Organic Farming
-
ఫినిక్స్లో సేంద్రీయ వ్యవసాయంపై నాట్స్ అవగాహన
ఫినిక్స్ : అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా తెలుగు వారి కోసం సేంద్రీయ వ్యవసాయం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. నాట్స్ ఫినిక్స్ చాప్టర్ ఆధ్వర్యంలో ఫినిక్స్లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. సేంద్రీయ వ్యవసాయం ప్రాముఖ్యతను ఈ సదస్సులో నాట్స్ నాయకులు వివరించారు. సేంద్రీయ వ్యవసాయం వల్ల నేలతల్లికి కూడా మేలు చేసినట్టవుతుందని ప్రముఖ పర్యావరణ ప్రేమికులు ప్రవీణ్ వర్మ అన్నారు. సేంద్రీయ వ్యవసాయం వల్ల కలిగే లాభాలను, ఆరోగ్యానికి జరిగే మేలును ఆయన వివరించారు. ఇదే కార్యక్రమంలో ఇంటి ఆవరణలోనే పండించిన సేంద్రీయ ఉత్పత్తులను రైతు బజార్ తరహాలో పెట్టి విక్రయించారు. తాము ఎలా సేంద్రీయ పద్దతుల్లో ఆకుకూరలు పండించింది కూడా పండించిన వారు ఈ కార్యక్రమంలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి కృషి చేసిన నాట్స్ ఫినిక్స్ సభ్యులను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అభినందించారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
దున్నకుండా.. కలుపు తీయకుండా.. రసాయనాల్లేకుండానే సాగు!
రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా వ్యవసాయం చేస్తున్నారంటే ఇప్పుడెవరూ ఆశ్చర్యపోవడం లేదు. కానీ.. ఎద్దులతోనో, ట్రాక్టరుతోనో దున్నే పనే లేకుండా ప్రకృతి వ్యవసాయం చేయొచ్చంటే.. నమ్మలేం. అయితే, మధ్యప్రదేశ్కు చెందిన దివంగత రైతు శాస్త్రవేత్త రాజు టైటస్ మాత్రం 30 ఏళ్ల పాటు ఇలాగే వ్యవసాయం చేసి సత్ఫలితాలు సాధించారు. ‘ప్రకృతి వ్యవసాయం వెనుకబడినదో లేదా ప్రాచీనమైనదో కాదు. ఆధునికమైనది, వినూత్నమైనది అని రాజు టైటస్ రుజువు చేశారు’ అని ఐసిఎఆర్ ప్రశంసించింది. ఆరేళ్ల క్రితం కన్నుమూసినా.. ఆయన కృషి రైతులకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్కు చెందిన ‘రాజు టైటస్’ ప్రభుత్వోద్యోగి. అయినా కుటుంబ వారసత్వంగా వచ్చిన 13 ఎకరాల పొలాన్ని సాగు చేయటం మానలేదు. 70వ దశకంలో అందరిలానే ఆయనా ‘హరిత విప్లవం’ ఒరవడిలో రసాయన ఎరువులు, కీటకనాశనులు వాడటం మొదలుపెట్టారు. మొదట్లో దిగుబడులు పెరిగి ఆదాయం వచ్చినా పదిహేనేళ్లు తిరిగేసరికి పంట భూమి నిస్సారమయింది. దిగుబడులు తగ్గి నష్టాల పాలై పొలం అమ్మేయాలని నిశ్చయించుకున్నాడు. ఇది జరిగింది 1984లో. రాజు నిర్ణయంతో తల్లి హతాశురాలయింది. గాంధేయవాదులు నడిపే స్వచ్ఛంద సంస్థ ‘ఫ్రెండ్స్ రూరల్ సెంటర్’ కార్యకర్తలతో ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. వారు ఆమె చెప్పినదంతా విని జపాన్ దేశానికి చెందిన ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త మసనోబు ఫుకుఒకా రాసిన ‘గడ్డిపరకతో విప్లవం’ (వన్ స్ట్రా రివల్యూషన్) పుస్తకాన్నిచ్చి మీ సమస్యకు ఈ పుస్తకం పరిష్కారాన్ని చూపుతుందని చెప్పారు. కలుపు తీయకుండా.. దుక్కిదున్నకుండా.. ఎరువులు వేయకుండా.. పురుగు మందులు పిచికారీ వంటి పద్ధతులు అనుసరించకుండానే పంటలను సాగు చేసే పద్ధతుల గురించి పుకుఒకా ఆ పుస్తకంలో వివరించారు. ఈ పుస్తకాన్ని చదివిన రాజు తను సాగులో తను అనుసరిస్తున్న పద్ధతులు అనర్థ హేతువులని అర్థం చేసుకున్నారు.అడ్డంకులను అధిగమించి.. 15 ఏళ్లుగా రసాయన ఎరువులు వేస్తూ పంటభూమిని ధ్వంసం చేస్తున్నానని అర్థం చేసుకున్న రాజు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. 1985 నుంచి పుకుఒకా చెప్పిన పద్ధతులను అనుసరించి వ్యవసాయం చేయటం మొదలుపెట్టారు. అప్పటి నుంచి నేలను దున్నటం, ఎరువులు, పురుగుమందుల వాడకం ఆపేశారు. రకరకాల గడ్డి, చెట్ల విత్తనాలను పొలంలో వెదజల్లి అవి పెరిగాక కత్తిరించి ఆచ్ఛాదనగా వాడేవారు. దీనివల్ల వర్షపు నీరు బయటకు వెళ్లకుండా పొలంలోనే ఇంకి.. నేల గుల్లబారటంతో పాటు తేమను పట్టి ఉంచింది. తొలుత గ్రామస్తులు అవహేళన చేసినా అడ్డంకులను అధిగమించి రాజు ప్రకృతిసేద్యం దిశగా వడివడిగా అడుగులు వేశారు.సోయా విత్తన బంతులు!అంకితభావంతో రాజు టైటస్ చేసిన కృషి ఫలితాన్నిచ్చింది. 1988లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొనటానికి ఇండియా వచ్చిన ఫుకుఒకా ప్రకృతిసేద్యం చేస్తున్న రాజు గురించి తెలుసుకొని ఆయన పొలాన్ని సందర్శించారు. ఫుకుఒకా సలహాలు సూచనలను అనుసరించి రెట్టించిన ఉత్సాహంతో రాజు పనిచేశారు. పుకుఒకా సూచన మేరకు పంటను విత్తుకోవటానికి బదులు.. ఒక పాలు సోయా విత్తనం, ఏడు పాళ్లు మట్టి కలిపి క్రికెట్ బాల్ పరిమాణంలో ఉండే ‘విత్తన బంతుల’ ను తయారు చేశారు. భార్య శాళిని సహకారంతో.. అడుగుకో బంతి చొప్పున.. పొలంలో వేశారు. దీనివల్ల మొలకెత్తినప్పటి నుంచే మొక్కలు పోషకాలను, సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహించి ఏపుగా ఎదిగాయి. ఆ ఏడాది దిగుబడి బావుండటంతో పాటు నాణ్యమైన పంట వచ్చింది. సోయా మొక్కల మధ్య ఎత్తుగా పెరిగిన గడ్డిని కత్తిరించి భూమిపైన ఆచ్ఛాదనగా వేశారు. దీనివల్ల పంటలకు మేలు చేసే వానపాములు, మిత్రపురుగులు, సూక్ష్మజీవులకు ఆశ్రయం లభిస్తుంది. పంటలకు హానిచేసే శతృ పురుగులను ఇవి నిర్మూలిస్తాయి. దీనివల్ల రసాయనిక ఎరువులు, కీటకనాశనుల అవసరం తప్పుతుంది. ఇవి నేలలో చేసే బొరియల వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది. వేర్లు లోతుకంటా చొచ్చుకు΄ోయి తేమను ΄ోషకాలను గ్రహిస్తాయి. నేల గుల్లబారి భూ సారం పెరిగి మంచి పంట దిగుబడులు వస్తాయి. నేలను దున్నాల్సిన అవసరం లేకపోవటం వల్ల ట్రాక్టరు.. ఎద్దుల కోసం అప్పు చేయాల్సిన అగత్యం తప్పింది. రాజు తన పొలంలో నత్రజనిని స్థిరీకరించేందుకు సుబాబుల్ చెట్లను సాగు చేశారు. దీనివల్ల యూరియా రూపంలో రసాయన ఎరవును అందించాల్సిన అవసరం ఉండదంటారాయన. సుబాబుల్ ఆకులు మేకలకు మంచి మేతగా ఉపయోగపడ్డాయి. ఈ చెట్ల కలపతో పాటు మేకల విక్రయం ద్వారా ఆదాయం లభిస్తోంది. ఆ విధంగా 30 ఏళ్లకు పైగా పొలాన్ని దున్నకుండానే సమృద్ధిగా పంటలు పండిస్తూ పేరు΄ పొందారు. వినియోగదారులు అడిగితేనే రైతులు పండిస్తారు!వినియోగదారులు కూడా ఆరోగ్యకరమైన ఆహారం కోసం డిమాండ్ చేసినప్పుడే రైతులు రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడటం మానేస్తారు. ఆరోగ్యకరమైన నేల ద్వారానే ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తి సాధ్యమనే విషయాన్ని గుర్తిస్తారు’ అనేవారు రాజు టైటస్. మన దేశంలో ప్రజలకు సోకుతున్న పలు జబ్బులకు మూలకారణం ఆహార పంటల సాగులో వాడుతున్న రసాయనాలు. వీటి వల్ల తొలుత మధుమేహం సోకి పలు దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీస్తుంది. నాకు పక్షవాతం వచ్చింది. నా భార్య గుండెజబ్బు వ్యాధిగ్రస్తురాలు. అయినా మేం కోలుకోవటానికి ప్రకృతి సేద్య పంట ఉత్పత్తులే కారణం అన్నారాయన. ఇదీ చదవండి: మదర్స్ ప్రైడ్ : తల్లిని తలుచుకొని నీతా అంబానీ భావోద్వేగంమా కుటుంబ అవసరాల కోసం ప్రస్తుతం ఎకరా పొలంలో ధాన్యం, పండ్లు, పాలు, కూరగాయలను సాగు చేస్తున్నాం. ఖరీఫ్లో గోధుమ, వరి, మొక్కజొన్న, రబీలో పెసరను సాగు చేస్తున్నాం. రోజురోజుకు వ్యవసాయంలో పెరుగుతున్న ఖర్చులే రైతు ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. ఫుకు ఒకా విధానంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ సేద్యం మూలసూత్రాలను ఒంటబట్టించుకుంటే ఏ రైతైనా పొలాన్ని దున్నకుండానే సేద్యం చేయవచ్చు అంటారు రాజు టైటుస్! -
అన్నదాత మెచ్చిన రైతుబిడ్డ
పొలాలే బడులుగా రైతులకు సరికొత్త వ్యవసాయ పాఠాలు చెబుతుంది సిద్దిపేట జిల్లా అక్కన్నపేట (Akkannapet) మండలంలోని రామవరం క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిణి (ఏఈవో) కరంటోతు శ్రీలత. ఆమె పాఠాలు వృథా పోలేదు. సేంద్రియ ఎరువుల ప్రాధాన్యత నుంచి మల్చింగ్ (mulching) పద్ధతిలో కూరగాయల సాగు వరకు ఎన్నో విషయాలను అవగాహన చేసుకొని కొత్తదారిలో ప్రయాణిస్తున్నారు అన్నదాతలు...అక్కన్నపేట మండలం పంతులు తండాకు చెందిన శ్రీలతకు ఏఈవో ఉద్యోగం వచ్చినప్పుడు ‘నాకు ఉద్యోగం వచ్చింది’ అనే సంతోషం కంటే ‘ఈ ఉద్యోగం వల్ల ఎంతోమంది రైతులకు సహాయంగా నిలబడవచ్చు’ అనే సంతోషమే ఎక్కువ. రైతు కుటుంబంలో పుట్టిన శ్రీలతకు రైతుల కష్టాలు, నష్టాలు తెలియనివేమీ కాదు. సాగులో మెలకువలు పాటించకపోవడం వల్ల పంట దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు. అయితే మెలకువలు పాటించకపోవడం నిర్లక్ష్యం వల్ల కాదు... అవగాహన లేకపోవడం వల్లే జరుగుతోందని గ్రహించిన శ్రీలత రంగంలోకి దిగింది.ఆమె పొలం దగ్గరికి వస్తే ఎక్కడి నుంచో అగ్రికల్చరల్ ఆఫీసర్ (Agriculture Officer) వచ్చినట్లు ఉండదు. తెలిసిన వ్యక్తో, చుట్టాలమ్మాయో వచ్చినట్లుగా ఉంటుంది. ఎలాంటి బేషజాలు లేకుండా అందరితో కలిసిపోయి వారి సమస్యలు తెలుసుకుంటుంది. పొలం దగ్గరికి వచ్చినప్పుడు శ్రీలత కూడా రైతుగా మారిపోతుంది. తానే స్వయంగా ట్రాక్టర్తో వరి పొలం దున్నుతుంది. వరిలో కాలిబాటల ప్రయోజనాల గురించి చెబుతుంది. ఎరువులు ఎంత మోతాదులో చల్లాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రత్యక్షంగా చేసి చూపిస్తోంది. వ్యవసాయ శాస్త్రవేత్తలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ నూతన సాగు పద్ధతులను తెలుసుకుంటూ, వాటిని తన క్లస్టర్ పరిధిలోని రామవరం, గండిపల్లి, కుందన్వానిపల్లి, మైసమ్మవాగు తండా రైతులకు చెబుతుంటుంది. రసాయనిక మందుల వినియోగం లేకుండా సేంద్రియ పద్దతిలో సాగు చేసే విధంగా రైతులనుప్రోత్సహిస్తోంది. గిరిజన గ్రామాల్లో సైతం మల్చింగ్ పద్ధతిలో కూరగాయలు ఎక్కువగా సాగు చేసేలా చేస్తోంది. చదవండి: చేనేతను ఫ్యాషైన్ చేద్దాం!పంటల్లో అధిక దిగుబడులు సాధించడానికి రసాయన ఎరువులు మోతాదుకు మించి వాడటం వల్ల భూసారం దెబ్బతింటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సేంద్రియ ఎరువులప్రాధాన్యత గురించి ఒకటికి పదిసార్లు చెప్పడమే కాదు సేంద్రియ ఎరువులను ఎలా తయారు చేసుకోవాలని అనే అంశంపై ప్రత్యేక వీడియోను తయారు చేసింది. జీవ ఎరువుల వినియోగంపై కూడా ప్రత్యేక వీడియోను తయారు చేసి రైతులకు అవగాహన కలిగిస్తోంది.క్షేత్రస్థాయిలోకి...రైతు అంటే నా దృష్టిలో ఒక పొలానికి యజమాని మాత్రమే కాదు... మన ఇంటి వ్యక్తి. మనకు అన్నం పెట్టే అన్నదాత. రైతుకు మంచి జరిగితే లోకానికి మంచి జరిగనట్లే. నా ఉద్యోగం ద్వారా రైతులకు ఏదో రకంగా మేలు చేసే సలహాలు, సూచనలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. – శ్రీలత – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేట– మాలోతు శ్రీనివాస్, సాక్షి, అక్కన్నపేట -
ప్రపంచ సేంద్రియ సాగు పైపైకి!
రసాయన అవశేషాల్లేని సేంద్రియ ఆహారోత్పత్తుల సాగు, వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా ఏటేటా విస్తరిస్తోంది. 2023లో ప్రపంచవ్యాప్తంగా 188 దేశాల్లో 9.89 కోట్ల హెక్టార్లకు సేంద్రియ సాగు విస్తరించింది. 2022తో పోల్చితే 2023లో సేంద్రియ / ప్రకృతి సాగు విస్తీర్ణం 2.6 శాతం (25 లక్షల హెక్టార్లు) పెరిగింది. జర్మనీలోని నరెంబర్గ్లో జరుగుతున్న అంతర్జాతీయ సేంద్రియ ఆహారోత్పత్తుల వాణిజ్య ప్రదర్శనలో మంగళవారం విడుదలైన ‘ద వరల్డ్ ఆఫ్ ఆర్గానిక్ అగ్రికల్చర్ 2025’ వార్షిక సర్వే నివేదిక ఈ తాజా గణాంకాలను వెలువరించింది. స్విట్జర్లాండ్ సేంద్రియ పరిశోధనా సంస్థ (ఎఫ్ఐబీఎల్), ఐఫోమ్–ఆర్గానిక్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా ఈ సర్వే నివేదికను వెలువరించాయి. – సాక్షి సాగుబడి, హైదరాబాద్అత్యధిక రైతులు మన వాళ్లే..ప్రపంచవ్యాప్తంగా 43 లక్షల మంది రైతులు సేంద్రియ సాగు చేస్తుండగా, 24 లక్షల మంది సర్టిఫైడ్ సేంద్రియ రైతులు మన దేశంలోనే ఉన్నారు. ఉగాండా (4.04 లక్షలు), ఇథియోపియా (1.21 లక్షలు) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. కాగా, విస్తీర్ణం పరంగా చూస్తే 5.3 కోట్ల హెక్టార్లలో సర్టిఫైడ్ సేంద్రియ సేద్యంతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా.. 4.5 లక్షల హెక్టార్లతో భారత్ రెండో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం సాగు భూమిలోని 2.1 శాతంలో సర్టిఫైడ్ సేంద్రియ సేద్యం జరుగుతోంది.వినియోగంలో ఫస్ట్ అమెరికా2023లో ప్రపంచ సేంద్రియ ఆహారోత్పత్తుల వ్యాపారం 136 బిలియన్ యూరోల (రూ.12,17,920 కోట్ల)కు పెరిగింది. 59 బిలియన్ యూరోల వాటాతో అమెరికా అతిపెద్ద సేంద్రియ మార్కెట్గా నిలిచింది. జర్మనీ, చైనా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. సేంద్రియ ఆహారం కొనుగోలుపై స్విట్జర్లాండ్ వాసులు అత్యధికంగా డబ్బు వెచ్చిస్తున్నారని ఈ సర్వే తెలిపింది. అనేక ఏళ్లుగా ఆర్గానిక్ ఫుడ్ మార్కెట్ స్థిరంగా పెరుగుతుండటం విశేషం. మున్ముందు కూడా ఈ ట్రెండ్ కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు. -
చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలతో రైతుగా మారాడు..! కట్చేస్తే..
చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలు అతడిని నగర జీవితం నుంచి గ్రామం బాట పట్టేలా చేశాయి. అక్కడే వ్యవసాయం చేసుకుంటూ బతకాలనుకున్నాడు. చివరికి అదే అతడికి కనివిని ఎరుగని రీతిలో లక్షలు ఆర్జించేలా చేసి..మంచి జీవనాధారంగా మారింది. ఒకరకంగా ఆ ఆరోగ్య సమస్యలే ఆర్థిక పరంగా స్ట్రాంగ్గా ఉండేలా చేయడమే గాక మంచి ఆరోగ్యంతో జీవించేందుకు దోహదపడ్డాయి. ఇంతకీ అతడెవరంటే..అతడే హర్యానాకి చెందిన జితేందర్ మాన్(Jitender Mann). ఆయన చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో 20 ఏళ్లు టీసీఎస్ ఉద్యోగిగా పనిచేశారు. అయితే ఆ నగరాల్లో కాలుష్యం, శారీరక శ్రమ లేకపోవడం తదితర కారణాలతో నలభైకే రక్తపోటు, కీళ్ల నొప్పులు వంటి రోగాల బారినపడ్డారు. జస్ట్ 40 ఏళ్లకే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక రాను రాను ఎలా ఉంటుందన్న భయం ఆయన్ని నగర జీవితం నుంచి దూరంగా వచ్చేయాలనే నిర్ణయానికి పురిగొలిపింది. అలా ఆయన హర్యానాలోని సొంత గ్రామానికి వచ్చేశారు. అక్కడే తన భార్య సరళతో కలిసి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా రెండు ఎకరాల్లో సేంద్రియ మోరింగ ఫామ్(organic moringa farm)ని ప్రారంభించారు. అలాగే ఆకుల్లో పోషకవిలువలు ఉన్నాయని నిర్థారించుకునేలా సాంకేతికత(technology)ని కూడా సమకూర్చుకున్నారు. అలా అధిక నాణ్యత కలిగిన మోరింగ పౌడర్ని ఉత్పత్తి చేయగలిగారు ఈ జంట(Couple). వారి ఉత్పత్తులకు త్వరితగతిన ప్రజాదరణ పొంది..ఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరు,ముంబై వంటి నగరాలకు వ్యాపించింది. ఈ పౌడర్కి ఉన్న డిమాండ్ కారణంగా నెలకు రూ. 3.5 లక్షల ఆదాయం తెచ్చిపెట్టింది ఆ దంపతులకు. అలా ఇప్పుడు నాలుగు ఎకరాలకు వరకు దాన్ని విస్తరించారు. అత్యున్నత నాణ్యతను కాపాడుకోవడమే ధ్యేయంగా ఫోకస్ పెట్టారిద్దరు. అందుకోసం ఆకులను కాండాలతో సహా కోసి రెండుసార్లు కడిగి ఏడు నుంచి తొమ్మిది కాండాలను కలిపి కడతామని అన్నారు. తద్వారా ఆకుని సులభంగా ఎండబెట్టడం సాధ్యమవుతుందని జితేందర్ చెబుతున్నారు. ఆకులను పెద్ద ఫ్యాన్ల కింద నియంత్రిత గ్రీన్హౌస్ సెటప్లో ఎండబెట్టడం జరుగుతుంది. అందువల్ల 12 గంటలలోనే ఆకులను కాండాల నుంచి తీసివేసి ముతక పొడిగాచేసి జాగ్రత్తగా ప్యాక్ చేస్తారు. అంతేగాదు ఈ దంపతులు తాము నేలను దున్నమని చెబుతున్నారు. తాము కలుపు మొక్కలు, ఇతర ఆకులనే రక్షణ కవచంగా చేసుకుంటారట. అలాగే హానికరమైన రసాయన ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులను ఉపయోగించమని చెబుతున్నారు. ఇలా జితేందర్ వ్యవసాయ రంగాన్ని ఎంచుకోవడంతోనే ఆయన లైఫ్ మారిపోయింది. ఇదివరకటిలా ఆరోగ్య సమస్యలు లేవు. మంచి ఆరోగ్యంతో ఉన్నాని ఆనందంగా చెబుతున్నాడు. అలాగే ప్యాకేజింగ్ కోసం పొడిని పంపే ముందే తాము కొన్ని జాడీలను తమ కోసం పక్కన పెట్టుకుంటామని చెప్పారు. ఈ మొరింగ పౌడర్ వినియోగం తమకు మందుల అవసరాన్ని భర్తీ చేసేస్తుందని అందువల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ధీమాగా చెబుతున్నారు. అలాగే జితేంద్ర దంపతులు తాము గ్రామానికి వెళ్లాలనుకోవడం చాలామంచిదైందని అంటున్నారు. "ఎందుకంటే మేము ఇక్కడ కష్టపడి పనిచేయడం తోపాటు ఆరోగ్యంగా ఉంటున్నాం. పైగా కాలుష్యానికి దూరంగా మంచి జీవితాన్ని గడుపుతున్నాం అని సంతోషంగా చెబుతోంది ఈ జంట. View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) (చదవండి: లెడ్లైట్ థెరపీ: అన్ని రోగాలకు దివ్యౌషధం..!) -
గోకృపామృత సేద్యం, మెరుగైన ఫలితాలు
ఇరవై ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్న ఉత్తమ రైతు కరుటూరి పాపారావు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్ ఆయన స్వగ్రామం. 8 ఎకరాల్లో పదేళ్లుగా పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు. అరెకరంలో వివిధ రకాల పసుపు, పండ్ల మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. 2012లో బాసరలో సుభాష్ పాలేకర్ శిక్షణా శిబిరంలో పాల్గొని స్ఫూర్తి పొందిన పాపారావు 2015 నుంచి 8.5 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. పంట వ్యర్థాలను కాలబెట్టకుండా జనుము, జీలుగతో కలిపి కుళ్లబెట్టి భూమిని సారవంతం చేస్తున్నారు ΄ పాపారావు. తన వ్యవసాయ క్షేత్రంలో 5వేల లీటర్ల ట్యాంకును ఏర్పాటు చేసి బెల్లం, మజ్జిగ, మదర్ కల్చర్ కలిపి గోకృపామృతం.. దేశీ ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, శనగపిండి, పుట్టమట్టి కలిపి జీవామృతం తయారు చేస్తున్నారు. ఈ రెండింటినీ కలిపి పైప్లైన్ల ద్వారా పంటలకు అందిస్తున్నారు. పురుగుల నియంత్రణ కోసం వేప కషాయం, పుల్లటి మజ్జిగ, బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం, దశపర్ణి కషాయం అవసరాన్ని బట్టి పిచికారీ చేస్తున్నారు.ఏడాది పాత బియ్యం..పంట నూర్పిడి అనంతరం నిల్వ, ప్రాసెసింగ్ అంతా సంప్రదాయ పద్ధతులను పాటిస్తూ పోషక సంపన్న ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెస్తుండటం రైతు పాపారావు మరో ప్రత్యేకత. వరి పొలం గట్ల మీద కందిని కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే సాగు చేస్తున్నారు. కందులను ఇసుర్రాయితో ఆడించి సహజ విధానంలో పప్పుగా మార్చుతున్నారు. ధాన్యం దిగుబడి రసాయన సాగుతో పోలిస్తే సగమే వస్తోంది. కూలీల అవసరమూ ఎక్కువే. ధాన్యాన్ని బాగా ఆరబెట్టి గన్నీ బ్యాగుల్లో నింపి ఏడాది పాటు నిల్వ చేస్తున్నారు. నిల్వ సమయంలో పురుగు పట్టకుండా ఉండేందుకు వావిలాకు, గానుగ ఆకు, సీతాఫలం ఆకు ధాన్యం బస్తాల వద్ద ఉంచుతున్నారు. ఏడాది దాటిన తరువాత ధాన్యాన్ని ముడి బియ్యం ఆడించి 10 కిలోల సంచుల ద్వారా ప్రజలకు ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపుతున్నారు.పచ్చి పసుపు ముక్కలు..పసుపు తవ్విన తరువాత ఉడకబెట్టి, పాలిష్ చేసి అమ్మటం సాధారణ పద్ధతి. అలాకాకుండా, పచ్చిగా ఉన్నప్పుడే శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేసి, నీడలో ఎండబెట్టి పసుపు పొడిని తయారు చేయిస్తున్నారు. ఉడకబెడితే పోషకాలు తగిపోతాయని ఇలా చేస్తున్నానని అంటున్నారు పాపారావు. నల్ల పసుపు, సేలం, కృష్ణ సేలం రకాల పసుపును సాగు చేస్తున్నారు. మునగాకును నీడలో ఆరబెట్టి ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. ఆయన 50 రకాలకు పైగా కూరగాయలు, సుగంధ, ఔషధ, పండ్ల రకాలను సేంద్రియ పద్ధతిలో పండిస్తు న్నారు. తాను పండించే పంటలతో పాటు పప్పులు, బెల్లం, పల్లీలు ఇతర జిల్లాలు, రాష్ట్రాల సేంద్రియ రైతుల నుంచి సేకరించి వాట్సప్ ద్వారా విక్రయిస్తున్నారు. పలువురు ప్రకృతి వ్యవసాయదారులను కలుపుకొని వాట్సప్లో‘నేచురల్ ప్రొడక్ట్స్ కన్జ్యూమర్స్ గ్రూపు’ ఏర్పాటు చేసుకొని ఆరోగ్యదాయక ఉత్పత్తులను నేరుగా ప్రజలకు అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న పాపారావును ప్రభుత్వం నుంచి ఉత్తమ రైతు పురస్కారంతో అనేక ఇతర పురస్కారాలు కూడా అందుకున్నారు. ప్రకృతి సాగుకు మరింత తోడ్పాటునివ్వాలి అన్ని రకాల పంటలను రైతు పండించి, సంప్రదాయ పద్ధతుల్లో ప్రాసెస్ చేసి వినియోగదారుడికి నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతో సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో నా వంతు కృషి చేస్తున్నాను. రైతులు అన్ని రకాల పంటలు పండించాలి. అన్ని పనులూ వ్యక్తిగత శ్రద్ధతో చేసుకోవాలి. ప్రతి రైతూ ఈ లక్ష్యంతోనే ముందుకెళ్లాలి. ప్రకృతి సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం మరింత తోడ్పాటు ఇవ్వాలి. – కరుటూరి పాపారావు (96188 11894), జైతాపూర్, ఎడపల్లి మండలం, నిజామాబాద్ జిల్లా -
నిత్య ఆదాయం..పచ్చ తోరణం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: నిత్య కల్యాణం.. పచ్చతోరణం అనే నానుడిని అక్కడి రైతులు ‘నిత్య ఆదాయం.. పచ్చతోరణం’గా మార్చేసుకున్నారు. 300 ఏళ్లుగా వారసత్వ సాగునే కొనసాగిస్తూ అలనాటి వ్యవసాయ పద్ధతులను నేటికీ ఆచరిస్తున్నారు. సేంద్రియ విధానంలో ఆకు కూరల్ని పండిస్తున్నారు. తమ గ్రామం నుంచే ఆకు కూరల సాగు తెలుగు రాష్ట్రాలకు విస్తరించిందని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎనీ్టఆర్ జిల్లా నందిగామ మండలంలోని కంచల గ్రామంలోకి అడుగు పెడితే... మునేరు ఒడ్డున.. పోషకాల వడ్డన మునేరుకు ఒడ్డున గల కంచల గ్రామంలో ఇసుకతో కూడిన తువ్వ (మెతక) నేలలు ఉండటంతో ఆ గ్రామ రైతులు ఆకు కూరల సాగుకు అనువుగా మలచుకున్నారు. ఈ నేలలో పండించిన ఆకు కూరలు రుచికి పెట్టింది పేరుగా మారాయి. పోషకాల పుట్టినిల్లుగా రెండు తెలుగు రాష్ట్రాలకు పోషక విలువలతో కూడిన ఆకు కూరలను నిత్యం ఇక్కడి రైతులు సరఫరా చేస్తున్నారు. తమ తాత ముత్తాతలు ఏ విధానంలో ఆకు కూరల్ని పండించారో నేటికీ అదే పద్ధతుల్ని అనుసరిస్తున్నారు. పశువుల పేడ, వానపాముల ఎరువు వినియోగించడం వల్ల మంచి నాణ్యతతో కూడిన ఆకు కూరలు ఉత్పత్తి చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. మార్కెట్లో కంచల ఆకు కూరలకు డిమాండ్ ఉంది. తాము పండించిన ఆకు కూరలను రైతులే నేరుగా విజయవాడ, నందిగామ, జగ్గయ్యపేట, కోదాడ, హైదరాబాద్ వరకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. ఏడాది మొత్తం రోజూ ఆదాయం వచ్చే ఆకు కూరలకు కాలంతో సంబంధం లేకుండా పండిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉండటంతో తమ పూర్వీకులు ఆకు కూరల సాగును ఎంచుకున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ఎకరాకు రూ.30 వేల కౌలు రెండు వేలకు పైగా జనాభా ఉన్న కంచల గ్రామంలో కులం, మతం భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఆకు కూరలను కలిసిమెలిసి సాగు చేస్తున్నారు. వీరికి చెరువుల కింద సాగు భూమి ఉన్నప్పటికీ ఆ భూమిలో తినడానికి వరి పండిస్తూ.. మెట్ట భూములను కౌలుకు తీసుకుని మరీ ఆకు కూరలను సాగు చేస్తున్నట్టు చెప్పారు. ఏడాదికి కౌలు రూపంలో ఎకరానికి రూ.30 వేల వరకు చెల్లిస్తున్నామన్నారు. కౌలు, పెట్టుబడి పోగా ఎకరానికి రూ.70 వేల నుంచి రూ.2 లక్షల వరకు వార్షికాదాయం పొందుతున్నట్టు చెప్పారు. గ్రామంలో 1,000కి పైగా ఎకరాల్లో ఆకు కూరలు పండిస్తున్నట్టు పేర్కొన్నారు. మునేరు పొంగితే నష్టమే..భారీ వర్షాలు కురిసినప్పుడు మునేరు పొంగి పంటలకు నష్టం వాటిల్లుతోంది. గతేడాది ఆగస్ట్లో వచ్చిన వరదలకు పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని రైతులు చెప్పారు. సొంత విత్తనాలతోనే.. కంచల రైతులు విత్తనాలను సొంతంగానే తయారు చేసుకుంటున్నారు. తోటకూర, బచ్చలికూర, పాలకూర, గోంగూర, పొన్నగంటికూర, మెంతికూర, చుక్కకూర, కొత్తిమీర, కరివేపాకు వంటి ఆకు కూరలను సాగు చేస్తూ వీటినుంచి వచ్చే విత్తనాలనే సేకరిస్తున్నారు. తమకు సరిపడా ఉంచుకుని ఇతర గ్రామాల రైతులకు విక్రయిస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. కంచల గ్రామ ఆకు కూరలకు ప్రత్యేక గుర్తింపు ఉండటంతో మార్కెట్లో లభించే విత్తనాల కంటే ఇక్కడి విత్తనాలకు డిమాండ్ ఎక్కువ.సొంతంగా విత్తనాల తయారీ మేం పండిస్తున్న ఆకు కూరల విత్తనాలను మేమే తయారు చేసుకుంటాం.దీంతో మంచి దిగుబడులు సాధిస్తున్నాం. విత్తనాల ఖర్చూ తగ్గుతుంది. మేం పండించే ఆకు కూరలతో పాటు ఇక్కడి విత్తనాలకు కూడా మంచి డిమాండ్ ఉంది..– ఎం.భూలక్ష్మి, ఆకు కూరల రైతువరదలతో తీవ్ర నష్టం మా పెద్దోళ్ల కాలం నుంచి ఆకు కూరలనే పండిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నాం. రూ.లక్షల్లో ఆదాయం రాకపోయినా రోజువారీ కూలీ రూ.500కి తగ్గకుండా ఆదాయం వస్తుంది. ఇటీవల మునేరు వరదతో తీవ్రంగా నష్టపోయాం. – చలమల సుబ్బారావు, ఆకు కూరల రైతు -
అత్యధిక జీతాన్ని వద్దనుకొని.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు
కరోనా మహమ్మారి చాలామంది జీవితాల్లో అగాధాన్ని సృష్టించింది. మరెందరో జీవితాల్ని అతలాకుతలం చేసింది. అంతేకాదు కోవిడ్-19 సృష్టించిన విలయం కారణంగా ఆత్మీయులను కోల్పోయినవారిలో, ఉద్యోగాలను పోగొట్టుకున్నవారిలో జీవితం పట్ల ఒక కొత్త దృక్పథాన్ని ఆవిష్కరించింది అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి వారిలో ఒకరు కావ్య ధోబ్లే. కోవిడ్ రోగుల మధ్య నెలల తరబడి పనిచేస్తూ, రోజుకు అనేక మరణాలను చూడటం, స్వయంగా కరోనా బాడిన నేపథ్యంలో జీవితంలో ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. అదే ఆమె విజయానికి, సంతోషకరమైన జీవితానికి పునాది వేసింది. ఏంటి ఆ నిర్ణయం? కావ్య సాధించిన విజయం ఏంటి? తెలుసుకుందాం ఈ కథనంలో.కావ్య ధోబ్లే-దత్ఖిలే ముంబైలో ఒక నర్సు. కావ్య ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచనలో పెరిగింది. బహుశా ఆ కోరికే ఆమెన నర్సింగ్పైపు మళ్లించిందేమో.జనరల్ నర్సింగ్,మిడ్వైఫరీలో డిప్లొమా పూర్తి చేసిన తర్వాత, ముంబైలోని లోకమాన్య తిలక్ మున్సిపల్ మెడికల్ కాలేజ్ మరియు జనరల్ హాస్పిటల్ (సియోన్ హాస్పిటల్)లో పనిచేయడం ప్రారంభించింది. తరువాత ను టాటా క్యాన్సర్ హాస్పిటల్లో రెండు సంవత్సరాలు పనిచేసింది. దీనితో పాటు, కావ్య 2017లో నర్సింగ్లో బి.ఎస్సీ పూర్తి చేసింది. ఒక ప్రైవేట్ కళాశాలలో ఒక సంవత్సరం బోధించిన తర్వాత,ముంబైలోని సియోన్ ఆసుపత్రికి స్టాఫ్ నర్సుగా చేరింది. 2019 నుండి 2022 వరకు సియోన్ హాస్పిటల్లో ఆయన పనిచేసిన కాలంలోనే కరోనా మహమ్మారి విజృంభించింది.ఉద్యోగం మానేసి, సంచలన నిర్ణయం కావ్య కూడా కరోనా బారిన పడి దాదాపు మరణం అంచుల దాకా వెళ్లి వచ్చింది. ఎన్నో మరణాలను చూసింది. కానీ తన రోగనిరోధక శక్తి తనను కాపాడిందనే విషయాన్ని అర్థం చేసుకుంది. అలాగే వ్యవసాయం అంటే మక్కువ ఉన్న ఆమె మనం పండించే, రసాయనాలతో నిండిన ఆహారం వ్యాధులకు హేతువని తెలుసుకుంది. అందుకే సమస్య మూలాన్ని తొలగించాలని గట్టిగా నిర్ణయించుకుంది. అంతే నెలకు రూ. 75వేల జీతం వచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలివేసింది. ఈ నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించినా, ఆమె భర్త రాజేష్ దత్ఖిలే క్యావకు మద్దతు ఇచ్చాడు. 2022లో, ఆమె తన ఉద్యోగాన్ని వదిలి భర్త గ్రామానికి వెళ్లింది.నర్సింగ్ నుండి జీరో ఇన్వెస్ట్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వరకుఆహారానికి ఆధారం వ్యవసాయం. అందుకే ఎలాంటి రసాయనాలు వాడని పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించుకుంది కావ్య. పట్టుదలగా కృషి చేసింది. వర్మీ కంపోస్ట్ బిజినెస్తో లక్షలు సంపాదిస్తోంది. రాజేష్ కుటుంబానికి పూణేలోని జున్నార్లోని దత్ఖిలేవాడి గ్రామంలో ఒక ఎకరం భూమి ఉంది. ఇందులో 5 గుంతల (0.02 ఎకరాలు) వర్మీకంపోస్ట్ తయారీ యూనిట్ను ప్రారంభించింది. వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని వదిలి, వర్మీకంపోస్ట్ వంటి సేంద్రీయ ఇన్పుట్లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కావ్య స్థానిక రైతులతో మాట్లాడింది. ఉత్తమ వ్యవసాయ పద్ధతులపై ఒక యూట్యూబ్ ఛానెల్ను కూడా ప్రారంభించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తొలి సంవత్సరంలో టర్నోవర్ రూ. 24 లక్షలు. ఈ ఆర్థిక సంవత్సరం రూ. 50 లక్షల టర్నోవర్ టార్గెట్ పెట్టుకుంది. కావ్య ప్రతి నెలా దాదాపు 20 టన్నుల రిచ్ వర్మీకంపోస్ట్ను తయారు చేస్తుంది. 50 శాతం లాభం మార్జిన్తో 50 కిలోల బ్యాగు ధర రూ. 500 లకు విక్రయిస్తుంది. ప్రస్తుతం 30 లక్షల వార్షిక టర్నోవర్తో విజయ వంతంగా దూసుకుపోతోంది. వోల్జా డేటా ప్రకారం, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వర్మీకంపోస్ట్ ఎగుమతిదారు. ఆ తర్వాత టర్కీ, ఇండోనేషియా,వియత్నాం ఉన్నాయి. ఈ రంగంలో అవార్డును కూడా అందుకుంది. ప్రారంభంలో తప్పని సవాళ్లుసేంద్రీయ వ్యవసాయం, వర్మీ కంపోస్ట్ గురించి కావ్య రైతులతో మాట్టాడినప్పుడల్లా, ఆమెకు లభించే సమాధానం, 'మీరు దీన్ని చేసి మాకు చూపించండి' అని. దీంతో ఆగస్టు 2022లో, అతను ఒక రైతు నుంచి ఒక కిలో వానపాములతో జీరో పెట్టుబడితో వర్మీ కంపోస్ట్ తయారీనీ మొదలు పెట్టింది. ప్రారంభించాడు. అక్టోబర్ 2022 నాటికి, వర్మీకంపోస్ట్ సిద్ధమైంది. మార్చిలో, కావ్య కృషి కావ్య బ్రాండ్ కింద వర్మీకంపోస్ట్ వాణిజ్య అమ్మకాలను ప్రారంభించింది. దాని ఫలితాలను రైతులు స్వయంగా అనుభవించారు. వారి విజయాలను తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసేది. ఒక రైతు ఐదు టన్నుల వర్మీకంపోస్టును రూ. 50,000 (కిలోకు రూ. 10) కు కొనుగోలు చేశాడు. రెండు వేల మంది రైతులకు ఇవ్వడానికి ఒక ఫౌండేషన్ 2,000 కిలోల వానపాములను కొనుగోలు చేసింది. కావ్య కిలో రూ.400కి అమ్మింది. ప్రతి రెండు నెలలకు 200 కిలోల వానపాములు, 35వేల కిలోల వర్మీ కంపోస్టును విక్రయిస్తుంది. అంతేకాదు ఆమె శిక్షణ తర్వాత మహారాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200 మంది వర్మీ కంపోస్ట్ను తయారు చేస్తున్నారు.తన చుట్టూ ఉన్నరైతుల్లో ఈ మార్పు తీసుకురాగలిగినందుకు చాలా సంతోషం అంటుంది కావ్య. వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేస్తారు?వర్మీకంపోస్ట్కు అవసరమైన ప్రధానమైనవి ఆవు లేదా గొర్రెలు , మేక పెంట, చెట్ల ఆకులు, పంట అవశేషాలు, కూరగాయల వ్యర్థాలు, బయోగ్యాస్ ప్లాంట్ స్లర్రీ లాంటి సేంద్రియ వ్యర్థాల మిశ్రమానికి వానపాములు కలుపుతారు, అవి ఎరువుగా రూపాంతరం చెందుతాయి.కేవలం రూ.500 పెట్టుబడితో ప్రారంభించవచ్చు. కంపోస్ట్ను ఎత్తైన పడకల మీద, డబ్బాలు, చెక్క డబ్బాలు, సిమెంటు ట్యాంకులు లేదా గుంటలు, వెదురు, ప్లాస్టిక్ కంటైనర్లు లేదా మట్టి కుండలలో కూడా తయారు చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,500 జాతుల వానపాములు ఉన్నాయి. అయితే స్థానిక జాతులను ఉపయోగించడం అనువైనది ఎందుకంటే అవి తక్షణమే అందుబాటులో ఉంటాయి, పైగా స్థానిక వాతావరణానికి బాగా సరిపోతాయి. భారతదేశంలో, సాధారణంగా ఉపయోగించే వానపాము జాతులు పెరియోనిక్స్ ఎక్స్కవాటస్, ఐసెనియా ఫోటిడా , లాంపిటో మౌరిటీ లాంటివి ఉన్నాయి. View this post on Instagram A post shared by Kavya Dhoble - Datkhile (@kavya.dhoble) -
స్ఫూర్తిదాయక ‘సాగుబడి’
హరిత విప్లవం పుణ్యమాని ఆహారోత్పత్తిలో మనదేశం స్వయం సమృద్ధి సాధించింది. ఆహార ధాన్యాలు, కూరగాయాలు, పండ్లు అధికంగా పండించడమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి మన వ్యవసాయ రంగం ఎదిగింది. ఇదంతా నాణానికి ఒకవైపు. ఇంకోవైపు విచ్చలవిడి రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంతో సాగుచేసిన ఆహార ఉత్పత్తులు ప్రజల ప్రాణాలకు సంకటంగా మారుతున్నాయి. అధికోత్పత్తి ఆశతో మోతాదుకు మించి వాడుతున్న రసాయన ఔషధాలు, మేలు కంటే కీడే ఎక్కువ చేస్తున్నాయి. ప్రజలు, మూగజీవాల ఆరోగ్యాలకు హానికరంగా మారడంతో పాటు నేల సారాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి. వ్యవసాయక ఉత్పాదకత, ఆహార భద్రత, పర్యావరణ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. వీటన్నింటికి విరుగుడుగా రసాయనేతర సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం మళ్లీ తెరమీదకు వచ్చింది.భూ సారానికి, వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించిన రసాయనిక వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా.. అతి తక్కువ సాగు ఖర్చుతో ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తులను పండించడమే లక్ష్యంగా ప్రకృతి వ్యవసాయం పురుడు పోసుకుంది. అయితే సరైన ప్రచారం లేకపోవడంతో దీని గురించి రైతులకు, ఔత్సాహికులకు తెలియకుండా పోయింది. సరిగ్గా అలాంటి సమయంలోనే సాక్షి దినపత్రిక ఈ గురుతర బాధ్యతను భుజాన వేసుకుంది. పునరుజ్జీవన వ్యవసాయ కథనాలకు ‘సాగుబడి’ పేరుతో ప్రత్యేకంగా ఒక పేజీని కేటాయించి ముందడుగు వేసింది. ప్రకృతి, సేంద్రియ రైతుల స్ఫూర్తిదాయక కథనాలతో పాటు రైతు శాస్త్రవేత్తల ఆవిష్కరణలను వెలుగులోకి తెచ్చింది. విత్తు దగ్గరి నుంచి విక్రయం వరకు.. అన్నదాతలకు ఉపయుక్తమైన సమాచారాన్ని ‘సాగుబడి’ సాధికారికంగా అందించింది. స్వల్ప వ్యవధిలోనే ‘సాగుబడి’ తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు దిక్సూచిగా అత్యంత ఆదరణ చూరగొంది. ఇంటి పంటలు, సేంద్రియ సాగు, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని రైతులకు చేరువ చేసింది.చదవండి: తక్కువ ఖర్చుతో.. పంటభూమిలో విషానికి బ్యాక్టీరియాతో చెక్‘సాగుబడి’లోని 2014-16 మధ్య కాలంలో ప్రచురితమైన ప్రకృతి వ్యవసాయ ప్రేరణాత్మక కథనాలను పుసక్తంగా ప్రచురించారు సీనియర్ జర్నలిస్ట్ పంతంగి రాంబాబు. ప్రకృతి, సేంద్రియ సాగుకు సంబంధించిన అన్ని అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ప్రకృతి వ్యవసాయంలో లబ్దప్రతిష్టులైన వారు, రైతు శాస్త్రవేత్తల ఇంటర్వ్యూలతో పాటు రైతులకు అవసరమయ్యే సమాచారాన్నంతా అందించారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా ప్రచురించిన ఈ పుస్తకాన్ని చూస్తేనే అర్థమవుతుంది రచయిత నిబద్దత. ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునే వారితో పాటు సేంద్రియ సాగు గురించి తెలుసుకోవాలకునే వారికి కూడా ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. రచయిత చెప్పినట్టుగా ఈ పుస్తకం ప్రకృతి వ్యవసాయానికి పెద్దబాలశిక్ష వంటిదే.సాగుబడి (మొదటి భాగం)ప్రకృతి వ్యవసాయ స్ఫూర్తి కథనాలుపేజీలు: 320;వెల: 600 /- ; రచన, ప్రతులకు:పంతంగి రాంబాబు,8639738658👉ఆన్లైన్లో సాగుబడి పుస్తకం కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి. -
సేద్యంలో మహిళా సైన్యం!
