eve teasing
-
HYD: బోరబండలో రెచ్చిపోయిన కామాంధులు!
హైదరాబాద్: బోరబండ(Borabanda)లో అందరూ చూస్తుండగానే దారుణం జరిగింది. పదిహేడేళ్ల ఓ బాలికతో కొందరు దుండగులు అనుచితంగా ప్రవర్తించారు. ఇంట్లోకి వెళ్లి మరీ ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ ఆటో డ్రైవర్ వాళ్లను అడ్డుకుని.. ఆమెను రక్షించారు. అయితే.. దుండగుల దాడిలో ఆ డ్రైవర్కు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు 100కు(Dial 100) ఫోన్ చేసి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు(Police) ఆ కామాంధులను అదుపులోకి తీసుకున్నారు. గాయపడి డ్రైవర్ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది.ఇదీ చదవండి: కామాంధుడికి 20 ఏళ్ల జైలు శిక్ష -
యువతి నుదిట సింధూరం.. యువకుడి పాలిట మరణ శాసనం
సాక్షి, క్రైమ్: షాద్నగర్లో దారుణం జరిగింది. బలవంతంగా యువతి నుదట దిద్దిన సింధూరం!.. ఓ యువకుడిపాలిట మరణ శాసనమైంది. ప్రేమ పేరుతో తన కూతురిని వేధిస్తున్నాడంటూ ఓ యువకుడిని హతమార్చాడు ఓ తండ్రి. సినీ ఫక్కీలో పక్కా మర్డర్కు ప్లాన్ వేసి మరీ కిరాతకంగా ప్రాణం తీశాడు. బీహార్కు చెందిన కరుణాకర్ కుటుంబం.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలో నివాసం ఉటూ చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆగష్టు 29వ తేదీ నుంచి కరుణాకర్ కనిపించకుండా పోయాడు. దీంతో.. అతని సోదరుడు దీపక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకు దర్యాప్తులో షాకింగ్ విషయాలు తెలిశాయి. రంజిత్ కుమార్ అనే వ్యక్తి ప్లాన్ ప్రకారమే కరుణాకర్ను హత్య చేశారని పోలీసులు దర్యాప్తు ద్వారా తేల్చారు. రంజిత్ కుమార్ కూతురిపై కరుణాకర్ ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె నుదుటిపై సింధూరం కూడా దిద్ది ఆమెను ఇబ్బందికి గురి చేశాడు. ఈ విషయం బయటకు పొక్కితే తన పరువు పోతుందని రంజిత్ రగిలిపోయాడు. కరుణాకర్ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఆగష్టు 15వ తేదీన కేశంపేట మండలంలోని నిడదవెళ్లి గ్రామం నుంచి జూలపల్లి వెళ్లే రోడ్డులో ఉన్న వరి చేను దగ్గరికి పిలిపించుకున్నాడు. విచక్షణా రహితంగా కరుణాకర్పై దాడికి దిగాడు. కాళ్లు చేతులు కట్టేసి వరి చేను నీటి బురద లో తలకాయ ముంచి ఊపిరాడకుండా చేసి హత్య చేసి అదే బురదలో పాతిపెట్టి వెళ్లిపోయారు. దర్యాప్తు ద్వారా ఈ కేసును చేధించామని, ప్రధాన నిందితుడు రంజిత్తో పాటు అతనికి సహకరించిన వాళ్లనూ అరెస్ట్ చేశామని శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి మీడియాకు వెల్లడించారు. నిందితులపై 302, 201 ,34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉండగా.. వాళ్లను జువైనల్ హోంకు తరలించినట్లు తెలిపారు. -
నిమజ్జనంలో నికృష్ట పనులు.. 240 మంది పోకిరీల పట్టివేత
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకు జరిగిన నవరాత్రి ఉత్సవాలపై నగర షీ– టీమ్స్కు చెందిన ప్రత్యేక బృందాల డేగకన్ను ఫలితంగా 240 మంది పోకిరీలు చిక్కినట్లు అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ సోమవారం ప్రకటించారు. నిమజ్జనం రోజుతో పాటు విగ్రహాలను ఏర్పాటు చేసిన మండపాల దగ్గరా షీ–టీమ్స్ నిఘా వేశాయి. మఫ్టీల్లో, రహస్య కెమెరాలతో ఉన్న ఈ బృందాలకు మహిళలు, యువతులను వేధిస్తున్న 240 మంది పోకిరీలు చిక్కారు. వీరిని పక్కా సాక్ష్యాలతో సంబంధిత కోర్టుల్లో హాజరుపరిచినట్లు ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. పోకిరీలకు కనిష్టంగా రెండు నుంచి గరిష్టంగా పది రోజుల వరకు జైలు శిక్ష విధించినట్లు చెప్పారు. షీ–టీమ్స్ కృషిని కొత్వాల్ సీవీ ఆనంద్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థినులపై హెచ్ఎం అసభ్యకర ప్రవర్తన మహబూబాబాద్ రూరల్: విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ హెచ్ఎంను పాఠశాలకు రావద్దని.. విద్యార్థుల తల్లిదండ్రులు, తండావాసులు వెళ్లగొట్టారు. మహబూబాబాద్ దూదియ తండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం షేక్ సర్వర్ పాషా కొన్నిరోజులుగా తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఐదుగురు విద్యార్థినులు శుక్రవారం వారి తల్లిదండ్రులకు చెప్పారు. సోమవారం వారందరూ పాఠశాలకు చేరుకుని హెచ్ఎంను నిలదీశారు. పిల్లలకు విద్యాభోధన చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. అయితే, తనను క్షమించమని, ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా పనిచేస్తానని ఉపాధ్యాయుడు చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే.. కొన్ని రోజులుగా మద్యం తాగి పాఠశాలకు వచ్చి హెచ్ఎం తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని విద్యార్థినులు ఆరోపించారు. గతంలోనూ ఇలాగే ప్రవర్తించాడని, ఇంట్లో చెబుతామంటే వద్దన్నాడని తెలిపారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పర్వతగిరి జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం రాందాస్కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపించిన డీఈఓ.. ఉపాధ్యాయుడు సర్వర్ పాషాను సస్పెండ్ చేశారు. (చదవండి: హాస్టల్లో కామాంధుడు.. విద్యార్థులకు వీడియోలు చూపించి..) -
ఈవ్ టీజింగ్ను ప్రతిఘటించిన మహిళ.. బ్లేడుతో దాడి.. 118 కుట్లు
భోపాల్: ఈవ్ టీజింగ్ను ప్రతిఘటించిన మహిళపై ముగ్గురు బ్లేడుతో విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచారు. ముఖమంతా రక్తమోడుతున్న ఆమెకు ఆస్పత్రిలో 118 కుట్లువేసి చికిత్స చేశారు. భోపాల్లో జూన్ 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రాత్రిపూట భర్తతో కలిసి బైక్ మీద ఇంటికొస్తున్న మహిళపట్ల ఇద్దరుబాలురు, ఒక వ్యక్తి ఈవ్టీజింగ్కు పాల్పడ్డారు. ప్రతిఘటించిన ఆమె ముఖంపై 10 సెంటీమీటర్ల మేర లోతైన గాటు పెట్టి బ్లేడుతో పలుచోట్ల దాడిచేశారు. నిందితులను పోలీసులు అరెస్ట్చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం శివరాజ్ ఆదేశించారు. బాధితురాలిని సీఎం పరామర్శించి లక్ష ఆర్థికసాయం ప్రకటించారు. మున్సిపల్ అధికారులు ఒక నిందితుని ఇంటిని కూల్చివేశారు. अन्याय का प्रतिकार करना अन्य लोगों के लिए प्रेरणा का कार्य है, इस नाते बहन सीमा अन्य महिलाओं के लिए प्रेरक भी हैं। उनके बेटा और बेटी पढ़ते हैं और उनके सहयोग के लिए भी कलेक्टर भोपाल को आवश्यक निर्देश दिये हैं। pic.twitter.com/BXQ5ywPCxG — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) June 12, 2022 -
పోకిరీ మైనర్!
సాక్షి, సిటీబ్యూరో: ఈవ్ టీజర్ల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మహిళలు, అమ్మాయిలను నడి రోడ్డు మీదే అసభ్య పదజాలంతో దూషించడం, ఫోన్, సోషల్ మీడియాలలో వేధిస్తున్నారు. 319 మంది ఈవ్ టీజర్లకు, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సైబరాబాద్ షీ టీమ్స్ కౌన్సెలింగ్ ఇచ్చాయి. వీరిలో 98 మంది మైనర్లే ఉన్నారు. 19–24 ఏళ్ల వయస్కులు 112 మంది ఉండగా.. 25–35 ఏళ్ల వాళ్లు 92 మంది, 36–50 ఏళ్ల వయస్సు వారు 17 మంది ఉన్నారు. గత రెండు నెలలో సైబరాబాద్ షీ టీమ్కు వివిధ మాధ్యమాల ద్వారా 355 ఫిర్యాదులు అందాయి. వీటిలో అత్యధికంగా 299 ఫిర్యాదుల వాట్సాప్ ద్వారా చేయగా.. ట్విటర్లో 8 మంది, హ్యాక్ ఐలో 7 మంది, ఈ–మెయిల్ ద్వారా 5 మంది, ఉమెన్ సేఫ్టీ వింగ్ ద్వారా 36 మంది, భౌతికంగా 30 మంది ఫిర్యాదు చేశారు. ఫోన్లో మహిళలను వేధించే ఆకతాయిలే ఎక్కువ. గత రెండు నెలలలో 141 పిటీషన్లు ఈ తరహావే కావటం గమనార్హం. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తున్నారని 34 మంది, సోషల్ మీడియాలో 33, బెదిరింపులు 33, స్టాల్కింగ్ 35 మంది, పెళ్లి చేసుకుంటానని మోసం పోయిన మహిళలు 19 మంది, అసభ్యప్రవర్తన 31, వాట్సాప్లో వేధింపులు 11, కామెంట్లు 7 మంది, రహస్యంగా మహిళల ఫొటోలు, వీడియోల చిత్రీకరణ 3, పని ప్రదేశాలలో వేధింపులు 3, ప్రేమ సమస్యలు 2, ఫ్లాషింగ్ 2 మంది మహిళా బాధితులున్నారు. 7 బాల్య వివాహాలకు చెక్.. గత రెండు నెలల వ్యవధిలో సైబరాబాద్ కమిషనరేట్లో 7 బాల్య వివాహాలను షీ టీమ్లు అడ్డుకున్నాయి. 81 కేసులను నమోదు చేశాయి. వీటిలో 18 క్రిమినల్ కేసులు కాగా.. 63 పెట్టీ కేసులున్నాయి. బస్టాప్స్, రైల్వే స్టేషన్లు, మాల్స్, కాలేజీలు వంటి బహిరంగ ప్రదేశాలలో 1,003 డెకాయ్ ఆపరేషన్లను నిర్వహించారు. ఆయా ప్రాంతాలలో 248 మంది రెడ్ హ్యాండెడ్గా పట్టుబడగా.. వీటిలో 117 పెట్టీ కేసులను నమోదు చేశారు. మిగిలిన ఆకతాయిలను కౌన్సెలింగ్కు పంపించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రాత్రి సమయాల్లో నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లలో 75 మంది రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్, సైబరాబాద్ షీ టీమ్ సంయుక్తంగా కలిసి కౌన్సెలింగ్ ఇచ్చాయి. -
SHE Teams: ఏడేళ్లుగా ‘ఆమె’కు నిరంతరం రక్షణగా..
సంతోషకరమైన జీవనం వైపుగా అడుగులు వేయడానికి భద్రమైన మార్గంలో పయనించడానికి సమాజం మనందరికీ చేదోడు వాదోడుగా నిలుస్తుంది. కానీ, ఈ సమాజంలో మహిళ రక్షణ ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉంటోంది. దీనికి సమాధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైంది ‘షీ టీమ్’. ఉమెన్ సేఫ్టీ వింగ్ కార్యక్రమాల్లో భాగంగా స్త్రీల రక్షణ కోసం 24 గంటలూ పనిచేస్తూ మహిళా నేస్తంగా మారిన ‘షీ టీమ్’ సేవలకు ఏడేళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో మహిళల భద్రత ఏవిధంగా ఉంది? పెరుగుతున్న నేరాలు, మారుతున్న విధానాలు తీసుకుంటున్న చర్యల గురించి పూర్తి సమాచారంతో మన ముందుంచింది తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్. వేధింపులకు చెక్పెట్టడమే లక్ష్యం – స్వాతి లక్రా ► తెలంగాణలో ‘షీ టీమ్’ ఏర్పాటై ఏడేళ్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన ఫలితాలను చూసినప్పుడు మీకేమనిపించింది? ‘షీ టీమ్’ గురించి 90 శాతం ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో అవగాహన రావడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇదే విషయం మీద సర్వే చేశాం. దాంట్లో మంచి రేటింగ్ వచ్చింది. ప్రజలకు ‘షీ టీమ్’ సేవలు బాగా నచ్చాయి. మంచి ఫలితాలు వచ్చాయి. ప్రతి యేటా 5 వేలకు పైగా ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నాం. మహిళల రక్షణ, వారి భద్రతకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఒక వేదిక ఉండాలనుకుని ప్రభుత్వం అక్టోబర్ 24, 2014లో హైదరాబాద్లో షీ టీమ్ను ప్రారంభించింది. ఏప్రిల్, 2015లో తెలంగాణ మొత్తంగా షీ టీమ్ సేవలను విస్తృతం చేసింది. ► ఇన్నేళ్లుగా వచ్చిన మహిళలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇటీవల మహిళలపై నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు ఎలాంటివి? గతంలో భౌతిక దాడులు, లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్కు సంబంధించినవి మొదటి జాబితాలో ఉండేవి. దాదాపు వందలో 60 శాతం ఫోన్ వేధింపులు, సామాజిక మాధ్యమాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉంటున్నాయి. ఈ ఫిర్యాదుల్లో వాట్సప్ ద్వారా వచ్చేవి ఎక్కువ ఉండగా, డయల్ –100, ఫేస్బుక్, హ్యాక్ ఐ యాప్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్ నుంచి కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. ► సామాజిక మాధ్యమాల ద్వారా పెరిగే వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి తీసుకుంటున్న చర్యలు? మహిళలు చాలా మంది వేధింపుల బారిన పడుతున్నామని తెలిసినా ఫిర్యాదు చేయడానికి ఇంకా ముందుకు రావడం లేదు. ముందు వాళ్లలో చాలా మార్పు రావాలి. ఏ వేధింపులైనా వెంటనే మాకు తెలియజేయడం ద్వారా సత్వర పరిష్కారం లభిస్తుంది. ఉమన్ సేఫ్టీ వింగ్లో ప్రత్యేకంగా సైబర్ క్రైమ్కు సంబంధించి ‘షీ ల్యాబ్’ను కూడా ప్రారంభిస్తున్నాం. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ వేధింపులను సైబర్ నిపుణుల ద్వారా కనిపెట్టి, వీటికి అడ్డుకట్ట వేస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచీ సైబర్ నేరస్తులు ఉంటున్నారు. ఇలాంటప్పుడు వారిని పట్టుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసుల సాయమూ తీసుకుంటున్నాం. ఏఅగిఓ ఉ్గఉ మొబైల్ అప్లికేషన్ ఉంది. ఇది ఇప్పటికే 30 లక్షల మందికి పైగా రీచ్ అయ్యింది. మా వెబ్సైట్లో సోషల్మీడియాలో మహిళలు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిపే విధానాలపై పూర్తి సమాచారం ఉంచాం. వాటిని చదివి తెలుసుకోవచ్చు. ‘షీ టీమ్’ సమావేశం అనంతరం సభ్యులతో స్వాతి లక్రా ► షీ టీమ్లో మహిళా భద్రత కోసం ఎంత మంది వర్క్ చేస్తుంటారు? 33 శాతం మహిళలకు రిజర్వేషన్ వచ్చాక మహిళలు అధిక సంఖ్యలో పోలీసు విభాగంలోకి వస్తున్నారు. కానీ, ఇంకా తక్కువమంది మహిళా పోలీసులు ఈ విభాగంలో ఉండటం ఆలోచించ వలసిన విషయం. షీ టీమ్ బృందాలుగా రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తారు. ఒక బృందంలో 5 గురు సభ్యులు, ప్రతి బృందంలో తప్పనిసరిగా ఒక మహిళ ఉంటారు. వీళ్లు యూనిఫామ్లో కాకుండా సివిల్ డ్రెస్లో డిప్యూటీ సూపరిండెంట్ ఆఫీసర్ పర్యవేక్షణలో విధులను నిర్వర్తిస్తుంటారు. ఇదే విధానం తెలంగాణ మొత్తం ఉంటుంది. సుశిక్షితులైన వారే ఈ టీమ్లో ఉంటారు. అలాగే, సమాజంలో మహిళల స్థానం పట్ల అవగాహన, వారి పట్ల నడుచుకునే విధానం, ఆపరేషన్ నైపుణ్యాలు, పద్ధతులు, సాంకేతిక నైపుణ్యం, న్యాయపరమైన, చట్టపరమైన నిబంధనల పట్ల పూర్తి సమాచారం కలిగి ఉంటారు. ► మన సమాజ మూలాల్లోనే కుటుంబాల్లోనూ అమ్మాయిల పట్ల ఒక వివక్ష ఉంది. షీ టీమ్ ఏర్పాటై ఇన్నేళ్ల తర్వాత ఈ విధానంలో ఏమైనా మార్పు వచ్చిందంటారా? చాలా మార్పు వచ్చింది. వివక్ష లేకపోలేదు. కానీ, వివక్ష తీవ్రత తగ్గింది. 2016–17 సమయంలో అమ్మాయిలను వేధించేవారిలో చాలా మంది మైనర్ అబ్బాయిలను మేం పట్టుకున్నాం. వారికి కౌన్సెలింగ్ చేస్తూ వచ్చాం. దీంతో వారిలో మార్పు తీసుకురావడానికి జూనియర్, డిగ్రీ స్థాయి కాలేజీల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రోగ్రామ్లు చేశాం. ఇప్పుడు సర్వే చేస్తే మైనర్ అబ్బాయిలు వేధింపులకు పాల్పడటం లేదని తెలిసింది. అవగాహన కావచ్చు. కౌన్సెలింగ్ కావచ్చు. అన్నీ దోహదం చేస్తున్నాయి. కాలేజీల్లో అబ్బాయిలు కూడా షీ టీమ్ కార్యక్రమాల సమయంలో పాల్గొనడానికి స్వచ్ఛందంగా ముందుకువస్తున్నాయి. అమ్మాయిలను ఎలా చూడాలనే ఆలోచనల్లో మార్పు రావడానికి మేం చేస్తున్న కార్యక్రమాలు దోహదం చేస్తున్నాయి. ఇళ్లలో చూస్తే ఈ మార్పు చాలా నెమ్మదిగా ఉంది. మరొక బాధాకరమైన విషయం ఏంటంటే.. బధిరులను వేధించడం, వారిపై లైంగిక దాడులకు పాల్పడటం వంటివి జరుగుతున్నాయి. బధిరుల పట్ల ఎలా నడుచుకోవాలనే విషయాల పట్ల కుటుంబాల నుంచే అబ్బాయిల్లో అవగాహన పెంచితే మరింత బాగుంటుంది. ► ఇటీవల చిన్నపిల్లలపై లైంగిక దాడుల సంఘటనలు ఎక్కువ వింటున్నాం. తెలిసినవారే నిందితులుగా ఉంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? నిజమే, పిల్లలపై దాడులు చేసేవారు 90 శాతం కంటే ఎక్కువ ఆ కుటుంబాలకు తెలిసినవారే ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే కుటుంబాల నుంచి ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇంట్లో, ఇంటి చుట్టుపక్కల ఉండే ‘అంకుల్స్’ వల్ల ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. పిల్లలపై లైంగిక దాడి జరిగిందని తెలిసినప్పుడు తప్పనిసరిగా ఫిర్యాదు చేయాలి. ఆ నేరాన్ని దాచిపెట్టాలని చూసినా అది నేరమే. ఈ విషయాలు పిల్లలకు కూడా తెలియాలని పాఠశాలల్లో ‘సేఫ్–అన్ సేఫ్ టచ్’ పట్ల అవగాహన కల్పిస్తున్నాం. సమస్య తెలిసినప్పుడు టీచర్లు కూడా ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత గురించి తెలియజేస్తున్నాం. ► మహిళకు సమస్య వచ్చి, మిమ్మల్ని కలిసిన తర్వాత ఆమె జీవితంలో నిలదొక్కుకోవడానికి ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు? బాధితుల్లో ఎలాంటి అండ లేనివారికి ప్రభుత్వం నుంచి పరిహారం ఉంటుంది. వారు నిలదొక్కుకోవడానికి చదువు, జీవననైపుణ్యాలను కల్పించేందుకు తగిన శిక్షణ కూడా ఉంటుంది. ► చాలా వరకు మహిళా బాధితుల్లో ఇప్పటికీ పోలీసు స్టేషన్కి రావాలంటే ఒక తెలియని సందిగ్ధత ఉంటుంది. షీ టీమ్ వచ్చాక ఈ విధానంలో మార్పు వచ్చిందంటారా? గత పోలీసు స్టేషన్లు, నేటి పోలీసు స్టేషన్లను చూస్తే ఆ తేడా మీకే అర్థమవుతుంది. ఒక మంచి వాతావరణంలో మా సిబ్బంది పనిచేస్తున్నారు. ముఖ్యంగా లింగసమానతలు, సున్నితమైన విషయాల గురించిన అవగాహనతో పనిచేస్తున్నారు. ఒక మహిళ పోలీస్ స్టేషన్కు వస్తే ఆమెతో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలనే విషయాల పట్ల మార్పు వచ్చింది. అలాగే, ప్రతీ పోలీసు స్టేషన్ రిసెప్షన్లో ఒక మహిళ ఉంటుంది. దీని వల్ల మంచి మార్పుతోపాటు గతంలో ఉన్న సందిగ్ధతలు చాలా వరకు తగ్గాయి. ఒక మహిళ ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేస్తే, మేం వారిని నేరుగా సంప్రదించి వివరాలన్నీ తీసుకుంటున్నాం. అంటే, మహిళ పోలీసు స్టేషన్కు రాకుండానే ఆమెకు న్యాయం జరిగేలా చూస్తున్నాం. ► ఇతర రాష్ట్రాల్లో ‘షీ టీమ్’ లాంటి మహిళా రక్షణ కోసం చేస్తున్నæ విభాగాలున్నాయా? మనం వారి నుంచి స్ఫూర్తి పొందినవి ఉన్నాయా? తప్పకుండా ఉంటాయి. మన సెంటర్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసు విభాగం నుంచి వచ్చి చూస్తుంటారు. మేం కూడా మహిళా రక్షణలో ఇతర రాష్ట్రాల పోలీసు విభాగం చేస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకుంటుంటాం. ఇది రెండువైపులా ఉంటుంది. ► ఇక్కడి మహిళలు వేరే దేశాల్లో వేధింపులకు గురైన సందర్భాల్లో వచ్చిన ఫిర్యాదులు.. ఈ విధానంలో ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి? ఉమెన్ సేఫ్టీ వింగ్లోనే ‘ఎన్ఆర్ఐ సెల్’ కూడా ఏర్పాటు చేశాం. ఎన్ఆర్ఐ లను పెళ్లి చేసుకున్న మహిళలు విదేశాలకు వెళ్లిన తర్వాత వారిని వదిలేయడం, అదనపు కట్నం కోసం వేధించడం వంటి సంఘటనలు చూస్తున్నాం. ఇలాంటి వారి కోసం ఒక టీమ్ పని చేస్తుంది. లాయర్ ద్వారా, స్వచ్ఛంద సంస్థల నుంచి, ఎంబసీస్, విదేశీ మంత్రిత్వ శాఖ, ఆర్పీఓ .. అందరినీ సంప్రదించి ఆ సదరు మహిళకు ఎలా సాయం అందించాలో చూస్తున్నాం. కొన్ని విషయాల్లో టైమ్ పడుతుంది కానీ, మంచి ఫలితాలు వస్తున్నాయి. ► మహిళా రక్షణ విషయంలో ఇప్పటి వరకు