Hafiz Saeed
-
Hafiz Saeed extradition: నేరగాళ్ల అప్పగింతకు ఒప్పందమేదీ?: పాక్
ఇస్లామాబాద్: నేరగాళ్ల అప్పగింతకు భారత్తో తమకు ద్వైపాక్షిక ఒప్పందమేమీ లేదని పాకిస్తాన్ పేర్కొంది. ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ను అప్పగించాల్సిందిగా పాక్ను భారత్ కోరడం తెలిసిందే. ఇందుకవసరమైన అన్ని పత్రాలను కూడా పాక్కు ఇప్పటికే అందజేసినట్టు విదేశాంగ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి వెల్లడించారు. సయీద్ను అప్పగించాలంటూ భారత్ నుంచి అభ్యర్థన అందిందని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ ధ్రువీకరించారు. అయితే హఫీజ్ అప్పగింతకు వీలు కల్పించే ద్వైపాక్షిక ఒప్పందమేదీ ఇరు దేశాల మధ్య లేదన్నారు. -
భారత్ రిక్వెస్ట్కి పాక్ నో!
ఉగ్రవాది హఫీజ్ సయీద్ను అప్పగించాలంటూ భారత్ కోరిందని పాకిస్థాన్ నిర్ధారించింది. ఈ మేరకు పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. అయితే.. హఫీజ్ను అప్పగించేందుకు మాత్రం పొరుగు దేశం పరోక్షంగా నో చెప్పేసింది. ముంబై 26/11 ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్ను అప్పగించాలంటూ భారత్ అభ్యర్థించిందని పాకిస్థాన్ చెప్పింది. పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. మనీలాండరింగ్ కేసులో హఫీజ్ సయీద్ను అప్పగించాలంటూ భారత అధికారుల నుంచి విజ్ఞప్తి వచ్చిందన్నారు. అయితే.. నేరస్థుల అప్పగింతకు సంబంధించి భారత్, పాకిస్థాన్ల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక ఒప్పందాలు లేవన్నారు. మరోవైపు ఢిల్లీ వర్గాలు కూడా ఈ తరహా ఒప్పందం ఇస్లామాబాద్తో లేదని ధృవీకరించాయి. ఇక.. హఫీజ్ సయీద్ను అప్పగించాలని పాకిస్థాన్ కోరడం నిజమేనని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం నిర్ధారించిన విషయం తెలిసిందే. ఒక కేసులో విచారణ కోసం హఫీజ్ సయీద్ను అప్పగించాలని అభ్యర్థించినట్టు చెప్పారు. కాగా హఫీజ్ సయీద్ భారత్లో అనేక కేసులలో వాంటెడ్గా ఉన్నాడు. ఐక్యరాజ్య సమితి నిషేధిత ఉగ్రవాదుల జాబితాలో కూడా అతడి పేరు ఉందన్న విషయం తెలిసిందే. పాక్లో మత పెద్దగా చెలామణి అవుతున్న సయీద్ను 2019లో అక్కడి ఉగ్రవాద వ్యతిరేక కలాపాల న్యాయస్థానం అరెస్ట్ చేసింది. ఆ టైంలో సయీద్ అతని అనుచరులపై ఏకంగా 23 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. ఇక.. కిందటి ఏడాది ఏప్రిల్లో ఉగ్రవాదులకు డబ్బు సాయం అందించిన రెండు కేసులకు సంబంధించి.. యాంటీ-టెర్రరిజం కోర్టు సయీద్కు 33 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2008 నాటి భయానక ముంబై ఉగ్రదాడుల్లో ఆరుగురు అమెరికన్లు సహా 166 మంది మృత్యువాత పడ్డారు. అయితే పాక్లో సయీద్కు లభించే వీఐపీ ట్రీట్మెంట్ చర్చనీయాంశంగా మారింది. సయీద్కు అక్కడి ఆర్మీ సంరక్షణలో ఉండడం, అక్కడ రాజకీయ పార్టీలు సైతం సయీద్ ఉగ్ర కార్యకలాపాలను ఖండించకపోవడం చూస్తున్నదే. ఇక.. సయీద్ కొడుకు తల్హా సయీద్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే పాక్ సార్వత్రిక ఎన్నికల్లో లాహోర్ నుంచి పోటీ చేస్తుండడం గమనార్హం. -
హఫీజ్ సయీద్ను అప్పగించండి
న్యూఢిల్లీ: 26/11 ముంబై దాడుల సూత్రధారి, కరడుగట్టిన ఉగ్రవాది, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం పాకిస్తాన్కు అధికారికంగా విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక వినతిని పాకిస్తాన్ ప్రభుత్వానికి పంపించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సయీద్ను అప్పగించడానికి చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరినట్లు తెలియజేశాయి. భారత్ రూపొందించిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో హఫీజ్ సయీద్ ఉన్నాడు. అతడి తలపై అమెరికా ప్రభుత్వం 10 మిలియన్ డాలర్ల బహుమానం ప్రకటించింది. 2008 నాటి ముంబై దాడులకు వ్యూహ రచన చేసిన హఫీజ్ సయీద్ను విచారించేందుకు భారత ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. అతడిని తమకు అప్పగించాలని భారత్ పదేపదే కోరుతున్నా పాకిస్తాన్ పట్టించుకోవడం లేదు. -
పాక్ ఎన్నికల్లో 26/11 సూత్రధారి స్థాపించిన పార్టీ
ఇస్లామాబాద్: 26/11 సూత్రధారి హఫీజ్ సయీద్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ పాకిస్థాన్ మర్కాజీ ముస్లిం లీగ్ (PMML) పాకిస్థాన్లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనుంది. పార్టీ తమ అభ్యర్థులను ఇప్పటికే ఎంపిక చేసినట్లు సమాచారం. హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ కూడా పోటీలో ఉన్నాడు. నేషనల్ అసెంబ్లీ నియోజకవర్గం NA-127 లాహోర్ నుంచి బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థగా గుర్తించిన లష్కరే తోయిబా (ఎల్ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్. అనేక ఉగ్రవాద ఫైనాన్సింగ్ కేసుల్లో దోషిగా తేలడంతో 2019 నుంచి హఫీజ్ సయీద్ జైలులో ఉన్నాడు. సయీద్పై అమెరికా 10 మిలియన్ డాలర్ల బహుమతిని కూడా ప్రకటించింది. నిషేధిత జమాత్-ఉద్-దవా (JuD)లష్కరే తోయిబా (LeT)కు చెందిన సంస్థ. 2008 నాటి ముంబయి పేలుళ్లకు ఈ సంస్థే బాధ్యత వహిస్తుంది. ఈ సంస్థకు హఫీజ్ సయీద్ నాయకత్వం వహించాడు. పీఎంఎంఎల్ ఎన్నికల గుర్తు కుర్చీ. తమ పార్టీ జాతీయ, ప్రావిన్షియల్ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని పీఎంఎంఎల్ అధ్యక్షుడు ఖలీద్ మసూద్ సింధు ఒక వీడియో సందేశంలో తెలిపారు. అవినీతి కోసం కాకుండా ప్రజలకు సేవ చేయడమే ధ్యేయమని పేర్కొన్నారు. పాకిస్థాన్ను ఇస్లామిక్ సంక్షేమ రాజ్యంగా మార్చాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కాగా.. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్పై ఖలీద్ మసూద్ పోటీ చేయనున్నారు. ఫిబ్రవరి 8న పాకిస్థాన్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇదీ చదవండి: Year End 2023: ప్రపంచాన్ని వణికించిన భూకంపాలు ఇవే..! -
పాక్ టెర్రరిస్టుకు చైనా అండ.. 4 నెలల్లో ఐదోసారి మోకాలడ్డు
వాషింగ్టన్: పాకిస్థాన్కు వంతు పాడే చైనా మరోమారు తన కుటిల బుద్ధిని చూపించింది. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలనే భారత్-అమెరికా ప్రతిపాదను అడ్డుకుంది. పాకిస్థాన్కు చెందిన తల్హా సయీద్ను ఉగ్రవాదిగా గుర్తించాలని భారత్, అమెరికా ప్రతిపాదించగా.. బీజింగ్ హోల్డ్లో పెట్టింది. లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది షాహిద్ మహమూద్ను గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించటాన్ని అడ్డుకున్న కొన్ని గంటల్లోనే మరోమారు చైనా ఈ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్ను ఇటీవలే ఉగ్రవాదిగా గుర్తించింది భారత్. చట్ట వ్యతిరేక చర్యల నియంత్రణ చట్టం 1967 కింద హఫీజ్ సయీద్ను టెర్రరిస్ట్గా ప్రకటించింది. ఈ మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 8న నోటిఫికేషన్ జారీ చేసింది. తల్హా సయీద్.. భారత్లో లష్కరే తోయిబా కోసం నియామకాలు చేపట్టటం, నిధులు సేకరించటం, దాడులకు ప్రణాళికలు రచించటంలో కీలకంగా వ్యవహరించినట్లుపేర్కొంది. ఐక్యరాజ్య సమితిలోని 1267 అల్ఖైదా ఆంక్షల కమిటీలో భారత్, అమెరికా ప్రతిపాదనలకు చైనా అడ్డుకోవటం ఇదేం మొదటిసారి కాదు. గడిచిన నాలుగు నెలల్లోనే చైనా ఓ ఉగ్రవాదికి మద్దతు ఇవ్వటం ఇది ఐదోసారి. ఇటీవలే లష్కరే సభ్యుడు షాహిద్ మహమూద్, సెప్టెంబర్లో సాహిద్ మిర్, జూన్లో జమాత్ ఉద్ దావా లీటర్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ, ఆగస్టులో జైషే మహమ్మద్ చీఫ్ సోదరుడు అబ్దుల్ రావూఫ్ అజార్లకు మద్దతు తెలిపింది. వారిని అంతర్జాతీయ ఉగ్రవాదులగా గుర్తించాలని ప్రతిపాదనకు అడ్డుపడింది. ఇదీ చదవండి: భారత్పై దొంగదెబ్బ తీసిన కమాండర్లకు చైనా ప్రమోషన్.. టాప్ పోస్టులతో సత్కారం! -
ముంబై పేలుళ్ల సూత్రధారికి 32 ఏళ్ల జైలు శిక్ష
లాహోర్: ముంబై పేలుళ్ల సూత్రధారి, నిషేధిత జమాత్ ఉద్ దవా(జేయూడీ) సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్(70)కు ఉగ్రవాద వ్యతిరేక కోర్టు 32 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఉగ్రముఠాలకు ఆర్థిక సాయం అందించిన కేసులో 2019లో ఇతడికి 36 ఏళ్ల జైలు శిక్ష పడగా ప్రస్తుతం లాహోర్లోని కోట్ లఖ్పత్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఉగ్ర సంస్థలకు ఆర్థిక సాయం అందించిన మరో రెండు కేసుల్లో కలిసి 32 ఏళ్లతోపాటు, 3.40 లక్షల పాకిస్తానీ రూపాయల జరిమానా విధిస్తూ తాజాగా గురువారం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలవుతాయని తెలిపింది. 2008లో సంభవించిన ముంబై బాంబు పేలుళ్లకు జేయూడీకి చెందిన లష్కరే తోయిబా సూత్రధారిగా ఉంది. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడిన హఫీజ్పై అమెరికా ప్రభుత్వం కోటి రూపాయల రివార్డు ప్రకటించింది. ఇండియాకు చెందిన ఎన్ఐఏ మోస్టు వాంటెడ్ జాబితాలో ఉన్న హఫీజ్ సయీద్ పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతంలోని సర్గోధాలో 1950 జూన్ 5న జన్మించాడు. తొలుత మత గురువుగా పనిచేశాడు. తర్వాత ఉగ్రబాట పట్టాడు. ఐక్యరాజ్యసమితి కూడా అతడిని ఉగ్రవాదిగా అధికారికంగా గుర్తించింది. -
హఫీజ్ సయీద్కు కఠిన కారాగార శిక్ష
లాహోర్: ముంబై దాడుల్లో మాస్టర్ మైండ్, నిషేధిత జమాత్ –ఉద్–దవా(జుద్) చీఫ్, హఫీజ్ సయీద్కి పాక్లోని లాహోర్లో ఉన్న యాంటీ టెర్రరిస్టు కోర్టు 15 ఏళ్ల 6నెలల జైలు శిక్ష విధించింది. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న నాలుగు నేరాల్లో ఇప్పటికే 70 ఏళ్ళ సయీద్కి 21 ఏళ్ళ శిక్ష పడింది. గురువారం సయీద్ సహా జమాత్–ఉద్–దవా ఉగ్రవాద సంస్థ ఐదుగురు నాయకులకు కోర్టు పదిహేనున్నరేళ్ల జైలు శిక్ష విధించిందని కోర్టు అధికారులు తెలిపారు. సయీద్కి ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక తోడ్పాటునిచ్చి ప్రోత్సహిస్తున్నారన్న ఐదు నేరాల్లో కలిపి మొత్తం 36 ఏళ్ళ జైలు శిక్ష విధించారు. కాగా, 2008లో ముంబై తాజ్ హోటల్లో హఫీజ్ పెంచి పోషించిన ఉగ్రబృందం కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో 166 మంది అమాయకులు మృత్యువాత పడగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మారణకాండలో మొత్తం పది మంది ఉగ్రమూకలు పాల్గొన్నాయి. ఈ కేసుకు సంబంధించి కరడుగట్టిన ఉగ్రవాది కసబ్కు ఇప్పటికే ఉరిశిక్ష అమలైంది. గతంలో ప్రపంచ ఉగ్రవాదిగా హఫీజ్ను ప్రకటించిన ఐక్యరాజ్య సమితి అతడి తల తీసుకు వస్తే 10మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే. -
హఫీజ్ సయీద్కు పదేళ్ల జైలు శిక్ష
ఇస్లామాబాద్: ముంబై 26/11 ఉగ్రదాడి సూత్రధారి, జమాత్-ఉల్-దవా ఉగ్రసంస్థ చీఫ్ హఫీజ్ సయీద్కు పాకిస్తాన్ కోర్టు పదేళ్లపాటు జైలు శిక్ష విధించింది. రెండు ఉగ్రదాడుల్లో దోషిగా తేలడంతో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. ఉగ్ర కార్యకలాపాలకు వ్యతిరేకంగా పనిచేసే లాహోర్ కోర్టు(యాంటీ టెర్రరిజం కోర్టు) హఫీజ్తో పాటు జాఫర్ ఇక్బాల్, యహ్యా ముజాహిద్ లకు పదిన్నరేళ్ల పాటు శిక్ష ఖరారు చేసింది. అతడి తోడల్లుడు అబ్దుల్ రెహమాన్ మక్కికి ఆర్నెళ్ల శిక్ష పడింది. కాగా 2008లో ముంబై తాజ్ హోటల్లో హఫీజ్ పెంచి పోషించిన ఉగ్రబృందం కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో 166 మంది అమాయకులు మృత్యువాత పడగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మారణకాండలో మొత్తం పది మంది ఉగ్రమూకలు పాల్గొన్నాయి. ఈ కేసుకు సంబంధించి కరడుగట్టిన ఉగ్రవాది కసబ్కు ఇప్పటికే ఉరిశిక్ష అమలైంది. గతంలో ప్రపంచ ఉగ్రవాదిగా హఫీజ్ను ప్రకటించిన ఐక్యరాజ్య సమితి అతడి తల తీసుకు వస్తే 10మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే.(చదవండి: చిత్తశుద్ధి లేని చర్య) అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి ఇక ఉగ్రవాద సంస్థలకు ఆర్ధిక సహాయం చేస్తున్న హఫీజ్ను అరెస్టు చేయాలని అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి రావడంతో పాకిస్తాన్ ప్రభుత్వం గత ఏడాది జూలైలో అతడిని అరెస్టు చేసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య హఫీజ్ సయీద్ పాక్లోని కోట్ లాక్పాత్ జైలులో ఉన్నాడు. ప్రపంచ తీవ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేస్తున్న హఫీజ్ పాకిస్తాన్ కేంద్రంగా భారత్లో ఉగ్రదాడులకు పాల్పడుతున్నాడని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ (ఎఫ్ఏటిఎఫ్) పేర్కొంది. అతడిపై చర్యలు తీసుకోవాలని ఎఫ్ఏటిఎఫ్ పాకిస్తాన్పై ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే జమాత్-ఉల్-దవా ప్రతినిధులపై పాకిస్తాన్ ఉగ్ర వ్యతిరేక సంస్థ ఇప్పటి వరకు 41కేసులు నమోదు చేసింది. 4 కేసుల్లో హఫీజ్ సయీద్ దోషిగా తేలగా మిగతావి పాక్లోని పలు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. పాకిస్తాన్లో ఉగ్రవాదులకు స్థావరం లేకుండా చేయాలని భారత్ తన మిత్ర దేశాలతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలను ఎప్పటి నుంచో కోరుతోంది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్థావరం కల్పించడంపై ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా పని చేస్తున్న ఎఫ్ఏటిఎఫ్ కు భారత్ కొన్ని ఆధారాలను అందించింది. గత ఏడాది ఫిబ్రవరిలో జమ్మూ-కశ్మీర్లోని పుల్వామా ప్రాంతంలో సిఆర్పిఎఫ్ జవాన్లపై బాంబు దాడికి పాల్పడిన జైషే-మహ్మద్ ఉగ్రవాద సంస్థకు కొన్ని పాక్ సంస్థలు ఆర్థిక సహాయం చేస్తున్నాయని భారత్ ఆధారాలతో సహా ఎఫ్ఏటిఎఫ్ కు ఫిర్యాదు చేసింది. ఉగ్రవాదులకు మద్దతిస్తుందన్న ఆరోపణల కారణంగా ఎఫ్ఏటిఎఫ్ పాకిస్తాన్ను బ్లాక్లిస్టులో పెట్టింది. దీంతో ప్రంపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఐఎమ్ఎఫ్ వంటి సంస్థలు పాకిస్తాన్కు అప్పు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న పాక్ గత్యంతరం లేక ఉగ్రవాదులపై చర్యలకు ఉపక్రమించింది. -
చిత్తశుద్ధి లేని చర్య
ముంబై మహానగరంపై పన్నెండేళ్లక్రితం జరిగిన ఉగ్రవాద దాడి సూత్రధారి, జమాత్ ఉద్ దవా(జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్కు పాకిస్తాన్ కోర్టు బుధవారం 11 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఇది విని అమెరికా హర్షం వ్యక్తంచేసింది గానీ పాకిస్తాన్ న్యాయస్థానాల తీరుతెన్నులు, అక్కడి పాలకుల ఎత్తుగడలు తెలిసినవారికి ఈ పరిణామం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు ముసుగు సంస్థగా రంగంలోకొచ్చిన జేయూడీ మన దేశంలో 173 మందిని పొట్టనబెట్టుకున్న ముంబై ఉగ్రవాద దాడి కేసులో మాత్రమే కాదు... 12 మంది మరణించిన 2001 పార్లమెంటు దాడి, 209 మంది చనిపోయిన 2006 నాటి ముంబై రైలు పేలుళ్ల కేసు వగైరాల్లో ప్రధాన పాత్ర పోషించింది. ఈ కేసుల్లో హఫీజ్ను అప్పగించాలని మన దేశం డిమాండ్ చేస్తోంది. ముంబై ఉగ్ర దాడికి సంబంధించి నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు కూడా సమర్పించింది. కానీ ఇచ్చిన సాక్ష్యాలు సరిపోవని, మరిన్ని వివరాలు కావాలని పదే పదే అడగటం తప్ప పాక్ చేసిందేమీ లేదు. ముంబై ఉగ్రదాడి జరిగిన ఏడాది తర్వాత అమెరికా పోలీసులకు చిక్కి ప్రస్తుతం అక్కడే జైలుశిక్ష అను భవిస్తున్న పాకిస్తానీ అమెరికన్ డేవిడ్ హెడ్లీ సైతం ఆ దాడిలో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ప్రమేయం, లష్కర్తో దానికున్న సంబంధాలు, హఫీజ్ సయీద్ పోషించిన పాత్ర వగైరాలపై పూస గుచ్చినట్టు చెప్పాడు. అలాంటి హఫీజ్కు ఇప్పుడు ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందించిన కేసులో శిక్ష పడింది. అతగాడి పాపాల చిట్టాతో పోలిస్తే ఈ ఆర్థిక సాయం ఆరోపణ చాలా చిన్నది. అంతర్జాతీయంగా ఒత్తిళ్లు వచ్చినప్పుడు హఫీజ్ను జైలుకు పంపడం, అవి చల్లారగానే అతన్ని విడుదల చేయడం రివాజుగా మారింది. మధ్యమధ్య గృహ నిర్బంధంలో ఉంచడం కూడా సర్వసాధారణం. గత పదేళ్లుగా ఈ తంతు నడుస్తూనేవుంది. 90వ దశకం చివర లష్కరే సంస్థను నిషేధించినప్పుడు అప్పటికి ఉనికిలో లేని జమాత్ ఉద్ దవావల్ ఇర్షాద్ అనే సంస్థ పంచన చేరిన హఫీజ్ 2002లో దాన్ని జేయూడీగా మార్చుకున్నాడు. అది ధార్మిక సంస్థ అని చెప్పుకున్నాడు. దానిద్వారా భారీయెత్తున నిధులు సేకరించడం, ఆ నిధుల్ని ఖర్చుపెట్టి ఉగ్రవాద మూకలను తయారు చేయడం వంటి చర్యలు కొనసాగిస్తున్నా పాకిస్తాన్ ప్రభుత్వాలు కళ్లు మూసుకున్నాయి. జేయూడీకి సైన్యం అండదండలుండటమే ఇందుకు కారణం. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిరుడు అమెరికా పర్యటనలో వుండగా ఇలాంటి ఉగ్ర మూకల గురించి తీవ్రంగానే మాట్లాడారు. అఫ్ఘానిస్తాన్, కశ్మీర్లలో పోరాడిన సాయుధ మిలిటెంట్లు 30,000 నుంచి 40,000 వరకూ పాక్లో ఉన్నారని ప్రకటించారు. పాక్ను గతంలో ఏలినవారంతా ఈ నిజాన్ని దాచి దేశానికి నష్టం కలగ జేశారని ఆరోపించారు. ఈ మాదిరి మిలిటెంట్లపై తాము చర్యలు తీసుకోవడం మొదలుపెట్టామని కూడా చెప్పారు. కానీ అందులో అర్థసత్యమే ఉందని ప్రపంచానికంతకూ తెలుస్తునే వుంది. అందుకు హఫీజ్ సయీద్ ఉదంతమే పెద్ద ఉదాహరణ. నిజంగా తన దేశంలో సాయుధ మిలిటెంట్ల బెడద వుండకూడదనుకుంటే హఫీజ్పైనా, అలాంటి మరికొందరిపైనా పకడ్బందీ సాక్ష్యాలు సేకరించి, వారందరికీ ఎప్పుడో శిక్ష పడేలా చర్యలు తీసుకునేవారు. కానీ ఆ విషయంలో చిత్తశుద్ధి కనబడటం లేదు. ఇప్పుడైనా శిక్ష పడిన సందర్భమేమిటో గమనిస్తే చివరకు ఈ కేసు ఏమవుతుందో సులభంగానే తెలుస్తుంది. జీ–7 దేశాల చొరవతో 1989లో ఏర్పడి, పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాద లావాదేవీల నిఘా సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) ఉగ్రవాదుల కదలికలను, వారి లావాదేవీలను గమనిస్తూ వుంటుంది. ఏ దేశమైనా ఇలాంటి లావాదేవీలను నిరో ధించలేకపోయినా, వాటిని ప్రోత్సహిస్తున్నట్టు అనుమానం కలిగినా, ఉగ్ర సంస్థల నిధుల వ్యవ హారాన్ని దర్యాప్తు చేయడంలో సహకరించకపోయినా అనుమానిత దేశాల జాబితాలో లేదా కుమ్మక్కయిన దేశాల జాబితాలో చేరుస్తుంది. పర్యవసానంగా ప్రపంచ దేశాలనుంచి వాటికి ఆర్థిక సాయం నిలిచిపోతుంది. బ్లాక్ లిస్టులో చేరిన దేశాలపై ఇతరత్రా ఆంక్షలు కూడా విధిస్తారు. ఇరాన్, ఉత్తర కొరియాలపై ఈ వంకనే ఆంక్షలు అమలవుతున్నాయి. ఆ సంస్థ నిరుడు జూన్లో సమావే శమైనప్పుడు పాకిస్తాన్ను తీవ్రంగా హెచ్చరించింది. 2020 ఫిబ్రవరి 20కల్లా చర్య తీసుకోకపోతే చర్యలు తప్పవని తెలిపింది. ఉగ్రవాద సంస్థలను నియంత్రించడంలో సమర్థవంతంగా వ్యవహ రించలేకపోతున్నారని చీవాట్లు పెట్టింది. నిజానికి అప్పట్లోనే కఠిన చర్య తీసుకోవాల్సివున్నా చైనా, టర్కీ, మలేసియా, సౌదీ అరేబియా, గల్ఫ్ సహకార మండలి జోక్యం చేసుకుని ఆ దేశానికి మరికొంత సమయం ఇద్దామని నచ్చజెప్పాయి. మరో మూడురోజుల్లో పారిస్లో ఎఫ్ఏటీఎఫ్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈసారి హఫీజ్పై చర్యకు వెనకాడితే ఎవరూ తనను సమర్థించరన్న భయం పాకిస్తాన్కు వుంది. అలాగే అఫ్ఘానిస్తాన్ ఊబిలో కూరుకుపోయిన అమెరికా సాధ్యమైనంత త్వరగా అక్కణ్ణించి బయటపడాలని చూస్తోంది. పాక్ అండ లేకుంటే అది సాధ్యం కాదు గనుక, ఎఫ్ఏటీఎఫ్ బెడద తప్పించుకోవడానికి వెనువెంటనే ఏదో ఒక చర్య తీసుకోమని అమెరికా సలహా ఇచ్చి వుండొచ్చు కూడా. మొత్తానికి ఇలా స్వీయ ప్రయోజనాలను ఆశించి ఉగ్రవాదంపై భిన్న వైఖరులు తీసుకునే దేశాల వల్లే పాకిస్తాన్ ఇష్టానుసారం వ్యవహరించగలుగుతోంది. ఇది అంతిమంగా ఉగ్రవాదులకు ఊతం ఇస్తోంది. ఎఫ్ఏటీఎఫ్ సమావేశాలు ముగిశాక పాక్లో మరో న్యాయస్థానం హఫీజ్ నిర్దోషి అని తీర్పి చ్చినా ఆశ్చర్యం లేదు. సంస్థల నిషేధం, వ్యక్తుల అరెస్టులు మించి అదనంగా పాక్ ఏం చేస్తున్నదో నిశితంగా గమనించాల్సిన అవసరం... అది అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడేలా చూడాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలకుంది. ముఖ్యంగా ఉగ్రవాదం రాజ్య విధానంగా లేదా దాని ఉపకరణంగా మారకూడదన్న స్పష్టత అందరికీ ఉండాలి. -
ఉగ్రవాది హఫీజ్ సయీద్కు షాక్
ఇస్లామాబాద్ : 2008 ముంబై దాడుల సూత్రదారి, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్కు పాకిస్తాన్లో యాంటీ టెర్రరిజమ్ కోర్టు (ఏటీసీ) షాక్ ఇచ్చింది. ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చారని నిర్థారణ కావడంతో అతడికి పదకొండేళ్ల జైలుశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చినట్టు హాఫీజ్పై నమోదైన రెండు కేసులపై విచారణ చేపట్టిన ఏటీసీ జడ్జి అర్షద్ హుస్సేన్ ఈ మేరకు శిక్షను ఖరారు చేశారు. అలాగే ప్రతి కేసుకు సంబంధించి రూ. 15 వేల జరిమానా విధించింది. అంతర్జాతీయ ఒత్తిడిలకు తలొగ్గే పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో హాఫీజ్ 16 సార్లు అరెస్ట్ అయినప్పటికీ ప్రతిసారి ఎటువంటి శిక్ష పడకుండా విడుదల అవుతూనే ఉన్నాడు. పలు ఉగ్ర కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న హాఫీజ్.. పాక్లో స్వేచ్ఛగా తిరుగుతూ భారత్పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అయితే గతేడాది జూలైలో జమాత్-ఉద్-దవా(జేయూడీ)కి చెందిన 13 మంది కీలక సభ్యులు తాము సేకరించిన ఆర్థిక వనరులను ఉగ్ర సంస్థలకు మళ్లిస్తున్నట్టుగా కేసులు నమోదయ్యాయి. మొత్తం 23 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా.. అందులో 11 కేసుల్లో హాఫీజ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. కాగా, 26/11 ముంబై దాడులకు హఫీజ్ సయీద్ ప్రధాన సూత్రధారి. ఈ దాడుల్లో మొత్తం 166 మంది దుర్మరణం పాలయ్యారు. -
ఉగ్ర సయీద్ దోషే
లాహోర్: ముంబై ఉగ్రదాడుల వ్యూహకర్త, నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దావా అధ్యక్షుడు హఫీజ్ సయీద్ను పాకిస్తాన్ కోర్టు ఒకటి దోషిగా ప్రకటించింది. పంజాబ్ ప్రాంతంలోని పలు నగరాల్లో సయీద్ ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందించారని స్పష్టం చేస్తూ యాంటీ టెర్రరిజమ్ కోర్టు జడ్జి మాలిక్ అర్షద్ భుట్టా తీర్పునిచ్చారు. పంజాబ్ ప్రావిన్స్కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక విభాగం ఈ ఏడాది జూలైలో సయీద్, అతడి అనుచరులపై ఈ కేసు దాఖలు చేసింది. హఫీజ్ సయీద్ను అరెస్ట్ చేసి కోట్ లఖ్పత్ జైల్లో ఉంచింది. పంజాబ్తోపాటు లాహోర్, గుజ్రన్వాలా, ముల్తాన్ నగరాల్లో ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో సయీద్, అతడి అనుచరులు నిధులు సేకరించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. -
ఉగ్ర సయీద్కు ఊరట
లాహోర్: ముంబై ఉగ్ర పేలుళ్ల ప్రధాన సూత్రదారి, నిషేధిత ఉగ్రవాద సంస్థ జేయూడీ (జమాత్–ఉద్–దవా) చీఫ్ హఫీజ్ సయీద్కు లాహోర్లోని యాంటీ టెర్రరిజమ్ కోర్టులో (ఏటీసీ) ఆశ్చర్యకర రీతిలో స్వల్ప ఊరట లభించింది. ఉగ్ర నిరోధక కేసులో హఫీజ్తో పాటు మరో నిందితుడిగా ఉన్న మాలిక్ జాఫర్ ఇక్బాల్ను అధికారులు విచారణకు హాజరుపర్చకపోవడం పట్ల కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇక్బాల్ను కోర్టులో ప్రవేశపెట్టని కారణంగా హఫీజ్పై ఎలాంటి అభియోగాలు నమోదు చేయకుండానే విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి విచారణలో భాగంగా ఈ నెల 11న అతడిపై అభియోగాలు నమోదు చేస్తామని శనివారం తెలిపింది. 11న ఇక్బాల్ను కోర్టు ఎదుట హాజరుపర్చాలని అధికారులను ఆదేశించింది. -
వాళ్లను విచారించి తీరాల్సిందే: అమెరికా
వాషింగ్టన్ : తమ భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులను ఏరివేయాలంటూ అగ్రరాజ్యం అమెరికా పాకిస్తాన్కు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. లష్కర్-ఎ-తొయిబా నాయకుడు హఫీజ్ సయీద్ సహా ఇతర ఉగ్రవాదులను అరెస్టు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని.. అయితే వారందరినీ తప్పక విచారించి తీరాల్సిందేనని పేర్కొంది. తమ దేశ భవిష్యత్తు కోసం ఉగ్రవాదలును ఏరివేస్తామని ప్రకటించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన మాట నిలబెట్టుకోవాలని సూచించింది. ఈ మేరకు అమెరికా దక్షిణ-మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక సహాయక కార్యదర్శి అలైస్ వెల్స్ ట్వీట్ చేశారు. కాగా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్- ఉగ్రవాదులకు డబ్బు చేకూరే మార్గాలను పరిశీలించే సంస్థ) బ్లాక్లిస్టులో ఉన్న దేశాల జాబితాను ప్రకటించనున్న నేపథ్యంలో అమెరికా ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం. ఇక భారత్లో ఉడి, పుల్వామా ఘటనలకు పాల్పడినట్లుగా భావిస్తున్న ఉగ్ర సంస్థలు జైషే మహ్మద్, లష్కర్-ఎ-తొయిబాలను మాత్రమే నిషేధించిన పాకిస్తాన్... తాము విడుదల చేసి నిషేధిత ఉగ్ర సంస్థల సరికొత్త జాబితాలో కొన్నింటిని ‘వాచ్లిస్టు’లో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే తమ జాబితాలో గ్రేలిస్టులో ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదుల పట్ల తన వైఖరి మార్చుకోకపోతే ఇరాన్, ఉత్తర కొరియాలతో పాటు బ్లాక్లిస్టులో చేరుస్తామని ఎఫ్ఏటీఎఫ్ హెచ్చరించింది. అక్టోబరు 2019 నాటికి తమ విధానమేమిటో స్పష్టం చేయాలని పాక్ను కోరింది. ఈ నేపథ్యంలో గురువారం ఎల్టీఈ చీఫ్ సయీద్ సహా ఉగ్ర సంస్థలకు సహాయం చేసే నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పాకిస్తాన్ మీడియా పేర్కొంది. ఇక 2008లో ముంబై పేలుళ్లకు కీలక సూత్రధారిగా భావిస్తున్న హఫీజ్ సయీద్పై అమెరికా ప్రభుత్వం 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్, కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తదితర అంశాల్లో అంతర్జాతీయ సమాజం ముందు భారత్ను దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించిన పాక్ ప్రయత్నాలు బెడిసికొట్టిన విషయం విదితమే. -
హఫీజ్ సయీద్ను దోషిగా నిర్ధారించిన పాక్ కోర్టు
పాకిస్తాన్ : ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్దౌలా (జేయూడీ)చీఫ్ హఫీజ్ సయీద్ను గుజ్రన్వాలాలోని యాంటీ టెర్రరిజమ్ కోర్టు దోషిగా తేల్చింది. ఉగ్రకార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేశాడనే కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్(సీటీడీ) వాదనతో ఏకీభవించింది. తదుపరి ఈ కేసు విచారణ పాక్లోని గుజరాత్ యాంటీ టెర్రరిజం కోర్టులో జరగనుంది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ అమెరికా పర్యటనకు వెళ్లేముందు హఫీజ్ సయీద్ను కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ఉగ్రవాది అయిన హఫీజ్.. ఇదే కేసులో ముందస్తు బెయిల్ పొందేందుకు గుజ్రన్వాలా ప్రాంతం నుంచి లాహోర్కు వెళ్తుండగా జులై 17న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రకార్యకలాపాల వ్యతిరేక కోర్టు ముందు హఫీజ్ను హాజరుపర్చగా ఏడు రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆ తర్వాత కోట్ లక్పత్ జైలుకు తరలించారు. ఇదే జైలులో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అలాగే జేయూడీకి చెందిన 13 మంది అగ్రనేతలపై పంజాబ్ ప్రావిన్స్లోని పలు ప్రాంతాల్లో దాదాపు 23 కేసులు నమోదయ్యాయి. హఫీజ్ సయీద్ అరెస్ట్పై ఆనాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తంచేశారు. హఫీజ్పై అమెరికా ఇప్పటికే దాదాపు రూ.68 కోట్ల రివార్డు ప్రకటించింది. -
గతంలో కూడా అరెస్టయ్యాడు కదా: అమెరికా
వాషింగ్టన్ : ఉగ్రవాది హఫీజ్ సయీద్ విషయంలో పాక్ ఏ మేరకు కఠినంగా వ్యవహరిస్తుందో ఇకపై చూడాల్సి ఉందని వైట్హౌజ్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ముంబై పేలుళ్లు, భారత పార్లమెంట్పై దాడి సూత్రధారి, జమాత్ ఉద్దౌలా (జేయూడీ) హఫీజ్ సయీద్ను పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్కు చెందిన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో హఫీజ్ అరెస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ పరిపాలనా అధికారి మాట్లాడుతూ.. ‘గతంలో ఏం జరిగిందో మనకు తెలుసు. మిలిటరీ గ్రూపులకు పాకిస్తాన్ సైన్యం సహాయం చేస్తుందన్న విషయం బహిరంగ రహస్యమే. ఉగ్రవాదాన్ని అంతం చేసే క్రమంలో ఉగ్ర సంస్థల ఆస్తులు సీజ్ చేసే దిశగా ముందుకు సాగుతున్నామంటూ ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పడం హర్షించదగ్గ విషయం. అయితే ఇప్పుడు హషీజ్ సయీద్ విషయంలో పాక్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే గతంలో అతడు ఏడుసార్లు అరెస్టయ్యాడు. కానీ వెంటనే విడుదలయ్యాడు కూడా. అందుకే అతడి అరెస్టు లష్కర్-ఎ-తొయిబా కార్యకలాపాలను ఏ మేరకు ప్రభావితం చేస్తుందనేది మన ముందున్న ప్రశ్న. తూతూ మంత్రంగా కాకుండా పాక్ నిజంగా ఉగ్రవాదాన్ని రూపుమాపాలని భావిస్తే ఆ దేశంలో శాంతి, సుస్థిరత నెలకొంటాయి’ అని పేర్కొన్నారు. కాగా అంతర్జాతీయ ఉగ్రవాది అయిన హఫీజ్.. ఉగ్రకార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నాడన్న కేసులో ముందస్తు బెయిల్ పొందేందుకు గుజ్రన్వాలా ప్రాంతం నుంచి లాహోర్కు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఇక హఫీజ్పై అమెరికా ఇప్పటికే దాదాపు రూ.68 కోట్ల రివార్డు ప్రకటించింది. హఫీజ్ను ఉగ్రకార్యకలాపాల వ్యతిరేక కోర్టు ముందు హాజరుపర్చగా ఏడు రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఆ తర్వాత కోట్ లక్పత్ జైలుకు తరలించారు. ఇక జేయూడీకి చెందిన 13 మంది అగ్రనేతలపై పంజాబ్ ప్రావిన్స్లోని పలు ప్రాంతాల్లో జూలై 3న దాదాపు 23 కేసులు నమోదయ్యాయి. -
ఉగ్ర సయీద్ అరెస్ట్
లాహోర్: ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్దౌలా (జేయూడీ) హఫీజ్ సయీద్ను పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్కు చెందిన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసింది. త్వరలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో హఫీజ్ అరెస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. అంతర్జాతీయ ఉగ్రవాది అయిన హఫీజ్.. ఉగ్రకార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నాడన్న కేసులో ముందస్తు బెయిల్ పొందేందుకు గుజ్రన్వాలా ప్రాంతం నుంచి లాహోర్కు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. హఫీజ్పై అమెరికా ఇప్పటికే దాదాపు రూ.68 కోట్ల రివార్డు ప్రకటించింది. హఫీజ్ను ఉగ్రకార్యకలాపాల వ్యతిరేక కోర్టు ముందు హాజరుపర్చగా ఏడు రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఆ తర్వాత కోట్ లక్పత్ జైలుకు తరలించారు. ఇదే జైలులో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. జేయూడీకి చెందిన 13 మంది అగ్రనేతలపై పంజాబ్ ప్రావిన్స్లోని పలు ప్రాంతాల్లో జూలై 3న దాదాపు 23 కేసులు నమోదయ్యాయి. ఉగ్రవాది హఫీజ్ సయీద్ అరెస్ట్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తంచేశారు. -
సయీద్ అరెస్టుకు సిద్ధం
లాహోర్/న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్ దవా(జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్, అతని ప్రధాన అనుచరులను త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు పాకిస్తాన్లోని పంజాబ్ పోలీసులు గురువారం వెల్లడించారు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందిస్తున్నారన్న ఆరోపణలపై సయీద్తోపాటు మరో 13 మంది జేయూడీ నేతలపై పాక్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ బుధవారం 23 కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి రోజే హఫీజ్ సయీద్తోపాటు కేసులు నమోదైన 13 మంది నేతలను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు పాక్ పోలీసులు ప్రకటించడం గమనార్హం. సయీద్ను అరెస్టు చేసేందుకు గాను పంజాబ్ పోలీసులు ‘పైస్థాయి’ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలోని ఓ కీలకవ్యక్తి ఒకరు వెల్లడించారు. సయీద్ ప్రస్తుతం లాహోర్ లోని జాహర్ పట్టణంలోని తన ఇంట్లో ఉన్నారని, ప్రభుత్వం నుంచి పచ్చజెండా రాగానే ఏక్షణమైనా పోలీసులు సయీద్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని సదరు వ్యక్తి తెలిపారు. సయీద్ ఈ వారంలోనే అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనీ వివరించారు. ఉగ్రవాదాన్ని అదుపులో పెట్టే విషయమై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) పాక్కు గతంలో పలుమార్లు చివాట్లు పెట్టింది. జూన్లోగా చర్యలు తీసుకోవాలంటూ ఎఫ్ఏటీఎఫ్ గతంలో విధించిన గడువును పాక్ ఉల్లఘించింది. దీంతో గడువును అక్టోబర్ వరకు పొడిగించిన ఎఫ్ఏటీఎఫ్.. ఉగ్రవాదాన్ని అణచివేయాల్సిందేనని పాక్కు తేల్చిచెప్పింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే సయీద్ అరెస్టుకు పాకిస్తాన్ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాద గ్రూపులపై నామమాత్రపు చర్యలు మాత్రమే తీసుకుంటూ అంతర్జాతీయ సమాజాన్ని పాకిస్తాన్ మోసగించడానికి ప్రయత్నిస్తోందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రావీష్ కుమార్ గురువారం మీడియాతో అన్నారు. -
‘ప్రపంచాన్ని వణికించే ఉగ్రవాది అతడు’
ముంబై : ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ను పొగుడుతూ బ్రిడ్జ్ పిల్లర్పై గుర్తు తెలియని దుండగులు రాతలు రాయడం కలకలం రేపింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ విచారణ చేపట్టింది. వివరాలు.. ముంబై అర్బన్లోని బ్రిడ్జి పిల్లర్లపై ఐఎస్ హెడ్ అబూ బాకర్ అల్ బాగ్దాదీ, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ను పొగుడుతూ రాతలు వెలిశాయి. ప్రపంచాన్ని వణికించే ఉగ్రవాది బాగ్దాది అంటూ ఐఎస్ను చీఫ్ను పొగడటంతో పాటు.. పోర్టు, ఎయిర్పోర్టు, పైప్లైన్, ట్రెయిన్ వంటి వివిధ చిత్రాలను గీసిన దుండగులు వాటిని మార్క్ చేశారు. ఈ విషయాన్ని గమనించిన కోప్తా గ్రామ ప్రజలు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ నేపథ్యంలో బ్రిడ్జి వద్దకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని పర్యవేక్షించారు. అనంతరం ఏటీఎస్కు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో అర్బన్ ఏరియా, పోర్టు సమీపంలో భద్రత పటిష్టం చేశారు. బుధవారం రంజాన్ నేపథ్యంలో అల్లర్లు ప్రేరేపించేందుకే దుండగులు ఇటువంటి చర్యలకు పాల్పడ్డారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే బ్రిడ్జికి సమీపంలో మద్యం సీసాలు లభించిన కారణంగా పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే ఆకతాయిలు ఈ పని చేశారా అన్న దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. -
