Sye Raa Narasimha Reddy
-
టాలీవుడ్ @ 2020
గడిచిన పదేళ్ల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ.. ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. మరెన్నో శిఖరాలను అందుకుంది. గొప్ప గొప్ప విజయాలను సాధించింది. తన మార్కెట్ వ్యాల్యూనూ అనూహ్యంగా పెంచుకుంది. ఇవాళ జాతీయంగా, అంతర్జాతీయంగా తెలుగు సినిమాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దేశవ్యాప్తంగానే కాదు.. ఓవర్సీస్లోనూ భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇందుకు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలి. తెలుగు సినిమాను అంతర్జాతీయంగా నిలబెట్టడంలో, టాలీవుడ్ ఖ్యాతిని అంతర్జాతీయంగా విస్తరింపజేయడంలోనూ బాహుబలి సినిమాలది ప్రత్యేకమైన స్థానం. కానీ అంతకుముందు నుంచి టాలీవుడ్ సినిమాలు వడివడిగా ఎదుగుతూ ఎంతో పేరుప్రఖ్యాతలు పొందాయి. ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్ దిశదిశలా వ్యాపించింది. ఇప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగానే క్రేజ్ నెలకొంది. అంతర్జాతీయంగానూ గుర్తింపు లభిస్తోంది. ఈ నేపథ్యంలో విస్తరించిన మార్కెట్ను అందిపుచ్చుకోవడం.. పెరిగిపోయిన అంచనాలకు దీటుగా సత్తా ఉన్న సినిమాలు నిర్మించడం తెలుగు చిత్రసీమకు కత్తిమీద సాములాంటిదే. పెరిగిన బడ్జెట్.. అంచనాలు! బాహుబలి ఇచ్చిన జోష్తో భారీ సినిమాలు తెరకెక్కించేందుకు ఇప్పుడు దర్శకనిర్మాతలు ముందుకొస్తున్నారు. ఒకప్పుడు 30, 40కోట్ల బడ్జెట్తో సినిమాలను తెరకెక్కించేందుకు దర్శకనిర్మాతలు వెనుకాముందు అయ్యేవారు. సినిమా హిట్టయినా అంత బడ్జెట్ తిరిగొస్తుందా? అన్న సందేహాలు వెంటాడేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతిష్టాత్మక సినిమాల కోసం, క్రేజీ కాంబినేషన్ల కోసం వందల కోట్లు పెట్టేందుకు నిర్మాతలు ముందుకొస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు తీసేందుకు దర్శక, నిర్మాతలు సాహసిస్తున్నారు. ఈ కోవలో వచ్చిన సినిమాలే సాహో, సైరా, మహర్షి, వినయవిధేయ రామ. ఇవన్నీ భారీ బడ్జెట్ సినిమాలు. ఇందులో సాహో, సైరాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు 200 కోట్లకుపైగా బడ్జెట్తో భారీ అంచనాలతో, కళ్లుచెదిరే విజువల్స్, స్టంట్లతో ఈ సినిమాలు తెరకెక్కాయి. ఈ సినిమాలకు టాలీవుడ్లోనే కాదు దేశవ్యాప్తంగా క్రేజ్ నెలకొంది. అయితే, భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఏమాత్రం కథ, కథనాలు ఏమాత్రం ప్రేక్షకుడి అంచనాలకు మించి లేకపోతే.. కథ మొదటికి వచ్చే ప్రమాదం ఉందని ఈ ఏడాది వచ్చిన సినిమాలు నిరూపించాయి. బాహుబలి తర్వాత భారీ అంచనాలతో, దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్తో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘సాహో’. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విడుదలైనప్పటికీ.. అంచనాలను అందుకోవడంలో దారుణంగా విఫలమైంది. దర్శకుడు సినిమాలోని స్టంట్ల మీద పెట్టిన ఫోకస్లో కొంతమేరకైనా కథ, స్క్రీన్ప్లే మీద పెట్టి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదేమోనని వినిపించింది. మొత్తానికి హిందీలో తప్ప మిగతా అన్ని భాషల్లో సాహో సినిమా భారీ పరాభవాన్నే ముటగట్టుకుంది. హిందీలో వందకోట్లకుపైగా వసూళ్లు రావడం, ప్రభాస్ స్టార్డమ్ కలిసిరావడంతో ఈ సినిమా నిర్మాతలకు కొంత ఊరటనిచ్చే విషయం. ఇక, చారిత్రక నేపథ్యంతో భారీ బడ్జెట్తో తెరకెక్కిన సైరానరసింహారెడ్డి సినిమా కూడా అంచనాలకు దూరంగానే ఉండిపోయింది.రేనాటి సూరీడు, స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాంచరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగులో హిట్టైనప్పటికీ.. అంచనాలను అందుకోలేకపోయింది. ఇతర భాషల్లో ఓ మోస్తరు వసూళ్లే రాబట్టింది. మహేశ్బాబు 25వ సినిమా మహర్షి కూడా భారీ బడ్జెట్తో తెరకెక్కింది. అయితే, ఈ సినిమా హిట్ అయినప్పటికీ.. ప్రిన్స్ మహేశ్ స్టామినాకు తగ్గట్టు వసూళ్లు రాబట్టంలో సక్సెస్ కాలేదు. ఇక, రాంచరణ్ హీరోగా తెరకెక్కిన వినయవిధేయ రామ సినిమా గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. రంగస్థలం లాంటి పర్ఫార్మెన్స్ ఒరియంటెడ్ పాత్ర చేసిన చరణ్.. ఆ వెంటనే రోటిన్ ఫార్ములా సినిమాలో నటించడం.. ఫైట్లు, రక్తపాతంతో దర్శకుడు బోయపాటి శ్రీను ప్రేక్షకులను బెంబెలెత్తించడంతో ఈ సినిమా బోల్తా కొట్టింది. మారిన బాక్సాఫీస్ సరళి! తెలుగు చిత్రపరిశ్రమ మార్కెట్ ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశీయంగానూ పొరుగు రాష్ట్రాల్లోనూ మంచి మార్కెట్ ఏర్పడింది. అంతేకాదు ఓవర్సీస్లోనూ గణనీయంగా వసూళ్లు రాబట్టే సత్తా ఉన్నట్టు తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో సినిమా జయాపజయాల ప్రమాణాలూ మారిపోయాయి. ఒకప్పడు 50 రోజులు ఆడితే బొమ్మ హిట్టు అనేవారు. వందరోజులు ఆడితే సూపర్హిట్టు.. 175, 200 రోజులు ఆడితే బ్లాక్బస్టర్ హిట్టు, ఆల్టైమ్ హిట్టు అని కొనియాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. డిజిటల్ స్ట్రీమింగ్ అందుబాటులోకి రావడంతో 40రోజుల్లోనే కొత్త సినిమా ప్రేక్షకుల చెంతకు చెరిపోతోంది. టీవీల్లోనూ, ఇంకా వీలైతే యూట్యూబ్లోనూ వీలైనంత త్వరగా కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ పరిస్థితుల నడుమ ఎన్ని థియేటర్లలో విడుదలైంది.. ఏ స్థాయిలో ప్రారంభ వసూళ్లు సాధించింది.. ఎన్ని వారాలపాటు నిలకడగా వసూళ్లు రాబట్టగలిగిందనేని సినిమా విజయానికి ఇప్పుడు ప్రమాణంగా మారింది. ప్రారంభ వసూళ్ల ఆధారంగా సినిమా జయాపజయాలు బేరిజు వేసే పరిస్థితి వచ్చింది. మొదటి మూడు రోజులు బంపర్ వసూళ్లు సాధిస్తే బొమ్మ హిట్టు, సూపర్హిట్టు ఖాతాలోకి వెళ్లిపోతోంది. మొదటి రెండు వారాల వసూళ్లు సినిమా విజయానికి ప్రాణపదంగా మారిపోయాయి. థియేటర్లలో లాంగ్రన్ అనేది చాలావరకు కనుమరుగవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. బాహుబలి, రంగస్థలం లాంటి బలమైన కథాచిత్రాలే చాలాకాలంపాటు ప్రేక్షకులను థియేటర్లకు లాక్కొచ్చాయి. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. ఎంత మంచి టాక్ వచ్చిన సినిమా అయినా, స్టార్ హీరో మూవీ అయినా మూడు, నాలుగు వారాలకు మించి థియేటర్లలో నిలబడని పరిస్థితి. మారిన పరిస్థితులకు అనుగుణంగా టాలీవుడ్ కూడా తన పద్ధతలను మార్చుకుంది. ప్రారంభ వసూళ్లపైనే ఇప్పుడు దర్శక నిర్మాతలు, సినీ తారలు ఫోకస్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున విడుదల చేసి మొదటి ఒకటిరెండు వారాల్లోనే దండిగా వసూళ్లు రాబడట్టంపై దృష్టి పెట్టారు. ఆన్లైన్లో వరుసగా ఫస్ట్లుక్, టీజర్లు, పాటలు, ట్రైలర్లు విడుదల చేస్తూ.. ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచుతూనే.. క్షేత్రస్థాయి పర్యటనలతో సినిమా విడుదలకు ముందే ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లి.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు కొత్త కొత్త వ్యూహాలు పన్నుతున్నారు. ఈ పరిణామాలు కొంతమేరకు సక్సెస్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా సినిమాలోబలమైన కథకథనాలు, భావోద్వేగాలు, వినోదం ఉంటే.. ఆటోమేటిక్గా ప్రేక్షకులు థియేటర్ వైపు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కథకథనాలు బాగుండి.. స్టార్ బలం లేకపోయినా, అంతగా ప్రచారం లేకపోయినా హిట్టు కొట్టవచ్చునని ఈ ఏడాది వచ్చిన బ్రోచేవారెవురా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, ఎవరు, మల్లేశం వంటి సినిమాలు నిరూపించాయి. మొత్తానికి కళ్లుచెరిరే స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్ మాత్రమే సినిమాను ప్రేక్షకులకు చేరువచేయలేదని, ప్రేక్షకుడిని రంజింపజేసే కథ, స్క్రీన్ప్లే, బలమైన భావోద్వేగాలు ఉంటే తప్ప బొమ్మ హిట్టు కావడం అంత ఈజీ కాదని 2019 బాక్సాఫీస్ హిస్టరీ చాటుతోంది. మూస సినిమాలకు కాలం చెల్లిపోయిందని, రొటీన్ ఫార్మూలాలతో తెరకెక్కించే మసాలా సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ దొరకడం కష్టమేనని తాజా పరిణామాలు చెప్పకనే చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే, పెరిగిన మార్కెట్ అంచనాలకు దీటుగా.. మారిన ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని.. ఫ్రెష్ కంటెంట్నూ, క్రియేటివ్ కథలను అన్వేషించి తెరకెక్కించాల్సిన అవసరముందని టాలీవుడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కమర్షియల్ సినిమా పేరిట ఇన్నాళ్లు అవలంబించిన రోటిన్, మూస ఫార్ములా చిత్రాలను పక్కనబెట్టి.. ఒరిజినాలిటీ ఉన్న కథలను, ఆసక్తికరమైన స్క్రీన్ప్లేతో వినూత్నంగా తెరకెక్కిస్తే ప్రేక్షకుల హృదయాలు గెలుచుకోవడం ఈజీ అని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సంక్రాంతికి రాబోతున్న టాలీవుడ్ పందెకోళ్లు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురం సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. సరికొత్త కథాకథనాలతో కొత్త సంవత్సరంలో రాబోయే సినిమాలు ప్రేక్షకులను ఆదరిస్తాయని, నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తాయని ఆశిద్దాం. - శ్రీకాంత్ కాంటేకర్ -
21 నుంచి అమెజాన్ ప్రైమ్లో సైరా..
హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి నటించిన పీరియాడిక్ డ్రామా సైరా ఈనెల 21 నుంచి ఆన్లైన్లో హెచ్డీ ప్రింట్ అందుబాటులో ఉంటుందని అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. సైరా తమిళ్, తెలుగు, కన్నడ, మళయాళం వెర్షన్లను ఆన్లైన్లో వీక్షించవచ్చని పేర్కొంది. హిందీ వెర్షన్ త్వరలోనే ఆన్లైన్లో అందుబాటులోకి వస్తుందని తెలిపింది. సురేందర్రెడ్డి నిర్ధేశకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై రామ్చరణ్ ప్రొడ్యూస్ చేసిన సైరా పాజిటివ్ టాక్తో విజయవంతంగా థియేటర్లలో సందడి చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి టైటిల్ రోల్లో కనిపించిన సైరాలో వీరోచిత పోరాట ఘట్టాలు మెగా అభిమానులను విశేషంగా అలరించాయి. ఇక నయనతార, సుదీప్, అమితాబ్, జగపతిబాబు, తమన్నా, విజయ్ సేతుపతి, అనుష్క వంటి దిగ్గజ నటులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. -
కేకు శిల్పాలు
సైరా సినిమా సక్సెస్మీట్లో అందరి దృష్టిని ఆకర్షించింది ఎదురుగా ఉన్న శిల్పం. అది శిల్పం కాదని, కేక్ అని తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో నివాసముండే ఢాకా రాధ ఆ కేక్ రూపకర్త. ఇంట్లో పుట్టినరోజు నుంచి సెలబ్రిటీల ఫంక్షన్ల వరకు రాధ అందించే రకరకాల శిల్పాకృతులను పోలిన కేక్ తయారీకి ఆమె చేసిన కృషి గురించి ఆమె మాటల్లోనే... సైరా సక్సెస్మీట్లో..కేక్! ‘ఈ బేకింగ్ ఆర్ట్లో నైపుణ్యం సాధించడానికి కొన్నేళ్లు పట్టింది. రాత్రింబవళ్లు కష్టపడితే తప్ప ఈ రూపాలు రాలేదు. మొదట్లో మా పిల్లలిద్దరి పుట్టిన రోజులకు కేక్స్ తయారుచేసేదాన్ని. వాటిల్లోనూ బయట కొనే కేకుల మాదిరి కాకుండా ఏదైనా భిన్నంగా ఉండాలనుకున్నాను. వాటిని చాలా అందంగా డెకొరేట్ చేసేదాన్ని. వచ్చిన బంధుమిత్రులు చూసి వారిళ్లలో వేడుకలకు కేక్స్ తయారుచేసి ఇవ్వమనేవాళ్లు. ఆ తర్వాత్తర్వాత కేక్తోనే చిన్న చిన్న బొమ్మలను తయారుచేసి అలంకరించేదాన్ని. గతంలో వంటల పుస్తకాలు చూస్తూ వంటలు చేసేదాన్ని. తర్వాత్తర్వాత ఇంటర్నెట్లో ఇలాంటి కళ కోసం, కళాకారుల కోసం వెతుకుతూ ఉండేదాన్ని. సాధనతో ఆకృతులు చేయడం వచ్చింది. థీమ్కు తగినట్టు చదివింది పోస్టు గ్రాడ్యుయేషన్. కానీ, పెయింటింగ్ మీద చిన్నప్పటి నుంచి ఆసక్తి. క్యారికేచర్స్ వేసేదాన్ని. తంజావూర్, వాటర్ కలర్ పెయింటింగ్స్ చేసేదాన్ని. ఆ కళ ఇలా కేక్ మీదకు తీసుకురావడానికి ఉపయోగపడింది. పెళ్లి రోజు, రిసెప్షన్, షష్టిపూర్తి.. ఇలా ఏ కార్యక్రమమైనా ఆ థీమ్కు తగ్గట్టు బొమ్మల కేక్ తయారు చేసి ఇస్తూ ఉండేదాన్ని. సింగర్ సునీతకు.. కేక్ ఆకృతి వంటల పోటీలు కేక్ ఆర్ట్లో నిరంతర సాధన, ప్రయోగాలు చేస్తూనే దేశంలో ఎక్కడ బేకింగ్ పోటీలు జరిగినా వాటిలో పాల్గొంటూ వచ్చాను. దేశంలో యుకెకు చెందిన కేక్ మాస్టర్స్ మ్యాగజీన్, గ్లోబల్ షుగర్ ఆర్ట్ ఆన్లైన్ మ్యాగజీన్స్ ప్రతియేటా టాప్ టెన్ అవార్డులను ఇస్తుంటాయి. కిందటేడాది ఆ అవార్డు నన్ను వరించింది. వంటగదిలోనే.. మా అమ్మగారికి ఎనభైమూడేళ్లు. ఇప్పటికీ తను వంట చేస్తారు. ఇంట్లో వంటవాళ్లు ఉన్నప్పటికీ వండి వడ్డించడంలో ఆమెకున్న ఆసక్తి నన్నూ వంటవైపుగా నడిపించింది. ఆమె దగ్గరే నేనూ రకరకాల పదార్థాల తయారీ నేర్చుకున్నాను. మా ఇంట్లోని వంటగదే ఈ కేక్ వ్యాపారానికి కేంద్రబిందువు. మా పిల్లలు కూడా కేక్ బేకింగ్లో పాల్గొంటారు. ఈ తరం వాళ్లలో ఉండే ఆలోచనలు, సృజన కేక్ తయారీ రూపకల్పనకు ఉపయోగపడుతుంది. అటు అమ్మ నుంచి ఇటు మా అమ్మాయి నుంచీ సూచనలు తీసుకుంటాను. ఆర్డర్స్ ఎక్కువ వచ్చాయంటే మా ఇంట్లో వాళ్లూ సాయం చేస్తారు. ఇదంతా మా ఇంటి సభ్యుల టీమ్ ఎఫర్ట్. పదేళ్లుగా బిజినెస్ బిజినెస్ చేయాలనే ఆలోచనతో కాకుండా బేకింగ్ ఆర్ట్ ఆసక్తితో నేర్చుకున్నాను. ముందు బంధు మిత్రులు అడిగితే కేక్స్ చేసి ఇస్తూ వచ్చిన నేను పదేళ్ల క్రితం బిజినెస్ మొదలుపెట్టాను. బేకింగ్ క్లాసులు కూడా తీసుకుంటున్నాను. ఆ క్లాసులు రెండు రోజుల నుంచి నెల రోజుల వరకూ ఉంటాయి. ఆన్లైన్ ద్వారా ఈ కేక్ తయారీ గురించి తెలుసుకుంటూ బంగ్లాదేశ్, శ్రీలంక నుంచి వచ్చి ఈ బొమ్మల కేక్ తయారీలో మెలకువలు నేర్చుకొని వెళుతుంటారు. గృహిణిగా ఉంటూ ఇష్టం కొద్ది మొదలుపెట్టిన ఈ కేక్ తయారీ ఇప్పుడు నాకో ప్రత్యేక గుర్తింపును తెచ్చింది’ అంటూ రాధ ఆనందంగా తెలిపారు. – నిర్మలారెడ్డి,ఫొటో: ఎస్.ఎస్.ఠాకూర్ -
నేను చాలా తప్పులు చేశా..
సినిమా: తన సినీ పయనం సక్సెస్ఫుల్ కాదని నటి తమన్నా అంటోంది. ఇటీవల తెలుగులో చిరంజీవితో కలిసి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటనకు గానూ మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ, తమిళంలో నటించిన పెట్రోమ్యాక్స్ చిత్రం కూడా సక్సెస్ కావడంతో చాలా హుషారుగా ఉంది. ఈ సందర్భంగా తమన్నా ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తనకు నటి శ్రీదేవి పాత్రలో నటించాలన్నది కోరిక అని పేర్కొంది. ఆమెను తాను ఎప్పుడూ ఒక యువ నటిగానే చూశానని చెప్పింది. శ్రీదేవి బయోపిక్ను ఎవరైనా చిత్రంగా రూపొందిస్తే అందులో ఆమె పాత్రలో నటించాలని ఆశ పడుతున్నట్లు పేర్కొంది. నిజం చెప్పాలంటే తన సినీ పయనం సక్సెస్ఫుల్ కాదని అంది. తానూ చాలా తప్పులు చేశానని, అయితే వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పింది. మరో విషయం ఏమిటంటే ఎవరికీ విజయం మాత్రమే లక్ష్యం కాదని అంది. కఠిన శ్రమ లేకుంటే ఎవరూ నూరు శాతం సాధించలేరని అంది. అదేవిధంగా సుస్థిరత చాలా ముఖ్యం అని పేర్కొంది. సమీపంలో తాను నటించిన పెట్రోమ్యాక్స్ చిత్రం విడుదలై ప్రేక్షకుల మధ్య మంచి ఆదరణతో ప్రదర్శింపబడుతోందని చెప్పింది. ఇది తెలుగులో హిట్ అయిన ఆనందోబ్రహ్మ చిత్రానికి రీమేక్ అని తెలిపింది. తనలోని నటనా ప్రతిభను వెలికి తీసే ఎలాంటి పాత్రనైనా తాను సంతోషంగా నటిస్తానని చెప్పింది. తన దృష్టిలో సైరా నరసింహారెడ్డి చిత్రం అయినా, దేవీ–2 చిత్రం అయినా ఒకటేనంది. ప్రేక్షకులు అదే దృష్టితో చూడాలని కోరుకుంటున్నానంది. వినోదంతో కూడిన హర్రర్ చిత్రాల్లో నటించాలన్నది తన ఆశ కాకపోయినా తెలుగు చిత్రం ఆనందోబ్రహ్మ చూసిన తరువాత తన అభిప్రాయం మారిందని చెప్పింది. అందుకే ఆ చిత్ర తమిళ రీమేక్లో నటించే అవకాశాన్ని తాను సద్వినియోగం చేసుకున్నట్లు తమన్న పేర్కొంది. పెట్రోమ్యాక్స్ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు నటించారని, అందులో తానూ ఒకరినని అంది. తనను దృష్టిలో పెట్టుకుని ఆ చిత్ర కథను తయారు చేయలేదని చెప్పింది. తాను ఎప్పుడూ బడ్జెట్ చిత్రాలు, స్టార్స్ చిత్రాలు అన్న తారతమ్యాన్ని చూపలేదని తెలిపింది. అదే విధంగా రీమేక్ చిత్రాల్లో నటించడానికి తనకెలాంటి సందేహం గానీ, భయంగానీ ఉండదని చెప్పింది. రీమేక్ చిత్రాలంటే కచ్చితంగా పోల్సి చూస్తారని, అయితే చిత్ర యూనిట్ అంతా కలిసి ఒరిజినల్ చిత్రానికి న్యాయం చేసేలా పెట్రోమ్యాక్స్ చిత్రాన్ని కృషి చేసినట్లు తమన్నా పేర్కొంది. విశాల్కు జంటగా నటించిన యాక్షన్ చిత్రం నిర్మాణం చివరి దశకు చేరుకుందని, ప్రస్తుతం ఒక మలమాళ చిత్రంతో పాటు గోపీ సుందర్ దర్శకత్వంలో ఒక క్రీడా ఇతివృత్తంతో కూడిన కథా చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పింది. ప్రస్తుతం పలు కథలను వింటున్నట్లు తమన్నా తెలిపింది. -
శివను కలిసి వచ్చాను: రాంచరణ్
హైదరాబాద్: మెగాపవర్ స్టార్ రాంచరణ్ అనుకోకుండా దర్శకుడు కొరటాల శివను కలిశారు. త్వరలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయన 152వ సినిమాని కొరటాల శివ డైరెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ శివ కార్యాలయానికి అలా వెళ్లివచ్చానని రాంచరణ్ శుక్రవారం ఫేస్బుక్లో వెల్లడించారు. ‘శివగారి ఆఫీస్కు వెళ్లి వచ్చాను. ఆయన ఎనర్జీ ఎంతగానో నచ్చింది. చిరంజీవి 152వ సినిమాకు ఆల్ది బెస్ట్’ అని రాంచరణ్ తన ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా చార్లీ చాప్లిన్ ఫొటో ఎదుట తాను, శివతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసుకున్నారు. చారిత్రక నేపథ్యంతో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటు రాంచరణ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’. సినిమాలో ఎన్టీఆర్తో కలిసి నటిస్తున్నారు. రాంచరణ్ సరసన ఆలియా భట్ నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘మేమిద్దరం ఇప్పుడు రాజకీయాలు వదిలేశాం’
సాక్షి, న్యూఢిల్లీ : సైరా నరసింహారెడ్డి చ్రితం చాలా బాగుందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. బుధవారం తన నివాసంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి వెంకయ్య, ఆయన కుటుంబసభ్యులు సైరా చిత్రాన్ని వీక్షించారు. అనంతరం వెంకయ్య సైరా చిత్రంపై తన స్పందన తెలియజేశారు. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రపై సినిమా తీయడం చాలా గొప్ప నిర్ణయం. భారతదేశం స్వరూపాన్ని, వలస పాలకుల నియంతృత్వ పాలన గురించి ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఈ సినిమా వల్ల ప్రజల్లో దేశం మీద ప్రేమ మరింత పెరుగుతోంది. ఈ చిత్రంలో చిరంజీవి నటన చాలా బాగుంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా చాలా బాగా నటించారు. ఇలాంటి సినిమాలు ఇంకా రావాల్సిన అవసరం ఉంది. మేమిద్దరం(చిరంజీవి, నేను) ఇప్పుడు రాజకీయాలను వదిలేశాం. మరిన్ని సినిమాలతో చిరంజీవి ప్రజలను రంజింప చేయాల’ని వెంకయ్య పేర్కొన్నారు. అలాగే చిత్ర నిర్మాత రామ్చరణ్, దర్శకుడు సురేందర్రెడ్డి అభినందలు తెలిపారు. ప్రధాని అపాయింట్మెంట్ అడిగాను : చిరంజీవి వెంకయ్య నాయుడు సమయం తీసుకుని ‘సైరా’ చూడటం చాలా సంతోషంగా ఉందని చిరంజీవి అన్నారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెంకయ్య రాజకీయాల్లో ఎదిగారని గుర్తుచేశారు. ప్రధాని అపాయింట్మెంట్ అడిగానని తెలిపారు. ఈ రోజు వెంకయ్యను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన చిరంజీవి సైరా చిత్రం చూడాల్సిందిగా ఆహ్వానించారు. వెంకయ్య నివాసంలోనే సైరా ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. చదవండి : వెంకయ్య నివాసంలో ‘సైరా’ ప్రత్యేక ప్రదర్శన -
వెంకయ్య నివాసంలో ‘సైరా’ స్పెషల్ షో
న్యూఢిల్లీ : ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడితో భేటీ అయ్యారు. బుధవారం ఢిల్లీ వెళ్లిన చిరంజీవి వెంకయ్య నాయుడిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని చూడాల్సిందిగా చిరంజీవి పలువురు ప్రముఖలను కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కలిసి ఈ చిత్రాన్ని చూడాల్సిందిగా కోరారు. వెంకయ్య నివాసంలో సైరా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఈ చిత్ర ప్రదర్శనకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర పెద్దలను చిరంజీవి ఆహ్వానించనున్నారని సమాచారం. వెంకయ్య నాయుడు, ఆయన కుటుంబసభ్యులు, పలువురు కేంద్ర పెద్దలతో కలిసి చిరంజీవి ఢిల్లీలో ‘సైరా’ చిత్రాన్ని వీక్షించనున్నారు. కాగా, చిరంజీవి హీరోగా తెరకెక్కిన చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చిరంజీవి ఆహ్వానం మేరకు సైరా చిత్రాన్ని వీక్షించిన సంగతి తెలిసిందే. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చిరంజీవి దంపతులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ను సైరా చూడటానికి ఆహ్వానించనట్టు చిరంజీవి తెలిపారు. -
వెంకయ్య నివాసంలో ‘సైరా’ ప్రత్యేక ప్రదర్శన
-
ఉపరాష్ట్రపతితో భేటీ కానున్న చిరంజీవి
న్యూఢిల్లీ: తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ఈనెల 2న విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. దీంతో ఎంతో చరిత్రాత్మాక నేపథ్యం ఉన్న ఈ సినిమాను పలువురు రాజకీయ ప్రముఖుల చేత వీక్షింపచేయాలని మెగాస్టార్ చిరంజీవి భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు చిరంజీవి బుధవారం ఢిల్లీకి పయనమయ్యారు. ఉప రాష్ట్రపతి కోసం ప్రత్యేకంగా ఆయన నివాసంలో ఈ రోజు సాయంత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్ర ప్రదర్శన జరగనున్నది. వెంకయ్యనాయుడితో కలిసి చిరంజీవి సినిమాను వీక్షించనున్నారు. అనంతరం ‘సైరా’ విశేషాలను వారిరువరు చర్చించుకోనున్నారు. అదేవిధంగా ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ కానున్నట్టు సమాచారం. సైరా సినిమా చూడాలని చిరంజీవి వారిరువురిని కోరనున్నట్టు తెలుస్తోంది. కాగా ఈనెల 5న తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ను చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చూడాలని ఆమెను చిరంజీవి కోరారు. చిరంజీవి ఆహ్వానం మేరకు గవర్నర్ ప్రత్యేకంగా ఈ సినిమాను వీక్షించారు. అదేవిధంగా సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి దంపతులు మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీతో భేటీ కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. -
తమన్నా మారిపోయిందా..?
