tungabhadra
-
తుంగభద్రలో ఏటా 699.34 టీఎంసీల లభ్యత
సాక్షి, అమరావతి: కృష్ణా ప్రధాన ఉప నది అయిన తుంగభద్రలో ఏటా సగటున 699.34 టీఎంసీల లభ్యత ఉంటుందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా తేల్చింది. తుంగభద్ర సబ్ బేసిన్లో 2003–04 నుంచి 2022–23 వరకూ 20 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా తీసుకుని నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. కృష్ణా నదిలో 38 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా అధ్యయనం చేసిన సీడబ్ల్యూసీ 3,048.37 టీఎంసీల లభ్యత ఉంటుందని ఇటీవల అంచనా వేసింది. ఇందులో గరిష్టంగా తుంగభద్ర సబ్ బేసిన్ నుంచే వస్తుందని లెక్కగట్టింది.తుంగభద్ర సబ్ బేసిన్ ఇదీకర్ణాటక పశ్చిమ కనుమల్లోని వరాహ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 1,458 మీటర్ల ఎత్తులో గంగమూల వద్ద వేర్వేరు ప్రాంతాల్లో తుంగ, భద్ర జన్మిస్తాయి. తుంగ 147 కి.మీ., భద్ర 171 కి.మీ, దూరం ప్రయాణించాక కూడలి వద్ద సంగమించి తుంగభద్రగా మారిన అనంతరం 531 కి.మీ. దూరం ప్రవహించి.. తెలంగాణలోని జోగులాంబ జిల్లా గుండిమల వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. తుంగభద్ర సబ్ బేసిన్ 70,764 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. కృష్ణా నదికి అతి పెద్ద ఉప నది తుంగభద్ర.అధ్యయనంలో వెల్లడైన అంశాలివి⇒ 2002–03 నుంచి 2022–23 వరకూ 20 ఏళ్లలో సగటున ఏటా 862.47 మి.మీ. వర్షపాతం కురిసింది. దీని పరిమాణం 2,155.58 టీఎంసీలు.⇒ బాష్ఫీభవనం (ఆవిరి) రూపంలో ఏటా 1,633.20 టీఎంసీలు వాతావరణంలో కలుస్తాయి.⇒ సబ్ బేసిన్లో సాగు చేసిన పంటల ద్వారా ఏటా సగటున 190.02 టీఎంసీలు ఆవిరవుతాయి. ⇒ నదీ పరివాహక ప్రాంతంలోని జలాశయాల్లో ఏటా సగటున 24.02 టీఎంసీలు ఆవిరి రూపంలో వాతావరణంలో కలుస్తాయి.⇒ సాగు, తాగు, పారిశ్రామిక, గృహ అవసరాలకు ఏటా సగటున 699.34 టీఎంసీల లభ్యత ఉంటుంది. ⇒ సబ్ బేసిన్లలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
కృష్ణా, తుంగభద్ర పోటాపోటీ
సాక్షి, అమరావతి/హొసపేటె/శ్రీశైలం ప్రాజెక్ట్: కృష్ణా, ప్రధాన ఉప నది తుంగభద్ర పోటాపోటీగా వరదెత్తుతున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు జూరాల నుంచి 3.12 లక్షల క్యూసెక్కుల కృష్ణా జలాలు.. సుంకేశుల నుంచి 99,736 క్యూసెక్కుల తుంగభద్ర జలాలు వెరసి శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,12,280 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 866.4 అడుగుల్లో 127.59 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు కుడి కేంద్రంలో ఏజీ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ 18,480 క్యూసెక్కులు.. ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులను దిగువకు వదులుతోంది. కృష్ణా, తుంగభద్రల నుంచి భారీ వరద వస్తుండటంతో సోమ లేదా మంగళవారం ప్రాజెక్టు గేట్లు ఎత్తేయనున్నారు. నాగార్జునసాగర్లోకి 52,599 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 507.80 అడుగుల్లో 127.97 టీఎంసీలకు చేరుకుంది. కృష్ణా ప్రధాన పాయలో ఉధృతి మరింత పెరిగింది. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్లలోకి వచి్చన వరదను వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్రలో ఉధృతి మరింత పెరిగింది. డ్యామ్లోకి 1.21 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో.. మొత్తం 33 గేట్లు ఎత్తేసి, విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 1.58 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. దాంతో మంత్రాలయం వద్ద తుంగభద్ర ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వరద మట్టం 311.25 మీటర్లు(సముద్రమట్టానికి)కు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సుంకేశుల బ్యారేజ్లోకి 1,02,100 క్యూసెక్కులు చేరుతుండగా.. కేసీ కెనాల్కు 1,540 క్యూసెక్కులు వదులుతూ గేట్లు ఎత్తి దిగువకు 99,736 క్యూసెక్కులను వదిలేస్తున్నారు. దీంతో ఆదివారం శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉధృతి మరింత పెరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. -
కృష్ణమ్మకు జలకళ
సాక్షి, హైదరాబాద్: పరీవాహక ప్రాంతం(బేసిన్)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానది జలకళ సంతరించుకుంది. ప్రధాన పాయతోపాటు ఉప నదులు కూడా పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్లు ఇప్పటికే నిండుకుండలా మారడంతో వచి్చన వరదను వచి్చనట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. ఆ వరద అంతా జూరాలకు వస్తుండగా.. 37 గేట్లు ఎత్తేసి నీటిని విడుదల చేస్తున్నారు. అలా కృష్ణమ్మ పరుగుపరుగున శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతోంది. మరోవైపు కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రలో వరద ఉధృతి పెరిగింది. తుంగభద్ర డ్యామ్ నిండుకుండలా మారింది.ఎగువ నుంచి మరింత వరద వస్తుండటంతో.. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు గేట్లు ఎత్తి నీటిని వదలడం ప్రారంభించారు. నీటి విడుదలను క్రమేణా పెంచుతామని, నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జల వనరుల శాఖ అధికారులకు తుంగభద్ర బోర్డు సమాచారం ఇచ్చింది. తుంగభద్ర డ్యామ్ నుంచి విడుదలవుతున్న నీళ్లు సుంకేశుల బరాజ్ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతాయి. ఇటు జూరాల నుంచి, అటు సుంకేశుల నుంచి వచ్చే ప్రవాహాలతో.. శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద భారీగా పెరగనుంది. సాగర్ ఎడమ కాల్వ కట్టకు బుంగ నడిగూడెం: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం సమీపాన సాగర్ ఎడమ కాల్వ కట్టకు ఆదివారం రాత్రి బుంగ పడింది. కట్టతోపాటు, కాల్వ లైనింగ్ కూడా కోతకు గురైంది. దీంతో అధికారులు కృష్ణానగర్, చాకిరాల వంతెనల వద్ద రాకపోకలను నిలిపివేస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. బుంగపడిన చోట కంచె ఏర్పాటు చేశారు. గతంలో ఏర్పడిన చిన్న బుంగ ప్రస్తుతం పెద్దగా మారి, కట్ట పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఏర్పడిందని రైతులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కాల్వ కట్టలకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. -
‘కృష్ణా’లో స్థిరంగా వరద ఉధృతి
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/విజయపురిసౌత్ (మాచర్ల)/అచ్చంపేట/పోలవరం రూరల్: పరీవాహక ప్రాంతంలో ఎగువన ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతుండగా గోదావరిలో క్రమంగా తగ్గుతోంది. జూరాల నుంచి కృష్ణా, సుంకేశుల నుంచి తుంగభద్ర ద్వారా శనివారం సా.6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,25,563 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 14 వేలు, హంద్రీ–నీవా ద్వారా 1,688 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం ద్వారా 30,252, ఎడమ కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రాజెక్టులో 884.3 అడుగుల్లో 211.47 టీఎంసీలను నిల్వచేస్తూ.. పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,76,170 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. సాగర్లోకి 4.09 లక్షల క్యూసెక్కులు అలాగే, నాగార్జునసాగర్లోకి 4,09,963 క్యూసెక్కులు చేరుతుండగా.. 586.3 అడుగుల్లో 301.87 టీఎంసీలను నిల్వచేస్తూ.. 3,58,120 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల్లోకి 3,77,117 క్యూసెక్కులు చేరుతుండగా.. 168.01 అడుగుల్లో 35.59 టీఎంసీలను నిల్వచేస్తూ.. 17 గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 3,40,827 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఇక పులిచింతల నుంచి దిగువకు వదిలేస్తున్న నీటికి పాలేరు, మున్నేరు వరద తోడవుతుండడంతో ప్రకాశం బ్యారేజ్లోకి 4,15,036 క్యూసెక్కులు చేరుతోంది. మిగులుగా ఉన్న 4,02,944 క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంలో ఆల్మట్టి, నారాయణపూర్లలోకి వచ్చిన నీటిని వచ్చిట్లుగా 2.30 లక్షల క్యూసెక్కులను, తుంగభద్ర డ్యామ్ నుంచి 1.05 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం కూడా శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్లలోకి ఇదే రీతిలో వరద కొనసాగనుంది. గోదావరిలో క్రమంగా తగ్గుముఖం మరోవైపు.. గోదావరిలోనూ వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ఆదివారం నాటికి మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భద్రాచలం వద్ద నీటిమట్టం 52 అడుగుల్లో కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టులోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. దీంతో శనివారం రాత్రి 9 గంటలకు ధవళేశ్వరం బ్యారేజి వద్ద నీటి మట్టం 14.90 అడుగులకు చేరింది. మిగులుగా ఉన్న 14,74,377 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
శ్రీశైలంలో 199.27 టీఎంసీల నిల్వ
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్: కృష్ణా, తుంగభద్ర వరద జలాలకు స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వస్తున్న నీరు తోడవుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు సుంకేశుల బ్యారేజ్ నుంచి 1,28,985 క్యూసెక్కులు, జూరాలలో విద్యుదుత్పత్తి చేస్తూ వదులుతున్న 44,047 క్యూసెక్కులకు హంద్రీ నుంచి వస్తున్న 250 క్యూసెక్కులు చేరడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,73,282 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుద్పత్తి చేస్తూ దిగువకు 63,885 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 882.1 అడుగుల్లో 199.27 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేస్తూ విడుదల చేస్తున్న జలాలకు స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వస్తున్న ప్రవాహం తోవడంతో సాగర్లోకి 67,722 క్యూసెక్కులు చేరుతున్నాయి. కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీ ప్రాజెక్టులకు 9,351 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్లో 560.4 అడుగుల్లో 233.35 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సాగర్కు దిగువన మూసీ పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల కృష్ణా వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టులోకి 10,400 క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుదుత్పత్తి చేస్తూ అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. వాటికి పాలేరు, మున్నేరు, కట్టలేరు తదితర వాగులు, వంకల ప్రవాహం తోడవడంతో ప్రకాశం బ్యారేజ్లోకి 22,955 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఇందులో కృష్ణా డెల్టాకు 12,031 క్యూసెక్కులు విడుదల చేస్తూ.. మిగులుగా ఉన్న 10,924 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల వల్ల ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్లలోకి స్థిరంగా వరద కొనసాగుతుండటం, వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తుండటంతో గురువారమూ శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇదే రీతిలో వరద ప్రవాహం కొనసాగనుంది. ఇక పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో గోదావరిలో వరద ప్రవాహం మరింతగా తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజ్లోకి 2,76,712 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 10,100 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 2,66,612 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
సుంకేసుల బ్యారేజీకి పరుగులు తీస్తున్న తుంగభద్ర
-
9న కృష్ణా బోర్డు భేటీ
సాక్షి, అమరావతి: తుంగభద్ర జలాల్లో చౌర్యానికి అడ్డుకట్ట వేయడమే అజెండాగా ఈనెల 9న హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు నీళ్లను మళ్లించకుండా అడ్డుకట్ట వేసి.. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను పరిరక్షించడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యమని బోర్డు వర్గాలు తెలిపాయి. తుంగభద్ర జలాశయంలో కేసీ కెనాల్కు 10 టీఎంసీల కోటా ఉంది. నదిలో సహజ ప్రవాహం లేనప్పుడు, సుంకేశుల బ్యారేజీ వద్ద నీటి లభ్యత లేనప్పుడు.. ఈ కోటా నీటిని విడుదల చేయాలని తుంగభద్ర బోర్డుకు ఏపీ ఈఎన్సీ ప్రతిపాదనలు పంపిస్తుంటుంది. ఆ మేరకు తుంగభద్ర బోర్డు నీటిని విడుదల చేస్తుంది. తుంగభద్ర జలాశయం నుంచి ఆ నీళ్లు నదీ మార్గంలో రాజోలిబండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్)కు చేరగానే.. వాటిని ఎడమ కాలువ ద్వారా కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు మళ్లిస్తున్నాయి. సుంకేశుల బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా నీళ్లను చౌర్యం చేస్తోంది. కృష్ణా బోర్డు జాయింట్ కమిటీ ఇటీవల క్షేత్ర స్థాయిలో నిర్వహించిన తనిఖీల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల జలచౌర్యం బయటపడింది. దీనికి అడ్డుకట్ట వేయకపోతే ఏపీ హక్కులకు భంగం కలుగుతుందని జాయింట్ కమిటీ తేల్చిచెబుతూ కృష్ణా బోర్డుకు నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను 9వ తేదీన నిర్వహించే బోర్డు సమావేశంలో చైర్మన్ ఎంపీ సింగ్ ప్రవేశపెట్టనున్నారు. జలచౌర్యానికి అడ్డుకట్ట వేసేందుకు.. ఆర్డీఎస్ను ఏపీ, తెలంగాణ, కర్ణాటక అధికారులతో కూడిన జాయింట్ కమిటీ పర్యవేక్షణలో నిర్వహించాలని ప్రతిపాదించనున్నారు. ఎడమ కాలువపై టెలీమీటర్లు ఏర్పాటు చేసి.. నీటి వినియోగాన్ని ఎప్పటికప్పుడు లెక్కించాలని సూచించే అవకాశముంది. కోటాకు మించి వాడుకుంటే.. అదనంగా ఉపయోగించుకున్న నీటిని ఆ రాష్ట్ర కోటాలో కలిపి.. కోత వేయనున్నట్లు సమాచారం. అనుమతి లేకుండా నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతలను పూర్తిగా ఆపేయాలని స్పష్టం చేసే అవకాశముంది. వీటిపై సమావేశంలో మూడు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుని.. తుది నిర్ణయం తీసుకోనున్నారు. -
Kurnool: జల ప్రళయానికి 12 ఏళ్లు
తుంగభద్ర నది ఉగ్ర రూపం.. కృష్ణానది విలయ తాండవం.. వెరసి జిల్లాకు జల ప్రళయం. కర్నూలు చరిత్రలో ఎన్నడూ చూడని వరద. పుష్కర కాలం గడిచినా ఆ కన్నీటి జ్ఞాపకాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. వాటిని తలుచుకుంటే హృదయం ద్రవిస్తుంది. 2009 సెప్టెంబర్ చివరిలో ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షాలకు నదులు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అక్టోబర్ 2వ తేదీన తుంగభద్ర తీరంలో ఉన్న మంత్రాలయం మొదలు నదీ పరీవాహక ప్రాంతాలు జలమయం అయ్యాయి. లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండటంతో శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్ల పైనుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కింది. సుంకేసుల ప్రాజెక్ట్ కట్టలు తెంచుకోవడం, కృష్ణానది జలాలు వెనక్కు ముంచెత్తడంతో కర్నూలు నగరం అతలాకుతలమైంది. కొండారెడ్డి బురుజు సగానికి మునిగిపోయింది. అంతటా హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. ఆ రోజు రాత్రి కాళరాత్రిగా మారింది. తెల్లారేసరికి వేల మంది కట్టుబట్టలతో మిగిలారు. ఇళ్లల్లోకి బురద చేరి.. వ్యవసాయ భూములు కోతకు గురై.. ఎంతో మంది రోడ్డున బడ్డారు. దాదాపు 50 మంది మృత్యువాత పడ్డారు. రూ. కోట్లలో నష్టం వాటిల్లింది. కోలుకోవడానికి సంవత్సరాలు పట్టింది. నాటి వదర బీభత్సానికి నిదర్శనమే ఈ చిత్రాలు.. – కర్నూలు -
బిరబిరా కదిలొస్తున్న కృష్ణమ్మ
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/బళ్లారి/జూపాడు బంగ్లా: కృష్ణా నదిలో వరద ఉధృతి మరింత పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 4.05 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతుండగా.. గడచిన 24 గంటల్లో ప్రాజెక్టులోకి 27.37 టీఎంసీలు చేరాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రాజెక్టులో 93.58 టీఎంసీలు నిల్వ ఉండగా.. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 120.95 టీఎంసీలకు చేరింది. మరోవైపు తుంగభద్ర పరవళ్లు తొక్కుతుండటంతో తుంగభద్ర డ్యామ్లోకి 1.81 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. నీటి నిల్వ 88.66 టీఎంసీలకు చేరుకోవడంతో డ్యామ్ గేట్లు ఎత్తివేసి దిగువకు 46.5వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ఆదివారం అర్ధరాత్రికి దిగువకు విడుదల చేసే ప్రవాహాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచుతామని తుంగభద్ర బోర్డు వర్గాలు శ్రీశైలం ప్రాజెక్టు అధికారులకు సమాచారం ఇచ్చాయి. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వదులుతున్న నీటిలో సాగర్కు 31,784 క్యూసెక్కులు చేరుతున్నాయి. మూసీ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 13,800 క్యూసెక్కులు చేరుతుండగా.. తెలంగాణ సర్కార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ అంతే స్థాయిలో దిగువకు నీటిని వదిలేస్తోంది. ఆ ప్రవాహానికి కట్టలేరు, మున్నేరు, వైరా వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 55,571 క్యూసెక్కులు చేరుతోంది. కృష్ణా డెల్టా కాలువలకు 3,631 క్యూసెక్కులు వదలుతూ.. మిగులుగా ఉన్న 51,940 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను అడుగు మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నామని ఈఈ స్వరూప్ తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని పోతిరెడ్డిపాడు నూతన హెడ్ రెగ్యులేటర్ 4, 5, 6 గేట్లను అడుగుమేర ఎత్తి 4 వేల క్యూసెక్కుల నీటిని ఆదివారం దిగువకు విడుదల చేశారు. ఈ నీటిని బానకచర్ల నీటి నియంత్రణ సముదాయం నుంచి తెలుగు గంగ కాల్వకు మళ్లిస్తున్నట్టు అధికారులు తెలిపారు. -
24 గంటల్లో 27.37 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్/ భద్రాచలం/ కాళేశ్వరం: కృష్ణా నది పరవళ్ళు తొక్కుతోంది. ఎగువ నుంచి దిగువకు పరుగులు పెడుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 24 గంటల్లో 27.37 టీఎంసీలు చేరాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రాజెక్టులో 93.58 టీఎంసీలు ఉన్న నీటి నిల్వ .. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 120.95 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టులోకి ఏ స్థాయిలో వరద ఉధృతి ఉందో ఇది స్పష్టం చేస్తోంది. తుంగభద్ర పోటెత్తడంతో డ్యామ్లోకి 1.81 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. నీటి నిల్వ 88.66 టీఎంసీలకు చేరుకోవడంతో గేట్లు ఎత్తి దిగువకు 40 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ఆదివారం అర్ధరాత్రికి దిగువకు విడుదల చేసే ప్రవాహాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచుతామని తుంగభద్ర బోర్డు వర్గాలు శ్రీశైలం ప్రాజెక్టు అధికారులకు సమాచారం ఇచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చే వరద మరింతగా పెరగనుంది. ప్రస్తుతం 4,05,064 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 95 టీఎంసీలు అవసరం. వరద ఉధృతి ఇలానే కొనసాగితే గురువారం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. సాగర్కు 31,784 క్యూసెక్కులు శ్రీశైలంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తూ వదులుతున్న నీటితో కలిపి సాగర్కు 31,784 క్యూసెక్కులు చేరుతున్నాయి. మూసీ నుం చి పులిచింతల ప్రాజెక్టులోకి 13,800 క్యూసెక్కులు చేరుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తూ అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తోంది. ప్రమాద హెచ్చరికల ఉపసంహరణ గోదావరి నది శాంతించింది. భద్రాచలం వద్ద వరద తగ్గింది. ఆదివారం తెల్లవారుజామున నీటిమట్టం 48 అడుగులకు తగ్గడంతో రెండో ప్రమాద హెచ్చరికను, సాయంత్రం 4 గంటలకు 43 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను సైతం అధికారులు ఉపసంహరించారు. కాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద శుక్రవారం 13.70 మీటర్లు ఉన్న నీటిమట్టం ఆదివారం నాటికి 9.50 మీటర్లకు చేరింది. -
ఎత్తిపోతల పథకం.. సీమకు శరణ్యం
సాక్షి, కడప: శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ ప్రభుత్వం దిగువకు తోడేస్తుండడంతో కరువుకు నిలయమైన వైఎస్సార్ జిల్లా వాసుల్లో ఆందోళన నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ఇదే వైఖరితో ముందుకు సాగితే రాయలసీమ, ముఖ్యంగా వైఎస్సార్ జిల్లాతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలు సాగు, తాగునీటి కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఏడాది భారీ వర్షాలు కాకుండా సాధారణ వర్షపాతం నమోదయ్యే పక్షంలో దిగువ జిల్లాలకు ముఖ్యంగా వైఎస్సార్ జిల్లాకు నీటి ఇక్కట్లు తప్పవు. గత రెండేళ్లలో ప్రభుత్వం జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను నీటితో నింపడంతో లక్షలాది ఎకరాలలో పచ్చని పంటలు కళకళలాడాయి. అప్పట్లో కృష్ణా జలాల కంటే తుంగభద్ర క్యాచ్మెంట్ ఏరియాల్లోని వర్షపు నీరే తాము వాడుకున్నామని ఈ ప్రాంత సాగు నీటి రంగ నిపుణులు పేర్కొంటున్నారు. రాబోయే కాలంలో వర్షాలు తగ్గుముఖం పట్టి తెలంగాణ ప్రభుత్వం ఇదే వైఖరితో ముందుకు సాగితే జిల్లా మళ్లీ కరువు కోరల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వరద సమయంలో త్వరితగతిన నీటిని తెచ్చుకుని ప్రాజెక్టులు నీటితో నింపాలన్న ఉద్దేశంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మొదలు పెట్టింది. ప్రభుత్వం చేపట్టిన ఈ పథకమే శరణ్యమని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. జిల్లాలో సాగునీటి వనరుల పరిస్థితి జిల్లాలో తెలుగుగంగ పరిధిలోని బ్రహ్మంసాగర్ రిజర్వాయర్తోపాటు సబ్సిడరీ రిజర్వాయర్–1, సబ్సిడరీ రిజర్వాయర్–2, గండికోట, మైలవరం, వామికొండ, సర్వరాయసాగర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పైడిపాలెం, లోయర్ సగిలేరు, బుగ్గవంక, అన్నమయ్య ప్రాజెక్టు, వెలిగల్లు, పింఛా ప్రాజెక్టులతోపాటు కేసీ కెనాల్ ఉండగా, వీటి పరిధిలో 94.489 టీఎంసీల నీరు అవసరముంది. ఇందులో నాలుగు ప్రాజెక్టులు మినహా మిగిలిన 10 సాగునీటి వనరులు కృష్ణా, తుంగభద్ర జలాలపైనే ఆధారపడి ఉన్నాయి. వీటి పరిధిలో 86.989 టీఎంసీల నీరు అవసరముంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొలువుదీరాక రెండు సంవత్సరాల్లో జిల్లాతోపాటు ఎగువ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. కృష్ణానదితోపాటు రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపురం పరిధిలోని తుంగభద్ర నది సైతం పొంగి ప్రవహించాయి. తుంగభద్ర నీళ్లు పెద్ద ఎత్తున కృష్ణాలో కలిశాయి. దీంతో శ్రీశైలం నుంచి భారీ స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేశారు. జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను ప్రభుత్వం నీటితో నింపింది. గండికోటలో పూర్తి సామర్థ్యం 26.850 టీఎంసీల నీటిని నిల్వ పెట్టింది. తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలోని సాగునీటి వనరులకు 18 టీఎంసీలు, కేసీ కెనాల్కు సుమారు 10 టీఎంసీల నీటిని తరలించారు. దీంతో జిల్లాలోని బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, కడప తదితర నియోజకవర్గాల పరిధిలో లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందింది. భూగర్భ జలాలు పెరిగి బోరు బావులకు నీరు చేరింది. అదనపు ఆయకట్టుకు సాగునీరు, తాగునీటి ఇబ్బందులు తీరాయి. తెలంగాణ వైఖరితో జిల్లా వాసుల్లో ఆందోళన ఈ ఏడాది ముందస్తు వర్షాలు ప్రారంభం కావడంతో సకాలంలో కృష్ణా నీరు దిగువకు చేరి జిల్లాలోని ప్రాజెక్టులు నీటితో నిండితే గత రెండేళ్లు లాగే సాగునీటి ఇబ్బందులు తీరుతాయని భావిస్తున్న జిల్లా వాసులకు తెలంగాణ వైఖరి మరింత ఆందోళన కలిగిస్తోంది. శ్రీశైలంలో నామమాత్రపు నీరు ఉన్నా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరుతో దిగువకు విడుదల చేస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు త్వరితగతిన నిండి రాయలసీమ జిల్లాలతోపాటు వైఎస్సార్ జిల్లాకు సకాలంలో నీరొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ స్థానికంగా సాధారణ వర్షపాతం నమోదై ఎగువ రాష్ట్రాల్లో నామమాత్రపు వర్షాలు కురిస్తే వైఎస్సార్ జిల్లాకు కృష్ణా జలాలు రావడం గగనం. ఎత్తిపోతల పథకం తప్పనిసరి.. వాస్తవానికి గత రెండేళ్లలోనూ కృష్ణానది నీరు కాకుండా జిల్లా ప్రాజెక్టులకు తుంగభద్ర నీరే వాడుకున్నట్లు సాగునీటి రంగ నిపుణులు పేర్కొంటున్నారు. తుంగభద్ర పరిధిలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో గత రెండేళ్లలో భారీ వర్షాలు కురిశాయి. ఆ నీరు కృష్ణానదిలో చేరింది. ఆ మేరకు మాత్రమే జిల్లాలోని ప్రాజెక్టులకు నీటిని వాడినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. అంతేగానీ కృష్ణా జలాలు వాడింది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమ జిల్లాలతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీటి ఇక్కట్లు తలెత్తే విధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించడంపై ఈ ప్రాంత వాసుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం తప్పనిసరి అని జిల్లా వాసులు పేర్కొంటున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ప్రధాన కాలువల ఆధునికీకరణ, ఎత్తిపోతల పథకం ద్వారా వరద కాలంలో నీటిని తరలించుకునే అవకాశం ఉంటుంది. ఒప్పందం మేరకు 15 టీఎంసీల కృష్ణా జలాలను వైఎస్సార్ జిల్లా మీదుగా చెన్నై తాగునీటి అవసరాలకు తరలించాల్సి ఉంది. దీంతోపాటు నెల్లూరు జిల్లాలోని 78 టీఎంసీల సామర్థ్యం కలిగిన సోమశిల రిజర్వాయర్తోపాటు అదే జిల్లాలోని కండలేరు రిజర్వాయర్కు జిల్లా మీదుగానే కృష్ణాజలాలను తరలిస్తున్నారు. తెలంగాణ వైఖరితో రాయలసీమ జిల్లాలతోపాటు అటు నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ఇటు ప్రకాశం జిల్లాకు నీటి కష్టాలు తప్పవన్నది నిపుణుల వాదన. నీటిని వృథా చేయడం నేరం నీరు జాతీయ సంపద. దానిని వృథా చేయడం నేరం. అవసరం లేకపోయినా తెలంగాణ ప్రభుత్వం నీటిని వృథా చేస్తోంది. శ్రీశైలం నీటిని దిగువకు వదలడం వల్ల రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. – దేవగుడి చంద్రమౌళీశ్వర్రెడ్డి, రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన సమితి కన్వీనర్, కడప తెలంగాణ ప్రభుత్వం నీటి విడుదలను వెంటనే ఆపాలి శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న కొద్దిపాటి నీటిని తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరుతో దిగువకు వదలడం వల్ల వైఎస్సార్ జిల్లాకు తీరని నష్టం వాటిల్లుతుంది. వెంటనే తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుంచినీటి విడుదలను ఆపాలి. – సంబటూరు ప్రసాద్రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్, కడప మనం వాడుకున్నది తుంగభద్ర నీరే తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో ఉన్న కాస్త నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో దిగువకు తోడేయడం సరికాదు. గత రెండేళ్లలో భారీ వర్షాలు కురవడంతో జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను నింపుకున్నాం. మనం వాడుకున్నది కృష్ణా జలాలు కాదు. తుంగభద్ర నీరు మాత్రమే. – వెంకట్రామయ్య, ఈఈ, ఇరిగేషన్, కడప -
నది స్నానాలకు అనుమతి లేదు: వెల్లంపల్లి
సాక్షి, కర్నూలు : తుంగభద్ర పుష్కరాలు రేపటి(నవంబర్ 20) నుంచి ప్రారంభం అవుతున్నాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. డిసెంబర్ 1 వరకు ఈ పుష్కరాలు కొనసాగుతాయన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పుష్కరాలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు మాత్రమే ఘాట్లోకి భక్తులను అనుమతిస్తామని చెప్పారు. తుంగభద్ర పుష్కరాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం కర్నూలుకు రానున్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం స్నానాలను నిషేదించిట్లు మంత్రి వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ నది స్నానాలకు అనుమతి లేదని మంత్రి గుర్తు చేశారు. పుష్కరాలను కూడా విపక్షాలు రాజకీయ కోణంలో చూస్తున్నాయని విమర్శించారు. పుష్కరాల పేరుతో చంద్రబాబు నాయుడు వందల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. -
స్నానాలొద్దు.. నీళ్లు చల్లుకుంటే చాలు
సాక్షి, అమరావతి: భక్తుల సెంటిమెంట్ను దృష్టిలో పెట్టుకొని కరోనా పరిస్థితుల్లోనూ తుంగభద్ర పుష్కరాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి, ఆ దిశగా కట్టుదిట్టంగా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే వైరస్ వ్యాప్తికి అవకాశం లేకుండా పుణ్య స్నానాలపై నియంత్రణ చర్యలు చేపట్టనుంది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 వరకు తుంగభద్ర నదికి ఈ సారి పుష్కరాలు రానున్నాయి. ఇది కృష్ణా నదికి ఉప నది. కర్ణాటకలో అత్యధిక భాగం, మిగతా ఏపీలోని కర్నూలు జిల్లాలో ప్రవహిస్తూ.. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల మీదుగా కృష్ణాలో కలుస్తుంది. పుష్కరాల నేపథ్యంలో కర్నూలు జిల్లాలో నదీ పరీవాహక ప్రాంతం వెంట ఉన్న 16 ప్రముఖ ఆలయాలలో రూ.కోటి ఖర్చుతో ఆధునికీకరణ, అలంకరణ కార్యక్రమాలు చేపడుతున్నట్టు దేవదాయ శాఖ అధికారులు వెల్లడించారు. ► పుష్కరాలలో భక్తుల పుణ్య స్నానాల నిర్వహణలో నియంత్రణ చర్యలు చేపట్టాలని దేవదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. లాక్డౌన్ అనంతరం దేశ వ్యాప్తంగా స్విమ్మింగ్ పూల్స్పై ఇప్పటికీ ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో దేవదాయ శాఖ తుంగభద్ర పుష్కరాలపై ప్రత్యేక నిబంధనావళితో ఉత్తర్వులు జారీ చేసింది. ► ప్రత్యేక ఘాట్ల ఏర్పాటుకు తగిన చర్యలు చేపడుతూనే వైరస్ వ్యాప్తికి అవకాశం లేకుండా భక్తులు పుష్కర రోజుల్లో ఇంటి వద్దనే స్నానాలు చేసి, నది వద్ద కేవలం పవిత్ర జలాలను నెత్తిన చల్లు కోవాలని (ప్రోక్షణ) విస్త్రత స్థాయిలో ప్రచారం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ► భక్తుల సెంటిమెంట్ దృష్ట్యా పితృ దేవతలకు పిండ ప్రదానం నిర్వహించడం వంటి కార్యక్రమాలను ఏకాంతంగా జరుపుకునేందుకు పూర్తి స్థాయిలో అనుమతి ఇస్తారు. ► ఇందుకోసం 16 దేవాలయాల పరిధిలో ప్రత్యేక షెడ్లు నిర్మిస్తున్నారు. 600 మంది పురోహితులకు గుర్తింపు కార్డులు ఇస్తున్నారు. ► వైరస్ లక్షణాల భక్తులు ఎవరైనా దర్శనం కోసం వచ్చినట్టు గుర్తిస్తే, ఆ భక్తుడే స్వచ్ఛందంగా తిరిగి వెనక్కు వెళ్లేలా నచ్చ జెప్పాలని దేవదాయ శాఖ కర్నూలు జిల్లా అధికారులను ఆదేశించింది. -