దేవతల స్వంత దేశంగా భావించే భూమిపై తమకంటూ సొంతమైన కుంచెడు భూమి లేని నిరుపేద మహిళలు వారు. కేరళ ప్రభుత్వం ఇచ్చిన చిన్న ఆసరాతో సాగునే నమ్ముకోని వేరే ఉపాధికి నోచుకోని ఆ మహిళలు చేయి.. చేయి కలిపారు. సాగుబాటలో వేల అడుగులు జతకూడాయి. మహిళల నుదుటి చెమట చుక్కలు చిందిన బీడు భూములు విరగపండాయి. పైరు పరవళ్లు తొక్కాయి. వ్యవసాయం లాభసాటి కాదనే మాటలు నీటిమీది రాతలుగా తేలాయి. కేరళలో 10,000 హెక్టార్లలో కుడుంబశ్రీ ఆధ్వర్యంలో సేంద్రియ సేద్యం జరుగుతోంది. వ్యవసాయంలో మాదే పైచేయి సుమా అంటున్నారు కేరళ మహిళా రైతులు.భూమిలేని మహిళల ఆర్థిక స్వావలంభన కల్పించే దిశగా కేరళ ప్రభుత్వం ప్రారంభించిన వినూత్న కార్యక్రమం కుడుంబశ్రీ. కేరళ రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ 1998లో ఊపిరి΄ోసుకున్న ‘కుడుంబ శ్రీ’ కేరళ గడ్డపై మహిళా సంఘటిత శక్తికి ప్రతీకగా ఎదిగింది. ఆ రాష్ట్రం మొత్తం ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఉపాధి. ముఖ్యంగా తమకంటూ సొంత వ్యవసాయ భూములు లేని కుటుంబాలే ఎక్కువ. స్థానిక సాగు భూములను వ్యవసాయేతర పనులకు ఉపయోగించటం వల్ల నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండేది. వ్యవసాయ రంగంలో పనిచేసేది ఎక్కువగా మహిళలే కావటంతో పనులు దొరక్క తీవ్ర ఒడిదుడుకులకు లోనవ్వాల్సివచ్చేది. రాష్ట్ర భూ సంస్కరణల చట్టం కౌలుపై నిషేధం విధించింది. అనధికారికంగా కౌలుకు ఇస్తే తమ భూమిపై అధికారం శాశ్వతంగా కోల్పోతామనే భయం యజమానుల్లో ఉండేది. కూలి పనులు మానుకొని సొంత వ్యవసాయం చేయాలనుకునేవారికి అది అందని ద్రాక్ష అయింది. సంఘటిత శక్తే తారక మంత్రం.. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోను కేరళ ప్రభుత్వం వెనుకడుగేయలేదు. సామూహిక వ్యవసాయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భూమిలేని మహిళలకు ΄÷లం, పంటతో అనుబంధం కల్పించటమే లక్ష్య సాధనలో తొలి అడుగుగా కొంతమంది భూమిలేని మహిళలను కలిపి 15–40 మంది మహిళలను కలిపి స్వయం సహాయక సంఘాలుగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, వ్యక్తిగత వ్యవసాయ భూములను గుర్తించి సంఘాలకు దఖలు పరిచారు. పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు సాగులో సేంద్రియ పద్ధతులకు పెద్ద పీట వేశారు. సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు మహిళా రైతుల కోసం ఏర్పాటు చేశారు. మంచి దిగుబడులను సాధించిన సంఘాలకు ఆర్థిక ప్రోత్సాహకాలను కల్పించేవారు. అన్ని జిల్లాల్లో 201 క్లస్టర్లలో 10,000 హెక్టార్లలో కుడుంబశ్రీ ఆధ్వర్యంలో సేంద్రియ / ప్రకృతి సేద్యం జరుగుతోంది. నాబార్డు సహకారంతో కుడుంబశ్రీ పథకం కింద బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించారు. రుణాలు తీసుకోవటం తిరిగి చెల్లించటంలో ఆయా సంఘాల్లోని మహిళా సభ్యులందరిది ఉమ్మడి బాధ్యత. ఒక్క తిరువనంతపురం జిల్లాలోనే ఆరువేల గ్రూపులు ఏర్పాటయ్యాయి. వీటిలో సుమారు 30 వేల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఆదునిక పద్ధతుల్లో అరటి సాగుపై కేర ళ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇచ్చిన శిక్షణతో తక్కువ కాలంలోనే రెండింతల దిగుబడులు సాధించారు. వనితా కర్మసేన పేరుతో కుడుంబశ్రీ కోసం వ్యవసాయ పరికాలను, యంత్రాలను ఉపయోగించటంలో మహిళలకు శిక్షణ ఇచ్చారు. కొనుగోలుకు రుణాలు ఇచ్చారు. ప్రతి సంఘానికి తమ సొంత పరికరాలు ఉన్నాయి. దీంతో వారే శ్రామికులుగా మారటంతో ఖర్చును ఆదా చేయగలిగారు. పంటను నష్ట΄ోయిన సందార్భాల్లో నాబార్డ్ మహిళా రైతులకు అండగా నిలిచింది. 47 వేల పై చిలుకు సంఘాలు, లక్ష ఎకరాల్లో సాగు చేస్తున్నాయి. జీడిమామిడి, కొబ్బరి, వరి, అరటి, పైనాపిల్ పండ్లతోటలు, ఆకుకూరలు, గుమ్మడి, బఠాణీ, సొర, అల్లం, బెండ, మిరప, వంటి పలు రకాల పంటలను సాగు చేస్తున్నారు. తాము పండించిన పంటలను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి విక్రయించటంతో మంచి లాభాలు కళ్లజూశారు. ఆరు నెలలు తిరగకుండానే రుణాలు తిరిగి చెల్లించారు. ఒక్కో సీజన్లోనే ఈ సంఘాలు రూ. లక్ష వరకు నికరాదాయం ఆర్జించేవి. దీంతో తమకంటూ సొంత ఇళ్లను నిర్మించుకున్నారు. చిన్న వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు. బ్యాంకులు గతంలో మహిళలకు రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చేవి కాదు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారింది. 10543 స్వయం సహాయక సంఘాలకు రూ. 123 కోట్ల రుణాలు ఇచ్చారు. ఇప్పుడు బ్యాంకుల దృష్టిలో మహిళారైతులు అంటే మంచి పరపతిగల మహిళలు. (చదవండి: కామెల్లియా..అచ్చం గులాబీలా ఉంటుంది..! కానీ..) -
సేంద్రియ రైతులకు ఆహ్వానం
సాక్షి, సిద్దిపేట/రంగారెడ్డి జిల్లా/నందిగామ: భారతదేశ ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయ రంగానిది కీలకపాత్ర అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు. రైతుల ఆర్థిక ప్రగతే దేశ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా పనిచేస్తుందని చెప్పారు. మెదక్ జిల్లాలోని తునికి గ్రామంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో బుధవారం నిర్వహించిన సేంద్రియ రైతు సమ్మేళనం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. మెదక్ జిల్లాలో 655 మంది రైతులు సేంద్రియ సేద్యం చేపట్టి దేశంలో చరిత్ర సృష్టించారని ప్రశంసించారు. తునికి గ్రామం తనకు మార్గదర్శకమని చెప్పారు. తునికి సేంద్రియ సాగు రైతులంతా మూడు రోజులపాటు ఢిల్లీలోని తన గృహానికి అతిథులుగా రావాలని ఆహ్వానించారు. స్థానిక మార్కెటింగ్ పెంచాలి 2001లో అప్పటి ప్రధాని వాజ్పేయి కిసాన్ దివస్ను ప్రారంభించగా.. త్వరలో అత్యంత వైభవంగా రజతోత్సవం నిర్వహించుకోబోతున్నామని ఉపరాష్ట్రపతి చెప్పారు. ఇందులో దేశంలోని 730పైచిలుకు కేవీకేలు, 150 ఐకార్ సంస్థలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పండించిన పండ్లు, కూరగాయలను అక్కడే విక్రయిస్తే.. ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ప్రతీ భారతీయుడు జాతీయవాదంపై విశ్వాసంతో ఉండాలని పిలుపునిచ్చారు. సేంద్రియ సాగు పెరగటం శుభ పరిణామం: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సేంద్రియ వ్యవసాయ సమ్మేళనంలో 500 కుటుంబాలు పాల్గొనడం ఆనందంగా ఉందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. రైతులు సేంద్రియ సాగు దిశగా అడుగులు వేస్తూ.. రసాయనిక సాగును క్రమంగా తగ్గిస్తుండటం శుభ పరిణామం అని సంతోషం వ్యక్తంచేశారు. కేవీకేలో 43,337 మంది పురుషులు, 16,937 మంది మహిళా రైతులు సభ్యులుగా ఉండటం గొప్ప విజయమన్నారు. ఈ కార్యక్రమంలో సేంద్రియ రైతులు నరేందర్ రెడ్డి, ధనలక్ష్మిని ఉపరాష్ట్రపతి ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సతీమణి సుదేష్ ధన్ఖడ్, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్రావు, ఆర్ఎస్ఎస్ కార్యదర్శి భాగయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఉపరాష్ట్రపతి దంపతులకు శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీలు డాక్టర్ కె.లక్ష్మణ్, వద్దిరాజు రవిచంద్ర, కేఆర్ సురేష్ రెడ్డి, దామోదర్ రావు, పార్థసారధి రెడ్డి, డీజీపీ జితేందర్, తదితరులు ఘన స్వాగతం పలికారు. కన్హా శాంతివనంలో ధ్యానం.. రంగారెడ్డి జిల్లా నందిగామలోని కన్హా శాంతివనం దేశంలో అత్యుత్తమ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుందని జగదీప్ ధన్ఖడ్ అన్నారు. బుధవారం ఉపరాష్ట్రపతి దంపతులు కన్హా శాంతివనాన్ని సందర్శించారు. హార్ట్ఫుల్నెస్, శ్రీరామచంద్ర మిషన్ గురూజీ కమ్లేష్ పటేల్ (దా జీ)తో కలిసి వారు ధ్యానం చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. కమ్లేష్ పటేల్ వలన ప్రతి ఒక్క రూ ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. ధన్ఖడ్ దంపతులు రాత్రి కాన్హాలోనే బసచేశారు. గురువారం ఉదయం ధ్యానం చేసిన అనంతరం ఢిల్లీ వెళ్లనున్నారు. -
19 ఏళ్ల ఐటీ ఉద్యోగానికి బై చెప్పి, ప్రకృతి సేద్యంతో లాభాలు
దేశ విదేశాల్లో అధికాదాయాన్నిచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగంలో అంతకంతకూ పెరిగే పని ఒత్తిడి, తీవ్ర అసంతృప్తి నుంచి బయటపడటానికి ప్రకృతితో తిరిగి మమేకం కావటం ఒక్కటే మార్గమని మునిపల్లె హరినాద్(52) భావించారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లె గ్రామానికి చెందిన కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి కుమారుడు హరినాద్. 1994లో బీటెక్ పూర్తి చేసి చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఆస్ట్రేలియా, అమెరికా, యూకేలలో పనిచేశారు. నెలకు రూ. 1.5 లక్షల జీతంతో మిడిల్ మేనేజ్మెంట్ స్థాయిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ 2013లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఎడతెగని పని వత్తిడితో నలుగుతూ కుటుంబానికి సమయం ఇవ్వలేని స్థితిలో ఎంత చేసినా సంతృప్తినివ్వని ఉద్యోగాన్ని కొనసాగించటం కన్నా.. సొంతూళ్లో కుటుంబ సభ్యులతో కలసి ప్రశాంతంగా జీవిస్తూ వారసత్వ భూమిలో సాధారణ రైతుగా కొత్త జీవితాన్ని ప్రారంభించటంలో నిజమైన ఆనందం ఉందని ఆయన భావించారు. ముందు నుంచే అధ్యయనంవిదేశాల్లో ఉన్న సమయంలో అక్కడి సూపర్ మార్కెట్లలో లభించే ఆర్గానిక్ ఉత్పత్తులకు ఆకర్షితులయ్యారు. ఖర్చు ఎక్కువైనా కల్తీలేని ఆహార పదార్ధాలను తాను కూడా ఎందుకు పండించేలేననే పట్టుదలతో ఇంటర్నెట్లో ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలనే అంశాలపై మూడేళ్లపాటు అధ్యయనం చేశారు. రసాయనిక అవశేషాల్లేని, పోషకాల సమతుల్యతతో కూడిన ఆరోగ్యాదాయకమైన ఆహారాన్ని పండించటమే ముఖ్యమైన పనిగా తలచి ఉద్యోగానికి 2013లో రాజీనామా ఇచ్చారు. ఆ కొత్తలోనే మధురైలో జరిగిన పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. సుభాష్ పాలేకర్ శిక్షణా శిబిరంలో హరినాధ్ పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన ఇతర రైతులతో పరిచయాలు పెంచుకొని వారి క్షేత్రాలను సందర్శించి, వ్యవసాయం చేస్తూ నేర్చుకున్నారు. వారసత్వంగా సంక్రమించిన 2.5 ఎకరాల మాగాణి, అర ఎకరం మెట్టలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. (చిన్న ప్యాకెట్ : 30 రోజులైనా పండ్లు, కూరగాయలు పాడుకావు!)దిబ్బపై ఉద్యాన పంటలుమాగాణిలో సార్వాలో వరి, దాళ్వాలో మినుములు, పెసలు, నువ్వులు తదితర పంటలను హరినా«ద్ సాగు చేస్తున్నారు. మాగాణి పక్కనే 3 అడుగుల ఎత్తు దిబ్బగా ఉన్న అరెకరంలో పండ్లు, దుంపలు తదితర పంటలు పండిస్తున్నారు. అరటి, జామ, బొ΄్పాయి, కొబ్బరి, మునగ, కంద, అల్లం, కంద, మద్ది, మామిడి, టేకు పెంచుతున్నారు. తమ ప్రాంతంలో ఖరీఫ్లో వరి కోతలు అయ్యాక, రబీలో మొక్కజొన్న పూర్తయ్యాక పంట వ్యర్థాలను ఉత్తరాదిలో మాదిరిగా తగుల బెడుతున్నారని హరినా«ద్ తెలిపారు. గత ఏడాది ఇతర ΄÷లాల నుంచి వ్యాపించిన మంటలకు తమ అరెకరంలోని ఉద్యాన పంటలు కాలిపోయాయన్నారు. గోదావరి ఇసుకలు, కట్టుయానం...ప్రకృతి సేద్యానికి అనువైన దేశీ వరి రకాల సాగుపై హరినాద్ దృష్టి కేంద్రీకరించారు. వ్యవసాయం చేసిన అనుభవం లేక΄ోయినా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఒక్కో పని నేర్చుకుంటూ నిలదొక్కుకున్నారు. కాశీవిశ్వనాద్ (130 రోజులు) అనే సన్న తెల్ల వరి రకాన్ని 8 ఏళ్ల పాటు వరుసగా సాగు చేశారు. బీపీటీ కన్నా సన్నని ఈ రకం ధాన్యాన్ని పూర్తిగా ప్రకృతి సేద్యంలో ఎకరానికి అత్యధికంగా 25 బస్తాల దిగుబడి పొందారు. ఈ ఏడాది నుంచి 1.25 ఎకరాల్లో గోదావరి ఇసుకలు (110 రోజులు) సాగు చేస్తున్నారు. ఇది తెల్ల, సన్న రకం. త్వరలో నూర్పిడి చేయనున్నారు. ఎకరానికి 20 బస్తాల దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. మరో 1.25 ఎకరాల్లో కట్టుయానం (180 రోజులు) అనే రెడ్ రైస్ను సాగు చేస్తున్నారు. ఇది 15 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రావచ్చని చెప్పారు.సంపూర్ణ సంతృప్తి, సంతోషం!ఉద్యోగ బాధ్యతల్లో అసంతృప్తి, పని ఒత్తిడితో ఏదో తెలియని వేదనకు గురయ్యాను. వారానికి 5 గంటలు నిద్రతో సరిపెట్టుకొని, పర్సనల్ పనులనూ మానుకొని, 3–4 నెలల ΄ాటు పనిచేసి ్ర΄ాజెక్టు పూర్తి చేసిన రోజులున్నాయి. డబ్బు వస్తుంది. కానీ, ఆ వత్తిడిమయ జీవితంలో సంతృప్తి, ఆనందం లేవు. గత 9 ఏళ్లుగా కుటుంబీకులతో ఉంటూ ప్రకృతి సేద్యం చేసే భాగ్యం కలిగింది. కుటుంబం అంతా మద్దతుగా నిలిచారు. రసాయనాల్లేకుండా వరి ధాన్యం తొలి ఏడాది 10 బస్తాల దిగుబడి తీయటం ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు 25 బస్తాల దిగుబడినిచ్చే స్థాయికి ΄÷లం సారవంతమైంది. ఈ ఏడాది జీవామృతం కూడా ఇవ్వలేదు. పూర్తి ప్రకృతి వ్యవసాయం అంటే ఇదే. రైతుగా మారి 6 కుటుంబాలకు ఏడాది ΄÷డవునా ఆరోగ్యదాయకమైన ఆహారం అందిస్తున్నా. అనేక ఆరోగ్య సమస్యలు తగ్గాయని, షుగర్ను నియంత్రించటం సులువైందని వారు చెబుతుంటే సంతృప్తిగా ఉంది. సొంతూళ్లో ప్రకృతి సేద్యం సంపూర్ణంగా సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తోంది. – మునిపల్లె హరినాద్ (93805 16443). మునిపల్లె, పొన్నూరు మండలం, గుంటూరు జిల్లా ఈ ఏడాది జీవామృతమూ లేదు!పొలం దుక్కి చేయటం, రొటోవేటర్ వేయటం, దమ్ము చేయటం వంటి పనులను సొంత చిన్న ట్రాక్టర్తో స్వయంగా చేసుకోవటం నేర్చుకున్నారు హరినా«ద్. పచ్చిరొట్ట పంటలను కలియదున్నటం, జీవామృతం పిచికారీ, కాలువ నుంచి తోడుకునే నీటితో కలిపి ఆవు మూత్రం పారించటం చేస్తుంటారు. ఈ సంవత్సరం అవేవీ చెయ్యలేదన్నారు. అయినా, గోదావరి ఇసుకలు రకం ధాన్యం ఎకరానికి 20 బస్తాలకు తగ్గకుండా వస్తాయని సంతోషంగా తెలిపారు. నాట్లు, కలుపు తీత, కోతలు మనుషులతోనే చేయిస్తున్న హరినాద్కు ఎకరా వరి సాగుకు రూ. 35 వేల నుంచి 40 వేల వరకు ఖర్చు అవుతోంది. అన్నీ అనుకూలిస్తే రసాయనిక రైతులకు 40–45 బస్తాలు, తనకు 25 బస్తాల వరకు ధాన్యం దిగుబడి వస్తుందని, అయినా తనకు మంచి ఆదాయమే వస్తున్నదన్నారు. ఆ ప్రాంతంలో అందరూ కౌలు రైతులే. కోత కోసి ఆ రోజే అమ్మేస్తుంటారు. హరినా«ద్ నెలకోసారి ధాన్యం మర పట్టించి కనీసం 6 కుటుంబాలకు నెల నెలా పంపుతూ ఉంటారు. కిలో బియ్యం రూ. వందకు అమ్ముతున్నారు. తాను నిర్ణయించిన ధరకు నేరుగా వినియోగదారులకు అమ్మటం వల్ల తనకు ఇతర రైతుల కన్నా అధికాదాయమే వస్తోందని హరినా«ద్ తెలిపారు. నేలను బాగు చేసుకుంటూ ఇతరులకూ ఆరోగ్యదాయక ఆహారాన్ని అందిస్తున్నానన్న సంతృప్తితో చాలా ఆనందంగా ఉన్నానని ఆయన తెలిపారు. – సయ్యద్ యాసిన్, సాక్షి, పొన్నూరు, గుంటూరు జిల్లా -
ఎర్ర ఆకులతో అరటి చెట్టు.. ఎక్కడైనా చూశారా?
ఎర్ర అరటి పండు మనకు అక్కడక్కడా కనిపిస్తుంది. అయితే, ఎర్ర ఆకులతో కూడిన అరటి చెట్టు అరుదనే చెప్పాలి. దీని ఆకు మాదిరిగానే కాయ కూడా ఎర్రగానే ఉంటుంది. కర్ణాటకలోని సిర్సికి చెందిన రైతు ప్రసాద్ కృష్ణ హెగ్డే ఈ అరుదైన అరటి వంగడాన్ని సంరక్షిస్తున్నారు. దీనితో పాటు ఆయన మరో 80 అరటి రకాలను తన పొలంలో పెంచుతూ అరటి పంటల్లో వైవిధ్యాన్ని కాపాడుతున్నారు. ప్లాస్టిక్ బనానా అనే మరో రకం కూడా ఈయన దగ్గర ఉంది. దీని ఆకులను భోజనం చేయటానికి వాడతారట. మైసూరులో ఇటీవల 3 రోజుల పాటు సహజ సమృద్ధ, అక్షయకల్ప ఆర్గానిక్స్ ఆధ్వర్యంలో జరిగిన ‘అరటి పండుగ’ సందర్భంగా ప్రసాద్ను ఘనంగా సత్కరించారు. 550 అరటి రకాలను సంరక్షిస్తున్న కేరళకు చెందిన వినోద్ నాయర్ 75 రకాల అరటి పండ్లను ఈ ఉత్సవంలో ప్రదర్శించటం మరో విశేషం. వినోద్ నాయర్తో పాటు 100 దేశీ అరటి రకాలను సంరక్షిస్తున్న తమిళనాడుకు చెందిన సెంథిల్ కుమార్ను సైతం ఘనంగా సత్కరించారు.ఆహార నిపుణురాలు, రచయిత్రి రత్న రాజయ్య అరటి పండుగలో మాట్లాడుతూ ఏదో ఒకే రకం అరటిని సాగు చేయటం ప్రమాదకరమని, ఏదైనా మొండి తెగులు సోకిందంటే మొత్తం ఆ అరటి రకమే అంతరించిపోతుందన్నారు. భవిష్యత్తు తరాల కోసం అరటి రకాల్లో జీవవైవిధ్యాన్ని మన తరం పరిరక్షించుకోవాలని పలుపునిచ్చారు.ఎర్ర అరటి జగత్ప్రసిద్ధంసహజ సమృద్ధ ఎన్జీవో డైరెక్టర్ జి. కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ‘అరటి బంగారంతో సమానం. అరటి ప్రపంచం పెద్దది. వందలాది వంగడాలున్నాయి. మానవ జీవితంలో పుట్టుక దగ్గరి నుంచి చావు వరకు అనేక సందర్భాల్లో, ఆచార వ్యవహారాల్లో అరటి పండు సాంస్కృతిక అవసరం ఉంటుంది. ప్రతి రకం రుచి, రంగు, సైజు, చెట్టు ఎత్తులో వైవిధ్యభరితంగా ఉంటాయ’న్నారు. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి అరటి రకాలున్నాయి. ఆఫ్రికన్ జంజిబార్ స్ప్రౌట్ లాంగ్ బనానా, ఇండోనేషియా జావా బ్లూ బనానా, హవాయికి చెందిన తెల్ల చారల అరటితో పాటు దక్షిణాసియాకు సంబంధించి ఎర్ర అరటి రకాలు జగత్ప్రసిద్ధి గాంచాయన్నారు.చదవండి: తాటి తేగలతోనూ వంటకాలు!అరటికి భారతదేశం పుట్టిల్లు. ఇక్కడ ఎన్నో వందల రకాల అరటి వంగడాలు కనిపిస్తాయి. భింకెల్ అనే రకం అరటి చెట్టు ఎత్తయిన దూలం మాదిరిగా ఉంటుంది. కేరళకు చెందిన పొడవాటి రకం అరటి గెలకు వెయ్యి కాయలుంటాయి. ప్రపంచంలోకెల్లా ఇదే అతి పొడవైన అరటి రకం. కొడిగుడ్డు అంత చిన్న అరటి కాయ రకం కూడా ఉంది అన్నారు కృష్ణప్రసాద్. కర్ణాటకకు ప్రత్యేకమైన అరటి రకాలు ఉన్నాయన్నారు. వాణిజ్యపరంగా డిమాండ్ ఉన్న కావెండిష్ బ్రీడ్ల అరటి పంటలను సాగు చేయటం ప్రారంభమైన తర్వాత దేశీ వంగడాలు మరుగున పడిపోయాయంటున్నారు కృష్ణప్రసాద్. ఒకే రకం అరటి సాగు చేస్తే పనామా కుళ్లు తెగులు సోకే ముప్పు ఉందని చెబుతూ, ఈ తెగులు సోకిందంటే పంటంతా తుడిచిపెట్టుకుపోవటం ఖాయమన్నారు.కార్డమమ్, నెండ్ర ఆర్గానిక్ సాగుకు అనుకూలంసేంద్రియ పద్ధతుల్లో సాగు చేసిన అరటి పండ్లకు ఈ రోజుల్లో అధిక డిమాండ్ ఉందన్నారు కృష్ణప్రసాద్. సేంద్రియంగా సాగు చేయటం వల్ల భూమి కరువు బారిన పడకుండా ఉంటుంది. రసాయనాలకు ఖర్చుపెట్టే డబ్బు ఆదా అవుతుంది అన్నారాయన. కార్డమమ్, నేండ్ర అరటి రకాలు సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయటానికి అనువైనవే కాక, మార్కెట్ డిమాండ్ రీత్యా కూడా ఇవి మేలైనవని దేశీ విత్తన నిపుణుడు కూడా అయన కృష్ణప్రసాద్ వివరించారు. అరటి సాళ్ల మధ్యన ముల్లంగి, ఆకుకూరలు, గుమ్మడి, బీన్స్, పసుపు, చిలగడదుంప పంటలను సాగు చేసుకోవచ్చని కృష్ణప్రసాద్ వివరించారు. ఇతర వివరాలకు.. 94821 15495. -
మనం తింటున్న ఆహారం నాణ్యత ఎలా ఉంది?
హరిత విప్లవానికి పట్టుగొమ్మ వంటి పంజాబ్ రాష్ట్రంలో రైతులు పునరలోచనలో పడ్డారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు అత్యధిక మోతాదులో వాడుతూ ఏడు దశాబ్దాలుగా మార్కెట్ కోసం వరి, గోధుమ వంటి పంటలు పండిస్తూ వచ్చిన రైతులు.. ఆ ఆహారం తిని తమ కుటుంబ సభ్యులు వ్యాధిగ్రస్తులుగా మారుతుండటాన్ని గురించారు. తమ కుటుంబం కోసమైనా రసాయనాలు వాడకుండా పూర్తి సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించుకోవటమే ఆరోగ్యాన్ని తిరిగి పొందే మార్గమని పంజాబ్ రైతులు ఎట్టకేలకు గ్రహిస్తున్నారు.తేజ్పాల్ సింగ్ 30 ఎకరాల ఆసామి. పొలం అంతా (గత సెప్టెంబర్లో) పచ్చని వరి పంటతో నిండి ఉంది. పటియాలా జిల్లా కక్రాల గ్రామ పొలిమేరల్లోని తన వరి పొలానికి 4 టన్నుల యూరియా వేశానని, పురుగుల మందు ఒకసారి చల్లానని చెప్పారు. ఇది మార్కెట్లో అమ్మటం కోసం అతను పండిస్తున్నాడు. ఈ పంట అమ్మటం కోసం కాదుఈ ప్రధాన పొలానికి పక్కనే అతనిదే 4 ఎకరాల పొలం మరొకటి ఉంది. అందులో కొంత మేరకు వరి పంట, దాని పక్కనే కూరగాయల తోట కూడా ఉంది. ‘ఈ 4 ఎకరాల పంట అమ్మటం కోసం కాదు, మా కుటుంబం కోసమే పూర్తిగా సేంద్రియంగా పండిస్తున్నా. పచ్చిరొట్ట ఎరువు, వర్మీకంపోస్టు, జీవన ఎరువులు ఈ పొలంలో వాడుతున్నా. మా కుటుంబం తినగా మిగిలినవి ఏమైనా ఉంటే అమ్ముతా’ అన్నారు తేజ్పాల్ సింగ్.ఈ మార్పు ఎందుకొచ్చిందని అడిగితే.. మూడేళ్ల క్రితం తన భార్య అనారోగ్యం పాలైంది. టెస్ట్ చేయిస్తే యూరిక్ యాసిడ్ పెరిగిందన్నారు. ఆ రోజుల్లో మరో దగ్గరి బంధువుకు కేన్సర్ వచ్చింది. అప్పటి నుంచి మనం తింటున్న ఆహారం నాణ్యత ఎలా ఉంది అని ఆలోచించటం మొదలు పెట్టాడు. తాను రసాయనాలతో పండించిన ఆహారోత్పత్తుల్ని పరీక్ష చేయించాడు. యూరియా, పొటాష్, పురుగుమందుల అవశేషాలు ప్రమాదకర స్థాయిలో ఆ ఆహారంలో ఉన్నట్లు తేలింది.మా కోసం ఆర్గానిక్ పంటలు‘అప్పుడు నేను నిర్ణయించుకున్నా. మా కుటుంబం తినేదంతా సేంద్రియ పద్ధతుల్లోనే పండించుకోవాలని గట్టి నిర్ణయానికొచ్చా. అప్పటి నుంచి ఈ 4 ఎకరాల్లో మా కోసం ఆర్గానిక్ పంటలు పండించుకొని తింటున్నాం. నా భార్య దేహంలో యూరిక్ యాసిడ్ తగ్గింది. మేం తింటున్న సేంద్రియ ఆహారం రుచిగా, నాణ్యంగా ఉంది. ఈ ఆహారం అంతకు ముందు తిన్న దానికన్నా ఎంతో మేలైనదని మాకు అర్థమైంది’ అన్నారు తేజ్పాల్ సింగ్. ఇది ఆయన ఒక్కడి మాటే కాదు. తినే ఆహారంలో రసాయనాల అవశేషాల్లేకపోతే ఆరోగ్యం బాగుంటుందని గట్టిగా గుర్తించిన రైతులు చాలా మందే కనిపిస్తున్నారంటే ఆశ్చర్యం లేదు.చదవండి: సహకారం రాష్ట్ర సబ్జెక్ట్.. కేంద్రం చట్టాలు ఎలా చేస్తుంది?కొద్ది నెలల క్రితం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం.. పంజాబ్లో 2023–24లో ఎకరానికి 103 కిలోల రసాయనిక ఎరువులు వాడారు. దేశవ్యాప్తంగా రైతులు వాడుతున్న 58 కిలోలతో పోల్చితే ఇది దాదాపుగా రెట్టింపు. 1980–2018 మధ్యలో పంజాబ్ రైతులు వాడిన ఎన్పికె ఎరువులు ఏకంగా 180% పెరిగిందట.దీనికి తగ్గట్టే జబ్బులూ పెరిగాయి. ఐసిఎంఆర్ సంస్థ నేషనల్ కేన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ గణాంకాల ప్రకారం.. పంజాబ్లో 2021లో 39,521 మంది కేన్సర్ బారిన పడితే.. అది 2024 నాటికి 42,288కి పెరిగింది. పొలాల్లో రసాయనాల వాడకం పెరగటానికి, మనుషుల్లో జబ్బులు పెరగటానికి మధ్య సంబంధం స్పష్టంగానే కనిపిస్తోంది. ఇది పంజాబ్ రైతులు, వినియోగదారులూ గుర్తిస్తున్నారు. మన సంగతేంటి? -
ప్రకృతి చోద్యం!
ఎలాంటి రసాయనాలు వాడకుండా పంటలు పండించడమే ప్రకృతి వ్యవసాయం. దీనివల్ల భూసారం పెరగడంతో పాటు రైతులకు పెట్టుబడి తగ్గుతుంది. అంతేకాకుండా ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందుబాటులోకి వస్తాయి. అందువల్లే గత ప్రభుత్వాలు కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాయి. ఇందుకోసం వ్యవసాయశాఖలోనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేశాయి. కానీ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం లెక్కలు ఘనంగా కనిపిస్తున్నా... క్షేత్రాలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.కర్నూలు(అగ్రికల్చర్): ప్రకృతి వ్యవసాయం జిల్లాలో రికార్డుల్లోనే సాగుతోంది. అధికారులు వేలాది ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగుతోందని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం నామమాత్రానికే పరిమితమైంది. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక విభాగం ఉన్నా... ఉత్తుత్తి హడవుడే తప్ప ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ప్రకృతి వ్యవసాయం కింద జిల్లాలో సాగుచేసిన ఆహార పంటల్లో కెమికల్స్ అవశేషాలు ఉన్నట్లుగా శాస్త్రీయంగా నిర్ధారణ కావడంతో ప్రకృతి సేద్యం...అంతా చోద్యంగా మారింది. లెక్కల్లో మాత్రం 34,024 ఎకరాల్లో... 2024–25 సంవత్సరంలో జిల్లాలోని 141 గ్రామ పంచాయతీల్లో ప్రకృతి వ్యవసాయం జరుగుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది 53,834 మంది రైతులతో 75,534 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టాలన్నది వ్యవసాయ శాఖ లక్ష్యం. ప్రకృతి వ్యవసాయ విభాగం లెక్కల ప్రకారం ఇప్పటికే 32,607 మంది రైతులు 34,024 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కానీ 32,707 మంది రైతుల్లో 5 శాతం మంది కూడా ప్రకృతి వ్యవసాయం చేయడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అందువల్లే జిల్లాలో వేలాది మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు చెబుతున్నప్పటికి.. సరి్టఫికేషన్ మాత్రం అతి కొద్ది మందికే వస్తోంది. అది కూడా స్వచ్ఛందంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకే దక్కుతోంది. సాగుకు సిబ్బంది వెనుకంజ ప్రకృతి వ్యవసాయ విభాగంలో 367 మంది పనిచేస్తున్నారు. వాస్తవానికి వీరంతా వారికున్న భూమిలో ఎకరా, అర ఎకరా విస్తీర్ణంలో తప్పనిసరిగా ప్రకృతి వ్యవసాయం చేయాలి. ప్రధానంగా ఎల్–1, ఎల్–2, ఎల్–3 కేటగిరీ వరకు ప్రకృతి వ్యవసాయం చేస్తూ రైతులకు అదర్శంగా నిలవాలి. కానీ వీరిలోనే 60 శాతం మంది ప్రకృతి వ్యవసాయాన్ని పట్టించుకున్న దాఖలాల్లేవు. రైతులకు ఆదర్శంగా ఉండాల్సిన సిబ్బందే కాడికిందపడేస్తే ఇక రైతులు ఎందుకు పట్టించుకుంటారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు కొందరు మాస్టర్ ట్రైనర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. విచ్చలవిడిగా కెమికల్స్ వాడుతున్నా.. ప్రకృతి వ్యవసాయం అంటూ నమ్మిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచ్చల విడిగా కెమికల్స్ వాడకం జిల్లాలో చాలా మంది పేరుకే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఆచరణలో మాత్రం అంతా కెమికల్స్ వ్యవసాయమే. ప్రకృతి వ్యవసాయం పెద్ద ఎత్తున జరుగుతుంటే రసాయన ఎరువుల వినియోగం గణనీయంగా తగ్గాలి. కానీ వివిధ మండలాల్లో లెక్కకు మించి రసాయన ఎరువులు వినియోగిస్తుండటం గమనార్హం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2.50 లక్షల టన్నుల వరకు రసాయన ఎరువుల వినియోగం ఉంది. జిల్లాల పునరి్వభజన తర్వాత కర్నూలు జిల్లాలో 1.50 లక్షల టన్నుల వరకు వినియోగమవుతోంది. 2024–25 ఖరీఫ్లో 1,27,567.657 టన్నుల రసాయన ఎరువులను వినియోగించినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. సాగు విస్తీర్ణం పెంచుతాం జిల్లా రైతులు ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపుతున్నారు. ఆసక్తి ఉన్న వారిని గుర్తించి శిక్షణ ఇస్తున్నాం. జీవామృతం, కషాయాల తయారీపై కూడా అవగాహన కల్పిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేసే సిబ్బంది కూడ ఎకరా, అర ఎకరా విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఈ ఏడాది 54,834 మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రానున్న రోజుల్లో ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారిప్రకృతి వ్యవసాయం అంటే... ప్రకృతి వ్యవసాయం అంటే ఎలాంటి పురుగు మందులు, రసాయన ఎరువులు వాడకుండా పంటలు పండించడం. పంటల సాగులో ద్రవ, ఘన జీవామృతాన్ని మాత్రమే వినియోగించడం. చీడపీడల నివారణకు కషాయాలు, బ్రహ్మస్త్రం, అగ్ని అస్త్రం, దశపర్ణి కషాయం తదితర వాటిని వినియోగించడం. ఏ రకంగానూ ఇటు పురుగుమందులు, అటు రసాయన ఎరువులు వినియోగించకపోవడం. అలా..వరుసగా మూడేళ్లు సాగు చేస్తే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లుగా పరిగణిస్తారు. కానీ అధిక దిగుబడుల కోసం చాలా మంది వి చ్చల విడిగా రసాయన మందులు వాడుతున్నారు. కల్లూరు మండలం లక్ష్మీపురం పంచాయతీలో 631 మంది మహిళలు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఆ పంచాయతీలో ముగ్గురు మాత్రమే 100 శాతం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అందుకే సరి్టఫికేషన్ కూడా ఎవరూ వెళ్లడం లేదు. అధికారులు చెబుతున్న లెక్కలన్నీ ఇలాగే ఉంటున్నాయి. పాలేకర్ స్ఫూర్తితో 150 మంది రైతులు.. ఎవరి ప్రమేయం లేకుండా స్వచ్ఛందగా జిల్లాలోని 150 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వీరు దాదాపు పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్నారు. వీరు సుబాష్ పాలేకర్ స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయం చేస్తుండటం విశేషం. ప్రకృతి వ్యవసాయ విభాగం చెబుతున్న వారిలో 5 శాతం కూడ ప్రకృతి వ్యవసాయం చేసే వారు లేరు. ఈ 150 మంది రైతుల ఉత్పత్తులతోనే ప్రకృతి వ్యవసాయ సిబ్బంది హడావుడి చేస్తున్నారు.34,024 ఎకరాలు అధికారుల లెక్కల ప్రకారం ప్రకృతి సాగు విస్తీర్ణం367 ప్రకృతి సాగు విభాగంలోని సిబ్బంది75,534 ఎకరాలు ఈ ఏడాది ప్రకృతి వ్యవసాయం లక్ష్యం? ? ప్రస్తుతం జిల్లాలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు -
చలికాలంలో పిండినల్లి, చీడపీడలు : ఇవి చల్లుకుంటే చాలు
శీతాకాలం చలి వాతావరణంలో ఉష్ణోగ్రత తక్కువగా, గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చే పురుగులు, వైరస్ తెగుళ్ల వ్యాప్తికి ఇది అనువైన కాలం. కుండీల్లో, పెరట్లో ఆకుకూరలు, టమాటా, చిక్కుడు, వంగ, మిరప, బీర, ఆనప తదితర పంటలు చీడపీడల బారిన పడకుండా చూసు కోవడానికి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. చీడపీడలు రానీయని టీకాలన్నమాట. జనవరి ఆఖరులో చలి తగ్గేవరకు వీటిని పాటించాలి. జీవామృతంను 1:10 పాళ్లలో నీటిలో కలిపి ప్రతి 10–15 రోజులకోసారి క్రమం తప్పకుండా పిచికారీ చేస్తుంటే పంటలు ఆరోగ్యంగా పెరుగుతాయి. చీడపీడలను తట్టుకునే శక్తి పెరుగుతుంది.ఘా చ్ఛాదన: కుండీలు, మడుల్లో కూరగాయ మొక్కలు/చెట్ల చుట్టూ గడ్డీ గాదంతో ఐదారు అంగుళాల మందాన ఆచ్ఛాదనగా వేస్తే మంచిది. ఇంటిపంటల్లో పెద్ద పురుగులు కనిపిస్తే వాటిని చేతితో ఏరేయడం ఉత్తమం. శీతాకాలంలో పంటలనాశించే కొన్ని పురుగులుటమాటా, వంగ, ఆకుకూరలతోపాటు మందారం, చామంతి, గులాబీ వంటి పంటలపై పిండినల్లి(మీలీ బగ్), తామర పురుగు(త్రిప్స్) తరచూ కనిపిస్తుంటాయి. వీటితోపాటు పేనుబంక, దీపపు పురుగులు, తెల్లదోమ, ఎర్రనల్లి కూడా ఆశిస్తుంటాయి. పిండినల్లి: పిండినల్లి మొక్కలను ఆశించి రసం పీల్చుతుంటుంది. అందువల్ల మొక్క పెరుగుదల నిలిచిపోతుంది. ఇది సోకినప్పుడు పళ్లు తోముకునే బ్రష్ను ముంచి తుడిచేస్తే పోతుంది. కలబంద రసం లేదా వేపనూనె లేదా సబ్బు నీళ్లలో బ్రష్ను ముంచి తుడిచేయాలి. పేనుబంక: దీన్నేమసిపేను అని కూడా అంటారు. కంటికి కనిపించనంత చిన్న పేన్లు బంకవంటి తీపి పదార్థాన్ని విసర్జిస్తుంటాయి. ఈ తీపి కోసం చీమలు చేరతాయి. మొక్కల మీద చీమలు పారాడుతూ ఉంటే పేనుబంక లేదా పిండినల్లి సోకిందన్నమాటే. పచ్చదోమ: ఆకుపచ్చగా ఉండే చిన్న దోమలు ఆకుల నుంచి రసం పీల్చుతుంటాయి. పచ్చదోమ ఆకుల చివర్ల నుంచి పని మొదలు పెడతాయి. కాబట్టి ఇది సోకిన ఆకులు కొసల నుంచి లోపలి వరకు ఎండి΄ోతూ ఉంటాయి. బీర, ఆనప వంటి పెద్ద ఆకులుండే పంటలను పచ్చదోమ ఎక్కువగా ఆశిస్తూ దిగుబడిని తగ్గించేస్తాయి. తామరపురుగు: తామర పురుగు సోకిన మిరప ఆకులకు పైముడత వస్తుంది. మిరప కాయలు వంకర్లు తిరుగుతాయి. వాటిపై చారలు ఏర్పడతాయి. దీన్ని గజ్జి తెగులు, తామర తెగులు అని కూడా అంటారు. బూడిద తెగులు: చల్లని వాతావరణంలో శిలీంద్రం వేగంగా వ్యాపించడం వల్ల బూడది తెగులు వస్తుంది. ఇది సోకిన పంటల ఆకులపై తెల్లని పొడి కనిపిస్తుంది. మిరప, వంగ, టమాటా, ఆకుకూరలపై ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. రసంపీల్చే పురుగులు: ముందుజాగ్రత్త పిచికారీలురసం పీల్చే పురుగులు పంటల జోలికి రాకుండా ముందుగానే జాగ్రత్తపడడం ఉత్తమం. వేపాకు రసం లేదా వావిలి ఆకుల కషాయం లేదా వేప నూనె లేదా వేపపిండి కషాయంను (వీటిలో ఏదైనా ఒక దాన్ని గానీ లేదా ఒక దాని తర్వాత మరొక దాన్ని మార్చి మార్చి గానీ) ప్రతి 7–10 రోజులకోసారి పిచికారీ చేయాలి. వేపాకు రసం: పావు కిలో వేపాకులు రుబ్బి + 5 లీటర్ల నీటిలో కలిపి అదే రోజు పంటలపై చల్లాలి(10 కిలోల వేపాకులు రుబ్బి 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరంలో పంటలకు చల్లవచ్చు). వావిలి ఆకుల కషాయం: 2 లీటర్ల నీటిలో 350 గ్రాముల వావిలి ఆకులు వేసి 2 లేదా 3 పొంగులు వచ్చే వరకు మరిగించి.. చల్లార్చిన తర్వాత ఆ కషాయంలో 10 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేయాలి(5 కిలోల వావిలి ఆకుల కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపితే ఎకరానికి సరిపోతుంది). వేప నూనె: మార్కెట్లో దొరుకుతుంది. సీసాపై ముద్రించిన సాంద్రతకు తగిన మోతాదులో పిచికారీ చేయాలి.వేపకాయల పిండి రసం: 10 లీటర్ల నీటిలో అర కేజీ వేపకాయల పిండి(వేపగింజల పిండి 300 గ్రాములు చాలు)ని పల్చటి గుడ్డలో మూటగట్టి.. 4 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత మూటను నీటిలో నుంచి తీసి పిండాలి. ఇలా అనేకసార్లు ముంచుతూ తీస్తూ పిండాలి. అదే రోజు పిచికారీ చేయాలి లేదా రోజ్ క్యాన్ ద్వారా మొక్కలపై చల్లవచ్చు. ఈ కషాయాలు, రసాలను పిచికారీ చేసేముందు 10 లీటర్లకు 5 గ్రాముల(100 లీటర్లకు 200 గ్రాముల) సబ్బు పొడి లేదా కుంకుడు రసాన్ని కలపాలి. నూనె పూసిన ఎరలు: నూనె పూసిన ఎరలు(స్టిక్కీ ట్రాప్స్) వేలాడదీస్తే పురుగులను ఆకర్షించి నశింపజేస్తాయి. తామర పురుగులను ఆకర్షించడానికి తెలుపు, తెల్లదోమలను నీలం, పచ్చదోమలను పసుపుపచ్చ ఎరలను వాడాలి. టమాటా, వంగ, మిర్చి వంటి ప్రతి 20 కూరగాయ మొక్కలకు ఒక్కో రకం ఎరలను రెండేసి చొప్పున వేలాడదీయాలి. ఎరలను మార్కెట్లో కొనొచ్చు. లేదా ఆయా రంగుల డబ్బాలు లేదా ΄్లాస్టిక్ షీట్లు ఉంటే వాటికి నూనె లేదా గ్రీజు రాసి వేలాడదీయవచ్చు.రసంపీల్చే పురుగుల తీవ్రత ఎక్కువగా ఉంటే?రసంపీల్చే పురుగులు ఇప్పటికే మొక్కలకు తీవ్రస్థాయిలో ఆశించి ఉంటే పైన పేర్కొన్న పిచికారీలు కొనసాగిస్తూనే.. తెల్లటి షేడ్నెట్ను మొక్కలపై గ్రీన్హౌస్ మాదిరిగా రక్షణగా ఏర్పాటు చేయాలి. ఇనుప తీగతో డోమ్ ఆకారం చేసి దానిపై తెల్లని షేడ్నెట్ చుట్టేస్తే సరి. – డా. గడ్డం రాజశేఖర్ సుస్థిర వ్యవసాయ కేంద్రం, సికింద్రాబాద్ -
దేశవాళీ సేద్యకారుడు
దాదాపు సగం జనాభాలో మధుమేహం కనిపిస్తే తెలిసొచ్చింది .. నేల నెరిగి సాగు చేయాలని! భూమాతను గౌరవిస్తే ఆరోగ్య సిరిని ఒంటికందిస్తుందని! కనుమరుగవుతున్న దేశవాళీ ధాన్యానికి మళ్లీ నారుపోయాలని! అందుకే ఇప్పుడు కర్షకలోకమంతా సేంద్రియ సాగు వైపు మళ్లింది! ఆ బాటలోనే.. ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా, కొయ్యలగూడెం వాసి పొట్టిపోతుల పోతురాజు కూడా నడుస్తూ తోటి రైతులకు స్ఫూర్తి పంచుతున్నారు.పుడమితల్లి బాగుంటే ఆ తల్లిని నమ్ముకున్న జనం కూడా బాగుంటారు. భావితరాల ఆరోగ్యానికీ భరోసా ఉంటుంది. అదే లక్ష్యంతో ప్రకృతి వ్యవసాయానికి నాగలి పట్టింది ‘ఆర్గానిక్ ప్లానెట్’. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ మూవ్ టు నేచర్, నేచర్ ఫ్రెండ్లీ నినాదాలతో వేదభారత్ నేచురల్ ఫుడ్ ప్రోడక్ట్స్ పేరిట దేశవాళీ బియ్యాన్ని అందిస్తోంది. ‘భూమి మీది.. విత్తనం, మార్గదర్శనం మావి! పండించిన పంటకు మార్కెటింగ్ సహకారం కూడా మాదే’ అంటూ తెలుగు రాష్ట్రాల రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గేలా చేస్తోంది. అలా పోతురాజు కూడా సేంద్రియ సాగుకు ఆకర్షితుడయ్యారు. తొలుత ఎకరం విస్తీర్ణంలో నారు పోశారు. కలుపు తీయలేదు. ఎరువు వేయలేదు. నెల దాటినా పైరు పెద్దగా ఎదగలేదు. పది బస్తాల దిగుబడే వచ్చింది. ఇరుగు పొరుగు రైతులు నిరుత్సాహపరచారు. అయినా పోతురాజు దైర్యం వీడలేదు. రెండో ఏడాది విస్తీర్ణం పెంచారు. పట్టువదలకుండా ఆరేళ్లుగా ప్రకృతి వ్యవసాయం బాటలోనే సాగుతున్నారు. ఇప్పుడది పది ఎకరాలకు విస్తరించింది. ఆరోగ్యంతో పాటు, మధుమేహాన్ని క్రమంగా తగ్గించే గుణం కలిగిన నవారా, కాలాభట్టి, బహురూపి, మైసూరు మల్లిగ లాంటి దేశవాళీ రకాల వరిని మాత్రమే పండిస్తూ.. ఎకరాకు 25 బస్తాల దిగుబడి సాధిస్తున్నారు. ఎకరాకు 80 వేల రూపాయల ఆదాయాన్ని అందుకుంటున్నారు. 210 రోజుల్లో పంటకు వచ్చే మాపిలై సాంబ రకాన్ని, కూరగాయలు, పండ్లు, ఆయిల్ పామ్ను పండించే ఆలోచనలో ఉన్నారు. సతీమణి నాగమణి సహకారంతో దేశవాళీ సేంద్రియ ధాన్యం సాగులో పోతురాజు చేస్తున్న కృషికి ప్రధాని కార్యాలయం నుంచీ ప్రశంసలు అందాయి. మొన్నటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశమూ అతనికి వచ్చింది. ∙వై.మురళీకృష్ణ, రిపోర్టర్ , తాడేపల్లిగూడెం27 రకాలు ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించేందుకు 27 రకాల విత్తనాలను వేదభారత్ సరఫరా చేస్తోంది. వాటిల్లో బహురూపి, చింతలూరి సన్నాలు, మైసూర్ మల్లిగ, నారాయణ కామిని, నవారా, బర్మాబ్లాక్, రక్తశాలి (ఎర్రబియ్యం), సిద్ధ సన్నాలు, రాజోలు సన్నాలు, కేతిరి మహరాజ్ , కుజు పటాలియా, దూదేశ్వర్ మొదలైన రకాలున్నాయి. -
సేంద్రియ/ప్రకృతి సేద్యంలో 3 నెలల కోర్సు
ఈనెల22, 23 తేదీల్లో బయోడైనమిక్సేద్యంపై శిక్షణ దేశ విదేశాల్లో చిరకాలంగా కొందరు రైతులు అనుసరిస్తున్న సేంద్రియ సేద్య పద్థతుల్లో బయోడైనమిక్ సేద్యం ఒకటి. రైతులు స్వయంగా తయారు చేసుకునే ఆవు కొమ్ము ఎరువు తదితర సేంద్రియ ఎరువులను సూక్ష్మ పరిమాణంలో వేస్తూ చేసే రసాయన రహిత సేద్య పద్ధతి ఇది. టైమ్ టేబుల్ ప్రకారం ప్రతి వ్యవసాయ పనినీ నిర్దేశిత రోజుల్లో మాత్రమే చేయటం ఇందులో ప్రత్యేకత. బయోడైనమిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 22, 23 తేదీల్లో బెంగళూరులోని బెంగళూరు ఇంటర్నేషనల్ సెంటర్లో రైతు శిక్షణా శిబిరం జరగనుంది. బయోడైనమిక్ సేద్యంలో అనుభవం కలిగిన రైతులు శిక్షణ ఇస్తారు. క్షేత్ర సందర్శన ఉంటుంది. ప్రవేశ రుసుము (శిక్షణ, భోజనం సహా): రూ. 1,500. వసతి ఎవరికి వారే చూసుకోవాలి. ఆసక్తి గల వారు ముందుగా గూగుల్ ఫామ్ ద్వారా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇతర వివరాలకు.. 97386 76611 సంప్రదించవచ్చు. సేంద్రియ/ప్రకృతి సేద్యంలో 3 నెలల కోర్సు కేంద్ర వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ΄్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ (ఎన్ఐపిహెచ్ఎం) దేశంలోనే పేరెన్నికగల వ్యవసాయ శిక్షణా సంస్థ. సేంద్రియ / ప్రకృతి సేద్య పద్ధతులపై రైతులు, ఎఫ్పిఓలు/ సహకార సంఘాల నిర్వాహకులు, రైతు శాస్త్రవేత్తలుగా ఎదిగి స్వయం ఉపాధి పొందాలనుకునే యువతకు లోతైన శాస్త్రీయ అవగాహన, ఆచరణాత్మక శిక్షణ కల్పించడానికి ఎన్ఐపిహెచ్ఎం 3 నెలల సర్టిఫికెట్ కోర్సు తెలుగు/హిందీ భాషల్లో నిర్వహించనుంది.నూటికి నూరు శాతం రసాయనాల్లేకుండా సేంద్రియ/ప్రకృతి వ్యవసాయాన్ని లాభదాయకంగా చేయదలచిన వారికి ఇది సదవకాశం. నవంబర్ 27 నుంచి వచ్చే మార్చి 5 వరకు ఈ కోర్సు ఉంటుంది. వివిధ కేంద్ర వ్యవసాయ సంస్థలతో కలసి ఎన్ఐపిహెచ్ఎం నిర్వహించే ఈ కోర్సులో 3 దశలుంటాయి. మొదట 21 రోజులు రాజేంద్రనగర్లోని ఎన్ఐపిహెచ్ఎం ఆవరణలో శాస్త్రీయ అంశాల బోధన. తర్వాత అభ్యర్థి ఎంపిక చేసుకున్న ప్రాంతంలో 2 నెలలు క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు. ఆ తర్వాత ఎన్ఐపిహెచ్ఎంలో 10 రోజుల తుది దశ శిక్షణ ఉంటాయి. ఇంటర్ లేదా టెన్త్ తర్వాత వ్యవసాయ డిప్లొమా చేసిన 18 ఏళ్లు నిండిన అన్ని సామాజిక వర్గాల స్త్రీ పురుషులు అర్హులు. గ్రామీణ యువతకు ప్రాధాన్యం. కోర్సు ఫీజు: రూ. 7,500. శిక్షణా కాలంలో ఉచిత వసతి కల్పిస్తారు. భోజనానికి రోజుకు రూ.305 అభ్యర్థి చెల్లించాలి. ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ ఇస్తారు. దరఖాస్తులను నవంబర్ 22 లోగా పోస్టు/మెయిల్ ద్వారా పంపవచ్చు. ఇతర వివరాలకు కోర్సు కోఆర్డినేటర్ డా.కె. దామోదరాచారి (95426 38020)ని సంప్రదించవచ్చు. -
Sagubadi: ‘ఐ గ్రో యువర్ ఫుడ్’.. ఉద్యమం!
