palakollu
-
ప్రాణం తీసిన గూటీ బిళ్ల
పాలకొల్లు అర్బన్: గూటీ బిళ్ల ఆట యువకుడి ప్రాణం తీసింది. పాలకొల్లు పట్టణంలో సోమవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై జి.పృథ్వీ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బంగారు వారి చెరుగట్టు ప్రాంతానికి చెందిన మాతకాని హరికృష్ణ పదో తరగతి వరకు చదివాడు. పెయింటింగ్ పనిచేసుకుని తల్లిదండ్రులకు ఆసరా ఉంటున్నాడు. స్నేహితులతో కలిసి సోమవారం మధ్యాహ్నం కొత్త కుళాయి చెరువుగట్టు మీద గూటీ బిళ్ల ఆడుకుంటున్నారు. గూటి బిళ్ల కుళాయి చెరువులో పడిపోయింది. దీంతో హరికృష్ణ దాని కోసం చెరువులోకి దిగి గల్లంతయ్యాడు. తహసీల్దార్ దుర్గాకిషోర్ ఫైర్ సిబ్బందితో కుళాయి చెరువులో వెతికించారు. రాత్రి 7 గంటల సమయంలో మృతదేహం లభించింది. తల్లిదండ్రులు లక్ష్మీ, అప్పన్న కూలి పనిచేసుకుని జీవిస్తున్నారు. వీరికి హరికృష్ణ ఒక్కడే మగ సంతానం. హరికృష్ణ మృతితో వృద్ధాప్యంలో తమకు దిక్కెవరు అంటూ కన్నీరు పెడుతున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏపీ హోంమంత్రి అనిత వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి,పశ్చిమ గోదావరి : డ్రగ్స్ తీసుకుంటేనే, స్మగ్లింగ్ చేస్తేనే హీరోలా చూస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిల్లా పాలకొల్లు మండలంలో ఇవాళ (డిసెంబర్15) ఉదయం పాలకొల్లులో ‘సేవ్ గర్ల్ చైల్ఢ్’ అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు.ఈ సందర్భంగా వంగలపూడి అనిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీలో యువత గంజాయి మత్తుకు అలవాటుపడుతోంది. సినిమాలు చూసి ప్రభావితమవుతున్నారు. గంజాయి,డ్రగ్స్,మందు తాగేవాళ్లను హీరోలుగా చూస్తున్నారు. చిన్నారులపై అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం,రాష్ట్రంలో శాంతి భద్రతలు సంరక్షించే హోంమంత్రి హోదాలో అనిత ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై వివాదం రాజుకుందిఇలా హోమంత్రిగా హోదాలో ఉన్న వంగలపూడి అనిత ఈ నవంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నోరు పారేసుకున్నారు.అసెంబ్లీలో అనిత ఏం మాట్లాడారంటే?ఐదు సంవత్సరాల వైఎస్సార్సీపీ పాలనలో కంటే.. తమ హయాంలోని గత ఐదు నెలల కాలంలోనే క్రైమ్ రేటు విపరీతంగా తగ్గిందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ ఆందోళనకుదిగగా.. మరోవైపు చైర్మన్ సైతం ఆమె తీరును తప్పుబట్టారు.ఏపీ శాసన మండలిలో శాంతి భద్రతలపై వాడీ వేడి చర్చ నడిచింది. తొలుత.. రాష్ట్రంలో అత్యాచార ఘటనలు పెరిగిపోవడంపై వరదు కళ్యాణి మాట్లాడారు. దిశ యాప్, చట్టాన్ని నిర్వీర్యం చేయడంపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. దీనిపై అనిత మాట్లాడుతూ.. అత్యాచార ఘటనను రాజకీయం చేయొద్దన్నారు. అలాగే.. మహిళల భద్రత పేరిట వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిశ చట్టం తెచ్చిందని, దిశ పోలీస్ స్టేషన్లు గతంలో ఏర్పాటు చేశారని.. తాము అధికారంలోకి వచ్చాక వాటిని తొలగించామని ఆమె అన్నారామె. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా విఫలం అయ్యిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పిన వ్యాఖ్యలను మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.అసహనానికి లోనైన ఆమె.. దమ్ము, ధైర్యం అంటూ ఆమె తీవ్ర పదజాలంతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో కొయ్యే మోషేన్రాజు, మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు.బాధ్యత గల మంత్రిగా ఉండి.. దమ్ము ధైర్యం గురించి మాట్లాడం సరైనది కాదు అని అన్నారాయన. దీంతో ఆమె క్షమాపణలు చెప్పి కూర్చున్నారు. అయితే అనిత వ్యాఖ్యలపై నిరసనగా.. శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం విఫలమైనందున మండలి నుంచి వైఎస్సార్సీపీ వాకౌట్ చేసింది. అంతకు ముందు..‘‘ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పై నేరాలు, వేధింపులు పెరిగాయి. రాష్ట్రంలో రోజుకు 59 నేరాలు మహిళల పై జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి గంట కి ఇద్దరు, ముగ్గురు మహిళలు పై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసులు వైఫల్యం వలన మహిళలు, చిన్నారుల పై నేరాలు జరుగుతున్నాయి. ముచుమర్రి లో 9 ఏళ్ల బాలిక పై అత్యాచారం చేసి చంపేస్తే ఈరోజు కి మృతదేహం దొరకలేదు. హిందూపురం లో అత్తా కోడళ్ల పై గ్యాంగ్ రేప్ చేశారు. ఏ ఆర్ పురంలో చిన్నారిని అత్యాచారం చేసి చంపేశారు. దిశ యాప్ ని కొనసాగిస్తున్నారా..? లేదా..?. దిశ పోలీసు స్టేషన్ల ను కొనసాగిస్తున్నారా లేదా?. మహిళల పై నేరాల పై నియంత్రణ కు ఏదైనా కొత్త వ్యవస్థ తెచ్చారా..? అని మండలిలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు గుప్పించారు. -
పాలకొల్లు రైల్వే స్టేషన్ దగ్గర విషాదం.. ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
సాక్షి, పశ్చిమగోదావరి: పాలకొల్లు రైల్వే స్టేషన్ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేయగా, యువకుడు మృతిచెందాడు. రైలు వచ్చే సమయానికి యువతిని పక్కకు నెట్టి యువకుడు సూసైడ్కు పాల్పడ్డాడు. పెద్దలు వీరి వివాహానికి అంగీకరించకపోవడమే కారణమని సమాచారం.ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందగా, ప్రియురాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.మృతుడుది గణపవరం కాగా, ప్రియురాలు ఎస్ కొండేపాడు గ్రామానికి చెందిన అమ్మాయిగా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఈవారం కథ: 'తరలి వచ్చిన వసంతం'!
ఆమె నన్ను ఎప్పటికీ క్షమించదు : రమాకాంత్ సెప్టెంబర్ 3.. 2023 సంవత్సరం.. సాయంత్రం నాలుగు గంటలు. ఆసుపత్రి నుంచి డిశ్చారై్జ నేటికి మూడోరోజు. రియల్లీ సర్ప్రైయిజింగ్. భూమ్మీద నాకింకా నూకలున్నందుకు ఆనందించాలో.. విచారించాలో తెలియడం లేదు. నాలో ఇప్పుడు ఎలాంటి ఆశలు గానీ అసంతృప్తులు గానీ లేవు. డాక్టర్ నోటి వెంట వచ్చిన ఆ మూడుముక్కలు నా చెవిన పడ్డాక మనసు తేలికైంది. ఇక ఏ గొడవా లేదు. రోజులు లెక్కపెట్టుకుంటూ కాలం గడిపేయాల్సిందే. చివరిరోజుల్లో మనిషికి.. తనకు బాగా దగ్గరైన మిత్రులు గానీ, శత్రువులు గానీ గుర్తొస్తుంటారట. అందుకనేమో నాలో ఇప్పుడీ ఆలోచనలు.. ఏభైఆరేళ్ల నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు. వందల చిత్రాల్లో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బహుభాషా చిత్రాల్లో నటించాను. అవార్డులెన్నో గెలుచుకున్నాను. పేరు, గౌరవం, డబ్బు, సెలబ్రిటీ స్టేటస్.. ఇవేవీ నాకు తెలియనివి కావు. వేషాల కోసం ప్రొడక్షన్ హౌస్ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాను. వెన్ను తట్టి ప్రోత్సహించిన వాళ్లకంటే తిరస్కరించిన వాళ్ళే ఎక్కువ. తర్వాత వాళ్ళే నా డేట్స్ కోసం నా ఇంటిచుట్టూ తిరగడం నేనెరుగుదును. దానికి నేనేం గర్వంగా ఫీలవ్వను. ఎందుకంటే ఎవరి టైమ్ ఎప్పుడొస్తుందో చెప్పలేం గదా! కానీ ప్రతినాయక పాత్రల్లో ఆదరించి నన్నో స్టార్ని చేసిన ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రం ఎప్పటికీ మరచిపోను. అందుచేత కృతజ్ఞతలు చెప్పాల్సివస్తే అది మొదట ప్రేక్షకులకే. తర్వాత సినీ రంగానికి! పరిశ్రమలోని ఎందరో ప్రముఖులు.. వారితో గల స్నేహాలూ, నైట్ పార్టీలూ నాకో కొత్త ఫిలాసఫీని పరిచయం చేశాయి. చివరకు అదే నా జీవితాన్ని తల్లకిందులు చేసింది. లోపలకు ఎవరో వచ్చినట్టున్నారు.. మంచంపై నిస్తేజంగా పడున్న నేను కళ్ళు తెరచి చూశాను. నా భార్య లత..ఆమెతో పాటు ఎవరో ఇద్దరు పరిచయస్తులు. నా అచేతనావస్థను చూసి సన్నగా వాళ్లలో గుసగుసలు.. ‘ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు? ప్చ్.. అంతా అతని కర్మ!’ ‘అతని కర్మ కాదు.. ఆమె చేసిన కర్మ!’ ‘ష్.. అవన్నీ ఇప్పుడెందుకులే..’ మాటలు ఆగిపోయాయి. లతకు ధైర్యం చెప్పి వాళ్ళ మానాన వాళ్ళు వెళ్లిపోయారు. వారి సంభాషణలో దొర్లిన ‘ఆమె’ మాత్రం ఈమె కాదు. ఆమె ఒకప్పటి నా కలల ప్రపంచం. నా జీవన మాధుర్యం. పాతికేళ్ళనాటి ఆమె జ్ఞాపకాలు ఒక్కటొక్కటిగా నాలో.. తన తమిళ చిత్రంలోని హీరోయిన్ పాత్ర కోసం నాట్యం తెలిసిన అమ్మాయి గురించి నా దర్శక మిత్రుడొకడు అన్వేషిస్తున్న కాలమది. అంతకు మునుపు రవీంద్రభారతిలో నాట్య ప్రదర్శనతో అమితంగా ఆకట్టుకున్న ఓ అమ్మాయి చప్పున గుర్తొచ్చింది. ఆమె పేరు మధురిమ. ఆమె వివరాలను కనుక్కొని అతనికి పంపించాను. ఆమె హీరోయిన్గా సెలెక్టయ్యి నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ కృతజ్ఞతాభావంతో ఓ రోజు ట్రీట్ ఇస్తానని రెస్టారెంట్కు ఆహ్వానించడంతో వెళ్లాను. ఒకే టేబుల్పై ఎదురెదురుగా కూర్చొని దగ్గరగా అలా చూడటం అదే తొలిసారి. విరిసిన మందారంలా.. స్వచ్ఛంగా.. ముగ్ధమనోహరంగా ఉందామె. ‘చెప్పండి.. ఏం తీసుకుంటారు?’ తేనెలొలుకుతున్నట్టు మధురంగా వినిపించిందామె గొంతు. ‘ఏదైనా చెప్పండి.. నో ప్రాబ్లెమ్’ అన్నాను. ‘ఐతే.. నాకిష్టమైనవన్నీ చెప్పేస్తా. ఫర్వాలేదా?’ అంది. సమ్మోహనమైన ఆమె నవ్వు నాలోని సీరియస్నెస్ను బద్దలు కొట్టింది. నవ్వాను తొలిసారి మనసు నిండుగా. ఆర్డర్ చేసినవి వచ్చాయి. తింటున్నంతసేపూ వసపిట్టలా మాట్లాడుతూనే ఉందామె. సొట్టబుగ్గల నడుమ ఆమె నవ్వు ముత్యాలహారంలా తళుక్కుమంటోంది. కలువకళ్ళ ఆమె ఓరచూపు ఆయస్కాంతంలా ఆకర్షిస్తూనే ఉంది. ఆమెతో గడిపిన ప్రతీక్షణం.. అద్భుత ఊహాలోకంలో హాయిగా విహరిస్తోన్న ఆనందపరవశం. ప్రేమిస్తున్నానని చెప్పేశాను ఒకరోజు ఆమోదించిందామె. ప్రపంచానికి చక్రవర్తినైనంత సంబరం నాలో! ఫోన్ కబుర్లూ.. షికార్లూ.. లాంగ్డ్రైవ్ల ద్వారా ఒకరి సాన్నిహిత్యాన్ని ఒకరం ఇష్టపడేవాళ్ళం. అప్పటికే పరిశ్రమలో మాపై రకరకాల కథనాలు ఇద్దరి ఇళ్ల వరకూ పాకాయి. అభ్యంతరాలేవి ఎటువైపు నుంచీ లేవు. కానీ ఆమెకు నామీద ఒకే ఒక్క విషయంపై అభ్యంతరమో.. ఆగ్రహమోగానీ తీవ్రంగా ఉండేది. ఎన్నోసార్లు దాన్ని బహిరంగంగా ప్రదర్శించింది. నన్ను మార్చాలని చూసింది. సున్నితంగా హెచ్చరించింది. మగాణ్ణి కదా.. అహం. గ్రహించలేకపోయాను. ఆ రోజు కార్తీక పౌర్ణమి. తన పుట్టిన రోజు. టెర్రస్ నుంచి విశాఖసాగర తీరం ఉరకలేస్తూ కనిపించసాగింది. పండు వెన్నెల వెలుగుల్లో ఇసుక తిన్నెలు బంగారు వర్ణంతో మెరుస్తున్నాయి. వీటన్నిటి సమక్షంలో తన పుట్టినరోజు వేడుక ఒక మధుర స్మృతిలా జరుపుకోవాలనేది మధు చిరకాల కోరిక. అది నెరవేరేసరికి రాత్రి తొమ్మిదయ్యింది. టేబుల్పై డిన్నర్ ఐటమ్స్ వున్నాయి. ‘మధూ.. ఇక భోంచేద్దామా’ అదుపు తప్పి తడబడిన మాటకు నా వైపు దూరం నుంచి సీరియస్గా చూసిందామె. ‘ఆకలిగా లేదు. నువ్వు భోంచెయ్’ అయిష్టంగానే అంది. ‘ఏం..ఎందుకని?’ ‘తినాలని లేదు’ ముఖంలోని గాంభీర్యం గొంతులో చేరి కఠినంగా వినిపించింది. ‘పోనీ.. నేను తినిపించనా?’ ‘ఎందుకు? నీ నోటి నుంచి వచ్చే వాసన భరించి తినడం కన్నా ఖాళీ కడుపుతో పడుకోవడం బెటర్.’ విసిరిన ఈటెలా వచ్చిపడిన ఆమె సమాధానానికి మత్తు దిగిపోయింది. కిందకు వెళ్లి సాయంత్రం నేను చేసిన ఘనకార్యమేమిటో గుర్తొచ్చింది. ‘సారీ మధు..’ అన్నాను. ‘మందు మానేస్తానని చేసిన ప్రామిస్ చేసిన సంగతి గుర్తుందా?’ ఆవేశంగా అంది. ‘ఉంది..కానీ ఈరోజు నీ పుట్టిన రోజు కదా అని..’ నసిగాను. ‘నీకెన్నిసార్లు చెప్పాలి.. డ్రంకర్డ్స్ అంటే నాకసహ్యమని! ఐనా నువ్వు మారడంలేదు. మారతావనే నమ్మకం కూడా లేదు. నీలాంటివాణ్ణి ప్రేమించినందుకు సిగ్గు పడుతున్నా.’ కళ్ళల్లో చేరిన సన్నటి కన్నీటిపొరను మునివేళ్ళతో తుడుచుకుంటూ అంది. ‘మధూ.. ఈ ఒక్కసారికి నమ్ము.. ప్లీజ్’ చిన్న పిల్లాడిలా అభ్యర్థించాను. ‘లేదు రమా.. ఈ రోజునుంచి మందు మానేస్తానని ఇదే లాస్ట్ ప్రామిస్ అని చెప్పి మరీ ఈ పని చేశావంటే నిన్నెలా నమ్మేది? ఇదిగో.. నువ్విచ్చిన గొలుసు. నాకవసరం లేదు. గుడ్ బై!’ గొలుసును నా చేతిలో పెట్టి రూమ్లోకి వెళ్లి తలుపేసుకుంది. ఎంతసేపు పిల్చినా.. బతిమాలినా స్పందన లేదు. ఉండుండి వినిపిస్తోన్న ఆమె ఏడుపు తప్ప! ఉదయాన్నే రూమ్ ఖాళీ చేసి నాకంటే ముందు వెళ్ళిపోయింది. ఇక అప్పటినుంచి నన్ను కలవడానికి గానీ, మాట్లాడానికి గానీ ఇష్టపడలేదు. సెట్లో కనిపించినా ‘మనిద్దరి ఆలోచనలు వేరు. మనస్తత్వాలు వేరు. అవి కలవవు. మరిచిపో నన్ను’ అని కటువుగా చెప్పేసి దూరం పెట్టేసింది. నిర్వీర్యుడినయ్యాను. నాలో సగభాగం తెగిపడినట్టుగా కుంగిపోయాను. నిజమే. తప్పు నాదే. తన ఇష్టాయిష్టాలను ఏమాత్రం పట్టించుకోని అబ్బాయిని ఏ అమ్మాయైనా ఎందుకు ఇష్టపడాలి? డిప్రెషన్లో కూరుకుపోయాను. పెళ్ళయితే నాలో మార్పు వస్తుందని భావించిన అమ్మ పెళ్లి చేసుకోమంది. ఆమె సంతోషం కోసం పెళ్లి చేసుకున్నాను. మూడేళ్లకు నాకో కొడుకు. మధురిమ గురించిన సమాచారం పత్రికల ద్వారా కొన్నాళ్లకు తెలిసింది. హీరో అభిజిత్ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనీ.. అతని భార్యగా జూబ్లీహిల్స్లోని ఖరీదైన భవంతిలో మహారాణిలా ఉంటోందని! విన్నాక నాకేం బాధనిపించలేదు. తనపై కోపం కూడా రాలేదు. జీవితం తనది.. దాన్ని ఎప్పుడు ఎవరితో ఎలా పంచుకోవాలో నిర్ణయించుకునే హక్కు ఆమెది. తనేం చిన్నపిల్ల కాదు గదా. కానీ ఎంతో ఇష్టంగా ప్రేమించిన మధురిమ జ్ఞాపకాల్ని ఎన్నాళ్ళైనా వదులుకోలేక పోయాను. ఆమెతో పంచుకున్న ప్రేమకబుర్లు చేసే గాయాల నుంచి తప్పించుకోలేకపోయాను. అదే నా పొరపాటు. నటనలో ఏకాగ్రత పోయింది. షూటింగ్లకు గైర్హాజరయ్యేవాడిని. రోజులు కాదు.. నెలలు. కొత్త తరంతో పోటీలో వెనకబడి పోయాను. అవకాశాలు కరువైపోయాయి. పార్టీలు ఎక్కువయ్యాయి. తాగుడికి బానిసనైపోయాను. భరించలేక మంచం పట్టి చనిపోయింది అమ్మ. లివరు పూర్తిగా, కిడ్నీలు పాక్షికంగా దెబ్బతిన్నాయని నేనిక బతకడం కష్టమని డాక్టర్లు తేల్చేశారు. వారంరోజుల చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు. అందరూ వచ్చి చూసి పోతున్నారు. చనిపోయేలోగా మధునొకసారి చూడాలనీ వీలైతే మాట్లాడాలనీ ఎక్కడో మనసు మూలల్లో కోరిక ప్రబలంగా ఉంది. ఐనా నా పిచ్చి గానీ తనిక్కడికి వస్తుందా.. మనసారా మాట్లాడుతుందా.. ఇది జరిగే పనేనా? నా భార్య లత చాలా మంచిది. నా గురించి, మధురిమతో నాకున్న ఎఫైర్ గురించి తెలిసే పెళ్ళికి సిద్ధపడింది. ఎప్పటికైనా ఈ వ్యసనం నుంచి బయటపడి మారతాననేది ఆమె నమ్మకం. వమ్ము కావడానికి ఎంతో కాలం పట్టలేదు. ఐనా సరే.. నన్నామె ఏనాడూ తక్కువగా చూడలేదు. నా అభిమానిగా అదామె గొప్పతనం. అందుకు సదా ఆమెకు రుణపడి వుంటాను. స్వతహాగా ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆ సంపాదనతోనే కుటుంబ బాధ్యతను తన నెత్తికెత్తుకుంది. కొడుకును చదివించింది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో దర్శకత్వ శిక్షణ నిప్పించింది. వాడి ప్రయత్నాలేవో సాగుతున్నాయి. ఎప్పటికైనా వాడిని దర్శకుడిగా చూడాలనేది మా ఇద్దరి కల. అది ఎప్పటికి నెరవేరుతుందో.. మా ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో, నా ప్రాణం ఎంతవరకు నిలుస్తుందో కాలమే సమాధానం చెప్పాలి. నిజాయితీ లోపించిన ప్రేమ ఎప్పటికీ సఫలం కాదు : మధురిమ సెప్టెంబర్ 20.. 2023 సంవత్సరం.. ఉదయం పన్నెండు గంటలు.. ‘హలో మధూ..’ ‘చెప్పండి..’ ‘నీకీ విషయం తెల్సా ..’ ‘ఏంటి?’ ‘రమాకాంత్ చనిపోయాడట..’ ‘ఈజ్ ఇట్ ట్రూ?’ ‘యస్.’ ‘ఎప్పుడు?’ ‘నిన్న సాయంత్రం నాలుగు గంటలకు.. వాళ్లింట్లోనే..’ ‘మై గాడ్.. ఎంత ఘోరం..’ ‘కంట్రోల్.. ఐ కెన్ అండర్ స్టాండ్ యువర్ పెయిన్. ఎంతైనా నీ మాజీ లవర్ కదా!’ ఎప్పటిలాగే సూదుల్లా గుచ్చే అతని మాటలు. బాధనిపించలేదు. నాకివి మామూలే. ‘అంతేకాదు. ఒకప్పుడతను మన కోస్టార్. అది మరిచిపోకు. మనసు రాయి చేసుకుని ఉండలేం కదా నీలాగ!’ నావైపు కౌంటర్ ఇచ్చి ఫోన్ పెట్టేశాను. టీవీ ఆన్ చేశాను. రమాకాంత్ మరణవార్త ప్రసారమవుతోంది. కృష్ణానగర్లోని అతనింట్లో ఫ్రీజర్లో ఎముకల పోగులా అతని శరీరం.. చుట్టూ అతని బంధుమిత్రులు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎలా ఉండేవాడు రమాకాంత్.. ఆరడుగుల ఎత్తుతో బలిష్టమైన దేహం.. చురుకైన కళ్ళతో.. ఎలాంటి పాత్రనైనా కొట్టి పిండి చేయగల సత్తాతో! అతని వెరైటీ విలనిజానికి ప్రత్యేక అభిమానవర్గం ఉండేది. సినిమాల్లో ఎంత క్రూరంగా ఉంటాడో బయట అంత సౌమ్యుడు. శత్రువుకైనా సాయం చేసే మనస్తత్వం! చిన్నప్పటినుంచి నాకు డాన్ ్స అంటే పిచ్చి. ఆ ఇష్టంతోనే ఐదేళ్లు కష్టపడి కూచిపూడి నేర్చుకుని ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టాను. ఒక డాన్స్ ప్రోగ్రామ్లో నన్ను చూసిన రమాకాంత్ ఓ తమిళ సినిమాలో హీరోయిన్ పాత్రకోసం సంప్రదించారు. అమ్మకు ఇష్టంలేకపోయినా నా బలవంతమ్మీద సరేనంది. ఆ సినిమా సక్సెసయ్యి సుమారు పాతిక సినిమాల్లో నటించాను. రమాకాంత్తో ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఎక్కడకు వెళ్లాలన్నా ఏ ఫంక్షన్కు హాజరవ్వాలన్నా కలిసి వెళ్లి.. కలిసే వచ్చేవాళ్ళం. ఆ చనువును ఎప్పుడూ ఆసరగా లేదు. అమ్మకూ అతనంటే అభిమానమే. అందుకే అతన్ని పెళ్లిచేసుకునేందుకు సిద్ధపడ్డాను. కానీ అతనికి ఒకే ఒక బలహీనత ఆల్కహాల్. ఏమాత్రం ఖాళీ దొరికినా స్నేహితులతో మందు పార్టీకే తొలి ప్రాధాన్యత. మానెయ్యమని ఎన్నోసార్లు చెప్పాను. బతిమాలాను. ‘పరిశ్రమలో మనుగడ సాగించాలంటే అందరితో టచ్లో ఉండాలి. కలిసి మెలిసి తిరగాలి. కనుక పార్టీలు తప్పవు’ అనే ఒక విచిత్రవాదనను వినిపించేవాడెప్పుడూ. ‘అదే నిజమైతే సినిమాలు మానేయ్. సంపాదించిన దాంతో ఏదైనా బిజినెస్ మొదలుపెట్టు. జీవితాంతం నేన్నీకు తోడుంటాను’ అని చాలాసార్లు హామీ నిచ్చాను. అతను పట్టించుకోలేదు. అమ్మ బెంగాలీ. నాన్నది ఇక్కడే. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. డాడీకున్న తాగుడు వ్యసనం వలన అమ్మ ఎంత బాధ పడిందో.. ఎన్ని ఇబ్బందులు.. అవమానాలు ఎదుర్కొందో నాకు తెలుసు. అందుకే తాగేవాళ్లంటే భయం. అసహ్యం. మందు మానేస్తానని ఎన్నోసార్లు రమాకాంత్ మాటిచ్చాడు. కానీ కట్టుబడిలేడు. అందుకే అతన్ని పూర్తిగా నమ్మలేకపోయాను. ఎక్కడైనా నమ్మకమూ, ప్రేమా ఉన్నచోటే గదా అభిమానం, ఆరాధన ఉండేవి. వాళ్ళమ్మ కూడా ఈ విషయంలో చేసేదేంలేదని చేతులెత్తేసింది. నా మనసు విరిగిపోయింది. నా నిర్ణయాన్ని అతనితో కరాఖండీగా చెప్పేశాను అదీ నా పుట్టిన రోజునాడే. అలా చెప్పడానికి నాలో నేనెంత వేదన పడ్డానో! మరచిపోవడం అతనికే కాదు. నాకూ కష్టమే! కానీ తప్పదు. నేను చాలా ప్రాక్టికల్. ప్రేమ పేరిట భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేంత పిచ్చితనం నాలో లేదు. ఆ తర్వాత అతను ఇల్లు ఎక్కడికో మార్చాడట. అదెక్కడో కూడా నాకు తెలియదు. కొన్నాళ్లకు హీరో అభిజిత్ లవ్ ప్రపోజల్ తెచ్చాడు.అతన్ని పెళ్లి చేసుకున్నాను. మరో ఏడాదికి అబ్బాయి పుట్టాడు. వాడిప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్నాడు. నా భర్త చెడ్డవాడు కాదు. అలాగని మంచివాడూ కాదు. అతనొక మగాడు. అంతే! రమాకాంత్తో నా ప్రేమవ్యవహారాన్ని ముల్లులా గుచ్చుతూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు.. అమ్మాయిలతో అతనికిగల సంబంధాల్ని ప్రశ్నించినపుడల్లా! రమాకాంత్ పూర్తిగా మద్యానికి బానిసయ్యాడనీ, భార్య సంపాదనతోనే ఇల్లు నడుస్తోందని తెల్సి చాలా బాధపడ్డాను. చేయి దాటిన పరిస్థితిని ఎవరు మాత్రం చక్కదిద్దగలరు? కేవలం సానుభూతి చూపించడం తప్ప. అతనలా మారడానికి కారణం నేనేనని ఎక్కడెక్కడో విని ఎన్నో రోజులు కుమిలిపోయాను. అతనికా వ్యసనం నా మూలంగా అబ్బలేదు. దాన్ని నేను ప్రోత్సహించనూ లేదు. అలాంటపుడు నన్నెలా నిందిస్తారు? మనుషులు గానీ, బంధాలు గానీ దక్కనపుడు కలిగే దుఃఖాన్ని భరించగలిగే మానసిక స్థితి లేదని తెలిసినపుడు మనిషి ఎంత జాగ్రత్తగా ఉండాలి? సంబంధాల్ని ఎంత సున్నితంగా నెరపగలగాలి? ఒక పక్క భర్త ప్రవర్తనకూ మరోపక్క లోకం అపవాదుకూ మధ్యన నలిగిపోతూ ఎన్నో నిద్రలేని రాత్రుళ్ళు గడిపాను. ఆ మానసిక ఒత్తిడి నుంచి త్వరగా బయటపడి నగరంలోని ఒక రిచెస్ట్ ఏరియాలో డాన్ ్స స్కూల్ పెట్టాను. డాన్స్ చేస్తూ.. చూస్తూ.. నేర్పిస్తూ.. ఏళ్లుగా కోల్పోయిన నన్ను నేను అక్కడ పొందుతున్నాను. వారం క్రితం మేమిద్దరం నటించిన తొలి చిత్రాన్ని పాతికేళ్ళు నిండిన సందర్బంగా రీరిలీజ్ చేశారు. ఐమాక్స్ థియేటర్లో మళ్ళీ ఆ సినిమా చూసి నాటిæ షూటింగ్ అనుభూతుల్ని.. మధురస్మృతుల్ని ప్రెస్ మీట్ పెట్టి అందరం పంచుకున్నాం. మెయిన్ విలన్ ఒక్క రమాకాంత్ తప్ప. అతను తీవ్ర అనారోగ్యంతో బయటకురాలేని స్థితిలో ఉన్నాడనీ.. తెలిసి హృదయం ద్రవించింది. అతని చిరునామా ఎలాగోలా తెలుసుకొని చూసి రావాలనిపించింది. అంతలోనే హఠాత్తుగా ఈరోజు మరణ వార్త.. ‘రమాకాంత్ సర్ వాళ్లింటి దగ్గరకు వచ్చేశామమ్మా..’ డ్రైవర్ అన్నమాటతో ఈ లోకంలోకి వచ్చాను. కారు దిగి చుట్టూ చూశాను. జనంతో రద్దీగా వుంది. అభిజిత్కు కాల్ చేశాను. రమాకాంత్ చివరిచూపు కోసం వెళ్తున్నానీ.. రావడం లేటవుతుందనీ చెప్పి కాల్ కట్ చేశాను. లేకపోతే అటు నుంచి ఏం జవాబొస్తుందో నాకు తెలుసు. అది వినడం ఇష్టం లేదు. జనాల్ని తప్పించుకుంటూ లోపలకు నడిచాను. ఇంటి బయట టెంట్ వేసి ఉంది. రమాకాంత్ అంతిమ సంస్కారం పూర్తయినట్టుంది. బాధనిపించింది. గది మూలన అతని ఫొటో, దాని కింద దీపం వెలుగుతూ ఉంది. లీలగా వినిపిస్తోన్న బంధువుల రోదనలు తప్ప ఇల్లంతా ప్రశాంతం. నన్ను చూడగానే వచ్చారా అన్నట్టుగా చూసిందతని భార్య. బాగా తెలిసినవాడిలా కుర్రాడొకడు నన్ను లోపలకు తీసుకెళ్ళాడు. విశాలమైన రూమ్లో.. షెల్ఫ్లో షీల్డులూ, ఫొటోలూ, సన్మాన పత్రాల మెమెంటోలూ, కొన్ని పెయింటింగ్స్ కొలువుదీరి ఉన్నాయి. మరోపక్క నా బస్ట్ సైజ్ రూపం వాటర్ పెయింట్ ఒకటి గోడపై ఉంది. పుట్టిన రోజున నేను తిరిగిచ్చిన గోల్డ్ చైన్ పూదండలా దానిపై వేలాడుతోంది. ‘అదృష్టం ఒక్కసారే తలుపు తడుపుతుంది. దురదృష్టం తలుపు తీసేవరకూ తడుతూనే ఉంటుందట. ఆ అదృష్టం నేను చేజార్చుకున్న నీ సాహచర్యం. దురదృష్టం నన్ను కౌగిలించుకున్న ఈ వ్యసనం. మధూ.. క్షమించానని ఒక్క మాట చెప్పవూ..’ అని పెయింటింగ్ కింద రాసి ఉంది. చదివేసరికి గుండెను పిండేసినట్టయింది. కనుకొలకుల్లో నీళ్లు. ‘స్వఛ్చమైన, నిర్మోహమైన ప్రేమ కోసం జీవితపర్యంతం పరితపించి ప్రాణాలొదిలిన ప్రియ సఖుడా.. ఇదే నా కన్నీటి నివాళి. మనస్ఫూర్తిగా మన్నించా! వెళ్లి రా.. ప్రియనేస్తమా.. వేచి ఉంటా.. మరుజన్మలో నీ కోసం!’ నా మనసు ఆర్తిగా రోదించింది. ‘డాడీ ఎప్పుడూ మీ గురించే చెప్తుండే వారండీ.. యు ఆర్ ఏ వండర్ఫుల్ యాక్ట్రెస్ అంటూ!’ అన్నాడా కుర్రాడు. ఆ కుర్రాడెవరో అప్పుడర్థమైంది. కళ్ళు తుడుచుకొని నిశితంగా అతన్ని చూశాను. యుక్త వయసు రమాకాంత్ కనిపించాడు. పేరు హరీష్ అని చెప్పాడు. అతనితో చాలాసేపు మాట్లాడాను. మూగగా ఏడుస్తున్న రమాకాంత్ భార్య దగ్గరకు వెళ్లాను. ‘చనిపోయారనే వార్త ఈరోజు ఉదయమే తెల్సింది. అసలు రమాకాంత్ పరిస్థితి విషమంగా ఉందని ఈ మధ్యే విన్నాను. వద్దామని అనుకునేలోపే ఇలా.. ఆఖరికి చివరిచూపు కూడా దక్కలేదు’ వేదనగా అన్నాను. నా వైపే నిశ్చలంగా చూస్తూ వింటోందామె. ‘ఆయన ఉన్నప్పుడు కలిసుంటే బావుండేదండీ’ ముక్తసరిగా అందామె. కళ్లు దించుకున్నాను. ఇద్దరి మధ్యా కాసేపు నిశ్శబ్దం. తర్వాత ఆమెతో మాట్లాడాను. ఈలోపు కాఫీ తెచ్చిచ్చాడు హరీష్. తాగడం మొదలుపెట్టాను. ‘హరీష్.. నీకో గుడ్ న్యూస్. ఇందాకే మేడమ్ చెప్పారు’ అందామె. తెలుసన్నట్టు చిన్నగా నవ్వాడతను. తల్లీ కొడుకుల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. ఆ వెలుగు నాలో కూడా కొంత ప్రసరించింది. స్తబ్ధత, నైరాశ్యం ఒక్కసారిగా మాయమై రీలీఫ్గా అనిపించింది. లేచి నిలబడ్డాను. ‘రేపు ఆఫీస్లోనే ఉంటాను. హరీష్ను పంపించండి. అతనిదే ఆలస్యం. మా బ్యానర్లోనే.. నేనే ప్రొడ్యూసర్ని. అతన్ని దర్శకుణ్ణి చేసే బాధ్యత నాది. సరేనా?’ అన్నాను.. అంతకుముందు ఇద్దరితో చెప్పిన మాటను మళ్లీ ఒక్కసారి నిర్ధారిస్తున్నట్టుగా. ఆమె నా రెండు చేతుల్ని తన గుప్పిట్లోకి తీసుకొని కళ్ళకు అద్దుకుంటూ ‘థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్’ అంది.. ఆమె గొంతు సన్నగా వణికింది. కారెక్కి కూర్చొని చూస్తే ఆమె చెంపల పైనే కాదు నా రెండు చేతుల పైన కూడా ఆమె కన్నీటి బొట్లే! ఇవి చదవండి: నిజాలతో నిమిత్తం లేని.. 'అదొక అబద్ధాల అట్టహాసం'! -
వైఎస్సార్సీపీ నేత కుమారుడి వివాహానికి హాజరైన సీఎం జగన్
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: కాళ్ల మండలం పెద అమిరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించారు. రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్లో పాలకొల్లు వైఎస్సార్సీపీ నాయకులు గుణ్ణం నాగబాబు కుమారుడు సుభాష్ వివాహానికి సీఎం హాజరయ్యారు. వరుడు గుణ్ణం సుభాష్, వధువు దీప్తిలను సీఎం జగన్ ఆశ్వీరదించారు. ఈ వివాహ వేడుకలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు, ఎమ్మెల్యేలు గ్రంథి శ్రీనివాస్, పుప్పాల వాసు బాబు, శ్రీ రంగనాథరాజు తదితరులు పాల్గొన్నారు. -
పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఓవరాక్షన్
-
చంద్రబాబు అబద్ధం.. జగన్ నిజం.. పాలకొల్లు సభలో మంత్రి వేణు
సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా: పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుని, సంక్షేమ పథకాలతో వారి ఎదుగుదలకు ఆలోచన చేసిన నాయకుడు సీఎం జగన్ అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో శ్రీహరి గోపాలరావు (గోపి) ఆధ్వర్యంలో బస్సుయాత్ర నిర్వహించారు. పాలకొల్లు బైపాస్ రోడ్డు రామచంద్ర గార్డెన్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. అనంతరం పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ వరకు బస్సుయాత్ర సాగింది. గాంధీ బొమ్మల సెంటర్లో జరిగిన బహిరంగ సభలో మంత్రులు కొట్టు సత్యనారాయణ, విశ్వరూప్, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు, ఎంపీ నందిగాం సురేష్, ఎమ్మెల్సీలు కవురు శ్రీనివాస్, ఇజ్రాయెల్ పాల్గొన్నారు. మంత్రి వేణు మాట్లాడుతూ, గతంలో అబద్ధం అధికారంలో ఉంది.. ఆ అబద్ధమే చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. ‘‘ఎన్నికల సమయంలో నాలుగు మాయమాటలు చెప్పి అధికారం పొందాలని గత పాలకులు అనుకుంటున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 90 శాతం అమలు చేసిన నాయకుడు సీఎం జగన్. 139 బీసీ కులాలను గుర్తించి వారి సామాజిక స్థితి పెరగడానికి అండగా నిలిచారు. బీసీ వర్గాలను అణచివేసిన వ్యక్తి చంద్రబాబు. పేదరికంపై యుద్ధం చేయాలంటే ఆయుధం విద్య అని అంబేద్కర్ చెప్పారు. ఆయనకు నిజమైన వారసుడిగా విద్యకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చారు’’ అని మంత్రి వేణు పేర్కొన్నారు. ‘‘విద్యా కానుక, వసతి దీవెన, విద్యా దీవెన.. వంటి పథకాలతో అందరిని ద్రాక్షగా ఉన్న చదువును పేదలకు చేరువచేశారు. ఫీజు రియింబర్స్మెంట్కు కోతలు పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా జబ్బున్న వారిని జల్లెడ పట్టి వారికి అండగా నిలిచారు. గతంలో చంద్రబాబు బీసీలు వెళ్లి అడిగితేనే తోకలు కత్తిరిస్తా అన్నాడు. మంత్రి మండలిలో సైతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చారు.. బీసీ కులాలకు ఆత్మ గౌరవాన్ని నింపిన వ్యక్తి సీఎం జగన్.’’ అని మంత్రి చెప్పారు. మూడు ప్రాంతాల్లో జరుగుతున్న వైఎస్సార్సీపీ సామాజిక సాధికారిక యాత్ర బహిరంగసభలు ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. సీఎం జగన్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీల అగ్రవర్ణ పేదల ప్రభుత్వం. సామాజిక సాధికారత జగనన్నకే సాధ్యమైందని పాలకొల్లు సభ ద్వారా తెలుపబోతున్నాం. రెండు లక్షల 38 వేల కోట్లు అవినీతికి ఆస్కారం లేకుండా దళారీ లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు చేరింది. అందులో ఒక లక్ష 78 వేల కోట్లు బీసీ సంక్షేమ శాఖ ద్వారా అణగారినవర్గాలకు చేరింది. సీఎం జగన్ పాలన అణగారిన వర్గాల్లో మనోధైర్యం నింపింది’’ అని మంత్రి వేణు తెలిపారు. చదవండి: ‘వెనుకబడిన వర్గాలకు అండగా సీఎం జగన్’ సామాజిక న్యాయం తుంగలో తొక్కిన ఘనత చంద్రబాబుది: మంత్రి విశ్వరూప్ ప్రజలను ఎలా మోసం చేయాలో చంద్రబాబుకి తెలిసినట్టు ఎవ్వరికీ తెలీదంటూ మంత్రి విశ్వరూప్ ఎద్దేవా చేశారు. చెప్పింది చెప్పినట్టు నెరవేర్చే ఒకే ఒక్కడు జగన్ మాత్రమే.. చంద్రబాబు ఇచ్చే హామీలు ఎన్నికలు ముగిసేవరకు మాత్రమే.. సామాజిక న్యాయం తుంగలో తొక్కిన ఘనత చంద్రబాబుది. దేశంలో అత్యుత్తమ పాలన జగన్ అందిస్తున్నారు. పక్క రాష్ట్ర సీఎం కేసీఆర్ సైతం పింఛన్ విడతల వారీగా పెంచుతామని అన్నారు. 1లక్ష 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ది. చంద్ర బాబు హయాంలో ఎస్సీ, మైనారిటీలకు ఒక్క మంత్రి పదవి లేదు. బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన నాయకుడు సీఎం జగన్’’ అని మంత్రి కొనియాడారు. -
మరోసారి ఉదారత చాటుకున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ఉదారత చాటుకున్నారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్ధి కలను సాకారం చేసేందుకు ఆర్ధిక భరోసా కల్పించారు. వివరాలు.. పాలకొల్లుకు చెందిన జహ్నవి దంగేటి ఏవియేషన్ శిక్షణకు గతంలో ఏపీ ప్రభుత్వం రూ. 50 లక్షల సాయం అందజేసింది. గతేడాది జూలైలో రాజమహేంద్రవరం పర్యటన సందర్భంగా సీఎంజగన్ జాహ్నవికి ఈ సాయం అందించారు. తాజాగా రాజమహేంద్రవరం ఆర్అండ్బీ గెస్ట్హౌస్ నుంచి వరద బాధితులను పరామర్శించేందుకు కోనసీమ జిల్లాకు బయలుదేరుతున్న ముఖ్యమంత్రిని జాహ్నవి కలిశారు. పైలెట్ ఆస్ట్రొనాట్ అవ్వాలన్న తన కోరికను అర్థం చేసుకొని ఉన్నత చదువుకు చేసిన సాయానికి వైఎస్ జగన్కు జాహ్నవి, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాలోని ఫ్లోరిడాలో కమర్షియల్ పైలెట్ శిక్షణ నిమిత్తం అవసరమైన ఆర్ధిక సాయం చేయాలని మరోసారి విజ్ఞప్తి చేయగా.. సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా గతంలో ప్రభుత్వం చేసిన ఆర్ధిక సాయంతో గ్రామీణ ప్రాంతానికి చెందిన జాహ్నవి ఐఐఏఎస్ ఫ్లోరిడా, యూఎస్ఏ నుంచి సైంటిస్ట్ వ్యోమగామి అభ్యర్థిగా సిల్వర్ వింగ్స్ అందుకున్నారని సీంఎ జగన్కు సమాచార శాఖ మంత్రి వేణుగోపాల్ వివరించారు. ఇప్పటికే జాహ్నవి నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి ఇండియన్గా గుర్తింపు తెచ్చుకుందని తెలిపారు. అయితే భారత సంతతికి చెందిన కల్పనాచావ్లా, సునీతా విలియమ్స్లా అంతరిక్షంలోకి అడుగుపెట్టాలన్న సంకల్ప స్ఫూర్తితో ముందుకెళుతున్నట్లు వైఎస్ జగన్కు జాహ్నవి వివరించారు. చదవండి: గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా గమనించండి: సీఎం జగన్ -
సత్ఫలితాలు ఇస్తున్న వలంటీర్ వ్యవస్థ
-
‘నిమ్మల’ నాటకాలు!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఒకవైపు పనులు జరగకుండా అడ్డుకోవడం.. మరోవైపు ఆగిపోయాయంటూ యాగీ చేయడం.. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీరు ఇదీ.. సొంత నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటవుతుంటే స్వాగతించాల్సిందిపోయి అడ్డదారుల్లో అడ్డుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాలకొల్లు మండలం దగ్గులూరులో 58.33 ఎకరాల విస్తీర్ణంలో రూ.475 కోట్ల వ్యయంతో నూతన మెడికల్ కళాశాలకు సీఎం వైఎస్ జగన్ గతేడాది శంకుస్థాపన చేశారు. అనంతరం కళాశాల నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభమయ్యాయి. తొలుత రోడ్డు నిర్మాణాన్ని చేపట్టి ల్యాండ్ ఫిల్లింగ్ పనులు చేస్తున్నారు. 27 మీటర్ల లోతులో ఆరు బోర్లు తవ్వారు. 1.7 మీటర్ల ఎత్తు వరకూ ఫ్లోర్ కాంక్రీట్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. పనులు దక్కించుకున్న మెగా సంస్థను యలమంచిలి మండలం వేల్పూరులంకలో ఇసుక తవ్వకానికి మైనింగ్ శాఖ అనుమతించింది. ఎమ్మెల్యే నిమ్మల ఈ పనులను అడ్డుకునేందుకు అనుచరులతో పర్యావరణానికి హాని కలుగుతోందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు. దీంతో ఐదు నెలల పాటు పనులు నిలిచిపోయాయి. కాంట్రాక్టర్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని పనులను కొనసాగిస్తున్నారు. పాలకొల్లులో సోమవారం టీడీపీ బస్సు యాత్ర సందర్భంగా పార్టీ నాయకులతో పొలాల్లో సెల్ఫీ దిగిన నిమ్మల రామానాయుడు ఇదే మెడికల్ కాలేజీ.. అసలు పనులే జరగడం లేదని బురద చల్లేందుకు ప్రయతి్నంచారు. -
బరితెగించి అయ్యన్న బూతు పురాణం
పాలకొల్లు సెంట్రల్: పత్రికల్లో రాయలేనంత పచ్చి బూతులతో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు రెచ్చిపోయారు. సంస్కారం లేకుండా ఆయన పబ్లిక్గా బూతులు మాట్లాడుతుంటే అక్కడ సభలో పాల్గొన్న తెలుగు మహిళలు సిగ్గుతో తలదించుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం జరిగింది. భవిష్యత్కు గ్యారంటీ చైతన్య రథయాత్ర సమావేశంలో అయ్యన్న.. సీఎం జగన్పై రెచ్చిపోయి మాట్లాడారు. పనికిరాని సన్నాసి, నత్తి నాకొ.. లాంటి దారుణ పదజాలంతో సీఎంను విమర్శించారు. వీడు.. వాడు.. అంటూ సీఎం అనే మర్యాద లేకుండా ఏకవచనంతో సంబోధించారు. సీఎం సతీమణిపైనా అవాకులు చెవాకులు పేలారు. ఇప్పటికే తనపైన 14 కేసులు పెట్టారని, ఎన్ని కేసులు పెట్టినా ఏమీ పీకలేరంటూ అసభ్యంగా సంజ్ఞలు చేస్తూ చూపించారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ‘గత ఎన్నికల ముందు రూ.10 వేలు ఇచ్చాం. అంతా మనకే గుద్దేస్తారని చంకలు కొట్టేసుకున్నాం. అయినా మనకి పెద్ద పువ్వు చూపించారు. గెలుపు అంత ఈజీ కాదు. చివరి వరకూ పోరాటం చేయాల్సిందే’ అని చెప్పారు. శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
సీఐతో ఎమ్మెల్యే నిమ్మల దురుసు ప్రవర్తన
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలోని పాలకొల్లులో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మంగళవారం సీఐ, పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. అనుమతిలేని కార్యక్రమాలు నిర్వహించరాదని అడ్డుకున్న సీఐని ఏకవచనంతో సంబోధించడమేగాక మా ఇష్టం వచ్చింది చేసుకుంటామంటూ మాట్లాడారు. రైతుల సమస్యలపై స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇస్తామని ఎమ్మెల్యే పోలీసులకు తెలిపారు. ఎమ్మెల్యే నిమ్మల, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తదితరులు తహసీల్దారు కార్యాలయం వద్దకు వచ్చారు. టీడీపీ నేతలు తహసీల్దార్ కార్యాలయం పక్కన ఉన్న చెట్టు కొమ్మలను విరగ్గొట్టి రైతుకు ఉరి అనే నినాదంతో రెండు కర్రలను ఏర్పాటు చేసి చెట్టుకు కట్టారు. ప్లకార్డులు, ఉరితాళ్లతో నిరసన తెలిపేందుకు సిద్ధపడ్డారు. దీన్ని పట్టణ సీఐ డి.రాంబాబు అడ్డుకున్నారు. వినతిపత్రం ఇస్తామని అనుమతి తీసుకుని ఈ కార్యక్రమాలు చేయడమేమిటని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే నిమ్మల పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీ ఐ రాంబాబునుద్దేశించి.. నీకు సంబంధం ఏమిటి? మా ఇష్టం వచ్చింది చేసుకుంటాం. రోడ్డుపై ఏది చేసుకున్నా నీకు అనవసరం. నీ తహసీల్దార్ కార్యాలయంలో చేస్తే నువ్వు ప్రశ్నించు.. అంటూ మాట్లాడారు. దీనిపై సీఐ స్పందిస్తూ.. సార్ నేను గౌరవంగా మాట్లాడుతున్నాను.. మీరు మర్యాదగా మాట్లాడండి.. అని సూచించారు. దీంతో మీ మంత్రి రైతులను ఉద్దేశించి ఎర్రిపప్ప అన్న మాటలకు మాకు బాధేసింది అంటూ ఎమ్మెల్యే టాపిక్ను డైవర్ట్ చేసేందుకు ప్రయత్నించారు. సీఐ ఆధ్వర్యంలో పోలీసులు ఉరితాళ్లను తొలగించారు. అనంతరం టీడీపీ నేతలు తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలోకి వెళ్లి అక్కడున్న ఆర్డీవో దాసి రాజుకు వినతిపత్రం అందజేశారు. -
అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి
అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వీర సాయిష్ ఉన్నత చదువుల నిమ్మితం అమెరికా వెళ్లాడు. ఓహియో స్టేట్ పిన్స్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. కొలంబస్ ఫ్రాంక్లింటన్లోని ఓ షెల్ గ్యాస్ స్టేషన్లో పార్ట్టైం ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. బుధవారం అర్థరాత్రి 12.50 గంటలకు (భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం) గ్యాస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తుండగా ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి నగదు తీసుకుపోయారు. ఈ కాల్పుల్లో సాయిష్కు తీవ్ర గాయాలవ్వగా ఓహియోహెల్త్ గ్రాంట్ మెడికల్ సెంటర్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యరణించాడు. సాయిష్ తల్లి ప్రస్తుతం ఏలూరులో నివాసం ఉంటోంది. ఈ ఘటనపై గురువారం రాత్రి 8 గంటలకు తమకు సమాచారం అందిందని మృతుడి కుటుంబసభ్యులు తెలిపారు. కాగా పాలకొల్లు పట్టణానికి చెందిన వీరా రమణ నాలుగేళ్ల క్రితం మృతిచెందారు. ఆయన చిన్న కుమారుడైన సాయేష్ అమెరికాలోని ఓహియో స్టేట్ పిన్స్ యూనివర్సిటీలో ఎమ్మెస్ చదువుతున్నాడు. రెండేళ్ల క్రితం యూఎస్ వచ్చిన సాయిష్.. ఇప్పడిప్పుడే కుటుంబ ఆర్థిక సమస్యలను చక్కబెడుతున్నాడు. ప్రస్తుతం చివరి సెమిస్టర్ చదువుతుండగా.. మరో 10 రోజుల్లో ఎంఎస్ పూర్తికానుంది. ఈ సమయంలో కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆయన తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చదవండి: రంజాన్ 2023: యెమెన్లో వితరణ వేళ విషాదం.. 78 మంది దుర్మరణం -
మహిళా సర్పంచ్ పై రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
-
కాళ్లు లేని వారిని నడిపిస్తున్న సదా‘సేవా’మూర్తి!
పాలకొల్లు (సెంట్రల్): పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఆయన పేరు వేదాంతం సదాశివమూర్తి. పాతికేళ్ల వయసు (1981)లో రైలు దిగుతుండగా కాలుజారి ప్లాట్ఫామ్, బోగీ మధ్యలో పడిపోవడంతో ఆయన రెండు కాళ్లూ కోల్పోయారు. పూనేలోని డిఫెన్స్ రిహేబిలిటేషన్ సెంటర్లో మూడు నెలలపాటు చికిత్స చేయించుకున్న సదాశివమూర్తి కృత్రిమ కాళ్లు అమర్చుకున్నారు. 6 నెలల తరువాత కృత్రిమ కాళ్లతోనే బుల్లెట్ వాహనాన్ని నడిపి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఆ తర్వాత తాను ధరించే కృత్రిమ కాళ్లకు ఎలాంటి మరమ్మతు వచ్చినా పూనే వెళ్లాల్సి వచ్చేది. అలా 1998 వరకు దాదాపు 17 సంవత్సరాలపాటు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సదాశివమూర్తి పూనే వెళ్లి వస్తుండేవారు. తాను పడుతున్న ఇబ్బందుల్ని తనలాంటి వారు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో స్థానిక రంగమన్నార్పేటలో చైతన్య కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలా మొదలుపెట్టిన ఈ కేంద్రంలో ఇప్పటివరకు సుమారు 10 వేల మందికి కృత్రిమ కాళ్లను అమర్చారు. ఇటీవల ఓ ఆవుకు సైతం కృత్రిమ కాలు అమర్చి ఔరా అనిపించారు సదాశివమూర్తి. అతి తక్కువ ధరకే.. ఒక్కో కృత్రిమ కాలు ధర రూ.15 వేల నుంచి సుమారు రూ.25 వేల వరకు ఉంటుంది. కాళ్లతో పాటు చేతి వేళ్లు, చెవులు ఇలా ఏ రంగు వారికి ఆ రంగులోనే కృత్రిమ అవయవాలు తయారు చేస్తున్నారు సదాశివమూర్తి. రూ.14 వేలు ఉండే కృత్రిమ కాలిని రూ.900, రూ.3,500 ఉండే కాలి ధరను రూ.120కు తీసుకువచ్చారు. వివిధ కంపెనీలు వేసే రాడ్ల స్థానంలో సైకిల్కు వాడే కడ్డీలను కట్ చేసి కృత్రిమ కాళ్ల పరికరాలు తయారు చేయడం ద్వారా కృత్రిమ కాళ్ల ధరలను నిరుపేదలకు సైతం అత్యంత అందుబాటు ధరల్లోకి తెచ్చారు. సదాశివమూర్తి సేవలను గుర్తించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆర్థోపెడిక్ సర్జన్స్ 15 ఏళ్ల క్రితం స్వర్ణ పతకాలను అందజేశాయి. కృత్రిమ అవయవాలను కొత్తగా తయారు చేసినందుకు 2010లో ఆలిండియా అవార్డుతో పాటు రూ.2 లక్షల నగదు కూడా అందుకున్నారు. 2007లో పుట్టపర్తి సత్యసాయిబాబా ఆశ్రమ నిర్వాహకులు సదాశివమూర్తిని స్వర్ణ ఉంగరంతో సత్కరించారు. ఆస్ట్రేలియా వర్సిటీ డాక్టరేట్ ప్రదానం నూతన టెక్నాలజీతో తక్కువ ధరకు.. పేదవారికైతే ఉచితంగానే కృత్రిమ అవయవాలను అందిస్తున్న సమాచారాన్ని సదాశివమూర్తి ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో పోస్ట్ చేస్తుండేవారు. అతని ఫేస్బుక్ ఖాతాను ముంబైలో నివాసం ఉంటున్న డాక్టర్ వీవీఎల్ఎన్ శాస్త్రి చాలాకాలంగా ఫాలో అవుతూ.. ఆ పోస్టులను భద్రపరిచి ఆస్ట్రేలియా యూనివర్సిటీకి పంపించారు. ఆయన అందిస్తున్న సేవలను గుర్తించిన ఆస్ట్రేలియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. గత నెల 5వ తేదీన ఢిల్లీలో డాక్టరేట్ను అందించడంతోపాటు ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అవార్డును సైతం సదాశివమూరి్తకి అందజేసింది. పేదలను ఆదుకోవాలనే తపనతోనే.. ఎంఏ చదువుతున్నప్పుడు కాళ్లు కోల్పోయాను. అనంతరం డిపొ్లమా ఇంజనీరింగ్ చేశాను. మోకాలి కింద వరకు కృత్రిమ కాళ్లను ఉచితంగానే అమరుస్తున్నాం. మోకాలి పైవరకు అమర్చాలంటే రూ.45 వేలకు పైగా ఖర్చవుతుంది. పేదలకు ఉచితంగా సేవలందించాలనేదే సంకల్పం. – వేదాంతం సదాశివమూర్తి, చైతన్య కృత్రిమ అవయవ కేంద్రం నిర్వాహకుడు, పాలకొల్లు చదవండి: వేరుశనగలో ‘విశిష్ట’మైనది -
Fact Check: ‘పచ్చ పత్రిక’ తప్పుడు ప్రచారం.. వాస్తవం ఇదే..