సయీద్కు ఐరాస షాక్
న్యూఢిల్లీ: ముంబై మారణహోమం సూత్రధారి, జమాత్ ఉద్ దవా(జేయూడీ) అధినేత హఫీజ్ సయీద్కు ఐక్యరాజ్యసమితి(ఐరాస) షాక్ ఇచ్చింది. నిషేధిత ఉగ్రవాదుల జాబితా నుంచి సయీద్ పేరును తొలగించేందుకు ఐరాస నిరాకరించింది. ఈ సందర్భంగా సయీద్పై నిషేధం ఎత్తివేతను భారత్, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ వ్యతిరేకించగా, పాక్ మౌనంగా ఉండిపోయింది. కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘సయీద్కు వ్యతిరేకంగా భారత్ బలమైన సాక్ష్యాలను సమర్పించింది. అతని ఉగ్రవాద కార్యకలాపాలపై పూర్తిస్థాయి ఆధారాలను ఐరాసకు అందజేసింది. దీంతో సయీద్పై నిషేధాన్ని కొనసాగిస్తామని ఐక్యరాజ్యసమితి ఆయన న్యాయవాది హైదర్ రసూల్ మిర్జాకు తెలియజేసింది’ అని వెల్లడించారు. లష్కరే తోయిబా సహ–వ్యవస్థాపకుడైన సయీద్ ప్రస్తుతం పాకిస్తాన్లో గృహనిర్బంధంలో కొనసాగుతున్నాడని పేర్కొన్నారు. జేయూడీపై ఐరాస 2008లో నిషేధం విధించిందన్నారు. ఈ కేసులో స్వతంత్ర అంబుడ్స్మెన్గా వ్యవహరిస్తున్న డానియెల్ కిఫ్సెర్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడం ఆలస్యమయిందని తెలిపారు. సయీద్పై నిషేధానికి ఐరాస 1267 ఆంక్షల కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. ఐరాస ఆంక్షల కమిటీ ప్రధానంగా ఆస్తుల జప్తు, ప్రయాణ నిషేధం, ఆయుధాల అమ్మకం నిలిపివేత అనే మూడు అంశాలను పర్యవేక్షిస్తుంది. ఆంక్షల కమిటీ నిబంధనల మేరకు నిషేధిత జాబితాలోని సంస్థలు లేదా వ్యక్తుల ఆస్తులను సభ్యదేశాలు తక్షణం జప్తుచేయాలి. వీరికి ప్రభుత్వాలు ఎలాంటి సహాయసహకారాలు అందించరాదు. -
నిర్బంధంలో అజహర్ కొడుకు, సోదరుడు
ఇస్లామాబాద్: ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెరుగుతున్న వేళ పాకిస్తాన్ కొరడా ఝుళిపించింది. జైషే చీఫ్ మసూద్ అజహర్ కొడుకు, సోదరుడు సహా నిషేధిత సంస్థలకు చెందిన మొత్తం 44 మందిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకుంది. విచారణ నిమిత్తం జైషే చీఫ్ కొడుకు హమద్ అజహర్, సోదరుడు ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నామని పాక్ హోం శాఖ వెల్లడించింది. అరెస్ట్ కాదు..: భారత్ ఈఅరెస్టులపై భారత్ స్పందించింది. వారిని ఉగ్రవాద వ్యతిరేక చట్టాల ప్రకారం అరెస్టు చేయలేదని, వారికి భద్రత కల్పించి కాపాడేందుకేనని భారత భద్రతా దళాధికారి ఒకరు పేర్కొన్నారు. నిషేధిత జాబితాలో జమాతే–ఉద్–దవా ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయిద్ నేతృత్వంలోని జమాత్–ఉద్–దవా, దాని అనుబంధ సంస్థ ఫాలా–ఈ–ఇన్సానియత్ ఫౌండేషన్ను పాక్ నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ రెండు సంస్థలు వాచ్లిస్ట్లోనే ఉన్నాయని భారత మీడియాలో వార్తలు వచ్చిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రభుత్వ సమాచారం ప్రకారం జమాత్, ఫాలాతో కలుపుకుని మొత్తం 70 సంస్థలు నిషేధిత జాబితాలో ఉన్నాయి. జమాతే, ఫాలా సంస్థల ఆస్తుల్ని స్థంభింపజేసినట్లు పాక్ ఇది వరకే ప్రకటించింది. హఫీజ్ సయీద్ను అమెరికా 2012లోనే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి, అతని సమాచారం తెలిపిన వారికి 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. -
ఓటేసిన అంతర్జాతీయ ఉగ్రవాది
లాహోర్, పాకిస్తాన్ : అందరూ చూస్తుండగానే ఓ అంతర్జాతీయ ఉగ్రవాది ఓటేశాడు. బుధవారం పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా లాహోర్లోని ఓ ఓటింగ్ కేంద్రానికి వెళ్లిన 26/11 ముంబై దాడుల సూత్రధారి, లష్కర్-ఈ-తోయిబా(ఎల్ఈటీ), జైష్-ఈ-మొహమ్మద్ ఉగ్ర సంస్థల చీఫ్ హఫీజ్ సయీద్ ఓటు వేశాడు. ముంబై ఉగ్రదాడి వెనుక హఫీజ్ సయీద్ ఉన్నాడని నిర్ధారించిన అమెరికా 2012 అతన్ని పట్టించిన వారికి 10 మిలియన్ డాలర్ల అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో సయీద్ ఓటు వేసేందుకే పరిమితం కాలేదు. అతనికి చెందిన 200 మంది అభ్యర్థులు ఎన్నికల్లో తలపడుతున్నారు. గతేడాది ఆగష్టులో సయీద్ మిల్లీ ముస్లిం లీగ్(ఎమ్ఎమ్ఎల్) పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించడానికి ప్రయత్నించాడు. అయితే, అమెరికాతో పాటు పలు దేశాలు దీన్ని ముక్తకంఠంతో ఖండించాయి. అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్ అతని పార్టీకి గుర్తింపు ఇవ్వలేమని పేర్కొంది. అయినా ఎలాంటి ఒత్తడికి గురవని సయీద్ అతి సునాయాసంగా తన అభ్యర్థులను అల్లా-ఓ-అక్బర్ తెహ్రీక్(ఏఏటీ) ద్వారా బరిలో నిలిపాడు. పాకిస్తాన్ ఎన్నికల్లో పార్లమెంట్లోని 272 స్థానాలకు 3,459 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా.. 4 రాష్ర్టాల అసెంబ్లీలోని 577 స్థానాలకు 8,396 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్, పాకిస్థాన్ ముస్లిం లీగ్కు మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని సర్వేలు వెల్లడించాయి. -
అమెరికా బానిస కొడుకులకు, మోదీ స్నేహితులకు..
‘‘అమెరికా బానిస కొడుకులకు, నరేంద్ర మోదీ స్నేహితులకు ఓటేయాలని నిర్ణయించుకున్నట్టయితే, మీ గొయ్యిని మీరు తవ్వుకున్నట్టే’’ అంటూ ఓటర్లను హెచ్చరిస్తున్నాడు ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్! రాజకీయ ముసుగేసుకుని ఈ నెల 25న జరిగే పాకిస్తాన్ ఎన్నికల బరిలోకి దిగిన ఇతగాడు.. 265 మందిని పోటీకి పెట్టాడు. ‘‘అమెరికా మద్దతు ఉన్న అఫ్గానిస్తాన్లో భారత్ తిష్టేసింది. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ను చీల్చేందుకు ఆ దేశం కుట్ర పన్నుతోంది’’ అంటూ విషప్రచారం సాగిస్తున్నాడు. నిషేధిత/ఉగ్ర గ్రూపుల ప్రతినిధులు పాక్లో భారీగా పోటీకి దిగారు. సైన్యం మద్దతుతో పెట్రేగిపోతున్నారు. భారత్తో శాంతి సంబంధాల గురించి మాట్లాడుతున్న పీఎంఎల్ (ఎన్)ను పక్కకు తప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో సూత్రధారి పాత్రధారీ సైన్యమే. పాకిస్తాన్తోపాటు భారత్కూ అత్యంత అపాయకరమైన ఈ పరిణామాలపై ఓ పరిశీలన. ఔరంగజేబ్ ఫరూకీ.. పాకిస్తాన్లో మతం పేరిట హింసను ప్రేరేపిస్తున్న ఓ నిషేధిత ఉగ్రవాద గ్రూపు నాయకుడు. మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం ద్వారా షియా కార్యకర్తల హత్యలకు కారకుడయ్యాడనే ఆరోపణలున్నాయి. ఈ నెల 25న పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్) ఎన్నికల్లో ఇతడు పోటీ చేస్తున్నాడు. ఇస్లామిక్ టెర్రరిస్టు గ్రూపులతో సంబంధ బాంధవ్యాలున్న అనేక మంది అభ్యర్థుల్లో ఫరూకీ కూడా ఒకడు. మిలిటెంట్లతో ఫరూకీ గ్రూపునకు సంబంధాలున్నాయనే ఆరోపణలు ఉన్నప్పటికీ ఓ కోర్టు అతడి పోటీకి అనుమతించింది. ఫరూఖీ సహా ఎన్నికల్లో పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులు ఉగ్రవాద నిఘా జాబితా (ఉగ్ర నిరోధక చట్టంలోని ఫోర్త్ షెడ్యూల్)లో ఉన్నారు. జనసమూహాల్ని కలిసేందుకు, కొన్ని ప్రాంతాల్లో తిరిగేందుకు, బ్యాంకు అకౌంట్లు వాడేందుకు చట్టం అనుమతించనప్పటికీ వారు ఎన్నికల బరిలో నిలిచారు. 2013 ఎన్నికల్లో కేవలం 202 ఓట్లతో ఓడిపోయిన ఫరూకీ.. ప్రస్తుతం కరాచీలో ఓ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేస్తున్నాడు. అతడు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయనే మాటలు వినబడుతున్నాయి. సైన్యం ప్రమేయంతోనే ఇలాంటి గ్రూపుల ప్రతినిధులు చట్టపరమైన అడ్డంకుల నుంచి బయటపడగలుగుతున్నారని చెబుతున్నారు పరిశీలకులు. వీరు గనుక జాతీయ అసెంబ్లీకి ఎన్నికైతే విధాన నిర్ణయాల్లో సైన్యానికి తోడుగా ఉంటారనడంలో సందేహం లేదు. లష్కరే తొయిబా విభాగమైన జమాత్–ఉద్–దవా (జేయూడీ) చీఫ్, ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్ ‘మిల్లీ ముస్లిం లీగ్’ పార్టీ స్థాపించి తన కొడుకు, అల్లుడితో సహా 265 మంది అభ్యర్థుల్ని బరిలోకి దింపాడు. వీరిలో 80 మంది జాతీయ అసెంబ్లీకి, 185 మంది ప్రొవిన్షియల్ అసెంబ్లీకి పోటీ పడుతున్నారు. ఎన్నికల కమిషన్ తన పార్టీ నమోదుకు నిరాకరించడంతో అల్లాహో అక్బర్ తెహరీక్ (ఏఏటీ) అనే పార్టీ పేరిట హఫీజ్ రంగంలోకి దిగాడు. పాక్ రాజకీయ నాయకుల్ని భారత్–అమెరికాల కీలుబొమ్మలుగా వర్ణిస్తూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడు. ముత్తాహి–ఇ–మజ్లిస్ (ఎంఎంఏ) అనే ఐదు ఛాందస పార్టీల కూటమి కూడా పోటీలో ఉంది. మరోవైపు ఇస్లాంను దూషించే వారిని శిక్షిస్తానంటున్న తెహ్రీక్–ఇ–లబ్బైక్ అనే పార్టీ ఈ నెలలో అధికారిక ఆమోదం దక్కించుకుని పోటీకి దిగింది. 2011లో పంజాబ్ గవర్నర్ను చంపిన ఖాద్రి ఈ గ్రూపునకు చెందిన వాడే. తర్వాతి కాలంలో అతణ్ణి ఉరి తీశారు. పాకిస్తాన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో సైన్యం మద్దతు ఉన్న ఈ జిహాదీ గ్రూపులు కొన్ని సీట్లు గెలుచుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రశ్నార్థకంగా ఎన్నికల చట్టబద్ధత... ఉగ్ర ప్రతినిధులు భారీ సంఖ్యలో పోటీ చేస్తుండటంపై పాక్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మత విద్వేషపూరిత ప్రసంగాలు చేసేందుకు ఈ గ్రూపుల అభ్యర్థుల్ని అనుమతించడం, ప్రచారంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలైన పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్), పీపీపీ, అవామీ వర్కర్స్ పార్టీల అభ్యర్థులపై భద్రతా బలగాలు వేధింపులకు పాల్పడటం, మీడియాపై ఆంక్షలు విధించడం వంటి చర్యల నేపథ్యంలో ఎన్నికల చట్టబద్ధతనే ఆ సంస్థ ప్రశ్నిస్తోంది. నవాజ్ షరీఫ్ పార్టీపై సైనిక నేతల గురి... పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్)ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే ముఖ్య ఎజెండాగా పెట్టుకున్నారు సైనిక నేతలు. విదేశాంగ విధాన సంబంధిత విషయాల్లో ప్రత్యేకించి భారత్ విషయంలో తమతో విభేదించిన ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పట్ల వారు కంటగింపుగా ఉన్నారు. పనామా పత్రాల కుంభకోణాన్ని ఉపయోగించుకుని ఆయన్ను పదవి నుంచి తప్పించగలిగారు. న్యాయవ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని షరీఫ్నూ, ఆయన రాజకీయ వారసురాలైన కుమార్తెను జైలుకు పంపారు. ఎన్నికల్లో పాల్గొనకుండా జీవితకాల నిషేధం విధించారు. ఈ చర్యలన్నీ షరీఫ్ పార్టీని తప్పించాలనే మిలటరీ వ్యూహంలో భాగంగానే చూస్తున్నారు విశ్లేషకులు. సైన్యం మద్దతు పుష్కలంగా ఉన్న ఇమ్రాన్ఖాన్ పార్టీ ‘పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్’ (పీటీఐ)ని గెలిపించేందుకు రంగం సిద్ధమైందనే వార్తలు వస్తున్నాయి. ఈ భారత వ్యతిరేక నేత గతంలో కంటేæ ఇప్పుడు బలం పుంజుకున్నాడు. ఇమ్రాన్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించవచ్చునని లేదంటే స్వల్ప ఆధికత్యతో బయటపడవచ్చునని పరిశీలకులు చెబుతున్నారు. వీరి అంచనా ప్రకారం నవాజ్ పార్టీ రెండో అతిపెద్ద పార్టీ హోదా సంపాదించే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
జైల్లో మాజీ ప్రధాని.. ఎన్నికల ప్రచారంలో ఉగ్రవాది
లాహోర్ : ఉగ్రవాదుల పట్ల పాకిస్తాన్ అవలంభిస్తున్న ధోరణి మరోసారి బట్టబయలయింది. అవినీతి కేసుల్లో ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ను అరెస్ట్ చేశామంటూ గొప్పలు చెప్పుకున్న పాక్, ఉగ్రవాదుల విషయంలో మాత్రం తన వైఖరిని మార్చుకోలేదు. పనామా పత్రాల కేసులో షరీఫ్ను, ఆయన కూతురు మరియమ్ను స్వదేశంలో అడుగుపెట్టగానే పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ముంబై దాడుల ప్రధాన సూత్రధారుడు, కరుడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ విషయంలో మాత్రం పాక్ ఇందుకు భిన్న వైఖరి కనబరుస్తోంది. ఇప్పటికే అతనిపై 10 మిలియన్ డాలర్ల రివార్డుతో పాటు, ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోవడంలేదు. ప్రసుత్తం జమాత్ ఉద్ దవా(జేయూడీ) ఉగ్ర సంస్థకు హఫీజ్ అధినేతగా ఉన్నాడు. మిల్లీ ముస్లిం లీగ్(ఎంఎంఎల్) పార్టీ వ్యవస్థాపకుడిగా ఉన్న హఫీజ్ జూలై 25న జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ తరపున విస్తృత ప్రచారం చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో హఫీజ్ కొడుకు, అల్లుడు, 13 మంది మహిళలతో పాటు జేయూడీ ఉగ్ర సంస్థకు చెందిన 265 మంది సభ్యులు ఎంఎంఎల్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. కాగా తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహిస్తున్న ర్యాల్లీలో హఫీజ్ పాల్గొంటున్నాడు. ఎంఎంఎల్ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో జేయూడీ ఉగ్ర సంస్థ సీనియర్ యాకుబ్ షేక్ కూడా కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఓ సభలో ఆయన మాట్లాడుతూ.. నిజాయితీ, ధర్మం ప్రతిపాదికన ఎంఎంఎల్ అభ్యర్థులను గెలిపించాలని పాక్ ప్రజలను కోరారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పాక్లోని పరిస్థితులను మార్చివేస్తామని అన్నారు. మానవత్వంతో సేవలందిస్తామని, కశ్మీర్కు స్వాతంత్ర్యం కల్పిస్తామని తెలిపారు. ఎంఎంఎల్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో భాగంగా భారత్, యూఎస్లపై విరుచుకుపడుతున్నారు. అవినీతికి పాల్పడ్డ ఆ దేశ మాజీ ప్రధానిని జైల్లో ఉంచిన పాక్, ఉగ్ర సంస్థలకు చెందిన వారు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రపంచ దేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కరడుగట్టిన ఉగ్రవాదిగా ఏడు దశల్లో శిక్షణ
ముంబై దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ భారత్పై దాడులకు నిరంతరం పన్నాగాలు పన్నుతూనే ఉన్నాడు. హఫీజ్ని అప్పగించాలంటూ భారత్ ఒకవైపు అంతర్జాతీయంగా పాక్పై ఒత్తిడి తెస్తున్న సమయంలోనే అతను యదేచ్ఛగా ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. హఫీజ్కు చెందిన ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా, లష్కరే తోయిబా కలసికట్టుగా భారత్పై దాడులు జరపడం కోసం ఉగ్రవాదులకు శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించింది. ఇందు కోసం ఆ ఉగ్రసంస్థలు బహిరంగంగానే ఆసక్తి ఉన్న వారు శిక్షణలో చేరవచ్చు అంటూ యువకులకి వల విసురుతున్నాయి. ఈ విషయాన్ని గత మార్చి 20న కుప్వారాలో భారత సైన్యం నిర్వహించిన ఉగ్రవాద నిర్మూలన ఆపరేషన్లో పట్టుబడిన లష్కరే ఉగ్రవాది జబియుల్లా అలియాస్ హమ్జా వెల్లడించాడు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణలో అతను కఠోరమైన వాస్తవాలను మన కళ్ల ముందు ఉంచాడు. ఇంటరాగేషన్లో హమ్జా చెప్పిన విషయాలను క్రోడీకరించి ఎన్ఐఏ ఒక నివేదిక రూపొందించింది. ‘జమాత్ ఉద్ దవా బహిరంగంగానే జిహాదీల కోసం ఆహ్వానిస్తోంది. 15 నుంచి 20 ఏళ్ల వయసు ఉండి, ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడిన వారికి కఠోర శిక్షణ ఇస్తోంది. అలా శిక్షణ తీసుకుంటున్న వారి పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు బయటపెడుతున్నారు. సయీద్ హఫీజ్, లష్కరేకి చెందిన జకీర్ ఉర్ రెహ్మన్ లఖ్వీలు బహిరంగంగానే యువకులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం చేపట్టారంటూ’ హమ్జా వెల్లడించాడు. అంతేకాదు వీరికి ఏడు వేర్వేరు ప్రాంతాల్లో ఏడు దశల్లో శిక్షణ ఇస్తారు. మొత్తం రెండేళ్లపాటు ఈ శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ కార్యక్రమాల సమయంలో సయీద్ హఫీజ్ తనని తాను అమీర్ సాహెబ్ లేదంటే అమీర్–మస్గర్గా వ్యవహరిస్తాడు. ఉగ్రవాదంలో శిక్షణనిచ్చే ఇన్స్ట్రక్టర్లు, శిక్షణ కోసం చేరిన వారు కూడా అతనిని అమీర్ సాహెబ్ అనే పిలవాలి. ఇక శిక్షణనిచ్చే వారిని మసూల్స్, కాక్రూన్స్ అని పిలుస్తారు. ఈ శిక్షకులు జోన్, జిల్లా, తెహ్సీల్, పట్టణ , సెక్టార్స్థాయిలో ఉంటారు. వివిధ మదరసాల నుంచి పనికొచ్చేవారికి మసూల్స్ ఎంపిక చేసి లాహోర్లోని శిక్షణా కేంద్రానికి తరలిస్తున్నారని ఇంటరాగేషన్లో హమ్జా తెలిపాడు. ఎక్కడెక్కడ ఎలా ఈ శిక్షణ ఇస్తున్నారంటే.. 1. దౌరాబైత్ ఉల్ రిజ్వాన్, పంజాబ్ యుద్ధ శిక్షణ 2. తబూక్ క్యాంప్ గడి, హబిబుల్లా ఫారెస్ట్ సాయుధ శిక్షణ 3. ఆక్సా మసర్ కేంప్ షువై నాలా.. ముజఫరాబాద్ మ్యాప్ రీడింగ్, జీపీఎస్ వ్యవస్థ వంటి సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ 4. కరాచీ ఫుడ్ సెంటర్, ముజఫరాబాద్ సరకుల్ని క్రమం తప్పకుండా సరఫరా చేయడం, నిల్వ, వినియోగంలో శిక్షణ 5. డైకెన్, ముజఫరాబాద్ గోడలు ఎక్కడంలో శిక్షణ 6. మస్కర్ ఖైబర్ అండర్ గ్రౌండ్ సెంటర్, ముజఫరాబాద్ ఆత్మాహుతి దాడుల్లో శిక్షణ 7. ఖలీద్ బిన్ వాలిద్, జమాత్ ఉద్ దవా ప్రధాన కార్యాలయం, ముజఫరాబాద్ ఆయుధాలు, దుస్తులు పంపిణీలో శిక్షణ శిక్షణా శిబిరాలకు సయీద్, లఖ్వీ హాజరయ్యేవారు : హమ్జా హమ్జా తండ్రి స్వయంగా మసూల్. అతనే తనకి ఉగ్రవాదం శిక్షణ ఇచ్చాడని హజ్జా వెల్లడించాడు. ఈ శిక్షణ శిబిరాల్లో తమకు ఎలాంటి అవసరం వచ్చినా పాక్ ఆర్మీ, ఐఎస్ఎస్ సిబ్బంది సాయం చేసేవారని చెప్పాడు. శిక్షణ కార్యక్రమం పూర్తయిన సమయంలో సయీద్, లఖ్వీలుకూడా వచ్చేవారని చెప్పాడు. సయీద్ అందరినీ హత్తుకొని భారత్పై దాడులకు దిగండంటూ ప్రేరేపించాడని హజ్జా చెప్పుకొచ్చాడు. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పశ్చిమాసియా దేశానికి సయీద్ తరలింపు??