నవంబర్ 20 నుంచి తుంగభద్ర పుష్కరాలు
సాక్షి, అమరావతి: తుంగభద్ర పుష్కరాలను నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 దాకా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, అనిల్కుమార్ యాదవ్, గుమ్మనూరు జయరాం దిశానిర్దేశం చేశారు. విజయవాడలో 18 శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు పుష్కరాలకు వచ్చే యాత్రికులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మంత్రులు ఏం చెప్పారంటే.. u పాత పుష్కర ఘాట్లకు అవసరమైన ప్రాంతాల్లో మరమ్మతులు చేయాలి. కొత్తగా నిర్మించే పుష్కర ఘాట్లను నాణ్యంగా, వేగంగా పూర్తి చేయాలి. భవిష్యత్లో వాటిని ఉపయోగించుకునేలా ఘాట్ల నిర్మాణాన్ని చేపట్టాలి. పుష్కర ఘాట్ల పనులు నవంబర్ 1లోగా పూర్తి కావాలి. u రహదారుల నిర్మాణం కోసం ఇప్పటికే రూ.117.02 కోట్లు మంజూరయ్యాయి. ఆ పనులను శరవేగంగా పూర్తి చేయాలి. u స్నాన ఘట్టాలను పరిశుభ్రంగా ఉంచాలి. తాగునీటి సరఫరా, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండాలి. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకోవాలి. -
కరువు నేలకు జలాభిషేకం
సాక్షి, కర్నూలు : ఆలస్యంగానైనా నైరుతి రుతు పవనాలు కరుణించాయి.. తుంగభద్ర, కృష్ణా నదులకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో కరువు జిల్లా కర్నూలు జలాభిషేకంతో పులకించిపోతోంది. జలాశయాలన్నీ నిండుకుండలా తొణికిసలాడుతున్నాయి. ప్రధాన కాలువలు గలగల పారుతూ.. పొలాలన్నీ పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయి. చాలా ఏళ్ల తరువాత తుంగభద్ర, కృష్ణా నదులకు రెండోసారి వరదలు వచ్చాయి. శ్రీశైలానికి సెప్టెంబరు నెలలోనే వెయ్యి టీఎంసీలకుపైగా వరద నీరు వచ్చి చేరింది. జలాశయం నిండడంతో పోతిరెడ్డిపాడు ద్వారా 89.814 టీఎంసీల నీటిని వాడుకున్నట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని గాజులదిన్నె మధ్య తరహా ప్రాజెక్టు మినహా మిగిలినవన్నీ దాదాపు పూర్తిస్థాయి నీటిమట్టాలతో ఉన్నాయి. దీంతో ఖరీఫ్లో సాగు చేసిన పంటలకు పూర్తి స్థాయిలో నీటిని అందించేందుకు ఎలాంటి ఢోకా లేనట్లేనని అధికార యాంత్రాంగం చెబుతోంది. శ్రీశైలానికి వరద కొనసాగుతుండడంతో మరో 70 టీఎంసీలకుపైగా నీటిని వాడుకునేందుకు అవకాశం ఉంది. రిజర్వాయర్ల నీటి మట్టాలు టీఎంసీల్లో .. పుష్కలంగా నీరు.. జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు కాలువలకు నీటిని పుష్కలంగా వదులుతున్నారు. ఫలితంగా ఆయకట్టు రైతుల్లో ఆనందం నెలకొంది. కేసీ కాలువ కింద ఇప్పటికే వరి నారుమళ్లు వేసుకోగా..మరికొందరు నాట్లు పూర్తి చేసుకున్నారు. తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో 40కి పైగా ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. నదికి వరద కొనసాగుతుండడంతో ఆయా ప్రాంత రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. దీంతో పాటు శ్రీశైలం వెనక జలాల కింద ఏర్పాటు చేసిన పథకాలు, కుందూ నదిపై ఉన్న పథకాల ద్వారా పంటలకు సాగునీరు అందుతోంది. ఆశాజనకంగా సాగు.. జలాశయాలకు సమృద్ధిగా నీరు రావడం, వర్షాలు ఆశించిన మేర కురవడంతో ఖరీఫ్ ఆశాజనకంగా సాగుతోంది. జిల్లాలో సాధారణ సాగు 6,09,916 హెక్టార్లుండగా ఇప్పటి వరకు 5,33,692 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. పత్తి సాధారణ సాగు 2,40,212 హెక్టార్లు ఉండగా 2,63,595 హెక్టార్లలో సాగైంది. వేరుశనగ సాధారణ సాగు 91190 హెక్టార్లుండగా 79,407 హెక్టార్లలో వేశారు. కాల్వలకు నీరు విడుదల చేయడంతో వరిసాగు క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 38,814 హెక్టార్లలో వరిసాగైంది. మొక్కజొన్న 28,712, కంది 63,906, కొర్ర 6,455, సజ్జ 5,683, మినుము 1,953, ఆముదం 16,653, మిరప 10,882, ఉల్లి 13,235 హెక్టార్లలో సాగయ్యాయి. ఇంకా 71,260 హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. పత్తికొండ మండలం దూదేకొండ గ్రామ సమీపంలో కళకళలాడుతున్న వేరుశనగ పైరు ఆయకట్టుకు ఇబ్బందులు ఉండబోవు కృష్ణా, తుంగభద్ర నదులకు మరోసారి వరద నీరు వస్తోంది. జిల్లాలోని రిజర్వాయర్లలో 90 శాతానికిపైగా నీరు నిల్వ ఉంది. సాగు నీటి సలహా మండలి సమావేశం నిర్వహణపై కలెక్టర్తో చర్చించాలని సర్కిల్ ఎస్ఈకి సూచించాం. శ్రీశైలానికి వరద నీరు ఏ మేరకు వస్తుందో చూడాలి. ఆయకట్టుకు మాత్రం నీటి ఇబ్బందులు ఉండబోవు. వెలుగోడులో పూర్తి స్థాయి నీటి మట్టానికి నిల్వ చేస్తాం. గోరుకల్లులో 9 నుంచి 10 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – నారాయణరెడ్డి, సీఈ జల వనరుల శాఖ -
మళ్లీ వరద
సాక్షి, కర్నూలు: కృష్ణ, తుంగభద్ర నదులకు మళ్లీ వరద ప్రవాహం మొదలైంది. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల ఈ నదులకు వరద వస్తోంది. కృష్ణానదిలో వరద పెరగడంతో బుధవారం మధ్యాహ్నం ఆల్మట్టి డ్యాం నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని నారాయణపూర్కు విడుదల చేశారు. అలాగే నారాయణపూర్ నుంచి జూరాలకు 1,13,280 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జూరాలకు ఎగువ నుంచి వచ్చే నీటిని దృష్టిలో పెట్టుకుని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి గత నెల 25న కృష్ణా జలాల ప్రవాహం నిలిచిపోయింది. నదులకు ఒకసారి నీటి ప్రవాహం వచ్చాక రెండో సారి అనేది ఇటీవల కాలంలో చాలా అరుదు. ఇప్పటికే కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరి కళకళలాడాయి. కొంత మేర నీటిని ఆయకట్టుకు వాడుకోగా..డ్యాంలలో నీటి మట్టం క్రమంగా తగ్గుతున్న తరుణంలో మళ్లీ నదులకు వరద రావడం విశేషం. దీంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఆయకట్టుకు సాగునీరు ఇచ్చేందుకు అవకాశం ఉందని ఇంజినీరింగ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తుంగభద్ర డ్యాంకు సైతం ఎగువ నుంచి వరద ప్రవాహం ఉండడంతో పది గేట్లు పైకెత్తి సుమారు 35 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరు నేటి రాత్రికి సుంకేసుల బ్యారేజీకి చేరుకునే అవకాశం ఉంది. ఈ నదికి నీటి ప్రవాహం నిలిచిపోయి.. కేసీ ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్న తరుణంలో మళ్లీ వరద వస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు సుంకేసుల బ్యాకేజీలో నీటి మట్టం తగ్గడంతో కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు వస్తాయనే ఆందోళన ఉండేది. ప్రస్తుత వరదతో తాగునీటి కష్టాలు సైతం గట్టెక్కుతాయని నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
కర్ణాటక జల చౌర్యానికి చెక్
సాక్షి, ఆదోని(కర్నూలు) : తుంగభద్ర జలాల వినియోగం.. కర్ర ఉన్నోడిదే బర్రె అన్న చందంగా సాగుతోంది. దిగువ కాలువ పరిధిలో యథేచ్ఛగా జల చౌర్యం జరుగుతోంది. కర్ణాటకలో జల చౌర్యాన్ని గత ప్రభుత్వాలు అడ్డుకోలేకపోయాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతూ జల చౌర్యానికి చెక్ పెడుతోంది. తుంగభద్ర కాలువల భూగర్భంలో 200 చోట్ల శాశ్వత ప్రాతిపదికన వేసిన పైపులను గుర్తించి..వాటిలో కాంక్రీట్ను నింపుతున్నారు. కాంక్రీట్ గట్టి పడేంత వరకు 48 గంటల పాటు పోలీసులతో ఎల్లెల్సీ అధికారులు కలిసి కాపలా ఉంటున్నారు. కాంక్రీట్ గట్టి పడిన తరువాత తొలగించడం సాధ్యం కాదు. గతంలో బోర్డు అధికారులు నీటి చౌర్యాన్ని అరికట్టేందుకు యత్నించినా కర్ణాటక రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఈ సారి పోలీస్ బందోబస్తు మధ్య పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. నాడు.. తుంగభద్ర డ్యాంలో నిండా నీరున్నా..దిగువ కాలువకు వచ్చేవి అరకొరే. కర్ణాటక రాష్ట్రంలో యథేచ్ఛగా జలచౌర్యం జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకునేవి కావు. రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు జరిపినప్పుడు తూతూ మంత్రంగా పోలీసులతో గస్తీ తిప్పి..తరువాత వదిలేసేవి. దీంతో ఆయకట్టులో సాగుకు ఇబ్బందులు ఏర్పడేవి. సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గేది. నేడు.. తుంగభద్ర డ్యాంలో నిండా నీరున్నాయి..ఎల్లెల్సీకి వాటా నీరు వదులుతున్నా జిల్లా సరిహద్దుకు వచ్చే సరికి తగ్గిపోతున్నాయి. కర్ణాటక ప్రాంతంలో జల చౌర్యాన్ని అరికట్టడానికి ప్రస్తుత ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంది. అక్రమంగా వేసిన పైపులను గుర్తించి...వాటిని కాంక్రీట్తో నింపుతోంది. ఫలితంగా దిగువ కాలువలో నీటి మట్టం పెరుగుతోంది. ప్రభుత్వ చర్యలతో ఈ ఏడాది సాగునీటికి ఇబ్బందులు ఉండబోవని, బంగారు పంటలు పండించుకోవచ్చని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇవీ... హెచ్చెల్సీ, ఎల్లెల్సీ పరిధిలో రెండువేల చోట్ల జలచౌర్యం జరుగుతున్నట్లు గుర్తించారు. భూగర్భంలో 200 చోట్ల శాశ్వత ప్రాతిపదికన పైపులను వేసుకొని పెద్ద ఎత్తున నీటిని మళ్లిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఈ పైపులను కాంక్రీట్తో మూసి వేసి..అది గట్టి పడేంత వరకు దాదాపు 48 గంటల పాటు పోలీసులతో కలిసి కాపలా ఉంచుతున్నారు. ఈ నెల 16న 287 క్యూసెక్కులకు పడిపోయిన నీటి మట్టం బుధవారం.. 363 క్యూసెక్కులకు పెరిగింది. నాలుగో వంతుకు పైగా నీటి చౌర్యం తుంగభద్ర జలాశయంలో 160 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని ఈ ఏడాది అధికారులు అంచనా వేశారు. హెచ్చెల్సీకి 25 టీఎంసీలు, ఎల్లెల్సీకి 18.6 టీ ఎంసీలు కేటాయించారు. అయితే హెచ్చెల్సీ 105కి.మీ, ఎల్లెల్సీ 250కి.మీ కర్ణాటక రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి. ఏటా టీఎంసీల కొద్ది నీటిని అక్రమంగా మళ్లించుకుంటూ వేల ఎకరాల్లో అక్రమ ఆయకట్టు సాగు చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం, బోర్డు అధికారులు కూడా నీటి చౌర్యాన్ని పట్టించుకునే వారు కాదు. దీంతో అనంతపురం, కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలు కరువు బారిన పడి.. ఏటా వేల ఎకరాలు ఆయకట్టు భూమి బీడుగా మారుతోంది. గత సంవత్సరం ఎల్లెల్సీకి కేటాయించిన 14 టీఎంసీలలో ఆకట్టుకు 8.7 టీఎంసీలు మాత్రమే చేరింది. దాదాపు 5.2 టీఎంసీలకు గండి పడింది. ఎల్లెల్సీ కింద జిల్లా పశ్చిమ ప్రాంతంలో 1, 56,963 ఎకరాలు, హెచ్ఎల్సీ కింద అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలో 1,88,777 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో.. దశాబ్దాలుగా జరుగుతున్న నీటి చౌర్యాన్ని అరికట్టడంతో బోర్డు అధికారులు విఫలం అవుతున్నారు. ఇటీవల బెంగళూరులో జరిగిన జరిగిన తుంగభద్ర జలాల కేటాయింపులో రాష్ట్రం తరఫున చర్చల్లో పాల్గొన్న ఈఎన్సీ వెంకటేశ్వరరావు.. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని సమవేశం దృష్టికి తీసుకువెళ్లారు. నీటి చౌర్యం అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరారు. గత సంవత్సరం జలాల కేటాయింపు, వినియోగాన్ని సమీక్షించి చౌర్యం అయిన నీటిని కర్ణాటక వాటాలో తగ్గించాలని, ఆ మేరకు కేంద్ర జలవనరుల శాఖకు కూడ నివేదిక సమర్పిస్తామని ఆయన చెప్పారు. ఏ మేరకు నీటి చౌర్యం జరిగిందో ఖచ్చితమైన వివరాలు ఏపీ చేతిలో ఉండడంతో బోర్డు, కర్ణాటక జలవనరుల శాఖ అధికారులు జల చౌర్యంపై గట్టి చర్యలు తీసుకోడానికి అంగీకరించారు. ఆ మేరకు కాలువ గట్లపై 24 గంటలపాటు పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కాలువల భూగర్భంలో ఏర్పాటు చేసిన పైపులను గుర్తించి కాంక్రీట్తో నింపుతున్నారు. మూడు రోజులుగా కాంక్రీట్ నింపే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బోర్డు ఎస్ఈ వెంకటరమణ, ఈఈ సురేష్రెడ్డి, డీఈఈ సేవ్లానాయక్, ఏఈలు రవి, వెంకటేష్ పోలీసు బందోబస్తు మద్య పనులను పర్యవేక్షిస్తున్నారు. మిగిలిన చోట్ల తాత్కాలికంగా పైపులు, పంపింగ్ మోటార్లు ఏర్పాటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు కొనసాగిస్తున్నారు. వీలైనంత త్వరలో నీటి చౌర్యాన్ని పూర్తిగా అరికట్టే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. బోర్డు అధికారుల చర్యలు పూర్తిగా ఫలిస్తే సీమ జిల్లాల్లో విస్తరించిన ఎల్లెల్సీ, హెచ్ఎల్సీ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరుందుతోందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎల్లెల్సీలో పెరిగిన నీటి మట్టం బోర్డు సరిహద్దు 250కి.మీ. హానువాళు వద్ద బుధవారం ఎల్లెల్సీలో నీటి మట్టం 363 క్యూసెక్కులు ఉంది. ఈ నెల 16న 287 క్యూసెక్కులకు పడిపోయిన నీటి మట్టం.. ఎగువన చర్యలు చేపట్టడంతో నీటి మట్టం పెరిగినట్లు తెలుస్తోంది. అధికారుల ఇండెంట్ మేరకు బోర్డు సరిహద్దు వద్ద 600 క్యూసెక్కులు ఉండాలి. ఎగువన నీటి చౌర్యంను పూర్తిగా అరికడితే ఆ మేరకు నీటి మట్టం పెరుగవచ్చని ఎల్లెల్సీ అధికారులు, రైతులు ఆశిస్తున్నారు. -
తుంగభద్రపై కర్ణాటక పెత్తనం
సాక్షి, కర్నూలు : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ప్రధాన జలవనరుల్లో ఒకటి తుంగభద్ర డ్యాం. ఈ డ్యాంలో నీటి లభ్యతను బట్టి ఏటా బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన వాటాల మేరకు నీటిని కేటాయిస్తారు. అదే విధంగా డ్యాంలోకి వచ్చే నీటి చేరికలను బట్టి డ్యాం ఆధారిత ప్రాంతాల్లో తాగునీరు, సాగు కష్టాలను దృష్టిలో పెట్టుకొని కాలువలకు నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే దశాబ్దన్నర కాలంగా తుంగభద్ర జలాల వినియోగంలో కర్ణాటక ఇష్టారాజ్యంతో జిల్లాకు అన్యాయమే జరుగుతోంది. కర్ణాటక కాలువలకు అనుమతులు లేకున్నా నీరు.. ఏటా డ్యాంలోకి నీటి చేరికలు మొదలైన తరువాత ముందుగా కర్ణాటక రాష్ట్ర పరిధిలోని సాగు నీటి కాలువలకు నీరు ఇచ్చిన తరువాతనే ఏపీకి చెందిన కాలువలకు ఇస్తున్నారు. అది కూడా ఇండెంట్కు అనుమతులు వచ్చేంత వరకు టీబీ బోర్డు అధికారులు చుక్క నీటిని వదలరు. కర్ణాటకకు చెందిన కాలువలకు మాత్రం అనుమతులు లేకపోయినా సాగు కోసం నీటిని విడుదల చేస్తుండడంతో అనంత, కర్నూలు జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఈ జిల్లాల్లో ఈ ఏడాది వర్షాభావం కారణంగా తాగునీటికి సైతం ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తాగునీటి అవసరాలకు సైతం నీరు విడుదల చేయడంలో బోర్డు అధికారులు జాప్యం చేశారు. ఈ లోపు టీబీ డ్యాంకు వరద నీరు వచ్చింది. డ్యాం గరిష్ట స్థాయికి చేరుకొని గేట్లుపైకెత్తి నీటిని నదిలోకి వదిలారు. అయితే హెచ్చెల్సీ, ఎల్ఎల్సీ కాలువలకు మాత్రం సాగునీటిని విడుదల చేయకపోవడంపై ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. కడలికి చేరుతున్న వరద జలాలు.. తుంగభద్ర డ్యాం పూర్తి సామర్థ్యం 100 టీఎంసీలు. ఈ జలాలతో కర్నూలు జిల్లాలోని పశ్చిమ పల్లెలకు తాగు, సాగు నీటి అవసరాలు తీర్చేందుకు ఆధారం. జిల్లాలో 5 నియోజకవర్గాల్లో సాగు, 8 నియోజకవర్గాల్లో తాగు నీటి అవసరాలకు సైతం తుంగభద్ర జలాలే ఆధారం. జిల్లాకు మొత్తం 1,51,134 ఎకరాల ఆయకట్టుకు నీరు అందాల్సి ఉంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎల్ఎల్సీ కాలువకు 24 టీఎంసీలు, హెచ్చెల్సీకి 32.5 టీఎంసీలను కేటాయించింది. అయితే దశబ్దన్నర కాలంగా ఎల్ఎల్సీకి 13, హెచ్చెల్సీకి 18 టీఎంసీలకు మించి అందని పరిస్థితి. డ్యాం నుంచి వరద నీరు దిగువకు ఇప్పటి వరకు 45 టీఎంసీలు వదిలారు. కాల్వలకు మాత్రం ఇవ్వలేదు. ఇదేంటని బోర్డు అధికారులను అడిగితే ఇండెంట్ పెడితే నీటిని ఇస్తామని, వరదల సమయంలో నీరిచ్చినా కేటాయింపుల్లోకే లెక్కిస్తామని చెబుతున్నారు. -
శాంతించిన కృష్ణమ్మ
ఎగువన కురిసిన భారీ వర్షాలతో ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ క్రమంగా తగ్గుముఖం పట్టింది.. గతం వారం రోజులుగా అంతకంతకూ పెరుగుతూ వచ్చిన వరద ఆదివారం వరకు 8 లక్షల క్యూసెక్కులకు చేరింది.. ఈ క్రమంలో నదీ పరివాహక ప్రాంతాల్లోని వేలాది ఎకరాల్లో పంట పొలాలు, పలు గ్రామాలు నీట మునగడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.. గత పదేళ్ల నాటి వరదలను దృష్టిలో ఉంచుకొని ఒకింత భయాందోళనకు గురయ్యారు.. అయితే వర్షాలు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో సోమవారం సాయంత్రం నుంచే వరద నీటి ప్రవాహం తగ్గుతూ వస్తోంది.. మంగళవారం వరకు ఏకంగా లక్ష క్యూసెక్కుల మేర తగ్గడంతో అధికారులు సైతం ఊపిరిపీల్చుకున్నారు.. సాక్షి, వనపర్తి : ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కృష్ణానది వరద రోజురోజుకు ఉగ్రరూపం దాల్చి.. మూడురోజులుగా జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాలను ముంచెత్తింది. ఈ క్రమంలో మంగళవారం కృష్ణమ్మ శాంతించడంతో అధికారులు, రైతులు ఊపిరి పీల్చుకున్నాయి. శనివారం రాత్రి తొమ్మిది గంటలకు జూరాల నుంచి దిగువకు 6,30,642 క్యూసెక్కుల వరద నీరు వదిలారు. 24 గంటల వ్యవధిలోనే ఆదివారం తొమ్మిది గంటలకు వరద ఉధృతి పెరిగింది. దిగువకు వదులుతున్న నీరు 8,57,488 క్యూసెక్కులకు చేరింది. ఒక్కసారిగా లక్షల క్యూసెక్కుల నీరు పెరగడంతో కృష్ణానది తీర ప్రాంతాల్లోని సుమారు 11 గ్రామాల్లో పంట పొలాలు, పండ్లతోటలు, పలు గ్రామాలు నీట మునిగాయి. అప్రమత్తమైన అధికారులు 2009లో ముంచెత్తిన వరదలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని ఆత్మకూరు, అమరచింత, పెబ్బేరు, చిన్నంబావి మండలాల్లోని 23 గ్రామాల్లో ప్రమాదపు హెచ్చరికలు జారీ చేశారు. ఒక్కో గ్రామానికి ఒక్కో అధికారిని కేటాయించి ఎప్పటికప్పుడు వరద ప్రభావాన్ని నమోదు చేసుకున్నారు. శనివారం సాయంత్రం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు వరద ఉధృతి పెరుగుతూ వచ్చింది. సోమవారం సాయంత్రం నుంచి కొద్దిగా తగ్గింది. పెరిగిన కృష్ణానది వరదకు తుంగభద్ర నదీ సోమవారం ఉదయం నుంచి పోటెత్తి సుమారు 2.20 లక్షల క్యూసెక్కుల నీటితో కృష్ణమ్మతో కలిసి శ్రీశైలానికి పరుగులు తీసింది. పొలాలు చాలా వరకు నీట మునిగిపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఎట్టకేలకు సోమవారం సాయంత్రం ఆరు గంటల నుంచి కృష్ణమ్మ శాంతిస్తూ వస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు 8,67,099 క్యూసెక్కుల వరద నుంచి సాయంత్రం ఆరు గంటలకు 8,26,855కు తగ్గింది. రాత్రి తొమ్మిది గంటలకు 8,16,957 క్యూసెక్కులు వచ్చింది. నాలుగు గేట్ల మూసివేత సోమవారం ఉదయం నుంచి పన్నెండు గంటల వరకు వచ్చి వరదతో పోల్చితే మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయానికి సుమారుగా లక్ష క్యూసెక్కుల వరద నీరు తగ్గింది. జూరాల వద్ద 62 క్రస్టుగేట్లతో దిగువకు వచ్చే వరద నీరు మంగళవారం మధ్యాహ్నం వరకు అధికారులు జూరాల వద్ద నాలుగు గేట్లను మూసివేసి 58 గేట్ల నుంచి దిగువకు వరద నీటిని వదులుతున్నారు. 24 గంటల వ్యవధిలోనే.. దాదాపు 24 గంటల వ్యవధిలోనే కృష్ణమ్మ సుమారు లక్ష క్యూసెక్కుల వరద నీరు తగ్గి ప్రవహించడంతో జిల్లా పరిధిలోని నదీ పరివాహక ప్రాంతాల్లో సుమారు పది అడుగుల మేర వరద నీరు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో రైతులు తమ పంటలకు ఢోకా లేదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద పెరిగితే పరిస్థితి ఏంటి.. గ్రామాలు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వస్తుందని భావించిన అధికారులకు మంగళవారం వరద ఉధృతి తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు మంగళవారం సైతం గ్రామాల్లో రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు వరద ఉధృతిని నమోదు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తూనే ఉన్నారు. -
శ్రీశైలంలోకి భారీ వరద
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్టు/ధవళేశ్వరం/రంపచోడవరం: కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో గురువారం మహారాష్ట్రలో మహాబళేశ్వర్, కర్ణాటకలో పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో శ్రీశైలం జలాశయంలోకి భారీ వరద ప్రవాహం చేరుతోంది. గురువారం రాత్రికి శ్రీశైలం జలాశయంలోకి 3,01,570 క్యూసెక్కులు వస్తోంది. జలాశయంలో ప్రస్తుతం 875 అడుగుల్లో 163.20 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. అలాగే, శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. పూర్తిస్థాయి నీటినిల్వ 215.81 టీఎంసీలు. మరో 52 టీఎంసీలు వస్తే శ్రీశైలం జలాశయం నిండుతుంది. శుక్రవారం నాటికి ఎగువ నుంచి శ్రీశైలానికి 3,06,169 క్యూసెక్కుల ప్రవాహం వస్తుందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తన నివేదికలో పేర్కొంది. శ్రీశైలం జలాశయం పవర్హౌస్ల ద్వారా విడుదల చేసిన వరద నీరు 73,912 క్యూసెక్కులు నాగార్జునసాగర్లోకి చేరుతున్నాయి. ప్రమాదకర స్థాయిలో తుంగభద్ర కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర ఉగ్రరూపం దాల్చింది. తుంగభద్ర జలాశయంలోకి 2,09,319 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా దిగువకు 2,16,040 క్యూసెక్కులు వదులుతున్నారు. కర్నూల్ జిల్లా మంత్రాలయంలో అధికారులు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. సుంకేసుల బ్యారేజీలోకి కూడా 1,81,066 క్యూసెక్కులు చేరుతుండగా.. 1,78,712 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు.. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ఖమ్మం, కృష్ణా జిల్లాల్లో కురిసిన వర్షాలకు ప్రకాశం బ్యారేజీలోకి గురువారం సా.6 గంటలకు 13,850 క్యూసెక్కుల వరద రాగా.. ఆ మొత్తాన్ని దిగువకు విడుదల చేశారు. అలాగే, ఉత్తరాంధ్రలోని వంశధార కూడా ఉప్పొంగింది. గురువారం సా.6 గంటలకు 44,189 క్యూసెక్కులను గొట్టా బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలారు. నాగావళి కూడా పొంగిపొర్లుడడంతో తోటపల్లి బ్యారేజీ నుంచి దిగువకు 26 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. ఇదిలా ఉంటే.. గోదావరిలో వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గురువారం 4,52,855 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలారు. అలాగే, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలోని పలు వాగులు రహదారులపై నుంచి పెద్దఎత్తున పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ కారణంగా గురువారం ఆంధ్రా నుంచి చత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువన గోదావరికి భారీగా వరద వస్తుండడంతో శబరి నది ఉధృతి కూడా ఎక్కువగానే ఉంది. ప్రధాన రహదారులపై నుంచి సుమారుగా పది అడుగుల మేర నిలిచి ఉంది. దీంతో పలు పంచాయితీల్లోని 24 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
తుంగభద్ర డ్యామ్ 33 గేట్ల ఎత్తివేత..!
సాక్షి, కర్నూలు: తుంగభద్ర నది పరవళ్లు తొక్కుతోంది. ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో 33 గేట్లను ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 1,67,485 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 1,99,432 క్యూసెక్కుల నీటిని దిగువగు వదులుతున్నారు. తుంగభద్ర డ్యామ్ పూర్తిస్థాయి నీటమట్టం 1633 అడుగులు కాగా, బుధవారం సాయంత్రం నాటికి 1631.63 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ100.86 టీఎంసీలు కాగా, 95.64 టీఎంసీల నీటితో తుంగభద్ర నిండు కుండలా మారింది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
శ్రీశైలానికి ఆగని వరద
సాక్షి, హైదరాబాద్: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మకు ప్రవాహాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో ఆల్మట్టి, నారాయణపూర్కు వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. రెండ్రోజుల క్రితంతో పోలిస్తే ఈ రెండు ప్రాజెక్టులకు 70 వేల క్యూసెక్కుల మేర ప్రవాహం పెరిగింది. ఆల్మట్టిలోకి మంగళవారం సాయంత్రం 95,680 క్యూసెక్కుల మేర వరద వచ్చి చేరగా, 65 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్కు 90 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, 92,680 క్యూసెక్కులు దిగువకు వదిలారు. మరో పక్క తుంగభద్రకు రెండ్రోజుల కిందటి వరకు 60వేల క్యూసెక్కుల వరద రాగా, అది మరోమారు పుంజుకొని 1.12 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టు నిండి ఉండటంతో అక్కడి నుంచి 1.18లక్షల క్యూసెక్కులు వదిలేస్తున్నారు. ఇక రాష్ట్ర పరిధిలోని జూరాలకు 35 వేల క్యూసెక్కులు వస్తుండగా, 50 వేల క్యూసెక్కులు దిగువకు వదిలారు. జూరాల నీటికితోడు తుంగభద్ర నుంచి వస్తున్నప్రవాహాలతో శ్రీశైలానికి 95,680 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో ప్రస్తుతం శ్రీశైలంలో 215 టీఎంసీలకుగానూ 150.81 టీఎంసీల నిల్వలున్నాయి. దిగువ నాగార్జునసాగర్ అవసరాల దృష్ట్యా శ్రీశైలం నుంచి 64,449 క్యూసెక్కుల నీటిని వదలడంతో సాగర్లోకి 17,226 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ప్రాజెక్టు మట్టం 312 టీఎంసీలకు గానూ 153.69 టీఎంసీలకు చేరింది. గోదావరిలో తగ్గిన ప్రవాహం.. : ఇక గోదావరిలో ప్రవాహాలు తగ్గిపోయాయి. ఎల్లంపల్లిలో నిన్నమొన్నటి వరకు భారీ ప్రవాహాలురాగా, మంగళవారం 15,719 క్యూసెక్కులకు తగ్గింది. ఎల్లంపల్లిలో 20 టీఎంసీలకుగానూ 19.04 టీఎంసీల నిల్వ ఉంది. ఇక కడెంలోకి 2,366 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఎస్సారెస్పీలోకి 2,300 క్యూసెక్కులు వస్తుండగా నిల్వ 90 టీఎంసీలకు గానూ 16.91 టీఎంసీలకు చేరింది. సింగూరు, నిజాంసాగర్, ఎల్ఎండీల్లోకి ఎలాంటి ప్రవాహాలు నమోదు కావడం లేదు. -
జూరాలకు మళ్లీ వరద
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో భారీ వర్షాలు కురు స్తుండటంతో నారాయణపూర్, తుంగభద్ర గేట్లు 15 రోజుల తర్వాత తిరిగి తెరుచుకున్నాయి. ప్రాజెక్టులు ఇప్పటికే నిండిపోవడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. దీంతో నారాయణపూర్ నీరు గురువారానికి జూరాల చేరనుంది. తుంగభద్ర నుంచి ఒకట్రెండు రోజుల్లో శ్రీశైలానికి ప్రవాహాలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పూర్తిగా నిండిన ఆల్మట్టికి ప్రస్తుతం 30,900 క్యూసెక్కుల వరద వస్తుండగా ఆ నీటిని అలాగే దిగువకు వదిలేస్తున్నారు. దీంతో దిగువనున్న నారాయణపూర్లోకి 30 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. అక్కడి నుంచి 7 గేట్లు ఎత్తి 22,240 క్యూసెక్కుల నీరు దిగువ జూరాలకు వదులుతున్నారు. జూరాలలో 9.66 టీఎంసీలకుగానూ 7.89 టీఎంసీల నీరుంది. 16 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 5,860 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోతల పథకాల అవసరాలకు విడుదల చేస్తున్నారు. తుంగభద్రకూ స్థిరంగా వరద తుంగభద్రకూ వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. బుధవారం 21,483 క్యూసెక్కుల ప్రవాహం రాగా 3 గేట్లు ఎత్తి 18,452 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. తుంగభద్రలో 100 టీఎంసీల నిల్వకుగానూ 98.20 టీఎంసీల నీరుంది. శ్రీశైలంలో 215 టీఎంసీల నిల్వకుగానూ 144.11 టీఎంసీలున్నాయి. సాగర్కు శ్రీశైలం నుంచి 23,768 క్యూసె క్కుల నీటిని విడుదల చేశారు. దీంతో సాగర్లోకి 17,643 క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్లో 144.04 టీఎంసీల నీరుంది. గోదావరి పరీవాహకంలో వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టుల్లో ఎక్కడా ప్రవాహాల జాడ కనిపించడం లేదు. -
రసాభాసగా తుంగభద్ర అడ్వైజరీ బోడు భేటీ
-
తుంగభద్రపై ఏపీ మరో ఎత్తిపోతలు!
సాక్షి, హైదరాబాద్ : తుంగభద్ర నదీ జలాలను వినియోగించుకుంటూ భారీ ఎత్తిపోతల చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది. 40 టీఎంసీల మేర నీటిని వినియోగించుకుంటూ ఏకంగా రూ.12వేల కోట్లతో ‘నాగల్దిన్నె, అనంతపూర్ ఎత్తిపోతల పథకం’చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. తుంగభద్ర జలాలపై ఆధారపడ్డ శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా చేపడుతున్న ఈ ఎత్తిపోతలను ఎట్టి పరిస్థితుల్లో నిలువరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమైంది. తెలంగాణకు జరిగే నష్టాలను వివరిస్తూ త్వరలోనే కేంద్రానికి లేఖ రాసేందుకు సిద్ధమవుతోంది. కర్నూలు జిల్లా నందవరం మండలం నాగల్దిన్నె సమీపంలో 40 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రణాళిక రూపొందించింది. ఈ నీటిని నిల్వ చేసేందుకు 6 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను ప్రతిపాదిస్తోంది. దీనిద్వారా కర్నూలు, అనంతపురం జిల్లాలకు సాగు, తాగునీటిని సరఫరా చేయాలని భావిస్తోంది. మహబూబ్నగర్కు ముంపు.. ఈ పథకం చేపట్టిన పక్షంలో దిగువన ఉన్న రాష్ట్ర ప్రాజెక్టులకు, వాటి నీటి అవసరాలకు తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు జరిగే నష్టాన్ని పేర్కొంటూ ఓ నివేదికను సిద్ధం చేసినట్లుగా తెలిసింది. దాని ప్రకారం ‘కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్–1 ప్రకారం కృష్ణా బేసిన్ పరిధిలో ఎలాంటి అంతర్రాష్ట్ర ప్రాజెక్టులు చేపట్టినా తెలంగాణ అనుమతులు తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏపీ ఎలాంటి అనుమతినీ తీసుకోలేదు. దీనికితోడు తుంగభద్ర జలాలు శ్రీశైలం ప్రాజెక్టు అవసరాలను తీరుస్తున్నాయి. శ్రీశైలం నిండితే సాగర్కు నీటి లభ్యత పెరుగుతుంది. ప్రస్తుతం తుంగభద్ర జలాలను ఎగువే వినియోగిస్తే దిగువన ఉన్న శ్రీశైలం, సాగర్లు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొనే ప్రభావం ఉంటుంది. ఇక నీటి నిల్వలకు అనుగుణంగా 15 నుంచి 20 టీఎంసీల రిజర్వాయర్ల నిర్మాణానికి ఏపీ ప్రణాళిక వేసింది. దీనివల్ల మహబూబ్నగర్ జిల్లాలోని చాలా ప్రాంతాలకు ముంపు ప్రమాదం పొంచి ఉంది. ఈ దృష్ట్యా ఎత్తిపోతల పథకాన్ని చేపట్టకుండా కేంద్రం జోక్యం చేసుకుని ఏపీకి తగిన ఆదేశాలు ఇవ్వాలి’అని నివేదికలో పేర్కొన్నట్లుగా తెలిసింది. ఈ నివేదికలోని అంశాలతో త్వరలోనే కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. -
తుంగభద్ర ఎగువన భారీ వర్షాలు
- డ్యామ్కు పెరుగుతున్న వరద హొసపేటె : తుంగభద్ర డ్యామ్కు ఎగువన నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తుండటంతో ఇన్ఫ్లో 24,438 క్యూసెక్కులకు పెరిగింది. తుంగభద్ర డ్యాం ఎగువన ఆగుంబె, శివమొగ్గ, తీర్థహళ్లి, చిక్కమగళూరు తదితర మలెనాడు ప్రదేశాల్లో వర్షాలు జోరుగా కురుస్తుండటంతో రోజురోజుకు డ్యామ్ ఇన్ఫ్లో పెరుగుతోంది. దీంతో డ్యాంలో నీటి నిల్వ 63.670 టీఎంసీలకు చేరుకుంది. ప్రస్తుతం డ్యాంలో నీటి మట్టం 1621.95 అడుగులు, ఇన్ఫ్లో 23,438 క్యూసెక్కులు, ఔట్ఫ్లో 700 క్యూసెక్కులుగా ఉందని తుంగభద్ర మండలి తెలిపింది. గత ఏడాది ఇదే సమయానికి డ్యాంలో నీటి మట్టం 1617.55 అడుగులు, నీటి నిల్వ 51.850 టీఎంసీలు, ఇన్ఫ్లో 7107 క్యూసెక్కులుగా ఉండేదని తెలిపారు. -
జూరాల.. పారాల!