ఉన్న చట్టాలు సరిపోతాయా? అదనంగా కొత్త చట్టాలను చేర్చాల్సిన అవసరం ఉందా? చట్టాలు చాలా ఉన్నాయి. వాటిని అమల్లో పెట్టడం ముఖ్యం. ఈ విషయంపైనే మేం దృష్టి పెడుతున్నాం. విచారణ త్వరగా పూర్తి చేయాలి. చార్జ్షీట్ ఫైల్ చేశాక త్వరగా బాధితులకు న్యాయం జరగాలి.. ఈ విధానంలోనే మేం పనిచేస్తున్నాం. ► సమాజంలో చోటు చేసుకోవాలనుకుంటున్న మార్పుల గురించి? దేశవ్యాప్తంగా పోలీసు విభాగంలో మహిళల సంఖ్య తక్కువే ఉంది. ఇప్పుడిప్పుడే మహిళా పోలీసుల సంఖ్య పెరుగుతోంది. మన సమాజంలో 50 శాతం మహిళలు ఉంటే అంత శాతం పోలీసు విభాగంలోనూ ఉండాలి. దీనివల్ల సమాజంలో ఉన్న మహిళలకు మరింత మేలు జరుగుతుంది. ఏ సమయంలోనైనా మహిళ ధైర్యంగా తన పనుల నిమిత్తం వెళ్లగలిగే పరిస్థితి రావాలనుకుంటున్నాను. ఆ రోజు తప్పక వస్తుంది అన్న నమ్మకమూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మహిళల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న ‘షీ టీమ్’, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇన్చార్జ్, అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా, డిఐజీ సుమతి ఇంటర్వ్యూలతో షీ టీమ్ గురించిన సమగ్ర సమాచారం. ఎంబీయే చేస్తున్న నాకు మా కాలేజీలో చదువుతున్న సురేష్ (పేరు మార్చడమైనది) ప్రేమిస్తున్నానంటూ దగ్గరయ్యాడు. ఏడాదిగా బాగానే ఉన్న సురేష్ అనుమానంతో విసిగిస్తుండటంతో భరించలేక బ్రేకప్ చెప్పేశాను. ఆనాటి నుంచి తన దగ్గరున్న ఫొటోలతో నన్ను బెదిరించడం మొదలుపెట్టాడు. నా ఫోన్లో ఉన్న మా బంధుమిత్రుల నెంబర్లన్నీ ట్యాప్చేసి, తీసుకొని వారందరికీ మా ప్రేమ గురించి, ఫొటోల గురించి చెబుతానని బెదిరించేవాడు. ఇది నా భవిష్యత్తుకే ప్రమాదం అనుకున్నాను. మా ఫ్రెండ్ ఇచ్చిన సలహాతో ‘షీ టీమ్’ను వాట్సప్ నెంబర్ ద్వారా సంప్రదించాను. పోలీసులు సురేష్ను హెచ్చరించి, అతని వద్ద నాకు సంబంధించి ఉన్న ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయించారు. ఇక నుంచి ఎలాంటి వేధింపు చర్యలకు పాల్పడబోనని రాతపూర్వకంగా రాయించుకొని, అతని మీద నిఘా పెట్టారు. రెండు నెలలుగా ఈ సమస్యతో నరకం చూసిన నాకు, షీ టీమ్ ద్వారా ఒక్క రోజులోనే పరిష్కారం దొరికింది. ఇప్పుడు హాయిగా ఉన్నాను. – బాధితురాలు మా అమ్మాయి ఏడవ తరగతి చదువుతుంది. సెలవులకు మా అమ్మ వాళ్ల ఊరు వెళ్లింది. అదే ఊళ్లో ఉంటున్న తెలిసిన వ్యక్తే మా అమ్మాయి పట్ల దారుణంగా ప్రవర్తించడమే కాకుండా, ఫొటోలు, వీడియోలు తీసి మమ్మల్ని మానసికంగా వేధించేవాడు. భరించలేక షీ టీమ్ను ఫోన్ ద్వారా సంప్రదించాం. షీ టీమ్ సదరు వ్యక్తి నుంచి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సరైన విధంగా బుద్ధి చెప్పారు. ఏడాది నుంచి సమస్యేమీ లేకుండా మనశ్శాంతిగా ఉన్నాం. – మరో బాధితురాలి తల్లి అవగాహన తీసుకొస్తున్నాం– బి. సుమతి ► మహిళల వేధింపులకు సంబంధించి రోజూ ఎన్ని కేసులు ఫైల్ అవుతుంటాయి? రోజూ దాదాపు 20 నుంచి 25 కేసుల వరకు ఉంటాయి. వీటిలో లైంగిక వేధింపులు ఎక్కువ. స్నేహం, ప్రేమ పేరుతో దగ్గరయ్యి ఫొటోలు, వీడియోలు నలుగురిలో పెట్టి పరువు తీస్తామనే బెదిరింపులూ ఎక్కువే. పదేళ్ల లోపు చిన్నపిల్లలకు సంబంధించిన కేసులు కూడా ఉంటున్నాయి. వీటిలో తీవ్రత శాతాన్ని బట్టి మానిటరింగ్ ఉంటుంది. ప్రధానంగా నేరాల తీవ్రతను బట్టి ఒక షెడ్యూల్ను రూపొందించాం. పిల్లలు, మహిళలపై పబ్లిక్గా జరిగే దాడులు, లైంగిక హింస, మనుషుల అక్రమరవాణా, సైబర్క్రైమ్, గృహహింస ప్రధానమైనవి. ► షీ టీమ్ ఆధ్వర్యంలో పిల్లల భద్రత కోసం చేస్తున్న కార్యక్రమాలు గురించి? చిన్న పిల్లల్లో అవగాహన కల్పించడానికి రాష్ట్రస్థాయిలో స్కూళ్లను ఎంచుకున్నాం. షీ టీమ్, సైబర్ నిపుణులు, స్వచ్ఛంధ సంస్థ భాగస్వామ్యంతో ఇప్పటికి 1650 స్కూళ్లలో ‘సైబర్ కాంగ్రెస్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశాం. తెలంగాణలోని 33 జిల్లాల్లోనూ ప్రతి స్కూల్ నుంచి విద్యార్థులు పాల్గొనేలా చూస్తున్నాం. ► టీనేజర్లు, యువతలో మహిళల భద్రతకు సంబంధించి చేస్తున్న కార్యక్రమాలు? యువతలో 19 నుంచి 25 ఏళ్ల లోపు అమ్మాయిలపై వేధింపులు ఎక్కువున్నాయి. అందుకని, కాలేజీల్లో ‘గర్ల్ సేఫ్టీ క్లబ్స్’ ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో 25 మంది విద్యార్థులను తీసుకుంటే సగం అమ్మాయిలు, సగం అబ్బాయిలు ఉండేలా చూస్తున్నాం. ఒక కాలేజీలో 25 మంది సేఫ్టీ క్లబ్గా ఉంటే వారి చుట్టుపక్కల, కాలేజీలో ఏదైనా సమస్య వస్తే ఎలా స్పందించాలి, అనే విషయాల పట్ల శిక్షణ ఇస్తాం. వాళ్లు పరిష్కరించలేని సమస్యలను మా దగ్గరకు తీసుకువచ్చేలా శిక్షణ ఇస్తున్నాం. ► ఆన్లైన్ మోసాలకు గురయ్యేవారిలో గృహిణులూ ఉంటున్నారు. వీరి రక్షణ కోసం చేస్తున్న కార్యక్రమాలు? గృహిణులు సైబర్ మోసాల బారినపడకుండా, అవగాహన కల్పించేందుకు ‘సైభర్’ కార్యక్రమం రూపొందించాం. ఆన్లైన్ మాధ్యమంగానే చేసిన ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 50 లక్షల మందికి రీచ్ అయ్యాం. స్లమ్స్లలో కూడా అక్కడి అమ్మాయిల భాగస్వామ్యంతో గృహిణుల రక్షణ కోసం అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నాం. వీటి విస్తృతి పెంచేందుకు మరికొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ► గ్రామస్థాయిల్లో మహిళలకు రక్షణ కల్పించేందుకు, అవగాహన పెంచేందుకు చేస్తున్న కృషి? పట్టణ, గ్రామీణ స్థాయిలోనూ షీ టీమ్ ద్వారా నేరుగా దాదాపు 30 లక్షల మందికి రీచ్ అయ్యాం. స్థానిక జానపద కళాకారులతో కలిసి గ్రామస్థాయిలో కార్యక్రమాలు చేశాం. వీటిని మరింతగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. షీ టీమ్ మీ కోసమే.. ► పబ్లిక్ ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు (ఈవ్ టీజింగ్.. వంటివి) జరిగినా ► ఫోన్కాల్, మెసేజ్లు, ఇ–మెయిల్స్, సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురిచేసినా ► మహిళ ఒంటరిగా ప్రయాణించే సందర్భాలలో వెంటనే పోలీసు సాయం అందాలన్నా షీ టీమ్ వెంటనే స్పందిస్తుంది. ► మహిళలపై తీవ్రమైన నేరాలను అరికట్టడానికి నిరోధక శక్తిగా పనిచేస్తుంది. ► తప్పుదారి పట్టిన యువతను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి నిపుణులచే కౌన్సెలింగ్ ద్వారా అవగాహన కల్పింస్తుంది. వారిని తమ నిఘానేత్రంతో నిశితంగా గమనింఇస్తుంది. ► మహిళకు హక్కుల పట్ల షీ టీమ్ వివిధ వేదికల ద్వారా అవగాహన కలిగిస్తుంది. భద్రత... సురక్షితం ► బృందాలుగా తెలంగాణ వ్యాప్తంగా ‘షీ టీమ్’ పనిచేస్తుంది. ప్రతి టీమ్లో ఒక మహిళా పోలీస్ అధికారి ఉంటారు. ► బస్స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, స్కూళ్లు–కాలేజీలు, లేడీస్ హాస్టల్స్, పార్కులు, ఆసుపత్రుల చుట్టుపక్కల ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించి నిఘాను ఉంచుతుంది. ► చట్టం, న్యాయం, సాంకేతిక విషయాల్లో సుశిక్షితులైన వారు ఈ బృందంలో తమ విధులను నిర్వర్తిస్తుంటారు. ఎప్పటికప్పుడు షీ టీమ్కు నిఘా విభాగం నుంచి సమాచారం చేరుతూనే ఉంటుంది. ► మహిళలు ఆన్లైన్ వేదికల ద్వారా తమ ఫిర్యాదులను అందజేయవచ్చు. షీ టీమ్ బృందం సివిల్ డ్రెస్సులో బాధితులను నేరుగా కలిసి, తదుపరి విచారణ కొనసాగిస్తుంది. ► ఒకసారి ఒక వ్యక్తిపై మొదటిసారి నేరారోపణ వస్తే సుమోటోగా బుక్ చేసి, తగిన చర్యలు తీసుకుంటారు. అదే నేరసుడిపై మరోసారి ఫిర్యాదు వస్తే.. ఆ కేసును నిర్భయ యాక్ట్ కింద బుక్ చేసి, మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటారు. అందుకని, బాధితులు వెనుకంజ వేయకుండా తమ సమస్యను నివేదించి, సరైన పరిష్కారం పొందవచ్చు. ► సమాజంలో మహిళలకు సంబంధించిన సమస్యలను పరువుగా చూస్తారు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఆ వివరాలు బయటకు వచ్చి, తమ కుటుంబ పరువు పోతుందేమో అని భయపడతారు. షీ టీమ్ లోబాధితుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతారు. సామాజిక మాధ్యమాలు, ఫోన్ నెంబర్, నేరుగా.. ఫిర్యాదులను స్వీకరించడమే కాకుండా, అత్యంత వేగంగా పరిష్కారం చూపుతారు. అందుకని మహిళలు తమను వేధించేవారిని ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే వారికై వారుగా ముందుకు రావాలి. ► మహిళా రక్షణ కోసం షీ టీమ్ వివిధ వేదికల ద్వారా ప్రజలలో అవగాహన కలుగజేస్తుంది. ఆ కార్యక్రమాలలో పాల్గొని తమ అభిప్రాయాలనూ పంచుకోవచ్చు. ఫిర్యాదులకు వేదికలు తెలంగాణ మొత్తానికి మహిళకు రక్షణకవచంలా ఉంది షీ టీమ్. సమస్య వచ్చినప్పుడు సందేహించకుండా సత్వర పరిష్కారం కోసం సంప్రదించాల్సిన వేదికలు.. ఇన్స్టాగ్రామ్:telanganasheteams ఫేస్బుక్, ట్విటర్:@ts-womensafety మెయిల్: womensafety-ts@tspolice.gov.in య్యూట్యూబ్: Women Safety Wing Telangana Police వాట్సప్ నెం. 944 166 9988 క్యూ ఆర్ కోడ్.. వంటి వేదికల ద్వారా ఫిర్యాదు చేయచ్చు. లైంగిక వేధింపులు, దాడులు, సైబర్ నేరాల నుంచి ‘ఆమె’ను రక్షించడానికి నిరంతరాయంగా కృషి చేస్తున్న షీ టీమ్కు ‘సాక్షి’ సెల్యూట్. – నిర్మలారెడ్డి, ఫొటోలు: నోముల రాజేష్రెడ్డి -
ఆకతాయిల భరతం పట్టే ‘స్పెషల్ 40’
భోపాల్: అక్షయ్ కుమార్–కాజల్ అగర్వాల్ సినిమా ‘స్పెషల్ చబ్బీస్’ గురించి తెలుసు.. ఈ ‘స్పెషల్ 40’ ఏమిటి? అనే కదా డౌటు. ఆ సినిమాలో ఒక గ్రూప్ సభ్యులు సీబిఐ, ఇన్కామ్టాక్స్ ఆఫీసర్లుగా పోలీసులను బోల్తా కొట్టిస్తుంటారు. అయితే ఈ‘స్పెషల్ 40’ ని మాత్రం పోలీసులే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో మహిళలపై జరిగే రకరకాల అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు ఏర్పాటు చేసిన గ్రూప్ ఇది. మురికివాడల్లో నివసించే ఆడపిల్లలపై రౌడీలు, తాగుబోతుల కన్నుపడింది. అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే రకరకాలుగా వేధించడం, అఘాయిత్యాలకు పాల్పడటం లాంటివి జరిగేవి. ‘ఈ దేశంలో ప్రతి పౌరుడు టోపీ ధరించని పోలీసే’ అనేది మన తెలుగు సినిమా డైలాగ్ కావచ్చుగానీ శాంతిభద్రతల సంరక్షణ అనేది మన అందరి బాధ్యత. ‘స్పెషల్ 40’లో ఉన్న మహిళల్లో ఎవరూ పోలిస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన వారు కాదు. ఎక్కడో ఏదో సంఘటన చూసి కడుపు రగిలిపోయిన వారు, ‘చూస్తూ కూడా ఏమీ చేయలేమా’ అని నిస్సహాయంగా పిడికిళ్లు బిగించిన వారు, ‘మనకెందుకులే’ అని రాజీపడి, అదో పశ్చాత్తాపమై, భారమై, బాధపడి ‘లేదు. ఏదో ఒకటి చేయాలి’ అనుకున్నవాళ్లు ఎందరో ఉన్నారు. ‘స్పెషల్ 40’ సభ్యులకు కరాటే, తైక్వాండోలాంటి ఆత్మరక్షణ విద్యలలో శిక్షణ ఇవ్వడంతో పాటు, చట్టం, న్యాయ సంబంధిత విషయాలపై అవగాహన కలిగిస్తున్నారు. ఎలాంటి చర్యలు నేరాల పరిధిలోకి వస్తాయి? ఏ నేరానికి ఎలాంటి శిక్ష పడుతుంది? ముఖ్యమైన సెక్షన్లు ఏం చెబుతున్నాయి?... మొదలైనవి ‘స్పెషల్ 40’ సభ్యులకు కొట్టిన పిండి. ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా అక్కడ వాలిపోయి, ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ‘స్పెషల్ 40’ సభ్యులు ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’లాంటి విషయాలపై పిల్లలకు అవగాహన కలిగిస్తున్నారు. అనుకోకుండా ఆపద ఎదురైతే ముందుగా చేయాల్సిన పని ఏమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?... మొదలైన విషయాలను తెలియపరుస్తున్నారు. ఈ గ్రూప్లో 20 ఏళ్ల వయసు నుంచి మొదలు 60 పైబడి ఉన్న మహిళలు కూడా ఉన్నారు. వీరి గ్రూప్లో సీనియర్ అయిన చంద్రకాంత మాలవీయాకు 63 సంవత్సరాలు. ‘ఈ వయసులో ఇదంతా ఎందుకు తల్లీ!’ అన్నవారు లేకపోలేదు. అయితే చంద్రకాంత వారి మాటలను పట్టించుకోలేదు. ‘భగవంతుడు ఇచ్చిన గొప్ప అవకాశం గా దీన్ని భావిస్తున్నాను. ఎందరో ఆడపిల్లలు నన్ను సొంత తల్లిలా భావించి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు’ అంటుంది చంద్రకాంత. ‘స్పెషల్ 40లో నేను సభ్యురాలిని అనే విషయం తలచుకోగానే చెప్పలేనంత ఉత్సాహం, ధైర్యం ఒంట్లోకి వచ్చి చేరుతాయి. ఆడపిల్లల రక్షణ కు అవసరమైతే ప్రాణాలు కూడా లెక్క చేయను’ అంటుంది సంధ్యా మనోజ్ కాస్త ఉద్వేగంగా.ఒక మురికి వాడలో నివసించే రీతి అనే అమ్మాయి ఒకరోజు పోకిరీల బారిన పడింది. ఈ విషయాన్ని ఇంట్లో చెబితే ‘ఈ సమయంలో అటు వైపు ఎందుకు వెళ్లావు?’ అని మందలించాడు నాన్న. నిజానికి అప్పుడు రాత్రి ఎనిమిది కూడా దాటలేదు. మరోసారి ఒకచోట తాగుబోతుల బెడద ఎదురైతే వెంటనే ‘స్పెషల్ 40’కి సమాచారం ఇచ్చింది. ‘స్పెషల్ 40’ ఆ తాగుబోతుల భరతం పట్టింది. ఇప్పుడు ‘స్పెషల్ 40’ సభ్యుల దగ్గర వాకీ–టాకీలు ఉన్నాయి. వాటికంటే మఖ్యంగా అంతులేని ధైర్యం ఉంది. ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవాలనే అపారమైన తపన ఉంది. ఇంతకంటే కావల్సింది ఏమిటి! -
చెప్పు దెబ్బలు తిన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు
లక్నో : లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న కారణంతో ఇద్దరు యువతులు కలిసి అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తిని చెప్పులతో దేహశుద్ది చేసిన ఘటన ఆదివారం ఉత్తర్ప్రదేశ్లోని జలాన్లో చోటుచేసుకుంది. వివరాలు.. జలాన్కు చెందిన అనూజ్ మిశ్రా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. కాగా ఆదివారం అనూజ్ మిశ్రా జలాన్ సమీపంలోని ఒరై రైల్వే స్టేషన్కు వచ్చాడు. ఇంతలో స్టేషన్వైపు వస్తున్న ఇద్దరు యువతులపై అనూజ్మిశ్రా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈవ్ టీజింగ్కు పాల్పడడమే గాకుండా లైంగిక వేధింపులకు గురిచేశాడు. (చదవండి : బట్టతల దాచి పెళ్లి చేసుకున్నాడని..) దీంతో ఆగ్రహించిన సదరు యువతులు అనూజ్ మిశ్రాను పట్టుకొని తమ చెప్పులతో దేహశుద్ది చేశారు. చివరికి అనూజ్మిశ్రా క్షమించమని మహిళ కాళ్లు మీద పడ్డా అప్పటికే కనికరించలేదు. అప్పటికే కోపంతో ఊగిపోతున్న వారు అతని బట్టలు చించేసి మరోసారి చితకబాదారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకొని అనూజ్ మిశ్రాను విడిపించి అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడికి ఈ శాస్తి జరగాల్సిందే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
చెంపలు వాయించింది
కర్ణాటక,మండ్య : మండ్య నగరం నుంచి పాండవపురకు వెళుతున్న కేఎస్ ఆర్టీసీ బస్సులో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడి చెంప వాయించింది ఓ యువతి. ప్రస్తుతం ఈ వీడియో కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. మండ్య నగరం నుంచి పాండవపురకు యువతి గురువారం బస్సులో వెళ్తుండగా అదే బస్సులో వెనక సీటులో కూర్చున్న యువకుడు యువతిని తాకడం చేశాడు. ఓపిగ్గా చూసిన యువతి పరిస్థితి శ్రుతి మించడంతో ఒక్కసారిగా ఆగ్రహంతో సదరు యువకుడి చెంప చెల్లున వాయించింది. నీ చెల్లి, తల్లి ఉంటే ఇలాగే చేస్తావా అంటూ అతడిని ప్రశ్నించింది. బస్సులో ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. ఆ వెంటనే యువకుడు బస్సు నుంచి కిందకు దిగి వెళ్లిపోయాడు. -
చున్నీ లాగాడని చితకబాదిన ఎస్ఐ?
నెల్లూరు(క్రైమ్): ఏమాత్రం సంబంధం లేని విషయంలో ఎస్ఐ తన కుమారుడిని పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టాడని ఆరోపిస్తూ ఓ తల్లి సోమవారం వేదాయపాలెం పోలీస్స్టేషన్ ఎదుట విలపించింది. సదరు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఆమె ఉన్నతాధికారులను కోరింది. బాధిత తల్లి, సేకరించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వేదాయపాలెం పోలీసుస్టేషన్ పరిధిలో ఈ నెల 21వ తేదీన తెలుపురంగు స్కూటీలో వెలుతున్న యువకుడు ఓ యువతి చున్నీ పట్టుకుని లాగాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటనలో అనుమానంతో ఆదివారం రాత్రి గాంధీనగర్కు చెందిన పవన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. తనకు ఏమీ తెలియదనీ, ఎవరి చున్నీ లాగలేదని ఆ యువకుడు చెబుతున్నా పట్టించుకోకుండా ఎస్ఐ కొట్టడంతో అస్వస్థతకు గురయ్యాడు. స్టేషన్ బయట ఉన్న కుటుంబసభ్యులను పిలిచిన పోలీసులు వెంటనే అతనిని తీసుకెళ్లాలని సూచించారు. దీంతో బాధిత కుటుంబసభ్యులు అతనిని చికిత్సనిమిత్తం జీజీహెచ్కు తరలించి చికిత్స చేయించారు. ఎస్ఐ వ్యవహారశైలిని నిరసిస్తూ బాధిత తల్లి, కుటుంబసభ్యులు సోమవారం వేదాయపాలెం పోలీస్స్టేషన్ వద్దకు చేరుకున్నారు. తన కుమారుడు ఈ నెల 21వ తేదీన నెల్లూరు నగరంలోనే లేడని పనుల కోసం బయటకు వెళ్లాడని చెబుతున్నా పోలీసులు వినకుండా తీవ్రంగా కొట్టారని బాధిత తల్లి చంద్రకళ ఆరోపించింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి ఆ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇదే విషయాన్ని ఆమె స్థానిక వేదాయపాళెం ఇన్స్పెక్టర్ టి.వి.సుబ్బారావును సైతం కోరింది. -
రెచ్చిపోతున్న ఈవ్ టీజర్స్
-
ఈవ్ టీజింగ్ తట్టుకోలేక యువతి ఆత్మహత్య
వైఎస్ఆర్ జిల్లా, పోరుమామిళ్ల: టీచర్ ట్రైనింగ్ చేస్తున్న అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ ఓ యువకుడు వేధించడంతో తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకున్న ఘటన బుధవారం మండలంలోని అక్కలరెడ్డిపల్లెలో జరిగింది. ఎస్ఐ మోహన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అక్కలరెడ్డిపల్లెకు చెందిన దాసరిపల్లె వెంకటయ్య, కుమారిల పెద్ద కూతురు శాంతిప్రియ పోరుమామిళ్లలోని కృష్ణశారద కళాశాలలో టీచర్ ట్రైనింగ్ చేస్తోంది. అదే గ్రామానికి చెందిన ఓబుళాపురం ఓబులేసు పోరుమామిళ్లలోని ఓ దుకాణంలో గుమస్తాగా పని చేస్తున్నాడు. రోజూ ప్రేమిస్తున్నానంటూ ఆమెను వెంటపడేవాడు. తనను వేధించవద్దని శాంతిప్రియ చెప్పినా అతను తన వైఖరి మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో శాంతిప్రియ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు అమ్మాయి తల్లి కుమారి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మోహన్ తెలిపారు. నిందితుడిని ఉరి తీయాలి: మృతురాలి తల్లి ‘ఓబులేసు వేధిస్తున్నాడని చెబితే మేము మా అమ్మాయినే మందలించాము. అయినా ఓబులేసు మా ఇంటిపై దాడి చేసి కత్తితో బెదిరించాడు. అతని బెదిరింపులకు భయపడి మా అమ్మాయి ఉరి వేసుకుంది’.. అని మృతురాలు శాంతిప్రియ తల్లి కుమారి బోరు న విలపించింది. దిశ చట్టం అమలు చేసి ఓబులేసును ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేసింది. ట్రైనింగ్ పూర్తయితే ఉద్యోగం వస్తుందని, కుటుంబానికి ఆసరా గా ఉంటుందని ఎంతగానో ఆశలు పెట్టుకున్నాం.. ఇంతలోనే దుర్మార్గుడు పొట్టన పెట్టుకున్నాడని కన్నీరు మున్నీరైంది. -
తమ్ముడూ నిన్నే..