సినిమా: నటి తమన్నా మారిపోయిందట. ఏమియా మార్పు? ఏ మా కథ..చూసేస్తే పోలా! గ్లామర్కు మారు పేరు ఈ అమ్మడు. ఆదిలో అందాలను నమ్ముకుని కథానాయకిగా ఎదిగిన నటి తమన్నా. అందాలారబోత అంటే అలా ఇలా కాదు. రెచ్చిపోవడమే. అలా ఈత దుస్తుల్లో తడి తడి అందాలతో కుర్రకారును గిలిగింతలు పెట్టడంలో ఈ బ్యూటీ తరువాతే ఎవరైనా అని చెప్పవచ్చు. ఇక ఐటమ్ సాంగ్స్లో అయితే చెప్పనక్కర్లేదు. అదేమంటే డాన్స్ అంటే నాకిష్టం అనే సమాధానం ఈ జాణ నుంచి వస్తుంది. అయితే తమన్నాలోనూ మంచి నటి ఉంది. ఆ విషయం తమిళంలో నటించిన కల్లూరి చిత్రంలోనే నిరూపించుకున్నా, ఎందుకనో దర్శక, నిర్మాతలు తమన్నాను గ్లామర్కే ఎక్కువగా వాడుకుంటున్నారు. అయితే ప్రతి నటి, నటుడికి జీవితంలో ఒక మైలు రాయిగా నిలిచిపోయే చిత్రం అంటూ ఉంటుంది. అలా తమన్నా నట జీవితంలో బాహుబలి చిత్రం మరచిపోలేని చిత్రంగా గుర్తిండిపోతుంది. ఆ తరువాత ఈ అమ్మడికి సరైన పాత్ర లభించలేదనే చెప్పాలి. మళ్లీ షరా మామూలుగా గ్లామర్ పాత్రలపై మొగ్గు చూపుతూ వచ్చింది. అదే విధంగా హర్రర్ కథా చిత్రాలు తమన్నాకు వరుస కడుతున్నాయి. ఇలాంటి సమయంలో సైరాతో మరోసారి తనలోని నటిని బయటకు తీసే అవకాశం వచ్చింది. పాత్రలో సత్తా ఉండాలేగాని, నమిలేస్తా అన్నట్టుగా సైరా చిత్రంలో లక్ష్మీ పాత్రకు జీవం పోసింది తమన్నా. నిజం చెప్పాలంటే అ చిత్రంలో నయనతార కంటే తమన్నా పాత్రకే పేరు వచ్చింది. ఇక ఇటీవల తెరపైకి వచ్చిన తమిళ చిత్రం పెట్రోమ్యాక్స్ తమన్నాకు సక్సెస్ను అందించింది. తమన్నాలో మార్పుకు ఈ చిత్రాలేనట. ఇంతకీ ఆ మార్పు ఏమిటో చెప్పనేలేదు కదూ! ఇకపై గ్లామర్కు దూరంగా ఉండాలని తమన్నా నిర్ణయించుకుందట. నటనకు అవకాశం ఉన్న కథా పాత్రలనే ఎంపిక చేసుకుని నటిస్తానంటోంది. అది సరే ఈ మిల్కీబ్యూటీ గ్లామర్ను ఎంజాయ్ చేసే యువత పరిస్థితి ఏమిటీ? అందాలారబోతకు దూరం అన్న తమన్నా నిర్ణయం వారిని తీరని నిరాశాపాతంగా మారుతుందే. ఏదేమైనా మంచి కుటుంబ కథా పాత్రల్లో నటించాలన్న తమన్నా ఆశను ఆహ్వానించాల్సిందే గానీ, ఈ బ్యూటీ తన మాటపై నిలబడుతుందా? ఎందుకంటే ప్రస్తుతం విశాల్తో నటిస్తున్న యాక్షన్ చిత్రంలో గ్లామరస్గానే కనిపించనుంది. ఇకపోతే పెళ్లి సంగతేమిటన్న ప్రశ్నకు ఈ అమ్మడు తన పెళ్లి గురించి చాలానే ప్రచారం అవుతోందని, అయితే అందులో ఒక్క శాతం కూడా నిజం లేదని చెప్పింది. కొందరు ఈ విషయంలో కావాలనే కల్పిత రాతలు రాస్తున్నారని, అలాంటి వాటినన్నింటిని తన వద్దకు తీసుకొస్తే, వాటిలో తానే ఒక చిత్రంగా నిర్మించడానికి సిద్ధం అని కొంచెం ఘాటుగానే బదులిచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో నటుడు గోపీచంద్కు జంటగా నటిస్తోందట. అందులో కబడ్డీ కోచ్గా నటిస్తున్నట్లు తమన్నా చెప్పింది. అదే విధంగా హిందీ చిత్రం క్వీన్ తెలుగు రీమేక్ దటీజ్ మహాలక్ష్మీ చిత్రంలో తమన్నా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. -
బిగ్బీ శంకర్... మనోడు అదుర్స్
ఆయన పాత్రకు ప్రాణమయ్యాడు.. వెండితెరపై మాటల తూటాలు పేల్చాడు.. ప్రేక్షకుల మది దోచాడు. ఆయనే డబ్బింగ్ ఆర్టిస్ట్ శంకర్. కొత్తగూడెం పట్టణానికి చెందిన ఈయన డబ్బింగ్ ఆర్టిస్ట్గా సినీ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలోని బౌద్ధనగర్లో నివాసముంటున్న శంకర్ ఇప్పటి వరకు 300 సినిమాలు, 70 టీవీ సీరియల్స్కు గాత్రం అందించాడు. ఇటీవల విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో అమితాబ్ బచ్చన్ పాత్రకు తెలుగులో డబ్బింగ్ చెప్పి అందరి మన్ననలు అందుకున్నాడు. అయ్యారే చిత్రంతో ప్రస్థానం ప్రారంభించిన శంకర్... రేసుగుర్రం, ఎవడు, పద్మావతి, మణికర్ణిక, ఖైదీ నంబర్ 150 తదితర చిత్రాలతో ఫేమస్ అయ్యాడు. మమ్ముట్టి, సుమన్, అర్జున్, భానుచందర్, ప్రదీప్రావత్, నాజర్ తదితరులకు డబ్బింగ్ చెప్పాడు. నాడు క్షీర సాగర మథనం సందర్భంగా వెలువడిన గరళాన్ని శంకరుడు తన కంఠంలో ఉంచుకుని లోకానికి మేలు చేశాడు. నేడు డబ్బింగ్ కళా సాగర మథనంలో బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ గళాన్ని తన కంఠంతో పలికించాడు ఈనాటి మన శంకరుడు. ఇటీవల విడుదలై విజయ ఢంకా మోగిస్తున్న ‘సైరా’ నరసింహారెడ్డి సినిమాలో బిగ్ బీకి తెలుగులో డబ్బింగ్ చెప్పి అదరహో అనిపించాడు రేణికుంట్ల శంకర్కుమార్. డబ్బింగ్ కళాకారుడిగానే కాకుండా సినిమాలు, టీవీ సీరియళ్లు, వ్యాపార ప్రకటనలు, ప్రోమోలు, నేషనల్ జియోగ్రఫీ, డిస్కవరీ టీవీ చానెళ్లతో పాటు ప్రభుత్వ పథకాల ప్రకటనలకు వాయిస్ ఓవర్ చెబుతూ ప్రతిభ చాటుతున్నాడు ఈ గళజీవి. ఓయూ సమీపంలోని బౌద్ధనగర్లో సాధారణ జీవితం గడుపుతున్న కంచుకంఠం శంకర్కుమార్ ‘కళా’త్మక ప్రస్థానంపై ప్రత్యేక కథనం. – ఉస్మానియా యూనివర్సిటీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం పట్టణం 7వ ఇంక్లెయిన్కు చెందిన సింగరేణి ఉద్యోగి రేణికుంట్ల మదనయ్య, రాంబాయి దంపతుల కుమారుడు శంకర్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వనపర్తిలోని ఓయూ అనుబంధంగా ఉన్న సాయికృష్ణ కాలేజీలో ఎంబీఏ పూర్తి చేశాడు. తొలుత ప్రవేటు ఇన్సూరెన్స్, బ్యాంకుల్లో పని చేశాడు. ఆ తర్వాత సొంత వ్యాపారం ప్రారంభించాడు. కొంత కాలం తర్వాత వ్యాపారంలో నష్టం రావడంతో మానేసి డబ్బింగ్ వైపు ఆసక్తి పెంచుకున్నాడు. గత పదేళ్లలో 300 సినిమాలు, 70 టీవీ సీరియళ్లకు డబ్బింగ్ చెప్పాడు. ఇటీవల విడుదలైన చిరంజీవి సినిమా ‘సైరా నరసింహరెడ్డి’లో అమితాబ్బచ్చన్కు తెలుగులో డబ్బింగ్ చెప్పి తన ప్రతిభను చాటుకున్నాడు. అమితాబ్కు డబ్బింగ్ చెప్పడం తొలుత ఎంతో భయమేసిందని, సినిమా పూర్తయిన తర్వాత బంధువులు, స్నేహితులు అభినందించారని శంకర్ ఈ సందర్భంగా సంతోషం వెలిబుచ్చాడు. తొలి సినిమా ‘అయ్యారే’ రాజేంద్రప్రసాద్ నటించిన ‘అయ్యారే’ చిత్రంలో శంకర్ తొలిసారిగా డబ్బింగ్ చెప్పారు. రేసుగుర్రం, గౌతంనందా, విన్నర్, నాయక్, ఇంటెలిజెంట్, కురుక్షేత్రం, పద్మావతి, మణికర్ణిక, సత్య–2, జక్వార్, తుఫాన్, ఎవడు, ఖైదీనంబర్ 150 తదితర సినిమాల్లో డబ్బింగ్ చెప్పాడు. డబ్బింగ్ సేవలకు గుర్తింపుగా 2013లో మాటీవీ అవార్డును అందుకున్నాడు. స్నేహితుల ప్రోత్సాహంతోనే.. నీ వాయిస్ చాలా బాగుంటుంది. సినిమాలో ప్రయత్నించు అని శంకర్ స్నేహితులు, బంధువులు చెబుతుండేవారు. తనలోని టాలెంట్ను గుర్తించిన శంకర్కు డబ్బింగ్పై ఆసక్తి కలిగింది. ఈ క్రమంలోనే చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో జరిగిన ఓ కార్యక్రమం ఆయన జీవితాన్ని మలుపుతిప్పింది. ప్రఖ్యాత డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్సీఎం రాజుతో పరిచయం ఏర్పడింది. ‘నీ వాయిస్ బాగుంది’ అని కితాబు ఇచ్చారు. డైరెక్టర్ కస్తూరి శ్రీనివాస్ వద్దకు పంపించారు. అప్పట్లో ఏపీ మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ నిర్వహించిన ఆడిషన్స్లో 170 మంది పాల్గొన్నారు. శంకర్ 2వ స్థానంలో నిలిచాడు. ఇలా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న శంకర్కు తూర్పువెళ్లే రైలు టీవీ సీరియల్లో డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చింది. అదే ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ జీవితానికి నాంది పలికింది. పరకాయ ప్రవేశం చేస్తా.. డబ్బింగ్ చెప్పాలంటే పరకాయ ప్రవేశం చేయాల్సి ఉంటుంది. నటుడి హావభావాలు, బాడీ లాంగ్వేజ్ తదితర అంశాలను నిశితంగా పరిశీలించి డబ్బింగ్ చెబితేనే సక్సెస్ అవుతుంది. డబ్బింగ్ చెబుతుంటె నటుడే మాట్లాడుతున్నట్లు ప్రేక్షకులకు భ్రమ కల్పించాలి. భాషపై పట్టు ఉండాలి. జీవంలేని బొమ్మకు ప్రాణం పోసే ప్రక్రియే డబ్బింగ్. నటనపై నాకు ఆసక్తి లేదు. – శంకర్కుమార్ -
‘సైరా’ టీమ్కు సన్మానం
-
సైరాలాంటి సినిమాలు ఇంకా రావాలి
‘‘సైరా నరసింహారెడ్డి’లాంటి కథను ఎంచుకోవడమే పెద్ద సాహసం. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలి’’ అన్నారు ‘కళాబంధు’, నిర్మాత టి. సుబ్బిరామిరెడ్డి. చిరంజీవి హీరోగా సురేందర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 2న విడుదలైంది. చిత్రబృందాన్ని టి. సుబ్బిరామి రెడ్డి సన్మానించి, మాట్లాడుతూ–‘‘దాదాపు ఇరవై ఏళ్ల క్రితం చిరంజీవితో నేను ‘స్టేట్రౌడీ’ సినిమా నిర్మించాను.ఈ సినిమాను హిందీలో డబ్ చేస్తే సూపర్హిట్ సాధించింది. చరణ్లాంటి కుర్రాడు ఇంత పెద్ద సినిమా నిర్మించాడంటే ఆశ్చర్యంగా ఉంది’’ అన్నారు. చిరంజీవి మాట్లాడుతూ– ‘‘సైరా’ సినిమా విజయం సాధిస్తుందని ధీమాగా చెప్పేవారు సుబ్బిరామిరెడ్డి. ఆయన కళాహృదయానికి చేతులెత్తి నమస్కరిస్తున్నా’’ అన్నారు. ‘‘సుబ్బిరామిరెడ్డిగారి ఫంక్షన్ లేకపోతే ఆ ఏడాది మాకు ఏదో వెలితిగా ఉంటుంది’’ అన్నారు రామ్చరణ్. ‘‘ఎక్కడ మంచి సినిమా ఉన్నా ఆ యూనిట్ని గౌరవించడం సుబ్బిరామిరెడ్డిగారి గొప్పతనం’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ‘‘తెలుగు చలన చిత్రపరిశ్రమకు అంతర్జాతీయంగా పేరు తెచ్చిన గొప్ప సినిమా ‘సైరా’’ అన్నారు నటుడు మురళీమోహన్. ‘‘తెలుగువారందరూ గర్వపడేలా చేసిన చిరంజీవిగారు నిజంగా గ్రేట్’’ అన్నారు నటుడు రాజశేఖర్. ‘‘చిరంజీవిగారి కెరీర్లో ఇదొక మైలురాయి సినిమా’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. సురేందర్రెడ్డి, నటి తమన్నా, కెమెరామన్ రత్నవేలు, రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, సాయి మాధవ్ బుర్రా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నటులు కృష్ణంరాజు, వెంకటేష్, దర్శకులు కోదండరామిరెడ్డి, క్రిష్, సుకుమార్, మెహర్ రమేష్, నిర్మాతలు అశ్వనీదత్, డి.సురేష్బాబు, బోనీ కపూర్, కేఎస్ రామారావులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘సైరా’ చిత్రాన్ని వీక్షించిన గవర్నర్ తమిళిసై
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యలవాడ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం సైరా చిత్రాన్ని వీక్షించారు. తమిళిసై కోసం చిరంజీవి ప్రత్యేక షో ఏర్పాటు చేశారు. గవర్నర్తోపాటు ఆమె కుటుంబ సభ్యులు, చిరంజీవి కుమార్తె సుష్మిత కూడా ఉన్నారు. అనంతరం ఈ చిత్రానికి పనిచేసిన బృందాన్ని తమిళిసై అభినందించారు. ఈ చిత్రం తనకు బాగా నచ్చిందని ఆమె పేర్కొన్నారు. కాగా, శనివారం రోజున గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిసిన చిరంజీవి.. సైరా చిత్రం చూడాల్సిందిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈనెల 2న విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. సురేందర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బిగ్ బీ అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతారలాంటి ప్రముఖులు నటించారు. రామ్చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. -
సై.. సైరా.. చిరంజీవ!
-
చిరంజీవి కొత్త సినిమా షురూ
మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని సినిమాకు సంబంధించిన పూజా కార్యాక్రమాన్ని చిత్ర సభ్యులు నిర్వహించారు. ఎలాంటి పెద్ద హడావుడి లేకుండా ఈ వేడుక జరిగింది. పూజా కార్యక్రమాల అనంతరం దేవుడి చిత్రపటాలపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి సతీమణి సురేఖ క్లాప్ కొట్టారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో చిరంజీవి, రామ్చరణ్, కొరటాల శివతో పాటు అంజనీ దేవి, సురేఖ తదితరులు పాల్గొన్నారు. కాగా సినిమాకు సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. ఇక త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ రికార్డు కలెక్షన్లతో దూసుకపోతోంది. సినిమా విడుదలై దాదాపు వారమైనా థియేటర్లలో ఇంకా అభిమానుల హడావుడి తగ్గలేదు. ఇప్పటికీ పలు థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయంటే ‘సైరా’ ఏ రేంజ్లో హిట్ అయిందే అర్థం చేసుకోవచ్చు. కాగా, ఇంతటి భారీ విజయం అందుకున్న టాలీవుడ్ మెగాస్టార్ తన తదుపరి చిత్రానికి ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఉగాదికి ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సామాజిక అంశాలతో ఈ చిత్రం స్క్రిప్ట్ను కొరటాల శివ రూపొందించినట్లు తెలుస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నాకంటే అదృష్టవంతుడు ఎవరుంటారు?
‘‘ఇప్పటి వరకూ 150 సినిమాలు చేశాను. అవన్నీ ఒక ఎత్తయితే ‘సైరా నరసింహారెడ్డి’ ఒక ఎత్తని గతంలోనూ చెప్పా.. ఇప్పుడూ చెబుతున్నా. నా గత చిత్రాలన్నింటిలో ‘సైరా’ మొదటిస్థానంలో ఉంటుంది. దీన్ని మించిన సినిమా నా నుంచి వస్తే అంతకంటే ఆనందం ఇంకే కావాలి? నాకంటే అదృష్టవంతుడు ఎవరుంటారు?’’అని చిరంజీవి అన్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, నయనతార జంటగా నటించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. కొణిదెల సురేఖ సమర్పణలో రామ్చరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 2న విడుదలైంది. ఈ సందర్భంగా ‘సైరా’ చిత్రబృందం హైదరాబాద్లో విలేకరులతో సమావేశమయ్యారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు చిరంజీవి సమాధానమిస్తూ–‘‘సైరా’ చిత్రం కథ, కథనాలపై నమ్మకం ఉండటంతో బడ్జెట్కి కానీ, ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సి వస్తుందని కానీ భయపడలేదు. ఈ సినిమాకి దాదాపు 285 కోట్లు బడ్జెట్ అయింది. అంత బడ్జెట్ రామ్చరణ్ పెట్టడానికి కారణం వాడి వెనుక నేను ఉన్నాననే భరోసా (నవ్వుతూ). ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ‘సైరా’ ని ఇంత గ్రాండ్గా నిర్మించిన చరణ్ ఇండస్ట్రీలో నంబర్ 1 నిర్మాత అయ్యాడు. ‘రంగస్థలం’ చిత్రంలో చరణ్ నటనకు జాతీయ అవార్డు రావాలి. నిర్మాతగా, నటుడిగా, కొడుకుగా వాడికి 100కి 100మార్కులు వేస్తా. ‘సైరా’ డబ్బింగ్ టైంలో ‘ఇది మామూలు సినిమా కాదు. భారతీయులకు గౌరవాన్ని తీసుకొచ్చే చిత్రం. ముందుగానే అభినందనలు’ అంటూ అమితాబ్ బచ్చన్గారి నుంచి వచ్చిన ప్రశంసని మరచిపోలేను. నేను, నాగార్జున కలిసి స్వయంగా సినిమా చూశాం. సినిమా పూర్తవగానే నన్ను గట్టిగా హత్తుకుని ‘సినిమా సూపర్.. చాలా బాగుంది’ అంటూ తన స్టయిల్లో అభినందించాడు. ఎంతోమంది నా తోటి నటీనటులు అభినందిస్తూ మెసేజ్లు, ట్వీట్స్ చేశారు. పలువురు దర్శకులు స్వయంగా నన్ను కలిసి అభినందనలు చెప్పారు. అప్పుడు నాకు అనిపించింది.. తోటి నటులు నా నటన బాగుందంటూ అభినందిస్తుంటే ‘ఇంతకంటే ఇంకేం కావాలి? అనిపించింది. ‘సైరా’ తొలిరోజు 7గంటల వరకూ కూడా సినిమా గురించి ఎటువంటి ఫీడ్ బ్యాక్ రాలేదు. సినిమా విజయంపై నమ్మకం ఉంది. అయినా లోలోపల కొంచెం టెన్షన్ పడ్డాను. సినిమా సూపర్ అంటూ ‘బన్ని’ వాస్ చెప్పాడని బన్నీ (అల్లు అర్జున్) చెప్పాడు. మా ఇంట్లోవాడు కాబట్టి ఆ మాటలు అంత కిక్ ఇవ్వలేదు. ‘సినిమాకి ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది’ అంటూ యూవీ క్రియేషన్స్ విక్రమ్ వాయిస్ మెసేజ్ పెట్టడంతో చాలా సంతోషంగా అనిపించి, నా టెన్షన్ పోయింది. నేను, చరణ్ కలిసి నటించే సినిమాపై కొన్ని గంటల్లో ప్రకటన వెలువడనుంది. చరణ్తో కలిసి నటించడం ఎంత సంతోషంగా ఉంటుందో నా తమ్ముడు పవన్ కల్యాణ్తో నటించడం కూడా అంతే సంతోషంగా మంచి కిక్ ఇస్తుంది. నాకు, కల్యాణ్కి సరిపడ మంచి కథలతో వస్తే కచ్చితంగా సినిమా చేస్తాం’’ అన్నారు. పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మాట్లాడుతూ – ‘‘సైరా’ సినిమా చూస్తుంటే యూనిట్ ఎంత కష్టపడ్డారో తెలుస్తోంది. చిరంజీవి ప్రాణం పెట్టి చేశాడు. ఆ పాత్రలో ఆయన్ని తప్ప ఎవర్నీ ఊహించలేం. ఆయన నటనకు హద్దుల్లేవ్. భారతదేశం అంతా చూడాల్సిన సినిమా ‘సైరా’. ప్రపంచంలో తెలుగు సినిమా తలెత్తుకునేలా చేసిన చిత్రమిది. ఇందులో నేను రాసిన పాటకి కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందనుకుంటున్నా’’ అన్నారు. ‘‘సైరా’ చిత్రంతో ఓ గొప్ప వీరుడి కథ చెప్పానని సంతోషంగా ఉంది. చిరంజీవిగారు ఏ రోజూ రెండో టేక్ తీసుకోలేదు. ఒక్క టేక్లోనే అద్భుతంగా నటించేవారాయన. అందుకే ఆయన అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ మెగాస్టార్’’ అని సురేందర్ రెడ్డి అన్నారు. ‘‘సైరా’ విడుదల తర్వాత అందరూ నన్ను సాయిచంద్ అనడం మానేసి సుబ్బయ్య అంటూ ఫోన్లు చేస్తూ, మెసేజ్లు చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో మంచి కిక్ ఇచ్చిన పాత్ర ఇది. తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి ఎవరెస్ట్ శిఖరం. అలాంటిది నా నటన బాగుందని ఆయన అభినందించడం నాకు ఆస్కార్ అవార్డు వచ్చినంత సంతో షం వేసింది’’ అన్నారు నటుడు సాయిచంద్. ‘‘రేసుగుర్రం’ టైమ్లో మెగాస్టార్గారి గురించి విన్నా. ‘సైరా’లో ఆయనతో పనిచేయడం నా అదృష్టం. అంతపెద్ద స్టార్ అయినా సింపుల్గా ఉంటారాయన’’ అన్నారు నటుడు రవికిషన్. -
సైరా సక్సెస్ మీట్
-
నేనందుకే ప్రమోషన్స్కి రాను!
సినిమా: లేడీ సూపర్స్టార్. అభిమానులు నయనతారకిచ్చిన పట్టం ఇది. అందుకు తగ్గట్టుగానే ఈ సంచలన నటి తన స్టార్డంను పెంచుకుంటూపోతోంది. ఆదిలో నయనతారకు గ్లామర్ పాత్రలే తలుపు తట్టేవి. ఇప్పుడు నటనకు అవకాశం ఉన్న పాత్రలు వరిస్తున్నాయి. ఇకపోతే ఈ అమ్మడిపై వచ్చినన్ని వదంతులు, తను ఎదురొడ్డిన ఎదురీతలు చాలానే. ముఖ్యంగా వ్యక్తిగతంగానే పలు విమర్శలను ఎదుర్కొంటోంది. అందులో ఒకటి నయనతార తన చిత్రాల ప్రారంభోత్సవాల్లోనూ, చిత్ర ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొనదనేది. నిజమే ఈ అమ్మడు తను నటించిన ఏ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలకు రాదు. అది ఎంత పెద్ద చిత్రం అయినా, చివరికి సొంత చిత్రం అయినా కావచ్చు. అలాంటిది ఇటీవల విజయ్కు జంటగా నటించిన బిగిల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొననుందనే ప్రచారం జరిగింది. అదేకాదు, తెలుగులో చిరంజీవికి జంటగా నటించిన సైరా నరసింహారెడ్డి చిత్ర ప్రచార కార్యక్రమానికి యథాతథంగా నయనతార డుమ్మా కొట్టింది. అంత వరకూ ఎందుకు తాను తన ప్రియుడిని నిర్మాతగా చేస్తూ నిర్మిస్తున్న నెట్రికన్ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా రాలేదు. దీంతో తన చిత్ర ప్రారంభోత్సవానికి రాకపోవడం ఏమిటీ? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అసలు విషయాన్ని నయనతార తన సన్నిహితుల వద్ద చెప్పుకుని బాధ పడిందట. తాను ఏ చిత్ర ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఆ చిత్రాలు బాగా ఆడలేదని చెప్పింది. ఆ సెంటిమెంట్ కారణంగానే తానీ చిత్ర ప్రారంభోత్సవాల్లోనూ, ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదని అసలు విషయాన్ని బయటపెట్టింది. దీంతో నయనతార కూడా ఇంత సెంటిమెంటల్ ఉమెన్నా అంటూ చాలా మంది ఆశ్యర్యపోతున్నారు. ఇదిలాఉండగా, నయనతార దర్శకుడు విఘ్నేశ్శివన్ల ప్రేమ వ్యవహారం గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ సంచలన జంట చాన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఇదీ బహిరంగమే. అయితే ఇటీవల నయనతార, విఘ్నేశ్శివన్ పెళ్లికి సిద్ధం అయ్యారని, వీరి పెళ్లి తేదీ కూడా ఖరారైట్లు, డిసెంబర్ 25న ముహూర్తం, విదేశంలో వివాహతంతు ఇలాంటి ప్రచారాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే వీటికి ఫుల్స్టాప్ పెట్టే విధంగా నయనతార ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్శివన్ ఒక ప్రకటనను తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అందులో ఎవరేమైనా రాసుకోండి. దాని గురించి మాకు బాధ లేదు. మాకు చాలా పనులు ఉన్నాయి. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు. అసలు ఆ విషయం గురించి వివరించడం కుదరదని పేర్కొన్నాడు. మరి ఇకనైనా ఈ జంట గురించి వదంతులు ఆగుతాయో లేదో చూడాలి. -
బాక్సాఫీస్ వసూళ్లు: సైరా వర్సెస్ వార్
ఈసారి గాంధీ జయంతి సందర్భంగా రెండు ప్రతిష్టాత్మక చిత్రాలు ఒకేసారి, ఒకేరోజు విడుదల అయ్యాయి. వరుస సెలవులను క్యాష్ చేసుకోవడానికి పోటాపోటీగా ప్రేక్షకుల ముందుకువచ్చాయి. ఆ సినిమాలేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లో భారీ మల్టీస్టారర్, యాక్షన్ థ్రిల్లర్గా ‘వార్’ సినిమా ప్రేక్షకుల ముందుకురాగా.. సౌత్లో చారిత్రక సినిమాగా భారీ బడ్జెట్తో చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ విడుదలైంది. ఈ రెండు సినిమాలూ భారీ అంచనాల మధ్యే ప్రేక్షకులను పలుకరించాయి. చారిత్రక నేపథ్యంలో దాదాపు రూ. 300 కోట్ల ఖర్చుతో రేనాటి సూర్యుడు సైరా నరసింహారెడ్డి జీవిత కథతో సైరా సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను దేశవ్యాప్తంగా విడుదల చేశారు. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో దేశవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా కోసం అన్ని భాషల్లోనూ భారీఎత్తున ప్రమోషన్స్ నిర్వహించారు. అటు బాలీవుడ్ బడా స్టార్స్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్లు తొలిసారి కలిసి నటించిన మల్టీస్టార్ సినిమా వార్ కూడా భారీ అంచనాలతో గత బుధవారం ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ సినిమాలో హృతిక్ కబీర్గా, టైగర్ ఖలీద్గా.. గురుశిష్యులుగా నటించడం.. ఒళ్లు గగుర్పొడిచే భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండటంతో ఈ సినిమాపై సినీ ప్రియుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఈ ఏడాది అతిపెద్ద యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ప్రమోట్ చేశారు. దుమ్మురేపిన కలెక్షన్లు.. భారీ చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’... మెగాస్టార్ స్టామినాను చాటుతూ బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతోంది. అయితే, ఈ సినిమా ప్రధాన మార్కెట్ అయిన ఏపీ, తెలంగాణలోనే జోరుగా దూసుకుపోతుంది. సౌత్లోని ఇతర రాష్ట్రాల్లో ఓ మోస్తరు వసూళ్లు రాబడుతున్నా.. హిందీలో మాత్రం అనుకున్నంతగా రాణించలేకపోయింది. హిందీలో తొలిరోజు రూ. 2.6 కోట్లు సాధించి.. పర్వా లేదనిపించిన సైరా.. ఆ తర్వాత పుంజుకోలేక చతికిలపడింది. ఓవర్సీస్లోనూ తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద గట్టిగా సత్తా చాటుతున్న ఈ సినిమా తొలి మూడురోజుల్లో వరల్డ్వైడ్గా రూ. 100 కోట్లకు పైగా సాధించినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే ఈ సినిమా రూ. 32 కోట్లు రాబట్టినట్టుసమాచారం. దసరా సెలవులు కావడం.. పాజిటివ్ టాక్ ఉండటం తెలుగు రాష్ట్రాల్లో సైరాకు కలిసివస్తోంది. ముఖ్యంగా నైజాంలో ఈ సినిమా తొలి మూడు రోజుల్లో రూ. 14.62 కోట్లు రాబట్టింది. ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ.. నైజాంలో మూడురోజుల కలెక్షన్ వివరాలు (తొలిరోజు రూ. 8.10 కోట్లు, రెండోరోజు రూ. 3.98 కోట్లు, మూడో రోజు రూ. 2.54 కోట్లు) రివీల్ చేశారు. ఇక ఓవర్సీస్ మార్కెట్లోనూ సైరా సత్తా చాటుతోంది. మూడు రోజుల్లో అమెరికాలో ఈ సినిమా రూ. 1.5 మిలియన్ డాలర్లు (రూ. 10.62 కోట్లు) రాబట్టిందని రమేశ్ బాలా మరో ట్వీట్లో వెల్లడించారు. రికార్డుల సృష్టిస్తున్న వార్ భారీ యాక్షన్ థ్రిల్లర్ అయిన వార్ మూవీ ఊహించినరీతిలో భారీ వసూళ్లే రాబడుతోంది. తొలిరోజు ఏకంగా రూ. 53.35 కోట్లు రాబట్టి.. బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. అదేవిధంగా మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్బులో చేరింది. హిందీపరంగా విస్తారమైన మార్కెట్ ఉండటంతో వార్.. దసరా పండుగ సీజన్లో అత్యంత భారీ వసూళ్లు రాబట్టే అవకాశం కనిపిస్తోంది. హిందీ వెర్షన్లో తొలిరోజు రూ. 51 కోట్లు, రెండోరోజు గురువారం రూ. 23.10 కోట్లు, మూడో రోజు శుక్రవారం రూ. 21.25 కోట్లు సాధించిన వార్.. . తొలి మూడు రోజుల్లోనే రూ. 96 కోట్లు తన ఖాతాలో వేసుకుంది. ఇక, తెలుగు, తమిళ వెర్షన్లలో రూ. 4.15 కోట్లు సాధించి.. మొత్తంగా రూ. 100.15 కోట్లు వార్ తన ఖాతాలో వేసుకుంది. బాక్సాఫీస్ వద్ద వార్ జోరు చూస్తుంటే.. రానున్న రోజుల్లో మరింత వసూళ్లు సాధించి.. రికార్డులు బద్దలుకొట్టే అవకాశం కనిపిస్తోంది. గురువారం, శుక్రవారం సాధారణ వర్కింగ్ డేస్ అయినప్పటికీ.. వార్ వసూళ్లు తిరుగులేని రీతిలో ఉండటం ఇందుకు తార్కాణం అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. తొలి మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లు సాధించిన ఐదో యశ్రాజ్ ఫిలిమ్స్ సినిమాగా వార్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఇంతకుముందు ధూమ్-3, సుల్తాన్, టైగర్ జిందా హై, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమాలు తొలి మూడురోజుల్లోనే వందకోట్ల క్లబ్బులో చేరాయి. మొత్తానికి చూసుకుంటే.. తమకు గట్టి పట్టున్న మార్కెట్లో బాక్సాఫీస్ వద్ద సైరా, వార్ పోటాపోటీగా కలెక్షన్లు రాబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. -
ఆసక్తికరం; గవర్నర్తో చిరంజీవి భేటీ
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి శనివారం తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం, శాలువాతో ఆమెను సత్కరించారు. గవర్నర్కు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. తన తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చూడాలని గవర్నర్ను చిరంజీవి ఆహ్వానించారు. త్వరలోనే సినిమా చూస్తానని ఆమె చెప్పారు. కాగా, ఈనెల 2న విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో మూడు రోజుల్లోనే వంద కోట్ల కలెక్షన్లు సాధించినట్టు సమాచారం. దసరా పండుగ సెలవులు ఉండటంతో వసూళ్లు మున్ముందు మరింత పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సినిమా హిట్ కావడంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. (చదవండి: సైరాకు భారీగా కలెక్షన్స్.. 3రోజుల్లోనే వందకోట్లు!) -
సైరాకు భారీగా కలెక్షన్స్.. 3రోజుల్లోనే వందకోట్లు!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’... రేనాటి వీరుడు.. తొలి స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ నేపథ్యంతో అత్యంత్ర ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడం.. రివ్యూలు కూడా పాజిటివ్గా ఉండటంతో ‘సైరా’ భారీ వసూళ్లు రాబడుతోంది. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న (బుధవారం) ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాన మార్కెట్ అయిన ఏపీ, తెలంగాణలో ఈ సినిమా సత్తా చాటుతోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే సైరా రూ. 32 కోట్లు రాబట్టింది. పాజిటివ్ టాక్ ఉండటంతో తొలి మూడు రోజుల్లో సైరాకు భారీగా వసూళ్లు దక్కినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నైజాంలో ఈ సినిమా తొలి మూడు రోజుల్లో రూ. 14.62 కోట్లు రాబట్టింది. ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ.. నైజాంలో మూడురోజుల కలెక్షన్ వివరాలు (తొలిరోజు రూ. 8.10 కోట్లు, రెండోరోజు రూ. 3.98 కోట్లు, మూడో రోజు రూ. 2.54 కోట్లు) ట్విటర్లో వెల్లడించారు. ఇక ఓవర్సీస్ మార్కెట్లోనూ సైరా సత్తా చాటుతోంది. మూడు రోజుల్లో అమెరికాలో ఈ సినిమా రూ. 1.5 మిలియన్ డాలర్లు (రూ. 10.62 కోట్లు) రాబట్టిందని రమేశ్ బాలా మరో ట్వీట్లో వెల్లడించారు. అత్యంత భారీ బడ్జెట్తో రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ‘సైరా’ సినిమా విడుదలైన ప్రతీ చోట హిట్ టాక్తో భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. ఇక ఈ చిత్రానికి సామాన్య అభిమానులే కాకుండా సెలబ్రెటీలు కూడా ఫిదా అవుతున్నారు. చిరంజీవి నటనకు, సినిమాను తెరకెక్కించిన విధానానికి ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ‘సైరా’థియేటర్లలోనే కాకుండా.. సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. ఈ సినిమాపై సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. -
మీ ప్రేమకు ధన్యవాదాలు: ఉపాసన
సాక్షి, హైదరాబాద్ : సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ ఎంతో మందికి అండగా నిలుస్తున్న వ్యాపారవేత్త, సినీ హీరో రామ్చరణ్ సతీమణి ఉపాసన ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి నాయకత్వ విభాగంలో మహాత్మా గాంధీ అవార్డు సొంతం చేసుకున్నారు. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా అవార్డు అందుకున్న విషయాన్ని ఉపాసన తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు... ‘ఇతరులకు సేవ చేయడం ద్వారా.. నిన్ను నువ్వు కోల్పోయే క్రమమే.. నిజమైన నిన్ను కనుగొనే అత్యుత్తమ మార్గం. మహాత్మా గాంధీ అవార్డు అందించినందుకు ధన్యవాదాలు. ఈ గాంధీ జయంతి మా కుటుంబానికి నూతనోత్సాహాన్ని ఇచ్చింది. సైరా నరసింహారెడ్డి మీద ప్రేమ కురిపిస్తున్నందుకు కృతఙ్ఞతలు’ అని ఉపాసన ట్వీట్ చేశారు. కాగా అపోలో హాస్పిటల్స్కు సంబంధించిన హెల్త్కేర్ విభాగంలో ఉపాసన కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా పలు సామాజిక కార్యక్రమాల్లోనూ ఆమె ముందుంటారు. ఇక తన భర్త రామ్చరణ్కు సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ అభిమానులను ఖుషీ చేస్తారన్న సంగతి తెలిసిందే. కాగా రామ్చరణ్ నిర్మాణంలో చిరంజీవి ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా విశ్వరూపం ప్రదర్శించిన చిరంజీవి నటనకు అభిమానులు నీరాజనాలు పడుతుండగా.. నిర్మాతగా రామ్చరణ్ మరో సక్సెస్ అందుకోవడంతో మెగా ఫ్యామిలీ సంబరాల్లో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. -
సైరా సెలబ్రేషన్స్
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. చిరంజీవి టైటిల్ రోల్లో నటించిన ఈ సినిమాను సురేందర్రెడ్డి దర్శకత్వంలో రామ్చరణ్ నిర్మించారు. ఈ నెల 2న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సక్సెస్ను సెలబ్రేట్ చేయడానికి అల్లు అరవింద్ ‘సైరా’ టీమ్కి పార్టీ ఏర్పాటు చేశారు. దర్శకులు త్రివిక్రమ్, సుకుమార్, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్లతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ పార్టీలో పాల్గొన్నారు. -
అల్లు అరవింద్ ఆఫిస్లో ‘సైరా ’ గ్రాండ్ సక్సెస్ పార్టీ
-
అల్లు ఫ్యామిలీ ‘సైరా’ పార్టీ
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి హిట్ టాక్తో దూసుకెళ్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో సైరా చిత్ర యూనిట్కు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్లు గ్రాండ్ సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు, సైరా చిత్ర యూనిట్ సభ్యులు, మరికొందరు ఇండస్ట్రీ ప్రముఖులను ఆహ్వానించారు. ఈ పార్టీలో పాల్గొన్న వారిలో చిరంజీవి, రామ్చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్తేజ్, వరుణ్తేజ్, నిహారిక, అల్లు శిరీష్లు, అఖిల్ అక్కినేని, శ్రీకాంత్, దర్శకులు సురేందర్రెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి, సుకుమార్, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, జెమిని కిరణ్లు పాల్గొన్నారు. కాగా, తొలి స్వతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా తెరకెక్కిన సైరా.. బాక్సాఫీసు వద్ద చిరంజీవి స్టామినా తగ్గలేదని చెప్పుతోంది. దర్శకుడు సురేంద్రరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీంతో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అల్లు అరవింద్ ఆఫిస్లో ‘సైరా ’ గ్రాండ్ సక్సెస్ పార్టీ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సైరా కోసం గుండు కొట్టించిన రామ్చరణ్!