అంతర్జాతీయ సేంద్రియ వ్యవసాయ ఉద్యమ సంస్థల సమాఖ్య (ఐ.ఎఫ్.ఓ.ఎ.ఎం. –ఐఫోమ్) పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులు ఈ నెల 10వ తేదీన ‘ఐ గ్రో యువర్ ఫుడ్’ పేరిట వినూత్న ప్రచారోద్యమాన్ని చేపట్టారు. ప్రజల కోసం రసాయనాల్లేకుండా ఆరోగ్యదాయకంగా చేపట్టిన సేంద్రియ వ్యవసాయం– మార్కెటింగ్ తీరుతెన్నులు.. సమస్యలు ఏమిటి? వాటి పరిష్కారానికి ప్రజలు చేయగల సహాయం ఏమిటి? వంటి అంశాలపై తమ అభి్రపాయాలతో కూడిన వీడియోలను సేంద్రియ రైతులు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.ఐగ్రోయువర్ఫుడ్.. బయో పేరిట ఏర్పాటైన ప్రత్యేక వెబ్సైట్లో, ఐఫోమ్ ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్కు చెందిన వెబ్సైట్/ఎక్స్/యూట్యూబ్/ఇన్స్టా తదితర సోషల్ మీడియా వేదికల్లో ప్రపంచ దేశాల సేంద్రియ రైతుల షార్ట్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. వీటిని చూసిన ప్రజలు/వినియోగదారులు తమ అభి్రపాయాలను, సూచనలను పంచుకోవడానికి వీలుంది.ఐఫోమ్ ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్ 1972లో ఫ్రాన్స్లో ప్రారంభమైంది. వంద దేశాల్లోని సుమారు 700 సేంద్రియ వ్యవసాయ సంస్థలకు ఇప్పుడు ఐఫోమ్ సభ్యత్వం ఉంది. ఆరోగ్యం, పర్యావరణం, న్యాయం, శ్రద్ధ అనే నాలుగు మూల సూత్రాలపై ఆధారపడి సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరింపజేయటమే ఐఫోమ్ తన లక్ష్యంగా పెట్టుకుంది. సేంద్రియ వ్యవసాయానికి అంతర్జాతీయ ప్రమాణాలను నిర్దేశించటంతో పాటు ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజన్సీలకు అక్రెడిటేషన్ ఇస్తుంది. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఆహారోత్పత్తి చేసి ప్రజలకు అందిస్తున్న రైతుల్లో 80% మంది చిన్న, సన్నకారు రైతులేనని ఐఫోమ్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 57 కోట్ల వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. వీటిలో 90% క్షేత్రాలు ఒంటరి రైతులు లేదా రైతు కుటుంబాలే నడుపుతున్నారు. సంస్థలు/కంపెనీల ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యవసాయ క్షేత్రాలు మిగతా పది శాతం మాత్రమే. https://igrowyourfood.bio/కేరళలో కౌలు సేద్యం చేస్తున్నా..!నా పేరు షమికా మోనే, మహారాష్ట్రలో పుట్టా. పరిశోధనలు వదలి పెట్టి సేంద్రియ రైతుగా మారా. కేరళలో భూమిని కౌలుకు తీసుకొని సేంద్రియ వ్యవసాయం చేస్తున్నా. అనేక రకాల దేశీ వరితో పాటు కూరగాయలు పండిస్తున్నా. పంట విత్తిన దగ్గర నుంచి నూర్పిడి,ప్రాసెసింగ్ వంటి పనులు సాధ్యమైనంత వరకు నేనే చేసుకోవటం అద్భుతమైన అనుభవం. నేను పండించిన ఆహారోత్పత్తుల్ని తింటున్న స్నేహితులు, బంధువులు చాలా సంతోషంగా ఉన్నారు. సీజన్కు ముందే డబ్బు పెట్టుబడిగా ఇస్తారు. పంటలు పండించిన తర్వాత.. తమకు అవసరమైన ఆహారోత్పత్తుల్ని తీసుకుంటున్నారు. దేశీ వరి బియ్యం, అటుకులతో చేసిన స్థానిక సంప్రదాయ వంటకాలను పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. ఐఫోమ్ ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు ‘ఐగ్రోయువర్ఫుడ్’ ఉద్యమంలో భాగస్వామిని కావటం సంతోషంగా ఉంది.– షమిక మోనె, సేంద్రియ యువ మహిళా రైతు, కేరళ -
సేంద్రియ సాగు, ప్రాసెసింగ్పై 3 రోజుల శిక్షణ
ప్రకృతి/ సేంద్రియ సాగు విధానం, కషాయాలు, మిశ్రమాల తయారీతోపాటు పంట దిగుబడులకు విలువ జోడింపు ద్వారా అధికాదాయం పొందటం వంటి అంశాలపై గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో ఆగస్టు 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో నాబార్డు సహకారంతో రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ పురస్కార గ్రహీత యడ్లపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. డ్రోన్ల వాడే పద్ధతులు, యంత్రపరికరాలతో సులువుగా వ్యవసాయ పనులు చేసుకోవటంపై కూడా శిక్షణ ఇస్తారు. ఏపీలోని 30 మంది రైతులకే ఈ అవకాశం. వసతి, భోజన సదుపాయం ఉంది. ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనదలచిన రైతులు 97053 83666/ 90739 73999కు ఫోన్ చేసి తప్పక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. -
రసాయనిక ఆహారం వల్లే రోగాలు..!
సాక్షి, హైదరాబాద్: భూతాపాన్ని పెంపొందించటం ద్వారా రైతులను ఆత్మహత్యలకు గురిచేయటంతో పాటు వినియోగదారులను రోగగ్రస్తంగా మార్చుతున్న రసాయనిక వ్యవసాయాన్ని నిషేధించాలని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుభాశ్ పాలేకర్ పిలుపునిచ్చారు. వాతావరణ మార్పుల్ని దీటుగా తట్టుకుంటూ సంపూర్ణ ఆహార స్వావలంబన ద్వారా అన్ని విధాలా సమృద్ధిని సాధించటం సుభాశ్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిని అనుసరించటం తప్ప మరో మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు.ఫిలింనగర్ క్లబ్లో మంగళవారం సాయంత్రం పలువురు సినీ ప్రముఖులు, సామాజిక వేత్తలతో జరిగిన చర్చాగోష్టిలో డా. పాలేకర్ ప్రసంగించారు. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత, శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు కె.ఎస్. వరప్రసాద్రెడ్డి, ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్, టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, నాఫ్స్క్వాబ్ మాజీ అధ్యక్షులు కొండ్రు రవీంద్రరావు, ఆధ్యాత్మికవేత్త సత్యవాణి, సినీ రచయిత భారవి, నాబార్్డ పూర్వ సీజీఎం మోహనయ్య, సేవ్ సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్ తదితరులతో పాటు వందలాది మంది ప్రకృతి వ్యవసాయ ప్రేమికులు పాల్గొన్నారు.డా. పాలేకర్ మాట్లాడుతూ, రసాయనిక వ్యవసాయం వల్ల బియ్యం, గోధుమలను మాత్రం ఉత్పత్తి చేసుకుంటున్నామని, వంటనూనెలు, పప్పుధాన్యాలను విదేశాల నుంచి లక్షల టన్నుల దిగుమతి చేసుకుంటున్నామని విమర్శించారు. రసాయనిక వ్యవసాయోత్పత్తులు దేశ ప్రజలను మధుమేహం, కేన్సర్ వంటి భయంకర జబ్బుల పాలు జేస్తున్న విషయాన్ని పాలకులు, సమాజం ఇప్పటికైనా గుర్తించాలన్నారు. సేంద్రియ వ్యవసాయంలోనూ టన్నుల కొద్దీ పశువుల ఎరువులు వేయటం వల్ల రసాయనిక వ్యవసాయంలో మాదిరిగానే కర్బన ఉద్గారాలు పెద్ద ఎత్తున వెలువడి భూతాపాన్ని పెంపొందిస్తున్నాయని ఆయన తెలిపారు.రసాయనిక వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోవటం వల్ల రైతులు అప్పులపాలై ఆత్మహత్యల పాలవుతున్నారని, రైతు కుటుంబాల్లోని యువత వ్యవసాయేతర రంగాల్లోకి వలస వెళ్లటం వల్ల భవిష్యత్తులో వ్యవసాయం చేసే రైతులు కరువయ్యే దుర్గతి నెలకొనబోతోందన్నారు.సుభాశ్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిలో నేలలో సూక్ష్మజీవులను పెంపొందించే జీవామృతం, ఘన జీవామృతం వంటి మైక్రోబియల్ కల్చర్ను కొద్ది మొత్తంలో వేస్తే సరిపోతుందని, టన్నుల కొద్దీ పశువుల ఎరువులు వేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయాలను ఆకళింపు చేసుకొని 5 లేయర్ పద్ధతిలో సాగు చేస్తే ఎకరానికి తొలి ఏడాదిలోనే రూ. 1.5 లక్షల ఆదాయం వస్తుందని, ఆరేళ్ల నుంచి ఏటా ఎకరానికి రూ. 6 లక్షల ఆదాయం వస్తుందని.. రైతులు సాగు చేస్తున్న నమూనా క్షేత్రాలు సాక్ష్యంగా ఉన్నాయన్నారు. భూములను పునరుజ్జీవింపజేసుకుంటూ భవిష్యత్తులో పెరిగే జనాభాకు ఆహార కొరత లేకుండా చూడాలంటే ప్రకృతి నియమాలను అనుసరిస్తూ ఎస్.పి.కె. వ్యవసాయ పద్ధతిని అనుసరించాలన్నారు. ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఇదొక ప్రజా ఉద్యమంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తోందని, తెలుగు రాష్టా్రల్లో ప్రతి గ్రామానికీ ఈ వ్యవసాయాన్ని తీసుకెళ్లడానికి అందరూ సహకరించాలని పాలేకర్ కోరారు.7 వేల మందితో మెగా శిక్షణా శిబిరం..2015 ఫిబ్రవరి 15 నుంచి 23 వరకు రంగరెడ్డి జిల్లాలోని కన్హ శాంతివనంలో 7 నుంచి 10 వేల మంది రైతు కుటుంబీకులతో మెగా శిక్షణా శిబిరాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు శిబిరం నిర్వాహకులు, సేవ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్ ప్రకటించారు. డా. పాలేకర్ ఈ 9 రోజుల శిబిరంలో రోజుకు పది గంటల పాటు శిక్షణ ఇస్తారన్నారు. 7 వేల మంది రైతులు, 3 వేల మంది రైతుల జీవిత భాగస్వాముల్ని సైతం ఈ శిబిరానికి ఆహ్వానిస్తున్నామన్నారు. తెలుగు రాషా్ట్రల్లో ప్రతి గ్రామానికీ సుభాష్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతి వ్యవసాయాన్ని విస్తరింపజేయాలన్నదే లక్ష్యమని విజయరామ్ వివరించారు.శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు కె.ఎస్. వరప్రసాద్రెడ్డి ప్రసంగిస్తూ పాలేకర్ వ్యవసాయ పద్ధతిపై రైతు శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పడానికి తన వంతు సహాయం చేస్తానని ప్రకటించారు. ఆధ్యాత్మికవేత్త సత్యవాణి మాట్లాడుతూ పాలేకర్ కారణజన్ములని, ఈ వ్యవసాయ పద్ధతిని ప్రతి గ్రామానికీ తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఇవి చదవండి: లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్మార్కెట్లు -
బయోచార్ కంపోస్టు.. నిజంగా బంగారమే!
– వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునే క్రమంలో ఇటీవల అందుబాటులోకి వస్తున్న ఒక పద్ధతి ‘బయోచార్’ వినియోగం. దీన్నే మామూలు మాటల్లో ‘కట్టె బొగ్గు’ అనొచ్చు. పంట వ్యర్థాలతో రైతులే స్వయంగా దీన్ని తయారు చేసుకొని పొలాల్లో వేసుకోవచ్చు.– బయోచార్ ఎరువు కాదు.. పంటలకు వేసే రసాయనిక ఎరువులు గానీ, సేంద్రియ ఎరువులు గానీ కనీసం 30–40% ఎక్కువ ఉపయోగపడేందుకు బయోచార్ ఉపయోగపడుతుంది అంటున్నారు స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ నక్కా సాయిభాస్కర్రెడ్డి.– మట్టిలో పేరుకుపోయిన రసాయనిక అవశేషాలను తొలగించడానికి, వరిసాగులో మిథేన్ వాయువు కాలుష్యాన్ని తగ్గించడానికి బయోచార్ తోడ్పడుతుంది.– ఒక్కసారి వేస్తే వందల ఏళ్లు నేలలో ఉండి మేలు చేస్తుంది.. సీజనల్ పంటలకైనా, పండ్ల తోటలకైనా బయోచార్ నిజంగా బంగారమే అంటున్న డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డితో ‘సాక్షి సాగుబడి’ ముఖాముఖి.బయోచార్.. ఈ పేరు చెప్పగానే ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ నక్కా సాయిభాస్కర్రెడ్డి(55) పేరు చప్పున గుర్తొస్తుంది. 20 ఏళ్ల క్రితం నుంచి ‘బయోచార్’ అనే పేరును ఖరారు చేసి.. వ్యవసాయకంగా, పర్యావరణపరంగా దీని ప్రయోజనాల గురించి దేశ విదేశాల్లో విస్తృతంగా పరిశోధనలు, క్షేత్ర ప్రయోగాలు చేస్తూ ఇప్పటికి 5 పుస్తకాలను వెలువరించారు. వెబ్సైట్ ద్వారా ఈ ఓపెన్ సోర్స్ పుస్తకాలను అందుబాటులో ఉంచారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసంగాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఆయనతో ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు..బయోచార్ (కట్టె బొగ్గు) అంటే..?వ్యవసాయ వర్గాల్లో ఈ మధ్య తరచూ వినవస్తున్న మాట బయోచార్. బయో అంటే జీవం.. చార్ (చార్కోల్) అంటే బొగ్గు. బయోచార్ అంటే ‘జీవం ఉన్న బొగ్గు’ అని చెపొ్పచ్చు. భూసారానికి ముఖ్యమైనది సేంద్రియ కర్బనం. ఇది మట్టిలో స్థిరంగా ఉండదు. అంటే ఇది అస్థిర కర్బనం (ఒలేటైల్ కార్బన్). దీన్ని పెంపొందించుకోవటానికి ఫిక్స్డ్ కార్బన్ ఉపయోగపడుతుంది. అదే బయోచార్.బయోచార్ కోసం కట్టెలు కాలబెట్టడం వల్ల అడవులకు, పర్యావరణానికి ముప్పు లేదా?బొగ్గు నల్ల బంగారంతో సమానం. బంగారం అని ఎందుకు అన్నానంటే.. ప్రపంచంలో తయారు చేయలేనిది, డబ్బుతో కొనలేనిది మట్టి ఒక్కటే. హరిత విప్లవం పేరుతో మట్టిని మనం నాశనం/ విషతుల్యం/ నిర్జీవం చేసుకున్నాం. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం బయోచార్. అడవులను నరికి బయోచార్ తయారు చేయమని మనం చెప్పటం లేదు. పత్తి కట్టె, కంది కట్టె, వరి పొట్టు వంటి పంట వ్యర్థాలను వట్టిగానే తగులబెట్టే బదులు వాటితో బయోచార్ తయారు చేసుకోవచ్చు. వూరికే పెరిగే సర్కారు తుమ్మ వంటి కంప చెట్ల కలపతో లేదా జీడి గింజల పైపెంకులతో కూడా బయోచార్ తయారు చేసుకోవచ్చు. వరి పొట్టును బాయిలర్లలో, హోటళ్ల పొయ్యిల్లో కాల్చిన తర్వాత మిగిలే వ్యర్థాలను కూడా బయోచార్గా వాడుకోవచ్చు.పరిమితంగా గాలి సోకేలా లేదా పూర్తిగా గాలి సోకకుండా ప్రత్యేక పద్ధతిలో, పెద్దగా పొగ రాకుండా, 450 నుంచి 750 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో కాల్చితే (ఈ ప్రక్రియనే ‘పైరోలిసిస్’ అంటారు) తయారయ్యే నల్లని కట్టె బొగ్గే బయోచార్. ఆరుబయట కట్టెను తగుటబెడితే బూడిద మిగులుతుంది. ఈ పద్ధతిలో అయితే బూడిద తక్కువగా బయోచార్ ఎక్కువగా వస్తుంది. రైతు స్థాయిలో ఇనుప డ్రమ్ములో లేదా కందకం తవ్వి కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. బయోచార్ వందల ఏళ్ల ΄ాటు మట్టిలో ఉండి మేలుచేసే సూక్ష్మజీవరాశికి, పోషకాలకు, మొత్తంగా పర్యావరణానికి ఎంతగానో తోడ్పడుతుంది. సాగు నీటిలో విషాలను పరిహరిస్తుంది. దీనితో వ్యవసాయంలో కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలతో పోల్చితే.. దీన్ని తయారు చేసేటప్పుడు వెలువడే కొద్ది΄ాటి పొగ వల్ల కలిగే నష్టం చాలా తక్కువ.‘బయోచార్ కంపోస్టు’ అంటే ఏమిటి?బయోచార్ అంటే.. పొడిగా ఉండే కట్టె బొగ్గు. దీన్ని నేరుగా పొలాల్లో వేయకూడదు. బయోచార్ కంపోస్టు తయారు చేసుకొని వేయాలి. చిటికెడు బొగ్గులో లెక్కలేనన్ని సూక్ష్మరంధ్రాలు ఉంటాయి. నేరుగా వేస్తే మట్టిలోని పోషకాలను బొగ్గు పెద్దమొత్తంలో పీల్చుకుంటుంది. అందువల్ల వట్టి బయోచార్ను మాత్రమే వేస్తే పంటకు పోషకాలు పూర్తిగా అందవు. అందుకనే. వట్టి బయోచార్ను కాకుండా బయోచార్ కంపోస్టును తయారు చేసుకొని వేస్తే ఈ సమస్య ఉండదు.మాగిన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టు లేదా బయోగ్యాస్ స్లర్రీ లేదా జీవామృతం లేదా పంచగవ్య వంటి.. ఏదైనా సేంద్రియ ఘన/ ద్రవరూప ఎరువులలో ఏదో ఒకదాన్ని బయోచార్ను సమ΄ాళ్లలో కలిపి కుప్ప వేసి, బెల్లం నీటిని చిలకరిస్తూ రోజూ కలియదిప్పుతూ ఉంటే 15 రోజుల్లో బయోచార్ కంపోస్టు సిద్ధం అవుతుంది. అప్పుడు దీన్ని పొలాల్లో వేసుకుంటే సత్ఫలితాలు వస్తాయి. మన పొలంలో మట్టి గుణాన్ని బట్టి తగిన మోతాదులో వేసుకోవటం ముఖ్యం. బయోచార్ ఒకటి రెండు సీజన్లలో ఖర్చయిపోయే ఎరువు వంటిది కాదని రైతులు గుర్తుంచుకోవాలి. వంద నుంచి వెయ్యేళ్ల వరకు నేలలో స్థిరంగా ఉండి మేలు చేస్తుంది.రసాయనిక ఎరువులు వాడే రైతులకు కూడా బయోచార్ ఉపయోగపడుతుందా? బయోచార్ సేంద్రియ ఎరువులు లేదా రసాయనిక ఎరువులు వాడే రైతులు కూడా వాడుకోవచ్చు. కట్టెబొగ్గుతో యూరియా, ఫాస్పేటు వంటి వాటిని కలిపి వేసుకోవచ్చు. వట్టిగా యూరియా వేస్తే 20–30 శాతం కన్నా పంటకు ఉపయోగపడదు. అదేగనక బయాచార్తో యూరియా కలిపి వేస్తే 30–40% ఎక్కువగా పంటకు ఉపయోగపడుతుంది. బొగ్గులోని ఖాళీ గదులు ఉంటాయి కాబట్టి యూరియాను కూడా పట్టి ఉంచి, ఎక్కువ రోజుల ΄ాటు పంట మొక్కల వేర్లకు నెమ్మదిగా అందిస్తుంది.వరి సాగుకూ ఉపయోగమేనా?వరి పొలాల్లో నీటిని నిల్వగట్టే పద్ధతి వల్ల మిథేన్ వంటి హరిత గృహ వాయువులు గాలిలో కలుస్తూ వాతావరణాన్ని అమితంగా వేడెక్కిస్తున్నాయి. రసాయనిక ఎరువులు వాడే పొలాల వాయుకాలుష్యం మరింత ఎక్కువ. ఈ పొలాల్లో బయోచార్ వేస్తే.. నీటి అడుగున మట్టిలో ఆక్సిజన్ను లభ్యత పెరుగుతుంది. మిథేన్ తదితర హరిత గృహ వాయువులను బొగ్గు పీల్చుకుంటుంది. కాబట్టి, వాతావరణానికి జరిగే హాని తగ్గుతుంది. అందుకనే బయోచార్ వాడితే కార్బన్ క్రెడిట్స్ పేరిట డబ్బు ఇచ్చే పద్ధతులు కూడా సమీప భవిష్యత్తులోనే అమల్లోకి రానున్నాయి.బయోచార్పై మరింత సమాచారం కోసం చూడండి.. www.youtube.com/@biocharchannelhttps://biochared.comఏ పొలానికి ఎంత వెయ్యాలో తెలిసేదెలా?మీ భూమికి ఖచ్చితంగా ఎంత మొత్తంలో బయోచార్ కంపోస్టు వేస్తే సరిపోయేదీ ఒక టెస్ట్ ద్వారా మీరే స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ విషయం ఎవరినో అడిగితే తెలియదు. మీ పొలంలో ఎత్తయిన ప్రదేశంలో 5 చిన్న మడులు చేసుకొని, వాటిల్లో బయోచార్ కంపోస్టును వేర్వేరు మోతాదుల్లో వేసి.. ఆ 5 మడుల్లోనూ ఒకే రకం పంటను సాగు చేయండి. 3 నెలల్లో మీకు ఫలితం తెలిసిపోతుంది. 1 చదరపు మీటరు విస్తీర్ణం (ఈ విసీర్ణాన్ని మీరే నిర్ణయించుకోండి)లో పక్క పక్కనే 5 మడులు తయారు చేసుకోండి. అంటే.. మొత్తం 5 చ.మీ. స్థలం కేటాయించండి. ఒక్కో దాని మధ్య గట్టు మాత్రం ఎత్తుగా, బలంగా వేసుకోండి.1వ మడిలో బయోచార్ కంపోస్టు అసలు వెయ్యొద్దు. 2వ మడిలో బయోచార్ కంపోస్టు 0.5 కిలో, 3వ మడిలో 1 కిలో, 4వ మడిలో 2 కిలోలు, 5వ మడిలో 4 కిలోలు వెయ్యండి. ఈ 5 మడుల్లో 3 నెలల్లో చేతికొచ్చే ఒకే రకం పంట విత్తుకోండి లేదా కూరగాయ మొక్కలు నాటుకోండి.– బయోచార్ కంపోస్టుపై శిక్షణ ఇస్తున్న డా. సాయి భాస్కర్ రెడ్డిబయోచార్ కంపోస్టు విషయంలో వత్యాసాలు ΄ాటించి చూడటం కోసమే ఈ ప్రయోగాత్మక సాగు. ఇక మిగతా పనులన్నీ ఈ మడుల్లో ఒకేలా చేయండి. అంటే నీరు పెట్టటం, కలుపు తీయటం, పురుగుమందులు లేదా కషాయాలు పిచికారీ చేయటం అన్నీ ఒకేలా చెయ్యండి.ఆ పంటల్లో పెరిగే దశలో వచ్చే మార్పులన్నిటినీ గమనించి, రాసుకోండి. ప్రతి వారానికోసారి ఫొటోలు/వీడియో తీసి పెట్టుకోండి. కాండం ఎత్తు, లావు, పిలకలు/కొమ్మల సంఖ్య, పూత, దిగుబడి, గింజ/కాయల సైజు, ఆ మొక్కల వేర్ల పొడవు వంటి అన్ని విషయాలను నమోదు చేయండి. 3 నెలల తర్వాత ఆ పంట పూర్తయ్యే నాటికి బయోచార్ కంపోస్టు అసలు వేయని మడితో వేర్వేరు మోతాదుల్లో వేసిన మడుల్లో వచ్చిన దిగుబడులతో పోల్చిచూడండి. బయోచార్ కంపోస్టు ఏ మోతాదులో వేసిన మడిలో అధిక దిగుబడి వచ్చిందో గమనించండి. ఇదే మోతాదులో మీ పొలం అంతటికీ వేసుకోండి. – నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
Sagubadi: విపత్తులకు తట్టుకునే ప్రకృతి సేద్యం.. గొప్పేంటి?
2023 డిసెంబర్ 4,5 తేదీల్లో విరుచుకుపడిన మిచాంగ్ తుపాను ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో పంటలను, ముఖ్యంగా వరి పంటను, నేలమట్టం చేసింది. అయితే, ఆ తీవ్రమైన గాలులు, వర్షాన్ని తట్టుకొని నిలబడే ఉన్నాయి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగవుతున్న వరి పొలాలు. రసాయనిక వ్యవసాయ పద్ధతిలో సాగవుతున్న వరి చేలు నేలకు వాలిపోయి, నీట మునిగి ఉంటే.. వీటి పక్కన పొలాల్లో ఉన్న ప్రకృతి వ్యవసాయ వరి పంట మాత్రం చెక్కుచెదరకుండా దర్జాగా నిలబడి ఉండటం గురించి అప్పట్లోనే వార్తా కథనాలు చదివిన విషయం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. మిచాంగ్ తుపానే కాదు అంతకుముందు కూడా అనేక విపత్కర పరిస్థితుల్లోనూ ఇది స్పష్టంగా కళ్లకు కట్టిన వాస్తవం. అయితే, ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. ‘రీజెనరేట్ ఎర్త్’ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులైన ఆస్ట్రేలియన్ సాయిల్ మైక్రోబయాలజిస్టు డాక్టర్ ఫిల్ లీ ఈ నెల మొదటి వారంలో ఏపీలో పర్యటించారు. అనంతపురం తదితర జిల్లాల్లో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు తుపానును, కరువును దీటుగా తట్టుకొని నిలబడుతూ సుభిక్షంగా, ఉత్పాదకంగా నిలవటానికి వెనుక గల శాస్త్రీయ కారణాలను డా. ఫిల్ లీ అన్వేషించారు. అనేక కోస్తా జిల్లాల్లో మిచాంగ్ తుపానుకు నేలకొరిగిన రసాయనిక వరి పొలాల్లో గడ్డికి, పక్కనే పడిపోకుండా నిలబడిన వరి పొలాల్లో గడ్డికి మధ్య ఉన్న వ్యత్యాసాలేమిటో తన వెంట తెచ్చిన అధునాతన మైక్రోస్కోప్ ద్వారా పరిశోధించారాయన. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన వరి మొక్క కాండంలో కణ నిర్మాణం రసాయనిక వ్యవసాయంలో కన్నా బలంగా, ఈనెలు తేలి ఉండటాన్ని ఆయన గుర్తించారు. రసాయనాలతో సాగు చేసిన వరి పొలం మిచాంగ్ తుపానుకు నేలకొరిగింది (ఎడమ ఫైల్), ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన వరి పొలం మిచాంగ్ తుపానుకు తట్టుకుంది (కుడి ఫైల్) "మిచాంగ్ తుపాను నాటి రసాయనిక, ప్రకృతి సేద్య వరి పంటలపై ఆస్ట్రేలియా శాస్త్రవేత్త డా. ఫిల్ లీ అధ్యయనం" "ప్రకృతి సేద్యంతో ఒనగూడుతున్న అద్భుత ఫలితాలను కళ్లకు కట్టిన అధ్యయన ఫలితాలు" "ప్రకృతి వ్యవసాయం వల్ల మట్టిలో జీవశక్తి, సూక్ష్మజీవరాశి వైవిధ్యత పెరుగుతుంది. అందువల్లనే ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే శక్తి ఈ పంటలకు వస్తోందనడానికి ఇప్పుడు విస్పష్టమైన రుజువులు దొరికాయి". – డాక్టర్ ఫిల్ లీ, ఆస్ట్రేలియన్ సాయిల్ మైక్రోబయాలజిస్టు, ‘రీజెనరేట్ ఎర్త్’ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ‘ప్రకృతి వ్యవసాయంలో పండించిన వరి మొక్కలు చాలా బలంగా ఉన్నాయి. ఇది ప్రకృతి సేద్య బలానికి నిదర్శనం’ అన్నారు డా. ఫిల్ లీ. అదేవిధంగా, ఏప్రిల్ మొదటి వారంలో అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆయన రసాయనిక, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగవుతున్న పంటలను పరిశీలించారు. ఆయా పొలాల్లో మట్టి నమూనాలను కూడా సేకరించి అధ్యయనం చేశారు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన వరి కాండం (మైక్రోస్కోప్ ఎడమ చిత్రం), రసాయనాలతో పండించిన వరి కాండం (కుడి చిత్రం) బంతి పూలను ఏకపంటగా సాగు చేస్తున్న రసాయనిక పొలంలోని మట్టిలో జీవం తక్కువగా ఉందని గుర్తించారు. ఆ పొలం పక్కనే బంతితో పాటు 12 పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న పొలంలోని మట్టి నమూనాలను పరిశోధించగా.. మట్టి కణాల నిర్మాణం, ఆ మట్టిలో వైవిధ్యపూరితమైన సూక్ష్మజీవరాశి ఎంతో సుసంపన్నంగా ఉన్నట్లు గుర్తించానని డా. ఫిల్ లీ వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయం వల్ల మట్టిలో పెరుగుతున్న జీవశక్తి, సూక్ష్మజీవరాశి వైవిధ్యత వల్లనే పంటలకు వైపరీత్యాలను తట్టుకునే శక్తి వస్తోందనడానికి విస్పష్టమైన రుజువులు దొరికాయని ఆయన తెలిపారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వీడియోలు ‘ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిటీ నాచురల్ ఫార్మింగ్’ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. తిరుపతిలో 20,21 తేదీల్లో ఆర్గానిక్ మేళా.. తిరుపతి టౌన్ క్లబ్ కూడలిలోని మహతి ఆడిటోరియంలో ఏప్రిల్ 20, 21 తేదీల్లో ఉ. 10.30 గం. నుంచి రాత్రి 8 గం. వరకు స్వచ్ఛంద సంస్థ ‘కనెక్ట్ 2 ఫార్మర్’ ఆధ్వర్యంలో సేంద్రియ ఆహారోత్పత్తులు ప్రదర్శన, అమ్మకం మేళా జరగనుంది. రైతులు నేరుగా తమ ఆర్గానిక్ పంట ఉత్పత్తులను వినియోగదారులకు అమ్ముకోగలిగే ఏర్పాటు చేయటం.. దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు కూడా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని కనెక్ట్ 2 ఫార్మర్ వ్యవస్థాపకులు శిల్ప తెలిపారు. 20న కషాయాల తయారీపై గంగిరెడ్డి, దేశవాళీ పండ్లు / పూల మొక్కల గ్రాఫ్టింగ్పై జె.ఎస్. రెడ్డి శిక్షణ ఇస్తారు. కంపోస్టింగ్పై డా.సింధు అవగాహన కల్పిస్తారు. 21న 5 దొంతర్ల పండ్లు, కూరగాయల సాగుపై, ఇంకుడుగుంతల నిర్మాణంపై విజయరామ్ ప్రసంగిస్తారు. ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రకృతివనం ప్రసాద్ ప్రసంగిస్తారు. వివరాలకు.. 63036 06326. ఇవి చదవండి: Sagubadi: మనసుపెట్టి ఇష్టంగా.. ఏడాదికి మూడు పంటలు! -
Sagubadi: మనసుపెట్టి ఇష్టంగా.. ఏడాదికి మూడు పంటలు!
భూతల్లి కన్న తల్లితో సమానమని భావించే ఈ రైతు దంపతులు తమ సొంత భూమిలో మనసుపెట్టి ఇష్టంగా వ్యవసాయం చేస్తూ ఏడాదికి మూడు పంటలు పండిస్తున్నారు. దీంతో వీరి పొలాలు ప్రదర్శన క్షేత్రాలుగా మారిపోయాయి. పశువులు, గొర్రెలు, కోళ్ల ఎరువులు, జీవామృతంతో పంటలు పండిస్తున్నారు. మంచి దిగుబడులతో పాటు చక్కని ఆదాయం పొందుతున్నారు. మిట్టపెల్లి రాజేష్ రెడ్డి, భారతి ఆదర్శ రైతు దంపతులు. చదివించి పదో తరగతే అయినా తమ 12 ఎకరాల భూమిలో మనసుపెట్టి సేంద్రియ వ్యవసాయం చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఇంటికి అవసరమైన అన్నింటినీ సేంద్రియంగా పండించుకొని తింటూ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. వీరిది జగిత్యాల జిల్లాలో మెట్పల్లి మండలంలోని జగ్గాసాగర్ గ్రామం. 3 కి.మీ.ల పైపులైను.. ఆ రైతు దంపతులకు వ్యవసాయం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు పంచప్రాణాలు! వీరికి పన్నెండు ఎకరాల భూమి ఉంది. బావులే ఆధారం. 3 కి.మీ. దూరంలో వున్న ఎస్సారెస్పీ వరద కాల్వ నుంచి పైపులైన్లు వేసుకొని డ్రిప్తో సాగు చేస్తున్నారు. 20 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నప్పటికీ దిగుబడులు అంతంతే కాని, ఖర్చులు మాత్రం పెరిగాయి. ఇష్టారీతిన రసాయన ఎరువులు వేయడంతో ప్రతి పంటలో పురుగులు, తెగుళ్ల బెడద ఎక్కువై, వాటికి రసాయన మందులు పిచికారీ చేసేందుకు వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కుటుంబ అదాయం పిల్లల చదువుకు కూడా సరిపోయేది కాదు. ఈ నేపథ్యంలో పాలేకర్ పద్ధతిలో తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేయవచ్చని తెలసుకొని సాగు పద్ధతిని మార్చుకున్నారు. ఈ దంపతులు ప్రతి ఏడాదీ మూడు పంటలు పండిస్తున్నారు. మేలో తప్ప మిగతా 11 నెలలూ వీరి పొలాల్లో పంటలతో ఉంటాయి. వర్షాలతో సంబంధం లేకుండా, వ్యవసాయ భావుల్లో ఉన్న కొద్దిపాటి నీటితోనే, జూన్ రెండో వారంలోనే విత్తనాలు వేస్తుంటారు. వానాకాలం సీజన్లో ఆరు ఎకరాల్లో సన్న రకం వరి, రెండెకరాల్లో పసుపు, మూడెకరాల్లో మొక్కజొన్న, ఒక ఎకరంలో మిర్చి పంట సాగు చేశారు. యాసంగి సీజన్లో ఆరెకరాల్లో లావు రకం వరి, ఎకరంలో జొన్న, 3 ఎకరాల్లో మొక్కజొన్న, రెండెకరాల్లో నువ్వు సాగు చేస్తున్నారు. ఖర్చు తగ్గించే సాగు పద్ధతులతో మేలు! మా భూమిలో రకరకాల పంటలు పండించి, ఆ పంటల్లో అధిక దిగుబడులు తీసినప్పుడు మాకు కష్టం గుర్తుకురాదు. ప్రధానంగా భూతల్లిని కాపాడేందుకు రసాయనాలను పూర్తిగా తగ్గించి, పశువులు, కోళ్లు, గొర్రెల ఎరువు వాడుతున్నాం. వ్యవసాయంతో చాలా మంది ఇబ్బందిగా ఫీలవుతుంటే, మేం మాత్రం ఇష్టంగా చేస్తున్నాం.. సంతృప్తిని, ఆదాయాన్ని పొందుతున్నాం. ప్రతి రైతు ఖర్చు తగ్గించే పద్ధతులపై దృష్టి పెట్టాలి. మేం అలాగే చేస్తున్నాం. మా పద్ధతిలోకి రావాలని తోటి రైతులను ప్రోత్సహిస్తున్నాం. – మిట్టపెల్లి భారతి, రాజేష్ రెడ్డి (9618809924, 9618111367) వెద వరి.. 30 క్వింటాళ్ల దిగుబడి వరి సాగు చేయబోయే పొలంలో జూన్లో మొక్కజొన్న సాగు చేసి, కంకులు కోసిన తర్వాత మొక్కజొన్న మొక్కలను రోటోవేటర్తో పొలంలో కలియ దున్నేస్తారు. ఆ తర్వాత, వరి నారు పోసి, నాటు వేసే బదులు, నేరుగా వెదజల్లి ఎకరానికి 30 క్వింటాళ్లకు పైగా దిగుబడి సాధిస్తున్నారు. అలాగే, పసుపు, మొక్కజొన్న సాగు చేసే భూమిలో రెండు లారీల గొర్రెల ఎరువు, ఒక లారీ మాగిన కోళ్ల ఎరువు వేసి భూసారం పెంచుకుంటూ ఉంటారు. పంటకాలంలో ప్రతి పంటకు జీవామృతాన్ని మూడు సార్లు ఇస్తున్నారు. నాలుగు ఆవులు, మూడు గేదేలను పెంచుతున్నారు. సగటున ఎకరానికి సజ్జలు 12–15, పసుపు 30, మొక్కజొన్నలు 40–45, నువ్వులు 4–6 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. భారతి, రాజేష్ రెడ్డి దంపతులు తెల్లవారుఝామున 3 గంటలకే వీరి దిన చర్య ప్రారంభం అవుతుంది. ఆవులు, గేదేల నుంచి పాలు పిండి 30 మందికి పాలు పోస్తారు. ఇంట్లో వంట పనులు పూర్తి చేసుకొని ఇద్దరూ తెల్లారేసరికే పొలంలో అడుగుపెడతారు. సా. ఆరు గంటలైతే కానీ ఇంటికి రారు. ఏ ఫంక్షన్కు వెళ్లినా సాయంత్రం ఇంటికి రావాల్సిందే! విలువ జోడించే అమ్ముతారు భారతి, రాజేష్ రెడ్డి దంపతులు తాము పండించిన పంటలను విలువ జోడించి అమ్ముతూ మంచి ఆదాయం పొందుతున్నారు. సన్న వరి ధాన్యాన్ని మర ఆడించి బియ్యం క్వింటాకు రూ. 6,500కు విక్రయిస్తున్నారు. మిరపకాయలను ఎండబెట్టి కారం పొడిని కిలో రూ. 280కి వినియోగదారులకు అమ్ముతున్నారు. సజ్జలను బై బ్యాక్ పద్ధతిలో కంపెనీలకు క్వింటా రూ.7 వేలకు, పసుపును క్వింటా రూ.11 వేలకు, మొక్కజొన్నను క్వింటా రూ.2,100కు నువ్వులను క్వింటా రూ.14 వేల చొప్పున విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. తమ పిల్లలిద్దరినీ హైద్రాబాద్లో ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. ఫార్మ్ అండ్ రూరల్ సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్లో పూర్వ ఉపకులపతి దివంగత జె. రఘోత్తమరెడ్డి స్మాకరకోపన్యాస సభలో భారతి ఉత్తమ సేంద్రియ రైతు పురస్కారాన్ని అందుకోవటం విశేషం. – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్ -
నారి వారియర్
మంజు వారియర్....పేరులోనే కాదు ఆమె వేసే ప్రతి అడుగులో సాహసం ఉంటుంది. కళకు సామాజిక స్పృహ జోడించి ముందుకు వెళుతోంది. యాక్టర్, రైటర్, డ్యాన్సర్, బ్రాండ్ అంబాసిడర్, ప్రొడ్యూసర్, సోషల్ యాక్టివిస్ట్గా బహుముఖ ప్రజ్ఞను సొంతం చేసుకుంది... కేరళలోని తిరువనంతపురం కల్పాక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోని మహిళా సభ్యులు సొంతంగా కూరగాయలు పండించడం ప్రారంభించారు. అందరూ ఆశ్చర్యపోయేలా పెద్ద వెజిటెబుల్ గార్డెన్ను సృష్టించారు. ‘కల్పాక క్వీన్స్’గా పేరు గాంచారు. వెజిటెబుల్ గార్డెన్ సృష్టించడానికి కల్పాక క్వీన్స్కు ‘హౌ వోల్డ్ ఆర్ యూ’ అనే సినిమా స్ఫూర్తి ఇచ్చింది. సమాజాన్ని సినిమా ప్రభావితం చేస్తుందా? సినిమాను సమాజం ప్రభావితం చేస్తుందా?... అనే చర్చ మాట ఎలా ఉన్నా సమాజంపై సినిమా చూపే ప్రభావం తక్కువేమీ కాదు. మంచి లక్ష్యానికి మంచి సినిమా వెన్నుదన్నుగా నిలుస్తుంది. మంజు వారియర్ రీఎంట్రీ మూవీ ‘హౌ వోల్డ్ ఆర్ యూ’ ఈ కోవకు చెందిన సినిమానే. మంజు వారియర్ ఈ సినిమాలో నిరూపమ రాజీవ్ అనే పాత్ర పోషించింది. నిరూపమ రాజీవ్ అనే వివాహిత టెర్రస్ ఫార్మింగ్కు సంబంధించిన ప్రయాణం సినిమా మూల కథ. ‘స్త్రీలు తమలో ఉన్న శక్తి సామర్థ్యాలపై దృష్టి సారించి వెలికి తీస్తే ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి’ అంటుంది వారియర్. ‘హౌ వోల్డ్ ఆర్ యూ’ సినిమా విడుదలైన తరువాత మంజు వారియర్ ఎక్కడికి వెళ్లినా మహిళలు దగ్గరికి వచ్చి ‘మీ సినిమా స్ఫూర్తితో టెర్రస్ ఫార్మింగ్ మొదలు పెట్టాం’ అని చెప్పేవాళ్లు. ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ ‘కుటుంబశ్రీ’కి బ్రాండ్ అంబాసిడర్గా ఎంతో మంది మహిళలను ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు నడిపిస్తోంది మంజు వారియర్. పదిహేడు సంవత్సరాల వయసులో ‘సాక్ష్యం’ సినిమాతో మలయాళ చిత్రసీమలోకి అడుగు పెట్టిన వారియర్ ‘తూవల్’ ‘కొట్టరం’ ‘సల్లాపం’...మొదలైన సినిమాలతో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. చిత్రసీమలోకి రావడానికి ముందు దూరదర్శన్ సీరియల్స్లో నటించింది. జెండర్–ఈక్వాలిటీని దృష్టిలో పెట్టుకొని కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘జెండర్ పార్క్’ ప్లాట్ఫామ్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న వారియర్ క్యాన్సర్ పేషెంట్ల కోసం హెయిర్ డొనేషన్ డ్రైవ్లను నిర్వహిస్తుంటుంది. ‘చతర్ముఖం’ అనే మలయాళం సినిమాతో నిర్మాతగా తొలి అడుగు వేసింది మంజు. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘సినిమా నిర్మాణంలో రిస్క్లు, బాధ్యతలు ఉంటాయి. నా చుట్టుపక్కల వాళ్ల సహకారంతో నిర్మాతగా ఎలాంటి సవాళ్లు, ఒత్తిడి ఎదుర్కోలేదు. ‘కాయట్టం’ సినిమాకు సహనిర్మాతగా ఉన్నప్పుడు చిత్ర నిర్మాణం గురించి సీరియస్గా ఆలోచించడం మొదలు పెట్టాను. నా జీవితంలో ఏది ప్లాన్ చేసుకోలేదు. ఆ సమయానికి ఏది ఆసక్తిగా ఉంటే అది చేస్తూ పోయాను. సినిమా నిర్మాణాన్ని నా జీవితంలో కొత్త ప్రయోగంగా భావిస్తాను’ అంటుంది మంజు వారియర్. క్లాసికల్ డ్యాన్సర్గా మంజు వారియర్ తెచ్చుకున్న పేరు తక్కువేమీ కాదు. స్కూల్లో చదువుకుంటున్న రోజుల నుంచి వారియర్ నాట్యప్రతిభ గురించి ప్రముఖ నాట్యకారుడు ఎన్వీ క్రిష్ణన్కు తెలుసు. ‘మంజు గిఫ్టెడ్ డ్యాన్సర్. మన దేశంలోని అద్భుతమైన భరతనాట్య కళాకారులలో ఆమె ఒకరు’ అంటాడు క్రిష్ణన్. భరతనాట్యంలో పేరు తెచ్చుకున్న మంజు వారియర్ తన కూతురు మీనాక్షి డ్యాన్స్ టీచర్ గీతా పద్మకుమారన్ నుంచి కూచిపూడి నాట్యం నేర్చుకుంది. ‘వారియర్కు కూచిపూడి నేర్పడం ఒక అద్భుత అనుభవం. తక్కువ సమయంలోనే డ్యాన్స్ నేర్చుకుంది. అద్భుతమై ఎక్స్ప్రెషన్స్ ఆమె సొంతం’ అంటుంది గీత. ‘సల్లాపం’ అనే పుస్తకంతో రైటర్గా కూడా తన ప్రతిభ చాటుకుంది వారియర్. ‘సల్లాపం’ తన జ్ఞాపకాల సమాహారం. వీణ వాయించడం నేర్చుకున్న వారియర్ ఎన్నో వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. మంజు వారియర్ బహుముఖ ప్రతిభకు మరోసారి ఫిదా అయ్యారు అభిమానులు. సంతోషమే నా బలం ప్రాజెక్ట్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా... ఫలితంతో సంబంధం లేకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండడానికే ప్రయత్నిస్తాను. సంతోషమే నా బలం. నా జీవితంలో ఎప్పుడూ ఏది ప్లాన్ చేసుకోలేదు. అయితే మంచి విషయాలు నా దారిలో ముందుకు వచ్చి కనిపిస్తాయి. వాటితో కలిసి ప్రయాణిస్తాను. సాహిత్య కార్యక్రమాల్లో మాట్లాడడానికి ముందు నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఏం చెప్పబోతున్నానో, ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో... ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటాను. – మంజు వారియర్ -
విప్రోలో ఉద్యోగం వదిలి.. వ్యవసాయంతో రూ.205 కోట్లు సంపాదన
దేశంలోనే దిగ్గజ ఐటీ కంపెనీలో మంచి ఉద్యోగం.. దాదాపు 17 ఏళ్లు పనిచేసిన అనుభవం.. ఉద్యోగానికి రాజీనామా.. ఏదైనా ఐటీ కంపెనీ స్థాపిస్తాడేమోనని అనుకుంటాం. కానీ వ్యవసాయం ప్రారంభించాడు. ఏటా ఏకంగా రూ.205 కోట్లు సంపాదిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ఏ పద్ధతులు ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నాడు? అంత సంపాదన ఎలా సాధ్యమైందో ఈ కథనంలో తెలుసుకుందాం. కర్ణాటకకు చెందిన శశికుమార్ 17 ఏళ్లపాటు ఐటీరంగంలో సేవలందించారు. అందులో 13 ఏళ్లు దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థ విప్రోలో విధులు నిర్వర్తించారు. దేశం అభివృద్ధి చెందుతున్నప్పటికీ వ్యవసాయానికి మాత్రం ప్రత్యామ్నాయం లేదని గ్రహించారు. రసాయనాలు కలిపిన ఆహారం తీసుకోవడం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన, సేంద్రియ ఆహారం అందించాలని భావించారు. దాంతో ఆర్గానిక్ పద్ధతులతో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆలోచన వచ్చిన వెంటనే తను చేస్తున్న ఉద్యోగం మానేశారు. ఈ విషయాన్ని స్నేహితులకు చెప్పడంతో వారూ తనకు సహాయం అందించారు. దాంతో 2010లో 9 మంది మిత్రులు కలిసి అక్షయకల్ప ఆర్గానిక్ని ప్రారంభించారు. శశికుమార్ మొదట్లో కేవలం ముగ్గురు రైతులతో పాల వ్యాపారం మొదలుపెట్టారు. అయితే అక్షయకల్ప ఆర్గానిక్ నిర్వాహకులు పాలతో ఆగకుండా.. సేంద్రియ కూరగాయలు, పండ్లను పండించడం ప్రారంభించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోని ప్రజలకు ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రత్యేకతను వివరిస్తూ వారికి చేరువవుతున్నారు. ఆర్గానిక్ పద్ధతులతో పండిస్తున్న రైతుల ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తూ వారికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. రైతులకు, కొనుగోలుదారులకు మధ్య వారధిగా నిలుస్తున్నారు. రైతుల ఆదాయాలను పెంచుతున్నారు. ప్రస్తుతం అక్షయకల్ప ఆర్గానిక్ ద్వారా పాలఉత్పత్తిలో భాగంగా 700 మంది రైతులు సహకారం అందిస్తున్నారు. దాదాపు 60,000 లీటర్ల సేంద్రియ పాలను ఉత్పత్తి చేస్తున్నట్లు శశికుమార్ తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో మార్కెటింగ్ సేవలందించేందుకు 500 మందికి పైగా శిక్షణ ఇస్తున్నారు. సేంద్రియ పాలపై మొదట్లో వినియోగదారులకు అవగాహన కల్పించడం పెద్ద సవాలుగా మారిందని శశికుమార్ తెలిపారు. గడిచిన 12 ఏళ్ల కాలంలో తన స్నేహితులు ఆర్థికంగా ఎంతో సహాయం చేశారని చెప్పారు. ఇటీవల రూ.10 కోట్లతో కొత్త డెయిరీ ప్లాంట్ ప్రారంభించామన్నారు. దాని ద్వారా రోజుకు లక్ష లీటర్ల పాలు ప్రాసెసింగ్ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఇదీ చదవండి: 11వేల కార్మికులపై కేసులు నమోదు.. 150 ఫ్యాక్టరీలు మూసివేత సేంద్రియ కూరగాయలు, పండ్ల వ్యాపారం గతంలో కంటే మెరుగవుతుందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో అక్షయకల్ప ఆర్గానిక్ స్టార్టప్ రూ.205 కోట్లు ఆర్జించింది. 2023-24లో ఆదాయం మరో 25 శాతం పెరుగుతుందని శశి కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కంపెనీ 5 వేల గ్రామాలు, 5 వేల మంది రైతులకు సహాయం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. -
ఆర్గానిక్ పాలకు అధిక డిమాండ్ ఉంది
-
తేనెటీగలు సంచార జాతికి చెందినవి
-
సంపద కేంద్రంలో ప్రకృతి వనం
కంకిపాడు(పెనమలూరు): అది చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రం. నిన్నటి వరకూ ప్రజలకు అంత వరకే తెలుసు. ప్రస్తుతం ప్రకృతి విధానంలో కూరగాయల మొక్కల సాగు జరుగుతోంది. ఎరువులు, పురుగు మందులు వాడకుండా సేంద్రీయ పద్ధతిలో కూరగాయలను పండిస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా సంపద కేంద్రాన్ని తీర్చిదిద్దేందుకు కంకిపాడు పంచాయతీ పాలకవర్గం పాటుపడుతూ స్థానిక సంస్థలకు ఆదర్శంగా నిలుస్తోంది. మండల కేంద్రమైన కంకిపాడులో గత పాలకపక్షం హయాంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని నిర్మించారు. ఈ పాలకపక్షం అధికారం చేపట్టాక సంపద వృద్ధి, ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించింది. ప్రస్తుతం వర్మికంపోస్టు, పొడి చెత్త విక్రయాలు సాగిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం సంపద కేంద్రంలో ఉన్న ఖాళీ స్థలంలోనూ సంపద సృస్టించేందుకు పంచాయతీ పాలకవర్గం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఐదు నెలల క్రితం సంపద కేంద్రం ప్రాంగణంలో వృథాగా ఉన్న స్థలాన్ని బాగుచేయించారు. ఆ ప్రాంతంలో వర్మీకంపోస్టు, మట్టి కలిపి మొక్కల పెంపకానికి ఏర్పాట్లు చేశారు. వంగ, బెండ, గోరు చిక్కుడు, టమాటా, మిర్చి మొక్కలు నాటారు. తీగజాతికి చెందిన సొర, బీర, కాకర, పొట్లను కూడా సాగుచేస్తున్నారు. వీటికి పందిరి అవసరం లేకుండా ప్రాంగణంలో కొంచెం ఎత్తు మాత్రమే ఉన్న చెట్లకు పాదులను పాకిస్తున్నారు. తోటకూర, పాలకూర, గోంగూర నారుపోసి సంరక్షించారు. అరటి, జామ, దానిమ్మ, పనస, మామిడి, ఉసిరి వంటి పండ్ల జాతి మొక్కలను పెంచుతున్నారు. ఈ మొక్కలు తెగుళ్లు, పురు గుల బారిన పడకుండా నిత్యం పంచాయతీ సిబ్బంది సంరక్షిస్తున్నారు. మొక్కలు ఆరోగ్యంగా ఎదిగేందుకు, మంచి ఫలసాయం లభించేందుకు ఎప్పటికప్పుడు వర్మికంపోస్టు, సేంద్రీయ ఎరువును మొక్కలకు అందిస్తున్నారు. ఆదాయం పెంపు దిశగా.. ఇప్పటికే చెత్త నుంచి సంపద కేంద్రం నుంచి వర్మీ కంపోస్టు, పొడి చెత్త విక్రయాలు జరుగుతు న్నాయి. వీటి తోపాటుగా అన్ని సీజన్లలో ప్రకృతి విధానంలో కూరగాయ మొక్కలను పెంచి వాటి ఉత్పత్తులను విక్రయించటం ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు పంచాయతీ చర్యలు తీసుకుంది. వర్మీకంపోస్టు కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రజలు ఆర్గానిక్ కూరగాయలకు ఆసక్తి చూపుతారు. అదే ఉద్దేశంతో ప్రకృతి విధానాన్ని సంపద కేంద్రంలో అమలు చేస్తోంది. ఆర్గానిక్ ఉత్పత్తులకు డిమాండ్ ప్రస్తుతం ఆర్గానిక్ ఉత్పత్తులను మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఆరోగ్యంపై అవగాహన, శ్రద్ధ పెరిగాయి. ఆర్గానిక్ పద్ధతిలో పెరిగిన కూరగాయలను భుజించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదే కారణంతో ఆర్గానిక్ పద్ధతిలో సాగుచేసిన కూరగాయలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావా లని నిర్ణయించుకున్నాం. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో వృథాగా ఉన్న ఖాళీ స్థలాన్ని మొక్కల పెంపకానికి వినియోగి స్తున్నాం. కేంద్రం ప్రాంగణం మొత్తం కూరగాయలు, ఆకుకూరలు పెంచి విక్రయించటం ద్వారా పంచాయతీకి కూడా ఆదాయం సమకూరుతుంది. – రాచూరి చిరంజీవి, ఉప సర్పంచ్, కంకిపాడు -
హైబ్రీడ్ రకాల సాగుకే మొగ్గుచూపుతున్న అన్నదాతలు
-
పుష్ప శ్రీవాణి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న వ్యవసాయం
-
ఆర్గానిక్ పంటలకు మార్కెట్లో మంచి ధర దక్కుతుంది
-
లే‘టేస్ట్’ ట్రెండ్..!