తమ్ముడూ నిన్నే.ఎవరూ చూడటం లేదనుకుంటున్నావేమో.ఆమెకు తెలియకుండా ఫోన్లోబంధించాలనుకుంటున్నావేమో.చెత్త ఆలోచనలకు వాడాలనుకుంటున్నావేమో.మానుకో. మారు.నీ పనులకు శిక్షలు ఉన్నాయి.నీ చేష్టలకు బేడీలు పడతాయి.స్త్రీలు అప్రమత్తమయ్యారు.వారు నిన్ను వదలరు. తాట తీస్తారు. మెట్రోలో ప్రయాణిస్తున్నారు ముగ్గురు స్నేహితులు. ఆఫీస్ వేళ కావడం వల్ల రద్దీగా ఉంది ట్రైన్. ఈ ముగ్గురికీ సీట్ దొరకలేదు. కూర్చున్న లేడీస్కి దగ్గరగా నిలబడి ఉన్నారు. ఇంతలో మ«ధ్యలో నిలబడ్డవాడు మెల్లగా ఫోన్లోని కెమెరా ఆన్ చేశాడు. ఈ అమ్మాయిలను ఫోకస్ చేశాడు. కూర్చుని ఉన్న అమ్మాయిల ఎదను చేయి పైకెత్తి కేప్చర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కూర్చున్న అమ్మాయిలు వీళ్లను గమనించట్లేదు. కాని ఆ ముగ్గురి పక్కన నిలబడ్డ ఒక అమ్మాయి పసిగట్టి.. అతని చేతిలోంచి ఫోన్ లాగేసి ‘మిమ్మల్ని వీడు వీడియో తీస్తున్నాడు’ అంటూ ఆ ఫోన్ను ఆ అమ్మాయిల చేతికిచ్చింది. వాళ్లు అలెర్ట్ అయ్యేలోపు ఈ ముగ్గురూ ఆ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. గోలగోల అయ్యింది. అందరూ కలిసి పక్కస్టేషన్లో ఆ ముగ్గురిని పోలీసులకు అప్పజెప్పారు. బస్టాప్లో ఆ కుర్రాడు. ఈ పని కోసమే వచ్చినట్టున్నాడు. బస్ కోసం వెయిట్ చేస్తున్న ఒకావిడను వెనక నుంచి వీడియో తీయడం మొదలుపెట్టాడు. దూరం నుంచి చూసేవారికి అతను మామూలుగా ఫోన్ పట్టుకున్నట్టు ఉంటుంది. కాని అందులో ఆమె వెనుకభాగం రికార్డ్ అవుతోంది. ఇంతలో ఆమె వెనక్కి తిరిగింది. అతడు కంగారు పడ్డాడు. అనుమానం కలిగించింది. వెంటనే వెళ్లి ఫోన్ లాక్కుంటే కెమెరా ఆన్లో ఉంది. మైట్రో ట్రైన్ వెళుతూ ఉంది. ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఎదురుగా కాలేజీ అమ్మాయి నిలబడి ఉంది. అతను ఫోన్లో ఒక వీడియో ఆన్ చేసి ఎదురుగా నిలబడి ఉన్న అమ్మాయికి కనిపించేలా పెడ్తున్నాడు. ముందు ఆ అమ్మాయి పట్టించుకోలేదు. ఎంతసేపైనా ఆ వీడియోను ఆఫ్ చేయకపోయేసరికి అతనికి తెలియకుండా ఏమన్నా ఆన్ అయిందేమో అనుకొని అతనికి చెప్పబోతూ ఆ వీడియోను చూసి షాక్ అయింది. అది పోర్న్ వీడియో. కావాలనే.. తనకు కనిపించాలనే అతను అలా పెట్టాడు అని అర్థమైంది ఆ అమ్మాయికి. ఇవన్నీ నిజాలే. జరిగినవే.. జరుగుతున్నవే. అయితే ఇలాంటి చర్యలకు పాల్పపడుతున్న వాళ్లకు ఇవీ నేరాలే అది వీటికి శిక్షలున్నాయని తెలియదు. మనల్ని ఎవరు పట్టుకుంటారు అన్న ధీమాతో ప్రవర్తిస్తుంటారు. కాని వీళ్లు ఒళ్లు దగ్గరపెట్టుకుని నడుచుకునేలా చేసే చట్టాలున్నాయి. ఈ నేరాలు ఏ చట్టం కిందకు వస్తాయి? ‘మహిళ అనుమతి లేకుండా, ఆమెకు తెలియకుండా ఆమెను, ఆమె కదలికలను, శరీర భాగాలను చిత్రీకరిస్తే నిర్భయ చట్టంలోని 354 (డి) కింద నేరం. మొదటిసారి చేస్తే మూడేళ్ల జైలుశిక్ష.. పదేపదే చేస్తే అయిదేళ్ల జైలు శిక్ష ఉంటుంది. ఐపీసీ 509 ప్రకారం ఇది మహిళ గౌరవమర్యాదలకు భంగం వాటిల్లే చర్య. కాబట్టి ఈ సెక్షన్ కింద కేసు నేరస్తుడికి మూడు నుంచి అయిదేళ్ల జైలు శిక్ష ఉంటుంది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటివాటికి పాల్పడినందుకు, పోర్న్వీడియోలు చూపించినందుకు ఐపీసీ 294 (అబ్సీన్ యాక్ట్) కింద మూడు నెలల నుంచి ఆరునెలల వరకు జైలు శిక్ష ఉంటుంది. వీన్నిటితోపాటు ఐటీ యాక్ట్ ఉండనే ఉంది. 67 ఆఫ్ ఐటీ యాక్ట్ ప్రకారం మహిళకు సంబంధించిన దృశ్యాలను కామాన్ని ప్రేరేపించేలా చిత్రీకరించి వాటిని ఇంటర్నెట్లో ప్రచురించిన, ప్రసారం చేసినా అయిదేళ్ల జైలు శిక్షతోపాటు లక్షరూపాయల జరిమానా ఉంటుంది. అమ్మాయిలే కాదు.. అబ్బాయిల తల్లిదండ్రులూ ఇవి తెలుసుకోవాలి. తమ పిల్లల కదలికల మీద నిఘా వేయాలి’ అని వివరిస్తున్నారు అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సెలర్ పార్వతి. కంప్లయింట్ ఎక్కడ ఇవ్వాలి? అయితే ఈ శిక్షలన్నీ పడాలంటే ముందు ఆ నేరం నమోదు కావాలి. అంటే నేరస్తుడిని పట్టుకోవాలి. ‘బహిరంగ ప్రదేశాల్లో ఇలా తమను ఎవరైనా వెంటాడుతున్నారు.. తమ మీద ఫోన్ ఫోకస్ అయి ఉంది అన్న అనుమానం రాగానే రియాక్ట్ కావాలి. వెంటనే అవతలి వ్యక్తి చేతుల్లోంచి ఫోన్ లాక్కోవాలి. గట్టిగా అరిచి చుట్టూ ఉన్నవాళ్ల దృష్టిని తన వైపు తిప్పి ఆ వ్యక్తి పారిపోకుండా చేయాలి. 100కి డయల్ చేస్తే షీటీమ్స్కి కనెక్ట్ అయ్యి దగ్గర్లో ఉన్న షీ టీమ్స్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఇప్పుడు తెలంగాణ పోలీస్ వాళ్ల ‘హాక్ – ఐ’ యాప్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘దిశ’ యాప్లూ ఉన్నాయి అందుబాటులో. హాక్– ఐలోని ఎస్ఓఎస్ నొక్కితే చాలు మీరు రక్షణ వలయంలోకి వెళ్లినట్టే. దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ప్రమాదంలో ఉన్నామనే అనుమానం కలిగితే చాలు ఆ యాప్ ఓపెన్ చేసి ఫోన్ కదిలిస్తే సమీప పోలీస్ సిబ్బందికి సంకేతాలు వెళ్లి నేరస్తుల వేట మొదలవుతుంది. ఇవన్నీటితోపాటు మీకు దగ్గర్లో ఉన్న ఏ పోలీస్ స్టేషన్లోనైనా జరిగిన సంఘటన గురించి ఫిర్యాదు చేయవచ్చు. మిమ్మల్ని వీడియో తీసిన కాపీ అతని ఫోన్లో లేకపోయినా... దాని కాపీ ఇంకా ఎక్కడ దొరికినా.. కూపీలాగి నేరస్తుడిని కటకటాల్లో తోసే వీలుంటుంది’ అని చెప్తారు తెలంగాణలోని విమెన్ ప్రొటెక్షన్ వింగ్ ఇన్స్పెక్టర్ కిరణ్. ఇంత మందిలో నన్నెవరు చూడొచ్చారులే అనే జులాయీల ధిలాసాకు వణుకు పుట్టించే టెక్నిక్స్ ఎన్నో ఉన్నాయి. ట్రాక్ యాప్ల నుంచి సర్వైలెన్స్ ఐ వరకు పోలీస్ రిపోర్ట్ నుంచి కోర్ట్ కొరడా దాకా బోలెడు. అందుకే మహిళల పట్ల మర్యాద పాటించడం ఒక్కటే రక్షణ కవచం. అది నేర్చుకుంటే ఇవన్నీ దూరం. ఈ పాఠం అందరికీ! – సరస్వతి రమ కొత్త యాప్లున్నాయి.. జాగ్రత్త కొత్త కొత్త యాప్లు వస్తున్నాయి వాటి గురించి అవగాహన ఉండాలి. మనకు తెలియకుండానే మనల్ని వీడియో తీస్తుంటారు. అనుమానం వచ్చి పట్టుకుంటే ఆ ఫోన్లో ఏమీ కనిపించదు. అలాంటి యాప్ను డౌన్లోడ్ చేసుకుంటారు. అందుకే ఫోన్ లాక్కోగానే గ్యాలరీలోకి వెళ్లి చూసే బదులు కెమెరా యాక్టివ్లో ఉందా అనేది చెక్ చేయాలి. కెమెరా యాక్టివ్లో ఉంటే కచ్చితంగా మిమ్మల్ని ట్రేస్ చేస్తున్నట్లే లెక్క. కొన్ని ఫోన్లలో టచ్ చేయంగానే కెమెరా ఆఫ్ అయిపోయేలా సెట్టింగ్స్ ఉంటాయి. అప్పుడు ఓపెన్లో ఉన్న ట్యాబ్స్ అన్నీ చెక్ చేయాలి. గ్యాలరీలో ఫీడ్ ఏమీ దొరక్కపోయినా తర్వాత ఎక్కడోక్కడ కాపీ చేస్తారు. అప్పుడు దాంతో ఇమేజ్ అనాలిసిస్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఫోన్ లాక్కోగానే కెమెరా పొజిషన్ను చెక్ చేయడం మాత్రం మరవద్దు. ఒకవేళ ఎక్కడా ఏమీ దొరక్కపోయినా సీసీ కెమెరా ఫుటేజ్తో నేరస్తులు ఏం చేశారో చూడొచ్చు. ఫేస్ రికగ్నినిషన్ కెమెరాలను అమర్చీ ఇలాంటి వాళ్ల ఆగడాలను అరికట్టొచ్చు.– సందీప్ ముదాల్కర్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ అండ్ ట్రైనర్, ఇ. పార్వతిఅడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సెలర్ -
ప్రేమించాలంటూ వేధింపులు..
ఘట్కేసర్: తనను ప్రేమించాలని వేధించిన యువకుడిని ఘట్కేసర్ పోలీసులు రిమాండ్కు తరలించారు. సీఐ కథనం ప్రకారం.. పెద్దపల్లి సాగర్ రోడ్డుకు చెందిన ఎండీ ఇంతియాజ్ నగరంలోని తార్నాకలో నివాసం ఉంటూ ఆటోడ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న పెద్దపల్లికి చెందిన ఓ విద్యార్థినిని ప్రేమించాలని ఏడాదిగా వేధిస్తున్నాడు. వేధింపుల విషయమై అతడిపై పెద్దపల్లి పోలీస్స్టేషన్లో గతంలో రెండు కేసులు నమోదయ్యాయి. విద్యాభ్యాసం కోసం ఈ నెల 8న మండలంలోని చౌదరిగూడలోని కాలేజీకి రోడ్డుపై వెళ్తుండగా నిందితుడు బైక్పై వచ్చి తార్నాకలోని అతడి స్నేహితుడి గదికి తీసుకెళ్లాడు. తనను ప్రేమించని పక్షంలో అంతు చూస్తానని బెదిరించాడు. ఆమె గట్టిగా అరవడంతో తిరిగి ఆమెను కాలేజీ సమీపంలో వదిలివెళ్లాడు. ఈ విషయమై నిందితుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్ధిని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. -
తల్లీకూతుళ్లను అడ్డగించి అసభ్యకరంగా..
బంజారాహిల్స్: నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న తల్లీకూతుళ్లను ఇద్దరు యువకులు అడ్డగించి అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం:13లోని గౌరీశంకర్ కాలనీలో నివసిస్తున్న లక్ష్మి అనే వివాహిత తన ఏడేళ్ల కూతురితో కలిసి ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో వైట్హౌస్ మీదుగా గౌరీశంకర్ నగర్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. వైట్హౌస్ వెనకాల రోడ్డు వద్దకు రాగానే ఇద్దరు ఆగంతుకులు స్కూటీ మీద వచ్చి అడ్డగించారు. వీరిలో ఓ యువకుడు ఆమె కూతురును బలవంతంగా స్కూటీపై ఎక్కించుకుని వెళ్లిపోయాడు. మరో యువకుడు లక్ష్మి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె అరుస్తూ చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేస్తుండగానే ఆగంతుకుడు ఆమెను కిందకు నెట్టేసి పరారయ్యాడు. ఆందోళన చెందిన ఆమె కూతురు కోసం గాలిస్తూ ఇంటికి వెళ్లగాఇంట్లోనే కూతురు కనిపించింది. తన కూతుర్ని బలవంతంగా లాక్కెళ్లి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకులపై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితులపై ఐపీసీ సెక్షన్ 354, 323, 341 కింద క్రిమినల్ కేసు నమోదు చేసి పోలీసులు గాలింపు చేపట్టారు. -
థియేటర్లో ఈవ్టీజింగ్
చెన్నై, తిరువొత్తియూరు: సినిమా చూస్తున్న సమయంలో మహిళ వద్ద అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై వలసరవాక్కం బెత్తానియా నగర్ 3వ వీధికి చెందిన జయలక్ష్మి (40) శనివారం రాత్రి వడపళణిలో ఉన్న మాల్లో సినిమా చూస్తున్నారు. ఆమె వెనుక సీట్లలో కూర్చొని ఉన్న ఇద్దరు యువకులు కాళ్లతో ఆమెకు అసౌకర్యం కలిగించినట్టు తెలిసింది. దీని గురించి జయలక్ష్మి వారిని ప్రశ్నించగా వారు ఆమెతో అసభ్యంగా మాట్లాడి గొడవ చేశారు. దీని గురించి జయలక్ష్మి వడపళణి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. విచారణలో వారు సాలిగ్రామంకు చెందిన రమిష్ (29), రమేష్ (26) అని తెలిసింది. మద్యం మత్తులో ఉన్నట్టు తెలిసింది. -
బైక్ ఇచ్చి.. బలయ్యాడు!.
తాడేపల్లిరూరల్: తన బైక్ను స్నేహితులకివ్వడం.. ఆ యువకుడి ప్రాణాలనే బలిగొంది. ఆ స్నేహితులు ఓ యువతిని వేధించడం.. బైక్ నంబర్ ఆధారంగా పోలీసులు ఆ యువకుడిని స్టేషన్కు తీసుకెళ్లి విచారించడంతో అవమాన భారంతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాడేపల్లి పట్టణ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ చానెల్లో(సాక్షి కాదు) విలేకరిగా పనిచేస్తున్న తాడేపల్లి ముగ్గురోడ్డు ప్రాంతానికి చెందిన చరణ్రాజు తన బైక్ను విజయవాడలోని స్నేహితుడు శివ, అతనితోపాటు వచ్చిన మరో యువకుడికి ఈ నెల 24వ తేదీ రాత్రి ఇచ్చి విజయవాడలోని చర్చికి వెళ్లాడు. వారిద్దరూ బైక్పై విజయవాడ వన్టౌన్ ప్రాంతానికి వెళ్లి అక్కడ ఓ యువతిని ఈవ్టీజింగ్ చేయడంతో ఆమె వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బైక్ నంబర్ ఆధారంగా పోలీసులు చరణ్ రాజును అదుపులోకి తీసుకుని రోజంతా పోలీస్స్టేషన్లో ఉంచి విచారించారు. ఈవ్ టీజింగ్ చేసింది చరణ్రాజు కాదని నిర్ధారించుకున్నాక విడిచిపెట్టారు. చేయని తప్పునకు శిక్ష అనుభవించానంటూ తీవ్ర మనస్తాపం చెందిన చరణ్రాజు గురువారం రాత్రి తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
మేజర్లుగా మారుతున్న వారు ఎక్కువ శాతం నేరగాళ్లుగా..
సాక్షి, సిటీబ్యూరో: ఏడాది క్రితం తొమ్మిదో తరగతి పిల్లాడు ఆకస్మాత్తుగా స్కూలుకెళ్లడం మానేశాడు. చదువులో పూర్తిగా వెనుకబడిపోయాడు. 24 గంటలూ తన గదిలోనే ఉండేవాడు. ఆ పిల్లాడి ప్రవర్తనలో మార్పును తల్లిదండ్రులు పసిగట్టలేకపోయారు. చివరకు ఎదురుగా ఉన్న ఓ లేడీస్ హాస్టల్లో స్నానం చేస్తున్న అమ్మాయిల ఫొటోలను తన మొబైల్ఫోన్లో చిత్రీకరిస్తూ పట్టుబడిపోయాడు. అప్పుడు ఆ తల్లిదండ్రుల కళ్లు తెరుచుకున్నాయి. నగరంలో అప్పట్లో ఈ విషయం చర్చనీయాంశమైంది. అదొక్కటే కాదు. తల్లిదండ్రుల పెంపకంలోని లోపాలు, సామాజిక మాద్యమాలు, మీడియా, సినిమాలు వంటి అనేక కారణాలు చిన్నారుల్లో నేరప్రవృత్తికి ఆజ్యం పోస్తున్నాయి. అశ్లీల సాహిత్యం, హింసాత్మక సినిమాలు ఎదుగుతున్న పిల్లలను నేరాల వైపు నడిపిస్తున్నాయి. మరోవైపు స్కూళ్లు, కాలేజీల్లో కంఫ్యూటర్ సైన్స్ వంటి కోర్సులకు ఇచ్చే ప్రాధాన్యం మోరల్ సైన్స్కు ఇవ్వడం లేదు. నీతి కథలు బోధించే అధ్యాపకుల జాడే లేదు. ఏది మంచి, ఏది చెడు అని విడమర్చి చెప్పే చదువులు లేవు. దీంతో ఒక తరం నుంచి మరో తరానికి వారసత్వంగా అందాల్సిన ఉన్నతమైన మానవ విలువలు అంతరించిపోతున్నాయి. విచ్ఛిన్న సంబంధాల్లోనే చిచ్చు.... ఒక్క ‘దిశ’ విషయంలోనే కాదు. గతంలో జరిగిన అనేక లైంగిక దాడుల్లోనూ అరాచకమైన మనస్తత్వం కలిగిన వారే నేరాలకు పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల మైనారిటీ తీరని పిల్లలు ఉంటే, మరి కొన్ని చోట్ల అప్పుడప్పుడే మేజర్లుగా మారుతున్న వారు ఎక్కువ శాతం నేరగాళ్లుగా మారుతున్నారు. ఈ తరహా నేరాల్లో విచ్ఛిన్నమై న కుటుంబసంబంధాలే ప్రధాన కారణమని మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘‘ భార్యాభర్తల మధ్య తర చూ జరిగే ఘర్షణలు, విడాకులు కోసం దారితీసే పరిస్థితులు, వివాహేతర సంబంధాలు తదితర అంశాలు పిల్లలపై దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రశ్నించేవారు, పర్యవేక్షించే వారు లేకపోవడం వల్లనే తప్పులు చేస్తున్నా రు. ’’ అని ప్రముఖ మనస్తత్వ నిపుణులు డాక్టర్ కల్యాణ్చక్రవర్తి పేర్కొన్నారు. మరోవైపు పేదరికం కారణంగా, తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్లస్కూల్ దశలోనే చదువు ఆపేసిన పిల్లల మెదళ్లు నేరాలకు అడ్డాలవుతున్నాయి. ఇలాంటి వారి మెదళ్లు చదువు, విజ్ఞానానికి బదులు శూన్యంతో ఉండి నేరపూరితమైన ఆలోచనలు, అరాచకత్వంతో నిండిపోతున్నాయి అన్నారు. మానసిక అసమతౌల్యం... ‘‘పిల్లల్లో నేరప్రవృత్తికి సంబంధించిన లక్షణాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు దూరం కావడం, ఒంటరిగా గడపడం, చదువులో వెనుకబడిపోవడం వంటివి నేరపూరితమైన ఆలోచనలుగా భావించవచ్చు. ప్రాథమికంగా గుర్తిస్తే మార్పు తేవడం సాధ్యమే...’’ అంటారు ప్రముఖ మానసిక నిపులు డాక్టర్ లావణ్య. మొదట్లోనే గుర్తించి మార్పు తేకపోవడం వల్లనే ఇలాంటి వ్యక్తులు కుటుంబాల నుంచి విడివడి నేరస్తులుగా మారుతున్నారని, శవంపైన సైతం లైంగిక దాడికి పాల్పడే క్రూరత్వాన్ని సంతరించుకుంటున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు అరచేతిలో అశ్లీలాన్ని చూపించే మొబైల్ ఫోన్ ఒక మహమ్మారిలా యువతను కబళిస్తోంది. టీనేజీ యువత మంచి కంటే చెడు పట్ల ఎక్కువ ఆకర్షితులవుతున్నారు. కానీ ఈ మంచి, చెడులను చెప్పే కుటుంబాలు, విద్యాసంస్థలు ఆ పని చేయకపోవడం వల్ల నేరస్తులుగా మారుతున్నారు. మనిషిలోని ‘బాధ’ తెలియాలి ఒక మనిషి పరిపూర్ణమైన ఉత్తమ వ్యక్తిత్వాన్ని సంతరించుకోకుండానే ఎదుగుతున్న దశలో నేరస్తుడగా మారుతున్నాడంటే సుస్థిరమైన కుటుంబం లేకపోవడమే ప్రధాన కారణం. నీతి, నైతిక విలువలు లేని విద్యాబోధన మరో కారణం. దీంతో మనుషులను గౌరవించే మనస్తత్వం అలవడడం లేదు. అలాగే తన చర్యల వల్ల ఎదుటి మనిషిని ఎలా బాధకు గురిచేస్తున్నాడో కూడా తెలుసుకోలేక పశువుగా మారుతున్నాడు. విలువలు బోధించే కుటంబం, విద్య చాలా అవసరం.–డాక్టర్ కల్యాణ్చక్రవర్తి, మానసిక వైద్య నిపుణులు -
పోకిరి మారట్లే!
సాక్షి,సిటీబ్యూరో: నూనూగు మీసాలు రాని కుర్రాడు బాలికను అటకాయిస్తున్నాడు..విచ్చలవిడిగా తిరుగుతూ కంటి చూపుతో ఇబ్బంది పెడుతున్నాడు. ఒకేచోట పనిచేస్తున్న సహోద్యోగినిని ఫాలో అవుతూ పురుషులు వేధిస్తున్నారు.. జుట్టు నెరిసి.. వయసు మళ్లిన ఇంకొందరు పెద్దమనుషులు మహిళల అవసరాలను ఆసరాగా చేసుకుని వికృతంగా ప్రవర్తిస్తున్నారు. భయపడి కొందరు.. ఎవరికీ చెప్పుకోలేక ఎందరో మహిళలు, యువతులు, బాలికలు వేధింపులను మౌనంగానే భరిస్తున్నారు. కొందరు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అలా ఈ ఏడాది 11 నెలల్లో సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో 1,247 మంది ఈవ్ టీజర్లను షీ బృందాలు పట్టుకున్నాయి. అంటే నెలకు సగటున 113 వేధింపుల కేసులు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఓవైపు ఆకతాయిల ఆట కట్టిస్తున్న షీ బృందాలు ఇటు బాలికలు, అటు బాలురకు అవగాహన సదస్సులు సైతం నిర్వహించి వారి ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాయి. ఆపద, వేధింపులు ఎదురైనప్పుడు ఏం చేయాలన్న దానిపై బాలికలు స్పష్టత ఇస్తూనే.. అమ్మాయిలను వేధిస్తే కుర్రాళ్ల కెరీర్ ఎలా పాడైపోతుందో.. సమాజంలో ఎంత చులకనగా మారిపోతారో చెబుతూ పోలీసులు సుతిమెత్తగా హెచ్చరిస్తున్నారు. ఇలా ఈ ఏడాది 11 నెలల్లో రెండు కమిషనరేట్లలో నాలుగు వేలకు పైగా శిబిరాలు ఏర్పాటు చేసి 6 లక్షల మందిని జాగృతి చేశారు. ఈవ్ టీజర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్న పోలీసులు ఫోన్తోనే పట్టించేస్తున్నారు.. బస్టాప్లు, ఆటో స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లతో పాటు, పనిచేసే ప్రాంతాలు, విద్యాసంస్థలు.. ఇలా ఏ ప్రాంతమైనా సరే బాలికలు, యువతులు, మహిళలను వేధిస్తే షీ బృందాలను ఆశ్రయించాలని చేస్తున్న విస్తృత ప్రచారం బాగానే పనిచేస్తోంది. పోలీసు స్టేషన్లలో నేరుగా వచ్చి ఫిర్యాదు చేసేందుకు ఇబ్బంది అనిపిస్తే వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, మెయిల్, హాక్ఐ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని యువతులను చైతన్యం చేస్తున్న తీరు బాగానే పనిచేస్తోంది. ఇందుకనుగుణంగా వాట్సాప్, ఫేస్బుక్, ఈ–మెయిల్, ట్విట్టర్, డయల్ 100 ద్వారా మహిళల ఫిర్యాదుల శాతం పెరిగింది. అయితే ఫిర్యాదు అందిన వెంటనే మఫ్టీలో రంగంలోకి దిగుతున్న షీ బృందాలు అక్కడికి చేరుకొని ఆకతాయిల వెకిలి చేష్టలను వీడియో తీసి సాక్ష్యాలతో కోర్టుకు సమర్పిస్తుండడంతో నిందితులు కటకటాలపాలవుతున్నారు. మేజర్లు, మైనర్లు కూడా.. జంట కమిషనరేట్లలో ఇప్పటి దాకా షీ బృందాలకు చిక్కివారిలో ఎక్కువగా 1,057 మంది మేజర్లుంటే, 190 మంది మైనర్లు ఉన్నారు. చిన్నప్పటి నుంచి సమాజంలోని స్త్రీల పట్ల గౌరవం పెంచేలా తలిదండ్రులు, గురువులు చొరవ చూపకపోవడం వల్లనే ఆకతాయిలుగా మారుతున్నారని షీ బృందం ఇచ్చే కౌన్సెలింగ్లో తేటతెల్లమవుతోంది. వయసుల వారీగా పరిశీలిస్తే ఎక్కువగా కౌమార దశలో ఉన్న విద్యార్థులు, యువకులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మనవడు, మనవరాళ్లతో హాయిగా గడపాల్సిన సీనియర్ సిటిజన్లు కూడా మహిళలను వేధించడం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోందని పోలీసులు, కౌన్సిలర్లు అంటున్నారు. ఆ కుటుంబాల పిల్లలే ఎక్కువ యువతులను వేధిస్తూ షీ బృందాలకు పట్టుబడుతున్నవారిలో ఎక్కువగా తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేసే కుటుంబాల్లోని పిల్లలే ఉంటున్నారు. పిల్లలపై వీరి పర్యవేక్షణ తక్కువగా ఉండడంతో దారి తప్పుతున్నారని కౌన్సిలింగ్లో గుర్తిస్తున్నారు. ఉదయం పిల్లలను స్కూలు, కాలేజీలకు పంపిన తర్వాత విధులకు వెళ్లే భార్యాభర్తలు.. తిరిగి వచ్చేసరికి రాత్రి దాటుతోంది. ఈ మధ్య పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు.. ఎక్కడెక్కడ తిరుగుతున్నారు.. సెల్ఫోన్తో ఏం చేస్తున్నారనే విషయాలు కన్నవారు దృష్టి పెట్టలేకపోతున్నారు. దీంతో ఆ తరహా పిల్లలు ఈవ్ టీజర్లుగా మారుతున్నారు. ఇటువంటి కుటుంబాలు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.– అనసూయ,సైబరాబాద్ షీ–టీమ్స్ ఇన్చార్జి -
స్టూడెంట్ పోలీస్
దూషణ నుంచి ఈవ్టీజింగ్, హెరాస్మెంట్, డొమెస్టిక్ వయొలెన్స్, దాడి, లైంగిక దాడి.. ఎంతటి తీవ్రమైన నేరాన్ని ఎదుర్కొన్నా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలంటే భయపడ్తారు మహిళలు. పోలీసులకు చెప్పేకన్నా నేరం తాలూకు బాధను భరించడమే నయమనే భావనలో ఉంటారు. పోలీసుల ప్రవర్తనపట్ల ఉన్న భయమే కారణం. ఇలాంటి భయాన్ని పోగొట్టి.. మహిళలకు, పోలీసులకు మధ్య స్నేహాన్ని పెంపొందించి.. ఏ ఇబ్బంది ఎదురైనా ధైర్యంగా పోలీసులకు చెప్పే వాతావరణాన్ని కల్పించమని ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లోని అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ ఫెడరేషన్.. ఉత్తరప్రదేశ్ డీజీపీకి లేఖ రాసింది. ఇది చాలా వైరల్ అయ్యి అక్కడి పోలీసులనూ ఆలోచింపచేసింది. ఓ అడుగు ముందుకేసేలా కదిలించింది కూడా. దాని పర్యవసానమే... ఆ జిల్లాల్లోని విద్యార్థినులను ఒకరోజు స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్చార్జిగా నియమించాలని ఘజియాబాద్ పోలీసులు నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన కసరత్తులను మొదలు పెట్టారు కూడా. పోలీసులు నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం ఘజియాబాద్ జిల్లాలోని పాఠశాలల విద్యార్థినుల్లో కొంతమందిని ఎంపిక చేసుకొని పర్యవేక్షణ, మహిళల మీద జరుగుతున్న నేరాలు, అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు.. మొదలైన వాటి మీద శిక్షణనిస్తారు. తర్వాత సీనియర్ పోలీస్ అధికారులు వాళ్లకు కౌన్సెలింగ్ ఇచ్చి స్థానిక పోలీస్స్టేషన్లకు ఒకరోజు ఇన్చార్జిగా నియమిస్తారు. దీనివల్ల పోలీసులంటే భయం పోవడమే కాకుండా.. అనుకూల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలస్తుంది, పోలీసులకు, మహిళలకు మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. క్విజ్, వ్యాసరచనతో... స్కూళ్లల్లో క్విజ్, వ్యాసరచన పోటీలు పెట్టి, నెగ్గిన విద్యార్థినులను స్టేషన్ ఇంచార్జీలుగా ఎంపిక చేస్తే బాగుంటుందని ఘజియాబాద్ అపార్ట్మెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యుడొకరు పోలీసులకు సలహా ఇచ్చారు. దీని గురించి పోలీసులూ ఆలోచిస్తున్నారట. ఏమైనా పోలీసులు ఇలాంటి చొరవ తీసుకోవడం మంచి ఫలితాన్నే ఇస్తుంది అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇటీవల జరిపిన పలు సర్వేల్లో మహిళలకు జరిగిన అన్యాయం గురించి మహిళా పోలీస్ స్టేషన్లలో నమోదైన ఫిర్యాదుల సంఖ్య ఇదివరటికంటే 22 శాతం పెరిగిందని తేలింది. దీన్నిబట్టే ఘజియాబాద్ పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని అనుకుంటున్నారంతే. మన దగ్గర షీటీమ్స్ వగైరా ఉన్నా.. ఇలాంటి కార్యక్రమాలూ చేపడితే మరిన్ని మంచి ఫలితాలు వచ్చి.. మహిళల పట్ల జరిగే నేరాలు చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుందేమో! -
యువతిని వేధిస్తున్న ఆకతాయిలు అరెస్టు !