తెలుగు రాష్ట్రాల్లో సైరా చిత్రానికి కలెక్షన్లు కురుస్తున్నాయి. అభిమానులే కాదు సినీ తారలు సైతం ‘సైరా నరసింహారెడ్డి’ని అభినందించకుండా ఉండలేకపోతున్నారు. ఇక సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ చిత్ర మేకింగ్ కష్టాల్ని మరిచిపోయేలా చేసింది. ఈ సినిమా కోసం నటీనటులు అందరూ ప్రాణం పెట్టి చేశారనడంలో అతిశయోక్తి లేదు. సైరాలో నటించిన బ్రహ్మాజీ కూడా ఆ కోవకే చెందుతాడు. పాత్ర కోసం తనని తాను మలుచుకోడానికి సిద్ధపడిపోయాడు. అందుకోసం హార్స్ రైడింగ్ నేర్చుకోవడమే కాక గుండు కొట్టించుకున్నాడు. సైరా చిత్రీకరణ సమయంలో గుండు కొట్టించుకున్న చిత్రాలను బ్రహ్మాజీ ట్విటర్లో పోస్ట్ చేశారు. సైరాలో ఏదైనా పాత్ర ఇవ్వమని రామ్చరణ్ను అడిగాను. కానీ ఎక్కువ నిడివి ఉన్న పాత్ర ఇస్తాడనుకోలేదంటూ ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇందుకు సినిమా యూనిట్కు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అంటూ ఫొటోను షేర్ చేసుకున్నారు. ఈ ఫొటోలో గుండు కొట్టిన తర్వాత పూర్తిగా పాత్రలో లీనమైపోయిన బ్రహ్మాజీని చూడవచ్చు. పైగా రామ్చరణ్ దగ్గరుండి మరీ గుండు కొట్టిస్తున్నాడు. కాగా పోరాట ఘట్టాల్లో బ్రహ్మజీ నటన అద్భుతమని ప్రేక్షకులు కొనియాడుతున్నారు. Requested Ram Charan garu to give me an opportunity to work with mega star in #SyeRaa .. never imagined it to be a full length role.. ever greatful 🙏🏼🙏🏼.. Nd can’t thank enough @DirSurender @RathnaveluDop for ur support 🙏🏼.@KonidelaPro 🙏🏼 pic.twitter.com/jKqRYCZdj3 — BRAHMAJI (@actorbrahmaji) October 4, 2019 -
సైరా ‘లక్ష్మి’కి ఉపాసన సూపర్ గిఫ్ట్
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఎక్కడ చూసినా సైరా (సైరా నరసింహారెడ్డి) ఫీవర్ సందడి చేస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా కొణిదెల ప్రొడక్షన్స్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ బిగ్గెస్ట్ మూవీ హిట్ టాక్తో దూసుకు పోతోంది. ఈ విజయాన్ని చిత్ర యూనిట్తోపాటు సైరా నిర్మాత రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంతో తన సంతోషాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేస్తున్నారు. తాజాగా తమన్నాకు తనదైన శైలిలో అభినందనలు తెలిపారు ఉపాసన . అద్భుతంగా నటించి మెప్పించిన తమన్నాకు ఆమె ప్రత్యేక బహుమతి అందజేశారు. ఖరీదైన ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చారు. ‘నిర్మాత భార్య నుంచి సూపర్ తమన్నాకు ఓ బహుమతి. నిన్ను మిస్ అవుతున్నాను. త్వరలో కలుద్దాం` అంటూ ఉపాసన ట్వీట్ చేశారు. మరోవైపు `సైరా` విజయం మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా కొత్త ఊపిరినిచ్చింది. సినిమాలో నర్సింహారెడ్డి ప్రియురాలు లక్ష్మిగా అద్భుత నటనతో సైరా లక్ష్మిగా నిలిచిపోనుందంటూ తమన్నాపై ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా `సైరా` అంటూ సాగే పాటలో తమన్నా హావభావాలు అటు ప్రేక్షకులను, ఇటు విమర్శకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. A gift for the super @tamannaahspeaks from Mrs Producer 😉❤️🥳 Missing u already. Catch up soon. #SyeraaNarashimaReddy pic.twitter.com/rmVmdwWNAd — Upasana Konidela (@upasanakonidela) October 3, 2019 -
చాలు.. ఇక చాలు అనిపించింది
‘‘సైరా’ సినిమా విడుదలకు నెలన్నర ముందు నుంచి తెల్లవారుజాము 3.30 ప్రాంతంలో ఉలిక్కిపడి నిద్రలేచేవాణ్ణి. అది ఎందుకో తెలియదు. బహుశా మన తెలుగు సినిమా నిర్మాతలందరూ అలాగే లేస్తారేమో తెలియదు’’ అన్నారు ‘సైరా’ చిత్రనిర్మాత రామ్చరణ్. చిరంజీవి టైటిల్ రోల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో సురేఖ సమర్పణలో రామ్చరణ్ నిర్మించిన చిత్రం ‘సైరా’. సురేందర్రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం ఈ నెల 2న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్రబృందం ‘థ్యాంక్స్ టూ ఇండియా’ ప్రెస్మీట్ను నిర్వహించారు. రామ్చరణ్ మాట్లాడుతూ– ‘‘ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆత్మ పైనుండి మమ్మల్ని ఆశీర్వదించి నాన్నగారితో ఇంత గొప్ప సినిమా తీసే అవకాశం ఇచ్చారేమో. ఇది భారతీయులు గర్వపడే సినిమా’’ అన్నారు. చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఈ కథ పరుచూరి బ్రదర్స్ బిడ్డ. ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు సురేందర్ రెడ్డితో చెప్పాం. కథ ఏ విధంగా చెప్పారో అదే కథను ఓ ఎపిక్లా తెరమీద చూపించినందుకు హ్యాట్సాఫ్ టు సురేందర్. నేను ఎప్పుడూ ఏ కథ విన్నా నాతోపాటు ఓ స్క్రిప్ట్ డాక్టర్ ఉంటారు. ఆయనే సత్యానంద్గారు. ఆయనకు థ్యాంక్స్. సాయిమాధవ్గారు చక్కని మాటలను అందించారు. అమితాబ్గారు స్పెషల్ ఫ్లైట్లో వచ్చి మాకు ఎలా కావాలో అలా అద్భుతంగా నటించారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అంకితభావంతో చేశారు కాబట్టే ఈ రోజున ‘సైరా’ అందరితో ‘వావ్’ అనిపించుకుంటోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మొట్టమొదటి స్వాతంత్య్ర సమర యోధుడు అనే సంగతి ప్రపంచానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియన్ ఫిల్మ్గా విడుదల చేశాం. ఈ సినిమా ప్రీమియర్ను ఒకటో తారీఖున ముంబైలో మీడియాకి వేశాం. అక్కడ సినిమా చూసినవారందరూ సౌత్లో ఇంతమంచి నాయకుడు ఉన్నాడా అని ఆశ్చర్యపోయి, స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారట. ఇది సౌత్, నార్త్ సినిమా కాదు.. ఇండియన్ సినిమా అంటున్నారు. ప్రేక్షకులు ఈ సినిమా చూసి చిరంజీవి 150 సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు అంటుంటే చాలు.. ఇక చాలు! ఈ సినిమా నా బిడ్డ నిర్మించినందుకు నాకు ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి అనిపించింది’’ అన్నారు. సురేందర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇంత గొప్ప హిస్టారికల్ ఫిల్మ్ను తీసే చాన్స్ ఇచ్చినందుకు చిరంజీవిగారికి, రామ్చరణ్కి రుణపడి ఉంటాను’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘బాలీవుడ్ సినిమా కలెక్షన్లను గ్రాస్లో చెబుతారు. తెలుగులో షేర్ను మాత్రమే చెప్పేవాళ్లం. ఫస్ట్ టైమ్ తెలుగు సినిమా 85 కోట్లు వసూలు చేసిందని గ్రాస్లో కలెక్షన్లను చెబుతున్నాం. ఇది అమేజింగ్ ఫిగర్. చిరంజీవిగారిని కలిసినప్పుడు ఎంత కలెక్ట్ చేస్తుందని కాదు రాజూ.. ఇది రెస్పెక్టెడ్ మూవీ, ఆ గౌరవాన్ని కాపాడాలి అన్నారు’’ అని చెప్పారు. ‘‘చిరంజీవిగారు తన తర్వాతి సినిమాల్లో కూడా నన్ను తీసుకోవాలి’’ అన్నారు తమన్నా. పరుచూరి బ్రదర్స్, సత్యానంద్, రత్నవేలు, బుర్రా సాయిమాధవ్, కమల్కణ్ణన్, జగపతిబాబు, సుస్మిత, విద్య తదితరులు పాల్గొ న్నారు. -
‘సైరా నరసింహారెడ్డి’ థ్యాంక్యూ మీట్
-
తమన్నా కాదిక.. ‘సైరా’ లక్ష్మి
‘పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దుబిడ్డవవురా.. ఉయ్యాలవాడ నారసింహుడా.. చరిత్రపుటలు విస్మరించ వీలులేని వీరా.. రేనాటిసీమ కన్న సూర్యుడా..’అంటూ ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో వచ్చే పాటకు హీరోయిన్ తమన్నా చేసిన ఫెర్ఫార్మెన్స్కు అభిమానులు సెల్యూట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఒకటిరెండు మినహా అన్నీ గ్లామరస్ పాత్రలకే పరిమితమైన ఈ మిల్కీ బ్యూటీ.. తాజాగా సైరా చిత్రంలో ఓ ఫవర్ ఫుల్ పాత్రలో కనిపించింది. ప్రతిభ ఉన్న వారికి సరైన అవకాశం దొరికితే ఎలాంటి ప్రదర్శన చేస్తోరో తమన్నా ఈ సినిమాలో నిరూపించింది. దీంతో తమన్నా అభిమానులు తెగ పండగ చేసుకుంటున్నారు. ‘బాహుబలి’, ‘బద్రీనాథ్’వంటి భారీ చిత్రాలలో తమన్నా నటించినప్పటికీ.. ఆమె నటన పెద్దగా ఎలివేట్ కాలేదు. అయితే గ్లామరస్ పాత్రలతో మాత్రం కుర్రకారును తనవైపు తిప్పేసుకుంది. కానీ సంపూర్ణ నటిగా ఇంకా ఫ్రూవ్ చేసుకోలదనే అపవాదు తమన్నాపై ఉండేది. తాజాగా ‘సైరా’ చిత్రంతో ఆ అపవాదును తొలగించుకుంది. సైరా చిత్రంలో తమన్నా ప్రధాన పాత్ర పోషించింది. నరసింహారెడ్డి ప్రియురాలు లక్ష్మిగా చాలా చక్కగా నటించింది.. కాదు జీవించిందనే చెప్పాలి. తన డ్యాన్స్లతో, పాటలతో ప్రజల్లో స్వాతంత్ర్యకాంక్షను రేకెత్తించేలా ఆమె చేసే ప్రదర్శన ఔరా అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ చిత్రంలో తమన్నా పాత్ర ముగింపు సినిమాను మలుపు తిప్పుతుంది. ఇక ప్రస్తుతం తమన్నా నటనపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తున్నారు. ‘మిల్కీ బ్యూటి కాదిక.. సైరా లక్ష్మి’, ‘తమన్నా నీ నటనకు స్టాండింగ్ ఓవియేషన్’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా నరసింహారెడ్డి’బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తొలి షో నుంచే హిట్ టాక్తో దూసుకపోతున్న ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అంతేకాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ చిత్రంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: ‘సైరా’ ఫుల్ రివ్యూ (4/5) -
‘చరిత్ర మళ్లీ పుట్టింది.. చిరంజీవి అయ్యింది’
ఎన్నో ఆశలు.. అంతకుమించి అంచనాలతో.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ‘సైరా’ తొలి షో నుంచే హిట్టాక్ రావడంతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇక ఈ చిత్రానికి సామాన్య అభిమానులే కాకుండా సెలబ్రెటీలు కూడా ఫిదా అవుతున్నారు. చిరంజీవి నటనకు, సినిమాను తెరకెక్కించిన విధానానికి ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ‘సైరా’థియేటర్లలోనే కాకుండా.. సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. ఈ సినిమాపై సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘సైరా’పై సెలెబ్రిటీలు ఏమన్నారంటే ‘ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి జీవితానికి చిరంజీవి గారు జీవం పోశారు. కాలగర్భంలో కలిసిపోయిన చరిత్రను మళ్లీ వెలుగులోకి తెచ్చారు. జగపతిబాబు, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా తమ పాత్రలను అద్భుతంగా పోషించారు. సినిమాకు వీరంతా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు’ - దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి 'ఈ రోజు చరిత్ర మళ్లీ పుట్టింది.. చిరంజీవి అయ్యింది.. చిత్ర యూనిట్కు హ్యాట్సాఫ్'- డైరెక్టర్ హరీష్ శంకర్ ‘విజువల్ పరంగా సినిమా రిచ్గా, అద్భుతంగా ఉంది. చిరంజీవి తన నట విశ్వరూపం ప్రదర్శించారు. 'సైరా' తప్పక చూడాల్సిన సినిమా. నిర్మాతగా రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డితో పాటు చిత్రయూనిట్కు శుభాకాంక్షలు. కళ్లు చెదిరే రీతిలో ఫొటోగ్రఫీ అందించి కెమెరామన్ రత్నవేలు రియల్లీ గ్రేట్. ఈ మధ్యకాలంలో నేను చూసిని సినిమాల్లో బెస్ట్ సినిమాటోగ్రఫీ ఇదే’ -హీరో మహేశ్ బాబు ‘నర్సింహారెడ్డిగా తెర మీద మెగాస్టార్ గర్జించారు. ప్రాజెక్టును బలంగా నమ్మి.. అద్భుతంగా తెర మీద ఆవిష్కరించిన రామ్చరణ్కు హ్యాట్సాఫ్. సురేందర్ రెడ్డి టేకింగ్ అద్భుతం. రత్నవేలు విజువల్స్ మైండ్ బ్లోయింగ్. తమన్నా అద్భుతంగా నటించింది’ - అనిల్ రావిపుడి ‘పదునాలుగేళ్ల మా కలను సాకారం చేసిన మెగాస్టార్కు, ఆయన కడుపున పుట్టిన పులిబిడ్డ రామ్ చరణ్కి వందనం ! అభివందనం! నిద్రలేని రాత్రులు గడిపి, ఈ చిత్రం ఘన విజయం సాధించడానికి కారకుడైన సురేందర్రెడ్డికి, సాంకేతిక నిపుణులకు, నటీనటులకు నమో నమః జై చిరంజీవా, జైజై సైరా’- పరుచూరి గోపాలకృష్ణ ‘సినిమా పట్ల ఉన్న అంకితభావం, ప్రేమకు గాను మెగా పవర్ స్టార్ రామ్చరణ్కు కంగ్రాట్స్. స్వాతంత్ర్య సమరయోధుడి కథను అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ సురేందర్ రెడ్డికి ధన్యవాదాలు. అలాగే నయనతార, తమన్నాలు తమ పాత్రలతో వెండితెరపై మెరిశారు’ - శ్రీను వైట్ల ‘ఎమోషన్స్, అనుభవానికి సైరా నర్సింహారెడ్డి పెద్ద పీట వేశారు. మెగాస్టార్ ఫెర్ఫార్మెన్స్ లెజెండరీగా నిలిచింది. సురేందర్ రెడ్డి చరిత్రను వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కరించారు. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ ఎంత రిచ్గా ఉందో రాంచరణ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ అంతే రిచ్గా ఉన్నాయి’ - సుధీర్ బాబు చదవండి: సైరా ఫుల్ రివ్యూ (4/5) -
తండ్రికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన రామ్చరణ్!
‘సైరా నరసింహారెడ్డి’.. ప్రస్తుతం మెగాస్టార్ అభిమానులకు ఈ పేరే ఒక ఎమోషన్గా మారిపోయింది. గాంధీ 150వ జయంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రికార్డులను కొల్లగొట్టే దిశగా ముందుకు వెళుతోంది. దాదాపు ఒకటో రెండో తప్ప మిగతా సంస్థలన్నీ సైరా సినిమాపై మంచి రివ్యూలనే అందించాయి. తాజాగా ఈ చిత్రంపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో తనకు తెలిసిన చిరంజీవిగా కాకుండా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగానే కనిపించాడన్నారు. మెగాస్టార్ అద్భుత నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారన్నారు. ఈ సందర్భంగా సైరా టీంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సైరా బ్లాక్ బాస్టర్ హిట్గా నిలుస్తుందని రాఘవేంద్రరావు కితాబిచ్చారు. దర్శకుడు సురేందర్ రెడ్డి కష్టం సినిమాలో కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందన్నారు. ఇక ప్రీ క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాల్లో తమన్నా నటన అదరగొట్టిందన్నారు. నిర్మాతగా వ్యవహరించిన రామ్చరణ్ ఈ చారిత్రాత్మక చిత్రంతో తండ్రికి అసలు సిసలైన గిఫ్ట్ ఇచ్చారని రాఘవేంద్రరావు కొనియాడారు. Congratulations to the entire team of #SyeRaaNarasimhaReddy for scoring a blockbuster! This is a perfect gift to a father from a son... #RamCharan @KonidelaPro — Raghavendra Rao K (@Ragavendraraoba) October 3, 2019 కాగా సైరా హిట్తో మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగిపోయింది. ఈ మేరకు సంతోష క్షణాలతో కూడిన ఫొటోలను సాయి ధరమ్ తేజ్ ట్విటర్లో పోస్ట్ చేశారు.. ‘చిరంజీవి అల్లుడిగా కాకుండా ఆయన అభిమానిగా చెప్తున్నా.. వెండితెరపై ఆయన మ్యాజిక్ చేశారు’ అంటూ చిరు నటనను కొనియాడారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి జీవించారని సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. Congratulated our #megastar not as a nephew but as a fan, as a boy who saw him creating magic on screen ,who breathed life into the historical character of #uyyalawadanarasimhareddy , thank you my #HERO 🙏🏼, love you so much 🤗😘 #syeraanarasimhareddy #syeraa #megastar pic.twitter.com/K7SDng0eKO — Sai Dharam Tej (@IamSaiDharamTej) October 3, 2019 -
‘సైరా’తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?
‘సచిన్ సెంచరీ కొట్టుడు.. బప్పిలహరి పాట కొట్టుడు.. మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ బద్దలుకొట్టుడు సేమ్ టు సేమ్’అంటూ మెగా అభిమానులు థియేటర్ల ముందు తెగ సందడి చేస్తున్నారు. చిరంజీవి హీరోగా నటించిన భారీ చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. గాంధీ జయంతి కానుకగా నిన్న(అక్టోబర్ 2)న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అత్యంత భారీ బడ్జెట్తో రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ‘సైరా’ సినిమా విడుదలైన ప్రతీ చోట హిట్ టాక్తో భారీ కలెక్షన్ల దిశగా దూసుకపోతోంది. దసరా సెలవులు కావడంతో పాటు క్రిటిక్స్ కూడా ‘సైరా’ చరిత్ర తిరగరాస్తుందని పేర్కొనడంతో రానున్న రోజుల్లో కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో రామ్ చరణ్ నిర్మాతగా రెండో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడని సినీ విశ్లేషకులు అభిప్రాపడుతున్నారు. ‘సైరా’తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే సుమారు రూ.85 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగురాష్ట్రాలు మినహా దక్షిణాదిలో రూ. 32 కోట్లు, ఉత్తరాదిలో రూ. 35 కోట్లు, ఓవర్సీస్లో రూ. 28 కోట్ల మేర వసూలు రాబట్టినట్లు సమాచారం. ఓవరాల్గా రూ. 180 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో సైరా ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తంగా రూ.106 కోట్ల మేర జరిగింది. నైజాంలో రూ.28 కోట్లు, సీడెడ్లో రూ.20 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.15 కోట్ల మేర బిజినెస్ జరిగిన విషయం తెలిసిందే. దీంతో ప్రీరిలీజ్ బిజినెస్తో పాటు, తొలి రోజు కలెక్షన్లను గమనిస్తే ఒకటి రెండు రోజుల్లోనే రికార్డులను తిరగరాసి, లాభాల బాట పట్టే అవకాశం ఉంది. అయితే ‘సైరా’ తొలిరోజు కలెక్షన్లు అధికారికంగా తెలియజేయాల్సి ఉంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నాన్నకు ప్రేమతో..
‘‘మాకన్నీ అందించిన వ్యక్తి నాన్నగారు. ఇప్పుడు ‘సైరా’తో ‘బాస్బస్టర్’ అందించారు. థ్యాంక్యూ నాన్నా’’ అంటూ ఈ ఫొటోలను రామ్చరణ్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్చరణ్ నిర్మించిన ‘సైరా’ బుధవారం విడుదలైన విషయం తెలిసిందే. -
సైరా హిట్.. మెగా ఫ్యామిలీ సంబరం
సీనియర్ నటుడు చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాపై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో మెగా ఫ్యామిలీలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. బుధవారం ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ సినిమా బాగుందన్న టాక్ వచ్చింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్చరణ్ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తమ సంతోషాన్ని ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు రామ్చరణ్. తన తండ్రి తనను ఆప్యాయంగా ముద్దు పెట్టుకుని ఆలింగనం చేసుకున్న ఫొటోలను ట్విటర్లో షేర్ చేశారు. ‘మనకు అన్నీ ఇచ్చేసిన వ్యక్తి’ అంటూ తన తండ్రిని ప్రశంసించారు. ‘సైరా’తో సూపర్హిట్ అందించినందుకు తన తండ్రికి ధన్యవాదాలు తెలిపారు. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో చిరంజీవి ఒదిగిపోయారని, అందరినీ మెప్పించారని సమీక్షకులు పేర్కొన్నారు. అంచనాలకు తగినట్టుగా సినిమా ఉందని అంటున్నారు. తమ హీరో బాగుందన్న టాక్తో మెగా ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. ‘సైరా నరసింహారెడ్డి’ ధియేటర్ల వద్ద పెద్ద ఎత్తున వేడుకలు జరుపుతున్నారు. ‘సైరా సూపర్‘ అంటూ పండగ చేసుకుంటున్నారు. (చదవండి: ‘సైరా’ మూవీ రివ్యూ) -
సైరా సినిమాకు వెళ్లిన ఎస్ఐలపై వేటు
సాక్షి, కర్నూలు : విధి నిర్వహణలో ఉండి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ‘సైరా’ సినిమాకు వెళ్లిన ఆరుగురు ఎస్ఐలపై బదిలీ వేటు పడింది. ఈ సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సినిమాకు వెళ్లారంటూ జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాకఉ చెందిన ఆరుగురు ఎస్ఐలు బుధవారం తెల్లవారుజామున సైరా సినిమాకు వెళ్లారు. అయితే వీరంతా సమాచారం ఇవ్వకుండా వెళ్లడంతో ఆరుగురు ఎస్ఐలను ఎస్పీ వీఆర్కు బదిలీ చేశారు. బదిలీ వేటు పడినవారిలో ...అవకు ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, కొలిమిగుండ్ల ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి, నందివర్గం ఎస్ఐ హరిప్రసాద్, బండి ఆత్మకూర్ ఎస్ఐ వెంకట సుబ్బయ్య, రాచర్ల ఎస్ఐ ప్రియతంరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ అశోక్ ఉన్నారు. చదవండి: ‘సైరా’ మూవీ రివ్యూ కాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఏపీలో ఈ సినిమా అదనపు షోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అక్టోబర్ 2 నుంచి 8 తేదీ వరకు స్పెషల్ షోలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రతి రోజు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం పది గంటల వరకు స్పెషల్ షో లకు అనుమతించింది. థియేటర్లో ‘సైరా’ చిత్రం వీక్షిస్తున్న ఎస్ఐలు.. -
సైరా కటౌట్ అంటే ఆమాత్రం ఉండాలి!