మండపేట: నాటుకోడి... కౌజుపిట్ట... కొర్రమీను... ఇదీ ఇప్పుడు ట్రెండ్.. అటు రెస్టారెంట్లలో అందరి దృష్టి వీటిపైనే ఉంటోంది. ఇటు పెంపకంలోనూ వీటిపైనే యువత ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. కొందరు ఉద్యోగం చేస్తూనే తమకున్న ఆసక్తి మేరకు కొద్దిపాటి స్థలంలో గేదెలు, ఆవులు, నాటుకోళ్లు, కౌజుపిట్టలు, కొర్రమీను చేపలు వంటివి ఒకేచోట పెంచుతూ అదనపు ఆదాయం పొందుతున్నారు. ఇదే తరహాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం పాలతోడు గ్రామానికి చెందిన పిల్లా విజయ్కుమార్ కేవలం ఆరు సెంట్ల స్థలంలో నాటుకోళ్లు, కౌజుపిట్టలు, కొర్రమీను చేపలను ఆర్గానిక్ పద్ధతిలో పెంచుతున్నాడు. నెలకు రూ.40వేల వరకు ఆదాయం పొందుతున్నాడు. డిప్లొమా సివిల్ ఇంజినీరింగ్ చదివిన విజయ్కుమార్ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో సివిల్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. చిన్నతనం నుంచి పశుపోషణ, కోళ్ల పెంపకంపై ఆసక్తి కలిగిన అతను తన సొంతూరులో ఆరు సెంట్ల స్థలంలో నాలుగేళ్ల కిందట మూడు గేదెలు, రెండు ఆవులతో డెయిరీఫాం, నాటుకోళ్ల పెంపకం ప్రారంభించాడు. డెయిరీఫాం బాగానే ఉన్నా కార్మికుల సమస్యతో దానిని మధ్యలోనే ఆపేశాడు. అనంతరం కోళ్ల పెంపకంపై దృష్టి పెట్టాడు. భీమవరం నుంచి మేలుజాతి కోడిపుంజులు, పెట్టలను తీసుకువచ్చి గుడ్లు ఉత్పత్తి చేయించి ఆర్గానిక్ తరహాలో పెంచడం ప్రారంభించాడు. ఆ తర్వాత హోటళ్లలో కౌజుపిట్టలకు మంచి గిరాకీ ఉందని గుర్తించి... రెండేళ్లుగా వాటిని కూడా పెంచుతున్నాడు. అంతటితో ఆగకుండా గతంలో ఏర్పాటుచేసిన డెయిరీ ఫాంలో పశువుల కోసం నిర్మించిన నీటి తొట్టెలలో ఏడాది నుంచి కొర్రమీను చేపల పెంపకం ప్రారంభించాడు. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూనే వారానికి ఒకసారి ఒకసారి వచ్చి అన్నీ చూసుకుని వెళతాడు. ఆయనకు కుటుంబ సభ్యులు సాయం చేస్తున్నారు. యూట్యూబ్ వీడియోల ఆధారంగా ఎప్పటికప్పుడు మెళకువలు తెలుసుకుంటూ కోళ్లు, చేపలు, కౌజుపిట్టల పోషణ చేస్తున్నాడు. యూట్యూబ్లో చూసి గుడ్లను పొదిగించేందుకు ఇన్వర్టర్పై పని చేసే ఇంక్యుబేటర్ను సొంతంగా ప్లేవుడ్తో తయారు చేసుకున్నాడు. దానిలోనే కోడిగుడ్లు, కౌజుపిట్ట గుడ్లు పొదిగిస్తున్నారు. ఆదాయం బాగుంది నాటుకోళ్లు, కౌజుపిట్టలు, కొర్రమీనుల పెంపకం లాభసాటిగా ఉంది. వీటిని పూర్తి ఆర్గానిక్ పద్ధతుల్లో పెంచుతాం. గుడ్ల ఉత్పత్తికి వినియోగించే కోడి పుంజు రూ.75 వేలు కాగా, పెట్ట రూ.25 వేలు చొప్పున భీమవరంలో కొనుగోలు చేశా. ప్రస్తుతం వందకు పైగా కోళ్లు, 2,500 నుంచి 3,000 వరకు కౌజుపిట్టలు, 1,000 నుంచి 1,200 వరకు కొర్రమీను చేపలు పెంచుతున్నాం. మేత, ఇతర ఖర్చులు పోనూ ప్రతి నెలా రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు ఆదాయం వస్తోంది. – పిల్లా విజయ్కుమార్, పాలతోడు, మండపేట మండలం -
బ్లాక్ రైస్, రెడ్ రైస్ సాగుతో అధిక దిగుబడిని పొందిన రైతు
-
రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయంపై విదేశీయుల ఆసక్తి
-
సేంద్రియ వ్యవసాయంతో రైతుకు కలుగుతున్న లాభాలు
-
ఆరోగ్యకర జీవనానికి ఔషధ మొక్కలు
-
మల్లేశ్వరమ్మ సహకార వెలుగులు
చిన్న, సన్నకారు మహిళా రైతులు సంఘటితమైతే ఆర్థికాభివృద్ధితో పాటు మంచి ఆహారం కూడా మారుమూల గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి వస్తుందనటానికి శ్రీగాయత్రి మహిళా రైతుల పరస్పర సహకార పరపతి సంఘం ఓ తాజా ఉదాహరణ. వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లె మండలం ముసలిరెడ్డిగారిపల్లి కేంద్రంగా 2014లో ఈ సొసైటీ ఏర్పాటైంది. సుస్థిర వ్యవసాయ కేంద్రం ఈ సొసైటీకి ఆది నుంచి అండగా నిలుస్తోంది. మల్లేపల్లి తదితర పరిసర గ్రామాలకు చెందిన 301 మంది సన్న, చిన్నకారు మహిళా రైతు కుటుంబాలలో ఆర్థిక, ఆహార భద్రతా వెలుగులు నింపుతున్న ఈ సొసైటీకి సీనియర్ ఎన్పిఓపి సర్టిఫైడ్ సేంద్రియ రైతు వడ్డెమాని మల్లేశ్వరమ్మ అధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు. చదువు లేకపోయినా.. కఠోర శ్రమ, పట్టుదలతో సొసైటీ వార్షిక వ్యాపారాన్ని రూ.65 లక్షలకు పెంచగలిగిరామె. ఆమె కృషిని ‘నాబార్డు’ మెచ్చింది. నాబార్డు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ బాబు.ఎ., మార్కెటింగ్, సహకార శాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి చేతుల మీదుగా ఇటీవల విజయవాడలో ఉత్తమ మహిళా రైతు పుస్కారాన్ని మల్లేశ్వరమ్మ అందుకోవటం విశేషం. సేంద్రియ సేద్యం ఇలా.. మల్లేశ్వరమ్మ, చంద్రశేఖరరెడ్డి దంపతులు ముసలిరెడ్డిగారిపల్లి పరిసరాల్లోని 4 చోట్ల ఉన్న 9 ఎకరాల వారసత్వ భూముల్లో సేంద్రియ సేద్యం చేస్తున్నారు. 2 ఎకరాల్లో మూడేళ్ల క్రితం బత్తాయి మొక్కలు నాటారు. అందులో అంతరపంటగా సాగు చేస్తున్న పత్తి ప్రస్తుతం కోతకు వచ్చింది. గతంలో వేరుశనగ తదితర ఆహార పంటలనే వేసే వారమని, అడవి పందుల బాధ పడలేక పత్తి వేశామని ఆమె తెలిపారు. ఆగస్టు ఆఖరుకు పత్తి తీత పూర్తవుతుంది. సగటున చెట్టుకు 35 కాయలు వచ్చాయి. ఎకరానికి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని ఆశిస్తున్నారు. ఈ రెండెకరాల్లో పత్తికి ముందు పెసర, మినుము సాగు చేశారు. మరో రెండెకరాల్లో పూర్తిగా పత్తి సాగు చేస్తున్నారు. 4 ఎకరాలను బొప్పాయి నాటడానికి సిద్ధం చేశారు. ఊరికి ఆనుకొని ఉన్న ఎకరంలో 32 రకాల కూరగాయలను ఇటీవలే విత్తామని మల్లేశ్వరమ్మ తెలిపారు. సిఎస్ఎ క్షేత్ర సిబ్బంది తోడ్పాటుతో ఏ పంటైనా సేంద్రియంగానే సాగు చేస్తుండటం విశేషం. మూడేళ్లకోసారి దిబ్బ ఎరువు వేస్తారు. ప్రతి ఏటా టైప్ 2 ఘనజీవామృతం, వేపపిండి, కానుగ పిండి ఎరువుగా వేస్తున్నారు. అవసరాన్ని బట్టి ద్రవ జీవామృతం, దశపర్ణి కషాయం, వేపనూనె పిచికారీ చేస్తున్నారు. గుంటక, సైకిల్ వీడర్తో కలుపు సమస్యను కొంత మేరకు అధిగమిస్తున్నారు. ఈ 9 ఎకరాలు మెయిన్ కేసీ కెనాల్కు దగ్గర్లో ఉండటంతో భూగర్భ జలానికి కొదువ లేవు. ఒకే బోరుతో నీటిని తోడుతూ భూగర్భ పైపు లైను ద్వారా నాలుగు పొలాల్లోని పంటలకు డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. పెసర, మినుము, ధనియాలు, వాము, ఆవాలు, పత్తి, కంది, వేరుశనగ, గోధుమ తదితర పంటలు సీజన్కు అనుగుణంగా సాగు చేస్తున్నారు. సేంద్రియంగానే సంతృప్తికరమైన దిగుబడులు తీస్తున్నామని మల్లేశ్వరమ్మ వివరించారు. 48 మందికి సేంద్రియ సర్టిఫికేషన్ శ్రీగాయత్రి మహిళా రైతుల పరస్పర సహకార పరపతి సంఘంలో దాదాపు 11 గ్రామాలకు చెందిన 301 మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. ఇందులో 48 మంది సేంద్రియ సేద్యం చేస్తున్నారు. మల్లేశ్వరమ్మ సహా పది మంది ఎన్పిఓపి థర్డ్పార్టీ సేంద్రియ సర్టిఫికేషన్ పొందారు. విదేశాలకూ ఎగుమతి చేయొచ్చు. మరో 40 మంది పీజీఎస్ సర్టిఫికేషన్ పొందారు. రైతులకు విత్తనాలు తదితర ఉత్పాదకాలను తెప్పించి తక్కువ ధరకు సొసైటీ అందిస్తుంది. దీనితో పాటు కొర్రలు, అండుకొర్రలు, వేరుశనగలు, తెల్లజొన్న, గోధుమలు, ధనియాలు, కందులు, పెసలను సుమారు 15 క్వింటాళ్ల వరకు సభ్య రైతుల నుంచి కొనుగోలు చేసి సొసైటీ నిల్వ చేసి, ఏడాది పొడవునా శుద్ధి చేసి విక్రయిస్తున్నారు. ప్రస్తుతానికి రుణం తీసుకోకుండా సొసైటీ సొంత డబ్బుతోనే పరిమితంగా కొంటున్నామన్నారు. మల్లేశ్వరమ్మ తన సొంత ఇంటిలోనే కొన్ని గదులను కేటాయించి సొసైటీ ముడి ధాన్యాలను నిల్వ చేశారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలను మరపట్టే యంత్రాలను ఏర్పాటు చేసుకున్నారు. డిమాండ్ మేరకు ధాన్యాలను శుద్ధి చేయించి సరసమైన ధరకు విక్రయిస్తున్నారు. కందులను సంప్రదాయ పద్ధతుల్లో పప్పుగా తయారు చేస్తున్నారు. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా పురుగు సమస్య ఉండదని తెలిపారు. ఇరుగు పొరుగు గ్రామాల వాళ్లు కూడా వచ్చి కొనుక్కెళ్తున్నారు. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో ఉన్న కొందరికి కూడా పంపుతున్నామని మల్లేశ్వరమ్మ తెలిపారు. సోలార్ డ్రయ్యర్లతో ఒరుగులు, పొడులు టొమాటోలు, నిమ్మకాయల వంటి పంటలకు మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పుడు కొనుగోలు చేసి, సోలార్ డ్రయ్యర్ల ద్వారా ఒరుగులు తయారు చేసి విక్రయించడం ఈ సొసైటీ చేస్తున్న మరో మంచి పని. రహేజా సోలార్ స్టార్టప్ సంస్థ 3 టన్నుల సామర్థ్యం గల 6 సోలార్ డ్రయ్యర్లను ఈ సొసైటీకి సిఎస్ఎ ద్వారా 80% సబ్సిడీపై 5 నెలల క్రితం అందించింది. గతంలో టొమాటో ఒరుగులు తయారు చేసి కిలో రూ. 340కి అమ్మినట్లు మల్లేశ్వరమ్మ తెలిపారు. 20 కిలోల టొమాటోలను ఎండబెడితే కిలో ఒరుగులు వస్తాయి. రెండోరకం టొమాటోలు కిలో రూ. 8 చొప్పున కొని ఎండబెట్టి రహేజా సంస్థకే అమ్మామని తెలిపారు. ఇప్పుడు నిమ్మకాయల ఒరుగులు చేస్తున్నారు. 11 కిలోలకు 1 కిలో ఒరుగులు వస్తున్నాయి. ధర రూ.340కి అమ్ముతున్నారు. కరివేపాకు, మునగాకులను సైతం ఈ డ్రయ్యర్లలో ఎండబెట్టి పొడులను ఆర్డర్లపై సరఫరా చేస్తున్నామని ఆమె వివరించారు. సొసైటీ పనులు చేసే మహిళా సభ్యులకు వేతనానికి అదనంగా రోజుకు రూ. 5లను వారి పేరున భవిష్యనిధిగా జమ చేస్తున్నామని మల్లేశ్వరమ్మ తెలిపారు. ఈ మహిళా రైతుల సహకార సంఘం సేవలు మరెందరికో స్ఫూర్తిదాయకం కావాలని ఆశిద్దాం. మంచి ఫుడ్డు అందిస్తున్నానన్న సంతృప్తి ఉంది పజలకు ఆదాయం ఉంది, డబ్బుంది. కానీ, మంచి ఫుడ్డు లేదు. ఈ ఆలోచనతోనే సేంద్రియ ఆహారాన్ని పండించి అందించాలన్న ఆలోచన వచ్చింది. రసాయనాల్లేకుండా పండించిన రాగి సంగటి, కొర్రన్నం, సింగిల్ పాలిష్ బియ్యం, కూరగాయలు, ఆకుకూరలు ఇంటిల్లపాదీ తింటున్నాం. దీని వల్ల మా ఆరోగ్యం ఎంతో బాగుంది. మా ఊళ్లో వాళ్లు 60% మా దగ్గర కొంటారు. బెంగళూరు, హైదరాబాద్లలో 18 కుటుంబాలకు కూడా పార్శిల్ ద్వారా పంపుతున్నాం. మా కుటుంబానికి, ప్రజలకు కూడా మంచి ఫుడ్డు అందిస్తున్నానన్న సంతృప్తి చాలా ఉంది. ఈ కీర్తి చాలు. – వడ్డెమాని మల్లేశ్వరమ్మ (62815 06734), అధ్యక్షులు, శ్రీగాయత్రి మహిళా రైతుల పరస్పర సహకార పరపతి సంఘం, ముసలిరెడ్డిగారిపల్లి, వేంపల్లె మం., వైఎస్సార్ కడప జిల్లా. – పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్ -
సేంద్రియ వ్యవసాయంతో రైతులకు కాసుల వర్షం
-
సేంద్రియ పంటలతో ఆరోగ్యంతో పాటు ఆదాయ మార్గం
-
ఏడాదికి మూడు పంటలు పండిస్తూ మంచి లాభాలు
-
సెమీ ఆర్గానిక్ పద్ధతిలో బంగినపల్లి మామిడి ... లక్షల్లో ఆదాయం
-
అధిక ఎరువులు వాడితే అనర్థమే
నవాబుపేట: రసాయన ఎరువులు అధికంగా వాడితే అనర్థమే అని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా దిగుబడి తగ్గి, పెట్టుబడులు పెరుగుతాయని అంటున్నారు. సాధారణంగా నేల స్వభావం, భూసారాన్ని బట్టి ఎరువులు వాడాలి. కానీ రైతులంతా ఒకే రకమైన ఎరువులను వినియోగిస్తున్నారు. వరి సాగులో ఎకరాకు 50కేజీల డీఏపీ, 100 కేజీల యూరియా వాడాలి. కానీ రైతులు ఎకరాకు రెండు బస్తాలకు తగ్గకుండా డీఏపీ వేస్తున్నారు. పైరు నాటే సమయంలో బస్తాకు అదనంగా 25 కేజీల పొటాష్ను కలిపి వేయాల్సి ఉన్నా రైతులు వేయడం లేదు. వరికి యూరియాను నాలుగు సార్లు వాడాలి. వాడిన ప్రతి సారి 30 కేజీల చొప్పున వాడాలి. పొట్టదశలో యూరియాకు 25 కేజీల పొటాష్ను కలిపి వాడాలి. అయితే రైతులు చాలా వరకు నాటిన 20 రోజులకు 50 కేజీలు, మధ్యలో 50 కేజీలు వాడుతున్నారు. ఇక పత్తి పంట విషయానికి వస్తే విత్తేకంటే ముందే ఎకరాకు మూడు నాలుగు అంగుళాల లోతున పడేలా 50 కేజీల డీఏపీ వాడాలి. అయితే వర్షాధారంగా సాగు చేసే పంటల్లో విత్తనాలు మొలుస్తాయో లేదోనని పత్తి విత్తేటప్పుడు ఎరువులు వేయడం లేదు. కనీసం 25సెం.మీ. లోతులో భూమిలో పదును ఉండేలా వర్షం పడినప్పుడు ఎరువుతో పాటు పత్తి గింజలు వేస్తే మంచి ఫలితం ఉంటుంది. పత్తితో పాటు అన్ని ఖరీఫ్ పంటలకు 50 కేజీల వరకు మాత్రమే డీఏపీ వాడాలి. అయితే రైతులు పైరు ఎదుగుదల దశలో రెండు మూడు బస్తాలు వరకు డీఏపీని పై పాటుగా చల్లుతున్నారు. దీని వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. పోషకాలు ఉన్న కాంప్లెక్స్ ఎరువులు రెండు బస్తాలు వాడితే సరిపోతుంది. అధిక భాస్వరంతో నష్టం అధిక మోతాదులో భాస్వరం వాడడం వల్ల దిగుబడులపై క్రమంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. తొలి రెండేళ్ల పాటు దిగుబడులు బాగా వచ్చినా ఆ తర్వాత ఎరువులు వాడినా దిగుబడులు రానంతగా నేల దెబ్బతింటుంది. భాస్వరం భూమి లోపలి పొరల్లో నిల్వ ఉండి నేల గట్టిగా మారి పంటలకు నష్టం కలిగిస్తుంది. సమతూల్యత ఏది? ప్రతి మొక్కకూ నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అవసరం. రైతులు అవగాహన లోపంతో కొన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల్లో ఉండని పోషకాలను అదనంగా చేర్చి వాడాల్సిన విషయం రైతులకు తెలియదు. ఉదాహరణకు 28 – 28 – 0, డీఏపీలోను పొటాష్ ఉండదు. ఈ ఎరువులు వినియోగించినప్పుడు పైరు ఎదుగుదల దశలో పైపాటుగా యూరియాను వాడాలి. దుక్కిలో కాంప్లెక్స్ ఎరువులు వాడాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నా పైపాటుగా కూడా వాడుతుండడంతో ఎరువుల్లో పోషకాలు సరిగ్గా మొక్కకు చేరక వృథా అవుతున్నాయి. సూక్ష్మ పోషకాల అవసరాన్ని రైతులు గుర్తించకపోవడంతో పంటల్లో దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. సేంద్రియ ఎరువులు తప్పని సరి రైతులు రసాయన, సేంద్రియ ఎరువులు సగం మోతాదులో వాడాల్సి ఉంది. కేవలం రసాయన ఎరువులే వాడటం వల్ల భూ సారం తగ్గిపోయి నిస్సారంగా మారుతుంది. మొదట్లో బాగానే దిగుబడులు వచ్చినా క్రమంగా భూ సారం తగ్గి దిగుబడులు రావు. సేంద్రియ ఎరువులు వాడడం వల్ల బరువు నేలలు గుళ్ల బారి వేర్లు చక్కగా పెరగటానికి సహాయపడుతుంది. అవగాహన కల్పిస్తున్నాం ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మోతాదుకు మించి ఎరువులు వాడడం వల్ల కలిగే నష్టాన్ని తెలియజేస్తున్నాం. ఏ పంటకు ఏ సమయంలో ఎంత ఎరువు వాడాలి అనేది తెలిస్తే పంట దిగుబడిలో ప్రయోజనం కనిపిస్తుంది. ఆ దిశగా రైతులకు సూచనలు ఇస్తున్నాం. అంతేకాకుండా భూసార పరీక్షలపై అవగాహన కల్పిస్తున్నాం. – ప్రసన్నలక్ష్మి, ఏఓ -
జీరో బడ్జెట్ ఆర్గానిక్ వ్యవసాయం ... లక్షల్లో ఆదాయం
-
తూములూరు రుచులు ఊరు
మొదట అక్కడ సేంద్రియ వ్యవసాయం మొదలైంది. తర్వాత స్త్రీలు సేంద్రియ తినుబండారాలు మొదలుపెట్టారు. రేకుల షెడ్డే వారి వంటశాల. అరవై పైబడిన బసవ పూర్ణమ్మ వారి మేస్త్రి. రాగి లడ్డు, జొన్నలడ్డు, నల్ల అరిసెలు, నువ్వుండలు... ఆ కారం... ఈ పచ్చడి... ఎక్కడా రసాయనాల ప్రస్తావన ఉండదు. ఆముదం, కాటుక, కుంకుమ కూడా తయారు చేస్తున్నారు. వీరికి ఆర్డర్లు భారీగా ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని ఒక చిన్న ఊరు స్త్రీల వల్ల కరకరలాడుతోంది. కళకళలాడుతోంది. 2018లో మొదలైంది ఈ కథ. ‘అమ్మా... మేము పండిస్తున్న సేంద్రియ పంటలకు మంచి డిమాండ్ వస్తోంది. కాని ఇవే సేంద్రియ పదార్థాలతో చిరుతిండ్లు చేయించి అమ్మమని అందరూ అడుగుతున్నారు. నువ్వు తయారు చేస్తావా?’ అని అడిగాడు అవుతు వెంకటేశ్వర రెడ్డి తన తల్లి బసవ పూర్ణమ్మతో. ఆమెకు పల్లెటూరి పిండి వంటలు చేయడం వచ్చు. పండగలకు పబ్బాలకు పల్లెల్లో ఎవరు మాత్రం చేయరు? ‘అదెంత పనిరా చేస్తాను’ అంది. అలా గుంటూరు జిల్లాలోని కొల్లిపరకు ఆనుకుని ఉండే తూములూరు అనే ఊళ్లో సేంద్రియ చిరుతిళ్ల తయారీ మొదలైంది. బసవ పూర్ణమ్మ ఇంటిలో వేపచెట్టు కింద ఉండే పశువుల కొట్టాం కాస్తా వంటల షెడ్డుగా మారింది. ఊళ్లో వంటలు చేయడం ఆసక్తి ఉన్న స్త్రీలకు ఇదొక ఉపాధిగా ఉంటుందని వారిని తోడుకమ్మని ఆహ్వానించింది బసవ పూర్ణమ్మ. అలా ‘విలేజ్ మాల్’ అనే బ్రాండ్తో ‘కొల్లిపర మండల వ్యవసాయదారుల సంఘం’ అనే లేబుల్ కింద తూములూరు చిరుతిండ్ల తయారీ మొదలైంది. రసాయనాలు లేని తిండి ‘మా అబ్బాయీ, ఇంకొంత మంది రైతులు 2015 నుంచి కొల్లిపర చుట్టుపక్కల ఊళ్లలో సేంద్రియ పద్ధతిలో వరి, పసుపు,అరటి, నిమ్మ పండించడం మొదలుపెట్టారు. వీళ్లకు ‘గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం’ అనే సంఘం ఉంది. రైతులంతా కలిసి ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటూ పంటను మంచి రేటుకు అమ్ముతున్నారు. ఆ సమయంలోనే మార్కెట్లో కల్తీ నూనెలతో, పిండ్లతో తయారై వస్తున్న పిండి వంటలు తినలేక సేంద్రియ పిండివంటల కోసం కొందరు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. మా అబ్బాయి ప్రోత్సాహంతో రంగంలోకి దిగాను. మొదట వేరుశనగ ఉండలు చేశాం. నిడదవోలు, మాండ్య లాంటి చోట్ల నుంచి సేంద్రియ బెల్లం తెప్పించి చేశాం. రుచి భలే ఉండటంతో డిమాండ్ వచ్చింది. అలా ఒక్కోటి పెంచుకుంటూ వెళ్లాం. ఇవాళ 30 రకాల చిరుతిళ్లు తయారు చేస్తున్నాం’ అని చెప్పింది బసవపూర్ణమ్మ. రాగిలడ్డు, జొన్న లడ్డు, నల్లబియ్యం అరిసెలు, నువ్వుండలు, పప్పుండలు, జంతికలు, కొబ్బరి లడ్డు, చెక్కలు ఇవి కాకుండా కరివేపాకు కారం, మునగాకు కారం వీరు తయారు చేస్తున్నారు. ఇక మామిడి, గోంగూర పచ్చడి గుంటూరు జిల్లా ప్రత్యేకం. అవీ చేస్తున్నారు. ‘సేంద్రియ నూనె పేరుతో అమ్ముతున్న నూనెలు కూడా కరెక్ట్గా లేవు. చాలా నూనెలు ట్రై చేసి రాజస్థాన్లో ఒక చోట నుంచి మంచి సేంద్రియ నూనె తెప్పించి ఈ పిండివంటలకు వాడుతున్నాం’ అని తెలిపింది బసవ పూర్ణమ్మ. ఆమె అజమాయిషీలో సాగే వంటశాలకు వెళితే చెట్టు కింద కట్టెలపొయ్యి మీద ఆముదం గింజలు కుతకుత ఉడికిస్తుంటారు కొందరు. వరండాలో జీడిపాకం ఆరబెట్టి, ఉండలు చుడుతుంటారు కొందరు. చిరుధాన్యాలతో లడ్డూలు, నల్లబియ్యంతో అరిసెలు చేస్తారు మరికొందరు. అంతా కళకళగా ఉంటుంది. ఆముదం, కుంకుమ ‘మార్కెట్లో సిసలైన ఆముదం దొరకడం లేదు. మా చిన్నప్పుడు ఎవరి ఆముదం వారే తయారు చేసుకునేవాళ్లం. అందుకనే ఆముదం కూడా తయారు చేస్తున్నా. లీటరు 800 పెట్టినా ఎగరేసుకుని పోతున్నారు. పసుపు నుంచి కుంకుమ తయారు చేసే పద్ధతి ఉంది. అలా స్వచ్ఛమైన కుంకుమ తయారు చేస్తున్నా. ఆముదం గింజల నుంచే కాటుక తయారు చేయవచ్చు. అదీ చేస్తున్నా. మా చిరుతిండ్ల కంటే వీటిని ఎక్కువమంది మెచ్చుకుని కొనుక్కుంటున్నారు’ అని తెలిపింది బసవపూర్ణమ్మ. ఈ మొత్తం పనిలో పదిహేను మంది ప్రత్యక్షంగా మరో పదిహేనుమంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. కోటి టర్నోవర్కు... వచ్చే మార్చికంతా కోటి టర్నోవర్కు ఈ పిండి వంటల పరిశ్రమ చేరుకోవచ్చని అంచనా. తూములూరు పిండి వంటలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా కేంద్రాల్లో అమ్ముడుపోతున్నాయి. కొందరు సరుకు తీసుకుని తమ బ్రాండ్ వేసుకుని అమ్ముకుంటున్నారు. సరుకు రవాణ మొత్తం ఆర్.టి.సి. కార్గొ మీద ఆధారపడటం విశేషం. గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల సంఘం నగరాల్లో నిర్వహించే ప్రదర్శనల్లో తూములూరు పిండివంటల స్టాల్ కచ్చితంగా ఉంటోంది. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం నిర్వహించే సమావేశాలకూ ఈ పిండివంటలనే ఆర్డరు చేస్తున్నారు. ‘ఈ రోజుల్లో ఆడవాళ్లకు పిండివంటలు చేసుకోవటం కష్టమవుతోంది. దీనికితోడు రసాయన అవశేషాలు లేని ఆహారపదార్థాలు దొరకటం దుర్లభంగా తయారైంది. అందుకే మాకు డిమాండ్ వస్తోంది. మరింతమంది రైతులను కలుపుకుని సేంద్రియ పంటలతో పిండివంటలను పరిశ్రమ స్థాయికి చేర్చాలనే ఆలోచన సంఘ సభ్యుల్లో ఉంది. అప్పుడు మా వంటశాలను విస్తరించాల్సి వస్తుంది’ అని తెలిపింది బసవ పూర్ణమ్మ. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
ఆర్గానిక్ మహోత్సవ్ అదిరింది
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో నిర్వహించిన అంతర్జాతీయ ఆర్గానిక్ మహోత్సవ్లో రూ.140 కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు కుదిరాయి. ఈ నెల 2వ తేదీ నుంచి ఆదివారం వరకు మూడు రోజులపాటు నగరంలోని గాదిరాజు ప్యాలెస్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ సంయుక్తంగా ఈ భారీ మేళాను నిర్వహించాయి. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, వినియోగదారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే లక్ష్యంతో రాష్ట్రంలో తొలిసారిగా దీనిని ఏర్పాటు చేశారు. ఈ మేళాలో సేంద్రియ విధానంలో పండించిన వరి, చిరుధాన్యాలు, పప్పు దినుసులు, బెల్లం, మామిడి పండ్లు, తేనె తదితర సేంద్రియ సహజ ఉత్పత్తులను 123 స్టాళ్లలో ప్రదర్శనకు ఉంచారు. ప్రత్యేకంగా ఒక ఆర్గానిక్ ఫుడ్ కోర్టును కూడా ఏర్పాటు చేశారు. సందర్శకులు వివిధ సేంద్రియ వంటకాలను ఆరగించి సంతృప్తి చెందారు. బహుళజాతి సంస్థల ప్రతినిధులు రాక దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు సింగపూర్ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్, బహుళజాతి సంస్థల ప్రతినిధులు, రైతులు, వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు ప్రతినిధులు, చిరుధాన్యాల ఉత్పత్తి, సాగుదారులు, కొనుగోలుదారులు భారీగా హాజరయ్యారు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై సెమినార్లు, వర్క్షాపులు నిర్వహించారు. ఈ మేళాకు మూడు రోజుల్లో 22 వేల మందికి పైగా సందర్శకులు వచ్చారు. 12కు పైగా సంస్థలు రైతుల తరఫున రైతు సాధికార సంస్థతో అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకున్నాయి. వీటిలో బెంగళూరుకు చెందిన ఫలద ఆగ్రో ప్యూర్ అండ్ ష్యూర్ సంస్థ రూ.90 కోట్లు, సాగ్లిష్ హార్వెస్ట్ రూ.10 కోట్లు, సింగపూర్కు చెందిన జీఎన్ ఆర్గానిక్ రూ.10 కోట్లతో పాటు ఈ–మిల్లెట్స్, స్వచ్ఛ మిల్లెట్స్, బిగ్ బాస్కెట్, గాట్ కాటన్ తదితర సంస్థలు వెరసి రూ.140 కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రకృతి వ్యవసాయ రైతులతో ప్రతినెలా ఉత్పత్తుల కొనుగోలుకు ముందుకొచ్చాయి. జీవనశైలి వ్యాధులకు దూరంగా ఉండాలంటే జీవన విధానం మార్చాలనే ఇతివృత్తంతో సేంద్రియ పంటలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆర్గానిక్ మహోత్సవ్ ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. ఆర్గానిక్ మేళాకు హాజరైన ఆయా సంస్థల ప్రతినిధులకు నిర్వాహకులు సరి్టఫికెట్లు అందజేశారని రైతు సాధికార సంస్థ సీనియర్ థిమాటిక్ లీడ్ ప్రభాకర్ ‘సాక్షి’కి తెలిపారు. -
ప్రకృతి సాగే పరిష్కారం!
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలను ఆరోగ్యంగా ఉంచాలి. 98% ప్రాణవాయువును మొక్కలే ఇస్తున్నాయి. 80% ఆహారం పంటల ద్వారానే వస్తోంది. భూతాపోన్నతి కారణంగా విజృంభిస్తున్న పురుగులు, తెగుళ్ల వల్ల దిగుబడి 40% మేరకు దెబ్బతింటున్నది. ఈ నష్టం విలువ ఏడాదికి 22,000 కోట్ల డాలర్లని ఎఫ్.ఎ.ఓ. లెక్కగట్టింది. మన దేశంలో కత్తెర పురుగు, నల్ల తామర పురుగు, రుగోస్ తెల్లదోమ.. వంటివి ఇందుకు ఉదాహరణలు. అయితే, పొలాలు, పర్యావరణ వ్యవస్థలకున్న ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యంపై ఈ నష్టం తీవ్రత ఆధారపడి ఉంటుందని ఎఫ్.ఎ.ఓ. స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో.. సాగు పద్ధతి మార్చుకుంటే వీటి తీవ్రత తగ్గినట్లు ఏపీ రైతు సాధికార సంస్థ అధ్యయనంలో తేలింది. రసాయనిక వ్యవసాయంలో పురుగుల తీవ్రత, దిగుబడి నష్టం 50 శాతం పైగా ఉంటే.. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో 10% మాత్రమే. ప్రధాన పంట సాగుకు ముందు 30 రకాల పచ్చిరొట్ట (నవధాన్య) పంటలు సాగు చేసే రైతుల జీవవైవిధ్య క్షేత్రాల్లో ఒక్కో ఏడాది గడిచేకొద్దీ చీడపీడల బెడద అంతకంతకూ తగ్గుతోందని కూడా ఈ అధ్యయనం చెబుతోంది. ఈ నెల 12న ‘అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం. మన దేశంలో ఇటీవల సంవత్సరాల్లో పంటలకు పెను నష్టం కలుగజేస్తున్న కత్తెర పురుగు, నల్ల తామర పురుగు, రుగోస్ తెల్లదోమ.. వంటి పురుగులే ఇందుకు ఉదాహరణలు. రసాయనిక వ్యవసాయం చేసే రైతులకు ఈ పురుగులు తీవ్ర నష్టం కలిగిస్తుండగా, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించే రైతుల పొలాల్లో ఈ పురుగుల తీవ్రత, నష్టం చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయాన్ని అమలుచేస్తున్న రైతు సాధికార సంస్థ అధ్యయన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 30 రకాల పచ్చిరొట్ట పంటలు వేసిన తర్వాత ఆహార/వాణిజ్య పంటలు సాగు చేయటంయటం వల్ల వాతావరణ మార్పులను, చీడపీడలను తట్టుకొని నిలబడి మంచి దిగుబడులను ఇచ్చే శక్తి ప్రకృతి సేద్య క్షేత్రాలకు పెరుగుతున్నట్లు అర్థం అవుతున్నది. రైతులు వచ్చే ఖరీఫ్లో సాగు చేసే ప్రధాన పంటకు చీడపీడల బెడద తక్కువగా ఉండాలన్నా, భూసారం పెరగాలన్నా.. ఇప్పుడే పచ్చిరొట్ట పంటలు సాగు చేయాలి. ఏ జనుమో, జీలుగో వేస్తే చాలదు.. ముప్పై పంటల విత్తనాలను చల్లేయాలి అంటున్నది ఏపీ రైతు సాధికార సంస్థ. మిత్ర పురుగులే రైతుల సైన్యం ప్రకృతి సేద్యం దిగుబడి సాధించటంతో పాటు అనేక ఇతర ప్రయోజనాలు కూడా నెరవేరుతున్నాయి. జీవవైవిధ్యం. ఒకే పంట వేయటం కాదు. అనేక పంటలు కలిపి సాగు చేయటం అనేది ప్రకృతి సేద్యంలో ఓ ముఖ్యమైన మూలసూత్రం. బహుళ పంటలు ఉన్న పొలంలో పురుగులు గానీ, తెగుళ్లుగానీ అదుపులో ఉంటాయి. రకరకాల పంటలున్న చేనులో అనేక రకాల మిత్ర పురుగులు మనుగడ సాధ్యపడుతుంది. రసాయనిక పురుగుమందులు వాడే పొలాల్లో శత్రు పురుగులతో పాటు ఈ మిత్ర పురుగులు కూడా నాశనమవుతాయి. కాబట్టి, చీడపీడలు ఉధృతం అవుతున్నాయి. ప్రకృతి వ్యవసాయంలో మిత్ర పురుగులే రైతుల సైన్యం. ప్రకృతి సేద్యం చేయటంతోపాటు.. ఏడాది పొడవునా ఇటువంటి బహుళ పంటలతో భూమిని కప్పి ఉంచితే (365 డేస్ గ్రీన్ కవర్) ఇంకా మంచిది. ఈ పద్ధతులు పాటించే ప్రకృతి సేద్య క్షేత్రాల్లో చీడపీడల సమస్య చాలా తక్కువగా కనిపిస్తోందని ఏపీ రైతు సాధికార సంస్థ తెలిపింది. ముఖ్యంగా, కత్తెర పురుగు, నల్లతామర వంటి పురుగుల విషయంలో ఇది ప్రస్ఫుటంగా నమోదైంది. 90% తగ్గిన కత్తెర పురుగు విజయనగరం, ప.గో., గుంటూరు జిల్లాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్న 49 ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు, మరో 49 రసాయనిక వ్యవసాయ క్షేత్రాల్లో కత్తెర పురుగు తీవ్రతపై ఏపీ రైతు సాధికార సంస్థ అధ్యయనం చేసింది. కత్తెర పురుగు తీవ్రత పురుగుమందులు చల్లిన పొలాల్లో 5% మాత్రమే తగ్గితే, ప్రకృతి సేద్య పొలాల్లో 90% తగ్గిందని ఈ అధ్యయనంలో తేలింది. నల్ల తామర: ఇక్కడ 9.87% అక్కడ 57% లక్షల ఎకరాల్లో మిరప పంటకు గతంలో నష్టం కలిగింది. రసాయనిక పురుగుమందులు ఎన్ని వాడినా నల్లతామర తగ్గలేదు. కానీ ప్రకృతి వ్యవసాయంలో నియంత్రణలోకి వచ్చింది. ఏపీ రైతుసాధికార సంస్థ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లోని 70 ప్రకృతి వ్యవసాయ మిరప తోటల్లో, 73 రసాయనిక మిరప తోటల్లో అధ్యయనం చేసింది. నల్లతామర కలిగించిన నష్టం ప్రకృతి సేద్య మిరప పొలాల్లో 9.87% కాగా, రసాయనిక మిరప పొలాల్లో 57.53% వరకు ఉందని గుర్తించారు. ప్రకృతిసేద్యం చేస్తున్న మిరప పొలాల్లో అక్షింతల పురుగులు, క్రైసోపెర్ల అనే రెక్కల పురుగులు వంటి మిత్ర పురుగులు విస్తారంగా నల్లతామర పురుగుల్ని తింటూ నియంత్రించినట్లు కనుగొన్నారు. రసాయనిక పురుగుమందులు చల్లే మిరప పొలాల్లో ఇవి కనిపించలేదు. పంటలకొద్దీ మిత్రపురుగులు పీఎండీఎస్లో నవధాన్య పంటలుగా ఎన్ని ఎక్కువ పంటలు సాగు చేస్తే ఆ తర్వాత సీజన్లో మిత్రపురుగుల సంఖ్య ఎక్కువగా ఉండి చీడపీడల బెడద తగ్గినట్లు రైతు సాధికార సంస్థ గుర్తించింది. వేర్వేరు జిల్లాల్లో కొన్ని పొలాల్లో 27 రకాలు, మరికొన్ని పొలాల్లో 19 రకాలు, ఇంకొన్ని పొలాల్లో 9 రకాల నవధాన్య పంటలను సాగు చేయించారు. 9,19 రకాలు సాగు చేసిన పొలాల్లో కన్నా 27 రకాలు సాగు చేసిన పొలాల్లో మిత్ర పురుగుల సంఖ్య అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఎన్ని ఎక్కువ పంటలు సాగు చేస్తే అన్ని ఎక్కువ మిత్రపురుగులుంటాయి. పీఎండీఎస్తో తగ్గుతున్న చీడపీడల తీవ్రత ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా వానకు ముందే 30 రకాల ఆహార ధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు తదితర పంటల విత్తనాలను (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్– పీఎండీఎస్) వానకు ముందే విత్తితే.. భూమి సారవంతం అవుతుంది. భూమి తేమగా ఉంటే నేరుగా విత్తనాలు వేస్తున్నారు. తేమ లేకపోతే విత్తనాలకు మట్టి, ఘనజీవామృతం తదితరాలను పట్టించి ‘విత్తన గుళికలు’ (సీడ్ పెల్లెట్స్) తయారు చేసి వేసవిలోనే వానకు ముందే విత్తుతున్నారు. ఇది ఏపీలో ముఖ్యంగా అనంతపురం జిల్లా కేంద్రంగా ప్రకృతి వ్యవసాయదారులు అనుసరిస్తున్న వినూత్న ఆవిష్కరణ. ఈ ఏడాది ఇతర జిల్లాల్లో కూడా ఈ పద్ధతిని రైతులకు ఆర్బీకేల ద్వారా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు పరిచయం చేస్తున్నారు. వరుసగా రెండేళ్లు, అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు వేసవిలో 30 రకాల పీఎండీఎస్ పంటలు పండించిన పొలాల్లో ఆ తర్వాత సీజన్లో సాగు చేసిన 123 క్షేత్రాల్లో చీడపీడల బెడదపై అధ్యయనం చేశారు. మూడేళ్లుగా వేసవిలో పీఎండీఎస్ పంటలు సాగు చేసిన పొలాల్లో అన్ని రకాల చీడపీడల బెడద రసాయనిక పొలాలతో పోల్చినప్పుడు 66 శాతం తగ్గిపోయినట్లు గుర్తించటం విశేషం. రైతు దేవుళ్ల చేతుల్లోనే భవిత! 50–60 ఏళ్ల విషపూరిత వ్యవసాయం వల్ల మన భూములు, వాతావరణం, గాలి, నీరు నాశనమయ్యాయి. క్లైమెట్ ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. ఆరో ప్రళయం రాబోతోంది. పోషకార/ఆహార భద్రతకూ ముప్పు రానుంది. దీని నుంచి రక్షించగల శక్తి ఒక్క రైతు చేతులోనే ఉంది. రసాయనిక వ్యవసాయం వల్ల వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించడంతో పాటు యావత్తు భూగోళాన్ని చల్లబరిచే శక్తి కూడా ప్రకృతి/పునరజ్జీవ వ్యవసాయానికి ఉంది. రసాయనాలు వాడకుండా పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేయటంతో పాటు.. 30 రకాల నవధాన్య (పీఎండీఎస్) పంటల సాగును వేసవిలో, పంట సీజన్లకు మధ్యలో ప్రతి పొలంలోనూ సాగు చేయాలి. ఇన్ని పంటలు ఎందుకంటే ప్రతి పంట మొక్క వేర్ల దగ్గర వేర్వేరు రకాల మేలు చేసే సూక్ష్మజీవరాశి పెరుగుతోంది. ఎన్ని ఎక్కువ పంటలు వేస్తే అన్ని ఎక్కువ రకాల సూక్ష్మజీవరాశి తిరిగి భూమిలోకి చేరుతున్నది. మట్టిలో సూక్ష్మజీవుల వైవిధ్యం ఎంత ఎక్కువగా ఉంటే మన భూమి అంత సారవంతమవుతోంది. అంత శక్తివంతమవుతోంది. అంతగా చీడపీడల బెడద తగ్గుతుంది. కరువును, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడి 20–30% అధిక దిగుబడులు వస్తున్నాయి. ప్రతి పొలంలో పీఎండీఎస్ పంటలు సాగు చేయాలి. వాన నీరు పూర్తిగా పొలాల్లో ఎక్కడికక్కడే పూర్తిగా ఇంకుతుంది. ఇది అనంతపురం రైతు దేవుళ్ల అద్భుత ఆవిష్కరణ. ఈ ఏడాది ఏపీలో ఇతర జిల్లాల్లో కూడా దీన్ని అమలు చేస్తున్నాం. 10 వేల మంది రైతులను మాస్టర్ ట్రైనర్లుగా తీర్చిదిద్దాలనేది లక్ష్యం. అనేక ఇతర రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశాలు కూడా మన వైపు చూస్తున్నాయి. – టి. విజయకుమార్, ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ చిరుధాన్యాల శుద్ధి, విలువ జోడింపు, మార్కెటింగ్పై ఈ నెల 18–19 తేదీల్లో పులివెందులలోని ఫుడ్సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీ ఆవరణలో ఔత్సాహికులకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ (ఐఐపిఎం) శిక్షణ ఇవ్వనుందని లైవ్లిహుడ్ ఇంక్యుబేషన్ సెంటర్ కోర్సు డైరెక్టర్ డా. నబీరసూల్ తెలిపారు. ఎఫ్.పి.ఓలు, వ్యవసాయ, ఉద్యాన అధికారులు, చిరుధాన్యాల వ్యాపారులు, గ్రామీణ యువతకు ఇది ఉపయోగకరం. భోజన వసతి సదుపాయాలు ఉన్నాయి. ఫీజు రూ. 5 వేలు. వివరాలకు.. డా. నబీరసూల్ – 630297 72210 -పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
ప్రకృతిని, ఆవులను నమ్ముకున్నారు.. 40 సెంట్లు.. రూ.3 లక్షలు!
ఈ రైతు దంపతులు ప్రకృతిని, తనకున్న రెండు ఆవులను నమ్ముకున్నారు.. పేడ, గోమూత్రంతో ఘనజీవామృతం, జీవామృతాలను తయారు చేసుకొని ఏడేళ్లుగా శ్రద్ధగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు.. వీరి స్వయం కృషికి పంచభూతాలు సాయం చేస్తున్నాయి. మామిడి తోట మధ్యలో 40 సెంట్లలో ఫిబ్రవరి నుంచి అంతర పంటలుగా కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తూ ప్రతి వారం మంచి ఆదాయం పొందుతున్నారు. అందుకే దీన్ని ‘ఏటీఎం నమూనా’గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రూ. 1,20,000 ఆదాయం వచ్చింది. కేవలం ఈ అంతరపంటల ద్వారా మొత్తం రూ.3 లక్షలకు పైగా ఆదాయం పొందే అవకాశం ఉందంటున్న నారాయణ, పార్వతి దంపతుల కృషిపై ‘సాక్షి’ ఫోకస్.. స్వయంకృషితో పాటు ప్రకృతిని నమ్ముకుంటే రైతు సుభిక్షంగా ఉంటాడనడానికి హెచ్. నారాయణ, పార్వతి దంపతులే నిదర్శనం. వీరి స్వస్థలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మల్లాపురం గ్రామం. తమకున్న 3.70 ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. అంతర పంటల్లోనూ మంచి ఆదాయం తమకున్న రెండు నాటు ఆవులను సంరక్షిస్తూ పేడ, గో మూత్రంతో ద్రవ జీవామృతం, ఘన జీవామృతం, నీమాస్త్రం తయారు చేసుకొని పంటలకు వాడుతున్నారు. స్వయం కృషికి తోడుగా అతి తక్కువ పెట్టుబడితోనే మామిడిలో, అంతర పంటల్లోనూ మంచి ఆదాయం ఆర్జిస్తూ ఇతర రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. మామిడి తోటలోని 40 సెంట్ల స్థలాన్ని ఫిబ్రవరి 13న ఎంపిక చేసుకొని బోదెలు సిద్ధం చేసుకున్నారు. ఐదు వరసల్లో 5 రకాల పంటలను విత్తుకున్నారు. గోరుచిక్కుడు, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, అలసంద, మొక్కజొన్నతో పాటు మెంతాకు, కొత్తిమీర, గోంగూర సాగు చేస్తున్నారు. బోరు నీటిని అందిస్తున్నారు. ఘనజీవామృతం వేస్తున్నందు వల్ల నీరు కూడా ఎక్కువ అవసరం రావటం లేదు. ఒక్క తడి ఇస్తే 15–20 రోజులు ఉంటుంది. కెమికల్ వేసిన పొలం అయితే ఐదారు రోజులకే నీరు మళ్లీ అడుగుతుంది. తోట పనులను నారాయణ, ఆయన భార్య కలసి చేసుకుంటున్నారు. ప్రతి శుక్రవారం మార్కెట్లో, ఇంటి దగ్గర కూరగాయలు అమ్ముతున్నారు. గోరుచిక్కుడు ద్వారా 30 వేలు ఇప్పటివరకు గోరుచిక్కుడు (చోలా కాయల) ద్వారా రూ.30 వేలు, ముల్లంగి ద్వారా రూ.50 వేలు, కొత్తిమీరలో రూ.20 వేలు, మెంతాకు, గోంగూరలలో మరో రూ.20 వేలు ఆదాయం వచ్చింది. ముల్లంగి, ఆకుకూరలు తీసేవి తీస్తూ ఉంటే మళ్లీ విత్తుతున్నారు. మొక్కజొన్న, అలసంద, క్యారెట్, బీట్రూట్ పంటలు మరో ఒకటిన్నర నెలల్లో చేతికొస్తాయి. క్యారెట్, బీట్రూట్ మంచి ధర పలుకుతాయని, మొత్తంగా 40 సెంట్లకు రూ.3 లక్షలకు పైగానే ఆదాయం వస్తుందని, ఇదంతా నికరాదాయమేనని నారాయణ ధీమాగా చెబుతున్నారు. రూ. 1,500లతో విత్తనాలు కొనటం తప్ప వేరే ఏ ఖర్చూ లేదన్నారు. రసాయనాలు వేయకుండా పంటలను పసిబిడ్డల్ని చూసుకున్నట్లు చూసుకుంటున్నామని నారాయణ చెప్పారు. అంతర పంటల ద్వారా నిరంతరం ఆదాయం వస్తోందని చెబుతూ.. ఇదే ఏటీఎం మోడల్ పంటల వల్ల లాభం అన్నారు. తనను చూసి తన పక్క పొలం రైతు కూడా 20 సెంట్లలో ఈ నమూనాలో పంటలు వేశాడన్నారు. క్లస్టర్లో మరో 25 మంది రైతులు వేశారన్నారు. మామిడిలోనూ మంచి ఆదాయం మామిడి పంటను కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే నారాయణ దంపతులు సాగు చేస్తున్నారు. ఘనజీవామృతం, జీవామృతాన్ని వినియోగిస్తూ మంచి దిగుబడి, ఆదాయం పొందుతున్నారు. గత ఏడాది మామిడి 8 టన్నుల దిగుబడి రాగా రూ.2 లక్షల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఇప్పటికే 6 టన్నులు పంట కోత కోశారు. మరో 3 టన్నులు పంట చేతికొస్తుంది. మామిడి ద్వారా రూ.3 లక్షలకు పైగా ఆదాయం వస్తుందని నారాయణ చెబుతున్నారు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన పండ్లు, కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటున్నాయని, రుచిగా ఉంటున్నాయని వినియోగదారులు సంతోషంగా మంచి ధరకు తీసుకుంటున్నారని నారాయణ, పార్వతి ఆనందంగా చెబుతున్నారు. వీరి పొలాన్ని ఇటీవల పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ స్పెషల్ ఛీప్ సెక్రటరీ బి.రాజశేఖర్, ఏపీ రైతు సాధికార సంçస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయ్కుమార్, అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి తదితరులు సందర్శించి అభినందించారు. ప్రకృతి వ్యవసాయం ఎంతో మేలు నేను అయిష్టంగానే ప్రకృతి వ్యవసాయాన్ని ఏడేళ్ల క్రితం మొదలు పెట్టాను. డీపీఎం లక్ష్మానాయక్, మాస్టర్ ట్రైనర్ శివశంకర్ అన్ని విషయాలూ అర్థమయ్యేలా చెప్పి సహకరించారు. ఘన, ద్రవ జీవామృతాలు తయారు చేసుకొని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. పంటలకు ఎలాంటి తెగుళ్లు, వైరఃస్లు రాలేదు. పండ్ల తోటల్లో కూడా ఐదారు రకాల కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తే ఒకదాని తర్వాత ఒకటి మనకు పంట చేతికొస్తుంది. మంచి నికరాదాయం వస్తుంది. ఇది రైతులకు ఎంతో మేలైన పద్ధతి. భూమి కూడా గుల్లబారి బాగుంటుంది. వాన నీరు బాగా ఇంకుతుంది. సహజ సిద్ధమైన ఎరువులతో పండించిన కూరగాయలు, ఆకుకూరలు తింటే మనిషి ఆరోగ్యం కూడా బాగుంటుంది. నన్ను చూసి కొందరు ప్రకృతి వ్యవసాయం ప్రారంభించారు. రైతులంతా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి. – హెచ్.నారాయణ (95504 84675), ప్రకృతి వ్యవసాయదారుడు, మల్లాపురం గ్రా., కళ్యాణదుర్గం మం., అనంతపురం జిల్లా స్వయంగా చూస్తే గానీ నమ్మలేరు.. పది రకాల కూరగాయలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తూ అనంతపురం జిల్లాలో రైతులు సుమారు 400 మంది అత్యంత ఆశ్చర్యకరమైన రీతిలో అధికాదాయం పొందుతున్నారు. స్వయంగా వచ్చి చూస్తే గానీ ఇంత ఆదాయం వస్తున్నదని నమ్మకం కలగదు. నారాయణ, పార్వతి రైతు దంపతులు తమ మామిడి తోటలో 40 సెంట్లలో అంతర పంటలుగా కూరగాయలను సాగు చేస్తూ చక్కని ఆదాయం పొందుతున్నారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటికి రూ. 1,20,000 ఆదాయం వచ్చింది. మరో రెండు నెలల్లో ఈ ఆదాయం రూ. 3 లక్షలకు పెరుగుతుందని రైతు ధీమాగా ఉన్నారు. జిల్లా కలెక్టర్ గౌతమి, ఏపీ రైతుసాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్చైర్మన్ టి. విజయకుమార్, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ స్పెషల్ ఛీప్ సెక్రటరీ బి.రాజశేఖర్ కూడా ఇటీవల నారాయణ తోటను సందర్శించారు. అంత ఆదాయాన్ని పొందే అవకాశాలు ప్రకృతి వ్యవసాయంలో ఉన్నాయన్నది ఈ తోటలను స్వయంగా చూసిన వారికి అర్థం అవుతుంది. వారానికి రెండు, మూడు సార్లు కూరగాయలను విక్రయిస్తూ నిరంతరం ఆదాయం పొందుతున్నారు. అందువల్లనే ఈ నమూనాను ‘ఏటీఎం మోడల్’ అని పిలుస్తున్నాం. – లక్ష్మానాయక్ (83310 57583), ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్, అనంతపురం జిల్లా - ఈదుల శ్రీనివాసులు, సాక్షి, కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా -
సేంద్రీయ వ్యవసాయంపై అక్షయ్ కుమార్,వీరేంద్ర సెహ్వాగ్ పెట్టుబడులు!
సేంద్రీయ ఎరువులతో సేంద్రీయ పద్దతులతో పండించే పంటనే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు. ఇప్పుడీ ఆర్గానిక్ ఫార్మింగ్పై బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్,టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్లు కోట్లలో పెట్టుబడులు పెట్టారు. టూబ్రదర్స్ ఆర్గానిక్ ఫార్మ్స్ (టీబీఓఎఫ్) అనే స్టార్టప్ సంస్థ ఫండింగ్ రౌండ్లో ఇన్వెస్ట్ చేశారు. ఈ సందర్భంగా..అందరికీ మెరుగైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం టూబ్రదర్స్ ఆర్గానిక్ ఫార్మ్స్ (టీబీఓఎఫ్) ప్రయాణంలో భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాను. సేంద్రీయ వ్యవసాయం ద్వారా గ్రామీణ వర్గాల సాధికారత కోసం సంస్థ దృష్టి ,నిబద్ధతను నమ్ముతున్నాను" అని అక్షయ్ కుమార్ అన్నారు. ఆరోగ్యకరమైన సేంద్రీయ ఆహారాన్ని ఉత్పత్తి చేయడం, గ్రామీణ రంగాన్ని అభివృద్ధి చేయడంపై కంపెనీ బలమైన ప్రాధాన్యత కారణంగా తాను tbofలో పెట్టుబడి పెట్టానని ఆయన పేర్కొన్నారు. రైతులు, సమాజంపై సానుకూల ప్రభావాన్ని సృష్టించే దిశగా సంస్థ నిబద్ధత తనను ప్రేరేపించిందని కాబట్టే పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమైనట్లు వీరేంద్ర సెహ్వాగ్ తెలిపారు. -
మలేసియాలో ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి గ్రామానికి: రారాజులా లాభాల పంట
విదేశంలో ఉద్యోగం.. ఐదెంకల ఐటీ ఉద్యోగం. అయినా ఇవేవీ సంతోషాన్ని ఇవ్వలేదు. అందుకే లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి తనకెంతో ఇష్టమైన రైతుగా మారి పోయాడు. మలేషియాలో ఉద్యోగానికి బైబై చెప్పేసి ఆర్గానిక్ ఫామింగ్ (సేంద్రీయ వ్యవసాయం) ద్వారా లక్షలు సంపాదిస్తున్నాడు. ఒడిశాలోని రాయగడ జిల్లాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సత్య ప్రబిన్ వినూత్న వ్యవసాయ పద్ధతులతో విజయం సాధించి సమాజానికి ప్రేరణగా నిలుస్తున్నాడు. బీటెక్ పూర్తి చేసిన సత్య, మలేషియా ఐటీ కంపెనీలో టెకీగా 11 ఏళ్లు పని చేశాడు. నెలకు రూ.2 లక్షల వేతనం సౌకర్య వంతమైన జీవితం. అయినా అతనికి వ్యవసాయం మీద ఉన్న మక్కువ పోలేదు. ముఖ్యంగా తన చిన్నతనంలో తండ్రి జీవనోపాధి కోసం కూరగాయలు పండించేవారు. అది అతని మనసులో ఎపుడూ మెదులుతూ ఉండేది. వన్ ఫైన్ మార్నింగ్ ఇక ఉద్యోగాన్ని వదిలేసి గ్రామానికి వెళ్లి వ్యవసాయాన్ని మొదలు పెట్టాలనుకున్నాడు. క్షణం ఆలస్యం చేయ కుండా చకచకా పనులన్నీ చక్క బెట్టుకుని తనకున్న అభిరుచుని నెరవేర్చుకునేందుకు రంగంలోకి దిగిపోయాడు. 2020లో సొంత గ్రామానికి వచ్చేసి 34 ఎకరాల భూమిలో డ్రిప్ సిస్టమ్, సేంద్రీయ ఎరువులు వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగించి వ్యవసాయం ప్రారంభించాడు. అంతే నమ్ముకున్న భూమి అతనికి గొప్ప విజయాన్ని అందించింది. సేంద్రీయ పద్ధతుల్లో భూమి సారాన్ని కాపాడుకుంటూ, వ్యవసాయంలో చక్కటి ఫలాలను అందుకుంటూ మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలిచాడు. సంకల్పం, పట్టుదల, వ్యవసాయంపై మక్కువతో కష్టపడి పనిచేస్తే విజయం తప్పక వరిస్తుందని ఆయన చేసి చూపించాడు. రైతుగా సత్య సాధించిన విజయాలు సమాజంలోని ఇతరులకు ఆదర్శంగా నిలవడమే కాదు ఆయన వ్యవసాయ విధానం అద్వితీయంగా, వినూత్నంగా ఉండడంతో స్థానికుల అభిమానాన్ని, అధికారుల దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు తన గ్రామం, చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు 60 మందిని ఎంచుకుని వ్యవసాయాన్ని ముందుకు నడిపించాడు. తద్వారా అనేక కుటుంబాలకు అండగా నిలబడటమే కాదు, స్థానిక ఆర్థికవ్యవస్థకుగణనీయమైన ఎనలేని సహకారాన్ని అందించాడు. కలెక్టర్లు, ఇతర స్థానిక ఉ ఉన్నతాధికారులు పలువురి ప్రశంసలందుకున్నాడు. చుట్టుపక్కల సన్నకారు రైతులంతా సత్యను ఆదర్శంగా తీసుకుని సేంద్రియ ఎరువులతో తమ భూమిలో కూరగాయలు పండించి స్వయం సమృద్ధి సాధించి ఆర్థికస్థితిని మెరుగు పరుచుకోవాలని పిలుపునిచ్చారు. సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలతో అందరి ఆరోగ్యానికి తోడ్పటమే కాదు, స్థానికి ఆర్థిక పరిపుష్టికి తన వంతు సాయం అందించడం విశేషంగా నిలిచింది. వ్యవసాయంలో రారాజుగా నిలవాలన్న ఆత్మవిశ్వాసమే ఆయనను ఈరోజు విజయ వంతమైన రైతుగా నిలబెట్టి, ఎందరికో స్ఫూర్తి దాయకంగా నిలిచింది. -
గ్రీన్ లైఫ్: అవును... మిద్దెలపై డబ్బులు కాస్తాయి!!
ఆరోజు మార్కెట్కు వెళ్లి కూరగాయలు కొని ఇంటికి తీసుకువచ్చింది కేరళలోని కొట్టాయంకు చెందిన రెమాదేవి. కూరగాయలను కడుగుతున్నప్పుడు ఒకరకమైన రసాయనాల వాసన వచ్చింది. ఆ సమయంలో పిల్లలు, వారి భవిష్యత్ గుర్తుకు వచ్చింది. అదే సమయంలో తాను ఒక నిర్ణయం తీసుకుంది... ‘ఇంటికి అవసరమైన కూరగాయలు ఇంటిదగ్గరే పండించుకుంటాను’ అలా మిద్దెతోటకు శ్రీకారం చుట్టింది రెమాదేవి. అమ్మమ్మ రంగంలోకి దిగింది. సేంద్రియ వ్యవసాయంలో అమ్మమ్మది అందెవేసిన చేయి. ఆమె సలహాలు, సూచనలతో మిద్దెతోట పచ్చగా ఊపిరిపోసుకుంది. కొంత కాలానికి... ఇంటి అవసరాలకు పోగా మిగిలిన కూరగాయలను అమ్మడం మొదలుపెట్టారు. తమకు ఉన్న మరో రెండు ఇండ్లలోనూ మిద్దెతోట మొదలుపెట్టింది రెమాదేవి. అలా ఆదాయం పెరుగుతూ పోయింది. మిద్దెతోటపై ఆసక్తి ఉన్న వాళ్లు రెమాను రకరకాల సలహాలు అడిగేవారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ‘రెమాస్ టెర్రస్ గార్డెన్’ పేరుతో యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది. ‘మిద్దెతోటకు పెద్దగా ఖర్చు అక్కర్లేదు’ అని చెబుతూ ఆ తోటపెంపకానికి సంబంధించిన ఎన్నో విషయాలను అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు చెబుతుంది. వంటగది వ్యర్థాలతో మనకు కావల్సిన ఎరువులు ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోల ద్వారా చూపుతుంది. దీంతోపాటు సోషల్ మీడియా ఫార్మింగ్ గ్రూప్స్ ద్వారా విత్తనాలు అమ్ముతుంది రెమాదేవి. కేవలం విత్తనాల అమ్మకం ద్వారానే నెలకు 60,000 రూపాయల ఆదాయం అర్జిస్తుంది. రెమాదేవిని అనుసరించి ఎంతోమంది మిద్దెతోటలను మొదలుపెట్టి రసాయన–రహిత కూరగాయలను పండించడమే కాదు, తగిన ఆదాయాన్ని కూడా గడిస్తున్నారు. మంచి విషయమే కదా! -
ఊరంతా బాగుండాలి.. అందులో నేనుండాలి! ఎమ్మే బీఈడీ చదివి ఇప్పుడిలా..
ఎమ్మే బీఈడీ చదివినా ప్రకృతి వ్యవసాయంపై మక్కువ.. ఎకరం కౌలు పొలంలో 20 రకాలకుపైగా కూరగాయల సాగు.. గ్రామస్తులకు, స్కూలు పిల్లల మధ్యాహ్న భోజనానికి కూరగాయలు సరఫరా.. తిరుపతి జిల్లా ఎస్బీఆర్ పురం వాసి కోనేటి శైలజ ఆదర్శ సేద్యం ఎమ్మే బీఈడీ చదివినా ఉద్యోగం కోసం ఎదురు చూడలేదు. తన కుటుంబంతో పాటు... గ్రామంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. ఎకరం భూమిని లీజుకు తీసుకొని అందులో 20 రకాలకుపైగా కూరగాయలు, ఆకుకూరలు సాగుచేస్తున్నారు. పండించిన పంటను మార్కెట్లో విక్రయించకుండా... తన ఊర్లో వారికి, అంగన్వాడీ, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు కోనేటి శైలజ. శైలజ స్వస్థలం తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్బీఆర్పురం గ్రామం. పుట్టినిల్లు.. మెట్టినిల్లు కూడా అదే ఊరు. అందరూ వ్యవసాయంపై ఆధారపడ్డవారే. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఎంఏ, ప్రైవేటు కాలేజ్లో బీఈడీ పూర్తి చేశారు. వ్యవసాయదారుడు మాధవ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సొంత భూమిలో మామిడి తోట సాగులో ఉంది. ఏపీ రైతు సాధికార సంస్థ ప్రోత్సాహంతో శైలజ ప్రకృతి సేద్యంలో కూరగాయల సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలోనే ఎకరం భూమిని లీజుకు తీసుకున్నారు. గత ఏడాది నవంబర్లో 20 రకాల కూరగాయల సాగు ప్రారంభించారు. ఇప్పటివరకు పెట్టిన ఖర్చు రూ.13,500 చేశారు. శైలజ తోటలో కిలో పచ్చిమిర్చి రూ. 60, క్యారెట్, బీట్రూట్ రూ. 50, టొమాటో, వంగ, బెండ, గోరుచిక్కుడు, కాకర, అలసంద రూ. 40, ముల్లంగి (కట్ట) రూ.15, గోంగూర(కట్ట) రూ. 10 చొప్పున అమ్ముతున్నారు. మొన్నటి వరకు రూ.17,500 ఆదాయం వచ్చింది. ఏడాది పొడవునా రోజూ కూరగాయలను ప్రజలకు అందించాలన్నదే తన లక్ష్యమని శైలజ వివరించారు. మధ్యాహ్న భోజనంలో ఇవే కూరలు శైలజ పండించే కూరగాయలను గ్రామస్తులకే విక్రయిస్తున్నారు. ముఖ్యంగా అంగన్వాడీ, ప్రాథమిక, జిల్లా పరిషత్ హైస్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేస్తున్నారు. ఘనజీవామృతం, ఆవు పేడ, పంచితం, మజ్జిగతో కషాయాలను తయారు చేసి పంటలకు ఉపయోగిస్తుండటాన్ని గ్రామస్తులు ఆసక్తిగా చూస్తుంటారు. ప్రకృతి సాగు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను రైతు సాధికర సంస్థ సిబ్బంది, శైలజ, ఆమె భర్త మాధవ వర్మ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామస్తులు, సచివాలయ సిబ్బంది కూరగాయలు కొంటున్నారు. అంగన్వాడీ పిల్లలు, స్కూల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో వడ్డించే కూరగాయలు కూడా శైలజ పండిస్తున్నవే. ‘శైలజ పండించిన కూరగాయలను ధర కాస్త ఎక్కువైనా కొని వాడుతున్నా. పిల్లలు కూరలు రుచిగా ఉన్నాయని చెబుతుంటే సంతోషంగా ఉందంటున్నారు మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలు పూర్ణ. గ్రామస్తులు, స్కూలు పిల్లల కోసమే! ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో నేను పండించే కూరగాయలు తిని మా ఊరివాళ్లంతా ఆరోగ్యంగా ఉంటే అంతే చాలు. ప్రస్తుతం నేను పండించే కూరగాయలు మా ఊరి వాళ్లకే సరిపోతున్నాయి. గ్రామస్తులు, స్కూలు పిల్లల తరువాతే ఎవరికైనా. ఏడాది పొడవునా కూరగాయలు పండించి ఇవ్వాలన్నదే నా తపన. – కోనేటి శైలజ, (9912197746),ఎస్బీఆర్ పురం, వడమాలపేట మం., తిరుపతి జిల్లా కొసమెరుపు: గ్రామానికి చెందిన వెంకట్రామరాజు శైలజ పండించే కూరగాయలను కొనుగోలు చేసి చెన్నైలో ఉంటున్న తన కుమారుడు డాక్టర్ రామకృష్ణంరాజుకు వారానికి ఒక రోజు పంపుతుండటం మరో విశేషం. – తిరుమల రవిరెడ్డి, సాక్షి ప్రతినిధి, తిరుపతి. ఫొటోలు: కేతారి మోహన్కృష్ణ నిర్వహణ: పంతంగి రాంబాబు చదవండి: BCCI: వారికి 7 కోట్లు.. వీరికి 50 లక్షలు! నిర్ణయాలు భేష్! మరీ కోట్లలో వ్యత్యాసం.. తగునా? -
సేంద్రియ సాగుబాట.. దేశంలో ఆర్గానిక్ ఫార్మింగ్వైపు రైతుల అడుగులు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: సేంద్రియ వ్యవసాయం.. ఇప్పుడు ఈ పదం పంటల సాగులో ఎక్కువగా వినిపిస్తోంది. ఇంతకాలం అధిక దిగుబడి ఆశతో విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడిన రైతులు దానివల్ల భూమి నిస్సారంగా మారడమే కాకుండా భూగర్భ జలాలు కలుషితమవడం, పురుగుమందుల అవశేషాలున్న పంట ఉత్పత్తులను ఆహారంగా వినియోగిస్తూ ప్రజలు అనారోగ్యం బారినపడుతున్నారని క్రమంగా గుర్తిస్తున్నారు. నెమ్మదిగా మళ్లీ సేంద్రియ సాగువైపు మళ్లుతున్నారు. బుడిబుడి అడుగులు.. దేశంలో ప్రస్తుతం 39.4 కోట్ల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది. అందులో వ్యవసాయం చేస్తున్న భూమి 21.5 కోట్ల ఎకరాలు ఉంది. ఇందులో 66 లక్షల ఎకరాల్లో మాత్రమే సర్టిఫైడ్ ఆర్గానిక్ సాగు జరుగుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే పూర్తి సాగు విస్తీర్ణంలో సేంద్రియ సాగు కేవలం 3.24 శాతమేనన్నమాట. అయినప్పటికీ గత కొన్నేళ్లతో పోలిస్తే సేంద్రియ సాగు దిశగా ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయని అర్థమవుతోంది. సర్టిఫికేషన్ లేకుండా సేంద్రియ సాగు చేస్తున్న రైతులు కూడా ఉన్నారు. ఈ విస్తీర్ణం దాదాపు సర్టిఫైడ్ సేంద్రియ సాగు కంటే ఏడెనిమిది రెట్లు అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆదర్శంగా సిక్కిం.. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన సిక్కిం చిన్న రాష్ట్రమే అయినా.. సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ఆ రాష్ట్ర రైతులకు ప్రోత్సాహకాలు కల్పించడంలో అక్కడి ప్రభుత్వం ముందంజలో ఉండడమేకాక... వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించే యత్నం చేస్తోంది. దేశంలో మొట్టమొదటి పూర్తి సేంద్రియ సాగు (ఆర్గానిక్ ఫామింగ్) సర్టిఫికేషన్ పొందిన రాష్ట్రం కూడా సిక్కిం ఒక్కటే కావడం విశేషం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సేంద్రియ వ్యవసాయ రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంపై దృష్టిపెట్టింది. అందులో భాగంగా ప్రధాన దేవాలయాలకు సరఫరా చేసే ఆహారపదార్థాలను సేంద్రియ సాగు ద్వారా పండించినవే వినియోగించేలా ముందుకు సాగుతోంది. మధ్యప్రదేశ్ అగ్రస్థానం.. సేంద్రియ సాగుపై రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ప్రస్తుతం విస్తీర్ణపరంగా చూస్తే మధ్యప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఏపీ సైతం గత రెండేళ్లుగా దీనిపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తోంది. భారీగా రైతులు సేంద్రియ సాగువైపు మళ్లేలా ప్రణాళికలు అమలు చేస్తోంది. ఏపీలో దాదాపు 10 శాతం మంది రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఆరేడు లక్షల ఎకరాల వరకు సేంద్రియ సాగు జరుగుతున్నట్లు అంచనా. సేంద్రీయ వ్యవసాయంలో అనుభవం గడించిన వారితోనే మిగిలిన రైతాంగానికి శిక్షణ ఇప్పిస్తుండటంతో రైతులు ఆకర్షితులు అవుతున్నారు. గుజరాత్, హరియాణా కూడా సేంద్రియం వైపు వడివడిగా అడుగులేస్తున్నాయి. ఆయా రాష్ట్రాలు తమ దగ్గర సాగైన సేంద్రియ పంటలను విదేశాలకు ఎగుమతి చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. సేంద్రియ ఉత్పత్తుల విలువ రూ.14,800 కోట్లు దేశంలో సాగవుతున్న సేంద్రియ ఉత్పత్తుల మొత్తం విలువ రూ.14,800 కోట్లు. ఇందులో విదేశాలకు దాదాపు రూ.11,500 కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అవుతుండగా.. రూ.2వేల కోట్ల విలువైన ఉత్పత్తులు రిటైల్ మార్కెట్లకు వెళుతున్నాయి. మిగిలిన ఉత్పత్తులను రైతులు నేరుగా విక్రయించుకుంటున్నారు. ఎందుకు ఈ సేంద్రియం..? సేంద్రియ సాగుతో ప్రధానంగా రైతులు చేసే వ్యయం గణనీయంగా తగ్గుతుంది. సంప్రదాయ వ్యవసాయంతో వచ్చే ఆదాయం కంటే కూడా సేంద్రియ వ్యవసాయంతో లాభాలు ఎక్కువ. దీనికితోడు పొలాలు సారవంతం కావడం, భూగర్భ జలాలు కలుషితం కావు. సేంద్రియ సాగుతో అటు ప్రకృతికి, ఇటు ప్రజలకు మేలు జరుగుతుంది. అయితే దేశంలోని రైతులంతా సేంద్రియ సాగు బాట పట్టేలా అడుగులేయడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రభుత్వాలు కూడా సేంద్రియ సాగు వైపు రైతులను మళ్లించడానికి వీలుగా తగిన ప్రోత్సాహకాలు కల్పించాల్సిన అవసరం ఉంది. రైతుకు నమ్మకం కలిగిస్తున్నాం.. ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయంపై నమ్మకం కలిగించేలా చర్యలు చేపట్టాం. 2030–31 నాటికి రాష్ట్రంలోని రైతులంతా ప్రకృతి సాగు వైపు మళ్లించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. రైతు భరోసా కేంద్రాలే ప్రకృతి సాగుపై శిక్షణ ఇచ్చే కార్యాలయాలు. రైతులు ఒకేసారి మారాలంటే మారరు. అందుకు ఓపికగా వారిని మార్చడానికి ప్రయత్నించాలని సీఎం జగన్మోహన్రెడ్డి చెబుతున్నారు. అలా రైతులను ఒప్పించడం వల్లే 10 శాతం మంది సేంద్రియ సాగువైపు మళ్లారు. సాధారణ ఉత్పత్తుల కంటే ఆర్గానిక్ ఉత్పత్తులకు 10 శాతం అధిక ధరలు లభిస్తున్నాయి. మధ్యప్రదేశ్, మేఘాలయ, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల నుంచి రైతులు ఏపీలో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయడానికి వస్తున్నారు. – విజయ్కుమార్ ఐఏఎస్, ఏపీ రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ప్రపంచంలోనే ఎక్కువ మంది రైతులు మన దగ్గరే.. సేంద్రియ వ్యవసాయం చేస్తున్న వారిలో ప్రపంచంలో అత్యధిక రైతులు భారత్లోనే ఉన్నారు. వారికి సరైన మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే ఎక్కువ మంది ఈ సాగుపట్ల మొగ్గు చూపుతారు. ప్రభుత్వాలు దీనిపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది. సేంద్రియ సాగు సర్టిఫికేషన్పై రైతుల్లో ఇంకా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. – సీవీ రామాంజనేయులు, సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
రోజుకు రూ. 1500.. ఎకరంన్నరలో ఏటా 4 లక్షలు! ఇలా చేస్తే లాభాలే!
ఏదో ఒక పంట సాగుపై ఆధారపడి జీవించే రైతు కుటుంబాలు ఆదాయపరంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతుంటాయి. ముఖ్యంగా, ఎకరం, రెండెకరాల భూమి మాత్రమే కలిగి ఉన్న చిన్న, సన్నకారు రైతు కుటుంబాలు ఏక పంటల సాగుతో తగినంత ఆదాయం పొందలేక అప్పుల పాలవుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ దుస్థితి నుంచి రైతులు బయటపడాలంటే సమీకృత సేంద్రియ వ్యవసాయం ఒక్కటే మార్గం. సమీకృత సేద్యం అంటే.. చిన్న కమతం నుంచి కూడా ఒకటికి నాలుగు విధాలుగా ఆదాయం వచ్చే విధంగా కృషి చెయ్యటం అన్నమాట. నిరంతర ఆదాయం వచ్చేలా సమీకృత సేంద్రియ సేద్యం చేపట్టి.. నిరంతరం ఆదాయం పొందే మార్గాలను ఆచరించి చూపుతున్నారు సూర్యాపేట జిల్లాకు చెందిన రైతు దంపతులు వాసికర్ల శేషుకుమార్, లక్ష్మీప్రియ. ఎమ్మే చదువుకొని రెక్కల కష్టాన్ని నమ్ముకునే చిన్న, సన్నకారు రైతు దంపతులకు ఏడాది పొడవునా అనుదినం ఆదాయాన్ని అందించే విధంగా సమీకృత సేంద్రియ సేద్య పద్ధతులను విజయవంతంగా ఆచరించి చూపిస్తున్నారు వాసికర్ల శేషుకుమార్(53), లక్ష్మీప్రియ దంపతులు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన శేషుకుమార్(53) ఎమ్మే చదువుకొని గత 30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. అభ్యుదయ భావాలు కలిగిన ఆయన 25 ఎకరాల్లో డ్రమ్సీడర్, వెద పద్ధతుల్లో వరి పండిస్తున్నారు. నాగార్జునసాగర్ కాల్వ పక్కనే పొలం ఉండటంతో సాగు నీటికి దిగులు లేదు. వరి సాగు నష్టదాయకంగా పరిణమిస్తున్న నేపథ్యంలో వరికి బదులుగా.. కాయకష్టం చేసే రైతు కుటుంబాలకు రోజూ ఆదాయాన్నిచ్చే సమీకృత సేంద్రియ వ్యవసాయ నమూనా వైపు ఏడాదిన్నర క్రితం దృష్టి సారించారు. నాలుగు రకాలుగా నిరంతరం ఆదాయం పొందటమే ఎకరంన్నర విస్తీర్ణంలో సమీకృత సేంద్రియ సేద్యం చేపట్టారు. ఈ క్షేత్రం ప్రదర్శన క్షేత్రంగా, రైతులకు శిక్షణా కేంద్రంగా మారింది. శేషు అనుసరిస్తున్న సమీకృత సేంద్రియ సేద్య నమూనా రైతులను ఆకర్షిస్తోంది. కూరగాయలు, పశుగ్రాస పంటలతో పాటు దీర్ఘకాలిక పండ్ల చెట్లను పూర్తి సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. దీనితో పాటు.. మేకలు గొర్రెలు, నాటుకోళ్లు, పుట్టగొడుగులు, ముత్యాల పెంపకాన్ని చేపట్టి ఒకటికి నాలుగు రకాలుగా నిరంతరం ఆదాయం పొందటమే ఈ నమూనాలో ప్రత్యేకత. 5 వేల ఆల్చిప్పల్లో ముత్యాల సాగు ఎకరంన్నరలో మొదట గొర్రెలు, మేకలు పెంచేందుకు ప్రత్యేకంగా ఎలివేటెడ్ షెడ్ను రూ. 5 లక్షల ఖర్చుతో నిర్మించారు. షెడ్ పైఅంతస్థులో మేకలు, గొర్రెలు పెరుగుతూ ఉంటే.. షెడ్ కింద కొంత భాగంలో నాటు కోళ్ళ పెంపకకానికి శ్రీకారం చుట్టారు. షెడ్ కింద మిగతా భాగంలో ఒక డార్క్ రూమ్ను నిర్మించి పాల పుట్టగొడుగుల పెంపకానికి ఉపయోగిస్తున్నారు. 3 సిమెంటు ట్యాంకులు నిర్మించి స్థానికంగా సేకరించిన 5 వేల ఆల్చిప్పల్లో 3 నెలల క్రితం ముత్యాల సాగు ప్రారంభించారు. వంగ, టమాటో, మిర్చి, బోడ కాకర.. ఇంకా.. ఈ సమీకృత వ్యవసాయం క్షేత్రం చుట్టూ ప్రత్యేకంగా కంచె ఏర్పాటు చేశారు. చుట్టూతా కొబ్బరి, డ్రాగన్ఫ్రూట్ తదితర దీర్ఘకాలిక పండ్ల మొక్కలు నాటారు. ప్లాస్టిక్ షీట్తో మల్చింగ్ చేసి.. బోడ కాకర, బీర, సొర, కాకర సాగు చేపట్టారు. వంగ, టమాటో, మిర్చి, బోడ కాకర, బీర, సొర, నేతి బీర, కాకర, పొట్ల, చిక్కుడు, మునగ, బంతి, గులాబీ తదితర రకాల పంటల సాగు చేపట్టారు. పశువుల కోసం నేపియర్, దశరధ గడ్డి, మొక్కజొన్న గడ్డిని పెంచుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడా చోటు వృథా కాకుండా అధిక సాంద్రతలో అనేక పంటలు, పండ్ల మొక్కలు నాటారు. ఈ క్షేత్రంలో ఎలాంటి రసాయనాలను ఉపయోగించటం లేదు. ఒకటికి నాలుగు దారుల్లో ఆదాయం పొందే సాగు పద్ధతిపై చిన్న, సన్నకారు రైతులు, మహిళలకు స్ఫూర్తినిస్తున్న శేషుకుమార్ దంపతులు ధన్యులు. – మొలుగూరి గోపి, సాక్షి, నడిగూడెం, సూర్యాపేట జిల్లా చిన్న రైతులు నిత్యం ఆదాయం పొందాలి వరి పంట సాగులో పెట్టుబడులు బాగా పెరిగాయి. కూలీల కొరత ఇబ్బందిగా మారింది. దీంతో నిత్యం ఆదాయం పొందే విధంగా ఈ సమీకృత వ్యవసాయంపై ఆసక్తి కలిగింది. తక్కువ భూమిలో విభిన్న రకాల పంటల సాగు చేపట్టాం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికతో ముందుకువెళ్తున్నాం. – వాసికర్ల లక్ష్మీప్రియ, సమీకృత సేంద్రియ మహిళా రైతు, సిరిపురం, సూర్యాపేట జిల్లా సులువుగా సేంద్రియ పుట్టగొడుగుల పెంపకం సమీకృత వ్యయసాయ క్షేత్రంలో షెడ్డులో సేంద్రియ పద్ధతుల్లో పాల పుట్టగొడుగుల పెంపకం చేపట్టారు. వరిగడ్డి ముక్కలను, మట్టిని ప్రత్యేక పద్ధతుల్లో శుద్ధి చేసి, పుట్టగొడుగుల పెంపకానికి పాలిథిన్ బ్యాగ్లను సిద్ధం చేస్తారు. ఈ ప్రక్రియ అంతా పరిశుద్ధమైన 27 డిగ్రీల వాతావరణంలో గాలి, వెల్తురు తగలని చీకటి గదిలో జరుగుతుంది. బ్యాగ్లలో నింపిన గడ్డిపై మైసీలియం అనే శిలీంధ్రం అభివృద్ధి చెందిన తర్వాత బ్యాగ్లను మామూలు గదిలోకి మార్చుతారు. వారం తర్వాత నుంచి పుట్టగొడుగుల దిగుబడి వస్తుంది. వరిగడ్డి ముక్కలను స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్స్ సహాయంతో ఆవిరి ద్వారా శుద్ధి చేసే ప్రత్యేక పద్ధతిని శేషు అనుసరిస్తున్నారు. దీని వల్ల గడ్డి వెంటనే తడి ఆరిపోతుందన్నారు. ఈ విధంగా సేంద్రియ పద్ధతిలో పుట్టగొడుగుల పెంపకం సులభతరమైందని శేషు చెప్పారు. ముత్యాల సాగును ఒక్క రోజులో నేర్చుకోవచ్చు ఎకరంన్నరలో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్న శేషుకుమార్ దంపతులు ప్రత్యేక షెడ్లో మూడు సిమెంటు ట్యాంకులను నిర్మించి ముత్యాల సాగు చేపట్టారు. దేవతా రూపాల్లో డిజైనర్ ముత్యాలైతే 14 నెలల్లో, ఎం.ఓ.పి. న్యూక్లియస్ల ద్వారా గుండ్రటి ముత్యాలైతే 18 నెలల్లో దిగుబడి వస్తుందన్నారు. ఒక ఆల్చిప్పకు రెండు ముత్యాలు వస్తాయి. నాణ్యతను బట్టి ధర ఉంటుంది. సగటున ధర రూ. 150–200 ఉంటుంది. ఒక రోజు శిక్షణతో మహిళలు కూడా ముత్యాల సాగును నేర్చుకోవచ్చు. చిన్న రైతులకు దారి చూపాలని.. భూమి తక్కువగా ఉండే చిన్న, సన్నకారు రైతు దంపతులు ఏదో ఒకే పంట సాగుపై ఆధారపడితే తగినంత ఆదాయం రాదు. సమీకృత సేంద్రియ సాగు చేపడితే రోజువారీగా మంచి ఆదాయం పొందే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అందుకని, ఎకరంన్నర పొలంలో ఈ క్షేత్రాన్ని రూపొందించాం. ఎకరంన్నర భూమిలో భార్య, భర్త స్వయంకృషి చేస్తే అన్ని ఖర్చులూ పోను రూ. 4 లక్షలకు పైగా నికరాదాయం వస్తోంది. ఈ సందేశం రైతులందరికీ తెలియజెప్పాలనేదే మా తపన. రోజుకు రూ.1,500 ఆదాయం వస్తున్నది. రెండు వేలకు పెంచాలనేది లక్ష్యం. ప్రతి రైతూ ముందుకు రావాలి. ప్రభుత్వం అవగాహన కల్పించాలి. – వాసికర్ల శేషుకుమార్ (91824 06310), సమీకృత సేంద్రియ రైతు, సిరిపురం, సూర్యాపేట జిల్లా చదవండి: నివాస ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాల్లో కూరగాయల సాగు.. నగరంలో కిచెన్ గార్డెనింగ్ ప్రయోజనాలివే! 70 ఎకరాలు 30 పంటలు.. హైదరాబాద్ నగరానికి ఏడాది పొడవునా -
నగరంలో కిచెన్ గార్డెనింగ్ ప్రయోజనాలివే.. ఇలా చేశారంటే..
బెర్లిన్.. జర్మనీ రాజధాని నగరం. యూరోపియన్ యూనియన్లోకెల్లా జనసమ్మర్దం ఎక్కువగా ఉండే నగరం. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు పంటలు సాగు చేసుకోవడానికి అనువైన కాలం. మిగతా నెలల్లో మంచుకురుస్తూంటుంది. అర్బన్ అగ్రికల్చర్ కార్యకలాపాల సంప్రదాయం బెర్లిన్ నగరానికి కొత్తేమీ కాదు. కమ్యూనిటీ గార్డెన్లు, కిచెన్ గార్డెన్లలో కూరగాయలు, పండ్ల సాగు సుదీర్ఘకాలంగా జరుగుతున్నదే. అయితే, నగరవాసులకు అవసరమైన కూరగాయలు మాత్రం ఎక్కడి నుంచో నగరానికి తరలించక తప్పటం లేదు. ఈ పరిస్థితిని మార్చలేమా? వ్యాపకంగా సాగుతున్న అర్బన్ అగ్రికల్చర్ను మరింత సీరియస్గా తీసుకొని ఖాళీ జాగాల్లో పండిస్తే నగర కూరగాయల అవసరాలు ఎంత మేరకు తీరుతాయి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నంలో భాగంగా మొట్ట మొదటిసారిగా ఇటీవల సమగ్ర అధ్యయనం జరిగింది. బెర్లిన్ కూరగాయల వినియోగంలో 82 శాతం వరకు నగరంలోనే పండించుకోవచ్చని ఈ అధ్యయనంలో తేలింది! 200 కమ్యూనిటీ గార్డెన్లు.. పోట్స్డ్యామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్లో పరిశోధకుడిగా ఉన్న డియెగో రిబ్స్కీ బృందం ఈ అధ్యయనం చేసింది. నివాస ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాల్లో కూరగాయల సాగుకు పేదలకు కేటాయించిన తోటలు, భవనాలపై బల్లపరుపుగా ఉన్న పై కప్పులు, సూపర్ మార్కెట్ పార్కింగ్ స్థలాలతో పాటు మూసివేసిన శ్మశానవాటిక స్థలాల్లో ఎంత మేరకు కూరగాయలు సాగు చేయొచ్చో అధ్యయనం చేశారు. బెర్లిన్లో ఇప్పటికే 200 కంటే ఎక్కువ కమ్యూనిటీ గార్డెన్లు ఉన్నాయి. పేదలు కూరగాయలు పండించుకోవడానికి ప్రభుత్వ స్థలాల్లో కేటాయించిన చిన్న ప్లాట్లు 73,000 కంటే ఎక్కువగానే ఉన్నాయి. వీటికి తోడుగా, భవనాల పైకప్పులు, నివాస ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు, పెద్ద గృహ సముదాయాల మధ్య పచ్చటి ప్రదేశాలలో కూడా కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేసే గొప్ప అవకాశం ఉందని ఈ అధ్యయనం ద్వారా గుర్తించారు. కార్ల సంఖ్యను తగ్గించే ప్రణాళికలు రచిస్తున్నందున పార్కింగ్ స్థలాలను కూడా కూరగాయలు పండించడానికి ఉపయోగించుకోవచ్చని రిబ్స్కీ అన్నారు. తక్కువ స్థలంలో ఎక్కువ కూరగాయలు.. బెర్లిన్లోని మొత్తం 4,154 హెక్టార్లలో కూరగాయలు పండించవచ్చని అధ్యయనంలో తేలింది. నగర వైశాల్యంలో ఇది దాదాపు 5 శాతం. ఈ భూమి మొత్తంలో కూరగాయలు పండిస్తే బెర్లిన్ కూరగాయల డిమాండ్లో 82 శాతం స్థానికంగా తీరిపోతుందని రబ్స్కీ పేర్కొన్నారు. అయితే, ఈ కల సాకారమవ్వాలంటే నీరు, మానవ వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. 75.3 కోట్ల యూరోల పెట్టుబడి అవసరం. వినటానికి అంతా డబ్బా అనిపిస్తుంది గానీ.. 2020వ సంవత్సరంలో బెర్లిన్ స్థూల దేశీయోత్పత్తిలో ఇది దాదాపు 0.5 శాతం మాత్రమే. సవాళ్లు అనేకం.. నగరంలో తోట పనిని ప్రోత్సహించి ఈ కలను సాకారం చేయాలంటే అధిగమించాల్సిన సవాళ్లు తక్కువేమీ కాదు. ‘స్థలం ఉంది, కానీ ఇంకా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు, తోట పనిని ఎవరు చేయబోతున్నారు? ప్రైవేట్ తోటమాలులను నియమించి సాగు చేయిస్తామా? లేదా వ్యాపార నమూనా అవసరమా? పేదలకు కేటాయించిన తోటల్లో ఉత్పత్తిని పెంచగలమా? నగరంలో వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఎటువంటి పరిస్థితులను సృష్టించగలం? వంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సి ఉంటుందని అధ్యయనకారులు అంటున్నారు. ‘స్థానికంగా కూరగాయల సాగు బహుశా చాలా ఖరీదైన పని కావచ్చు. అయితే, సేంద్రియంగా పండిస్తాం. కాబట్టి, కొత్త బ్రాండ్ను సృష్టించుకోవచ్చు. అందుకని సూత్రప్రాయంగా ఇది సానుకూల పరిణామమని నేను నమ్ముతున్నాను’ అన్నారు పోట్స్డ్యామ్ ఇన్స్టిట్యూట్కు చెందిన మారియన్ డి సిమోన్. నగరంలో కిచెన్ గార్డెనింగ్ ప్రయోజనాలు.. సేంద్రియ కూరగాయల లభ్యత పెరగడంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి. ఎవరికి వారుగా ఉండిపోయిన నగర ప్రజలను కమ్యూనిటీ గార్డెన్లు ఒకచోటకు చేర్చుతాయి. పచ్చని ప్రదేశాలు ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణం, జీవవైవిధ్యానికి మేలు చేస్తాయి. స్థానిక ఆహార ఉత్పత్తితో దూరం నుంచి కూరగాయల రవాణా వల్ల వెలువడే కర్బన ఉద్గారాలు కూడా తగ్గుతాయి. ఇన్ని ప్రయోజనాలున్న అర్బన్ గార్డెనింగ్పై సీరియస్గా దృష్టి పెట్టడం బెర్లిన్కే కాదు, మన నగరాలకూ ఎంతో అవసరం. కానీ, మన పాలకులు గుర్తించేదెన్నడో కదా?! -పంతంగి రాంబాబు చదవండి: ఫంగల్ వ్యాధుల్ని నివారించే తెల్లముల్లంగి! -
రైతు ఇంట ప్రకృతి పంట.. విస్తరిస్తున్న ప్రకృతి వ్యవసాయం
రాజాం(విజయనగరం జిల్లా): పెరుగుతున్న జనాభా వల్ల ఆహార ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. మార్కెట్లో ఆహారకొరతను తీర్చేందుకు... అధిక దిగుబడుల సాధనకు రైతులు రసాయనిక ఎరువుల వినియోగాన్ని అమాంతం పెంచారు. ఫలితంగా ఆహార ఉత్పత్తులు కషితమవుతున్నాయి. ప్రమాదకరంగా మారి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ పరిస్థితుల నుంచి మానవాళిని రక్షించేందుకు, ఆరోగ్యకర పంటలను ఉత్పత్తిచేసేందుకు వ్యవసాయశాఖ అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయం ప్రస్తుతం సత్ఫలితాలిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు కారణంగా ఇటీవల కాలంలో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఆరోగ్యకర ఆహార ఉత్పత్తుల ఎగుమతికి ఆస్కా రం కలుగుతోంది. రైతులకు తక్కువ పెట్టుబడితోనే ఆదాయం సమకూరుతోంది. 33 వేల ఎకరాల్లో... జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం 2.20 లక్షల హెక్టార్లు కాగా, ఇందులో 33 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం జరుగుతోంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో కేవలం 10 పంచాయతీల్లో, పదిహేను ఎకరాల్లో ప్రారంభమైన సాగు 2022వ సంవత్సరం రబీనాటికి 33 వేలఎకరాలకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా 157 పంచాయతీల్లో ప్రకృతి సేద్యం జరుగుతోంది. 32 వేల మంది రైతులు సాగులో భాగస్వాములయ్యారు. ఖరీఫ్లో 90 మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తి చేశారు. 390 మంది ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఈ విధానాన్ని అమలుచేసేందుకు రైతులకు సహకరిస్తున్నారు. గ్రామాల్లో నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆర్బీకేల సాయంతో.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. పచ్చిరొట్ట విత్తనాలను రాయితీపై పంపిణీ చేస్తోంది. సేంద్రియ, ప్రకృతి సాగును ప్రోత్సహిస్తోంది. పంటల సాగులో సూచనలు, సలహాలు అందిస్తోంది. యంత్ర పరికరాలను సమకూర్చుతోంది. సాగును లాభదాయకంగా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. గ్రామ పంచాయతీల్లో సేకరించిన చెత్తను సేంద్రియ ఎరువులుగా మార్చి రైతులకు రాయితీపై అందిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో వరి, చెరకు, మొక్కజొన్న , మినుములు, పెసర, ఆముదం, నువ్వులు, వేరుశనగ, రాగులు, కొర్రలు, సామలు తదితర పంటలను ప్రకృతి సేద్యంలో రైతులు సాగుచేస్తున్నారు. ఎరువుల తయారీ చాలా సులభం ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి సేంద్రియ ఎరువు తయారీ చాలా సులభం. ఆవుపేడ, వేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆవుమూత్రం ప్రధానమైన ముడిసరుకులు. వీటిని తగిన మోతాదులో ప్రకృతి వ్యవసాయం అధికారులు, సిబ్బంది సలహాలతో ఒక రోజు వ్యవధిలో ఎరువులు తయారు చేయవచ్చు. అగ్ని అస్త్రం, ఘన, ధ్రవ జీవామృతాలు, భీజామృతాలు, కషాయాలు తయారుచేసి వరి, మొక్కజొన్న, చెరకు వంటి పంటలతో పాటు చిరుధాన్యాలు, కూరగాయల పంటల్లో వినియోగించవచ్చు. వీటి వలన పంటలో వైవిధ్యం కనిపించడంతో పాటు పంటపొలాలు సారవంతంగా మారి నేలల్లో ఆర్గాన్, కార్బన్ ఉత్పత్తులు పెరుగుతాయి. వీటి ఫలితంగా వచ్చే దిగుబడి ప్రతీ మనిషికి ఆరోగ్యంగా ఉండడంతో పాటు అనేక పోషకాలు కలిగిఉంటాయి. మంచి ఫలసాయం మేము కూరగాయల పంటలకు ఎక్కువుగా సేంద్రియ ఎరువు, జీవామృతాలు వినియోగిస్తున్నాం. మంచి దిగుబడి వస్తుంది. ఈ పంటలు స్థానికంగానే అమ్ముడవుతున్నాయి. – పొగిరి అన్నంనాయుడు, మామిడిపల్లి, సంతకవిటి మండలం ఎరువుల వినియోగాన్ని తగ్గించాం వరి, మొక్కజొన్న పంటకు గతంలో ఎక్కువుగా యూరియా, డీఏపీలు వినియోగించేవాళ్లం. ఇప్పుడు పశువుల గెత్తం, ఆవు పేడ, కషాయాలు, పచ్చిరొట్ట ఎరువులు వినియోగిస్తున్నాం. పంటలో చీడపీడలు తగ్గి, దిగుబడి పెరుగుతోంది. – టి.అప్పలనాయుడు, లక్ష్మీపురం, రాజాం మండలం -
న్యూ లీఫ్ మైక్రోగ్రీన్స్లో 83 పోషకాలు.. ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలు
ఆహారోత్పత్తుల్లో పోషక విలువల సాంద్రతను బట్టి వాటి నాణ్యతను నిర్ణయించే పద్ధతి ఒకటుంది. సేంద్రియ/ప్రకృతి సేద్య పద్ధతుల్లో పండించిన ఆహారంలో రసాయనిక ఎరువులతో పండించిన పంటల్లో కన్నా ఎక్కువ సంఖ్యలో పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ఆరుబయట పొలాల్లో పండించే పంటలకే కాదు.. మహానగరాల్లో భవనాల్లో వర్టికల్ ఫామ్స్లో పండించే పంటలకూ వర్తిస్తుంది. ప్రకృతిలో 92 సహజ రసాయనిక మూలకాలు ఉంటాయి. ఇందులో పంటలకు 18 పోషకాలు అత్యవసరమని, వీటిలో 15 మట్టి నుంచి, 3 వాతావరణం నుంచి అందుతున్నాయని ఐరాసకు చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) చెబుతోంది. ఈ లెక్క రసాయనిక వ్యవసాయంలో పండించిన ఆహారానికి సంబంధించినదని భావించవచ్చు. న్యూ లీఫ్ మైక్రోగ్రీన్స్లో 83 పోషకాలు తాము ప్రత్యేక సేంద్రియ ఎరువులతో మట్టిలో పండించే మైక్రోగ్రీన్స్లో 83 రకాల పోషకాలు ఉంటాయని దుబాయ్లోని వర్టికల్ అర్బన్ ఫార్మింగ్ సంస్థ న్యూ లీఫ్ వ్యవస్థాపకుడు ఆడమ్ పిట్స్ ప్రకటించారు. దుబాయ్లో 715 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిలువుగా పేర్చిన ట్రేలలో నియంత్రిత వాతావరణంలో మైక్రోగ్రీన్స్ పండిస్తున్న అర్బన్ వ్యవసాయ క్షేత్రం న్యూ లీఫ్. ఈ సంస్థ వందల కొద్దీ రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లకు ఆకుకూరలు, మైక్రోగ్రీన్స్, పచ్చివే తినదగిన పువ్వుల (ఎడిబుల్ ఫ్లవర్స్)ను పండించి, తాజాగా విక్రయిస్తోంది. ఆడమ్ తన ఇండోర్ ఫార్మింగ్ ప్రయాణాన్ని ఇరవై సంవత్సరాల క్రితం ప్రారంభించారు. అనారోగ్యంతో ఉన్న తండ్రి కోసం క్రెసెస్ వంటి మైక్రోగ్రీన్స్ పండించటానికి న్యూ లైఫ్ను ప్రారంభించి.. ఇప్పుడు 58 రకాల మైక్రోగ్రీన్స్, ఎడిబుల్ ఫ్లవర్స్ను దుబాయ్ ప్రజలకు అందిస్తున్నారు. పోషక నాణ్యతకు మూలం మట్టి ‘దుకాణాలలో విక్రయించే దాదాపు మైక్రోగ్రీన్స్ మొక్కలన్నీ హైడ్రోపోనికల్గా పండించినవే. అయితే, మేం ప్రత్యేకంగా తయారు చేసుకున్న సేంద్రియ మట్టి మిశ్రమంలోనే మైక్రోగ్రీన్స్ను పెంచుతున్నాం. పోషక నాణ్యతకు మూలస్తంభం మట్టి. హైడ్రోపోనిక్ లేదా ఏరోపోనిక్ పద్ధతులను ఉపయోగించకుండా గత ఇరవై సంవత్సరాలుగా అభివృద్ధి చేసిన మట్టి మిశ్రమంలో పెంచుతున్నాం అని వివరించారు ఆడమ్. ‘మట్టిని ఉపయోగించడం అంటే.. మనకు చాలా ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల సహాయం తీసుకోవటమే. ఇవి మొక్కలు పోషకాలను తీసుకోవడానికి సహాయపడతాయి. మా సూపర్ఫుడ్ మైక్రోగ్రీన్స్ 83 రకాల పోషకాలను కలిగి ఉంటాయి. సూక్ష్మజీవులు లేకుండా ఇది సాధ్యం కాద’ని ఆడమ్ వివరించారు. పంటను పండించిన తర్వాత మొక్కల వ్యర్థాలను తిరిగి మట్టిలోనే కలిపేస్తాం. ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు మరింతగా వృద్ధి చెంది, తదుపరి పంటకు ఉయోగపడుతున్నాయి. మట్టి ఆధారిత సాగులో మైక్రోగ్రీన్స్, ఆకుకూరల అధిక నాణ్యతను వినియోగదారులు గ్రహించి అభినందిస్తున్నారని ఆడమ్ అన్నారు. ‘ఎడారి వాతావరణంలో ఉత్తమమైన మైక్రోగ్రీన్స్ను పెంచడం చాలా విశేషం. ఇండోర్ ఫార్మింగ్తో మీరు ఏ నగరం మధ్యలో అయినా మట్టిలోనే అద్భుతమైన ఉత్పత్తులను పండించవచ్చ’ని ఆడమ్ అనుభవంతో చెబుతున్నారు. మైక్రోగ్రీన్స్ ప్రయోజనాలెన్నో ►విత్తిన 2 వారాల్లో వేలెడంత పొడవున్న మొక్కలను మారాకు వేయకముందే కత్తిరించిన మైక్రోగ్రీన్స్లో.. ఇదే పరిమాణంలో బాగా పెరిగిన ఆకుకూరల కంటే 9 రెట్లు ఎక్కువ విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ (వ్యాధితో పోరాడటానికి సహాయపడే సమ్మేళనాలు) ఉంటాయి. ►పొటాషియం, ఐరన్, జింక్, కాపర్, మెగ్నీషియం వంటి వివిధ రకాల ఖనిజాలూ పుష్కలంగా ఉన్నాయి. ►వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటే గుండె జబ్బులు, అల్జీమర్స్, డయాబెటిస్, కొన్ని క్యాన్సర్ల ముప్పును తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ►పొలంలో మట్టిని పరీక్షించి సేంద్రియ/ప్రకృతి సాగుకు సేంద్రియ ధ్రువీకరణ ఇవ్వటం కంటే.. ఆహారోత్పత్తుల్లో పోషకాల సాంద్రత, ఎన్ని ఎక్కువ రకాల పోషకాలు ఉన్నాయో పరీక్షించి, దాని ఆధారంగా సర్టిఫికేషన్ ఇవ్వటం మేలేమో! – పంతంగి రాంబాబు చదవండి: Alzheimer's: కండరాల కదలికలు చురుగ్గా ఉన్న వారికి రిస్క్ తక్కువే! ఏం చేయాలంటే.. పెసర, మినుములేనా? బ్రహ్మీ, వస సాగు.. భలే బాగు! ఏడాదికి నికరాదాయం ఎంతంటే.. -
పెసర, మినుములేనా? బ్రహ్మీ, వస సాగు.. భలే బాగు! ఏడాదికి నికరాదాయం ఎంతంటే..
