Siddharamayya
-
నిర్ణయం బోర్డుదే
బోర్డు నిర్ణయానికి ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉంటాయి ఆర్బీసీ ఆధునికీకరణపై ఏపీ, కర్ణాటక సీఎంల ఉమ్మడి ప్రకటన కర్ణాటకలో ఆన్లైన్ ట్రేడింగ్ విధానం భేష్ : చంద్రబాబు ల్యాండ్పూలింగ్ ద్వారా రాజధాని నిర్మాణానికి భూమి సేకరణ ఈ చర్చ వల్ల ఒరిగింది శూన్యమన్న కర్ణాటక నీటిరంగ నిపుణులు బెంగళూరు : తుంగభద్ర రైట్ బ్యాంక్ కెనాల్ (ఆర్బీసీ) ఆధునికీకరణకు సంబంధించిన విషయంలో తుది నిర్ణయం తుంగభద్ర నదీ జలాల పంపకం కోసం ఏర్పాటైన బోర్డుదేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉమ్మడిగా ప్రకటించారు. బోర్డు నిర్ణయానికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కట్టుబడి ఉంటాయని వారు తెలిపారు. తుంగభద్ర నదీ జలాల పంపకం విషయమై ఏపీ, కర్ణాటక ముఖ్యమంత్రుల మధ్య సోమవారమిక్కడి సీఎం క్యాంపు కార్యాలయం కృష్ణలో దాదాపు 45 నిమిషాలు చర్చలు జరిగాయి. అనంతరం సీఎం చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడుతూ... ఆర్బీసీ ఆధునికీకరణ పూర్తయితే అనంతపురం, కడప, కర్నూలుతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు, కర్ణాటకలోని బళ్లారి జిల్లాకు ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటక నీరావరి నిగమ్ వద్ద ఆర్బీసీ ఆధునికీకరణకు సంబంధించిన విషయం పరిశీలనలో ఉందన్నారు. ఇక్కడ నుంచి టెక్నికల్ సబ్ కమిటీకి అటుపై తుంగభద్ర బోర్డు ముందుకు ఆధునికీకరణ విషయం పరిశీలనకు వస్తుందన్నారు. ఆధునికీకరణకు సంబంధించి బోర్డు నిర్ణయాన్ని ఇరురాష్ట్రాలు విధిగా అంగీకరిస్తామని స్పష్టం చేశారు. ఆధునికీకరణకు అవసరమైన నిధుల విషయంలో కూడా బోర్డు నిర్ణయం అనంతరం స్పష్టత వస్తుందన్నారు. కాగా, చర్చల అనంతరం వ్యవసాయ రంగంలో కర్ణాటక అవలంభిస్తున్న నూతన విధానాలపై సంబంధిత అధికారులు కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి కృష్ణబైరేగౌడ సమక్షంలో సీఎం చంద్రబాబునాయుడుకు దాదాపు గంటపాటు పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... కర్ణాటకలో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం కోసం అవలంబిస్తున్న ఆన్లైన్ ట్రేడింగ్ విధానం చాలా బాగుందని మెచ్చుకున్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి దీనితో పాటు మరికొన్ని విధానాలను ఏపీలో అమలు చేయనున్నానని తెలిపారు. ల్యాండ్పూలింగ్ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణానికి భూమిని సేకరిస్తున్నామని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. డిజైన్లో మార్పులేదు - సిద్ధు తుంగభద్ర ఆర్బీసీ ఆధునికీకరణ జరిగినా కాలువ డిజైన్లో ఎటువంటి మార్పు ఉండదని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ప్రస్తుతం 190 కిలోమీటర్ల పొడవైన ఈ కాలువలో పూడిక పేరుకుపోవడం వల్ల ఏడాదికి 32 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు కోల్పోతున్నాయన్నారు. ఈ పూడిక ఇలాగే కొనసాగితే 32 టీఎంసీలకు అదనంగా ప్రతి ఏటా 0.45 టీఎంసీల నీటిని నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఆధునికీకరణ విషయం తుంగభద్ర బోర్డు నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. తాజా చర్చల్లో కేవలం ఆర్బీసీ ఆధునికీకరణకు సంబంధించిన విషయం మాత్రమే చర్చకు వచ్చిందని... వరద నీటి కాల్వ విషయం ప్రస్తావనకు రాలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. చర్చల్లో రెండు రాష్ట్రాలకు చెందిన నీటి పారుదలశాఖ మంత్రులు ఎంబీపాటిల్, దేవినేని ఉమామహేశ్వరరావుతోపాటు ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ప్రయోజనం శూన్యం! తుంగభద్ర ఆర్బీసీ ఆధునికీకరణ విషయమై సోమవారం జరిగిన చర్చల వల్ల ఎటువంటి ప్రయోజనం కలగలేదని కర్ణాటక నీటిరంగ నిపుణులతోపాటు చర్చల్లో పాల్గొన్న మంత్రులు పేర్కొంటున్నారు. తుంగభద్ర నీటి పంపకాలకు సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనేక ప్రతిపాదనలు బోర్డుముందుకు తీసుకువెళ్లినా వాటిని కొట్టివేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. బోర్డు ముందుకు నేరుగా వెళితే ఎటువంటి ప్రయోజనం ఉండబోదని భావించడం వల్లనే ఏపీ ప్రభుత్వం నేరుగా కర్ణాటక దగ్గరకు వస్తోందని, అయితే ఈ చర్చల వల్ల కూడా ప్రయోజనం శూన్యమేనని చర్చల్లో పాల్గొన్న ఓ మంత్రి పేర్కొన్నారు. -
నేడు బెంగళూరు, విశాఖలకు ఏపీ సీఎం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం బెంగళూరు, విశాఖపట్నంలలో పర్యటించనున్నారు. ఉదయం ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తారు. అక్కడ కర్నాటక సీఎం సిద్ధరామయ్యతో సమావేశమవుతారు. తుంగభద్ర నుంచి రాయలసీమకు నీటి విడుదలపై చంద్రబాబు చర్చిస్తారు. అనంతరం అక్కడి నుంచి విశాఖకు బయలుదేరి వెళ్తారు. అక్కడి జన్మభూమి కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారని అధికారవర్గాలు తెలిపాయి. -
ఉండేనా..ఊడేనా?
మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణపై అమాత్యుల ఆందోళన పదవి పోతుందని భయం సీనియర్ల గుండెల్లో రైళ్లు ఐదు లేదా ఆరుగురిపై వేటు నూతన జాబితాకు రాహుల్ ఓకే రాష్ట్ర మంత్రి వర్గానికి త్వరలోనే సర్జరీలు చేపడతామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించిన నేపథ్యంలో మంత్రి వర్గంలోని సీనియర్ మంత్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ సర్జరీల్లో భాగంగా మంత్రి వర్గం నుంచి తమనే తప్పించబోతున్నారా.. అన్న ఆలోచనలు సీనియర్ మంత్రులను వేధిస్తున్నాయి. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న మంత్రి వర్గ విస్తరణతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చురుగ్గా తీసుకెళ్లడంలో విఫలమైన వారిని మంత్రి వర్గం నుంచి తొలగించేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సన్నద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి ఇటీవల ఢిల్లీ పర్యటనలో ‘మంత్రి వర్గ పునర్వవస్థీకరణ భాగంలో కొంత మందిని తప్పించబోతున్నాం’ అని స్పష్టం చేశారు. దీంతో మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఎవరికి ఉద్వాసన పలుకుతారనే విషయంపై సీనియర్ మంత్రుల్లో భయం నెలకొంది. సీనియర్లే ఎందుకు.... ఉద్యానశాఖను నిర్వహిస్తున్న శ్యామనూరు శివశంకరప్ప వయోభారంతో బాధపడుతుండడం వల్ల ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించాలని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు సమాచారం. ఇక రెవెన్యూ శాఖను నిర్వహిస్తున్న శ్రీనివాస్ ప్రసాద్ అనారోగ్య కారణాలతో తన శాఖను సమర్థవంతంగా నిర్వహించలేక పోతున్నారని హైకమాండ్కు నివేదిక అందింది. ఇక గృహ నిర్మాణ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అంబరీష్ ప్రజలతో పాటు అధికారులతో కూడా మమేకం కాలేకపోతున్నట్లు ముఖ్యమంత్రికి ఫిర్యాదులు తలెత్తుతున్నాయి. వీరితో పాటు మరికొందరు సీనియర్లను సైతం మంత్రి మండలి నుంచి తప్పించాలని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు సమాచారం. మంత్రి వర్గంలోని సీనియర్లు తన మాట వినకపోవడం వల్లే సిద్ధరామయ్య ఈ నిర్ణయానికి వచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల మంత్రుల పనితీరుకు సంబంధించిన ‘వర్క్ రిపోర్ట్’ను అడిగిన సందర్భంలో కూడా సిద్ధరామయ్యపై సీనియర్ మంత్రు లు సీరియస్ అయ్యారు. ‘మమ్మల్నే వర్క్ రిపోర్ట్ అడుగుతారా..’ అని కొందరు ప్రశ్నిస్తే, మరికొందరేమో అధికారుల పనితీరు సరిగా లేదు, నిధులు రాలేదు అనే సాకులు చెబుతూ వర్క్ రిపోర్ట్ను ఇవ్వలేదు. దీంతో సీనియర్ మంత్రులను మంత్రి వర్గం నుంచి తప్పించేందుకు సిద్ధరామయ్య సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. రాహుల్ ఓకే.. ఇక ఢిల్లీ పర్యటన సమయంలో మంత్రి వర్గానికి యువ రక్తాన్ని చేర్చాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సూచించినట్లు సమాచారం. మంత్రి వర్గం మరింత చురుగ్గా పనిచేసేందుకు గాను అసమర్థులైన మంత్రులను తప్పించి వారి స్థానంలో కార్యదక్షత ఉన్న యువ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను అప్పగించాలని రాహుల్ గాంధీ సిద్ధరామయ్యను ఆదేశించారు. దీంతో చాలా కాలంగా మంత్రి వర్గ పునర్వవస్థీకరణ చేపట్టేందుకు వేచి చూస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మార్గం సుగమమైందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుత మంత్రి వర్గంలోని ఐదు లేదా ఆరుగురు సీనియర్లను మంత్రి వర్గం నుంచి తప్పించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈనెల 16న నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. ఆ సమయంలో మంత్రి వర్గంలో చోటు కల్పించబోయే వారి జాబితాకు హైకమాండ్ నుంచి ఆమోదం పొందనున్నారని, అనంతరం మంత్రి వర్గ పునర్వవస్థీకరణను చేపట్టనున్నారని తెలుస్తోంది. -
కొంత మందిని తప్పిస్తాం
సీఎం సిద్ధరామయ్య బెంగళూరు: పునఃవ్యవస్థీకరణలో భాగంగా కొంత మందిని మంత్రి మండలి నుంచి తప్పిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అదేవిధంగా మరి కొంత మంది మంత్రిత్వశాఖలను మారుస్తామని తెలిపారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన ఆయన అక్కడ మీడియాతో ఈ వాఖ్యలు చేశారు. -
మరో శిరోభారం
‘వర్క్ రిపోర్టు’ను అడగడంతో సీఎం సిద్ధుపై సీనియర్లు సీరియస్ అధికారులు సహకరించకుండా, నిధులు రాకుండా పనులెలా చేస్తామంటూ సీఎంపై ఆగ్రహం సాక్షి, బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మరో తలనొప్పి వచ్చిపడింది. మంత్రుల పనితీరును తెలుసుకునేందుకు గాను సీఎం సిద్ధరామయ్య మంత్రులను ‘వర్క్ రిపోర్ట్’ను అడగడమే అందుకు కారణం. సిద్ధరామయ్య మంత్రివర్గంలోని కొందరు మంత్రులు ప్రజల సంక్షేమానికి సంబంధించిన ఎలాంటి పనులు చేయడం లేదని, అంతేకాక తమ శాఖల్లోని నిధులను సద్వినియోగం చేయడంపై సైతం దృష్టి సారించడం లేదనే విమర్శలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసహనం పెరిగిపోతుందని భావించిన పార్టీ హైకమాండ్ మంత్రుల పనితీరుకు సంబంధించిన నివేదికను రూపొందించాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఆదేశించింది. ఈ నివేదికను ఆధారంగా చేసుకొని మంత్రి వర్గంలో ఎలాంటి మార్పులు చేయాలి.. ఎవరెవరిని మంత్రి వర్గం నుంచి తొలగించాలి అన్న అంశాలపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘వర్క్ రిపోర్ట్’ అందజేయండి.... ఇక హైకమాండ్ ఆదేశాలతో తన మంత్రి వర్గ సహచరులను ‘వర్క్ రిపోర్ట్’ అందజేయాల్సిందిగా సిద్ధరామయ్య కోరారు. పదవిని చేపట్టిన అనంతరం మీ నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టారు?, ఎన్నిసార్లు కార్యకర్తలతో సమావేశమయ్యారు?, బడ్జెట్లో ప్రకటించిన పనులు ఎంత వరకు అమలు చేశారు? ఇలా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అందజేస్తూ ప్రతి మంత్రి నివేదికను అందజేయాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశించారు. అధికారులు సహకరించట్లేదు.... కాగా, తమని వర్క్ రిపోర్ట్ అడగడంపై మంత్రి వర్గంలోని కొందరు సీనియర్ మంత్రులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తమ పనితీరుపై నిఘా ఉంచేందుకు సిద్ధరామయ్య ప్రయత్నిస్తుండడం తమకెంతో ఇబ్బందికరంగా ఉందని వారు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. అంతేకాక ‘పని’ చేసేందుకు తమకున్న ఇబ్బందుల గురించి కూడా వారు సీఎంను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ‘మా శాఖల్లోని అధికారులు మాకు సహకరించట్లేదు. బడ్జెట్లో వివిధ అభివృద్ధి పథకాల కోసం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా విడుదల చేస్తోంది. బడ్జెట్లో కేటాయించిన నిధులు ఇంకా పూర్తిగా అందనేలేదు. ఇలాంటి సందర్భంలో మా నియోజక వర్గాల్లో అభివృద్ధి పనులతో పాటు బడ్జెట్లో ప్రకటించిన పథకాలు ఎలా పూర్తవుతాయి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకోకుండా మా పనికి సంబంధించిన ‘వర్క్ రిపోర్ట్’ను కోరడం, ఆ నివేదిక ద్వారా మా పనితీరును బేరీజు వేయడం ఎంత వరకు సమంజసం’ అని కొందరు సీనియర్ మంత్రులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రుల వర్క్ రిపోర్ట్ను అందజేయాల్సిందిగా హైకమాండ్ ఇచ్చిన ఆదేశాలను పాటించలేక, వర్క్ రిపోర్ట్ విషయమై సీనియర్ మంత్రులను సమాధాన పరచలేక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తలపట్టుకున్నారు. -
కీచక పర్వంపైప్రజాగ్రహం
కేంబ్రిడ్జి పాఠశాల ఎదుట ఆందోళనలు భారీ బందోబస్తు ఏర్పాటు నిందితుడు జైశంకర్ అరెస్ట్ సాక్షి, బెంగళూరు : ఉద్యాననగరిలో మరోసారి ప్రజాగ్రహం పెల్లుబికింది. విబ్గయార్, ఆర్కిడ్ సంఘటనలు మరచిపోకముందే కేంబ్రిడ్జి పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే పాఠశాలలో హిందీ బోధనతో పాటు పీఈటీగా విధులు నిర్వర్తిస్తున్న జై శంకర్ అత్యాచారానికి పాల్పడిన విషయం వెలుగుచూసిన విష యం తెలిసిందే. ఈ ఘటనలో జైశంకర్ను పోలీసులు అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరులో శుక్రవారం వెల్లడించారు. మరోవైపు నిందితుడు జైశంకర్ను బెంగళూరు న్యాయస్థానంలో పోలీసులు శుక్రవారం సాయంత్రం హాజరుపరిచారు. అనంతరం న్యాయమూర్తి అనుమతి మేరకు వారంరోజుల పోలీసు కస్టడీకి తరలించారు. ఈ కేసు దర్యాప్తు మల్లేశ్వరం ఉపవిభాగం ఏసీపీ సారాఫాతిమా ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా తాజా ఘటనల దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తనిఖీ రోజే ఆకృత్యం... కేంబ్రిడ్జ్ పాఠశాల బెంగళూరు దక్షిణ విభాగం పరిధిలోకి వస్తుంది. పాఠశాలలో భద్రతా చర్యల కోసం ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన గైడ్లైన్పై ఈనెల 28న బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి (బీఈఓ) రమేష్ నేతృత్వంలో కేంబ్రిడ్జ్ పాఠశాలలో తనిఖీ నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఈ కార్యక్రమం కొనసాగింది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత నిందితుడు చిన్నారిని మొదటి అంతస్తులోని బాలుర శౌచాలయంలోకి బలవంతంగా తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసుల పరిశీలనలో తేలింది. తర్వాతి రోజు (అక్టోబర్ 29న) కూడా ఇదే విధంగా చిన్నారిపై జైశంకర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారి తన జననేంద్రియాల వద్ద సమస్యగా ఉందంటూ తల్లికి చెప్పడంతో ఆమె బాలికను గైనకాలజిస్టు వద్దకు తీసుకెళ్లింది. వైద్యుల పరీక్షల్లో చిన్నారి లైంగిక దాడికి గురైనట్లు గుర్తించారు. తర్వాత వైద్యులు, స్వచ్ఛంద సంస్థల సూచనల మేరకు బాధిత చిన్నారి తల్లిదండ్రులు స్థానిక జీవన్భీమా నగర్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా విచారణలో శంకర్ ఇంటి వద్ద హిందీ ట్యూషన్లు చెప్పేవాడని తేలింది. ఆ సమయంలో బాధిత విద్యార్థిని తల్లి హిందీ నేర్చుకోవడం కోసం జై శంకర్ వద్దకు గతంలో ట్యూషన్కు వెళ్లేవారిని సమాచారం. ఇదిలా ఉంటే నిందితుడి కుమారుడు కూడా ఇదే పాఠశాలలో చదువుతుండటం గమనార్హం. అగ్నిగోళంగా మారిన ప్రజాగళం... చిన్నారిపై అత్యాచారం విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేశంతో రగిలిపోయారు. పాఠశాల వద్దకు చేరుకుని నిందితున్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఉదయం ఎనిమిది గంటలకే వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు అక్కడికి చేరుకుని పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినదించారు. వేలకు వేలు ఫీజులు వసూలు చేసే ఈ పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. అదేవిధంగా 11 గంటల సమయంలో సీ.వీ రామన్నగర్ శాసనసభ్యుడు (బీజేపీ) రఘు నేతృత్వంలో వందలాది మంది పార్టీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. బెంగళూరులో ప్రతి రోజూ ఏదోఒక చోట పిల్లలు, మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతకు నైతిక బాధ్యత వహిస్తూ హోంశాఖ మంత్రి కే.జేజార్జ్తోపాటు సీఎం సిద్ధరామయ్య తమ పదవులకు రాజీనామా చేయాలని ఎమ్మెల్యే రఘు ఈసందర్భంగా డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా పాఠశాల యాజమాన్యానికి చెందిన ఒక్కరు కూడా అటు విద్యాశాఖకు కానీ ఇటు పోలీసుశాఖకు కానీ అందుబాటులోకి రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా, పాఠశాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర పోలీస్కమిషనర్ ఎం.ఎన్.రెడ్డి స్వయంగా పాఠశాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. బుధవారం పాఠశాల పునఃప్రారంభం! పాఠశాల విద్యార్థినిపై అత్యాచార విషయం గురువారం రాత్రి వెలుగులోకి రావడంతో పాఠశాల యాజమాన్యం శుక్రవారం స్కూల్కు సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఎం.ఎన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేకంగా సమావేశమై సంఘటన పట్ల చర్చించారు. ఈ సందర్భంగా పాఠశాలలో భద్రతా చర్యలు సరిగా లేవ ంటూ తల్లిదండ్రులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. పరిస్థితి చక్కబడేంతవరకూ తమ పిల్లలను పాఠశాలకు పంపేది లేదని తేల్చిచెప్పారు. చివరికి అందరూ కలిసి పాఠశాలను బుధవారం పునఃప్రారంభించడానికి నిర్ణయించారు. మరోవైపు ఈ విషయమై సోమవారం మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో తీర్మానించారు. నిర్లక్ష్యపు సమాధానాలు! కేంబ్రిడ్జ్ పాఠశాల ఉదంతం నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు హోంశాఖ మంత్రి కే.జే. జార్జ్ చేసిన వ్యాఖ్యల పట్ల సామాజిక వేత్తలతో పాటు తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారి వ్యాఖ్యలు ప్రజలను కాపాడటంలో ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్య వైఖరికి అద్ధం పడుతున్నాయని విమర్శిస్తున్నారు. పాఠశాల యాజమాన్యానిదే బాధ్యత : పాఠశాలల్లో ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్లో జరిగే అత్యాచారాలకు ప్రభుత్వం బాధ్యత వహించదు. ఆయా పాఠశాలల యాజమాన్యానిదే బాధ్యత. అయితే అకృత్యానికి పాల్పడినవారు ఎవరైనా చట్టం ప్రకారం వారిని కఠినంగా శిక్షిస్తాం. - సీఎం తల్లిదండ్రులదే ఎక్కువ బాధ్యత: పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల రక్షణ విషయంపై ఎక్కువ దృష్టి సారిస్తే ‘కేంబ్రిడ్’్జ వంటి ఘటనలు పునరావృతం కావు. ప్రతి చోటుకూ వెళ్లి పోలీసులు రక్షణ కల్పించడానికి వీలుకాదుకదా? - హోంశాఖ మంత్రి -
చర్చలు సఫలం
వైద్యుల డిమాండ్లకు సర్కార్ ఓకే 14 డిమాండ్లలో పదింటికి అంగీకారం రాజీనామాలను వెనక్కు తీసుకున్న డాక్టర్లు ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు ఆగ్రహం ఎందుకు ఎస్మా చట్టాన్ని ప్రయోగించలేదంటూ మండిపాటు నేడు కోర్టుకు హాజరుకావాలంటూ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడికి ఆదేశం సాక్షి, బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన ప్రభుత్వ వైద్యుల సంఘం, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మధ్య బుధవారం జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో తాము ఇచ్చిన రాజీనామాలను వెనక్కు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ వైద్యులు అంగీకరించారు. డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘంలోని 4,500 మంది సోమవారం నుంచి రెండు రోజులు సామూహిక రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. సమస్యల పరి ష్కారం కోసం ఆరోగ్య, కుటంబ సంక్షేమశాఖ మంత్రి యూటీ ఖాదర్ అధ్యక్షతన పలుదఫాలుగా చర్చలు జరిగినా ఫలితం కనబడలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి. వైద్యుల 14 డిమాండ్లలో పదింటిని పరిష్కరించడానికి ప్రభుత్వం అంగీకరించింది. దీంతో వైద్యులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమ వల్ల ఇబ్బంది పడిన ప్రజలకు ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు వీరభద్రయ్య క్షమాపణలు కూడా చెప్పారు. ఇకపై వైద్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్నాకు కాని, రాజీనామాలకు కాని పాల్పడకూడదన్నారు. ఏ విషయమైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. ఇందుకు విరుద్ధంగా జరిగి తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల సామూహిక రాజీనామాలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అత్యవసర సేవల పరిధిలో ఉన్న వైద్యులు సామూహిక రాజీనామాలకు దిగితే వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించకుండా ఎందుకు ఊరికే ఉన్నారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నించింది. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యులు సామూహిక రాజీనామాలకు దిగుతున్న నేపథ్యంలో వారి లెసైన్సులను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది ఎస్పీ అమృతేష్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి కేఎల్ మంజునాథ్తో కూడిన హైకోర్టు ధర్మాసనం బుధవారం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా వైద్యుల సామూహిక రాజీనామాలపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘డిమాండ్ల పరిష్కారం కోసమంటూ ప్రభుత్వ వైద్యులు ప్రతిసారీ ఇలాగే రోగుల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. వీరిపై ప్రభుత్వం ఎందుకు ఎస్మా చట్టాన్ని ప్రయోగించలేదు. అత్యవసర సేవల పరిధిలోని వైద్యులు సమ్మెలకు దిగిన సందర్భాల్లో ఎస్మాను తప్పక ప్రయోగించాల్సిందిగా కోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వం ఎందుకు పాటించలేదు. ఈ విషయంలో ప్రభుత్వంపై కోర్టు ధిక్కార కేసును ఎందుకు నమోదు చేయకూడదు’ అంటూ ప్రశ్నించింది. ఇక ఈ వ్యాజ్యంపై విచారణను గురువారానికి వాయిదా వేయడంతో పాటు ఈ విచారణకు రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు వీరభద్రయ్య స్వయంగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. -
అసెంబ్లీ సమావేశాలు నడిపేందుకు ప్రభుత్వం వెనకడుగు....