- ఆల్మట్టికి 1.30 లక్షల క్యూసెక్కుల మేర వరద - మరో 50 టీఎంసీలు చేరితే జూరాలకు ప్రవాహాలు మొదలు - నారాయణపూర్కూ భారీ ప్రవాహాలు సాక్షి, హైదరాబాద్: వానమ్మ కరుణించింది. కృష్ణమ్మ పరవశించింది. ఎగువన వాన వెల్లువైంది. దిగువన ఉన్న ప్రాజెక్టులకు వరద వచ్చే వేళ అయింది. ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల్లో గడిచిన వారం రోజులుగా వానలు జోరుగా కురుస్తున్నాయి. మహారాష్ట్రలోని మహాబలేశ్వరం ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది విశ్వరూపం చూపుతోంది. అక్కడి ప్రధాన ప్రాజెక్టు కోయినా డ్యామ్తోపాటు ఇతర చిన్న తరహా ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో కర్ణాటకకు భారీగా ప్రవాహాలు వస్తున్నాయి. దీంతో గడిచిన 4 రోజులుగా 40 నుంచి 50 వేల క్యూసెక్కుల మేర ఆల్మట్టిలోకి ప్రవాహాలుండగా, అవి ఆదివారానికి ఏకంగా 1.30 లక్షల క్యూసెక్కులకు చేరింది. రోజుకు ఏకంగా 12 టీఎంసీల మేర నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 78.91 టీఎంసీలకు చేరింది. ప్రవాహాలు పెరగడంతో 33 వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నారాయణపూర్కు వదిలేస్తున్నారు. దీంతో నారాయణపూర్కు 30,966 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తోంది. ప్రాజెక్టులో 37.64 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్య ముండగా ప్రస్తుతం 26.61 టీఎంసీలకు చేరింది. ఈ రెండు ప్రాజెక్టుల్లో 50 టీఎంసీల మేర నిల్వలు పెరిగితే దిగువన ఉన్న జూరాలకు నీటి ప్రవాహాలు మొదలయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న వరదే మరిన్ని రోజులు కొనసాగితే 5 రోజుల్లోనే జూరాలకు నీటి ప్రవా హం మొదలయ్యే అవకాశముం ది. ఇక తుంగభద్రకు కూడా ఇన్ఫ్లో పెరిగింది. రెండ్రోజుల కిం దటి వరకు 20 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు నమోదు కాగా, ప్రస్తుతం అక్కడ 51,162 క్యూసె క్కుల ఇన్ఫ్లో ఉంది. దీంతో 100 టీఎంసీలకుగానూ అక్కడ 26.61 టీఎంసీల నిల్వలున్నాయి. ఆత్రుతగా దిగువ ప్రాజెక్టులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రవాహాలకు నోచుకోని రాష్ట్ర ప్రాజెక్టులు నీటి కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రాజెక్టులకు కేవలం 10 టీఎంసీల మేర నీరు వచ్చింది. మరో 390 టీఎంసీల మేర నీరు వస్తే కానీ ప్రాజెక్టులు నిండే అవకాశం లేదు. శ్రీశైలంలో 215 టీఎంసీలగానూ కేవలం 19 టీఎంసీల నీరే నిల్వ ఉండగా, సాగర్లో 312 టీఎంసీలకు 117 టీఎంసీల నీరే ఉంది. ఈ రెండు ప్రాజెక్టుల నిల్వల్లో వినియోగార్హమైన నీరు 2 టీఎంసీలకు మించి ఉండదు. ఇక జూరాలలో 9.6 టీఎంసీలకుగానూ 6.8 టీఎంసీ నిల్వ ఉండగా, ఈ నీటిని సాగు అవసరాలకు విడుదల చేయాలని ఇప్పటికే డిమాండ్లు పెరిగాయి. అయితే, ఎగువ ప్రవాహాలు మొదలైతే కానీ నీటి విడుదలపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. -
‘జల’ నిర్బంధం
- ఎల్లెల్సీ ప్రవాహానికి అడ్డుకట్ట - మోకావద్ద రింగ్బండ్ - కర్ణాటక వాసుల దుశ్చర్య - తెరుచుకోని ఎస్కేప్ చానల్ షట్టర్లు - చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు ఆదోని/హాలహర్వి: తుంగభద్ర జలాశయం నుంచి ఎల్లెల్సీకి విడుదల అయిన తాగునీటికి కర్ణాటకలోని మోకా వద్ద అడ్డుకట్ట పడింది. ఇసుక సంచులతో కాలువకు అడ్డంగా దాదాపు ఏడు అడుగుల ఎత్తుతో రింగ్ బండ్ నిర్మించారు. రింగ్ బండ్కు ఎగువన ఉన్న వంకకు నీరు మళ్లించుకోడానికే కర్ణాటక వాసులు ఇలా చేశారని తెలుస్తోంది. దీంతో జిల్లాకు నీటి చేరిక మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. మూడురోజుల క్రితం విడుదల.. జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు, పత్తికొండ నియోజక వర్గాలలో ఎల్లెల్సీ ఆధారంగా 27 ఎస్ఎస్ ట్యాంకులు నిర్మించారు. ఇందులో ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీల కోసం నిర్మించినవి కూడా ఉన్నాయి. నీటి నిల్వలు తగ్గిపోవడంతో ఎల్లెల్సీపై ఆశలు పెంచుకున్నారు. వర్షాల రాకతో గడిచిన వారం రోజుల్లో తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం 12.8 టీఎంసీలకు చేరింది. నీటి చేరిక ఆశాజనకంగా ఏపీ వాటా కింద ఎల్లెల్సీకి 500 క్యూసెక్కుల నీనరు విడుదల చేయాలని తుంగభద్ర బోర్డుకు ఇండెంట్ పెట్టారు. ఇండెంట్ మేరకు మూడు రోజుల క్రితం జలాశయం నుంచి బోర్డు అధికారులు నీటిని విడుదల చేశారు. అడ్డంకులు వీ.. ఎల్లెల్సీ ద్వారా నీటి ప్రవాహం బుధవారానికి మోకా వద్దకు చేరింది. మరో రెండు రోజుల్లో రాష్ట్ర సరిహద్దు చింతకుంటకు ఆ తరువాత మూడు, నాలుగు రోజుల్లో కోడుమూరు వరకు నీటి ప్రవాహం వస్తుందని అధికారులు అంచనా వేశారు. వెంటనే ఎస్ఎస్ ట్యాంకులకు నీటి పంపింగ్ ప్రారంభించాలని అధికారులు భావించారు. అయితే కర్ణాటకలో నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడంతో తాగు నీటి ఇబ్బందులు తప్పవేమోనని అధికారులు, ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ పరిస్థితుల్లో బోర్డు అధికారులు వెంటనే రింగ్బండ్ను తొలగించాల్సి ఉంది. షెట్టర్లను తెరవని అధికారులు ఏపీ వాటా నీటిని జిల్లాకు చేర్చడంపై తుంగభద్ర బోర్డు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాగునీటి కోసం విడుదల అయిన నీరు మోకా వద్దకు చేరింది. అయితే ఎస్కేప్ చానల్ వద్ద షట్టర్లను మాత్రం అధికారులు తెరవలేదు. ఎగువన ఇసుక సంచులను తొలగించినా ఎస్కేప్ చానల్ వద్ద నీటి ప్రవాహం మళ్లీ నిలిచిపోతోంది. ఆదోని మండలం హానువాళు 251కిమీ వరకు కాలువ బోర్డు పరిధిలో ఉంది. దీంతో ఆదోని ఎల్లెల్సీ ప్రాజెక్టు అధికారులకు కాలువపై ఎలాంటి అధికారం ఉండదు. అయితే నీటి విడుదల జరిగినా బోర్డు అధికారులు ఎస్కేప్ చానల్ షట్టర్లు తెరవక పోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. చర్యలు చేపట్టండి ఎల్లెల్సీకి అడ్డంగా మోకా వద్ద ఏర్పాటు చేసిన రింగ్ బండ్ను వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సాయి ప్రసాద్రెడ్డి. జిల్లా కలెక్టరు సత్యనారాయణను కోరారు. మోకా వద్ద ఇసుక బస్తాలతో నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేశారనే సమాచారం రావడంతో వైఎస్సార్ నాయకుటు చంద్రకాంత్రెడ్డి హైదరాబాదులో ఉన్న ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డికి ఫోన్లో సమాచారం అందించారు. ఈ విషయమైజిల్లా కలెక్టరు, నీటి పారుదల శాఖ, బోర్డు ఈఈతో తాను మాట్లాడానని ఎమ్మెల్యే ఫొన్లో ‘సాక్షి’కి తెలిపారు. ఈ విషయమై కలెక్టరు బళ్లారి జిల్లా కలెక్టరును కూడా ఫోన్లో సంప్రదించి పరిస్థితిని వివరించారని చెప్పారు. రింగ్బండ్ తొలగింపునకు వెంటనే చర్యలు చేపడుతామని, ఎస్కేప్ చానల్ వద్ద షట్టర్లను కూడా తెరిపిస్తామని బళ్లారి జిల్లా కలెక్టరు తెలిపారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. -
కోట్ల బ్యారేజి గేట్లకు మరమ్మతులు
కర్నూలు(సిటీ) : మండల పరిధిలోని సుంకేసుల వద్ద తుంగభద్రనదిపై నిర్మించిన కోట్ల విజయభాస్కర్రెడ్డి బ్యారేజి గేట్ల మరమ్మతులు సోమవారం ప్రారంభమయ్యాయి. క్రస్ట్ గేట్లకు రంగులు వేయడం, రోప్స్, రబ్బర్ సీల్స్, వాక్ వే నిర్మాణం తదితర వాటి కోసం నీరు-చెట్టు కింద రూ.8 కోట్లతో టెండర్లు పిలువగా స్వప్న కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పనులను దక్కించుకుంది. ఇటీవలే ఏజెన్సీతో కేసీ కాలువ ఇంజనీర్లు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం బ్యారేజికి రంగులు వేసే పనులను డీఈఈ జవహర్రెడ్డి, ఏఈఈ శ్రీనివాసరెడ్డి పూజ చేసి ప్రారంభించారు. -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
కర్నూలు: నగర శివారులోని తుంగభద్ర నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి నేతృత్వంలో ఎస్ఐ గిరిబాబు తన సిబ్బందితో దాడి చేసి 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. పంచలింగాల గ్రామానికి చెందిన షేక్ మౌలాలి, ఆంజనేయులు, బోయ రాజు నాయుడు, బిచ్చన్న నాయుడు, వెంకటనారాయణ, నిడ్జూరు గ్రామానికి చెందిన సయ్యద్మహబూబ్, సయ్యద్ రాజుబాష, బోయ రఘుబాబు, పంచలిగాల గ్రామానికి చెందిన బోయ మహేంద్ర, శివప్రసాద్, అయ్యస్వాములు, మునగాలపాడుకు చెందిన బోయ శివుడు, ఆంబోతు అంత్య, రంగారెడ్డి జిల్లా చెంగారెడ్డి గూడెంకు చెందిన ఐచ్చర్ లారీతో పాటు 12 ట్రాక్టర్లను పట్టుకొని స్టేషన్కు తరలించారు. అందరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు. -
కోట్ల బ్యారేజీకి రూ.8.8 కోట్లు
- గేట్ల మరమ్మతులకు ప్రతిపాదనలు - నీరు-చెట్టు కింద నిధులు మంజూరు - గేట్లకు రంగు, రోప్లు, రబ్బర్సీళ్లు, వాక్వే పనులకు ప్రాధాన్యం - 6 నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు కోట్ల విజయభాస్కర్రెడ్డి (సుంకేసుల) బ్యారేజ్కి 2009 వరదలు చేసిన గాయానికి చికిత్స మొదలైంది. కర్నూలు-కడప కాల్వ సాగునీటి సరఫరాకు ప్రధాన ఆధారంగా ఉన్న ఈ రిజర్వాయర్ వరదల కారణంగా ఛిద్రమై ఎనిమిదేళ్లుగా ఉండి లేనట్టుగా మారింది. ఎట్టకేలకు నీరు-చెట్టు కింద నిధులు మంజూరు కావడంతో అధికారులు టెండర్లు పిలిచారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. కర్నూలు సిటీ: తుంగభద్ర నదికి 2009లో వచ్చిన భారీ వరద కారణంగా చిద్రమైన కోట్ల విజయ భాస్కర్రెడ్డి బ్యారేజీ గేట్ల మరమ్మతులపై ఎనిమిదేళ్ల తర్వాత జిల్లా అధికార యాంత్రాంగంలో కదలిక వచ్చింది. దెబ్బతిన్న బ్యారేజీ గేట్లను ఏటా సీజన్కు ముందు, తరువాత మెకానికల్ ఇంజినీర్లు పరిశీలించి నివేదికలు ఇవ్వడం తప్ప ప్రభుత్వంలో చలనం లేకుండా పోయింది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ఇటీవలే బ్యారేజీని పరిశీలించి నీరు-చెట్టు కింద రూ. 8.8 కోట్లు మంజూరు చేశారు. ఈ మేరకు కేసీసీ కర్నూలు డివిజన్ ఇంజినీర్లు రెండు రోజుల క్రితం టెండర్లు పిలిచారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేసేలా టెండర్లో నిబంధన పెట్టారు. కడప, కర్నూలు జిల్లాల సాగు నీటి రంగంలో కేసీ కాలువది కీలకపాత్ర. ఈ డ్యాం నుంచి వచ్చే నీటితోనే కాల్వ కింద 2.65 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. అయితే వరదల్లో డ్యాం గేట్లు డెబ్బతినడంతో ఆ పరిస్థితి లేదు. ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోక పోవడంతో గేట్లు తుప్పు పట్టి, రోప్లు, రబ్బరు సీళ్లు సైతం దెబ్బతిన్నాయి. కొన్ని గేట్ల నుంచి లీకేజీలు పెరిగిపోయాయి. బ్యారేజీకి ప్రమాదం పొంచి ఉన్నట్లు ఇప్పటికే రీజినల్ వర్క్షాపు అండ్ నిర్వహణ విభాగం ఇంజినీర్లు హెచ్చరించారు. ఏటా గేట్ల పరిస్థితిని పరిశీలించి నివేదిక అందిస్తూనే ఉన్నారు. రూ. 8.8కోట్లతో బ్యారేజీకి మరమ్మత్తులు...! సుంకేసుల బ్యారేజీకి స్పిల్వేలో 30 రేడియల్ క్రస్ట్ గేట్లు, హెడ్ రెగ్యులేటర్, స్కవర్ వెంట్కు 4 ప్రకారం వర్టికల్ గేట్లున్నాయి. 2009లో బ్యారేజీకి వరద పోటెత్తడంతో గేట్లు దెబ్బతిన్నాయి. నాటి నుంచి ఆ గేట్లను ఎవరూ పట్టించుకోలేదు. వాక్వే కొట్టుకుపోవడంతో గేట్ల ఆర్మ్స్కు గ్రీజ్ కూడా వేయడంలేదు. రబ్బల్ సీల్స్ మార్చకపోవడంతో లీకేజీలు పెరిగిపోయాయి. బ్యారేజీ నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసిన 2 స్టాప్లాక్ గేట్లలో ఒకటి 30 గేటుకే ఫిక్స్ చేశారు. ఉన్న ఒక్కటి తుప్పుపట్టి సక్రమంగా పని చేయడం లేదు. గేట్లన్నింటికీ 2004 తరువాత పెయింటింగ్ కూడా చేయలేదు. నిపుణులు హెచ్చరిస్తున్నా.. బ్యారేజీ గేట్ల పనితీరుపై ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ రెండు సార్లు నివేదికలు ఇచ్చినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం గమనార్హం. ఇంజనీరింగ్ అధికారులు సైతం బ్యారేజీలో నీటి నిల్వలున్నాయంటూ మరమ్మతుల విషయంలో తప్పించుకునే ధోరణితో వ్యవహారించారు. అయితే ఈ ఏడాది రెండు నెలల క్రితమే పూర్తిగా అంటుగంటిపోవడంతో పనులు చేసేందుకు అవకాశం వచ్చింది. ఇటీవలే కలెక్టర్ బ్యారేజీని పరిశీలించి గేట్లకు నీరు-చెట్టు పథకం కింద నిధులు మంజూరు చేస్తామని చెప్పడంతో ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు నిధుల మంజూరుకు అనుమతి రావడంతో టెండర్లు పిలిచారు. మంజూరైన నిధులతో గేట్లు, వాక్వే, రోప్లు, స్టాక్లాక్ గేట్ మరమ్మతులకు ప్రాధాన్యం ఇస్తారు. మరో రూ. 18 లక్షలతో రబ్బరు సీళ్లు, ఇతర పనులు చేస్తారు. టెండర్లు పిలుస్తున్నాం - ఎస్.చంద్రశేఖర్రావు, జల వనరుల శాఖ ఎస్ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి బ్యారేజీ(సుంకేసుల) గేట్ల మరమ్మతులు, పెయింటింగ్ కోసం రూ. 8.8 కోట్లతో అంచనాలు రూపొందించాం. టెండర్లు పిలుస్తున్నాం. గేట్ల రోప్లు, రబ్బరు సీళ్లు, వాక్వేతో పాటు ఇతర చిన్న చిన్న రిపేర్లు చేయనున్నాం. ఇందుకు కలెక్టర్ నీరు-చెట్టు పథకం కింద అనుమతులు ఇచ్చారు. -
హద్దుమీరి అడ్డదారి
- కర్ణాటక ఇసుక మాఫియా - జిల్లా సరిహద్దుల్లో దందా - ఇసుక దోపిడీకి ప్రత్యేక దారి - వంద ట్రాక్టర్లలో తరలింపు - పట్టించుకోని రెవెన్యూ అధికారులు మంత్రాలయం : కర్ణాటక ఇసుక మాఫియా హద్దులు దాటింది. తమవైపు ఇసుకనంత ఊడ్చేసి.. ఇప్పుడు ఆంధ్ర హద్దుల్లోకి ప్రవేశించింది. అక్రమ దందాకు ఆంధ్ర వైపుగా తుంగభద్ర నదిలో అడ్డదారి వేసింది. ఈ దారిలో అడ్డదిడ్డంగా ఇసుకను తరలిస్తోంది. వేలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించి కాసుల వర్షం కురిపించుకుంటోంది. అరికట్టాల్సిన రెవెన్యూ అధికారులు మాత్రం కళ్లు మూసుకున్నారు. రోజుకు వెయ్యి ట్రిప్పులు.. కర్ణాటక నదీతీర గ్రామాల ఇసుక మాఫియా హద్దులు మీరింది. తమ హద్దులు దాటుకుని ఆంధ్రవైపు ఇసుక నిల్వపై పడింది. కోసిగి మండలం తుమ్మిగనూరు, సాతనూరు, కందకూరు, బొమ్మలాపురం హద్దుల్లో పాగా వేసింది. ఇసుక తరలించేందుకు ఏకంగా మట్టితో అడ్డదారి సైతం నిర్మించుకుంది. కర్ణాటక ప్రాంతం రాజోలి, జూకూరు గ్రామాల ఇసుక మాఫియా దందాకు దారితీసింది. ఏకకాలంలో 100 ట్రాక్టర్లు చొరబడి రేయింబవళ్లు ఇసుకను ఎత్తుకెళ్తున్నాయి. రోజుకు వెయ్యి ట్రిప్పులు తరలిస్తున్నారు. సాతనూరు, తుమ్మిగనూరు గ్రామాల సమీపానికి చేరుకుని ఇసుకను భారీగా హద్దులు దాటిస్తున్నారు. మారని తీరు కర్ణాటక ఇసుక మాఫియాకు ఇదో పరిపాటిగా మారింది. గతంలో ఇసుక తరలించేందుకు ఆర్డీఎస్ ఆనకట్ట పైభాగాన ఆనుకుని దారి వేయడం జరిగింది. కోసిగి పోలీసులు దాడులు చేసి దారిని జేసీబీతో మొత్తం చెరిపేశారు. అదే తరహాలో ప్రస్తుతం సాతనూరు సమీపంలో దాదాపు కి.మీ. పొడవునా మట్టిరోడ్డు వేశారు. ఆంధ్రవైపు చొరబడటంతో ఇక్కడి రైతులు గగ్గోలు పెడుతున్నారు. స్థానికులు ఇసుకను తీసుకెళ్తే కోసిగి అధికారులు తక్షణమే దాడులు చేస్తున్నారు. కర్ణాటక వారు.. దోపిడీ సాగిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే మంత్రాలయం మండల కేంద్రంలో మాత్రం స్థానిక ఇసుక మాఫియా నిశీధిలో తన కార్యకలాపాలు సాగిస్తోంది. పట్టించుకోని రెవెన్యూ అధికారులు.. పోలీసులు కాస్త చొరవతోనే దాడులు నిర్వహిస్తున్నా రెవెన్యూ అధికారుల్లో చలనం కొరవడింది. కోసిగి రెవెన్యూ అధికారులు అలసత్వం కారణంగా కర్ణాటక ఇసుక మాఫియాకు అడ్డుఅదుపూ లేకపోయింది. మంత్రాలయంలో పోలీసులు పగ్గాలేసి పడుతున్నా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో ట్రాక్టర్లు స్టేషన్ నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. లోపాయికారీ ఒప్పందాలతోనే ఈ దందా సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు మాత్రం ఇసుక దందా లేదని...దాడులు చేస్తున్నామని చెబుతున్నారు. కర్ణాటక ఇసుక మాఫియా రోడ్డు వేసిన విషయం ప్రస్తావించగా అలాంటిదేమీ లేదన్నారు. -
ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట
కర్నూలు సీక్యాంప్: తుంగభద్ర తీరం వెంబడి ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు తహసీల్దార్ టీవీ రమేష్బాబు, తాలుకా సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు. శుక్రవారం కర్నూలు మండలం పంచలింగాల, మునగాలపాడు వంటి గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది దాడులు చేసి ఓ ట్రాక్టర్ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తహసీల్దార్, సీఐ మాట్లాడుతూ నిబంధనలను విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఎల్లెల్సీకి నీటి విడుదల
హొళగుంద: తుంగభద్ర దిగువ కాల్వకు శుక్రవారం డ్యాం నుంచి నీటిని విడుదల చేశారు. ప్రతి రెండు గంటలకు వంద క్యూసెక్కుల చొప్పున పెంచుతూపోతున్నారు. గతంలో ఫిబ్రనరి 6న కాల్వకు నీటి సరఫరాను నిలిపేశారు. తాగనీటి అవసరాల కోసం ఆంధ్ర కోటా నీటిని విడుదల చేసినట్లు బోర్డు అధికారులు తెలిపారు. ఆంధ్ర బార్డర్(250కిమీ)కు 600 క్యూసెక్కుల నీటిపి పారించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ నెల 11వ తేదీ నాటికి ఆంధ్ర పరిధి(చింతకుంట 135కిమీ)నీరు చేరే అవకాశం ఉందన్నారు. శుక్రవారం డ్యాం నీటిమట్టం 1578 అడుగుల వద్ద 3.70 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
కొత్త ఇసుక రీచ్లు గుర్తించండి
– జిల్లా కలెక్టర్ కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో ఇసుక తవ్వకాలకు కొత్త రీచ్లను గుర్తించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా ఇసుక కమిటీ సమావేశాన్ని తన చాంబరులో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... గనుల శాఖ, భూగర్భ జల శాఖ, ఇరిగేషన్ అధికారులు కమిటీగా ఏర్పడి తుంగభద్ర, హంద్రీ ఇతర ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలకు కొత్త రీచ్లను గుర్తించాలని తెలిపారు. కొత్త రీచ్ల గుర్తింపు ప్రతిపాదనలను 15 రోజుల్లో ఇవ్వాలని కమిటీ సభ్యులను ఆదేశించారు. హంద్రీ నదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలను 100 శాతం అదుపు చేయాలని తెలిపారు. అక్రమంగా ఇసుకను తరలించే వారు ఏ స్థాయి వారైన కఠిన చర్యలు తీసుకోవాలని వివరించారు. ఏడు మండలాల్లోని హంద్రీ తీర గ్రామలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు హంద్రీలో నిరంతరం గస్తీ తిరుగుతూ... ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టాలని తెలిపారు. హంద్రీ వెంట అడ్డుగోలుగా వేసిన బోర్లను గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జేసీ హరికిరణ్, డీఆర్ఓ గంగాధర్గౌడు, గనులశాఖ ఏడీ వెంకటరెడ్డి, కర్నూలు ఆర్డీఓ హుసేన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. -
తుంగఛిద్రం!
బింగిరాళ్లకు రెక్కలు - హద్దులు దాటుతున్న విలువైన ఖనిజం - బాల కార్మికులతో సేకరణ - నదీ తీరంలో టీడీపీ నేత పాగా - ఐదేళ్లుగా సాగుతున్న వ్యాపారం - చోద్యం చూస్తున్న మైనింగ్, రెవెన్యూ అధికారులు తుంగభద్ర ఎడారిగా మారుతోంది. నదీ తీరంలో కోట్లాది రూపాయల విలువైన బింగిరాళ్ల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో అధికార పార్టీకి చెందిన తూర్పు గోదావరి జిల్లా నేత కనుసన్నల్లో ఈ దందా జరుగుతోంది. ఐదేళ్లుగా అడిగే నాథుడే లేకపోవడంతో భూగర్భ జలాలపై ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. స్థానిక టీడీపీ నేత అండతో పాటు అధికారుల చేతులు తడుస్తుండటంతో ఎవ్వరూ నోరు మెదపడం లేదని తెలుస్తోంది. కర్నూలు(వైఎస్ఆర్ సర్కిల్): జిల్లా మీదుగా ప్రవహిస్తున్న తుంగభద్ర తీరంలోని బింగిరాళ్లకు(పెబ్బెల్ క్వార్ట్ ్జ) రెక్కలొచ్చాయి. ఎలాంటి ఉపయోగం లేని విధంగా కనిపించే ఈ రాళ్ల ధర టన్ను రూ.3వేల నుంచి రూ.5వేలు పలుకుతోంది. నదీ తీరంలో వందల ఎకరాల్లో విస్తరించిన ఈ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. వరద ఉద్ధృతంగా ఉన్న సమయంలో ఈ రాళ్లు వేగంగా వచ్చే నీటిని నిలువరించే వీలుంటుంది. తద్వారా భూగర్భ జలాల పెంపునకు ఈ రాళ్లు దోహదం చేస్తాయి. ఇంతటి విలువైన రాళ్లను అక్రమార్కులు సరిహద్దులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వందలాది మంది కూలీలకు రోజుకు ఒక్కొక్కరికి రూ.120 చెల్లిస్తూ ఈ అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగిస్తున్నారు. కూలీలు సేకరించిన రాళ్లను 10-20 ఎంఎం, 20-30, 30-40 ఎంఎం.. ఇలా వంద వరకు సైజుల్లో నదీ తీరంలోనే విభజించి ఓ ప్రముఖ ప్రయివేట్ పాఠశాల వద్దకు రాత్రిళ్లు ఆటోల్లో తరలించి డంప్ చేస్తున్నారు. అక్కడ రాళ్లను సంచుల్లో నింపి బెంగళూరు, హైదరాబాద్, నల్లగొండ, విజయవాడ, అమరావతితో పాటు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. కోట్లు కురిపిస్తున్న ఖనిజం ఒక్క పంచలింగాల ప్రాంతంలోనే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యాపారి ఈ రాళ్ల వ్యాపారం జోరుగా సాగిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ కూలీలు ప్రతి రోజూ 40 టన్నుల రాళ్లు సేకరించి లారీల ద్వారా హద్దులు దాటిస్తున్నారు. ఇటీవల నల్గొండతో పాటు, విజయవాడ, బెంగళూరు ప్రాంతాల్లో ఖనిజానికి డిమాండ్ ఏర్పడింది. ఒక్కో లారీలో 40 టన్నుల వరకు తరలించే అవకాశం ఉండటంతో.. టన్ను రూ.3వేలు చొప్పున సొమ్ము చేసుకుంటున్నారు. ఈ లెక్కన ఒక్క లోడుతో రూ.1.20 లక్షలు ఆక్రమార్కుల జేబుకు చేరుతోంది. గత ఐదేళ్లుగా సాగుతున్న ఈ వ్యాపారాన్ని పరిశీలిస్తే కోట్లాది రూపాయల మేర ప్రభుత్వ ఖజానాకు గండి పడుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ సాగిస్తున్న ఈ వ్యవహారంలో బాల కార్మికులను కూలీలుగా మార్చడం గమనార్హం. బహిరంగమే.. నోరు మెదపరు నగరానికి కూతవేటు దూరంలోని నదీ తీరంలో రాళ్ల తరలింపు నిత్యకృత్యమే అయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఎలాంటి అనుమతి లేకుండా నది వద్దే రాళ్లను గ్రేడింగ్ చేస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. గనుల శాఖలోని ఓ అధికారితో పాటు రెవెన్యూ, పోలీసు యంత్రాంగానికి సదరు వ్యాపారి లారీకి రూ.2వేల చొప్పున మామూళ్ల రూపంలో ముట్టజెబుతుండటం వల్లే వ్యవహారం సాఫీగా సాగిపోతున్నట్లు తెలుస్తోంది. బింగిరాళ్ల ఉపయోగం - మంచినీటిని శుద్ధి చేసే ట్యాంకుల్లో.. - వాటర్ ప్యూరిఫయర్లలో.. - రహదారులు, హోటళ్లు, విలాసవంతమైన ఇళ్లకు అలంకరణ. మా దృష్టికి రాలేదు తుంగభద్ర నుంచి పెబ్బెల్క్వార్ట్ ్జను అక్రమంగా తరలిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. ఎవరైనా అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. - వెంకటరెడ్డి, భూగర్భ గనుల శాఖ -
ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
కర్నూలు సీక్యాంప్: కర్నూలు మండలం తుంగభద్ర తీరాన ఉన్న బావాపురంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న తొమ్మిది ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేశారు. కొంతకాలంగా తుంగభద్ర తీరాన ఇసుక తవ్వకాలు ప్రభుత్వం నిలుపుదల చేసింది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి కొందరు వ్యాపారులు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. పక్కా సమాచారంతో సోమవారం సాయంత్రం కర్నూలు తహసీల్దార్ టీవీ రమేష్బాబు సిబ్బందితో దాడి చేసి తిమ్మిది ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. యజమానులకు షోకాజ్ నోటీసులు ఇచ్చి ఒక్కో ట్రాక్టర్కు రూ.2 లక్షల చొప్పున జరిమానా వేస్తున్నట్లు తహసీల్దార్ వివరించారు. -
మనసే మంత్రాలయం
– ఆకట్టుకున్న సంస్థాన పూజలు – అలరించిన దాసవాణి, వీణ కచేరీలు – నేడు రాఘవేంద్రుల జన్మదినం వేడుక మంత్రాలయం : వేదం వీణ గానమైంది.. మనసే మంత్రాలయాన్ని స్మరించింది. సద్గురు శ్రీరాఘవేంద్రస్వామి వైభవోత్సవాలతో తుంగభద్రమ్మ భక్తిగానం ఆలపించింది. శనివారంతో శ్రీగురు వైభవోత్సవాలు ఐదో రోజుకు చేరాయి. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో వేకువ జాము నుంచే శ్రీమఠంలో వేడుకలు ప్రారంభమయ్యాయి. రాఘవేంద్రుల మూలబృందావనానికి నిర్మల్య విసర్జన, పుష్ప, పంచామృతాభిషేకాలు, తులసీమాల ధారణ, కాషాయ పట్టువస్త్ర, పుష్పామాలంకరణ చేశారు. పూజా మందిరంలో మూలరాముల పూజ, బృందావన ప్రతిమకు బంగారు పల్లకీ సేవ, రాయరు పాద నిర్వహించారు. గురుసార్వభౌమ దాససాహిత్య మండపంలో కర్ణాటక సంగీత కళాకారుల దాసవాణి, వీణ కచేరీలు ఎంతగానో భక్తులను ఆకట్టుకున్నాయి. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను అంబారీ, చెక్క, వెండి, బంగారు, నవరత్న రథాలపై కనుల పండువగా ఊరేగించారు. యోగీంద్ర మండపంలో బెంగళూరుకు చెందిన రూప, గీత సంగీత విభావరిలో ఆలపించిన భక్తిగేయాలు భక్తులను విశేషంగా అలరించాయి. బెంగళూరు ఆరాధన స్కూలు విద్యార్థులు నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. పీఠాధిపతి.. కళాకారులకు శేషవస్త్రం, రాఘవేంద్రుల జ్ఞాపిక బహూకరించి ఫల, పూల, మంత్రాక్షింతలతో ఆశీర్వదించారు. ఉత్సవంలో ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, దివాన్ వాదీరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి, డీఎం ఆనందరావు పాల్గొన్నారు. నేడు రాఘవేంద్రుల జన్మదిన వేడుక విశ్వ గురువు రాఘవేంద్రస్వామి జన్మదినం వేడుక ఆదివారం జరగనుంది. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో వేకువజామున రాఘవేంద్రుల మూలబృందావనంకు విశేష పంచామృతాభిషేకం చేస్తారు. రాయరు చిత్రపటాలను ర«థాలపై ఊరేగిస్తారు. డోలోత్సవ మండపంలో రాయరు జీవిత చరితను భక్తులకు ప్రవచిస్తారు. వేడుక సందర్భంగా పలువురు ప్రముఖులతోపాటు, వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. -
ముగిసిన కంగాల్షా వలీ ఉరుసు
– మూడు రాష్ట్రాల భక్తులతో కిటకిటలాడిన బావాపురం బావాపురం (కర్నూలు సీక్యాంప్): మండల పరిధిలోని తుంగభద్ర నదీ సమీపంలోని బావాపురంలో వెలసిన కంగాల్షా వలీకంగాల్షా వలీ ఉరుసు గురువారంతో ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన ఉరుసు ఉత్సవాలకు కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. చివరిరోజు అయిన గురువారం కిస్తీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా కర్ణాటక భక్తులు ప్రసాదం వేసిన తర్వాత స్థానిక భక్తులు ప్రసాదం వేశారు. ఈ ప్రసాదాన్ని తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. ప్రసాదం దక్కితే మంచిదని భక్తుల నమ్మకం. -
నేడు కంగాల్షా వలీ ఉరుసు
– తెలంగాణ, కర్ణాటక నుంచి భక్తులు – ముగిసిన గంధం కర్నూలు సీక్యాంప్ : తుంగభద్ర నదీ తీరంలో బావాపురంలో కంగాల్షా వలీ ఉరుసు బుధవారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొలిరోజు వేలాది భక్తుల మధ్య భక్తిశ్రద్ధలతో గంధం కార్యక్రమం నిర్వహించారు. గురువారం కిస్తీ, ఖవ్వాలీ నిర్వహించనున్నట్లు పీఠాధిపతి సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ ఖాద్రీ తెలిపారు. వాటిని తిలకించేందుకు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని పేర్కొన్నారు. -
గుర్తుతెలియని వారి చేతిలో మొసలి హతం
- తల, మొండెం వేరుచేసిన వైనం - కర్నూలు మండలం బావాపురం వద్ద ఘటన కర్నూలు సీక్యాంప్: మండల పరిధిలోని బావాపురం తుంగభద్ర తీరాన మంగళవారం ఒక మొసలిని గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమైంది. కొంత కాలంగా నదిలో నీరు తక్కువగా ఉండడంతో మొసలి దారి తప్పి పొలాల్లోకి వచ్చింది. అప్పటికే రాత్రి వేళల్లో పంటలకు నీరు పెట్టేందుకు వచ్చిన స్థానికులు మొసలిని చూసి భయంతో చంపేసినట్లు తెలుస్తోంది. మొసలి తల, మొండెం వేరు చేసి వెళ్లారు. అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. స్థానికులను వివరాలు ఆరా తీశారు. -
మహిమాన్వితుడు..కంగాల్ షా వలీ
- మార్చి 1.2 తేదీల్లో ఉరుసు - ప్రసిద్ధిగాంచిన కిస్తీ వేడుకలు - ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు - తుంగా తీరంలో ఆకట్టుకుంటున్న దర్గా కర్నూలు (ఓల్డ్సిటీ): కొలిచిన వారికి కొంగు బంగారం.. హజరత్ కంగాల్షా వలీ. ఈయన అసలు పేరు హజరత్ సయ్యద్ ఖుద్రతుల్లాషా ఖాద్రి. ఈ హజరత్ దర్గా పవిత్ర తుంగభద్ర నదీ తీరంలో కర్నూలుకు పది కిలోమీటర్ల దూరంలో వెలిసింది. మార్చి నెల ఒకటో తేదీ ఉరుసు ప్రారంభం కానుంది. ఉత్సవాల్లో పాల్గొనేందుకు మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది రానున్నారు. ఈ నేపథ్యంలో హజరత్ దర్గాపై ప్రత్యేక కథనం. హజరత్.. బాగ్దాద్కు చెందిన మహెబూబ్ సుభాని (గౌసేపాక్ దస్తగిరి) (ర.అ) 13వ తరం వారసుడు. భారత దేశంలో మొగలులు సామ్రాజ్యం స్థాపించక ముందే హర్యానా రాష్ట్రంలోని సధౌరా ప్రదేశంలో ఈయన స్థిరపడ్డారు. అక్బర్ చక్రవర్తి తల్లి హమీదా స్థాపించిన ఇస్లాం యూనివర్సిటీకి హజరత్ తాత సయ్యద్ అబ్దుల్ ముకరిమ్ ఖాద్రీ వైస్ చాన్స్లర్గా ఉండేవారు. హజరత్ పూర్వీకులు చదువు, ఆధ్యాత్మిక అంశాల్లో ఆరితేరి ఉండటంతో మొగల్ సామ్రాజ్యంలోని చక్రవర్తులంతా వీరి కుటుంబం వద్ద శిష్యరికం పొందారు. ఔరంగజేబు మరణం తర్వాత రాజరిక పరిస్థితులు అధ్వానంగా మారాయి. ఆతర్వాత హజరత్ కుటుంబం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లింది. షాజహానాబాద్ (ఇప్పటి న్యూఢిల్లీ)లో ఉంటున్న హజరత్ క్రీ.శ. 1725లో కర్నూలుకు వచ్చారు. బావాపురంలో సమాధి.. ప్రస్తుతం బావాపురం గ్రామం..ఒకప్పుడు క్రూరమృగాలు సంచరించే అటవీ ప్రాంతం. హజరత్ స్థిరపడ్డాక అక్కడ నివాసాలు ఏర్పడి గ్రామంగా అవతరించింది. దైవచింతన ద్వారా కుల మతాలకు అతీతంగా భక్తుల సమస్యలు ఆయన పరిష్కరించే వారు. తన ప్రసంగాల ద్వారా శిష్యులను (భక్తులను) సన్మార్గంలో నడిపించే వారు. ఆయన ఆధ్యాత్మిక ప్రసంగాలు వినేందుకు ముస్లింలతో పాటు అన్యమతస్తులూ వచ్చే వారు. కర్నూలు నవాబ్ అలాఫ్ ఖాన్–1.. హజరత్ వద్ద శిష్యరికం స్వీకరించారు. గ్రామం చుట్టూ ఉన్న ఐదు ఎస్టేట్ల జాగీరును బహూకరించినా హజరత్ స్వీకరించలేదు. కర్నూలు ప్రజలు హజరత్ వద్దకు వచ్చి విద్య, ఆధ్యాత్మిక విలువలు నేర్చుకునేందుకు వీలుగా నవాబు.. కర్నూలు నుంచి బావాపురానికి రోడ్డు వేయించారు. స్వామి 1766లో సమాధి అయ్యారు. ప్రస్తుతం హజరత్.. ఆరో ముని మనుమడు సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ ఖాద్రి..ఉరుసు నిర్వహిస్తున్నారు. ఉరుసు చివరి రోజున నిర్వహించే కిస్తీలు అత్యంత వైభవంగా జరుగుతాయి. సుందరంగా దర్గా.. మొదట సమాధి వరకే నిర్మించిన దర్గాను ఇప్పుడు రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండేలా సుందరంగా తీర్చిదిద్దారు. చుట్టూ నాలుగు స్తంభాలతో తాజ్మహల్ను పోలి ఉండటం, భారీ ప్రవేశ ద్వారం, మదీనాలోని మస్జిదే నబ్వీని పోలిన ఆస్తానా గుమ్మజ్ కట్టించడంతో భక్తులకు ఇట్టే ఆకట్టుకుంటోంది. హజరత్ దర్గా తుంగభద్ర నదీ తీరంలో ప్రశాంతమైన ప్రదేశంలో ఉంది. ఆవరణలో పచ్చని చెట్ల నీడ లభిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో కర్నూలు నగర వాసులు దీన్ని విహార స్థలంగా ఎంచుకున్నారు. రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని ఈ ప్రాంతం నుంచే ప్రారంభించడం ఆనవాయితీ. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి ప్రతిసారి ఎన్నికల ప్రచారాన్ని మొదట దర్గాను దర్శించుకున్న తర్వాతే ప్రారంభిస్తారు. ఇలా చేరుకోవాలి.. హజరత్ కంగాల్షా వలీ దర్గాకు చేరుకోవాలంటే కర్నూలు కొత్త బస్టాండులో సుంకేసుల డ్యాం, రాజోలి గ్రామాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణించాల్సి ఉంది. పాత బస్టాండు నుంచి ఈ మార్గంలో ఆటోలు కూడా ఉంటాయి. భక్తులు బావాపురం దర్గా వద్ద ఏర్పాటు చేసిన స్టేజీలో దిగాల్సి ఉంటుంది. ఒకటి నుంచి ఉరుసు – సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ ఖాద్రి మార్చి నెల ఒకటో తేదీ నుంచి ఉరుసు ప్రారంభమవుతుంది. ఒకటిన గంధోత్సవం, బాణోత్సవం, రెండో తేదీ సాయంత్రం 4 గంటలకు కిస్తీ, రాత్రి ఖవ్వాలి కార్యక్రమాలు ఉంటాయి. ఉరుసుకు లక్ష మంది వచ్చే అవకాశం ఉంది. ఇందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. -
