-
ఇంటికి 100 మీటర్ల దూరంలో.. 26 ఏళ్ల పాటు చెరలో
అల్జీర్స్: టీనేజీ వయసులో పాఠశాలకు వెళ్తుండగా మార్గమధ్యంలో అపహరణకు గురై ఏకంగా 26 సంవత్సరాలపాటు బందీగా ఉండిపోయిన అల్జీరియన్ వ్యక్తి వేదన ఇది. అల్జీరియా దేశంలోని డిజేఫ్లా రాష్ట్రంలో ఇటీవల కిడ్నాపర్ చెర నుంచి విముక్తుడైన 45 ఏళ్ల ఒమర్ బిన్ ఒమ్రాన్ గాథను స్థానిక అల్జీరియన్ ఎల్ఖబర్ వార్తాసంస్థ వెలుగులోకి తెచి్చంది. గడ్డితో నిండిన సెల్లార్లో ఏళ్ల తరబడి.. ఒమర్కు 19 ఏళ్ల వయసు ఉన్నపుడు అంటే 1998 సంవత్సరంలో ఒకరోజు ఉదయం వృత్తివిద్యా పాఠశాలకు ఒమర్ తన ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంతదూరం వెళ్లగానే కిడ్నాప్కు గురయ్యాడు. కిడ్నాప్చేసిన వ్యక్తి ఒమర్ను ఒక గడ్డితో కప్పిన నేలమాళిగలో దాచిపెట్టాడు. ఎందుకు కిడ్నాప్ చేశాడో, ఎందుకు ఇన్ని సంవత్సరాలు అక్కడే ఉంచాడో ఎవరికీ తెలీదు. తోబుట్టువు పోస్ట్తో వెలుగులోకి కిడ్నాపర్కు ఒక తోబుట్టువు ఉన్నారు. ఆ వ్యక్తి ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో ఒక విషయం రాసుకొచ్చారు. ఊరిలో ఒక‡ కిడ్నాప్ ఉదంతంలో తన పాత్ర కూడా ఉందని ఒక పోస్ట్చేశారు. ఈ పోస్ట్ను ఒమర్ కుటుంబం గమనించి వెంటనే దర్యాప్తు సంస్థకు సమాచారం ఇచ్చారు. దీంతో నేషనల్ జెండర్మెరీన్( దేశ దర్యాప్తు సంస్థ) పాత కేసును తిరగతోడింది. పోస్ట్ పెట్టిన వ్యక్తిని విచారించి కిడ్నాపర్ ఇంటిని కనిపెట్టారు. అధికారులు ఆదివారం కిడ్నాపర్ ఇంటిపై మెరుపుదాడి చేసి ఇళ్లంతా వెతికారు. చివరకు గడ్డితో ఉన్న రహస్య సెల్లార్లో ఒమర్ను కనుగొన్నారు. 61 ఏళ్ల కిడ్నాపర్ పారిపోతుంటే పోలీసులు పట్టుకున్నారు. కిడ్నాపర్ ఇల్లు.. ఒమర్ సొంత ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. ఈ సెల్లార్ ఒక గొర్రెల కొట్టం కింద ఉన్నట్లు తెలుస్తోంది. కిటికీలోంచి చూసేవాడిని: ఒమర్ ‘‘కిడ్నాప్కు గురయ్యాక ఈ సెల్లార్లోనే ఉండిపోయా. నా కుటుంబసభ్యులు అటుగా వెళ్లేటపుడు సెల్లార్ కిటికీ నుంచి చూసేవాడిని. అరిచి పిలుద్దామని వందలసార్లు అనుకున్నా. కానీ పక్కనే కిడ్నాపర్ ఉండేవాడు. భయంతో నోరు మెదపలేదు’’ అని విడుదలయ్యాక ఒమర్ చెప్పారు. -
మిస్ యూఎస్ఏ స్థానం నుంచి తప్పుకుంటున్న మరో బ్యూటీ!..
గతేడాది 2023లో మిస్ యూఎస్ఏ విజేతగా ఎంపికైన నోలియా వోయిగ్ట్ సడెన్గా తన స్థానం నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవలే ప్రకటించింది. అది మరువకు మునుపే మరో బ్యూటీ తన కిరీటాన్ని వదులుకుంటున్నట్లు ప్రకటించి అందర్నీ షాక్కి గురి చేసింది. అందాల తారలు వరుస ప్రకటనలు అమెరికా అందాల పోటీల నిర్వాహకులను తీవ్ర గందరగోళంలో పడేశాయి. నోలియా రాజీనామా చేసిన రెండు రోజులకే 17 ఏళ్ల మిస్ టీన్ యూఎస్ఏ ఉమా సోఫియా తాను కూడా తన స్థానం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మెక్సికన్ ఇండియన్ అమెరికన్ అయిన ఉమా సోఫియా నా విలువలు సంస్థ తీరుతో పూర్తిగా సరిపోవడం లేదని అందువల్ల తాను తన స్థానం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తాను ఈ అత్యున్నత టైటిల్ని గెలుకోవడంలో సహకరించిన తన కుటుంబం, తన రాష్ట్ర ప్రజలు, తన సహ మోడళ్లకు ఎంతగానో రుణపడి ఉన్నాను.వారందిరి ఆదరాభిమానానికి కృతజ్ఞతలు అని తన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది. జాతీయ స్థాయిలో తొలి మెక్సికన్ ఇండియన్ అమెరికన్గా తన రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించినందుకు గర్వంగా ఉందని పేర్కొంది. ఆమెకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు..ఉమా సోఫియా శ్రీవాస్తవ అమెరికా తొలి మెక్సికన్ ఇండియన్ అమెరికన్ మిస్ న్యూజెర్సీ టీన్. యూఎన్ అంబాసిడర్ కావలన్నది ఆమె కల. ఆమె భారతదేశంలోని అనగారిన పిల్లలకు చక్కటి విద్య, సరైన పోషకాహారం, ఆరోగ్య సంరక్షణను అందించడంలో సహాయపడటానికి లోటస్ పెటల్ ఫౌండేషన్తో కలిసి పనిచేస్తుంది. ఉమాసోఫియా తన దివైట్ జాగ్వర్ పుస్తకాన్ని రచించారు. ఆమె మొత్తం నాలుగు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. ఆమె ఒక పియానిస్ట్ దట్స్ ఫ్యాన్ బిహేవియర్ని నడుపుతోంది. ప్రస్తుతం ఆమె జూనియర్ కళాశాల విద్యను అభ్యసిస్తోంది.(చదవండి: తెల్లటి చీరలో మెరిసిపోతున్న మిల్కీబ్యూటీ..ధర వింటే నోరెళ్లబెడతారు!) -
హీరోయిన్లా కనిపించాలని వందకుపైగా సర్జరీలు! అందుకోసం..
అందంగా కనిపించాలని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు చాలమంది. ఇలా అందం కోసం చేయించుకున్న సర్జరీలు వికటించి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఇలా ఒకటో రెండో సర్జరీలు అయితే ఓకే. కానీ ఇక్కడొక అమ్మాయి తనకు నచ్చిన హీరోయిన్లా ఉండాలని ఎన్ని సర్జరీలు చేయించుకుందో వింటే కంగుతింటారు. ఈ విచిత్ర ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్కు చెందిన ఝూ చునా జస్ట్ 13 ఏళ్ల వయసుకే ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవాలనుకుంది. తనకు ఇష్టమైన నటి ఎస్తేర్ యులా ఉండాలని కోరుకుంది. ఇలా ఈ ఏజ్లోనే ప్లాస్టిక్ సర్జరీలుచేయించుకోవాడానికి ప్రధాన కారణం..ఆమె స్నేహితులు, బంధువులు తన తల్లి కంటే అందంగా లేవని చెప్పడం తట్టుకోలేకపోయింది. అదీగాక తన తోటి విద్యార్థులు కూడా అందంగా ఉండటం వల్లే కాన్ఫిడెంట్గా ఉన్నారని నమ్మింది. ఇవన్నీ కలగలసి చునాని ఆత్మనూన్యత భావంలోకి నెట్టి..తన రూపాన్ని మార్చుకోవాలనే చర్యకు ప్రేరేపించాయి. అలా చునా 13 ఏళ్ల నుంచి ప్లాస్టిక్ సర్జరీల చేయించుకోవడం ప్రారంభంచింది. అయితే ఆమె తల్లి తొలి ఆపరేషన్కి సపోర్ట్ చేసి డబుల్ కనురెప్పల ప్రక్రియకు అనుమతించింది. ఆ తర్వాత నుంచి చునా ఒక్కొక్కటిగా రూపాన్ని మార్చుకునే ప్రక్రియలో నిమగ్నమైపోయింది. అలా పాఠశాల విద్యకు కూడా దూరమయ్యింది. ఇలా ఆమె దాదాపు అన్ని రకాల ప్లాస్టిక్ సర్జరీలను దాదాపు వందకు పైగా చేయించుకుంది. వాటిలో రినోప్లాస్టి, బోన్ షేవింగ్ వంటి క్రిటికల్ ప్లాస్టిక్ సర్జరీలు కూడా ఉన్నాయి. డాక్టర్లు తన కళ్లను పెద్దవి చేసే పని చేయడం కుదరదని హెచ్చరించారు. అయినా సరే లెక్కచేయక వేరే డాక్టర్ని సంప్రదించి చేయించుకుంది. ఆ సర్జరీల్లో అత్యంత పెయిన్తో కూడిన సర్జరీ బోన్ షేవింగ్. దీన్ని ఏకంగా పది గంటలపాటు చేస్తారు వైద్యులు. దీని కారణంగా 15 రోజుల పాటు మంచానికే పరిమితమయ్యింది. ఇన్ని నరకయాతనలు అనుభవించినా కూడా.. ఎక్కడ ఏ మాత్రం తగ్గకుండా అచ్చం తను ఇష్టపడే హీరోయిన్లా ఉండే సర్జరీలు చేయించుకోవడం ఆపకపోవడం కొసమెరుపు. ఇక్కడ ఏ వైద్యుడు ఆమెకు ఒక్కసారి ప్లాస్టిక్ సర్జరీ చేశాక మరో సర్జరీ చేసేందుకు ముందుకు వచ్చేవాడు కాదు. అయినా ఆ తిరస్కరణలు కూడా పట్టించుకోకుండా ఇంకో డాక్టర్ ..ఇంకో డాక్టర్ అంటూ సంప్రదిస్తూ ఆపరేషన్ చేయించుకుంది. ఇలా ఆమె వందకు పైగా చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీల కోసం దాదాపు రూ. 4 కోట్లకు పైగా ఖర్చు చేసిందట. అయితే ఇన్ని ఆపరేషన్లకు చునా తల్లి కూడా సపోర్ట్ చేయలేదు. ఇక ఆమె తండ్రి చునా కొత్త రూపాన్ని అస్సలు అంగీకరించ లేదు. అలాగే ఆమె స్నేహితులు సైతం ఆమె కొత్త రూపాన్ని చూసి చునా అని గుర్తుపట్టులేకపోయారు. ఏదీఏమైతేనే చునా అనుకున్నది సాధించి అన్ని బాధకరమైన సర్జరీ ప్రక్రియలను చేయించుకుని మరీ తనకు ఇష్టమైన హీరోయిన్లా మారాలనే కలను నిజం చేసుకుంది. ప్రస్తుతం చునాకి 18 ఏళ్లు. ఇక తన శస్త్రచికిత్సా ప్రయత్నాలను కూడా ముగించినట్లు ప్రకటించింది. మరీ ఇంతలా అందం కోసం ప్రాణాలనే పణంగా పెట్టే వెర్రీ మనుషులు ఉంటారా? అనిపిస్తుంది కదూ!.. (చదవండి: చెఫ్గా పదిమందికి కడుపు నిండా భోజనం పెట్టేది..కానీ ఆమె అన్నమే..!) -
Rest Mom Face: పేరెంటింగ్ ప్రపంచంలో కొత్త మంత్రం