సాక్షి, బెంగళూరు : రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వాటిని చర్చించేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్.డి.కుమారస్వామి మండిపడ్డారు. ఇందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సైతం వెనకడుగు వేస్తోందని విమర్శించారు. హాసనలోని హాసనాంబ దేవాలయాన్ని శుక్రవారం సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గృహనిర్మాణ సహకార సంఘానికి చెందిన ఇళ్ల పంపిణీలో తాను అక్రమాలకు పాల్పడ్డానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపిస్తున్నారని, ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు జరిపితే ఎవరు అక్రమాలకు పాల్పడ్డారో తెలుస్తుందని సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో సిద్ధరామయ్య ప్రభుత్వం పూర్తిగా వెనుకబడిందని, స్పీకర్ కాగోడు తిమ్మప్ప రాష్ట్ర మంత్రివర్గ సభ్యులపై విమర్శలు చేస్తుండడమే ఇందుకు ఉదాహరణ అని కుమారస్వామి పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్నభాగ్య పధకం పూర్తిగా విఫలమైందని, అన్నభాగ్య పథకం పూర్తిగా ధనవంతులు, దళారులకు ప్రయోజనాలు చేకూరుస్తోందని విమర్శించారు. ఇక రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డి.కె.శివకుమార్ అక్రమ ఆస్తులపై సమగ్ర విచారణ జరపాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. డి.కె.శివకుమార్ అద్దాల మేడలో కూర్చున్నారని, అక్రమంగా ఆస్తులను సంపాదించడంతో పాటు ఆ సంపదతో మంత్రి పదవిని కూడా పొందారని మండిపడ్డారు. అదే సందర్భంలో దేవెగౌడ కుటుంబం అద్దాల మేడలో లేదని, వీధుల్లో సామాన్య ప్రజలతోనే వారి సమస్యలను చర్చిస్తూ ఉందని అన్నారు. జేడీఎస్లో 11 మంది సభ్యులతో ఒక కోర్ కమిటీని రూపొందించామని, మరో రెండు మూడు రోజుల్లో కోర్ కమిటీలోని సభ్యుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. కోర్ కమిటీని ప్రకటించిన అనంతరం జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రస్తుతం జేడీఎస్ రాష్ట్రశాఖ అధ్యక్ష పదవి కోసం ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు. అందువల్ల త్వరలోనే జేడీఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో పాటు జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్.డి.దేవెగౌడతో కలిసి సమావేశాన్ని నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు చెప్పారు. -
నిబంధనలకు నీళ్లు
సాక్షి, బెంగళూరు : పాఠశాలల్లో అత్యాచారాలు, పిల్లలపై భౌతిక దాడులను అరికట్టడానికి వీలుగా పోలీస్ శాఖ ఆగస్ట్లో రూపొందించిన భద్రతా చర్యలను రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పాటించడం లేదు. దీంతో ‘విబ్గయార్’ సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ది ఆర్కిడ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో మంగళవారం మరో బాలికపై అత్యాచారం జరిగడమే ఇందుకు నిదర్శనం. మరోవైపు పోలీసు శాఖ సూచనలు పాటిస్తే ఆర్థికంగా అటు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పాఠశాల యాజమాన్యం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందనేది పాఠశాల యాజమాన్యం వాదన. ఇక గత జూలైలో బెంగళూరులోని విబ్గయార్ పాఠశాలలో చదువుతున్న ఆరేళ్ల బాలిక పై అదే పాఠశాలలో స్కేటింగ్ ఇన్స్ట్రక్షర్గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై సిద్ధరామయ్య ప్రభుత్వం పై జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన పోలీసు శాఖ ప్రైవేటు పాఠశాలలకు కొన్ని నూతన మార్గదర్శకాలను సూచించింది. వీటిని అమలు చేయడానికి ఈ ఏడాది ఆగస్టు 30 వరకూ సమయం కూడా ఇచ్చింది. అయితే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం మాత్రం వీటిని అమలు చేయడం పట్ల విముఖత ప్రదర్శిస్తోంది. పోలీసుశాఖ ఇచ్చిన గడువు పూర్తయి దాదాపు రెండు నెలలు కావస్తున్నా రాష్ట్రంలోని మొత్తం ప్రైవేటు పాఠశాల్లో కనీసం 20 శాతం సంస్థలు కూడా సూచనలను పూర్తిస్థాయిలో పాటించడం లేదని పోలీసుశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే పోలీసు శాఖ ఏక పక్షంగా తీసుకున్న నిర్ణయాలను తమపై రుద్దడం సరికాదని నగరంలోని విశ్వ పబ్లిక్ స్కూల్ సంస్థ డెరైక్టర్ వివేక్ పేర్కొంటున్నారు. అంతేకాకుండా పోలీసు శాఖ సూచనలు ఆర్థికంగా చాలా ఖర్చుతో కూడుకున్నవని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం చెబుతోంది. పోలీసు శాఖ చేసిన చేసిన సూచనల్లో ముఖ్యమైనవి కొన్ని... పాఠశాలల్లో సీసీ కెమరాలు తప్పక ఏర్పాటు చేయాలి. విద్యార్థులను రవాణా చేసే వాహనాల్లో తప్పక ఒక మహిళా సహాయకురాలు ఉండాలి. విద్యాసంస్థలోని ఆటమైదానాల్లో ఇరవైనాలుగు గంటల పాటు తప్పక సెక్యూరిటీ గార్డ్ల పహారా ఉండాలి. పాఠశాల సిబ్బంది వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్కు తెలపాలి. కొత్తగా విధుల్లో చేరే వారితోపాటు ఉద్యోగం వదిలి వెళ్లిన సిబ్బంది వివరాలను ఎప్పటికప్పుడు పోలీసులకు తెలియజేయాలి. పాఠశాలల్లో జరిగే ఉత్సవాలు, ముఖ్యఅతిథిగా వస్తున్న వారి వివరాలు కనీసం 48 గంటల ముందు పోలీసులకు తెలియజేయాలి. తరుచుగా పాఠశాల పరిసరాల తనిఖీకి పోలీసులను అనుమతించాలి పాఠశాల యాజమాన్యం చెబుతున్న అభ్యంతరాలు... సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ ఖర్చుతో కూడుకున్నది. ఈ ఆర్థిక భారాన్ని చివరికి విద్యార్థుల తల్లిదండ్రుల పై వేయాల్సి వస్తుంది. సెక్యూరిటీ గార్డులు దొరకడం చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో విధులు నిర్వర్తించడానికి ఎక్కువ జీతాలను డిమాండ్ చేస్తున్నారు. చిన్నారులను రవాణా చేసే వాహనాల్లో డ్రైవర్లగా పురుషులు ఉండటం వల్ల వాహనాల్లో మహిళా ఉద్యోగులను నియమించడం సరికాదు. దీని వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. పాఠశాలలో పనిచేసే సిబ్బంది వివరాలను ఎప్పటికప్పుడు ఇవ్వడం శ్రమతో కూడుకున్నది. ఇందుకు ఎక్కువ మంది సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంటుంది. ఇది పాఠశాలపై ఆర్థిక భారాన్ని మోపనుంది. తనిఖీ పేరుతో పోలీసులు తరుచుగా పాఠశాలల్లోకి రావడం పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. నివేదిక కోరాను.. విద్యార్థుల రక్షణ కోసం తీసుకోవలసిన రక్షణ చర్యల విషయమై పోలీసు శాఖ రూపొందించిన మార్గదర్శకాలు చాలా పాఠశాలలు పాటించడం లేదు. తాజాగా ఆర్కిడ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన ఘటన నేపథ్యంలో, పాఠశాలలు పాటిస్తున్న భద్రతా చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని నగర కమిషనర్ ఎంఎన్ రెడ్డిని ఆదేశించాను. నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు చేపడుతాం. - కే.జే.జార్జ్ , రాష్ట్రహోం శాఖ మంత్రి -
జంప్..
బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ ముఖ్యమంత్రి సిద్ధుకు షాక్ సాక్షి, బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. మొన్నటి వరకూ ఆయన వెంట తిరిగిన గుల్బర్గా జిల్లా అళింద నియోజకవర్గ శాసనసభ్యుడు బీఆర్ పాటిల్ తాను బీజేపీలో చేరుతున్నట్లు మీడియాకు సోమవారం వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకే సరైన విలువ దక్కడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఇంకా ఆయన వెంటే ఉండడం సరికాదని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన చర్యను సమర్థించుకున్నారు. అధికారికంగా త్వరలో బీజేపీలో చేరనున్నట్లు స్పష్టం చేశారు. త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కానున్న నేపథ్యంలో బీఆర్ పాటిల్ సిద్ధరామయ్యను కాదని బీజేపీలో చేరుతుండడం గమనార్హం. ఇదిలా ఉండగా గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ పాటిల్ కర్ణాటక జనతా పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. పేరుకు ఆయన కేజేపీ శాసనసభ్యుడే అయినా అప్పటి నుంచి కాంగ్రెస్ కార్యక్రమాల్లో తరుచుగా కనిపించేవారు. యడ్యూరప్ప కేజేపీను వదిలి తిరిగి మాతృ పక్షమైన బీజేపీలో చేరిన సమయంలో కూడా బీఆర్ పాటిల్ తటస్థంగా ఉండిపోయారు. తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. అంతేకాక అప్పటి నుంచి కాంగ్రెస్ కార్యక్రమాల్లో ముఖ్యంగా సీఎం సిద్ధరామయ్య వెంట ఎక్కువగా కనిపించేవాడు. అయితే తాజాగా సిద్ధు రాజకీయ స్నేహాన్ని వద్దనుకుని బీఆర్ పాటిల్ బీజేపీ గూటిని చేరనున్నారు. -
ఎన్నాళ్లీ నిరీక్షణ?
అమలుకు నోచుకోని ‘జ్యోతి సంజీవిని’ నగదు రహిత వైద్య సేవల కోసంఎదురుచూపులు సీఎం ప్రకటించి ఎనిమిది నెలలైనా కార్యరూపం దాల్చని వైనం సాక్షి,బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం ఆర్భాటంగా చేస్తున్న ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. దీని వల్ల ఆ పథకంపై ఆశలు పెట్టుకున్న లక్షల మంది ఉద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇందుకు ‘జ్యోతి సంజీవిని’ మినహాయింపు కాదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం శస్త్రచికిత్స జరిగిన సమయంలో వైద్య ఖర్చులను ప్రభుత్వ ఉద్యోగులు ఆస్పత్రికి మొదట చెల్లించి ఆపై ఆ మొత్తాన్ని పొందాల్సి ఉంటుంది (మెడికల్ రీ ఎంబర్స్ మెంట్). తమకు నగదు రహిత వైద్య సేవలు అందేలా నిబంధనల్లో మార్పుచేయాలని చాలా ఏళ్లుగా ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలను అందించే నిమిత్తం ‘జ్యోతి సంజీవిని’ పేరుతో నూతన పథకాన్ని అమలు చేస్తామని సిద్ధరామయ్య ఈ ఏడాది (2014-15) బడ్జెట్ లో ఆర్భాటంగా ప్రకటించారు. 30 లక్షల మంది ఎదురు చూపులు ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 5,54,036 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ‘జ్యోతి సంజీవిని’ పథకం అనుసరించి ఉద్యోగి, అతని భాగస్వామి, తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలకు నగదు రహిత వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ లెక్కన రాష్ట్రంలో సుమారు 30 లక్షల మందికి ఈ పథకం కింద ప్రయోజనం కలుగుతుంది. బడ్జెట్ ప్రవేశపెట్టి ఇప్పటికి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తున్నా ఆ పథకం అమలుకు మాత్రం నోచుకోలేదు. ముఖ్యంగా గ్రూప్ సీ, డీ తదితర కిందిస్థాయి సిబ్బంది వైద్య ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పథకం అమలు కోసం ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆధార్ సంఖ్యను ప్రభుత్వం కేంద్ర మానవ వనరుల శాఖకు అందించాల్సి ఉంటుంది. ఈ పనిని సిబ్బంది, పరిపాలన నిర్వహణ శాఖకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు తమ ఆధార్ నంబర్ను నమోదు చేయించుకోవడానికి ముందుకు వస్తున్నా.. రేపు, ఎల్లుండి అని సంబంధిత అధికారులు తిప్పించుకుంటున్నారని రాష్ట్ర ఉద్యోగ సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ‘జ్యోతి సంజీవిని’ అమలు కోసం ఏర్పాటు చేసిన సువర్ణ ఆరోగ్య సురక్ష ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బోరేగౌడ మాట్లాడుతూ... ‘జ్యోతి సంజీవిని పనులు కొంత ఆలస్యమైన మాట వాస్తవమే. మానవ వనరుల కొరత, సాంకేతిక ఇబ్బందుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. త్వరలో పథకాన్ని అమలు చేస్తాం’ అని తెలిపారు. -
కార్పొరేషన్లు, బోర్డులకు ప్రాధాన్యం
మండ్య: పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మొదట కార్పొరేషన్లు, బోర్డు ల నియామకంలో ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. పాండవపుర తాలూకా బన్నంగాడి గ్రామంలోని జూనియర్ కళాశాల ఆవరణలో శనివారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేషన్లు, బోర్డుల్లో నియమాకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ ఆదేశించిందని తెలిపారు. ఈ క్రమంలోనే అభ్యుర్థులను నియమించడానికి అన్ని చర్య లూ తీసుకున్నామన్నారు. త్వరలోనే జాబితా విడుదల చేస్తామని చెప్పా రు. బోర్డుల నియామకం అనంతరం మంత్రి వర్గ విస్తరణను చేపడతామని వివరించారు. నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి రశ్మి మహేష్పై జరిగిన దాడిపై విచారణ చేసేందుకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇప్పటికే ఆమె దాడి చేసిన వారిని గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. అధికారుల నివేదిక వచ్చిన తర్వాత నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బెంగళూరు నగరంపై ఉగ్రవాదులు దృష్టిసారించిన విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఎం స్పందిస్తూ ఐసీఎస్ ఉగ్రవాదులు బెంగళూరును టార్గెట్ చేసిన విషయం తెలిసిందన్నారు. ఉగ్రవాదుల దాడికి ఎదుర్కోవడానికి అన్ని చర్యలూ ప్రభుత్వం తీసుకుంటుందని వివరించారు. -
ఉపాధి కల్పనే లక్ష్యం
సాక్షి, బెంగళూరు : రానున్న ఐదేళ్లలో 15 లక్షల ఉద్యోగాలను పారిశ్రామిక రంగంలో సృష్టించాలనే లక్ష్యంతో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. ఇందులో కూడా స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన పారిశ్రామిక విధానాన్ని (ఇండస్ట్రియల్ పాలసీ) సీఎం సిద్ధరామయ్య శుక్రవారం సాయంత్రం విధాన సౌధాలోని బాంక్వెట్ హాల్లో జరిగిన కార్యక్రమంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... నూతనంగా రూపొందించిన పాలసీ ఈ ఏడాది నుంచి ఐదేళ్ల పాటు (2014-2019 వరకూ) అమల్లో ఉంటుందన్నారు. ఈ సమయంలో రూ. ఐదు లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, 15 లక్షల నూతన ఉద్యోగాలను సృష్టించడం ప్రధాన లక్ష్యాలుగా నూతన పాలసీను అమలు చేయనున్నామన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామం (పీపీపీ) పద్ధతిలో నూతన పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసే విధానాన్ని మొదటి సారిగా ఇదే పాలసీలో పొందుపరిచామన్నారు. ప్రతి ఏడాది ఒక్కొక్కటి 5,000 నుంచి 8,000 ఎకరాల విస్తీర్ణంలో కనిష్టంగా ఐదు పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చాలా పరిశ్రమల స్థాపన మైనింగ్ రంగంతో ముడిపడి ఉంటుందన్నారు. అందువల్ల నూతన మైనింగ్ పాలసీను రూపొందించాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. నూతన పారిశ్రామిక పాలసీలో ఏరోస్పేస్, మిషన్టూల్, స్టీల్, సీమెంట్ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. అతిచిన్న, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా గరిష్ట పెట్టుబడి మొత్తాన్ని కూడా రెట్టింపు చేశామన్నారు. ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ, వెనుక బడిన తరగతులు, మహిళలు, వికలాంగులకు, విశ్రాంత సైనికులు పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తే ఎక్కువ సబ్సిడీలు కల్పించనున్నామన్నారు. అదేవిధంగా పరిశ్రామిక వాడకు కేటాయించిన మొత్తం భూమి విస్తీర్ణంలో 22.5 శాతం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి తప్పక కేటాయించేలా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించమని తెలిపారు. అదే విధంగా నూతన పాలసీ వ్యవధి లోపు రెండు పారిశ్రామిక వాడలను మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి పారిశ్రామిక వాడ విస్తీర్ణంలో ఐదు శాతాన్ని వారికి తప్పక కేటాయిస్తామని సిద్ధరామయ్య వివరించారు. -
అన్యాయం
కార్మిక చట్టాలను మార్చడంపై మల్లికార్జున ఖర్గే ఆగ్రహం కార్పొరేట్ వర్గాలు, వ్యాపారవేత్తలకే లబ్ధి అని ఆరోపణ కేంద్ర ప్రభుత్వ చర్యలపై మండిపాటు కార్మికుల సంక్షేమంపై తమకూ ప్రత్యేక శ్రద్ధ ఉందన్న కేంద్ర మంత్రి అనంతకుమార్ సాక్షి, బెంగళూరు : అనేక సంవత్సరాలుగా ఉన్న కార్మిక చట్టాల్లో మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించడంపై కేంద్ర మాజీ మంత్రి, పార్లమెంటు సభ్యుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. కార్మిక చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకురాదలచిన మార్పుల వల్ల కార్మికులకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని విమర్శించారు. కార్పొరేట్ వర్గాలు, వ్యాపారవేత్తలకు ప్రయోజనం చేకూర్చేలా కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్మిక చట్టాల్లో మార్పులకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మల్లికార్జున ఖర్గే పై విధంగా స్పందించారు. శుక్రవారమిక్కడి వసంతనగర్లో నవీకరించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాలను డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ల కాలంలో రూపొందించినవని చెప్పారు. ఈ చట్టాల్లో ఏవైనా చిన్నపాటి సవరణలు చేయవచ్చు కానీ పూర్తిగా చట్టాలనే మార్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇక ఇప్పుడున్న కార్మిక చట్టాలతోనే జీడీపీ 10 శాతం నుంచి 12 శాతానికి పెరిగిందని, జీడీపీ నెపాన్ని చూపుతూ కార్మిక చట్టాల్లో మార్పులకు సన్నద్దం కావడం సరికాదని అన్నారు. కార్మిక చట్టాల్లో మార్పుపై మరోసారి ఆలోచించాల్సిందిగా ప్రధానికి సూచించాలని అదే వేదికపై ఉన్న కేంద్ర మంత్రి అనంతకుమార్ను ఖర్గే కోరారు. అనంతరం కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ...నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పనిచేస్తోందని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ టీ అమ్ముకుంటూ ప్రధాని స్థానానికి చేరుకున్నారని, అందువల్ల కేంద్ర ప్రభుత్వానికి కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ ఉందని తెలిపారు. రాష్ట్రంలో ప్రారంభోత్సవం కోసం ఎదురుచూస్తున్న ఈఎస్ఐ ఆస్పత్రుల గురించి త్వరలోనే కేంద్ర కార్మికశాఖ మంత్రితో చర్చిస్తానని అనంతకుమార్ వెల్లడించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాష్ట్ర మంత్రి ఆంజనేయ తదితరులు పాల్గొన్నారు. -
సిద్ధూ వేస్ట్..
ఆయనో అసమర్థ ముఖ్యమంత్రి చెరుకు రైతుకు అందని మద్దతు ధర దివాళా దిశగా రాష్ట్ర ఆర్థిక స్థితి కరువు బాధితులను ఆదుకోవడం పూర్తిగా విఫలం మాజీ సీఎం, ఎంపీ యడ్యూరప్ప ధ్వజం సాక్షి,బెంగళూరు : రాష్ట్రంలో పాలన గాడితప్పిందని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసమర్థతే అందుకు కారణమని మాజీ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యుడు యడ్యూరప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హుబ్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బెల్గాంలో గతంలో జరిగిన శీతాకాల శాసనసభ సమావేశాల్లో ప్రకటించిన చెరుకు మద్దతు ధర ఇప్పటికీ రైతులకు అందలేదన్నారు. మొదట ఆ బాకీ మొత్తాన్ని చెల్లించిన తర్వాతే సిద్ధరామయ్య త్వరలో జరగబోయే బెల్గాం చట్టసభల్లో పాల్గొనాలని ఘాటు వాఖ్యలు చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో పన్నుల వసూలులో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుండటంతో అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడుతోందని తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా దివాళాతీసే స్థితిలో ఉందని అభిప్రాయపడ్డారు. దీంతో రాష్ట్రం అభివృద్ధిలో తిరోగమనంలో ప్రయాణిస్తోందని విమర్శించారు. అతివృష్టి వల్ల పంటలు, పశువులు, ఇళ్లను కోల్పోయిన రైతులను, ప్రజలను ఆదుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు. కరువు తాలూకాలు ప్రకటనకు మాత్రమే పరిమితమయ్యాయని తెలిపారు. కరువు ప్రాంతాల్లో ప్రజలకు మేలుచేకూరే పనులు ఒక్కటి కూడా జరగడం లేదని విమర్శించారు. అధికారులపై తరుచుగా ఆగ్రహం వ్యక్తం చేసే బదులు వారి ఆలోచనలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని యడ్యూరప్ప సీఎం సిద్ధరామయ్యకు సలహా ఇచ్చారు. ఇదే సమయంలో శాసనసభ ప్రతిపక్ష నాయకుడు జగదీష్ శెట్టర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో జలాశయాలు దాదాపు గరిష్ట నీటిమట్టాన్ని కలిగి ఉండి అందుకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నా కూడా ప్రజలు విద్యుత్ కోతలు ఎదుర్కొంటుండటం ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనమన్నారు. ఇందుకు ప్రజలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఇంధనశాఖ మంత్రి డీకే శివకుమార్ సమాధానం చెప్పితీరాలని శెట్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చెత్త ఉద్యోగులపై చర్యలు
సీఎం సిద్ధరామయ్య హెచ్చరిక ‘బీవీజీ’ నిర్లక్ష్యం వల్లే చెత్త సిటీగా బెంగళూరు నిర్లక్ష్యపు గుత్తేదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోండి సాక్షి, బెంగళూరు : చెత్త సేకరణ, నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే కాంట్రాక్టర్లతో పాటు సంబంధిత అధికారులపై కఠిన చర్యలకు వెనుకాడబోమని సీఎం సిద్ధరామయ్య హెచ్చరించారు. మరోసారి బెంగళూరులో చెత్త సమస్య తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. స్థానిక మహాలక్ష్మి లే అవుట్లో రూ.3 కోట్లతో తలపెట్టిన అభివృద్ధి పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల బెంగళూరు చెత్తసిటీగా పేరు తెచ్చుకోవడానికి చెత్త నిర్వహణ పనులు దక్కించుకున్న బీవీజీ సంస్థ నిర్వాహకమే కారణమని ఆరోపించారు. ఇకపై ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్త వహించాలన్నారు. ప్రస్తుతం బీబీఎంపీ పరిధిలో 130 వార్డులో చెత్త తొలగింపు పనులను కాంట్రాక్టర్లకు అప్పగించామన్నారు. ఈ చెత్త నిర్వహణలో విఫలమైన గుత్తేదారులపై చట్టపరమైన చర్యలకు వెనకాడవద్దని అధికారులను హెచ్చరించారు. పన్నుల వసూలు విషయంలో సంబంధిత అధికారులకు విధించించిన లక్ష్యాలను వెంటనే పూర్తి చేయూలన్నారు. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి.. వాననీటిలో కొట్టుకుపోయి ఓ చిన్నారి మరణించిన ఘటనకు సంబంధించి ఒక్కరికి కూడా శిక్షపడలేదని గీతాలక్ష్మి ఉదంతాన్ని ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య ఉటంకించారు. ఇదే సంఘటన పాశ్చాత్య దేశాల్లో జరిగితే సంబంధిత అధికారికి ఎంతటి కఠిన శిక్ష విధించే వారో ఊహించలేనిదని బీబీఎంపీ అధికారులను ఉద్దేశించి పేర్కొన్నారు. ఇకనైనా ఇలాంటి ఘటనలకు తావివ్వకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులకు హితవు పలికారు. కార్యక్రమంలో మేయర్ శాంతకుమారి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మాకీ గతేంటి?
అధికారుల తీరుపై సీఎం సిద్ధు సీరియస్ మీ నిర్లక్ష్యంతో మాకు ఇబ్బందులు ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలి ప్రతి మూడు నెలలకు ఓసారి సమీక్ష నిర్వహించాలి జిల్లా ఇన్చార్జ మంత్రి గైర్హాజర్ అయితే చర్యలు పన్నుల వసూలుపై నిర్లక్ష్యం వీడండి సహాయక చర్యల్లో అవకతవకలు, జాప్యం చేయొద్దు సాక్షి, బెంగళూరు : కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా పనిచేస్తుండటంతో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసహనం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరిగితే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెంగళూరులోని విధానసౌధాలో సీఎం అధ్యక్షతన మంత్రులు, వివిధ ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, కలెక్టర్లతో ఉన్నత స్థాయి సమావేశం సోమవారం జరిగింది. అందులో వివిధ శాఖల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, అధికారుల తీరుతెన్నులను సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. నిర్ధిష్ట సమయంలోపు ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆ పరిస్థితి ఎదురుకాకుండా జాగ్రత్త వహించాలని హితవు పలికారు. ముఖ్యంగా జిల్లా స్థాయి అధికార యంత్రాంగం సరిగా విధులు నిర్వహిస్తే ప్రజల సమస్యల్లో 80 శాతం అప్పటికప్పుడు పరిష్కారమవుతాయన్నారు. ఇందు కోసం జిల్లా ఇన్చార్జ్ మంత్రులతో పాటు కలెక్టర్లు రెండు, మూడు నెలలకు ఒకసారి సమీక్ష సమావేశం జరపాలని సూచించారు. ఈ సమావేశంలో పాల్గొనని జిల్లా ఇన్చార్జ్ మంత్రుల పై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పన్నులు వసూలు చేయండి.. బృహత్ బెంగళూరు మహానగర పాలికే పరిధిలో అనుకున్నంత మేరకు పన్నులు వసూలు కావడం లేదని సిద్ధరామయ్య సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీ ఖాతా పొందన భవన యజమానులు చాలా ఏళ్లుగా పన్నులు కట్టకున్నా సంబంధిత అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం తగదన్నారు. పన్నుల రాబడి పెంచడం కోసం ఎన్ని సమావేశాలు నిర్వహించామన్నది ముఖ్యం కాదని.. ఎంత పన్నులు వసూలు చేశామన్నది ముఖ్యమని పేర్కొన్నారు. ఇక అభివృద్ధి పనుల్లో కూడా సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదన్నారు. ఇందుకు చిన్నపాటి వర్షానికే కొట్టుకుపోతున్న రోడ్లే ప్రత్యక్ష ఉదాహరణమని అసహనం వ్యక్తం చేశారు. సహాయ కార్యక్రమాలపై సుదీర్ఘ చర్చ రాష్ట్రంలో ఓ వైపు అతివృష్టి.. మరోవైపు అనావృష్టి ఏర్పడిన వైనంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. సహాయ చర్యలకు అవసరమైన నిధుల కొరత లేదని అధికారులకు స్పష్టం చేశారు. అందువల్ల ప్రజలకు ముఖ్యంగా గ్రామీణులకు ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. కరువు కోరల్లో చిక్కుకున్నవారికి ప్రత్యాన్మాయ పనులు చూపించడంలో విఫలమైతే వలసలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అతివృష్టి వల్ల నష్టపోయినవారికి పరిహారం చెల్లింపులో ఎటువంటి అవకతవకలు జరిగినా, ఆలస్యమైనా సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. -
గుండె దడ!