న్యూఢిల్లీ : ముంబై దాడుల కేసులో ప్రధాన నిందితుడు, జమాత్ ఉద్ దవా ఉగ్ర సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ను తప్పించేందుకు కుట్ర జరగుతోందా?. ఈ మేరకు పాకిస్తాన్, చైనాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు జాతీయ దినపత్రిక ‘ది హిందూ’ సంచలన రిపోర్టును ప్రచురించింది. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న సయీద్ను భారత్కు అప్పగించాలని అంతర్జాతీయంగా పాకిస్తాన్పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హఫీజ్ సయీద్ను ఏదైనా పశ్చిమాసియా దేశానికి పంపి, సంరక్షించాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షాహిద్ ఖాన్ అబ్బాసీకి సూచించినట్లు ది హిందూ తన కథనంలో పేర్కొంది. పశ్చిమాసియా దేశాలు అయితేనే సయీద్ ‘ప్రశాంత జీవితం’ గడపటానికి అవకాశం ఉంటుందని జిన్పింగ్ పేర్కొన్నట్లు తెలిపింది. గత నెలలో చైనాలో బీఓఏఓ సమావేశం వేదికగా జిన్పింగ్, అబ్బాసీలు కలుసుకున్నారు. దాదాపు 35 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చించారు. ఇందులో దాదాపు 10 నిమిషాల పాటు హఫీజ్ సయీద్ అంశంపైనే జిన్పింగ్ మాట్లాడినట్లు ది హిందూ పేర్కొంది. సయీద్ను వెలుగులో నుంచి తప్పించడం వల్ల తొందరగా ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవచ్చని జిన్పింగ్ అబ్బాసీకి చెప్పినట్లు తెలిపింది. ఈ మేరకు అబ్బాసీ ప్రభుత్వ న్యాయకోవిదులతో ఈ మేరకు చర్చించినట్లు పేర్కొంది. అయితే, వారు ఇప్పటికే పరిష్కారాన్ని చూపలేదని వెల్లడించింది. ఈ నెల 31తో అబ్బాసీ ప్రభుత్వ సమయం ముగుస్తుండటంతో కొత్త ప్రభుత్వానికి సమస్యను అప్పజెప్పే ఆలోచనలో కూడ ఉన్నారని తెలిపింది. ఈ ఏడాది జులై మాసం ఆఖర్లో పాకిస్తాన్లో జనరల్ ఎలక్షన్స్ జరగనున్నాయి. ముంబై దాడుల అనంతరం ఐక్యరాజ్యసమితి హఫీజ్ సయీద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన విషయం తెలిసిందే. ఐక్యరాజ్యసమతి, భారత్, అమెరికాలు సయీద్ ఆచూకీ తెలిపిన వారికి 5 మిలియన్ డాలర్లు బహుమానాన్ని సైతం ప్రకటించాయి. -
ముంబై పేలుళ్ల సూత్రధారికి మళ్లీ భద్రత
లాహోర్: ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి, జమాత్-ఉద్-దవా, లష్కరే తోయిబా అధిపతి హఫీజ్ సయీద్కు పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి భద్రతను పునరుద్ధరించింది. అవసరం లేకున్నా ప్రభుత్వం తరఫున భద్రతా సేవల్ని పొందుతున్న వారికి తక్షణం సెక్యూరిటీని తొలగించాలని పాకిస్తాన్ సుప్రీంకోర్టు నెల రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలతో పంజాబ్ ప్రభుత్వం సయీద్కు భద్రతను ఉపసంహరించింది. దీనిపై హఫీజ్ లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అవసరం లేకున్నా ప్రభుత్వం తరఫున సెక్యూరిటీ సేవల్ని అందిస్తున్నారని సుప్రీం చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించి తనకు పంజాబ్ రాష్ట్రం భద్రతను తొలగించిందని హఫీజ్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. తన ప్రాణాలకు నిజంగానే ముప్పు ఉందని కోర్టుకు విన్నవించుకున్నాడు. కాగా, ప్రాణాలకు ముప్పు ఉన్న వారికి సెక్యూరిటీని కల్పించాలని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ తన ఉత్తర్వులను సవరించడం గమనార్హం. హఫీజ్ ప్రాణాలకు ముప్పు ఉన్నందునే భద్రతను పునరుద్ధరించామని పంజాబ్ ముఖ్యమంత్రి షాబాజ్ షర్ఫీ తెలిపారు. సయీద్ లాహార్ హైకోర్టులో వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకున్నాడు. -
హఫీజ్ సయీద్ను వేధించొద్దు: పాక్ కోర్టు
లాహోర్: ముంబై దాడుల ప్రధాన సూత్రధారి, హఫీజ్ సయీద్ను వేధించవద్దంటూ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని లాహోర్ హైకోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఆయన తన సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగించడానికి వీలు కల్పించాలని సూచించింది. ఇదే కోర్టు గత నవంబర్లో హఫీజ్ సయీద్కు గృహ నిర్బంధం నుంచి విముక్తి కల్పించింది. తన సామాజిక సేవా సంస్థలు జమాత్–ఉద్–దవాహ్ (జేయూడీ), ఫలాహ్–ఐ–ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్ఐఎఫ్)లను పాక్ ప్రభుత్వం నిషేధించడాన్ని సవాలు చేస్తూ లాహోర్ హైకోర్టులో సయీద్ పిటిషన్ వేశారు. -
పొలిటికల్ పార్టీకి షాక్
వాషింగ్టన్ : సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో పాకిస్తాన్కు చెందిన మిల్లి ముస్లిం లీగ్(ఎంఎంఎల్) పార్టీకి షాక్ తగిలింది. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్-ఉద్దవా(జేయూడీ) స్థాపించిన ఈ పార్టీని ఉగ్ర సంస్థగా అమెరికా గుర్తించింది. దీంతో పాటు పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న ఏడుగురు నాయకులను ఉగ్రవాదులుగా గుర్తిస్తున్నట్లు చెప్పింది. లష్కర్-ఈ-తైబా(ఎల్ఈటీ) కశ్మీర్లో నడుపుతున్న తెహ్రిక్-ఈఆజాదీ-ఈ-కశ్మీర్(టీఏజేకే)ను సైతం ఉగ్ర సంస్థగా గుర్తిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. ఎన్నికల్లో పాల్గొనేందుకు హోం శాఖ నుంచి గుర్తింపు తీసుకోవాలని ఎంఎంఎల్ను పాకిస్తాన్ ఎలక్షన్ కమిషన్(పీఈసీ) కోరిన తరుణంలో అమెరికా నిర్ణయం సయీద్కు చావుదెబ్బే. రాజకీయ పార్టీగా గుర్తింపు కోసం గతంలో ఎంఎంఎల్ చేసిన దరఖాస్తును ఈసీ తిరస్కరించింది. ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నారనే అభియోగంపై పాకిస్తాన్ హోం శాఖ ఎంఎంఎల్కు రాజకీయ పార్టీ హోదా ఇవ్వొద్దని ఈసీని కోరింది. అంతర్జాతీయ ఉగ్రసంస్థగా ముద్ర పడుతుందనే భయంతో ఎల్ఈటీ తరచూ పేర్లు మార్చుకుంటూ వస్తుంది. టీఏజేకే, ఎంఎంఎల్లు ఎల్ఈటీకు మారు పేర్లే. అంతర్జాతీయ సమాజానికి ఈ విషయం తెలియజేసేందుకే టీఏజేకే, ఎంఎంఎల్లను ఉగ్రసంస్థలుగా గుర్తిస్తున్నామని అమెరికా వివరించింది. -
చీలిన లష్కరే తోయిబా; జైషే మన్కాఫా ఏర్పాటు
-
చీలిన లష్కరే తోయిబా; జైషే మన్కాఫా ఏర్పాటు
ఇస్లామాబాద్ : ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. హఫీజ్ సయీద్ కార్యకలాపాలపై నిఘా తీవ్రతరం కావడంతో సంస్థ డిప్యూటీ మౌలనా అమీర్ హంజా.. కొత్త కుంపటికి తెరలేపారు. ‘జైషే మన్కాఫా’ పేరుతో మౌలానా కొత్త సంస్థను స్థాపించినట్లు పాక్ మీడియా పేర్కొంది.ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకే హఫీజ్ ఈ ఎత్తుగడ వేసి ఉంటాడని తెలుస్తోంది. హఫీజ్ నిర్వహిస్తున్న సంస్థలను సీజ్ చేసిన పాక్ సర్కారు.. ఆయన ఏర్పాటు చేయాలనుకున్న రాజకీయ పార్టీకి కూడా అనుమతి నిరాకరించింది. కాగా, కొత్త సంస్థ తన ఉనికిని చాటేందుకు జమ్మూకశ్మీర్లో దాడులకు తెగబడొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
మీ లెక్చర్ వినాల్సిన ఖర్మ పట్టలేదు!
జెనీవా : తనను తాను ఉగ్రవాద బాధిత దేశంగా చెప్పుకుంటున్న దాయాది పాకిస్థాన్ తీరుపై భారత్ మరోసారి నిప్పులు చెరిగింది. ఒకవైపు ఒసామా బిన్ లాడెన్, హఫీజ్ సయీద్ వంటి అంతర్జాతీయ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూనే.. మరోవైపు పాక్ బాధితురాలంటూ సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డింది. విఫలరాజ్యంగా పేరొందిన పాక్ నుంచి మానవ హక్కులపై లెక్చర్ వినాల్సిన ఖర్మ పట్టలేదని ఘాటుగా బదులిచ్చింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 37వ సదస్సులో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదంటూ పాక్ చేసిన ఆరోపణలను మన దేశ ప్రతినిధి (ఇండియా సెంకండ్ సెక్రటరీ) మినిదేవీ కుమామ్ తిప్పికొట్టారు. ‘ఒసామా బిన్ లాడెన్ను రక్షించి.. ముల్లా ఒమర్కు ఆశ్రయమిచ్చిన దేశం తనను తాను బాధితగా చెప్పుకోవడం అసాధారణం’ అని ఆమె అన్నారు. ‘ఐరాస భద్రతా మండలి తీర్మానం 1267ను ఉల్లంఘిస్తూ.. ఐరాస నిషేధిత ఉగ్రవాదులైన హఫీజ్ సయీద్ లాంటివారు పాక్లో యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఐరాస నిషేధిత ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్లో రాజకీయ ప్రధాన స్రవంతిలో కొనసాగుతున్నాయి’ అని ఆమె మండిపడ్డారు. భారత్లో సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతునిస్తోందని ఆమె అన్నారు. ఎలాంటి భయంలేకుండా ఉగ్రవాదులు పాక్ నడివీధుల్లో యథేచ్ఛగా సంచరిస్తున్నారని, ఒక విఫలరాజ్యంగా మారిన దేశం నుంచి మానవ హక్కులు, ప్రజాస్వామ్యం గురించి ఉపన్యాసం వినాల్సిన అగత్యం ప్రపంచానికి లేదని ఘాటుగా పేర్కొన్నారు. -
‘అమెరికానే అంతర్జాతీయ ఉగ్రవాది’
లాహోర్ : అంతర్జాతీయ ఉగ్రవాది, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ అమెరికాపై సంచలన ఆరోపణలతో విరుచుకుపడ్డాడు. అసలు అమెరికానే ప్రపంచంలో అతిపెద్ద ఉగ్రవాది అని.. దాని ద్వారానే ప్రపంచానికి పెను ముప్పు పొంచి ఉందని హఫీజ్ చెబుతున్నాడు. గృహ నిర్భంధం నుంచి విముక్తి పొందాక పాక్ అతనిపై ఆంక్షలు విధించింది. అయినప్పటికీ శుక్రవారం సెర్మోన్లో నిర్వహించిన ఓ బహిరంగ సభకు హాజరై హఫీజ్ ప్రసంగించాడు. ఈ క్రమంలో అమెరికాతోపాటు పాక్ పాలకులపైనా విరుచుకుపడ్డాడు. అమెరికా ఉగ్రవాద రాజ్యం... ‘‘శాంతి స్థాపన పేరిట యుద్ధాలు, దాడులు చేస్తూ లక్షల మంది ప్రజల ప్రాణాలను తీస్తున్న అమెరికానే అసలైన ఉగ్రవాది. పాక్ గడ్డ నుంచే అఫ్ఘనిస్థాన్పై అమెరికా దళాలు డ్రోన్ల దాడులతో విరుచుకుపడ్డాయి. తీరా ఓటమి పాలు కావటంతో పాక్పై ఆ నెపంను నెట్టేసి ఆర్థిక సాయంపై ఆంక్షలు విధించారు. చివరకు అప్ఘన్ ఉగ్ర సంస్థలకు సంధి కోసం అమెరికా ఆహ్వానం పంపింది. అలాంటి వాళ్ల ముందు పాకిస్థాన్ మోకరిల్లుతోంది. వారిచ్చే ఆర్థిక సాయం కోసం ఎఫ్ఏటీఎఫ్(ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) సమావేశంలో నేను నిర్వహించే సంస్థలను ఉగ్ర సంస్థలుగా తీర్మానించే ప్రయత్నం చేయబోతున్నారు. కానీ, ఆ ప్రయత్నం ఫలించదు. ఎఫ్ఐఎఫ్ లాంటి ట్రస్ట్ల ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను. జమాత్-ఉద్-దావా (జేయూడీ) ద్వారా కశ్మీర్ స్వేచ్చ కోసం నేను పోరాడుతున్నాను. అలాంటి నన్ను కట్టడి చేయాలని అమెరికా ఆదేశించటమేంటి? దానిని పాక్ అమలు చేయాలని చూడటమేంటి? నా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేని కొందరు పాక్ పాలకులు అందుకు సహకరిస్తున్నారు. నా రాజకీయ విభాగం జమాత్-ఉద్-దావా ఆస్తులు జప్తు చేయాలని ఆదేశిస్తున్నారు. అసలు వారికా ఆ హక్కులు ఉన్నాయా?’’ అని హఫీజ్ ప్రశ్నించాడు. తమ సంస్థలు ఉగ్రసంస్థలు కాదన్న విషయం ప్రపంచానికి తెలియజేసేలా పోరాటం చేస్తానని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడైన హఫీజ్ చెప్పుకొచ్చాడు. అల్లాను వ్యతిరేకించే వారంతా శత్రువులే... అల్లాను, ఇస్లాంను వ్యతిరేకించే వారంతా పాకిస్థాన్కు శత్రువులేనని హఫీజ్ పేర్కొన్నాడు. ఈ విషయంలో చైనా, టర్కీలకు బానిసత్వం చేయటం ఆపి.. వాటికి దూరంగా ఉండాలని పాక్ ప్రభుత్వానికి అతను సూచిస్తున్నాడు. ఆపద సమయంలో అల్లా తప్ప వాళ్లేవ్వరూ పాక్ను ఆదుకోలేరని అంటున్నాడు. క్రైస్తవులు, అమెరికన్లు, హిందువులు ఇలా.. అందరినీ శత్రువులుగానే భావించాలని ప్రజలను హఫీజ్ కోరాడు. కొసమెరుపు.. ఓ పక్క హఫీజ్ సయీద్, అతని సంస్థలపై ఆంక్షలు విధించినట్లు ప్రకటించిన ప్రభుత్వం.. అవి యథాతథంగా కొనసాగుతున్నా అడ్డుకోకపోవటం విశేషం. పైగా హఫీజ్ నిర్వహించే రాజకీయ ర్యాలీలు, సమావేశాలకు అనుమతులు ఇస్తూ.. భద్రత కల్పించటం గమనార్హం. -
దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి: సయీద్
లాహోర్: దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ పాకిస్తాన్ ప్రభుత్వానికి సవాలు విసిరాడు. ‘ఒకవేళ పాకిస్తాన్ ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే..రండి అరెస్ట్ చేయండి. కానీ 2018 సంవత్సరాన్ని కశ్మీరీలకు అంకితం చేయడాన్ని నేను ఆపను. మమ్మల్ని అణచడానికి మీరు ఎంతగా యత్నిస్తే అంతగా ఎదురు తిరుగుతాం’ అని సోమవారం నాడిక్కడ నిర్వహించిన ఓ ర్యాలీలో సయీద్ హెచ్చరించాడు. కశ్మీర్ అంశంలో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తగినంత కృషి చేయలేదని విమర్శించాడు. కశ్మీర్ స్వాతంత్య్రం కోసం పోరాడతానంటే షరీఫ్ను మళ్లీ ప్రధాని చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తామని ప్రకటించాడు. సయీద్ తలపై అమెరికా కోటి డాలర్ల నజరానాను ప్రకటించిన సంగతి తెలిసిందే -
ఆ దేశం.. ఉగ్రవాదుల కార్ఖానా!