సాక్షి, విజయవాడ: బస్టాండు సమీపంలో యువతిని వేధిస్తున్న ఆరుగురు ఆకతాయిలను కృష్ణ లంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ బస్టాండు ప్రాంగణంలో బస్సు కోసం వేచిచూస్తున్న యువతిని ఆరుగురు యువకులు వేధిస్తుండగా బాధితురాలు పోలీసులకు సమాచారం అందించింది. దీంతో వేధింపులకు గురిచేస్తున్న ఆరుగురితోపాటు, స్కార్పియో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
అనంతలో కామాంధుడి వికృత చేష్టలు
-
యాంటి రోమియో స్క్వాడ్ పని తీరు భేష్
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లో ప్రారంభించిన వివాదాస్పద యాంటి రోమియో స్క్వాడ్ బృందానికి తాజాగా మరో మద్దతుదారు దొరికారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి యాంటి రోమియో స్క్వాడ్ పనితీరు బాగుందని మెచ్చుకున్నారు. త్వరలోనే దీన్ని ఢిల్లీలో కూడా ప్రారంభిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో బీజేపీ స్టేట్ వర్కింగ్ కమిటీ ప్రారంభోత్సవానికి హాజరైన మనోజ్ తివారి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఉత్తరప్రదేశ్లో ప్రారంభమైన యాంటి రోమియో స్క్వాడ్ బృందాల పని తీరు చాలా బాగుంది. మహిళల రక్షణకు ఇది చాలా మంచి పద్దతి. త్వరలోనే దీన్ని ఢిల్లీలో కూడా ప్రారంభిస్తే బాగుంటుంద’న్నారు. ఈవ్ టీజింగ్కు పాల్పడే వారి పని పట్టడం కోసం 2017లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ యాంటి రోమియో స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ బృందాల పని తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. మహిళల రక్షణ పేరిట ఈ బృందాలు జంటలపై దాడులకు తెగబటమే కాక యువకులకు గుండు కొట్టించడం.. గుంజీలు తీయించడం వంటి దారుణాలకు పాల్పడ్డారు. దాంతో కొన్ని రోజుల పాటు ఈ బృందాల మీద నిషేధం విధించారు. కానీ తాజాగా మహిళల పట్ల నేరాలు పెరుగుతుండటంతో యోగి ఆదిత్యనాథ్ ఈ యాంటి రోమియో స్క్వాడ్ను తిరిగి పునరుద్దరించారు. -
రౌడీ షీటర్లపై నిఘా
సాక్షి, అనకాపల్లి (విశాఖపట్నం) : త్వరలో జరగనున్న పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గ్రామాలు, పట్టణాల్లో ఉండే రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ చెప్పారు. అనకాపల్లిలోని కొత్తూరు మహార్షి ఫంక్షన్ హాల్లో పోలీస్సబ్ డివిజన్ పరిధిలో అధికారులతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది నేరాల సంఖ్యను తగ్గించామన్నారు. పాఠశాలలు, కళాశాలల వద్ద ఈవ్ టీజింగ్కు పాల్పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. అలాగే ప్రస్తుతం ఎక్కువగా గొడవలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై రౌడీ షీట్ నమోదు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది వేసవిలో చోరీలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో క్రైం రేటు తగ్గించగలిగామన్నారు. ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారించేందుకు ఆర్అండ్బీ, రవాణాశాఖ, వివిధశాఖల అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మావోస్టుల ప్రభావం ఏజెన్సీ ప్రాంతంలో తగ్గుముఖం పట్టిందని, గతంలో గిరిజనులు వారికి ఆశ్రయం ఇచ్చేవారని, ఇప్పడు ఆ పరిస్థితి లేకుండాపోయిందన్నారు. గిరిజనులు అభివృద్ధి చెందాలని రోడ్లు, సెల్టవర్లు ఏర్పాట్లు చేసేందుకు సహకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. బెల్ట్షాపులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, అటువంటి వారు తరుచూ ఏర్పాటు చేసినట్లయితే పీడీ యాక్టులు కూడా నమోదు చేస్తామని స్పష్టం చేశారు. గంజాయి రవాణా చేస్తున్న పాత నేరస్తులపై ఎప్పటికప్పుడు దృష్టిపెడుతూ, ఎక్సైజ్ శాఖతో చర్చిస్తున్నామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలతో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. సమావేశంలో డీఎస్పీ ఎస్.వి.వి.ప్రసాదరావు, సీఐలు కిరణ్కుమార్, తాతారావు, రామచంద్రరావు, శ్రీనివాసరావు, ఎస్సైలు పాల్గొన్నారు. -
మాటు వేసి పట్టేస్తారు..
సాక్షి, సిటీబ్యూరో: ఈవ్టీజింగ్ చేస్తున్నారని ఫిర్యాదు అందితే సంఘటనా స్థలానికి చేరుకొని నిఘా వేసి నిందితులను పట్టుకునే సైబరాబాద్, రాచకొండ షీ బృందాలు పంథా మార్చాయి. ఎక్కువగా ఈవ్టీజింగ్ జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో మాటు వేసి ఆకతాయిల ఆట కట్టిస్తున్నాయి. ఇటు అమ్మాయిలు, అటు ఈవ్టీజర్లకు తెలియకుండానే పోకిరీల వెకిలిచేష్టలు, వేధింపులను వీడియో రికార్డు చేసి సాక్ష్యాలతో సహా పట్టుకుంటున్నాయి. వారిపై కేసులు నమోదుచేసి న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నారు. వీరిలో కొందరికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి పరివర్తన తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. బస్టాప్లు, మల్టీప్లెక్స్లు, షాపింగ్మాల్స్, పర్యాటక ప్రాంతాల్లో యువతులు, విద్యార్థినులను వేధిస్తున్నారంటూ ఫిర్యాదులు అందుతుండటంతో సైబరాబాద్, రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. నెలరోజుల్లో రెండు కమిషనరేట్ల పరిధిలో 210 కేసులు నమోదు చేశారు. 80 మందిపై క్రిమినల్, పెట్టీ కేసులు పెట్టారు. ఆకతాయిలను వెంబడిస్తూ... వివిధ పనుల నిమిత్తం ఇల్లు, వసతి గృహాల నుం చి ఒంటరిగా బయటికి వస్తున్న విద్యార్థినులు, యువతులను టార్గెట్గా చేసుకుని పోకిరీలు వేధిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసులు, విచారణలు అంటూ ఠాణాల చుట్టూ తిరగాల్సి వస్తుందని బాధితులు వారి ఆగడాలను బరిస్తున్నారు. కొందరు పోకిరీలు గచ్చిబౌలి, కూకట్పల్లి, కేపీహెచ్బీ, ఎల్బీనగర్, ఉప్పల్, అల్వాల్ తదితర ప్రాంతాల్లో యువతులు, విద్యార్థినులను ప్రతిరోజూ వెంటపడి వేధిస్తున్నారు. బాధితులు భయపడుతుండడంతో వారు మరింత రెచ్చిపోతున్నారు. దీనిపై నిఘా వేసిన ‘షీ’ బృందాలు వెంటనే వారిని అదుపులోకి తీసుకుంటున్నాయి. ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా మఫ్టీలో ఉంటూ ఆకతాయిల ఆగడాలను వీడియో తీసి న్యాయస్థానంలో సాక్ష్యాలు సమర్పిస్తున్నారు. లేడీస్ హాస్టళ్లలోనూ ప్రత్యేక చర్యలు... బస్స్టాపులు, బహిరంగ ప్రదేశాల్లో వేధింపులను నియంత్రిస్తున్న పోలీసులు.. యువతులు, మహిళల హాస్టళ్లు పరిసర ప్రాంతాల్లో ఈవ్టీజింగ్ నివారించేందుకు చర్యలు చేపట్టారు. అపహరణలు.. అత్యాచారయత్నాలు.. వేధింపులు.. ఈవ్టీజింగ్ తదితర నేరాలను కట్టడి చేసేందుకు లా అండ్ అర్డర్ పోలీసులకూ సమాచారం ఇస్తున్నారు. హాస్టళ్ల నిర్వాహకులతో చర్చించి సీసీ కెమెరాలు, పరిసర ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఎస్సీఎస్సీ మార్గదర్శనంలో ‘సేఫ్ స్టే’ పకడ్బందీగా అమలు చేయాలని సూచిస్తున్నారు. హాస్టళ్లలో వైఫై సౌకర్యంతో పాటు బాధితులకు వేధింపుల ఫోన్లు రాగానే ‘షీ’ బృందం సాంకేతిక సభ్యులకు సమాచారం అందించాలని సూచించారు. బాధితుల్లో ఎక్కువ మంది స్టేషన్కు వచ్చేందుకు సందేహిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలకు ఉపక్రమించారు. అలాగే ఆకతాయిలకు ఎలా బుద్ధి చెప్పాలి, స్వీయ ఆత్మరక్షణ, పోలీసులకు ఎలాంటి సమాచారంఇవ్వాలన్న అంశాలపై వారికి అవగాహన కల్పిస్తున్నారు. -
ఈవ్టీ(నే)జర్స్!
మహిళలు, యువతుల రక్షణకు ఎన్ని చట్టాలు చేసినా ఆకతాయిల ఆగడాలు ఆగడంలేదు. వారు ఇంటా, బయటా,ఆఫీసులో, కళాశాలలో, అడుగడుగునా వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ముఖ్యంగా విజయవాడ నగరంలో పోకిరీల చేష్టలు మితిమీరిపోతున్నాయి. స్కూళ్లు, కళాశాలలకువెళ్లే యువతులే లక్ష్యంగా చెలరేగిపోతున్నారు. వీరినిఅదుపు చేసేందుకు పోలీసులుఅన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా.. పరిస్థితి అదుపులోకిరావడం లేదు. మరోవైపు ఈవ్టీజింగ్ కేసుల్లో ఎక్కువగామైనర్లే పట్టుబడుతుండటంఆందోళన కల్గించే అంశం. సాక్షి, అమరావతి బ్యూరో : బెజవాడ నగరంలో ఆకతాయిల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. మహిళలపై వేధింపులు ఎక్కువవుతున్నాయి. పోకిరీల ఆటకట్టించి, కటకటాల వెనక్కి నెట్టడానికి ఏపీ పోలీస్ శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘శక్తి’ బృందాలను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. మఫ్టీలో పోలీసులున్నా.. బస్టాపులు, రైల్వేస్టేషన్, స్కూల్స్, కాలేజీలు, మాల్స్ తదితర ప్రాంతాల్లో మహిళలను, అమ్మాయిలను వేధిస్తున్న పోకిరీలు, ఈవ్టీజింగ్ చేస్తున్న ఆకతాయిల బెడద ఇటీవల ఎక్కువైంది. దీంతో పోలీసులు మఫ్టీలో ఉంటూ ఇలాంటి ఆకతాయిలఆటకట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నగరంలో కమిషనరేట్ పరిధిలో వేధింపులకు గురవుతున్న మహిళలు వెంటనే పోలీసులను ఆశ్రయించడానికి, ఫిర్యాదులు చేయడానికి ప్రత్యేక వాట్సాప్ నంబరు అమల్లోకి తెచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇటీవల శక్తి బృందాలు, పోలీసులు అరెస్టు చేస్తున్న పోకిరీలు, ఆకతాయిల్లో ఎక్కువగా మైనర్లే పట్టుబడుతున్నారు. వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న పోలీసులు తల్లిదండ్రులను స్షేషన్కు పిలిపించి వారి సమక్షంలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. బాలికలను టీజింగ్ చేస్తున్న మైనర్లు.. బెంజి సర్కిల్ సమీపంలోని ప్రైవేటు కళాశాల ల విద్యార్థినులు సాయంత్రం అక్కడి బస్టాపులో ఇళ్లకు వెళ్లేందుకు వేచి ఉంటున్నారు. ఈ సమయంలో అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద కొందరు పోకిరీలు అమ్మాయిలను నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారు. ఇటీవల కొందరు అమ్మాయిలు ధైర్యం చేసి వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. క్షణంలో తప్పించుకుని బైక్పై ఉడాయించారు. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, మొగల్రాజపురం, వన్టౌన్ తదితర ప్రాంతాల్లో ఇలాంటి పోకిరీల బెడద రోజు రోజుకూ పెరుగుతోంది. వీరి బారి నుంచి తమకు రక్షణ కల్పించాలని విద్యార్థినులు వేడుకుంటున్నారు. ‘శక్తి’కి ఇటీవల వచ్చిన ఫిర్యాదులు.. ⇔ కళాశాలకు వచ్చి, వెళ్లే సమయాల్లో కొందరు అబ్బాయిలు మమ్మల్ని టీజింగ్ చేస్తున్నారంటూ బీఆర్టీఎస్ రహదారిలో పెట్రోలింగ్ చేస్తున్న ‘శక్తి’ టీం సిబ్బందికి శారదా కళాశాల విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. మరుసటి ఉదయం కళాశాల వద్ద ‘శక్తి’ బృంద సభ్యులు కాపు కాసి అమ్మాయిలకు ఇబ్బంది కల్గిస్తున్న 15 మందిని అదుపులోకి తీసుకుని.. కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ⇔ సింగ్నగర్లోని వివేకానంద స్కూల్వద్ద కొందరు పోకిరీలు అమ్మాయిలను వేధిస్తున్నారంటూ ఓ పౌరుడు వాట్సాప్కు మెస్సెజ్ చేశాడు. దీనికి స్పందించిన ‘శక్తి’ బృందం సభ్యులు మఫ్టీలో స్కూల్వద్ద నిఘా పెట్టి ఈవ్టీజింగ్ చేస్తున్న 5 మంది మైనర్లను అదుపులోకి తీసుకుని.. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. 626 మందికి కౌన్సెలింగ్ ఆరు నెలల కాలంలో మహిళ రక్షణ విభాగం పోలీసులు 626 మంది ఈవ్టీజర్లకు కౌన్సిలింగ్ ఇవ్వగా.. గత ఏడాది డిసెంబర్ 12న నుంచి శక్తి బృందాలు విధులు నిర్వర్తిస్తున్నాయి. ఈ బృందా లు వచ్చాక విజయవాడలో సినిమా హాల్స్, పార్కు లు, బస్టాపులు, కృష్ణానది ఘాట్లవద్ద తిరుగుతూ మహిళలను ఈవ్టీజింగ్ చేస్తున్న 190 మందిని అదుపులోకి తీసుకుని వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది. 61 మంది కటకటాలు.. గత రెండేళ్లలో విజయవాడ కమిషనరేట్ పరిధిలో మహిళలు, విద్యార్థినుల పట్ల, వేధింపులు, అసభ్యం, అశ్లీలంగా వ్యవహరించిన కేసులు 1,958 వరకు నమోదు అయ్యాయి. అయితే వీటిలో చాలా వరకు కేసులు భార్యభర్తల మధ్య గొడవలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ కేసుల్లో 90 శాతం పైగా రాజీ అయ్యారు. వీటిలో ఈవ్టీజింగ్ కేసులు, ఫొక్సో చట్టం కింద నమోదైన కేసులు, రేప్ అనంతరం హత్య చేసిన కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో న్యాయస్థానం 61 మందికి జైలు శిక్ష విధించింది. -
ఇడియట్స్
సాక్షి, వరంగల్ క్రైం: మహిళలు, యువతుల రక్షణకు చట్టసభల్లో ఎన్ని చట్టాలు చేసినా ఆకతాయిల ఆగడాలు ఆగడం లేదు. వారు ఇంట్లో, బయటా, ఆఫీసులో, కళాశాలలో, అడుగడుగునా వేధింపులకు గురవుతునే ఉన్నారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం కూడా వేధింపులకు మార్గం అవుతోంది. ఫోన్లలో యువతుల ఫొటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఒంటరిగా కళాశాలకు వెళ్లే యువతుల కోసం బస్టాండ్ల వద్ద కాచుకుకూర్చుంటున్నారు. పోకిరీలు చేసే హేళన, సూటిపోటి మాటలను విద్యార్థినులు మౌనంగా భరిస్తున్నా రు. ఏం చేయాలో తెలియక బాధను గుండెల్లోనే దాచుకుంటున్నారు. వేధింపులు శృతి మించితేనే ఫిర్యాదు వరకు వెళ్తున్నా యి. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మహిళలు, యువతులకు రక్షణ కల్పించడానికి మూడు షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. అయినప్పటికీ వేధింపులు ఆగడం లేదు. పరువు కోసం.. కళాశాలలు, పనిచేస్తున్న కార్యాలయాలు, బంధువులు ఇలా అనేక రూపాల్లో యువతులు వేధింపులకు గురవుతున్నారు. అయినా వాటిని మౌనంగా భరిస్తూనే ఉన్నారు. పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, పరువు పోతుందనే ఉద్దేశంతో ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఎవరైనా ముందుకు వచ్చి కేసులు పెడితే వారికి కుటుంబ సభ్యుల నుంచి, సమాజం నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు దొరకడం లేదు. దీంతో ఎన్ని వేధింపులు ఎదుర్కొన్నా మనసులో కుమిలిపోతున్నారే తప్పా బయటపడడం లేదు. ఈ పరిస్థితుల నుంచి మహిళలు, యువతులు బయటికి రావడానికి పోలీసు శాఖ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో.. గౌరవప్రదమైన ఉద్యోగాలు చేసే చోట కూడా తోటి పురుష ఉద్యోగులు మహిళా ఉద్యోగులను ద్వంద్వార్థాలతో వేధిస్తున్నారు. వారిని ప్రతిఘటిస్తే అది చేయడం లేదు.. ఇది చేయడం లేదు అంటూ కక్ష సాధింపునకు పాల్పడుతున్నారు. అర్బన్ జిల్లాలో ఇటీవల ఇద్దరు ఉన్నతాధికారులు మహిళ అధికారులను సూటిపోటి మాటలతో వేధించడంతో వారు ఏకంగా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న వేధింపులను మహిళా అధికారులు, కింది స్థాయి మహిళా ఉద్యోగులు విధిలేని పరిస్థితుల్లో మౌనంగా భరిస్తున్నారు. అయితే వారు ఫిర్యాదు చేస్తే చాలు చర్యలు తీసుకునేందుకు షీ టీమ్స్ అధికారులు సిద్ధంగా ఉన్నప్పటికీ తమ పరువు బజారుకెక్కుతుందనే భయంతో వెనుకడుగు వేస్తున్నారు. ఇలాంటి దుశ్శాసనుల పీచమణచాలంటే రావల్సిందల్లా మహిళల్లో చైతన్యమే. పెరుగుత్ను కేసులు... వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో రోజురోజుకు వేధింపులు పెరుగుతున్నాయి. మహిళలు, యువతులు ఇప్పుడిప్పుడే పోలీస్ స్టేషన్ వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయగలుగుతున్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2015లో 188 కేసులు నమోదు కాగా, 2016లో 208 కేసులు, 2017లో 185 కేసులు, 2018లో ఇప్పటి వరకు 169 కేసులు నమోదయ్యాయి. ఈవ్టీజింగ్ కేసుల్లో పట్టుబడిన బాలురపై పోలీసులు కేసులు పెట్టకుండా తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, చేతుల్లో వేలాది రూపాయల విలువ చేసే స్మార్ట్ఫోన్లు ఉండడం, ఇంటర్నెట్లో ఇష్టారాజ్యంగా లాగిన్ కావడం, వాట్సప్, ఫేస్బుక్ పేరిట పరిచయం లేని వ్యక్తులతో చనువుగా మాట్లాడడం, ప్రైవేట్ హాస్టళ్ల నిర్వాహకుల పర్యవేక్షణ లేకపోవడం తదితర కారణాలతో యువతులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈవ్టీజర్లపై కఠిన చర్యలు మహిళలు, యువతులను వేధింపులకు గురిచేసే ఈవ్టీజర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా వేధింపులకు గురైతే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలి. కమిషనరేట్ పరిధిలో మూడు బృందాలు, ఒక్కో బృందంలో నలుగురు సభ్యులు పనిచేస్తున్నారు. అందరు మఫ్టీలో ఉంటారు. కళాశాలలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్ వద్ద షీటీమ్స్ పోలీసులు మఫ్టీలో ఉండి అకతాయిలను అదుపులోకి తీసుకుంటారు. ప్రతి శనివారం కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. ఎవ్వరికైనా ఇబ్బందులు ఉంటే క్రైం ఏసీపీ 9491089112, కమిషనరేట్ వాట్సప్ నంబర్ 9491089257, షీటీమ్స్ ఇన్స్పెక్టర్ 7382294058 నంబర్లకు సమాచారమిస్తే వెంటనే స్పందిస్తాం. – శ్రీనివాస్రావు, షీ టీమ్స్ ఇన్స్పెక్టర్ -
పోకిరీలకు చెక్
కళాశాలలు.. విద్యాసంస్థలు.. బస్స్టాపులు.. రైల్వేస్టేషన్లు.. వాణిజ్య సముదాయాలు.. సినిమా థియేటర్ల వద్ద యువతులు, మహిళలను వేధిస్తున్న పోకిరీలకు మహిళా రక్షక్ బృందాలు బుద్ధి చెబుతున్నాయి. బృంద సభ్యులు మఫ్టీలో తిరుగుతూ ఈవ్టీజర్ల భరతం పడుతున్నారు. సాక్షి, నెల్లూరు(క్రైమ్): మహిళలు సమాజంలో ధైర్యంగా తిరిగే భరోసా ఇవ్వాలి. ఆకతాయిల ఆటలు ఇక సాగవనే నమ్మకం కలిగించాలి. తమ కోసం ఓ నిఘా వ్యవస్థ అండగా ఉందనే అవగాహన తేవాలి. అప్పుడు చక్కటి సమాజం ఆవిష్కృతమవుతుందనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఈ నెల 13వ తేదీన జిల్లా కేంద్రంలో తొలిసారిగా 10 మహిళా రక్షక్ టీంలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అవి సత్ఫలితాలిస్తున్నాయి. నగరంలో ఇప్పటి వరకు 145 మంది ఈవ్టీజర్లను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్కు తరలించారు. వారి పూర్తి వివరాలను సేకరించి రికార్డుల్లో నిక్షిప్తం చేస్తున్నారు. పోకిరీల తల్లిదండ్రులను స్టేషన్కు పిలిపించి వారి సమక్షంలో పోలీసు సిబ్బంది కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అనంతరం తల్లిదండ్రుల పూచీకత్తుపై వారిని బయటకు విడిచి పెడుతున్నారు. తొలిసారి కౌన్సెలింగ్తో సరి.. ఈవ్టీజింగ్కు పాల్పడుతూ పోలీసులకు చిక్కిన ఆకతాయిలకు తొలిసారిగా పోలీసులు తమదైన శైలిలో కౌన్సెలింగ్ చేస్తున్నారు. అతని గత చరిత్రను పరిశీలించి నేరచరిత్ర లేకపోతే తల్లిదండ్రుల పూచీకత్తుపై విడిచి పెడుతున్నారు. మరోసారి చిక్కితే కటకటాల లెక్కించాల్సిందేనని వారిని హెచ్చరిస్తున్నారు. పోలీసులు కౌన్సెలింగ్ చేసిన వారిలో అధిక శాతం మంది 20 నుంచి 30 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉన్నారు. సత్ఫలితాలు .. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన రక్షక్ బృందాలు సత్ఫలితాలిస్తున్నాయి. వేదాయపాళెం, హరనాథపురం తదితర ప్రాంతాల్లో పలువురు ఈవ్టీజర్లపై డయల్ 100కు ఫిర్యాదులు వెళ్లాయి. తక్షణమే స్పందించిన బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఈవ్టీజర్ల భరతం పట్టాయి. దీంతో ఆయా ప్రాంత వాసులు బృందాల పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి. త్వరలో అవగాహన సదస్సులు పోకిరీల ఆటలు కట్టిస్తున్న మహిళా రక్షక్ బృందాలు త్వరలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, విద్యాసంస్థలకు వెళ్లనున్నాయి. ఈవ్టీజింగ్కు వ్యతిరేకంగా విద్యార్థినులకు అవగాహన సదస్సులు నిర్వహించేందుకు పక్కాప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. విద్యార్థినుల మనోగతం, వేధించిన వారిపై చట్టపరంగా పోలీసులు చేపట్టే చర్యలను వివరించనున్నారు. షీ బృందం ఏం చేస్తుందంటే.. కళాళాలలు, బస్టాండ్, రైల్వేస్టేషన్, మార్కెట్ తదితర ప్రాంతాల్లో సంచరిస్తూ ఈవ్టీజర్లను గుర్తించి వారిని అరెస్ట్ చేస్తారు. ఒక్కో బృందంలో నలుగురు ఉంటారు. వీరు మఫ్టీలో తిరుగుతూ ఈవ్టీజర్ల భరతం పడుతారు. ఎలాంటి నేర ప్రవృత్తి లేకుండా తొలిసారిగా ఈవ్టీజింగ్ చేసిన వారికి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసి గట్టిగా మందలిస్తారు. కరుడుగట్టిన వారైతే కేసులు నమోదు చేస్తారు. ఎవరైనా మహిళలు తామెదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదు చేస్తే వారి పేరు బయటకు రానివ్వకుండా విచారిస్తారు. విద్యార్థినులు, మహిళలు ఏం చేయాలంటే.. మగవాళ్లు మాటలతో కానీ, చేష్టలతో కాని, అనుచిత రీతిలో తాకటం, అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు తీయడం వంటి చర్యలతో ఇబ్బంది పెడుతుంటే డయల్ 100కు కాల్ చేసి తామున్న ప్రదేశాన్ని తెలియజేయాలి. లేదా పబ్లిక్ ఐవాట్సప్ నంబర్ 9390777727కు సమాచారం (టైప్చేసి గానీ, ఫొటోల రూపంలో గాని) పంపితే వెంటనే మహిళా రక్షక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ఈవ్టీజర్ల భరతం పడుతాయి. ఈవ్టీజర్లే కాదు ఇంకా ఎవరైనా ఇబ్బందులకు గురి చేసినా పై నంబర్లకు ఫోను చేసి ఫిర్యాదు చేస్తే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదుదారుల వివరాలను బృందాలు గోప్యంగా ఉంచుతాయి. నిర్భయంగా ఫిర్యాదు చేయండి మహిళల రక్షణే ధ్యేయంగా మహిళా రక్షక్ టీంలను ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ప్రవేశ పెట్టారు. నగరంలోని ఆరు పోలీసుస్టేషన్లలో ఆరు బృందాలు, మహిళా పోలీసుస్టేషన్ పరిధిలో నాలుగు బృందాలు పని చేస్తున్నాయి. మఫ్టీలో తిరుగుతూ ఆకతాయిల భరతం పడుతున్నాం. మహిళలకు, విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటికే పలు ఫిర్యాదులు అందాయి. మహిళలు, విద్యార్థులు తామెదుర్కొంటున్న సమస్యలపై డయల్ 100, 9390777727, 94904 39561లకు ఫిర్యాదు చేయాలి. తగిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు సైతం సమాచారం అందించవచ్చు. – పి. శ్రీధర్, మహిళా రక్షక్టీమ్స్ నోడల్ అధికారి -