పదవుల పంపకంపై సమావేశం నేతలతో చర్చించిన సిద్ధు, పరమేశ్వర్ ఎన్నికల్లో ఓడినవారిని గుర్తించాలని పలువురి విజ్ఞప్తి సామర్థ్యాన్ని బట్టి కేటాయిస్తామన్న సీఎం ఓడిన అందరికీ కేటాయించలేమన్న కేపీసీసీ చీఫ్ సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్ నేతల్లో గుండె దడ పెరిగిపోతోంది. ఆశించిన పదవులు దక్కుతాయో లేదో అన్న ఆందోళన ఆశావహుల్లో చోటు చేసుకోగా, పదవులు కట్టబెట్టడంలో ఏమైనా పొరబాట్లు జరిగితే పార్టీలో అసంతృప్తి పెరిగిపోయే ప్రమాదముందని అగ్రనేతలతో దడ మొదలైంది. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో తమకూ తగిన ప్రాధాన్యతనివ్వాలంటూ గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం క్యాంపు కార్యాలయం కృష్ణలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ పరమేశ్వర్తో నెల నరేంద్రబాబు, బి.ఎల్. శంకర్, అంజనామూర్తితో సహ 60 మంది ఆదివారం సమావేశమై తమ ప్రధాన డిమాండ్ను వినిపించారు. తమ అభ్యర్థనను మన్నిస్తే రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టుకునేందుకు అవకాశముంటుందని సూచన చేశారు. అతి తక్కువ ఓట్ల తేడాతో తాము ఓటమి పాలయ్యామని, ఈ విషయాన్ని గమనిస్తే తమకు నైతికంగా ప్రజల మద్దతు ఉన్నట్లు స్పష్టమవుతోందని వివరించారు. ఎమ్మెల్యేలకు మాత్రమే నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యతనివ్వడం సబబుగా లేదని పేర్కొన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి నిధుల విడుదల, ప్రభుత్వ కార్యాక్రమాల్లో వారికే పెద్ద పీట వేస్తున్నారని నిష్టూరమాడారు. కనీసం నామినేటెడ్ పోస్టుల విషయంలోనైనా తమకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. దీనిపై సిద్ధరామయ్య మాట్లాడుతూ... శక్తిసామర్థ్యాలను బట్టి నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని అన్నారు. ఇదే సమయంలో పరమేశ్వర్ మాట్లాడుతూ.. ఓటమి పాలైనవారందరికీ నామినేటెడ్ పోస్టులను ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. అయితే స్థానికంగా వారికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి మొత్తం పోస్టుల్లో 30 శాతం వరకూ కేటాయిస్తామని వివరించారు. మిగిలిన వాటిలో కొన్ని సీనియర్లకు, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన వారికి, మంత్రి పదవులు ఆశిస్తున్న వారికి కేటాయించబోతున్నట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో తాము ఆశించిన పదవులు దక్కలేదన్న అక్కసుతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. -
.. ఆ అధికారం ప్రభుత్వానికి లేదు
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరు : అక్రమాస్తుల కేసులో ఇక్కడి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో కారాగార వాసాన్ని అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను ఆ రాష్ట్ర జైలుకు తరలించే విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోజాలదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. క్యాంప్ కార్యాలయం కృష్ణాలో మంగళవారం ఆయన జనతా దర్శన్లో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని జయను తమిళనాడు జైలుకు తరలించాలని మాజీ ప్రధాని దేవెగౌడ చేసిన ప్రకటనపై స్పందిస్తూ, దీనిపై సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే బెంగళూరులో జయ కేసు విచారణ జరిగిందే తప్ప, రాష్ట్రం పాత్ర ఏమీ లేదని స్పష్టం చేశారు. జయను జైలు నుంచి విడుదల చేయకపోతే కన్నడిగులను ముట్టడిస్తామని తమిళనాడులో కొందరు హెచ్చరించడం సరికాదని హితవు పలికారు. మనమంతా సమైక్య వ్యవస్థలో నివసిస్తున్నందున రాష్ట్రంలోని తమిళులకు, తమిళనాడులోని కన్నడిగులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉందని అన్నారు. కాగా విజయ దశమి సందర్భంగా చాముండి దేవికి పూలమాల వేసే సందర్భంలో తాను బూట్లు ధరించానని కొన్ని ఛానెళ్లు ప్రచారం చేయడంపై మండిపడ్డారు. తాను సాక్స్ మాత్రమే ధరించానని, దీనిపై ఆ ఛానెళ్లకు నోటీసులిస్తానని వెల్లడించారు. -
ఆగని విమర్శలు
సాక్షి, బెంగళూరు : మహాత్ముడి విగ్రహావిష్కరణకు సంబంధించి శాసనమండలి అధ్యక్షుడు శంకరమూర్తిపై విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ‘ఆయన ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిచి తప్పుచేశాం’ అని ఘాటుగా స్పందించారు. విధానసౌధ, వికాస సౌధ మధ్య ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహవిష్కరణ గురువారం జరిగింది. ఇందుకు ఏర్పాటు చేసిన వేదికపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, స్పీకర్ కాగోడు తిమ్మప్ప, మండలి అధ్యక్షడు శంకరమూర్తితో పాటు ఆర్ఎస్ఎస్ నాయకుడు చక్రవర్తి సూలిబెరె ప్రసంగించారు. అనంతరం కేపీసీసీ కార్యాలయంలో జరిగిన గాంధీ జయంతి వేడుకకు సీఎం సిద్ధరామయ్య హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంటు సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి వీరప్పమొయిలీ మాట్లాడుతూ... గాంధీజీ ని ఆర్ఎస్ఎస్ పొట్టన బెట్టుకుందని, ఆ సంస్థకు చెందిన చక్రవర్తిసూలిబెరెను ఈ కార్యక్రమానికి ముఖ్య ఉపన్యాసకుడిగా ఆహ్వానించడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. గతంలో ఆయన ప్రసంగించిన చాలా ప్రాంతాల్లో మతఘర్షణలు జరిగిన విషయం ప్రభుత్వం ృష్టికి రాలేదా? అని నిలదీశారు. నరేంద్రమోడీ ప్రధాని అయినప్పటి నుంచి దేశంలో యుద్ధభయం పెరుగుతోందపి వీరప్పమొయిలీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు ఆయన అనుసరిస్తున్న విదేశాంగ విధానాలే కారణమన్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ చక్రవర్తి సూలిబెరెను కార్యక్రమానికి ఆహ్వానించి తప్పు చేశామన్నారు. ఆయన కార్యక్రమానికి వస్తున్నట్లు తనకు ముందు తెలియదన్నారు. కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను మండలి అధ్యక్షుడు శంకరమూర్తికి అప్పగించి పొరపాటు చేశామన్నారు. అయితే కార్యక్రమం మధ్యలో ఈ విషయాలన్నింటినీ ప్రస్తావించడం మహాత్మాగాంధీని అవమానించినట్లవుతుందనే ఉద్దేశంతో మిన్నకుండిపోయానని సిద్ధరామయ్య వివరణ ఇచ్చారు. కాగా, అంతకు ముందు విగ్రహవిష్కరణ సందర్భంగా మాట్లాడిన సిద్ధరామయ్య జాతి, కుల, మత వర్గాల పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలనుృసష్టించాలని ప్రయత్నిస్తున్న వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. అహింసను బోధించిన గాంధీ మహాత్ముని మార్గంలో పయనించినప్పుడే శాంతియుత జీవనానికి వీలవుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా విగ్రహ రూపకర్తలు రామ్ వీ. సుతార్, ఆయన కుమారుడు అనిల్ ఆర్ సుతార్లను మండలి అధ్యక్షుడు డీ.హెచ్ శంకరమూర్తి మైసూరు పేటా, శాలువాతో సత్కరించారు. -
ఆవిష్కరణ వివాదం
ప్రొటోకాల్ పాటించడం లేదంటూ మంత్రి రోషన్బేగ్ ఆగ్రహం ఆహ్వాన కమిటీ చైర్మన్ శంకరమూర్తిపై విమర్శలు ప్రొటోకాల్ మేరకే ఆహ్వానమన్న మండలి అధ్యక్షుడు కార్యక్రమాన్ని వాయిదా వేయాలని వాటల్ వినతి గాంధేయవాదులను విస్మరించారని ఆరోపణ ఆహ్వాన పత్రికలో నగర ప్రథమ మహిళ పేరును ప్రస్తావించకపోవడంపై అసహనం సాక్షి, బెంగళూరు : జాతిపిత విగ్రహావిష్కరణ కార్యక్రమం నేతల మధ్య వివాదానికి తెరలేపింది. విధానసౌధ, వికాససౌధ మధ్య 22 అడుగుల ఎత్తై గాంధీ విగ్రహాన్ని నేడు(గురువారం) ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ విషయంలో ప్రోటోకాల్కు తిలోదకాలిచ్చారంటూ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి రోషన్బేగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేపీసీసీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించే సమయంలో పాటించాల్సిన నియమాలను విస్మరించారని అసహనం వ్యక్తంచేశారు. గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ప్రాంతం శివాజీనగర నియోజకవర్గ పరిధిలోకి వస్తుందని, ఆ ప్రాంతానికి ఎమ్మెల్యేనైన తానే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే ఈ విషయాలు ఏవీ తెలియని శాసన మండలి అధ్యక్షుడు డి.హెచ్.శంకరమూర్తి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నారని మండిపడ్డారు. కాగా, అసెంబ్లీ, మండలి సభా కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ప్రత్యేక చానల్కు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుమతి తెలిపారని అన్నారు. త్వరలో చానల్ ప్రారంభమవుతుందని తెలిపారు. అలాగే న్యాయపరమైన చిక్కుల వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన కేబుల్ నెట్వర్క్ వ్యవస్థ ఆలస్యమవుతోందని పేర్కొన్నారు. ప్రోటోకాల్ మేరకే ఆహ్వానం మహాత్ముడి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అతిథులను ఆహ్వానించే విషయంలో తాము పారదర్శకంగానే ఉన్నామని విధానపరిషత్ సభాపతి డి.హెచ్.శంకరమూర్తి స్పష్టం చేశారు. కార్యక్రమ నిర్వహణలో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ రాష్ట్ర మంత్రి రోషన్బేగ్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆవిష్కరణకు సంబంధించి తన అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ పారదర్శకంగానే వ్యవహరిస్తోందని అన్నారు. శాసనసభ, మండలి విపక్ష నేతలను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించినట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రులు యడ్యూరప్ప, జగదీష్శెట్టర్, ఎస్ఎం ృ ష్ణను కూడా ఆహ్వానించినట్లు తెలిపారు. అయితే కమిటీ సభ్యులు సూచన మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కొద్ది మంది పేర్లు మాత్రమే ఆహ్వాన పత్రికలో ముద్రించినట్లు చెప్పారు. విగ్రహావిష్కరణను వాయిదా వేయండి గాంధీజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని శాసనమండలి అధ్యక్షుడు డీహెచ్ శంకరమూర్తిని మాజీ శాసనసభ్యుడు వాటాళ్ నాగరాజు కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన విధానసౌధలో శాసనమండలి అధ్యక్షున్ని కలుసుకుని ఓ వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రంలోని గాంధేయవాదులతోపాటు అర్హులైన చాలామందిని ప్రభుత్వం ఆహ్వానించలేదన్నారు. అంతేకాక ఆహ్వాన పత్రికల్లో ప్రోటోకాల్ ప్రకారం పేర్లను ముద్రించక పోవడం వల్ల వారికి అవమానం జరిగిందని చెప్పారు. నగర ప్రథమ మహిళ, బీబీఎంపీ మేయర్ శాంతకుమారి పేరు కూడా ఆహ్వాన పత్రికలో లేకపోవడం ఇందుకు నిదర్శనమని అసహనం వ్యక్తం చేశారు. అందువల్ల కార్యక్రమాన్ని వాయిదా వేసి ప్రోటోకాల్ పాటిస్తూ అందరినీ ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. -
ప్రతి ఇంటికీ సైన్స్
అన్ని జిల్లాల్లో విజ్ఞాన శాస్త్ర కేంద్రాలు శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకోవాలి మూఢ నమ్మకాలతో సమాజాభివృద్ధి కుంటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలోని అన్ని జిల్లాల్లో ఉప ప్రాంతీయ విజ్ఞాన శాస్త్ర కేంద్రాలను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. మంగళూరులోని పిలికులలో బుధవారం ఆయన ప్రాంతీయ విజ్ఞాన శాస్త్ర కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ విజ్ఞాన శాస్త్రం ప్రతి ఇంటి ముంగిట చేరాలని, విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకోవాలని ఉద్బోధించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయపడుతుందని చెప్పారు. మూఢ నమ్మకాలను ఇంకా ఆచరిస్తూ ఉంటే సమాజం అభివృద్ధి చెందలేదని పేర్కొన్నారు. బసవన్న లాంటి వారు కర్మ సిద్ధాంతాన్ని తిరస్కరించారని గుర్తు చేస్తూ, అనేక మంది ఇంకా జన్మ, పునర్జన్మలను విశ్వసిస్తున్నారని ఎద్దేవా చేశారు. గత జన్మ, వచ్చే జన్మ అంటూ ఉండదని, వాటి గురించి ఎవరికీ తెలియదని అన్నారు. బసవన్న వాస్తవాన్ని స్వర్గంగా, మూఢ నమ్మకాన్ని నరకంగా అభివర్ణించారని చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు మూఢ నమ్మకాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి పౌరుడు శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకోవాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలోని 51 ఏహెచ్ అధికరణకు సవరణను తీసుకొచ్చారని తెలిపారు. అయినప్పటికీ మనం అడుగు ముందుకు వేయలేక పోతున్నామని, తద్వారా సమాజం వృద్ధి చెందలేక పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళయానం విజయవంతంగా పూర్తయిందని, తొలి ప్రయత్నంలోనే సఫలం కావడం ద్వారా ప్రపంచ పటంలో ఇండియా లీడర్గా ఆవిర్భవించిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీపాద్ యెస్సో నాయక్ మాట్లాడుతూ జిల్లాల్లో ఉప ప్రాంతీయ విజ్ఞాన శాస్త్ర కేంద్రాలను రాష్ర్ట ప్రభుత్వం ప్రారంభించదల్చితే, కేంద్రం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. రాష్ట్ర ఐటీ, బీటీ శాఖ మంత్రి ఎస్ఆర్. పాటిల్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి రమానాథ్ రై ప్రభృతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ కేంద్రాన్ని నెలకొల్పాయి. -
బళ్లారి జిల్లాకు రూ.850 కోట్ల ప్రత్యేక నిధులు
సీఎం సిద్ధరామయ్య సాక్షి, బళ్లారి : బళ్లారి జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.850 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఆయన సోమవారం బళ్లారి జిల్లాలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలను, జిల్లా ప్రగతి పరిశీలన సమావేశంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. బళ్లారి గ్రామీణ ఉప ఎన్నికల సందర్భంగా బళ్లారిలో అనేక సమస్యలు ఉన్నట్లు గుర్తించామన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ బళ్లారి తాలూకాలో రెండు రోజుల పాటు ఉండి తన శాఖ పరిధిలో బళ్లారి జిల్లాకు రూ.204 కోట్ల నిధులు కావాలని కోరారన్నారు. ఆయన కోరిన విధంగా బళ్లారి జిల్లాకు నిధుల మంజూరుకు ఆమోద ముద్ర వేశానన్నారు. ప్రస్తుతం బళ్లారి జిల్లాకు రూ.850 కోట్ల ప్రత్యేక నిధులు విడుదల చేశామని, ఇందులో రోడ్లు, మంచినీటి సమస్య తీర్చేందుకు, విద్యుత్, ఇళ్ల నిర్మాణాలకు ఖర్చు చేస్తారన్నారు. మంచినీటి సమస్య ఏర్పడకుండా అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. బళ్లారి జిల్లా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధంగా ఉందన్నారు. బళ్లారి తాలూకాలోని సిరివార, చాగనూరు వద్ద విమానాశ్రయ నిర్మాణం గురించి తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వ్యతిరేకించానని, అయితే అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని భూమిని కొనుగోలు చేసిందన్నారు. ప్రస్తుతం విమానాశ్రయ నిర్మాణ మా లేక మరేదైనా నిర్మాణం చేపట్టాలా? అనే విషయంపై ఆలోచిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు డీకే శివకుమార్, అంబరీష్, పరమేశ్వరనాయక్, ఉమాశ్రీ పాల్గొన్నారు. -
ఆధునికత దిశగా వ్యవసాయం
సాక్షి, బెంగళూరు : రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే దిశలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ధార్వాడలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కృషి వేళాను నిర్వహిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం ప్రారంభించిన ఈ మేళా రెండు రోజుల పాటు సాగుతుంది. కాగా, రైతులు, స్థానిక ప్రజల కోరిక మేరకు ‘మేళా’ వ్యవధిని మరిన్ని రోజులు పెంచే ఆలోచన ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మేళాలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తక్కువ వ్యవధిలో ఎక్కువ దిగుబడి సాధించే విధానాలు, వివిధ వ్యవసాయ వర్శిటీలు ఇటీవల అభివృద్ధి చేసిన నూతన వంగడాలను రైతులకు పరిచయం చేశారు. ఈ మేళకు కేవలం స్థానిక రైతులే కాకుండా చుట్టు పక్కల జిల్లాల నుంచి కూడా పలువురు తరలివచ్చారు. ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణభైరేగౌడ తదితరులు పాల్గొన్నారు. -
మేము కాదు!
జయలలితకు శిక్ష ప్రకటనపై కర్ణాటకకు సంబంధం లేదన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పరప్పన అగ్రహార ఎదుట జయలలిత మద్దతుదారుల నిరసన తమిళనాడుకు కేఎస్ఆర్టీసీ బస్సు సర్వీసుల నిలిపివేత సాక్షి, బెంగళూరు : అన్నా డీఎంకే అధినేత్రి జయలలితకు శిక్ష పడటానికి కర్ణాటక ఏమాత్రం కారణం కాదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కర్ణాటకలో కేసు విచారణ జరిగినందువల్లే జయలలితకు శిక్ష పడిందంటూ తమిళనాడులో కొన్ని వదంతులు వ్యాపిస్తున్నాయంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు సిద్ధరామయ్య ఈ విధంగా సమాధానమిచ్చారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా పాటిస్తుందని, ఇందులో ఎవరి ప్రమేయం ఉండబోదని అన్నారు. అసత్య వదంతులను నమ్మి శాంతికి భంగం కలిగించే ప్రయత్నాలు చేయడం ఎవరికీ మంచిది కాదని సూచించారు. రాష్ట్ర యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో ఆదివారమిక్కడి విధానసౌధ ఎదుట నిర్వహించిన యువచేతన బైక్ ర్యాలీని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. న్యాయస్థానంలో జరిగిన విచారణలో జయలలిత దోషి అని తేలిందని, ఇందులో కర్ణాటక ప్రమేయం ఎంతమాత్రం లేదని అన్నారు. అనవసరంగా కర్ణాటకనుగానీ, ఇక్కడి ప్రభుత్వాన్ని గానీ ఈ విషయానికి సంబంధించి బాధ్యులను చేస్తూ అమాయకులైన ప్రజలను రెచ్చగొట్టడం సమంజసం కాదని హితవు పలికారు. పరప్పన ఎదుట ఆందోళన.... ఇక పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఉన్న తమ నాయకురాలు జయలలితను కలిసేందుకు ఆదివారం తమిళనాడు రాష్ట్ర మంత్రులతో పాటు వందల సంఖ్యలో మద్దతుదారులు, అన్నా డీఎంకే కార్యకర్తలు వచ్చారు. అయితే వీరిని జైలులోపలికి అనుమతించేందుకు పోలీసులు నిరాకరించడంతో అక్కడ కాసేపు వాతావరణం ఉద్రిక్తంగా మారింది. తమ ‘అమ్మ’ లేకుండా తమిళనాడు రాష్ట్రం అనాధ అయిపోయిందంటూ పరప్పన అగ్రహార వద్దకు చేరుకున్న మహిళలు గుండెలు బాదుకుంటూ రోదించారు. దీంతో పరప్పన అగ్రహార జైలు వద్దకు చేరుకున్న సీనియర్ పోలీసు అధికారులు జయలలిత మద్దతుదారులందరినీ అక్కడినుండి పంపివేసి భద్రతా చర్యలను పర్యవేక్షించారు. కేఎస్ఆర్టీసీ బస్ల నిలిపివేత.... ఇక అన్నాడీఎంకే అధినేత్రికి జైలు శిక్ష పడిన నేపథ్యంలో కర్ణాటక నుంచి తమిళనాడుకు వెళ్లే అన్ని బస్ సర్వీసులను కేఎస్ఆర్టీసీ నిలిపివేసింది. జయలలితకు శిక్షను ఖరారుచేస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించిన నేపథ్యంలో తమిళనాడులో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో కేఎస్ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేఎస్ఆర్టీసీ బస్లకు ఏదైనా హాని కలగవచ్చనే అనుమానంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఆదివారం రాత్రి తొమ్మిది గంటల తరువాత బస్ సర్వీసులను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. -
2030 నాటికి 50 శాతం జనాభా పట్టణాల్లోనే
ఆ మేరకు రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలి సీఎం సిద్ధరామయ్య సాక్షి, బెంగళూరు : ప్రభుత్వ గణాంకాలను అనుసరించి 2030 నాటికి కర్ణాటక జనాభాలో 50 శాతానికి పైగా జనాభా పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఆమేరకు పట్టణ రవాణా వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి సహకరించాల్సిందిగా స్వీడన్ దేశ ప్రతినిధులను కోరారు. స్వీడన్ దేశ సహకారంతో ‘పట్టణ రవాణ వ్యవస్థ-ఉత్తమ భాగస్వామ్య పద్దతులు’ అనే విషయమై బెంగళూరులో సోమవారం అంతర్జాతీయ సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిద్ధరామయ్య మాట్లాడుతూ... రవాణా వ్యవస్థ ఆయా ప్రాంతాల ఆర్థిక స్థితిగతులతో పాటు ప్రజల ఉత్తమ జీవన ప్రమాణాలకు నిదర్శనంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పట్టణాల్లో ముఖ్యంగా బెంగళూరులో రవాణా వ్యవస్థ సరిగా లేదన్నారు. ముఖ్యంగా పాదచారులకు అనువైన ఫుట్పాత్లు, సైకిలిస్టుల ప్రత్యేక మార్గాలు లేవన్నారు. వీటిని అభివృద్ధి చేయడం వల్ల పర్యావరణానికి ఉపయోగమేకాకుండా ట్రాఫిక్ ఇబ్బందులను కూడా తప్పించవచ్చునన్నారు. వివిధ కారణాల వల్ల కర్ణాటలో పట్టణీకరణ పెరుగుతోందన్నారు. అందుకు అనుగుణంగా రవాణా వ్యవస్థను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇందుకు ప్రైవేటుతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా అవసరమన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని నరేంద్రమోదీ పాల్గొనే ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి హోదాలో తాను కూడా పాల్గొంటానని తెలిపారు. బీదర్లో పాత్రికేయులపై దాడి సమర్థనీయం కాదన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో స్వీడన్ అంబాసిడర్ హెచ్.ఈ హరాల్డ్ సాండ్బర్గ్, ఆ దేశ వాణిజ్య మంత్రిత్వశాఖ సలహాదారు జాన్సన్స్ హాప్స్ట్రోమ్, రాష్ట్ర మంత్రులు రామలింగారెడ్డి, వినయ్కుమార్ సూరకే తదితరులు పాల్గొన్నారు. -
సీఎం@ ఆన్లైన్