అమ్మానాన్నా మాట్లాడుతున్నా సరే, వినకుండా విసురుగా వెళ్లిపోవడం వ్యంగ్యంగా మాటలు అనేయడం నాటకీయంగా కళ్లు తిప్పడం ఉన్నట్టుండి తమ గదిలోకి వెళ్లి ‘ధఢేల్’న తలుపులు వేసుకోవడం ఇలాంటివెన్నో సంఘటనలు... టీనేజ్ పిల్లలున్న తల్లిదండ్రులకు తెలియని విషయమేమీ కాదు. ఒంటరి తల్లులకు పిల్లల పెంపకం మరింత కష్టంగా ఉంటుంది. పిల్లల చంచలమైన భావాలను నియంత్రించలేక తల్లులు చాలాసార్లు మౌనంగా మారిపోతుంటారు. ఇంట్లో టీనేజర్లు సృష్టించే యుద్ధ వాతావరణంలో ఎవరు గెలుస్తారో ప్రతి పేరెంట్కు తెలుసు కాబట్టి ఆర్ఎమ్ఎఫ్ మంత్రాన్ని మననం చేసుకోండి అంటున్నారు నిపుణులు. రెస్ట్ మామ్ ఫేస్ (ఆర్ఎమ్ఎఫ్) అనే ఈ మంత్రం అమ్మ ముఖకవళికలను పిల్లల ముందు ఎలా ప్రదర్శించాలి, అందుకు తగిన సాధన ఏ విధంగా చేయాలో నిపుణులు చెబుతున్నారు. ‘టీనేజ్లో ఉన్న మా అమ్మాయి విషయంలో చాలాసార్లు నా ప్రవర్తన ఒత్తిడితో కూడుకున్నదై ఉంటుంది. చికాకు పరిచే సంఘటనలు ఎదురైనప్పుడు నా ఎమోషన్స్ని సమర్థంగా నియంత్రించలేక పోతుంటాను’ అంటుంది కార్పొరేట్ ఆఫీసులో హెడ్గా పనిచేసే కౌముది. ‘మా అబ్బాయితో గొడవపడటం, పదే పదే చెప్పడం, గతంలో చేసిన ్రపామిస్లను గుర్తుచేయడం అదేపనిగా జరుగుతుంటుంది. కానీ, ఆ వెంటనే తప్పనిసరై నాకు నేనే తగ్గడం, మౌనంగా ఉండటం, లేదంటే సర్దిచెప్పడం.. ఎప్పుడూ జరిగే పనే’ అంటుంది బొటిక్ను నడిపే వింధ్య. ‘కుటుంబ ఆకాంక్షలను పిల్లలు తీర్చాలనే లక్ష్యంగానే నేటి తల్లిదండ్రుల ప్రవర్తన ఉంటోంది. తల్లులు టీనేజ్ పిల్లల విషయంలో తమను తాము నియంత్రించు కోవడానికి ఇది కూడా ఒక కారణంగా ఉంటుంది’ అని తెలియజేస్తుంది హోలీ గ్రెయిల్ ఆఫ్ పేరెంటింగ్ మ్యాగజైన్. ఎలాంటి భావోద్వేగాలను ముఖంలో చూపని తటస్థ స్థితిని రెస్టింగ్ మామ్ ఫేస్ సాధన చేస్తే సరైన ప్రయోజనాలను ΄÷ందవచ్చు అని చెబుతోంది. అదెలాగో చూద్దాం. తటస్థంగా.. సాధారణంగా ఎలాంటి వ్యక్తీకరణ లేని స్త్రీ ముఖాన్ని చూసిన వాళ్లు అహంకారమనో లేదా నిరాడంబరత అనో నిర్ధారించుకుంటుంటారు. సంతోషించే సమయంలోనూ వీరు ‘తటస్థ’ ముఖాలతో ఉండటం చూస్తుంటాం. చూసేవారికి వీరి ముఖాల్లో ప్రశాంతత కూడా కనిపిస్తుంటుందని పరిశోధకులు గ్రహించారు. అందరూ ఇలా ఉండలేరు. కానీ, పిల్లల ముందు తమ భావోద్వేగాలను బయటకు చూపకుండా తమని తాము నిభాయించుకుంటూ ఉండాలంటే ్రపాక్టీస్ అవసరం. విశ్రాంతికి 30 సెకన్లు అమ్మల ముఖం పిల్లల ముందు సరైన విధంగా ఉండాలంటే...ఫేస్ యోగాను సాధన చేయాలి. కోపంగా ఉన్న పిల్లలతో మాట్లాడేముందు ముఖ కండరాలకు కూడా విశ్రాంతి అవసరం అని తమకు తాముగా చెప్పుకోవాలి. రెండు పిడికిళ్లతో ముఖాన్ని రుద్దుకుంటున్నట్టు, కోపాన్ని కూల్ చేసుకుంటున్నట్టు ఊహించుకోవాలి. గాఢంగా ఊపిరి పీల్చుకోవడం, వదలడం చేయాలి. అయితే, అది ఎదుటివారికి నిట్టూర్పులా ఉండకూడదు. మీ ముఖ కండరాలలో చికాకు, ఆశ్చర్యం, విమర్శిం చడం ... వంటివన్నీ తీసేసి, స్పష్టంగా అనుకున్న విషయాన్ని చెప్పేయాలి. చిన్నపిల్లలు యుక్తవయసులో ఉన్నా, పెద్దవారైనప్పుడైనా ఈ ఆర్ఎమ్ఎఫ్ ఉపయోగకరంగా ఉంటుంది. నిజాయితీగా ఈ వ్యూహాన్ని అమలుపరిస్తే ప్రయోజనకరమైన మార్పులు కనిపిస్తాయి. గొడవ పడే సమయాల్లో ఎలాంటి బోధలు చేయద్దు. అలాగే శిక్షించవద్దు. పిల్లలు వారి భావోద్వేగాలను స్వీయ – నియంత్రణ చేయగలిగేలా చేయడమే లక్ష్యంగా ఉండాలి. మీ బిడ్డ తన ఆందోళనను, అసంతృప్తిని మరింత ఆమోదయోగ్యమైన మార్గాల్లో వ్యక్తపరచలేకపోతే అకస్మాత్తుగా దాడికి దిగవచ్చు. లేదంటే తనని తాను బాధించుకోవచ్చు. అందుకని సమస్యను కూల్గా పరిష్కరించాలి. బంధాలు పదిలం.. ‘తల్లి మెరుగైన ఆలోచనతో ఉంటే పిల్లలతో స్నేహాలను, ఆరోగ్యకరమైన సంబంధాలను పెంచుకోగలదు. కానీ, నియంత్రణతో సరైన ప్రయోజనాలను రాబట్టలేరు’ అంటారు సైకాలజిస్ట్ అండ్ పేరెంటింగ్ రైటర్ అలిజా. పిల్లల ఆకలి తీరినప్పుడు వారి కోపం చల్లబడుతుంది. అందుకని వారికి ఆరోగ్యకరమైన చిరుతిండిని అందిస్తుండాలి. దీంతో పిల్లల దృష్టి మారిపోతుంది. కానీ, అన్ని విషయాల్లో ఇది సాధ్యం కాకపోవచ్చు. అందుకని సాధ్యమైనంత వరకు ఆర్ఎమ్ఎఫ్ని సాధన చేయడమే మేలు అనేది నిపుణుల మాట. -
తిట్టడం సులభం.. ఫలితం అనూహ్యం
ఇంటికి రెండు గంటలు ఆలస్యంగా వచ్చిన టీనేజ్ కుమారుణ్ణి తల్లిదండ్రులు మందలిస్తే ఆ కుర్రవాడు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్లో జరిగిన తాజా ఘటన ఇది. తల్లిదండ్రులు పిల్లల నడవడికను సరి చేయాలని ఆందోళన చెందడం మంచిదే కాని పిల్లల వయసును దృష్టిలో పెట్టుకుని వారి పొరపాట్లకు కారణాలను తెలుసుకోకుండా వారు చెప్పేది అర్థం చేసుకోకుండా తిడితే అసలుకే ప్రమాదం వస్తుంది. టీనేజ్ పిల్లలతో తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలి? ఇంటర్ చదివే కుర్రాడు కాలేజ్ అయిపోయాక రెండు గంటల ఆలస్యంగా ఇంటికొచ్చాడు. తల్లిదండ్రుల ఆలోచన: వీడు టైమ్ వేస్ట్ చేస్తున్నాడు. ఏ పనికిమాలిన బ్యాచ్తోనో తిరుగుతున్నాడు. ఏదో సినిమాకు వెళ్లి ఉంటాడు. ఇలా అయితే వీడు ర్యాంక్ తెచ్చుకున్నట్టే. వీడు ఎన్నిసార్లు చెప్పినా మారడం లేదు. ఇవాళ వీడికి బాగా పడాలి. కుర్రాడి ఆలోచనలు: ఉదయం నుంచి సాయంత్రం వరకూ క్లాసులు చాలా స్ట్రెస్గా ఉంటున్నాయి. కొంచెం కూడా రిలాక్స్ అవడానికి లేదు. మా బ్యాచ్ అంతా కాసేపు బేకరీకి వెళ్దామంటున్నారు. నేను వెళ్లకపోతే వాళ్లు నన్ను ఐసొలేట్ చేస్తారు. అలుగుతారు. బ్యాచ్ నుంచి కట్ చేస్తారు. అందరూ వెళుతుంటే నేనెందుకు వెళ్లకూడదు. వెళ్లి ఇంటికి వెళతా. రెండు వెర్షన్లు సరైనవే. కాని ఒక వెర్షన్ వారికి ఆధిపత్యం ఉంటుంది. మరో పక్షం వారికి ఆందోళన ఉంటుంది. తల్లిదండ్రులు ఇంటి యజమానులు. కుర్రాడికి కూడా యజమానులు. వారు యజమానులు కాకుండా తల్లిదండ్రులు ఎప్పుడవుతారంటే ఆ కుర్రాడు ఏదీ దాచకుండా తల్లిదండ్రులకు చెప్పినప్పుడు. చెప్పుకునే వాతావరణం ఉన్నప్పుడు. దానిని అర్థం చేసుకుని ఎంతవరకు అలౌ చేయాలో అంత వరకూ అలౌ చేయగలిగినప్పుడు. పై సందర్భంలో ఆ కుర్రాడు ‘మా బ్యాచ్ అంతా బేకరీకి వెళ్దామంటున్నారు’ అని కాల్ చేస్తే తల్లిదండ్రులు ‘సరే.. వెళ్లు. కాని దాని వల్ల నీ టైమ్ వేస్ట్ అవుతుంది. అలాగని వెళ్లకపోతే బాగుండదు. ఒక గంట సేపు ఉండి వచ్చెయ్’ అనగలిగితే ఆ కుర్రాడు 45 నిమిషాలే ఉండి వచ్చే అవకాశం ఉంది. కాని తిడతారనే భయంతో చెప్పకుండా, లేట్గా ఇంటికొచ్చినప్పుడు... తల్లిదండ్రులు ముందు వెనుకా చూడకుండా చెడామడా తిడితే ఆ చిన్న హృదయం ఎంత ఇబ్బంది పడుతుంది? సెన్సిటివ్ పిల్లలు అయితే అఘాయిత్యానికి పాల్పడితే? అంగీకరించాలి: టీనేజ్లోకి వచ్చిన పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల ప్రస్తుత స్థితిని అంగీకరించాలి మొదట. తమ టీనేజ్ కాలానికి ఇప్పటి టీనేజ్ కాలానికి కాలం చాలా మారిపోయి ఉంటుందని గ్రహించాలి. తమలాగే తమ పిల్లలు ఉండాలనుకుంటే అది కాలానికి విరుద్ధం. ఈ కాలంలో పిల్లలు ఎలా ఉండాలనుకుంటారో అలా ఉంటారు. అందులో ఏ మేరకు చెడు ఉందో చూసి దానిని పరిహరించడానికి మాత్రమే తల్లిదండ్రులు ప్రయత్నించాలి. పిల్లలకు సవాళ్లు: మీ పిల్లలు మీకు సమస్య సృష్టిస్తున్నారా? లేదా మీరు మీ పిల్లలకు సమస్య సృష్టించారా? మీ పిల్లలు వారికి ఇష్టమైన కోర్సు చదివేలా చూశారా? వారు యావరేజ్ స్టూడెంట్ అయినా ఫస్ట్ ర్యాంక్ రావాలని వెంట పడుతున్నారా? వారి జ్ఞాపకశక్తి పరీక్షలకు వీలుగా ఉందా? వారికి అన్ని సబ్జెక్ట్లు అర్థం అవుతున్నాయా? వారికి పరీక్షల వొత్తిడి ఎలా ఉంది? వారికి ఏ మాత్రమైన ఆహ్లాదం అందుతోంది? ఇవన్నీ గమనించకుండా పిల్లలు మరబొమ్మల్లా ఎప్పుడూ చెప్పినట్టల్లా వింటూ కేవలం పుస్తకాలు మాత్రమే పట్టుకుని కూచోవాలని ఆశిస్తే ఆ పిల్లలకు ఉక్కిరిబిక్కిరి ఎదురవుతుంది. దాని నుంచి బయటపడాలని తల్లిదండ్రులకు తెలియకుండా దొంగపద్ధతులకు దిగుతారు. అది తల్లిదండ్రులకు ఇంకా తప్పుగా కనిపిస్తుంది. వారు తప్పు చేసేలా చేసింది తల్లిదండ్రులే మరి. పనిష్మెంట్ వద్దు ఇన్స్పిరేషన్ ముఖ్యం: పిల్లలు టీనేజ్లోకి వచ్చాక మానసికంగా, శారీరకంగా ఒక ట్రాన్స్ఫర్మేషన్లో ఉంటారు. ఆ సమయంలో వారు ఫోకస్ పెట్టి చదవాలని అనుకున్నా కొన్ని డిస్ట్రాక్షన్లు ఉంటాయి. అంతేగాక ఈ సమయంలో వారు ఎన్నో సందేహాలతో ప్రవర్తనకు సంబంధించి సంశయాలతో ఉంటారు. తల్లిదండ్రులు ఎంతో సన్నిహితంగా ఉంటూ వారితో సంభాషిస్తూ ‘ఏదైనా మాతో చెప్పి చేయండి’ అనే విధంగా మాట్లాడితే చాలా సమస్యలు తీరుతాయి. చదువు పట్ల, ప్రవర్తన పట్ల వారిని తల్లిదండ్రులు ఇన్స్పయిర్ చేసేలా ఉండాలి తప్ప పనిష్మెంట్ చేసేలా ఉండకూడదు. తిట్టడం, కొట్టడం అనేవి కాదు చేయాల్సింది. బుజ్జగించడం, బతిమాలడం కూడా కాదు. కేవలం స్నేహంగా గైడ్ చేయడం. వారి వల్ల జరిగే తప్పులను, పొరపాట్లను జడ్జ్ చేయకుండా వారి వైపు నుంచి ఆలోచించి వారికి అర్థమయ్యేలా సరి చేయడం. టీనేజ్లో ఉన్న పిల్లలకు పెద్దవాళ్లు చెప్పేది అర్థమవ్వాలంటే వారు పెద్దవాళ్లంత వయసుకు చేరాలి. కాబట్టి తల్లిదండ్రులే పిల్లల వయసుకు దిగి పిల్లలతో వ్యవహరించడం ఇరుపక్షాలకు శ్రేయస్కరం. -