న్యూఢిల్లీ : పాకిస్తాన్.. ఉగ్రవాదుల కార్ఖానా అని ఫ్రీడమ్ ఆఫ్ బలూచిస్తాన్ వైస్ ఛైర్మన్ మామా ఖదీర్ స్పష్టం చేశారు. బలూచిస్తాన్ స్వతంత్ర పోరాటాన్ని ఉగ్రవాదుల సహకారంతో అణిచేందుకు ఆ దేశం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. పాకిస్తాన్లో అడుగడుగునా ఉగ్రవాదులను తయారు చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయని ఆయన చెప్పారు. పాక్ ఆక్రమణ నాటినుంచి బలూచ్లో మానవహక్కుల ఉల్లంఘన యధేచ్చగా జరుగుతోందని అన్నారు. భారత్కు చెందిన కులభూషణ్ జాదవ్ను ఇరాన్నుంచి పాకిస్తాన్ నిఘాసంస్థ ఐఎస్ఐ కిడ్నాప్ చేయించిందని ఖదీర్ పేర్కొన్నారు. ఈ కిడ్నాప్ కోసం కోట్లరూపాయలను పాకిస్తాన్ ఖర్చు చేసిందని అన్నారు. హఫీజ్ సయీద్, ముల్లా ఒమర్ వంటి రక్తపిపాసులైన ఉగ్రవాదులను తయారు చేసిందని మండిపడ్డారు. వారే నేడు పాక్లో ఉగ్రవాదులను తయారు చేసే కార్ఖానాలను ఏర్పాటు చేశారుని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులభూషణ్ జాదవ్ను అడ్డం పెట్టుకుని బలూచ్ విషయంలో భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోందని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బలూచిస్తాన్లో 2004 నుంచి 45 వేల మంది ప్రజలు కనిపించకుండా పోయారని.. ఇందుకు ఐఎస్ఐ, ఎంఐ, ఎఫ్సీ కారణమని ఆయన చెప్పారు. స్వతంత్ర పోరాటం ఉధృతం అయ్యే సమయంలో.. ఐఎస్ఐ ఇతర సంస్థలు.. కీలక వ్యక్తులను మాయం చేస్తున్నాయని ఆరోపించారు. -
పాకిస్తాన్లో ‘భగత్ సింగ్’ మంటలు
లాహోర్: స్వతంత్రం కోసం పోరాడిన సర్దార్ భగత్ సింగ్కు పాకిస్తాన్లోని అత్యున్నత గ్యాలంటరీ అవార్డు అయిన ‘నిషాన్ ఏ హైదర్’తో సత్కరించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఆయనను 86 ఏళ్ల కింద ఉరి తీసిన లాహోర్లోని షాదమన్ చౌక్లో భగత్సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భగత్సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ డిమాండ్ చేస్తోంది. ఫౌండేషన్ ఛైర్మన్ ఇంతియాజ్ ఖురేషీ మాట్లాడుతూ.. భగత్ సింగ్ ఒక యూత్ ఐకాన్ అని, నేటి యువతకు ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత అని చెప్పారు. స్వతంత్రం కోసం భగత్ సింగ్ చేసిన పోరాటాన్ని, ఆత్మత్యాగాన్ని అందరం గుర్తించాలని ఖురేషి తాజాగా మరోసారి పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వానికి లేఖ రాశారు. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా సైతం భగత్ సింగ్ త్యాగానికి నివాళి అర్పించాలన్న వ్యాఖ్యలను లేఖలో పొందుపరిచారు. సర్దార్ భగత్ సింగ్.. నిజమైన స్వతంత్ర యోధుడు. అతనికి పాకిస్తాన్ అత్యుతన్న గాలంటరీ మెడల్తో సత్కరించాలని ఖురేషీ స్పష్టం చేశారు. స్వతంత్రం కోసం చిన్నతనంలోనే బ్రిటీష్తో భగత్ చేసిన పోరాటం అసామాన్యం అని కొనియాడారు. నాటి బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న భగత్ సింగ్ను, ఆన మిత్రులు అయిన సుఖ్దేవ్, రాజ్ గురులను 1931 మార్చి 23న లాహోర్ ఉరితీశారు. నిషాన్ ఏ హైదర్ అంటే: పాకిస్తాన్ సైన్యంలో అత్యంత ధైర్యసాహసాలు, ప్రతిభ కనబర్చిన సైనికులకు ఇచ్చే అత్యున్నత పురస్కారమే నిషాన్ ఏ హైదర్. ఈ పదానికి సింహబలుడు అని అర్థం. హఫీజ్ సయీద్ వ్యతిరేకత: సర్దార్ భగత్ సింగ్కు అత్యున్న సైనిక పురస్కారం ఇవ్వాలన్న డిమాండ్పై ముంబై దాడుల సూత్రధారి, జమాతే ఉద్ దవా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అంతేకాక షాదమన్ చౌక్ పేరు మార్పుపైనా వ్యతిరేకత ప్రకటించారు. ఇటువంటి చర్యలు పాకిస్తాన్ పైర సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తాయని హఫీజ్ సయీద్ పేర్కొన్నారు. -
హఫీజ్కు పాక్ ప్రధాని మద్దతు
ఇస్లామాబాద్ : ముంబై దాడుల సూత్రధారి, ఉగ్ర సంస్థ జమాతే ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్కు పాకిస్తాన్ ప్రధాని షాహిద్ ఖాన్ అబ్బాసీ మద్దతు ప్రకటించారు. అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించిన హఫీజ్ సయీద్పై పాకిస్తాన్లో ఎటువంటి కేసులు లేవని.. ఆయన స్పష్టం చేశారు. ఒక పాకిస్తాన్ టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో పాక్ ప్రధాని ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా హఫీజ్ సయీద్ను పొరుగుదేశ ప్రధాని సహాబ్ అని సంబోధించడం గమనార్హం. ఇదిలావుండగా అమెరికా నిధులు నిలిపివేయడంతో... హఫీజ్ సయీద్ను పొరుగుదేశం నిషేధిత ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో హఫీజ్ గురించి.. పాక్ ప్రధాని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. అబ్బాసీ వ్యాఖ్యలు మరింత అంతర్జాతీయంగా మరింత మంటలు రాజేస్తాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
అమెరికా దెబ్బ.. హఫీజ్ తిక్కకుదిరింది
అమెరికా దెబ్బకు పాకిస్తాన్ దిగొచ్చింది. ఉగ్రవాద సంస్థ జమాతే ఉద్ దవా(జేయూడీ) అధినేత, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్కు వ్యతిరేకంగా సంచలన నిర్ణయం తీసుకుంది. హఫీజ్ సంస్థలకు బయట ఆర్థిక మూలాలను అడ్డకుంటూ కీలక ప్రకటన చేసింది. పాకిస్తాన్లో ఉగ్రవాదంతోపాటు హఫీజ్ కార్యకలాపాలను అడ్డుకోకపోవడంతో అగ్రరాజ్యం అమెరికా పాకిస్తాన్కు నిధులను నిలిపివేసింది. దీంతో దిక్కుతోచని పాక్, హఫీజ్కు చెందిన సంస్థల ఆర్థిక మూలాలకు అడ్డకట్టవేసింది. హఫీజ్ సయీద్కు చెందిన సంస్థలకు విరాళాలిస్తే జైలు శిక్షను ఎదుర్కొవాల్సి ఉంటుందని పాక్ అంతర్గత వ్యవహారాలశాఖ వెల్లడించింది. సయీద్కు చెందిన ఉగ్రవాద సంస్థ జమాత్-ఉల్-దవా(జేయూడీ), ఫలాఫ్-ఈ-ఇన్సానియత్ ఫౌండేషన్(ఎఫ్ఐఎఫ్) సంస్థలతో పాటు మొత్తం 72 సంస్థలపై నిషేధం విధిస్తూ బ్లాక్ లిస్ట్లోకి చేర్చుతున్నట్లు పాక్ ప్రకటించింది. ఈ సంస్థలకు ఎవరైనా ఆర్థికంగా విరాళాలు అందజేస్తే 10ఏళ్ల జైలు శిక్షతో పాటు, భారీ జరిమానా ఎరుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అక్రమంగా ఉగ్రవాద సంస్థలకు విరాళాలు ఇవ్వడం నేరంగా పరిగనిస్తున్నామని ప్రకటిస్తూ పాక్లోని అన్ని మీడియా సంస్థలతో పాటు, పత్రికా ప్రకటనను విడుదల చేసింది. అంతేకాకుండా సయీద్కు చెందిన జేయూడీ, ఎఫ్ఐఎఫ్ సంస్థల ఆస్తులను జప్తు చేసేందుకు పాక్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఉగ్రవాదుల నియంత్రణకు అమెరికా ప్రతి ఏడాది పాక్కు సుమారు దాదాపు రూ.7,290 కోట్లు (1.15 బిలియన్ డాలర్ల) భద్రత సాయాన్ని అందిస్తోంది. అయితే ఉగ్ర నియంత్రణకు ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడంతో పాక్కు అందిస్తున్న సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా శుక్రవారం ప్రకటించింది. -
క్షమాపణ చెప్పకుంటే రూ. 5 కోట్లు కట్టండి
లాహోర్: ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ పాక్ రక్షణమంత్రి దస్తగీర్కు రూ.5.70 కోట్ల(10 కోట్ల పాకిస్తానీ రూపాయలు) పరువునష్టం నోటీసులిచ్చాడు. ‘పాఠశాల విద్యార్థులపై ఉగ్రమూకలు విచక్షణారహితంగా కాల్పులు జరపకుండా ఉండేందుకే జేయూడీ, ఎఫ్ఐఎఫ్లకు విరాళాలపై నిషేధం విధిస్తున్నాం’ అని ఇటీవల దస్తగీర్ అన్నారు. దీంతో ‘ఈ విషయమై నా క్లయింట్(సయీద్)కు 14 రోజుల్లోగా రాతపూర్వకంగా క్షమాపణ చెపాల్పి. ఇలాంటి ఘటనలు పునరావృతం కావని దస్తగీర్ మాటివ్వాలి. లేదంటే పాకిస్తాన్ శిక్షాస్మృతి సెక్షన్ 500 కింద కోర్టును ఆశ్రయిస్తాం’ అని సయీద్ న్యాయవాది నోటీసులు జారీచేశారు. -
‘ట్రంప్ నిర్ణయం వెనుక భారత్’
ఇస్లామాబాద్ : ఉగ్రవాద సంస్థ జమాతే ఉద్ దవా(జేయూడీ) అధినేత, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ మరోసారి భారత్పై విషం కక్కాడు. పాకిస్తాన్కు అమెరికా నిధులు నిలిపివేయడం వెనుక భారత్ హస్తం ఉందని పేర్కొన్నాడు. భారత్ ఒత్తిడి కారణంగానే తమ దేశానికి సహాయక నిధులు నిలిపివేస్తూ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. అమెరికా నిర్ణయంపై హఫీజ్ సయీద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలావుండగా.. అమెరికా నిర్ణయంపై పాకిస్తాన్ ప్రధాని షాహీద్ ఖాన్ అబ్బాసీ అత్యవసరంగా ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాక్ నిఘా సంస్థ అయిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్ (ఐఎస్ఐ) సహా ఇతర ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సయీద్ ర్యాలీలో పాలస్తీనా దూత
న్యూఢిల్లీ: ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్తో కలిసి పాకిస్తాన్లోని పాలస్తీనా రాయబారి అబు అలీ వేదిక పంచుకోవడాన్ని భారత్ తప్పుపట్టింది. పాలస్తీనా రాయబారి అద్నన్ హైజాను విదేశాంగ కార్యాలయానికి పిలిపించి భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో పాలస్తీనా.. పాక్లోని తమ రాయబారికి ఉద్వాసన పలికింది. ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ‘పాలస్తీనా రాయబారితో పాటు రమల్లాలోని ఆ దేశ విదేశాంగ శాఖకు మా ఆందోళనల్ని స్పష్టం చేశాం. ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొన్న సయీద్తో కలిసి శుక్రవారం రావల్పిండిలో నిర్వహించిన కార్యక్రమంలో పాలస్తీనా రాయబారి పాల్గొనడం ఎంత మాత్రం అంగీకారం కాదని ఆ దేశానికి గట్టిగా చెప్పాం’ అని పేర్కొంది. ఈ సంఘటనపై తీవ్ర పశ్చాత్తాపం వెలిబుచ్చడంతో పాటు సయీద్ కార్యక్రమంలో తమ రాయబారి పాల్గొనడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని పాలస్తీనా స్పష్టం చేసినట్లు భారత్ తెలిపింది. ‘ఈ అంశాన్ని తగిన విధంగా పరిష్కరిస్తాం. భారత్లో సంబంధాలకు పాలస్తీనా అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఉగ్రపోరులో ఆ దేశానికి అండగా ఉంటాం. భారత్కు వ్యతిరేకంగా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడిన వారితో సంబంధాలు పెట్టుకోం’ అని పాలస్తీనా పేర్కొన్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. -
భారత్కు షాకిచ్చిన పాలస్తీనా!
రావుల్పిండి : అంతర్జాతీయ వ్యవహరాల్లో వెన్నుదన్నుగా ఉన్న అమెరికాను కాదని.. పాలస్తీనాకు భారత్ మద్దతిచ్చింది. ఐక్యరాజ్య సమితిలో అమెరికా తీసుకున్న జెరూసలేం నిర్ణయానికి వ్యతిరేకంగా భారత్ ఓటేసింది. అంతేకాక జెరూసలేం నిర్ణయాన్నివెనక్కు తీసుకోవాలని అమెరికాను భారత్ కోరింది. ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య సమతూకం పాటించే విషయంలో భారత్ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అవలంబించింది. ఇదంతా జరిగి వారం రోజులు గడవకముందే భారత్కు పాలస్తానా భారీ షాక్ ఇచ్చింది. శుక్రవారం రావుల్పిండిలోని లియాఖత్ బాగ్లో ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని దిఫా ఈ పాకిస్తాన్ అనే సంస్థ జెరూసలేం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో పాకిస్తాన్లోని పాలస్తీనా రాయబారి వాలిద్ అబు వలీ, నిషేధిత ఉగ్రవాది హఫీజ్ సయీద్తో కలిసి వేదిక పంచుకున్నారు. సభ జరుగుతున్న సమయంలో ఇద్దరూ అత్యంత సన్నిహితంగా మాట్లాడుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సభలో మాట్లాడిన వక్తలంతా భారత్, అమెరికాలపై తీవ్రమైన విమర్శలు చేశారు. హఫీజ్ సయీద్లో పాలస్తీనా రాయబారి సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని, నిషేధిత అంతర్జాతీయ ఉగ్రవాదితో పాలస్తీనా రాయబారి అలా వేదిక పంచుకోవడమేంటని భారత విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని భారత్లోని పాలస్తీనా రాయబారి, ఆ దేశ అధికారుల దృష్టికి తీసుకెళతామని, దానికి వారు సమాధానం చెప్పాలని మండిపడింది. దురదృష్టకరం : పాలస్తీనా ముంబైదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్తో కలిసి తమ దేశ రాయబారి వేదికను పంచుకోవడంపై పాలస్తీనా విచారం వ్యక్తం చేసింది. ఇదొక దురదృష్టకర ఘటనగా ఆదేశం అభివర్ణించింది. పాకిస్తాన్లోని తమ రాయబారి వాలిద్ అబు వలీ ప్రవర్తనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పాలస్తీనా విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత్ అభ్యంతరాలను గౌరవిస్తామని పాలస్తీనా పేర్కొంది. -
హఫీజ్కు చుక్కెదురు!
ఇస్లామాబాద్ : ముంబైదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్కు పాకిస్తాన్ ప్రభుత్వం మరోసారి చెక్ పెట్టింది. వచ్చ ఏడాది ఎన్నికల్లో పాల్గొంటానని ఇప్పటికే సయీద్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఏర్పాటు చేసిన మిల్లీ ముస్లిం లీగ్ పార్టీ రిజిస్ట్రేషన్ను పాకిస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. ఇదిలా ఉండగా.. ఈ పార్టీని రిజిస్టర్ చేసేందుకు గతంలోనే పాకిస్తాన్ ఎన్నికల సంఘం నిరాకరించింది. మిల్లీ ముస్లిం లీగ్ అనే పార్టీ నిషేధిత జమాతే ఉద్ దవా, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలకు జేబు సంస్థఅని పాక్ అంతర్గత మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎంఎంఎల్ పార్టీ రిజిస్ట్రేషన్ను తిరస్కరించిన అంతర్గత మంత్రిత్వ శాఖ.. ఇటువంటి పార్టీలకు అనుమతివ్వండం దేశానికి మంచిది కాదని పేర్కొంది. రాజకీయాల్లో హింస, వేర్పాటు, ఉగ్రవాదా భావజాలం వేగంగా వ్యాప్తి చెందేందుకు ఇటువంటి పార్టీలు దోహదం చేస్తాయని అంతర్గ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇస్లామాబాద్ హైకోర్టు కూడా.. ఎంఎంఎల్ పిటీషన్ను స్వీకరించేది పరిగణలోకి తీసుకోవడం లేదని తెలిపింది. -
ముస్లిం ప్రపంచం నుంచి ప్రతిఘటన తప్పదు
లాహోర్ : ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్.. అమెరికాపై మరోసారి విషంకక్కాడు. వచ్చే ఏడాది పాకిస్తాన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేస్తానని ప్రకటించిన హఫీజ్.. అమెరికాపై రాజకీయ వ్యాఖ్యలు చేశాడు. ప్రధానంగా జెరూసలేంపై అమెరికా తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది పాలస్తీనా భవిష్యత్ను ప్రశ్నార్థకం చేస్తుందని ధ్వజమెత్తాడు. జమాతే ఉద్ దవా, లష్కే తోయిబా ఉగ్రవాద సంస్థల వ్యవస్థాపకుడైన హఫీజ్... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై గతంలోనూ విరుచుకుపడ్డాడు. తాజాగా జెరూసలేంపై ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఆమెరికాను పాకిస్తాన్ సహా అన్ని ముస్లిం దేశాలకు శత్రువుగా పరిగణిస్తామని చెప్పాడు. ఇజ్రాయిల్ రాజధానిగా జెరూసలేంను గుర్తించడం అనేది మధ్యప్రాచ్యం, మొత్తం ప్రపంచాన్ని అస్థిరతకు గురి చేస్తుందన్నాడు. ఈ క్రమంలో మొత్తం ముస్లిం ప్రపంచం పాలస్తీనాకు అండగా నిలుస్తాయని.. అవసరమైతే యుద్ధం చేసేందుకైనా సిద్ధమని హఫీజ్ అమెరికాను హెచ్చరించాడు. ఇజ్రాయిల్ అనేది ఒక క్యాన్సర్ వ్యాధి అని.. ఈ రోగం దాదాపు అర్ద శతాబ్దం నుంచి పాలస్తీనా ముస్లింలను పీడిస్తోందని అన్నాడు. ఒక్క ఇజ్రాయిల్ వల్ల మొత్తం ప్రపంచమంతా అస్థిరత్వంలో పడుతోందన్నాడు. పాలస్తీనా ముస్లింలపై ఇజ్రాయిల్ ప్రయోగించిన రసాయన ఆయుధాల గురించి ప్రపంచం మర్చిపోయిందని.. ముస్లిం ప్రపంచానికి ఇంకా ఆ విషయం గుర్తుందని హఫీజ్ సయీద్ చెప్పాడు. -
పాకిస్తానీల నమ్మకం.. ‘హఫీజ్ సయీద్’
ఇస్లామాబాద్ : ముంబైదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ను సమర్థించే వారి సంఖ్య పాకిస్తాన్లో క్రమక్రమంగా పెరుగుతోంది. హఫీజ్ సయీద్కు నేనో పెద్ద అభిమానినంటూ పాక్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా జాబితాలోకి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బాజ్వా చేరారు. దశాబ్దాలుగా నలుగుతున్న కశ్మీర్ సమస్యను హఫీజ్ సయీద్ మాత్రమే పరిష్కరించగలరని ప్రతి పాకిస్తానీలు విశ్వసిస్తున్నాడంటూ.. జావేద్ సంచలన ప్రకటన చేశారు. ఇస్లామాబాద్లో జరిగిన సెనెట్ కమిటీ సమావేశంలో జావేద్ ఈ వ్యాఖ్యలు చేశారు. హఫీజ్ సయీద్ దేశం కోసం పోరాటం చేస్తున్నాడని జావేద్ కీర్తించారు. అంతేకాక కశ్మీర్ అంశంలో సయీద్ చేస్తున్న పోరాటం చాలా గొప్పదని చెప్పారు. హఫీజ్ సయీద్ మాత్రమే కశ్మీర్కు విముక్తి ప్రసాదిస్తాడని పాకిస్తానీలంతా నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. -
భారత్పై విషం కక్కిన హఫీజ్ సయీద్
లాహోర్ : ముంబైదాడుల సూత్రధారి హఫీజ్ మరోసారి భారత్ మీద విషం కక్కాడు. భారత్ నుంచి కశ్మీర్ను వేరు చేయడానికే జీహాద్ను కొనసాగిస్తున్నట్ల చెప్పారు. లాహోర్లో జమాతే ఉద్ దవా మద్దతుదారులతో శనివారం హఫీజ్ మాట్లాడారు. ఈ సందర్భంగా 1971 యుద్ధానికి భారత్పై ప్రతీకారం తీర్చుకోవాలని జమాతే కార్యకర్తలకు పిలుపునిచ్చారు. యుద్ధంలో భారత్ను ఓడించి.. కశ్మీర్కు స్వేచ్ఛ ప్రసాదించాలని మద్దతుదారులకు చెప్పారు. బంగ్లాదేశ్ విమోచన యుద్ధంపై భారత్పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రతి పాకిస్తానీ ఎదురు చూస్తున్నాడని.. ఆ రోజు ఎంతో దూరం లేదని హఫీజ్ పేర్కొనడం విశేషం. తూర్పు పాకిస్తాన్ను.. పాకిస్తాన్ నుంచి విడదీనట్టు.. భారత్ నుంచి కశ్మీర్ను వేరు చేయాలని చెప్పారు. కశ్మీర్ విమోచనమే అసలైన ప్రతీకారమని హఫీజ్ సయీద్ తన మద్దతాదారులతో అన్నారు. డిసెంబర్ 16న భారత్, బంగ్లాదేశ్లు విజయ్ దివస్గా జరుపుకోవడంపై హఫీజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో.. పాకిస్తాన్పై భారత్ అద్వితీయ విజయం సాధించింది. పాకిస్తాన్కు చెందిన లక్ష మంది సైనికులను భారత సైన్యం.. యుద్ధఖైదీలకు బంధించింది. తరువాత జరిగిన ఒప్పందాల్లో భారత్ పెద్ద మనసుతో వారికి క్షమాభిక్ష ప్రసాదించి వదలిపెట్టిన విషయం విదితమే. -
ఆ.. కలయిక ప్రపంచానికే ప్రమాదం!