సాక్షి, అమరావతి: నరసాపురం పర్యటన సందర్భంగా పాలకొల్లులో ప్రభుత్వ వైద్యకళాశాల నిర్మాణ పనులు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అబద్ధాలు చెప్పారంటూ పచ్చపత్రిక తప్పుడు ప్రచారానికి దిగింది. అయితే ఈ వ్యవహారం వెనుక వాస్తవాలు ఓ సారి గమనిస్తే.. వైద్యశాఖలో సమూల మార్పులకు సీఎం జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నాడు–నేడు కార్యక్రమం కింద 17 కొత్త వైద్యకళాశాలల నిర్మాణం చేపడుతున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో రూ.475 కోట్లతో ప్రభుత్వం వైద్యకళాశాల నిర్మాణం చేపట్టింది. ప్యాకేజ్–3 కింద పాలకొల్లు, ఏలూరు వైద్యకళాశాలల నిర్మాణం చేపడుతుండగా ఈ కాంట్రాక్టును మెగా ఇంజనీరింగ్ సంస్థ దక్కించుకుంది. ఈ ఏడాది జూన్ 28వ తేదీన ఆ సంస్థకు ఎల్వోఏ జారీచేశారు. పాలకొల్లు వైద్యకళాశాల నిర్మాణానికి నాబార్డు ఈ ఏడాది సెప్టెంబర్ 27న రూ.275 కోట్ల రుణం మంజూరు చేసింది. దీంతో వైద్యకళాశాల నిర్మాణ పనులు మొదలయ్యాయి. పాలకొల్లులో వైద్య కళాశాల నిర్మాణం కోసం పనులు జరుగుతున్న దృశ్యాలు ప్రీ కన్స్ట్రక్షన్ కార్యకలాపాలను ప్రారంభించి మానవ, ఇతర వనరులను సమకూరుస్తోంది. పేదప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని ప్రభుత్వరంగంలో అందించడమే లక్ష్యంగా కొత్త వైద్యకళాశాలల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తోంది. ఇటీవల వరదల నేపథ్యంలో ఆ ప్రదేశంలో నీరు చేరడంతో పనులు ఆలస్యమయ్యాయి. వాస్తవాలు ఇలా ఉంటే ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకున్న దుష్టచతుష్టయం పనిగట్టుకుని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
బస్సులో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల ఓవరాక్షన్.. కౌంటర్ ఇచ్చిన మహిళలు!
పాలకొల్లు అర్బన్/పోడూరు: ఆర్టీసీ బస్సులో మహిళలపై పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దౌర్జన్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాలకొల్లు నుంచి పెనుగొండ వరకు ఆదివారం అమరావతి పాదయాత్ర సాగింది. ఈ మార్గంలో ఓ ఆర్టీసీ బస్సు ఎక్కిన ‘నిమ్మల’.. ప్రయాణికులతో మాటామంతీ కలుపుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైన, సీఎం జగన్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపైన బురదజల్లే ప్రయత్నం చేయబోయారు. దీంతో ఆ మహిళలు.. సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని, ఇంటి స్థలాలు ఇస్తున్నారని వాదించడంతో ఎమ్మెల్యే అవాక్కయ్యారు. ఈ దృశ్యాన్ని ఒక మహిళ వీడియో తీసింది. దీంతో, రెచ్చిపోయిన ఎమ్మెల్యే రామానాయుడు ఆ మహిళ చేతిలోని సెల్ఫోన్ బలవంతంగా లాక్కున్నారు. ఆ దృశ్యాలను తీసేస్తాను తన సెల్ఫోన్ తనకు ఇవ్వాలని ఆ మహిళ ప్రాథేయపడుతున్నా ఎమ్మెల్యే వినకుండా సెల్ఫోన్ను పక్కనే ఉన్న మరో టీడీపీ నేతకు ఇవ్వడం.. ఆ మహిళ ఎమ్మెల్యే మెడలోని పచ్చకండువాను, చొక్కాను లాగడం.. ఎమ్మెల్యే కేకలు వేయడం ఆ వీడియోలో స్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో ఆయన మహిళల ముందు అభాసుపాలయ్యారని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. పితాని, నిమ్మలకు ఝలక్.. మరోవైపు.. ఇదే జిల్లా పోడూరు మండలం కవిటం లాకుల వద్ద కూడా బస్సు ప్రయాణికుల నుంచి పాదయాత్రలోని మాజీమంత్రి పితాని, ఎమ్మెల్యే నిమ్మలకు ఝలక్ తగిలింది. పాదయాత్ర పేరుతో టీడీపీ నాయకులు బలప్రదర్శనకు దిగడం.. ట్రాఫిక్ స్తంభించడంతో ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు వారిపై మండిపడ్డాడు. గతంలో టీడీపీ హయాంలో చంద్రబాబు రాష్ట్రానికి చేసిన అన్యాయం, ఆ ప్రభుత్వం చేసిన మోసం చాలదా? ఇప్పుడు రైతుల ముసుగులో పాదయాత్ర చేస్తూ ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారంటూ టీడీపీ నేతలను నిలదీశాడు. దీంతో పాదయాత్ర చేస్తున్న పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీమంత్రి పితాని సత్యనారాయణ తదితరులు కంగుతిన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటించినట్లుగా మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు తెలుపుతామని ప్రయాణికులు తెగేసి చెప్పారు. -
పాలకొల్లులో అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ
-
Jahnavi Dangeti: వ్యోమగామి కలకు సీఎం జగన్ చేయూత
సాక్షి, అమరావతి/పాలకొల్లు అర్బన్: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి వ్యోమగామి అవ్వాలనే కలను సాకారం చేస్తూ సీఎం వైఎస్ జగన్ రూ.50 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేసినట్టు పౌరసంబంధాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. సచివాలయంలో బుధవారం జాహ్నవికి చెక్కును అందజేశారు. చదవాలనే తపన ఉండి నిరుపేద విద్యార్థులకు సీఎం జగన్ ఎప్పుడూ అండగా నిలుస్తారని చెప్పారు. జాహ్నవి పంజాబ్లో ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. వ్యోమగామి అవ్వాలనే లక్ష్యంతో నాసాతో పాటు పోలాండ్లో అనలాగ్ ఆస్ట్రోనాట్ శిక్షణ పొందింది. అయితే వ్యోమగామికి అంతర్జాతీయ సంస్థలో పైలెట్ శిక్షణ పొందాల్సి ఉండగా ఆర్థిక సాయం నిమిత్తం సీఎంని కలిసి కోరగా సానుకూలంగా స్పందించారు. నెలలోపే ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. జాహ్నవి మాట్లాడుతూ సీఎం దీవెనలతో త్వరలోనే శిక్షణను విజయవంతంగా పూర్తి చేస్తానని చెప్పారు. వ్యోమగామిగా దేశ కీర్తిని పెంచేందుకు కష్టపడతానని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్విప్ ముదునూరి ప్రసాదరాజు, పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాసరావు ఉన్నారు. విజయవాడలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను జాహ్నవి బుధవారం కలిశారు. ఈ సందర్భంగా జాహ్నవిని పద్మ సత్కరించారు. (క్లిక్ చేయండి: చరిత్ర సృష్టించిన జాహ్నవి.. స్పేస్ కావాలి!) -
ఎలబ్రస్ పర్వతంపై ఏపీ యువకుడు
పాలకొల్లు అర్బన్: రష్యాలోని మౌంట్ ఎలబ్రస్ పర్వతాన్ని రాష్ట్రానికి చెందిన 22 ఏళ్ల యువకుడు అధిరోహించాడు. సముద్ర మట్టానికి 18,500 ఫీట్ల ఎత్తులో ఉన్న ఎలబ్రస్ పర్వతాన్ని అధిరోహించడానికి ఏడుగురు సభ్యుల బృందం రష్యా లోని బేస్ క్యాంప్ నుంచి ఈ నెల 12న బయలుదేరింది. మౌంట్ ఎలబ్రస్ పర్వతంపై సీఎం వైఎస్ జగన్, మాజీ మంత్రి రంగనాథరాజుల ఫొటోలను దాసు ప్రదర్శించారు. క్లిక్: ఎంఎల్హెచ్పీలకు జోన్–2లోనే ఎక్కువ ఖాళీలు -
సీఎం వైఎస్ జగన్ను కలిసిన పాలకొల్లుకు చెందిన జాహ్నవి
-
అమ్మమ్మ కథలు.. అస్ట్రోనాట్ కలలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం)తూర్పుగోదావరి: నిండు పున్నమి రోజు ఆరు బయట మంచం మీద బామ్మ ఆమెకు అన్నం తినిపిస్తూ ఆకాశంలో ఉన్న చందమామని చూపిస్తూ అనేక కథలు చెప్పేది. చందమామ లోపల ఒక ముసలావిడ నూలు వడుకుతుందని చెప్పేది. ఒక్కోసారి చందమామ ఎందుకు కనిపించకుండా పోతుందని అమ్మమ్మని అడిగితే..రాహువు, కేతువులు చందమామని మింగేస్తారు అందుకే చందమామ క్రమంగా తరుగుతూ, పెరుగుతూ ఉంటుందని తెలపడంతో మనవరాలిలో ఆలోచనలు మొలకెత్తాయి. చదవండి: రాజమౌళి తండ్రి హైస్కూల్ వరకూ చదివింది ఇక్కడే.. ఆ చిన్నారికి చందమామ దగ్గర ఏం ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి వయసుతోపాటు పెరుగుతూ వచ్చింది. 17 సంవత్సరాలకే నాసా నిర్వహించిన ప్రోగ్రామ్లో పాల్గొని రికార్డు నెలకొల్పింది. 18 ఏళ్ల వయసులో ఇప్పుడు పోలెండ్లో నిర్వహించిన అంతరిక్ష వ్యోమగాముల శిక్షణ శిబిరంలో పాల్గొని అతి చిన్న వయసులో ఈ శిక్షణ పొందిన మొదటి మహిళగా రికార్డు సాధించింది. అంతరిక్షంలో విహారానికి రెక్కలు చాపుకుని ప్రయత్నిస్తున్న ఆ అమ్మాయి పాలకొల్లుకి చెందిన జాహ్నవి దంగేటి. అమ్మమ్మ నాగమణితో జాహ్నవి అమ్మమ్మ లాలనలో... జాహ్నవి అమ్మానాన్నలు శ్రీనివాస్, పద్మశ్రీ ఉద్యోగ రీత్యా కువైట్లో ఉండడంతో ఆమె అమ్మమ్మ నాగమణి దగ్గర పెరిగింది. అమ్మాయిలకు స్వీయరక్షణ సామర్థ్యం ఉండాలని జాహ్నవి తండ్రి ఆలోచన ఆమెను ఐదవ తరగతిలో కరాటే నేర్చుకొనేలా చేసింది. అందులో నేషనల్, ఇంటర్నేషనల్ పతకాలు సాధించింది. స్విమ్మింగ్, స్కూబా డైవింగ్లో కూడా తర్ఫీదు పొందింది. 17వ ఏటే నాసాలో పాల్గొన్న రికార్డు పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఉండే జాహ్నవి పంజాబ్లోని లవ్లీ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. యూఎస్కి చెందిన నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్లో పాల్గొని చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు భారతదేశం నుంచి ప్రాతినిధ్యం లేని ప్రోగ్రామ్లో ఆమె పాల్గొంది. జాహ్నవి పాల్గొనడం ఒక్క భారతదేశానికే కాదు ఆసియా ఖండానికి కూడా రికార్డే. తల్లిదండ్రులతో జాహ్నవి రాకెట్ నడిపింది.. జాహ్నవి గత సంవత్సరం 2021 నవంబర్ 12వ తేదీన యూఎస్కి వెళ్లి అక్కడి అలబామాలోని నాసాకు చెందిన స్పేస్ అండ్ రాకెట్ సైన్స్ సెంటర్లో అస్ట్రానాట్ ప్రోగ్రామ్లో శిక్షణ పూర్తి చేసుకొంది. పది రోజుల్లో ఆమె జీరో గ్రావిటీ, మల్టీ యాక్సెస్, ట్రైనింగ్, అండర్వాటర్ రాకెట్ లాంచ్ చేయడంతో పాటు ఎయిర్ క్రాఫ్ట్ను నడపడం కూడా నేర్చుకొంది. మెషీన్ కంట్రోలర్కి ఫ్లైట్ డైరెక్టర్గా వేర్వేరు దేశాలకు చెందిన పదహారు మంది యువతతో కూడిన బృందానికి జాహ్నవి నేతృత్వం వహించింది. సెస్మా 170 స్కైహాక్ అనే చిన్న రాకెట్ని విజయవంతంగా లాంచ్ చేసింది. భూమి మీద నుంచి గాల్లోకి ఎగరడం, దాదాపు అరగంట సేపు ఆకాశంలో విహరించడం, తిరిగి జాగ్రత్తగా ల్యాండ్ చేయడంలో ప్రతిభ చూపింది. నాసా సెంటర్లో తోటి అనలాగ్ అస్ట్రోనాట్స్తో కలెక్టర్ ప్రశంసలు పొంది.. పోలెండ్లో నిర్వహించిన అంతరిక్ష వ్యోమగాముల శిక్షణ శిబిరంలో పాల్గొని అతి చిన్న వయసులో ఈ శిబిరంలో పాల్గొన్న మొదటి మహిళాగా రికార్డు సాధించిన జాహ్నవి బుధవారం పోలెండ్ నుంచి రాజమహేంద్రవరం చేరుకుని కలెక్టర్ మాధవీలతను మర్యాద పూర్వకంగా కలిసింది. అనలాగ్ అస్ట్రోనాట్గా శిక్షణ పొంది దేశానికి గర్వకారణంగా జాహ్నవి నిలిచిందని, అంతరిక్షంలోకి వెళ్లాలన్న ఆమె లక్ష్యం నెరవేరాలని కలెక్టర్ మాధవీలత ఆకాంక్షించారు. తమ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామన్నారు. స్కూబా డైవింగ్ నేర్చుకున్నాను స్కూబా డైవింగ్ అని చెప్తే ఇంటో వాళ్లు పంపించరేమోనని స్విమ్మింగ్ అని చెప్పి వైజాగ్ వెళ్లాను. ఆ తర్వాత గోవాకు వెళ్లి ట్రైనింగ్ సెషన్స్లో పాల్గొని లైసెన్స్ తీసుకున్నాను. అండమాన్లో స్కూబా డైవింగ్లో అడ్వాన్స్డ్ కోర్సు పూర్తి చేశాను. అంతరిక్షంలో జీరో గ్రావిటీలోనే ఉండాలి. నీటి అడుగున కూడా గ్రావిటీ ఉండదు. ఆ ఎక్స్పీరియన్స్ కోసమే స్కూబా డైవింగ్ నేర్చుకున్నాను. పీపుల్స్ చాయిస్ అవార్డు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నా పేరు నమోదు అయ్యింది. నేను సాధించిన వాటికి వచ్చిన ప్రశంసలన్నీ మా అమ్మమ్మకే దక్కాలి. – జాహ్నవి దంగేటి -
భీమవరానికి కొత్త శోభ.. 2 కోట్లతో సుందరీకరణ పనులు
భీమవరం(ప్రకాశం చౌక్): నూతన పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరం కొత్త శోభ సంతరించుకోనుంది. పట్టణ సుందరీకరణ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఇటీవల పట్టణ సుందరీకరణపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వ హించారు. మున్సిపల్ అధికారులకు సృష్టమైన ఆదేశాలు జారీచేశారు. దాంతో పట్టణ సుందరీకణ పనులపై ఆగమేఘాలపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ పనులకు సంబంధించి డ్రాయింగ్స్, నమూనాలు, నిధులు, అంచనాలు తదితర వాటితో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికే భీమవరంలో మల్టీప్లెక్స్లు, షాపింగ్ మాల్స్, హోటల్స్, పెద్ద పెద్ద బట్టల దుకాణాలు, బంగారం షాపులు ఉన్నాయి. అలాగే ఆకర్షణీయమైన లైటింగ్స్, డైకరేషన్తో భీమవరం కళకళలాడుతోంది. చిన్న సైజు నగరాన్ని తలపిస్తోంది. పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసి ఆకర్షణీయంగా చేసేందుకు వాటర్ ఫౌంటెన్లు, వాల్ బ్యాక్గ్రౌండ్ ఫౌంటెన్స్, పచ్చదనం, వెల్కమ్ ఆర్చ్లు ఏర్పాటు చేసి మరింత అందంగా తీర్చిదిద్దనున్నారు. వాటర్ ఫౌంటెన్లకు రూ. 45 లక్షల ఖర్చు పట్టణ సుందరీకరణ పనులకు పలు రకాల నిధులు వాడేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. మున్సిపల్ సాధారణ నిధులు, సీడిఎంఏ, సీఎస్ఆర్ నిధులు ఉపయోగించుకుని అభివృద్ధి పనులు చేస్తారు. పట్టణంలోని ప్రకాశం చౌక్ సెంటర్, పోట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్, బీవీ రాజు విగ్రహం సెంటర్లలో లైటింగ్ విత్ వాటర్ ఫౌంటెన్లును ఏర్పాటు చేస్తారు. ఇందుకు సీఎస్ఆర్ నిధులు రూ.45 లక్షలు వెచ్చిస్తారు. ఒక్కొక్క ఫౌంటెన్కు రూ.15 లక్షలు ఖర్చు చేయనున్నారు. త్వరలోనే ఈ పనులు చేపడతారు. 6 చోట్ల స్వాగత ఆర్చ్లు భీమవరం పట్టణానికి ఇతర ప్రాంతాల నుంచి ప్రవేశించే ప్రధాన రోడ్లపై ఆర్చ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉండి రోడ్డు, బీవీ రాజు రోడ్డు, గొల్లవానితిప్ప, పాలకొల్లు, జువ్వలపాలెం రోడ్డు, తణుకు రోడ్డులో ఈ ఆర్చ్లు ఏర్పాటు చేస్తుండగా.. వాటి నిర్మాణం కోసం మున్సి పల్ నిధులు రూ.90 లక్షలు ఖర్చు చేయనున్నారు. ఒక్కొక్క ఆర్చ్కు రూ.15 లక్షలు ఖర్చు చేస్తారు. పచ్చదనం కోసం రూ. 54 లక్షలు పట్టణంలో పచ్చదనం (గ్రీనరీ) కోసం సీడీఎంఏ నిధులు రూ.54 లక్షలు ఉపయోగించుకోనున్నారు. పట్టణంలో ప్రధాన రహదారుల వెంట ప్రత్యేకమైన, అందమైన మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతు న్నారు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో యమనదుర్రు వంతెనకు అనుకుని గోడకు అందమైన చిత్రాలు వేయనున్నారు. అలాగే వాల్ ఫౌంటెన్ లేదా లైటింగ్ విత్ భీమవరం అని బోర్డు ఏర్పాటు చేస్తారు. ఇందుకు రూ.20 లక్షలు మున్సిపల్ నిధులు ఖర్చు చేస్తారు. స్థానిక ప్రకాశం చౌక్ సెంటర్ నుంచి పోలీసు బొమ్మ సెంటర్ వరకు పీపీ రోడ్డు మధ్యలో రూ.15 లక్షల ఖర్చుతో డివైడర్ నిర్మించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటారు. ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాటు ప్రకాశం చౌక్ సెంటర్, అంబేద్కర్ సెంటర్లో భీమవరానికి సంబంధించి విషయాలు తెలియచెప్పేలా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సీఎస్ఆర్ నిధులు రూ.15 లక్షలు ఖర్చు చేస్తారు. (క్లిక్: పోలీసుల అదుపులో కోనసీమ అల్లర్ల కేసు అనుమానితుడు?) సుందరీకరణ పనులకు ప్రతిపాదనలు పంపాం కలెక్టర్ అదేశాలతో భీమవరం పట్టణం సుందరీకరణ పనులకు సంబంధించి అన్నీ సిద్ధం చేసి ప్రతిపాదనలు ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖకు, భీమవరం ప్రత్యేక అధికారికి పంపాం. పట్టణంలో మూడు చోట్ల ఫౌంటెన్స్ నిర్మాణం పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నాం. మిగిలిన పనులకు సంబంధించి ప్రణాళికలను రూపొందించి వాటి నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటాము. – పి.శ్రీకాంత్, భీమవరం మున్సిపల్ ఇంజనీర్ -
జాతీయ మహమ్మారి ‘బ్రూసెల్లోసిస్’: పశువులతో పాటు మనుషులకూ ప్రమాదమే
సాక్షి, పాలకొల్లు అర్బన్: బ్రూసెల్లోసిస్ అనేది పశు సంపదను నిర్వీర్యం చేసే ప్రమాదకరమైన వ్యాధి. బ్రూసిల్లా అబార్టస్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి పశువులకు సోకుతుంది. ఇది పశువుల నుంచి మనుషులకు కూడా సోకే అతి ప్రమాదకరమైన బ్యాక్టీరియా. దీనిని బ్యాంగ్స్ వ్యాధి అని కూడా పిలుస్తారు. ఇది అంటువ్యాధి. బ్రూసెల్లా సూక్ష్మజీవులు పశువుల జననేంద్రియాలను, పొదుగును ఆశించి వ్యాధిగ్రస్తం చేస్తాయి. ఈ వ్యాధి సోకితే చూడి పశువుల్లో గర్భస్రావాలు జరుగుతాయి. ఈ వ్యాధి సోకడం వల్ల కోడెలు, దున్నల్లో సంతానోత్పత్తి శక్తి తగ్గిపోతుంది. జాతీయ ప్రాజెక్టుగా వ్యాధి నివారణ... ఈ వ్యాధి పశువులకు చాలా కాలం నుంచి వస్తున్నప్పటికీ దీని నివారణకు వ్యాక్సిన్ ఇటీవలే కనుగొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యాధి నివారణను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి దశల వారీగా దేశంలోని నాలుగు నెలల వయస్సు దాటి ఎనిమిది నెలల లోపు ఉన్న పెయ్య దూడలన్నింటికీ ఈ వ్యాక్సిన్ అందించే ప్రక్రియను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించాయి. ఏడాదిలో మూడు సార్లు ఈ వ్యాక్సిన్ ఒక్కొక్క మోతాదు చొప్పున పశువులకు అందించాలని కార్యాచరణ రూపొందించాయి. ఈ వ్యాక్సిన్ ఒకసారి పశువులకు చేస్తే జీవిత కాలంలో బ్రూసెల్లోసిస్ వ్యాధి సోకదని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటివరకు 29,159 పశువులకు ఈ వ్యాక్సిన్ అందించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ పశువులకు వేసేటప్పుడు రక్షణ పరికరాలు వినియోగించాలి. లేనిపక్షంలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ఈ వ్యాక్సిన్ చుక్కలు మనిషి శరీరంపై పడితే బోద మాదిరిగా వాపులు వస్తాయని పశువైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలకొల్లు మండలం గోరింటాడలో ఆవుదూడకి బ్రూసెల్లోసిస్ వ్యాక్సిన్ వేస్తున్న సిబ్బంది వ్యాధి వ్యాప్తి ఇలా.. వ్యాధిగ్రస్తమైన పశువుల్లో గర్భస్రావం జరిగినప్పుడు పిండం ద్వారా గర్భకోశ స్రవాల ద్వారా సూక్ష్మజీవులు బయటకు వచ్చి పశువులు మేసే మేతను, నీటిని ఆశించి కలుషితం చేస్తాయి. ఈ మేతను, నీటిని ఇతర పశువులు తీసుకోవడం ద్వారా వాటికి వ్యాధి సోకుతుంది. గర్భస్రావం జరిగిన పశువులు చెరువుల్లో, నీటి కుంటల్లో పొర్లినప్పుడు గర్భకోశ స్రవాలు బయటకు వచ్చి నీటిని కలుషితం చేయడం ద్వారా సూక్ష్మ జీవులు వ్యాపిస్తాయి. వ్యాధిగ్రస్తమైన కోడెలు, దున్నలు ఆరోగ్యకరమైన ఆవులు, గేదెలను దాటినప్పుడు వీర్యం ద్వారా సూక్ష్మజీవులు వ్యాపిస్తాయి. వ్యాధి లక్షణాలు చూడి పశువుల్లో గర్భస్రావాలు సాధారణంగా చూడి ఆఖరి దశలో సంభవించడం వ్యాధి ప్రధాన లక్షణం. చూడి మోపగానే సూక్ష్మజీవుల మాయను గర్భకోశాన్ని ఆశించి వ్యాధిగ్రస్తం చేస్తాయి. కాటిలెడెన్సు కుళ్లిపోవడం వల్ల పిండం మరణించి గర్భస్రావం అవుతుంది. గర్భస్రావాలు ఈ విధంగా రెండు, మూడు ఈతల్లో సంభవిస్తాయి. మనుషులకు వ్యాప్తి ఇలా.. బ్రూసెల్లోసిస్ సూక్ష్మజీవులు మనిషి కంటి పొరల ద్వారా లేదా ఈ వ్యాధి సోకిన పశువుల పాలు, వెన్న, మాంసం ఆహారంగా భుజించడం వల్ల వ్యాప్తి చెందుతుంది. పురుషులకు ఈ వ్యాధి సోకితే వృషణాలు వాపు చెందుతాయి. వీర్యం సక్రమంగా విడుదల కాక సంతానోత్పత్తి జరగదు. పురుషులకు నపుంసకత్వం వచ్చే ప్రమాదం ఉంది. మహిళలకు అబార్షన్ జరుగుతుంది. పిల్లలు పుట్టే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. రైతులు అవగాహన పెంచుకోవాలి బ్రూసెల్లోసిస్ వ్యాధి చాలా కాలం నుంచి పశువులకు సోకుతోంది. ఈ ఏడాది జనవరిలో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో మొదటి దశలో కొన్ని పశువులను గుర్తించి వ్యాక్సిన్ అందించాం. ఈ వ్యాధిపై రైతులు అవగాహన పెంచుకోవాలి. వ్యాక్సిన్ వేసే సిబ్బంది కూడా జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ కె.మురళీకృష్ణ, జిల్లా పశుసంవర్థక శాఖాధికారి, భీమవరం -
సైకిల్ యాత్రలో అపశృతి.. కింద పడ్డ టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి, పశ్చిమగోదావరి: పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు సైకిల్ యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. గుండుకొలను సమీపంలో ప్రమాదవశాత్తు ఎమ్మెల్యే నిమ్మల సైకిల్పై నుంచి జారిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు ఆయనను పైకి లేపారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే నిమ్మలకు స్వల్ప గాయాలయ్యాయి. చదవండి: (జేసీ అనుచరుల ఆగడాలు.. ప్రభాకర్రెడ్డి అన్న చెప్పాడంటూ) -
ఎమ్మెల్యే నిమ్మల సైకిల్ యాత్రలో అపశ్రుతి
-
సంప్రదాయం తోడుగా.. పాలకొల్లు పాగా
పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు ప్రాంతానికి చెందిన పాగాలు కర్ణాటక, మహారాష్ట్రలోని సంపన్న వర్గాల సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో సంపన్న కుటుంబాల్లో వివాహాది శుభకార్యాల సమయంలో ప్రతి పురుషుడు శిరస్సున పాగా ధరించడం ఆనవాయితీ. ఈ సాంప్రదాయ పాగా పాలకొల్లు ప్రాంతంలో తయారైనది కావడం విశేషం. పేట అంటే హిందీలో పాగా అని అర్థం. పాలకొల్లు పాగాను ఆయా రాష్ట్రాల్లో పాలకొల్లు పేటగా పిలుచుకుంటారు. శిరస్సున ధరించి రాజఠీవిగా భావిస్తారు. ప్రధానంగా పాలకొల్లు మండలంలోని భగ్గేశ్వరంలో ఈ పాగాల తయారీ ఎక్కువగా ఉంది. – పాలకొల్లు అర్బన్ 15 ఏళ్ల క్రితం రూ.5 కోట్ల వ్యాపారం పాలకొల్లు మండలంలోని భగ్గేశ్వరం, చింతపర్రు, దగ్గులూరు, దిగమర్రు, వాలమర్రు, యలమంచిలి మండలం పెనుమర్రు గ్రామాల్లో 15 ఏళ్ల క్రితం సుమారు 300కి పైగా మగ్గాలపై పాగాలు నేసేవారు. ఏడాదికి రూ.5 కోట్ల వరకు వ్యాపారం జరిగేది. ప్రస్తుతం భగ్గేశ్వరం, చింతపర్రు గ్రామాల్లో 50 మగ్గాలపై మాత్రమే పాగాలు నేస్తున్నారు. ఏడాదికి రూ.50 లక్షల వ్యాపారం జరుగుతోంది. బళ్లారి నుంచి ముడి సరుకు కర్ణాటకలోని బళ్లారి, అనంతపురం జిల్లా రాయదుర్గం, హిందూపురం నుంచి పాగా నేతకు అవసరమైన ముడి సరుకు (రా సిల్కు)ను దిగుమతి చేసుకుంటారు. ప్రస్తుతం కిలో ముడి సరుకు ధర రూ.4,500 ఉంది. దీనిని ఉడక బెట్టి, రంగులు వేసి, ఆరబెట్టి, ఆరుబయట పడుగు నేసి, అచ్చులు వేసి, హల్లులు దిద్ది, చిలకలు చుట్టి, మగ్గంపైకి పడుగు తీసుకురావడానికి ఆరు చేతులు మారుతాయి. చివరగా మగ్గంపై పాగా తయారవుతుంది. సుమారు 15 రోజులపాటు భార్యాభర్తలు కలిసి పనిచేస్తే 6 నుంచి 7 పాగాలు తయారవుతాయి. జనవరి నుంచి మే వరకు సీజన్ ఏటా జనవరి నుంచి మే వరకు పాగాల తయారీకి సీజన్. ఈ సమయంలో మహారాష్ట్ర, కర్ణాటకలో సంపన్న వర్గాల ఇంట వివాహాది శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ముందుగా వారు పాలకొల్లు పాగాలు కొనుగోలు చేసి మిగిలిన పనులు ప్రారంభిస్తారు. 65 ఏళ్లు పైబడిన వారే.. పాగా నేయడం పండుగలా ఉండేది. ఊరంతా పడుగులే. ఏ వీధిలోకి వెళ్లినా మగ్గం నేత శబ్దం వినిపించేంది. ప్రస్తుతం పరిస్థితి మారింది. పాగా నేసే కార్మికులు వృద్ధులైపోయారు. యువత ఈ పని నేర్చుకోవడానికి ముందుకు రావడం లేదు. 65 ఏళ్లు పైబడిన వారే ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. మరో ఐదేళ్లలో పాగా నేయడం కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. – రామలింగేశ్వరరావు, నేత కార్మికుడు ఏడాదికి రూ.50 లక్షలు పాగా వ్యాపారం బాగుండే రోజుల్లో ఈ ప్రాంతంలో ఎగుమతిదారులు ఉండేవారు. వ్యాపారం కోట్లలో సాగేది. ప్రస్తుతం ఏడాదికి రూ.50 లక్షలు వ్యాపారం జరగడం కష్టంగా ఉంది. పెద్ద వయసు వారు పాగాలు నేయడంపై జీవనం సాగిస్తున్నారు. ముడి సరుకుల ధరలు పెరగడం, నూలుపై జీఎస్టీ 12 శాతం పెంచడంతో పాగా తయారీ కష్టంగా మారింది. –విశ్వనాథం బాలాజీ, నేత కార్మికుడు రోజుకి రూ.200 కిరాయి ఒక పడుగు తయారీకి 15 రోజుల సమయం పడుతుంది. పడుగు మీద ఇద్దరం ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేస్తుంటాం. 9 గజాలు అయితే 6 పాగాలు, 8 గజాలు అయితే 7 పాగాలు తయారవుతాయి. పాగా ప్రస్తుతం రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు ధర పలుకుతుంది. పడుగు లెక్కన కిరాయి లభిస్తుంది. రోజుకి రూ.200 కచ్చితంగా కిడుతుంది. –విశ్వనాథం కోట మల్లయ్య, నేత కార్మికుడు -
చరిత్ర సృష్టించిన పశ్చిమ గోదావరి జాహ్నవి.. స్పేస్ కావాలి!