సోషల్ మీడియా వైపు సిద్ధు దృష్టి ముఖ్యమంత్రి పేరుతో వెబ్సైట్, ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్లు యూట్యూబ్లోనూ సీఎం కార్యక్రమాలు యువతకు చేరువ కావడమే లక్ష్యమన్న సీఎం మోడీతో కలిసే బెంగళూరు నుంచి తుమకూరు వెళ్తానని స్పష్టీకరణ సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలోని యువతకు చేరువ కావడం కోసమే తాను సోషల్ మీడియా వైపు దృష్టి సారించానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. సీఎం పేరిట ప్రత్యేక వెబ్సైట్, ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా విధాన సౌధలో సోమవారం జరిగిన కార్యక్రమంలో సీఎం వీటిని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలను నేరుగా కలుసుకోవడానికే తాను ఇష్టపడతానన్నారు. రాష్ట్ర జనాభాలో 35 ఏళ్ల కంటే తక్కువ వయసుతో దాదాపు 65 శాతం మంది ఉన్నారని వెల్లడించారు. వీరంతా స్మార్ట్ఫోన్లు, ల్యాప్ట్యాప్లను చేత పట్టుకుని ఎప్పుడూ సోషల్ మీడియాలను అనుసరిస్తుంటారని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాల్సి ఉంటుందన్నారు. అందువల్లే రాష్ట్ర యువతకు చేరువ కావడం కోసం తాను కూడా ఈమీడియాలో సభ్యుడిని కావాల్సి వచ్చిందని వివరించారు. ఈ అంశాల్లో తనకు సాంకేతిక పరిజ్ఞానం కొంత తక్కువ కనుక, త్వరలోనే అవగాహన పెంచుకుంటానని చెప్పారు. కాగా ప్రధాని నరేంద్ర మోడీతో కలిసే తాను బెంగళూరు నుంచి తుమకూరుకు వెళతానని తెలిపారు. తనకు వ్యతిరేకంగా ఎవరూ ఎలాంటి నినాదాలు చేయబోరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సీఎం సామాజిక సైట్ల నిర్వహణ కోసం నియమించిన ప్రత్యేక అధికారి శివరుద్రప్ప మాట్లాడుతూ... ఇక పై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొనే ప్రతి కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, ప్రసంగ పాఠాలను ఈ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తామన్నారు. అంతేకాకుండా సీఎం పాల్గొనబోయే అధికారిక కార్యక్రమాలను కూడా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ముఖ్యమంత్రి అనుమతి తీసుకుని తాము ఫేస్బుక్, ట్విట్టర్లో సందేశాలను (మెసేజ్) పోస్ట్ చేస్తామన్నారు. యూట్యూబ్లో కూడా సీఎం పాల్గొన్న కార్యక్రమాలను అప్లోడ్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సమాచారశాఖ మంత్రి రోషన్ బేగ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. www.cmkarnataka.gov.in ఫేస్బుక్ : cmofkarnataka ట్విట్టర్ : cmofkarnataka -
మోడీ సభలో పాల్గొంటా
సీఎం సిద్ధరామయ్య వెల్లడి అది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి హాజరవుతా లేకుంటే ఆ కార్యక్రమాన్ని బీజేపీ హైజాక్ చేస్తుంది బీజేపీ హయాంలో జరిగిన డీ నోటిఫికేషన్లపై దర్యాప్తు చేయిస్తా దసరా అనంతరం కార్పొరేషన్లు, బోర్డుల నియామకాలు బీబీఎంపీ విభజన వల్లే సమస్యల పరిష్కారం మూడు డివిజన్లుగా విభజించే యోచన సాక్షి ప్రతినిధి, బెంగళూరు : తుమకూరులో ఈ నెల 24 ప్రధాని నరేంద్ర మోడీ సభలో పాల్గొంటానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. నగరంలోని ఛాన్సెరీ పెవిలియన్ హోటల్లో శనివారం రోజంతా జరిగిన కేపీసీసీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతున్న సందర్భంగా, మోడీ సభలో పాల్గొనవద్దని పదాధికారులు డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో మన పార్టీకి చెందిన ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, మోడీ సభలో పాల్గొన్నప్పుడు చేదు అనుభవం ఎదురైందని గుర్తు చేశారు. కనుక ఆ సమావేశానికి వెళ్లకపోవడమే మంచిదని సూచించారు. దీనిపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ కార్యక్రమం కనుక ప్రధాని పాల్గొనే సభకు ముఖ్యమంత్రిగా తాను హాజరు కావడం రాజ్యాంగ విధి అని అన్నారు. ఒక వేళ తాను హాజరుకాకపోతే బీజేపీ ఈ మొత్తం కార్యక్రమాన్నే హైజాక్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కనుక ఏదెలా ఉన్నా ప్రోటోకాల్ను పాటించడం తన కర్తవ్యమని ఆయన చెప్పారు. బీజేపీ డీ నోటిఫికేషన్లపై దర్యాప్తు రాష్ర్టంలో బీజేపీ హయాంలో జరిగిన పది వేల ఎకరాల డీ నోటిఫికేషన్ వ్యవహారంపై దర్యాప్తు జరిపిస్తానని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్కటంటే ఒక ఎకరాను కూడా డీనోటిఫై చేయలేదని తెలిపారు. బీజేపీ నాయకులు అసత్యాలను వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కనుక వారి హయాంలో జరిగిన డీనోటిఫికేషన్లపై దర్యాప్తు జరిపించడం ద్వారా వారి అసలు రంగు బయటపెడతానని సవాలు విసిరారు. కాంగ్రెస్ రహిత భారత్ అంటూ బీజేపీ వారు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. దసరా అనంతరం కార్పొరేషన్లు, బోర్డుల నియామకాలను చేపడతామని ఆయన వెల్లడించారు. మూడుగా బీబీఎంపీ పాలనా సౌలభ్యం దృష్ట్యా బీబీఎంపీని మూడు డివిజన్లుగా విభజించాలని యోచిస్తున్నట్లు సీఎం తెలిపారు. దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ, నివేదిక సమర్పించిన వెంటనే ప్రభుత్వ నిర్ణయం వెలువడుతుందన్నారు. బెంగళూరు నగర విస్తీర్ణం ఇప్పుడు 80 చదరపు కిలోమీటర్లు దాటిపోయిందని, దీని వల్ల అనేక పాలనా సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. బీబీఎంపీ విభజనే దీనికి పరిష్కారమని ఆయన స్పష్టం చేశారు.. -
గూడు కోల్పోయిన వారికి అధిక నష్ట పరిహారం
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల ఇళ్లను కోల్పోయిన వారికి ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం ఇస్తున్న నష్ట పరిహారం చాలా తక్కువ కనుక, ఈ మొత్తాన్ని పెంచాలని యోచిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. విధాన సౌధలో శుక్రవారం ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం పక్కా ఇంటికి రూ.70 వేలు, ఇతరత్రా ఇళ్లకు రూ.20 వేలు చొప్పున నష్ట పరిహారం చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. గత ఆగస్టు 18 నుంచి 30 వరకు కురిసిన భారీ వర్షాల వల్ల 11 వేల ఇళ్లకు నష్టం వాటిల్లిందని తెలిపారు. వరదల వల్ల రూ.426 కోట్ల నష్టం వాటిల్లిందని, రూ.266 కోట్ల సాయం కోరుతూ కేంద్రానికి లేఖ రాశామని చెప్పారు. ఈ నెల 24న రాష్ర్ట పర్యటనకు వస్తున్న ప్రధానిని స్వయంగా కలుసుకుని ఈ విషయాన్ని ప్రస్తావిస్తానని చెప్పారు. యూనికోడ్ మొబైల్ అంతకు ముందు సీఎం యూనికోడ్ ఆధారిత మొబైల్ ఆప్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విధాన సౌధలోని కమిటీ రూంలో కన్నడ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ త్వరలోనే అన్ని ఇంటర్నెట్ సైట్లను కన్నడంలోకి తర్జుమా చేయనున్నట్లు తెలిపారు. కాగా నగరంలో కేసీ. రెడ్డి, నిజలింగప్ప, దేవరాజ్ అర్స్ లేఔట్ల నిర్మాణంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. -
ముక్కలు కానివ్వం
అఖండ కర్ణాటక విడిపోదు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం హై-క విమోచన దినోత్సవంలో సీఎం సిద్ధరామయ్య రాయచూరు రూరల్ : ఎలాంటి పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వబోమని, అఖండ కర్ణాటక ఎప్పటికీ విడిపోదని రాష్ర్ట ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. గుల్బర్గాలో బుధవారం నిర్వహించిన హై-క విమోచన దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. అంతకు ముందు పటేల్ రోడ్డులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఉత్తర కర్నాటకను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న మాజీ మంత్రి ఉమేష్ కత్తి.. తాను అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయంపై ఎం దుకు నోరు విప్పలేదని సీఎం ప్రశ్నిం చారు. అన్నదమ్ముల్లా మెలుగుతున్న కన్నడిగుల మధ్య ఉమేష్ కత్తి చిచ్చు రాజేస్తున్నారని మండిపడ్డారు. రెచ్చగొట్టే మాటలతో అలజడి సృష్టించవద్దని హితవు పలికారు. హై-క అభివృద్ధికి బోర్డు ఏర్పాటు చేసి రూ.600 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం రూ.150 కోట్లు నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. రాయచూరులో ఐఐటీ, ఎయిమ్స్ సంస్థల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. నవంబర్లో మంత్రి వర్గ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. అతివృష్టి, అనావృష్టి పీడిత ప్రాంతాల్లో నష్టంపై అంచనాలను వారం రోజుల్లో సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. -
నేనలా అనలేదు
‘శ్రీరామసేన’ నిషేధం వార్తలపై సీఎం సిద్ధరామయ్య మతవాద ముసుగులో అరాచకాలకు పాల్పడే వారిపై గూండాయాక్ట్ మతవాదులకు మద్దతిచ్చే వారే అలా మాట్లాడతారంటూ శోభాపై ఫైర్ సాక్షి, బెంగళూరు : శ్రీరామసేనపై నిషేధం విధించే ఆలోచనలో ఉన్నట్లు తానెక్కడా అనలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. మతవాద ముసుగులో బెదిరింపులు, అరాచకాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రమే చెప్పానని తెలిపారు. పేపర్ బాయ్స్గా ఉంటూ చదువులో ప్రతిభను కనబరుస్తున్న వారిని సత్కరించేందుకు గాను ప్రగతిపర పాత్రికేయుల సంఘం ఆధ్వర్యంలో శనివారమిక్కడి ప్రెస్క్లబ్ ఆవరణలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కార్యక్రమ అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘మతవాద ముసుగులో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. అలాంటి వ్యక్తులు, వ్యవస్థలపై గూండాయాక్ట్ను నమోదు చేయడానికి కూడా వెనుకాడం’ అని హెచ్చరించారు. ఇక ‘శ్రీరామసేనను నిషేధిస్తామంటున్న ముఖ్యమంత్రికి రాష్ట్రంలోని నేనలా అనలేదు ముస్లిం ధార్మిక సంస్థలను నిషేధించే ధైర్యం ఉందా’? అన్న ఎంపీ శోభాకరంద్లాజే వ్యాఖ్యలపై సిద్ధరామయ్య స్పందిస్తూ...‘మతవాదశక్తులకు మద్దతిచ్చే వారు మాత్రమే ఇలా మాట్లాడుతుంటారు’ అని విమర్శించారు. ఇక అంతకుముందు జరిగిన పేపర్బాయ్స్ సత్కార కార్యక్రమంలో సిద్ధరామయ్య మాట్లాడుతూ...పత్రికా రంగంలో పేపర్బాయ్స్ది అత్యంత ముఖ్యమైన పాత్ర అని పేర్కొన్నారు. పేపర్బాయ్గా పనిచేసిన అబ్దుల్కలామ్ అనంతరం ప్రముఖ శాస్త్రవేత్తగా ఎదగడంతో పాటు రాష్ట్రపతి కూడా అయ్యారని, మీరంతా ఆయన్ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సత్కార గ్రహీతలకు సూచించారు. మంత్రి వర్గంలోని అసమర్థులపై చర్చ.... ఇక మంత్రి వర్గ విస్తరణకు తాను కూడా సుముఖంగానే ఉన్నానని, అయితే మంత్రివర్గ పునర్నిర్మాణానికి మాత్రం అంగీకరించనని అన్నారు. మంత్రి వర్గంలోని అసమర్థులను ఆయా పదవుల నుంచి తప్పించాలనే ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో తాను కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్తో చర్చించనున్నానని, అయితే ఆ చర్చకు సంబంధించిన అంశాలను బహిరంగపరచలేనని తెలిపారు. మంత్రి వర్గ విస్తరణలో ఒక ముఖ్యమంత్రిగా తనకు పూర్తిస్థాయి అధికారాలున్నాయని, ఈ విషయంలో ఎవరి జోక్యాన్ని తాను అంగీకరించనని పేర్కొన్నారు. మైసూరు దసరా విషయంలో మహారాణి ప్రమోదాదేవి ఎక్కడా తన అభ్యంతరాన్ని తెలియజేయలేదని, ఈ విషయంలో వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలు మాత్రమేనని అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు వివాదం విషయంలో ‘మహాజన్ నివేదిక’ తమ అంతిమ నిర్ణయమని, ఈ విషయంలో ఎలాంటి చర్చలకు ఆస్కారం లేదని తెలిపారు. -
శ్రీరామసేనపై వేటు!
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య యోచన సంస్కృతి పరిరక్షణ పేరుతో దౌర్జన్యాలా? సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో ప్రమోద్ ముతాలిక్ సారథ్యంలోని శ్రీరామ సేనను నిషేధించాలని యోచిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. బెల్గాం పర్యటనలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ పక్క రాష్ట్రమైన గోవాలో ఇదివరకే శ్రీరామ సేనను నిషేధించారని గుర్తు చేశారు. సంస్కృతి పరిరక్షణ పేరుతో దౌర్జన్యాలకు దిగుతున్న ఇలాంటి సంస్థలకు ప్రజాస్వామ్య వ్యవస్థలో తావు లేదని తేల్చి చెప్పారు. శ్రీరామ సేన వైఖరిలో మార్పు వస్తుందని ఎదురు చూసినప్పటికీ, నిరాశే మిగిలిందని అంటూ దానిని నిషేధించాలని తీవ్రంగా యోచిస్తున్నట్లు చెప్పారు. కాగా నాలుగో తరగతి వరకు మాతృ భాషలోనే విద్యా బోధన సాగించాలనే విషయమై సుప్రీం కోర్టులో మరో అప్పీలును దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. దీనిపై ఇదివరకే దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను కోర్టు కొట్టి వేసినందున, న్యాయ నిపుణులతో చర్చించి అప్పీలుకు వెళ్లడానికి ప్రయత్నిస్తామన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ న్యాయ పోరాటం ముగిసిపోలేదని చెప్పారు. దీనిపై అఖిల పక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి వివిధ పార్టీలు అభిప్రాయాలు, సలహాలను స్వీకరిస్తామని తెలిపారు. కాగా కాంగ్రెస్ శాసన సభ్యులు విదేశ పర్యటనలకు వెళ్లిన విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, వారి ఖర్చుతో వెళితే తానేం చేయగలనని నిలదీశారు. ప్రభుత్వ ఖర్చయితే తాను సమాధానం చెప్పగలనని అంటూ, వ్యక్తిగత పర్యటనలపై వెళ్లే వారిని ఎలా నిలువరిస్తామని ఎదురు ప్రశ్నించారు. -
ఐతే ఓకే
నూతన పారిశ్రామిక విధానానికి మంత్రి మండలి ఆమోదం సాక్షి, బెంగళూరు : నూతన పారిశ్రామిక విధానానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన విధానసౌధలో గురువారం జరిగిన మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఫలితంగా రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో 15 లక్షల మందికి ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి రంగాలలో విస్తృత అవకాశాలు ఏర్పడనున్నాయి. మంత్రి మండలి నిర్ణయాలను మీడియా సమావేశంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర వెల్లడించారు. నూతన విధానంలో ఉత్పాదన రంగానికి పెద్ద పీట వేసి ఇందులో 20 శాతం అభివృద్ధి సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2014 నుంచి 2019 వరకూ అమల్లో ఉండే ఈ నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా రూ.5 లక్షల కోట్లు పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగాల కల్పనలో స్థానికులకు పెద్ద పీట వేయనుంది. రాష్ట్రంలోని మొత్తం తాలూకాలను ఆరు జోన్లుగా విభజించడం ద్వారా స్థానికతకు అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటు, రాయితీలు తదితర విషయాల్లో పారదర్శకత పెరుగనుంది. పరిశ్రమలు స్థాపించే ప్రాంతం, పెట్టుబడి పరిమాణాన్ని పరిగణలోకి తీసుకుని వడ్డీ రహిత రుణాలు ఇవ్వడంతో పాటు ఏడు నుంచి 14 శాతం వరకు వ్యాట్ నుంచి మినహాయింపు కూడా ఇవ్వనున్నారు. పారిశ్రామిక రంగంలో మహిళలను ప్రోత్సహించే దిశగా ఆరహళ్లి, హుబ్లీ - ధార్వాడల్లో ప్రత్యేక పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. పారిశ్రామిక అవసరాల కోసం భూములు ఇచ్చే కుటుంబంలో అర్హులైన ఒకరికి తప్పక ఉద్యోగం కల్పించడాన్ని చట్టబద్ధం చేయనున్నారు. మాతా శిశుమరణాలను అరికట్టడంలో భాగంగా రాష్ట్రంలోని 10 జిల్లాల్లో మాత్రం అమల్లో ఉన్న ‘మడలు’ పథకాన్ని మిగిలిన అన్ని జిల్లాలకు విస్తరించడానికి మంత్రిమండలి అంగీకరించింది. రాష్ట్రంలో నూతనంగా మూడు ప్రైవేట్ వైద్య కళాశాలకు అనుమతి లభించింది. హగరి నదిపై వంతెన నిర్మాణానికి అవసరమైన రూ.33.69 కోట్ల నిధుల విడుదలకు కూడా మంత్రి మండలి ఆమోదం దక్కింది. -
జిల్లాకొక మెడికల్ కళాశాల
సీఎం సిద్ధరామయ్య ఐదు ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఓ మెడికల్ కళాశాలతో పాటు ఐదు ప్రాంతాల్లో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. తద్వారా పేదలకు నాణ్యమైన వైద్యం చేరువ చేసేందుకు వీలుకలుగుతుందని అన్నారు. బెంగళూరులోని జయదేవ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన రెండు అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ల్యాబ్లను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జిల్లాకొక మెడికల్ కళాశాల ఏర్పాటు వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు కూడా వైద్య విద్యను అభ్యసించేందుకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు. మైసూరు, గుల్బర్గా, హుబ్లీ, బళ్లారి, బెల్గాంలో సూపర్స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించనున్నట్లు చెప్పారు. జయదేవ ఆస్పత్రి డెరైక్టర్ సి.ఎన్.మంజునాథ్ మాట్లాడుతూ దేశంలో ఏడు క్యాథలిక్ ల్యాబ్లు ఉన్న వైద్య సంస్థ తమదేనని తెలిపారు. నిరుపేదలకు ఎలాంటి రుసుం లేకుండా ఉచితంగా అత్యాధునిక వైద్యసేవలు అందిస్తున్నట్లు చెప్పారు. మైసూరులో 350 పడకల సామర్థ్యం గల మరోశాఖను రెండేళ్లలో ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. -
ఆదుకోండి...
అతివృష్టిపై కేంద్ర సాయం కోరిన సీఎం వరద నష్టం సుమారు రూ.400 కోట్లు 53 వేల హెక్టార్లలో పంట నష్టం నివేదికల తయారీలో అధికారులు నిమగ్నం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఉత్తర కర్ణాటకలోని ఎనిమిది జిల్లాల్లో గత నెలలో కురిసిన భారీ వర్షాల వల్ల అపార ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. వరద తాకిడికి గురైన గుల్బర్గ, రాయచూరు నగరాల్లో ఆయన శనివారం పర్యటించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైమానిక సర్వే నిర్వహించిన అనంతరం ఆయన గుల్బర్గలో హెలిప్యాడ్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వరద నష్టంపై వారంలోగా కేంద్రానికి నివేదిక సమర్పించి, పెద్ద మొత్తంలో నష్ట పరిహారం ఇవ్వాల్సిందిగా కోరుతామని చెప్పారు. ఉత్తర కర్ణాటకలో అతివృష్ట వల్ల ఎనిమిది జిల్లాల్లో రూ 400 కోట్లు పంట నష్టం జరిగిందని, 22 మంది చనిపోయారని తెలిపారు. సుమారు 53 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందన్నారు. ఈ నష్టాలపై నివేదికలను తయారు చేయడంలో అధికారులు నిమగ్నమై ఉన్నారని చెప్పారు. కాగా అక్టోబరు ఆఖరు వారం లేదా నవంబరు తొలి వారంలో గుల్బర్గలో మంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. గుల్బర్గ హైకోర్టు బెంచ్ పరిధిలోకి బళ్లారి, కొప్పళ జిల్లాలను చేర్చే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ బెంచ్ ఏర్పాటు విషయాన్ని కూడా ఇదే సమయంలో పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి వెంట రెవెన్యూ శాఖ మంత్రి వీ శ్రీనివాస ప్రసాద్, వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణ బైరేగౌడ, జిల్లా ఇన్చార్జి మంత్రి ఖమరుల్ ఇస్లాం, యాదగిరి జిల్లా ఇన్చార్జి మంత్రి బాబూరావు చించనసూరు తదితరులు ఉన్నారు. -
ఆప్ ఉద్యమ బాట
సాక్షి, బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వంలో అవినీతిపరులైన రాజకీయ నేతలు, అధికారుల సంఖ్య పెరిగిపోయిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విమర్శించింది. శుక్రవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆప్ ప్రతినిధి రవికృష్ణారెడ్డి మాట్లాడుతూ.... బీజేపీ ప్రభుత్వంలో అవినీతి కార్యకలాపాలు అధికం కావడంతోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారని అన్నారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవినీతి పరులకే మద్దతు తెలపడం బాధాకరమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సామాన్యుడికి ఏ పని కావాలన్నా డబ్బు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ కారణంగా రాష్ట్రంలోని సామాన్య ప్రజలకు సంక్షేమ పథకాలు చేరక వారి పరిస్థితి దుర్భరంగా మారిందని అన్నారు. అందుకే ఆప్ ఆధ్వర్యంలో నేటి(శనివారం) నుండి రాష్ట్ర వ్యాప్తంగా ‘అవినీతి పరులారా అధికారాన్ని వదలి పోండి’ నినాదంతో ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఎదుట అవినీతి అధికారులకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. -
అల్ఖైదాపై అలర్ట
శాంతి భద్రతలపై కఠినంగా వ్యవహరించండి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మైసూరు : భారత ఉప ఖండంలో అల్ఖైదా ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఎటువంటి వైఫల్యానికి తావు లేకుండా నిత్యం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించామని చెప్పారు. ఇక్కడి విమానాశ్రయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అల్ఖైదా నుంచి ఎటువంటి హెచ్చరికలు లేనప్పటికీ, కేంద్రం నుంచి అందే ఆదేశాలను తు.చ తప్పకుండా పాటిస్తామని వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం ఇవ్వవద్దని పోలీసు శాఖకు సూచించామని చెప్పారు. కాగా ఉత్తర కర్ణాటకలోని ఎనిమిది జిల్లాల్లో అతివృష్ట కారణంగా 22 మందితో పాటు 54 పశువులు మృ్యువాత పడ్డాయని తెలిపారు. సుమారు రూ.400 కోట్ల పంట నష్టం వాటిల్లిందని చెప్పారు. శనివారం గుల్బర్గ, గదగ, రాయచూరు జిల్లాల్లో వైమానిక సర్వేను నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు, అధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. బాధితులకు నష్ట పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కాగా రాష్ర్టంలో మొబైల్ ఫోన్ల ద్వారా అత్యవసర ప్రభుత్వ సేవలను అందించనున్నట్లు తెలిపారు. త్వరలో ప్రారంభించబోయే ఈ కార్యక్రమం దేశంలోనే మొదటిదని ఆయన చెప్పారు. -
బీజేపీ క్రుట
రాష్ట్రపతి ప్రణబ్కు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఫిర్యాదు రాష్ర్ట ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు వ్యూహారచన చేశారని ఆరోపణ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కేంద్రంలో తమ పార్టీ ప్రభుత్వం ఉన్నదన్న భరోసాతో కర్ణాటకలో ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఫిర్యాదు చేశారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం ఆయన రాష్ర్టపతిని కలుసుకున్నారు. అర్కావతి లేఔట్ డీనోటిఫికేషన్ వ్యవహారాన్ని ముందు పెట్టుకుని తనను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా గవర్నర్ అనుమతిని కోరే పనిలో ఉన్నారని ఆరోపించారు. ఎలాగైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేలా వారంతా అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వంతో పాటు గవర్నర్కు సూచించాలని విన్నవించారు. కాగా అధికార యంత్రాంగంలో పూర్తిగా ఈ-గవర్నెన్స్ను అమలు చేయడం ద్వారా కాగిత రహిత పాలనకు శ్రీకారం చుట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతూ, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి రావాలని సీఎం రాష్ట్రపతిని ఆహ్వానించారు. ‘మీకు అనుకూలమైన రోజేదో చెబితే, అదే రోజు ప్రారంభోత్సవాన్ని ఏర్పాటు చేస్తాం’ అని విన్నవించారు. -
రాజకీయ చరమాంకంలో ఉన్నా...