ఆమ్స్టర్డ్యామ్ : పాకిస్తాన్లో ఈ మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలు మొత్తం ప్రపంచాన్నే ప్రమాదంలోకి నెట్టెలా ఉన్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కొన్ని వారాల కిందట గృహనిర్భంధం నుంచి విడుదలైన జమాతే ఉద్ దవా చీఫ్ హపీజ్ సయీద్, మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ కలిసి ఎన్నికలకు వెళితే ప్రమాదకర ఫలితాలు వస్తాయని సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ డిప్లమెసీ హెడ్ పాల్ స్కాట్ అంచనా వేశారు. ‘హపీజ్ సయీద్ : ఏ సీరియస్ ఆఫ్ క్యూరియస్ డెవలప్మెంట్స్’ పేరుతో పాల్ స్కాట్ ఒక ఆర్టికల్ ప్రచురించారు. అందులో ముంబై దాడులకు సంబంధించి హఫీజ్ సయీద్ పాత్రపై ఆధారాలు లేవని పాకిస్తాన్ కోర్టులు ప్రకటించడంపై ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. హఫీజ్ సయీద్ విడుదలపై భారత్తో పాటు అమెరికా సైతం.. పాకిస్తాన్ను తీవ్రంగా ఆక్షేపించింది. ఇదిలా ఉండగా హఫీజ్ సయీద్ తాజాగా రాజకీయాల్లోకి రావడంతో.. పాకిస్తాన్ విదేశాంగ విధానంలోనూ భారీగా మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. పాక్ మాజీ సైనిక పాలకుడు ముషరాఫ్ బహిరంగంగానే హఫీజ్ సయీద్కు మద్దతు పలకడం, లష్కరే తోయిబా, జమాతే ఉద్ దవాలకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం విపరీత పరిస్థితులకు దారి తీసే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్తో అమెరికా స్నేహ, దౌత్య సంబంధాలు తెంచుకోవడం మంచిదని ఆయన సూచించారు. హఫీజ్ సయీద్, ముషారఫ్ ఎన్నికల్లో గణనీయ స్థానాలు సాధిస్తే.. అది భారత్తో పాటు ప్రపంచానికే ప్రమాద ఘంటికలు మోగించేదని స్కాట్ తెలిపారు. -
నియంతృత్వ పాలన దిశగా పాక్?!
పాకిస్తాన్లో మళ్లీ నియంతృత్వ పాలన రానుందా? పాకిస్తాన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పూర్తికాలం మనుగడ సాగించలేవా? ప్రజా ప్రభుత్వాలకంటే.. నియంతృత్వ పాలకులే మేలని ప్రజలు అనుకుంటున్నారా? పారిణామాలు చూస్తుంటే.. ఏదైనా జరగవచ్చు అని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇస్లామాబాద్ : ప్రస్తుతం పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.. దేశం సైనిక పాలన దిశగా మళ్లుతున్న అనుమానాలు వస్తున్నాని అంతర్జాతీయ ఆన్లైన్ న్యూస్ మ్యాగజైన్ ప్రకటించింది. ప్రస్తుతంపాకిస్తాన్లో అత్యంత కుట్రపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని ఆ మేగజైన్ పేర్కొంది. పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ ఏర్పాటు చేసిన గ్రాండ్ అలయెన్స్, అదే సమయంలో ఆయన అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్కు మద్దతు పలకడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయని మేగజైన్ తెలిపింది. ముంబై దాడులు సూత్రధారి హఫీజ్ సయీద్ ఇప్పటికే 2018 ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. అందులో భాగంగానే గృహనిర్భంధంలో ఉన్న సమయంలోనే హఫజ్ సయీద్ మిల్లీ ముస్లిం లీగ్ పార్టీని కూడా ఏర్పాటు చేశారు. హహీజప్ సయీద్ గృహనిర్భంధాన్ని పొడిగించాలన్న పంజాబ్ ప్రభుత్వం అభ్యర్థనను పాక్ న్యాయవ్యవస్థ తోసిపుచ్చడం కూడా అనుమానాలకు మరింత బలాన్ని ఇస్తోంది. పాకిస్తాన్ సైన్యం, మత సంస్థలు.. తమ మధ్యనున్న వివాదాలను పరిష్కరించుకునే దిశగా అడుగులే వేస్తున్నాయి. ఇదే అత్యంత ప్రమాదకర పరిణామాలకు సంకేతాలని మేగజైన్ తెలిపింది. హఫీజ్ సయీద్ విడుదల తరువాత పాకిస్తాన్లో జీహాదీ గ్రూపులు మరింత ధైర్యంగా, స్వేచ్ఛగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటివరకూ మతసంస్థల అధిపతులగా ఉన్న వ్యక్తులంతా.. హఫీజ్ సయీద్ బాటలో.. ప్రధాన రాజకీయ స్రవంతిలోకి వస్తున్నారు. ఇదిలా ఉండగా.. మాజీ మిలటరీ పాలకుడు ముషారఫ్ త్వరలోనే పాకిస్తాన్లో తిరిగి అడుగు పెటడుతున్నట్లు జీహాదీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ముషారఫ్ పాక్లో అడుగు పెడితే.. పరిస్థితులు అత్యంత వేగంగా మారిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
హఫీజ్ సయీద్తో పొత్తుకు సిద్ధమే!
ఇస్లామాబాద్ : ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాతే ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్కు ఇటీవలే జై కొట్టిన పాక్ మాజీ మిలటరీ రూలర్.. తాజాగా మరో అడుగు ముందుకేశారు. వచ్చే ఏడాది పాకిస్తాన్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్తో పొత్తు సిద్దమని ముషారఫ్ ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. పాకిస్తాన్లోని ఒక న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ.. ‘పొత్తు విషయమై నేను వారితో మాట్లాడలేదు, అయితే వారు ముందుకుకొస్తే అహ్వానం పలికేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని ముషారఫ్ చెప్పారు. గత నెల్లో పాకిస్తాన్లోని 23 పార్టీలతో కలిపి అవామీ ఇత్తేహాద్ కూటమిని ముషారఫ్ ప్రకటించారు. అయితే కొద్ది రోజుల్లోనూ కూటమి కకావికలైంది. ఇదిలా ఉండగా.. ఈ మధ్యే ఒక న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్కు అతిపెద్ద మద్దతుదారుడిని అని ప్రకటించి సంచలనం సృష్టించారు. ముంబై దాడుల తరువాత హఫీజ్ సయీద్ని అమెరికా సైతం అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతని తలమీద 10 మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించింది. పాకిస్తాన్లోని పలు మతసంస్థలపై హఫీజ్ సయీద్ పట్టుసాధించాడు. హఫీజ్ సయీద్ ఉగ్రవాది కాదని.. అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితా నుంచి హఫీజ్ సయీద్ పేరును తొలగించాలని ముషారఫ్ కోరారు. -
ఎన్నికల బరిలో హఫీజ్.. ప్రమాదంలో ప్రపంచం
ఇస్లామాబాద్ : సమాతే ఉద్ దవా చీఫ్, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ 2018 సాధారణ ఎన్నికల్లు పోటీ చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తాడనే విషయాన్ని మాత్రం ఆయన ప్రకటించలేదు. ముంబై దాడుల సూత్రధారి అయిన హఫీజ్ సయీద్.. ఈ మధ్యే గృహనిర్భంధం నుంచి విడుదలయ్యారు. హఫీజ్ సయీద్ ఇప్పటికే పాకిస్తాన్లో మిల్లీ ముస్లిం లీగ్ అనే పార్టీని ఏర్పాటు చేశారు. అయితే పాకిస్తాన్ ఎన్నికల సంఘం దానిని అధికారికంగా గుర్తించలేదు. ఎన్నికల సంఘం పార్టీని గుర్తించకపోయినా.. ఎంఎంఎల్ పార్టీ అభ్యర్థిగానే ఎన్నికల్లో పోటీ చేస్తానని హఫీజ్ సయీద్ చెప్పారు. పాకిస్తాన్ను నిజమైన ముస్లిం సంక్షేమ రాజ్యంగా మలిచే శక్తి ఒక్క హఫీజ్ సయీద్కు మాత్రమే ఉందని ప్రముఖ మత బోధకుడు సైఫుల్లా ఖలీద్ అన్నారు. దేశంలోని ఇతర రాజకీయ నేతలతో పోలిస్తే.. హఫీజ్ సయీద్కు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని ఆచన చెప్పారు. -
ఉగ్రవాదులకు పాక్సైన్యం శిక్షణ
సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్రవాదులకు పాకిస్తాన్ సైన్యం శిక్షణ అందిస్తోందన్న ఆరోపణలకు మరోసారి బలమైన సాక్ష్యం లభించింది. నవంబర్ 24న కశ్మీర్లో భద్రతాబలగాలకు చిక్కిన లష్కరే తోయిబా ఉగ్రవాది.. ఇందుకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఎన్ఐఏ విచారణలో చెప్పారు. ముంబై దాడులు సూత్రధారి హఫీజ్ సయీద్ ఏర్పాటు చేసిన ఉగ్రసంస్థ జమాతే ఉద్ దవా తనకు ఉగ్రశిక్షణ ఇచ్చిందని.. ఎన్ఐఏకు తెలిపారు. అలాగే పాకిస్తాన్ సైన్యం.. మిలటరీ ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు భారత్లోరి రహస్యంగా పంపిందని ఎన్ఐఏ అధికారులుకు వివరించారు. ఇదిలా ఉండగా అరెస్టయిన లష్కరే తోయిబా ఉగ్రవాదిని అమీర్ బెన్ రియాజ్ అలియాస్ అబు హమాస్గా పోలీసులు గుర్తించారు. పాకిస్తాన్లోని కరాచీ అతని స్వస్థలమని పోలీసులు చెబుతున్నారు. హహీజ్ సయీద్ గృహ నిర్భంధం తరువాత భారత్పై మళ్లీ భారీ దాడికి పాల్పడే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హఫీజ్ సయీద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక మిలిటెంట్ను భద్రతాధికారులు పట్టుకోవడంపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
‘పాకిస్తాన్ది ఉగ్రవిధానం’
సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్రవాదం.. పాకిస్తాన్ దేశ విధానం అని చెప్పడానికి ఆదేశ మాజీ అధ్యక్షుడు ముషరాఫ్ వ్యాఖ్యలే నిదర్శనమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చెప్పారు. లష్కేరే తోయిబా, హఫీజ్ సయీద్పై ముషారఫ్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమని ఆయన అన్నారు. లష్కరే తోయిబా, హఫీజ్ సయీద్పై ముషారఫ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఉగ్రవాదానికి ఊతమిచ్చేలా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం దుబాయ్లో ఉంటున్న ముషారఫ్.. పాకిస్తాన్లోని ఒక న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ.. లష్కరేతోయిబా, హఫీజ్ సయీద్కు తాను అభిమాననింటూ చెప్పుకున్నారు. అదే సమయంలో కశ్మీర్ వేర్పాటు వాదం, ఉగ్రవాదాలను సమర్థిస్తున్నట్లు ముషారఫ్ చెప్పుకోచ్చారు. ముషారఫ్ ఇంటర్వ్యూపై రాథోర్ ట్విటర్లో స్పందించారు. పాకిస్తాన్.. ఉగ్రవాదాన్ని దేశ విధానంగా అనుసరిస్తున్నట్లు అనిపస్తోందని రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ ట్వీట్ చేశారు. Pervez Musharraf has openly endorsed terror as state policy, says @Ra_THORe https://t.co/X59vAmqwUj — Rajyavardhan Rathore (@Rathore_Fans) November 30, 2017 -
భారత్తో సంబంధాలను పాక్ వద్దనుకుంటోంది!?
వాషింగ్టన్: ముంబై దాడుల సూత్రధాని హఫీజ్ సయీద్ను గృహనిర్భంధం నుంచి పాకిస్తాన్ విడుదల చేయడంపై అమెరికా మరోసారి తీవ్రస్థాయిలో స్పందించింది. ఉగ్రవాదిగా గుర్తించిన హఫీజ్ సయీద్ను పాక్ విడుదల చేయడం అంటేనే.. భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని ఆ దేశం కోరుకోవడం లేనట్టు స్పష్టమవుతోందని అమెరికా వ్యాఖ్యానించింది. హఫీజ్ సయీద్ విడుదల పాకిస్తాన్ - భారత్ మధ్య దౌత్య సంబంధాలను మరింత దెబ్బతీస్తాయని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వ్యాఖ్యానించింది. హఫీజ్ సయీద్ విడుదలతోనే పాకిస్తాన్ ఉగ్రవాదుల స్వర్గధామం అన్న విషయం మరోసారి స్పష్టమైందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. హఫీజ్ సయీద్ను అమెరికా ఉగ్రవాదిగా గుర్తించింది.. అతని తలపై 10 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హఫీజ్ సయాద్ గురించిన మరో ఆలోచన లేదని.. అతడు అంతర్జాతీయ ఉగ్రవాదేని అమెరికా మరోసారి పునరుద్ఘాటించింది. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద సంస్థలు, గ్రూపులపై ఎటువంటి చర్య తీసుకోవాలనేది ఆ దేశ నిర్ణయమేనని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ కేంద్రంగా పలు ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయి.. ఉగ్రవాదులకు పాకిస్తాన్ అడ్డాగా మారిందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. హఫీజ్ సయాద్ను తిరిగి అరెస్ట్ చేయాలని అమెరికా ఇప్పటికే పాకిస్తాన్ను ఆదేశించింది. హఫీజ్ సయీద్ వ్యవహారం ఇరు దేశాల దౌత్య సంబంధాలపై పెను ప్రబావం చూపే అవకాశముందని అమెరికా ఇప్పటికే పాకిస్తాన్ను హెచ్చరించింది. -
‘హఫీజ్పై ఆధారాలుంటే చూపండి’
న్యూఢిల్లీ : ముంబూ దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ని ఆయన అల్లుడు వెనుకోసుకొచ్చాడు. ముంబూ దాడులకు సంబంధించి భారత్ వద్ద ఆధారాలుంటే బయటపెట్టాలని హఫీజ్ సయీద్ అల్లుడు వాలీద్ డిమాండ్ చేశారు. లష్కరే తోయిబా, హఫీజ్ సయీద్ భారత్కు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నట్లు రుజువులు ఉంటే ప్రపంచం ముందూ చూపించిండి.. అవి లేకుంటే మా మీద పడి ఏడవడం మానుకోండి.. అని వాలీద్ భారత్కు చెప్పారు. పాకిస్తాన్, హఫీజ్ సయీద్ విషయంలో భారత్ ప్రతిసారి అమెరికా భుజాల మీద పడి ఏడవడం పరిపాటిగా మారిందన్నారు. భారత్ ఒత్తిడికి తగ్గట్లే అమెరికా కూడా ప్రవర్తిస్తోందని చెప్పారు. అందులో భాగంగానే హఫీజ్ సయీద్ను మరోసారి గృహనిర్భంధంలో ఉంచాలని అమెరికా డిమాండ్ చేస్తోందని చెప్పారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్లో ఉగ్రవాద దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్కు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే హఫీజ్ సయీద్కు అనుకూలంగా మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషరాఫ్ సహా పలుపురు రాజకీయ నేతలు మద్దతు ప్రకటించారు. -
‘నేను ఉగ్రవాదిని కాను’
న్యూఢిల్లీ : ముంబై దాడుల ప్రధాన సూత్రధారి, జమాత్ ఉద్ దవా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్.. తాను ఉగ్రవాదిని కాదని ప్రకటించుకున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితా నుంచి తన పేరును తొలగించాలని హఫీజ్ సయీద్ ఐక్యరాజ్యసమితిలో పిటీషన్ దాఖలు చేశారు. ప్రముఖ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సహవ్యవస్థాపకుడిగా పేరొందిన హఫీజ్ సయీద్ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ పాకిస్తాన్లోని ఒక న్యాయవాద సంస్థ ఐక్యరాజ్య సంస్థలో పిటీషన్ దాఖలు చేసింది. ముంబైదాడుల కేసులో కొన్ని నెలలుగా గృహనిర్భంధంలో ఉన్న హఫీజ్ సయీద్కు పాకిస్తాన్ కోర్టు ఈ మధ్యే స్వేచ్చను ప్రసాదించింది. ముంబై దాడులు అనంతరం ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సెల్ రిజుల్యూషన్ 1267 మేరకు హఫీజ్ సయీద్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా సమితి ప్రకటించింది. -
సయీద్ను వెంటనే అరెస్ట్ చేయండి: అమెరికా
వాషింగ్టన్: ఇటీవల పాక్లో గృహనిర్బంధం నుంచి విడుదలైన ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ను వెంటనే అరెస్ట్ చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అమెరికా డిమాండ్ చేసింది. సయీద్ విడుదల పాక్ ఉగ్రవాదానికి కొమ్ముకాస్తుందన్న సందేశాన్ని ఇస్తోందని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి సారా శాండర్స్ మండిపడ్డారు. సయీద్ను వెంటనే మళ్లీ అరెస్ట్ చేసి విచారించాలన్నారు. సయీద్ విడుదలతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటాయని హెచ్చరించారు. దక్షిణాసియా విధానంలో భాగంగా అమెరికా పాక్తో నిర్మాణాత్మకమైన సంబంధాలను కోరుకుంటోందని శాండర్స్ తెలిపారు. ఇందుకోసం ఈ ప్రాంతంలో ఆశాంతిని రేకెత్తించే ఉగ్రసంస్థలను పాక్ నిర్మూలించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. హఫీజ్ సయీద్ను అమెరికా ఇంతకుముందే అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన సంగతి తెలిసిందే. సయీద్ తలపై కోటి డాలర్ల రివార్డును కూడా అమెరికా ప్రకటించింది. -
అక్కడ హఫీజ్ విడుదల.. ఇక్కడ సంబరాలు
లక్ష్మీపూర్/ఖేరి : ముంబై పేలుళ్ల సూత్రధారి, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా చీఫ్ హహీజ్ సయీద్ను పాకిస్తాన్ ప్రభుత్వం గృహనిర్భంధం నుంచి విడుదల చేయడంతో ఉత్తర్ ప్రదేశ్లోని లక్ష్మీపూర్ గ్రామంలో కొందరు వేడులు నిర్వహించుకున్నారు. హహీజ్ సయీద్ విడుదలపై ఉత్తర్ ప్రదేశ్లో వేడుకలు నిర్వహించడం దేశవ్యాప్తంగా అత్యంత వివాదాస్పదంగా మారింది. శివపురి ప్రాంతంలోని బేగంబాగ్ కాలనీలో కొందరు హఫీజ్ సయీద్ విడుదల అనంతరం.. ‘హఫీజ్ సయీద్ జిందాబాద్’... ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేస్తూ.. ఆకుపచ్చ జెండాలను ఎగురవేశారు. అత్యంత వివాదాస్పదమైన ఈ ఘటన కలెక్టర్ అక్షద్వీప్ దృష్టికి రావడంతో.. పూర్తి ఆధారాలతో విచారణ నిర్వహించాలని ఆయన పోలీసులను ఆదేశించారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం హఫీజ్ సయీద్కు అనుకూలంగా 20-25 మంది యువకులు నినాదాలు చేసినట్లు కత్వాలి పోలీసులకు మొదటి సమాచారం అందింది. అయితే ఈ ఘటన తీవ్రతను మొదట అధికారులు గుర్తించడంలో విఫలమైనట్లు తెలుస్తోంది. అయితే జిల్లా కలెక్టర్ అక్షద్వీప్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే పలు ఇళ్లపై ఎగరేసిన ఆకుపచ్చ జెండాలను అధికారులు తొలగించారు. హఫీజ్ సయాద్, పాకిస్తాన్కు అనుకూలంగా చేసిన నినాదాలు, వేడుకులకు సంబంధించిన వీడియో ఫుటేజ్ లభించిందని.. పోలీసులు ప్రకటించారు. యువకులు చేసిన నినాదాలకు సంబంధించి వీడియో ఫుటేజ్ ఉందని పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనపై లక్ష్మీపూర్ ఇమామ్ అష్పాఖ్ ఖాద్రీ మాట్లాడుతూ.. హఫీజ్ సయీద్ విడుదలపై వేడుకలు చేసుకోలేదని చెప్పారు. హహీజ్కు అనుకూలంగా నినాదాలు ఎవరూ చేయలేదని కూడా ఆయన ప్రకటించారు. తామంతా జులూస్ ఏ మహమ్మదీ జన్మదినోత్సవ వేడుకలు జరుపుకున్నట్లు ఆయన తెలిపారు. -
‘కశ్మీర్’పై ప్రజా ఉద్యమం
లాహోర్: జమాత్ ఉద్ దవా చీఫ్ (జేయూడీ) హఫీజ్ సయీద్ మరోసారి భారత్పై నోరు పారేసుకున్నాడు. కశ్మీర్కు స్వాతంత్య్రం సాధించటానికి పాకిస్తాన్లో ప్రజా ఉద్యమం తీసుకొస్తానని ప్రతిజ్ఞ చేశాడు. 297 రోజుల గృహ నిర్బంధం అనంతరం ఈ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు గురువారం అర్ధరాత్రి దాటాక విడుదలయ్యాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘కశ్మీర్ గురించి మాట్లాడనీయకుండా చేయడానికే నన్ను 10 నెలలు గృహనిర్బంధంలో ఉంచారు. నేను కశ్మీరీల కోసం పోరాడుతాను. వారికి స్వాతంత్య్రం వచ్చేలా చేయడానికి ప్రయత్నిస్తాను. కశ్మీర్కు స్వాతంత్య్రాన్ని కోరుకునే పాకిస్తానీలను ఏకం చేసి ఆ కల నెరవేరేందుకు ప్రయత్నిస్తాను’అని పేర్కొన్నాడు. అలాగే శుక్రవారం ఓ మసీదులో సయీద్ మతోపన్యాసం చేస్తూ..పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, భారత్తో మైత్రి కోసం ప్రయత్నించి దేశద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించాడు. 2008 నవంబరు 26న 10 మంది ఉగ్రవాదులు ముంబై నగరంలో పలుచోట్ల మారణహోమం సృష్టించి ఆరుగురు అమెరికన్లు సహా 166 మందిని పొట్టనబెట్టుకోవడం తెలిసిందే. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ద్వారా హఫీజ్ సయీద్ ఈ దాడికి ప్రణాళిక రచించాడు. ఆ తర్వాత అతనికి వ్యతిరేకంగా పాకిస్తాన్కు భారత్ ఆధారాలు అందజేయడంతో ఈ ఏడాది జనవరి 31న సయీద్తో పాటు మరో నలుగురిని పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్సు ప్రభుత్వం గృహనిర్బంధం చేసింది. సయీద్పై అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేస్తూ ఇతని తలపై అమెరికా కోటి డాలర్ల నజరానా కూడా ప్రకటించింది. అరెస్టు చేయాలి: అమెరికా హఫీజ్ సయీద్ చేసిన నేరాలకు అతణ్ని పాకిస్తాన్ ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టాలని అమెరికా కోరింది. ‘లష్కరే తోయిబా స్థాపకుడు సయీద్ను గృహనిర్బంధం నుంచి విడుదల చేయడం మాకు ఆందోళన కలిగిస్తోంది. అమెరికన్లు సహా వందలాది మంది ప్రజలను లష్కరే తోయిబా అన్యాయంగా చంపేసింది. సయీద్ను పాక్ ప్రభుత్వం అరెస్టు చేయాలి’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. -
హఫీజ్ సయీద్ను విడిచిపెట్టిన పాక్!