రాయదుర్గంలో ఈవ్టీజింగ్
అనంతపురం, రాయదుర్గంటౌన్ : రాయదుర్గంలో ఈవ్టీజింగ్ అధికమవుతోంది. వారం వ్యవధిలోనే రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా సోమ వారం పట్టణంలోని జెడ్పీ బాలికోన్నత పాఠశాలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పట్ల గుమ్మఘట్ట మండలం వీరాపురం గ్రామానికి చెందిన రవి అనే యువకుడు ఈవ్టీజింగ్కు పాల్పడ్డాడు. అదే గ్రామానికి చెందిన విద్యార్థిని ఉదయం పాఠశాలకు వస్తున్న సమయంలో ఆ యువకుడు వెంటపడి వేధించసాగాడు. పాఠశాల సమీపంలో రద్దీ ప్రాంతంలోనే కోపంతో విద్యార్థిని చెంపపై కొట్టాడు. దీంతో విద్యార్థిని భయాందోళనకు గురై పాఠశాలకు పరుగులు తీసింది. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు, స్థానికులు ఆ యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. గత నెల రోజుల నుంచి తనను వేధిస్తున్నట్లు విద్యార్థిని ఉపాధ్యాయులతో పేర్కొనట్లు సమాచారం. ఈ ఘటనతో పాఠశాల, కళాశాల విద్యార్థినులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలావుండగా ఇలాంటి ఘటనే వారంరోజుల క్రితం ఇదే పాఠశాలకు చెందిన తొమ్మిదవ తరగతి చదువుతున్న మరో అమ్మాయిని ప్రేమించకపోతే చేయి చేసుకుంటానని ఓ యువకుడు వేధించినట్లు ఆలస్యంగా తెలిసింది. రద్దీ ప్రాంతమైన జెడ్పీ బాలికోన్నత పాఠశాలలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ తరచూ ఈవ్టీజింగ్ సమస్య ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. చర్యలు తీసుకుంటాం ఇటీవల మహిళా రక్షణ టీమ్లు ఏర్పాటు చేశాం. ఈ టీములు గ్రామాలు కూడా తిరుగుతుండడంతో వల్ల పట్టణంలో కాస్త పర్యవేక్షణ తగ్గింది. ఉన్నతాధికారులతో చర్చించి మహిళా రక్షణ టీమ్ను పట్టణంలో నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటాం. కళాశాల, పాఠశాల రాకపోకల వేళల్లో పోలీసు సిబ్బంది పర్యవేక్షణ కూడా ఉంచి ఈవ్టీజింగ్పై కఠిన చర్యలు తీసుకుంటాం. సోమవారం పాఠశాల వద్ద జరిగిన ఘటనపై యువకుడి బంధువులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చాం. విచారణ అనంతరం కేసు నమోదు చేస్తాం. – నాగేంద్రప్రసాద్, ఎస్ఐ -
ర్యాగింగ్ రక్కసి
ర్యాగింగ్, ఈవ్టీజింగ్ల పేరుతో ఇతరులను హింసించి పైశాచికత్వాన్ని పొందుతున్న విద్యార్థుల ముఠాను మదురై ప్రభుత్వ వైద్య కళాశాలలో గుర్తించారు. వీరి భరతం పట్టేందుకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ మరుదు పాండియన్ సిద్ధం అయ్యారు. 20 మందిని గుర్తించి సస్పెండ్ చేశారు. పరీక్షలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయానికి వచ్చారు. సాక్షి, చెన్నై: వర్సిటీలు, కళాశాలల్లో గతంలో చోటుచేసుకున్న సంఘటనల్ని పరిగణించి ర్యాగింగ్ను నిషేధిస్తూ పాలకులు చట్టం తీసుకొచ్చారు. అయితే, చట్టం అమల్లో విఫలమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కళాశాలు ప్రారంభమయితే చాలు ఈవ్ టీజర్లు రంగంలోకి దిగడం సాధారణంగా మారింది. బస్టాపులు, కళాశాల సమీపాల్లో , రైల్వే స్టేషన్లలో విద్యార్థినులు కన్పిస్తే చాలు డొంకతిరుగుడు మాటలతో వేధించే వాళ్లు ఎక్కువే. ఇలాంటి టీజర్ల భరతం పట్టేందుకు పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగాల్సిందే. మహిళా పోలీసుల్ని మఫ్టీలో మాటేసినా, ఆ హడావుడి మూణ్ణాళ్ల ముచ్చటగా మారుతోంది. పోలీసుల ధోరణి ఫిర్యాదులు వస్తేనే, తాము స్పందిస్తామన్నట్టుగా ఉంది. కళాశాలల విషయానికి వెళ్తే, జూనియర్లను సీనియర్లు వేధించడం ప్రతిఏటా వెలుగు చూస్తున్నాయి. ర్యాగింగ్ నియంత్రణకు కళాశాల, వర్సిటీల స్థాయిలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినా, హాస్టళ్లు, బయటి ప్రాంతాల్లో జూనియర్లను వేధించే సీనియర్లు అనేక మంది ఉన్నారు. కొన్ని ర్యాంగింగ్ సంఘటనలు వెలుగులోకి వస్తుండగా, కొందరు విద్యార్థులు సీనియర్లకు భయపడి ముందుకు రావడం లేదు. ఇంకొందరు తమ ఇళ్లకు పరుగులు తీస్తున్నారు. కొన్ని చోట్ల సరదాగా సాగే టీజింగ్,వివాదాలకు సైతం దారితీస్తున్నాయి. వైద్య కళాశాలలు ప్రారంభం ‘ఒక విద్యార్థిని అవమానపర్చడం, మానసికంగా దెబ్బతీయడం, భయందోళనకు గురిచేయడం, బెదిరించడం లేదా గాయపడే పరిస్థితి కల్పించడం.’ వంటివి ర్యాగింగ్గా పరిగణించవచ్చు. ఇక, ర్యాగింగ్ నిరోధించాల్సిన బాధ్యత కళాశాల ప్రిన్సిపాల్ లేక యాజమ్యాన్యానిది. చట్టం ప్రకారం ర్యాగింగ్ ఫిర్యాదు అందిన వెంటనే కళాశాల ప్రిన్సిపాల్ లేదా యాజమాన్యం స్పందించి విచారణ చేపట్టాలి. ప్రాథమిక సాక్ష్యాధారాలు లభిస్తే ర్యాగింగ్కు పాల్పడిన వారిని వెంటనే సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తాజాగా వైద్య కళాశాలలు ప్రారంభం అయ్యాయి. మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాంగింగ్ పేరిట వేధించే పనిలో సీనియర్లు నిమగ్నం అయ్యారా..? అన్న ప్రశ్నకు సమాధానంగా మదురైలో ఘటన వెలుగు చూసింది. ఢిల్లీకి చేరిన ఫిర్యాదు మదురై ప్రభుత్వ వైద్య కళాశాలలో సీనియర్లు జూనియర్లను ఇష్టారాజ్యంగా వేధిస్తుండడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ తమకు న్యాయం లభించదన్న ఆందోళనతో జూనియర్ ఒకరు ఏకంగా ఢిల్లీలోని ర్యాంగింగ్ నియంత్రణ కమిటీకి రహస్యంగా మెయిల్ పంపించారు. ఈ మెయిల్ను పరిశీలించిన కమిటీ శనివారం రంగంలోకి దిగింది. మదురై వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మరుదు పాండియన్ నేతృత్వంలోని బృందంతో కలసి ర్యాగింగ్కు పాల్పడుతున్న సీనియర్ల భరతం పట్టే పనిలో నిమగ్నం అయ్యారు. హాస్టల్ గదుల్లో, కళాశాల వెలుపల సీనియర్లు జూనియర్లను హింసిస్తుండడాన్ని పసిగట్టారు. ఈ కమిటీకి పలువురు రెడ్ హ్యాండెండ్గా చిక్కారు. దీంతో పదిహేను మంది జూనియర్ విద్యార్థులు సాహసం చేసి సీనియర్ల వేధింపుల గురించి లిఖిత పూర్వకంగా ఆదివారం ప్రిన్సిపల్కు ఫిర్యాదుచేశారు. దీంతో రెండో సంవత్సరం చదువుతున్న 20 మంది సీనియర్ విద్యార్థులను గుర్తించారు. వారిని ఆరు నెలల పాటు కళాశాలల నుంచి సస్పెండ్ చేశారు. సెమిస్టర్ పరీక్షలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు. అలాగే, ఈ20 మంది హాస్టల్లో రెండేళ్ల పాటు ప్రవేశించకుండా నిషేధం విధించారు. నిఘా నేత్రాల ఆధారంగా.. కళాశాల, హాస్టల్ పరిసరాల్లోని నిఘా నేత్రాల్లో నమోదైన దృశ్యాలను సమగ్రంగా పరిశీలించి, మరికొందరు సీనియర్ల భరతం పట్టే రీతిలో వైద్యకళాశాల వర్గాలు ముందుకు సాగుతున్నాయి. ఇందులో మరో ఇద్దరు విద్యార్థుల తీరును గుర్తించడంతో వారి మీద కూడా చర్యకు నిర్ణయించారు. సోమవారం జరగనున్న కళాశాల ర్యాగింగ్ నియంత్రణ కమిటీ సమావేశంలో వీడియో దృశ్యాలను పరిశీలించి, ర్యాగింగ్కు పాల్పడ్డ సీనియర్ల భరతం పట్టేందుకు నిర్ణయించామని ప్రిన్సిపాల్ మరుదు పాండి తెలిపారు. కాగా, మదురైలో ర్యాగింగ్ రక్కసి వెలుగు చూడడంతో రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నిఘాను పెంచారు. ఎవరైనా ర్యాంగింగ్, ఈవ్ టీజింగ్ వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న హెచ్చరికల బోర్డులు ప్రత్యక్షం అయ్యాయి. -
రెచ్చిపోతున్న మృగాళ్లు
ఉదయం లేవగానే తయారై కళాశాలల వద్ద వేచి ఉండటం.. నచ్చిన అమ్మాయి కనిపిస్తే వెంటపడటం.. అసభ్యకరమాటలతో లైంగిక వేధింపులకు పాల్పడటం ఆకతాయిలకు నిత్యకృత్యంగామారుతోంది. ఎవరైనా తమకు ఎదురు తిరిగితే నేరాలకు, దాడులకు పాల్పడటానికి కూడా వెనుకాడటం లేదు. రహస్యంగా నిఘా ఉంచిన మహిళా రక్షక్ బృందాలు కొంతమంది ఈవ్టీజర్లను రెడ్హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా గడిచిన వారం రోజుల్లో అమ్మాయిలను వేధిస్తూ వెంటబడిన 44 మంది ఈవ్టీజర్లకు పోలీసులు శనివారం కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతపురం సెంట్రల్: సమాజంలో మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోతోంది. ఎక్కడో ఒక చోట అఘాయిత్యాలు వెలుగుచూస్తున్నాయి. పా ఠశాలకు వెళ్లి చదువుకోవాలన్నా.. ఉద్యోగాలు చేయాలన్నా.. ఒంటరిగా వెళ్లాలన్నా ఎక్కడ కీచకులు మాటువేసు ఉంటారోనని భయాందోళన వ్యక్తమవుతోంది. బాలికలు, మహిళల రక్షణ కో సం ప్రత్యేక చట్టాలు అమల్లో ఉన్నా నేరాలు అదు పు కావడం లేదు. చట్టాలపై పెద్దగా అవగాహన లేకపోవడం వలన ఏమవుతుందిలే అనే ధోరణిలో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ప్రతి ఏడాది పదుల సంఖ్యలో పోక్సో చట్టం కింద కేసులు నమోదవుతుండడం గమనార్హం. చట్టంపై అవగాహన శూన్యం.. ఢిల్లీలో నిర్భయ ఉదంతం అనంతరం మహిళా రక్షణ చట్టాల్లో మార్పులు చేశారు. నిర్భయ యాక్టు, పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్)యాక్టు అమల్లోకి వచ్చాయి. ఈ చట్టం ప్రకారం 12 సంవత్సరాల లోపు పిల్లలపై లైంగిక వేధింపులు, అత్యాచారం ఘటనలు జరిగితే ఏకంగా ఉరిశిక్ష పడే అవకాశం ఉంది. 18 సంవత్సరాల లోపు పిల్లలపై నేరాలు జరిగితే జీవితఖైదు శిక్ష పడే అవకాశాలున్నాయి. అయితే గ్రామీణ స్థాయి వరకు ఈ చట్టాలపై పెద్దగా అవగాహన లేకుండాపోతోంది. క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు చట్టంపై అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా నేరాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఉసిగొల్పుతున్న సెల్ఫోన్స్.. ఇంటర్నెట్ ప్రభావం వలన ఇలాంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్లు హల్చల్ చేస్తున్నాయి. వీటికి తోడు పలు కంపెనీలు ఉచిత ఇంటర్నెట్ అవకాశం కల్పించడం వలన ఎక్కువశాతం యువత పెడదారి పడుతున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో నేరాలు మరింత ఎక్కువవుతున్నాయి. చేతిలో సెల్ఫోన్ లేకపోతే నిమిషం కూడా గడవదనే రీతిలో యువత వ్యవహరిస్తోంది. యువత మాత్రమే కాకుండా చదువుకున్న విజ్ఞానవంతులు, సన్మార్గంలో నడిపించాల్సిన వ్యక్తులు కూడా ఈ తరహా నేరాలకు పాల్పడుతుండడంతో సభ్యసమాజం తలదించుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. అఘాయిత్యాలకుపాల్పడితే కఠిన చర్యలు విద్యార్థినిలు, మహి ళల రక్షణ కోసం కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. దీనిపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో ప్రత్యేకంగా మహిళా రక్షక్ బృందాలు పనిచేస్తున్నాయి. ప్రతి రోజూ పాఠశాలలు, కాలేజీల్లో పోక్సో, నిర్భయ చట్టాలపై అవగాహన కల్పిస్తున్నాయి. పోలీసులు గ్రామాలకు వెళ్లినప్పుడు కూడా గ్రామసభల్లో ఈ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కొత్త చట్టాలు వచ్చిన తర్వాత అత్యాచారాలు, లైంగిక వేధింపులకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడుతున్నాయి. – జె.వెంకట్రావ్, డీఎస్పీ అనంతపురం -
మీ హెయిర్ స్టైల్ పోలిసుల కంటపడకుండా చూసుకోండి
కర్ణాటక, మాలూరు: పట్టణంలోని పోకిరిలకు, ఆడపిల్లలను వేధించే వారికి పట్టణ పోలీసులు సోమవారం వినూత్న రీతిలో బుద్ధి చెప్పారు. గత వారం విద్యార్థిని రక్షిత హత్య ఉదంతం అనంతరం మేల్కొన్న పోలీసులు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పట్టణంలో పోకిరిలు, ఆడపిల్లలను వేధించే వారు, వినూత్న రీతిలో హేర్ కటింగ్ చేయించుకున్న వారు, గడ్డాలు విడిచిన వారికి తగిన హెచ్చరికలు జారీ చేసే ప్రయత్నం చేపట్టారు. ఇందులో భాగంగా ఎస్ఐ ఎం. ఎన్ మురళి నేతృత్వంలోని పోలీస్ సిబ్బంది సోమవారం ఉదయం పట్టణంలోని ప్రముఖ వీధులలో సంచరించి స్టైల్గా గడ్డం పెంచిన వారిని, చిత్ర విచిత్రంగా తల వెంట్రుకలు పెంచిన వారిని గుర్తించి వారిని నేరుగా కటింగ్ షాపులకు తీసుకు వెళ్లి గడ్డాలను, స్టైల్ కటింగ్లను తీయించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎస్ఐ మురళి పట్టణంతో పాటు తాలూకాలోని ప్రతి గ్రామంలోను ఇలాంటి వారిని గుర్తించి గట్టిగా బుద్ధి చెబుతామన్నారు. పట్టణంలో బీట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. -
షాకింగ్ : అనుప్రియకు వేధింపులు
లక్నో, ఉత్తరప్రదేశ్ : కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్కు చేదు అనుభవం ఎదురైంది. ఉత్తరప్రదేశ్లోని ఆమె సొంత నియోజకవర్గం మీర్జాపూర్కు వెళ్లిన ఆమెను కొందరు ఆకతాయిలు వేధించారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీర్జాపూర్లో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనుప్రియ తిరిగివస్తున్న సమయంలో ముగ్గురు యువకులు కారులో ఆమె కాన్వాయ్ను ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో భద్రతా సిబ్బంది వారిని హెచ్చరించారు. అయినా పట్టించుకోని ఆకతాయిలు మంత్రి, సెక్యూరిటీ సిబ్బందిని ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారు. యువకుల ప్రయాణిస్తున్న కారుకు నెంబర్ ప్లేట్ లేదు. మంత్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆకతాయిలను అరెస్టు చేసి, కారును స్వాధీనం చేసుకున్నారు. కాగా, మహిళల రక్షణ కోసం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం యూపీలో యాంటీ రోమియో స్క్వాడ్స్ను నియమించిన విషయం తెలిసిందే. అయితే, ఆశించిన స్థాయిలో ఈ స్క్వాడ్స్ ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. ఏకంగా కేంద్రమంత్రిపైనే ఆకతాయిలు వేధింపులకు దిగడం యూపీలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. -
ఈవ్టీజింగ్పై ఉక్కుపాదం
ఈవ్టీజింగ్ రక్కసిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కోటి ఆశలతో ఉన్నత చదువుల కోసం విద్యార్థినులు కళాశాల బాట పడుతున్నారు. పాశ్చాత్య సంస్కృతి మోజులో ఈవ్టీజింగ్ చేయడం, ప్రేమించాలని వేధించడం చేస్తూ పోలీసులకు పట్టుబడితే ఊచలు లెక్కబెట్టాల్సిందే. అనంతపురం సెంట్రల్: మహానగరాల్లోనే కాకుండా అనంతపురం జిల్లాలో కూడా ఈవ్టీజింగ్ రక్కసి కొనసాగుతోంది. పలు కళాశాలల్లో ఈవ్టీజింగ్ దెబ్బకు చదువులు మానేసిన పిల్లలు కోకొల్లలుగా ఉంటే.. ప్రాణాలు తీసుకున్న వారు కూడా లేకపోలేదు. ముఖ్యంగా అమ్మాయిల చదువులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీనిపై ప్రత్యేక దృష్టి సారంచిన పోలీసులు గతేడాది నవంబర్ నుంచి ప్రత్యేకంగా మహిళా రక్షక్ బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా పది సబ్డివిజన్ కేంద్రాల్లో ఈ మహిళా రక్షక్ బృందాలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, అమ్మాయిలకు వేధింపుల నుంచి రక్షణ కల్పించడమే లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారు. కళాశాలలు, పాఠశాలలు, దేవాలయాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, పార్కులు, సినిమా థియేటర్లు తదితర ప్రాంతాల్లో మఫ్టీలో ఉంటూ నిఘా వేస్తున్నారు. ప్రత్యేక హెల్ప్లైన్: మఫ్టీలో ఉండడమే కాకుండా ఆపదలో ఉన్న మహిళలు, విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా హెల్ప్లైన్ ఏర్పాటు చేశారు. డయల్ 100, 9989819191 వాట్సాప్ నంబర్లను ఆశ్రయిస్తే తక్షణ సాయం అందేలా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు 720 మంది పోకిరీలు పట్టుబడ్డారు. వీరిని వెంటనే ఆయా పోలీస్స్టేషన్లకు తరలిస్తారు. అనంతరం జిల్లా కేంద్రంలోని పోలీసుకార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా గ్రీవెన్ సెల్ కార్యాలయంలో పోకిరీలకు వారి తల్లిదండ్రుల సమక్షంలో న్యాయవాదులు, మహిళా పోలీసులు, ఎన్జీఓలతో కూడిన బృందం ద్వారా పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తారు. కౌన్సెలింగ్ ద్వారా పద్ధతి మార్చుకోని వారు, నేర తీవ్రత ఎక్కువ ఉన్న వారిపై కేసులు కూడా నమోదు చేస్తుండడం గమనార్హం. ఇప్పటి వరకూ 17 మందిపై పెట్టీ కేసులు నమోదు చేయగా, 10 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నగరంలో కలెక్టరేట్కు సమీపంలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలల్లో పదవతరగతి చదువుతున్న విద్యార్థినిని వేధిస్తున్న పోకిరీపై గతంలో నేరచరిత్ర ఉండడంతో రౌడీషీట్ ఓపెన్ చేయడం గమనార్హం. ఉపేక్షించేది లేదు ఈవిటీజింగ్ను ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదు. ఎస్పీ జీవీజీ అశోక్కుమార్ కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ప్రత్యేకంగా మహిళా రక్షక్ బృందాలు నియమించాం. ఈవ్టీజింగ్కు పాల్పడుతూ పట్టుబడితే జైలుపాలు కావాల్సిందే. మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయి. అనంతపురం సబ్డివిజన్ పరిధిలోనే అనేక మందిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశాం. – వెంకట్రావ్, డీఎస్పీ, అనంతపురం -
మైనర్బాలికపై ఈవ్టీజింగ్
నెల్లూరు(క్రైమ్): మైనర్బాలికపై ఈవ్టీజీంగ్కు పాల్పడిన ఇద్దరు వ్యక్తులకు స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితులను పోలీసులకు అప్పగించిన ఘటన ఆదివారం రాత్రి నెల్లూరులోని మినీబైపాస్లో అన్నమయ్య సర్కిల్ వద్ద చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. డైకస్రోడ్డుకు చెందిన దంపతులు తమ ఇద్దరు పిల్లలతో పాటు బంధువుల కుమార్తెను ఆదివారం గొలగమూడిలోని ఫన్పార్క్కు తీసుకెళ్లారు. తిరిగి స్కూటీపై ఇంటికి బయలుదేరుతూ బంధువుల కుమార్తెను గొలగమూడి నుంచి ఆటోలో ఎక్కించి దంపతులిద్దరూ వాహనాన్ని వెంబడిçస్తూ బయలుదేరారు. అయితే కనుపర్తిపాడు సమీపంలోని మద్యం దుకాణం వద్ద సుందరయ్యకాలనీకి చెందిన పోతయ్య, గొలగమూడికి చెందిన నాగూరు అనే ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి మోటార్బైక్పై నగరంలోకి వస్తూ ఆటోలో వస్తున్న బాలికకు అసభ్యకర సైగలు చేస్తూ వెంబడించారు. ఈ విషయాన్ని వెనుక వస్తున్న దంపతులు గుర్తించి అన్నమయ్య సర్కిల్ వద్ద వారిని పట్టుకుని ప్రశ్నించగా ఎదురుతిరిగారు. దీంతో స్థానికులు అక్కడకు విషయం తెలుసుకున్నారు. ఈవ్టీజింగ్కు పాల్పడిన పోతయ్య, నాగూరులకు దేహశుద్ధిచేసి నాలుగోనగర పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు. బాలిక బంధువుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తప్పతాగి బాలికను వేధించబోతే...
-
తప్పతాగి బాలికను వేధించబోతే...
శ్రీనగర్ : తప్పతాగిన ముగ్గురు యువకులు రోడ్డు మీద వెళ్లే వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బైక్పై దూసుకెళ్లారు. ఇంతలో ఓ స్కూల్ విద్యార్థిని స్కూటీపై వెళ్తుండగా.. ఆమెను వేధించాలని డిసైడ్ అయ్యారు. మార్గం మధ్యలో బైక్ దిగిన ఒకడు ఆమెను అడ్డగించేందుకు యత్నించాడు. అయితే ఆమె వేగంగా దూసుకెళ్లటంతో బైక్ తగిలి బొక్కా బొర్లాపడిపోయాడు. ఆ యత్నంలో బాలిక కూడా కింద పడిపోయింది. ఆ వెంటనే ఆమె పైకి లేవగా.. ఆ పోకిరీ మాత్రం కదలకుండా అలాగే ఉండిపోయాడు. భయంతో మిగతా ఇద్దరు అతన్ని కదలించే యత్నం చేశారు. ఈ ఘటనంతా అక్కడే ఉన్న ఓ ఇంటి సీసీ కెమెరాలో రికార్డయ్యింది. జమ్ము కశ్మీర్ దొడా జిల్లా భాదర్వా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోగా.. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మంచి పని అయ్యిందంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. -
రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ ఈవ్టీజర్..