‘సైరాకు లేదు పోటీ.. చిరుకు రారెవరు సాటి!’ ప్రస్తుతం అభిమానులు ముక్తకంఠంతో అంటున్న మాట ఇది. గత కొంతకాలంగా సైరా మేనియాతో ఊగిపోతున్న అభిమానులకు అసలైన పండగ రానే వచ్చింది. బ్రిటీషర్లపై ఉక్కుపాదం మోపిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సైరా చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే! మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం నేడు విడుదల అవడంతో అభిమానుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. అభిమానులు థియేటర్ల వద్ద పోటెత్తుతున్నారు. అంతేకాక చిరుకు కానుకగా ఆయన కటౌట్లను ఏర్పాటు చేసి సందడి చేస్తున్నారు. డై హార్డ్ ఫ్యాన్స్ అయితే మరో అడుగు ముందుకేసి వారికున్న ఎవరెస్టు శిఖరమంత ప్రేమను చాటుకోవడానికి అత్యంత భారీ కటౌట్ను హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. చిరంజీవి జీవితంలోనే ఇది భారీ కటౌట్ అని ఆయన ఫ్యాన్స్ చెపుతున్నారు. ఈ భారీ కటౌట్లో చిరంజీవిని శిరస్సు నుంచి పాదాల వరకు పూలమాలలతో ఘనంగా ముస్తాబు చేశారు. దీనికోసం త్రివర్ణాలతో కూడిన పూలదండలను ఉపయోగించారు. ప్రస్తుతం ఈ కటౌట్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రానికిగానూ అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ అమ్మకాలు తారాస్థాయిలో జరగాయి. దీనికి తోడు పండగ సెలవులు కూడా సైరా కలెక్షన్లకు కలిసొచ్చే అంశంగా మారనుంది. మరి ఈ చారిత్రాత్మక చిత్రంతో చిరంజీవి రికార్డులపరంగా చరిత్ర సృష్టిస్తారా అనేది చూడాలి! చదవండి.. సైరా ఫుల్ రివ్యూ (4/5) -
‘సైరా’ మూవీ రివ్యూ
టైటిల్: సైరా జానర్: పీరియాడిక్ మూవీ నటీనటులు: చిరంజీవి, అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, నయనతార, తమన్నా తదితరులు సంగీతం : అమిత్ త్రివేది నిర్మాత: రామ్ చరణ్ దర్శకత్వం: సురేందర్ రెడ్డి రేనాటి వీరుడు.. తొలి స్వతంత్ర సమర యోధుడు.. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటాయి. రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సైరా అందర్నీ మెప్పించిందా లేదా అన్నది చూద్దాం. కథ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ కొత్తది కాదని అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది స్వతంత్ర సమర యోధుల కథలను వెండితెరపై చూశాం. అయితే మొట్టమొదటి యోధుడు.. రేనాటి వీరుడైన నరసింహా రెడ్డి గురించి ఇంతవరకు ప్రపంచానికి అంతగా తెలీదు. ఇదే ఈ సినిమాకు కొత్త పాయింట్. ఈ పాయింటే మనల్ని సినిమా చూసేలా చేస్తుంది. 61 మంది పాలేగాళ్ల ను ఏకం చేసి బ్రిటీష్ సామ్రాజ్యానికి ఎదురు వెళ్లాలని ప్రయత్నిస్తుంటాడు నరసింహా రెడ్డి. ఈ కథలో సిద్దమ్మ, లక్ష్మీ పాత్ర ఏంటి? స్వాతంత్ర్య సమరం కోసం అందరినీ నరసింహారెడ్డి ఏకతాటి పైకి ఎలా తెచ్చాడు? ఆ క్రమంలో అతనికి ఎదురైన సంఘటనలు ఏంటి? అన్నదే మిగతా కథ. నటీనటులు సైరాలో మెగాస్టార్ చిరంజీవి కన్నా ఉయ్యాలవాడ నరసింహారెడ్డే కనిపించాడు. ఇమేజ్ జోలికి పోకుండా పాత్రలో ఉన్నగంభీరం ఎక్కడా మిస్ కాకుండా చిరంజీవీ అద్భుతంగా నటించారు. యాక్షన్ సీన్స్లో అయితే మెగాస్టార్ అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. సినిమా అంతా భారీ తారాగణంతో, ప్రతీ సీన్ నిండుగా ఉన్నా.. కళ్లన్నీ నరసింహారెడ్డి మీదే ఉండేలా నటించారు. సినిమా అంతా తన భుజాలమీదే మోశాడు. ముఖ్యంగా ఇంటర్వెల్లో వచ్చే సీన్స్లో చిరు యాక్షన్ అదుర్స్ అనిపిస్తుంది. వావ్ అనిపించే పోరాట సన్నివేశాలను కూడా అవలీలగా చేసేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్తో ఈ సినిమా రూపురేఖలే మారిపోయాయి. ప్రతీ ఒక్కరూ తలెత్తుకునేలా చేసే సన్నివేశమది. మరణం కాదు ఇది జననం.. అంటూ చిరు పలికే సంభాషణలు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. చిరంజీవి తరువాత అంతగా పండిన పాత్ర అంటే అవుకు రాజు కిచ్చా సుదీప్దే. విభిన్న కోణాలను చూపిస్తూ.. అవసరమున్న చోట ప్రేక్షకులను సర్ప్రైజ్కు గురి చేస్తారు. గురువు పాత్రలో గోసాయి వెంకన్నగా అమితాబ్ గౌరవ పాత్రలో నటించారు. కనిపించింది కొన్ని సీన్స్లోనైనా.. తెరపై అద్భుతంగా పడించారు. వీరా రెడ్డిగా జగపతి బాబు చక్కగా నటించాడు. క్లైమాక్స్లో జగపతి బాబు కంటతడి పెట్టిస్తాడు. విజయ్ సేతుపతి పాత్ర నిడివి తక్కువే అయినా రాజా పాండిగా నమ్మిన బంటు పాత్రలో ఒదిగిపోయాడు. సిద్దమ్మ పాత్రలో నయనతార.. కనిపించింది ఐదారు సీన్లే అయినా.. తన ముద్ర కనిపిస్తుంది. ఇక లక్ష్మీ పాత్రలో నటించిన తమన్నా అందర్నీ ఆకట్టుకుంటుంది. తన పాత్ర ముగింపు సినిమాను మలుపు తిప్పుతుంది. ఇక రవికిషన్, బ్రహ్మాజి, అనుష్క, ఇలా అందరూ తమ పరిధి మేరకు నటించారు. విశ్లేషణ అందరికీ తెలిసిన కథనే ప్రేక్షకలక నచ్చే, మెచ్చే విధంగా తీయడంలోనే దర్శకుడి ప్రతిభ కనబడుతుంది. అందులోనూ చరిత్ర పుటల్లో అంతగా లేని నరసింహా రెడ్డి కథను, నేటి తరానికి దగ్గరయ్యేలా తీశాడు సురేందర్ రెడ్డి. నరసింహా రెడ్డి గురించి చెప్పడానికి, బ్రిటీష్ వాళ్ళ ఆగడాలు, అప్పటి జనాల స్థితిగతులు చెప్పడానికే ఫస్ట్ హాఫ్ను ఎక్కువగా వాడుకున్నాడు దర్శకుడు. ప్రతీ షాట్లో క్యారెక్టర్ ఎలివేట్ అయ్యేలా చిత్రీకరించాడు. ప్రతీ సీన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేసాడు. ఈ కథ చెప్పడానికి దర్శకుడు ఎంచుకున్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. మొదటి సీన్ నుంచి చివరి వరకు తాను రాసుకున్న కథనం ఆకట్టుకుంటుంది. ద్వేషం కోసం కాదు దేశం కోసం నిలబడు లాంటి ఎన్నో అద్భుతమైన, అర్థవంతమైన మాటలను సాయి మాధవ్ బుర్రా రాశాడు. సినిమాకు మరో ప్రధాన బలం సంగీతం. అమిత్ త్రివేది అందించిన పాటలు సినిమాను మరో లెవల్కు తీసుకెళ్లాయి. ఉన్నవి రెండు పాటలే అయినా.. వాటిని తెరకెక్కించిన విధానానికి ప్రేక్షకులు ముగ్దులు కావాల్సిందే. సైరా క్యారెక్టర్ అంతగా ఎలివేట్ అయిందంటే.. ప్రతీ సీన్తో ప్రేక్షకులు ఎమోషన్గా కనెక్ట్ అయ్యారంటే జూలియస్ ప్యాకియమ్ అందించిన నేపథ్య సంగీతమే అందుకు కారణం. రత్నవేలు పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. తన తండ్రి కోరిక నేరవేర్చేందుకు రామ్ చరణ్ పడిన కష్టం, చేసిన ఖర్చు తెరపై కనపిస్తుంది. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్గా చెప్పుకునే ఈ సైరాను.. విజువల్ వండర్గా తెరకెక్కించిన తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. నిర్మాణంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా ఖర్చు పెట్టాడు. దానికి తగ్గ ఫలితం వెండితెరపై కనబడుతుంది. ఎడిటింగ్, క్యాస్టూమ్, ఆర్ట్ ఇలా అన్ని విభాగాలు సినిమాను విజయవంతం చేయడంలో సహాయపడ్డాయి. బండ కళ్యాణ్, సాక్షి వెబ్డెస్క్. -
ఓవర్సీస్ టాక్.. ‘సైరా’ అదిరిపోయింది
రేనాటి వీరుడు.. తొలి స్వతంత్ర సమర యోధుడు.. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రంపై అంచనాలు ఆకాశాన్నoటాయి. అత్యంత భారీ బడ్జెట్తో రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు. . మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సైరా ఎట్టకేలకు వచ్చేసింది. మరి సైరా టాక్ ఎలా ఉంది? ట్విటర్ ట్రెండింగ్ ఏంటి? అన్నది చూద్దాం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ తెరపై చూడటానికి కొత్తది కాదని అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది స్వతంత్ర సమర యోధుల కథలను వెండితెరపై చూశాం. అయితే మొట్టమొదటి యోధుడు.. రేనాటి వీరుడైన నరసింహా రెడ్డి గురించి ఇంతవరకు ప్రపంచానికి అంతగా తెలీదు. ఇదే ఈ సినిమాకు కొత్త పాయింట్. ఈ పాయింటే మనల్ని సినిమా చూసేలా చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని.. ఎందుకు చెప్పుకున్నారో సైరా చూస్తే అర్థం అవుతుందని సినిమా చూసిన వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో సినిమా ప్రారంభం అవుతూ బ్రిటీష్ వారి ప్రవేశం, వారి ఆగడాల గురించి చెప్తాడు. ఇక నరసింహ రెడ్డి కథలోకి తీసుకెళ్లేందుకు తన స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో చిన్న సర్ప్రైజ్ చేశాడు దర్శకుడు. సినిమాలోని ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ వెళ్తాడు. చిరు ఎంట్రీ మాత్రం మెగా అభిమానులను కట్టిపడేస్తుంది అంటున్నారు. ఇక జాతర సాంగ్ తెరపై చూడటానికి రెండు కళ్ళు చాలవు అనేంత అద్భుతంగా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ బోర్ కొట్టించేలా ఉన్నాయని.. అయితే మధ్యలో వచ్చే ఫైట్స్ కన్నులపండవగా ఉంటాయని అంటున్నారు. నయనతార, తమన్నా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని ప్రశంసిస్తున్నారు. ఇక విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ లకు మంచి పాత్రలు లభించాయని అంటున్నారు. ఇక ఫస్ట్ హాఫ్ ను నిలబెట్టింది ఇంటర్వెల్ సీన్ అని ముక్తకంఠంతో చెప్తున్నారు. ఈ సీన్స్ తో ఒక్కసారిగా రోమాలు నిక్కబొడుచుకుంటాయని చెప్తున్నారు. ఇక సెకండ్ హాఫ్ ఊపందుకుంటూ వెళ్తుందని.. మొదట్లో నరసింహా రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న అవుక రాజు సుదీప్.. తిరిగి చేతులు కలపడానికి వస్తాడు. బ్రిటీష్ వారిని పూర్తి స్థాయిలో ఎదుర్కోవడానికి సైన్యాన్ని తయారు చేసుకునే ప్రయత్నం చేస్తుంటాడు నరసింహా రెడ్డి. ఈ క్రమంలో వచ్చే సైరా సాంగ్ తెరపై ఇంతకుముందెన్నడు చూడని విధంగా ఉంటుందని అంటున్నారు. ఈ పాటను విజువల్ వండర్ గా తెరకెక్కించారని అంటున్నారు. ఇక నరసింహా రెడ్డిని వెన్నుపోటు పొడిచేది ఎవరు, బ్రిటీష్ వారికి చిక్కిన తమన్నా కథ ఏం అవుతుంది, ఇలాంటి ట్విస్టులెన్నో సెకండాఫ్ను మరింత ఆసక్తికరంగా మలుస్తాయి. ఇక చివరి నలభై నిమిషాలు సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్లాయని అంటున్నారు. క్లైమాక్స్ అదిరిపోయిందని.. ప్రతి ఒక్కరి గుండెను కదిలిస్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మెగాస్టార్ తన ఎనర్జీ ని చూపించారని, నరసింహా రెడ్డి మాత్రమే కనిపించారని అంటున్నారు. ఈ వయసులో కూడా అంత ఎనర్జీతో గుర్రపు స్వారీలు, యుద్ధ సన్నివేశాలు చేయడంలో హైలెట్ అని ట్రెండ్ అవుతోంది. తన నటనతో మరోసారి విజృంభించాడని అభిమానులు సంబర పడుతున్నారు. ఇక గురువుగా నటించిన అమితాబ్ కనిపించేది కొన్ని సీన్స్లోనే అయినా.. ఎంతో ప్రభావం చూపించారని అంటున్నారు. ఇలాంటి సినిమాను నిర్మించిన రామ్ చరణ్ను అభినందిస్తున్నారు. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనపడిందని అంటున్నారు. సాంకేతికంగా ఈ సినిమా ఇంకో స్థాయికి వెళ్లిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. సురేందర్రెడ్డి తనదైన శైలిలో రాసుకున్న స్క్రీన్ప్లే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ, తన దర్శకత్వ ప్రతిభతో ఈ సినిమా స్థాయిని పెంచేశాడని, ప్రతీ సన్నివేశాన్ని ఎంతో అందంగా మలిచాడని అంటున్నారు. అమిత్ త్రివేది అందించిన సంగీతం అదిరిపోయిందని, సినిమా విజయం సాధించడంలో అదేంతో దోహదపడిందని అంటున్నారు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన జూలియస్.. ప్రతీ సన్నివేశాన్ని గుండెకు హత్తుకునేలా చేశాడని అంటున్నారు. రత్నవేలు మరోసారి తన పనితనాన్ని చూపించడాని అంటున్నారు. ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్, ఆర్ట్, కాస్ట్యూమ్ ఇలా అన్ని విభాగాలు ఈ సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లాయని అంటున్నారు. ఓ కొడుకు తన తండ్రి కలను నెరవేర్చడానికి ఎంతో ఖర్చు పెట్టాడని.. దానికి మించి ఔట్ పుట్ ను తీసుకొచ్చి.. తన తండ్రి సినీ జీవితంలో గుర్తుండిపోయే చిత్రాన్ని నిర్మించాడని అంటున్నారు. చదవండి.. సైరా ఫుల్ రివ్యూ (4/5) -
సైరా విడుదలకు గ్రీన్సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: సైరా నర్సింహారెడ్డి సినిమా విడుదల కాకుండా ఉత్తర్వులివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి దాఖలు చేసిన రిట్ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డిలతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీస్తున్నట్లు ప్రకటించారని, చరిత్రను వక్రీకరిస్తూ చిత్రాన్ని నిర్మించారనే పిటిషన్కు నంబర్ కేటాయింపు చేయాలో, వద్దో అనే ప్రాథమిక దశలోనే హైకోర్టు కొట్టివేసింది. సినిమాను వినోద అంశంగానే చూడాలని హితవు చెప్పింది. మరో రిట్ దాఖలు: ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి ప్రధాన అనుచరుడు వడ్డే ఓబయ్య అయితే రాజా పాండే ప్రధాన అనుచరుడిగా సినిమాను నిర్మించడం తప్పని పేర్కొంటూ వడ్డెర సంక్షేమ సంఘం విడిగా రిట్ దాఖలు చేసింది. దీనిని మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి విచారించారు. వడ్డే ఓబయ్య పాత్ర చిత్రంలో ఉందని సైరా చిత్రం తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి చెప్పారు. తదుపరి విచారణ 16వ తేదీకి వాయిదా పడింది. సైరా ప్రత్యేక షోలకు అనుమతి సాక్షి, అమరావతి: చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాకు బుధవారం నుంచి ఈ నెల 8వ తేదీ వరకు వారం రోజులపాటు ప్రత్యేక షోలు ప్రదర్శించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్ఎం కిశోర్కుమార్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఆ మేరకు ఏడు రోజులపాటు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 10 గంటల మధ్య ప్రత్యేక షోల ప్రదర్శనకు అనుమతించారు. -
ఏపీలో ‘సైరా’ అదనపు షోలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో సైరా నరసింహారెడ్డి చిత్రం అదనపు షోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అక్టోబర్ 2 నుంచి 8 తేదీ వరకు స్పెషల్ షోలకు అనుమతి ఇస్తూ మంగళవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రతి రోజు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం పది గంటల వరకు స్పెషల్ షో లకు అనుమతిస్తున్నట్టు జీవోలో పేర్కొంది. కాగా, మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నయనతార, జగపతిబాబు, తమన్నా, సుదీప్, విజయ్ సేతుపతి, రవికిషన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్చరణ్ సైరాను నిర్మించారు. చదవండి : ‘సైరా’పై మోహన్బాబు స్పందన.. సైరా ఫుల్ రివ్యూ (4/5) -
నాన్న సినిమాకు చేయడం ఛాలెంజింగ్గా తీసుకున్నా!
సినీ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగాస్టార్ మెగా మూవీ సైరా నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా ఒళ్లు గగుర్పొడిచేలా నటించారు చిరంజీవి. అయితే ఆ సినిమాలో వాడిన కస్టూమ్స్ , జ్యూవెలరీ గురించి సినిమా కాస్టూమ్ డిజైనర్, మెగాస్టార్ చిరంజీవి తనయ సుస్మిత చెప్పిన ముచ్చట్లు అదేవిధంగా ఆమ్రపాలి డైరెక్టర్,సైరా సినిమా కోఆర్డినేటర్ అనిల్ అజ్మీర్ సైరా నరసింహారెడ్డి గురించి చెప్పిన విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. -
‘సైరా’పై మోహన్బాబు స్పందన..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్తో తెరకెక్కిన చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం బుధవారం(అక్టోబర్ 2) రోజున ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రం ఘన విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా ప్రముఖ నటుడు మోహన్బాబు సైరా మూవీకి బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ‘నా మిత్రుడు చిరంజీవి మంచి నటుడు, తన కుమారుడు చరణ్ అధిక వ్యయంతో తీసిన సినిమా సైరా. ఇది అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని.. నిర్మాత చరణ్కు, చిరంజీవికి డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలు తేవాలని మనసా వాచా కోరుకుంటున్నాను’ అని తెలిపారు. నా మిత్రుడు చిరంజీవి మంచి నటుడు, తన కుమారుడు చరణ్ అధిక వ్యయంతో తీసిన సినిమా సైరా. ఇది అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని నిర్మాత చరణ్ కు, చిరంజీవి కి డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలు తేవాలని మనసా వాచా కోరుకుంటున్నాను. Best of Luck! — Mohan Babu M (@themohanbabu) October 1, 2019 చదవండి : ‘సైరా’ఫస్ట్ రివ్యూ: రోమాలు నిక్కబొడిచేలా చిరు నటన బాక్సాఫీస్ను షేక్ చేయనున్న ‘సైరా’ చదవండి.. సైరా ఫుల్ రివ్యూ (4/5) -
‘సైరా’ వర్కింగ్ స్టిల్స్
-
బాక్సాఫీస్ను షేక్ చేయనున్న ‘సైరా’
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ బుధవారం విడుదలకానున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొంది. దాదాపు రూ. 200 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దీంతో పాటు బాలీవుడ్ సినిమా ‘వార్’ కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ రెండు సినిమాలు మొదటి రోజు ఎంత వసూలు చేస్తాయనే దానిపై మార్కెట్ విశ్లేషకులు అంచనాలు కడుతున్నారు. ‘సైరా నరసింహారెడ్డి’ తొలి రోజు దక్షిణాదిలో రూ. 30 కోట్లు రాబట్టే అవకాశముందని ప్రముఖ ఫిల్మ్ ట్రేడ్ విశ్లేషకుడు గిరీశ్ జోహార్ పేర్కొన్నారు. ఇక వార్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు రూ. 45 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేశారు. ‘దక్షిణాదిలో చిరంజీవి పెద్ద స్టార్. ఆయన తాజా చిత్రం భారీ ఎత్తున విడుదలవుతోంది. అడ్వాన్స్ బుకింగ్ కూడా బ్రహ్మండంగా ఉన్నాయి. హిందీకి వచ్చేసరికి వార్ సినిమాకే మొదటి ప్రాధాన్యం దక్కుతుంది. వార్ సినిమా ఎలా ఉంటుందనే దానిపైనే బాలీవుడ్లో సైరా సినిమా కలెక్షన్లు ఆధారపడి ఉంటాయి. సౌత్లో మాత్రం సైరా బాక్సాఫీస్ను బద్దలు కొడుతుందని కచ్చితంగా చెప్పగలను’ అంటూ గిరీశ్ జోహార్ వివరించారు. కాగా, ‘సైరా నరసింహారెడ్డి’లో సినిమాతో చిరంజీవి సరికొత్త చరిత్రను లిఖించనున్నారని యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు ప్రశంసించారు. మరోవైపు ‘సైరా నరసింహారెడ్డి’ విడుదలకానున్న థియేటర్ల వద్ద సందడి నెలకొంది. అభిమానులు భారీ ఎత్తున కటౌట్లు ఏర్పాటు చేశారు. (చదవండి: ‘సైరా’ ఫస్ట్ రివ్యూ) వార్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ టికెట్ల అమ్మకాలు బాగున్నాయని, ఇప్పటికే రూ. 25 కోట్లు వచ్చాయని వెల్లడించారు. సినిమా బాగుందని టాక్ వస్తే ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రికార్డు(రూ.27.5 కోట్లు)ను వార్ అధిగమిస్తుందని జోస్యం చెప్పారు. వరుస సెలవులు ఉండడంతో కలెక్షన్లు భారీగానే ఉండే అవకాశముందని గిరీశ్ జోహార్ అంచనా వేశారు. (చదవండి: ‘సైరా’ను ఆపలేం.. ) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి.. సైరా ఫుల్ రివ్యూ (4/5) -
‘సైరా’ను ఆపలేం.. తేల్చిచెప్పిన హైకోర్టు
ఈ మధ్యకాలంలో సినిమాలను పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. దీంతో సినిమా విడుదలకు అడ్డంకులు ఏర్పాడుతున్నాయి. గతంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గద్దలకొండ గణేశ్’ సినిమా విడుదల చివరి రోజు వరకు ఉత్కంఠ నెలకొంది. అయితే విడుదలకు కొన్ని గంటల ముందు సినిమా పేరు మార్చి చిత్ర యూనిట్ పెద్ద ధైర్యమే చేసిన విషయం తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీగా తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ప్రస్తుతం ఈ చిత్రాన్ని కూడా వివాదాలు చుట్టుముట్టాయి. బయోపిక్ అని చెప్పి ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారని తమిళనాడు యువ సంఘం నాయకులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో ‘సైరా’ విడుదలపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ వివాదంపై విచారణ చేపట్టిన హైకోర్టు తన తుది తీర్పును మంగళవారం వెలువరించింది. ఇరువర్గాల వాదనను విన్న హైకోర్టు ‘సైరా’ సినిమా విడుదలను ఆపలేమని తేల్చిచెప్పింది. ‘సైరా’చిత్రంలో తాము ఎట్టిపరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సినిమాను కేవలం వినోద పరంగానే చూడాలని పిటిషనర్కు సూచించింది. ఎంతో మంది మహానుభావుల చరిత్రను ఉన్నది ఉన్నట్టు ఎవరు చూపించారని ప్రశ్నిస్తూనే.. గతంలో గాంధీ, మొఘల్ల సామ్రాజ్యాన్ని తెరకెక్కించిన చిత్రాలను ప్రస్తావించింది. సినిమా నచ్చేది నచ్చనిది ప్రేక్షకులకు వదిలేయాలని తెలిపింది. ప్రస్తుతం సినిమాను తాము ఆపలేమంటూ ఫిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో తెలంగాణలో సైరా సినిమా విడుదలకు అడ్డంకులు తొలిగిపోయాయి. ఇప్పటికే ఈ చిత్రంపై వచ్చిన తొలి రివ్యూతో ‘సైరా’ చిత్ర యూనిట్ ఆనందంలో ఉండగానే.. హైకోర్టు తీర్పు రెట్టింపు ఉత్సాహాన్ని కలిగిస్తోందని చిత్ర సభ్యులు పేర్కొన్నారు. చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘సైరా’ రేపు(బుధవారం) గాంధీ జయంతి కానుకగా విడుదల కానున్న విషయం తెలిసిందే. -
‘సైరా’ ఫస్ట్ రివ్యూ: రోమాలు నిక్కబొడిచేలా చిరు నటన
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. అయితే సినిమా థియేటర్లలో విడుదల కాకముందే తొలి టాక్ వచ్చేసింది. యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు ఈ చిత్రానికి సంబంధించిన రివ్యూను ట్విటర్లో తనదైన రీతిలో పోస్ట్ చేశాడు. ‘సైరా’మామూలుగా లేదంటూ అతడు పేర్కొనడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సంధు తన రివ్యూలో ఏం పేర్కొన్నాడంటే.. రోమాలు నిక్క పొడిచాయి ‘సైరా’ చూస్తున్నంత సేపు మీ రోమాలు నిక్కపోడుచుకోవడం ఖాయం. సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ గుండెలను హత్తుకునేలా ఉన్నాయి. నిజజీవిత కథ ఆధారంగా ‘సైరా’ తెరకెక్కించడంతో సినిమాలో మనం లీనమవుతాం. తరువాత ఏంటి అని ఆత్రుతగా ఎదురు చూస్తాం. మనకు తెలిసిన, తెలియని స్వాతంత్ర్య పోరాటంలో జరిగిన ఎన్నో విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ విషయంలో దర్శకుడు సురేందర్ రెడ్డి విజయవంతం అయ్యారు. ఈ సినిమాతో సురేందర్ రెడ్డి చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. సంగీత దర్శకుడు అమిత్ త్రివేదీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో దుమ్ములేపారు. చిరంజీవి నటనకు హ్యాట్సాఫ్.. చిరంజీవి హీరోగా నటించిన 150 చిత్రాలు ఒక ఎత్తు అయితే ‘సైరా’మరొక ఎత్తు. తొలిసారి చారిత్రక సినిమాలో నటించి చిరంజీవి.. సరికొత్త చరిత్రను లిఖించనున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే చిరంజీవి నటన అద్భుతం.. జాతీయ ఆవార్డే చిరంజీవి కోసం వేచి చూసేలా నటించారు. ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలవడం ఖాయం. చిరంజీవి లుక్స్ కూడా కొత్తగా.. సినిమాకు యాప్ట్ అయ్యే విధంగా ఉన్నాయి. ఇక అచ్చం ఉయ్యాలవాడ నర్సింహారెడ్డినే తెరపై చూసినట్టు అనిపించేలా చిరంజీవి నటించారు. మెగాస్టార్ నటనకు ప్రతీ ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. అంతేకాకుండా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపడం ఖాయం. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు’అంటూ సంధు ట్వీట్ చేశారు. ప్రస్తుతం సంధు చేసిన ట్వీట్ తెగ వైరల్గా మారుతుంది. ఇప్పటికే ‘సైరా’కు సంబంధించిన ట్రైలర్, పాటలు హిట్టవ్వడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా.. తాజాగా సంధు రివ్యూతో ఈ చిత్రంపై అంచనాలు మరో రేంజ్కు వెళ్లాయి. ఇక టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం హిట్టవ్వాలని ప్రతీ ఒక్క సినిమా అభిమాని కోరుకోవడం విశేషం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి.. సైరా ఫుల్ రివ్యూ (4/5) -
సై సైరా... భయ్యా!