లాహోర్: 26/11 ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా స్థాపకుడు హఫీజ్ సయీద్కు విముక్తి లభించింది. గృహనిర్బంధంలో ఉన్న సయీద్ను విడుదల చేయాలని పాకిస్థాన్కు చెందిన పంజాబ్ జ్యుడీషియల్ రివ్యూ బోర్డు బుధవారం ఆదేశాలు జారీచేసింది. సయీద్ను గృహనిర్బంధం నుంచి విముక్తి కల్పిస్తే.. అంతర్జాతీయ సమాజం నుంచి మరిన్ని ఆంక్షలు ఎదుర్కోవాల్సి రావొచ్చని పాక్ సర్కారు ఆందోళన వ్యక్తం చేసిన మరునాడే ఈ మేరకు ఆదేశాలు వెలువడటం గమనార్హం. సయీద్ను గృహనిర్బంధాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని కోరుతూ.. అతన్ని పంజాబ్ ప్రభుత్వం మంగళవారం జ్యుడీషియల్ రివ్యూ బోర్డు ముందు హాజరు పరిచింది. అయితే, సయీద్కు వ్యతిరేకంగా తగినంత ఆధారాలు సమర్పించడంలో పాక్ సర్కారు విఫలమైందని, కాబట్టి, అతన్ని గృహనిర్బంధంలో కొనసాగించడం రివ్యూ బోర్డు స్పష్టం చేసింది. సయీద్ గృహనిర్బంధం కొనసాగించకుంటే.. అంతర్జాతీయ సమాజం దేశంపై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశముందని, కాబట్టి అతన్ని గృహనిర్బంధం కొనసాగించాలని పంజాబ్ హోంశాఖ అధికారులు జ్యుడీషియల్ రివ్యూ బోర్డును కోరారు. సయీద్కు వ్యతిరేకంగా నిఘా వర్గాల సమాచారం ఉందని, ఆర్థికమంత్రిత్వశాఖ వద్ద కూడా అతనికి వ్యతిరేకంగా తగినంత ఆధారాలు ఉన్నాయని అధికారులు చెప్పినా.. రివ్యూ బోర్డు ఈ వాదనతో ఏకీభవించలేదు. -
హఫీజ్ సయీద్ హత్యకు కుట్ర!
లాహోర్: నిర్బంధంలో ఉన్న ముంబై దాడుల సూత్రధారి, జమాత్–ఉద్–దవా(జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్కు భద్రత పెంచాలని అక్కడి పంజాబ్ హోం మంత్రత్వ శాఖను పాకిస్తాన్ ప్రభుత్వం కోరింది. ఆయన్ని హతమార్చేందుకు ఓ విదేశీ నిఘా సంస్థ కుట్ర పన్నిందని ఆరోపించింది. పాకిస్తాన్ జాతీయ ఉగ్రవ్యతిరేక ఏజెన్సీ రాసిన లేఖలో...హఫీజ్ను అంతమొందించేందుకు విదేశీ నిఘా సంస్థ ఓ నిషేధిత సంస్థకు చెందిన ఇద్దరికి రూ.8 కోట్లు చెల్లించినట్లు వెల్లడించింది. హఫీజ్కు కట్టుదిట్టమైన భద్రతను కల్పించాలని పంజాబ్ హోంమంత్రిత్వ శాఖను కోరింది. ఉగ్ర వ్యతిరేక చట్టం కింద ఈ ఏడాది జనవరి 30 నుంచి లాహోర్లో గృహ నిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. జేయూడీ ఇప్పటికే అంతర్జాతీయ ఉగ్ర సంస్థగా ప్రకటించిన అమెరికా హఫీజ్ తలపై 10 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది. -
పాక్ పాలిటిక్స్లో సంచలనం: హఫీజ్ కొత్త పార్టీ
ఇస్లామాబాద్: ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి, కరడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ మరో సంచలనానికి తెరలేపాడు. ప్రస్తుతం గృహనిర్బంధంలో ఉన్న ఆయన.. తను నెలకొల్పిన మత సంస్థ ‘జమాత్ ఉల్ దవా’కు కొనసాగింపుగా కొత్త రాజకీయ పార్టీని స్థాపించాడు. సయీద్ ప్రధాన అనుచరుడు సైఫుల్లా ఖలీద్ సోమవారం ఇస్లామాబాద్లో కొత్త పార్టీని ప్రకటించాడు. పార్టీ పేరు ‘మిల్లి ముస్లిం లీగ్’(ఎంఎంఎల్) అని, పాకిస్తాన్ను నిజమైన ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే తమ ధ్యేయమని సైఫుల్లా చెప్పుకొచ్చాడు. గృహనిర్బంధంలో ఉన్న హఫీజ్ సయీద్ విడుదలయ్యే వరకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు తానే నిర్వహిస్తానని తెలిపాడు. 2018లో పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇస్లామిక్ స్టేట్ ఎజెండా కలిగిన పార్టీలతో కలిసి భారీ కూటమిని ఏర్పాటుచేయాలని హఫీజ్ భావిస్తున్నాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని ముజఫరాబాద్కు చెందిన హఫీజ్ సయీద్కు.. స్వరాష్ట్రం సింధ్లో భారీ మద్దతు ఉన్నది. మిగిలిన రాష్ట్రాల్లోనూ ప్రభావం చూపేలా స్థానిక పార్టీలతో కలిసి పనిచేయబోతున్నట్లు సైఫుల్లా ప్రకటనను బట్టి అర్థమవుతోంది. ఎన్నికల్లో ప్రభావం చూపుతారా? కాగా, పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మతఛాందసుల సంఖ్య గడిచిన కొన్నేళ్లుగా తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో కేవలం మత రాజ్యం ఎజెండాతో హఫీజ్ స్థాపించిన ఎంఎంఎల్ మనుగడ ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి నెలకొంది. ఎంఎంఎల్ తరహాలోనే.. మొదట మత సంస్థలుగా ప్రారంభమై, రాజకీయ పార్టీలుగా మారిన జమైత్ ఉలేమా ఎ ఇస్లామిక్ ఫజల్(వ్యవస్థాపకుడు ఫజ్లూర్ రెహమాన్) నుంచి ప్రస్తుత జాతీయ అసెంబ్లీకి డజను మంది సభ్యులు ఎన్నికయ్యారు. జమాత్ ఏ ఇస్లామి అనే మరో పార్టీ నుంచి ఆరుగురు సభ్యులు ఎన్నికయ్యారు. వచ్చే ఎన్నికల్లో వీళ్లంతా కలిసి పోటీచేసినా, ప్రగతిశీల పార్టీలుగా పేరు పొందిన పీఎల్ఎం-ఎన్(నవాజ్), పీపీపీ(భుట్టో కుటుంబం), పీటీఐ(ఇమ్రాన్ ఖాన్), ఏఎన్పీ(అబ్దుల్ వలీ)లను ఎలా నెగ్గుకొస్తారు వేచిచూడాల్సిందే. గృహనిర్బంధంలోనే హఫీజ్.. పలు ఉగ్రకుట్రలకు కేంద్రబిందువైన హఫీజ్ను అరెస్ట్ చేయాలంటూ భారత్ సహా పలు దేశాలు పాకిస్తాన్పై ఒత్తిడి తేవడంతో అక్కడి ప్రభుత్వం అతన్ని ఎట్టకేలకు జనవరి 31న నిర్బంధించింది. గడిచిన ఆరు నెలలుగా హఫీజ్ గృహనిర్బంధంలోనే ఉన్నాడు. తాజాగా(జులై 27న) అతని హౌస్ అరెస్ట్ను మరో రెండు నెలలు పొగించారు. దీంతో జమాతుల్ దవా కార్యకలాపాలన్నీ హఫీజ్ నమ్మిన బంటు సైఫుల్లానే పర్యవేక్షిస్తున్నారు. హఫీజ్ ఇప్పుడప్పుడే విడుదలయ్యే అవకాశాలు లేకపోవడంతో సైఫుల్లా చేత పార్టీ ప్రకటన చేయించాడు. -
ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన పాక్
ఇస్లామాబాద్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దెబ్బకు పాకిస్థాన్ దిగొచ్చింది. తమ దేశంలోని ఉగ్రవాది హపీజ్ సయీద్ అండదండలతో నడుస్తున్న తెహ్రిక్ ఈ ఆజాదీ జమ్ము అండ్ కశ్మీర్ సంస్థపై నిషేధం విధించింది. ఈ సంస్థే ప్రస్తుతం జమాత్ ఉద్ దవాగా కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2008లో ముంబయిలో పేలుళ్లకు ఈ ఉగ్రవాద సంస్థే మాస్టర్మైండ్గా వ్యవహరించింది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఏమాత్రం ప్రోత్సహించరాదని, అలా చేస్తే అంతర్జాతీయ సమాజం తరుపున తీవ్రంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఉన్నపలంగా ఉగ్రవాద చర్యలను నిలువరించే చర్యలు తీసుకోవాలని లేదంటే తమ నుంచి సహకారం అందబోదని చెప్పారు. దీంతో పాకిస్థాన్ తాజా చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత జనవరిలోనే హఫీజ్ సయీద్ను గృహ నిర్బందం చేసిన పాక్ పోలీసులు అతడిని అరెస్టు మాత్రం చేయకుండా పరిశీలనలో ఉంచారు. అదే సమయంలో జమాత్ ఉద్ దవాపై కూడా ఓ కన్నేసి ఉంచారు. సయీద్పై ఎప్పుడైతే పాక్ చర్యలు తీసుకోవడం మొదలుపెట్టిందో అప్పటి నుంచే భారత్కు వ్యతిరేకంగా కొన్ని లక్షిత దాడులు చేయించేందుకు జమాత్ సంస్థకు సంకేతాలు పంపించినట్లు ఆ మేరకు ఆ సంస్థ ముందుకు కదిలినట్లు తెలిసింది. ఇదే సమయంలో డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంతో జమాత్ ఉద్ దవాను నిషేధ సంస్థల జాబితాలో చేర్చింది. -
హఫీజ్కు వ్యతిరేకంగా తొలిసారి పాక్ సాక్ష్యం
-
జిహాద్ పేరుతో ఉగ్రవాద వ్యాప్తి..
లాహోర్: ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి, జమత్ ఉద్ దవా(జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్ జిహాదీ పేరుతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాడని, అందుకే అతన్ని నిర్బంధంలోకి తీసుకున్నామని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ జ్యుడీషియల్ రివ్యూ బోర్డుకు తెలిపింది. సయీద్ అతడి సహాయకులు జాఫర్ ఇక్బాల్, అబ్దుల్ రెహమాన్, అబ్దుల్లా ఉబెద్, క్వాజి కషిఫ్ నైజ్ జిహాదీ పేరుతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ప్రచారం చేస్తున్నారని బోర్డుకు తెలిపింది. ఇందుకు సంబంధించి ఆధారాల్ని అందజేయాల్సిందిగా ప్రభుత్వాన్ని బోర్డు ఆదేశించింది. -
హఫీజ్కు వ్యతిరేకంగా తొలిసారి పాక్ సాక్ష్యం
లాహోర్: ముంబయి పేలుళ్ల సూత్రదారి ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్కు వ్యతిరేకంగా పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి జ్యుడిషియలర్ రివ్యూ బోర్డు ముందు వాంగ్మూలం ఇచ్చారు. జిహాద్ పేరిట సయీద్ ఆయన అనుచరులు ఉగ్రవాదాన్ని వ్యాపింప జేస్తున్నారని, తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. గృహనిర్బందం చేసిన సయీద్ను మరో 90 రోజులపాటు నిర్బంధంలో ఉంచేందుకు పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై లాహోర్ హైకోర్టు ప్రశ్నించింది. అతడి నిర్భందాన్ని పొడిగించడానికి ముందు వారిని ఎందుకు జ్యుడిషియల్ రివ్యూ బోర్డు ముందుకు తీసుకురాలేదని ప్రశ్నించింది. ఈ నేపథ్యంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ సయీద్ అతడి నలుగురు అనుచరులను బోర్డు ముందుకు తీసుకొచ్చిన పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ అనంతరం వారిని అదుపులోకి తీసుకోవడానికి గల కారణాలు తెలిపింది. దీంతో ఈసారి విచారణకు అటార్నీ జనరల్ను పంపించాల్సిందిగా రివ్యూ బోర్డు ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
సయీద్ గృహనిర్బంధం పొడిగింపు
లాహోర్: ముంబై దాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ గృహనిర్బంధాన్ని పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద సయీద్, ఆయన నలుగురు అనుచరులు ఇక్బాల్,అబిద్, హుస్సేన్, ఉబేద్ల మూడు నెలల గృహ నిర్బంధం ఆదివారం రాత్రితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ గృహనిర్బంధాన్ని మరో మూడు నెలలపాటు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉగ్రవాద కార్యకలాపాల ఆరోపణలపై ప్రభుత్వం వీరిని జనవరి 30వ తేదీ నుంచి లాహోర్లో గృహనిర్బంధంలో ఉంచుతోంది. -
మోదీపై ముషార్రఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: ముంబైపై 2008లో ఉగ్రవాదులు దాడిచేసి 166 మందిని పొట్టనపెట్టుకున్న ఘటనలో జమాత్–ఉద్–దవా చీఫ్ హఫీజ్ సయీద్ పాత్ర లేదని పాక్ మాజీ నియంత పర్వేజ్ ముషార్రఫ్ తెలిపారు. పాకిస్తాన్ సయీద్ను అసలు ఉగ్రవాదిగా భావించడమే లేదన్నారు. సయీద్ గృహనిర్భంధంపై మీడియాతో మాట్లాడుతూ.. ‘హఫీజ్ సమస్య భారత్కే పరిమితం. దీని గురించి అమెరికాలో ఎవ్వరూ మాట్లాడర’ని స్పష్టం చేశారు. ప్రస్తుత భారత్–పాక్ సంబంధాలపై ముషార్రఫ్ స్పందిస్తూ, ఇరుదేశాల మధ్య శాంతిని పెంపొందించగల శక్తి ఒక్క నరేంద్ర మోదీకే ఉందని అభిప్రాయపడ్డారు. కానీ శాంతి నెలకొనడం ఆయనకు ఇష్టం లేదన్నారు. 2018లో జరగనున్న ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు ముషార్రఫ్ ప్రకటించారు. తాను ప్రధాని కావాలనుకోవడం లేదని, మూడో రాజకీయ శక్తిగా ఎదగాలనుకుంటున్నట్టు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తీసుకురావడంతో 68 ఏళ్ల సయీద్ను ఇంతకుముందు పాకిస్తాన్ 90 రోజుల పాటు గృహనిర్బంధంలో ఉంచింది. -
బావమరిదికి పగ్గాలు!
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవాకు కొత్త బాస్ వచ్చాడు. ఇప్పటివరకు అధినేతగా ఉన్న హఫీజ్ సయీద్ గృహనిర్బంధంలో ఉండటంతో.. అతడి బావమరిది హఫీజ్ అబ్దుల్ రెహమాన్ మక్కీని ఆ సంస్థకు అధిపతిగా నియమించారు. అతడిని పట్టిస్తే 13 కోట్ల రూపాయల బహుమతి ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. కొత్త బాస్ మక్కీ అన్న విషయాన్ని జమాత్ ఉద్ దవా అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం మక్కీ జేయూడీలో నెంబర్ 2గా ఉన్నాడు. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రభుత్వం సయీద్ను గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. గృహ నిర్బంధంలోనే ఉన్నా.. ఇంటి నుంచే హఫీజ్ సయీద్ కార్యకలాపాలు సాగిస్తున్నాడన్న వదంతులు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని జేయూడీ ఖండించింది. సంస్థకు సంబంధించిన అన్ని విషయాలూ మక్కీయే చూసుకుంటున్నాడని చెప్పింది. హఫీజ్ సయీద్ నిర్బంధం తర్వాతి నుంచి ఇప్పటివరకు మక్కీ లాహోర్ నగరంలో దాదాపు ఆరు ర్యాలీలు నిర్వహించాడు. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రభుత్వం జమాత్ ఉద్ దవాతో పాటు మరో నలుగురు జేయూడీ నేతలను, ఫలా ఎ ఇన్సానియత్ నేతలను 90 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచింది. ఈ రెండు సంస్థలకు చెందిన పలు కార్యాలయాలను కూడా మూసేశారు. ఈ రెండింటినీ ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద పరిశీలనలో ఉంచారు. సయీద్ గృహనిర్బంధం తర్వాత జేయూడీ తన పేరు మార్చుకుంది. 'తెహరీక్ ఆజాదీ జమ్ము కశ్మీర్' అనే కొత్త పేరుతో దీని కార్యకలాపాలు నడుస్తున్నాయి. -
పాకిస్తాన్ కు తీవ్ర ముప్పు!
ఇస్లామాబాద్: ముంబై ఉగ్ర దాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్తో తమ దేశానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పేర్కొన్నారు. పాక్ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా అతన్ని గృహనిర్బంధంలో ఉంచినట్లు తెలిపారు. జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో జరుగుతున్న అంతర్జాతీయ భద్రతా సదస్సులో ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. హఫీజ్కు ఉన్న ఉగ్రవాద సంబంధాలపై ఒక పాక్ నేత బహిరంగంగా మాట్లాడటం ఇదే తొలిసారి. 2008 నవంబర్లో జరిగిన ముంబై ఉగ్రదాడుల అనంతరం సయీద్ను గృహనిర్బంధంలో ఉంచారు. అయితే 2009లో కోర్టు అతనికి విముక్తి కల్పించింది. వివిధ తీవ్రవాద కార్యకలాపాల్లో సయీద్ ప్రమేయాన్ని గుర్తించిన అమెరికా ప్రభుత్వం అతని తలపై రూ. 67 కోట్ల రివార్డు ప్రకటించింది. సదస్సులో తీవ్రవాదంపై జరిగిన చర్చలో ఆసిఫ్ మాట్లాడుతూ ‘తీవ్రవాదానికి ఏ మతంతోనూ సంబంధాలు లేవు, వారికి ఏ మతాన్నీ ఆపాదించొద్దు, వారు క్రిస్టియన్లు కాదు, ముస్లింలూ కాదు, బౌద్ధులు, హిందువులూ కాదు, వారు కేవలం తీవ్రవాదులు, నేరస్తులు’ అని పేర్కొన్నారు. ఈ నెల రోజుల్లో పాక్లో 8 తీవ్రవాద దాడులు జరిగాయని, కనీసం వందమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు తమ దేశం కృత నిశ్చయంతో ఉందన్నారు. సయీద్ ఆయుధ లైసెన్స్ రద్దు లాహోర్: జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్తో పాటు అతని అనుచరులకు జారీ చేసిన 44 ఆయుధ లైసెన్స్లను భద్రతా కారణాల రీత్యా రద్దు చేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. ఆయుధ లైసెన్స్లు రద్దు చేయడంతో సయీద్, అతని సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రారంభమైనట్లు హోంశాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. సయాద్తో పాటు అతని సంస్థల్లోని మరో 37 మంది దేశం విడిచి వెళ్లకుండా పాక్ ప్రభుత్వం వారి పేర్లను ఎగ్జిట్ కంట్రోల్ జాబితాలో చేర్చింది. -
నిర్బంధంపై కోర్టుకు..