సాక్షి, హైదరాబాద్ : ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తూ, వారితో సీక్రెట్గా దిగిన ఫోటోలను ఫేస్బుక్లో పెడతానంటూ బెదిరిస్తున్న ఓ యువకుడిని బుధవారం షీ టీం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండ ప్రాంతానికి చెందిన అల్తాన్ ఖాన్ తరచూ అమ్మాయిలను వేధించేవాడు. వారితో రహస్యంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు. అల్తాన్ ఖాన్ చర్యలకు విసుగు చెందిన ఓ అమ్మాయి షీ టీం పోలీసులను ఆశ్రయించింది. టోలీచౌకి చౌరస్తా వద్ద మాటు వేసిన పోలీసులు అల్తాన్ ఖాన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గతంలో అమ్మాయిలను వేధించిన కేసులో అల్తాన్ ఖాన్ అరెస్టయిన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
ఆకతాయిలకు..చెక్
భానుగుడి(కాకినాడ సిటీ): బాలికలు, మహిళలు ధైర్యంతో అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కోరారు. శనివారం స్థానిక భానుగుడి సెంటర్లో కాకినాడ స్మార్ట్సిటీలో ఈవ్టీజింగ్ నివారణకు జిల్లా పోలీస్ విభాగం షీ టీమ్స్ ఏర్పాటు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు. 2కే రన్ ర్యాలీని రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ప్రారంభించారు. జేఎన్టీయూకే అలుమినీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై షీ టీమ్స్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీసీఎం రాజప్ప మాట్లాడుతూ మహిళల గౌరవం, హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, ఇటీవల నిర్వహించిన పోలీస్ రిక్రూట్మెంట్లో మహిళలకు 30 శాతం ప్రాధాన్యం పాటించామన్నారు. మహిళల గౌరవాన్ని, స్వేచ్ఛను భంగపరిచే అనుచిత ప్రవర్తన, వేధింపులను నిర్మూలించేందుకు షీ టీమ్స్ రక్షణ వ్యవస్థను అమలులోకి తెచ్చిందన్నారు. సీసీటీవీ కెమెరాలు, మఫ్టీలో షీటీమ్ల నిఘాలో కాకినాడ నగరంలో మహిళలకు మరింత భద్రతంగా రూపుదిద్దినందుకు ఎస్పీ, పోలీసు యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు. ఎస్పీ విశాల్గున్ని మాట్లాడుతూ నగరంలో ఈవ్టీజింగ్ జరిగే ప్రదేశాల్లో ఒక మహిళా ఎస్సై, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు, మరో ఇద్దరు పురుష కానిస్టేబుళ్లతో షీ టీమ్ మఫ్టీలో రహస్య నిఘా ఉంచుతాయన్నారు. ఫిర్యాదులను 100 నంబర్కు ఫోన్ ద్వారాగానీ, ‘షీటీమ్కేడీఏ’ ఫేస్బుక్ అడ్రస్కు, వాట్సాప్ నంబర్ 94949 33233కు మెసేజ్ ద్వారా లేదా, కాకినాడ టూటౌన్ పోలీస్స్టేషన్ పై అంతస్తులోని డీఎస్పీకి తెలియజేస్తే 24 గంటలలోపు ఆకతాయిలపై చర్య చేపట్టి భద్రత కల్పిస్తామన్నారు. కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ నగరంలో బాలికలు, మహిళలకు ఎదురయ్యే ఆకతాయి వేధింపులను షీ టీమ్స్ అండతో ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. రంపచోడవరం ఏఎస్పీ అజితావేజెండ్ల మాట్లాడుతూ మహిళల రక్షణకోసం ఏర్పాటైన చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలని కోరారు. ఐడియల్ కళాశాల కార్యదర్శి డాక్టర్ పి.చిరంజీవినికుమారి మాట్లాడుతూ మహిళలకు నేనున్నానని ఆత్మస్థైర్యం కల్పిస్తూ పోలీస్ షీటీమ్స్ వ్యవస్థ నిలవడం ముదావహమన్నారు. ముందుగా భానుగుడి సెంటర్ నుంచి జేఎన్టీయూకే ఆడిటోరియం వరకు పెద్ద సంఖ్యలో బాలికలు, మహిళల భాగస్వామ్యంతో 2కే రన్ సాగింది. ఈ రన్లో విజేతలుగా నిలిచిన బాలికలు జి.దివ్య, పుష్పవాణి, మోహితాప్రసన్న, రామలతలకు జేఎన్టీయూకే ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం రాజప్ప బహుమతులు అందజేశారు. ఎస్పీ సతీమణి నేహాగున్ని, డీఎఫ్ఓ డాక్టర్ నందినీ సలారియా, ఏఎస్పీ ఏఆర్ దామోదర్, రంగరాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.మహాలక్ష్మి, డీఎస్పీలు, కళాశాల విద్యార్థినిలు, వివిధ రంగాల మహిళలు పాల్గొన్నారు. -
సికింద్రాబాద్లో పోకిరీకి దేహశుద్ధి
-
పోకిరీ తాట తీసింది...!
సాక్షి, న్యూఢిల్లీ : రోడ్డు మీద వెళ్తుంటే ‘కుక్కల్లా మొరుగుతుంటారు’.. మనమెందుకులే అని మిగతా యువతుల్లా భరించాలని ఆమె అనుకోలేదు. కొద్దిసేపు భరించింది. వెంటాడుతూ అనుచిత వ్యాఖ్యలకు దిగారు. అంతే... తట్టుకోలేకపోయింది. ఉగ్రరూపం దాల్చి ఆ పోకిరీని గల్లా పట్టి కొట్టుకుంటూ స్టేషన్కు ఈడ్చుకొచ్చింది. దేశరాజధానిలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయంలోకి వెళ్తే.. ఫిబ్రవరి 25న కరోల్ బాగ్లోని గఫర్ మార్కెట్కు తన స్నేహితురాలితో ఆ యువతి వెళ్లింది. ఇంతలో ఐదుగురు వ్యక్తులు వారిని వేధించటం మొదలుపెట్టారు. దీంతో యువతులిద్దరూ రిక్షా ఎక్కి అక్కడి నుంచి బయలుదేరారు. వారిలో ఇద్దరు బైక్పై వాళ్ల రిక్షాను వెంబడిస్తూ కామెంట్లు చేస్తూనే ఉన్నాడు. అందులో ఒక్క వ్యక్తి మాత్రం సదరు యువతిపై అనుచితంగా వ్యాఖ్యలు చేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ యువతి రిక్షా దిగి మరీ అతన్ని ఈడ్చి కొట్టింది. అంతటితో ఆగకుండా వాడి గల్లా పట్టి కొట్టుకుంటూ దగ్గర్లోని పోలీస్ స్టేషన్కు లాక్కెళ్లింది. ఈ క్రమంలో అక్కడ గుమిగూడిన స్థానికులు కొందరు ఆమెకు సాయం చేయటం విశేషం. యువతి ఫిర్యాదు మేరకు మనీష్, అభిషేక్ అనే యువకులను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో గత రెండేళ్లలో లైంగిక దాడుల కేసులు అధికమైపోయాయి. సగటున రోజుకు అయిదుకు పైగా అత్యాచార కేసులు నమోదు అవుతున్నట్లు ఢిల్లీ పోలీసు గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది సుమారు 3,273 కేసులు నమోదు కాగా, అందులో 650 ఈవ్టీజింగ్ కేసులు ఉన్నాయి. -
అచంటలో పోలీసుల ఓవరాక్షన్..వీడియో వైరల్ !
సాక్షి, పశ్చిమ గోదావరి: జిల్లాలోని అచంటలో పోలీసుల ఓవరాక్షన్ కలకలం రేపింది. శివరాత్రి వేడుకల్లో యువతులను ఈవ్టీజింగ్ చేశారని కొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఏ విధమైనా విచారణ చేయకుండా వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అంతటితో అగకుండా పీఎస్లోనే ఆ యువకులపై చేయి చేసుకున్నారు. ఈ దృశ్యాలను వీడియో చిత్రీకరిస్తున్న మీడియాపై పోలీసులు చిందులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. -
విస్తుగొల్పే వాస్తవాలు!
సాక్షి, అమరావతి బ్యూరో: మహిళ అర్ధరాత్రి ధైర్యంగా నడిచి వెళ్లగలిగిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అని మహాత్మా గాంధీ అన్నారు. అయితే రాష్ట్ర రాజధానిలో భాగమైన విజయవాడలో అర్ధరాత్రి కాదు కదా పట్టపగలే మహిళ ధైర్యంగా వెళ్లగలిగే పరిస్థితి లేదు. నగరంలో ఈవ్టీజర్లు, రౌడీలు చెలరేగిపోతున్నారు. నగరంలో ప్రధాన ప్రాంతాల్లోనూ మహిళలు ఒంటరిగా సంచరించే పరిస్థితుల్లేవని ఓ మహిళా మిత్ర సభ్యులే తేల్చిచెప్పడం గమనార్హం. వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో ‘క్లాప్’ కార్యక్రమంలో నిర్వహించిన సర్వేలో వెల్లడైన విస్తుగొల్పే విషయాలు రాజధానిలో మహిళల దుస్థితిని తేటతెల్లం చేస్తున్నాయి. ఇదీ ‘క్లాప్’ అమెరికా కాన్సులేట్ కార్యాలయం సహకారంతో విజయవాడలోని వాసవ్య మహిళా మండలి ‘క్లాప్’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. విజయవాడ పోలీస్ కమిషరేట్లో అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలోని మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ‘మహిళా మిత్ర’ సభ్యులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఇందులో భాగంగా మొదటి దశలో విజయవాడలో గవర్నర్పేట, సూర్యారావుపేట, మాచవరం, సత్యనారాయణపురం, సింగ్నగర్, నున్న పోలీస్స్టేషన్ల పరిధిలో మహిళా మిత్ర సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా ఈ పోలీస్స్టేషన్ల పరిధిలో మహిళల భద్రతపై మహిళా మిత్ర సభ్యుల అభిప్రాయం తెలుసుకోవాలని సర్వే నిర్వహించారు. నగర శివార్లలో అధ్వానం విజయవాడ నడిబొడ్డున ఉన్న ప్రదేశాల్లోనే మహిళలకు రక్షణ కరువైందని సర్వేలో తేటతెల్లమైంది. మరీ ఎక్కువగా నగర శివార్లులోని పోలీస్స్టేషన్ల పరిధిలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉందని పోలీసువర్గాలే చెబుతున్నాయి. శివారు ప్రాంతాల్లోనే కాలేజీలు, ఇతర విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. రౌడీ గ్యాంగ్లు, పోకిరీలు నగరంలో ఎక్కడపడితే అక్కడ ఈవ్టీజింగ్, వేధింపులకు పాల్పడుతున్నారు. విజయవాడ పోలీసుల అధికారిక లెక్కల ప్రకారమే గతేడాది 2,500 మంది ఈవ్టీజర్లను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. సర్వే ఇలా.. ఆరు పోలీస్స్టేషన్ల పరిధిలో 40 ముఖ్య ప్రదేశాలను ఎంపిక చేశారు. ఈ ప్రదేశాల పేర్లతో ప్రశ్నావళిని రూపొందించి మహిళా మిత్ర సభ్యులకు నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. అవి.. ఎలాంటి అనుమతి లేకుండానే వెళ్లగలం, కుటుంబసభ్యుల అనుమతి తీసుకుంటేనే వెళ్లగలం, ఒక్కరమే వెళ్లలేం, అసలు వెళ్లలేం. ఈ నాలుగు ఆప్షన్లల్లో ఏవి ఆ 40 ప్రదేశాలకు సరిపోతాయని మహిళా మిత్ర సభ్యులను ప్రశ్నించారు. అందుకు వారు ఇచ్చిన సమాధానాలు విజయవాడలో మహిళలు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులను తెలిపాయి. ఆ 40 ప్రదేశాల్లో 27 మహిళలకు సురక్షితమైనవి కావని సమాధానమిచ్చారు. కేవలం 13 ప్రదేశాలకు మాత్రమే కుటుంబసభ్యుల అనుమతి లేకుండా ధైర్యంగా వెళ్లగలమన్నారు. ఇంకో 13 ప్రదేశాలకు వెళ్లాలంటే ముందుగా కుటుంబసభ్యుల అనుమతి తీసుకోవాల్సిందేనని చెప్పారు. వీటిలో కంట్రోల్ రూమ్, నెహ్రూ బస్టాండ్, రాజీవ్గాంధీ పార్క్, కాళీమాత ఆలయం, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మొదలైన ప్రదేశాలు ఉండటం గమనార్హం. ఈ ప్రదేశాల్లో మహిళలు వేధింపులకు గురవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని స్పష్టం చేశారు. మరో 13 ప్రదేశాలకు కుటుంబ సభ్యులు, స్నేహితులు తోడు లేకుండా వెళ్లలేమని వెల్లడించారు. వాటిలో పాత ప్రభుత్వ ఆస్పత్రి రోడ్డు, లెనిన్ సెంటర్, సింగ్నగర్ బ్రిడ్జ్, టైమ్ ఆస్పత్రి రోడ్, అలంకార్ థియేటర్, సదర్న్ హోటల్ రోడ్డు, రమేశ్ ఆస్పతి రోడ్డు మొదలైనవి ఉండటం గమనార్హం. ఈ ప్రదేశాలకు ఒంటరి మహిళలు వెళ్తే ఈవ్టీజింగ్, వేధింపుల బారిన పడాల్సిందేనని తేల్చిచెప్పారు. ఒక ప్రదేశానికి తోడు ఉన్నాసరే వెళ్లలేమని పేర్కొన్నారు. సర్వేకి ఎంపిక చేసిన ప్రదేశాలు 40 సురక్షితం కానివి 27 -
ప్రజల భాగస్వామ్యంతోనే నేరాలు అదుపు
కొత్తకోట: సమాజంలోని ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములుకావాలని.. అప్పుడే వందశాతం నేరాలు అదుపు చేయవచ్చని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. మండల కేంద్రంలోని బీపీఆర్ గార్డెన్లో ఆదివారం ఆమె సీసీ కెమెరాల ఏర్పాటు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పట్టణంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వలన కలిగే లాభాలను ఎస్పీ వివరించారు. వీటిని ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, పట్టణవాసులు, వ్యాపారులు, వివిధ కులసంఘాల నాయకులు, గ్రామ పంచాయతీ పాలకమండలి సభ్యులు సహకరించడం అభినందనీయమన్నారు. ఇటీవల పట్టణ కేంద్రాల్లో ఎక్కువగా చోరీలు జరుగుతుండటం మూలంగా వాటిని అరికట్టడానికి పట్టణంలో 70కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల దొంగలను గుర్తించడమే కాకుండా.. రోడ్డు ప్రమాదాలు జరిగిన వారికి ఇన్సూరెన్స్ కల్పించడం, అమ్మాయిలను రాగింగ్ చేసే వారిని గుర్తించడంతోపాటు ఇతర చట్టవ్యతిరేక సంఘటనలకు పాల్పడుతున్న దుండగులను పట్టుకోచ్చని తెలిపారు. పట్టణంలో సీసీల ఏర్పాటుకు కృషి చేసిన కొత్తకోట సీఐ సోమ్నారాయణŠసింగ్, ఎస్ఐ రవికాంత్రావును అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సురేందర్రెడ్డి, జెడ్పీటీసీ డా. పీజే బాబు, ఎంపీపీ గుంత మౌనిక, కొత్తకోట సర్పంచ్ చెన్నకేశవరెడ్డి, సీడీసీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, కొత్తకోట సింగల్విండో చైర్మన్ సురేంద్రనాథ్రెడ్డి, ఆయా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
నటి భువనేశ్వరి కొడుకు అరెస్ట్
చెన్నై: సంచలనాలకు కేంద్రబిందువు నటి భువనేశ్వరి. ఆమె కొడుకు కళాశాల విద్యార్థినిని పెళ్లి పేరుతో టార్చర్ పెట్టిన కేసులో అరెస్ట్ అయ్యి కటకటాలు లెక్కపెడుతున్నాడు. వివరాల్లోకెళ్లితే స్థానిక వలసరవాక్కం, తిరుమలై నగర్, ఏంజల్ వీధిలో నటి భువనేశ్వరి నివశిస్తోంది. ఆమె కొడుకు (23) మిథున్ శ్రీనివాసన్ లా చదువుతున్నాడు. ఇతనికి స్థానిక అన్నానగర్, తిరుమంగళంలో నివశిస్తున్న ఒక యువతికి ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అనంతరం ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం పెరగడంతో తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతిపై ఒత్తిడి చేయడం మొదలెట్టాడు. అందుకు ఆ యువతి నిరాకరించడంతో మిథున్ శ్రీనివాసన్ ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. అంతే కాకుండా ఆ యువతి చదివే కళాశాలకు వెళ్లి పెళ్లి చేసుకోవాలని టార్చర్ వేధించడంతో ఈ విషయాన్ని ఆ అమ్మాలు తల్లిదండ్రులకు చెప్పింది. వారు తిరుమంగళం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి మిథున్ శ్రీనివాసన్ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇంతకు ముందు నటి భువనేశ్వరి ఇంట్లో పని కోసం శ్రీలంక నుంచి తీసుకొచ్చిన యువతితో తన కొడుకుకు పెళ్లి చేసినట్లు, ఆ అమ్మాయి తల్లిదండ్రులను బెదిరించినట్లు మద్రాసు హైకోర్టులో కేసు విచారణలో ఉందన్నది గమనార్హం. -
ఆ హీరో కంట పడితే ఇక అంతే...
సాక్షి, ముంబై : ఆకతాయిల వేధింపులు కంటపడితే మనకెందుకులే.. సమయం వృథా... అని కొందరు పక్కకెళ్లి పోతున్న ఈ రోజుల్లో... ముంబైకి చెందిన దిపేష్ తంక్ చేస్తున్న పనిని మాత్రం అభినందించకుండా ఉండలేం. ఎందుకంటే రైల్వే రౌడీల భరతం పడుతున్న ఆయన ఇప్పుడు ముంబై హీరో అయిపోయాడు. ఇంతకీ ఆయన ఏం చేస్తున్నాడో చదవండి. సామాజిక వేత్త అయిన దిపేష్ తంక్ ఉదయాన్నే లేచి ముంబై రైళ్లు, రైల్వే స్టేషన్లలో సంచరిస్తూ కనిపిస్తుంటారు. ఎక్కడైనా ఆకతాయిలు అమ్మాయిలను వేధిస్తూ కనిపిస్తే చాలూ కాసేపు వారినే ఆయన తదేకంగా చూస్తుంటారు. ఆపై వారి దగ్గరి కెళ్లి ఆ చేష్టలను అడ్డుకుంటారు. ఈ గ్యాప్లోనే అసలు వ్యవహారం ఉంటుంది. కళ్లద్దాలు పెట్టుకుని జేమ్స్ బాండ్ తరహాలో ఆయన అక్కడి దృశ్యాలను చిత్రీకరిస్తుంటారు. ఇందుకోసం తన కళ్లజోడులో ఓ క్వాలిటీ కెమెరాను ఫిక్స్ చేసుకున్నారు. అమ్మాయిలను వేధించే వారిని మాత్రమే కాదు.. రైళ్ల నుంచి తిక్క చేష్టలు చేసే వారిని కూడా ఆయన చిత్రీకరిస్తుంటారు. వారిని అడ్డుకునే సమయంలో బుకాయిస్తే వాటిని సాక్ష్యాలుగా చూపిస్తారన్న మాట. ఈ విధంగా 6 నెలలుగా ఈ వన్ మన్ ఆర్మీ మిషన్ ద్వారా సుమారు 140 మందిని సాక్ష్యాలతోసహా ఆయన పోలీసులకు పట్టించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు బెదిరింపులు ఎదురు కాలేదా? అని ఆయన్ని అడిగితే.. జైలుకు వెళ్లి వచ్చిన కొందరు తనను చంపుతామని బెదిరించారని... మహిళలకు వేధింపులు ఆగేంతవరకు తాను ఎంత దూరమైన వెళ్తానని దిపేష్ చెబుతున్నారు. ఓవైపు సోషల్ మీడియా మొత్తం హర్వే వ్యవహారం తర్వాత మీటూ క్యాంపెయినింగ్తో నిండిపోయిన సమయంలో దీపేశ్ చేస్తున్న పనిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
అల్లానే మా అమ్మాయిని కాపాడాడు..
సాక్షి, విజయవాడ : ‘మా అమ్మాయిని అల్లానే కాపాడాడు. పోకిరీల వికృత చేష్టలపై ఫిర్యాదు చేసినా రైల్వే పోలీసులు స్పందించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని’ షేక్ నజ్బుల్లా తల్లిదండ్రులు షేక్ జాకీర్, నజియా బేగం పేర్కొన్నారు. పోకిరీల వికృత చేష్టలతో రైలు నుంచి దూకి గాయపడ్డ నజ్బుల్లా చికిత్స అనంతరం నిన్న (శుక్రవారం) రాత్రి విజయవాడలోని పెజ్జోనిపేటలోని తన ఇంటికి చేరింది. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులు మాట్లాడుతూ.. వరుస సెలవులు రావడంతో బక్రీద్ పండుగను తమతో కలిసి జరుపుకుందామని స్నేహితులతో కలిసి నజ్బుల్లా చెన్నై నుంచి బయలుదేరిందన్నారు. రైలులో పోకిరీలు వేధిస్తున్నారని పలుమార్లు ఫిర్యాదు చేసినా రైల్వే పోలీసులు పట్టించుకోలేదన్నారు. కాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్న నజ్బుల్లా తన స్నేహితురాళ్లతో కలిసి మిలీనియం ఎక్స్ప్రెస్ రైలులో చెన్నై నుంచి విజయవాడ వస్తుండగా కొందరు పోకిరీలు అఘాయిత్యం చేయబోయారు. సూటిపోటి మాటలు.. వెకిలి చేష్టలతో అసభ్యంగా ప్రవర్తించే సరికి తట్టులేక ఆమె ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద నడుస్తున్న రైలులో నుంచి దూకేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్కు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
మహిళా సీఐకి తప్పని పోకిరీ వేధింపులు
-
షీ టీమ్ కానిస్టేబుల్కే వేధింపులు
- ఈవ్టీజింగ్ కేసు విచారణలో భాగంగా నిందితుడికి ఫోన్కాల్ - ఆ నంబర్కే అసభ్యకర సందేశాలు పంపిస్తూ వేధింపులు - ఏకంగా పోర్న్ వెబ్సైట్లో మహిళా కానిస్టేబుల్ నంబర్ - ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్న రాచకొండ పోలీసులు సాక్షి, హైదరాబాద్: ఈవ్టీజర్ల ఆటకట్టించే షీ టీమ్లోని కానిస్టేబుల్నే ఎనిమిది నెలలుగా వేధింపులకు గురిచేస్తున్న యువకుడిని ఎట్టకేలకు రాచకొండ షీ టీమ్ బృందం పట్టుకుంది. మంగళవారం రాచకొండ షీ టీమ్స్ ఇన్చార్జ్ ఏసీపీ స్నేహిత వివరాలను మీడియాకు వెల్లడించారు. గుర్తు తెలియని వ్యక్తి నుంచి తన ఫోన్కు అసభ్యకర సందేశాలు వస్తున్నాయంటూ రంగారెడ్డి జిల్లా మంచాలలోని ప్రతిభా డిగ్రీ కాలేజీకి చెందిన అమ్మాయి రాచకొండ పోలీసు కమిషనరేట్కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఇబ్రహీంపట్నం షీ టీమ్స్ వాట్సాప్ నంబర్కు మెసేజ్ పంపింది. దీనిపై ఏఎస్ఐ నరసింహ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగి ఆ అమ్మాయిని సంప్రదించగా, ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అయితే ఎలాగైనా తన సమస్యను పరిష్క రించాలని అభ్యర్థించింది. అయితే విచారణ క్రమంలో నిందితుడి సెల్ నంబర్కు షీ టీమ్ సభ్యురాలు మహిళా పోలీసు కానిస్టేబుల్ వివరాల కోసం ఫోన్కాల్ చేసింది. ఆ తర్వాత మహిళా కానిస్టేబుల్ సెల్ నంబర్కు అసభ్యకర మెసేజ్లు పంపించడం ప్రారంభించాడు. తొలినాళ్లలో పట్టించుకోకున్నా వేధింపులు మరింత ఎక్కువ కావడంతో కానిస్టేబుల్ ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్లో జనవరి 23న ఫిర్యాదు చేసింది. కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు మహిళా కానిస్టేబుల్ను వేధించడం మాత్రం మానలేదు. నెల రోజుల క్రితం మహిళా కానిస్టేబుల్ ఫోన్ నంబర్ను పోర్న్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడంతో ఆమెకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి విపరీతమైన కాల్స్ వచ్చేవి. కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు నిందితుడు వరంగల్ జిల్లా పరకాల మండలానికి చెందిన బి.నిఖిల్ కుమార్గా గుర్తించి అరెస్టు చేశారు. -
50 మంది ఈవ్ టీజర్లకు కౌన్సెలింగ్
హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నయువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 50 మంది ఈవ్ టీజర్లకు షి-టీమ్ ఏసీపీ స్నేహిత కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ కౌన్సెలింగ్లో ఈవ్టీజర్స్ తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. -
ఈవ్ టీజింగ్ చేశాడని ఉతికి ఆరేసారు
-
ప్రేమించకుంటే.. ఇద్దరినీ పెట్రోల్ పోసి తగలేస్తా..
బంజారాహిల్స్: తనను ప్రేమించకపోతే పెట్రోల్ పోసి తగలేస్తానంటూ బెదిరిస్తున్న యువకుడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కల్లకూరు గ్రామానికి చెందిన యువతి తల్లిదండ్రులతో కలిసి బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎన్బీటీ నగర్లో నివాసం ఉంటోంది. సమీపంలోని ఓమెగా ఆస్పత్రిలో 2014 నుంచి టెక్నికల్ ఆపరేటర్గా పని చేస్తోంది. ఆస్పత్రికి వచ్చిపోయే సమయంలో అందులోనే గతంలో ఎలక్ట్రీషన్గా పనిచేసిన మహేష్ ఏడాది కాలంగా ప్రేమించాలంటూ వెంట పడుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెకు ఫోన్ చేసి ప్రేమించకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు. తనను కాకుండా ఇంకెవరినైనా పెళ్ళి చేసుకుంటే ఇద్దరినీ కలిసి పెట్రోల్ పోసి తగలేస్తానంటూ గత నెల మరోసారి ఎస్వీఆర్ స్కూల్ వద్ద అడ్డగించి బెదిరించాడు. రెండో రోజుల క్రితం మరోసారి ఫోన్ చేసి తనను ప్రేమిస్తావా లేకపోతే చస్తావా అంటూ హెచ్చరించాడు. తనను కాదని పెళ్ళి చేసుకుంటే అంతు చూస్తానంటూ బెదిరించడమే కాకుండా మానసికంగా వేధింపులకు గురి చేస్తానని బెదిరించాడు. దీంతో మహేష్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు మహేష్పై సెక్షన్ 354(డి), 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీస్ కాదు పోకిరి
– గృహిణిని ఫొటోలు తీస్తూ చిక్కిన హెడ్కానిస్టేబుల్ – సబ్జైలుకు తరలింపు నంద్యాల: ఆకతాయిల నుంచి మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ పోకిరి అవతారమెత్తి చివరకు జైలు పాలయ్యాడు. నంద్యాల సరస్వతి నగర్లో నివాసం ఉన్న హెడ్కానిస్టేబుల్ ప్రసాద్ నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్లో పని చేస్తూ ఇటీవల మిడుతూరుకు బదిలీ అయ్యారు. రాజమండ్రికి చెందిన ఓ పెళ్లి బృందం నందికొట్కూరుకు వివాహానికి హాజరైంది. ఈ బృందంలో ఓ మహిళ, ఆమె సోదరులు చంద్రశేఖర్, శంకర్ వెంట ఉన్నారు. వీరు మళ్లీ రాజమండ్రికి బయల్దేరానికి గురువారం నందికొట్కూరుకు నుంచి నంద్యాలకు ఆర్టీసీ బస్సులో బయల్దేరారు. మార్గమధ్యంలో మిడుతూరులో హెడ్కానిస్టేబుల్ ప్రసాద్ కూడా బస్సు ఎక్కాడు. బస్సులో ఉన్నంత సేపు పెళ్లి బృందంలోని ఓ యువతితో వెకిలిగా ప్రవర్తించాడు. బస్సు నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ చేరాక, ఈ యువతి లగేజి తీసుకుంటూ ఉండగా హెడ్కానిస్టేబుల్ ప్రసాద్ సెల్ఫోన్లో ఫొటోలు తీశాడు. ఈ విషయాన్ని గ్రహించిన కుటుంబ సభ్యులు, స్థానికులు అతన్ని చితకబాది వన్టౌన్ పోలీసులకు అప్పగించారు. సీఐ ప్రవీణ్కుమార్ కేసు నమోదు చేసి అతన్ని శుక్రవారం జేఎఫ్సీఎం కోర్టులో హాజరు పరిచారు. జడ్జి బాబాఫకృద్దీన్ బెయిల్కు నిరాకరించి రిమాండ్కు తరలించాలని ఆదేశించారు. ఈ మేరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని సబ్జైలుకు తరలించారు. -
ఐదుగురు ఈవ్ టీజర్లు ఆత్మహత్యాయత్నం!