150 సినిమాల రిలీజులు చూశారు కాబట్టి మీకు రిలీజ్లు కొత్త కాదు. అయినా 151వ సినిమా ‘సైరా’ రిలీజ్ అంటే ఏమైనా టెన్షన్గా ఉందా? చిరంజీవి: నిజం చెప్పాలంటే ఏ సినిమాకి ఆ సినిమా కొత్తగా అనిపిస్తుంది. ప్రేక్షకులు దీనిని ఎలా ఆదరిస్తారు? మనం అనుకున్నది కాకుండా ఊహించని విధంగా ఏదైనా స్పందిస్తారా? వంటి సంశయాలు ఎప్పుడూ ఉంటాయి. టెన్షన్ అనను కానీ ఆత్రుత, ఉద్వేగం వంటి మిక్స్డ్ ఫీలింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. కొన్ని సినిమాలకు ‘ఈ సినిమాను కచ్చితంగా ఆదరిస్తారు’ అనే ప్రగాఢమైన నమ్మకం ఉంటుంది. అలా ఈ సినిమాకు అనిపిస్తోంది. ఈ సినిమా కథ చాలా నమ్మకం కలిగించింది. ఆ నమ్మకమే ధైర్యంగా ఉండేలా చేసింది. గుర్రపు స్వారీలు మీకు అలవాటే. కత్తి యుద్ధాలు మొదటిసారి చేశారు కదా... ఎలా అనిపించింది? నేనెప్పుడూ కత్తి యుద్ధాలు చేసింది లేదు. భరతనాట్యం నేర్చుకోలేదు. కానీ చూసి, గమనించి చేసేవాణ్ణి. అలా బాగా డ్యాన్స్ చేయడం అలవాటైంది. కత్తి యుద్ధాలు, జానపద సినిమాలు చేసింది లేదు. మాస్టర్స్ చేసి, చూపించారు. అది చూసి నేర్చుకుని చేసేశాను. కొత్త విషయాలు నేర్చుకోవడం ఎప్పుడూ బాగుంటుంది. ఒక్క ఫ్లాప్ కెరీర్ని నిర్ణయించే వృత్తి మీది. 30 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న మీరేమంటారు? ఈ వృత్తిలో ఎన్ని ప్లస్సులున్నాయో అన్ని మైనస్సులూ ఉన్నాయి. ఇదే కాదు ఏ ప్రొఫెషన్లో అయినా ప్లస్సు, మైనస్సు కచ్చితంగా ఉంటాయి. చాలెంజ్లను అధిగమిస్తూ విజయాలు సాధించగలిగితేనే నువ్వు ముందుకు వెళ్లగలుగుతావు. ఇక్కడ సక్సెస్ రావాలంటే మనల్ని ముందుకు నడిపించేది కథ. ఆ కథలో కూడా కీలకమైనది ‘ఎమోషన్’ అని అంటాను నేను. ఆ ఎమోషన్ మిస్ అవ్వకుండా తీయగలిగితే సినిమా మీద కచ్చితంగా ధైర్యంగా, నమ్మకంగా ఉండొచ్చు. నేను కథలు వినేప్పుడు కూడా కామెడీ సీన్లు ఎన్ని ఉన్నాయి? డ్యాన్స్లు చేయడానికి స్కోప్ ఉందా? అని ఆలోచించను.హృదయాలను కదిలించే ఉద్వేగం ఉందా? లేదా అని చూసుకుంటాను. కంట తడిపెట్టించే సీన్స్ కొన్నయినా ఉండాలి. లేకపోతే ఎందుకు చూడాలి? మీరిచ్చే హంగులు అన్ని చోట్లా దొరుకుతున్నాయి. ప్రస్తుతం అందరికీ స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లభిస్తోంది. దాన్ని మించి నువ్వు మాకు ఏమి ఇస్తున్నావు? అనే ప్రేక్షకుడి ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉండాలి. ఆ సమాధానం మంచి కథ. ఇక ఎంతోమంది అభిమానులను ఇచ్చిన ఈ వృత్తికి ఎందుకు వచ్చాం అనే ఫీలింగా? నో చాన్స్. అది ఎప్పటికీ ఉండదు. డిజిటల్ మీడియా ఎంటర్టైన్మెంట్ నుంచి ఆడియన్స్ని డైవర్ట్ చేయాలంటే మంచి కథ ఉన్న సినిమాలు ఇవ్వాలన్నారు. డిజిటల్ ముందు సినిమా స్కేల్ ఏమైనా తగ్గిందంటారా? ఆ స్కేల్ ఇంకా పెరిగిందంటాను. ప్రస్తుతం ఉన్న సాంకేతికతను వినియోగించుకుంటూ సినిమా కొత్త పుంతలు తొక్కుతుందని భావిస్తున్నాను. స్మార్ట్ఫోన్ రూపంలో మన చేతిలోనే ఇంత కంటెంట్ అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని మించి మనం ఏం ఇవ్వగలం అనే ఆలోచనతో కొత్త కొత్త ఐడియాలు వస్తుంటాయి. నూతన దర్శకులు అలా ఆలోచించబట్టే కొత్త సబ్జెక్ట్లు వస్తున్నాయి. ‘అర్జున్ రెడ్డి, పెళ్లిచూపులు, కేరాఫ్ కంచెరపాలెం’ అన్నీ సక్సెస్ అయ్యాయి. డిజిటల్ ఎప్పుడూ సినిమాకు పోటీ కాదు. అయితే ది బెస్ట్ దిశగా ఆలోచింపజేస్తుంది. బెస్ట్ సినిమాలు వచ్చేందుకు స్కోప్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటి ఆర్టిస్ట్లను చూస్తే ఈర్ష్యగా ఏమైనా అనిపిస్తోందా? మీ టైమ్లో యాక్షన్లో రిస్క్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు టెక్నాలజీతో కొంత మేనేజ్ చేసే అవకాశం ఉంది కదా? అలాంటి ఫీలింగ్ నాకు ఎప్పుడూ ఉండదు. మీరన్నట్లు ఇప్పుడు చాలా సౌకర్యాలు ఉన్నాయి. మాకున్నంత రిస్క్ ఉండకపోచ్చు. అయితే రిస్క్ ఉంది. ప్రతి ఒక్కరూ నిరూపించుకోవడానికి కష్టపడాల్సిందే. అంత కష్టపడి సినిమా పూర్తి చేసిన తర్వాత కూడా ఈ సినిమాను ఎలా ఆదరిస్తారు అని టెన్షన్ ఉంటుంది. చిన్న చిన్న కంఫర్ట్స్ ఉంటే ఉండొచ్చు కానీ ఎవరైనా సరే ఈ మానసిక టెన్షన్ అనుభవించాల్సిందే. అది నేనయినా, మా అబ్బాయి రామ్చరణ్ అయినా.. ఎవరైనా. కష్టం కష్టమే. ఎవ్వరూ రిలాక్స్ అవుతూ సుఖంగా మాత్రం పని చేయడానికి కుదరదు. కొడుకు నిర్మాణంలో తండ్రి సినిమా చేయడం స్పెషల్గా ఉంటుంది. మీరు హీరోగా రామ్చరణ్ డబ్బులు పెట్టి ‘సైరా’ చేయడం గురించి... (నవ్వుతూ) ఇందులో తన డబ్బు వేరు.. నా డబ్బు వేరు అనే ఆలోచన మాకు లేదు. మేమందరం ఒకే రూఫ్ కింద ఉంటున్నాం. కాబట్టి మాకు ఆ తేడాలు లేవు. నాకోసం ఇలాంటి సినిమా నిర్మించాలనే తన తపనను కచ్చితంగా అభినందిస్తాను. ‘మగధీర’ సినిమా చేస్తున్నప్పుడు ‘నీకు రెండో సినిమాకే ఓ కాస్ట్యూమ్ డ్రామా చేసే అవకాశం వచ్చింది. నాకు ఆ అవకాశం రాలేదు’ అన్నాను. ‘డాడీకి అది తీరని కోరిక. ఇలాంటి సినిమా తీస్తే తన కోరిక నెరవేరుతుంది’ అని తన మనసులో ఉండిపోయింది. అందుకే ‘సైరా’ నిర్మించే అవకాశం నాకు ఇవ్వండి అని అడిగాడు. తనకు తెలుసు ఆ కథ నా దగ్గరే ఉందని. పరుచూరి బ్రదర్స్తో మళ్లీ కూర్చొని ఆ కథను బయటకు తీసుకొచ్చాడు. ఆ విధంగా నాకు మిగిలిన కోరికను తను తీర్చాడని చెప్పగలను. ఇప్పటి నటీనటులకు మీకన్నా రిస్క్ తక్కువ అని మాట్లాడుకున్నాం. అయినప్పటికీ రిస్క్ అయితే ఉంది. మరి.. ఓ స్టార్ కొడుకుకి ఇంత కష్టం అవసరమా? అని చరణ్ని సినిమాల్లోకి పంపించేటప్పుడు అనుకోలేదా? చరణ్ సినిమాల్లోకి రావాలనే విషయాన్ని వాళ్ల అమ్మ ద్వారా నాకు తెలియజేశాడు. నన్ను ఆర్టిస్ట్గా ఎంతగా గమనిస్తున్నాడు, ఎంతగా ఇష్టపడుతున్నాడో నాకు అప్పటివరకు తెలియదు. డాడీలా నేనూ సినిమాలు చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు నన్ను గమనించిన విషయం గ్రహించాను. తను వస్తాను అన్నప్పుడు నేను ఒక్కటే చెప్పాను.. ‘నా కొడుకుగా నీకు అన్నీ కేక్ వాక్ అనుకుంటే కుదరదు. చాలా కష్టపడి పని చేయాలి. నీ కష్టాన్ని గుర్తిస్తారు. అంత ప్రేమను పొందాలంటే కష్టపడాలి. కష్టపడే విషయంలో చరణ్కి చెప్పేది లేదు. ఎంత కష్టపడతాడనే దానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే ‘మగధీర’ సినిమా చేస్తున్నప్పుడు కాలికి గాయం అయింది. అది జరిగిందనే విషయం వారం వరకూ నాకూ, వాళ్ల అమ్మకు తెలియదు. ఇంట్లో కుంటుతూ నడుస్తుంటే, ‘ఏమైంది రా కాలికి... చూపించు’ అంటే చూపించాడు. మానుతున్నట్టుగా ఉంది గాయం. ‘మందులు వేసుకుంటున్నాను. ఫర్వాలేదులే’ అన్నాడు. కష్టపడే విషయంలో ఒళ్లు దాచుకోడు ^è రణ్. ఒక స్టార్ కొడుకుని, గోల్డెన్స్పూన్తో పుట్టాను అనే ఫీలింగ్ ఎక్కడా ఉండదు తనలో. ఎవరైనా బాధల్లో ఉంటే సహాయం చేయడం, హాస్పిటల్లో చూపించడం చేస్తుంటాడు. ఇవన్నీ చెప్పుకోవడం తనకు ఇష్టం ఉండదు. దానికి ప్రాచుర్యం కూడా కోరుకోడు. ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరూ ‘ఇంత బాగా చూసుకున్న నిర్మాత ఎవ్వరూ లేరు’ అంటున్నారు. సినిమాలో పని చేసిన ఎవరినైనా అడగండి ఇదే చెబుతారు. ‘ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులందరూ సంక్రాంతి చేసుకున్నాం’ అని కృష్ణానగర్లో ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారని మా మేకప్మేన్ చెప్పాడు. అది ‘సైరా’ వల్లే. సినిమా షూటింగ్లో ప్రతి రోజూ సెట్లో కొన్ని వేలమంది ఉండేవాళ్లు. చాలా మందికి పని దొరికింది. వాళ్లందరి ఆశీస్సులు ఈ సినిమాకు కచ్చితంగా ఉంటాయి. దాదాపు 300 కోట్లతో చరణ్ ఈ సినిమా నిర్మించారు. తన వెనకాల తండ్రి ఉన్నారనే ధైర్య మేనా? ఆ ధైర్యమే (నవ్వుతూ). ఇప్పుడు చరణ్కి ఉన్నంత రిస్కీ నేచర్ నాకు ఉండదు. ఎందుకంటే మా నాన్న మధ్యతరగతి వ్యక్తి. నేను సాధారణ కుటుంబం నుంచి వచ్చాను. ప్రతీ అడుగు ఆచితూచి జాగ్రత్తగా ఆలోచించి వేస్తాను. అయితే చరణ్కి నచ్చితే వెనకాడడు. దూకేస్తాడు. ఎందుకంటే వాళ్ల నాన్న మెగాస్టార్ అనే భరోసా ఉండి ఉండొచ్చు. 300 కోట్లు పెట్టి సినిమా చేసి, పెట్టిన డబ్బులు తిరిగొస్తాయా లేదా? అని ఆలోచించలేదు. మంచి ప్రయత్నం చేశాం అని అనుకుంటున్నాడు. నాకేంటి అనే ధీమా. నేనంత ధీమాగా, ధైర్యంగా ఆలోచించలేను. చరణ్ ‘ధైర్యం’ మీరు. మరి మీ ‘ధైర్యం’ ఏంటి? మీరు యాక్టర్గా ఎదుగుతున్న క్రమంలో మీ మానసిక స్థితి ఎలా ఉండేది? నా ధైర్యం నేనే. ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాను? ఎంత సంపాదిస్తున్నాను? ఎంత బ్యాంక్ బాలెన్స్ ఉంది అని కాకుండా ఎంత సేపటికీ బెస్ట్ సినిమాలు ఏం వస్తున్నాయి అని ఆలోచించేవాణ్ణి. ఇక్కడ నిలదొక్కుకోవాలి, మన ం ‘ద బెస్ట్’ అనిపించుకోవాలి అనే తాపత్రయం ఎప్పుడూ ఉండేది. కొందరు పారితోషికం సరిగ్గా ఇచ్చేవారు.. కొందరు ఎగ్గొట్టేవారు. ఎప్పుడూ కూడా నాకు ఇంత కావాలని డిమాండ్ చేసింది లేదు. 2007లో ‘శంకర్దాదా జిందాబాద్’ చేస్తున్నంతవరకూ కూడా నిర్మాతలకు ఎంత మిగులుతుందని ఆలోచించి, దానికి తగినట్టుగా పారితోషికం తీసుకునేవాణ్ణి. డిమాండ్, కమాండ్ చేసిన సందర్భాలు ఎప్పుడూ లేవు. దానివల్ల ‘మంచివాడిలా ఉన్నాడు. ఇతనితో సినిమా చేద్దాం’ అని నిర్మాతలు నా దగ్గరకు వస్తారనుకునేవాడిని. నిర్మాత బతకాలి. తనుంటేనే మనకు బ్రతుకు తెరువు ఉంటుందని ఆలోచించేవాణ్ణి. నాతో సినిమాలు చేసిన నిర్మాతలందరూ ‘మీతో సినిమా చేసిన తర్వాత మాకు ఇంత మిగులుతుందని భరోసా ఉంటుంది’ అన్న సందర్భాలున్నాయి. లైఫ్ మొత్తం ప్రతిదీ ఆచి తూచి చేసుకుంటూ వచ్చాను. టెన్షన్తో నిద్రలేని రాత్రులు.. ఏమైపోతాం అనే భయాలు ఉండేవా? ‘ఏమైపోతాం’ అనే భయం ఎప్పుడూ లేదు. నా మీద నాకు నమ్మకం ఎక్కువ. ‘చాన్స్ రావాలే కానీ ఇరగదీస్తాను’ అనే కాన్ఫిడెన్స్ ఉండేది. అవకాశం రావాలి అంటే టాలెంట్ మాత్రమే సరిపోదు. మన క్యారెక్టర్ నచ్చాలి. ‘ఇతనితో సినిమా తీస్తే కంఫర్ట్బుల్గా ఉంటుందయ్యా’ అనుకోవాలి. మన ప్రవర్తన కూడా మన ఫ్యూచర్ మీద ప్రభావం చూపించే వీలుంది. నా క్యారెక్టర్ని, వ్యక్తిగత ప్రవర్తనను, టాలెంట్ను బిల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్లాను. చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాణ్ని. ఓకే... ‘సైరా’ చేయకముందు మీకు నచ్చిన దేశం కోసం పోరాడిన వీరుడు ఎవరు? ఇప్పుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ తర్వాత మీ అభిప్రాయం? మహాత్మా గాంధీ నా ఫేవరెట్ హీరో అని ఎప్పుడూ చెబుతుంటాను. మహాత్ముడు గొప్ప స్వాతంత్య్ర సమర యోధుడు అని చదువుకున్నాం. ఆ తర్వాత హీరోయిక్గా అనిపించింది భగత్సింగ్.. ఆజాద్ చంద్రశేఖర్. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి తెలుసుకున్నాక ఆయనలోని తెగువ, మొండితనం, ధైర్యం ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఇంత గొప్ప వీరుడు మన తెలుగు ప్రాంతంలో ఉన్నారా? అని ఆయన మీద అభిమానం పెరిగిపోయింది. ఇప్పుడు నా వీరుల జాబితాలో ఈయన యాడ్ అయ్యారు. మీ మనవళ్లు, మనవరాళ్లతో ఇలాంటి వీరుల కథలు చెబుతారా? చెప్పాను. మా పెద్ద పాప సుస్మిత అయితే ‘సైరా’లో నాలాంటి కాస్ట్యూమ్స్ చిన్నవి తయారు చేయించి వాళ్ల పిల్లలకు వేసి ఫొటోలు తీసింది. వాళ్లు నాతోటి ఫోటోలు దిగారు. మా ప్రొడక్షన్ కంపెనీలో సీఎఫ్ఓగా పని చేసిన విద్య ఉంది. తను కూడా మా ఇంటి అమ్మాయే. విద్య కొడుకు ఆర్నవ్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సంబంధించిన ఒక ఇంగ్లీష్ బుక్ కొనేశాడు. దాని మీద నాతో ‘సైరా’ అని సంతకం చేయించుకున్నాడు. సినిమా విడుదలయ్యే ముందు నరసింహారెడ్డి గురించి మొత్తం తెలుసుకోవాలని ఆ బుక్ మొత్తం కంఠస్థ పట్టాడు కూడా. నా గ్రాండ్ చిల్డ్రన్ అందరూ నన్ను ‘భయ్యా’ అంటారు. తాతయ్యా అని ఎవరూ పిలవరు. భయ్యా అని నేను పిలవమని చెప్పలేదు (నవ్వుతూ). వాళ్లే పిలుస్తుంటారు. భయ్యా చేస్తున్న సినిమా.. ఒక వారియర్ సినిమా.. సూపర్ మేన్ సినిమా అంట చూద్దాం అని వాళ్లంతా చాలా ఆసక్తిగా ఉన్నారు. ‘సైరా’కి వాడిన నగల విషయంలో సుస్మితకు సలహా ఇచ్చింది సురేఖగారే అని విన్నాం... అవును. నయనతార, తమన్నా వాళ్లకు సుస్మిత పాత కాలం నగలను డిజైన్ చేసింది. ఆమ్రపాలి, మంగత్రాయ్ వాళ్లతో కలిసి చేసింది. వాళ్ల గురించి చెప్పింది సురేఖే. ఆ నగల్లో తమన్నా, నయనతార కుందనపుబొమ్మలా ఉన్నారు. రెగ్యులర్ సినిమాల్లో కనిపించేలా ఈ సినిమాలో ఉండరు. మీరు సురేఖగారికి కొనిపెట్టిన నగల గురించి? నేను చాలా కొనిపెట్టాను. ఈ మధ్యన హాలీడేకు వెళ్లాం. మొన్న లాస్ట్ బర్త్డేకు ఐదు క్యారెట్ల డైమండ్ స్టడ్స్ ఇచ్చాను. చాలా హ్యాపీ ఫీల్ అయింది. అయితే సురేఖ సింపుల్ ఉమన్. ఏదైనా కొనిపెడతానంటే నాకెందుకు? పిల్లలకు కొనిపెడదాం అంటుంది. మరి నువ్వూ అనుభవించాలి కదా అంటుంటాను. ఇక మా రోల్స్ రాయల్స్ కారు ఎక్కాలంటే నేను ఉండాల్సిందే. ‘మీరు పక్కన ఉన్నప్పుడు ఆ కారులో వెళితే గర్వంగా ఉంటుంది. నేను ఒక్కదాన్నే ఎక్కితే నాకు అస్సలు ఇష్టం ఉండదు’ అంటుంది. ఆ కారులో తను ఒక్కతే వెళ్లదు. అంత సింపుల్. నిజానికి ఇప్పుడు మీ మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకున్నంత ఎక్కువగా అప్పట్లో మీ పిల్లలతో ఆడుకోలేకపోయారు. ఇప్పుడు మీ భార్య సురేఖగారి ఫీలింగ్ ఏంటి? కష్టపడి పైకి వచ్చే రోజుల్లో నిరంతరం షూటింగ్లో ఉండి, పిల్లలు ఎలా ఎదిగారో కూడా తెలియలేదు. ఈ మధ్య నేను మా గ్రాండ్ చిల్డ్రన్తో ఆడుకుంటున్నాను. నేల మీద వాళ్లతో దొర్లుతున్నాను. అలా వాళ్లతో ఆడుకుంటుంటే పక్కనే సురేఖ నన్ను అలా గమనిస్తూ ఉంది. ఏంటి అని కళ్లతోనే అడిగాను. ‘ఏం లేదు.. మన పిల్లలతో మీరు ఎప్పుడు ఇలా ఆడుకున్నారా? అని గుర్తు తెచ్చుకుంటున్నాను. నాకు అస్సలు గుర్తు కూడా రావడం లేదు’ అంది. అదేంటి ‘ఎప్పుడైనా హాలిడేస్ అప్పుడు కలసి సరదాగా గడిపేవాళ్లం కదా’ అన్నాను. ‘అది సంవత్సరానికి ఒక్కసారో రెండుసార్లోనే కదా. పండగలకు కూడా మీరు ఉండేవారు కాదు’ అని చెప్పింది. నాకే కాదు ప్రొఫెషనల్ లైఫ్లో బిజీగా ఉండే ప్రతి ఒక్కరికీ ఇది కామన్. బ్రతుకుతెరువు కోసం కష్టపడే రోజుల్లో పిల్లల ఆలనా పాలనా చూసుకునే తీరిక కూడా ఉండదు. వాళ్లు ఎప్పుడు పెరిగి పెద్దవాళ్లు అయ్యారో కూడా కళ్లారా చూసుకునే వీలుండదు. నాకు ముగ్గురు పిల్లలుంటే నేను ఇంటికి రాగానే సుస్మిత, చరణ్ నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్లు. వాళ్లను దగ్గరకు తీసుకొని ముద్దు చేసేవాణ్ని. ఆ తర్వాత మేడపైకి వెళ్లిపోతుంటే సురేఖ ‘ఏవండీ.. ఒక్క నిమిషం మీకు మూడో పాప కూడా ఉంది గుర్తుందా?’ అనేది. ‘సారీ.. సారీ’ అంటూ తన గదిలోకి వెళ్లి శ్రీజను చూసేవాణ్ని. అప్పుడు శ్రీజ నెలల పిల్ల. ఇంకా నడక రాలేదు. దగ్గరకి వచ్చిన ఇద్దరి పిల్లలను ముద్డాడి, మూడో బిడ్డ గురించి మరచిపోయేవాణ్ణి. అంతలా పని చేశాను. అంత పని చేయకపోతే 33 సంవత్సరాల నా సినీ కెరీర్లో 150 సినిమాలు చేయడానికి కుదిరేది కాదు. రోజుకి 2–3 షిఫ్ట్లు చేసేవాణ్ణి. 33 ఏళ్లు నాన్స్టాప్గా పని చేశాక వచ్చిన ఆ గ్యాప్ అనేది మీ ఫ్యాన్స్కు చాలా బాధగా ఉండి ఉంటుంది. మీకెలా అనిపించేది? బాస్ సినిమాలు రావడం లేదనే ఫీలింగ్ వాళ్లకు ఉండి ఉండొచ్చు కానీ ఆ సమయంలో నేను తీసుకున్న నిర్ణయం సబబే. నేను చేసిన సర్వీస్ నాకు తృప్తిని ఇచ్చింది. ఆ తర్వాత నేను ఉన్న కాంగ్రెస్ పార్టీయే లేకుండా పోవడం? ఎటు వెళ్లాలి? అని అగమ్యగోచరంలో ఉండటం సినిమా ఇండస్ట్రీ నన్ను వెల్కమ్ చెప్పడంతో మళ్లీ వచ్చేశాను. నన్ను ఎంతగా ప్రేమించారు అని చెప్పడానికి ‘ఖైదీ నంబర్ 150’యే నిదర్శనం. రాజకీయాలు చూశాను, సినిమా పరిశ్రమ చూశాను కానీ సినిమా పరిశ్రమలో ఉండే తృప్తిగానీ, నేను పొందిన ఆనందం కానీ రాజకీయాల్లో నాకు రాలేదు. సినిమా పరిశ్రమ చాలా గొప్పది అనే ఫీలింగ్ నాకు ఉంది. నీ సంతోషం కోసం నువ్వు సినిమాలు చేసుకుంటూ వెళుతూ నిస్వార్థంగా నిన్ను ఆదరించి, కింగ్లాగా చూస్తారు. డెమీగాడ్లానూ చూస్తారు. అనుభవపూర్వకంగా తెలుసుకొని చెబుతున్నాను సినిమా పరిశ్రమలాంటిది మరోటి లేదు. నెక్ట్స్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమా గురించి? ఆయన స్టయిల్లో ఉంటుంది. ఆయన స్టయిల్లో నేను చేయడం కొత్తగా ఉంటుంది. లుక్ పూర్తిగా సెట్ కాలేదు. త్వరలోనే కొరటాల శివగారే ప్రకటిస్తారు. ఫైనల్లీ.. ఈ ప్రొఫెషన్ మిమ్మల్ని మెగాస్టార్ని చేసింది. వేలమంది అభిమానులను ఇచ్చింది. అదే వృత్తి మిమ్మల్ని కడుపు నిండా భోజనం చేయనివ్వలేదు, కంటి నిండా నిద్రపోనివ్వలేదు...వేళకు తినాలని, కడుపు నిండా తినాలని మన శరీరానికి ఆకలి ఎలా ఉంటుందో మన ఆత్మకి కూడా ఒక ఆకలి ఉంటుంది. ఆ సోల్కి కావాల్సింది దొరికితే ఫిజికల్ హంగ్రీ అనేది అసలు సమస్యే కాదు. అభిమానులు, ప్రేక్షకుల ప్రేమాభిమానాలతో నా సోల్ నిండుగా, సంపూర్ణంగా ఉంది. అందుకని ‘డైట్’ చేస్తున్నా ఏమీ అనిపించడంలేదు. ‘ఐయామ్ హ్యాపీ’. ‘సైరా’ సినిమా ఎందుకు చూడాలి అంటే తెలియని చరిత్ర కోసం చూడాలి. యువతను ప్రభావితం చేసేలా నరసింహారెడ్డి కథను చూపించగలిగారా? సురేందర్ రెడ్డిని ఈ సినిమాకి డైరెక్టర్గా అడిగినప్పుడు కొంచెం టైమ్ కావాలన్నాడు. తర్వాత కొన్ని రోజులు టచ్లో లేకపోవడంతో ‘చేయకూడదనుకుంటున్నాడా?’ అనిపించింది. అయితే కథతో సహా వచ్చాడు. చాలా అద్భుతంగా అనిపించింది. నరసింహారెడ్డి కథను తను తీసిన విధానం చూసేవారిని ప్రభావితం చేస్తుంది. ఈ సినిమాలో చిరంజీవిని చూడరు. ఒక పాత్రను చూస్తారు. సినిమాలో ఏం కోరుకుంటారో అవన్నీ ఉండటంతో పాటు ఒక మెసేజ్ ఉంటుంది. చాలామందిలో దేశభక్తి క్షీణిస్తున్న ఈ తరుణంలో మన పూర్వీకులు ఎంత సఫర్ అయ్యారు? బానిస బతుకు బతికి ఎన్ని కష్టాలు పడ్డారు వాళ్లందరి ప్రాణత్యాగాల ఫలమే మన స్వాతంత్య్రం అన్నది తెలుసుకోవాలి. వాళ్లందరినీ తలచుకోవాలి. గొప్పగా వాళ్లను స్మరించుకోగలిగితే అదే మనం వాళ్లందరికీ ఇచ్చే నివాళి. అలాంటి ఫీలింగ్ కలగాలంటే సినిమాను మించిన పవర్ఫుల్ మీడియమ్ లేదని అనుకుంటా. యువతరం చూడాల్సిన సినిమా. మీరు పిల్లల్ని బాగా ప్రేమిస్తారు. అసలు కన్నా కొసరు ముద్దు అన్నట్లు గ్రాండ్ చిల్డ్రన్ని గ్రాండ్గా చూసుకుంటారు కదా... గత నాలుగు రోజులుగా ‘సైరా’ ప్రమోషన్స్ చేస్తూ ఇంట్లో ఉండటం లేదు. మా చిన్నమ్మాయి శ్రీజ చిన్న కూతురికి పది నెలలు. ప్రమోషన్స్ అయి, ఇంటికి వెళ్లగానే కేకలు పెట్టేసింది. నన్ను చూసి పాప ఒకటే హుషారుగా ఆడుకోవడం మొదలుపెట్టింది. ఎత్తుకున్న తర్వాత కొనుక్కున్న కొత్త బొమ్మలను చూపించింది. అంతే.. నాలుగు రోజుల అలసట జస్ట్ అరగంటలో దూరం అయిపోయింది. పిల్లలు మన స్ట్రెస్ని అంతా ఇట్టే తగ్గించేస్తారు. అందుకే ‘ఐ లవ్ చిల్డ్రన్’. చిరంజీవి తనయుడు రామ్చరణ్, మనవరాళ్లు నివృతి, సమారా, సంహిత, మనవడు ఆర్నవ్ ‘మగధీర’ చూసి ఇలాంటి సినిమా చేయలేకపోయానన్నందుకు చరణ్ మీతో ‘సైరా’ తీశారు. ఈ సినిమా చేసినందుకు మీ భార్య సురేఖ ఏమన్నారు? ఇవాళ (సోమవారం) ఉదయం సురేఖ ఓ మాట అంది. ఈ సినిమా కొన్ని చోట్ల మేమే సొంతంగా రిలీజ్ చేస్తున్నాం. కొన్ని చోట్ల మంచి బిజినెస్ అయింది. ‘మనం డబ్బుల గురించి చూడకూడదు. డబ్బు వస్తుందో రాదో తెలియదు కానీ లైఫ్ టైమ్లో మీకు గొప్ప పాత్ర ఇది. ఆ తృప్తిని డబ్బుతో కొలవలేం. మీ కోరిక తీర్చాలని రామ్ చరణ్ ఈ సినిమా చేశాడు. ఆ విధంగా వాడు సంతృప్తిగా ఉంటాడు. గొప్ప పాత్ర చేశాను అనే మీ కోరిక నెరవేరింది. నేను మీతో సినిమా చేయాలనే నా కోరిక నెరవేరింది (సురేఖ సమర్పణలో ‘సైరా’ రూపొందింది)’ అని చెప్పింది. అలా ‘సైరా’ విషయంలో ఇంటిల్లిపాదీ ఆనందంగా ఉన్నాం. నటుడిగా శరీరానికి విపరీతమైన కష్టాన్ని ఇచ్చేశాం. కొంచెం సుఖపెట్టి ఉండుంటే బావుండేది అని ఎప్పుడైనా అనిపించిందా? అస్సలు అనిపించలేదు. నాకు సుఖం అంటేనే ఇష్టం ఉండదు. ఖాళీగా ఉంటే రెస్ట్లెస్ అయిపోతాను. ఉదాహరణకు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉండేది. కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’కి మార్నింగ్ 7 అంటే 7, 9 అంటే 9కి మేకప్తో రెడీగా ఉండేవాణ్ని. చాలా హ్యాపీగా ఉండేది. ‘పని చేస్తేనే, షూటింగ్కి వెళ్తేనే మీరు హ్యాపీగా, హుషారుగా ఉంటారు. ఖాళీగా ఉంటే మాత్రం ఏంటోలా అయిపోతారు’ అని సురేఖ అంటుంది. -
‘సైరా’పై బన్నీ ఆసక్తికర కామెంట్స్
తొలి స్వతంత్ర్య సమరయోధుడి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ మూవీపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం మెగా అభిమానులే కాక.. తెలుగు ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీపై స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కామెంట్స్ చేశారు. తన సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న బన్నీ.. ప్రీ రిలీజ్ ఈవెంట్కు కూడా రాలేకపోయాడు. దీంతో సైరాపై తనదైన స్టైల్లో స్పందించాడు. ‘సైరా.. నరసింహారెడ్డి.. మన మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి వస్తోన్న అద్భుతమైన చిత్రం. ఇలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలో ఆయన నటించాలని.. మగధీర సినిమాను చూసినప్పటి నుంచీ అనుకున్నాను. ఆ కోరిక నేటితో నిజమైంది. చిరంజీవి గారితో ఇలాంటి సినిమా తీసిన నిర్మాత, మై డియర్ బ్రదర్ రామ్ చరణ్కు థ్యాంక్స్ అండ్ కంగ్రాట్స్. ఓ తండ్రికి కొడుకు ఇవ్వగల గొప్ప బహుమతి ఇది. ఆయన లెగసీకి ఇదో నివాళి. చిత్రానికి పని చేసిన ప్రతిఒక్కరికీ ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ సురేందర్రెడ్డికి నా తరుపున స్పెషల్ రెస్పక్ట్. మన హృదయంలోఎప్పటికీ మరిచిపోలేని మ్యాజిక్ను ఈ మూవీ క్రియేట్ చేయాలని, సైరా అంటూ నిత్యం మన గుండెల్లో వినిపించాలని కోరుకుంటున్నా’ అంటూ సోషల్ మీడియా ద్వారా సైరాపై తనకున్న ప్రేమను వెల్లడించారు. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు, నయనతార, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 2న ఈ మూవీ విడుదల కానుంది. -
‘సైరా నరసింహారెడ్డి’ ప్రెస్మీట్
-
నా సినీ జీవితంలో గుర్తుండిపోయేలా.. : చిరంజీవి
బెంగళూరు : ‘రామ్ చరణ్ రెండో సినిమా మగధీరలో చేసిన క్యారెక్టర్ చూసీ జెలసీ ఫీలయ్యాను. నేను ఇన్ని సినిమాలు చేసినా.. ఇలా కత్తి పట్టుకుని చేసే అవకాశం నాకు రాలేదని చరణ్తో అన్నాను. ఆ తర్వాత దాన్ని వదిలేశాను. కానీ చరణ్లో ఆ ఆలోచన ఉండిపోయింది. అందుకే ఇప్పుడు సైరా నరసింహారెడ్డి రూపంలో చరణ్ నాకు పెద్ద గిప్ట్ అందజేశాడు. నా సినీ జీవితంలో గుర్తుండిపోయేలా.. ఈ సినిమాను నాకు బహుమతిగా ఇచ్చాడు. నేను ఏం సాధించానంటే రామ్ చరణ్ను సాధించానని గర్వంగా చెబుతాన’ని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. బెంగళూరులో ఆదివారం జరిగిన సైరా నరసింహారెడ్డి కన్నడ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయణ్, కన్నడ హీరో శివ రాజ్కుమార్, నిర్మాత రామ్చరణ్, హీరోయిన్ తమన్నా హాజరయ్యారు. ఇంకా చిరంజీవి ఏం మాట్లాడారో కింది వీడియోలో చూడండి.. కాగా, చిరంజీవి, నయనతార జంటగా అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, తమన్నా, సుదీప్, విజయ్ సేతుపతి, రవికిషన్ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలవుతోంది. -
‘సైరా’కు ఆత్మ అదే : సురేందర్ రెడ్డి
మెగాస్టార్ చిరంజీవి తొలి స్వతంత్ర్య సమరయోధుడి పాత్రలో నటిస్తున్న సైరాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు రంగం సిద్దం చేశారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. ప్రమోషన్ కార్యక్రమాల జోరును పెంచింది చిత్రబృందం. సినిమాకు సంగీతం, నేపథ్య సంగీతం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. సన్నివేశాల్లోని భావాలను మరింత పెంచేందుకు బ్యాగ్రౌండ్ స్కోర్ దోహదపడుతుంది. దాదాపు 250 కోట్లతో తెరకెక్కిన సైరాలో బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, అదే సైరాకు ఆత్మ అని, దీంతో సైరా మరో లెవల్కు వెళ్తుందని దర్శకుడు సురేందర్ రెడ్డి తెలిపాడు. తాజాగా ఈ మూవీ డీటీఎస్ మిక్సింగ్ పూర్తయిందని పేర్కొన్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు, నయనతార, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 2న ఈ మూవీ విడుదల కానుంది. -
నా కల నెరవేరింది : చిరు
సైరా చిత్రంతో తన చిరకాల కల నెరవేరిందన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈయన నటించిన చారిత్రాత్మక భారీ బడ్జెట్ చిత్రం సైరా నరసిహారెడ్డి. చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్చరణ్ నిర్మించిన ఈ చిత్రానికి పరచూరి బ్రదర్స్ కథను సమకూర్చగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. బాలీవుడ్ బిగ్బీ అమితాబ్బచ్చన్, కన్నడ నటుడు సుధీప్, తమిళ నటుడు విజయ్సేతుపతి, జగపతిబాబు, నటి నయనతార, తమన్న వంటి భారీ తారాగణం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సైరా చిత్రం తెలుగుతో పాటు, తమిళం,హింది, మలయాళ, కన్నడ భాషల్లోనూ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2వ తేధీన భారీ ఎత్తున విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా ఈ చిత్ర తమిళనాడు విడుదల హక్కులను సూపర్గుడ్ ఫిలింస్ ఆర్బీ.చౌదరి సొంతం చేసుకున్నారు. ఈ నేపధ్యంలో తమిళ వెర్షన్ ప్రమోషన్లో భాగంగా శనివారం మధ్యాహ్నం చెన్నైలో చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, రామ్చరణ్, నటి తమన్నా తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా చిత్ర నిర్మాత రామ్చరణ్ మాట్లాడుతూ సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని నిర్మించడం తన అదృష్టంగా పేర్కొన్నారు. ఈ వేదికపై తాను ముగ్గురి గురించి కచ్చితంగా చెప్పాలన్నారు. అందులో నటుడు విజయ్సేతుపతి ఒకరన్నారు. విజయ్ సేతుపతికి తాను వీరాభిమానినన్నారు చరణ్. 96 చిత్రంలో ఆయన నటన ఎంతగానో ఆకట్టుకుందన్నారు. ముఖ్యంగా ఆ చిత్ర తుది ఘట్టంలో విజయ్సేతుపతి నటన అద్భుతం అని పేర్కొన్నారు. అలాంటి నటుడు సైరా చిత్రంలో ఒక భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. మరో విషయం ఏమిటంటే తాను అభిమానించే నటులలో అరవిందస్వామి ఒకరన్నారు. ఆయనతో కలిసి తాను ధృవ చిత్రంలో నటించినట్లు తెలిపారు. అరవిందస్వామి ఇటీవల తన ఇంటికి వచ్చారనీ, అప్పుడు ఆయన తాను చాలా అసంతృప్తిగా ఉన్నాననీ చెప్పారన్నారు. ఏం జరిగిందని అడగ్గా సైరా చిత్రం నిర్మిస్తున్నావటగా, తమిళ నటుడు విజయ్సేతుపతి గుర్తు కొచ్చారు గానీ, తాను గుర్తుకు రాలేదా? తనకు ఇందులో వేషం లేదా? అని అడిగారన్నారు. తానందుకు కాస్టింగ్ విషయం దర్శకుడు చూసుకున్నారని చెప్పగా, అంతా నాకు తెలియదు. సైరా చిత్రంలో తానుండాలి అని అన్నారన్నారు. చిత్రం పూర్తి అయ్యిపోయ్యిందని చెప్పడంతో, చిరంజీవి పాత్రకు తాను తమిళంలో డబ్బింగ్ చెబుతానంటూ పట్టు పట్టారన్నారు. అప్పటికే వేరొకరితో చెప్పించినా , అరవిందస్వామి కోరిక మేరకు ఆయనతోనే డబ్బింగ్ చెప్పించినట్లు తెలిపారు. ఇక మరో విషయం ఏమిటంటే ఈ చిత్రంలో ముందు మాటను నటుడు కమలహాసన్ చెప్పారన్నారు. ఆయనకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఇక తనది తమన్నది హిట్ కాంబినేషన్ అన్నారు. రచ్చ చిత్రంలో నటించినప్పుడు ఆ చిత్ర ప్రచార వేడుకలో తన తండ్రి పాల్గొన్నారన్నారు. అప్పుడాయన తాను మళ్లీ నటిస్తే తనకు జంటగా తమన్నను ఎంపిక చేస్తానని చెప్పారన్నారు. ఇదెలా సాధ్యం, అని అప్పుడు అంతా ఆశ్యర్యపోయారన్నారు. అయితే సంకల్పబలం ఉంటే అసాధ్యం అన్నది ఉండదన్నట్లు అప్పుడు నాన్న అన్నది ఇప్పుడు ఈ చిత్రంలో జరిగిందని రామ్చరణ్ అన్నారు. బాహుబలి 2నే సైరాకు స్పూర్తి అనంతరం చిత్ర కథానాయకుడు చిరంజీవి మాట్లాడుతూ చాలా కాలం తరువాత తాను నటుడిగా పుట్టిన చెన్నైకి రావడం సంతోషంగా ఉందన్నారు. సైరా చిత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడైన సైరా నరసింహారెడ్డి జీవిత చరిత్రలో నటించాలని 12 ఏళ్లుగా అనుకుంటున్నాం.. ఆ కల ఇప్పుడు నెరవేరినందుకు సంతోషంగా ఉందన్నారు. కొంత కాలం రాజకీయాలతో బిజీగా ఉండటంతో చిత్రాలకు దూరం కావలసి వచ్చిందనీ, అలాంటిది రామ్ చరణ్ నటించిన మగధీర చిత్రం విజయం తనలో సైరా నరసింహారెడ్డి చిత్రం గురించి ఆలోచన రేపిందన్నారు. 70–80 కోట్ల రూపాయలతో రూపొందిన మగధీర చిత్రం సక్సెస్ కావడంతో సైరా చిత్రాన్ని భారీగా చేయవచ్చుననిపించిందన్నారు. ఆ తరువాత బాహుబలి 2 చిత్రం సైరా చిత్రం చేయడానికి స్పూర్తినిచ్చిందన్నారు. అప్పుడు చరణ్తో సైరా గురించి చర్చించానన్నారు. ఆ తరువాత రచయితలు పరచూరి బ్రదర్స్ సైరా కథను చెక్కడం మొదలెట్టారన్నారు. రాజకీయాలను వదిలి వచ్చిన తరువాత ఖైధీ నంబర్ 150 చేశాననీ, ఆ చిత్రం చేసేటప్పుడు కాస్త భయపడ్డాననీ, కారణం 10 ఏళ్ల గ్యాప్ తరువాత చేస్తున్న చిత్రం కావడమేనన్నారు. అయితే ఆ చిత్ర విజయం తనలో కాన్ఫిడెన్స్ని నింపిందన్నారు. కాగా సాధారణంగా తండ్రులు కొడుకులతో చిత్రం చేస్తారనీ, ఇక్కడ తన కొడుకు తనతో చిత్రం చేయడం మంచి అనుభూతి అని పేర్కొన్నారు. అదే విధంగా ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్బచ్చన్ను నటింపజేశాలని భావించినప్పుడు, ఆయన్ని సంప్రదించగా నటించడానికి అంగీకరించడంతో సైరా విజయంపై నమ్మకం కలిగిందన్నారు. అదే విధంగా విజయ్సేతుపతి, నయనతార, తమన్నాలు కీలక పాత్రల్లో నటించారని తెలిపారు. తన మిత్రుడు కమలహాసన్ ఈ చిత్రం ప్రారంభంలో పరిచయ వ్యాక్యలు మాట్లాడినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టుగా తెలిపారు. -
‘సైరా’ సుస్మిత
-
‘సైరా’ సుస్మిత
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘సైరా’ నరసింహారెడ్డిలో వినియోగించిన ఆభరణాలను శనివారం పార్క్ హయాత్లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సైరాకు స్టైలిస్ట్, డిజైనర్గా పనిచేసిన చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె రూపొందించిన ఆభరణాల డిజైన్లను అనుసరించి మంగత్రాయ్ సంస్థ జ్యువెల్లరీని రూపొందించి అందించింది. వీటినే చిరంజీవి, నయనతారలు ధరించినట్లు సుస్మిత తెలిపారు. ఫ్యాషన్ సూత్ర సంప్రదాయం, ఆధునికత మేళించిన దుస్తులు, ఆభరణాలతో పాటు పలురకాల మహిళా ఉత్పత్తులతో ఏర్పాటు చేసి ‘సూత్ర ఫ్యాషన్ ఎగ్జిబిషన్’ తాజ్కృష్ణా హోటల్లో ప్రారంభమైంది. వర్థమాన నటి సలోనిజోషి (ఫలక్నుమా దాస్ ఫేమ్) ముఖ్య అతిథిగా హాజరై ఎగ్జిబిషన్ ప్రారంభించింది. పండగల సీజన్ పురస్కరించుకుని వైవిధ్యమైన కలెక్షన్స్ అందుబాటులో ఉంచామని, ఎగ్జిబిషన్ ఈ ఆదివారంతో ముగుస్తుందని నిర్వాహకుడు ఉమేష్ మద్వాన్ తెలిపారు. భాగ్యనగరంలో ఆస్ట్రేలియా అందం మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా టైలాకానన్ నగరంలో సందడి చేశారు. యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అసోషియేషన్ (వైఈఏ) ఆధ్వర్యంలో బంజారాహిల్స్ రాడిసన్ హోటల్లో ‘టిప్స్ ఆన్ హెల్త్ నూట్రిషన్ అండ్ ఫిట్నెస్’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టైలా.... ఫిట్నెస్, న్యూట్రిషన్పై పలు సలహాలు ఇచ్చారు. -
అది..రాంచరణ్నే అడగండి: సుస్మిత
కొత్తదనాన్ని డిజైన్ చెయ్యడానికి విజన్ ఉన్న డిజైనర్ చాలు. పాతదనాన్ని డిజైన్ చెయ్యడానికి మాత్రంఇమేజ్ని, ఇమాజినేషన్ని కలిపే ప్రతిభ ఉండాలి. కళ్లముందు కనిపించే ఇమేజ్ని రెండు శతాబ్దాల వెనకటి ఇమాజినేషన్తోమ్యాచ్ చేసిన అమేజింగ్ డిజైనర్ సుస్మిత. చిన్నప్పుడు నాన్న రెడీ చేయించిన ఈ అమ్మాయి కాస్ట్యూమ్స్ డిజైనర్గా ఇప్పుడు నాన్నను ‘సైరా’ కోసం రెడీ చేసింది! నరసింహారెడ్డిలా నాన్నను ఇమాజిన్ చేసిన ఈ ‘ఇమేజింగ్’ డిజైనర్తో ‘సాక్షి’ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ‘రాధే గోవిందా...’ అంటూ అప్పట్లో ‘ఇంద్ర’ సినిమాలో పాటకు మీ నాన్నగారు వేసుకున్న డ్రెస్సులు ట్రెండీగా ఉన్నాయి. మీకది ఫస్ట్ సినిమా కదా? సుస్మిత : అవును. 2002లో ఆ సినిమా వచ్చింది. పదహారేళ్ల క్రితం ట్రెండ్కి తగ్గట్టుగా నాన్నగారి కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాను. ట్రెండ్ని మాత్రమే కాదు.. నాన్న స్టైల్కి తగ్గట్టు డిజైన్ చేస్తుంటాను. యాక్చువల్గా కాస్ట్యూమ్ డిజైనర్గా నాకది ఫస్ట్ మూవీ. కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు మీ డాడీకి స్టయిలింగ్ చేస్తున్నారు. చిన్నప్పుడు ఎప్పుడైనా మీ నాన్నగారు మిమ్మల్ని రెడీ చేసిన సందర్భాలున్నాయా? (నవ్వుతూ). నాన్నగారు మా చిన్నప్పుడు ఫుల్ బిజీగా ఉండేవారు. మాతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేసే వీలు లేకుండా పోయింది. అయితే మమ్మల్ని ఆయన పూర్తిగా రెడీ చేయకపోయినా మా అమ్మగారు రెడీ చేసిన తర్వాత ‘ఇది బావుంది, ఇలా బాలేదు. మార్చు’ అని చెప్పేవారు. అమ్మకి ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. మీ స్టయిలింగ్పై మీ నాన్న అభిప్రాయం? నాన్నగారి దగ్గర ఉన్న మంచి విషయం ఏంటంటే.. తన కూతురే కదా అని ఏం చేసినా బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చేయరు. కాంప్లిమెంట్ ఎంత బాగా ఇస్తారో, మిమర్శ కూడా అలానే చేస్తారు. బాగా లేకపోతే ‘వేరే ఆప్షన్ చూపించు’ అంటారు. అందుకే నాన్నగారితో వర్క్ చేయడం చాలా బావుంటుంది. ఆయన ఇచ్చే విమర్శ కూడా విలువైనదే. ‘సైరా’లో ఒక 45 లుక్స్ ఉంటాయి. అందులో 6–7 సార్లే చిన్న చిన్న మార్పులు కోరారు. చిరంజీవిగారి కోసం ఎన్ని కాస్ట్యూమ్స్ తయారు చేశారు? నాన్నకే సుమారు 100 నుంచి 120 కాస్ట్యూమ్స్ చేశాం. ఇంకా అమితాబ్గారు, నయనతార, తమన్నా కూడా ఉన్నారు. సుదీప్, సేతుపతి, జగపతిబాబు, రవికిషన్లకు ఉత్తరా మీనన్ డిజైన్ చేశారు. ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్లే సుమారు 50 మందికి పైగా ఉన్నారు. సాధారణంగా కాస్ట్యూమ్స్ సూట్కేసుల్లో తీసుకెళ్తాం. ఈ సినిమా కాస్ట్యూమ్స్ మాత్రం పెద్ద పెద్ద ట్రంకు పెట్టెల్లో డీసీఎం వ్యానులో తీసుకెళ్లేవాళ్లం. కొన్ని కాస్ట్యూమ్స్ని మడతపెట్టకూడదు. అలాగే హ్యాంగర్కి తగిలించి, జాగ్రత్తగా లొకేషన్కి తీసుకెళ్లేవాళ్లం. నాన్నగారి లుక్ చూసి మీ అమ్మగారు ఏమన్నారు? నాన్నగారి తలకట్టు, మీసం అయితే అమ్మకు చాలా నచ్చింది. అమ్మకి ఇది స్పెషల్ సినిమా. ఎందుకంటే నాన్న, నేను, చరణ్, ఈ కంపెనీ సీఈఓ మా పెద్దమ్మ వాళ్ల అమ్మాయి విద్య.. ఇలా అందరం ఈ సినిమాకి పని చేశాం. నేను అనుకున్న విధంగా నగలు ఎవరు డిజైన్ చేస్తారనే సందిగ్ధ సమయంలో మా అమ్మ సురేఖ ‘మంగత్రాయ్’ను సంప్రదించమని చెప్పారు. వెంటనే ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ గుప్తాను కలిశా. నేను గీసిన కొన్ని డిజైన్స్ ఇచ్చా. నేను అనుకున్నట్లు నగలు డిజైన్ చేశారు. చిరంజీవిగారి కమ్బ్యాక్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ ఒప్పుకున్నాక ఆయనేమో ఆ షూటింగ్కి చరణ్ ‘రంగస్థలం’ షూటింగ్కి వెళుతుంటే ఆవిడ చాలా హ్యాపీగా ఫీలయ్యారట.. అవును. ‘ఖైదీ నంబర్ 150’ పూర్తవ్వక ముందే రంగస్థలం మొదలైంది. నాన్న, చరణ్, నేను రెడీ అయి వెళుతుంటే అమ్మకి స్పెషల్ మూమెంట్లా అనిపించేది. ‘రంగస్థలం’ పూర్తవ్వకముందే ‘సైరా’ స్టార్ట్ అయింది. ఈసారి మేం ముగ్గురం ఒకే సినిమాకి అంటే ఆవిడకి చాలా ఆనందం అనిపించింది. ఖైదీ నంబర్ 150’ కమర్షియల్ ఫార్మట్. ‘రంగస్థలం’ మీకు అలవాటు లేని డిఫరెంట్ బ్యాక్డ్రాప్. అదో చాలెంజ్ అయితే ‘సైరా’ హిస్టారికల్. ఈ సినిమాలో మీరెలా భాగమయ్యారు? చిరంజీవిగారి పర్సనల్ స్టయిలింగ్, బాడీ లాంగ్వేజ్ తెలిసి ఉన్న కాస్ట్యూమ్ డిజైనర్ అయితే బెస్ట్ అనుకున్నారు. డాడీ పర్సనల్ స్టయిలింగ్ డిపార్ట్మెంట్లో నేనెప్పుడూ ఉంటాను. ‘సైరా’ సినిమాకు అంజు మోడీ అనే డిజైనర్ని తీసుకున్నారు. సినిమాకు కావాల్సిన మూడ్, కలర్ పాలెట్ అంతా ఆమె డిజైన్ చేశారు. ఆ తర్వాత ఆమెకు వేరే కమిట్మెంట్స్ ఉండటంతో కంటిన్యూ చేయలేకపోయారు. అప్పుడు నరసింహారెడ్డి పాత్రకు సంబంధించిన డిజైనింగ్ తీసుకోవాల్సి వచ్చింది. నేను కొన్ని డిజైన్ చేశాను. ‘మిగతా లీడ్ రోల్స్కి (నయనతార, సుదీప్, తమన్నా, అనుష్క) కూడా నువ్వెందుకు చేయకూడదు?’ అని చరణ్ అడిగాడు. సాధారణంగా పెద్ద స్టార్స్ అందరికీ పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్స్ ఉంటారు. ఈ సినిమాలో కొన్ని లీడ్ పాత్రలన్నీ ఒకే సింక్లో ఉండాలి. వేరు వేరు డిజైనర్స్ని ఒక చోటుకి రప్పించి అందరితో ఒకలాంటి స్టయిల్లో చేయించడం ప్రాక్టికల్గా కుదరదు. ‘నీకు స్టోరీ మొత్తం తెలుసు. కథకు ఏం కావాలో తెలుసు. వాళ్లకి కూడా నువ్వే డిజైన్ చేయి’ అన్నాడు చరణ్. వాళ్లందరూ పెద్ద పెద్ద స్టార్స్. దాంతో నాకు చిన్నపాటి ప్రెషర్ అనిపించింది. కొన్ని డిస్కషన్స్ తర్వాత చేయగలననిపించింది. కంటిన్యూస్గా దాదాపు మూడు సమ్మర్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లున్నాయి.. (నవ్వుతూ). ‘రంగస్థలం’ షూటింగ్ని రాజమండ్రిలో మంచి ఎండల్లో చేశాం. దాదాపు అందరం ట్యాన్ అయిపోయాం. కొందరైతే కళ్లు తిరిగి కూడా పడిపోయారు. అలా ఒక సమ్మర్ మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. ‘సైరా’కి వచ్చేసరికి రెండు సమ్మర్లు చూశాం. ఫుల్గా ఎండలోనే షూటింగ్ చేశాం. ఫ్యాబ్రిక్లో ఎక్కువ ఖాదీ, కాటన్, ఖాదీ సిల్క్ ఉపయోగించాం. ఖాదీ స్క్రీన్ మీద బాగా కనిపిస్తుంది. కంటికి సరిగ్గా అర్థం కాకపోయినా స్క్రీన్ మీద అర్థం అవుతుంది. సరిగ్గా చేయకపోతే ఈజీగా దొరికిపోతాం. చాలా జాగ్రత్తగా చేనేత ఫ్యాబ్రిక్స్ వాడాం. ఇది హిస్టారికల్ సినిమా కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకూ సెట్లోనే ఉండాల్సి వచ్చింది. కష్టమే అయినా ఇలాంటి సినిమాలు చేసినప్పుడు సంతృప్తి ఉంటుంది. నరసింహారెడ్డిగారికి సంబంధించి మనకు అందుబాటులో ఉన్న సమాచారం చాలా తక్కువ కదా... చారిత్రాత్మకంగా కరెక్ట్గా ఉంటూ, కమర్షియల్ మీటర్ను ఆర్టిస్టిక్గా ఎలా బ్యాలన్స్ చేశారు? పరిశోధన బాగా చేశాం. నరసింహారెడ్డిగారి మీద ఎక్కువ సమాచారాన్ని ఎవరూ పేపర్ మీద పెట్టలేదు. కొన్నే ఉన్నాయి. మేం చేసిందేంటంటే.. 1800 కాలంలో ప్రజలు ఎలాంటి బట్టలు వేసుకునేవారు? ఎలాంటి రంగులు వాడేవారు? స్త్రీల చీరకట్టు ఎలా ఉండేది? మగవాళ్ల పంచెకట్టు ఏంటి అనే విషయాలను తీసుకొని డిజైన్ చేశాం. స్వాతం త్య్రోద్యమ సమయంలో నాటి ఉద్యమకారుల్ని ఉహించుకుని నరసింహారెడ్డి ఇలా ఉంటారనే విధంగా 400కి పైగా స్కెచ్లు వేసుకున్నా. ఫైనల్గా 40 స్కెచ్లు ఎంపిక చేసుకుని ఆ లుక్ వచ్చేలా శ్రమించా. కమర్షియల్గానూ ఉండాలి. లేదంటే డాక్యుమెంటరీ ఫీలింగ్ వస్తుంది. అక్కడ నా అనుభవం ఉపయోగపడిందని నేను గర్వంగా చెప్పగలను. స్క్రీన్ మీద ఏది బాగా కనిపిస్తుంది, ఏది ఎబ్బెట్టుగా ఉంటుందో నాకు ఐడియా ఉంది. ప్రతి లుక్కి ఓ బ్యాకప్ పెట్టుకున్నాను. ఒక షెడ్యూల్లో ఐదు డ్రెస్ చేంజ్లు ఉంటే, ఒకటికి మూడు పెట్టుకునేదాన్ని. చరణ్ మిమ్మల్ని నమ్మి ఈ పని అప్పగించారు.. అయితే ప్రాక్టికల్గా పని మొదలుపెట్టాకే మనమీద మనకు పూర్తి నమ్మకం కలుగుతుంది కదా... ఆ నమ్మకం మీకెప్పుడు కలిగింది? ఫస్ట్ షెడ్యూల్లో రెండు మూడు సీన్లు చేసేటప్పటికే నేను క్యారెక్టర్ని అర్థం చేసుకుంటున్నానని తెలిసిపోయింది. బాగా చేయగలం అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అయితే అందరికీ ఎలా వస్తుందా అనే డౌట్ ఉండేది. రషెస్ చూశాక నమ్మకం కలిగింది. కాస్ట్యూమ్స్ మెటీరియల్ ఎక్కడి నుంచి తెప్పించారు? ఇందులో వాడినవన్నీ ఎక్కువ మన దేశంలోనివే. అమితాబ్గారికి వాడినవాటిలో కొన్నింటిని ఢిల్లీ నుంచి తెప్పించాం. లేడీస్కి మంగళగిరి, వెంకటగిరి, ధర్మవరం చీరలు వాడాము. పాత్రల కాస్ట్యూమ్స్ చూస్తే షాప్లో నుంచి తీసుకొచ్చి వేసుకున్నట్టు ఉండదు. ఆ పాత్రలు ఎప్పుడూ కట్టుకునే బట్టల్లానే ఉంటాయి. కాస్ట్యూమ్ ఆథెంటిసిటీ ఈ సినిమాలో వందశాతం ఉంటుంది. కాస్ట్యూమ్ డిజైనర్గా ఎంత సంతృప్తికరంగా ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నాను. అందరం మనస్ఫూర్తిగా కష్టపడి చేసిన సినిమా ఇది. చారిత్రాత్మక సినిమాలు చేసేటప్పుడు రంగుల్లో కొన్ని పరిమితులు ఉంటాయి కదా? అవును. ఇది వార్ సినిమా కాబట్టి ఒక బ్రౌన్ కలర్ టోన్ ఉంటుంది. అందుకోసం కొన్ని కలర్స్ వాడకూడదు. ఈ సినిమాలో ప్రాథమిక రంగులేవీ వాడలేదు. (రెడ్, బ్లూ, ఎల్లో) ఏవీ వాడలేదు. అవి స్క్రీన్ మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. కాస్ట్యూమ్స్ ఎప్పుడూ కథలో కలసిపోవాలని నేను నమ్ముతాను. ఈ రంగులు మామూలుæ కమర్షియల్ సినిమాలకైతే ఫర్వాలేదు. ఇలాంటి సినిమాలకు వాడితే కథలో నుంచి బయటకు వచ్చిన ఫీలింగ్ కలిగిస్తాయి. ఆ పాత్ర ఎలాంటి మూడ్లో ఉన్నారో కూడా కాస్ట్యూమ్స్ ద్వారా తెలియజేయాలి. కాస్ట్యూమ్స్ అంటే కెమెరా, దర్శకుడు, ఆర్ట్ డిపార్ట్మెంట్తో సమన్వయం ఉండాలి. ఈగోలు ఉండటం సహజం. వాటిని ఎలా పరిష్కరించుకుంటారు? డైరెక్టర్, ఆర్ట్డైరెక్టర్, కెమెరామేన్, కాస్ట్యూమ్స్ ఈ నాలుగింటినీ క్రియేటివ్ డిపార్ట్మెంట్ అంటారు. క్రియేటివ్ డిపార్ట్మెంట్ కలసి పని చేయాలి. నేను అందరితో సింక్లో ఉండి చేయాలనుకుంటాను. క్రియేటివ్ డిపార్ట్మెంట్లో ఈగోలు కామన్. చరణ్ నన్ను అక్కగా ఈ సినిమా చేయమనలేదు. ఒక నిర్మాతగా నన్ను డిజైనర్గా ఈ సినిమాలో భాగమవ్వమన్నాడు. హోమ్ వర్క్ బాగా చేస్తాను. అది తనకి తెలుసు. ‘ఖైదీ నంబర్ 150, రంగస్థలం, సైరా’ వరుసగా కెమెరామేన్ రత్నవేలుతో మూడో సినిమా. ఆయన సూచనలు ఉపయోగపడ్డాయి. ఒకవేళ సెట్లో ఎవరితో అయినా అభిప్రాయభేదాలు వస్తే అది ఆ రోజు వరకే. ఎందుకంటే అవి వ్యక్తిగత విభేదాలు కావు. కొన్నిసార్లు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికే టైమ్ పడుతుంది. దర్శకుడు మనసులో ఏముందో అర్థం చేసుకుంటే పని సులువు అవుతుంది. ‘సైరా’ శ్రమతో కూడుకున్న సినిమా అన్నారు. ఎందుకు ఒప్పుకున్నానా అనే సందర్భాలు? అలా అనుకుంటే ఈ ఫీల్డ్లో ఉండలేం. నేను చిరంజీవిగారి కూతుర్ని కదా నేను పని చేయడమేంటి? మనం పని చేయించుకోవచ్చు కదా అని పని చేస్తే మనల్ని చూసి పని చేసేవాళ్లు కూడా పాడైపోతారు. వాళ్లను కూడా చెడగొట్టినవాళ్లం అవుతాం. వాళ్లతో పని చేయించాలంటే నేనూ అలానే పని చేయాలి. రాత్రి ఎంతైనా సరే నేను వాళ్ల వెనకే ఉండాలి. నేనే ఉన్నానంటే వాళ్లు కూడా ఉండాల్సిందే. అలా పని పూర్తి చేసేదాన్ని. పని చేస్తూ, చేయిస్తూ ఉంటేనే పని జరుగుతుంది. ఇద్దరు పిల్లలకు తల్లిగా నేను ఈ పనులన్నీ చేస్తున్నానంటే మీరు కూడా చెయొచ్చు అని మా టీమ్లో అమ్మాయిలకు చెబుతుంటాను. ఇదే కష్టపడే సమయం.. ఉపయోగించుకోవాలని చెబుతుంటాను. మీ ఫ్యామిలీ హీరోలతోనే సినిమాలు చేశారు. బయట వాళ్లతో చేయాలనుకోవడం లేదా? ఇక్కడ ఇన్ని అవకాశాలు దొరికాయి. ఇంతకంటే ఎక్కువ చేయలేం. నాకు 9 ఏళ్ల పాప, 7 ఏళ్ల పాప ఉన్నారు. పనిని, ఇంటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎక్కువ సినిమాలు చేస్తే ఆ బ్యాలెన్స్ ఖచ్చితంగా పోతుంది. ప్రత్యేకంగా ఎవరైనా యాక్టర్కి స్టయిలింగ్ చేయాలనుకుంటున్నారా? అమితాబ్గారితోనే మరో సినిమా చేయాలనుంది. ఆయన చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆయన స్థాయికి నేను చాలా చిన్న డిజైనర్ని. అయినా గౌరవించారు. ‘నువ్వు చిన్నయినా పెద్దయినా నువ్వు ఒక పని చేస్తున్నావు. దానికి గౌరవం ఇస్తాను. నీ పని నీకు బాగా తెలుసు. నువ్వు అనుకున్న కలర్సే తీసుకురా. వేసుకుంటాను’ అని ఆయన అన్నారు. దాంతో సౌకర్యంగా అనిపించేది. ఏదైనా చెప్పినప్పుడు ఓ కొత్త నటుడిలా చాలా శ్రద్ధగా వింటారు. సినిమాలో అమితాబ్గారి క్యారెక్టర్ కీలకమైనది. ఆయనకి 15 నుంచి 18 కాస్ట్యూమ్స్ ఉంటాయి. ‘సైరా’ 1800 కాలం. ఈ సినిమా తర్వాత కొరటాల శివగారి డైరెక్షన్లో మీ నాన్నగారు చేయబోతున్నారు. 1800 నుంచి ఇప్పుడు 2020కి మీరు వర్క్ చేయాలి... యస్. ఇంత వేరియేషన్ అంటే చాలా ఎగై్జటింగ్గా ఉంది. నాకు హీరో పాత్ర వరకూ చెప్పారు. నాన్నగారి పాత్ర కాకుండా కొన్ని ముఖ్యమైన పాత్రలకు కూడా లుక్ డిజైన్ చేయమన్నారు. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమా కోసం మేం ఒక లుక్ని డిజైన్ చేశాం. అదే ఫైనల్ కాదు. ఇంకొన్ని లుక్స్ ఉన్నాయి. మీ వృత్తే కాస్ట్యూమ్ డిజైన్ చేయడం. రోజూ ప్రత్యేకంగా రెడీ అవుతారా? ఒక్కోసారి టైమ్ ఉండదు. దొరికింది వేసుకొని షూటింగ్కి పరుగు పెట్టడమే (నవ్వుతూ). డిజైనర్గా మారడానికి మీ స్పూర్తేంటి? సినిమాయే నా స్ఫూర్తి. చిన్నప్పటి నుంచి సినిమా చూస్తూనే పెరిగాను. గంటలకొద్దీ షూటింగ్లు చూసేదాన్ని. అలా చూస్తూ ఉండిపోగలను. సినిమాకి, ఫ్యాషన్కి కలిపేది కాస్ట్యూమ్స్. అందుకే దీన్ని ఎంచుకున్నాను. 150 సినిమాల్లో ఎన్నో పాత్రల్లో చిరంజీవి కనిపించారు. ఆయన లుక్స్లో మీ ఫేవరెట్ ఏది? ‘కొదమసింహం’. ఆ సినిమాలో కౌబాయ్ లుక్ భలే ఇష్టం. ‘కొండవీటి దొంగ’ కూడా ఇష్టం. ‘చంటబ్బాయి’ సినిమా నా ఫేవరెట్. నిర్మాణ సంస్థ కూడా ఏర్పాటు చేస్తున్నారు? అవును. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో స్టార్ట్ చేశాను. ప్రస్తుతం డిజిటల్ కంటెంట్ ట్రెండ్ నడుస్తోంది. నేను డిజిటల్ కంటెంట్ బాగా చూస్తుంటాను. మా ఆయన ఊరికే కంప్లయింట్ చేస్తుంటారు. ఇప్పుడు ఆయన్నే ఈ బిజినెస్లోకి దించేశాను. ఆయన ఫైనాన్స్ చూసుకుంటారు. కాస్ట్యూమ్ డిజైనర్, ఇద్దరి పిల్లలకు అమ్మగా, ఇప్పుడు నిర్మాతగా ఎలా మ్యానేజ్ చేస్తున్నారు.. ఫ్యామిలీని మిస్సవుతున్న ఫీలింగ్? నేను చెన్నైలో ఉంటాను. ‘సైరా’ కోసం హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. పిల్లల్ని అక్కడ వదిలి నేనిక్కడ పని చేయడం కుదరదు. పిల్లలతో వచ్చాను. మా ఆయన చెన్నై టు హైదరాబాద్ ట్రావెల్ చేశారు. అది హెల్ప్ అయింది. ప్యాకప్ అయిన తర్వాత పిల్లలతో ఉండేదాన్ని. నైట్ షూటింగ్ అప్పుడు వాళ్లు స్కూల్కి వెళ్లే ముందు కనబడేదాన్ని. అలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేశాను. మా అమ్మ, నా భర్త నా పెద్ద సపోర్ట్. పిల్లల్ని చూసుకోవడానికి అమ్మ ఉన్నారు. వర్క్ పరంగా ఇబ్బందిగా ఉంటే మా ఆయన ఉంటారు. మెడిటేషన్ చేయించకుండానే మెడిటేషన్ చేసినట్టు కూల్ చేసేస్తారు. మీరు ఏ పని చేసినా మీ బ్యాక్గ్రౌండ్ తాలూకా ప్రెషర్ కచ్చితంగా ఉంటుంది కదా? మేమెలా పెర్ఫార్మ్ చేస్తాం అనే విషయంలో ఎప్పుడూ ఒక ఒత్తిడి ఉంటుంది. ఈ ప్రెషర్తో పని చేయకూడదు. ఈ ఒత్తిడితో పని చేస్తే ఎక్కడో చోట మిస్ అయిపోతాం. అనుకున్న అవుట్పుట్ ఇవ్వలేం. అందుకే ఇవన్నీ పక్కన పెట్టేస్తాను. మమ్మల్ని అలానే పెంచారు. మీరు అదీ ఇదీ అన్నట్టు పెంచలేదు. అందరిలానే. నేనెప్పుడూ సెలబ్రిటీని అనుకోను. నా సొంతంగా నేనేదైనా సాధించినప్పుడు నేను కూడా సెలబ్రిటీయే అని భావిస్తాను. అప్పటి వరకూ నేను కూడా అందరిలానే వర్కింగ్ మామ్నే. కమర్షియల్, పీరియాడిక్, ఇప్పుడు హిస్టారిక్ సినిమా చేశారు. అన్నింట్లో ఏది ఈజీ.. ఏది టఫ్? ‘సైరా’ చాలా శ్రమతో కూడుకున్న సినిమా. అంత శ్రమ ఉంది కాబట్టి అందులో చాలా చాలెంజ్లు ఉన్నాయి. చాలెంజ్లు ఎదురైనప్పుడు మన పని మీద ఆసక్తి ఇంకా పెరుగుతుంటుంది. షెడ్యూల్స్ ఎంత చాలెంజింగ్గా, క్రేజీగా ఉంటేనే అంత ఆసక్తికరంగా ఉంటుంది. ఇలాంటి సినిమాలు మనకు చాలా నేర్పిస్తాయి. మరి.. రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చారు? (నవ్వుతూ) చరణ్నే అడగండి. ►ఫ్యాషన్ డిజైనర్గా, స్టయిలిస్ట్గా రెండేళ్లుగా ఎంత కష్టపడ్డాననేది ఈ సినిమా ద్వారా నిరూపితం కానుంది. ‘యాజ్ ఏ ఫ్యాన్ ఐ కాంట్ వెయిట్ ఫర్ ద మూవీ’ (ఆనంద బాష్పాలతో). నరసింహారెడ్డి ఎలా ఉంటాడో కూడా తెలియని ప్రపంచానికి ఈ సినిమా ద్వారా స్వయానా నేను నాన్నని డిజైన్ చేసి చూపించబోతున్నా. – గౌతమ్ మల్లాది -
అమితాబ్ చెప్పినా చిరు వినలేదట
మెగాస్టార్ చిరంజీవి స్వతంత్ర్య పోరాట యోధుడిగా చేస్తున్న సైరా చిత్రం అన్ని కార్యక్రమాలకు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్యాన్ఇండియన్ మూవీగా అత్యధిక స్క్రీన్స్పై ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. జాతీయ స్థాయిలో అత్యంత భారీ ఎత్తున విడుదల చేస్తున్న ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టింది చిత్రయూనిట్. ఈ క్రమంలో చిరు ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక చెన్నై, బెంగళూరులోకూడా ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచారు. అయితే ముంబై వెళ్లిన చిరును, అమితాబ్తో కలిపి ఫర్హాన్ అక్తర్ ఓ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఇరువురు పలు ఆసక్తికర సంఘటలను వెల్లడించారు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పినప్పుడు తాను వద్దని వారించినా.. తన మాట వినలేదని అమితాబ్ చెప్పుకొచ్చాడు. అమితాబ్ చెబితే వినలేదు.. వెళ్లాను.. బాధపడ్డానంటూ చిరు బదులిచ్చాడు. ఇదే సలహాను రజనీకాంత్కు కూడా ఇచ్చాను కానీ ఆయన కూడా వినలేదంటూ అమితాబ్ వెల్లడించాడు. బిగ్బీ అమితాబ్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, నయన తార, తమన్నా, జగపతి బాబు లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సైరా ప్రమోషన్స్.. ముంబై వెళ్లిన చిరు
తొలి స్వతంత్ర్య యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. జీవిత చరిత్ర ఆధారంగా సైరా నరసింహారెడ్డి తెరకెక్కింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీని రామ్చరణ్ నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్స్, సాంగ్తో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు. ఈ మూవీ ప్రమోషన్స్ పెంచే కార్యక్రమంలో భాగంగా.. చిరు ముంబైకి వెళ్లారు. ఈ క్రమంలో అమితాబ్, ఫర్హాన్ అక్తర్, చిరంజీవి కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సురేందర్రెడ్డి దర్శకత్వంలో బిగ్ బీ అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతారలాంటి భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ చిత్రం ఈ చిత్రం తెలుగు, తమిళ, మళయాల, కన్నడ హిందీ భాషల్లో అక్టోబర్ 2న విడుదల కానుంది. -
యాదాద్రిలో చిరంజీవి సతీమణి పూజలు
సాక్షి, యాదాద్రి: మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ శుక్రవారం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అక్టోబర్ 2వ తేదీన చిరంజీవి నటించిన ‘సైరా’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో సినిమా పెద్ద హిట్ కావాలని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సురేఖకు...ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. కాగా చిరంజీవి హీరోగా తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా, రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే సినిమా సెన్సార్ కూడా పూర్తయింది. చదవండి: నా జీవితంలో ఇదొక అద్భుతమైన రోజు : చిరంజీవి -
సైరా : మరో ట్రైలర్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లకు సూపర్బ్ రెస్పాన్స్ రావటంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఆ అంచనాలు మరింత పెంచేస్తూ మరో ట్రైలర్ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. యుద్ధ సన్నివేశాలకు సంబంధించిన ఈ ట్రైలర్ అభిమానుల్లో అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లేలా ఉంది. యాక్షన్ సీన్స్లో చిరు లుక్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి. ఈ ట్రైలర్లో చిరుతో పాటు సుధీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు పాత్రలను కూడా ప్రధానం చూపించారు. దాదాపు 250 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తుండగా లేడీ సూపర్ స్టార్ నయనతార చిరుకు జోడిగా నటిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
అమితానందం
బాలీవుడ్ బిగ్ బి, ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్కు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమాలో చిరంజీవి పాత్ర నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ – ‘‘లివింగ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. 1969లో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన అమితాబ్ బచ్చన్ స్వర్ణోత్సవాన్ని పూర్తి చేసుకున్నారు. గడిచిన 50 ఏళ్లలో చరిత్రలో నిలిచిపోయే చిత్రాలే ఎన్నింటిలోనూ అమితాబ్ బచ్చన్ నటించి, మెప్పించారు. యుక్త వయసులో యాంగ్రీ యంగ్మేన్ అనిపించుకున్న అమితాబ్ జీ. ఇప్పుడు వైవిధ్యంతో కూడుకున్న సినిమాల్లో నటిస్తున్నారు. మా అబ్బాయి రామ్చరణ్ నిర్మించిన ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రంలోనూ నా గురువు గోసాయి వెంకన్న పాత్రను ఆయన పోషించడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది’’ అన్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్చరణ్ నిర్మించిన ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రం అక్టోబరు 2న విడుదల కానుంది. -
‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపిన రామ్చరణ్
సాక్షి, హైదరాబాద్ : సైరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అద్భుతంగా ప్రసారం చేసినందుకు గాను చిత్ర నిర్మాత మెగాపవర్ స్టార్ రామ్చరణ్ సాక్షి మీడియాకి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ‘ సాక్షి’ అద్భుత కవరేజీ ఇచ్చిందని ప్రశంసించారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం సైరా. తొలి స్వతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.తాజాగా ఈ మూవీ సెన్సార్కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ను జారీ చేశారు. సురేందర్రెడ్డి దర్శకత్వంలో బిగ్ బీ అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతారలాంటి భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ చిత్రం ఈ చిత్రం తెలుగు, తమిళ, మళయాల, కన్నడ హిందీ భాషల్లో అక్టోబర్ 2న విడుదల కానుంది. -
సెన్సార్ పూర్తి చేసుకున్న సైరా
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం సైరా. తొలి స్వతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఆదివారం ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, రాజమౌళి, వివి వినాయక్, కొరటాల శివ లాంటి ఎంతో మంది ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ను సక్సెస్ చేశారు. ఇక తాజాగా ఈ మూవీ సెన్సార్కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ను జారీ చేశారు. బిగ్ బీ అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతారలాంటి భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మెగాపవర్ స్టార్ రామ్చరణ్ నిర్మించారు. సురేందర్రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, మళయాల, కన్నడ హిందీ భాషల్లో అక్టోబర్ 2న విడుదల కానుంది. Certified U/A! Censor done with no cuts... MEGA RELEASE worldwide on October 2nd. Are you ready to see high octane action unleash on screen? @DirSurender #RamCharan #MegastarChiranjeevi #SyeRaa #SyeRaaOnOct2nd #SyeRaaNarasimhaReddy pic.twitter.com/H2ndK3kQbz — Konidela Pro Company (@KonidelaPro) September 23, 2019 -
అన్నయ్య పక్కన ఆ డైలాగ్ చాలు: పృధ్వీరాజ్
‘సైరా’ చిత్రంలో మాధవయ్యర్ క్యారెక్టర్ చేయడం తన పూర్వజన్మ సుకృతం భావిస్తున్నానని, సినీనటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృధ్వీరాజ్ తెలిపారు. తన సినీ జీవితంలో ఈ క్యారెక్టర్ ఒక్కటి చాలని, ఇంకా సినిమాలు చేయకపోయినా పరవాలేదని ఆయన ఉద్వేగంగా అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన సైరా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పృధ్వీరాజ్ మాట్లాడుతూ.... సినిమా ఇంటర్వెల్ బ్లాక్లో ‘అన్నయ్య’ గొప్పదనం గురించి చెప్పేటప్పుడు మాధవయ్యార్ సునామీలా విరుచుకుపడతాడు. ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు అన్నయ్యకు జీవితాంతం రుణపడి ఉంటా. నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా ఆయన రుణం తీర్చుకోలేను. ఈ సినిమాలో నాది మాధవయ్యర్ పాత్ర. నేను ఢిల్లీ నుంచి వచ్చి అన్నయ్యను కలిసినప్పుడు నాతో అన్నారు... ఈ క్యారెక్టర్ ఎవరికి రాసుంటే వాడే చేస్తాడురా.. డూ ఇట్..డూ యువర్ బెస్ట్ అని అన్నారు. ఆ అవకాశం నన్ను వరించింది. ఆ ఒక్క మాట చాలు నాకు ‘ఐ ఫీల్ దిస్ ఇజ్ ఆస్కార్ అవార్డు ఫర్ మీ. దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ మెగాస్టార్’ . అన్నయ్య పక్కన పవర్ఫుల్ డైలాగ్స్తో ఇంతకన్నా నాకు ఏం కావాలి. ఈ చిత్రం మెగా అభిమానులకు ఫుల్ జోష్. సినిమా అన్ని భాషల్లో సూపర్, డూపర్ హిట్ అవుతుంది. రికార్డులు బద్దలు కొట్టడానికి కొణెదల సింహం వస్తున్నాడు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు సురేందర్ రెడ్డి, పరుచూరి బ్రదర్స్కు నా కృతజ్ఞతలు’ అని తెలిపారు. ఈ వేడుకకు హాజరైన దర్శకుడు కొరటాల శివ...తనకు ఓ క్యారెక్టర్ ఇవ్వాల్సిందేనంటూ పృధ్వీరాజ్ కోరారు. -
‘సైరా నరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
ఆ కోరిక, కల అలాగే ఉండిపోయింది : చిరంజీవి
‘‘సెప్టెంబర్ 22 నా జీవితంలో అద్భుతమైనటువంటి ల్యాండ్ మార్క్. 1978 సెప్టెంబర్ 22న నా మొట్టమొదటి సినిమా ‘ప్రాణం ఖరీదు’ విడుదలైన రోజు. ఓ వైపు టెన్షన్.. మరోవైపు ఎగ్జయిట్మెంట్.. ఇలా రకరకాల అనుభూతులతోటి నేను నేలమీదలేనంటే ఒట్టు. ఇన్నేళ్ల తర్వాత అలాంటి అనుభూతి ఈరోజు భావిస్తున్నానన్నది వాస్తవం. దానికి కారణం ‘సైరా నరసింహారెడ్డి’’ అని చిరంజీవి అన్నారు. చిరంజీవి, నయనతార జంటగా అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, తమన్నా, సుదీప్, విజయ్ సేతుపతి, రవికిషన్ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఏ కథ అయినా అనుకుని అద్భుతంగా అల్లుకుని సెట్స్పైకి తీసుకెళతాం. కానీ, ‘సైరా’ అలాంటిది కాదు. దాదాపుగా ఒకటిన్నర దశాబ్దం నుంచి ఇది నా మదిలో మెదులుతూ ఉంది. దానికంటే 25 ఏళ్లకి ముందు ‘మీరు చేయాల్సిన పాత్రలేమైనా ఉన్నాయా?’ అని అడిగితే ఎప్పుడూ అంటుంటాను. స్వాతంత్య్ర సమరయోధుడి పాత్ర చేయాలి.. ప్రజల్లో శాశ్వితంగా నిలిచిపోయే పాత్ర అవ్వాలి.. నా కెరీర్కి అది బెస్ట్ పాత్ర అవ్వాలి అది భగత్సింగ్’ అంటూ నేను చెప్పుకుంటూ వచ్చేవాణ్ణి. కానీ ఎందుకో భగత్సింగ్ పాత్రని రచయితలు, దర్శకులు, నిర్మాతలు తీసుకురాలేదు.. దాంతో ఆ కోరిక, కల అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత, పుష్కరానికి ముందు పరుచూరి బ్రదర్స్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చెప్పారు. ఆయన గురించి కర్నూలుతో పాటు చుట్టుపక్కన ఉన్న జిల్లాల్లోని కొందరికి తప్ప ఆయన గురించి ఎవరికీ తెలియదు. ఆ టైమ్లో నాకూ పెద్దగా తెలియలేదు. నాకు తెలిసినవారిని అడిగినా మాకూ తెలియదన్నారు. ఆయనకు సంబంధించిన కొన్ని పేజీలు, బుర్ర కథలు, ఒగ్గు కథలున్నాయి తప్ప ఆయన గురించి పెద్దగా ప్రాచుర్యం ఏ ప్రాంతానికీ పాకలేదు. కానీ, కథ విన్నప్పుడు అద్భుతమైన కథ, ఓ గొప్ప యోధుడు అనిపించింది. తెరమరుగైపోయిన, తొలి స్వాతంత్య్ర సమరయోధుడు నరసింహారెడ్డి కథని అందరికీ తెలియజేయాలని సినిమా తీశాం. 1857లో సిపాయుల తిరుగుబాటు వచ్చినప్పుడు మంగళ్పాండే, ఝాన్సీ లక్ష్మీభాయ్ గురించి తెలుసు. ఆ తర్వాత ఆజాద్, భగత్సింగ్, నేతాజీ... ఇలా ఒక్కరేంటి.. మహాత్మాగాంధీ వరకూ ఎంతో మంది యోధులు, త్యాగమూర్తుల గురించి పుస్తకాల్లో చదివి తెలుసుకున్నాం. అయితే మన తెలుగువాడైన నరసింహారెడ్డివంటివారి కథ తెరమరుగైపోకూడదు అని మైండ్లో గట్టిగా ఉండిపోయింది. ఇలాంటి కథ కోసమే కదా ఇన్నాళ్లు ఎదురు చూస్తున్నాను.. మనం సినిమా చేస్తున్నాం అని పరుచూరి బ్రదర్స్కి చెప్పా. అయితే ఈ కథని తెరకెక్కించి న్యాయం చేయాలంటే బడ్జెట్ సమస్య అని మాకందరికీ అనిపించింది. పది–పదిహేనేళ్ల కిత్రం నాపై 30–40 కోట్లతో సినిమాలు తీసే రోజుల్లో ‘సైరా’ సినిమాకి 60–70 కోట్లపైన అవుతుంది. ఏ నిర్మాత ముందుకు రాలేడు.. చేయమని మనం అడగలేం. ఎందుకంటే నష్టపోయే పరిస్థితి. కానీ, చూద్దాం.. చేద్దాం.. రాజీపడలేం అనుకున్నాం. ఏ నిర్మాత ముందుకు రాకపోవడంతో ఆగిపోయింది. కానీ, నా 151వ సినిమాగా ‘సైరా’ చేస్తే ఎలా ఉంటుందన్న మా ఆలోచనకు శ్రీకారం చుట్టింది, ఇన్డైరెక్ట్గా సపోర్ట్ చేసింది దర్శకుడు రాజమౌళి. ఆయన ‘బాహుబలి’ తీసి ఉండకపోతే ఈరోజు ‘సైరా’ వచ్చుండేది కాదు.. మన తెలుగు సినిమాకి భారతదేశమంతా ఓ దారి వేశారాయన. ఇన్ని వందల కోట్లు మనం ఖర్చు పెట్టినా సంపాదించుకోవచ్చు.. నిర్మాతలకి నష్టం లేకుండా చూడొచ్చు అని భరోసా ఇచ్చాడు రాజమౌళి. శభాష్.. హ్యాట్సాఫ్ టు రాజమౌళి. ‘ఇంతఖర్చు పెట్టి రిస్క్ చేయమని ఎవరికైనా ఎందుకు మనం చెప్పాలి.. రాజీ పడకుండా మనమే చేద్దాం’ అని చరణ్ అనడంతో సై అన్నాను. ఈ కథని ఎవరు డైరెక్ట్ చేస్తారంటే.. నాపైన నమ్మకం ఉన్న పరుచూరి వెంకటేశ్వరావుగారు ‘మీరే చేయండి’ అన్నారు. నటిస్తూ దర్శకత్వం చేయడం కష్టం. దర్శకత్వం చేయలేక కాదు. దేన్నో ఓ దాన్ని వదిలేయాలి.. దేన్ని వదిలేయమంటారు? అడిగితే.. నరసింహారెడ్డిగా మిమ్మల్నే ఊహించుకున్నాం.. డైరెక్టర్ని వేరేవారిని పెట్టుకుందాం అన్నారు. సరే ఎవరు? అనుకుంటుంటే ‘ధృవ’ చేసిన అనుభవంతో మన సురేందర్ రెడ్డి అయితే బావుంటుంది అని చరణ్ అన్నాడు. సరే అన్నాను. ఈ విషయం సురేందర్కి చెబితే ఎగిరి గంతేస్తాడని అనుకుంటే ‘నాకు కొంచెం టైమ్ కావాలి సర్’ అన్నాడు. ఆ మాట మమ్మల్ని నిరుత్సాహానికి గురిచేసింది. వారం తర్వాత వచ్చి చేస్తాను సర్ అన్నాడు. కర్నూలుకు వెళ్లి నరసింహారెడ్డిగారి గురించి సమాచారం సేకరించి, మూడు వారాలు గోవాలో ఉండి స్టోరీ రెడీ చేసుకొచ్చాడు. వాస్తవ కథను ఎక్కడా వక్రీకరించకుండా కమర్షియలైజ్ చేసిన తనకు హ్యాట్సాఫ్. ఈ పాత్రలో ఎంతో కష్టం ఉంటుంది. నేనేమో డూప్ని ఒప్పుకోను. నా అభిమానులు అస్సలు ఒప్పుకోరు. ‘సైరా’ లో శారీరకంగా నన్ను ఎంతో హింస పెట్టి యాక్షన్ సీక్వెన్స్ని రాబట్టారు. ఒక్కసారి మేకప్ వేసుకుని, కత్తి చేతబట్టుకుని గుర్రం ఎక్కాక నా వొళ్లు మరచిపోతాను.. నా వయసూ మరచిపోతాను.. నాకు గుర్తొచ్చేది నా భిమానులు మాత్రమే. అక్కడ గుర్తొచ్చేది నా ఇమేజ్ మాత్రమే. 25ఏళ్ల కిత్రం జోష్ ఉండేది. ఆ ఉత్సాహాన్ని ఇచ్చేది ఒకటి ఆ పాత్ర.. రెండోది అభిమానులు. ‘సైరా’వంటి సినిమా చేయడం ఆ భగవంతుడు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం.. మీకు చూపించడం ఎంతో పుణ్యం. ఇండస్ట్రీకి, తెలుగువారికి, ఆ సినిమా చేసిన వారికి గౌరవాన్ని తీసుకొచ్చే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంత గౌరవాన్ని తెచ్చిన సినిమా ‘శంకరాభరణం’. ఆ తర్వాత కొన్ని సినిమాలు గౌరవాన్ని తీసుకొచ్చినా తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఘనత రాజమౌళి ‘బాహుబలి’. మనమంతా తెలుగువాళ్లం అని గర్వంగా చెప్పుకుంటూ కాలర్ ఎగరేసేలా గౌరవాన్ని తీసుకొచ్చింది. ఈరోజు ‘సైరా’ సినిమా కూడా అంత గౌరవాన్ని తెస్తుందనే ప్రగాఢ విశ్వాసం, నమ్మకం నాకుంది. నేను మాట్లాడేది గౌరవాన్ని గురించే.. విజయాన్ని గురించి ఇంకో సినిమాతో పోల్చట్లేదు.. ఇది గమనించాలి. పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ‘సైరా’ సినిమాకి ఎంతో ఉపయోగపడింది. ఈ చిత్రంలో పాటలు, స్టెప్స్ ఉండకపోవచ్చు కానీ, ప్రతి ఒక్క యువతకి కనెక్ట్ అయ్యే సినిమా. ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా ‘సైరా’. మనమందరం భారతీయులుగా గర్వించాలి. ఇలాంటి సినిమాని నిర్మించినందుకు చరణ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.. ఓ కొడుకుగా కాదు.. ఓ నిర్మాతగా. సురేందర్ రెడ్డి అడిగినది ఏదీ కాదనకుండా, ధైర్యంగా ఖర్చుకు వెనకాడకుండా చేశాడు చరణ్. జార్జియాలో 45రోజుల పాటు పతాక సన్నివేశంలో వచ్చే యుద్ధం చేశాం. దానికి 75కోట్లు ఖర్చు అయింది. ‘ఎంత లాభాలు పొందామన్నది కాదు. రామ్చరణ్–సురేందర్ రెడ్డి ఎంత గొప్ప సినిమా తీశారన్నది కావాలి’ అన్నాడు. ఒక్క ఫోన్ చేయగానే నా గురువుపాత్ర చేసేందుకు ఒప్పుకున్న అమితాబ్గారికి కృతజ్ఞతలు. జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా.. ఇలా అందరూ ‘సైరా’ లో భాగమవ్వాలని నటించారు. ఈ సినిమాలో నేను ఇంత గ్లామర్గా ఉన్నానంటే ఆ క్రెడిట్ కెమెరామన్ రత్నవేలుగారిదే. అక్టోబర్ 2న గాంధీగారి 150వ జయంతి. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఆ రోజున సినిమాని విడుదల చేసేందుకు ముందుకు వెళుతున్నామంటే ఇందుకు దోహదం చేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’’అన్నారు. పవన్కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘సైరా’ ప్రీ రిలీజ్ ఫంక్షన్కు ఒక అతిథిగా నన్ను పిలవడం నా అదృష్టం. బయట నా పేరు.. ఇమేజ్.. ఇవన్నీ నాకు తెలియదు కానీ అన్నయ్య దగ్గరకి వచ్చే సరికి నేను ఒక అభిమానిని. ఈ రోజు మీ(అభిమానులు) ముందు ఈ స్థాయిలో ఉండి మాట్లాడటానికి కారణం అన్నయ్య నేర్పించిన పాఠాలే. ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి అన్నయ్య. నేను మద్రాసులో ఉన్నప్పుడు దేశం గర్వించే సినిమాలు అన్నయ్య చేయాలని కోరుకున్నాను. నాకు స్టార్డమ్ వచ్చినా అన్నయ్యతో సినిమా చేయలేకపోయాను. నా ముందు పెరిగిన రామ్చరణ్ స్వార్థం చూసుకోకుండా ఇలాంటి అద్భుతమైన సినిమా తీసినందుకు నా అభినందనలు. కళ అనేది అద్భుతమైనది. అనేక పరిస్థితుల్లో అది రకరకాలుగా ఉద్భవిస్తుంటుంది. భారతదేశం తాలూకు గొప్పదనం చెప్పే సినిమా ఇది. మన దేశం ఇతర దేశాలమీద దాడి చేయలేదు. ప్రపంచ దేశాలవారు మన దేశంపై దాడి చేశారు. మరి.. భారతదేశం అంటే ఏంటి? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి వ్యక్తుల సమూహం భారతదేశం. ఆయన ఎలా ఉండేవారో, ఎలా పోరాటం చేశారో పుస్తకం చదివితే అర్థం చేసుకోవచ్చు. కానీ కొన్ని కోట్ల మంది ఒక అనుభూతిలోకి రావాలి అంటే ఇలాంటి సినిమాలు రావాలి. భగత్సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, మహాత్మాగాంధీ, పటేల్, అంబేద్కర్ వంటి గొప్ప మహనీయుల త్యాగాలను మనం గుర్తు పెట్టుకోవాలి. ఉయ్యాలవాడ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఒక వినోదం కోసం మాత్రమే కాదు. ఇలాంటి ఒక చరిత్రను తెరకె క్కించడానికి చాలా కష్టపడాలి. రక్తాలు ధారపోసి, ప్రాణాలు అర్పించిన ఎందరో స్వాతంత్య్ర సమర యోధుల త్యాగఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తున్న ప్రజాస్వామ్యం. అనుభవానికి నేను చాలా పెద్దపీట వేస్తాను. ఇది ఎప్పుడు నేర్చుకున్నాను అంటే... అన్నయ్య ‘ఖైదీ’ సినిమా విడుదలైన తర్వాత బలమైన స్టార్డమ్ స్టార్ట్ అయినప్పుడు.. ఒక తమ్ముడిగా మా అన్నయ్య పెద్ద హీరో అని అనుకుంటాం కదా. అలా అనుకున్నప్పుడు... ఎన్టీఆర్గారి సినిమారాగానే... ‘విశ్వామిత్ర’ అనుకుంటా... అది అన్ని రికార్డులను బద్దలు కొట్టేసింది. ఆ రోజు నాకు అర్థం అయ్యింది. ఒక వ్యక్తి తాలూకు అనుభవాన్ని ఎప్పుడూ తీసివేయలేం. అలాగే చిరంజీవిగారి అనుభవాన్ని... ఎంతమంది కొత్తవారు వచ్చినా కానీ, ఎంతమంది రికార్డులు బద్దలు కొట్టినా కానీ.. అంటే ఆయన అనుభవాన్ని మనం కొట్టేయలేం. అందుకే నాకు సీనియర్స్ అంటే చాలా గౌరవం. ‘సైరా:నరసింహారెడ్డి’ సినిమాను భారతదేశం గర్వించే చిత్రంగా చేయడం చాలా గర్వంగా ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగారు అంటే చిరంజీవిగారే గుర్తొచ్చారు. సురేందర్ రెడ్డిగారు చాలా బాగా తెరకెక్కించారు. పరుచూరి బ్రదర్స్ ఈ సినిమా కోసం కలలు కన్నారు. నేను నటించకముందు ‘శుభలేఖ’ లో ఒక డైలాగ్కి డబ్బింగ్ చెప్పాను. ఆ తర్వాత మళ్లీ నా గళం ఇచ్చింది ‘సైరా’ చిత్రానికే. మన దేశం కోసం, ప్రజల కోసం తీసిన సినిమా ఇది. అందుకే నా గొంతను గర్వంగా, మనస్ఫూర్తిగా ఇచ్చాను. ‘సైరా’లాంటి సినిమాలో నా భాగస్వామ్యం ఉన్నందుకు సంతోషంగా ఉంది. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళిగారు ఇక్కడి రావడం నిజంగా సంతోషం. ఎవరు ఎన్ని విజయాలు సాధించినా మాకు అసూయ కలగదు. ఇంకా ఆనందపడతాం. ఎందుకంటే పదిమంది బాగుండాలని కోరుకునేవాళ్లం మేము. రాజమౌళిగారు రికార్డులు బద్దలు కొడితే ఆనందంగా ఉంటుంది. సురేందర్రెడ్డిగారు కూడా రికార్డులు బద్దలుకొడితే ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మన సినిమా. మన జాతి. మన భారతజాతి. మన తెలుగుజాతి. మనం ఎక్కడికి వెళ్లినా.. ఇండియా అనేది బ్రిటిష్ వారు పెట్టిన పేరు. భారతదేశం అనేది మనది. భారతీయులుగా మనం గర్వించేలా సినిమా తీసిన సాంకేతిక నిపుణులకు, నటీనటులకు ధన్యవాదాలు’’ అన్నారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఈ వేదికపై చాలా మంది గొప్పవారు ఉన్నారు. ఈ సినిమాలో పనిచేసిన వారు కాకుండా ఈ సినిమాను చూసిన మొట్టమొదటి ప్రేక్షకుడిని నేను. సూపర్హిట్ సినిమా. ఇన్ని రోజులు, ఇంత ఖర్చు పెట్టి తీశారు. సినిమా ఎలా వచ్చిందో అని చాలా భయంతో చూసి, చిరంజీవిగారిని కౌగిలించుకున్నాను. నాకు దుఃఖం వచ్చినంత పని అయ్యింది. ఇంత గొప్ప సినిమా తీసినందుకు చిరంజీవిగారి కన్నా... రామ్చరణ్పై ఓ ఎమోషనల్ ఫీలింగ్ వచ్చింది. చిరంజీవిగారితో ఇన్ని సినిమాలు తీసిన నేను, ఇలాంటి ఓ సినిమా తీయలేకపోయానే అనే ఒక బాధ కలిగింది. రెండో సినిమాతోనే చరణ్ గొప్ప సినిమా తీశాడు’’ అన్నారు. రామ్చరణ్ మాట్లాడుతూ – ‘‘ఈ స్టేజ్పై నేను చెప్పే మాటలు నా లోని భావాలను తెలియజెప్పలేవు. ‘సైరా’ షూట్ చేసిన ప్రతిరోజు టీమ్కి థ్యాంక్స్ చెబుతూనే ఉన్నాను. అందరి సహకారం లేకపోతే నాన్నగారి ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ సాధ్యమయ్యేది కాదు. ఈ సినిమాలో నటించినవారికి, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అన్నారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ–‘‘సైరా’ సినిమా కోసం 215 రోజులు ఓ కుటుంబంలా సాంకేతిక నిపుణలందరూ కష్టపడి పనిచేసినందుకు థ్యాంక్స్. చిరంజీవిగారి డ్రీమ్ ప్రాజెక్ట్ని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు. నాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చి సపోర్ట్గా ఉంటూ ఫ్రీడమ్ ఇచ్చి ముందుకు నడిపించిన రామ్చరణ్గారికి థ్యాంక్స్’’ అన్నారు. డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ – ‘‘సైరా’ షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడు రామ్చరణ్గారు కొన్ని రషెష్ చూపించారు. సినిమా అండర్ ప్రొడక్షన్లో ఉండగానే అంత పాజిటివ్, అంత బ్లాక్బస్టర్ టాక్ ఈ ఒక్క సినిమాకే సాధ్యం. ఇలాంటి గొప్ప కావ్యమైన సినిమా తీసినందుకు సురేందర్రెడ్డిగారికి ఇది గొప్ప అవకాశం.. అదృష్టం. జనరల్గా తండ్రి నిర్మాత అయితే కొడుకు నటిస్తాడు.. ఇక్కడ మాత్రం కొడుకు నిర్మాత అయితే తండ్రి నటించడం చూడ్డానికే చాలా ఆనందంగా ఉంది. ‘సైరా’ సినిమా నిజంగా చాలా సంచలనం అవుతుంది’’ అన్నారు. ‘‘నా తొలి తెలుగు సినిమా చిరంజీవిసర్తో చేయడం సంతోషంగా ఉంది. రామ్చరణ్, సురేందర్ రెడ్డి సార్లకు కృతజ్ఞతలు’’ అన్నారు నటుడు విజయ్ సేతుపతి. డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ– ‘‘ఇంతపెద్ద సినిమా, ఇంత చారిత్రాత్మక సినిమా వేడుక ఈ రోజు ఇక్కడ జరుగుతోందంటే మనం గుర్తించుకోవాల్సింది, అభినందించాల్సింది, కృతజ్ఞతలు చెప్పాల్సింది పరుచూరి బ్రదర్స్కి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని ఎన్నేళ్లు వారి గుండెల్లో, మనసుల్లో మోశారో సినిమా రంగంలోని వారందరికీ తెలుసు. బ్రిటీష్వారిపై తొలిసారి పోరాడింది ఓ తెలుగు వీరుడు.. ఇది అందరికీ తెలియాలని వాళ్లు చాలా ఏళ్లు వేచిచూశారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత వాళ్ల కోరికని రామ్చరణ్ తీరుస్తున్నాడు. చరణ్.. ఇది మీ నాన్నగారికి ఇస్తున్న గిఫ్ట్ కాదు.. తెలుగువారందరికీ ఇస్తున్న గిఫ్ట్.. థ్యాంక్యూ. ఇలాంటి సినిమా తీయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ‘బాహుబలి’ లో 2300 వీఎఫ్ఎక్స్ షాట్లు ఉంటే ‘సైరా’ లో 3800 షాట్స్ ఉన్నాయి. అన్ని షాట్స్ మధ్యలో ఎమోషన్స్ని వదలకుండా, మరచిపోకుండా చేశారు. ‘సైరా’ ట్రైలర్ చూడగానే సినిమాపై అందరికీ నమ్మకం వచ్చింది. ‘మగధీర’ స్టోరీ సిట్టింగ్స్లో వారం పాటు చిరంజీవిగారు ఉత్సాహంగా పాల్గొని చాలా సలహాలు ఇచ్చారు. కొన్ని ఇలా చేస్తే బాగుంటుందంటూ నటించి చూపించారు. అప్పుడు నాకు అనిపించింది. ఈ కథలో హీరోగా చరణ్ని ఊహించుకోకుండా ఆయన్నే ఊహించుకుంటున్నాడని నాకు అనిపించింది. ‘మగధీర’ విడుదలయ్యాక చిరంజీవిగారు చెప్పారు.. ‘రాజమౌళిగారు.. నేను ఇన్ని సినిమాలు చేశాను కానీ, ‘మగధీర’ లాంటి సినిమా ఒక్కటి కూడా చేయలేదు’ అన్నారు. ఆ కోరికని ఇప్పుడు చరణ్ తీరుస్తున్నాడు’’ అన్నారు. కథా రచయిత పరుచూరి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ –‘‘సైరా’ మా పదేళ్ల కల. ఈ కథని చాలామందికి చెప్పాం. చిరంజీవిగారు చేస్తాను అన్న తరవాత చాలా ఏళ్లు వెయిట్ చేశాం. న్యాయంగా చిరంజీవిగారి కోసమే చాలా మంది పెద్దవారు వదిలేసిన కథలా నేను భావిస్తుంటాను. నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవిగారు నటించడం మన అదృష్టం. రామ్చరణ్ అత్యద్భుతంగా ఈ సినిమా తీశారు. ఆర్టిస్టుల నుంచి మంచి నటనను రాబట్టుకోగలరు సురేందర్రెడ్డి. ‘సైరా’ చిత్రం సూపర్ హిట్ అవుతుంది’’ అన్నారు. మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ – ‘‘కృష్ణానగర్లో నేను అవకాశాల కోసం తిరుగుతుండేవాణ్ణి. ఓ రోజు అమ్మమ్మ ఫోన్ చేసి ‘అరేయ్.. చిరంజీవిని కలవరా.. ఆయన సినిమాకి ఒక్క డైలాగ్ అయినా రాయరా’ అనేది. ఆయన సినిమాకి మాటలు రాయడం ఏంటమ్మా.. అది జరిగేపనికాదు.. అలాంటి అవకాశాలు రావు.. ఆకాశాన్ని అందుకోమంటున్నావు అది జరిగేపని కాదు ఫోన్ పెట్టేయ్’ అని చెప్పేవాణ్ణి. అలాంటి నేను చిరంజీవిగారికి తొలిసారి ‘ఖైదీ నంబర్ 150’ సినిమాకి, ఇప్పుడు ‘సైరా’ కి మాటలు రాశా. అవకాశం ఇచ్చిన చిరంజీవి, రామ్చరణ్, సురేందర్ రెడ్డిగార్లకు థ్యాంక్స్’’ అన్నారు. డైరెక్టర్ వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమా రారాజు మా అన్నయ్య మెగాస్టార్. ఈ సినిమా సూపర్హిట్ సాధించి చరణ్బాబు కలను, అన్నయ్యగారికి గొప్పగా గుర్తిండిపోయే సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు. కొణిదెల సురేఖ, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, డి.సురేశ్బాబు, డీవీవీ దానయ్య, కిరణ్, హీరోలు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వాకాడ అప్పారావ్, వైవీ ప్రవీణ్ కుమార్, రామ్చరణ్ సతీమణి ఉపాసన, సోదరీమణులు సుశ్మిత, శ్రీజ, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, నటులు జగపతిబాబు, ‘థర్టీ ఇయర్స్’ పృథ్వీ, డైరెక్టర్ మెహర్ రమేశ్, కెమెరామన్ రత్నవేలు తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