లాహోర్: పాకిస్తాన్ ప్రభుత్వం తమను గృహనిర్బంధం చేయడంపై జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ సహా మరో నలుగురు లాహోర్ కోర్టులో పిటిషన్ వేశారు. బుధవారం ఈ పిటిషన్ విచారణకు రానుంది. సీనియర్ న్యాయవాది ఏకే దోగర్ ద్వారా హఫీజ్ సయీద్, మాలిక్ జాఫర్ ఇక్బాల్, అబ్దుర్ రహమాన్, మాలిక్ జాఫర్ రెహమాన్ అబిద్, కాజీ కషీఫ్ హుస్సేన్, అబ్దుల్లా ఉబాయిద్ల నిర్బంధాన్ని కోర్టులో చాలెంజ్ చేశారు. గృహనిర్బంధంపై ఫిబ్రవరి ప్రారంభంలోనే పిటిషన్ దాఖలు చేసినా టెక్నికల్ గ్రౌండ్స్ లేకపోవడం లాహోర్ కోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద సయాద్, మరో నలుగురిని పాకిస్తాన్ ప్రభుత్వం గృహనిర్బంధం చేసింది. మంగళవారం సయీద్కు ఉన్న ఆయుధ లైసెన్స్లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. యూఎన్ కౌన్సిల్ ఆదేశాల మేరకే సయీద్ను 90రోజుల పాటు గృహనిర్బంధం చేస్తున్నట్లు పాకిస్తాన్ హోం శాఖ మంత్రి చౌదరి నిసార్ అలీ ఖాన్ తెలిపారు. కాగా, పలు దేశాల్లో జరిగిన ఉగ్రదాడులకు కారణం సయీద్ అనే ఆరోపణలు ఉన్నాయి. 2008 ముంబై ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ సయీద్ను నిర్బంధించింది. అప్పట్లో లాహోర్ హైకోర్టులో పిటిషన్ వేసిన సయీద్.. నిర్బంధం నుంచి బయటకు వచ్చాడు. అమెరికాలో సయీద్పై రూ.10 లక్షల డాలర్ల రివార్డు ఉంది. -
‘భారత్కు పాక్ మోకరిల్లుతుందనుకోలేదు’
న్యూఢిల్లీ: భారత్ ఒత్తిడికి తలొగ్గి తన సోదరుడు లష్కరే తోయిబా చీఫ్, జమాతే ఉద్ దవా స్థాపకుడు ఉగ్రవాది హఫీజ్ సయీద్ను పాకిస్థాన్ గృహ నిర్బంధం చేసిందని సయీద్ సోదరుడు హఫీజ్ మసూద్ ఆరోపించాడు. అతడిని కలవడం తమకు చాలా కష్టమైపోతోందని, ఇంకా ఆయనను చాలా రోజులు బంధించే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతానికి మసూద్ చర్యలను పాక్ తీక్షణంగా గమనిస్తోందని, కఠిన నిబంధనలు పెట్టిందని, ఆయన మాములుగా కలిసేందుకు పెద్ద విధివిధానాలు పెట్టిందని అన్నారు. జమాత్ ఉద్ దవా కార్యకర్తలు ఎలాంటి ఉగ్రవాద చర్యలకు దిగకుండా దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపాడు. లష్కర్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ అని, ఎన్నో స్కూళ్లను, ఆస్పత్రులు నిర్వహిస్తోందని చెప్పాడు. కశ్మీర్ లష్కర్ యూనిట్తో తాము ఎలాంటి చర్యలకు దిగడం లేదని, అది అక్కడ ఏర్పడిన సంస్థే అని వివరించాడు. ‘భారత్ నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే నా సోదరుడిని గృహనిర్బంధం చేశారని అనుకుంటున్నాం. కశ్మీర్లో ఉన్న సమస్యలపై నుంచి ప్రపంచ దృష్టి తప్పించి హఫీజ్ సయీద్, పాకిస్థాన్పై మరల్చాలని ఇండియా భావిస్తోంది. భారత్ తాను చేసిన తప్పులు దాయాలని చూస్తోంది. అందులో భాగంగానే ఇలా చేస్తోంది. భారత్ ఒత్తిడికి పాకిస్థాన్ మోకరిల్లడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పటికైనా షరీఫ్ భారత్కు మద్దతివ్వడం, ఆ దేశంతో స్నేహానికి ప్రయత్నించడం మానుకోవాలి’ అని మసూద్ చెప్పాడు. -
ఉగ్ర సయీద్కు ఎదురుదెబ్బ
-
ఉగ్ర సయీద్కు ఎదురుదెబ్బ
ఇస్లామాబాద్: ముంబై ఉగ్రదాడిలో కీలక సూత్రధారి, పాక్ ఉగ్రవాది, జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్కు పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్సు గట్టి ఝలక్ ఇచ్చింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం (ఏటీఏ) నాలుగో జాబితాలో అతని పేరును శనివారం చేర్చింది. పాక్ ప్రభుత్వం ఆదేశాల మేరకు హఫీజ్ నిర్వహించే సంస్థలను కూడా ఈ జాబితాలో చేర్చినట్లు పాక్ మీడియా వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం.. ఉగ్రవాదిగా అనుమానమున్న వ్యక్తులపై నిఘా ఉంచుతారని తెలిపింది. అంతేకాకుండా సదరు అనుమానితులు స్థానిక పోలీస్ స్టేషన్లలో అడిగిన ప్రతీసారి కచ్చితంగా హాజరుకావలసి ఉంటుందని వివరించింది. పాకిస్తాన్ హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఉగ్రవాద నిరోధక శాఖ (సీటీడీ) హఫీజ్ పేరును ఏటీఏ జాబితాలో చేర్చింది. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాక్ను ఉగ్రవాద దేశంగా పరిగణించే అవకాశం ఉందని భావించిన పాక్ అధికార యంత్రాంగం హఫీజ్ సయీద్ సహా పలువురిని గతనెల 30న లాహోర్లో గృహ నిర్భందం చేసిన సంగతి తెలిసిందే. అలాగే దేశం విడిచి పారిపోకుండా ఎగ్జిట్ కంట్రోల్ జాబితాలో కూడా హఫీజ్ను చేర్చింది. -
కశ్మీర్ స్వేచ్ఛ కోసం పాక్ ఉగ్రవాది సంస్థ!
ఇస్లామాబాద్: జమాత్ ఉద్ దవా కార్యక్రమాలపై పాకిస్థాన్ ప్రభుత్వం నిఘా పెట్టడం.. ఆ సంస్థ అధినేత, ఉగ్రవాది హఫీజ్ సయీద్ను గృహ నిర్బంధం చేసిన నేపథ్యంలో తెరవెనక సరికొత్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ముంబయి దాడుల సూత్రధారి అయిన హఫీజ్.. తన గృహనిర్బంధానికి వారం ముందే కశ్మీర్ స్వేచ్ఛ కోసం తెహ్రీక్ ఎ ఆజాదీ జమ్మూకశ్మీర్(టీఏజేకే) అనే సంస్థను ప్రారంభిస్తున్నట్లు సూచించాడు. ఆ మేరకే సయీద్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న జమాత్ ఉద్ దవా, ఫలా ఎ ఇన్సానియత్ ఫౌండేషన్ల కార్యక్రమాలను టీఏజేకే అనే కొత్త సంస్థ పేరుతో చేపట్టేందుకు రంగం సిద్ధంచేశాడని అధికారులు ధ్రువీకరిస్తున్నారు. వేర్పాటువాదులు ఫిబ్రవరి 5న పాకిస్థాన్లో కాశ్మీర్ డే పేరుతో కార్యక్రమం జరుపుతారు. దానికి సంబంధించిన బ్యానర్లు తెహ్రీక్ ఎ ఆజాదీ జమ్ము కశ్మీర్ పేరుతో లాహోర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కన్పించాయి. -
‘దావూద్ను పట్టి తేవడం చిటికెలో పని’
మరిన్ని సర్జికల్ దాడులు కొట్టిపారేయలేం పాక్ ఉగ్రసంస్థలు రెచ్చిపోతే చూస్తూ ఊరుకోం సయీద్ గృహనిర్భంధం కంటితుడుపు చర్యే చిత్తశుద్ధి ఉంటే వెంటనే సయీద్ను జైలులో పెట్టాలి: రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్, కరడుగట్టిన ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడం తమకు చిటికె వేసినంత సేపు పని అని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈ విషయంలో తాము కచ్చితంగా విజయం సాధిస్తామని, అతడిని పట్టుకొస్తామన్న నమ్మకం తమకుందని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన పలు విషయాల్లో చాలా స్పష్టంగా మాట్లాడారు. ముఖ్యంగా పాక్ విషయంలో తమ ప్రభుత్వ వైఖరిని కుండబద్ధలు కొట్టారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో మరిన్ని సర్జికల్ దాడులు జరిగే అవకాశాన్ని తీసిపారేయలేమని తెలిపారు. పాకిస్థాన్ తమ పొరుగు దేశం అని, ఒక వేళ మంచి కోసం పాక్ మారదామని అనుకున్నా ఆ దేశం మాటలు నమ్మి ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా లేమని, అసలు అలాంటి అడుగు వేయాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేశారు. అయితే, పాక్ నుంచి ఏ ఉగ్రసంస్థగానీ, ఉగ్రవాదులుగానీ భారత్పైకి దాడి చేసేందుకు వస్తే మాత్రం తాము చూస్తూ ఊరుకోబోమని, మరిన్ని సర్జికల్ దాడులు జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. అయితే, ఇలాంటివి జరగాలని తాము కోరుకోవడం లేదని, అలాంటి పరిస్థితి ఉంటే తప్పక ధీటుగా స్పందిస్తామని తెలిపారు. గత నాలుగు నెలల కిందట భారత్ సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో సర్జికల్ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. సయీద్ గృహనిర్భంధంపై స్పందిస్తూ.. ‘ఉగ్రవాది, లష్కరే ఈ తోయిబా, జమాతే ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ను గృహ నిర్బంధం చేయడం ఒక కంటి తుడుపుచర్యే. నిజంగా పాక్కు చిత్తశుద్ధి ఉంటే అతడిని ఈ పాటికే జైలు ఊచలు లెక్కబెట్టిస్తుండాలి. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అందుకు సంబంధించిన ఆధారాలు ఇప్పటికే ఉన్నాయి కూడా’ అని రాజ్నాథ్ అన్నారు. దావూద్పై స్పందిస్తూ.. ఎన్నేళ్ల నుంచో తప్పించుకుని తిరుగుతున్న దావూద్ పాక్లోనే తలదాచుకున్నాడని తెలుసు. అతడిని పట్టుకొని తీసుకురావడం మాకు చిటికెవేసినంతసేపు పని. అతడిని వెనక్కి తీసుకురావడంలో విజయంసాధిస్తామన్న నమ్మకం నాకుంది. -
‘ఉగ్రవాదులు వచ్చిందే మీ దేశం నుంచి..’
న్యూఢిల్లీ: ఉగ్రవాది, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ నేర చరిత్రకు సంబంధించిన ఆదారాలన్నీ కూడా పాకిస్థాన్కు అందుబాటులో ఉన్నాయని భారత్ స్పష్టం చేసింది. 2008లో ముంబయిలో పేలుళ్లకు సంబంధించి కీలక సూత్రదారి అయిన హఫీజ్ను ఇప్పటికే పాక్ ప్రభుత్వం గృహనిర్బంధం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాక్ స్పందిస్తూ ముంబయి పేలుళ్లకు సంబంధించి స్పష్టమైన పకడ్బంధీ ఆధారాలు తమకు అందించాలని భారత్ను కోరింది. దీనికి భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ స్పందిస్తూ ముంబయి దాడికి సంబంధించిన ప్రణాళిక మొత్తం పాక్లోనే జరిగిందని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు కూడా పాక్ నుంచే వచ్చారని, అందుకే ఆధారాలు కూడా పాక్లోనే ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని ఆయన బదులిచ్చారు. -
సయీద్పై ఎఫ్ఐఆర్.. ఇక వరుస అరెస్టులు!
లాహోర్: ముంబయి దాడుల కీలక సూత్రదారి, ఉగ్రవాది జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్పై ఎఫ్ఐఆర్ నమోదుకానుంది. ఈ మేరకు పాక్కు చెందిన ఓ సీనియర్ మంత్రి చెప్పారు. అయితే, అతడిపై ఏ కేసుకింద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారనే విషయం ఇంకా తెలియలేదు. ‘సయీద్పై చర్యలు తీసుకుంటున్నాం. అతడిపై ఉన్న ఆరోపణలన్నీ పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఇప్పటికే ప్రభుత్వం అతడిని గృహ నిర్బంధం చేసింది. ఇక త్వరలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం’ అని ఫెడరల్ కామర్స్ మంత్రి ఖుర్రం దస్తగిర్ బుధవారం మీడియాకు చెప్పారు. ఏ కేసు అనే విషయం త్వరలోనే చెప్తామని స్పష్టం చేశారు. త్వరలోనే జమాత్ సంస్థకు, ఫలాహ ఈ ఇన్సాన్యత్(ఎఫ్ఈఎఫ్)కు చెందిన కార్యకర్తలందరినీ కూడా అరెస్టు చేస్తామని పంజాబ్ ప్రావిన్స్ న్యాయశాఖ మంత్రి రాణా సనావుల్లా తెలిపారు. ప్రస్తుతానికి వారందరిపై పరిశీలన పెట్టామని, త్వరలోనే యాంటీ టెర్రరిజం యాక్ట్ కింద అరెస్టు చేస్తామని తెలిపారు. జాతీయ అవసరాల విషయంతో తాము అస్సలు రాజీపడబోమని, కశ్మీర్ విషయంలో తమ విధానం వేరని చెప్పారు. జమాత్కు కశ్మీర్కు సంబంధం లేదని, అవి వేర్వేరు విషయాలని అన్నారు. ఇదిలా ఉండగా సయీద్ అరెస్టు విషయంలో ఇప్పటికే ఆయా పార్టీలకు చెందిన నేతల్లో చీలికలు వచ్చాయంట. -
నా అరెస్టు ప్రేరణనిస్తుంది
కశ్మీరీ ఉద్యమంపై ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ లాహోర్: ‘‘వాషింగ్టన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే.. నన్ను గృహనిర్బంధంలోకి తీసుకు న్నారు. నన్ను నిర్బంధించడం ద్వారా కశ్మీర్లోని స్వేచ్ఛా ఉద్యమానికి చెక్ పెట్టవచ్చని ఎవరైనా భావిస్తే.. వారు కచ్చితంగా భ్రమల్లో ఉన్నట్లే. భారత్ కు వ్యతిరేకంగా కశ్మీరీలు జరుపుతున్న ఉద్యమానికి నా అరెస్టు ప్రేరణనిస్తుంది’’ అని ముంబై పేలుళ్ల సూత్రధారి, జేయూడీ ఉగ్రవాద సంస్థ నాయకుడు హఫీజ్ సయీద్ పేర్కొన్నాడు. తన అరెస్టు ద్వారా కశ్మీర్లో ఉపశమనం లభిస్తుందని భారత ప్రధాని మోదీ భావిస్తే.. అది పెద్ద తప్పేనన్నాడు. ‘2017ను కశ్మీరీల సంఘీభావ సంవత్స రంగా నిర్ణయించాం. పాక్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఫిబ్రవరి 5న కార్యక్రమా లు నిర్వహించాలని నిర్ణయించాం’ అని చెప్పాడు. కాగా, సయీద్తో పాటు మరో నలుగురు ఉగ్రవాదులను గృహ నిర్బంధంలోకి తీసుకోవడంపై పాక్ ఆర్మీ స్పందిస్తూ.. ఇది జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న విధానపరమైన నిర్ణయమని ప్రకటించింది. సయీద్ను ఉగ్రవాద వ్యతిరేక చట్టం ప్రకారం 90 రోజుల పాటు గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. పాక్ ప్రభుత్వం రానున్న రోజుల్లో జేయూడీతో పాటు దాని సోదర సంస్థలకు వ్యతిరేకంగా పలు చర్యలు తీసుకునే అవకాశముందని చెప్పారు. ‘సయీద్ నిర్బంధంపై సంబంధిత విభాగం ఒకట్రెండు రోజుల్లో మరింత సమాచారం ఇవ్వవచ్చు’ అని మిలటరీ ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ తెలిపారు. సయీద్ను గృహ నిర్బంధంలోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ లాహోర్, ముల్తాన్ , కరాచీల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. -
ట్రంప్-మోదీ దోస్తీపై సయీద్ ఫైర్!
ట్రంప్ సర్కార్ ఒత్తిడితో ఉగ్రవాద సూత్రధారి హఫీజ్ సయీద్కు వ్యతిరేకంగా పాకిస్థాన్ అధికారులు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ముంబై దాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దావా (జేయూడీ) అధినేత అయిన సయీద్ను పాక్ పోలీసులు ఆదివారం రాత్రి గృహనిర్బంధంలో ఉంచారు. అయితే, లాహోర్లోని తన నివాసంలోనే గృహనిర్బంధంలో ఉన్న సయీద్ ఒక వీడియో ఫుటేజ్ను విడుదల చేశాడు. అమెరికా-భారత్ మధ్య అనుబంధం బలపడుతుండటమే తన హౌజ్ అరెస్టుకు కారణమని ఆయన ఈ వీడియోలో నిందించాడు. తనను అరెస్టు చేయాలని పాక్ ప్రభుత్వంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి తెచ్చారని, తద్వారా భారత ప్రధాని మోదీతో ఆయన తన స్నేహాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అంతకుముందు జేయూడీ అధికారి అహ్మద్ నదీమ్ మాట్లాడుతూ కూడా ఇదేవిధంగా అమెరికా, భారత్పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అమెరికా, భారత్లను సంతృప్తిపరిచేందుకు సయీద్ను పాక్ ప్రభుత్వం అరెస్టు చేసిందని, జేయూడీ కార్యాలయం వద్ద భారీగా బలగాలను మోహరించి తమను భయపెడుతున్నదని ఆయన విమర్శించారు. దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి (అమెరికా దిక్కులు పిక్కటిల్లేలా..) (ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్) (ట్రంప్ ‘నిషేధం’: ఐసిస్ విజయోత్సవాలు) (ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం!) (అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి) (ట్రంపోనమిక్స్ మనకు నష్టమా? లాభమా?) (ట్రంప్గారు మా దేశంపై నిషేధం విధించండి!) (ట్రంప్కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో!) (వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా) -
పాక్ ఉగ్ర సూత్రధారికి ట్రంప్ ఝలక్!
-
బ్రేకింగ్: పాక్ ఉగ్ర సూత్రధారికి ట్రంప్ ఝలక్!
హఫీజ్ సయీద్ హౌజ్ అరెస్టు.. ఆకస్మికంగా చర్యలు తీసుకున్న పాక్ ఇస్లామాబాద్: ముంబై దాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దావా (జేయూడీ) అధినేత హఫీజ్ సయీద్కు పాకిస్థాన్ అధికారులు సడన్గా ఝలక్ ఇచ్చారు. ఆయనతోపాటు జేయూడీకి చెందిన మరో నలుగురిని గృహనిర్బంధం (హౌజ్ అరెస్టు)లో ఉంచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఒత్తిడి మేరకే పాక్లో యథేచ్ఛగా తిరుగుతున్న సయీద్పై ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. లాహోర్ చౌబుర్జీలోని జమియా మసీద్ ఆల్ ఖద్సియా వద్ద సయీద్కు గృహనిర్బంధాన్ని విధించారు. ఇక్కడ జేయూడీ ప్రధాన కార్యాలయం ఉంది. ఇక్కడే ఉన్న సయీద్ నివాసాన్ని సబ్ జైలుగా మార్చి.. ఆయనను గృహ నిర్బంధంలో కొనసాగించనున్నట్టు అధికారులు తెలిపారు. పాక్ కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఈ నెల 27న జారీచేసిన ఆదేశాల మేరకు పంజాబ్ ప్రావిన్స్ హోంత్రిత్వశాఖ సయీద్ హౌజ్ అరెస్టుకు ఆదేశాలిచ్చింది. భారీ ఎత్తున మోమరించిన పోలీసులు జేయూడీ ప్రధాన కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని జేయూడీ సభ్యుడు నదీమ్ పేర్కొన్నారు. పాక్ ప్రభుత్వం బయటి ఒత్తిడికి తలొగ్గి ఈ నిర్ణయం తీసుకుందని, భారత్ను సంతృప్తిపరిచేందుకు సయీద్ను అదుపులోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ఐరాస భద్రతా మండలి సయీద్పై ఆంక్షలు విధించిన నేపథ్యంలో అతన్ని అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్నట్టు అంతకుముందు పాక్ హోంమంత్రి చౌదరి నిస్సార్ అలీఖాన్ తెలిపారు. జేయూడీ అణచివేతకు చర్యలు తీసుకోకుంటే పాక్పై ఆంక్షలు తప్పవని అమెరికా సర్కార్ హెచ్చరించిందని, అందుకే సయీద్ను అదుపులోకి తీసుకున్నారని పాక్కు చెందిన న్యూస్డైలీ పేర్కొంది. సయాద్ స్థాపించిన కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా 26/11 ముంబై దాడులకు పాల్పడి.. మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. లష్కరేపై నిషేధం విధించడంతో దీనికి ముసుగు సంస్థగా జేయూడీని సయీద్ స్థాపించాడు. ఇది కూడా ఉగ్రవాద సంస్థనని ఇప్పటికే అమెరికా, ఐరాస ప్రకటించిన సంగతి తెలిసిందే.