‘సుంకేసుల’లో ఉద్రిక్తత
- విద్యుత్ మోటార్ల తొలగింపును అడ్డుకున్న రైతులు - మున్సిపల్ అధికారులతో వాగ్వాదం సుంకేసుల(గూడూరు): తుంగభద్ర నదీ తీరం వెంట విద్యుత్ మోటార్లను తొలగించాలన్న కలెక్టర్ ఆదేశాలతో సోమవారం సుంకేసుల వద్ద ఉద్రిక్తత నెలకొంది. సుంకేసుల రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1.20 టీఎంసీలు. ప్రస్తుతం డ్యాంలో 0.302 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ నీరు మరో నెలరోజులు మాత్రమే సరిపోతాయి. ఇటువంటి పరిస్థితుల్లో మోటార్లను తొలగించాలని నాలుగు రోజుల క్రితం కలెక్టర్ సీహెచ్ విజయ్మోహన్ కర్నూలు కార్పొరేషన్, ట్రాన్స్కో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ట్రాన్స్కో, కర్నూలు కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు సోమవారం సుంకేసుల దగ్గరికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న కొత్తకోట, సుంకేసుల, ఆర్.కొంతలపాడు, తదితర గ్రామాలకు చెందిన రైతులు జలాశయం దగ్గరికి చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రవీంద్రబాబు, ఈఈ రాజశేఖర్, కర్నూలు తహసీల్దార్ రమేష్బాబు, ట్రాన్స్కో గూడూరు ఏడీ పార్థసారధి, తదితర అధికారులు సుంకేసులకు చేరుకోవడంతో రైతులు అధికారులను చుట్టుముట్టి వాదనకు దిగారు. తుంగభద్ర నది నీటిని నమ్ముకుని వందల ఎకరాల్లో ఉల్లి, మొక్కజొన్న, పత్తి, మిరప, చెరుకు, తదితర పంటలు సాగు చేసుకున్నామని.. విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తే నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. మరో 15 రోజులు అవకాశం ఇస్తే పంటలు చేతికి వస్తాయని అధికారులతో మొరపెట్టుకున్నారు. రిజర్వాయర్కు అవతలి వైపు (తెలంగాణ) కూడా అధిక సంఖ్యలో విద్యుత్ మోటర్లు ఉన్నాయని వాటిని తొలగించడం లేదని వాదనకు దిగారు. సాగునీటి కంటే తాగునీరు ముఖ్యమని..అధికారులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కోడుమూరు సీఐ శ్రీనివాసులు, గూడూరు, కోడుమూరు ఎస్ఐలు పవన్కుమార్, మహేష్కుమార్లు రైతులకు సర్ది చెప్పారు. కలెక్టర్ను కలిసేందుకు కర్నూలుకు వెళ్లిన రైతులు: కలెక్టర్ ఆదేశాల మేరకే విద్యుత్ మోటార్లను తొలగిస్తున్నట్లు అధికారులు చెప్పడంతో తమ గోడు తెలిపేందుకు సుంకేసుల సర్పంచు నాగన్న ఆధ్వర్యంలో రైతులు కర్నూలుకు వెల్లారు. చేతికి వచ్చిన పంటలు అందకుండా పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రైతులు కర్నూలుకు వెళ్లిన తరువాత ట్రాన్స్కో అధికారులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు కనెక్షన్లను తొలగించారు. -
ఎల్లెల్సీకి నీటి విడుదల
హోళగుంద : తుంగభద్ర డ్యాం నుంచి శనివారం రాత్రి బోర్డు అధికారులు దిగువ కాల్వ(ఎల్లెల్సీ)కు నీటిని విడుదల చేశారు. ముందుగా పసవర్ కెనాల్కు విడుదల చేసిన అధికారులు శనివారం రాత్రి ఎల్లెల్సీకి వదిలి రెండు గంటలకు వంద క్యూసెక్కుల చొప్పున పెంచుతూ పోతున్నారు. తాగునీరు అవసరాల కోసం దిగువకు 987 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు బోర్డు అధికారులు చెప్పారు. శనివారం డ్యాంలో నీటిమట్టం 1585 అడుగులతో 6.83 టీఎంసీలు నిల్వ ఉంది. -
నీటి ఇక్కట్లకు చంద్రబాబే కారణం
- ముచ్చుమర్రి పేరుతో జనాన్ని మభ్యపెడుతున్నారు - విలేకరుల సమావేశంలో బైరెడ్డి కర్నూలు సిటీ: కర్నూలు- కడప కాలువ పరిధిలో సాగునీటి కష్టాలకు సీఎం చంద్రబాబే కారణమని రాయల సీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి అన్నారు. కర్నూలులోని ఓ హోటల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. గతంలో చంద్రబాబు హయాంలోనే కర్ణాటక ప్రభుత్వం తుంగభద్రపై అక్రమ ప్రాజెక్టులు నిర్మించిందన్నారు. దీనివల్ల తుంగభద్ర డ్యాంకు నీటి సరఫరా తగ్గిపోయి కేసీ ఆయకట్టుకు ఇక్కట్లు మొదలయ్యాయన్నారు. పట్టిసీమను నిర్మించి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పిన సీఎం చుక్కనీరు ఇవ్వకపోగా ప్రస్తుతం ముచ్చుమర్రి ఎత్తిపోతలను తెరపైకి తెచ్చి సీమ జనాన్ని మభ్యపెడుతున్నారని ఆరోపించారు. కేసీకి 39.9 టీఎంసీల నికర జలాల వాటాను వదులుకునే విధంగా ప్రభుత్వ చర్యలున్నాయన్నారు. 35 వేల ఎకరాల కోసం ఏర్పాటు చేసిన పథకంతో రాయల సీమనే సస్యశ్యామలం చేస్తామని చెప్పడం దురదృష్టకరమన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే 69జీఓను రద్దు చేసి, శ్రీశైలంలో 854 అడుగుల కనీన నీటి మట్టాన్ని ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాయల సీమకు కృష్ణా జలాలు, కోస్తాంద్రకు గోదావరి జలాలను ఇవ్వాలని, కృష్ణ పుష్కరాలను ముచ్చుమర్రిలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టని సీఎం, కలెక్టర్కు ముచ్చుమర్రిలో పర్యటించే అర్హతనే లేదన్నారు. -
కౌతాళం చేరిన టీబీ డ్యాం నీరు
కౌతాళం: ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు తుంగభద్ర డ్యాం నుంచి విడుదల చేసిన 1.5టీఎంసీల నీరు శనివారం మండలంలోని ఎల్ఎల్సీకి చేరింది. ఇటీవల మండల రైతులు తమ పంటల పరిస్థితిని ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోపోవడంతో వారు స్పందించి ఈ నీటిని విడుదల చేయించారు. ఈ నీరు శనివారం మండల సరిహద్దులోకి చేరింది. -
టీబీ బోర్డు కేసును వాయిదా వేసిన హైకోర్టు
కర్నూలు సిటీ: టీబీ బోర్డు కేసును శుక్రవారం హైకోర్టు వాయిదా వేసింది. తుంగభద్ర జలాల విషయంలో దిగువ కాలువ ఆయకట్టుకు అన్యాయం జరుగుతోందని రైతులు హైకోర్టులో కేసు వేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరుగగా.. టీబీ డ్యాంలో కేవలం 5.5 టీఎంసీల నీరు మాత్రమే ఉందని బోర్డు తరఫున కోర్టుకు నివేదించారు. నిల్వ నీటిపై కర్ణాటక ప్రభుత్వ తప్పుడు లెక్కలు చెబుతుందని, 9.5 టీఎంసీల నీరు నిల్వ ఉందని బోర్డు అధికారులే సమాచారం ఇచ్చారని పీపీ కోర్టు దృష్టికి తీసుకపోయారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు విచారణను ఈ నెల6వ తేదికి వాయిదా వేసింది. -
తుంగభద్రలో ఆడశిశువు మృతదేహం
కర్నూలు (ఓల్డ్సిటీ): భేటీ బచావో (ఆడపిల్లను రక్షించండి) నినాదాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశ నలుమూలలా మార్మోగిస్తున్నా.. ఆడశిశువు నిరాదరణకు గురవుతునే ఉందని చెప్పేందుకు ఇదిగో ఈ ఘటన నిదర్శనం. నగర శివార్లలోని రైల్వే బ్రిడ్జి కింద తుంగభద్ర నదిలో సోమవారం స్థానికులు ఆడశిశువు మృతదేహాన్ని గుర్తించారు. శరీరం ఉబ్బి ఉండటాన్ని బట్టి రెండు రోజుల క్రితమే పారవేసినట్లు తెలుస్తోంది. -
నెలాఖరు వరకు ఎల్లెల్సీకి నీరు
హొళగుంద: తుంగభద్ర దిగువ కాల్వ(ఎల్లెల్సీ)కు ఈ నెలాఖరు వరకు సాగునీటి సరఫరా ఉంటుందని టీబీ బోర్డు ఈఈ విశ్వనాథరెడ్డి సోమవారం విలేకరులకు తెలిపారు. నీటి విడుదలపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వర్షాభావం కారణంగా ఈ ఏడాది డ్యాంలో 60 టీఎంసీల నీరు మాత్రమే చేరిందని చెప్పిన ఆయన ఈ నెల 27 వరకు ఆంధ్ర కోటా కింద నీరు ఇవ్వాల్సి ఉందన్నారు. అందులో భాగంగా కాల్వ కింద సాగైన పంటలు, ఆంధ్రాకు తాగునీరును అందించాలనే ఉద్దేశంతో బోర్డు ఉన్నతాధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కర్ణాటక కోటా నీటిని నిలిపి వేసి ఆంధ్రాకు మాత్రమే సరఫరా చేస్తున్నట్లు ఈఈ వెల్లడించారు. -
నేడు తుంగా హారతి
– ఏర్పాట్లలో శ్రీమఠం అధికారులు – నదీ తీరం, ప్రాంగణంలో దీపోత్సవం మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి సన్నిధిలో సోమవారం పవిత్ర తుంగా హారతి ఇవ్వనున్నారు. ఇందుకు పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు నేతృత్వంలో తుంగభద్ర నది తీరంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 6 నుంచి 11 గంటల వరకు పుణ్యహారతి, కార్తీక దీపోత్సవం చేపడతారు. ముందుగా ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను ప్రత్యేక వాహనంపై గజరాజు స్వాగతిస్తుండగా మంగళవాయిద్యాలు, భజనలు, వేద పఠనంతో ఊరేగింపుగా నది చెంతకు తీసుకువస్తారు. అక్కడ పీఠాధిపతి తుంగా హారతి విశిష్టతను భక్తులకు ప్రవచిస్తారు. పవిత్ర నది జలంతో ఆజ్యం ఇచ్చి కుంకుమార్చన, నారీకేళ సమర్పణ, వాయినాలు వదిలి శాస్త్రోక్తంగా పూజలు చేస్తారు. అర్చకులు కార్తీక దీపాలతో వేదపఠనం సాగిస్తూ హారతులు పడతారు. భక్తులు వేలాదిగా నదీ తీరం, శ్రీమఠం ప్రధాన ద్వారం, ప్రాంగణాల్లో కార్తీక దీపాలు వెలిగిస్తారు. ఈ నేపథ్యంలో మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
హంద్రీనీవాతో సీమ సస్యశ్యామలం
హాలహర్వి : దివంగత ముఖ్యమంత్రి ఽవైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా సాగు, తాగునీరు అందించి సీమ జిల్లాలను సస్యశ్యామలం చేశారని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. బుధవారం ఆయన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో కలిసి మండల కేంద్రంలో నూతన తహసీల్దార్ కార్యాలయం, హర్ధగేరి హెల్త్ ఏటీఎంను ప్రారంభించారు. జిల్లాలో ఆలూరు నియోజకవర్గం అత్యంత వెనకబడిందని, ఈ ప్రాంత రైతులు వర్షాధారంపై ఏటా పంటలను సాగుచేసి నష్టపోతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. కరువు రైతులను ఆదుకునేందుకు దివంగత మహానేత వైఎస్సార్ అప్పట్లోనే హాలహర్వి మండలం గూళ్యం తుంగభద్ర వృథా జలాలను ఆపేందుకు వేదావతి ప్రాజెక్టును నిర్మించేందుకు యత్నించారని, ఆయన మరణంతో ఆ ప్రాజెక్టు నిర్మాణం జరగలేదన్నారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు గూళ్యం వద్ద దాదాపు రూ.650 కోట్లతో ప్రాజెక్టు చేపడతామని హామీ ఇచ్చారని, ఇంతవరకు అమలు చేయలేదన్నారు. ప్రాజెక్టు పూర్తయితే నియోజకవర్గంలోని హాలహర్వి, హొళగుంద, ఆస్పరి, ఆలూరు మండలాలకు తాగు, సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గంలో ఉన్న చెరువులను నింపేందుకు హంద్రీనీవా కాలువను వెడల్పు చేస్తానని, అందుకు రూ.120 కోట్లు ఖర్చు పెడతానని ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఆ ప్రచారాలను కట్టిబెట్టి హంద్రీనీవా ఽద్వారా చెరువులు నింపే కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు కేంద్ర పథకాలను తమవిగా గొప్పలు చెప్పుకుంటున్నారన్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ భీమప్పచౌదరి, ఎంపీపీ బసప్ప, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు, జెడ్పీటీసీ సభ్యుడు రేగులరమణ, హర్ధగేరి సర్పంచు తిప్పారెడ్డి, ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వీరభద్రగౌడ్, రాష్ట్ర జలవనరుల శాఖ అఫెక్స్ మెంబర్ కుమార్గౌడ్ పాల్గొన్నారు. -
వీఆర్వోపై ఇసుక మాఫియా దాడి
– ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టుకున్నాడని దాడి – తాలుకా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన నిడ్జూరు వీఆర్వో నాగన్న – కేసు వెనక్కి తీసుకోవాలని అధికారపార్టీ నేతల ఒత్తిడి కర్నూలు సీక్యాంప్: ఇసుకమాఫియా బరితెగించింది. నిడ్జూరు సమీపంలో తుంగభద్ర నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్న నిడ్జూరు వీఆర్వో నాగన్నపై సోమవారం దాడికి పాల్పడింది. దీనిపై వీఆర్వో తాలుకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎలాగైనా కేసు వెనక్కి తీసుకోవాలని ట్రాక్టర్యజమానుల తరఫున అధికారపార్టీనేతలు రంగంలోకి దిగారు. పెద్దసంఖ్యలో ఆ పార్టీ నేతలు తహశీల్దార్ కార్యాలయం చేరుకున్నారు. అయితే, తహసీల్దార్ కార్యాలయంలో లేకపోవడంతో అక్కడే మధ్యాహ్నం వరకు వేచి ఉన్నారు. చివరకు ఆళ్లగడ్డకు చెందిన ముఖ్యనేత బంధువు, కోడుమూరు నియోజకవర్గ ముఖ్య నేతలు ఇద్దరు తహసీల్దార్కు ఫోన్లు చేసి తమ వారిపై కేసులు పెట్టవద్దని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. గడువు ముగిసినా ఇసుక రవాణా కర్నూలు మండలం నిడ్జూరు వద్ద ఇసుక రీచ్ ఉండేది. ఇప్పుడు దాని గడువు పూర్తి అయిపోయింది. ఇకఅక్కడ ఇసుకతీయరాదని అధికారులు నిర్ణయించారు. ఇసుక తీయడం వల్ల తుంగభద్రనదిలో భూగర్భ జలాలు ఇంకిపోయి తాగునీటి సమస్య వస్తుందని రెవెన్యూ సిబ్బంది గ్రామస్తులకు, వ్యాపారులకు చాలా సార్లు విన్నవించారు. ఇవేవి తమకు పట్టవన్నుట్టు వ్యాపారులు నదిలో నుంచి ట్రాక్టర్లలో యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు సోమవారం ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను నిడ్డూరు వద్ద స్థానిక వీఆర్వో పట్టుకున్నాడు. తమ దందాను అడ్డుకుంటావని అక్రమార్కులు వీఆర్వోపై దాడికి పాల్పడ్డాడు. దాడిపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాం: టీవీ రమేష్బాబు, తహసీల్దార్, కర్నూలు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక వ్యాపారం చేస్తున్న రెండుట్రాక్టర్లను వీఆర్వో పట్టుకున్నందుకు ఆయనపై దాడి చేశారు. దీనిపై వీఆర్వో తాలుకా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ఇసుక తరలిస్తే ఉపేక్షించేది లేదు. దాడి కేసు వెనక్కి తీసుకోవాలని మాకు ఎటువంటి ఒత్తిళ్లు రాలేదు. -
సాగునీటి ప్రాజెక్ట్లపై ప్రభుత్వం వివక్ష
– ఆసుపత్రుల అభివృద్ధికి నిధులు కేటాయించాలి – అప్పెరల్ పార్కుపై అలసత్వం తగదు - కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఎమ్మిగనూరు: జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వం వివక్ష చూపుతుందని కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక విమర్శించారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఎమ్మిగనూరులోని మాచాని శివన్న స్వగృహంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. తుంగభద్ర దిగువ కాలువ నీటిని సక్రమంగా, విడుదల చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు. రూ. 30 కోట్లు కేటాయిస్తే పులికనుమ ప్రాజెక్టు పూర్తయి రూ. 24,600 ఎకరాలకు సాగునీరందించవచ్చన్నారు. రూ. 15 కోట్లతో నగరడోణ ప్రాజెక్టు పూర్తవుతోందనీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ మాత్రం నిధులు కూడా కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. బనవాసి దగ్గర అప్పెరల్ పార్కు కోసం కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ అడిగితే రాష్ట్రం నుంచి ఇంత వరకూ డీపీఆర్యే వెళ్లకపోవడం విచారకరమన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఎమ్మిగనూరుకు రెండు చేనేత క్లస్టర్ తెస్తే అదితామే తెచ్చామంటూ ఎవరో ప్రచారం చేసుకోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ. 50 లక్షలు : పార్లమెంట్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపీ కోటా నిధులతో ఏటా రూ. 50 లక్షలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. వెనుకబడిన ప్రాంతాలు, మండలాలు ఎక్కువ ఉన్న పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలకు రూ. కోటి వరకు వెచ్చిస్తున్నామన్నారు. తాగునీటి అవసరాలు, రోడ్లు, డ్రైనేజి వ్యవస్థల మెరుగుకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఎమ్మిగనూరు, ఆదోని మున్సిపాలిటీల్లో వాటర్ ట్యాంకుల వెహికల్స్ కొనుగోలు చేస్తున్నామన్నారు. ఎమ్మిగనూరు, ఆదోని, కర్నూలుతో పాటు గూడూరు నగర పంచాయతీ అభివృద్ధి కోసం మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ కన్నబాబుతో యాక్షన్ ప్లాన్పై చర్చించామన్నారు. ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి సమస్య పరిష్కారం కోసం స్పెషల్ ఆఫీసర్ అంకయ్యతో చర్చించి రీ ఎస్టిమేషన్స్ వేయిస్తున్నామన్నారు. ఆదర్శానికి అడ్డంకులు : చేనేతలు, ప్రజల కోరిక మన్నించి తుంగభద్ర వరదల్లో నష్టపోయిన నాగలదిన్నెను దత్తత గ్రామంగా తీసుకున్నామన్నారు. అయితే అక్కడ అడుగడుగునా సమస్యలే ఎదురవుతున్నాయన్నారు. మొత్తం 1599 ఇళ్లను పునరావాసం కింద నిర్మించాల్సి ఉంటే కేవలం 524 ఇళ్లతో సరిపెట్టారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించి విసిగిపోయాననీ, కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయిస్తామన్నా రాష్ట్ర ప్రభుత్వం సహకారం తప్పని సరి కావడంతో ఇళ్ల నిర్మాణంపై ముందుకు వెళ్లలేక పోయామన్నారు. ఆసుపత్రులు ఆధ్వానం: ఆదోని ఏరియా ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగు పడాల్సి ఉందన్నారు. మదర అండ్ చైల్డ్ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది సేవలు బాగున్నా వసతులు కరువయ్యాయన్నారు. జిల్లా పెద్దాసుపత్రి పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. కోట్లలో నిధులున్నా వాటిని సద్వినియోగం చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితులున్నాయన్నారు. కర్నూలు మెడికల్ కళాశాల డైమండ్ జూబ్లి ఉత్సవాలకు ప్రధానిని ఆహ్వానించాననీ, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా ఆహ్వానం అందితే అది ఉన్నతంగా ఉంటుందన్నారు. -
ఆయకట్టు తడిసే.. రైతన్న మురిసే!
తుంగభద్ర ఎగువ కాల్వ ద్వారా ఆలూరు బ్రాంచి కెనాల్ రైతులకు ఏళ్ల తరబడి సాగునీరు అందని పరిస్థితిని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తిరగరాశారు. సాగునీరు రాక ఆయకట్టు రైతులు పంటలు నష్టపోయే పరిస్థితి లేకుండా చేశారు. రెండేళ్ల క్రితం ఆయన తీసుకున్న చర్యల కారణంగా ఎప్పుడూ నీరు లేక ఒట్టిపోయి దర్శనమిచ్చే ఏబీసీ ప్రస్తుతం నీటితో కళకళలాడుతూ ఆయకట్టు భూముల్లో సిరుల పంటకు కారణమవుతోంది. ఆలూరు రూరల్/చిప్పగిరి : అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతంలోని నిమ్మగల్ ప్రధాన రెగ్యులేటర్ నుంచి హెచ్ఎల్సీ ద్వారా ఆలూరు బ్రాంచి కెనాల్కు ఏటా 120 నుంచి 140 క్యూసెక్కుల టీబీ డ్యాం నీరు సరఫరా కావాల్సి ఉంది. ఈ నీటితో ఏబీసీ పరిధిలోని 19 డిస్టిబ్యూటర్ల కింద 14,225 ఎకరాల్లో పంటలు సాగు చేయాలి. అయితే వివిధ కారణాలతో 7 డీపీలకు మాత్రమే నీరు సరఫరా అవుతోంది. మిగతా డీపీల కింద ఉన్న ఆలూరు, చిప్పగిరి మండలా పరిధిలోని రామదుర్గం, నేమకల్, బెల్డోణ, హత్తిబెళగల్ తదితర గ్రామాల రైతులకు ఎదురుచూపులు తప్పేవి కాదు. నీరు రాకపోవడం, వచ్చినా సకాలంలో అందకపోవడంతో రైతులు పంటలు నష్టపోయేవాళ్లు. రైతుల పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సమస్య పరిష్కారానికి ఉపక్రమించారు. హంద్రీనీవాపై దృష్టి.. హెచ్ఎల్సీకి కిలోమీటరు దూరంలోనే ఇక్కడి నీటిని అనంతపురం జిల్లాకు తీసుకెళ్తున్న హంద్రీనీవా సుజల స్రవంతి కాల్వ నిండుగా పారుతున్నా ఎగువ కాల్వ ఆయకట్టు నీటికి మొహం వాచే పరిస్తితిని ఎమ్మెల్యే గుర్తించారు. గుంతకల్ మండలం కమ్మకొట్టాల మీదుగా వెళ్తున్న ఆ కాల్వ నుంచి ఏబీసీ కెనాల్కు నీటిని అందించాలని సంబంధిత అధికారులను కోరారు. వారు స్పందించకపోవడంతో వాదనకు దిగారు. మన జిల్లా ఆయకట్టు అవసరాలు తీర్చిన తర్వాతే మిగతా ప్రాంతాలకు తరలించాలని పట్టుబట్టారు. అధికార యంత్రాంగంతో పోరాటం.. ఎలాగైనా హంద్రీనీవా నీటిని ఏబీసీ ఆయకట్టుకు పారించాలని నిర్ణయించుకున్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఏబీసీ రైతులతో కలిసి 2014 అక్టోబర్ 19న గుంతకల్ మండలం కమ్మకొట్టాల వద్దకు చేరుకున్నారు. అక్కడ అనంతపురం జిల్లా పోలీస్ యంత్రాంగం, స్పెషల్ పార్టీ పోలీసులు అడ్డుకున్నా లెక్క చేయకుండా హంద్రీనీవా సుజలాస్రవంతి ప్రధాన కాలువకు గండి కొట్టి ఎగువ కాల్వకు నీటిని మళ్లించారు. ప్రస్తుతం ఆ కాలువ ద్వారా ఏబీసీ పరిధిలో 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతోందని, ఇదంతా ఎమ్మెల్యే కృషి వల్లనే సాధ్యమైందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏబీసీ కెనాల్ కింద 10 నుంచి 16వ డీపీ వరకు నీరు పూర్తిస్థాయిలో పారుతోంది. -
ముందుంది ముప్పు!
– సుంకేసులలో పడిపోయిన నీటి నిల్వలు – నగర వాసులకు 45 రోజులు మాత్రమే సరిపడా నీరు – తుంగభద్ర జలాలపైనే ఆశలు – ప్రత్యామ్నాలకు అనుమతులు ఇవ్వని ప్రభుత్వం – సీఎం దృష్టికి తీసుకపోయినా స్పందన కరువు కర్నూలు సిటీ: వేసవికి ముందే కర్నూలు నగర వాసులకు తాగు నీటి ఇబ్బందులు రానున్నాయా? ప్రస్తుతం సుంకేసుల బ్యారేజీ, ఎస్ఎస్ ట్యాంకుల్లో నిల్వ ఉన్న నీరు 45 రోజులకు మాత్రమే సరిపోనున్నాయా? టీబీ డ్యాం నుంచి రావాల్సిన వాటా నీరు ఇక వచ్చే అవకాశమే లేదా అంటే అధికార వర్గాలు అవుననే అంటున్నాయి. తుంగభద్ర నదిలో ఈ ఏడాది నీటి లభ్యత తక్కువగా ఉండడంతో వేసవికి మూడు నెలల ముందే కర్నూలు నగర ప్రజలకు తాగు నీటి ముప్పు పొంచివుంది. అయినా నగర పాలక సంస్థ అధికారులు ప్రత్యామ్నాయాలు చూడటం లేదు. కేసీ ఆయకట్టుకు అందాల్సిన నీటిని తాగు నీటికి ఇస్తున్నారు. అయితే శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో నేటికీ కేసీ వాటా నీటిపైనే నగర వాసుల దాహార్తి ఆధారపడి ఉంది. ఈ ఏడాది తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో నెలకొన్న నీటి కొరత వల్ల సుంకేసుల బ్యారేజీలో నీరు కేసీ ఆయకట్టుకు ఇవ్వడంతో పూర్తి స్థాయిలో పడిపోయాయి. ప్రస్తుతం 06 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. బ్యారేజీ నుంచి రోజు 200క్యూసెక్కుల నీరు వదిలితే 21 కి.మీ వరకు వచ్చేది కేవలం 60 క్యూసెక్కుల నీరు కూడా రావడం లేదు. నగరపాలక సంస్థ అధికారుల అంచనాల ప్రకారం రోజుకు 77 మిలియన్ లీటర్లు సరఫరా చేయాలి. ప్రస్తుతం బ్యారేజీ, ఎస్ఎస్ ట్యాంకుల్లో ఉన్న నీరు కేవలం 45 రోజులకు మాత్రమే సరిపోతుందని జల వనరుల శాఖ ఇంజినీర్లు చెబుతున్నారు. తుంగభద్ర జలాలు వచ్చేనా? తుంగభద్ర జలాలు జిల్లాతో పాటు, కడప జిల్లాలో 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఖరీఫ్లో ఆయకట్టుకు ఈ జలాలు తక్కువగానే అందాయి. శ్రీశైలం ప్రాజెక్టు నీరు ఏస్కేప్ ఛానల్, హంద్రీనీవా నుంచి రెండు పంపులు మళ్లించడంతో 63 కి.మీ మినహా మిగతా ఆయకట్టుకు సాగు నీరు ఇబ్బందులు తగ్గాయి. అయితే సుంకేసుల బ్యారేజీ నుంచి 63 కి.మీ వరకు 10 వేల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. హంద్రీనీవా నీటిని మళ్లించడం వల్ల 63 కి.మీ నుంచి వెనకకు 20 కి.మీ నీరు వస్తుంది. మిగిలిన 43 కి.మీ మేర ఉన్న 8 వేల ఎకరాలకు ప్రస్తుతం 10 రోజులుగా సాగు నీరు అందడం లేదు. సుంకేసుల బ్యారేజీలో నీటి నిల్వలు తగ్గడం, టీబీ డ్యాం నుంచి కేసీ వాటాగా రావాల్సిన 1.4 టీఎంసీల నీరు ఇవ్వాలని 20 రోజుల క్రితం నుంచి అధికారులు ప్రభుత్వం వెంట పడుతున్నా ఏ ఒక్కరూ స్పందించడం లేదు. పైగా ఆ వాటాలో నుంచి టీఎంసీ నీటిని అనంతపురం జిల్లాకు మళ్లించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలాంటి సమయంలో బ్యారేజీలో ఉన్న నీరు కేసీ ఆయకట్టుకు ఇవ్వకుంటేనే నగర వాసులకు నెల రోజులు దాహం తీరుతుంది. లేకపోతే కష్షమేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనికి తోడు కేసీ అధికారులు 43 కి.మీ వరకు ఉన్న ఆయకట్టుకు నీరు ఇవ్వాలని రైతుల నుంచి ఒత్తిళ్లు వస్తుండడంతో కలెక్టర్ అనుమతి తీసుకొని నీరు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ప్రతిపాదనలపై స్పందన కరువు కర్నూలు నగరవాసుల దాహార్తి తీర్చేందుకు ఎస్ఎస్ ట్యాంకు నీరు ఏ మాత్రం సరిపోకపోవడంతో కల్లూరు ప్రాంతానికి తడకనపల్లె చెరువు, నంద్యాల చెక్ పోస్టు ప్రాంతాలకు గార్గేయపురం చెరువు నుంచి నీరు సరఫరా చేసేందుకు నగర పాలక సంస్థ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే ఇంత వరకు ప్రతిపాదనలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అనుమతులు ఇచ్చింటే కొంత మేరకైనా నీటి సమస్య తీరేది. ఈ చెరువులకు హంద్రీనీవా నుంచి నీరు సరఫరా అవుతుంది. నగర వాసులకు తాగు నీరు ఇబ్బందులు ఉన్నాయని, ఎలాగైనా టీబీ డ్యాం నుంచి కేసీ వాటాగా ఉన్న 1.4 టీఎంసీ నీరు విడుదల చేయించాలని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి బుధవారం సీఎంను కోరగా చూద్దాంలే అనే సమాధానం వచ్చినట్లు తెలిసింది. -
వరద రక్షణ గోడ లేనట్లే!
– దివంగత వైఎస్ఆర్ హయాంలో రూ. 244 కోట్లు మంజూరు - ఆయన అకాల మరణంతో నిలిచిపోయిన పనులు – చేతులెత్తేసిన ప్రస్తుత ప్రభుత్వం - రెండున్నర ఏళ్లు గడిచినా అమలుకు నోచుకోని ఎమ్మెల్యే హామీ – రక్షణ గోడకు బదులు పూడికతీతతోనే సరిపెట్టేందుకు ఎత్తుగడ కర్నూలు సిటీ: కర్నూలు నగరానికి ఒక వైపు తుంగభద్ర, మధ్యలో హంద్రీనది ప్రవహిస్తోంది. ఈ నదులు రెండుమూడు సార్లు ఉగ్రరూపం దాల్చి నగర రూపురేఖలను ఛిన్నభినం చేశాయి. ఎందరో నిరాశ్రయులయ్యారు. మళ్లీ ఈ పరి స్థితి పునరావృతం కాకూడదని 2008లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వరద రక్షణ గోడ నిర్మాణానికి రూ. 244 కోట్లు మంజూరు చేశారు. అదే ఏడాది డిసెంబర్ 11న పనులకు శంకుస్థాపన చేశారు. అయితే, ఆయన అకాల మరణంతో అధికారం చేపట్టిన పాలకులు పట్టించుకోకపోవడంతో పనులు ప్రారంభదశలోనే నిలిచిపోయాయి. ఈ లోపు రాష్ట్ర విభజన జరగడం, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావడంతో రక్షణ గోడ అటకెక్కింది. ఆయకట్టు లేనప్పుడు అంత మొత్తంలో నిధులు ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. త్వరలో నగర పాలక సంస్థకు ఎన్నికల రానుండడంతో అందులో లబ్ధిపొందేందుకు హంద్రీనదిలో పూడికతీత తీసేందుకు నీరు–చెట్టు కింద 29.86 కోట్లు, సుద్దవాగుకు వాల్, పూడికతీతకు 39 కోట్లు, జోహరాపురం దగ్గర వంతెనకు 19 కోట్లతో అంచనాలు వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. పూడితతీతో సరిపెట్టేందుకు అధికారి పార్టీ ఎత్తుగడ! త్వలరలో నగరపాలక సంస్థ ఎన్నికలు రానుండడంతో ప్రజలను మరో సారి మభ్య పెట్టేందుకు అధికారపార్టీ నేతలు యత్నిస్తున్నారు. గతంలో ఇచ్చిన రక్షణ గోడ హామీని వదిలేసి పూడికతీతతో సరిపెట్టేందుకు ఎత్తుగడ వేశారు. నీరు–చెట్టు కార్యక్రమం కింద రూ.29.86 కోట్లతో 44వ జాతీయ రహదారి దగ్గర ఉన్న హంద్రీ బ్రిడ్జి నుంచి జోహరాపురం వరకు పూడికతీసేందుకు అంచనాలు వేశారు. మొత్తం హంద్రీ 0.కిమీ నుంచి 5.4 కి.మీ వరకు ఉన్న 12,02, 096 క్యుబిక్ మీటర్ల పూడిక, ముళ్ల కంప, 59339 క్యుబిక్ మీటర్ల రాక్, 2626 క్యుబిక్ మీటర్ల కాంక్రీట్ దిమ్మెలను తొలగించనున్నారు. సుద్దవాగులో పూడిక తీసేందుకు రూ.39 కోట్లు, జోహరాపురం దగ్గర వంతెన నిర్మాణానికి 19 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. హామీని మరచిన ఎమ్మెల్యే! 2008, 2009 సంవత్సరాఽల్లో హంద్రీ, తుంగభద్ర నదులు పోటెత్తి నగర ప్రజలకు ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చాయి. వర్షం వస్తే చాలు ఇప్పటికీ నాటి భయంకర పరిస్థితులు వారికి గుర్తుకు వస్తాయి. తనను గెలిపిస్తే నగరాన్ని శాశ్వతంగా వరదల నుంచి కాపాడేందుకు రక్షణ గోడ నిర్మిస్తానని కర్నూలు ఎమ్మెల్యే గత ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీచ్చారు. కానీ గెలిచి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ఆ హామీ ప్రకటనకే పరిమితమైంది. పూడికతీతకు ప్రతిపాదనలు పంపాం – మల్లికార్జునరెడ్డి, ఎఫ్ఆర్ఎల్,ఈఈ హంద్రీ, సుద్దవాగులో పేరుకుపోయిన పూడిక తీసేందుకు అంచనాలు వేసి సీఈ ద్వారా ఇటీవలే ప్రభుత్వానికి పంపించాం. నీరు–చెట్టు కింద పూడికతీత పనులు చేపడతాం. జోహరాపురం వద్ద వంతెన నిర్మాణానికి రూ. 19 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు పంపించాం. -
తీరం.. శోకం!
ఎడారిని తలపిస్తున్న తుంగభద్ర – ఎత్తిపోతల పథకాలలకు నీరందక అన్నదాత అవస్థలు – పంట పొట్ట దశలో తీవ్రమైన నీటి ఎద్దడి – నీరు ఇవ్వాలని కోరినా స్పందించని ప్రభుత్వం – నదీ తీరంలో ఎండుతున్న పంటలు – సుమారు రూ.150 కోట్ల పంట నష్టపోయే ప్రమాదం కర్నూలు సిటీ/నందవరం: వరుస కరువు అన్నదాతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత రెండేళ్లుగా తీవ్ర వర్షాభావం నేపథ్యంలో తుంగభద్ర నదీ తీరంలో సాగు చేసిన పంటల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు ముందుచూపు లేకుండా తీసుకున్న నిర్ణయాలతో ఎత్తిపోతల పథకాల కింద సాగు చేసిన పంట చేతికొచ్చే దశలో నీరు లేక ఎండిపోయే పరిస్థితి తలెత్తింది. ప్రధానంగా వరి, మిరప పైర్లు సాగు చేసిన రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సుమారు నెల రోజులుగా నదిలో నీటి ప్రవాహం లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమవుతోంది. అయితే నదికి నీటిని విడుదల చేయించే విషయంలో అధికార పార్టీ నేతలు ఎలాంటి ఒత్తిళ్లు తీసుకు రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. వారంలోపు నీరివ్వకపోతే పంట ప్రశ్నార్థకం జిల్లాలో 88 ఎత్తిపోతల పథకాలు.. తుంగభద్ర నదీ తీరంలో మొత్తం 20 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటి కింద 25వేల ఎకరాల ఆయకట్టు ఉంది. దీంతో పాటు మరో 30వేల ఎకరాల ఆయకట్టు నది నీటి ద్వారా సాగవుతోంది. ప్రస్తుతం నీటి ప్రవాహం లేకపోవడం వల్ల నది ఎడారిని తలపిస్తుంది. అధిక శాతం వరి, మిరప, చెరుకు, పత్తి, మొక్క జొన్న పంటలు సాగు చేశారు. ఈ పంటల సాగుకు ఎకరాకు రూ.20 వేలు నుండి రూ.30 వేలు వరకు పంటను బట్టి పెట్టుబడి పెట్టారు. ప్రస్థుతం వరి పంట కంకి దశలో ఉంది. ఈ దశలో నీరందకపోతే పంట దిగుబడి ప్రశ్నార్థకం అవుతుంది. మిగతా పంటల పరిస్థితీ అంతే. నదికి వారంలోపు నీరు రాకపోతే సుమారు రూ.150 కోట్ల రూపాయల పెట్టుబడులు గంగలో కలిసినట్లే. కేసీ వాటాగా ఉన్న 1.55 టీఎంసీల నీరు నదికి విడుదల చేయాలని జల వనరుల శాఖ ఇంజినీర్లు ఉన్నతాధికారులను ప్రాధేయపడుతున్నా ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. పైరు కంకి దశలో ఉంది తుంగభద్ర నది నీటిపై ఆధారపడి 15 ఎకరాల్లో వరి పంట సాగు చేసినా. అప్పు చేసి నది నుండి ప్రత్యేకంగా పొలం వరకు పైపులైను వేసుకున్నా. ఇందులో 7 ఎకరాలను కౌలుకు తీసుకుని వరి.. సొంతంగా మరో 8 ఎకరాల్లో వరి పంట వేసినా. పంట సాగుకు కౌలు కింద ఎకరాకు రూ.40 వేలు, సొంత పొలం కింద ఎకరాకు రూ.20 వేలు చొప్పున ఖర్చయింది. పంట కంకి దశలో ఉంది. ఇప్పుడు నీరందిస్తేనే గింజ గట్టిపడుతుంది. నదిలో నీరు లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఉంది. – భీమారెడ్డి, రైతు, చిన్నకొత్తిలి పెట్టుబడులకు అప్పులు చేసినా నందవరం ఎత్తిపోతల పథకం కింద 12 ఎకరాల్లో పత్తిన సాగు చేసినా. ప్రస్తుతం నదిలో నీరు లేదు. చెలమలు తవ్వినా చుక్క నీరు కనిపించట్లేదు. ఈ పథకం కింద దెబ్బతిన్న పైపులైన్ను పట్టించుకునే వారే లేరు. రూ.1.50 లక్షలు అప్పు చేసి పెట్టుబడి పెట్టినా. అయితే నీరందక పంట ఎండిపోతోంది. పైరుకు నీరందిస్తే కనీసం పెట్టుబడి అయినా దక్కుతుంది. – నాగరాజు, రైతు, నందవరం టీబీ డ్యాం నుంచి నీరివ్వాలని కోరాం తుంగభద్ర డ్యాం నుంచి కేసీ వాటా నీరు ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. ఇటీవల విజయవాడ సమావేశంలో కూడా ఇదే విషయాన్ని గట్టిగా చెప్పాం. నీటి విడుదలపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. – ఎస్.చంద్రశేఖర్ రావు, జల వనరుల శాఖ ఎస్ఈ -
కత్తితో బెదిరించి...