నా జీవితంలో ఇదొక అద్భుతమైన రోజు : చిరంజీవి
నా మొట్టమొదటి సినిమా ప్రాణం ఖరీదు సెప్టెంబర్ 22నే విడుదలైందని..అప్పుడు ఎలాంటి ఫీలింగ్ కల్గిందో.. మళ్లీ 41ఏళ్ల తరువాత అప్పటి ఫీలింగే మళ్లీ కలుగుతోంది. దానికి కారణం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అన్నారు. దాదాపు పుష్కర కాలం నుంచి ఈ కథ నా మదిలో మెలుగుతూ ఉండేదంటూ నేటి ప్రీ రిలీజ్ ఈవెంట్ చిరంజీవి మాట్లాడారు. పూర్తి ప్రసంగం కోసం కింది వీడియోను చూడండి. పవన్కళ్యాణ్ మట్లాడుతూ.. ‘ఈ ఈవెంట్కు నన్ను పిలిచింనందు అదృష్టంగా భావిస్తున్నాను.. ఆయనకు మీలా నేనూ ఓ అభిమానినే. ఆ విధంగానే నేను ఇక్కడకు వచ్చాను. అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి చిరంజీవి. మీ అభిమానుం నాకు దక్కిందటే.. ఆయన నేర్పిన పాఠాలే కారణం. ఆయన అప్పుడు ఇచ్చిన ధైర్యం.. నన్ను ఇప్పుడు మీ ముందు నిలబెట్టింది’అంటూ మాట్లాడారు. రాజమౌళి మాట్లాడుతూ.. ఇంత పెద్ద సినిమా వేడుక జరుగుతుందంటే.. పరుచూరి బ్రదర్స్ గారికిథ్యాంక్స్ చెప్పాలి. బ్రిటీష్ వారిపై మొట్టమొదటగా పోరాడింది మన తెలుగు వాడని అందరికీ తెలిసేలా మా హీరో రామ్ చరణ్ చేశాడు. ఇది మీ డాడీకే గిఫ్ట్ కాదు.. మొత్తం తెలుగు వారికి అందిస్తున్న గిఫ్ట్’అని అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ... ‘అందరికీ నమస్కారం.. వర్షం ఇంత కురుస్తున్నా మీరు ఇలా ఉంటూ.. మెగాస్టార్పై మీకున్నా అభిమానాన్ని చూపిస్తున్నారు.. సమయం లేనందున.. అందరి గురించి చెప్పలేకపోతున్నాను. ఎవరికీ తెలియని ఓ విషయాన్ని చెబుతాను. పవర్స్టార్కూడా తెలియనిది చెబుతాను. నేను సైరాను చూశాను.. నేను మొట్టమొదటి ప్రేక్షకుడిని. సినిమా చూసి కింద పడిపోయాను.. ఈ మూవీ సూపర్హిట్’ అని అన్నారు. . చిత్ర నిర్మాత, హీరో రాంచరణ్ మాట్లాడుతూ.. ‘ఇక్కడకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. సినిమాకు పనిచేసిన అన్ని శాఖల వారికి థ్యాంక్యూ. షూటింగ్ చేసిన ప్రతి రోజు వారందరికీ థ్యాంక్స్ చెబుతూనే ఉన్నాను. వారంతా సహకరించడం వల్లే ఈ సినిమా పూర్తి చేయగలిగాం. ఎక్కువసేపు నాన్నగారిని, బాబాయ్ని వెయిట్ చేయించి మాట్లాడలేను. అందుకే ముగించేస్తున్నాను. అంతేకాకుండా వర్షం వచ్చేలా కూడా ఉంది కాబట్టి మరోసారి అందరికి ధన్యవాదాలు చెబుతూ ముగించేస్తున్నాను’ అని తెలిపాడు. హైదరాబాద్లో సముద్రం లేదని ఎవరు చెప్పారు..? తరలిరాదా తనే వసంతం తనదరికి రాని వనాల కోసం అంటూ రుద్రవీణ పాట పాడాడు మాటల రచయిత సాయి మాధవ్బుర్రా. చిరంజీవి పిలిస్తే.. వసంతాలు కాదు సముద్రాలే తరలివస్తాయన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. మా అమ్మమ్మకు 80లో ఉన్న హీరోలు ఎవరూ తెలీదు. ఒక్క చిరంజీవి తప్పా.. ఆయన పాటను వింటూనే ఉంటుంది. నేను సినిమా ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు చిరంజీవికి మాటలు రాయమని మా అమ్మమ్మ అనేది. ఆకాశాన్ని అందుకోమని అంటే ఎలా అది కుదరని పని అంటూ చెప్పేవాడ్ని కానీ ఆయన సినిమాకు ఇప్పుడు మాటలు రాశాను. ఆయనకు ఒక్క మాట రాసినా చాలు అనుకునే వాడిని.. ఖైదీ నెం.150కు డైలాగ్స్రాయమని పిలిచారు. ఆయన డైలాగ్చెబితే.. ఆయన మాత్రమే చెప్పేలా ఉండాలి.. అందుకే ఓ డైలాగ్రాశానని.. పొగరు నా ఒంట్లో ఉంటది.. హీరోయిజం నా ఇంట్లో ఉంటది అనే మాటలు రాశాను. అది ఆయనకు తప్పా ఇంకెవరికి సెట్ కాదు. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ టెక్నీషియన్ను రామ్ చరణ్ బాగా చూసుకున్నాడు. అతనొక గొప్ప హీరో మాత్రమే కాదు.. గొప్ప ప్రొడ్యూసర్. ఈ సినిమాలో డైలాగ్స్ బాగున్నాయంటే.. నా ఒక్కడి కృషి కాదు.. అది అందరి సమష్టి కృషి. ఈ సినిమా ద్వారా సురేందర్ రెడ్డి ఓ మంచి స్నేహితుడయ్యాడు. ఈ సినిమా తమకు పదేళ్ల కల అని.. కల ఎపపుడు చెదిరపోదని పరుచూరి వెంటేశ్వర్రావు అన్నారు. ఈ కథను చిరంజీవి కోసమే ఎంతోమంది పెద్దొళ్లు వదిలేశారని అనిపిస్తుంది. అందుకే పదేళ్ల తరువాత కూడా చిరు కోసమే ఈ సినిమా ముందుకు కదల్లేదు. ఆయన ఇప్పుడు కూడా ఆలానే కనిపిస్తున్నాడు. తన తండ్రి కోసం రామ్ చరణ్.. ఈ చిత్రాన్ని అద్భుతంగా నిర్మించాడు. తండ్రిని ఎక్కడో కూర్చోబెట్టాలని ఈ చిత్రాన్ని తీశాడు. సినిమాలోని ఓ డైలాగ్ చెప్పి అభిమానులను అలరించారు. తన గురువైన గోసాయి వెంకన్న దగ్గరికి ఉయ్యాల వాడ నరసింహారెడ్డి వెళ్లి.. భార్యాబిడ్డల్నీ వదిలేసి యుద్దానికి వెళ్తున్నా ఆశీర్వందించండి అనే చెప్పే సందర్భంలో వచ్చే ఈ డైలాగ్ను స్టేజ్పై చెప్పాడు. ‘భార్య కోసం యుద్దం చేస్తే పురాణం అవుతుంది.. భూమి కోసం యుద్దం చేస్తే ఇతిహాసం అవుతుంది.. జాతి కోసం యుద్దం చేస్తే చరిత్ర అవుతుంది’ అంటూ అమితాబ్ చెప్పే అద్భుతమైన డైలాగ్ను ఆయన స్టేజ్పైనే చెప్పారు. తన తండ్రి అచ్చం నరసింహారెడ్డిలా కనిపించాలని దగ్గరుండి మరీ సుష్మిత క్యాస్టూమ్స్ను డిజైన్ చేసిందని కొనియాడారు. ఎవరిని ఎంతగా వాడుకోవాలో.. ఎవరి చేత ఎంతగా నటింపజేయాలో సురేందర్ రెడ్డికి బాగా తెలుసంటూ.. ఈ సినిమా హిట్ కాబోతోన్నందుక ముందుగానే అతని కంగ్రాట్స్ చెప్పారు. చిరంజీవి హీరోగా సురేందర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటించారు. ఆల్రెడీ విడుదలైన ఈ సినిమా ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుక ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో మొదలైంది. ఈ వేడుక కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. అభిమానుల మధ్య ‘సైరా’ ప్రీ–రిలీజ్ వేడుక కన్నుల పండవగా జరుగనుంది. రెండు రాష్ట్రాల్లోని మెగా అభిమానులు ఈ వేడుకకు భారీగా హాజరయ్యారు. ముందుగా చిరంజీవి నటించిన హిట్ చిత్రాలలోని పాటలను గాయనీ,గాయకులు ఆలపిస్తూ, అభిమానులను అలరిస్తున్నారు. కాగా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో అక్టోబరు 2న ‘సైరా’ చిత్రం విడుదల కానుంది. సాయంత్రం 6 గంటల నుంచి సాక్షి టీవీలో ప్రత్యక్ష ప్రసారం -
‘సైరా’ డిజటల్, శాటిలైట్ రైట్స్ ఎంతంటే?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్లోనే సరికొత్త రికార్డ్లు సృష్టిస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్కు సంబంధించి రకరకాల వార్తలు టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. తాజాగా సైరా డిజిటల్, శాటిలైట్ రైట్స్కు సంబంధించిన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సైరా డిజిటల్ హక్కులు 40 కోట్లకుపైగా ధర పలికినట్టుగా తెలుస్తోంది. ఇక తెలుగుతో పాటు ఇతర భాషల శాటిలైట్ హక్కులు అన్ని కలిపి 70 కోట్లకు పైగా పలికాయట. అంటే కేవలం డిజిటల్, శాటిలైట్ హక్కుల ద్వారా సైరా 100 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. ఇక థియెట్రికల్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతుండటంతో ఈ సినిమా రిలీజ్కు ముందే నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టడం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చారిత్రక చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై నిర్మిస్తున్నారు. తండ్రి డ్రీమ్ ప్రాజెక్ట్ కావటంతో చరణ్ ఖర్చుకు ఏ మాత్రం వెనకాడుకుండా 200 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ సినిమాను రూపొందించాడు. చిరు సరసన నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, సుధీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, తమన్నా, రవి కిషన్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
ఐ యామ్ వెయిటింగ్: ఆమిర్ ఖాన్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై చిరంజీవి తనయుడు, హీరో రామ్చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలకానుంది. తాజాగా విడుదలైన చిత్ర ట్రైలర్కు దేశ వ్యాప్తంగా విశేష స్పందన వస్తోంది. భారీ యాక్షన్ విజువల్స్లో రూపొందించిన ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలను భారీగా పెంచేస్తోంది. అభిమానుల నుంచే కాకుండా సినీ తారలు కూడా ‘సైరా’ట్రైలర్కు ఫిదా అయ్యారు. (చదవండి: ‘అతనొక యోగి.. అతనొక యోధుడు’) ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి, హీరోలు నాని, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ, సల్మాన్ ఖాన్లు ట్రైలర్ను మెచ్చుకున్నారు. తాజాగా బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కూడా ‘సైరా’ కు ఫ్యాన్ అయ్యాడు. ‘సైరా’ ట్రైలర్ను చూసిన తర్వాత తన అభిప్రాయాన్ని ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘సైరా ట్రైలర్ బాగుంది. ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. నేను చిరంజీవికి పెద్ద అభిమానిని. చిరంజీవి సర్, రామ్ చరణ్ సర్ అండ్ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్’అంటూ ట్వీట్ చేశాడు. ఇక ట్రైలర్లో గంభీరమైన స్వరంతో చిరంజీవి చెప్పిన డైలాగులు మెగా ఫ్యాన్స్ను ఉర్రూతలూగిస్తున్నాయి. మెగాస్టార్ సరసన నయనతార నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, మిల్క్ బ్యూటి తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. -
రికార్డుల వేటలో ‘సైరా: నరసింహారెడ్డి’
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ చారిత్రక ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమా తెలుగు ట్రైలర్ యూట్యూబ్ ట్రెండింగ్లో నంబర్వన్గా నిలిచింది. ఈ సినిమా ట్రైలర్ను బుధవారం సాయంత్రం హైదరాబాద్లో విడుదల చేశారు. 3 నిమిషాల నివిడి ఉన్న ఈ ట్రైలర్ తమ అంచనాలకు తగినట్టుగా ఉండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. గంభీరమైన స్వరంతో చిరంజీవి చెప్పిన డైలాగులు అభిమానులను ఉత్తేజితులను చేస్తున్నాయి. నరసింహారెడ్డి పాత్రలో చిరు ఒదిగిపోయారని ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ట్రైలర్కు మంచి స్పందన వస్తోంది. యూట్యూబ్లో తెలుగు ట్రైలర్ను 24 గంటల్లోపే 5 కోట్ల మందిపైగా వీక్షించారు. 3 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. హిందీలో సుమారు 50 లక్షలు, తమిళంలో దాదాపు 9 లక్షలు, కన్నడంలో 6.7 లక్షలు, మలయాళంలో లక్షకుపైగా వీక్షణలు నమోదయ్యాయి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’లో చిరంజీవి టైటిల్ రోల్ పోషించారు. కోణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై హీరో రామ్చరణ్ ఈ సినిమాను నిర్మించగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, రవికిషన్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది. (చదవండి: ఇలాంటి సినిమాలకు డబ్బులుంటే సరిపోదు) -
‘ఇలాంటి సినిమాలకు డబ్బులుంటే సరిపోదు’
నరసింహారెడ్డిగారి కుటుంబ సభ్యులను కలిశాను. ఒక వ్యక్తి జీవితం వందేళ్ల తర్వాత చరిత్ర అవుతుంది. సుప్రీం కోర్టు ఎప్పుడో తీర్పు ఇచ్చింది. వందేళ్ల తర్వాత ఒక వ్యక్తి జీవితంపై ఎవరైనా సినిమా తీయవచ్చు. ఏ ప్రాబ్లమ్ లేకుండా గౌరవంతో తీయవచ్చు. లేటెస్ట్గా చెప్పాలంటే... మంగళ్పాండే అనే ఒక గ్రేట్ లీడర్ మన ఇండియాలో ఉన్నారు. ఆయన గురించి ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు వందేళ్లు కాదు... 65 ఏళ్లకు సినిమా తీయొచ్చన్నారు. ఒక కుటుంబానికి లేదా కొందరు వ్యక్తులకు నరసింహారెడ్డిగారిని లిమిట్ చేయడం అనేది నాకు అర్థం కావడం లేదు. ఆయన దేశం కోసం పని చేశారు. ఉయ్యాలవాడ కోసం ఉన్నారు. రేపు నేను ఏదైనా చేయాలి అనుకుంటే ఊరి కోసం చేస్తాను. ఆ జనాల కోసం చేస్తాను. ఒక కుటుంబానికి లేదా ఓ నలుగురు వ్యక్తులకు నేను చేయను. అలా చేసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగారి స్థాయిని తగ్గించలేను. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, సుదీప్ వంటి స్టార్లు నటించడానికి సగం చిరంజీవిగారి బలం అయితే.... వీరందరూ వచ్చి ఆయనతో కొంత సమయమైనా స్క్రీన్పై కనిపించాలి అనేది ఒక ఉద్దేశం అయితే ... మహానుభావులు నరసింహారెడ్డిగారి బలమే చిరంజీవిగారిని, వీరందర్నీ సినిమా చేసేలా చేసింది. – రామ్చరణ్ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. చిరంజీవి టైటిల్ రోల్లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్చరణ్ నిర్మించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళ భాషల్లో అక్టోబరు 2న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ను బుధవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రామ్చరణ్, సురేందర్ రెడ్డిలతో పాటు ప్రసాద్ ల్యాబ్స్ అధినేత∙రమేశ్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్చరణ్ మాట్లాడుతూ – ‘‘పదేళ్ల క్రితం నాన్నగారు ఓకే చేసిన సబ్జెక్ట్ ఇది. సరైన సమయంలో సరైన బడ్జెట్.. టెక్నీషియన్స్ ఇలా అన్నీ సహకరించినప్పుడే సినిమా తీయాలనుకున్నాం. దర్శకుడు సురేందర్ రెడ్డిగారు, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్గారు అందరూ చిరంజీవిగారి పాత్ర ఎలా ఉండాలి? ఎలాంటి కాస్ట్యూమ్స్ వాడాలి? అని చర్చించుకుని డిజైన్ చేయించారు. వాటిని నాన్నగారు ఫాలో అయ్యారు. నాన్నగారికి ఈ వయసులో ఆ గెటప్ కుదరడం అదృష్టం. బాబాయ్ (పవన్ కల్యాణ్) వాయిస్ ట్రైలర్లోనే కాదు.. సినిమాలో కూడా ఉంటుంది. సురేందర్ రెడ్డిగారి దర్శకత్వంలో ‘ధృవ’ సినిమాలో హీరోగా నటించిన తర్వాత ‘ఇంటెన్స్ ఫిల్మ్స్’ని కూడా బాగా తీయగలరని అర్థమైంది. ‘సైరా’కి ఆయనే మంచి ఆప్షన్ అనిపించింది. నిర్మాతగా ఉండటం చాలా టఫ్ అనిపించింది. నాన్నగారు, పరుచూరిగారు మొదలుపెట్టిన ఒక థాట్ తెరపైకి రావాలి అంటే అందరూ చాలా రెస్పెక్ట్గా తీయాలి. డబ్బులంటే, దర్శకులు ఉంటే సరిపోదు. ప్యాషన్, క్రమశిక్షణతో తీయాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి. చాలా గౌరవంతో ఈ సినిమా తీశాం. రికార్డ్స్ గురించి ఆలోచించి ఖర్చు పెట్టలేదు. రికార్డులు కాదు.. మాకు తిరిగి డబ్బులు వస్తాయా? రావా? అని కూడా ఆలోచించకుండా ప్యాషనేట్గా చేశా’’ అన్నారు. సురేందర్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకు వస్తుందని ఊహించలేదు. వచ్చాక ఈ సినిమా చేయడానికి పదిహేను రోజులు టైమ్ అడిగాను. చిరంజీవిగారు హీరోగా చేస్తున్న ఇంత భారీ స్కేల్ మూవీ నేను చేయగలనా? అనే విషయం గురించి ఆలోచించుకోవడానికి అంత టైమ్ అడిగాను. నాకప్పుడు ఎదురుగా కనిపించింది చిరంజీవిగారు ఒక్కరే. ఆయన లైఫ్ కనిపించింది. ఆయన ఎంత కష్టపడ్డారు. ఎంత ఎత్తుకు ఎదిగారు అన్నది కనపడింది. అలా ఆయన స్ఫూర్తితో చరణ్గారు నా వెనకాల ఉన్నారన్న ధైర్యంతో ముందుకు వెళ్లడం జరిగింది. మాకు దొరికిన ఆధారాలను బట్టి ఈ సినిమా చేశాం. సినిమా స్టార్ట్ చేసే ముందు నరసింహారెడ్డిగారి గురించి నాకు తక్కువ తెలుసు. ఆరు నెలలు పరిశోధించి, ఆయన గురించి తెలుసుకున్నాను. పుస్తకాలు చదివాను. నేనూ పోచ బ్రహ్మానందరెడ్డిగారు అని ఇప్పుడు నంద్యాల ఎంపీ... ‘రేనాటి సూర్యచంద్రలు’ అనే ట్రస్ట్కు ఆయన అధ్యక్షులు. ఆయన ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను. ఆయన ఒక బుక్ ఇచ్చారు. నరసింహారెడ్డిగారి పేరు మీద ప్రభుత్వం విడుదల చేసిన స్టాంప్ను ఇవ్వడం జరిగింది. నా మిత్రుడు ప్రభాకర్ రెడ్డి ద్వారా చెన్నై నుంచి నరసింహారెడ్డిగారికి సంబంధించిన గెజిట్స్ని తీసుకుని వచ్చి రీసెర్చ్ చేయడం జరిగింది. ఈ సినిమా ముగింపు చరిత్రలో భాగమే. నరసింహారెడ్డి గారు ఏదైతే తన జీవితాన్ని త్యాగం చేశారో అదే విక్టరీ. ఆయన తన మరణంతో బ్రిటిషు వాళ్లపై యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు. ఇది విషాదాంత ముగింపు కాదు. ఈ సినిమాకు అదే విజయం. ఈ సినిమాకున్న ప్లస్ పాయింట్ అదే. ఇది నేను రికార్డ్స్ కోసం చేసిన సినిమానో, ‘బాహుబలి’లాంటి సినిమా చేయాలనో చేయలేదు. చరణ్గారు నాతో ‘‘మా నాన్నకి నేను ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి. ఆయన 150 సినిమాలు చేశారు. ఆ సినిమాలన్నింటిలో ఈ సినిమా నంబర్ వన్గా ఉండాలి. నాన్న పేరు ఈ సినిమా ద్వారా హిస్టరీలో ఉండాలి’ అన్నారు. ఆ ఫీలింగ్తోనే ఈ సినిమా స్టార్ట్ చేశారు. మంచి సంకల్పంతో ఈ సినిమా చేశాం’’ అన్నారు. -
‘సైరా’ ట్రైలర్ విడుదల
-
‘అతనొక యోగి.. అతనొక యోధుడు’
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమర వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్కు రెడీ అవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్తో పాటు మేకింగ్ వీడియో మెగా ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను చిత్ర బృందం కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. ట్రైలర్లోనే యాక్షన్, సెంటిమెంట్, దేశ భక్తి చూపించారు. ‘నరసింహారెడ్డి సామాన్యుడు కాదు అతడు కారణజన్ముడు’ అంటూ మొదలైన ట్రైలర్.. చివరి వరకూ అందరినీ కట్టిపడేసింది. అంతేకాకుండా పలు డైలాగ్లు తెగ ఆకట్టుకుంటున్నాయి. ‘ఈ భూమ్మీద పుట్టింది మేము.. ఈ మట్టిలో కలిసేది మేము. మీకెందుకు కట్టాలిరా శిస్తు’, ‘స్వేచ్చ కోసం ప్రజలు చేస్తున్న తిరుగుబాటు, నా భరతమాత గడ్డ మీద నిల్చొని హెచ్చరిస్తున్నా, నా దేశం వదిలి వెళ్లిపోండి.. లేదా యుద్ధమే’అంటూ చిరంజీవి పలికే డైలాగ్ ట్రైలర్కు హైలెట్గా నిలిచాయి. భారీ యాక్షన్ విజువల్స్లో రూపొందించిన ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలను భారీగా పెంచేస్తోంది. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, సుధీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, రవికిషన్, తమన్నాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిరు డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా కావటంతో రామ్ చరణ్ దగ్గరుండి సినిమా పనులన్ని చూసుకుంటున్నాడు. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. -
పోలీసుల అదుపులో ‘ఉయ్యాలవాడ’ వంశీకులు
బంజారాహిల్స్: తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10 ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలోని కొణిదల ప్రొడక్షన్స్ కార్యాలయం ఎదుట బైఠాయించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబీకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ తాలూకా, ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 5వ తరం వారసులు దొరవారి దస్తగిరిరెడ్డి, లక్ష్మి కుమారి మాట్లాడుతూ గత మే నెలలో స్వామినాయుడు, రాంచరణ్ పీఏ అవినాష్ తమను చిరంజీవి బ్లడ్ బ్యాంక్కు పిలిపించి ఉయ్యాలవాడ వంశీకులు 22 మందికి రూ. 5 కోట్లు ఇప్పిస్తామంటూ అగ్రిమెంట్ చేసి నోటరీ కూడా చేసి ఇచ్చారన్నారు. అయితే ఇప్పటి వరకు న్యాయం చేయలేదన్నారు. గత నెల 16న ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున ఏడు కుటుంబాలకు డబ్బులు ఇస్తామని తేల్చిచెప్పారన్నారు. అయితే ఇప్పటివరకు తమకు న్యాయం చేయకపోవడంతో తాము రాంచరణ్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామన్నారు. ఇటీవల అతడి పీఏ అవినాష్ మీకెలాంటి హక్కులు లేవంటూ చెప్పేశాడని ఆరోపించారు. తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నోటరీ చేసినప్పుడే 15 రోజుల గడువు ఇచ్చారని దానిని పూర్తిగా విస్మరించారన్నారు. -
వేడుక వాయిదా
చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రామ్ చరణ్ నిర్మాత. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, సుదీప్, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రీ–రిలీజ్ వేడుకను బుధవారం నిర్వహించాలనుకున్నారు. ఇప్పుడు ఆదివారానికి వాయిదా వేశారు. భారీ వర్షం పడే సూచనలు కనిపిస్తుండటంతో అటు అభిమానులకు ఇటు వేడుకకు ఇబ్బంది అవుతుందని ఆదివారం నిర్వహించాలని నిశ్చయించుకున్నారని సమాచారం. అయితే ముందుగా ప్రకటించినట్టే ట్రైలర్ను మాత్రం బుధవారం రిలీజ్ చేస్తారని తెలిసింది. -
నయన్ ఎందుకలా చేసింది..?
సౌత్లో సూపర్స్టార్ రేంజ్ను అనుభవిస్తున్న హీరోయిన్ నయనతార. ఓ వైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను చేస్తూనే.. మరోవైపు మాస్ ఎంటర్టైన్ మూవీల్లోనూ నటిస్తోంది. కోలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. అక్కడ పలు ప్రాజెక్ట్లతో బిజీగా ఉండే.. నయన్ తన ప్రియుడు విఘ్నేశ్ శివన్తో అప్పుడప్పుడు బయటకు వెళ్తుంది. తాజాగా విఘ్నేష్ శివన్, నయన్లు కలిసి ఉన్న ఓ పిక్ వైరల్ అవుతోంది. ఈ సెల్ఫీలో విఘ్నేశ్ తన ప్రియురాలిని కూడా బంధించాలని చూస్తున్నా.. నయన్ మాత్రం తన చేతులతో మొహాన్ని దాచేసింది. అయితే సిగ్గుతో అలా చేసిందా?.. కొత్త సినిమా లుక్ను రివీల్ చేయద్దని చేతులు అడ్డు పెట్టావా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం నయనతార సైరా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేపనిలో పడింది యూనిట్. మరి ఈ ప్రమోషన్ ఈవెంట్లకైనా నయన్ వస్తుందో లేదో చూడాలి. -
సైరా : గ్రాఫిక్స్కే భారీగా..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. తండ్రి డ్రీమ్ ప్రాజెక్ట్ కావటంతో ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా దాదాపు 350 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చారిత్రక కథ కావటం, భారీ యుద్ధ సన్నివేశాలు ఉండటంతో విజువల్ ఎఫెక్ట్స్ కోసమే పెద్ద మొత్తం ఖర్చవుతున్నట్టుగా తెలుస్తోంది. కేవలం గ్రాఫిక్స్ కోసమే 45 కోట్లు ఖర్చు చేస్తున్నారట సైరా టీం. 17 దేశాల్లో ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, సుధీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, తమన్నాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ నెల 18న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే రోజు థియెట్రికల్ ట్రైలర్ విడుదల కానుంది. -
‘సైరా’ ట్రైలర్ లాంచ్కు ముహూర్తం ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమర వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్కు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ట్రైలర్ రిలీజ్కు ముహూర్తం ఫిక్స్ చేశారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ను ఈ నెల 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు అభిమానుల సమక్షంలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెగా తనయుడు రామ్చరణ్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, సుధీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, తమన్నాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.