ఓ పాపాయి నేను డాక్టర్ని అవుతాను... అంటే! మన దగ్గర కావలసినన్ని కాలేజీలున్నాయి. మరో పాపాయి ‘ఇంజినీరింగ్ ఇష్టం’ అంటే... లెక్కకు మించిన విద్యాసంస్థలున్నాయి. ‘నేను ఆస్ట్రోనాట్ అవుతాను’ అంటే... ఎలా చదవాలో చెప్పేవాళ్లే లేరు. ‘స్పేస్ ఎడ్యుకేషన్’కి తగిన స్పేస్ మన దగ్గర లేదు. ఒక కల్పనాచావ్లా... మరో సునీతా విలియమ్స్ గురించి చెప్పుకుని సంతోషపడుతున్నాం ఇప్పటికీ. భారత సంతతికి చెందిన వారని సంతృప్తిపడుతున్నాం. మనదేశం నుంచి తొలిసారిగా ఒక అమ్మాయి ముందుకొచ్చింది. ‘నేను అంతరిక్షంలో అడుగుపెడతాను’ అంటున్న... ఈ తెలుగమ్మాయి పేరు జాహ్నవి దంగేటి. ‘చందమామ రావే’ అంటూ సాగిన బాల్యం. ‘అంతరిక్షంలో విహరిస్తా’ అంటూ రెక్కలు విచ్చుకున్నది. జాహ్నవి దంగేటిది పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు. బీటెక్ రెండవ సంవత్సరం చదువుతోంది. యూఎస్కు చెందిన నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్లో పాల్గొని చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు భారతదేశం నుంచి పార్టిసిపేషన్ లేని ప్రోగ్రామ్లో ఆమె పాల్గొన్నది. జాహ్నవి రికార్డు ఒక్క భారతదేశానికే కాదు ఆసియా ఖండానికి కూడా రికార్టే. రాకెట్ నడిపింది! జాహ్నవి గత నవంబర్ పన్నెండున యూఎస్కి వెళ్లి, అక్కడి అలబామాలోని నాసాకు చెందిన ‘స్పేస్ అండ్ రాకెట్ సైన్స్ సెంటర్’లో ఆస్ట్రోనాట్ ప్రోగ్రామ్లో శిక్షణ పూర్తి చేసుకుని 22వ తేదీన తిరిగి వచ్చింది. పదిరోజుల్లో ఆమె జీరో గ్రావిటీ, మల్టీ యాక్సెస్ ట్రైనింగ్, అండర్వాటర్ రాకెట్ లాంచ్ చేయడంతోపాటు ఎయిర్ క్రాఫ్ట్ను నడపడం కూడా నేర్చుకుంది. జాహ్నవి మిషన్ కంట్రోలర్కి ఫ్లైట్ డైరెక్టర్గా వేర్వేరు దేశాలకు చెందిన పదహారు మంది యువతతో కూడిన బృందానికి నేతృత్వం వహించింది. ‘సెస్నా 171 స్కైహాక్’ అనే చిన్న రాకెట్ను విజయవంతంగా లాంచ్ చేసింది. ‘భూమి మీద నుంచి గాల్లోకి ఫ్లై అవడం, దాదాపు అరగంట సేపు ఆకాశంలో విహరించడం, తిరిగి జాగ్రత్తగా ల్యాండ్ చేయడం’ మరిచిపోలేని అనుభూతి అన్నది ఈ అమ్మాయి. ‘ఆస్ట్రోనాట్గా పూర్తి స్థాయి శిక్షణ తీసుకోవాలనే కోరిక బలపడడంతోపాటు ఆస్ట్రోనాట్ కాగలననే నమ్మకం కూడా కలిగింది. పైలట్ ఆస్ట్రోనాట్ అయి తీరుతాను’ అని చెప్పింది. అమ్మమ్మ పెంపకం! జాహ్నవి అమ్మానాన్నలు ఉద్యోగరీత్యా కువైట్లో ఉండడంతో ఆమె అమ్మమ్మ లీలావతి దగ్గరే పెరిగింది. అమ్మమ్మ చందమామ కబుర్లు చెబుతూ పెంచింది. అలా ఆకాశంలో విహరించాలనే కోరికకు బీజం పడింది. అమ్మాయిలకు స్వీయరక్షణ సామర్థ్యం ఉండాలని జాహ్నవి తండ్రి ఆలోచన ఆమెను ఐదవ తరగతిలో కరాటే క్లాసులో చేర్చింది. అందులో నేషనల్, ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించింది. అంతరిక్షం కల మాత్రం ఆమెను వెంటాడుతూనే వచ్చింది. అందుకు ఉపకరించే స్కిల్స్ కోసం అన్వేషణ ఆమె మదిలో సాగుతూనే ఉండేది. స్విమ్మింగ్, స్కూబా డైవింగ్లో కూడా తర్ఫీదు పొందింది. వివక్ష తప్పలేదు... కానీ! ఆడపిల్లలు డైనమిక్గా ఉంటే సమాజం ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటుంది. తీర్పులు ఇస్తూనే ఉంటుంది. వద్దన్నా వినకుండా సలహాలు ఇస్తూనే ఉంటుంది. ఇవన్నీ తనకూ తప్పలేదని చెప్పింది జాహ్నవి. ‘‘పాలకొల్లు వంటి చిన్న పట్టణంలో చాలామందికి నేను చేస్తున్నవన్నీ విచిత్రాలుగానే తోచాయి. మెడిసినో, కంప్యూటర్ ఇంజనీరింగో చేసి ఉద్యోగం చూసుకోకుండా ఇవెందుకు? అన్నారు. ఇంతడబ్బు ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బు కట్నంగా ఇచ్చి పెళ్లి చేసుకోవచ్చు కదా! అని కూడా అన్నారు. ఇవన్నీ వాళ్లకు ‘స్పేస్’ మీద అవగాహన లేకపోవడం వల్ల అన్న మాటలే. అందుకే ప్రతి పట్టణంలోనూ స్పేస్ మ్యూజియం కానీ అంతరిక్ష పరిజ్ఞానానికి సంబంధించిన యాక్టివిటీ సెంటర్ కానీ పెడితే బావుంటుంది. అమ్మాయిలను రొటీన్ కోర్సులకు పరిమితం చేయకుండా వాళ్లకు ఇష్టమైన కోర్సుల్లోకి వెళ్లడానికి ప్రోత్సహించమని పెద్దవాళ్లను కోరుకుంటున్నాను. మా క్లాసులో 33 మంది అబ్బాయిలుంటే నేను మాత్రమే అమ్మాయిని. ఈ విషయంలో మా అమ్మానాన్నలు గ్రేట్ అని అక్కడికి వెళ్లిన తర్వాత తెలిసింది’’ అని చెప్పింది జాహ్నవి. అంతరిక్షమే హద్దు! ‘‘స్కూబా డైవింగ్ అని చెప్తే ఇంట్లో వాళ్లు పంపించరేమోనని స్విమ్మింగ్ అని చెప్పి వైజాగ్కు వెళ్లాను. ఆ తర్వాత గోవాకు వెళ్లి ట్రైనింగ్ సెషన్స్లో పాల్గొని లైసెన్స్ తీసుకున్నాను. అండమాన్లో స్కూబా డైవింగ్లో అడ్వాన్స్డ్ కోర్సు పూర్తి చేశాను. అంతరిక్షంలో జీరో గ్రావిటీలోనే ఉండాలి. నీటి అడుగున కూడా గ్రావిటీ ఉండదు. ఆ ఎక్స్పీరియెన్స్ కోసమే స్కూబా డైవింగ్ కోసం అంత పట్టుపట్టాను. ఈ మధ్యలో ఓసారి నా ఆలోచనలు ఏవియేషన్ పైలట్ వైపు మళ్లాయి. కానీ నాన్న ‘నీ లక్ష్యం అంతకంటే పెద్దది, దాని మీద నుంచి దృష్టి మరల్చవద్దు’ అన్నారు. ఇక అంతరిక్షం అనే కల నాతోపాటు పెరిగి నాలో స్థిరపడిపోయింది. ఇంజినీరింగ్కి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీని ఎంచుకోవడంలో ఉద్దేశం కూడా అంతరిక్షం కలను సాకారం చేసుకోవడానికే. ఇప్పటికే ఆన్లైన్లో నాసా నిర్వహించిన ఐదు ప్రోగ్రామ్లలో పాల్గొన్నాను. గత ఏడాది ‘పీపుల్స్ చాయిస్’ అవార్డు కూడా వచ్చింది. అయితే ఇప్పటి వరకు నాసా నుంచి నేను సాధించిన అన్నింటిలో ఇది చాలా ఇంపార్టెంట్ టాస్క్. నేను ఇవన్నీ చేస్తున్న సమయంలోనే ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’ నుంచి ఫోన్ వచ్చింది. ఆగస్టులో ఆ పురస్కారం అందుకున్నాను. నేనేం సాధించినా ప్రశంసలు దక్కాల్సింది మా అమ్మమ్మకే’’ అన్నది జాహ్నవి అమ్మమ్మను అల్లుకుంటూ... ‘నాసా’ సెంటర్లో, అమ్మమ్మ లీలావతితో జాహ్నవి. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: రియాజ్, ఏలూరు -
తెలుగు యువత దళిత నేతను కొట్టిన ఎమ్మెల్యే నిమ్మల
పాలకొల్లు సెంట్రల్: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలుగుయువత నియోజకవర్గ అధ్యక్షుడిపై దాడి చేశారు. సోమవారం ఉదయం సత్యాగ్రహ దీక్షలో భాగంగా పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్ వద్ద రోడ్డుకు అడ్డంగా దీక్షకు రంగం సిద్ధం చేస్తున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని ట్రాఫిక్కు అంతరాయం కలిగించవద్దని పట్టణ సీఐ అఖిల్ కోరారు. ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగితే కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎమ్మెల్యే వెనుక ఉన్న నాయకులను పక్కకు ఉండాలని సీఐ హెచ్చరించారు. ఈ సమయంలో తీవ్ర అసహనానికి గురైన రామానాయుడు తన వెనుక ఉన్న తెలుగుయువత నియోజకవర్గ అధ్యక్షుడు కె.నరేష్పై విరుచుకుపడ్డారు. ఆయనపై చేయిచేసుకున్నారు. పార్టీకే చెందిన తెలుగుయువత నేతపై ఎమ్మెల్యే దాడిచేయడం అక్కడున్న వారందరినీ భయభ్రాంతుల్ని చేసింది. ఊహించని ఘటనతో పార్టీ నాయకులు, కార్యకర్తలు దూరంగా వెళ్లిపోయారు. పబ్లిసిటీకి తానే ముందుండాలనుకునే రామానాయుడు ఎవరు ముందున్నా ఒప్పుకోరు. కానీ తన వెనుక నిలబడిన యువ దళిత నాయకుడిని ఇష్టానుసారం కొట్టడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొందరు పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే పబ్లిసిటీ యావ పరాకాష్టకు చేరుకుందని, అందుకే ఈ సంఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వైఎస్సార్సీపీలో చేరిన జనసేన నేత గుణ్ణం నాగబాబు
-
వైఎస్సార్సీపీలో చేరిన జనసేన నేత గుణ్ణం నాగబాబు
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు జనసేన నేత గుణ్ణం నాగబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో గుణ్ణం నాగబాబు వైఎస్సార్సీపీలో చేరారు. నాగబాబుతో పాటు ఆయన తనయుడు గుణ్ణం సుభాష్, పాలకొల్లు జనసేన నేతలు వీర శ్రీనివాసరావు, విప్పర్తి ప్రభాకరరావులకు సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చదవండి: చంద్రబాబు రాజకీయ జీవితానికి తెరపడింది: విజయ సాయిరెడ్డి ఈ కార్యక్రమంలో గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇక పాలకొల్లుకు చెందిన గుణ్ణం నాగబాబు గత అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. -
పాలకొల్లులో వైఎస్ఆర్ సీపీ శ్రేణుల ఆందోళన
-
రెండుచోట్ల గెలవడం కొంప ముంచింది
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థులతో పోటీపడి రెండు చోట్ల గెలిచాడు. ఉప సర్పంచ్గా ఎన్నికయ్యాడు. కానీ.. చివరకు ఏ పదవీ ఆయనకు దక్కలేదు. అత్యంత అరుదైన, ఆసక్తికరమైన ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం చింతపర్రులో చోటుచేసుకుంది. ఫిబ్రవరి 9వ తేదీన చింతపర్రు సర్పంచ్ పదవితో పాటు గ్రామంలోని వార్డు పదవులకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అదే గ్రామానికి చెందిన పెనుమత్స వెంకట రామకృష్ణంరాజు 4, 5 వార్డుల్లో పోటీ చేశారు. రెండుచోట్లా ప్రత్యర్థుల్ని చిత్తు చేసి మరీ గెలిచారు. 4వ వార్డులో 243 మంది ఓటర్లు ఉండగా.. 212 ఓట్లు పోలయ్యాయి. మొత్తం నలుగురు అభ్యర్థులు రంగంలో ఉండగా రామకృష్ణంరాజు 44 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 5వ వార్డులోనూ 243 మంది ఓటర్లు ఉండగా.. 214 పోలయ్యాయి. ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయగా.. 38 ఓట్ల మెజార్టీతో రామకృష్ణంరాజే గెలిచారు. ఆ తర్వాత వార్డు సభ్యుల ద్వారా పరోక్ష పద్ధతిన జరిగే ఉప సర్పంచ్ ఎన్నికల్లోనూ రామకృష్ణంరాజు పోటీపడి ఉప సర్పంచ్గానూ గెలుపొందారు. కానీ.. చివరకు వార్డు పదవితోపాటు ఉప సర్పంచ్ పదవికి సైతం ఆయన దూరం కావాల్సి వచ్చింది. ప్రత్యర్థులు ఫిర్యాదు చేయడంతో.. పంచాయతీ ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒక స్థానానికి మించి పోటీ చేయకూడదు. కానీ.. రామకృష్ణంరాజు మాత్రం రెండు వార్డుల్లో పోటీ చేయడమే కాకుండా రెండుచోట్లా గెలిచారు. నిబంధనల కారణంగా.. ఆయన రెండు వార్డు పదవులతో పాటు ఉప సర్పంచ్ పదవిని సైతం కోల్పోవాల్సి వచ్చింది. ఎన్నికల నిబంధనావళి రూల్ నంబర్ 8(3) ప్రకారం.. ఒక అభ్యర్థి ఒకచోట కంటే ఎక్కువ చోట్ల నామినేషన్లు దాఖలు చేసిన పక్షంలో నామినేషన్ల ఉపసంహరణ తేదీ నాటికి అందులో ఏదో ఒకచోట తప్ప మిగిలిన చోట్ల నామినేషన్లు ఉపసంహరించుకోవాలి. లేనిపక్షంలో అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్లన్నీ రద్దవుతాయి. ఈ నిబంధన విషయంలో పోటీ చేసిన అభ్యర్థితోపాటు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన ఉద్యోగికి సైతం అవగాహన లేకపోవడంతో రామకృష్ణంరాజుకు రెండుచోట్లా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారు. దీనివల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. రామకృష్ణంరాజు నిబంధనల్ని ఉల్లంఘించి ఎన్నికల్లో గెలిచారంటూ అయనపై పోటీ చేసిన ప్రత్యర్ధులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్కు ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ జరిపించిన ఎన్నికల కమిషన్ ఆ రెండు వార్డుల ఎన్నికలతో పాటు ఉప సర్పంచ్ ఎన్నికనూ రద్దు చేసింది. దీంతో ఆయన అన్ని పదవులనూ కోల్పోవాల్సి వచ్చింది. రిటర్నింగ్ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్ల ఈ పరిస్థితి ఎదురైనట్టు గుర్తించిన కలెక్టర్ స్టేజ్–1 రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన కె.శ్రీరామమూర్తిని సస్పెండ్ చేసినట్టు సమాచారం. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమాచారం ఇచ్చారని తెలిసింది. ఆ రెండు వార్డుల ఎన్నికకు ప్రత్యేక నోటిఫికేషన్ చింతపర్రు గ్రామ పంచాయతీలో 4, 5 రెండు వార్డులతోపాటు ఉప సర్పంచ్ పదవికి తిరిగి ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 13వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు వార్డు పదవులకు బుధవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. ఈ నెల 26వ తేదీన పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నికను కూడా చేపడతారు. ఇలావుండగా, రామకృష్ణంరాజు రెండు వార్డుల్లోనూ తిరిగి నామినేషన్ వేశారు. ఏ వార్డు అనుకూలమో నిర్ణయించుకుని రెండోచోట నామినేషన్ ఉపసంహరించుకుంటానని ఆయన తెలిపారు. -
దారుణం: అద్దె అడిగితే హతం చేశాడు
సాక్షి, పశ్చిమగోదావరి: పాలకొల్లులో దారుణం చోటుచేసుకుంది. అద్దె అడిగినందుకు ఇంటి యజమానిని హతమార్చాడో దుర్మార్గుడు. వివరాలు.. అడపా చిన్న కొండయ్య అనే వ్యక్తి కొన్నాళ్ల క్రితం వంగా ప్రసాద్(50) ఇంట్లో అద్దెకు దిగాడు. ఈ క్రమంలో కిరాయి చెల్లించమని అడగటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన కొండయ్య.. ప్రసాద్ తలపై బండ రాయితో కొట్టాడు. ఈ ఘటనలో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. అనంతరం కొండయ్య నేరుగా పోలీస్ స్టేషనుకు వెళ్లి లొంగిపోయాడు. చదవండి: తండ్రి మృతి..అప్పులు తీర్చలేక కొడుకు ఆత్మహత్య : బస్సులో ప్రయాణికుడి మృతి -
‘దిబ్బరొట్టె చేయడం నేర్పినందుకు గురుదక్షిణ’
సెలబ్రిటీ చెఫ్ వికాస్ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పాక శాస్త్ర ప్రావీణ్యంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వికాస్. లాక్డౌన్ నేపథ్యంలో ఈ స్టార్ చెఫ్ పేదలకు తన వంతు సాయం అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం వికాస్ చేసిన ఓ ట్వీట్ తెగ వైరలయ్యింది. ‘‘స్ట్రీట్ బైట్’ యూట్యూబ్ చానెల్ ద్వారా నాకు మాస్టర్ చెఫ్ సత్యం పరిచయం అయ్యారు. ఈ చానెల్లో వచ్చిన సత్యం గారి వీడియో చూసి నేను దిబ్బ రొట్టె చేయడం ఎలాగో నేర్చుకున్నాను. ఈ క్రమంలో నేను నా గురువు సత్యం గారికి గురుదక్షిణ సమర్పించాలనుకుంటున్నాను. దయచేసి ఆయనకు సంబంధించిన వివరాలు తెలియజేయండి అంటూ వికాస్ ట్వీట్ చేశారు. URGENT- Plz Share-Andhra Pradesh ThankU @street_byte 4 introducing me 2 MasterChef Satyam💕 I learnt technique of Dibba Roti by watching him years ago Plz help me reach out to him asap This is the true heritage of our country and we have to protect these treasures. #GuruDakshinā pic.twitter.com/rlmZrfFolo — Vikas Khanna (@TheVikasKhanna) May 11, 2020 కొద్ది గంటల్లోనే ఈ ట్వీట్ వేలాది లైక్లు, షేర్లు సంపాదించింది. అంతేకాక 24 గంటల్లోనే సదరు సత్యం వివరాలను రీట్వీట్ చేశారు ట్విటర్ ఫాలోవర్లు. తన గురువు గారి వివరాలు తెలియజేసిందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు వికాస్ ఖన్నా. Thank you all. We have found MASTERCHEF Satyam,72 who taught me Dibba Roti technique (thru youtube) Need trustworthy source to deliver ration to Yeagi Ravithi Satyanarayana Near Satya hospital Deavuni Thota Palakollu, West Godavari District Andhra Pradesh 534260 info@vkhanna.com pic.twitter.com/JVy9r1wZ9T — Vikas Khanna (@TheVikasKhanna) May 11, 2020 -
ఓ వైపు పోలీసులు హెచ్చరిస్తున్నా ...
-
గుంజీలు తీయించి, పూలదండలు వేశారు..