సీబీఎస్ఈ 9వ తరగతి పుస్తకాల్లో... డేటింగ్, రిలేషన్షిప్ పాఠాలు
న్యూఢిల్లీ: టీనేజీ విద్యార్థులకు ఏదైనా ఒక విషయాన్ని సమాజం.. తప్పుడు కోణంలో చెప్పేలోపే దానిని స్పష్టమైన భావనతో, సహేతుకమైన విధానంలో పాఠంగా చెప్పడం మంచిదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) సీబీఎస్ఈ నిర్ణయించుకుంది. పిల్లలతో తల్లిదండ్రులు చర్చించడానికి విముఖత చూపే డేటింగ్, రిలేషన్షిప్ వంటి సున్నితమైన అంశాలపై టీనేజీ విద్యార్థుల్లో సుస్పష్టమైన ఆలోచనను పాదుకొల్పే సదుద్దేశంతో సీబీఎస్ఈ ముందడుగు వేసింది. ఇందులో భాగంగా డేటింగ్, రిలేషన్షిప్ వంటి ఛాప్టర్లను తమ 9వ తరగతి ‘వాల్యూ ఎడిషన్’ పాఠ్యపుస్తకాల్లో చేర్చింది. టీనేజీ విద్యార్థుల్లో హార్మోన్ల ప్రభావంతో తోటి వయసు వారిపై ఇష్టం, కలిసి మెలసి ఉండటం వంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో సవివరంగా చెబుతూ ప్రత్యేకంగా పాఠాలను జతచేశారు. ‘డేటింగ్ అండ్ రిలేషన్షిప్స్: అండర్స్టాండింగ్ యువర్సెల్ఫ్ అండ్ ది అదర్ పర్సన్’ పేరుతో ఉన్న ఒక పాఠం, కొన్ని పదాలకు అర్ధాలు, ఇంకొన్ని భావనలపై మీ అభిప్రాయాలేంటి? అనే ఎక్సర్సైజ్ సంబంధ పేజీలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. ఫొటోలవంటి ఇతరుల సమాచారాన్ని దొంగతనంగా సేకరించి వాటితో ఇంకొకరిని ఆకర్షించే ‘క్యాట్ఫిషింగ్’, సంజాయిషీ లేకుండా బంధాన్ని హఠాత్తుగా తెగతెంపులు చేసుకునే ‘ఘోస్టింగ్’, ‘సైబర్ బులీయింగ్’ పదాలకు అర్ధాలను వివరిస్తూ చాప్టర్లను పొందుపరిచారు. ‘క్రష్’, ‘స్పెషల్’ ఫ్రెండ్ భావనలను చిన్న చిన్న కథలతో వివరించారు. -
పీరియడ్ నొప్పిని భరించలేక ఆ మాత్రలు వేసుకుంది! అంతే..
మహిళలకు రుతుక్రమం సమయంలో కడుపు నొప్పి సహజంగానే వస్తుంది. కొందరికీ మరీ ఎక్కువగా సమస్యాత్మకంగా ఉంటుంది. కొద్దిమందిలో మొదటి రెండు రోజులు తట్టుకోలేని నొప్పి ఉంటుంది. ఆ తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది. ఆ టైంలో పెయిన్ తట్టుకోలేకపోతే వైద్యుల సూచించిన లేదా నొప్పి ఉపశమించే మందులను వాడుతుంటారు మహిళలు. అలానే ఇక్కడొక అమ్మాయి కూడా మాత్రలు వేసుకుని ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ విషాద ఘటన యూకేలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..యూకేకి చెందిన 16 ఏళ్ల విద్యార్థిని లైలా అనే అమ్మాయి పిరియడ్ నొప్పి భరించలేక అల్లాడిపోయింది. దీంతో ఆమె స్నేహితులు ఆ నొప్పి తగ్గాలంటే గర్భనిరోధక మాత్రలు వేసుకోవాలని సూచించారు. లైలా వారి చెప్పినట్లే నవంబర్ 25 నుంచి ఆ టాబ్లెట్లు వేసుకోవడం ప్రారంభించింది. అంతే ఆ ట్యాబ్లెట్లు వాడిన మూడు వారాల తర్వాత నుంచి ఆమెకు తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. క్రమేణ పరిస్థితి సీరియస్గా మారిపోయింది. డిసెంబర్ 5 నుంచి తీవ్రమైన వాంతులు అవ్వడం ప్రారంభమయ్యాయి. ఇక క్రమక్రమంగా పరిస్థితి విషమించడం మొదలైంది. ఆమె కడుపు నొప్పిని తాళ్లలేక పోవడంతో కుటుంబ సభ్యలు హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు కడుపులో ఏదైనా గడ్డ ఉందేమోనని అనుమానించారు. కానీ సీటీ స్కాన్లో వైద్యులకే దిమ్మతిరిగేలా అసలు విషయం బయటపడింది. కడుపు నొప్పి ..అంటే కడుపులో సమస్య అనుకుంటే అసలు సమస్య బ్రెయిన్లోనే ఉండటం వైద్యులనే ఆశ్చర్యపరచడమే గాక కలవరపరిచింది. ఆమె మెదడులో వేగంగా రక్తం గడ్డకడుతుండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దీంతో వారు వెంటనే డిసెంబర్ 13న ఆ అమ్మాయికి ఆపరేషన్ చేశారు. అయితే ప్రయోజనం లేకుండాపోయింది. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. దీంతో ఒక్కసారిగా ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..దయచేసి ఎవ్వరూ కూడా ఇలా ఆ మాత్రలు వేసుకుంటే త్గగుతుంది అనంగానే ఆమెలా అనాలోచితంగా వేసుకోవద్దు. ఒక వేళ అలా వేసుకోవాలనుకున్నా ముందు మీ పెద్దవాళ్లకు కూడా చెప్పండి. ప్రతి ఒక్కరి శరీరం విభిన్నంగా ఉంటుంది. మాత్రలు అందరీకి ఒకేలా రియాక్షన్ ఇవ్వవు. దీన్ని కూడా గుర్తించుకోవాలి. మన శరీర ఆరోగ్య పరిస్థితి, మనకున్న ఆహారపు అలవాట్లు అన్నింటిని పరిగణించి వైద్యులు మాత్రలు ఇస్తారు. ఒక్కొసారి డాక్టర్లు ఇచ్చినవే మనకు ఇబ్బందిగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇలా తెలిసిన మాత్రలో లేక ఎవరో చెప్పారనో ఎలాంటి మందులు తీసుకోవద్దు. కోరి ప్రాణాల మీదకు తెచ్చుకుని కుటుంబసభ్యులకు తీరని ఆవేదనను మిగల్చకండి అని చెబుతున్నారు వైద్యులు. (చదవండి: తొమ్మిది పదుల వయసులో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన బామ్మ!) -
13 ఏళ్లకే ‘అత్యంత మేధావి’గా.. తెలంగాణ కొత్తగూడెం మిస్ టీన్!
ఖమ్మం/కొత్తగూడెం: అమెరికాలోని వాషింగ్టన్లో ఉన్న సియాటల్ నగరంలో ఈనెల 16న ‘సామాజిక విద్యాపరమైన సమతుల్యత’ అంశంపై జరిగిన ఈవెంట్లో కొత్తగూడేనికి చెందిన పదమూడేళ్ల బాలిక అవ్యుక్త గెల్లా ప్రతిభ కనబరిచి అత్యంత మేధావి అవార్డుకు ఎంపికైంది. అమెరికాలో ఉంటున్న గెల్లా గణేష్ – రాధిక కుమార్తె అవ్యుక్తతో పాటు 13 ఏళ్ల నుండి 40 ఏళ్ల లోపు వయస్సు కలిగిన 30 మంది ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిస్ టీన్ విభాగంలో అవ్యుక్త పలు అంశాలపై తన ప్రసంగంతో ఆకట్టుకోగా అవార్డుకు ఎంపిక చేశారు. ఈమేరకు ఆమె తాతయ్య, అమ్మమ్మ అయిన కొత్తగూడేనికి చెందిన వసుంధర వస్త్ర దుకాణం యజమానులు తాటిపల్లి శంకర్బాబు – రాజేశ్వరి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఇవి చదవండి: ఔను..! నిజంగానే కలెక్టర్కు కోపమొచ్చింది! -
మిస్సింగ్ కేసుని చేధించిన ఆ 'ఎమోషనల్ ఫేస్బుక్ సందేశం"
