ము చేసుకుంటున్నాయి. చార్జీల వివరాలను ఆన్లైన్లో ఉంచి, టిక్కెట్లను విక్రయిస్తున్నాయి. రవాణా శాఖ అధికారులు గత నాలుగు రోజులుగా రాష్ట్ర సరిహద్దుల్లో ప్రైవేటు బస్సుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 170 బస్సులను సీజ్ చేసి, 80 కేసులు నమోదు చేశారు. చార్జీలు విచ్చలవిడిగా పెంచేసి, ప్రయాణికులను దోచుకుంటున్న ట్రావెల్స్ సంస్థలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ బస్సులపై రూ.25 వేల చొప్పున జరిమానా విధించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కేసులు నమోదు చేసిన బస్సుల వివరాలు అన్ని చెక్పోస్టులకు పంపించాలని సూచించారు. కేసుల నమోదు విషయంలో ఇతర రాష్ట్రాల బస్సులకు సైతం మినహాయింపు లేదని స్పష్టం చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్కు పండుగ పండుగ సీజన్లో టిక్కెట్ల ధరలు తగ్గిస్తామని ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రికి తొలుత హామీనిచ్చారు. కానీ, ఆ హామీని తుంగలో తొక్కుతున్నారు. డిమాండ్ ఉన్న తేదీల్లో దోపిడీ మరింత అధికంగా ఉంది. జనవరి 11న ఏపీఎస్ ఆర్టీసీ ఏసీ బస్సుల్లో(రెగ్యులర్ సర్వీసు) హైదరాబాద్ నుంచి గుంటూరుకు రూ.530 వరకు ధర ఉంది. స్పెషల్ బస్సు అయితే రూ.795 వసూలు చేస్తున్నారు. ప్రైవేటు బస్సుల్లో రూ.1,130 నుంచి రూ.1,200 వరకు గుంజుతున్నారు. నాన్ ఏసీ ఆర్టీసీ బస్సుల్లో(రెగ్యులర్ సర్వీసు) రూ.383 కాగా, స్పెషల్ బస్సుల్లో రూ.609 వసూలు చేస్తున్నారు. ప్రైవేటు నాన్ ఏసీ బస్సుల్లో టిక్కెట్ల ధరలు రూ.850 వరకు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రైవేటు బస్సులు: 750 గత నాలుగు రోజుల్లో సీజ్ చేసిన బస్సులు: 170 నమోదు చేసిన కేసులు: 80 వారం వ్యవధిలో వాట్సాప్ నెంబరుకు అందిన ఫిర్యాదులు: 1,702 తనిఖీలు ఇక మరింత ముమ్మరం ‘‘బస్సు టిక్కెట్ల రిజర్వేషన్లు చేసే రెడ్ బస్, అభీ బస్ వెబ్సైట్ల నిర్వాహకులను పిలిపించి మాట్లాడాం. మోటారు వాహన చట్టం ప్రకారం ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులపైనే కాదు.. ఇలాంటి వెబ్సైట్లపైనా కేసులు నమోదు చేయొచ్చు. ఆపరేటర్లు ప్రకటించిన రేట్లనే ఆన్లైన్లో ఉంచి, టిక్కెట్లు విక్రయిస్తున్నామని వెబ్సైట్ల నిర్వాహకులు చెబుతున్నారు. అధిక చార్జీలు వసూలు చేస్తే వెబ్సైట్ల నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తాం. ప్రైవేటు బస్సుల్లో తనిఖీలను మరింత ముమ్మరం చేస్తాం’’ – పీఎస్సార్ ఆంజనేయులు, రవాణా శాఖ కమిషనర్ -
క్రేజీ..ఇక ఆన్లైన్
సాక్షి,సిటీబ్యూరో: రవాణాశాఖ రిజర్వేషన్ నంబర్లకు ఇంత వరకు వాహనదారుల సమక్షంలో నిర్వహిస్తున్న వేలానికి త్వరలో స్వస్తి పలకనున్నారు. దీనికి బదులు ఆన్లైన్ వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 54 రకాల పౌర సేవలను ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తెచ్చిన రవాణాశాఖ.. ప్రస్తుతం రిజర్వేషన్ నంబర్లపై దృష్టి సారించింది. ఈ పద్ధతి అమల్లోకి వస్తే వాహనదారులు ఇంటి నుంచే నేరుగా పోటీలో పాల్గొని తమకు నచ్చిన నంబర్ను దళారుల జోక్యం లేకుండా సొంతంచేసుకోవచ్చు. మరోవైపు నంబర్ల కేటాయింపుల్లోనూ పూర్తి పారదర్శకతసాధ్యమవుతుందని రవాణా శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో వాహనాల రిజర్వేషన్ నంబర్లలోనూ దళారుల దందా యథేచ్ఛగా సాగుతోంది. అధికారులే స్వయంగా ఈ దందాను ప్రోత్సహిస్తున్నారన్న తీవ్రమైన ఆరోపణలు సైతం ఉన్నాయి. దీంతో నిజమైన నంబర్ కోసం ఎంత మొత్తమైనావెచ్చించేందుకు సిద్ధంగా ఉన్న వినియోగదారులు తమకు కావాల్సిన నంబర్లను పొందలేకపోవడంతో పాటు రవాణాశాఖ ఆదాయానికి గండి పడుతోంది. డిమాండ్ బాగా ఉన్న నంబర్లను కూడా తరచుగా ఎలాంటి వేలం లేకుండా నిర్ణీత ఫీజుల్లోనే కేటాయించడం వల్ల ఆ నంబర్లపై వచ్చే ఆదాయాన్ని కోల్పోవలసి వస్తోంది. ‘ఆన్లైన్ బిడ్డింగ్’ విధానం అమల్లోకి వస్తే ఇలాంటి అక్రమాలకు కళ్లెం పడుతుంది. ఇందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, విధి విధానాలపై దృష్టి సారించినట్లు రవాణాశాఖ అధికారి ఒకరు తెలిపారు. దీనిపై త్వరలోనే స్పష్టత రానుందని, ఎలాంటి జాప్యానికి తావు లేకుండా నిర్ణీత వ్యవధిలోపు ఆన్లైన్ బిడ్డింగ్ను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఆన్లైన్ వేలం ఎలా అంటే.. ప్రస్తుతం లెర్నింగ్ లైసెన్సులు, డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్, బదిలీలు, చిరునామా మార్పు, తదితర పౌరసేవల కోసం వాహనదారులు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని ఆన్లైన్లోనే ఫీజు చెల్లిస్తున్నారు. అనంతరం ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లి తమకు అవసరమైన సేవలను పొందుతున్నారు. కానీ రిజర్వేషన్ నంబర్ల ఆన్లైన్ టెండర్లో వినియోగదారులు నేరుగా కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉండదు. మధ్యాహ్నం 1 గంట లోపు తమ పరిధిలోని ఆర్టీఏ కార్యాలయాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న నంబర్లలో నచ్చిన నంబర్ పైన క్లిక్ చేసి స్లాట్ నమోదు చేసుకోవచ్చు. ఆ సమయంలోనే వాహనం తాత్కాలిక రిజిస్ట్రేషన్ వివరాలను అప్లోడ్ చేసి, నిర్ణీత ఫీజు చెల్లించాలి. ఒక నంబర్పై ఒకరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్లైన్ వేలం నిర్వహిస్తారు. ఎక్కువ మొత్తంలో నగదు చెల్లించిన వారికి ఆ నంబర్ కేటాయిస్తారు. ఇందులో ఎక్కడా ఎలాంటి లోపాలకు, దళారులు, అధికారుల ప్రమేయానికి అవకాశం లేకుండా పూర్తిగా ఆన్లైన్ బిడ్డింగ్ జరుగుతుంది. ప్రత్యేక నంబర్లకు డిమాండ్ రవాణావాఖ నుంచి ‘‘9, 1, 999, 9999, 786, 6,666, 1111, 1234’’ వంటి నంబర్లకు వాహనదారుల్లో ఎంతో క్రేజ్ ఉంది. ఆల్ నైన్స్(9999) కోసం రూ.10 లక్షలకు పైగా వేలంలో పోటీపడడం సాధారణంగా మారింది. అంతే కాకుండా ఫ్యాన్సీ నంబర్లు, అదృష్ట సంఖ్యలు, రైజింగ్ నంబర్లుగా భావించే కొన్ని రకాల వాహన రిజిస్ట్రేషన్ నంబర్ల కోసం అనూహ్యమైన పోటీ ఉంటుంది. బీఎండబ్ల్యూ, ల్యాండ్ రోవర్, ల్యాండ్ క్రూజర్, ఆడీ వంటి లగ్జరీ వాహనాలే గాక, బైక్లకు ఫ్యాన్సీ నంబర్లకు కూడా వాహనదారులు రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా 70 వేల నుంచి 80 వేల నంబర్లకు ప్రస్తుతం వేలం నిర్వహిస్తున్నారు. ఈ నంబర్ల పైన రవాణాశాఖకు ఏటా రూ.50 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. ఇందులో సగానికి పైగా గ్రేటర్ హైదరాబాద్ నుంచే వస్తుందంటే.. నగరంలో ఫ్యాన్సీ, ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్లపై ఉన్న క్రేజ్ను అర్థం చేసుకోవచ్చు. వాహనదారులు ఎంతో ముచ్చటపడే ‘9’తో మొదలయ్యే నంబర్లను కేటాయించే ఖైరతాబాద్ కార్యాలయానికే ఏటా రూ.15 కోట్లకు పైగా ఆదాయం లభిస్తుండడం విశేషం. -
దివాకర్ బస్సు సీజ్
కళ్యాణదుర్గం: రవాణాశాఖ అనుమతులు లేని రూట్లలో తిరుగుతున్న దివాకర్ బస్సును మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సీజ్ చేశారు. అక్రమంగా తిరుగుతున్న బస్సులను గుర్తించడంలో భాగంగా సోమవారం చిత్తూరు జిల్లాకు చెందిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు నాగరాజు నాయక్, మధుసూధన్రెడ్డి, మణి, అనంతపురం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నరసింహులు వివిధ రూట్లలో వాహనాలపై దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగానే ఏపీ 39 ఎక్స్7699 నంబర్ గల దివాకర్ బస్సు అనుమతిలేని రూట్లో వస్తుండగా అడ్డుకుని రికార్డులను పరిశీలించి బస్సును సీజ్ చేశారు. అనంతపురం– మొలకాల్మూరు రాకపోకలు సాగించే దివాకర్ బస్సు నిబంధనలకు విరుద్ధంగా మరో రూట్లో వస్తుండటంతో పట్టుకున్నారు. నిబంధనల ప్రకారం సదరు నంబర్ గల దివాకర్ బస్సు అనంతపురం నుంచి కళ్యాణదుర్గం, బెళుగుప్ప, గుండ్లపల్లి, రాయదుర్గం మీదుగా మొలకాల్మూరుకు రాకపోకలు సాగించాలి. అలా కాకుండా మొలకాల్మూరు నుంచి తిరుగు ప్రయాణంలో వస్తున్న సదరు దివాకర్ బస్సు రాయదుర్గం, గుండ్లపల్లి, బెళుగుప్ప మీదుగా వెళ్ళకుండా గుండ్లపల్లి నుంచి నేరుగా కళ్యాణదుర్గంకు వస్తుండగా బళ్ళారి బైపాస్ రోడ్డులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు అడ్డుకున్నారు. 38 మంది ప్రయాణికులతో వస్తున్న దివాకర్ బస్సును సీజ్ చేసి అనంతపురంలోని ఉప రవాణా కమిషనర్ కార్యాలయానికి తరలించారు. అదేవిధంగా అధిక లోడ్తో చిత్రదుర్గం నుంచి కళ్యాణదుర్గానికి వస్తున్న మరో సంస్థకు చెందిన ప్రైవేటు బస్సుపై కూడా కేసు నమోదు చేశారు. -
ఆర్టీసీకి ఆక్సిజన్ అందించేందుకే..
సాక్షి, అమరావతి బ్యూరో : ఏటా రూ.1200 కోట్ల నష్టాలు చవిచూస్తూ వెంటిలేటర్పై ఉన్న ఆర్టీసీకి ఆక్సిజన్ అందించేందుకే స్వల్పంగా చార్జీలు పెంచుతూ నిర్ణయం తీçసుకున్నామని ప్రభుత్వం వెల్లడించింది. ఆర్టీసీకి ఏ ఏటికి ఆ యేడు నష్టాలు వేల కోట్ల రూపాయలకు పెరిగిపోవడంతో చార్జీల పెంపు అనివార్యమైందని పేర్కొంది. ప్రభుత్వం స్వల్పంగా చార్జీలు పెంచినా, ఆర్టీసీ ఇంకా రూ.300 కోట్ల నష్టాల్లో ఉంటుందని చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. పల్లె వెలుగు, సిటీ సర్వీస్ బస్సులకు ప్రతి కిలోమీటర్కు రూ.10 పైసలు, ఇతర సర్వీసులకు కిలోమీటర్కు రూ.20 పైసల చొప్పున పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకే ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు. నష్టాల నుంచి ఆర్టీసీని గట్టెక్కించాలంటే చార్జీలు పెంచక తప్పట్లేదన్నారు. చార్జీల పెంపుపై ఆర్టీసీ బోర్డు ప్రతిపాదనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారని, పెంచిన చార్జీలు ఎప్పటి నుంచి అమలులోకి వచ్చేది ఒకటి రెండు రోజుల్లో వెల్లడిస్తామని ఆయన వివరించారు. ఇప్పటికే ఉద్యోగుల విలీనం ఆర్టీసీ విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని మంత్రి నాని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ఆస్తులను పంచుకోవాల్సి ఉందని, వాటి పంపకం పూర్తయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారని, అసెంబ్లీలో దీనిపై చట్టం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని వివరించారు. సంస్థలో కాలం చెల్లిన (12 లక్షల కిలోమీటర్లు తిరిగి కండిషన్లో లేనివి) బస్సుల స్థానంలో ఏప్రిల్ నాటికి వెయ్యి కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. విలేకరుల సమావేశంలో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ ఎం.టి.కృష్ణబాబు, ఆపరేషన్స్ ఈడీ కేవీఆర్కే ప్రసాద్ పాల్గొన్నారు. చార్జీల పెంపుతోనే ఆర్టీసీకి జీవం ఆర్టీసీని ఆదుకునేందుకు చార్జీల పెంపు అనివార్యమైంది. ఏ ఏటికాయేడు భారం పెరిగి పోతుండటంతో ఇప్పటికే నష్టాలు రూ.6,735 కోట్లకు చేరుకున్నాయి. ఈ పరిస్థితిలో ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించి, కార్మికులకు చేయూతనందించేందుకు ప్రయాణికులు స్వల్పంగా చార్జీల పెంపును భరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నెల 1 నుంచి తెలంగాణలో ఆర్టీసీ చార్జీలను అన్ని సర్వీసులకు కిలోమీటరుకు 20 పైసల వంతున, స్టూడెంట్ పాస్ల రేట్లను 30 శాతంకు పైగా పెంచారు. తెలంగాణ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ రోజుకు 700 సర్వీసులకు పైగా నడుపుతోంది. ఒక్క హైదరాబాద్కే ప్రతి రోజూ 565 సర్వీసులు తిరుగుతున్నాయి. మిగిలిన సర్వీసులు భద్రాచలం, మిర్యాలగూడ, కరీంనగర్, ఖమ్మం, నల్గొండకు వెళుతున్నాయి. ప్రస్తుతం, పెరిగాక చార్జీలు ఇలా.. ఏపీకి, తెలంగాణకు అంతర్రాష్ట్ర ఒప్పందాలున్న నేపథ్యంలో అంతర్రాష్ట్ర సర్వీసుల్లో చార్జీల మధ్య మరీ ఎక్కువ వ్యత్యాసం ఉండకూడదనే నిబంధన ఉంది. దీంతో ఏపీఎస్ఆర్టీసీ కూడా చార్జీలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటర్కు 10 పైసలు, మిగిలిన అన్ని సర్వీసుల్లో 20 పైసల వంతున పెంచేలా నిర్ణయం తీసుకున్నట్లు శనివారం రవాణా శాఖ మంత్రి పేర్నినాని వివరించారు. కాగా, డీజిల్ ధర పెరిగిన కారణంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆర్టీసీపై రూ.360 కోట్ల భారం పడింది. అన్ని రకాలుగా భారం భరిస్తున్న ఆర్టీసీని ఆదుకునేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇదివరకెన్నడూ లేనివిధంగా బడ్జెట్లో రూ.1,572 కోట్లు కేటాయించింది. నెలకు రూ.100 నుంచి రూ.150 కోట్ల వరకు సాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. దీనికితోడు స్వల్పంగా చార్జీలు పెంచడం వల్ల అప్పులు, నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీకి మరి కొంత ఊరట కలుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. -
ముంచుతున్న మంచు!
సాక్షి, అమరావతి: గతనెల 4న తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ వద్ద చెన్నై నుంచి భువనేశ్వర్కు కార్ల లోడుతో వెళ్తున్న ఓ కంటైనర్ కాల్వలోకి దూసుకెళ్లింది. ఎన్హెచ్–16పై రావులపాలెం–రాజమహేంద్రవరం మధ్య ఏటిగట్టు జంక్షన్లో జరిగిన ఈ ప్రమాదంలో లారీ డ్రైవరు ఎస్కే అబ్దుల్, క్లీనర్ ఎస్కే డానేష్ హక్లు మృతిచెందారు. తెల్లవారుజామున మంచు కారణంగా జంక్షన్ వద్ద ములుపు కనిపించకపోవడంతోనే ఈ దుర్ఘటన జరిగింది. లఇలా రాష్ట్రంలో గత సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 440 వరకు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 67 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో 250కు పైగా జాతీయ రహదారులపైన జరగ్గా 42 మంది మరణించారు. ఈ ప్రమాదాలకు మితిమీరిన వేగం, డ్రంకెన్ డ్రైవ్, రోడ్డు ఇంజనీరింగ్ లోపాలు ఓ కారణమైతే.. తెల్లవారుజామున మంచు కూడా ఓ ప్రధాన కారణమని రవాణా శాఖ అధ్యయనంలో తేలింది. దీంతో రవాణా శాఖా అధికారులు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. డ్రైవరును ఆపి ముఖం కడుక్కోడానికి నీళ్లివ్వడం, టీ అందించడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డిసెంబరు, జనవరి నెలల్లో మంచు కారణంగా అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని అంచనా వేసిన అధికారులు టోల్గేట్లు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో పోలీసులతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. వీటన్నింటి కోసం ఇటీవలే రూ.120 కోట్లు మంజూరు చేశారు. దీంతో ఎలక్ట్రానిక్ బోర్డులు, రోడ్లపై డైవర్షన్ బోర్డులను రేడియం స్టిక్కర్లతో ఏర్పాటుచేస్తున్నారు. భారీ వాహనాలతో ప్రమాదాలు జాతీయ రహదార్లపై ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) విశ్రాంతి స్థలాలు సరిగ్గా ఏర్పాటుచేయకపోవడంతో రోడ్ల వెంబడే భారీ వాహనాలు నిలిపి ఉంచుతున్నారు. మంచులో కనిపించక వెనుక నుంచి అతివేగంతో వస్తున్న వాహనాలు వీటిని ఢీకొంటున్నాయి. దీంతో అక్కడికక్కడే మరణిస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో పదుల సంఖ్యలో జరిగాయి. మరోవైపు.. నిబంధనల ప్రకారం ఐదు గంటల కంటే ఎక్కువసేపు వాహనాన్ని డ్రైవరు నడపకూడదు. రెండో డ్రైవర్ విధిగా ఉండాలి. కానీ, వాహన యజమానులు రెండో డ్రైవరును పంపకపోవడంతో ప్రమాదాలు అధికమయ్యాయి. ప్రమాదాల నివారణకు నీళ్లు, టీ అందిస్తున్నాం గతేడాది గుంటూరు జిల్లాలో ఒక్క డిసెంబరులోనే మూడు రోజుల వ్యవధిలో పొగమంచు కారణంగా తెల్లవారుజామున 15 మరణాలు చోటుచేసుకున్నాయి. పోలీసుల సహకారంతో ఆ సమయంలో వాహనాలను ఆపి డ్రైవర్లను ముఖం కడుక్కోమని సూచిస్తున్నాం. ఇందుకు నీటిని సమకూరుస్తున్నాం. అలాగే, వారంలో మూడుసార్లు డ్రైవర్లకు టీ అందిస్తున్నాం. – మీరా ప్రసాద్, గుంటూరు డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ పొగమంచు వల్ల.. కంటిచూపుపై ప్రభావం పొగమంచు వల్ల కంటి చూపుపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సాధారణ వెలుగు కంటే మంచులో ప్రయాణం అంటే 40 శాతం చూపు తగ్గిపోతుంది. అదే 40 ఏళ్లు పైబడిన డ్రైవరుకు చత్వారం సమస్య తోడవుతుంది. ఎదురుగా వచ్చే వాహనాల లైటింగ్వల్ల కూడా చూపు తగ్గుతుంది. దీనికి తోడు తెల్లవారుజామున కళ్లు మూతపడతాయి. ఆ సమయంలో డ్రైవర్లకు విశ్రాంతి అవసరం. – డాక్టర్ నరేంద్రరెడ్డి, సూపరింటెండెంట్, కర్నూలు ప్రాంతీయ కంటి ఆస్పత్రి రావులపాలెం–రాజమహేంద్రవరం మధ్య కాల్వలోకి దూసుకెళ్లిన కంటైనర్ -
అవినీతిని ‘వాస్తు’ దాచునా..!.
సాక్షి, అనంతపురం : రోడ్డు రవాణాశాఖ అధికారులకు వాస్తు భయం పట్టుకుంది. గతకొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తున్న చాంబర్లను మార్పు చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా ఉన్నతాధికారి అయిన ఉప రవాణా కమిషనర్ చాంబర్ను ఆర్టీఓ చాంబర్లోకి మారుస్తున్నారు. ఆర్టీఓకు మరో చాంబర్ ఏర్పాటు చేస్తున్నారు. రెండు రోజులుగా రవాణాశాఖ కార్యాలయంలో ఈ పనులు జరుగుతున్నాయి. దీంతో అధికారులు ఇతర గదుల్లో కూర్చొని విధులు నిర్వహిస్తున్నారు. గతంలో పనిచేసిన సీ.హెచ్.ప్రతాప్, సుందర్వద్దీలకు అవినీతి, అక్రమాల మరకలు అంటుకోవడంతో ప్రస్తుత డీటీసీ శివరామప్రసాద్ వాస్తు ప్రకారం చాంబర్ మార్చుకోవాలని భావించినట్లు కార్యాలయవర్గాలు వెల్లడిస్తున్నాయి. వాస్తు పనుల్లో భాగంగా గ్రానైట్ ఫ్లోరింగ్, పీఓపీ సీలింగ్ తదితర పనులు చేపడుతున్నారు. ఇందుకోసం రూ.3లక్షలకు పైగానే ఖర్చవుతున్నట్లు తెలిసింది. కాగా ఇందుకోసం రవాణశాఖ కమిషనరేట్ నుంచి నిధులు కోరగా.. రూ.2లక్షల వరకే అనుమతిచ్చినట్లు సమాచారం. అయితే మిగిలిన డబ్బును ఏదోలా సర్దుబాటు చేయొచ్చని భావిస్తున్నారు. వాస్తు మార్చాలనుకోవడంలో తప్పు లేదు.. కానీ బాగా ఉన్న చాంబర్లను వాస్తు పేరుతో మారుస్తూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. -
ఫ్యాన్సీ నంబర్స్కు భలే క్రేజ్
సాక్షి,సిటీబ్యూరో: రవాణాశాఖ ఖైతరాబాద్ కార్యాలయంలో బుధవారం ప్రత్యేక నంబర్లకు నిర్వహించిన వేలంలో పలువురు వాహనదారులు తమ క్రేజ్ను చాటుకున్నారు. నచ్చిన నంబర్ను రూ.లక్షలు పోసి దక్కించుకున్నారు. ఇలా ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా బుధవారం ఒక్కరోజే సంస్థకు రూ.27,44,157 ఆదాయం వచ్చింది. రేంజ్ రోవర్ 3.0 ఎల్డబ్ల్యూబీ వాహనానికి టీఎస్09 ఎఫ్హెచ్ 9999 నంబర్కు రూ.10.35 లక్షలకు బిడ్ వేసి ట్రాక్స్ అండ్ టవర్స్ ఇన్ఫ్రా లిమిటెడ్ దక్కించుకుంది. అలాగే మసరట్టి లవెంటి వాహనం కోసం టీఎస్09 ఎఫ్జే 0009 నంబర్కు గంగవరం పోర్ట్ లిమిటెడ్ కంపెనీ రూ.4.01 లక్షలు వెచ్చించింది. స్కోడా సూపర్బ్ ఎల్ అండ్ కే వాహనానికి టీఎస్09 ఎఫ్జే 0099 నంబర్కు రూ.2.97 లక్షలకు బిడ్ వేసి ఈటీఏ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. -
20 వేల బస్సులైనా తీసుకురండి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారం ఎంతకీ తెగట్లేదని, ఎంతకాలం ప్రజలకు ఈ ఇబ్బందులని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పదిహేను, 20 వేల ప్రైవేటు బస్సులను రాష్ట్రంలో సాధ్యమైనంత త్వరగా ప్రవేశపెట్టాలని, వాటికి రూట్ పర్మిట్లు జారీ చేసేందుకు కసరత్తు చేయాలని రవాణ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. ఆర్టీసీ సమ్మెపై బుధవారం ప్రగతి భవన్లో రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఆ శాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ, ప్రభుత్వ సలహాదారు రాజీవ్శర్మతో సమీక్షించారు. గురువారం హైకోర్టులో ప్రభుత్వం తరఫున దాఖలు చేయనున్న అఫిడవిట్ను సీఎం పరిశీలించారు. హైకోర్టు నుంచి ప్రభుత్వానికి ప్రతికూల ఆదేశాలందితే తక్షణమే సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం సూచించినట్లు తెలిసింది. సకల జన భేరీ నిర్వహించడం, విపక్ష నేతలను ఈ సభకు ఆహ్వానిచడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారని అధికారవర్గాలు తెలిపాయి. -
దివాకర్ ట్రావెల్స్..రాంగ్రూట్లో రైట్రైట్
ఆయనో పెద్ద మనిషి. మైకు దొరికితే నీతులు చెబుతుంటారు. ముఖ్యమంత్రులు, ప్రధానులకు సైతం సలహా ఇచ్చే రీతిలో వ్యాఖ్యలు చేస్తుంటారు. కానీ ఆయన బిజనెస్ మొత్తం అడ్డదారిలో సాగుతోంది. కొన్నేళ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమ ట్రావెల్స్ బస్సుల ద్వారా రూ. కోట్లు కొల్లగొట్టారు. అన్నాతమ్ముడు ఏకమై పాతికేళ్లుగా ప్రైవేటు ట్రావెల్స్ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోయారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుపుతూ ఎన్నో ప్రాణాలు తీశారు. మరెంతో మందిని క్షతగాత్రులుగా మిగిల్చారు. అందుకే ఆ బస్సు చూస్తే చాలు జనం మృత్యుశకటమొచ్చనంటూ పరుగులు తీస్తున్నారు. సాక్షి, అనంతపురం: మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డిలకు చెందిన దివాకర్ ట్రావెల్స్...జిల్లాలోనే కాదు...రాష్ట్ర వ్యాప్తంగా సర్వీసులు నడుపుతోంది. కానీ అన్నీ అడ్డదారిలోనే...పర్మిట్ ఓ రూట్లో తీసుకుని...మరో రూట్లో బస్సులు నడుపుతారు. కొన్నింటికి అసలు పర్మిటే ఉండదు. ఇలా అడ్డదారిలో అడ్డంగా తిరుగుతున్న ట్రావెల్స్పై ఇటీవల రవాణాశాఖ అధికారులు నిఘా వేశారు. ఆకస్మిక తనిఖీలు చేయగా.. ట్రావెల్స్ గుట్టు రట్టయ్యింది. ఇటీవల రోడ్డు రవాణాశాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ప్రారంభించారు. ఈ క్రమంలో జిల్లాలోనూ ఉపరవాణా కమిషనర్ శివరామప్రసాద్ ఆధ్వర్యంలో బృందాలుగా విడిపోయిన అధికారులు ఈనెల 16న వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. తొలిరోజు 8, మరుసటి రెండు బస్సులను సీజ్ చేశారు. జిల్లాలో సీజన్ చేసిన వాటిలో 8 బస్సులు దివాకర్ ట్రావెల్స్వే కావడం గమనార్హం. ఇలా అనంతపురంలో 4, గుంతకల్లులో 3, పెనుకొండలో ఒక దివాకర్ బస్సును సీజ్ చేశారు. రవాణాశాఖ నిబంధనలను తుంగలోకి తొక్కి బస్సులు నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. అంతా అడ్డదారిలోనే... ఇంటర్స్టేట్ క్యారేజ్ అనుమతులు తీసుకొని జిల్లా వ్యాప్తంగా మొత్తం 196 ప్రైవేటు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. స్టేజ్ క్యారెజ్ అనుమనుతులు తీసుకున్న ప్రైవేటు ట్రావెల్స్ రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలోనే ఉండటం గమనార్హం. అనంతపురం టూ బెంగుళూరు, అనంతపురం టూ బళ్లారి, అనంతపురం టూ చెళికర, అనంతపురం టూ హైదరాబాద్ సర్వీసుల పేరుతో పలు ట్రావెల్స్కు చెందిన బస్సులు తిరుగుతున్నాయి. ఒక పర్మిట్తో రెండు, మూడు బస్సులు ఇంటర్ స్టేజ్ వ్యవహారం వెనుక భారీ అక్రమాలు జరుగుతున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ అనుమతులు తీసుకున్నది ఒక రూట్ అయితే.. మరో రూట్లో బస్సులు తిప్పితున్నారు. కొన్నింటికి గడువు మీరిపోయినా అలాగా కొనసాగిస్తున్నారు. మరికొందరు అనుమతి ఒక బస్సుపై ఉంటే.. రెండు మూడు బస్సులు అదనంగా తిప్పుతున్నారు. ఇందులో దివాకర్ ట్రావెల్స్ బస్సులు కూడా మినహాయింపేమి కాదు. ఇటీవల అధికారులు సీజ్ చేసిన 8 దివాకర్ బస్సుల్లో రెండింటికీ పూర్తిగా అనుమతి లేకపోవడం, మరికొన్నింటిలో నిబంధనలకు విరుద్ధంగా సీటింగ్ కెపాసిటీ పెంచి ప్రయాణికులను ఎక్కించుకోవడం, మరికొన్నింటిలో డ్రైవర్లు, కండెక్టర్లకు లైసెన్స్లు లేనట్లు అధికారులు గుర్తించారు. దీంతో (ఏపీ02టీహెచ్4220, ఏపీ02టీఈ2196, ఏపీ02టీసీ3969, ఏపీ02టీఏ6373, ఏపీ02టీఈ0135, కేఏ01ఏకే3929, కేఏ34ఏ0987, కేఏ34ఏ8874) సీజ్ చేసినట్లు రవాణాశాఖ అధికారులు వివరించారు. ప్రభుత్వానికి రూ.కోట్లలో గండి... ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ జిల్లాలో దివాకర్ ట్రావెల్స్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. అనుమతులు లేకుండా తిరుగుతుండడంతో పాటు అనుమతి లేని రహదారులపై కూడా దర్జాగా రాకపోకలు సాగిస్తున్నాయి. తాజాగా రవాణాశాఖ అధికారుల దాడులతో బట్టబయలు అయిన వ్యవహారం జిల్లాలో కొన్నేళ్ల నుంచి జరుగుతున్నా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ట్రావెల్స్ దందా కొనసాగించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పనిచేసిన రవాణాశాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారు. రహదారులపై అడ్డదారిలో తిరగడమే కాకుండా ఏపీఎస్ ఆర్టీసీకి నష్టం కలిగించేలా కొన్ని రూట్లలో అతివేగంతో రాకపోకలు సాగిస్తూ అనేక మంది ప్రజల ప్రాణాలను కూడా జేసీ ట్రావెల్స్ బస్సులు తీశాయి. ఇటీవల రవాణా శాఖ అధికారులు సీజ్ చేసిన దివాకర్ ట్రావెల్స్ బస్సులు 8 2017 నవంబర్ 3న ఆత్మకూరు సమీపంలోని వడ్డుపల్లి వద్ద వేగంగా వచ్చిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వచ్చిన బొలొరో వాహనాన్ని ఢీ కొంది. ఈ ఘటనలో ‘ఆత్మ’ డీపీడీ రమణ ప్రాణాలు కోల్పోయారు. 2017 సెప్టెంబర్లో ఆత్మకూరు మండలం వై.కొత్తపల్లెకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తిని కామారుపల్లివద్ద దివాకర్ బస్సు ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సదరు ట్రావెల్స్ నిర్వాహకులు ఆస్పత్రి ఖర్చులు కూడా చెల్లించకపోవడంతో బాధితుడు గ్రామస్తుల సాయంతో ధర్నా చేశాడు. ఇలా గత నాలుగేళ్లలో దివాకర్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలతో అనేక మంది ప్రాణాలు కోల్పోగా, చాలా మంది క్షతగాత్రులుగా మిగిలి జీవచ్ఛవాల్లో బతుకుతున్నారు. ప్రమాదాలకు కారణమైన బస్సులకు అనుమతి లేనట్లు గుర్తించినా.. అప్పటి రవాణాశాఖ అధికారులు చర్యలకు వెనుకంజ వేశారు. ఫిర్యాదుల మేరకే దాడులు నిబంధనలకు విరుద్ధంగా బస్సులు తిరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాం. ఇందులో పదిబస్సులు పట్టుబడగా దివాకర్ ట్రావెల్స్కు చెందినవి 8 ఉన్నాయి. అనుమతులు లేకపోవడం, డ్రైవర్, కండెక్టర్లకు లైసెన్స్ లేకపోవడం, అక్రమంగా సీటింగ్ కెపాసిటీ పెంచి ప్రయాణికులను తరలిస్తుండడం తదితర కారణాలతో వాటిని సీజ్ చేశాం. ఈ దాడులు కొనసాగుతాయి. రోజూ 20 చొప్పున ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – శివరామప్రసాద్, ఉపరవాణా కమిషనర్ -
‘ఆర్థిక సాయానికి 25లోగా దరఖాస్తు చేసుకోండి’
సాక్షి, అమరావతి: ప్రభుత్వం అందజేయనున్న రూ.10 వేలు ఆర్థిక సాయానికి అర్హులైన ఆటో, ట్యాక్సీ డ్రైవర్లందరూ ఈ నెల 25 లోగా దరఖాస్తు చేసుకోవాలని రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు శుక్రవారం వెల్లడించారు. సొంతంగా ఆటో, ట్యాక్సీ ఉండి.. వారే నడుపుకునే వారికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ ఆర్థిక సాయాన్ని అందించనున్న సంగతి తెలిసిందే. భార్య, భర్తను ఓ యూనిట్గా తీసుకుని సాయం అందిస్తారు. కొడుకు, కూతురు ఇదే వృత్తిలో ఉండి వివాహం కాకున్నా.. మేజర్లు అయితే చాలు.. వారిని మరో యూనిట్గా పరిగణిస్తారు. వారు కూడా ఆర్థిక సాయం పొందడానికి అర్హులేనని రవాణాశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. (చదవండి : ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ. 400 కోట్లు) వర్షాలు తగ్గిన తర్వాత 160 కోట్ల రూపాయలతో రోడ్ల మరమ్మతులు చేపడుతామని తెలిపారు. 86 వేల దరఖాస్తులు ఆన్లైన్లో.. 40 వేల దరఖాస్తులు ఆఫ్లైన్లో అందాయని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో లైసెన్స్ తీసుకుని ఆంధ్రప్రదేశ్లో ఆటో, ట్యాక్సీలు నడుపుకునే వారు కూడా ఈ ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకోవచ్చని కృష్ణబాబు వెల్లడించారు. అక్టోబర్ 4 నుంచి అర్హులైన ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లో నగదు డిపాజిట్ అవుతుందని చెప్పారు. (వచ్చే నెల 4 నుంచి ఆటో, ట్యాక్సీ వాలాలకు రూ.10 వేలు) -
టూవీలర్లకు ఈ పథకం వర్తించదు : మంత్రి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక సహాయం టూవీలర్ ట్యాక్సీలకు ప్రస్తుతం వర్తించదని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆటోలు, ట్యాక్సీలు నడిపేవారికి ఏటా రూ. 10 వేల ఆర్ధిక సహాయం అందజేస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వచ్చే ఏడాది నుంచి అర్హులైన టూవీలర్ ట్యాక్సీలకు కూడా ఈ పథకం అమలు చేసే దిశగా ఆలోచిస్తామని మంత్రి తెలిపారు. ఈ పథకం వచ్చే నెల 4 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్న మంత్రి దరఖాస్తులను ఈ నెల 14 నుంచి 25వ తేదీ వరకు స్వీకరిస్తామని వెల్లడించారు. ఆన్లైన్, ఆఫ్లైన్లలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. వాహనాలను ఫైనాన్స్లో తీసుకున్నవారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని, లబ్దిదారులు కొత్త బ్యాంకు అకౌంట్లు తెరవాలని కోరారు. దాదాపు నాలుగు లక్షల దరఖాస్తులు రావొచ్చనే అంచనాలున్నాయని పేర్కొన్న మంత్రి, ఒకవేళ అంతకు మించి దరఖాస్తులొచ్చినా ఇబ్బంది లేకుండా పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. -
ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ. 400 కోట్లు
సాక్షి, అమరావతి: ఆటో, ట్యాక్సీ వాలాలకు మంచి రోజులు రానున్నాయి. అధికారంలోకి రాగానే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు సాయం అందించి ఆసరాగా నిలుస్తామని తన పాదయాత్రలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఈ నెలాఖరున నెరవేరనుంది. మేనిఫెస్టోలో చేర్చిన మేరకు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లను ఆదుకునేందుకు ఏడాదికి రూ.400 కోట్ల సాయం అందించనున్నారు. ఈ సాయాన్ని ఈ నెల నాలుగో వారంలో నేరుగా లబ్ధిదారులకు అందించేందుకు అనుగుణంగా ప్రభుత్వం రవాణా శాఖకు మార్గదర్శకాల్ని జారీ చేసింది. ఈ నెల 4న జరిగిన కేబినెట్ సమావేశంలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదించింది. అర్హులైన వారిని గుర్తించేందుకు ఇప్పటికే రవాణా శాఖ కసరత్తు పూర్తి చేసింది. రేపటి నుంచి (మంగళవారం) అర్హులైన వారి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించేందుకు రవాణా శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆన్లైన్లో అందిన దరఖాస్తులన్నీ ఆయా జిల్లాల కలెక్టర్లకు వెళతాయి. అనంతరం వెరిఫికేషన్ కోసం ఆయా గ్రామ, వార్డు వలంటీర్లకు పంపుతారు. ఆ తర్వాత సొంతంగా ఆటో, ట్యాక్సీ ఉండి.. వారే నడుపుకునే వారికి ఈ సాయం వర్తింపజేయనున్నారు. 2019 మార్చి నెలాఖరు వరకు రాష్ట్రంలో 6.63 లక్షల ఆటోలు, ట్యాక్సీలు ఉన్నట్లు అంచనా. ఇందులో సొంతంగా నడుపుకుంటున్న వారివి 3.97 లక్షలకు పైగా ఉన్నట్లు రవాణా శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల నాలుగో వారంలో స్క్రూటినీ చేసి గ్రామాల్లో ఎంపీడీవోలు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అనంతరం రూ.10 వేల నగదును బ్యాంకుల్లో వారి ఖాతాల్లో జమ చేస్తారు. అనంతరం అందుకు సంబంధించిన రశీదుల్ని లబ్ధిదారులకు గ్రామ/వార్డు వలంటీర్లు అందిస్తారు. బతుకు భారం తగ్గించేందుకు చేయూత రాష్ట్రంలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫిట్నెస్, బీమా, మరమ్మతులకు అయ్యే ఖర్చు ఏటా రూ.10 వేల వరకు ఉంటోంది. సొంతంగా ఆటో, ట్యాక్సీ నడుపుకునే వారికి ఈ ఖర్చు భారంగా మారింది. కష్టాలెదుర్కొంటున్న ఆటో డ్రైవర్లకు మేలు చేయడం అటుంచి ఆటోలపై చంద్రబాబు సర్కారు 2017లో జీవిత కాల పన్ను మోపింది. ఫిట్నెస్ సర్టిఫికెట్లు జాప్యమైతే రోజుకు రూ.50 వంతున జరిమానా విధించింది. ఆటో డ్రైవర్ల బతుకు చిత్రాన్ని ఛిద్రం చేసింది. దీంతో అన్ని జిల్లాల్లో ఆటో డ్రైవర్లు పాదయాత్రలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరవు పెట్టారు. ప్రతి చోటా ఆటో డ్రైవర్ల యూనియన్ నేతలు కలిసి చంద్రబాబు ప్రభుత్వం తమను ఎలా ఇబ్బంది పెడుతుందో.. సోదాహరణగా విన్నవించారు. రోడ్ ట్యాక్స్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, బీమా పేరుతో ఏడాదికి రూ.10 వేల వరకు ఖర్చవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలను కళ్లారా చూసిన, విన్న వైఎస్ జగన్.. తాము అధికారంలోకి రాగానే ఉపాధి కోసం ఆటో కొనుక్కుని జీవనం సాగిస్తున్న వారికి రూ.10 వేల సాయం అందిస్తామని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన పాదయాత్రలో ప్రకటించారు. అప్పటి నుంచి రాష్ట్రంలో జరిగిన ప్రతి సభలోనూ ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని చెబుతూ వారి సమస్యల్ని ప్రస్తావించారు. రూ.10 వేల సాయంతో బీమా, రోడ్ ట్యాక్స్లు, చిన్న చిన్న రిపేర్లకు ఇబ్బంది లేకుండా పోతుందన్నారు. ఇచ్చిన మాట మేరకు మేనిఫెస్టోలోనూ పొందుపరిచారు. అధికారంలోకి రాగానే తొలి బడ్జెట్లోనే వీరి కోసం నిధులు కేటాయించారు. ఇప్పుడు ఒక్కొక్కరికి రూ.10 వేల వంతున సాయం అందించనున్నారు. భార్య, భర్తను ఓ యూనిట్గా తీసుకుని సాయం అందిస్తారు. కొడుకు, కూతురు ఇదే వృత్తిలో ఉండి వివాహం కాకున్నా.. మేజర్లు అయితే చాలు.. మరో యూనిట్గా పరిగణించి వారికి కూడా సాయం అందించనున్నారు. ప్రాథమికంగా 4 లక్షల మంది డ్రైవర్లకు సాయం అందించేందుకు ఏర్పాట్లు చేశామని రవాణా శాఖ చెబుతోంది. ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల సంఖ్య పెరిగినా సాయం వర్తింపజేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రవాణా శాఖ కసరత్తు ప్రారంభం సాక్షి, మచిలీపట్నం: అర్హులైన వారి జాబితా సిద్ధం చేసే పనిలో రవాణా శాఖ నిమగ్నమైంది. ఆటోల వరకు ఇబ్బంది లేకున్నప్పటికీ, సొంత ట్యాక్సీలు నడుపుతున్న వారిని గుర్తించాల్సి ఉంది. రవాణా శాఖలో రిజిస్ట్రేషన్ అయిన ఆటోలు ఎన్ని ఉన్నాయి ? ప్రస్తుతం ఎన్ని నడుస్తున్నాయి? వారి యజమానుల స్థితి గతులు ఏమిటి? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. మరొక వైపు ట్రావెల్ ఏజెన్సీల పరిధిలో ఉన్న కార్లు మినహా, వ్యక్తిగతంగా నడుపుతున్న వారు ఎంతమంది ఉన్నారు? ఆ లెక్కన ఎన్ని ట్యాక్సీలున్నాయి? వంటి అంశాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఉన్న వివరాల మేరకు సొంతంగా ఆటో, ట్యాక్సీ నడుపుతున్న వారికి రూ.10 వేల చొప్పున పంపిణీ చేయాలంటే కనీసం రూ.400 కోట్లు అవసరమవుతుందని అంచనా వేశారు. ఆ మేరకు బడ్జెట్ కేటాయింపులు జరిగినట్టు రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలిపారు. మంగళవారం లేదా బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో రవాణా శాఖ ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో విధివిధానాలు ఖరారు చేయనున్నారు. ఆటో కార్మికులతో మంత్రి మాటామంతి ఆటో కార్మికుల సాధక బాధలు తెలుసుకునేందుకు మంత్రి పేర్ని నాని ఆదివారం స్వయంగా మచిలీపట్నంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆటోలోనే ప్రయాణించారు. ఆటో కార్మికులు, కార్మిక సంఘాలతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని వంద రోజుల్లో అమలు చేసిన వైఎస్ జగన్ లాంటి సీఎంను తామెన్నడూ చూడలేదని ఆటో కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సొమ్ము ఏటా ఆటో, ట్యాక్సీల నిర్వహణకు ఎంతగానో ఉపకరిస్తుందని వారు పేర్కొన్నారు. రికార్డులన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ తమ టార్గెట్ పేరుతో ఆర్టీఏ, పోలీస్ వేధింపులు తాళలేకపోతున్నామని, వాటి నుంచి తమకు విముక్తి కల్పించాలని కోరుతున్నారు. రానున్న ఐదేళ్లు మీకు మంచి రోజులేనని, అనవసరపు వేధింపులు ఉండబోవని మంత్రి భరోసా ఇచ్చారు. మంత్రి వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ సిలార్ దాదా, మచిలీపట్నం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు తదితరులున్నారు. -
టన్ను ఇసుక రూ.375
ఏపీఎండీసీ వెబ్సైట్ (యాప్) ద్వారా బుక్ చేసుకుని, ఆన్లైన్లో డబ్బు చెల్లించిన వారికి ఇసుకను స్టాక్ యార్డులోని వాహనంలో లోడ్ చేసి ఇస్తారు. లోడింగ్ రుసుముతో కలిపి ఈ ధర ఉంటుంది. కేవలం స్టాక్ యార్డుల్లో ఇసుక అందించడంతోనే ప్రభుత్వం చేతులు దులుపుకోవడం లేదు. వినియోగదారుల వద్దకు తక్కువ ధరకే రవాణా చేసేలా ఏర్పాట్లు కూడా చేస్తోంది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక విరివిగా అందుబాటులోకి రానుంది. నిల్వ కేంద్రాల్లో (స్టాక్ యార్డులు) టన్ను ఇసుకను కేవలం రూ.375 చెల్లించి తీసుకోవచ్చు. లోడింగ్ రుసుముతో కలిపి టన్ను ఇసుకను రూ.375కే ప్రజలకు అందించాలని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ), భూగర్భ గనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశాయి. ప్రస్తుతం ఉన్న ధరల కంటే తక్కువ ధరకే ప్రజలకు ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఏపీఎండీసీ, భూగర్భ గనుల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించారు. ఒకటి, రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించి, ఇసుక సరఫరా ధరను అధికారికంగా ప్రకటించనున్నారు. యాప్లో బుకింగ్.. ఆన్లైన్లో చెల్లింపులు రాష్ట్రంలో నూతన ఇసుక విధానాన్ని సెప్టెంబరు 5వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఏపీఎండీసీ వెబ్సైట్ (యాప్) ద్వారా బుక్ చేసుకుని, ఆన్లైన్లో డబ్బు చెల్లించిన వారికి ఇసుకను స్టాక్ యార్డులో వాహనంలో లోడ్ చేసి ఇస్తారు. లోడింగ్ రుసుముతో కలిపి ఈ ధర ఉంటుంది. కేవలం స్టాక్ యార్డుల్లో ఇసుక అందించడంతోనే ప్రభుత్వం చేతులు దులుపుకోవడం లేదు. వినియోగదారుల వద్దకు తక్కువ ధరకే రవాణా చేసేలా ఏర్పాట్లు కూడా చేస్తోంది. జిల్లాల్లో ట్రాన్స్పోర్టర్స్ అసోసియేషన్తో (లారీలు, టిప్పర్ల ఓనర్ల) సంప్రదింపులు జరిపి, ఇసుక రవాణాకు వీలైనంత తక్కువ ధరలు ఖరారు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. కిలోమీటర్ రవాణాకు టన్నుకు రూ.4.90లోపే ఉండేలా చూడాలని సూచించింది. జిల్లా కలెక్టర్లు ఒకటి రెండు రోజుల్లోనే ట్రాన్స్పోర్టు అసోసియేషన్ ప్రతినిధులు, రవాణా శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, ఇసుక రవాణా ధరలు ఖరారు చేస్తారు. జీపీఎస్ పరికరాలు అమర్చుకుని, భూగర్భ గనుల శాఖ వద్ద రిజిస్టర్ చేసుకున్న వాహనాలతో స్టాక్ యార్డుల నుంచి ప్రజలకు ఇసుక రవాణా చేయవచ్చు. 58 స్టాక్ యార్డులు సిద్ధం ఏపీఎండీసీ ఇప్పటికే రాష్ట్రంలో 58 చోట్ల స్థలాలను గుర్తించి, ఇసుక స్టాక్ యార్డులకు అనువుగా తీర్చిదిద్దింది. విశాఖ, విజయనగరం జిల్లాల్లో నదులు లేనందున ఇసుక లభ్యం కాదు. ఈ రెండు జిల్లాలకు శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఇసుక తరలిస్తున్నారు. విశాఖపట్నంలోని అగనంపూడి, ముడసర్లోవలో స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి, లారీల్లో పొరుగు జిల్లాల నుంచి ఇసుక తరలిస్తున్నారు. ఈ జిల్లాలోని స్టాక్ యార్డులకు ఇసుకను సుమారు 150 కిలోమీటర్ల నుంచి తరలించాల్సి ఉంటుంది. అందువల్ల ఎక్కువ ఖర్చవుతుంది. అన్ని జిల్లాల్లో రీచ్ల నుంచి స్టాక్ యార్డులకు ఇసుక తరలింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. 102 రీచ్ల నుంచి ఇసుక తరలించి ప్రజలకు అందిస్తారు. ఇసుకకు డిమాండ్ అధికంగా ఉన్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కొత్త రీచ్లను గుర్తించి, చట్టబద్ధమైన అనుమతులు తీసుకునే ప్రక్రియను కూడా అధికార యంత్రాంగం వేగవంతం చేసింది. ఇసుక తవ్వే రీచ్ల సంఖ్యను దశలవారీగా 303కు పెంచాలని భూగర్భ గనుల శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. సాధ్యమైనంత వరకూ సమీప ప్రాంతాల నుంచే ఇసుక అందించాలనే ఉద్దేశంతో స్టాక్ యార్డుల సంఖ్యను 157కు పెంచేందుకు ప్రణాళిక తయారు చేశారు. నిర్వహణ వ్యయం ఎక్కువైనా... తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్లో ఇసుక తవ్వకం, స్టాక్ యార్డులకు తరలింపు తదితర నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంది. పర్యావరణ నిబంధనావళి ప్రకారం రీచ్లలో యంత్రాలు వినియోగించకుండా కూలీలతోనే ఇసుక తవ్వాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. అలాగే ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలకు ఏమాత్రం ఆస్కారం లేకుండా నిరంతర నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. దీంతో తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్లో నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంది. అయినప్పటికీ ప్రజల ప్రయోజనార్థం సరసమైన ధరలకే ఇసుక అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అందువల్లే తెలంగాణలో టన్ను ఇసుక ధర రూ.400 ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్లో రూ.375కే ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. టన్ను ఇసుకకు గరిష్టంగా రూ.225 ఖర్చు ఇసుకను రీచ్ల నుంచి స్టాక్ యార్డులకు చేరవేసి, అక్కడి నుంచి ప్రజలకు అందించడానికి మొత్తం నిర్వహణ వ్యయం, పన్నులు కలిపి టన్నుకు దాదాపు రూ.225 ఖర్చవుతుందని అధికారులు లెక్కగట్టారు. రీచ్లో ఇసుకను తవ్వి స్టాక్ యార్డుకు చేరవేయడానికి కాంట్రాక్టర్లకు ఇచ్చే మొత్తమే టన్నుకు రూ.100 అవుతోంది. ఒక్కో స్టాక్ యార్డులో 14 మంది ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వాల్సి ఉంటుంది. టన్ను ఇసుకకు యార్డుల నిర్వహణకు సగటున రూ.30, జీఎస్టీ రూ.22, సీనరేజి రూ.33, జిల్లా మినరల్ ఫండ్(డీఎంఎఫ్) రూ.10, మెరిట్, ఐటీ, ఇతరత్రా అన్నీ కలిపితే అయ్యే వ్యయం రూ.225. స్టాక్ యార్డుల్లో టన్ను ఇసుక రూ.375కు విక్రయిస్తే ఖర్చులు పోను ప్రభుత్వానికి రూ.150 మిగులుతుందని అంచనా. ఇలా మిగిలే మొత్తాన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.16.38 కోట్లు ఇవ్వండి: ఏపీఎండీసీ ఇసుక దారి మళ్లకుండా పకడ్బందీగా నిఘా పెట్టేందుకు సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫైబర్ నెట్ తదితర ఏర్పాట్ల కోసం రూ.16.38 కోట్లు మూలధన నిధి కింద విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఏపీఎండీసీ కోరింది. స్టాక్ యార్డులకు ఫైబర్ నెట్ కోసం ఇప్పటికే రూ.38 లక్షలు చెల్లించామని ఆర్థిక శాఖకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. -
భారీ పెనాల్టీల అమలులో జాప్యం?
సాక్షి, హైదరాబాద్: రోడ్డు రవాణా నిబంధనలు అతిక్రమిస్తే అతి భారీ పెనాల్టీలు విధించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేయడంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వాహనదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న పెనాల్టీలను ఏకంగా పది రెట్లు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే. సెపె్టంబర్ ఒకటి నుంచి కొత్త పెనాల్టీలు అమలులోకి రావాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పునరాలోచనలో పడింది. ఒకేసారి ఏకంగా పది రెట్లకు పెనాల్టీలు పెంచటం సబబు కాదన్న అభిప్రాయంతో ఉంది. ఆదివారం నుంచే అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా ఉత్తర్వు జారీ చేయాల్సి ఉంటుంది. కానీ శనివారం రాత్రి వరకు ఉత్తర్వు విడుదల కాలేదు. శనివారం సాయంత్రం రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్శర్మ రవాణా శాఖ అధికారులతో భేటీ అయ్యారు. కొత్త పెనాల్టీల సర్క్యులర్ను అధికారులు ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా అతి భారీ పెనాల్టీల పర్యవసానాలపై వారు చర్చించారు. సమావేశం నుంచే ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల అధికారులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్ట సవరణలోని అంశాలకు కొన్ని సవరణలు కోరుతూ కేంద్రానికి ప్రతిపాదన పంపాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని సునీల్శర్మ రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. వెరసి ఆదివారం నుంచి ఇవి అమలులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. -
రాష్ట్ర రెవెన్యూపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర రెవెన్యూపై వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంపులు, రవాణా శాఖ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులెలా ఉన్నాయో విభాగాల వారీగా ఆయా శాఖల అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. అనంతరం సీఎం జగన్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ‘మద్య నియంత్రణ, నిషేధం అమలుకు ఎన్ఫోర్స్మెంట్, పోలీసు విభాగాలను మరింత బలోపేతం చేయాలి. స్మగ్లింగ్ జరగకుండా.. నాటు సారా తయారీ కాకుండా కఠిన చర్యలు చేపట్టాలి. మద్యం వల్ల వచ్చే అనర్థాలపై పాఠ్యప్రణాళికలో చేర్చాలి. గ్రామ సెక్రటేరియట్ ఉద్యోగులకు మద్య నియంత్రణ, నిషేధంపై శిక్షణనివ్వాలి. మద్య నిషేధం అమలుకోసం గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుల సేవల్ని వినియోగించుకోవాలి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లంచాల వ్యవస్థ ఉండకూడదు’అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులిలా.. అంతకు ముందు ఆయా శాఖల అధికారులు సీఎం దృష్టికి పలు అంశాలు తీసుకొచ్చారు. వాణిజ్యపన్నుల్లో 14శాతం వృద్ధి ఉండాల్సి ఉండగా 5.3శాతానికి తగ్గిందని అధికారులు సీఎంకు వివరించారు. గడచిన నాలుగు నెలల్లో ఆదాయంలో అనుకున్నంతమేర వృద్ధిలేదని తెలిపారు. స్టీల్, ఇనుము, సిమెంటు రేట్లు కూడా తగ్గడం ఆదాయంపై ప్రభావం చూపుతోందని అన్నారు. వాహన రంగంలో మందగమనం వల్ల జీఎస్టీ తగ్గిందని పేర్కొన్నారు. కాని, ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఆదాయాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. జీఎస్టీ పరిహారం కింద వచ్చే నెల (సెప్టెంబర్) మొదటివారంలో రూ.597 కోట్లు ఆదాయం వస్తుందని సీఎంకు తెలిపారు. వాణిజ్య పన్నుల్లో 14శాతం వృద్ది ఉంటుందని అన్నారు. లిక్కర్ వినియోగం గణనీయంగా తగ్గిందని చెప్పారు. 2018–2019లో 125 లక్షల కేసుల లిక్కర్ విక్రయాలు జరగగా.. బెల్టుషాపుల ఏరివేత వల్ల 2019 జులై వరకూ 12 లక్షల కేసుల వినియోగం తగ్గిందని చెప్పారు. ప్రైవేటు మద్యం దుకాణాలు తొలగింపునకు రంగం సిద్ధమైందని తెలిపారు. దుకాణాల సంఖ్య 4380 నుంచి 3500 తగ్గిస్తున్నామన్నారు. మద్యనియంత్రణ, నిషేధానికి, డీఎడిక్షన్ సెంటర్లకు రూ.500 కోట్లు పెంచుతున్నామన్నారు. -
కోడెల కుమారుడిపై కేసు
సాక్షి, గుంటూరు: బైక్ల విక్రయాల్లో భారీ కుంభకోణానికి పాల్పడిన శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామకృష్ణపై పోలీసు కేసు నమోదు అయింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.80 లక్షలు స్వాహా చేసినట్లు గుర్తించిన రవాణా శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు చుట్టుగుంట సెంటర్లో కోడెల శివరామ్కు గౌతమ్ హీరో బైక్ షోరూమ్ ఉంది. దీనికి అనుబంధంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా అనధికారికంగా 50కుపైగా సబ్ డీలర్లు ఉన్నారు. గత కొన్ని రోజులుగా శివరామ్ షోరూమ్లో టీఆర్ (తాత్కాలిక రిజిస్ట్రేషన్) లేకుండా బైక్లు డెలివరీ చేస్తున్నారు. దీనిపై గత ఏడాదే రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయి. అయితే కోడెల తనయుడి షోరూమ్ కావడంతో గత ప్రభుత్వ హయాంలోను అధికారులు గౌతమ్ షోరూమ్ జోలికి వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల మళ్లీ ఫిర్యాదులు రావడంతో రవాణా శాఖ కమిషనర్ విచారణ చేయించారు. గత ఏడాది కాలంలో టీఆర్ లేకుండా 1,025 బైక్లు విక్రయించినట్లు విచారణలో గుర్తించారు. టీఆర్, లైఫ్ ట్యాక్స్, శాశ్వత రిజిస్ట్రేషన్ తదితర ఫీజుల కింద ఒక్కో బైక్కు సగటున రూ.8వేల చొప్పున వినియోగదారుల నుంచి వసూలు చేసిన శివరామ్ ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించకుండా నొక్కేశారు. కేసు నమోదు.. విచారణ అనంతరం గుంటూరు జిల్లా ఉపరవాణా కమిషనర్ మీరాప్రసాద్ గౌతమ్ హీరో షోరూమ్ యజమాని శివరామ్పై నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 1,025 బైక్లు టీఆర్ లేకుండా విక్రయించి 1989 కేంద్ర మోటర్ వాహన చట్టం నిబంధన 42ను కోడెల శివరామ్ అతిక్రమించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కోడెల శివరామ్పై ఐపీసీ 406, 409, 420, 468, 471 సెక్షన్ల కింద శనివారం కేసు నమోదు చేశారు. -
టాక్సీ,ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఆసరా
సాక్షి, విజయవాడ: టాక్సీ, ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగించేవరికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని రవాణాశాఖ కమిషనర్ సీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి వాహన బీమా, ఫిట్నెస్, మరమ్మత్తుల నిమిత్తం రూ. 10 వేలు ఇవ్వనుందని, దీని కోసం రూ.400 కోట్ల నిధుల్ని విడుదల చేయనుందని వెల్లడించారు. రహదారి భద్రత కోసం 50 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఈ నిధులతో భద్రతా ప్రమాణాలు పెంపొందించేందుకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేస్తామన్నారు. ఆరు నెలల కాలంలో 9 జిల్లాల్లో సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 100 షోరూంలలో తనిఖీలు నిర్వహించామని, వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరిగినట్టు బయటపడిందని అన్నారు. ఇన్వాయిస్లు తక్కువగా చూపించి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టిన వారిపై చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఈ క్రమంలొ గుంటూరు జిల్లాకు చెందిన గౌతమ్ హీరో షోరూమ్పై చర్యలు తీసుకున్నామని తెలిపారు. అనంతపురంలోని మారుతి డీలర్పై 41 లక్షల రూపాయలు టాక్స్లు, అదనంగా 41.41 లక్షల రూపాయలు జరిమానా విధించామన్నారు. అక్రమాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
కోడెల తనయుడి బైక్ షోరూమ్ సీజ్
సాక్షి, గుంటూరు, అమరావతి/నరసరావుపేట, నగరంపాలెం (గుంటూరు): అధికారం ఉన్నప్పుడు ‘కేట్యాక్స్’ వసూలు చేయడంలోనే కాదు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్ను ఎగ్గొట్టడంలోనూ కోడెల కుటుంబానిది అందె వేసిన చెయ్యి. పారదర్శకత కోసం రవాణా శాఖలో ప్రవేశపెట్టిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ను అడ్డుగా పెట్టుకుని శివరామ్ భారీ స్కామ్కు పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. తాను నిర్వహిస్తున్న గౌతమ్ హీరో బైక్ షోరూమ్లో నిబంధనలకు విరుద్ధంగా వాహన విక్రయాలు నిర్వహించి, ప్రభుత్వానికి వెళ్లాల్సిన రూ.కోటి వరకూ స్వాహా చేశాడు. దీంతో ఆ షోరూమ్లను సీజ్ చేశారు. గౌతమ్ హీరో షోరూమ్లో గత ఆరు నెలల్లో 800 బైక్లకు టీఆర్ లేకుండానే విక్రయించినట్టు తెలుస్తోంది. దీని ద్వారా కోడెల శివరామ్ ప్రభుత్వ ఆదాయానికి రూ.కోటి వరకూ గండి కొట్టారని ప్రాథమిక విచారణలో తేలింది. నిబంధనల ప్రకారం నూతన వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ చార్జి కింద ప్రభుత్వానికి రూ.1000–1300 వరకూ చెల్లించాలి. లైఫ్ ట్యాక్స్ కింద బైక్ ధరపై 9–14శాతం కట్టాలి. గౌతమ్ షోరూమ్ నుంచి విక్రయించిన బైక్లన్నీ రూ.60 వేల నుంచి రూ.2 లక్షల మధ్య ఉన్నాయి. ఈ లెక్కన ఒక్కో బైకుకు రూ.6వేల నుంచి రూ.20 వేల వరకు చెల్లించాల్సి ఉండగా కోడెల శివరామ్ ప్రభుత్వానికి చెల్లించకుండా స్వాహా చేశారు. అక్రమాలు తేలడంతో గుంటూరులోని గౌతమ్ షోరూమ్తో పాటు, నరసరావుపేటలో హీరో కంపెనీ ద్విచక్రవాహనాలకు ఆధరైజ్డ్ డీలర్గా వ్యవహరిస్తున్న యర్రంశెట్టి మోటార్ షోరూమ్, సర్వీసు సెంటర్లను రవాణా వాహనాల అధికారులు శనివారం సీజ్ చేశారు. కోడెల కుటుంబానికి సన్నిహితులైన యర్రంశెట్టి రాము, బాబ్జీ సోదరులు దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలలో 300 వాహనాలకు లెక్కతేలలేదని ఎం.వి.ఐ. అనిల్కుమార్ తెలిపారు. పన్నులు చెల్లించని డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రవాణా శాఖ కమిషనర్ పి.సీతారామాంజనేయులు ఎస్పీకి సూచించారు. వాహనాల రిజిస్ట్రేషన్లో అవకతవకలపై విచారణ గౌతమ్ హీరో షోరూంలో అవకతవకలు జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదుపై విచారణ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రవాణాశాఖకు లైఫ్ టాక్స్లు చెల్లించకుండా, తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయకుండా వాహనాలు విక్రయించినట్లు తేలిందన్నారు. దీంతో శనివారం గౌతమ్ హీరో, యర్రంశెట్టి హీరో షోరూంలను సీజ్ చేశామన్నారు. – జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ప్రసాదరావు -
విశాఖలో ఐ అండ్ సీ సెంటర్
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం గ్రామంలో ఇన్స్పెక్షన్ అండ్ సర్టిఫికేషన్ సెంటర్ (ఐ అండ్ సీ సెంటర్) ఏర్పాటు చేసేందుకు రవాణా శాఖ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఈ సెంటరును మంజూరు చేసింది. దీని నిర్మాణానికి స్థలం చూపిస్తే ఏర్పాటుకు అయ్యే వ్యయం మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. ఇప్పటికే ఐ అండ్ సీ సెంటరు నిర్మాణాన్ని ఏపీలో చేపట్టేందుకు రూ.16.5 కోట్లు కేటాయించాలని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ (ఎంఓఆర్టీహెచ్) కేంద్రానికి సిఫారసు చేసింది. అయితే విభజన హామీ అయిన ఐ అండ్ సీ సెంటర్ను రాష్ట్రంలో ఏర్పాటు చేసుకునేందుకు గత ప్రభుత్వం నాన్చివేత వైఖరి అవలంబించింది. గన్నవరంలో ఏర్పాటు చేస్తున్నామని ఊదరగొట్టారే తప్ప సెంటు స్ధలం కేటాయించలేదు. ఐ అండ్ సీ ట్రాక్లపై రవాణా వాహనం వెళితే లోపాలన్నీ తెలుస్తాయి. ఫిట్నెస్ పరీక్షలు మాన్యువల్ విధానంలో రవాణా ఇన్స్పెక్టర్లు నిర్వహిస్తున్నారు. ఐ అండ్ సీ సెంటర్ ఏర్పాటైతే ఫిట్నెస్ పరీక్షలు మొదలు అన్నీ ఆటోమేషన్ విధానంలోనే జరుగుతాయి. విశాఖ జిల్లాలో 14 ఎకరాల స్ధలం విశాఖ జిల్లా గంభీరం వద్ద రవాణా శాఖకు 14 ఎకరాల స్ధలం ఉండటంతో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం మళ్లీ తాజాగా ప్రతిపాదనలు పంపింది. ఇక్కడే డ్రైవింగ్ ట్రాక్లు ఉండటంతో త్వరితగతిన ఐ అండ్ సీ సెంటరు ఏర్పాటు చేయాలని రవాణా శాఖ కేంద్రాన్ని కోరింది. డ్రైవింగ్ ట్రాక్ల ఏర్పాటుకు రాజధానిలో స్ధల సమస్య ఉండటంతో ఇటీవలే అధికారులు సీఆర్డీఏ కమిషనర్కు లేఖ రాశారు. నాలుగేళ్ల క్రితం 9 జిల్లాల్లో ఆటోమేషన్ విధానంలో డ్రైవింగ్ పరీక్షలకు డ్రైవింగ్ ట్రాక్ల ఏర్పాటుకు కేంద్రం రూ.9 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో విశాఖ, కాకినాడ, ఏలూరు,విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురంలలో ఆటోమేషన్ విధానంలో డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించేందుకు రవాణా శాఖ నిర్ణయించింది. -
అమలు సరే.. అమ్మేవారెవరు..!
సాక్షి, సిటీబ్యూరో: వాహనాల వేగానికి కళ్లెం వేసేందుకు రవాణాశాఖ సన్నద్ధమైంది. రహదారి భద్రత దృష్ట్యా రవాణా వాహనాలు పరిమితమైన వేగంతోనే పరుగులు తీయాలని ఆదేశించింది. వేగాన్ని నియంత్రించే పరికరాలైన స్పీడ్గవర్నర్స్ను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇవి లేని వాహనాలను ఫిట్నెస్ లేని వాటిగా గుర్తించి కేసులు నమోదు చేయనున్నట్లు అధికారులు హెచ్చరించారు. స్కూల్ బస్సులతో పాటు మరో నాలుగు రకాల వాహనాలకు ఈ నిబంధనను తప్పనిసరి చేశారు. స్కూళ్లు తెరుచుకొనే నాటికే దీనిని అమలు చేయాలని భావించినప్పటికీ సమయం తక్కువగా ఉండడం వల్ల ఆగస్టు వరకు పొడిగించారు. అయితే ఇప్పటి వరకు స్పీడ్గవర్నర్లను విక్రయించే డీలర్లు, తయారీదారుల జాబితాను మాత్రం ఆర్టీఏ సిద్ధం చేయలేదు. వచ్చే నెల ఒకటో తారీఖు నుంచే అమలు కావలసిన ఈ నిబంధనపై అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు రవాణాశాఖ అనుమతి లేని విక్రయ సంస్థల నుంచి ఏర్పాటు చేసుకొనే స్పీడ్ గవర్నర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తాము పరిగణనలోకి తీసుకోబోమని రవాణా అధికారులు తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఒకవైపు స్పీడ్ గవర్నర్ల ఏర్పాటును తప్పనిసరి చేసిన అధికారులు మరోవైపు అధీకృత డీలర్లు, విక్రేతలను ఇప్పటి వరకు నిర్ధారించకపోవడం వాహనదారులను గందరగోళానికి గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు నుంచి స్పీడ్గవర్నర్లు ఏ మేరకు అమలు జరుగుతాయనే దానిపై సందేహం నెలకొంది. వేగానికి కళ్లెం ఇలా... రహదారి భద్రత దృష్ట్యా అన్ని రకాల రవాణా వాహనాలకు వేగాన్ని నియంత్రించారు. నగరంలో తిరిగే స్కూల్ బస్సులు, చెత్త తరలింపు వాహనాలు, నీళ్ల ట్యాంకర్లు, 8 సీట్ల కంటే ఎక్కువ ఉన్న మ్యాక్సీ క్యాబ్లు గంటకు 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్లకుండా స్పీడ్ గవర్నర్లు అమర్చుకోవాలి. హైవేలపైన రాకపోకలు సాగించే సరుకు రవాణా లారీలు, ప్రయాణికుల రవాణా బస్సులు గంటకు 80 కిలోమీటర్ల వేగాన్ని మించరాదు. ఇందుకనుగుణంగా స్పీడ్ గవర్నర్లను ఏర్పాటు చేయాలి. 2015 అక్టోబర్ 1 నుంచి నమోదైన రవాణా వాహనాలకు ఇది వర్తిస్తుంది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, క్వాడ్రాసైకిళ్లు, ఫైరింజన్లు, అంబులెన్సులు, పోలీసు వాహనాలకు ఈ నిబంధన వర్తించదు. ఈ వాహనాలకు మినహాయింపును ఇచ్చారు. 2020 నాటికి రోడ్డు ప్రమాదాలను 20 శాతానికి తగ్గించాలనే లక్ష్యంతో తెచ్చిన ఈ నిబంధన జూన్ రెండో వారం నుంచే అమలు చేయాలని భావించినప్పటికీ అప్పటికే చాలా వరకు స్కూల్ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు ముగిసి విద్యార్థులకు అందుబాటులోకి రావడంతో గడువును ఆగస్టు వరకు పొడిగించారు. ఏఆర్ఏఐ ఆమోదించిన విక్రేతలెవరు... వాహనాల ఇంజన్ సామర్థ్యం, వేగ నియంత్రణ ప్రమాణాలు, తదితర అంశాలపై అధ్యయనం చేసి ఆమోదించే ఆటోమొబైల్ రీసెర్చ్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) నుంచి ఆమోదం పొందిన స్పీడ్గవర్నర్లను మాత్రమే వాహనాలకు బిగించాలని రవాణాశాఖ నిర్ణయించింది. ఇలా ఏఆర్ఏఐ నుంచి అనుమతులు పొందిన విక్రయ సంస్థలు, డీలర్లు రవాణా కమిషనర్ నుంచి ధృవీకరణ పొందాలి. ఏఆర్ఏఐ అనుమతులు కలిగి, తమ వద్ద నమోదైన విక్రేతల జాబితాను రవాణాశాఖ వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఈ జాబితాలో ఉన్న డీలర్లు లేదా విక్రయ సంస్థల నుంచి మాత్రమే వాహనదారులు స్పీడ్గవర్నర్లను కొనుగోలు చేయాలి. అయితే ఇప్పటి వరకు అలాంటి జాబితాను రవాణా అధికారులు సిద్ధం చేయలేదు. పైగా తమ వద్ద గుర్తింపు లేని డీలర్ల నుంచి స్పీడ్ గవర్నర్లను ఏర్పాటు చేసుకుంటే పరిగణనలోకి తీసుకోబోమంటూ తాజాగా ప్రకటించడం గమనార్హం. -
విద్యుత్ బస్సులపై ప్రతిపాదనలు రెడీ!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ బస్సుల్ని నడిపేందుకు ఆర్టీసీ ప్రతిపాదనల్ని సిద్ధం చేసింది. నిర్వహణ వ్యయం భారీగా తగ్గించేందుకు 350 బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తే మేలని నిర్ణయించారు. ఇందుకు రూ. 764 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. విజయవాడ, అమరావతి, విశాఖపట్టణం, తిరుపతి, కాకినాడ నగరాల్లో విద్యుత్ బస్సులను తిప్పనున్నారు. ఏటా ఆర్టీసీ 32 కోట్ల లీటర్ల మేర డీజిల్ను వినియోగిస్తుండగా... ధరల పెరుగుదలతో రూ.300 కోట్ల వరకు నష్టాల్ని చవి చూస్తోంది. ఈ భారం నుంచి ఆర్టీసీని గట్టెక్కించడానికి ఇటీవల ప్రభుత్వం విద్యుత్ బస్సుల నిర్వహణపై నిపుణుల కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. డీజిల్ బస్సులు నడపడం వల్ల కి.మీ.కు డ్రైవరు జీతభత్యంతో కలిపి రూ. 38 వరకు ఖర్చవుతుంది. అదే విద్యుత్తు బస్సు నిర్వహణ ఖర్చు కి.మీ.కి రూ. 19 వరకే అవుతుందని కమిటీ తేల్చింది. ఈ నెల 26న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన అధ్యయన కమిటీ రిటైర్డ్ ఐపీఎస్ ఆంజనేయరెడ్డి అధ్యక్షతన భేటీ కానుంది. ఈ కమిటీకి ఆర్టీసీ ప్రతిపాదనలు అందించనుంది. ఆ టెండర్లు రద్దు.. ఎన్నికల ముందు విద్యుత్ బస్సులు నడపడానికి ఆర్టీసీ ప్రైవేటు కంపెనీలతో చర్చలు జరిపింది. అయితే కి.మీ.కి రూ. 65 వరకు అవుతుందని ప్రైవేటు నిర్వాహకులు స్పష్టం చేశారు. ఆ తర్వాత 80 విద్యుత్ బస్సులను నిర్వహించేందుకు ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. ఒకే ఒక్క కంపెనీ అందులో పాల్గొనగా... ఎక్సెస్ రేట్లకు టెండర్లు దాఖలు చేయడం గమనార్హం. నిర్వహణకు కి.మీ.కు రూ. 38 చెల్లించేలా ఆర్టీసీ టెండర్లలో పొందుపరిస్తే, టెండర్లలో పాల్గొన్న కంపెనీ కిలోమీటరుకు రూ. 50కి పైగా కోట్ చేసింది. ఇప్పుడు ఆ టెండర్లను రద్దు చేయాలని నిర్ణయించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఫేమ్-2 పథకం కింద రాయితీ అందిస్తే విద్యుత్తు బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేస్తే మేలని ప్రతిపాదనలు రూపొందించారు. ఛార్జింగ్ చేస్తే ఏడు నుంచి ఎనిమిది గంటలు రాష్ట్రాల్లో ఇంధన పొదుపు చర్యలు చేపట్టేందుకు గాను ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని కేంద్రం ఫేమ్-2 పథకాన్ని నిర్వహిస్తోంది. సాధారణంగా విద్యుత్ బస్సు కొనుగోలు చేయాలంటే రూ. 2 కోట్ల నుంచి రూ. 2.5 కోట్ల వరకు ఖరీదు ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 50 శాతం రాయితీ ఇవ్వనుంది. ఎలక్ట్రిక్ బస్సులో సీసీ కెమెరా, 31 సీట్ల సామర్థ్యం ఉంటుంది. ఆటోమేటిక్ గేర్లతో బస్సు నడుస్తుంది. రెండు గంటలు ఛార్జింగ్ చేస్తే నిరంతరాయంగా ఏడు నుంచి ఎనిమిది గంటలు బస్సు నడుస్తుందని ఆర్టీసీ ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. కేంద్రం సాయం కోరేందుకు ప్రతిపాదనలు రాష్ట్రంలో నడిపేందుకు ప్రభుత్వమే విద్యుత్ బస్సులను కొనుగోలు చేస్తుంది. ఇందుకు కేంద్ర సాయం కోరేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. విద్యుత్తు బస్సు నిర్వహణ వ్యయం డీజిల్ బస్సు నిర్వహణ వ్యయంతో పోలిస్తే కిలోమీటరుతో సగానికి సగం తక్కువగా ఉంది. ఈ నెల 26న అధ్యయన కమిటీతో భేటీ కానుంది. అందరం చర్చించి మెరుగైన ప్రజారవాణా వ్యవస్థ అందుబాటులోకి తెస్తాం. - పేర్ని వెంకట్రామయ్య (నాని), రవాణా శాఖ మంత్రి -
మెట్రో నగరాల్లో 350 ఎలక్ట్రిక్ బస్సులు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని మెట్రో నగరాల్లో త్వరలో 350 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నట్టు రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రకటించారు. ఆర్టీసీని అన్ని విధాలా ఆదుకుంటామని, దేశంలోనే అత్యుత్తమ ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రవాణా, సమాచారశాఖ మంత్రిగా ఆయన గురువారం వెలగపూడి సచివాలయం ఐదో బ్లాక్లోని తన చాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. దివ్యాంగులు ఒకసారి బస్పాస్ తీసుకుంటే మూడేళ్ల పాటు చెల్లుబాటయ్యే ఫైలుపై తొలి సంతకం చేశారు. అనంతరం నాని మీడియాతో మాట్లాడుతూ రవాణాశాఖ కార్యాలయాల్లో కూడా లైసెన్సులకు దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త వాహనాల కొనుగోలు సమయంలో డీలర్ వద్దే రిజిస్ట్రేషన్ చేయాలని, 24 గంటల్లోగా ఆర్టీవో అనుమతులివ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలిచ్చేందుకు సీఎం సూత్రప్రాయంగా అంగీకరించినట్టు మంత్రి చెప్పారు. ఫిట్నెస్ లేకుంటే సీరియస్గా పరిగణిస్తాం .. ఈ నెల 13 నుంచి ఫిట్నెస్ లేని వాహనాల విషయంలో తనిఖీలు చేపట్టి 624 స్కూల్ బస్సులపై కేసులు నమోదు చేశామని.. ఇప్పటిదాకా 357 బస్సులను సీజ్ చేసినట్లు తెలిపారు. ఫిట్నెస్ లేకుండా విద్యా సంస్థల బస్సులు పట్టుబడితే ఇకపై సీరియస్గా పరిగణిస్తామని మంత్రి స్పష్టం చేశారు. విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నాయని, తమ బస్సులకు ఫిట్నెస్ లేదని చెప్పకుండా రవాణాశాఖ అధికారులపై తప్పులు నెడుతున్నాయన్నారు. ఫిట్నెస్ లేని విద్యా సంస్థల బస్సుల విషయంలో తల్లిదండ్రులు తమకు సహకరించాలని మంత్రి కోరారు. -
ఆ వివరాలు ప్రజల ముందు ఉంచుతాం
సాక్షి, అమరావతి : ఈ నెల 13 నుంచి ఫిట్నెస్లేని 624స్కూల్ బస్సులపై కేసులు బుక్ చేశామని, ఇప్పటిదాకా 357 బస్సులను సీజ్ చేశామని, ఆ వివరాలన్నింటిని ప్రజల ముందు ఉంచుతామని రవాణా, సమాచారం శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. సచివాలయంలో ఐదో బ్లాక్లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దివ్యాంగులకు ఆర్టీసీ బస్ పాసులు మూడేళ్లకు ఒకసారి తీసుకునేలా మొదటి ఫైలుపై సంతకం చేశారు. మెట్రో నగరాల్లో 350 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించారు. రవాణాశాఖ కార్యాలయాల్లో కూడాల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. కొత్త వాహనాల కొనుగోలు సమయంలో డీలర్ వద్దనే రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. 24 గంటల్లోనే ఆర్టీవో అప్రూవల్ ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలోని జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సీఎం సూత్రప్రాయంగా అంగీకరించారని తెలిపారు. -
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు : పేర్ని నాని
సాక్షి, అమరావతి : రాష్ట్రానికి రెవెన్యూ తీసుకొచ్చే శాఖల్లో రవాణా శాఖ నాల్గో స్థానంలో ఉందని.. ఆర్టీసీ బస్టాండ్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు వ్రికయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది రవాణా శాఖ నుంచి నాలుగు వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. పైస్థాయి నుంచి అవినీతి నిర్మూలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. రవాణా శాఖలో దళారీ వ్యవస్థను అరికట్టేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు నాలుగు వేల బస్సుల ఫిట్నెస్ను తనిఖీ చేశామని తెలిపారు. సచివాలయంలో త్వరలో ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు. -
రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ బస్సుల తనిఖీలు
సాక్షి, విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏపీలోని 13 జిల్లాల్లో ఉదయం నుంచి రవాణాశాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. డీటీసీ మీరా ప్రసాద్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బస్సులను తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 152 బస్సులపై కేసులు నమోదుచేయగా.. వాటిలో 125 బస్సులను రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీటీసీ మీరా ప్రసాద్ మాట్లాడుతూ.. స్కూల్ బస్సుల ఫిట్నెస్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోందని తెలిపారు. రవాణాశాఖ మంత్రి, కమిషనర్ల ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తున్నామని చెప్పారు. ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేస్తున్నామన్నారు. విద్యార్థులను తరలించే ప్రైవేట్ వాహనాలు, ఆటోలను కూడా తనిఖీ చేస్తున్నామని వెల్లడించారు. స్కూల్ బస్సులతో పాటు అందరూ రవాణాశాఖ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. -
ఇన్చార్జ్లతో ఆర్టీసీ అస్తవ్యస్తం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఆయన ఓ ఉన్నతాధికారి. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న బస్భవన్లో ఇన్చార్జి ఈడీగా ఉన్నారు. ఆయన అసలు పోస్టు ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్. హైదరాబాద్–ఆదిలాబాద్ మధ్య 300 కి.మీ. దూరం ఉంటుంది. ఇంతదూరంలో ఉన్న రెండు ప్రాంతాల్లో ఒకే వ్యక్తి ఎలా పనిచేయగలరు. ఇది ఆర్టీసీలో ఉన్న గందరగోళానికి ఓ నిదర్శనం. ఇదే అధికారి ఈనెలాఖరున పదవీ విరమణ పొందనున్నారు. సీనియారిటీ క్రమంలో ఆయనకు ఈడీ పదోన్నతి రావాలి. కానీ, ఎన్నికల కోడ్ పేరుతో ఇంతకాలం కాలయాపన జరిగింది. కోడ్ ముగిసినా ఇప్పటివరకు పదోన్నతుల ఊసు లేదు. ఇలాగే ఉంటే ఆయన ఈడీగా కాకుండా అంతకంటే ఓ మెట్టు దిగువన ఉండే రీజినల్ మేనేజర్గానే పదవీ విరమణ పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం దాదాపు పది ప్రాంతాల్లో పూర్తిస్థాయి ఆర్ఎంలు, డీవీఎంలు లేరు. ఎక్కడెక్కడో ఉన్న వారితో ఇన్చార్జులుగా నెట్టుకొస్తున్నారు. ఇంత గందరగోళంగా ఉన్న ఆర్టీసీకి అసలు పూర్తిస్థాయి ఎండీనే లేకపోవటంతో ఈ పదోన్నతులు, బదిలీల గందరగోళం తీవ్రమైంది. మూడు పోస్టులతో సతమతమవుతున్న ఇన్చార్జి ఎండీకి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ, కీలక అంశాలకు సంబంధించిన ఫైళ్లను సిద్ధం చేసేవారు కూడా లేకపోవటంతో అంతా అస్తవ్యస్తంగా తయారైంది. అసలే తీవ్ర నష్టాలతో దివాలా దిశలో సాగుతున్న ఆర్టీసీ... గాడిలో పడాల్సింది పోయి ఇలా గందరగోళంతో కుస్తీపడుతోంది. ఆ కమిటీ ఎక్కడుంది? రాష్ట్ర విభజన జరిగినా ఇప్పటికీ ఆర్టీసీ సాంకేతికంగా రెండు రాష్ట్రాల మధ్య విడిపోలేదు. దీంతో తెలంగాణ ఆర్టీసీకి పాలకమండలి లేదు. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సింది పాలకమండలి కావటంతో చాలా పనులు తాత్కాలిక పద్ధతిలో జరుగుతున్నాయి. పదోన్నతుల విషయంలోనూ అదే జరుగుతోంది. దీంతో గత సంవత్సరం సెప్టెంబర్లో ప్రభుత్వం సెలక్షన్, డిసిప్లినరీ కమిటీని నియమించింది. ఆర్టీసీ చైర్మన్, ఆర్టీసీ ఎండీ, జీహెచ్ఎంసీ కమిషనర్, రవాణా శాఖ, ఫైనాన్స్ (ట్రాన్స్పోర్టు), కార్మిక శాఖల కార్యదర్శులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సమావేశమై కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ఇది అమలులో ఉంటుంది. అంటే గతేడాది సెప్టెంబర్లో ఈ కమిటీ ఏర్పడినందున అంతకుముందు జరిగిన వాటిని రెగ్యులరైజ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం బస్భవన్లో పురుషోత్తమనాయక్, వినోద్కుమార్లు ఈడీలుగా పదోన్నతి పొంది పనిచేస్తున్నారు. వీరిద్దరిని కూడా ఈ కమిటీ రెగ్యులరైజ్ చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు కొత్త పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. ఎన్నికల కోడ్ రావటంతో గతేడాది చివరి నుంచి పదోన్నతులు ఆగిపోయాయి. పదోన్నతులు లేనందున కొత్త ఖాళీలు ఏర్పడక బదిలీలు కూడా నిలిచిపోయాయి. వాస్తవానికి ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటై ఉన్నందున, ఆ కమిటీ సమావేశమై బదిలీలు, పదోన్నతులపై నిర్ణయం తీసుకుని అత్యవసర పనిగా ఎన్నికల కమిషన్ ముందు ప్రతిపాదిస్తే ఆమోదం లభించే అవకాశం కూడా ఉండేదన్న అభిప్రాయం ఉంది. కానీ, ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు కమిటీ సమావేశమే కాలేదు. ఇప్పుడు ఎన్నికల కోడ్ ముగిసినా ఆ ఊసే లేక పాలన అంతా అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 20 కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సాక్షాత్తూ బస్భవన్లోనే ముగ్గురు ఈడీలు ఇన్చార్జులుగా ఉన్నారు. ఇటీవల ఆర్ఎం స్థాయిలో ఉన్న అధికారులను తాత్కాలిక పద్ధతిలో ఈడీలుగా కూర్చోబెట్టారు. పదోన్నతులు లేనందున వీరు పర్యవేక్షించే రెగ్యులర్ పోస్టుల్లో ఎవరినీ నియమించలేదు. ఈ ముగ్గురు అధికారులకు ఈడీ పదోన్నతి ఇస్తే వారు చూసే రెగ్యులర్ ఆర్ఎం కేడర్ పోస్టులు ఖాళీ అవుతాయి. వాటిని డీవీఎంలతో భర్తీ చేస్తారు. అలా ఖాళీ అయ్యే డీవీఎం పోస్టులను సీనియర్ డీఎంలతో భర్తీ చేస్తారు. వాటిని అసిస్టెంట్ డీఎం పోస్టులతో.. ఇలా కిందిస్థాయి వరకు పోస్టులు భర్తీ అవుతాయి. కానీ ఈ ప్రక్రియ జరగక అధికారుల్లో అయోమయం నెలకొంది. ఇక దాదాపు పది డిపోలకు పూర్తిస్థాయి డిపో మేనేజర్లు లేరు. వాటిని తాత్కాలిక పద్ధతిలో ఇతరులు పర్యవేక్షిస్తున్నారు. ఈ వ్యవహారం ఆర్టీసీ బస్సుల నిర్వహణపై పడుతోంది. సాధారణంగా రెండుమూడేళ్లు జిల్లాల్లో పనిచేసే పెద్ద అధికారులను ఆ తర్వాత నగరానికి బదిలీ చేస్తారు. కానీ ప్రస్తుతం నాలుగేళ్లు దాటినా తమకు హైదరాబాద్ భాగ్యం దక్కటం లేదని కొందరు అధికారులు వాపోతున్నారు. ఇక పాఠశాలలు తెరిచేలోపే బదిలీలు జరిగితే బాగుండేదని, ఇప్పుడు బడులు తెరిచినందున మధ్యలో ట్రాన్స్ఫర్స్ జరిగితే పిల్లల చదువులకూ ఇబ్బందులు ఏర్పడతాయని అధికారులు వాపోతున్నారు. ఈ వ్యవహారం మరోవైపు ఆర్టీసీ అధికారుల సంఘంలోనూ లుకలుకలకు కారణమైంది. బదిలీలు, పదోన్నతుల విషయంలో ఎండీపై ఒత్తిడి చేయటం లేదంటూ బాధ్యులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సంఘానికి ఎన్నికలు నిర్వహించాలంటూ కొందరు డిమాండ్ ప్రారంభించారు. ఇక సందట్లో సడేమియాగా జూనియర్ అధికారులు కొందరు పైరవీలతో పెద్ద పోస్టుల్లో తాత్కాలిక పద్ధతిలో నియామకమయ్యేలా చక్రం తిప్పుతున్నారు. -
రోడ్ల ఉపరితల నిర్మాణంలో నవశకం
సాక్షి, హైదరాబాద్: రోడ్ల ఉపరితల నిర్మాణ డిజైన్లలో అనుసరించాల్సిన నూతన పద్ధతులతోపాటు ఉపరితల నాణ్యతను కచ్చితంగా అంచనా వేసే విధానాన్ని ఐఐటీ హైదరాబాద్ పరిశోధక బృందం రూపొందించింది. సాంప్రదాయక రోడ్డు నిర్మాణ పద్ధతులతో వీటిని సరిపోల్చిన పరిశోధకులు నూతన విధానం ఆచరణ సాధ్యమని వెల్లడించారు. వీరి పరిశోధన ఫలితాలను ‘జర్నల్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్’అనే అంతర్జాతీయ జర్నల్ ప్రచురించింది. 2022 నాటికి దేశంలో 65 వేల కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులను నిర్మించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ నేపథ్యంలో ఐఐటీ (హెచ్) పరిశోధక బృందం రూపొందించిన నూతన నమూనా రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులకు ప్రయోజనకారిగా ఉంటుందని భావిస్తున్నారు. అమెరికా తర్వాత ప్రపంచంలో అత్యంత పొడవైన రోడ్ నెట్వర్క్ గల రెండో దేశంగా భారత్కు ప్రత్యేక స్థానం ఉంది. గణాంకాల పరంగా ప్రస్తుతం భారత్లో ప్రతీ వేయి మంది పౌరులకు సగటున 4.37 కిలోమీటర్ల పొడవైన రహదారులున్నాయి. వీటిలో జాతీయ, గ్రామీణ, అంతర్గత రహదారుల పేరిట అనేక రకాలైన రోడ్డు మార్గాలు ఉన్నాయి. 2 దశాబ్దాలుగా భారత్లో రహదారుల నిర్మాణం ఊపందుకోగా 2016 నుంచి 62.5 శాతం రహదారులకు సాంకేతిక పద్ధతిలో ఉపరితలం నిర్మించారు. ఉపరితల డిజైన్ కీలకం.. రోడ్ల నిర్మాణంలో ఉపరితల డిజైన్ అత్యంత సంక్లిష్లమైన ప్రక్రియ కాగా.. ట్రాఫిక్ రద్దీ, స్థానికంగా సహజంగా లభించే నిర్మాణ సామగ్రిని దృష్టిలో పెట్టుకుని డిజైన్ రూపొందించాల్సి ఉంటుంది. సుఖమయమైన ప్రయాణానికి వీలుగా అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఉపరితల నిర్మాణ డిజైన్ను ఇంజనీర్లు రూపొందిస్తారు. జారుడు స్వభావం లేకుండా, రాత్రివేళల్లో వాహనాల లైట్ల వెలుతురు పరావర్తనం చెందకుండా, శబ్ద కాలుష్యం తక్కువగా ఉండేలా రోడ్ల ఉపరితల నిర్మాణంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ఎక్కువ కాలం మన్నేలా నాణ్యత కలిగిన రోడ్డు ఉపరితల నిర్మాణంతోపాటు, ఉపరితల నాణ్యతను కచ్చితంగా అంచనా వేసే విధానాలను రూపొందించడంపై ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు ముందడుగు వేశారు. పొరలతో కూడిన ఉపరితలం.. అనుసరణీయం నేలపై వివిధ రకాల నిర్మాణ సామగ్రితో నిర్మించే పొరలపై రహదారి ఉపరితల నాణ్యత ఆధారపడి ఉంటుందని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ శిరీష్ సారిడే నేతృత్వంలోని పరిశోధక బృందం గుర్తించింది. సంక్లిష్టమైన పొరలతో నిర్మించే రోడ్డు ఉపరితలం నాణ్యతను నేల స్వభావం, నిర్మాణ సామగ్రి, స్థానిక పర్యావరణ, వాతావరణ పరిస్థితులు, వాహన రద్దీ తదితర అంశాలు ప్రభావితం చేస్తాయని తేల్చారు. వీటన్నింటినీ అధిగమించి రోడ్డు ఉపరితలం వాహన భారాన్ని తట్టుకునేలా డిజైన్ చేయాల్సి ఉంటుంది. నాలుగు రకాల పొరలతో కూడిన రహదారి నిర్మాణంపై ఉపరితల నాణ్యత ఆధారపడి ఉంటుందని పరిశోధనలో తేల్చారు. సాధారణంగా రోడ్లను సబ్గ్రేడ్, గ్రాన్యులార్ సబ్ బేస్, బేస్, బిటుమినస్ అనే 4 రకాలైన పొరలతో నిర్మిస్తారు. వీటిలో బిటుమినస్ లేయర్ మందం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునే బేస్ లేయర్పైనే ఉపరితల నాణ్యత ఆధారపడి ఉంటుందని పరిశోధక బృందం గుర్తించింది. మరమ్మతులు కూడా సులభం అత్యంత దృఢమైన కాంక్రీట్తో నిర్మించే రహదారులు వాహన భారాన్ని నేరుగా మోయగలిగినా.. నిర్మాణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. పొరలతో కూడిన రహదారుల నిర్మాణంలో స్థానికంగా లభించే నిర్మాణ సామగ్రిని వినియోగించే వీలుండటంతోపాటు, దశలవారీగా పనులు చేసే వీలుంటుంది. మరమ్మతులు చేయడం కూడా సులభమని పరిశోధకులు తేల్చారు. తాము రూపొందించిన నూతన రోడ్డు డిజైన్ను ‘రిలయబిలిటీ బేస్డ్ డిజైన్ ఆప్టిమైజేషన్ (ఆర్బీడీవో)’గా వ్యవహరిస్తున్న పరిశోధక బృందం.. తమ పరిశోధన ఫలితాలను రహదారుల ఉపరితల డిజైన్లకు మార్గదర్శిగా భావించే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ హైవేస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అఫీషియల్స్ (ఆష్తో) ప్రమాణాలతో పోల్చి చూశారు. ఆష్తో ప్రమాణాలతో పోలిస్తే తాము రూపొందించిన నూతన విధానం 10 నుంచి 40 శాతం మేర మెరుగ్గా ఉందని పరిశోధక బృందం సభ్యులు డాక్టర్ మునావర్ బాషా, పీఆర్టీ ప్రణవ్ వెల్లడించారు. -
వాహన కాలుష్యానికి.. ఆన్లైన్ తనిఖీలు
సాక్షి, హైదరాబాద్ : వాహన కాలుష్యానికి ఆన్లైన్ తనిఖీలతో కళ్లెం వేసేందుకు రవాణాశాఖ సన్నద్ధమవుతోంది. ఇప్పటివరకు మనుషుల ద్వారా నిర్వహించే కాలుష్య తనిఖీ పరీక్షలను ఇక నుంచి ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా నిర్వహించనున్నారు.కేంద్రమోటారు వాహన చట్టంలో రూపొందించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వాహనాలనే రోడ్లపైకి అనుమతిస్తారు. గ్రేటర్లో వాహన కాలుష్యం రోజు రోజుకు ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు ఏటేటా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న కొత్త వాహనాలతో పాటు, కాలం చెల్లిన వాహనాలు సైతం రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. పాత వాహనాలు ప్రమాదకరమైన కాలుష్యకారక పదార్ధాలను వెదజల్లుతున్నాయి. వాటికి నిర్వహించే కాలుష్య తనిఖీల్లో ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు ఉండడం లేదు. రోడ్లపై అక్కడక్కడా కనిపించే సంచార పరీక్షాకేంద్రాల్లో ఉత్తుత్తి తనిఖీలను నిర్వహించేస్తున్నారు. రూ.యాభయ్యో, రూ.వందో తీసుకొని కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రాలను ఇచ్చేస్తున్నారు. ఆర్టీఏ అధికారులు వాటినే ప్రామాణికంగా తీసుకొని వాహనాల సామర్థ్యాన్ని ధ్రువీకరిస్తున్నారు. దీంతో యథావిధిగా ఈ వాహనాలు భయంకరమైన కాలుష్యాన్ని చిమ్ముతున్నాయి. రవాణాశాఖ లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్లో ప్రస్తుతం 55 లక్షల వాహనాలు ఉన్నాయి. బీఎస్ –4 ప్రమాణాల మేరకు ఉన్న కార్లు, బైక్లు, తదితర వ్యక్తిగత వాహనాలు మినహాయిస్తే బస్సులు, ఆటోలు, లారీలు, ఇతర ప్రయాణికుల రవాణా వాహనాల్లో లక్షల కొద్దీ పాత వాహనాలే ఉన్నాయి. బీఎస్–2, బీఎస్–3 వాహనాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇలాంటి వాటి నుంచి ప్రమాదకరమైన సల్ఫర్, కార్బన్మోనాక్సైడ్, కార్బన్డయాక్సైడ్, లెడ్ వంటివి పెద్ద మొత్తంలో విడుదలవుతున్నప్పటికీ ఇప్పుడు ఉన్న మాన్యువల్ పద్ధతిలో సరిగ్గా నిర్ధారించలేకపోతున్నారు. పైగా కాలుష్య తనిఖీ నియంత్రణ స్టేషన్లపైన ఎలాంటి నిఘా లేకపోవడం వల్ల 80 శాతం ఉత్తుత్తి తనిఖీలతోనే వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ‘స్మార్ట్చిప్’తో ఒప్పందం... కాలుష్యనియంత్రణపైన రవాణా అధికారులు కొంత కాలంగా తీవ్రంగా దృష్టిసారించారు. ఇప్పుడు ఉన్న పద్ధతిని పూర్తిగా మార్చివేసి మనుషులతో ప్రమేయం లేకుండా ఆన్లైన్లోనే వాహనాల కాలుష్యాన్ని నిర్ధారించాలనే ప్రతిపాదించారు. దీనికి అనుగుణంగా సాంకేతిక సంస్థల నుంచి గతేడాది టెండర్లను ఆహ్వానించారు.పలు సాంకేతిక సంస్థలు పోటీపడ్డాయి. వాటిలో ఢిల్లీకి చెందిన ‘స్మార్ట్చిప్’సంస్థను ఎంపిక చేశారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ సంస్థతో ఒప్పదం కుదుర్చుకోనున్నట్లు రవాణాశాఖ ఐటీ విభాగం సంయుక్త రవాణా కమిషనర్ రమేష్ ‘సాక్షి’ కి చెప్పారు. కేంద్ర మోటారు వాహన చట్టంలో నిర్దేశించిన ప్రమాణాల మేరకు కాలుష్య కారకాలను గుర్తించి సర్టిఫికెట్లను అందజేయడంలో తమకు ఈ సంస్థ సాంకేతిక సాయం అందజేస్తుందన్నారు. నగరంలోని సుమారు 350 కి పైగా ఉన్న కాలుష్య తనిఖీ వాహనాలను, కేంద్రాలను ఆన్లైన్ పరిధిలోకి తేనున్నామన్నారు. రహదారులపై వాహనాలకు కాలుష్య పరీక్షలు నిర్వహించినప్పుడు వాటి కాలుష్యం ఏ స్థాయిలో ఉందనేది ఖైరతాబాద్లోని రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలోనే ఆన్లైన్లో నిర్ధారించి సర్టి ఫికెట్లను అందజేస్తారు. తనిఖీ కేంద్రాల్లోని ప్రింటర్ల ద్వారా ఈ సర్టిఫికెట్లు వాహనదారుడికి చేరుతాయి. ఎక్కడా మనుషుల ప్రమేయానికి తావు ఉండదు. పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. మరోవైపు ఇప్పుడు ఉన్న తనిఖీ కేంద్రాలను కూడా పెంచుతారు. ప్రతీ వాహనదారుడు తప్పనిసరిగా కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రం పొందేవిధంగా పర్యవేక్షిస్తారు. పాత పద్ధతికి స్వస్తి.. కేంద్రమోటారు వాహనచట్టం 1988 ప్రకారం కాలుష్య నియంత్రణకు 2002లో తనిఖీ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వీటిలో కొన్ని పెట్రోల్ బంకులలో ఏర్పాటు చేసిన స్థిరమైన కేంద్రాలు. కాగా. మరికొన్ని సంచార టెస్టింగ్ స్టేషన్లు. ఈ కేంద్రాల్లో గ్యాస్ అనలైజర్లు, స్మోక్ మీటర్లు ఉంటాయి. వాటి సాయంతో వాహనం నుంచి వెలువడే పొగసాంద్రత, దానిలోని కాలుష్య కారక పదార్ధాలను నిర్ధారిస్తారు. కానీ కొన్ని స్టేషన్లలో అనలైజర్లు, స్మోక్మీటర్లు పని చేయడం లేదు. కేవలం ఉత్తుత్తి తనిఖీలతో సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు, సివిల్ పోలీసులు, రవాణా అధికారులు ఈ స్టేషన్ల పై ఎలాంటి తనిఖీలు నిర్వహించపోవడం, చట్టపరమైన చర్యలు లేకపోవడం వల్ల అవి యధేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. వీటికి ఇక కళ్లెం పడనుంది. -
డీజిలే అసలు విలన్...
సాక్షి, హైదరాబాద్: డీజిల్ ఉంటే బస్సు ముందుకు పోతుంది. కానీ, డీజిల్ కొంటే ఆర్టీసీ సంస్థ ఆర్థికంగా వెనక్కి పోతోంది. చమురు ధరల భారంతో నష్టాల ఊబిలో కూరుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత డీజిల్ ధర ఒక్కసారిగా పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న సమయంలో ఆర్టీసీ తీవ్ర ఆందోళన చెందుతోంది. ఇప్పటికే ఆ భారాన్ని మోయలేక చతికిలబడ్డ రవాణాసంస్థ, భవిష్యత్తు భారాన్ని బేరీజు వేసుకుని కాపాడాలంటూ రాష్ట్రప్రభుత్వాన్ని కోరుతోంది. విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను ఒక శాతానికి తగ్గించాలని చాలాకాలంగా ఆర్టీసీ కోరుతోంది. మూడేళ్లుగా బస్సుచార్జీలు పెంచనందున ఈసారి కచ్చితంగా టికెట్ ధరలను సవరించాల్సిందేనని రవాణాశాఖ ముఖ్యకార్యదర్శికి విజ్ఞప్తి చేసింది. మూడేళ్ల క్రితం ఆర్టీసీ చార్జీలను ప్రభుత్వం 10 శాతానికి పెంచింది. అప్పట్లో డీజిల్ ధర లీటరుకు రూ.44.50 ఉంది. అది కొంత పెరుగుతూ, తగ్గుతూ ఇప్పుడు రూ.72కు చేరుకుంది. అంటే లీటరుపై రూ.28 పెరిగింది. ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. దీనికి ప్రధానకారణం డీజిల్ భారమేనని, అంతర్గత సామర్థ్యం పెంచుకుంటూ ఆదాయాన్ని మెరుగుపరుచుకుంటున్నా డీజిల్ భూతం మింగేస్తోందని తాజాగా లెక్కలు తేల్చింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 11 నెలల కాలం(మార్చి లెక్కలు తేల్చాల్సి ఉంది)లో తెలంగాణ ఆర్టీసీ అంతకుముందు సంవత్సరం అదే సమయం కంటే రూ.295 కోట్ల ఆదాయాన్ని పెంచుకుంది. ఇందులో టికెట్ల రూపంలో రూ.165 కోట్లు, స్క్రాప్ విక్రయం, ఇతర వాణిజ్యమార్గాల ద్వారా రూ.56 కోట్లు, బస్ పాస్ రీయింబర్స్మెంటు ద్వారా మిగతా మొత్తం సమకూర్చుకుంది. కానీ, ఇదే సమయానికి పెరిగిన నష్టాలు ఏకంగా రూ.432 కోట్లు ఉన్నాయి. ఇందులో డీజిల్ వాటా రూ.186 కోట్లని లెక్కలు తేల్చారు. తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు డీజిల్ ధరలను ఏకంగా 130 సార్లు సవరించారు. తెలంగాణ ఆవిర్భవించిన సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.63గా ఉంది. అంతర్జాతీయంగా వచ్చిన మార్పుల కారణంగా 2016లో ఫిబ్రవరిలోరూ. 44గా మారింది. ఆ తర్వాత క్రమంగా పెరగటం మొదలుపెట్టి ఇప్పుడు రూ.72కు చేరుకుంది. ►ఆర్టీసీ నిత్యం ఐదున్నర లక్షల లీటర్ల డీజిల్ ఖర్చు చేస్తోంది. అంటే ఏడాదికి 20 కోట్ల లీటర్లకు పైమాటే.. ►2018–19లో 11 నెలల కాలానికి నష్టాలు రూ.684 కోట్లు. ఇది అంతకుముందు సంవత్సరం అదే కాలానికి వచ్చిన నష్టాల కంటే రూ.137 కోట్లు అధికం. ఇదే సమయంలో ముందు సంవత్సరం కంటే పెరిగిన డీజిల్ భారం రూ.186 కోట్లు. 2017–18 సంవత్సరానికి డీజిల్బిల్లు రూ.1,084 కోట్లు నమోదు కాగా, 2018 –19లో రూ.1,270 కోట్లు వచ్చింది. ఇందులో దాదాపు రూ.300 కోట్లు వ్యాట్ కింద రాష్ట్రప్రభుత్వం వసూలు చేసిందే కావటం గమనార్హం. ►2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ఆదేశం ఇచ్చారు. హైదరాబాద్లో ఆర్టీసీకి వచ్చే నష్టాలను జీహెచ్ఎంసీ భర్తీ చేస్తుందన్నది దాని సారాంశం. ఆ మేరకు విడుదల చేసిన ఉత్తర్వులో రూ.336 కోట్లు జీహెచ్ఎంసీ ఆర్టీసీకి ఇవ్వాలంటూ పేర్కొంది. 2015–16కుగాను ఒకసారి జీహెచ్ఎంసీ ఇచ్చింది. ఆ తర్వాత చేతులెత్తేసింది. ►పల్లె వెలుగు బస్సులు గ్రామాలకు ఊతం. కానీ, గత ఆర్థిక సంవత్సరంలో ఆ బస్సుల రూపంలో ఆర్టీసీకి వచ్చిన నష్టాలు రూ.330 కోట్లు. 60 వేల లోపే... ఇటీవల విమానయాన సంస్థలను ఆదుకునే క్రమంలో ప్రభుత్వాలు రాయితీలు ప్రకటిస్తున్నాయి. విమాన ఇంధనంపై 16 శాతంగా ఉన్న వ్యాట్ను గతేడాది ఒక శాతంగా మార్చారు. దీంతో విమానయాన సంస్థలు లాభపడ్డాయి. విచిత్రమేంటంటే... మన రాష్ట్రంలో సగటున నిత్యం ప్రయాణించే విమాన ప్రయాణికుల సంఖ్య 60 వేలలోపే. కానీ నిత్యం కోటిమందిని గమ్యం చేరుస్తున్న ఆర్టీసీ మాత్రం అదే ఇంధనంపై ఏకంగా 27 శాతం చెల్లించాల్సి వస్తోంది. ధనికులు ప్రయాణించే విమానాలకు వెసులుబాటు కల్పించినప్పుడు ఎక్కువ మంది పేదలే ప్రయాణించే ఆర్టీసీ బస్సుకు ఎందుకు వెసులుబాటు రాదని ఆర్టీసీ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. విమానయాన సంస్థలు ఆర్థిక ఒడిదొడుకులకు గురైతే దాని ప్రభావం ధనిక వర్గాలపైనే ఉంటుందని, కానీ ఆర్టీసీ ఇబ్బంది పడితే నేరుగా పేదలే సతమతమవ్వాల్సి వస్తుందన్న విషయాన్ని వారు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. డీజిల్పై వ్యాట్ తగ్గిస్తే సాలీనా మిగులుబాటు రూ.300 కోట్ల(ప్రస్తుత ధరల ప్రకారం)కే పరిమితమవుతుందని, అదే టికెట్ ధరలను డిమాండ్ చేసిన 30 శాతంలో సగం 15 శాతం పెంచినా రూ.500 కోట్ల లబ్ధి చేకూరుతుండటమే దీనికి కారణం. -
పనితీరు బావుంటే డ్రైవర్ పోస్టు
సాక్షి, హైదరాబాద్: అస్తవ్యస్థ డ్రైవింగ్తో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న అద్దె బస్సు డ్రైవర్ల ను దారిలో పెట్టేందుకు రవాణా శాఖ చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం అద్దె బస్సులను తగ్గించే పరిస్థితి లేనందున తప్పక వాటిని కొనసాగించాల్సిన పరిస్థితి. దీంతో వాటిని నడుపుతున్న డ్రైవర్లను గాడిలో పెట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది. గత కొన్నిరోజులుగా అద్దె బస్సులు వరసగా ప్రమాదాలకు గురవుతుండటంతో నిర్లక్ష్యంగా బస్సులు నడిపే వారి పై చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రకటించారు. దీంతోపాటు, వారికి తాయిలం ప్రకటిస్తే పరివర్తన వస్తుందన్న అధికారుల సూచనకూ సానుకూలంగా స్పందించారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించటమే సమస్యకు పరిష్కారంగా అధికారులు భావిస్తున్నారు. అద్దె బస్సులకు డ్రైవర్లుగా పనిచేస్తున్నవారిలో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా డ్రైవింగ్ చేసే వారిని భవిష్యత్లో ఆర్టీసీ రెగ్యులర్ డ్రైవర్లుగా నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్ల నియామకాలు చేపట్టినప్పుడు, మెరుగైన పనితీరు కనబరిచిన అద్దె బస్సు డ్రైవర్లకు వెయిటేజీ మార్కుల రూపంలో ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తు న్నారు. 2012 తర్వాత ఆర్టీసీ డ్రైవర్లను నియమించలేదు. దీంతో దాదాపు 2 వేల డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డ్రైవర్ల కొరతతో అధికారులు అద్దె బస్సుల సంఖ్య పెంచాల్సి వస్తోంది. గతంలో మొత్తం ఆర్టీసీ బస్సుల్లో కేవలం 15 శాతం మాత్రమే ఉన్న వాటిని 20 శాతానికి పెంచేశారు. అద్దె బస్సు డ్రైవర్లకు వేతనాలు తక్కువగా ఉండటంతో నైపుణ్యం ఉన్న డ్రైవర్లు రావటం లేదు. దీంతో ఆటో, లారీ, ట్రాక్టర్ డ్రైవర్లు బస్సులు నడపడంతో ప్రమాదాలకు కారణమవుతోంది. దీంతో డ్రైవర్ల నియామకం చేపట్టేలా శాఖ యోచిస్తోంది. దీంతో అద్దె బస్సులను భద్రంగా నడిపిన డ్రైవర్లకు వెయిటేజీ ఇచ్చి రెగ్యులర్ డ్రైవర్లు్లగా నియమించుకోవాలనే ఆలోచనను అధికారులు మంత్రి ముందుంచారు. దీని సాధ్యాసాధ్యాలు చూసి నివేదిక ఇవ్వమని ఆయన ఆదేశించారు. అద్దె బస్సు డ్రైవర్లకు ఈ సంకేతం చేరితే ఆర్టీసీ ఉద్యోగం వస్తుందన్న ఆలోచనతో బస్సులను భద్రంగా నడిపే అవకాశం ఉంటుందనేది అధికారుల యోచన. -
నాసిరకం డ్రైవర్లు రాకుండా చూడాలి
సాక్షి, హైదరాబాద్: తక్కువ వేతనం ఇస్తుండటం వల్లే అద్దె బస్సులకు నాసిరకం డ్రైవర్లు వస్తున్నందున ఈ సమస్య పరిష్కారానికి వెంటనే దృష్టి సారించనున్నట్టు రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి అన్నారు. వారికి మెరుగైన వేతనాలు చెల్లిస్తే నైపుణ్యం ఉన్నవారు డ్రైవింగ్కు వచ్చే వీలున్నందున, అద్దె బస్సు యజమానులతో చేసుకునే ఒప్పందంలో మెరుగైన వేతనాలు చెల్లించేలా నిబంధన చేర్చాలని, వేతనాలు పెంచేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొన్నిరోజులుగా అద్దెబస్సులు ప్రమాదాలకు గురవుతున్న తీరు, దానికి కారణాలను విశ్లేషిస్తూ ‘ఆటోడ్రైవర్ల చేతిలో ఆర్టీసీ బిస్స’శీర్షికతో శనివారం ‘సాక్షి’ప్రచురించిన కథనానికి ఆయన స్పందించారు. శనివారం సాయంత్రం సచివాలయంలో ఆయన రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్శర్మ, ఆర్టీసీ ఈడీలు పురుషోత్తం నాయక్, వినోద్, టీవీరావు, అజయ్కుమార్, సీటీఎం రాజేంద్రప్రసాద్, సీఎంఈ వెంకటేశ్వర్లు, ఓఎస్డీ కృష్ణకాంత్, ఇతర అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. అద్దె బస్సులకు నైపుణ్యంలేని డ్రైవర్లు వస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుభవం, నైపు ణ్యం లేకపోవటమే కాకుండా డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్లో మాట్లాడటం, పాన్, గుట్కా వేసుకోవటం లాంటివి కూడా ప్రమాదాలకు కారణమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూండటం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని మంత్రి అన్నారు. దీన్ని వెంటనే సరిదిద్దాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నిర్లక్ష్యంగా బస్సులు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్న డ్రైవర్లపైనే కాకుండా, వారిని పనిలో పెట్టిన అద్దె బస్సుల యజమానులపై కూడా చర్యలు తీసుకుంటేనే ప్రమాదాలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. ఏం చర్యలు తీసుకుంటున్నారు..? ప్రమాదాలకు కారణమవుతున్న డ్రైవర్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అధికారులను మంత్రి వేముల ప్రశ్నించారు. సంస్థ సొంత డ్రైవర్లయితే ప్రాథమిక విచారణ జరిపి బాధ్యులని తేలితే సస్పెండ్ చేస్తున్నామని, తుది విచారణలోనూ నిర్ధారణ అయితే తొలగిస్తున్నామని అధికారులు వివరించారు. అద్దె బస్సు డ్రైవర్లను బ్లాక్లిస్టులో పెడుతున్నామని పేర్కొన్నారు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసే వారికి ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని అధికారులు వివరించారు. ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురికాకుండా చూడాలని అధికారులకు సూచించారు. అద్దె బస్సు డ్రైవర్లకు కొన్ని మార్కులను వెయిటేజీగా ఇస్తే ఉద్యోగం వస్తుందన్న ఉద్దేశంతో వారు బాధ్యతాయుతంగా ఉంటారని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. వీటిపై సాధ్యాసాధ్యాలు పరిశీలించి తెలపాలని మంత్రి సూచించారు. బస్సుల జీవితకాలం వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. 13.50 లక్షల కిలోమీటర్లు తిరిగినా లేదా 15 ఏళ్లపాటు తిరిగిన వాటిని తుక్కు కింద తొలగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. సాధ్యమైనంత వరకు బస్సులు కండీషన్లో ఉండేలా చూడాలని ఆయన ఆదేశించారు. -
ఆర్టీఏలో బ్రేక్డౌన్
సాక్షి, సిటీబ్యూరో: రవాణాశాఖలో సోమవారం పౌర సేవలు స్తంభించాయి. విద్యుత్ సరఫరాలో తలెత్తిన సాంకేతిక కారణాలతో ఖైరతాబాద్లోని రవాణా కమిషనర్ ప్రధాన కార్యాలయంలో ఉన్న సర్వర్ల సేవలను నిలిపేశారు. దీంతో అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో లెర్నింగ్ లైసెన్స్లు, డ్రైవింగ్ లైసెన్స్లు, వాహనాల రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్ తదితర సేవలకు బ్రేక్ పడింది. వివిధ రకాల సేవల కోసం ఆన్లైన్లో స్లాట్లు నమోదు చేసుకొని ఫీజు చెల్లించి ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చిన వినియోగదారులు గంటల తరబడి పడిగాపులు కాశారు. సాంకేతిక కారణాలతో సేవలు నిలిచిపోయినట్లు తెలిసి నిరాశతో వెనుదిరిగారు. మరోవైపు మధ్యాహ్నం వరకు అన్ని రకాల సర్వీసులను పునరుద్ధరించినట్లు సంయుక్త రవాణా కమిషనర్ రమేశ్ తెలిపారు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సర్వీసులను పొందలేకపోయిన వారికి మంగళవారం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. జనరేటర్లో మంటలు రావడంతో... రవాణా కమిషనర్ కార్యాలయంలోని జనరేటర్లో రివర్స్ విద్యుత్ సరఫరా కారణంగా ఆదివారం రాత్రి స్వల్పంగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న సాంకేతిక అధికారులు, సిబ్బంది అప్పటికప్పుడు కార్యాలయానికి చేరుకొని సర్వర్లు, బ్యాటరీల సేవలను నిలిపివేశారు. అదే సమయంలో ఫైర్ సిబ్బంది సహాయంతో జనరేటర్లో మంటలను ఆర్పివేశారు. సర్వర్లను నిలిపివేయడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాలకు అందజేయాల్సిన డేటా సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో అన్ని చోట్ల పౌరసేవలు స్తంభించాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్లతో పాటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, ఆదిలాబాద్ తదితర జిల్లాలు, పట్టణాల్లోని ఆర్టీఏ కార్యాలయాలు, ప్రాంతీయ రవాణా కేంద్రాల్లో సుమారు 5వేలకు పైగా డ్రైవింగ్ లైసెన్సులు, రెన్యూవల్స్, కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల వంటి 50 రకాల పౌర సేవలకు అంతరాయం ఏర్పడింది. -
హాజీపూర్ : వెయ్యి ఊళ్లకు బస్సుల్లేవ్!
సాక్షి, హైదరాబాద్: తాండూరు పట్టణానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాలుగైదు పల్లెల్లోని బాలికలకు చదువుకోవాలనే ఆసక్తి ఉంది. కానీ ఆ ఊళ్లలో సర్కారు బడులు లేకపోవటంతో బషీరాబాద్ మండల కేంద్రం ప్రధాన రహదారిపై ఉన్న గొట్టిగ ఖుర్ద్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు. సరే అంతదూరం వెళ్లయినా చదువుకుందామంటే.. అక్కడిదాకా వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేదు. బడికి నడుచుకుంటూ వెళ్లాల్సిందే. దీంతో అంతంతదూరం నడుస్తూ వెళ్లి చదివించడం అవసరమా అని తల్లిదండ్రులు ఆడపిల్లలను బడులకు పంపించేందుకు సందేహిస్తున్నారు. చాలామంది పేరెంట్స్ ఈ కారణంతోనే బడులు మాన్పించారు కూడా. ఈ విషయాన్ని గుర్తించిన రోటరీ క్లబ్ సభ్యులు.. చదువుకోవాలని ఆసక్తి ఉన్న వారందరికీ గతేడాది 150 సైకిళ్లను పంపిణీ చేశారు. ఇప్పుడు వారు సైకిళ్లపై అంతా కలిసికట్టుగా బడికి వెళ్తున్నారు. చాలా మంచి పరిణామం ఇది. సరే.. మరి సైకిళ్లు కూడా లేని ఊళ్ల సంగతేంటనే సందేహానికి తల్లిదండ్రుల వద్ద నుంచి వచ్చే ఏకైక సమాధానం.. చదువు మాన్పించడమే. కొందరు నడుచుకుంటూనో, వాహనాలను లిఫ్ట్ అడిగో బడులకు వెళ్తున్నారు. ఇలాంటి ఊళ్లు వెయ్యికి పైగానే ఉన్నాయి. మరి ఆ గ్రామాల్లో పరిస్థితేంటి? హాజీపూర్ ఘటన పది రోజుల క్రితం.. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న, యాదాద్రి జిల్లా హాజీపూర్ గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి అనే కీచకుడి ఉదంతం వెలుగులోకి రావడంతో ఆడపిల్లల తల్లిదండ్రుల్లో భయం పెరిగింది. చదువు కోసమో, ఇతర పనుల కోసమో వేరే ఊళ్లకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఆడపిల్లలను బయటకు పంపాలంటే వణికిపోతున్నారు. ఇది ఒక గ్రామం సమస్యకాదు. వేయి గ్రామాల్లోని ఆడపిల్లల తల్లిదండ్రుల ఆవేదన. ఎందుకంటే ఈ గ్రామాలకు ఇప్పటికీ బస్సు వసతి లేదు. హాజీపూర్ గ్రామానికి నగరం నుంచి సిటీ బస్సు సౌకర్యం ఉన్నా, స్కూలుకెళ్లే సమయానికి బస్సులు లేకపోవటంతో పిల్లలు నడుచుకుంటూనో, ఆ దారిగుండా వెళ్లే వాహనాలను లిఫ్ట్ అడిగో వెళ్తుంటారు. వీరి ఈ నిస్సహాయతను ఆసరా చేసుకుని శ్రీనివాస్ రెడ్డి ‘హత్యా’చారాలకు పాల్పడ్డ తీరు నివ్వెరపరిచింది. ఇదే ఇప్పుడు బస్సు సౌకర్యం లేని ఊళ్లలో ఆడపిల్లలను అలా పంపాలంటే తల్లిదండ్రులు ఆవేదన చెందేందుకు కారణమవుతోంది. ములుగు గణపురం సమీపంలోని బస్వరాజుపల్లెకు బస్సు వసతి లేక ప్రయాణికులు ఇలా వెళ్తున్నారు ఎందుకీ దుస్థితి? రాష్ట్రంలో 844 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని ఆర్టీసీ అధికారులు అంకెల్లో చూపుతున్నా.. వాస్తవానికి ఆ సంఖ్య వెయ్యికిపైగానే ఉంటుందని సిబ్బందే పేర్కొంటున్నారు. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఏకంగా 330 గ్రామాలకు బస్సులు నడవటం లేదు. ఇందులో జనాభా పరంగా పెద్ద గ్రామాలు 66 ఉన్నాయి. అనుబంధ గ్రామాలు కలిపితే వాటి సంఖ్య 1300కుపైనే ఉంది. దేశంలో ఎక్కడా లేనట్టుగా తెలంగాణలో 24 గంటల కరెంటు సరఫరా అవుతూ రికార్డు సృష్టిస్తున్న వేళ.. వెయ్యికి పైగా గ్రామాలు ఆర్టీసీ బస్సు మొహం చూడకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. బస్సులు లేకపోవటాన్ని ఆసరాగా చేసుకుని ఆటోవాలాలు రెచ్చిపోతున్నారు. కనీసం డ్రైవింగ్ కూడా సరిగా రాని యువకులు ఆటోలు నడుపుతూ జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇష్టమొచ్చినంత మందిని ఆటోల్లో కుక్కి తీసుకెళ్తూ.. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ప్రతిరోజూ ఆటో చార్జీలు భరించలేని పేద విద్యార్థులకు నడిచి వెళ్లడమో, లిఫ్ట్ అడగడమో తప్ప వేరే మార్గమే లేదు. కానీ.. హాజీపూర్ ఉదంతంతో లిఫ్ట్ అడగాలంటేనే పదిసార్లు ఆలోచించే పరిస్థితి తలెత్తింది. బస్సులెందుకు నడవటం లేదు ప్రధాన రహదారులకు చేరువగా ఉన్నా.. కొన్ని ఊళ్లకు ఇప్పటికీ సరైన రోడ్డు వసతి లేదు. గతుకుల రోడ్డుపై ప్రయాణంతో బస్సులు తొందరగా పాడయ్యే అవకాశం ఉంది. దీంతో ఆ ఊళ్లకు బస్సును నడిపేందుకు ఆర్టీసీ అధికారులు నిరాకరిస్తున్నారు. గతంలో బస్సులు నడిచి, ఆ తర్వాత రోడ్డు బాగా పాడవటంతో సర్వీసులను ఆపేసిన సందర్భాలూ ఉన్నాయి. ఆర్టీసీ చెబుతున్న లెక్కల ప్రకారం 844 గ్రామాలకు బస్సులు నడవటం లేదు. వీటిల్లో 416 గ్రామాలకు రోడ్డు సరిగా లేకపోవడాన్నే కారణంగా చూపుతుండటం విశేషం. కొన్ని ఊళ్లకు బస్సు పట్టేంత రోడ్డు లేదు. మలుపులు, వంకలు, పురాతన బావులను దాటుకుని వెళ్లటం అసాధ్యమంటున్నారు. ఈ గ్రామాలకు యుద్ధప్రాతిపదికన రోడ్లను నిర్మించాల్సి ఉన్నా, అది జరగటం లేదు. ప్రభుత్వం జిల్లా కేంద్రాలకు, మండల కేంద్రాలకు డబుల్ రోడ్లను నిర్మిస్తున్నా.. గ్రామాల విషయంలో నిర్లక్ష్యం చూపిస్తోంది. ఇప్పటి వరకు రవాణాశాఖ – పంచాయతీరాజ్ శాఖల మధ్య అసలు సమన్వయమే కుదరలేదు. ఈ దిశగా చర్చలు జరగకపోవటమే అసలు ట్విస్టు. ప్రధాన రోడ్లకు చేరువగా ఉంటే శాపమే ఆర్టీసీ పరిభాషలో ‘టీ’ ఆపరేషన్ అని ఉంటుంది. అంటే ప్రధాన రోడ్డుకు నాలుగైదు కిలోమీటర్ల చేరువలో ఉన్న ఊళ్లకు బస్సులు వెళ్లవన్నమాట. ఆ మార్గంలో ఒకటి రెండు ఊళ్లు మాత్రమే ఉంటే, వాటి కోసం ప్రత్యేకంగా బస్సు తిప్పరు. ఆ ఊరి జనం ప్రధాన రోడ్డుమీదకు వచ్చి బస్సు ఎక్కాల్సిందే. ఆ మార్గంలో ఏడెనిమిది ఊళ్లుంటేనే ఓ సర్వీసు నడుపుతారు. అలా ప్రధాన రోడ్లకు చేరువగా ఉండి బస్సు తిరగని ఊళ్లు ఆర్టీసీ లెక్కల ప్రకారం 136 ఉన్నాయి. ఇతర ‘అక్రమ’ వాహనాలతో.. బస్సు లేనప్పుడు ప్రత్యామ్నాయ రవాణావైపు చూడాల్సిందే. పల్లెల్లో చాలాచోట్ల బస్సులు రాకపోవటాన్ని ఆసరా చేసుకుని ఆటోలు, జీపులు, వ్యాన్లు, ఇతర వాహనాలు ప్రయాణికులను తరలిస్తున్నాయి. ఇప్పుడేమో అలాంటి వాహనాలు పెరిగినందువల్ల బస్సులు నడిపితే నష్టం వస్తుందంటూ ఆర్టీసీ కొన్ని గ్రామాలకు బస్సులు తిప్పటం లేదు. తన లెక్కల ప్రకారమే ఇలాంటి రూట్ల సంఖ్య 244. తీవ్ర నష్టాల్లో ఉన్నా... 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెల వరకు ఆర్టీసీ తేల్చిన నష్టాల లెక్క రూ.680 కోట్లు. మార్చితో అది దాదాపు రూ.750 కోట్లకు చేరి రికార్డు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇలాంటి దుస్థితి ఉన్నప్పుడు ఆర్టీసీ ఏం చేయాలి. వీలైనంత వరకు ప్రయాణికుల సంఖ్య పెంచుకుని ఆదాయాన్ని ఆర్జించాలి. కానీ కొత్త ప్రాంతాలకు తిప్పేందుకు ఆర్టీసీ వద్ద చాలినన్ని బస్సులు లేవు. ఒకవేళ తిప్పినా.. ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) తక్కువగా ఉంటోందన్న పేరుతో రద్దు చేస్తున్నారు. డిపో మేనేజర్లపై నిరంతరం ఓఆర్ కత్తి వేళ్లాడుతుండటంతో.. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండే ఊళ్లకు బస్సులు నడిపేందుకు వారు వెనకడుగువేస్తున్నారు. నష్టాలతో లింకెందుకు... ప్రతి ఊరుకు రవాణా వసతి హక్కు లాంటిదే. కానీ వివిధ కారణాలతో వెయ్యి గ్రామాలకు బస్సు వెళ్లకపోవటం బాధాకరమే. నష్టాలతో లింకు పెట్టకుండా అన్ని ఊళ్లకు బస్సు నడపాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. ఆ నష్టాలను ప్రభుత్వమే భరించి అన్ని గ్రామాలకు ప్రభుత్వ, సురక్షిత రవాణా వసతి కల్పించాలనే వాదన బలంగా ఉంది. కానీ అది అమలు కావటంలేదు. సామాజిక పింఛన్ల తరహాలో రవాణా వసతి లాంటి వాటికి కూడా ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఆ మేరకు ఆర్టీసీకి నిధులు కేటాయిస్తే ఈ సమస్య పరిష్కారమవుతుందని సూచిస్తున్నారు. ప్రమాదాలూ తగ్గుముఖం చాలా రోడ్డు ప్రమాదాల్లో నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణమవుతోంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చాలా వరకు సురక్షితమే. నలుగురు ఎక్కాల్సిన ఆటోల్లో పదిహేను మంది వరకు ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి తప్పిపోతుంది. కొన్ని చోట్ల లారీల్లో వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక ఆర్టీసీ బస్సు ప్రయాణం బాలికలు, మహిళలకు కొంతవరకు రక్షణ ఇస్తుంది. ‘హాజీపూర్’లాంటి దురాగతాలకు బస్సు ద్వారా చెక్ చెప్పినట్టవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సకాలంలో రాని బస్సు..
సాక్షి, హైదరాబాద్: బస్సు సకాలంలో రాకపోవడంతో ఓ ప్రయాణికుడు ఎస్ఎంఎస్ ద్వారా రవాణా మంత్రికి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆర్టీసీ అధికారులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. కరీంనగర్కు చెందిన శంకరయ్య, అతని కుమారుడు అరవింద్లు అహ్మదాబాద్ నుంచి ఆదివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. ఎయిర్పోర్టు నుంచి కరీంనగర్ వెళ్లాల్సిన బస్సులో ఆన్లైన్ ద్వారా వీరు టికెట్ బుక్ చేసుకున్నారు. ఉదయం పదిన్నరకు రావాల్సిన బస్సు కనిపించకపోవటంతో వారు ఎయిర్పోర్టులో ఉన్న ఆర్టీసీ కౌంటర్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో కౌంటర్లో సిబ్బంది కూడా లేకపోవటంతో ఎస్ఎంఎస్ ద్వారా రవాణా శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డికి ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు వెంటనే బస్సును ఏర్పాటు చేశారు. అయితే బస్సు సకాలంలో ఎందుకు రాలేదని, సిబ్బంది కౌంటర్లో ఎందుకు లేరని ప్రశ్నించిన మంత్రి ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. -
హతవిధీ.. ఆర్టీసీ నిపుణుల కమిటీ!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సంక్షోభంతో మనుగడే ప్రశ్నార్థకం అవుతున్న ఆర్టీసీని బాగుచేసేందుకు ప్రత్యేకంగా ఏర్పడ్డ కమిటీ కూడా చేతులెత్తేసింది. ఉన్నపళంగా సంస్థ బాగు పడాలంటే ఏం చేయాలనే విషయంలో సిఫారసులు చేసేందుకు 8 నెలల కింద ఏర్పాటైన కమిటీ ఇప్పటివరకూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించలేకపోయింది. అసలు ఆ కమిటీ గురించి పట్టించుకునే వారే లేకపోవటంతో కమిటీ సభ్యులు కూడా మిన్నకుండి పోయారు. ఆర్టీసీకి ప్రస్తుతం పూర్తిస్థాయి ఎండీ, చైర్మన్ లేకపోవటం కమిటీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సంస్థను పర్యవేక్షించేవారు లేకపోవటంతో అధికారులు కూడా కమిటీకి సహకరించటం లేదని తెలుస్తోంది. విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్దామంటే, రవాణా శాఖ మంత్రి ఇటీవలే బాధ్యతలు స్వీకరించటం, వెంటనే లోక్సభ ఎన్నికల్లో బిజీ కావటంతో కమిటీ సభ్యులు కలవలేకపోయారు. విచిత్రమేంటంటే.. మూడు నెలల కిందే నివేదిక సిద్ధమైనా, దాన్ని సమర్పించే ఆసక్తి కూడా సభ్యుల్లో నశించిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఎనిమిది మంది సభ్యులున్నారు. వారు అన్ని రకాలుగా సంస్థ పనితీరును పరిశీలించి సూచనలతో నివేదిక సిద్ధం చేశారు. కొంత సమాచారం కావాల్సి ఉండగా, ఆ వివరాలు చెప్పేందుకు అధికారు లు సహకరించట్లేదు. కమిటీలో కీలక బాధ్యత ల్లో ఉన్న ఈడీ మాత్రం నిరంతరం అందు బాటులో ఉంటున్నా.. ఓ ఉన్నతాధికారి సభ్యు లను కలిసేందుకు ఆసక్తి చూపట్లేదు. పలు మార్లు సమయం కోరితే అతి కష్టమ్మీద ఒక్క సారి కలసి మొక్కుబడిగా సమావేశాన్ని ముగించారు. వారికే అంత పట్టింపు లేనప్పుడు తామెందుకు పట్టించుకోవాలన్న తీరులో సభ్యులున్నారు. నివేదికపై ఇప్పటికీ కొందరు సభ్యులు సంతకాలు కూడా చేయలేదు’అని కమిటీకి సహకరించిన ఓ ప్రతినిధి వ్యాఖ్యానించారు. గతంలో బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్కు చైర్మన్గా వ్యవహరించిన కర్ణాటక కాంగ్రెస్ నేత నాగరాజు కూడా కమిటీ సభ్యులకు అందుబాటులో లేకుండా పోయారు. ఆ నివేదికపై ఆయన సంతకం చేసేందుకు కూడా ఆసక్తి చూపట్లేదట. ఇదీ నేపథ్యం.. గతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు మూడేళ్ల కింద ఆర్టీసీ తీరును సమీక్షించారు. అప్పట్లో ఆయన ఎన్నో సూచనలు చేశారు. కానీ వాటిని ఏమాత్రం పట్టించుకోని అధికారులు యథావిధిగా సంస్థను సంక్షోభంలోకి నెట్టేశారు. అప్పట్లో ఎండీగా పనిచేసిన రిటైర్డ్ అధికారి రమణారావుకు ఈడీలతో సఖ్య త లేకపోవటం సంస్థపై తీవ్ర ప్రభావం చూపింది. సంస్థను బాగు చేసేందుకు కొంత వరకు కృషి చేసిన నాటి చైర్మన్ సోమారపు సత్యనారాయణకు, అప్పటి ఎండీకి మధ్య పొసగలేదు. దీంతో ఎండీ నుంచి సహకారం లేక సోమారపు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. వాస్తవానికి ఆయన కృషి వల్లే నిపుణుల కమిటీ ఏర్పడింది. ఇక మళ్లీ సమీక్షలు కూడా లేకపోవటంతో పరిస్థితి బాగా దిగజారిపోయింది. కమిటీ సిఫారసుల్లో కొన్ని.. - ఆర్టీసీ నుంచి హైదరాబాద్ సిటీని విడదీసి.. మెట్రో రైలుతో కలిపి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఇందులో ఎంఎంటీఎస్ రైల్ నెట్వర్క్ను కూడా కలపాలి. - రాష్ట్రంలో చాలా ప్రాంతాలకు ఇప్పటికీ బస్సు వసతి లేదు. గత ఐదు సంవత్సరాలుగా ఆర్టీసీ కొత్త బస్సులు సరిగా కొనట్లేదు. వెంటనే 1,000 కొత్త బస్సులు కొనుగోలు చేయాలి. నిధుల సమస్య ఉంటే విడతల వారీగా కొనాలి. సంస్థలో కాలం చెల్లిన బస్సులను పక్కనపెట్టాలి. వాటివల్ల నష్టాలు పెరుగుతున్నాయి. ఉన్న బస్సుల సామర్థ్యం పెరగాల్సి ఉంది. - కార్మికులకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కొన్ని సమస్యలు పరిష్కరించాలి. లేకుంటే తరచూ కార్మికులతో అధికారులకు వివాదాలు తలెత్తి వాటి ప్రభావం సంస్థ పనితీరుపై పడుతోంది. - సంస్థకు నిరంతరం పూర్తిస్థాయి ఎండీ ఉండాలి. అవగాహన ఉన్న వ్యక్తి చైర్మన్గా ఉండాలి. సంస్థపై సరైన పర్యవేక్షణ లేకపోవటంతో పనితీరు బాగా దిగజారిపోతోంది. - తెలంగాణ ఆర్టీసీకి ప్రత్యేక పరిపాలన బోర్డు ఉండాలి. ఇది జరగాలంటే ఏపీ, తెలంగాణ ఆర్టీసీల మధ్య పూర్తిస్థాయిలో విభజన జరగాలి. -
ఓలాకు షాక్.. ఆరు నెలల నిషేధం
బెంగళూరు: ప్రముఖ క్యాబ్ సర్వీసెస్ సంస్థ 'ఓలా'కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నిబంధనలను అతిక్రమించినందుకుగాను ఆ సంస్థ లైసెన్స్లను ఆరు నెలలు రద్దు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కర్ణాటకలో ఆరు నెలలు ఈ సంస్థ సర్వీసులు నిలిచిపోనున్నాయి. రూల్స్ను అతిక్రమించి ఎలాంటి అనుమతులు లేకుండానే ఓలా బైక్ ట్యాక్సీని నడుపుతుందని కర్ణాటక రవాణ శాఖ తెలిపింది. దీనిపై వివరణ కోరామని.. అయితే సంస్థ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని వివరించింది. దీంతో కర్టాటక రవాణ చట్టం 2016 ప్రకారం ఆ సంస్థ లైసెన్స్లను ఆరు నెలలు రద్దు చేస్తున్నట్లు ఆదేశాలను జారీ చేశారు. ఈనెల 18వ తేదీనే ఆదేశాలను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆర్డర్ కాపీ అందిన మూడు రోజుల్లోనే లైసెన్సును సరెండర్ చేయాలని కూడా ఓలా కంపెనీని ఆదేశించారు. దీంతో ఓలా క్యాబ్స్ కర్ణాటక రోడ్లపై ఆరు నెలలు కనిపించవని ఆ శాఖ ఉన్నతాధికారి తెలిపారు. -
‘ఎక్స్షోరూమ్ ప్రైస్’ చట్టవిరుద్ధం.. తీర్పు ఒక్క కేసుకే పరిమితమా?
సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా ఉన్నత న్యాయస్థానం ఏదైనా కేసులో వెలువడిన తీర్పు.. చట్టాలను అనుసరించి ఆ తరహా అన్ని కేసులకు వర్తిస్తుంది.. ప్రభుత్వం, అధికారులు ఆ తీర్పును అమలు చేసి తీరాలి. కానీ రవాణా శాఖ మాత్రం అందుకు మినహాయింపు అంటోంది. వాహనాల జీవిత కాల పన్ను విధింపులో వెలువరించిన తీర్పును అమలు చేయకపోగా.. అది కేవలం ఒక్క కేసుకు సబంధించింది మాత్రమేనని ఆ శాఖ వాదిస్తోంది. వాహనాల జీవితకాల పన్నును వినియోగదారుడు చెల్లించిన ధరపైనే విధించాలన్న హైకోర్టు ఆదేశించినా అమలుకు నోచుకోవడం లేదు. ఎక్స్షోరూమ్ ప్రైస్తో నిమిత్తం లేకుండా ఇన్ వాయీస్ ఆధారంగానే లైఫ్ట్యాక్స్ తీసుకోవాలని రెండు నెలల క్రితమే ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కానీ ఈ తీర్పును అమలు చేయడంలో రవాణాశాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 29న వెలువడిన హైకోర్టు ఆదేశాలు కేవలం ‘ఆ ఒక్క కేసు’కు సంబంధించి మాత్రమేనంటూ ఆ శాఖ అధికారులు వితండ వాదం చేయడం గమ నార్హం. మరోవైపు జీవితకాల పన్ను విధింపుపై కూడా రవాణాశాఖలో స్పష్టత కొరవడింది. ఉన్నతస్థాయి అధికారులకు, కిందిస్థాయి అధికారులకు మధ్య సమన్వయం లేకపోవడంతో పన్ను వసూళ్లపై సందిగ్ధత నెలకొంది. వాహన షోరూమ్ డీలర్లు వినియోగదారులకు ఇచ్చే రాయితీలతో సంబంధం లేకుండా వాహనాల తయారీదారు నిర్ణయించిన ధర ప్రకారమే జీవితకాల పన్ను విధించాలని అప్పటి రవాణా కమిషనర్ సందీప్కుమార్ సుల్తానియా రెండేళ్ల క్రితం అధికారులను ఆదేశించారు. ఎక్స్షోరూమ్ ధరలపై లైఫ్ ట్యాక్స్ వసూలు చేయకపోవడాన్ని తప్పుబట్టారు. దీంతో అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతివాహనానికి ఆయా డీలర్ల నుంచి ‘ఎక్స్షోరూమ్ ధర’ల జాబితాను తెప్పించి మరీ అదనపు వసూళ్లు చేపట్టారు. దీంతో డీలర్ల నుంచి రాయితీల రూపంలో వినియోగదారుడికి కొంత మేరకు ఊరట లభించినప్పటికీ దానికి రెట్టింపు చొప్పున అదనంగా జీవితకాల పన్ను రూపంలో చెల్లించాల్సి వచ్చింది. ఇది ఇటు వినియోగదారుల్లోనూ, అటు వాహన డీలర్లలోనూ ఆందోళనకు దారితీసింది. ఇన్వాయీస్ ధరలపైనే పన్ను వసూలు చేయాలని డీలర్లు రవాణా అధికారులను కోరారు. అయినప్పటికీ అధికారులు నిరాకరించడంతో ఖైరతా బాద్ సెంట్రల్ ప్రాంతీయ రవాణా కార్యాలయం పరిధికి చెందిన ఒక డీలర్, మరో వినియోగదారుడు గతేడాది హైకోర్టును ఆశ్రయించారు. ఈ మే రకు ఉన్నత న్యాయస్థానం ‘ఎక్స్షోరూమ్ ప్రైస్’ చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. ‘ఇన్వాయీస్’ ప్రకారమే పన్ను విధించాలని ఆదేశించింది. ఆ ఒక్క కేసుకే పరిమితం కాదు... జీవితకాల పన్నులో కోత విధించేందుకే డీలర్లు భారీ ఎత్తున రాయితీలు ఇస్తున్నారని రవాణా అధికారులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా ఒక వాహనం ఖరీదు రూ.8.70 లక్షలు ఉంటే పండుగలు, ప్రత్యేక సందర్భాల్లోను ఏడాది ఎండింగ్ సీజన్లో వాహనం ధరపై రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు డీలర్లు డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే రూ.8.40 వేలకే వినియోగదారుడికి వాహనం లభిస్తుంది. ఇది ఇన్వాయీస్ ధర. కానీ ఎక్స్షోరూమ్ ధర మాత్రం రూ.8.70 లక్షలు ఉంటుంది. ఇన్వాయీస్ ధరపై జీవితకాల పన్ను తగ్గుతుంది. ఇలా ఒక్కో వాహనంపైనా వాటి ఖరీదు మేరకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు కూడా నష్టపోవాల్సి వస్తుందని రవాణా అధికారులు అప్పట్లో అంచనా వేశారు. ఎక్స్షోరూమ్ ధరలపైనే పన్ను వసూలు చేయాలని నిర్ణయించడంతో ఒక్క ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలోనే ఏడాది కాలంలో అప్పటి వరకు విక్రయించిన వాహనాలపైన సుమారు రూ.30 కోట్ల మేర తిరిగి లైఫ్ ట్యాక్స్ వసూలు చేశారు. అన్ని కార్యాయాల నుంచి రూ.100 కోట్లకు పైగా రాబట్టారు. ఎక్స్షోరూమ్ ధరలపై పన్ను విధించడాన్ని ఒక వినియోగదారుడు సవాల్ చేయడంతో పరిస్థితి తలకిందులైంది. మరోవైపు ఈ కేసును ఒక్క ఖైరతాబాద్ ఆర్టీఏకు మాత్రమే పరిమితం చేసేందుకు ప్రయత్నించారు. కానీ వినియోగదారుల హక్కులు, చట్టాలను అనుసరించి ఏ ఒక్క కేసులో వెలువడిన తీర్పయినా అందరికీ వర్తిస్తుందని, అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లోనూ ఇన్వాయీస్ ప్రకారమే లైఫ్ట్యాక్స్ తీసుకోవాలని న్యాయనిపుణులు సూచిస్తున్నారు. వాహనాల షోరూమ్ డీలర్లు సైతంఇన్వాయీస్ ధరలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్పష్టత లేకపోవడం వల్లనే.. మోటార్ వాహన చట్టంలో వాహనం ధరపై స్పష్టమైన నిర్వచనం లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. రూ.10 లక్షల కంటే ఖరీదైన వాహనాలపై 14 శాతం లైఫ్ ట్యాక్స్ విధిస్తున్నారు. దీంతో ఈ పన్ను భారాన్ని తగ్గించుకొనేందుకు కొందరు డీలర్లు వినియోగదారులకు డిస్కౌంట్ ఇస్తున్నారు. దీంతో లైఫ్ట్యాక్స్ 14 శాతం నుంచి ఏకంగా 12 శాతానికి పడిపోతుంది. రవాణాశాఖ ఆదాయం దృష్టిలో ఇది పెద్ద నష్టమే. కానీ అదే సమయంలో వినియోగదారుడి కొంత మేరకు ఊరటతో పాటు డీలర్లకు సైతం కలిసొస్తుంది. ఈ నష్టాన్ని నివారించేందుకు ‘ఎక్స్షోరూమ్ ప్రైస్’ పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినప్పటికీ ఆ మేరకు మోటారు వాహన చట్టంలో మార్పు చేయలేదు. తాజా హైకోర్టు ఆదేశాల మేరకు మాత్రం ఇన్వాయీస్ ప్రకారం జీవిత కాల పన్ను విధించాల్సిందే. కానీ ఈ దిశగా రవాణాశాఖ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. -
రవాణా శాఖలో ఓడీల బాగోతం..
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ డీటీవో కార్యాలయంలో ఎంవీఐగా పనిచేస్తున్న కె.వేణు నిన్న మొన్నటి వరకు ఇన్చార్జి డీటీవో, డీటీసీగా వ్యవహరించారు. ఇటీవలే పదోన్నతిపై పురుషోత్తం డీటీసీగా విధుల్లో చేరగా, వేణు ఎంవీఐ, ఇన్చార్జి డీటీవోగా కొనసాగుతున్నారు. వరంగల్ రూరల్ రెగ్యులర్ ఎంవీఐ రమేష్రాథోడ్ జనగామ ఇన్చార్జి ఎంవీఐతో పాటు డీటీవోగా మూడు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భూపాలపల్లి ఎంవీఐగా రెగ్యులర్ పోస్టులో ఉన్న పి.రవిందర్ ఇన్చార్జి డీటీవోతో పాటు ఖమ్మం ఇన్చార్జి ఎంవీఐగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ రెగ్యులర్ ఎంవీఐగా ఉన్న బద్రునాయక్ అక్కడే ఇన్చార్జి డీటీవోగా, ఖమ్మం ఇన్చార్జి డీటీవోగా వ్యవహరిస్తున్నారు. ఇలా రవాణాశాఖలో కొందరు మోటారు వెహికిల్ ఇన్స్పెకర్లు (ఎంవీఐలు) ఇప్పుడు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్లోని కొందరు పెద్దల ఆశీస్సులు ఉంటే చాలు... పదోన్నతులు, హోదాలతో పని లేకుండా ఇన్చార్జి డీటీవోలు, డీటీసీలుగా కూడా కొనసాగుతున్నారు. అవీ చాలదన్నట్లు పొరుగు జిల్లాల బాధ్యతల కోసం పైరవీలు సాగిస్తున్నట్లు మంత్రి పేషీకి చేరిన ఫిర్యాదులు వెల్లడిస్తున్నాయి. రవాణాశాఖలో ఎంవీఐ ఉద్యోగం.. వారి ఆదాయం గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అయితే మరీ ‘నీకది.. నాకిది’ అన్న చందంగా ఆన్ డెప్యూటేషన్ల పేరిట ఇష్టారాజ్యంగా పరిమితికి మించిన పోస్టింగ్లు తెచ్చుకుంటుండటం ఆ శాఖలో వివాదస్పదం అవుతోంది. రవాణాశాఖలో ఆన్ డెప్యూటేషన్(ఓడీ)ల పేరిట అక్రమార్జన తంతు సాగుతోంది. ఆ శాఖలోని కొందరు ఉన్నతాధికా రులు, మరికొందరు ఉద్యోగ సంఘాల నాయకుల కనుసన్నల్లో ఈ దందా నడుస్తోంది. వివిధ కారణాలతో రవాణాశాఖలో ప్రమోషన్లకు అడ్డుచక్రం వేసిన సదరు వ్యక్తులు ఖాళీల పేరిట కథ నడిపిస్తున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత ‘సిండికేట్’గా ఏర్పడిన కొందరు కీలక అధికారులు పో స్టుకో రేటును ఫిక్స్ చేసి అనుయాయులకు ‘ఆన్ డెప్యూటేçషన్’ పేరిట అదనపు బాధ్యతలు కట్టబెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఈ బాగోతం ఇటీవల వివాదస్పదంగా మారింది. ‘ఏ శాఖలో కూడా ఆన్ డెప్యూటేషన్లు ఉండవద్దు.. అవసరమైతే డీపీసీలు పెట్టి నియమాకాలు, పదోన్నతులు ఇవ్వాలి’ అంటూ ఇటీవ ల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఆ ఉ త్తర్వులు రవాణాశాఖలో మాత్రం వర్తించడం లేదు. ఫలితంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆన్ డెప్యూటేషన్ పోస్టింగ్ల వ్యవహారం ఏకంగా రవా ణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి పేషీకి చేరడం ఆ శాఖలో చర్చనీయాంశం అవుతోంది. ఖాళీల పేరిట ‘ఓడీ’ల వ్యవహారం... రవాణాశాఖలో 2013 తర్వాత పదోన్నతులు లేవు. దీంతో కొందరు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు ‘ఖాళీల’ పేరిట ఈ తతంగం నడిపిస్తున్నారు. కానిస్టేబుళ్లు, క్లర్క్ల నుంచి అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ)ల నుంచి ఎంవీఐల పదోన్నతులు నిలిచిపోయాయి. ఎంవీఐల నుంచి డీటీవో/ఆర్టీవోల పదోన్నతుల్లో జాప్యం జరిగినా.. ఇటీవలే హఠాత్తుగా ఐదుగురు జిల్లా రవాణాశాఖ అధికారుల (డీటీవోల)కు ఉప కమిషనర్ (డీటీసీ)లుగా పదోన్నతి కల్పిస్తూ పోస్టింగ్లు ఇచ్చారు. ఇందులో భాగంగానే వరంగల్ డీటీసీగా పురుషోత్తంను నియమించారు. ఇదిలా వుంటే క్లర్క్లు, కానిస్టేబుళ్ల నుంచి ఏఎంవీఐలుగా ప్రమోషన్లు పొందిన వారి పదోన్నతుల ఫైలు ఆరేళ్లుగా ముందుకు సాగడం లేదు. కొందరు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతల విజ్ఞాపన మేరకు రవాణాశాఖలో పదోన్నతుల కోసం డిపార్టుమెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) వేయాలని 2014 అక్టోబర్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రక్రియ మొదలైనట్లే కనిపించినా అనేక కారణాలతో డీపీసీ ఇప్పటివరకు జరగలేదు. ఫలితంగా పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోగా... రవాణాశాఖలో ఖాళీల పేరిట ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను బుట్టదాఖలు చేసి పెద్ద ఎత్తున ‘రేటు’ ఫిక్స్ చేసి ఆన్ డెప్యూటేషన్లను సాగిస్తున్నారని ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. ములుగు కోసం పోటీలో ఆ ఇద్దరు... ట్రాన్పోర్ట్ డిపార్టుమెంట్లో పని చేస్తున్న ఇద్దరు అధికారులు కొత్తగా ఏర్పడిన ములుగు జిల్లా కోసం కూడా పోటీ పడుతుండటం ఆ శాఖలో హాట్టాపిక్గా మారింది. వరంగల్ రూరల్ రెగ్యులర్ ఎంవీఐ రమేష్రాథోడ్ జనగామ ఇన్చార్జి ఎంవీఐతో పాటు డీటీవోగా మూడు బాధ్యతలు నిర్వహిస్తూ ములుగు ఇన్చార్జి డీటీవో కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. భూపాలపల్లి ఎంవీఐగా రెగ్యులర్ పోస్టులో ఉన్న పి.రవిందర్ ఇన్చార్జి డీటీవోతో పాటు ఖమ్మం ఇన్చార్జి ఎంవీఐగా కూడా బాధ్యతల్లో ఉండి, ములుగు కోసం ప్రయత్నం చేస్తున్నట్లు ఆ శాఖ అధికారులు చర్చించుకుంటున్నారు. మహబూబాబాద్ రెగ్యులర్ ఎంవీఐగా, అక్కడే ఇన్చార్జి డీటీవోగా, ఖమ్మం ఇన్చార్జి డీటీవోగా వ్యవహరిస్తున్న బద్రునాయక్కు కూడా ఈ రేసులో ఉన్నట్లు మంత్రి పేషీకి చేరిన ఫిర్యాదులో పేర్కొనడం ఆ శాఖలో చర్చనీయాశంగా మారింది. -
నష్టాలకు మళ్లీ రెక్కలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ నష్టాల బాట వీడలేదు. రెండేళ్లతో పోలిస్తే నష్టాలు కొంత తగ్గాయి. అయితే, గత ఆర్థిక సంవత్సరం కంటే ఈసారి మళ్లీ నష్టాలు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. జనవరితో కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నష్టాలు రూ.603 కోట్లుగా లెక్కతేలింది. ఇందులో జనవరి నెల వాటా రూ.69 కోట్లుగా గుర్తించారు. ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలల్లో లాభాలు నమోదైతేనే మొత్తంగా నష్టాలు తగ్గుతాయి. కానీ గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఏకంగా రూ.170 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం నష్టాలు రూ.650 కోట్లుగా తేలాయి. 2015–16, 2016–17 ఆర్థిక సంవత్సరాల్లో ఈ నష్టాలు ఏకంగా రూ.700 కోట్లను మించిపోయాయి. ఆ తర్వాత దాన్ని రూ.650 కోట్లకే పరిమితం చేశారు. కొన్ని పొదుపు చర్యల వల్లే నష్టాలు తగ్గాయని పేర్కొన్న అధికారులు, పొదుపు మరింత పెంచి ఈ ఆర్థిక సంవత్సరంలో నష్టాలను మరింత తగ్గిస్తామని పేర్కొన్నారు. కానీ, గత నవంబర్లో రూ.105 కోట్లు, డిసెంబర్లో రూ.72 కోట్ల నష్టం రావటంతో పరిస్థితి చేయిదాటిపోయింది. ప్రస్తుతం ఆర్టీసీతీరు గందరగోళంగా మారింది. సంస్థకు పూర్తిస్థాయి ఎండీ లేరు. గతంలో పనిచేసిన రిటైర్ట్ అధికారి రమణారావు పదవీకాలం పొడిగించలేదు. సంస్థపై పూర్తిస్థాయిలో దృష్టి సారించేవారు లేక నష్టాలకు ముకుతాడు పడలేదు. ఇదే ఆర్థిక సంవత్సరంలో ముగ్గురు ఈడీలు పదవీవిరమణ పొందారు. మరో నెల రోజుల్లో ఇంకో అధికారి కూడా రిటైర్ కానున్నారు. నష్టాలకు ముకుతాడు వేస్తా: మంత్రి వేముల ఆర్టీసీని కచ్చితంగా చక్కదిద్దుతానని రవాణా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రకటించారు. మంగళవారం ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... గత ఆర్థిక సంవత్సరం కం టే 5 శాతం నష్టాలు తక్కువగా నమోదయ్యాయని, వచ్చే ఆర్థిక సంవత్సరం తుదివరకు అది 10 శాతం తక్కువగా ఉండేలా చూస్తానని పేర్కొన్నారు. 72 బస్టేషన్లలో బడ్జెట్ హోటళ్ల నిర్మాణం, 97 కేంద్రాల్లో ఇంధన ఔట్లెట్ల ఏర్పాటుతో ఆదాయం పెరుగుతుందన్నారు. ఆర్టీసీ ప్రజాసేవకే ఉందని, లాభార్జన కోసం కాదన్న విషయాన్ని కూడా గుర్తించాలన్నారు. రవాణా శాఖ 2015లో రూ.1,800 కోట్లు ఉన్న ఆదాయాన్ని ప్రస్తుతం రూ.3 వేల కోట్లకు పెంచుకుందని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ఆస్తుల విభజన ఇంకా పీటముడిగానే ఉందన్నారు. నా కోసం కొత్త బస్సుల ప్రారంభం ఆపకండి ‘కొత్త బస్సుల ప్రారంభోత్సవం కోసం నేనో, మరొకరో రావాలని ఎదురు చూడకండి. ఎండీ అందుబాటులో లేకున్నా ఈడీలే వాటిని ప్రారంభించేసుకోవచ్చు. నాలుగైదు రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కాలి’అని ఆర్టీసీ అధికారులను మంత్రి వేముల ఆదేశించారు. మంత్రో, మరెవరో ప్రారంభోత్సవాలకు రావాలని ఎదురుచూస్తూ బస్సులను డిపోలకే పరిమితం చేయటం సరికాదన్నారు. గత సంవత్సరం ఆర్టీసీ కొత్తగా సమకూర్చుకున్న దాదాపు 400 బస్సులను ముఖ్యమంత్రి ప్రారంభించాలన్న ఉద్దేశంతో ఏడెనిమిది నెలలపాటు పార్కింగ్ యార్డులో ఉంచారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్కు వంద ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేయగా తొలిదశలో 40 బస్సులు సమకూరాయి. ఒక్కోటి రూ.3 కోట్ల ఖరీదు చేసే ఈ బస్సులను అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ వినియోగించుకోనుంది. కేంద్రం ఇచ్చిన సబ్సిడీని కూడా ప్రైవేటు సంస్థకు మళ్లించిన అధికారులు ఆ సంస్థ నుంచి వాటిని అద్దెరూపంలో తీసుకోనున్నారు. కిలోమీటరుకు రూ. 34 చొప్పున ఆ సంస్థకు ఆర్టీసీ అద్దె చెల్లిస్తుంది. అంతకుమించి వసూలయ్యే మొత్తాన్ని తాను జమ చేసుకుంటుంది. ప్రస్తుతం నగరంలోని కంటోన్మెంట్, మియాపూర్–2 డిపోలకు 20 చొప్పున బస్సులు కేటాయించారు. -
రోడ్ సేఫ్టీ కమిషనరేట్ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో వందల మంది మృత్యువాత పడుతున్నారు. వేల మంది క్షతగాత్రులుగా మారుతున్నారు. రహదారుల దుస్థితితో పాటు భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యం కారణంగానే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రహదారుల స్థితిగతుల మెరుగుదలతోపాటు రహదారుల భద్రతా ప్రమాణాల అమలుపై నిరంతర పర్యవేక్షణ కోసం త్వరలో రోడ్ సేఫ్టీ కమిషనరేట్ ఏర్పాటు కానుంది. రహదారుల భద్రత బిల్లును సైతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతోంది. తుది రూపుదిద్దుకుంటున్న ఈ బిల్లును భవిష్యత్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ బిల్లు అమల్లోకి వస్తే రహదారుల భద్రతకు రాష్ట్రంలో మరింత ప్రాధాన్యత పెరగనుంది. అన్ని శాఖల పరిధిలోని రహదారుల స్థితిగతులు, భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించేందుకు రోడ్డు సేఫ్టీ కమిషనరేట్ పేరుతో కొత్త ప్రభుత్వ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. రహదారుల భద్రతా ప్రమాణాల అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఆపరేషనల్ వింగ్స్ను స్థాపించనున్నారు. అదేవిధంగా రహదారుల నిర్మాణం, నిర్వహణకు సంబంధించిన నిధుల్లో కొంత శాతాన్ని రహదారుల భద్రత కోసం ఆయా శాఖలు కేటాయించనున్నాయి. రహదారుల భద్రతకు సంబంధించి హైకోర్టు గతంలో జారీ చేసిన ఓ తీర్పు అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఇటీవల రాష్ట్ర రవాణా, పురపాలక, పంచాయతీరాజ్, పోలీసు శాఖలు, జాతీయ రహదారుల విభాగం అధికారులతో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల్లో రహదారు ల నిధుల నుంచి కొంత శాతాన్ని భద్రతా ప్ర మాణాల అమలుకు కేటాయించాలని తాజాగా రాష్ట్ర పురపాలక శాఖ మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, క్షతగాత్రులు, మరణాల సంఖ్య తగ్గింపు కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. 24 గంటల్లో మరమ్మతులు.. హైదరాబాద్ నగర పరిధిలో రహదారుల మరమ్మతుల కోసం 79 తక్షణ మరమ్మతుల బృం దాలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. రహ దారులు దెబ్బతిన్న చోట్లలో తక్షణ మరమ్మతులు చేసేందుకు ఏడాది పొడవున ఈ బృందా లు పనిచేయనున్నాయి. గుంతలను బీటీ మిశ్రమంతో పూడ్చేందుకు బీటీ మిక్సింగ్ ప్లాంట్ను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసుకుంది. నగరంలో దెబ్బతిన్న రోడ్లను కేవలం 24 గంటల్లోగా మరమ్మతు చేసేందుకు బృందాల సంఖ్య ను ఇంకా పెంచుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ను సీఎస్ ఎస్కే జోషి ఆదేశించారు. రా ష్ట్రంలో రహదారుల భద్రతా ప్రమాణాల అమలుపై సంబంధిత శాఖలతో ఇకపై ఆయన క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహించనున్నారు. -
ఏప్రిల్ 1 నుంచి షోరూంల్లోనే నంబర్ ప్లేట్
సాక్షి, హైదరాబాద్: హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల విషయంలో రాష్ట్ర రవాణా శాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. వాహనానికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ బిగించుకోవడం తప్పనిసరయినా.. కొందరు వీటిపై ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఇలాంటి వారు సైతం విధిగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ బిగించుకోవాలన్న ఆలోచనతో షోరూంల్లోనే వీటిని బిగించేలా రవాణా శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ప్రతీ వాహనానికి సంబంధించిన సాంకేతిక వివరాలతోపాటు, వాహన యజమాని వ్యక్తిగత వివరాలు పొందుపరిచేలా.. బయోమెట్రిక్ యంత్రాలు సమకూర్చుకోవాలని షోరూంలకు ఆదేశాలు జారీ చేసింది. హైసెక్యూరిటీ ప్లేట్ల విషయంలోనూ ఇదే విధానం పాటించనుంది. ఇకపై షోరూంల్లో రిజిస్ట్రేషనయ్యే బైకులు, కార్లు, తదితర నాన్ట్రాన్స్పోర్టు వాహనాలకు హైసెక్యూరిటీ ప్లేట్లు అక్కడే బిగించి బయటకు పంపుతారు. హైసెక్యూరిటీ తప్పనిసరి ఎందుకు? వాహనాల విషయంలో పలువురు అవకతవకలకు పాల్పడటం, ఒకే నంబర్పై అనేక వాహనాలు నడపటం, పేలుళ్లకు చోరీ చేసిన వాహనాలు వినియోగించడం తదితర ఘటనలు పెరుగుతున్న దరిమిలా.. 2012లోనే హైసెక్యూరిటీ ప్లేట్ల బిగింపును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. 2015, డిసెంబర్ నాటికి పాత, కొత్త వాహనాలకు వీటిని తప్పనిసరి చేసింది. అయితే, అప్పటి నుంచి కొత్త వాహనాలకు మాత్రమే వీటిని బిగిస్తున్నారు. బైక్కు రూ.245, ఆటోకు రూ.400, కారుకు రూ.619 వసూలు చేస్తున్నారు. షోరూంలో వాహనం కొనుగోలు సమయంలోనే ఈ రుసుము చెల్లించాలి. నంబర్ప్లేట్ సిద్ధం కాగానే వాహనదారుడికి ఎస్ఎమ్ఎస్ వస్తుంది. అపుడు వెళ్లి దాన్ని బిగించుకోవాలి. అసలు ఇలాంటి వాహనాలకు ఆర్సీలు పంపడం వల్లే వాహనదారులు కొందరు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లపై ఆసక్తి చూపడం లేదని తెలంగాణ ఆటోమోటార్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దయానంద్ ఆరోపించారు. వాస్తవానికి ఇలాంటి వాహనాలకు చలానాలకు బదులు సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అమలులో అనేక లోపాలు.. వాస్తవానికి ఈ హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు చాలా పలుచగా ఉన్నాయని విమర్శలున్నాయి. వీటిని పిల్లలు సైతం వంచడం లేదా పీకేయడం సులువుగా చేస్తున్నారు. దీంతో ఈ ప్లేట్లు అమర్చాక పట్టుమని 10 నెలలు కూడా ఉండటం లేదని వాహనదారులు వాపోతున్నారు. మరోవైపు ఇవి ఆకర్షణీయంగా లేవన్న కారణంతో యువకులు చాలామంది బిగించుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో చాలా వరకు హైసెక్యూరిటీ నంబర్ప్లేట్లు ఆర్టీఏ కార్యాలయాల్లో మూలకు పడుతున్నాయి. ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి కొందరు నంబర్ప్లేట్లను వంచడం, విరగ్గొట్టడం చేస్తున్నారు. ఈ నంబర్ ప్లేట్ రెండోసారి బిగించుకోవాలంటే ఎఫ్ఐఆర్ తప్పనిసరి. ఈ తతంగమంతా ఎందుకులే అని వాహనదారులు వారే కొత్త ప్లేట్ వేయించుకుంటున్నారు. హైసెక్యూరిటీ నంబర్ప్లేట్ లేకుండా తిరిగినప్పుడు ట్రాఫిక్, ఆర్టీఏ అధికారులు చలానా రాస్తారు. అయినా.. వాహనదారులు చలానాలు కడుతున్నారు తప్ప.. వీటిని బిగించుకోవడంపై ఆసక్తి చూపడం లేదు. -
ఆర్టీఓలు కావలెను!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖలో ఆర్టీఓలు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ఏకంగా ఆర్టీఓ పోస్టుల్లో సిబ్బంది లేకపోవడంతో ఇన్చార్జుల పాలనే నడుస్తోంది. దాదాపుగా మూడేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నియామకాలపై దృష్టి సారించకపోవడం గమనార్హం. ఇదే అదనుగా చాలా చోట్ల దళారులు చెలరేగుతున్నారు. నేపథ్యం ఏంటి? 2016 అక్టోబర్ వరకు తెలంగాణలో 10 జిల్లాలు ఉండేవి. వాటికి అనుగుణంగా 10 మంది ఆర్టీఓలు ఉండేవారు. కానీ, 2016 దసరా తర్వాత జిల్లాల సంఖ్య 31కి చేరింది. దీంతో మిగిలిన జిల్లాలకు కొత్తగా ఆర్టీఓలు, ఇతర సిబ్బంది అవసరమయ్యారు. అయితే ఈ మేరకు నియామకాలు చేపట్టలేదు. దీంతో ఆ ఆర్టీఓ అధికారులకే మిగతా కార్యాలయాలను అప్పగించారు. దీంతో వీరిపై తీవ్ర పనిభారం పెరిగింది. అయితే వీరికి బాధ్యతలు అప్పగించిన స్థానంలో ఇన్చార్జులుగా మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు/ అడ్మినిస్ట్రేషన్ సిబ్బందిని ఆర్టీఓలుగా నియమించారు. మరీ కీలకమైన పనులు ఉన్నపుడు మాత్ర మే ఆర్టీఓలు సదరు కార్యాలయాలకు వెళ్తున్నారు. ఇన్చార్జులకు పనిభారం.. ప్రస్తుతం 31 జిల్లాలకు 14 జిల్లాలకు ఆర్టీఓలున్నారు. మిగిలిన 17 జిల్లాలకు మాత్రం ఇన్చార్జులే ఆర్టీఓలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వీరిని డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్టు ఆఫీసర్ (డీటీఓ)లుగా పిలుస్తున్నారు. వీరిలో 9 మంది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, 8 మంది డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్లున్నారు. వాస్తవానికి ఆర్టీఓలుగా పదోన్నతి పొందడానికి వీరిలో చాలామందికి అర్హత ఉంది. మూడేళ్లుగా ఇన్చార్జులుగా విధులు నిర్వర్తిస్తున్నా ప్రభుత్వం పదోన్నతులు కల్పించలేదు. ఇటు పనిభారం పెరగటంతో పాటు కనీసం అలవెన్సులు కూడా పెంచలేదంటూ వాపోతున్నారు. ఇప్పటికైనా అర్హులను ఆర్టీఓలుగా నియమించాలని వారు కోరుతున్నారు. త్వరలో మరో రెండు కొత్త జిల్లాలు.. మరో రెండు కొత్త జిల్లాల (ములుగు, నారాయణ్ పేట్) ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇన్చార్జ్ ఆర్టీఓలుగా ఉన్న 17 జిల్లాలతో పాటు కొత్తగా ఏర్పాటయ్యే 2 కొత్త జిల్లాలకు ఆర్టీఓ అధికారులు అవసరమే. ఏజెంట్లదే హవా.. ఇన్చార్జి ఆర్టీఓలున్న ఆఫీసుల్లో ప్రైవేటు ఏజెంట్లు హల్చల్ చేస్తున్నారు. వీరు ఏకంగా సిబ్బందితో కలసిమెలసి ఉంటున్నారు. సాధారణంగా వివిధ పర్మిట్లకు సంబంధించిన వివిధ స్మార్ట్కార్డులు స్పీడ్ పోస్టు ద్వారా పంపాలి. కానీ, ఈ ఏజెంట్లకు రూ. 200 ఇస్తే చాలు. క్షణాల్లో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, వివిధ రకాల పర్మిట్లు నేరుగా చేతిలో పెడుతున్నారు. గతంలో కింది స్థాయిలో పనిచేసిన సమయంలో ఏజెంట్లతో వీరికున్న సాన్నిహిత్యమే ఇందుకు కారణమన్న విమర్శలున్నాయి. -
ఇంకా ‘ఫిట్’ కాలేదు!
సాక్షి, హైదరాబాద్: వాహనాల ఫిట్నెస్ తనిఖీ కోసం చౌటుప్పల్ సమీపంలోని మల్లాపూర్లో ఏర్పాటు చేసిన ఫిట్నెస్ సెంటర్ ప్రారంభోత్సవానికి నోచుకోవట్లేదు. యంత్రాలతో వాహనాల ఫిట్నెస్ను తనిఖీ చేసి 10 నిమిషాల్లో సర్టిఫికెట్ జారీ చేసే సామర్థ్యం ఈ కేంద్రం ప్రత్యేకత. 95 శాతం పూర్తయిన ఈ కేంద్రాన్ని 2018 మే నెలాఖరుకు ప్రారంభించాలి. కానీ పలు కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వస్తోంది. పనులు పూర్తయి ఏడాది కావొస్తున్నా దీన్ని ప్రారంభించట్లేదు. ఈ సెంటర్ ప్రారంభోత్సవాన్ని పట్టించుకున్న నాథుడే కరవయ్యాడు. జాప్యానికి కారణాలేంటి? ఈ కేంద్రానికి కేటాయించిన ప్రాంతంలోని 10 గుంటల స్థలం వివాదంలో చిక్కుకుంది. ఈ స్థలం తనదంటూ ఓ వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. దీంతో దీని ప్రారంభోత్సవంలో జాప్యం నెలకొంటోంది. ఇప్పటిదాకా దాదాపు 70 శాతం మేరకు కొనుగోలు చేసిన యంత్రాలు వృథాగా ఉన్నాయి. వీలైనంత త్వరగా దీన్ని ప్రారంభించాలని, లేకపోతే కోట్లు వెచ్చించి తెప్పించిన యంత్రాలు పనికిరాకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేపథ్యం ఇదీ..! రోడ్డుపైకి వచ్చే ప్రతి వాహనానికి ఫిట్నెస్ ఎంతో కీలకం. ఈ విషయంలో రాష్ట్ర రవాణా అధికారులు వాహనాల ఫిట్నెస్ జారీకి ఇంకా మాన్యువల్ విధానాన్నే పాటిస్తున్నారు. దీనివల్ల అనేక అవకతవకలకు ఆస్కారం ఉంది. మామూళ్ల కోసం పలువురు ఆర్టీఏ అధికారులు ఫిట్నెస్ లేని వాహనాలకు పర్మిట్లు ఇస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్రానికి అనుమతి, నిధులు సమకూర్చింది. 2014లో ఈ సెంటర్ నిర్మాణానికి కేంద్రం వాటా మేరకు రూ.14.4 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2015 జూన్లో చౌటుప్పల్ సమీపంలోని మల్లాపూర్లో దాదాపు 10 ఎకరాల స్థలం కేటాయించింది. ఈ పనులకు అప్పటి రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి శంకుస్థాపన చేశారు. రోజుకు 250 నుంచి 300 వాహనాలను తనిఖీ చేసి సర్టిఫికెట్లు జారీ చేసే సామర్థ్యం ఈ కేంద్రానికి ఉంది. రద్దీని బట్టి దీని కెపాసిటీని పెంచుకునే అవకాశం కూడా ఉంది. పూర్తి అత్యాధునిక ఆటోమేటెడ్ యంత్రాలతో వాహనాలకు ఈ కేంద్రంలో ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇది దేశంలోనే రెండో కేంద్రం కావడం విశేషం. ఈ సెంటర్లో అవసరమైన వాటిలో ఇప్పటివరకు 70 శాతం యంత్రాలు వచ్చాయి. ఏమేం పరీక్షలు చేస్తారు? ఇక్కడి యంత్రాలన్నీ కంప్యూటర్కు అనుసంధానం చేసి ఉంటాయి. సర్టిఫికెట్ల జారీ కూడా కంప్యూటర్ల ద్వారానే జరుగుతుంది. వాహనాల బ్రేకులు, పీయూసీ, ఇంజిన్ కండీషన్, గేర్బాక్స్, హెడ్లైట్లను పరీక్షించేందుకు ఇక్కడ అత్యాధునిక యంత్రాలు అమర్చారు. నిర్ణీత ప్రమాణాల మేరకు వాహనాల పరికరాల్లోని లోపాలను ఇవి క్షణాల్లో గుర్తిస్తాయి. -
ఒకటే టికెట్
సాక్షి, హైదరాబాద్: ఒకే టికెట్తో మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సుల్లో పయనించే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. ఆటోలు, ఓలా, ఉబెర్ క్యాబ్లో సైతం ఈ కాంబి టికెట్ను వినియోగించి పయనించవచ్చు. కామన్ మొబిలిటీ కార్డు (సీఎంసీ)గా పేర్కొనే ఈ టికెట్ పురోగతిపై మంగళవారం బేగంపేట్లోని మెట్రో రైల్ భవన్లో సమీక్ష జరిగింది. రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్శర్మ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తమ్ నాయక్ పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జనవరి నెలాఖరు వరకు కనీసం రెండు మెట్రో స్టేషన్ల్లో, అలాగే ఈ స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించే 100 బస్సుల్లో పైలట్ ప్రాజెక్టుగా సీఎంసీని ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు. ప్రయాణికులు ట్రైన్ దిగిన వెంటనే తమకు అందుబాటులో ఉన్న ఇతర ప్రయాణ సాధనాల ద్వారా లాస్ట్మైల్ వరకు చేరుకునేందుకు ఈ కాంబి టికెట్ దోహదపడుతుంది. ఇలా వినియోగించుకోవచ్చు... ప్రస్తుతం వినియోగంలో ఉన్న క్రెడిట్, డెబిట్ కార్డుల తరహాలోనే స్టేట్ బ్యాంక్ ఈ సీఎంసీలను అందుబాటులోకి తెస్తుంది. ఈ కార్డు ధర రూ.50 వరకు ఉంటుంది. ఒకసారి కార్డు కొనుగోలు చేసిన తరువాత తమ నెలవారీ ప్రయాణ అవసరాలకు అనుగుణంగా రూ.3,000 వరకు రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ కార్డులు అన్ని చోట్ల లభిస్తాయి. బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, షాపింగ్ సెంటర్లు, తదితర అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతారు. సీఎంసీలను స్వైప్ చేసేందుకు మెట్రో రైళ్లు, బస్సులు, ఆటోలు, ఓలా, ఉబెర్ క్యాబ్లో ఇంటెలిజెన్స్ టిమ్స్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టు తర్వాత దశలవారీగా నగరమంతటా ఈ సదుపాయాన్ని విస్తరించనున్నారు. -
ఉలికిపడిన రవాణా శాఖ
విజయనగరం ఫోర్ట్: రవాణశాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ఇంట్లో... ఆయన పనిచేస్తున్న విజయనగరంలోని డీటీసీ(ఉప రవాణా కమిషనర్) కార్యాలయంలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టడమే దీనికి కారణం. ఏకకాలంలో మంగళవారం ఉదయం నుంచి రెండు చోట్లా సోదాలు చేపట్టడంలో అధికారులతోపాటు, సిబ్బందిలో కలవరం మొదలైంది. విధులు నిర్వర్తిస్తున్నంతసేపూ రవాణా శాఖ అధికారులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. కొంతమంది అధికారులు కార్యాలయానికి రాకుండా డుమ్మా కొట్టారు. ఇక్కడ పనిచేసిన అధికారుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించడంఇదే మొదటిసారి కానప్పటికీ... రెండేళ్ల గ్యాప్ తరువాత జరగడమే చర్చకు కారణమైంది. కానిస్టేబుల్ నుంచి ఏఎంవీగా పదోన్నతి కొత్తపల్లి రవికుమార్ కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరి అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ స్థాయికి చేరా రు. విశాఖ పరిధిలోని గాజువాక, మర్రిపాలెం రవాణా శాఖ కార్యాలయాల్లో 20 ఏళ్లపాటు కానిస్టేబుల్గా పని చేసి 2014 సెప్టెంబర్ నెలలో ఏఎంవీగా పదోన్నతిపై విజయనగరం వచ్చారు. విజయనగరం డీటీసీ కార్యాలయంలో కీలకంగా చక్రం తిప్పుతూ ఆదాయానికి మిం చి ఆస్తులు కూడగట్టారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనిపైనే మంగళవారం తెల్లవారు జామునుంచి విశాఖలోని కోరమండల్ గేటు వద్ద ఉన్న అతని నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. చేతివాటం ఎక్కువే చేతివాటం ప్రదర్శించడంలో రవికుమార్ది ఓ ప్రత్యేకతన్న ప్రచారం స్థానికంగా ఉంది. ఈయన డీటీసీ కార్యాలయంలో గాకుండా ఎక్కువగా ఎన్ఫోర్స్మెంట్(వాహన తనిఖీలు చేసే విభాగం)లోనే పనిచేయడానికి ఇష్టపడేవారని స్థానికంగా తెలుస్తోంది. వాహన తనిఖీలు చేసేటప్పుడు చూసీచూడనట్టు వ్యవహరిస్తే చేతివాటం ప్రదర్శించడానికి అవకాశం ఉంటుందనే భావనతో ఈ విభాగాన్ని ఎంచుకుంటారని చెబుతున్నారు. ఈయనపై వచ్చిన ఈ ఆరోపణలతోనే ఏడాది క్రితం ఎన్ఫోర్స్మెంట్ విభాగం నుంచి తప్పించి డీటీసీ కార్యాలయానికి చేర్చారు. మూడు రోజుల క్రితమే మరలా ఎన్ఫోర్స్మెం ట్ విభాగం బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. పని విజయనగరం... నివాసం విశాఖలో... ఉపరవాణా కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్నప్పటికీ సగం మంది అధికారులు పనిచేసే చోట నివాసం ఉండడం లేదు. అధికశాతం మంది విశాఖపట్నం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కాని ఉన్నత అధికారులకు మాత్రం స్థానికంగా నివాసం ఉంటున్నట్టు చూపించడం కోసం ఒక గది అద్దెకు తీసుకుని ఉంచుతున్నారు. అందులో ఈయన కూడా విశాఖనుంచే రాకపోకలు చేస్తున్నారు. 2016లో ఇన్చార్జ్ ఆర్టీఓ చిన్నోడుపై దాడులు 2016లో డీటీసీ కార్యాలయంలో ఇన్చార్జ్ ఆర్టీఓగా పనిచేసిన పిల్లి చిన్నోడు ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే ఆయన కూడ విశాఖలోని సీతమ్మధారలో నివాసం ఉండడంతో అక్కడే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన దాదాపు రూ.60 కోట్ల వరకు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్టు గుర్తించడంతో ఉన్నత అధికారులు అతన్ని సస్పెండ్ చేసారు. రెండేళ్ల అనంతరం ఇప్పుడు ఏఎంవీ రవికుమార్ను కూడ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై విశాఖలోనే దాడులు నిర్వహించడం గమనార్హం. వీరే గాదు... కార్యాలయంలో పనిచేస్తున్న గుమస్తాల దగ్గర నుంచి ఇన్స్పెక్టర్లు, ఉన్నత అధికారుల వరకు ఆదాయానికి మంచి సంపాదిస్తున్నాననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసి విశాఖకు బదిలీపై వెళ్లి ఏసీబీకి పట్టుబడ్డ మోటారు వెహికల్ ఇనస్పెక్టర్లు(ఎంవీఐ) రమేష్. గర్భాల బాలనాయక్ కూడా రూ.కోట్లలోనే సంపాదించినట్టు తేలింది. ఏసీబీకి దొరుకుతున్నా అవినీతి మామూలే... రవాణా శాఖ కార్యాలయంలో పనిచేసే అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నా... ఎవరూ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కలేదు. ఇప్పటికీ ఏజెంట్ల ద్వారా వెళితేనే విజయనగరం రవాణా శాఖ కార్యాలయంలో పని జరుగుతుంది, లేదంటే జరగడం లేదనీ పలువురు పేర్కొంటున్నారు. ఆన్లైన్లోనే అంతా జరుగుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నా... అందులోనూ లొసుగులు చూపించి దండుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదాలకు ‘లైసెన్స్’
దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో ఏటా లక్ష మంది ప్రాణాలు కోల్పోతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపటం, రోడ్డు నిబంధనలు, డ్రైవింగ్ నియమాలు తెలియకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అందరూ భావిస్తుంటారు. అయితే, గతేడాది (2017) జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 80 శాతం ప్రమాదాలకు కారకులు డ్రైవింగ్ లైసెన్సు ఉన్న వారేనని తాజా అధ్యయనంలో తేలింది. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. 2019 నుంచి దేశ వ్యాప్తంగా ఒకే విధమైన డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. అయితే, డ్రైవింగ్ లైసెన్సు నిబంధనలను కచ్చితంగా పాటించడం, ఆర్టీఏ కార్యాలయాల్లో దళారుల వ్యవస్థను నిర్మూలించడం జరగకపోతే ఎన్ని చర్యలు తీసుకున్నా ఉపయోగం ఉండదని సేవ్లైవ్ ఫౌండేషన్ సీఈవో పీయూష్ తివారి హెచ్చరించారు. చట్టంలో ఉన్న లొసుగుల ఆధారంగా అనర్హులు కూడా డ్రైవింగ్ లైసెన్సులు ‘కొనేస్తున్నార’ని ఆందోళన వ్యక్తం చేశారు. తాజా సర్వే ప్రకారం... 2017లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 80శాతం ప్రమాదాలకు డ్రైవింగ్ లైసెన్సు ఉన్న వారే కారణం. దేశంలో డ్రైవింగ్ లైసెన్సు పొందిన వారిలో 59శాతం మంది ఒక్క పరీక్షకు కూడా హాజరు కాలేదు. దేశంలో 25 శాతం మందికి ఒకటి కంటే ఎక్కువ డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయి. డ్రైవింగ్ లైసెన్సు ఉన్న వారిలో రోడ్డు నిబంధనలు తెలిసిన వారు 12 శాతం కంటే తక్కువే. చాలామంది ఎలాంటి పరీక్షలకు హాజరు కాకుండానే దళారులకు 3,4 వేలు చెల్లించి డ్రైవింగ్ లైసెన్సు పొందుతున్నారనీ, అలాంటి వారి చేతిలో వాహనం పిచ్చివాడి చేతిలో రాయిలా మారుతుందని పీయూష్ ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవింగ్ లైసెన్సు నిబంధనలను కచ్చితంగా అమలు పరచాలని ఇందుకోసం పాస్పోర్టు సేవా కేంద్రాల తరహాలో లైసెన్స్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. కొన్ని రాష్ట్రాల్లో వాహనాల ఫిట్నెస్ను పరీక్షించడానికి ఆటోమేటిక్ యంత్రాలు ఏర్పాటు చేస్తున్నారని, డ్రైవింగ్ లైసెన్సు పరీక్షలకు కూడా ఇలాంటి యంత్రాలను ఏర్పాటు చేస్తే లోపాలకు ఆస్కారం ఉండదని ఆయన అన్నారు. -
ఆ ఒక్కటీ ఉంటే..!
సాక్షి, సిటీబ్యూరో: వందలకొద్దీ ప్రమాదాలు.. వేల సంఖ్యలో క్షతగాత్రులు. ఒక్క చిన్న లోపం కారణంగా సకాలంలో వైద్యం లభించక అనేక మంది మృత్యువాతపడుతున్నారు. వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సులలో ఆధార్ నెంబర్తో పాటు వ్యక్తిగత వివరాలను పక్కాగా నమోదు చేసే రవాణాశాఖ మరో ముఖ్యమైన అంశాన్ని మాత్రం విస్మరిస్తోంది. అదే బ్లడ్ గ్రూప్. ఈ ఒక్క అంశం డ్రైవింగ్ లైసెన్సుల్లో ప్రస్తావించకపోవడంతో ప్రమాదాల్లో గాయపడ్డ వారికి సత్వరమే వైద్యం లభించడం లేదు. క్షతగాత్రుల రక్తనమూనా వివరాలు వైద్యులకు వెంటనే తెలుసుకొనే అవకాశం లేకపోవడంతో ప్రమాదాల్లో పెద్ద ఎత్తున రక్తస్రావమైన వారికి వెంటనే రక్తం ఎక్కించలేకపోతున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాల తీవ్రత, బాధితుల సంఖ్య పెరుగుతోందని రహదారి భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన సుమారు 1209 రోడ్డు ప్రమాదాల్లో 1,221 మంది వరకు గాయపడ్డట్లు అధికారులు చెబుతున్నారు. 154 మంది మృత్యువాత పడ్డారు. సకాలంలో వైద్యసేవలు అందితే మృతుల సంఖ్య ఇంకా తగ్గేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు తీవ్ర రక్తస్రావానికి గురైన వారికి సకాలంలో వైద్యం లభించకపోవడంతో చివరకు కాళ్లు, చేతులు కోల్పోయి శాశ్వత వికలాంగులుగా మారుతున్నారు. ‘ఎక్కడో ఊరికి దూరంగా ప్రమాదం జరుగుతుంది. ఆ సమయంలో బంధువులు, తెలిసినవాళ్లు ఎవ్వరూ ఉండరు. క్షతగాత్రులను పోలీసులు, 108 సిబ్బంది ఆసుపత్రుల్లో చేర్పిస్తారు. కానీ ఆ సమయంలో బాధితుల రక్త నమూనా తెలిస్తే తప్ప వైద్యం చేయలేం. అప్పటికే గాయపడి రక్తస్రావమవుతున్నవాళ్లు, రక్త నమూనా తెలుసుకొనే వరకు మరింత రక్తాన్ని కోల్పోవాల్సి వస్తోంద’ని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రామ్కమల్ ‘సాక్షి’తో చెప్పారు. మరోవైపు రహదారి భద్రతా రంగంలో పనిచేసే సంస్థలు సైతం ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. ‘అనేక దేశాల్లో వాహనదారుల పూర్తి వివరాలు, ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు కూడా డ్రైవింగ్ లైసెన్సుల్లో నమోదై ఉంటాయి. కానీ మన దగ్గర మాత్రం అది తప్పనిసరి కాకపోవడం గమనార్హం’ అని ఇండియన్ రోడ్ సేఫ్టీ సంస్థ ప్రతినిధి వినోద్ కనుముల పేర్కొన్నారు. లైసెన్సుల జారీ ఇలా... గ్రేటర్లోని 10 ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ప్రతిరోజు 1000 నుంచి 1500 వరకు లెర్నింగ్ లైసెన్సులు, డ్రైవింగ్ లైసెన్సులు అందజేస్తారు. లైసెన్సులు తీసుకొనే అభ్యర్థులు మొదట ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకోవాలి. ఈ స్లాట్ సమోదు సమయంలోనే అభ్యర్ధులు పేరు, చిరునామా, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, విద్యార్హతలు నమోదు చేయాలి. వీటిలో ఏ ఒక్కటీ నమోదు చేయకపోయినా స్లాట్ లభించదు. అన్ని వివరాలకు ప్రత్యేకంగా ఒక కాలమ్ కేటాయించినట్లుగానే బ్లడ్ గ్రూపు కోసం కూడా కేటాయించారు. కానీ అభ్యర్థులు తమ బ్లడ్ గ్రూపు వివరాలను నమోదు చేయకపోయినా సరే స్లాట్ లభిస్తుంది. మోటారు వాహన చట్టంలో బ్లడ్ గ్రూపు తప్పనిసరి అనే నిబంధన లేకపోవడంతోనే, దానిని ఒక ఆప్షన్గా ఉంచామని రవాణాశాఖ అధికారి ఒకరు తెలిపారు. ‘బ్లడ్గ్రూపును తప్పనిసరి చేస్తే మంచిదే. కానీ అభ్యర్థులు నమోదు చేసిన వివరాలు సరైనవా కాదా తెలుసుకొనేందుకు డాక్టర్ల ధ్రువీకరణ అవసరం. ఇది చాలా పెద్ద పని. కేంద్ర మోటారు వాహన నిబంధనల్లో ఆ అంశం తప్పనిసరి అని లేకపోవడంతో పరిగణనలోకి తీసుకోవడం లేదు’ అని మరో అధికారి చెప్పారు. గవర్నర్ చెప్పినా... డ్రైవింగ్ లైసెన్సుల్లో బ్లడ్గ్రూపు తప్పనిసరిగా ప్రస్తావించకపోవడాన్ని గవర్నర్ నరసింహన్ గతంలోనే గుర్తించారు. డ్రైవింగ్ లైసెన్స్లో బ్లడ్ గ్రూపు ఉంటే మంచిదని సూచించారు. ప్రమాదాలు జరిగినప్పుడు డాక్టర్లకు పని తేలికవుతుందని పేర్కొన్నారు. అప్పట్లో ఆర్టీఏ అధికారులు ఈ సలహాను సీరియస్గానే పరిగణించారు. కానీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఉంటే మంచిది... డ్రైవింగ్ లైసెన్సులో బ్లడ్ గ్రూపు ఉంటే చాలా మంచిది. వెంటనే వైద్యం చేయగలుగుతాం. చాలామంది తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో చేరుతారు. అలాంటి సమయంలో వెంటనే రక్తం ఎక్కించలేం కదా. పరీక్ష చేయాల్సిందే. అప్పటి వరకు పేషెంట్ మరింత నష్టపోవాల్సి వస్తుంది.– డాక్టర్ రామ్ కమల్, ఆర్థోపెడిక్ సర్జన్ తప్పనిసరి చేయాలి.. స్లాట్ నమోదులో బ్లడ్గ్రూపు కోసం ఒక కాలమ్ ఉంచినప్పుడు దానిని తప్పనిసరి చేస్తే మరింత బాగుండేది. నిజానికి డ్రైవింగ్ లైసెన్సు ఒక కీలకమైన ధ్రువీకరణ. దానిని ఎవరైనా, ఎప్పుడైనా, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ప్రామాణికంగా ధ్రువీకరించే వెసులుబాటు ఉండాలి.– వినోద్ , ఇండియన్ రోడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ -
దోచుకో.. దాచుకో
రోడ్డు రవాణా శాఖ (ఆర్టీఏ)లో పనిచేసే కొందరు అధికారులు, సిబ్బంది అక్రమ సంపాదనకు బాగా అలవాటుపడిపోయారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించి.. కేసులు నమోదు చేస్తున్నా ఏమాత్రం భయపడడం లేదు. ఆన్లైన్ వ్యవస్థ తీసుకొచ్చినా అవినీతి తగ్గడం లేదు. అక్రమ వసూళ్ల రూపంలో దోచుకుని.. వాటిని దాచుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు. అనంతపురం సెంట్రల్: రోడ్డు రవాణా శాఖలో అవినీతి అక్రమాలను తగ్గించేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు ఏడెనిమిది రకాల సేవలు తప్ప మిగిలిన 76 రకాల సేవలను ఆన్లైన్లోకి తీసుకొచ్చారు. ఇక పారదర్శక పాలన అందుతుందని అందరూ భావించారు. కానీ అది తప్పని నిరూపిస్తున్నారు కొంతమంది సిబ్బంది. తమ వాటా తమకు అందితే తప్ప ఫైల్ ముందుకు పోదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నారు. దీని వలన పేరుకు ఆన్లైన్ అయినా జరిగేదంతా ఆఫ్లైనేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆగని అక్రమాలు.. శాఖలో మార్పులు తీసుకొస్తున్నా.. వరుస ఏసీబీ దాడులు జరుగుతున్నా అక్రమాలు తగ్గడం లేదు. తాజాగా శనివారం తెల్లవారు జామున పెనుకొండ ఆర్టీఏ చెక్పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు చేసి అనధికారికంగా ఉన్న రూ.10వేల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. పలువురిపై కేసులు నమోదు చేశారు. ఇదే పెనుకొండ చెక్పోస్టుపై 2016లో రెండుసార్లు, గతేడాది ఒక సారి దాడులు చేసి అవినీతిని బట్టబయలు చేశారు. గత నెలలో ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించడానే అభియోగంపై గుంతకల్లు ఆర్టీఓ కార్యాలయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ రవింద్రనాథ్రెడ్డికి సంబంధించి మూడు ప్రాంతాల్లోని ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. రూ.30కోట్లకు పైగా విలువజేసే ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటన మరవకముందే పెనుకొండ ఆర్టీఏ చెక్ఫోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు చేయడం కలవరపాటుకు గురి చేస్తోంది. బాధ్యులపై చర్యలు నిల్ అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారులు, సిబ్బందిపై రోడ్డు రవాణా శాఖలో చర్యలు ఉండడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో ఏసీబీకి పట్టుబడిన వారు మరుసటి రోజు నుంచే యథావిధిగా విధులకు హాజరైన ఘటనలు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే అవినీతి, అక్రమాలను ఏ స్థాయిలో వెనుకేసుకొస్తున్నారో తెలిసిపోతుంది. పెనుకొండ: అక్రమాలకు కేరాఫ్గా నిలుస్తున్న పెనుకొండ ఆర్టీఓ చెక్పోస్ట్పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఏసీబీ డీఎస్పీ జయరామరాజు నేతృత్వంలో సీఐలు ప్రతాపరెడ్డి, చక్రవర్తి శనివారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ దాడుల్లో ఏసీబీ కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, షేక్షావలి, విరూపాక్ష, హరిబాబు పాల్గొన్నారు. మధ్యవర్తులుగా మున్సిపల్ కార్పొరేషన్ డీఈ నరసింహ, అంజనీకుమార్ వ్యవహరించారు. తనిఖీల్లో లెక్కలు లేని రూ.10,010 నగదును అధికారులు స్వాధీనం చేసుకుని.. డ్యూటీలో ఉన్న ఏఎంవీఐ మధుసూదనరెడ్డితో పాటు హోంగార్డ్ చాంద్బాషాపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ మీడియాకు వెల్లడించారు. అక్రమ వసూళ్లకు తెరలేపారిలా.. చెక్పోస్ట్లో ఇరవై రోజులుగా సీసీ కెమెరాలు పని చేయడం లేదు. ఇక ఏమి చేసినా సాక్ష్యాధారాలు ఉండవని ఇక్కడి సిబ్బంది రెచ్చియపోయారు. బెంగళూరు, అనంతపురం వైపు వెళ్లే లారీల డ్రైవర్లు డబ్బులు – రికార్డులు తీసుకురాగా చెక్పోస్ట్ సిబ్బంది నగదును చేతికి తీసుకోకపోవడంతో వారు సమీపంలోని పూలకుండీలో వేసి వెళ్లారు. ప్రతి డ్రైవర్ అదేవిధంగా చేశాడు. ఏసీబీ డీఎస్పీ ఇదంతా నిశితంగా పరిశీలించారు. ఎంవీఐలకు చురకలు చెక్పోస్టులో సీసీ కెమెరాలు చెడిపోయి ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి.. మరమ్మతు చేయించుకోకుండా మూడు వారాలైనా పట్టించుకోవడం లేదంటే డబ్బు వసూలు కోసమే ఇలా చేశారు కదా అంటూ ఎంవీఐలకు ఏసీబీ అధికారులు చురకలంటించారు. ఓ మహిళా ఎంవీఐ తాను ఐదు రోజుల క్రితమే ఇక్కడికి వచ్చానని చెప్పగా.. డీఎస్పీ పరిగణనలోకి తీసుకోలేదు. ఏసీబీ అధికారులు వచ్చిన విషయాన్ని పసిగట్టిన ప్రైవేట్ వ్యక్తులు అక్కడి నుంచి ఉడాయించినట్లు తెలిసింది. -
అంతా వాళ్లిష్టం..
సాక్షి సిటీబ్యూరో: ఆటో పర్మిట్లు ఫైనాన్షియర్లకు కాసులు కురిపిస్తున్నాయి. సాధారణంగా కొత్త ఆటో ధర రూ.1.60 లక్షల నుంచి రూ.1.70 లక్షల వరకు ఉంటుంది. అయితే ఫైనాన్షియర్లు విక్రయించే ధర ఏకంగా రూ.2.7 లక్షలు కావడం గమనార్హం. అంటే ఒక్క ఆటోపై రూ.లక్ష నుంచి రూ.1.10 లక్షల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ‘ఆటోడ్రైవర్ల సంక్షేమం’ పేరుతో అనేక రకాల చట్టాలను రూపొందించే రవాణాశాఖ ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయలేకపోతోంది. వేల సంఖ్యలో ఆటో పర్మిట్లు ఫైనాన్షియర్ల గుప్పిట్లో ఉండడమే ఇందుకు కారణం. వాహన కాలుష్యం దృష్ట్యా ప్రభుత్వం నగరంలో కొత్త ఆటోపర్మిట్లపై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలే ఫైనాన్షియర్లకు కాసులు కురిపిస్తున్నాయి. ఆంక్షల నేపథ్యంలో ఆటోడ్రైవర్లు నేరుగా షోరూమ్కు వెళ్లి ఆటో కొనుగోలు చేసే వీలు లేదు. కాలం చెల్లిన, పాత ఆటో రిక్షాల స్థానంలో మాత్రమే కొత్త వాటిని కొనుగోలు చేయవచ్చు. రవాణా అధికారుల సమక్షంలో పాత ఆటోలను తుక్కు కింద మార్చివేస్తే వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేసేందుకు అనుమతిస్తారు. ఫైనాన్షియర్ల చక్రవడ్డీ వ్యాపారం కారణంగా సకాలంలో డబ్బులు చెల్లించలేక ఆటోరిక్షాలను వదులుకున్న వారు వేల సంఖ్యలో ఉన్నారు. అలాంటి పాత వాహనాల పర్మిట్లను ఫైనాన్షియర్లు రూ.లక్ష నుంచి రూ.1.10 లక్షలకు విక్రయిస్తున్నారు. అంటే ఒక ఆటోడ్రైవర్ కొత్తగా ఆటో కొనుగోలు చేయాలంటే పాత పర్మిట్కు రూ.లక్ష చొప్పున, కొత్త ఆటోకు రూ.1.6 లక్షల చొప్పున రూ.2.6 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. డిఫాల్టర్లుగా మారిన ఆటోడ్రైవర్ల నుంచి వచ్చే వాటితో పాటు సహజంగానే కాలం చెల్లిన ఆటోలను కూడా వాటి యజమానుల నుంచి కొనుగోలు చేసి రూ.లక్షల్లో విక్రయిస్తున్నారు. అక్రమార్జనకు మూలం ఇక్కడే.. ఒక ఆటోడ్రైవర్ ఆటోరిక్షా ద్వారా నగరంలో ఉపాధి పొందాలంటే కనీసం రూ.2.7 లక్షల వరకు వెచ్చించాలి. ఇది సాధ్యం కాకపోవడంతో తన వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బులకు మరికొంత అప్పు చేయాల్సి వస్తుంది. వీరి అవసరం ఫైనాన్షియర్లకు అక్రమార్జనకు ఊతమిస్తోంది. వడ్డీలపై అప్పులు ఇస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వారు అప్పులు తీసుకోవాల్సి వస్తోంది. ఆంక్షల కారణంగా పర్మిట్లను తమ దగ్గర పెట్టుకొని అక్రమ దందాలకు పాల్పడుతున్న ఫైనాన్షియర్లు ఆటోల ధరలను భారీగా పెంచేస్తున్నారు. దీంతో ఆటోడ్రైవర్లు పర్మిట్ల కోసం చెల్లించే రూ.లక్షా 10 వేలతో పాటు, వడ్డీ రూపంలో కనీసం మరో రూ.50 వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఒక వేళ సకాలంలో చెల్లించలేకపోతే తిరిగి డిఫాల్టర్లుగా మారి ఆటోలను కోల్పోవాల్సి వస్తోంది. అలా స్వాధీనం చేసుకున్న ఆటోలను మరొకరికి విక్రయిస్తున్నారు. ఒక చట్రంలా సాగుతున్న ఈ సుడిగుండంలో ఆటోడ్రైవర్లే సమిధలుగా మారుతున్నారు. ఆర్టీఏ ప్రేక్షక పాత్రకు పరిమితం.. ఆటోడ్రైవర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం పన్నుల భారాన్ని తొలగించింది. పర్మిట్లపై ఆంక్షలను సడలిస్తూ కొత్తవి కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. అయినా ఫైనాన్షియర్ల కబంధ హస్తాల నుంచి ఆటోడ్రైవర్లకు విముక్తి కల్పించడంలో మాత్రం విఫలమవుతోంది. వందలాది మంది ఫైనాన్షియర్లు కేవలం నామమాత్రపు పత్రాలపైన చేసుకున్న ఒప్పందాలనే ప్రామాణికంగా భావించి ఆర్టీఏ అధికారులు వాహనాల రిజిస్ట్రేషన్లకు అనుమతులిచ్చేస్తున్నారు. ఆటోడ్రైవర్కు, ఫైనాన్షియర్కు మధ్య రుణ ఒప్పందాన్ని (హైపతికేషన్) ధృవీకరిస్తున్నారు. అయితే ఫైనాన్షియర్ చట్టబద్దతను, ప్రామాణికతను ఆర్టీఏ అధికారులు ఎక్కడా పరిగణనలోకి తీసుకోకపోవడంతో కోట్లాది రూపాయాల అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నారు. ఆటోడ్రైవర్లపై సాగుతున్న ఈ దారుణ దోపిడీలో ఆర్టీఏ ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. -
అమ్మాయిలు అదరగొట్టారు
సాక్షి, హైదరాబాద్: విదేశీ రహదారులపై హైదరాబాదీ మహిళలు దూసుకెళ్తున్నారు. చదువు, ఉద్యోగం, వ్యా పారం తదితరాల కోసం ఇతర దేశాలకు వెళ్తున్న వనిత లు.. అక్కడ సొంత డ్రైవింగ్కే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ పొందిన వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారంటే వ్యక్తిగత వాహనాల వినియోగానికి వారు ఎంత ప్రాధాన్యమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది ఇప్పటివరకు 14,365 మంది పర్మిట్ తీసుకోగా అందులో 8, 549 మంది మహిళలే ఉన్నారు. విదేశాల్లో ప్రజా రవాణా తక్కువగా ఉండటం, వ్యక్తిగత డ్రైవింగ్ తప్పనిసరి కావడం, పటిష్టమైన రహదారి భద్రత నిబంధనలు కూడా తోడవడంతో సొంత డ్రైవింగ్పై ఆసక్తి చూపుతున్నారు. సొంత వాహనాలకే ప్రాధాన్యం అమెరికా వంటి దేశాల్లో చాలా ప్రాంతాల్లో ప్రజా రవాణా తక్కువ. దీంతో ప్రతి ఒక్కరూ సొంత వాహనాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. అయితే హైదరాబాద్లో సొంత వాహనాలపై పరుగులు తీసిన వాళ్లు విదేశాల్లో మరింత ఉత్సాహంగా దూసుకెళ్తున్నారు. నగరంలో పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్లో వాహనాలు నడిపిన వారికి అక్కడ డ్రైవింగ్ సులువవుతోంది. కొద్దిపాటి మెళకువలతో చక్కగా డ్రైవింగ్ చేస్తున్నారు. అక్కడి పటిష్టమైన రహదారి భద్రత నిబంధనలు, సురక్షిత డ్రైవింగ్కు ఎక్కువ అవకాశాలు ఉండటం, ట్రాఫిక్ తక్కువగా ఉండటం ఇందుకు దోహదపడుతున్నాయి. రహదారులు, ట్రాఫిక్కు అనుగుణమైన వేగ నియంత్రణ విధానం, పోలీసుల నిఘా కూడా వాహనదారులకు భరోసా ఇస్తున్నాయి. దీంతో నగరం నుంచి వెళ్తున్న వారు సొంత వాహనాలకే ప్రాధాన్యమిస్తున్నారు. వెంటనే పర్మిట్ అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ తీసుకోవడం చాలా తేలిక. పాస్పోర్టు, వీసా తీసుకున్న నగరవాసులు.. రవాణా శాఖ అధికారిక వెబ్సైట్లో అంతర్జాతీయ పర్మిట్ కోసం స్లాట్ నమోదు చేసుకొని ఆన్లైన్ ద్వారా లేదా ఈ–సేవలో రూ.1,500 ఫీజు చెల్లించాలి. స్లాట్ ప్రకారం ఆర్టీఏ అధికారులను సంప్రదిస్తే అదే రోజు పర్మిట్ అందజేస్తారు. ఆయా దేశాల్లో ఏడాది పాటు ఇది చెల్లుబాటులో ఉంటుంది. ఆ లోపు అక్కడి నిబంధనల మేరకు లైసెన్సు తీసుకుంటే చాలు. గ్రేటర్లో 48 వేల పర్మిట్లు రాష్ట్రంలో ఇప్పటివరకు 68,078 అంతర్జాతీయ పర్మిట్లు ఇచ్చారు. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే 48 వేల వరకు ఉన్నాయి. పర్మిట్లు ఏటా 10–15 శాతం పెరుగుతున్న రవాణా అధికారులు అంచనా వేస్తున్నారు. ‘మన దగ్గర జూన్లో స్కూళ్లు, విద్యా సంస్థలు తెరుచుకున్నట్లు అక్కడ ఆగస్టులో ప్రారంభమవుతాయి. దీంతో అప్పటివరకు సెలవుల కోసం నగరానికి వచ్చిన వారు తిరిగి వెళ్లే సమయంలో తప్పనిసరిగా అంతర్జాతీయ పర్మిట్లతో వెళ్తున్నారు. సాధారణంగా ఆగస్టు, డిసెంబర్ నెలల్లో ఎక్కువ మంది అంతర్జాతీయ పర్మిట్ల కోసం వస్తున్నారు’అని ఓ ఆర్టీఏ అధికారి తెలిపారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాల కోసం ఎక్కువ మంది పర్మిట్లు తీసుకుంటున్నట్లు చెప్పారు. గత నాలుగేళ్లలో పర్మిట్లు పొందిన వారిలో మగవారు ఎక్కువగా ఉండగా.. ఈ సారి మాత్రం మహిళలు ఎక్కువగా ఉన్నారు. -
భద్రత లేని అంబులెన్స్ ప్రయాణం!
సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లా బలిజిపేట మండలం మిర్తివలస వద్ద ఈ ఏడాది ఏప్రిల్ 14న చంద్రన్న సంచార చికిత్స వాహనం, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో సంచార చికిత్స వాహనం డ్రైవర్ శిల్లా మోహనరావు, స్టాఫ్ నర్సు సంతోషికుమారి మరణించగా, ఆర్టీసీ బస్సులో ఉన్న 16 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆర్టీసీ బస్కు, చంద్రన్న సంచార చికిత్స వాహనానికి ఫిట్నెస్, బీమా రెండూ లేవు. ఈ కారణంగా బాధిత కుటుంబాలకు న్యాయంగా దక్కాల్సిన పరిహారం అందలేదు. - నాలుగు నెలల కిందటగుంటూరు జిల్లా 104 వాహనాల డ్రైవర్లు మూకుమ్మడిగా రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి అంబులెన్స్లు, సంచార చికిత్స వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు చేయించాలని, బీమా కంపెనీలు ప్రీమియం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ప్రభుత్వ సర్వీసులో ఉన్న వాహనాలు ప్రమాదాలు జరిగినప్పుడు పరిహారం అందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వాపోయారు. అయినా ఇంతవరకు చర్యలు లేవు. - రెండ్రోజుల కిందట తూర్పుగోదావరి జిల్లా మండపేట నుంచి కందులపేట వెళుతున్న ఓ 104 అంబులెన్స్ను రవాణా శాఖ అధికారులు తనిఖీ చేయగా, రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేవు. దీంతో రవాణా అధికారులు కేసు నమోదు చేశారు. - గతేడాది అక్టోబరులో విజయవాడలో గవర్నర్పేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుడమేరు వంతెన వద్ద బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా జనంపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి కారణం బస్సు ఫిట్నెస్ లేకపోవడమే. చంద్రన్న వాహనాలతో అధిక ప్రమాదాలు సాధారణంగా ఏ వాహనమైనా ఫిట్నెస్ లేనిదే రోడ్డుపై తిరిగేందుకు వీల్లేదు. అలాంటిది ఏకంగా ప్రభుత్వ వాహనాలనే ఫిట్నెస్ లేకుండా రోడ్లపై తిప్పుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను ఆస్పత్రులకు సకాలంలో చేర్చే 108, 104 అంబులెన్స్లు ఫిట్నెస్ లేకుండా దర్జాగా తిరుగుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఆ వాహనాలన్నింటికీ అనుమతులు కాలం చెల్లినవే కావడం గమనార్హం. కనీసం ఆ వాహనాల పరిస్థితి ఏంటో ఏ అధికారీ పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో 108 వాహనాలు 438, 104 వాహనాలు 277 వరకు మొత్తం 715 వరకు ఉన్నాయి. వీటిలో 500 వాహనాలకు ఫిట్నెస్ లేకపోవడం గమనార్హం. ఇటీవలి కాలంలో చంద్రన్న సంచార చికిత్స వాహనాలతో రాష్ట్రంలో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. ఫిట్నెస్ పరీక్షలకు దూరంగా ప్రభుత్వ వాహనాలు పోలీసు శాఖ వాడుతున్న జీపులు కూడా ఫిట్నెస్ పరీక్షలకు దూరంగా ఉంటున్నాయి. ఆర్టీసీ బస్సులకు తూతూ మంత్రంగా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటికి ఆటోమేటెడ్ పరీక్షలు నిర్వహిస్తే, సగంపైగా బస్సులకు ఫిట్నెస్ లభించదని ఓ రవాణా ఉన్నతాధికారి అభిప్రాయం. ఆర్టీసీలో మొత్తం 10,736 బస్సులున్నాయి. వీటన్నింటికి బీమా కట్టాలంటే ఎక్కువ ఖర్చవుతుందని ఏకంగా ఆర్టీసీ బీమా లేకుండానే ఆర్టీసీ బస్సుల్ని తిప్పడం గమనార్హం. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడే బీమా, ఫిట్నెస్ లేని అంశాలు చర్చకు వస్తున్నాయి. సుప్రీంకోర్టు కమిటీ ఆగ్రహం ప్రభుత్వ వాహనాలే ఫిట్నెస్, అనుమతులు, బీమా లేకుండా తిరుగుతున్నా రవాణా శాఖ అధికారులు ఏ మాత్రం పట్టింకోవడం లేదు. ఏదో నామమాత్రంగా అప్పుడప్పుడు తనిఖీలు చేయడం మినహా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. దీనిపై ఇటీవల సుప్రీంకోర్టు కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘వాహనాలకు బీమా లేకపోతే రోడ్లపై ఎందుకు తిరగనిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు పరిహారం కూడా అందడం లేదు. ఫిట్నెస్, వాహన బీమా లేకపోతే ఏ వాహనాన్నైనా సీజ్ చేయాల్సిందే. రెండు నెలల్లోగా ఎన్ని తనిఖీలు చేశారు, ఎన్ని వాహనాలు సీజ్ చేశారు, అనే వివరాలతో సమగ్ర నివేదిక అందించండి’ అని రహదారి భద్రతపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ ఇటీవల రవాణా శాఖను ఆదేశించింది. రోడ్ సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీంకోర్టు సాధికార కమిటీ నివేదిక ప్రకారం ఏపీలో రోడ్డు ప్రమాదాల శాతం 5.7గా నమోదవుతుంటే, 2 శాతం రోడ్డు ప్రమాదాలు ఫిట్లెస్ వాహనాల కారణంగానే జరుగుతున్నాయి. 2017లో రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు 24,375 రోడ్డు ప్రమాదాలు జరిగితే, ఇందులో ఫిట్నెస్ లేని వాహనాల కారణంగా ఏడు వేలకు పైగా ప్రమాదాలు జరిగినట్లు రవాణా శాఖ అంచనా. -
ఎల్ఎల్ఆర్ మేళాతో మోసం
జంగారెడ్డిగూడెం : కాదేది వసూళ్లకు అనర్హం అన్నట్లుగా సాగింది ఓ సీఎస్సీ నిర్వాహకుడి తీరు. రవాణా శాఖ ద్వారా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎల్ఎల్ఆర్ మేళాను కాసులు కురిపించే కార్యక్రమంగా మార్చుకున్నాడు. అమాయక గిరిజనులను టార్గెట్ చేసుకుంటూ లక్షలాది రూపాయలు కాజేశాడు. మోసపోయామని తెలుసుకున్న గిరిజనులు ఐటీడీఏ పీఓను ఆశ్రయించడంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రవాణా శాఖ ప్రతీ వాహన చోదకుడు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రవాణా శాఖ జంగారెడ్డిగూడెం సబ్యూనిట్ ఆధ్వర్యంలో ఇటీవల జీలుగుమిల్లిలో ఒక సీఎస్సీ (కామన్ సర్వీస్ సెంటర్) ద్వారా ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు మంచి స్పందన వచ్చింది. ఆ రోజు సర్వర్ సక్రమంగాపనిచేయకపోవడంతో కొద్ది మందికి మాత్రమే స్థానిక ఎంవీఐ సీహెచ్ వెంకటరమణ, ఏఎంవీఐ శ్రీనివాస్ ఎల్ఎల్ఆర్లు జారీచేయగలిగారు. మిగిలిన వారంతా నిరాశతో వెనుదిరిగారు. దీనినే సీఎస్సీ నిర్వాహకుడు కాసులు పండించే అవకాశంగా మలుచుకున్నాడు. రవాణాశాఖ అధికారులకు తెలియకుండా వారి అనుమతి లేకుండా ఏజెన్సీ గ్రామాల్లో సొంతంగా ఎల్ఎల్ఆర్ మేళాను ఏర్పాటు చేశారు. ఒక కారులో ల్యాప్టాప్ తీసుకుని ఆయా గ్రామాలకు వెళ్లి దండోరా వేయించి ఏకంగా పంచాయతీ కార్యాలయంలోనే ఎల్ఎల్ఆర్ మేళా ఏర్పాటు చేశాడు. డ్రైవింగ్ లైసెన్స్ కావాల్సిన వారు పంచాయతీ కార్యాలయానికి రావాలని డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తామని దండోరా వేయించారు. ఐటీడీఏ ద్వారా మేళాను ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చాడు. దీంతో అమాయక గిరిజనులు వందల సంఖ్యలో క్యూకట్టారు. ఇలా జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో సదరు సీఎస్సీ నిర్వాహకుడు మేళాను ఏర్పాటు చేశారు. వాస్తవానికి మోటార్ సైకిల్ ఎల్ఎల్ఆర్కు రూ.260 తీసుకోవాల్సి ఉండగా సదరు నిర్వాహకుడు రూ.600, కారు లేదా ట్రాక్టర్కు అయితే రూ.410 తీసుకోవాల్సి ఉండగా రూ.1000 వరకు వసూలు చేశాడు. అంటే ఒక్కొక్క ఎల్ఎల్ఆర్కు రెట్టింపుపైగా వసూలు చేశాడు. సుమారు 2500 స్లాట్లు బుక్ చేశాడు. ఈ విధంగా లక్షలాది రూపాయలు దండుకున్నాడు. దీంతో స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో సెప్టెంబర్ 2వ వారం వరకు కూడా ఎల్ఎల్ఆర్కు స్లాట్లకు ఖాళీలేదు. సదరు నిర్వాహకుడు బుక్ చేసిన స్లాట్కు సంబంధించి గిరిజన యువకులు ఎంవీఐ కార్యాలయానికి వచ్చి లైసెన్స్ ఇమ్మని అడగడంతో రవాణా శాఖాధికారులు అవాక్కయ్యారు. దీనికోసం టెస్ట్ నిర్వహించడంతో వారంతా అవగాహన లేక టెస్ట్లో విఫలమయ్యారు. దీంతో గిరిజనులు ఐటీడీఏ పీఓ హరేంద్రప్రసాద్కు ఫిర్యాదుచేశారు. వెంటనే ఆయన స్థానిక ఎంవీఐ సీహెచ్ వెంకటరమణను అడగ్గా తామేమీ ఎల్ఎల్ఆర్మేళా నిర్వహించలేదని స్పష్టం చేశారు. దీంతో నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఐటీడీఏ మేనేజర్కు ఆదేశాలు జారీచేశారు. అయినా ఫలితం లేకపోయింది. గిరిజనులు మాత్రం డ్రైవింగ్ లైసెన్సుల కోసం స్థానిక ఎంవీఐ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో ఎంవీఐ వెంకట రమణ సీఎస్సీ హెడ్ అయిన ఏలూరుకు చెందిన రాజుకు ఫోన్లో జీలుగుమిల్లి సీఎస్సీ నిర్వాహకుడిపై ఫిర్యాదు చేశారు. అయినా నేటికీ చర్యలు లేవు. తామంతా మోసపోయామని, తమ వద్ద ఎల్ఎల్ఆర్ పేరుతో లక్షలాది రూపాయలు సీఎస్సీ నిర్వాహకుడు వసూలు చేశాడని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నాలుగు ‘హారాల’కు ఓకే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హరితహారం కారణంగా ఆర్అండ్బీ శాఖ అధికారులు–జాతీయ రహదారుల నిర్వాహకుల (కన్షెషనర్ల) మధ్య నెలకొన్న వివాదం ముగిసింది. రవాణాశాఖ కమిషనర్ సునీల్శర్మ జోక్యంతో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరింది. మొదట ఆర్అండ్బీ చెప్పినట్లుగా రోడ్డుకు ఇరువైపులా ఆరు వరుస (3+3)ల్లో కాకుండా.. చివరికి నాలుగు వరుస (2+2)ల్లో మొక్కలు నాటేందుకు కన్షెషనర్లు ముందుకు వచ్చారు. శుక్రవారం సచివాలయంలో సునీల్శర్మ వారితో మాట్లాడారు. అసలేం జరిగింది? రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారాన్ని తమ పరిధిలోని రోడ్లకు ఇరువైపులా విజయవంతంగా నిర్వహించాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. దీంతో రోడ్లు భవనాల శాఖ ఇందుకోసం దాదాపు రూ.20 కోట్ల నిధులను కేటాయించింది. జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్క లు నాటే విషయంలో కన్షెషనర్లు–ఆర్అండ్బీ అధికారుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. రహదారులకు ఇరువైపులా ఆరు వరుసల్లో మొక్కలు నాటేందుకు రోడ్లు భవనాల శాఖ సిద్ధమైంది. రెండు వరుసల వరకైతే తమకు అభ్యంతరం లేదని కన్షెషనర్లు చెప్పారు. దీనిపై మంత్రి తుమ్మల అసంతృప్తి వ్యక్తం చేశారు. కన్షెషనర్లపై కేంద్రమంత్రికి ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. సాధ్యం కాదన్న ఎన్హెచ్ఐఏ అధికారులు.. ఈ విషయంలో ఇరు వర్గాల మధ్య సమాచార మార్పిడి లోపంతోనే వివాదం చెలరేగింది. చివరికి ఈ విషయం మంత్రి తుమ్మల దాకా వెళ్లింది. ఈ విషయంపై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఐఏ) ప్రతినిధులు ‘సాక్షి’కి స్పష్టతనిచ్చారు. నేషనల్ గ్రీన్ హైవేస్ పాలసీ–2015 నిబంధనల ప్రకారం.. ఆరు వరుసల్లో మొక్కలు నాటడం కుదరదని తెలిపారు. ఎందుకంటే తెలంగాణలో ఉన్న జాతీయ రహదారుల వెడల్పు 60 మీటర్లు, ఇందులో డివైడర్ 5 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇక మిగిలిన రెండువైపులా 27.5 మీటర్ల స్థలం ఎన్హెచ్ఐఏ ఆధీనంలో ఉంటుంది. ఇందులో 22 మీటర్లు బీటీ రోడ్డు పోగా మిగిలిన 5 మీటర్ల ఖాళీ స్థలం భవిష్యత్తు అవసరాల కోసం ఉంచుతారు. ఇపుడు అందుబాటులో ఉన్న స్థలం ప్రకారం.. ఒక వరుస చెట్లను ఇప్పటికే నాటారు. మరో వరసకు అతికష్టమ్మీద మొక్కలు నాటే వీలుంది. ఇక మూడో వరసకు చోటే లేదన్నది కన్షెషనర్ల వాదన. ఒక వేళ నాటినా.. రోడ్డు విస్తరణ సమయంలో వాటి కొట్టేయడానికి అనేక అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 31 నాటికి పూర్తి.. ఎక్కడైనా మొక్కలు ఎండిపోయినా, చనిపోయినా వాటిస్థానంలో కొత్తవి నాటుతామని, మొత్తం మీద ఆగస్టు 31 నాటికి హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల చెప్పారు. మరోవైపు జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి హరితహారంలో భాగంగా నాటిన అనేక మొక్కలను మిషన్ భగీరథ కోసం పెకిలించివేశారని ఎన్హెచ్ఏఐ అధికారులు వాపోయారు. మేం చిన్న మొక్క పెకిలించాలన్నా.. అభ్యంతరాలు వ్యక్తం చేసే అటవీశాఖ అధికారులు మిషన్ భగీరథ కోసం వేలాది మొక్కలు పెకిలించినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. -
ప్రాణాలతో చెలగాటం !
ప్రైవేటు బస్సులు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నాయి. రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాలకు రాష్ట్ర రాజధాని నగరం విజయవాడ నుంచి ప్రయాణికులను చేరవేసేందుకు అనుమతులు తీసుకుంటున్న యాజమాన్యాలు ఆ తరువాత నిబంధనలు పాటించకుండా బస్సులను తిప్పుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రైవేటు బస్సుల తీరు ప్రత్యక్షంగా కనిపిస్తున్నా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం వెనుక ‘మామూళ్లే’ కారణమన్న ఆరోపణలున్నాయి. సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ ఆర్టీసీ బస్టాండ్కు కూతవేటు దూరంలోనే ఈ బస్సుల స్టేజీలు ఉన్నా.. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు బస్టాండుకు వస్తున్న ప్రయాణికులను పిలిచి మరీ ప్రైవేటు బస్సుల్లో ఎక్కించుకుంటున్నా అధికారులు నోరు మెదపకపోవడం విడ్డూరంగా ఉంది. స్టేజీ క్యారియర్గా ఒక్క బస్సుకూ అనుమతి లేకుండా నిత్యం వందలాది బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాజధాని హైదరాబాద్కు తిరుగుతున్నా చేష్టలుడిగి చూడటం రవాణా శాఖ అధికారులకే చెల్లింది. ఒక్క బస్సుకూ అనుమతి లేదు.. రాజధాని ప్రాంతం కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ప్రతి రోజూ రాష్ట్రంతోపాటు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితరాల ప్రాంతాలకు 750 బస్సులు ప్రయాణికులను చేరవేస్తున్నాయి. వీటిలో ఒక్క బస్సుకూ స్టేజీ క్యారియర్ అనుమతి లేదు. అయినా ఆ బస్సులు నిత్యం రోడ్లపై తిరుగుతున్నాయి. దీనిని అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎప్పుడైనా ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం హడావుడి చేసి ఆ తర్వాత చేతులు దులుపుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో ప్రస్తుతం రవాణాశాఖలో 530 బస్సులు తిరుగుతున్నాయి. వీటిల్లో ప్రయాణికులను చేరవేసే ప్రైవేటు బస్సులు 225 వరకు ఉన్నాయి. వీటిలో 13 జిల్లాల్లో తిరిగేందుకు పర్మిట్లు ఉన్నవి 108, జాతీయ పర్మిట్లు కలిగినవి 117 ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 150 ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, బెంగళూరు తదితర ప్రాంతాలకు తిరుగుతున్నాయి. మిగిలిన బస్సులు అనంతపురం, కడప, తిరుపతి నగరాల నుంచి తిరుగుతున్నాయి. పండిట్ నెహ్రూ బస్టాండే అడ్డాగా... విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ను అడ్డాగా చేసుకుని ప్రైవేటు బస్సులు దందా సాగిస్తున్నాయి. ఆర్టీసీ బస్టాండుకు వెళ్లేందుకు వస్తున్న ప్రయాణికులను ఆయా ప్రైవేటు బస్సుల సహాయ సిబ్బంది ప్రయాణికులను దారి మళ్లిస్తున్నారు. బస్టాండుకు కూతవేటు దూరంలోనే ఈ తతంగమంతా జరుగుతున్నా అటు ఆర్టీసీ అధికారులు కానీ, ఇటు రవాణా శాఖ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. అదేవిధంగా రవాణా శాఖ కమిషనర్ కార్యాలయం ముందు కూడా పదుల సంఖ్యలో ప్రైవేటు బస్సులు తిష్ట వేసి ప్రయాణికులను తీసుకెళ్తున్నాయి. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు ఇస్తున్న నెలావారీ మామూళ్లకు అలవాటు పడే రవాణా శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ? గత ఏడాది మార్చి నెల 1వ తేదీన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద జరిగిన ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మృతి చెందగా.. 32 మంది గాయపడ్డారు. ఈ ఘటన అప్పట్లో రవాణాశాఖలో పెద్ద దుమారాన్ని రేపింది. దీనిపై కృష్ణా డీటీసీ కార్యాలయం వద్ద విజయవాడ ఎంపీ కేశినేని నాని, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా, ఎమ్మెల్యే బుద్దా వెంకన్నలు.. రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దాడి చేసినంత పనిచేశారు. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకొని ఇరువురికి రాజీ చేయాల్సి వచ్చింది. సోమవారం రోజూ జగ్గయ్యపేట సమీపంలోనే మరో బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మూడు బస్సులు, ఒక కారు ఢీ కొన్న సమయంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. లేదంటే భారీ ప్రాణ నష్టం సంభవించేది. ఎదైనా ప్రమాదం జరిగినప్పుడే హడావుడి చేసే అధికారులు అనుమతి లేని బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితి తలెత్తదని ప్రయాణికులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సంబంధించి తక్షణమే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్లో తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. -
ఆర్టీవో ఆఫీసుపై ఏసీబీ దాడి
రవాణాశాఖ గుడివాడ ప్రాంతీయ కార్యాలయంపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడి చేశారు. కార్యాలయంలో 14 మంది దళారులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఆన్లైన్లో నిర్వహించే పరీక్ష పాస్ చేసేలా అనధికారిక వ్యక్తులు సాయం చేస్తున్నారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. గుడివాడ టౌన్ : గుడివాడ రాజేంద్ర నగర్ లోని రవాణా శాఖ ప్రాంతీయ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఐదుగురు సిబ్బందితో జరిపిన ఈ తనిఖీల్లో 14 మంది దళారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ ఎస్వివి ప్రసాదరావు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్టీవో ఏజెంట్లకు కార్యాలయంలో ప్రవేశం లేదన్నారు. వీరు కంప్యూటర్ల వద్ద తిష్ట వేసి టెస్ట్కు హాజరయ్యే వారిని ఉత్తీర్ణులయ్యేలా కార్యాలయ ఉద్యోగులతో లాలూచీ పడి లైసెన్స్లకు దరఖాస్తు చేసిన వారిని పాస్ చేసేలా పనిచేస్తున్నారని.. ఇది చట్టరీత్యా నేరమన్నారు. దీనిపై తనిఖీలు చేశామన్నారు. అదుపులోకి తీసుకున్న వారి నుంచి లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీనిపై రవాణా శాఖ ఉన్నత అధికారులకు నివేదిక ఇస్తామని అనంతరం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ సిబ్బంది,పాల్గొన్నారు. -
ప్రైవేటు ట్రావెల్స్ అగడాలు మళ్లీ మొదటికి!
రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్ అక్రమాలు మళ్లీ జోరందుకున్నాయి. కాంట్రాక్టు క్యారియర్లుగా అనుమతులు పొందిస్టేజి క్యారియర్లుగా దూసుకెళ్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కార్గో రవాణా, ఒకే పర్మిట్తో మరికొన్ని బస్సుల్ని తిప్పి రహదారి పన్ను ఎగ్గొడుతున్నా.. రవాణా శాఖ చోద్యం చూస్తోందన్న ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. గత ఆర్నెల్ల కాలంలో వీటిపై రవాణా శాఖ ఒక్క కేసూ నమోదు చేయకపోవడంతో ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది. దీంతో ఆర్టీసీ బస్టాండ్ల ఎదుటే టికెట్ కౌంటర్లు, పికప్ పాయింట్లు ఏర్పాటుచేసి మరీ ప్రైవేట్ యాజమాన్యాలు చెలరేగిపోతున్నాయి. – సాక్షి, అమరావతి 491- రాష్ట్ర పరిధిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న కాంట్రాక్టు క్యారేజీ బస్సుల సంఖ్య 50 - వీటిలో స్లీపర్ బస్సుల సంఖ్య 750 - ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న కాంట్రాక్టు క్యారేజీ బస్సులు 600 - వీటిలో 2 ప్లస్ వన్ బెర్తులున్న బస్సులు 70,000 - ఈ బస్సుల్లో ప్రతిరోజూ ప్రయాణించే ప్రయాణీకుల సంఖ్య ప్రైవేటు ట్రావెల్స్ అక్రమాలతో ఆర్టీసీ ఏటా రూ.2,700 కోట్లు ఆదాయం పోగొట్టుకుంటోందని గతంలో సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. ప్రైవేటు ట్రావెల్స్ను అడ్డుకోలేమని ఇటీవలే ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య చెప్పడాన్ని చూస్తే సర్కారు ప్రైవేటు ట్రావెల్స్ అక్రమాలను ఏ విధంగా కొమ్ము కాస్తోందో అర్ధమవుతోంది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రైవేటు బస్సులను అడ్డుకునేందుకు, వాటి అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం పలు కమిటీలు ఏర్పాటుచేసింది. అంతేకాక, వీటి ఆగడాల నిరోధానికి ప్రత్యేకంగా మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లను నియమించినా ఆ తర్వాత పట్టించుకున్న దాఖలాల్లేవు. నాడు వద్దన్నదే నేడు ముద్దు ఇదిలా ఉంటే.. అరుణాచల్ప్రదేశ్లో రిజిస్ట్రేషన్లు చేయించి తమ రాష్ట్రం మీదుగాగానీ.. తమ రాష్ట్రం నుంచి గానీ తిప్పడంలేదని అక్కడ ప్రభుత్వం ఏకంగా ప్రైవేట్ బస్సుల రిజిస్ట్రేషన్లు, పర్మిట్లను గతంలో రద్దుచేసిన సంగతి తెలిసిందే. కానీ, ఆ బస్సుల్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరిగి అనుమతించారు. మరోవైపు.. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు మితిమీరిన వేగంతో వెళ్లేందుకు డ్రైవర్లు కొంత మోతాదులో మద్యం సేవించాలని ప్రైవేటు ఆపరేటర్లే ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం ఉంది. ఈ ప్రచారానికి ఊతమిస్తూ ఇటీవలే ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవర్లు పలువురు మద్యం తాగి పోలీసులకు పట్టుబడ్డారు. గుంటూరు, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో పోలీసుల తనిఖీల్లో ఓ ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవరు మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తనిఖీల్లో వెల్లడైంది. అలాగే, జాతీయ రహదారులపై టోల్గేట్లలో బ్రీత్ ఎనలైజర్లతో తనిఖీలు చేయాలి. ఇందుకు ప్రభుత్వం గతేడాది రూ.10 కోట్లతో వాటిని కొనుగోలు చేసింది. కానీ, అధికారులు తనిఖీలు చేయకుండా ప్రైవేటు బస్సులను వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కార్మిక చట్టాలూ గాలికి.. ఇదిలా ఉంటే.. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు డ్రైవర్ల సంక్షేమాన్ని గాలికొదిలేస్తున్నాయి. డ్రైవర్లకు కనీస సదుపాయాలు కల్పించడంలేదు. ప్రైవేటు ఆపరేటర్లు మోటారు వాహన కార్మికుల చట్టం అమలుచేస్తున్నారా? లేదా? అన్నది కార్మిక శాఖ కనీసం పరిశీలించడం లేదు. గతేడాది ఫిబ్రవరిలో కృష్ణా జిల్లాలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన తర్వాతే రవాణా శాఖ డ్రైవర్ల పనివేళలు, రెండో డ్రైవరు నిబంధనపై మొక్కుబడిగా ఆదేశాలిచ్చిందే తప్ప వాటి అమలును పట్టించుకున్న పాపాన పోలేదు. నిబంధనలకు విరుద్ధంగా కార్గో రవాణా రవాణా చెక్పోస్టుల్లో ప్రతీ వాహనాన్ని ఆ శాఖాధికారులు విధిగా తనిఖీ చేయాలి. ముఖ్యంగా ప్రయాణీకుల్ని తరలించే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఓ కన్నేయాలి. సామర్థ్యానికి మించి వాహనం ఉందో లేదో పరిశీలించాలి. కానీ, అటువంటిదేమీ జరగకపోవడంతో దాదాపు 15 సంస్థలు ప్రయాణీకుల మాటున చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్టణం తదితర నగరాల నుంచి పెద్దఎత్తున అక్రమంగా సరుకు తరలిస్తున్నారు. ఇటీవలే గుంటూరులో ఓ ప్రైవేటు బస్సులో 50 కేజీల వెండి, ఫర్నీచర్ సామాగ్రి రవాణా అధికారులకు దొరకడం ఇందుకు ఉదాహరణ. గతంలోనూ ప్రైవేటు బస్సుల్లో బాణాసంచా తరలించడంతో అగ్ని ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాలున్నాయి. అయినా ప్రైవేటు యాజమాన్యాలు నిబంధనలను బేఖాతరు చేస్తూ జీరో వ్యాపారానికి తోడ్పాటునందిస్తున్నాయి. -
కొత్త బండి.. జేబులకు గండి
కొత్తగా బైక్ కొనాలని కొన్ని షోరూంలకు వెళితే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకుంటే రవాణా శాఖ నిబంధనలతో పేరుతో షోరూం యజమానులు అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు. రిజిస్ట్రేషన్, బీమా తదితరాలు వారి వద్దే చేయించుకోవాలనే నిబంధన వారికి కాసుల వర్షం కురిపిస్తోంది. వారు చెప్పినంత ఇచ్చి బైక్ను కొనాల్సిందే. ఇది పలమనేరు పట్టణంలో మాత్రమే కాదు జిల్లా వ్యాప్తంగా సాగుతున్న తంతు. పలమనేరుకు చెందిన శరత్చంద్ర షోరూంలో ఓ బైక్ కొన్నాడు. బైక్ విలువతోపాటు అదనంగా ఆర్సీ, ఇన్సూరెన్స్, లైఫ్టాక్స్, నెంబర్ ప్లేట్కు ఇలా అధికంగానే డబ్బులు గుంజారు. ఇదేంటని ప్రశ్నిస్తే మీరు ఏ షోరూంకు వెళ్లినా ఇంతేనని సమాధానమిచ్చారు. దీంతో విధిలేక అదనంగా డబ్బులు చెల్లించి బైక్ను సొంతం చేసుకున్నాడు. పలమనేరు: కొత్తగా వాహనాన్ని కొనేటప్పుడే అందుకు సంబంధించిన మొత్తం ప్రొసెస్తో పాటు అవసమైన సర్టిఫికెట్లను షోరూం నిర్వాహులే అందించాలని రవాణాశాఖ ఈ మధ్యనే ఆదేశాలు జారీ చేసింది. ఇదంతా ఆన్లైన్లో సాగే ప్రక్రియే. రవాణా శాఖ నిబంధనల మేరకు ఆర్సీకి రూ.760, లైఫ్టాక్స్ బండి విలువలో 9 నుంచి 12శాతం, ఇన్సూరెన్స్ రూ.1800, నంబర్ ప్లేటుకు రూ. 250 వసూలు చేయాల్సి ఉంది. జరుగుతున్న తతంగం ఇలా.. అయితే కొన్ని షోరూంల నిర్వాహకులు ఆర్సీకి రూ.1000 నుంచి 1,600, టాక్స్ రూ.1200, ఇన్సూరెన్స్ రూ.2,200, నంబర్ ప్లేటుకు రూ.400 వసూలు చేస్తున్నారు. దీంతోపాటు లైసెన్స్ లేకుంటే దాన్ని తామే ఇస్తామంటూ వసూలుకు పాల్పడుతున్నారు. ఇక హెల్మెట్లు బయటి మార్కెట్కంటే రూ.500 వరకు ఎక్కువగా గుంజుతున్నారు. మొత్తం మీద ఓ బైక్కు రూ. 2వేలు అదనంగా ఇవ్వాల్సిందే. జిల్లాలో పలు వాహనాల కంపెనీలకు సంబంధించి సుమారు 220 షోరూంలున్నాయి. అన్ని చోట్ల ఇదే తంతు కొనసాగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. అన్ని చోట్ల సిండికేటే.. పట్టణాల్లోని షోరూం నిర్వాహకులంతా సిండికేట్గా మారి అధిక వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కొనుగోలుదారులు ఏ షోరూంకు వెళ్లినా ఇదే ధరలుంటాయి. దీంతో వారు చెప్పిన ధర ఇచ్చి బైక్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇక షోరూంలలో వాయిదాలతో వాహనాలు కొనేవాళ్లపై ఈ వాతలు కాస్త అధికంగానే ఉంటున్నాయి. దీన్ని ప్రశ్నించినా లాభం లేకుండా ఉంది. దీనిపై ఎంవీఐ శివారెడ్డిని వివరణ కోరగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ధరల పట్టికలు పెట్టాలి ప్రభుత్వం నిర్దేశించిన ధరల వివరాలను సంబంధిత షోరూంల వద్ద రవాణాశాఖ ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకోవాలి. షోరూం నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి తగు సూచనలివ్వాలి. దీనిపై కొనుగోలుదారుకు అవగాహన లేకపోవడంతో దోపిడీ సాగుతోంది.–శరత్చంద్ర, పలమనేరు ఈఎంఐలో అధిక వసూళ్లు కొనుగోలు సమయంలో మొ త్తం నగదు కట్టి బండి కొనేవాళ్లు రిసిప్టులు చూస్తారు కాబట్టి తెలుస్తుంది. వాయిదాల్లో వాహనాలు కొనేవాళ్ల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారు. సేవలకు ధరలను పట్టిక రూపంలో షోరూంల వద్ద తెలియజేసేలా చర్యలు తీసుకోవాలి.–చెంగారెడ్డి, కూర్మాయి, పలమనేరు -
ఒక్క పర్మిట్.. రెండు బస్సులు
సాక్షి, అమరావతి: ఆటోల నుంచి రోడ్ ట్యాక్స్ను, ఫిట్నెస్ ఫీజు జాప్యానికి అపరాధ రుసుమును ముక్కు పిండి వసూలు చేసే రవాణా శాఖ ప్రైవేట్ ట్రావెల్స్కు మాత్రం మినహాయింపునిస్తోంది. ఒకే పర్మిట్తో రెండు బస్సులను తిప్పుతూ రోడ్ ట్యాక్స్ ఎగ్గొడుతున్నా చేష్టలుడిగి చూస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకుల్లో చాలామంది అధికార పార్టీకి చెందిన వారే కావడంతో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేయడం లేదు. ఒకే పర్మిట్తో రెండు బస్సులను తిప్పుతూ ట్రావెల్స్ నిర్వాహకులు రవాణా శాఖ ఆదాయానికి గండి కొడుతున్నారు. రాష్ట్రంలో 491 ప్రైవేట్ బస్సులు కాంట్రాక్టు క్యారేజీ కింద అనుమతి పొందగా, ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న బస్సులు మరో 750 వరకు ఉన్నాయి. సాధారణంగా ప్రతి ప్రైవేట్ బస్సు ప్రతి మూడు నెలలకోసారి విధిగా త్రైమాసిక పన్ను చెల్లించాలి. సీటుకు రూ.3,750 చొప్పున చెల్లించాలి. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న బస్సులతో కలిపి ఏటా రూ.50 కోట్ల వరకు రోడ్ ట్యాక్స్ వసూలు కావాల్సి ఉండగా, రూ.25 కోట్లే వసూలవుతున్నట్లు రవాణా వర్గాలు పేర్కొనడం గమనార్హం. ఆన్లైన్పై విముఖత అధికార పార్టీకి చెందిన ట్రావెల్స్ నిర్వాహకులు ఒకే పర్మిట్తో రెండు బస్సులను తిప్పుతుండడంతో రోడ్ ట్యాక్స్ ఆదాయానికి గండి పడుతోంది. ఉదాహరణకు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒక పర్మిట్తో విజయవాడ నుంచి హైదరాబాద్కు బయలుదేరితే, రెండో బస్సు అదే పర్మిట్ నంబరుతో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరుతుంది. రవాణా శాఖ ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తోంది. ఆన్లైన్లోనే రోడ్ ట్యాక్స్ చెల్లించవచ్చు. ఈ విధానంలో పన్ను చెల్లిస్తే.. ఒకే పర్మిట్తో రెండు బస్సులను తిప్పడం కష్టం. దీంతో ఆన్లైన్లో పన్ను చెల్లించేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్టపడడం లేదు. -
రవాణా శాఖకు కాంట్రాక్టర్ల కుచ్చుటోపీ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: లారీల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ)లను కలర్ జిరాక్స్ల ద్వారా ఏమార్చి సింగరేణి సంస్థకు భారీ నష్టాన్ని కలిగిస్తున్న కాంట్రాక్టర్లు రవాణా శాఖను నిలువునా మోసం చేస్తున్నారు. లారీలు, టిప్పర్ల రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆ శాఖ సిబ్బందితో కుమ్మక్కై నెట్ వెయిట్ను తగ్గించి రికార్డు చేయించే కాంట్రాక్టర్లు ఓవర్లోడ్ నిబంధనలను అధిగమించేందుకు అక్రమ మార్గాల వైపు మళ్లినట్లు తేలింది. ఆర్సీలో లారీ బరువును ఒక టన్ను నుంచి మూడు టన్నుల వరకు తగ్గించడం ద్వారా అంతే మొత్తానికి అధిక సరుకును రవాణా చేసుకోవచ్చనేది ట్రాన్స్పోర్టర్ల లెక్క. దీనికోసం ఎంచుకున్న అక్రమ మార్గ మే ఆర్సీలో ‘అన్లాడెన్ వెయిట్’ను మార్చడం. సింగరేణిలోని 11ఏరియాల్లోని గనుల నుంచి సీహెచ్పీ, డిస్పాచ్ పాయింట్లకు బొగ్గు రవాణా చేస్తున్న వేలాది లారీల్లో 80 శాతానికి పైగా ఇదే తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు సింగరేణి అధికారులే ఒప్పుకుంటుండటం గమనార్హం. ఆర్టీఏ చట్టాలు కాగితాలకే ... 12 టైర్ల లారీ 31 టన్నుల బరువుతో మాత్రమే రోడ్డు మీదికి రావాలి. అలాగే 14 టైర్ల లారీ 37 టన్నులకు మించి బరువు ఉండకూడదు. అంటే 14 టైర్ల లారీ నెట్ వెయిట్ 12.250 టన్నులు ఉందనుకుంటే.. 24.750 టన్నుల సరుకును మాత్రమే రవాణా చేయాలి. టైర్ల సంఖ్యను బట్టి 49 టన్నుల వరకు రవాణా చేసే లారీలు సింగరేణి ట్రాన్స్పోర్టర్ల వద్ద ఉన్నాయి. రెండేళ్ల క్రితం ఇచ్చిన సడలింపుల ప్రకారం నెట్ వెయిట్ కన్నా 5 శాతం అటూఇటుగా బరువును పెంచుకోవచ్చు. తద్వారా ఒక టన్నుకు పైగా అదనంగా రవాణా చేసుకునే వెసులుబాటు లభించింది. అయితే సింగరేణి బొగ్గు రవాణాలో ఏర్పడ్డ పోటీ వల్ల లారీల యజమానులు ఒక టన్ను/కిలోమీటరుకు అతి తక్కువ మొత్తానికి (రూ.5 వరకు) టెండర్లో కోట్ చేసి, రవాణా కాంట్రాక్టులు దక్కించుకుంటున్నారు. ఆర్సీ ప్రకారం 14 టైర్ల వాహనం నెట్వెయిట్ 10–11 టన్నుల మధ్యలో ఉంటుంది. అదే 14 టైర్ల వాహనం బరువు 12.250 టన్నులకు అటూఇటుగా ఉంటుంది. టైర్ల సంఖ్య పెరిగే కొద్దీ వాహనాల బరువుతో పాటు క్యారింగ్ కెపాసిటీ (సీసీ) కూడా పెరుగుతుంది. అయితే తక్కువ ధరకు టెండర్లు దక్కించుకున్న బడా ట్రాన్స్పోర్టు కాంట్రా క్టర్లే ఈ అక్రమాలకు తెరలేపారు. అందులో భాగంగానే ఒరిజినల్ ఆర్సీలను జిరాక్స్ చేసి, కంప్యూటర్ ద్వారా ట్రక్ నెట్ వెయిట్ను ఒకటి నుంచి మూడు టన్నుల వరకు తగ్గించి దందా సాగిస్తున్నారు. దీంతో 12.250 టన్నుల నెట్వెయిట్ లారీ 9 టన్నులకు, 17 టన్నుల లారీ 15 టన్నులకు తగ్గిపోయింది. సాధారణంగా ఎలాంటి యాక్సెసరీస్ (అదనపు హంగులు) లేకుండా చూసి తక్కువ బరువుతో రిజిస్ట్రేషన్ చేయించే యజమానులు ఆర్సీ వచ్చిన తరువాత అదనపు ఆకర్షణలు జోడించడం జరుగుతుంది. దీనికి తోడు ఆర్సీని మార్ఫింగ్ చేసి నెట్ వెయిట్ను మూడు టన్నులు అంతకు మించి తగ్గించడం వల్ల రోడ్డుపై ఓవర్లోడ్తో లారీ వెళ్తుంది. ఇది రవాణా శాఖ నిబంధనలకు పూర్తి విరుద్ధం. ప్రామాణిక బరువు కన్నా క్వింటాలు ఎక్కువ లోడ్తో రోడ్డెక్కే వాహనాలను ఓవర్లోడ్తో జరిమానాలు విధించే రవాణా శాఖ అధికారులు సింగరేణిలో మాల్ప్రాక్టీస్ చేసి, ఆర్సీనే తిరగరాసి తిరుగుతున్న లారీల గురిం చి పట్టించుకోవడం లేదు. శ్రీరాంపూర్ ఏరియాలో గనుల నుంచి సీహెచ్పీలకు తిరిగే 60 ట్రక్కుల్లో 25 వరకు ఒకే కంపెనీకి చెందినవి కాగా, అవన్నీ ఆర్సీలను మార్చివేయడం గమనార్హం. ఇక్కడ ఆర్సీలను మార్చేసినట్లు గుర్తించిన 39 లారీలకు తోడు మరో 15 వరకు ఇదే రీతిన బొగ్గు రవాణా చేస్తున్నట్లు సింగరేణి అధికారులు నిరా ్ధరించారు. కొత్తగూడెం, భూపాలపల్లి, రామగుండం, బెల్లంపల్లి, మందమర్రి, ఇల్లం దు ఏరియాల్లో కూడా వందలాది లారీలు ఇదే తరహా లో ఆర్సీలను మార్చి సింగరేణిని, రవాణా శాఖను ఏమార్చి బొగ్గు రవాణా చేస్తున్నాయని తెలుస్తోంది. చర్యలకు శ్రీకారం: జిరాక్స్ ఆర్సీలలో లారీల నెట్వెయిట్ను తగ్గించి బొగ్గు రవాణా చేయడాన్ని సింగరేణి యాజమాన్యం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు హైదరాబాద్, కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయం నుంచి శ్రీరాంపూర్ జీఎం వివరణ కోరినట్లు సమాచారం. ఎన్నో ఏళ్ల నుంచి సాగుతున్న ఈ దందాను ఇటీవలే గుర్తించి లారీ యజమానులకు నోటీసులు కూడా జారీ చేసిన విషయాన్ని జీఎం ఉన్నతాధికారులకు వివరించారు. కాగా ఆర్టీఏ అధికారులు కూడా ఈ అంశంపై సీరియస్గా ఉన్నారు. సింగరేణి నుంచి జిరాక్స్ ఆర్సీలను స్వాధీనం చేసుకొని ఒరిజినల్ ఆర్సీలను పరిశీలించి కేసులు నమోదు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మంచిర్యాల ఆర్టీఏ అధికారులు ఇక్కడ రిజిస్టరైన ట్రక్కుల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. సింగరేణి అధికారుల మీమాంస సింగరేణిలో బొగ్గు రవాణా చేసే లారీల యజమానులు ఆర్సీలలో నెట్వెయిట్ మార్చడం అత్యంత సహజమైన ప్రక్రియగా అధికారులు భావిస్తున్నారు. తక్కువ మొత్తానికి కోట్ చేసి కాంట్రాక్టు పొందిన లారీ యజమానులు లాభం కోసం కక్కుర్తి పడటం సహజం అనే ధోరణిలో సింగరేణి కార్పొరేట్ అధికారులు ఉన్నారు. సింగరేణిలో లారీల నెట్వెయిట్ను తగ్గించి రవాణా చేస్తున్నప్పటికీ, బొగ్గుతో నిండినప్పుడు గ్రాస్వెయిట్లో తేడా ఉండదని చెపుతున్నారు. ఆర్సీతో పాటు గని వద్ద బొగ్గు లోడ్ అయినప్పుడు, సీహెచ్పీ వద్ద డంప్ అవుతున్నప్పుడు మూడు విధాలుగా బరువును తూచడం జరుగుతుందని, అందులో ఎక్కడ తక్కువగా నమోదైతే దానికే బిల్లులు చెల్లించడం జరుగుతుందని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ ఎస్డీఎం సుభాని‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. దీనివల్ల సింగరేణి సంస్థకు ఆర్థికంగా ఎలాంటి నష్టం జరగలేదని చెప్పడం గమనార్హం. -
లేటెస్ట్ పొల్యూషన్ టెస్ట్
సాక్షి, సిటీబ్యూరో: వాహన కాలుష్యాన్ని కచ్చితంగా నిర్థారించి ధృవీకరణ పత్రాలు అందజేసేందుకు రవాణాశాఖ అధునాతన కాలుష్య తనిఖీ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వాహనాల నుంచి వెలువడే పొగలో ఏ రకమైన కాలుష్య కారకాలు.. ఏ స్థాయిలో ఉన్నాయో శాస్త్రీయంగా నిర్థారించే సాంకేతిక పరిజ్ఞానం ఈ స్టేషన్లలో ఉంటుంది. మొదట రవాణాశాఖ ప్రధాన కార్యాలయం ఖైరతాబాద్లోను, బండ్లగూడ ప్రాంతీయ రవాణా కార్యాలయంలోను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయనున్నారు. వాహనాలకు అక్కడే పరీక్షలు చేసి ధ్రువ పత్రాలను అందజేస్తారు. ఒకవేళ కాలుష్య కారకాలు అతిగా వెలువడితే వాహనానికి మరమ్మతులు సూచిస్తారు. అప్పటికే దాని జీవితం కాలం ముగిస్తే సదరు వాహనాన్ని పక్కన పెట్టేస్తారు. ఆ వాహనదారులు కూడా వాటిని వినియోగించకుండా చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం నగరంలో ఏర్పాటు చేసిన అధునాతన సిటీ బస్టాప్ల తరహాలోనే కాలుష్య తనిఖీ కేంద్రాలను (పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్స్)ను కూడా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యలో పెట్రోల్ బంకులు, ఇతర కేంద్రా లకు విస్తరించి నిర్వహించాలని యోచిస్తున్నట్టు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్ నాయక్ ‘సాక్షి’తో చెప్పారు. ఖైరతాబాద్, బండ్లగూడ స్టేషన్ల ఫలితాలను పరిశీలించి ఆ తరువాత అన్ని చోట్లకు వీటిని విస్తరిస్తామన్నా రు. ఇలా ఏర్పడిన స్టేషన్లకు, మొబైల్ పొల్యూషన్ టెస్టింగ్ కేంద్రాలను ఆన్లైన్తో అనుసంధానం చేసి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. నగరంలో ఏర్పాటు కానున్న వాహన కాలుష్య నియంత్రణ వ్యవస్థ మొత్తంగా రవాణా కమిషనర్ కార్యాలయంలోని ప్రధాన సర్వర్తో అనుసంధానమై ఉంటుంది. వాహనాల కాలుష్య కారకాల మోతాదులను ఇక్కడి నుంచే నిర్దేశించి ధృవీకరణ పత్రాలను అందజేస్తారు. నియంత్రణ లేని కాలుష్యం నుంచి ఊరట.. ప్రస్తుతం నగరంలో సుమారు 350 వరకు మొబైల్ పొల్యూషన్ టెస్టింగ్ కేంద్రాలు, పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్లు ఉన్నాయి. కానీ వీటి ద్వారా నిర్వహించే తనిఖీల్లో ఎలాంటి ప్రామాణికత, శాస్త్రీయత లేదు. వాహనాల నుంచి వెలువడే పొగలోని కాలుష్య కారక పదార్థాలను అంచనా వేసి సర్టిఫికెట్లను అందజేసే కాలుష్య తనిఖీ కేంద్రాలు ఉత్తుత్తి పరీక్షలతో కాసులు పండించుకుంటున్నాయి. దీంతో ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా పరిణమించిన వాహన కాలుష్యాన్ని నియత్రించాలనే ఉన్నతమైన లక్ష్యం పక్కదారి పడుతోంది. రోడ్డుపైన అక్కడక్కడా దర్శనమిచ్చే ఈ మొబైల్ పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్లు వాహనదారులను నిలిపి పరీక్షలు చేస్తాయి. కాలుష్య నియంత్రణలో ఆ వాహనం ఎలాంటి ప్రమాణాలను అనుసరించేదీ ధృవీకరిస్తారు. ఈ టెస్టింగ్ స్టేషన్లు అందజేసే ధృవీకరణ పత్రాలనే రవాణాశాఖ ప్రాతిపదికగా భావిస్తుంది. ఇలాంటి కీలకమైన అంశంలో టెస్టింగ్ స్టేషన్లలో సింహభాగం ఎలాంటి పరీక్షలు లేకుండానే వాహనదారులకు ధృవీకరణ పత్రాలను అందజేస్తున్నాయి. అతి ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్ వంటి పదార్థాలను వెలువరించే వాహనాలకు సైతం ఈ స్టేషన్లు పచ్చ జెండా ఊపుతున్నాయి. ఆధునిక మొబైల్ పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్ల వల్ల ఇలాంటి తప్పుడు పరీక్షలకు అవకాశం ఉండదు. ప్రజలకు వాహన కాలుష్యం నుంచి ఊరట లభిస్తుంది. నిర్థారణ ఇలా చేయాలి.. ⇔ ప్రస్తుతం ఉన్న మొబైల్ టెస్టింగ్ స్టేషన్లలో గ్యాస్ అనలైజర్లు, స్మోక్ మీటర్ల సహాయంతో వాహనం నుంచి వెలువడే పొగ సాంధ్రత, దానిలోని కార్బన్ మోనాక్సైడ్, హైడ్రో కార్బన్, మీథెన్ స్థాయిని అనలైజర్ల సహాయంతో నిర్థారిస్తారు. ⇔ స్మోక్ మీటర్ సహాయంతో పొగ సాంధ్రతను నిర్థారిస్తారు. ఇది వాహనం సాధారణంగా ఉన్నప్పుడు 65 హార్ర్టిజింగ్ యూనిట్స్, రైజింగ్లో ఉన్నప్పుడు 75 హార్ర్టిజింగ్ యూనిట్స్ ఉంటుంది. ఈ ప్రమాణాలను అధిగమించి తిరిగే వాహనాలన్నీ ప్రమాదకరమైన కాలుష్యాన్ని వెదజల్లుతున్నట్లే. ⇔ కార్బన్ మోనాక్సైడ్ 0.5 శాతం, హైడ్రోకార్బన్ 750 పీపీఎం (పార్ట్స్ ఫర్ మిలియన్) చొప్పున ఉండాలి. ఈ ప్రమాణాల కంటే ఎక్కువ ఉండే వాహనాలన్నీ కాలుష్య కారక వాహనాల కిందే లెక్క. ⇔ కానీ ఆటో మొబైల్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) నిర్దేశించిన ఈ ప్రమాణాలను నగరంలోని మొబైల్ పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్లు పాటించడం లేదు. ⇔ రవాణాశాఖ ఈ పత్రాలనే ప్రాణికంగా పాటిస్తోంది. దీంతో చట్టాల దారి చట్టాలది. కాలుష్యం దారి కాలుష్యానికి అన్నట్లుగా మారింది. -
అందరికి హైదరాబాదే కావాలి..
సాక్షి, సిటీబ్యూరో : ఆర్టీఏలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఉత్కంఠ రేపుతోంది.మరి కొద్ది రోజుల బదిలీల ప్రక్రియ పూర్తికానున్న నేపథ్యంలో వివిధ కేటగిరీల్లో పని చేసే ఉద్యోగులు ఆప్షన్ల ఎంపికలో తలమునకలయ్యారు. ఈ నెల 7, 9 తేదీల్లో రెండు విడతలుగా కౌన్సెలింగ్ నిర్వహించి 15 నాటికి బదిలీలను పూర్తి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బదిలీల జాబితాలో ఉన్న ఉద్యోగులంతా తమకు నచ్చిన స్థానాల కోసం ముమ్మర ప్రయత్నాలు మొదలెట్టారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లో పని చేస్తున్న పలువురు అధికారులు హైదరాబాద్లోనే ఉండేందుకు పావులు కదుపుతున్నారు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకే తమ బదిలీ పరిమితం కావాలని కోరుకుంటున్నారు. మరోవైపు వివిధ జిల్లాల్లో పని చేస్తున్న ఉద్యోగులు సైతం బదిలీపై హైదరాబాద్కే రావాలని కోరుకుంటుండటంతో రవాణాశాఖలో బదిలీల అంశం ఆసక్తికరంగా మారింది. ఆప్షన్ల ఎంపికలోనూ పలువురు ఈ మూడు జిల్లాలకే ప్రాధాన్యతనిచ్చారు. పరిపాలనా అధికారులు, సీనియర్ అసిస్టెంట్లు, ఎంవీఐలు, ఏఎంవీఐలు, జూనియర్ అసిస్టెంట్లు, తదితర కేటగిరీల్లో సుమారు 125 పోస్టులు ఉన్నాయి. బదిలీకి 2 ఏళ్ల కాలపరిమితిని కనీస అర్హతగాను, 5 ఏళ్లను గరిష్టంగానూ ప్రభుత్వం నిర్ధేశించిన సంగతి తెలిసిందే. ఒకే చోట 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి బదిలీ తప్పనిసరి కావడంతో హైదరాబాద్కే పరిమితయ్యేలా ఎవరి స్థాయిలో వారు ప్రయత్నిస్తున్నారు. మెడికల్ సర్టిఫికెట్ల కోసం పోటీ.... ఈ క్రమంలో మరో రెండు, మూడేళ్లలో ఉద్యోగ విరమణ చేయనున్న కొందరు సీనియర్లు మెడికల్ సర్టిఫికెట్ల కోసం వైద్యులను ఆశ్రయిస్తున్నారు. దూరప్రాంతాల్లో పని చేయలేని అశక్తతను, తాము ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలను ధృవీకరించే సర్టిఫికెట్లతో అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఒక్క ఆరో జోన్ పరిధిలోనే 30 మందికి పైగా పరిపాలనా విభాగానికి చెందిన ఉద్యోగులు, మరో 10 మంది హెడ్కానిస్టేబుళ్లు బదిలీ కావలసి ఉంది. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో బదిలీ అయ్యే జూనియర్ అసిస్టెంట్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. జోనల్ స్థాయి బదిలీలు తప్పనిసరైన వారు పొరుగు జిల్లాలకు వెళ్లేందుకు విముఖత చూపుతున్నారు. ‘‘ గత 10 ఏళ్లుగా ఇక్కడే పని చేస్తున్నాను. మరో 2 ఏళ్లలో రిటైర్ అవుతాను. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాను. ఈ పరిస్థితుల్లో ఎక్కడికో వెళ్లడం పనిష్మెంట్ వంటిదే..’’ అని నగరంలోని ఒక ప్రాంతీయ రవాణా కార్యాలయంలో పని చేస్తున్న హెడ్కానిస్టేబుల్ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. బదిలీల పట్ల విముఖత చూపుతున్న మరి కొందరు ఉద్యోగులు పిల్లల చదువులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.‘‘ పిల్లలను స్కూళ్లలో చేర్పించాం. ఫీజులు కట్టాం. యూనిఫాంలు, బుక్స్ తీసుకున్నాం, క్లాసులు కూడా జరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో మరో చోటుకు ఎలా వెళ్లగలం. ఏప్రిల్, మే నెలల్లోనే బదిలీలు పూర్తి చేసి ఉంటే ఈ బాధ ఉండేది కాదు కదా...’’ అని అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఉద్యోగసంఘాల నాయకులకు ఊరట దక్కేనా... మరోవైపు ఉద్యోగ సంఘాల నాయకులు సైతం బదిలీల పట్ల ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది హైదరాబాద్కే పరిమితయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగ సం ఘంలో గత ఆరేళ్లుగా ఒకేవిధమైన బాధ్యతల్లో ఉ న్నవారిని మాత్రం వారు కోరుకున్న చోటనే వి ధులు నిర్వహించేందుకు అనుమతించాలని నిర్ణయించారు. మరి కొందరు ఏదో ఒక విధంగా ఉద్యోగసంఘాల నేతల నుంచి ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో నగరంలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో బదిలీలే ప్రధాన చర్చనీయాంశంగా మారింది. పారదర్శకంగా బదిలీలు... బదిలీలను పారదర్శకంగా నిర్వహించేందుకు రవాణాశాఖలో మొట్టమొదటిసారి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్శర్మ చైర్మన్గా మరో ఇద్దరు ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. గతంలో జోనల్ స్థాయి బదిలీలకు సంబంధిత జోనల్ ఇన్చార్జి అధికారికే బాధ్యతలు ఉండేవి. ఇందుకు విరుద్దంగా ఈ సారి కమిటీయే అన్ని రకాల బదిలీలను చేపడుతుంది. ఈ క్రమంలో ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు తలొగ్గకుండా పూర్తిస్థాయిలో పారదర్శకంగా బదిలీలను పూర్తి చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. ఈ విషయంలో ఉద్యోగులు నిశ్చింతగా ఉండాలని సూచించారు. -
లైసెన్స్ లేకుండానే రయ్..రయ్!
నూనూగు మీసాలు కూడా రాని బాలుడు లైసెన్స్ లేకుండానే బులెట్పై నగరంలో హల్చల్ చేస్తాడు. కాలేజీ కుర్రకారు బైక్ రేసులతో భయం పుట్టిస్తారు. మైనర్లతో పాటు చాలామంది వాహనదారులు ఎటువంటి లైసెన్సులు లేకుండానే వాహనాలు నడుపుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రవాణా శాఖ తనిఖీల్లో చేపట్టి జరిమానాలు విధిస్తున్నా మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో జూన్ 3న పదివేల మందికి ఎల్ఎల్ఆర్లు మంజూరు చేసేందుకు రవాణా అధికారులు ప్రణాళిక రూపొందించారు. విజయవాడ: ఏపీ తాత్కాలిక రాజధానికి సమీపంలో ఉన్న విజయవాడ నగర రోడ్లపైకి వేలాది మంది వాహనదారులు లైసెన్స్ లేకుండా దూసుకువస్తున్నారు. ఓ వైపు విస్తరణకు నోచని రహదారులు, ఏటా పెరుగుతున్న వాహనాలు, మరోవైపు లైసెన్స్ లేకుండా వేలాది మంది వాహనదారులు రోడ్లపైకి రావడంతో నగర వాసులు బెంబెలెత్తిపోతున్నారు. పరిస్థితి చేయి దాటి పోకుండా రవాణాశాఖ అప్రమత్తమైంది. సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. నగరంలో ప్రతి నిత్యం సుమారుగా 5లక్షలకు పైగా వాహనాలు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. వీటిలో సింహభాగం ద్విచక్ర వాహనాలే. రెండేళ్ల కాలంలో కొత్తగా 1.75లక్షల వాహనాలు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇటీవల కాలంలో లైసెన్స్ లేకుండా వాహనాదారులు అడ్డూ అదుపు లేకుండా రోడ్లపై చెలరేగుతున్నారు. ఈ క్రమంలో రవాణాశాఖ ముందుగా కొరడా ఝళిపించింది. వాహనాల తనిఖీలు చేసేందుకు స్పెషల్డ్రైవ్ చేపట్టింది. ఈ తనిఖీల్లో వేలాది మంది లైసెన్స్ లేని వాహనదారులు రోడ్లపైకి వస్తున్నట్లు తేలింది. 2016లో 19,617 కేసులు, 2017లో 14,066 కేసులు, 2018లో ఇప్పటివరకు 3వేల మంది లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. లైసెన్స్లు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిలో మైనర్లు, మహిళలు ఉన్నట్లు రవాణాశాఖ అధికారులు గుర్తించారు. లైసెన్స్ లేని వారిపై మరింత కఠిన చర్యలకు రవాణాశాఖ దిగింది. మూడు నెలల్లో లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 270 మందికి కోర్టు ద్వారా జైలు శిక్ష కూడా విధించే విధంగా చర్యలు తీసుకున్నారు. అయినా వారిలో మార్పురాక పోవటంతో రవాణా శాఖ వినూత్నంగా ఆలోచించి వాహనం నడిపే వారందరూ విధిగా లైసెన్స్ పొందే విధంగా ప్రజ లకు అవగాహన కల్పిస్తోంది. కళాశాలలు, విద్యాసంస్థలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవగాహన కార్యక్రమాల ద్వారా వాహనచోదకులు విధిగా లైసెన్స్ పొందాలని సూచిస్తోంది. జిల్లాలో మచిలీ పట్నం, గుడివాడ, నూజివీడు, నందిగామ, జగ్గయ్యపేట ఏరియాల్లో రవాణా అధికారులు ఎల్ఎల్ఆర్ మేళాలు నిర్వహించారు. ఏడాది కాలంలో 6500మందికి కొత్తగా లైసెన్స్లు జారీ చేశారు. తాజగా జూన్ 3వ తేదీన విజయవాడలో మెగా ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహిస్తోంది. ఈ మేళా ద్వారా దాదాపు నగర వ్యాప్తంగా 10వేల మందికి ఎల్ఎల్ఆర్లు జారీ చేయాలనే లక్ష్యంతో ప్రైవేటు సంస్థల సాంకేతిక సహకారంతో ఎల్ఎల్ఆర్ టెస్ట్లు నిర్వహించటానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఎల్ఎల్ఆర్ మేళాపై కరపత్రాల ద్వారా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. -
అనగనగా.. ఓ వంతెన!
సాక్షి, అమరావతి బ్యూరో: ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి నిచ్చెన వేస్తా అందట! రాష్ట్ర ప్రభుత్వ తీరు మాటలు కోటలు దాటుతున్నా కాలు గడప దాటడం లేదు. విజయవాడలో కేవలం రూ.450 కోట్లతో పూర్తయ్యే కీలకమైన ఓ వంతెన నిర్మాణాన్నే మూడేళ్లు అవుతున్నా పూర్తి చేయలేని రాష్ట్ర సర్కారు.. రూ.లక్షల కోట్లతో అమరావతిని కడతామంటూ ఊహా చిత్రాలను ఆవిష్కరిస్తోంది! సీఎం చంద్రబాబు ఏడాదిలోపే పూర్తి చేస్తామన్న విజయ వాడ కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఎక్కడివి అక్కడే మిగిలిపోవటం సర్కారు అసమర్థతకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటూ బెజవాడ నడిబొడ్డున మూడేళ్లుగా ఓ ఫ్లై ఓవర్ను నిర్మించలేకపోవటాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వాధినేత పరిపాలనా సామర్థ్యం ఏపాటిదో ఇట్టే అవగతమవుతోంది. పుష్కరాలు వచ్చాయి.. వెళ్లాయి విజయవాడలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ 2015 డిసెంబర్ 5వతేదీన శంకుస్థాపన చేశారు. 2016 ఆగస్టు పుష్కరాలనాటికి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని నాడు సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. పుష్కరాలు వచ్చాయి వెళ్లాయి కానీ ఫ్లైఓవర్ నిర్మాణం 10 శాతం కూడా పూర్తి కాలేదు. ఆ తరువాత చంద్రబాబు 2016 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. అనంతరం గడువు 2017 ఆగస్టు 15 వరకు, తరువాత డిసెంబర్ 31వతేదీకి పొడిగించారు. చివరకు 2018 మార్చి 31 అన్నారు. అది కూడా పూర్తయి ఇప్పుడు మే నెల చివరికి వచ్చినా ఫ్లైఓవర్ పనులు పూర్తి కాలేదు. ఇప్పుడు ఇక ఎన్నికలకు ఏడాది లోపే సమయం ఉండటంతో 2019 జనవరి నాటికి పూర్తి చేస్తామంటూ మరోసారి మాయమాటలు చెబుతున్నారు. డీపీఆర్ నుంచి డిజైన్ దాకా అలసత్వమే కేంద్ర నిధులతో చేపట్టిన దుర్గ గుడి ఫ్లైఓవర్ పనులను పర్యవేక్షించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆది నుంచి నిర్లక్ష్య వైఖరినే ప్రదర్శిస్తూ వచ్చింది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండానే డీపీఆర్ను లోపభూయిష్టంగా తయారు చేశారు. ఫ్లై ఓవర్ నిర్మించే చోట భౌగోళిక స్వరూపం, పరిమితులను దృష్టిలో పెట్టుకోకుండా ఆషామాషీగా ఓ డిజైన్ రూపకల్పన పేరుతో సంవత్సరాల తరబడి సమయం వృథా చేసి దాన్ని ఆమోదించారు. అయితే తర్వాత మళ్లీ డిజైన్లో లోపాలు ఉన్నాయంటూ కొత్త వాటి పేరుతో మరి కొద్ది నెలలు కాలయాపన చేశారు. ఇరుకు మార్గంలో ఆ డిజైన్తో కష్టమే 417 పైల్స్, 47 స్తంభాలు, 47 స్తంభాల పైకప్పులు (స్పైన్, వింగ్స్ కలిపి) ఫ్లై ఓవర్ నిర్మించేలా డిజైన్ రూపొందించారు. పనులు ప్రారంభమైన కొన్నాళ్లకు ఆ డిజైన్తో నిర్మాణం సాధ్యం కాదని గుర్తించారు. దాదాపు 140 టన్నుల చొప్పున బరువు ఉండే ఒక్కో పైకప్పును స్తంభాలపైకి చేర్చడం అసాధ్యమని ఇంజనీర్లు చేతులెత్తేశారు. కేవలం మైదాన ప్రాంతాల్లో నిర్మాణాలకే అది సాధ్యమని, ఇరుకుగా ఉండే దుర్గ గుడి మార్గంలో అసాధ్యమని నిపుణులు తేల్చేశారు. దీంతో 2016 జూన్లో ఎట్టకేలకు కొన్ని మార్పులతో డిజైన్ను ఆమోదించారు. అయితే వెంటనే మేల్కొని డిజైన్లో మార్పులు చేసి ఉంటే పనులు వేగంగా జరిగేవి. ఆ పని చేయకుండా సమీక్షల పేరుతో కాలయాపన చేశారు. సీఎం స్వయంగా 15 రోజులకు ఒకసారి సమీక్ష జరిపిన ఫ్లై ఓవర్ పనులే ఇలా ఉంటే ఇక రాజధాని కట్టడానికి ఎన్ని శతాబ్దాల సమయం పడుతుందో? అని బెజవాడ వాసులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మార్చిన డిజైన్లోనూ లోపాలు! మార్పుల అనంతరం ఖరారు చేసిన డిజైన్ కూడా లోపభూయిష్టంగానే ఉందని ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఫ్లై ఓవర్ మీద ఆరు మలుపుల్లో మూడు అత్యంత ప్రమాదకరమైనవని హెచ్చరిస్తున్నారు. ఫలితంగా ఫ్లై ఓవర్పై రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. బిల్లుల చెల్లింపుల్లోనూ తీవ్ర జాప్యం ఒకవైపు డీపీఆర్, డిజైన్లపై కనీస శ్రద్ధ చూపని రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్కు బిల్లుల చెల్లింపుల్లోనూ అంతులేని జాప్యాన్ని ప్రదర్శించింది. కేంద్ర ప్రభుత్వం సూచించినట్లుగా కనీసం గ్యారెంటీ ఇస్తే ఈపాటికి పనులు జరిగి ఉండేవి. ఈ బాధ్యతను సైతం చంద్రబాబు సర్కారు పట్టించుకోకపోవటం గమనార్హం. యాత్రలు, సదస్సులకు రూ.వందల కోట్లు ప్రత్యేక విమానాలు, విదేశీ యాత్రలు, సదస్సుల పేరుతోప్రచార ఆర్భాటం కోసం రూ.వందల కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన దుర్గ గుడి ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని గాలికి వదిలేయటంతో ట్రాఫిక్ కష్టాలతో అల్లాడుతున్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణానికి నిధులు విడుదల చేస్తే తరువాత కేంద్రం తిరిగి ఇస్తామంటున్నా ముందుకు రాకపోవటంతో పనులు మూడేళ్లుగా నత్త నడకను తలపిస్తున్నాయి. అసలు ఎప్పటికి పూర్తవుతుందో కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ‘సింగపూర్ తరహా రాజధాని నిర్మిస్తాం... అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో కడతాం’ – ఇదీ నాలుగేళ్లుగా సీఎం చంద్రబాబు గ్రాఫిక్స్లో చూపిస్తున్న సినిమా హైదరాబాద్ నుంచి విజయవాడకు 4 గంటల్లోనే చేరుకోవచ్చు. కానీ నగరంలోని బస్టాండ్కు వెళ్లాలంటే గంటపైనే పడుతోంది. కీలకమైన కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం మూడేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. పలు ప్రాంతాల నుంచి విజయవాడ చేరు కునేందుకు ఇదే కీలక దారి కావటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. – రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు ఇది కాదా తార్కాణం? -
ఈ-రిక్షా.. ట్రాఫిక్కు శిక్ష!
సాక్షి, హైదరాబాద్: ఈ-రిక్షాలు రోడ్డెక్కకముందే అటకెక్కాయి. హైదరాబాద్ నగరంలో తీవ్రంగా పెరుగుతున్న వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఈ-రిక్షాలు ఉపయోగ పడతాయని భావించినా.. ట్రాఫిక్ చిక్కులు వాటికి ప్రతిబంధకంగా మారాయి. నెమ్మదిగా తిరిగే ఈ వాహనాలు ట్రాఫిక్ సమస్యను తీవ్రం చేస్తాయని భావించిన పోలీసు శాఖ, వాటిని అనుమతించేందుకు ససేమిరా అంటోంది. దీంతో వాటిని నగరంలో తిప్పేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తోంది. ఢిల్లీ తరహాలో ఈ-రిక్షాలను ప్రవేశపెట్టి వీలైనంత మేర వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు చేసిన ప్రయత్నం దాదాపు నీరుగారిపోయింది. వీటికి అనుమతి వస్తుందన్న ఉద్దేశంతో దాదాపు ఐదు కంపెనీలు ఈ-రిక్షాల సరఫరాకు ముందుకు వచ్చినప్పటికీ, ప్రస్తుతం ఆర్డర్లు లేక బిచాణా ఎత్తేసేందుకు సిద్ధమయ్యాయి. ఢిల్లీలో లక్ష ఈ-రిక్షాలు: రాష్ట్రంలో వాహనాల సంఖ్య బాగా పెరిగిపోతోంది. ప్రస్తుతం కోటి వాహనాలతో తెలంగాణ కిటకిటలా డుతోంది. ఇందులో మూడొంతులు భాగ్యనగరం, శివారు ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఫలితంగా నగరంపై కాలుష్య మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఢిల్లీలో వాహన కాలుష్యం తీవ్రంగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం బ్యాటరీ రిక్షాలను ప్రోత్సహించింది. ప్రస్తుతం అక్కడ దాదాపు లక్ష ఈ-రిక్షాలు తిరు గుతున్నాయి. ఇదే తరహాలో ఇక్కడ కూడా వాటిని ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి వినతులు రావటంతో, రవాణా శాఖ అనుమతించింది. ప్రస్తుతం నగరంలో 1.20 లక్షల సాధారణ ఆటోలు తిరుగుతున్నాయి. కొత్త ఆటో పర్మిట్లపై సిటీలో నిషేధం ఉన్నా, వేరే జిల్లాలు, నగర శివారు ప్రాంతాల చిరునామాలతో ఆటోలు కొని అక్రమంగా తిప్పుతున్న వారి సంఖ్య ఎక్కువే ఉంది. చాలామంది ఆటోవాలాలు ఖర్చు తగ్గించుకునేందుకు డీజిల్లో కిరోసిన్ కలుపుతుం డటం కాలుష్యాన్ని మరింత పెంచుతోంది. గంటకు 25 కిలోమీటర్లే.. ఈ-రిక్షాలు అందుబాటులోకి వస్తే కాలుష్యాన్ని తగ్గించొచ్చన్న అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. కానీ ఈ-రిక్షాలు గంటకు 25 కి.మీ. కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. ఇది ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమవుతుంది. మరోవైపు సాధారణ ఆటోలపై నిషేధం ఉన్నా, ఈృరిక్షాలకు అనుమతిస్తే వాటి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగటం ఖాయం. దీంతో ట్రాఫిక్ చిక్కులు పెరుగుతాయని పోలీసు శాఖ నివేదించడంతో రాజధానిలో ప్రస్తుతానికి ఈ-రిక్షాల ప్రవేశానికి ప్రభుత్వం అనుమతించలేదు. శివారు ప్రాంతాలు, ఇతర జిల్లాలకు మాత్రం అనుమతి కొన సాగిస్తోంది. కానీ వేరే చోట్ల వీటికి అంత డిమాండ్ లేకపోవటంతో రోడ్లపై అరుదుగానే కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో సాధారణ ఆటోలకు కొత్త పర్మిట్లు మంజూరు చేసే సమయంలో, వాటికి బదులుగా ఈ-రిక్షాలను మాత్రమే కొనేలా ఆంక్షలు విధిస్తే ఫలితముంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ దీనిపై ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించినట్లు కనిపించటం లేదు. -
నాలుగేళ్లలో 3,155 కి.మీ. రోడ్లు
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే నాటికి రాష్ట్ర జాతీయ రహదారుల సగటు 2.2 కిలోమీటర్లు. అది జాతీయ రహదారుల సగటు (2.84 కిలోమీటర్లు) కంటే తక్కువ. ఈ స్థితిలో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రహదారుల నిర్మాణానికి నడుం బిగించారు. పలుమార్లు కేంద్రానికి లేఖలు రాశారు. అలా ఎన్నో రహదారులను సాధించుకున్నాం. కేంద్రం నుంచి వచ్చిన అనుమతులతో రాష్ట్రంలో జాతీయ రహదారుల సగటు 4.1 కిలోమీటర్లకు చేరింది. నాలుగేళ్లలో 3,155 కిలోమీటర్ల నిడివి ఉన్న జాతీయ రహదారులు రాష్ట్రానికి వచ్చాయి’’అని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పలు రహదారులకు శంకుస్థాపన చేసేందుకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శనివారం హైదరాబాద్ రానున్నారని చెప్పారు. శుక్రవారం తుమ్మల విలేకరులతో మాట్లాడుతూ, ‘‘ఔటర్ రింగ్రోడ్డు నుంచి మెదక్ 765డీ జాతీయ రహదారిపై 62.92 కిలోమీటర్ల నిడివి గల రహదారికి గడ్కరీ శంకుస్థాపన చేస్తారు. ఆ రహదారి నిర్మాణం అంచనా రూ.426.52 కోట్లు. భూ సేకరణకు అవసరమైన నిధులను కేంద్రం విడుదల చేస్తుంది. దీనివల్ల హైదరాబాద్–నర్సాపూర్–కౌడిపల్లి–అప్పాజిపల్లి–రాంపూర్–మెదక్ పట్టణాల అనుసంధానం జరుగుతుంది. ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. మెదక్ జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాల ఆర్థిక ఆవలంబనకు దోహదపడుతుంది’’అని వివరించారు. ప్రాంతీయ ఔటర్రింగ్ రోడ్డు నిర్మాణానికి ఏర్పాట్లు హైదరాబాద్–బెంగళూరు 44వ జాతీయ రహదారిపై ఆరాంగఢ్–శంషాబాద్ మధ్య 10 కిలోమీటర్ల నిడివి గల రహదారిని ఆరు వరుసలుగా నిర్మిస్తామని తుమ్మల తెలిపారు. ఇది రాష్ట్ర రాజధానికి విమానాశ్రయాన్ని కలిపే అతి ముఖ్య రహదారని పేర్కొన్నారు. అంబర్పేట్ కూడలి వద్ద నాలుగు వరుసల ఫ్లై ఓవర్ను నిర్మిస్తామని వెల్లడించారు. హైదరాబాద్–భూపాలపట్నం 202వ జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు, హైదరాబాద్లో కోఠి–ఉప్పల్ మధ్య సిటీ ట్రాఫిక్ను నియంత్రించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఉప్పల్లో హైదరాబాద్–భూపాలపట్నం 202వ జాతీయ రహదారిపై 6.25 కిలోమీటర్ల నిడివిగల ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్ను నిర్మిస్తామని తెలిపారు. ప్రాంతీయ ఔటర్రింగ్ రోడ్డు నిర్మాణానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని, సంగారెడ్డి, నర్సాపూర్, గజ్వేల్, జగదేవ్పూర్, చేవెళ్ల, శంకర్పల్లి తదితర 330 కిలోమీటర్ల పరిధిలో ఇది ఉంటుందని వెల్లడించారు. రూ.7,500 కోట్లు ఇందుకు ఖర్చు కానుందని చెప్పారు. సెంట్రల్ రోడ్ ఫండ్ కింద రూ.వెయ్యి కోట్లు అడిగినట్లు తెలిపారు. గోదావరి తీరం వెంబడి పలు ప్రాజెక్టులను కలిపేలా రహదారి నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. రోడ్లు భవనాల శాఖలో రిటైరైన వారిని తీసుకోవడంపై విలేకరులు ప్రశ్నించగా, కొత్త రాష్ట్రం కాబట్టి అనుభవజ్ఙులను తీసుకుంటున్నామని తెలిపారు. కోదండరాం ఏర్పాటు చేసిన కొత్త పార్టీపై వ్యాఖ్యానించడానికి తుమ్మల నిరాకరించారు. సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఇంజనీర్ ఇన్ చీఫ్ ఐ.గణపతిరెడ్డి పాల్గొన్నారు. నేడు నగరంలో కేంద్ర మంత్రి గడ్కరీ పర్యటన రూ.1,523 కోట్ల పనులకు శంకుస్థాపన సాక్షి, హైదరాబాద్: కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శనివారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. దీనిలో భాగం గా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. రూ.1,523 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ కార్యక్రమాల్లో హైదరాబాద్–బెంగళూరు మధ్య గల ఎన్హెచ్ 44లో ఆరాంఘర్–శంషాబాద్ సెక్షన్ను ఆరులేన్ల రహదారిగా మార్చడం, ఎన్హెచ్ 765డి లో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మెదక్ వరకు రోడ్డు స్థాయిని పెంచ డం, అంబర్పేట్ ఎక్స్ రోడ్డు వద్ద 4 లేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణం, హైదరాబాద్–భూపాలపట్నం సెక్షన్లో ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఆరులేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం వంటి పనులున్నాయి. వీటికి గడ్కరీ శంకు స్థాపన చేస్తారు. రామంతపూర్లోని హైదరాబాద్ పబ్లిక్ గ్రౌండ్స్లో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ కూడా పాల్గొంటారు. -
నరసింహారెడ్డి ఆక్రమాస్తులు 100 కోట్లు
-
సరుకు రవాణా వాహనాలకు సింగిల్ పర్మిట్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య సరుకు రవాణా వాహనాలకు సింగిల్ పర్మిట్ అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి పేర్కొన్నారు. లారీలకు సంబంధించిన సమస్యలపై ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే సమావేశమైందని, వారంలో మరోసారి సమావేశమై సింగిల్ పర్మిట్పై చర్చించనున్నట్లు తెలిపారు. అనంతరం కమిటీ ఏపీకి వెళ్లి అక్కడి అధికారులతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. సింగిల్ పర్మిట్కు సంబంధించి గతంలో ఏపీ అధికారులతో కమి టీ జరిపిన చర్చలు సఫలం కాలేదని చెప్పారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర లారీ యజమానుల సంఘం ప్రతినిధులు, అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అధిక వేగం, పరిమితికి మించి సరుకు రవాణా చేసే వాహనాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్కెట్లు, రైతుబజార్లలో సరుకు దింపే సమయంలో లారీల డ్రైవర్లను వేధించి వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్లు, కార్మిక శాఖ కమిషనర్ను ఆదేశిస్తున్నట్టు చెప్పారు. -
క్షతగాత్రులకు న్యాయం కోసం..