సాక్షి, పాలకొల్లు: లాక్డౌన్ నేపథ్యంలో పనిలేకుండా బయటకొచ్చే వారిపై కఠిన చర్యలు తప్పవని ఓ వైపు పోలీసులు హెచ్చిరిస్తున్నా... మరోవైపు జనాలు రోడ్లమీదకు వస్తూనే ఉన్నారు. పోలీసులు హెచ్చరిస్తున్నా ఫలితం లేకపోతోంది. నిబంధనలు ఉల్లంఘించినవారి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నా... రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. (వారికి ముందుగా పరీక్షలు చేయాలి : సీఎం జగన్) తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో లాక్డౌన్ నియమ నిబంధనలను అతిక్రమించి నిర్లక్ష్యంగా తిరుగుతున్న పలువురిని పోలీసులు పట్టుకున్నారు. పట్టణ సీఐ సీహెచ్ ఆంజనేయులు ఆధ్వర్యంలో వారికి సన్మానం చేశారు. అందరిని వరుసగా నిలబెట్టి పది గుంజీలు తీయించారు. అంతేకాకుండా నిబంధనలు అతిక్రమించిన వారిందరికీ పూలదండలు వేశారు. రేపటి నుండి మేం బయటకురామంటూ వారిచేత ప్రతిజ్ఞ చేయించారు. (కరోనా: వీధుల్లో తిరుగుతున్న దెయ్యాలు!) -
సైకో స్వైర విహారం
పశ్చిమగోదావరి, పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లులో ఒక వ్యక్తి సైకోలా వీరంగం చేసి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. విచక్షణారహితంగా పలువురిపై దాడికి పాల్పడటంతో స్థానికులు కర్రలతో అతడిని కట్టడి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి.. తమిళనాడు తంజావూరు నుంచి వచ్చిన కొందరు యువకులు పాలకొల్లులో జ్యూస్ సెంటర్ నడుపుతున్నారు. వారిలో ఒకడైన సులేన్ అనే వ్యక్తి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఆదివారం మిత్రులతో గొడవ పడి జ్యూస్ సెంటర్ నుంచి బయటకు వచ్చాడు. యడ్లబజారు సెంటర్లోని కనకదుర్గమ్మ ఆలయంలోకి వెళ్లి శంభోశంకర అంటూ అరుచుకుంటూ అమ్మవారి విగ్రహం వద్దకు వెళ్లి అక్కడున్న వస్తువులను గిరాటు వేశాడు. ఇద్దరు భక్తులు, అర్చకునిపై దాడికి పాల్పడ్డాడు. అక్క డి నుంచి బయటకు వచ్చిన సులేన్ రోడ్డుపై వెళుతున్న పలువురిపై దాడులకు దిగాడు. అటుగా వచ్చిన కానిస్టేబుల్పై కూడా దాడి చేశాడు. రోడ్డుపై కనిపించిన వ్యక్తులను ఇష్టమొచ్చినట్లు కొడుతూ తన చేతులను కత్తితో చీరేసుకున్నాడు. ఎంఎంకేఎన్ఎం హైస్కూల్ వద్ద మరో వ్యక్తిపై పైసాచికంగా దాడి చేస్తుండగా స్థానికులు సులేన్ను కర్రలతో కట్టడి చేశారు. అనంతరం అతడిని తాళ్లతో నిర్బంధించి పోలీసుల సహకారంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సులేన్ మానసిక స్థితి సరిగా లేదని, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించిన అనంతరం సులేన్ను మిత్రులకు అప్పగించామని పోలీసులు చెప్పారు. -
క్షీర రామ లింగేశ్వర స్వామి దేవాలయంపై సాక్షి ప్రత్యేక కథనం
-
పేదల కడుపు నింపుతున్న చిట్టెమ్మ హోటల్..
పశ్చిమగోదావరి, పాలకొల్లు అర్బన్: గోదావరి జిల్లాలంటేనే ఆతిథ్యానికి పెట్టింది పేరు. లాభాపేక్ష చూసుకోకుండా ఎందరో పేదల కడుపు నింపిన అన్నపూర్ణలు ఈ రెండు జిల్లాల్లో ఎందరో ఉన్నారు. అలాంటి కోవలోకే వస్తుంది పాలకొల్లు పట్టణానికి చెందిన ఇండిగుల చిట్టెమ్మ. తనకు గిట్టుబాటు కాకపోయినా తన హోటల్కు వచ్చే వారికి అన్ని వంటకాలతో కడుపునిండా భోజనం పెడుతుంది. అందుకే పాలకొల్లులో చిట్టెమ్మ హోటల్ పేదల హోటల్గా పేరుపడింది. లాభం లేకుండా హోటల్ ఎందుకు నడుపుతున్నావని ఎవరైనా ప్రశ్నిస్తే.. తనకు నాలుగు ముద్దలు తినేందుకు అవసరమైన డబ్బు మిగిలితే చాలు.. డబ్బులు వెనకేసుకుని ఏం చేసుకుంటాం అని సమాధానమిస్తుంది చిట్టెమ్మ.. పేదలు, రోజువారీ కూలీలే ఎక్కువ పాలకొల్లు పట్టణంలో భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, రోజువారీ కూలీలు, పేదల్ని చిట్టెమ్మ హోటల్ ఎక్కడంటే టక్కున చెబుతారు. ఎందుకంటే తక్కువ రేటుకే వారందరికీ కడుపు నిండా అన్నం పెడుతుంది ఆమె. పాలకొల్లు పట్టణంలో 40 ఏళ్ల క్రితం ప్రారంభించినటా హోటల్కు ఇప్పటికీ గిరాకీ తగ్గలేదు. అందుకు కారణం రుచికరమైన వంటకాలతో కడుపునిండా భోజనం పెట్టడం ఒకటైతే.. పట్టణంలోని మిగతా హోటళ్ల కంటే సగం ధరకే కడుపు నింపడం. కట్టెల పొయ్యిపై చేసిన రుచికరమైన వెజిటేరియన్ భోజనం రూ.40కి, నాన్ వెజ్ భోజనం రూ. 50కే పెడుతుంది. కట్టెల పొయ్యిపైమాంసం కూరవండుతున్నఇండిగుల చిట్టెమ్మ ,కస్టమర్లకు భోజనం వడ్డిస్తున్న చిట్టెమ్మ అప్పటి నుంచీ అదే మెనూ చిట్టెమ్మ స్వగ్రామం నరసాపురం.. పెళ్లాయ్యాక తరువాత బతుకుదెరువు కోసం పాలకొల్లులో భోజనం హోటల్ ప్రారంభించింది. హోటల్ ప్రారంభించినప్పుడు రూ.2.50కే నాన్వెజ్ భోజనం పెట్టేవారు. కోడికూర లేదా చేపల పులుసుతో పాటు పప్పు, వేపుడు, పులుసు కూర, పచ్చడి, పెరుగు, రసం లేదా సాంబారు ఉంటుంది. మనం ఎంత కావాలంటే అంత తినొచ్చు. వెజిటేరియన్ భోజనంలోను అన్ని వెరైటీలు ఉంటాయి. అప్పటి నుంచి అదే విధానం కొనసాగిస్తున్నారు. చిట్టెమ్మ హోటల్లో చేపల కూర అద్భుతమంటూ భోజన ప్రియులు లొట్టలేస్తుంటారు. ఒకసారి ఆ రుచి చూస్తే వదిలిపెట్టరని చెబుతారు. కట్టెల పొయ్యిపైనే అన్ని వంటలు కట్టెల పొయ్యిపై వంట చేస్తే ఆ రుచే వేరని చెబుతుంది చిట్టెమ్మ. ఇక అక్కడి తినేవారు సైతం కట్టెల పొయ్యిపై చేసిన వంటకాలు చాలా రుచికరంగా ఉంటాయంటారు. రోజూ వంద కిలోల రైస్ వండేది. ఒకప్పుడు కళకళలాడిన హోటల్కు ప్రస్తుతం కస్టమర్ల రాక తగ్గింది. ఎక్కడపడితే అక్కడ బిర్యానీ సెంటర్లు, పాస్ట్ఫుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు రావడంతో వ్యాపారం తగ్గిందని చిట్టెమ్మ చెబుతోంది. చిట్టెమ్మ హోటల్ భోజనం చేసేవారంతా రిక్షా కార్మికులు, జట్టు కార్మికులు, వ్యవసాయ కూలీలు. సామాన్య, మధ్య తరగతికి చెందిన వారే. తక్కువ ధరకు కడుపునిండా భోజనం పెట్టడంతో వెదుక్కుని మరీ ఇక్కడకు వస్తుంటారు. చిట్టెమ్మకు ముగ్గురు కొడుకులు కాగా.. ఇద్దరు ఆటో డ్రైవర్లుగా స్థిరపడ్డారు. మూడో కొడుకు తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ హోటల్ వ్యాపారంలో సాయపడుతున్నాడు. 30 గజాలే ఆస్తి ఇన్నేళ్లలో ఈ భోజన హోటల్ మీద నేను సంపాదించింది 30 గజాల స్థలం. నేను, నా భర్త హోటల్ వ్యాపారంలో ఉండడంతో ముగ్గురు పిల్లల్ని చదివించలేకపోయాను. ఏదో నాలుగు ముద్దలు తినేంత మిగిలితే సరిపోతుందని ఈ రోజు వరకు వ్యాపారం సాగిస్తున్నాను. ఈ మధ్య నాకు శరీరం సహకరించడం లేదు. లాభాపేక్ష లేకుండా ఏదో ఇంతకాలం వ్యాపారం చేశాను. - ఇండిగుల చిట్టెమ్మ, హోటల్ నిర్వాహకురాలు పేదల హోటల్గా ప్రసిద్ధి పేదల హోటల్గా ఇది ప్రసిద్ధి. కాఫీ అండ్ భోజన హోటల్ నడిపేవాడిని. నష్టాలు రావడంతో కాఫీ హోటల్ తీసేశాను. కొన్నాళ్ల క్రితం కాలికి గాయమైంది. మోకాలు జాయింట్లో సమస్య ఏర్పడింది. శస్త్ర చికిత్స చేయాల్సి ఉన్నా వయసు సహకరించదన్నారు. ఏ పని చేయలేకపోతున్నా. నా భార్య చిట్టెమ్మ, మూడో కొడుకు, కోడలు సాయంతో హోటల్ నడుపుతున్నాం. ఇండిగుల సత్యనారాయణ, చిట్టెమ్మ భర్త ఇంట్లో భోజనంలా ఉంటుంది ఇంట్లో భోజనంలా చాలా రుచిగా ఉంటుంది. లాభం కోసం ఆలోచించరు. ఎలా గిడుతుందో అర్థం కాదు. పెరిగిన నిత్యావసర సరకుల ధరలతో పోలిస్తే చాలా తక్కువ ధరకు భోజనం లభిస్తుంది.చిర్ల శ్రీనివాసరెడ్డి,ఆర్ఎంపీ వైద్యుడు -
పాలకొల్లులో వివాహిత అనుమానాస్పద మృతి
సాక్షి, పశ్చిమగోదావరి: పాలకొల్లు పట్టణం మావుళ్లమ్మ పేటలో ఓ వివాహిత అనుమానాస్పదం గా మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకొల్లుకు చెందిన ప్రియదర్శిని అనే వ్యక్తికి, మొగల్తూరు మండలం తూర్పుతాళ్లుకు చెందిన కోడి దుర్గ(19)కు ఏడాది క్రితం పెరుపాలెం బీచ్లో పరిచయం ఏర్పడింది. గత ఏడాది ఫిబ్రవరిలో దుర్గను ఇంటికి తీసుకొచ్చిన ప్రియదర్శిని.. ఏప్రిల్లో ఆమెను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె తొమ్మిదినెలల గర్భవతి. కాగా, శుక్రవారం రాత్రి దుర్గ అనుమానాస్పదంగా మృతి చెందారు. భర్తే దారుణంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని దుర్గ బంధువులు ఆరోపిస్తున్నారు. మరో వైపు దుర్గ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని ప్రియదర్శిని బంధువులు చెబుతున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ ప్రారంభించారు. -
దిబ్బరొట్టె.. వదిలితే ఒట్టే
కాగితం కంటే పల్చగా.. నాన్స్టిక్ పెనంలో నూనె వేయకుండా కాల్చే తెల్ల దోసెలు తినడానికి అలవాటు పడిన వారికి పాలకొల్లు దిబ్బరొట్టె గురించి చెబితే కడుపు నిండిపోతుందేమో. ఇంత మందాన, ఎర్రగా కాలిన ఆ దిబ్బ రొట్టె రుచే వేరు. బొగ్గుల కుంపటిపై పాత కాలం మూకుడు పెట్టి.. అందులో పిండివేసి.. దానిపై మూతవేసి.. ఆపైన ఎర్రటి నిప్పులు వేసి దోరగా కాల్చే మినప రొట్టెను ఓసారి రుచి చూస్తే.. లొట్టలేసుకుని మరీ తినాల్సిందే. సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి పాలకొల్లు పేరు చెప్పగానే గుర్తొచ్చేది పంచారామ క్షేత్రాల్లో ఒకటైన క్షీరా రామలింగేశ్వరస్వామి క్షేత్రం. ఈ ప్రాంతం ఎందరో కళామతల్లి ముద్దుబిడ్డలకు జన్మస్థానం. నిప్పులపై కాల్చే మినప దిబ్బరొట్టెకూ పాలకొల్లు ప్రసిద్ధి. దీనిని ఒక్కసారి రుచి చూసిన వారు మళ్లీ మళ్లీ తినాలనుకుంటారు. ఇతర జిల్లాల నుంచి పాలకొల్లు వచ్చే ప్రతి ఒక్కరూ ‘పాలకొల్లు దిబ్బరొట్టె దొరికేదెక్కడ’ అని అడ్రస్ అడిగి మరీ వెళ్లి తింటుంటారు. పట్టణంలోని మారుతి థియేటర్ క్యాంటీన్లో కాల్చే దిబ్బరొట్టె గోదావరి జిల్లాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. చింతామణి చట్నీ (శనగ పిండిని ఉడికించి.. తాలింపు వేసిన చట్నీ)తో ఆ రొట్టెను తింటే నాలుక చిమచిమలాడాల్సిందే. ఇలా కాలుస్తారు.. ముందుగా బొగ్గుల పొయ్యి (కుంపటి)లో బొగ్గులను వేసి నిప్పు రాజేస్తారు. దానిపై పాత కాలం నాటి మూకుడు పెట్టి అందులో కొంచెం నూనె వేస్తారు. ఆ తరువాత రవ్వ కలిపిన మినప పిండిని వేసి దానిపై మూత పెడతారు. ఆ మూతపై మరికొన్ని నిప్పులు వేసి రొట్టెల్ని కాలుస్తారు. ఒక్కో రొట్టె కాలడానికి సుమారు 20 నిమిషాలు పడుతుంది. వారంతా రుచిచూశారు.. పాలకొల్లు వచ్చిన ఏ సినిమా నటుడైనా మారుతీ హాల్ క్యాంటీన్కు వెళ్లాల్సిందే. ఈ థియేటర్ ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణకు చెందినది. ఆయన పాలకొల్లులో ఏటా లలిత కళాంజలి నాటకోత్సవాలు నిర్వహించేవారు. ఈ కార్యక్రమాలకు పెద్దఎత్తున సినిమా నటులు హాజరయ్యేవారు. వారంతా ఇక్కడి దిబ్బరొట్టెను లొట్టలేసుకుని తినేవారు. మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు, ధవళ సత్యం, రవిరాజా పినిశెట్టి వంటి వారంతా ఈ దిబ్బరొట్టె రుచి చూసిన వారే. నిత్యం 500 రొట్టెలకు పైనే.. ప్రతిరోజూ ఇక్కడ సుమారు 30 కేజీలు మినప్పప్పు నానబెడతారు. రోజుకు 500 రొట్టెలు పైనే అమ్ముతుంటారు. ఒక్కో రొట్టె ధర రూ.30. సగం రొట్టె ధర రూ.15. బొగ్గుల పొయ్యి (నిప్పుల కుంపటి) పైనే వీటిని కాలుస్తారు. ఉదయం 6 గంటలు మొదలు రాత్రి 9 గంటల వరకూ ఎప్పుడు చూసినా 20 పొయ్యిలపై వీటిని కాలుస్తూనే ఉంటారు. రొట్టె తినాలంటే నిప్పులపై కాలేవరకూ కనీసం అరగంట సేపు వేచి ఉండాల్సిందే. సెల్ఫ్ సర్వీస్ కావడం వల్ల ఈ క్యాంటీన్కు వచ్చే ప్రముఖులు, సామాన్యులు సైతం కార్లలోను, రోడ్డుపైనే నిలబడి భుజిస్తుంటారు. ఇప్పుడు పాలకొల్లులో వివిధ ప్రాంతాల్లో దిబ్బరొట్టె తయారు చేసే హోటళ్లు వెలిశాయి. అయితే, మారుతీ క్యాంటీన్లో వేసే దిబ్బరొట్టెకు ఉన్నంత గుర్తింపు వీటికి దక్కలేదు. ఆరు దశాబ్దాల చరిత్ర మారుతి థియేటర్ నిర్మించి 60 సంవత్సరాలు దాటింది. అప్పటినుంచీ ఇక్కడ దిబ్బరొట్టె ప్రాముఖ్యత సంతరించుకుంది. మా చిన్నతనంలో రొట్టెను నాలుగు ముక్కలు చేసి అమ్మేవారు. ఈ క్యాంటీన్ను 8 సంవత్సరాల క్రితం లీజుకు తీసుకున్నాను. ఇక్కడి రొట్టెకు గల ప్రాముఖ్యత దృష్ట్యా దిబ్బరొట్టెల్ని వేస్తూనే ఉన్నాం. – మట్టా విజయభాస్కర్, క్యాంటీన్ యజమాని -
ఫైనాన్స్ కంపెనీ మోసం: 1600 మందికి పైగా డిపాజిటర్లు
సాక్షి, ఏలూరు: పాలకొల్లుకు చెందిన ఫైనాన్స్ కంపెనీ మోసంతో బాధితులు ఘొల్లుమంటున్నారు. పట్టణంలో నాలుగు నెలల క్రితం ఓ రియల్టర్, ఫైనాన్స్ వ్యాపారి సుమారు రూ.130 కోట్లకు బోర్డు తిప్పనున్నాడంటూ పెద్ద ఎత్తున అలజడి రేగిన విషయం తెలిసిందే. ఈ వ్యాపారి వద్ద నగదు డిపాజిట్ చేసిన వ్యక్తులు సుమారు 1600పైనే ఉంటారని అంచనా వేస్తున్నారు. కానీ ఇంతవరకూ ఎవరూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. ఒకవేళ కేసు పెట్టడానికి ముందుకు వచ్చినా పోలీసులు కేసు నమోదు చేయలేదనే ఆరోపణలూ వినిపించాయి. ఎట్టకేలకు పాలకొల్లు పట్టణానికి చెందిన మద్దుల వెంకట సుబ్బారావు అనే వ్యక్తి తనకు కోటి రూపాయల వరకూ ఇవ్వాలంటూ కలెక్టర్, ఎస్పీలను కలిసి స్పందనలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కంపెనీ యజమాని అరెస్టుకు సిద్ధపడ్డారు. పాలకొల్లు పట్టణానికి చెందిన లలితా ఫైనాన్స్ కంపెనీ యజమాని తాళ్లూరి వెంకట సుబ్బారావుకు చెందిన ఆస్తులను అమ్మితే ప్రతి డిపాజిట్దారునికి రూపాయికి 65 పైసలు చొప్పున మాత్రమే సరిపోతుందని అతని ఆస్తుల విలువ తెలిసిన వ్యక్తులు అంచనాలు వేసుకుంటున్నారు. కానీ ఇంతలో అతని వద్ద ఓ సెటిల్మెంట్ బ్యాచ్ తయారైంది. సెటిల్మెంట్ బ్యాచ్ అడుగు పెట్టిన తరువాత 65 పైసలు చొప్పున ఇవ్వనవసరం లేదని 35 పైసలు చొప్పున ఇస్తే సరిపోతుందని సలహా ఇచ్చినట్లు సమాచారం. దీంతో దాదాపుగా ఓ 100 మంది డిపాజిట్దారులకు పైన చెప్పిన ప్రకారం సరిపెట్టినట్లు పాలకొల్లులో చర్చ జరుగుతోంది. ఆ 35 పైసలు కూడా ఎలాగంటే లలితా ఫైనాన్స్ వ్యాపారి సుబ్బారావుకు ఒక వ్యక్తి కోటి రూపాయలు అప్పు ఇచ్చి ప్రతి నెలా వడ్డీ తీసుకుంటున్నారు. ఆ వ్యక్తి వడ్డీ రూపంలో ఇప్పటివరకూ సుమారు రూ.50 లక్షలు తీసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న సెటిల్మెంట్లో ఆ వ్యక్తి 35 పైసలు చొప్పున రూ.35 లక్షలు వస్తుందని ఆశతో వెళ్లాడు. కానీ అక్కడ ఇచ్చిన అప్పు కోటి రూపాయల్లో తీసుకున్న వడ్డీ రూ.50 లక్షలు తగ్గించి మిగిలిన రూ.50 లక్షల్లో 35 పైసలు చొప్పున రూ.17.5లక్షలు ఇచ్చినట్లు తెలిసింది. ఇలా సుమారు ఓ వంద మందికి సరిపెట్టినట్లు పట్టణ వాసులు చర్చించుకుంటున్నారు. ఇదే కోణంలో భీమవరానికి చెందిన ఓ వ్యక్తి కోటి రూపాయలు డిపాజిట్ చేసి రూ.కోటిపైనే వడ్డీ తీసుకువెళ్లినట్లు తెలిసింది. అతనికి ఇక ఏమీ ఇచ్చేదిలేదంటూ చేతులెత్తేశారు. ఆ డిపాజిట్దారుని కోసం భీమవరానికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే రంగంలోకి దిగి సెటిల్మెంట్ బ్యాచ్ను ఆశ్రయించారు. అతనికి పైసాకూడా ఇచ్చేదిలేదంటూ తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఆ మాజీ ఎమ్మెల్యే కనీసం ఆ 35 పైసలు చొప్పునైనా ఇవ్వాలంటూ అడిగినా తాము ఏమి చేయలేమంటూ చేతులెత్తేసినట్లు సమాచారం. ఆ సెటిల్మెంట్ బ్యాచ్కు ఇన్నోవా కారు గిఫ్ట్గా ఇచ్చినట్లు పట్టణంలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి తాళ్లూరి సుబ్బారావు ఇంటిలో పోలీసులు సోదా చేసి అధికారికంగా ఉన్న అకౌంట్ పుస్తకాల ప్రకారం జనాల నుంచి తీసుకున్న అప్పులు రూ.25 కోట్లు, బ్యాంక్ అప్పు రూ.3.30 కోట్లు ఉండగా రూ. 34 కోట్ల ఆస్తులు ఉన్నట్లు లెక్కతేలింది. ఇవి కాక బయట పడని బాకీలు సుమారు రూ.100 కోట్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. బాధితులు బయటకు రాకపోవడానికి కారణం నల్లధనమేనా? పట్టణంలో కొందరు వ్యాపారులు, వైద్యులు ఈ ఫైనాన్స్ కంపెనీ యజమానికి అప్పులు ఇచ్చినట్లు తెలిసింది. వీళ్లంతా తమకు డబ్బు ఇవ్వకపోయినా పరవాలేదు తమ పేర్లు మాత్రం దయచేసి బయటపెట్టవద్దని కోరినట్లు సమాచారం. మరి కొందరు తమ సొమ్ము తమకు ఇవ్వాలంటూ ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు తప్ప బహిరంగంగా అడగలేకపోతున్నారు. బహిరంగం చేస్తే ఆదాయపన్ను శాఖ అధికారులకు లెక్కలు చూపించాలని భయపడుతున్నారు. కొందరు బడా బాబులు తమ సొమ్ములు రికవరీ కోసమే సెటిల్మెంట్ బ్యాచ్ను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి అధికారికంగా అప్పు ఇచ్చిన వ్యక్తులకు ఉన్న బాకీలు లెక్కిస్తే పూర్తి మొత్తంలో వడ్డీతో సహా ఇచ్చినా ఇంకా నగదు మిగులుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. చీటింగ్ కేసు నమోదు చేయని పోలీసులు ఆ రియల్టర్ తనను చీటింగ్ చేశాడంటూ పట్టణానికి చెందిన బోడపాటి జోగయ్య అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. చీటింగ్ కేసు నమోదు చేయాలని నరసాపురం డీఎస్పీని కలవగా పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని చెప్పినట్లు జోగయ్య తెలిపారు. ఆగస్టు 28న పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు గానీ, ఆ రియల్టర్ను పిలిచి విచారించినట్లు గానీ ఇంతవరకూ సమాచారం అందించలేదని తెలిసింది. ఓ సినీ నటి ఆగ్రహం? సినీ ఇండస్ట్రీతో కూడా సంబంధాలు ఉన్న ఆ రియల్టర్ ఓ హాస్య నటి నుంచి కూడా పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ సేకరించినట్లు సమాచారం. ఈ రియల్టర్ వద్ద ఆ నటి పెద్దమొత్తంలో డిపాజిట్ చేయడానికి ఓ హాస్య కథానాయకుడు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలిసింది. ఆ హాస్య కథానాయకుడి తాతగారు ఊరు యలమంచిలి మండలం కావడంతో ఆ పరిచయాలతో పెద్దమొత్తంలో డిపాజిట్ చేసినట్లు తెలిసింది. ఇటీవల ఒక రోజు ఆ రియల్టర్ ఇంటికి వచ్చిన ఆ నటి తీవ్రంగా దుర్భాషలాడినట్లు చెబుతున్నారు. పాల‘ఘొల్లు’ -
సీఎం జగన్పై ఆర్.నారాయణమూర్తి ప్రశంసలు
సాక్షి, పశ్చిమగోదావరి : సినీ నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. పాలకొల్లులో ఆయన మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని మనస్పూర్తిగా అభినందిస్తున్నా. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపుల్ని ప్రాత్సహించలేదు. ఎవరైనా నాయకుడు పార్టీ మారాలని చూస్తే ఆ పార్టీకి, పదవికీ రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు 54 శాతం రిజర్వేషషన్లు కల్పించిన ఏకైక నాయకుడు సీఎం జగన్. మార్కెట్లో ప్రజాస్వామ్యం అనే సినిమాను మీరందరూ చూడండి, ఆదరించండి. చూపించండి. భారత దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ఓటుకు నోటు, రూ.100 కోట్లు పెడితే ఎమ్మెల్యే, 200 కోట్లు పెడితే ఎంపీ టికెట్. ప్రజాస్వామ్యం ధన స్వామ్యం అయిపోయింది. ప్రజాస్వామ్యం సంతలో సరుకైపోయింది. ప్రజాస్వామ్యన్ని పరిరక్షించడం ద్వారా మన అందరి బతుకులు బాగుంటాయి అనేది ఈ చిత్రం. ఇసుక జల సంపద. భారత దేశంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జాతి సంపద, మూల సంపద అయిన ఇసుకను ఏ వ్యక్తుల చేతుల్లో లేకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలి’అన్నారు. కాగా, నవంబరు 29న మార్కెట్లో ప్రజాస్వామ్యం సినిమా విడుదల కానుంది. -
దోమలపై దండయాత్రతో దోచింది మర్చిపోయారా?
సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా : టీడీపీ పాలనలో డ్రైనేజీలను నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రస్తుతం వ్యాధులు ప్రబలుతున్నాయని పాలకొల్లు వైఎస్సార్సీపీ ఇంచార్జి కవురు శ్రీనివాస్ తెలిపారు. దోమలపై దండయాత్ర పేరుతో నిధుల దోపిడీ చేయడం తప్ప ఒక్క పనీ చేయలేదని ఆయన మండిపడ్డారు. శనివారం స్థానికంగా నిర్వహించిన ప్రెస్మీట్ కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ.. కిడ్నీ బాధితులకు గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవినీతి లేని పాలన అందిస్తూ రూ. 25 లక్షలు ఇచ్చారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే రామానాయుడు చేసిన తప్పులను ప్రజల్లో ఎండగడతామని వెల్లడించారు. వైఎస్సార్సీపీ నాయకుడు యడ్ల తాతాజీ మాట్లాడుతూ.. గతంలో చేసిన అవినీతి, తప్పిదాల నుంచి తప్పించుకోవడానికి ఎమ్మెల్యే డ్రామాలాడుతున్నాడని పేర్కొన్నారు. పర్సంటేజీలు వచ్చే పనులకు ప్రాధాన్యతనిచ్చి మిగిలిన పనులను మరుగున పడేయడం వల్లే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. -
పాలకొల్లులో ఆటోడ్రవర్ల ర్యాలీ
-
‘డెంగీ నివారణకు తక్షణ చర్యలు చేపట్టండి’
సాక్షి, పాలకొల్లు: డెంగీ నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ్ రాజు అధికారులను ఆదేశించారు. సోమవారం మంత్రి పాలకొల్లు పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి పారిశుద్ధ్య చర్యలను పరిశీలించారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ గురించి మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న మున్సిపల్ హెల్త్ అసిస్టెంట్ కుమార్ రాజును సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. పాలకొల్లు ప్రధాన మురుగు కాలువ పూడికతీత పనులు వేగవంతం చేయాలన్నారు. అవసరమైతే ప్రైవేట్ వాహనాల ద్వారా యుద్ధ ప్రాతిపదికన మూడు రోజుల్లో పూడికతీత పూర్తి చేయాలన్నారు. పట్టణంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. ఇటీవల విష జ్వరాల బారిన పడి మృతిచెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రితో మాట్లాడి సాయం అందేలా చేస్తామని తెలిపారు. మంత్రి వెంట వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, యడ్ల తాతాజీ తదితరులు ఉన్నారు. -
పాలకొల్లులో మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి, పాలకొల్లు: పోలీసుస్టేషన్లో అన్యాయంగా నిర్బంధించారంటూ ఒక మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో చోటు చేసుకుంది. తన ఇంట్లో బంగారం చోరి జరిగిందని మడికి మేరిరత్నం అనే మహిళ పాలకొల్లు పోలీస్స్టేషన్లో కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. ఈ కేసులో భాగంగా ఆమెను స్టేషన్కు పిలిచిన సిఐ ఆంజనేయులు.. బంగారం రీకవరి చేస్తామని, కాకపోతే ఆ బంగారం ధరను తక్కువగా చూపించి మరో కేసు పెట్టాలని డిమాండ్ చేశారని బాధితురాలు తరపు బంధువులు ఆరోపించారు. అంతేకాకుండా ఆమెను చేయి పట్టుకుని లాగి నిర్బధించారని తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను పాలకొల్లు ప్రభుత్వాసుప్రతికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సీఐ ఆంజనేయులపై కఠిన చర్యలు తీసుకోవాలని మేరిరత్నం బంధువులు డిమాండ్ చేస్తున్నారు. -
మద్యం మత్తులో అన్నను చంపిన తమ్ముడు
సాక్షి, పశ్చిమగోదావరి(పాలకొల్లు) : మద్యం మత్తు ఆ కుటుంబంలో చిచ్చురేపింది. తాగిన మైకంలో ఓ తమ్ముడు క్రికెట్ బాట్తో అన్న తలపై కొట్టడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ దుర్ఘటన పాలకొల్లు మండలం చందపర్రులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మద్యానికి బానిసలైన దేవాబత్తుల ప్రభాకరరావు (48) అతని సోదరుడు సుభాకర్ మంగళవారం రాత్రి కూడా ఫూటుగా మద్యం సేవించారు. వీరు ఇద్దరూ కలిసి తాగడం అలవాటుగా చేసుకున్నారు. వారి మధ్య కుటుంబ కలహాలు కూడా ఉన్నాయి. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం చెలరేగింది. దీంతో ఉక్రోషంతో తమ్ముడు సుభాకర్ అందుబాటులో ఉన్న క్రికెట్ బ్యాట్ తీసుకుని ప్రభాకరరావుపై దాడి చేశాడు. తలపై క్రికెట్ బ్యాట్తో బ లంగా మోదడంతో ప్రభాకరరావు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు హుటాహుటిన పాలకొల్లు ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉద యం ప్రభాకరరావు మరణించాడు. తల్లి సమక్షంలోనే కొట్లాట : ప్రభాకరరావు, సుభాకర్ ఇద్దరూ కొట్లాడుకునే సమయంలో తల్లి నెలసనమ్మ అక్కడే ఉంది. అన్నయ్యను కొ ట్టవద్దని వారిస్తున్నా మద్యం మత్తులో ఉన్న సుభాకర్ ఆమె మాట పట్టించుకోలేదు. మృ తుడు ప్రభాకరరావు భార్య కృష్ణవేణి ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లింది. అతని కుమారుడు సుకుమార్ పట్టణంలోని ప్రైవేట్ స్కూల్లో తొ మ్మిదో తరగతి చదువుతున్నాడు. పరారీలో నిందితుడు వీఆర్వో మీసాల శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై పి.అప్పారావు ఘటనాస్థలానికి వచ్చి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రభాకరరావును హత్య చేయడానికి ఉపయోగించిన క్రికెట్ బ్యా ట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త మ్ముడు సుభాకర్ పరారీలో ఉన్నాడు. రూరల్ సీఐ డి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సై అప్పారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసులకు సవాల్ విసిరిన పేకాట రాయుళ్లు..
మా భర్తలు ఉదయాన్నే పని ఉందని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. ఎప్పుడో అర్ధరాత్రి వస్తున్నారు. 24 గంటలూ క్లబ్బుల్లోనే ఉండి మద్యం సేవిస్తూ.. పేకాటలోనే నిమగ్నమవుతున్నారు. ఉన్న ఆస్తులను తగలేస్తున్నారు. ఇంటి వ్యవహారాలు అసలు పట్టించుకోవడం లేదు. అత్యవసరమై ఫోన్ చేసినా స్పందించడం లేదు. పేకాట స్థావరాలను మూయించండి. – ఇదీ ఇటీవల కొందరు మహిళలు జిల్లా పోలీసు అధికారులకు ఫోన్ చేసి వెళ్లబోసుకున్న గోడు సాక్షి, పాలకొల్లు సెంట్రల్/భీమవరం: క్లబ్లు, టౌన్హాళ్లలోని పేకాట స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో జూదరులు రూటుమార్చారు. పేరొందిన హోటళ్లు, ధనికులు నివాసముండే ప్రాంతాలను ఎంచుకుని జోరుగా పేకాట శిబిరాలు సాగిస్తున్నారు. పోలీసులకే సవాల్ విసురుతున్నారు. జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, జంగారెడ్డిగూడెం, నల్లజర్ల తదితర ప్రాంతాల్లో యూత్క్లబ్లు, కాస్మోక్లబ్లు, టౌన్హాళ్లు ఉన్నాయి. వీటిలో ఎంతోకాలంగా పేకాట ఆడడం సహజంగా మారిపోయింది. ఎస్పీగా నవదీప్సింగ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో క్లబ్లపై దృష్టిసారించారు. దీంతో ఉద్యోగ విరమణ చేసిన వారు, కొంతమంది రాజకీయ నాయకులు, ధనికులు పెద్ద మొత్తంలో పేకాట ఆడే క్లబ్లు కొన్ని నెలలుగా దాదాపు మూతపడ్డాయి. పోలీసులు నిత్యం దాడులు చేస్తూ పేకాటను దాదాపుగా అరికట్టారనే చెప్పాలి. అయితే పేకాట ఆడడమే నిత్యకృత్యంగా మారిన వారు దానిని మానలేక కొత్తకొత్త స్థావరాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారు. కొంతకాలం పొరుగు రాష్ట్రాలకు వెళ్లినా.. పోలీసుల దాడులతో బెంబేలెత్తిన జూదరులు కొంతకాలం యానాం, ఖమ్మం, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లి పేకాట ఆడినా.. ఇటీవల మళ్లీ రూటు మార్చి జిల్లాలోని పట్టణాల్లోనే ప్రత్యేక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. భీమవరం పట్టణంలో పేరొందిన హోటళ్లు, లాడ్జిల్లోనే పెద్ద ఎత్తున జూదం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ హోటళ్లలో అయితే పోలీసు దాడులుండవనే భావనతోనే వీటిని ఎంచుకున్నట్టు సమాచారం. ఈ సమాచారం మేరకు ఇటీవల భీమవరంలోని పలు హోటళ్లల్లో పోలీసులు దాడులు చేసి నిందితులను అరెస్టు చేసి వారినుంచి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంకా అనేక చోట్ల పేకాట స్థావరాలు నడుస్తున్నాయని తెలుస్తోంది. అలాగే ధనికులు నివాసం ఉండే ప్రాంతాల్లోని ఖాళీగా ఉన్న విశాలమైన గృహాలను ఆఫీసు కార్యకలపాలంటూ అద్దెకు తీసుకుని వాటిలో గుట్టుచప్పుడు కాకుండా పేకాడుతున్నట్టు సమాచారం. పట్టుబడుతున్నది యువకులే! పోలీసుల దాడుల్లో పట్టుబడుతున్నది అధికంగా యువకులేనని పోలీసులు చెబుతున్నారు. బడాబాబులూ పట్టుబడుతున్నా.. వారిని పోలీసులు తప్పిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది పోలీసు సిబ్బంది జూదరులకు సహకరిస్తూ దాడుల్లో జరిగే అవకాశం ఉంటే ముందుగా వారికి ఫోన్ ద్వారా సమాచారం అందిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. పోలీసు శాఖ మరింత పకడ్బందీగా ముందుకెళ్తే పేకాటను పూర్తిగా అరికట్టవచ్చని, అయితే స్థానిక పోలీసు సిబ్బందితో కాకుండా పొరుగు స్టేషన్ల సిబ్బందితో దాడులు చేయిస్తే ప్రయోజనం ఉంటుందనే వాదన వినబడుతోంది. పాలకొల్లులో పోలీసులకే సవాల్! పాలకొల్లు టౌన్ హాలులో మంగళవారం పోలీసులు దాడి చేసి 16 మంది జూదరులను అరెస్ట్ చేశారు. గతంలో చాలాసార్లు హెచ్చరికలు జారీ చేసినా క్లబ్ సభ్యులు వినకపోవడంతో ఆఖరికి పోలీసులు దాడులు చేసినట్టు తెలుస్తోంది. దాడి చేసిన సమయంలో కొందరు జూదరులు గోడ దూకి పారిపోయారు. కొందరు పోలీసులను చూసినా కోతాట ఆడుతూనే ఉన్నారు. క్లబ్ సభ్యులు కొందరు తమకు కోర్టు అనుమతి ఉంది.. ఆడే దమ్ముంది.. మీకు ఆపే దమ్ముంటే ఆపుకోవచ్చని పోలీసులకు సవాల్ విసిరినట్టు సమాచారం. ఈ విషయం ఎస్పీ నవదీప్సింగ్ దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారు. టౌన్ హాలు వద్ద బుధవారం కూడా భారీగా పోలీసులను మోహరించారు. బుధవారం సాయంత్రం కొందరు సభ్యులు టౌన్హాల్ వద్దకు కార్లలో రావడంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేకించి కార్లలో ఇక్కడకు ఎందుకు వచ్చారో తెలుసుకుంటామని, వారు సరైన వివరాలు ఇస్తే వారి అడ్రస్లు తీసుకుని విడుదల చేస్తామని సీఐ ఆంజనేయులు తెలిపారు. కాయిన్లతో ఆట జిల్లాలోని క్లబ్బుల్లో నగదు ప్రత్యక్షంగా టేబుల్పై పెట్టకుండా అక్కడ ఉండే కౌంటర్లలో నగదు చెల్లించి దానికి సరిపడా కాయిన్లు తీసుకుంటారు. వాటితోనే ఆట కొనసాగిస్తారు. -
ఉసురుతీసిన ఆక్వా సాగు
సాక్షి, పాలకొల్లు(పశ్చిమగోదావరి) : సిరులు కురిపించే ఆక్వా సాగులో నష్టాలు రావడంతో రైతు కుంగిపోయాడు. వంశపారంపర్యంగా వచ్చిన వ్యవసాయ భూమిని, ఇంటి స్థలాన్ని విక్రయించినా అప్పులు తీరకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. పురుగుమందు తాగి ఆక్వా రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పోడూరు మండలం వద్దిపర్రులో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పాలకొల్లు మండలం లంకలకోడేరుకి చెందిన ఆరేపల్లి సూర్య వెంకట సురేష్కుమార్ (39) పోడూరు మండలం వద్దిపర్రులో రొయ్యల చెరువు సాగు చేస్తున్నాడు. దీంతో పాటు అడపాదడపా వరి కూడా సాగుచేస్తుంటాడు. గతంలో లంకలకోడేరులో ఉన్న ఉమ్మడి ఆస్తి సుమారు ఆరు ఎకరాలు విక్రయించి పోడూరు మండలం వద్దిపర్రులో ఆరు ఎకరాలు కొనుగోలు చేసి రొయ్యల సాగు మొదలుపెట్టాడు. అయితే ఆక్వాసాగు అతడికి కలిసిరాలేదు. అప్పులుపాలు కావడంతో వద్దిపర్రులో తన పేరు మీద ఉన్న పొలాన్ని విక్రయించి కొంతమేర బాకీలు తీర్చాడు. తల్లిదండ్రుల పేరు మీద ఉన్న మరో మూడు ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నాడు. అప్పులు బాగా పెరిగిపోవడంతో గతేడాది లంకలకోడేరులో ఉన్న మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని కూడా విక్రయించి కొన్ని బాకీలు తీర్చాడు. ఇటీవల రొయ్యల చెరువు పట్టుబడి పట్టగా సుమారు రూ.3 లక్షలకు పైగా నష్టం వచ్చింది. దీంతో పాత, కొత్త అప్పులు కలిపి సుమారు రూ.10 లక్షల వరకు ఉన్నాయి. ఒకవైపు అప్పుల బాధ వేధిస్తుండగా మరోపక్క భార్యాభర్తల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో బుధవారం వద్దిపర్రులో రొయ్యల చెరువు వద్ద సురేష్కుమార్ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య రాజేశ్వరి, ఇద్దరు కుమారులు ఉన్నాయి. ఇద్దరు కుమారులను పోగొట్టుకున్న తండ్రి వృద్ధులైన ఆరేపల్లి సింహాచలం, కృష్ణవేణి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు సురేష్కుమార్ కాగా చిన్నకుమారుడు రమేష్. రమేష్ దాదాపు 15 ఏళ్ల క్రితం ఉపాధి కోసం కువైట్ వెళ్లి అక్కడ జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. సురేష్కుమార్ వ్యవసాయం చేసి తల్లిదండ్రులు, భార్యాబిడ్డలను పోషి స్తున్నాడు. ఇటువంటి నేపథ్యంలో సురేష్కుమార్ ఆత్మహత్య ఆ కుటుంబాన్ని మరింత కుం గదీసింది. వృద్ధాప్యంలో తమకు దిక్కెవరని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. భా ర్య రాజేశ్వరి, కుమారుల రోదనలు మిన్నం టాయి. పోలీసులు మృతదేహానికి పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రూరల్ సీఐ దేశింశెట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పో డూరు ఎస్సై బి.సురేంద్రకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ శేషుబాబు పరామర్శ విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ప్రభుత్వాసుపత్రిలో ఉన్న సురేష్కుమార్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. పోలీస్, రెవెన్యూ, వ్యవసాయాధికారులతో మాట్లాడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. -
నేనే రాజు.. నేనే బంటు
సాక్షి, పాలకొల్లు(పశ్చిమగోదావరి) : నిస్వార్థ రాజకీయాలకు ఆయనో ఐకాన్. రాజకీయాల్లో ఉన్నంతకాలం నిజాయితీగా పనిచేశారు. ఆ తర్వాత ఎంతో నిరాడంబరంగా జీవిస్తున్నారు. ఆయనే పాలకొల్లు మండలం ఉల్లంపర్రు గ్రామానికి చెందిన కాటంరెడ్డి రామారావు. ఒకప్పుడు పోడూరు మండలం జిన్నూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశారు. సొసైటీ పరిధిలోని రైతులకు వ్యవసాయ పెట్టుబడులు అందించి వారి అభివృద్ధికి కృషి చేశారు. నేడు పాలకొల్లులో దిగమర్రు కాలువ గట్టున సైకిల్ మెకానిక్గా పనిచేస్తున్నారు. 1938లో కాటంరెడ్డి రామారావు ఉల్లంపర్రులో జన్మించారు. 1952లో కమ్యూనిస్టు భావాలకు ఆకర్షితులై పార్టీ కార్యకర్తగా చేరారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలతో 1989లో కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. అప్పట్లో జరిగిన జిన్నూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఎన్నికల్లో ఆ గ్రామానికి చెందిన కొప్పర్తి సూర్యం సొసైటీ అధ్యక్షుడు ఎన్నికకాబడిన సమయంలో కాటంరెడ్డి రామారావును ఉపాధ్యక్షుడిగా సభ్యులు ఎన్నుకున్నారు. ఆ విధంగా మూడు సార్లు సొసైటీ ఉపాధ్యక్షుడిగా, 1985–86లో జిన్నూరు సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికై రైతులకు సేవలందించారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్పార్టీలో పనిచేస్తున్నారు. రామారావుకి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వారికి వివాహాలు చేశారు. ప్రస్తుతం సైకిల్ మెకానిక్గా కుటుంబ భారాన్ని మోస్తున్నారు. రాజకీయాల్లో ఎకరం పొలం అమ్ముకున్నా నా 67 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజల సమస్యలపై పోరాటమే తప్ప ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని నా స్వార్థం కోసం వినియోగించుకోలేదు. రాజకీయాల్లో తిరిగి ఎకరం పొలం అమ్ముకున్నా. జిన్నూరు సొసైటీకి అధ్యక్షుడుగా పనిచేసి రైతులకు ఉపయోగపడ్డాననే సంతృప్తి కలిగింది. ఉల్లంపర్రులో పేదలకు 40 మందికి ఆ రోజుల్లో ఇళ్ల స్థలాలు ఇప్పించాను. ఏ వ్యక్తైనా ఎదుట వారికి ఉపయోగపడాలి. వృద్ధాప్యంలో కుటుంబ పోషణ కోసం సైకిల్ మెకానిక్గా పని చేస్తున్నా. –కాటంరెడ్డి రామారావు, ఉల్లంపర్రు -
‘పబ్లిసిటీ కోసమే ఎమ్మెల్యే నిమ్మల డ్రామాలు’
సాక్షి, పాలకొల్లు: జల దీక్షలంటూ టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డ్రామాలాడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర్ర కార్యదరి చిలువూరి కుమార దత్తాత్రేయ వర్మ మండిపడ్డారు. దీక్ష పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. అసత్యాలు ప్రచారం చేసి పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంపు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ముంపు బాధితులకు అండగా ఉంటాం: వరద ముంపు బాధితులకు అండగా ఉంటామని వైఎస్సార్సీపీ రాష్ట్ర పంచాయితీ రాజ్ విభాగం ప్రధాన కార్యదర్శి యడ్ల తాతాజీ అన్నారు. బాధితులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. బాధితులకు ఇబ్బందులు కలగకుండా నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పునరావాస కేంద్రాల్లో వండిన ఆహారాన్ని ఎమ్మెల్యే నిమ్మల అనుచరులు తినేయడంతో.. మళ్లి వండించి బాధితులకు పెట్టామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాధితులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సాయంపై నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. -
నెలలు నిండకుండానే కాన్పు చేయడంతో..
సాక్షి, పశ్చిమగోదావరి(పాలకొల్లు) : పాలకొల్లు సూర్య నర్సింగ్ హోంలో వైద్యురాలు పీపీఆర్ లక్ష్మీకుమారి నిర్లక్ష్యం కారణంగా గర్భిణి చల్లా ధనలక్ష్మి మృతి చెందిన సంఘటనపై ఆసుపత్రి రిజిస్ట్రేషన్ను రద్దు చేస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వై.సుబ్రహ్మణ్యేశ్వరి ఆదివారం ఏలూరులో విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. స్పందన కార్యక్రమంలో మృతురాలు తండ్రి చల్లా సత్యనారాయణ కలెక్టర్ రేవు ముత్యాలరాజుకు స్వయంగా ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటనపై విచారణ చేయాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నరసాపురం మండలం చిట్టవరం గ్రామ మాజీ సర్పంచ్ చల్లా సత్యనారాయణ ఎకైక కుమార్తె చల్లా ధనలక్ష్మి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. వైద్య పరీక్షల కోసం పాలకొల్లులో నివాసం ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు రాగా ఈ ఏడాది మే 31న పట్టణంలోని సూర్య నర్సింగ్ హోమ్లో వైద్యురాలు పీపీఆర్ లక్ష్మీకుమారి సలహా మేరకు ఆసుపత్రిలో ఉంచాలని చెప్పడంతో అదే రోజు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే నెలలు నిండకుండానే కాన్పు చేసే ప్రయత్నం చేయడంతో ధనలక్ష్మి మృతిచెందింది. దీనిపై ఆమె తండ్రి సత్యనారాయణ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడంతో గతనెల 23న జిల్లా ప్రభుత్వాసుపత్రి ప్రసూతి వైద్యనిపుణురాలు డా.ఎం పద్మ పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో విచారణ నిర్వహించారు. ధనలక్ష్మి మృతికి సూర్య నర్సింగ్ హోం డాక్టర్ పీపీఆర్ లక్ష్మీకుమారి నిర్లక్ష్యం కారణంగా నిర్ధారించి ఏపీపీఎంసీఈ చట్టం ప్రకారం 6 నెలల పాటు ఆసుపత్రి గుర్తింపును రద్దు చేస్తూ చర్యలు తీసుకున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుబ్రహ్మణ్యేశ్వరి పేర్కొన్నారు. నా పరిస్థితి ఎవరికీ రాకూడదు నాకు ఒకే ఒక కుమార్తె. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాను. చదువులో మెరిట్గా నిలిచేది. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం చేస్తుంది. ఎంతో ఆరోగ్యంతో ఉండేది. కేవలం పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో చూపించాను. అయితే డాక్టర్ పీపీఆర్ లక్ష్మీకుమారి నిర్లక్ష్యంగా వైద్యం చేసింది. ప్రాణాలు బలిగొంది. అధికారులు చర్యలు తీసుకోవడంతో న్యాయం జరిగింది. ఇటువంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు. –చల్లా సత్యనారాయణ, మృతురాలి తండ్రి -
గోరింటాడ యువకుడు లాత్వియాలో మృతి
సాక్షి, పాలకొల్లు(పశ్చిమగోదావరి) : విదేశీ చదువుల కోసం లాత్వియా దేశం వెళ్లిన పాలకొల్లు మండలం గోరింటాడకు చెందిన వడల వివేక్ (19) శనివారం రాత్రి అక్కడ నదిలో ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయి ప్రాణాలు విడిచారు. దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. మృతుడు అమ్మమ్మ సునీత పాలకొల్లులోని క్రిష్టియన్పేటలో ఉంటోంది. మనవడి మృతి వార్త తెలిసి కన్నీరుమున్నీరవుతోంది. వివేక్ తండ్రి శ్యాంబాబు గత 20 ఏళ్ల నుంచి కువైట్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం చేస్తున్నారు. తల్లి స్వర్ణలత కూడా అక్కడే ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వివేక్ ఈ ఏడాది జనవరిలో బీఎస్సీ మెకానికల్ ఇంజినీరింగ్ చదివే నిమిత్తం లాత్వియా దేశంలోని రిగా యూనివర్సిటీలో చేరారు. మొదటి సెమిష్టర్ పరీక్షలు పూర్తి చేశారు. మరో వారంరోజుల్లో వివేక్ తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తున్న కువైట్ నగరానికి రానున్నారు. అయితే ఈ లోగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వివేక్ కువైట్లో తల్లిదండ్రుల వద్ద ఉంటూ 8వ తరగతి వరకు అక్కడే చదివారు. ఆ తర్వాత హైదరాబాద్లో హాస్టల్లో ఉంటూ 9, 10 తరగతులు, ఇంటర్మీడియట్ వరకు చదివారు. అనంతరం ఒక ఏడాది ఖాళీగా ఉన్నారు. గతేడాది నవంబర్లో రిగా యూనివర్సిటీలో బీఎస్సీ మెకానికల్ ఇంజనీరింగ్ సీటు ఖరారయ్యింది. ఈ ఏడాది జనవరిలో యూనివర్శిటీలో చేరారు. యూనివర్సిటీ హాస్టల్లో సీటు లేకపోవడంతో మన రాష్ట్రానికి చెందిన మిత్రులతో కలిసి ప్రత్యేకంగా నివాసం ఉంటున్నారు. రాత్రి సమయంలో బయటకు తీసుకెళ్లిన మిత్రుడు మృతుడు వివేక్ ఉంటున్న గదికి వేరొక మిత్రుడు వచ్చి బయటకు తీసుకువెళ్లినట్లు సమాచారం. వెంటనే తిరిగి వస్తాను, గదికి లోపల గడియ పెట్టవద్దు అని మిత్రులకు చెప్పి వివేక్ బయటకు వెళ్లినట్లు బంధువులు చెబుతున్నారు. తనను తీసుకువెళ్లిన మిత్రుడు దగ్గరలోని నదికి తీసుకువెళ్లి స్నానం చేయడానికి నదిలో దిగినట్లు చెబుతున్నారు. వివేక్ను తీసుకువెళ్లిన మిత్రుడు మునిగిపోతూ కేకలు వేయడంతో దగ్గరలో ఉన్న పోలీసులు అతడ్ని రక్షించారు. అయితే వివేక్ అప్పటికే నదిలో కొట్టుకుపోయినట్లు సమాచారం. నీళ్లంటే భయపడే తన మేనల్లుడు వివేక్ను అతని స్నేహితుడు వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని అస్సాంలో ఆర్మీలో సుబేదార్గా పనిచేస్తున్న వర్థనపు స్టీవెన్సన్ స్థానిక విలేకరులకు తెలిపారు. లాత్వియాలో వివేక్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మంగళవారం సాయంత్రం బంధువులకు అప్పగిస్తారని సమాచారం. అక్కడ నుంచి విమానంలో ఉక్రెయిన్ నుంచి న్యూఢిల్లీ మీదుగా విజయవాడకు విమానంలో తీసుకువచ్చి అక్కడ నుంచి పాలకొల్లు మండలం గోరింటాడకు మృతదేహాన్ని తీసుకురానున్నట్లు స్టీవెన్సన్ తెలిపారు.కువైట్లో ఉన్న తల్లిదండ్రులు వర్థనపు శ్యాంబాబు–స్వర్ణలత కన్నకొడుకుని కడసారా చూసుకునేందుకు కువైట్ నుంచి నేరుగా గోరింటాడ వస్తున్నట్లు చెప్పారు. -
‘అర్చకులు బాగుంటేనే ఆలయాలు బాగుంటాయి’
సాక్షి, పశ్చిమ గోదావరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దిగ్విజయంగా కొనసాగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం పాలకొల్లు పంచారామ క్షేత్రంలోని క్షీర రామలింగేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. ఆలయ పూజారులు, అధికారులు పూర్ణకుంభంతో మంత్రికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్చకులు బాగుంటేనే దేవాలయాలు బాగుంటాయని అభిప్రాయపడ్డారు. దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. జగన్ ఆదేశాల ప్రకారం ప్రతి దేవాలయంలో దూపదీప నైవేద్యాలు అందించాలని, ఆలయాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. అర్చకులకు ఇళ్లు, వేతనాల పైంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. మంత్రి వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ డా.సిహెచ్ సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, రాష్ట్ర కార్యదర్శులు చెల్లెం ఆనంద ప్రకాశ్, చిలువూరి కుమార దాత్త్ర్యాయ వర్మ, యడ్ల తాతాజీ ఉన్నారు. -
రిసార్టులు, పార్కుల్లో అలంకరణకు ఈత చెట్లను..