ఈ రోజుల్లో పొరపాటున పిల్లలు తప్పిపోతే దొరకడం చాలా కష్టం. పోలీసులు చుట్టు తిరిగినా దొరికే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే పిల్లలను ఎత్తకుపోయే ముఠాలు, మానవ అక్రమ రవాణ తదితరాల కారణంగా ఆచూకి అంత ఈజీ కాకుండా పోయింది. ఐతే ఈ ఆధుననిక టెక్నాలజీ ఈ విషయంలో సహకరిస్తుందని చెప్పాలి. ఫేస్బుక్, ట్విట్టర్ మాధ్యమాల ద్వారా ఇన్ఫర్మేషన్ సెకన్లలో చేరి ఏదో రకంగా వాళ్ల ఆచూకీ లభించి కుటుంబ చెంతకు చేరిన ఎన్నో ఉదంతాలు చూశాం. అలాంటి ఆశ్చర్యకర ఉదంతమే ఇక్కడ చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...యూకేకి చెందిన అలెక్స్ బట్టీ ఆరేళ్ల వయసులో తప్పిపోయాడు. స్పెయిన్లో ఉండగా సెలవుల్లో తన అమ్మ, తాతయ్యలతో కలిసి ఊరికి వెళ్తుండగా తప్పిపోయాడు. అప్పటి నుంచి అతడి మిస్ కేసింగ్ కేసు పరిష్కారం కానీ కేసుగా ఉండిపోయింది. ఇంటర్నెట్లో అతడి ఆచూకీ కోసం ఓ ప్రకటన కూడా ఉంది. అయితే ఆ చిన్నారి అలెక్స్ ఇప్పుడూ అనూహ్యంగా 17 ఏళ్ల వయసులో ఫ్రాన్స్ పర్వాతాల్లో ఓ వాహనదారుడికి కనిపించాడు. దీంతో అతను ఆ టీనేజర్ని ఇక్కడ ఎందుకు ఉన్నావని ఆరా తీయగా నాలుగు రోజుల నుంచి ఈ పర్వతాల నుంచే నడుచుకుంటూ వస్తున్నట్లు తెలిపాడు. వెంటనే అతడు ఆ బాలుడి పేరుని ఇంటర్నెట్లో టైప్ చేసి చెక్చేయగా అతడి ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు తెలిసింది. దీంతో అతను వెంటనే ఆ టీనేజర్ని పోలీసులకు అప్పగించాలనుకున్నాడు. అంతేగాదు అలెక్స్ ఆ వాహనదారుడి ఫోన్ సహాయంతో ఫేస్బుక్లో యూకేలో ఉన్న తన అమ్మమ్మ తాతయ్యల కోసం ఓ సందేశం పెట్టాడు. ఆ సందేశంలో "హలో అమ్మమ్మ నేను అలెక్స్. నేను ఫ్రాన్స్ టౌలౌస్లో ఉన్నాను. మీకు సందేశం చేరుతుందని ఆశిస్తున్నాను. ఐ లవ్ యూ, నేను ఇంటికి రావాలనుకుంటున్నా".అని ఉద్వేగభరితంగా సందేశం పెట్టాడు. ఇది వారికి రీచ్ అవ్వడమే గాక ఒక్కసారిగా ఆ కుటుంబం సంతోషంతో మునిగిపోయింది. మళ్లీ ఆరేళ్ల తర్వాత ఆ టీనేజర్ తొలిసారిగా తన అమ్మమ్మను కలుసుకోనున్నాడు. ప్రస్తుతం ఆ టీనేజర్ టౌలౌస్లోని ఒక యువకుడి సంరక్షణలో ఉన్నాడని ఏ క్షణమైన నగరానికి రావొచ్చని పోలీసులు తెలిపారు. అదృశ్యమయ్యే సమయానికి అలెక్స్ వసయు 11 ఏళ్లు కాగా ఆరేళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకోనున్నాడు. ఐతే ఈ ఆరేళ్లలో ఎక్కడ ఉన్నాడు, ఎలా మిసయ్యాడు అనే దానిపై లోతుగా విచారణ చేయాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: 220 టన్నుల హోటల్ని జస్ట్ 700 సబ్బులతో తరలించారు!) -
పనిపిల్లపై యజమాని కుటుంబం దాష్టీకం
గురుగ్రామ్: పదమూడేళ్ల పనిపిల్ల పట్ల ఓ ఇంటావిడ దారుణంగా ప్రవర్తించింది. హరియాణాలోని గురుగ్రామ్ పట్టణంలోని సెక్టార్ 51 పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పనికి కుదిర్చిన వ్యక్తితో కలిసి ఎట్టకేలకు తల్లి.. ఆమె కూతురుని విడిపించుకుంది. తాను అనుభవించిన చిత్రహింసను కూతురు ఏడుస్తూ చెప్పడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. బిహార్కు చెందిన ఈమె తన కూతురును జూన్ 27వ తేదీన ఒకావిడ ఇంట్లో పనికి కుదిర్చింది. ఇంట్లో ఉంచుకుని, పనికి నెలకు రూ.9,000 జీతం ఇచ్చేలా ఒప్పందం కుదర్చుకుంది. ‘‘ మొదట్లో రెండు నెలలు మాత్రమే నా కుతురుకు జీతం ఇచ్చారు. ఆ తర్వాత చిల్లిగవ్వ ఇవ్వలేదు. ఇంటి పని అంతా చేయించుకుని ఇష్టమొచి్చనట్ట కొట్టేవారు. పెంపుడు కుక్కతో కరిపించేవారు. యజమాని ఇద్దరు కుమారులు నా బిడ్డను లైంగికంగా వేధించారు. బలవంతంగా బట్టలూడదీసి ఫొటోలు, వీడియోలు తీసేవారు. అసభ్యంగా తాకేవారు. యజమానురాలు ఇనుప కడ్డీ, సుత్తితో కొట్టి చిత్రహింసలు పెట్టేది. బయటకు తప్పించుకునిపోకుండా గదిలో బంధించేవారు. కట్టేసి అరవకుండా నోటికి టేప్ అంటించారు. చేతులపై యాసిడ్ పోశారు. విషయం బయటకు పొక్కితే చంపేస్తామని బెదిరించేవారు. నా బిడ్డకు రెండు రోజులకు ఒకసారి భోజనం పెట్టేవారు. ఇంతటి దారుణాలు తెలిశాక స్థానిక వ్యక్తితో కలిసి ఎట్టకేలకు ఆ బిడ్డను విడిపించుకున్నా’’ అని టీనేజర్ తల్లి వాపోయారు. -
టీనేజ్ పిల్లలను ఇలా హ్యాండిల్ చేస్తే.. దెబ్బకు మాట వింటారు
‘మా అమ్మాయి నిన్నమొన్నటి వరకూ చెప్పినట్లు వినేది. ఇప్పుడు ఏం చెప్పినా పట్టించుకోవడం లేదు. నాకు తెలుసులే అన్నట్లు మాట్లాడుతోంది. ఈ పిల్లతో వేగేదెట్లా’ ఓ తల్లి కలవరం. ‘నేనేం చెప్పినా మావాడు ఎదురు మాట్లాడుతున్నాడు. కొంచెం గొంతు పెంచితే చేతిలో ఉన్నది పగలకొట్టేస్తున్నాడు. ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కావడంలేదు’ ఓ తండ్రి బాధ. టీనేజ్ పిల్లలున్న తల్లిదండ్రులందరిదీ ఇదే స్థితి. మొన్నటివరకు పిల్లిపిల్లల్లా తమ వెనుకే తిరిగిన బిడ్డలు ఇప్పుడు ఎదురు మాట్లాడుతుంటే భరించలేరు. బాధపడుతుంటారు. టీనేజ్ గురించి, ఆ వయసులో వారి తీరు గురించి తెలియకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఆ వయసు పిల్లలతో ఎలా మాట్లాడో తెలుసుకుంటే వారిని అదుపు చేయడం, సరైన మార్గంలో నడిపించడం చాలా సులువైన విషయం. ఇదో విప్లవాత్మక దశ.. టీనేజ్ లేదా కౌమార దశ అనేది చాలా విప్లవాత్మకమైన దశ. హర్మోన్ల పని తీరు ఉధృతమవుతుంది. శారీరకంగా మార్పులు చోటుచేసుకుంటాయి. కొత్త కొత్త ఆలోచనలు.. కోరికలు పుడుతుంటాయి. సమాజాన్ని మార్చేయాలని.. ప్రపంచాన్ని జయించాలనే ఆవేశం ఈ వయసులో అత్యంత సహజం. బాల్యం నుంచి వయోజనుడిగా మారే క్రమంలో తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్తుంటారు. అది తమ సొంత వ్యక్తిత్వాన్ని సంతరించుకునే క్రమంలో భాగమే తప్ప తల్లిదండ్రుల పట్ల వ్యతిరేకత కాదు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. వారి విమర్శలను సీరియస్గా తీసుకుని బాధపడకుండా లేదా గొడవ పడకుండా వారిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. స్నేహితుడిలా మాట్లాడాలి.. వయసుకు వచ్చిన పిల్లల్ని మనతో సమానంగా చూడాలని పెద్దలు చెప్తుంటారు. ఈ మాట పాటిస్తే చాలు బంధాలు, అనుబంధాలు బలోపేతమవుతాయి. చిన్నపిల్లలను తిట్టినట్టు తిట్టకుండా, కొట్టకుండా.. స్నేహితులతో మాట్లాడినట్లు మంచిగా మాట్లాడాలి. ఆ మేరకు కమ్యూనికేషన్ను మార్చుకోవాలి. వాళ్లు పెరిగి పెద్దవాళ్లవుతున్నారని, సొంతగా నిర్ణయించుకునే, నిర్ణయాలు తీసుకునే హక్కు వాళ్లకు ఉందని గుర్తించాలి, గౌరవించాలి. తమ జనరేషన్కు, పిల్లల జనరేషన్కు అభిప్రాయాలు, అభిరుచుల్లో తేడాలుంటాయని గుర్తించాలి, గౌరవించాలి. అప్పుడే వారితో సరైన రీతిలో కమ్యూనికేట్ చేయగలం. సవాళ్లు విసరొద్దు.. ఇంట్లో టీనేజ్ పిల్లలున్నప్పుడు వాదోపవాదాలు సహజం. అయితే ఆ సమయంలో ఏం చెప్పాలో.. ఏం చెప్పకూడదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. టీనేజర్ మన పెంపకాన్ని విమర్శిస్తున్నప్పుడు బాధగానే ఉంటుంది. అయినా సరే మనల్ని మనం సమర్థించుకోవడం మానేయాలి. ‘నాకు చేతనైంది నేను చేశా, నువ్వేం చేస్తావో చేసి చూపించు’ లాంటి సవాళ్లు విసరకూడదు. దానికన్నా ఏమీ మాట్లాడకపోవడం మంచిది. పిల్లలపై మాటల్లో గెలవడం కంటే, వాళ్ల మనసుల్లో నిలవడం ముఖ్యమని గుర్తించాలి. ఇలాంటి మాటలన్నీ తాత్కాలికమని అర్థం చేసుకోవాలి. ‘మేం పేరెంట్స్మి, మా మాట వినాలి’ అనే అహాన్ని లేదా అధికారాన్ని వదులుకుంటేనే ఇవన్నీ సాధ్యం. టీనేజర్ మిమ్మల్ని విమర్శిస్తున్నప్పుడు.. 1. నువ్వు చెప్పేది వింటున్నాను. ఇంకా బెటర్గా ఉండేందుకు ప్రయత్నిస్తా. 2. ఐయామ్ సారీ, ఇంకొంచెం బెటర్గా చేసి ఉండాల్సింది. 3. ఈ పరిస్థితిని ఎలా డీల్ చేయాలో నాకన్నా నీకు ఎక్కువ తెలుసు. 4. నువ్వు బాధపడేలా చేసినందుకు సారీ. 5. మన మధ్య విషయాలు కష్టంగా ఉన్నాయని తెలుసు. దీన్ని బెటర్ చేసేందుకు ఇద్దరం కలసి పనిచేద్దాం. 6. ఏం జరిగినా సరే నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలుసుకో. మన మధ్య బంధం బలంగా ఉంచడానికి నేను కట్టుబడి ఉన్నా. మీ టీనేజర్ కష్టపడుతున్నప్పుడు.. 1. నేను నీకు ఎలా హెల్ప్ చేయగలనో చెప్పు. 2. నీకు నేనున్నాను. 3. నేను నిన్ను, నీ సామర్థ్యాన్ని నమ్ముతాను. 4. అవును, అది చాలా కష్టంగా ఉంది. 5. అవును, అది కష్టమని నువ్వు అనుకోవడం కరెక్టే. 6. తప్పులు చేయడం ఓకే. అందరం చేస్తాం. టీనేజర్ పట్ల ప్రేమను వ్యక్తం చేయడానికి.. 1. ఐ లవ్ యూ ఫర్ హూ యూ ఆర్. 2. నీతో సమయం గడపడం నాకు చాలా ఇష్టం. 3. ఐ యామ్ గ్రేట్ఫుల్ ఫర్ యూ. 4. నువ్వు సాధించిన దాని గురించి కాదు.. ఐ యామ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ హూ యు ఆర్. 5. మనిద్దరం కలసి మంచి జ్ఞాపకాలను సృష్టించడం నాకు చాలా ఇష్టం. 6. నువ్వు నా దగ్గరకు రావడం, నాతో ఉండటం నాకు చాలా ఇష్టం. --సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com (చదవండి: ఎవరికీ కనిపించనివి కనిపిస్తున్నాయా?.. వినిపించనివి వినిపిస్తున్నాయా?) -
అబ్బాయిలాగా..టీనేజ్లో స్వరం మారిపోయింది, ఏం చేయాలి?