చిలకలపూడి (మచిలీపట్నం) : ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు న్యాయం చేసేందుకు కృష్ణా జిల్లాలో ప్రథమంగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై. లక్ష్మణరావు తెలిపారు. తన చాంబర్లో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో జాతీయ రహదారులు ఎక్కువగా ఉండటంతో ప్రతి అర గంటకు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదాలకు కారకుల వాహనాలకు ఇన్సూరెన్స్ లేకపోవటం, డ్రైవర్కు లైసెన్సు లేని పరిస్థితుల్లో ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు నష్ట పరిహారం చెల్లించటంలో ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఇందుకోసం 2017 నవంబరు 7వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జిల్లాలో అమలు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ తీర్పు ఆధారంగా ప్రమాదాల్లో వాహనాలకు ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్సు లేకపోతే పోలీసులు వాహనాలు సీజ్ చేసి కోర్టు ఉత్తర్వులు వెలువడేంత వరకు దాన్ని యజమానికి అప్పగించకూడదని చెప్పారు. ఇప్పటి వరకు రవాణా శాఖ అధికారులు ధ్రువీకరణ పత్రం ఇస్తే వాహనాన్ని విడుదల చేస్తున్నారని, ఇకపై కోర్టు ఆదేశాల మేరకే వాహనాన్ని విడుదల చేసేలా రవా ణా, పోలీసు శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రమాదం జరిగిన మూడు నెలల్లోపు వాహన యజమాని క్షతగాత్రుడికి నష్ట పరిహారం ఇచ్చేందుకు పూచీకత్తు ఇవ్వని పక్షంలో ఆ వాహనాన్ని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో వేలం వేసి వచ్చిన మొత్తాన్ని డిపాజిట్ చేస్తారని వెల్లడించారు. ప్రయాణీకులు ఏ వాహనమైనా ఎక్కేటప్పుడు దానికి ఇన్సూరెన్స్, డ్రైవర్కు లైసెన్సు ఉందో, లేదో తెలుసుకోవాల్సి ఉందని సూచించారు. వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్, డ్రైవర్ లైసెన్సు వాహనంలో ప్రదర్శించాలన్నారు. లేదంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. నెం బరు ప్లేట్లు లేకుండా తిరిగేవాటిపై స్పెషల్ డ్రైవ్గా రవాణా, పోలీసు శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించాలని సూచించామని చెప్పారు. ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ప్రైవేటు ఫైనాన్స్ ద్వారా తీసుకున్న వాహనాలకు కూడా తప్పనిసరిగా ఇన్సూరెన్స్ను కట్టించాలన్నారు. 22న లోక్ అదాలత్ ఈ నెల 22వ తేదీ ఆదివారం జిల్లా కోర్టు ఆవరణలో నేషనల్ లోక్ అదాలత్ను నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణరావు తెలిపారు. తొలుత ఈ నెల 14వ తేదీ నిర్వహించాలని భావించినప్పటికీ అదే రోజు అంబేడ్కర్ జయంతి కారణంగా వాయిదా వేశామన్నారు. ఈ లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అలాగే, ఈ నెల 14న అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని పదో తరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అంబేడ్కర్ జయంతి రోజున బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పీఆర్ రాజీవ్ పాల్గొన్నారు. -
వాహనం ఎక్కడో...రిజిస్ట్రేషన్ ఇక్కడే...
యానాం: ఆ శాఖలో అంతా ఇష్టారాజ్యం. ఉద్యోగుల ముసుగులో కొంతమంది ఔట్సోర్సింగ్ సిబ్బంది ఆమ్యామ్యాలతో తతంగమంతా నడిపిస్తుంటారు. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసేస్తుంటారు. ఇష్టారాజ్యంగా లైసెన్సులు జారీ చేస్తుంటారు. వారి దగ్గరే సంబంధిత ఆఫీసు తాళం కూడా ఉండటంతో ఇక ప్రతిదీ వారిష్టమే. సంబంధిత శాఖ అధికారులు సిటిజన్ చార్టర్ పెట్టరు. ఫీజుల వివరాలు బహిర్గతం చేయరు. అన్నిటా గోప్యతే. దీనిని ఎవరైనా ప్రశ్నిస్తే ఉద్యోగులు ఎదురు తిరిగి కొట్టేంత పని చేస్తున్నారంటే వారి బరితెగింపును అర్థం చేసుకోవచ్చు. అక్రమాలకు అడ్డాగా.. : పొరుగునున్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కన్నా పుదుచ్చేరిలో రవాణా శాఖ రిజిస్ట్రేషన్లు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో పలు ఇతర రాష్ట్రాల వాహనాలకు యానాంలో తప్పుడు చిరునామాలు, డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు పలు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఈ నెల 20న హర్యానాలో రూ.2.32 కోట్లతో కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ కారుకు ఇక్కడ తప్పుడు చిరునామాలు సృష్టించి రూ.1.22 లక్షలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే 14 శాతం చొప్పున రూ.7.28 లక్షలు అయ్యేది. ఇక్కడ అద్దెకు ఉంటున్నట్లు అడ్రస్సులు సృష్టించి, తదనంతరం ఎల్ఐసీ పాలసీ సంపాదించి, రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మార్చి 2న రేంజ్ రోవర్ చిన్న మోడల్ కారును గుంటూరులో కొనుగోలు చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేశారు. అలాగే ప్రతి నెలా సుమారు 30 హర్యానాకు చెందిన బస్సులను యానాంలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్క ఫిబ్రవరి నెలలోనే 18 హర్యానాకు చెందిన ఏసీ బస్సులకు రిజిస్ట్రేషన్లు జరిగాయంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 60 వేల జనాభాకు అన్ని బస్సులా? యానాం జనాభా కేవలం 60 వేలు. ఇక్కడ బస్సులు కొనుగోలు చేసేవారు చాలా తక్కువమంది ఉన్నా రిజిస్ట్రేషన్లు మాత్రం గణనీయంగానే జరుగుతున్నాయి. 2016 నుంచి ఇప్పటివరకూ ఇక్కడ 70 బస్సులకు రిజిస్ట్రేషన్లు చేశారన్న ఆరోపణలున్నాయి. వాస్తవానికి ఇక్కడ రిజిస్ట్రేషన్ అవుతున్న బస్సులేవీ యానాంలో ఉండడం లేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కనుసన్నల్లోనే.. యానాం రవాణా శాఖలో పని చేస్తున్న ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఇటీవల డ్రైవింగ్ స్కూల్ను తన తండ్రి పేరిట బదిలీ చేయించి, ఆ స్కూల్ లైసెన్సులను సహితం ఇష్టారాజ్యంగా ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డ్రైవింగ్ స్కూల్ నడుపుకునే ఆ వ్యక్తి, చాలా సంవత్సరాలపాటు ఆర్టీవో ఆఫీసుకు బ్రోకర్గా వ్యవహరించేవాడు. తదనంతరం మెల్లగా ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా రవాణా శాఖ కార్యాలయంలో తిష్ట వేసిననాటి నుంచీ అంతా తానై నడిపిస్తున్నాడు. ఇతడికి ఏళ్ల తరబడి బదిలీ లేకుండా అక్కడే ఉంటున్న ఒక యూడీసీ స్థాయి ఉద్యోగి సహకారం తోడవడంతో ఇక్కడి అక్రమాలకు అడ్డు లేకుండా పోతోందనే ఆరోపణలు వస్తున్నాయి. సదరు ఔట్సోర్సింగ్ ఉద్యోగి పని కేవలం సంబంధిత పత్రాలు ప్రింటింగ్ తీయడమే. కానీ ఇష్టానుసారం వసూళ్లు చేస్తూ, షాడో అధికారిగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక గది కేటాయించినప్పటికీ అతను ప్రధాన గదిలోనే ఉంటూ తతంగమంతా నడిపిస్తుంటాడు. టూ వీలర్ లైసెన్సుకు రూ.1015 తీసుకోవాల్సి ఉండగా రూ.1220 తీసుకుంటున్నాడు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1560గా నిర్ణయిస్తే రూ.2,100, ఆర్డినరీ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.9 వేలు ఉంటే రూ.12,500 వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్కు ఫిర్యాదు... యానాం రీజినల్ ట్రాన్స్పోర్ట్ యూనిట్లో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్బేడీకి ఫిర్యాదు చేసినట్లు శ్రీనివాసా యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కోన వెంకటరత్నం, సుంకర స్వామినాయుడు వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు సుంకర కార్తీక్ తెలిపారు. అంతా సక్రమమే.. యానాం ఆర్టీవో కార్యాలయంలో అన్నీ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతున్నాయని ఆర్టీవో రవిచంద్రన్ చెప్పారు. దీనిపై ప్రశ్నించిన ‘సాక్షి’ విలేకరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇక జిల్లాల్లో ట్రాఫిక్ మేనేజ్మెంట్
సాక్షి, హైదరాబాద్: టెక్నాలజీతో శాంతి భద్రతల పర్యవేక్షణ సులభతరం చేసిన పోలీస్ శాఖ, ఇప్పుడు ట్రాఫిక్ మేనేజ్మెంట్పై దృష్టి సారించింది. హైదరాబాద్ కమిషనరేట్లో పూర్తి స్థాయిలో ఈ–చలాన్ వ్యవస్థ, ట్రాఫిక్ పోలీసులకు బాడీ వార్మ్డ్ కెమెరాలు, ఆన్లైన్ ద్వారా జరిమానాల చెల్లింపు, మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘిస్తే పాయింట్ల విధానం, తదితరాలన్నింటిని అమలుచేసి సక్సెస్ అయ్యింది. ఇదే తరహాలో 60 శాతం మేర సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలోనూ టెక్నాలజీ వినియోగాన్ని తీసుకువచ్చారు. ఇప్పుడిదే తరహా ఆధునీకరణ చర్యలను అన్ని జిల్లాల్లోని పోలీస్ విభాగాల్లో ప్రవేశపెట్టాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. క్యాష్లెస్ విధానంలో... రాజధాని ట్రాఫిక్ పోలీసులు ఎక్కడా కూడా నేరుగా జరిమానాలు స్వీకరించడం లేదు. ఈ–సేవ, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా జరిమానాల చెల్లింపులు స్వీకరిస్తున్నారు. దీని ద్వారా ట్రాఫిక్ పోలీసులపై వచ్చే అవినీతి ఆరోపణలకు చెక్పెట్టినట్టయ్యింది. ఇదే రీతిలో జిల్లాల్లోని అర్బన్ ప్రాంతాల్లో ముందుగా ఈ–చలాన్ విధానం, క్యాష్లెస్ చలాన్లను అమలు చేయాలని భావిస్తున్నారు. ఇందుకుగాను అర్బన్ ప్రాంతాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అత్యాధునిక సిగ్నల్ వ్యవస్థ, సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని యోచిస్తున్నారు. ప్రతిజిల్లాకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల మేర నిధులు కేటాయించి ఈ సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్ సిటీ కమిషనరేట్లో ప్రవేశపెట్టిన బాడీ వార్మ్డ్ కెమెరాలను జిల్లాలోని ట్రాఫిక్ అధికారులకు కూడా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించే వారి డ్రైవింగ్ లైసెన్స్పై పాయింట్ల విధానం ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్లో అమల్లో ఉంది. దీన్ని జిల్లాల్లో కూడా అమలు చేసే ఆలోచన ఉంది. ఇందుకుగాను ప్రతీ జిల్లాల్లోని రవాణా శాఖ డేటాబేస్ను పోలీస్ శాఖ డేటాబేస్కు అనుసంధానించేలా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాలని ఆయా జిల్లాల ఎస్పీలను రాష్ట్ర పోలీస్ శాఖ ఆదేశించినట్టు తెలుస్తోంది. డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు సైతం ప్రతి గురు, శుక్ర, శనివారాలు తప్పనిసరిగా నిర్వహించేలా పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేయబోతోంది. దీని కోసం అత్యాధునిక బ్రీత్ అనలైజర్లు, ఇతర సామగ్రిని కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ప్రతి జిల్లాలో శాంతి భద్రతల విభాగానికి ఉన్నట్టుగానే ప్రత్యేకంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం కంట్రోల్ సెంటర్లను ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. దీని ద్వారా సీసీ కెమెరాల ద్వారా ఆటోమేటిక్ చలాన్ జనరేటింగ్, నిబంధనలు ఉల్లంఘించేవారి జాబితా ఆన్లైన్లోనే రూపొందించడం సులభతరమవుతుంది. అదే విధంగా అర్బన్ ప్రాంతాల్లో రోడ్లపై జరిగే నేరనియంత్రణ కూడా సులభమవుతుందని పోలీస్ శాఖ భావిస్తోంది. -
పన్ను ఎగవేత అంత వీజీ కాదు
సాక్షి, సిటీబ్యూరో: పొరుగు రాష్ట్రాలకు చెందిన వాహనాల నమోదులో అక్రమాలను అరికట్టేందుకు రవాణాశాఖ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. వాహనాల జీవితకాల పన్నుపైన ప్రభుత్వానికి వచ్చే కోట్లాది రూపాయాల ఆదాయానికి గండి కొట్టే విధంగా కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. దళారులతో కుమ్మక్కై వాహనాల జీవితకాల పన్ను ఎగ్గొడుతున్న నేపథ్యంలో సర్కార్ అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నియంత్రించేందుకు జాతీయ సమాచార కేంద్రం (నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్)లోని ‘వాహన్ సారధి’ తో మొత్తం వాహనాలను అనుసంధానించాలని నిర్ణయించింది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణలో ఎక్కడ వాహనాలు రిజిస్ట్రేషన్ అయినా వాటి వివరాలు వెంటనే వాహన్ సారథిలో నిక్షిప్తమవుతాయి. అలాగే వాహనాల ఖరీదు, వాటిపైన ప్రభుత్వానికి చెల్లించవలసిన జీవితకాల పన్ను మొత్తం కూడా నమోదవుతుంది. దీంతో ప్రాంతీయ రవాణా అధికారి నుంచి కిందిస్థాయి అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, క్లర్క్లు ఎలాంటి అక్రమాలకు పాల్పడేందుకు అవకాశం ఉండదు. మరోవైపు నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) ద్వారా పొరుగు రాష్ట్రాలకు చెందిన వాహనాల వివరాలను కూడా వెంటనే తెలుసుకొని జీవితకాల పన్నును కచ్చితంగా అంచనా వేసేందుకు అవకాశం లభిస్తుంది. ఇటీవల నగరంలోని బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయంలో కొందరు అధికారులు దళారులతో కుమ్ముక్కై సుమారు 800 వాహనాలకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంలో సుమారు రూ.1.5 కోట్ల మేర ప్రభుత్వాదాయానికి గండి పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమాలకు సంబంధం ఉన్నట్లు గుర్తించిన ఒక అడ్మినిస్ట్రేటివ్ అధికారి, మరో ముగ్గురు క్లర్క్లను సస్పెండ్ చేయడంతో పాటు, సదరు ప్రాంతీయ రవాణా అధికారిని ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. బండ్లగూడ తరహాలో మరోసారి అక్రమాలు జరగకుండా ఉండేందుకు ఎన్ఐసీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. బండ్లగూడ అక్రమాలపై విచారణ .. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ వంటి ఇరుగు పొరుగు రాష్ట్రాలకు చెందిన 500 నుంచి 1000 వాహనాలు రోజూ గ్రేటర్ హైదరాబాద్లోని ఆర్టీఏ కార్యాలయాల్లో నమోదవుతాయి.ఈ సమయంలో వాహనాల ఇన్వాయీస్, వాహనాల వయస్సును పరిగణనలోకి తీసుకొని జీవితకాల పన్ను వసూలు చేయాలి. ఉదాహరణకు కర్ణాటకకు చెందిన రూ.6.5 లక్షల మారుతీ స్విఫ్ట్ డిజైర్ కారు హైదరాబాద్కు బదిలీ అయినప్పుడు 12 శాతం పన్ను వసూలు చేయాలి. ఒకవేళ అది రెండేళ్ల కిందటి వాహనం అయితే 10 శాతం చొప్పున తీసుకోవాలి. కానీ బండ్లగూడలో ఇలాంటి లెక్కలు లేకుండా, ఇన్వాయిస్ నమోదు చేయకుండా ఏకంగా 800 వాహనాలపైన అతి తక్కువ జీవితకాల పన్ను విధించారు. ఒక్కో వాహనంపై సగటున రూ.55000 ఆదాయం రావలసి ఉండగా, అందులో రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకే ప్రభుత్వ ఆదాయానికి జమ చేశారు. మిగతా సొమ్మును దళారులు, అధికారులు కాజేసినట్లు గుర్తించారు.అలా రూ.కోటి 50 లక్షల వరకు ప్రభుత్వ ఆదాయం పక్కదారి పట్టింది. ఈ ఉదంతంపై ప్రస్తుతం రంగారెడ్డి ఉప రవాణా కమిషనర్ ప్రవీణ్రావును ప్రభుత్వం విచారణాధికారిగా నియమించింది. ఎన్ఐసీతో అనుసంధానం ఇలా... కేంద్ర జాతీయ సమాచార వ్యవస్థలో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఎన్ఐసీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్ఐసీలో ‘వాహన్,సారధి’ ఒక ప్రత్యేక ఆప్షన్. ఇందులో ఆర్టీఏ కార్యాలయాల్లో నమోదయ్యే వాహనాలు, డ్రైవింగ్ లైసెన్సుల వివరాలను నిక్షిప్తం చేస్తారు. అలాగే పొరుగు రాష్ట్రాల వాహనాలు, డ్రైవింగ్ లైసెన్సుల సమాచారాన్ని కూడా ఈ ఆప్షన్ ద్వారా పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్ఐసీతో రవాణాశాఖ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో అనుసంధానం కాకపోవడం వల్ల ఆ లోపా న్ని అవకాశంగా మార్చుకొని కొంతమంది అధికారులు సొమ్ము చేసుకున్నారు. వాహనాలపై రావలసిన జీవితకాల పన్నును ఎగ్గొట్టారు. ఎన్ఐసీతో అనుసంధానం కావడం వల్ల పొరు గు రాష్ట్రాల వాహనాలను హైదరాబాద్లో, తెలంగాణ లో ఎక్కడ నమోదు చేసినా వాటి వాస్తవ ధరలు, వివరాల ప్రకారమే నమోదు చేయాల్సి ఉంటుంది. -
విజయవాడకు షి‘కారు’
హైదరాబాద్ నుంచి విజయవాడ.. 250 కిలోమీటర్ల దూరం.. బస్సులో వెళ్తే 6 గంటల ప్రయాణం. అమరావతి, గరుడ ప్లస్ వంటి ఆర్టీసీ ఏసీ బస్సుల్లో అయితే ఐదు గంటల్లో గమ్యం చేరవచ్చు. వీటికి రూ.580 వరకు టికెట్ ధర భరించాల్సి ఉంటుంది. మరి అదే ఏసీ ప్రయాణం, కేవలం మూడున్నర గంటల్లోనే గమ్యం చేరే అవకాశం, ప్రయాణ ఖర్చు రూ.500 మాత్రమే అయితే..! సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు బస్సులను మించిన ట్రావెల్ దందా మొదలైంది. కార్లు స్టేజీ క్యారియర్లుగా అవతారమెత్తాయి. హైదరాబాద్–విజయవాడ మధ్య ప్రయాణికులను తరలిస్తున్నాయి. గరు డ ప్లస్, అమరావతి వంటి ఏసీ బస్సుల కంటే వేగంగా గమ్యం చేరటంతోపాటు, తక్కువ ధర కావటంతో ప్రయాణికులు వాటికే ఎగబడుతున్నారు. దీంతో తవేరా, ఇన్నోవా, ఫార్చునర్ వంటి కార్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కొందరు వాహన యజమానులు సిండికేట్గా మారి సిబ్బందిని నియమించి ప్రయాణికులను వాటిలోకి ఎక్కేలా చేస్తున్నారు. నెల రోజులుగా ఈ తంతు జరుగుతున్నా రవాణా శాఖ కానీ ఆర్టీసీ కానీ దృష్టి సారించలేదు. మూడు గంటల్లోనే.. ఎంత తొందరగా ప్రయాణికులను గమ్యానికి చేరిస్తే.. ఆదరణ అంత ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో కార్లలో ప్రయాణికులను ఎక్కించుకుని దూసుకుపోతున్నారు. అర్ధరాత్రి అయితే మూడు గంటల్లోనే గమ్యం చేరుస్తున్నా రు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉం దన్న ఆందోళన కలుగుతోంది. ఆర్టీసీ బస్సుల కు రావాల్సిన ప్రయాణికులు వీటికి మళ్లుతుండటంతో రవాణా శాఖ భారీగా నష్టపోతోంది. గతంలో ప్రైవేటు బస్సుల వల్ల నష్టం జరుగుతోందని గగ్గోలు పెట్టిన ఆర్టీసీకి ఇప్పుడు వీటి రూపంలో మరో ప్రమాదం ముంచుకొచ్చింది. ఉదయం అటు.. మధ్యాహ్నం ఇటు ఉదయం ఏడు గంటల నుంచి కార్ల హవా మొదలవుతోంది. ఉదయం వేళ ఎక్కువగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే వాహనాలు, మధ్యాహ్నం తర్వాత తిరిగి విజయవాడ నుంచి బయలుదేరుతున్నాయి. మూడు వరసల సీట్లు ఉండే ఈ కార్లలో ఏడు నుంచి ఎనిమిది మందిని ఎక్కించుకుంటున్నారు. దిల్ సుఖ్నగర్, ఎల్బీ నగర్ల నుంచి ఇవి మొదలవుతున్నాయి. ముందస్తు సీటు రిజర్వు చేసుకునే అవసరం లేకపోవటం, రోడ్డు మీదకు రాగానే సిద్ధంగా ఉంటుండటంతో ప్రీమియం కేటగిరీ బస్సుల్లో ఎక్కే ప్రయాణికులు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ఉదయం విజయవాడకు వెళ్లి పని చూసుకుని తిరిగి సాయంత్రం హైదరాబాద్కు వచ్చేవారు ముందే వాహనంలో సీటు రిజర్వు చేసుకునే వెసులుబాటు కూడా వీటిలో కల్పిస్తున్నారు. గతంలో హైదరాబాద్లో ట్రావెల్స్లో తమ వాహనాన్ని ఉంచిన కొంతమంది సిండికేట్గా మారి ఈ దందా ప్రారంభించారు. దీంతో వారి మధ్య మంచి అవగాహన ఉంది. ఏ కారు ఎక్కడుందనే సమాచారం వారి మధ్య ఉంటోంది. ఉదయం తన కారులో వచ్చిన వారు తిరిగి విజయవాడలో బయలుదేరేప్పు డు ఏ కారులో వెళ్లవచ్చో ఆ డ్రైవరే చెబుతు న్నాడు. సంబంధిత కారు డ్రైవర్ ఫోన్ నంబర్ కూడా ఇస్తుండటంతో పని సులువవుతోంది. దృష్టి సారించని రవాణా శాఖ ఆర్టీసీ మినహా మిగతా ప్రైవేటు వాహనాలేవీ స్టేజీ క్యారియర్లుగా తిరగకూడదని పేర్కొనే రవాణా శాఖ అధికారులు ఇప్పటి వరకు వీటిపై దృష్టి సారించలేదు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న అరుణాచల్ప్రదేశ్ బస్సులను ఇటీవల నియంత్రించి చివరకు ప్రభుత్వ ఆదేశంతో వాటికి స్వేచ్ఛనివ్వటం తెలిసిందే. ఇప్పుడు వాటికి తోడుగా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న కార్లు కొత్త సమస్యను తెచ్చిపెట్టాయి. వేగంగా దూసుకుపోతుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశమే ఎక్కువ ఆందోళన కలిగిస్తోంది. వీటి వల్ల ఆర్టీసీ భారీగా నష్టపోతుందని, దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఓ డిపో మేనేజర్ వ్యాఖ్యానించారు. ‘నెల రోజులుగా ఈ కార్ల హవా పెరిగిందని సిబ్బంది నుంచి సమాచారం అం దింది. వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు విన్నవిస్తున్నాం’ అని విజయవాడకు ఎక్కువగా ప్రీమియం కేటగిరీ బస్సులు తిప్పే డిపో మేనేజర్ తెలిపారు. గంటకు 12 నుంచి 15 కార్లు దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, అటు విజయవాడలోని ప్రధాన ప్రాంతాల్లో ఈ కార్లను వరుస ప్రకారం నియంత్రించేందుకు కొందరు సిబ్బందిని కూడా నియోగించారు. ఆ సిబ్బంది ముందు వచ్చిన కారులో ప్రయాణికులను ఎక్కించిన తర్వాత వెనక కారుకు మళ్లిస్తారు. బస్సు కోసం వేచి చూసే ప్రయాణికుల వద్దకు వెళ్లి ఏసీ కార్లు అందుబాటులో ఉన్నాయని, ఆర్టీసీ బస్ చార్జి కంటే తక్కువ ధరకే సిద్ధమని, గంటన్నర ముందే గమ్యం చేరుకోవచ్చంటూ ప్రయాణికులను మళ్లిస్తున్నారు. గంటకు 12 నుంచి 15 వరకు కార్లు వరస కడుతున్నాయి. -
దివాకర్ బస్సుది ‘రాంగ్రూటే’
అనంతపురం సెంట్రల్: వరుస ప్రమాదాలకు కారణమవుతున్న ఏపీ05 డబ్ల్యూ 8556 నంబరుగల దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రయాణిస్తున్నది రాంగ్ రూటేనని రోడ్డు రవాణా శాఖ అధికారులు నిర్దారించారు. రెండురోజుల క్రితం ఈ బస్సు బెళుగుప్ప మండల పరిధిలో అతివేగంతో ప్రయాణించడం వల్ల ప్రమాదానికి గురై 17 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గతంలో వ్యవసాయ అనుబంధ ‘ఆత్మ’ డీడీ రమణ ప్రయాణిస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టి.. ఆయన మృతికి కారణమైంది. ఇలా వరుస ప్రమాదాలకు కారణమవుతున్న ఈ బస్సు కర్ణాటక ప్రభుత్వం నుంచి పర్మిట్ పొందింది ఒక రూటైతే.. ప్రయాణికులను ఎక్కించుకుంటున్నది మరో రూట్ కావడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న దివాకర్ ట్రావెల్స్ బస్సులపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన అనంతపురం ఉప రవాణా కమిషనర్ (డీటీసీ) సుందర్వద్దీ సదరు ట్రావెల్స్ యజమాన్యానికి బుధవారం నోటీసులు పంపారు. -
దివాకర్’ అంటే హడల్
అనంతపురం సెంట్రల్: ప్రజల ప్రాణాలను బలిగొంటున్న దివాకర్ ట్రావెల్స్పై చర్యలు తీసుకునేందుకు రవాణాశాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. లైసెన్సు లేకపోయినా...పర్మిట్ గడువు ముగిసినా ముక్కుపిండి జరిమానా విధించే అధికారులు దివాకర్రెడ్డి ట్రావెల్స్ విషయంలో మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. వరుస ప్రమాదాలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నా... చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. 17 మంది గాయపడినా... దివాకర్ ట్రావెల్స్కు చెందిన ఏపీ05డబ్ల్యూ8556 బస్సు సోమవారం బెళుగుప్ప మండల పరిధిలో అతివేగంతో వెళ్తూ గుంతల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో మొత్తం 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ బస్సుకు పర్మిట్ లేకపోవడం... రవాణాశాఖ అధికారులు అడినప్పటికీ డ్రైవర్ లైసెన్స్ చూపకపోవడం గమనార్హం. వాస్తవానికి మరోదారిలో వెళ్లేందుకు కర్ణాటకలో కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ పొందిన ఈ బస్సును నిబంధనలకు విరుద్ధంగా వేరేదారిలో తిప్పుతున్నారు. గతేడాది నవంబర్ 3న కూడా వ్యవసాయశాఖలో ‘ఆత్మ’ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న రమణను కూడా దివాకర్ ట్రావెల్స్కు చెందిన బస్సు బలిగొంది. వరుస ప్రమాదాలకు కారణమవడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా రాకపోకలు సాగిస్తున్నా... దివాకర్ ట్రావెల్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకునేందుకు రవాణాశాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అధికారపార్టీ నాయకులు కావడంతోనే జీ హుజూర్ అంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
హైటెక్ నంబర్ ప్లేట్ ఉండాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ) లేకుండా తిరిగే వాహనాలపై కొరడా ఝళిపించేందుకు రవాణా శాఖ సన్నద్ధమైంది. ఆర్టీఏలో కొత్తగా వాహనం నమోదైనప్పటికీ చాలామంది వాహనదారులు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లకు బదులు సాధారణ నంబర్ ప్లేట్లనే వినియోగిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 వేల వాహనాల హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో 2013 డిసెంబర్ తర్వాత రిజిస్టర్ అయిన వాహనాలు తప్పకుండా హైటెక్ నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని.. లేకుంటే ఆయా వాహనాలకు సేవలన్నింటినీ నిలిపి వేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. శనివారం రవాణా కమిషనర్ ప్రధాన కార్యాలయంలో సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్ నాయక్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ మేర కు నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచే ఇది అమల్లోకి రానుంది. దీంతో హైటెక్ నంబర్ ప్లేట్లు లేని వాహనాల యాజమాన్య బదిలీ, చిరునామా బదిలీ, హైపతికేషన్, పన్ను చెల్లింపులు, పర్మిట్లు వంటి అన్ని రకాల పౌరసేవలు నిలిచిపోనున్నాయి. 2013లో అమల్లోకి.. వాహనాల భద్రత దృష్ట్యా సుప్రీంకోర్టు హెచ్ఎస్ఆర్పీని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 2013 డిసెంబర్లో ఉమ్మడి రాష్ట్రంలో ఇది అమల్లోకి వచ్చింది. అప్పట్లో రవాణా కార్యాలయంలో నమోదైన ప్రతి వాహనం విధిగా హెచ్ఎస్ఆర్పీ బిగించుకోవాలని నిబంధన విధించారు. అయితే హెచ్ఎస్ఆర్పీ ప్లేట్ల కొరత వల్ల ఈ నిబంధన సరిగా అమలు కాలేదు. దీంతో ఈ స్కీమ్ను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు రవాణా శాఖ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విధానం మేరకు వాహనం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారం, పది రోజుల్లో హెచ్ఎస్ఆర్పీ బిగించుకోవాలి. అలా ఉన్న వాటికే అన్నిరకాల పౌరసేవలు వర్తిస్తాయి. లేకుంటే బ్యాంకు రుణాలపై కొనుగోలు చేసిన వాహనాల హైపతికేషన్ రద్దు, రవాణా రంగానికి చెందిన వాహనాలకు ప్రతి సంవత్సరం ఇచ్చే పర్మిట్లు, త్రైమాసిక పన్ను చెల్లింపులు, వాహనం ఒక చోట నుంచి మరో చోటకు బదిలీ చేయడం, చిరునామా, యాజమాన్య బదిలీ వంటి సేవలు నిలిచిపోనున్నాయి. ఆదివారం సైతం సేవలు... హెచ్ఎస్ఆర్పీ అమలులోని జాప్యాన్ని నివారించేందుకు ఇకనుంచి ఆదివారం కూడా నంబర్ ప్లేట్లను బిగించనున్నట్లు జేటీసీ పాండురంగ్ నాయక్ తెలిపారు. ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సదుపాయం ఉంటుందన్నారు. హెచ్ఎస్ఆర్పీ ఏజెన్సీ నుంచి ఎస్సెమ్మెస్ అందుకున్న వాహనదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు. మొదట ఖైరతాబాద్ ఆర్టీఏలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని, ఆ తరువాత హైదరాబాద్లో పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చి దశలవారీగా రాష్ట్రమంతటా ఆదివారం సేవలను విస్తరిస్తామని ఆయన వివరించారు. హెచ్ఎస్ఆర్పీ నిబంధనను ఉల్లంఘించే వాహనాలపై భవిష్యత్తులో దాడులు చేసి కేసులు నమోదు చేసేందుకు కూడా వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. -
‘అరుణాచల్’ కథ కంచికి!
సాక్షి, హైదరాబాద్: నిబంధనలు మారలేదు.. బస్సుల యజమానులూ పద్ధతి మార్చుకోలేదు. కొన్ని నెలల క్రితం ప్రభుత్వానికి అక్రమంగా కనిపించిన తీరు ఇప్పు డు ఉన్నట్టుండి సక్రమమైంది. గత జూన్లో అరుణాచల్ప్రదేశ్ రిజిస్ట్రేషన్తో ఉన్న బస్సులపై ఆ రాష్ట్రం కన్నెర్ర చేసిన నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ కూడా అలాంటి బస్సులపై కొరడా ఝళిపించింది. కానీ ఆరు నెలలు తిరక్కుండానే రవాణా శాఖ ఆ హెచ్చరికలను ‘తాటాకు చప్పుళ్లు’ చేసి ఆ బస్సులకు లైన్ క్లియర్ చేసింది. వెరసి ఆర్టీసీ దివాలా దశకు చేరటానికి కారణంగా మారిన ప్రైవేటు బస్సులను నియంత్రించటం అసాధ్యమని మరోసారి నిరూపించింది. నిబంధనలతోపాటు భద్రత ప్రమాణాలను కూడా ప్రైవేటు బస్సులు పాటించటం లేదని ఆరోపించే రవాణా శాఖ.. ఇప్పుడు వాటికి అనుకూలంగా వ్యవహరించటం చర్చనీయాంశంగా మారింది. జరిగింది ఇదీ! గత జూన్లో అరుణాచల్ప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు బస్సులపై విరుచుకుపడింది. అక్కడి చిరునామాలతో అక్కడే బస్సులను రిజిస్టర్ చేసి, అక్కడే పర్మిట్లు పొంది వేరే ప్రాంతాల్లో తిరగటం అక్రమమని గుర్తించి వాటి అనుమతులు రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అలాం టి బస్సులు దాదాపు వెయ్యి వరకు ఉండటంతో ఇక్కడా వాటిని నియంత్రించారు. తెలంగాణ ప్రభుత్వం ఆ బస్సులను గుర్తించి వాటి నుంచి త్రైమాసిక పన్ను వసూలును నిలిపివేసింది. వాటికి అనుమతి లేనందున రోడ్డెక్కితే జప్తు చేయాలని ఆదేశించింది. దీంతో రవాణా శాఖ అధికారులు ఆ బస్సులు ఎక్కడ కనిపిస్తే అక్కడ జప్తు ప్రారంభించారు. దీంతో ఆర్టీసీ బస్సులు కళకళలాడాయి. రద్దీ ఉన్న చోట్ల అదనపు బస్సులు తిప్పడాన్ని ఆర్టీసీ మొదలుపెట్టింది. ఇంతలో కొందరు దళా రులు ఆ బస్సులపై నిషేధం ఎత్తేయాలని రవాణా శాఖపై ఒత్తిడి ప్రారంభించారు. ఆ ఒత్తిడే పని చేసిందో, త్రైమాసిక పన్ను రూపంలో ఆదాయం కోల్పో వటం ఎందుకని అనుకున్నారో తెలియదు గాని సంక్రాంతి సమయంలో వాటికి పచ్చజెండా ఊపేశారు. రూ.5.5 లక్షల ఆదాయం ప్రతి ప్రైవేటు బస్సు మూడు నెలలకోసారి సీటుకు రూ.3,500 చొప్పున ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. వెరసి ఒక్కో బస్సు నుంచి ఏడాదికి రూ.ఐదున్నర లక్షల వరకు పన్ను వసూలవుతుంది. సీన్ రివర్స్! బెంగళూరు సహా విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుండటంతో హైదరాబాద్ నగరంలోని బీహెచ్ఈఎల్, మియాపూర్, కూకట్పల్లి.. తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ ఏసీ బస్సులు నడుపుతోంది. బీహెచ్ఈఎల్, మియాపూర్, హైదరాబాద్–3 డిపోలకు సంబంధించి 20 గరుడ ప్లస్, 20 రాజధాని ఏసీ బస్సులు నడుస్తున్నాయి. ప్రైవేటు బస్సులపై నిషేధం ఉన్న సమయంలో ఈ బస్సుల్లో సీట్లు సరిపోక అదనపు బస్సులు నడపాల్సి వచ్చింది. ఫలితంగా ఆర్టీసీ గల్లా పెట్టె కళకళలాడింది. ప్రైవేటు బస్సులపై నిషేధం తొలగ్గానే ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో సగటున 45 శాతానికి పడిపోయింది. పగటి పూట నడిచే రాజధాని బస్సుల్లో ఇది 70 శాతం వరకు ఉండగా, గరుడ బస్సుల్లో పరిస్థితి దారుణంగా పడిపోయింది. రాత్రి వేళ ప్రైవేటు బస్సులు స్లీపర్ సర్వీసులు నడుపుతుండటంతో జనం అటువైపు మొగ్గు చూపుతున్నారు. విషయాన్ని డిపో మేనేజర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ప్రైవేటు బస్సుల నియంత్రణ తమ చేతుల్లో లేకపోవటంతో వారు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. ఏపీ చర్యలతో గండి..? నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఈ బస్సులు ఏపీ కేంద్రంగానే ఎక్కువగా ఉన్నాయి. అరుణాచల్ప్రదేశ్ ఉదంతం సమయంలో వాటిని నియంత్రించారు. కానీ రెండుమూడు నెలలకే అనుమతించేశారు. దీంతో ఏపీ నుంచి హైదరాబాద్కు ఎక్కువ బస్సులు తిరగటం మొదలుపెట్టాయి. ఇక్కడ నిషేధం ఉండటంతో అధికారులు వాటిని జప్తు చేయటం గందరగోళంగా మారింది. ఎలాగూ ఏపీ గేట్లు ఎత్తేసింది కాబట్టి ఇక్కడా నిషేధం తొలగించి పన్ను వసూలు చేసుకోవటం మంచిదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కొందరు అధికారులు చెబుతున్నారు. నిబంధనల ఉల్లంఘన ఇలా.. - కేంద్ర మోటారు వాహనాల చట్టం 1989 నిబంధన 128(10) ప్రకారం జాతీయ పర్మిట్ ఉన్న రవాణా వాహనాల్లో బెర్తులు ఏర్పాటు చేయొద్దు. కానీ రాష్ట్రంలో తిరుగుతున్న ప్రైవేటు బస్సుల్లో ఉంటున్నాయి. - నిబంధన 125(4) సి, ప్రకారం ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థలు, రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి పర్మిట్లు పొందిన ప్రైవేటు బస్సులు మాత్రమే బెర్తులు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ వేర్వేరు రాష్ట్రాల పర్మిట్ పొంది రాష్ట్రాల మధ్య తిరుగుతున్నాయి. - తెలంగాణ మోటారు వాహనాల చట్టం నిబంధన 297(ఎ) ప్రకారం ఆర్టీసీ మినహా మరే బస్సులు స్టేజీ క్యారియర్లుగా తిరగొద్దు. ప్రైవేటు సంస్థలు బోర్డులు పెట్టి మరీ టికెట్లు అమ్ముకుంటున్నాయి. -
అచ్చెన్నా.. ఆర్టీసీ ఓ టెక్కలి టెండర్!!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కొండంత అప్పుల్లో కూరుకుపోయిన ఆర్టీసీ పరిస్థితి అసలే దినదినగండంగా ఉంది. అలాంటప్పుడు ఒడ్డున పడేసే ఏ చిన్న అవకాశం వచ్చినా సంస్థకు మేలు చేసి కాపాడాలి. అదే జీవనాధారంగా గడుపుతున్న వేల కుటుంబాలను నిలబెట్టాలి. కానీ వడ్డించేవాడు మనవాడైతే కడబంతిలో కూర్చున్నా ఇబ్బంది లేదన్నట్లుగా రవాణా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి అనుచరులు ఆర్టీసీకి చెందిన ఖరీదైన స్థలం చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. గుట్టుగా టెండర్లు.. మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో దాదాపు మూడు ఎకరాల్లో ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది. ఇందులో రెండు ఎకరాలు వాణిజ్య కార్యకలాపాల కోసం లీజుకిచ్చేందుకు ఇటీవల ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. అయితే ఈ టెండర్ల ప్రక్రియ గుట్టుచప్పుడు కాకుండా సాగిపోయింది. టెండర్లు దాఖలు చేసినవారిలో మంత్రి అచ్చెన్నకు సన్నిహితుడైన లాడె శ్రీనివాస్ తదితర స్థానిక వ్యాపారులున్నారు. తెరపైకి వారి పేర్లు వచ్చినా ఆ స్థలం మంత్రి కోసమేనన్న విమర్శలున్నాయి. ఇతరులకు స్థలం దక్కకుండా రాజధాని స్థాయిలో పావులు కదుపుతున్నట్లు సమాచారం. రూ.10 కోట్ల విలువైన స్థలం... నియోజకవర్గ కేంద్రమైన టెక్కలిలో ప్రస్తుతం సెంటు స్థలం విలువ రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల దాకా ఉంది. ఈ ప్రకారం చూస్తే ఆర్టీసీ స్థలం విలువ కనిష్టంగా రూ.10 కోట్ల వరకూ ఉంటుంది. ప్రధాన రహదారికి ఆనుకొని ఆర్టీసీ స్థలం ఉండటంతో దీనికి మరింత డిమాండ్ ఉంది. ఇక్కడ ఫంక్షన్ హాల్, మల్టీఫ్లెక్స్ సినిమా థియేటర్, షాపింగ్ మాల్ నిర్మిస్తే అవి అక్షయపాత్రలా మారతాయనడంలో సందేహం లేదు. ఈ విషయం గ్రహించే మంత్రి అనుచరులు పక్కా ప్లాన్ ప్రకారం ఆర్టీసీ స్థలం దక్కించుకునేందుకు ప్రణాళిక రచించినట్లు తెలిసింది. టెండర్ నిబంధనల ప్రకారం 44 సంవత్సరాల లీజు కోసం రూ.5 కోట్లు అడ్వాన్సుగా చెల్లించాల్సి ఉంది. అలాగే ఏటా ఆర్టీసీకి లీజు కింద కొంత మొత్తం కూడా లీజుదారులు చెల్లించాలి. అయితే టెండర్లు ఖరారయ్యేవరకూ లీజు మొత్తం ఎంతనేది తెలిసే అవకాశం లేదని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. బహిరంగ టెండర్లు పిలిస్తే ఆర్టీసీకి మేలు విజయనగరం ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయంలో వాణిజ్య విభాగం అధికారుల వద్ద ఈ లీజు గురించి ప్రస్తావించగా టెండర్లు ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. అయితే అచ్చెన్నాయుడే రవాణా శాఖ మంత్రిగా ఉన్నందున ఆయన అనుచరులు నామమాత్ర లీజుతో విలువైన ఆర్టీసీ స్థలాన్ని దక్కించునే అవకాశం ఉంది. అసలు ప్రధాన పత్రికల్లో ఎక్కడా టెండరు ప్రకటన కనిపించకుండా ఏదో నామమాత్రంగా ఇచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విలువైన స్థలానికి బహిరంగ టెండర్లు ఆహ్వానిస్తే ఆర్టీసీకి మేలు జరుగుతుందని టెక్కలి ప్రజలు స్పష్టం చేస్తున్నారు. -
గ్యాస్ సిలిండర్ల తనిఖీ లేదేం?
సాక్షి, హైదరాబాద్: వాహనాల్లో అమర్చిన గ్యాస్ సిలిండర్ల విషయంలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సి ఉన్నా, ఆ పని చేయకపోవడంపై ఉమ్మడి హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రవాణా శాఖ కమిషనర్, డీజీపీ, కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి, హెచ్పీసీఎల్ తదితరులను ఆదేశించింది. దీనిలో భాగంగా వారికి నోటీసులు జారీ చేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వాహనాల్లో గ్యాస్ సిలిండర్లను తనిఖీ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ వినియోగదారుల హక్కుల సంఘం గ్రేటర్ అధ్యక్షుడు హరిబాబు హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. పార్కులపై కౌంటర్ దాఖలు చేయండి: జంట నగరాలతో పాటు తెలంగాణలో పార్కులకోసం స్థలం కేటాయింపు, వాటి నిర్వహణ తదితర అంశాలకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పార్కులకు తగినంత స్థలం లేకపోవడం వల్ల హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్గా మారిపోయిందని, ఈ విషయంలో ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ సీనియర్ న్యాయవాది కె.ప్రతాప్రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆక్రమణలకు అడ్డాలుగా ఫుట్పాత్లు జంట నగరాల్లోని ఫుట్పాత్లన్నీ ఆక్రమణలకు అడ్డాలుగా మారాయని, దీంతో పాదచారులు విధిలేని పరిస్థితుల్లో రోడ్లపై నడవాల్సి వస్తోందని ఉమ్మడి హైకోర్టు వ్యాఖ్యానించింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల అలసత్వం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని మండిపడింది. హైదరాబాద్, సిద్ది అంబర్బజార్లలో ఫుట్పాత్ వ్యాపారులు చట్టానికంటే తామే అధికులమని భావిస్తున్నారని.. అందుకే కోర్టుకిచ్చిన హామీని ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుట్పాత్లను ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారో తెలపాలని జీహెచ్ఎంసీ కమిషనర్ను ఆదేశించింది. ఇందుకు స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని కమిషనర్కు స్పష్టం చేసింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్ల ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ‘సోలార్’ కంపెనీలకు భూములు కట్టబెట్టొద్దు మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల్లో ప్రైవేట్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల్ని రిజిస్ట్రేషన్ చేశారనే ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. దేవాదాయ, సర్వీస్ ఇనాం, అసైన్డ్ భూములే కాకుండా వెట్టి నుంచి విముక్తి కల్పించిన కార్మికులకు ఇచ్చిన భూముల్ని కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ పాలమూరు వలస కూలీల సంఘం హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ప్రైవేట్ సోలార్ పవర్ ప్రాజెక్టుల పేరిట రిజిస్ట్రేషన్ జరగకుండా చూడాలని అధికారులను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వ, పేదల భూములు పరులపరం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి, రెండు జిల్లాల కలెక్టర్లకు నోటీసులిచ్చింది. -
నమోదు కాని వాహనాలు జప్తు!
సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ కింద వాహనాలను నమోదు చేసుకోని సంస్థలపై కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు వివరాలు నమోదు చేయని సంస్థలకు త్రైమాసిక పన్ను చెల్లింపునకు అవకాశం లేకుండా చేస్తారు. తర్వాత పన్ను చెల్లించని వాహనం రోడ్డెక్కితే జప్తు చేస్తారు. కార్మిక చట్టాలను కచ్చితంగా అమలు చేసే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు పట్టని సంస్థలు రవాణా సంస్థల్లో పని చేసే కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి చట్టంలో అన్ని నిబంధనలు పొందుపర్చినా చాలా సంస్థలు పట్టించుకోవటం లేదు. అసలు ఏ సంస్థలో ఎంతమంది పని చేస్తున్నారు, ఇతర వివరాలు కూడా ప్రభుత్వానికి అందుబాటులో ఉండటం లేదు. కనీస వేతనాలు చెల్లింపు మొదలు రెండో డ్రైవర్, 8 గంటలకు మించి పని చేయించకపోవటం వంటి అంశాలపై స్పష్టమైన ఆదేశాలున్నా అమలు చేయకుండా.. ఆయా సంస్థల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రయాణికుల రవాణా, సరుకు రవాణా వాహనాలు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించేప్పుడు కూడా రెండో డ్రైవర్ను ఏర్పాటు చేయటం లేదు. ఫలితంగా ఒకే డ్రైవర్ ఎక్కువ గంటలు పని చేయటంతోపాటు తీవ్రంగా అలసిపోయి ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కూడా కారణమవుతోంది. పది శాతం కూడా రిజిస్టర్ కాలేదు.. ఈ నేపథ్యంలో వీటిపై నిఘా ఉంచాలంటే ఆయా సంస్థలు ట్రాన్స్పోర్టు వర్కర్స్ యాక్ట్ కింద వాహనాలను రిజిస్టర్ చేయాల్సి ఉంది. ఆ వివరాల ఆధారంగా కార్మిక శాఖ, రవాణా శాఖల అధికారులు దాడులు చేసి వివరాలు వాకబు చేస్తారు. కానీ రాష్ట్రంలో ఇప్పటివరకు పది శాతం వాహనాలు కూడా తమ వాహనాలను రిజి స్టర్ చేయలేదు. ఇప్పుడు అన్ని వాహనాలు రిజిస్టర్ అయ్యేలా కార్మిక శాఖ చర్యలు తీసుకుంటోంది. రిజిస్టర్ చేయించుకున్న వాహనాలకే ప్రత్యేకంగా ఓ టోకెన్ ఇస్తుంది. టోకెన్ చూపితేనే త్రైమాసిక పన్ను కట్టించు కుంటారు. టోకెన్ లేకుండా పన్ను కట్టించు కోవద్దని నిర్ణయించినట్టు రవాణా శాఖ కమి షనర్ సునీల్ శర్మ సోమవారం సచివాల యంలో విలేకరుల సమావేశంలో తెలిపారు. టోకెన్ లేని వాహనాల నుంచి పన్ను వసూలు చేయబోమని, ఆ వాహనాలను అధికారులు జప్తు చేస్తారని హెచ్చరించారు. ఇప్పటికే వాహనాల జప్తు ప్రారంభించారు. రెండో డ్రైవర్ లేకపోవటం, డ్రైవర్తో ఎక్కువ గంటలు పనిచేయిస్తున్న అంశాల ఆధారంగా గత వారం రోజుల్లో 51 వాహనాలను జప్తు చేసి వాటి పర్మిట్లు రద్దు చేసినట్టు జేటీసీ రమేశ్ వెల్లడించారు. -
‘సిక్స్’కు ఫిక్స్
అదృష్ట సంఖ్యలుగా భావించే వాహనాల ఫ్యాన్సీ నంబర్లపై సిటీలో క్రేజ్ పెరుగుతోంది. ఇటీవల సిక్స్ సిరీస్ నంబర్లకు మరింత డిమాండ్ ఎక్కువైంది. కోట్లాది రూపాయల విలువైన హైఎండ్ కార్లు కొనుగోలు చేయడంతోపాటు తమ హోదాను ప్రతిబింబించే విధంగా వాహనదారులు లక్కీ నంబర్లను ఎంపిక చేసుకుంటున్నారు. ఒక్క ఆల్నైన్స్, ఆల్ సిక్స్లే కాకుండా తమకు నచ్చిన ఇతర నంబర్ల కోసమూ రూ.లక్షలు చెల్లిస్తున్నారు. ఖరీదైన కార్లకే కాదు, బైక్ల నంబర్ల కోసం కూడా వాహనదారులు పోటీకి దిగుతున్నారు. కొందరు బర్త్డే గిఫ్ట్లుగా వీటిని బంధువులు, మిత్రులకు ఇస్తున్నారు. ఫ్యాన్సీ రూపంలో ఏటా రవాణాశాఖకు సుమారు రూ.50 కోట్ల ఆదాయం లభిస్తోందంటే పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సాక్షి, సిటీబ్యూరో: ‘టీఎస్ 09 ఈడబ్ల్యూ 0999’ నెంబర్కు ఆర్టీఏ నిర్ణయించిన ఫీజు రూ.50 వేలు. వేలంలో ఈ నంబర్ కోసం పోటీపడిన ఓ వాహనదారుడు ఏకంగా రూ.9.30 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నాడు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ‘టీఎస్ 09 ఈడబ్ల్యూ 6666’ నంబర్కు రూ.8.67 లక్షల ఆదాయం లభించింది. వాహనదారులు క్రేజ్గా భావించే మరో నంబర్ ‘టీఎస్ ఈడబ్ల్యూ 1234’ కోసం ఒక వాహనదారుడు రూ.4.50 లక్షలు వేలంలో చెల్లించాడు. టీఎస్ 09 ఈడబ్ల్యూ 5555’ నంబర్కు రూ.2.71 లక్షల డిమాండ్ వాహనదారులు ఎక్కువగా కోరుకొనే మరో నంబర్ ‘టీఎస్ 09 ఈడబ్ల్యూ 2345’ పైన రూ.2.15 లక్షల ఆదాయం లభించింది. గత నెల రోజుల్లోనే వాహనాల నంబర్ల పైన నిర్వహించిన వేలంపాటల్లో ఖైరతాబాద్ ఆర్టీఏకు ఏకంగా రూ.1.37 కోట్ల ఆదాయం లభించింది. అదృష్టసంఖ్యలుగా భావించే వాహనాల ఫ్యాన్సీ నంబర్లపై నగరవాసులకు మోజు పెరుగుతోంది. తమకిష్టమైన నంబర్లకు ఎన్ని లక్షల రూపాయలైనా చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్క ఆల్నైన్స్, ఆల్ సిక్స్ వంటి నంబర్లే కాదు..ఇతరత్రా అదృష్ట సంఖ్యలకూ డిమాండ్ పెరుగుతోంది. ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఏటా రవాణా శాఖకు సుమారు రూ.50 కోట్ల ఆదాయం లభిస్తోంది. వాహనదారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘9’ అంకెతో మొదలయ్యే ఖైరతాబాద్ కార్యాలయంలోనే గతేడాది రూ.15 కోట్లకు పైగా ఆదయం లభించగా, ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.20 కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా. ఖైరతాబాద్తో పాటు మేడ్చల్, అత్తాపూర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, మెహదీపట్నం వంటి అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లోనూ ప్రత్యేక నంబర్లకు క్రేజ్ పెరుగుతోంది. ‘ఆల్ సిక్స్’ ఆల్ టైమ్ రికార్డు... ఇటీవల ఖైరతాబాద్ ఆర్టీఏలో నిర్వహించిన వేలం పాటల్లో ఆల్సిక్స్ నంబర్ కోసం ఓ వాహనదారుడు ఏకంగా రూ.8.67 లక్షలు వేలంలో చెల్లించాడు. దీని కోసం ఏడుగురు పోటీకి దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్కు ఇదే నంబర్ ఉండడం, ఆయనకు ఈ నంబర్ అంటే ఎంతో ఇష్టం కావడంతో సహజంగా నగరవాసుల్లోనూ సిక్స్పై మక్కువ ఏర్పడింది. హోదా కోసం... అదృష్ట సంఖ్యలుగా భావించి కొందరు పోటీకి దిగుతుండగా, హోదా, పేరు ప్రతిష్టల కోసం మరికొందరు ఫ్యాన్సీ నంబర్లను దక్కించుకుంటున్నారు. ఉద్యోగం, వ్యాపారం, సినిమాలు, రాజకీయాలు, పరిశ్రమలు వంటి విభిన్నరంగాలకు చెందిన వాహన యజమానులు ‘లక్కీ’ నంబర్ల కోసం రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఆర్టీఏలో కొత్త సీరిస్ ప్రారంభమవుతుంది. మొత్తం నంబర్లలో 2500 వరకు ఫ్యాన్సీ నంబర్లు ఉంటాయి. వీటి కోసం వేలాది మంది పోటీపడుతున్నారు. ఒక్కో నంబర్కు సగటున 5 నుంచి 10 మంది వాహన యజమానులు పోటీకి వస్తుండగా, నచ్చినవి లభించని వాళ్లు నెలల తరబడి వేచి ఉంటున్నారు. అదృష్టం కోసం... కేవలం ఫ్యాన్సీ కోసం కాకుండా కొన్ని నంబర్ల వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుందనే నమ్మకం కూడా ఈ క్రేజ్కు కారణం. జ్యోతిష్యులు ఒక్కొక్క నంబర్ను ఒక గ్రహంతో, వాటి కదలికలతో అంచనా వేసి భవిష్యత్తును, మానసిక స్వభావాలను నిర్ధారిస్తారు. అలా తమ స్వభావానికి తగిన నంబర్లను వాహనదారులు ఎంపిక చేసుకుంటున్నారు. ఆ రకంగా 1,2,3,4,5,6,7,8,9 వంటి ప్రతి సింగిల్ నంబర్కు ఒక లక్షణం ఉంటుంది. ఉదాహరణకు ‘1’ నాయకత్వానికి, ‘2’ శాంతస్వభావానాకి నిదర్శనం. గురుగ్రహంతో పోల్చే ‘3’ వల్ల చక్కటి తెలివి తేటలు, జ్ఞానం లభిస్తాయని నమ్మకం. ‘5’ను బుధుడికి ప్రతిబింబంగా భావిస్తారు. ఈ నంబర్ వల్ల వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం. ఇక ప్రతి ఒక్కరు ఇష్టపడే నంబర్ ‘9’ కుజగ్రహానికి ప్రతీకగా భావిస్తారు. జీవితంలో విజేతలుగా, తిరుగులేని నాయకులుగా ఎదగాలని కోరుకునేవాళ్లు, పోటీ మనస్తత్వం, పోరాడే తత్వం ఉన్నవాళ్లు ఈ నంబర్ను ఇష్టపడతారు. 1980 నుంచే.... సిటీలో 1980 నుంచే ఫ్యాన్సీ నంబర్లపై వాహనదారుల్లో మక్కువ ఉంది. ‘9999’ వంటి నంబర్లు అప్పట్లో కేవలం రూ.500కు లభించేవి. ఎలాంటి పోటీ ఉండేది కాదు. రాజకీయరంగ ప్రవేశం చేసిన ఎన్టీరామారావు వంటి ప్రముఖులు తమ వాహనాలకు నచ్చిన నంబర్లను ఏర్పాటు చేసుకోవడంతో ఈ క్రేజ్ మొదలైంది. అప్పట్లో ఎన్టీరామారావు ‘ 27’, 999’, ‘9999’ వంటి నంబర్లకు ప్రాధాన్యతనిచ్చేవారు. బర్త్డే గిఫ్టుల్లా ఇస్తున్నారు... ఇటీవల కాలంలో చాలామంది వినియోగదారులు తమ కుటుంబ సభ్యులకు వాహనాలను బహుమానంగా అందజేయడమే కాదు...వారి పుట్టిన రోజు కలిసొచ్చేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబర్లను ఎంపిక చేసుకొని పోటీకి వస్తున్నారు. ‘1313’(తేరా తేరా) అంటే పంజాబీలకు ఎంతో ఇష్టం. దీనిని వాళ్లు అదృష్ట సంఖ్యగా భావిస్తారు. ‘5121’ అనే నంబర్ను ఆంగ్ల అక్షరాల్లో ‘సిరి’గా భావిస్తారు.‘143’, ‘214’, ‘8045’ వంటి నంబర్లకూ ఎంతో క్రేజ్ ఉంది. ఏటా క్రేజ్ పెరుగుతోంది గత రెండేళ్లుగా ఫ్యాన్సీ నంబర్లపై అనూహ్యమైన క్రేజ్ కనిపిస్తోంది. ఖైరతాబాద్ కార్యాలయంలో అత్యధిక డిమాండ్ ఉంటోంది. వేలంలో ఈ నెలలోనే ఇక్కడ రూ.కోటికి పైగా ఆదాయం లభించడం ఇందుకు నిదర్శనం. లగ్జరీ వాహనాల వినియోగం బాగా పెరగడం, ద్విచక్ర వాహనదారుల నుంచి కూడా గట్టి పోటీ ఉండడం వల్ల ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్ బాగా పెరిగింది. – సి.రమేష్, ఆర్టీఓ, ఖైరతాబాద్ -
బస్సు ఎక్కడుందో.. ఎప్పుడొస్తుందో..
సాక్షి, హైదరాబాద్: బస్టాప్లలో ప్రయాణికులు నిత్యం తమ తోటివారిని ఎప్పుడూ ఓ ప్రశ్న అడుగుతుంటారు. ఈ బస్సు ఎప్పుడొస్తుంది అని..! అడిగేవారికి ఎలా ఉన్నా చెప్పేవారు మాత్రం చిరాకుగా ఫీలవుతుంటారు. ఏదేమైనా ఎవరి సాయం లేకుండా ఏ బస్సు ఎక్కడుందో, ఎంత సేపట్లో ఆ బస్టాప్నకు చేరుకుంటుందో అనే కచ్చితమైన సమాచారాన్ని తెలిపే ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డును బస్టాపుల్లో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేసింది ఆర్టీసీ ఈ ఆలోచనతోనే హైదరాబాద్లో ఫ్రాన్స్ సాంకేతిక సహకారంతో స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాజెక్టుకు ఆర్టీసీ ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు సన్నద్ధమైంది. పైలట్ ప్రాజెక్టుగా కోఠి–సికింద్రాబాద్ మార్గంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా 42 బస్సులతో ఈ వ్యవస్థను అనుసంధానిస్తున్నారు. బస్భవన్లో కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటు ఇప్పటికే రెండు ఫ్రెంచి కంపెనీలు తమ సాఫ్ట్వేర్తో అనుసంధానించి బస్భవన్లో కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేశాయి. దీన్ని భారత్లోని ఫ్రాన్స్ రాయబారి అలెగ్జాండర్ జిగ్లర్ శనివారం స్వయంగా పరిశీలించి ప్రారంభించనున్నారు. రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్శర్మ, ఆర్టీసీ ఎండీ రమణారావుల సమక్షంలో దీన్ని ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్న ఫ్రెంచి కంపెనీల నిర్వాహకులు ఈ ప్రాజెక్టు పనిచేసే తీరును ఫ్రాన్స్ రాయబారి, రవాణాశాఖ మంత్రి, అధికారులకు వివరిస్తారు. అలాగే అది పనిచేసే తీరును సోలార్ ఆధారిత ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డుపై ప్రత్యక్షంగా పరిశీలించి చూపుతారు. ప్రయాణికులకు కచ్చితమైన సమాచారం.. 50 లక్షల వాహనాలతో కిటకిటలాడుతున్న భాగ్యనగరంలో నిత్యం ట్రాఫిక్ సమస్యలతో సగటు ప్రయాణికుడు నానా ఇబ్బంది పడాల్సివస్తోంది. బస్సు ప్రయాణికులు ఏ బస్సు ఎప్పుడొస్తుందో తెలియక ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోలార్ ఆధారిత ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. దీని సాయంతో ఏ బస్సు ఎక్కడుందో, ఎంత సేపట్లో ఆ బస్టాప్నకు చేరుకుంటుందో, దాని వెనక మరెన్ని బస్సులు ఎక్కడెక్కడున్నాయో తదితర కచ్చితమైన వివరాలు తెలుసుకోవచ్చు. ఏ ఇబ్బందులు లేకుండా ప్రయాణికులు తమ గమ్యాన్ని చేరుకోవచ్చు. -
ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లకూ ఈఎస్ఐ, పీఎఫ్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో పనిచేస్తున్న అద్దె బస్సు డ్రైవర్లకు కూడా ఈఎస్ఐ, పీఎఫ్ వసతి కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్రెడ్డి తెలిపారు. శనివారం ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల సంఘం ప్రతినిధులు తిరుపతిరెడ్డి, రాజు, ఇతర సభ్యులు మంత్రిని కలసి తమ సమస్యలు పరిష్క రించాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. భవిష్య త్తులో ఆర్టీసీలో డ్రైవర్ల నియామకం చేపట్టేప్పుడు అద్దె బస్సు డ్రైవర్లకు ప్రాధాన్యమివ్వనున్నట్లు వెల్లడిం చారు. ఆర్టీసీ బస్సు ప్రమాదాల్లో అద్దె బస్సుల సంఖ్య ఎక్కువగా ఉందని, వీటిని నియంత్రించేందుకు ఆ బస్సుల డ్రైవర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
మావాళ్లు మంచి వాళ్లే
నెల్లూరు (టౌన్): రవాణాశాఖ అధికారులు చనిపోయిన వ్యక్తి పేరుపై బైక్ రిజిస్ట్రేషన్ చేయడంపై ఈ నెల 17న ‘సాక్షి’లో ‘ఆత్మ సంతకం పెట్టిందేమో’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ కథనంపై విచారణ చేపట్టిన రవాణా శాఖ అధికారులు మా వాళ్లు మంచివాళ్లే.. తప్పంతా న్యాయవాది, ఫైనాన్షియర్దేనని తేల్చారు. రవాణా అధికారులు, గుమస్తాల తప్పేమిలేదని, కేవలం ప్రైవేటు వ్యక్తుల కారణంగానే తప్పిదం జరిగిందని రిపోర్టు తయారు చేసి పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. వాహనం ట్రాన్స్ఫర్ సమయంలో సంబంధిత యజమాని ఆధార్కార్డుతో నేరుగా రవాణా కార్యాలయంలో అధికారుల ముందు సంతకం పెట్టాలి. సంతకం పెట్టిన వ్యక్తి ఆధార్ను పరిశీలించకుండానే రవాణా అధికారి సంతకం తీసుకున్నారాని అందరు నోరు వెల్లబెడుతున్నారు. న్యాయవాది, ఫైనాన్షియర్పై ఫిర్యాదు చనిపోయిన వ్యక్తిపై బైకును రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంపై రవాణాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంపై న్యాయవాది మధుసూదనరావు, సాయిగణేష్ ఫైనాన్స్ నిర్వాహకులపై 5వ నగ ర పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన తప్పుడు ధ్రువీకరణ పత్రాల కారణంగానే బైకు రిజిస్ట్రేషన్ జరిగిందని చెబుతున్నారు. సాధారణంగా నాన్ ట్రాన్స్పోర్టు వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో వాహన యజమాని సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించి అధికారి ముందు సంతకం చేయాల్సి ఉంది. అన్ని పత్రాలు సరైనవి నిర్ధారించుకున్న తర్వాతే వాహన ఆర్సీ బుక్ను రిజిష్టర్ పోస్టు ద్వారా యజమాని సమర్పించిన అడ్రస్కు పంపిస్తారు. అధికారులను తప్పించడంపై విమర్శలు మృతి చెందిన వ్యక్తి పేరుపై బైకు రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో అధికారుల పాత్ర ఏమిలేదని తేల్చడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత అధికారితో ముందస్తు చేసుకున్న ఒప్పందంలో భాగంగానే బైకు లేకుండానే రిజిస్ట్రేషన్, ట్రాన్స్ఫర్ చకచకా జరిగిపోయాయి. డీబీఏలో పనిచేసే ఓ వ్యక్తి ఏజెంట్ ద్వారా రూ.8వేలు నగదు తీýసుకుని ఉన్నతాధికారి వరకు కమీష న్ అందజేసినట్లు ప్రచారం జరుగుతోంది. గుమస్తానే నేరుగా బైకుకు రిజిస్ట్రేషన్ చేశారని ఉన్నతాధికారికి తెలిసినా అవేమి పట్టనట్లు బయట వ్యక్తులపై నెట్టడం రవాణాశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైన బైకు రిజిస్ట్రేషన్ వ్యవహారంపై విజిలెన్స్ అధికారుల ఆధ్వర్యంలో ³పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులే తేలుస్తారు చనిపోయిన వ్యక్తి పేరు మీద బైకు రిజిస్ట్రేషన్ జరగడంపై విచారణ చేయాల్సిందిగా ఎంవీఐ రామకృష్ణారెడ్డిని నియమించాం. ఆయన విచారణ చేపట్టి నివేదికను అందజేశారు. నివేదిక ఆధారంగా న్యాయవాది, ఫైనాన్షియర్ మీద పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తాం. అధికారులకు తెలియకుండా జరిగిందానే ప్రశ్నకు పోలీసుల దర్యాప్తులో తేలుతుందని సమాధానమిచ్చారు. – ఎన్.శివరాంప్రసాద్, డీటీసీ -
అన్నింట్లో ఫస్ట్
సాక్షి, కడప : జిల్లా రవాణాశాఖ రాబడిలో దూసుకుపోవడంతోపాటు అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో నిలువడంతో సంబంధితశాఖ మంత్రి, ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించాయి. రవాణాశాఖను అభివృద్ధి బాటలో నడిపిస్తూనే ప్రమాదాల నివారణ, అధిక రాబడి సాధించిన నేపథ్యంలో ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ మల్లెపల్లె బసిరెడ్డిని సత్కరించారు.2016–17లో రాష్ట్ర స్థాయిలో వైఎస్సార్ జిల్లా అన్ని పన్నుల వసూళ్లతోపాటు లక్ష్యాలను అధిగమించి రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. 2017–18 సంవత్సరానికి సంబంధించి ఆరు నెలల పన్నుల వసూళ్లలో కూడా రాష్ట్ర స్థాయిలో మళ్లీ మొదటి స్థానం సాధించింది. ఇందుకుగాను మంత్రి, ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించి బహుమతులను అందజేశారు.పలువురు బసిరెడ్డికి అభినందనలు తెలియజేశారు. వైఎస్సార్ జిల్లా రవాణాశాఖ డీటీసీగా పనిచేస్తున్న బసిరెడ్డి కర్నూలుకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయన రవాణాశాఖ రాబడి పెంచుతూనే లక్ష్యాలను అధిగమించడం, ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయడం పట్ల బెస్ట్ పర్ఫార్మెన్స్ కింద సత్కరించారు. విజయవాడలోని రవాణాశాఖ కమిషనరేట్ కార్యాలయంలో ఆ శాఖ మంత్రి అచ్చెంనాయుడు, కమిషనర్ బాలసుబ్రమణ్యం అభినందించారు. మిగతా అధికారులు ఈయనను స్ఫూర్తిగా తీసుకుని వృత్తిలో రాణించాలని వారు సూచించారు. -
వందో సమస్య
నగరానికి చెందిన విఘ్నేష్ ఓ సంస్థలో చిరుద్యోగి. అతని భార్య కూడా ఉద్యోగిని. విఘ్నేష్ కార్యాలయానికి వెళ్లే దారిలోనే అతని భార్య పనిచేసే కార్యాలయం కూడా ఉంది. దీంతో ప్రతిరోజూ తన వద్ద ఉన్న చిన్న బైక్ పై భార్యను కూడా తీసుకెళ్లి ఆఫీసు వద్ద వదిలి, తిరిగి వచ్చేటపుడు భార్యను తీసుకొని ఇంటికి వస్తుంటాడు. తన వద్ద ఉన్న బైక్ పాతదయిపోయి ఎక్కువగా రిపేర్లు వస్తుండడంతో దానిని పక్కనపెట్టి కాస్తకాస్తగా కూడబెట్టిన సొమ్ముతో 100సీసీ సామర్థ్యం ఉన్న బైకును కొనాలని భావించాడు. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంతో అతని ఆలోచన తలకిందులైంది. 100 సీసీ బైకును కొంటే భార్యను ఆఫీసుకు తీసుకెళ్లేందుకు వీలుకాదు. అలాగని అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైకును కొనాలంటే అందుకు తన బడ్జెట్ సహకరించదు. ఎలాగనే ఆలోచనలో పడ్డాడు.... బెంగళూరులోను, రాష్ట్రంలోనూ ఇప్పుడు చాలామందికి ఇదే అంతర్మథనం. సాక్షి, బెంగళూరు: 100 సీసీ, అంతకంటే తక్కువ సామర్థ్యం ఉన్న బైకులపై పిలియన్ రైడర్ని నిషేధిస్తూ రాష్ట్ర రవాణా శాఖ ఆదేశాలు జారీ చేయడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నిర్ణయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పర్యావరణ వేత్తలు ప్రభుత్వ తాజా నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయం కారణంగా నగర రోడ్లపై ద్విచక్ర వాహనాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, తద్వారా నగరంలో వాయు కాలుష్యం కూడా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సగటుజీవి ఆవేదన కొత్తగా కొనాలంటే 100సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలనే కొనాల్సి ఉంటుందని, అయితే ఇందుకు తమ కుటుంబ బడ్జెట్ సహకరించదనేది మధ్యతరగతి వర్గాల వాదన. అలా కాకుండా 100సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న బైకును కొంటే కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక్కో బైకును కొనాల్సి ఉంటుంది. ఇది కూడా సాధ్యమా? అని ప్రశ్నిస్తున్నారు. 100 సీసీ, అంతకంటే తక్కువ సామర్థ్యం ఉన్న బైకులపై పిలియన్ రైడర్ని నిషేధించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చనేది ప్రభుత్వం వాదన. అయితే ప్రమాదాలను నివారించడం ఎలా ఉన్నా ప్రభుత్వ నిర్ణయం కారణంగా నగరంలో ట్రాఫిక్ రద్దీ మరింతగా పెరుగుతుందనే ఆదుర్దా వ్యక్తమవుతోంది. ప్రజా వ్యతిరేకత వస్తే సమీక్షిస్తాం ∙‘100 సీసీ’ నిర్ణయంపై మంత్రి రేవణ్ణ సాక్షి, బెంగళూరు: హైకోర్టు ఆదేశాల ప్రకారమే 100సీసీ, అంతకంటే తక్కువ సామర్థ్యం కలిగిన బైకులపై పిలియన్ రైడర్ను నిషేధించామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి హెచ్.ఎం.రేవణ్ణ వెల్లడించారు. మంగళవారమిక్కడి విధానసౌధలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘100 సీసీ, అంతకంటే తక్కువ సామర్థ్యం కలిగిన బైకులపై పిలియన్ రైడర్ ఉండకూడదని హైకోర్టు ఆదేశించింది. కర్ణాటక మోటార్ వెహికల్ యాక్ట్ కూడా ఇదే చెబుతోంది. ప్రమాదాల్లో బీమా కూడా చెల్లించబడదు. అందుకే కోర్టు ఆదేశాలను పాటించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. అంతేకాదు ఈ ఆదేశాలు కొత్త వాహనాలకు మాత్రమే అన్వయించబడతాయి. ఇందులో ప్రభుత్వ ఆసక్తి ఏదీ లేదు. ఈ నిర్ణయం పై ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమైతే ఈ నిర్ణయంపై మరోసారి ఆలోచిస్తాం.’ అని హెచ్.ఎం.రేవణ్ణ తెలిపారు. మరింతగా కాలుష్యం బెడద ‘సాధారణంగా పేద, మధ్యతరగతికి చెందిన ప్రజలు ఎక్కువగా 100 సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న బైకులనే కొంటూ ఉంటారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఎక్కువగా వారే ఇబ్బంది పడతారు. ఇక ఒక్కో వ్యక్తి ఒక్కో బైకును కొనుగోలు చేస్తే నగరంలో కాలుష్యం కూడా మరింతగా పెరిగిపోతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది అన్న చందంగా ఉంది ’ – పర్యావరణ కార్యకర్త విజయ్ నిశాంత్ కొత్త వాహనాలకు మాత్రమే అమలు ‘హైకోర్టు ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనాల సామర్థ్యం 100 సీసీ, అంతకంటే తక్కువ సామర్థ్యం ఉన్న బైకులపై పిలియన్ రైడర్కి అవకాశం లేదు. అలాంటి వాహనాలను రిజిస్ట్రేషన్ చేసేందుకు కూడా వీలు లేదు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాహనాలకు మాత్రమే కొత్త నిబంధనలు అమలవుతాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన వాహనాలపై నిషేధం ఏమీ లేదు’ – రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ బి.దయానంద్ ఆ వాహనాల పరిస్థితేమిటి? ఈ సమస్యపై నగరంలోని ఓ వాహన షోరూమ్ యజమాని మాట్లాడుతూ.....‘దీపావళి సందర్భంగా ఎక్కువ మంది 100సీసీ, అంతకంటే తక్కువ సామర్థ్యం ఉన్న బైకులను ఎక్కువగా కొనుగోలు చేశారు. వీటిలో 50 శాతం మేర వాహనాల రిజిస్ట్రేషన్ ఇంకా పూర్తి కాలేదు. ఈ సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా వారందరూ నష్టపోవాల్సిందేనా. ఇప్పటికిప్పుడు ఆ బైక్ల సీటింగ్ విధానాన్ని మార్చడం కూడా వీలుకాదు’ అని వాపోయారు. – వాహన డీలర్ -
డంకన్ డ్రైవర్లపై రవాణా శాఖ కొరడా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న పోలీసులకు.. రవాణా శాఖ అధికారులు తోడయ్యారు. ఇప్పటి వరకూ పోలీసులు మాత్రమే నిర్వహిస్తున్న ఈ పరీక్షలను రవాణా శాఖ కూడా చేపడుతోంది. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడితే వాహనాన్ని నడిపే వారి డ్రైవింగ్ లైసెన్సు రద్దుతో పాటు ఆ వాహనాన్ని రవాణా శాఖ సీజ్ చేస్తోంది. రహదారి భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టింది. ఏ కేటగిరి వాహనమైనా సీజ్ చేసి సమీప పోలీస్ స్టేషన్లో అప్పగించేలా రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే తాగి వాహనం నడిపేవారిపై రవాణా శాఖ కూడా కఠిన చర్యలు తీసుకుంటోంది. రవాణా శాఖ ఇటీవలే రూ.3 కోట్లతో బ్రీత్ ఎనలైజర్లను కొనుగోలు చేసింది. డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడితే ప్రస్తుతం వాహనదారుడి లైసెన్సు సస్పెండ్ చేయడంతో పాటు ప్రాసిక్యూషన్ చేస్తున్నారు. తాగి వాహనం నడిపిన వ్యక్తి డ్రైవింగ్ లైసెన్సును మూడు నెలలు సస్పెండ్ చేస్తున్నారు. దీంతో పాటు రూ. 2 వేల జరిమానా, ఒక రోజు నుంచి 20 రోజుల వరకు జైలుశిక్ష విధిస్తున్నారు. వీటికి తోడు వాహనాన్ని కూడా సీజ్ చేసేందుకు ఉన్నత స్థాయి నుంచి రవాణా శాఖ అధికారులకు ఆదేశాలందాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని రవాణా చెక్పోస్టుల్లో అధికారులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నారు. నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 5,200 కేసులు నమోదు చేశారు. లారీ డ్రైవర్లే ఎక్కువ.. రాష్ట్ర సరిహద్దుల్లో రవాణా శాఖ అధికారులు చేపడుతున్న డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో అధికంగా లారీ డ్రైవర్లు పట్టుబడుతున్నారు. సాధారణంగా వంద మిల్లీ లీటర్ల రక్తంలో 30 మి.గ్రా. మోతాదు కంటే అధికంగా ఆల్కహాల్ ఉంటే డ్రంకన్ డ్రైవ్ కేసు నమోదు చేస్తారు. తాగి నడుపుతున్న లారీ డ్రైవర్లలో 300 మి.గ్రా. నుంచి 400 మి.గ్రా. మోతాదు వరకు ఆల్కహాల్ ఉంటోంది. ఈ మోతాదులో ఆల్కహాల్ సేవించి లారీని నడపడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, రహదారి ప్రమాదాల్లో 40 శాతం మరణాలు ఇలాంటివే అని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట సరిహద్దు ప్రాంతాలైన దాచేపల్లి, మాచర్ల, గురజాలలో ఇటీవల కాలంలో అధికంగా డ్రంకన్ డ్రైవ్ పరీక్షల్లో వాహనదారులు పట్టుబడ్డారు. ఈ నెలలో ఇక్కడ మొత్తం 486 మంది లారీ డ్రైవర్లపై కేసులు నమోదు చేసి లారీలను సీజ్ చేసినట్లు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ రాజారత్నం తెలిపారు. ఇందులో 185 మందికి జైలు శిక్ష పడగా, 301 మందికి జరిమానా విధించామన్నారు. ఆహార ఉత్పత్తులు ఎగుమతి చేసే వాహనాలకు రెండో డ్రైవర్ ఉంటే వదిలేస్తున్నామన్నారు. లారీల యజమానులు తమ డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇవ్వాలని చెప్పారు. డ్రైవర్ తాగి వాహనం నడిపినపుడు ప్రమాదాలకు కారణమైతే సంబంధిత యజమానిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలోని ఓ చిన్న గ్రామానికి చెందిన ఆనందరావు గొర్రెల కాపరి. వయస్సు 21ఏళ్లు. ఉన్నట్టుండి ఓ రోజు ముక్కు నుంచి రక్తం ధారగా కారడంతో ఒక్కసారిగా శరీరమంతా నిస్సత్తువ ఆవహించింది. ఆస్పత్రికి వెళ్తే.. అన్ని పరీక్షలు చేశాక చివరకు రసాయన పురుగు మందుల కారణంగా ఎక్కువగా వచ్చే ఎప్లాస్టిక్ ఎనీమియా వ్యాధిగా తేల్చారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆనందరావుకు గ్రామస్తులందరూ కలిసి రూ.2లక్షలు సాయం చేశారు. అయినా పెద్దగా మార్పు లేకపోవడంతో ఇప్పుడు ఆనందరావుది దిక్కుతోచని పరిస్థితి. గుంటూరు జిల్లా గురజాలకు చెందిన గాయత్రిది మరో రకమైన సమస్య. ఆమెకు ఇటీవలే వివాహమైంది. పెళ్లయిన నాలుగు నెలలకు గర్భం దాల్చింది. ఎంతో ఆనందంగా ఉన్న ఆమెకు ఒక్కసారిగా షాక్. కడుపులో ఏదో తెలియని ఇబ్బంది. డాక్టర్ వద్దకు వెళ్తే బిడ్డ ఎదుగుదల లేదని చెప్పారు. అబార్షన్ చేసి పిండాన్ని తొలగించారు. పరీక్షలు చేస్తే.. ఎప్లాస్టిక్ ఎనీమియా అన్నారు. పురుగు మందుల అవశేషాల కారణంగా సోకినట్లు నిర్ధారించారు. మాతృత్వం మాధుర్యాన్ని చూడాలనుకున్న ఆమెలో ఆనందం ఒక్కసారిగా ఆవిరైంది. -
గోల్మాల్ రవాణా
తిరుపతి మంగళం: రవాణా శాఖలో ఏదైనా వాహనాన్ని విక్రయించాలంటే యజమాని వేలిముద్రలు తప్పనిసరి. అయితే ఇక్కడ ఏజెంట్లు లైన్లో నిలబడి మొదట్లో వాహన రిజిస్ట్రేషన్ కోసం అసలు యజమాని ఇచ్చిన ఆధార్ను తీసుకుని వాహన యజమానిగా అవతారమెత్తుతున్నారు. వచ్చిన వ్యక్తి వాహన యజమాని కాదని రవాణాశాఖ సిబ్బందికి కూడా తెలుసు. అయినప్పటికీ ఏజెంట్లతో ముందే కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా పని కానిచ్చేస్తున్నారు. జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, మదనపల్లె ప్రాంతాల్లోని రవాణాశాఖ కార్యాలయాల్లో ఈ నకిలీ రిజిస్ట్రేషన్ల వ్యవహారం జోరుగా సాగుతున్నట్లు సమాచారం. ఇందుకోసం వివిధ ఫైనాన్స్ కంపెనీలతో ముందుగానే అటు ఏజెంట్లు, ఇటు రవాణాశాఖ సిబ్బంది చేతులు కలిపి వ్యవహారాలు సాగిస్తున్నట్లు తెలిసింది. ఒక్కో రిజిస్ట్రేషన్కు రూ.2 వేలు నుంచి రూ.5 వేల వరకు లాగుతున్నారు. ఏజెంట్ల మాయాజాలం నకిలీ రిజిస్ట్రేషన్లను రవాణా శాఖలో ఏజెంట్లు దగ్గరుం డి నడిపిస్తున్నారు. వాహనదారుడు ఫైనాన్స్లో బైక్ను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఆరునెలలు, ఏడాది పాటు వాడుకుని ఫైనాన్స్ సంస్థకు డబ్బులు చెల్లించని వాహనాన్ని సంస్థ నిర్వాహకులు సీజ్ చేస్తారు. అలాంటి వాహనాలకు వారు తిరిగి వేలం నిర్వహిస్తుంటారు. వీటికి రిజిస్ట్రేషన్ చేయాలంటే పాత యజమాని రాడు. దీంతో రోడ్డు పక్కన వాహనాలను విక్రయించే వినియోగదారులు ఆర్టీఏ కార్యాలయంలోని సిబ్బంది, ఏజెంట్లతో కుమ్మక్కై ఎవరో ఒకరి వేలిముద్రలతో రిజిస్ట్రేషన్ చేయించేసి వ్యవహారాలను చక్కబెట్టుకుంటున్నారు. అందుకు నజరానాగా అటు ఫైనాన్స్ సంస్థల నుంచి ఒక్కో రిజిస్ట్రేషన్కు ఏజెంట్లు డబ్బులు వసూలు చేస్తున్నారు. వాహనాన్ని బట్టి రూ.2వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. పాత తేదీలతో వ్యవహారం ప్రస్తుతం రవాణా శాఖలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వచ్చింది. ఈ విధానంలో నేరుగా డీలర్ల వద్దనే అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. 24గంటల్లో శాశ్వత నెంబర్ వాహన యజమానికి అందుతోంది. అయితే నూతన విధానం కొన్ని వాహనాలకు మాత్రమే వర్తిస్తోంది. గతంలో కొన్ని వాహనాలను మాత్రం పాత విధానాన్ని రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఫైనాన్స్ సంస్థలు సీజ్ చేసిన వాహనాలన్నీ పాతవి కావడంతో వీరి పని సులువుగా మారుతోంది. వాహనాన్ని ఇతరులకు అమ్మి.. అతని పేరిట రిజిస్ట్రేషన్ చేయించాలంటే కచ్చితంగా రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిందే. అప్పుడే వాహనాన్ని ఇతరులకు బదలాయిస్తారు. అయితే జిల్లాలో మాత్రం వాహన యజమాని లేకుండానే నకిలీ యజమాని వేలిముద్రలతో ఇతరుల పేరిట పని కానిచ్చేస్తున్నారు. ప్రధానంగా ఫైనాన్స్ తీసుకుని సకాలంలో కంతులు చెల్లించకుండా సీజ్ చేసిన వాహనాలను ఇతరులకు విక్రయించేస్తున్నారు. అది కూడా మొదట ఫైనాన్స్ తీసుకున్న యజమాని లేకుండానే. ఏజెంట్ల మాయాజాలంతో ఈ తంతు నిరాటంకంగా కొనసాగుతున్నా రవాణాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఫిర్యాదులొస్తే చర్యలు యజమాని లేకుండా రిజిస్ట్రేషన్ చేయడం చట్టవిరుద్ధం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా రిజిస్ట్రేషన్ చేయకూడదు. ముందుగా వాహన దారుడి ఆధార్ను కంప్యూటర్లో నమోదు చేస్తాం. అలా చేసుకోకుంటే వాహనాన్ని కొనుగోలు చేసినవారు నేరుగా మా వద్దకు రావాలి. అప్పుడు ఆ వాహన రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో సూచిస్తాం. అలా కాకుండా ఏజెంట్లతో కుమ్మౖక నకిలీ రిజిస్ట్రేషన్లు చేసుకుని, మోసపోవద్దు. ఈ వ్యవహారంపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి, చర్యలు తీసుకుంటాం. – వివేకానందరెడ్డి, తిరుపతి ఆర్టీఓ -
ఆత్మ సంతకం పెట్టిందేమో!
నెల్లూరు (టౌన్): బతికున్నప్పుడు ఒకాయన బైక్ కొన్నాడు. సుమారు ఏడాది తరువాత మరణించాడు. ఆ తరువాత మూడేళ్లకు ఆయన ఆత్మ వచ్చి సంతకం పెట్టిందో ఏమో.. రవాణా శాఖ అధికారులు ఆ బైక్ను వేరే వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ అయ్యింది. నెల్లూరు రవాణా శాఖ కార్యాలయంలో చోటుచేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ముత్తుకూరు మండలంలోని బ్రహ్మదేవి గ్రామానికి చెందిన మారుబోయిన వెంకటయ్య (తండ్రి బక్కయ్య) 2013లో హీరో గ్లామర్ బైక్ను ఒక ఫైనాన్స్ సంస్థ ద్వారా కొనుగోలు చేశారు. అన్ని పన్నులు చెల్లించి ఏపీ 26 యూజీ టీఆర్ 9347 నంబర్తో టెంపరరీ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ తరువాత 2014 ఫిబ్రవరి 26న వెంకటయ్య మృతి చెందారు. అయినా ఆ బైక్కు ఈ ఏడాది జూన్ 5న నెల్లూరు రవాణా కార్యాయంలో శాశ్వత రిజిస్ట్రేషన్ చేశారు. వెంకటయ్య పేరిట ఏపీ 26 బీఆర్ 3922 నంబర్తో రిజిస్ట్రేషన్ అయిన ఆ బైక్ను అదే నెల 16న షేక్ ఖాజావలి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. చనిపోయి వ్యక్తి పేరుమీద శాశ్వత రిజిస్ట్రేషన్ చేసినందుకు మధ్యవర్తుల ద్వారా రవాణా అధికారులు కొంత మొత్తాన్ని తీసుకున్నట్లు ప్రచారం జరు గుతోంది. రిజిస్ట్రేషన్ చేయాలంటే.. బైక్ కొనుగోలు చేసిన వ్యక్తి ఆధార్, గుర్తింపు కార్డు ఆధారంగా తొలుత తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) చేస్తారు. ఆ తరువాత వాహన యజమాని శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం రవాణా కార్యాలయానికి స్వయంగా వెళ్లి సంతకం చేయాల్సి ఉంటుంది. వెంకటయ్య తాను కొనుగోలు చేసిన బైక్ను శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించకుండానే మృతి చెందారు. ఇలాంటి సందర్భాల్లో ఆ బైక్కు శాశ్వత రిజిస్ట్రేషన్ చేయాలన్నా, ఆ బైక్ను మరొకరికి విక్రయించాలన్నా.. తొలుత కుటుంబ సభ్యులు అంటే భార్య, లేదంటే పెద్ద కుమారుడు పేరిట చేయాల్సి ఉంటుంది. ఇందుకు సదరు వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యులతో ఉన్న గుర్తింపుకార్డు, అఫిడవిట్ను సమర్పించాల్సి ఉంటుంది. తొలుత వారి కుటుంబ సభ్యుల పేరుమీద రిజిస్ట్రేషన్ చేస్తారు. అనంతరం ఎవరైతే ఆ వాహనాన్ని కొనుగోలు చేస్తారో వారిపేరు మీదకు ట్రాన్సఫర్ చేస్తారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా చనిపోయిన వ్యక్తి సంతకంతో బైక్ను ఆ వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ చేయడం ఆ శాఖలో అవినీతి ఏ మేరకు ఉందనేది తేటతెల్లం చేస్తోంది. పైసలిస్తే ఏపనైనా సరే .. రవాణా శాఖలో అడిగినంత డబ్బులిస్తే ఏ పనైనా క్షణాల్లో పూర్తవుతుంది. సరైన పత్రాలు ఉంటే ఒక ధర, లేకుంటే మరో ధర నిర్ణయించి యథేచ్ఛగా వసూలు చేస్తున్నారు. రవాణా కార్యాలయంలో ఏ పని కావాలన్నా కొంతమంది ఏజెంట్లు, ప్రైవేటు వ్యక్తుల ద్వారా వస్తేనే చేసే విధంగా అధికారులు, గుమాస్తాలు పధకాన్ని రూపొందించారు. ఆయా సెక్షన్లలో చలానాలకు మించి అదనంగా వసూలు చేసే మొత్తంలో ఉన్నతాధికారికి కొంత ముట్టజెబుతుంటారు. రోజుకు ఒక్కో సెక్షనులో అదనపు ఆదాయం సుమారు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటోంది. సొమ్ములు వసూలు చేసే ప్రైవేటు వ్యక్తులు రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు కమీషన్ రూపంలో పొందుతున్నారు. విచారిస్తే మరిన్నిభోగస్ పత్రాలు వెలుగులోకి.. రవాణా శాఖలో నకిలీ పత్రాలపై విచారణ చేపడితే మరిన్ని కేసులు వెలుగులోకి వస్తాయని ఆ శాఖలో పనిచేసే కొంతమంది అధికారులే చెబుతున్నారు. దొంగ ఇన్సూరెన్స్ల నుంచి ట్రక్కు బిల్లులు, నకిలీ విద్య, రెసిడెన్స్, మెడికల్, ఫిట్నెస్ తదితర సర్టిఫికెట్ల వరకు బయట పడుతాయంటున్నారు. నకిలీ ధ్రువపత్రాలతో ఆయా సెక్షన్లలో పనులు చేస్తుండటంతో ప్రత్యేకంగా ఓ ముగ్గురు ఏజెంట్లు అధికారులతో కుమ్మక్కై ఈ వ్యవహారాన్ని చక్కబెడుతున్నారు. పేరు కు మాత్రం రవాణాలో సేవలు పారదర్శకమంటూ అధికారులు ఊదరగొడుతున్నారు. రిజిస్ట్రేషన్కు వాహన యజమాని రావాల్సిందే వాహనం రిజిస్ట్రేషన్కు యజమాని తప్పకుండా కార్యాలయానికి రావాల్సి ఉంది. యజమాని లేకుండా వాహనం రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఈ నిబంధనలకు వ్యతిరేకంగా రిజిస్ట్రేషన్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. ఈ విషయంపై విచారణ చేపడతాం. – ఎన్.శివరాంప్రసాద్, ఉప రవాణా కమిషనర్, నెల్లూరు -
రవాణా శాఖ ఆదాయం అదుర్స్
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా రవాణా కార్యాలయ అర్ధ సంవత్సర ఆదాయం గణనీయంగా పెరిగింది. ఏడాది త్రైమాసిక పనుల్లో రూ. 33.38 కోట్ల టార్గెట్ కు 34.72 కోట్లు వచ్చింది. పెరిగిన ఆదాయం 1.34 కోట్లు, వాహన జీవిత కాల పన్ను టార్గెట్ రూ.192.66 కోట్లు కాగా 192.94 కోట్లు వచ్చింది. దరఖాస్తుల ఫీజులు రూ.17.88 కోట్ల టార్గెట్ కు రూ.17.14 కోట్లు వచింది. ఇందులో రూ.73 లక్షలు తగ్గింది. సర్వీస్ చార్జీలు రూ.3.72 కోట్లు టార్గెట్ ఉండగా రూ. 4.02 కోట్లు వచింది. ఇందులో రూ.30 లక్షలు ఆదాయం పెరిగింది. వాహన తనిఖీలకు రూ.6.72 కోట్ల టార్గెట్ ఉండగా రూ.8.63 కోట్లు వచ్చాయి. రూ. 1. 91కోట్ల ఆదాయం పెరిగింది. మొత్తం త్రైమాసిక లక్ష్యం రూ. 254.36 కోట్లు ఉండగా రూ. 257.45 కోట్లు లభించింది. -
అరుణాచల్ బస్సులకు రైట్రైట్!
సాక్షి, హైదరాబాద్: రవాణా చట్టాల అమలు ఎంత నాసి రకంగా ఉందో ఇటీవల అరుణాచల్ప్రదేశ్ ప్రభుత్వం బట్టబయలు చేసింది. ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ జరుపుకొని పర్మిట్లు పొంది తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న బస్సుల బండారం బయటపెట్టింది. దీంతో కంగుతిన్న తెలంగాణ ప్రభుత్వం.. ఆ బస్సులపై తాత్కాలికంగా నిషేధం విధించింది. అంటే ఆ బస్సులు రోడ్డెక్కితే జప్తు చేయాల్సిన బాధ్యత రవాణా శాఖ ది. కానీ రాజధాని నగరం హైదరాబాద్లో ఆ బస్సులు దర్జాగా ప్రయాణికులను ఎక్కించుకుని పరుగుపెడుతున్నాయి. రవాణా చట్టాల అమల్లోని డొల్లతనాన్ని అరుణాచల్ప్రదేశ్ బట్టబయలు చేస్తే, ఇప్పుడు మన రవాణా శాఖ ‘గుడ్డి దర్బారు’ వ్యవహారాన్ని ఆ బస్సులే బహిర్గతం చేస్తున్నాయి. ఆ బస్సులను సీజ్ చేయొద్దని, చూసీచూడనట్టు వదిలేయా లని కొందరు పెద్ద నేతలు అధికారులపై ఒత్తిడి చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో.. కొన్ని రోజులుగా అక్కడి రిజిస్ట్రేషన్తో ఉన్న బస్సులు యథేచ్ఛగా నడుస్తున్నాయి. రోజూ రాత్రి 7 తర్వాత మియాపూర్, లింగంపల్లి, చందానగర్, కేపీహెచ్బీల నుంచి బయలుదేరుతున్నాయి. ఆంధ్ర, బెంగళూరు, షిర్డీ, ముంబై వంటి ప్రాంతాలకూ తిరుగుతున్నాయి. నిబంధనలను పాటిస్తున్నదీ లేనిదీ పరిశీలించేందుకు రవాణా శాఖ అధికారులతోపాటు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రధాన రహదారుల మీదుగా వెళ్తున్నా వాటిని ఎవరూ ఆపటం లేదు. నేతల ఒత్తిడికి తలొగ్గి అధికారులు వాటికి స్వేచ్ఛ ప్రసాదించారో, కమీషన్లకు కక్కుర్తిపడి చూడకుండా కళ్లకు గంతలు కట్టుకున్నారో తెలియటం లేదు. రవాణా శాఖ ద్వంద్వ వైఖరి: అరుణాచల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అక్కడి కోర్టు స్టే విధించినప్పటికీ, ఇతర చట్టాలను ఉల్లంఘించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ బస్సులపై నిషేధం విధించింది. దీంతో ఇక్కడ అవి తిరిగేందుకు వీలు లేదు. ఈ విషయాన్ని రవాణా శాఖ ఉన్నతాధికారులే స్పష్టం చేస్తున్నారు. తమ బస్సులను జప్తు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ బస్సుల నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. రవాణా శాఖ అధికారులు వాటికి అనుమతి ఇవ్వటానికి నిరాకరించారు. నిషేధం విధించిన సమయంలో రోడ్లపై కనిపించిన అరుణాచల్ రిజిస్ట్రేషన్ ఉన్న బస్సులను సీజ్ చేశారు. చెక్పోస్టుల వద్ద జప్తు చేశారు. ఇప్పుడు హైదరాబాద్లోనే టికెట్లు బుక్ చేయించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నా పట్టించుకోకపోవటం రవాణా శాఖ ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోంది. వెరసి ఆదిలో హడావుడి చేసి నిబంధనలు, చట్టాలను ఠంచన్గా అమలు చేస్తున్నామని చెప్పుకునేలా కఠినంగా వ్యవహరించి.. తర్వాత పాతబడి పోగానే నీరు గార్చటం పరిపాటిగా మారింది. ఆ బస్సులకు అనుమతి లేదు అరుణాచల్ బస్సులపై నిషేధం కొనసాగుతోంది. ఆ రిజిస్ట్రేషన్ ఉన్న బస్సులు రోడ్డెక్కటానికి కుదరదు. వాటి నుంచి పన్నులు కూడా వసూలు చేయటం లేదు. ఎలాంటి కారణాలతోనూ బస్సుల్లో ఒక్కదానికి కూడా అనుమతి మంజూరు చేయలేదు. అవి రోడ్డెక్కటం నిబంధనలకు విరుద్ధమే’ – సునీల్ శర్మ, రవాణా శాఖ కమిషనర్