సాక్షి, బెంగళూరు : ‘రాజకీయంగా విశ్రాంతి తీసుకునే స్థితిలో ఉన్నా. అందువల్ల నేను మంత్రి పదవులు ఆశించడం లేదు. ప్రస్తుతం ఉన్న స్పీకర్ పదవితో సంతోషంగా ఉన్నాను.’ అని స్పీకర్ కాగోడు తిమ్మప్ప పేర్కొన్నారు. విధానసౌధాలో గురువారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. రాజకీయంగా ఎన్నో పదువులను అనుభవించానన్నారు. అందువల్ల ప్రస్తుతం మంత్రి పదవి కోసం ఎవరినీ సంప్రదించే ఆలోచన లేదన్నారు. రాష్ట్రంలో బగర్హుకుం భూముల సమస్యలు త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాసినట్లు చెప్పారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు యడ్యూరప్ప చాలా అదృష్టవంతుడని, ఇలా ఎందుకు వాఖ్యానించానో ఇప్పుడే చెప్పబోనని పేర్కొన్నారు. -
దసరా తర్వాతే
విస్తరణపై అధిష్టానాన్ని ఒప్పించిన సీఎం సిద్ధరామయ్య కలిసి వచ్చిన డిగ్గీ రాజ అమెరికా పర్యటన ఆయన వచ్చిన తర్వాతేతుది నిర్ణయమన్న హైకమాండ్ పరమేశ్వరకు లైన్ క్లియర్ ఉప ముఖ్యమంత్రి పదవికే కేపీసీసీ చీఫ్ పట్టు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణను వీలైనంత మేరకు వాయిదా వేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆ దిశగా అధిష్టానాన్ని కూడా ఒప్పించగలిగారు. బుధవారం ఢిల్లీలో ఆయన పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. బోర్డులు, కార్పొరేషన్లకు నియామకాలను చేపట్టాలనుకుంటున్నందున, దానిపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. అంతకు ముందు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ అమెరికా పర్యటనలో ఉండడంతో విస్తరణకు, కొత్త నియామకాలకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా, లేదా అనే ఉత్కంఠతో వందల మంది ఆశావహులు ఢిల్లీలో మకాం వేశారు. వారితో కర్ణాటక భవన్ కిక్కిరిసి పోగా, అక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రిని కలవడానికి పలువురు పోటీ పడ్డారు. మంత్రి పదవులను ఆశిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉండడంతో విస్తరణను కొంత కాలం పాటు వాయిదా వేయడమే మంచిదని సీఎం అనుకుంటున్నారు. దిగ్విజయ్ సింగ్ అమెరికా పర్యటనలో ఉండడం ఆయనకు కలిసొచ్చింది. దిగ్విజయ్ తిరిగి వచ్చిన తర్వాత, మరో దఫా దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుందామని సీఎంకు అధిష్టానం సూచించినట్లు తెలిసింది. పరమేశ్వర ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్నప్పటికీ, అధిష్టానం ఆ దిశగా ఆలోచించడం లేదు. అయితే మంత్రి వర్గంలో ఆయనకు చోటు కల్పించాలని ఇదివరకే సీఎంకు సూచించింది. కనుక అధిష్టానం అనుమతిస్తే పరమేశ్వరను మాత్రం చేర్చుకుని, తదుపరి విస్తరణను దసరా అనంతరం చేపట్టాలనేది ముఖ్యమంత్రి ఆలోచనగా చెబుతున్నారు. మంత్రి వర్గంలో ప్రస్తుతం నాలుగే ఖాళీలున్నాయి. కనుక అందరినీ సముదాయించడం కన్నా, వాయిదా వేయడమే మంచిదని ఆయన అధిష్టానానికి సూచించారని సమాచారం. మరో వైపు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే తాను మంత్రి వర్గంలో చేరబోనని పరమేశ్వర అధిష్టానానికి విన్నవించారని తెలిసింది. మంత్రిగా ఉండడం కన్నా కేపీసీసీ అధ్యక్షుడిగానే కొనసాగడం మంచిదని ఆయన చెబుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎటూ మరో ఏడాదిన్నర పాటు తాను ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉన్నందున, మంత్రి పదవిని తిరస్కరిస్తున్నారని తెలిసింది. ఏదేమైనా అధిష్టానం మాటే అందరికీ శిరోధార్యం కనుక, అటు వైపు నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. -
సమర సన్నాహాలు
అర్కావతిపై న్యాయ పోరాటం చేయాలని బీజేపీ నిర్ణయం సీఎం ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి కోరాలని తీర్మానం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలోని అర్కావతి లేఔట్ డీనోటిఫికేషన్ వ్యవహారంపై న్యాయ పోరాటం చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి తెలిపారు. మల్లేశ్వరంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన కోర్ కమిటీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. డీనోటిఫికేషన్పై ఇప్పటి వరకు సాగుతున్న ఆందోళనకు కొనసాగింపుగా న్యాయ పోరాటం చేయాలని సమావేశంలో తీర్మానించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా గవర్నర్ను కోరాలని నిర్ణయించినట్లు కూడా చెప్పారు. ఇప్పటికే దీనిపై రాజకీయ పోరాటం సాగుతున్నదని గుర్తు చేశారు. డీనోటిఫికేషన్ వ్యవహారంపై పరిశీలన జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సురేశ్ కుమార్ నాయకత్వంలో కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. న్యాయ పోరాటానికి అవసరమైన డాక్యుమెంట్లను సేకరించాల్సిందిగా కూడా కమిటీకి సూచించామని చెప్పారు. మేయర్ అభ్యర్థిపై చర్చ బీబీఎంపీకి కొత్త మేయర్, ఉప మేయర్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేసే విషయమై సమావేశంలో చర్చించామని జోషి తెలిపారు. అభ్యర్థుల విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. కాగా కోర్ కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రులు అనంత కుమార్, డీవీ. సదానంద గౌడ, మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ యడ్యూరప్ప, శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రులు కేఎస్. ఈశ్వరప్ప, ఆర్. అశోక్లు పాల్గొన్నారు. -
నేనే సర్వాధికారి
సాక్షి, బెంగళూరు : మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి సర్వాధికారాలు తనవేనని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. బెంగళూరులో మీడియా ప్రతినిధులతో గురువారం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం మంత్రి మండలిలోకి ఎవరిని తీసుకోవాలనే విషయంపై తన నిర్ణయమే అంతిమమని చెప్పారు. వ్యక్తిగత పనిపై ఇంధన శాఖ మంత్రి డి.కె.శివకుమార్ ఢిల్లీకి వెళ్లాడని, ఈ విషయంపై మీడియా అనవసర రాద్ధాంతం చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు. -
పదవుల లొల్లి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : అధికార పార్టీలో పదవుల లొల్లి మొదలైంది. రాష్ర్టంలోని బోర్డులు, కార్పొరేషన్ల డెరైక్టర్లు, చైర్మన్ల నియామకాలను 15 రోజుల్లోగా చేపట్టాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సూచించారు. ఇక్కడి కేపీసీసీ కార్యాలయంలో మంగళవారం జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన సీఎంతో పాటు కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, మంత్రులు డీకే. శివ కుమార్, కేజే. జార్జ్ ప్రభృతులు పాల్గొన్నారు. కార్పొరేషన్లు, బోర్డుల నియామకాల్లో 30 శాతం పదవులను ఎమ్మెల్యేలకు, మిగిలిన 70 శాతం పదవులను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకు కేటాయించాలని నిర్ణయించారు. మంత్రి వర్గ విస్తరణే తప్ప పునర్వ్యవస్థీకరణ వద్దని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలను భర్తీ చేయాలని నిర్ణయమైంది. ఆశావహుల జాబితాతో ఢిల్లీకి రావాల్సిందిగా దిగ్విజయ్, సీఎంతో పాటు పరమేశ్వరను ఆహ్వానించారు. కాగా పార్టీ, పాలన వ్యవహారాల్లో ఉమ్మడి నిర్ణయాలే తప్ప ఏకపక్ష నిర్ణయాలు తగవని దిగ్విజయ్ సూచించినట్లు సమాచారం. మోడీ ప్రభంజనం ఆగిపోయింది దేశంలో మోడీ ప్రభంజనానికి కాలం చెల్లిందని ఉప ఎన్నికల ఫలితాల ద్వారా వెల్లడైందని దిగ్విజయ్ సింగ్ అన్నారు. సమన్వయ కమిటీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ర్టంలో ఉప ఎన్నికలు జరిగిన మూడింట్లో రెండింటిని తమ పార్టీ సునాయాసంగా గెలుచుకుందని, ఒక స్థానంలో గట్టి పోటీ ఇచ్చిందని తెలిపారు. ఇందుకు గాను ఆయా నియోజక వర్గాల ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి వర్గ విస్తరణ, కార్పొరేషన్లు, బోర్డుల నియామకాలు ముఖ్యమంత్రి విచక్షణకు సంబంధించిన అంశాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు మరో తొమ్మిది నెలల్లో జరగాల్సి ఉన్నందున, పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలను చేపట్టాల్సిందిగా నిర్ణయించామని తెలిపారు. బూత్ స్థాయిలో బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని, ప్రజలకు చేరువ కావాలని కూడా తీర్మానించామని ఆయన చెప్పారు. కార్యాలయం వద్ద సందడి సమన్వయ కమిటీ సమావేశం జరుగుతున్న కేపీసీసీ కార్యాలయం వద్ద మంత్రి పదవుల ఆశావహులు బల ప్రదర్శనకు దిగారు. తమకు మంత్రి పదవులు ఇవ్వాలంటూ మద్దతుదారుల చేత డిమాండ్ చేయించారు. ఎమ్మెల్యేలు ఆర్వీ. దేవరాజ్, మాలికయ్య గుత్తేదార్, బసవరాజ్ పాటిల్ల మద్దతుదారులు పెద్ద సంఖ్యలో గుమికూడారు. తమ నాయకునికి మంత్రి పదవి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. కొందరు మద్దతుదారులు టపాకాయలు పేల్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీసీపీ సందీప్ పాటిల్ నేతృత్వంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. -
అత్యాధునికం
రూ. 39.25 కోట్లతో పిణ్యా బస్స్టాండ్ ఏర్పాటు ప్రారంభించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సాక్షి, బెంగళూరు : స్థానిక ప్రముఖ పారిశ్రామిక కేంద్రం పిణ్యాలో అత్యాధునిక సౌకర్యాలతో కేఎస్ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటైంది. 6.29 ఎకరాల్లో రూ. 39.25 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ బస్టాండ్ను రాష్ర్ట ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం ప్రారంభించారు. ఈ బస్టాండ్ పనులు 2008 అక్టోబర్ 24న ప్రారంభమయ్యాయి. కాగా, ఈ బస్టాండ్లో వచ్చే నెల 1 నుంచి బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. బస్టాండ్ బేస్మెంట్, గ్రౌండ్ఫ్లోర్ కాక రెండు అంతస్తులు ఉన్నాయి. ఇందులో కేఎస్ ఆర్టీసీ బస్సులు నిలిపేందుకు బేస్మెంట్లో 26, అప్పర్ ఫ్లోర్లో 17 ప్లాట్ఫాంలు ఏర్పాటు చేశారు. బస్టాండ్లో ప్రైవేట్ సంస్థలు తమ వాణిజ్య కార్యకలాపాలు సాగించుకునేందుకు సంస్థ అవకాశం కల్పిస్తోందిఇ. మరోవైపు ప్రయాణికుల కోసం పార్కింగ్ వ్యవస్థ, లగేజీ కౌంటర్, వెయిటింగ్ లాంజ్, ముందస్తు రిజర్వేషన్ తదితర సౌకర్యాలను సంస్థ కల్పించింది. ఈ శాటిలైట్ బస్స్టాండ్ నుంచి బెంగళూరులోని కెంపేగౌడ, శాంతినగర బస్స్టేషన్లకు 32 కనెక్టింగ్ బీఎంటీసీ బస్సులను కూడా అధికారులు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. కాగా, ఇక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ చోట్లకు బయలుదేరే బస్సులు, వాటి సమయం తదితర వివరాల కోసం 080-22221321, 22221223 లో సంప్రదించవచ్చు. -
సీఎంకు జైలు ఖాయం
అర్కావతి లేఔవుట్ దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తే... రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి సాక్షి, బళ్లారి : అర్కావతి లే అవుట్లో చోటు చేసుకున్న అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు చేయిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు జైలు శిక్ష తప్పదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి జోష్యం చెప్పారు. బళ్లారిలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అర్కావతి లే అవుట్ అక్రమాలపై తమ వద్ద పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ విపక్షనేత జగదీష్ శెట్టర్ పేర్కొంటున్నప్పటికీ సీబీఐ దర్యాప్తునకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. వాస్తవాలు వెలుగు చూస్తే తనకు జైలు శిక్ష తప్పదని తెలుసుకునే సీబీఐ దర్యాప్తునకు ముఖ్యమంత్రి వెనుకంజ వేస్తున్నారని ఎద్దేవా చేశారు. తన కుమారుడితో ఇసుక మాఫియాను నడుపుతున్న ముఖ్యమంత్రికి ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించే అర్హత లేదని అన్నారు. ఉప ఎన్నికల సందర్భంగా బళ్లారిలో అధికారదుర్వినియోగానికి తెరలేపారని మండిపడ్డారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఉప ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టడం ద్వారా అధికార కాంగ్రెస్ పార్టీకి హెచ్చరికలు చేయాలంటూ ఓటర్లకు జగదీష్ శెట్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు సదానందగౌడ, అనంత్కుమార్, బళ్లారి ఎంపీ శ్రీరాములు, కేఎంఎఫ్ అధ్యక్షుడు గాలి సోమశేఖరరెడ్డి, బళ్లారి మాజీ ఎంపీ శాంత, మాజీ మేయర్ ఇబ్రహీంబాబు పాల్గొన్నారు. -
గడ్డుకాలం...
సాక్షి, బెంగళూరు : ప్రస్తుతం జేడీఎస్ పార్టీ కష్టకాలంలో ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ పేర్కొన్నారు. నాయకుల మధ్య భేదాబిప్రాయాలు ఉన్నమాట వాస్తవమని వాటిని కొలిక్కి తెచ్చే సామర్థ్యం తనకుందన్నారు. బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో సోమవారం జరిగిన పార్టీ బృహత్ సమావేశంలో ఆయన నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో జేడీఎస్ పార్టీ ఉనికి లేకుండా చేయడానికి అనేక మంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రత్యక్షంగానే జేడీఎస్ పార్టీ నాయకులను కాంగ్రెస్లో చేరమని ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈ విషయాలన్నింటినీ నిషిత దృష్టితో గమనిస్తున్నానన్నారు. ఆయన ప్రయత్నాలను సాగనివ్వబోనన్నారు. ఈ వయసులో కూడా పార్టీని పటిష్ట పరిచే సామర్థ్యం తనకుందన్నారు. తన సామర్థ్యంపై విశ్వాసం ఉన్నవారు తనతో పాటు ఉండవచ్చునని లేదా పార్టీని వదిలీ ఇతర పార్టీలోకి వెళ్లవచ్చునని పునరుద్ఘాటించారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో పాటు జేడీఎస్ నాయకుడు రేవణ్ణ ఢిల్లీ వెళ్లిన మాట వాస్తవమన్నారు. దీంతో కొన్ని మీడియా సంస్థలు కుమారస్వామి కాంగ్రెస్లో చేరుతున్నారని పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. జేడీఎస్ కుటుంబ పార్టీ అనే అపవాదును పోగొట్టడానికి ఏ త్యాగానికైనా సిద్ధమన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటన చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఇదే వేదికపై మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తాను ఆరోగ్యంగానే ఉన్నానన్నారు. దాదాపు ఏడాదిన్నర కాలంలో సిద్ధరామయ్య ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. పాలనలో ఆయన పూర్తిగా విఫలమయ్యారన్నారు. పార్టీలోని అందరి నాయకులను కలుపుకుని పోయి పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తానని కుమారస్వామి చెప్పుకొచ్చారు. వేదిక నుంచి దిగిపోయిన జేడీఎస్ నాయకులు దేవెగౌడ ప్రసంగం తర్వాత వేదికపై ఉన్న పలువురు నాయకులు మాట్లాడటానికి పోటీ పడ్డారు. ఒకరి చేతిలో ఉన్న మైకును మరొకరు బలవంతంగా లాక్కొవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా గందరగోళం నెలకొంది. దీంతో నొచ్చుకున్న పార్టీ సీనియర్ నాయకులు ఎం.సి.నాణయ్య, పుట్టణ్ణ, రేవణ్ణ వేదిక దిగి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా వేదిక కింద ఉన్న ఓ కార్యకర్త మైకును తీసుకుని ‘ఇతర పార్టీలోకి వెళ్లే వారి విషయం కాదు. పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్న వారిపై దృష్టి సారించండి. బ్యాటరాయణపుర, యశ్వంతపుర నియోజక వర్గంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలే ఇందుకు ఉదాహరణ.’ అంటూ గట్టిగా మాట్లాడుతుండంగానే మరో నాయకుడు అతని వద్ద నుంచి మైకును లాక్కొవడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో కల్పించుకున్న దేవెగౌడ ‘ఇలాంటి కార్యకర్తలే కావాలి. అతని వద్దమైకును బలవంతంగా తీసుకోకండి. ఇలా చేస్తే మన మధ్య విభేదాలు బయటపడ్డాయనే మీడియా వాఖ్యానిస్తుంది.’ అని పేర్కొన్నారు. తర్వాత కుమారస్వామితో పాటు పలువురు నాయకులు కల్పించుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో వేదిక పై నాయకుల ప్రసంగాలు కొనసాగాయి. -
ప్రచారానికి తెర
మూడు నియోజకవర్గాల్లో నేతల సుడిగాలి పర్యటనలు 21న పోలింగ్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్ సాక్షి, బెంగళూరు : ఉప ఎన్నికల బహిరంగ ప్రచారానికి మంగళవారం సాయంత్రం తెరపడనుంది. గెలుపును బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. శికారిపుర, చిక్కొడి - సదలగా, బళ్లారి గ్రామీణ నియోజకవర్గాలకు ఈ నెల 21న ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు పార్టీలోని పలువురు నేతలకు ఈ ఉప ఎన్నికలు రాజకీయ దిశానిర్ధేశం చేయనున్నాయి. దీంతో ఎలాగైనా మూడు స్థానాలను దక్కించుకోవాలని సిద్ధరామయ్య పావులు కదుపుతున్నారు. మంత్రులు సైతం వారం రోజులుగా అయా నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ బీజేపీ అభ్యర్థులపై, స్థానిక నేతలపై వాగ్భానాలు సంధిస్తూ వచ్చారు. శికారిపురలో విజయాన్ని కైవసం చేసుకునేందుకు రాజకీయ వైరుద్ధ్యాన్ని సైతం కాంగ్రెస్ పార్టీ పక్కనపెట్టి జేడీఎస్తో మద్దతు కూడగట్టుకుంది. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బీఎస్ రాఘవేంద్రపై కాంగ్రెస్ అభ్యర్థి శాంతవీరప్ప గౌడను గెలిపించడం కోసం కాంగ్రెస్ తన శక్తియుక్తులను ధారపోస్తోంది. అదేవిధంగా బళ్లారిలో ఎన్.వై.గోపాలకృష్ణ, చిక్కొడి-సదలగాలో గణేస్ హుక్కేరిని గెలిపించేందుకు వారం రోజులుగా ప్రధాన నేతలు అక్కడే తిష్టవేశారు. ప్రభుత్వ వైఫల్యాలే ప్రచారాస్త్రాలుగా... అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రచారాస్త్రాలుగా బీజేపీ సంధిస్తోంది. ఈ ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలో నెలకొన్న అభద్రతా భావం, మహిళలపై అత్యాచారాలు, స్థానిక సమస్యలను ఎండగడుతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తన కుమారుడు రాఘవేంద్రను గెలిపించుకోవడం ద్వారా మరోసారి తన సత్తాను చాటుకునేందుకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు యడ్యూరప్ప ప్రయత్నిస్తున్నారు. బళ్లారిలో ఓబులేసు, చిక్కొడి-సదలగలో మహంతేష్ కపటిగిమఠ గెలిపించుకునేందుకు మాజీ సీఎం జగదీష్ శెట్టర్, పార్టీ అధ్యక్షుడు ప్రహ్లాదజోషి, ఎమ్మెల్సీ కే.ఎస్.ఈశ్వరప్ప, మాజీ డీసీఎం అశోక్ తదితర హేమాహేమిలు రంగంలో దిగారు. ఈ ఉప ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అటు ఎన్నికల కమిషన్తో పాటు రాష్ట్ర హోంశాఖ ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టింది. -
బెల్గాం కర్ణాటకలో భాగమే
సాక్షి, బెంగళూరు : బెల్గాం విషయమై మహారాష్ట్రకు చెందిన నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసహనం వ్యక్తం చేశారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన బెల్గాంను మహారాష్ట్రకు వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. బెల్గాంలో ఆయన మీడియాతో ఆదివారం మాట్లాడుతూ... మహాజన్ నివేదికను అనుసరించి బెల్గాం ప్రాంతం కర్ణాటకకు చెందుతుందన్నారు. అయితే ఈ విషయంలో రాజకీయ ప్రయోజనం ఆశించి కొంతమంది నాయకులు స్థానిక ప్రజల శాంతియుత జీవనానికి ఆటంకం కలిగిస్తూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో భాగంగా శికారిపురలో మాత్రం కాంగ్రెస్కు జేడీఎస్ మద్దతు ఇస్తోందని తెలిపారు. అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయడం కోసమే కేపీఎస్సీ11 నియామకాలను రద్దు పై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. -
పోతే.. పోండి!
పార్టీ నుంచి వెళ్లేవాళ్లను ఆపను జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ సాక్షి, బెంగళూరు : స్వార్థంతో పార్టీని వీడేవారిని ఎలాంటి పరిస్థితుల్లోనూ తాను ఆపబోనని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ అన్నారు. పార్టీ నుంచి ఎందరు నాయకులు బయటకు వెళ్లినా తాను భయపడనని స్పష్టం చేశారు. తన చివరి శ్వాస వరకూ పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. జేడీఎస్ నేతలు జమీర్ ఖాన్, చెలువరాయస్వామితో పాటు మరికొందరు శనివారం రహస్యంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను బేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని జేడీఎస్ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశంలో దేవెగౌడ మాట్లాడుతూ... ఉప ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు లేదని తాము చెబుతున్నా కొందరు రహస్యంగా సీఎంతో భేటీ కావడం వెనుక మర్మం అర్థం కావడం లేదని అన్నారు. ఇతర పార్టీలో చేరితే రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతామని భావిస్తే జేడీఎస్ను వీడి వెళ్లవచ్చునని చెప్పారు. పార్టీని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా రానున్న శనివారం నుంచి తన నివాసాన్ని హాసనకు మారుస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ విధివిధానాలపై చర్చించేందుకు వీలుగా బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో సోమవారం బృహత్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు కార్యకర్తలను తరలించేందుకు ప్రత్యేక బస్సులను కేటాయిస్తున్నామన్నారు. -
మృగాళ్లను ఉపేక్షించం
అత్యాచార కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడి ప్రస్తుత చట్టాలు కఠినతరం చేస్తామని ప్రకటన బాలికలు ఇంటికి చేరుకునే వరకూ పాఠశాల యాజమాన్యాలదే బాధ్యతని సూచన సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఇటీవల మహిళలు, బాలికలపై జరిగిన అత్యాచార సంఘటనలు తనను కలచి వేశాయంటూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడడంతో పాటు నిందితుల పట్ల ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హెచ్చరించారు. ఇక్కడి మానెక్ షా పెరేడ్ గ్రౌండ్లో శుక్రవారం ఆయన 68వ స్వాతంత్య్ర దినోత్సవ సభలో ప్రసంగించారు. అత్యాచారాలను సమర్థంగా అరికట్టడానికి ప్రస్తుత చట్టాలను మరింత కఠినతరం చేస్తామని వెల్లడించారు. ఇందులో భాగంగా గూండా చట్టానికి సవరణలు తెచ్చామని, అత్యాచారం కేసులను వేగవంతంగా పరిష్కరించడానికి పది ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలను వేధించడంతో పాటు అత్యాచారాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించామని చెప్పారు. పాఠశాలలు, కళాశాలల్లో బాలికలపై వేధింపులను నిరోధించడానికి ప్రభుత్వం కఠిన చర్యలను చేపట్టిందని తెలిపారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలలు తమ సంస్థల్లో చదివే బాలికల సంరక్షణా బాధ్యతలను చేపట్టాలని ఆదేశించామన్నారు. ‘ఉదయం స్కూలులోకి ప్రవేశించింది మొదలు, సాయంత్రం ఇంటికి పోయే దాకా బాలికల సంరక్షణ బాధ్యత ఆయా పాఠశాలలదే’ అని హెచ్చరిక స్వరంతో చెప్పారు. ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు పునరావృతం కాకుండా బాలికల సంరక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని పాఠశాలలను ఆదేశించామని తెలిపారు. బోధన, బోధనేతర సిబ్బందిని నియమించుకునే ముందు వారి నేపథ్యాన్ని సునిశితంగా పరిశీలించాలని కూడా సూచించామని వెల్లడించారు. కాగా వేధింపులు, అత్యాచారాలకు గురైన మహిళలకు అవసరమైన చికిత్సలను అందించడానికి మొత్తం 30 జిల్లా ఆస్పత్రుల్లో ప్రత్యేక మహిళా విభాగాలను ప్రారంభిస్తామని వెల్లడించారు. బెంగళూరులోని అయిదు ఆస్పత్రుల్లో కూడా ఈ విభాగాలుంటాయన్నారు. వీటిల్లో న్యాయ, ఆర్థిక సాయం లభిస్తుందని చెప్పారు. అత్యాచారాలకు గురైన బాలికలకు అత్యవసర సాయాన్ని అందించడానికి రూ.25 లక్షలతో పిల్లల నిధిని కూడా ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. -
ఆయనో అబద్ధాల పుట్ట
సాక్షి, బళ్లారి : ‘ఈ దేశంలో అబద్దాలు చెప్పే ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారంటే అది సిద్ధరామయ్య ఒక్కరే’ అని మాజీ సీఎం జగదీష్ శెట్టర్ విమర్శించారు. బళ్లారి గ్రామీణ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన బళ్లారి తాలూకాలోని బెళగళ్లు గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. అబద్ధాలతో రాష్ర్ట ప్రజలను సీఎం సిద్ధరామయ్య మభ్య పెడుతున్నాడని ఆరోపించారు. బీజేపీ హయాంలో చేపట్టిన పనులను గాలికి వదిలేశారని మండిపడ్డారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ యడ్యూరప్ప, తాను ప్రవేశపెట్టిన పలు పథకాలకు సిద్ధరామయ్య ప్రభుత్వం తిలోదకాలిచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధనాలు అవలంభిస్తున్న ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అధికారులను అడ్డుపెట్టుకుని గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నిందని అన్నారు. అయితే ప్రజాబలంతో ఉప ఎన్నికలు జరుగుతున్న మూడు ప్రాంతాల్లోనూ బీజేపీ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సామాన్య కార్యకర్తగా ఉన్న ఓబులేసును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కేఎంఎఫ్ అధ్యక్షుడు గాలి సోమశేఖరరెడ్డి, బీజేపీ అభ్యర్థి ఓబులేసు, ఎమ్మెల్సీ మృత్యుంజయ జినగ, జిల్లా బీజేపీ అధ్యక్షుడు నేమిరాజ్ నాయక్, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నిధుల వినియోగంలో ఉదాసీనత