నేనొక సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ని. మా హాస్టల్లో ఒక పన్నెండేళ్ల పాపకు స్వరం మారిపోయింది.. ఆ ఏజ్లో మగపిల్లలకు మారిపోయినట్టుగా. అయితే ఆ పాప ఇంకా పెద్దమనిషి అవలేదు. ఆ గొంతుతో ఆ అమ్మాయి చాలా సిగ్గుపడుతోంది. దాంతో మాట్లాడ్డమే తగ్గించేసింది. ఇలా అయితే పాప కాన్ఫిడెన్స్ కోల్పోతుందేమోననే భయంతో .. పరిష్కారం కోసం మీకు రాస్తున్నాను. – పేరు, ఊరు వివరాల్లేవు. వయసు పెరిగేకొద్దీ .. ప్యూబర్టీ టైమ్కి ఆడపిల్లల్లో చాలా మార్పులు వస్తాయి. (వాయిస్ బాక్స్) కూడా థిక్ అండ్ లార్జ్ అవుతుంది. అంతేకాదు ప్యూబర్టీ టైమ్కి సైనస్ క్యావిటీస్, గొంతు వెనుక భాగం కూడా ఎన్లార్జ్ అవుతాయి. వాయిస్ మారడానికి ఇవీ కారణమే. అందుకే 11 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న మగపిల్లల్లోనే కాదు ఆడపిల్లల్లోనూ గొంతు మారడాన్ని గమనిస్తాం. ఇలా హఠాత్తుగా తన వాయిస్ అబ్బాయి వాయిస్లా హార్డ్గా అవడంతో అమ్మాయి ఇబ్బంది పడుతుండవచ్చు. కాబట్టి వీటన్నిటినీ వివరిస్తూ అదెంత సర్వసాధారణమైన విషయమో చెబుతూ సైకాలజిస్ట్ ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించాలి. అమ్మాయిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. స్పీచ్ థెరపీ, గొంతును తగ్గించి మాట్లాడ్డం వంటివి కొంతవరకు సహాయపడతాయి. అయితే జన్యుపరమైన కారణాల వల్లా కొంతమంది అమ్మాయిల్లో మేల్ వాయిస్ ఉంటుంది. కొందరికి అవాంఛిత రోమాలు కూడా రావచ్చు. అంటే ఆండ్రోజెన్ (మేల్ హార్మోన్) హార్మోన్ ఎక్కువ ఉండొచ్చు. ఒవేరియన్ సిస్ట్స్ వల్ల కూడా ఇలా అవొచ్చు. కాబట్టి ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించాలి. కొన్ని కేసెస్లో న్యూరలాజికల్ కండిషన్స్ వల్ల కూడా ఇలా మారవచ్చు. స్పెషలిస్ట్ని సంప్రదించాలి. రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉంటే వాయిస్ చేంజ్ను అడాప్ట్ చేసుకునే కౌన్సెలింగ్ని ఇప్పించాలి. విటమిన్ బీ12, విటమిన్డి సప్లిమెంట్స్ కూడా కొంతమందిలో ఈ హార్డ్ వాయిస్ని తగ్గిస్తాయి. డా. భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
ఆ ఇరాన్ యువతి మృతి
దుబాయ్: ఇరాన్లో కొద్ది వారాల కింద హిజాబ్ ధరించకుండా మెట్రో రైల్లో ప్రయాణిస్తూ అంతుబట్టని రీతిలో తీవ్ర గాయాలపాలైన టీనేజ్ యువతి మరణించింది. కొద్ది రోజుల కోమా అనంతరం ఆమె తుదిశ్వాస విడిచినట్టు ప్రభుత్వ మీడియా శనివారం ఈ మేరకు వెల్లడించింది. అరి్మత గెర్వాండ్ అనే ఆ యువతి అక్టోబర్ 1న టెహ్రాన్లో మెట్రోలో ప్రయాణిస్తూ గాయపడింది. ఆమె ట్రైన్లోంచి ప్లాట్ఫాంపైకి వచ్చి పడుతున్న వీడియో బయటికి వచి్చంది. మెట్రోలో ఏమైందో ఇప్పటిదాకా బయటికి రాలేదు. హిజాబ్ ధరించనందుకే పోలీసులు ఆమెకు ఈ గతి పట్టించి ఉంటారని హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. ఏడాది కింద ఇలాగే హిజాబ్ ధరించనందుకు 22 ఏళ్ల మహ్సా అమినీని మోరల్ పోలీసులు తీవ్రంగా కొట్టడం, ఆమె జైల్లో మరణించడం, దానిపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు, ఆందోళనలు పెల్లుబుకడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గెర్వాండ్ మృతితో మళ్లీ అలాంటి పరిస్థితులు తలెత్తుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
సబ్బుతో స్కిన్ క్యాన్సర్కి చెక్..14 ఏళ్ల బాలుడి సరికొత్త ఆవిష్కరణ
క్యాన్సర్ ఎంత ప్రమాదకరమైన వ్యాధో అందరికి తెలిసిందే. బాగా డబ్బుంటే విదేశాల్లో పేరుగాంచిన ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుని బయటపడుతుంటారు ప్రముఖులు, సెలబ్రెటీలు. అలాంటి భయానక క్యాన్సర్ వ్యాధుల్లో ఒకటి ఈ స్కిన్ క్యాన్సర్. అలాంటి స్కిన్ క్యాన్సర్ని తక్కువ ఖర్చుతోనే ఈజీగా నయం చేసేలా ఓ సరికొత్త ఆవిష్కరణకు నాంది పలికాడు ఓ టీనేజర్. ఈ ఆవిష్కరణతో ఆ యువ శాస్త్రవేత్త అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ ఎవరా టీనేజర్? ఏమిటా ఆవిష్కరణ..?. వివరాల్లోకెళ్తే..అమెరికాలోని వర్జీనియాకు చెందిన 14 ఏళ్ల హేమన్ బెకెలే స్కిన్ క్యాన్సర్ని జయించేలా సబ్బుని కనిపెట్టాడు. అది కూడా తక్కువ ఖర్చతోనే నయం అయ్యేలా రూపొందించాడు. ఈ సబ్బు ధర కేవలం రూ. 800/-. ఈ సరికొత్త ఆవిష్కరణగానూ ఆ బాలుడు టాప్ యంగ్ సైంటిస్ట్గా అవార్డును గెలుచుకున్నాడు. ఈ సబ్బు అందరికీ అందుబాటులో ఉండేలా ఆ బాలుడు లాభప్రేక్షలేని ఓ సంస్థను కూడా స్థాపించాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఆ బాలుడికి ఈ ఆవిష్కరణను కనుగొనడానికి త్రీఎం డిస్కవరరీ ఎడ్యుకేషన్ శాస్త్రవేత్తల సలహాదారు డాక్టర్ మహ్ఫుజా అలీ సాయం చేశారు. బెకెలేకి జీవశాస్త్రం, సాంకేతికపై మంచి ఆసక్తి. ఇదే ఈ ఆలోచనకు పురిగొల్పింది. అదే అతడిని యూఎస్లో ఏటా నిర్వహించే 2023 3M యంగ్ సైంటిస్ట్స్ ఛాలెంజ్లో పాల్గొనేలా చేసింది. దాదాపు తొమ్మిది మంది పోటీ పడిన ఈ చాలెంజ్లో అమెరికా టాప్ యంగ్ సైంటిస్ట్గా విజయం కైవసం చేసుకుని దాదాపు రూ. 31 లక్షల ఫ్రైజ్ మనీని గెలుచుకున్నాడు. ఇథియోపియాకు చెందిన బెకెలే తాను అక్కడ ఉన్నప్పుడు చాలామంది స్కిన్ క్యాన్సర్తో బాధపడుతుండటం చూశానని చెప్పుకొచ్చాడు. అప్పుడే దీన్ని నయం చేసేలా ఏదైనా కనిపెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నానని చెప్పాడు. దీనికి ఈ ఛాలెంజ్ పోటీనే సరైన వేదికగా భావించానని చెప్పుకొచ్చాడు. ఇక బెకెలే రూపొందించిన ఈ సబ్బు పేరు స్కిన్ క్యాన్సర్ ట్రీటింగ్ సోప్. ఈ సోప్ చర్మాన్ని రక్షించే డెన్డ్రిటక్ కణాలను పునరుద్ధరింంచి, స్కిన్ క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడతుందని బెకెలే పేర్కొన్నాడు. అదీగాక ఇంతవరకు మార్కెట్లో స్కిన్ క్యాన్సర్కి సంబంధించి క్రీమ్లు మాత్రమే మార్కెట్లో ఉన్నాయని, సబ్బుని ఉపయోగించడం ఇదే తొలిసారి అని యంగ్ ఛాలెంజ్ ప్రెజెంటేషన్ ప్యానల్ వివరించాడు బెకెలే. సమాజానికి తన వంతుగా సాయం అందించేలా ఈ స్కిన్ క్యాన్సర్ని అతి తక్కువ ఖర్చుతోనే జయించేలా తాను కనుగొన్న ఈ సరికొత్త ఆవిష్కరణ ప్రపంచానికి ఓ కొత్త ప్రేరణ ఇస్తుందని ఆశిస్తున్నానని ప్యానెల్ సభ్యులకు వివరించాడు బెకెలే. (చదవండి: అంతరించిపోయే స్టేజ్లో అరటిపళ్లు!..శాస్త్రవేత్తలు స్ట్రాంగ్ వార్నింగ్) -
టేప్, జిగురు లేకుండా ప్లేయింగ్ కార్డు స్ట్రక్చర్తో రికార్డు సృష్టించాడు!
కోల్కతాకు చెందిన పదిహేను సంవత్సరాల అర్నవ్ దాగ ప్రపంచంలోనే పెద్దదైన ప్లేయింగ్ కార్డ్ స్ట్రక్చర్ను సృష్టించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించాడు. కోల్కత్తాలోని ప్రసిద్ధ నిర్మాణాలు రైటర్ బిల్డింగ్, షాహీద్ మినార్, సాల్ట్ లేక్ స్టేడియం, సెయింట్ పాల్స్ కేథడ్రల్ ఆధారంగా చేసుకొని ఈ నిర్మాణం చేశాడు. పని ప్రారంభించడానికి ముందు ఈ నాలుగు నిర్మాణాల దగ్గరకు వెళ్లి వాటి ఆర్కిటెక్చర్ను పరిశీలించాడు. ఈ స్ట్రక్చర్ కోసం 143,000 ప్లేయింగ్ కార్డ్స్ను ఉపయోగించాడు. టేప్, జిగురు ఉపయోగించకుండానే 40 అడుగుల ఎత్తుతో ఈ స్ట్రక్చర్ను సృష్టించాడు. దీనికోసం 41 రోజుల పాటు కష్టపడ్డాడు. ‘పూర్తయి పోయింది అనుకున్న నిర్మాణం కొన్నిసార్లు హఠాత్తుగా కుప్పకూలిపోయేది. మళ్లీ మొదటి నుంచి పని మొదలు పెట్టాల్సి వచ్చేది. విసుగ్గా అనిపించేది. అయినా సరే కష్టపడేవాడిని’ అంటున్నాడు అర్నవ్. గతంలో బ్రియాన్ బెర్గ్ అనే వ్యక్తి 34 అడుగుల ఎత్తుతో ఉండే ప్లేకార్డ్ స్ట్రక్చర్ను సృష్టించాడు. బెర్గ్ రికార్డ్ను అర్నవ్ బ్రేక్ చేశాడు. (చదవండి: స్కిప్పింగ్ని వేరే లెవల్కి తీసుకెళ్లిందిగా ఈ డ్యాన్సర్! వీడియో వైరల్) -
టీనేజర్లు కోరికల్ని నియంత్రించుకోవాలి.. కలకత్తా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
పోక్సో కేసులో కలకత్తా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని సూచించింది. ముఖ్యంగా బాలికలను ఉద్ధేశించి.. రెండు నిమిషాల సుఖం కోసం లొంగిపోవద్దని, ఇది సమాజంలో ఆమె గౌరవాన్ని తగ్గిస్తుందనే విషయాన్ని నొక్కి చెప్పింది. అబ్బాయిలు కూడా మహిళల విషయంలో గౌరవంగా, మర్యాదగా వ్యవహరించాలని పేర్కొంది. పరస్పర సమ్మతితో సెక్స్లో పాల్గొనే కేసుల్లో పోక్సో చట్టాన్ని ప్రయోగించే అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తూ హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. మైనర్ అయిన తన భార్యతో శారీరక సంబంధంలో పాల్గొనందుకు గతేడాది ఓ టీనేజర్కు సెషన్స్ కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుపై యువకుడు కలకత్తా హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై జస్టిస్ చిత్తరంజన్ దాస్, పార్థ సారథి సేన్లతో కూడిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అత్యాచారం కేసులో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ మేరకు టీనేజీ అబ్బాయిలు, అమ్మాయిలకు పలు సూచనలు చేసింది. విచారణ సందర్భంగా... తన ఇష్టపూర్వకంగానే టీనేజర్తో రిలేషన్లో ఉన్నానని కోర్టుకు సదరు బాలిక కోర్టుకు తెలిపింది. అతన్ని పెళ్లి కూడా చేసుకున్నానని పేర్కొంది. అయితే 18 ఏళ్లలోపు పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్ధం అనే విషయాన్ని కూడా ఆమె అంగీకరించింది. కాగా, పోక్సో చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు శృంగారంలో పాల్గొనడం అత్యాచారం కిందకు వస్తుంది. చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన ఐసీఎంఆర్: ప్రపంచంలోనే తొలిసారి! టీనేజీలో సెక్స్ అనేది సాధారణమైన విషయమని, అయితే అలాంటి కోరికలను ప్రేరేపించడం అనేది వ్యక్తుల చర్యలపై ఆధారపడి ఉంటుందని బెంచ్ పేర్కొంది. యుక్త వయసు బాలికలు రెండు నిమిషాల సుఖం కోసం బాలికలు మొగ్గు చూపరాదని, లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని సూచించింది. రెండు నిమిషాల సుఖం కోసం ఆశపడితే సమాజంలో చెడ్డపేరు వస్తుందని, అలాంటి పనులకు పాల్పడవద్దని హితవు పలికింది. బాలికలకు వ్యక్తిత్వం, ఆత్మ గౌరవం అన్నిటికంటే ముఖ్యమని చెప్పింది. అదే విధంగా టీనేజీలోని అబ్బాయిలు కూడా అమ్మాయిలను గౌరవించాలని తెలిపింది. వారి హక్కులను, గోప్యతను, ఆత్మగౌరవవాన్ని, ఆమె శరీర స్వయంప్రతిపత్తిని కాపాడేలా వ్యవహరించాలని తెలిపింది. ఇలాంటి విషయాల్లో పిల్లల తల్లిదండ్రులే మొదటి ఉపాధ్యాయులుగా ఉండాలని, మంచి-చెడుల గురించి చెప్పాలని సూచించింది. మగపిల్లలకు తల్లిదండ్రులు మహిళలను ఎలా గౌరవించాలో చెప్పాలని, లైంగిక కోరికతో ప్రేరేపించబడకుండా వారితో ఎలా స్నేహం చేయాలో చెప్పాలని సూచించింది. యుక్త వయస్సులో లైంగిక సంబంధాల వల్ల తలెత్తే చట్టపరమైన సమస్యలను నివారించడానికి పాఠశాలలో లైంగిక విద్య అవసరమని నొక్కి చెప్పింది. -