అనంతపురం: ఓ యువతిని ఐదుగురు ఆటో ద్రైవర్లు గత కొంత కాలం నుంచి ఎంతగానో వేధిస్తున్నారు. చివరికి పోలీసుల చేతికి చిక్కేసరికి కేసుల భయంతో ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక చంద్రబాబు నగర్కు చెందిన ఓ యువతిని ఐదుగురు ఆటోడ్రైవర్లు కొంతకాలం నుంచి వేధింపులకు గురిచేస్తున్నారు. బాధిత యువతి ఈవ టీజింగ్ చేసిన ఐదుగురిపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆ యువతిని ఆటో డ్రైవర్లు ఓ రహస్య ప్రాంతానికి తీసుకెళ్తుండగా పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఇదివరకే యువతి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ ఐదుగురినీ గత మూడు రోజులుగా రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసుల భయంతో వారు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఈవ్టీజర్ భరతం పట్టిన ప్రజలు
-
శ్రీకృష్ణుడు ఈవ్టీజరే: ప్రశాంత్ భూషణ్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో ఆకతాయిలకు వ్యతిరేకంగా అమలుచేస్తున్న ‘యాంటీ రోమియో’ కార్యక్రమాన్ని విమర్శిస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ శ్రీకృష్ణునిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయనపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘రోమియో ఒక్క అమ్మాయినే ప్రేమించాడు. కానీ శ్రీకృష్ణుడు పురాణాల్లో ఈవ్టీజర్గా నిలిచిపోయాడు. తన అనుచరులను కృష్ణ వ్యతిరేక బృందాలు అని పిలిచేందుకు యూపీ సీఎం ఆదిత్యనాథ్కు ధైర్యముందా?’ అని భూషణ్ ట్వీట్ చేశారు. తర్వాత.. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, హిందూ సెంటిమెంట్లను అగౌరవపరచడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చారు. -
నేనూ ఈవ్ టీజింగ్ బాధితురాలినే!
నేనూ ఈవ్ టీజింగ్ బాధితురాలినే నటోంది నటి ఇలియానా. ఇంతకుముందు టాలీవుడ్లో క్రేజీ నటిగా వెలిగిన కథానాయకి ఇలియానా. నన్భన్ చిత్రంతో కోలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ఈ గోవా బ్యూటీ ఆ తరువాత బాలీవుడ్ మోహంతో దక్షిణాదిలో కనుమరుగైంది. అయితే అక్కడా అమ్మడి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అయితే సందర్భాన్ని బట్టి ఏదో ఒక సంఘటనతో వార్తల్లో ఉంటూ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల తారల లైంగిక వేధింపుల గొడవ పెద్ద ఇష్యూగా మారడంతో తానూ అలాంటి బాధితురాలినే నంటూ మరోసారి వార్తల్లోకెక్కింది. ఇంతకీ ఇలియానా ఏం చెప్పిందనేగా మీ ఆసక్తి. ఆ జాణ మాటల్లోనే చూద్దాం. నేనూ ఈవ్టీజింగ్ బాధితురాలినే. నటిగా రంగప్రవేశం చేసిన కొత్తలో అలాంటి భయంకరమైన సంఘటనను ఎదుర్కొన్నాను. మా ఇంటి సమీపంలో నివశించే ఒక కుర్రాడు రోజూ నా వెంటపడి వేధించేవాడు. మొదట్లో నేను పెద్దగా పట్టించుకోలేదు. అలా చాలా రోజులు మౌన వేదననను భరించాను. అప్పటికి ఒక చిత్రంలోనే నటించడంతో నన్ను ఎవరూ గుర్తుపట్టలేదు. అయితే రోజు రోజుకీ అతడి ఆగడాలు మితిమీరడంతో ఒక రోజు అమ్మకు చెప్పేశాను. మా అమ్మ చాలా ధైర్యవంతురాలు. అతడిని పిలిచి గట్టిగా హెచ్చరించింది. అయినా చేతనైతే పోలీసులకు ఫిర్యాదు చేసుకో అని అతడు అనడంతో కచ్చితంగా ఫిర్యాదు చేస్తానని అమ్మ అంది. దీంతో ఆ మరుసటి రోజు నుంచి అతడి జాడ లేదు. అయితే ఆ కొద్దిరోజులు నేను భయంగానే గడిపాను. ఈవ్టీజింగ్ క్రూరమైన చర్య అని ఇలియానా పేర్కొంది. -
ఈవ్టీజింగ్ కేసులో యువకుల అరెస్టు
ముజఫర్నగర్: అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఈవ్టీజింగ్కు పాల్పడుతున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రవేశ పెట్టిన ఆంటీ రోమియో స్క్వాడ్ ఆకతాయిల పట్ల ఉక్కుపాదం మోపుతుంది. ముజఫర్ నగరలోని తానా భావన్ పట్టణంలో ఆరుగురి ఆకతాయిలను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్లో మహిళపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, శాంతి నెలకొల్పాలని పోలీసులకు ప్రత్యేక అధికారాలు ఇస్తున్నట్లు సీఎం ఆదిత్యానాద్ ప్రకటించిన విషయం తెలిసిందే. మార్కెట్లు, మాల్స్, స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్ల వద్ద పోలీసులు మఫ్టిలో విధులు నిర్వహిస్తున్నారు. ఈవ్టీజింగ్ రూపుమాపడమే రోమియో స్క్వాడ్ లక్ష్యమని పోలీసులు ప్రకటించారు. -
ఆడవాళ్ల జోలికొస్తే ఖబడ్తార్ అంటూ ఉతికేసింది
-
చెంప చెళ్లుమనేదే! కానీ...
హిందీలో ‘బేబీ’, ‘పింక్’, ‘నామ్ షబానా’ సినిమాలు తాప్సీకి యాక్షన్ గాళ్ ఇమేజ్ తీసుకొచ్చాయి. ఈ నెల 31న విడుదల కానున్న ‘నామ్ షబానా’ ట్రైలర్లో అయితే పవర్ ప్యాక్డ్ పంచ్లతో చెలరేగారు. రియల్ లైఫ్లోనూ తాప్సీ తీరు పరిశీలిస్తే... ఫైర్ బ్రాండ్ను తలపిస్తుందనే చెప్పాలి. కానీ, ‘నేనంత ఫైర్బ్రాండ్ను కాదండీ బాబు’ అంటున్నారు తాప్సీ. కనీసం ఓ మనిషిని చెంపదెబ్బ కూడా కొట్టలేనన్నారు. ఆమె కాలేజీ రోజుల్లో జరిగిన ఓ ఘటన గురించి తాప్సీ మాట్లాడుతూ.. ‘‘కాలేజీలో ఈవ్ టీజింగ్ చేసేవారు. కొన్నిసార్లు ఎక్కడెక్కడో చేతులు వేసేవారు. అసభ్యంగా ప్రవర్తించేవారు. ఓసారి విపరీతమైన కోపం వచ్చింది. అప్పుడు ఓ అబ్బాయి చెంప గట్టిగా చెళ్లుమనేది. కానీ, నేను అంత సాహసం చేయలేకపోయా. బహుశా... భయపడి ఉంటాను’’ అన్నారు. -
నో యాక్ట్.. నో..యాక్షన్
►ప్రత్యేక చట్ట మంటూ లేని ‘షీ–టీమ్స్’ ►రెండేళ్ల క్రితమే ప్రతిపాదించిన వైనం ►తమిళనాడు తరహా ముసాయిదా సమర్పణ ►ఇప్పటికీ ప్రభుత్వం వద్ద పెండింగ్లోనే... సిటీబ్యూరో: ‘ఆ వ్యక్తి చేష్టలతో యువతులు కొన్ని నెలల పాటు విసిగిపోయారు. అనేక సందర్భాల్లో తీవ్ర ఆందోళనకు, దిగ్భ్రాంతికి, అభద్రత భావానికీ లోనయ్యారు. అయితే ఆ పోకిరీకి పడిన శిక్ష రూ.50 జరిమానా మాత్రమేనా.?’ ‘షీ–టీమ్స్’ ఫేస్బుక్ పేజీలో ఈ తరహా పోస్టింగ్స్ ఎన్నో. దీనికి పరిష్కారంగా అధికారులు రూపొందించిన ప్రతిపాదనే ‘తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ఈవ్ టీజింగ్ యాక్ట్’. తమకో ప్రత్యేక చట్టం కావాలంటూ ‘షీ–టీమ్స్’ రెండేళ్ల క్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా... ఇప్పటికీ స్పందన రాలేదు. ఈ ఫైల్ న్యాయ విభాగం వద్ద పెండింగ్లో ఉండిపోయింది. సరైన చట్టం లేని కారణంగా అనేక మంది పోకిరీలు స్వల్ప శిక్షలతో తప్పించుకునే పరిస్థితి నెలకొంది. మూడేళ్లవుతున్నా చట్టం లేదు... రోడ్లపై ఉండే పోకిరీల మొదలు ఆన్లైన్లో, సోషల్మీడియా ద్వారా అదును చూసి కాటు వేస్తున్న నయవంచకుల వరకు... ఎందరో మృగాళ్ళ బారినుంచి అతివల్ని రక్షిస్తున్న హైదరాబాద్ ‘షీ–టీమ్స్’ అమలులోకి వచ్చి మూడేళ్లు కావస్తోంది. ఇప్పటికే గణనీయమైన ఫలితాలు సాధిస్తున్న ఈ బృందాల పని తీరును మరింత మెరుగుపరచడంతో పాటు మహిళలు/యువతులకు పూర్తి స్థాయి భరోసా ఇవ్వడానికి ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈవ్ టీజర్లకు కఠిన శిక్షలు పడేలా చేసేందుకు ప్రత్యేక చట్టం అవసరమని నిర్ణయించారు. తమిళనాడులో అమలులో ఉన్న ‘తమిళనాడు ప్రొహిబిషన్ ఆఫ్ ఈవ్ టీజింగ్ యాక్ట్’ తరహాలో రూపొందించిన ముసాయిదాను రెండేళ్ళ క్రితమే ప్రభుత్వానికి సమర్పించారు. చిక్కుతున్నా చిన్న కేసులే... బహిరంగ ప్రదేశాల్లో యువతులు/మహిళల్ని వేధిస్తున్న పోకిరీలను నిత్యం ‘షీ–టీమ్స్’ పట్టుకుంటున్నా... తీవ్రత, ఆధారాలు ఉంటే తప్ప అందరి పైనా ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)తో పాటు నిర్భయ, యాంటీ ర్యాగింగ్ యాక్ట్ల ప్రకారం కేసులు నమోదు చేయడం సాధ్యం కావట్లేదు. దీంతో మూడేళ్లలో సీసీఎస్ ఆధీనంలోని ‘షీ–టీమ్స్’కు చిక్కిన పోకిరీల్లో దాదాపు సగం మంది చిన్న (పెట్టీ) కేసులు, నామమాత్రపు జరిమానాతో సరిపెట్టాల్సి వచ్చింది. ఈవ్–టీజింగ్కు పాల్పడుతూ రెండోసారీ చిక్కిన ఓ వ్యక్తితో పాటు తీవ్రమైన స్థాయిలో రెచ్చిపోయిన వారిపైనే కేసులు నమోదు చేయగలిగారు. పోకిరీల వేధింపులు అనేవి చూడటానికి చిన్న విషయంగా కనిపించినా యువతులు/మహిళలపై వాటి ప్రభావం తీవ్రంగా ఉండటంతో పాటు సమాజం, పోలీ సులపై ఏహ్యభావం ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రత్యేక యాక్ట్తోనే కట్టడి... ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న సీసీఎస్ ఉన్నతాధికారులు ఈవ్ టీజర్లను పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి ప్రత్యేక చట్టం అవసరమని భావించారు. దీంతో పలు ప్రాంతాల్లో అమలులో ఉన్న విధానాలను అధ్యయనం చేసి... చివరకు తమిళనాడులో అమలులో ఉన్న చట్టం ఉపయుక్తంగా ఉందని నిర్థారించారు. ఈవ్–టీజింగ్ బారినపడి పలువురు అతివలు గాయపడటం, కొందరు మరణించడం సైతం జరగడంతో అక్కడి సర్కారు 1998లోనే ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చింది. ఆ ఏడాది జూలై 30 ఆర్డినెన్స్ రూపంలో, కొన్ని నెలలకే చట్టంగా అమలులోకి వచ్చిన ఈ యాక్ట్ మంచి ఫలితాలు ఇచ్చినట్లు అధికారులు తమ పరిశీలనలో గుర్తించారు. ప్రభుత్వానికి ముసాయిదా ప్రతి... దీంతో అక్కడి చట్టంలోని అంశాలతో పాటు ఇతర పరిణామాలను చేరుస్తూ ఓ ముసాయిదాను రూపొం దించిన ఉన్నతాధికారులు రెండేళ్ల క్రితమే ప్రభుత్వానికి పంపారు. న్యాయ మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్లో ఉండిపోయిన ఈ ఫైలు ఒక్క అడుగూ ముందుకు వేయలేదు. ఈ ముసాయిదా చట్ట రూపం దాలిస్తే తెలం గాణలోనూ మంచి ఫలితాలు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. ముసాయిదాలోని ముఖ్యాంశాలు ►బహిరంగ ప్రదేశాలు, పని చేసే ప్రాంతాలు, మాల్స్...ఎక్కడైనా ఈవ్ టీజింగ్కు పాల్పడుతూ చిక్కిన పోకిరీపై నేరం నిరూపణైతే ఏడాది జైలు లేదా రూ.10 వేల జరిమానా లేదా రెండూ పడతాయి. ►ఈవ్ టీజింగ్ చేయడానికి పోకిరీలు వాహనాలను వినియోగిస్తే వాటిని పోలీసులు స్వాధీనం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ►దేవాలయాలతో పాటు మాల్స్, సినిమా హాల్స్, విద్యాసంస్థలు తదితర చోట్ల జరిగే ఈవ్ టీజింగ్ను నిరోధించాల్సిన బాధ్యత వాటి నిర్వాహకులపై ఉంటుంది. అలాంటి సమాచారాన్ని తక్షణం సంబంధిత పోలీసులకు చేరవేయాల్సిందే. ► దీనికి భిన్నంగా వ్యవహరిస్తే ఆ నేరానికి యాజమాన్యాలనూ బాధ్యుల్ని చేయవచ్చు. వీరికి న్యాయస్థానం జరిమానా విధించే అవకాశం ఉంటుంది. -
కర్రతో ఈవ్ టీజర్లపై శివంగిలా యువతి దూకి..
లక్నో: వేధింపులకు గురిచేయాలని ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులకు ఓ యువతి తగిన బుద్ధి చెప్పింది. శివంగిలా వారిపై దూకి దుమ్ము దులిపింది. ఎంతలా అంటే ఆమె కోపానికి భయపడి ఏ ఒక్కరు ఆమెను ఆపే సాహసం చేయలేదు. వివరాల్లోకి వెళితే..లక్నోలో స్కూటర్పై ఓ యువతి వెళుతుండగా బైక్పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు ఆమెను ఫాలో అవుతూ అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించారు. అనకూడని మాటలు అన్నారు. దీంతో చిర్రెత్తిపోయిన ఆ యువతి వెంటనే తన స్కూటీని ఆపేసి ఓ సెక్యూరిటీ గార్డు నుంచి కర్ర లాగేసుకుని వాళ్లను చిత్తుగా కొట్టింది. ఆమె దాడి చేసే తీరు చూసి భయంతో ఏ ఒక్కరు కూడా ఆమెను ఆపే ప్రయత్నం చేయలేదు. వారిని చితక్కొట్టిన ఆ యువతి అనంతరం మహిళా పోలీసుల హెల్ప్లైన్ నంబర్ 1090కు ఫోన్ చేసి వారిని పట్టించింది. -
ఆకతాయికి రెండేళ్ల సత్ ప్రవర్తన విధింపు
ఆకివీడు : అమ్మాయిల్ని వేధిస్తున్నాడనే ఆరోపణపై స్థానిక కోసూరు వారి వీధికి చెందిన ఎండీ ఫరూక్కు రెండేళ్ల సత్ ప్రవర్తన, రూ.10 వేల విలువైన హామీతో కూడిన జామీను ఇవ్వాలని భీమవరం ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి.దీనబాబు శుక్రవారం తీర్పు చెప్పారు. ఈ ఏడాది జనవరి 3వ తేదీన ఆ ప్రాంతానికి చెందిన యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి కేవీఎస్వి ప్రసాద్ కేసు నమోదు చేసి ఫరూక్ను రిమాండ్కు పంపారని ఎస్సై ఆకుల రవి చెప్పారు. వాదోపవాదాలు అనంతరం తీర్పు చెప్పారని, రెండేళ్లలో సత్ ప్రవర్తన కలిగి ఉండకపోతే శిక్ష వేస్తారన్నారు. ప్రాసిక్యూష¯ŒS తరపున ఏపీపీ బి.మోహనరావు వాదించారని చెప్పారు. -
'షీ'భరోసా
► పోకిరీల ఆగడాలకు చెక్ పెడుతున్న షీ టీమ్స్ ► విద్యార్థినులు, మహిళలరక్షణకు ప్రత్యేక బృందాలు ► కౌన్సెలింగ్తో పలుసమస్యలకు పరిష్కారాలు ► ఎందరికో భరోసా ఇస్తూ ముందుకు.. ► సవాళ్లను ఎదుర్కొంటూనే సత్ఫలితాలు ఆమెకు అండగా ఓ సైన్యమే ఉంది. ఎక్కడ ఎలా నిఘా ఉంచుతారో.. ఎప్పుడు ఎవరిని పట్టుకుంటారో, ఎవరిని గమనిస్తున్నారో తెలియనంత నిఘా. ఒక్క కాల్చేస్తే చాలు.. క్షణాల్లో వాలిపోతారు. వ్యూహచతురతతో ఆకతాయిల పనిపడుతున్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఇదే షీ టీమ్ నిత్యకార్యాచరణ. మహబూబ్నగర్ క్రైం : జిల్లా కేంద్రంగా షీ బృందం అందిస్తున్న సేవలు సత్ఫలితాలనిస్తోంది. సవాళ్లను ఎదుర్కోవాలంటూ యువతులలో చైతన్యం నింపేందుకు పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థినులు, యువతులు, మహిళల రక్షణ కోసం 2015 ఏప్రిల్లో షీ టీమ్ కార్యకలాపాలను ప్రవేశపెట్టింది. నిర్ధిష్టమైన మార్గదర్శకాలతో మొదలైన ఈ వినూత్న కార్యక్రమం అతివలందరూ మెచ్చేలా మంచి ఫలితాలను సాధిస్తోంది. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. ఠక్కున వాలిపోయి కీచకుల అరాచకాలను అడ్డుకుంటారు. సమస్య తీవ్రత, బాధితుల కోరిక మేరకు అవసరమైతే నిందితులపై కేసులు నమోదు చేసి ఊచలు లెక్కించేలా చేస్తారు. ఇదే సమయంలో సమస్య నేపథ్యాన్ని విశ్లేషించడం, అవసరమైన మేరకే నిందితులపై చర్యలు తీసుకోవడంలో, మానవతా కోణాన్ని ఆవిష్కరిస్తుండటంతో జనం మెప్పుపొందుతున్నారు. ఇప్పటి వరకు షీ టీమ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 12ఎఫ్ఐఆర్లు, 120వరకూ సాధారణ కేసులు నమోదు చేశారు. తెలిసీ తెలియని వయసులో పెడదోవ పడుతున్న యువకుల తల్లిదండ్రులను పిలిపించడం.. ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చి సన్మార్గంలో పెట్టడం కూడా బాధ్యతగానే స్వీకరిస్తున్నారు. మరో 200మందికి కౌన్సెలింగ్ ఇచ్చి వారిలో పరివర్తనకు కృషి చేశారు. ప్రేమ వేధింపులే అధికం: ఆకతాయి చేష్టలు, ప్రేమ పేరుతో వేధింపులు.. ఈ సమస్యలే షీ బృందాలకు ఎదురవుతున్నాయి. పాఠశాల స్థాయి నుంచి ఇంటర్ డిగ్రీ, పీజీ వరకు సీనియర్లు జూనియర్లను వేధిస్తున్న సందర్భాల్లో సహాయం అందించిన కేసులు చాలానే ఉన్నాయి. సామాజిక మాధ్యమాలు: ఫేస్బుక్, వాట్సాప్ పరిచయాలు.. స్నేహం ముసుగులో ఎదురవుతున్న వేధింపుల విషయంలో బాధితులకు షీటీమ్ అవసరం ఎంతో ఏర్పడుతోంది. ఫేస్బుక్లో వెల్లువలా వచ్చే పోస్టింగ్లకు లైక్ కొట్టగానే మురిసిపోవడం.. క్రమక్రమంగా మెసెంజర్లలో అసభ్యకర మెస్సేజ్లు చేసే వరకురావడం పలు కేసులలో గుర్తించారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధిత యువతులు, విద్యార్థినులను ప్రేమించాలంటూ యువకులు బ్లాక్మెయిలింగ్కు దిగుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఈ పరిణామాన్ని ఊహించని బాధిత యువతులు షీటీమ్ను ఆశ్రయించడం పరిపాటిగా మారుతున్నాయి. ముఖ్యంగా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు, వేర్వేరు నంబర్ల నుంచి వరుసగా కాల్స్ రాత్రి, పగలు తేడా లేకుండా ఫోన్ చేయడం మాట్లాడేటప్పుడు పెట్టేయడం.. కొన్నిసార్లు అసభ్యంగా మాటలు.. వందల సంఖ్యలో పట్టణంలో యువతులు, మహిళలు ఎదుర్కొంటున్న వేదన ఇది. పాతనంబర్ తీసేసి కొత్త ఫోన్ నంబర్ తీసుకున్నా చాలామందికి ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. ఇంట్లో ఎవరికైనా చెబితే నీకు తెలియకుండా ఎవరు ఫోన్ చేస్తారు..? అర్ధరాత్రి కూడా స్నేహితులతో మాటలేంటి? అంటూ చీవాట్లు తప్పడంలేదు. ఇలాంటి వారి సమస్య పరిష్కరించేందుకు షీ బృందాలు పని చేస్తున్నాయి. ఒంటరి మహిళలు ఒంటరిగా పనుల నిమిత్తం బయటకు వచ్చే మహిళలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వేధింపులూ జిల్లాలో ఎక్కువగానే ఉన్నాయి. కొన్నాళ్లు వెంటబడ డం, పరిచయం చేసుకుని మాటలు కలపడం.. కొంతకాలం తర్వాత తమ వక్రబుద్ధిని ప్రదర్శిస్తున్న ప్రబుద్ధులు చివరకు పోలీస్ స్టేషన్లకు చేరుకుంటున్నారు. రద్దీ ప్రాంతాలు: ముఖ్యంగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, కళాశాలల ఎదుట, పాఠశాలల సమీపంలో విద్యార్థినులు, యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సందర్భాల్లో బాధితుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఇలా సమస్య ఏదైతేనేం ఇల్లు విడిచి బయటికి వచ్చే యువతులు, మహిళలకు షీటీమ్ రక్షణ కవచంలా నిలుస్తోంది: .షీటీమ్కు సిబ్బంది సమస్య మహిళలకు, విద్యార్థినులకు రక్షణ కోసం పనిచేస్తున్న షీటీమ్ ఇప్పుడు సిబ్బంది కొరతతో ఇబ్బందిపడుతోంది. ఒక ఇన్చార్జ్ సీఐతో పాటు నలుగురు కానిస్టేబుళ్లు, మరొక హోంగార్డు పని చేస్తున్నారు. వాస్తవానికి ఈ బృందానికి మరికొంత మంది సిబ్బంది తోడుగా ఉండాలి. ముఖ్యంగా బాధితులు మహిళలు కావడంతో వారి సమస్యలను స్పష్టంగా వివరించుకునేందుకు మహిళా సిబ్బందిని ఎక్కువగా నియమించాలి. మహబూబ్నగర్ వన్టౌన్సీఐ సీతయ్య పర్యవేక్షణలో సాగుతున్న ఈ బృందం మరింత మెరుగైన ఫలితాలను సాధించాలంటే తగిన ఆధునిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. -
ఈవ్టీజింగ్ను అడ్డుకున్నందుకు హత్య
కోల్కతా: పశ్చిమబెంగాల్లో ఘోరం జరిగింది. ఈవ్టీజింగ్కు పాల్పడుతున్న యువకులను అడ్డుకున్నందుకు ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. మృతుడ్ని పరగాణ జిల్లాకు చెందిన ఎండీ ముస్తాకిన్గా గుర్తించారు. శనివారం శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో మహిళా కళాకారులు పాల్గొన్నారు. నలుగురు యువకులు వీరిపట్ల అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించారు. వీరిని ముస్తాకిన్ అడ్డుకోగా.. నలుగురు యువకులు అతన్ని దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, మృతుడు ముస్తాకిన్పై క్రిమినల్ రికార్డు ఉందని పోలీసులు పేర్కొన్నారు. -
నేనూ లైంగిక వేధింపులకు గురయ్యా!
నేనూ లైంగిక వేధింపులకు ప్రత్యక్షంగా గురయ్యానని నటి ఇలియానా అన్నారు. నిజం చెప్పాలంటే చాలా మంది హీరోయిన్లు ఇలాంటి దుశ్చర్యలకు గురవుతున్నారు. సినీ, బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనే నటీమణులు అభిమానం పేరుతో పెట్రేగిపోయే పిచ్చి వ్యామోహపరుల చిల్లర చేష్టలను భరిస్తున్నారు. మరి కొందరు మద పిచ్చిగాళ్లు ట్విట్టర్, ఫేస్బుక్ వంటి మాద్యమాలను దుర్వినియోగం చేస్తూ హీరోయిన్లపై పైశాచికత్వానికి పాల్పడుతున్నారు. ఈవ్ టీజింగ్ పేరుతో వేదనకు గురి చేస్తున్నారు. ప్రముఖ నటీమణులు నయనతార, తమన్నా, తాప్సీ, నమిత, శ్రియ లాంటి వాళ్లు బహిరంగ ప్రాంతాల్లో అభిమానుల పిచ్చి చేష్టల బారిన పడ్డవారే. బాలీవుడ్ భామ దీపికాపదుకోనే ఆ మధ్య అభిమానులకు చిక్కి బాధకు గురయ్యారు. కత్రినాకైఫ్ సినిమా థియేటర్లోనూ, సోనాక్షిసిన్హా ఒక సినీ కార్యక్రమంలోనూ దురాభిమానుల బాధింపునకు గురయ్యారు.దీంతో చాలా మంది తమకు పర్సనల్గా బాడీగార్డ్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరైతే ట్విట్టర్, ఫేస్బక్ ఎకౌంట్లను క్లోజ్ చేసుకుంటున్నారు. మరి కొందరు అసభ్యంగా ప్రవర్తించేవారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకునేలా చేస్తున్నారు. మరో సెలబ్రిటి నటి ఇలియానా తాను లైంగిక వేధింపులు ఎదర్కొన్నానని చెప్పారు.దీని గురించి తను చెబుతూ హీరోయిన్లను కొందరు చాలా చీప్గానూ, చులకనగానూ చూస్తున్నారన్నారు. ఈ పరిస్థితి మారాలన్నారు. తాను సోషల్ మీడియాలో ఈవ్ టీజింగ్కు గురయ్యానని చెప్పారు.కొందరైతే ఫోన్లు చేసి అసభ్యపదజాలాలతో హింసించేవారని అన్నారు.ఇలాంటివి తనను చాలా బా«ధించేవని, అలాంటి సమయాల్లో తన తల్లిదండ్రుల అండగా నిలబడడం ఎంతో మనశ్శాంతినిచ్చేదని చెప్పారు. -
మహిళలే ఎక్కువ
‘‘స్త్రీ పురుషులకు సమాన హక్కులు ఉండాలని పోరాడడమే ఫెమినిజమ్ అయితే నేను ఫెమినిస్ట్ కాదు. మగవారి కంటే మహిళలే ఎక్కువ అని నమ్ముతా’’ అన్నారు షారుక్ ఖాన్. కొత్త ఏడాది ప్రారంభ వేడుకలప్పుడు బెంగళూరులో అమ్మాయిల పై జరిగిన ఈవ్ టీజింగ్ ఘటనపై షారుక్ తాజా ఇంటర్వూ్యలో స్పందించారు. మహిళలకు మద్దతు పలుకుతూ తన ఇద్దరు కుమారుల పెంపకం గురించి మాట్లాడారు. ‘‘మా అబ్బాయిలు ఆర్యన్, అబ్రమ్లకు మహిళలను హర్ట్ చేయొద్దని చెబుతుంటా. వాళ్లను గౌరవించమని అంటుంటా. ఒకవేళ మహిళల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తిస్తే మీ తల నరికేస్తానని గట్టిగా చెప్పా’’ అని షారుక్ పేర్కొన్నారు. -
పాట మధ్యలో ఆపేసి.. హీరో అయ్యాడు!
-
పాట మధ్యలో ఆపేసి.. హీరో అయ్యాడు!
అతడో పాకిస్థానీ గాయకుడు. పేరు ఆతిఫ్ అస్లాం. ఓ షోలో పాట పాడుతున్నాడు. అంతలో ఒక అమ్మాయిని కొంతమంది రౌడీలు వేధిస్తుండటాన్ని చూశాడు. అంతే, వెంటనే పాట ఆపేశాడు. వాళ్ల మీద విరుచుకుపడ్డాడు. ''ఎప్పుడూ అమ్మాయిల మొఖం చూడలేదా? మీకు అక్క - అమ్మ లేరా? వాళ్లు కూడా ఇక్కడ ఉంటే ఏం చేసేవాళ్లు'' అంటూ చెడామడా వాయించేశాడు. ఈ విషయం మొత్తం అక్కడ అతడి షోను చిత్రీకరిస్తున్న వీడియోలో రికార్డయింది. దాంతో ఒక్కసారిగా జనంలో కూడా ఉత్సాహం వెల్లివిరిసింది. 'ఆతిఫ్.. ఆతిఫ్' అంటూ అరవడం మొదలుపెట్టారు. అతడిని అభినందనలలో ముంచెత్తారు. తన వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందికి చెప్పి, రౌడీలు ఏడిపిస్తున్న అమ్మాయిని భద్రంగా ఇంటివద్ద దించిరమ్మన్నాడు. ఈవ్ టీజర్లకు అతడు బుద్ధి చెప్పిన వైనాన్ని చాలామంది సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకున్నారు. ఆతిఫ్ అస్లాం పాకిస్థాన్తో పాటు భారతదేశంలో కూడా బాగా సుప్రసిద్ధ గాయకుడు. ఇలియానాతో కలిసి 'పెహ్లీ దఫా' అనే ఆల్బంలో కనిపించాడు. భారత్ -పాక్ మధ్య సంబంధాలు చెడిపోవడం, పాక్ కళాకారులను ఇక్కడ నిషేధించడం లాంటి ఘటనలు జరుగుతున్న సమయంలోనే అతడి ఆల్బం విడుదలైనా, బాగానే క్లిక్ అయింది. -
రేపిస్ట్లయ్యే వరకు వెయిట్ చేయకండి!
న్యూఢిల్లీ: ‘ఈవ్ టీజింగ్ అన్నది చిన్న విషయం కాదు. పెద్ద నేరంగానే పరిగణించాలి. ఆకతాయిల వేధింపులకు, బెదిరింపులకు భయపడవద్దు. వారు రేపిస్ట్ల్లా మారకముందే మనం మేలుకోవాలి. ఈవ్ టీజింగ్ చేసేవారిపై వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా ఒత్తిడి చేయాలి’ అని లక్నోలో లా చదువుతున్న సౌమ్య గుప్తా తన ఫేస్బుక్ పేజీ ద్వారా తోటి అమ్మాయిలకు పిలుపునిచ్చారు. ఇటీవల ఆమెకు ఎదురైన ఓ అనుభవాన్ని అందులో వివరించారు. ‘నేను ఆ రోజు బస్సులో వెళుతున్నా. నా వెనక సీటులో కూర్చున్న వ్యక్తి వెనక నుంచి చేతులపెట్టి నా పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. నేను వెంటనే లేచి నిలబడి ఆయన్ని నిలబడమన్నాను. ఆ మనిషికి దాదాపు 40 ఏళ్లు ఉంటాయి. గుర్తింపు కార్డు చూపించమన్నాను. అందుకు ఆయన అంగీకరించలేదు. తోటి ప్రయాణికులు కూడా నాకు మద్దతు తెలపడంతో ఆయన తన ప్రర్తనకు క్షమాపణలు చెప్పాడు. అందుకు నేను ఒప్పుకోలేదు. క్షమాపణలతో ఇలాంటి వ్యక్తిని వదిలేయకూడదని భావించాను. బస్సు డ్రైవర్కు చెప్పి దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి అక్కడ బస్సు ఆపమని చెప్పాను. బస్సు డ్రైవర్ అలాగే చేశారు. తోటి ప్రయాణికుల సహాయంతో నేను నిందితుడిని స్టేషన్లోకి తీసుకెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేశాను. చిన్న విషయానికి పెద్ద గొడవెందుకంటూ పోలీసులు కూడా నాకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అది చిన్నవిషయమా! లా చదువుతున్న నేనే ఊరుకుంటే లాభంలేదని ఎఫ్ఐఆర్ నమోదు చేయించాను. ఆ తర్వాత నా పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి బంధువులు, మిత్రులు నా వద్దకు వచ్చి రకరకాలుగా బెదిరించారు. ఇద్దరు పిల్లల తండ్రి అలా చేస్తారంటే ఎవరు నమ్మరని, నా పరువే పోతుందని హెచ్చరించారు. వాళ్లతో వీళ్లతో తిరుగుతూ కనిపిస్తుంటావు. నీ ప్రవర్తనే సరిగ్గా ఉండదని ప్రచారం చేస్తామని, పరువు తీస్తామని బెదిరించారు. పైగా ఆయనకు పురషత్వం లేదని కూడా సర్టిఫికెట్ తెస్తామన్నారు. అయినా భయపడలేదు. ఇష్టమున్నట్లు ప్రచారం చేసుకోమని చెప్పాను. పోలీసు స్టేషన్కు రెండు, మూడు సార్లు వెళ్లి కేసు కోర్టు వరకు వచ్చేలా చేశాను. నాకు ఈ విషయం సహకరించిన తోటి ప్రయాణికులకు నా ధన్యవాదాలు. నాలాంటి అనుభవం ఎదురైతే ఎవరూ ఉపేక్షించరాదు. ఇవ్వాళ వారిని వదిలేస్తే రేపు వారే రేపిస్టులుగా మారుతారు’ అని సౌమ్య గుప్తా తన ఫాలోవర్లకు పిలుపునిచ్చారు. -
ఈవ్ టీజర్లను వెంటాడి.. రఫాడిన లేడీ ప్లేయర్!
జైపూర్: భారత డిస్కస్ త్రో క్రీడాకారిణి కృష్ణ పూనియా నిజమైన హీరోగా నిలిచారు. రాజస్థాన్లోని చిరు పట్టణమైన చురులో ఆమె ముగ్గురు ఆకతాయిలను వెంటాడి.. ఒకడి భరతం పట్టారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఓ రైల్వే క్రాసింగ్ వద్ద తన కారులో పూనియా వేచి చూస్తుండగా.. ముగ్గురు యువకులు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలను వేధించడం ఆమె కంటపడింది. వెంటనే కారులోంచి దిగిన ఆమె ఆకతాయిలను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. దీంతో బెదిరిపోయిన ముగ్గురు యువకులు బైక్ మీద పరారయ్యేందుకు ప్రయత్నించారు. అయినా, వారిని వదిలిపెట్టకుండా వెంటాడి మరీ బైక్ మీద ఒక ఆకతాయిని ఆమె పట్టుకొని పోలీసులకు అప్పగించారు. 2010 కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు కృష్ణ పూనియా గోల్డ్ మెడల్ అందించిన సంగతి తెలిసిందే. 'అమ్మాయిలను ఆకతాయిలు వేధిస్తుండటం చూడగానే.. వారు నా కూతుళ్లయితే ఏం చేసేదాన్ని అన్న ఆలోచన వచ్చింది. వెంటనే కిందకు దిగాను. నేను ఎదురుపడటంతో వారు పరారయ్యారు' అని పూనియా 'హిందూస్తాన్ టైమ్స్'కు తెలిపింది. ఒక ఆకతాయిని పట్టుకొని పోలీసులకు ఫోన్ చేసినా వారు వెంటనే సంఘటనాస్థలానికి రాలేదని, ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే.. దేశంలో మహిళలకు భద్రత ఎలా లభిస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
విద్యార్థినులను వేధిస్తున్న పోకిరి అరెస్ట్
సిరిసిల్ల: పోకిరి వేషాలు వేస్తూ.. విద్యార్థినులను ఏడిపిస్తున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్ల రాజీవ్ నగర్కు చెందిన పెండ్యం రాజు గత కొంతకాలంగా కళాశాలకు వెళ్తున్న విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో వేధింపులు ఎక్కువవడంతో.. ఓ విద్యార్థిని ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. దీంతో సోమవారం రంగంలోకి దిగిన స్థానిక ఎస్సై శ్రీనివాస్ విచారణ చేపట్టి పోకిరిని అరెస్ట్ చేశారు. -
ఈవ్టీజింగ్పై అప్రమత్తంగా ఉండాలి
షీ టీం జిల్లా ఇన్చార్జి అనురాధ నకిరేకల్ : ఈవ్టీజింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని షీటీం జిల్లా ఇన్చార్జి, నల్లగొండ మహిళా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అనురాధ సూచించారు. నకిరేకల్లోని ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో ఆదివారం జరిగిన షీటీం అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బాలికలు మనోధైర్యంతో ఉండాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలి గినా షీ టీం దృష్టికి తీసుకురావాలని సూ చించారు. ఫిర్యాదు చేయడానికి వాట్సప్ సెల్న నంబర్ 9963393970, ఫోనరుుతే 100కు డయల్ చేయాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సీఐ సుబ్బిరామిరెడ్డి, ఎస్ఐ నర్సింహరావు, బాలికల కళాశాల వసతి గృహం అధికారి భాగ్యలక్ష్మి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరులో పోకిరీకి బడితెపూజా
-
బెజవాడలో పెరిగిన ఈవ్టీజింగ్
కళాశాలలు, బస్సుల్లో అల్లరిమూకల హల్చల్ ఆకతాయిలపై కొరవడిన పోలీసు నిఘా ‘మేం కంకిపాడులో ఉంటున్నాం. నా కుమార్తె రోజూ విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని ఓ కాలేజీలో చదువుతోంది. రోజూ సాయంత్రం కాలేజీ ముగిసిన తర్వాత వచ్చి తీసుకెళ్తున్నాను. ఇటీవల కాలంలో బెంజిసర్కిల్ నుంచి పటమట వరకు ఆడపిల్లలను వేధించే గ్యాంగ్లు పెరిగాయి. విద్యార్థినులను వెంబడిస్తూ ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తూ నా కుమార్తెను ఒంటరిగా పంపడానికి భయమేస్తోంది.’ – ఇదీ కంకిపాడుకు చెందిన వెంకటేశ్వరరావు ఆవేదన విజయవాడ : నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ఇటీవల అల్లరిగ్యాంగ్ల ఆగడాలు మళ్లీ పెరిగిపోయాయి. హైస్కూళ్లు, కాలేజీల వద్ద చేరి ఆడపిల్లలను అల్లరి చేస్తున్నారు. నగరంలో ప్రయివేటు డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల వద్ద రోజురోజుకూ పెరుగుతున్న ఈవ్టీజింగ్కు విద్యార్థినులు బెంబేలెత్తిపోతున్నారు. చదువుకునేందుకు వెళ్లిన తమ బిడ్డ తిరిగి ఇంటికి వచ్చేవరకు తల్లిడండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈవ్టీజింగ్, ర్యాగింగ్ చేసే గ్యాంగ్లపై పోలీసు నిఘా కొరవడిందని, అందువల్లే రెచ్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసుల నిఘా కొరడటంతో తప్పనిసరిగా తాము రోజూ వచ్చి పిల్లలను తీసుకెళ్లాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. చికటి పడితే వణుకే... పటమట ఏరియాలోని బెంజిసర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు పలు కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీల్లో తరగతులు రాత్రి ఏడు గంటలకు పూర్తవుతాయి. కళాశాలలన్నీ ఒకేసారి వదులుతున్నారు. ఒకేసారి వేలాది మంది విద్యార్థినులు కళాశాల బస్సులు, ఆర్టీసీ బస్సులు, ఆటోలు ఎక్కేందుకు బందరు రోడ్డుపైకి వస్తున్నారు. ఆ సమయంలో ఆకతాయిలు గుంపులు, గుంపులుగా అక్కడికి చేరుకుని వెకిలి చేష్టలతో ఆడపిల్లలను వేధిస్తున్నారు. కొన్నిసార్లు చీకట్లో ఆకతాయిలు శృతిమించి ప్రవర్తిస్తుండటంతో విద్యార్థినులు వణికిపోతున్నారు. బస్టాపుల్లో బాధలు వర్ణనాతీతం.. బెంజిసర్కిల్, పటమట ప్రాంతంలోని విద్యా సంస్థల్లో కంకిపాడు, ఉయ్యూరు, ఇబ్రహీంపట్నం, నిడమానూరు తదితర ప్రాంతాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరు రాత్రి 7 గంటలకు తరగతులు ముగిసిన తర్వాత తమ ఇళ్లకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు, ఆటోల కోసం బస్టాపుల్లో పడిగాపులు పడుతుంటారు. ఆ సమయంలో ఈవ్టీజర్లు రెచ్చిపోతున్నారు. నిక్ నేమ్లతో కామెంట్లు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. కొందరు వింత చేష్టలతో వేధిస్తున్నారు. బైక్లపై వెంబడిస్తూ... కొందరు ఈవ్టీజర్లు శృతిమించి ప్రవర్తిస్తున్నారు. మైలవరం, ఇబ్రహీంపట్నం, కానూరు తదితర ప్రాంతాలకు వెళ్లే ఇంజినీరింగ్ కళాశాలల ఆడప్లిల బస్సులను బైక్లపై వెంబడించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. మరికొందరు రాత్రివేళ బస్సుల్లో వస్తున్న ఆడపిల్లలను బైక్పై వెంబడిస్తూ మద్యం తాగి కేకలు వేస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారు. మద్యం ఖాళీ సీసాలను బస్సులపై విసురుతూ బీభత్సం సష్టిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల నిఘా పెంచి అల్లరిమూకల ఆగడాలకు కళ్లెం వేయాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
లైంగిక వేధింపులకు గురయ్యాను!
యుక్త వయసులో తానూ లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పుకొచ్చారు నటి తాప్సీ. ఇప్పటివరకూ తాను చాలా ధైర్యవంతురాలిని అంటూ చెప్పుకొచ్చిన ఈ ఢిల్లీ బ్యూటీ తన నిజజీవితంలోని మరో కోణాన్ని తాజాగా పేర్కొన్నారు. అది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా సంచలనం కలిగిస్తోంది. తాప్సీకిప్పుడు తమిళం, తెలుగు భాషల్లో అవకాశాలు లేవు. హిందీలో బిగ్బీ అమితాబ్తో నటించిన పింక్ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. అందులో ఈ భామ అత్యాచారానికి గురైన అమ్మాయిగా నటించారు. ఈ పాత్ర గురించి ఇప్పటికే చాలాసార్లు ప్రచారం చేసుకున్న తాప్సీ.. తాజాగా ఈ పాత్రకు, తన నిజ జీవితానికి చాలా పోలికలు ఉన్నట్టు పేర్కొన్నారు. అదేమిటో చూద్దాం. ''నేను డిల్లీలో పెరిగాను. ఏదైనా ఉత్సవాల సమయంలో జనాల కూటమి అధికంగా ఉంటుంది. అలాంటి సమయాల్లో అబ్బాయిలు అమ్మాయిలను అల్లరి చేస్తారు. కానిచోట్ల గిల్లుతూ అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. లైంగిక వేధింపులకు పాల్పడతారు. చాలా శాడిజం ప్రదర్శిస్తారు. అలాంటి క్లిష్టపరిస్థితులను నేనూ ఎదుర్కొన్నాను. ద్వంద్వార్థాలతో హింసిస్తుంటారు. వారి చూపులు కూడా చాలా క్రూరంగా ఉంటాయి. అందుకే అలాంటి చోట్లకు వెళ్లవద్దని, అలాంటి దుస్తులు ధరించవద్దని, అణిగిమణిగి ఉండాలని ఇంట్లో పెద్దలు హితవు పలికేవారు. అప్పట్లో లైంగిక వేధింపులను ఎదిరించకపోవడం నేను చేసిన తప్పు అని ఇప్పుడు అనిపిస్తోంది'' అని నటి తాప్సీ పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకూ ఈ విషయాల గురించి నోరు విప్పని ఈ అమ్మడు ఇప్పుడు వీటిని బహిర్గతం చేయడంలో ఆంతర్యం ఏమిటనే భావాన్ని సినీవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
హీరోయిన్కూ తప్పని ఈవ్ టీజింగ్
అందరు అమ్మాయిల మాదిరిగానే హీరోయిన్ తాప్సీ కూడా కాలేజీ రోజుల్లో ఈవ్ టీజింగ్కు గురైందట. అయితే ఇది సాధారణమైన విషయమే అంటుంది. కానీ ఇటీవల ముంబైలో తను ఫేస్ చేసిన ఓ సంఘటన మాత్రం తనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందంటోంది. ముంబైలో ఓ సాయంత్రం వేళ తన ఫ్రెండ్ని కలిసేందుకు బయలుదేరింది తాప్సీ. ఫోన్లో మాట్లాడుతూ రోడ్డు మీద నడుస్తుండగా.. తనకు దగ్గరగా వచ్చి మరీ ఇద్దరు కుర్రాళ్లు నోటి దురుసును ప్రదర్శించారట. బైక్ని తాప్సీకి దగ్గరగా పోనిచ్చి ఆమెపై కామెంట్స్ చేసి వెకిలిగా నవ్వడం ప్రారంభించారు. గమనించిన తాప్సీ ఏమాత్రం తొణకకుండా వారినే సీరియస్గా చూడటం ప్రారంభించింది. కొన్ని సెకన్ల అనంతరం ఆ యువకుల ముఖాల్లో భయం మొదలవ్వడం స్పష్టంగా కనిపించిందని చెప్తుంది తాప్సీ. 'అప్పుడే తొలిసారి నాకర్థమయింది.. వాళ్ల కామెంట్లకి మనం సీరియస్గా స్పందించడం మొదలుపెడితే.. మగవాళ్లు మనతో సమానంగా భయపడతారని' అంటూ ఇటీవల తనకెదురైన సంఘటనను వివరించింది 'పింక్' స్టార్ తాప్సీ. లైంగిక వేధింపుల బాధితురాలిగా తాప్సి నటించిన 'పింక్' చిత్రం శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. తాప్సీ ఈ సినిమాలో తాను చేసిన పాత్ర.. ప్రస్తుత సమాజంలో లైంగిక దాడులకు బలైపోయిన చాలామంది యువతుల మానసిక సంఘర్షణను చూపిస్తుందని చెబుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ కీలకమైన పాత్రలో నటించారు. ఈ చిత్రం తప్పకుండా తనకు సక్సెస్ తెచ్చిపెడుతుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది. -
మహిళలను వేధిస్తున్న ఆకతాయిలకు కౌన్సెలింగ్
వరంగల్ : మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఆకతాయిలకు షీ టీం ఇన్చార్జీ ఏసీపీ ఈశ్వర్రావు బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. గత కొద్దిరోజులుగా వరంగల్, హన్మకొండ, రంగశాయిపేట జూని యర్ కాలేజీ, కేడీసీ, జిజ్ఞాస జానియర్ కాలేజీ, బస్టాండ్, షాపింగ్ కాంప్లెక్స్ల సమీపంలో గ్రూపులుగా ఏర్పడి కాలేజీలకు వచ్చిపోయే విద్యార్థినులను వేధింపులకు పాల్పడుతున్నట్లు షీ టీంకు సమాచారం అందిందన్నారు. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వేధింపులకు పాల్పడుతున్న పస్తం నాగేశ్, ఎండి.హుస్సేన్, చిన్నపల్లి అఖిల్, కావటి కరుణాకర్, విష్ణు, గండి రాహుల్, పి.విఠల్, శివకందన్, ఎండీ అంజాద్, ఎండీ అన్వర్, బాసానీ అఖిల్, జూలూరి సాయితేజ, మండ బిక్షపతి, మోరె అని ల్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరికివారి తల్లిదండ్రుల ముం దు కౌన్సెలింగ్ నిర్వహించడమే కాకుండా భవిష్యత్లో ఇలాంటి సంఘటనలకు పాల్పడితే చట్టపరమైన కేసులు నమోదు చేస్తామన్నారు. ఈకేసులు నమోదైతే ప్రభు త్వ ఉద్యోగాలకు అనర్హులుగా పరిగణింపబడుతారని హెచ్చరించారు. కౌన్సెలింగ్ కార్యక్రమంలో షీటీం కానిస్టేబుళ్లు శ్రీని వాస్, బిచ్యానాయక్, రమణ, శ్రీనివాస్, రాజేశ్, వనజ, మోనికాలు పాల్గొన్నారు. -
నడిరోడ్డులో అమ్మాయిలు చితక్కొట్టారు
భువనేశ్వర్: ఒడిశా రాజధాని భువనేశ్వర్లో అమ్మాయిలు ఈవ్టీజర్కు బడితెపూజ చేశారు. అమ్మాయిలు వెదురుకర్రలతో అతణ్ని చితకబాది, మోకాలిపై నుంచోపెట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. భువనేశ్వర్లోని ఉత్కల్ యూనివర్శిటీలో ఎంబీఏ చదువుతున్న విద్యార్థినిపై వినోద్ కుమార్ సాహూ అనే ఓ ప్రైవేట్ ట్యూటర్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. వాణి విహార్ వద్ద ఉన్న వర్శిటీ క్యాంపస్ వుమెన్స్ హాస్టల్కు ఆమె వెళ్తుండగా బస్ స్టాప్ వద్ద ఈ ఘటన జరిగింది. ఆ విద్యార్థిని స్నేహితులను పిలవగా వెంటనే అక్కడకు వచ్చారు. ఆమె స్నేహితులకు విషయం చెప్పింది. ఇది గమనించిన సాహు అక్కడ నుంచి జారుకున్నాడు. అయితే అమ్మాయిలు అతని కోసం గాలించి వీఎస్ఎస్ నగర్ గేట్ వద్ద పట్టుకున్నారు. రోడ్డుపై అతణ్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. -
మజ్నూ రిటర్న్స్: 50 మంది అరెస్టు
గూర్గావ్ : "మజ్నూ రిటర్న్స్" ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. అనుచిత వ్యాఖ్యలు చేసిన 50 మంది ఈవ్ టీజర్లను గూర్గావ్ పోలీసులు అరెస్టు చేశారు. మేహరౌలీ-గూర్గావ్ రోడ్డులో శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి శనివారం మధ్యాహ్నం ఒకటింటి వరకు మహిళా పోలీసులు సాధారణ దుస్తులతో మజ్నూ రిటర్న్స్ డ్రైవ్ను నిర్వహించారు. ఈ డ్రైవ్లో భాగంగా ఎంజీ రోడ్డులో, సహారా మాల్ బయట, మెట్రో స్టేషన్లలో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న పురుషులను గుర్తించామని, వారిని వెంటనే అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. గతేడాది ఇలాంటి డ్రైవ్లతో 250 మందిని పోలీసులు అరెస్టు చేశారు. చివరి డ్రైవ్ డిసెంబర్లో జరిగింది. పోలీసులు నిర్వహించే ఈ డ్రైవ్కు పెట్టిన పేరు మజ్నూను ప్రేమకు చిహ్నమైన లైలా-మజ్నూ నుంచి ప్రతిపాదించినట్టు వారు పేర్కొన్నారు. ప్రస్తుతం యువకులు లైంగిక ఆసక్తి, ప్రేమ పేరుతో మహిళలను వేధిస్తున్నారని, వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని పోలీసులు తెలిపారు. వారినుంచి మహిళలను కాపాడేందుకే ఈ డ్రైవ్లు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.