కర్నూలు : నగర శివారుల్లోని మాసమసీదు వద్ద గురువారం అర్ధరాత్రి కత్తితో బెదిరించి ఓ రైతు వద్ద నుంచి దుండగులు డబ్బులు లాక్కొని ఉడాయించారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. జి.సింగవరం గ్రామానికి చెందిన నాగన్న అనే రైతు మార్కెట్లో కూరగాయలు అమ్ముకొని మున్సిపల్ ఆఫీసు వద్ద స్వగ్రామానికి వెళ్లేందుకు ఆటో కోసం వేచి ఉన్నాడు. ముగ్గురు యువకులు కూడబలుక్కొని అక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్లాలంటూ నాగన్నను మాటల్లో పెట్టారు. తాము కూడా సింగవరానికి వెళ్తున్నామని నమ్మించి, ఆటోలో ఎక్కించుకొని నగర శివారుల్లోని వాగు వద్ద తుంగభద్రనది వైపు ఆటోలో తీసుకెళ్లి అరవకుండా నోటికి బట్టకట్టి దాడి చేసి గాయపరిచారు. రైతు ప్రతిఘటించేందుకు ప్రయత్నించగా కత్తితో బెదిరించి అడ్డపంచతో పాటు డబ్బులు లాక్కున్నారు. రైతు కేకలు వేసుకుంటూ డ్రాయర్తో మెయిన్ రోడ్డుకు పరిగెత్తి మునగాలపాడుకు నడుకుంటూ వెళ్లి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బైక్ తెప్పించుకొని స్వగ్రామానికి చేరుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామంటూ బెదిరించారని బాధితుడు సాక్షితో తన గోడును చెప్పుకున్నాడు. -
రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోం
– ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆదోని టౌన్: తుంగభద్ర దిగువ కాలువ ఆయకట్టు రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని అధికారులను ఎమ్మెల్యే సాయి ప్రసాద్రెడ్డి హెచ్చరించారు. నాలుగు రోజులుగా డీపీలకు నీటి సరఫరాను పూర్తి స్థాయిలో నిలిపేస్తే ఆయకట్టు కింద సాగు చేసిన పంటలు ఏం కావాలని టీబీపీ డీఈ విశ్వనాథరెడ్డి, ఏఈ కౌలుట్లయ్య, జేఈ గోపీనాథరెడ్డిలను నిలదీశారు. బుధవారం ఎమ్యేల్యే సాయి ప్రసాదరెడ్డి తన అనుచర గణంతో తుంగభద్ర దిగువ కాలువపై పర్యటించారు. సంతెకూడ్లూరు, చిన్న హరివాణం, హానవాలు, మదిర, 104 బసాపురం, నాగనాథనహళ్ళి గ్రామాల ఆయకట్టు రైతుల విన్నపం మేరకు కాలవపై కలియ తిరిగారు. రైతులు సాగు చేసిన పత్తి, మిరప, వరి పంటల పరిస్థితిని చూసి చలించిపోయారు. సాగు నీరు లేక తాము పడుతున్న ఇబ్బందులను రైతులు..ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. టీబీపీ అధికారులతో సాయి ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రా వాటా కింద 650 క్యూసెక్కుల నీరు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. రబీలో ఆరు తడి పంటలకు సమృద్ధిగా నీరు అందేలా చూడాల్సిన భాద్యత అధికారులపైనే ఉందన్నారు. ప్రస్తుతం కెనాల్లో ప్రవహించే 200 క్యూసెక్కుల నీటితో ప్రజల గొంతులు ఎలా తడపాలి, పంటలకు నీరు ఎలా మళ్లించాలో అధికారులే తేల్చాల్సి ఉందన్నారు. నీటి మళ్లింపులో కోత విధించడంతో రైతులు డీపీలను పగుల గొట్టేందుకు సిద్ధపడ్డారు. ఎమ్మెల్యే జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. చిన్న హరివాణం కాలువ వద్ద రైతులు పెద్ద ఎత్తున పోగై..ఎమ్మెల్యేకు సమస్యను తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులు చంద్రకాంతరెడ్డి, గోవర్ధనరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ఆదినారాయణరెడ్డి, ప్రతాపరెడ్డి, పంపాపతి తదితరులు పాల్గొన్నారు. -
చివరి ఆయకట్టుకు నీరందించేందుకు చర్యలు
కర్నూలు(సిటీ): తుంగభద్ర దిగువ కాల్వ చివరి ఆయకట్టుకు నీరందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చల్లా విజయమోహన్ జలవనరుల శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ భవనంలో ఎల్లెల్సీ ఇంజనీర్లతో జలచౌర్యంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుంగభద్ర దిగువ కాల్వకు ఉన్న వాటా మేరకు నీరు తీసుకొచ్చి చివరి ఆయకట్టు వరకు నీరందించే బాధ్యత ఇంజనీర్లపై ఉందన్నారు. ప్రధానంగా జలచౌర్యం బోర్డు పరిధిలో ఉన్న కాల్వ నుంచే జరుగుతోందన్నారు. దీనిపై ముందు నుంచి ప్రణాళిక లేకపోవడం వల్లే ప్రతి ఏటా వాటా నీటిని ఎగువ ప్రాంతం వారు చౌర్యం చేసి వేలాది ఎకరాల అక్రమ ఆయకట్టును సాగు చేస్తున్నారన్నారు. ఈ చౌర్యం అరికట్టేందుకే 135 నుంచి 324 కి.మీ వరకు నాలుగు శాఖలకు చెందిన అధికారులతో 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో విద్యుత్ శాఖ, జలనవరుల శాఖ, పోలీసు, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు ప్రత్యేక బృందాల్లో ఉంటారన్నారు. నిత్యం కాల్వపై పర్యవేక్షిస్తూ అక్రమంగా నీటిని వాడుకుంటున్న వారిపై కేసులు నమోదు చేసి అయినా, చివరి ఆయకట్టుకు నీరందించాల్సిన అవసరం ఉందన్నారు. నెల రోజుల పాటు నిరంతరంగా కాల్వపైనే ఈ ప్రత్యేక బృందాలు తిరుగుతూ చౌర్యాన్ని అరికట్టాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన వాహనాలు, సిబ్బందిని ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజాము సమయాల్లో నిఘాను విస్తృతం చేసి గస్తీ నిర్వహించాలన్నారు. ఏఈతో పాటు లస్కరు ఖచ్చితంగా ప్రతిరోజు విధులు నిర్వహించాలన్నారు. ప్రస్తుతం ఉన్న టీములలో ఉన్న లస్కర్లను తొలగించి, నూతన టీమ్లను ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు తీసుకొని జలచౌర్యాన్ని అరికట్టాలని ఇంజనీర్లను ఆదేశించారు. -
చివరి ఆయకట్టుకు 400 క్యూసెక్కుల నీరు
ఆదోని రూరల్ : తుంగభద్ర దిగువ కాలువ నుంచి ఆంధ్రప్రదేశ్లో చివరి ఆయకట్టు వరకు 400 క్యూసెక్కుల నీటిని అందించేందుకు పటిష్ట చర్యలు చేపడదామని టీబీపీ డ్యాం అధికారులు, ఎల్లెల్సీ అధికారులు తీర్మానించారు. బోర్డు నుంచి ఆంధ్రాకు రావాల్సిన 600 క్యూసెక్కుల నీటిని కర్ణాటక నానాయకట్టు రైతులు అక్రమంగా వాడుకుంటున్నారని కనీసం కౌతాళం డీపీ నం.74వ కి.మీ. వరకు ఎల్ఎల్సీ ప్రధాన కాలువకు నీరు అందకుండా పోయింది. దీంతో ఆగ్రహించిన రైతులు మంగళవారం ఆదోనిలో ఉన్న ఎల్లెల్సీ ఈఈ కార్యాలయాన్ని దిగ్భందించి ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఎల్లెల్సీ అధికారులు ఎస్ఈ చంద్రశేఖర్ రావు, ఈఈ భాస్కర్రెడ్డి, టీబీ బోర్డు అధికారులు ఎస్ఈ శశిభూషణ్ రావు, ఈఈ విశ్వనాథ్రెడ్డితో బుధవారం స్థానిక ఈఈ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చింతకుంట 135కి.మీ. వరకు 800 క్యూసెక్కుల నీటిని తీసుకొచ్చే బాధ్యత తాము తీసుకుంటామని బోర్డు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి 250 కి.మీ. గల చివరి ఆయకట్టు వరకు కనీసం 400 క్యూసెక్కుల నీటిని రైతులకు అందించే విధంగా ఎల్లెల్సీ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంపై బోర్డు సెక్రటరీతో సమావేశం నిర్వహించి త్వరలోనే రైతులకు నీటిని అందించే విధంగా చొరవ చూపుతామని టీబీ అధికారులు హామీ ఇచ్చారు. ఎస్ఈ చంద్రశేఖర్ రావు, ఈఈ భాస్కర్రెడ్డి , బోర్డు డీఈలు పంపన్న, గౌడ్, శ్రీనివాసనాయక్, ఎల్ల్సీ డీఈలు నెహామియా, విశ్వనథ్రెడ్డి, జేఈలు పాల్గొన్నారు. -
దిగువకు దిక్కెవరు?
- హామీని విస్మరించిన చంద్రబాబు - ఎల్లెల్సీలో యథేచ్ఛగా జలచౌర్యం - పట్టించుకోని అధికార పార్టీ నేతలు - బీడుభూమిగా మారుతున్న ఆయకట్టు - కాల్వ ఏపీది.. పెత్తనం బోర్డుది - పర్యవేక్షణ కరువు..అందని నీటివాటా కర్నూలు సిటీ: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తుంగభద్ర జలాల వాటాలో నుంచి చుక్క నీరు కూడా చౌర్యం కాకుండా చూస్తాం. కర్ణాటక రాష్ట్రానికి చెందిన రైతులు జలచౌర్యం చేయకుండా ఎల్ఎల్సీ ఆధునీకరణ చేయడమా? లేకపోతే ప్రధాన కాల్వకు బదులు అంతర్గత పైపులు లైన్లు వేయడమా అనేది చూస్తాం - ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఇది. అధికారంలోకి వచ్చాక జల చౌర్యాన్ని అడ్డుకోలేకపోయారు. ఫలితంగా తుంగభద్ర జలాల్లో కర్నూలు జిల్లా తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఈ అన్యాయంపై తుంగభద్ర బోర్డు అధికారులను టీడీపీ నేతలు నిలదీయలేకపోతున్నారు. దీంతో ఆయకట్టుకు నీరు అందక పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్ర జలాశయం. డ్యాం నిర్వహణకు ఏర్పాటు అయిన బోర్డు మూడు రాష్ట్రాలకు దామాషా ప్రకారం సాగు నీరు అందించాల్సి ఉంది. అయితే బోర్డు కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేస్తూ.. మిగతా రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. టీబీ డ్యాం నుంచి దిగువ కాలువ కింద జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలోని ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు మండలాలకు చెందిన 1.51 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కాల్వ ఏపీది...పెత్తనం బోర్డుది దిగువ(ఎల్ఎల్సీ)కాల్వ మొత్తం 398 కి.మీ పొడవు ఉంటుంది. ఇందులో కర్ణాటక పరిధిలో 134 కి.మీ మాత్రమే ఉండేది. మిగతాది ఏపీకి చెందినది. అయినా 135 నుంచి 250 కి.మీ వరకు ఉన్న కాలువ నిర్వహణ బోర్డు పరిధిలో ఉంది. దామాషా ప్రకారం అందాల్సిన వాటా నీరు అందించేందుకు కాల్వపై ఎలాంటి పర్యవేక్షణ లేదు. దీంతో జల చౌర్యం యథేచ్ఛగా సాగుతోంది. ప్రధాన కాల్వకు పైపులు వేసి నీటిని కర్ణాటక రైతులు తోడేస్తున్నారు. ఇదేమని ప్రశ్నించే అధికారులకు మామూళ్లు ఇస్తున్నారు. ప్రస్తుతం కాల్వకు 690 క్యూసెక్కుల నీరు రావాల్సి ఉంది. అయితే 200 క్యూసెక్కుల నీరు రావడం లేదు. ఏపీలో ఉన్న కాలువపై బోర్డు పర్యవేక్షణ ఉండడంతో ఆ ప్రాంతానికి ఇంజినీర్లు వెళ్లడం లేదు. బోర్డు పరిధిలోని కాలువకు ఏపీకి అప్పగిస్తేనే వాటా మేరకు కొంత మేరకైనా నీరు వస్తుందని ఇంజినీర్లు సాగు నీటి సలహా మండలి సమావేశం దృష్టికి తీసుకపోయినా..ప్రభుత్వం స్పందించడం లేదు. జలచౌర్యం మితిమీరిపోయింది – యస్.చంద్రశేఖర్ రావు, జల వనరుల శాఖ ఎస్ఈ దిగువ కాలువ 135 నుంచి 250 కి.మీ వరకు బోర్డు పరిధిలో ఉంది. ఈ కారణంతోనే ఆ ప్రాంతంలో అధిక శాతం జల చౌర్యం జరుగుతోంది ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకపోయాం. ఈ ఏడాది చౌర్యం మితిమీరిపోయింది. దానాని అడ్డుకోవాలనే 8 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. చౌర్యం అడ్డుకోకపోతే ఆయకట్టుకు సాగు నీరు ఇవ్వడం ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంది. ఆంధ్ర సరిహద్దు వరకు పైప్లైన్ వేయాలి: అబ్దుల్ కరీం, రిటైర్డ్ ఇరిగేషన్ డీఈఈ ఎల్లెల్సీ వాటా నీరు రావాలంటే డ్యామ్ నుంచి ఏపీ సరిహద్దు వరకు పైప్లైన్ వేయాలి. హొళగుంద సమీపంలో రెగ్యులేటర్ను నిర్మించి వాటా నీటిని నిలువ చేస్తే రెగ్యులేటర్ నుంచి పైప్లైన్ ద్వారా ఎల్లెల్సీలోకి అవసరమైన మేర విడుదల చేసుకునే వెసులబాటు ఉంటుంది. ఈ రెండు ఇప్పటికే ప్రతిపాదనల్లో ఉన్నాయి. వరి సాగు మరచిపోయాం: గోపాల్, రైతు, నందవరం ఎల్లెల్సీకి నీరు రాకపోవడంతో వరి సాగు చేయడం మరచిపోయాం. కాలువ కింద ఉన్న పొలాల్లో పత్తి పంట సాగు చేశాం. ఆరేళ్లుగా వరి పంట లేదు. బియ్యాన్ని అంగట్లో కొనుగోలు చేసి తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకపుడు వరి పంట పైర్లతో కళకళలాడేవి. ఇపుడు ఎక్కడ చూసిన మెట్ట పంటలు తప్ప మరొకటి కనిపించదు. -
తుంగమ్మ ఒడికి దుర్గమ్మ
– ఘనంగా దుర్గామాత నిమజ్జనం – దుర్గాఘాట్ వద్ద ఆధ్యాత్మిక పరిమళం – నగరంలో కలశాలతో మహిళల ఊరేగింపు కర్నూలు(కల్చరల్) : దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా పది రోజులుగా విశిష్ట పూజలందుకున్న దుర్గామాత బుధవారం తుంగభద్రమ్మ ఒడికి చేరింది. రమ్యకపర్దిని... మోక్షదాయని... శిష్టసంరక్షిణి... దుష్ట సంహారిణి... దయ చూడవమ్మా.. అంటూ నగరంలోని వివిధ ప్రాంతాలలో దుర్గామాత విగ్రహాలకు పూజలు చేశారు. అనంతరం విగ్రహాలను ఊరేగింపుగా దుర్గా ఘాట్కు తీసుకెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు నగరంలోని చిన్నమార్కెట్ సమీపంలో నేతాజీ వీధిలో దుర్గామాత విగ్రహానికి టీజీవి ట్రస్ట్ నిర్వాహకులు, యువ పారిశ్రామికవేత్త టి.జి.భరత్ ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపును ప్రారంభించారు. చిన్న మార్కెట్ నేతాజీ వీధి నుంచి ప్రారంభమైన విగ్రహాల ఊరేగింపు చిత్తారి వీధి, జొహరాపురం, రాంభొట్ల ఆలయం, వన్టౌన్ పోలీస్స్టేషన్, పూలబజార్, మించిన్ బజార్, తెలుగు తల్లి సర్కిల్, మున్సిపల్ పాఠశాల గ్రౌండ్, కోట్ల సర్కిల్, ఎస్బీఐ సర్కిల్ మీదుగా సంకల్బాగ్లోని దుర్గా ఘాట్ను చేరుకున్నాయి. కృష్ణానగర్, బుధవారపేట, ఆర్ఎస్ సర్కిల్ తదితర ప్రాంతాల నుంచి ఊరేగింపుగా తరలివచ్చిన విగ్రహాలు సంకల్బాగ్లోని దుర్గాఘాట్ను చేరుకున్నాయి. దుర్గా ఘాట్ వద్ద ఆధ్యాత్మిక పరిమళం... నగరంలోని దుర్గాఘాట్ వద్ద 67 దుర్గామాత విగ్రహాలు తరలిరావడంతో ఆధ్యాత్మిక పరిమళం అలుముకుంది. తుంగభద్ర తీరంలో విద్యుత్ దీపకాంతులతో చేసిన అలంకరణలు చూపరులను ఆకట్టుకున్నాయి. ట్రాక్టర్లలో తరలివస్తున్న విగ్రహాల ముందు పరాశక్తి భక్తబృందం చేసిన భజనలు, పాడిన ఆధ్యాత్మిక గీతాలు అలరించాయి. ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై విద్యార్థులు దుర్గామాతను స్తుతిస్తూ చేసిన నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. టీజీవి ట్రస్ట్, గీతా ప్రచార సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సాయంత్రం 5:30 గంటలకు దుర్గా ఘాట్ వద్ద నిమజ్జనోత్సవం ప్రారంభమయ్యింది. దుర్గమ్మ ఆశీస్సులతో సుఖశాంతులు... దుర్గమ్మ ఆశీస్సులతో జిల్లాలో సుఖశాంతులు విలసిల్లుతాయని రాజ్యసభ సభ్యులు టి.జి.వెంకటేష్ తెలిపారు. సంకల్బాగ్లోని దుర్గాఘాట్ వద్ద జరిగిన నిమజ్జనోత్సవ ప్రారంభ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఏటా దుర్గా విగ్రహాల సంఖ్య పెరుగుతోందని, మహిళలు పెద్ద ఎత్తున నిమజ్జనోత్సవంలో పాల్గొంటున్నారని తెలిపారు. దుర్గా నిమజ్జనోత్సవ కార్యక్రమంలో మహిళలు పాల్గొని తమ భక్తిప్రపత్తులు చాటుకోవడం అభినందనీయని కలెక్టర్ విజయమోహన్ అన్నారు. పరాశక్తి విగ్రహానికి తొలి నిమజ్జనం... దుర్గా ఘాట్ వద్ద చిన్నమార్కెట్ నుంచి తరలివచ్చిన పరాశక్తి విగ్రహానికి పూజలు చేసి తొలి నిమజ్జనం నిర్వహించారు. తలపై కలశాలతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు నిమజ్జనోత్సవంలో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత, కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, మార్కెట్ యార్డు చైర్మన్ శమంతకమణి, బీజేపీ నాయకులు కాటసాని రాంభూపాల్రెడ్డి, టీడీపీ పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జి ఏరాసు ప్రతాప్రెడ్డి, డోన్ టీడీపీ ఇన్చార్జి కె.ఇ.ప్రతాప్, కలెక్టర్ విజయమోహన్, ఎస్పీ ఆకే రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కేసీకి సాగు నీరు బంద్
కర్నూలు సిటీ: కర్నూలు–కడప కాలువకు నీటి విడుదలను నిలిపేశారు. తుంగభద్ర నది నుంచి సుంకేసుల బ్యారేజ్కు ఇన్ఫ్లో లేకపోవడంతో శనివారం..అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఇటీవల నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు కురవడంతో కొంత నీటి ప్రవాహం వచ్చింది. దీంతో కేసీ కాల్వ 0కి.మీ నుంచి 120 కి.మీ వరకు సాగు చేసిన ఆయకట్టుకు నీరు ఇచ్చారు. అలగనూరు జలాశయంలోకి కూడా కొంత నీటిని నిల్వ చేశారు. కేసీ కింద ఈ ఖరీఫ్లో 40 వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. కాల్వకు నీరు బంద్ కావడంతో వరి సాగుకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దిగువ కాల్వపై గస్తీకి కలెక్టర్ అనుమతి... తుంగభద్ర దిగువ కాలువపై పోలీసు గస్తీ ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ చల్లా విజయమోహన్ అనుమతులు ఇచ్చారు. కాలువపై 135 కి.మీ నుంచి 250 కి.మీ వరకు గస్తీ నిర్వహించేందుకు పోలీసులకు అవసరమైన వాహనాలు, తాత్కాలిక విడిది ఏర్పాట్లకు సుమారు 6 లక్షలు ఖర్చు అవుతుందని ఇంజినీరింగ్ అధికారులు అంచనాలు వేసి కలెక్టర్కు నివేదిక అందజేశారు. దీంతో పాటు ఎస్పీ ఆకే రవికృష్ణ దృష్టికి తుంగభద్ర దిగువ కాలువపై గస్తీ ఏర్పాటుకు అనుమతించాలని ఇంజినీర్లు కోరారు. దసరా ఉత్సవాల తరువాత పోలీస్ బంద్ బస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ హామీనిచ్చారు. -
నేడు అట్లా సదస్సు
ఆదోని: తుంగభద్ర దిగువ కాలువ నీటి వాటా సాధనకు చేపట్టాల్సి కార్యాచరణపై అసోసియేషన్ ఆఫ్ తుంగభద్ర ఎల్లెల్సీ ఆయకట్టుదార్స్ (అట్లా) ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని ద్వారకా ఫంక్షన్ హాల్లో సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఆదినారాయరణ రెడ్డి, శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం భీమాస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టులు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పులికనుమ, గురు రాఘవేంద్ర ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తి కావచ్చాయని, మిగులు పనులను పూర్తి చేయడానికి ప్రభుత్వం ఏ మాత్రం చొరవ చూపక పోవడం విచారకరమని అన్నారు. పోరాటేందుకు ప్రజల్లో చైతన్యం కోసం సదస్సు ఏర్పాటు చేశామని, మేధావులు, ఆయకట్టు బాధితులు, ప్రజలు హాజరై సూచనలు, సలహాలు ఇస్తే ఆ మేరకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. -
‘సుంకేసుల’కు పెరిగిన ఇన్ఫ్లో
సుంకేసుల(గూడూరు): మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా తుంగభద్రనది ద్వారా సుంకేసుల రిజర్వాయర్కు నీరు చేరుతోంది. గురువారం డ్యాంకు 2700 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు డ్యాం ఏఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేసీ కాల్వకు 2600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. రిజర్వాయర్ గేటును అర మీటర్‡మేర ఎత్తి దిగువకు 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. మరో రెండు, మూడు రోజుల పాటు ఇన్ఫ్లో కొనసాగే అవకాశం ఉందన్నారు. -
మితిమీరిన జల దోపిడీ
– ఎగువ రాష్ట్రాల తీరుపై రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ ఆరోపణ – నియంత్రనకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ నంద్యాలరూరల్: తుంగభద్ర నదిపై కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల జలదోపిడీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకోవాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ దేవగుడి చంద్రమౌళీశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. నంద్యాల మాజీ ఎంపీ బొజ్జా వెంకటరెడ్డి స్వగృహంలో బుధవారం ఏర్పాటు చేసిన రైతు సంఘాల ప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తుంగభద్ర నదిపై కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు విచ్చలవిడిగా ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసి దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్కు నీరు రాకుండా చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కేసీ కెనాల్కు రావాల్సిన నీరు కూడా తుంగభద్ర నుంచి రాలేదని, ఈ కారణంగా ఆయకట్టులో సాగైన ఖరీఫ్ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. మహబూబ్నగర్ జిల్లా ఆర్డీఎస్ ఆయకట్టు స్థిరీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తుమ్మిళ్ల దగ్గర మరో ఎత్తిపోతల పథకం ప్రారంభించినప్పటికీ సీఎం చంద్రబాబు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఈయన తీరువల్లే ఎగువ రాష్ట్రాలు మరింత రెచ్చిపోతున్నాయన్నారు. తక్షణమే కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలతో చర్చలు జరిపి అక్రమంగా చేపడుతున్న ఎత్తిపోతల పథకాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి జనవరి నెలాఖరునాటికి కేసీ కాల్వకు పూర్తిస్థాయిలో సాగునీరు విడుదల చేయాలన్నారు. శ్రీశైలం జలాశయంలోని 854అడుగుల నీటి మట్టాన్ని కొనసాగించాలని, సిద్దేశ్వరం అలుగు నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు. శంకుస్థాపన దశలో ఉండిపోయిన రాజోళి బండ, జోళదరాశి రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. సమావేశంలో కుందూ పోరాట సమితి కన్వీనర్ కామిని వేణుగోపాల్రెడ్డి, సిద్ధేశ్వరం జలసాధన సమితి కన్వీనర్ వైఎన్రెడ్డి, రాయలసీమ జలసాధన సమితి అధ్యక్షుడు ఏర్వ రామచంద్రారెడ్డి, నంది రైతు సమాఖ్య, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
టీబీ డ్యాం నుంచి నీటి విడుదల బంద్
– ఇండెంట్ గడువుకు ముందే నిలుపుదల – హంద్రీనీవా నుంచి మళ్లింపునకు అనుమతించని సర్కారు – కేసీ ఆయకట్టు రైతుల ఆందోళన కర్నూలు సిటీ: మూడు రోజులు ముందుగానే తుంగభద్ర డ్యాం నుంచి నీటి విడుదల శనివారం నిలిచిపోయింది. కేసీ ఆయకట్టును కాపాడేందుకు డ్యాం నుంచి గత నెల 29న నీటి విడుదల ప్రారంభించారు. 3వేల క్యుసెక్కుల చొప్పున 5 రోజులు, 1500 క్యుసెక్కుల చొప్పున 10 రోజులపాటువిడుదల చేయాలని టీబి బోర్డుకు జల వనరుల శాఖ ఇంజినీర్లు ఇండెంట్ పెట్టారు. డ్యాం నుంచి విడుదల చేసిన నీరు ఈ నెల 3న సుంకేసుల బ్యారేజీకి చేరుకుంది. కాల్వ ద్వారా డ్యాం నుంచి 120 కి.మీ. వరకు కూడా చేరకముందే నీరు బంద్ కావడంతో ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవంగా ఈ నెల 13 వరకు డ్యాం నుంచి నీరు రావాల్సి ఉన్నా ఎలాంటి సమాచారం లేకుండానే బోర్డు అధికారులు నీటిని బంద్ చేశారు. ఈ కారణంగా కేసీకి మరో మూడ, నాలుగు రోజుల్లో నీటిని బంద్ చేసే అవకాశం ఉన్నట్లు అధికార యంత్రాంగం చెబుతోంది. ఆదిలోనే అడ్డంకులు.. కేసీ ఆయకట్టుకు సాగునీరు అందించడం కోసం హంద్రీనీవా మొదటి లిఫ్ట్ మల్యాల నుంచి ప్రత్యామ్నాయంగా నీటి మళ్లించేందుకు రెండు పైపులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రతిపాదన 2013 నుంచి పెండింగ్లోనే ఉంది. అయితే ఇటీవల దీని కోసం రైతులు డిమాండ్ చేయడంతో పనులు మొదలు పెట్టి పూర్తి చేసే దశకు చేరుకున్నారు. ఒక పంపు పనులు పూర్తి చేసి రెండు రోజుల క్రితమే ట్రయల్ రన్ చేశారు. మరో పైపు పనులు రెండు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే నీటి మళ్లింపునకు ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో ట్రయల్రన్ చేసిన వెంటనే బంద్ చేసినట్లు తెలిసింది. కేసీకి నీరు మరో నాలుగు రోజులే.. టీబీ డ్యాం నుంచి ఎలాంటి సమాచారం లేకుండానే నీటి విడుదల నిలిపేశారు. అయితే పై నుంచి వస్తున్న నీరు కేసీకి మరో నాలుగు రోజులు సరిపోతుంది. హంద్రీనీవా నుంచి నీరు మళ్లించేందుకు ప్రస్తుతం ఒక పైపు పనులు పూర్తయ్యాయి. అవసరం మేరకు హంద్రీనీవా నీరు వాడుకుంటాం. అనుమతుల విషయం తెలియదు. – ఎస్.చంద్రశేఖర్రావు, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ -
కేసీ కింద వరి సాగు వద్దు
నంద్యాలరూరల్: కర్నూలు–కడప ప్రధాన కాల్వ కింద ఆయకట్టు రైతులు వరి సాగు చేయవద్దని, ఆరుతడి పంటలు వేసుకోవాలని కేసీ కెనాల్ సబ్ డివిజనల్ అధికారి ఎంజే రాజశేఖర్ కోరారు. బుధవారం నంద్యాల కేసీ కెనాల్ డీఈ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తుంగభద్ర నదికి ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వరద నీరు రాలేదని, దీంతో సుంకేసుల ఆనకట్ట ద్వారా కేసీ కెనాల్కు పూర్తి స్థాయిలో నీరు సరఫరా చేయడం కష్ట సాధ్యమన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తుంగభద్ర బోర్డు ద్వారా మూడు టీఎంసీల నీరు కేసీకి విడుదల చేస్తామని, ఆ నీరు తుంగభద్ర డ్యాం నుంచి సుంకేసులకు చేరుకునేందుకు రెండు రోజులు పడుతుందన్నారు. అక్కడి నుండి కేసీ కెనాల్కు వచ్చేందుకు మరో మూడు రోజులు పట్టే అవకాశం ఉందన్నారు. -
యువకుడి మృతదేహం లభ్యం
కోసిగి : తుంగభద్ర నదిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. శ్రావణ మాసం ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకుని కోసిగి మండలం కందుకూరు గ్రామ ఒడ్డున జరిగిన శ్రీలక్ష్మి నరసింహ (ఉరుకుంద ఈరన్న) స్వామి పల్లకోత్సవ ఉత్సవాలను తిలకించేందుకు∙కర్ణాటక రాష్ట్రం మాన్వి తాలుకా పొన్నూరు గ్రామానికి చెందిన ఏడుగురు యువకులు పుట్టిలో వస్తున్నారు. మార్గమధ్యలో పుట్టి మునిగిపోగా ఆరుగురు యువకులు ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. యల్లమ్మ, హనుమయ్య దంపతుల కుమారుడు రాము(22) నదిలో కొట్టుకుపోయాడు. ఆ రోజు ఎంత గాలించినా ఆ యువకుడి ఆచూకీ లభించలేదు. మూడవ రోజు బుధవారం కందుకూరు సమీపంలో కర్ణాటక ప్రాంతం ఒడ్డున మతదేహం బయటపడింది. పోలీసులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాన్వి ఆసుపత్రికి తరలించారు. -
వరుణుడు కరుణించాలని..
వరణుడి కరుణించాలని ఆస్పరి మండలం బిణిగేరి గ్రామస్తులు గ్రామ దేవతకు జలాభిషేకం చేసేందుకు తుంగభద్ర నీటిని యాత్రగా తీసుకెళ్తున్నారు. ఖరీఫ్లో సాగు చేసిన పంటలు వర్షాలు లేక వాడు ముఖం పట్టడంతో శుక్రవారం తుంగ భద్రనదీ జలం కోసం వెళ్లారు. శనివారం తిరుగు ప్రయాణంలో ఆదోని మీదుగా వెళ్తున్నారు. మారణాయుధాలు, కర్రలకు పూలు అలంకరించడం.. కళశాలతో నీళ్లు తీసుకెళ్తూ ప్రత్యేకంగా కనిపించారు. – ఆదోని టౌన్ -
టీబీ బోర్డులోకి రాజోలిబండనా?
– ఎజెండా నుంచి తొలగించాల్సిందే – సీడబ్ల్యూసీ చైర్మన్తో మాట్లాడిన ఎంపీ బుట్టా, డిప్యూటీ సీఎం – ఈ నెల 20న తుంగభద్ర బోర్డు సమావేశం సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాజోలిబండ డైవర్షన్ పథకాన్ని(ఆర్డీఎస్) తుంగభద్ర బోర్డులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. తద్వారా ఆర్డీఎస్కు నీటి విడుదల వ్యవహారంలో తన పట్టు పెంచుకోవడంతో పాటు ఆధునీకరణ పనులను కూడా మొదలు పెట్టేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీన జరగనున్న తుంగభద్ర బోర్డు సమావేశంలో ఎజెండా అంశంగా ముందుకు తెచ్చింది. ఈ నేపథ్యంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక నేరుగా కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్లు్యసీ) చైర్మన్తో ఫోన్లో మాట్లాడారు. ఎట్టిపరిస్థితుల్లో టీబీ బోర్డులోకి రాజోలిబండను చేర్చవద్దని... సమావేశపు ఎజెండా నుంచి కూడా ఈ అంశాన్ని తొలగించాలని కోరారు. ఇదే విషయాన్ని రాష్ట్ర జలవనరులశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ)కి కూడా వివరించారు. ఒకవేళ సమావేశంలో తెలంగాణ ప్రతినిధులు ఈ అంశాన్ని లేవనెత్తితే.. వెంటనే కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని కూడా ఈఎన్సీకి సూచించారు. ఇదే అంశంపై డిప్యూటీ సీఎం కేఈ కష్ణమూర్తి కూడా ఈఎన్సీకి ఫోన్ చేశారు. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో సుంకేసుల కూడా బోర్డు పరిధిలోకి పోయే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. ఇదీ వివాదం...! వాస్తవానికి రాజోలిబండ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య తాజాగా వివాదం తలెత్తింది. రాజోలిబండ ఆధునీకరణ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య కొద్దిరోజుల క్రితం గొడవ జరిగింది. ఆర్డీఎస్ ఎత్తు పెంపును మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన రైతులు వ్యతిరేకించారు. ఈ మేరకు ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నేతత్వంలో అక్కడే బైఠాయించారు. ఆనకట్ట ఎత్తు పెంచితే తమకు నీళ్లు రావనేది ఇక్కడి రైతుల భావనగా ఉంది. మరోవైపు ఆర్డీఎస్ ఎత్తు పెంపు పనులను నిలిపివేస్తున్నారని.. ఇందుకు అనుగుణంగా పనులు జరగకుండా అడ్డుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అప్పట్లో మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆర్డీఎస్ను టీబీ బోర్డు పరిధిలోకి తెస్తే.. సులభంగా ఆధునీకరణ పనులను కొనసాగించవచ్చనేది తెలంగాణ ప్రభుత్వ భావన. ఇందుకు అనుగుణంగా టీబీ బోర్డు సమావేశంలో ఎజెండా అంశంగా తెరమీదకు తీసుకొచ్చారు. దీనిని అడ్డుకోకపోతే జిల్లాలోని పశ్చిమ ప్రాంతం మరింత నీటి కరువుతో సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే బోర్డు పరిధిలో ఉన్న ఎల్ఎల్సీలకు సరిపడినన్ని నీళ్లు రాక పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఇదే కోవలో రాజోలిబండ ఆయకట్టు ప్రాంతం కూడా ఇబ్బందులు ఎదురవుతాయనే భయాందోళన ఇక్కడి రైతుల్లో వ్యక్తమవుతోంది. -
ఆంధ్ర సరిహద్దు చేరిన ఎల్లెల్సీ నీరు
హాలహర్వి : తుంగభద్ర డ్యాం నుంచి దిగువకాల్వకు విడుదలైన నీరు ఆదివారం రాత్రికి ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలోని 135వ మైలురాయిని దాటాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రైతులు సోమవారం తుంగభద్ర జలాలకు పూజలు చేశారు. ఈ నెల 18వ తేదీన తుంగభద్ర డ్యాం అధికారులు ఆంధ్రాకు తాగునీటి అవసరాల నిమిత్తం 690 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అయితే కర్ణాటకలోని 6వ కి.మీ. వద్ద కాలువకు ఓ చోట గండి పడడంతో నీటిని నిలుపుదల చేశారు. గండిని పూడ్చేందుకు అక్కడి అధికారులు చర్యలు చేపట్టారు. రెండు రోజులక్రితం గండి పూడ్చడం పూర్తయిన తర్వాత తిరిగి నీట విడుదలను కోనసాగించారు. ఆ నీరే ప్రస్తుతం దిగువ కాలువకు చేరిందని ఆంధ్రసరిహద్దు ఎల్లెల్సీ డీఈ నెహేమియా సోమవారం విలేకరులకు తెలిపారు. డ్యాంలో పూర్తిస్థాయిలో నీరు చేరితే సాగునీటిని కూడా త్వరలో విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. -
తుంగభద్ర దిగువ కాల్వకు గండి
– కాల్వకు నీటిసరఫరా నిలిపివేత – మరమ్మతులకు చర్యలు సాక్షి, బళ్లారి : తుంగభద్ర జలాశయం నుంచి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు తాగు, సాగు నీటినందించే తుంగభద్ర దిగువ కాల్వకు శనివారం గండి పడింది. బళ్లారి జిల్లా కంప్లి నియోజకవర్గ పరిధిలోని గుండ్లుకెరి సమీపంలో బుక్కసాగరకు ఆనుకుని కాలువకు గండి పడింది. నీరంతా బయటకు పారుతుండడంతో ఆ ప్రాంతవాసులు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు తుంగభద్ర బోర్డు సెక్రటరీ రంగారెడ్డి, సంబంధిత అధికారులు గండి ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. కాలువకు మూడు రోజుల క్రితం నీటిని విడుదల చేశారు. ఈ నీరు ఆంధ్రా సరిహద్దు కాదు కదా కర్ణాటక పరిధిలోని బళ్లారి జిల్లాకు కూడా పూర్తిగా చేర కుండా గండిపడింది. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు వెంటనే రంగంలోకి దిగి మరమ్మతులకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కాల్వకు నీటి సరఫరాను నిలిపివేశారు. పనులు పూర్తయిన వెంటనే తిరిగి కాలువకు నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. -
తుంగభద్రను తోడేస్తున్న తమ్ముళ్లు
► దర్జాగా అధికార పార్టీనేతల ఇసుక దందా ► నిషేధిత నిడ్జూరు ఇసుక రీచ్ నుంచి అక్రమ రవాణా ► చర్యలకు వెనకాడుతున్న అధికారులు కర్నూలు సిటీ: తుంగభద్ర నదిని అడ్డాగా చేసుకున్న అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా ఇసుక దందా నడుపుతున్నారు. గతేడాది ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు డ్వాక్రా సంఘాల ద్వారా ప్రభుత్వం ఇసుక అమ్మకాలు చేపట్టింది. దీనిపై విమర్శలు రావడంతో ఈ ఏడాది ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తున్నట్లు ప్రకటించి ఎంపిక చేసిన రీచ్ల్లో మాత్రమే తవ్వకాలు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలో పూడూరు, ఆర్.కొంతలపాడుతో పాటు మరో మూడు చోట్ల మాత్రమే ఇసుక ఉచితంగా తవ్వుకునేందుకు అనుమతులు ఇచ్చారు. కానీ అధికార పార్టీ నేతలు అక్రమార్కులతో చేతులు కలిపి తుంగభద్ర నదిని తోడేస్తునానరు. అడ్డుకోవాల్సిన అధికారులు టీడీపీ నేతల బెదిరింపులకు తలొగ్గుతున్నారు. తుంగభద్ర, హంద్రీ, వేదావతి నదుల్లో నాలుగు రీచ్లకు మాత్రమే ఇసుక తవ్వుకునేందుకు అనుమతులు ఉన్నాయి. కానీ తుంగాతీరంలోని జి.శింగవరం, నిడ్జూరు గ్రామాల తీరంలోని నది నుంచి ఎలాంటి ఇసుక తవ్వకాలు చేయకూడదు. కానీ అధికార పార్టీకి చెందిన నేతలు కొందరు కాసుల దాహంతో అడ్డగోలుగా తవ్వకాలు చేపడుతున్నారు. అనుమతులు ఉన్న రీచ్ల్లోనే ఇసుక తవ్వకాలు చేయాల్సి ఉన్నా రీచ్లు దూరంగా ఉన్నాయనే సాకుతో నిడ్జూ రు రీచ్పై కన్నేశారు. దీంతో రేయింబవళ్లు తేడా లేకుండా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. మునగాలపాడుకు చెందిన కొందరు వ్యక్తులు ఎమ్మెల్యే మనుషులమని చెప్పి అడ్డగోలుగా దోచుకుంటున్నారు. నదిలో నుంచి తీసిన 20 ట్రాక్టర్ల ఇసుకను ఎమ్మెల్యే సమీప బంధువు నందికొట్కూరు చెందిన వారికి అమ్ముకొని సొమ్ము చేసుకున్నట్లు తెలిసింది. పూడూరు దగ్గర తవ్వుతున్న ఇసుకను ఓ వ్యక్తి తన లారీలతో తరలిస్తున్నాడు. ఇందుకు ఓ రెవెన్యూ అధికారి అతనికి అండగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కర్నూలు తహశీల్దారు కార్యాలయ అధికారులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లు సీజ్ చేస్తే అధికార పార్టీ నేత వాటిపై కేసు నమోదు చేయవద్దని అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ట్రా క్టర్ల రాకపోకలపై తీవ్ర అవస్థలు పడుతున్నామని సమీప గ్రామాల ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. నిడ్జూరు రీచ్లో తవ్వకాలు నిషేధించాం తుంగభద్ర నదిలో రెండు రీచ్ల్లో మాత్రమే ఉచితంగా ఇసుక తవ్వకాలు చేసుకోవచ్చు. నిడ్జూరు రీచ్లో తవ్వకాలు నిషేధించాం. ఇక్కడి నుంచి అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. తుంగభద్ర తీర ప్రాంతంలో రెవెన్యూ సిబ్బందిని అలర్ట్ చేసి ఇసుక అక్రమ రవాణా చేసే వాహనాలను సీజ్ చేస్తాం. - రఘుబాబు, కర్నూలు రెవెన్యూ డివిజన్ అధికారి -
తుంగా స్నానం..ఎంతో కష్టం
► పుణ్యస్నానాలకు పడరాని పాట్లు ► ఎండిన తుంగభద్ర.. కానరాని ప్రత్యామ్నాయం ► భక్తుల ఇబ్బందులను గాలికి వదిలేసిన శ్రీమఠం మంత్రాలయం తుంగా స్నానం పాప హరణం. ఇది భక్తుల ప్రగాఢ నమ్మకం. రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చిన ప్రతి భక్తుడూ తుంగభద్రమ్మ ఒడిలో పుణ్యస్నానాలు ఆచరించడం ఆచారం. ప్రస్తుతం చుక్కనీరు లేక తుంగభద్ర నది పూర్తిగా ఎండిపోయింది. భక్తులకు పుణ్యస్నానాలు కరువయ్యాయి. శ్రీమఠం అధికారులు సైతం భక్తుల కష్టాలను గాలికి వదిలేశారు. కారణంగా భక్తులు స్నానాలకు పడరాని పాట్లు పడుతున్నారు. పేరు గొప్ప.. కష్టాల దిబ్బ అన్న చందంగా క్షేత్రంలో భక్తుల పరిస్థితి మారింది. వేడుక చూస్తున్న శ్రీమఠం.. రాఘవేంద్రస్వామి దర్శనార్థం రోజుకు 2-3 వేలు మంది భక్తులు ఇక్కడి వస్తారు. వేసవి సెలవులు రావడంతో భక్తుల తాకిడి పెరిగిపోయింది. అయితే భక్తులు పుణ్యస్నానాల చేసుకోవడానికి నీరులేక అల్లాడిపోతున్నారు. నదిలో ఓచోట మడుగులో నిల్చిన కలుషిత నీటిలోనే ముక్కు మూసుకుని ఒళ్లు తడుపుకుంటున్నారు. నీరు పచ్చగా మారి వాసన వస్తున్నా వేరే గత్యంతరం లేక స్నానాలు చేస్తున్నారు. అందులో స్నానం చేయడంతో ఒళ్లు దద్దులు, దురద వేస్తోందని భక్తులు వాపోతున్నారు. ఆ మడుగులో నీరింకితే అగమ్య గోచరమే. వర్షాభావ పరిస్థితుల్లో భక్తులకు ఇక్కట్లు వస్తాయని తెలిసినా కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేకపోయారు. కోనేరును కూల్చే యోచన.. తిరుపతి, మహానంది, యాగంటి పుణ్యక్షేత్రాల్లో భక్తులు కోనేరుల్లో ఎంతో ఆనందంగా స్నానాలు ఆచరిస్తారు. ఇక్కడి భక్తులకు ఆ భాగ్యం ఎప్పటి నుంచో లేదు. చెంతనే తుంగభద్ర నది ఉన్నా పుష్కరిణి నిర్మించలేకపోయారు. ఏడేళ్ల క్రితం భక్తుల సౌకర్యార్థం అంచనా వ్యయం రూ.16 లక్షలతో మఠం వెనుకభాగం తులసీవనం సమీపంలో పుష్కరిణి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కోనేరు ప్రాకారం, వాటర్ ఫౌంటెన్ నిర్మాణాలు సైతం పూర్తి చేశారు. అయితే మఠం అధికారులు అర్ధంతరంగా పనులు నిలిపేశారు. కట్టిన అరకొర కట్టడాల కోనేరును సైతం ప్రస్తుత అధికారులు కూల్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భక్తులు పుణ్యస్నానాలకు కనీసం నీళ్ల ట్యాంకర్లు ఏర్పాటు చేసినా పర్వాలేదు. అధికారులకూ ఇవేమీ పట్టడం లేదు. భక్తులను కష్టాలకు వదిలేసి వేడుక చూస్తున్నారు. పుణ్యస్నానాల విషయంలో వచ్చిన ప్రతి భక్తుడూ శ్రీమఠం అధికారులను నిట్టూరుస్తున్నా స్పందించని వైనం. -
సమస్యలు వినిపించేనా?
నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం ► ప్రజాసమస్యలు చర్చకు వచ్చేనా? ► కరువు కోరల్లో పాలమూరు ► గ్రామాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ► గ్రాసం లేక కబేళాలకు పశువులు ► విపక్షసభ్యులు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది.. గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సమస్య సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మేత కోసం మూగజీవాలు అల్లాడుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోయి రైతులు దిక్కుతోచనిస్థితిలో పడ్డారు. ఈ ఏడాది సరైన వర్షాల్లేక కృష్ణా, తుంగభద్ర నదులు ఎండిపోయాయి. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో ప్రభుత్వం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించింది. కరువు సహాయకచర్యలు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు సీజనల్ వ్యాధులతో ఆస్పత్రుల పాలవుతున్నారు.. ఇలా అనేక సమస్యలతో జిల్లా ప్రజలు సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో బుధవారం జరిగే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సమస్యల పరిష్కారం కోసం ఏ మేరకు దిశానిర్దేశం చేస్తుందని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. కరువుపై నిలదీయనున్న ప్రతిపక్షాలు జిల్లాలో కరువు పరిస్థితులు తీవ్రంగా అలుముకున్నాయని ప్రతిపక్ష జెడ్పీటీసీ సభ్యులు చెబుతున్నారు. కరువుపై జెడ్పీ సర్వసభ్య సమావేశంలో పాలకపక్షాన్ని నిలదీస్తామని కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మికాంత్రెడ్డి చెప్పారు. జిల్లా ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చేసిన ఏ తీర్మానాల్లో ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని ఆరోపిస్తున్నారు. గ్రామాలు, మండలాల్లో అధికారులు ప్రజాసమస్యలపై స్పందించడం లేదని ఈ అంశంపై సభలో చర్చించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఎంపీపీ కార్యాలయాల్లో జెడ్పీటీలకు ప్రత్యేక చాంబర్ను ఏర్పాటు చేయనున్నట్లు జెడ్పీ సర్వసభ్య సమావేశాలు తీర్మానించినా ఎక్కడా అమలుకాలేదని పలువురు జెడ్పీటీసీ సభ్యులు ఆరోపిస్తున్నారు. నేడు జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రజాసమస్యలపై చర్చించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. గత సమావేశాల తీరిది.. ప్రస్తుత జెడ్పీ పాలకమండలి 2014 జులై 5న కొలువుదీరింది. ఇప్పటివరకు 8సార్లు సర్వసభ్య సమావేశాలు జరిగాయి. ఈనెల 20న మరోసారి సమావేశం జరగనుంది. గతేడాది ఏప్రిల్ 7న జరిగిన సమావేశంలో ప్రొటోకాల్ వివాదం, జూరాల- పాకాల పథకానికి నిధుల కేటాయింపుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వ అధికార కార్యక్రమాలకు అధికారులు తమను ఆహ్వానించడం లేదని అధికార, ప్రతిపక్షాల జెడ్పీటీసీలు సభ్యులు వాకౌట్ చేశారు. తమకు ప్రత్యేకగదిని కేటాయించాలని ఎంపీపీలు డిమాండ్ చేస్తున్నారు. గత మే 23వ తేదీన ప్రత్యేకంగా జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సారి కేవలం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఎలా నిర్వహించాలనే అంశంపైనే చర్చించారు. సెప్టెంబర్ 4న జరిగిన సమావేశం రసాభాసగా మారింది. జనవరి 4న జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే గువ్వల బాల్రాజు, కాంగ్రెస్ ఎంపీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ సమావేశంలో గొడవతోనే సరిపోయింది. జెడ్పీ నిధులను ఎమ్మెల్యేలకు కేటాయించొద్దని జెడ్పీటీసీలు, ఆ నిధులను తమకు కేటాయించాలని ఎంపీపీలు.. ఇలా అనే డిమాండ్లతో సభ గందరగోళంగా మారింది. ఆర్డబ్ల్యూఎస్, డ్వామ్యాపై చర్చించే అవకాశం నేడు జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా తాగునీటి సరఫరా, ఉపాధిహామీ పథకాలపైనే చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎండాకాలంలో గ్రామాల్లో మంచినీటి కొరత తీవ్రంగా ఉంది. దీంతోపాటు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేపట్టాలనే ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గత సమావేశంలో కూడా ఆర్డబ్ల్యూఎస్ శాఖపైనే ప్రధానంగా చర్చ జరిగింది. అప్పట్లో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం రూ.100కోట్లు మంజూరుచేసిందని మంత్రి ప్రకటించారు. ఆ చర్యలు ఎంతవరకు వచ్చాయని ప్రశ్నించేందుకు సభ్యులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టమవుతోంది. ఎజెండాలు సమర్పించని 19 శాఖలు జెడ్పీ సర్వసభ్య సమావేశానికి 19శాఖలు తమ శాఖలో చేపట్టిన పూర్తి వివరాలను ఎజెండాలో సమర్పించలేదు. మొత్తం 64 శాఖలకు గాను 19శాఖలు ఇవ్వలేదు. మత్స్యశాఖ, వికలాంగుల సంక్షేమశాఖ, సివిల్సప్లయి, పశుసంవర్థక శాఖ, ఇరిగేషన్శాఖ వారు తమ ప్రగతి సమాచారాన్ని జెడ్పీ ఎజెండాకు సమర్పించలేదు. నివేదిక సమర్పించని శాఖలను ఎందుకు ప్రశ్నించడం లేదని జెడ్పీటీసీలు నిలదీస్తున్నారు. ఈ సారైన నివేదికలను సమర్పించని శాఖలను ప్రశ్నిస్తారా? లేదా? అన్నది వేచిచూడాల్సి ఉంది. -
సరిహద్దుల్లో చెక్
► ఉచిత ఇసుక విధానంపై నేడు సమావేశం ► తుంగభద్రపై రెండు రీచ్ల్లోనే తవ్వకాలు ► పంచాయతీ కార్యదర్శులకు అధికారాలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఉచిత ఇసుక విధానంపై జిల్లాలో కసరత్తు మొదలైంది. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధ్యక్షతన సోమవారం వివిధ శాఖల అధికారులతో సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా జిల్లా నుంచి ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలకుండా పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు చెక్పోస్టులను ఏర్పాటు చేయడంపై చర్చించనున్నారు. అదేవిధంగా తుంగభద్ర నదిపై కేవలం రెండు ఇసుక రీచ్ల్లో మాత్రమే తవ్వకాలు చేపట్టేందుకు అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం. స్థానికంగా వాగులు, వంకల నుంచి ఇసుక తవ్వకాలపై నిబంధనలు సడలించేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. అయితే గ్రామాల్లో నిర్మాణాల కోసం ఇసుక తవ్వకాల కోసం ముందస్తుగా పంచాయతీ కార్యదర్శి నుంచి అనుమతి తీసుకోవాలనే నిబంధన పెట్టనున్నట్టు తెలుస్తోంది. రెండు బోర్డర్ చెక్పోస్టులు జిల్లాకు ఆనుకుని రెండు రాష్ట్రాల సరిహద్దులు ఉన్నాయి. ఒకవైపు తెలంగాణలో ఉచిత ఇసుక విధానం అమల్లో లేదు. కర్ణాటక రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి వస్తే... ఈ రెండు రాష్ట్రాలకు ఇసుక తరలిపోయే ప్రమాదం పొంచి ఉంది. దీనిని అరికట్టేందుకు బోర్డర్ చెక్పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. మైనింగ్ శాఖతోపాటు రెవెన్యూ, పోలీసు విభాగాల ద్వారా నిరంతరం నిఘా ఏర్పాటు చేయడం ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఈ చెక్పోస్టులను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై సోమవారం స్పష్టత రానుంది. అవసరమైతే మరిన్ని చెక్పోస్టులు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ముందస్తు అనుమతి తప్పనిసరి గ్రామాలకు సమీపంలో ఉన్న వాగులు, వంకల్లో ఇసుక తరలింపునకు పెద్దగా ఆటంకాలు కల్పించకూడదనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఇక్కడ ఇసుక తరలింపును సరళతరం చేయనున్నట్టు తెలిసింది. అయితే గ్రామాల్లో ఇసుక తరలించుకునే వారు సంబంధిత పంచాయతీ కార్యదర్శి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలనే నిబంధన విధించనున్నట్టు సమాచారం. తద్వారా విచ్చలవిడిగా ఇసుక తరలింపు జరగకుండా ఉంటుందనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. నందవరంలోని గురజాల, ఆర్.కొణతపాడు సమీపంలోని తుంగభద్ర నది నుంచి ఇసుక తవ్వకాలకు అనుమతి ఉంది. పంచలింగాల వద్ద బ్రిడ్జికి 500 మీటర్ల దూరంలో ఉండటంతో పాటు పర్యావరణ అనుమతి లేదు. పూడురు-పడిదెంపాడు రీచ్లల్లో మాత్రం ఇసుక తవ్వకాలకు అనుమతి ఉంది. ఇవీ నిబంధనలు...! = {బిడ్జిలకు 500 మీటర్ల దూరంలో ఇసుక తవ్వకాలపై పూర్తిగా నిషేధం = భూగర్భ జలాలు ఇంకిపోయి తాగునీటికి ఇబ్బందులు తప్పవనే ప్రాంతాల్లో కూడా ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వరు. = ఈసీ క్లియరెన్స్ కచ్చితంగా ఉన్న రీచ్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. = బోర్డర్ చెక్పోస్టుల ద్వారా ఇసుక రాష్ట్రం దాటకుండా పటిష్ట నిఘా = ఇసుక రీచ్లల్లో నిరంతరం నిఘాకు ఏర్పాట్లు -
ఎట్టకేలకు..
► ప్రభుత్వానికి చేరిన తుమ్మిళ్ల ఎత్తిపోతల డీపీఆర్ ► మూడు రిజర్వాయర్లతో డీపీఆర్ను ఆమోదించిన ఈఎన్సీ ► రూ. 835 కోట్లఅంచనాతో తుమ్మిళ్ల ► ఎత్తిపోతల డీపీఆర్ డీపీఆర్కు అనుమతి వస్తే పథకం పనులకు శ్రీకారం ► ఈ ఎత్తిపోతలతో ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు నీళ్లు ► 23వ డిస్ట్రిబ్యూటరీ నుంచి ఆయకట్టులోని 70వేల ► ఎకరాలు సాగులోకి.. జూరాల : మూడు రిజర్వాయర్లతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం డీపీఆర్ను ఈఎన్సీ ఆమోదించి మంజూరు కోసం ప్రభుత్వానికి పంపారు. దీంతో ఎనిమిది నెలలుగా సర్వే దశలో ఉన్న ఈ పథకం ముందడుగు పడినట్లయింది. దశాబ్దాలుగా ఆర్డీఎస్ ఆయకట్టులో నీళ్లందని రైతులకు శాశ్వత పరిష్కారంగా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం అందుబాటులోకి వచ్చే అవకాశం ఏర్పడింది. ఆర్డీఎస్ ఆయకట్టులో చివరి ఎకరా వరకు నీళ్లిచ్చేందుకు ప్రతిపాదించిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం డీపీఆర్ను రూ. 835 కోట్ల అంచనాకు ఈఎన్సీ మురళీధర్ ఆమోదించి ప్రభుత్వానికి పంపినట్లు అధికారులు తెలిపారు. వడ్డేపల్లి మండలం తుమ్మిళ్ల గ్రామం వద్ద తుంగభద్ర నదీతీరంలో మూడు పంపులతో పంప్హౌస్ నిర్మించనున్నారు. ఒక్కో పంపు 10 క్యూమిక్స్ నీటిని తోడే సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నారు. అక్కడినుంచి నీటిని మొదటగా మల్లమ్మ కుంట రిజర్వాయర్కు పంపింగ్ చేస్తారు. మల్లమ్మ కుంట రిజర్వాయర్ నుంచి జూలకల్, వల్లూరుల వద్ద నిర్మించే రెండు రిజర్వాయర్లకు నీటిని మళ్లించి నింపుతారు. మూడు రిజర్వాయర్ల ద్వారా ఆర్డీఎస్ డి-23 నుంచి అలంపూర్ మండల పరిధిలోని చివరి ఎకరాకు నీళ్లందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని డిజైన్ చేశారు. ఎత్తిపోతల ద్వారా ఎనిమిది టీఎంసీల నీటిని 90 రోజుల్లో తుంగభ ద్ర నుంచి పంపింగ్ చేయాలన్నది లక్ష్యం. 70 నుంచి 80వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించే విధంగా డిజైన్ చేశారు. ఆగస్టు మొదటి వారం నుంచి అక్టోబర్ చివరి వరకు నదిలో వరద ఉన్న సమయంలో పంపింగ్ను చేయాలన్నది లక్ష్యంగా నిర్ణయించారు. కర్ణాటకలోని మాన్వి తాలూకా పరిధిలో ఉన్న ఆర్డీఎస్ హెడ్వర్క్స్ నుంచి వచ్చే నీళ్లు చివరి దాకా అందని ఆయకట్టు భూములకు తుమ్మిళ్ల ఎత్తిపోతల పూర్తయితే శాశ్వతంగా నీరందనుంది. మన రాష్ట్ర ప్రభుత్వం తుమ్మిళ్ల సర్వేను వీఎస్ మ్యాప్ సంస్థకు రూ. 18 లక్షల అంచనాతో జూన్లో అప్పగించింది. నాటి నుంచి సర్వే కొనసాగుతూ ఎట్టకేలకు డిసెంబర్ చివరి వారంలో సర్వేను పూర్తి చేశారు. సర్వేకు అనుగుణంగా అంచనాను రూపొందించి రూ.835 కోట్ల డీపీఆర్ను సిద్ధం చేశారు. -
తుంగభద్రలో యువకుడి మృతదేహం లభ్యం
మహానంది (కర్నూలు) : స్నేహితులతో కలసి తుంగభద్ర నదిలో బోటింగ్కు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు బోటులో నుంచి పడి గల్లంతయ్యాడు. దీంతో అతని స్నేహితులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. శనివారం మృతదేహం లభ్యమైంది. కర్ణాటకలోని రాయచూరుకు చెందిన వేణుగోపాల్(19) తన తొమ్మిదిమంది స్నేహితులతో కలిసి శుక్రవారం కర్నూలు జిల్లా మహానందీశ్వరుడిని దర్శించుకోవడానికి వెళ్లారు. ఈ క్రమంలో బోటు పై షికారు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు నదిలో పడి గల్లంతయ్యాడు. అప్పటి నుంచి గాలింపు చర్యలు చేపట్టగా ఈరోజు మృతదేహం లభ్యమైంది. -
మరో తొంభైటీఎంసీలు!
ఎగువన ఉన్న కర్ణాటక ప్రాజెక్టులు నిండేందుకు అవసరమైన నీరు ఇది ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్రలకు కొనసాగుతున్న ఇన్ఫ్లో అక్కడ 60 టీఎంసీలు వచ్చినా మనకు నీరొచ్చే అవకాశం హైదరాబాద్: కృష్ణా నది ఎగువన కర్ణాటకలోని ప్రధాన ప్రాజెక్టుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లోకి ఆశించిన స్థాయిలో నీరు చేరడంతో అవన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. మూడు ప్రాజెక్టుల వాస్తవ నీటి నిల్వ సామర్థ్యం 268.22 టీఎంసీలు కాగా అందులో 177.90 టీఎంసీల నీటి నిల్వలు ప్రస్తుతం ఉన్నాయి. మరో 90 టీఎంసీల మేర నీరు చేరితే అవి నిండిపోతాయి. ఇందులో 60 టీఎంసీల మేర నీరొచ్చినా దిగువన తెలంగాణకు ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర నీటి పారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. కృష్ణా బేసిన్లోని ప్రధాన ప్రాజెక్టుల్లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నీటి మట్టాలు గణనీయంగా పడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర ప్రాజెక్టుల్లోకి ఇన్ఫ్లో లేని కారణంగా నాగార్జునసాగర్ , శ్రీశైలం, జూరాలలో నీటిమట్టాలు పూర్తిగా అడుగంటాయి. ఇప్పటికే సాగర్లో కనీస మట్టం కిందకు నిల్వలు పడిపోవడంతో శ్రీశైలం నుంచి విడుదల చేస్తున్నారు. గత మూడు రోజులుగా శ్రీశైలం నుంచి సాగర్కు నీటిని విడుదల చేయడంతో శ్రీశైలంలో నీటిమట్టం 800 అడుగులకు చేరింది. ఒక్క జూరాలలో మాత్రం కాస్త ఆశాజనకంగా 11.9 టీఎంసీలకు గాను 6.26 టీఎంసీల నీరుంది. దిగువన రాష్ట్ర ప్రాజెక్టుల్లోకి నీరు చేరాలంటే ఎగువ కర్ణాటక ప్రాజెక్టులు నిండాల్సి ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్లు నిండితేనే దిగువకు ఇన్ఫ్లో ఉంటుంది. అక్కడ ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఇన్ఫ్లో పెరగడంతో ఆల్మట్టిలో ప్రస్తుతం 129.72 టీఎంసీలకు గాను 69.06 టీఎంసీలు నిల్వ ఉంది. నారాయణపూర్లో 37.64 టీఎంసీలకుగాను 32.1 టీఎంసీల నీరుండగా, తుంగభద్రలో 100.86 టీఎంసీలకు 76.74 టీఎంసీల నీరు ఉంది. మొత్తంగా 90 టీఎంసీల మేర లోటు కనబడుతున్నా, అందులో 50-60 టీఎంసీలు చేరితే దిగువకు ఇన్ఫ్లో కొనసాగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆల్మట్టిలో మరో 30-40 టీఎంసీల నీరు చేరితే దిగువ నారాయణపూర్కు వదులుతారు. అక్కడ ఇప్పటికే పుష్కలంగా నిల్వలు ఉన్నందున, ఆల్మట్టి నుంచి వచ్చే నీటిని నేరుగా దిగువ రాష్ట్రానికే వదిలే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సైతం ఆల్మట్టి, నారాయణపూర్లకు తగిన రీతిలో ఇన్ఫ్లో ఉందని, ఇది ఇలాగే కొనసాగితే సెప్టెంబర్ రెండోవారానికి పూర్తిస్థాయిలో ప్రాజెక్టులు నిండుతాయి. అలా జరిగితే రాష్ట్ర ప్రాజెక్టుల్లోకి నీరు వచ్చే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు అంచనావేస్తున్నాయి. -
ర్యాప్తో సినీ గేయాలకు కొత్త ఒరవడి
అమలాపురం టౌన్ : మంత్ర సినిమాలో ‘మహా...మహా...’, విక్రమార్కుడు సినిమాలో ‘అత్తిలి సత్తై.. సత్తై అంటూ ర్యాప్తో ఉర్రూతలూగించిన నోయల్ నటుడిగా కూడా ప్రేక్షకులకు పరిచయమే. ఇప్పుడు విలన్గా కూడా తెరపై కనిపించనున్నారు. ర్యాప్తో ఉర్రూతలూగిస్తున్న నోయల్ అమలాపురంలో తళుక్కుమన్నారు. ఒక పంథాలో... సంప్రదాయ పద్ధతిలో సాగుతున్న తెలుగు సినీ పాటల్లో ర్యాప్ విధానం కొత్త ఒరవడి సృష్టించిందని నోయల్ చెప్పారు. అమలాపురంలో ఏయూ పూర్వవిద్యార్థుల సంఘ అధ్యక్షుడు బండారు రామ్మోహనరావు ఇంట్లో మంగళవారం కొరియో గ్రాఫర్ సుభాష్ సరికొండ, హాస్యనటుడు నవీన్లతో కలసి నోయల్ విలేకరులతో మాట్లాడారు. తనకు తొలిసారిగా విక్రమార్కుడు సినిమాలో ర్యాప్ సాంగ్ పాడేందుకు దర్శకుడు రాజమౌళి అవకాశం ఇచ్చారన్నారు.. కొత్తగా విడుదలైన రేయ్ సినిమాలో పవనిజం పాటకు చేసిన ర్యాప్కు చాలామంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పారు. నటుడిగా కూడా తాను రాణిస్తున్నానని, మగధీర, బంపర్ ఆఫర్, ఈగ, గెడ్డం గ్యాంగ్ వంటి సినిమాల్లో నటించానని తెలిపారు. తాజాగా కుమారి 21 ఫిమేల్ చిత్రంలో విలన్గా చేస్తున్నానని చెప్పారు. హైదరాబాద్కు చెందిన తాను సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ, ర్యాప్ సింగింగ్పై ఆసక్తి పెంచుకుని ఆ రంగంలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. అదే సమయంలో నటుడిగా నిలదొక్కుకునేందుకు శ్రమిస్తున్నానని వివరించారు. పలు హీరోలకు ట్రైనర్ సుభాష్ తూర్పుగోదావరి జిల్లా రాజానగరానికి చెందిన సుభాష్ సరికొండ ఇటీవల కాలంలో పలు చిత్రాలకు కొరియో గ్రాఫర్గా పనిచేస్తూనే పలు చిత్రాల్లో నటించారు. అయితే అంతకు ముందు సినీ పరిశ్రమలో వర్ధమాన హీరోలు సాయిచరణ్తేజ, సందీప్కిషన్, సర్వానంద్, రోహిత్ వంటి వారికి హైదరాబాద్లోని ఓ డ్యాన్స్ స్కూల్లో ట్రైనర్గా పనిచేసిన అనుభవం సుభాష్కు ఉంది. ముమ్మిడివరం ఎయిమ్స్ కళాశాలలో జరుగుతున్న ఉత్సవాలకు నోయల్, సుభాష్, నవీన్ అతిథులుగా హాజరైన సందర్భంగా అమలాపురంలో కొద్దిసేపు గడిపారు. ప్రస్తుతం పాలకొల్లులో చిత్రీకరణ జరుపుతున్న కుమారి 21 ఫిమేల్ చిత్రానికి తాను కొరియో గ్రాఫర్గా పనిచేస్తున్నానని చెప్పారు. ఓ పాత్రలో కూడా నటిస్తున్నానని పేర్కొన్నారు. పేరుతెచ్చిన తుంగభద్ర అమలాపురానికి చెందిన హాస్యనటుడు నవీన్ ఇటీవల విడుదలైన తుంగ భద్ర సినిమాలో హాస్యనటుడిగా ప్రతిభ కనబరిచాడు. అమలాపురం వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుల్లితెరపై అవకాశాలు ఎక్కువగా వస్తున్నా సినీ పరిశ్రమలో హాస్యనటుడిగా ఎక్కువ అవకాశాలు వస్తుండడంతో ప్రాధాన్యం ఇస్తున్నాన్నారు. ఇష్క్ చిత్రం తమిళ వెర్షన్ ఉరిల్.. ఉరిల్ చిత్రంలో నటిస్తున్నానన్నారు. ప్రముఖ నటి జయప్రద కుమారుడు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారని తెలిపారు. తనకు దర్శకుడు సుకుమార్ 100% లవ్ చిత్రం దాంవకా బ్రేక్ ఇచ్చారన్నారు. -
ఈ చిత్రంతో నాకు బ్రేక్ ఖాయం : అదిత్
తెలుగులో కథ, వీకెండ్ లవ్, తెలుగు ‘హ్యాపీ డేస్’ తమిళ రీమేక్తో పాటు మరో రెండు తమిళ చిత్రాల్లో హీరోగా నటించారు అదిత్. ఇప్పటివరకు చేసినవి ట్రయల్ బాల్స్ లాంటివనీ, ఇప్పుడు చేసిన ‘తుంగభద్ర’ ఫస్ట్ బాల్ లాంటిదని అంటున్నారు. సాయి శివాని సమర్పణలో సాయి కొర్రపాటి ప్రొడక్షన్స్పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ కానుంది. శ్రీనివాసకృష్ణ గోగినేని దర్శకుడు. ఈ చిత్రవిశేషాలను అదిత్ పాత్రికేయులతో పంచుకున్నారు. ‘‘‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణతో ఈ సంస్థలో నేనో సినిమా చేయాల్సి ఉంది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడీ సినిమాకి కుదిరింది. సాయి కొర్రపాటిగారు మంచి చిత్రాలు నిర్మిస్తారు. అందుకే, ఈ చిత్రం ‘నా కెరీర్కి సరైన పునాది’ అంటున్నా’’ అని అదిత్ చెప్పారు. ఈ చిత్రకథ గురించి చెబుతూ, ‘‘ఇది నది నేపథ్యంలో సాగే కథ కాదు. ఒక ఊరిలో రెండు వర్గాల మధ్య జరిగే కథ. ఆ కథలో ఓ ప్రేమకథ ఉంటుంది. ఇందులో చేసిన కొర్లపూడి శ్రీను పాత్ర కోసం గుంటూరు యాసలో మాట్లాడాలి. మాటలు తక్కువ, హావభావాలు ఎక్కువ. నటనకు అవకాశం ఉన్న పాత్ర’’ అన్నారు. ‘‘ఇప్పటివరకు నేను చేసిన చిత్రాల్లో నటనపరంగా నాకే లోపాలు కనిపించాయి. కానీ, ఈ చిత్రంలో బాగా నటించాననే సంతృప్తి కలిగింది. హీరో బాలకృష్ణ ఈ సినిమా చూసి, అభినందించారు. క్లయిమాక్స్ అర్థవంతంగా ఉంటుంది. నా కెరీర్కి తొలి బ్రేక్ ఖాయం అనే నమ్మకం ఉంది’’ అని అదిత్ అన్నారు. -
ఫ్యాక్షన్ తీరంలో తుంగభధ్ర
-
పల్లెటూరి ప్రేమ
గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన చిత్రం ‘తుంగభద్ర’. ఆదిత్, డింపుల్ జంటగా గోగినేని శ్రీనివాసకృష్ణను దర్శకునిగా పరిచయం చేస్తూ వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 20న విడుదల కానున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ సినిమాలో ప్రతి సన్నివేశం కదిలించేలా ఉంటుంది. దర్శకుడు అంత అందంగా తెరకెక్కించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని అన్నారు. కోట శ్రీనివాసరావు, చలపతి, సప్తగిరి, సత్యరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: హరిగౌర, కెమెరా: రాహుల్ శ్రీ వాత్సవ్, నిర్మాత: రజని కొర్రపాటి. -
తుంగభద్ర అంటే చాలా ఇష్టం : రాజమౌళి
‘‘నాకు, నా కుటుంబ సభ్యులకు తుంగభద్ర అంటే ఇష్టం. మేం అక్కణ్ణుంచి వచ్చినవాళ్లమే. అదే టైటిల్తో సాయి కొర్రపాటి ఈ చిత్రం నిర్మించడం ఆనందంగా ఉంది. మంచి ట్విస్ట్తో సాగే సినిమా ఇది. శ్రీనివాస కృష్ణ అద్భుతంగా తెరకెక్కించాడు. క్లయిమాక్స్ చాలా అద్భుతంగా ఉంది. హరి గౌర మంచి పాటలిచ్చారు’’ అని దర్శకుడు రాజమౌళి చెప్పారు. అదిత్, డింపుల్ చోపడే జంటగా సాయి శివాని సమర్పణలో సాయి కొర్రపాటి ప్రొడక్షన్స్పై రజనీ కొర్రపాటి నిర్మించిన చిత్రం ‘తుంగభద్ర’. శ్రీనివాసకృష్ణ గోగినేని దర్శకుడు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న హీరోలు నాని, నాగశౌర్య సీడీలను ఆవిష్కరించారు. ప్రచార చిత్రాన్ని రాజమౌళి విడుదల చేశారు. పాటలన్నీ చాలా బాగున్నాయనీ, కొత్తవారికి అవకాశం ఇవ్వడం ద్వారా సాయిగారికి ఎంతో పుణ్యం దక్కుతోందని కీరవాణి అన్నారు. ఈ చిత్రానికి సాహితి, చైతన్య ప్రసాద్ రెండు పాటలు రాయగా, తన తల్లి రెండు పాటలు రాశారని సంగీతదర్శకుడు తెలిపారు. మంచి చిత్రంలో నటించినందుకు ఆనందంగా ఉందని డింపుల్, అదిత్ తెలిపారు. ఈ వేడుకలో బీవీయస్యన్ ప్రసాద్, లగడపాటి శ్రీధర్, అంబికా కృష్ణ, వందేమాతరం శ్రీనివాస్, కల్యాణ్ కోడూరి తదితరులు పాల్గొన్నారు. -
నీటి బొట్టు వదిలితే ఒట్టు..!