ఉజ్జయిని హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్
భోపాల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉజ్జయిని మైనర్ అత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిపై బుల్డోజర్యాక్షన్కి సిద్ధమయ్యారు అధికారులు. అక్రమంగా నిర్మించారనే కారణంతో.. అతని ఇంటికి కూల్చేయబోతున్నారు. జరిగింది ఇదే.. మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాకు చెందిన 12 ఏళ్ల.. సెప్టెంబర్ 25వ తేదీన ఉజ్జయినిలో లైంగిక దాడికి గురైంది. అనంతరం గాయాలతోనే ఆమె సాయం కోసం ఉజ్జయినిలో నడిరోడ్డుపై 8 కిలోమీటర్లు తిరిగింది. సుమారు 2 గంటల పాటు ఇంటింటికి వెళ్లి సాయం అర్థించింది. చివరకు ఓ ఆశ్రమం వద్ద స్పృహ తప్పిపడిపోయిన ఆమెను ఓ పూజారి పోలీసుల సాయంతో దవాఖానకు తరలించారు. ప్రధాన నిందితుడి అరెస్టు? లైంగికదాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమెతో మాట్లాడిన ఐదుగురిని ప్రశ్నించారు. ఓ ఆటోడ్రైవర్ సహా నలుగురిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిలో ఆటో డ్రైవర్ భరత్ సోనిని ప్రధాన నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: ఉజ్జయిని కేసులో పోలీసుల కృషిని కొనియాడిన ఏఎస్పీ.. వారిపై కూడా చర్యలు తప్పవు.. -
ఇంటి ప్రేమే అసలు వైద్యం
సమాజంలో టీనేజ్ పిల్లల్లో డిప్రెషన్ పెరిగిందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆత్మహత్యలు తార్కాణాలుగా నిలుస్తూనే ఉన్నాయి. కాని తల్లిదండ్రులు మేల్కొనడం లేదు. టీనేజ్లో ఉన్న పిల్లల మూడ్స్ను గమనించి వారిని అక్కున చేర్చుకోవాల్సింది మొదట తల్లిదండ్రులే. వైద్యం మొదలవ్వాల్సింది ఇంటి నుంచే. డిప్రెషన్ సూచనలు కనిపించే పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? తెలుసుకుందాం. ఏదో భయం. ఆందోళన. తల్లిదండ్రుల అంచనాకు తగినట్టు లేనని భయం. మార్కులు తగినన్ని తేలేకపోతున్నానని భయం. పాఠాలంటే భయం. పరీక్షలంటే భయం. ఒంటరిగా ఉండాలంటే భయం. స్నేహితులు లేరని భయం. స్నేహితులతో స్నేహం చెడుతుందేమోనని భయం. ఎవరితో చెప్పుకోవాలో తెలియని భయం. ఎవరితోనూ చెప్పుకోలేనేమోనని భయం. టీనేజ్ పిల్లలు ఎదిగీ ఎదగని లేత వయసు పిల్లలు. వారికి అన్నీ సందేహాలే. ఆందోళనలే. మన దేశంలో 13–17 ఏళ్ల మధ్య ఉన్న దాదాపు కోటిమంది టీనేజ్ పిల్లలు డిప్రెషన్ బారిన పడుతున్నారని ఒక అంచన. డిప్రెషన్లో భయం, ఆందోళన ఉంటాయి. ఈ వయసులో మొదలైన డిప్రెషన్ కొందరిని ముప్పైల్లో, నలబైల్లో ప్రవేశించే వరకు వెంటాడుతుంది. కొందరిని జీవితాంతం వెంటాడవచ్చు. ఇలాంటి స్థితిలో ఉన్న పిల్లలు చీమను కూడా భూతద్దంలో చూసి భయపడతారు. తమ సమస్యకు సమాధానం లేదేమో, ఎవరి నుంచీ దొరకదేమో అనిపించడమే డిప్రెషన్ అత్యంత ప్రమాదకరమైన స్థితి. సమస్యకు పరిష్కారం చావు అనిపించడం దీని పర్యవసానం. ఇంతవరకూ వచ్చే లోపు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి పిల్లల్ని కాపాడుకుంటే వారు ఆ స్థితిని దాటుతారు. లేదంటే అపాయంలో పడతారు. కారణాలు టీనేజ్ పిల్లల్లో డిప్రెషన్, యాంగ్జయిటీ రావడానికి కారణాలు ఇదమిత్థంగా తేల్చలేము. చదువుకు సంబంధించిన ఒత్తిడి, తల్లిదండ్రులతో బలమైన అనుబంధం మిస్ కావడం, ర్యాంకుల బరువు, భవిష్యత్తుపై బెంగ, రూపం గురించిన చింత, మెదడులో అసమతుల్యత... ఏమైనా కావచ్చు. మనదేశంలోని సీబీఎస్ఈ స్కూళ్లల్లో సర్వే చేస్తే చాలామంది పిల్లలు తమకు క్లోజ్ ఫ్రెండ్స్ లేరని చెప్పారు. లక్షణాలు ఉత్సాహం చూపకపోవడం, చిరాకు, కోపం, ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం, నిద్ర సరిగా ఉండకపోవడం, అలసట, ధ్యాస లేకపోవడం, సరిగా చదవలేక పోవడం... ఏం చేయాలి? ముందు తల్లిదండ్రులు, తదుపరి స్కూళ్లు శ్రద్ధ వహించాలి. ► తల్లిదండ్రులు టీనేజ్లో ఉన్న పిల్లలతో నిత్యం సంభాషణ జరపాలి. వారితో కూచుని వారు నిస్సంకోచంగా తమ సమస్యలు చెప్పుకోనివ్వాలి. వారు చెప్పేది కొట్టేయకుండా, బదులు తిట్టకుండా అర్థం చేసుకోవాలి. సమస్య మూలాల వరకూ వెళ్లాలి. వారికి చాలా ప్రేమను ఇస్తూ కౌన్సిలింగ్ చేయాలి. రెండు శాతం కంటే తక్కువ మంది పిల్లలకు మందులతో వైద్యం అవసరం కావచ్చు. ► తల్లిదండ్రులు పిల్లల శ్రద్ధ, శక్తిని అంచనా వేస్తూ వారికి లక్ష్యాలు ఇవ్వాలి. వారికి పూర్తిగా ఇష్టం లేని, వారు చేయలేని చదువులో ప్రవేశ పెట్టరాదు. వారు గట్టి స్నేహితులు కలిగి ఉండేలా చూడాలి. ఆ స్నేహితులను ఇంటికి ఆహ్వానించి పిల్లలు వారితో గడిపేలా చేయాలి. పిల్లలను గాయపరిచే మాటలు తల్లిదండ్రులు మాట్లాడటం బొత్తిగా మానుకోవాలి. మేమున్నామన్న భరోసా ఇవ్వాలి. ► స్కూళ్లు విధిగా కౌన్సిలర్లను ఉంచాలి. తరగతి వారీగా, ప్రతి విద్యార్థిని మెంటల్ హెల్త్ విషయంలో అంచనా కట్టాలి. వారి సమస్యను అర్థం చేసుకుని టీచర్లకు, లెక్చరర్లకు అవగాహన కల్పించడమే కాక తల్లిదండ్రులకు సమస్య తెలపాలి. అసలు సమస్య మనదేశంలో దాదాపు 4 వేల మంది సైకియాట్రిస్ట్లు, వెయ్యి మంది క్లినికల్ సైకాలజిస్ట్లు ఉన్నారు. వీరంతా పెద్ద ఆస్పత్రుల్లో లేదా సొంత క్లినిక్లలో ఉంటారు. టీనేజ్ పిల్లలకు వీరితో యాక్సెస్ ఉండదు. స్కూళ్లల్లో మానసిక సమస్యలు గమనించి భరోసా ఇచ్చే కౌన్సెలర్ల వ్యవస్థ ఇప్పటికీ ఏర్పడలేదు. ప్రభుత్వ బడులలో చదివే పిల్లలకు తమకు మానసికంగా ఇబ్బంది ఉన్నట్టు గ్రహించడం కూడా తెలియదు. కనుక పిల్లలు ఆత్మహత్యలు చేసుకునే వరకూ వెళుతున్నారు. -
'నాకే సలాం కొట్టవా..?' బాలునిపై కాంగ్రెస్ నేత కొడుకు దాడి
ధన్బాద్: తనకు నమస్కారం చేయలేదని జార్ఖండ్ కాంగ్రెస్ నాయకుని కుమారుడు ఓ బాలునిపై దాడి చేశాడు. పిస్టల్తో బెదిరించి, కర్రలతో తీవ్రంగా కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాధితుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకుడు రణ్విజయ్ సింగ్ కుమారుడు రణ్వీర్ సింగ్. ధన్బాద్లో తాను వెళ్లే క్రమంలో నమస్కారం చేయలేదని 17 ఏళ్ల ఆకాశ్ చందల్ అనే బాలునిపై దాడి చేశారు. కారులో బలవంతంగా ఎక్కించి విపరీతంగా కొట్టారు. అనంతరం ఓ టీషాపు వద్దకు తీసుకెళ్లి మళ్లీ దాడి చేశారని బాధితుడు పోలీసులకు తెలిపాడు. తొమ్మిదో తరగతి చదువుతున్నానని తెలిపిన చందల్.. ట్యూషన్కు వెళ్లి వచ్చే క్రమంలో దాడి జరిగిందని చెప్పాడు. తాను ఓ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద నిలబడగా.. ఐదు కార్లు తమ ముందుగా వెళ్లాయని తెలిపాడు. ఇంతలో కారులోంచి రణ్వీర్ సింగ్ దిగి తనకు నమస్కారం పెట్టమని వేధించారు. సలాం కొట్టడానికి నిరాకరించగా.. కారులోకి ఎక్కించుకుని కొట్టారని చెప్పాడు. ఓ బాడీగార్డు తనను పట్టుకెళ్లి రణ్వీర్ సింగ్ పాదాల వద్ద పడేశాడని పోలీసులకు తెలిపాడు. "Parnam kaahe nahi kiya re Madh**d!" Dhanbad, Jharkhand: Ranveer, the son of a Congress leader Ranvijay Singh, brutally beat a student with the butt of a pistol for not touching his feet. An FIR has been registered after immense pressure. pic.twitter.com/VjdrTfg4xc — Treeni (@_treeni) August 29, 2023 ఈ దాడిపై స్పందించిన కాంగ్రెస్ నాయకుడు .. రణ్వీర్ సింగ్కు ఆ గొడవకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తన ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నంలోనే ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రగా ఆయన పేర్కొన్నారు. అందులో తన కొడుకు ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు కూడా లేవని చెప్పారు. వీడియోపై దర్యాప్తు చేయాలని అన్నారు. ఇదీ చదవండి: 'పాక్కు ఎందుకు వెళ్లలేదు..?' విద్యార్థులపై టీచర్ అనుచిత వ్యాఖ్యలు.. -
మద్యం మత్తులో యువతి హల్చల్.. రోడ్డుపై గంట పాటు చుక్కలు చూపించింది
బనశంకరి(బెంగళూరు): మద్యం అలవాటు చాలా మందికి ఉంటుంది. కొందరు తాగిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండా వారి ఇళ్లకు వెళ్తుంటారు. అయితే కొందరు మాత్రం కిక్కు ఎక్కువై రోడ్డు మీద నానా రభస చేస్తూ, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఇటీవల ఈ తరహా ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అధికారులు వీరి మీద చర్యలు తీసుకున్నప్పటికీ అవి ఆశించినంత ఫలితాలను ఇవ్వడం లేదనే చెప్పాలి. తాజాగా ఓ యువతి పీకల దాకా మద్యం సేవించిన మత్తులో హల్చల్ చేసింది. ఈఘటన నగరంలో జరిగింది. మత్తులో తూలుతూ కాలినడకన వస్తున్న ఆమెను కొందరు వెళ్లి రక్షించే ప్రయత్నం చేయగా వారిని దుర్భాషలాడింది. ఆమెను ఎలాగైన సురక్షితంగా ఇంటిక పంపాలని రాత్రి విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది ప్రయత్నం చేశారు. కానీ మహిళా పోలీసు సిబ్బంది లేనికారణంగా యువతిని ఆటోలో కూర్చోబెట్టడానికి ఇబ్బంది పడ్డారు. గంటపాటు ప్రయత్నించిన అనంతరం మరో యువతి సాయంతో ఆమెను ఇంటికి సురక్షితంగా తరలించారు. చదవండి హైదరాబాద్లో అమానుషం.. యువతి బట్టలిప్పి వివస్త్రను చేసిన కీచకుడు -
అప్పుడే జుట్టు తెల్లబడుతుందా? ఐతే ఇలా చేసి చూడండి!
ఒకప్పుడు యాభైఏళ్లు దాటిన వారికే తెల్లజుట్టు వచ్చేది కానీ ఇప్పుడు చాలామందికి పాతికేళ్లకంటే ముందే తెల్లజుట్టు వచ్చేస్తోంది. దాంతో ఉన్న వయసు కంటే పెద్దగా కనిపించడం, దానిని కప్పి పుచ్చుకోవడానికి తలకు రకరకాల హెయిర్ డైలు, షాంపూలు వాడటం... వాటిలోని రసాయనాల ప్రభావంతో సైడ్ ఎఫెక్టులు రావడం... వీటన్నింటి బదులు అసలు చిన్న వయసులోనే తెల్లజుట్టు ఎందుకు వస్తుందో చెబుతూ...దానిని నివారించడానికి తగిన సూచనలు, సలహాలతో కూడిన కథనం ఇది. చిన్న వయసులోనే తెల్లజుట్టు రావడానికి గల అనేక కారణాలలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన కారణాలు ప్రధానం. డైట్లో పోషకాల కొరత ఉండకూడదు. తెల్లజుట్టు రాకుండా ఉండాలంటే విటమిన్ బి ఉండే ఆహారాలని పుష్కలంగా తినాలి. డైట్లో ఇవి కచ్చితంగా ఉండేవిధంగా చూసుకోవాలి. జుట్టు తెల్లగా మారుతుందంటే విటమిన్ బి లోపం ఉందని అర్థం చేసుకోండి. అంతేకాదు దీనివల్ల జుట్టు రాలడం, పొడి జుట్టు సమస్యలు కూడా ఎదురవుతాయి. రోజువారీ ఆహారంలో విటమిన్ బి ఉందా లేదా అన్నదానిపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే హెల్తీ ఫుడ్స్ ద్వారా జుట్టుకు పోషణ లభిస్తుంది. తెల్ల జుట్టును సహజంగా నల్లగా సరైన సమయంలో ఆహారంలో మార్పులు చేయకపోతే అది జుట్టుకు హాని కలిగిస్తుంది. విటమిన్ బి సమృద్ధిగా లభించే పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవాలి. దీనితో పాటు విటమిన్ బి6, విటమిన్ బి12 కూడా ఉండే ఆహారాలని తినాలి. శరీరంలో విటమిన్ బి లోపం ఉంటే జుట్టుకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. బయోటిన్, ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కూడా చిన్న వయస్సులోనే జుట్టు నెరుస్తుంది. కాయధాన్యాలు, తృణధాన్యాలు, గింజలు, పాలు, పెరుగు, జున్ను, గుడ్డు, ఆకుకూరలు, గోధుమలు, పుట్టగొడుగులు, బఠానీ, పొద్దుతిరుగుడు గింజలు, అవకాడో, చేపలు, మాంసం, చిలగడదుంప, సోయాబీన్, బంగాళదుంప, బచ్చలికూర, అరటి, బ్రకోలీ, బీన్స్ ప్రతిరోజు డైట్లో ఉండేలా చూసువడం వల్ల తెల్లజుట్టు సమస్యను వాయిదా వేయచ్చు. గుడ్డులోని తెల్లసొన లేదా మజ్జిగతో కలిపి రుబ్బిన కరివేపాకు లేదా మెంతి ఆకు పేస్ట్ని తలకు ప్యాక్గా వేసుకోవాలి. రెండు గంటల తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేసుకోవాలి. తలస్నానానికి తక్కువ గాఢత ఉన్న షాంపూలనే ఉపయోగించాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల తెల్లజుట్టు రాదు. వచ్చిన తెల్ల జుట్టు కాలక్రమేణా నల్లగా మారుతుంది. తెల్ల జుట్టు సమస్యను అద్భుతంగా పారదోలే వాటిలో కాఫీ పొడి ఒకటి. ఓ గ్లాసుడు నీళ్లలో ఒకటిన్నర చెంచాల కాఫీ పొడిని మరిగించి చల్లారిన తర్వాత జుట్టు కుదుళ్లకు పట్టించాలి. వేళ్లను జుట్టు కుదుళ్లకు తగిలేలా మసాజ్ చేస్తుండాలి. ఇలా చేసిన 30 నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి. మీ తలకు సరిపడేటన్ని మందార ఆకులు తీసుకుని పేస్ట్ లా చేసుకుని అందులో కొబ్బరి నూనె కలిపి జుట్టుకి అప్లయ్ చేసి 2 గంటల తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల తెల్లజుట్టు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. హెర్బల్ హెన్నాలో బీట్ రూట్ రసం కలిపి ప్యాక్ వేసుకున్నా జుట్టుకు మంచి రంగు వస్తుంది.హెన్నా పౌడర్ ను ఆముదంలో మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ పై నుంచి దించి చల్లారిన తర్వాత దానిని జుట్టు కుదుళ్లకు అంటుకునేలా రాయాలి. ఆ తర్వాత కుంకుడు కాయ లేదా శీకాయతో తలస్నానం చేయాలి. తెల్లజుట్టు ఉన్న వారు పెనంపై రెండు చెంచాల పసుపును వేసి వేడి చేసి నల్లగా మారేంత వరకు మాడ్చాలి. చల్లారిన తర్వాత దీనికి సరిపోయేంత కొబ్బరినూనె లేదా నువ్వులనూనెలో కలిపి తలకు పట్టించాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఎక్కువ కాలం నల్లగా ఉంటుంది. తల స్నానానికి గోరు వెచ్చని నీళ్లు మాత్రమే వాడాలి. (చదవండి: కొంబుచా హెల్త్ డ్రింక్! దీని ప్రయోజనాలకు ఫిదా అవ్వాల్సిందే!) -
పైశాచికత్వం: యువతిని 14 ఏళ్లు బందించి.. శృంగార బానిసగా మార్చి..
రష్యాలో అతి కిరాతక ఘటన వెలుగులోకి వచ్చింది. యువతిని 14 ఏళ్లుగా ఒకే ఇంట్లో బందించి శృంగారానికి బానిసగా మార్చుకున్నాడో వ్యక్తి. ఇన్నేళ్లుగా ఆమెను బయటకు వెళ్లనీయకుండా బందించి, దాదాపు 1000 సార్లకు పైగా అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా మహిళను అనేక పర్యాయాలు హింసించి రాక్షసంగా ప్రవర్తించాడని పేర్కొన్నారు. నిందితున్ని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ రష్యాలోని చెల్యాబిన్స్క్లో వ్లాదిమిర్ చెస్కిడోవ్(51) అనే వ్యక్తి రాక్షస ప్రవృత్తిని ప్రదర్శించాడు. ఇంటికి ఆల్కహాల్ పార్టీకి పిలిచి ఎకటెరినా అనే యువతిని 2009లో బందించాడు. బెడ్రూం నుంచి ఆమె బయటకు రాకుండా నిర్భందించాడు. దాదాపు 1000కి పైగా సార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. ప్రస్తుతం ఆమె వయస్సు 33 ఏళ్లు. అతని తల్లి సహాయంతో.. వ్లాదిమిర్ చెస్కిడోవ్ ఇటీవల మానసిక రుగ్మతలతో బాధపడుతున్నాడు. ఈ కారణంతో ఆస్పత్రికి వెళ్లాడు. ఈ క్రమంలో బాధిత మహిళకు చెస్కిడోవ్ తల్లి సహాయం చేసింది. బయటకు పారిపోవడానికి ఏర్పాటు చేసింది. దీంతో బయటకు వచ్చి పోలీసులకు జరిగిన ఉదంతాన్ని వివరించింది. కత్తితో బెదిరించేవాడని తెలిపింది. చిన్న చిన్న విషయాలకు తీవ్రంగా హింసించేవాడని వెల్లడించింది. దీంతో ఇన్నేళ్లుగా సాగిన బయంకరమైన ఘటన బయటకొచ్చింది. ఇదీ చదవండి: యుద్ధఖైదీల పట్ల అమానుషం.. లైంగికంగా వేధించి.. చిత్రహింసలకు గురిచేసి.. సెక్స్ టాయ్, శృంగార సీడీలు.. బాధిత మహిళ చెప్పిన విషయాల ఆధారంగా స్మోలినో గ్రామంలోని నిందితుని ఇంటికి వెళ్లిన పోలీసులకు బయంకరమైన వస్తువులు కనిపించాయి. చెస్కిడోవ్ ఇళ్లు సెక్స్ టాయ్స్, శృంగార వీడియోలతో నిండి ఉంది. ఇంటి నేలమాళిగలో మానవ అవశేషాలు కూడా కనిపించాయి. మరో మహిళతో.. నిందితుని ఇంటి నుంచి బయటకొచ్చిన ఎకటెరినా.. పోలీసులకు మరో విషయాన్ని వెల్లడించింది. తనను బందించిన ఇంటికే మరో మహిళా ఖైదీని కూడా చెస్కిడోవ్ తీసుకువచ్చాడని తెలిపింది. 2011లో జరిగిన గొడవలో ఆమెను అంతమొందించినట్లు పోలీసులకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఆ మహిళను అనేక సార్లు పొడిచి అత్య చేసినట్లు వెల్లడించింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మానసిక రోగంతో ఉన్న నిందితున్ని ఆస్పత్రిలో తమ సమక్షంలో ఉంచినట్లు తెలిపారు. ఇదీ చదవండి: దక్షిణాఫ్రికా రాజకీయాలు హింసకు దారి తీస్తున్నాయా? -
45 ఏళ్ల వరుడు..13 ఏళ్ల వధువు.. బాలికను తీసుకుని పరార్
సాక్షి, నవీపేట (నిజామాబాద్ జిల్లా): జిల్లాలోని నవీపేట మండలం ఫకీరాబాద్ గ్రామానికి చెందిన అబ్బాపూర్ (బి) తండాలో ఓ తండ్రి రూ.60 వేలకు ఆశపడి 13 ఏళ్ల తన కూతురుకు బాల్య వివాహం జరిపించేశాడు. గ్రామానికి చెందిన కొంతమంది యువకులు బాలిక తండ్రిని నిలదీయడంతో అప్పటికే పెళ్లికొడుకు బాలికతో కలిసి పరారయ్యాడు. ఫకీరాబాద్ గ్రామానికి చెందిన మలావాత్ సాయెబ్రావ్ (45)కు అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. అబ్బాపూర్ (బి) తండాకు చెందిన ఓ వ్యక్తి తన కూతుర్ని సాయెబ్రావ్కు ఇచ్చి వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాడు. అందుకుగాను సాయెబ్రావ్ వద్ద నుంచి రూ.60 వేలను బాలిక తండ్రి తీసుకున్నాడు. దీంతో శుక్రవారం అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా ఇరువురు బంధువుల సమక్షంలో బాలికకు పెళ్లి జరిపించేశారు. అయితే బాల్యవివాహం గురించి తెలుసుకున్న గ్రామానికి చెందిన కొంతమంది యువకులు వెళ్లి బాలిక తండ్రిని, పెళ్లిపెద్దలను నిలదీయగా వారు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. దీంతో ఆ యువకులు హెల్ప్లైన్ ద్వారా పోలీసులకు, ఐసీడీఎస్కు సమాచారం ఇచ్చారు. ఈలోగా సాయెబ్రావ్ బాలికను తీసుకుని పారిపోయాడు. సమాచారం అందుకున్న డీసీపీవో చైతన్యకుమార్, చైల్డ్హెల్ప్లైన్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ జ్యోత్స్నదేవి, ఐసీడీఎస్ సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి గ్రామానికి వెళ్లి విచారించారు. బాలిక తండ్రి అందుబాటులో లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయెబ్రావ్తో పాటు పెళ్లికి సహకరించిన పెద్దలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనపై జీపీ కార్యదర్శి షేక్ అహ్మద్ పాషా ఫిర్యాదు చేశారు. -
తెలియని వ్యక్తులతో చాటింగ్ చేస్తున్నారా? ఆ మాయలో పడకండి