రాష్ర్టంలో కుంటు పడుతున్న అభివృద్ధి నత్తనడకన సంక్షేమ పథకాలు అధికారులు, మంత్రుల మధ్య సమన్వయ లోపం మంత్రుల మధ్య లోపిస్తున్న సఖ్యత సాక్షి, బెంగళూరు : వివిధ ప్రభుత్వ శాఖలకు అవసరమైన నిధులు విడుదల చేయడంలోనూ ఆర్థిక వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంలోను సిద్ధరామయ్య ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడుతోంది. సంక్షేమ పథకాలు నత్తనడకన సాగుతున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్లో రూ. 66,463 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ ఆర్థిక ఏడాది తొలి నాలుగు నెలల్లో రూ.9,196 కోట్లు విడుదల కాగా, ఇప్పటి వరకు రూ. 4,751 కోట్లను వివిధ పథకాలు, అభివృద్ధి కోసం వెచ్చించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో బడ్జెట్లో పేర్కొన్న పథకాలు ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. అంతేకాక గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని సంక్షేమ పథకాలను కొనసాగించలేని పరిస్థితి నెలకొంది. లోపించిన సఖ్యత రాష్ట్ర మంత్రుల మధ్య సఖ్యత లోపించింది. మరోవైపు అధికారులు, మంత్రుల మధ్య సమన్వయం లేకుండా పోయింది. ఈ వైఖరిల వల్లనే నిధుల వినియోగం సక్రమంగా కాకపోవడానికి కారణమవుతున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ పాడి రైతులకు ప్రోత్సహాకాన్ని రూ. 4కు అదనంగా రూ. 2 పెంచే విషయంపై పశుసంవర్ధక శాఖ మంత్రి టి.బి.జయచంద్ర, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ.ఆంజనేయులు ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఏకాభిప్రాయానికి రాకపోవడం వల్ల ఆ పథకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. దీంతో సాంఘిక సంక్షేమ శాఖలో నిధులున్నా ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొంది. ఇక ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల క్షేత్ర స్థాయిలో పనులు సక్రమంగా సాగడం లేదు. ‘రాష్ట్రంలోని 32 ప్రభుత్వ శాఖల్లో దాదాపు 1.90 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మానవ వనరులు తక్కువగా ఉండటం వల్ల అభిృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సరిగా జరగడంలేదు. దీంతో ఆయా శాఖలకు కేటాయించిన నిధులు మురిగిపోతున్నాయి.’ అని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సభ్యుడు రామకృష్ణ పేర్కొన్నారు. -
సవాల్.. ప్రతి సవాల్
సిద్ధు, కుమార మధ్య మాటల యుద్ధం గెజిటెడ్ ప్రొబేషనరీ అభ్యర్థులకు కుమార సంఘీభావం నిపుణుల సలహా మేరకే నిర్ణయం : సీఎం సిద్ధు బహిరంగ చర్చకు తాను సిద్ధమే : కుమార సాక్షి, బెంగళూరు : కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2011 గెజిటెడ్ ప్రొబేషనరీ పోస్టుల రద్దు విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నాయకుడు కుమారస్వామి మధ్య మాటల యుద్ధం మొదలైంది. బహిరంగ చర్చకు సిద్ధమంటూ పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. బెంగళూరులోని సెయింట్ జాన్స్ వైద్య విద్యా కళాశాలలో శనివారం జరిగిన స్వర్ణోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అనంతరం సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. కేపీఎస్సీ పరీక్షల్లో అక్రమాలు జరిగిన విషయం ఇప్పటికే సీఐడీ దర్యాప్తులో తేటతెల్లమైందన్నారు. అందువల్లే న్యాయ నిపుణుల సలహా మేరకు ప్రభుత్వం పోస్టులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ‘రాజకీయాల్లో ఉన్నప్పుడు సాధ్యమైతే ఇతనికి సహాయం చేయండి అని చెప్పడం సాధారణం. ఈ క్రమంలోనే గతంలో నేను ఒకరిద్దరికి సిఫార్సు లేఖలు ఇచ్చిన మాట వాస్తవం. అంత మాత్రాన లంచం తీసుకుని సదరు అభ్యర్థులకు సహాయం చేయమని చెప్పలేదు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకునే కేపీఎస్సీ సభ్యులు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది’ అని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ విషయంతో పాటు కేపీఎస్సీ అక్రమాలకు సంబంధించి ఎప్పుడైనా బహిరంగ చర్చకు తాను సిద్ధమని సిద్ధరామయ్య తెలిపారు. ఇక పై అక్రమాలకు తావులేకుండా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రమాణాలను కేపీఎస్సీ పరీక్షల నిర్వహణకు పాటిస్తామన్నారు. 2011 అక్రమాలు బయటికి రావడానికి డాక్టర్ మైత్రీ అనే అభ్యర్థి ప్రధాన కారణమని ఆమెను అభినందిస్తున్నానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. చట్టసభల్లో చర్చించడానికైనా సిద్ధమే: కుమారస్వామి 2011 కేపీఎస్సీ పరీక్షలకు సంబంధించి బహిరంగ చర్చకు సిద్ధమన్న సిద్ధరామయ్య వ్యాఖ్యలను కుమారస్వామి స్వాగతించారు. ఈ విషయంలో తాను కూడా ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. అవ సరమైతే ఈ విషయంపై చట్టసభల్లో కూడా తాను చర్చించడానికి సిద్ధమన్నారు. ఫ్రీడం పార్కులో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన దీక్ష చేస్తున్న అభ్యర్థులను పరమార్శించడానికి శనివారం వెళ్లిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. కేపీఎస్సీ 1998 నుంచి 2011 వరకూ నిర్వహించిన పరీక్షలన్నింటిపై దర్యాప్తు జరిపించాలన్నారు. అప్పుడు మాత్రమే పూర్తి నిజాలు బయటికి వస్తాయని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కుమారస్వామి డిమాండ్ చేశారు. -
పరిశ్రమలకు ఊతం
సీఐఐ సదస్సులో సీఎం సిద్ధరామయ్య కేపీసీసీ నియామకాల రద్దు సబబే విపక్షాల అనవసర రాద్ధాంతం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలోని ప్రస్తుత పరిశ్రమలు, కొత్తగా స్థాపించబోయే పరిశ్రమలకు ప్రాథమిక సదుపాయాలను కల్పించడానికి కొత్త విధానాన్ని రూపొందిస్తామని, తద్వారా పారిశ్రామిక ప్రగతికి పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. నగరంలోని ఓ హోటల్లో భారతీయ పరిశ్రమల సంఘాల సమాఖ్య (సీఐఐ) శుక్రవారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఐటీ రంగాన్ని మరింతగా అృవద్ధి పరచడానికి ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ కనబరుస్తుందని తెలిపారు. ప్రపంచ పెట్టుబడుల్లో కర్ణాటకను అత్యంత ప్రాధన్యతా గమ్య స్థానంగా తీర్చి దిద్దడానికి గత ఏడాది ప్రారంభించిన ‘4ఐ’ విధానానికి పారిశ్రామిక రంగం నుంచి చక్కటి స్పందన లభించిందని చెప్పారు. నియామకాల రద్దు సబబే కేపీఎస్సీ ద్వారా 2011లో చేపట్టిన నియామకాలను రద్దు చేయడం సబబేనని ముఖ్యమంత్రి సమర్థించుకున్నారు. అప్పట్లో కేఏఎస్ గ్రూపు-1, గ్రూపు-2 ఉద్యోగాలకు 362 మంది ఎంపిక కాగా, ఇందులో అవకతవకలు చోటు చేసుకున్నాయని తేలడంతో రాష్ట్ర మంత్రి వర్గం గురువారం ఆ నియామకాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీఐడీ కూడా దర్యాప్తు చేపట్టి, అవకతవకలు నిజమేనని తేల్చిందని చెప్పారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎస్. నిజలింగప్ప 14వ వర్ధంతిని పురస్కరించుకుని విధాన సౌధలోని ఆయన విగ్రహానికి శుక్రవారం నివాళులు అర్పించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏ విషయంలోనైనా న్యాయ శాఖ, అడ్వొకేట్ జనరల్, సీఐడీ అభిప్రాయాలను పక్కన పెట్టడం సాధ్యం కాదని చెప్పారు. అవినీతిని అంతమొందించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న క్రమంలో, ఇలాంటి అవకతవకలను ఎలా సహించగలమని ప్రశ్నించారు. దీని వల్ల కొందరికి అన్యాయం జరిగి ఉన్నప్పటికీ, అవినీతికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. అప్పట్లో 1,085 గెజిటెడ్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించగా, 362 మంది ఎంపికయ్యారని తెలిపారు. పరీక్షలకు హాజరైన వారిలో ఇద్దరు మినహా మిగిలిన వారందరికీ ఒకే విధమైన మార్కులు వచ్చాయంటూ, ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. ఇలాంటి విషయాల్లో రాజకీయాలు వద్దని ఆయన హితవు పలికారు. -
‘అర్కావతి లే ఔట్’పై సీబీఐ దర్యాప్తు చేయించాలి
బళ్లారి ఎంపీ శ్రీరాములు సాక్షి, బళ్లారి : రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాను నీతి నిజాయితీపరుడని చెప్పుకునే వారని, అయితే ఆర్కావతి లేఔట్ డీ నోటిఫికేషన్లో ఆయన అసలు రంగు బయటపడిందని, వెంటనే డీనోటిఫికేషన్కు సంబంధించిన ఉదంతంపై సీబీఐ దర్యాప్తుకి అప్పగించాలని బళ్లారి ఎంపీ శ్రీరాములు అన్నారు. ఆయన గురువారం నగరంలోని కౌల్బజార్లో విలేకరులతో మాట్లాడారు. నిజంగా సిద్ధరామయ్య నిజాయితీ పరుడైతే ఆర్కావతి లేఅవుట్ వివాదంపై సీబీఐకి అప్పగించి తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. బళ్లారి రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థితోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పించలేదని అన్నట్లు పత్రికల్లో చదివానని, అయితే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఈ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి తాను చేసిన కృషి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునన్నారు. న్రియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో పర్యటించి, మంచినీటి సమస్య తీర్చడంతోపాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చే శానని, కాంగ్రెస్ నేతలు ఎక్కడికి పిలిచినా బహిరంగ విచారణకు తాను సిద్ధమేనని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వస్తూ అరచేతిలో వైకుంఠం చూపుతారని, వాటిని ప్రజలు నమ్మకూడదని కోరారు. తన ఆప్త మిత్రుడు గాలి జనార్దనరెడ్డికి కర్ణాటక కేసులకు సంబంధించి బెయిల్ వచ్చిందని, త్వరలో అన్ని కేసులకు సంబంధించి బెయిల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గోవిందరాజులు, శ్రీనివాస మోత్కర్ పాల్గొన్నారు. -
పెల్లుబికిన నిరసన
మంత్రి మండలి నిర్ణయంపై గెజిటెడ్ ప్రొబెషనరీ అభ్యర్థుల ఆగ్రహం ఒకరి ఆత్మహత్యాయత్నం కొనసాగుతున్న ధర్నా సాక్షి, బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన గురువారంజరిగిన మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. బాధితుల్లో కొంతమంది బెంగళూరులో అత్మహత్య యత్నం కూడా చేయడం గమనార్హం. వివరాలు... 2011లో గెజిటెడ్ ప్రొబెషనరీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని సీఐడీ దర్యాప్తులో తేలడంతో సదరు నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్లు మంత్రి మండలి తాజాగా నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఆ పోస్టులకు నూతన నోటిఫికేషన్ విడుదలకు అంగీకారం తెలిపింది. ఇక 2011లో గెజిటెడ్ ప్రొబెషనరీ పరీక్ష రాసిన అభ్యర్థులకు తాజాగా పరీక్షలు రాయదల్చుకుంటే వయోపరిమితి సడలింపు ఇవ్వడానికి మంత్రిమండలి సభ్యులు సమ్మతించారు. అయితే అప్పటి నోటిఫికేషన్కు సంబంధించి ఇంటర్వ్యూ కూడా పూర్తిచేసుకుని ఉద్యోగానికి ఎంపికయిన 362 మంది అభ్యర్థులు ప్రభుత్వ తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బెంగళూరులోని ఫ్రీడం పార్కు వద్ద ధర్నా చేపట్టారు. ఒకరిద్దరు చేసిన పనికి ఎంతో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల భవిష్యత్తును బలిచేయడం సరికాదని వారు వాపోయారు. ఇదిలాఉండగా ఫ్రీడం పార్క్ వద్ద ఉషారాణి అనే అభ్యర్థి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో తప్ప తాము ఎవరితోనూ మాట్లాడబోమని అభ్యర్థులు తేల్చి చెప్పారు. గురువారం రాత్రి పొద్దుపోయేంతవరకూ బాధిత అభ్యర్థులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ఫ్రీడం పార్కు వద్ద ధర్నా చేస్తూనే ఉన్నారు. -
నీటి పారుదల పథకాలకు మరిన్ని నిధులు
ఉప ఎన్నికలపై బీజేపీ వ్యూహం విభేదాలు వీడి... విజయానికి కృషి చేయాలని నేతల పిలుపు ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనకు తీర్మానం జెడ్పీ ఎన్నికల సన్నాహాలపై చర్చ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని మూడు శాసన సభ స్థానాలకు ఈ నెల 21న జరుగనున్న ఉప ఎన్నికలను సమైక్యంగా ఎదుర్కోవడం ద్వారా విజయాన్ని సొంతం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్య వర్గ సమావేశం తీర్మానించింది. స్థానిక మల్లేశ్వరంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి, విజయానికి అందరూ కృషి చేయాలని నిర్ణయించారు. రెండు స్థానాల్లో పార్టీ బలంగా ఉన్నందున, మూడో స్థానాన్నీ గెలుచుకోవడానికి శాయశక్తులా కృషి చేయాలని తీర్మానించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై చేపట్టాల్సిన ఆందోళన గురించి కూడా సమావేశంలో చర్చించారు. అర్కావతి లేఔట్ డీనోటిఫికేషన్, లోపించిన శాంతి భద్రతలు, పెరిగిన అత్యాచారాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని నిర్ణయించారు. రాబోయే జిల్లా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సన్నాహాలపై కూడా చర్చ జరిగింది. పదాధికారుల సమావేశం అనంతరం పార్టీ జిల్లా శాఖల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉభయ సభల్లో ప్రతిపక్ష నాయకులు జగదీశ్ శెట్టర్, కేఎస్. ఈశ్వరప్ప ప్రభృతులు పాల్గొన్నారు. శాంతి భద్రతలు విచ్ఛిన్నం రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వాన స్థితికి చేరుకున్నాయని, ప్రభుత్వం నిద్ర పోతోందని జోషి, ఈశ్వరప్పలు విమర్శించారు. పదాధికారుల సమావేశం అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ హోం మంత్రికి ప్రత్యేకంగా సలహాదారును నియమించడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించారు. కేజే. జార్జ్ బదులు ఆయన సలహాదారు కెంపయ్య హోం మంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అతివృష్టి, అనావృష్టి తాండవిస్తున్నప్పటికీ, మంత్రులు పీడిత ప్రాంతాలను సందర్శించలేదని వారు విమర్శించారు. -
కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకం
ఉప ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం వ్యూహం విజయానికి కారకులైన వారికే పదవులు అంటూ ఆశావహులకు ఎర 10 నుంచి ప్రచారానికి సీఎం, కేపీసీసీ చీఫ్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని మూడు శాసన సభ స్థానాలకు ఈ నెల 21న జరుగనున్న ఉప ఎన్నికలు అధికార కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకంగా మారాయి. వీటిలో రెండు సీట్లు బీజేపీ ఆధీనంలో ఉన్నాయి. మొత్తం మూడు సీట్లను గెలుచుకోవడం ద్వారా ఇటీవల లోక్సభ ఎన్నికల్లో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గట్టి పట్టుదలతో ఉన్నారు. ఆయా నియోజక వర్గాల్లో అన్ని వర్గాలను ఏక తాటిపైకి తీసుకు రావడం ద్వారా గెలుపు సొంతం చేసుకోవాలని వ్యూహ రచన చేస్తున్నారు. ఉప ఎన్నికలు ముగియగానే కార్పొరేషన్లు, బోర్డులకు నియామకాలుంటాయని ఆశావహులకు తాయిలాలు చూపిస్తున్నారు. ఉప ఎన్నికల్లో విజయానికి కారకులైన వారికే ఈ పదవులంటూ ఊరిస్తున్నారు. మూడు నియోజక వర్గాలకు ఇన్ఛార్జిలుగా నియమితులైన మంత్రులతో పాటు తాలూకా స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలు సైతం...ఆ పదవులు మీకేనంటూ ద్వితీయ శ్రేణి నాయకులను ఆశల పల్లకిలో ఊరేగిస్తున్నారు. ఉప ఎన్నికలు జరగాల్సిన శివమొగ్గ జిల్లాలోని శికారిపుర, బళ్లారి గ్రామీణ నియోజక వర్గాల్లో బీజేపీకి గట్టి పట్టుంది. ఆ పార్టీ నుంచి ఈ రెండు స్థానాలను కైవసం చేసుకోవడం కాంగ్రెస్కు పెద్ద సవాలే. ఆ నియోజక వర్గాల్లో బీజేపీకి బలముందని చెప్పడం కంటే మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, మాజీ మంత్రి శ్రీరాములుకు మంచి పలుకుబడి ఉందని చెప్పడమే నగ్న సత్యమవుతుంది. గత శాసన సభ ఎన్నికల్లో శికారిపుర నుంచి యడ్యూరప్ప కేజేపీ టికెట్టుపై, బళ్లారి గ్రామీణ నుంచి శ్రీరాములు బీఎస్ఆర్ కాంగ్రెస్ టికెట్టు మీద గెలుపొందిన సంగతి తెలిసిందే. కనుక వారి వ్యక్తిగత ప్రతిష్టే బీజేపీకి శ్రీరామ రక్ష అవుతుందని చెప్పక తప్పదు. మరో స్థానం చిక్కోడి-సదలగలో గతంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రకాశ్ హుక్కేరి గెలుపొందారు. సిద్ధరామయ్య మంత్రి వర్గంలో కూడా పని చేశారు. సరైన అభ్యర్థి లేరనే సాకుతో హుక్కేరికి ఇష్టం లేకున్నా అధిష్టానం లోక్సభ ఎన్నికల్లో ఆయనను బరిలో దింపింది. ఇప్పుడు ఆయన తనయుడు గణేశ్ హుక్కేరి పోటీ చేస్తున్నారు. ప్రకాశ్ హుక్కేరితో పాటు యడ్యూరప్ప, శ్రీరాములు లోక్సభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. అందువల్లే ఇప్పుడు ఉప ఎన్నికలను నిర్వహించాల్సి వస్తోంది. 10 నుంచి సీఎం, పరమేశ్వర ప్రచారం తన ఒంటెత్తు పోకడల వల్లే లోక్సభ ఎన్నికల్లో తొమ్మిది స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చిందని పార్టీలో విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉప ఎన్నికలకు అప్రమత్తమయ్యారు. కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వరతో ఆయనకు విభేదాలున్న సంగతి బహిరంగ రహస్యమే. ఈసారి ఆయనతో కలసే ఎన్నికల ప్రచారం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ నెల 10 నుంచి ఉభయులూ సంయుక్తంగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. బళ్లారి గ్రామీణ, శికారిపురల్లో మూడేసి రోజులు, చిక్కోడి-సదలగలో రెండు రోజులు వారిద్దరూ ప్రచారం చేయనున్నారు. జేడీఎస్ పోటీలో లేనందున లౌకిక ఓట్లలో చీలిక ఉండబోదని, కనుక గెలుపు ఖాయమని కాంగ్రెస్ విశ్వాసంతో ఉంది. -
ఆపలేరు... అడిగితే ఓపలేరు!
అధికారుల అసహనం స్త్రీలపై ఇంతగా అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? వీటిని ఎవరూ నివారించలేరా? ఈ సందేహాలు మీక్కూడా వస్తే ఎవరినైనా అడగండి కానీ, రాజకీయకుల్ని, పెద్దపెద్ద హోదాలలో ఉన్న ప్రభుత్వాధికారులను మాత్రం అడక్కండి. ఎందుకంటే, వాళ్లు చెప్పే సమాధానాలు అసహనంతో కూడుకున్నవి అయి ఉంటాయి. ఎందుకు అసహనం? నివారించలేనప్పుడు పొడుచుకొచ్చేది అసహనమే కదా. ఉదా: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. బెంగుళూరులోని ఓ పబ్లిక్ స్కూల్లో ఆరేళ్ల చిన్నారిపై ఇటీవల జరిగిన అత్యాచారం కేసులో ‘‘పురోగతి ఏమైనా కనిపించిందా?’’ అనే ప్రశ్నకు సిద్ధరామయ్య మీడియాపై విరుచుకు పడ్డారు. ‘‘ఇది తప్ప మీకు ఇంకో వార్త లేదా?’’ అని అసహనం వ్యక్తం చేశారు. ఇంకో ఉదా: ఉత్తర ప్రదేశ్ గవర్నర్ అజీజ్ ఖురేషీ. ఆయనలోనూ ఇదే అసహనం! పదవిలోంచి దిగిపోతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఉత్తరప్రదేశ్లోని శాంతిభద్రతల గురించి విలేఖరులు ‘అత్యాచారాల మాటేమిటి?’ అన్నప్పుడు ఖురేషీ చాలా చికాకుగా ‘‘ప్రభుత్వం ఏం చెయ్యగలదయ్యా. ఆ దేవుడే దిగి వచ్చినా అత్యాచారాలను ఆపలేడు’’ అని అన్నారు!! ఈ రెండు తాజా ఉదాహరణలను బట్టి చూసినా... మహిళల భద్రతను ఉన్నతస్థాయి అధికారులు, రాజకీయ నాయకులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని అర్థమౌతోంది. ఈ స్థితిలో ప్రభుత్వం మోయవలసిన బరువు బాధ్యతలు కూడా మహిళా కమిషన్ల మీద పడుతున్నాయి. సమస్య ఎక్కడుందో గుర్తించడం, సమస్యకు పరిష్కారాన్ని సూచించడం మాత్రమే కాకుండా కనీస అవసరాలకు సైతం ప్రభుత్వంతో ‘తలపడి’ మరీ సాధించుకోవడం కూడా మహిళా కమిషన్ల వంతే అవుతోంది. ప్రస్తుతం అస్సాం రాష్ట్ర మహిళా కమిషన్ అదే పోరుబాటలో ఉంది. అస్సాంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలలో 51 శాతం వీధి దీపాలు లేకపోవడం వల్లనేనని కమిషన్ గుర్తించింది. ‘‘పైకి ఇది చిన్న విషయంలా కనిపించవచ్చు. కానీ చీకటి పడుతుంటే మహిళలకు ఇక్కడ భద్రత కరువవుతోందన్న మాట మాత్రం వాస్తవం’’ అని కమిషన్ చైర్పర్సన్ మీరా బారువా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, మరో రెండు ముఖ్యసమస్యలపైన కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అందులో ఒకటి: గృహహింస. రెండోది: మంత్రగత్తెల పేరుతో అమాయక గ్రామీణ మహిళలను చంపడం! పైన పేర్కొన్న సమస్యలు ఒక్క అస్సాంవే కాదు. ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నాయి. మహిళల భద్రత తమకు పట్టనట్లున్న ప్రభుత్వాలు కనీసం మహిళా కమిషన్లకు తగినన్ని నిధులైనా సమకూరిస్తే పరిస్థితి చాలావరకు మెరుగవుతుంది. -
పదవుల కోసం పట్టు
ముఖ్యమంత్రిపై పెరుగుతున్న ఒత్తిడి కేపీసీసీ చీఫ్తో సీఎం మంతనాలు తొలగింపు జాబితాలో శామనూరు, శ్రీనివాసప్రసాద్, వినయ్కుమార్ సొరకె, కిమ్మనె పరిశీలనలో ఎస్ఎస్ మల్లికార్జున, అరకలగూడు మంజు, కోళివాడ, మాలికయ్య గుత్తేదార్ పేర్లు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం కోసం పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఒత్తిడి తీసుకు వస్తున్నారు. ఉప ఎన్నికలకు ముందే మంత్రి వర్గాన్ని విస్తరించాలని వారు పట్టుబడుతున్నారు. ఇటీవలే అనేక మంది ఎమ్మెల్యేలు సీఎం క్యాంప్ కార్యాలయం కృష్ణాలో ఆయనను కలుసుకుని తమకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని పట్టుబట్టారు. దీనిపై ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వరలు గురువారం ప్రత్యేకంగా సమావేశమై చర్చించుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న శాసన సభ సమావేశాలు వచ్చే వారం ముగియనున్నాయి. అనంతరం మూడు స్థానాలకు జరిగే ఉప ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక, మంత్రి వర్గ విస్తరణ , కార్పొరేషన్లు, బోర్డులకు నియామకాలపై అధిష్టానంతో చర్చించడానికి వారు ఉభయులూ ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రి వర్గ విస్తరణ కన్నా పునర్వ్యవస్థీకరణపైనే సీఎం ఆసక్తి చూపుతున్నారు. సరిగ్గా పని చేయని కొందరు మంత్రులను తొలగించి, కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఆయన యోచిస్తున్నారు. మంత్రులు శామనూరు శివశంకరప్ప, శ్రీనివాస ప్రసాద్, వినయ్ కుమార్ సొరకె, కిమ్మనె రత్నాకర్లను తొలగించాలనుకుంటున్నారు. వయో భారంతో అవస్థలు పడుతున్న శివశంకరప్ప తన స్థానంలో తన కుమారుడు ఎస్ఎస్. మల్లిఖార్జునకు స్థానం కల్పించాలని కోరుతున్నారు. సీఎం కూడా ఆయన విన్నపం పట్ల సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. కొత్తగా ఆమాత్య యోగం పట్టబోతుందనుకున్న వారి జాబితాలో అరకలగూడు మంజు, కేబీ. కోళివాడ, మాలికయ్య గుత్తేదార్ పేర్లు ఉన్నట్లు సమాచారం. స్పీకర్ కాగోడు తిమ్మప్ప కూడా తనకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని పట్టుబడుతున్నారు. గత ఏడాది ఆయన అయిష్టంగానే ఈ పదవిని చేపట్టారు. ఒక వేళ ఆయన కోరుకున్నట్లు మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తే, బసవరాజ రాయరెడ్డి కొత్త స్పీకర్ అయ్యే అవకాశాలున్నాయి. శాసన సభ సమావేశాల తర్వాత ఢిల్లీకి వెళ్లనున్న సీఎం, పరమేశ్వరలు అధిష్టానంతో జరిపే చర్చల్లో దీనిపై తుది నిర్ణయం వెలువడనుంది. -
నైస్పై దర్యాప్తు
రూ. కోట్లలో కుంభకోణం జరిగిందనే ఆరోపణలపై సభా సంఘం ఏర్పాటు రాష్ర్ట ప్రభుత్వ ప్రకటన సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెంగళూరు, మైసూరు మధ్య వేగవంత రహదారి (బీఎంఐసీ) నిర్మాణాన్ని చేపట్టిన నంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ప్రైజస్ (నైస్)కు భూముల కేటాయింపులో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందనే ఆరోపణలపై దర్యాప్తు జరపడానికి సభా సంఘాన్ని నియమించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై సభలో జరిగిన చర్చకు ప్రజా పనుల శాఖ మంత్రి హెచ్సీ. మహదేవప్ప గురువారం సమాధానమిస్తూ ‘ఈ ప్రభుత్వం ఉన్నది అమ్మకానికి కాదు. బీఎంఐసీ ప్రాజెక్టు విషయంలో అనేక సంవత్సరాలుగా అనుమానాలున్నాయి. ఇలాంటి విషయాల్లో సిద్ధరామయ్య ప్రభుత్వం రాజీ పడదు. నైస్ కంపెనీకి భూముల కేటాయింపుపై సభా సంఘం దర్యాప్తు జరుగుతుంది’ అని ఆయన ఉద్వేగపూరితంగా ప్రకటించారు. మంత్రి ఈ ప్రకటన చేస్తుండగానే పార్టీలకు అతీతంగా సభ్యులందరూ బల్లలు చరిచి సంతోషం వ్యక్తం చేశారు. సభా సంఘాన్ని వీలైనంత త్వరగా నియమిస్తామని మంత్రి ప్రకటించారు. నైస్ వ్యవస్థాపకుడు, ఎమ్మెల్యే అశోక్ ఖేణిపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని, ప్రాజెక్టు చుట్టూ సంవత్సరాల తరబడి వ్యక్తమవుతున్న సందేహాలు, అవకతవకలు నిజమేనా... అని ప్రభుత్వం తెలుసుకోదలచిందని వివరించారు. సభా సంఘం వాస్తవాలను వెలికి తీస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా అంతకు ముందు జరిగిన చర్చలో పాల్గొన్న సభ్యులు పార్టీలకతీతంగా నైస్ తీరుపై ధ్వజమెత్తారు. విలువైన ప్రభుత్వ భూములను నైస్కు కేటాయిస్తే, కోట్ల రూపాయలకు వాటిని రియల్ ఎస్టేట్ కంపెనీలకు అమ్ముకుందని ఆరోపించారు. దేవెగౌడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1995లో సదుద్దేశంతో బీఎంఐసీ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారని మంత్రి కితాబునిచ్చారు. అయితే రోజు రోజుకు ఈ ప్రాజెక్టుపై అనేక ఆరోపణలు వచ్చాయని తెలిపారు. ఇందులో వందల కోట్ల రూపాయల కుంభకోణం చోటు చేసుకుందనే అనుమానాలు తలెత్తాయని చెప్పారు. ‘ఈ సభ అమ్మకానికి సిద్ధంగా లేదు. ఈ సభ సందేహాలకు అతీతంగా వ్యవహరిస్తుంది’ అని చర్చ సందర్భంగా స్పీకర్ కాగోడు తిమ్మప్ప చేసిన వ్యాఖ్యలను మంత్రి గుర్తు చేస్తూ, ‘సార్ మీరు ఈ మాటలు అన్నప్పుడు రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆ కుర్చీపై కూర్చుని మాట్లాడుతున్నారా అని అనిపించింది. మీపై గౌరవం పదింతలైంది. నేను హామీ ఇస్తున్నాను. ఈ ప్రభుత్వం కూడా అమ్మకానికి సిద్ధంగా లేదు’ అని మంత్రి ఉద్వేగంగా ప్రకటించారు. -
మీకు ఇదే వార్తా? ఇంకేమీ సమస్యలే లేవా?
ఆరేళ్ల బాలిక రేప్పై సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఒక పబ్లిక్ స్కూల్లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగిన సంఘటన పై బెంగళూరులోనే కాక దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసన పెల్లుబికిన నేపథ్యంలో, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం చేసిన తాజా వ్యాఖ్యలు మరో వివాదం రేకెత్తిస్తున్నాయి. ఈ కేసులో దోషులను శిక్షించాలంటూ ఒకవైపు విద్యార్థుల తల్లిదండ్రులు వీధుల్లో ఆందోళన జరుపుతుండగా, కేసు విచారణలో పురోగతిపై సమాచారం అడిగిన విలేకరిపై సిద్ధరామయ్య అనుచిత వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ’అసలు ఈ వార్త తప్ప మరే వార్తలూ, సమస్యలూ లేవా? మీకు ఈ వార్త మాత్రమే కావాలా? ఈ కేసులో ఎలాంటి చర్య అవసరమో అవే చర్యలు తీసుకుంటాం. ఎక్కడ గూండా చట్టం ప్రయోగించాలో అక్కడ ప్రయోగిస్తాం.’ అంటూ విలేకరిపై విసుక్కున్నారు. అంతేకాదు.. ప్రతిపక్షం బీజేపీపై కూడా ఆరోపణలు సంధించారు. ఈ కేసులో రాజకీయ లబ్ధికోసం బీజేపీ ప్రయత్నిస్తోందని, రాజకీయం చేస్తోందని అన్నారు. ఈ కేసుపై పోలీసులు వేగంగా స్పందించడంలేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు నిరసన వ్యక్తంచేస్తున్న తరుణంలో సీఎం సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. పైగా, మహిళలపై లైంగిక నేరాలు అన్న అంశంపై గత శుక్రవారం అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో సిద్ధరామయ్య తన సీట్లో కళ్లుమూసుకుని నిద్రలో జోగుతున్నట్టు ఉన్న దృశ్యాలు, టీవీ చానళ్ల లో కనిపించడంతో ఆయన ఇరకాటంలో పడ్డారు. సభలో కునుకుతీయలేదని, చర్చను శ్రద్ధగా వింటున్నానని ఆయన వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. మరో వైపు, విబ్జియార్ స్కూలు ఘటనతోపాటు, 22ఏళ్ల యువతిపై కారులో జరిగిన అత్యాచారం, ఓ శిక్షణా సంస్థలో పదహారేళ్ల క్రైస్తవ సన్యాసినిపై జరిగిన మానభంగం, తాజాగా మూడేళ్ల బాలికపైనా జరిగిన రేప్ ఘటనలు సిద్దధరామయ్య సర్కారును ఇరుకున పడేశాయి. -
మృగాళ్లపై గూండా చట్టం
హోం మంత్రి కె.జె.జార్జ్ చట్టానికి సవరణలు జిల్లాకొక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు జార్జ్ రాజీనామాకు శెట్టర్ పట్టు అత్యాచార ఘటనలతో రాజకీయ లబ్ధి వద్దు : కుమార సాక్షి ప్రతినిధి, బెంగళూరు : అత్యాచారాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు గూండా చట్టాన్ని ప్రయోగించనున్నట్లు హోం మంత్రి కేజే. జార్జ్ తెలిపారు. ప్రస్తుత గూండా చట్టం ప్రకారం అత్యాచారాలకు పాల్పడే వారిని శిక్షించే అవకాశం లేదని, కనుక ఈ చట్టానికి సవరణను తీసుకొస్తామని వెల్లడించారు. అత్యాచార ఘటనలకు సంబంధించి శాసన సభలో సోమవారం జరిగిన స్వల్ప వ్యవధి చర్చకు ఆయన సమాధానమిచ్చారు. అంతకు ముందు చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జోక్యం చేసుకుంటూ, అత్యాచారాల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిందని తెలిపారు. ఇందులో భాగంగా అత్యాచారాలకు పాల్పడిన వారిపై గూండా చట్టం కింద కేసులు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. మహిళా పోలీసు స్టేషన్లు మహిళలపై లైంగిక దాడులు, దౌర్జన్యాలను అరికట్టడానికి ప్రతి జిల్లాలో మహిళా పోలీసు స్టేషన్లను ప్రారంభిస్తామని హోం మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే పది మహిళా పోలీసు స్టేషన్లు ఉన్నాయని, ఈ ఏడాది కొత్తగా పది పోలీసు స్టేషన్లను ప్రారంభిస్తామని వెల్లడించారు. వచ్చే ఏడాది మరో పది స్టేషన్లను ప్రారంభిస్తామన్నారు. ప్రతి జిల్లాలో కనీసం ఒక మహిళా పోలీసు స్టేషన్ ఉంటుందని ఆయన తెలిపారు. రాజీనామాకు పట్టు రాష్ట్రంలో వరుస లైంగిక దాడులను అరికట్టడంలో విఫలమైన హోం మంత్రి కేజే. జార్జ్ వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ డిమాండ్ చేశారు. లైంగిక దాడులపై శాసన సభలో ఆయన స్వల్ప వ్యవధి చర్చను ప్రారంభిస్తూ, పాలనా పరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో హోం మంత్రి విఫలమయ్యారని ఆరోపించారు. మహిళల్లో విశ్వాసం పెంచే కార్యక్రమాలు కూడా చేపట్టలేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో విఫలమయ్యారని ఆరోపించారు. పోలీసు అధికారులు ఏం పని చేస్తున్నారో ఎవరికీ అంతుబట్టడం లేదని, పని చేయాలనే ఉత్సాహం అధికారుల్లో కొరవడిందని విమర్శించారు. పోలీసు శాఖకు చెందిన హొయ్సళ, చీటా వాహనాలు పని చేయడం లేదని ఆరోపించారు. లైంగిక దాడులకు నిరసనగా ప్రజలు రోడ్డుకెక్కినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని దుయ్యబట్టారు. తమపై జరిగే దౌర్జన్యాలపై ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్లకు వచ్చే మహిళల పట్ల పోలీసులు గౌరవప్రదంగా నడుచుకునేట్లు చూడాలని సూచించారు. పోలీసులు ఎవరి పట్లా గౌరవంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. పాఠశాలల్లో లైంగిక దాడులు జరుగుతున్నా, విద్యా శాఖ ఏం చేస్తున్నదో అర్థం కావడం లేదని విమర్శించారు. విబ్గ్యార్ పాఠశాల యాజమాన్యంపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష ఉప నాయకుడు ఆర్. అశోక్ ్రపభృతులు చర్చలో పాల్గొన్నారు. రాజకీయం చేయదలచుకోలేదు రాష్ర్టంలో లైంగిక దాడుల విషయంలో ప్రభుత్వం పట్ల జేడీఎస్ మెతకగా వ్యవహరిస్తోందంటూ వస్తున్న విమర్శలను తిప్పి కొట్టడానికి ఆ పార్టీ శాసన సభా పక్షం నాయకుడు హెచ్డీ. కుమారస్వామి ప్రయత్నించారు. చర్చలో పాల్గొన్న ఆయన జేడీఎస్, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ కొందరు తమను విమర్శిస్తున్నారని తెలిపారు. లైంగిక దాడుల సంఘటనలను అడ్డు పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూడడం ఏ పార్టీకీ తగదని హితవు పలికారు. పోలీసు శాఖ వైఫల్యంపై ఇదివరకే తమ పార్టీ గళం విప్పిందని గుర్తు చేశారు. లైంగిక దాడులపై గత మూడు రోజులుగా ృస్తత చర్చలు జరుగుతున్నాయని, అయితే ఎవరూ దీనికి పరిష్కార మార్గాలు చెప్పడం లేదని అన్నారు. గుజరాత్ సహా దేశంలోని ప్రతి రాష్ర్టంలోనూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. అందరూ కూర్చుని ఈ లైంగిక దాడులను పూర్తిగా అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఓ నిర్ణయానికి రావాలని ఆయన అన్ని పార్టీలను కోరారు. -
ఎన్నాళ్లిలా?
వరుస అత్యాచార ఘటనలపై ముఖ్యమంత్రి ఆగ్రహం సమీక్షలో పోలీస్ అధికారుల నిలదీత మాటలతో కాదని చేతల్లో చూపాలని హితవు అదుపు చేయకపోతే ప్రత్నామ్నాయం తప్పదని హెచ్చరిక సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో మహిళలపై వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనల నియంత్రణలో పోలీసుల వైఫల్యంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు ప్రభుత్వానికి తలవంపులు తెచ్చినా, పోలీసు శాఖ ఏమీ జరగనట్లు వ్యవహరిస్తోందని నిష్టూరమాడారు. విధాన సౌధలో సోమవారం ఆయన సీనియర్ పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. వివిధ శాఖల మంత్రులు కూడా పాల్గొన్నారు. లైంగిక దాడులను నిరోధించడానికి, సంఘటనలు చోటు చేసుకున్న సందర్భాల్లో సరైన చర్యలు చేపట్టడానికి రెండు రోజుల్లో సవరణ మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా ఆరోగ్య, విద్య, పోలీసు శాఖలకు సీఎం సూచించారు. రోజూ లైంగిక దాడుల వార్తలు వస్తూనే ఉన్నాయని చెబుతూ, పోలీసు శాఖ ఏం చేస్తోందని నిలదీశారు. అన్నిటికీ సర్కారు వైపు వేలెత్తి చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ సక్రమంగా పని చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని డీజీపీ లాల్రుఖుం పచావ్ను నిలదీశారు. ఆయన వివరణ ఇవ్వబోగా, కోపోద్రిక్తుడైన సీఎం..తొలుత వీటిని అరికట్టండని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటలతో లాభం లేదని, చేష్టలు ముఖ్యమని దెప్పి పొడిచారు. లైంగిక దాడులకు నిరసనగా ఆందోళనలు జరుగుతున్నాయని, ప్రతిపక్షాలు సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని చెప్పారు. అయినప్పటికీ పోలీసు శాఖ ఏమీ జరగలేదనే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పరిస్థితిని అదుపు చేయకపోతే ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుందని పోలీసు అధికారులను హెచ్చరించారు. ఇకమీదట ఇలాంటి సంఘనటలు జరుగకుండా చూడాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల్లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, మహిళా సిబ్బంది సంఖ్యను పెంచాలని సూచించారు. లైంగిక దాడులు జరిగిన తర్వాత ఆరోగ్య శాఖ విమర్శలకు గురి కాకుండా సరైన పరీక్షా పద్ధతులను అనుసరించాలని ఆదేశించారు. ప్రస్తుతం దీనిపై ఉన్న మార్గదర్శకాలను సవరించి, ప్రభుత్వానికి సమర్పించాలని ఆయన సూచించారు. -
బీ-ట్రాక్కు రూ.11 కోట్లు కేటాయింపు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెంగళూరు ట్రాఫిక్ అభివృద్ధి ప్రాజెక్టు ‘బీ-ట్రాక్’కు రాష్ట్ర మంత్రి వర్గం రూ.11 కోట్లను కేటాయించింది. 2010లో చేపట్టిన ఈ ప్రాజెక్టును విడతల వారీ చేపట్టి 2015 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రి వర్గంలో తీసుకున్న ఇతర నిర్ణయాలు .. = ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు చేస్తున్న బీసీ విద్యార్థిని, విద్యార్థుల కోసం జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక హాస్టళ్లు. ఒక్కో హాస్టల్కు వంద మంది విద్యార్థులు = తుమకూరు వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిధిలో హిరేహళ్లిలో పండ్ల పరిశోధనకు 25 ఎకరాల కేటాయింపు. = చిక్కబళ్లాపురం జిల్లా శిడ్లఘట్టలో మెట్ట సేద్యంపై పరిశోధనలకు 84 ఎకరాల కేటాయింపు. = వ్యవసాయ విశ్వ విద్యాలయాల్లో పాలక మండళ్లలో సభ్యుల సంఖ్య 23 నుంచి 12కు తగ్గింపు. = ప్రభుత్వ కళాశాలల్లోని 362 మంది అతిథి ఉపన్యాసకుల బకాయిలు, ఏప్రిల్ వరకు గౌరవ భృతి చెల్లింపునకు రూ.61.16 కోట్ల విడుదల. = సైబర్ పోలీసు స్టేషన్లలో ఎస్ఐల నియామకానికి విద్యార్హత బీ.టెక్ లేదా బీసీఏగా నిర్ణయం. = తుమకూరు జిల్లా శిరా తాలూకా చీలేనహళ్లి వద్ద ఆధునిక వధ్య శాలకు 20 ఎకరాల కేటాయింపు. ఇక్కడి నుంచి ఆరోగ్యకరమైన గొర్రె మాంసం బెంగళూరుకు సరఫరా. = పలు నిబంధనలతో తిరిగి క్వారీయింగ్కు అనుమతి. ఇసుక విధానం కూడా దాదాపుగా తయారీ. -
నూతన సంక్షేమ పథకాలకు బ్రేక్
= నూతన సంక్షేమ పథకాలకు బ్రేక్ = రాష్ట్రానికి రాబడి లేకపోవడమే కారణం = లక్ష్యాలను చేరుకోలేనిప్రధాన ఆదాయ శాఖలు = మరో వైపు పెరిగిపోతున్న సబ్సిడీ భారం = నూతన పథకాలతో లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేలా కాంగ్రెస్ వ్యూహం = నిధుల్లేక ఫ్లాప్ అయిన ప్రణాళికలు = కేంద్ర పథకాలకూ వాటా నిధులు ఇవ్వలేని స్థితిలో ‘రాష్ర్టం’ సాక్షి, బెంగళూరు : రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇక నూతన సంక్షేమ పథకాలకు తాత్కాలిక బ్రేక్ పడినట్లే. గడిచిన ఆరు నెలల్లో అనుకున్నంత రాబడి రాకపోవడమే ఇందుకు కారణం. చాలా సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. పథకాల అమలు అనేది ఆయా రాష్ట్ర ఆదాయ వనరులను బట్టి ఉంటుంది. అయితే ముఖ్యమంత్రి పదవిని పొందిన సిద్ధరామయ్య అత్యుత్సాహంతో మొదటి రోజే దాదాపు రూ.4,500 కోట్ల విలువజేసే సంక్షేమ పథకాలను ప్రకటించారు. ఎన్నికల మేనిఫేస్టోను, వివిధ రాబడి వనరులను దృష్టిలో ఉంచుకుని సిద్ధరామయ్య ప్రభుత్వం 2013-14 ఏడాదికి గాను దాదాపు రూ.1.21 లక్షల కోట్ల విలువైన బడ్జెట్ను రూపొందించింది. బడ్జెట్ను అనుసరించి ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ విభాగాల నుంచి రూ.97,986 కోట్లు ఆదాయం రావాల్సి ఉంది. సాధారణంగా మొత్తం లక్ష్యంలో ఆరు నెలల్లో సగం పూర్తికావాల్సి ఉంటుంది. అయితే ఈ ఆరు నెలల్లో రూ.38,940 కోట్లు (39.7 శాతం) మాత్రమే వసూలైనట్లు ఆర్థిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర ఖజానాకు ముఖ్య ఆదాయాన్ని తెచ్చిపెట్టే కమర్షియల్ టాక్స్, ఎక్సైజ్ (అబ్కారి), స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, మోటార్ వెహికల్ టాక్సెస్ విభాగాల రాబడి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. ఇదిలా ఉండగా ప్రభుత్వంపై సబ్సిడీ భారం అధికమైంది. అన్నభాగ్య, క్షీరభాగ్య, రుణమాఫీ తదితర పథకాల సబ్సిడీ మొత్తం రూ.14,500 కోట్లకు చేరింది. అటు రాబడి తగ్గడం.. ఇటు సబ్సిడీ మొత్తం పెరడగంతో ప్రభుత్వం ఆర్థిక ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో నూతన పథకాల రూపకల్పన, అమలు నిలిపివేయాల్సిందిగా ఆర్థిక శాఖ నుంచి ప్రభుత్వానికి సూచన అందినట్లు సమాచారం. అధిష్టానానికి నిరాశే!.. దక్షిణ భారత దేశంలో కాంగ్రెస్ తన ప్రాభవాన్ని రోజురోజుకూ కోల్పోతోంది. ఈ క్రమంలో ఆ పార్టీ ఆశలన్నీ కర్ణాటకపైనే పెట్టుకుంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని అధిష్టానం గంపెడాశ పెట్టుకుంది. ఆ ఎన్నికలకు ముందు ప్రజాకర్షక పథకాలను అమలు చేసి ఓట్లు రాబట్టాని అనేక వ్యూహాలు పన్నింది. అయితే రాష్ట్రానికి అనుకున్నంత రాబడి రాకపోవడంతో కాంగ్రెస్ అధిషానికి నిరాశే మిగిలింది. నూతన పథకాల రూపకల్పనకు రాష్ర్ట ఆర్థిక శాఖ అభ్యంతరాలు చెబుతుండటంతో కాంగ్రెస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడిన టై్లంది. కనీసం కేంద్రం నుంచైనా భారీగా నిధులు విడుదల చేద్దామనుకుంటే.. తన వాటాను కూడా వెచ్చించలేని స్థితిలో రాష్ర్ట ప్రభుత్వం ఉంది. ఈ విషయమై రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘కొన్ని కేంద్ర పథకాల అమలుకు రాష్ట్ర వాటాగా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత రాబడి దృష్ట్యా అది సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల కొన్ని కేంద్ర ప్రభుత్వం పథకాల అమలు కూడా అనుమానంగా ఉంది.’ అని పేర్కొన్నారు. -
చిక్కలళ్లాపురం ఇక శాటిలైట్ టౌన్
= సర్వతోముఖాభివృద్ధి చేస్తా = రైల్వే ప్రాజెక్టుల పూర్తికి దశలవారీ నిధులు = కోలారు వద్ద రైల్వేకోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి త్వరలో చర్యలు = ఇచ్చిన 169 హామీల్లో 60 నెరవేర్చాం = మిగతావి నాలుగేళ్లలో పూర్తి చేస్తాం = చిక్కబళ్లాపురం- కోలారు రైలు ప్రారంభోత్సవ సభలో సీఎం చిక్కబళ్లాపురం, న్యూస్లైన్ : బెంగళూరులో జనసంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, తద్వారా తలెత్తుతున్న ఇబ్బందుల పరిష్కారం కోసం చిక్కబళ్లాపురాన్ని శాటిలైట్ టౌన్గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. దీని వల్ల చిక్కబళ్లాపురంలో రోడ్లు, విద్యుత్, మంచినీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు పెరుగుతాయని భరోసా ఇచ్చారు. నగరంలోని నందిరంగ మందిరంలో నైరుతి రైల్వే మండలి ఏర్పాటు చేసిన చిక్కబళ్లాపురం - కోలారు రైల్వే బ్రాడ్గేజ్, నూతన రైలును ముఖ్యమంత్రి శుక్రవారం ప్రారంభించి ప్రసంగించారు. చిక్కబళ్లాపురలో రైల్వేస్టేషన్ విస్తరణ కోసం ఇళ్లను కోల్పోయే చిక్కబళ్లాపురం, చామరాజపేట కాలనీ వాసులకు పునరావాసం కల్పించడానికి అవసరమైన ప్రణాళికలు పూర్తయ్యాయన్నారు. అందులో భాగంగా 13 ఎకరాల భూమిని ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిందన్నారు. రాష్ట్రంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అవసరమైన రూ.10 వేల కోట్లను దశలవారీగా విడుదల చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కోలారు వద్ద రూ1,400 కోట్లతో రైల్వేకోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర వాటా కింద రూ. 700 కోట్లు ప్రభుత్వం త్వరలోనే అందిస్తుందన్నారు. ఈ నెల 13 తేదీకి రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తి చేసుకుంటుందని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 169 హామీల్లో ఇంతవరకు 60 హామీలను నెరవేర్చామని తెలిపారు. మిగిలిన వాటిని నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. రైల్వే శాఖ మంత్రి మల్లికార్జునఖర్గే మాట్లాడుతూ రూ.440 కోట్లతో 87 కిలోమీటర్లు పొడవైన కోలారు - చిక్కబళ్లాపురం రైలు మార్గాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ నిర్మాణంతో అన్ని వర్గాల వారికీ మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలీ, కేహెచ్ మునియప్ప, రాష్ట్ర ఆహార పౌరసర ఫరాల శాఖామంత్రి దినేశ్గుండూరావు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎన్హెచ్ శివశంకరరెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సుధాకర్, రాజణ్ణ, జేకే కృష్ణారెడ్డి, ఎస్ఎన్ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీలు నజీర్ అహ్మద్, వైఏ నారాయణస్వామి, జెడ్పీ అధ్యక్షుడు చిన్నప్ప, కలెక్టర్ ఆర్ విశాల్, ఎస్పీ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మెట్ట వ్యవసాయ అభివృద్ధికి నూతన పాలసీ
కృషి మేళాలో ముఖ్యమంత్రి = పౌల్ట్రీ, పశు, చేపల పెంపకాలూ వృద్ధి = ‘మెట్ట’లోనూ అధిక దిగుబడినిచ్చే వంగడాలను సృష్టించాలి = వ్యవసాయం మానుకుంటున్న రైతులు = ఉపాధి కోసం పట్టణాలకు వలస.. ‘సాగు’పై యువత విముఖత = క్షేత్రస్థాయిలో పర్యటించని అధికారులు.. తగ్గుతున్న దిగుబడులు సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో మెట్ట వ్యవసాయ అభివృద్ధికి నూతన పాలసీని ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. ఈ పాలసీ వల్ల వ్యవసాయ ఆధారిత పరిశ్రమలైన పౌల్ట్రీ, పశు, చేపల పెంపకం తదితర విభాగాలూ అభివృద్ధి చెందుతాయని చెప్పారు. బెంగళూరులో గురువారం నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ కృషి మేళాను ప్రారంభించిన ఆయన మాట్లాడారు. విస్తీర్ణం పరంగా దేశంలో వర్షాధార (మెట్ట) వ్యవసాయం ఆధారిత రాష్ట్రాల్లో రాజస్థాన్ మొదటి.. కర్ణాటక రెండవ స్థానంలో ఉన్నాయన్నారు. అయితే ఇటీవల కాలంలో రాష్ట్రంలో మెట్ట వ్యవసాయం రైతులకు భారంగా మారిందన్నారు. దీంతో పంట పెట్టుబడులూ దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం నూతన పాలసీని ప్రవేశపెడతామని వివరించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా మెట్ట భూముల్లో అధిక దిగుబడి ఇచ్చే వాటితోపాటు రోగనిరోధక వంగడాలను సృష్టించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకు కావాల్సిన సహాయ సహకారాలను సంబంధిత విశ్వవిద్యాలయా లు, పరిశోధనా కేంద్రాలకు అందిస్తుందని భరోసా ఇచ్చా రు. అతివృష్టి, అనావృష్టి వల్ల వ్యవసాయ రంగం నష్టాల ఊబిలో కూరుకుపోతోందని, దీంతో అనేక మంది రైతులు ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక యువత ఈ రంగంపై తీవ్ర విముఖత వ్యక్తం చేస్తుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. గతంలో మొత్తం జనాభాలో 80 శాతం మంది గ్రామాల్లో నివసించేవారని, నేడు అది 61 శాతానికి పడిపోవడమే ఇందుకు తార్కాణమని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వంతో పాటు వ్యవసాయ విశ్వవిద్యాలయాలపై కూడా ఉందన్నారు. క్షేత్రస్థాయికి చేరని ఫలాలు .. వ్యవసాయ రంగం అభివృద్ధిలో ప్రాథమిక సూత్రమైన ‘ల్యాబ్ టూ ల్యాండ్’ను మరిచిన వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లడం లేదన్నారు. ప్రభుత్వం అందించే కోట్లాది రూపాయల సబ్సిడీని మాత్రం రైతులకు అందిస్తూ కార్యాలయాలకే పరిమితమవుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. మరికొందరు అధికారులు కాంట్రాక్టర్లతో కుమక్కై.. అర్హులకు చెందాల్సిన సబ్సిడీనీ స్వాహా చేస్తున్నారని మండిపడ్డారు. ఇండీ గ్రామంలో వరి పంటకు విచిత్ర తెగులు సోకి దిగుబడి పూర్తిగా తగ్గిందని, తరచుగా వ్యవసాయ శాఖ అధికారులు పొలాలను పరిశీలిస్తూ ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కృష్ణ భైరేగౌడ, విశ్వవిద్యాలయం వైస్చాన్స్లర్ నారాయణగౌడ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పంటల ఉత్పత్తిలో విశేష ప్రతిభ కనబరిచిన రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరత్పవార్ గైర్హాజరయ్యారు. -
ఓట్ల కోసమే షాదీ
= పథకాన్ని విస్తరించాల్సిందే = లేకుంటే రాష్ర్ట వ్యాప్తంగా ఉద్యమం = ధర్నాలో సీఎంపై యడ్డి ధ్వజం = 24వ తేదీ వరకూ ధర్నా పొడిగింపు సాక్షి, బెంగళూరు : షాదీ భాగ్య పథకాన్ని అన్ని వర్గాల వారికీ విస్తరింపజేయాలని గత నెల 31 నుంచి చేపట్టిన ధర్నాను ఈ నెల 24 వరకూ పొడిగించినట్లు కర్ణాటక జనతా పార్టీ (కేజేపీ) అధ్యక్షుడు యడ్యూరప్ప బెంగళూరులో తెలిపారు. బెంగళూరు ఆనందరావు సర్కిల్లో చేపట్టిన ఈ ధర్నా మంగళవారంతో ముగించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం స్పందించకపోవడంతో ధర్నాను పొడిగించినట్లు యడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ తన డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించకుంటే పార్టీ కార్యకర్తలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతానని హెచ్చరించారు. ఓ వర్గం ఓట్లు రాబట్టుకోడానికే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇలా నీచ రాజకీయాలకు తెర తీశారని దుయ్యబట్టారు. కాగా, ఈ ధర్నాకు ఇతర విపక్ష పార్టీల నుంచి సరైన మద్దతు లభించడం లేదని మీడియా అడిగిన ప్రశ్నకు యడ్యూరప్ప స్పందించడానికి నిరాకరించారు. -
జనవరి 10 నుంచి హంపి ఉత్సవాలు
బళ్లారి టౌన్, న్యూస్లైన్ : జనవరి 10 నుంచి మూడు రోజుల పాటు హంపి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్చార్జ్ మంత్రి పీటీ. పరమేశ్వర నాయక్ తెలిపారు. ఆయన శుక్రవారం సాయంత్రం అధికారులతో కలిసి హంపి ఉత్సవాల ముందస్తు సమావేశం జరిపిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనవరి 10న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా ఉత్సవాలను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మండ్య లోక్సభ సభ్యురాలు రమ్య, పర్యాటక శాఖా మంత్రి ఆర్వీ దేశ్పాండేలను ఆహ్వానించినట్లు చెప్పారు. రెండవ రోజు జరిగే కార్యక్రమానికి ప్రతిపక్ష నేత హెచ్డీ కుమారస్వామి, గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ మంత్రి హెచ్కే. పాటిల్లను ఆహ్వానిస్తున్నామన్నారు. 12న ముగింపు కార్యక్రమానికి కేంద్ర రైల్వే శాఖా మంత్రి మల్లికార్జునఖర్గే, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, రాష్ట్ర వసతి శాఖా మంత్రి అంబరీష్ను ఆహ్వానించాలని తీర్మానించినట్లు తెలిపారు. ఈసారి ఉత్సవాల్లో రెండు వేదికలను ఏర్పాటు చేస్తున్నామని, ఒక వేదికకు శ్రీకృష్ణదేవరాయల వేదికగా, మరొక దానినిమాజీ ఉప ముఖ్యమంత్రి ఎంపీ ప్రకాష్ వేదికగా ఏర్పాటు చేయాలని తీర్మానించామన్నారు. జిల్లా, రాష్ట్ర, అంతర్జాతీయ కళాకారులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ ఉత్సవాల్లో జిల్లా, రాష్ట్ర కళాకారులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఈ ఉత్సవాలకు రూ.6 కోట్లు ఖర్చు చేయాలని అంచనా ఉన్నట్లు చెప్పారు. ఇందుకోసం సార్వజనిక, పలు పరిశ్రమల యజమానుల సహకారం తీసుకుంటామన్నారు. కన్నడ సంస్కృతీ శాఖ నుంచి రూ.కోటి, పర్యాటక శాఖ నుంచి రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆయా మంత్రులు ప్రకటించారని, వీటిని మరింత పెంచాలని కోరుతున్నామన్నారు. శ్రీకృష్ణదేవరాయల గత వైభవాన్ని తలపించేలా పారదర్శకంగా ఉత్సవాలను జరుపుతున్నట్లు తెలిపారు. ఉత్సవాలు జరిగే నాటికల్లా హెచ్చెల్సీ కాలువపై కూలిన బ్రిడ్జ్ను నిర్మించేలా చర్యలు తీసుకుంటామన్నారు. డిసెంబర్ నెలలో కాలువ నీరు నిలిపి వేస్తున్నందున డిసెంబర్ చివరి నాటికి పనులు ముగించాలని జిల్లాధికారిని ఆదేశించామన్నారు. అదే విధంగా హంపికి వెళ్లే రోడ్డు మరమ్మతులు సైతం చురుగ్గా సాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో హగరిబొమ్మనహళ్లి ఎమ్మెల్యే భీమానాయక్, జెడ్పీ అధ్యక్షురాలు బెండిగేరి శోభ, జిల్లాధికారి ఏఏ.బిస్వాస్, ఎస్పీ చేతన్ సింగ్ రాథోర్, జెడ్పీ సీఎస్ మంజునాథ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఒకటో తరగతి నుంచే ఏబీసీడీ....