మాగాణి రేగడి భూముల్లో వరి, పెసర, మినుము మాత్రమేనా? ఇంకే ఇతర పంటలూ సాగు చేసుకోలేమా? ఉన్నాయి. ఔషధ పంటలున్నాయి. ఎకరానికి ఏటా రూ. లక్షకు తగ్గకుండా నికరాదాయం ఇచ్చే బ్రహ్మీ, వస వంటి దీర్ఘకాలిక ఔషధ పంటలు ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో కొందరు రైతులు ఈ పంటలను నీటి వసతి ఉన్న మాగాణి నల్లరేగడి భూముల్లో సాగు చేస్తూ చక్కని ఆదాయం పొందుతున్నారు. ఛత్తీస్గఢ్ ఔషధ మొక్కల బోర్డు వీరిని ప్రోత్సహిస్తోంది. ఆయుర్వేద ఔషధ పరిశ్రమదారులతో కొనుగోలు ఒప్పందాలు చేయించి సాగు చేయిస్తుండటం విశేషం. బహ్మీ, వస పంటల సాగులో అక్కడి ముగ్గురు రైతుల అనుభవాలను పరిశీలిద్దాం.. బ్రహ్మీ.. 4 నెలలకో కోత బ్రహ్మీ (Bacopa monneiri) నేల మీద పాకే తీగజాతి దీర్ఘకాలిక పంట. బ్రహ్మీ పంటను వరి పంటకు మాదిరిగానే దమ్ము చేసి, 2–3 అంగుళాల మొక్క కటింగ్ను నాటాలి. ఒకసారి నాటితే చాలు. 5 ఏళ్ల పాటు మళ్లీ నాటక్కర లేదు. 4 నెలలకోసారి పంట కోతకు వస్తుంది. అయితే, ఏడాది పొడవునా పంట పొలాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. పొలం అంతా బ్రహ్మీ మొక్కలు అల్లుకుపోతాయి కాబట్టి కలుపు సమస్య ఉండదు. అయితే, పంట కోతకు వచ్చినప్పుడు అవసరాన్ని బట్టి కలుపు తీసి, తర్వాత కొడవళ్లతో నేల మట్టానికి బ్రహ్మీ మొక్కలను కోస్తారు. ఆ తర్వాత కొంచెం ఎరువు చల్లి నీటి తడి ఇస్తే చాలు.. పంట మళ్లీ ఏపుగా పెరుగుతుంది. ప్రతి కోతకు ఎకరానికి 3,000–6,000 కిలోల పచ్చి బ్రహ్మీ మొక్కల దిగుబడి వస్తుంది. ఆరుబయట గచ్చు మీద ఎండబెడితే.. కొద్ది రోజుల్లో 600–700 కిలోల ఎండు బ్రహ్మీ సిద్ధమవుతుంది. దీని ధర మార్కెట్లో రూ. 40–50 వరకు ఉంటుంది. అంటే కోతకు రూ. 30 వేల చొప్పున.. ఏడాదిలో 3 కోతలకు.. రూ. 90 వేల వరకు రైతుకు ఆదాయం వస్తుంది. ప్లాంటింగ్ మెటీరియల్ను రైతులకు మొదటిసారి ఔషధ మొక్కల బోర్డు ఇస్తుంది. పెరిగిన పంట నుంచి తీసి 2–3 అంగుళాల ముక్కలను నాటుకుంటున్నారు. మొక్కలను ఎలా నాటుకోవాలో రైతులకు శిక్షణ ఇస్తారు. బ్రహ్మీ మొండి మొక్క. నిర్వహణ పెద్దగా అవసరం లేదు. ఒకటి, రెండు సార్లు కలుపు తీస్తే చాలు. ఎరువులు వాడాలని లేదు. జీవామృతం వాడినా సరిపోతుంది. వస.. 9 నెలల పంట పసుపు పంట మాదిరిగా వస (Bach-Acorus calamus) 2–3 అడుగుల ఎత్తున పెరుగుతుంది. 9 నెలల పంట. కొమ్ములను నాటుకోవాలి. మొక్కలు పెంచైనా నాటుకోవచ్చు. 9 నెలలకు కొమ్ములు తవ్వి తీసి, ఎండ బెట్టి, పాలిషింగ్ చేసి ఔషధ కంపెనీలకు విక్రయించాలి. 20–30 ఎకరాలకు ఒకటి చొప్పున పాలిషింగ్ మిషన్ అవసరం. ఎకరానికి 10–20 క్వింటాళ్ల వస కొమ్ముల దిగుబడి వస్తుంది. ఎకరానికి ఖర్చు రూ.20 వేలు పోను, రూ. 60 వేలు–లక్ష వరకు నికరాదాయం వస్తుంది. ఎకరానికి ఏటా రూ. 70 వేల నికరాదాయం అశ్వని శబారియా.. గొరెల్లా పెండ్ర మర్వాహి జిల్లా పెండ్ర పట్టణ శివారులో ఈ యువ రైతు 10 నెలల క్రితం 9 ఎకరాల్లో బ్రహ్మీ, 2.5 ఎకరాల్లో వస సాగు ప్రారంభించారు. బీకాం చదువుకున్న అశ్వని ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి రైతుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారు. తిపాన్ నది ఒడ్డున దేవుడి మాన్యం నల్ల రేగడి భూమిని కౌలుకు తీసుకొని, బోర్ల ద్వారా నీటిని తోడుకుంటూ సాగు చేస్తున్నారు. బ్రహ్మీ నాటు మొక్కలు, వస విత్తన కొమ్ములను ఛత్తీస్గఢ్ ఔషధ మొక్కల బోర్డు ద్వారా తీసుకున్నారు. వర్మీ కంపోస్టు, వేపపిండి చల్లి దుక్కి చేసిన తర్వాత మొక్కలు నాటారు. తర్వాత ఎరువులేమీ వేయటేదు. వారానికి రెండు సార్లు తగుమాత్రంగా నీటి తడి ఇస్తున్నారు. ఈ రెండు పంటలకూ నీరు నిల్వ ఉండక్కరలేదు. మట్టిలో తేమ బాగా ఉంటే చాలు. బ్రహ్మీ పంటను అశ్వని 10 నెలల్లో 3 సార్లు కోసి, ఎండబెట్టి విక్రయించారు. బ్రహ్మీ సాగు ద్వారా ఎకరానికి ఏడాదికి 3 కోతల్లో రూ. 90 వేల ఆదాయం. అన్నీ కలిపి రూ. 20 వేల ఖర్చవుతోంది. రూ. 70 వేలు నికరాదాయమని అశ్వని తెలిపారు. బ్రహ్మీలో వరి కన్నా ఎక్కువ ఆదాయం వస్తున్నదన్నారు. బ్రహ్మీ కొనుగోలుదారులను ఛత్తీస్గఢ్ ఔషధ మొక్కల బోర్డు పరిచయం చేసిందన్నారు. ఆన్లైన్లో నేరుగా విక్రయించడానికి ఇండియామార్ట్. కామ్ వెబ్సైట్లో కూడా తాను రిజిస్టర్ చేసుకున్నారు. మార్కెటింగ్ సమస్య లేదంటున్నారు రైతు అశ్వని శబారియా (81203 57007). ప్రకృతి సేద్యంలో ఏపుగా బ్రహ్మీ డోమన్లాల్ సాహు.. బలోదబజార్ జిల్లా గైత్ర గ్రామంలో 25 ఎకరాల సొంత భూమిలో వరి, కంది, శనగ తదితర పంటలను 4 ఏళ్లుగా ప్రకృతి సేద్య పద్ధతుల్లో సాగు చేస్తూ రసాయనిక ఎరువులు వాడే రైతులతో సమానంగా దిగుబడులు తీస్తున్నారు. 6 నెలల క్రితం బోర్డు ద్వారా మొక్కలు తెప్పించి 2 ఎకరాల నల్లరేగడిలో నాటారు. పంట కోతకు సిద్ధంగా ఉంది. ఎకరానికి వర్మీకంపోస్టు 2 క్వింటాళ్లు, 100 కిలోల ఘనజీవామృతం చల్లి దమ్ము చేసి, బ్రహ్మీ మొక్కలు నాటారు. వర్మీవాష్, వేస్ట్డీకంపోజర్, ద్రవ జీవామృతం 15 రోజులకోసారి పిచికారీ చేస్తున్నారు. పంట ఆరోగ్యంగా పెరిగింది. ఛత్తీస్గఢ్ ఔషధ మొక్కల బోర్డు ద్వారా విక్రయిస్తానని సాహు (62651 71801) తెలిపారు. రూ. 50–60 వేల నికరాదాయం సుగత్సింగ్ (66) జాంజ్గిర్ ఛాంప జిల్లా ఖటోల గ్రామానికి చెందిన సింగ్ వందెకరాల్లో సేద్యం చేసే రైతు. వరి, గోధుమ, పప్పుధాన్యాలు పండిస్తారు. 2021 జూలైలో ఛత్తీస్గఢ్ ఔషధ మొక్కల బోర్డు సూచన మేరకు నల్లరేగడి భూమి 3 ఎకరాల్లో బ్రహ్మీ, 2 ఎకరాల్లో వస నాటారు. ఎకరానికి 4 క్వింటాళ్ల సిటీ కంపోస్టు దుక్కిలో వేసి, అవసరం మేరకు నీటి తడులు ఇస్తున్నారు. బ్రహ్మీ పంటను కోసి గచ్చుపై ఎండబెడుతున్నారు. వరిలో ఎకరానికి రూ. 30–35 వేలు నికరాదాయం వస్తుంటే.. బ్రహ్మీ, వసలో రూ. 50–60 వేల వరకు వస్తోందని సింగ్(83055 61057) తెలిపారు. మామిడి చెట్ల నీడలో సర్పగంధ మొక్కలను 16 నెలల క్రితం వేశారు. మరో 2 నెలల్లో కోతకు రానుంది. మార్కెటింగ్ సమస్య లేదు! ఔషధ మొక్కల సాగు ద్వారా రైతులు సాధారణ పంటలతో పోల్చితే అధిక నికరాదాయం పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వరి సాగు చేసే నల్ల రేగడి, లోతట్టు ప్రాంతాల్లో దీర్ఘకాలిక ఔషధ పంటలైన బ్రహ్మీ, వసను సాగు చేసుకోవచ్చు. ఎకరానికి రూ. లక్ష వరకు నికరాదాయం పొందే వీలుంది. విత్తనాలు, మొక్కలను బోర్డు ద్వారా అందించి రైతులను ప్రోత్సహిస్తున్నాం. ఔషధాల తయారీదారులు, వ్యాపారులతో ముందే టైఅప్ చేసుకొని తగిన జాగ్రత్తలతో అవగాహన ఒప్పందం చేసుకొని మార్కెటింగ్ సమస్య లేకుండా చేస్తున్నాం. రైతుల ఉత్పత్తులకు మంచి ఆదాయం వచ్చేలా చేస్తున్నాం. ఎకరానికి ఏడాదికి రూ. పది లక్షల వరకు ఆదాయం వచ్చే ఔషధ పంటలు కూడా ఉన్నాయి. ఏ రాష్ట్రంలోని రైతులకైనా, సంస్థలకైనా కన్సల్టెన్సీ సేవలు అందించేందుకు మా బోర్డు సిద్ధంగా ఉంది. – జె.ఎ.సి.ఎస్.రావు (96769 95404), సీఈఓ, ఛత్తీస్గఢ్ ఔషధ మొక్కల బోర్డు, పూర్వ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్, రాయపూర్. -నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
కమ్యూనిటీ గార్డెనింగే దివ్యౌషధం! తీసుకునే ఆహారంలో ఒక్క గ్రాము పీచు పెరిగినా..
శారీరక, మానసిక ఆరోగ్యం కోసం నలుగురితో చేయీ చేయీ కలిపి ఉమ్మడిగా సేంద్రియ కూరగాయ పంటలు పండించుకోవటం కన్నా కొత్త సంవత్సరంలో అమలు చేయదగిన ఆరోగ్యదాయక తీర్మానం మరొకటి ఉండబోదు. కమ్యూనిటీ గార్డెనింగ్.. ప్రజల ఆరోగ్యంపై చూపే ప్రభావాలపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్ నిర్వహించిన ఓ శాస్త్రీయ అధ్యయనం శాస్త్రీయతను విడమర్చింది. ఈ దిశగా జరిగిన తొట్టతొలి రాండమైజ్డ్, కంట్రోల్డ్ స్టడీ ఇది. దీనికి అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నిధుల్ని సమకూర్చింది. ‘లాన్సెట్ ప్లానెటరీ హెల్త్’ జర్నల్లో జనవరి 4న ప్రచురితమైన ఈ స్టడీ ఆసక్తి రేపుతోంది. తిరుగులేని సాక్ష్యాలు డయాబెటిస్, క్యాన్సర్ వంటి జీవనశైలి వ్యాధులతోపాటు, మానసిక సమస్యలను ప్రభావశీలంగా నివారించే శక్తి కమ్యూనిటీ గార్డెనింగ్కు ఉందనడానికి ఈ అధ్యయన ఫలితాలు తిరుగులేని సాక్ష్యాలుగా నిలిచాయని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ జిల్ లిట్ వ్యాఖ్యానించారు. కొలరాడో యూనివర్సిటీ బౌల్డర్లో పర్యావరణ అధ్యయనాల శాఖ ప్రొఫెసర్గా ఆమె పనిచేస్తున్నారు. డెన్వర్ ప్రాంతానికి చెందిన 291 మందిపై అధ్యయనం చేశారు. వీరిలో ఎవరికీ గతంలో కమ్యూనిటీ గార్డెనింగ్ చేసిన అనుభవం లేదు. సగటు వయసు 41 ఏళ్లు. సగం మంది అల్పాదాయ వర్గాల వారు. 145 మందిని ‘ఎ’ గ్రూప్గా, 146 మందిని ‘బి’ గ్రూప్గా విడదీశారు. ‘ఎ’ గ్రూప్ వారికి ఒక ఏడాది తర్వాత గార్డెనింగ్ మొదలుపెడుదురు గాని అని చెప్పారు. ‘బి’ గ్రూప్ వారికి స్వచ్ఛంద సంస్థ డెన్వర్ అర్బన్ గార్డెన్స్ ద్వారా శిక్షణ ఇప్పించారు. డెన్వర్ ఏరియాలో ఒక స్థలం కేటాయించి, కూరగాయ విత్తనాలు, మొక్కలు ఇచ్చి, సామూహికంగా ఇంటిపంటలు సాగు చేయించారు. ఈ రెండు గ్రూపుల్లోని వారి శారీరక కొలతలు, ఆరోగ్య వివరాలు, మానసిక ఆరోగ్య స్థితిగతులు, ఎంత సేపు గార్డెనింగ్ చేస్తున్నారు, ఏమేమి తింటున్నారు.. వంటి వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేశారు. ఒక్క గ్రామైనా ప్రభావం ఎక్కువే సగటున అమెరికావాసులు ఆహారం ద్వారా రోజుకు 16 గ్రాముల పీచు తీసుకుంటున్నారు. 25–38 గ్రాములు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. కొద్ది కాలం గడిచేసరికి.. కమ్యూనిటీ గార్డెనింగ్ చేస్తున్న ‘బి’ గ్రూప్ వారు ‘ఎ’ గ్రూప్ వారి కన్నా 1.4 గ్రాములు (7%) అధికంగా పీచుపదార్థం (కూరగాయలు, పండ్ల రూపంలో) తింటున్నారని తేలింది. ఒక్క గ్రాము పీచుపదార్థం పెరిగినా ఒక్క గ్రాము పీచుపదార్థం పెరిగినా శరీరంలో వాపు నివారణ, రోగనిరోధక శక్తి పెంపుదలపైన.. ఆహార శోషణ, పెద్దపేగుల్లోని సూక్ష్మజీవరాశి స్థితిగతులపైన ఎక్కువ ప్రభావం కనిపించిందని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కరోలినాలోని క్యాన్సర్ నివారణ–నియంత్రణ కార్యక్రమం సంచాలకుడు జేమ్స్ హెబెర్ట్ అన్నారు. వారానికి కనీసం 150 నిమిషాలైనా శారీరక శ్రమ చేయాలి. పరివర్తన అమోఘం అమెరికన్లలో 25% మంది మాత్రమే చేస్తున్నారు. కమ్యూనిటీ గార్డెనింగ్ చేస్తున్న ‘బి’ గ్రూప్ వారి శారీరక శ్రమ వారానికి 42 నిమిషాలు పెరిగింది. వీరిలో మానసిక ఆందోళన, వ్యాకులత గణనీయంగా తగ్గాయి. కమ్యూనిటీ గార్డెనింగ్ చేసేవారికి ఒనగూరే ప్రయోజనాలు ప్రతి సీజన్కూ పెరుగుతాయని ప్రొ. లిట్ భావిస్తున్నారు. ఈ ఫలితాలు డెన్వర్ అర్బన్ గార్డెన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లిండా అప్పెల్ లిప్సియస్ను ఆశ్చర్యపరచలేదు. 43 ఏళ్లుగా ఏడాదికి 18 వేల మందికి కమ్యూనిటీ గార్డెనింగ్లో లిండా శిక్షణ ఇస్తుంటారు. ‘వీరిలో వచ్చిన పరివర్తన అమోఘం. కొందరిలో మార్పు ప్రాణ రక్షణ స్థాయిలోనూ ఉండొచ్చ’ని లిండా అంటున్నారు. ‘కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ఎవరి ఇంట్లో వారు పెంచుకోవచ్చు. అయితే, ప్రకృతిలో ఆరుబయట నలుగురూ కలసి గార్డెనింగ్ పనిలో నెలల తరబడి భాగస్వాములు కావటం అద్భుత ఫలితాలనిస్తోంది. కూరగాయలు, పండ్ల వినియోగం పెరగడంతో పాటు తోటి వారితో సంబంధ బాంధవ్యాలు వికసించాయి. మానసిక ఆరోగ్యంపై దీని ప్రభావం చాలానే ఉంది. దీని ప్రభావశీలతకు శాస్త్రీయ రుజువులు దొరికాయి’ అన్నారు ప్రొ. లిట్. కమ్యూనిటీ గార్డెన్ల బృహత్ బహుళ ప్రయోజనాలను గుర్తించడంలో వైద్యులు, విధాన నిర్ణేతలు, లాండ్ ప్లానర్లకు ఈ అధ్యయన ఫలితాలు తోడ్పడతాయని ప్రొ. లిట్ సంతోషపడుతున్నారు. అర్థం ఏమిటంటే.. జీవనశైలి వ్యాధుల చికిత్సలో భాగంగా సామూహిక ఇంటిపంటల సాగును రోగులకు సీరియస్గా ప్రిస్క్రైబ్ చేసే రోజులు వచ్చేశాయి! – పంతంగి రాంబాబు -
విరబూసిన ప్రకృతి సేద్య పద్మాలు: పగలు సేద్యం.. రాత్రి వైద్యం.. దేశీ వరి వంగడాలే ప్రాణం!
2023 పద్మశ్రీ పురస్కార గ్రహీతల్లో వ్యవసాయంతో సంబంధం ఉన్న వారంతా (ప్రసిద్ధ ఆక్వా శాస్త్రవేత్త డా. విజయ్గుప్తా మినహా) దేశీ వంగడాలతో ప్రకృతి, సేంద్రియ తరహా సేద్య పద్ధతులను ప్రాచుర్యంలోకి తెచ్చిన వారే. అంతేకాదు, నెక్రమ్ శర్మ (హిమాచల్ ప్రదేశ్) 9 పంటల మిశ్రమ ప్రకృతి సాగు చేస్తున్నారు. పతయత్ సాహు (ఒడిషా) ఔషధ మొక్కలను సాగు చేస్తూ ఆయుర్వేద వైద్యం చేస్తున్నారు. చెరువాయల్ రామన్ (కేరళ) దేశీ వరి వంగడాల పరిరక్షణ ఉద్యమకారుడు. తులారామ్ ఉపేతి (సిక్కిం) 80 ఏళ్లుగా వారసత్వ సేంద్రియ సేద్యం చేస్తున్న కురువృద్ధుడు కావటం విశేషం. పురాతన ‘అటవీ కృషి’ పద్ధతిని పునరుద్ధరించి సిరిధాన్యాలను ప్రాచుర్యంలోకి తెచ్చిన డా. ఖాదర్ వలి ఆంధ్రప్రదేశ్లోని ప్రొద్దుటూరులో జన్మించినా మైసూరులో స్థిరపడినందున కర్ణాటక కోటాలో ఎంపికయ్యారు. వీరి కృషి గురించి రేఖామాత్రంగా... తొమ్మిది పంటల మిశ్రమ సేద్యం నెక్రమ్ శర్మ (59).. మంచు కొండల రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లో మండి జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు. ఈ ఏడాది ఆ రాష్ట్రం నుంచి పద్మశ్రీకి ఎంపికైంది ఆయనొక్కరే. ప్రభుత్వ ఉద్యోగం కోసం విఫలయత్నం చేసిన ఆయన తదనంతరం సేద్యాన్నే వృత్తిగా ఎంచుకున్నారు. నాలుగున్నర ఎకరాల వారసత్వ భూమిలో 38 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. రసాయనిక వ్యవసాయం వల్ల భూసారం దెబ్బతింటున్నదని గుర్తించి, 22 ఏళ్ల క్రితమే సుభాష్ పాలేకర్ బాటలో ప్రకృతి సేద్యంలోకి మళ్లారు. కనీసం 3 డజన్ల పంటలకు చెందిన దేశీ విత్తనాలను ఆయన పరిరక్షిస్తూ ఇతరులకు స్ఫూర్తినిస్తున్నారు. పది వేల మంది రైతులకు ఆయన ఉచితంగా దేశీయ విత్తనాలు పంచిన ఘనత ఆయనిది. ‘నౌ అనజ్’ (9 పంటలు) అనే పురాతన ప్రకృతి సేద్య పద్ధతిని శర్మ పునరుద్ధరించారు. పొలంలో కనీసం 9 రకాల పంటలు కలిపి మిశ్రమ సాగు చేస్తున్నారు. తిండి గింజలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, తీగజాతి పంటలను కలిపి ఒకే పొలంలో సాగు చేస్తారు. వానాకాలంలో 9 పంటలు, శీతాకాలంలో మరో 9.. ఏటా 18 పంటలను ఆయన సాగు చేస్తున్నారు. 20 ఏళ్లుగా దేశీ విత్తన పరిరక్షణపై కృషి చేస్తున్నారు. 8 రకాల చిరుధాన్యాలు కూడా ఇందులో ఉన్నాయి. ప్రకృతి సాగు వల్ల 50% నీటి అవసరం తగ్గుతుంది. భూసారం పెరుగుతుంది. దేన్నీ బయట నుంచి తెచ్చి వేసే అవసరం లేదంటారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ మంచి దిగుబడులు సాధిస్తున్నానని, మంచి ఆహారాన్ని ఇష్టపడే స్నేహితులే తనకు బలమని అన్నారు. ‘రోజుకు 14 గంటలు పనిచేస్తున్నాను. పద్మశ్రీ అవార్డు బాధ్యతను పెంచింది. ఇక 18 గంటలు పనిచేస్తా’నంటున్నారు నెక్రమ్ శర్మ వినమ్రంగా. పగలు సేద్యం.. రాత్రి వైద్యం పతయత్ సాహు (67).. విశిష్ట వ్యవసాయ వైద్యుడు. ఒడిషాలోని కలహండి జిల్లా నందోల్ ఆయన స్వగ్రామం. 40 ఏళ్లుగా దాదాపు 3 వేల ఔషధ మొక్కలను తన ఎకరంన్నర భూమిలో పూర్తి సేంద్రియంగా పెంచుతూ.. ఆ మూలికలతోనే ప్రజలకు వైద్యం చేస్తున్నారు. ప్రతి మొక్క గుణగణాల గురించి తడుముకోకుండా అనర్ఘళంగా చెప్పగలరాయన. పగలు ఔషధ మొక్కల తోట పనులు స్వయంగా చేసుకుంటూ బిజీగా గడిపే సాహు.. రాత్రిపూట ప్రజలకు వైద్యం చేస్తారు. ఇంతని ఫీజు అడగరు. ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. యుక్తవయసులోనే ఆసక్తితో ఔషధ మొక్కలు సేకరించి పెంచటం అలవాటు. తాత ఆయుర్వేద వైద్యుడు. చదువు అయ్యాక తాత దగ్గరే సంప్రదాయ ఆయుర్వే వైద్యం నేర్చుకున్నారు. ఇప్పుడున్న 3 వేల జాతుల ఔషధ మొక్కల్లో చాలా వరకు స్వరాష్ట్రంలో అరణ్యాల్లో నుంచి అటవీ అధికారులతో పాటు వెళ్లి ఎన్నో అరుదైన మొక్కలను సేకరించారు. 500 రకాలను ఒడిషా ఔషధ మొక్కల బోర్డు తోడ్పాటుతో ఇతర రాష్ట్రాల నుంచి సేకరించి సంరక్షిస్తున్నారు. ఔషధ మొక్కల జీవవైవిధ్యానికి ఆయన క్షేత్రం నిలయంగా మారింది. వ్యవసాయంతో వైద్యంతో అనుసంధానం చేయటం విశేషం. అరుదైన ఔషధులను పరిరక్షిస్తూ వాటి ప్రయోజనాలను అక్షరబద్ధం చేసి కొత్త తరానికి అందించటం గొప్ప సంగతి. ‘సిరి’ధాన్యాలే నిజమైన ఆహార పంటలు! డాక్టర్ ఖాదర్ వలి (65).. సంప్రదాయ ప్రకృతి సేద్య పద్ధతి ‘అటవీ కృషి’ (కడు కృషి) పునరుద్ధరించి సిరిధాన్యాలను ప్రాచుర్యంలోకి తెచ్చిన అరుదైన స్వతంత్ర శాస్త్రవేత్త. కమతం చిన్నదైనా అందులో 20% విస్తీర్ణంలో అడవిని పెంచుకుంటూ.. మిగతా స్థలంలో సీజనల్ పంటలు సాగు చేయటమన్నది ‘అటవీ కృషి’లో ఒక అంశం. ‘కడు చైతన్యం’ పేరిట ద్రవరూప ఎరువును రూపొందించారు. రసాయనాల్లేకుండా వర్షాధారంగా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల మిశ్రమ సాగే మనకు, ప్రకృతికి మేలు చేసే సేద్యమని ప్రచారోద్యమం నిర్వహిస్తున్నారు. కొర్రలు, అండుకొర్రలు, అరికలు, ఊదలు, సామలు వంటి ‘సిరిధాన్యాలు’ తింటూ హోమియో/ఆయుర్వేద మందులు వాడుతుంటే.. మధుమేహం నుంచి కేన్సర్ వరకు ఏ జబ్బయినా 6 నుంచి 2 ఏళ్లలోగా తగ్గిపోతాయంటారు డా. ఖాదర్. వరి, గోధుమలకు బదులు రోజువారీ ప్రధాన ఆహారంగా సిరిధాన్యాలను ఒక్కో రకాన్ని రెండు, మూడు రోజులు మార్చి మార్చి తినాలి. కొత్తగా అలవాటు చేసుకునే వారు 6 వారాల పాటు అన్నంగా కాకుండా అంబలి రూపంలో, కూరలు నంజుకుంటూ, తాగాలన్నది ఆయన సూచన. ఐదేళ్ల క్రితం డా. ఖాదర్ని ‘సాక్షి సాగుబడి’ తెలుగువారికి తొలిసారి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. నీలి విప్లవ మార్గదర్శి మోదడుగు విజయ్ గుప్తా (83).. ఆక్వాకల్చర్ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన శాస్త్రవేత్త. సముద్రతీర ప్రాంత పట్టణం బాపట్లలో జన్మించారు. మత్స్యకారుల జీవితాల్లో మార్పు తేవాలన్న ఆసక్తితో కృషి చేసి అంతర్జాతీయ స్థాయి మత్స్యశాస్త్రవేత్తగా ఎదిగారు. ఆగ్నేయాసియాలో నీలి విప్లవానికి మార్గదర్శకుడిగా పేరుగాంచారు. 22 దేశాల్లోని చిన్న రైతులు, గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబనతో పాటు పౌష్టికాహారం అందించే విధంగా చేపల పెంపకం పద్ధతులను రూపొందించారు. మలేషియాలోని అంతర్జాతీయ సంస్థ వరల్డ్ ఫిష్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పదవీ విరమణ చేసి హైదరాబాద్లో స్థిరపడ్డారు. మన దేశంలో ఉన్న వనరులను ఉపయోగించుకొని చేపల వినియోగాన్ని తలసరిన 5 కిలోల నుంచి 15 కిలోలకు పెంపొందించడం ద్వారా పౌష్టికాహార లోపాన్ని అధిగమించవచ్చని విజయ్ గుప్తా సూచిస్తున్నారు. ఆక్వా శాస్త్రవేత్తగా ఆయన కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక ప్రపంచ ఆహార బహుమతి (2005)ని, మొదటి సన్హాక్ శాంతి బహుమతి(2015)ని గెలుచుకున్నారు. సేంద్రియ సేద్య కురువృద్ధుడు తులారామ్ ఉపేతి.. 98 ఏళ్లు ఉపేతి గత 80 ఎనభయ్యేళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. 2023లో పద్మశ్రీ పురస్కారం పొందిన వ్యవసాయదారుల్లోకెల్లా ఈయనే పెద్ద. సిక్కిం తొలి సేంద్రియ వ్యవసాయ రాష్ట్రంగా అభివృద్ధి చెందింది. సేంద్రియ వ్యవసాయం ద్వారా పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో అక్కడి రైతులు ముఖ్యపాత్ర పోషించారు. ఐదో తరగతి చదివిన ఉపేతి చిన్నతనం నుంచి సేంద్రియ వ్యవసాయాన్ని వారసత్వంగా కొనసాగించారు. ఇతర రైతులకు మార్గనిర్దేశం చేశారు. సిక్కిం భారత్లో కలవక ముందు టిబెట్లోని యటుంగ్కు భుజాలపై మోసుకెళ్లి ధాన్యం, మొక్కజొన్నలను అమ్మేవారు. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న తులారామ్ ఐదారేళ్ల క్రితం వరకు స్వయంగా పొలానికి వెళ్లి పనులు చేయించేవారు. దేశీ వరి వంగడాలే ప్రాణం! చెరువాయల్ రామన్(72).. కేరళకు చెందిన ఆదివాసీ సేంద్రియ రైతు. దేశీ వరి వంగడాల పరిరక్షణ ఉద్యమకారుడు కూడా. వయనాడ్ ప్రాంతంలో మనంతవాడి పంచాయతీలోని కమ్మన గ్రామంలో ఆయన నివశిస్తారు. రామన్ 150 ఏళ్ల నాటి వారసత్వ పూరింట్లోనే, విత్తనాల కుండల మధ్యనే, ఇప్పటికీ నివాసం ఉంటున్నారు. స్థానికంగా ‘గార్డియన్ ఆఫ్ నేటివ్ పాడీ’గా ప్రసిద్ధి చెందారు. రామెట్టన్ అని కూడా ఆయన్ను పిలుస్తారు. ఔషధ గుణాలు, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే గుణం వంటి ప్రత్యేకతలు కలిగిన స్వదేశీ వరి రకాలు శతాబ్దాలుగా మన దేశంలో వాడుకలో ఉన్నాయి. అయితే, హైబ్రిడ్, జన్యుమార్పిడి వరి రకాల రాకతో దేశీ రకాలు చాలా వరకు అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చెరువాయల్ రామన్ తన 4 ఎకరాల పొలంలో 1.5 ఎకరాలను 22 ఏళ్ల క్రితం దేశీ వరి సాగుకు కేటాయించారు (మిగతా పొలంలో ఇతర పంటలు పండిస్తున్నారు). 54 దేశవాళీ రకాల వరిని ప్రతి ఏటా పండిస్తూ సంరక్షిస్తున్నారు. తన జీవితాన్ని దేశీ విత్తనాల పరిరక్షణకే అంకితం చేశారు. వయనాడ్ ప్రాంతంలో కురిచ్య గిరిజన జాతిలో పుట్టిన ఆయన ఆసుపత్రి వార్డెన్గా ఉద్యోగం చేసేవారు. అయితే, తమ గిరిజన కుటుంబాలు పురాతన దేశీ వరిసేద్యానికి క్రమంగా స్వస్తి చెబుతుండటాన్ని గుర్తించి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చారు. 2004 నుంచి దేశీ వరి రకాలను ఉద్యమ స్ఫూర్తితో తాను సాగు చేయటమే కాదు. ఆ ప్రాంతంలో రైతులను కూడగట్టి సంఘంగా ఏర్పరిచి దేశీ వరి సాగును విస్తృతం చేశారు. అపురూపమైన దేశీ వరి విత్తనాలు డబ్బు కన్నా విలువైనవని ఆయన భావన. అందుకే విత్తనాలను అమ్మరు. ఉచితంగా ఇస్తారు. పండించిన తర్వాత అంతే పరిమాణంలో విత్తనాలను తనకు తిరిగి ఇవ్వాలి. అదొక్కటే షరతు. కొన్నేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ‘జీనోమ్ సేవియర్ పురస్కారం’ ప్రదానం చేసి గౌరవించింది. నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ చదవండి: అల్లుడు బియ్యం అదుర్స్! -
సేంద్రీయ సేద్యంలో అగ్రస్థానంలో ఏపీ
సాక్షి, అమరావతి: దేశంలోనే సేంద్రీయ సేద్యంలో అగ్రస్థానంలో ఉన్న ఏపీకి 2020, 2021 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ఒక లక్ష హెక్టార్లలో సేంద్రీయ సేద్యానికి అనుమతులు మంజూరు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఇటీవల లోక్ సభలో వెల్లడించారు. 2019–20 నుంచి ఇప్పటివరకు ఏపీలో 1,44,465 హెక్టార్లు సేంద్రీయ వ్యవసాయం కిందకు వచ్చినట్లు తెలిపారు. 2020–21లో భారతీయ ప్రాకృతిక కృషి పద్ధతి కింద 8 రాష్ట్రాల్లో 4.09 లక్షల హెక్టార్లలో సేంద్రీయ సేద్యానికి అనుమతి ఇచ్చామన్నారు. ఇందులో అత్యధికంగా ఏపీలో లక్ష హెక్టార్లకు అనుమతి ఇచ్చినట్లు వివరించారు. పరంపరాగత్ కృషి వికాస్ యోజన పథకం, భారతీయ ప్రాకృతిక కృషి పద్ధతి కింద దేశంలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. చదవండి: వాహ్ వైజాగ్.. సాటిలేని మేటి సిటీ 2019–20 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ 2 పథకాల కింద సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు శిక్షణ, సామర్ధ్యం పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మూడేళ్లలో రైతుల క్లస్టర్ల ఏర్పాటు, సామర్ధ్యం పెంపునకు హెక్టార్కు రూ.12,200 సాయాన్ని అందించినట్లు చెప్పారు. హ్యాండ్ హోల్డింగ్, సర్టిఫికేషన్, అవశేషాల విశ్లేషణ్కు హెక్టారుకు మూడేళ్లలో రూ. 2 వేల ఆర్థిక సాయం అందించామన్నారు. సహజ సేద్య ఉత్పత్తుల మార్కెటింగ్, ప్రచారం, విలువ జోడింపునకు రైతులకు హెక్టార్కు మూడేళ్లలో రూ.8,800 డీబీటీ ద్వారా ఇచ్చామన్నారు. ఉత్పత్తి నుండి ప్రాసెసింగ్ వరకు, ధృవీకరణ, మార్కెటింగ్, పంటకోత తర్వాత నిర్వహణకు పూర్తి మద్దతు అందిస్తున్నట్లు తెలిపారు. -
Omaha City: ఇంటి పంటలకు నెలవు
ఒమాహా నగరఒమాహా.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన నెబ్రాస్కాలోని ముఖ్య నగరం. ఇక్కడ సేంద్రియ ఇంటి పంటల ఉద్యమం తామర తంపరగా విస్తరించింది. నగరంలో ఎటు చూసినా చిన్న చిన్న కమ్యూనిటీ కిచెన్ గార్డెన్స్ ఉంటాయి. అక్కడక్కడా విస్తారమైన అర్బన్ గార్డెన్లు కనిపిస్తాయి. సుమారు 5 లక్షల జనాభా గల ఒమాహాలో ఆఫ్రికన్ అమెరికన్లు(12%), ఆసియన్లు(5%) సహా వివిధ జాతులవారుంటారు. వారంతా తమవైన సంప్రదాయ సేంద్రియ ఇంటిపంటల సాగు ద్వారా కమ్యూనిటీలను పోషించుకునే పనిలో వున్నారు అంటే అతిశయోక్తి లేదు. నగరంలోని ఖాళీ స్థలాల్లో పంటలు పండించేందుకు 2014లో ఒమాహా ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనుమతించిన తర్వాత కమ్యూనిటీ గార్డెన్ల సంఖ్య 58కి పెరిగింది. ఖాళీ స్థలాలను ఆకర్షణీయమైన హరిత ప్రదేశాలుగా మార్చారు. ఆహార లభ్యత సమస్యలతో బాధపడుతున్న వారి కోసం కూరగాయలు, ఆకుకూరలను పెంచుతున్నారు. కమ్యూనిటీ గార్డెన్లు కిరాణా దుకాణాలకు ఎప్పుడూ చూసి ఎరుగని దేశీయ ఆహారోత్పత్తులను అందిస్తూండటం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలనాటి విక్టరీ గార్డెన్స్ మాదిరిగా.. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఒమాహాలో ‘విక్టరీ గార్డెన్స్’ ఉండేవని మేరీ కార్పెంటర్ తన బాల్య జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ‘కూరగాయలు, పండ్లు పెంచుకునే పెరటి తోట ప్రతి ఒక్కరికీ ఉండేది. ఆస్పరాగస్, బంగాళదుంపలు, టొమాటోలు, బ్లాక్ రాస్ బేర్రీస్, ద్రాక్ష వంటివన్నీ యుద్ధ కాలంలో పండించుకొని తినే వాళ్ళం. తరువాతి కాలంలో కిరాణా దుకాణాల్లో సంవత్సరం పొడవునా అన్నీ అమ్మటంతో ఆ తోటలు చాలా వరకు అదృశ్యమయ్యాయి. 80 ఏళ్ల తర్వాత మళ్లీ పెరటి తోటలు కొత్తగా వెలుస్తున్నాయి.. మంచిదే’ అన్నారు మేరీ హ్యాపీగా. తమదైన తాజా ఆహారంపై ఆసక్తి ఒమాహా ‘ఆధునిక అర్బన్ అగ్రికల్చర్ గురు’గా చెప్పదగిన వ్యక్తి జాన్ పోర్టర్. నెబ్రాస్కా ఎక్స్టెన్షన్ ఆఫీస్లో విద్యాధికారి. ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని స్థానికంగా పెంచుకోవాల్సిన ఆవశ్యకత గురించి, ఆ ఉద్యమం వెనుక ఉన్న కథపై ఆసక్తిని కల్పించినందున నగరంలో తోటలు విస్తరిస్తున్నాయన్నారు. కోవిడ్ మహమ్మారి దాన్ని మరింత పెంచింది. అన్నింటికంటే, తమదైన తాజా ఆహారం తినాలన్న ఆకాంక్ష ఇందుకు మూలం అన్నారు జాన్. సిటీ స్ప్రౌట్స్లో తొలి అడుగులు.. సిటీ స్ప్రౌట్స్ ఒమాహాలో సేంద్రియ ఇంటి పంటల సాగును అలవాటు చేసిన స్వచ్ఛంద సంస్థల్లో ముఖ్యమైనది. ఇప్పుడు ఈ సంస్థ 45 చిన్నపాటి గార్డెన్ ప్లాట్లను నిర్వహిస్తోంది. ఉత్తర ఒమాహాలోని డెకాటూర్ అర్బన్ ఫార్మ్లో పండ్ల చెట్లు, బెర్రీ పొదలను భారీ సంఖ్యలో పెంచుతోంది. కమ్యూనిటీ గార్డెన్స్, అర్బన్ ఫామ్ల మధ్య వ్యత్యాసం గురించి చెబుతూ సిటీ స్ప్రౌట్స్ మేనేజర్ షానన్ కైలర్ .. ‘నిర్దిష్ట కమ్యూనిటీ కోసం తరచుగా ఎత్తైన మడుల్లో కూరగాయలను పండించేది కమ్యూనిటీ గార్డెన్. అర్బన్ వ్యవస్థ క్షేత్రం కూరగాయలు, పండ్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తుంది. సిటీ స్ప్రౌట్స్ ప్రతిరోజూ వందలాది స్థానిక కుటుంబాలకు తాజా ఆహారాన్ని ఉచితంగా అందిస్తుంది. తాజా ఆహారాన్ని అందించటానికి అర్బన్ ఫారమ్స్ నిజంగా చక్కని మార్గం’ అంటారు. నాన్సీ విలియమ్స్ ‘నో మోర్ ఎంప్టీ పాట్స్’ను ద్వారా ఆహార స్వయం సమృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ‘పాప్–అప్ ఒయాసిస్’ గార్డెన్.. దేశీయ వంగడాలు సాగయ్యే కమ్యూనిటీ గార్డెన్. గత దశాబ్దంలో ఒమాహాలో ఉద్భవించిన డజన్ల కొద్దీ కొత్త కమ్యూనిటీ గార్డెన్లలో ఇదొకటి. హార్టికల్చరిస్ట్ నాన్సీ స్కాట్ తదితరులు అందులో పంటలు పండిస్తున్నారు. గస్ వాన్ రోన్న్ ‘ఒమాహా పెర్మాకల్చర్’ను స్థాపించి ఒమాహాలోని ఆడమ్స్ పార్క్ పరిసరాల్లోని ఖాళీ స్థలాలను ఆర్గానిక్ గార్డెన్స్గా మార్చారు. (క్లిక్ చేయండి: నెలకు లక్ష జీతం.. సాఫ్ట్వేర్ వదిలి ‘సాగు’లోకి..) – పంతంగి రాంబాబు prambabu.35@gmail.com -
గేటెడ్ కమ్యూనిటీలో నివాసం.. పెరట్లో కూరగాయల సాగు, కోళ్లు, కుందేళ్ల పెంపకం! ఇంకా
ఆఫ్రికా దేశమైన కెన్యాలోనూ అర్బన్ ప్రజలు సేంద్రియ ఇంటిపంటల సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. దేశ జాతీయోత్పత్తిలో 30% వ్యవసాయం నుంచి పొందుతున్న కెన్యాలో విష రసాయనాల వాడకం విచ్చలవిడిగా సాగుతోంది. నగరాలు, పట్టణాల్లో నివసించే ప్రజలు కూరగాయలు, ఆకుకూరలు వీలైనంత వరకు ఇంటి దగ్గరే ఏదో విధంగా తిప్పలుపడి సేంద్రియంగా పండించుకుంటున్నారు. కోవిడ్ కాలంలో ఆహార కొరత, ధరల పెరుగుదలతో కొంతమంది కెన్యన్లు అర్బన్ ప్రాంతాల నుంచి తిరిగి గ్రామాలకు వెళ్ళిపోయారు. అక్కడ ఆహారం చౌకగా ఉండటంతో పాటు సొంతంగా కూరగాయలు పండించుకోవడానికి పెరటి స్థలాలు చాలా గ్రామీణ కుటుంబాలకు అందుబాటులో ఉంటాయి. అయితే, కోవిడ్ మహమ్మారి అర్బన్ అగ్రికల్చర్ విస్తరణకూ ఊపునిచ్చింది. ఆహార సరఫరా తగ్గిపోవటంతో ఆరోగ్యదాయకమైన ఆహార భద్రత కోసం అర్బన్ ప్రాంతాల్లో సొంతంగా కూరగాయలు, ఆకుకూరలు పండించుకునే వ్యాపకం ఇటీవల ఊపందుకుంది. ఇంటి స్థాయిలో ఆహార భద్రతను కల్పించడానికి కెన్యా ప్రభుత్వం ‘మిలియన్ కిచెన్ గార్డెన్స్ ప్రాజెక్ట్’లో భాగంగా రెండేళ్ల క్రితం కూరగాయల విత్తనాలు, వ్యవసాయ కిట్లను పంపిణీ చేసింది. అర్బన్ గార్డెనింగ్ చానల్ నగరంలో ఉంటున్నా ఇంటి దగ్గరే సొంత ఆహారాన్ని పెంచుకోగలుగుతున్న అదృష్టవంతుల్లో న్యాంబురా సిమియు ఒకరు. 35 ఏళ్ల శాస్త్రవేత్త అయిన ఆమె తన కుటుంబంతో పాటు కెన్యా రాజధాని నగరం నైరోబీ శివార్లలోని గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్నారు. తన ఇంటి వెనుక పెరట్లో తన నలుగురు కుటుంబానికి సరిపడా కూరగాయలను పండిస్తున్నారు. అంతేకాదు, 200 వరకు కోళ్లు, కుందేళ్లను సైతం పెరట్లో పెంచుతున్నారు. ఏడాది పొడవునా కూరగాయలు, గుడ్లు, మాంసాలతో కూడిన సేఫ్ ఫుడ్ను కుటుంబానికి సమకూర్చుతున్నారు. అర్బన్ రైతులకు శిక్షణ ఇస్తున్నారు. అందుకోసం తన పేరుతోనే యూట్యూబ్లో అర్బన్ గార్డెనింగ్ చానల్ను నిర్వహిస్తున్నారు. పురుగుమందులకు బదులు కుందేలు మూత్రం వాడుతున్నారు. తెగుళ్ళను అరికట్టడానికి ‘కంపానియన్ ప్లాంటింగ్’ వంటి సంప్రదాయ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఉపాధి మార్గంగానూ.. యువ అర్బన్ ఫార్మింగ్ ఎంటర్ ప్రెన్యూర్స్లో నైరోబీ వాసి ఎల్జీ చెబెట్ ఒకరు. సృజనాత్మకంగా కిచెన్ గార్డెనింగ్ నమూనాలను నిర్మించటంలో ఆమె దిట్ట. కుటుంబం కోసం కూరగాయలు, ఆకుకూరలు పండించటం మాత్రమే కాదు, దాన్నే ఉపాధి మార్గంగానూ ఎంచుకున్నారామె. కెన్యా ఆర్గానిక్ కిచెన్ గార్డెన్స్ సంస్థను నెలకొల్పారు. పెరట్లో, మేడ మీద, గచ్చు మీద ఏ కొంచెం స్థలం వున్నా సరే గృహస్థుల అభిరుచి, అవసరాలకు తగినట్లుగా ఎడిబుల్ లాండ్స్కేప్ గార్డెన్స్ను అందంగా డిజైన్ చేస్తున్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఆహార సరఫరాకు అంతరాయం కలిగిన తర్వాత పరిమిత స్థలంలోనే కొంతమంది నగరవాసులు తమ వంట గదుల్లో, బాల్కనీల్లో కూరగాయలను పెంచడం ప్రారంభించారని ఎల్జీ చెబెట్ చెప్పారు. రెండు చదరపు మీటర్లు చాలు.. ‘ఆహారోత్పత్తి అనేది ప్రభుత్వ విధాన స్థాయిలో, ఇంటి స్థాయిలోనూ ఒక ముఖ్యమైన పని’ అని ప్రజలు గ్రహించారని రూట్–టు–ఫుడ్ ఇనీషియేటివ్ సంస్థను నిర్వహిస్తున్న ఇమాన్యుయేల్ అటాంబా అన్నారు. ప్రజలు, వారు తినే ఆహారం, దాన్ని ఎలా పండిస్తారు అనే విషయాలపై అవగాహన లోపించింది అన్నారాయన. ‘నగరంలో కూరగాయలు పెంచడం మంచిది కాదని భావించే వ్యక్తులు ఉన్నారు. ఇది మురికి పని లేదా చేయవలసిన పని కాదని అనుకుంటున్న మహానుభావులు కూడా వున్నార’ని న్యాంబురా సిమియు చెప్పారు. ఒక వ్యక్తికి సరిపడా కూరగాయలు పెంచుకునే కిచెన్ గార్డెన్కు కేవలం రెండు చదరపు మీటర్ల భూమి చాలు. పట్టణ వ్యవసాయానికి నీరు, స్థలం అవసరం. వీటిని నగరంలో ఏర్పాటు చేసుకోవటం చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది. కెన్యా నగరాలూ, పట్టణాల్లో వుండే చాలా మందికి ఈ వనరులు అందుబాటులో లేవు. ముఖ్యంగా నగర జనాభాలో ఎక్కువ మంది నివసించే మురికివాడల్లో మరీ కొరతగా వుంది అంటున్నారు ఆటంబ. సంప్రదాయ వ్యవసాయానికి అవసరమైన నీరు, స్థలంలో నాలుగింట ఒకవంతు కంటే తక్కువ ఉపయోగించి ఆహారాన్ని పండించే హైడ్రోపోనిక్స్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. - పంతంగి రాంబాబు చదవండి: Spineless Cactus: 5 ఎకరాల జామ తోట చుట్టూ ముళ్లు లేని బ్రహ్మజెముడు! ఈ ఉపయోగాలు తెలుసా.. కూర వండుకుని తింటే -
ప్రకృతి సేద్యంలో ఏపీ ఫస్ట్
ప్రకృతి వ్యవసాయం 17 రాష్ట్రాలకు విస్తరించింది. మొత్తం 16.78 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో అత్యధికంగా 6.30 లక్షల మంది రైతులు ఆంధ్రప్రదేశ్లోనే (2.90 లక్షల హెక్టార్లలో) ప్రకృతి సేద్యం చేస్తుండగా.. గుజరాత్లో 2.49 లక్షల మంది రైతులు (అత్యధికంగా 3.17 లక్షల హెక్టార్లలో) ప్రకృతి సేద్యం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రారంభించిన జాతీయ పోర్టల్లో ఈ విషయాన్ని పేర్కొంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అధ్యక్షతన న్యూఢిల్లీలోని కృషి భవన్లో ‘జాతీయ ప్రకృతి సేద్య కార్యక్రమం’ సారథ్య సంఘం మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తోమర్ ప్రకృతి వ్యవసాయంపై జాతీయ పోర్టల్ను ప్రారంభించారు. ప్రకృతి సేద్య విస్తరణ కార్యక్రమాన్ని అందరి సహకారంతో ముందుకు తీసుకువెళ్తామని ఆయన చెప్పారు. బీజామృతం, జీవామృతం, ఘన జీవామృతం ఉపయోగించి రసాయన రహితంగా పంటలు పండించడాన్ని ప్రకృతి సేద్యంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర శాఖలతో సమన్వయం చేసుకుని మార్కెట్లను అనుసంధానించాలని అధికారులను కోరారు. తద్వారా, రైతులు తమ ఉత్పత్తులను మరింత సులభంగా విక్రయించుకునేందుకు వీలవుతుందన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్సింగ్, కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తదితరులు హాజరయ్యారు. ఈ పోర్టల్ను కేంద్ర వ్యవసాయ–రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం గురించి పూర్తి సమాచారం, అమలు విధానం, వనరులు, అమలు పురోగతి వివరాలను తెలిపే ఈ పోర్టల్ దేశంలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుందని మంత్రి తెలిపారు. 2021 డిసెంబర్ తర్వాత 17 రాష్ట్రాల్లో 4.78 లక్షల హెక్టార్లకు పైగా అదనపు వ్యవసాయ భూములను ప్రకృతి సేద్యం కిందకు తీసుకువచ్చినట్టు మంత్రి తోమర్ వెల్లడించారు. గంగా నది ఒడ్డున నాలుగు రాష్ట్రాల్లో 1.48 లక్షల హెక్టార్లలో ప్రకృతి సేద్యం జరుగుతున్నట్లు తెలిపారు. – సాక్షి, సాగుబడి డెస్క్ -
Cuba: పట్టణ సేంద్రియ వ్యవసాయంతో వినూత్న పరిష్కారం..