సోషల్ మీడియా ద్వారా చిన్న చిన్న అట్రాక్షన్స్కు లోనై ‘లవ్’ పేరుతో ట్రాఫికింగ్ బారిన పడుతున్న అమ్మాయిల వ్యథలు ఇటీవల ఎన్నో ఉంటున్నాయి. ఈ సమస్య సమాజంలో ఎలాంటి పరిణామాలను సృష్టిస్తుందో, ముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు చెప్పే విషయాలను ‘మనం మాట్లాడుకోవాల్సిందే!’’ మనం మాట్లాడుకోవాల్సిందే! ఆన్లైన్ లవ్ మాయలో పడొద్దు! ‘ప్రియ (పేరుమార్చడమైనది) కనిపించక రెండు రోజులవుతోంది. ఏం జరిగిందో తెలియక తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కంప్లైంట్ ఇచ్చిన ఒక రోజులోనే ప్రియని తీసుకొచ్చి, తల్లిదండ్రులకి అప్పజెప్పారు పోలీసులు. వారు చెప్పిన విషయం విన్న తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ప్రియ వయసు పదిహేనేళ్లు. పదో తరగతి చదువుతోంది. కరోనా టైమ్లో ఆన్లైన్ క్లాసెస్ కోసం తండ్రి స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. ఇప్పటికీ ఆ ఫోన్ తనే వాడుతోంది. మూడు నెలల క్రితం సోషల్ మీడియాలో ఆమెకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని పేరు విక్కీ. ఫ్రెండ్గా ఆమె మంచి చెడులు కనుక్కుంటూ, చాటింగ్ చేస్తూ ఉండేవాడు. మొదట వాయిస్ కాల్స్, ఆ తర్వాత వీడియో కాల్స్ మాట్లాడుతుండేవాడు. అతను చెప్పే ప్రేమ కబుర్లు ప్రియకు బాగా నచ్చాయి. అమ్మానాన్నలు ఎంతసేపూ చదువు చదువు అని అంటుంటారు. కానీ, వాటి గురించి విక్కీ మాట్లాడడు. ఒక్కరోజు విక్కీ చాట్ చేయకపోయినా, ఫోన్లో మాట్లాడకపోయినా ప్రియకు ఊపిరాడనట్లుండేది. విక్కీ ఏం చెప్పినా ప్రియ వెనకాడకపోయేది. రోజు రోజుకూ విక్కీ లేకపోతే తను బతకలేనని అనిపించసాగింది ప్రియకు. దీంతో ఓ రోజు విక్కీ చెప్పిన చోటుకు వెళ్లిపోవాలనుకుంది. దాంతో తల్లికి తెలియకుండా డబ్బులు తీసుకుని చెప్పకుండా వెళ్లిపోయింది. ఎవరికైనా చెబితే పరువు పోతుందనే భయం ఓ వైపు, కూతురు ఏమైందోననే భయం మరోవైపు వారిని కుదిపేసింది. తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్తో.. ప్రియ ముంబైకి చేరుకున్నట్టు కనిపెట్టిన పోలీసులు, ఆమెను సురక్షితంగా తిరిగి తీసుకొచ్చారు. ఇలాంటి కథనాలు ఇటీవల మనం తరచూ వింటున్నాం. పెద్ద శిక్ష ♦ ఆన్లైన్లోనే కాదు బయట కూడా అమ్మాయిలను ట్రాప్ చేయడానికి చిన్న చిన్న ఆకర్షణ పథకాలను అమలు చేసేవారుంటారు. ♦ మైనర్ అమ్మాయిలు/అబ్బాయిలు పరిచయం లేని వ్యక్తులు ఇచ్చే కానుకలకు కూడా అట్రాక్ట్ అవుతుంటారు. ♦ అవతలి వారు చెప్పేది నిజం అని నమ్మి, ఇంటిని వదిలి వెళ్లిపోతుంటారు. ♦ ఇంట్లో ప్రేమ దక్కలేదనో, మరో కారణం చేతనో బయటి వ్యక్తుల పట్ల ఆకర్షితులవుతుంటారు. అలవాట్లు రుగ్మతలు అవుతున్నాయి. రుగ్మతలుగా మారడం వల్లే నేరాలు కూడా భిన్నంగా మారిపోయాయి. ఇంటర్నెట్ వల్ల మంచి ఎంత పెరిగిందో, చెడు అంతకన్నా ఎక్కువ పెరిగింది. కొందరికి ఇదొక ఉపయోగకరమైన అడిక్షన్గా కూడా మారింది. ప్రతిదీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో అందరిలోనూ కాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా పెరిగాయి. దేనికోసం మనం ముందుకు వెళుతున్నాం అనే స్పష్టత ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. షార్ట్కట్స్లో సంపాదించాలనే ఆలోచన వల్ల కూడా సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి. చూడకూడనివి ఎక్కువ చూడటం వల్ల మనస్తత్వాలు మారుతున్నాయి. ఫోన్ చూడద్దని, ఇంటర్నెట్ చూడద్దని, ఎక్స్పోజర్ తగ్గించుకోమని చెప్పలేం. ఇవన్నీ మన జీవితంలో భాగమైనప్పుడు ఎలా డీల్ చేయాలో తెలుసుకోవడం మాత్రమే ఈ రోజుల్లో కుటుంబాలకు అవసరం. ఈ రోజుల్లో మైనర్లు ఇంటర్నెట్లో ఎక్కువ ఉంటున్నారు. వారిని గమనిస్తూ, మంచి చెడులను చర్చిస్తూ ఉండాలి. ప్రేమ, పెళ్లి పేరుతోనో వెళ్లిపోయారని, వీటిని మిస్సింగ్ కేస్ కింద చూడం. కిడ్నాప్ కింద రిజిస్టర్ చేస్తాం. ట్రేస్ అవగానే రేప్ సెక్షన్స్ యాడ్ చేస్తాం. ఒక్కసారి పోక్సో కేసు కింద నమోదు చేసిన తర్వాత నేరస్తులకు శిక్ష భారీ ఎత్తున పడుతుంది. నాన్బెయిలబుల్ సెక్షన్స్ కింద కేస్ బుక్ అవుతుంది. మైనర్ని తీసుకువెళ్లి, పెళ్లి చేసుకున్నా అది చట్టరీత్యా నేరం. మైనర్ అమ్మాయి లేదా అబ్బాయి ఇద్దరిలో ఎవరు మిస్ అయినా దానిని ట్రాఫికింగ్కు సంబంధించిన సెక్షన్స్ కింద కేస్ రిజిస్టర్ చేస్తాం. రూరల్, అర్బన్ ఏరియాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఆన్లైన్ ప్రేమల జోలికి వెళ్లకుండా ఉండటమే ఉత్తమం. – సుమతి, ఐపీఎస్, డీఐజీ, ఉమెన్ సేఫ్టీ వింగ్, తెలంగాణ ఇదొక వ్యసనం పరిచయం లేని వ్యక్తులు తమ పట్ల చూపే కన్సర్న్ని నిజమైన ప్రేమ అనుకొని భ్రమిస్తుంటారు కొందరు. ఈ మోహం ఆమె/ అతడి ఆరోగ్యం, భవిష్యత్తు సంబంధాలను ప్రభావితం చేస్తుంది. న్యూరలాజికల్ కెమికల్ అయిన ఫినైల్ ఇథైలమైన్ పెరగడం వల్ల ప్రేమభావాలు కలుగుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. మోహానికి గురైన వ్యక్తులు ఆల్కహాల్, డ్రగ్స్ వంటి అలవాట్లకు కూడా లోనవుతుంటారు. వారిలో ఆనందపు స్థాయులను పెంచుకోవడానికి రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. ఇందుకు సినిమాలు, ఇంటర్నెట్ పోర్న్ సదుపాయాలు కూడా పిల్లల మెదళ్లపై ప్రభావం చూపుతున్నాయి. ఇదొక వ్యసనం అని చాలామంది గుర్తించరు. ఆన్లైన్ రిలేషన్షిప్స్ తల్లిదండ్రులకు తెలియడం లేదు. పిల్లల ఆన్లైన్ నెట్వర్కింగ్ గురించి తల్లితండ్రులకు, కౌన్సెలింగ్ థెరపీ ద్వారా పిల్లల్లోనూ మంచి మార్పులు తీసుకురావచ్చు. స్కూళ్లు, కాలేజీల్లో కూడా ‘లవ్, రిలేషన్షిప్స్’ డిజిటల్ వాడకం, ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అనే విషయాల పైన అవగాహన తరగతులు తీసుకోవాలి. – డాక్టర్ గిడియన్,డి–అడిక్షన్ థెరపిస్ట్ లివింగ్ సోబర్, హైదరాబాద్ – నిర్మలారెడ్డి -
స్పైడర్ మ్యాన్ ను పట్టుకొని చితక్కొట్టేశారు..
న్యూయార్క్: 15 ఏళ్ల అమెరికా టీనేజర్ స్పైడర్ మ్యాన్ వేషధారణలో పార్కుకు వెళ్తే అక్కడి ఆకతాయి యువత బాలుడిని ఎగతాళి చేసి గాయపరిచారు. పాపం స్పైడర్ మ్యాన్ కు ముక్కు నుండి రక్తం ధారకట్టడంతో నిస్సహాయంగా నిలుచుండిపోయాడు. వారు దాడి చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. హడ్సన్ ఫాల్స్ కు చెందిన 15 ఏళ్ల అయిడిన్ పెడోన్ న్యూయార్క్ లోని ఒక పార్కు వారు నిర్వహించిన సూపర్ హీరో థీమ్ లో పాల్గొనేందుకు తనకు ఇష్టమైన స్పైడర్ మ్యాన్ గెటప్ వేసుకుని పార్కుకి వెళ్ళాడు. అంతలోనే అక్కడికి వచ్చిన కొంతమంది టీనేజర్లు అయిడిన్ చుట్టూ చేసిరి మొదట ఎగతాళి చేశారు. ఆ గుంపులోని ఒక అమ్మాయి అయిడిన్ ముఖంపై బలంగా కొట్టింది. దాంతో తూలిపడబోయిన అయిడిన్ ఆపుకుని స్పైడర్ మ్యాన్ మాస్క్ తొలగించగా ముక్కు మీద తీవ్ర గాయం కావడంతో రక్తం బొటబొటా కారింది. ఈ సంఘటన జరుగుతుండగా పార్కులో మిగతావారు ఫోన్లో ఈ సన్నివేశాన్ని వీడియో తీస్తూ కనిపించడం విశేషం. This is actually disgusting… I hope there were consequences for what they did to that poor boy pic.twitter.com/vQ2hHEDcU4 — FadeHubb (@FadeHubb) July 1, 2023 స్థానిక మీడియా న్యూయార్క్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం అయిడిన్ చికిత్స పొందుతున్నాడని, గో ఫండ్ మి అనే పేజీ ప్రతినిధులు మరోసారి అయిడిన్ ఇలా దెబ్బలు తినకుండా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి చందాలు వసూలు చేయగా ఇప్పటికి 10,000 యూఎస్ డాలర్లు( రూ 8.21 లక్షలు) పోగయ్యాయని అన్నారు. ఆరో తరగతి చదువుతున్న అయిడిన్ కు ఆత్మన్యూనతా భావం ఎక్కువని, స్కూల్లో తరచుగా సహచరులు తనని ఆటపట్టిస్తూ ఉండటంతో ఆ భావం నుండి బయటపడేందుకు ఆదివారం తనకు ఇష్టమైన స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకున్నాడని, తీరా అక్కడ ఇలా జరగడం అమానుషమని అన్నారు. చుట్టూ ఉన్నవారు దాడిని ఆపకపోగా వీడియోలు తీస్తూ నవ్వుతుండడం మరింత బాధించిందని తెలిపారు. అయిడిన్ తల్లి ఫిర్యాదు మేరకు హడ్సన్ ఫాల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దాడి చేసిన టీనేజ్ అమ్మాయిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఇది కూడా చదవండి: Roller Coaster: తలకిందులుగా వేలాడుతూ.. 3 గంటలు నరకయాతన..
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
లెహంగాలో అదిరిపోతున్న జాన్వీ..ఆ నెక్లెస్ స్పెషాలిటీ ఏంటంటే..!
దిశ ఎఫెక్ట్: విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు
మేజర్ లీగ్ క్రికెట్కు లిస్ట్-ఏ హోదా
చిరుత హీరోయిన్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్తోనే భయపెట్టేశారు!
మహిళల అశ్లీల వీడియోలు సీక్రెట్ గా రికార్డ్...
Janhvi Kapoor: మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రమోషన్స్లో జాన్వీ బిజీ బిజీ..క్రికెట్ థీమ్ నెక్లెస్..!
హీరామండి నటితో డేటింగ్.. స్పందించిన నటుడు..!
తెల్లచీరలో రాయంచలా మెరిసిపోతున్న ఈ బ్యూటీ గుర్తుందా!
ఎమ్మెల్సీ కవిత బెయిల్.. తీర్పు రిజర్వ్
Deepika Padukone : దీపికా పడుకోణె అమేజింగ్ లగ్జరీ కార్లు, విలువ ఎంతో తెలుసా?
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత-ఏ జట్టు
- స్కానింగ్ సెంటర్లో టెక్నీషియన్ వికృత చేష్టలు.. న్యూడ్ ఫొటోలు తీసి..
- రాజమౌళి పేరు చెప్పే అర్హత నాకిప్పుడు లేదు: డైరెక్టర్
- పపువా న్యూ గినియా విపత్తుపై ప్రధాని మోదీ ట్వీట్
- ఫోన్ ట్యాపింగ్.. నేను అలాంటి పనులు చేయను: సీఎం రేవంత్
- తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
- ప్రజా భవన్లో ముగిసిన తనిఖీలు..
- పడిలేసిన పసిడి.. పరుగులు పెడుతున్న వెండి: నేటి కొత్త ధరలు ఇలా..
- కుప్పకూలిన క్వారీ.. పది మంది మృతి
- 'ప్రపంచ ఆకలి దినోత్సవం': ఎంతమంది బాధపడుతున్నారంటే..?
Advertisement