సాక్షి, పాలకొల్లు అర్బన్(పశ్చిమ గోదావరి) : ఈత చెట్లు ప్రకృతి సంపద. డ్రెయిన్ గట్లు, కాలువ గట్లు, ప్రభుత్వ స్థలాల్లో, బండిదారి పోరంబోకు స్థలాల్లో ఈత చెట్లు సహజ సిద్ధంగా పెరుగుతుంటాయి. వీటిని కొందరు చెట్ల వేళ్లతో సహా తవ్వేసి తరలించుకుపోతున్నారు. కొంతమంది సంపన్నుల గృహాల ముందు, రిసార్టులు, పార్కుల్లో అందంగా అలంకరణ కోసం వీటిని అక్రమంగా తవ్వుకుపోతున్నారు. చెట్టు వేళ్లతో తవ్వేసి పార్కుల్లో తిరిగి పాతడం వల్ల ఈతచెట్టు ఏపుగా పెరిగి కొత్త ఆకులతో అందంగా కనిపిస్తుంది. గల్ఫ్ దేశాల్లో ఇంటి ముందు ఖర్జూరం చెట్లు అందంగా కనిపిస్తుంటాయి. అదే మాదిరిగా స్వదేశంలో విదేశీ సంస్కృతికి అలవాటు పడిన కొందరు సంపన్నులు వారి గృహాల ముందు ఈత చెట్లను అందంగా అలకరించుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం అభివృద్ధి చేసే పార్కుల్లో సైతం ఈత చెట్లను ఆయా కాంట్రాక్టర్లకు విక్రయించి అక్రమార్కులు సొమ్ములు చేసుకుంటున్నారు. ఉపాధికి గండి వేసవికాలంలో ఈత చెట్ల నుంచి కల్లు తీసి గీత కార్మికులు ఉపాధి పొందుతున్నారు. అలాగే యానాదులు, ఉప్పర్లు ఈతచెట్ల కొమ్మలను సేకరించి వాటి ఈనెల ద్వారా తట్టలు, బుట్టలు అల్లుకుని ఉపాధి పొందుతున్నారు. ఈత ఈనెలతో తయారు చేసిన తట్టలు, బుట్టలు రైతాంగానికి ఎంతో ఉపయోగపడే పరికరాలు. కాలువ గట్ల వెంబడి సహజ సిద్ధంగా పెరిగి చూపరులకు కనువిందు చేసే ఈతచెట్లు అక్రమార్కుల కంటపడడంతో అక్రమంగా తవ్వుకుపోతున్నారు. పట్టించుకోని అధికారులు చెట్టు కొట్టాలంటే రెవెన్యూ అధికారి అనుమతి తీసుకోవాలి. అలాగే ఇరిగేషన్ పరిధిలో ఉన్న చెట్లకు ఇరిగేషన్ శాఖ అధికారుల అనుమతి తీసుకోవాలి. ఇది ఇలా ఉండగా గీత కార్మికుల ఉపాధికి ఉపయోగపడే ఈతచెట్టును ఎక్సైజ్ శాఖ అధికారులు పరిరక్షించాలి. అయితే అటు రెవెన్యూ, ఇరిగేషన్, ఎక్సైజ్శాఖల అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కుల పని సులువుగా సాగిపోతోందన్న విమర్శలు ఉన్నాయి. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి ఈతచెట్లను కొంతమంది ముఠాగా ఏర్పడి అక్రమంగా తరలిస్తున్నారు. దీంతో మా ఉపాధికి గండి పడుతోంది. ఈతకల్లులో పోషక విలువలున్నాయి. చాలామంది ఈతకల్లు కావాలని అడుగుతుంటారు. అయితే ఈత చెట్లు అందుబాటులో ఉండక తాటి చెట్ల నుంచే ఎక్కువగా కల్లు తీసి విక్రయిస్తుంటాం. ఈత చెట్లను వేళ్లతో సహా తొలగించి వ్యాపారం చేసుకుంటున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. –జి.నరసింహరావు, గీత కార్మికుడు, ఆగర్రు -
నారికేళం...గం‘ధర’ గోళం
జిల్లాలో కొబ్బరి రైతుల పరిస్థితి గందరగోళంగా మారింది. కొబ్బరి, దాని ఉత్పత్తుల ధరలు భారీగా పతనం కావడంతో రైతులు, వ్యాపారులు నష్టపోతున్నారు. దాదాపు రెండేళ్ల నుంచి ఇదే పరిస్థితి నెలకొనడంతో వారు తీవ్రంగా మథనపడుతున్నారు. సాక్షి, పాలకొల్లు(పశ్చిమ గోదావరి): ఈ ఏడాది వర్షాభావంతో కొబ్బరికాయ పరిమాణం (సైజు) బాగా తగ్గిపోయింది. అదే సమయంలో కొబ్బరి ఉత్పత్తి ఆశాజనకంగా ఉన్నా.. కాయలకు డిమాండ్ పడిపోయింది. దీంతో ధర కూడా భారీగా పతన మైంది. ఫలితంగా దింపు కూలీ ఖర్చులూ రావట్లేదని రైతులు లబోదిబోమంటున్నారు. ధరలు బాగా ఉన్నప్పుడు పంట ఉత్పత్తి తగ్గుతుందని, ఉత్పత్తి ఉన్నప్పుడు ఎగుమతులు ఉండడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఇదే దుస్థితి జిల్లాలో 60వేల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతుండగా 3,750 ఎకరాల్లో కొబ్బరి మొక్క తోటలు పెంపకం జరుగుతోంది. ఏటా ఇదే దుస్థితి ఎదురవుతోందని, ఉత్పత్తి బాగున్నప్పుడు ధర ఉండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ధరల పతనమైనప్పుడు రైతులను ఆదుకోవడానికి గతంలో గోదావరి జిల్లాలో నాఫెడ్, ఆయిల్ఫెడ్ సంయుక్త ఆధ్వర్యంలో కొబ్బరి కొనుగోలు కేంద్రాలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఉద్యాన వనశాఖ కొబ్బరి తోటల్లో అంతర్గత పంటలైన కోకో, అరటి, ఇతర పంటలను ప్రోత్సహించడం వలన ఆదాయ మార్గాలు బాగుంటాయి. దీనికోసం ఉద్యాన వనశాఖ అధికారులు జిల్లాలోని కొబ్బరి రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొబ్బరి ధర పతనానికి కారణాలు ఈ ఏడాది శ్రీరామనవమితో పండుగల సమయం ముగియడంతో వివిధ రాష్ట్రాల్లోని వ్యాపారులు కొబ్బరి కాయల కొనుగోలును తగ్గించారు. ఫలితంగా ఆర్డర్లు పెద్దగా రాకపోవడంతో ఎగుమతులు తగ్గాయి. దీనివల్ల ధర పతనమైందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల కొబ్బరి రైతులతోపాటు తామూ ఆర్థిక ఇబ్బందులు చవిచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎగుమతులు ఎక్కడెక్కడికి.. జిల్లాలోని పాలకొల్లు ప్రధాన కేంద్రంగా గతంలో రోజుకి 100 నుంచి 200 లారీల కొబ్బరికాయలు రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్య ప్రదేశ్, ఛత్తీస్గడ్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేవి. 1996లో వచ్చిన తుపాను తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది వద్ద తీరం దాటడంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని కొబ్బరి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లడం తెలిసిందే. అప్పట్లో తుపాను తీవ్రత కారణంగా కొబ్బరి పంటపై ఎర్రనల్లి తెగులు సోకి కొబ్బరికాయ సైజు తగ్గడంతో పాటు నాణ్యత లేదని కొన్ని రాష్ట్రాల్లో వ్యాపారులు ఆంధ్ర కొబ్బరికాయలు కొనుగోలు చేయడం మానేశారు. అప్పటి నుంచీ ధర తగ్గుదల సమస్య వేధిస్తోంది. దీనికితోడు తమిళనాడు, కేరళ కొబ్బరికాయలు నాణ్యంగా ఉండడంతో వ్యా పారులు వాటిని దిగుమతి చేసుకోవడం మన కొబ్బరి ధర పతనానికి కారణమవుతోంది. రోజుకు 50 నుంచి 80 లారీలు ప్రస్తుతం జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు 50 నుంచి 80లారీలు మాత్రమే ఎగుమతులు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజ స్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ వ్యాపారులు తమిళనాడు, కేరళ నుంచి వచ్చే కొబ్బరికాయలను దిగుమతి చేసుకోవడంతో ఆంధ్రా ఎగుమతులు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. దింపు ఖర్చులూ రాని పరిస్థితి ప్రస్తుతం ఏడాది పొడవునా కొబ్బరికాయల దింపు తీసి అమ్మకాలు చేసినా.. ఖర్చులు రాని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరితోటల్లో దింపు తీయాలంటే ఒక కాయకి రూపాయి, మోతకూలీ 50పైసలు ఖర్చు అవుతుందని, జామ కాయకంటే కొబ్బరికాయ ధర దారుణంగా పడిపోయిందని రైతులు వాపోతున్నారు. వ్యాపారుల బాధ ఇదీ.. రైతుల వద్ద కొబ్బరికాయలు కొనుగోలు చేసి ఒలుపు కూలీ, లారీ కిరాయి ఒక్కొక్క కొబ్బరికాయకి రూ.2.50 ఖర్చు అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం ఒక కొబ్బరికాయ ధర రూ.10 నుంచి రూ.14వరకు పలికిందని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, రూ.5 పలుకుతోందని, ఫలితంగా నష్టాల ఊబిలోకి కూరుకుపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రానికి గురుపౌర్ణమి, రాఖీ సందర్భంగా ఎగుమతులు జరగడంతో కొంతమేర ధర పెరిగినా నష్టం తప్పడం లేదని పేర్కొం టున్నారు. పెరిగిన ధర ఎంతవరకు నిలబడుతుందో తెలియని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. దింపు కూలి రావడం లేదు కొబ్బరికాయల ధర చాలా దారుణంగా పడిపోయింది. దింపు, సాగుబడి ఖర్చులు రాక నష్టపోతున్నాం. ఎగుమతులు లేవు. అమ్మితే అడవి, కొంటే కొరివిలా కొబ్బరి రైతుల పరిస్థితి తయారైంది. రెండేళ్ల క్రితం కొబ్బరికాయ రూ.10 నుంచి రూ. 14వరకు ధర పలికింది. ప్రస్తుతం రూ.కాయ ఒక్కింటికి రూ.5 పలుకుతోంది. ఈ ధర ఎంతకాలం ఉంటుందో తెలియదు. – కర్రా సత్తిబాబు, కొబ్బరి రైతు, రాజోలు ఎగుమతులు లేకపోవడం వల్లే కొబ్బరికాయ ఎగుమతులు సక్రమంగా జరగడం లేదు. దీనివల్ల ధర పడిపోయింది. ఈ ఏడాది వర్షాలూ సక్రమంగా లేకపోవడం వల్ల కాయ సైజు చిన్నదైంది. కొబ్బరి తోటలు పెంచలేని పరిస్థితి ఏర్పడింది. దింపు ఖర్చులు కూడా రాని పరిస్థితి ఎదురవుతోంది. – ఎర్రగొప్పుల హరేరామ్, కొబ్బరిరైతు, ఆచంట నాణ్యత లేక ఎగుమతులు తగ్గాయి పాలకొల్లు కేంద్రంగా గతంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గడ్ రాష్ట్రాలకు ఎగుమతులు ఎక్కువగా జరిగేవి. అయితే ప్రస్తుతం కేరళ, తమిళనాడు కొబ్బరికి నాణ్యత ఉండడంతో ఆంధ్రా కొబ్బరిని కొన్ని రాష్ట్రాల వ్యాపారులు దిగుమతి చేసుకోవడం లేదు. దీనివలన ఇక్కడ ఎగుమతులు జరగక ధర పతనమైంది. – ఎంవీవీ నరసింహమూర్తి, కొబ్బరి వ్యాపారి, పాలకొల్లు -
దమ్ము రేపుతున్న పవర్ టిల్లర్
పాలకొల్లు సెంట్రల్: జిల్లాలో సార్వా పంట దమ్ము పనులు జోరుగా సాగుతున్నాయి. అడపాదడపా వర్షాలు, కాల్వల నుంచి వదులుతున్న నీటితో డెల్టాలో పనులు జోరందుకున్నాయి. రైతులు దమ్ము పనులు వేగవంతం చేశారు. గతంలో నాగళ్లకు ఎడ్లను కట్టి దమ్ము పనులు చేసేవారు. ఆ తరువాత ట్రాక్టర్లు రావడంతో పని సులవైంది. అయితే ఇప్పుడు రైతులు పవర్ టిల్లర్తో దమ్ము పనులు చేస్తున్నాడు. వరి సాగు అనగానే దమ్ము పనులు ఎంతో కీలకం. గతంలో ఇంత ఆయకట్టుకు ఒక ట్రాక్టర్ను మాట్లాడుకుని దమ్ము పనులు చేసేవారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి ట్రాక్టర్లు ప్రకాశం, గుంటూరు జిల్లాలకు వెళ్లి సుమారు నెల రోజులు అక్కడే ఉండి పనులు చేసుకునేవారు. నేడు వ్యవసాయ శాఖ సబ్సిడీపై ఇచ్చే పవర్ టిల్లర్లతో రైతులు సొంతంగానే దమ్ము పనులు చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో పవర్ టిల్లర్ ప్రయోజనాలపై రైతులకు అవగాహన పెరగడంతో వాటి వైపు మొగ్గుచూపుతున్నారు. ఎకరాకు ఐదారు లీటర్ల ఆయిల్ ఖర్చు పవర్ టిల్లర్తో దమ్ము చేస్తే ఎకరాకు సుమారు ఐదు లేక ఆరు లీటర్లు ఆయిల్ ఖర్చవుతుంది. ఇలా రోజుకు దాదాపుగా ఐదారు ఎకరాల్లో దమ్ము చేయవచ్చని రైతులు చెబుతున్నారు. ఈ యంత్రంతో దమ్ము చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు అంటున్నారు. ట్రాక్టర్లతో చేస్తే సుమారు రెండు అడుగులు లోతు వరకూ దిగిపోతుంది. దీనివల్ల పంట దిగుబడుల్లో ఇబ్భందులు ఎదురవుతున్నాయి. అదీ కాక ట్రాక్టర్లతో దమ్ము చేసే సమయంలో ఒక్కోసారి ట్రాక్టర్లు పైకి లేచిపోవడం తిరగబడడంతో ట్రాక్టర్ డ్రైవర్లుకు ప్రాణనష్టం జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పవర్టిల్లర్తో అలాంటి ప్రమాదాలకు చెక్పెట్టవచ్చు. మరో మనిషి అవసరం లేకుండా దమ్ము చేసుకునే వెసులుబాటు ఉంది. పొలం పనులకు కావలసిన సామగ్రిని దీనిపై తీసుకెళ్లిపోవచ్చు. ఈ పవర్టిల్లర్పై కూర్చుని చేయడానికి సీటు కూడా ఏర్పాటుచేసుకునే అవకాశం ఉంటుంది. పవర్టిల్లర్తో ప్రయోజనాలు పవర్టిల్లర్తో దమ్ము 15 అంగుళాల లోతు వరకే జరగడంతో వరినాట్లు పైపైన వేయడానికి అనుకూలంగా ఉంటుంది. వరిపంట వేర్ల వ్యవస్థ ఆరు అంగుళాలు ఉంటుంది. పవర్టిల్లర్ దమ్ముతో వరి మొక్క వేగంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎరువులు కూడా బాగా అందుతాయి. పవర్టిల్లర్ దమ్ము చేయడానికే కాకుండా బావులు, కాలువల నుండి పొలాలకు నీరు తోడుకోవడానికి ఉపయోగపడుతుంది. దీనికి పంకాలు ఏర్పాటుచేసి ధాన్యం ఎగరబోతకు ఉపయోగించుకోవచ్చు. 1.5 టన్నుల వరకూ బరువును తీసుకువెళ్లే వెసులుబాటు కలుగుతుంది. పవర్టిల్లర్కు 13 హెచ్పీ సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. -
స్వగ్రామం చేరిన మృతదేహాలు
సాక్షి, పాలకొల్లు (పశ్చిమ గోదావరి): గుంటూరు సమీపంలోని చిలకలూరిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తిరుమల నాగ వెంకటేశ్వరరావు, అతని భార్య సూర్య భవాని, కుమార్తె సోనాక్షి, కుమారుడు గీతేశ్వర్, బావమరిది కటికిరెడ్డి అనోద్కుమార్ల మృతదేహాలు అంబులెన్స్లో సోమవారం రాత్రి 11 గంటలకు స్వగ్రామం చేరుకున్నాయి. పాలకొల్లు మండలం సబ్బేవారిపేటలో ఇంటి వద్ద ఉదయం నుంచి మృతదేహాల కోసం ఎదురు చూసిన బంధువులు, మిత్రులు, స్థానికులకు మృతుల ముఖాలు చూపించకుండానే అంబులెన్సులు యడ్లబజారులోని హిందూ శ్మశాన వాటికకు తరలించారు. అనోద్కుమార్ తండ్రి శ్రీనివాసరావు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. డాడీ.. అమ్మా భవాని.. ఎక్కడికి వెళ్లినా చెప్పి వెళ్లేవాడివి.. డాడీ ఇప్పుడే వస్తాననేవాడివి అంటూ అనోద్కుమార్ తండ్రి శ్రీనివాసరావు కుమారుడిని తలచుకుని కన్నీళ్లు పెట్టారు. అమ్మా భవాని... అమ్మా భవానీ అంటూ కుమార్తెను, మనవరాళ్లని అమ్మా సోనా అంటూ తలచుకుని ఏడుస్తుంటే చూసేవారి హృదయాలు ద్రవించాయి. విధి చిన్నచూపు.. స్వయంకృషితో ఎదిగి నలుగురికి ఆదర్శంగా నిలిచారు.. మూడు పదుల వయసు దాటక ముందే మృత్యుఒడికి చేరారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలో పాలకొల్లు మండలం సబ్బేవారిపేటకు చెందిన తిరుమల నాగ వెంకటేశ్వరరావు (వెంకట్) (30), భార్య సూర్యభవాని (28), కుమార్తె సోనాక్షి (7), కుమారుడు గీతేశ్వర్ (5)తో పాటు సూర్యభవాని తమ్ముడు కటికిరెడ్డి అనోద్కుమార్ మృతిచెందారన్న వార్తతో స్థానిక సబ్బేవారిపేట ప్రజలు ఉలిక్కిపడ్డారు. బంధు,మిత్రుల రోదనలతో ఆ ప్రాంతం నిండిపోయింది. మిత్రులంతా వెంకట్ అని ముద్దుగా పిలుచుకునే వెంకటేశ్వరరావు, మణికంఠ ఇరువురు అన్నదమ్ములు. తండ్రి పట్టాభిరామయ్య పండ్ల వ్యాపారం చేసేవారు. తల్లి జానమ్మ, తల్లిదండ్రులు ఇద్దరూ సుమారు 15 ఏళ్ల క్రితం కాలం చేశారు. వెంకటేశ్వరరావు, మణికంఠలు అప్పటికి మైనర్లు. ఏ పనీ చేతకాని వయసు వారిది. తండ్రి నిర్వహించిన పండ్ల వ్యాపారాన్ని మేనమామల సూచనలు, సలహాలతో అన్నదమ్ములిద్దరు కొంతకాలం చేశారు. ఫొటోగ్రఫీ నేర్చుకుని పదేళ్ల క్రితం పట్టణంలోని మునిసిపల్ ఆఫీస్కు ఎదురుగా లక్ష్మీ శ్రీపట్టాభి పేరుతో ఫొటోగ్రఫీ, డిజిటల్ వర్క్స్ను ప్రారంభించారు. తండ్రి హయాంలో నిర్మించిన ఇంటిని చక్కగా రీమోడలింగ్ చేసుకున్నారు. స్డుడియో వర్కు మీద దూర ప్రాంతాలకు వెళ్లడానికి మారుతీ వ్యాన్ కూడా కొనుగోలు చేసుకున్నారు. వారం రోజుల క్రితమే కృష్ణాజీ మల్టీఫ్లెక్స్ సమీపంలో శ్రీ గాయత్రి రెస్టారెంట్ను లాంచనంగా ప్రారంభించారు. వీరి ఎదుగుదలను విధి చిన్నచూపు చూసింది. రోడ్డు ప్రమాదం రూపంలో వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను కబళించింది. ప్రమాద సమయంలో తమ్ముడు మణికంఠ వాహనం నడుపుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనంలోని బెలూన్లు తెరుచుకోవడంతో ఆయన మృత్యువు నుంచి తప్పించుకున్నారు. ఎప్పుడూ వారు వారి మారుతీవ్యాన్లో వెళ్లేవారు. అయితే దైవదర్శనం కోసం ఎక్కువమంది ప్రయాణించాల్సి ఉందని వెంకటేశ్వరరావు మిత్రుడికి చెందిన వాహనంలో వెళ్లి మృత్యువాత పడ్డారని స్థానికులు చెబుతున్నారు. దేవుడు అన్యాయం చేశాడు నేను పండ్ల వ్యాపారం చేస్తా. నాకు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. వెంకట్ నా మేనమామ కొడుకు. చిన్నప్పట్నుంచి కష్టజీవి. స్వయంకృషితో పైకి వచ్చాడు. ఇలా కుటుంబం అంతా మరణిస్తారని ఊహించలేదు. సొంతంగా ఫొటోగ్రఫీ వర్క్ చేసుకుంటూ బీజీ అయ్యాడు. ఈ మధ్యనే హోటల్ పెట్టాలని లాంచనంగా జూన్ 26న ముహూర్తం చేశాడు. – పవన్, మృతుడు వెంకట్ బంధువు చాలా మంచి కుటుంబం చాలా మంచి కుటుంబం అందరితోనూ కలిసిమెలసి ఉండేవారు. ఫొటో స్టూడియో నడుపుకుంటూ జీవిస్తున్నారు. ఎవరితోనూ విభేదాలు లేవు. వారి పిల్లల ఆటపాటలు, మాటలే గుర్తుకు వస్తున్నాయి. వీరంతా స్వామి దర్శనానికి వెళ్లి ప్రమాదానికి గురవ్వడం నమ్మలేకపోతున్నాం. రెండు రోజుల ముందు మా కళ్లెదురుగానే ఉన్న ఆ కుటుంబం ఇలా ప్రమాదానికి గురవ్వడం చాలా బాధగా ఉంది. ఒకే కుటుంబంలో అందరూ మృతి చెందడం కాలనీ వాసులను కలచి వేసింది. - రాజన్ పండిట్, స్థానికుడు, సబ్బేవారిపేట తీరని వేదన మృతుడు మా మేనమామగారి అబ్బాయి. సుమారు 12 ఏళ్ల క్రితమే తల్లిదండ్రులు మృతి చెందారు. అప్పటి నుంచి అన్నదమ్ములు ఇద్దరూ మేనమామ సంరక్షణలోనే ఉన్నారు. ఆయన కూతురినే పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు కుటుంబం అంతా మరణించడం బాధాకరం. ఈ ఘటన మాకు తీరని వేదనను మిగిల్చింది. – కుంపట్ల నాగ శ్రీనివాసు, మృతుని తండ్రి మేనల్లుడు -
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, గుంటూరు : గుంటూరు జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్ర్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొన్న దుర్ఘటనలో అయిదుగురు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, మహిళ ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వీరు తిరుమల దైవ దర్శనం చేసుకుని తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు.. రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు కారులో మొత్తం 11 మంది ఉన్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
క్షణాల్లో కారు దగ్ధం...తృటిలో బయటపడ్డారు..