క్యూబా.. నగర, పట్టణ ప్రాంతాల్లో సేంద్రియ ఇంటిపంటల సాగు సంస్కృతికి ప్రపంచంలోనే అతి పెద్ద ఉదాహరణగా నిలిచింది. 70% క్యూబా ప్రజలు అర్బన్ ప్రాంతాల్లో నివాసం ఉంటారు. దేశానికి కావాల్సిన ఆహారంలో 50% ఇప్పుడు సేంద్రియ ఇంటిపంటలే అందిస్తున్నాయి. స్థానిక సహజ వనరులతో ఆరోగ్యదాయకమైన పంటలు పండించుకుంటూ ఆహార సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోగలమని క్యూబా ప్రజలు ప్రపంచానికి చాటుతున్నారు. సోవియట్ యూనియన్ పతనానికంటే ముందు వరకు క్యూబా.. పెట్రోల్, డీజిల్తోపాటు 60%పైగా ఆహారోత్పత్తుల్ని, రసాయనిక ఎరువులు, పురుగుమందులను సైతం ఆ దేశం నుంచే దిగుమతి చేసుకుంటూండేది. పొగాకు, చక్కెర తదితరాలను ఎగుమతి చేస్తూ ఆహారోత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటూ ఉండేది. ఆ దశలో సోవియట్ పతనం(1990–91)తో కథ అడ్డం తిరిగింది. అమెరికా కఠిన ఆంక్షల నేపథ్యంలో సోషలిస్టు దేశమైన క్యూబా అనివార్యంగా ఆహారోత్పత్తిలో స్వావలంబన దిశగా అడుగేయాల్సి వచ్చింది. క్యూబా ఆకలితో అలమటించిన కష్టకాలం అది. ఈ సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో క్యూబా సమాజం ఉద్యమ స్ఫూర్తిని చాటింది. నగరాలు, పట్టణాల్లో ఖాళీ స్థలాలన్నీ సేంద్రియ పొలాలుగా మారిపోయాయి. అర్బన్ ప్రజలు సైతం తమ ఇళ్ల పరిసరాల్లోనే సీరియస్గా సేంద్రియ ఇంటిపంటల సాగు చేపట్టారు. గ్రామీణ రైతులు కూడా పొలాల్లో ఎగుమతుల కోసం చెరకు, పొగాకు వంటి వాణిజ్య పంటల సాగు తగ్గించి ఆహార పంటల సాగు వైపు దృష్టి సారించారు. సగం కంటే తక్కువ రసాయనాలతోనే రెండు రెట్లు ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయవలసి వచ్చింది. డీజిల్ లేక ట్రాక్టర్లు మూలనపడ్డాయి. పూర్తిగా ఎద్దులతోనే వ్యవసాయం చేయాల్సి వచ్చింది. అటువంటి సంక్షోభం నుంచి ‘పట్టణ సేంద్రియ వ్యవసాయం’ వినూత్న పరిష్కారాన్ని ఆవిష్కరించింది. నగర/పట్టణ ప్రాంతాల్లో స్థానిక సేంద్రియ వనరులతోనే జీవవైవిధ్య వ్యవసాయ సూత్రాల ఆధారంగా సేద్యం సాధ్యమేనని రుజువైంది. నగరాలు, పట్టణాల్లో ఖాళీ స్థలాలన్నీ సేంద్రియ క్షేత్రాలుగా మారాయి. అక్కడ వీటిని ‘ఆర్గానోపోనికోస్’ అని పిలుస్తున్నారు. ‘సమీకృత సస్య రక్షణ, పంటల మార్పిడి, కంపోస్టు తయారీ, భూసార పరిరక్షణ చర్యలు పెద్ద ఎత్తున అమలయ్యాయి. అడుగు ఎత్తున మడులను నిర్మించి, డ్రిప్తో పంటలు సాగు చేశారు. వర్మి కంపోస్టు, పశువుల ఎరువు, జీవన ఎరువులతో పాటు 25% మట్టిని కలిపి మట్టి మిశ్రమాన్ని తయారు చేసి ఈ ఎత్తు మడుల్లో పంటల సాగుకు వినియోగిస్తున్నారు. ఇలా అమలు చేసిన పర్మాకల్చర్, వర్మికల్చర్ తదితర సాంకేతికతలనే ఇప్పుడు క్యూబా ఇతర దేశాలకు అందిస్తోంద’ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ క్యూబా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ స్టీఫెన్ విల్కిన్సన్ చెప్పారు. 1993లో క్యూబా వ్యవసాయ మంత్రిత్వ శాఖలో ప్రపంచంలోనే తొట్టతొలి పట్టణ వ్యవసాయ విభాగం ఏర్పాటైంది. నగరాలు, పట్ణణాల్లో పంటల సాగుకు ఆసక్తి చూపిన కుటుంబానికి లేదా చిన్న సమూహానికి ఎకరం పావు (0.5 హెక్టారు) చొప్పున ప్రభుత్వం స్థలం కేటాయించింది. వాళ్లు తమకు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించుకొని తింటూ.. మిగిలినవి ఇతరులకు అమ్ముతుంటారు. ఈ ప్లాట్లు కాకుండా.. నగరం మధ్యలో, పరిసరాల్లో 5–10 ఎకరాల విస్తీర్ణంలో డజన్ల కొద్దీ పెద్దస్థాయి సేంద్రియ క్షేత్రాలు (ఆర్గానోపోనికోలు) ఏర్పాటయ్యాయి. సహకార సంఘాలే వీటిని నిర్వహిస్తున్నాయి. బచ్చలి కూర, పాలకూర, టమాటాలు, మిరియాలు, గుమ్మడికాయలు, బత్తాయిలు, ఔషధ మొక్కలు, అనేక ఇతర పంటలను భారీ పరిమాణంలో పండించి తక్కువ ధరకు ప్రత్యేక దుకాణాల్లో సహకార సంఘాలు విక్రయిస్తూ ఉంటాయి. హవానా నగరంలో దేశాధినేత కార్యాలయానికి అతి దగ్గర్లోనే 3 హెక్టార్లలో ‘ఆర్గానోపోనికో ప్లాజా’ క్యూబా ఆహార సార్వభౌమత్వాన్ని చాటుతూ ఉంటుంది. 1995 నాటికే క్యూబా రాజధాని నగరం హవానాలో ఇలాంటి 25,000 సేంద్రియ తోటలు వెలిశాయి. 2020 నాటికి వీటి సంఖ్య 30 వేలకు చేరింది. ఆ విధంగా క్యూబా సమాజం తనపై విరుచుకుపడిన ఆంక్షలను, ఆకలిని అర్బన్ అగ్రికల్చర్ ద్వారా జయించింది. (క్లిక్ చేయండి: అర్బన్ ఫుడ్ హీరో మజెదా బేగం!) – పంతంగి రాంబాబు prambabu.35@gmail.com -
అర్బన్ ఫుడ్ హీరో మజెదా బేగం!
కోవిడ్ మహమ్మారి సృష్టించిన ఆహార, ఆదాయ కొరత సమస్యల నుంచి బయటపడటానికి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో పేద కుటుంబాలకు.. ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) కొత్త బతుకు బాట చూపింది. అందుబాటులో ఉన్న స్థలాల్లో మెరుగైన పద్ధతుల్లో సేంద్రియ కూరగాయల సాగు నేర్పించింది. ఎక్కడో మారుమూల గ్రామాల్లో వ్యవసాయక కుటుంబాల్లో పుట్టి పొట్ట చేతపట్టుకొని నగరాలకొచ్చి స్థిరపడిన పేదలకు స్వీడన్ నిధులతో ఎఫ్.ఎ.ఓ. అర్బన్ గార్డెనింగ్లో ఇచ్చిన శిక్షణ వారికి కొత్త భరోసా ఇస్తోంది. దీంతో 2.2 కోట్ల జనాభాతో కాంక్రీటు నివాసాలతో కిటకిటలాడే ఢాకా నగరం అంతటా కోవిడ్ కష్టకాలంలో సేంద్రియ కూరగాయ తోటలు వెలిశాయి. ఇవి పేదలకు సేంద్రియ ఆహారాన్ని రుచి చూపించాయి! ‘సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేసుకోవాలో, ఎలా ఉపయోగించాలో, నా కుటుంబం కోసం సేంద్రియ కూరగాయలను ఎలా పండించాలో శిక్షణకు హాజరైన తర్వాత నాకు తెలిసింది’ అని మజెదా బేగం ఆనందంగా చెబుతోంది. ఢాకాలో నివాసం ఉండే పేద కుటుంబాల్లో ఆమె కుటుంబం ఒకటి. భర్త, ఐదుగురు పిల్లలతో కలసి రెక్కల కష్టం మీద మజెదా బేగం కుటుంబాన్ని లాక్కొస్తుంటుంది. కోవిడ్ విరుచుకుపడే సమయానికి టీ స్టాల్ నడుపుకుంటూ, చిన్నా చితకా వస్తువులు అమ్ముతూ, మురికివాడలో జీవనం సాగించేవారు. టీ స్టాల్ ప్రారంభించిన తర్వాత జీవన పరిస్థితులు అంతకుముందుకన్నా మెరుగుపడినప్పటికీ, వచ్చే ఆదాయం కుటుంబానికి పూర్తిగా సరిపోయేది కాదు. ఐదుగురు పిల్లలకు మరింత మెరుగైన పోషకాహారాన్ని అందించడం ఎలాగూ సాధ్యపడదు. అయితే, ఆహార వ్యవసాయ సంస్థ తోడ్పాటు వల్ల మజెదా ఏర్పాటు చేసుకున్న అర్బన్ కిచెన్ గార్డెన్ ఈ కొరత తీర్చింది. అసంఘటిత రంగంలో ఆహార, ఆర్థిక అభద్రత మధ్య జీవనం సాగించే అనేక మందిలాగే మజెదా కుటుంబాన్ని కూడా కోవిడ్ దారుణంగా దెబ్బ తీసింది. లాక్డౌన్ వల్ల జీవనాధారమైన టీ స్టాల్ను మూసివేయవలసి వచ్చినప్పుడు మజెదా చేతిలో డబ్బేమీ లేదు. పనులు దొరకడం కష్టమైపోయింది. పైగా, ఆమె భర్త తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆ విధంగా ఏడుగురితో కూడిన కుటుంబానికి ఆమే జీవనాధారమైంది. అయినా, ఆమె నిరాశ పడకుండా ధైర్యంగా నిలబడింది. వ్యవసాయం అంటే ఆమెకు బాల్యం నుంచి ఉన్న ఇష్టం ఇప్పుడు ఉపయోగపడింది. ఇళ్లకు దగ్గర్లో అందుబాటులో ఉన్న స్థలాల్లో సేంద్రియ కూరగాయలు పండించటం, కుటుంబం తినగా మిగిలిన కూరగాయలను అమ్మి ఆదాయం పొందటంలో పేద మహిళలకు ఎఫ్.ఎ.ఓ. శిక్షణ ఇచ్చింది. దీంతో, ఢాకా నగరం మధ్యలో ఇళ్ల వెనుక స్థలాలు, ఖాళీ స్థలాల్లో, నదీ తీర ప్రాంతాల్లో ఆర్గానిక్ కిచెన్ గార్డెన్లు వెలిశాయి. మజెదా కూడా కూరగాయల సాగు చేపట్టింది. ‘సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేయాలో, చీడపీడల్ని ఎలా అదుపులో ఉంచాలో అంతకుముందు నాకు తెలీదు. కానీ ఇప్పుడు వాటిని ఎలా ఉపయోగించాలో, నా కుటుంబం కోసం సేంద్రియ కూరగాయలను ఎలా పండించాలో ఇప్పుడు తెలిసింది. ఇప్పటికైనా రైతును కావడం గొప్ప అదృష్టం’ అంటోంది మజెదా సంతృప్తితో. పురుగుమందులు వాడకుండా తమ కళ్ల ముందే ఆమె పండించే కూరగాయలకు స్థానికంగా చాలా డిమాండ్ ఉంది. కూరగాయల తోట ద్వారా తన కుటుంబ అవసరాలు పోను నెలకు 1500 టాకాల (సుమారు రూ. 2 వేలు) ఆదాయం పొందుతోంది మజెదా. ఐదుగురు బిడ్డలున్నా ఎన్నడూ లేనిది ఇప్పుడు ఒక బిడ్డను ఆమె బడికి పంపగలుగుతోంది. కష్టకాలంలో తన కుటుంబానికి అండగా నిలవగలిగినందుకు తనకు చాలా గర్వంగా ఉందని మజెదా పట్టలేని సంతోషంతో చెబుతోంది. ప్రపంచ ఆహార దినోత్సవం–2022 సందర్భంగా ఎఫ్.ఎ.ఓ. ఆమెను ‘ఫుడ్ హీరో’గా గుర్తించి గౌరవించింది అందుకే! (క్లిక్ చేయండి: నేచర్ అర్బైన్.. అతిపెద్ద రూఫ్టాప్ పొలం!) – పంతంగి రాంబాబు prambabu.35@gmail.com -
మైండ్బ్లోయింగ్ ఐడియా.. మట్టి లేకుండా వ్యవసాయం, ఏడాదికి 70 లక్షల ఆదాయం!
భారత్ గతంలో వ్యవసాయ ఆధారిత దేశంగా ఉండేది. అధిక శాతం జనాభా ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తూ ఉండేవారు. అయితే ఏళ్లు గడిచే కొద్దీ వ్యవసాయానికి సాయం లేక డీలా పడిపోయింది. దీంతో వ్యవసాయ భూములు కాలం గడిచే కొద్దీ కనుమరుగవుతూ ఉన్నాయి. మరోవైపు ఇటీవల కొందరు రసాయనాల ద్వారా పంటలు పండిస్తున్నట్లు చాలా ఘటనల్లో నిరూపితమైంది. దీంతో ప్రజల ఆరోగ్యం ప్రశ్నార్థకమైంది. ఈ తరుణంలో ఎటువంటి రసాయనాలు కలపకుండా సేంద్రీయ పద్ధతిలో సహజంగా పండించిన కూరగాయలు, పండ్లకి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. మట్టి లేకుండా వ్యవసాయం.. అందుకే వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. ఓ వ్యక్తి తన ఇంటినే వ్యవసాయ క్షేత్రంగా మార్చి ఏడాదికి 70 లక్షల సంపాదిస్తూ అందరికీ షాకిస్తున్నాడు. ఉత్తర ప్రదేశ్ కి చెందిన రామ్ వీర్ సింగ్ అనే రైతు అతని ఇంటి మీద పంట వేయడమే కాకుండా లాభాల బాట పట్టించి పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించాడు. గతంలో జర్నలిస్ట్గా పని చేసిన ఈయన.. తనకున్న వనరులతో వ్యవసాయం చేయాలని అనుకున్నాడు. అందుకే వింపా ఆర్గానిక్ అండ్ హైడ్రోపోనిక్స్ అనే స్టార్టప్ ని ప్రారంభించి హైడ్రోపోనిక్ పద్దతిని తెలుసుకుని, దానికి అనుగుణంగా తన ఇంటిలో పై ఉన 3 అంతస్తులను వ్యవసాయ క్షేత్రంగా మలచుకున్నాడు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ పద్ధతితో సాగుకు మట్టి అవసరం లేదని, 90 శాతం నీటిని పొదుపు చేయవచ్చు. ఇందులో రసాయనాలు కూడా వాడాల్సిన అవసరం లేదు. కేవలం పీవీసీ పైపుల సహాయంతో అతని బాల్కనీలో పంటలు పండిస్తున్నాడు. స్ట్రా బెర్రీ, కాలీ ఫ్లవర్, బెండకాయలు వంటి 10 వేల రకాల మొక్కలను 3 అంతస్తుల్లో లేయర్స్ గా వేసి పండిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో నెట్టింట వైరల్గా మారింది. మరో విషయం ఏమిటంటే ఈ విషయంలో ఇతర రైతులకు కూడా రామ్ వీర్ సహాయం చేస్తున్నాడు. This man earns 70 lakhs growing vegetables in a 3 storey house without soil or chemicals.#growingvegetables #housegardening #chemicalfree #jounalist #uttarpradesh pic.twitter.com/aZ3N6KFCWN — The Better India (@thebetterindia) October 20, 2022 చదవండి: క్రెడిట్ స్కోరు పెంచుకోవాలా?.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి! -
18 ఎకరాలు: బత్తాయి, వరి, సీతాఫలం సాగు.. బియ్యం కిలో రూ. 80 చొప్పున! ఇంకా..
జీవనమే నిత్య పోరాటమైతే వ్యవసాయం అనుక్షణ యుద్ధమే అంటారు ఒంటరి మహిళా రైతు శశికళ. ఎం.ఎ., బీఈడీ చదివిన ఆమె భర్త ఆకస్మిక మృతితో ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయం చేపట్టారు. 2005 నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఆవులంటే ఇష్టంతో గోశాలను ఏర్పాటు చేసి వర్మీ కంపోస్టు, వర్మీ కల్చర్ను ఉత్పత్తి చేస్తున్నారు. పచ్చదనాన్ని అమితంగా ఇష్టపడే ఆమె నర్సరీ ఏర్పాటు చేసుకొని లాండ్స్కేప్ కన్సల్టెంట్గా ఎదిగారు. క్షణం తీరిక లేకుండా పనుల్లో మునిగిపోయే శశికళ రైతుగా అనేక పురస్కారాలు అందుకున్నారు. ఇటు రైతుగా, అటు ఒంటరి మహిళగా దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను వజ్రసంకల్పంతో ఎదుర్కొంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 17 ఏళ్లుగా 18.5 ఎకరాల్లో మొక్కవోని దీక్షతో సమీకృత సేంద్రియ వ్యవసాయం కొనసాగిస్తున్న కర్ర శశికళ స్వగ్రామం (నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం) దుగ్గెపల్లి. సొంతంగా తయారు చేసుకున్న వర్మీ కల్చర్తో బత్తాయి తోటను చీడపీడల నుంచి కాపాడుకోగలగటం ఆమెను దృఢచిత్తంతో సేంద్రియ వ్యవసాయం వైపు తొలి అడుగులు వేయించాయి. సొంతంగా తయారు చేసుకునే వర్మీ కంపోస్టుకు అనేక జీవన ఎరువులు కలిపి తయారు చేసిన ‘వర్మీ కల్చర్’ను ప్రధానంగా శశికళ ఉపయోగిస్తున్నారు. దీనితోనే వరి, బత్తాయి, పశుగ్రాసం తదితర పంటలతో పాటు నర్సరీ మొక్కలను సాగు చేస్తున్నారు. వర్మీ కల్చర్ను ఇతర రైతులకూ విక్రయిస్తూ ఆదాయం గడిస్తున్నారు. – నాతి రమేష్, సాక్షి, త్రిపురారం, నల్లగొండ జిల్లా వరి.. రెండేళ్లకో పంట! తనకున్న వనరులను ప్రణాళికాబద్ధంగా ఉపయోగిస్తూ ముందడుగు వెయ్యటం శశికళ సేద్యం ప్రత్యేకత. సొంత భూమి 18.5 ఎకరాలకు గాను 6 ఎకరాల్లో బత్తాయి, 5 ఎకరాల్లో వరి పంట, 2 ఎకరాల్లో సీతాఫలం తోట సాగు చేస్తున్నారు. 2 ఎకరాల్లో దేశీ జాతుల గోశాలను ఏర్పాటు చేసి.. వర్మీ కల్చర్ ఉత్పత్తి చేస్తున్నారు. పుణేలో శిక్షణ పొంది 3.5 ఎకరాల్లో మూడేళ్లుగా నర్సరీని నిర్వహిస్తూ.. లాండ్స్కేప్ కన్సల్టెంట్గా ఎదుగుతున్నారు. అనుదినం 20 మంది మహిళా కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారు. పండించిన ధాన్యాన్ని బియ్యం చేసి నేరుగా హైదరాబాద్ తదితర ప్రాంతాల్లోని పరిచయస్తులకు కిలో రూ. 80 చొప్పున అమ్ముతున్నారు. ఒక సీజన్లో పండించిన ధాన్యం నిల్వచేసి రెండేళ్లపాటు బియ్యం విక్రయిస్తుంటారు. రెండేళ్లకు ఒక సీజన్లో మాత్రమే వరి పండిస్తారు. ఉదా.. ప్రస్తుత వానాకాలంలో 5 ఎకరాల్లో 5204 సన్న రకం వరి పంటను సాగు చేస్తున్నారు. యాసంగిలో గానీ, వచ్చే ఏడాది రెండు సీజన్లలో గానీ వరి పండించరు. ఈ మూడు సీజన్లలో తమ ఆవుల కోసం పశుగ్రాసం పండిస్తారు. మార్కెట్ అవసరం మేరకు ఏ పంటైనా పండించటం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చని శశికళ అనుభవపూర్వకంగా చెప్తున్నారు. వరి పంటకు దుక్కి దశలో ఓ సారి, చిరు పొట్ట దశలో మరోసారి వర్మీ కల్చర్ను వేస్తున్నారు. దీంతో పాటు ద్రవరూప ఎరువు వర్మీవాష్ను పైప్లైన్ల ద్వారా అందిస్తున్నారు. వర్మీ కల్చర్ ప్రొడక్ట్ ద్వారా పెట్టుబడి ఖర్చులు తగ్గడంతో పాటు ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తున్నదన్నారు. 70 కిలోల ధాన్యం బస్తాలు ఎకరానికి 35 వరకు పండుతాయన్నారు. పూర్తిస్థాయి శ్రద్ధతో 3 దఫాలు వర్మీకల్చర్, 4 దఫాలు పంచగవ్య వాడటం ద్వారా శ్రీవరిలో ఎకరానికి 55 బస్తాల ధాన్యం దిగుబడి(2008లో) సాధించిన అనుభవం ఆమెది. ప్రస్తుతం నర్సరీ, లాండ్స్కేపింగ్ రంగంలోకి అడుగుపెట్టడం వల్ల వరి సాగుపై అంతగా శ్రద్ధ చూపలేకపోతున్నామన్నారు. 6 ఎకరాల్లో బత్తాయి మొక్కలు నాటి మూడేళ్లయ్యింది. ఏడాదికి రెండుసార్లు వర్మీకల్చర్, హ్యూమిక్ యాసిడ్ను వాడుతున్నారు. వచ్చే ఏడాది పంట కాపు వస్తుంది. 2 ఎకరాల్లో రెండేళ్ల క్రితం సీతాఫలం తోటను సాగు చేస్తున్నారు. ఏడాదికి రెండు సార్లు వర్మికల్చర్, హ్యూమిక్ యాసిడ్ను వాడుతున్నారు. కాపు మొదలవుతోంది. ఏటా 100 టన్నుల వర్మీ కల్చర్ 2 ఎకరాల్లో ఏర్పాటైన గోశాలలో 45 దేశీ జాతుల ఆవులు, 25 ఎద్దులు 7 లేగదూడలు ఉన్నాయి. పేడ, మూత్రం, చేపల చెరువు వ్యర్థ జలాలను వర్మీ కల్చర్ ఉత్పత్తికి వాడుతున్నారు. ఏడాదికి సుమారు 100 టన్నుల వర్మీ కల్చర్ను తయారు చేస్తున్నారు. వర్మీ కల్చర్ను స్వంత వ్యవసాయానికి వినయోగిస్తూ ఇతర రైతులకు కిలో రూ. 15 చొప్పున విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు. 450 రకాల మొక్కల ఉత్పత్తి పుణే వెళ్లి 20 రోజులు శిక్షణ పొందిన తర్వాత శశికళ తన వ్యవసాయ క్షేత్రంలోనే 3.5 ఎకరాల్లో నర్సరీని ఏర్పాటు చేశారు. లాండ్స్కేపింగ్ కన్సల్టెంట్గా పనిచేస్తూ సమస్యలను అధిగమిస్తూ అభివృద్ధి సాధిస్తున్నారు. ఇన్డోర్, అవుట్ డోర్, బోన్సాయ్ మొక్కలు.. అంటుకట్టిన పండ్లు, పూల మొక్కలు సుమారు 450 రకాల మొక్కలు ఉన్నాయి. కొన్ని రకాల మొక్కలను పూణె, కోల్కత్తా, బెంగుళూరు నుంచి తెప్పిస్తున్నారు. నిమ్మ, నారింజ, ఉసిరి, బత్తాయి అంటు మొక్కలను, ఎవెన్యూ ప్లాంటేషన్కు వాడే రకరకాల మొక్కలను సొంతంగా ఉత్పత్తి చేస్తున్నారు. నర్సరీలో పెంచిన మొక్కలను స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీలు, మున్సిపల్ ఆఫీసులకు విక్రయిస్తున్నారు. ప్రైవేటు గృహాల్లో లాండ్స్కేపింగ్కు వినియో విక్రయిస్తూ శశికళ ఆదాయం పొందుతున్నారు. సేంద్రియ వ్యవసాయంలో నిలదొక్కుకోవడంతో పాటు నర్సరీ రైతుగా, లాండ్స్కేప్ నిపుణురాలిగా ఎదుగుతున్న శశికళ మహిళా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తీరికలేని పనంటే ఇష్టం..! తీరిక లేని పనిలో నిమగ్నం కావటం అంటే ఇష్టం. పరిగెట్టి సంపాయించాలని కాదు. స్వతంత్ర జీవనం పట్ల, పచ్చదనం పట్ల మనసులో ఉన్న ఇష్టం కొద్దీ నర్సరీ–లాండ్స్కేపింగ్ రంగంలోకి అడుగుపెట్టాను. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే ఈ రంగం పుంజుకుంటున్నది. అమ్ముడుపోకుండా మిగిలిన మొక్కలను పెద్ద (21 ఇంచ్ల) కవర్లలోకి మార్చి తర్వాత నెమ్మదిగా ఎక్కువ ధరకు అమ్ముతున్నాను. 20 మందికి పనికల్పించాను. వ్యవస్థ సజావుగా నడిచే అంత ఆదాయం అయితే వస్తోంది. వర్మీ కంపోస్ట్ తయారు చేసుకుంటూ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను. సేంద్రియ వ్యవసాయంలో ఖర్చులు అదుపు చేసుకుంటేనే మంచి ఆదాయం వస్తుంది. ఒకే పంటపై ఆధారపడకుండా నర్సరీ ప్రారంభించాను. కష్టమైనా నష్టమైనా వ్యవసాయంలోనే నాకు సంతృప్తి. అమ్మానాన్న, బాబు సపోర్ట్ ఉండటంతో ఒంటరి మహిళనైనా పట్టుదలతో జీవన పోరాటం సాగిస్తున్నాను. పురుషులకు లేని సమస్యలు మహిళా రైతులను ఇంటాబయటా ఇబ్బంది పెడుతుంటాయి. తప్పదు. ఎదుర్కోవాల్సిందే! – కర్ర శశికళ (91824 43048), సేంద్రియ రైతు, లాండ్స్కేపింగ్ కన్సల్టెంట్, దుగ్గెపల్లి, త్రిపురారం మం., నల్లగొండ జిల్లా చదవండి: Bio Fence: వారెవ్వా.. అప్పుడు ఖర్చు 40 వేలు.. ఇప్పుడు 1500.. కోతుల బెడద లేదు! కాకర, చిక్కుడు.. అదనపు ఆదాయం కూడా.. ఎకరంలో కూరగాయల పందిరి సాగు.. ఏడాదికి లక్ష వరకు ఆదాయం! ఇక సోరకాయతో నెలలో 50 వేల వరకు.. -
ఆదివాసీ రైతు.. అభివృద్ధి పథంలో సాగుతూ..
బుట్టాయగూడెం(ఏలూరు జిల్లా): పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన రైతులు ఎటువంటి రసాయనాలను వినియోగించకుండా ఆరోగ్యవంతమైన పంటలు పండించేలా కృషి చేస్తున్న ఆదివాసీ జీడిమామిడి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ సీఈఓ సోడెం ముక్కయ్యను వైఎస్సార్ అచీవ్మెంట్ పురస్కారం వరించింది. గిట్టుబాటు ధరతో పాటు నేరుగా పంటలను విక్రయించుకునేలా రైతులకు తోడ్పాటునందించేలా గురుగుమిల్లిలో 2019లో నాబార్డు సహకారంతో ఆయన ఆదివాసీ జీడిమామిడి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ను ఏర్పాటుచేశారు. అలాగే ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ బ్యాంక్ సహకారంతో ఆదివాసీ జీడిమామిడి ప్రాసెసింగ్ యూనిట్ను నెలకొల్పారు. ఆయా సంస్థల ద్వారా ఏటా లక్షలాది రూపాయల అమ్మకాలు చేస్తున్నారు. దీంతోపాటు 200 ఎకరాల్లో జీడిమామిడి పంటలను ప్రోత్సహించడంతోపాటు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల ద్వారా రైతులు పంటలు పండించేలా ముక్క య్య కృషి చేస్తున్నారు. ప్రస్తుతం వీరి సంస్థలో 714 మందికి పైగా రైతులు పనిచేస్తున్నారు. వ్యవసా యాభివృద్ధి లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది గురుగుమిల్లి వంటి మారుమూల గ్రామంలో పనిచేస్తున్న నేను వైఎస్సార్ సాఫల్య పురస్కారానికి ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ గుర్తింపుతో మరింత బాధ్యత పెరిగింది. గిరిజన ప్రాంతంలో వ్యవసాయాభివృద్ధికి మరింత కృషి చేస్తా. – సోడెం ముక్కయ్య -
Natural Farming: ప్రకృతి వ్యవసాయానికి ఏపీ చేదోడు
సమస్త జీవకోటి భారాన్ని మోసేది నేల. గతం నుండి మన తరానికి సంక్రమించిన వారసత్వ సంపద నేల. నేలను సారవంతంగా ఉంచే కారకాలు అపరిమితమైనవి కాదు, పరి మితమైనవి. విచ్చలవిడిగా భూమిని వాడిపడేస్తే... అది త్వరలోనే వట్టిపోతుంది. మనం ఈ భూమి మీద నివసిస్తున్నట్లే భవిష్యత్తు తరాలూ మనుగడ సాగించాలంటే... వారికి పనికి రాని నేలను కాక... సజీవమైన భూమిని అప్పగించాల్సిన బాధ్యత మనదే. మనుషుల నిర్లక్ష్యం, పేరాశ కారణంగా సాగు భూమి నిస్సారమైపోతోంది. నేల సేంద్రియ కర్బన పదార్థాలను కోల్పోయి పంటల సాగుకు పనికి రాకుండా పోతున్నది. వ్యవసాయంలో విచక్షణారహితంగా రసాయనాలను వాడటం వల్ల నేల నిస్సారమవుతున్నది. అధిక మొత్తంలో రసాయనాలు వాడిన ఫలి తంగా వచ్చిన వ్యవసాయ ఉత్పత్తులు తిన్న జీవజాలం అనారోగ్యం పాలవుతుంది. కన్న తల్లి పాలు కూడా పంటలపై చల్లే రసాయనాల కారణంగా విషతుల్య మవుతున్నాయని రాజస్థాన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు డాక్టర్ ఇంద్రసోని పాల్ తెలిపారు. విషతుల్యమైన వ్యవసాయ ఉత్పత్తుల వల్ల పిల్లల రోగ నిరోధక శక్తి నశిస్తుందనీ, తెలివితేటలు, జ్ఞాపకశక్తి దెబ్బతింటాయనీ ఇప్పటికే పరిశోధకులు తేల్చారు. అందుకే వ్యవసాయ విధానం ప్రకృతికి దగ్గరగా ఉండాలనే నినాదం ఇప్పుడు ఊపందుకుంది. అందులో భాగంగా నేలలోని సారం దీర్ఘకాలం మన గలిగే నిర్వహణ పద్ధతులు ప్రచారం చేస్తున్నారు. మట్టి ఆరోగ్యమే మనిషి ఆరోగ్యం అని తాత్వికతతో వ్యవసాయాన్ని సాగించాలి. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికీ, పర్యావరణాన్ని సుస్థిరమైనదిగా తయారు చేయ డానికీ, రైతుల జీవన ప్రమాణాలు పెంచడానికీ, సహజ వనరు లను ఉపయోగించి మంచి ఫలసాయం సాధించడానికీ, ప్రకృతి వ్యవసాయం దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ప్రత్యేకంగా ‘రైతు సాధికార సంస్థ’ ద్వారా జీరో–బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్, కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమాలను అమలు చేస్తోంది. రైతుల సంక్షేమం, వినియోగదారుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ వంటి బహుళ లక్ష్యాలతో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. రైతుల సాగు ఖర్చులను తగ్గించడం, రైతుల దిగుబడిని మెరుగుపరచడం, వారి నష్టాలను తగ్గించడం, లాభదాయ కమైన ధరలను పొందడం ద్వారా వారి నికర ఆదాయాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అధిక ధర కలిగిన కృత్రిమ ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు ఉపయోగించకుండా ప్రకృతికి అనుగుణంగా గోమూత్రం, గో పేడ, వేప ఆకులు, స్థానిక వనరులతో... ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, బీజామృతం, నీమాస్త్రం, అగ్నిఅస్త్రం, బ్రహ్మాస్త్రం వంటివాటిని తయారుచేసుకుని వ్యవసాయంలో ఉపయోగించడానికి ప్రోత్సహిస్తోంది. ఇందువల్ల నేలలో జీవ పదార్థం అధికమవ్వడమే కాక మొత్తంగా భూసారం పెరుగుతుంది. ప్రకృతి వ్యవసాయం ద్వారా మానవ ఆరోగ్యమే కాక, నేల ఆరోగ్యాన్నీ కాపాడవచ్చని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. (క్లిక్ చేయండి: తూర్పు కనుమల అభివృద్ధిపై విభిన్న వైఖరి!) – ఎ. మల్లికార్జున, ప్రకృతి వ్యవసాయ శిక్షకుడు -
శ్రీవారికి సేంద్రీయ ధాన్యం
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా వెన్నుదన్నుగా నిలుస్తోంది. సేంద్రియ విధానంలో సాగు చేసిన (ఆర్గానిక్) పంట ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా స్వామివారి ప్రసాదాలు, అన్న ప్రసాదాల్లో కూడా సేంద్రియ బియ్యం వినియోగించాలని ఆలోచనతో ఈ రకం ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఎంఎస్పీ కంటే పది శాతం ధర అధికంగా ఇచ్చి కొనుగోలు చేయడానికి రైతులను ఎంపిక చేసి ఒప్పందాలు చేసుకుంటోంది. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రత్యేక సర్టిఫికెట్ అందజేస్తోంది. వారు పండించిన పంటను మాత్రమే టీటీడీ కొనుగోలు చేయనుంది. కందుకూరు(పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. రసాయనిక ఎరువుల రహిత పంటలు పండించేలా రైతుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతుల్లో పండించిన పంటలకు ప్రభుత్వమే నేరుగా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తోంది. అందులో భాగంగా కొన్ని ఎంపిక చేసిన పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసేలా ప్రభుత్వం రైతులతో ఒప్పందం చేసుకుంటోంది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా గతేడాది నాలుగు జిల్లాల్లో శనగ పంటను ఎంపిక చేయగా, ఈ ఏడాది వరి పంటను ఎంపిక చేశారు. పైలట్ ప్రాజెక్ట్గా జిల్లా ఎంపిక ఈ ఏడాది ప్రకృతి సాగు పద్ధతుల్లో వరి ధాన్యాన్ని పెద్ద ఎత్తున పండించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు రాష్ట్రంలో వరి అధికంగా సాగయ్యే పలు జిల్లాలను ఎంపిక చేశారు. అందులో భాగంగా మేలు రకం వరి సాగుకు పెట్టిన పేరైన నెల్లూరు జిల్లాను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. జిల్లాలో ఈ రబీ సీజన్ నుంచి వరి పంటను సేంద్రియ విధానంలో సాగు పద్ధతులను పాటించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో ఎంపిక చేసిన రైతులకు ఈ తరహా సాగు విధానంలో అవగాహన కల్పించేందుకు ఒప్పిస్తున్నారు. గుడ్లూరు మండలంలోని చేవూరులో 25 మంది రైతులతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి సాగు చేసేందుకు ముందుకొచ్చే రైతులతో ముందుగానే ఒప్పందం చేసుకుంటున్నారు. దీని ప్రకారం రైతులు కచ్చితంగా అధికారులు సూచించిన సేంద్రియ సాగు పద్ధతుల్లోనే పంటలు పండించాలి. ఎటువంటి రసాయనిక ఎరువులను వాడకుండా కేవలం సేంద్రియ ఎరువులను మాత్రమే ఉపయోగించాలి. రైతులకు సేంద్రియ ఎరువులను సరఫరా చేయడంతో పాటు సాగులో వారికి ఆ శాఖ సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తారు. ఇలా పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే ప్రత్యేకంగా మార్కెటింగ్ చేయిస్తుంది. 2,640 టన్నుల ధాన్యం సరఫరాకు టీటీడీతో ఒప్పందం ప్రకృతి సాగు పద్ధతుల్లో పండించిన వరి ధాన్యాన్ని మార్కెటింగ్ కోసం ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డుతో ప్రత్యేక ఒప్పందం చేసుకుంది. జిల్లా నుంచి 2,640 టన్నుల మేలు రకం (సన్నబియ్యం) ధాన్యం సరఫరా చేసేందుకు అంగీకరించారు. ఇందుకు 1,300 ఎకరాల్లో వరిని సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఎకరాకు 2 టన్నుల చొప్పున దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 870 ఎకరాల్లో సాగు చేసేలా రైతులతో ఒప్పందం చేసుకున్నారు. మిగతా విస్తీర్ణానికి రైతులను ఒప్పించి పనిలో అధికారులున్నారు. సన్న రకాలే సాగు రైతుల ద్వారా ప్రధానంగా మూడు రకాలైన సన్న బియ్యం రకాల వరిని పండించనున్నారు. వీటిలో నెల్లూరు సన్నాలు (ఎన్ఎల్ఆర్34449), సాంబమసూరి (బీపీటీ 5204), రాజేంద్రనగర్ సన్నాలు (ఆర్ఎన్ఆర్15048) రకాలను పండించాలి. సేంద్రియ వ్యవసాయ సాగు పద్ధతుల్లోనే వరి పంటను ఈ రబీ సీజన్లో సాగు చేయించనున్నారు. ఈ విధంగా పండించిన పంటను ప్రభుత్వం సాధారణంగా ధాన్యానికి క్వింటాకు ఇచ్చే మద్దతు ధర కంటే 10 శాతం అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేయనున్నారు. ఈ సేకరించిన ధాన్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాద ట్రస్ట్కు సరఫరా చేయనున్నారు. పండించిన శనగ పంటను గతేడాది టీటీడీకి సరఫరా చేశారు. సేంద్రియ వ్యవసాయ రైతులకు సర్టిఫికెట్ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు సాగు చేసే రైతుల ఉత్పత్తులకు గుర్తింపు ఇచ్చేలా ఈ ఏడాది నుంచి ప్రత్యేకంగా సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. సేంద్రియ సాగు పద్ధతుల్లో పండించిన పంటలను ప్రత్యేకంగా మార్కెటింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మార్కెట్ ధర కంటే అధిక ధర రైతులకు లభిస్తుందని చెబుతున్నారు. అన్ని రకాల పంటలు సాగు చేసే రైతులకు ప్రకృతి వ్యవసాయశాఖ నుంచి సర్టిఫికెట్లు జారీ చేస్తామని ఆ శాఖ అధికారులు తెలిపారు. రసాయన రహితంగా ధాన్యం ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతుల్లో రబీ సీజన్లో ధాన్యం పండించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రసాయన రహిత ధాన్యాన్ని టీడీటీకి సరఫరా చేసేందుకు అంగీకారం కుదిరింది. ఇందు కోసం పైలట్ ప్రాజెక్ట్గా జిల్లాను ఎంపిక చేశారు. 2640 టన్నుల ధాన్యం ఉత్పత్తి కోసం కొంత మంది రైతులతో ఒప్పందం చేసుకుని మేలు రకం ధాన్యాన్ని జెడ్బీఎన్ఎఫ్ సిబ్బంది పర్యవేక్షణలో పండించేలా చర్యలు తీసుకున్నారు. పూర్తిగా సేంద్రియ ఎరువులను వినియోగించి పండించిన ధాన్యా న్ని మాత్రమే తీసుకుంటాం. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు ప్రత్యేకంగా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. – డీ మాలకొండయ్య, జెడ్బీఎన్ఎఫ్, డీపీఎం -
గిరిజన రైతులకు ఎఫ్పివో దన్ను! కాఫీ పండ్లు కిలో రూ. 50, మిరియాలు 400– 430కి కొని!
పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రకృతి వ్యవసాయదారుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించడం, నాణ్యమైన విత్తనాలను అందించడంలో తనదైన వ్యూహంతో ముందుకెళ్తోంది ‘మా భూమి’ ఎఫ్.పి.ఓ.! 2012–13లో గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామంలో పది మంది రైతులు కలిసి ‘శ్రీ వెంకటేశ్వర రైతు క్లబ్’ను ఏర్పాటు చేసుకున్నారు. డి.పారినాయుడు నేతృత్వంలోని జట్టు ట్రస్టుతో పాటు నాబార్డు సహకారం తీసుకున్నారు. రూ.5 లక్షల యంత్ర సామాగ్రిని 90 శాతం రాయితీపై సమకూర్చుకొని విత్తన శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత గరుగుబిల్లి మండలంలోని రైతు క్లబ్లన్నింటినీ ఏకం చేసి.. మా భూమి రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని (ఎఫ్పి.ఓ.ను) కంపెనీ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేయించారు. 4 మండలాలకు చెందిన 573 మంది రైతులు ఈ ఎఫ్.పి.ఓ.లో సభ్యులుగా, 15 మంది డైరెక్టర్లుగా వున్నారు. ఆరేళ్ల క్రితం నుంచి ఎఫ్.పి.ఓ. ప్రకృతి వ్యవసాయ విధానం వైపు రైతులను ప్రోత్సహిస్తోంది. ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, వేపపిండి, కషాయాలను తయారు చేసి రైతులకు విక్రయిస్తోంది. వీటి రవాణాకు ఎస్బీఐ సీఎస్ఆర్ నిధులతో రూ.7 లక్షల వ్యాన్ సమకూరింది. నూనె గానుగను రైతుసాధికార సంస్థ తోడ్పాటుతో ఏర్పాటు చేశారు. వివిధ సంస్థల నుంచి దఫదఫాలుగా రూ. 70 లక్షల రుణాలు తీసుకొని వ్యాపారాభివృద్ధికి ఉపయోగించారు. 2016–17లో రూ.18 లక్షల వ్యాపారం ద్వారా రూ. 80 వేల నికర లాభం గడించిన ఎఫ్.పి.ఓ... 2020–21 నాటికి రూ.70.02 లక్షల వార్షిక టర్నోవర్తో రూ.46 వేల నికరాదాయం ఆర్జించటం విశేషం. రైతుల్లో 90% చిన్న, సన్నకారు రైతులే. పెరుగుతున్న సాగు ఖర్చులు, తగ్గుతున్న దిగుబడులు, దళారుల దగాలు, ప్రకృతి వైపరీత్యాలు.. ఇవీ ఈ బడుగు రైతుల సమస్యలు. ఈ సమస్యలను తట్టుకొని రైతులు నిలబడాలంటే.. ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లటంతో పాటు తమ ఉత్పత్తులకు విలువను జోడించి, గిట్టుబాటు ధరలకు అమ్ముకోగలగటం ముఖ్యం. బడుగు రైతులను ఈ దిశగా సమైక్యంగా నడిపించడంలో ‘రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఏపీ రైతులకు చెందిన అటువంటి రెండు ఎఫ్.పి.ఓ.లు 2022–23కు సంబంధించి జాతీయ స్థాయి ‘జైవిక్ ఇండియా’ అవార్డుల్ని గెలుచుకోవటం విశేషం. ఈ నెల 23న ఆగ్రాలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. పాడేరు, పార్వతీపురం ప్రాంత రైతులకు విశేష సేవలందిస్తున్న ఈ రెండు ఎఫ్.పి.ఓ.ల విజయగాథలు రైతు లోకానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. గిరిజన రైతులకు ఎఫ్పివో దన్ను! కాఫీ, మిరియాలు, పసుపు కొనుగోళ్లతో రైతులకు మంచి ఆదాయం అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలంలోని ఎం. నిట్టాపుట్టు గ్రామం కేంద్రంగా రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్పివో) 2018లో ఏర్పాటైంది. 549 మంది రైతులు షేర్ హోల్డర్లుగా ఉన్నారు. 11 పంచాయతీలకు చెందిన 75 గ్రామాల్లోని 3,685 మంది గిరిజన రైతుల ద్వారా 9,575 ఎకరాల్లో ఈ ఎఫ్.పి.ఓ. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. దిగుబడులకు గిట్టుబాటు ధర కల్పనే లక్ష్యంగా గిరిజన రైతులకు అండగా నిలుస్తోంది. గత మూడేళ్లుగా కాఫీ పండ్లు, పాచ్మెంట్, మిరియాలు, పసుపు ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తోంది. బ్యాంకుల సహకారంతో నిట్టాపుట్టు ఎఫ్పివో వ్యాపారంలో రాణిస్తూ జాతీయ స్థాయిలో ఉత్తమ ఎఫ్పివోగా గుర్తింపు పొందింది. కాఫీ, మిరియాలు, పసుపు తదితర ఉత్పత్తుల వ్యాపారం ద్వారా 2019–20లో రూ.29.9 లక్షలు, 2020–21లో రూ.1.91 కోట్ల టర్నోవర్ సాధించింది. కాఫీ పండ్లను కిలో రూ.50కు, మిరియాలను రూ.400–430కి, పసుపును రూ.65–80కు ఎఫ్.పి.ఓ. కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తోంది. సీజన్లో రోజుకు 35–45 మంది గిరిజనులకు పని కల్పిస్తూ రూ.350ల రోజు కూలీ చెల్లిస్తున్నారు. గిరిజన రైతులు రసాయనాలు వాడకుండా పండించే ఉత్పత్తులకు ఆర్గానిక్ సర్టిఫికెట్లు సాధించి గిట్టుబాటు ధర రాబట్టడంలో ఎం.నిట్టాపుట్టు ఎఫ్టీవో మంచి పేరు తెచ్చుకుంది. – ఎన్.ఎం. కొండబాబు, సాక్షి, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా ∙మాభూమి ఎఫ్.పి.ఓ.లో విత్తనాల ప్రాసెసింగ్ యంత్రం దళారులు లేకుండా నేరుగా వ్యాపారం మాభూమి విత్తన కంపెనీ ద్వారా నాణ్యమైన విత్తనాలను రైతులకు విక్రయిస్తున్నాం. ఆరోగ్యానికి మేలు చేసే వరి దేశీయ రకాలైన నవారా, కాలాభట్, రత్నచోడి, ఢిల్లీ బాస్మతి, చిట్టి ముత్యాలు, సుగంధ సాంబ విత్తనాలను రైతులకు అందిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జోడించటం, దళారుల్లేకుండా నేరుగా వ్యాపారం నిర్వహించడం వంటి పనులు చేస్తున్నాం. – తాడేన మన్మథనాయుడు (63649 93344), మాభూమి ఎఫ్ఏవో కమిటీ సభ్యుడు, లక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలం ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం కృషి మాభూమి ఎఫ్ఏవో ఉత్పత్తులకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం హైదరాబాద్లోని స్కంద ఆర్గానిక్–42 కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ కంపెనీ సిబ్బంది క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి సర్టిఫికేట్ను మంజూరు చేస్తారు. ఇంటర్నేషనల్æ కంట్రోల్ సిస్టమ్(ఐసీఎస్) సర్టిఫికెట్ ఉంటే రైతులు పండించిన ఉత్పత్తులను లాభాలున్న చోట ఎక్కడైనా విక్రయించుకొనేందుకు అవకాశం ఉంటుంది. – ఎం. నూకం నాయుడు (94400 94384), సీఈవో, మాభూమి ఎఫ్పీవో, తోటపల్లి తూకాలు, ధరల్లో మోసాలకు స్వస్తి దళారుల తూకాలు, ధరల్లో మోసాలకు స్వస్తి చెప్పి తోటి గిరిజనులకు మేలు చేయాలనే లక్ష్యంతో ఎఫ్పీవోను ప్రారంభించాం. కాఫీ, మిరియాలు, పసుపు మార్కెటింగ్ బాధ్యతలు చేపట్టి రైతులకు మంచి లాభాలు అందిస్తున్నాం. ఈ ఆర్ధిక సంవత్సరంలో చిరుధాన్యాలను కూడా కొనుగోలు చేస్తాం. ప్రకృతి వ్యవసాయంపై అన్ని గ్రామాల్లోనూ విస్తృత ప్రచారం చేస్తున్నాం. – పరదాని విజయ (63000 39552) , చైర్పర్సన్, ఎం.నిట్టాపుట్టు ఎఫ్టీవో, జి.మాడుగుల మం., అల్లూరి సీతారామరాజు జిల్లా రెండేళ్లుగా ఎఫ్పీవోకే అమ్ముతున్నా... ఎఫ్పీవో ద్వారా రెండేళ్లుగా మంచి లాభాలు వస్తున్నాయి. ఈ ఏడాది కిలో రూ.50ల ధరతో 200 కిలోల కాఫీ పండ్లు, రూ.250ల ధరతో 500 కిలోల పాచ్మెంట్ కాఫీ గింజలను అమ్మాను. మిరియాలు కిలో రూ.460కి ఎఫ్పివో కొనుగోలు చేసింది. – పరదాని లక్ష్మయ్య, నిట్టాపుట్టు గ్రామం, జి.మాడుగుల మం. ,ఏఎస్సార్ జిల్లా – అల్లు సూరిబాబు, సాక్షి ప్రతినిధి, విజయనగరం చదవండి: Sagubadi: కాసుల పంట డ్రాగన్! ఎకరాకు 8 లక్షల వరకు పెట్టుబడి! రెండో ఏడాదే అధికాదాయం.. 50 లక్షలకు పైగా! -
ప్రకృతి సాగులో ఏపీ భేష్
సాక్షి, అమరావతి/అనంతపురం అగ్రికల్చర్: ప్రకృతి సాగును ప్రోత్సహించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషి అద్భుతమని గ్రౌండ్స్ వెల్ ఇంటర్నేషనల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టీవ్ బ్రేసియా ప్రశంసించారు. సంస్థ ఆధ్వర్యంలో వారం రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి వచ్చిన లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలకు చెందిన 30 మంది ప్రతినిధుల బృందం గురువారం అనంతపురంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్చైర్మన్ టి.విజయకుమార్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి పరిశీలనలో తమ అనుభవాలను విదేశీ ప్రతినిధులు పంచుకున్నారు. స్టీవ్ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయ విధానం అమలుచేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని కొనియాడారు. ప్రత్యేకంగా రైతు సాధికార సంస్థ ఏర్పాటుచేసి వ్యవసాయ భూమిని సారవంతం చేయడంతో పాటు తక్కువ ఖర్చుతో లాభసాటి వ్యవసాయం చేయిస్తున్న తీరు అమోఘమన్నారు. రైతుల సంక్షేమం, భూ పరిరక్షణకు చేపడుతున్న చర్యలతో ప్రపంచానికే ఏపీ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఇందుకు ప్రోత్సహిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. సమావేశానికి హాజరైన 15 దేశాల ప్రతినిధులు అందరూ నేర్చుకోవాలి : నేపాల్ నేపాల్ ప్రతినిధి నవరాయ్ ఉపాధ్యాయ మాట్లాడుతూ.. ఇక్కడ రైతులు ఆచరిస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు ఆదర్శనీయమన్నారు. నేపాల్లో పెద్దఎత్తున ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తామన్నారు. ఇక ‘మేం విన్నది ఇక్కడ ప్రత్యక్షంగా చూశాం. పంట వైవిధ్యత, నీటి పొదుపు చర్యలు ఎంతో మెరుగ్గా వున్నాయి. బీజామృతంతో విత్తనశుద్ధి చేసి గుళికలు తయారుచేయడం ప్రపంచంలో మరెక్కడా చూడలేదు. ఆంధ్రప్రదేశ్లో ఒక క్రమపద్ధతిలో చేస్తున్న ప్రకృతి సాగు ద్వారా భూమి సారవంతం కావడంతో పాటు వాతావరణంలో స్పష్టమైన మార్పులు వస్తున్నట్లుగా గమనించాం. ప్రకృతి సాగులో మహిళల పాత్ర ఎంతో ఉంది’.. అని ఘనా∙దేశ ప్రతినిధి డాన్ బనాకూ అన్నారు. ప్రభుత్వ కృషి బాగుంది హోండూరస్ దేశ ప్రతినిధి ఎడ్విన్ ఎసకొటో మాట్లాడుతూ.. ఇక్కడ పర్యటించడం ఎంతో సంతోషంగా ఉందని, ఇక్కడ ఎన్నో విషయాలు నేర్చుకుని వెళ్తున్నామన్నారు. మా దేశంలో ఈ విధానాన్ని సులువుగా అమలుచెయ్యగలుగుతామన్న నమ్మకం కలిగిందన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు అదనపు ధర చెల్లించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి బాగుందన్నారు. అలాగే, ఇక్కడ ఆచరిస్తున్న విధానాలను తమకు అనుకూలంగా మలుచుకుని ఆచరిస్తామని... ప్రకృతి సాగులో మహిళల భాగస్వామ్యం మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందని బుర్కినా ఫాసో దేశ ప్రతినిధి ఫాటూ భట్ట అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రకృతి సేద్యం: మంత్రి కాకాణి ఇక ప్రకృతి వ్యవసాయానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యత ఇచ్చి రైతాంగాన్ని ప్రోత్సహిస్తున్నారని.. ప్రస్తుతం నాలుగువేల ఆర్బీకేల పరిధిలో అమలవుతున్న ప్రకృతి సాగును భవిష్యత్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు కృషిచేస్తున్నట్లు మంత్రి కాకాణి వెల్లడించారు. రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్కుమార్ మాట్లాడుతూ.. రైతుసాధికార సంస్థతో కలిసి పనిచేసేందుకు మెక్సికో ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నేపాల్ ప్రభుత్వం నుంచి కూడా తనకు ఆహా్వనం అందిందని చెప్పారు. -
ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్న మహిళా రైతు ఓబులమ్మ
తలకు మించిన భారంగా, నష్టదాయకంగా మారిన రసాయనిక వ్యవసాయంతో విసిగి వేసారి ఆరేళ్ల క్రితం ప్రకృతి వ్యవసాయం చేపట్టిన మహిళా రైతు కుటుంబం రైతు లోకానికే ఆదర్శంగా నిలిచింది. అంతేకాదు, జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జైవిక్ ఇండియా జాతీయ ఉత్తమ రైతు పురస్కారాన్ని గెల్చుకోవటం విశేషం. వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం టి. కొత్తపల్లెకు చెందిన బండి ఓబులమ్మ, తిరుమలయ్య దంపతులు 2016 నుంచి కొద్ది విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించి.. తదనంతరం పదెకరాలకు ప్రకృతి సేద్యాన్ని విస్తరించారు. నిమ్మ తోటలో అంతర పంటలు సాగు చేస్తున్నారు. దేశీ వరిని సాగు చేస్తున్నారు. కొంత విస్తీర్ణంలో ఏడాది పొడవునా కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తూ.. స్వయంగా నేరుగా వినియోగదారులకు విక్రయిస్తూ నిరంతర ఆదాయం గడిస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం పూర్తిగా నిలిపివేశారు. మూడు ఆవులను కొనుగోలు చేసి, పేడ, మూత్రంతో ఘనజీవామృతం, జీవామృతం స్వయంగా తయారు చేసి వాడుతున్నారు. అవసరం మేరకు కషాయాలు వాడి పంటలు పండిస్తున్నారు. తొలుత యూట్యూబ్లో ప్రకృతి సేద్యపు విజయగాథలు చూసి స్ఫూర్తి పొంది శ్రీకారం చుట్టారు. తదనంతరం గ్రామ స్థాయిలో అందుబాటులోకి వచ్చిన ఏపీ ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బంది సూచనలు, సలహాలు పాటిస్తూ.. పర్యావరణానికి, ప్రజలకు ఆరోగ్యదాయకమైన సేద్య రీతిలో తిరుగులేని పట్టు సంపాదించారు. అంతేకాదు, సొంతంగా ప్రజలకు అమ్ముకోవటంలోనూ విజయం సాధించారు. కలిసొచ్చిన నోటి ప్రచారం పండించిన కూరగాయలు, ఆకుకూరలను తాము తినటంతో పాటు ఓబులమ్మ స్వయంగా ఇంటింటికీ వెళ్లి అమ్ముతుండటం విశేషం. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆరోగ్యదాయక ఉత్పత్తుల విశిష్టత గురించి గ్రామాల్లో ఆయమ్మకు ఈయమ్మకు చెప్పడం మొదలు పెట్టారు. వీటిని తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని తెలియజెప్తూ అమ్మేవారు. ఈ విషయం ఆ నోట ఈ నోట తామర తంపరగా పాకిపోయింది. వారి గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే మైదుకూరు పట్టణంలోని కూరగాయల వ్యాపారులకూ ఈ విషయం తెలిసింది. వారి నుంచి కడప, పొద్దుటూరులో కూరగాయల వ్యాపారులకు కూడా తెలిసింది. వారు నేరుగా ఓబులమ్మ తోట దగ్గరకు వచ్చి కూరగాయలు కొనుక్కెళ్లటం అలవాటైంది. దీంతో ఓబులమ్మ పండించే ప్రకృతి వ్యవసాయ పంట దిగుబడులకు మార్కెటింగ్ సమస్యతో పాటు రవాణా ఖర్చు కూడా మిగిలింది. ఖర్చు తగ్గడంతో మంచి రాబడి ప్రారంభమైంది. దీంతో ఓబులమ్మ తన భర్త తిరుమలయ్యతో కలిసి క్రమంగా ప్రకృతి వ్యవసాయ విస్తీర్ణం పెంచుతూ వచ్చారు. 2018 నుంచి తమకున్న మొత్తం 10 ఎకరాల్లోనూ ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. అల్లుడు శివరామయ్య, కుమార్తె ఆదిలక్ష్మిల సహకారంతో ప్రకృతి వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలను పాటిస్తూ దిగ్విజయంగా ఓబులమ్మ, తిరుమలయ్య దంపతులు ప్రకృతి వ్యవసాయంలో ముందుడుగు వేస్తున్నారు. నిమ్మ తోటలో అంతర పంటలు మొదల్లో 2 ఎకరాల్లో నిమ్మ మొక్కలు నాటి.. అంతరపంటలుగా వంగ, మిరప, ఆరటి, బొప్పాయి వంటి తదితర పంటలను సాగు చేశారు. నిమ్మ, అరటి, బొప్పాయి పండ్లను పొలం వద్దనే వ్యాపారులకు అమ్మేవారు. తక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన కూరగాయలు, ఆకుకూరలను మాత్రం ఆలవాటు కొద్దీ ఉదయాన్నే గ్రామాగ్రామానికి తిరిగి అమ్మడం నేటికీ కొనసాగిస్తున్నారు ఓబులమ్మ. 2020లో మరో 6 ఎకరాల్లో నిమ్మ మొక్కలు నాటారు. ఈ ఆరు ఎకరాల్లో కూడా అంతర్ పంటగా ప్రతి 50 సెంట్లలో టమోటా, మిరప, వంగ, గోంగూర, పాలకూర, చుక్కాకు వంటివి సాగు చేశారు. పండ్లు, కూరగాయలను పొలం వద్దే కొనుగోలు చేసుకొని తీసుకు వెళ్తుండటంతో ఓబులమ్మకు మార్కెటింగ్ సమస్య లేకుండా పోయింది. (క్లిక్: ఎకరాకు 8 లక్షల పెట్టుబడి! రెండో ఏడాదే అధికాదాయం.. 50 లక్షలకు పైగా!) అధిక ధరకే అమ్మకాలు గతేడాది 10 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా రూ. 6.99 లక్షల నికరాదాయం వచ్చిందని ఓబులమ్మ తెలిపారు. రూ. 4.8 లక్షలు ఖర్చవ్వగా వివిధ పంటల అమ్మకం ద్వారా రూ. 11,79 లక్షల ఆదాయం వచ్చింది. 3 ఎకరాల్లో నువ్వులు, 2 ఎకరాల్లో కొర్రలు, 2 ఎకరాల్లో మైసూరు మల్లిక, బహురూపి దేశీ వరిని ఓబులమ్మ సాగు చేశారు. మిగతా 3 ఎకరాల్లో పలు రకాల కూరగాయలు, ఆకుకూరలను సాగు చేశారు. నువ్వుల ద్వారా రూ. లక్ష, నిమ్మకాయల ద్వారా రూ.4.70 లక్షలు, మైసూరు మల్లిక, బహురూపి బియ్యం ద్వారా 1.13 లక్షలు, కొర్ర ధాన్యం ద్వారా రూ. 56 వేలు, మిర్చి ద్వారా రూ. 2.78 లక్షలు, టమాటోలు తదితర కూరగాయల ద్వారా రూ. 1.62 లక్షల ఆదాయం వచ్చింది. కూరగాయలు, ఆకుకూరల అమ్మకం ద్వారా ప్రతి రోజూ కొంత రాబడి వస్తున్నది. మార్కెట్లో సాధారణ కూరగాయల చిల్లర కన్నా కిలోకు 2–3 రూపాయల అధిక ధరకు విక్రయిస్తున్నట్లు ఓబులమ్మ వివరించారు. ఈ ఏడాది ఖరీఫ్లో నిమ్మ తోటలో అంతరపంటలుగా 2 ఎకరాల్లో ఉల్లి, 1.5 ఎకరాల్లో కొత్తిమీర, 50 సెంట్లలో వరి పంటలను సాగు చేస్తున్నారు. ఇతర వివరాలకు ఓబులమ్మ అల్లుడు శివరామయ్య (98485 58193)ను సంప్రదించవచ్చు. – గోసుల ఎల్లారెడ్డి, సాక్షి, కడప అగ్రికల్చర్ మా కష్టాన్ని గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టినప్పటి నుంచి సాగు ఖర్చు భారీగా తగ్గింది. నా భర్త తిరుమలయ్యతోపాటు అల్లుడు శివరామయ్య, కుమార్తె ఆదిలక్ష్మితో కలిసి వివిధ పంటలను సాగు చేస్తున్నాను. పురుగు మందులకు బదులు నీమాస్త్రం, దశపర్ణి కషాయం, వేపనూనె, కానుగ నూనెలను వాడతాం. ఎరువులకు బదులుగా జీవామృతం, ఘనజీవామృతం వేసుకుంటాం. వీటిని మేమే తయారు చేసుకుంటాం, పంటల సాగుకు ముందు నవధాన్యాలను విత్తి, ఎదిగిన తర్వాత పొలంలో కలియదున్నుతాం. తర్వాత వేసే పంటలకు అది సత్తువగా పనికొస్తుంది. పండ్లను వ్యాపారులే వచ్చి కొనుక్కుంటున్నారు. కూరగాయలను ఇంటింటికీ తీసుకెళ్లి అమ్ముతున్నా. మా కష్టాన్ని గుర్తించిన ప్రకృతి వ్యవసాయ అధికారులు అవార్డుకు దరఖాస్తు చేయించారు. జైవిక్ ఇండియా అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. – బండి ఓబులమ్మ, ప్రకృతి వ్యవసాయదారు, టి. కొత్తపల్లె, మైదుకూరు మం., వైఎస్సార్ జిల్లా -
నేచర్ అర్బైన్.. అతిపెద్ద రూఫ్టాప్ పొలం!
పారిస్.. ఫ్రాన్స్ రాజధాని. అత్యంత జనసాంద్రత కలిగిన యూరోపియన్ రాజధానులలో ఒకటి. కాంక్రీటు అరణ్యంగా మారిపోవటంతో పచ్చని ప్రదేశాల విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. అన్నే హిడాల్గో అనే మహిళ 2014లో మేయర్గా ఎన్నికైన తర్వాత పారిస్ పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధారణ పచ్చదనంతో అన్నే సంతృప్తి చెందలేదు. విస్తారమైన వాణిజ్య సముదాయాల పైకప్పులను పచ్చని సేంద్రియ పంట పొలాలుగా మార్చాలని ఆమె సంకల్పించారు. అర్బన్ కిచెన్ గార్డెన్స్ నిర్మించే సంస్థలను ప్రోత్సహించడానికి నిర్మాణాత్మక కార్యాచరణ చేపట్టి సఫలీకృతులవుతున్నారు. పారిస్లో అర్బన్ అగ్రికల్చర్ విస్తీర్ణాన్ని 100 హెక్టార్లకు విస్తరించాలన్న లక్ష్యానికి చేరువలో ఉన్నారు మేయర్ అన్నే హిడాల్గో. పారిస్కల్చర్ రూఫ్టాప్లపైన, పాత రైల్వే ట్రాక్ పొడవునా, భూగర్భ కార్ల పార్కింగ్ ప్రదేశాల్లోనూ, ఖాళీ ప్రదేశాల్లో సేంద్రియ పంటలు, పుట్టగొడుగుల సాగును ప్రోత్సహిస్తు న్నారు. ‘ద పారిస్కల్చర్స్’ పేరిట అర్బన్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్లకు ప్రోత్సాహం ఇచ్చే పథకానికి మేయర్ శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి అత్యాధునిక మిద్దె (రూఫ్టాప్) పొలాలు నగరం అంతటా వెలుస్తున్నాయి. వాటిల్లో ‘నేచర్ అర్బైన్’ అతి పెద్దది. దక్షిణ పారిస్లో అద్భుతమైన కొత్త ఎగ్జిబిషన్ హాల్ భవనం పైన 14,000 చదరపు మీటర్ల (3.45 ఎకరాల) విస్తీర్ణంలో ఈ రూఫ్టాప్ ఫామ్ ఏర్పాటైంది. రోజుకు వెయ్యి కిలోల సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, సలాడ్ గ్రీన్స్, స్ట్రాబెర్రీ తదితర పండ్లను ఉత్పత్తి చేస్తున్న ‘నేచర్ అర్బైన్’లో 20 మంది పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రూఫ్టాప్ క్షేత్రంగా ఇది పేరుగాంచింది. పారిస్ వాసులకు లెట్యూస్, టొమాటోలు, స్ట్రాబెర్రీలు, దుంపలు, తులసి, పుదీనా, ఇతర తాజా 35 రకాల సేంద్రియ పండ్లు, కూరగాయ లతో పాటు ఔషధ, సుగంధ మొక్కలను ‘నేచర్ అర్బైన్’ అందిస్తోంది. కరోనా మహమ్మారి మొదటి దఫా లాక్డౌన్ ముగిసిన తర్వాత .. నగరాల్లోనే సాధ్యమైనంత వరకు సేంద్రియ ఆహారోత్పత్తుల ఆవశ్యకతను చాటిచెబుతూ ‘నేచర్ అర్బైన్’ ప్రారంభమైంది. ఆక్వాపోనిక్స్.. హైడ్రోపోనిక్స్.. రూఫ్టాప్ పొలంలో రసాయన ఎరువులు, పురుగుమందులు, శిలీంద్రనాశినులు వాడరు. ఆక్వాపోనిక్స్, హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పంటలను సాగు చేస్తున్నారు. మట్టిని వాడరు. పోషకాలు, ఖనిజాలు, జీవన ఎరువులతో కూడిన పోషక ద్రావణం కలిపిన నీటిని మొక్కల వేర్లకు అందిస్తూ పంటలను 10% నీటితోనే సాగు చేస్తున్నారు. నిలువు ప్లాస్టిక్ స్తంభాలలో లెట్యూస్, తులసి, పుదీనా మొక్కలు ఏరోపోనిక్స్ పద్ధతిలో ఏపుగా పెరుగుతుంటాయి. (క్లిక్ చేయండి: పేదల ఆకలి తీర్చే ఆర్గానిక్ గార్డెన్స్!) వీటికి ఎదురుగా, సన్నగా, అడ్డంగా ఉండే ట్రేలలో కొబ్బరి పొట్టులో నోరూరించే దేశవాళీ చెర్రీ టొమాటోలు, నాటు వంకాయలు, టొమాటోలు, కీర దోస తదితర కూరగాయలను పెంచుతున్నారు. పారిస్ వాసులు స్వయంగా తామే ఈ రూఫ్టాప్ పొలంలో పంటలు పండించుకోవడానికి ఎత్తు మడులతో కూడిన ప్లాట్లను ఏడాదికోసారి అద్దెకిస్తారు. 140 కూరగాయల ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. నగరవాసులకు సాగు నేర్పడానికి పారిస్ నగరపాలక సంస్థ ఒక ప్రత్యేకమైన స్కూల్ను కూడా ప్రారంభించింది. పారిస్ నగరపాలకుల ప్రయత్నాల వల్ల స్థానికుల ఆహారపు అవసరాలు తీరేది కొద్ది మేరకే అయినప్పటికీ, తద్వారా ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ఒనగూరే బహుళ ప్రయోజనాలు మాత్రం అమూల్యమైనవి! – పంతంగి రాంబాబు -
పేదల ఆకలి తీర్చే ఆర్గానిక్ గార్డెన్స్!
మురికివాడల్లో నిరుపేదల సంక్షేమం కోసం ఆహార ధాన్యాలు, పప్పులు ఉప్పులను ప్రభుత్వం సబ్సిడీపై ఇవ్వటం మనకు తెలుసు. వాటితో పాటు సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలను అందుబాటులోకి తెస్తోంది రియో డి జనీరో (బ్రెజిల్) నగరపాలక సంస్థ! రియో ఎంతో అందమైన నగరం. అంతే కాదు.. విశాలమైన మనసున్న మహానగరం కూడా! సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలను మడుల్లో పెంచటాన్ని నేర్పించటం ద్వారా సేంద్రియ ఆహారాన్ని వెనుకబడిన ప్రజల్లోనూ ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే బృహత్తర లక్ష్యాన్ని పెట్టుకున్నారు రియో నగర మేయర్ ఎడ్వర్డో పేస్. తొలినాళ్లలో ప్రభుత్వ నిధులతో గార్డెన్లను నిర్వహించటం, తదనంతరం స్థానికులే స్వయంగా నిర్వహించుకుని కూరగాయల సాగులో స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహిస్తోంది రియో నగర పర్యావరణ శాఖలోని ప్రత్యేక ఉద్యాన విభాగం. పేదల ఇళ్ళకు దగ్గర్లోనే ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో కమ్యూనిటీ కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసింది. వీటిల్లో వేలకొలది ఎత్తు మడులు నిర్మించి, అక్కడి వారితోనే సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయించి, ఇంటింటికీ పంపిణీ చేస్తోంది. 2006లో ప్రారంభమైన ఈ అర్బన్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ ‘హోర్టాస్ కారియోకాస్’ (‘రియోవాసుల కూరగాయల తోట’ అని దీని అర్థం) సంఖ్య గత 16 ఏళ్లలో 56కి పెరిగింది. వీటిలో 29 మురికివాడల్లో, 27 నగరంలోని పాఠశాలల్లో ఉన్నాయి. దాదాపు 50,000 కుటుంబాలు ఇప్పటికే ఈ ప్రాజెక్ట్లో నిమగ్నమై ఉన్నాయి. గత సంవత్సరానికి మొత్తం 80 టన్నుల ఆకుకూరలు, కూరగాయలను వీటిలో పండించి, పంపిణీ చేశారు. ఇది కొందరికి తాజా ఆహారం దొరికింది. మరికొందరికి ఈ గార్డెన్స్లో పని దొరకటంతో ఆదాయం సమకూరింది. కరోనా కష్టకాలంలో ఈ గార్డెన్లు తమని ఎంతో ఆదుకున్నాయని ప్రజలు సంతోషపడుతున్నారు. ఆహారం ఎంతో అవసరమైన జనం నివాసమున్న చోటనే కమ్యూనిటీ అర్బన్ గార్డెన్లను మరింతగా విస్తరించాలని రియో నగర పాలకులు సంకల్పించారు. రియో నగర ఉత్తర ప్రాంతంలోని మూడు మురికివాడల్లో నిర్మించిన గార్డెన్లను విస్తరింపచేసి ప్రపంచంలోనే అతిపెద్ద అర్బన్ కమ్యూనిటీ కిచెన్ గార్డెన్ను నెలకొల్పాలనే లక్ష్యంతో పనులు చేపట్టారు. ఆ గార్డెన్ ఏకంగా 15 ఫుట్ బాల్ కోర్టులంత ఉంటుందట. అంటే, దాదాపు 11 హెక్టార్ల విస్తీర్ణం అన్నమాట! 2024 నాటికి ఈ కల సాకారం కాబోతోంది! ప్రతినెల లక్ష కుటుంబాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రయోజనం పొందుతాయి. అర్బన్ అగ్రికల్చర్కు ఉన్న శక్తి ఏపాటిదో దీన్ని బట్టి అర్థం అవుతుంది అంటున్నారు జూలియో సీజర్ బారోస్. ‘హోర్టాస్ కారియోకాస్’ పథకం అమలుకు రియో డి జనీరో మునిసిపల్ పర్యావరణ విభాగం తరఫున ఆర్గానిక్ గార్డెనింగ్ డైరెక్టర్ హోదాలో శ్రీకారం చుట్టిన అధికారి ఆయన. ‘మా ప్రాజెక్ట్ లక్ష్యం అందమైన తోటను నిర్మించడం కాదు. నగరంలోనే సేంద్రియ ఆహారాన్ని పండించి ఎంత మందికి అందించగలమో చూడాలన్నదే’ అని బారోస్ చెప్పారు. మురికివాడల్లో నివాసం ఉండే వారినే తోట మాలులుగా, సమన్వయకర్తలుగా నియమిస్తారు. వారికి స్టైఫండ్ ఇస్తారు. పండించిన కూరగాయల్లో 50% మురికివాడల్లోని పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తారు. మిగిలిన 50% తోటమాలులకు ఇస్తారు. వాళ్ళు ఇంట్లో వండుకొని తినొచ్చు లేదా అక్కడి వారికే సరసమైన ధరలకు అమ్ముకోనూ వచ్చు. ప్రతి తోటకు కొంత కాలమే ప్రభుత్వ సాయం అందుతుంది. చివరికి స్వతంత్రంగా మారాల్సి ఉంటుంది అని బారోస్ చెప్పారు. ఆర్థిక లాభాలతో పాటు, ఒకప్పుడు పరిసరాల్లో సాధారణంగా ఉండే మాదకద్రవ్యాల అక్రమ రవాణా నుంచి ప్రజలు దూరంగా ఉండటంలో ఈ ప్రాజెక్ట్ మరింత పెద్ద సామాజిక ప్రయోజనాన్ని అందిస్తుందని బారోస్ అంటారు. – పంతంగి రాంబాబు -
కూరగాయలు, పండ్ల నిల్వలో విప్లవం.. 2 నెలల వరకు చెక్కు చెదరవు!
పండ్లు, కూరగాయల నిల్వ పద్ధతిలో విప్లవాత్మక మార్పు వచ్చింది. అస్సాంలోని గౌహతి ఐఐటీ శాస్త్రవేత్తలు ఉద్యాన పంటల రైతులకు తీపికబురు చెప్పారు. విస్తృత పరిశోధనల ఫలితంగా సముద్రపు నాచు వంటి సహజ పదార్థాలతో ఓ సేంద్రియ లేపన పదార్థాన్ని ఆవిష్కరించారు. ఈ ద్రావణంలో కూరగాయలు, పండ్లను ముంచి తీసి పక్కన పెడితే సరి. లేదంటే ఈ పదార్థంతో కవరును తయారు చేసి అందులో పండ్లు, కూరగాయలను నిల్వ చేసినా చాలు. వారం, రెండు వారాలు కాదు.. ఏకంగా రెండు నెలల వరకు చెక్కు చెదరకుండా నిల్వ ఉంటాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. కుళ్లిపోయిన టమాటోలు, ఉల్లిపాయలు, పండ్లను చెత్తకుప్పల్లో పారబోయాల్సిన దుస్థితికి కాలం చెల్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయనిపిస్తోంది. అంతేకాదు.. ‘పచ్చి సరుకు’ కాబట్టి తక్కువ ధరకే తెగనమ్ముకోవాల్సిన దుస్థితి నుంచి ఉద్యాన రైతులు విముక్తి పొందే రోజు కూడా దగ్గర్లోనే ఉందని చెప్పొచ్చు! కూరగాయలు, పండ్లను పొలంలో పండించడానికి రకాన్ని బట్టి 3 నుంచి 12 నెలల సమయం పడుతుంది. ఇంతా కష్టపడి పెంచి చెట్ల నుంచి కోసిన తర్వాత, ప్రజలకు అందించేలోగా, కొద్ది రోజుల్లోనే వడలిపోతుంటాయి. ఇంకొన్ని రోజులైతే కుళ్లి పనికిరాకుండా పోతుంటాయి కూడా. ఈ క్రమంలో ఉద్యాన పంటల రైతులకు, చిరు వ్యాపారులకు తీవ్రనష్టం జరుగుతూ ఉంటుంది. కొన్ని రకాల కూరగాయలు, పండ్లకైతే అత్యధికంగా 20% వరకు నష్టం జరుగుతోంది. ధర మరీ పతనమైతే పారబోయాల్సిన దుస్థితి. ఈ కష్టాల నుంచి రైతులను, వ్యాపారులను గట్టెక్కించే సరికొత్త సేంద్రియ లేపన పదార్థాన్ని గౌహతిలోని ఐఐటీకి చెందిన రసాయన ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్లు, పరిశోధకులు కనుగొన్నారు. తాజాదనాన్ని, పోషకాలను, రంగును, రూపురేఖలను కోల్పోకుండా పండ్లు, కూరగాయలను నిల్వ చేయొచ్చు. బంగాళదుంపలు, ఉల్లిపాయలు వంటి వాటిని మెత్తబడిపోకుండా, మొలక రాకుండా చూసుకోవచ్చు. ఏకంగా రెండు నెలల వరకూ కాపాడుకోవచ్చని ఐఐటీ నిపుణులు చెబుతున్నారు. సేంద్రియ పదార్థాలతో తయారు చేసిన ఈ లేపనం పూసిన పండ్లు, కూరగాయలను తిన్న వారికి ఎటువంటి హానీ జరగదని శాస్త్రీయ పరీక్షల్లో రుజువైందంటున్నారు. బంగాళాదుంపలు, టొమాటోలు, పచ్చి మిరపకాయలు, స్ట్రాబెర్రీలు, ఖాసీ మాండరిన్ రకం నారింజ పండ్లు, ఆపిల్స్, పైనాపిల్స్, కివీ పండ్లపై ఈ పదార్థాన్ని ఇప్పటికే పరీక్షించి.. వీటిని దాదాపు రెండు నెలల పాటు తాజాగా ఉంచగలిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిశోధనా బృందానికి కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ విమల్ కటియార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. వైభవ్ వి గౌడ్ మార్గదర్శకత్వం నెరిపారు. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ సస్టైనబుల్ పాలిమర్స్కు చెందిన పరిశోధకులు తబ్లీ ఘోష్, కోన మొండల్, మాండవి గోస్వామి, శిఖా శర్మ, సోను కుమార్ విజయవంతంగా పరిశోధనలు నిర్వహించారు. లేపనంలో ఏముంది? డునాలియెల్లా టెర్టియోలెక్టా అనే సముద్రపు నాచు సారానికి పాలీసాకరైడ్లను కలిపి ఈ లేపన పదార్థాన్ని రూపొందించారు. ఈ సముద్రపు నాచు యాంటీఆక్సిడెంట్లతో పాటు.. కెరోటినాయిడ్లు, ప్రోటీన్లు వంటి వివిధ బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఒమేగా–3 కొవ్వు ఆమ్లంను ఉత్పత్తి చేయడానికి, అదే విధంగా జీవ ఇంధనం ఉత్పత్తికి కూడా ఈ సముద్రపు నాచును ఉపయోగిస్తున్నారు. ఒమేగా–3 కొవ్వు ఆమ్లంను వెలికితీసిన తర్వాత మిగిలే అవశేషాలను వ్యర్థాలుగా భావించి పారేసేవారు. అయితే, గౌహతి ఐఐటి పరిశోధకులు ఈ అవశేషాలను చిటోసాన్ అనే పిండి పదార్థంతో కలిపి లేపన పదార్థాన్ని రూపొందించే పద్ధతిని కనుగొన్నారు. సూక్ష్మక్రిములు, శిలీంధ్రాల నాశని లక్షణాలు కలిగిన ఈ పదార్థాలతో తయారైన లేపన పదార్థం తిన్న వారికి ఎటువంటి నష్టం కలగదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. (క్లిక్: ఇంటి పంట: రూఫ్టాప్ పొలం.. 5.7 ఎకరాలు!) ఈ విధంగా తయారు చేసిన లేపన పదార్థంలో మనుషుల ఆరోగ్యానికి మేలు చేసే మెరుగైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట. ఇది 40 డిగ్రీల వరకు వేడికి తట్టుకుంటుంది. లేపనం రాసిన తర్వాత చెదిరిపోకుండా ఉంటుంది. పండ్లు, కూరగాయల్లో నుంచి నీటి ఆవిరి బయటకుపోకుండా అడ్డుకుంటుంది. కాంతిని అడ్డుకునే శక్తి దీనికి ఉందని అనేక పరీక్షల ద్వారా నిర్థారణైందని పరిశోధకులు తెలిపారు. పరిశోధకులు ఈ పూతను జీవ భద్రత కోణంలోనూ పరీక్షించారు. వివిధ జీవ ప్రక్రియల అధ్యయనానికి ప్రయోగశాల ప్రమాణంగా పరిగణించే ‘బిహెచ్కె21 సెల్ లైన్’ ద్వారా పరీక్షించి చూశారు. ఈ లేపన పదార్థం విషపూరితమైనది కాదని, తినదగిన ఆహార ప్యాకేజింగ్ పదార్ధంగా సురక్షితంగా ఉపయోగించవచ్చని పరీక్షల్లో తేలిందన్నారు. (క్లిక్: నెలకు 3 లక్షల రూపాయల జీతం వదిలేసి..) ఈ అధ్యయన ఫలితాలు రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ అడ్వాన్సెస్, అమెరికన్ కెమికల్ సొసైటీకి చెందిన ‘ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ సహా అనేక ప్రతిష్టాత్మక శాస్త్రీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పండ్లు, కూరగాయల వృథాను అరికట్టడంతో పాటు, రైతుల వెతలను తగ్గించి మంచి ఆదాయాన్నిచ్చే ఈ అద్భుత లేపనం త్వరలోనే అందుబాటులోకి రావాలని ఆశిద్దాం. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఆకృతి, రంగు, రుచి, పోషకాలు చెక్కుచెదరవు! భారత వ్యవసాయ పరిశోధనా మండలి అంచనా ప్రకారం 5 నుంచి 16 శాతం పండ్లు, కూరగాయలు కోసిన తర్వాత నిల్వ సామర్థ్యం లేక వృథాగా పాడైపోతున్నాయి. వాస్తవానికి ఈ నష్టం బంగాళాదుంప, ఉల్లిపాయలు, టొమాటో వంటి కొన్ని పంటల్లో కోత అనంతర నష్టం 19% వరకు ఉండొచ్చు. ప్రజలు ఎక్కువగా తినే ఈ కూరగాయల ధర ఆ మేరకు పెరిగిపోతోంది. ఈ లేపన పదార్ధాన్ని పెద్దఎత్తున ఉత్పత్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. 40 డిగ్రీల సెల్షియస్ వరకు కాంతిని, వేడిని, ఉష్ణోగ్రతను ఈ లేపనం చాలా స్థిరంగా తట్టుకుంటుంది. తిన్న వారి ఆరోగ్యానికి ఎటువంటి హానీ జరగదు. సురక్షితమైనది. లేపనం చేసిన పండ్లు, కూరగాయల ఆకృతి, రంగు, రుచి, పోషక విలువలు చెక్కుచెదరదు. ఈ లేపన పదార్థాన్ని నేరుగా కూరగాయలు, పండ్లపై పూయవచ్చు లేదా ఈ పదార్థంతో కవర్ను తయారు చేసి కూరగాయలు, పండ్లను అందులో నిల్వ చేయవచ్చు. ఈ రెండు పద్ధతుల్లో ఎలా ఉపయోగించినా కూరగాయలు, పండ్ల నిల్వ సామర్థ్యాన్ని పొడిగించవచ్చు. ఇది సాధారణ ‘డిప్ కోటింగ్ టెక్నిక్’. పెద్దగా ఖర్చు పెట్టకుండానే పంట కోత అనంతరం దిగుబడులను సులభంగా దీర్థకాలం నిల్వ చేసుకోవచ్చు. – ప్రొ. విమల్ కటియార్, అధిపతి, కెమికల్ ఇంజనీరింగ్ విభాగం, ఐఐటి, గౌహతి, vkatiyar@iitg.ac.in -
నెలకు 3 లక్షల రూపాయల జీతం వదిలేసి..
ఆయన ఓ విశ్రాంత ఉద్యోగి. నెలకు రూ.3 లక్షలు జీతం. ప్రైవేటు కంపెనీలో డిజిఎంగా పనిచేసి వీఆర్ఎస్ తీసుకున్నారు ఘట్రాజు వెంకటేశ్వరరావు. వ్యవసాయంపై ఉన్న ఆసక్తితో అమ్మమ్మ గారి ఊరు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామానికి వచ్చి తమ 4.5 ఎకరాల పొలంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో దేశీ వరి రకాల సాగు చేపట్టారు. సుమారు రెండేళ్లు నిల్వ చేసిన ధాన్యాన్ని ఆరోగ్యదాయకమైన దేశీ బియ్యం విక్రయిస్తూ లాభాలతో ఆత్మసంతృప్తిని ఆర్జిస్తున్నారు. ఆయన అనుభవాల సారం ఆయన మాటల్లోనే.. ‘‘ప్రముఖ కంపెనీలో ముంబైలో ఉద్యోగం చేశాను. డీజీఎంగా బాధ్యతలు నిర్వహణ. ఐదేళ్ల క్రితం వీఆర్ఎస్ తీసుకుని హైదరాబాద్కు వచ్చేశాను. అప్పటికే ప్రకృతి సేద్యంపై ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ప్రకతి వ్యవసాయ నిపుణులు సుభాష్ పాలేకర్ శిక్షణా తరగతుల్లో పాలొని మెళకువలు నేర్చుకున్నా. ఆచరణలో పెట్టేందుకు అమ్మమ్మ వాళ్ల ఊరైన కోలవెన్ను వచ్చి స్థిరపడ్డా. 4.5 ఎకరాల్లో తులసీబాణం, నారాయణ కామిని, నవారా, కాలాభట్, మార్టూరు సన్నాలు, రత్నచోడి, బహురూపి వంటి దేశీ వరి రకాలు సాగు చేస్తున్నా. రెండు ఆవులను తెచ్చుకున్నా. ఏటా సాగు ఆరంభంలో 40 ట్రక్కుల ఘన జీవామృతాన్ని పొలంలో చల్లుతున్నా. పంటకు అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తున్నాయి. వర్రలతో బావిని కట్టించి 1200 లీటర్ల జీవామృతం తయారుచేసి 15 రోజులకోసారి చల్లుతున్నా. పంట ఆరోగ్యంగా ఎదుగుతున్నది. తెగుళ్ల బెడద లేదు. ఆవ పిండి చెక్క కూడా జీవామృతంలో కలిపి వాడుతున్నా. ఎకరాకు రూ. 25–30 వేల వరకూ పెట్టుబడి అవుతుంది. 25–28 బస్తాల వరకూ ధాన్యం దిగుబడి వస్తున్నది. పంటను ఆశించే పురుగు నివారణకు వేపపిండి చల్లుతాను. పోషకాలు జీవామతం ద్వారా అందుతాయి. మరీ అవసరం అయితే, అగ్ని అస్త్రం చల్లుతాను. ఎలాంటి పురుగైనా నాశనం అవుతుంది. దేశవాళీ విత్తన పంట నిల్వ, మార్కెటింగ్ విషయాలు చాలా ప్రధానమైనవి. పంట చేతికి వచ్చాక కనీసం 10 నెలల నుంచి రెండేళ్ల వరకూ పంటను మాగబెట్టిన ధాన్యాన్ని మిల్లులో ఆడించి నాణ్యమైన బియ్యాన్ని బెంగుళూరు, హైదరాబాద్, కొచ్చిన్, చెన్నై ప్రాంతాల్లో ఉన్న నేరుగా విక్రయిస్తున్నా. నవారా, కాలాభట్ స్థానికంగా కిలో రూ. 90కి, బయట ప్రాంతాలకు రూ. 120కే అందిస్తున్నా, రవాణా ఖర్చు కూడా కలిపి. ఇతర రకాల బియ్యం కిలో రూ.75కే ఇస్తున్నా. ప్రతి రైతూ ప్రకృతి విధానం వైపు అడుగులు వేస్తే దిగుబడులు, ఆరోగ్యం, ఆదాయం, భూసారం పెంపుదల సాధ్యమే. ప్రభుత్వం రైతు భరోసా, ఇతర సబ్సిడీలు అందిస్తున్నది. వీటితో పాటు ప్రకృతి విధానంలో పండించిన పంటకు అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని మార్కెటింగ్ సదుపాయాలు విస్తరించి, అదనపు వసతులు కల్పిస్తే కొత్త రైతులు కూడా ఈ విధానంలోకి వచ్చేస్తారు.’’ – ఈ.శివప్రసాద్, సాక్షి, కంకిపాడు, కృష్ణా జిల్లా వడ్లు ఎంత మాగితే అన్నం అంత ఒదుగుతుంది. ధాన్యం నిల్వ చేయకుండా తినటం వల్ల కడుపు నొప్పి, అజీర్ణ సమస్యలు ఏర్పడతాయి. పంట నాణ్యంగా ఉంటే ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. అలాగే ప్రకృతి విధానం వల్ల భూసారం పెంపొందుతుందని గుర్తించాను. (క్లిక్: కొబ్బరి పొట్టుతో సేంద్రియ ఎరువు! ఎలా తయారు చేసుకోవాలంటే!) – ఘట్రాజు వెంకటేశ్వరరావు (92255 25562), కోలవెన్ను -
స్ఫూర్తి..: జీవనాడిని విస్తరించింది.. రూ.60 లక్షల వ్యాపారం
పచ్చని ఆకులో భోజనం మన సంప్రదాయం అదే మన ఆరోగ్య రహస్యం. ఆ జీవనాడిని పట్టుకొని అదే వ్యాపారంగా మార్చుకున్నారు తెలంగాణలోని సిద్దిపేట జిల్లా వాసి మాధవి విప్పులంచ. బాధించిన క్యాన్సర్ నుంచి కోలుకొని అమెరికాలో చేస్తున్న ఉద్యోగం వదిలి సేంద్రియ వ్యవసాయం వైపు మరలి పచ్చని విస్తరాకు ప్లేట్లను రాష్ట్రంతోపాటు ఇతర దేశాలకూ సరఫరా చేస్తున్నారు. స్థానిక మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన విప్పులంచ మాధవి బీఫార్మసీ చేసి, బ్యాంకాక్, మలేషియా, సింగపూర్, అమెరికా దేశాల్లో ఉద్యోగాలు చేశారు. తిమ్మారెడ్డిపల్లిలో సేంద్రీయ వ్యవసాయం చేస్తూ మోదుగ, అడ్డాకులతో ప్లేట్లు తయారు చేస్తూ, వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. 20 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ, యేటా రూ.60 లక్షలు సంపాదిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అగ్రి టూరిజాన్ని వృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్న మాధవిని ఆమె పర్యావరణ ప్రయాణం గురించి అడిగితే ఎన్నో విశేషాలను వివరించింది. ‘‘పుట్టి పెరిగింది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఎనుగుర్తి గ్రామం. అమ్మానాన్నలు ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డారు. నాన్న చింతల బలరాం కళాశాల ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యారు. అమ్మ సరోజిని రిటైర్డ్ ఫార్మసిస్ట్. నేను డిగ్రీవరకు హైదరాబాద్లోనే చదువుకున్నాను. ఆ తర్వాత అమ్మ సలహా తో వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో బీఫార్మసీ పూర్తి చేశాను. చదువుకునే సమయంలోనే పెళ్లైంది. ఇద్దరు కొడుకులు. నా చదువు పూర్తయిన తర్వాత నా భర్త వేణుగోపాల్తో కలిసి ఉద్యోగరీత్యా పూణె వెళ్లాను. అక్కడ పూణె హాస్పిటల్లో ఫార్మసిస్ట్గా మూడేళ్ల పాటు పని చేశాను. ఆ తర్వాత బ్యాంకాక్, మలేషియా, సింగపూర్, అమెరికా దేశాల్లో ఉద్యోగాలు చేసి, 2007లో తిరిగి హైదరాబాద్కు వచ్చేశాం. స్కూల్తో మొదలు కొన్ని రోజుల్లోనే ప్రైమరీ పాఠశాలను ప్రారంభించాను. సాయంత్రం వేళల్లో యోగా శిక్షకురాలిగా పనిచేశాను. వ్యవసాయం అంటే ఉన్న ఆసక్తితో సేంద్రియ సేద్యం వైపు దృష్టి పెట్టాను. అంతా సాఫీగా సాగుతుందనుకున్న క్రమంలో కొద్దిరోజుల తేడాతో నాన్న, అక్క మరణించడం నన్ను తీవ్రంగా బాధించింది. క్యాన్సర్ నుంచి కోలుకుని.. వారి మరణం బాధ నుంచి కోలుకోక ముందే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డాను. అయినా భయపడకుండా ధైర్యంగా ఉంటూ చికిత్స తీసుకున్నాను. ఆ సమయంలో యోగా శిక్షణ నన్ను మరింత బలంగా చేసింది. ఏడాదిన్నర కాలంలో క్యాన్సర్ను జయించాను. ఆ సమయంలోనే కూరగాయలు, పంటల సాగులో రసాయనాల వాడకం, కలుషితమైన వాతావరణమే నా వ్యాధికి కారణమని గ్రహించాను. నాలాగే చాలామంది ఇలాంటి సమస్యలకు లోనవుతుంటారని కూడా తెలుసుకున్నాను. అప్పుడే ప్రకృతి సేద్యం చేస్తూ ఉన్నంతలో మంచి ఆహార పంటల ఉత్పత్తులను సమాజానికి అందించాలన్న ఉద్దేశంతో నా భర్త సహకారంతో 2017లో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి లో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశాం. అందులో 20 వేల వరకు మామిడి, జామ, అరటి, బత్తాయి, సపోట తోటలు పెట్టాం. ఇతర కూరగాయలు పంటలను çపండించడం మొదలుపెట్టాం. సేంద్రియ ఎరువు తయారీకి 15 ఆవులను పెంచుతున్నాం. వాటి మూత్రం, పేడతో జీవామృతం తయారుచేసి మొక్కలకు అందిస్తున్నాం. పచ్చని విస్తరాకులు పండించే పంట, చేసే వంట మాత్రమే కాదు తినే ప్లేటు కూడా బాగుండాలనే ఆలోచన యూజ్ అండ్ త్రో మెటీరియల్ను చూసినప్పుడల్లా కలిగేది. ప్లాస్టిక్ కారణంగా ఎంత నష్టం వాటిల్లుతుందో తెలుసుకునే క్రమంలో చాలా బాధ అనిపించింది. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు విస్తరాకుల తయారీ సరైనదని గ్రహించాను. నా చిన్నతనంలో ఆకులతో కుట్టిన విస్తరాకుల్లోనే భోజనం చేసేవారు. ఇప్పుడు ఆ పద్ధతి మారిపోయింది. మన సంస్కృతిలో భాగమైన విస్తరాకుల తయారీని ముందు చేత్తోనే చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత దీనినే 2019లో ‘ఆర్గానిక్ లీఫ్ టేబుల్’ పేరిట వ్యాపారాన్ని ప్రారంభించాను. ఈ విస్తరాకు ల విక్రయానికి ప్రత్యేకంగా ఒక పోర్టల్ సైతం ఏర్పాటు చేశాను. దీంతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ నిత్యం పోస్టులు చేయడం ద్వారా కొనుగోలుదారులు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. విదేశాలకూ ఎగుమతి జర్మనీ, హాంకాంగ్, అమెరికా దేశాలకు సైతం మా విస్తరాకులు ఎగుమతి అవుతున్నాయి. వీటి తయారీకి కావాల్సిన అడ్డాకులను ప్రత్యేకంగా ఒరిస్సా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మోదుగ ఆకులు మన నేలకు మాత్రమే ప్రత్యేకమైనవి. ఆకుల సేకరణ కష్టంగా ఉంది. ఇబ్బందులను అధిగమిస్తూనే రోజూ 10 వేల వరకు విస్తరాకులను తయారు చేస్తున్నాం. దాదాపు 20 మంది స్థానిక మహిళలకు ఉపాధి కల్పించాను. ప్రతి యేడు రూ.60 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది. రానున్న రోజుల్లో మేం పండిస్తున్న సేంద్రియ కూరగాయలు, పండ్లతో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేయాలనుకుంటున్నాం. ఎవరైనా వ్యవసాయం గురించి తెలుసుకోవాలనుకుని వచ్చినవారికి మా స్థలంలో ఒక పిక్నిక్ స్పాట్ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. వచ్చినవాళ్లకు రెండు మూడు రోజులపాటు వసతి సదుపాయాలు అందించేలా జాగ్రత్తలు తీసుకుంటూ, అగ్రి టూరిజం చేయాలనేదే లక్ష్యంగా ముందుకెళ్తున్నాను’ అని వివరించారు మాధవి. పండించే పంట, చేసే వంట మాత్రమే కాదు తినే ప్లేటు కూడా బాగుండాలనే ఆలోచన యూజ్ అండ్ త్రో మెటీరియల్ను చూసి నప్పుడల్లా కలిగేది. ప్లాస్టిక్ కారణంగా ఎంత నష్టం వాటిల్లుతుందో తెలుసుకునే క్రమంలో చాలా బాధ అనిపించింది. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు విస్తరాకుల తయారీ సరైనదని గ్రహించాను. – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట ఫొటోలు: కె.సతీశ్కుమార్ -
Organic Farming: నలభై ఎకరాల భూమి.. ప్రకృతి సేద్యం.. ఆరోగ్యసిరిగా...
బాధ్యతల బరువు దించుకున్నాక సామాన్యుల కోసం ఏమైనా చేయగలనా అనుకుంది. సొంత లాభం కొంతమానుకుని నలుగురికి ఉపయోగపడాలని అనుకున్న ఆలోచన ఆమెను వ్యవసాయం దిశగా నడిపించింది. ప్రకృతి సేద్యంతో పదిమందికి చేయూతనిస్తూ తన జీవనాన్ని అర్థవంతంగా మార్చుకుంటోంది ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని కొల్లావారిపల్లెకు చెందిన శవన హైమావతి. ఆరోగ్యసిరిగా అందరిచేత ప్రశంసలు అందుకుంటోంది. కొడుకు, కూతురు విదేశాలలో స్థిరపడ్డారు. చిన్నకొడుకు చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. భర్త మరణం తర్వాత ఒంటరి జీవితం ఆమెను వ్యవసాయం వైపు దృష్టి మళ్లించేలా చేసింది. వారసత్వంగా ఉన్న భూమిని తనే స్వయంగా సాగులోకి తీసుకురావాలనుకుంది. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో తన ద్వారా తన చుట్టూ ఉన్నవారి ఆరోగ్యం బాగుపడాలని కోరుకుంది. పదిహేనేళ్లుగా ప్రకృతిసేద్యంతో పంటసిరులను కురిపిస్తోంది హైమావతి. ప్రయోగాలతో సేద్యం... హైమావతి కుటుంబానికి పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న భూమి నలభై ఎకరాలు ఉంది. అందులో మొదట్లో కొద్దిపాటి భూమిని స్వయంగా సేద్యం చేసుకుంటూ, ప్రకృతి సేద్యంపట్ల అవగాహన కల్పించుకుంటూ చిన్న చిన్న ప్రయోగాలు చేస్తూ వచ్చింది. పదిహేనేళ్లుగా చేస్తున్న ఈ సేంద్రియ వ్యవసాయం ఇప్పుడు 34 ఎకరాలకు విస్తరించింది. సుభాష్ పాలేకర్ను స్ఫూర్తిగా తీసుకుని సమావేశాలకు హాజరవుతూ, వ్యవసాయానికి సంబంధించిన పుస్తకాలు చదువుతూ ప్రకృతిసేద్యంలో పూర్తి నైపుణ్యం సాధించింది. రసాయనాలు వాడకుండా ఎరువులు మొదలుకొని పురుగు మందుల వరకు అన్నీ సొంతంగా తయారు చేస్తుంది. స్వయంగా ఎరువుల తయారీ... స్కూల్ చదువు దగ్గరే ఆగిపోయిన హైమావతి ఇప్పుడు సేంద్రియ వ్యవసాయంలో ఎంతోమందికి సలహాలు ఇచ్చేంతగా ఎదిగింది. ఎరువుల కోసం పాడి ఆవుల పెంపకాన్ని చేపట్టింది. పురుగులు, తెగుళ్లను నివారించేందుకు స్వయంగా మిశ్రమాలను తయారుచేస్తూ చుట్టుపక్కల గ్రామాల రైతులకు అవగాహన కలిగిస్తోంది. ఎండిన ఆకులతో, మగ్గబెట్టిన చెత్తాచెదారం, పండ్లు, కూరగాయల వ్యర్థాలతో ఎరువులు, యూరియా వంటివి తయారు చేస్తూ రసాయనాల వాడకం లేకుండానే అధిక దిగుబడులు సాధిస్తోంది. నామమాత్రపు ధర... మామిడి, చెరకు, నిమ్మ, జామ, సపోట, నేరేడు, ఉసిరి, పనస, చీనీ.. పండ్ల తోటల సాగుతోపాటు అన్ని రకాల కూరగాయలు పండిస్తున్నారు. వీటిని తన చుట్టుపక్కల వారికి ఇవ్వడంతో పాటు మిగతా వారికి నామమాత్రపు ధరలతో అందిస్తున్నారు. అందరికీ ఇవ్వగా మిగిలిన ఉత్పత్తులను రాజంపేట పాత బస్స్టాండు వద్ద షాపును ఏర్పాటు చేసి, పేదలకు ఉచితంగా అందజేయడంతో పాటు మిగతా ఉత్పత్తులను తక్కువ ధరకు అందిస్తోంది. అందరి ఆరోగ్యం ఈ కంప్యూటర్ యుగంలో ఎక్కడ చూసినా కల్తీ సరుకులే. వీటితో ఎంతోమంది అనారోగ్యం బారిన పడటం చూస్తున్నాను. రసాయనాలు లేని సేంద్రియ వ్యవసాయంతో పండించిన ఉత్పత్తులను అందరూ ప్రోత్సహించాలి. అందుకే ఈ పనిని ఎంచుకున్నాను. ఎటువంటి లాభాలూ ఆశించకుండా నా చుట్టూ ఉన్నవారికి సేంద్రియ ఆహారం అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. – శవన హైమావతి పురస్కారాల పంట... ప్రకృతి సేద్యంలో రాణిస్తున్న హైమావతిని ప్రతి యేటా అవార్డులు వరిస్తున్నాయి. ఈ ఏడాది మహిళా దినోత్సవ సందర్భంగా మాతృభూమి ఫౌండేషన్ నుంచి తెలంగాణ గవర్నర్ తమిళసై చేతుల మీదుగా హైమావతికి అవార్డును ప్రదానం చేశారు. ప్రకృతి వ్యవసాయంలో ప్రతిది క్షుణ్ణంగా తెలుసుకుంటూ నేడు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న హైమావతికి అభినందనలు చెబుదామా!- – బసిరెడ్డి వెంకట నాగిరెడ్డి, సాక్షి, అన్నమయ్యజిల్లా చదవండి: Sagubadi: మూడు చక్రాల బుల్లెట్ బండి! లీటర్ డీజిల్తో ఎకరం దున్నుకోవచ్చు!