= కన్నడ రాజ్యోత్సవంలో సీఎం వెల్లడి .. = ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంగ్లిషు తప్పనిసరి = ఉపాధి అవకాశాల దృష్ట్యా ఆ భాషకు ప్రాధాన్యత = అంతమాత్రాన ఆంగ్లమే సర్వస్వం కాదు = ఇంగ్లిషులోనే మాట్లాడాలని విద్యార్థులపై ఒత్తిడి తేవడం సరికాదు = కన్నడ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది = ఆ మాధ్యమం పాఠశాలలను ఎట్టి పరిస్థితుల్లోనూ మూసేయం = ఇక్కడున్న రాష్ట్రేతరులూ కన్నడ నేర్చుకోవాలి సాక్షి, బెంగళూరు : ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాష నేర్చుకోవడం తప్పని సరైన పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచే ఆంగ్లాన్ని బోధనా భాషగా ప్రవేశ పెట్టాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. ఇక్కడి కంఠీరవ స్టేడియంలో శుక్రవారం జరిగిన కన్నడ రాజ్యోత్సవంలో ఆయన ప్రసంగించారు. ప్రపంచీకరణతో పాటు ఉపాధి అవకాశాల దృష్ట్యా ఇంగ్లిషుకు ప్రాధాన్యత కల్పించడం తప్పనిసరి అన్నారు. అందువల్లే విద్యార్థులకు ఒకటో తరగతి నుంచే ఇంగ్లిషును బోధనా భాషగా ప్రవేశ పెట్టాలని నిర్ణయించామని చెప్పారు. అంతమాత్రాన ఇంగ్లిషు భాషే సర్వస్వం అనుకోవడానికి లేదన్నారు. ఆ భాషను ఎంతవరకూ నేర్చుకోవాలి, ఏ సమయంలో ఉపయోగించుకోవాలనే విషయం అప్పటి పరిస్థితులను బట్టి ఎవరికి వారు నిర్ణయం తీసుకోవాలన్నారు. కన్నడ మీడియంలో చదివితే పిల్లలు ఉన్నత స్థానాలకు చేరుకోలేరనే అభిప్రాయం తల్లిదండ్రుల్లో పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ ఆలోచన వల్లే వారు తమ పిల్లలను ఇంగ్లిషు మీడియంలో చేర్పించడమే కాకుండా ఆ భాషలోనే మాట్లాడాలని ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఇది సరికాదన్నారు. మాతృభాషను నేర్చుకోవడం, మాట్లాడటంలో నిర్లక్ష్యం వహిస్తే మిగిలిన భాషలపై పట్టు ఎలా సాధిస్తారని ప్రశ్నించారు. కన్నడ భాష అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువనో, ఉపాధ్యాయుల కొరత ఉందనో రాష్ట్రంలోని కన్నడ మాధ్యమం పాఠశాలలను మూసేయబోమని భరోసా ఇచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు తమ పిల్లలతో పాటు తామూ కన్నడంను నేర్చుకోవాలని ఉద్బోధించారు. ఇక్కడి సదుపాయాలను అనుభవిస్తూ స్థానిక భాషను నేర్చుకోమంటే ఎలాగని ఆయన నిలదీశారు. -
మంత్రులకు పరీక్ష
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రి వర్గ సభ్యుల పనితీరును బేరీజు వేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిందని కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర తెలిపారు. విధి విధానాలను నిర్ణయించిన అనంతరం పనితీరును లెక్కగడతామని చెప్పారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని స్వీకరించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం తన నివాసంలో ఆయనను పలువురు అభినందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ర్టంలో పార్టీని అధికారంలోకి తీసుకు రావడం పెను బాధ్యతగా స్వీకరించానని చెప్పారు. అప్పటి ప్రతిపక్ష నాయకులు సిద్ధరామయ్య, ఎస్ఆర్. పాటిల్ సహా నాయకులందరూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి శాయశక్తులా కృషి చేశారని ప్రశంసించారు. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని 30 జిల్లాల్లో పర్యటన చేపట్టనున్నట్లు వెల్లడించారు. తనను ఉప ముఖ్యమంత్రిని చేసే విషయమై అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. తనకు ఆ పదవి ఇవ్వాలన్నది కార్యకర్తల అభిమతమని ఆయన చెప్పారు. -
తాలూకా కేంద్రాల్లో చౌక మందుల దుకాణాలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని అన్ని తాలూకా కేంద్రాల్లో చౌక మందుల (జెనరిక్) దుకాణాలను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. తద్వారా పేదలందరికీ భరించదగ్గ స్థాయిలోనే మందులు లభ్యమవుతాయని తెలిపారు. ఇక్కడి ఎస్డీఎస్ క్షయ రోగ పరిశోధనా కేంద్రంలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సంస్మరణార్థం నిర్మించిన కొత్త ఆస్పత్రి భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించి ప్రసంగించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు వివిధ వ్యాధులతో బాధ పడుతున్నారని, వైద్యానికి పెద్ద మొత్తంలో ఖర్చును భరించే స్తోమత వారికి లేనందున అందరికీ ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పిస్తామని వెల్లడించారు. పెద్ద ఆస్పత్రుల్లో ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తేనే వ్యాధులు నయమవుతాయనే అపోహ చాలా మందిలో ఉందంటూ, వాటిని దూరం చేసుకోవాలని కోరారు. రోగుల్లో విశ్వాసం కల్పించడానికి వైద్యులు ప్రయత్నించాలని సూచించారు. కాగా గుజరాత్లో మద్య నిషేధం విఫలమైందని, అక్కడ ఎవరూ తాగుడును మానుకోలేదని అన్నారు. రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలన్న ప్రతిపాదనపై ఆయన మాట్లాడుతూ, నిషేధం వల్ల అక్రమాలు పెరిగిపోతాయన్నారు. వైద్య విద్యాశాఖ మంత్రి డాక్టర్ శరణ్ ప్రకాశ్ పాటిల్ మాట్లాడుతూ రాష్ర్టంలోని నాలుగు రెవెన్యూ జోన్లలో పేదల కోసం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి పాల్గొన్నారు. -
‘పద్మరాజ్’ సిఫార్సులను పరిశీలిస్తాం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో ముగ్గురు ముఖ్యమంత్రుల హయాంలో బీడీఏ జీ కేటగిరీ నివేశన స్థలాల పంపిణీలో అవ కతవకలు చోటు చేసుకున్నందున, వాటిని వెనక్కు తీసుకోవాలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పద్మరాజ్ కమిటీ చేసిన సిఫార్సులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ధరం సింగ్, కుమారస్వామి, యడ్యూరప్పల హయాంలో ముఖ్యమంత్రి విచక్షణ కోటాలో మొత్తం 313 నివేశన స్థలాలను నిబంధనలకు విరుద్ధంగా పంపిణీ చేశారని కమిటీ తేల్చిన సంగతి తెలిసిందే. ఆదివారం ఇక్కడి కాక్స్ టౌన్లో జరిగిన సామూహిక వివాహాల కార్యక్రమంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కమిటీ నివేదికను తానింకా పరిశీలించ లేదని చెప్పారు. పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయిస్తామన్నారు. కాగా నగరానికి అధిక తాగు నీటి సరఫరా, ప్రాథమిక సదుపాయాల కల్పనపై బెంగళూరు జల మండలి విశ్రాంత అధ్యక్షుడు త్యాగరాజన్ నేతృత్వంలో ఏర్పడిన కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కుటుంబ నియంత్రణ పాటించాలి నూతన వధూవరులు ఒకరు లేదా ఇద్దరు పిల్లలకు పరిమితమై కుటుంబ నియంత్రణను పాటించడం ద్వారా జనాభా విస్ఫోటనాన్ని అరికట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. నూతన వధూవరులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ చిన్న కుటుంబం వల్ల పిల్లలకు ఉత్తమ విద్యను, సదుపాయాలను అందించవ చ్చని అన్నారు. నిరాడంబర పెళ్లిళ్లకు ప్రాధాన్యతనివ్వాలని, తద్వారా అనవసర ఖర్చులను తగ్గించవచ్చని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అయిదు నెలల కాలంలోనే అనేక హామీలను నెరవేర్చిందని అన్నారు. -
సిద్ధు పదవికి ఎసరు!
ఖర్గే ఆవేదన = సిద్దయ్య పాలన బాగుంది = అతన్ని పదవీచ్యుతున్ని చేసేలా కుట్రలు = నేను ఎవరిపైనా ఆరోపణలు చేయను = అయితే.. ఇలాంటి ప్రయత్నాలు మానుకోండి = ఆయనకు మంత్రులు, పార్టీ నాయకులు సహకరించాలి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో ఉత్తమ పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పదవీచ్యుతుని చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని రైల్వే శాఖ మంత్రి మల్లిఖార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పరిణామం కాదని హితవు పలికారు. యువజన కాంగ్రెస్ శుక్రవారం ఇక్కడ తన నివాసంలో సన్మానించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సిద్ధరామయ్యను పదవీచ్యుతుని చేయడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారని అడిగినప్పుడు, ఆయన నేరుగా సమాధానం చెప్పడానికి నిరాకరించారు. పాలక, ప్రతిపక్షాల్లోని వారు ఆయనను పదవి నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నిర్దుష్టంగా తాను ఎవరి పైనా ఆరోపణలు చేయలేనని అన్నారు. అయితే ఇలాంటి ప్రయత్నాలు మంచివి కావన్నారు. జనంలోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. ముఖ్యమంత్రి తన పరిధిలో ఉత్తమ పనులు చేస్తున్నారని, మంచి పాలనను అందిస్తున్నారని కితాబునిచ్చారు. ఆయనకు మంత్రులు, పార్టీ నాయకులు సహకరించాలని కోరారు. కాగా మంత్రి సంతోష్ లాడ్ను మంత్రి వర్గం నుంచి తొలగించాలన్న డిమాండ్పై తాను కొత్తగా చెప్పేదేమీ లేదన్నారు. రాష్ట్రంలో రైల్వే పథకాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. రాష్ర్టం వాటా 50 శాతం నిధులను ఇవ్వడానికి ముఖ్యమంత్రి సమ్మతించారని చెప్పారు. ప్రత్యేక హోదా పొందిన హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసే నోటిఫికేషన్పై రాష్ట్రపతి సంతకం చేసినందున, ఆ ప్రాంత అభివృద్ధికి పచ్చ జెండా ఊపినట్లయిందని ఆయన అన్నారు. -
ప్రాథమిక సదుపాయాల కల్పనకు నిధులివ్వండి
= ఆర్థిక సంఘానికి సీఎం వినతి = శాఖల్లో అసమానతలను తొలగించడానికిరూ.16 వేల కోట్లు అవసరం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దేశంలోనే రెండో జాతీయ నగరంగా పేరు పొందిన బెంగళూరులో ప్రాథమిక సదుపాయాల కల్పనకు విరివిగా నిధులు మంజూరు చేయాలని 14వ ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. సంఘం అధ్యక్షుడు డాక్టర్ వైవీ. రెడ్డి, ఇతర సభ్యులతో గురువారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. బెంగళూరులో తాగు నీరు, రోడ్లు తదితర ప్రాథమిక సదుపాయాలను కల్పించడం సవాలుగా మారుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో సదుపాయాలను కల్పించడానికి అవసరమైన నిధులను ఉదారంగా ఇవ్వాలని కోరారు. 12వ పంచ వర్ష ప్రణాళిక లక్ష్యాన్ని నెరవేర్చడానికి, వ్యవసాయ, తోటలు, పశు సంవర్ధక, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల్లో నెలకొన్న అసమానతలను తొలగించడానికి రూ.16 వేల కోట్లు అవసరం ఉందన్నారు. ఈ మొత్తాన్ని మంజూరు చేయించడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా ఇస్తున్న 32 శాతాన్ని 42 శాతానికి పెంచాలని అభ్యర్థించారు. కేంద్రం గ్రాంట్లను ఇచ్చేటప్పుడు హైదరాబాద్-కర్ణాటక ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. రాజ్యాంగంలో 371జే అధికరణను చేర్చడం ద్వారా ఆ ప్రాంతానికి లభించిన ప్రత్యేక హోదాను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అనేక సంక్షేమ పథకాలను ఆయన ఏకరువు పెడుతూ, వాటికి తగ్గట్టుగా నిధులు ఇవ్వాలని అర్థించారు. -
‘పాడి’ని ఆదుకుంటాం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో గాలి కుంటు వ్యాధి వల్ల పశు సంపదను కోల్పోయిన రైతులు కొత్తగా ఆవులను కొనుగోలు చేయడానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని అందిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ హామీ ఇచ్చారు. ఇక్కడి వ్యవసాయ విశ్వ విద్యాలయంలో బుధవారం వ్యవసాయ విశ్వ విద్యాలయాల ఎనిమిదో జాతీయ సదస్సును ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఆవులను పోగొట్టుకున్న రైతులకు నష్ట పరిహారం అందించడానికి ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోరడాన్ని ప్రస్తావిస్తూ, నష్ట పరిహారం ఇవ్వడానికి సాధ్యం కాదని తేల్చి చెప్పారు. అయితే కొత్తగా ఆవుల కొనుగోలుకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. కాగా రాష్ట్రంలో వక్క రైతులకు జరిగిన నష్టంపై అంచనా వేయడానికి ఇటీవల పంపిన కేంద్ర బృందం నివేదికను సమర్పించిందని వెల్లడించారు. దాని ఆధారంగా రూ.175 కోట్ల నష్ట పరిహారాన్ని అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. స్థిరంగా వృద్ధి దేశంలో గత దశాబ్దంగా ఆహార ధాన్యాల ఉత్పాదకతలో స్థిరమైన వృద్ధిని సాధిస్తున్నామని ఆయన ప్రశంసించారు. ప్రస్తుతం హెక్టారుకు జాతీయ ఆహార ధాన్యాల ఉత్పాదకత స్థాయి 2,059 కిలోలకు పెరిగిందని వెల్లడించారు. 2002-03తో పోల్చుకుంటే 34 శాతం అధికమన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు ఉత్పాదకతలో జాతీయ సగటును మించి పోయాయని కొనియాడారు. చిరు, ముతక ధాన్యాల ఉత్పాదకత గణనీయంగా పెరిగిందన్నారు. దీనిని ఇలాగే కొనసాగిస్తూ పప్పు దినుసులు, వంట నూనెల ఉత్పాదకతలో కూడా అదే వృద్ధిని చూపించాలని కోరారు. ప్రస్తుతం రూ.10 వేల కోట్ల విలువైన పప్పులను, రూ.60 వేల కోట్ల విలువైన వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్నామని వెల్లడించారు. దీనిని నివారించడానికి స్థానికంగా ఉత్పత్తిని పెంచుకోవడం ద్వారా దిగుమతులపై ఆధార పడడాన్ని తగ్గించుకోవాలని సూచించారు. అదే సమయంలో పంట మార్పిడి విధానాలను అవలంబించడం ద్వారా ఉత్పాదకతను పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ హెచ్ఆర్. భరద్వాజ్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
‘ధర్మ స్థల’ ఘటనపై న్యాయం కోసం..
= ‘హత్యాచారం’పై రాజుకుంటున్న వివాదం = ఏడాది అయినా వీడని మిస్టరీ = కొనసాగుతున్న సీఐడీ దర్యాప్తు = ధర్మస్థల ధర్మాధికారి హెగ్డేపై ఆరోపణలు = హెగ్డేకు మద్దతిస్తున్న పలువురు మఠాధిపతులు = లైంగిక దాడికి నిరసనగా ఊపందుకుంటున్న ప్రదర్శనలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దక్షిణ కన్నడ జిల్లా ధర్మ స్థలలో సుమారు ఏడాది కిందట సౌజన్య అనే విద్యార్థిని ‘హత్యాచారం’పై నెలకొన్న వివాదం రాష్ట్రంలో రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఇప్పటికే సీఐడీ దీనిపై దర్యాప్తు చేస్తున్నప్పటికీ, నత్త నడకలా సాగుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. సౌజన్యపై లైంగిక దాడి చేసి, హత్య చేసిన వారిని ధర్మ స్థల ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే వెనకేసుకొస్తున్నారని పలువురు ఆరోపిస్తుండగా, ఆయన తీవ్రంగా ఖండించారు. దీనిపై ఎలాంటి దర్యాప్తు అయినా, ఆఖరికి సీబీఐ దర్యాప్తు జరిపించినా తనకు సమ్మతమేనని హెగ్డే తేల్చి చెప్పారు. తన కుటుంబ సభ్యులపైనే ఆరోపణలు వస్తుండడంతో ఎలాంటి విచారణకైనా సిద్ధమని బహిరంగంగానే ప్రకటించారు. వివాదం తీవ్రమవుతుండడంతో పలువురు మఠాధిపతులు హెగ్గడేకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. తాను సౌజన్య తల్లిదండ్రులను కలుసుకున్నప్పుడు, వారు కూడా హెగ్డేపై ఆరోపణలు చేయలేదని ఉడిపి పెజావర మఠాధిపతి విశ్వేశ తీర్థ స్వామీజీ తెలిపారు. అయితే దర్యాప్తు సరైన దిశలో సాగనందున, తమకు న్యాయం జరగక పోవచ్చనే సందేహాన్ని మాత్రమే వారు వెలిబుచ్చారని వివరించారు. సీబీఐ దర్యాప్తు జరిపిస్తేనే న్యాయం జరుగుతుందని అన్నారని తెలిపారు. మరో వైపు రాజకీయ పలుకుబడితో హెగ్డే కుటుంబ సభ్యులు ఈ కేసును నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్న నాగరిక సేవా ట్రస్టుకు కూడా క్రమేణా మద్దతు పెరుగుతోంది. కాగా దీనిపై బెంగళూరు, మైసూరు, ఉడిపి, దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరు, బెళ్తంగడి, పుత్తూరులలో నిరసన ప్రదర్శనలు ఊపందుకుంటున్నాయి. సౌజన్య కుటుంబానికి వీలైనంత త్వరగా న్యాయం జరగాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆకాంక్షించారు. త్వరలోనే దర్యాప్తును ముగించి, రెండో చార్జిషీట్ను దాఖలు చేస్తామని సీఐడీ అధికారులు తనకు చెప్పారని వివరించారు. తనకు వీరేంద్ర హెగ్గడేపై గౌరవం ఉందంటూ, ఆయన కూడా సౌజన్య కుటుంబానికి సామాజిక న్యాయం జరగాలనే కోరుకుంటారని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. -
ప్రభుత్వ కళాశాలల్లో రాయితీ ధర కు.. మధ్యాహ్న భోజనం
= యోచనలో సర్కార్ : సీఎం వెల్లడి = విద్యార్థులతో పాటు బోధన, బోధనేతర సిబ్బందికీ = పౌష్టికాహార లోపం నివారణే లక్ష్యం = అమలుపై సాధక బాధకాలను పరిశీలిస్తున్నాం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులతో పాటు బోధన, బోధనేతర సిబ్బందికి అతి తక్కువ ధరకు మధ్యాహ్న భోజనాన్ని (బిసియూటె) అందించాలని ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. పౌష్టికాహార లోపంతో ఎవరూ బాధ పడరాదని, సమాజంలో అందరూ ఆరోగ్యవంతంగా బతికే వ్యవస్థను నిర్మించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రతిభావంతులవుతారని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వ కళాశాలల్లో బిసియూటెను అందించే విషయమై సాధక బాధకాలను పరిశీలిస్తున్నామని వివరించారు. ఇక్కడి శేషాద్రి రోడ్డులోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల స్వర్ణోత్సవాలను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతోనే ‘అన్న భాగ్య’ పథకాన్ని ప్రవేశ పెట్టామని తెలిపారు. అంతకు ముందు మాట్లాడిన స్థానిక శాసన సభ్యుడు రోషన్ బేగ్ విద్యార్థులకు రూ.5, బోధనేతర సిబ్బందికి రూ.15, బోధనా సిబ్బందికి రూ.20 ధరపై వేడి భోజనం అందించాలని ముఖ్యమంత్రిని కోరారు. -
ముసాయిదాలను కన్నడలోనే రూపొందించండి
= ముఖ్యమంత్రి సిద్ధరామయ్య = కన్నడలో తీర్పు చెప్పిన న్యాయమూర్తులకు సన్మానం సాక్షి,బెంగళూరు: రాష్ట్ర చట్టసభల్లో ప్రవేశపెట్టే ముసాయిదాలను మొదట కన్నడలో రూపొందించి అటుపై ఆంగ్లంలోకి తర్జుమా చేయాలని దీని వల్ల మాతృభాషకు ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధికి తోడ్పడిన వాళ్లమవుతామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో కన్నడలో తీర్పు చెప్పిన 48 మంది న్యాయమూర్తులకు బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్రలో కన్నడ ప్రాధికార సంస్థ ఆదివారం సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ... ప్రస్తుతం శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెట్టే ముసాయిదాలను మొదట ఇంగ్లీషులో రూపొందించి తర్వాత కన్నడలోకి మారుస్తున్నారని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని ఇందుకు అవసరమైన నిబంధనలు రూపొందించాల్సిందిగా న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి టీ.బీ జయచంద్రకు సూచించారు. కన్నడ భాషకు ఎంతో చరిత్ర ఉందన్నారు. ఎనిమిది మంది కన్నడ సాహితీవేత్తలకు జ్ఞానపీఠ పురస్కారం అందిందన్నారు. ఇంతటి ఘనచరిత్ర ఉన్న కన్నడపై ప్రజలకు ఆసక్తి తగ్గుతోందనే విమర్శలు రావడం సరికాదన్నారు. కన్నడ భాషలో చదివిన వారు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉన్నత స్థానాలకు వెళ్లరనే ఆలోచన వీడాలని ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య ప్రజలకు హితవు పలికారు. హైకోర్టు, సుప్రీం కోర్టులో కన్నడలో వాదన లు చేయడానికి, తీర్పును వెలువరించడానికి కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవమన్నారు. అయితే రాష్ట్రంలోని కొన్ని చోట్ల కోర్టు వ్యవహారాలకు సంబంధించి కన్నడ భాష ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితిని పూర్తిగా సద్వినియోగం చేసుకుని న్యాయవాదులు కన్నడలోనే వాదనలు వినిపించాలన్నారు. అదేవిధంగా న్యాయమూర్తులు కూడా కన్నడలోనే తీర్పు వెలువరించాలని సీఎం సిద్ధు అభిప్రాయపడ్డారు. దీని వల్ల సామన్య ప్రజలకు కూడా కోర్టు వ్యవహారాలు అర్థమవుతాయన్నారు. కాగా, కార్యక్రమంలో భాగంగా సన్మానం పొందిన ఒక్కొక్క న్యాయమూర్తికి రూ.10 వేల నగదు, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కన్నడ ప్రాధికార సంస్థ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రు, సీనియర్ జడ్జి ఎన్.కుమార్ తదితరులు పాల్గొన్నారు.