రీ జనరేట్ వాటర్ను కాజేస్తున్న కర్ణాటక వందల సంఖ్యల్లో వెలసిన అక్రమ లిప్టులు జూరాల, ఆర్డీఎస్ రిజర్వాయర్లకు చేరని నీరు ఏటా రబీ పంటలకు నీళ్లందక కష్టకాలం నేడు బెంగళూరులో తుంగభద్ర బోర్డు భేటీ గద్వాల(మహబూబ్నగర్): కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి దిగువకు వచ్చే రీ జనరేట్ వాటర్ను పొరుగు రాష్ట్రం కర్ణాటక అప్పనంగా కాజేస్తోంది. వందలకొద్దీ అక్రమ ఎత్తిపోతల పథకాల ద్వారా తోడేస్తోంది. దీంతో ఏటా మనరాష్ట్రంలో రబీలో నీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సాధారణంగా రబీ సీజన్లో నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల క్రస్టుగేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేయరు. రిజర్వాయర్లో ఉన్న నీటిని ఆయకట్టుకు ప్రధానకాల్వ ద్వారా మాత్రమే విడుదల చేస్తారు. కాగా, ఈ నీళ్లు పొలాల ద్వారా వాగుల్లో కలిసి తిరిగి నదిలోకి చేరుతాయి. అయితే ఈ నీరు దిగువనున్న జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్టు రిజర్వాయర్కు చేరాల్సి ఉంది. ఎగువ నుంచి దిగువన ఉన్న ప్రాజెక్టు వరకు మధ్యన ఉన్న ప్రాంతంలో తాగునీటి అవసరాలకు మినహా నదిలోకి వెళ్తున్న రీ జనరేట్ వాటర్ను ఎత్తిపోతల పథకాలతో కాజేయడానికి అవకాశం లేదు. కానీ కర్ణాటకలో వందల సంఖ్యలో మినీ ఎత్తిపోతలతో తోడేస్తున్నారు. విచ్చలవిడిగా నీటి తోడివేత తుంగభద్ర నీటిని రబీ సీజన్లో కర్ణాటక, రాయలసీమలోని ఆయకట్టుకు విడుదల చేస్తారు. ఆయకట్టుకు పారిన నీళ్లు పొలాల ద్వారా తిరిగి తుంగభద్రలోకి చేరతాయి. ఆ నీరు కర్ణాటకలోనే ఉన్న ఆర్డీఎస్ హెడ్వర్క్స్ వరకు చేరకుండానే దాదా పు 130 మినీ ఎత్తిపోతల పథకాలతో సాగుతో పాటు, పరిశ్రమలకు, చేపల చెరువులకు వినియోగిస్తున్నారు. వాస్తవంగా ఈ నీటిని తాగు అవసరాలకే వాడాల్సి ఉంది. తుంగభద్ర నుంచి ఆర్డీఎస్ హెడ్వర్క్స్ మధ్య 40కి పైగా మినీ ఎత్తిపోతల పథకాలు, మినీ జలవిద్యుత్ కేంద్రాలు నిర్మించారు. నికర జలాలను పై ప్రాంతంలో సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా వాడేందుకు అనుమతి లేకున్నా పంప్సెట్లతో వందలాది ఎకరాల్లో చేపల చెరువులను నదికి రెండువైపులా ఏర్పాటు చేశారు. దీనికి మన ప్రభుత్వం అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం. నదిపై 35 పైగా చిన్నసామూహిక లిఫ్టులు ఏర్పాటు చేశారు. కర్ణాటకలో కృష్ణానదిపై నిర్మితమైన నారాయణపూర్ ప్రాజెక్టు రిజర్వాయర్ నీటిని దాదాపు రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు రబీ సీజన్లో కర్ణాటక ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఆయకట్టుకు విడుదలైన నీళ్లు పొలాలకు వెళ్లి మిగిలిన నీళ్లు తిరిగి నదిలోకి చేరతాయి. నారాయణపూర్ ఆయకట్టు నుంచి మనరాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్కు వంద కిలోమీటర్ల దూరంలో ఉండటంతో మధ్యలో 80 వరకు మినీ ఎత్తిపోతల పథకాలను చేపట్టారు. ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు విడుదలైన నీటిలో రెండు టీఎంసీల నీటిని కర్ణాటకలో అవసరాలకు వినియోగించుకుని మిగతాది జూరాలకు వెళ్లేలా చూడాలి. కానీ, కర్ణాటకలో అక్రమ ఎత్తిపోతల ద్వారా ఆరు టీఎంసీల నీటిని వాడేస్తున్నారు. నేడు బెంగళూరులో తుంగభద్ర బోర్డు భేటీ ఈ పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం బెంగుళూరు తుంగభద్ర నది బోర్డు చైర్మన్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. బోర్డులో ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరఫున కర్నూలు జిల్లా ప్రాజెక్టుల ఎస్ఈ మాత్రమే పాల్గొనేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో మొదటిసారిగా మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టుల ఇన్చార్జి సీఈ ఎస్.ఖగేందర్ బోర్డు సమావే శంలో పాల్గొననున్నారు. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన నీటివాటాతో పాటు కర్ణాటకలో ఈ రెండు నదులపై నిర్మించిన మినీ ఎత్తిపోతల పథకాలపై ప్రస్తావించనున్నారు. -
ఎల్లెల్సీ నీటి వాటాలో కోత
అనంతపురం జిల్లాకు మళ్లించేందుకు రంగం సిద్ధం ఆదోని : తుంగభద్ర దిగువ కాలువ రాష్ట్ర నీటివాటాలో దాదాపు ఒక టీఎంసీ నీటిని కోత విధించారు. కేసీకి కేటాయించిన నీటి వాటాలో కూడా మరో 0.3 టీఎంసీ కోతపెట్టారు. బుధవారం జలాశయం కార్యాలయంలో బోర్డు సమావేశం జరిగింది. జలాశయంలో నీటి నిల్వ, ఇప్పటి వరకు ఆయా కాలువలకు సరఫరా చేసిన నీటిని, ఉన్న నీటిని రబీ పంటలకు సరఫరా చేసే అంశాలను బోర్డు సమీక్షించింది. జిల్లా సాగునీటి శాఖ ఎస్ఈ నాగేశ్వర రావు, ఎల్ఎల్సీ, హెచ్ఎల్సీ ఎసీఈలు, కర్ణాటక, తుంగభద్ర బోర్డు ఎస్ఈలు సమావేశంలో పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం జూన్లో జలాశయానికి 144 టీఎంసీల నీరు చేరవచ్చని అంచనావేసిన బోర్డు దిగువ కాలువకు రాష్ట్ర వాటా కింద 16.302 టీఎంసీలనీటిని కేటాయించింది. అయితే అంచనాకంటే రెండు టీఎంసీలు తక్కువగా 138టీఎంసీలు మాత్రమే జలాశయానికి చేరడంతో నీటి వాటా కేటాయింపును 15.62 టీఎంసీలకు కుదించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఖరీఫ్ పంటలకు ఇప్పటివరకు దిగువ కాలువకు కేటాయించిన నీటి వాటాలో 6.2టీఎంసీలు వినియోగించుకున్నట్లు తుంగభద్ర బోర్డు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం కొత్తగా నీటి వాటా కేటాయింపును పరిగణలోకి తీసుకుంటే 9.36 టీఎంసీలు మాత్రమే జలాశయంలో ఎల్ఎల్సీ నీటివాటా నీరు నిల్వ ఉంది. ఖరీఫ్లో కాలువ కింద సాగుచేసిన వరి, మిరప, పత్తి పంటలకు మరో పక్షం రోజుల పాటు నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇందుకు మరో టీఎంసీ నీరు అవసరం కావచ్చని అంచనా వేస్తున్నారు. తాగు, సాగు నీటి అవసరాలకోసం గాజులదిన్నె ప్రాజెక్టుకు మరో టీఎంసీ నీటిని మళ్ళించాల్సి ఉంది. వేసవిలో జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలకు 3టీఎంసీలు పోగా జలాశయంలో 4.36 టీఎంసీల నీరు మాత్రమే మిగులుతుంది. ప్రవాహ నష్టం, నీటి ఆవిరి రూపంలో మరో టీఎంసీ నీటికి కోతపడుతుంది. దీంతో రబీ పంటలకు 3.36 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అనంతపురం జిల్లాకు నీటి మళ్లింపు.. ? తుంగభద్ర దిగువ కాలువ, కేసీ కెనాల్కు కేటాయించిన నీటిని అనంతపురం జిల్లాకు మళ్ళించేందుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఆ జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయకులు బోర్డుపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో అధికారులు ఒత్తిళ్ళకు తలొగ్గి నీటి మళ్ళింపుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించాల్సి ఉంది. ప్రస్తుతం ఎల్ఎల్సీ వాటాకింద రబీ సీజన్లో 3.36 టీఎంసీలు మాత్రమే మిగిలి ఉంది. ఇందులో నుంచి అనంతపురం జిల్లాకు నీటిని మళ్ళిస్తే ఎల్ఎల్సీ, కేసీ కెనాల్ కింద రబీ పంటలకు సాగునీరందించడం కష్టసాధ్యమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో రబీ పంటలకు సాగునీరు అందిస్తారో లేదోనని దిగువ కాలువ రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. -
గుట్టుగా కొల్లగొట్టు
మానవపాడు: మండలంలోని తుంగభద్ర నదీతీర ప్రాంతం నుంచి ఇసుక గుట్టుగా తరలిపోతోంది. ఇసుకాసురులు రాత్రివేళల్లో కర్నూలుకు చెందిన వే బిల్లులతో అక్రమమార్గం లో హైదరాబాద్కు రవాణా చేస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగం మాత్రం పట్టిపట్టనట్లు వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో అలంపూర్ ఎ మ్మెల్యే ఎస్.సంపత్కుమార్ కర్నూలు నుంచి వచ్చిన ఏడు ఇ సుకలారీలను నిలిపి మానవపాడు స్టేషన్కు తరలించారు. సరిహద్దు చెక్పోస్టు ఉన్నా ఫలితం శూన్యమని, కమీషన్ల మత్తులో లారీలను వదిలేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. జిల్లా సరిహద్దు చెక్పోస్టు వద్ద ఎమ్మెల్యే హల్చల్ సృష్టించి ఇసుక లారీలను అడ్డుకోవడంతో అలంపూర్ చౌరస్తా నుండి పుల్లూర్ టోల్ప్లాజా వరకు ఇసుకలోడుతో ఉన్న వాహనాలు నిలిచిపోయాయి. డబ్బులు చెల్లించి సీమాంధ్ర వే బిల్లులు తీసుకున్న వాహనాలను వదలకపోవడంతో ముందుకు పోలేక రోడ్లపైనా నిలిపిఉంచారు. ఓ వైపు సీమాంధ్ర నేతలు వే బిల్లులు ఉన్నాయని, ఆ వాహనాలను వదిలేయాలని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే సంపత్కుమార్ వాహనాలను వెళ్లనిచ్చేది లేదని హెచ్చరించారు. మాకెందుకులే..! తమకెందుకే అనుకున్నారేమో గాని రెవెన్యూ, పోలీసు అధికారులు రోజుకు వందల సంఖ్యలో ఇసుకలారీలు తరలిపోతున్నా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆ వాహనా ల దగ్గర వే బిల్లులు ఉన్నాయా.. లేదా? అని కూడా తని ఖీలు చేయడం లేదు. అక్రమంగా ఇసుకను తరలించే వారు అధికారులను తమ గుప్పిట్లో ఉంచుకుని యథేచ్ఛగా ఇసుకవ్యాపారం చేస్తున్నారు. -
..ప్చ్
‘ఎన్నాళ్లకెన్నాళ్లకో కర్ణాటక, ఏపీ ముఖ్యమంత్రులు కలుస్తున్నారు.. తుంగభద్ర నీటి పంపిణీ సక్రమంగా జరిగేలా చూసి కరువు బారి నుంచి అనంతకు కాసింత ఓదార్పు కలిగిస్తారు.. హెచ్చెల్సీ ఆయకట్టుకు మంచి రోజులు రాబోతున్నారుు..’ అని సంబరపడిన జిల్లా రైతులకు నిరాశే మిగిలింది. హెచ్చెల్సీకి ఏటా 32.5 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా, పూడిక పేరుతో దామాషా పద్ధతి ప్రకారం అంటూ 22 టీఎంసీలే ఇస్తుంటే ఇన్నాళ్లూ ప్రజాప్రతినిధులు నోరెత్తలేకపోయూరు. తుంగభద్ర బోర్డులో ఇరు రాష్ట్రాల అధికారులున్నప్పటికీ కర్ణాటకదే పైచేరుు అవుతోంది. సోమవారం నాటి ‘బాబు’ చర్చలతో ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశించడం అత్యాశే అని తేలిపోరుుంది. పెత్తనం తుంగభద్ర బోర్డుదే అని అక్కడి సీఎం సిద్ధరామయ్య అంటే.. దానికి మన ముఖ్యమంత్రి సైతం తందానా అన్నారు. సాక్షిప్రతినిధి, అనంతపురం : తుంగభద్ర బోర్డులో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్టాల అధికారులున్నప్పటికీ పెత్తనం అంతా కర్ణాటకదే అవడంతో ఏటా అనంతపురం జిల్లా రైతులు నష్టపోతున్నారు. తుంగభద్ర డ్యాం నుంచి హెచ్చెల్సీ(హైలెవల్ కెనాల్) ద్వారా ఆంధ్రాకు రావల్సిన నీటి కేటాయింపులు సక్రమంగా జరగడం లేదు. 132 టీఎంసీల సామర్థ్యంతో టీబీడ్యాంను నిర్మించారు. హెచ్చెల్సీ కెనాల్ ద్వారా 32.5టీఎంసీల నీళ్లు ఆంధ్రాకు కేటాయించాలని బచావత్ అవార్డు నిర్ణయించింది. ఈ నీళ్లు మొత్తం సాగునీటి అవసరాల కోసమే కేటాయించారు. ఈ నీటిపై ఆధారపడి అనంతపురంతో పాటు కర్నూలు జిల్లాలోని ఆలూరు బ్రాంచ్ కెనాల్, వైఎస్సార్జిల్లాలోని మైలవరం, పులివెందుల బ్రాంచ్ కెనాల్ కింద 2.84 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే టీబీ డ్యాంలో పూడిక వల్ల నిల్వ సామర్థ్యం 132 నుంచి 100 టీఎంసీలకు పడిపోయింది. తద్వారా నీటి లభ్యత కూడా 227 టీఎంసీల నుండి 190 టీఎంసీలకు పడిపోయింది. ఈక్రమంలో హెచ్చెల్సీకి నికర జలాల కేటాయింపులను పక్కనపెట్టి.. నీటి లభ్యత ఆధారంగా ఏటా కేటాయింపులు చేస్తున్నారు. ఏటా సగటున 20-22 టీఎంసీలు మాత్రమే దామాషా ప్రకారం సరఫరా చేస్తున్నారు. ఆవిరి, ప్రవాహ నష్టం తదితర కారణాలతో తుదకు 18 టీఎంసీలు మాత్రమే చేరుతోంది. ఇందులో ఏపీ ప్రభుత్వం 8.5 టీఎంసీలు తాగునీటికి కేటాయించింది. తక్కిన 9.5 టీఎంసీలు ఆయకట్టుకు చేరుతున్నాయి. ఈ నీరు 90-1.10 లక్షల ఎకరాలకు మాత్రమే సరిపోతోంది. ఈక్రమంలో మనకు రావాల్సిన కోటానీటిపై కర్ణాటక సీఎంతో చర్చలు జరిపి రాయలసీమకు న్యాయం చేస్తానని చంద్రబాబు కొద్ది రోజులుగా ఆర్భాటం చేశారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం.. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటున్నారంటూ తెగ హంగామా చేశారు. తుదకు కర్ణాటక సీఎంతో భేటీ వల్ల ఎలాంటి ఫలితం రాబట్టలేదని, ఒక్క మాటలో చెప్పాలంటే ‘తుస్సుమనింద’ని ఓ అధికారి వ్యాఖ్యానించారు. భేటిలో తేటతెల్లమైన బాబు ‘వైఖరి’! సోమవారం కర్ణాటక సీఎంతో చంద్రబాబు భేటి అయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడ చర్చకు వచ్చిన అంశాలేమిటంటే.. మొదటగా కాలువ ఆధునికీకరణ అంశాన్ని లేవనెత్తారు. డ్యాం నుంచి ఆంధ్రా సరిహద్దులోని 105 కిలోమీటరు వరకూ 4 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువను 60ఏళ్ల కిందట నిర్మించారని బాబు గుర్తు చేశారు. కానీ ఆ మేరకు నీటి ప్రవాహం ఉండటం లేదని, తద్వారా 105 కిలోమీటరు నుంచి తమకు రావాల్సిన నీటి ప్రవాహంపై ఆ ప్రభావం పడుతోందని వివరించారు. ప్రస్తుతం తాము 4 వేల క్యూసెక్కుల ప్రవాహంతో కాలువను ఆధునికీకరించామన్నారు. ఈ మేరకు నీటిప్రవాహం రావాలంటే కర్ణాటకలో డ్యాం నుంచి 105 కిలోమీటరు దాకా 6 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండేలా కాలువను ఆధునికీకరించుకోవాలని సీఎం సిద్ధరామయ్యకు సూచించారు. తద్వారా 105 కిలోమీటరుకు వచ్చేసరికి ప్రవాహం 4 వేల క్యూసెక్కులకు సరిపడేలా ఉంటుందన్నారు. ఈ ప్రతిపాదనను సిద్ధరామయ్య తిరస్కరించారు. 6 వేల క్యూసెక్కులకు పెంచడం కుదరదని తేల్చి చెప్పారు. అయితే 4 వేల క్యూసెక్కులు ప్రవహించేలా కాలువలో పూడికతీతతో పాటు ఆధునికీకరిస్తామని చెప్పారు. ఏపీకి రావల్సిన 32.5 టీఎంసీల నీళ్లు పంపిణీ జరగడం లేదని, కేటాయింపుల ప్రకారం జలాలు ఏపీకి వచ్చేలా చూడాలని కోరారు. దీనికి రామయ్య స్పందిస్తూ...‘కేటాయింపుల కోసం బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్, కృష్ణా బోర్డులు ఉన్నాయని, డ్యాంలో నీటి లభ్యతను బట్టి ఇరు రాష్ట్రాలకు సమన్యాయం చేసేలా తుంగభద్ర బోర్డు వ్యవహరిస్తుందని చెప్పినట్లు తెలిసింది. ఇందులో ఇరు రాష్ట్రాలు జోక్యం చేసుకోవాల్సిన పనిలేదని సిద్ధరామయ్య తెగేసి చెప్పడంతో చేసేదిలేక చంద్రబాబు ఒకింత అసహనంతో వెనుదిరిగినట్లు సమాచారం. జనం దృష్టి మళ్లించేందుకేనా? రాజధాని ఎంపికలో రాయలసీమ వాసుల మనోభావాలను పట్టించుకోకుండా ఒంటెత్తుపోకడతో చంద్రబాబు కోస్తాలో రాజధానిని ఎంపిక చేశారు. ఈ అంశంలో ‘బాబు’ వైఖరిపై ‘సీమ’వాసుల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకింది. ఈక్రమంలో వ్యూహం ప్రకారం ‘సీమ’ ప్రయోజనాల కోసం తాను పాకులాడుతున్నట్లు బాబు ఎత్తుగడ వేశారు. టీబీడ్యాం పరిస్థితి, నీటి లభ్యత అన్నీ బాబుకు తెలుసు. టీబీ డ్యాం నుంచి సక్రమంగా నీళ్లు రావాలంటే హెచ్చెల్సీ కాలువకు అనుసంధానంగా మరో వరద కాలువను నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందని సాగునీటిరంగ విశ్లేషకులు కొన్నేళ్లుగా సూచిస్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో కర్ణాటక సీఎంతో భేటీకి తెరలేపారు. దీనిపై వారం రోజులుగా విస్తృత ప్రచారం చేశారు. తీరా సోమవారం భేటీలో కూర్చుని ఎలాంటి ఫలితాలు లేకుండానే వెనుదిరిగారు. తాము ఈ ఫలితం ముందే ఊహించామని, అనుకున్నట్లుగానే జరిగిందని సాగునీటి రంగ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
తుంగభద్ర కాల్వ డిజైన్ మారదు
బోర్డు నిర్ణయం మేరకే నీటి పంపిణీ, ఆధునికీకరణ ఏపీ, కర్ణాటక సీఎంల ఉమ్మడి ప్రకటన సాక్షి, బెంగళూరు: తుంగభద్ర రైట్ బ్యాంక్ కెనాల్ (టీబీఆర్బీసీ) ప్రస్తుత డిజైన్లో ఎటువంటి మార్పు ఉండబోదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఉమ్మడిగా ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల కాల్వ ఆధునికీకరణ జరిగినా భవిష్యత్లో తుంగభద్ర నీటి పంపకాలకు సంబంధించి గొడవలు తలెత్తవని వారు అభిప్రాయపడ్డారు. తుంగభద్ర నదీ జలాల పంపిణీ విషయమై బెంగళూరులోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతినిధుల మధ్య సోమవారం దాదాపు 45 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. చర్చల అనంతరం తొలుత కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ... తుంగభద్ర నీటి పంపకం కోసం ఏర్పాటైన బోర్డు కాల్వ ఆధునికీకరణ విషయమై కూడా నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఈ నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సిందేనన్నారు. ప్రస్తుత చర్చల్లో కుడికాల్వ ఆధునికీకరణ విషయాన్ని మాత్రమే చర్చించినట్లు చెప్పారు. వరద కాలువ విషయం, మరో విషయమంటూ తమ మధ్య చర్చకు రాలేదని స్పష్టం చేశారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తుంగభద్ర కుడి కాల్వ ఆధునికీకరణ వల్ల హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ద్వారా బళ్లారితో పాటు అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఆధునికీకరణ విషయమై ‘బోర్డు నిర్ణయం’ తర్వాతే నిధుల విషయంపై స్పష్టత వస్తుందని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల ఆన్లైన్ ట్రేడింగ్ చర్చల అనంతరం కర్ణాటకలో వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం అక్కడి ప్రభుత్వం అవలంభిస్తున్న విషయాలపై సంబంధిత అధికారులు, కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణభైరేగౌడ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు హోటల్ అశోకాలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియూతో మాట్లాడుతూ.. కర్ణాటకలో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం కోసం అవలంభిస్తున్న ఆన్లైన్ ట్రేడింగ్ విధానం చాలా బాగుందని మెచ్చుకున్నారు. దీన్ని ఏపీలో అమలు చేయనున్నామని వెల్లడించారు. ల్యాండ్పూలింగ్ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణానికి భూమిని సేకరిస్తున్నామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. చర్చల్లో ఆంధ్రప్రదేశ్ మంత్రులు దేవినేని ఉమ, పరిటాల సునీత పాల్గొన్నారు. -
నీటి కేటాయింపుపై బోర్డుదే తుది నిర్ణయం
బెంగళూరు: తుంగభద్ర కుడి కాలువ ఆధునికీకరణ విషయానికి సంబంధించి కాల్వ డిజైన్లో ఎటువంటి మార్పు ఉండబోదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు ఉమ్మడిగా ప్రకటించారు. తుంగభద్ర కుడి కాలువ, హెచ్ఎల్సి కాలువ ఆధునికీకరణ పనులు చేయించడానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఆధునికీకరణ కూడా తుంగభద్ర బోర్డు నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని వారు తెలిపారు. తుంగభద్ర జలాల విషయమై బెంగళూరులో సోమవారం జరిగిన చర్చల అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తుంగభద్ర కుడి కాలువఆధునికీకరణ, కోటా మేరకు నీటి పంపిణీ వ్యవహారం తుంగభద్ర బోర్డు చూసుకుంటుందని వారు స్పష్టం చేశారు. హెచ్ఎల్సీ(తుంగభద్ర ప్రాజెక్టు హైలెవల్ కెనాల్)కి నీటి కేటాయింపు కూడా బోర్డు చూసుకుంటుందని సిద్ధరామయ్య తెగేసి చెప్పారు. చర్చలలో ఇద్దరు సీఎంలతోపాటు రెండు రాష్ట్రాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు చర్చల నిమిత్తం వచ్చిన చంద్రబాబు నాయుడుని సిద్దరామయ్య శాలువతో సత్కరించారు. ** -
ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చంద్రబాబు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం బెంగళూరు బయల్దేరి వెళ్లారు. ఈరోజు అంతా ఆయన బిజీబిజీగా గడపనున్నారు. బెంగళూరు, విశాఖలో చంద్రబాబు పర్యటిస్తారు. ముందుగా చంద్రబాబు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఆయన సమావేశం అవుతారు. తుంగభద్ర జలాలకు సంబంధించి రాయలసీమకు 32 టీఎంసీల నీటి విడుదలకు సహకరించాలని చంద్రబాబు కోరనున్నారు.అనంతరం అక్కడ నుంచి నేరుగా విశాఖకు బయలుదేరి వెళ్లి జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటారు. -
మిన్నంటిన విషాదం
అలంపూర్ : తుంగభద్రనదిలో ఇద్దరు గల్లంతైన సంఘటనతో అలంపూర్లో విషాదం అలుముకుంది. అలంపూర్-ర్యాలంపాడు గ్రామాల మధ్య తుంగభద్రనదిలో నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద ఈనెల 4వ తేదీన చేపలవేటకు వెళ్లిన వేణు(26), కు మార్(11)లు గల్లంతైన విషయం తెలిసిందే. మూడ్రోజులుగా మత్స్యకారులు, అధికారులు మృతదేహాలను వెలికితీయడానికి తీవ్ర ప్రయత్నమేచేశారు. గురువారం తెల్లవారుజామున మృతదేహాలు నీటిలో ఒడ్డుకు తేలియాడాయి. వారిని చూసి బాధిత కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. గుండెలు బాదుకుం టూ రోధించడంతో తుంగభద్ర తీరంలో విశాద వాతావరణం కనిపించింది. సంఘటన ఇలా.. మూడ్రోజుల కిందట అలంపూర్కు చెందిన చిన్న మద్దిలేటి తన కొడుకు కుమార్ను వెంటతీసుకొని మత్స్యకారులు వేణు, శంకర్, రాజులతో కలిసి పుట్టిలో చేపలవేటకు వెళ్లాడు. పనులు ముగిసిన తర్వాత కుమార్, వేణులు మరబోటులో వస్తామంటూ ఒడ్డున ఉండిపోయారు. కాసేపటి తర్వాత బ్రిడ్జి పనులు చేసే కూలీలతోపాటు బోటులో ప్రయాణమయ్యారు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత బోటు బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం ఏర్పా టు చేసిన తీగను తాకి బోల్తాపడింది. ముగ్గురు కూలీలు ఈదుకుంటూ ఒడ్డుకు చేరగా ఈతరాని వేణు, కుమార్లుమాత్రం గల్లంతయ్యారు. రెండ్రోజులు వారి కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. మూడోరోజు గురువారం తెల్లవారుజామున మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చా యి. సమాచారం అందుకున్న తహశీల్దార్ మంజుల, ఎస్ఐ వెంకటేష్లు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను స్థానికుల సహాయంతో బయటికి తీయిం చారు. అక్కడే ఒడ్డుకు చేర్చి పంచనామ నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కుటుంబసభ్యులకు అప్పగిం చారు. బాధితులకు పరిహారం అందించాలని మత్స్యకారులు కాసేపు అధికారుల తో వాగ్వాదం చేశారు. తహశీల్దార్ పక్కా హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. -
వరద కాలువతోనే అనంత, బళ్లారి సస్యశ్యామలం
వరద కాలువతోనే అనంత, బళ్లారి సస్యశ్యామలం అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలి కర్ణాటక సీఎంను ఏపీ సీఎం కలిసి చర్చిస్తాననడం సంతోషదాయకమే క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేలు చర్చలు జరిపితేనే అనుమానాల నివృత్తికి ఆస్కారం బళ్లారి జిల్లా తుంగభద్ర ఆయకట్టు సలహా సమితి కన్వీనర్ నారా ప్రతాప్రెడ్డి సాక్షి, బళ్లారి : కరువు జిల్లా అయిన అనంతపురం సస్యశ్యామలం కావడంతో పాటు బళ్లారి జిల్లాకు మరింత మేలు జరగాలంటే తుంగభద్ర డ్యాం నుంచి హెచ్ఎల్సీ కాలువ ఫ్లడ్ ఫ్లో కెనాల్ నిర్మాణం చేపట్టాలని బళ్లారి జిల్లా తుంగభద్ర ఆయకట్టు సలహా సమితి కన్వీనర్ నారా ప్రతాప్రెడ్డి పేర్కొన్నారు. ఆయన బుధవారం సాక్షితో మాట్లాడుతూ వచ్చే నెల 4న ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు హెచ్ఎల్సీ కాలువ నుంచి అదనంగా నీరు తీసుకెళ్లేందుకు కర్ణాటక సీఎంను కలుస్తానని పేర్కొనడం హర్షనీయమన్నారు. వరద కాలువ నిర్మాణాలపై గత ఏడాదే తాము బళ్లారి తుంగభద్ర ఆయకట్టు రైతుల సమక్షంలో వర్క్ షాపు నిర్వహించామని తెలిపారు. గతంలో తుంగభద్ర డ్యాంలో 133 టీఎంసీల నీరు నిల్వ ఉండేదని తెలిపారు. పూడికవల్ల 100 టీఎంసీలకే పడిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో పూడిక ద్వారా నష్టపోతున్న నీటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలోనే నీటిపారుదల శాఖ నిపుణులు రుద్రస్వామి, గోవిందరాజు వర్క్షాపులో పాల్గొని అనేక సలహాలు ఇచ్చారని పేర్కొన్నారు. పూడిక తీయడం సాధ్యం కాదని, ఫ్లడ్ఫ్లో కెనాల్ ఏకైక మార్గమని సూచించారని వివరించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోలేదన్నారు. ఫ్లడ్ ఫ్లో కెనాల్ నిర్మాణం చేపట్టేందుకు బళ్లారి జిల్లాకు చెందిన రైతలు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ముందుగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులు చర్చలు జరిపితే బాగుంటుందని వివరించారు. అనంతపురం జిల్లాకు 32 టీఎంసీల నీరు అందాల్సి ఉండగా, 22 టీఎంసీలు మాత్రమే అందుతోందని తెలిపారు. అందుకు నీటి నిల్వ తగ్గిపోవడమే కారణమన్నారు. తగ్గిపోయిన నీటిని యధావిధిగా తీసుకోవడంతో పాటు మరింత నీటిని పెంచుకునేందుకు ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఒక్కటే ఏకైక మార్గమన్నారు. ఈ ఏడాది తుంగభద్ర డ్యాం నుంచి దాదాపు 270 టీఎంసీల నీరు నది పాలైందన్నారు. వరద కాలువ నిర్మాణాలు చేపడితే అనంతపురం, బళ్లారి జిల్లా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ దిశగా అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. -
పచ్చరంగులో తుంగభద్ర నీరు
హొస్పేట : కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తాగు, సాగుకు నీటిని అందించే తుంగభద్ర జలాశయంలోని నీరు పచ్చరంగులోకి మారడంతో పాటు దుర్గంధం వెదజల్లుతోంది. తుంగభద్ర డ్యాం ఎగువన ఉన్న కర్మాగారాల నుంచి వెలువడే వ్యర్థపదార్థాలు నేరుగా డ్యాంలోకి వచ్చి చేరుతున్నాయి. అదే విధంగా ఎగువన ఉన్న రైతులు తమ పొలాల్లో పంటలకు వాడుతున్న ఎరువులు, రసాయనిక పదార్థాలు కూడా డ్యాంలోకి వచ్చి చేరుతున్నాయి. అందువల్లే నీరు పచ్చరంగులోకి మారుతోందని పలువురు పేర్కొంటున్నారు. ప్రతి ఏటా డ్యాంలో నీరు పచ్చరంగులోకి మారుతున్నా తుంగభద్ర మండలి అధికారులు చర్యలు తీసుకోవడం లేదని నగర వాసులు తెలిపారు. డ్యాంలోని నీరు పచ్చరంగుగా ఉండడంతో ఈ విషయంపై బుధవారం నగర అసిస్టెంట్ కమిషనర్ పీ.సునీల్ తుంగభద్ర తీరప్రాంత ప్రదేశాలన్ని సందర్శించి నీటిని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ డ్యాంలో నీరు పచ్చరంగులోకి మారడంతో నీటిని పరీక్షించేందుకు ల్యాబ్కు పంపుతున్నట్లు తెలిపారు. పరీక్ష రిపోర్టు వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
రాజధానికి అనువు.. కర్నూలు
కర్నూలు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి గలగలా పారే తుంభద్ర.. పరవళ్లు తొక్కే కృష్ణమ్మ... అందుబాటులో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు.. ఐటీకి అనువైన ప్రదేశం.. పారిశ్రామిక రంగానికి అనుకూల ప్రాంతం.. రైలు, రోడ్డు మార్గాలు.. రాజధానిగా ఎంపిక చేయడానికి కర్నూలుకు ఉన్న అనుకూలతలు ఇవి. 2-3 గంటల్లో హైదరాబాద్కు చేరుకోవడానికి వీలుగా హైవే ఉంది. అటు బెంగుళూరుకూ సులభంగా చేరుకోవచ్చు. మద్రాసు నుంచి విడిపోయినప్పుడు రాజధాని కొలువుదీరిందీ కర్నూలులోనే. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కర్నూలును ఎంపిక చేయడానికి అన్ని రకాల అనుకూలతలు ఉన్నా... పాలకులు ఈ దిశగా ఆలోచన చేయడం లేదు. వేలాది ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని జిల్లా అధికార యంత్రాంగం గుర్తించింది. నగరం చుట్టూ మరో 25 వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ఎలాంటి ఖర్చు లేకుండానే భూములు సేకరించడానికి అవకాశం ఉంది. అసలే లోటు బడ్జెట్తో ప్రయాణం మొదలుపెట్టిన ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మాణానికి నిధులు సమకూర్చుకోవడమే గగనం. భూముల సేకరణకూ నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి వస్తే.. ప్రభుత్వం మీద మోయలేని భారం పడుతుంది. ఈ నేపథ్యంలో.. అన్ని అనుకూలతలు ఉన్న కర్నూలును రాజధానిగా ఎంచుకుంటే ప్రభుత్వం మీద ఆర్థిక భారం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 3-4 గంటల్లో హైదరాబాద్కు కర్నూలు నుంచి 2-3 గంటల వ్యవధిలో పాత రాజధాని హైదరాబాద్కు చేరుకోవచ్చు. ఈ రెండు నగరాల మధ్య 6 లేన్ల రహదారి ఉంది. విమానాశ్రయాన్ని నిర్మించుకొనే వరకు శంషాబాద్ ఎయిర్పోర్టులను వాడుకోవడానికి వీలుంటుంది. హైదరాబాద్ సిటీలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే విమానాశ్రయం నుంచి నేరుగా కర్నూలు చేరుకోవచ్చు. రైల్లే మార్గం కూడా ఉంది. కర్నూలు నుంచి బెంగుళూరుకు వెళ్లడం కూడా సులభమే. ఫలితంగా ఇటు హైదరాబాద్, అటు బెంగుళూరు నుంచి ఐటీ పరిశ్రమను ఆకర్షించడానికి వీలవుతుంది. రెండు నగరాలకు మధ్యలో ఉంటుంది కాబట్టి అదనపు ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. కర్నూలు నుంచి నందికొట్కూరు, ఆత్మకూరు మీదుగా ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చేరుకోవడానికి ప్రస్తుతం ఉన్న రోడ్లును 6 లేన్ల రహదారిగా విస్తరిస్తే.. తక్కువ సమయంలో కోస్తా జిల్లాల ప్రజలు కూడా కర్నూలు చేరుకోవడానికి అవకాశం ఉంది. బాబూ.. ఏకపక్ష నిర్ణయాలొద్దు నంద్యాల: రాజధాని విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని, అందరి ఏకాభిప్రాయంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రాయలసీమ ఐక్యకార్యాచరణ సమితి ప్రధాన కార్యదర్శి బొజ్జా దశరథరామిరెడ్డి సూచించారు. శనివారం నంద్యాల పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని కోసం కర్నూలులో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుంటే విజయవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించడం శోచనీయమన్నారు. ఇలాంటి ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటే తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ గతే పడుతుందని హెచ్చరించారు. ‘‘మా ఇష్టమొచ్చినట్లు మేము చేసుకుంటాం.. మీకు చేతనైందని మీరు చేసుకోండి’’ అని చంద్రబాబునాయుడు హెచ్చరిస్తున్నా ఆ పార్టీ నాయకులు నోరు ఎత్తకపోవడం బాధాకరమన్నారు. విజయవాడకు అన్ని ప్రాజెక్టులను తరలిస్తూ.. రాయలసీమకు సానుభూతి ప్రకటనలు కూడా చేయకపోవడం దారుణమన్నారు. ప్రతి జిల్లా వారు రాజధాని కావాలనుకుంటారని, తాను కూడా కుప్పంలో రాజధాని కావాలని కోరుకుంటానంటూ.. సీఎం మొసలి కన్నీరు కార్చడాన్ని సీమ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. -
తుంగభద్రకు మళ్లీ పెరిగిన వరద
హొస్పేట : తుంగభద్ర జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద మళ్లీ పెరగడంతో గురువారం డ్యాం 33 గేట్లను పెకైత్తి దిగువకు 1,17,630 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు బోర్డు అధికారులు తెలిపారు. 25 గేట్లను మూడు అడుగులు, ఎనిమిది గేట్లను ఒక అడుగు మేర పెకైత్తి నీటిని వదులుతున్నట్లు, రాత్రికి డ్యాంకు ఇన్ఫ్లో మరింతగా పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 1630.38 అడుగులు, కెపాసిటీ 91.084 టీఎంసీలు, ఇన్ఫ్లో 1,22,792 క్యూసెక్కులుగా ఉందని తెలిపారు. -
తుంగభద్రకు కొనసాగుతున్న వరదనీరు
మహబూబ్నగర్ : తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర పరవళ్లు తొక్కుతోంది. ప్రస్తుత నీటి నిల్వ 97 టీఎంసీలు ఉండగా, నీటిమట్టం 1632 అడుగులుకు ఉంది. జలాశయం ఇన్ఫ్లో 1,66,706 క్యూసెక్కులు ఉండగా, ఔట్ఫ్లో 1,89254 క్యూసెక్కులు ఉంది. సుంకేశుల జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. ప్రస్తుత నీటి నిల్వ 0.33 టీఎంసీలు ఉండగా, నీటిమట్టం 289 అడుగులకు ఉంది. మరోవైపు తుంగభద్రలోకి ఒకేసారి 1.80 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండటంతో రాజోలి సమీపంలోని ఓవర్ బ్రిడ్జి వరకు బ్యాక్ వాటర్ చేరుకున్నాయి. దీంతో పాత గ్రామంలోని మాలగేరి, ఎస్సీ కాలనీ, మార్లబీడు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. -
కృష్ణా, తుంగభద్ర పరవళ్లు
* జూరాల నిండుకుండ * శ్రీశైలానికి జల సిరి.. 2 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో * తుంగభద్ర, సుంకేశుల డ్యాం గేట్ల ఎత్తివేత * సాగర్కు వస్తోంది 13,800 క్యూసెక్కులే సాక్షి యంత్రాంగం: కృష్ణా, తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో కర్ణాటకలోని ప్రాజెక్టులు దాదాపు నిండిపోయాయి. ఫలితంగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర రిజర్వాయర్ పూర్తి సామర్థ్యానికి దగ్గరవుతోంది. అందువల్ల 33 గేట్లను ఎత్తి రిజర్వాయర్లోకి చేరుతున్న నీటి పరిమాణానికి సమానంగా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలోకి 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు ఒక్క టీఎంసీ నీరు చేరితే జూరాల పూర్తిగా నిండుతుంది. దీంతో ప్రాజెక్టులోకి వస్తున్న నీటిని యథావిధిగా కిందకు వదలిపెడుతున్నారు. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 1.46 లక్షల క్యూసెక్కులుగా ఉంది. జూరాల నుంచే కాకుండా తుంగభద్ర నుంచి విడుదలైన నీరు రోజా గేజింగ్ పాయింట్ ద్వారా శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరుతోంది. జూరాల నుంచి 1,65,304 క్యూసెక్కులు, రోజా గేజింగ్ పాయింట్ నుంచి 46 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు 11 టీఎంసీలకు పైగా నీరు డ్యాంలో చేరింది. పీక్లోడ్ అవర్స్లో విద్యుదుత్పాదన చేస్తూ నాగార్జునసాగర్కు 9,402 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. సుంకేసుల జలాశయానికి కూడా భారీగా వరద నీరు వస్తోంది. సుంకేసులకు ఆదివారం రాత్రి 7గంటల ప్రాంతంలో 1.65 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. దీంతో సుంకేసుల నుంచి 29 గేట్లు ఎత్తి తుంగభద్ర నది నుంచి శ్రీశైలం వైపునకు 1.10 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. అదే విధంగా కడప-కర్నూలు (కేసీ) కాలువకు 2,200 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఎగువ ప్రాజెక్టులన్నీ దాదాపు నిండే దశలో ఉన్న నేపథ్యంలో.. ఆ ప్రాంతాల్లో మరో వారం రోజులు వర్షాలు భారీగా కురిస్తే శ్రీశైలంలో నీటి మట్టం బాగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. నాగార్జునసాగర్కు అతి తక్కువగా 13,800 క్యూసెక్కుల నీరు వస్తోంది. మొత్తం మీద ఈ ఏడాది కంటే గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు మెరుగ్గా ఉన్నాయి. గత ఏడాది ఇదే రోజుకు శ్రీశైలంలో 183 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నాగార్జునసాగర్లోనూ 230 టీఎంసీల నీరు ఉంది. గోదావరి బేసిన్కు ఎగువున వర్షాలు లేకపోవడంతో తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. తెలంగాణ, ఏపీలో వర్షాలు కురవడంతో దిగువున ధవళేశ్వరం వద్ద 1.90 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతుండగా..1.89 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. తుంగభద్ర తీరప్రాంతాల్లో హై అలర్ట్ తుంగభద్రకు భారీ వరద ఉధృతి కొనసాగుతోంది. భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆర్డీఎస్కు ఎగువనున్న కౌతాళం, కోసిగి పరిధిలో పత్తి, సజ్జ తదితర పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. తుంగభద్ర జలాశయానికి ప్రస్తుతం రెండు లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉందని, దీంతో డ్యాంకున్న 33 గేట్లను ఎత్తి దిగువకు అదే పరిమాణంలో నీటిని వదులుతున్నట్లు తుంగభద్ర బోర్డు సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం సాయంత్రానికి కర్నూలు జిల్లా సరిహద్దు ప్రాంతానికి వరదనీరు చేరుకుంది. మంత్రాలయం వద్ద వరద నీరు 1.45 లక్షల క్యూసెక్కులు ప్రవహిస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. భారీ ఎత్తున వరద నీరు వస్తుండటంతో కర్నూలు జిల్లా కలెక్టర్ విజయమోహన్ నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ముఖం చాటేస్తున్న అల్పపీడనం! సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ముఖం చాటేస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపు రావాల్సిన ఈ అల్పపీడనం వాయవ్య, ఉత్తర బంగాళాఖాతం మీదుగా కోల్కతా తీరం వైపు పయనిస్తోంది. దీని ప్రభావం ఏపీ, తెలంగాణలపై ఉండబోవని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి కొనసాగడం వల్ల కోస్తాంధ్ర, తెలంగాణలో కొన్ని చోట్ల జల్లులు పడొచ్చు. -
జలకళ
నిండుకుండలా జలాశయాలు కోస్తా, మలెనాడులో జనజీవనం అస్తవ్యస్తం జలదిగ్బంధంలో దక్షిణ కన్నడ జిల్లాలోని పలు గ్రామాలు తుంగభద్ర 10 గేట్లు ఎత్తివేత సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నైరుతి రుతు పవనాలు కాస్త ఆలస్యమైనప్పటికీ వరుణుడు కరుణించాడు. రాష్ర్ట వ్యాప్తంగా గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రధాన జలాశయాలన్నీ దాదాపుగా నిండిపోయాయి. కోస్తా, మలెనాడు జిల్లాల్లో భారీ వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తమైంది. ఆ జిల్లాల్లోని నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రహహిస్తున్నాయి. కర్ణాటకతో పాటు రాయలసీమ జిల్లాల జీవనాడిగా భావించే తుంగభద్ర నది పూర్తిగా నిండిపోయింది. శివమొగ్గ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల తుంగా నది ఉరకలెత్తింది. దీని ప్రభావం వల్ల తుంగభద్రలో ఇన్ఫ్లో మరింతగా పెరగనుంది. బీజాపుర జిల్లాలోని ఆల్మట్టి, హాసన జిల్లాలోని హేమావతి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మండ్య జిల్లాలోని కేఆర్ఎస్ జలాశయం గరిష్ట మట్టానికి చేరువలో ఉంది. కృష్ణా నదిలో కూడా వరద ఉధృతి సాగుతోంది. స్వల్ప విరామం అనంతరం మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణాతో పాటు దాని ఉప నదులు ఉరకలెత్తాయి. మలెనాడు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. జన జీవనం అస్తవ్యస్తమైంది. ప్రధాన జలాశయాల్లో ఇన్ఫ్లో పెరిగింది. అనేక గ్రామాల్లో పడవల ద్వారా రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దక్షిణ కన్నడ జిల్లాలో కుండపోత భారీ వర్షాల కారణంగా దక్షిణ కన్నడ జిల్లాలో అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ధర్మస్థలకు 17 కిలోమీటర్ల దూరంలోని కొక్కడ గ్రామంలో ఉన్న పురాతన ఆలయ సముదాయం నీట మునిగింది. విద్యానాథేశ్వర విష్ణుమూర్తి ఆలయ సముదాయంలోని శివుని గర్భ గుడి ద్వారం వరకు మునిగిపోయింది. నాగ పంచమిని పురస్కరించుకుని శుక్రవారం అనేక మంది భక్తులు అక్కడే ఉన్న నాగ దేవతల విగ్రహాలకు నీరు, పాలు, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. శివుని గర్భ గుడి జల దిగ్బంధంలో ఉన్నందున దూరం నుంచే స్వామిని పూజించుకున్నారు. తుంగభద్ర 10 గేట్లు ఎత్తివేత సాక్షి, బళ్లారి : కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ప్రస్తుతం తెలంగాణా రాష్ట్ర పరిధిలోని పలు జిల్లాలకు తాగు, సాగునీరిందిందే ఉమ్మడి ప్రాజెక్టు అయిన తుంగభద్ర డ్యాం నిండుకుండలా పొంగిపొర్లుతోంది. శుక్రవారం సాయంత్రానికి తుంగభధ్రలో లక్ష క్యూసెక్కులు ఇన్ఫ్లో రావడంతో డ్యాంకు ఉన్న 33 గేట్లులో 10 గేట్లును ఎత్తివేసి నదికి వదిలారు. డ్యాం నుంచి దిగువకు ప్రారంభంలో 3 గేట్లును ఎత్తి వదిలిన అధికారులు సాయంత్రం 10 గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం డ్యాం నీటిమట్టం 1633 అడుగులు కాగా, డ్యాంలో 1632 అడుగులు పెట్టుకుని మిగిలిన నీటిని నదికి వదులుతున్నారు. -
ఖరీఫ్.. కటీఫ్..!
గద్వాల : ఖరీఫ్ సీజన్లో ఆశించిన మేరకు వర్షాలు రాకపోవడంతో కృష్ణా, తుంగభద్ర నదుల్లోకి వరద నీరు రాలేదు. దీంతో ఖరీఫ్ ఆయకట్టుకు నీళ్లందించే పాత ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టుల పరిధిలో రైతులకు కన్నీళ్లు తప్పేట్లు లేవు. జూన్ మొదటి వారంలోనే వర్షాలు కురిసి ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టుకు నీళ్లు వస్తాయన్న ఆశతో ఆయకట్టు రైతులు నారుమళ్లు సిద్ధం చేసుకున్నారు. ఆగస్టు మొదటివారం నాటికి నీళ్లు వస్తే నాట్లు వేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. కానీ, ఇప్పటివరకు ఆల్మట్టికే నీరు సగానికి మించి చేరలేదు. క ృష్ణా, తుంగభద్ర నదులకు కూడా నీటి రాక ప్రారంభం కాలేదు. నీటిరాక ఇంకా ఆలస్యమైతే వరినార్లు ముదిరి సాగుకు పనికిరాకుండా పోతాయన్న ఆందోళనలో రైతులున్నారు. ఒకవేళ ఆలస్యంగా సాగుచేసినా దిగుబడులు దారుణంగా పడిపోయే ప్రమాదముందని భావిస్తున్నారు. నార్లు సిద్ధం చేసుకున్న అన్నదాతలు ఖరీఫ్లో ప్రస్తుతం ఉన్న జూరాల ఆర్డీఎస్, కోయిల్సాగర్ ప్రాజెక్టుల పరిధిలో రైతులు ఇప్పటికే లక్షా 75వేల ఎకరాలకు సరిపోను నార్లు సిద్ధం చేసుకున్నారు. ఇక ఈ ఏడాది మొదటిసారిగా కొత్త ప్రాజెక్టుల పరిధిలో ఖరీఫ్కు సాగునీటిని అం దిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినందున భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టుల పరిధిలో లక్షా 55వేల ఎకరాల్లో సాగు చేసుకునేం దుకు రైతులు ఎదురుచూస్తున్నారు. పాత, కొత్త ప్రాజెక్టుల పరిధిలో ఈ ఖరీఫ్లో దాదాపు 3.22లక్షల ఎకరాలలో సాగునీటిని అందిస్తారన్న ఆశతో రైతులు ఎదురు చూస్తున్న తరుణంలో కృష్ణా, తుంగభద్ర నదులకు వరద రాకపోవడం రైతులను అయోమయంలోకి నెట్టేసింది. జూరాలకు నేటికీ చేరని వరద... కృష్ణానదిపై కర్ణాటకలో మొదటి ప్రాజెక్టుగా ఉన్న ఆల్మట్టి రిజర్వాయర్ 129 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం ఉండగా వారం నుంచి వస్తున్న ఇన్ఫ్లోతో కేవలం 50 టీఎంసీలకు మాత్రమే నీటినిల్వ చేరింది. ఇంకా 60 టీఎంసీల ఇన్ఫ్లో వచ్చి చేరితేనే దిగువకు నీటిని విడుదల చేస్తారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు రిజర్వాయర్కు ఇప్పటి వరకు వరద ప్రారంభం కాలేదు. ఇక కృష్ణానదిపై మన రాష్ట్రంలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు పైనుంచి వరద రాకపోవడంతో జూరాల ప్రాజెక్టు ఆధారంగా ఖరీఫ్ సాగుకు నీటిని అందించే పరిస్థితులు కనిపించడం లేదు. తుంగభద్ర రిజర్వాయర్కు నీటినిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా ఇప్పటి వరకు 45 టీఎంసీల నీటినిల్వ చేరింది. ఈ ప్రాజెక్టు నుంచి ఎప్పటికి నీటి విడుదల జరుగుతుందో అధికారులు చెప్పలేకపోతున్నారు. -
వరద గూ(గో)డు
తుంగభద్ర ఉగ్రరూపం ఇప్పటికీ గుర్తే. ఆ దృశ్యాలు చెరిగిపోని చేదు జ్ఞాపకాలు. తలుచుకుంటే ఒళ్లు గగుర్పొడొస్తుంది. ఊరూవాడా కొట్టుకుపోగా.. కట్టుబట్టలతో రోడ్డున పడిన కుటుంబాలు కోకొల్లలు. ప్రాణమైతే మిగిలింది కానీ.. ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లేందుకు పడిన కష్టం అంతాఇంతా కాదు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం అదిగో.. ఇదిగో అంటూ సరిపెట్టింది. అత్తెసరు సాయంతో మూతి పొడిచింది. గూడు పేరిట.. మొండి గోడలతో సరిపెట్టింది. ఆ నిర్లక్ష్యం ఇప్పటికీ వరద బాధితులను వెక్కిరిస్తోంది. కర్నూలు(రూరల్): ఐదేళ్లు గడిచినా వరద బాధితులకు గూడు కరువైంది. నిర్మాణ వ్యయం పెరిగిపోవడంతో ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. నిర్మాణంలోని ఇళ్లను పూర్తి చేస్తామని.. తక్కినవి బాధితులే కట్టుకుంటే పరిహారం ఇస్తామనే హామీతో బాధ్యత నుంచి తప్పుకుంది. 2009లో వరదలు బీభత్సం సృష్టించగా.. ఆరు నెలల్లోపు బాధితులందరికీ పునరావాసం కల్పిస్తామని నమ్మబలికిన నేతలు ఆ తర్వాత మొహం చాటేశారు. ఇప్పుడిక కొత్త ప్రభుత్వం చుట్టూ వీరి ఆశల ‘పందిరి’ అల్లుకుంటోంది. కర్నూలు మండల పరిధిలోని సుంకేసుల, జి.శింగవరం, నిడ్జూరు, మునగాలపాడు, మామిదాలపాడు గ్రామాలను వరదలు తుడిచిపెట్టేశాయి. సుంకేసుల గ్రామంలో పునరావాస కాలనీలో 576 ఇళ్లు నిర్మించాల్సి ఉంది. ఇప్పటి వరకు 100 పూర్తి కాగా.. మిగతా ఇళ్ల నిర్మాణం ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోని పరిస్థితి. కాలనీలో మంచినీటి పైపులైన్లు, అంతర్గత రోడ్ల ఊసే కరువైంది. జి.శింగవరంలో 1039 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా 692 పూర్తయ్యాయి. మిగతా నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. అంతర్గత రోడ్లు నిర్మించకపోవడం.. వీధి లైట్లు.. పైపులైన్లు ఏర్పాటు చేయకపోవడంతో వరద బాధితుల్లో ఇళ్లలో కాపురం ఉండేందుకు అవస్థలు ఎదుర్కొంటున్నారు. అంతర్గత రోడ్లకు రూ.80 లక్షలు మంజూరైనా పనులు చేపట్టకపోవడం గమనార్హం. నిడ్జూరుకు 966 ఇళ్లు మంజూరు కాగా 654 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. 200 ఇళ్లు వివిధ దశల్లో ఉండగా.. మిగతా ఇళ్లకు సంబంధించి ఇప్పటికీ భూ సేకరణ కూడా చేపట్టకపోవడం వరద బాధితుల దుస్థితికి నిదర్శనం. ఇక్కడా పైపులైన్లు, అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని గాలికొదిలేశారు. మామిదాలపాడులో 459 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా 2011లో ఎంపీ కోట్ల సూర్యప్రకాష్రెడ్డి, అప్పటి కోడుమూరు ఎమ్మెల్యే మురళీకృష్ణ భూమి పూజ చేశారు. ఆ తర్వాత 22 ఇళ్లకు మాత్రమే పునాది పడినా ఇప్పటికీ నిర్మాణం ఒక్క అడుగు కూడా కదలకపోవడం నేతల చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. పైకప్పు ఏసినారంతే.. సెంటు భూమి లేదు. కూలికి పోతేనే పూట గడిచేది. 2009లో వచ్చిన వరదల్లో ఇల్లు కూలిపోయింది. ప్రభుత్వం ఇచ్చిన తడికెలతో తాత్కాలికంగా గుడిసె వేసుకున్నాం. వానలకు అది కూడ కూలిపాయ. ఇప్పుడు చెట్ల కింద బతుకుతున్నాం. ఐదుగురు కూతుళ్ల పెండ్లిళ్లు సేయనీక శానా కష్టపడిన. ఇల్లు కట్టిస్తామని సెప్పిన సారోల్లు పైకప్పు ఏసి వదిలేసినారు. సిమెంట్ సేయలేదు. పేదలంటే అందరికీ లోకువే. కాలనీల ఉండలేకపోతున్నాం.- ఉసేనమ్మ, నిడ్జూరు ఇళ్ల మధ్య కంప సెట్లు వరదల్లో కట్టుబట్టలతో మిగిలినం. అప్పులు సేసి ఏసుకున్న రేకుల షెడ్డులో తలదాచుకుంటున్నాం. ఇద్దరు కొడుకులున్నారు. కూలి పనికి పోతేనే పూట గడుస్తాది. మాలెక్కటోల్లకు ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తాదంటే సంతోషించిన. పనులైతే మొదలు పెట్టినారు కానీ సరిగ జరుగుతలేవు. కరెంటు, నీళ్లు, రోడ్లు లేక రేత్రిల్లు శానా ఇబ్బందులు పడుతున్నాం. ఇళ్ల మధ్య కంప సెట్లు పెరిగినాయి. యా సారూ మా బాధలు పట్టించుకోల్యా. మా బతుకులింతే.- మల్లికార్జునయ్య, జి.శింగవరం -
‘తుంగభద్ర’పై రెండు లిప్టు స్కీంలు !
సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర నదిపై రెండు లిప్టు స్కీంలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సుమారు రూ. 31 కోట్లను విడుదల చేశారు. ఈ మేరకు సోమవారం సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శి బి. అరవిందరెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. కర్నూలు జిల్లా బెలగాల్ మండలం పరిధిలో తుంగభద్ర నదిపై కొత్తగా లిప్టు స్కీంను నిర్మించనున్నారు. ఇందుకోసం రూ. 23.42 కోట్లను విడుదల చేశారు. ఈ స్కీం ద్వారా సుమారు 2,270 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించనున్నారు. అలాగే ఇదే జిల్లాలో కౌతాలం పరిధిలో రూ. 8.58 కోట్లతో మరో లిప్టు స్కీంను నిర్మిస్తారు. దీన్ని ద్వారా 1,200 ఎకరాలకు సాగునీరు అందనుంది. -
తుంగభద్రపై దొంగ లెక్కలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తుంగభద్ర నదీ జలాలను దోచుకోవడంలో తమకు ఎదురులేదని కర్ణాటక మరోసారి నిరూపించుకుంది. విస్తారంగా వర్షాలు కురిసి.. జులై చివరినాటికే తుంగభద్ర డ్యాం పొంగిపొర్లినా.. నీటి లభ్యత తగ్గిందంటూ దొంగ లెక్కలు చెప్పి తొలుత కేటాయించిన జలాల్లోనే కోతలు వేసింది. అదనపు జలాలు వస్తాయనుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఆశలపై నీళ్లుచల్లింది. సమైక్యాంధ్రలోనే టీబీ బోర్డులో కర్ణాటక పెత్తనం ఇలా ఉంటే.. రాష్ట్ర విభజన జరిగితే అది మరింత అధికమవుతుందని నీటి పారుదల శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక-ఆంధప్రదేశ్ రాష్ట్రాలు సంయుక్తంగా హోస్పేటకు సమీపంలో తుంగభద్ర నదిపై 133 టీఎంసీల సామర్థ్యంతో టీబీ డ్యామ్ను నిర్మించారు. డ్యామ్లో నీటి లభ్యత 230 టీఎం సీలు ఉంటుందని లెక్కలు వేసిన బచావత్ ట్రిబ్యునల్ ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీమ్)కు 6.51 టీఎంసీలు, కేసీ(కడప కర్నూలు) కెనాల్కు 10 టీఎంసీలు, ఎల్ఎల్సీ(లోయర్ లెవల్ కెనాల్)కి 24టీఎంసీలు, హెచ్ఎల్సీ(హైలెవల్ కెనాల్)కి 32.50 టీఎంసీలు కేటాయించింది. అంటే.. మొత్తమ్మీద టీబీ డ్యామ్ నుంచి 73.10 టీఎంసీల జలాలను మన రాష్ట్రానికి కేటాయించింది. రాయచూరు కెనాల్ సహా కర్ణాటకకు 138.99 టీఎంసీలను కేటాయించింది. కానీ.. డ్యామ్లో పూడిక పేరుకుపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం 100.85 టీఎంసీలకు తగ్గిపోయిందని గతంలో టీబీ బోర్డు నిర్ధారించింది. నీటి లభ్యత కూడా 230 టీఎంసీల నుంచి 150 టీఎంసీలకు తగ్గిపోయిందని లెక్కలు వేసి.. దామాషా పద్ధతిలో నీటిని కేటాయిస్తున్నారు. దాంతో మన రాష్ట్ర కోటా కింద రావాల్సిన 73.10 టీఎంసీల్లో కేవలం 40 నుంచి 50 టీఎంసీలే దక్కుతున్నా యి. ఈ ఏడాది జూన్ 24న సమావేశమైన టీబీ బోర్డు.. డ్యాంలో 150 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని లెక్కలు కట్టి.. దామాషా పద్ధతిలో హెచ్చెల్సీకి 22.99 టీఎంసీలు, ఎల్ఎల్సీకి 16.90, కేసీ కెనాల్, ఆర్డీఎస్లకు 11.21 టీఎంసీలను కేటాయించింది. అంటే.. మొత్తమ్మీద మన రాష్ట్ర వాటా కింద 51.10 టీఎంసీలను కేటాయించింది. అయితే, ఆ జలాలను కూడా తగ్గించేలా కర్ణాటక ఇప్పుడు ఎత్తులు వేసింది. విస్తారంగా వర్షాలు కురిసినా.. తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లో ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిశాయి. సాధారణంగా ఆగస్టు నెలాఖరుకు నిండే టీబీ డ్యాం.. ఈ ఏడాది జూలై ఆఖరునాటికే పొంగి పొర్లింది. దాంతో అదనపు జలాలు రావచ్చని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ ఏడాది మన రాష్ట్ర వాటా కింద రావాల్సిన జలాల్లో హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, ఆర్డీఎస్, కేసీ కెనాల్లకు కలిపి 23.30 టీఎంసీలు, కర్ణాటక వాటా కింద 50.70 టీఎంసీలను ఇప్పటికే విడుదల చేశారు. మన రాష్ట్ర వాటా కింద మరో 27.8 టీఎంసీలు, కర్ణాటక వాటా కింద 47.01 టీఎంసీలు విడుదల చేయాల్సి ఉంది. ప్రస్తుతం డ్యామ్లో ఉన్న 83.59 టీఎంసీలు, ఇప్పటిదాకా ఆంధ్ర, కర్ణాటక వినియోగించుకున్న జలాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ ఏడాది డ్యాంలో కనీసం 157.59 టీఎంసీలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. కానీ.. డ్యామ్లో నీటి లభ్యత 144 టీఎంసీలకు పడిపోయిందని టీబీ బోర్డు దొంగ లెక్కలు వేసింది. ఈ మేరకు సోమవారం నిర్వహించిన బోర్డు సమావేశంలో నీటి లభ్యత తగ్గిందని అధికారికంగా ప్రకటించింది. సమైక్య రాష్ట్రంలోనే టీబీ బోర్డుపై కర్ణాటక పెత్తనం చేస్తోంటే.. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర, తెలంగాణ ప్రాం తాలకు టీబీ డ్యాం నుంచి చుక్కనీళ్లు కూడా వచ్చే అవకాశాలు ఉండవని ఎల్ఎల్సీ అధికారి ఒకరు ‘సాక్షి’కి స్పష్టం చేశారు. -
దోపిడీని ప్రోత్సహిస్తున్న కర్ణాటక ప్రభుత్వం
-
దిగువన ఉన్న మన రాష్ట్ర రైతుల నోట్లో మట్టి
-
నాణ్యత.. ‘నారాయణ’కే ఎరుక!
ఆదోని, న్యూస్లైన్: తుంగభద్ర దిగువ కాల్వ అక్రమార్కులకు కల్ప వృక్షమైంది. జిల్లా పశ్చిమ ప్రాంతాలతో పాటు బళ్లారి జిల్లాలోని బీడు భూములను సస్యశ్యామలం చేసే ఎల్లెల్సీలో అవినీతి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నాలుగు రోజుల క్రితం మోకా గ్రామం సమీపంలో కాల్వకు పడిన గండిని పూడ్చి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే సీసీ లైనింగ్ జరిగిన స్థలంలోనే గండి పడి వేల క్యూసెక్కుల నీరు వృథా అయింది. ఇందుకు బాధ్యులు అవినీతి కాంట్రాక్టరా, పర్యవేక్షించాల్సిన అధికారులదా తెలియలేదు. పర్సెంటేజీలు తీసుకున్న ఉన్నతాధికారులు గండికి కారకులైన వారిపై చర్యలు తీసుకునేందుకు సాహసిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. తుంగభద్ర ప్రాజెక్టు ఆంధ్ర, కర్ణాటక ఉమ్మడి రాష్ట్రాల ప్రాజెక్ట్ కావడంతో దిగువ కాలువ అభివృద్ధి, నిర్వహణకు అవసరమైన నిధులను రెండు రాష్ట్రాలు సమకూర్చుతున్నాయి. అయితే రాజకీయ జోక్యం, అధికారులు, కాంట్రాక్టర్ల స్వార్థం కారణంగా ప్రజా ధనం ఏటా రూ.కోట్లలో దుర్వినియోగం అవుతోంది. 50 శాతంకు పైగా నిధులు స్వార్థపరుల జేబుల్లోకి వెళ్తున్నట్లు అంచనా. కాంట్రాక్టర్లు నీటిని విడుదల చేసే సమయంలో పనులను తూతూ మంత్రంగా చేస్తుండగా, అధికారులు నీటి విడుదల పూర్తయిన తరువాత పనులను పరిశీలించకుండానే అధికారులు బిల్లులు చెలిస్తున్నారు. కాంట్రాక్టర్లు, అధికారుల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఇదంతా జరుగుతుందనేది బహిరంగ రహస్యం. ప్రస్తుతం 120వ కిలో మీటరు వద్ద పడిన గండి సంఘటనపై విచారించి నాణ్యతా లోపమే ఇందుకు కారణమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని బోర్డు కార్యదర్శి రంగారెడ్డి ప్రకటించారు. అయితే గతంలో కూడా పలువురు అధికారులు ఇలాంటి ప్రకటనలు చేసినా ఇంత వరకు ఒక్కరిపై కూడా చర్యలు లేవు. దీంతో కారయదర్శి చేసిన ప్రకటన కూడా వాస్తవ రూపం దాల్చక పోవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలే బాధ్యతలు చేపట్టడంతో కాల్వ స్వార్థపరులకు ఎంత పట్టు ఉందో తెలియక కార్యదర్శి స్పందించి ఉండొచ్చని భావిస్తున్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటారని తుంగభద్ర బోర్డు బళ్లారి ఈఈ నారాయణ నాయక్ను ‘న్యూస్లైన్’ వివరణ కోరగా ‘దాదాపు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన పనులలో నాణ్యత ఉందా లేదా?అని ఇప్పుడు ఎలా చెప్పగలమని అన్నారు. సీసీ లైనింగ్ జరిగిన చోట గండి పడకూడదని ఎలా అనుకోగలం’ ఆయన కాంట్రాక్టర్లను వెనకేసుకొచ్చారు. -
మానని గాయం
మహబూబ్నగర్, సాక్షి ప్రతినిధి: 2009 అక్టోబర్ 2 నాటి తుంగభద్ర , కృష్ణానదుల ఉప్పెన గుర్తుకొస్తే ఇప్పటికీ ఒళ్లు జలదరిస్తుం ది. వరద బీభత్సానికి ఇళ్లు, వాకిలి, గోడ్డుగోదా, ధాన్యం సర్వం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రజలు నిస్సహాయస్థితిలో ప్రాణాలను దక్కించుకున్నారు. గ్రామాలు శ్మశాలను తలపిం చాయి. ఈ చేదు ఘటన జరిగి నాలుగేళ్లు గడిచింది. జిల్లాలోని అలంపూర్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోని దాదా పు 35 గ్రామాలు పూర్తిగా నీటమునిగి ప్రజలు కేవ లం కట్టుబట్టలతో బతికిబయటపడ్డారు. బాధితులందరికీ పునరావాసం కల్పిస్తామని ఆయా గ్రా మాలను సందర్శించిన ప్రజాప్రతినిధులు హామీ ఇ చ్చి వె ళ్లి బుధవారం నాటికి నాలుగేళ్లు గడిచింది. అ యితే నేటికీ 75శాతం గ్రామాల్లో ఇళ్లను నిర్మించిన పాపానపోలేదు. దీంతో సొంతంగా ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థికస్తోమత లేనివారు ఇంకా గుడారాల్లోనే జీవనం సాగిస్తున్నారు. వారిని పలకరించేవా రే కరువయ్యారు. కొల్లాపూర్, అలంపూర్, మానవపాడు, ఇటిక్యాల, వడ్డేపల్లి, అయిజ మండలాల్లోని 35 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. పూర్తిస్థాయిలో దెబ్బతిన్న 12 గ్రామాల్లో పునరావాసంలో భాగంగా ఇళ్ల నిర్మాణానికి ప్ర భుత్వం చర్యలు చేపట్టింది. వీటిలో కేవలం అ యిజ మండలంలోని కూట్కనూరు, ఇటిక్యాల మండలంలోని ఆర్.గార్లపాడు, కొల్లాపూర్ మం డలం అయ్యవారిపల్లిలో గ్రామాల్లో ఇళ్ల నిర్మా ణం పూర్తిచేసి నిర్వాసితులకు అప్పగించారు. అ యితే అయ్యవారిపల్లిలో దాదాపు 150 ఇళ్లు పూ ర్తిగా దెబ్బతినడంతో వాటిస్థానంలో ప్రస్తుతం 50 ఇళ్లను ఒక ప్రైవేట్ సంస్థ నిర్మించి ఇవ్వగా, మరో 100 మంది ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తూ కాలం గడుపుతున్నారు. నేతన్న బతుకు ఛిద్రం ఇదిలాఉండగా చేనేతకు పేరుగాంచిన రాజోలి గ్రామంలో పునరావాస చర్యలు చేపట్టడంతో అ ధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒక్క రాజోలి గ్రామంలోని 212 ఎకరాల్లో 3158 ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని అధికారులు నిర్ణయించి అందుకు త్వరితగ తిన ఇళ్లు పూర్తిచేయడానికి ప్ర త్యేక డిజైన్తో పునాదులు తీసి పిల్లర్లు వేశారు. నాలుగేళ్లుదాటినా పిల్లర్లపై కప్పుపడటం లేదు. దాదాపు 500 ఇళ్లు పునాదులు దాటి ముందుకు వెళ్లలేదు. సర్వం కోల్పోయిన దాదాపు రెండు వే ల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా కేవ లం 884 మందికి మాత్రమే పట్టాలు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. వడ్డేపల్లి మండలంలోని పడమటి గార్లపాడు గ్రామ ని ర్వాసితులకు ఇళ్ల స్థలపరిశీలన ప్రక్రియ జరుగుతుంది. అలాగే మానవపాడు మండలం మ ద్దూరు గ్రామంలో 550 ఇళ్లు నేలమట్టం కావడం తో ఇప్పటివరకు ఆ గ్రామప్రజల ఇబ్బందుల ను పట్టించుకోవడం లేదు. దీంతో ఆ గ్రామస్తులంతా పాములు, తేళ్లతో సహజీవనం చేస్తూ బి క్కుబిక్కుమంటూ నేటికీ గుడారాల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికీ గుడారాల్లోనే జీవనం అలంపూర్, న్యూస్లైన్: వరదల్లో సర్వం కో ల్పోయి రోడ్డునపడ్డ వరద బాధితులు ఇప్పటికీ గుడారాల్లోన్నే తలదాచుకుంటున్నారు. అలంపూర్, మానవపాడు, ఇటిక్యాల, వడ్డేపల్లి, అయి జ మండలాల్లోని 28 గ్రామాలు ముంపునకు గు రయ్యాయి. వీటిలో పూర్తిస్థాయిలో దెబ్బతిన్న 10 గ్రామాల్లో పునరావాసంలో భాగంగా ఇళ్ల ని ర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీటి లో కేవలం అయిజ మండలంలోని కూట్కనూ రు, ఇటిక్యాల మండలంలోని ఆర్.గార్లపాడు గ్రామాల్లోనే ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి నిర్వాసితులకు అప్పగించారు. మిగిలిన గ్రామాల్లో చేపట్టి న పునరావస చర్యలు నెమ్మదించడంతో నిర్వాసితులు గుడారాల్లోనే తలదాచుకుంటు దుర్భరమైన జీవనం గడుపుతున్నారు. మావనపాడు మండలంలోని మద్దూరు గ్రామంలో ఐదేళ్ల త ర్వాత స్థల సేకరణకు గ్రహణం వీడింది. వరద గ్రామంలోని 500 కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం కోసం 32 ఎకరాలు సేకరించారు. కానీ ఇప్పటికి రైతుల నుంచి కొనుగోలు చేయలేదు. ఇలా పునరావాసం కల్పనలో పురోగతిలేకపోవడంతో వ రద బాధితులకు కష్టాలు తప్పడంలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరావాసచర్యలు వేగవంతం చేసి బాధితులకు గూడు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
పెరగనున్న హెచ్చెల్సీ కోటా!
అనంతపురం టౌన్, న్యూస్లైన్ : తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కు ఈ ఏడాది నీటి కోటాను ఒకట్రెండు టీఎంసీలు పెంచనున్నారు. కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురవడంతో తుంగభద్ర జలాశయం నీటితో కళకళలాడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తుంగభద్రకు వరదలు పోటెత్తుతున్నాయి. ఇది హెచ్చెల్సీ ఆయకట్టుదారులకు వరంగా మారుతోంది. డ్యాంలో ప్రస్తుత నీటి లభ్యతను బట్టి హెచ్చెల్సీ కోటా పెంచే యోచన ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈసారి హెచ్చెల్సీకి కాస్త మెరుగ్గానే నీటి కేటాయింపులు చేశారు. గతేడాది 18 టీఎంసీలు మాత్రమే కేటాయించగా... ఈసారి జూలైలో నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకుని 22.999 టీఎంసీలు కేటాయించారు. ఇందులో తాగునీటి అవసరాలకు 8.5 టీ ఎంసీలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇది గతేడాది కంటే 0.5 టీఎంసీలు అధికం. ఇదిలావుండగా కర్ణాటక ఎగువ ప్రాంతం నుంచి ఇప్పటికీ వరద నీరు భారీగా డ్యాంలోకి వచ్చి చేరుతోంది. 18,048 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. ఈ కారణంగా హెచ్చెల్సీకి కేటాయింపులు పెంచే యోచన ఉన్నట్లు సమాచారం. ప్రతి రెండు నెలలకొకసారి నిర్వహించే తుంగభద్ర బోర్డు సమావేశంలో నీటి కేటాయింపులపై చర్చిస్తారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కేటాయింపులు పెంచడం, తగ్గించడం చేస్తారు. గతేడాది తొలుత 22 టీ ఎంసీలు కేటాయించిన అధికారులు... నీటి ల భ్యత పడిపోయిందని సాకుగా చూపించి చివరకు 18 టీఎంసీలు ఇచ్చారు. దీంతో గతేడాది రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే... ఈ ఏడాది ఆశాజనకమైన వాతావరణం నెలకొనడంతో రైతు ల్లో ఉత్సాహం కన్పిస్తోంది. ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని తుంగభద్ర బోర్డు అధికారులపై ఒత్తిడి తెస్తే జిల్లాకు నీటి కేటాయింపులు పెరుగుతాయని అధికారులు కూడా సూచిస్తున్నారు. నీటి విడుదలలో పిసినారితనం తుంగభద్ర డ్యాంలో నీరు సమృద్ధిగా ఉన్నా హెచ్చెల్సీకి ఆ మేరకు విడుదల చేయడంలో బోర్డు అధికారులు పిసినారి తనాన్ని ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. హెచ్చెల్సీ మెయిన్ కెనాల్, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్తో పాటు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు నీటిని ఏకకాలంలో సరఫరా చేయాలంటే కనీసం 1,800 క్యూసెక్కులు విడుదల చేయాలి. అయితే.. ప్రస్తుతం 1,200 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోంది. అన్నింటికీ సరఫరా చేయలేక హెచ్చెల్సీ అధికారులు చేతులెత్తేస్తున్నారు. పంటల సాగుకు అదను దాటిపోతున్నా హెచ్చెల్సీ సౌత్, నార్త్ కెనాళ్లకు నీరివ్వలేకపోతున్నారు. డ్యాం వద్ద అవసరాల మేరకు నీటిని విడుదల చేస్తే సరఫరా చేయడం సులభతరంగా ఉంటుందని అధికారులు అంటున్నారు. కోటా పెరగవచ్చు: ధనుంజయరావు, ఈఈ, లోకలైజేషన్ తుంగభద్ర డ్యాంలోకి ప్రస్తుతం వరద నీరు ఆశాజనకంగా చేరుతోంది. దీంతో హెచ్చెల్సీకి కేటాయింపులు పెరగవచ్చని భావిస్తున్నాం. ఏ మేరకు పెంచుతారన్నది త్వరలో జరిగే బోర్డు సమావేశంలో నిర్ణయిస్తారు. కేటాయింపులు పెరిగితే రైతులకు ఊరట కలుగుతుంది. -
తుంగభద్రకు పోటెత్తిన వరద
హొస్పేట, న్యూస్లైన్ : తుంగభద్ర జలాశయం ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ఉధృతి భారీగా కొనసాగుతోంది. జలాశయం ఎగువ ప్రాంతాలైన శివమొగ్గ, ఆగుంబే, చిక్కమగళూరు, శృంగేరి, తీర్థహళ్లి తదితర మలెనాడు ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తింది. దీంతో సోమవారం డ్యాంలోని మొత్తం 33 క్రష్ట్ గేట్లలో 25 క్రష్ట్ గేట్లను నాలుగు అడుగులు మేర, మిగత 8 క్రస్ట్ గేట్లను ఒక్క అడుగు మేర పైకి ఎత్తి దిగువకు 1,60,000 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు. వరద ఉధృతి ఇంకా రెండు రోజులు కొనసాగవచ్చని, లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని మండలి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 1631.86 అడుగులు, కెపాసిటీ 96.491 టీఎంసీలు, ఇన్ఫ్లో 1,74,860 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,60,000 క్యూసెక్కులు ఉందని అధికారులు తెలిపారు. తుంగభద్ర లోతట్టు ప్రాంతాలు జలమయం..: తుంగభద్ర ఉగ్రరూపం దాల్చడంతో లోతట్టు ప్రాంతమైన హంపిలోని పురంధరదాసు మండపంతోపాటు ఇతర అనేక స్మారకాలు పూర్తిగా నీట మునిగాయి. అదే విధంగా హంపిలో ఉన్న రామలక్ష్మణ ఆలయంలోకి వరద నీరు పోటెత్తింది. ఆలయం ముందున్న ధ్వజ స్థంభం సగానికి పైగా నీట మునిగింది. ఆలయం పక్కనున్న హోటళ్లోకి కూడా వరద నీరు భారీగా చేరింది. కాగా హంపికి వచ్చిన విదేశీ పర్యాటకులు తుంగభద్రమ్మ వరద ఉధృతిని వీక్షించి ఆనందిస్తున్నారు.