సాక్షి, నిడమానూరు : కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమానూరు వద్ద హైవేపై బుధవారం ఉదయం ఓ కారు దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్నవారు ఈ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. హైదరాబాద్ నుండి పాలకొల్లు వెళుతున్న ఐ-టెన్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారును డ్రైవ్ చేస్తున్న మల్లాది నరసింహ శాస్త్రి మంటలను గమనించి వెంటనే వాహనాన్ని పక్కకు తీశారు. అదృష్టవశాత్తూ కారులో ఉన్నవారంతా దిగగానే మంటలు ఒక్కసారిగా చెలరేగి, క్షణాల్లో కారు దగ్ధమైంది. హైదరాబాద్లోని ఓ ఫార్మా కంపెనీలో మేనేజర్గా పని చేస్తున్న నరసింహ శాస్త్రి పాలకొల్లులోని తమ బంధువులు ఇంటికి కుటుంబంతో కలిసి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకోవడంపై అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
డ్వాక్రా మహిళల రుణాలు నాలుగు దశల్లో మాఫీ చేస్తా
-
వైఎస్సార్సీపీలో చేరిన రచయిత చిన్ని కృష్ణ
సాక్షి, పాలకొల్లు: ఎన్నికల తేదీ దగ్గర పడుతున్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఆగడం లేదు. ఓ వైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటే.. పార్టీలో చేరడానికి పలువురు నేతలు క్యూ కడుతున్నారు. రాజకీయ నాయకులే కాకుండా సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖలు కూడా వైఎస్సార్సీపీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా పాలకొల్లులో ఎన్నికల బహిరంగ సభలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పలువురు నాయకులు పార్టీలో చేరారు. ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణతోపాటు, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కేటీ రామారావు, అడబాల వెంకట రమణ, బీసీ ఉద్యమ నాయకుడు చింతపల్లి గురు ప్రసాద్లకు వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కేటీ రామారావు ఈ సందర్భంగా చిన్ని కృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. తన జీవితం రజినీకాంత్తో ప్రారంభమైందని.. రాజకీయ జీవితం వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఆరంభం అయిందని తెలిపారు. వైఎస్ జగన్ త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రతి పుట్టిన రోజున కలిసేవాడినని గుర్తుచేశారు. వైఎస్సార్ మహానేత అని అన్నారు. టీడీపీ తుడిచి పెట్టుకుపోవాలంటే వైఎస్ జగన్ను బలపరిచి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నవరత్నాలు ఏపీలో నవధాన్యాలుగా విరాజిల్లుతాయని నమ్మి పార్టీలో చేరినట్టు వెల్లడించారు. వైఎస్ జగన్ ప్రజలకు ఏం చేస్తారో సూటిగా చెబుతున్నారని.. ఆయన ప్రసంగం విని చాలా మంది ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందన్నారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని అన్నారు. -
జనసంద్రంగా పాలకొల్లు వైఎస్ జగన్ ప్రచార సభ
-
ఆ రూ. 3లక్షలు మాఫీ చేస్తాం: వైఎస్ జగన్
సాక్షి, పాలకొల్లు: లంచాలు తీసుకునేది చంద్రబాబు అయితే వాటిని పేదవారు చెల్లించాలా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంకులపాడులో చంద్రబాబు కడుతున్న ఫ్లాటు తీసుకున్న వారిపై 3 లక్షల రూపాయల అదనపు భారాన్ని మోపడంపై ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ఆ మొత్తాన్ని తామే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని పాలకొల్లులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా తన కోసం వచ్చిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మీరు చెప్పిన కష్టాలన్నీ గుర్తున్నాయి.. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘నా సుదీర్ఘ పాదయాత్ర పాలకొల్లు గుండా సాగినప్పుడు మీరు చెప్పిన కష్టాలు విన్నాను. అవి ఈ రోజుకు కూడా నాకు గుర్తున్నాయి. పక్కనే గోదావరి ఉన్న రెండో పంటకు నీరందని పరిస్థితి. ఎంతో కొంత పంట పండిస్తే గిట్టుబాటు ధర ఉండదు. క్వింటాలుకు 1200 రూపాయలు కూడా రావడం లేదని మీరు చెప్పిన సమస్యలు నాకు గుర్తున్నాయి. పొగాకు ధర రోజురోజుకు పడిపోతుందన్న మీ ఆవేదన గుర్తుంది. పామయిల్ పంటకు నేను ధర్నా చేస్తే కానీ గిట్టుబాటు ధర రాని పరిస్థితి. అక్రమాలను, అవినీతిని అడ్డుకున్న ప్రభుత్వ ఉద్యోగులను అధికార పార్టీ నేతలు జట్టు పట్టుకుని లాక్కేళ్లిన పరిస్థితి ఇక్కడ ఉందని మీరు చెప్పారు. లేసు, అల్లికలు చేస్తున్నా అక్కాచెల్లమ్మలు ప్రభుత్వం నుంచి ప్రోత్సహం రాక పడుతున్న బాధలు గుర్తున్నాయి. ఆ మూడు లక్షలు చెల్లిస్తాం పెంకులపాడులో చంద్రబాబు నాయుడు కడుతున్న అవినీతి ఫ్లాట్ల గురించి కూడా మీరు నాతో చెప్పారు. వాస్తవానికి ఈ స్థలాన్ని పేదవారికి ఇచ్చేందుకు నాన్నగారు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కొనుగోలు చేశారు. 3లక్షల రూపాయల కూడా దాటని ఫ్లాట్లను చంద్రబాబు పేదలకు 6లక్షలకు అమ్ముతున్నారు. అందులో లక్షన్నర రాష్ట్ర ప్రభుత్వం, లక్షన్నర కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగిలిన 3లక్షల రూపాయలను అప్పుగా రాసుకుంటున్నారు. ఆ మొత్తాన్ని పేదవారు 20 ఏళ్ల పాటు నెలకు మూడు వేల రూపాయల చొప్పున కట్టాలని అంటున్నారు. లంచాలు తీసుకునేది చంద్రబాబు అయితే.. ఆ మొత్తాన్ని పేదవారు చెల్లించాలా?. చంద్రబాబు ఇచ్చిన ఫ్లాటులను తీసుకున్న వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ 3లక్షల రూపాయలను మాఫీ చేస్తాం. ఊరి మధ్యలో డంపింగ్ యార్డ్తో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నా పట్టించుకునే నాథుడు ఉండరు. యువతకు నేనున్నా.. 50 పడకల ఆస్పత్రిని 100 పడకలుగా మారుస్తామని చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారు. ఇప్పటికీ చంద్రబాబు ఆ హామీని నేరవేర్చరా?. శ్మశానాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పి వాటిలో కూడా కమీషన్లు దండుకునే అభివృద్ధి ఇక్కడ జరుగుతుంది. రుణామాఫీ జరగక డ్వాక్రా మహిళలు పడే ఇబ్బందులు చూశా. ఉద్యోగాలు రాక కోచింగ్ సెంటర్లలో విద్యార్థులు పడుతున్న బాధలు చూశా. పక్క రాష్ట్రాలకు వలసల పోతున్న దుస్థితి. లక్షా 42 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు కమల్నాథన్ కమిటీ చెప్పినా.. కానీ ఉద్యోగాల భర్తీ జరగదు. ప్రత్యేక హోదా వస్తే ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీలు కట్టాల్సిన అవసరం లేదు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, తమ బతుకులు బాగుపడతాయని భావించిన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం వెన్నుపోటు పోడిచింది. యువకులందరికీ నేనున్నానని భరోసా ఇస్తున్నాను. చంద్రబాబు పార్టనర్ దీనిని అంగీకరిస్తారా? పదేళ్లపాటు నన్ను రాజకీయాల్లో చూశారు. ఎవరికీ ఏ కష్టం వచ్చినా వైఎస్ జగన్ అక్కడ ఉన్నాడు. కానీ జగన్కు కలిగిన ప్రతి కష్టం చంద్రబాబు నాయుడుకు, ఎల్లో మీడియాకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. చివరకు మా చిన్నాన్న వివేకానందరెడ్డి హత్యను కూడా పండగ చేసుకున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడుకు పార్టనర్.. ఓ యాక్టర్ ఉన్నారు. ఆయన కూడా చంద్రబాబు నాయుడు కుట్రలో భాగమై విలువలు మరచిపోయి మాట్లాడుతున్నారు. మా చిన్నాన్నను హత్య విషయంలో ఆ యాక్టర్ కూడా చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరి కుటుంబం బాగుండాలని నేను కోరుకుంటాను. చంద్రబాబు పార్టనర్ను నేను ఓ విషయం అడుగుతున్నా.. మీ కుటుంబంలో ఎవరినైనా బాబు గారి మనుషులు చంపించి.. వాళ్ల పోలీసులు చేత విచారణ చేపిస్తూ.. వాళ్ల మీడియాతో వక్రీకరించి.. అది మీ బంధువులే చేయించారంటే మీరు అంగీకరిస్తారా?. చంద్రబాబు చేసిన అన్యాయాన్ని గమనించాలి. చంద్రబాబు అవినీతిలో మీకు భాగం లేదా? 2014లో చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయమని ఈ పార్టనర్ చెప్పారు. నాలుగు ఏళ్లపాటు ఆయన చంద్రబాబుతో కలిసే ఉన్నారు. ఈ కాలంలో చంద్రబాబు నాయుడు పాల్పడ్డ అవినీతి, అక్రమాలలో ఆయనకు భాగం లేదా?. నాలుగేళ్లపాటు కలిసి కాపురం చేసి.. ఎన్నికలకు ఏడాదికి ముందే విడిపోయినట్టు నాటకం ఆడుతారు. పార్టనర్ గారు నామినేషన్ వేయడానికి వెళ్తే అక్కడ కనిపించేవి టీడీపీ జెండాలు ఐదేళ్లు పాలన చేసిన చంద్రబాబు మోసాలపై, అన్యాయాలపై, అక్రమాలపై పార్టనర్ మాట్లాడరు. ఎప్పుడూ మాట్లాడిన జగన్.. జగన్.. అంటూ ఉంటారు. ఈ కుట్రలను గమనించమని ప్రజలను కోరుతున్నా. రానున్న రోజుల్లో ఈ కుట్రలు ఇంకా పెరుగుతాయి. ప్రతి ఊరికి మూటలు, మూటలు డబ్బులు తీసుకోస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి. ఇరవై రోజులు ఓపిక పట్టమని చెప్పండి చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండని గ్రామాల్లోని అక్కాచెల్లమ్మలకు, అవ్వ తాతలకు చెప్పండి. ఇరవై రోజులు ఓపిక పట్టమని చెప్పండి. జగనన్న చెప్పకపోయి ఉంటే పించన్ రెండు వేలకు పెరిగేదా అని గుర్తుచేయండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఏ చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి. గతంలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు వచ్చేవి. ఇప్పుడు అది కనిపించని పరిస్థితి. ఎన్నికల తేదీ వరకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా మీ చేతికే అందిస్తాం. అంతేకాకుండా మళ్లీ బ్యాంకుల వద్ద నుంచి సున్నా వడ్డీకే రుణాలు వస్తాయని చెప్పండి. మహిళలను లక్షాధికారులను చేయాలనే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూత కింద 75 వేల రూపాయలు నాలు దఫాలుగా చెల్లిస్తాం. చంద్రబాబు చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితి. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. నవరత్నాల గురించి ప్రతి అవ్వకు, తాతకు చెప్పిండి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బాబ్జీని, ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు ఆశీర్వదించమ’ని కోరారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జనసంద్రంగా మారిన పాలకొల్లు
సాక్షి, పాలకొల్లు : ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాకతో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గురువారంద జనసంద్రంగా మారింది. రాజన్న తనయుడి చూసేందుకు భారీగా జనాలు తరలి వచ్చారు. పాలకొల్లు చేరుకున్న వైఎస్ జగన్కు నరసాపురం ఎంపీ అభ్యర్థి రఘు రామ కృష్ణంరాజు, పాలకొల్లు వైసీపీ అభ్యర్థి డాక్టర్ బాబ్జీ, స్థానిక నేతలు శేషు బాబు, నరసాపురం ఆచంట అభ్యర్థులు ప్రసాద రాజు, రంగనాథ రాజు తదితరులు స్వాగతం పలికారు. మరోవైపు వైఎస్ జగన్ ఏపీలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. రోజుకు నాలుగు ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. ఇవాళ కూడా పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైఎస్ పర్యటన కొనసాగనుంది. ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం పశ్చిమగోదావరి జిల్లా నుంచి చింతలపూడి చేరుకుని ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం గుంటూరు జిల్లా వినుకొండలో, కృష్ణా జిల్లా నందిగామలోనూ వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ సభల ద్వారా... నవరత్నాల పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే... ఆయా నియోజకవర్గాల అభివృద్ధి కోసం చేపట్టే చర్యలను తెలియజేస్తున్నారు. -
ఇంటి స్థలం కోసం పట్టు
సాక్షి, పాలకొల్లు అర్బన్: నిరుపేదలకు ఇంటి స్థలాలిస్తామన్నారు. దీని కోసం గ్రామంలో భూమి సేకరించారు. రెండు సెంట్లు వంతున పట్టాలిచ్చారు. అయితే భూమి కేటాయించే సమయంలో అనర్హులను కూడా లబ్ధిదారుల జాబితాలో చేర్చి అందరికీ సెంటు భూమి వంతున కేటాయించారు. దీంతో లబ్ధిదారులు తమకు సెంటు భూమి పట్టా వద్దంటూ ఆదివారం ఆందోళన చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. పాలకొల్లు మండలం సగం చెరువులో దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి నిరుపేదలకు ఇంటిస్థలాలివ్వాలనే లక్ష్యంతో ఆర్ఎస్ నెం.121/4డీ, 4ఎఫ్, 5బీ సర్వే నంబర్లలో 0.67 ఎకరాల భూమిసేకరించారు. అప్పట్లో 18మంది లబ్ధిదారులను గుర్తించి ఒక్కొక్కరికి 2 సెంట్లు చొప్పున పట్టాలిచ్చారు. 2007లో లబ్ధిదారులకు ఇంటి స్థలం పట్టాలిచ్చినా స్థలం కేటాయించ లేదు. అప్పటి నుంచి లబ్ధిదారులు తమకు ఇంటి స్థలాలు కేటాయించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకపోయింది. సగంచెరువులో సేకరించిన 67 సెంట్ల భూమి గతేడాది ఆగస్టులో అనర్హులను కొంత మందిని చేర్చి 42 మందికి ఒక సెంటు చొప్పున స్థలం కేటాయిస్తూ పట్టాలిచ్చారు. సెంటు స్థలం ఎటూ సరిపోదని, సెంటున్నర కేటాయించాలని లబ్ధిదారులు ఇటీవల సగంచెరువులో వైఎస్సార్ సీపీ కన్వీనర్ గుణ్ణం నాగబాబుకి లబ్ధిదారులంతా ఫిర్యాదు చేశారు. లబ్ధిదారుల ఫిర్యాదు మేరకు కన్వీనర్ గుణ్ణం నాగబాబు తహసీల్దార్కి ఫోన్లో మాట్లాడి దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భూమి సేకరించామని, అర్హులందరికీ న్యాయం చేయాలని కోరడంతో అప్పటి తహసీల్దార్ దాసి రాజు వీఆర్వోతో గ్రామంలో సర్వే చేసి గ్రామంలో 14 మంది అనర్హులను గుర్తించారు. ఈ 14 మంది పట్టాలు రద్దు చేసి వారికి కేటాయించిన స్థలాన్ని పాత లబ్ధిదారులకు అర సెంటు చొప్పున పెంచి సెంటున్నర పట్టా కేటాయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. స్థలాల వద్ద ఆందోళన ఇందిరమ్మ పట్టాలు ఇచ్చిన స్థలాల్లో ఆదివారం లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. స్థలాల్లో ఆందో ళన శిబిరం ఏర్పాటు చేశారు. 14 మంది అనర్హుల్లో ఎవరైనా వచ్చి ఇళ్లు కట్టే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు. అలాగే అనర్హుల జాబితా పంచాయతీవద్ద ప్రదర్శించి నిజౖ మెన లబ్ధిదారులకు న్యాయంచేయాలని కోరుతున్నారు. -
ముద్రగడను కలిసిన మోహన్బాబు
-
ఆయన్ని పిలవకపోవడం సరికాదు: మోహన్బాబు
సాక్షి, పాలకొల్లు: దర్శకరత్న దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణకు కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంను ఆహ్వానించకపోవడాన్ని సినీ నటుడు మోహన్బాబు తప్పుబట్టారు. ఆయనను పిలవకపోవడం సరికాదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం ముద్రగడను మోహన్బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముద్రగడ తనకు మంచి మిత్రుడని, ఆయనతో ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదని తెలిపారు. తాను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదని, ముద్రగడ కూడా ఏ పార్టీలోనూ లేరని చెప్పారు. ‘అనుకున్నది సాధించాలన్న పట్టుదల గల వ్యక్తి ముద్రగడ. తనను నమ్ముకున్నవారిని ద్రోహం చేయకుండా అందరికీ మంచి చేయాలనే వ్యక్తిత్వం కలిగిన ముద్రగడ ఈ ప్రాంతంలో ఉండటం గర్వకారణమ’ని మోహన్బాబు అన్నారు. శనివారం పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో దాసరి కాంస్య విగ్రహావిష్కరణ సభ జరిగింది. ఇందులో మోహన్బాబుతో పాటు మురళీమోహన్, శ్రీకాంత్, శివాజీరాజా, కవిత, హేమ, ప్రభ, సి. కళ్యాణ్, రేలంగి నరసింహారావు, ధవళ సత్యం, రాజా వన్నెంరెడ్డి, రవిరాజా పినిశెట్టి, చోటా కె నాయుడు, సురేశ్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. దాసరి బయోపిక్ తీస్తే సహకరిస్తా దర్శకరత్న, తన గురువు దాసరి నారాయణరావు బయోపిక్ను ఎవరైనా తెరకెక్కిస్తే పూర్తిగా సహకరిస్తానని మోహన్బాబు అంతకుముందు చెప్పారు. దాసరి జీవితచరిత్రను సినిమా తీసేందుకు ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నం చేయాలని సూచించారు. ఎవరైనా ముందుకు వస్తే తాను పూర్తిగా అండగా ఉంటానని పునరుద్ఘాటించారు. సినీ జగత్తులో దాసరి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, తనలాంది వందల మంది కళాకారులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారని గుర్తు చేశారు. దర్శకుడికి హీరో ఇమేజ్ తీసుకొచ్చిన ఘనత దాసరికే చెందుతుందన్నారు. -
దాసరి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోహన్బాబు
-
‘కొమ్ములు తిరిగిన నటుడైనా సరే.. ఆయన దగ్గరకు రావాల్సిందే’
సాక్షి, పశ్చిమగోదావరి : తన జీవితంలో దీపాన్ని వెలిగించి వెలుగులు నింపింది దర్శకరత్న దాసరి నారాయణ రావేనని సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. పాలకొల్లులో ఏర్పాటు చేసిన దాసరి కాంస్య విగ్రహాన్ని ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ మా నాన్న ఒక బడిపంతులు. విలన్గా ఉన్న నన్ను కమెడియన్గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా.. హీరోగా తయారు చేసింది మా గురువు గారే. అక్కినేని నాగేశ్వరరావు పక్కన నటించే గొప్ప అవకాశాన్ని కల్పించారు. నేను నిర్మించిన శ్రీ విద్యానికేతన్లో దాసరి పేరుతో ఆడిటోరియం, లైబ్రరీని నిర్మించాను’ అని మోహన్బాబు దాసరిపై అభిమానాన్ని చాటుకున్నారు. కొమ్ములు తిరిగిన నటుడైనా సరే దాసరిని వేషం ఇమ్మని అడిగారే తప్ప ఆయన ఏనాడు ఏ నటుడిని ఫలానా వేషం వేయాలని అడగలేదని గుర్తు చేసుకున్నారు. దాసరి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అంటూ కొనియాడారు. కాగా దాసరి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపీలు మురళీమోహన్, గోకరాజు గంగరాజు, మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు సహా సినీ ప్రముఖులు రాజా వన్నెంరెడ్డి, కోటి, రవిరాజా పినిశెట్టి, ఎన్.శంకర్, సురేష్ కొండేటి, అంబికా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సొంతూర్లో బన్నీ సంక్రాంతి సందడి
-
సొంతూర్లో బన్నీ సంక్రాంతి సందడి
-
సొంతూర్లో బన్నీ సంక్రాంతి సందడి
పండగ వచ్చిందంటే చాలా మంది సోంతూర్లో వాలిపోతుంటారు. అక్కడే వేడుకలను జరుపుకోవడానికి ఇష్టపడుతుంటారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా పండగలను కుటుంబంతో కలిసి పల్లెటూర్లలో జరుపకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. దసరా వేడుకలను తన అత్తారింట్లో జరుపుకున్న బన్నీ.. సంక్రాంతిని మాత్రం తన సొంతూర్లో జరుపుకునేందుకు ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆయన ఫ్యామిలీతో కలిసి సోమవారం రాజమండ్రికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారీగా తరలివచ్చిన అభిమానులు రాజమండ్రి నుంచి పాలకొల్లు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆదివారం రోజున పాలకొల్లు సమీపంలోని కాజా గ్రామంలో తన బంధువులు కొప్పినీడు కుటుంబం వారి అతిథి మర్యాదలను బన్ని స్వీకరించారు. ఈ విషయాన్ని ఆయన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కాగా, మంగళవారం రోజున బన్ని పలు దేవాలయాలను దర్శించుకోనున్నారు. అంతేకాకుండా పాలకొల్లులోని అల్లు వెంకటేశ్వరావు మెమోరియల్ ప్రాథమిక పాఠశాలను సందర్శించనున్నారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫ్లాప్ కావటంతో బన్నీ తన తరువాత చిత్రానికి చాలా గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందు ఇలా ఫ్యామిలీతో పండగలు, ముఖ్యమైన వేడుకలను మిస్ కాకుండా చేసుకుని, ఆ తర్వాత సినిమాతో బిజీ అయిపోతారు బన్నీ. -
పాలకొల్లులో పండగ
‘మావయ్యది మొగల్తూరు.. మా నాన్నది పాలకొల్లు...’ అంటూ ‘గంగోత్రి’ సినిమాలో సందడి చేశారు అల్లు అర్జున్. ఆయనది పాలకొల్లు అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ స్టైలిష్ స్టార్ ఈసారి కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండగను పాలకొల్లులో జరుపుకోనున్నారు. తెలుగువారికి పెద్ద పండగ సంక్రాంతి. మామూలుగా సంక్రాంతి అంటే సిటీలో కాకుండా పల్లెల్లో బాగుంటుంది. పండగ సందడంతా అక్కడే ఉంటుంది. అందుకే బన్నీ పాలకొల్లు వెళ్లాలని అనుకుని ఉంటారు. ఈ మధ్య హైదరాబాద్లో క్రిస్మస్ సంబరాలు చేసుకుని, న్యూ ఇయర్ సందర్భంగా ఫ్యామిలీతో లెబనాన్ వెళ్లారు బన్నీ. ఇప్పుడు సంక్రాంతికి పాలకొల్లుని సెలెక్ట్ చేసుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ షూటింగ్ స్టార్ట్ కాకముందు ఇలా ఫ్యామిలీతో పండగలు, ముఖ్యమైన వేడుకలను మిస్ కాకుండా చేసుకుని, ఆ తర్వాత సినిమాతో బిజీ అయిపోతారు బన్నీ. -
‘సీబీఐ అంటే వణుకుతున్న చంద్రబాబు’
సాక్షి, పాలకొల్లు(పశ్చిమగోదావరి) : 'రాష్ట్రంలోఅవినీతి తారా స్థాయికి చేరింది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతిలో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ప్రతీ పనిలోనూ అవినీతి. పిల్లలకు పెట్టే గుడ్లు, కందిపప్పు, పుస్తకాల్లోనూ అవినీతి జరుగుతుంది. ఇంతలా అవినీతి జరగటంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీబీఐ అంటేనే భయపడుతున్నారు. తాను చేసిన అవినీతి అక్రమాలు ఎక్కడ బయటపడతాయోమోనని వణికి పోతున్నార'ని బీజేపీ తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త పురిగళ్ల రఘురాం ఆన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రధాని మోదీ మంచివారని, దమ్మున్న ప్రధాని అని, రాష్ట్రానికి కావల్పినన్ని నిధులు ఇస్తున్నారని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అనడం నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువ నిధులు ఇస్తున్నారని చెప్పింది మీరు కాదా అని నిప్పులు చెరిగారు. చంద్రబాబు తీరుతో విసిగిపోయిన కొందరు సీనియర్ తెలుగు దేశం నాయకులు పార్టీని వదలి వెళ్లిపోవాలని చూస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన 600 అబద్దపు హామీల్లో ఆరు హామీలనైనా నేరవేర్చలేని అసమర్ధ ప్రభుత్వం తెలుగు దేశం ప్రభుత్వం అని ఆయన విమర్శించారు. రైతుల కోసం కేంద్రం ప్రకటించిన 17 శాతం ఫసల్బీమా కూడా ఇవ్వకుండా అన్నదాతల పొట్టకొట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు ఇన్ని సమస్యలతో సతమతమౌతుంటే చంద్రబాబు మాత్రం పక్క రాష్ట్రాల సీఎంలతో కలిసి ఫొటోలకు ఫోజులిస్తున్నారని ఎద్దేవా చేశారు. నోటిఫికేషన్లపై మాయమాటలు చెప్పి నిరుద్యోగ యువత జీవితాలతో అడుకుంటున్నారని రఘురాం విమర్శించారు. -
కార్తీక పూజలు చేస్తూ అర్చకుడు మృతి
-
కార్తీక పూజలు చేస్తూ.. శివైక్యం చెందిన పూజారి
సాక్షి, పాలకొల్లు(పశ్చిమ గోదావరి): పంచారామా క్షేత్రాల్లో ఒకటైన పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న అర్చకులు కోట నాగవెంకట ప్రసాద్(నాగబాబు) మహాపర్వదినమైన ఏకాదశి రోజున శివైక్యం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కార్తీక మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని మహిషాసుర మర్ధిని అమ్మవారికి పూజలు చేస్తున్న పూజారి నాగబాబు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆలయ సిబ్బంది వెంటనే పూజారిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటు కారణంగా ఆయన శివైక్యం చెందినట్టుగా తెలుస్తోంది. పూజారి శివైక్యం చెందడటంతో క్షీరా రామలింగేశ్వర ఆలయాన్ని మూసివేశారు. సాయంత్రం వరకు భక్తులు ఎవరు దర్శనానికి రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. సంప్రోక్షణ అనంతరం సాయంత్రం 5 గంటలకు ఆలయం తెరుచుకోనుందని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది జూన్ 11న భీమవరం పంచారామ ఆలయ గర్భగుడిలో కుప్పకూలిన పూజారి రామరావు శివైక్యం చెందిన సంగతి తెలిసిందే. -
పశ్చిమావనిలో 'సీతయ్య' గురుతులు
పాలకొల్లు అర్బన్: రాజ్యసభ మాజీ సభ్యుడు, సినీ నటుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కుమారుడు హరికృష్ణ బుధవా రం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో జిల్లావాసులు, సినీ అభిమానులు, రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు ది గ్భ్రాంతికి గురయ్యారు. ఈ ప్రాంతంతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో షూటింగుల నిమిత్తం హరికృష్ణ పలుమార్లు జిల్లాకు విచ్చేశారు. సీతయ్య సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఆత్రేయపురం లాకుల వద్ద చిత్రీకరించారు. టైగర్ హరిశ్చంద్రప్రసాద్ సినిమా షూటింగ్ను రాజమండ్రి, కొవ్వూరు ప్రాంతాల్లో చిత్రీకరించినట్టు జూనియర్ ఆర్టిస్ట్ సరఫరా కాంట్రాక్టర్ కె.అన్నపూర్ణ తెలిపారు. ఎన్టీ ఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి షూటింగ్లకు వినియోగించే వ్యాన్ను చైతన్య రథంగా మార్చి రాష్ట్ర పర్యటన చేసిన సందర్భంలో ఆ వాహనానికి డ్రైవర్గా నందమూరి హరికృష్ణ తొలిసారి పాలకొల్లు విచ్చేశారు. కృష్ణాజిల్లా కైకలూరు నుంచి ఆకివీడు, ఉండి, భీమవరం మీదుగా పాలకొల్లు వచ్చినట్టు అభిమానులు చెబుతున్నారు. అప్పుడు సామాన్య కార్యకర్తగా హరికృష్ణ గ్రౌండ్లో నిలబడి తండ్రి రామారావు ప్రసంగాన్ని ఆలకించారని ఆనాటి సీనియర్ టీడీపీ నాయకులు గుర్తుచేసుకున్నారు. పాలకొల్లు కెనాల్ రోడ్డు మీదుగా మార్టేరు వెళుతుండగా చైతన్యరథాన్ని నడుపుతున్న హరికృష్ణను చూసినట్టు పట్టణానికి చెందిన రామా స్టూడియో నాయుడు తెలిపారు. తాను అప్పుడు ఆర్ఎంసీ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నానన్నారు. ఎర్రవంతెన వద్ద చైతన్యరథం ఆపి కొబ్బరి జట్టు కార్మికులతో ఎన్టీఆర్ ముచ్చటించారని చెప్పారు. మార్టేరులో నిర్వహించిన బహిరంగ సభలో అప్పటి పోడూరు మండలం వేడంగిపాలెం సర్పంచ్గా పనిచేస్తున్న తాను టీడీపీలో చేరినట్టు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు తెలిపారు. ఆ సమయంలో తొలిసారిగా హరికృష్ణను చూశానన్నారు. 1984లో తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన సంక్షోభ సమయంలోనూ అన్న ఎన్టీఆర్ చైతన్యరథానికి హరికృష్ణ సారథిగా ఉండి రెండోసారి పాలకొల్లు వచ్చారు. లాహరి.. లాహిరి.. లాహిరిలో.. చిత్ర విజయోత్సవాలు పాలకొల్లు మారుతి థియేటర్లో నిర్వహించారని, ఆ వేడుకలకు హరికృష్ణ హాజరయ్యారని పట్టణ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు షేక్ సిలార్ చెప్పారు. స్ఫూర్తిప్రదాత.. హరికృష్ణ పాలకొల్లు సెంట్రల్: రథసారథిగా రాష్ట్రమంతా తిరిగి ఎన్టీఆర్ను సీఎం పీఠం ఎక్కించడంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి నందమూరి హరికృష్ణ అనంతరం జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల్లో అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్రంలో రథయాత్రను కొనసాగించారు. ఆ రథయాత్ర పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఇం టి వెంకటరెడ్డి అనే వ్యక్తి హరికృష్ణ యాత్రలో వె న్నంటి ఉండి విజయవంతం చేసినట్టు చెప్పారు. రథయాత్రను నరసాపురం నుంచి ఏనుగువానిలంక, యలమంచిలి, మేడపాడు ప్రాంతాల్లో తిరిగి అనంతరం పాలకొల్లు గాంధీబొమ్మల సెం టర్లో జరిగిన సభలో హరికృష్ణ మాట్లాడారు. మార్టేరు, పెనుమంట్ర మీదుగా వీరవాసరం వర కూ హరికృష్ణ యాత్ర కొనసాగింది. అన్న టీడీపీలో తనను జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా అప్పట్లో హరికృష్ణ ప్రకటించినట్టు వెంకటరెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆయనతో అనుబంధం స్ఫూర్తినిచ్చిందని, ఆయన మరణం తీరని లోటని అన్నారు. 1996లో కురెళ్లగూడెంలో.. భీమడోలు: భీమడోలు మండలం కురెళ్లగూడెంలో 1996లో టీడీపీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా హరికృష్ణ హాజరయ్యారు. అప్పటి టీడీపీ నేత, ప్రస్తుతం వైఎస్సార్ మండల కన్వీనర్ రావిపాటి సత్యశ్రీనివాస్ ఇంట్లో భోజనం చేశారు. నాటి స్మృతులను ఆయన అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. పసలతో సాన్నిహిత్యం తాడేపల్లిగూడెం: హరికృష్ణకు టీడీపీ సీనియర్ నాయకులతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఎన్టీఆర్ అభిమానిగా రాజకీయాల్లో ప్రవేశించిన మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందరరావు ఎన్టీఆర్కు విధేయుడిగా, హరికృష్ణకు సన్నిహితుడిగా మెలిగారు. 1995లో హరికృష్ణ టీడీపీ మంత్రి వర్గంలో మం త్రిగా ఉన్న సమయంలో పసల ఎమ్మెల్యేగా పనిచేశారు. పార్టీ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా హరికృష్ణతో కలిసి రాష్ట్రమంతా తాను పర్యటించానని, హరికృష్ణ మరణం తీరనిలోటని పసల కనకసుందరరావు అన్నారు. గతంలో టీడీపీలో పనిచేసిన ప్రస్తుతం వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు గుండుబోగుల నాగు లండన్ నుంచి సంతా పం తెలిపారు. హరికృష్ణతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు.