Sakshi Editorial
-
నిజాయితీపరులకు న్యాయమెలా?
షడ్రసోపేత విందు సాగుతుండగా హఠాత్తుగా ఎవరోవచ్చి పంక్తి నుంచి అమర్యాదగా మెడపట్టి గెంటేస్తే? కాళ్లకింది నేల ఒక్కసారిగా బద్దలై మింగేస్తే? పశ్చిమబెంగాల్లో పదేళ్లుగా కొలువులు చేస్తున్న వేలాది ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది స్థితి అలాంటిదే. 2016లో స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ద్వారా ఎంపికైన మొత్తం 25,752 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలు చెల్లబోవని, వారిని తక్షణం తొలగించాలని గత వారం సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో వారంతా రోడ్డున పడ్డారు. కేన్సర్ బారినపడిన ఒకే ఒక్క ఉపాధ్యాయురాలిని మాత్రం ధర్మాసనం మినహాయించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొదలుకొని అందరూ ఉద్యోగాలు కోల్పోయినవారిపై సానుభూతి ప్రకటిస్తున్నారు. మమత అయితే తీర్పును తప్పుబట్టారు. ఉద్యోగాలు కోల్పోయినవారు ఎప్పటిలాగే విధి నిర్వహణ చేయొచ్చని, వేరే ప్రభుత్వ ఉద్యోగాల్లో సర్దుతామని బింకంగా ప్రకటించారు. వారికోసం జైలుకు పోవటానికీ సిద్ధమేనన్నారు. రేపటి సమాజం తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందంటారు. సగటు విద్యార్థులను సమున్నతంగా తీర్చిదిద్దటం, వారి సృజనాత్మకతను వెలికితీసి మెరికల్లా మార్చటం, పటుతర శక్తిగా మల చటం ఉపాధ్యాయులు చేసే పని. ఇంతటి మహత్కార్యాన్ని నిర్వర్తించాల్సినవారు కాస్తా ముడుపులు సమర్పించుకుని దొడ్డిదారిన వచ్చిచేరారంటే అంతకన్నా దారుణం మరొకటుండదు. ఈ రిక్రూట్ మెంట్పై ఆ రోజుల్లోనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. అభ్యర్థుల ర్యాంకులు తలకిందులు చేశారని, అధిక మార్కులు వచ్చినవారికి అన్యాయం జరిగిందని, అసలు మెరిట్ లిస్టులోగానీ, వెయిటింగ్ లిస్ట్లోగానీ లేనివారు చివరిలో విజేతల జాబితాకెక్కారని, మెరుగైన మార్కులతో ఉత్తీర్ణులై ఇంటర్వ్యూలో సైతం నెగ్గినవారికి ఉద్యోగాలు నిరాకరించారని ఆ ఆరోపణల సారాంశం. అయినా ప్రభుత్వం కిమ్మనలేదు. దీనిపై హైకోర్టు నియమించిన విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలోని నలుగురు సభ్యుల కమిటీ 2021లో ఎన్నో అవకతవకలు బయటపెట్టింది. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ల మూల్యాంకనానికి నియమించిన సంస్థ దాన్ని మరో సంస్థకు అప్పగించటమూ వెల్లడైంది. సీబీఐ దర్యాప్తులో కీలక సాక్ష్యాధారాలున్న మూడు హార్డ్ డిస్క్లు స్వాధీనమయ్యాయి. అయిదుగురు అరెస్టయ్యారు. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు గల్లంతయినట్టు కనుక్కుంది. తమ అవకతవకలు కప్పి పుచ్చేందుకు నిబంధనల సాకుచూపి 2019లోనే వాటిని ధ్వంసం చేసినట్టు నిర్ధారణైంది. ఆ సంస్థ నివేదిక ఆధారంగా మొత్తం రిక్రూట్మెంట్ ప్రక్రియను రద్దుచేస్తూ, తిరిగి నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు చేయాలని ఆదేశిస్తూ నిరుడు ఏప్రిల్లో కలకత్తా హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై మొదట్లో సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా హైకోర్టు తీర్పునే సమర్థిస్తూ ఈ నెల 3న తీర్పునిచ్చింది. మొత్తం రిక్రూట్మెంట్ రద్దు చేయటం భావ్యంకాదని, ఇందులో నిజాయితీగా ఎంపికైనవారూ ఉన్నారని ప్రభుత్వం చేసిన వాదనతో సుప్రీం ఏకీభవించలేదు. ఓఎంఆర్ షీట్లు లేకుండా ఆ సంగతెలా నిర్ధారిస్తామంది.హఠాత్తుగా ఉద్యోగాల నుంచి గెంటేయటం బాధాకరమనటంలో సందేహం లేదు. ఎందుకంటే ఎంపికైన వారంతా అవినీతిపరులు కాదు. వారి సంఖ్య 5,300 మించివుండదంటున్నారు. ఇలాంటి ఎంపికల్లో మొత్తం ప్రక్రియను భ్రష్టుపట్టించటం ఎంతటి అవినీతిపరులకైనా అసాధ్యం. కానీ సరైన మార్గంలో వచ్చినవారెవరో తెలిసేదెలా? ఇందుకు ప్రధానంగా నిందించాల్సింది ప్రభుత్వాన్నే. ఈ రిక్రూట్మెంట్ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన సీపీఎం నేత, న్యాయవాది వికాస్రంజన్ భట్టాచార్యకు నోబెల్ బహుమతి ఇవ్వాలని మమత వ్యంగ్యంగా వ్యాఖ్యానించటం సరేగానీ... తన వంతు ఆమె చేసిందేమిటి? ఒకపక్క ఆరోపణలొస్తున్నప్పుడు ఓఎంఆర్ షీట్లు భద్రపరచటం వంటి కనీస చర్యనైనా ఎందుకు తీసుకోలేకపోయారు? ఉపద్రవం ముంచుకొస్తున్నదని తెలిసినా నిమ్మకు నీరెత్తినట్టు ఎలావున్నారు? ఓఎంఆర్ షీట్లుంటే అక్రమార్కుల నిర్ధారణ సులభమయ్యేది. నిజాయితీ పరులకు రక్షణ దొరికేది. అయినా తమ వద్ద కచ్చితంగా నిర్ధారించగల ఇతరేతర సాక్ష్యాలున్నాయని ఉన్నతాధికారులంటున్నారు.ఉద్యోగాలు కోల్పోయిన టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఆగ్రహం అర్థం చేసుకోదగిందే. వారు ఇప్పటికే తమకంటూ గూడు నిర్మించుకుని వుంటారు. నెలవారీ వాయిదాల్లో చెల్లించేలా రుణాలు తీసుకుంటారు. అనారోగ్యం వల్లనో, మరే ఇతర కారణంతోనో దొరికినచోట అప్పుచేస్తారు. ఈ రుణవలయం నుంచి బయటపడేదెలా? అందరూ దొంగలు కాదు. అయినా కొలువు పోయింది... జీవనాధారం మాయమైంది, కానీ అదొక్కటే సమస్య కాదు తమ శిష్యుల ముందు చులకనై పోయారు. అవినీతిపరులన్న ముద్రపడింది. దీన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. విద్యా ర్థులది మరో సమస్య. వార్షిక పరీక్షలు దగ్గర పడుతుండగా గురువులు లేకపోవటం, కొన్నిచోట్ల సిబ్బంది కొరతతో యూనిట్ పరీక్షలు వాయిదా పడటం వారిని కలచి వేస్తోంది. అస్తవ్యస్త పాలనకు బెంగాల్ చిరునామాగా మారింది. నిరుడు ఆగస్టులో ఆర్జీ కార్ ఆస్పత్రిలో ఒక మహిళా వైద్యు రాలిపై అత్యాచార ఉదంతంలో సైతం స్పందన అంతంతమాత్రం. చివరకు సుప్రీంకోర్టు జోక్యం తప్పలేదు. ఇప్పుడు ఎస్ఎస్సీ స్కాంలోనూ అదే నిర్వాకం. ప్రస్తుతం నిజంగా అర్హులైన ఉపాధ్యాయులను గుర్తించి వారికి న్యాయం చేసేందుకు ఏయే అవకాశాలున్నాయో చూడటం, తమ దగ్గరున్న సాక్ష్యాధారాలివ్వటం తప్ప మరే మార్గమూ లేదు. దానికి బదులు కోర్టుల్ని నిందించి, మరొకరిని తప్పు బట్టి ప్రయోజనం లేదని మమతా బెనర్జీ గ్రహించాలి. -
సరైన న్యాయం!
పుష్కరకాలం క్రితం ఒక మునిమాపు వేళ హైదరాబాద్ నగరంలో 18 మంది అమాయకుల ప్రాణాలు తీసిన బాంబు పేలుళ్ల ఉదంతాల్లో దోషులుగా తేలిన ఆరుగురు నిందితులకూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం విధించిన మరణశిక్షను ధ్రువీకరిస్తూ తెలంగాణ హైకోర్టు మంగళవారం వెలువరించిన తీర్పు బాధిత కుటుంబాలకు మాత్రమే కాదు, ఉగ్రవాద ఘటనలను వ్యతిరేకించే వారందరికీ ఊరటనిస్తుంది. నగరంలోని దిల్సుఖ్నగర్లో రెండుచోట్ల జరిగిన ఈ పేలుళ్లలో మరో 131 మంది గాయాల పాలయ్యారు. వారిలో చాలామంది ఈనాటికీ ఆ గాయాలు కలిగించిన శారీరక, మానసిక క్లేశాల నుంచి కోలుకోలేకపోతున్నారు. మరణశిక్ష పడిన వారిలో రియాజ్ భత్కల్ అనే ఉగ్రవాది ఇప్పటికీ పాకిస్తాన్లో తలదాచుకున్నాడు. ఈ పేలుళ్లకు పథకం పన్నడంతోపాటు అందుకు కావల్సిన నిధుల సమీకరణ, పేలుడు పదార్థాలు, మనుషుల్ని సమకూర్చుకోవటం వగైరాలకు సూత్రధారి రియాజే. ఏవో కొన్ని ఉగ్రవాద ఘటనల ద్వారా దేశంలో అల్లకల్లోలం సృష్టించవచ్చని, దేశాన్ని బలహీనపరచవచ్చని ఈ బాపతు ఉగ్రవాదులు కలలుగంటారు. ఉగ్రవాదం మామూలు ఉన్మాదం కాదు. అది ఎప్పుడు ఎక్కడ తన విషపుకోరలు చాస్తుందో... ఎవరిని కాటేస్తుందో అంచనా వేయటం కూడా అసాధ్యం. పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలు అక్కడి సైన్యం, దాని గూఢచార విభాగం ఐఎస్ఐ సహకారంతో శిక్షణ శిబిరాలు నిర్వహించటం, యువకులను తప్పుడు మార్గానికి మళ్లించటం, సాధారణ ప్రజానీకానికి హాని కలిగించగల చర్యలకు ప్రేరేపించటం దశాబ్దాలుగా సాగుతోంది. ఆ సంస్థల ప్రేరణతో సొంతంగా ఉగ్రవాద సంస్థలను నెలకొల్పి భయోత్పాతాన్ని సృష్టించటం భత్కల్ లాంటివారికి లాభసాటి వ్యాపారంగా కూడా మారిందని దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల ఉదంతంపై చేసిన దర్యాప్తులో వెల్లడైంది. మంగళూరు సమీప ప్రాంతాల్లో రియాజ్ భత్కల్ భారీయెత్తున రియల్ ఎస్టేట్ వెంచర్లు నిర్వహించాడని, జిహాద్ పేరుతో దేశంలోనూ, వెలుపలా లక్షలాది రూపాయలు వసూలు చేసి సొంత ఖాతాలకు మళ్లించుకున్నాడని కూడా బయటపడింది.తమను తాము మత సంరక్షకులుగా చిత్రించుకోవటం, జిహాద్ చేస్తున్నామని మభ్యపెట్టడం భత్కల్ లాంటివారికి రివాజు. వీరి వలలోపడి అనేకమంది యువకుల జీవితాలు నాశనమయ్యాయి. జనసమ్మర్దంగల ప్రాంతాల్లో బాంబులుంచి సాధారణ పౌరుల ప్రాణాలకు హాని కలిగించే ఇలాంటి వారికి కఠినమైన శిక్ష విధించటం సమాజ శ్రేయస్సు కోసం తప్పనిసరి. ఈ పన్నెండేళ్ల కాలంలోనూ వీరు తమ చర్యలకు పశ్చాత్తాపం ప్రకటించటంగానీ, ఇకపై సత్ప్రవర్తనతో మెలుగుతామని గానీ ఎక్కడా చెప్పలేదు. వీరిలో పరివర్తనకూ లేదా సంస్కరణకూ అవకాశమే లేదని నిర్ధారణ కొచ్చినట్టు ఉన్నత న్యాయస్థానం చెప్పిందంటే ఈ నేరగాళ్లు ఎంత కరుడు గట్టిపోయారో అర్థమవుతుంది. ఉగ్రవాదులు మతం పేరు చెప్పుకోవచ్చుగానీ ఏ మతమూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదు. ఉగ్రవాదానికి అసలు మతం ఉండదు. ఇలాంటి నేరగాళ్ల చర్యల వల్ల మాత్రమే మతం సురక్షితంగా మనుగడ సాగించగలదని అందులోని వారెవరూ విశ్వసించరు కూడా! కానీ అమాయకులను నమ్మించటానికి వీరు మతాన్ని సాధనంగా వాడుకుంటారు. వారిని మభ్యపెట్టడం కోసం ఆధ్యాత్మి కతను ప్రబోధిస్తారు. క్రమేపీ తమ దురాలోచనను వారి మెదళ్లలోకి ఎక్కిస్తారు. అప్పటికల్లా ఆ యువకులు వీరి చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతారు. ఇలాంటివారికి చివరకు మిగిలేదేమిటో, వారి మానసిక, శారీరక స్థితిగతులు ఎలా దిగజారతాయో తెలియటానికి జాతీయ న్యాయ విశ్వ విద్యాలయ విద్యార్థులు కొందరు వారితో మాట్లాడి రూపొందించిన నివేదికే సాక్ష్యం. భిన్న వర్గాల ప్రజల మధ్య చిచ్చురేపి దేశాన్ని విచ్ఛిన్నం చేయటానికీ, సమాజాన్ని భయభ్రాంతపరచటానికీ వీరు పాల్పడిన చర్యల వల్ల ఎక్కడెక్కడి నుంచో పొట్టకూటి కోసం ఈ మహానగరాని కొచ్చిన సాధారణ ప్రజానీకం బలయ్యారు. అందులో అన్ని మతాలవారూ ఉన్నారు. ఇంకా అమ్మ కడుపులోనే ఉన్న శిశువు మొదలుకొని స్త్రీలు, పిల్లలు కూడా వీరి మతిమాలిన చేష్టలకు బలైపోయారు. అనేకమంది జీవితాలు అనిశ్చితిలో పడ్డాయి. మనుషులైవుండి తోటి మనుషుల పట్ల ఇంత క్రూరంగా, ఇంత దారుణంగా వ్యవహరించటం ఊహకందనిది. ఇలాంటి ఉదంతాల్లో ఆచూకీ దొరక్కుండా సులభంగా తప్పించుకోవచ్చని, నేర నిరూపణ అసాధ్యమని నేరగాళ్లు భావిస్తుంటారు. కానీ సాంకేతికత బాగా పెరిగిన ఈ కాలంలో అదేమంత కష్టం కాదని పకడ్బందీ దర్యాప్తు ద్వారా ఎన్ఐఏ నిరూపించింది. అయితే ఇలాంటి కేసుల్లో ఇమిడివుండే సంక్లిష్టతల వల్ల కావొచ్చు... మన న్యాయస్థానాలకు ఉండే పెండింగ్ కేసుల భారం వల్ల కావొచ్చు విచారణకు సుదీర్ఘ సమయం పడుతోంది. ఈ ఉదంతం చోటుచేసుకున్ననాటినుంచీ చూస్తే ఇప్పటికి పన్నేండేళ్ల సమయం పట్టింది. త్వరితగతిన విచారించి శిక్షించే వ్యవస్థ ఉంటే అలాంటి బాటలో పోయేవారికి అదొక హెచ్చరికగా పనికొస్తుంది. ఈ తరహా భయోత్పాత చర్యలకు ఒక నిరోధంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ ఉదంతంలో అయిన వారిని కోల్పోయినవారికీ, ప్రాణాలతో బయటపడి భారంగా బతుకీడుస్తున్నవారికీ ఇప్పటికీ ప్రభుత్వ సాయం అందలేదంటే మనసు చివుక్కుమంటుంది. కాళ్లూ చేతులూ కోల్పోయి, చూపు, వినికిడి దెబ్బతిని, కనీసం మందులు కొనే శక్తిలేక అనేకులు కష్టాలు పడుతుండటం కలచివేస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. -
గవర్నర్లు ఈసారైనా గ్రహిస్తారా?
ఎన్నికైన ప్రభుత్వాలను బేఖాతరు చేస్తూ తరచు ఇబ్బందులు సృష్టించే గవర్నర్లకిది శరాఘాతం. శాసనసభ ఆమోదించిన పది బిల్లులపై ఆమోదముద్ర వేయకుండా, రాష్ట్రపతి పరిశీలనకు పంపకుండా దీర్ఘకాలం పెండింగ్లో పెట్టిన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తీరును తప్పుబట్టడమేకాక ఆ బిల్లులన్నీ ఆమోదించినట్టుగా భావిస్తూ సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం వెలువరించిన తీర్పు అసాధారణమైనది. రాజ్యాంగంలోని 142వ అధికరణ కింద తనకు దఖలు పడిన విశేషాధి కారాలను వినియోగించుకుని సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. తాము ఎన్నికైన ప్రభుత్వాల కన్నా అధికులమని భావించటం, వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టడం చాన్నాళ్లుగా కొందరు గవర్నర్లలో కనిపిస్తున్న ధోరణి. తనముందుకొచ్చే ఈ మాదిరి కేసులపై విచారిస్తున్నప్పుడూ లేదా తీర్పు వెలువరించినప్పుడూ ఈ ప్రవర్తన సరికాదని సుప్రీంకోర్టు చెబుతూనే వచ్చింది. వేరే రాష్ట్రాలకు సంబంధించి తీర్పు వచ్చినప్పుడైనా తమ అధికారాలేమిటో, పరిమితు లేమిటో తెలుసుకుని మెలగటం, ప్రవర్తనను సవరించుకోవటం విజ్ఞత అనిపించుకుంటుంది. కానీ అదెక్కడా కనబడటం లేదు. అలాగని గవర్నర్లంతా ఈమాదిరిగానే ఉంటున్నారని అనుకోనవసరం లేదు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో వున్నచోట ఎలాంటి సమస్యలూ కన బడవు. వ్యక్తులుగా హుందాతనాన్ని ప్రదర్శించే గవర్నర్లు విపక్ష ప్రభుత్వాల ఏలుబడిలోని రాష్ట్రాల్లో సాఫీగా పనిచేసుకుపోతున్నారు. ఎటొచ్చీ కొందరు గవర్నర్లు మాత్రం వింత పోకడలు పోతున్నారు.తమిళనాడు శాసనసభ ఆమోదించి గవర్నర్ రవి వద్ద పెండింగ్లో వున్న పది బిల్లుల్లో జనవరి 2020 నాటిది కూడా ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది. అంతేకాదు... ఈ బిల్లుల్లో చాలాభాగం ఒకసారి అసెంబ్లీలో ఆమోదం పొంది గవర్నర్ తిరస్కారానికి గురై రెండోసారి అసెంబ్లీ ఆమోదం పొంది వచ్చినవి. రాజ్యాంగ నిబంధన ప్రకారం ఒక బిల్లు తన సంతకం కోసం వచ్చినప్పుడు గవర్నర్ దాన్ని ఆమోదించటమో, తిరస్కరించటమో, రాష్ట్రపతి పరిశీలనకు పంపడమో చేయాలి. అంతేతప్ప నెలల తరబడి తొక్కిపెట్టి వుంచ కూడదు. ఈ సంగతిని రెండేళ్లనాడు పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై తీర్పు వెలువరిస్తూ సుప్రీంకోర్టు తెలియజేసింది. అక్కడి గవర్నర్ ఏకంగా 12 బిల్లుల్ని దీర్ఘకాలం పెండింగ్లో ఉంచారు. తన ఆమోదముద్ర కోసం వచ్చిన బిల్లుపై ‘సాధ్యమైనంత త్వరగా’ గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని, పునఃపరిశీలన అవసరమని భావిస్తే ఆ సంగతి తెలియజేయాలని అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 200వ అధికరణ సైతం ఈ సంగతే చెబుతోంది. బిల్లు సక్రమంగా లేదని, స్పష్టత కొరవడిందని లేదా రాజ్యాంగ నిబంధనలను అతిక్రమిస్తోందని గవర్నర్ భావిస్తే దాన్ని తిప్పిపంపొచ్చు. గవర్నర్ ఇచ్చిన సలహాను అంగీకరించి బిల్లుకు సవరణలు చేయటమా లేక య«థాతథంగా దాన్నే మరోసారి ఆమోదించి పంపటమా అనేది శాసనసభ ఇష్టమని ఆ అధికరణ తేటతెల్లం చేస్తోంది. రెండోసారి వచ్చిన బిల్లును గవర్నర్ ఆమోదించి తీరాలని లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని చెబుతోంది. నిబంధనలుఇంత స్పష్టంగా ఉన్నప్పుడు రవి ఇష్టానుసారం ప్రవర్తించటం అనుచితం. పంజాబ్ కేసులో ఇచ్చిన తీర్పును గవర్నర్లు బేఖాతరు చేస్తున్నారని గమనించటం వల్లే... ఆమోదం కోరుతూ తమ వద్దకొచ్చిన బిల్లు విషయంలో గవర్నర్లు ఎలా మెలగాలో తాజా తీర్పులో సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్దేశించాల్సి వచ్చింది. రాష్ట్రపతి పరిశీలనకు పంపదల్చుకున్న బిల్లుల్ని గరిష్ఠంగా మూడు నెలలు మించి తమవద్ద ఉంచుకోరాదని, పునఃపరిశీలనకొచ్చిన బిల్లునైతే వెంటనే ఆమోదించాలని లేదా గరిష్ఠంగా నెల రోజుల్లోపల సమ్మతి తెలపాలని ధర్మాసనం తెలిపింది. తొలిసారి వచ్చిన బిల్లుకూ, రెండోసారి పంపిన బిల్లుకూ వ్యత్యాసం ఉన్నపక్షంలో మాత్రమే ఇందుకు మినహాయింపు వుంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలకు అధికారాలుండాలి. కానీ ఆ ప్రభుత్వాలపట్ల ఏర్పర్చుకున్న అభిప్రాయంతో ఈ అధికారాలకు అవరోధాలు కల్పించాలని చూడటం రాజ్యాంగ ధిక్కరణ అవుతుందని గవర్నర్లు గ్రహించటం లేదు. అరుణాచల్ప్రదేశ్ అసెంబ్లీ కేసులో 2016లో ఇచ్చిన తీర్పులో ఈ సంగతిని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.తన ఆమోదం కోసం వచ్చిన బిల్లులపై ‘సాధ్యమైనంత త్వరగా’ నిర్ణయం తీసుకోవాలని పంజాబ్ కేసు విషయంలో సుప్రీంకోర్టు చెప్పినప్పుడే రవి అప్రమత్తమై తన పరిమితులను గుర్తెరిగి వుంటే తాజా తీర్పులో నిర్దిష్ట గడువు నిర్దేశించాల్సిన అవసరం ఉండేది కాదు. తమ ప్రవర్తనవల్ల రాజ్యాంగ పదవికుండే ఔన్నత్యాన్ని పలచన చేస్తున్నామని గవర్నర్లు ఇకనైనా గుర్తెరగాలి. కేంద్రంలో రాష్ట్రపతి మాదిరే రాష్ట్రాల్లో గవర్నర్లు కూడా రాజ్యాంగానికి అనుగుణంగా కొన్ని అధికారాలు, బాధ్య తలు కలిగివుంటారు. కానీ రాష్ట్రపతి తరహాలో వారు ఎన్నిక కారు. కేంద్ర కేబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి వారిని నియమిస్తారు. రాజకీయ నాయకులు గవర్నర్లు కావటంవల్లే సమస్యలొస్తున్నాయని సుప్రీంకోర్టు భావించి భిన్నరంగాల్లో నిపుణులైనవారిని ఈ పదవికి ఎంపిక చేయాలని గతంలో సూచించింది. కానీ కేంద్రంలోని పాలకులకు నచ్చినవారే ఈ కోటాలో ఎంపికవుతారు గనుక ఆ నిపు ణులు రాజకీయాలకు అతీతంగా ఏమీవుండరు. రాజకీయంగా గవర్నర్లకు ఎలాంటి అభిప్రాయా లున్నా రాజ్యాంగ పదవిలో ఉంటున్నవారిగా అందుకు అనుగుణంగా మెలగటం నేర్చుకోవాలి. పదే పదే న్యాయస్థానాలతో చెప్పించుకోవటం మర్యాద కాదని తెలుసుకోవాలి. -
చెట్లు కుములుతున్న దృశ్యం
నగరం అప్పుడప్పుడే మేలుకుంటున్న వేళ డాబా మీదికి వెళ్ళి చూడండి: ఎప్పుడు మేలుకున్నాయో తెలియదు, ఎలా వచ్చాయో తెలియదు, చుట్టూ ఉన్న పెద్ద పెద్ద చెట్ల మీద, చిన్న చిన్న మొక్కల మీద, ఎక్కడబడితే అక్కడ చిన్నాపెద్దా పక్షులు, రంగురంగుల బుల్లి బుల్లి పిట్టలు! అవి నిర్విరామంగా కిచకిచల ధ్వనులు చేస్తూనే ఉంటాయి. అవి వాటితో అవి మాట్లాడుకోవడం; ఒకరి ఉల్లాసాన్ని ఒకరు పంచుకోవడం; కొమ్మమీంచి కొమ్మకు, ఆకుమీంచి ఆకుకు గెంతుతాయి,మందారపుష్పాల మెత్తని కేసరకాండాన్ని పట్టుకుని ఊగుతాయి. అది వాటి క్రీడావినోదం. అది కూడా కాసేపే! ఉషఃకాలపు పిల్లగాలులు చల్లచల్లగా వీస్తున్నప్పుడు, సూర్యుడు పూర్తిగా పొడుచుకు రానప్పుడు, పరిసరాలు వేడెక్కనప్పుడు, మరీముఖ్యంగా మానవ సంచారం మొదలవనప్పుడు! ఆ తర్వాత అవి అదృశ్యం! ఎక్కడికెడతాయో తెలియదు, రోజంతా ఎక్కడుంటాయో తెలియదు! వాటి గురించి ఎప్పుడైనా క్షణకాలం ఆలోచించి చూడండి, అప్పుడేమనిపిస్తుంది? బహుశా, ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం మానవ ధూర్తరాష్ట్రులతో ఆడిన జూదంలో ఓడిపోయి జనారణ్యంగా మారిన తమదైన అరణ్యంలోనే అజ్ఞాతవాసం చేస్తున్న పాండవుల అనంత సంతతి కాదుకదా అనిపిస్తుంది. అవి రోజూ పొద్దుటే కాసేపు తమ కొమ్మల మీద, తమ ఆకుల మధ్య ఇంద్రధనువుల్ని ఆవిష్కరిస్తూ కోలాహలంగా తిరుగుతూ ఉంటే ఆ చెట్లకెంత సంబరం! ఆ చెట్లూ, పిట్టలూ ప్రకృతి చరిత్ర పుటల్లోని తమ గురించిన అధ్యాయాలను మనిషి నిర్దాక్షిణ్యంగా చెరిపేసి పూర్తిగా సొంత అధ్యాయాలతో నింపేసుకున్న తర్వాత, కేవలం ప్రాచీన స్మృతులుగా మారిన తమ అనుబంధం గురించిన ఊసులు ఆ కాసేపూ నెమరేసుకుంటాయి కాబోలు! పక్షులతో పోల్చితే చెట్ల పరిస్థితి మరీ ఘోరం. అవి ఎగరనూ లేవు, ఆపైన వాటివి భారీకాయాలు కనుక అజ్ఞాతవాసయోగం కూడా వాటికి లేదు. తమ కొమ్మల మీద, తమ వేళ్ళ మీద మనిషి గొడ్డలి వేటు ఏ క్షణంలో పడుతుందో నన్న నిత్యభయగ్రస్త జీవితాన్ని నిలువు కాళ్ళమీద గడపక తప్పదు. చెట్లు కూలుతున్న దృశ్యం గురించి, రాక్షసుని వెన్నెముకపై ప్రతిష్ఠించిన నగరం గురించి, నగరంలో మనిషి కంటక శరీరుడిగా మారడం గురించి, సర్వత్రా వినిపించే కఠోర శబ్దాలు,ధ్వంసక్రీడ, దగ్ధక్రీడల గురించి, పూల చెట్లు విలపించడం గురించి, నిద్రలో నడుస్తున్న మనిషి నెత్తుటి మడుగును దాటలేడని చెప్పి అవి శపించడం గురించి– కవి అజంతా రాస్తాడు. అవును, నిజమే, నిద్రలో నడుస్తున్న మనిషి ప్రకృతిలోని సమస్త జీవజాలం మనుగడనూ నెత్తుటి మడుగు చేశాడు, తను సృష్టించిన ఆ మడుగును తను కూడా దాటలేని పరిస్థితిని తెచ్చుకుంటూనే ఉన్నాడు. ఒకప్పుడంతా అడవేనన్న సంగతి మరచిపోయి, నగరమే నిత్యమూ, సత్యమనే భ్రమలో పడిపోయాడు. చెట్లను కూల్చడం, వాటిని ఆశ్రయించుకున్న జీవజాలానికి నిలువనీడ లేకుండా చేయడమే అభివృద్ధి అని నిర్వచించుకుంటున్నాడు. తను కూడా భాగమైన ప్రకృతికి దూరమై ఒంటరివాడై పోతున్నాడు. అంతా తన ప్రయోజకత్వం, తానే భువికధినాథుడినని విర్రవీగుతున్నాడు. తను నెత్తిన మోసే తన పౌరాణిక, ఇతిహాస వారసత్వం నుంచి కూడా మనిషి పాఠాలు నేర్చుకోవడం లేదు. ఎగిరే పర్వతాల గురించి, మానవరూపం ధరించి మాట్లాడే నదుల గురించి, మాట్లాడే పక్షులు, జంతువుల గురించి అవి చెబుతాయి. అది, నువ్వు కూడా ప్రకృతిలో భాగమే సుమా అని గుర్తుచేయడం; ప్రకృతిలో ఏ జీవీ ఎక్కువా కాదు, తక్కువా కాదు, అన్నింటికీ జీవించే హక్కు ఉందని చెప్పడం! అడవులకు, అక్కడి సమస్త్ర పాణులకు రక్షణ కల్పించవలసిన అవసరం గురించి అర్థశాస్త్రం చెబుతుంది; అడవులూ, వాటిని ఆశ్రయించుకుని బతికే జీవులూ రాజ్యంలో భాగం కాని, స్వతంత్ర అస్తిత్వాలన్న సంగతిని ఆనాటి రాజుల వివేకం చెబుతుంది. ప్రాకృతికమైన పూర్తి అవగాహనతో పూర్వులు గీసిన ఈ లక్ష్మణ రేఖలన్నీ ఏమైపోయాయి? అడవిపై విచక్షణా రహితమైన రాజ్యపు రాబందు రెక్క పరచిందెవరు?! సమకాలీన శాస్త్రవిజ్ఞాన పాఠాలు కూడా మనిషి తలకెక్కడం లేదు; ఈ విశ్వమూ, భూమీ,అందులోని ప్రకృతీ తమవైన ప్రణాళికను, తమవైన కేలండర్ను అనుసరిస్తాయనీ, మనిషి ప్రణాళికలనూ, కేలండర్నూ అవి ఏ క్షణంలోనైనా కుప్పకూల్చగలవనే ఎరుక లేదు. వందల కోట్ల సంవత్సరాల భూమి చరిత్రలో ఎన్నో మంచుయుగాలు దొర్లాయి. భూకంపాలు, వరదలు, అగ్నిపర్వత విస్ఫోటాలు జీవి మనుగడను ఎన్నో మలుపులు తిప్పాయి. ఎంతో చరిత్రను తిరగరాశాయి. జీవపరిణామం ఎన్నో మార్పులు చెందింది. మానవ పరిణామంలో ఇప్పుడు చూస్తున్నదే తుది అంకం కాదు, మరిన్ని అంకాలకు అవకాశముందని జన్యుశాస్త్రజ్ఞులు హెచ్చరిక. మరి జంతువులు సహా ఇతర జీవజాలం సంగతేమిటి? మనిషిలోలానే వాటిలో కూడా ఏదైనా ఉత్పరివర్తన జరిగి అవి మనిషి స్థానాన్ని ఆక్రమిస్తే?! అది ప్రస్తుతానికి విపరీత ఊహలా అనిపించవచ్చు, కానీ ప్రకృతి గర్భంలో ఏ రహస్యాలు దాగున్నాయో ఎవరికి తెలుసు? కనుక మనిషి నేర్చుకోవలసింది వినమ్రత! ప్రకృతిపట్లా, అందులోని చరాచరాలన్నిటిపట్లా సమభావం, సమరసభావం!! పగబట్టి తిరగబడే ప్రకృతి ముందు తను పిపీలకమన్న ఆత్మజ్ఞానం!! -
దిద్దుబాటా... ఇంకో పొరపాటా?
కేంద్ర ప్రభుత్వం ఆశించినట్టుగానే హెచ్సీయూ ప్రతిష్ఠాత్మక విద్యా కేంద్రంగానే వెలుగొందింది. వారసత్వంగా సంక్రమించిన భూమిని కేటాయించడం, గౌరవ హోదాను అనుభవించడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఖర్చంతా యూజీసీ పద్దులే భరించాయి. యూనివర్సిటీని స్థాపించిన యాభయ్యేళ్లకు దాని భూములపై ఇప్పుడు జాతీయస్థాయిలో వివాదం జరుగుతున్నది. నిజానికి పాతికేళ్ల కిందనే ఈ చర్చను లేవనెత్తి ఉండాలి. ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు అప్పటి మీడియా కరపత్రికల్లా వ్యవహరించడం వల్ల, కేంద్రంలో కూడా ఆయన మిత్రపక్షమే ఉన్నందువల్ల చర్చ జరగలేదు. యూనివర్సి టీకి కేటాయించిన 2300 ఎకరాల్లో 800 ఎకరాల సంతర్పణ వివిధ సంస్థల పేర్లతో ఇష్టారాజ్యంగా జరిగి పోయింది.ఉస్మానియా యూనివర్సిటీకి ఉద్యమాల పుట్టినిల్లుగా పేరుండేది. ఉద్యమాల పర్యవసానంగా పుట్టిన యూనివర్సిటీ హైదరా బాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం. ఒక భావోద్వేగ పూరితమైన నేపథ్యం హెచ్సీయూ ఆవిర్భావానికి కారణమైంది. 1969, 1972 సంవత్సరాల్లో రెండు ఉధృతమైన ప్రత్యేక రాష్ట్ర ఉద్య మాలను తెలుగు నేల చూడవలసి వచ్చింది. ఆ ఉద్యమాలను చల్లార్చి ఉమ్మడి రాష్ట్రాన్ని కొనసాగించడం కోసం ఒక రాజీ ఫార్ములాగా ఆరు సూత్రాల పథకాన్ని కేంద్రం ముందుకు తెచ్చింది. అందులో ఒక అంశం హైదరాబాద్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు! విద్యారంగంలో వెనుకబాటుతనా నికి గురైన ప్రాంతంగా ఉన్న తెలంగాణలో ఒక ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఏర్పాటు, రాష్ట్ర రాజధానిలో ఆంధ్ర ప్రాంత విద్యార్థులకు కూడా సమాన అవకాశాలు లభించే విధంగా దాన్ని కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఉభయతారకంగా ఉంటుందని భావించారు.ఇందుకోసం రాజ్యాంగ సవరణ అవసరమైంది. 32వ సవరణ ద్వారా 371వ అధికరణానికి ‘ఈ’ అనే సబ్క్లాజ్ను జోడించారు. పార్లమెంట్ ఒక చట్టం ద్వారా హైదరాబాద్లో ఒక ‘సెంట్రల్’ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ఈ క్లాజ్ అవకాశం కల్పించింది. ఆ మేరకు హైదరాబాద్ విశ్వవిద్యాలయ చట్టం 1974ను పార్లమెంట్ ఆమోదించింది. అదే సంవత్సరం సెప్టెంబర్లో గెజెట్లో ఈ చట్టాన్ని ప్రచురించారు. భారత రాజ్యాంగంలో 371వ అధికరణం కింద ప్రస్తావించిన ఏకైక విశ్వవిద్యాలయం హెచ్సీయూ మాత్రమే! అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారుగా 2,300 ఎకరాల భూమిని హైదరాబాద్ నగర కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గచ్చిబౌలిప్రాంతంలో కేటాయించింది. ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడమో, లేక ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించడమో చేయలేదు.పూర్వపు హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలో వాటిని ఆనుకొని ఉన్న ఇతర జిల్లాల్లో ఉన్న భూములన్నీ నవాబ్ సొంత భూములుగా (‘సర్ఫెఖాస్’గా) పరిగణించేవారు. పోలీస్ యాక్షన్ తర్వాత ‘హైదరాబాద్ స్టేట్’ ఇండియన్ యూనియ న్లో విలీనమైంది. నైజాం... భూములన్నీ హైదరాబాద్ స్టేట్కు వారసత్వంగా లభించాయి. ఇందుకోసం మీర్ ఉస్మాన్ అలీఖాన్ జీవించి ఉన్నంతకాలం పెద్దమొత్తంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా రాజభరణం చెల్లించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తర్వాత హైదరాబాద్ చుట్టూ ఉన్న వేలాది ఎకరాల భూములు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ నగరంలో డజన్లకొద్ది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటుకు ఈ భూముల లభ్యతే కారణం.హెచ్సీయూను ఒక ప్రతిష్ఠాత్మక విద్యా కేంద్రంగా మల చాలని కేంద్రం భావించినందు వల్ల అప్పటికి ప్రపంచ స్థాయిలో పేరున్న యూనివర్సిటీలను దృష్టిలో పెట్టుకొని వాటి స్థాయి లోనే భూములను కేటాయించాలని భావించారు. ఈ భూము లను కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవోను కూడా విడుదల చేసింది. కాకపోతే భూముల రిజిస్ట్రేషన్ జరగలేదు. అటువంటిది అవసరమని కూడా నాటి యూని వర్సిటీ పాలకవర్గాలు భావించలేదు. హెచ్సీయూకు చీఫ్ రెక్టార్గా ఒక గౌరవ హోదా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పార్లమెంట్ చట్టపరంగానే కట్టబెట్టింది. కంచే చేను మేస్తుందని ఎవరు భావిస్తారు! అందువల్ల టెక్నికల్గా ఆస్తుల బదలాయింపు జరగలేదు.కేంద్ర ప్రభుత్వం ఆశించినట్టుగానే హెచ్సీయూ ప్రతి ష్ఠాత్మక విద్యా కేంద్రంగానే వెలుగొందింది. వారసత్వంగా సంక్ర మించిన భూమిని కేటాయించడం, గౌరవ హోదాను అనుభవించడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఖర్చంతా యూజీసీ పద్దులే భరించాయి. యూనివర్సిటీని స్థాపించిన యాభయ్యేళ్లకు దాని భూములపై ఇప్పుడు జాతీయస్థాయిలో వివాదం జరుగుతున్నది. నిజానికి పాతికేళ్ల కిందనే ఈ చర్చను లేవనెత్తి ఉండాలి. ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు అప్పటి మీడియా కరపత్రికల్లా వ్యవహరించడం వల్ల, కేంద్రంలో కూడా ఆయన మిత్రపక్షమే ఉన్నందువల్ల చర్చ జరగలేదు. యూనివర్సిటీకి కేటాయించిన 2300 ఎకరాల్లో 800 ఎకరాల సంతర్పణ వివిధ సంస్థల పేర్లతో ఇష్టారాజ్యంగా జరిగి పోయింది.మిగిలిన దాంట్లో 400 ఎకరాల భూమిని తాడూ బొంగరం లేని క్రీడా నిపుణుల పేరుతో బిల్లీరావు అనే వ్యక్తికి కారుచౌకగా చంద్రబాబు కట్టబెట్టారు. అదీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, కేబినెట్ అనుమతి కూడా లేకుండానే ఈ కేటా యింపులు జరిగాయి. ఈ నాలుగొందల ఎకరాలు చాలవని ఎయిర్పోర్టు సమీపంలో మరో నాలుగొందల యాభై ఎకరా లను కూడా కట్టబెట్టారు. ఆనాటికి దేశంలోని అతిపెద్ద స్కాముల్లో ఈ బిల్లీరావు భూబాగోతం కూడా ఒకటి. వెంటనే ఎన్నికలు రావడం, చంద్రబాబు ప్రభుత్వం ఓడిపోవడం,తదనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డిప్రభుత్వం ఈ అక్రమ కేటాయింపును రద్దు చేయడం తెలిసిన విషయాలే! రద్దును సవాల్ చేస్తూ బిల్లీరావు కోర్టుల్ని ఆశ్రయించి ఇరవయ్యేళ్లపాటు వ్యాజ్యాన్ని నడిపాడు. రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగానే నిలవడంతో ఇరవయ్యేళ్ల తర్వాత గత సంవత్సరమే సుప్రీంకోర్టు తుది తీర్పునిస్తూ ఈ 400 ఎకరాలు ప్రభుత్వాని వేనని తేల్చేసింది. కేవలం టెక్నికల్గానే ప్రభుత్వ భూములు అనుకోవాలి. యూనివర్సిటీకి ఈ భూములను కేటాయించినట్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వ కార్య దర్శి రామచంద్రారెడ్డి యూనివర్సిటీ అధికారులకు 1975లోనే ఫిబ్రవరి 21న డీఓ లెటర్ ద్వారా కమ్యూ నికేట్ చేశారు. 2,300 ఎకరాలు కేటాయించినట్టు అందులో స్పష్టంగా పేర్కొన్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు గానీ, ఆ రోజుల్లో రెండు కోట్లు ఖర్చుపెట్టి కాంపౌండ్వాల్ కట్టించింది.ఇక్కడ తలెత్తుతున్న కీలకమైన ప్రశ్న ఏమిటంటే, రెండు ప్రాంతాల్లో జరిగిన ఉద్యమాల నేపథ్యంలో ఆరు సూత్రాల పథకంలో భాగంగా ఏర్పడిన యూనివర్సిటీ ఇది. పార్లమెంట్లో ప్రత్యేకంగా చట్టాన్ని చేసి ఏర్పాటుచేశారు. రాజ్యాంగంలో పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా భూముల్ని కేటాయించింది. ఈ భూముల్ని అకడమిక్ అవసరాలకు మాత్రమే వినియోగించాలని సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే షరతు కూడా విధించింది. ఆ షరతును ఉల్లంఘించడానికి రాష్ట్ర ప్రభు త్వమే సిద్ధపడటం, అమ్ముకోవడానికి కూడా తెగించడం చెల్లు బాటయ్యే విషయాలేనా? నైతికంగానే కాదు, న్యాయపరంగా కూడా! విశ్వవిద్యాలయ వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వం తప్ప స్టేక్ హోల్డర్లు ఇంకెవరూ లేరా?కోర్టు తీర్పు వెలువడిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఈ భూముల్ని తాకట్టు పెట్టి పదివేల కోట్లు అప్పు తీసుకున్నదట! ఇప్పుడు వేలానికి సిద్ధపడింది. ఈ 400 ఎకరాల్లో పర్యా వరణ విధ్వంసం జరుగుతున్నదన్న వార్తలు వ్యాపించడం, హెచ్సీయూ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ఇది జాతీయ సమస్యగా మారింది. ఈ నాలుగొందల ఎకరాల పరిధిలోని దట్టమైన పొదలు స్క్రబ్ అడవిగా అల్లుకున్నాయి. మంజీరా బేసిన్లో ఎత్తయిన ప్రాంతంలో ఉన్నందువల్ల ఇక్కడి కుంటల్లో చేరిన నీరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూగర్భ జలాలకు ఊపిరిపోస్తున్నాయని చెబుతున్నారు. హెచ్సీయూ వెబ్సైట్ లోనే ఇక్కడున్న బయో డైవర్సిటీ గురించి అధికారికంగా పొందు పరిచారు. వంద ఎకరాల్లో బయో డైవర్సిటీని ధ్వంసం చేశారన్న వార్తలను అధికారికంగా రూఢి చేసుకున్న తర్వాతనే సర్వోన్నత న్యాయస్థానం సీరియస్గా స్పందించింది. ఏప్రిల్ 16వ తేదీ లోగా నివేదికను ఇవ్వాలని రాష్ట్ర సీఎస్ను ఆదేశించింది. న్యాయ స్థానం జోక్యంతో ప్రస్తుతం సద్దుమణిగినట్టు కనిపిస్తున్నా,ఎంపిక చేసుకున్న పత్రికల్లో వస్తున్న లీకు వార్తలు కొత్త కలవరాన్ని కలిగిస్తున్నాయి. 400 ఎకరాలే కాదు, మొత్తంరెండువేల ఎకరాల్లో ‘ఎకో పార్క్’ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నదనీ, ఇందుకోసం సెంట్రల్ వర్సిటీకి ఫ్యూచర్ సిటీలో వంద ఎకరాలు కేటాయించి, అక్కడికి తర లిస్తారనీ ముందుగా ఒక తెలుగు పత్రిక రాసింది. దానికి ప్రభుత్వ అనుకూల పత్రికగా పేరున్నది. ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి ఖండనా రాలేదు. రెండోరోజు ఒక జాతీయస్థాయి ఇంగ్లిషు పత్రికలో మరింత ప్రముఖంగా, సమగ్రంగా అదే వార్త వచ్చింది. ఎవరూ ఖండించలేదు. అధికారికంగా ప్రకటించనూ లేదు. ఇటువంటి వార్తల్నే జనం పల్స్ తెలుసుకోవానికి ప్రయో గించే ‘లీకు వార్త’లంటారు. నిజంగా ప్రభుత్వానికి అటువంటి ఉద్దేశం ఉన్నదా? వేలానికి అడ్డుపడ్డ సెంట్రల్ వర్సిటీ విద్యా ర్థులపై కోపమా? వాళ్ల మీద కోపంతో యూనివర్సిటీ స్థాయిని తగ్గించాలనుకుంటున్నారా? వాళ్లదేముంది. రెండు మూడేళ్లు చదువుకొని వెళ్లిపోతారు. నిజంగానే సెంట్రల్ వర్సిటీని వంద ఎకరాల్లోకి పంపించే ఉద్దేశం ఉంటే మాత్రం దాని స్థాపిత లక్ష్యాలను అవహేళన చేసినట్టే అవుతుంది. ఒక తప్పును దిద్దు కోవడానికి మరో తప్పు చేసినట్టవుతుంది. ప్రతిష్ఠాత్మకమైన కేంద్రీయ విశ్వవిద్యాలయంతో ఫుట్బాల్ ఆడుకునే హక్కు, అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయా అనే సంగతి కూడా తేలవలసి ఉన్నది. వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఇకనైనా అరాచకం ఆగేనా!
రాచరికాల్లో అధికారానికీ, దర్పానికీ, దానిద్వారా లభించే న్యాయానికీ రాజదండం చిహ్నం. ఈమధ్యకాలంలో బుల్డోజర్ అలాంటి పాత్ర పోషిస్తున్న వైనం కనబడుతోంది. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ పాలన మొదలయ్యాక బుల్డోజర్ అర్థం, దాని పరమార్థం మారిపోయాయి. ఆ రాష్ట్రాన్ని చూసి మరికొన్ని రాష్ట్రాలు వాతలు పెట్టుకోవటం కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో 2021 మార్చిలో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో అమానవీయంగా, చట్టవిరుద్ధంగా ఆవాసాలను కూల్చేసిన అధికారగణంపై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయటంతోపాటు, ఇళ్లు కోల్పోయిన ఆరుగురు పిటిషనర్లకూ ఆరువారాల్లో రూ. 10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు... ఈ ఉదంతం తమ అంతరాత్మను తీవ్రంగా కలవరపరిచిందని ధర్మాసనం తెలియజేసింది. అధికారమంటే ఇష్టానుసారం ఏదైనా చేయడానికి దొరికిన లైసెన్స్గా భావించే సంస్కృతి దేశంలో ముదిరిపోయింది. ఒక్క యూపీలోనేకాదు... మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ వగైరాల్లో ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకున్న తీరు గమనిస్తే ఇదో అంటువ్యాధిగా మారిందన్న అభిప్రాయం కలుగుతుంది. ఏదైనా కేసులో నిందితులుగా ఉన్నా లేదా శిక్షపడినా... అధికార పక్షానికి అనుకూలంగా లేకపోయినా అలాంటివారి ఇళ్లూ, దుకాణాలూ కూల్చేయడానికి బుల్డోజర్లు అత్యుత్సాహంతో ఉరుకుతున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. నిర్మాణ నిబంధనల్ని తీవ్రంగా ఉల్లంఘించారని తేలినా, ప్రభుత్వ భూమినో, మరొకరి భూమినో దురా క్రమించి కట్టారని తేలినా అలాంటివాటిని కూల్చేయటాన్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ అందుకొక విధానం ఉండాలి. చట్ట నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి. తప్పు చేశారని ఆరోపణ లొచ్చినవారికి తగిన నోటీసులిచ్చి వారి సంజాయిషీ కోరాలి. సంతృప్తి చెందనట్టయితే ఆక్రమణ దారులకు హేతుబద్ధమైన వ్యవధినిచ్చి కూల్చివేత ప్రక్రియ ప్రారంభించాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు విచారిస్తున్న కేసు సంగతే తీసుకుంటే 2021 మార్చి 1న మొదటిసారి అక్కడ నివాసముంటున్నవారికి నోటీసులు వచ్చాయి. వారికి అంతకు దాదాపు మూణ్ణెల్ల ముందే... అంటే జనవరి 8న నోటీసులిచ్చినట్టు, అందులో ఆ నెల 27లోగా ఎవరికివారు సొంత ఖర్చులతో ఇళ్లు కూల్చేయాలని ఆదేశించినట్టు ఉంది. దానికి స్పందన రాకపోవటంతో తాజాగా నోటీసులు జారీచేశామని అందులో పేర్కొన్నారు. మరో ఆరు రోజుల్లో బుల్డోజర్లతో వచ్చి ఇళ్లు కూల్చేశారు. తొలుత నోటీసులు వ్యక్తిగతంగా ఇవ్వటానికి చేసిన ప్రయత్నం విఫలం కావటంతో ఇళ్ల దగ్గర అతికించామన్న ప్రభుత్వ వాదనను న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ లతో కూడిన బెంచ్ విశ్వసించలేదు. పిటిషనర్లకు సహేతుకమైన వ్యవధినిచ్చిన దాఖలా కనబడటం లేదని, ఇది పౌరులకు రాజ్యాంగంలోని 21వ అధికరణ ద్వారా సమకూరిన ఆవాస హక్కును ఉల్లంఘించటమేనని తేల్చిచెప్పింది. ఈ తీర్పు అనేకవిధాల ఎన్నదగినది. పిటిషనర్లకు ఆ స్థలంపై చట్టబద్ధమైన హక్కుందా లేదా అన్న అంశంలోకి ధర్మాసనం పోలేదు. దానిపై వారు విడిగా న్యాయస్థానాల్లో తేల్చుకోవాల్సిందే! 2023 ఏప్రిల్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన రాజకీయ నాయకుడు, పలు కేసుల్లో నింది తుడైన అతీఖ్ అహ్మద్ అక్రమంగా ఆక్రమించుకున్న భూమిలో ఈ ఇళ్లున్నాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఎన్నడో 1906లో అప్పటి అలహాబాద్ జిల్లా కలెక్టర్ షకీర్ అహ్మద్ అనే వ్యక్తికి 30 ఏళ్లకు లీజుకిచ్చి మరో రెండు దఫాలు పొడిగించుకునే వీలు కల్పించారని రికార్డులు చెబు తున్నాయి. 1960లో జిల్లా మేజిస్ట్రేట్ అనుమతితో షకీర్ దాని హక్కుల్ని వేరేవారికి బదలాయించాడు. ఆ తర్వాత క్రమంలో అది మరికొందరి చేతులు మారింది. చివరకు ప్రస్తుత పిటిషనర్లు దాన్ని కొనుగోలు చేశారు. ప్రభుత్వం వాదిస్తున్నట్టు ఆ కొనుగోలు చెల్లకపోవచ్చు. అది ప్రజా ప్రయోజనం కోసం వినియోగించాల్సిన భూమే కావొచ్చు. అంతమాత్రాన నిబంధనలకు తిలోదకాలిచ్చి ఇళ్లు కూల్చటం సరైన చర్య కాదు. సుప్రీంకోర్టు తీర్పు దీన్ని తేటతెల్లం చేసింది.ఈ సందర్భంగా వేరేచోట బుల్డోజర్ కూల్చివేతలు సాగిస్తుండగా ఒకటో తరగతి బాలిక అనన్యా యాదవ్ తన స్కూల్ బ్యాగ్ను రక్షించుకోవటానికి మంటలంటుకున్న షెడ్ సమీపానికి వెళ్లిన వీడియోను న్యాయమూర్తులు ప్రస్తావించటం గమనార్హం. అలాంటి ఉదంతాలు అందరినీ దిగ్భ్రాంతిపరుస్తాయన్న వారి వ్యాఖ్యలతో ఏకీభవించని వారుండరు. గత నవంబర్లో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సైతం ఇటువంటి వ్యాఖ్యలే చేసింది. ‘ఇళ్లు కూల్చినప్పుడల్లా నిశిరాత్రిలో నడిరోడ్లపై చిన్నారులూ, మహిళలూ విలపిస్తున్న దృశ్యాలు అరాచకానికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి’ అని ధర్మాసనం గుర్తు చేసింది. ఇలాంటి సంద ర్భాల్లో కూల్చివేతలకు పాల్పడిన అధికారుల నుంచి ఇళ్ల, దుకాణాల పునర్నిర్మాణానికి అయ్యే వ్యయం వసూలు చేయాలని కూడా చెప్పింది. ఇతర మార్గదర్శకాలు కూడా రూపొందించింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలైనా ప్రభుత్వాల కళ్లు తెరిపించాలి. కేవలం అయిదేళ్ల కోసం ఎన్నికై అధి కారంలోకొచ్చిన ప్రభుత్వాలు శాశ్వతంగా నిలిచే రాజ్యాంగ విలువలను కాలరాయటం, ఇష్టాను సారం ప్రవర్తించటం తప్పుడు సంకేతాలిస్తుంది. సాధారణ పౌరుల్ని కూడా చట్ట ఉల్లంఘనలకు ప్రోత్సహిస్తుంది. అందుకే ప్రభుత్వాలు ఎంత త్వరగా మేల్కొంటే అంత మంచిది. నాలుగేళ్లు ఆలస్యమైనా సర్వోన్నత న్యాయస్థానంలో బాధితులకు సరైన న్యాయం దక్కటం హర్షించదగ్గది. -
బంగ్లాతో మళ్లీ చెలిమి!
నిరుడు ఆగస్టులో జరిగిన తిరుగుబాటులో అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పదవి కోల్పోయి భారత్లో ఆశ్రయం పొందుతున్నప్పటి నుంచీ భారత–బంగ్లాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనుస్కు లేఖ రాయటం ఆహ్వానించదగ్గ పరిణామం. బంగ్లా జాతీయ దినోత్సవం సందర్భంగా త్యాగాల పునాదులపై నిర్మితమైన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షించారు. పదిహేనేళ్లు పాలించిన హసీనా మత ఛాందసుల్ని అదుపులో పెట్టడంలో సాధించిన విజయాలు ప్రశంసనీయమైనా, రిగ్గింగ్తో విజయాన్ని చేజిక్కించుకోవటం, విపక్ష నేతలను ఏళ్ల తరబడి జైళ్లపాలు చేయటం వంటి ధోరణుల్ని ఎవరూ జీర్ణించుకోలేక పోయారు. తిరుగుబాటు జరి గాక, జనం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టయింది. హసీనా పార్టీ అవామీ లీగ్ నేత లపైనా, కార్యకర్తలపైనా దాడులతో పాటు ఆ పార్టీకి మద్దతు పలికారంటూ పలువురి ఆస్తుల్ని ధ్వంసం చేయటం మితిమీరింది. ఈ అరాచకం ఆపకపోగా అంతా సవ్యంగా ఉందంటూ యూనుస్ దబాయింపులకు దిగారు. మతఛాందసులది పైచేయి అయి మహిళలపైనా, మైనారిటీ హిందూ వర్గంపైనా దాడులకు పూనుకుంటున్నా... వివిధ ప్రాంతాల్లో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు బాగా పెరిగినా అదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. గత డిసెంబర్లో ఆ దేశాన్ని సందర్శించిన మన విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి ఈ నేరాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను బంగ్లా విదేశాంగ సలహాదారు మహమ్మద్ తౌహిద్ హుస్సేన్కు అందజేశారు. భౌగోళిక రాజకీయ కోణంలో బంగ్లాదేశ్తో చెలిమి భారత్కు చాలా అవసరం. అది చిన్న దేశమే అయినా దానితో మనకు 4,096 కిలోమీటర్ల మేర సరిహద్దువుంది. ఇందులో నదీ పరీవాహక ప్రాంతం వేయి కిలోమీటర్లపైన ఉంటుంది. తాగునీటికైనా, సాగునీటికైనా తీస్తా నదీజలాలు ఆ దేశానికి ప్రాణప్రదమైనవి. ఆ నది ప్రవహించే 315 కిలోమీటర్లలోనూ 130 కిలోమీటర్లు బంగ్లాదేశ్ భూభాగంలోనే ఉంటుంది. పశ్చిమబెంగాల్లోని గజల్డోబా బరాజ్ వల్ల భారీ మొత్తం జలాలు ఆ రాష్ట్రానికే పోతాయని, తమకు మిగిలేది అతి తక్కువని బంగ్లా వాదిస్తోంది. ఆ జలాల్లో తమకు 50 శాతం వాటా ఇవ్వాలని కోరుకుంటోంది. చివరకు కనీసం తొలి దశలో 25 శాతం ఇస్తే చాలని రాజీ కొచ్చింది కూడా. కానీ మమత అందుకు కూడా ససేమిరా అన్నారు. వాస్తవానికి 2011లో నాటి యూపీఏ ప్రధాని మన్మోహన్ సింగ్ తీస్తా నదీజలాల పంపకంపై బంగ్లాతో సూత్రప్రాయంగా అంగీకారానికొచ్చారు. ఒప్పందం రూపొందింది. కానీ అప్పుడు కూడా పశ్చిమ బెంగాల్ సీఎంగా వున్న మమతా బెనర్జీ యూపీఏ భాగస్వామి కావటం, ఆ ఒప్పందానికి ఆమె ససేమిరా అనటంతో చివరి నిమిషంలో ఆగిపోయింది. ఫెనీ జలాల విషయంలోనూ ఇలాంటి పీటముడే పడింది. నదీజలాల అంశం తప్ప ఇతరేతర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు బాగుండేవి. భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నదని, తమ ప్రయోజనాలను బేఖాతరు చేస్తున్నదని బంగ్లా ప్రజానీకంలో చాన్నాళ్ల నుంచి అసంతృప్తి వుంది. దానికితోడు హసీనాకు భారత్ గట్టి మద్దతుదారుగా ఉండటంవల్లే ఆమె ఇష్టారాజ్యం సాగిందని, లక్షలాదిమంది తమ కార్యకర్తలను జైళ్లలో పెట్టారని విపక్షాల ఆరోపణ. ఈశాన్య భారత్లో తరచు హింసాత్మక చర్యలకు పాల్పడుతూ బంగ్లాదేశ్ శిబిరాల్లో తలదాచుకునే మిలిటెంట్లను ఆమె హయాంలో భారత్కు అప్పగించేవారు. ఇది కూడా అక్కడి ఛాందసవాదులకు మింగుడుపడలేదు. అయినా ఇరు దేశాలూ ఉమ్మడిగా ఎదుర్కొనాల్సిన సమస్యలూ ఉన్నాయి. ఉదాహరణకు టిబెట్లో బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మించతలపెట్టిన మెడాగ్ జలవిద్యుత్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్దది కాబోతోంది. అది మనతోపాటు బంగ్లాదేశ్ ప్రయోజనాలకు కూడా ముప్పు కలిగిస్తుంది. బంగ్లా సాగు అవసరాల్లో 55 శాతం బ్రహ్మపుత్ర నదీజలాలు తీరుస్తాయి. చైనాలోని టిబెట్లో యార్లుంగ్ సాంగ్పోగా మొదలై మన దేశంలో ప్రవేశించేసరికి బ్రహ్మపుత్ర అయి, బంగ్లాలో అది జమునా నదిగా మారుతుంది. ప్రస్తుత బంగ్లా వాటా జలాల్లో 5 శాతం తగ్గినా సాగు ఉత్పత్తులు 15 శాతం పడిపోతాయని మూడేళ్ల క్రితం బంగ్లా పర్యావరణ శాఖ అంచనా వేసింది. బరాజ్ నిర్మిస్తున్న ప్రాంతం భూకంపాలపరంగా ప్రమాదకరమైనది. భూ అంతర్భాగంలోని టిబెట్ పలక చురుగ్గా ఉండటమే ఇందుకు కారణం. దీనిపై ఇప్పటికే మన దేశం చైనాకు ఆందోళనను తెలియజేయగా, బంగ్లాదేశ్ సైతం ఆ బరాజ్ ప్రభావంపై రూపొందించిన నివేదికలు తమకందించాలని ఆ దేశానికి లేఖ రాసింది.బంగ్లా విముక్తి దినోత్సవంపై ప్రస్తుత పాలకులకు అంత పట్టింపు లేదు. హసీనా పతనానికి దారితీసిన ఉద్యమానికి నాయకత్వం వహించి, ప్రస్తుత ప్రభుత్వంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న విద్యార్థులు తమది తటస్థ దేశంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆ ఆశయంతో గణతాంత్రిక్ ఛాత్ర సంగ్సద్ (ప్రజాతంత్ర విద్యార్థి మండలి) పేరిట గత నెలలో పార్టీ స్థాపించారు. అయితే ఛాందస వాదులు దీన్ని ఎంతవరకూ సాగనిస్తారో తెలియదు. దేశాన్ని మళ్లీ తూర్పు పాకిస్తాన్గా మార్చాలని వారు తహతహలాడుతున్నారు. ఇస్లామిక్ సంప్రదాయాలను అమలు చేయాలని చూస్తున్నారు. వచ్చే నెల 2 నుంచి 4 వరకూ బ్యాంకాక్లో జరగబోయే బంగాళాఖాత దేశాల ఆర్థిక సహకార సంఘం బిమ్స్టెక్ సమావేశం సందర్భంగా మోదీతో భేటీకి బంగ్లా ఆసక్తి చూపుతోంది. తాజా పరిణామంతో అది సాకారమైతే మళ్లీ ఇరు దేశాల స్నేహసంబంధాలూ పట్టాలెక్కుతాయి. -
మహానగరంలో ఏదీ భద్రత?
ఆడపిల్లల భద్రతకు ప్రమాదం పొంచివున్నదని స్పష్టంగా కనబడుతున్నా కళ్లుమూసుకున్న పోలీస్ యంత్రాంగం సాక్షిగా హైదరాబాద్లో మొన్న శనివారం ఒక యువతిపై లైంగిక దాడి జరిగింది.ఎంఎంటీఎస్లో ప్రయాణిస్తుండగా బోగీలో ఎవరూలేని సమయం చూసి దుండగుడు దాడి చేయగా తప్పించుకునే యత్నంలో నడుస్తున్న రైలునుంచి ఆమె దూకి తీవ్ర గాయాలపాలైంది. పగలంతా కిక్కిరిసి వుండే ఎంఎంటీఎస్ రైళ్లు చీకటిపడే వేళకు దాదాపు ఖాళీ అవుతుంటాయి. జనం ఎక్కువున్న సమయాల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా ఆడవాళ్ల బోగీల్లో ఎక్కి వెకిలిచేష్టలకు పాల్పడటం, సెల్ఫోన్లు, ఆభరణాలు అపహరించటం వంటివి పెరిగాయని అనేకులు చెబుతున్నారు. హిజ్రాల ఆగడాలు సరేసరి. ఒంటరిగా ప్రయాణించక తప్పని స్థితిలో ఈ అరాచకాలు ఇంకెంత మితిమీర గలవో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఈ మాదిరి ఉదంతాలపై నిత్యం ఫిర్యాదులు అందుతూనే ఉంటాయని మీడియా కథనాలు చెబుతున్నాయి. ప్రయాణికుల సంఘాలు కూడా ఆందోళనలు చేసినా పోలీసులు మేల్కొనలేదు. రైల్వే భద్రతా దళం(ఆర్పీఎఫ్), ప్రభుత్వ రైల్వే పోలీస్(జీఆర్పీ) విభాగం అసలు దీన్ని సమస్యగానే భావించలేదు. ఆ విభాగాలు కర్తవ్య నిర్వహణలో విఫలం కావటమే నిజమైన సమస్య. కనీసం చీకటిపడింది మొదలు అర్ధరాత్రి సర్వీసులు ఆగిపోయే వరకైనా బందోబస్తు అవసరమని గ్రహించలేదు. సరిగదా అంతక్రితం ఎంఎంటీఎస్ రైళ్లలోవుండే హోంగార్డుల్ని సైతం ఈమధ్య తొలగించారంటున్నారు. హైదరాబాద్ నగరంలో సుమారు 30 ఎంఎంటీఎస్ స్టేషన్లువుంటే కేవలం పది స్టేషన్లలో మాత్రమే భద్రత ఉండటం, అది కూడా అంతంత మాత్రం కావటం దారుణం. స్టేషన్లలో అక్కడక్కడ పేరుకు ఆర్పీఎఫ్, జీఆర్పీ కానిస్టేబుళ్లు కనబడు తుంటారు. కానీ మహిళల కోచ్లు ఎలావున్నాయో, భద్రత ఏ మేరకు అవసరమో గమనించేపాటి పని కూడా వారినుంచి ఆశించే స్థితి లేదంటే నిర్వాహకులు సిగ్గుపడాలి. సాంకేతికత విస్తరించిన ఈ కాలంలో కూడా దాన్ని సవ్యంగా వినియోగించలేని అశక్తతలో ప్రభు త్వాలుండటం విచారకరం. హైదరాబాద్ నగర శివారులో 2019 నవంబర్లో ఒక మహిళా వైద్యు రాలిని అపహరించి, ఆమెపై అత్యాచారం జరిపి హత్య చేసిన ఉదంతం చోటు చేసుకున్నప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాన్ని తెలంగాణకు సంబంధించిందిగా చూడలేదు. అలాంటి పరిస్థితి ఏపీలో తలెత్తకూడదన్న సంకల్పంతో పోలీస్ వ్యవస్థను కదిలించి కేవలం మూడు నెలల వ్యవధిలోనే దిశ యాప్ అందుబాటులోకి తెచ్చారు. దిశ ప్రత్యేక పోలీస్ స్టేషన్లు నెలకొల్పారు. లక్షలాదిమంది ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోవటంవల్ల ఆపత్కాలంలో అనేకమందిని రక్షించటం సాధ్యమైంది. 2021 సెప్టెంబర్లో ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష రాయటానికి ఢిల్లీ వెళ్లిన ఏపీ యువతి తెల్లారుజామున దిగి ఆటో ఎక్కాక కీడు శంకించినప్పుడు దిశ యాప్ వల్లే పోలీసులను అప్రమత్తం చేసింది. ఏపీ పోలీసుల సమన్వయంతో ఆమె క్షేమంగా పరీక్ష రాసింది. తిరిగి ఏపీకి వెళ్లే రైలు ఎక్కేవరకూ సాయం దొరికింది. హైదరాబాద్లో బెంగళూరు వెళ్లే రైలెక్కిన మహిళ సైతం ఈ యాప్ను ఉపయోగించుకునే తనను తాను రక్షించుకోగలిగింది. దేశంలో ఏ మూలనున్నా ఈ యాప్ ద్వారా సమాచారం అందుకుని మహిళలను రక్షించిన ఉదంతాలు కోకొల్లలు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక వెనకా ముందూ చూడకుండా దీన్ని రద్దుచేశారు. తొమ్మిది నెలలు జాప్యంచేసి, అదే యాప్కు సురక్షా అనే పేరు తగిలించి ఈ నెల మొదటివారంలో మళ్లీ తీసుకొచ్చారు. వేషం మారిన ఈ యాప్పై మహిళల్లో పెద్దగా ప్రచారం చేసిన దాఖలా కూడా లేదు. అఘాయిత్యాలు మితిమీరిన ఈ కాలంలో దిశవంటి యాప్ను కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేవరకైనా కొనసాగించాలన్న ఇంగితజ్ఞానం కూటమి ప్రభు త్వానికి లేకపోయింది. బహుశా ఆ యాప్ కొనసాగివుంటే ఎంఎంటీఎస్లో ఆపదలో చిక్కుకున్న యువతికి అది ఆసరాగా నిలిచేదేమో! ఎక్కడో వేరే రాష్ట్రంలోవున్న యువతులకు ఆపత్కాలంలో సాయపడటం మాట అటుంచి, తాడేపల్లిలో డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో దుండ గుల బారిన పడిన మహిళను కూడా కాపాడలేని అశక్తతలో ఏపీ పోలీసులు కూరుకుపోయారు. ఫలితంగా ఆ మహిళపై దుండగులు అత్యాచారం చేసి, హతమార్చారు. అదే ప్రాంతంలో మొన్న జనవరి 31న మరో మహిళ బలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈమాదిరి అఘాయిత్యాలకు అంతేలేదు.ఎంఎంటీఎస్ ఉదంతంలో రైల్వే పోలీసులు బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. దుండ గుడు పట్టుబడవచ్చు కూడా. ఈ ఉదంతం పోలీసులకు ఎలాంటి గుణపాఠం నేర్పిందోగానీ మళ్లీ మరోటి జరిగేవరకూ పట్టనట్టు వ్యవహరించే ధోరణికి ఇకనైనా స్వస్తి పలకాలి. ఖర్చు తగ్గించుకుని లాభార్జన చేయాలన్న యావ భద్రతకు తూట్లు పొడుస్తుందన్న సంగతి ఎంఎంటీఎస్ నిర్వాహకులు తెలుసుకోవాలి. ఆకతాయిలూ, అసాంఘిక శక్తులూ, యధేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించేవారూ తమకేం కాదన్న భరోసాతో ఉండటం మహిళలకూ, పిల్లలకూ ప్రాణాంతకమవుతుంది. రైల్వే స్టేషన్లతోపాటు బోగీల్లో సైతం సీసీ కెమెరాలుంటే, వాటిని నిత్యం పర్యవేక్షిస్తుంటే, తక్షణం చర్యలు తీసుకునే యంత్రాంగం పనిచేస్తే ఆగడాలను అరికట్టడం సులభమవుతుంది. అలాగే మహిళల రక్షణకు తగిన యాప్ను అందుబాటులోకి తీసుకురావాలి. గడప దాటితే క్షేమంగా తిరిగొస్తామో లేదోనన్న భయాందోళనల మధ్య పౌరులు బతికే దుఃస్థితి ఉండటం మంచిదికాదని ప్రభుత్వం, రైల్వేశాఖ గుర్తించాలి. -
ఇంతకూ ఆ కరెన్సీ ఎక్కడ?
దేశంలో అవినీతి సర్వాంతర్యామి అని, ఏ వ్యవస్థా అందుకు అతీతం కాదని గ్రహించినవారిని సైతం దిగ్భ్రాంతిపరిచేలా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో జరిగిన అగ్ని ప్రమాదం ఉదంతం రకరకాల మలుపులు తిరుగుతోంది. ఆ ఘటనలో భారీ మొత్తంలో కాలిన కరెన్సీ నోట్ల కట్టలున్న సంచులు బయటపడ్డాయని గుప్పుమంది. సుప్రీంకోర్టు వెబ్సైట్లో సైతం అందుకు సంబంధించిన వీడియో ఉంది. కానీ నోట్ల కట్టల సంగతి అబద్ధమని, కుట్రపూరితమని అంటున్నారు న్యాయమూర్తి. పైగా తానుంటున్న నివాసానికి విడిగా, అందరూ వచ్చిపోగలిగేలా ఉండే ఆ స్టోర్ రూమ్కు తాళం కూడా ఉండదని, అలాంటిచోట అంత డబ్బు ఎవరైనా దాస్తారా అన్నది ఆయన ప్రశ్న. కానీ, సామాన్యుల్లో తలెత్తుతున్న ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి. ఆయ నొక్కరే కాదు... బాధ్యతాయుత స్థానాల్లోవున్న చాలామంది సంజాయిషీ ఇవ్వకతప్పని ప్రశ్నలవి. ఈ నెల 14 అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగితే 21వ తేదీన మీడియా బయటపెట్టేవరకూ అధికారికంగా ఎందుకు వెల్లడించలేదు? న్యాయవ్యవస్థ, పోలీస్, అగ్నిమాపక విభాగాలు మౌనంగా ఎందుకు ఉండిపోయాయి? న్యాయమూర్తిపై అంతర్గత విచారణ నిర్వహిస్తున్నామని ఈ ఉదంతం వెల్లడైన వెంటనే సుప్రీంకోర్టు తెలిపింది. కానీ ఆయన విధులకు దూరంగా వుంటారని ఆ మర్నాడు ప్రకటించింది. బదిలీ చేశామని తాజాగా చెబుతోంది. మంచిదే. కానీ ఘటన తర్వాత వారంపాటు ఆయన విధులు ఎలా నిర్వర్తించగలిగారు? స్టోర్రూమ్కు తాళం లేదని జస్టిస్ వర్మ చెబుతున్నారు. ఘటన సంగతి తెలిశాక తానిచ్చిన ఆదేశాలతో అక్కడికెళ్లిన హైకోర్టు రిజిస్ట్రార్ సైతం ఆ మాటే అన్నారని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ అంటున్నారు. మరి తాళంవున్న గదిలోనే మంటలు రేగాయని పోలీసులు ఎలా చెబుతున్నారు? అసలు అగ్నిమాపక విభాగం తనకున్న నిబంధనల మేరకు నిర్వహించాల్సిన పంచనామా పూర్తిచేసిందా? అక్కడ గుర్తించదగిన లేదా సగం కాలిన సరుకు గురించిన వివరాలు నమోదు చేసిందా? ఇద్దరు సాక్షులతో ఆ పంచ నామాపై సంతకం చేయించిందా? మంటలు ఆర్పిన సందర్భంలో తమకు నోట్ల కట్టలున్న సంచు లేమీ కనబడలేదని ఢిల్లీ అగ్నిమాపక విభాగం చీఫ్ అతుల్ గార్గ్ శనివారం చెప్పారు. అలాంటి ప్రకటనేమీ తానీయలేదని ఆ మర్నాడు ఖండించారు. మళ్లీ గొంతు సవరించుకుని కరెన్సీ నోట్లు దొరకలేదని ఇప్పుడంటున్నారు. సుప్రీంకోర్టు వెబ్సైట్లో పెట్టిన వీడియోలో కాలిపోయిన, సగంకాలిన నోట్లు స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ ఆశ్చర్యకరంగా ఇప్పుడా నోట్లు మాయమ య్యాయి. పోలీస్ కమిషనర్ సైతం తన ప్రెస్నోట్లో పనికిరాని స్టేషనరీ సామాను కాలిపోయిందని తెలియజేశారు తప్ప కరెన్సీ నోట్ల సంగతి ప్రస్తావించలేదు. 14వ తేదీ రాత్రి జరిగిన ప్రమాదంలో కాలిబూడిదైన సామానంతా ఆ మర్నాడు ఉదయం అక్కడి నుంచి తొలగించారు. ఈ పనంతా చేసిందెవరన్న ప్రశ్నకు సమాధానం లేదు. న్యాయమూర్తితోపాటు అగ్నిమాపక విభాగం, పోలీసులు కరెన్సీ లేదని చెబుతుండగా, ఆ నివాసానికి సమీపంలోనే పారిశుద్ధ్య సిబ్బందికి ఒకటి రెండు కాలిన నోట్లు కంటబడ్డాయి. అంటే... ఇందులో నిగూఢంగా ఏదో జరుగుతున్నట్టే కదా!ఈ ఉదంతంలో పారదర్శకంగా వ్యవహరించటానికి సర్వోన్నత న్యాయస్థానం ప్రయత్నించటం అసాధారణమైంది, అభినందించదగ్గది కూడా. మంటల్లో బుగ్గి అయిన కరెన్సీ నోట్ల వీడియోనూ, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన ప్రాథమిక నివేదికనూ తన వెబ్ సైట్లో ఉంచింది. గతంలో న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు వచ్చిన సందర్భాలున్నా ఎన్నడూ ఇలా జరగ లేదు. అంతేగాక పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శీల్ నాగూ, హిమా చల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంథావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనూ శివరామ న్లతో ఈ వ్యవహారంపై విచారణకు సుప్రీంకోర్టు ఒక కమిటీని కూడా ఏర్పాటుచేసింది. అయితే అంతమాత్రాన అంతా సక్రమంగా సాగుతోందని భావించనక్కరలేదు. కాలిబుగ్గయిన కరెన్సీ నోట్ల సంచులు మాయమవటం, ఎవరూ నోట్ల సంగతి ధ్రువీకరించకపోవటం సందేహాలకు తావిస్తోంది. రాజ్యానికి సంబంధించిన మూడు ప్రధాన అంగాల్లో ఒక్క న్యాయవ్యవస్థకు మాత్రమే ఆ మూడింటి పరిధులనూ నిర్ణయించగల గొప్ప అధికారాన్ని రాజ్యాంగం ఇచ్చింది. కానీ ఆ బరువు బాధ్యతలకు తగ్గట్టుగా న్యాయవ్యవస్థ జవాబుదారీతనంతో ఉంటున్నదా? గత అనుభవాలు గమనిస్తే లేదన్న సమాధానమే వస్తుంది. కొలీజియం వ్యవస్థను మార్చాలని నిశ్చయించుకుని ఎన్డీయే సర్కారు బిల్లు తెచ్చినప్పుడు పార్లమెంటులో అనేకులు న్యాయవ్యవస్థ తీరుతెన్నులపై తీవ్ర విమర్శలు చేశారు. ఒకరిద్దరు న్యాయమూర్తులపై అభిశంసన వరకూ వెళ్లింది. కానీ విధాన సంబంధమైన సంక్లిష్టత వల్ల అవి వీగిపోయాయి. కొందరు రాజీనామా చేశారు. మరికొందరిపై చేసిన దర్యాప్తు అతీగతీ లేదు. న్యాయాన్యాయాలను విశ్లేషించి తీర్పులివ్వాల్సిన స్థానంలో ఉన్నందువల్ల న్యాయమూర్తులకు పటిష్ఠమైన రక్షణ కవచం ఉండాల్సిందే. దురుద్దేశంతో, కుయుక్తులతో వారిపై నీలాపనిందలు వేసే ధోరణులను అడ్డుకోవాల్సిందే. కానీ అది అవినీతి మకిలి అంటినవారికి ఆలంబన కారాదు. ఈ రెండింటి మధ్యా సమతౌల్యం సాధించటానికి ఇంతవరకూ ఎలాంటి ప్రయ త్నమూ జరగకపోవటమే సమస్యకు మూలం. ఇప్పుడున్న కొలీజియం బదులు మరొకటి వస్తే అంతా మారిపోతుందనుకోవటానికి లేదు. స్వయంప్రక్షాళనకు నడుంబిగించి జవాబుదారీతనం పెంపొందించే పకడ్బందీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనంతవరకూ ఈ పరిస్థితి మారదు. -
యవ్వనోత్సవం
జీవితంలో బాల్యం ఆటపాటల్లో శరవేగంగా గడచిపోతుంది. శరీరంలో శక్తులన్నీ ఉడిగిపోయినప్పుడు మీదపడే వార్ధక్యం కుంటినడకన సాగుతుంది. బాల్యంలో ఊహ తెలిసే దశకు వచ్చినప్పుడు త్వరగా యువకులుగా మారిపోవాలని కోరుకోవడం సహజం. నడివయసు కూడలికి వచ్చే సరికి యవ్వనం కొద్దిరోజుల్లోనే కరిగిపోతుందనే బెంగ మనసును పీడించడం కూడా అంతే సహజం. జీవితంలోని బాల్య వార్ధక్యాల మధ్య వచ్చే యవ్వనం ఒక కీలక దశ. అంతేకాదు, ఉత్పాదక దశ కూడా! బాల్య వార్ధక్య దశల్లో జీవనభారాన్ని మోసే శక్తి ఉండదు. ఒంట్లోని జవసత్త్వాలు ఉండే యవ్వనంలోనే జీవితాన్ని ఎంతోకొంత తీర్చిదిద్దుకోవడానికి కుదురుతుంది. జీవితంలో అందుబాటులో ఉన్న స్వేచ్ఛా సౌఖ్యాలను తనివితీరా అనుభవించడానికి వీలవుతుంది.యవ్వనాన్ని సార్థకం చేసుకోగలిగిన మనుషులు లోకంలో తక్కువగానే ఉంటారు. చాలామంది యవ్వనాన్ని నిరర్థకంగా గడిపేసి, వార్ధక్యంలో గడచిపోయిన రోజులను తలచుకుంటూ వగచి వలపోస్తారు. ‘లడక్పన్ ఖేల్ మే ఖోయా/ జవానీ నీంద్భర్ సోయా/ బుఢాపా దేఖ్కర్ రోయా’ అన్నాడు హిందీ సినీకవి శైలేంద్ర. బాల్యాన్ని ఆటపాటల్లో పోగొట్టుకుని, యవ్వనాన్ని ఒళ్లెరుగని నిద్రలో పోగొట్టుకుని, వార్ధక్యంలో వాటిని తలచుకుని రోదించే మనుషుల తీరును ఆయన మూడు ముక్కల్లో తేల్చేశాడు. ఇదే విషయాన్ని శంకరాచార్యుడు ‘బాల స్తావ త్క్రీడాసక్తః తరుణ స్తావ త్తరుణీసక్తః/ వృద్ధ స్తావ చ్చింతాసక్తః పరమే బ్రహ్మణి కో2పి న సక్తః’ అని ఏనాడో చెప్పాడు.బాల్య వార్ధక్యాలను ఎక్కువ కాలం కొనసాగించాలని ఎవరూ కోరుకోరు గాని, యవ్వనాన్ని వీలైనంతగా పొడిగించుకోవాలని, కుదిరితే గిదిరితే జీవితాంతం నిత్యయవ్వనులుగా కొనసాగాలని కోరుకోనివారు ఉండరు. నిత్యయవ్వనం మానవమాత్రులకు అసాధ్యమని అందరికీ తెలుసు. ఇది తీరే కోరిక కాదని తెలిసినా, కోరుకుంటారు. తీరని కోరికలను కూడా కోరుకోవడమే కదా మానవ స్వభావం. శుక్రాచార్యుడి శాపం వల్ల ముదిమి పొందిన యయాతి తన కొడుకు పురుడి ద్వారా పునఃయవ్వనం పొందాడు. సుకన్యను చేపట్టిన చ్యవనుడు అశ్వనీ దేవతల అనుగ్రహంతో పునఃయవ్వనం పొందాడు. జరా మరణాలను జయించి అమరులు కావడానికి దేవతలు అమృతం తాగారు. అమృతం కోసం దానవులతో కలసి క్షీరసాగర మథనం చేశారు. అమృతం దానవులకు దక్కకుండా ఉండటానికి శ్రీమహావిష్ణువు జగన్మోహిని అవతారం దాల్చి, దేవతలకు అమృతం పంచిపెట్టాడు. మన పురాణాల్లో ఉన్న ఈ గాథలు అందరికీ తెలిసినవే! ఇలాంటి గాథలు ప్రాచీన గ్రీకు పురాణాల్లోనూ ఉన్నాయి. గ్రీకుల యవ్వన దేవత హీబీ దేవతలకు ‘ఆంబ్రోజా’ అనే దివ్య ఫలహారాన్ని, ‘నెక్టర్’ అనే అమృతం వంటి పానీయాన్ని పంచిపెట్టిందట! ‘ఆంబ్రోజా’, ‘నెక్టర్’ల మహిమ వల్లనే దేవతలు నిత్య యవ్వనులు కాగలిగారని గ్రీకు పురాణాల కథనం.‘జీవితం మధుశాల యవ్వనం రసలీల/ రేపటి మాటేల? నవ్వుకో ఈవేళ’ అన్నారు వీటూరి. ‘పాడు జీవితము యవ్వనము మూడునాళ్ల ముచ్చటలోయి/ అయ్యయ్యొ నీదు పరుగులెచ్చట కోయి’ అన్నారు ఆరుద్ర. జీవితం క్షణభంగురం అని వేదాంతులు చెబుతారు. కోరికలు దుఃఖ హేతువులని, వాటిని జయించాలని ప్రవచనాలు చెబుతారు. ఎవరు ఎన్ని చెప్పినా, జీవితాన్ని ఆస్వాదించడానికి యవ్వనం ముఖ్య సాధనమనే ఎరుక కలిగినవారే ఏ క్షణానికి ఆ క్షణమే యవ్వనోద్ధృతితో జీవితాన్ని నిండుగా ఆస్వాదిస్తారు. వెర్రి వేదాంతుల మాటలను తలకెక్కించుకునే అర్భకులు– క్షణభంగుర సిద్ధాంతం బుర్రలో బొంగరంలా గింగిరాలు తిరుగుతుంటే, యవ్వనాన్ని అనవసరంగా వృథా చేసుకుని, నిష్ప్రయోజకులుగా బతుకు చాలిస్తారు.పునఃయవ్వనం పొందినవాళ్లు మనకు పురాణాల్లోను, కాల్పనిక సాహిత్యంలోను తప్ప నిజజీవితంలో కనిపించరు. నిత్యయవ్వనం మానవాళి సామూహిక ఆకాంక్ష. దీనిని నెరవేర్చడానికే ఆధునిక వైద్య పరిశోధకులు కూడా శక్తివంచన లేకుండా పరిశోధనలు సాగిస్తున్నారు. వారి వైద్య పరిశోధనలు ఫలించినట్లయితే, పునఃయవ్వనం పొందడానికి జనాలు ఎగబడి మరీ పోటీలు పడతారు. పరిశోధనలు ప్రాథమిక దశలో ఉండగానే, కొందరు అపర కుబేరులు ఖర్చుకు వెనుకాడ కుండా తమ యవ్వనాన్ని పొడిగించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్న ఉదంతాలు అడపాదడపా కథనాలుగా వెలువడుతూనే ఉన్నాయి. యవ్వనం ఉడిగి వయసుమళ్లి వార్ధక్యం ముంచుకు రావడాన్ని సహజ పరిణామంగానే చాలా కాలంగా భావిస్తూ వస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటి వరకు వార్ధక్యాన్ని వ్యాధిగా గుర్తించ లేదు గాని, వార్ధక్యం కూడా ఒక వ్యాధేనని కొందరు వైద్యపరిశోధకుల వాదన. వార్ధక్యాన్ని నివారించి, వయసును వెనక్కు మళ్లించే దిశగా వైద్య పరిశోధనలు ఇటీవలి కాలంలో ముమ్మరంగా సాగుతున్నాయి. వయసును వెనక్కు మళ్లించడానికి అమృతం వంటిదేదీ అవసరం లేదని, అసలైన యవ్వన కీలకం మానవ దేహంలోనే ఉందని తాజాగా జపాన్లోని ఒసాకా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. మానవ శరీరంలో ఒత్తిడికి లోనయ్యే కణాలకు ‘ఏపీ2ఏ1’ అనే ప్రొటీన్ సరఫరాను నిలిపివేసినట్లయితే, శరీరంలోని ప్రతి కణం పునఃయవ్వనాన్ని పొందగలుగుతుందని చెబుతున్నారు. ‘ఏపీ2ఏ1’ ప్రొటీన్ను నియంత్రించడానికి చేపట్టే చికిత్స పద్ధతులే పునఃయవ్వన చికిత్స పద్ధతులు కాగలవని అంటున్నారు. వారి ప్రయోగాలే గనుక ఫలిస్తే, ముందుండేది ముసళ్ల పండుగ కాదు, మానవాళికి అది యవ్వనోత్సవమే అవుతుంది. -
ట్రంప్ ద్వంద్వ ప్రమాణాలు
ద్విపాత్రాభినయం చేసే హీరోల సినిమాలకు ఒకప్పుడు జనాదరణ బాగుండేది. ఇద్దరూ ఒకరే అని తెలిసినా రెండు వేషాలతో మెప్పించే తీరు చూసి జనం ముచ్చటపడేవారు. ప్రపంచ యవనికపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అలాంటి పాత్రల్లోనే జీవిస్తున్నారు. యూరప్లో శాంతిమంత్రం పఠిస్తారు. రష్యా–ఉక్రెయిన్లు రాజీ పడాలంటారు. అందుకు షరతులు పెట్టిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని గెంటేసినంత పనిచేస్తారు. పశ్చిమాసియాలో ఇరాన్కు స్నేహ హస్తం అందిస్తారు. గాజాలో మారణహోమానికి ఇజ్రాయెల్ను ప్రోత్సహిస్తారు. యెమెన్లో వైమానిక దాడులకు తానే ఆదేశాలిస్తారు. ఒక అగ్రరాజ్యాధినేత ఏకకాలంలో ఇన్ని వైరుద్ధ్యాలు ప్రదర్శించటం గతంలో ఎప్పుడూ లేదేమో! ఒకపక్క జెలెన్స్కీ మూడో ప్రపంచయుద్ధ ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నారని ఆరోపించిన ట్రంప్... వేరొకచోట అదే ప్రమాదానికి దారితీసే పోకడలకు ఎందుకు పాల్పడుతున్నారో అనూహ్యం. తన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఉక్రెయిన్, గాజాల్లో శాంతి సాధిస్తానని పదే పదే ట్రంప్ చెప్పారు. కానీ దాని అర్థం ఇదా అని అమెరికా పౌరులే ఆశ్చర్యపోతున్నారు. రష్యా– ఉక్రెయిన్ లడాయి మూడేళ్లపాటు ఎడతెరిపి లేకుండా ఎందుకు కొనసాగిందో అందరికీ తెలుసు. జో బైడెన్ ఏలుబడిలోని అమెరికా... యూరప్ దేశాలతో చేతులు కలిపి ఉక్రెయిన్ ద్వారా రష్యాను చికాకుపరిచి, ఆ వంకన నాటోను తూర్పున విస్తరించే ప్రయత్న పర్యవసానమే ఆ యుద్ధం.రష్యా–ఉక్రెయిన్ల విషయంలోనే ట్రంప్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు. తన కాల్పుల విరమణ ప్రతిపాదనకు జెలెన్స్కీ షరతులు పెట్టడాన్ని ఏమాత్రం సహించలేని ట్రంప్... అదే రకంగా వ్యవహరించిన పుతిన్తో సౌమ్యంగా ఉంటున్నారు. జెలెన్స్కీ తమ భద్రతకు గ్యారెంటీ ఇవ్వాలన్నారు. దురాక్రమించిన ప్రాంతాలను తిరిగి ఇప్పించాలని కోరారు. నాటో సభ్యత్వం కావా లని అడిగారు. కానీ పుతిన్ అసలు కాల్పుల విరమణకే అంగీకరించలేదు. మూడు రోజులక్రితం మళ్లీ రెండోసారి మాట్లాడాక పరిమిత కాల్పుల విరమణకు ఒప్పుకున్నారు. పరస్పరం ఇంధన గ్రిడ్ల పైనా, ఇతర మౌలిక సదుపాయాలపైనా దాడులు చేసుకోవద్దన్నది ఆయన ప్రతిపాదన. ఉక్రెయిన్ ఏం చేయాలో ట్రంప్, పుతిన్లు నిర్ణయించారు. నల్లసముద్ర ప్రాంతంలో ఇరు నావికాదళాల దాడుల నిలిపివేతపై కూడా ఒక అంగీకారానికొచ్చాక శాంతి చర్చలు మొదలవు తాయంటున్నారు. ఇవన్నీ గమనిస్తూ కూడా తమ సార్వభౌమత్వం విషయంలో రాజీపడేదేలేదని ఇప్పటికీ జెలెన్స్కీ బడాయి పోతున్నారు. ఉక్రెయిన్ భూభాగంలోని క్రిమియాను రష్యా 2014లో ఆక్రమించగా, 2022లో యుద్ధం మొదలయ్యాక తూర్పు ఉక్రెయిన్లోని మరో నాలుగు ప్రాంతాల్లో భూభాగాన్ని సైతం అది సొంతం చేసుకుంది. మొత్తానికి ఉక్రెయిన్లోని అయిదోవంతు భూభాగం రష్యా అధీనంలో ఉంది. ఇందులో అంగుళం భూమిని కూడా వదలబోనని పుతిన్ పదే పదే చెబుతున్నారు. పశ్చిమాసియాలో ట్రంప్ కనీసం ఈమాత్రం కూడా చేయటంలేదు. తమ బందీలను హమాస్ మిలిటెంట్లు విడుదల చేయలేదన్న సాకుతో గాజాలో ట్రంప్ అండతోనే ఇజ్రాయెల్ నరమేధం సాగి స్తోంది. మొన్న మంగళవారం వైమానిక దాడుల్లో 413 మంది పౌరులను హతమార్చగా గురువారం ఇజ్రాయెల్ సైన్యం నేరుగా విరుచుకుపడి 70 మందికి పైగా పౌరులను కాల్చిచంపింది. ఈ దాడుల తర్వాత ఇజ్రాయెల్ ఉపయోగించిన భాష కూడా అభ్యంతరకరంగా ఉంది. తమ బందీలను హమాస్ విడిచిపెట్టేవరకూ దాడులు తప్పవని, ఆ సంస్థకు ఆశ్రయం కల్పించినంతకాలమూ సాధా రణ పౌరులు కనీవినీ ఎరుగని రక్తపాతం చవిచూడాల్సివస్తుందని రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ హెచ్చరించారు. బందీల అప్పగింత ప్రక్రియ పూర్తయ్యాక గాజా పౌరులను ప్రపంచంలో కోరుకున్న ప్రాంతాలకు తరలిస్తారట. లేనట్టయితే భారీ వినాశనం తప్పదట. యెమెన్లో సైతం ట్రంప్ తీరుతెన్నులు అలాగే ఉన్నాయి. గతవారం ఆ దేశంలో హౌతీ మిలి టెంట్ల స్థావరాలుగా భావిస్తున్న ప్రాంతాల్లో 40 వైమానిక దాడులు జరిపించారు. గాజా వాసులను ఇజ్రాయెల్ బెదిరిస్తున్న మాదిరే హౌతీలనూ, వారికి మద్దతిస్తున్నదని భావిస్తున్న ఇరాన్నూ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్పై నేరుగా యుద్ధం చేసే అవసరాన్ని తప్పించుకోవటానికీ, ఆ దేశాన్ని అణు చర్చలకు ఒప్పించటానికీ హౌతీలపై విరుచుకుపడటమే మార్గమని ఆయన భావిస్తున్నట్టు కనబడు తోంది. కానీ హౌతీలు సులభంగా లొంగివచ్చే రకం కాదు. వారు ఎర్ర సముద్రంలో మాటుగాసి అంతర్జాతీయ నౌకా రవాణాను అడ్డుకుంటున్న మాట వాస్తవమే అయినా వారితో చర్చించి సమస్య పరిష్కారానికి ప్రయత్నించటమే తెలివైన పని. గాజాలో ఇజ్రాయెల్ దాడులను ట్రంప్ ఆపగలిగితే హౌతీలను చర్చలకు ఒప్పించటం సులభం.అమెరికాలో వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో తన రేటింగ్ శరవేగంగా పడిపోయిన వైనం ట్రంప్ గమనించాలి. మిత్రదేశాలపై సైతం సుంకాల మోత మోగించటం, ఉపాధి కల్పనకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు పెద్దగా ఫలించకపోవటం ఇందుకు తక్షణ కారణం కావొచ్చుగానీ... యూరప్లో అరకొర శాంతి యత్నాలు, ఇజ్రాయెల్లో సాగుతున్న నరమేధం, హౌతీలను అదుపు చేయలేకపోవటం వంటివి కూడా ఆయనపై మరింత వ్యతిరేకత తీసుకొచ్చే అవకాశం ఉంది. అటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ పలుకుబడి సైతం క్షీణిస్తోంది. అందువల్లే చిత్తశుద్ధితో శాంతికి యత్నించటమే ట్రంప్ ముందున్న ఏకైక మార్గం. అప్పుడే ఇంటా బయటా అన్నీ చక్కబడతాయి. లేనట్టయితే మున్ముందు సమస్యలు మరింత ఉగ్రరూపం దాలుస్తాయి. -
ఎంతకాలం ఈ ‘పంచాయతీ’!
రాష్ట్రాల్లో క్రమం తప్పకుండా అయిదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో గద్దెనెక్కేవారు పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల విషయంలో మీనమేషాలు లెక్కించటం పరిపాటయింది. దేశంలో దాదాపు అన్ని చోట్లా ఇదే పోకడ. పల్లెసీమల్లో ప్రజాతంత్ర భావన పెంపొందించి, పంచాయతీరాజ్ సంస్థలను స్థానిక ప్రభుత్వాలుగా పనిచేయనివ్వాలని... వాటికవే అభివృద్ధి ప్రణాళికలను స్వతంత్రంగా రూపొందించుకోవటానికి అవకాశమీయాలన్న సంకల్పంతో మూడున్నర దశాబ్దాల క్రితం 73వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. కానీ ఇప్పటికీ చాలా ప్రభుత్వాలు ఆ సంస్కృతికి పాతరేస్తున్నాయని పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇటీవలి నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. గ్రామ పంచాయతీ కాలపరిమితి ముగిసేలోపు లేదా గడువుతీరిన ఆర్నెల్లలోగా ఎన్నికలు పూర్తి చేయాలని రాజ్యాంగంలోని 243 ఈ (3) నిర్దేశిస్తోంది. ఎన్నికలు సకాలంలో నిర్వహించని రాష్ట్రాలకు కేంద్రంనుంచి పంచా యతీలకు రావాల్సిన నిధులు ఆగిపోతున్నాయి. పర్యవసానంగా అభివృద్ధి కుంటుపడుతోంది. గ్రామాలు పారిశుద్ధ్య లేమితో, అందువల్ల కలిగే అంటువ్యాధులతో ఇబ్బంది పడుతున్నాయి.పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయటానికి రాష్ట్ర ప్రభుత్వాలు వేనవేల సాకులు చెబుతుంటాయి. అందులో రిజర్వేషన్ల నిర్ధారణ ఒకటి. పారదర్శకత పాటించకుండా, నిబంధనలకు విలు వీయకుండా రూపొందించే ఆ రిజర్వేషన్లు ఎటూ వివాదాస్పదంగా మారి న్యాయస్థానాల పరిశీలనకు వెళ్తాయని, దాన్ని సాకుగా చూపి ఎన్నికలు వాయిదా వేయొచ్చని చాలా ప్రభుత్వాలు అనుకుంటున్నాయి. ఈ విషయంలో కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అగ్రస్థానంలో ఉంది. ఆఖరుసారి 2006లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన ఆ కేంద్రపాలిత ప్రాంతం ఆ తర్వాతనుంచి ఏదో ఒక కారణం చూపిస్తూ వాయిదాల్లోనే కాలక్షేపం చేస్తోంది. సిగ్గుచేటైన సంగతేమంటే... అక్కడ ఫ్రెంచ్ పాలన సాగినన్నాళ్లు స్థానిక సంస్థలు అద్భుతంగా పనిచేశాయి. అభివృద్ధి పనుల ప్రణాళికలు ఒక క్రమపద్ధతిలో అమలయ్యాయి. తీరా స్వాతంత్య్రం వచ్చాక ఆ సంస్థలు నీరసించాయి. అధికారంలోకి ఎవరొచ్చినా ఏదో వంకతో వాటి ఎన్నికలు వాయిదా వేస్తూ పోయారు. 1954లో జరిగిన రిఫరెండమ్ ద్వారా భారత్లో విలీనానికి మెజారిటీ ప్రజలు సుముఖత వ్యక్తం చేయగా, 1962లో అది పూర్తి స్థాయి కేంద్రపాలిత ప్రాంతమైంది. 1968–2024 మధ్య కేవలం ఒకే ఒక్కసారి 2006లో పంచాయతీరాజ్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలైనా మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పుణ్యమే. అంటే గడిచిన 56 ఏళ్లలో ఒకే ఒక్కసారి మినహా పుదుచ్చేరిలోని 108 పల్లెల బాగోగులు చూసే ప్రజాతంత్ర వ్యవస్థలే లేవన్నమాట! చిత్రమేమంటే... వివిధ అంశాల్లో మొదటి పది స్థానాల్లో నిలిచిన కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటివి కూడా సకాలంలో ఎన్నికలు నిర్వహించటంలో విఫలమయ్యాయి. ఇప్పటికి నాలుగేళ్లుగా కర్ణాటకలో పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు లేవు. మహారాష్ట్ర మూడేళ్లనుంచీ, అస్సాం, జమ్మూ–కశ్మీర్ వంటివి రెండేళ్లనుంచీ ఎన్నికలు నిర్వహించటం లేదు. తెలంగాణ, తమిళనాడు, ఉత్తరాఖండ్లలో గతేడాది ఎన్నికలు జరగాల్సివుంది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవ తీర్మానం చేసింది కనుక త్వరలోనే పంచా యతీ ఎన్నికలకు మార్గం సుగమం అవుతుందని ఆశించాలి. రాజ్యాంగంలో ఎన్ని ఉన్నతాశయాలున్నా ఆచరణ సరిగా లేనప్పుడు అవన్నీ నీరుగారి పోతాయి. అందులో పల్లెసీమల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడే పంచాయతీరాజ్ సంస్థలను నిర్లక్ష్యం చేయటం ఒకటి. నిజానికి నిర్దిష్ట కాలంలో సక్రమంగా ఎన్నికలు జరిగేచోట సైతం ఆ సంస్థల పనితీరు ఏమంత ఆశాజనకంగా లేదు. నిధుల విడుదలలో జాప్యం, నాసిరకంగా పనులుండటం, సిబ్బంది కొరత వగైరాలు ఎన్నోవున్నాయి. ఇక మహిళలకు పంచాయతీరాజ్ వ్యవస్థలో పెద్ద పీట వేయాలని 73వ రాజ్యాంగ సవరణ ప్రతిపాదించింది. అందుకోసం వారికి మూడోవంతు స్థానాలు కేటాయించాలని నిర్దేశించింది. అయితే దీన్ని 50 శాతానికి మార్చాలని మెజారిటీ రాష్ట్రాలు భావించాయి. ఒక లెక్క ప్రకారం 21 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు సగం స్థానాలు మహిళలకు కేటాయించాయి. కానీ విషాదమేమంటే... మహిళల పేరుమీద వారి భర్తలో, తండ్రులో అధికారం వెలగబెడుతున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని తగిన చర్య తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు నిస్సహాయత వ్యక్తం చేసింది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈ సంగతి చూడాలని ఆదేశించింది. అటు తర్వాత ఈ సమస్య పరిష్కారానికి ఒక కమిటీ వేశారుగానీ జరిగిందేమీ లేదు. ప్రజా సేవారంగంలో మహిళలు చొరవగా పాల్గొనటా నికి ఉద్దేశించిన విధానం కాస్తా ఇలా దారితప్పుతోంది.దశాబ్దాల తరబడి పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ పోవటంవల్ల పల్లె సీమల్లో వర్ధిల్లాల్సిన ప్రజాస్వామిక వాతావరణం లోపిస్తోంది. తమకున్న వనరులేమిటో, తమ అవ సరాలేమిటో సమీక్షించుకుని ఏయే అభివృద్ధి పనులు చేపట్టాలో నిర్ణయించుకోవాల్సిన పంచాయతీ రాజ్ సంస్థలు నిధుల కోసం బేలగా ఎదురు చూస్తున్నాయి. పల్లెల్లో సమస్యలన్నీ అపరిష్కృతంగా ఉండిపోవటంవల్ల ఆ సంస్థలపై ప్రజలకు ఒక రకమైన చిన్నచూపు ఏర్పడుతోంది. అందుకే పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించినట్టు పంచాయతీరాజ్ ఎన్నికలు సకాలంలో జరిగేలా చూడాలి. పుదుచ్చేరి మాదిరి నిరవధికంగా వాయిదాలతో పొద్దుపుచ్చుతూ, పంచాయతీలను నామ మాత్రావశిష్టంగా మార్చే ప్రభుత్వాలను దారికి తీసుకొచ్చేందుకు కొత్త మార్గాలు వెదకాలి. -
వీరమల్లు సైద్ధాంతిక విన్యాసం!
సినీనటుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించి పుష్కర కాలం పూర్తయింది. పిఠాపురంలో నిన్న ఆ వేడుక వైభవంగానే జరిగింది. తాను అసెంబ్లీ గేటు తాకడానికి అవకాశం కల్పించిన పిఠాపురాన్ని ఈ రకంగా పవన్ గౌరవించారు. అసెంబ్లీ గేటును తాకే క్రమంలో పనిలో పనిగా కొన్ని తొడలు విరగ్గొట్టినట్టుగా కూడా ఆయన చెప్పారు. వీరమల్లు కదా, ఆ మాత్రం ఎలివేషన్ అవసరమే! పుష్కర సభ అంగరంగ వైభవంగా జరిగిందనీ, లక్షలాది జనసందోహంతో పొంగిపొరలిందనీ యెల్లో మీడియా వేనోళ్ల పొగిడింది.యెల్లో మీడియా సాధారణంగా చంద్రబాబుకూ, ఆయన పార్టీకీ మాత్రమే పరిమితం చేసే ప్రచార గౌరవాన్ని పవన్ సభకు కూడా కల్పించి ఔదార్యాన్ని చాటుకున్నది. అందులో ఒక పత్రిక సభలో జనగణన కూడా చేసింది. సభలో జనం కూర్చోవడానికి 14 ఎకరాలు కేటాయించారనీ, ఆ స్థలంలో లక్షలాదిమంది కిక్కి రిసిపోయారని రాసింది. జనం కిక్కిరిసి కూర్చుంటే ఎకరాకు ఐదు వేల మందిని లెక్కవేయడం ఆనవాయితీ. అంతకంటే ఐదు రెట్లు లేదా పది రెట్లు ఎక్కువగా కిక్కిరిశారని యెల్లో మీడియా చెబుతున్నది. ఏమో గుర్రం ఎగరావచ్చు! ఎవరికీ అభ్యంతరం లేదు. జనం కూర్చోవడానికి కేటాయించిన స్థలం 14 ఎకరాలు కాదని, తొమ్మిదెకరాలు మాత్రమేనని స్థానికుల సమాచారం. ఆ స్థానికులు గిట్టనివారు కావచ్చు. యెల్లో మీడియా రాసిందే అక్షర సత్యం కావచ్చు. సభ విజయవంతమైనందుకు పవన్ కల్యాణ్కు సనాతనాభివందనాలు!ఇప్పుడు పవన్ కల్యాణ్ అధికారంలో భాగస్వామి. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కనుక ఎన్నికల హామీల అమలు గురించో, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాల గురించో మాట్లాడుతారని జనం ఆశించడం సహజం. కానీ, అటువంటి ఆశలకు ఆయన అవకాశం ఇవ్వలేదు. కాలు వల కింద కూడా ఎండిపోతున్న పంటల గురించి ఆయన మాట్లాడలేదు. చెమటోడ్చి తెచ్చిన పంటలకు పడిపోతున్న ధరల గురించీ ఆయన మాట్లాడలేదు. అవసరమైన ఔషధా లతో, అందుబాటులో వైద్యులతో తొమ్మిది నెలల కిందటి దాకా ధైర్యం నింపిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇప్పుడు వెలవెల బోతున్న వైనం కూడా ఆయన ప్రసంగంలో చోటు చేసుకోలేదు.అధోముఖయానం చేస్తున్న జీఎస్టీ వసూళ్ల సాక్షిగా ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం గురించిన ప్రస్తావనే రాలేదు. పేద, మధ్యతరగతి వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపిన విద్యా విప్లవానికి ఎందుకు కళ్లెం వేశారన్నదానిపై వివరణే వినిపించ లేదు. డొక్కా సీతమ్మ పేరు పెట్టి ఇంటర్ విద్యార్థుల కోసం ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకం నెల తిరక్కుండానే పరమ నాసిరకంగా ఎందుకు దిగజారిందో ఆయన చెప్పలేదు. ఆర్బీకే సెంటర్లలో అందుబాటులో లేకుండా ఎరువులూ, విత్తనాలూ ఎందుకు అదృశ్యమయ్యాయో, ఇల్లిల్లూ తిరిగి సేవలందించిన వలంటీర్లు ఏమయ్యారో అనే విషయాల గురించి పవన్ మాట్లాడలేదు.ఎమ్మెల్యేలూ, నాయకులూ జనం మీద పడి దోచుకుతింటున్నారని యెల్లో మీడియానే కోడై కూస్తున్నది. పంపకాల్లో తేడా లతో కూటమి నాయకులు కాట్లాడుకుంటున్నారని కూడా పచ్చ కోడి గూడెక్కి కూస్తున్నది. అధికారులు కలెక్షన్ కౌంటర్లు తెరిచి అక్కడ వారి సతీమణుల్ని కూర్చోబెడుతున్నారని కూడా ఆరోప ణలు చేస్తున్నది. ఇటువంటి కీలక విషయాల జోలికి ఆయన వెళ్లలేదు. లౌకిక విషయాల గురించి ఆయన మాట్లాడ దలుచు కోలేదు. ఆయన ప్రసంగమంతా అలౌకిక పారవశ్యమే!ఈ సభ ద్వారా ఆయన మూడు అంశాలను చెప్పదలుచు కున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. మొదటి నుంచీ ఆయన రాజకీయ ప్రయాణమంతా సిద్ధాంతబద్ధంగానే సాగిందని జనం నమ్మాలనేది ఆయన మొదటి పాయింట్. బాల్యం నుంచే తాను సనాతన ధర్మం కోసం పోరాడుతున్నానని చెప్పుకోవడం, తద్వారా ఆ శ్రేణుల్లో అగ్రభాగాన నిలబడాలని కోరుకోవడం రెండో పాయింటు. కొందరు విశ్లేషకులు, మరికొందరు మీడియా వ్యక్తులు ఊహిస్తున్నట్టు కూటమిలో విభేదాలేమీ ఉండబోవనీ, అక్కడ మోదీకీ – ఇక్కడ బాబుకూ విధేయుడనే అనే సందేశాన్ని శ్రేణులకు పంపించడం మూడో పాయింటు.లెఫ్ట్ నుంచీ సెంటర్కూ, అక్కడి నుంచి రైట్కూ తన సిద్ధాంత విధేయత మారిందని మీడియాలో వస్తున్న విమర్శలపై పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. చేగువేరాను తాను అభిమానించడానికి కారణం అతను కమ్యూనిస్టు కావడం కాదట! వైద్యవృత్తిని వదిలేసి విప్లవకారుడుగా మారినందు వల్లనే అభిమానించానని చెప్పుకొచ్చిన పవన్ కల్యాణ్ భాషణపై సీపీఎం అగ్రనాయకుడు బీవీ రాఘవులు వ్యంగ్యంగా స్పందించారు. చేగువేరా మెడిసిన్ చదివిన మాట నిజమే కానీ, ఆయన వైద్యవృత్తిలో ఎప్పుడున్నారో నాకైతే తెలియదన్నారు. నిజంగానే వైద్యుడిగా చే ప్రాక్టీస్ చేసిందేమీ లేదు. అంతర్జాతీయ విప్లవ కారుడుగానే ఆయన ప్రసిద్ధుడు. చేగువేరా మీద అభిమానానికి పవన్ చెప్పిన కారణమే నిజమైతే, విప్లవాలు – యుద్ధాల వీధి గుమ్మాల్లో నిలబడి వైద్యసేవలందించిన డాక్టర్ నార్మన్ బెథూన్, డాక్టర్ ద్వారకానాద్ కోట్నిస్ల అభిమానిగా ఆయన మారి ఉండాలి. అసలు ప్రాక్టీసే చేయని చేగువేరాను విప్లవకర వైద్యుని కోటాలో అభిమానించడం అనే కథ సరిగ్గా అతకలేదు. తాను బాల్యం నుంచే సనాతనవాదినని పవన్ ఈ సభలో చెప్పుకున్నారు. సనాతన ధర్మం తన రక్తంలోనే వుందని చెప్పారు. పధ్నాలుగేళ్ల వయసు నుంచే దీక్షలు చేస్తున్నట్టు కూడా చెప్పారు. తనపై సినిమాల ప్రభావం బాగా ఎక్కువని కూడా పవన్ అంగీకరించారు. సినిమాలు, కథలు, నవలలతో బాగా ప్రభావితమయ్యే వ్యక్తులు కొందరు వాటిలోని పాత్రలతో తమను పోల్చుకోవడం అనే ఫ్యాంటసీలో మునిగి తేలుతుంటారు. చేగువేరా ప్రభావం బాగా ఉన్న రోజులో తమ తండ్రి గారు కమ్యూనిస్టని పవన్ చెప్పేవారు. అంతటితో ఆగకుండా, నానమ్మ దీపారాధన చేస్తుంటే ఆ దీపంతో నాన్నగారు సిగరెట్ కాల్చుకునేవారని కూడా ఒక సందర్భంలో ఆయన చెప్పారు. ఇంతకన్నా అవగాహనా రాహిత్యం ఇంకొకటి ఉండదు. కమ్యూనిస్టు లంటే దైవదూషకులనే అర్థం ఇందులో స్ఫురిస్తున్నది. కమ్యూనిస్టు అయినంత మాత్రాన నాస్తికుడై ఉండాలనేదేమీ లేదు. నాస్తికుడైనంత మాత్రాన దైవదూషణ చేస్తారనీ, అవమానిస్తా రనీ అర్థం కాదు. వారి వారి విశ్వాసాలకు, నమ్మకాలకు కట్టుబడి ఉంటారంతే! దైవదూషణ వంటి పనులకు విశ్వాసాలతో సంబంధం లేదు. అది వ్యక్తిగతం. పూజా పునస్కారాలు చేసే సంప్రదాయ కుటుంబాల్లో పుట్టిన నిగమశర్మ వంటి వారి కథలు కూడా మనం విన్నాము.ఇప్పుడాయన సనాతన ధర్మ ప్రభావానికి లోనైన తర్వాత కుటుంబ కథలో కొంత మార్పు చేశారు. కేవలం ఇరవయ్యేళ్ల వయసులోనే నాన్నగారు కమ్యూనిస్టు భావజాలంతో ఉండే వారని, ఆ తర్వాత రామభక్తుడిగా మారారని పిఠాపురం సభలో పవన్ చెప్పారు. తన చిన్నతనం నుంచే ఇంట్లో రామనామ జపం వినిపించేదని ఆయన అన్నారు. తన సనాతనధర్మ నిబద్ధతపై ఎవరూ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదనీ, ఈ దేశం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని మరోసారి ఆవేశం ప్రదర్శించారు. ఇదంతా ఎందుకంటే, తాను చిన్నతనం నుంచీ సిద్ధాంత నిబ ద్ధతతోనే ఉన్నాననీ, ఆ సిద్ధాంతం సనాతన ధర్మమేననీ ఇప్పు డాయన సవరణ చేయదలుచుకున్నారు.చేగువేరా కమ్యూనిస్టని కాదు... మంచి వైద్యుడూ, విప్లవ కారుడైనందువల్ల అభిమానించారు. మరి శ్రీశ్రీ, దాశరథి,శేషేంద్ర వంటి వారి సంగతేంది? అవకాశం దొరికిన ప్రతిసారీ వారి కవితా పంక్తుల్ని వల్లెవేయడం పవన్కు అలవాటు. వారు సనాతనవాదులా? సామ్యవాదులా? పిఠాపురం సభలో కూడా దాశరథినీ, శ్రీశ్రీని ఆయన తలచుకున్నారు. ‘‘ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో...’’ అనే దాశరథి గేయం సామ్యవాద గీతమా? సనాతనవాద గీతమా?. ప్రసంగాన్ని ముగిస్తూ శ్రీశ్రీ మహాప్రస్థానంలోని ‘అవతారం’ కవితను ఆసాంతం చదివి వినిపించారు. ‘‘యముని మహిషపు లోహఘంటలు మబ్బుచాటున ఖణేల్మన్నాయి / నరకలోకపు జాగిల మ్ములు / గొలుసు త్రెంచుకు ఉరికి పడ్డాయి / ఉదయ సూర్యుని సప్త హయములు / నురుగులెత్తే పరుగు పెట్టేయి / కనకదుర్గా చండసింహం జూలు దులిపీ, ఆవులించింది...’’ ... ఇలా పురాణ ప్రతీకలతో సాగిపోతుందా కవిత.ఇంతకాలం ఈ ప్రతీకలన్నీ ప్రభవించబోయే విప్లవానికి సూచికలుగా భావించారంతా! మరి సనాతన ధర్మ పరిరక్షణా యాత్రికునికి ఈ కమ్యూనిస్టు విప్లవ ప్రతీకలెందుకో! ఆయన విడమరిచి చెబితే తప్ప సామాన్యులకు అర్థం కాదు. ఆయన ప్రసంగంలో ఒకపక్క చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తు తూనే మోదీ తరఫున వకాల్తా పుచ్చుకొని తమిళనాడులోని డీఎమ్కే పార్టీ మీద దాడి చేశారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేయబోతున్నదనీ, దీనిపై ఐక్యంగా పోరాడదామనీ ఆ పార్టీ వాళ్లు వాళ్ల ప్రయత్నమేదో చేస్తున్నారు. బీజేపీ దీర్ఘకాల లక్ష్యాలకు ఇటువంటి చిన్నచిన్న ప్రయత్నాలు కూడా విఘాతం కలిగిస్తా యని బీజేపీ పెద్దలకు బాగా తెలుసు. వారి మనసెరిగి పవన్ ప్రసంగించారు. అప్పుడెప్పుడో చిన్నతనంలో ఆయన మద్రా స్లో ఉన్నప్పుడు తమిళుడెవరో ‘గొల్టీ’ అని గిచ్చాడట! దాన్ని ప్పుడు గుర్తుచేసుకున్నారు.పవన్ సభ ప్రారంభానికి ముందే చంద్రబాబు, లోకేశ్ బాబు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. యెల్లో మీడియా ఆ సభకు పూర్ణకుంభ స్వాగతం పలికింది. ఈ మూడు పార్టీల కూటమిలో లుకలుకలున్నాయనీ, విడిపోతాయనీ, బీజేపీ – జన సేన కలిసి ఒక కూటమిగా ఏర్పడుతాయనీ ఊహిస్తున్న విశ్లేష కులు ఇప్పటికైనా తమ ఆలోచనల్ని సరిదిద్దుకోవాలి. విభేదా లేమీ లేవు. ముగ్గురూ కలిసి పనిచేస్తారు. బీజేపీ–సంఘ్ పరి వార్ల దీర్ఘకాలిక లక్ష్యానికి సహకరిస్తూనే మిగిలిన ఇద్దరు ఎవరి ఇంటిని వాళ్లు చక్కదిద్దుకుంటారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం లోకేశ్ను సీఎం కుర్చీలో త్వరగా కూర్చోబెట్టాలనే ఒత్తిడి బాబు మీద పెరుగుతున్నది. ఆ పరిస్థితుల్లో డిప్యూటీగా ఉండటం పవన్కు ఇబ్బంది కనుక ఆయన కేంద్రానికి వెళతారనీ, వచ్చే ఎన్నికల నాటికి దక్షిణాదిన బీజేపీ తరఫున సనాతన ప్రచారానికి ఆయనను నియోగిస్తారని తెలుస్తున్నది. పవన్ స్థానంలో నాగబాబు రాష్ట్ర కేబినెట్లోకి రావచ్చు. జనసేన కార్య కర్తలు ఇంతకంటే పెద్ద దృశ్యాన్ని ఆశిస్తే నిరాశ తప్పకపోవచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఖాకీ రాజ్యం కళ్లు తెరవదా!
వ్యక్తి హక్కును తృణీకరించి అరాచకం రాజ్యమేలేచోట వ్యక్తికిగానీ, సమాజానికిగానీ రక్షణ ఉండ దంటాడు ఆఫ్రో–అమెరికన్ రచయిత ఫ్రెడరిక్ డగ్లస్. జనాన్ని అన్ని విధాలా ఏమార్చి తొమ్మిది నెలల క్రితం అందలం ఎక్కిన కూటమి సర్కారు వల్ల ఆంధ్రప్రదేశ్లో అక్షరాలా ఆ పరిస్థితే కొన సాగుతోంది. ఎన్నికల్లో అడ్డూ ఆపూ లేకుండా ఇచ్చిన హామీలేమయ్యాయని అడిగితే... వరస వైఫ ల్యాలను ఎండగడితే... తప్పుడు ప్రచారాలను నిలదీస్తే... జైళ్లు నోళ్లు తెరుచుకుంటున్నాయి. ప్రాథ మిక హక్కయిన భావప్రకటనా స్వేచ్ఛ బందీ అవుతోంది. అడుగడుగునా పౌరుల హక్కులను హరి స్తున్న పోలీసుల తీరును సహించబోమని రాష్ట్ర హైకోర్టు ఇప్పటికి మూడు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా ఈ తోలు మందం ప్రభుత్వానికి వివేకం కలిగినట్టు లేదు. అందుకే మంగళ వారం జస్టిస్ రావు రఘునందన్ రావు, జస్టిస్ మన్మథరావులతో కూడిన ధర్మాసనం మరో రెండు కేసుల్లో పోలీసులకు అక్షింతలు వేయాల్సివచ్చింది. పోలీసులైనాసరే చట్టానికి లోబడే వ్యవహరించాలని చీవాట్లుపెట్టింది. ఊహల ఆధారంగా కేసులు పెట్టడం, బెయిల్ రాకుండా తప్పుడు సెక్షన్లు బనాయించటం సహించబోమంది. చిన్న తప్పులే కదా అని వదిలేస్తే రేపు కోర్టుల్లోకొచ్చి కూడా అరెస్టు చేస్తారంది. ఈ వ్యాఖ్యలు చాలు... ఏపీలో పాలన ఎంత నిరంకుశంగా ఉందో చెప్పడానికి! మనసంటే తెలియని, మనుషులంటే లక్ష్యంలేని కూటమి నాయకులకూ, కార్యకర్తలకూ మూడు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మనోభావాలు దెబ్బతింటున్నాయి! అంటురోగం ప్రబలినట్టు, ఊరంతా ఒకేసారి పూన కాలు వ్యాపించినట్టు వీరంతా ఉన్నట్టుండి ఫిర్యాదులు చేస్తున్నారు. ఏమైంది వీళ్లకు? ఇదే తీరు కొనసాగిస్తే చట్టాన్ని సవరించి ఇలాంటి కేసుల్లో మొదటగా ఫిర్యాదీదారులను సైకియా ట్రిస్టుల దగ్గరకు పంపాలని... ఎన్నాళ్లుగా మనోభావాలు దెబ్బతిని వున్నాయో, పర్యవసానంగా వారిలో కనబడిన వైపరీత్యాలేమిటో కుటుంబసభ్యుల నుంచి తెలుసుకోవాలనీ నిబంధనలు చేర్చాలన్న డిమాండ్ బయల్దేరినా ఆశ్చర్యం లేదు. ఆ పనిచేస్తే ఇలాంటివారి రోగం కుదురుతుంది. అధికారంలో ఉన్నవారి మెప్పు పొందేందుకు ఫిర్యాదు అందిందే తడవుగా వెనకా ముందూ చూడకుండా పోలీసులు అరెస్టులకు దిగుతున్నారు. గొలుసు కేసులతో వందలాది కిలోమీటర్ల దూరంలోవుండే పోలీస్ స్టేషన్లకు మార్చి మార్చి తిప్పుతున్నారు. ఎవరిపై ఎన్ని కేసులు పెడుతున్నారో గమనిస్తే ఎవ రంటే పాలకులు వణుకుతున్నారో అర్థమవుతుంది. ప్రముఖ సినీ రచయిత పోసాని కృష్ణమురళి సంగతే తీసుకుంటే, 67 ఏళ్ల ఆ పెద్దమనిషిపై లెక్కకు మిక్కిలి కేసులు పెట్టారు. ఒకటి రెండు కేసుల్లో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు తగిలించి అరెస్టు చేస్తున్నారు. గుండెకు శస్త్ర చికిత్స చేయించుకుని పలు అనారోగ్య సమస్యలతో ఉన్న పోసానిని కేసుల పేరుతో వందల మైళ్లు తిప్పుతున్నారు. సోషల్ మీడియా కార్యకర్త అవుతు శ్రీధర్ రెడ్డిపై పెట్టిన కేసు గమనిస్తే పోలీసుల అత్యుత్సాహం అర్థమవుతుంది. ఒక కేసులో మేజిస్ట్రేట్ ఆయన రిమాండ్ను తిరస్కరించి విడుదల చేయాలని ఆదేశించిన వెంటనే పోలీసులు అతి తెలివి ప్రదర్శించి తిరిగి అవే ఆరోపణలతో ఆయనను మరో సారి అరెస్టు చే శారు. ఈసారి న్యాయస్థానం ఆయన్ను రిమాండ్కు తరలించింది. ఈ విషయంలో పోలీసుల పనితీరును హైకోర్టు ధర్మాసనం నిశితంగా విమర్శించింది. ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇష్టానుసారం అరెస్టు చేయటం, చట్టనిబంధనలను తుంగలో తొక్కడం చెల్లదని పేర్కొంది. ఈ విషయంలో యాంత్రికంగా వ్యవహరించినందుకు మేజిస్ట్రేట్ను తప్పుబట్టింది. తాచెడ్డ కోతి వనమంతా చెరచినట్టు పోలీసుల తీరు వల్ల కిందిస్థాయి న్యాయస్థానాలకు సైతం మందలింపులు తప్పటం లేదు. నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తికి ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పరు. ఆయన బంధువులకు సమాచారం ఇవ్వరు. అసలు ఆయనపై వున్న కేసులేమిటో చెప్పరు. ఇవి పాటించలేదని తెలిశాక కూడా యాంత్రికంగా రిమాండ్కు పంపుతున్న వైనాన్ని ధర్మాసనం ప్రత్యేకించి ప్రస్తావించింది. ఈ ధోరణి సరికాదని మందలించింది. మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్ కుమార్ అరెస్టు విషయంలో కూడా న్యాయమూర్తులు ఈ విధంగానే స్పందించారు. వ్యంగ్యంగా, ప్రతీకాత్మకంగా రూపొందించిన ఒక చిన్న రూపకం పోలీసులకు అభ్యంతర కరంగా తోచింది. అంతే... నిరుడు డిసెంబర్లో అర్ధరాత్రి దాటాక రెండున్నర గంటలకు కర్నూలు పోలీసులు తలు పులు బద్దలుకొట్టి ప్రేమ్కుమార్ భార్యాపిల్లలను వేరే గదిలో బంధించి ఆయన్ను ఈడ్చుకెళ్లారు. హాస్యాస్పదమైన విషయమేమంటే వినయ్కుమార్ దగ్గర దొరికిన రూ. 300 అక్రమ వసూళ్లట! పైగా సంఘటిత నేరాలకు పాల్పడ్డారంటూ ఆరోపించి బీఎన్ఎస్లోని సెక్షన్ 111 బనాయించారు. ఈ రెండు కేసుల విషయంలో మాత్రమే కాదు... ఇంతకు మునుపు మరో మూడు కేసుల్లో కూడా పోలీసుల తీరును హైకోర్టు తప్పుబట్టింది. డీజీపీని రప్పించాల్సివస్తుందని హెచ్చరించింది. అయినా పోలీసుల తీరు మారడం లేదు. ఈ తెలివితక్కువ చర్యల్ని ఘనకార్యాలుగా భావిస్తూ పాలకులు సిగ్గువిడిచి ఊరేగుతున్నారు. తమకు ఎదురులేదని విర్రవీగుతున్నారు. అలవిమాలిన హామీలిచ్చి, ఈవీఎంలను నమ్ముకుని, డబ్బు సంచులు గుమ్మరించి అందలం ఎక్కిన కూటమి ఇకముందూ ఇదే దోవలో అధికారాన్ని శాశ్వతం చేసుకోవచ్చని కలలు కంటోంది. తప్పు మీద తప్పు చేస్తూ పోతోంది. ఈ క్రమంలో పోలీసులను ఉపయోగించుకుని సంఘటిత నేరాలకు పాల్పడుతోంది. ఎల్లకాలమూ ఈ వ్యవహారం సాగదు. జనం నిజం గ్రహించారు. కీలెరిగి వాత పెట్టే రోజు ఎంతో దూరంలో లేదు. -
నెత్తురోడుతున్న బలూచిస్తాన్
ఒక ప్రాంత ప్రజల ఆకాంక్షలను ఉక్కుపాదంతో అణచాలని చూస్తే... దాని అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి అక్కడి వనరులను పీల్చిపిప్పి చేస్తే... ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక రూపంలో ఆగ్రహజ్వాలలు ఎగిసిపడతాయి. విభజనానంతరం పాకిస్తాన్ ఒక దేశంగా ఏర్పడినప్పుడు అందులో విలీనం కాకుండా తాము స్వతంత్రంగా ఉంటామని కరాత్ సంస్థానం ప్రకటించినప్పుడు నూతన పాలకులు ససేమిరా అంగీకరించలేదు. అక్కడి వనరులపై కన్నేసిన పాలకులు ఆ సంస్థానాన్ని నమ్మించి, స్నేహ ఒడంబడిక కుదుర్చుకుని చివరకు దాన్ని బుట్టదాఖలా చేశారు. ఈ ద్రోహం వెనక పాక్ జాతిపిత మహమ్మదాలీ జిన్నాతోసహా పలువురున్నారు. దాని పర్యవసానాలు ఈ ఏడున్నర దశాబ్దాలుగా ఆ దేశం అనుభవిస్తూనే ఉంది. క్వెట్టానుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను మంగళవారం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మిలిటెంట్లు హైజాక్ చేసి వందలమందిని అపహ రించుకు పోవటం, కొందరిని హతమార్చటం ఆ వరసలో మరో చర్య. బుధవారం భద్రతా దళాలను రంగంలోకి దింపి దాదాపు 200 మంది ప్రయాణికులను విడిపించినట్టు చెబుతున్నారు.ఇందుకు ప్రతిగా 50 మంది బందీలను మిలిటెంట్లు హతమార్చగా, ఆ తర్వాత మిలిటెంట్లందరినీ పాక్ సైన్యం మట్టుబెట్టిందంటున్నారు. ఇలా నిత్యం నెత్తురోడుతున్న బలూచిస్తాన్ భౌగోళికంగా పాకిస్తాన్లోనే ఉన్నా, అక్కడివారు తమను తాము పాకిస్తానీలుగా పరిగణించుకోరు. ఒకనాడు సాధారణ సమస్యల కోసం ఉద్యమించినవారు ఇప్పుడు స్వాతంత్య్రాన్ని కోరుకునేదాకా వచ్చారు. పాక్ పాలకుల నిర్వాకమే ఇందుకు కారణం.బలూచిస్తాన్ సాధారణ ప్రాంతం కాదు. ఇక్కడి భూమిలో బంగారం, వజ్రాలు, వెండి, రాగి వనరులు నిక్షిప్తమైవున్నాయి. దేశ వర్తక, వాణిజ్యాలను అత్యున్నత స్థాయికి తీసుకుపోగల డీప్ సీ పోర్టు ఉన్న గ్వాదర్ కూడా ఇక్కడిదే. 2002లో ఈ ఓడరేవు తొలి దశలో కొంత భాగాన్ని పూర్తిచేసి ఆదరాబాదరాగా ప్రారంభించారు. కానీ ఆ తర్వాత పనులు పడకేశాయి. దీన్ని నిర్మిస్తున్న చైనా... స్థానికులకు నామమాత్రం అవకాశాలిచ్చింది. ఇది బలూచి వాసుల అసంతృప్తిని మరిన్ని రెట్లు పెంచింది. భౌగోళికంగా వైశాల్యంలో ఫ్రాన్స్ను పోలివుండే ఈ ప్రాంత జనాభా కేవలం 90 లక్షలు. ఇంత తక్కువ జనాభాతో, అపరిమితమైన వనరులతో ఉండే ఈ బలూచిస్తాన్ గత 77 ఏళ్లలో వాస్తవానికి అద్భుతమైన ప్రగతి సాధించివుండాలి. కానీ విషాదమేమంటే ఇక్కడున్న 70 శాతం మంది ప్రజలు దుర్భర దారిద్య్రంలో మగ్గుతుంటారు. వారికి ఉపాధి అవకాశాలుండవు. వేరేచోటకు వెళ్లి స్థిరపడేంత చదువుసంధ్యలుండవు. సైనిక దళాల్లో సైతం బలూచిస్తాన్ వాసులకు మొండిచేయి చూపారు. వారిపై పాక్ సైన్యాధికారుల్లో వున్న అపనమ్మకమూ, భయాందోళనలే అందుకు కారణం. తెలివైన పాలకులైతే ఆ ప్రాంతానికి స్వయంప్రతిపత్తినిచ్చి, దాని అభివృద్ధికి బాటలు పరిచే వారు. కానీ పాకిస్తాన్ పాలకులు అణచివేతే పరిష్కారం అనుకున్నారు. సైనిక పదఘట్టనలతో అది పాదాక్రాంతం అవుతుందనుకున్నారు. బలూచిస్తాన్లో తరచు మిలిటెంట్ దాడులకు పాల్పడే బీఎల్ఏ 2000 సంవత్సరంలో ఏర్పడినా అంతకు చాలాముందునుంచే ఉద్యమకారులను అపహరించి మాయం చేయటం, బూటకపు ఎన్ కౌంటర్లలో వారిని హతమార్చటం పాక్ సైన్యం ఒక పద్ధతిగా కొనసాగించింది. 2011 నుంచి లెక్కేసినా దాదాపు 10,000 మంది అదృశ్యమయ్యారని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంటున్నది. బీఎల్ఏ సైతం అదే మార్గం ఎంచుకుంది. మొదట్లో చెదురు మదురు ఘటనలకే పరిమితమైన ఆ సంస్థ ఇటీవలి కాలంలో భారీ దాడులకు పాల్పడుతోంది. బీఎల్ఏ కారణంగా చైనా–పాకిస్తాన్ కారిడార్ (సీపీఈసీ) అటకెక్కేలావుంది. చైనా ఖండాంతర ప్రాజెక్టు బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్(బీఆర్ఐ)లో సీపీఈసీ కీలకమైనది. కారిడార్లో భాగంగా నిర్మిస్తున్న జాతీయ రహదారులనూ, ఇతర మౌలిక సదుపాయాలనూ బీఎల్ఏ లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేయటం ఇందుకే. 6,500 కోట్ల డాలర్ల విలువైన సీపీఈసీలో ఇంధనం, రవాణా, పారిశ్రా మిక కారిడార్లూ, గ్వాదర్ పోర్టు వగైరాలున్నాయి. స్థానికులకు అవకాశాలీయకుండా ఇంత పెద్ద నిర్మాణాన్ని తలకెత్తుకుంటే అసంతృప్తి రాజుకుంటుందన్న ఇంగితజ్ఞానం పాలకులకు కొరవడింది. బలూచిస్తాన్ వాసుల డిమాండ్లు ధర్మమైనవి. కానీ అందుకు హింసాత్మక మార్గాన్ని ఎంచు కోవటంవల్ల న్యాయమైన సమస్య మరుగున పడుతుంది. బలూచిస్తాన్లో జాతి, మత, తెగ, రాజకీయ విశ్వాసాలతో నిమిత్తం లేకుండా మానవ హక్కుల కోసం పోరాడే బలూచ్ యక్జహితీ కమిటీ (బీవైసీ) 2019 నుంచీ పనిచేస్తోంది. ఆ సంస్థ నాయకురాలు డాక్టర్ మెహ్రాంగ్ బలూచ్కు అన్ని వర్గాల నుంచీ అపారమైన ఆదరణ వుంది. పాక్ సైన్యం ఆగడాల కారణంగా తండ్రి అదృశ్యం కావటం, చాన్నాళ్ల తర్వాత ఛిద్రమైన ఆయన మృతదేహం లభ్యం కావటం ఆమె పట్టుదలను మరింత పెంచాయి. నిరుడు ఆగస్టులో డాక్టర్ మెహ్రాంగ్ గ్వాదర్లో తలపెట్టిన ర్యాలీయే దీనికి రుజువు. సైన్యం ఎన్ని అడ్డంకులు కల్పించినా అది విజయవంతమైంది. శాంతియుతంగా జరిగిన ఆ ర్యాలీలో పాల్గొన్నారన్న కక్షతో డజన్లకొద్దీమందిని అరెస్టు చేస్తే దానికి నిరసనగా 12 రోజుల పాటు ధర్నా సాగించి వారిని విడిపించుకున్న చరిత్ర బీవైసీది. అణచివేత ధిక్కారానికి దారి తీస్తుంది. దాన్ని ఉపేక్షిస్తే తిరుగుబాటుకు బాటలు పరుస్తుంది. ప్రజల మౌలిక ఆకాంక్షలను బేఖాతరు చేస్తే ఎంత శక్తిమంతమైన రాజ్యానికైనా భంగపాటు తప్పదు. బలూచిస్తాన్ ప్రజలు దాన్నే చాటుతున్నారు. -
ఈసీకి జ్ఞానోదయం ఎప్పుడు?
తటస్థతకు తిలోదకాలొదిలి అవకతవకలకు అసలైన చిరునామాగా మారిన ఎన్నికల సంఘం(ఈసీ) సిగ్గుపడాల్సిన విషయమిది. ఆరోపణలొచ్చినప్పుడూ, ఫిర్యాదులందినప్పుడూ మౌనంతోనో, దబా యింపుతోనో తప్పించుకోజూస్తున్న ఈసీపై సోమవారం పార్లమెంటు ఉభయసభలూ దద్దరిల్లాయి. మహారాష్ట్రలో వోటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ ఆరోపణలు చేసి మూణ్ణెల్లవుతోంది. నెల క్రితం కూడా ఆ పార్టీ నాయకుడు రాహుల్గాంధీ మీడియా సమావేశంలో ఈసీపై అభియోగాలు మోపారు. అయిదు నెలల వ్యవధిలో కొత్తగా 39 లక్షలమంది వోటర్లు ఎలా పుట్టుకొచ్చారని ప్రశ్నించారు. అవి ఆధార రహితం, తప్పుదోవ పట్టించే అభాండాలని చెప్పటం తప్ప నిర్దిష్టంగా ఫలానా చోట ఏం జరిగిందో, వోటర్ల సంఖ్య పెరగటానికి కారణమేమిటో వివరించే ప్రయత్నం ఈసీవైపు నుంచి లేదు! అటు బెంగాల్లో ఈ మాదిరి అవకతవకలే బయటపడి ఆ సంస్థ పరువు బజారుపాలు చేశాయి. వోటర్ల జాబితా అవకతవకలతోపాటు నకిలీ వోటరు కార్డులు రాజ్యమేలుతున్నాయని తృణమూల్ ఫిర్యాదు చేస్తే మూడు నెలల్లో సరిచేస్తామన్న జవాబొచ్చింది. వెనువెంటనే దర్యాప్తు చేసి దీనివెనక జరిగిందేమిటో తేల్చిచెప్పడానికి బదులు సరిచేస్తామనటంలో మర్మమేమిటి? అక్కడే కాదు... హరియాణా, గుజరాత్, ఒడిశా, యూపీల్లో సైతం ఇలాగే జరిగిందని విపక్ష సభ్యులు ఆరో పించారు. ఇటీవల ఎన్నికలు జరిగిన ఢిల్లీలోనూ ఇదే తంతు నడిచిందని ఆప్ ఆరోపణ. రాజ్యాంగ సంస్థగా ఎంతో హుందాగా, నియమ నిబంధనలకు లోబడి పనిచేయాల్సిన సంస్థ ఇలా అడుగడు గునా కంతలతో, లోపాయికారీ వ్యవహారాలతో ఎన్నికలు జరిపించటం సిగ్గుచేటు కాదా?ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ నిష్టగా నిర్వహించాల్సిన క్రతువు. అది కాస్తా ఈమధ్య కాలంలో నవ్వుల పాలవుతున్న వైనం కనబడుతున్నా తనకేం సంబంధం లేనట్టు ఆ సంస్థ ప్రవర్తి స్తోంది. ఆంధ్రప్రదేశ్లో నిరుడు ఎన్నికల సందర్భంగా కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమితో కొత్తగా చుట్టరికం కుదిరిందన్న ఏకైక కారణంతో అప్పటి విపక్ష నాయకులు చెప్పినట్టల్లా అధికారు లను బదిలీలు చేశారు. పర్యవసానంగా ఇతర జిల్లాల్లో జరిగిన దారుణ ఉదంతాల సంగతలా ఉంచి పల్నాడు ప్రాంతం ఎంతటి హింసను చవిచూసిందో, ఎన్ని గ్రామాల ప్రజలు ఇళ్లూ వాకిళ్లూ వదిలి ప్రాణభయంతో పారిపోయారో మీడియా సాక్షిగా వెల్లడైంది. పోలింగ్ కేంద్రాల దురాక్రమణ, తెల్లారుజాము వరకూ పోలింగ్ తంతు కానివ్వటం వంటి అరాచకాలకు అంతులేదు. సాయంత్రం గడువు ముగిసే సమయానికి పోలింగ్ కేంద్రం గేట్లు మూసి ఆ ఆవరణలో ఉన్నవారికి మాత్రమే స్లిప్లిచ్చి వోటు వేయటానికి అనుమతించాలని నిబంధనలు చెబుతున్నాయి. క్యూలో చిట్టచివర గేటు దగ్గర ఉన్నవారికి ఒకటో నంబర్ స్లిప్ ఇవ్వటంతో మొదలెట్టి బూత్ సమీపంలో ఉన్నవారికి ఆఖరి స్లిప్ ఇవ్వాలి. ఓటేశాక ఆ స్లిప్లు భద్రపరచాలి. సీసీ టీవీ ఫుటేజ్లు భద్ర పరచాలి. ఇదంతా జరిగిందా? పోలింగ్ ముగిసిన నాలుగురోజుల తర్వాత 12.5 శాతం వోటింగ్ పెరిగినట్టు చూప టానికి ఈసీ ఏమాత్రం మొహమాట పడలేదు. ఇదంతా ఎక్కడ బయటపడుతుందోనన్న కంగా రుతో పరాజితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే సమయానికే ఈవీఎంల డేటా ఖాళీ చేశారు. వీవీప్యాట్ స్లిప్లు ధ్వంసం చేశారు. ఈవీఎంలలో రికార్డయిన ఓట్ల లెక్కలు బయటకు తీసి, అవి వీవీప్యాట్ స్లిప్లతో సరిపోల్చాలని కోరితే డమ్మీ గుర్తులతో కొత్తగా నమూనా వోటింగ్ నిర్వహించ టానికి సిద్ధపడ్డారు! ఇక భద్రపరిచిన ఈవీఎంలలో చార్జింగ్ ఎలా పెరుగుతుందో ఇంతవరకూ చెప్పలేకపోయింది. వీటిపై వైఎస్సార్ కాంగ్రెస్ నిలదీస్తే జవాబివ్వటానికి ఈసీకి నోరు పెగలదు. పార్లమెంటులో ఇంత దుమారం రేగాక డూప్లికేట్ కార్డులపైనా, వోటర్ల జాబితా అవకతవక లపైనా సాధికారికంగా, పద్ధతిగా జవాబివ్వడానికి బదులు వేరే మార్గం ఎంచుకుంది. ‘ఈసీ వర్గాలు’ అనే పేరుతో ఒక వివరణ బయటికొదిలింది. ఆ సంస్థ తనను తాను ఏమనుకుంటున్నదో గానీ ఇలా మీడియాకు లీకులివ్వటం మర్యాదైన సంగతి కాదు. ఒక పార్టీయో లేదా ప్రభుత్వమో తమ ఆలోచనలపై ప్రజాస్పందనేమిటో తెలుసుకోవటానికి లీకులిస్తుంటాయి. దాని ప్రయోజనం దానికుంటుంది. కానీ ఈసీ అలా చేయటంలో ఆంతర్యమేమిటి? ఉదాహరణకు డూప్లికేట్ వోటర్ కార్డులు వారసత్వపు సమస్యగా తేల్చిచెప్పింది. 2008–13 మధ్యే ఈ కార్డులు జారీ అయ్యాయన్నది. అదే నిజమనుకుంటే ఆ సంగతి ఈసీకి ఎప్పుడు తెలిసింది? తెలిశాక తీసుకున్న చర్యలేమిటి? ఇన్నాళ్లూ సరిచేయక పోవటానికి కారణాలేమిటి? అధికారికంగా ఇలాంటి తెలివితక్కువ జవాబు లిస్తే మరిన్ని ప్రశ్నలు వచ్చిపడతాయన్న భయంతోనే ఆ సంస్థ లీకులతో సరిపెట్టింది.ఎంతకాలం ఈ దాగుడుమూతలు? ఎన్నాళ్లు ఈ అవకతవకలు? ఎన్నికల ప్రక్రియపైనా, వివిధ దశల్లో చోటుచేసుకున్న అక్రమాలపైనా ఫిర్యాదులొస్తే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుని ఇప్పుడు పార్లమెంటులో పెద్ద రాద్ధాంతం జరిగాక లీకులివ్వటం, అవి మరిన్ని సందేహాలకు తావీయటం అప్రదిష్ట కాదా? ఇందువల్ల తమ విశ్వసనీయత దెబ్బతింటుందన్న ఇంగితజ్ఞానం కూడా లేదా? ఓడిన రాజకీయ పార్టీలు మాత్రమే కాదు... సాక్షాత్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన ఎస్వై ఖురేషీ సైతం గతంలోనూ, ఇప్పుడూ కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఎన్నికల సంఘం తీరు సవ్యంగా లేదన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతున్నదని హెచ్చరించారు. కనుక ఆ సంస్థ ఇప్పటికైనా పారదర్శకతతో వ్యవహరించటం నేర్చుకోవాలి. తప్పును తప్పుగా ఒప్పుకొనే నిజాయితీ ప్రదర్శించాలి. లేనట్టయితే ప్రజానీకం దృష్టిలో దోషిగా మిగలక తప్పదు. -
రాజా... రాజాధిరాజా...
‘టిక్... టిక్... టిక్...’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న కె.భారతీరాజా తన మిత్రుడు ఇళయరాజాకు పాట సందర్భాన్ని వివరిస్తూ ‘పాట మధ్యలో ఒకచోట భయంకరమైన మ్యూజిక్ కావాలి. అక్కడ ప్రేక్షకులు ఉలిక్కిపడే దృశ్యం చూపిస్తాను’ అన్నాడట. ఇళయరాజా ‘సరే’ అని పాట రికార్డు చేశాడు. భారతీరాజా ఆ పాట విని మొదట తనే ఉలిక్కిపడ్డాడు. ఏమంటే భయంకరమైన మ్యూజిక్ కావాలని అతడు కోరిన చోట ఇళయరాజా (Ilayaraja ) ఏం చేశాడో తెలుసా? కొన్ని సెకన్ల నిశ్శబ్దం (Silence) ఉంచాడు. ‘నిశ్శబ్దానికి మించిన భయమైన ధ్వని ఏముంది?’. ఆ పాట హిట్ అయ్యింది. శబ్దం, నిశ్శబ్దం తెలిసిన ఈ మహా సంగీతకారుడు (music maestro) గత 50 ఏళ్లుగా కోట్లమందికి తోడుగా ఉన్నాడు. అభిమానులతో సహజీవనం చేస్తున్నాడు. ఆరాధకులతో సహయానం సాగిస్తున్నాడు. మనసుకు వైద్యుడు. కలత వేళ ఏకాంత తీరాలకు మోసే వెదురు తెప్ప.‘ప్రేమ’ సినిమా కుర్రకారు ఓపెనింగ్స్తో మొదలైంది. హీరో గిటారిస్ట్. క్లయిమాక్స్ జాతీయస్థాయిలో పాటల పోటీ. హీరో ఎలాంటి పాటతో అదరగొట్టి చిందులు వేస్తాడోనని అందరూ ఎదురు చూస్తే ‘ప్రియతమా... నా హృదయమా’... అని ఎంతో నెమ్మదైన మెలడీ వస్తుంది. ఇళయరాజా అలా ఎందుకు చేశాడు? పాట మరోసారి వినండి. పాటకు ముందు మెరుపు వేగంతో గిటార్ మోతతో స్టేజ్ ఊగిపోయేలా ప్రిలూడ్ వస్తుంది. హఠాత్తుగా ఆగి స్లోగా పాట మొదలవుతుంది. హీరో పాడాలనుకున్నది ప్రిలూడ్కు అనువైన పాట. పాడింది ఈ పాట. కారణం? హీరోయిన్ చావు బతుకుల్లో ఉంది. దర్శకుడి కంటే ఇళయరాజాకే కథ బాగా అర్థం అవుతుంది. అందుకే అతడి పాట నిలబడుతుంది.తెల్లవారే లేచి, కాస్త టీ కొట్టి, హైదరాబాద్ నుంచి చెన్నైకి కారు ప్రయాణం మీద బయలుదేరే కొందరు అమ్మో అంత దూరమా? అనుకోరు. ఇళయరాజా పాటల పెన్ డ్రైవ్ తగిలిస్తే చాలు అనుకుంటారు. ఏ శనివారం సాయంత్రమో పార్టీలో డబ్బు తక్కువై సరంజామా తగ్గినా ఊరుకుంటారు... ఇళయరాజా పాట మాత్రం బ్యాక్గ్రౌండ్లో ఉండాల్సిందే. ప్రేమ విఫలం... ఇళయరాజా. ప్రేమ జయం... ఇళయరాజా. భావనలొకటై సాగిపోయే వేళలో.... పరువమా చిలిపి పరుగు తీయకు....తమిళనాడు తేని జిల్లాలో మారుమూల కుగ్రామంలో రాజయ్యగా పుట్టి, రాజాగా మారి అప్పటికే మన ఏ.ఎం.రాజా ఇండస్ట్రీలో ఉండటం వల్ల ‘ఇళయ’ చేర్చుకుని ఇళయరాజాగా ‘అన్నాకిళి’ (1976)తో ఏ ముహూర్తాన సంగీత దర్శకుడిగా జన్మించాడోగాని ఇంతకాలం తర్వాత, 1,500 సినిమాలకు 8,500 పాటలు చేశాక, 81 ఏళ్లకు చేరుకున్నాక కూడా ఆకర్షణ కోల్పోలేదు. పెరిగే అభిమానుల రాశి తప్ప అతని పాటల సూచి కుదేలైన దాఖలా లేదు. ఇసైజ్ఞాని. మేస్ట్రో. రాజా సార్. ఒకసారి వింటే చర్మానికి అంటుకుపోయే ఒడు కొలాన్ సెంట్. 1980లలో హైస్కూల్లోనో కాలేజీలోనో ఉన్నవారెవరైనా ఇతని మొగలి వనాలలో వ్యసనపరులు. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. రావడం రావడమే కొత్త సౌండ్ను ప్రవేశ పెట్టిన ఇళయరాజాకు, కర్ణాటక ధోరణిని వెస్ట్రన్ తో ఫ్యూజన్ చేయాలనుకుంటున్న ఇళయరాజాకు తన పాటలు సగటు శ్రోతలకు నచ్చుతాయా లేదా అనే సందేహం తెగ పీడించింది. ఒకరోజు సాయంత్రం వాకింగ్కు ఇంటి నుంచి బయలుదేరితే రేడియోలో ‘అన్నాకిళి’ (రామచిలుక)లోని ‘మావయ్య వస్తాడట’ పాట మొదలైందట! అంతే... ఆ ఇంటి ఇల్లాలు గబగబా బయటకు వచ్చి ‘ఓ సుబ్బాయక్కా... మంగమ్మత్తా... మావయ్య వస్తాడట పాట వస్తోందే రేడియో పెట్టండి’ అని అరిచిందట! ఇళయరాజా నడుస్తున్న పొడవైన వీధి. ఇక చూడండి... ప్రతి గడపా వరుసగా రేడియో ఆన్ చేస్తూ అతని పాటను అతనికే వినిపిస్తూ కచేరీ. వారిచ్చిన నమ్మకం నేటికీ!‘సంగీతం రాదు... ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను’ అనే ఇళయరాజా ఇంత పేరు, ఖ్యాతి, సంపద తర్వాత కూడా వయసు రీత్యా విరమించుకొని ఉండొచ్చు. గర్వంతో మొద్దుబారి ఉండొచ్చు. అహంతో బంగారు సింహాసనం చేసుకుని విర్రవీగొచ్చు. కాని అతడు అవేం చేయలేదు. భారతీయ సంగీత ప్రతిభను ప్రపంచానికి చాటడానికి వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్లో అత్యంత క్లిష్టమైన ‘సింఫనీ’ రాసి, దానికి ‘వేలియంట్’ అని నామకరణం చేసి, మార్చి 8న లండన్ లో 85 మంది సభ్యుల ప్రతిష్ఠాత్మక రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో ప్రదర్శన ఇచ్చాడు. చదవండి: వాక్కాలుష్యం.. మాటల గురించి కాస్త మాట్లాడుకుందాంప్రపంచ దేశాల నుంచి రాజా అభిమానులు ఈ సింఫనీకి హాజరయ్యారు. 45 నిమిషాల నాలుగు అంచెల సింఫనీని విని స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఇలా వెస్ట్రన్ క్లాసికల్లో సింఫనీ రాసి, లండన్ (London)లో ప్రదర్శన ఇచ్చిన మొట్టమొదటి భారతీయుడిగా రాజా చరిత్ర సృష్టించాడు. మరల రాజాధిరాజుగా నిలిచాడు. వ్యక్తిగత ప్రవర్తనలో కొందరికి అభ్యంతరాలు ఉండుగాక... కాని ఇళయరాజా ఒకసారి హార్మోనియం పెట్టె ముందు కూచున్నాడంటే దేవుడు– అభిమానులకు! చేసిన పాటల కంటే బ్యాక్గ్రౌండ్ స్కోరుకు ఫ్యాన్స్ ఉన్నారంటే ఏమిటి చెప్పడం! చదవండి: ఆ రెండూ ఉంటే.. కావాల్సినవన్నీ ఉన్నట్టేరాజా తరగని స్ఫూర్తి. కొద్దిగా చేసి ఎంతో అనుకునేవారు, కాసింత వయసుకే డీలా పడిపోయే వారు, నాలుగు ముక్కలు చదివి మేధావులుగా చలామణి అయ్యేవారు, అద్దెలొచ్చే నాలుగు ఫ్లాట్లకు ఓనర్లైనంత మాత్రాన ఇతరులను పురుగుల్లా చూసేవారు... రాజా నుంచి నేర్చుకోవాల్సింది ఉన్నట్టే ఉంది. రాజా చెయ్యి వేస్తే... అది రాంగై పోదు లేరా! -
ఈ అనిశ్చితి పోయేదెలా?
జనవరి 20న గద్దెనెక్కినప్పటినుంచీ అధిక టారిఫ్లపై హెచ్చరిస్తూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... చివరికి అందుకు తుది గడువు ఖరారు చేశారు. తమ ఉత్పత్తులపై అధిక టారిఫ్లు వసూలు చేస్తున్న దేశాలన్నీ వచ్చే నెల 2 నుంచి తమ దెబ్బ కాచుకోవాలని హెచ్చరిక జారీచేశారు. దాదాపు వంద నిమిషాలపాటు అమెరికన్ కాంగ్రెస్నుద్దేశించి బుధవారం ఆయన చేసిన ప్రసంగం నిండా ఇలాంటి హెచ్చరికలున్నాయి. ఇప్పటికే చాలా సాధించినట్టు స్వోత్కర్షలున్నాయి. అమెరికా ప్రజల పాలిట తాను ఆపద్బాంధవుడినన్న భ్రమ కూడా ఆయనకు పుష్కలంగా ఉంది. ‘నేను విధించబోయే సుంకాలు కేవలం ప్రజానీకం ఉద్యోగాలు కాపాడటానికి మాత్రమే కాదు... ఈ చర్య మన దేశ ఆత్మను కాపాడటానికి కూడా’ అని ఆయన చెప్పుకొచ్చారు. సహజంగానే ప్రపంచమంతా ఏప్రిల్ గురించి బెంగపడుతోంది. ముంచుకొచ్చే ద్రవ్యపరమైన అసమతౌల్యతను అధిగమించడమెలాగో తెలియక అయోమయంలో కూరుకుపోతోంది. ఇప్పటికే ట్రంప్ చైనాపై అదనంగా 10 శాతం, మెక్సికో, కెనడాలపై మరో 25 శాతం సుంకాలు ప్రకటించటం వల్ల ఈ ఉపద్రవం ఖాయమని అన్ని దేశాలూ ఆందోళనతో ఉన్నాయి. సుంకాలను ట్రంప్ ‘సర్వరోగ నివారిణి’గా భావిస్తున్నారు. మెక్సికో మాదకద్రవ్య ముఠాల నుంచి పెద్ద యెత్తున వచ్చిపడే ఫెంటానిల్ అమెరికాకు పెద్ద సమస్యగా మారింది. అక్రమ వలసలు దీనికి అదనం. వలసలను అరికట్టి, మాదకద్రవ్య ముఠా నాయకుల్ని పట్టి అప్పగించకపోతే 25 శాతం సుంకాలు తప్పవని గత నెల 4న ట్రంప్ హెచ్చరించటంతో కెనడా, మెక్సికోలు ఒక నెల వ్యవధి కోరాయి. మెక్సికో అధ్యక్షురాలు షీన్బామ్ వెనువెంటనే అమెరికా–మెక్సికో సరిహద్దుల్లోకి అదనంగా 10,000 మంది సైనికులను తరలించి తనిఖీలు పెంచి వలసలను నియంత్రించారు. దేశంలో ఫెంటానిల్ నిల్వలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేయటంతోపాటు భారీయెత్తున అరెస్టులు చేయించారు. 29 మంది డ్రగ్స్ ముఠా నాయకుల్ని అమెరికాకు అప్పగించారు. కెనడా అధ్యక్షుడు ట్రూడో ఫెంటానిల్ సరిహద్దులు దాటకుండా తనిఖీ వ్యవస్థను ముమ్మరం చేశారు. అయినా ట్రంప్ మనసు మారలేదు. ఆ రెండు దేశాలపై 25 శాతం అదనపు సుంకాలుంటాయని తన ప్రసంగంలో ప్రకటించారు. త్వరలో జరగబోయే ఎన్ని కల్లో పార్టీ ఓటమి ఖాయమన్న అంచనాలుండటంతో దీన్ని తనకు అనుకూలంగా మలుచుకోవ టానికి ట్రూడో సిద్ధపడ్డారు. అందుకే ‘సై అంటే సై’ అంటున్నారు. అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించ బోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే 2,100 కోట్ల డాలర్ల విలువైన సరుకుపై సుంకాలు వడ్డించారు. వివాదం సద్దుమణగకపోతే మరో 8,700 కోట్ల డాలర్ల సరుకుపై ఇది తప్పదని హెచ్చరించారు. షీన్బామ్ ఈమధ్యే అధికారంలోకొచ్చారు గనుక ఆమెకు కావలసినంత వ్యవధి వుంది. అందుకే ఎంతో సంయమనం పాటిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని తలకిందులు చేసే ఈ మాదిరి బ్లాక్మెయిలింగ్ కొత్తగా ట్రంప్కు పుట్టిన బుద్ధికాదు. అమెరికాలో ఎవరున్నా ఇలాంటి బెదిరింపులతోనే ప్రపంచ దేశాలను దారికి తెచ్చుకున్నారు. 1986–89 మధ్య సుంకాలు, వాణిజ్యాలపై సాధారణ ఒడంబడిక (గాట్)కు సంబంధించిన ఉరుగ్వే రౌండ్ చర్చల్లోనైనా, ఆ తర్వాత ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)పై జరిగిన దోహా రౌండ్ చర్చల్లోనైనా అమెరికా వ్యూహం ఇదే. బ్రెజిల్ నుంచి వచ్చిన 4 కోట్ల డాలర్ల దిగుమతులపై వంద శాతం సుంకాలు విధించింది. మన నుంచి వెళ్లిన వస్త్ర దిగుమతులపైనా ఇలాంటి చర్యే తీసుకోబోతున్నట్టు హెచ్చరించింది. దాంతో మేధా సంపత్తి హక్కుల(ఐపీఆర్)పై అమెరికా తీసుకొచ్చిన అన్యాయమైన నిబంధనలకు తలొగ్గక తప్పలేదు. ఆఫ్రికా దేశాలనూ ఇలాగే దారికి తెచ్చుకుంది. అమెరికా అతి పెద్ద మార్కెట్ కావటం వల్ల అత్యధిక దేశాలు దానికెళ్లే ఎగుమతులపై ఆధారపడి వుంటాయి. మన దేశం నుంచి అమెరికాకు వెళ్లే ఎగుమతులు 18 శాతమైతే థాయ్లాండ్ నుంచి 17 శాతం, దక్షిణ కొరియానుంచి 16 శాతం ఎగుమతులుంటాయి. అమెరికాకు మెక్సికో ఎగుమతులు ఏకంగా 78 శాతం. తమ సంపద పెంచుకోవటానికి సంపన్న రాజ్యాలు నిరంతరం ప్రయత్నిస్తుంటాయి. భారత్తో సహా అనేక దేశాలు సుదీర్ఘకాలం పరాయి పాలనలో మగ్గిపోవటానికి ఏకైక కారణం ఇదే. ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు లభ్యతకూ, తయారైన సరుకు అమ్ముకోవటానికీ సరిహద్దులు దాటి వెళ్తూ సమయానుకూలంగా విధానాలు మార్చుకోవడం సంపన్న రాజ్యాల నైజం. గతంలో తన మార్కెట్ను విస్తరించుకోవటానికి డబ్ల్యూటీవో తీసుకొచ్చిన అమెరికాయే ఇప్పుడు వేరే మార్గానికి మళ్లింది. అయితే ట్రంప్ చర్యల వల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం అధికమవుతుంది. సగటు పౌరుల జీవన వ్యయం పెరిగి పోతుంది. వ్యాపారం దెబ్బతిని నిరుద్యోగం ప్రబలుతుంది. ఆర్థిక వ్యవస్థ మందగిస్తుంది. తరతమ స్థాయిల్లో అన్ని దేశాలూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనక తప్పదు. 80 ఏళ్లుగా ప్రపంచ మార్కెట్లను శాసిస్తూ అతిగా సంపద పోగేసిన దేశమే ‘నన్ను అందరూ దోచుకుతింటున్నార’ంటూ పెడబొబ్బలు పెట్టడం ఒక వైచిత్రి. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని బృందం అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ఎదురుచూస్తోంది. ఇప్పుడు ఒక్కొక్క దేశం అమెరికాపై ప్రతీకార సుంకాలకు రెడీ అవుతోంది. మున్ముందు కొత్త మార్కెట్ల వెదుకులాట కూడా మొదలవుతుంది. ఇలాకాక దేశాలన్నీ సమష్టిగా వ్యవహరిస్తేనే ఏదో మేర ప్రయోజనం ఉంటుంది. అమెరికాపై ఒత్తిడి పెరిగి సహేతుకమైన పరిష్కారం వీలవుతుంది. -
నిద్రలేచిన ‘బోఫోర్స్ స్కాం’
నలభైయ్యేళ్ల క్రితం పుట్టుకొచ్చి, పుష్కరకాలం క్రితం శాశ్వత సమాధి అయిందనుకున్న బోఫోర్స్ కుంభకోణం మళ్లీ ఆవులిస్తోంది. దాన్ని సమాధి చేసేవరకూ ఇంచుమించు ప్రతియేటా ఏదో ఒక కొత్త సంగతితో బయటికొస్తూ, వచ్చినప్పుడల్లా పెను సంచలనానికీ, దుమారానికీ కారణమైన బోఫోర్స్ ఆ రకంగా ‘ఎవర్ గ్రీన్’. ప్రత్యేక న్యాయస్థానం జారీ చేసిన అభ్యర్థన పత్రంతో కొన్ని రోజుల క్రితం కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ, అమెరికా న్యాయ విభాగాన్ని సంప్రదించటంతో అది మరోసారి పతాక శీర్షికలకు ఎక్కబోతున్నదని భావించవచ్చు. అప్పట్లో బోఫోర్స్ స్కాంపై దర్యాప్తు చేశామని చెప్పిన అమెరికన్ ప్రైవేటు డిటెక్టివ్ సంస్థ ‘ఫెయిర్ ఫాక్స్’ నుంచి సమాచారం సేకరించాలన్నది సీబీఐ ప్రధాన ధ్యేయం. వాస్తవానికి ఈ అభ్యర్థన పత్రాన్ని జారీ చేయాల్సిందిగా నిరుడు అక్టోబర్లోనే ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానాన్ని సీబీఐ ఆశ్రయించిందని చెబుతున్నారు. ఇప్పటికీ ఎవరూ అధిగమించలేని స్థాయిలో 1984 లోక్సభ ఎన్నికల్లో తన నేతృత్వంలోని కాంగ్రెస్కు 404 స్థానాలు సాధించిపెట్టిన మాజీ ప్రధాని రాజీవ్గాంధీని... ఆ తర్వాత మరో మూడేళ్లకు బయట పడిన ఈ కుంభకోణం ఊపిరాడనీయకుండా చేసింది. ఇందులో తనకు లేదా తన కుటుంబ సభ్యు లకు ఎలాంటి ప్రమేయమూ లేదని రాజీవ్ చెప్పిన మాటల్ని జనం విశ్వసించలేదు. 1989 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ సగానికిపైగా స్థానాలు కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితమైంది. వీపీ సింగ్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం 1990లో ఆదేశించే వరకూ నిందితులపై కేసు ల్లేవు. దర్యాప్తు లేదు. అంతవరకూ మన దేశంలో ఎవరికీ పెద్దగా తెలియని స్వీడన్ రేడియో 1987లో బోఫోర్స్ శతఘ్నుల కొనుగోళ్లలో ముడుపులు చేతులు మారాయని తొలిసారి వెల్లడించినప్పుడు మన దేశంలో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. అటు స్వీడన్లోనూ పెను సంచలనం కలిగించాయి. ఈ స్కాంలో మన రాజకీయ నాయకులు, రక్షణ అధికారులతోపాటు కొందరు విదేశీయులు పీకల్లోతు మునిగారని వెల్లడైంది. స్వీడన్ ఆయుధాల సంస్థ ఏబీ బోఫోర్స్ నుంచి నాలుగు వందల 155 ఎంఎం శతఘ్నులు కొనుగోలు చేయటానికి రూ. 1,437 కోట్లతో ఒప్పందం కుదరగా,అందులో రూ. 64 కోట్లు చేతులు మారాయన్నది ప్రధాన ఆరోపణ. ఇందులో ఇటలీ వ్యాపారవేత్త అటావియో కత్రోచి, బోఫోర్స్కు ఏజెంట్గా వ్యవహరించిన విన్చద్దా, పారిశ్రామికవేత్తలు హిందూజా సోదరుల పేర్లు వెల్లడయ్యాయి. ‘ది హిందూ’ దినపత్రిక జర్నలిస్టు చిత్రా సుబ్రహ్మణ్యం ఈ కుంభ కోణంపై వరసబెట్టి రాసిన కథనాల పరంపరతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. దీనికి తోడు బోఫోర్స్ సంస్థ ఎండీ మార్టిన్ ఆర్డ్బో రాసుకున్న డైరీలోని అంశాలు సైతం బట్టబయలయ్యాయి.దాదాపు పదిహేనేళ్లపాటు దర్యాప్తు పేరుతో సీబీఐ సాగించిందంతా ఒక ప్రహసనం. ఆ తంతు సాగుతుండగానే 1993లో కత్రోచి మన దేశం నుంచి చల్లగా జారుకున్నాడు. అతని బ్యాంకు ఖాతాల విషయమై సమాచారం కావాలంటూ భారత్ నుంచి వచ్చిన అభ్యర్థనను పట్టించుకోవాల్సిన పని లేదంటూ స్విట్జర్లాండ్ విదేశాంగ మంత్రికి అంతకు ఏడాదిముందు... అంటే 1992లో పీవీ నరసింహారావు ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా ఉన్న మాధవ్సిన్హ్ సోలంకీ ఉత్తరం అందజేశారు. ఇక 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఏలుబడి మొదలయ్యాక దర్యాప్తు పూర్తిగా పడకేసింది. ఈ కేసుకు సంబంధించి కొత్త పాత్రధారులు తెరపైకొస్తున్నా, సరికొత్త వివరాలు వెల్లడవుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. ఈలోగా నిందితుల్లో కొందరు మరణించారు. కనీసం బతికున్న కత్రోచి పైన అయినా దర్యాప్తు కొనసాగించమని 2005లో ఢిల్లీ హైకోర్టు చెప్పినా సీబీఐ ముందుకు కదలనే లేదు. వాస్తవానికి అంతకుముందు 2003లో మలేసియాలోనూ, ఆ తర్వాత 2007లో అర్జెంటీనా లోనూ కత్రోచి కదలికలు కనబడినా అరెస్టుకు ప్రయత్నించలేదు. సరిగదా... లండన్లోని కత్రోచి ఖాతాలకూ, ముడుపులకూ సంబంధం లేదంటూ ఆ ఖాతాల స్తంభనను రద్దు చేయించి, 2009లో ‘వాంటెడ్’ జాబితా నుంచి అతని పేరు తొలగింపజేయటంలో సీబీఐ అత్యుత్సాహం ప్రదర్శించింది. నిందితులుగా ఉన్న కత్రోచి, విన్ చద్దాలకు రూ. 41 కోట్లు అందాయని ఆదాయపన్ను విభాగం అప్పిలేట్ ట్రిబ్యునల్ నిర్ధారించి వారిద్దరూ ఆ ఆదాయంపై పన్ను కట్టాల్సిందేనని 2011లో తేల్చి చెప్పింది. వీరిద్దరికీ ఏఈ సర్వీసెస్ నుంచీ, స్వెన్స్కా అనే సంస్థ నుంచీ సొమ్ములు బదిలీ అయ్యా యని తెలిపింది. ఆ తర్వాతైనా సీబీఐ చేయాల్సింది చేయలేదు. ట్రిబ్యునల్ ఉత్తర్వులిచ్చిన మర్నాడే కత్రోచిని పట్టుకోవటం మావల్ల కాదని కోర్టులో ఆ సంస్థ చేతులెత్తేసింది. నిందితులందరిపై కేసుల ఉపసంహరణకు అనుమతించమని అది దాఖలు చేసిన పిటిషన్ను ప్రత్యేక కోర్టు అంగీకరించింది. కీలక నిందితుడు కత్రోచి 2013లో మరణించాడు. దీన్ని తిరగదోడేందుకు అనుమతించాలన్న సీబీఐ వినతిని సుప్రీంకోర్టు తీవ్ర జాప్యం చోటుచేసుకుందన్న కారణాన్ని చూపి 2018లో తోసిపుచ్చింది.రాజీవ్ గాంధీకి ఈ ముడుపుల వ్యవహారంతో సంబంధం లేదని 2004లో ఢిల్లీ హైకోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత కాలంలో దర్యాప్తు ఎందుకు నత్తనడకన సాగింది? ఎవరిని కాపాడటానికి ఆ సంస్థ తాపత్రయపడింది? ఒక స్విస్ బ్యాంక్లో ‘మాంట్ బ్లాంక్’ పేరిట ఉన్న ఖాతాలో బోఫోర్స్ ముడుపులున్నాయని తాము కనుగొన్నప్పుడు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆగ్రహోదగ్రు డయ్యారని ‘ఫెయిర్ ఫాక్స్’ సారథి మైకేల్ హెర్ష్మాన్ 2017లో చెప్పిన మాటల్లో వాస్తవం ఎంత? ఇందులో వెలికితీయాల్సిన చేదు నిజాలు చాలానే ఉన్నాయని ఈ పరిణామాలు చూస్తే అర్థమవు తుంది. ఈసారైనా ఆ పని జరుగుతుందా అనేది వేచిచూడాలి. -
ఇది చట్టబద్ధ హత్య!
పొట్ట చేతబట్టుకుని గల్ఫ్ దేశాలకు వలసపోయే కార్మికుల విషాద గాథలు మనకు కొత్తగాదు. జీవితాలు సవ్యంగా వెళ్తే సరేగానీ... ఒకసారంటూ సమస్యల్లో చిక్కుకుంటే అక్కడ నరకం చవి చూడక తప్పదని తరచు వెల్లడయ్యే ఘోర ఉదంతాలు చెబుతాయి. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబూధాబీలో చేయని నేరానికి ఉరికంబం ఎక్కిన ఉత్తరప్రదేశ్ యువతి షెహజాదీ ఉదంతం మరింత దారుణమైనది. నాలుగు నెలల శిశువును హత్య చేసిందని ఆరోపిస్తూ మోపిన కేసులో ఆమె వాదనలన్నీ అరణ్య రోదనలు కాగా చివరకు గత నెల 15న అక్కడి ప్రభుత్వం ఆ యువతి ఉసురు తీసింది. జవాబుదారీతనం ఏమాత్రం లేని వ్యవస్థలతో నిండిన యూఏఈలో వలస కార్మికులకు వీసమెత్తు విలువుండదు. వారి ప్రాణాలకు పూచీ ఉండదు. కానీ మన దేశం నుంచి వలసపోయే వారిలో అత్యధికులు ఎంచుకునేది యూఏఈనే. ఒక లెక్క ప్రకారం అక్కడ 35 లక్షలకు పైగా భారతీయ వలస కార్మికులున్నారు. ఆ దేశ జనాభాలో వీరి వాటా దాదాపు 33 శాతం. ఈ కార్మికుల్లో అత్యధికులు నివసించేది అబూధాబీలోనే. వలస కార్మికుల రక్షణ కోసం మన దేశం చర్యలు తీసుకుంటున్న మాట వాస్తవమే అయినా అవి చాలినంతగా లేవు. మనకు యూఏఈతో ద్వైపాక్షిక కార్మిక ఒప్పందాలున్నాయి. ప్రవాసీ బీమా యోజన కింద తప్పనిసరి ఇన్సూరెన్స్ పథకం ఉంది. కార్మికుల హక్కులు కాపాడటానికీ, వలసల క్రమబద్ధీకరణకూ ఈ–మైగ్రేట్ వ్యవస్థ ఉంది. కానీ ఇవేవీ షెహజాదీని కాపాడలేకపోయాయి. చిన్ననాడు ముఖంపై కాలిన గాయాలవల్ల ఏర్పడ్డ మచ్చలను తొలగించుకోవాలని ఆరాటపడి ఆమె ఒక మాయగాడి వలలో చిక్కుకుంది. యూఏఈలో ఉన్న తన బంధువుల ద్వారా అక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవచ్చని అతగాడు నమ్మించి షెహజాదీ నుంచి రూ. 3 లక్షలు, బంగారు నగలు తీసుకుని ఆమెను 2021 చివరిలో అబూధాబీకి పంపాడు. శస్త్రచికిత్స మాట వదిలి ఒక ఇంట్లో పని మనిషిగా చేర్చాడు. ఆ ఇంటి యజమాని భార్య ఒక శిశువుకు జన్మనిచ్చాక అదనంగా శిశు సంరక్షణ భారం కూడా పడింది. నాలుగు నెలలున్న శిశువు వ్యాక్సిన్ వికటించి మరణిస్తే షెహజాదీపై హత్యా నేరం మోపారు. 2022 డిసెంబర్లో ఈ ఘటన జరిగిన నాటి నుంచీ దర్యాప్తు పేరుతో ఆమెను జైలు పాలు చేసిన పోలీసులు 2023 ఫిబ్రవరిలో లాంఛనంగా అరెస్టు చేశారు. కోర్టులో విచారణ తంతు నడిపించి ఆమెను దోషిగా తేల్చారు. ఈ క్రమమంతా మన ప్రభుత్వ యంత్రాంగం, యూఏఈలోని మన రాయబార కార్యాలయం ఏం చేశాయన్నదే ప్రశ్న. శిశు మరణానికి కారణం స్పష్టంగా కనబడు తోంది. ఒక్కోసారి వ్యాక్సిన్లు శిశువులకు ప్రాణాంతకం కావటం అసాధారణమేమీ కాదు. ఆ మరణం వ్యాక్సిన్ వల్ల జరిగిందా లేక షెహజాదీయే శిశువుకు హాని తలపెట్టిందా అన్నది పోస్టు మార్టం జరిపితే వెల్లడయ్యేది. కానీ ఆ శిశువు తండ్రి అందుకు ఒప్పుకోలేదట. కనుక షెహజాదీని కోర్టులు దోషిగా నిర్ధారించాయి! సరైన ప్రయత్నాలు జరిపివుంటే న్యాయం జరిగేదేమో! రాష్ట్రపతి, ప్రధాని మొదలుకొని అన్ని స్థాయుల్లోనూ మొరపెట్టుకుంటూనే ఉన్నామని, వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నామని కానీ సరైన స్పందన లేదని షెహజాదీ తండ్రి షబ్బీర్ ఖాన్ అంటున్నారు. ఆఖరికి తమ కుమార్తె బతికుందో లేదో చెప్పమని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆమె తండ్రి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తే తప్ప నిజమేమిటో వెల్లడి కాలేదు. శస్త్ర చికిత్స కోసం వెళ్లిన యువతిని బలవంతంగా పనికి కుదుర్చుకోవటమేగాక ఆమెపై హత్యా నేరం మోపటం, కింది కోర్టు విధించిన శిక్షను ఉన్నత న్యాయస్థానం కనీస ఆలోచన లేకుండా ఖరారు చేయటం అమానవీయం. ప్రభుత్వం అంతకన్నా బాధ్యతారహితంగా వ్యవహరించింది. గత నెల 15న మరణశిక్ష అమలు చేయగా, 17న రివ్యూ పిటిషన్ దాఖలైనప్పుడు సైతం కేసును పరిశీ లిస్తున్నామన్న జవాబే ఇచ్చింది. మరణశిక్ష అమలైనట్టు 28నగానీ మన రాయబార కార్యాలయానికి చెప్పలేదు. కేసు విషయంలో చేయగలిగిందంతా చేశామని మన విదేశాంగ శాఖ వివరిస్తోంది. ఆమె తరఫున క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయించామని, చట్టాలు కఠినంగా ఉండటంతో కాపాడలేక పోయామని అంటున్నది. కానీ రెండేళ్లుగా నలుగుతున్న ఈ కేసు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం, ఇతరత్రా హక్కుల సంఘాల దృష్టికి వెళ్లిందో లేదో తెలియదు. ఉసురు తీసేముందు చివరి కోరికగా తల్లిదండ్రులతో మాట్లాడించినా అది రెండు నిమిషాల ముచ్చటే అయింది. సంపన్నవంతమైన దేశంలో కాయకష్టం చేస్తే మంచి సంపాదన ఉంటుందని భావించి చాలా మంది అక్కడికి వెళ్తుంటారు. కానీ 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో అత్యంత దారుణమైన పరి స్థితుల్లో పనిచేయాలని, అక్కడ అమల్లోవున్న కఫాలా వ్యవస్థ ప్రకారం వారి వీసాలు యజమానులకు అనుసంధానించి వస్తాయని, దిగినవెంటనే వారు పాస్పోర్టులు స్వాధీనం చేసుకుంటారని, అందువల్ల మరోచోట పని వెదుక్కోవటం అసాధ్యమని చాలామందికి తెలియదు. అధిక గంటలు పనిచేయించుకోవటం, వేతనాలు ఎగ్గొట్టడం, సామాజిక భద్రత పథకాలు లేకపోవటం వలస కార్మి కుల బతుకును దుర్భరం చేస్తోంది. ఈ విషయంలో యూఏఈతో మాట్లాడి తగిన చట్టాలు అమలయ్యేలా చూడటం, అక్కడ క్రిమినల్ కేసుల్లో చిక్కుకున్న మన కార్మికుల వివరాలు ఎప్పటికప్పుడు అందించే వ్యవస్థ అందుబాటులోకి తీసుకురావటం అవసరమని చెప్పాలి. వలసపోయే కార్మికులకు అక్కడ పొంచివుండే ప్రమాదాల గురించి అవగాహన పెంచాలి. షెహజాదీని కాపాడుకోలేక పోయినా, ఆ స్థితి మరెవరికీ రాకుండా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. -
వ్యక్తిగత ప్రపంచం
‘ఒక గ్రంథాలయం, ఒక గార్డెన్ ఉందంటే నీకు కావాల్సినవన్నీ ఉన్నట్టే’ అన్నారు రోమన్ తత్వవేత్త సిసిరో. ఆ రెండింటితో పాటు ఇంకా ఎన్నో ఉన్నప్పటికీ, కేవలం గ్రంథాలయం గురించే ముచ్చటగా తలుచుకున్నారు ఇటీవల ముగిసిన ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో తల్లి, రచయిత్రి సుధామూర్తితో అక్షతామూర్తి (బ్రిటన్ మాజీ ప్రధాని రిషీ సునాక్ భార్య) సంభాషిస్తూ తల్లికీ, తండ్రి (నారాయణ మూర్తి)కీ విడి పర్సనల్ లైబ్రరీలు (Personal Library) ఉండేవనీ; తల్లి దగ్గర సాహిత్యం, చరిత్ర పుస్తకాలుంటే, తండ్రి దగ్గర సైన్సు, టెక్నాలజీ పుస్తకాలుండేవనీ; తానూ, తమ్ముడు రోహన్ రెంటినీ కలగలిపి చదివేవారమనీ చెప్పారు. అన్నట్టూ, రోహన్ మూర్తి (Rohan Murty) పూనికతో 2015లో ప్రారంభమైన ‘మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా’ భారత సాహిత్యంలోని అన్ని క్లాసిక్స్ ఆంగ్లానువాదాలను ప్రచురిస్తోంది. ఏమైనా ఈ ‘ఇన్ఫోసిస్’ కుటుంబం పర్సనల్ లైబ్రరీ అనే భావనను మరోసారి సాహిత్య పాఠకులకు తియ్యగా గుర్తుచేసింది.వ్యక్తిగత లైబ్రరీ అనేదానికి నిర్దిష్ట కొలతలు లేవు. అన్ని సైజుల్లో, షేపుల్లో ఉంటుంది. అసలు ఏ ఆకృతి లేకుండా కేవలం పుస్తకాల దొంతర రూపంలోనూ ఉండొచ్చు. ఒంటరి పాఠకుడిగానూ, జీతం లేని లైబ్రేరియన్గానూ ద్విపాత్రాభినయం చేసే ఒకరి లైబ్రరీ ఇంకొకరి లైబ్రరీలా ఉండదు. అది వారి అభిరుచికీ, సౌకర్యానికీ అద్దం. పుస్తకాలను అక్షర క్రమంలో పెట్టుకుంటామా, సైజుల వారీగానా, వర్గీకరణ పరంగానా, రచయితల పరంగానా అన్నది వారి వారి ఛాయిస్. ఠక్కున తీసి చదువుకోగలిగే ఫేవరెట్స్ ఎక్కడ పెట్టుకోవాలో, రిఫరెన్స్ కోసం అవసరమయ్యే పుస్తకాలు ఎటువైపుంచాలో, ఎప్పుడోగానీ తీయమని తెలిసేవి ఎటు పక్కుంచాలో, అసలు ప్రతిపూటా తీయడం వల్ల నలిగిపొయ్యే నిఘంటువుల లాంటివి ఎక్కడ ఉంచితే మేలో, కొనడమేగానీ ఎన్నడూ పేజీ తిప్పిన పాపానపోని పుస్తకాలను ఏం చేయాలో ఎవరిది వారికే తెలుస్తుంది. ఏ పుస్తకం పక్కన ఏది వస్తే చెలిమి చేసినట్టుంటుందో, దేని పక్కన ఏది రాకుండా చూసుకుంటే గొడవ తప్పించినట్టు అవుతుందో కూడా చూసుకోవాలి. లైబ్రరీ అనేది భిన్న రూపాలుగా విస్తరించి ఉంటుందనేది నిజమే అయినా, ప్రాథమికంగా అది అచ్చు పుస్తకాల నిలయం. అమెరికా రచయిత్రి సూసన్ సోంటాగ్ దగ్గర 15,000 పుస్తకాల భారీ భాండాగారం ఉండేది. వాటిని ఆమె ఆర్ట్, ఆర్కిటెక్చర్, తత్వశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, చరిత్ర, మతం... ఇలా ప్రక్రియలుగా విభజించి పెట్టుకునేవారు. అర్జెంటీనా– కెనడా రచయిత ఆల్బెర్టో మాంగ్యూల్ దగ్గర ఏకంగా 35,000 పుస్తకాలు ఉన్నాయి. వాటిని ఎక్కడా సరిగ్గా సర్దుకోలేక ఫ్రాన్స్లో అవి పట్టేంతటి ఒక పాత భవంతి దొరికితే దాన్ని ఆయన కొనేశారు. ఇక అబ్బురపరిచే మేధానిధి లాంటి ‘బాబాసాహెబ్’ అంబేడ్కర్ తన జీవితకాలంలో తన నివాసం ‘రాజగృహ’లో సుమారు యాభై వేల పుస్తకాలను సేకరించారు. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యక్తిగత గ్రంథాలయాల్లో ఇదీ ఒకటి. వందల నుంచి వేల పుస్తకాల ఇంటి లైబ్రరీలు ఉన్న రచయితలు, సాహిత్య ప్రేమికులు తెలుగులోనూ గురజాడ అప్పారావు నుంచి మొదలుకొని ఎందరో ఉన్నారు.సాహిత్య వాసన ఉన్నవారికైనా ఒకరి ఇంటికెళ్తే ముందు చూపు పడేది వారింట్లో ఉన్న పుస్తకాలపైనే! అది సంభాషణకు మంచి ఊతం కాగలదు. కానీ అన్నీ మూటగట్టేసి అటక మీద పెట్టేసే జీవితపు కరుకు వాస్తవంలోకి మనుషులు జారిపోతున్నారు. అందుకే కనీసం ప్రదర్శన నిమిత్తం అయినా లైబ్రరీలు ఇళ్లల్లో ఆకర్షణగా ఉండటం లేదు. చేతిలో పుస్తకంతో కనబడటం పాత వాసనగా మారిపోయింది. కలిసి ఒక సినిమాకో, షాపింగ్కో వెళ్లినట్టుగా స్నేహంగా లైబ్రరీకి వెళ్లడం అనేది ట్రెండీగా ఉండటం లేదు. అందుకే పర్సనల్ లైబ్రరీలు అటుండనీ, అసలు లైబ్రరీలే తగ్గిపోతున్నాయి. పుస్తకాలను చదవడం బరువైపోతోంది, వాటిని నిర్వహించడం భారమైపోతోంది. ‘‘మనం చదివిన స్కూల్ లైబ్రరీలోని తెలుగు పుస్తకాలు గత పాతికేళ్లుగా చదివినవాళ్లు లేరుట. తీసేస్తున్నారని తెలిసి కొంచెం సొమ్ము ఇచ్చి కొనేశాను’ అంటూ విశ్వం నుంచి మెసేజ్’’ అని మొదలవుతుంది విజయ కర్రా రాసిన ‘ఆ ఒక్కటి’ కథ. కథానాయకుడు పదో తరగతిలో ఉన్నప్పుడు రాసిన ప్రేమలేఖను ఆ అమ్మాయికి ఇచ్చే ధైర్యం లేక ఒక పుస్తకంలో పెడతాడు. ఇన్నింట్లో ఆ పుస్తకం ఏమిటో ఇన్నేళ్ల తర్వాత వెతకడం ఇందులో కథ. ఆ పుస్తకాల డబ్బాలు విప్పుతు న్నప్పుడు బయటపడే తెలుగు, బెంగాలీ, సంస్కృత, రష్యన్ రచయితల పేర్లు బయటికి చదువు కోవడం పుస్తక ప్రేమికులకు మాత్రమే అర్థమయ్యే సంతోషం. చివరకు ‘భ్రమరవాసిని’ నవల ఆఖరు పేజీలలో ఆ ప్రేమలేఖ బయటపడుతుంది. అలా ‘మన జాతి సంపద’ ఏమిటో తెలుస్తుంది.ఇటాలియన్ రచయిత అంబెర్తో ఎకో వ్యక్తిగత గ్రంథాలయంలో ముప్పె వేలకు పైగా పుస్తకాలు ఉండేవి. ఇందులో చాలా పుస్తకాలు చదవనివి ఉంటాయని దీన్ని ‘యాంటీ–లైబ్రరీ’ అని అభివర్ణించారు లెబనీస్–అమెరికన్ వ్యాసకర్త నసీమ్ నికోలస్ తలాబ్. ఒక్క క్లిక్ దూరంలో వందల ఈ–బుక్స్ అందుబాటులో ఉన్న సాంకేతిక యుగంలో, అవసరమైనది ఇట్టే బ్రౌజ్ చేయడం వీలుకాక పుస్తకాల దొంతరలన్నీ తిప్పి తిప్పలు పడాల్సిన పరిస్థితిలో... మన ఇంట్లో ‘స్పేస్’ ఇవ్వాల్సివచ్చే భౌతిక పుస్తకం విలువైనది అయివుండాలి. కానీ పుస్తకాలంటూ ఇంట్లో ఉండాలి. ఎందుకంటే డిజిటల్ పుస్తకం చదివిన ఫీలివ్వదు; పుస్తకంలోని విషయమే తప్ప, ఆ పుస్తకం బయటి వ్యవహారంతో ముడిపడే జ్ఞాపకాన్నివ్వదు. మనసుకు నచ్చే కొన్ని పుస్తకాలతో అయినా ఇంటిని అలంకరించుకుందాం. గుండెల్లో భౌతిక పుస్తకాన్ని పదిలపరుచుకుందాం. -
ఆలస్యంగా దక్కిన న్యాయం
రాజ్యం అండదండలతో పట్టపగలు ఢిల్లీ రాజవీధుల్లో చెలరేగిపోయిన ముష్కర మూకలు చిన్నా పెద్దా ఆడా మగా తేడా లేకుండా 3,000 మందిని ఊచకోత కోసిన ఉదంతాల్లో ఆలస్యంగానైనా బాధితులకు న్యాయం దక్కుతోంది. ఆ మారణహోమం జరిగి నిరుడు అక్టోబర్కు నలభైయ్యేళ్లు కాగా, ఒక కేసులో అప్పటి కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ సజ్జన్కుమార్కు రెండు యావజ్జీవ శిక్షలు పడ్డాయి. ఢిల్లీలోని సరస్వతి విహార్ ప్రాంతంలో తండ్రీకొడుకులను హతమార్చిన కేసులో ఒక యావజ్జీవ శిక్ష, గృహదహనానికి ప్రేరేపించిన కేసులో మరో యావజ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇప్పటికే ఈ ఊచకోతకు సంబంధించి వేరే కేసులో సజ్జన్ 2018 నుంచి యావ జ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. దేశ విభజన సమయంలో పెద్ద యెత్తున జరిగిన హత్యలు, అత్యాచారాలు, గృహదహనాలు, లూటీలు, ఆస్తుల ధ్వంసం ఉదంతాల తర్వాత దేశ చరిత్రలో 1984 నాటి నరమేధం అతి పెద్దది. ఇలాంటి ఉదంతాల్లో మూకలు ఉన్మాదంతో దాడులు చేయటం కనబడుతుంది. ఈ దాడుల వెనక ఎప్పుడూ సంఘటిత నేరగాళ్ల ముఠా ఉంటుంది. వీరికి రాజకీయ నాయకుల అండదండలుంటాయి. రాజకీయాల్లో తమ మాటే చెల్లు బాటు కావాలని, తమ పేరు చెబితే జనమంతా హడలెత్తిపోవాలని ఈ ముఠాల వెనకున్న నేతలు కోరుకుంటారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ తన నివాస గృహంలోనే ఒకచోటి నుంచి మరో చోటుకు వెళ్తుండగా అంగరక్షకులు ఆమెను తుపాకులతో కాల్చిచంపిన అనంతరం ఢిల్లీలోనూ, వేరే రాష్ట్రాల్లోనూ ఈ మారణహోమం కొనసాగింది. ఇందిర హంతకులు సిక్కులు గనుక, ఆ ఉదంతానికి ప్రతీకారంగా సిక్కు మతానికి చెందిన ఎవరినైనా చంపుకుంటూ పోవాలని స్పష్టమైన ఆదేశాలున్న పర్యవసానంగానే ఈ దుర్మార్గం సాగింది. ‘ఉన్మాద మూకలు ఇల్లిల్లూ తిరిగి మారణహోమం సాగిస్తున్నాయి. దయచేసి కాపాడండ’ంటూ పోలీస్ స్టేషన్లకు పోయి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. హంతక ముఠాలు పట్టపగలు నడివీధుల్లో స్వైరవిహారం చేస్తున్నా దిక్కూ మొక్కూ లేదంటే అలాంటి నేరగాళ్లు మరింతమంది పుట్టుకొస్తారు. సమాజానికి పీడలా తయారవుతారు. ప్రతీకారం పేరుతో మరికొన్ని ముఠాలు రంగప్రవేశం చేస్తాయి. పర్యవసానంగా శాంతిభద్రతలు కరువవు తాయి. వరసగా మూడు నాలుగు రోజులపాటు ఈ మాదిరి ఉదంతాలు తీవ్ర స్థాయిలో కొనసాగినా పోలీసులు ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోతే ఆనాడు ప్రజాతంత్ర హక్కుల ప్రజాసంఘం (పీయూడీఆర్), పౌరహక్కుల ప్రజాసంఘం(పీయూసీఎల్) నాయకులు విధ్వంసం జరిగిన ప్రాంతాల్లో బాధిత కుటుంబాల నుంచి వివరాలు కనుక్కుని హత్యలు, సజీవ దహనాలు, అత్యాచారాలు, ఆస్తుల విధ్వంసాలు, గృహదహనాల వివరాలతో రోజుల వ్యవధిలోనే ‘ఎవరు నేరస్తులు?’ పేరుతో పుస్తకం ప్రచురించారు. ఒకపక్క ఢిల్లీ నగరంలో దారుణాలు కొనసాగుతుండగానే వీరు ప్రాణాలకు తెగించి ఇల్లిల్లూ తిరిగారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన కథనాల ఆధారంగా దగ్గరుండి హింసాకాండ నడిపించిన ఆనాటి కాంగ్రెస్ నాయకుల పేర్లు సైతం దానిలో ప్రచురించారు.అందులో సజ్జన్కుమార్ ఒకరు. ఢిల్లీలోని సుల్తాన్పురి, కంటోన్మెంట్ తదితరచోట్ల సజ్జన్ రెచ్చగొట్టే ఉపన్యాసాలిచ్చి ఉన్మాద ముఠాల్లోని ప్రతి ఒక్కరికీ వందేసి రూపాయలు, మద్యం సీసా అందించా డని ప్రత్యక్ష సాక్షులు ఫిర్యాదు చేశారు. హంతక మూకలను ఉసిగొల్పిన నాయకుల్ని వదిలి ప్రత్యక్ష సాక్షులను భయపెట్టేందుకు, కేసులు ఉపసంహరింపజేయటానికి పోలీసులు ఒత్తిడి తెచ్చిన ఉదంతాలు కోకొల్లలు. ఢిల్లీ కౌన్సిలర్గా, మూడుసార్లు ఎంపీగా పనిచేసిన వ్యక్తి ఇంతగా బరితెగించటం ఊహించలేం. ఈయనే కాదు... హెచ్కేఎల్ భగత్, జగదీష్ టైట్లర్ వంటి అనేకమంది నాయకులకు ఢిల్లీ ఊచకోతలో ప్రమేయం ఉండొచ్చని దాదాపు డజను కమిషన్లు భావించాయి. అయినా తమ దర్యాప్తులో సాక్ష్యాధారాలు దొరకలేదని సీబీఐ తేల్చింది.వ్యక్తులకు భావోద్వేగాలుంటాయి. రాగద్వేషాలుంటాయి. కానీ వ్యవస్థ వీటికి అతీతంగా ఉండాలి. తటస్థంగా మెలగాలి. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరించాలి. కానీ ఢిల్లీ ఊచ కోత నిందితులకు ఆనాటి రాజ్యవ్యవస్థ అండదండలిచ్చింది. అందుకే నలభైయ్యేళ్లు గడుస్తున్నా చాలా కేసులు ఇంకా కింది కోర్టుల్లో విచారణ దశలోనే ఉన్నాయి. కొన్ని సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో వీగిపోయాయి. ఇలాంటి పరిస్థితులే ప్రతీకారేచ్ఛకు పునాదులవుతాయి. పంజాబ్ను దాదాపు దశాబ్దంపాటు అట్టుడికించిన ఉగ్రవాదానికి మూలం సిక్కుల ఊచకోతనే. వెనువెంటనే నిందితులను అరెస్టుచేసి వారికి సత్వరం శిక్షలుపడేలా చేస్తే ఈ బెడద ఉండేదే కాదు. ఈ మారణకాండపై అప్పటి ప్రధాని రాజీవ్గాంధీని ప్రశ్నించినప్పుడు ‘వటవృక్షం నేలకూలినప్పుడు భూమి కంపించటం సహజమే’ అని వ్యాఖ్యానించటం గమనించదగ్గది. ఆ తర్వాత కాలంలో సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆనాటి ఊచకోతకు క్షమాపణ చెప్పారు. అలాగని నిందితులను శిక్షించే ప్రక్రియను వేగవంతం చేయలేకపోయారు. ఇలాంటి ధోరణులు మరిన్ని హత్యాకాండలను ప్రోత్సహిస్తాయి. 2002లో గుజరాత్లో జరిగిన నరమేధం అందుకు ఉదాహరణ. ఆ దారుణ ఉదంతంలోనూ కొద్దిమంది దోషులకు శిక్షపడినా చాలామంది తప్పించుకున్నారు. కాలం గాయాలను మాన్పుతుందని చెబుతారు. కానీ తమ ఆప్తులను కళ్లెదుటే హతమార్చినవారిని నిర్లజ్జగా నెత్తిన పెట్టుకునే వ్యవస్థలుంటే అది ప్రతీకారానికి పురిగొల్పుతుంది. క్షతగాత్ర హృదయం చల్లారదు. అది నిత్యమూ రగులుతూనే ఉంటుంది. -
కష్టాల జర్మనీకి కొత్త సారథ్యం
బహుముఖ సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్న జర్మనీ ఆదివారం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మితవాదపక్షాల వైపు మొగ్గింది. 1990లో జర్మనీ ఏకీకరణ తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో 83.5 శాతం పోలింగ్ నమోదు కాగా మధ్యేవాద మితవాదులైన క్రిస్టియన్ డెమాక్రాటిక్ యూనియన్ (సీడీయూ), క్రిస్టియన్ సోషల్ యూనియన్ (సీఎస్యూ) పార్టీలు రెండింటికీ కలిపి 208 స్థానాలు వచ్చాయి. పోలైన వోట్లలో ఆ రెండు పార్టీలూ 28.6 శాతం గెల్చుకోగా, తీవ్ర మితవాద పక్షం ఆల్టర్నే టివ్ ఫర్ జర్మనీ (ఏఎఫ్డీ) 20.8 శాతంతో రెండో స్థానానికి చేరుకోవటం అందరినీ కలవర పరుస్తోంది. ఆ పార్టీకి 132 స్థానాలు లభించాయి. 2021తో పోలిస్తే దాని వోటింగ్ శాతం రెట్టింప యింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుచరగణం అత్యుత్సాహం ప్రదర్శించి జర్మనీ ఎన్నికల్లో జోక్యం చేసుకోనట్టయితే ఏఎఫ్డీ వైపు మరింత శాతం మంది మొగ్గుచూపేవారన్నది ఎన్నికల నిపుణుల అంచనా. ఇంతవరకూ పాలించిన కూటమికి నేతృత్వం వహించిన సోషల్ డెమాక్రాటిక్ పార్టీ (ఎస్పీడీ) 16.4 శాతం వోట్లతో, 120 సీట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. కానీ పార్లమెంటులోని 630 స్థానాల్లో ప్రభుత్వం ఏర్పర్చటానికి కావాల్సిన 316 స్థానాలు సీడీయూ, సీఎస్ యూలకు లేవు గనుక అనివార్యంగా ఎస్పీడీతో చేతులు కలపాల్సి వుంటుంది. తమకు ప్రభుత్వంలో కొనసాగే ఉద్దేశం లేదని ఎస్పీడీ చెబుతున్నా అంతకుమించి దానికి వేరే ప్రత్యామ్నాయం లేదు. ఇప్పటికీ ప్రధాన స్రవంతి పక్షాల వైపే వోటర్లు మొగ్గుచూపుతున్నట్టు తేలినా వాటి బలం గణనీ యంగా పడిపోయిందని ఫలితాలు వెల్లడిస్తున్నాయి. యువత, మహిళలు ప్రధానంగా ఎస్పీడీ, గ్రీన్ పార్టీ, వామపక్షాల వైపు మొగ్గటం గమనించదగ్గ అంశం. యువతలో ఏఎఫ్డీ ప్రభావం కూడా పెరిగింది. ప్రాంతాలవారీగా చూస్తే గతంలో కమ్యూనిస్టుల ప్రాబల్యంవున్న తూర్పు జర్మనీ ప్రాంత రాష్ట్రాల్లో ఏఎఫ్డీ బలమైన శక్తిగా ఎదిగినట్టు కనబడుతోంది. పశ్చిమ ప్రాంతంలో సీడీయూ, సీఎస్ యూలు ఆధిక్యత సాధించాయి. తూర్పు, పశ్చిమ ప్రాంతాల మిశ్రమంగావున్న బెర్లిన్ ఒక్కటే ఇందుకు మినహాయింపు. అక్కడ వామపక్ష పార్టీకి అత్యధిక వోట్లు వచ్చాయి. ఈ ఫలితాలు వెల్లడిస్తున్న మరో కీలకాంశం దేశం ప్రాంతాలవారీగా విడిపోయిందన్నదే. తమను దేశంలో ద్వితీయ శ్రేణి పౌరు లుగా చూస్తున్నారని, వలసలను ప్రోత్సహిస్తూ తమ అవకాశాలను దెబ్బతీస్తున్నారని చాన్నాళ్లుగా పూర్వపు తూర్పు జర్మనీ వాసులు ఆగ్రహంతో ఉన్నారు. ఏఎఫ్డీ ఆ అసంతృప్తిని తనకు అనుకూలంగా మల్చుకున్నదని ఫలితాలు చెబుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధానంతరం చకచకా కోలుకుని సుస్థిర ఆర్థిక వ్యవస్థతో యూరప్ ఖండా నికే చుక్కానిగా నిలిచిన జర్మనీని గత కొన్నేళ్లుగా సమస్యలు చుట్టుముట్టాయి. ఇవి చాల్లేదన్నట్టు ట్రంప్ చేస్తున్న ప్రకటనలు ప్రజల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ప్రభుత్వం మైనారిటీలో పడటంతో గడువుకు ముందే ఎన్నికలకు పోవాలని చాన్స్లర్ ఓలోఫ్ షోల్జ్ గత ఏడాది నిర్ణయించారు.ట్రంప్నూ, రష్యా అధ్యక్షుడు పుతిన్నూ ఎదిరించే సామర్థ్యం షోల్జ్కు లేదని 65 శాతంమంది వోటర్లు అభిప్రాయపడ్డారు. తన మాట వినని దేశాలపై భారీగా సుంకాలు విధించటం, నాటో కూటమికి చరమగీతం పాడటం తప్పదని బెదిరిస్తున్న ట్రంప్ వ్యవహారశైలితో వోటర్లు అసహనంతో ఉన్నారు. దానికి తోడు మ్యూనిక్ భద్రతా సదస్సుకొచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర మితవాద పక్షాలను దూరం పెడుతున్న యూరప్ దేశాలపై విరుచుకుపడటంతో అంతవరకూ మందకొడిగా సాగుతున్న ఎన్నికల ప్రచారానికి ఒక్కసారిగా జవసత్వాలొచ్చాయి. ఒకప్పుడు తమ దేశం సర్వనాశనం కావటానికి కారణమైన తీవ్ర మితవాద పక్షాలను వెనకేసుకురావటం ఎటూ మొగ్గని వోటర్లను ప్రభావితం చేసింది. పూర్వాశ్రమంలో సీడీయూ నాయకుడే అయినా సైద్ధాంతికంగా విభేదించి పార్టీకి దూరమైన ఫ్రెడరిక్ మెర్జ్ రెండేళ్లక్రితం అదే పార్టీ సారథ్యం స్వీకరించి సీడీయూని విజయతీరాలకు చేర్చారు. ఆయన ముందున్న సవాళ్లు తక్కువేమీ కాదు. రష్యా నుంచి తమకు ఎప్పటికైనా ముప్పు తప్పదని జర్మనీ భావిస్తోంది. ట్రంప్ వైఖరి చూస్తుంటే నాటో కూటమి అంతరించటం ఖాయమన్న సంకే తాలు కనబడుతున్నాయి. కనుకనే ‘సాధ్యమైనంత త్వరగా’ యూరప్ రక్షణకు ఏర్పాట్లు చేసుకోవా లని షుల్జ్ పిలుపునిచ్చారు. అందుకు దండిగా నిధులు కావాల్సివుంటుంది. ప్రస్తుతం నాటోకు యూరప్ దేశాలు చెల్లిస్తున్న మొత్తం 29వేలకోట్ల డాలర్లు. కానీ భారీయెత్తున బలగాలు, ఆయుధాలు సమీకరించాలంటే అదనంగా మరో 26 వేల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే తప్ప రష్యాను యూరప్ దేశాలు సొంతంగా ఎదుర్కొనటం సాధ్యంకాదని నిపుణులు అంచనా వేశారు. యూరప్లో ఆర్థికంగా అగ్రస్థానంలోవున్న జర్మనీ ఇందులో అధిక మొత్తాన్ని భరించాల్సి వుంటుంది. ఇప్పుడున్న పరిస్థి తుల్లో అది సాధ్యమేనా? ఎందుకంటే ఎగుమతులపై ఆధారపడిన జర్మనీ ఆర్థిక వ్యవస్థకు ప్రపంచ బహిరంగ మార్కెట్ వ్యవస్థలు ఇన్నాళ్లూ దన్నుగా నిలిచాయి. అమెరికా వైఖరితో ఆ శకం అంత రిస్తున్న సూచనలు కనబడుతున్నాయి. కనుక మారిన పరిస్థి తుల్లో రష్యాతో తాత్కాలి కంగానైనా అవగాహనకు రావటం ఎంతో ఉత్తమం. ఇన్నాళ్లూ అమెరికా అభీష్టానికి అనుగుణంగా ఉక్రెయిన్లో నైనా, మరోచోటైనా యూరప్ దేశాలు పావులు కదిపినందు వల్లే రష్యాతో శత్రుత్వం వచ్చింది. ఇకపై ఆ దేశాలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయన్న అభిప్రాయం రష్యాలో కలిగించగలిగితే చాలా వరకూ సమస్యలు సమసిపోతాయి. ఈ విషయంలో యూరప్ దేశాలు వివేకంతో ఆలోచించాలి. -
జెలెన్స్కీ విషాదయోగం!
‘కర్ర గలవాడిదే బర్రె’ నానుడి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి చాలా ఆలస్యంగా అర్థమైనట్టుంది. మూడేళ్లుగా అరువు తెచ్చుకున్న బలంతో రష్యా సేనలను ఢీకొడుతూ రేపో మాపో విజయం తన దేనన్న భ్రమల్లో బతికిన ఆయన, శాంతి కోసం పదవీత్యాగానికైనా సిద్ధమని తాజాగా ప్రకటించారు. అంతేకాదు... ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం కావాలట! జో బైడెన్ హయాంలో ఆయనకు అటు డాలర్లూ, ఇటు మారణాయుధాలూ పుష్కలంగా వచ్చిపడ్డాయి. ఆ కాలంలో ఆయనకు ఎవరన్నా లెక్కలేకుండా పోయింది. నిరుడు ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ శాంతి సాధనలో భాగంగా తొలుత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలిశారు. ఆ తర్వాత ఉక్రెయిన్ వెళ్లి జెలెన్స్కీతో చర్చించారు. మోదీ వచ్చి వెళ్లిన వెంటనే ఆయన్ను హేళన చేస్తూ మాట్లాడారు. నియంతతో చేతులు కలిపి నీతులు బోధిస్తారా అంటూ విరుచుకుపడ్డారు. దౌత్య మర్యాదల్ని అతిక్రమించారు. ఏడాది తిరగకుండా అంతా తలకిందులైంది. అణకువ ఒంటబట్టినట్టుంది. దురుసుగా, కఠినంగా, అవమానకరంగా మాట్లాడుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను ప్రసన్నం చేసుకోవటానికి నానా పాట్లూ పడుతున్నారు. అందులో భాగంగానే తాజా ప్రతిపాదనలు చేశారు. వీటిని ట్రంప్ అంగీకరిస్తారని జెలెన్స్కీ ఎలా అనుకున్నారో అర్థంకాదు. ‘ఎన్నికల్లేకుండా అధికారం చలాయిస్తున్న నియంత’గా తనను నిందించిన ట్రంప్ పదవీ పరిత్యాగ ప్రకటనల్ని ఖాతరు చేస్తారనుకోవటం, మెచ్చుకోలు మాటలు మాట్లాడుతారనుకోవటం తెలివితక్కువతనం. నాటోకు తిలోదాకాలిచ్చేందుకు సిద్ధపడుతున్న ట్రంప్ను ఆ సంస్థ సభ్యత్వం ఇప్పించమనటం మూర్ఖత్వం.ఈ మూడేళ్ల యుద్ధంలో రష్యాను ఉక్రెయిన్ ముప్పుతిప్పలు పెట్టిన మాట వాస్తవం. అమెరికా, పాశ్చాత్య దేశాలు అందించిన క్షిపణులతో, డ్రోన్లతో రష్యా నగరాలపై దాడులు చేసి నష్టపరిచిన ఉదంతాలూ కోకొల్లలు. పర్యవసానంగా నేడో రేపో విజయం ఖాయమని భావించి దురాక్రమణకు దిగిన పుతిన్ అయోమయంలో పడిన సంగతి కూడా నిజం. ఒకపక్క అమెరికా, పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షలూ, మరోపక్క నేల రాలుతున్న సైనికుల ఉదంతాలూ, ధ్వంసమవుతున్న కీలక సైనిక స్థావరాలూ ఆయనకు కంటిమీద కునుకులేకుండా చేశాయి. ఉత్తర కొరియా నుంచి సైన్యాన్ని తీసుకొచ్చి రణరంగంలో ముందుకు నడిపించినా పెద్దగా ఫలితం దక్కలేదు. ఇక దీన్నుంచి గౌరవప్రదంగా బయటికి రావాలనుకున్నా అన్ని దారులూ మూసుకు పోయాయి. చివరకు అణ్వాయుధాలనే నమ్ముకోక తప్పదన్న నిర్ణయానికి కూడా వచ్చారని కథనాలు వెలువడ్డాయి. నిజానికి ఆ ఒక్క భయమే అమెరికా, పాశ్చాత్య దేశాలను ముందుకు అడుగేయ నీయలేదు. మాటలకేం... కోటలు దాటేలా చెప్పారు. ఆచరణలో మాత్రం ఎంతసేపూ ఉక్రెయిన్ను ముందుకు తోసి లబ్ధి పొందుదామన్న ధ్యాస తప్ప అమెరికాకు మరేం పట్టలేదు. ఉక్రెయిన్ తీవ్ర నష్టాలు చవిచూసింది. గణనీయంగా భూభాగాన్ని కోల్పోయింది. తిరిగి స్వాధీనం చేసుకున్నవి సైతం అనంతర కాలంలో రష్యా సేనలకు చిక్కాయి. పట్టణాలు, నగరాలు శిథిలమయ్యాయి. ఒక దశలో సైన్యం చాలటం లేదని యువతీ యువకులకు సైనిక శిక్షణనిచ్చి ఉరికించారు. అయితే అదే మంత ఫలితం ఇవ్వలేదు. మొత్తంగా 3,80,000 మంది ఉక్రెయిన్ పౌరులు, సైనికులు గాయాల పాలయ్యారు. కాళ్లూ చేతులూ పోగొట్టుకున్న సైనికులు లక్షల్లోనే ఉంటారు. 46,000 మంది సైనికులు మరణించగా, వేలాదిమంది ఆచూకీ లేకుండా పోయారు. అనేకులు బందీలుగా చిక్కారు. ట్రంప్ దృష్టంతా ఉక్రెయిన్ నేలలో నిక్షిప్తమైవున్న అపురూప ఖనిజాలు, ఇతర సహజ వన రులపై ఉంది. మూడేళ్లుగా తాము 50,000 కోట్ల డాలర్లు ఖర్చుచేశామని అమెరికా లెక్కలు చెబు తోంది. కానీ అది 12,000 కోట్ల డాలర్లు మించదని ఉక్రెయిన్ మొత్తుకుంటున్నది. పది తరాల ఉక్రె యిన్ పౌరుల్ని పీల్చిపిప్పిచేసే అమెరికా ఒప్పందం ససేమిరా సమ్మతం కాదన్న జెలెన్స్కీ మొర వినే నాథుడే లేడు. ఇన్నాళ్లూ అమెరికా సలహాతో ఉక్రెయిన్కు అన్నివిధాలా అండదండలందించిన పాశ్చాత్య దేశాలు సైతం ట్రంప్ను ధిక్కరించదల్చుకుంటే తమతో మాట్లాడొద్దని చెప్పటం ఆయనకు మింగుడుపడటం లేదు. ఒకపక్క అమెరికా రూపొందిస్తున్న ముసాయిదా ఒప్పందం ప్రతిపాదనల్ని పదిరోజులుగా ఉక్రెయిన్ వరసబెట్టి తిరస్కరిస్తుండగానే దాదాపు అంతా పూర్తయిందని, తుది దశ చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ అనటం జెలెన్స్కీని ఊపిరాడనివ్వటం లేదు. అమెరికా ప్రతిపాదన ఒప్పుకుంటే చమురు, సహజవాయువు, ఖనిజాలతోపాటు పోర్టులు, ఇతర మౌలిక సదుపాయాల ద్వారా వచ్చే ఆదాయంలో సగం సమర్పించుకోవాలి. తామిచ్చిన ప్రతి ఒక్క డాలర్కూ రెండు డాలర్లు చెల్లించాలన్నది అమెరికా డిమాండ్. ఇంత చేసినా ఉక్రెయిన్ రక్షణకు గ్యారెంటీ ఇవ్వటానికి తిరస్కరించటం, ముసాయిదా ఒప్పందంలో తొలుత ఉన్న ఆ మాటను తొలగించటం జెలెన్స్కీకి మింగుడుపడని అంశాలు.ఎవరో ప్రోత్సహిస్తే అక్రమంగా సింహాసనం అధిష్ఠించటం, ఎవరికోసమో పొరుగు దేశంపై తొడగొట్టడం ఎంత ఆత్మహత్యా సదృశమో వర్తమాన ఉక్రెయిన్ను చూసి అన్ని దేశాలూ గుణపాఠం నేర్చుకోవాలి. స్వీయప్రయోజనాలే సర్వస్వం అయిన యుగంలో బతుకుతూ అపరిపక్వతతో, అనాలోచితంగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అవి చివరకు తననే కాటేస్తాయని జెలెన్స్కీ గ్రహించలేక పోయారు. ఒకనాడు అమెరికన్ కాంగ్రెస్లో యుద్ధ యోధుడిగా నీరాజనాలందుకున్న మనిషే ఇవాళ దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మూడేళ్లలో ఎంత మార్పు! -
వాక్కాలుష్యం
మాటల గురించి చెప్పడమంటే, మాటలు కాదుగాని, మాటల గురించి కాస్త మాట్లాడుకుందాం. మాటలు రకరకాలు. ఇతరుల మనసులను గాయపరచే ఈటెల్లాంటి మాటలు; గాయపడ్డ మనసులకు ఊరటనిచ్చే ఊరడింపు మాటలు; ఎదుటివారిని మునగ చెట్టెక్కించే మెరమెచ్చు మాటలు; జనాలను ఇట్టే బోల్తా కొట్టించే బురిడీ మాటలు; సొంత డప్పు మోగించుకోవడంలో కోటలు దాటే మాటలు; కపటబుద్ధులాడే కల్లబొల్లి మాటలు; బుద్ధిహీనుల పొల్లు మాటలు; ఈర్శ్యాళువుల ద్వేషపు మాటలు; ఉబుసుపోవడానికి చెప్పుకొనే ఊకదంపుడు మాటలు– మాటల గురించి చెప్పుకోవాలంటే, ఇలా ఎన్ని మాటలైనా ఉంటాయి. మాటలాడే తీరును బట్టి మనిషిని అంచనా వేయవచ్చు. ఎంతటి స్ఫురద్రూపులైనా కావచ్చు; మరెంతటి నానాలంకారభూషితులైనా కావచ్చు; భాషణ నైపుణ్యం కొరవడితే మాత్రం ఎన్ని ఆభరణాలను దిగేసుకున్నా, ఎన్ని అలంకారాలు చేసుకున్నా, ఎవరూ పట్టించుకోరు. ‘కేయూరాణి న భూషయంతి పురుషం హారాః న చంద్రోజ్జ్వలాః/ న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః/ వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే/ క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం’ అన్నాడు భర్తృహరి. ఇదే శ్లోకాన్ని ఏనుగు లక్ష్మణకవి ‘భూషలు గావు మర్త్యులకు భూరిమయాంగద తార హారముల్/ భూషిత కేశ పాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్/ భూషలు గావు పురుషుని భూషితు జేయు పవిత్రవాణి వా/గ్భూషణమే సుభూషణము భూషణముల్ నశియించునన్నియున్’ అని తెలుగులోకి అనువదించాడు. మనకు ‘వేషభాషలు’ అనే పదబంధం ఉంది. వేషం ఒక్కటే చాలదు, అందుకు తగిన భాష కూడా ఉన్నప్పుడే రాణిస్తుంది. దర్పానికి చిహ్నమైన భుజకీర్తులు, మెడలో ధగధగలాడే సువర్ణహారాలు, కేశపాశాలకు సొగసైన అలంకారాలు, శరీరాన్ని ఘుమఘుమలాడించే పన్నీటి స్నానాలు, ఒంటికి పూసుకునే మైపూతలు – ఇవేవీ మనిషికి అలంకారాలు కాలేవు. సంస్కారభరితమైన, సందర్భోచితమైన మృదువాక్కులే మనిషికి అసలైన ఆభరణాలు. భర్తృహరి సారాంశం ఇదే! అసమాన పదసంపద, అనర్గళ వక్తృత్వ ప్రాభవం, అన్నింటికీ మించి బహిరంగ వేదికలపై వాక్కుకు తగిన అభినయ చాతుర్యం వంటి ప్రతిభా పాటవాలెన్ని ఉన్నా, కించిత్ సందర్భశుద్ధి కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే వాగ్భూషణం మిలమిలలాడుతుంది. సమయ సందర్భాలను పట్టించుకోకుండా, నోటికొచ్చినట్లు మాట్లాడితే సభలలో రసాభాస తప్పదు. పద్మభూషణ పద్మవిభూష«ణాది సగౌరవ భూషణాలు ఎన్ని ఉన్నా, సందర్భశుద్ధి లేని వాచాలత ప్రదర్శించినట్లయితే, సదరు మనుషుల వాగ్భూషణం వెలవెలబోతుంది.అనవసర ప్రసంగాలు, అసందర్భ ప్రలాపాలు, పరుష పదప్రయోగాలు వాగ్భూషణానికి కిలుములా పట్టి, దానిని వెలవెలబోయేలా చేస్తాయి. వాగ్భూషణం వన్నె తరగకుండా ఉండాలంటే, ఎప్పుడు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎప్పుడు మౌనం పాటించాలో తెలుసుకోగల ఇంగితం కలిగి ఉండాలి. సూక్ష్మంగా ఈ లక్షణాన్ని వాగ్వివేకం అనవచ్చు. వాగ్వివేకం కలిగినవాళ్లు లోకంలో ఉత్తములుగా, ఉన్నతులుగా సముచిత గౌరవం పొందుతారు. ‘మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటమే సురక్షితం’ అన్నాడు గ్రీకు తత్త్వవేత్త ఎపిక్టీటస్. మనోభావాల శకంలో ఆయన సలహా పాటించదగినదే! ‘మౌనేన కలహం నాస్తి’ అని మన పూర్వ సుభాషితం కూడా చెబుతోంది. అయినా, మాట్లాడక తప్పని పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలుసుకోవడమే వాగ్వివేకం. ఇదే సంగతిని ‘అనర్గళ వాగ్ధార కన్నా మాట్లాడటంలో విచక్షణ ముఖ్యం’ అని ఇంగ్లిష్ రాజనీతిజ్ఞుడు ఫ్రాన్సిస్ బేకన్ ఏనాడో చెప్పాడు. ‘సకాలంలో పాటించే మౌనం వాగ్ధాటి కంటే గొప్పది’ అని ఇంగ్లిష్ కవి మార్టిన్ టప్పర్ అన్నాడు. విచక్షణ లోపించిన మాటలు మాట్లాడేవారు ఎంతటి ఘనసంపన్నులైనా సమాజం నుంచి గౌరవ మర్యాదలను సంపాదించుకోలేరు.వాగ్ధాటికి, వాచాలతకు ఉన్న విభజనరేఖను తెలుసుకుంటే చాలు– మాటలాడే కళలో రాణించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇంత చిన్న సంగతి తెలుసుకోలేకపోవడం వల్లనే ప్రజాజీవితంలో ఉన్న నానా రంగాల ప్రముఖులు అనవసర ప్రసంగాలతో, అసందర్భ ప్రలాపాలతో అభాసుపాలవుతున్న సందర్భాలు ఇటీవలి కాలంలో తరచుగా తారసిల్లుతున్నాయి. ఇదొక పరిస్థితి అయితే, వాగ్దూషణా దురితచరితుల సంఖ్య కూడా సమాజంలో పెచ్చరిల్లుతోంది. ముఖ్యంగా రాజకీయ, వినోదరంగాల్లో వాక్కాలుష్యం దుర్భరంగా మారి, సామాన్యులకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. వాక్కాలుష్య ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఇటీవల వస్తున్న సినిమాలు, టీవీ కార్యక్రమాలు, ఓటీటీ ప్రదర్శనలు చూస్తే, ఇట్టే అర్థమైపోతుంది.‘ఆది నుంచి ఆకాశం మూగది/ అనాదిగా తల్లి ధరణి మూగది/ నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు/ నడమంత్రపు మనుషులకే మాటలు/ ఇన్ని మాటలు’ అన్నారు వేటూరి. నడమంత్రపు సిరివర్గం, మిథ్యామేధావి వర్గంలోని మనుషుల వల్లనే సమాజంలో వాక్కాలుష్యం ప్రబలుతోంది. పర్యావరణంలోని నానా రకాల కాలుష్యాల నివారణ కోసం ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు తమ వంతు చర్యలు చేపడుతూనే ఉన్నాయి. అయితే, వాక్కాలుష్య నివారణ చర్యలు తీసుకునే నాథులే కరవయ్యారు. వాక్కాలుష్య నివారణతోనే వాగ్భూషణానికి పునర్వైభవం సాధ్యం. -
ఇది కుట్రపూరిత నిర్లక్ష్యం!
కాలం కలిసొస్తే కొందరికి అధికారం సంప్రాప్తించవచ్చు. అదృష్టం ఈడ్చితంతే కొందరు సరాసరి సింహాసనం మీదనే కూలబడవచ్చు. నక్కజిత్తులతో, తోడేలు వంచనతో, వెన్నుపోటుతో, మోసపు మాటలతో మరికొందరు ‘పవర్’ఫుల్గా మారిపోవచ్చు. కానీ వారందరూ ప్రజానాయకులు కాలేరు. అసలు నాయకుడంటే ఎవరు? అతనెట్లా ఉండాలి?... నమ్మకానికి నిలువెత్తు ప్రతిరూపంలా ఉండాలి. ఆడిన మాట మీద నిలబడే వాడై ఉండాలి. మడమ తిప్పని వాడై ఉండాలి. నిరంతరం జనం గుండె చప్పుళ్లను వినగలిగే విద్యాపారంగతుడై ఉండాలి. సకల జనుల శ్రేయస్సు కోసం పరితపించే తాపసిగా ఉండాలి. అటువంటి ప్రజా నాయకుడికి అధికార హోదాలను మించిన గౌరవం ఉంటుంది. జనం గుండెల్లో కొలువుండే అత్యున్నత హోదా ఉంటుంది. ఆ నాయకుడు వీధుల్లోకి వస్తే జనవాహిని అతని వెంట ప్రవహిస్తుంది. ఆబాలగోపాలం ఆనందోద్వేగాలతో హోరెత్తుతుంది. అది గిరిజన ప్రాంతమా... నగరం నడిబొడ్డా అనే తేడా ఉండదు. అన్ని చోట్లా ఒకటే స్పందన. ఆ నాయకుడు కనిపించగానే జనశ్రేణుల పాదాలు జజ్జెనకరె గజ్జల సడి చేయడానికి సిద్ధమవుతాయి. అతడే ప్రజానాయకుడు! ద మాస్ లీడర్! ఇటువంటి మాస్ లీడర్లు ఎందరుంటారు? ఆంధ్రరాష్ట్రం విషయానికి వస్తే అప్పుడెప్పుడో స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ప్రకాశం పంతులు గారిలో ఈ మ్యాజిక్ ఉండేదట. ఆ తర్వాత ఒక ఎన్టీ రామారావు... ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి... ఇదిగో ఇప్పుడు ఒక జగన్మోహన్రెడ్డి. దట్సాల్!సింహం ఇంకా వేటకు బయల్దేరనే లేదు. అది వెళ్లేదారిలో గోతులు తవ్వడానికీ, మందుపాతర్లు పెట్టే వ్యూహం పన్నడానికీ తోడేలు మందలు, నక్కల గుంపులు సమావేశమవుతున్నాయట. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇంకా విస్తృత జనయాత్రలకు శ్రీకారం చుట్టనేలేదు. గద్దెనెక్కిన వారు ఏడాది పండుగ జరుపుకొనేదాకా ఊపిరిపీల్చుకునే అవకాశం ఇవ్వడానికి ఈ తాత్సారం కావచ్చు. ఇప్పుడు అడపాదడపా పర్యటనలు మాత్రమే జరుగుతున్నాయి. కష్టాల్లో ఉన్న ప్రజాశ్రేణులను కలవడానికీ, నిర్బంధాలకు గురవుతున్న కార్యకర్తలకూ, నేతలకూ అండగా నిలవడానికీ మాత్రమే ఈ పర్యటనలు పరిమితం. గడిచిన వారం ఇటువంటి మూడు యాత్రలు జరిగాయి. రెడ్బుక్ స్కీము కింద అరెస్టయిన సహచరుడు వంశీని కలవడానికి జగన్ విజయవాడ జైలుకు వెళ్లారు. దగా పడుతున్న రైతన్నకు దన్నుగా గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. కన్నుమూసిన పార్టీ నాయకుని కుటుంబాన్ని పలకరించడానికి పాలకొండకు వెళ్లారు. ప్రదేశం ఏదైనా, సందర్భం ఏదైనా ప్రజాస్పందన సుస్పష్టం. జనప్రభంజనపు అడుగుల చప్పుడు విస్పష్టం. ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి పార్టీ ఓడిపోయిందని నమ్మడానికి పేదవర్గాల ప్రజలు సిద్ధంగా లేరు. ఏదో ‘మాయ’ జరిగిందని వారు బలంగా నమ్ముతున్నారు. పేదల అభ్యున్నతి కోసం పని చేసినందుకే బడా బాబులంతా కలిసి కుట్ర చేశారన్న అభిప్రాయం వారి మనసుల్లో బలంగా నాటుకొని పోయింది. ఫలితంగా జగన్పై వారికున్న అభిమానం మరింత బలపడుతున్నది.ప్రజలే ఇవ్వని ప్రతిపక్ష హోదాను తామెట్లా ఇస్తామని ఇటీవలనే ప్రవచించిన ముఖ్యనాయకుడికి ప్రజలు మూడ్ బాగానే తెలుసు. జగన్మోహన్రెడ్డి జనంలోకి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు. జనంలో ఉన్న జగన్మోహన్రెడ్డితో తాము తలపడలేమని కూడా తెలుసు. అందుకే ఆయన జనంలోకి రాకూడదని ముఖ్యమంత్రీ, ఆయన శిబిరం భావిస్తుండవచ్చు. ఒక వేళ జనంలోకి వస్తే ఏం చేయాలన్న పథకంపై మొన్నటి పర్యటనల్లో రిహార్సళ్లు, రెక్కీలు జరిగి ఉండవచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. జడ్ ప్లస్ కేటగిరీ భద్రతా కవచాలలో ఉన్న జగన్మోహన్రెడ్డికి ఆ స్థాయి భద్రతను కల్పించవలసి ఉన్నది. కానీ, అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ఆ సిబ్బందిని భారీగా కుదించినప్పుడే అనుమానాలకు బీజం పడింది.తాడేపల్లిలోని జగన్మోహన్రెడ్డి నివాసం దగ్గర ఉన్న సెక్యూరిటీ టెంట్లనూ, బారికేడ్లనూ, సిబ్బందినీ తొలగించినప్పుడే ప్రభుత్వ పెద్దల దురుద్దేశం బట్టబయలైంది. వినుకొండ పట్టణ నడివీధిలో జరి గిన రెడ్బుక్ ఘాతుకానికి బలైన రషీద్ కుటుంబ పరామర్శకు బయ ల్దేరినప్పుడు కూడా డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించి జగన్ భద్రతను ప్రమాదంలోకి నెట్టారు. ఆయన నివాసానికి సమీపంలోనే మంటలు చెలరేగడం భద్రతా వైఫల్యం కాక మరేమంటారు? ప్రొటోకాల్ ప్రకారం జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉండే నాయకుడు పర్యటనలో ఉన్నప్పుడు రోడ్డు క్లియర్ చేసే టీమ్, కాన్వాయ్, రోప్ పార్టీ, ఎస్కార్ట్ విధిగా ఉండి తీరాలి. కానీ జగన్ పర్యటనల్లో వేళ్ల మీద లెక్కించగలిగేంత మంది కానిస్టేబుళ్లు తప్ప ఇవేమీ కనిపించడం లేదు.వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు భద్రతకు ఎటువంటి లోటూ జరగలేదు. రూల్బుక్ స్థానాన్ని రెడ్బుక్ ఆక్రమించలేదు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలోనే స్థిరనివాసం ఉండేవారు. జడ్ ప్లస్ కేటగిరీ కనుక ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రొటోకాల్ ప్రకారం తీసుకోవలసిన భద్రతా చర్యల్ని తీసుకున్నది. అది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. జగన్ విషయంలో ఈ బాధ్యతను రాష్ట్రప్రభుత్వం విస్మరించడం వెనుక భయంకరమైన కుట్ర ఉండవచ్చనే అనుమానాలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. అవి కేవలం అనుమానాలు మాత్రమే కావని జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఇది మరింత ఆందోళన కలిగించే విషయం.జగన్ భద్రత విషయంలో కుట్రపూరితమైన ఆలోచనలు చేయవలసిన అవసరం ప్రభుత్వ పెద్దలకు తప్ప ఇంకెవరికీ లేదు. చంద్రబాబు కూటమి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. తాము అమలు చేయలేమని తెలిసినప్పటికీ అనేక హామీలను గుప్పించి ఓటర్లను వంచించింది. ఇప్పుడా హామీలన్నింటినీ చాప చుట్టేసి అటకెక్కించింది. అంతకు ముందు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన ‘నవరత్న’ పథకాలు కూడా ఆగిపోయాయి.విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో జగన్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాస్వామికీకరణ కార్యక్రమాన్ని నిలిపి వేసి ప్రైవేట్ దోపిడీకి బాటలు వేస్తున్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన గృహనిర్మాణ విప్లవానికి కళ్లెం వేశారు. ‘అమ్మ ఒడి’ని ఆపేశారు. ‘చేయూత’ను వదిలేశారు. ‘కాపు నేస్తం’ కనిపించడం లేదు. ఈ బీసీ నేస్తం పత్తా లేదు. జాతీయ స్థాయిలో బహుళ ప్రశంసలు అందుకున్న వలంటీర్ వ్యవస్థను పూర్తిగా ఎత్తేశారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తానని ప్రతి ఎన్నికల సభలోనూ బాబు ఘంటాపథంగా చెప్పుకొచ్చారు. అధికారంలోకి రాగానే ఆ వ్యవస్థనే గిరాటేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇటువంటి పచ్చి మోసాన్ని అనుమతించవచ్చునా? ఇటువంటి మోసగాళ్లు పాలకులు కావడం వాంఛనీయమేనా? ఇదొక్క అంశమే కాదు. అన్ని హామీలకూ ఇదే గతి పట్టింది. వీటిపై ప్రజల్లోనూ, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వారిలోనూ విస్తృతమైన చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. ప్రజానాయకుడైన జగన్మోహన్రెడ్డి ఒకసారి రాష్ట్రవ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుడితే కూటమి మోసాల గుట్టురట్టవుతుంది. విస్తృత స్థాయిలో చర్చ మొదలవుతుంది. ఈ పరిణామం కూటమి మనుగడకే ్రపమాదం. కనుక జగన్మోహన్రెడ్డి జనంలోకి రాకూడదు. గతంలోనే ఆయనపై రెండు మార్లు హత్యాప్రయత్నాలు జరిగి ఉన్నాయి గనుక భద్రతా చర్యలను నిలిపివేస్తే ఆయన యాత్రలు ఆగిపోతాయన్న వెర్రి ఆలోచన ఏమైనా ఉండవచ్చు. భద్రతా సిబ్బందిని తొలగించినా, కార్యకర్తలే రోప్ పార్టీగా మారి నడుస్తున్న పరిణామాన్ని చూసిన తర్వాత మరింత తీవ్రమైన వ్యూహాలకు కూటమి సర్కార్ పదును పెట్టే అవకాశం ఉన్నది. ఎందుకంటే జగన్ వంటి ప్రజానాయకుడు రంగంలో ఉండగా తన వారసుడు రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమనే సంగతి చంద్రబాబుకు స్పష్టంగా తెలుసు. ఆదిలో బాబు నిల దొక్కుకోవడానికి కూడా ఎన్టీఆర్ను వెన్నుపోటు ద్వారా రంగం నుంచి తప్పించడానికి ఎటువంటి వ్యూహాలు అమలు చేశారనేది తెలిసిన సంగతే!రాజశేఖర్రెడ్డిని గద్దెదించడానికి కూడా బాబుకూటమి చేయని ప్రయత్నం లేదు. తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్నూ, సమైక్య రాష్ట్రానికి కట్టుబడివున్న సీపీఎంనూ ఒక్కచోటకు చేర్చి ‘మహాకూటమి’ని కట్టిన సంగతి కూడా తాజా జ్ఞాపకమే! ఆయన మీద ఎంత దుష్ప్రచారం చేసినా, ‘మహాకూటమి’ని నిర్మించినా, సంప్రదాయ కాంగ్రెస్ ఓటును చిరంజీవి పార్టీ బలంగా చీల్చినా బాబు ముఠా ప్రయత్నాలు ఫలించలేదు. కాకపోతే దురదృష్టవశాత్తు ఆ మహానేత మరో విధంగా రంగం నుంచి నిష్క్రమించారు.జగన్మోహన్రెడ్డి మరో బలమైన మాస్ లీడర్గా ఆవిర్భవిస్తారని చంద్రబాబు – యెల్లో మీడియా వారు ఆదిలోనే గుర్తించారు. ఆయన్ను మొగ్గలోనే తుంచేయడానికి చేసిన ప్రయత్నాలను తెలుగు ప్రజలందరూ గమనించారు. గడిచిన పదిహేనేళ్లుగా జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్న వ్యక్తిత్వ హనన కార్యక్రమం న భూతో న భవిష్యతి. ప్రపంచ చరిత్రలోనే ఈ స్థాయిలో వ్యక్తిత్వ హనన గోబెల్స్ ప్రచారం ఎవరి మీదా జరిగి ఉండదు. ప్రజా నాయకులను దూరం చేసి చంద్రబాబుకు మార్గం సుగమం చేసే కార్య క్రమంలో యెల్లో మీడియా, దాని రింగ్ లీడర్ రామోజీరావు పోషించినది దుర్మార్గమైన పాత్ర. చట్టాన్ని ధిక్కరించి ఫైనాన్సియర్స్ పేరుతో నిధులు పోగేసిన వ్యక్తి రామోజీ. చిట్ఫండ్స్ పేరుతో జనం సొమ్మును సొంత వ్యాపారాలకు వాడుకున్న వ్యక్తి రామోజీ. ఒకరి కొకరు తోడు నీడగా బాబు–రామోజీలు ముప్ఫయ్యేళ్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను భ్రష్టు పట్టించారు. అయినా సరే, జనం మాత్రం జగన్ వెంట నిలబడుతున్నారు. ఈ పరిణామం కూటమి నేతలకు మింగుడు పడటం లేదు. ఈ నేపథ్యంలోంచి చూసినప్పుడు జగన్కు భద్రత కల్పించడంలో విఫలం కావడమనేది కేవలం పొరపాటు కాదు. వట్టి నిర్లక్ష్యం కాదు. ఉద్దేశపూర్వక∙నిర్లక్ష్యం, కుట్రపూరిత నిర్లక్ష్యం! ఇటువంటి ధోరణిని ఎండగట్టకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలు మరింత బలహీనపడతాయి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఉదారతకు ట్రంప్ వీడ్కోలు!
రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కింది మొదలు వ్యవస్థల్ని ఎడాపెడా తొక్కుకుంటూ పోతున్న డోనాల్డ్ ట్రంప్ దృష్టి ప్రపంచ దేశాలకు ఉదారంగా సాయం అందించే అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్ ఎయిడ్)పై పడింది. గత నెల 27నే ఆ సంస్థ కార్యకలాపాలను నిలిపేస్తూ ఆయన ఉత్తర్వులిచ్చారు. దాన్నుంచి విడుదలయ్యే నిధుల గురించి సమీక్షించి ఆ పంపిణీని ‘మరింత సమర్థంగా’, తమ విదేశాంగ విధానానికి అనుగుణంగా వుండేలా రూపుదిద్దుతామని ఆ సందర్భంగా ప్రకటించారు. ఇప్పుడు దాని తాలూకు సెగలూ పొగలూ మన దేశాన్ని కూడా తాకాయి. ఆ సంస్థ నుంచి లబ్ధి పొందింది ‘మీరంటే మీర’ని బీజేపీ, కాంగ్రెస్లు వాదులాడుకుంటున్నాయి. సామాజిక మాధ్యమాల్లో గాలించి గత చరిత్ర తవ్వి పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. వెనకా ముందూ చూడకుండా చొరవగా దూసుకెళ్లే బీజేపీయే ఈ వాగ్యుద్ధానికి అంకు రార్పణ చేసింది. కాంగ్రెస్, మరికొన్ని పౌర సమాజ సంస్థలూ యూఎస్ ఎయిడ్ నుంచి దండిగా నిధులు పొందాయన్నది బీజేపీ ఆరోపణల సారాంశం. పనిలో పనిగా ప్రపంచ కుబేరుడు జార్జి సోరోస్తో కాంగ్రెస్కున్న సంబంధాలు మరోసారి ప్రస్తావనకొచ్చాయి. జార్జి సోరోస్కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నుంచి యూఎస్ ఎయిడ్కు ప్రధానంగా నిధులు వస్తాయి గనుక దాన్నుంచి నిధులందుకున్నవారంతా మచ్చపడినవారేనని బీజేపీ అభియోగం. కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మరో అడుగు ముందుకేసి యూఎస్ ఎయిడ్ నిధులతోనే ప్రభుత్వంపై అసంతృప్తిని పెంచే నిరసనోద్యమాలు దేశంలో గత కొన్నేళ్లుగా నడుస్తున్నాయని తేల్చారు. దేశద్రోహులు అనే మాటైతే వాడలేదుగానీ... ఆ చట్రంలో ఇమిడే కార్యకలాపాలన్నిటినీ పరోక్షంగా కాంగ్రెస్కూ, ఇతర సంస్థలకూ అంటగడుతూ ఏకరువు పెట్టారు. అటు కాంగ్రెస్ ఊరుకోలేదు. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఒకప్పుడు యూఎస్ ఎయిడ్ రాయబారిగా పనిచేయటం, నీతి ఆయోగ్, స్వచ్ఛభారత్ వంటి సంస్థలకు నిధులు రావటం వగైరాలను ప్రస్తావించింది. వాషింగ్టన్లోని భారత రాయబార కార్యా లయం వెబ్సైట్ సమాచారం ప్రకారం యూఎస్ ఎయిడ్ మన ప్రాథమిక విద్య, ఉపాధ్యాయ శిక్షణ, వ్యవసాయం, తాగునీరు, ఇంధనం వగైరాలకు సాయపడుతున్నది.ఇదంతా చూస్తుంటే ‘గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏర డం’ నానుడి గుర్తుకొస్తుంది. 1961లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ ఏలుబడిలో ప్రారంభమైన ఈ సంస్థనుంచి నిధులందుకున్న పార్టీలూ, స్వచ్ఛంద సంస్థలూ కొల్లలుగా ఉన్నాయని భావించవచ్చు. ప్రభుత్వ కార్యక్రమా లకు కూడా అది సాయపడింది. అమెరికా తన బడ్జెట్లో ఒక శాతాన్ని అంతర్జాతీయ సాయానికి కేటాయిస్తున్నది. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రపంచంలో అత్యధిక మానవతా సాయాన్ని అందించే ఏకైక దేశం అమెరికాయే. అంతర్జాతీయంగా నిరుడు వివిధ దేశాలకు అందిన సాయంలో అమెరికా వాటా 40 శాతం. 2025 ఆర్థిక సంవత్సరానికి యూఎస్ ఎయిడ్ ద్వారా 5,840 కోట్ల డాలర్లు వ్యయం కావొచ్చన్న అంచనా ఉంది. ట్రంప్ ప్రస్తుతం దాన్ని నిలుపుదల చేశారు గనుక ఇందులో ఎంత మొత్తానికి కత్తెరపడుతుందో అంచనా వేయటం కష్టం. మనకైతే ఇకపై రాక పోవచ్చు. ఎందుకంటే ట్రంప్ ఉద్దేశంలో భారత్ సంపన్న దేశం. 2021 నుంచి నిరుడు డిసెంబర్ వరకూ మన దేశానికి 2 కోట్ల డాలర్లు కేటాయించగా అందులో కోటీ 25 లక్షల డాలర్లు అందించి నట్టు లెక్కలున్నాయి. ఇదంతా ‘ప్రజాతంత్ర భాగస్వామ్యం’, పౌర సమాజం కోసం అని యూఎస్ ఎయిడ్ అంటున్నది. ఇందులో 55 లక్షల డాలర్లు నిరుడు జరిగిన ఎన్నికల్లో పెద్దయెత్తున వోటర్లు పాల్గొనేలా చూడటానికి అందించారు. ఏ సంస్థ ఎంత పొందిందన్న వివరాలు మాత్రం లేవు. దక్షిణ అమెరికాలో అమెజాన్ అడవుల రక్షణ, ఆఫ్రికాలో వ్యాధులు అరికట్టడానికి, ఆడపిల్లల విద్యకు, ఉచిత మధ్యాహ్న భోజనానికి సాయం చేయగా... రష్యా ఇరుగు పొరుగు దేశాల్లో దాని ప్రభావం తగ్గించటానికి, యుద్ధక్షేత్రమైన సిరియాలో ఆస్పత్రుల కోసం, ఉగాండాలో అట్టడుగు తెగల అభ్యున్నతికి, కంబోడియాలో మందుపాతరల తొలగింపునకు, బంగ్లాలో పౌరసమాజం కోసం... ఇలా భిన్నమైన పథకాలకూ, కార్యక్రమాలకూ అమెరికా తోడ్పడుతోంది. అసలు ఎవరైనా ఎందుకు సాయం చేస్తారు? వ్యక్తుల వరకూ చూస్తే తమ ఎదుగుదలకు కారణమైన సమాజానికి తిరిగి ఏదో ఇవ్వాలన్న కృతజ్ఞతా భావన కారణం కావొచ్చు. కానీ ఏ ఉద్దేశమూ లేకుండా అయా చితంగా ఖండాంతరాల్లోని సంపన్న దేశాలు వేరే దేశాలకు ఎందుకు తోడ్పాటునిస్తున్నాయి? చరిత్ర తిరగేస్తే దీని వెనకున్న మతలబు అర్థమవుతుంది. అప్పట్లో సోవియెట్ యూనియన్ ప్రభావం నుంచి ప్రపంచాన్ని ‘రక్షించే’ బాధ్యత తన భుజస్కంధాలపై వేసుకుని అమెరికా ఈ సాయం మొద లెట్టింది. అటు సోవియెట్ సైతం ఆ పనే చేసేది. ప్రపంచం దాదాపు రెండు శిబిరాలుగా చీలిన ఆ కాలంలో అమెరికా, సోవియెట్లకు ఈ ఉదారత ఎందుకంటిందో సులభంగానే గ్రహించవచ్చు. సాధారణ ప్రజానీకంలో తమపట్ల అనుకూల భావన కలిగితే అవతలివారిని సగం జయించినట్టేనని ఆ రెండు దేశాలూ భావించేవి. ప్రపంచ దేశాలన్నీ ప్రత్యర్థులుగా కనబడుతున్న వర్తమానంలో అమెరికాకు ఉదారత అవసరం ఏముంది? ‘నేను ఆదేశించింది పాటించటమే తప్ప నాతో తర్కానికి దిగొద్ద’ని ట్రంప్ స్వయంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మనదేశం ఈ సాయాన్ని ముందే తిరస్కరించి ఉంటే ఎంతో హుందాగా ఉండేది. కానీ ఇవ్వబోమని అమర్యాదకరంగా చెప్పించుకోవటం ఆత్మాభిమానం గల భారతీయులందరికీ చివుక్కుమనిపించే సంగతి. పాలకులు గ్రహిస్తారా? -
దీనావస్థలో యూరప్ దేశాలు
కళ్లముందు ప్రమాదకర సంకేతాలు కనబడుతున్నా అమెరికాను గుడ్డిగా అనుసరిస్తూ పోవటం అలవాటు చేసుకున్న యూరప్కి డోనాల్డ్ ట్రంప్ ఏలుబడి మొదలయ్యాక వరస షాక్లు తప్పడం లేదు. గతవారం జర్మనీలో జరిగిన మ్యూనిక్ భద్రతా సదస్సుకొచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ‘వాక్ స్వాతంత్య్రానికీ, ప్రజాస్వామ్యానికీ మీవల్లే ముప్పు ముంచుకొస్తున్నద’ని యూరప్ దేశాలపై విరుచుకుపడ్డారు. దాన్నుంచి తేరుకోకముందే ఆ దేశాల ప్రమేయం లేకుండా ఉక్రెయిన్ యుద్ధం నిలుపుదలపై రష్యాతో సౌదీ అరేబియాలోని రియాద్లో అమెరికా భేటీ అయింది. యూరప్ వరకూ ఎందుకు... రష్యాతో రెండేళ్లుగా సాగుతున్న యుద్ధంలో శిథిలావస్థకు చేరిన ఉక్రె యిన్నే ఆ చర్చలకు ఆహ్వానించలేదు. యుద్ధం ఆపడానికి అవకాశాలున్నాయా, ఆ విషయంలో తొలి అడుగువేయటం అసలు సాధ్యమేనా అనే అంశాలను నిర్ధారించుకోవటానికే రియాద్ సమా వేశం జరిగిందని అమెరికా విదేశాంగశాఖ సంజాయిషీ ఇస్తున్నా దాని వ్యవహారశైలి యూరప్ దేశా లకు మింగుడు పడటం లేదు. ఆ విషయంలో నిజంగా చిత్తశుద్ధి వుంటే రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడటానికి ముందు ట్రంప్ యూరప్ దేశాల అధినేతలను సంప్రదించేవారు. దాదాపు ఎనభైయ్యేళ్లుగా యూరప్ దేశాలన్నీ అమెరికా అడుగుజాడల్లో నడిచాయి. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ సైన్యాన్ని మట్టికరిపించిన సోవియెట్ సేనలు తూర్పు యూరప్ దేశాల తర్వాత తమవైపే చొచ్చుకొస్తాయని, తాము బలికావటం ఖాయమని పశ్చిమ యూరప్ దేశాలు వణికిపోయాయి. నాటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ దీన్ని చక్కగా వినియోగించుకుని ఉత్తర అమెరికా ఖండంలో తన పొరుగు దేశమైన కెనడాను కలుపుకొని పశ్చిమ యూరప్ దేశాలతో జత కట్టి పటిష్ఠమైన సైనిక కూటమి నాటోకు అంకురార్పణ చేశారు. అమెరికా–సోవియెట్ల మధ్య సాగే పోటీలో యూరప్ దేశాలు అవసరం లేకున్నా తలదూర్చాయి. ఆర్థికవ్యవస్థలు అనుమతించక పోయినా తమ తమ జీడీపీల్లో రెండు శాతం నాటో కోసం వ్యయం చేశాయి. యూరప్ భూభాగంలో అణ్వాయుధాల మోహరింపు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, మారణాయుధాలు జోరందుకున్నాయి. యూరప్ దేశాలకు ఆనాటి సోవియెట్ నుంచి లేదా ప్రస్తుత రష్యా నుంచి ఎన్నడూ ముప్పు కలగలేదుగానీ... నాటోవల్ల లిబియా, సిరియా, అఫ్గానిస్తాన్, సూడాన్, సోమాలియా తది తర దేశాలు అస్థిరత్వంలోకి జారుకుని ఉగ్రవాదం వేళ్లూనుకుంది. సిరియావంటి దేశాల్లో ప్రభుత్వా లను కూలదోసేందుకు విచ్చలవిడిగా ఆయుధాలందించటంవల్ల ఐసిస్ అనే భయంకర ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించింది. ఉక్రెయిన్ దురాక్రమణకు రష్యాను రెచ్చగొట్టింది కూడా యూరప్ దేశాలే. 2013లో అమెరికా ప్రోద్బలంతో ఉక్రెయిన్తో ఆర్థిక ఒప్పందం కుదుర్చుకోవటంతోపాటు ఐఎంఎఫ్ రుణం పొందేందుకు సహకరించింది ఈయూ దేశాల కూటమే. అయితే ఐఎంఎఫ్ కఠిన షరతులను తిరస్కరించి రష్యా ఇచ్చే 1,500 కోట్ల డాలర్ల రుణం తీసుకోవటానికి అప్పటి ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ నిర్ణయించటంతో దేశంలో ప్రజా ఉద్యమం పేరిట తిరుగుబాటుకు అంకు రార్పణచేసి అస్థిరపరచటంలో అమెరికా, ఈయూల పాత్ర వుంది. ఈ పరిణామాలే పుతిన్ను క్రిమియా ఆక్రమణకు పురిగొల్పాయి. ఎన్నికల్లో చట్టబద్ధంగా గెలిచిన యనుకోవిచ్ను ఈ వంక చూపి 2019లో కూలదోసి, సినీ నటుడు జెలెన్స్కీని అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టడం, పర్యవసానంగా మూడేళ్లక్రితం పుతిన్ ఉక్రెయిన్పై దండెత్తటం వర్తమాన చరిత్ర.యుద్ధంపై తమ ప్రమేయం లేని చర్చల్ని గుర్తించబోనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. యూరప్ దేశాలకు కనీసం ఆ మాత్రం ధైర్యం కూడా లేదు. తాజా పరిణామాల నేప థ్యంలో ఏం చేయాలో చర్చించటానికి ఫ్రాన్స్ చొరవతో సోమవారం పారిస్లో జరిగిన అత్యవసర భేటీకి అరడజను దేశాలు హాజరయ్యాయి. అవి కూడా కింకర్తవ్య విచికిత్సలో పడ్డాయి. ఉక్రెయిన్కు శాంతి సేనలను పంపటానికి తాను సిద్ధమని ప్రకటించిన బ్రిటన్... ఆ వెంటనే ‘అమెరికా అందుకు అనుమతిస్తేనే’ అని ముక్తాయించింది. ఈలోగా జర్మనీ, పోలాండ్, స్పెయిన్లు దాన్ని అసందర్భ ప్రతిపాదనగా కొట్టిపారేశాయి. అమెరికా తాజా వైఖరితో యూరప్ స్వీయరక్షణ కోసం సొంతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న ప్రతిపాదనపై సైతం అనుకూల స్వరాలు వినబడటంలేదు.ట్రంప్ ఆగమనం తర్వాత అమెరికాతో యూరప్ దేశాల సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్న అభిప్రాయం అందరిలో ఏర్పడింది. దీనికితోడు ట్రంప్ అనుచరగణం యూరప్లో తీవ్ర మితవాద పక్షాలను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారన్న అభిప్రాయం వివిధ దేశాధినేతలకు ఉంది. ట్రంప్ వైఖరి ఎలా వుంటుందన్న అంశంలో ఆయన తొలి ఏలుబడిలో యూరప్ దేశాలకు తగి నంత అవగాహన వచ్చింది. కానీ దశాబ్దాల తరబడి అమెరికా అనుసరిస్తున్న విధానాలను రెండో దఫాలో మెరుపువేగంతో ఆయన తిరగరాస్తారని ఆ దేశాలు ఊహించలేదు. ఈసారి ట్రంప్ వెనకున్న ఎలాన్ మస్క్, స్టీవ్ బానన్, మార్కో రుబియో తదితరులతోపాటు సమర్థుడైన దూతగా పేరున్న విట్కాఫ్లే అందుకు కారణం కావొచ్చు. పర్యవసానంగా ట్రంప్ రంగప్రవేశం చేసి నెల తిరగకుండానే యూరప్ దేశాలకు ప్రపంచం తలకిందులైన భావన కలిగింది. స్వతంత్రంగా ఎదగటానికి ప్రయత్నించక కీలుబొమ్మల్లా వ్యవహరించిన ఆ దేశాలు ఇప్పటికైనా వివేకం తెచ్చుకోవాలి. సొంత ఆలోచనతో, స్వీయప్రయోజనాల కోసం పనిచేయటం నేర్చుకోవాలి. రోజులు ఎప్పుడూ ఒకేలా వుండవని గ్రహించాలి. -
జనం ప్రాణాలంటే విలువేది?
వెల్లువలా వచ్చిపడుతున్న ప్రయాణికులు, రివాజు తప్పకుండా ఆలస్యంగా వచ్చిపోయే రైళ్లు, ఉన్న గందరగోళాన్ని ఒకింత పెంచే అనౌన్స్మెంట్లు, ఏమూలకూ సరిపోని మౌలిక సదుపాయాలు... ఇవన్నీ ఏకమై 45 నిమిషాలపాటు ఏకధాటిగా సృష్టించిన తీవ్ర గందరగోళ స్థితి శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటకు దారితీసి 18 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ మరణాలకు సంతాపం ప్రకటించటం, బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేయటం సరే... జరిగిన ఘోర ఉదంతానికి నైతిక బాధ్యత వహించాల్సిందెవరు? ఇలాంటివి పునరావృత్తం కానీయ బోమని చెప్పేదెవరు? మన దేశంలో ఎప్పుడు జనసమ్మర్దం అధికంగా ఉంటుందో, ఏ చర్యలు అవసరమో అధికార యంత్రాంగానికి తెలియక కాదు. అందుకు సంబంధించి ఇప్పటికే బోలెడు చేదు అనుభవాలున్నాయి. కానీ ఎన్ని జరుగుతున్నా గుణపాఠం నేర్వని మనస్తత్వమే ఈ విషాద ఘటనకు దారితీసింది. కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్లో తొక్కిసలాట చోటు చేసుకుని 30 మంది ప్రాణాలు బలై పక్షం రోజులు కాలేదు. అదే ప్రయాగ్రాజ్కు బయల్దేరిన భక్తులకు ఢిల్లీ రైల్వే స్టేషనే ఈసారి మృత్యుఘంటిక మోగించిందంటే నేరం ఎవరిదనుకోవాలి? తొక్కిసలాట జరిగిన అజ్మీరీ గేట్ టెర్మినల్ గురించి ఉత్తరాదిలో పనిచేసే రైల్వే ఉన్నతాధికారులకూ, ప్రత్యేకించి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అధికారులకూ తెలియంది కాదు. సాధారణ దినాల్లో సైతం ఆ టెర్మినల్ కిక్కిరిసివుంటుంది. ఢిల్లీ మెట్రో రైల్ను నేరుగా అనుసంధానం చేసే ప్రాంతమది. పైపెచ్చు వాహనాల పార్కింగ్కు అనువైనది. యూపీ మీదుగా వెళ్లాల్సిన రైళ్లు ఆగే అయిదు ప్లాట్ ఫాంలు అజ్మీరీ గేట్ టెర్మినల్ ప్రాంతంలోనే ఉన్నాయి. దానికితోడు ఇప్పుడు కుంభమేళా సంరంభం కొనసాగుతోంది. తగిన ప్రణాళిక రూపొందించుకుని, అదనపు జాగ్రత్తలు తీసుకోవడా నికి ఈ కారణాలు చాలవా? సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటలలోపు బయల్దేరే రైళ్లను అందు కోవటానికి వచ్చే జనరల్ కంపార్ట్మెంట్ ప్రయాణికులకు అక్కడ రోజూ 7,000 టిక్కెట్లు విక్రయి స్తారు. కానీ శనివారం రోజు కేవలం రెండు గంటల వ్యవధిలో అదనంగా మరో 2,600 మందికి టిక్కెట్లు విక్రయించారు. అంటే రిజర్వేషన్లేని ప్రయాణికుల సంఖ్య దాదాపు పదివేలు! ఇంత మంది టికెట్ల తనిఖీ అసాధ్యం. కనుక టికెట్ లేకుండా ప్రయాణించేవారు ఇంతకు మూడు నాలుగు రెట్లు అధికంగా ఉంటారని ఒక అంచనా. అందుబాటులో ఉన్న బోగీలెన్నో, జారీ చేయాల్సిన టికెట్లెన్నో కనీస అంచనాకు రాకపోవటం... అవసరమైన పోలీసు బలగాలను సమకూర్చుకోవాలన్న స్పృహ లోపించటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఘటన జరిగినప్పుడు ఆ ప్రాంతంలో 20 మంది పోలీసులు మాత్రమే ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వారు సైతం ఈ తొక్కిస లాట సమయంలో ‘బతుకుజీవుడా’ అనుకుంటూ పక్కకుపోయారు. పర్యవసానంగా ‘రక్షించండి...’ అంటూ ఆర్తనాదాలు చేస్తున్నవారి కోసం పోర్టర్లే రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. వారే గనుక ఆపద్బాంధవుల్లా రాకపోతే మరింతమంది మృత్యువాత పడేవారు. కుంభమేళా సందర్భంగా డిమాండ్ ఎక్కువుంది గనుక ఉన్న రైళ్లను సమయానికి నడిపుంటే ఇంత జనసమ్మర్దం ఉండేది కాదు. ఎంతో జాప్యం జరిగి ఒకదాని వెనక మరొకటిగా వరసపెట్టి మూడు రైళ్లుండటం వల్ల 14, 15 నంబర్ ప్లాట్ఫాంలపై వేలాదిమంది పడిగాపులు పడుతున్నప్పుడే ప్రయాగ్రాజ్ వెళ్లే ప్రత్యేక రైలుపై వెలువడిన అనౌన్స్మెంట్ తీవ్ర గందరగోళానికి దారితీసి తొక్కిసలాట జరగిందంటున్నారు. మన దేశం వరకూ చూస్తే తొక్కిసలాటల్లో దాదాపు 80 శాతం మతపరమైన పవిత్ర దినాల్లో, తీర్థయాత్రల్లో ఎక్కువగా జరుగుతున్నట్టు 2013లో ఒక అధ్యయనం తేల్చిచెప్పింది. భారీగా వచ్చి పడే ప్రజానీకాన్ని నియంత్రించటానికి జాతీయ విపత్తు నివారణ ప్రాధికార సంస్థ ఆ ఏడాదే సవివరమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పుడు సాంకేతికత మరింత విస్తరించి సీసీ కెమెరాలు, డ్రోన్ల వంటివి అందుబాటులోకొచ్చాయి. వీటి సాయంతో ఎప్పటికప్పుడు కంప్యూటర్ మానిటర్ లలో పర్యవేక్షిస్తూ అవసరమైన చోటకు బలగాలను తరలించటానికి, చర్యలు తీసుకోవటానికి పుష్క లంగా అవకాశాలున్నాయి. ఎక్కడో మారుమూల అడవుల్లో నక్సలైట్లను అణచడానికి వినియోగి స్తున్నామంటున్న సాంకేతికత దేశ రాజధాని నగరంలో కొలువుదీరిన రైల్వే స్టేషన్లో ఎందుకు ఆచూకీ లేకపోయిందో పాలకులు చెప్పగలరా?విషాదం చోటుచేసుకున్నప్పుడల్లా దాన్ని తక్కువ చేసి చూపటానికి, అంతా నియంత్రణలో ఉందని చెప్పటానికి పాలకులు తెగ తాపత్రయపడుతుంటారు. 2015లో రాజమండ్రిలో తన కళ్ల ముందే పుష్కరాల్లో 29మంది భక్తులు ప్రాణాలు కోల్పోతే చంద్రబాబు ఎంతటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారో ఎవరూ మరిచిపోరు. మొన్నటికి మొన్న తిరుపతి తొక్కిసలాట జరిగినప్పుడూ ఆయనది అదే వైఖరి. ఇప్పుడు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఉదంతంలోనూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ట్వీట్ల ప్రహసనం సైతం అలాగే వుంది. శ్రావణబెళగొళ, స్వర్ణాలయం వంటి చోట్ల ఇంతకు మించి ఎన్నో రెట్లు అధికంగా భక్తులు తరలివస్తారు. కానీ ఎప్పుడూ ఎలాంటి అపశ్రుతులూ చోటు చేసుకో లేదు. ఇందుకు వారు అనుసరిస్తున్న నియంత్రణ చర్యలేమిటో అధ్యయనం చేయాలన్న స్పృహ కూడా ఎవరికీ ఉన్నట్టు లేదు. ఈ విషాదం చెప్పే గుణపాఠాన్ని గ్రహించకపోతే, తప్పు తమది కానట్టు ప్రవర్తిస్తే మళ్లీ మళ్లీ ఇలాంటివే చోటు చేసుకుంటాయి. కమిటీలు, విచారణల తంతు సరే... నిర్దిష్టంగా తాము గ్రహించిందేమిటో, ఇకపై తీసుకోబోయే చర్యలేమిటో ప్రకటిస్తే జనం సంతోషిస్తారు. -
‘పెన్షన్’ పత్రిక
ఆ జ్ఞానము అచట ఉన్నది. పండిన అనుభవాల రాశి పోగుబడి ఉన్నది. వేళ్లకు వయసు వచ్చినది కాని కలానికి కాదు సుమా. విశాలమైన తలపులు చెప్పవలసిన సంగతులు ఒకటా రెండా? మేము విశ్రాంతిలో లేము. అక్షరాల ఆలోచనల్లో ఉన్నాం. గత యాత్రకు కొనసాగింపులో ఉన్నాం. మేము నడవవలసిన దారి తెరిచిన పుటల మీదుగా సాగుతుంది. పాఠకుల మనోరథాల మీదుగా విహరిస్తుంది. ఊహలకు ఊపిరి పోస్తే మాకు ఆయువు. పాత్రలతో సంభాషిస్తే మాకు ఉత్సాహం. మేమెవరమో మీకు తెలుసా? మా లోపల ఏముందో మీకు ఎరుకేనా?‘మా నాన్న అదృష్టవంతుడు. చనిపోయే వరకూ రాస్తూనే ఉన్నాడు. రాసిన దాని కోసం పత్రికలు ఎదురు చూశాయి. ప్రచురించి మర్యాద చేశాయి. ఆయన రచయితగా జీవించి రచయితగా మరణించాడు. నేనూ ఉన్నాను. కథ రాస్తే ఎక్కడ ఇవ్వను. రాయకుండా ఎలా బతకను?’ పెన్షనర్ వయసున్న ఒక రచయిత అన్న మాటలు ఇవి. నేటి తెలుగు రాష్ట్రాల్లో యాభైలు దాటి, రచనాశక్తితో ఉన్న వారి ఆవేదనంతటికీ ఈ మాటలు శోచనీయమైన ఆనవాలు.ఒక రచయిత పరిణతి యాభైల తర్వాతే రచనల్లో వ్యక్తమవుతుంది. అనుభవాల సారము, వాటి బేరీజు, వాటిపై వ్యాఖ్యానం, వాటితో నేటి తరానికి చెప్పవలసిన జాగరూకత, వాటి నమోదు, తద్వారా బలపడే సారస్వత సంపద... ఏ జాతికైనా పెను పెన్నిధి. దురదృష్టం, కాలమహిమ తెలుగు రాష్ట్రాల్లో పత్రికలు కనుమరుగైపోయాయి. సాహిత్య పత్రికలు, చిన్న పత్రికలు, వీక్లీలు.... ఎంత రాసినా వేసే మంత్లీలు... బైమంత్లీలు... క్వార్టర్లీలు.... ఏ బస్టాండ్ బడ్డీకొట్టులోనో అందుకునే అపరిచిత పాఠకుడికై వాటి అందుబాటు... ఎక్కడ... ఎక్కడా? ‘మీ రచనను ప్రచురణకు స్వీకరించాం’ కార్డు ముక్క, దానికి ఫలానా చిత్రకారుడు వేసే గొప్ప బొమ్మ, పోస్టులో పత్రిక అందడం, మరికొన్ని రోజులకు సంబరంగా సంతకం చేసి తీసుకునే పారితోషికపు మనీఆర్డర్... ఎక్కడ... ఎక్కడా? కంప్యూటర్ స్క్రీన్ కో, సెల్ఫోన్ కురచదనానికో సంతృప్తి పడే నేటి పాఠకులు ఉండుగాక. కాని పెద్దలు ఉన్నారు. కాగితపు వాసనను పీల్చి, అక్షరాలను వేళ్లతో తడిమిగాని సంతృప్తి పడని ప్రాణాలున్నాయి. కట్టె కొట్టె తెచ్చేలా కాకుండా, అరచేత్తో లోడేదే లోతు అనుకునే రచయితల్లా కాకుండా, తమ రచనలతో చెరువులనూ, కడలి కెరటాల సంచలనాత్మలనూ సృష్టించిన చేతులు ఉన్నాయి. వారి సంగతి ఏమిటి? వారికేదైనా పెన్షన్ కావాలని ఎవరైనా ఆలోచించారా?1970–90ల మధ్య కాలంలో కథ అంటే కనీసం ఐదారు పేజీలు ఉండేది. పెద్దకథలు ఉండేవి. నవలికలు, సీరియల్ నవలలు, గల్పికలు, ప్రహసనాలు, ఆత్మకథలు, జ్ఞాపకాలు, సంవాదాలు, అనువాదాలు, ఇంటర్వ్యూలు... ఇవన్నీ రాసినవారు, ఇచ్చినవారు ఇంకా ఉన్నారు. జనాభా లెక్కల్లో గల్లంతై పోలేదు. వీరు రాయగా చదివి అభిమానులు అయినవారు ఉన్నారు. బండలై పోలేదు. ఈ రాసే వారు రాయడానికీ... ఈ చదివేవారు అనుసంధానమై చదవడానికీ... అవసరమైన వేదికలే తెలుగునాట లేవు. ఈ రచయితలకు, పాఠకులకు ఒక పెన్షన్ స్కీమ్ కావాలి. వీరి అనుభవాన్ని, ఆత్మగౌరవాన్ని మన్నిస్తూ వీరి రచనలకు చోటు కల్పించడం కోసం ఒక పథకం కావాలి. కొత్త తరాలతో పోటీ పడుతూ డిజిటల్ క్యూలలో దూరి బుకింగ్ కోసం వీరు చేయి దూర్చరని గ్రహించడం అత్యవసరం. అదొక్కటేనా? పునఃపఠనం సంగతో? ఎంతో రాసి, ఎన్నో క్లాసిక్స్ ఇచ్చిన రచయితలను రీవిజిట్ చేయడానికి ఒక్క కాగితపు పుట ఇంత పెద్ద జాతికి లేకపోవడం విషాదమా, కాదా?‘ఏజ్లెస్ ఆథర్స్’... 65 ఏళ్లు ఆపైన వయసున్న వారి రచనలనే క్రమం తప్పకుండా వెలువరించే సంకలనాల వరుస ఇది. ‘క్రోన్ : విమెన్ కమింగ్ ఆఫ్ ఏజ్’... ఇది అరవైలు దాటిన స్త్రీల రచనలు ప్రచురించే పత్రిక. ‘పాసేజర్’... యాభై ఏళ్ల తర్వాత రాసిన వారివే ఈ పత్రిక వేస్తుంది. ‘ఎనభై ఏళ్లు పైబడిన వారు రాయట్లేదే అని చింతించాం. కాని ఇప్పుడు ఆ వయసు వారూ వచ్చి రాస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని ఆ పత్రిక పేర్కొంది. ‘రీ ఇన్వెన్షన్ ఆఫ్టర్ రిటైర్మెంట్’... స్లోగన్తో యాభైలు దాటిన రచయితల రచనలు మాత్రమే వేసే పత్రికలు పాశ్చాత్య దేశాల్లో ఉన్నాయి. వారి మానసిక ఆనందానికి అవి అవసరం అని ఆ యా దేశాలు భావిస్తున్నాయి. మన దేశంలో ఇతర భాషల్లో పత్రికలు సజీవంగా ఉన్నాయి కాబట్టి వారికి ఈ బెడద తెలియదు. తెలుగు సీనియర్స్కే సమస్య అంతా! వీరు చదివిన వందల పుస్తకాల నుంచి విలువైన మాటలు చెప్పాలా, వద్దా? వేయిదీపాల మనుషులు వీరు అనే సోయి మనకు ఉందా?‘రాయాలంటే ఎక్కడ రాయాలి’ అనుకునే కవులు, రచయితలు, ఆలోచనాపరులు, విమర్శకులు, నాటకకర్తలు, వ్యంగ్య విన్యాసకులు నేడు ఎందరో నిశ్శబ్దంగా ఉన్నారు. లోపలి వెలితితో ఉన్నారు. వీరి సృజన సన్నగిల్లలేదు. మరింత విస్తరణను కోరుకుంటోంది. వీరిని నిర్లిప్తంగా ఉంచడమంటే కనబడని గోడల జైలులో పెట్టడమే! సాంస్కృతిక ఆస్తిపత్రాలు గల్లంతు చేసుకోవడమే. ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, ఇద్దరు సంపాదక సిబ్బందితో ఏ రాష్ట్ర సాంస్కృతిక శాఖ అయినా ఏ యూనివర్సిటీ అయినా ఏ బాధ్యత గల్ల సంస్థైనా ప్రతి నెలా ‘పెన్షన్ పత్రిక’ నడపవచ్చు. పెన్షన్లు వ్యక్తిగత హితానికైతే ఇది సామాజిక హితానికి! అమరావతి, మూసీల ఖర్చులో దీనికై వెచ్చించవలసింది 0.0000001 పైసా. ఈ కొత్త పెన్షన్ కోసం డిమాండ్ చేద్దాం! -
‘సుప్రీం’ బోనులో ఈసీ
ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భాల్లో తప్ప వినబడని ఎన్నికల సంఘం(ఈసీ) పేరు ఇటీవలి కాలంలో తరచు వార్తల్లోకెక్కుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ మొదలుకొని ప్రచారం వరకూ... ఆ తర్వాత ఎన్నికల్లో పోలైన వోట్ల శాతం, వాటి లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకూ అన్ని దశల్లోనూ ఈసీపై నిందలు తప్పటం లేదు. తాజాగా ప్రజాతంత్ర సంస్కరణల సంఘం (ఏడీఆర్) దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం విచారిస్తున్న సందర్భంగా ఈవీఎంల పరిశీలన ప్రక్రియ అమల వుతుండగా వాటి డేటాను తొలగించవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించాల్సి వచ్చింది. నిరుడు ఏప్రిల్లో ఈ విషయమై ఇచ్చిన ఆదేశాలను సరిగా అర్థం చేసుకుని, సక్రమంగా పాటిస్తే ఇలా చెప్పించుకోవాల్సిన స్థితి ఈసీకి ఉండేది కాదు. ఈవీఎంలనూ, దానికి అనుసంధానించి వుండే ఇతర యూనిట్లనూ భద్రపరిచే విషయమై సుప్రీంకోర్టు అప్పట్లో కీలక ఆదేశాలిచ్చింది. అవి సరిగా పాటించటం లేదని ఏడీఆర్ మరోసారి కోర్టును ఆశ్రయించింది. ఎన్నికల్లో పరాజితులై 2, 3 స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు కనుక ఆ ఎన్నికను సవాలు చేసిన సందర్భాల్లో తనిఖీ చేయడానికి అనువుగా ఈవీఎంలతోపాటు, వాటిలో పార్టీల గుర్తులను లోడ్ చేయటానికి ఉపయోగించే సింబల్ లోడింగ్ యూనిట్ (ఎస్ఎల్యూ)లను సైతం 45 రోజులపాటు భద్రపరచాలని సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది. ఎన్నికల ఫలితంపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయటానికి పరాజిత అభ్యర్థులకుండే 45 రోజుల వ్యవధిని దృష్టిలో పెట్టుకుని ధర్మాసనం ఇలా ఆదేశించింది. అసెంబ్లీ నియో జకవర్గ పరిధిలోని 5 శాతం ఈవీఎంలు, ఎస్ఎల్యూలను ఇంజనీర్ల, ఉత్పత్తిదారుల సమక్షంలో తనిఖీకి అనుమతించవచ్చని సూచించింది. వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించే యంత్రాలు సమకూర్చు కునే ఆలోచన చేయాలని కూడా ఆ సందర్భంగా కోరింది. ఈ ఆదేశాల ఆంతర్యమేమిటో సుస్పష్టం. ఎన్నికలు న్యాయబద్ధంగా జరగడమే కాదు... అలా జరిగినట్టు కనబడాలంటే అంతా పారదర్శకంగా ఉండాలన్నది ధర్మాసనం ఉద్దేశం. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల అనంతరం ఈవీఎంలూ, వీవీప్యాట్లూ, ఎస్ఎల్యూల పరిశీలన విషయంలో ఈసీ కొన్ని నియమ నిబంధనలు విడుదల చేసింది. న్యాయస్థానం ఆదేశాలకూ, ఆ నియమ నిబంధనలకూ ఎక్కడా పొంతన లేదు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనూ 5 శాతం ఈవీఎంలు తనిఖీ చేయాలని ధర్మాసనం ఇచ్చిన ఆదేశానికి ఈసీ వేరే రకమైన భాష్యం చెప్పింది. వినియోగించిన ఈవీఎంలలో ఏ పార్టీకి ఎన్ని వోట్లు లభించాయో చూసి, వీవీ ప్యాట్ స్లిప్లు దానికి అనుగుణమైన సంఖ్యలో ఉన్నాయా లేదా అన్నది తేలిస్తే వేరే రకంగా ఉండేది. కానీ ఈసీ చేసిందల్లా ఇతరత్రా గుర్తులతో మళ్లీ నమూనా పోలింగ్ నిర్వహించి ఈవీఎంల డేటాకూ, వీవీప్యాట్ స్లిప్ల సంఖ్యకూ మధ్య తేడా లేదని నిరూపిస్తే చాలని భావించింది. అంతేకాదు... ఆ నమూనా పోలింగ్ కోసం ఈవీఎంలలోని డేటాను ఖాళీ చేసింది! ఈవీఎంలు సరిచూడాలని అభ్య ర్థులు కోరటం అంటే తమ సమక్షంలో ఈవీఎంలలో ఉన్న సాఫ్ట్వేర్నూ, హార్డ్వేర్నూ ఇంజనీర్లు పరిశీలించాలని... వీవీ ప్యాట్ స్లిప్ల సంఖ్య ఈవీఎంల డేటాతో సరిపోయిందో లేదో చూడాలని అడగటం. ఈసీ అనుసరించిన ప్రక్రియకూ, అభ్యర్థులు కోరుకునేదానికీ పొంతన ఎక్కడైనా ఉందా? ఈ మాత్రానికే అభ్యర్థులనుంచి ఈవీఎంకు రూ. 40,000 చొప్పున వసూలు చేయటం సిగ్గనిపించ లేదా? చిత్రమేమంటే... ఒక్కో ఈవీఎం తయారీకి ఖర్చయ్యేది కేవలం రూ. 30,000! గత లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఒడిశాల నుంచి 11 మంది అభ్యర్థులు ఈవీఎంలూ, వీవీప్యాట్ స్లిప్ల పరిశీలన కావాలన్నారని, అంతా పూర్తయ్యాక ఎక్కడా తేడా కనబడలేదని ఈసీ తేల్చింది. దేశవ్యాప్తంగా చూస్తే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇటువంటి అభ్యర్థనలే 83 వరకూ రాగా, అంతా సవ్యంగానే ఉన్నదని నిర్ధారణ అయిందని వివరించింది. ఆంధ్రప్రదేశ్లో 45 రోజులలోపు ఈవీఎంల డేటా తొలగించరాదన్న నిబంధనను సైతం ఈసీ ఉల్లంఘించింది. ఒకపక్క ఈవీఎంల పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతుండగా ఇలా చేయటం అనుమానాలను మరింత పెంచుతుందన్న ఇంగితజ్ఞానం దానికి లేకపోయింది.మేమిచ్చిన ఆదేశాలేమిటో, మీరు అనుసరించిన ప్రక్రియేమిటో వివరిస్తూ వచ్చే నెల 3లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఈసీని ఆదేశించటం హర్షించదగ్గది. అసలు 45 రోజుల్లోపే డేటాను ఎందుకు తొలగించాల్సివచ్చిందో కూడా ఈసీనుంచి సంజాయిషీ కోరాలి. ఇక పోలింగ్ శాతంపై ఈసీ విడుదల చేసిన ప్రకటనలు మరింత చిత్రంగా ఉన్నాయి. ఏడు దశల్లో జరిగిన పోలింగ్లో 3.2 శాతం నుంచి 6.32 శాతం వరకూ వోట్లు పెరిగినట్టు ఈసీ తేల్చింది. ఈ పెరిగిన వోట్ల శాతం ఆంధ్రప్రదేశ్లో 12.54 శాతం, ఒడిశాలో 12.48 శాతం ఉంది. పోలింగ్ ముగిసిన రాత్రి ఏపీలో 68 శాతం వోట్లు పోలయ్యాయని ప్రకటించగా, తుది ప్రకటనలో అది కాస్తా 81 శాతానికి ఎగబాకింది. ఈవీఎంల చార్జింగ్ పెరగటం మరో కథ! ఈ మార్పుల వెనకున్న మంత్రమేమిటో చెప్తే అందరూ విని తరిస్తారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ ఎంతో నిష్ఠగా నిర్వహించాల్సిన క్రతువు. ఒక రాజ్యాంగ సంస్థ అయివుండి, నిష్పక్షపాతంగా, నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన ఈసీ అందుకు భిన్నమైన పోకడలను ప్రదర్శించటం దానికి ఎంతమాత్రమూ గౌరవప్రదం కాదు. ఈసీ తీరు గమనించాక చాలామంది మళ్లీ బ్యాలెట్ పత్రాలకు మళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. ఈసీ బాణీ మారకపోతే చివరకు బ్యాలెట్ పత్రం విధానం కోసం జనం ఎలుగెత్తే రోజులు రావటం ఖాయం. -
మణిపూర్ శాంతిస్తుందా?
ఎట్టకేలకు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. దాదాపు రెండేళ్లనాడు హత్యలూ, అత్యాచారాలూ, గృహదహనాలతో అట్టుడికి ప్రపంచవ్యాప్తంగా మన దేశ పరువు ప్రతిష్ఠలను మంటగలిపిన ఆ రాష్ట్రం 649 రోజులైనా ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. 2023 మే 3న రాష్ట్రంలో ప్రధాన తెగలైన మెయితీలకూ, కుకీలకూ మధ్య రాజుకున్న ఘర్షణలు చూస్తుండ గానే కార్చిచ్చులా వ్యాపించగా అధికారిక లెక్కల ప్రకారమే 260 మంది ప్రాణాలు కోల్పోయారు. 60,000 మంది ఇప్పటికీ తమ స్వస్థలాలకు వెళ్లలేక సహాయ శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. భద్రతా బలగాల పహారా కొనసాగుతున్నా మెయితీలు, కుకీలు ఒకరి ప్రాబల్య ప్రాంతాల్లోకి మరొకరు ప్రవేశించే సాహసం చేయటం లేదు. అందువల్ల నిరుపేదల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింది. మణిపూర్ హింసాకాండ సాధారణమైనది కాదు. అనేకచోట్ల మహిళలను వివస్త్రలను చేసి, వారిపై అత్యాచారాలకు పాల్పడిన ఉదంతాలు దిగ్భ్రాంతికి గురిచేశాయి. పోలీసు స్టేషన్లపై, సాయుధ రిజర్వ్ బెటాలియన్ స్థావరాలపై దాడులకు దిగి తుపాకులు, మందుగుండు ఎత్తుకుపోయిన ఉదంతాలు కోకొల్లలు. ఈ మొత్తం హింసాకాండలో బీరేన్ సింగ్కు కేవలం నైతిక బాధ్యత మాత్రమే కాదు... నేరుగా ఆయన ఒక వర్గానికి వత్తాసుగా నిలిచారని అనేకులు ఆరోపించారు. ఇటీవల బయటపడి, ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్న సంభాషణల ఆడియో క్లిప్ ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది.కొందరి మతిమాలిన చర్యలవల్లా, పాలకులకు సరైన అంచనా లేకపోవటంవల్లా శాంతి భద్రతలు చేజారే ప్రమాదం ఉంటుంది. కానీ మణిపూర్లో జరిగింది వేరు. ఘర్షణలను కుకీ మిలి టెంట్లకూ, కేంద్ర భద్రతా బలగాలకూ మధ్య సాగుతున్న లడాయిగా మొదట్లో బీరేన్ సింగ్ కొట్టి పారేశారు. కానీ దాన్ని అప్పటి రక్షణ దళాల చీఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ ఖండించారు. అవి రెండు తెగలమధ్య కొనసాగుతున్న ఘర్షణలేనని తేల్చిచెప్పారు. ఆ తర్వాత దశలో ఘర్షణలను ఆపడానికి ప్రయత్నిస్తున్న కేంద్ర భద్రతా బలగాలు ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నా యంటూ బీరేన్ నిందించారు. విషాదం ఏమంటే 21 నెలలు గడిచినా ఈనాటికీ పరిస్థితి పెద్దగా మారింది లేదు. వాస్తవానికి ఘర్షణలు చెలరేగిన కొన్ని వారాల తర్వాత 2023 జూన్లో బీరేన్సింగ్ రాజీనామాకు సిద్ధపడ్డారు. కానీ రాజ్భవన్ కెళ్లే దారిలో ఆయన మద్దతుదార్లు పెద్దయెత్తున గుమి గూడి అడ్డంకులు సృష్టించి వెనక్కు తగ్గేలా చేశారు. ఇన్నాళ్లకు తప్పుకున్నారు. ఈ పని మొదట్లోనే జరిగుంటే ఈపాటికి పరిస్థితులు మెరుగుపడేవి. సకాలంలో తీసుకోని నిర్ణయం ఊహించని విష పరిణామాలకు దారితీసే ప్రమాదమున్నదని చెప్పటానికి మణిపూర్ పెద్ద ఉదాహరణ. ఇంతకూ బీరేన్ రాజీనామాకు కారణం ఏమిటన్నది మిస్టరీయే. సుప్రీంకోర్టు ధర్మాసనం పరిశీల నలో వున్న ఆడియో టేప్ అందుకు దారితీసి వుండొచ్చని కొందరంటున్నా... మణిపూర్ అరాచకంలోకి జారుకున్నప్పటినుంచీ ఆయనకు సొంత పార్టీలో వ్యతిరేకత పెరుగుతూ వచ్చిందన్నది వాస్తవం. కేబినెట్ సైతం రెండుగా చీలింది. ఒక వర్గం మణిపూర్ను విభజించి తాముండే ప్రాంతా లను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న కుకీల డిమాండ్ను సమర్థించగా, మరో వర్గం మణిపూర్ సమగ్రత కాపాడాలంటూ కోరుతూ వచ్చింది. బీజేపీ ఎమ్మెల్యేల్లో కొందరు అసెంబ్లీ స్పీకర్ సత్యబ్రతసింగ్ ఆధ్వర్యంలో ఆదివారం ఇంఫాల్ హోటల్లో సమావేశమై బీరేన్ను సాగనంపటానికి వ్యూహం రచించగా, సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన అసెంబ్లీ సమావేశాల్లో సర్కారుపై అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ నోటీసులిచ్చింది. బీరేన్ తప్పుకున్నాక అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ రద్దుచేశారు. బీజేపీ అధిష్టానం అండదండలుంటే అవిశ్వాస తీర్మానానికి బీరేన్ జడిసేవారు కాదు. ఎందుకంటే తొలి ఏలుబడిలో మూడుసార్లు అవిశ్వాస తీర్మానం వచ్చిపడినప్పుడు అసెంబ్లీలో తగినంత బలం లేకున్నా సునాయాసంగా బయటపడిన చరిత్ర బీరేన్ది. దేశానికి బలమైన రాజ్యాంగం ఉన్నా మణిపూర్లో కొనసాగుతున్న దారుణ హింసను అన్ని వ్యవస్థలూ చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయాయి. అది మన దేశంలో అంతర్భాగమని, అక్కడి ప్రజలు కూడా ఈ దేశ పౌరులేనని గుర్తించనట్టే ప్రవర్తించాయి. గవర్నర్ మొదలుకొని న్యాయవ్యవస్థ వరకూ అందరికందరూ మౌనంగా మిగిలారు. ఇలాంటి సమయాల్లో జోక్యం చేసుకోవాల్సిన కేంద్రం తన కర్తవ్యాన్ని మరిచింది. పార్లమెంటులో ఈ సమస్య ప్రస్తావనకొచ్చినప్పుడల్లా అధికార, విపక్ష సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకోవటం మినహా జరిగిందేమీ లేదు. కనీసం ఇప్పుడైనా అందరూ కదిలి క్షతగాత్రగా మిగిలిన మణిపూర్లో ఉపశమన చర్యలు తీసుకుంటారా?మాయమైన మనుషులు, ధ్వంసమైన ఇళ్లు, ఛిద్రమైన బతుకులు, మానప్రాణాలు తీసే మృగాళ్లు, జీవిక కోల్పోయి ఎలా బతకాలో తెలియక కుమిలిపోతున్న కుటుంబాలు – మణిపూర్ వర్తమాన ముఖచిత్రం ఇది. అందుకే ఆయుధాలు సమకూర్చుకుని అధికారంలో ఉన్నవారి అండదండలతో ఇన్నాళ్లనుంచీ రెచ్చిపోతున్న ముఠాల ఆటకట్టించటం తక్షణావసరం. అసెంబ్లీని సస్పెండ్ చేసి తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధిస్తారో, మరెవరినైనా ముఖ్యమంత్రి పీఠంపై ఎక్కిస్తారో ఇంకా తేలాల్సేవుంది. ఏం జరిగినా ముందు చట్టబద్ధ పాలనపై ప్రజలకు విశ్వాసం కలిగించే చర్యలు తీసుకోవటం అధికార యంత్రాంగం కర్తవ్యం. అప్పుడే శాంతి సామరస్యాలు వెల్లివిరుస్తాయి. సంక్షుభిత మణిపూర్ మళ్లీ చివురిస్తుంది. -
‘తెలివి’ తెల్లారకూడదు!
‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’– పొడి అక్షరాలలో ‘ఏఐ’ – ఇంతింతై వటుడింతౖయె అన్నట్టుగా రోజు రోజుకూ విశ్వరూపాన్ని సంతరించుకుంటోంది. ‘కృత్రిమ మేధ’గా మనం అనువదించుకుంటున్న ఆ మాట చూస్తుండగానే మన నిత్య వ్యవహారంలో భాగమైపోతోంది. అమెరికా అభివృద్ధి చేసిన ‘చాట్ జీపీటీ’ అనే ఏఐ లాంగ్వేజ్ నమూనాకు పోటీగా చైనా అభివృద్ధి చేసిన ‘డీప్ సీక్’ కొన్ని రోజులుగా చర్చనీయమవుతోంది. చాట్ జీపీటీ కన్నా ఇది మెరుగైన సాంకేతికత అనీ, ఏఐ రంగంలో చైనా పురోగమనాన్ని ఇది చాటి చెబుతోందనీ అంటున్నారు. ఇప్పటికే ఏఐ రంగంలో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా; చైనా, బ్రిటన్ రెండు, మూడు స్థానాలలో ఉన్నాయని సమాచారం. కృత్రిమమేధా రంగంలో ముందున్నవారే ప్రపంచాన్ని ఏలగలరని ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్య, ఈ సాంకేతికాద్భుతం ప్రపంచాన్ని ఏ స్థాయిలో ప్రభావితం చేయబోతోందో స్పష్టం చేస్తోంది. ఇంతటి కీలకరంగంలో మనదేశం ఏ స్థానంలో ఉందన్న ప్రశ్న తలెత్తడం సహజమే. మరీ వెనకబడి లేము కానీ, చైనా మొదలైన దేశాలతో పోల్చితే వెళ్లవలసినంత ముందుకూ వెళ్లలేదనే మాట వినిపిస్తోంది. ఇప్పటికైనా వేగాన్ని పెంచుకుని పోటాపోటీగా మన ఉనికిని స్థాపించుకోగల సత్తా మనకుందన్న భావన వ్యక్తమవుతోంది. అదలా ఉంచితే, ఏఐ సాంకేతికత సృష్టించే అద్భుతాలను సామాజిక మాధ్యమాల తెరపై ఇప్ప టికే చూస్తున్నాం. ఇటీవలి కుంభమేళాలో కొందరు విదేశీ ప్రముఖులు కాషాయవస్త్రాలు ధరించి పవిత్ర స్నానాలు చేసినట్టు చూపే చిత్రాలు సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షమయ్యాయి. అవి ఏఐ సాంకేతికతతో సృష్టించినవని చెప్పకపోతే నిజమని నమ్మేసే ప్రమాదం ఉండనే ఉంటుంది. ఇలాగే, తను కుంభమేళాలో స్నానం చేస్తున్నట్టు చూపించే ఏఐ చిత్రం ఒకటి చక్కర్లు కొడుతుండటం గమనించి ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రకరకాల మాధ్యమాలలో హోరెత్తుతున్న నకిలీ సమాచారానికి తోడు ఇప్పుడు నకిలీ చిత్రాలు కూడా అడుగు పెట్టాయనీ, వీటికి వ్యతిరేకంగా తన వంతు పోరాటంగా పోలీసులకు ఫిర్యాదు చేశాననీ ఆయన చెప్పుకొచ్చారు. నిక్కమైన సమాచారానికి నకిలీ వార్తల బెడద విడుపులేని రాహుగ్రహణంగా మారిన మాట నిజం. మంచి, చెడులు రెంటికీ పనికొచ్చే రెండంచుల కత్తి లాంటి సాంకేతిక సాధనాల జాబితాలో ఏఐ కూడా ఇలా చేరిపోతోంది. ఈ ప్రమాదానికి అడ్డుకట్ట వేయడం, ఏఐలో పురోగతిని సాధించడాన్ని మించిన సవాలు కాబోతోంది. ఇంకోవైపు, ఆకాశమే హద్దుగా ఏఐ సాంకేతికత సాధించగల అద్భుతాలను ఊహించుకున్న కొద్దీ, అది అచ్చంగా మాయల ఫకీరు చేతిలోని మంత్రదండాన్ని గుర్తుచేస్తుంది. తలకాయలను, వేషభాషలను మార్చడమే కాదు; స్త్రీ, పురుషుల రూపాలను కూడా అది తారుమారు చేయగలదు. ఆ విధంగా మంత్రాలూ, మహిమలతో నిండిన పౌరాణిక మాయాప్రపంచాన్ని కొత్తరూపంలో కళ్ళముందు ఆవిష్కరించగలదు. ఉదాహరణకు రామాయణంలోనే చూడండి, యుద్ధరంగంలో రాముని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఇంద్రజిత్తు ఒక మాయాసీతను సృష్టించి తన రథం మీద యుద్ధభూమికి తీసుకొచ్చి అందరూ చూస్తుండగా ఆమెను నరికి చంపుతాడు. రాముడంతటివాడు కూడా ఆమెను నిజ సీత అనుకుని దుఃఖంతో మూర్ఛపోతాడు. వినాయకుడికి ఏనుగు తలను, మరో పౌరాణిక పాత్రకు గుర్రం తలను అతికించడమూ పురాణాలలో కనిపిస్తాయి. ఒక రాకుమారుడు వేటకెళ్లి ఓ వనంలోకి ప్రవేశించగానే స్త్రీగా మారిపోయినట్టు చెప్పే కథ ఒకటి మహాభారతంలో ఉంది. అభిమన్యుని వధకు కారణమైన సైంధవుని సూర్యాస్తమయంలోగా చంపి తీరుతానన్న అర్జునుని ప్రతిజ్ఞను నిజం చేయడానికి కృష్ణుడు కృత్రిమ సూర్యాస్తమయాన్ని సృష్టి స్తాడు. ఏఐ సాంకేతికత ఇటువంటి అనేకానేక ఉదంతాలను తలపించి మరిపించే ఒక సరికొత్త మాంత్రిక ప్రపంచాన్ని సృష్టించి ఏది నిజమో, ఏది అబద్ధమో పోల్చుకోలేని ద్వైదీస్థితిలో మనిషిని నిలబెట్టే అవకాశం పుష్కలంగా ఉంది. మనిషి సృష్టించిన సాంకేతికత తిరిగి ఆ మనిషినే పునఃçసృష్టి చేయడం మానవ చరిత్ర పొడవునా జరుగుతూ వచ్చింది. రాతియుగంలో మనిషి కనిపెట్టిన శిలాసాధనాలే అన్నసంపాదనలో కొత్త మార్గాలు తెరచి భద్రమైన మనుగడ దిశగా అతణ్ణి ముందడుగు వేయించాయి. అతను కనిపెట్టిన ధనుర్బాణాలే ఆ అడుగుకు మరో పదడుగులు జమచేశాయి. ఆ తర్వాత అతనే కనిపెట్టి విడిచిపెట్టిన చక్రం వందల వేల సంవత్సరాలలో వేనవేల రూపాల్లోకి మారి, అతణ్ణి కూడా మార్చి ప్రపంచ యాత్ర చేయిస్తూ అప్రతిహతంగా తిరుగుతూనే ఉంది. ఆహార సేకరణ, పెరటి సాగు దశలను దాటి మనిషి సృష్టించిన వ్యవసాయ సాంకేతిక జ్ఞానమే, తిరిగి అతడికి నాగరికుడిగా కొత్త అవతారాన్ని సంతరించి సరికొత్త యుగావిష్కరణ వైపు నడిపించింది. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, మనిషి తను సృష్టించిన సాంకేతికతను తన అదుపులో ఉంచుకున్నప్పుడే అది ఉపయుక్తంగా మారి అతని మనుగడను ఎవరెస్టు ఎత్తుకు తీసుకెడుతుంది; కళ్లేలు వదిలేస్తే సమస్యలు, సంక్షోభాల లోయల్లోకి పడదోస్తుంది. ఏఐ లాంటి ఎంతటి అత్యాధునిక సాంకేతికత అయినా ఇందుకు మినహాయింపు కాదు. మనిషి సృష్టించిన కృత్రిమ మేధ మనిషి మేధనే కృత్రిమంగా మార్చివేయకుండా చూసు కోవాలి; ప్రపంచాన్నే మయసభగా మార్చి మాయావుల పరం చేయకుండా జాగ్రత్తపడాలి. -
చెదిరిన డాలర్ డ్రీమ్స్
అక్రమ వలసల్ని సహించేది లేదనీ, అక్రమ వలసదారుల్ని అమెరికా నుంచి వెనక్కి పంపేవరకు నిద్రపోయేది లేదనీ చెబుతూ వస్తున్న అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు చేతల్లోకి దిగారు. సరైన పత్రాలు లేకుండా తమ దేశంలో ఉంటున్న భారత్కు చెందిన అక్రమ వలసదారుల్లో కొందరిని తొలి విడతగా వెనక్కి పంపేశారు. అమెరికాలోని టెక్సాస్లో శాన్ ఆంటోనియో నుంచి బయలు అమెరికన్ యుద్ధవిమానం బుధవారం మధ్యాహ్నం మన అమృత్సర్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగడంతో కొత్త అంకం ఆరంభమైంది. ఆ ఖరీదైన సీ–17 అమెరికా యుద్ధ విమానం నుంచి 104 మంది భారతీయ అక్రమ వలసదారులు వెనక్కి వచ్చినట్టు కథనం. వచ్చిన వారి పత్రాలనూ పరిశీలించి, ప్రాథమికంగా ప్రశ్నించి, వైద్యపరీక్షలు సైతం చేసి, ఎలాంటి నేర చరిత్రా లేదని నిర్ధరించుకున్నాక వారిని స్వరాష్ట్రాలకు పంపే పనిలో భారత పాలనా యంత్రాంగం నిమగ్నమైంది. గడచిన బైడెన్ హయాంలో 2024లో అమెరికాతో మన సంబంధాలు కొంత అడుగంటాక, తాజా ట్రంప్ ఏలుబడిలో వాటిని మళ్ళీ బలోపేతం చేసుకోవాలని మోదీ సర్కార్ భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ అక్రమ వలసల అంశం కొంత చీకాకు పరిచేదే అయినా, అనివార్యతల్ని గ్రహించి, సహనంతో సమస్యల్ని చక్కదిద్దుకోవడమే భారత్ ముందున్న మార్గం. పత్రాలు లేకుండా ఉంటున్నవారిని సహించేది లేదని హెచ్చరిస్తూ వచ్చిన ట్రంప్ జనవరి 20న అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అలాంటివారిని ఏరి ఏరి మరీ భారత్కు వెనక్కు పంపడం ఇది తొలిసారి. గతంలో, గ్వాటెమలా, పెరూ, హాండూరస్ల నుంచి చట్టవిరుద్ధంగా వలస వచ్చినవారిని తిరుగు టపాలో పంపేందుకు అమెరికా సైనిక విమానాన్ని వినియోగించింది. ఇప్పుడు మన విషయంలోనూ అదే చేసింది. వెనక్కి పంపేందుకు సిద్ధం చేసిన 15 లక్షల మంది జాబితాలో భారతీయులు 18 వేల మంది దాకా ఉన్నారట. అంటే, రానున్న నెలల్లో ఇలాంటి మరిన్ని విమానాల్లో వందల సంఖ్యలో మనవాళ్ళు వెనక్కి రానున్నారన్నది చేదు నిజం. అంటే, ఎంత స్నేహమున్నా అసలు సంగతికొచ్చే సరికి అగ్ర రాజ్యాధినేత భారత్తోనూ ముక్కుసూటిగానే ఉంటారన్నది సుస్పష్టం. నిజానికి, మెక్సికో, ఎల్సాల్వడార్ల తర్వాత అమెరికాలో అక్రమ వలసదారుల్లో అధిక సంఖ్యాకులు భారతీయులే. అక్కడ అలాంటి భారతీయుల సంఖ్య దాదాపు 7.25 లక్షలని ఓ లెక్క. తాజాగా వెనక్కివచ్చినవారిలో పంజాబ్ (30 మంది), హరియాణా (33), గుజరాత్ (33), తదితర రాష్ట్రాల వారున్నారు. వీరిలో పిల్లలు, మహిళలు కూడా ఉండడం గమనార్హం. ఆ మాటకొస్తే, అమె రికా ఇలా అక్రమ వలసదారులైన భారతీయుల్ని వెనక్కిపంపడం కొత్తేమీ కాదు. గత అక్టోబర్లోనూ వంద మంది పంజాబ్కు తిరిగొచ్చారు. 2023 అక్టోబర్ నుంచి నిరుడు సెప్టెంబర్ ఆఖరు వరకు మొత్తం 1100 మంది ఇలా ఇంటి ముఖం పట్టినవారే! అగ్రరాజ్యాన్ని కలలస్వర్గంగా ఊహించుకుంటూ, అక్కడ జీవనం బాగుంటుందనే ఆశతో, డాలర్ల సంపాదనపై ఆకర్షణతో అక్కడకు సక్రమంగానో, అవసరమైతే అక్రమంగానో వెళ్ళి, స్థిరపడాలనే ధోరణి చాలాకాలంగా ఉన్నదే. ఒక లెక్క ప్రకారం ప్రపంచపు పెద్దన్న పంచన చట్టప్రకారమే దాదాపు 50 లక్షల మంది భారత జాతీయు లున్నారంటే మన అమెరికా మోజు ఎంతో అర్థం చేసుకోవచ్చు. దీర్ఘకాలంగా మన భారతీయుల్లో అంతకంతకూ అధికమవుతూ వచ్చిన ఆ మోజు ఫలితమే – అధికసంఖ్యలోని అక్రమ వలసలు. ముఖ్యంగా, పంజాబ్ లాంటి ప్రాంతాల నుంచి అలా వెళ్ళేవారు మరీ ఎక్కువ. స్థానిక పంజాబీ జాతీయంలో చెప్పాలంటే ‘డాంకీ రూట్స్’లో (వాహనాలు మారుతూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతూ) అమెరికా చేరుకుంటారు. విదేశాల్లో బతుకు తెరువుకై తపిస్తున్న వ్యక్తుల ఆశల్ని సొమ్ము చేసుకుంటూ, ట్రావెల్ ఏజెన్సీలు భారీగా లక్షల్లో డబ్బు గుంజి, దొంగ వీసాలతో వారిని ఇలా దేశాల హద్దుల్ని దాటిస్తుంటాయి. సగటున ఏటా 90 వేల పైచిలుకు భారతీయులు ఇలా అక్రమంగా అమెరికాలో ప్రవేశించబోయి, పట్టుబడుతున్నారు. తల తాకట్టుపెట్టి, సరైన పత్రాలు లేకుండానే అందరి కళ్ళుగప్పి అలా హద్దులు దాటి వెళ్ళిన పలువురికి ఇప్పుడు కల చెదిరింది. ట్రంప్ రాకతో వారి కథ మారింది. చాలామందికి కన్నీరే మిగిలింది. తగిన పత్రాలు లేకుండా అమెరికాలోనే కాదు, ఏ దేశంలోనైనా ఏ జాతీయులు నివసించినా అది తప్పే. శిక్షార్హమైన నేరమే. ఇంతకాలం చూసీచూడనట్టు చెల్లిపోయినా, అమెరికాను మళ్ళీ గొప్ప దేశంగా తీర్చిదిద్దుతానంటూ ఇప్పుడు రెండోసారి పగ్గాలు చేపట్టిన ట్రంప్ ఖడ్గప్రహారం చేయడాన్ని తప్పుపట్టలేం. అందుకే, బాధితులు భారతీయులైనా మన దేశం మారుమాట్లాడ లేకపోతోంది. ఆ మాటకొస్తే, వ్యవస్థీకృత నేరాలకు దారి తీస్తున్నట్లు భావిస్తున్న అక్రమ వలసలకు భారత్ వ్యతిరేక మని మన విదేశాంగ శాఖ నొక్కి వక్కాణించాల్సి వచ్చింది. అదే సమయంలో భారతీయుల పునరా గమనానికి వీలు కల్పిస్తామనీ చెప్పాల్సి వచ్చింది. వాణిజ్య సుంకాల విధింపు సహా అనేక విష యాల్లో ట్రంప్ దూకుడు మీదున్న తరుణంలో అమెరికాతో దీర్ఘకాలిక స్నేహసంబంధాలకు ఇబ్బంది కలగకుండా మన దేశం ఆచితూచి వ్యవహరించక తప్పదు. ఆ కోణం నుంచి చూసినప్పుడు భారత్ వైఖరి సమంజసమే కాదు సహజం కూడా! అయితే, ఈ అక్రమ వలసల్ని ఆపాలంటే, అమాయకుల ఆశను సొమ్ము చేసుకొనే అక్రమార్కుల పనిపట్టాలి. అంతకన్నా ముఖ్యంగా, ఆశల పల్లకీలో అగ్రరాజ్యం వైపు ఉరికే మనవాళ్ళకు గౌరవప్రదమైన ఉపాధి, ఉద్యోగావకాశాలిక్కడే కల్పించడంపై పాలకులు దృష్టిపెట్టాలి. చిత్తశుద్ధితో అది చేయనంతకాలం ఈ డాలర్డ్రీవ్స్ు కథలు కంచికి చేరవు! -
అగ్రరాజ్యపు వాణిజ్య యుద్ధం
అగ్రరాజ్యం కొత్త యుద్ధానికి తెర తీసింది. అయితే, ఇది ఆయుధాలతో కూడిన యుద్ధం కాదు... ఆర్థికపరమైన యుద్ధం. అధ్యక్షుడు ట్రంప్ తన అత్యవసర అధికారాలను ఉపయోగిస్తూ... కెనడా, మెక్సికోల నుంచి దిగుమతులపై 25 శాతం మేర, అలాగే చైనా నుంచి దిగుమతులపై ఇప్పటికే ఉన్న భారానికి అదనంగా మరో 10 శాతం మేర సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కెనడా నుంచి దిగుమతి చేసుకొనే చమురు, సహజ వాయువుపై మాత్రం 10 శాతం వడ్డింపుతో సరి పెట్టారు. ఇది అమెరికాకూ, దాని అతి పెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాలు మూడింటికీ మధ్య వాణిజ్య యుద్ధాల శకానికి శ్రీకారం చుట్టింది. చైనాను పక్కనబెట్టినా, సాక్షాత్తూ పొరుగుదేశాలపైనే ట్రంప్ ఇలా ఆర్థికంగా కత్తి దూయడం విడ్డూరమే. అదేమంటే... పెరుగుతున్న నేరాలనూ, డ్రగ్స్ సరఫరానూ అడ్డుకోవడానికే ఈ చర్య అంటూ సమర్థించుకోవడం మరీ విచిత్రం. ఈ సంచలనాత్మక చర్యకు ప్రతిచర్యగా మెక్సికో సైతం ఎదురు సుంకాలు వేయగా, త్వరలో జాతీయ ఎన్నికలున్న కెనడా కూడా అమెరికాకు దీటుగా 25 శాతం సుంకాల వడ్డింపుతో ఎదురుదాడికి దిగింది. అమెరికా తప్పుడు విధానాలపై ప్రపంచ వాణిజ్య సంస్థలో కేసు వేయనున్నట్టు చైనా ప్రకటించింది. కడపటి వార్తలు అందుతున్న సమయానికి అమెరికా – మెక్సికోల మధ్య మాత్రం సయోధ్య కుదురుతోందనీ, ఆ దేశంపై సుంకాలను అమెరికా నెల రోజులు వాయిదా వేసిందనీ సమాచారం. ఆ మాట ఏమైనా, విశ్వవేదికపై ట్రంప్ ఆరంభించిన వాణిజ్య పోరు రసకందాయంలో పడింది. ఇప్పటికే పరాయి దేశాలకు 36 లక్షల కోట్ల డాలర్ల మేర అప్పులున్న అగ్రరాజ్యం వాటి నుంచి బయటపడేందుకు సుంకాలు పెంచినట్టనిపిస్తున్నా, ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు స్వయంకృత గాయమే. పెరిగిన సుంకాలతో అమెరికాకు సరఫరా తగ్గి, సరుకుల ధరలు పెరిగి, సామాన్యులపై భారం పడుతుంది. ఈ సుంకాల వల్ల ఈ ఏడాది అమెరికాలో ద్రవ్యోల్బణం ఇప్పు డున్న 2.9 శాతం నుంచి మరో అర శాతం దాకా పెరుగుతుందట. ఇక, స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 1.5 శాతం మేర పడిపోతుందని విశ్లేషణ. సగటు అమెరికన్ కుటుంబంపై ఏటా వెయ్యి నుంచి 1200 డాలర్ల మేర భారం పడుతుందని లెక్క. మొత్తం మీద అక్రమ వలసలు, ఫెంటానిల్ తరహా మందుల లాంటి ప్రధాన సమస్యలపై ట్రంప్ దృష్టి పెట్టడం బానే ఉన్నా, దిగుమతి సుంకాలు పెంచడమనే తప్పుడు విధానం వల్ల అమెరికన్లకే నష్టమనే భావన ఉంది. సరుకుల ధరలు తగ్గిస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన ట్రంప్ తీరా అందుకు వ్యతిరిక్తంగా వ్యవహరిస్తున్నా రని ప్రతిపక్ష డెమోక్రాట్లు ధ్వజమెత్తుతున్నారు. గత ట్రంప్ హయాంలోని చైనాతో వాణిజ్య యుద్ధాన్నే తమ పాలనలో కొనసాగించిన డెమోక్రాట్లు ఇప్పుడు భిన్న వైఖరి తీసుకుంటారేమో చూడాలి. ప్రధాన ఆర్థిక వ్యవస్థలపై ఇంతగా సుంకాల విధింపు ఆలోచనను దశాబ్దం క్రితం చేస్తే దాన్ని వెర్రిమొర్రి ఆలోచనగా చూసేవారు. కానీ, ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఆ పనే చేసింది. మెక్సికో, కెనడా, చైనాలతో ఇది ఆగుతుందా, లేక రానున్న రోజుల్లో యూరోపియన్ యూనియన్, భారత్ సహా ఇతర దేశాలపైనా ట్రంప్ ఈ అస్త్రం ప్రయోగిస్తారేమో చూడాలి. నిజానికి, వలసలను ఆపి, అధిక దిగుమతులకు ముకుతాడు వేయాలంటే, తగినంత సమయం వెచ్చించి, విధానపరమైన అంశాలపై లోతుగా దృష్టి పెట్టాలి. వలసజీవుల్ని పెద్దయెత్తున వెనక్కి పంపడంతో అమెరికాలో చౌకగా దొరికే శ్రామికులు తగ్గి, వేతనాలు పెరిగి, ద్రవ్యోల్బణం హెచ్చుతుంది. కానీ, ఎవరు చెప్పినా ఒక పట్టాన వినే ఘటం కాని ట్రంప్ సమస్త వాణిజ్య, ఆర్థికేతర సమస్యలకూ ఈ సుంకాల విధింపే సర్వరోగ నివారిణి అని భావిస్తున్నారు. చమురు మొదలు సరుకుల దాకా ఏవీ పొరుగుదేశాల నుంచి అమెరికాకు అక్కర్లేదని హూంకరిస్తున్నారు కానీ, దిగుమతులేవీ చేసుకోకుండా, సమస్తం స్వదేశంలోనే సిద్ధం చేసుకొని, ఎవరితోనూ ఏ వాణిజ్య సంబంధాలూ అవసరం లేని బంధిత ఆర్థిక వ్యవస్థగా అమెరికాను తీర్చిదిద్దడం సాధ్యమేనా? దేశాల ద్వారాలన్నీ తెరుచుకొని, ప్రపంచమొక కుగ్రామంగా మారిన వర్తమాన కాలంలో ఈ రకమైన విధానంతో మనగలగడం అగ్రరాజ్యానికైనా సరే కుదురుతుందా?ట్రంప్ తాజా చర్యతో ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి, గందరగోళం నెలకొన్నాయి. ప్రపంచమంతటా దీని ప్రకంపనలూ తప్పవు. భారత్ అనేక విడిభాగాల కోసం దిగుమతులపై ఆధారపడినందున మన వస్తూత్పత్తి రంగం పైన, అలాగే డాలర్ బలపడి, విదేశీ మదుపరులు విక్రయాల్ని కొనసాగించడంతో మార్కెట్ పైన ప్రభావం కనిపించనుంది. అలాగే, అమెరికా భారీ సుంకాల బారిన పడ్డ ఆర్థిక వ్యవస్థలు ఇక తమ వస్తువుల్ని ఇతర దేశాల్లో కుమ్మరించాలి గనక భారత పరిశ్రమలకు బెత్తం చూపే ప్రమాదం ఉంది. కాబట్టి, ఇప్పటికైతే సుంకాల విధింపు జాబితాలో మన పేరు లేకున్నా భారత్ తగిన జాగరూకతతో వ్యవహరించాలి. ఈ నెలలోనే అమెరికాలో పర్యటించ నున్న భారత ప్రధాని ఇరుదేశాల బలమైన బంధాన్ని మనకు సానుకూలంగా మలుచుకోవాలి. అయితే, ఒకటి మాత్రం నిజం. కోర్టులు బరిలోకి దిగి, ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధమని తీర్మానిస్తే తప్ప... ప్రజాభిమతంతో గద్దెనెక్కిన ట్రంప్ ఆలోచనలకూ, అనుసరించే విధానాలకూ అడ్డులేదు. కనుక ట్రంప్ మార్కు వ్యవహారశైలికి ఇవాళ్టికి ఇవాళ బ్రేకులు పడవు. అదేసమయంలో దిగుమతి సుంకాల వల్ల అమెరికా సంపద్వంతమై, బలోపేతమవుతుందన్న ఆయన ఆలోచన మాత్రం ఆచరణలో వాస్తవరూపు దాల్చడమూ కష్టమే! -
దేవభూమి
గతేడాది డిసెంబర్ 25న మరణించిన మలయాళ మహారచయిత ఎమ్.టి.వాసుదేవన్ నాయర్ తన సాహిత్య జీవితంలో తనను బాగా కదిలించిన ఒక అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన 1976లో తీవ్రమైన అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో ఉన్నారు. అప్పుడో పల్లెటూరతను వచ్చి, ఆయనంటే అభిమానమని చెప్పడమే కాదు, ‘మీరు జబ్బుతో ఉన్నారని తెలిసి సేవ చేయడానికి వచ్చాను. కొన్ని పనులు మగ నర్సులే చేయాల్సి ఉంటుంది. మీకు నయమయే దాకా ఆ పనులు చేస్తాను’ అన్నాడట. మనిషి మానసిక ఘర్షణల మీద ఎక్కువ దృష్టి పెట్టిన ఎమ్టీ విస్తారంగా రాశారు. కథలు, నవలలు, యాత్రా రచనలు, బాల సాహిత్యం, విమర్శతో పాటు సినిమాలకు స్క్రీన్ ప్లే రచనలు చేయడమే కాకుండా, అత్యుత్తమ చిత్రాలు అనదగ్గవాటికి దర్శకత్వమూ వహించారు. కేరళ సంస్కృతి మీద ఆయన ప్రభావం ఎనలేనిది. ఆ పల్లెటూరి మనిషి ఎమ్టీ రచనలు చదవడమే కాదు, ఆయన కోసం తన వ్యవసాయ పనులను ఆపుకొని మరీ వచ్చాడు. ఏ రచయితకైనా తన రచనా ప్రయాణంలోని కష్టాల బరువు దిగిపోయే ఘట్టమిది. సహజంగానే ఆ స్పందనకు వాసుదేవన్ నాయర్ కళ్లు చెమ్మగిల్లాయి. ఇది ఒక గొప్ప రచయితగా వాసుదేవన్ నాయర్కు జరిగిన ఒక విడి అనుభవమే కావొచ్చు; కానీ మలయాళీయుల సాహిత్య సంపన్నతకు అది గుర్తు. పామరులను కూడా సాహిత్యం ఎలా పెనవేసుకుపోయిందో చెప్పడానికి నిదర్శనం. ఎందుకంటే, ఇదే వాసుదేవన్ నాయర్ మరో సందర్భంలో ఒక గ్రామీణుడు ఆయన దగ్గర ఉచితంగా పుస్తకం తీసుకోవడానికి నిరాకరించి, అతడి దగ్గరున్న ముడుతలు పడిన నోట్లు బలవంతంగా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ నేల అలాంటిది. దోస్తోవ్స్కీ లాంటి రష్యన్ రచయిత మీద కూడా ఒక సాధారణ ఆటోడ్రైవర్ తనదైన అభిప్రాయాన్ని కలిగివుంటాడని మురిసిపోయే మలయాళీ సాహిత్యజీవులు ఎందరో! ‘స్వర్గాన్ని నేను ఎప్పుడూ ఒక రకమైన గ్రంథాలయంలా ఊహిస్తాను,’ అంటారు అర్జెంటీనా రచయిత జార్జ్ లూయీ బోర్హెస్. పుస్తకాలను మించిన పెన్నిధి ఏముంది! గ్రంథాలయం అనేది ఒక ఆశ. ఒక దారిదీపం. ఎమ్టీ సహా చాలామంది రచయితలు తాము రచయితలు కావడానికి ఒక కారణంగా ‘ఎక్కువ సమయం లైబ్రరీలో గడపడం’ అని చెబుతారు. అత్యంత ప్రకృతి రమణీయత వల్ల కాబోలు కేరళను దేవభూమి అని పిలుస్తుంటారు. కానీ అక్కడి గ్రంథాలయాల వల్ల కూడా అది దేవభూమి అవుతోంది. రాష్ట్రంలో ఎనిమిది వేలకు పైగా లైబ్రరీలు ఉండటమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ముప్పైకి పైగా పెద్ద సాహిత్య ఉత్సవాలు జరుగుతుంటాయి. దేశంలో ప్రతి పంచాయితీలో దాదాపు ఎనిమిది గ్రంథాలయాలున్న ఏకైక రాష్ట్రం కేరళ. దేశంలో అత్యధిక పబ్లిక్ లైబ్రరీలున్న రాష్ట్రం మహారాష్ట్ర (12,191). తర్వాతి స్థానంలో ఉన్న కేరళ (8,415)తో పోల్చితే మహారాష్ట్ర విస్తీర్ణం సుమారు ఎనిమిదింతలని గ్రహిస్తే కేరళ గొప్పదనం అర్థమవుతుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడిగా కూడా కేరళ సంఖ్యలో నాలుగో వంతైనా లేవు. అక్కడి గిరిజన గ్రామాల్లోనూ కొత్తగా 630 గ్రంథాలయాలను ఏర్పాటుచేయాలని గతేడాది నిర్ణయించారు. కేరళ గ్రంథాలయోద్యమ పితామహుడు పీ.ఎం.పణిక్కర్ వర్ధంతి అయిన జూన్ 19ని అక్కడ ‘రీడింగ్ డే’గా జరుపుతుంటారు. చదవడాన్నీ, చదివే వాతావరణాన్నీ మలయాళీయులు ఎంతగా ప్రోత్సహిస్తున్నారనడానికి ఇది రుజువు. ఈమధ్య ‘కేరళ లెజిస్లేచర్ ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్–2025’ ప్రారంభిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, ‘ప్రపంచ పుస్తక రాజధాని’గా తిరువనంతపురంను ‘యునెస్కో’ గుర్తించాలని కోరింది అందుకే. తమ రాజధాని నగరం ఆ గౌరవానికి పూర్తిగా అర్హమైనదేనని ఆయన ధీమా!గతేడాదే ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో కేరళలోని మరో నగరమైన కోళిక్కోడ్ను ‘సాహిత్య నగరం’గా గుర్తించిన సంగతి ఇక్కడ గుర్తుచేసుకోవాలి. భారత్లో యునెస్కో గౌరవం దక్కించుకున్న తొలి నగరం ఇదే. ఒక్క కోళిక్కోడ్లోనే 600 గ్రంథాలయాలు, రీడింగ్ రూములు ఉన్నాయి. వాసుదేవన్ నాయర్, వైకోం మహమ్మద్ బషీర్, పి.వత్సల లాంటి ఎందరో రచయితలకు కోళిక్కోడ్తో అనుబంధం ఉంది. యునెస్కో మొదలైన 1945లోనే కేరళలో ‘సాహిత్య ప్రవర్ధక సహకార సంఘం’ ఏర్పాటుకావడం ఆ రాష్ట్ర ఘన సాహిత్య వారసత్వాన్ని గుర్తుచేస్తోంది. పుస్తకాల ప్రచురణ కోసం కొంతమంది రచయితలు కలిసి ఏర్పాటుచేసిన ఈ సంఘం సుమారు 8,400 పుస్తకాలను ప్రచురించింది. మలయాళ సినిమా అంతగా వర్ధిల్లుతుండటానికి కూడా ఈ సాహిత్య దన్నే కారణం. అందుకే ప్రముఖ సినీ జర్నలిస్ట్ అనుపమా చోప్రా నవతరం మలయాళ దర్శకులను ఇంటర్వ్యూ చేస్తూ, ‘అసలు మీరు ఏంచదువుతారు? ఏం చూస్తారు?’ అని ప్రశ్నించారు.పుస్తక ప్రేమికులుగా వ్యక్తులు ఉండటం దానికదే విశేషమే. కానీ వ్యవస్థలు పుస్తకాన్ని ప్రేమిస్తే దాని ప్రభావం వేరే ఉంటుంది. ‘పర్వతము ఎంత ఎత్తయి గగన భేద్యమయినా దాని విశాలమైన వక్షస్థలము నుండి చిన్న సెలయేరుగాని ప్రవహించకపోతే ఆ ప్రకృతి సౌందర్యం అసమగ్రంగా ఒంటరిగా శుష్కంగా గోచరిస్తుంది, ’ అంటారు తన ‘జీవనలీల’ పుస్తకంలో కాకాసాహెబ్ కాలేల్కర్. ఒక ఇల్లు ఎంత ఘనంగా నిర్మించినా దానిముందు ఒక పూలచెట్టో, ఒక ఊరు ఎంత పెద్దదయినా దాని మధ్యన ఒక గ్రంథాలయమో లేకపోతే అవి అసంపూర్ణం అవుతాయి. పువ్వులు (ప్రకృతి), పుస్తకాలు (వివేకం) ఉన్న ప్రతిచోటూ దేవభూమే! -
శతప్రయోగ విజయసీమ
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని చేరుకుంది. బుధవారం ఉదయం జరిపిన నూరవ రాకెట్ ప్రయోగంతో చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్)లో రెండో లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి ఎగసిన భూ సమకాలిక ఉపగ్రహ ప్రయోగవాహక నౌక (జీఎస్ఎల్వీ–ఎఫ్15) ఎన్వీఎస్–02 ఉపగ్రహాన్ని విజయ వంతంగా నిర్ణీత కక్ష్య అయిన జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ – జీటీఓలోకి చేర్చింది. ఈ కొత్త ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం నిర్విఘ్నంగా సాగడం శాస్త్రవేత్తల్లో ఆనందం పెంచింది. రోదసిలో చేరిన ఈ తాజా శాటిలైట్తో మన ‘నావిక్’ (నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్)లో విధులు నిర్వహిస్తున్న ఉపగ్రహాల సంఖ్య 4 నుంచి 5కు పెరిగింది. దీని వల్ల మన దేశంతో పాటు మన పొరుగు దేశాలకూ మొబైల్ ఫోన్లలో జీపీఎస్ సహా అనేక సేవల్లో కచ్చితత్వం పెరగనుంది. ఇతర దేశాలన్నీ అమెరికా తాలూకు జీపీఎస్పై ఆధారపడితే, భారత్ ఉపగ్రహ ఆధారిత నావిగేషన్లో సొంత కాళ్ళపై నిలబడేందుకు చేస్తున్న ఈ కృషి సగటు భారతీయుడి ఛాతీ ఉప్పొంగే క్షణం. సైకిళ్ళు, ఎడ్లబండ్లపై రాకెట్ విడిభాగాలను తరలించిన కాలం నుంచి ఇటీవలే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానించే (డాకింగ్ చేసే) స్థాయికి ఇస్రో చేరడం చిరకాలం చెప్పుకోవా ల్సిన స్ఫూర్తిగాథ. విక్రమ్ సారాభాయ్, సతీశ్ ధవన్ లాంటి దిగ్గజాల తొలి అడుగులతో ఆరంభించి, ఆపైన కలామ్ లాంటి వారి మేధను వినియోగించుకొని అయిదు దశాబ్దాల పైగా సాగించిన ప్రస్థానం చిరస్మరణీయం. 1962లో అణుశక్తి విభాగం కింద ఏర్పాటైన ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రిసెర్చ్ ద్వారా ఇస్రోకు బీజం పడింది. చంద్రుడి మీదకు అమెరికా మానవుణ్ణి పంపిన 1969లోనే ఇప్పుడు మనం చూస్తున్న ఇస్రో స్థాపన జరిగింది. 1972లో ప్రత్యేకంగా అంతరిక్ష శాఖ ఏర్పాటైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మన అంతరిక్ష పరిశోధనా సంస్థ అనేక రాకెట్లకు పురుడు పోయడమే కాక, ఇతర దేశాల ఉపగ్రహ ప్రయోగాలలోనూ విశ్వసనీయ భాగస్వామిగా ఎదిగింది. మన ఇస్రో 1979 ఆగస్ట్ 10న తొలిసారిగా ఉపగ్రహ ప్రయోగ నౌక (ఎస్ఎల్వీ–3 ఈ10) ద్వారా ప్రయోగాత్మకంగా రోహిణీ టెక్నాలజీ పేలోడ్ను నింగిలోకి పంపిన క్షణాలు ఆ తరంలో చాలామందికి ఇప్పటికీ గుర్తే. అప్పట్లో ఇస్రోతో పనిచేస్తున్న అబ్దుల్ కలామే ఆ ప్రయోగానికి డైరెక్టర్. సదరు ప్రయోగం పాక్షికంగానే విజయం సాధించింది కానీ, ఆ తర్వాత కాలగతిలో అంతరిక్ష ప్రయోగాల్లో మనం అగ్రరాజ్యాలకు దీటుగా ఆరితేరాం. అంకెల్లో చెప్పాలంటే, ఇప్పటి వరకు ఇస్రో 548 ఉప గ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దాదాపు 120 టన్నుల పేలోడ్ను నింగిలోకి పంపింది. అందులో 433 విదేశీ ఉపగ్రహాలకు చెందిన 23 టన్నులూ ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో షార్ కేంద్రం ఎన్నో చరిత్రాత్మక ఘట్టాలకు వేదికైంది. మూడు చంద్రయాన్లు, ఒక మార్స్ ఆర్బిటర్ ప్రయోగం, ఆదిత్య ఎల్1 ప్రయోగం లాంటివి గణనీయమైనవి. కక్ష్యలో పరిభ్రమించే వ్యోమనౌకను భూవాతావరణంలోకి ప్రవేశింపజేసి... భూమి పైకి క్షేమంగా తెచ్చి రికవరీ చేసే ‘స్పేస్ క్యాప్సూల్ రికవరీ ప్రయోగం’ (ఎస్ఆర్ఈ), అలాగే ఒకే రాకెట్తో 104 శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం వగైరా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి. ఇస్రో ప్రయోగించినవాటిల్లో కమ్యూనికేషన్ శాటిలైట్లు, భూ పరిశీలన ఉపగ్రహాలు, మార్గనిర్దేశక (నావిగేషనల్), ప్రయోగాత్మక శాటిలైట్లు అనేకం. ఆ వివరాలు సగర్వంగా తోస్తాయి. రానున్న రోజుల్లోనూ మరిన్ని చారిత్రక ఘట్టాలకు ఇస్రో చోదకశక్తి కానుంది. గగన్యాన్లో భాగంగా మానవరహిత జి1 ప్రయోగం తొలిసారి చేయనున్నారు. అలాగే, నెక్స్›్ట జనరేషన్ లాంచ్ వెహికల్ (ఎన్జీఎల్వీ), చంద్రయాన్, శుక్రయాన్ జరగనున్నాయి. ప్రైవేట్ ఉపగ్రహ ప్రయోగాలకు సైతం వేదికగా నిలిచి, అంతరిక్ష వాణిజ్యంలో తగిన వాటా కోసం ప్రయత్నిస్తున్న ఇస్రో మరో రెండేళ్ళలో శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్ను నిర్మించనుండడం విశేషం. అలాగే, తమిళనాడులోని కులశేఖరపట్నంలో రెండో ఉపగ్రహ ప్రయోగ కాంప్లెక్స్ సైతం సిద్ధమవుతోంది. భారీ పేలోడ్ లను రోదసిలోకి తీసుకెళ్ళగలిగే ఎన్జీఎల్వీల రూపకల్పనకూ, మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణానికీ దాదాపు రూ. 4 వేల కోట్లు ఖర్చవుతుంది. అంత మొత్తం వెచ్చించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం విశేషం. భారత అంతరిక్ష పరిశోధన, ప్రయోగ రంగానికి ఇది పెద్ద ఊతం. ఇవన్నీ ప్రైవేట్ రంగ రోదసీ ప్రయోగాల్లో ఇస్రో సింహభాగం దక్కించుకోవడానికి ఉపకరిస్తాయి. ఒకప్పుడు అగ్రరాజ్యాలు సాంకేతిక విజ్ఞానాన్ని అందించడానికి నిరాకరించినప్పుడు స్వశక్తితో దేశీయంగా బుడిబుడి అడుగులతో మొదలుపెట్టిన భారత్ దాదాపు అయిదు పదుల ఏళ్ళలో శత రోదసీ ప్రయోగాలు సాగించింది. రానున్న అయిదేళ్ళలోనే రెండో శతం పూర్తి చేసి, మొత్తం 200 ప్రయోగాల మైలురాయికి చేరుకోవడానికి ఉరకలు వేస్తోంది. ఇన్నేళ్ళుగా మన అంతరిక్ష పరిశోధ కులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు చూపుతున్న అచంచలమైన నిబద్ధత, అంకితభావానికి మచ్చుతునక ఈ ఇస్రో విజయగీతిక. విశ్వవేదికపై అగ్రరాజ్యాల సరసన అంతరిక్షంలో భారత్ సూపర్ పవర్గా ఎదిగిందనడానికీ ఇది ప్రతీక. అనేక ఆర్థిక, సాంకేతిక పరిమితులు ఉన్నప్పటికీ సృజనాత్మకంగా ఆలోచించి, పరిస్థితులకు తగ్గట్లు మనల్ని మనం మలుచుకొంటే గణనీయ విజయాలు సాధ్యమే అనడానికి ఇదే తిరుగులేని రుజువు. 1975లో తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగం నుంచి ఆ మధ్య మంగళ్యాన్ వరకు ప్రతిసారీ తక్కువ ఖర్చుతో, అంచనాలకు అందని విజయాలు సాధించిన మన శాస్త్రవేత్తల ఘనతకు భవిష్యత్తులోనూ ఆకాశమే హద్దు. -
బలమైన బంధం దిశగా..!
భౌగోళికంగానే కాదు... సంస్కృతి, నాగరికతల్లోనూ శతాబ్దాలుగా సన్నిహితమైన రెండు దేశాల మధ్య సహకారం సహజం. ఉమ్మడి ప్రయోజనాలూ అనేకం. ప్రయాణ, వాణిజ్యాలు చిరకాలంగా ఉన్నా, ఇప్పటి దాకా ఆ అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంలో వెనుకబడ్డ భారత, ఇండొనేసియాలు దాన్ని చక్కదిద్దుకొనే పనిలో పడ్డాయి. ఇండొనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో 4 రోజులు భారత్లో పర్యటించి, భారత 76వ గణతంత్ర దినోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడం బలమైన బంధానికి పునరంకితమయ్యే వీలు కల్పించింది. అన్నీ సాకల్యంగా చర్చించు కొనే విలువైన అవకాశం వచ్చింది. మొత్తం 55 పేరాల తాజా ఉమ్మడి ప్రకటనలో ఇరుపక్షాలూ విస్తృత ద్వైపాక్షిక, అంతర్జాతీయ సహకారంపై ఏకస్వరంతో మాట్లాడడం అందుకు నిదర్శనం. భౌగోళికంగా, చారిత్రకంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా భారత్తో ఇండొనేసియా అను బంధం బలమైనది. చిత్రమేమిటంటే చిరకాలంగా బలమైన బంధమున్నా అది భారీ స్థాయిలో ప్రతి ఫలించినట్లు కనిపించదు. అగ్రరాజ్యాల అధికార రాజకీయాలకు వ్యతిరేకతతో, అలీనోద్యమంతో ఆది నుంచి ముడిపడిన ఈ ఉభయ దేశాలూ వలస పాలనానంతర ఆసియా ఖండంలో ద్వైపాక్షికంగానూ, నాయకత్వంలోనూ కలసి అడుగేయాల్సింది. అయితే, ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ఢిల్లీ, జకార్తాలు దూరం జరిగాయి. ఈ నేపథ్యంలో ఇండొనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో తాజా ఢిల్లీ పర్యటన ఆశావహ పరిణామం. ఉభయదేశాల మధ్య అనుబంధానికి అవసరమైన వ్యూహాత్మక ప్రేరణను ఈ పర్యటన అందించింది. భారత గణతంత్ర దినోత్సవ కవాతుకు ముఖ్య అతిథిగా ఇండొనేసియా అధ్యక్షులు హాజరవడం ఇది నాలుగోసారి. భారత్ తొలిసారి జరుపుకొన్న రిపబ్లిక్ డే వేడుకలకు 1950లో సైతం ఇండొనేసియా అధ్యక్షుడే (సుకర్ణో) ముఖ్య అతిథి. ఆపైన సుసిలో బమ్బాగ్ యుధొయోనో (2011), జోకో విడోడో (2018), ఇప్పుడు సుబియాంటో! గమనిస్తే, ఆగ్నేయాసియా దేశాలతో బలమైన స్నేహం 1990ల నుంచి భారత ప్రయత్నం.అందులో భాగంగా జకార్తా, ఢిల్లీల మధ్య దూరం క్రమంగా తగ్గసాగింది. చైనా వ్యూహాత్మక ప్రాబల్యానికి పగ్గం వేసేలా ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలను పెంపొందించుకోవాలని భారత్ ‘ప్రాచ్యానికి ప్రాధాన్య విధానం’ (యాక్ట్ ఈస్ట్ పాలసీ) చేపట్టింది. ఇండో – పసిఫిక్ ప్రాంతం కీలకమని గుర్తించింది. అయినా, ఇరు దేశాల భాగస్వామ్యం ఉండాల్సినంత లేదు. సుమత్రా, జావా... ఇలా 17 వేలకు పైగా ద్వీపాలతో కూడిన ఇండొనేసియా 28 కోట్లకు పైగా ప్రజలతో జనసంఖ్యలో ప్రపంచంలో నాలుగోది. దాదాపు 1.4 లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థతో వచ్చే 2030 నాటి కల్లా ప్రపంచంలోని 10 అగ్రశ్రేణి ఎకానమీల్లో ఒకటిగా నిలవడానికి ఉరకలు వేస్తోంది. ఈ దేశ వేలాది ద్వీపాలు హిందూ, పసిఫిక్ మహా సముద్రాల మధ్య వారధుల లాంటివి. ఇండొనేసియా సముద్ర జలాలు భారత్ సహా ఈ ప్రాంతంలో పలు దేశాల ప్రపంచ వాణిజ్యానికి ఆయువుపట్టు. సహజ వనరులు పుష్కలంగా ఉండే ఈ అతి పెద్ద ద్వీపసమూహ దేశంతో బంధం భారత ఆర్థికప్రగతికి కీలకమనీ, బంధాన్ని బలోపేతం చేసుకోవాలంటున్నది అందుకే!అధ్యక్షుడి తాజా పర్యటనలో ఆరోగ్యం, సాంప్రదాయిక వైద్యం, సముద్రయాన భద్రత, డిజిటల్ అభివృద్ధి, సాంస్కృతిక సహకారంపై 5 అవగాహనా ఒప్పందాలు (ఎంఓయూలు) కుది రాయి. అలాగే, రక్షణ సహకారాన్ని పటిష్ఠం చేసుకోవాలన్న మాట ఉమ్మడి ప్రకటనలోనూ ప్రస్తావించారు. అయితే, భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను ఇండొనేసియా కొననున్నదంటూ పర్యట నకు ముందు వార్తలు గుప్పుమన్నా, ఆ రకమైన ఒప్పందమేదీ జరగలేదు. ఇండో– పసిఫిక్లో అమెరికా– చైనా శత్రుత్వం, దక్షిణ– తూర్పు చైనా సముద్రాల్లో చైనా బిగిస్తున్న పట్టు లాంటి సున్నిత అంశాలు, వాటి భౌగోళిక రాజకీయ ప్రభావాలు చర్చకు వచ్చిందీ, లేనిదీ తెలియలేదు. ఆర్థికాభివృద్ధిలోనూ ఇరుపక్షాలూ చేయాల్సింది చాలా ఉంది. ప్రస్తుతం 3 వేల కోట్ల డాలర్లే ఉన్న రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని ద్విగుణం, బహుళం చేయాలి. రెంటి మధ్య రాకపోకలు, ఆదానప్రదానాల పెంపుదల, పారిశ్రామిక భాగస్వామ్యాలను పెంచుకోవాలి. అధ్యక్షుడి వెంట దాదాపు 100 మంది సభ్యుల వ్యాపార బృందం వచ్చినందున ఆ రంగంలో పురోగతి కనిపిస్తుందని ఆశించవచ్చు. ఇండో–పసిఫిక్ ప్రపంచ వివాదానికి కేంద్రమవుతున్న వర్తమాన పరిస్థితుల్లో ద్వైపాక్షిక,ప్రాంతీయ సహకారానికి ఉభయ దేశాలూ నడుంకట్టాలి. గత అక్టోబర్లో ఇండొనేసియా అధ్యక్షు డిగా పదవీ బాధ్యతలు చేపట్టి, ప్రస్తుతం ఆ దేశంలో అమితమైన ప్రాచుర్యం ఉన్న సుబియాంటో గద్దెనెక్కిన కొద్దికాలానికే భారత్లో పర్యటించడం ద్వైపాక్షిక సంబంధాలకు ఉత్ప్రేరకమే. ఇరు దేశాలు సన్నిహిత మిత్రులుగా, భాగస్వాములుగా కొనసాగాలని ఆయన అభిలషించడం గమనార్హం. ‘ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య’కు మూలస్తంభమైన ఇండొనేసియా ప్రాంతీయ ఆర్థిక సమన్వయానికి, రాజకీయ, భద్రతా అంశాలకూ ముఖ్యమైనది. ఆ సంగతి భారత్ గమనంలో ఉంచుకోవాలి. బీజింగ్ కళ్ళతో, భౌగోళిక రాజకీయాల కోణం నుంచే జకార్తాతో బంధాన్ని చూడరాదు. ఇండొనేసియా సైతం ఆది నుంచీ అగ్ర దేశాలతో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆ సంగతి గుర్తించి, ఆ దేశంతో ద్వైపాక్షిక సహకారం వెల్లివిరిసేలా భారత్ కృషి చేయాలి. ఆసియాలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనేలా చూడాలి. పర్యటనతో రాజకీయ నాయకత్వం చొరవ చూపినందున ఇప్పుడిక అధికార యంత్రాంగం, దౌత్యవేత్తలు, పారిశ్రామిక భాగస్వాములు ఆచరణలో ముందుకు తీసుకుపోవాలి. -
ఇంగితం సంగతేంటి?
ఇంగితజ్ఞానం ఇంగితజ్ఞానమే, చదువులు చదువులే! చదువు పరమావధి జ్ఞానమే అయినా, చదువుకున్న వారందరూ జ్ఞానులు కాలేరు. అత్యంత దురదృష్టకరమైన విషయమేమిటంటే, చదువు కున్న వారిలో కొందరు కనీసం ఇంగితజ్ఞానులు కూడా కాలేరు. విపరీతంగా చదువుకుని, బహు పట్టభద్రులై, పాఠాలు బోధించే స్థాయిలో ఉన్నా, ఇలాంటివారు ఎప్పటికప్పుడు తమ ఇంగితజ్ఞాన రాహిత్యాన్ని బయటపెట్టుకుంటూ జనాలను విభ్రాంతికి గురిచేస్తుంటారు. ‘విద్యలేనివాడు వింత పశువు’ అంటూ నిరక్షరాస్యులను ఎద్దేవా చేసే పెద్దలు – అతి విద్యావంతులైన ఇంగితజ్ఞాన రహితులను ఏమంటారో!‘చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా/ చదువు నిరర్థకమ్ము గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్/ బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం/ పొదవెడు నుప్పు లేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!’ అని శతకకారుడు వాపోయాడు. రసజ్ఞత లేని చదువును ఉప్పులేని కూరతో పోల్చాడు. బహుశా, ఎంత చదువు చదువుకున్నా, కాస్తంతైనా ఇంగితజ్ఞానం లేనివారు ఆయనకు తారసపడి ఉండరు. అలాంటి అతి చదువరులే తారసడితే ఆయన ఇంకెంతలా వాపోయేవాడో! ఈ రోజుల్లో చదువుకున్న వాళ్లలో రసజ్ఞత సంగతి దేవుడెరుగు, ఇంగితజ్ఞానం కూడా కొరవడు తోందంటే, మన చదువులు ఎలా అఘోరిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అసలు మన చదువులు ఇలా ఎందుకు అఘోరిస్తున్నాయో, అందుకు గల కారణాలను అన్వేషించే వాళ్లు బహు అరుదు. ‘చాలామందికి, పిల్లల్ని చదువంటే బెదరగొట్టడం చాతనయినంత బాగా వాళ్లకి చదువు మీద ఇష్టం కలిగించడం చాతకాదు’ అంటారు కొడవటిగంటి కుటుంబరావు. ‘చదువు’ నవలలో ఆయన వెలి బుచ్చిన అభిప్రాయం ఇది. బెదరగొట్టి మరీ పిల్లలకు చదువు చెప్పే బడిపంతుళ్ల ధోరణి కూడా చదువుకున్న వాళ్లలో ఇంగితజ్ఞాన లోపానికి ఒక కీలక కారణం. బెదరగొట్టి పిల్లలకు చదువు చెప్పే దండోపాయ నిపుణులు పురాణకాలం నుంచే ఉన్నారు. ప్రహ్లాదుడికి చదువు చెప్పిన చండా మార్కుల వారసత్వాన్ని కొందరు నేటికీ కొనసాగిస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో చండా మార్కుల వారసులకే గిరాకీ ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి గురువులు పిల్లల బుర్రల్లోకి పాఠాల నైతే ఎక్కించగలరేమో గాని, చిటికెడు ఇంగితజ్ఞానాన్ని మాత్రం అలవరచలేరు. ‘ఇంగితజ్ఞానం మరీ అంత సర్వసాధారణమైనది కాదు’ అంటాడు ఫ్రెంచ్ తత్త్వవేత్త వోల్టేర్. ఇంగితజ్ఞానాన్ని ఇంగ్లిష్లో ‘కామన్సెన్స్’ అంటారు. అలాగని, ఇది మనుషులందరికీ ఉండే లక్షణ మని అనుకుంటే పొరపాటే! ‘మనుషులందరిలోనూ ఇంగితజ్ఞానం ఉందనే నమ్మకంతో కొన్నిసార్లు మనం ప్రమాదంలో పడుతుంటాం’ అన్నాడు ఐరిష్ సంగీతకారుడు హోజీర్.ఒకప్పుడు సమాజంలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు అక్షరాస్యులు బాగా పెరిగారు. అక్షరాస్యత పెరిగితే, జనాల్లో బుద్ధి జ్ఞానాలు, తెలివితేటలు పెరగడం సర్వసహజ పరిణా మమనేది ఒక అమాయకపు అంచనా. సమాజంలో అక్షరాస్యత పెరిగింది, నిజమే! తత్ఫలితంగా మూర్ఖత్వం తగ్గిందనుకుంటే పారపాటే! ‘చదవేస్తే ఉన్న మతి పోయింద’నే నానుడి ఉంది. ఇప్పటి చదువులను చూస్తే, పరిస్థితి అలాగే ఉందనిపిస్తుంది. ఈ చదువులతో కొందరిలో ఇంగితజ్ఞానం లోపిస్తుంటే, ఇంకొందరిలో చావుతెలివి పెచ్చుమీరుతోంది. బొటాబొటి చదువుల సైబర్ నేరగాళ్ల చేతిలో ఉన్నత విద్యావంతులు సైతం బోల్తాపడుతున్న ఉదంతాలను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒకవైపు శాస్త్రవేత్తలు కృత్రిమ మేధతో కుస్తీలు పడుతున్న రోజులు వచ్చిపడ్డాయి గాని, మనుషుల్లో ఇంగితాన్ని పెంచే చదువులే కరవవుతున్నాయి. ‘నడవడికను చక్కబరచడానికి ఉత్త పాఠ్య పుస్తకాల చదువు చాలదు’ అని గాంధీజీ చెప్పిన మాటలను నేటి కార్పొరేట్ విద్యావ్యవస్థ పట్టించు కుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. గాంధీజీ ‘హింద్ స్వరాజ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘పాఠ్యపుస్తకాల విద్య మానవుల నైతికోన్నతికి ఇంచుకైనా సహకరించదని; చదువు వేరు, సద్గుణం వేరని స్వానుభవంతో తెలుసుకున్నాను’ అన్నారు. ఆయన దేశానికి స్వాతంత్య్రం రాకముందు చెప్పిన మాటలివి. ఇప్పటికీ మన చదువులు పూర్తిస్థాయిలో చక్కబడకపోవడం విచారకరం.చదువులు చెప్పడానికి ఎన్నో బడులు ఉన్నాయి, కళాశాలలు ఉన్నాయి, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రత్యేక నైపుణ్యాలకు సంబంధించిన ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ఉన్నాయి. పుట్టల నుంచి చీమలు పుట్టుకొచ్చినట్లు వీటి నుంచి ఏటా పట్టభద్రులు పుట్టుకొస్తున్నారు. వాళ్లలో చాలామంది సమాజంలో మేధావులుగా చలామణీ అవుతున్నారు. అంతమాత్రాన, వాళ్లంతా ఇంగితజ్ఞాన సంపన్నులనుకోవడానికి ఆస్కారం లేదు. ‘మీ డిగ్రీ ఒక కాగితం ముక్క మాత్రమే. మీ చదువేమిటో మీ ప్రవర్తనలోను, ఆలోచనా ధోరణిలోను, సౌశీల్యంలోను ప్రతిఫలిస్తుంది’ అన్నాడు అమెరికా మూడో అధ్యక్షుడు థామస్ జెఫర్సన్. ప్రవర్తనను, ఆలోచనా ధోరణిని మార్చలేని డిగ్రీలు ఉత్త కాగితం ముక్కలు మాత్రమే! ‘కొన్ని ఆలోచనలు చాలా మూర్ఖంగా ఉంటాయి. వాటిని మేధా వులు మాత్రమే నమ్ముతారు’ అని ఇంగ్లిష్ రచయిత జార్జ్ ఆర్వెల్ అన్నాడు. గోమూత్రపానంతో జ్వరాలు తగ్గుతాయని ఇటీవల ఐఐటీ–మద్రాసు డైరెక్టర్ మహాశయుడు సెలవిచ్చారు. ఆయనను బహుశా మేధావులే నమ్ముతారు కాబోలు! -
లాంగ్ లివ్ ద రిపబ్లిక్
డెబ్బయ్ ఐదు సంవత్సరాలు. కాలగమనంలో ఇదొక కీలకమైన మైలురాయి. ఆనాడు భారత ప్రజలు ప్రకటించుకున్న ప్రజా స్వామ్య రిపబ్లిక్ నేడు ఈ మజిలీకి చేరుకున్నది. ఈ ప్రయాణ మంతా సాఫీగానే జరిగిందని చెప్పలేము. ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఎటుచూస్తే అటు చీకటి ముసిరిన చేటు కాలాన్ని కూడా దాటవలసి వచ్చింది. దారి పొడుగునా ఎగుడు దిగుళ్లూ, ఎత్తుపల్లాలూ ఇబ్బందులు పెట్టాయి. అయినా మన రిపబ్లిక్ రథం వెనుదిరగలేదు. వెన్ను చూపలేదు. రాజ్యాంగ దీపం దారి చూపగా మున్ముందుకే నడిచింది.సుదీర్ఘ ప్రయాణం ఫలితంగా మన రిపబ్లిక్ ఎంతో పరిణతి సాధించి ఉండాలి. అందువల్ల ఇకముందు సాగే ప్రయాణం నల్లేరుపై బండిలా సాగుతుందని ఆశించాలి. ప్రతిష్ఠాత్మకమైన శతాబ్ది మైలురాయిని తాకేందుకు ఉరకలెత్తే ఉత్సాహంతో సాగిపోతామనే ధీమా మనకు ఏర్పడి ఉండాలి. కానీ, అటువంటి మనో నిబ్బరం నిజంగా మనకున్నదా? మన రిపబ్లిక్కు ఆయువు పట్టయిన రాజ్యాంగం ఇకముందు కూడా నిక్షేపంగా ఉండగలదనే భరోసా మనకు ఉన్నట్టేనా? రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలన్నీ ఆశించిన విధంగానే పనిచేస్తున్నాయని గుండెల మీద చేయి వేసుకొని చెప్పుకోగలమా?మన స్వాతంత్య్రం ఎందరో వీరుల త్యాగఫలం. ఆ స్వాతంత్య్రానికి సాధికార కేతనమే మన గణతంత్రం. స్వాతంత్య్ర పోరాటంలో భారత జాతీయ కాంగ్రెస్ ఒక ప్రధాన స్రవంతి మాత్రమే! ఇంకా అటువంటి స్రవంతులు చాలా ఉన్నాయి. ఆ పార్టీ పుట్టకముందు కూడా ఉన్నాయి. మహాత్మాగాంధీ ఆ పోరాటాన్ని ఫైనల్స్కు చేర్చిన టీమ్ క్యాప్టెన్ మాత్రమే. రెండొందల యేళ్లలో అటువంటి క్యాప్టెన్లు చాలామంది కనిపిస్తారు. ఈస్టిండియా కంపెనీ రోజుల్లోనే బ్రిటీషర్ల దాష్టీకంపై తిరగబడిన వీర పాండ్య కట్టబ్రహ్మన, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి పాలె గాళ్ల వీరగాథలు మనం విన్నవే.ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందుగా, ఆ తర్వాత కూడా బ్రిటీష్ పాలనపై ఎందరో గిరిజన యోధులు తిరగ బడ్డారు. బిర్సాముండా, తిల్కా మాఝీ, సిద్ధూ–కన్హూ ముర్ములు, అల్లూరి దళంలోని సభ్యులు వగైరా అటవీ హక్కుల రక్షణ కోసం, స్వేచ్ఛ కోసం ప్రాణాలు ధారపోశారు. తొలి స్వాతంత్య్ర పోరుకు నాయకత్వం వహించిన చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వేలాదిమంది ముస్లిం స్వరాజ్య యోధుల దిక్సూచి. బ్రిటీషర్ల ఆగ్రహానికి గురై బర్మాలో ప్రవాస జీవితం గడిపిన జాఫర్ కనీసం తాను చనిపోయిన తర్వాతైనా తన మాతృదేశంలో ఖననం చేయాలని పాలకులను అభ్యర్థించారు.స్వాతంత్య్ర పోరాటంలో అంతర్భాగంగా, సమాంతరంగా దేశవ్యాప్తంగా ఎన్నో రైతాంగ పోరాటాలు జరిగాయి. అందులో కొన్ని సాయుధ పోరు రూపాన్ని తీసుకున్నాయి. జమీందారీ, జాగీర్దారీ దోపిడీ పీడనకు వ్యతిరేకంగా రైతులు తిరగబడ్డారు. ఈ విధంగా భిన్నవర్గాల, విభిన్న తెగల ఆకాంక్షలు, ఆశలూ ఈ పోరాటంలో ఇమిడి ఉన్నాయి. వేరువేరు భాషలు, విభిన్నమైన సంస్కృతులు, ఆచార వ్యవహారాలతో కూడిన సువిశాల భారత దేశ ప్రజల మధ్య భిన్నత్వంలో ఏకత్వాన్ని స్వాతంత్య్రోద్యమం సాధించగలిగింది. ఆ ఉద్యమాన్ని నడిపిన జాతీయ నాయకత్వా నికి ఈ భిన్నత్వంపై అవగాహనా, గౌరవం ఉన్నాయి.స్వతంత్ర దేశంగా అవతరించడానికి కొన్ని గంటల ముందు పండిత్ నెహ్రూ దేశ ప్రజలనుద్దేశించి చేసిన ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ ప్రసంగం చరిత్రాత్మకమైనది. ఆ రోజునే ఆయన దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం అందవలసి ఉన్నదనీ, సమాన అవకాశాలు కల్పించవలసి ఉన్నదనీ స్పష్టం చేశారు. మత తత్వాన్ని, సంకుచిత మనస్తత్వాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించరాదని ఆనాడే ఆయన నొక్కిచెప్పారు. ఆ తర్వాత మూడేళ్లపాటు జరిగిన రాజ్యాంగ సభ చర్చల్లోనూ ఇదే విచారధార ప్రధాన భూమికను పోషించింది. స్వేచ్ఛ, సమా నత్వం, సౌభ్రాతృత్వం పునాదులుగా డాక్టర్ అంబేడ్కర్ నేతృత్వంలో రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది.ప్రపంచంలోని లిఖిత రాజ్యాంగాలన్నింటిలో విపుల మైనది, పటిష్ఠమైనది భారత రాజ్యాంగమే. భవిష్యత్తులో దేశం నియంతృత్వంలోకి జారిపోకుండా చెక్స్అండ్ బ్యాలెన్సెస్లతో కూడిన రాజ్యాంగ వ్యవస్థలకు రూప కల్పన చేశారు. భారత్తోపాటు అదే కాలంలో స్వాతంత్య్రం సంపాదించుకున్న అనేక దేశాలు అనంతరం స్వల్పకాలంలోనే సైనిక పాలనల్లోకి, నిరంకుశ కూపాల్లోకి దిగజారిపోయాయి. వాటన్నింటి కంటే పెద్ద దేశమైన భారత్ మాత్రం కాలపరీక్షలను తట్టుకొని ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టుకోగలిగింది.ఇందుకు మనం మన అద్భుతమైన రాజ్యాంగానికీ, దాని రూప కర్తలకూ ధన్యవాదాలు సమర్పించుకోవలసిందే! మన పాలకుడు ఎంత గొప్ప మహానుభావుడైనప్పటికీ సర్వాధికారాలను అతనికే అప్పగిస్తే చివరికి మిగిలేది విధ్వంసమేనని జాన్ స్టూవర్ట్ మిల్ చేసిన హెచ్చరికను రాజ్యాంగ సభలో డాక్టర్ అంబేడ్కర్ ప్రస్తావించారు. ఇందిరాగాంధీపై మొదలైన వ్యక్తి పూజ ‘ఇందిరే ఇండియా’ అనే స్థాయికి చేరి పోయిన తర్వాత ఏం జరిగిందనేది మనకు తెలిసిందే! మన ప్రజాస్వామ్యానికి ఎమర్జెన్సీ అనేది ఒక మచ్చగా ఎప్పటికీ మిగిలే ఉంటుంది. ఇందిర తర్వాత ఆ స్థాయిలో ప్రస్తుత నరేంద్ర మోదీ వ్యక్తి పూజ కనిపిస్తున్నది. ఒక సందర్భంలో ఆయనే స్వయంగా ‘అయామ్ ది కాన్స్టిట్యూషన్’ (నేనే రాజ్యాంగం) అని ప్రకటించుకోవడం ఈ వీరపూజ ఫలితమే! ఫ్రెంచి నియంత పధ్నాలుగో లూయీ చేసిన ‘అయామ్ ది స్టేట్’ ప్రకటనకు ఇది తీసిపోయేదేమీ కాదు.ఈ దేశంలో ప్రజాస్వామ్యం చిరకాలం వర్ధిల్లడం కోసం రాజ్యాంగ నిర్మాతలు ఏర్పాటు చేసిన కొన్ని వ్యవస్థలు బీటలు వారుతున్న సూచనలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అధినాయకుని వీరపూజల ముందు వ్యవస్థలు నీరుగారుతున్న వైనాన్ని మనం చూడవచ్చు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్నీ, ఫెడరల్ తరహా పాలననూ రాజ్యాంగం ఆకాంక్షించింది. ఫెడరల్ అనే మాటను వాడకపోయినా ‘యూనియన్ ఆఫ్ ది స్టేట్స్’ అనే మాటను వాడారు. ఈ మాటలో రాష్ట్రాలకే ప్రాదేశిక స్వరూపం ఉన్నది తప్ప కేంద్రానికి కాదు.కేంద్ర ప్రభుత్వం కూడా బలంగానే ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించిన మాట నిజమే. దేశ విభజన అనంతర పరిస్థితుల నేపథ్యంలో బలహీన కేంద్రం వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నదని వారు అభిప్రాయపడ్డారు.అందువల్ల కేంద్రానికి కొన్ని అత్యవసర అధికారాలను కట్ట బెట్టారు. సాధారణ పరిస్థితుల్లో కూడా ఈ అధికారాలను చలా యించడానికి కాంగ్రెస్, బీజేపీ కేంద్ర ప్రభుత్వాలు అలవాటు పడ్డాయి. కేంద్రం పెత్తనం ఇప్పుడు మరీ పరాకాష్ఠకు చేరు కున్నది. అసమంజసమైన ద్రవ్య విధానాలతో రాష్ట్రాలను బల హీనపరిచే ఎత్తుగడలు ఎక్కువయ్యాయి.మొత్తం జీఎస్టీ వసూళ్లలో అన్ని రాష్ట్రాలకూ కలిపి మూడో వంతు లభిస్తుంటే, కేంద్రం మాత్రం రెండొంతులు తీసుకుంటున్నది. మోయాల్సిన భారాలు మాత్రం రాష్ట్రాల మీదే ఎక్కువ. రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన అవసరం లేని సుంకాలు, సర్ ఛార్జీల వసూళ్లు ఏటేటా పెరుగుతున్నాయి. పార్లమెంటరీ ప్రజా స్వామ్యం మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని సర్వోన్నత న్యాయస్థానం వివిధ సందర్భాల్లో ప్రకటించింది. కానీ పార్లమెంట్ చర్చలు పలు సందర్భాల్లో ఒక ప్రహసనంగా మారుతున్న వైనం ఇప్పుడు కనిపిస్తున్నది. అసలు చర్చలే లేకుండా కీలక బిల్లుల్ని ఆమోదింపజేసుకున్న ఉదాహరణ లున్నాయి.స్వతంత్ర వ్యవస్థగా ఉండాలని రాజ్యాంగం ఆకాంక్షించిన ఎన్నికల సంఘం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ వ్యవస్థ ప్రతిష్ఠ నానాటికీ దిగజారుతున్నది. మొన్నటి సాధారణ ఎన్నికల్లో అది పాతాళానికి పడిపోయింది. పోలయిన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎందుకు ఎక్కువ ఉన్నాయో తెలియదు. తొలుత ప్రకటించిన పోలయిన ఓట్ల శాతాన్ని నాలుగైదు రోజుల తర్వాత సవరించి అసాధారణంగా పెరిగినట్టు చెప్పడం ఎందువల్లనో తెలియదు. వాటిపై ప్రశ్నించిన స్వతంత్ర సంస్థలకూ, రాజకీయ పక్షాలకూ ఇప్పటి దాకా ఎన్నికల సంఘం సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయింది. ఎన్నికల సంఘం స్వతంత్రతను కోల్పోవడమంటే ప్రజాస్వామ్యం శిథిలమవుతున్నట్లే లెక్క.రిజర్వు బ్యాంకు స్వతంత్రంగా వ్యవహరించవలసిన సంస్థ. కరెన్సీకి సంబంధించిన నిర్ణయాలన్నీ తీసుకోవలసిన బాధ్యత దానిదే. కానీ, పెద్ద నోట్ల రద్దు వంటి అసాధారణ నిర్ణయాన్ని కొన్ని గంటల ముందు మాత్రమే ఆర్బీఐకి తెలియజేసి, బహి రంగ ప్రకటన చేశారు. ఆర్బీఐ పాలక మండలిని కనుసన్నల్లో పెట్టుకొని, దాన్ని అనుబంధ సంస్థగా మార్చేసుకున్నారనే విమ ర్శలు వస్తున్నాయి. ఇక సీబీఐ, ఆర్టీఐ, సీవీసీ వంటి ‘స్వతంత్ర’ సంస్థలు పంజరంలో చిలకలుగా మారిపోయాయనే విమర్శ సర్వత్రా వినబడుతూనే ఉన్నది.తమకు గిట్టని రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడానికి గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు గవర్నర్ వ్యవస్థను వాడుకున్నాయి. అయితే కొందరు గవర్నర్ల విపరీత ప్రవర్తన గతంతో పోల్చితే ఎక్కువైంది. విపక్ష ముఖ్యమంత్రులున్న రాష్ట్రాలకు ‘ట్రోజన్ హార్స్’ను పంపించినట్టే ఇప్పుడు గవర్న ర్లను పంపిస్తున్నారు. ఇప్పుడు ముందుకు తెచ్చిన ‘ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్’ (ఓఎన్ఓఈ) విధానానికి పార్లమెంటరీ ప్రజా స్వామ్యాన్ని మరింత బలహీనపరిచే స్వభావమున్నది.ప్రాంతీయ రాజకీయ పార్టీలనూ, రాజ్యాంగ ఫెడరల్ స్వభా వాన్నీ ధ్వంసం చేయడానికే దీన్ని తీసుకొస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ బిల్లు చట్టరూపం దాల్చాలంటే చేయవలసిన రాజ్యాంగ సవరణల ఫలితంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మరింత బలహీనపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, భిన్నత్వంలో ఏకత్వ భావన అనేవి మన రాజ్యాంగానికి పునాది వంటివి. పార్లమెంట్లో ఎంత మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం మాత్రం లేదని కేశవానంద భారతి (1973) కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులన్నీ అధ్యక్ష తరహా పాలనకు దారితీస్తున్నా యనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ లక్ష్యసాధనకు ప్రస్తుత రాజ్యాంగం ఉపయోగపడదు.ఇక నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని ఆధారం చేసుకొని తమకు పట్టున్న ఉత్తరాదిలో సీట్లు పెరిగేలా, బలహీనంగా ఉన్న దక్షిణాదిలో సీట్లు తగ్గేవిధంగా బీజేపీ ప్రయత్నిస్తున్నదనే అనుమానాలు కూడా విపక్షాలకు ఉన్నాయి. ఇదే నిజమైతే అంతకంటే దారుణం మరొకటి ఉండదు. ఇదంతా రాజకీయ భాగం మాత్రమే! అంబేడ్కర్ చెప్పినట్టు రాజ్యాంగం అభిలషించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు కేవలం రాజకీయపరమైనవే కాదు. సామాజిక ఆర్థికపరమైనవి కూడా! ఈ రంగాల్లో ఇంకా ఆశించిన లక్ష్యం సుదూరంగానే ఉన్నది. ఇప్పుడు రాజకీయ అంశాల్లోనే మన రిపబ్లిక్ సవాళ్లను ఎదుర్కో వలసి వస్తున్నది. ఈ సవాళ్లను అధిగమించి ఆర్థిక, సామాజిక రంగాల్లో కూడా నిజమైన స్వాతంత్య్రం సిద్ధించాలంటే మన రాజ్యాంగం, మన రిపబ్లిక్ చిరకాలం వర్ధిల్లాలి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
రసవత్తరంగా ఢిల్లీ రణం
శీతలగాలులు కమ్మేసిన సమయంలోనూ దేశ రాజధాని ఎన్నికల హంగామాతో వేడెక్కుతోంది. ఫిబ్రవరి 5న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమరంలో రాజకీయ పక్షాల ‘ఉచిత హామీల’ వ్యూహం ఊపందుకుంది. మహిళా ఓటర్లను కేంద్రంగా చేసుకొని ఎన్నికల మేనిఫెస్టోలలో పార్టీలు పోటా పోటీగా వాగ్దానాల వర్షం కురిపిస్తున్నాయి. 2012 నుంచి ఢిల్లీలో ఆధిపత్యం చూపుతున్న అధికార ఆప్, దాని ప్రధాన ప్రత్యర్థి బీజేపీలు రెండూ ఏక తీరున ఎడాపెడా హామీలిస్తుంటే, పోగొట్టుకున్న పట్టును వెతుక్కుంటూ కాంగ్రెస్ కొత్త ఉచితాల ప్రకటనలతో ఊపిరి పీల్చుకోవాలని చూస్తోంది. ఆప్ తన మేనిఫెస్టోలో సీనియర్ సిటిజన్లందరికీ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యచికిత్స, ఆటోడ్రైవర్లకు 5 గ్యారెంటీలు, అద్దెకున్నవారికి సైతం ఉచిత విద్యుత్, నీటి పథకం వర్తింపు లాంటివి ప్రకటించింది. బీజేపీ తన మేనిఫెస్టోలో హోలీ, దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు, గర్భిణు లకు రూ. 21 వేలు, ప్రతి నెలా మహిళలకు రూ. 2.5 వేలు సహా పలు హామీలిచ్చింది. ఇప్పటికే తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని బీజేపీ తోసిపుచ్చకపోవడం ఢిల్లీ నమూనాను సమర్థించ డమేనని ఆప్ ఎద్దేవా చేస్తుంటే... బీజేపీ మాత్రం ఆప్ మాటలు ధయాధర్మం చేస్తున్నామన్నట్లున్నా యనీ, తమది మాత్రం సమాజ సమగ్రాభివృద్ధికై సాగిస్తున్న సంక్షేమ వాగ్దానమనీ వాదిస్తోంది. వెరసి, మాటల యుద్ధంతో 70 స్థానాల ఢిల్లీ పీఠానికి పోటీ రసవత్తరంగా మారింది. 1993 నవంబర్లో తొలి ఢిల్లీ శాసనసభ ఏర్పాటైంది. అప్పటి నుంచి గమనిస్తే, ప్రజా ఉద్య మాలు పెల్లుబికిన ప్రతిసారీ జాతీయ రాజధానిలో అధికారం చేతులు మారిందని విశ్లేషణ. 1998లో షీలా దీక్షిత్ అధికారంలోకి వచ్చినా, 2013లో ఆమెను గద్దె దింపి అరవింద్ కేజ్రీవాల్ పీఠమెక్కినా... ప్రతి అసెంబ్లీ ఎన్నిక ముందు ఏదో ఒక ప్రజాందోళన జరిగిందని విశ్లేషకులు గుర్తు చేస్తుంటారు. 1998 నవంబర్లో ఎన్నికలైనప్పుడు అంతకంతకూ పెరుగుతున్న ధరలు సహా ప్రజల కోపకారణాలే ఊతంగా షీలా అధికారంలోకొచ్చారు. అంతకు కొద్దినెలల ముందు లోక్సభ ఎన్నికల్లో మంచి విజయం సాధించిన బీజేపీ తీరా ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. అలాగే, 2013లో నిర్భయ కేసులో ప్రజ్వరిల్లిన ప్రజాగ్రహం, అవినీతి అంశాల ఆసరాతో, ఉచిత విద్యుత్, నీటి సరఫరా హామీలు అండగా కేజ్రీవాల్ జయకేతనం ఎగరేశారు. సంక్షేమ పథకాలతో 2015, 2020లోనూ గట్టెక్కారు. పదేళ్ళ పైగా ‘ఆప్’ అధికారంలో ఉన్నందున ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత సహజమే. దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ అన్ని అస్త్రాలూ వాడుతోంది. కాంగ్రెస్ సైతం తానేమీ తక్కువ కాదన్నట్టు వ్యవహరిస్తోంది. చిత్రమేమిటంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎంతున్నా అదేమీ పట్టనట్టు ఆప్, దాని అధినాయకత్వం ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఢిల్లీ ఓటర్ల మనసెరిగి ప్రవర్తించడంలో ఆరితేరిన అధికార పక్షం గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ సంక్షేమ పథకాలు, తాయిలాలతో వారిని ఆకట్టుకోగలిగింది. ఈసారి కూడా పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్య బీమా అందిస్తామంటూ ఆప్ భారీ వాగ్దానమే చేసింది. నిజం చెప్పాలంటే, ఇతర పార్టీలు సైతం తన దోవ తొక్కక తప్పని పరిస్థితిని కల్పించడంలో కేజ్రీవాల్ విజయం సాధించారు. ఒకప్పుడు ‘ఎన్నికల ఉచిత మిఠాయిలు’ అంటూ ఈసడించిన ప్రధాని మోదీ సైతం చివరకు ఢిల్లీలో వాటికే జై కొట్టడం గమనార్హం. ఆప్ మళ్ళీ పగ్గాలు పడుతుందా, లేక పొరుగున హర్యానాలో అనూహ్య విజయంతో ఆశ్చర్యపరిచిన బీజేపీ ఢిల్లీలోనూ ఆ మ్యాజిక్ చేస్తుందా అన్నది ఆసక్తికరం. చిరకాలంగా లోక్సభలో బీజీపీకీ, అసెంబ్లీలో ఆప్కూ అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్న ఓటర్లు ఈసారీ అలాగే చేస్తారా అన్నది ప్రశ్న. ఆప్కు ఒకప్పుడున్న అవినీతి రహిత ఇమేజ్, సామా న్యులకు సానుకూలమనే పేరు ఇప్పుడు దెబ్బతిన్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల వలలో పార్టీ నేతలు చిక్కగా, కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్తో ఘర్షణతోనే పుణ్యకాలం హరించుకు పోవడం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే. ప్రతి ఎన్నికనూ జీవన్మరణ సమస్యగానే భావించే బీజేపీ ఎప్పటిలానే డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో ముందుకొచ్చింది. నిరుటి లోక్సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి భాగస్వాములుగా సీట్ల పంపిణీతో చెట్టపట్టాలేసుకున్న ఆప్, కాంగ్రెస్లు ఈసారి పరస్పరం కత్తులు దూసుకోవడమూ విడ్డూరమే. మరోపక్క భుజాలపై పార్టీ కండువాలు మార్చిన నేతలు పలువురు కొత్త జెండాతో బరిలో అభ్యర్థులుగా నిలవడం కార్యకర్తలకూ, పార్టీ నేతలకే కాదు... ఓటర్లకూ చీకాకు వ్యవహారమే. ఇలాంటి 20 మంది నేతల భవితవ్యం ఢిల్లీ కొత్త పీఠాధిపతిని నిర్ణయిస్తుందని అంచనా. అవన్నీ ఎలా ఉన్నా ప్రధాన చర్చనీయాంశం మాత్రం ఉచిత హామీలే.సమాజంలో అంతరాలు అంతకంతకూ అధికమవుతున్న పరిస్థితుల్లో అణగారిన వర్గాల సముద్ధరణకు చేయూత నివ్వడం సమంజసం. అయితే, విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి రంగాల్లో పెట్టుబడులు పెంచి, అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావడం దూరదృష్టి గల పాలకులు చేయాల్సిన పని. అవసరం లేని ఉచితాలపై మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల జాతరలో తాత్కాలికంగా పైచేయి అనుచితమైన ఉచితాలను పార్టీలు ప్రకటిస్తే, ఆ మాటలు నీటి మీది రాతలుగా మిగిలిపోతాయి. అథవా అమలు చేసినా, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమై, పాలనారథం తలకిందులయ్యే ప్రమాదమూ ఉంటుంది. అభివృద్ధి మంత్రానికీ, అధికారం కోసం పప్పుబెల్లాలు పంచాలనుకొనే ఉచితాల తంత్రానికీ నడుమ పోటీలో ఢిల్లీ జనం ఎటు మొగ్గుతారన్నది ఓట్ల లెక్కింపు జరిగే ఫిబ్రవరి 8న చూడాలి. -
భవిష్యత్తు బంగారమేనా?
అనుకున్నదే అయింది. అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తూనే డొనాల్డ్ ట్రంప్ తన మాటలు, చేతలు, చేష్టల ద్వారా సంచలనాలు సృష్టించారు. గతంలో దేశానికి 45వ అధ్యక్షుడిగా పనిచేసి, తాజాగా 47వ అధ్యక్షుడిగా సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ తన తొలి ప్రసంగంలోనే ‘ఇక నుంచి అమెరికాకు స్వర్ణయుగం’ అంటూ అమెరికన్లలో ఆశలు, ఆకాంక్షలు పెంచారు. అయితే, ‘అమెరికాను మళ్ళీ ఘనమైన దేశంగా తీర్చిదిద్దాల’ని (మాగా) నినదిస్తూ ఆయన ప్రకటించిన కొన్ని చర్యలు ఆధిపత్య, విస్తరణవాదానికి ప్రతీకగానూ ప్రతిధ్వనించాయి. వర్తమాన ప్రపంచ అధికార క్రమాన్ని మార్చివేసే పలు చర్యలకు నడుం బిగి స్తున్న తీరు, అలాగే కోవిడ్, చైనాలను సాకుగా చూపుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి, అలాగే పర్యావరణ రక్షణపై ప్యారిస్ ఒప్పందం నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు ప్రకటించడం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. ట్రంప్ పదవీ ప్రమాణ స్వీకారం పైకి సాదాసీదా అధికార మార్పిడిగా అనిపించవచ్చు. రాజకీయ ప్రత్యర్థులు సైతం చిరునవ్వులు చిందిస్తూ సౌహార్దం చూపుకుంటున్నట్టు కనిపించవచ్చు. అంతమాత్రాన అంతా మామూలే అనుకొంటే పొరపాటు. పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో దర్శనమిచ్చిన ఐక్యతకు భిన్నంగా ప్రత్యర్థులపై తుపాకులు ఎక్కుపెట్టిన తీరు ఆయన ప్రసంగంలో స్పష్టంగా వినిపించింది. కునారిల్లిన దేశాన్ని తాను మాత్రమే మళ్ళీ పునరుత్తేజితం చేయగలనన్న భావన కలిగించడంతో పాటు ఆయన ఒకటికి రెండు జాతీయ ఎమర్జెన్సీలు ప్రకటించడం పెను పర్యవసానమే. అలాగే, చైనా నుంచి పనామా కాలువను వెనక్కి తీసుకోవాలని పిలుపునివ్వడమూ వివాదాస్పదమే. బలప్రయోగం ద్వారా మాత్రమే సాధ్యమయ్యే అలాంటి పనుల ప్రస్తావన నిప్పుతో చెలగాటానికి సిద్ధమని స్పష్టం చేయడమే. ఇక, గద్దెనెక్కిన తొలిరోజునే ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ను ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా ట్రంప్ ప్రకటించడంతో రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా మరెన్ని ఆశ్చర్యకర పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఉద్విగ్నత నెలకొంది. పదవి చేపడుతూనే ట్రంప్ చకచకా సంతకాలు చేసిన పదుల సంఖ్యలోని కార్యనిర్వాహక ఆదేశాలు ఆసక్తికరం. పర్యావరణ పరిరక్షణను గాలికొదిలేయడం, జన్మహక్కుగా సంక్రమించే పౌర సత్వంపై అమెరికా రాజ్యాంగాన్ని సైతం తోసిపుచ్చడం లాంటివి ఇట్టే మింగుడుపడే అంశాలు కావు. జాతీయతతో సంబంధం లేకుండా దేశంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నవారికి పుట్టినబిడ్డలకు సైతం 150 ఏళ్ళ పైచిలుకుగా అమెరికా పౌరసత్వం దక్కుతూ వచ్చింది. కానీ, నెల రోజుల్లో అమలులోకి రానున్న తాజా ఆదేశం ఫలితంగా ఇప్పుడిక అలాంటి పిల్లలకు పౌరసత్వ పత్రాలివ్వరు. అదేమంటే, 1868లో చేసిన 14వ సవరణ కింద అమెరికా గడ్డపై పుడితేచాలు ఆ పిల్లలకు మారుమాట లేకుండా పౌరసత్వమివ్వాలనేమీ లేదనీ, సవరణను తప్పుగా వ్యాఖ్యానించారనీ ట్రంప్ వాదన. తాత్కాలిక వీసాలతో అమెరికాలో నివసిస్తూ, ఉద్యోగాధారిత గ్రీన్కార్డ్కై దీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్న 10 లక్షల పైచిలుకు మంది భారతీయులకు ఈ కొత్త నిర్ణయం అశనిపాతమే. ఇప్పటికే కొన్నిచోట్ల ఇమ్మిగ్రేషన్ లాయర్లు కోర్టుకెక్కిన ఈ ఆదేశం గనక అమలైతే, తాత్కాలిక వర్క్ వీసాలు, టూరిస్ట్ వీసాలపై అగ్రరాజ్యంలో ఉంటున్నవారి సంతానానికి అక్కడి పౌరసత్వ ఆశలు అడుగంటినట్లే. 2022 నాటి అమెరికా జనాభా లెక్కలపై ప్యూ రిసెర్చ్ విశ్లేషణ ప్రకారం అమెరికాలో 48 లక్షల మంది భారతీయ అమెరికన్లుంటే, వారిలో మూడింట రెండొంతుల మంది వలసజీవులే. కేవలం 34 శాతం, మరో మాటలో 16 లక్షల మంది మాత్రం అగ్రరాజ్యంలోనే పుట్టారు. ఇక, చట్టవిరుద్ధమైన వలసల్ని అడ్డుకుంటాననీ, సరైన పత్రాలు లేని లక్షలాది వలస జీవుల్ని దేశం నుంచి పంపివేస్తాననీ ట్రంప్ చేసిన గర్జన కూడా లక్షలమందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ జాబితాలో మెక్సికో (40 లక్షలు), ఎల్ సాల్వడార్ (7.5 లక్షలు) తర్వాత 7.25 లక్షల మంది భారతీయులదే మూడో స్థానం. ఫలితంగా, ట్రంప్ ప్రతి మాట, ప్రతి అడుగు మనవాళ్ళలో ఆదుర్దా పెంచుతోంది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ కొత్త ఏలుబడిలో భారత్తో బంధం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. మరోపక్క డెమోక్రాట్లను జనం బాధలు పట్టని కులీనులుగా చిత్రించి, సామాన్య పౌరుల సంరక్ష కుడిగా ఎన్నికల్లో తనను తాను చూపుకొన్న ట్రంప్ను అతిగా నమ్మి మోసపోయామనే భావన రేకెత్తడం సహజమే. చేతిలోని నియంత్రణ నిర్ణయాలే అండగా ఇటీవలే ఓ బ్రాండెడ్ క్రిప్టో టోకెన్ ద్వారా ఆయన వందల కోట్ల డాలర్ల లబ్ధి పొందాడనే విమర్శలూ గుప్పుమంటున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన 80 ఏళ్ళ తర్వాత కీలక సమయంలో పగ్గాలు చేపట్టిన ట్రంప్ తన మద్దతుదారులకై ఏమైనా చేసేలా ఉన్నారు. 2021లో అమెరికా అధ్యక్ష భవనంపై దాడి చేసిన దాదాపు 1500 మంది దుండగులకూ ఆయన తక్షణం సామూహిక క్షమాభిక్ష ప్రసాదించడమే అందుకు తార్కాణం. నాలుగేళ్ళు విచారించి, శిక్షలు వేసిన న్యాయవ్యవస్థను అలా నూతన అధ్యక్షుడు పరిహసించినట్టయింది. ఆశ్రితులు, ఆర్థిక దాతలు, బంధు మిత్రులకై క్షమాభిక్ష వ్యవస్థను దుర్వినియోగం చేయడంలో నిన్నటి బైడెన్ నుంచి నేటి ట్రంప్ దాకా అందరూ ఒకే తాను గుడ్డలన్న మాట. కాలు మోపిననాడే కాపురం చేసే లక్షణం తెలిసిందన్నట్టు ట్రంప్ 2.0 హయాం ఆరంభమవు తూనే రోజులు ఎలా ఉండనున్నాయో తేటతెల్లమైంది. బహుళ ధ్రువ ప్రపంచం వైపు అంతర్జాతీయ అధికార క్రమం అడుగులేస్తున్న కాలంలో ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో సామాజిక, ఆర్థిక రంగాల్లో ట్రంప్ ఆధిపత్యభావ నిర్ణయాలు రానున్న నాలుగేళ్ళలో ప్రపంచాన్ని కుదిపేయడం ఖాయం. -
పనీ – పాటా
పనీ–పాటా అనే నుడికారం ఊరికే పుట్టలేదు; శ్రామిక సంస్కృతిలో పని లేకుండా పాటా, పాట లేకుండా పనీ ఉండవు; అవి అన్యోన్యాలు. పాడుకుంటూ పనిచేస్తే పనిభారం తగ్గుతుందంటారు; అందుకే, ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూసొలుపేమున్నదని ఓ సినీకవి అన్నాడు. అసలు పాట రూపంలో కవిత్వమే కానీ, అభినయ రూపంలో నృత్య, నాటకాలే కానీ, ఆమాటకొస్తే ఇతర కళారూపాలే కానీ పుట్టింది పనితోనేనని పండితులు తేల్చారు. వైయక్తిక, సామూహిక శ్రమలో భాగమైన శారీరక చర్యలను కళారూపాలు అంటిపెట్టుకునే ఉండేవన్నారు. పనినీ, పాటనూ విడదీసి చూడడం నాగరికత ముదిరిన తర్వాతే వచ్చింది. పాట అనేది పనిలేనప్పుడు పాడుకునే వ్యాపకమైంది. రానురాను పాటను పక్కన పెట్టి పనికి మాత్రమే పట్టం కట్టే స్థితికి దారితీసి; తాజాగా వారానికి 70 గంటలు పనిచేయాలని ఒకరంటే, కాదు 90 గంటలు పనిచేయాలని మరొకరు అనే వరకు వెళ్లింది. కొన్నిరోజులుగా ఇదే పెద్ద చర్చనీయాంశం. మనిషితో సహా సమస్త జీవరాశితోనే పని కూడా పుట్టింది; అది కర్మగా మారి కర్మయోగంగా తాత్విక శిఖరానికీ చేరింది; దాంతోపాటు కలలూ, కన్నీళ్ళ చరిత్రనూ మూటగట్టింది. వేల సంవత్సరాల వెనకటి వేట–ఆహార సేకరణ జనాల జీవనంలోకి తొంగి చూస్తే, వారు వారానికి పదిహేను గంటలే పనిచేసేవారని మానవశాస్త్ర నిపుణులంటారు. వారిది మొరటుదనం, అజ్ఞానం మూర్తీభవించిన దుర్భర జీవితమని కొందరంటే; కాదు, ఆ తర్వాతి కాలానికి చెందిన వ్యవసాయ జీవనంతో పోల్చితే వేట–ఆహారసేకరణ జనాలది అత్యున్నత సంస్కృతికి చెందిన సంపన్న సమాజమనీ, తగినంత తీరిక ఉండడమే అందుకు కారణమనీ మరికొందరు అన్నారు. ప్రకృతిని అధ్యయనం చేయడానికీ, చంద్రుడి వృద్ధిక్షయాలపై ఆధారపడిన కాలగణనాన్ని కూర్చడానికీ, కళారూపాల అభివృద్ధికీ ఆ తీరిక తోడ్పడిందనీ, వారే తొలి శాస్త్రవేత్తలూ, కళాకారులనీ – అప్పటి అనేక గుహా చిత్రాలు, కుడ్యచిత్రాల ఆధారంగా నిపుణులు నిరూపించారు. వ్యవసాయ జీవనం నుంచీ ఆ తీరిక అడుగంటి పారిశ్రామిక యుగానికి వచ్చేసరికి వారానికి 80 నుంచి 100 గంటలు పనిచేయవలసిన దుఃస్థితి దాపురించి, ఆ నిర్బంధ శ్రమకు వ్యతిరేకంగా ఉద్యమాలు తలెత్తడంతో వారానికి 40 గంటల పని ప్రామాణిక కొలమానంగా స్థిరపడిందని చరిత్ర చెబుతోంది. నిజానికి పనీ–తీరికా అనేవి ఏదో ఒక నిర్ధారణకో, ఒకే ఒక్క నిర్వచనానికో అందని సంక్లిష్ట అనుభవాలు. ప్రతిసారీ పనిభారాన్ని దాని పరిమాణంతోనూ, గంటలతోనూ తూచలేం. ఇష్టంతో స్వచ్ఛందంగా చేసే పని అలాంటి కొలతలనూ, శ్రమనూ కూడా అధిగమిస్తుంది. నిర్బంధంగా విధించే పని తక్కువ పరిమాణంలో ఉండి, తక్కువ సమయాన్ని తీసుకునేదైనా భారంగానే తోస్తుంది. స్వతంత్రంగా కొయ్యపని చేసుకుంటూ అందులో కళాత్మకతనూ, తృప్తినీ ఆస్వాదించిన ఒక వడ్రంగి ఒక ఫ్యాక్టరీ కార్మికుడిగా మారడంతోనే వాటిని కోల్పోయి ఎలా నిరాసక్తంగా మారాడో కొడవటిగంటి కుటుంబరావు ఒక కథలో చిత్రిస్తారు. పనిగంటలు పెరిగితే ఉత్పాదకత పెరుగుతుందనుకోవడమూ సత్యదూరమేనని చెప్పి, ఐస్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్ లాంటి దేశాల అనుభ వాన్ని ఉటంకించేవారూ ఉన్నారు. వారానికి 30–35 గంటల పనితోనే ఈ దేశాలు ఉత్పాదకత లోనూ, సంతోషభరిత జీవనంలోనూ అగ్రస్థానం వహించడాన్ని వారు ఉదాహరిస్తున్నారు. పనీ–తీరికలలో ఏది ఎక్కువైనా జీవనశకటం ఒకవైపే ఒరిగిపోయి జీవితమే అస్తవ్యస్తమవుతుంది. జీవిక కోసమే మొత్తం సమయాన్ని వెచ్చిస్తే, జీవించడమే మరచిపోతామని ఒక సూక్తి. అన్నిటా సమతూకం పాటించడంలోనే సంతోష రహస్యం ఇమిడి ఉందన్నది మరొక ఉద్బోధ.అందుకే, ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్నారు; అదే అన్ని సందర్భాలకూ వర్తించే సార్వకాలిక సూత్రం. నిజానికి పనికీ–తీరికకీ మధ్య అన్యోన్యతా, పరస్పరతా ఉన్నాయే తప్ప వైరుద్ధ్యం లేదని, దేని విలువ దానిదేనని అనేవారూ ఉన్నారు. కుటుంబ సభ్యులతోనూ, విందు వినోదాలతోనూ ఆహ్లాదంగా గడిపే తీరిక సమయం పనిలో నిమగ్నతకూ, నాణ్యతకూ, ఉత్పాదకత పెరగడానికే తోడ్పడుతుందంటారు. పనిలో ఇతర దేశాలతో పోటీ, అభివృద్ధీ అనేవి కొత్తగా వచ్చాయి. దేశాభివృద్ధిని కొత్తపుంతలు తొక్కించడానికి పని గంటలు పెంచాలనడం పూర్తిగా కొట్టిపారవేయవలసినదేమీ కాదు. కాకపోతే, ఇతర అనేకానేక దృష్టికోణాలను, వాస్తవాలను విస్మరించి ఏకపక్షంగా అలాంటి అభిప్రాయానికి రావడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువన్నది ఒక విమర్శ. అభివృద్ధిలో పోటీ పడవలసిందే కానీ, ఇక్కడి మానవవనరుల అందుబాటునూ, వాటి అభివృద్ధినీ కూడా పరిగణనలోకి తీసుకుని తగిన ప్రణాళికతో ముందుకు వెళ్లాలనే వాదన వినిపిస్తోంది. వివిధ రంగాలలో ఇప్పటికే పెరిగిన పని భారం ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యాలపై తీవ్ర దుష్ప్రభావం చూపుతోందనీ, అందువల్ల ఉత్పాదకత మందగిస్తోందనీ ఆయా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఇంకోవైపు దేశంలో నిరుద్యోగం రేటు పెరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కనుక, పని గంటలను పెంచడం కన్నా పని చేసే చేతుల సంఖ్యను పెంచి పనిని పంచడమే అత్యుత్తమ పరిష్కారమనీ; అందుకు అవసర మైన అన్నిరకాల శిక్షణ సదుపాయాలనూ అభివృద్ధి చేయాలనే వాదన ముందుకు వస్తోంది. పని నుంచి పాటను వేరు చేసినప్పుడు చిన్న పని కూడా పెనుభారమే అవుతుంది. పనికి పాటను జోడించడమే దానిని తేలికచేసే మార్గం. పనీ–పాటా కలిసినప్పుడు... పనే పాటవుతుంది! -
అప్పారావు చిటికెల పందిరి!
ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం ఏడు మాసాలు పూర్తి చేసు కొని ఎనిమిదో నెలలో ప్రవేశించి ఓ వారం గడిచిపోయింది. అష్టమంలోకి బుధుడు ఎంట్రీ ఇచ్చినట్టున్నాడు. గణాంకాలూ, లెక్కలూ వగైరా సబ్జెక్టులు బుధ గ్రహం పోర్టుఫోలియోలని చెబు తారు. అవసరమున్నా లేకపోయినా సరే ఈ మధ్య ముఖ్య మంత్రి సంపద సృష్టి లెక్కలు చెప్పడం మొదలుపెట్టారు. ఇలా ఆర్థిక శాస్త్ర అధ్యాపకుని అవతారం ఎత్తడం వెనుక ఆయన మనో భావాలేమిటో గ్రహించాలి.కొత్త ప్రభుత్వ పనితీరును మొదటి ఆరు మాసాలపాటు జనం పెద్దగా పట్టించుకోరని మన రాజకీయ నాయకులు అభిప్రాయపడతారు. ఏడో నెల నుంచి మాత్రం నఖశిఖ పర్యంతం పరిశీలిస్తారు. అందుకే కొత్త ప్రభుత్వాలకు తొలి ఆరు నెలలు ‘హనీమూన్ పీరియడ్’ అనే ముద్దుపేరును తగిలించుకున్నారు. ఆ మురిపాల కాలం కరిగిపోయి ఐదు వారాలైంది. జనం ప్రశ్నించడం మొదలైంది. వీధుల్లోకి రావడం కూడా ప్రారంభమైంది. జనం దృష్టి మళ్లింపు ఎత్తుగడలతో నెట్టుకురావడం ఇక కుదరదు. ఏదో ఒకటి చెప్పాలి. ఇచ్చిన హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలి. ఎందుకు ఇంకా అమలు చేయడం లేదో విడమర్చి వివరించాలి.ఎన్నికలకు ముందు మూడు పార్టీల కూటమి ఎడాపెడా చేసిన వాగ్దానాల సంగతి తెలిసినదే! వాటిలో ఓ ఆరింటిని అతి ప్రధానాంశాలుగా గుర్తించి ‘సూపర్ సిక్స్’ పేరుతో తక్షణం అమలు చేస్తామని ఊదరగొట్టిన వైనమూ తెలిసినదే! ‘సూపర్ సిక్స్’లో భాగంగా యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తామనీ, నిరుద్యోగులకు నెలకు 3 వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామనీ హామీ ఇచ్చారు. ఒక ఇంటిలోంచి ఎంతమంది విద్యార్థులు బడికెళ్తే అంతమందికీ ఏటా రూ.15 వేలు ఇచ్చి ఆ తల్లికి వందనం చేస్తామన్నారు. ప్రతి రైతుకూ ఏటా ఇరవై వేల పెట్టుబడి సాయం అందజేస్తామన్నారు. ప్రతి ఇంటికీ ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లన్నారు. మహిళలందరికీ ఉచి తంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని మహిళలందరికీ నెలకు 15 వందల రూపాయలిస్తామన్నారు.ఎనిమిదో నెల వచ్చినా ఇందులో ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఆరింటిలో ఆర్థిక భారం పెద్దగా పడని గ్యాస్ సిలిండర్ల హామీని తీసుకొని పాక్షికంగా అమలు చేశారు. మూడుకు బదులు ఒకే సిలిండర్ను తొలి ఏడాదికి పరిమితం చేశారు.రెండో సంవత్సరం నుంచైనా మూడు సిలిండర్లిస్తారో ఒక్కదాని తోనే సరిపెడతారో చూడాలి. మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాల్లో అతి ప్రధానమైనవిగా ఎంపిక చేసుకున్న ‘సూపర్ సిక్స్’కే ఈ గతి పడితే మిగిలిన వాటి సంగతేమిటో అర్థం చేసుకోవచ్చు.ఎకనామిక్స్ పాఠాల ప్యాకేజీలో భాగంగా ఎన్నికల హామీలను తాము అమలు చేయబోవడం లేదనే సంగతిని నర్మగర్భంగా చంద్రబాబు చెప్పేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) తొలి అంచనాల పేరుతో మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు ఓ క్లాస్ తీసుకున్నారు. పవర్ పాయింట్ ద్వారా ఓ పది పదిహేను గణాంకాల టేబుళ్ళను ప్రదర్శించారు. ఈ సంవ త్సరం జీఎస్డీపీ పెరుగుదల రేటు 12.94 శాతంగా ఉండ బోతున్నదని జోస్యం చెప్పారు. ఈ అంచనాకు ఆధారమేమిటో ఆయన చెప్పలేదు.ఈ జోస్యం ఇంతటితో ఆగలేదు. ఆయన వేసిన చిటికెల పందిరి ఆకాశం దాకా ఎగబాకింది. ఏటా పదిహేను శాతం చొప్పున జీఎస్డీపీ పెరుగుతూ పోతే 2047 నాటికి 2.74 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుందనీ, తలసరి ఆదాయం 58,14,916 రూపాయలకు పెరుగుతుందనీ చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఎదిగినా డాలర్ కూడా ఇంకా బలపడుతుందట! అది కూడా ఆయనే చెప్పారు. 2047 నాటికి డాలర్ విలువ 127 రూపాయలుగా ఉండ బోతున్నదట! వచ్చే సంవత్సరం తమ పిల్లల్ని అమెరికా చదువులకు పంపించాలనుకునే వాళ్లు అప్పటికి డాలర్ రేటు ఎంతుంటుందోనని కంగారుపడే అవసరం లేదు. చంద్రబాబు సర్కార్ను సంప్రదిస్తే తెలిసిపోతుంది. వారికి డాలర్ జ్యోతిషం తెలుసు.ఈవిధంగా ఏటా 15 శాతం చొప్పున జీఎస్డీపీ పెరుగుతూ పోతే ఈ ఐదేళ్లలో 4 లక్షల 35 వేల కోట్ల రూపాయల కొత్త అప్పులు చేయవచ్చట! వాటి ఆధారంగా సంక్షేమ పథకాలను అమలు చేయవచ్చనే చావు కబురు చల్లగా చెప్పారు. ‘ఈ సంవ త్సరం మంచి వర్షాలు కురవాలి. అతివృష్టి, అకాల వర్షాలు ఉండరాదు. పశు, పక్ష్యాదుల దాడి ఉండకూడదు. పంట తెగుళ్ల బారిన పడకూడదు. మంచి దిగుబడి రావాలి. అద్భుతమైన ధర మార్కెట్లో పలకాలి. అప్పుడు తప్పకుండా విందు చేసుకుందాం’ అనే సందేశాన్ని ఆయన సంక్షేమ పథకాల అమలుకు వర్తింపజేశారు.ఇటువంటి పాలకులను ఉద్దేశించే కావచ్చు – వందేళ్ల క్రితమే సుప్రసిద్ధ ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ చెప్పిన ఒకమాట ప్రసిద్ధ కొటేషన్గా మారింది. ‘‘ఇన్ ద లాంగ్ రన్ వి ఆర్ ఆల్ డెడ్’’. సుదూర భవిష్యత్తులో మనమంతా విగత జీవులమే అనే మాటను తక్షణ సమస్యల పరిష్కారం అవసరాన్ని పాలకులకు చెప్పడం కోసం వాడారనే అభిపాయం ఉన్నది. ఇప్పుడు పరి ష్కారం కావలసిన ఆర్థిక సమస్యలను భవిష్యత్ మార్కెట్ పరిస్థితులు పరిష్కరిస్తాయని నమ్మేవారిపై కీన్స్ వేసిన సెటైర్గా దాన్ని చెబుతారు. ఇది మన ఏపీ సర్కార్కు బాగా నప్పుతుంది.చంద్రబాబుకు అత్యంత ప్రీతిపాత్రమైన ప్రపంచ బ్యాంకు ఇచ్చే నివేదికలను సైతం ఆయన లెక్కలోకి తీసుకోవడం లేదని పిస్తున్నది. గ్లోబల్ ఎకానమీ మీద ఈ జనవరిలోనే ప్రపంచ బ్యాంకు ఒక నివేదికను విడుదల చేసింది. ఈ శతాబ్దపు తొలి క్వార్టర్ (2000–2025) ఇచ్చినంత ఉత్తేజం ఆర్థిక రంగానికి రెండో క్వార్టర్ (2026–2050) ఇచ్చే అవకాశం లేదని ఈ నివేదిక అభిప్రాయపడింది. గ్లోబల్ జీడీపీ పెరుగుదల రేటు 2.7 శాతంగానే ఉండబోతున్నట్టు ఇది అంచనా వేసింది. రెండు ఖండాల్లో యుద్ధాలు, పెద్ద దేశాలు అవలంబిస్తున్న రక్షణాత్మక వాణిజ్య విధానాలు కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపెడుతున్నాయి. మిగతా ప్రాంతాలతో పోలిస్తే లాటిన్ అమెరికా, పశ్చిమాసియా, దక్షిణాసియా ప్రాంతాల పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉండొచ్చనీ, ఆ యా ప్రాంతాల్లోని స్థానిక విని మయ మార్కెట్లు బలపడడం అందుకు కారణమనీ ఈ నివేదిక పేర్కొన్నది.దక్షిణాసియా దేశాల్లో స్థానిక వినిమయ మార్కెట్లు బలపడుతుంటే ఆంధ్రప్రదేశ్లో ఆ అవకాశం లేకుండా చంద్ర బాబు హరించారు. ఆయన అధికారంలోకి వచ్చిన తొలి ఆరు మాసాల్లో తగ్గిపోయిన జీఎస్టీ వసూళ్లే అందుకు నిదర్శనం. ఏటికేడు పెరుగుతూ వస్తున్న జీఎస్టీ వసూళ్లు చంద్రబాబు తొలి ఆరు నెలల కాలంలో తొలిసారిగా నేల చూపులు చూస్తూ వచ్చాయి. లిక్కర్ అమ్మకాల పుణ్యమా అని ఒక్క అక్టోబర్ మాసంలోనే కొంత ఎదుగుదల నమోదైంది. ఈ జీఎస్టీ లెక్కలు చంద్రబాబు చెబుతున్న ఆకాశ రామన్న లెక్కలు కావు. స్వయానా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే లెక్కలివి. ఒకపక్క ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో సాక్ష్యాధారాలతో కనిపిస్తున్నది. కానీ జీఎస్డీపీ పెరుగుదల మాత్రం తారాజువ్వలను తలదన్నేలా ఉంటుందని చంద్రబాబు విడుదల చేసిన ఆకాశ రామన్న లెక్కలు చెబుతున్నాయి. ఇదెలా సాధ్యమవుతుందో చెప్పడం తలపండిన ఆర్థికవేత్తలకు కూడా సాధ్యం కాకపోవచ్చు.చంద్రబాబు తొలి ఆరు మాసాల కాలంలో రాష్ట్ర ప్రభు త్వానికి తన సొంత ఆదాయ మార్గాల ద్వారా వచ్చే ఆదాయంలో 1.69 శాతం క్షీణత నమోదైంది. అక్టోబర్లో లిక్కర్ వేలంపాటల ఆదాయం ఆదుకోకపోయి ఉంటే ఈ క్షీణత ఇంకా ఎక్కువే ఉండేది. అంతకుముందు సంవత్సరం (2023) అదే నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 12.19 శాతం వృద్ధి నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయాలంటే ఏముంటాయి? జీఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, సేల్స్ ట్యాక్స్ (పెట్రోలియం ఉత్పత్తులు ఈ కేటగిరీలో వస్తాయి), మైనింగ్ వగైరా పన్నేతర ఆదాయం... ప్రధానంగా ఇవే! ఈ వసూళ్లు క్షీణించడమంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్నట్టు అర్థం. ఈ వసూళ్లలో వృద్ధి కనిపిస్తేనే జీఎస్డీపీలో ఎదుగుదల కనిపిస్తుంది.చంద్రబాబు మొదటి ఐదేళ్ల (2014–19) కాలంలో దేశ జీడీపీలో ఏపీ వాటా 4.45 శాతంగా ఉంటే వైఎస్ జగన్ హయాంలో (2019–24) 4.82 శాతంగా నమోదైంది. ఈ లెక్కలను చంద్రబాబు ప్రెజెంటేషన్లో కూడా దాచిపెట్ట లేకపోయారు. వాస్తవాలు ఇలా ఉంటే జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందనే దగుల్బాజీ ప్రచారాన్ని ఇంకా కొనసా గిస్తున్నారు. ఒకపక్క పరిపాలనా వైఫల్యం, దివాళా తీస్తున్న ఆర్థిక రంగం, మరోపక్క ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజలను దారుణంగా వంచించడం... వీటి నుంచి దృష్టి మళ్లించడానికి తప్పుడు ప్రచారాలనూ, హెచ్చుల ‘విజన్’లనూ బాబు సర్కార్ ఆశ్రయిస్తున్నది.ఏడు మాసాల్లో 4 లక్షల కోట్ల పెట్టుబడులను రప్పించామని డప్పు వేసుకోవడం ఒక వంచన. 1 లక్షా 85 వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని చంద్రబాబు చెబుతున్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందాలపై జగన్ ప్రభుత్వ హయాంలోనే సంతకాలు పూర్తయ్యాయి. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కథ కూడా ఇంతే! కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం ఆ ఘనతను తన ఖాతాలోనే వేసుకొని ప్రచారం చేసుకుంటున్నది. తాజాగా విశాఖ ఉక్కు విషయంలోనూ ఇదే తంతు. కేంద్రం చేత 11 వేల కోట్లు విడుదల చేయించి తాము ఘనకార్యం చేశామనీ, ప్రైవేటీకరణ ఆగిపోయిందనీ కూటమి నేతలు ప్రచారం చేసు కుంటున్నారు. కానీ ఈ ప్రకటన చేసిన కేంద్ర మంత్రి కుమార స్వామి చెప్పిన విషయాన్ని మాత్రం యెల్లో మీడియా మరుగున పడేసింది. జగన్మోహన్రెడ్డి అడ్డుకున్నందు వల్లనే ప్రైవేటీకరణ ఆగిపోయిందని ఆయన మీడియా సమక్షంలోనే కుండబద్దలు కొట్టారు.కేంద్రం ఆర్థిక సాయాన్నయితే ప్రకటించింది గానీ ప్రైవేటీ కరణను ఆపేస్తామని ఎక్కడా చెప్పలేదు. కార్మిక సంఘాల ఇతర ప్రధాన డిమాండ్లయిన సొంత గనుల కేటాయింపు, ‘సెయిల్’లో విలీనంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇవేమీ లేకుండా 26 వేల కోట్ల అప్పులున్న సంస్థకు 11 వేల కోట్లు సాయం చేస్తే అప్పులూ, బకాయిలూ తీర్చి, సామర్థ్యాన్ని పెంచుకొని భారీ ఉత్పత్తులు సాధించి లాభాల బాటలో పయనిస్తుందా? పోలవరం, బనకచర్ల వంటి అంశాల్లోనూ మోసపూరితమైన తప్పుడు ప్రచారాలే! ఇటువంటి నయవంచనను ప్రతిఘటించవలసిన బాధ్యత కేవలం ప్రతిపక్ష రాజకీయ పార్టీలదే కాదు – విద్యాధి కులు, మేధావులు, ప్రజా సంఘాలది కూడా! అప్పుడే మన ప్రజాస్వామ్యం పరిణతి చెందినట్టు! లేకపోతే అప్పుల అప్పా రావులు వేసే చిటికెల పందిళ్లు ఎప్పటికి పూర్తవుతాయోనని కళ్లప్పగించి చూస్తూ ఉండాల్సిందే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
గాజాలో శాంతి సాధ్యమేనా!
బాంబుల మోత ఆగుతుందంటే... తుపాకులు మౌనం పాటిస్తాయంటే... క్షిపణుల జాడ కనబడదంటే... ఇనుప డేగల గర్జనలు వినబడవంటే... నిత్యం మృత్యువు వికటాట్టహాసం చేస్తున్నచోట హర్షాతిరేకాలు వ్యక్తం కావటం సహజమే. అందుకే 15 నెలలుపైగా... అంటే 467 రోజులుగా రాత్రింబగళ్లు ప్రాణభయంతో కంటి మీద కునుకు లేకుండా గడిపిన గాజా ప్రజానీకం వీధుల్లోకొచ్చి పండుగ చేసుకున్నారు. అటు హమాస్ చెరలో మగ్గుతున్నవారి కుటుంబసభ్యులు సైతం ఆనందో త్సాహాలతో ఉన్నారు. ఇజ్రాయెల్–మిలిటెంట్ సంస్థ హమాస్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని మధ్యవర్తులుగా వ్యవహరించిన అమెరికా, ఖతార్ ప్రతినిధులు బుధవారం రాత్రి ప్రకటించగానే ప్రపంచం, ప్రత్యేకించి పశ్చిమాసియా ఊపిరి పీల్చుకున్నాయి. ‘నేను దేశాధ్యక్షపదవి స్వీకరించబోయే జనవరి 20 నాటికి బందీలకు స్వేచ్ఛ లభించకపోతే సర్వనాశనం ఖాయమ’ని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పక్షం రోజుల నాడు ప్రకటించారు. ‘నా హెచ్చరిక ఫలించబట్టే కాల్పుల విరమణ ఒప్పందం సాకారమైంద’ని ఇప్పుడు ఆయన అంటుంటే... ‘నా అనుభవంలోనే అత్యంత కఠినమైన ఈ చర్చల ప్రక్రియను మొత్తానికి సుఖాంతం చేయగలిగాన’ని ప్రస్తుత అధ్య క్షుడు జో బైడెన్ చెబుతున్నారు. ఈ ఘనత ఎవరి ఖాతాలో పడాలన్నది తేలకముందే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మొండికేస్తున్నారు. తొలుత ఒప్పందాన్ని స్వాగతించిన ఆయనే ఇంకా తేలాల్సినవి ఉన్నాయంటున్నారు. ఒప్పందంపై ఆమోదముద్ర వేసేందుకు నిర్వహించాల్సిన కేబినెట్ సమావేశాన్ని నిలిపివేశారు. ఈలోగా నిన్న, ఇవాళ గాజాపై ఇజ్రాయెల్ సాగించిన బాంబు దాడుల్లో 19మంది పిల్లలు సహా 80 మంది చనిపోయారు. కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతుందా లేదా, ఈ ప్రాంతంలో తాత్కాలికంగానైనా శాంతి నెలకొంటుందా అన్న అంశంలో సందిగ్ధత ఏర్పడింది. సుదీర్ఘకాలం ఘర్షణలతో అట్టుడికినచోట సాధారణ పరిస్థితులు ఏర్పడటం అంత సులభమేమీ కాదు. అందునా ఇజ్రాయెల్తో వైరమంటే మామూలుగా ఉండదు.ఇజ్రాయెల్ భూభాగంలోకి హమాస్ మిలిటెంట్లు చొరబడి 2023 అక్టోబర్ 7న విచ్చలవిడిగా కాల్పులు జరిపి 1,200 మంది పౌరులను హతమార్చటంతో పాటు, 251 మందిని బందీలుగా తీసు కెళ్లటంతో ఇదంతా మొదలైంది. హమాస్ మతిమాలిన చర్య తర్వాత ఇజ్రాయెల్ క్షిపణులు, బాంబులతో గాజా, వెస్ట్బ్యాంక్లపై సాగించిన దాడుల పర్యవసానంగా ఇంతవరకూ కొందరు హమాస్ కీలకనేతలతో పాటు 46,700 మంది పౌరులు చనిపోయారు. ఇందులో అత్యధికులు పిల్లలు, మహి ళలే. ఇతరులు నిత్యం చావుబతుకుల మధ్య రోజులు వెళ్లదీస్తున్నారు. ఇజ్రాయెల్ సైన్యం జారవిడిచే కరపత్రాలు సూచించిన విధంగా ఎటు పొమ్మంటే అటు వలసపోతూ అష్టకష్టాలు పడుతున్నారు.తిండీ, నీళ్లూ కరువై, అంతంతమాత్రం వైద్య సదుపాయాలతో జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. ఒక్కోటి 42 రోజులు (ఆరు వారాలు)ఉండే మూడు దశల కాల్పుల విరమణ ఒప్పందం సజావుగా అమలవుతుందా, మధ్యలో తలెత్తగల సమస్యలేమిటి అన్న ప్రశ్నలకు ఎవరి దగ్గరా సమాధానాల్లేవు. హమాస్ చెరలో ఇంకా 94 మంది బందీలు మిగిలారని, వారిలో 34మంది మరణించివుండొచ్చని ఇజ్రాయెల్ అంచనా. తొలి దశ అమల్లోవుండగా గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ దళాలు వైదొలగాలి. ఆ తర్వాత పాలస్తీనా ఖైదీల విడుదలకు బదులుగా 33 మంది బందీలను హమాస్ విడుదల చేస్తుంది. ఒకసారంటూ ఒప్పందం అమలు మొదలైతే ఇరువైపులా ఉన్న బందీలను దశలవారీగా విడుదల చేస్తారు. గాజాకు భారీయెత్తున సాయం అందటం ప్రారంభమవుతుంది. ఒప్పందం ప్రకారం తొలి దశ కొనసాగుతున్న దశలోనే ఇజ్రాయెల్ రెండోదశ కోసం హమాస్తో చర్చించటం మొదలెట్టాలి. రెండో దశకల్లా బందీలతోపాటు దాడుల సందర్భంగా హమాస్కు చిక్కిన ఇజ్రాయెల్ ఆడ, మగ సైనికులు పూర్తిగా విడుదలవుతారన్నది అంచనా. అప్పుడు మొదలుకొని తొలి దశలో వున్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం శాశ్వత కాల్పుల విరమణగా మారుతుంది. మూడో దశ అంతా పునర్నిర్మాణంపై కేంద్రీకరిస్తారు. హమాస్ బందీలుగా ఉంటూ మరణించినవారి మృత దేహాలను అప్పగించాలి. కేవలం మొదటి దశకు మాత్రమే ప్రస్తుత ఒప్పందం పరిమితమనీ... కొత్తగా చర్చలు జరిగాకే రెండు, మూడు దశలకు సంబంధించి తుది నిర్ణయం ఉంటుందనీ ఇప్పటికే నెతన్యాహూ ప్రకటించారు. తొలి దశ పూర్తయ్యాక మళ్లీ యుద్ధం తప్పదన్న హామీ ఇవ్వకపోతే తమ ఆరుగురు మంత్రులూ తప్పుకుంటారని తీవ్ర మితవాదపక్ష నాయకుడు, జాతీయ భద్రతా మంత్రి బెన్గివర్ హెచ్చరించటం తీసిపారేయదగ్గది కాదు. లెబనాన్లోని హిజ్బొల్లాతో ఉన్న రెండు నెలల కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉంది. అక్కడ ఇరువైపులా కాల్పులు జరగని రోజంటూ లేదు. ఆ ఒప్పందం కూడా ఈనెల 26తో ముగుస్తుంది. ఇప్పుడు హమాస్తో కుదిరిన ఒప్పందం గతి కూడా అలాగే ఉంటుందా అన్నది ప్రశ్నార్థకం.సిరియాలో అసద్ నిష్క్రమణ, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా నిమగ్నమైవుండటం, ఇరాన్ బల హీనపడటం, ట్రంప్ ఆగమనం వంటి పరిణామాలతో హమాస్లో పునరాలోచన మొదలయ్యాకే ఈ ఒప్పందానికి అంగీకరించింది. ఎనిమిదినెలల నాడు దాదాపు ఇవే షరతులు ప్రతిపాదిస్తే ఆ సంస్థ తిరస్కరించటం గమనార్హం. మొత్తానికి పశ్చిమాసియా తెరిపిన పడటానికి అన్ని పక్షాలూ చిత్తశుద్ధి ప్రదర్శించటం అవసరం. దాడులతో ఎవరినీ అణిచేయలేమని ఇన్నాళ్ల చేదు అనుభవాల తర్వాతైనా ఇజ్రాయెల్ గుర్తిస్తే మంచిది. ఎన్ని లోటుపాట్లున్నా ఘర్షణలు అంతరించాలి. శాంతి చిగురించాలి. -
కచ్చితత్వం దిశగా...
పక్షుల, పాముల, జంతువుల ప్రవర్తనను చూసీ...ఆకాశం తీరుతెన్నులు గమనించీ, గాలివాటు, దాని వేగం గ్రహించీ వాతావరణాన్ని అంచనా కట్టే గతకాలపు రోజుల నుంచి ఇవాళ ఏం జరుగుతుందో, వచ్చే నాలుగైదు రోజుల్లో ఎలాంటి వాతావరణం ఉండబోతున్నదో, రాగల సంవత్సరమంతా ఎలాంటి స్థితిగతులుంటాయో స్పష్టంగా వివరించే సమాచారం అందరికీ అందుబాటులో కొచ్చింది. గత నూట యాభయ్యేళ్లుగా అవిచ్ఛిన్నంగా ఈ పనిలోనే నిమగ్నమై కోట్లాది పౌరులకు చేదోడువాదోడుగా నిలిచిన భారతీయ వాతావరణ విభాగం(ఐఎండీ) తన వార్షికోత్సవాన్ని మంగళ వారం ప్రధాని మోదీ సమక్షంలో ఘనంగా నిర్వహించుకుంది. ఒక దేశ విజ్ఞాన శాస్త్ర అవగాహన ఆ దేశంలోని వైజ్ఞానిక సంస్థల ప్రగతిలో ప్రతిఫలిస్తుందని ఈ సందర్భంగా మోదీ చెప్పిన మాట అక్షరసత్యం. ఈ నూటయాభయ్యేళ్లలో ఐఎండీ సాధించిన ప్రగతి ఇందుకు సాక్ష్యం. ‘వాన రాకడ... ప్రాణం పోకడ’ ఎవరికీ తెలియదనే నానుడి నుంచి మనం చాలా దూరం వచ్చాం. ఇక పోవటం ఖాయమనుకున్న ప్రాణాన్ని నిలబెట్టడానికీ, పునర్జన్మ ఇవ్వడానికీ అధునాతన వైద్య సదుపాయాలు విస్తృతంగా అందుబాటులోకొచ్చాయి. అలాగే వాన ఎక్కడ కురుస్తుందో, దాని తీవ్రత ఏపాటో అంచనా వేయగలుగుతున్నాం. తుపాను ఏర్పడే అవకాశాలు, దాని గమ్యం, గమనం, అది మోసుకు రాగల విపత్తు గురించీ హెచ్చరించటంతో పాటు కరవుకాటకాల ప్రమాదాన్ని తెలియజెప్పటం ఆ రంగంలో సాధించిన ప్రగతికి తార్కాణం. మూడు రోజుల వరకూ వాతావరణం ఎలా ఉండబోతు న్నదో చెప్పే స్వల్పకాలిక అంచనాలు, పదిరోజుల వరకూ వాతావరణ పోకడల్ని వివరించగల మధ్య శ్రేణి అంచనాలు, నెల పాటు ఏ వారమెలా వుంటుందో తెలియజేయగల సామర్థ్యం ఇప్పుడు మన సొంతం. ఇంకా స్థానిక వాతావరణాలను అంచనా వేయగలిగే దిశగా ఐంఎండీ ముందుకెళ్తోంది.పేరులో తప్ప జనాభా రీత్యా, సంపద రీత్యా, లేదా విస్తీర్ణం రీత్యా ఏ రకంగానూ ‘గ్రేట్’ అనే పదానికి అర్హత లేని బ్రిటన్ నుంచి వచ్చిన వలస పాలకులు ఈ దేశంలోని వాతావరణ తీరుతెన్నులు చూసి అయోమయంలో పడ్డారు. వీటిని సక్రమంగా అంచనా వేసే సాధనాలు లేకపోతే సరిగా పాలించటం అసాధ్యమన్న నిర్ణయానికొచ్చిన ఫలితంగానే 1875లో సర్ చార్లెస్ చాంబర్లేన్ నేతృత్వంలో ఐఎండీని నెలకొల్పారు. అంతవరకూ రైతులు సంప్రదాయంగా అనుసరిస్తూ వచ్చిన విధానాలన్నీ క్రమేపీ కనుమరుగై వాతావరణ అధ్యయనం కొత్త పుంతలు తొక్కటం ప్రారంభించింది. కేవలం బ్రిటన్ వాతావరణాన్ని పోలి వుంటుందన్న ఏకైక కారణంతో తమ వెసులుబాటు కోసం సిమ్లాలోని పర్వత ప్రాంతంలో మొదలెట్టిన ఐఎండీ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని గ్రహించాక 1928లో పుణేకు తరలిరావటం, ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఢిల్లీకి వెళ్లటం తప్పనిసరైంది. ఐఎండీ డైరెక్టర్ జనరల్గా వచ్చిన గిల్బర్ట్ వాకర్ 1904–1924 మధ్య రెండు దశాబ్దాల సమయంలో భారత వాతావరణంలో చోటుచేసుకున్న అసాధారణతలపై అధ్యయనం చేయటంతో అనేక అంశాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంత పసిఫిక్ మహా సముద్ర జలాలపై ఉండే వాయుపీడనంలో వచ్చే హెచ్చుతగ్గులే ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ స్థితిగతులను ప్రభావితం చేస్తున్నాయని ఆ అధ్యయనం తేల్చాక వాతావరణాన్ని అర్థంచేసుకునే తీరే మారిపోయింది. పసిఫిక్ జలాలపై ఉండాల్సిన సాధారణ ఉష్ణోగ్రతలో మైనస్ 17 డిగ్రీల సెల్సియస్ మేరకు హెచ్చితే లాæనినో... ఆ ఉష్ణోగ్రత మైనస్ 17 డిగ్రీల కన్నా తగ్గితే లానినా ఏర్పడు తుందని తేలింది అప్పుడే. ఇదంతా అర్థమయ్యాక రాగల కాలంలో వాతావరణమెలా వుండనున్నదో అంచనా వేయటం సులభమైంది. వాతావరణంలో విడిచిపెట్టే బెలూన్లు గాలిలో తేమనూ, ఉష్ణోగ్రతనూ ఇట్టే చెప్పగలుగుతుండగా ఉపగ్రహాలు నేల పరిస్థితుల గురించి సమాచారం ఇస్తున్నాయి.స్వాతంత్య్రానంతరం వాతావరణాన్ని కొలవటానికి రాడార్ల వంటి ఉపకరణాలు అందుబాటు లోకొచ్చాయి. 1971లో తొలి తుపాను హెచ్చరిక కేంద్రం ఏర్పాటైతే, 1990ల్లో ఇస్రో ఉపగ్రహాలు పంపే డేటాతో వాతావరణ అంచనాల కచ్చితత్వం పెరిగింది. సెకనుకు కొన్ని లక్షల గణనలను చేయగలిగిన అధునాతన సూపర్ కంప్యూటర్ వినియోగం మొదలయ్యాక రుతుపవనాలు, తుపానుల గురించి మాత్రమే కాదు... వడగాల్పులు, వరదల వంటి వైపరీత్యాల గురించి కూడా చెప్పగలుగుతున్నారు. మన దేశంలో సాగుకు యోగ్యమైన భూమిలో 60 శాతం కేవలం వర్షాధారం కావటం, జనాభాలో మూడింట రెండొంతుల మందికి జీవనాధారం వ్యవసాయమే కావటం వల్ల ఐఎండీ చెప్పే అంచనాలు ఎంతో అవసరం. అందుకే వర్షాలు సరిగ్గా ఎక్కడ పడతాయో, ఏ ప్రాంతంలో వడగాడ్పులు వీచవచ్చో, ఎక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నదో కూడా పదేళ్లుగా చెప్పగలుగుతోంది. కృత్రిమ మేధ దీన్ని మరింత పదునెక్కించింది.ఐఎండీ అంచనాల వల్ల ప్రభుత్వాలు అప్రమత్తమై లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించటం, వేలాది ప్రాణాలను కాపాడుకోవటం సాధ్యమవుతోంది. ఇది మున్ముందు ఇంకా విస్తరించి కనీసం అయిదురోజుల ముందు 90 శాతం కచ్చితత్వంతో చెప్పగలిగే విధానాలను అభివృద్ధి చేసుకోవాలనీ, ఆఖరికి భూకంపాల రాకడను సైతం పసిగట్టగలగాలనీ ఐఎండీ 2047 విజన్ డాక్యుమెంటు విడుదల సందర్భంగా మోదీ చేసిన సూచన శిరోధార్యం. ఈ అంచనాలు మన దేశానికి మాత్రమే కాదు...ఆసియా ప్రాంత దేశాలకు సైతం ఎంతో మేలుచేస్తాయి. పంటల దిగుబడిపై, ఆర్థికవ్యవస్థ తీరుతెన్నులపై మరింత మెరుగైన అంచనాలకు తోడ్పడతాయి. -
చైనా దాగుడుమూతలు!
సాధారణంగా దౌత్య సంబంధాల్లో అనూహ్యతకు తావుండదు. అవతలి దేశం మనతో చెలిమి కోరుకుంటున్నదో లేదో... అది మనవైపో, వేరేవాళ్లవైపో ఊహించటం పెద్ద కష్టం కాదు. కానీ చైనా మటుకు ఇందుకు విరుద్ధం. ‘నేనేంటో చెప్పుకోండి చూద్దాం’ అన్నట్టు వ్యవహరిస్తుంటుంది. నోటితో నవ్వి నొసటితో వెక్కిరిస్తున్న చందాన ప్రవర్తిస్తుంటుంది. రష్యాలో మూడు నెలల క్రితం బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరిగినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్లు కలుసుకున్నారు. అంతకు రెండు రోజుల ముందు వాస్తవాధీన రేఖ ప్రాంతాలైన డెస్పాంగ్, దెమ్ చోక్లలో ఇరు దేశాల సైన్యాల గస్తీపై అవగాహన కుదిరింది. ఆ ప్రాంతంలో ఇకపై సైనిక విన్యాసాలకు చోటీయరాదనీ, ఉద్రిక్తతలను ఉపశమింపజేయాలనీ దాని సారాంశం. అంతేగాదు... రెండు దేశాలూ దీనిపై వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. చాన్నాళ్లుగా నిలిచిపోయిన ఇరుదేశాల ప్రత్యేక ప్రతినిధుల సమావేశం గత నెలలో జరిగింది కూడా. తీరా తాజాగా తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో చైనా సైన్యం అధునాతన సాంకేతికతలతో, అన్నిరకాల నేలల్లోనూ పనికొచ్చే వాహనాలతో, డ్రోన్లతో, మానవరహిత విమానాలతో విన్యాసాలు నిర్వహించినట్టు బయటపడింది. తన సైనిక సామర్థ్యాన్ని, కొండప్రాంతాల్లో యుద్ధ సంసిద్ధతలను అంచనా వేసుకోవటానికి షిన్ జియాంగ్ మిలిటరీ కమాండ్ రెజిమెంట్ ఈ విన్యాసాలు నిర్వహించిందంటున్నారు. అంతక్రితం మాటెలావున్నా 2020 ఏప్రిల్లో గాల్వాన్ లోయలో మన సైన్యంతో గిల్లికజ్జాలకు దిగటం ద్వారా చైనా తన కవ్వింపు చర్యల జోరు పెంచింది. అప్పుడు జరిగిన ఘర్షణల్లో మన జవాన్లు 21 మంది చనిపోగా, చైనా కూడా గణనీయమైన నష్టాలు చవిచూసింది. ఆ ఘర్షణల్లోనే బిహార్ రెజిమెంట్లో 17వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ అయిన తెలంగాణకు చెందిన బి.సంతోష్బాబు వీర మరణం పొందారు. అనంతర కాలంలో ఇరు దేశాల మధ్యా సైనిక అధికారుల స్థాయి చర్చలు జరిగాయి. కొన్ని అంశాల్లో ఒప్పందాలు కుదిరాయి. ఆ ఏడాది ఆగస్టులో రెండు దేశాల విదేశాంగమంత్రులూ భేటీ అయ్యారు. అందులో భారత్–చైనాల మధ్య పంచసూత్ర పథకం కుదిరింది. ఇకపై సామరస్యంగా మెలగాలన్నది ఆ పథకం సారాంశం. దానికి కొనసాగింపుగా రక్షణ మంత్రులు కూడా సమావేశమయ్యారు. ఆ తర్వాత వివాదాస్పద ప్రాంతాల్లో సైనికుల ఉపసంహ రణ కూడా మొదలైంది. కానీ సమస్య ఎక్కడిదక్కడే ఉంది. డెస్పాంగ్, దెమ్చోక్ ప్రాంతాల విషయం మొదటి నుంచీ జటిలమే. అందువల్లే ప్రస్తుతానికి ఇరు దేశాల సైన్యాలూ ఆ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించాలని, ఉద్రిక్తతలు ముదిరే విధంగా ఎవరూ సైన్యాలను మోహరించ రాదని మూడు నెలలక్రితం నిర్ణయించారు. కానీ చైనాకు ఏమైందో కానీ దాన్ని బేఖాతరు చేస్తూ తాజాగా విన్యాసాలు మొదలుపెట్టింది. వారంరోజుల క్రితం షిన్జియాంగ్లోని వీగర్ స్వయంపాలిత ప్రాంతంలో ఉన్న హోటాన్ నగరానికి సమీపంలో చైనా కొత్తగా రెండు కౌంటీలను ఏర్పాటు చేసిందన్న కథనాలు వెలువడటం గమనించదగ్గది. ఈ రెండూ కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్లోని ఆక్సాయ్చిన్కు సమీపంలో ఉన్నాయి. దానిలోని కొంత భూభాగం ఈ రెండు కౌంటీల్లోనూ ఉన్నదంటున్నారు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ఇది చాలదా? ఇక బ్రహ్మపుత్ర నదిపై ఒక మెగా డ్యామ్ను నిర్మించటానికి చైనా సన్నాహాలు చేస్తున్నదన్న వార్త కూడా ఇటీవలి పరిణామమే. ఎగువ ప్రాంతాల్లో ఆనకట్టలు కట్టినప్పుడు దిగువ ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందక ఇబ్బందులు తలెత్తు తాయి. భారీవర్షాల సమయంలో దిగువకు నీరు వదలటం వల్ల ఆ ప్రాంతాలు మునుగుతాయి.అందువల్లే దేశాలమధ్య ప్రవహించే నదులపై నిర్మాణాలకు పూనుకున్నప్పుడు పరస్పరం చర్చించుకుంటాయి. అందరికీ ప్రయోజనం కలిగేలా ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. కానీ మెగా డ్యామ్ నిర్మాణాన్ని చైనా ఏకపక్షంగా ప్రకటించింది. దీనిపై మన దేశం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇక అరుణాచల్ప్రదేశ్కు మన నాయకులు వెళ్లినప్పుడల్లా చైనాకు ఆగ్రహావేశాలొస్తాయి. అక్కడి ఊళ్లకు సొంత పేర్లు పెట్టుకుని మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం చైనాకు చాన్నాళ్లుగా దురలవాటు. అందుకే చైనా వ్యవహారశైలి తెలిసినవారెవరూ దాని మాటలు విశ్వసించరు. చెప్పే మాటలకు భిన్నమైన ఆచరణ ప్రదర్శించటం చైనాకు అలవాటైన విద్య. ఇరుగు పొరుగు దేశాలన్నాక సమస్యలు సహజంగా వస్తాయి. వాటిని చర్చించుకోవటం, పరస్పర అంగీకారంతో సామరస్యపూర్వక పరిష్కారాన్ని సాధించటం వివేకవంతమైన చర్య. సమస్యలను దశాబ్దాల తరబడి అలాగే వదిలేస్తే అవి జటిలంగా మారి చివరకు శత్రుత్వానికి దారితీస్తాయి. మనతో ఉన్న వివాదాల విషయంలో చైనా మొదటినుంచీ దాగుడుమూతలు ఆడుతోంది. వివాదాలను పక్కనబెట్టి వ్యాపార వాణిజ్యాలను విస్తరించుకుంటే ఇరు దేశాలూ అభివృద్ధి చెందుతాయని ఊరించి 70వ దశకం చివరిలో మనకు మైత్రీ హస్తం అందించింది మొదలు చైనా తీరుతెన్నులు ఎన్నడూ సక్రమంగా లేవు. సరిహద్దు పరిణామాలపై మన దేశం అప్రమత్తంగానే ఉన్నదని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ సోమవారం చేసిన ప్రకటన సూచిస్తోంది. వివాదాస్పద ప్రాంతాల్లో ప్రస్తుతానికి ప్రతిష్టంభన ఉన్నదని ఆయనంటున్నారు. బ్రహ్మపుత్ర నదిపై ఆనకట్ట నిర్మాణం విషయంలోనైనా, లద్దాఖ్ ప్రాంతంలో చైనా సైన్యం కదలికల విషయంలోనైనా మన దేశం దృఢంగా వ్యవహరించాలి. దేశ రక్షణకు అది తప్పనిసరి. కరచాలనం చేస్తూనే కత్తులు దూయటం ఏమైనా కావొచ్చుగానీ దౌత్య కళ కాదని చైనాకు తెలియచెప్పటం అవసరం. -
సంక్రాంతి జరీచీర
ఏదో తప్పదు కావున పెళ్లి చేసి చేతులు దులుపుకున్నారనీ, సంక్రాంతికి పిన్నీ బాబాయిలు పుట్టింటి హోదాలో తననూ భర్తనూ పిలిచేదేమీ లేదనీ తేలిపోయాక చిన్నబుచ్చుకుంది ఆ కొత్త పెళ్లి కూతురు. భర్త గమనించాడు. వాళ్లు రాసినట్టే పిలిచినట్టే ఒక కార్డుముక్క సృష్టించాడు. పండక్కు ముందు భార్యను బయల్దేరదీశాడు. పట్నానికి తీసుకెళ్లి దర్జాగా హోటల్లో దించాడు. ‘ఇదేమిటండీ’ అని ఆశ్చర్యపోయింది భార్య. ‘మరేటనుకున్నావోయ్. ఇంతకు మించిన పుట్టిల్లు లేదు. కోరిన టిఫెను, భోజనం గదిలోకే వస్తాయి. సాయంత్రమైతే సినిమాలు షికార్లు బోలెడన్ని. ఇదే నీ పుట్టిల్ల నుకొని సంతోషపడు’ అంటాడు. మనసుంటే పండగ ఉండదా? మధురాంతకం రాజారాం ‘పండగ అల్లుడు’ కథ ఇది.చార్జీలు, పండగ ఖర్చులు తలచి పాపం ఆ పేద తల్లిదండ్రులు పెద పండుగ ఊసే ఎత్తలేదు కూతురి సంగతే మరిచినట్టు. అల్లుడు అది గమనించాడు. పండక్కు తన భార్య కొత్తచీర కట్టుకుంటే ఆ మురిపెం వేరు. సింగారమూ వేరు. కోర్టు గుమాస్తా అతను. చిన్న జీతమే. కాని పెద్ద మనసు. రిక్షా ఎక్కడం మానేశాడు. బయట టిఫెన్లు కాఫీలు మానేశాడు. నాటకాలు చూడ్డం మానేశాడు. పుస్త కాలు కొనడమున్నూ. ప్రతి పైసాను పొదుపు చేసి తెచ్చాడు ఆఖరుకు ‘పుల్లంపేట జరీచీర’! పది హేను మూరల ఆ జరీచీర కట్టుకుని కళకళ్లాడిన భార్య ‘ఇంత కష్టం చేసి నా కోసం తెచ్చారా’ అని భర్త కంఠార తల ఆన్చి బాష్పాలు రాలుస్తుంది. సయోధ్య ఉంటే కాపరం పండగే. శ్రీపాద కథ ఇది.కరువు రోజుల్లో పండగంటే ఎంత కష్టం. ఇంటి పెద్ద మనసు కష్టపెట్టుకుంటూనే ఎక్కడ ఏది సర్ది చెప్పాలా అని ఆగమవుతూ ఉంటాడు. పిల్లలకిది పడుతుందా? పండగ మరో నెలుందనగానే తట్టలు పట్టి ఎక్కడి పేడంతా సేకరించి పిడకలు కొట్టి ఆరబెట్టారు. ‘ఎన్నర్రా’ అని తండ్రి అడిగితే ‘300’ అన్నారు గర్వంగా. తండ్రికి ఎన్నో ఆలోచనలు. వాటిని పొయ్యిలోకి వాడితే కట్టెలైనా మిగిలి నాలుగు పైసలు ఆదా అవుతాయి గదా అని. ‘ఇవ్వండ్రా’ అనంటే ‘ఊహూ’. భోగి మంటలేసి ఎగిసే మంటలను చూసి పక్కింటివాళ్లను ఓడిస్తేనే పిల్లలకు ఆనందం. పేదవాడికి పండగంటే ‘సర్దుబాటే’. సాక్షాత్తూ ఆరుద్ర రాసిన కథ ఇది. అయితే ‘ఇప్పటి భోగిమంటలు ఒక మంటలేనా’ అంటారు ముళ్లపూడి వెంకట రమణ. జగన్నా థుని రథమంత ఎత్తున లేసేలా వేస్తేనే వేసినట్టట. ‘ఒరే ఫ్రెండూ... వెళ్లి రెండు బైండింగ్ అట్టలైనా పట్టుకురారా మంట పెంచుదాం’ అనంటే ఎవరింట ఉన్నాయట బైడింగ్ అట్టలూ పుస్తకాలూనూ. కోళ్లగంపలూ తాటాకు బుట్టలూ తప్ప. కావున జానెడు ఎత్తు మంటే జగన్నాథుడితో సమానం. అయితే పిల్లకారుకు చిన్న సరదా ఉందిలే. ఆ చిరుచీకట్లలో ప్లీడరు శేషయ్యగారి బోర్డు ఊడబెరికి మంటల్లో వేసి గోడ ఖాళీ ఎందుకని భోజనం తయార్ బోర్డు తెచ్చి అక్కడ వేళ్లాడదీశారు. పండగంటే పిల్లల అల్లరిది. జీవితాంతం చెప్పుకునేటందుకు జ్ఞాపకమై గూడుకట్టేది. ముళ్లపూడి ‘భోగి మంటలు’ బలే సరదా కథ. అయితే స్త్రీగళాన్ని ఎలా వదిలేస్తాం? ఒక సింగిల్ ఉమన్కు అందరూ గది అద్దెకిస్తారుగాని ఒకటే షరతు... రోజూ ఇంటి ముందర ముగ్గేయాలని. ఆ సింగిల్ ఉమన్ మంచి జర్నలిస్టు. ఆలోచనాశీలి. సమాజానికి పనికొచ్చే పనులు చేయగలిగినది. మించి తన జీవి తాన్ని తాను నిర్మించుకోగలిగేది. అయినా సరే. ముగ్గేయాల్సిందే. ‘నాకు రాదు... వచ్చినా వేయను’... ‘పనిమనిషితోనైనా వేయించు’... పండుగ నెల వచ్చిందంటే ఆమెకు గండం. ముగ్గు లేని వాకిలిగా ఆమె ఇల్లే కనపడుతుంది. ఆ నెల్లో యజమాని ఖాళీ చేయించడం ఖాయం. మరో గదికి చలో. ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలట. ఇల్లాలి చదువు, జ్ఞానం, వికాసం వీటి వల్ల కాదా దేశానికి పండగ వచ్చేది? పి.రామకృష్ణారెడ్డి కథ ‘ముగ్గు’.సంక్రాంతి తెలుగువారి ముఖ్యమైన పండగ. యుగాంతం వరకూ నిలిచే పండగ. సంస్కృతిని ఎప్పటికీ కాపాడుకోవాల్సిందే. కాని సందర్భాలలోని అంతరాలను చూసి సరిచేసి పండుగ అర్థాన్ని విశాలం చేసుకోవాలి కూడా. ‘గుమ్మం ముందు బొబ్బిలిపాట గాళ్లేమిటి... బుడబుక్కల వాళ్లేమిటి... తందానపదం వాళ్లేమిటి... గంగిరెడ్ల వాళ్లేమిటి... పగటి వేషగాళ్లేమిటి... తోలు బొమ్మలాళ్లేమిటి... ఎరకలాళ్లేమిటి... చెంచులాళ్లేమిటి... జంగాలేమిటి... సన్నాయి వాళ్లేమిటి... వీళ్లంతా నిమిష నిమి షానికి వచ్చేవాళ్లే’ అని రాస్తారు కవికొండల వేంకటరావు ‘మా ఇంట సంక్రాంతి’ కథలో. పండగ ఒకరు చేసుకునేదిగా... మరొకరు వారింటి ముందుకు వచ్చి ఇనాము అడిగేదిగా ఎందుకు ఉండాలి? ఇనాము ఇచ్చే స్థాయిలో ఒకరు, పొందే స్థాయిలో ఒకరు ఉంటే అది న్యాయమైన సమాజమేనా? జన్మ అంతరాలు, ఆర్థిక అగాథాలనే కాబోలు భోగిజ్వాలల్లో పడేయాల్సింది. గాయకుడు పుట్టా పెంచల్దాసు ‘యేటంబిడ యేడుచ్చా పోయా’ అనే కథను రాశాడు. భోగి రోజు పండగ చేసుకోనీకుండా, ఇల్లు గడిచేందుకు భత్యాలు తీసుకురమ్మని తల్లి పోరుపెడితే, చీకటితో బయల్దేరి ఇంటింటా పాటలు పాడి గింజలు, వడ్లు తీసుకుని చీకటి పడ్డాక ఇల్లు చేరి, అప్పుడు కొత్త బట్టలు కట్టుకుని ఎవరికి చూపించుకోవాలో తెలియక దిగాలు పడే పసివాడి కథ అది. దుఃఖం వస్తుంది. సంక్రాంతి ఎంతో సంబరమైన పండగ. కాని సమకాంతికై అది చేసే వాగ్దానాన్ని మనం ఇంకా అందుకోవలసే ఉంది. సామాజికంగా అందరూ అడుగు పెట్టగలిగేదే ఉత్తరాయణం అంటే. క్రాంతి రావడమే సరైన సంక్రాంతి. అటువంటి సంక్రాంతిని కాంక్షిస్తూ గుమ్మడి పూల, పసుపు చేమంతుల శుభాకాంక్షలు! -
భయం వద్దు... జాగ్రత్త ముద్దు!
మాస్కులు... చేతుల పరిశుభ్రత... తదితర జాగ్రత్తలు మళ్ళీ బలంగా వినిపిస్తున్నాయి. హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (హెచ్ఎంపీవీ) వల్ల చైనాలో వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో, మన దేశంలోనూ కేసులు కొన్ని బయటపడడంతో జనం ఉలిక్కిపడుతున్నారు. ఒక్కసారిగా పాత కరోనా జ్ఞాపకాలు ముప్పిరిగొంటున్నాయి. చైనా వార్తలతో సోమవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సెన్సెక్స్ 1.5 శాతం పైగా పడిపోవడం గగ్గోలు రేపుతోంది. ఉత్తరాన చైనాకు సమీపంలో ఉన్నందున ప్రజా సంబంధాలు, ఆర్థిక సంబంధాల రీత్యా స్వైన్ఫ్లూ, ఏవియన్ ఫ్లూ, కోవిడ్ల లానే ఇది కూడా వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో శ్వాసకోశ అనారోగ్యాలపై ఓ కన్నేసి ఉంచాలనీ, వేయికళ్ళతో పరిస్థితిని కనిపెట్టాలనీ, ఒకరి నుంచి మరొకరికి హెచ్ఎంపీవీ వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ప్రజల్లో చైతన్యం తేవాలనీ రాష్ట్రాలకు కేంద్ర సర్కార్ తాజాగా సూచనలు జారీ చేయడం గమనార్హం. హెచ్ఎంపీవీ సహా అలాంటి అనేక ఇతర వైరస్ల వల్ల చైనాలో ఇప్పటికే భారీ సంఖ్యలో శ్వాసకోశ వ్యాధులు ప్రబలాయి. ఆ దేశంలో జనం మాస్కులు ధరించి ఆస్పత్రుల్లో, బయట సంచ రిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ సహా ప్రపంచమంతటా ఈ కేసులపై దృష్టి పెరిగింది. హెచ్ఎంపీవీ వైరస్ వ్యవహారం చర్చనీయాంశమైంది. కోవిడ్ సృష్టించిన భయోత్పాతం రీత్యా, వైరస్లు, మహమ్మారుల పేరు చెప్పగానే జనం సహజంగానే బెంబేలెత్తిపోతున్నారు. ప్రజల్లో వ్యక్తమవుతున్న ఈ భయాందోళనలు అర్థం చేసుకోదగినవే. నిజానికి, హెచ్ఎంపీవీ కొత్త వైరస్ ఏమీ కాదు. శాస్త్రవేత్తలు 2001లోనే తొలిసారి దీని జాడ గుర్తించారు. వైరస్ స్వభావం, అది సోకినప్పటి లక్షణాల గురించి అవగాహన కూడా వచ్చింది. అయిదేళ్ళ లోపు చిన్నారులకూ, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికీ, వృద్ధులకూ ఈ వైరస్ సోకే ప్రమాదం అధికం. అందువల్లే, హెచ్ఎంపీవీతో తంటా చాలాకాలంగా ఉన్నదేననీ ఓ వాదన. అసలు మన దగ్గర తాజాగా ఈ కేసులు చాలా గమ్మత్తుగా బయటపడ్డాయి. అంతకంతకూ చలి ముదురుతున్న ఈ శీతకాలంలో శ్వాసకోశ అనారోగ్యాలను పసిగట్టి, వాటిపై నిఘా ఉంచేందుకు ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ (ఐసీఎంఆర్) ఎప్పటిలానే చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో ఈ వైరస్ బాధిత కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే, దేశంలో శ్వాసకోశ వ్యాధి పీడితుల్లో అనూహ్యమైన పెరుగుదల ఏదీ ఇప్పటికీ కనిపించలేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేయడం ఒకింత ఊరటనిస్తోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధమై ఉన్నామన్నది ఆ శాఖ ఆశ్వాసన. ఆ మాటకొస్తే, దేశంలో శ్వాసకోశ, సీజనల్ ఇన్ఫ్లుయెంజా కేసులను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండడం ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం చేసేదే. ఇప్పుడు హెచ్ఎంపీవీ పరిస్థితిపై ఒక్క సారిగా గగ్గోలు రేగడంతో అంతర్జాతీయ సంస్థలతోనూ సంప్రతిస్తున్నట్టు అధికారిక కథనం. కరోనా మొదలు నేటి హెచ్ఎంపీవీ దాకా అన్నీ చైనా కేంద్రంగా వార్తల్లోకి రావడంతో అనేక అనుమానాలు, భయాలు తలెత్తుతున్నాయి. చైనా సర్కార్ మాత్రం పౌరులతో పాటు తమ దేశానికి వచ్చే విదేశీ పర్యాటకుల ఆరోగ్యాన్ని సైతం కాపాడతామంటూ భరోసా ఇస్తోంది. బీజింగ్ ఎన్ని మాటలు చెప్పినా, గత చరిత్ర కారణంగా ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ నమ్మకం కుదరడం లేదు. చిత్రమేమిటంటే, ప్రస్తుత ఇన్ఫెక్షన్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఎలాంటి ప్రకటన, మార్గదర్శకాలు విడుదల చేయనేలేదు. విదేశీ ప్రయాణాలు చేయనివారికి సైతం హెచ్ఎంపీవీ సోకినట్టు వార్తలు రావడంతో, ఇది సీజనల్ సమస్యే తప్ప మరేమీ కాకపోవచ్చనే అభిప్రాయమూ ఉంది. చలికాలంలో ఇన్ఫెక్షన్లు సాధారణమే. అయితే, సరైన సమాచారం లేనప్పుడు పుకార్లు షికార్లు చేసి, లేనిపోని భయాలు సృష్టించి, ఆర్థిక, సామాజిక నష్టానికి దారి తీసే ముప్పుంది. జనవరి 13 నుంచి 45 రోజులు ప్రయాగలోని కుంభమేళాకు 40 కోట్ల పైగా భక్తులు హాజరవు తారని అంచనాలున్న వేళ అప్రమత్తత అవసరం. వైరస్ల విహారానికి ముకుతాడు వేయడం ముఖ్యం. కోవిడ్–19 కాలంలో లానే తరచూ చేతులను సబ్బునీళ్ళతో కడుక్కోవడం, చేతులు కడుక్కోకుండా కళ్ళు–ముక్కు–నోటిని తాకకపోవడం, వ్యాధి లక్షణాలున్న వారితో సన్నిహితంగా మెలగక పోవడం, దగ్గు – తుమ్ములు వచ్చినప్పుడు ముక్కు – నోటికి అడ్డు పెట్టుకోవడం, మాస్కులు ధరించడం ఉత్తమం. అసలు కరోనా, హెచ్ఎంపీవీ లాంటి వాటితో సంబంధం లేకుండా ఈ ఖర్చులేని సర్వసాధారణ జాగ్రత్తలను మన నిత్యజీవితంలో భాగం చేసుకోవడం ఆరోగ్య పరిరక్షణకు మరీ ఉత్తమం. కోవిడ్ అనుభవం ప్రపంచానికి నేర్పిన పాఠం – అప్రమత్తత. దేన్నీ తేలిగ్గా తీసుకోవద్దనీ, ఎట్టి çపరిస్థితుల్లోనూ స్వీయరక్షణ చర్యలను వదిలిపెట్టవద్దనీ తేల్చిచెప్పింది. దేశంలో 78 శాతం మేర చొచ్చుకుపోయిన మొబైల్ ఫోన్లనూ, 65 కోట్ల మందికి పైగా వీక్షకులున్న దూరదర్శన్నూ ప్రజాహిత సమాచార ప్రచారానికి వినియోగించాలి. అంతేకాక, ఇలాంటి వివిధ రకాల వైరస్లు, వ్యాధులకు దేశంలో టెస్టింగ్ సౌకర్యాలను విస్తరించాలి. ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసుకుంటేనే అవాంఛనీయ పరిస్థితుల్ని ఎదుర్కొనే సామర్థ్యం సిద్ధిస్తుంది. వైరస్ల తీవ్రత తక్కువ, ఎక్కువలతో సంబంధం లేకుండా పాలకులు పారిశుద్ధ్యం, స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణంపై శ్రద్ధ పెట్టడం అవసరం. వ్యాధులు ప్రబలాక చికిత్సకు శ్రమించే కన్నా, వైరస్లను ముందే పసిగట్టి, వాటి విజృంభణను నివారించేందుకు సర్వసన్నద్ధం కావడం అన్ని విధాలా ఉపయుక్తం, శ్రేయస్కరం. -
సురక్షిత డిజిటల్ ప్రపంచం కోసం!
కాలం మారుతున్నకొద్దీ, సాంకేతికతలు విస్తరిస్తున్నకొద్దీ కొత్త భయాలు పుట్టుకొస్తాయి. తమ పిల్లలు సోషల్ మీడియా వ్యామోహంవల్ల చెడిపోతున్నారని కొన్నాళ్లుగా తల్లిదండ్రుల్లో బెంగ పట్టు కుంది. అక్కడ తారసపడే విశృంఖల పోకడలు, తప్పుడు భావాలు పిల్లల మెదళ్లపై దుష్ప్రభావం కలగ జేస్తున్నాయి. వారి బాల్య, కౌమార దశలను కొల్లగొడుతున్నాయి. పిల్లలకు మాదకద్రవ్యాలు అల వాటు చేయడంలో సామాజిక మాధ్యమాల పాత్ర కాదనలేనిది. నిజానికి సోషల్ మీడియా దుర్వ్యసనంగా మారిన వైనమూ, దాని పర్యవసానాలూ చెదురుమదురుగా కనిపిస్తూనే ఉన్నాయి. కొత్త సాంకేతికతలు అందుబాటులోకి వచ్చినప్పుడు కొత్త తలనొప్పులు సహజమే. ఈ నేపథ్యంలో 18 ఏళ్ల లోపు పిల్లలు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరవటానికి తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి చేస్తూ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్టం ముసాయిదా నిబంధనలను కేంద్రం రూపొందించింది. అభ్యంతరాలు, సూచనలు వచ్చే నెల 18లోగా తెలియజేయాలని కోరింది.డేటా పరిరక్షణ కోసం, వ్యక్తిగత గోప్యత భద్రత కోసం ఒక చట్టం అవసరమన్న సంగతిని మన పాలకులు గ్రహించటంలో అలవిమాలిన జాప్యం చోటుచేసుకుంది. పౌరుల వేలిముద్రలు, బ్యాంకు ఖాతాలతో సహా సమస్త వివరాలనూ సేకరించే ఆధార్ వ్యవస్థ తీసుకొచ్చిన ఏడెనిమిదేళ్ల వరకూ ఆ డేటా పరిరక్షణకు ఎలాంటి కట్టుదిట్టాలు అవసరమన్నది ఎవరికీ తట్టలేదు. 2017లో జస్టిస్ పుట్టస్వామి పిటిషన్పై ఇచ్చిన తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు వ్యక్తిగత గోప్యతను తొలిసారి ప్రాథమిక హక్కుగా గుర్తించింది. మరో ఆరేళ్ల తర్వాత 2023 ఆగస్టులో డీపీడీపీ చట్టం వచ్చింది. దాని అమలుకు సంబంధించిన నిబంధనల రూపకల్పనకు మళ్లీ ఇన్ని నెలలు పట్టింది. సామాజిక మాధ్యమాల దుష్ప్రభావం గురించి ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్న వర్త మానంలో ఈ అంశంపై ఇప్పటికైనా ముసాయిదా నిబంధనలు రావటం హర్షించదగ్గది. ప్రస్తుతం ఎటునుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని వాతావరణంలో ప్రపంచం మనుగడ సాగిస్తోంది. గోడలకు చెవులుంటాయన్నది పాత సామెత. స్మార్ట్ ఫోన్లకు చెవులే కాదు... కళ్లు కూడా ఉంటున్నాయి. మనం పక్కవారితో సాగించే పిచ్చాపాటీని సైతం వినే సదుపాయం ఆ ఫోన్లలో ఉంటున్నదని, మన ఇష్టాయిష్టాలు తెలుసుకోవటం, వాటి ఆధారంగా డేటా రూపొంది క్షణాల్లో ఎవరెవరికో చేరిపోవటం రివాజైందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఫోన్లు వినియోగించనప్పుడు సైతం వాటి కెమెరాలు కళ్లు తెరిచే సాంకేతికత ఉన్నదంటున్నారు. ఇలాంటి ఫోన్లు తెలిసీతెలియని వయసులో ఉన్న పిల్లలకు ఎంత చేటు తీసుకురాగలవో ఊహించటానికి కూడా భయం వేస్తుంది. అందువల్లే ఎప్పుడెప్పుడు తగిన నిబంధనలు వస్తాయా అని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. తమ డేటా, బ్యాంకు ఖాతాల సమాచారం బయటకెలా పోతున్నదో తెలియక పెద్దలు కంగారు పడుతుంటే సామాజిక మాధ్యమాల్లో దుండగుల బారినపడి పిల్లలు తల్లడిల్లు తున్నారు. వినియోగదారుల డేటా సేకరణలో పారదర్శకతనూ, ఎందుకోసం సేకరిస్తున్నారో వెల్ల డించటాన్నీ నిబంధనలు తప్పనిసరి చేస్తున్నాయి. ఒకవేళ సంస్థల అజాగ్రత్త వల్ల లేదా ఉద్దేశపూర్వక చర్యవల్ల డేటా లీకైతే ఫిర్యాదు చేయటానికి కూడా ఏర్పాట్లున్నాయి. అలాగే సంస్థల్లో డేటా సేకర ణకు అనుసరిస్తున్న విధానాలను సవాలు చేయటానికి, వివరణ కోరటానికి అవకాశం ఉంది. నిబంధనల అమలును పర్యవేక్షించటానికి ప్రభుత్వం డేటా పరిరక్షణ బోర్డు (డీపీబీ) ఏర్పాటు చేస్తుంది. ఇదిగాక ప్రతి సంస్థా తమ ఖాతాదార్ల గోప్యత దెబ్బతినకుండా చూసేందుకు, వినియోగదారుల నుంచి అవసరమైన అనుమతులు పొందేందుకు డేటా పరిరక్షణ ప్రత్యేక అధికారిని నియమించు కోవటం, నిఘా పెట్టడం తప్పనిసరవుతుంది. డేటా లీక్ను అరికట్టడంలో విఫలమయ్యే సంస్థకు రూ. 250 కోట్ల వరకూ జరిమానా విధిస్తారు. మొత్తంగా మనం పౌరుల డేటా పరిరక్షణలో వెనకబడినట్టే, సామాజిక మాధ్యమాల దుష్ప్ర భావాల నుంచి పిల్లల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్న విషయంలోనూ వెనకబడ్డాం. ఐక్యరాజ్యసమితి సభ్యదేశాల్లో 137 దేశాలు చాన్నాళ్ల క్రితమే డేటా పరిరక్షణ చట్టాలు తెచ్చాయి. అమెరికాలో పదమూడేళ్లలోపు పిల్లలు ఆన్లైన్ వీక్షణపై కఠిన నిబంధనలున్నాయి. యూరప్లో పదహారేళ్లలోపు పిల్లలకు తల్లిదండ్రుల అనుమతి అవసరం. ఆస్ట్రేలియా సామాజిక మాధ్యమాల్లో పదహారేళ్లలోపు పిల్లల ప్రవేశంపై ఇటీవలే పూర్తి నిషేధం విధించింది. మన దేశంలో లేదుగానీ... టిక్టాక్ వల్ల విదేశాల్లో ఎన్నో సమస్యలొస్తున్నాయి. టీనేజ్ పిల్లల్లో 58 శాతంమంది దాన్ని చూస్తు న్నారని ఒక సర్వే చెబుతోంది. పసిహృదయాలకు ఉండాల్సిన అమాయకత్వం మాయమై అవాంఛ నీయ పోకడలు ప్రవేశించి వారిలో విషబీజాలు నాటుతున్నాయి. తప్పుడు భావాలూ, అభిప్రా యాలూ వ్యాపిస్తున్నాయి. పిల్లల సంగతలావుంచి... పెద్దలే వాటి మాయలో పడి తప్పుడు నిర్ణ యాలు తీసుకుంటున్నారు. ఆర్థికంగా కలిగే నష్టం నేరుగా కనబడుతుంది. కానీ మానసికంగా అది కలగజేసే ప్రభావం లెక్కకు అందనిది. ఇప్పుడు ఏఐ సైతం వచ్చి ప్రమాద తీవ్రతను పెంచింది. పిల్లల ముచ్చట కాదనకూడదని కార్లు, టూ వీలర్లు అందించి కొందరు తల్లిదండ్రులు పరోక్షంగా వారి చావుకు కారణమవుతున్నారు. ప్రజలకు ముప్పు కలిగిస్తున్నారు. అందువల్ల సామాజిక మాధ్య మాల్లో పొంచి వుండే ప్రమాదాలపై ముందు తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలి. పిల్లల సంరక్షణకు ఇది తప్పనిసరి. -
జీవితపు తాళంచెవి
‘‘ఉదయం నాలుగు కాళ్లతో, మధ్యాహ్నం రెండు కాళ్లతో, సాయంత్రం మూడు కాళ్లతో నడిచేది ఏమిటి?’’ క్రీస్తు పూర్వ కాలపు గ్రీకు విషాదాంత నాటక రచయిత సోఫోక్లిస్ రాసిన ‘ఈడిపస్ రెక్స్’ నాటకంలో ‘స్ఫింక్స్’ అడిగే ఈ చిక్కుప్రశ్న పాశ్చాత్య సాహిత్యంలో శ్రేష్ఠమైనది. థీబ్స్ నగరంలోకి ప్రవేశించాలంటే– మనిషి ముఖం, సింహం శరీరం, గద్ద రెక్కలుండే స్ఫింక్స్ ప్రశ్నలకు సమాధానం చెప్పే తీరాలి. లేదంటే మరణం తప్పదు. చివరకు రాజు ఈడిపస్ వాటికి జవాబు చెప్పి, ఆ విచిత్ర జీవి పీడను వదిలిస్తాడు. పాకే బాలుడిగా నాలుగు కాళ్లతో, నిటారుగా నిలబడే యువకుడిగా రెండు కాళ్లతో, వృద్ధుడిగా కర్ర ఊతంగా మూడు కాళ్లతో నడిచే ‘మనిషి’ దీనికి సమాధానం. ఇందులోదే మరో ప్రశ్న. ఇద్దరు అక్కాచెల్లెళ్లు. అక్క చెల్లికి జన్మనిస్తే, తిరిగి చెల్లి అక్కకు జన్మనిస్తుంది. ఏమిటి ఇందులోని మర్మం? ఆ అక్కాచెల్లెళ్లు రాత్రీ పగలూ అని తెలిస్తే, ఆ రోజు ఎంత బాగుంటుంది!ఇలాంటి చిక్కు ప్రశ్నలు సాహిత్యంలో లెక్కకు మిక్కిలిగా కనబడతాయి. కూట ప్రశ్న, పొడుపు కథ, ప్రహేళికగా అర్థం ఉన్న ‘రిడిల్స్’ ఆబాలగోపాలాన్నీ అలరిస్తాయి. ‘పొడుపు కథల’ రూపంలో చెప్పినప్పుడు పిల్లలు వాటికోసం చెవులు అప్పగిస్తారు; పెద్దలకు జ్ఞానచక్షువులు తెరుచుకుంటాయి. ఏ స్థాయిలో వారికి ఆ స్థాయి కఠినత్వం, విస్తృతి వీటిల్లో కలగలిసి ఉంటాయి. అందుకే ఇవి సాహిత్యంలో ఒక మనోహరమైన అంశంగా ప్రత్యేకంగా కనబడతాయి. జీవితంలోని సంక్లిష్టతలను తేలిగ్గా విడమరిచి చెప్పడానికి పనికొస్తాయి.నాలుగు వేల ఏళ్ల క్రితం నుంచే జనం తమ మేధాశక్తిని, విశ్లేషణా సామర్థ్యాలను చిక్కుప్రశ్నలతో సాన పట్టుకున్నారు. ప్రపంచానికి తెలిసిన తొట్టతొలి చిక్కుప్రశ్నల్లో ఒకటి ఒకప్పటి సుమేరియన్ (ఇప్పటి ఇరాక్ ప్రాంతం) నాగరికతా సాహిత్యంలో కనిపిస్తుంది. ‘అక్కడొక ఇల్లుంది. అందులోకి ఒకరు గుడ్డివాడిగా ప్రవేశించి, చూపుతో బయటికి వస్తారు. ఏమిటది?’ ప్రపంచానికి రాత రూప పలకలను పరిచయం చేసిన సుమేరియన్ నాగరికత మనిషి విజ్ఞానానికి అమితమైన ప్రాధాన్యతను ఇచ్చింది. అందుకే పై ప్రశ్నకు ‘బడి’ సమాధానం కావడంలో ఆశ్చర్యం లేదు. అజ్ఞానం అనేది అంధత్వమే కదా! చదువుతో వచ్చే జ్ఞానం మనిషికి ఒక కొత్త చూపునిస్తుంది కదా! ‘‘పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘రాజా, శ్రమ తెలియకుండా ఉండటానికి’’ అంటూ ప్రారంభించి ఒక కథ చెప్పడమూ, ఆ కథ చివర పలు ప్రశ్నలు సంధించడమూ, ఆ కథలోని ప్రశ్నలకు ‘సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల వేయి ముక్కలుగా పగిలిపోతుంది’ అని షరతు విధించడమూ, విక్రమార్కుడు జవాబు చెప్పి ‘మౌనభంగం కాగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టెక్క’డమూ తెలుగు బాల కథా సాహిత్యంలో ఒక అరుదైన ధారావాహిక వేడుక. మూలంలోని భట్టి విక్రమార్క కథల్లో బేతాళుడు అడిగిన 23 ప్రహేళిక ప్రశ్నల నమూనాలోనే ‘చందమామ’ పత్రిక ఎన్నో ప్రశ్నలను సంధించింది. అయితే, అసలు మూలంలో విక్రమార్కుడంతటివాడు కూడా జవాబు ఇవ్వలేని ప్రశ్న ఏమిటి? ఇరువురికీ భార్యలు లేని ఓ తండ్రి కొడుకులు తోవలో పాదముద్రలను చూసి, పెద్ద పాదాలావిడను తండ్రీ, చిన్న పాదాలావిడను కొడుకూ పెళ్లాడాలనుకుంటారు. తీరా పెద్ద పాదాలావిడ కూతురుగానూ, చిన్న పాదాలావిడ తల్లిగానూ తేలుతుంది. అయినా ఇచ్చుకున్న మాట ప్రకారమే వాళ్లు పెళ్లి చేసుకుంటారు. అప్పుడు ఆ ఇద్దరికీ చెరొక కొడుకు పుడితే, వాళ్లు వరుసకు ఏమవుతారు? బేతాళుడు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం లేక, విక్రమార్కుడు సహేతుక మౌనం వహించడంతో బేతాళుడు ఆయన వశమవుతాడు. కాలగమనంలో సడలనున్న నైతిక నియమావళికి ఈ ప్రశ్నొక ముందుచూపు. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ‘వడ్లగింజలు’ కథలోని ఇతివృత్తం ఒక ప్రశ్న కాకపోయినా చిక్కుతో ముడిపడినదే. ‘‘చదరంగానికి అరవై నాలుగు గదులు. మొదటి గదిలో వొక వడ్లగింజ వుంపించండి. తరవాత రెండో గదిలో రెండు, మూడో గదిలో నాలుగు, నాలుగో గదిలో యెనిమిది– యిలాగా వెళ్లినకొద్దీ రెట్టింపు చేయిస్తూ నాకు వడ్లగింజలు దయచేయించండి మహాప్రభూ’’ అంటూ తాను చదరంగంలో గెలిస్తే ఏమివ్వాలో తన ప్రత్యర్థి అయిన ‘శ్రీ వత్సవాయి చతుర్భజ తిమ్మజగపతి మహారాజులు’ గారికి తంగిరాల శంకరప్ప సవినయంగా విన్నవించుకుంటాడు. తీరా ఆటలో మహారాజును కట్టడి చేశాక, ‘‘మహాప్రభూ! వారి కోరిక తీర్చాలంటే పెద్దాపురం రాజ్యంలోనే కాదు, త్రిలింగ దేశం అంతటా వరాసగా నూరు సంవత్సరాలు పండిన ధాన్యం అయినా చాలదు’’ అని తేలినప్పుడు అందరూ నోరెళ్లబెట్టవలసి వస్తుంది. సాహిత్యంలో ఇలాంటి చిక్కుప్రశ్నలు మాటల ఎత్తుగడలను, భాషాపటిమను చాటుతాయి. పాత్ర లక్షణాలను బహిర్గతం చేయడానికీ, వాటి తెలివితేటలను తెలియజెప్పడానికీ, కథను ముందుకు నడపడానికీ కూడా రచయితలు వాటిని ఉపయోగించుకున్నారు. ఈ చిక్కుప్రశ్నలు తరచుగా జ్ఞానం, అవగాహన కోసం మానవుడు చేసే అన్వేషణను సూచిస్తాయి. జీవితం అనేది ఒక తాళం అయితే, దాన్ని తెరిచే తాళంచెవి ఒక కూటప్రశ్న. అదే సమయంలో అది ఒక మనోవ్యాయామం, ఒక భాషావినోదం, ఒక తాత్విక పరిమళం, ఒక జీవిత రహస్యం కూడా! -
సాగునీళ్లూ షాక్ కొడతాయా?
‘‘టంగుటూరు మిరియాలు తాటికాయలంత...’’. తెలుగు నాట ఇదొక సామెత. చేతలు గడప దాటకుండానే మాటల్ని కోటలు దాటించే కోతల రాయుళ్లపై ఇటువంటి సామెతలు చాలానే ఉన్నాయి. ఈ మధ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎడాపెడా విసురుతున్న మాటల ఈటెల్నీ, పలుకుతన్న పద జాలాన్నీ చూస్తుంటే ఈ సామెతలు సరిపోవనిపిస్తున్నది. ‘విజన్–2047’ పేరుతో ఆయన అట్టహాసంగా ఓ డాక్యుమెంట్ను ఇటీవల విడుదల చేశారు. ఈ విజన్ దెబ్బకు ఇంకో ఇరవై మూడేళ్లలో ఏపీ స్టేట్ ‘ఏక్ నంబర్ స్టేటస్’ చేరుకోనున్నదని ఆ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు. ‘ఏక్ నంబర్ స్టేటస్’ వస్తున్నప్పుడు స్పెషల్ స్టేటస్ ఎందుకనుకున్నారేమో గానీ, ఆ డాక్యుమెంట్లో అటువంటి ప్రస్తావన లేదు.చంద్రబాబు పార్టీకి గానీ, యెల్లో మీడియాకు గానీ ఇలా గొప్పలకు పోవడం, డప్పు వాయించుకోవడం కొత్తేమీ కాదు. కానీ, వారు ప్రగల్భాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. జనం మీదకు తేనె పూసిన కత్తుల్ని విసురుతున్నారు. విష గుళికలకు విజన్ లేబుళ్లు వేస్తున్నారు. కాకుల్ని కొట్టి, గద్దల్ని మేపే సామాజిక దుర్నీతి ఆయన తాజా విజన్ నిండా పరుచుకున్నదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఆ విజన్ డాక్యుమెంట్ మీద ఇంకా పూర్తి స్థాయి చర్చ ప్రారంభం కాక ముందే, అందులోంచి ఆయన ఓ జలపాత దృశ్యాన్ని బయటకు తీశారు. అరుంధతీ నక్షత్రం మాదిరిగా యెల్లో మీడియా దాన్ని ప్రజలకు చూపెట్టింది. ఈ నక్షత్రానికి ఆయన ‘తెలుగుతల్లికి జలహారతి’ అని నామకరణం కూడా చేసుకున్నారు.ఈ ‘జలహారతి’ పథకం తన ‘మానస పుత్రిక’ని కూడా బాబు ప్రకటించుకున్నారు. ‘విజన్ డాక్యుమెంట్’లో పండంటి రాష్ట్రానికి పది సూత్రాలని చెప్పుకున్నారు. ఆ పది సూత్రాల్లో ఒకటి ‘జలభద్రత’. నదుల అనుసంధానం ద్వారా ‘జలభద్రత’ కల్పించాలన్న ఒక అంశానికి కొనసాగింపుగా ఈ ‘జలహారతి’ పథకాన్ని ప్రకటించారు. ఈ విజన్ను కొంత లోతుగా తరచి చూస్తే, ఇందులో ఎంత ప్రజావ్యతిరేకత దాగి ఉన్నదో, పెత్తందారీతనపు ఫిలాసఫీ ఎలా ఇమిడి ఉన్నదో అవగతమవుతుంది.2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే, నాటి ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. జల వనరుల అధికార్లు,ఇంజినీర్లతో పలు దఫాల సమీక్ష, సాంకేతిక అంశాల పరిశీలన తర్వాత ఒక సమగ్ర నివేదిక (డీపీఆర్)ను జగన్ ప్రభుత్వం తయారు చేసింది. పోలవరం కుడి కాల్వ ప్రవాహ సామర్థాన్ని పెంచి, ఈ కొత్త ప్రాజెక్టుకు అవసరమైన నీటిని కూడా దాని ద్వారా తరలించి ప్రకాశం బరాజ్కు చేర్చాలని నిర్ణయించారు. అక్కడి నుంచి సాగర్ కుడి కాల్వను ఉపయోగించుకొని, బొల్లాపల్లి దగ్గర కొత్తగా నిర్మించే రిజర్వాయర్కు చేరుస్తారు. అక్కడి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి చేర్చాలి. ఇదీ ప్రాజెక్టు.ఈ ప్రాజెక్టు వల్ల సాగర్ కుడి కాలువతో పాటు, వెలిగొండ, తెలుగుగంగ, ఎస్సార్ బీసీ, గాలేరు–నగరి తదితర ప్రాజెక్టుల కింద ఉన్న 22 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం జరు గుతుంది. అదనంగా ఏడున్నర లక్షల ఎకరాల ఆయకట్టు చేరుతుందనీ, 80 లక్షల జనాభాకు తాగునీటి వసతి లభిస్తుందనీ అంచనా వేశారు. ఇందులో నదుల అనుసంధానానికి సంబంధించిన అంశం ఇమిడి ఉన్నందువల్ల అనుసంధానం కేంద్రం బాధ్యత కనుక ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని ప్రధాన మంత్రికి జగన్ మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధాని సూచన మేరకు ‘కేంద్ర జలసంఘం’ అనుమతి కోసం 2022లోనే రాష్ట్రం ఈ ప్రాజెక్టుపై డీపీఆర్ను సమర్పించింది.అదిగో అదే డీపీఆర్ను ఇప్పుడు బయటకు తీసి తన మానస పుత్రికగా చంద్రబాబు ప్రకటించుకున్నారు. నామకరణ మహోత్సవాన్ని కూడా జరుపుకున్నారు. అయితే ఇందులో ఒక్క మార్పు మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంచడం ద్వారా బనకచర్లకు కూడా వరద రోజుల్లో రోజుకు రెండు టీఎమ్సీల చొప్పున తరలించాలన్నది గత ప్రభుత్వ ప్రతిపాదన. చంద్రబాబు సర్కార్ ఇక్కడ మార్పు చేసింది. పోలవరం ప్రాజెక్టుకు దిగువన తాడిపూడి పాయింట్ దగ్గర ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి, కుడి కాల్వకు సమాంతరంగా మరో కాలువను తవ్వి, నీటిని తరలించాలని ప్రతిపాదించింది.ఎత్తిపోతల పంపుల కోసం, కరెంట్ కోసం అదనపు ఖర్చు. మరో కాలువ తవ్వడానికి భూసేకరణ ఒక ప్రధాన సమస్య. అదనపు ఖర్చు కూడా. జగన్ పథకాన్ని యథాతథంగా కాపీ చేయకుండా ఈ ఒక్క మార్పును ఎందుకు చేసినట్టు? అదనపు ఖర్చు వల్ల అదనపు కమిషన్ లభిస్తుందన్న కండూతి ఒక కారణం కావచ్చు. దీంతోపాటు ఇంకో విమర్శ కూడా వినిపి స్తున్నది. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 45.72 మీటర్లకు బదులుగా 41.15 మీటర్లకే పరిమితం చేయడానికి బాబు సర్కారు అంగీకరించిందనీ, ఈ మేరకు కేంద్ర కేబినెట్లో కూడా నిర్ణయం జరగిందనీ ఇటీవల సాక్షి మీడియాలో ప్రము ఖంగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తాడిపూడి ఎత్తి పోతల నిర్ణయం కూడా దాన్ని నిర్ధారిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వను పరిమితం చేస్తే కుడి కాలువ ఆయకట్టుకే సరిపోను నీటిని అందివ్వలేదనీ, అటువంట ప్పుడు ఇక బనకచర్లకు తరలింపు ఎలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కనుక ప్రాజెక్టు దిగువన కూడా వరద రోజుల్లో ప్రవాహం ఉన్నప్పుడు ఎత్తిపోయడానికి ఈ పథకాన్ని మార్చి ఉండవచ్చని తెలుస్తున్నది. ఇంకొక ముఖ్యమైన మార్పు సిసలైన గేమ్ ఛేంజర్ వంటి అంశం మరొకటి ఉన్నది. నదుల అనుసంధానం కింద ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం కోరింది. కానీ, చంద్రబాబు ఆలోచన మరో విధంగా ఉన్నది. ఈ పాజెక్టును ప్రకటించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అసలు విషయాన్ని కొద్దిగా ఆయన బయట పెట్టారు. ప్రాజెక్టు కోసం కేంద్రం నిధులిచ్చే అవకాశం లేదని చెబుతూ – ప్రైవేట్ వ్యక్తుల ద్వారా సేకరిస్తామని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పదేళ్లదాకా వాటి నిర్వహణను కూడా ప్రైవేట్ వారికే అప్పగిస్తామన్నారు. ఇటీవలే గ్రామీణ రోడ్ల నిర్మాణం – నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తామని చంద్రబాబు చెప్పిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ప్రైవేట్ వ్యాపారులు, సేవా దృక్పథంతో రోడ్లేయరు కదా! జనం తోలు వలిచి టోల్ వసూలు చేస్తారు. ఇక సాగునీటి సరఫరాకు కూడా అదే పద్ధతి రాబోతుందన్న మాట.ప్రాజెక్టులు నిర్మించి, నిర్వహించినందుకు ప్రభుత్వమే వారికి సొమ్ము చెల్లిస్తుందని ప్రస్తుతానికి ముఖ్యమంత్రి చెబుతు న్నప్పటికీ అది నమ్మశక్యంగా లేదు. అంతటి ఆర్థిక సామర్థ్యమే ఉంటే, మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా జలయజ్ఞంలోని అసంపూర్తి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నడుం కట్టేవారు. ఈ ప్రాజెక్టు నదుల అనుసంధానంలో భాగం కనుక కేంద్ర నిధుల కోసం ఒత్తిడి చేసేవారు. పైగా తమ సంఖ్యా బలం మీద ఆధార పడిన ప్రభుత్వాన్ని ముక్కుపిండి ఒప్పించడం ఎంతసేపు? జగన్ సర్కార్ డీపీఆర్ను కాపీ కొట్టిన ప్రభుత్వం ఆయన అనుసరించిన వైఖరిని ఎందుకు అనుకరించడం లేదు?ఎందుకంటే, సంపూర్ణ ప్రైవేటీకరణ ఆయన విధానం కనుక. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వడానికి వీల్లేదనీ, ప్రభుత్వ సేవలన్నిటికీ యూజర్ చార్జీలను వసూలు చేయాల్సిందేననీ గతంలోనే తన సిద్ధాంత పత్రాన్ని ఆయన రాసుకున్నారు కనుక. పాతికేళ్ల కింద ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మాదిరిగానే ‘విజన్ 2020’ని చంద్రబాబు ప్రకటించారు. అప్పుడు ఆకాంక్షించిన ఆర్థిక వృద్ధి జరిగిందా? కొందరు బలవంతులు మాత్రం మహాబలసంపన్నులుగా ఎదిగి పోయారు. ఆర్థిక అసమానతలు అమానవీయంగా పెరిగి పోయాయి. ఆ డాక్యు మెంట్కు కొనసాగింపే ‘విజన్ – 2047’. అంతేగాకుండా, కేంద్ర సర్కార్ ఇప్పటికే ప్రకటించిన ‘వికసిత్ భారత్–2047’కు అనుగుణంగా దీన్ని రూపొందించినట్టు స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు. దొందూ దొందే. మేడ్ ఫర్ ఈచ్ అదర్.చంద్రబాబు ప్రైవేటీకరణ పదజాలంలోకి కొత్త మాటలు వచ్చి చేరుతున్నాయి. గతంలో పీత్రీ (P3) మోడల్ను తానే ప్రతి పాదించాననీ, ఇప్పుడింకో ‘పీ’ని చేర్చి పీఫోర్ (P4)ని ప్రతిపా దిస్తున్నాననీ ఆయన చెప్పారు. పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్షిప్లో పీపుల్ను కూడా చేర్చారట. ‘పీత్రీ’ని అమలు చేసినప్పుడు పబ్లిక్ రంగ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. లాభసాటిగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ఖాయిలా పట్టించి కోట్ల విలువైన వాటి ఆస్తులతో సహా 54 సంస్థలను పప్పుబెల్లాలకు తన వారికి కట్టబెట్టిన ఉదంతాన్ని మరిచిపోగలమా?ఇప్పుడు ఇంకో ‘పీ’ పేరుతో ప్రజల్ని చేర్చారు. ప్రజలు ఎలా భాగస్వాములు అవుతారు? ప్రైవేట్ ఆస్తులను ప్రజలకైతే అప్పగించరు కదా! ప్రజలే వారి దగ్గర ఉన్న భూముల్ని ఇవ్వాల్సి ఉంటుంది. ప్రైవేట్ సేవలకు మెచ్చి నీటి పన్ను, బాట పన్ను, బడి పన్ను, దవాఖానా పన్ను వంటి వాటిని అవసరాన్ని బట్టి చెల్లించవలసి ఉంటుంది. తమ రెక్కల కష్టాన్ని సమర్పించు కోవాల్సి ఉంటుంది. ప్రజల భాగస్వామ్యానికి సంబంధించి ఇంతకంటే భిన్నమైన ప్రతిపాదనలైతే విజన్లో కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ అడ్రస్ను వెతుక్కుంటూ వేలకోట్ల పెట్టుబడులు పరుగెత్తుకొస్తున్నాయని విడతల వారీగా ప్రకటనలు గుప్పిస్తు న్నారు. తాజాగా చేసిన ప్రకటనలో రిలయన్స్వారు ‘కంప్రెస్డ్ బయోగ్యాస్’ ఉత్పాదన కోసం 65 వేల కోట్లు పెట్టుబడి పెడ తారనే, కళ్లు చెదిరే లెక్క కూడా చెప్పారు. అందుకోసం వారికి ఐదులక్షల ఎకరాల భూమిని అప్పగిస్తారట. ప్రతిగా కంపెనీ వాళ్లు రెండున్నర లక్షలమందికి ఉపాధి కల్పిస్తారట. అంత భూమిని పేదలకు అసైన్ చేస్తే అంతకంటే ఎక్కువమందే ఉపాధి పొందవచ్చు గదా అనే సందేహాలు అజ్ఞానులకు మాత్రమే కలుగుతాయి. ఆర్థిక నిపుణులు వాటికి సమాధానం చెప్పరు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఇంగ్లిష్పై ‘తీర్పు’ వివక్షాపూరితం!
విజయవాడలో జరిగిన మొన్నటి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో గత ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించడమే కాక, తత్సంబంధ జీవో నం.85ను రద్దు చేయాలని కూడా ప్రస్తుత ప్రభుత్వాన్ని కోరడం ఏ కోణం నుండి చూసినా సమంజసనీయమైనది కాదు. గౌరవ నీయ సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయ మూర్తిగా ఆయనకిది ఏమాత్రం తగినట్లుగా లేదు. అందుకే ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. మోదీ ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విధానంలో 8వ తరగతి వరకు మాతృభాషా మాధ్యమాలలోనే విద్య నేర్పాలని సూచించారు. అయితే నేటి పోటీ ప్రపంచంలో దీని అమలు అసాధ్యమని తెలిసినప్పటికీ, జస్టిస్ రమణ దీనిని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ఎక్కడా కోరలేదు. కానీ స్వరాష్ట్రానికి వచ్చేటప్పటికి తెలుగు మాధ్యమానికి మాత్రమే, అందునా ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే తెలుగు మాధ్యమానికి తావివ్వాలని మాట్లాడుతున్నారు!ప్రైవేట్ స్కూళ్లలో కూడా తెలుగు మీడియం ప్రవేశపెట్టాలని నామమాత్రంగానైనా ఆయన ఎందుకు అడగటం లేదు? అంటే సంపన్నుల పిల్లలకు ఒక న్యాయం, పేద దళిత గ్రామీణ పిల్లలకు మరొక న్యాయం! ఇదేనా ఎవరైనా ఇవ్వవలసిన ‘తీర్పు’? ఇంగ్లిష్ మీడియంతో ప్రైవేట్ విద్యారంగం కళకళలాడాలనీ, కేవలం తెలుగు మీడియంతో నడిచే ప్రభుత్వ పాఠశాలలు వెలవెల పోవాలనీ; ‘ప్రభుత్వం వేస్ట్.. ప్రైవేట్ రంగం బెస్ట్’ అనీ... ఆయన, ఆయన వెనుక ఉన్న రాజకీయ నేతల ఉద్దేశంలా కనిపిస్తోంది.మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేస్తూ తెలుగు భాషపై ప్రేమ వెలిబుచ్చుతూ ఉంటారు. వీరి పిల్లలందరూ ఇంగ్లిష్ మీడియంలోనే చదవాలి! విదేశాలకు వెళ్లి వచ్చి, గొప్పగా సంపాదించుకోవాలి. కానీ పేదవాళ్లకు మాత్రం ఆ అవకాశం ఇవ్వకూడదు, వాళ్లు రాష్ట్రం దాటి వెళ్లకూడదు.జగన్ సంస్కరణలు చరిత్రాత్మకం గత ఐదేళ్లలో జగన్ దేశంలోకెల్లా అత్యధికంగా పాలనలో, పలు రంగాలలో, ముఖ్యంగా విద్యారంగంలో అద్భుతమైన సంస్కరణలు తెచ్చి చరిత్రకెక్కారు. రాజకీయంగా జగన్ మోహన్రెడ్డితో విభేదిస్తే, రాజకీయంగానే ఎదుర్కోవాలి తప్ప, ఆయన మీది ద్వేషంతో ఆయన ప్రవేశపెట్టిన అన్ని పథకాలను రద్దు చేస్తూ పోవడం ఏమాత్రం సమంజసం కాకపోగా విపరిణామాలకు దారి తీస్తుంది.ద్విభాషా పాఠ్యపుస్తకాలను, ఇంగ్లిష్–తెలుగు నిఘంటువులను ఇచ్చినప్పటికీ, ఏ మీడియంలోనైనా చదువుకునే, పరీక్ష రాసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ, 90 శాతం తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియంనే కోరుకున్నప్పటికీ, లక్షలాదిగా ఉన్న వారి అభీష్టానికి, హక్కుకు వ్యతిరేకంగా ఈ న్యాయమూర్తి ఇలా మాట్లాడటం సరైనది కాదు. ఆయన మాట విని, ఆంగ్ల మాధ్యమంలో 9వ తరగతి వరకు వచ్చిన విద్యార్థులను నట్టేట ముంచి, తిరోగమన దిశలోకి మరల్చడం చంద్రబాబు చారిత్రక తప్పిదంగా నిలిచిపోతుంది.దీనికి బదులు, తెలుగు భాషపై తెలుగు మాధ్యమంపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే, ఆంగ్ల మాధ్యమాన్ని కొనసా గిస్తూనే, కేజీ టు పీజీ తెలుగు మాధ్యమ బోధనా విద్యాసంస్థలను సమాంతరంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రత్యే కంగా ఏర్పాటు చేసి, వారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధులలో రిజర్వేషన్ కల్పించాలని కోరడం సముచితంగా ఉంటుంది. స్థానిక ప్రభుత్వాలు స్థానిక ప్రజల భాష లోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని, న్యాయస్థానాలు ప్రజల భాషలోనే తీర్పులు ఇవ్వాలని ఆదేశిస్తే, నిర్దేశిత రాజ్యాంగ ఆశయాలు కూడా తద్వారా నెరవేరుతాయి.ఇలాంటి విశాల దృక్పథంతో ఆంగ్ల లేక తెలుగు మాధ్యమ అంశాలను పరిశీలించినప్పుడే ఆమోదయోగ్యమైన పరిష్కారం దొరుకుతుంది. అలా కాని పక్షంలో ఎన్నో వేల ఏళ్లుగా వివక్షకు గురైన అట్టడుగు పేద బడుగు వర్గాల నుండి ప్రతిఘటనను, ఇంగ్లిష్ మీడియం పరి రక్షణ ఉద్యమాలను కూటమి పాలకులు ఎదుర్కోవలసి వస్తుంది. ఈదర గోపీచంద్ వ్యాసకర్త సామాజిక ఉద్యమ కార్యకర్తమొబైల్: 94403 45494 -
మానవాళికి ప్రకృతి శాపం!
‘వాతావరణం కూడా ప్రభుత్వాల వంటిదే. అదెప్పుడూ చెడ్డగానే ఉంటుంది’ అంటాడు బ్రిటిష్ వ్యంగ్య రచయిత జెరోమ్ కె. జెరోమ్. అది ముమ్మాటికీ నిజం. దేశంలో గత 123 ఏళ్లలో కనీవినీ ఎరగనంత స్థాయి ఉష్ణోగ్రతలు నిరుడు నమోదయ్యాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) చేసిన ప్రకటన హడలెత్తిస్తోంది. అంతేకాదు... వచ్చే ఏడాది సైతం రికార్డులు బద్దలయ్యే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తోంది. మనదేశం మాత్రమే కాదు... ప్రపంచవ్యాప్తంగా కూడా నిరుటి ఉష్ణో గ్రతలు అధికంగానే ఉన్నాయని వివిధ దేశాల వాతావరణ విభాగాల ప్రకటనలు చూస్తే అర్థమవుతుంది. మన పొరుగునున్న చైనాలో 1961 నుంచీ పోల్చిచూస్తే గత నాలుగేళ్ల ఉష్ణోగ్రతలు చాలా చాలా ఎక్కువని అక్కడి వాతావరణ విభాగం తెలియజేసింది. నిజానికి 2024లో ప్రపంచ ఉష్ణో గ్రతల స్థితిగతులపై ఐక్యరాజ్యసమితి అనుబంధ ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) ఇంకా అధికారిక నివేదిక విడుదల చేయలేదు. అందుకు మార్చి వరకూ సమయం ఉంది. కానీ ఈలోగా కొన్ని కొన్ని అంశాల్లో వెల్లడైన వాతావరణ వైపరీత్యాలను అది ఏకరువు పెట్టింది. అవి చాలు... మనం ఆందోళన పడటానికి! వాటి ప్రకారం– నిరుడు జనవరి నుంచి సెప్టెంబర్ నెలలమధ్య ప్రపంచ ఉష్ణోగ్రతలు పారిశ్రామికీకరణకు ముందు కాలం నాటికంటే సగటున 1.54 డిగ్రీల సెల్సియస్ అధికం. అలాగే అంటార్కిటిక్ సముద్రంలో మంచు పలకలు మునుపటితో పోలిస్తే అధికంగా కరుగుతున్నాయి. ఉగ్రరూపం దాల్చిన వాతావరణం వల్ల నిరుడు మరణాలు, ఆర్థిక నష్టాలు కూడా బాగా పెరిగాయి. సాగర జలాల ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి. సముద్ర మట్టాలు ఉన్నకొద్దీ పెరుగుతున్నాయి. నిరుడు ప్రపంచవ్యాప్తంగా రికార్డయిన 29 వాతావరణ ఘటనలను విశ్లేషిస్తే అందులో 26 కేవలం వాతావరణ మార్పులవల్ల జరిగినవేనని తేలిందని డబ్ల్యూఎంఓ తెలిపింది. ఈ ఉదంతాల్లో 3,700 మంది మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని వివరించింది.స్వర్గనరకాలు మరెక్కడో లేవు... మన ప్రవర్తన కారణంగా ఆ రెండూ ఇక్కడే నిర్మితమవుతా యంటారు. వాతావరణం విషయంలో ఇది ముమ్మాటికీ వాస్తవం. మానవ కార్యకలాపాలే వాతా వరణ వైపరీత్యాలకు మూలకారణం. నూతన సంవత్సర సందేశంలో గత దశాబ్దకాలపు వార్షిక ఉష్ణోగ్రతలన్నీ రికార్డు స్థాయివేనని సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రకటించారు. ఈ వినాశకర దోవ విడనాడాలని పిలుపునిచ్చారు. విజ్ఞాన శాస్త్రం విస్తరిస్తోంది. వినూత్న ఆవిష్కర ణలు అందుబాటులోకొస్తున్నాయి. కానీ వీటిని చూసి విర్రవీగి, ప్రకృతి చేస్తున్న హెచ్చరికలను పెడ చెవిన పెట్టిన పర్యవసానంగా అది ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రకృతి చెప్పినట్టు వింటూ అది విధించిన పరిమితులను శిరసావహించాలి తప్ప దాన్ని నిర్లక్ష్యం చేస్తే వినాశనం తప్పదని ఏటా వెలువడే నివేదికలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. కానీ వినేదెవరు? లాభార్జనే తప్ప మరేమీ పట్టని పరిశ్రమలు, అభివృద్ధి పేరిట ఎడాపెడా అనుమతులు మంజూరు చేస్తున్న పాలకులు, వాతావరణం నాశనమవు తున్నదని గ్రహించే చైతన్యం లోపించిన ప్రజలు పర్యావరణ క్షీణతకు దోహదపడుతున్నారు. అయి దేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో పర్యావరణ పరిరక్షణ అంశం ఏనాడూ ప్రస్తావనకు రాదు. మన దేశంలోనే కాదు... ప్రపంచంలో వాతావరణ శిఖరాగ్ర సదస్సుల వంటివి నిర్వహించినప్పుడు తప్ప మరెక్కడా పర్యావరణం గురించి చర్చ జరగటం లేదు. ఇది ప్రకృతి విధ్వంసానికి పాల్పడే పారిశ్రామికవేత్తలకూ, పాలకులకూ చక్కగా ఉపయోగపడుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి జరగాల్సిందే. అందుకవసరమైన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ అభివృద్ధి అవసరాల కోసం పర్యావరణాన్ని బలిపెట్టే విధానాలు మొత్తంగా మానవాళికే ప్రమాదకరం. పర్యావరణ ముప్పు ముంచుకొస్తున్నదనే విషయంలో ఎవరూ పెద్దగా విభేదించటం లేదు. కానీ దాని నివారణకు తీసుకోవాల్సిన చర్యలే నత్తనడకన ఉంటున్నాయి. ప్రపంచంలో కర్బన ఉద్గా రాల తగ్గింపునకు 2015 పారిస్ శిఖరాగ్ర సదస్సు నిర్దేశించిన లక్ష్యాలను అందుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. చెప్పాలంటే ఆ దిశగా ఎంతోకొంత అడుగులేస్తున్నది మనమే. ఆ శిఖరాగ్ర సదస్సు 2050 నాటికి భూతాపం పెరుగుదలను 2 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ నిలువరించాలన్న సంకల్పాన్ని ప్రకటించింది. అయితే దాన్ని చేరుకోవటానికి వివిధ దేశాలు ఇచ్చిన హామీలు ఏమాత్రం సరిపోవన్నది శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. వాతావరణానికి తూట్లు పొడవటంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సంపన్న రాజ్యాలు బడుగు దేశాలకు హరిత ఇంధన సాంకే తికతలను అందించటంలో, అందుకవసరమైన నిధులు సమకూర్చటంలో ముఖం చాటేస్తున్నాయి. వాతావరణ మార్పుపై చెప్తున్నదంతా బోగస్ అనీ, పారిస్ ఒడంబడిక నుంచి తాము వైదొలగు తున్నామనీ అమెరికాలో క్రితంసారి అధికారంలోకొచ్చినప్పుడే ప్రకటించిన ట్రంప్... ఈసారి కూడా ఆ పనే చేస్తారు. ప్రపంచ దేశాల మాటెలావున్నా ఈ ఏడాది సైతం ఉష్ణోగ్రతలు భారీగా నమోదుకావొచ్చన్న సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని రిజర్వ్ బ్యాంక్ మొదలుకొని అన్ని ప్రభుత్వ శాఖలూ, విభాగాలూ అట్టడుగు స్థాయివరకూ తగిన వ్యూహాలు రూపొందించుకోవాలి. మండే ఎండలు మాత్రమే కాదు... జనావాసాలను ముంచెత్తే వరదలు కూడా ఎక్కువే ఉంటాయి. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను గరిష్ట స్థాయిలో ఉంచటానికి అవసరమైన కార్యాచరణను ఖరారు చేసుకోవాలి. బాధిత ప్రజానీకానికి సాయం అందించటానికి అవసరమైన వనరులను సమీకరించుకోవాలి. -
ట్రంప్ శిబిరంలో వీసా చిచ్చు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఘన విజయానికి దోహదపడిన అంశాల్లో కీలకమైన వలసల వివాదం... తిరిగి తిరిగి ఆయన శిబిరంలోనే చిచ్చు పెడుతున్న వైనం కనబడుతోంది. ఆయన ప్రమాణ స్వీకారానికి చాలాముందే అనుచరగణం పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. అమెరికాను మళ్లీ అగ్రస్థానానికి తీసుకెళ్లాలన్న ట్రంప్ ‘మాగా’ ఉద్యమ మూలపురుషుల్లో ఒకరైన స్టీఫెన్ మిల్లర్కూ, స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్కూ మధ్య హెచ్1బి వీసాల విషయంలో తాజాగా తలెత్తిన లడాయి ఇప్పట్లో చల్లారడం కష్టమే. తొలిసారి ట్రంప్ విజేతగా నిలిచిన 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో హెచ్1బి వీసాలపై ఆయన దూకుడుగా మాట్లాడటం వెనక మిల్లర్ వ్యూహం ఉంది. స్థానికులను నిర్లక్ష్యం చేసి తక్కువ వేతనాలకు పరాయి దేశాలవారిని ఉద్యోగాల్లో నియమించుకునే సంస్కృతిని సాగనివ్వబోనని అప్పట్లో ట్రంప్ చెప్పేవారు. తమ ఉద్యోగాలన్నీ బయటి దేశాల పౌరులు తన్నుకుపోతున్నారని ఆగ్రహంతో ఊగిపోయిన శ్వేతజాతి అమెరికన్లు ఆయనకు ఎగబడి ఓట్లేశారు. ట్రంప్ ప్రసంగాల రచయిత మిల్లరే. ఈ దఫా సైతం ఆయన ట్రంప్ ఆంతరంగిక బృందంలో ముఖ్యుడిగా ఉండబోతున్నారు. వలసల విషయంలో ట్రంప్ అనుచరగణంలో స్పష్టత లోపించిందన్న సంగతి ప్రచార సమయంలోనే బట్టబయలైంది. అక్రమ వలసదారులే పెద్ద సమస్యని ట్రంప్ సన్నిహితుడు వివేక్ రామస్వామి అభిప్రాయపడుతున్నారు. ఆయన్ను ఈమధ్యే ప్రభుత్వ సిబ్బందిలో అత్యధికుల్ని సాగనంపేందుకు ఏర్పాటైన ప్రభుత్వ సామర్థ్య విభాగానికి ట్రంప్ ఎంపికచేశారు. ఆ విభాగంలో ఆయనతోపాటు పనిచేయబోయే మస్క్ సైతం వివేక్ అభిప్రాయాన్ని సమర్థిస్తున్నారు. కానీ మిల్లర్తోపాటు, తీవ్ర మితవాది అయిన లారా లూమర్, స్టీవ్ బానన్ వంటివారు దీన్ని అంగీకరించటం లేదు. అసలు హెచ్1బి వీసా విధానాన్నే పూర్తిగా ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికన్ సంస్కృతి, జీవన విధానం వైపు చర్చ మళ్లడం దీని తీవ్రతను తెలియజేస్తోంది. అమెరికన్లలో అనేకులు సమర్థత నుంచి నాసిరకం సంస్కృతికి మళ్లి చాన్నాళ్లవుతోందని వివేక్ రామస్వామి వ్యాఖ్యానిస్తే... అమెరికన్లు తెగువ, ఆత్మవిశ్వాసం దండిగా ఉన్నవారంటూ 2020లో ట్రంప్ చేసిన ప్రసంగం వీడియోను మిల్లర్ ఎక్స్ వేదికపై వదిలారు. ఇంతకూ ట్రంప్ ఏమనుకుంటున్నారు? మాకు చురుకైనవాళ్లు, సమర్థులు కావాలని నూతన సంవత్సర వేడుకల సమావేశంలో ట్రంప్ చెప్పడం సహజంగానే అందరినీ ఆశ్చర్యపరిచింది. తానెప్పుడూ హెచ్1బి వీసాల విధానాన్ని వ్యతిరేకించలేదని అనటం అర్ధ సత్యమే అయినా ట్రంప్ వైఖరి మారిందని, ఆయనపై మస్క్ ప్రభావం బలంగా ఉన్నదని రిపబ్లికన్లలో బలమైన మితవాద వర్గం గుసగుసలు పోతోంది. ఎవరెలా అనుకున్నా హెచ్1బి వీసాల సంగతలా వుంచి అక్రమ వలసదారుల్ని గెంటేయటం అంత తేలిక కాదు. వారిపై ముందు వలస వ్యవహారాల న్యాయ స్థానంలో కేసు దాఖలు చేయాలి. వారు రకరకాల వాదనలతో ముందుకొస్తారు. విచారణ వాయి దాల్లో నడుస్తుంటుంది. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న కేసులు తేలాలంటేనే 2029 చివరివరకూ పడుతుందని గణాంకాలు చెబుతున్నాయి. కొత్తవారిని గుర్తించి కేసులు పెడితే ఆ భారం మరింత పెరుగుతుంది. చట్టాన్ని సవరిస్తే తప్ప ఇది అంత సులభంగా తేలదు. దానికితోడు అక్రమ వలస దారులను గుర్తించే ఐసీఈ ఏజెంట్లు 6,000 మందికి మించిలేరు. దానికి కేటాయించే నిధులు సైతం ఏ సమయంలోనూ 40,000 మందిని మించి నిర్బంధించేందుకు సరిపోవు. ఒకవేళ అక్రమ వలస దారులందరినీ సాగనంపడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినా, లక్షలమంది తరలింపునకు విమానాలు సమకూర్చడం అసాధ్యం. ఇక డెమాక్రాట్ల ఏలుబడిలో ఉన్న న్యూయార్క్, షికాగో, లాస్ఏంజెలస్, డెన్వర్ వంటి నగరాలు అక్రమ వలసదారుల ఏరివేతకు సహకరించవు. అక్రమ వలసదారుల్ని వెనక్కిపంపిన గతకాలపు అధ్యక్షుడు ఐసెన్ హోవర్ తనకు ఆదర్శమని ట్రంప్ అంటున్నారు. కానీ ఆకాలంలో మెక్సికో మినహా మరే దేశంనుంచీ పెద్దగా వలసలు లేవు. ఇప్పుడలా కాదు... చైనా, భారత్, మారుటేనియా, ఉజ్బెకిస్తాన్ దేశాలనుంచి రికార్డు స్థాయి అక్రమ వలసలున్నాయి. ఇందులో ఎన్ని దేశాలు ట్రంప్కు సహకరిస్తాయన్నది ప్రశ్న. సమస్యలు సృష్టించటం సులభం. కానీ వాటి పరిష్కారం అన్ని సందర్భాల్లోనూ అంత తేలిక కాదు. తగిన అర్హతలున్నవారు స్థానికంగా దొరక్కపోతే బయటి దేశాలనుంచి ఆ నైపుణ్యం ఉన్న వారిని తీసుకురావటం కోసం రూపొందించిన హెచ్1బి వీసాను బడా సంస్థలు ఖర్చు తగ్గించు కోవటానికి వాడుకుంటున్న మాట వాస్తవం. దాన్ని ట్రంప్ తనకు అనుకూలంగా సొమ్ము చేసు కోవటం సైతం నిజం. కానీ ఆ సమస్యే పార్టీలో చిచ్చుపెడుతుందని ఆయన ఊహించి వుండరు.ఇంతకూ ఆయన ఎవరి పక్షమన్న విషయంలో వైరి వర్గాల్లో ఎవరికీ స్పష్టత లేదు. ఎందుకంటే వివేక్, మస్క్, శ్రీరాం కృష్ణన్వంటి గతకాలపు వలసదారుల్ని తీసుకున్న ట్రంప్ మరోపక్క వలసలకు పక్కా వ్యతిరేకి అయిన స్టీఫెన్ మిల్లర్తోపాటు ఆయన భార్య కేటీ మిల్లర్ను సైతం తన బృందంలో చేర్చు కున్నారు. ఏదేమైనా హెచ్1బి వీసాలు పొందినవారిలో అత్యధికులు మనవాళ్లే కనుక వారి మెడపై కత్తి వేలాడుతూనే ఉంటుంది. అలాగే ట్రంప్ను మించిన శ్వేతజాతి చాంపియన్ అమెరికా రాజకీయాల్లో ఆవిర్భవించే అవకాశం కూడా లేకపోలేదు. -
మణిపూర్ చల్లారుతుందా?
ఇరవై నెలల నుంచి మహోగ్రంగా మండుతున్న మణిపూర్లో తొలిసారి ఒక చల్లని సాంత్వన వాక్యం వినబడింది. రాష్ట్రంలో ఇంతవరకూ జరిగిన హింసాకాండకు క్షమాపణ కోరుతున్నానని నూతన సంవత్సర ఆగమనవేళ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ప్రకటించారు. అనుకోనిది చోటు చేసుకున్నప్పుడు క్షమాపణ కోరటంవల్ల వెంటనే అంతా చక్కబడుతుందని అనుకోనవసరం లేదు. కానీ నేరగాళ్లపై చర్య తీసుకుంటారన్న విశ్వాసం కలిగినప్పుడు బాధిత పక్షంలో ప్రతీకార వాంఛ సన్నగిల్లుతుంది. వారిని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకునేవారి ఆటలు సాగవు. కానీ ఇన్నాళ్లుగా మణిపూర్లో జరిగింది వేరు. 2023 మే నెలలో ఘర్షణలు రాజుకున్నప్పుడు బీరేన్ సింగ్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రెండు ప్రధాన తెగలు మొయితీ–కుకీలు ఘర్షణ పడుతున్నారన్న సంగతిని గుర్తించటానికే నిరాకరించారు. ‘ఇదంతా కుకీ ఉగ్రవాదులకూ, భద్రతా దళాలకూ సాగు తున్న ఘర్షణ’ అంటూ భాష్యం చెప్పారు. మొయితీకి చెందిన నేతగా కుకీల తీరుపై ఎలాంటి అభి ప్రాయాలైనా, అభ్యంతరాలైనా ఆయనకు ఉండొచ్చు. కానీ సీఎం హోదాలో అలా మాట్లాడరాదన్న సంగతిని బీరేన్ గ్రహించలేకపోయారు. ఆ వెంటనే రక్షణ దళాల చీఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ ముఖ్యమంత్రి ప్రకటనను తోసిపుచ్చారు. అవి స్పష్టంగా తెగల ఘర్షణలేనని చెప్పారు. మణిపూర్ హింసకు ఇంతవరకూ 260 మంది బలి కాగా, 60,000 మంది ఇప్పటికీ రక్షణ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. రాష్ట్రం రెండు తెగలమధ్యా చీలిపోయింది. ఒకరి ప్రాంతాల్లోకి మరొకరు వెళ్లే పరిస్థితి లేదు. రెండు రోజుల క్రితం కేంద్ర హోంశాఖ విడుదల చేసిన నివేదిక గమనిస్తే మణిపూర్ ఎంత అధ్వాన్నంగా ఉన్నదో తెలుస్తుంది. అక్కడ మొయితీ, కుకీ, జోమీ తెగల పరస్పర ఘర్షణలవల్ల హింసాకాండ రాజుకుందనీ, మిలిటెంట్ల ప్రాబల్యం పెరిగిందనీ నివేదిక సారాంశం. మొత్తంగా ఈశాన్య ప్రాంతంలో అశాంతికి 77 శాతం మణిపూర్ పరిణామాలే కారణమని తెలిపింది. మొయితీ తెగను కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ మణిపూర్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ సమస్యకు మూల కారణం. 2023 మే 3న ఆ తీర్పును వ్యతిరేకిస్తూ మణిపూర్లోని ఆల్ ట్రైబల్స్ స్టూడెంట్స్ యూని యన్ నిర్వహించిన ర్యాలీపై మొయితీల దాడి, దానికి ప్రతిగా కుకీలు రెచ్చిపోవటం పరిస్థితిని దిగజార్చింది. చివరకు మహిళలపై గుంపులు దాడిచేసి వారిని వివస్త్రలను చేయటం, నగ్నంగా ఊరే గించి అత్యాచారాలకు తెగబడటం యధేచ్ఛగా సాగాయి. ఇక గృహదహనాలు, ఇతర ఆస్తుల ధ్వంసం వంటివి సరేసరి. పోలీస్ స్టేషన్లపై, సాయుధ రిజర్వ్ బెటాలియన్ స్థావరాలపై దాడులకు దిగి వేలాది తుపాకులు, రాకెట్ లాంచర్లు, లక్షల తూటాలు అపహరించారు. వేలాదిమంది కొంపా గోడూ వదిలి చెట్టుకొకరు పుట్టకొకరయ్యారు. ఆఖరికి ఇవి మత ఘర్షణలుగా కూడా పరిణమించాయి. వాస్తవానికి ఒక తెగవారంతా ఒకే మతంవారని చెప్పటానికి వీల్లేదు. అయితే కుకీల్లో అత్య ధికులు క్రైస్తవులుకాగా, హిందువులు కూడా ఉంటారు. మొయితీల్లో కూడా క్రైస్తవ మతాన్ని అనుస రించేవారున్నా వారి సంఖ్య తక్కువ. అత్యధికులు హిందువులు. ఈ పరస్పర వైషమ్యాల పర్యవ సానంగా చర్చిలను ధ్వంసం చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. నూతన సంవత్సర వేళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకూ, ప్రధాని నరేంద్ర మోదీకీ సమర్పించిన వినతిపత్రంలో 2023 నుంచి ఇంత వరకూ మణిపూర్లో 360 చర్చిలను ధ్వంసం చేశారని 400 మంది సీనియర్ క్రిస్టియన్ నాయకులు తెలియజేశారు. క్రైస్తవులపై దాడులు జరిగిన ఉదంతాలు 720 ఉన్నాయని వారంటున్నారు.ఘర్షణలు అడపా దడపా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అపహరించిన ఆయుధాలు అప్ప గించమని పోలీసులు చేసిన వినతి పెద్దగా పనిచేయలేదు. ఇప్పటికీ మొయితీ, కుకీ తెగలవద్ద కుప్ప లుగా ఆయుధాలున్నాయి. ఇందులో అపహరించిన వాటితోపాటు పొరుగునున్న మయన్మార్నుంచి వచ్చిపడుతున్న ఆయుధాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. మణిపూర్తో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాలు ఎంతో వైవిధ్యభరితమైనవి. అక్కడ 400కు పైగా తెగలున్నాయి. భిన్న సంస్కృతులు, విశ్వాసాలకు చెందిన వీరంతా కొన్ని మినహాయింపులతో శతాబ్దాలుగా కలిసిమెలిసి ఉంటున్నారు. అయితే పరిమిత వనరులను ఇంతమందితో పంచుకోవాల్సి రావటంవల్ల అందరిలోనూ భయాందోళనలున్నాయి. ఇది సాయుధ బృందాలకు ఊపిరిపోస్తోంది. తమకు స్వయం పాలిత ప్రాంతాలు కావాలన్న డిమాండ్ బయల్దేరుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎంతో జాగ్రత్తగా అడుగు లేయాల్సి వుండగా ఇన్నాళ్లూ మణిపూర్ నిర్లక్ష్యానికి గురైంది. ఇప్పుడు బీరేన్ సింగ్ ప్రకటన తర్వాతైనా వాస్తవాల ఆధారంగా నిర్దిష్ట చర్యలు ప్రారంభం కావాలి. సమస్య బయల్దేరినప్పుడు కిందిస్థాయిలో తగిన చర్యలు తీసుకోవటంలో విఫలమైనప్పుడే అవి పెరిగి పెద్దవై పరిష్కారానికి అసాధ్యంగా పరిణమిస్తాయని అమెరికా మాజీ రక్షణమంత్రి రాబర్ట్ గేట్స్ ఒక సందర్భంలో అంటారు. మొన్న జూన్లో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సమస్య ఉగ్రరూపం దాల్చిందని చెప్పిన సంగతి మరిచిపోరాదు. బాధిత పక్షాలకు భరోసా కల్పించే విధంగా అడుగులేస్తే, ఉపాధి కల్పనకు నడుం బిగిస్తే క్రమేపీ అంతా సర్దుకుంటుంది. ఏ తెగ హక్కులకూ భంగం కలగనీయబోమని, మారణకాండ కారకులను కఠినంగా శిక్షిస్తామని సంకేతాలు పంపితే ఉద్రిక్తతల ఉపశమనానికి ఆ వాగ్దానాలు తోడ్పడతాయి. రాజకీయ పక్షాలు సైతం ఈ సమయంలో బాధ్యతాయుతంగా మెలగాలి. -
అభివృద్ధా? అంతరమా?
సాధారణంగా కనిపించే లెక్కలు అసాధారణమైన అనేక అంశాలను మనకు పట్టి ఇస్తాయి. మన దేశ ప్రజలు దేని మీద ఎంత ఖర్చు చేస్తున్నారు లాంటి లెక్కలు చూసినప్పుడు సమాజంలో వచ్చిన అనేక మార్పులు కళ్ళకు కడతాయి. అతి విస్తృత స్థాయిలో దాదాపు 2.61 లక్షల గృహాలను సర్వే చేసి సేకరించిన సమాచారంతో గణాంకాలంటే ఇక వేరే చెప్పేది ఏముంది! ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్) అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. 2023 ఆగస్ట్ నుంచి 2024 జూలై మధ్య ప్రజల వినియోగాన్ని ఈ తాజా సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. సర్వసాధారణంగా అయిదేళ్ళకోసారి జరిపే ఈ సర్వేను వరుసగా గత ఏడాది, ఈ సంవత్సరం కూడా నిర్వహించడం విశేషమే. ప్రజా క్షేమం కోసం ప్రభుత్వం చేపట్టాల్సిన పథకాలు, అనుసరించాల్సిన విధానాలకు ఇలాంటి సర్వే ఫలితాలు దిక్సూచి. అలాగని వాస్తవాల సమగ్ర స్వరూపాన్ని ఇవి ప్రతిబింబిస్తాయని అనుకోలేం. అనేక ఇతర అంశాలు ఈ గృహవినియోగ వ్యయం లెక్కలను ప్రభావితం చేస్తాయన్న సంగతి విస్మరించి, వీటిని బట్టి జనజీవన ప్రమాణాల స్థాయిని నిర్ధారిస్తే అది సరికాదు. వేతనాలతో సహా అనేక ఇతర అంశాలపై సమాచారంతోనూ బేరీజు వేసుకోవాలి. 2023–24కి గాను కేంద్ర గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ గత వారం విడుదల చేసిన ఈ హెచ్సీఈఎస్ సర్వే అనేక అంశాలను విశ్లేషకుల దృష్టికి తెచ్చింది. దేశ ఆర్థిక రంగంలో వినియోగదారుల డిమాండ్ ఏ మేరకుంది, మరీ ముఖ్యంగా మహానగరాల్లో ఎలా ఉంది, దాన్నిబట్టి మన ఆర్థిక వ్యవస్థ ప్రస్థానాన్ని ఎలా అంచనా వేయాలనే దానిపై కొంతకాలంగా అనేక సందేహాలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజా హెచ్సీఈఎస్ సర్వే ఫలితాల పట్ల అందరిలో ఆసక్తి నెలకొంది. నిజానికి, దాదాపు 11 ఏళ్ళ విరామం తర్వాత గడచిన రెండేళ్ళుగా ఈ సర్వేలు వెలువడడం విశేషం. గడచిన ఏడాదితో పోలిస్తే 2023–24లో ఆహారపదార్థాలపై జనం వెచ్చించే మొత్తం పెరిగినట్టుగా తాజా సర్వేలోని గణాంకాలు చెబుతున్నాయి. గ్రామీణ కుటుంబాలు చేసే మొత్తం ఖర్చులో సైతం... తిండికి వెచ్చించేది మునుపు 2022–23లో 46.4 శాతం ఉండేది. ఇప్పుడు 2023–24లో అది 47.04కి పెరిగింది. పట్టణప్రాంత నివాసాల్లోనూ ఇలాంటి పరిస్థితే. ఆహారంపై జనం ఎక్కువ వ్యయం చేస్తున్నా, ఇప్పటికీ ఇంటి బడ్జెట్లో ఆహారేతర అంశాలదే సింహభాగం. ఆహారం మీద చేస్తున్న ఖర్చు ఏటేటా పెరుగుతున్నదన్నది మాత్రం స్పష్టం. అంత మాత్రం చేత ప్రజలందరి జీవన ప్రమాణాలు, పౌష్టికాహారం పట్ల శ్రద్ధ, ఆహార భద్రత అధికమయ్యాయని అనుకోలేం. ఆహార ద్రవ్యోల్బణం పెరగడంతో తిండిపై జనం చేయాల్సి వస్తున్న ఖర్చు కూడా అనివార్యంగా పెరిగిందన్నది విస్మరించలేం. ఇంకా చెప్పాలంటే, ఈ 2023–24లో గృహవినియోగ వ్యయం 8 – 9 శాతం దాకా పెరిగింది కానీ, అందుకు కూడా ద్రవ్యోల్బణమే ప్రధాన కారణం. దాన్ని గనక తీసేస్తే, అసలు సిసలు లెక్కల్లో వినియోగం ఏ మేరకు పెరిగిందన్నది తేలుతుంది. ఆ రకంగా చూస్తే, గృహవినియోగ వ్యయం కేవలం 3.5 శాతమే పెరిగిందట. ఆ పెరుగుదల కూడా 2024 ఆర్థిక సంవత్సరంలోని వాస్తవిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 8.2 శాతం కన్నా చాలా తక్కువ. అదీ విశ్లేషకులు తేలుస్తున్న మాట. అంటే, సర్వే గణాంకాలు పైకి ఏమి చెప్పినా, అసలు సిసలు వినియోగ వ్యయ వృద్ధి నత్తనడకనే సాగుతోందని అర్థం. దీనికీ మళ్ళీ కారణం – ద్రవ్యోల్బణం, అందులోనూ ఆహార ద్రవ్యోల్బణమే. ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాలి. సర్కారు సైతం ఈ సంగతి గ్రహించకపోలేదు. ఆహార సరఫరా వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు ప్రయత్నం కూడా చేసింది. ఆహార నిల్వలు, అలాగే కొన్ని ఆహార పదార్థాలు – కూరగాయల ఎగుమతులపై నిషేధం, వంట నూనెల లాంటి వాటిపై దిగుమతి సుంకాల తగ్గింపు తదితర చర్యలు చేపట్టింది. ఈ చర్యల వల్ల కొంత ఫలితం వచ్చింది. ఆహార ద్రవ్యోల్బణానికి ఒక మేర ముకుతాడు వేయగలిగారు. కానీ, ఇవన్నీ శాశ్వత పరిష్కారం చూపలేవు. ఇవాళ్టికీ మనం వ్యవసాయాధార దేశం కావడం, అందులోనూ మన వ్యవసాయమంతా ప్రధానంగా వర్షాధారమైనది కావడం ప్రధానమైన అవరోధం. ఇక, తాజా సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో తలసరి నెలవారీ గృహ వినియోగ వ్యయం నిరుటి రూ. 3,773 నుంచి రూ. 4,122కు పెరిగింది. పట్టణాల్లో అది రూ. 6,459 నుంచి రూ. 6,996కు హెచ్చింది. ఖర్చు విషయంలో గ్రామీణ – పట్టణ ప్రాంతాల మధ్య అంతరం అంత కంతకూ వేగంగా తగ్గుతోందని ఈ సర్వే డేటా చెబుతోంది. పుష్కరకాలం క్రితం 2011–12లో ఆ వ్యత్యాసం 83.9 శాతం. నిరుడు అది 71.2 శాతం. ఇప్పుడు 69.7కు తగ్గాయని సర్వే మాట. ఖర్చుల్లో అంతరాలు తగ్గినట్టు పైకి కనిపిస్తున్నా, అది వేతనంలో గణనీయమైన పెరుగుదల వల్ల వచ్చినవని చెప్పలేం. ఎందుకంటే, 2023–24తో ముగిసిన అయిదేళ్ళ కాలంలో గ్రామీణ వేతనాలు నామమాత్రంగా 5.2 శాతమే పెరిగాయి. పైగా, వాస్తవ వేతన వృద్ధి మైనస్ 0.4 శాతమే. అంటే, ఇవాళ్టికీ గ్రామీణ – పట్టణ, ధనిక – పేద అంతరాలు గణనీయంగానే ఉన్నాయన్నది నిష్ఠుర సత్యం. ఎక్కువగానే ఖర్చు పెడుతున్నారన్నది సర్వేల సారమైనా, చాలీచాలని జీతాలతో, బతుకు బండి ఈడుస్తున్న బడుగుల మాట ఏమిటి? అసలు ఖర్చే పెట్టలేని సగటు ప్రాణుల స్వరాలను ఈ సర్వేలు సరిగ్గా పట్టుకోగలుగుతున్నాయా? ఆ అసమానతలు తొలగించగలిగితేనే ప్రయోజనం. తొలగించడానికి తోడ్పడగలిగితేనే ఈ లెక్కలకు సార్థకత. -
స్ఫూర్తిదాయక విజయాలు
చదరంగంలో భారత దేశానికి ఇది స్వర్ణయుగం. న్యూయార్క్లో జరుగుతున్న ‘ఫిడే’ఉమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ పోటీల్లో భారత క్రీడాకారిణి కోనేరు హంపీ ఆదివారం సాధించిన ఘన విజయం అందుకు మరో తాజా నిదర్శనం. న్యూయార్క్లో మొత్తం 110 మంది పాల్గొన్న ర్యాపిడ్ చెస్ టోర్నీలో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి, ఛాంపియన్ అయ్యారు. అంతకు ముందు సింగపూర్లో క్లాసికల్ వరల్డ్ ఛాంపియన్షిప్లో గుకేశ్ విజయం, అంతకన్నా ముందు ఈ ఏడాది సెప్టెంబర్లో బుడాపెస్ట్లోని చెస్ ఒలింపియాడ్లో ఓపెన్, ఉమెన్స్ కేటగిరీలు రెంటిలోనూ కనివిని ఎరు గని రీతిలో భారత్ రెండు స్వర్ణాలు సాధించడం... ఇవన్నీ ఈ 2024ను భారత చదరంగానికి చిరస్మరణీయ వత్సరంగా నిలిపాయి. మంగళవారం నుంచి జరగనున్న ‘ఫిడే’ వరల్డ్ బ్లిట్జ్ ఛాంపి యన్షిప్ పైనా కన్నేసి, గ్రాండ్డబుల్ సాధించాలని హంపీ అడుగులేస్తుండడం విశేషం. గతంలో 2019లో జార్జియాలో తొలిసారి మహిళల వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ గెలిచిన కోనేరు హంపీకి తాజా విజయం రెండో ప్రపంచ టైటిల్. చైనాకు చెందిన జూ వెన్జున్ తర్వాత ఈ టైటిల్ను ఒకటికి రెండుసార్లు గెలిచింది హంపీయే! నిరుడు పెళ్ళి తరువాత మాతృత్వం కోసం కొన్నాళ్ళు ఆటకు దూరం జరిగిన హంపీ 2018లో చదరంగపు పోటీలకు తిరిగి వచ్చాక కూడా తన హవా కొనసాగిస్తూ వచ్చారు. 2019లో టైటిల్ సాధించారు. గత ఏడాది కూడా ఆమె గెలవాల్సింది. టై బ్రేక్లో త్రుటిలో ప్రపంచ టైటిల్ను కోల్పోయారు. అయితేనేం, పట్టుదలతో కృషిని కొనసాగించి మళ్ళీ ఇప్పుడు ఆటలో కిరీటం గెల్చుకొని, తనలో సత్తా చెక్కుచెదరలేదని నిరూపించారు. సామాన్యులతో పాటు ఆటలోని వర్ధిష్ణువులకు సైతం ఇది స్ఫూర్తి మంత్రం. నిజానికి, ఈ భారత నంబర్ 1 చదరంగ క్రీడాకారిణే అన్నట్టు, కచ్చితంగా సరికొత్త టైటిల్ విజయం మన దేశంలోని యువతరాన్ని చదరంగ క్రీడ వైపు మరింతగా ఆకర్షిస్తుంది. అదే సమయంలో పలువురు చెస్ ప్రొఫెషనల్స్గా తయారవడానికి ప్రేరణ కూడా అవుతుంది. ఫస్ట్ రౌండ్లో ఓటమి పాలైనా, 11వ, ఆఖరి రౌండ్లో గెలవడంతో 8.5 పాయింట్లతో పట్టికలో హంపీ అగ్రస్థానానికి చేరారు. ఇండోనేసియాకు చెందిన ఇరీన్ సుకందర్ను ఓడించి, వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ గెలుపుతో 2024కు ఘనంగా వీడ్కోలు పలికారు. చెస్లో ఆరితేరిన గ్రాండ్ మాస్టర్ అయినా బిడ్డకు తల్లి అయ్యాక, ఎన్నో కుటుంబ బాధ్యతలు మీద పడ్డాక, 37 ఏళ్ళ వయసులో హంపీ ఈ అరుదైన విన్యాసం సాధించడం అబ్బురం. అంతేకాదు... అభినందించాల్సిన అంశం. వయసు, బాధ్యతలు మీద పడుతున్నప్పటికీ పట్టు వదలకుండా, నిత్య కృషితో ముందుకు సాగడం, ఆటలో అదే నైశిత్యాన్ని ప్రదర్శించడం ఆషామాషీ కాదు. ఈ 2024 అంతా ఆశించిన ఆటతీరు కనబరచలేక, ఆత్మవిశ్వాసం కుంటుబడిన హంపీ ఒక దశలో అసలీ ఛాంపియన్షిప్లో పోటీ పడకూడదనీ అనుకున్నారట. ఆట నుంచి రిటైరవుతారన్న అనుమానాల నుంచి ఆఖరికి అగ్రపీఠాన్ని అధిష్ఠించే దాకా ఆమె ప్రస్థానం చిరస్మరణీయం. అందుకే, హంపీ గెలిచిన ఈ కొత్త కిరీటం మునుపటి విజయాల కన్నా ఎంతో ప్రత్యేకమైనది. చిన్నారి కూతురును చూసుకోవడంలో ఆమె తల్లితండ్రులు, భర్త పోషించిన పాత్ర మరెందరికో స్ఫూర్తిపాత్రమైనది. అంతర్జాయ యవనికపై భారత క్రీడాకారులు, అందులోనూ తెలుగువాళ్ళు కొన్నాళ్ళుగా సాధి స్తున్న ఘనతలు అనేకం. తాజా ఘటనలే తీసుకుంటే, తెలుగు మూలాలున్న చెన్నై కుర్రాడు గుకేశ్ ఇటీవల ప్రపంచ చదరంగ ఛాంపియన్గా అవతరించాడు. అంతకన్నా ముందు ఆ వెంటనే ఇప్పుడు హంపీ ర్యాపిడ్ చెస్లో రెండోసారి వరల్డ్ టైటిల్ సాధించారు. మరోపక్క భారత క్రికెట్ జట్టులో విశాఖకు చెందిన 22 ఏళ్ళ నవ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి ఆస్ట్రేలియాలో సంచలనం రేపాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న 4వ టెస్టులో ప్రతికూల పరిస్థితుల్లో క్రీజులో పాతుకుపోయి, అద్భుత మైన తొలి శతకం సాధించి, జట్టు పరువు నిలిపాడు. విదేశీగడ్డపై తొలి టెస్ట్ సిరీస్ ఆడుతూ, 8వ నంబర్ ఆటగాడిగా బరిలో దిగి సెంచరీ చేసిన తీరు యువతరంలోని క్రీడాకౌశలానికి నిదర్శనం. ఇవన్నీ భారత జాతి, మరీ ముఖ్యంగా మన తెలుగువాళ్ళు గర్వించాల్సిన క్షణాలు. అయితే, ఇవి సరి పోవు. మన 140 కోట్ల జనాభాలో ఇంతకు మించి శక్తి సామర్థ్యాలు, ఇంకా ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు. వారినీ సరైన రీతిలో ప్రోత్సహించి, ప్రాథమిక వసతి సౌకర్యాలు అందిస్తే ఇలాంటి విజయాలు అనునిత్యం మన సొంతమవుతాయి. తాజా ఘటనలు అదే రుజువు చేస్తున్నాయి. అయితే, మన దేశంలో ఎవరికి ఎంత ఆసక్తి ఉన్నా క్రీడల్లో కెరీర్ను నిర్మించుకోవడం ఇప్పటికీ కష్టసాధ్యంగానే ఉందన్నది నిష్ఠురసత్యం. ఆటల్లో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న పలువురు ఆనక కూలీనాలీ చేసుకుంటూ, కష్టంగా బతుకీడుస్తున్న ఉదంతాలు నేటికీ కళ్ళ ముందుకొస్తూ, కన్నీళ్ళు పెట్టిస్తున్నాయి. ఈ పరిస్థితులను చక్కదిద్ది, క్రీడల మీద ఆసక్తిని పెంచాల్సింది పాలకులు, ప్రభుత్వాలే. ఆ పని చేయకుండా... పతకాలు, టైటిళ్ళ మీదే ధ్యాసతో, ఆటగాళ్ళను నిందించి ప్రయోజనం లేదు. ఇంట్లో తల్లితండ్రులు, పాఠశాలలో అధ్యాపకుల స్థాయి నుంచి అందుకు తగ్గట్టు వాతావరణం కల్పించడం ముఖ్యం. అదే సమయంలో క్రీడా సంఘాలు, ప్రభుత్వ ప్రాధికార సంస్థల లాంటి వాటిని రాజకీయాలకు అతీతంగా నడపడం అంతకన్నా ముఖ్యం. అప్పుడే క్రీడాకారుల కలలు ఫలిస్తాయి. క్రీడాభిమాన లోకం ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. ఒలింపిక్స్కు సైతం ఆతిథ్య మివ్వాలని ఆశపడుతున్న మన పాలకులు అంత కన్నా ముందు సరిదిద్దుకోవాల్సిన అంశాలపై దృష్టి పెట్టడం అవసరం. -
ఈ మార్పు మంచికేనా?!
విద్య–సమాజం విడదీయలేనివి. అవి ఏకకాలంలో పరస్పరాశ్రితాలు, పరస్పర ప్రభావితాలు కూడా. ఒక సమాజంలో పిల్లలకు అందే విద్య ఆ సమాజ స్థాయికి ప్రతిబింబంగా ఉంటుంది. క్రమేపీ ఆ సమాజాన్ని మెరుగుపరుస్తుంది. తిరిగి ఆ ప్రభావంతో విద్య ఉచ్చస్థితికి వెళ్తుంటుంది. అందువల్లే సమాజ స్థితిగతుల అధ్యయనం ఆధారంగా విద్యావిధాన నిర్ణయాలుండాలంటారు. పాఠశాల విద్యలో ప్రస్తుతం అమలవుతున్న ‘నో డిటెన్షన్’ విధానాన్ని కేంద్రం రద్దు చేయటంపై లోతైన చర్చే సాగుతోంది. కేంద్రీయ విద్యాలయాలూ, నవోదయా విద్యాలయాలూ, సైనిక్ స్కూళ్లతోపాటు కేంద్రం నడిపే మరో 3,000 పాఠశాలల్లో తక్షణం ఈ విధానం అమల్లోకొచ్చింది. పర్యవసానంగా ఇకపై అయిదు, ఎనిమిది తరగతుల వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేనివారికి రెండు నెలల్లో పరీక్షలు నిర్వహిస్తారు. రెండోసారి కూడా ఫెయిలైతే వారు తిరిగి అవే తరగతులు చదవాలి. వాస్తవానికి ఈ విధానం రద్దు కోసం 2019లోనే విద్యాహక్కు చట్టాన్ని కేంద్రం సవరించింది. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నది కనుక రద్దు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది. అప్పట్లో 16 రాష్ట్రాలూ, 2 కేంద్రపాలిత ప్రాంతాలూ కేంద్ర విధానానికి అంగీకారం తెలిపాయి. కానీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలు మాత్రం వ్యతిరేకించాయి. నిర్ణయం తీసుకున్న అయిదేళ్ల తర్వాత తాజాగా నోటిఫికేషన్ వెలువడింది. ‘నో డిటెన్షన్’ విధానంపై అనుకూల వాదనలు ఎన్ని వున్నాయో, ప్రతికూల వాదనలు కూడా అంతకు మించే ఉన్నాయి. అనుకూల వాదనలు తీసిపారేయదగ్గవి కాదు. ఈ విధానంవల్ల డ్రాపౌట్ల శాతం గణనీయంగా తగ్గిందని, ఉత్తీర్ణత సాధించలేమన్న భయాన్ని విడనాడటంవల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతున్నదని, అందరూ తమను చిన్నచూపు చూస్తారన్న ఆందోళన తగ్గిందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక విద్యార్థిని ఫెయిల్ చేసినంత మాత్రాన నైపుణ్యం పెరుగుతుందన్న గ్యారెంటీ ఏమీ లేదని, పైగా తనతో చదివినవారంతా పై తరగతులకు పోవటంవల్ల ఆత్మ న్యూనతకు లోనై, ఒత్తిడి పెరిగి విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉన్నదని కూడా ‘నో డిటెన్షన్’ సమర్థకులు చెబుతున్నారు. విద్యాహక్కు చట్టం ‘నో డిటెన్షన్’ విధానం పెట్టి ఊరుకోలేదు. అందులోని 29(2)(హెచ్) నిబంధన విద్యాబోధన తీరుతెన్నులనూ, పిల్లల అధ్యయన నైపుణ్యాలనూ మెరుగుపరిచేందుకు సమగ్ర, నిరంతర మూల్యాంకన(సీసీఈ) విధానం ఉండాలని సూచిస్తోంది. సంప్రదాయ పరీక్ష విధానానికి బదులుగా నిర్దేశించిన ఈ విధానం ఆచరణలో ఎలా అమలవుతున్నదో ఎవరైనా పరిశీలించారా? ఇది సక్రమంగా అమలైతే ఎప్పటికప్పుడు పిల్లల గ్రాహకశక్తిని అంచనా వేసి చదువుల్లో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటానికి అవకాశం ఉండేది. కానీ ఉపాధ్యాయులకు అప్పజెప్పే ఇతరేతర పనులవల్ల కావొచ్చు... వారిలోని అలసత్వం వల్ల కావొచ్చు– పిల్లలపై శ్రద్ధ తగ్గిందన్నది ‘నో డిటెన్షన్’ విధానం రద్దు అనుకూలుర మాట. ‘ఎలాగైనా’ ఉత్తీర్ణులమవుతామన్న ధైర్యంతో పిల్లలు చదవటం లేదని, అలాంటివారి విషయంలో ఉపాధ్యా యులు కూడా నిర్లిప్తంగా ఉండిపోతున్నారని, ఇందువల్ల ఇతర పిల్లలపై కూడా ఆ ప్రభావంపడి మొత్తంగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని వారి వాదన. చాలా రాష్ట్రాల్లో పాలకులు పాఠశాల విద్యపై సమగ్ర దృష్టి సారించటం లేదు. ఈ విషయంలో కేరళ తర్వాత ఢిల్లీ చెప్పుకోదగ్గ ప్రగతి సాధించింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్ర ప్రదేశ్లో విద్యారంగ ప్రక్షాళన ఒక యజ్ఞంలాగే నడిచింది. ఒకపక్క సకల సదుపాయాలతో పాఠశాల భవనాలను తీర్చిదిద్దటంతోపాటు పిల్లల చదువులను మెరుగుపరిచేందుకు వీలుగా తరగతి గదుల్లో ఎన్నో బోధనోపకరణాలు ప్రవేశపెట్టారు. విద్యార్థులకు ట్యాబ్లు అందజేశారు. విద్యాబోధనపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. సీబీఎస్ఈ, ఐబీ సిలబస్ల అమలుకు అంకురార్పణ చేశారు. ఈ తరహా సిలబస్లు ప్రవేశపెట్టిన ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వంటివి ట్యూషన్ ఫీజు కింద రూ. 14 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయని ఈమధ్య మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రభుత్వాలు పాఠశాల విద్యను నిరంతరం పర్యవేక్షించి తగినంతమంది టీచర్లను నియమిస్తే, సదుపాయాలు మెరుగుపరిస్తే, ప్రామాణికమైన సిలబస్లు ప్రవేశపెడితే పిల్లల నైపుణ్యాలు పెరుగు తాయి. ప్రైవేటు విద్యలో ఎల్కేజీ నుంచే పిల్లల్లో పోటీ తత్వాన్ని పెంచే అనారోగ్యకర విధానాలు అమలవుతున్నాయి. కాన్సెప్ట్ స్కూళ్లు ఈ పోటీని మరింత పెంచాయి. ‘పిండికొద్దీ రొట్టె’ అన్నట్టు డబ్బు పారేస్తే తమ పిల్లలు అమాంతం ఎదుగుతారన్న భ్రమల్లో తల్లిదండ్రులున్నారు. మరి సర్కారీ బడుల్లో పిల్లల్ని చదివిస్తున్న పేద తల్లిదండ్రులు ఏం కావాలి... వారి పిల్లలకు మెరుగైన విద్య ఎలా అందాలి? గోరుచుట్టుపై రోకటి పోటులా ఇప్పుడున్న ‘నో డిటెన్షన్’ విధానం రద్దయితే పేద పిల్లలు ఎప్పటికి మెరుగుపడాలి? ఎదిగాక ఏం చేయాలి? కేంద్రం ఏ విధానం అమలు చేయదల్చుకున్నా దానికి ముందు బావురుమంటున్న ప్రభుత్వ బడులను ఉద్ధరించాలి. అక్కడి పిల్లలకు కడుపునిండా తిండి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే బోధన ఉంటున్నాయో లేదో గమనించాలి. ఉపాధ్యాయుల నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంపొందించాలి. వారిని బోధనకే పరిమితం చేయాలి. ‘నాణ్యత అనేది యాదృచ్ఛికంగా ఊడిపడదు. అది నిరంతరం కొనసాగే వేనవేల బౌద్ధిక చర్యల సమాహారం’ అన్నారు ప్రముఖ శాస్త్రవేత్త ఐన్స్టీన్. పాలకులు దాన్ని గుర్తెరగాలి. -
హసీనా అప్పగింత సాధ్యమేనా?
బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచీ మన దేశానికి తలెత్తుతున్న దౌత్య సమస్య లకు తాజాగా మరొకటి వచ్చిచేరింది. గత ఆగస్టు నుంచీ భారత్లో ఆశ్రయం పొందుతున్న తమ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని సోమవారం బంగ్లా విదేశాంగ శాఖ దౌత్య సందేశం పంపింది. హసీనా అవినీతి పాలనను వ్యతిరేకిస్తూ విద్యార్థుల నాయకత్వంలో జనాగ్రహం వెల్లువెత్తి ఆమె ఆ దేశం నుంచి నిష్క్రమించారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం వచ్చినప్పటినుంచీ మైనారిటీలకూ, హసీనా హయాంలో బాధ్యతలు నిర్వర్తించిన నేతలకూ, ఉన్నతాధికారులకూ గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. దాడులూ, దౌర్జన్యాలూ, నిర్బంధాలూ తప్పడం లేదు. ఆఖరికి న్యాయమూర్తుల్ని సైతం వెంటాడుతున్నారు. భయోత్పాతంలో ముంచెత్తుతున్నారు. చాలామంది అజ్ఞాతంలోకి పోయారు. దీన్నంతటినీ ఆపాలనీ, మైనారిటీలకు రక్షణ కల్పించాలనీ మన దేశం ఇప్పటికే బంగ్లా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కానీ కక్షపూరిత చర్యలు ఎక్కడా తగ్గిన దాఖలా లేదు. పైగా భారత మీడియా ఉన్నవీ లేనివీ కల్పించి తప్పుడు ప్రచారం చేస్తున్నదని అక్కడి ప్రభుత్వం ఆరోపిస్తోంది. అంతేకాదు... దానికి సమాంతరంగా అంతా బాగానే ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తోంది. ‘న్యూయార్క్ టైమ్స్’లో వచ్చిన కథనమే ఇందుకు ఉదాహరణ. విద్యార్థి బృందాలు దేశాభివృద్ధికి, అవినీతి అంతానికి ప్రణాళికలు వేస్తున్నట్టు ఆ కథనం సారాంశం. మైనారిటీలు సురక్షితంగా ఉన్నట్టు ఆ వర్గాలతోనే చెప్పించారు. నోబెల్ శాంతి బహుమతి పొందిన యూనస్ పాలన తీరుతెన్నులు గమనిస్తే పరిస్థి తులు ఆయన నియంత్రణలో ఉన్నట్టు కనబడదు. మైనారిటీల సంగతలావుంచి అసలు ముస్లిం మహిళలకే ఇబ్బందులు తప్పడం లేదు. మత ఛాందసవాదులు రంగంలోకి దిగి బురఖా ధరించని బాలికలనూ, మహిళలనూ నడిరోడ్లపై పంచాయతీలు పెట్టి హింసిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. హసీనా ఏలుబడిలో అవినీతి పెరిగిందనటంలో సందేహం లేదు. పదవి కాపాడుకొనేందుకు ఎన్నికల ప్రక్రియను ఏమార్చారన్న ఆరోపణల్లో కూడా నిజం వుంది. కానీ దానికి విరుగుడు ఈ అరాచకమా?!ప్రభుత్వాలను కూలదోసిన సందర్భాల్లో పాలకులు పరారీ కావటం, వేరేచోట ఆశ్రయం పొందటం అసాధారణమేమీ కాదు. హసీనా ఢిల్లీకి ఆదరా బాదరాగా వచ్చినా ఇక్కడినుంచి లండన్ వెళ్లాలని ప్రయత్నించారు. కానీ బ్రిటన్ ఆమె వినతిని తోసిపుచ్చింది. బంగ్లాలో హఠాత్తుగా బయ ల్దేరిన ఉద్యమానికి అమెరికా ఆశీస్సులున్నాయని ఆరోపణలొచ్చిన నేపథ్యంలో బ్రిటన్ ఆమె వినతిని తిరస్కరించటంలో వింతేమీ లేదు. కానీ ఆమెను అప్పగించాలని కోరిన వెంటనే మన ప్రభుత్వం అందుకు అంగీకరించటం సాధ్యమేనా? చట్టబద్ధ పాలన ఆనవాళ్లు లేవు సరికదా... ఎడాపెడా కక్షపూరిత విధానాలు అమలవుతున్నప్పుడు కోరిన వెంటనే ఒక మాజీ అధినేతను అప్ప గిస్తారని బంగ్లా ఎలా అనుకుంది? ఉగ్రవాదుల ఆటకట్టించేందుకు వీలుగా రెండు దేశాలూ 2013లో నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. తగిన సాక్ష్యాధారాలు అందజేశాకే నేరస్తుల్ని అప్పగించాలని ఉన్న నిబంధనను కాస్తా వారెంటు జారీ అయితే చాలు అప్పగించవచ్చని సవరిస్తూ 2016లో ఆ ఒప్పందాన్ని సరళం చేశారు. కానీ తనపై పెట్టిన కేసులు న్యాయసమ్మతమైనవి కాదని, అందువల్ల అప్పగింత వినతిని తిరస్కరించాలని హసీనా మన ప్రభుత్వాన్ని కోరుకోవచ్చు. రాజ కీయ కారణాలతో అప్పగించాలని కోరితే తిరస్కరించొచ్చని ఒప్పందంలోని నిబంధనలే చెబుతున్నాయి. సంక్లిష్టమైన ఈ ప్రక్రియంతా పూర్తికావటానికి సుదీర్ఘకాలం పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హసీనా విషయంలో అక్కడి న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా వ్యవహరిస్తుందన్న విశ్వాసం తమకు లేదని మన ప్రభుత్వం చెప్పే అవకాశం కూడా ఉంది. ఒకవేళ మన దేశం అందుకు సంసిద్ధత చూపినా హసీనా మన కోర్టుల్ని ఆశ్రయించి ఉపశమనం పొందుతారు. బ్రిటన్తో మనకు నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉన్నప్పటికీ రుణాలు తీసుకుని బ్యాంకులను వేలాది కోట్ల రూపాయల మేర మోసగించి పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యా వంటివారిని రప్పించటం అసాధ్యమవుతున్నది. మన దేశంలో ఉగ్రవాద ఘటనలకు పాల్పడి పరారీలో ఉన్న నేరగాళ్లను పట్టి అప్పగించటానికి కొన్ని యూరప్ దేశాలు నిరాకరిస్తున్నాయి. మన న్యాయవ్యవస్థ, జైళ్లు ప్రామాణికంగా లేవన్న కారణాలు చూపుతున్నాయి. అసలు తన ప్రస్థానం ఏ విధంగా కొనసాగించదల్చుకున్నదో బంగ్లాదేశ్ నిర్ధారించుకోవాలి. ఆ దేశ ఆవిర్భావానికి మూలకారణమైన ‘బెంగాలీ భావన’కు తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతోంది. బంగ్లా విముక్తిని తాము గుర్తించబోమని చెప్పే ఘనులు తయారవుతున్నారు. అడుగడుగునా మత ఛాందసుల ప్రాబల్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. మన దేశంతో సంబంధాల పునరుద్ధరణకు నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకొనేందుకు బంగ్లా ఇంతవరకూ సిద్ధపడలేదు. పైగా పాకిస్తాన్తో అంటకాగేందుకు ఉత్సాహపడుతోంది. 53 యేళ్ల క్రితం ఒక దేశంగా ఆవిర్భవించటానికి ముందు పాక్ సైనిక పాలకులు తమను ఎంత దారుణంగా అణచేశారో ఈ తరం మరిచిపోయి ఉండొచ్చు. 30 లక్షలమందికి పైగా ప్రజల బలిదానాలతో ఏర్పడిన దేశం కళ్లముందు కుప్పకూలుతుంటే నిశ్చేష్టులై ఉండిపోవటం విషాదకరం. అత్యంత విషమ పరిస్థితుల్లో కూడా ఎంతో అప్రమత్తతతో, వివేకంతో వ్యవహరించిన శ్రీలంక పౌరులను ఆదర్శంగా తీసుకుంటేనే దేశానికి మెరుగైన భవిష్యత్తు సాధ్యమవుతుందని బంగ్లా ప్రజలు తెలుసుకోవాలి. -
పారదర్శకతకు పాతర
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వ్యవహారశైలిపై, దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియపై అనేక అనుమానాలు తలెత్తుతున్న వేళ... అవి మరింత పెరిగే ప్రమాదం తాజాగా తలెత్తింది. ఎన్నికల నిర్వహణ నిబంధనల్ని మారుస్తున్నట్టు కేంద్ర సర్కార్ శుక్రవారం ప్రకటించింది. నిబంధనల్లో సరికొత్త సవరణ వల్ల ఇకపై ఎన్నికలకు సంబంధించిన అన్ని పత్రాలనూ పరిశీలించే అవకాశం ప్రజలకు ఉండదు. సీసీ టీవీ, వెబ్కాస్టింగ్ ఫుటేజ్, అభ్యర్థుల వీడియో రికార్డింగుల లాంటి ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు ఇకపై అందుబాటులో ఉండవు. అదేమంటే, అలాంటివన్నిటినీ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచితే వాటిని దుర్వినియోగం చేస్తారనీ, అసలు ఓటరు భద్రతకే ప్రమాదకరమనీ పాలక వర్గాల వాదన. సోషల్ మీడియా యుగంలో, పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్ల దృశ్యాలు విస్తృతంగా అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో అది వట్టి డొల్ల వాదనే. ఎన్నికల నిబంధనల్లో మార్పుపై దేశ వ్యాప్తంగా అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నది అందుకే!‘‘ఎన్నికకు సంబంధించిన మిగిలిన అన్ని పత్రాలనూ ప్రజాక్షేత్రంలో పరిశీలించేందుకు వీలుండాలి’’ అని 1961 నాటి ఎన్నికల నిర్వహణ నిబంధనల్లోని రూల్ 93(2)(ఎ) చెబుతోంది. దానికే ఇప్పుడు సవరణ చేశారు. ఈసీ సిఫార్సు మేరకు, కేంద్ర న్యాయశాఖ ఈ మార్పును నోటిఫై చేసింది. దాంతో, ఇప్పుడిక నిబంధనల్లో ప్రత్యేకంగా పేర్కొన్న పత్రాలను మాత్రమే జనం పరిశీలించవచ్చన్న మాట. అంతేకాదు... ఎన్నికల పత్రాలన్నిటినీ కోరినవారికి ఇవ్వాలంటూ ఈసీని ఇక కోర్టులు ఆదేశించడానికి వీలుండదు. చిత్రమేమంటే, ఇటీవలి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పోలింగ్ కేంద్రంలో పోలైన ఓట్లకు సంబంధించిన పత్రాల కాపీలు, సెక్యూరిటీ కెమెరాలోని ఫుటేజ్, వీడియోలను ఓ పిటిషనర్కు అందించాల్సిందిగా పంజాబ్ – హర్యానా హైకోర్ట్ సరిగ్గా ఈ నెల 9వ తేదీనే ఆదేశా లిచ్చింది. అక్టోబర్ నాటి ఎన్నికల్లో అభ్యర్థి కాదు గనక సదరు పిటిషనర్ ఆ పత్రాలు కోరరాదని ఈసీ వాదించింది. హైకోర్ట్ మాత్రం అభ్యర్థికైతే ఉచితంగా, ఇతరులకైతే రుసుముపై పత్రాలివ్వాలన్న పిటిషనర్ వాదనతో ఏకీభవించింది. కోర్టు ఆదేశాన్ని తప్పక పాటించాల్సిన పరిస్థితి. కానీ, తద్భిన్నంగా ఎన్నికల సంఘం నిబంధనల్ని సవరించడం సహజంగానే చర్చనీయాంశమవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తున్నప్పుడే, సామాన్య ఓటర్లకున్న తిరుగులేని సమాచార హక్కును సుప్రీమ్ కోర్ట్ నొక్కి వక్కాణించింది. రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చే వ్యక్తుల, సంస్థల వివరాలు తెలుసుకొనే హక్కు ప్రజలకుందని తేల్చి చెప్పింది. వివాదాస్పద బాండ్ల పథకాన్ని సమర్థించిన సర్కారుకు అది ఎదురుదెబ్బ. నిజానికి, ఎన్నికల ప్రక్రియ పారదర్శకత, నిజాయతీలో రాజీకి తావు లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం అప్పుడే స్పష్టం చేసినట్టయింది. అయినా సరే, ప్రభుత్వం చెవికెక్కించుకోకుండా ఇప్పుడు ఈసీ సిఫార్సు పేరు చెబుతూ, నిబంధనల సవరణకు దిగడం ప్రజాస్వామ్యవాదులకు దిగ్భ్రాంతి కలిగించే విషయం. ఓటర్లే స్వయంగా తమ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా సాక్షిగా పంచుకుంటున్న రోజుల్లో సీసీ టీవీ దృశ్యాల పట్ల ఈసీ ఇంత హంగామా ఎందుకు చేస్తోందో అంతుపట్టదు. సీసీ టీవీ ఫుటేజ్ అందుబాటులో ఉంటే కృత్రిమ మేధతో దుర్వినియోగం చేసే ముప్పుందన్న ఈసీ వాదన కొంత నిజమైనా, డిజిటల్ యుగంలో అన్ని వీడియోలపై నిషేధం పెడతామా? సవాలుకు అది పరిష్కారం కాదు కదా!ఎన్నికల సంఘం సారథ్యంలో నిఖర్సుగా సాగాల్సిన ఎన్నికల ప్రక్రియ తాలూకు నైతిక నిష్ఠ శరవేగంగా హరించుకుపోతోందంటూ ప్రతిపక్షాలు అసలే గొంతు చించుకుంటున్న సమయంలో నిబంధనల్లో ఈ కొత్త సవరణలు చేయ డాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఎన్నికల రికార్డులనూ, డేటాను ప్రజాక్షేత్రానికి దూరంగా ఉంచాలన్న జ్ఞానోదయం హఠాత్తుగా పాలకులకూ, ఈసీకీ ఎందుకు కలిగినట్టు? జనం దృష్టి నుంచి ఏం దాచాలని చూస్తున్నారు? ప్రతిపక్షాలనే కాదు... పౌరులనూ వేధిస్తున్న ప్రశ్నలివి. పైగా విస్తృత స్థాయి చర్చ జరగకుండానే చేపట్టిన ఈ తొందరపాటు చర్య ఎన్నికల ప్రక్రియపై మరిన్ని అనుమానాలు పెంచేలా పరిణమిస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో అది మరింత విషాదం. వాస్తవానికి భిన్న భౌగోళిక పరిస్థితులు, భాషలు, సంస్కృతులు, సమస్యలున్న సువిశాల దేశంలో అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియగా ఇన్నేళ్ళుగా విజయవంతంగా ఎన్నికలను నిర్వహిస్తూ రావడం గొప్పే. అందుకు మన రాజ్యాంగం ఏర్పరచిన సుస్థిర వ్యవస్థనూ, గత దశాబ్దాల్లో ఈసీ పాత్రనూ తప్పక ప్రశంసించాల్సిందే. కానీ ఏ ఎన్నికల ప్రక్రియకైనా పారదర్శకత ప్రాణాధారం. ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికీ అదే కీలకం. తీరా ఆ పారదర్శకతే ఇప్పుడు రానురానూ తగ్గుతూ పోతుంటే ఏమనాలి? ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యంగా గొప్పలు చెప్పుకొనే మనం ఎటువైపు ప్రయాణిస్తున్నట్టు? అందులోనూ ఆంధ్రప్రదేశ్, హర్యానా సహా అనేక చోట్ల ఎన్నికల్లో ఈవీఎంలపై, వీవీప్యాట్లపై నీలినీడలు కమ్ముకున్న ప్రస్తుత పరిస్థితుల్లో... ఈ తరహా కొత్త నిబంధనతో పాలకులు ఏ రకమైన సూచన ఇవ్వదలిచినట్టు? ఎన్నికల ప్రక్రియ పట్ల విశ్వాసం పాదుకొనాలంటే, ఈ సరికొత్త నిబంధనల మార్పును పునఃపరిశీలించాలి. స్వతంత్రంగా సాగాల్సిన ఈసీ పాలకుల చేతిలో మరబొమ్మగా మారిపోతున్నట్టు విమర్శలు పెల్లుబుకుతున్న సందర్భంలో అది అత్యవసరం. -
దేశం పాడిన గాయకుడు
కిశోర్ కుమార్ మీద సంజయ్ గాంధీ కినుక వహించాడు. ‘ఇరవై సూత్రాల పథకం’ ప్రచారం కోసం దూరదర్శన్ లో మొదలెట్టిన ‘గీతోం భరీ షామ్’లో పాడమని కిశోర్ని సంజయ్ గాంధీ ఆదేశించాడు. డబ్బులు లేకుండా కిశోర్ పాడడు. ఆదేశిస్తే అసలు పాడడు. దాంతో కిశోర్ గొంతుకు రేడియోలో తాళం పడింది. సినిమాల్లో పాడిస్తే ఏం గొడవోనని నిర్మాతలు వెనక్కి తగ్గారు. ‘ఆరాధన’ సూపర్ హిట్ తర్వాత కిశోర్కు వచ్చిన తిప్పలు ఇవి. అప్పుడు కొంతమంది రఫీ దగ్గరకు వచ్చి ‘కిశోర్కు శాస్తి జరిగింది. ఈ కాలాన్ని ఉపయోగించుకోండి’ అన్నారు. రఫీ ఏం మాట్లాడలేదు. ఢిల్లీ వెళ్లి సంజయ్ను కలిశాడు. ‘మీరు కిశోర్ మీద బ్యాన్ ఎత్తేయండి. అందుకు బదులుగా ఒకటి కాదు పది ప్రోగ్రామ్లు చేసిస్తాను’ అన్నాడు. ఆ వెంటనే నౌషాద్ను వెంటబెట్టుకుని దూరదర్శన్లో ప్రోగ్రామ్ ఇచ్చాడు. కిశోర్ బ్యాన్ పోయింది.పత్రికలు కూడా కిలాడీవి. రాజేష్ ఖన్నా స్టార్డమ్తో కిశోర్ గొంతు గిరాకీలోకి రాగానే ‘రఫీ పని అయిపోయింది’ అని రాయడం మొదలెట్టారు. రికార్డింగులు లేక రఫీ గోళ్లు గిల్లుకుంటున్నాడని రాశారు. కిశోర్ తైనాతీలు ఇవన్నీ తెచ్చి కిశోర్కి చూపించారు. కిశోర్ సంతోషించాడా? ప్రెస్మీట్ పెట్టి ‘ఇలాంటి వెధవ రాతలు మానండి. ఆయనంటే నాకు చాలా గౌరవం. మీరు ఎవర్ని గెలిపించి ఎవర్ని ఓడిస్తారు?’ అన్నాడు. ఈ ఇద్దరిని కొంతమంది ఫలానా మతం అనుకుంటారు. ఈ ఇద్దరు మాత్రం ఈ దేశవాసులు. రామ్, రహీమ్ల సన్మతి ఎరిగినవారు.రంజాను మాసంలో రికార్డింగుకు వచ్చి ‘హుక్కే మే ధువా’ (హుక్కా పొగ) అనే పదం చూసి పాడనన్నాడు రఫీ ఉపవాసానికి భంగమని. మతం అంటే అంత నిష్ఠ. సాటి మతం పట్ల? అంతే నిష్ఠ. ‘మన్ తర్పత్ హరి దర్శన్ కో ఆజ్’.... ‘బైజూ బావరా’లో రఫీ పాడితే కన్నీరు ఆగదు వినేవారికి. ఆ కాలంలో అనేక ఆలయాల్లో ఇది ప్రభాతగీతం. దీనిని పాడింది, రాసింది, స్వరం కట్టింది... రఫీ, షకీల్ బదాయునీ, నౌషాద్. ‘నా గొంతు రొటీన్ అవుతోంది. నాకు భజనలు పాడాలని ఉంది’ అని రఫీ వస్తే ఖయ్యాం ఆ కోరిక మన్నించి భజనలు పాడించి అపురూపమైన రికార్డు విడుదల చేశాడు. ‘రఫీ గొంతులో దేవుడు ఉన్నాడు’ అని అందరూ అనేవారే. ఆ దేవుడు అల్లాయా, ఈశ్వరుడా వెతకడం అల్పుల పని.1950–70ల మధ్య మన దేశ సినీ సంగీతం దాదాపు అన్ని భాషల్లో స్వర్ణయుగం చూసింది. సినిమా – దేశవాసులను కలిపే కొత్త మతం అయ్యింది. కళాకారులు వినోద ఉల్లాసాలకే కాదు సామ రస్య, సౌభ్రాతృత్వాలకు ప్రవక్తలుగా మారారు. దేశ విభజన చేదు నుంచి జనాన్ని బయట పడేయడానికి గుర్తెరిగి బాధ్యతగా నడుచుకున్నవారే అందరూ! ‘తూ హిందు బనేగా నా ముసల్మాన్ బనేగా ఇన్సాన్ కీ ఔలాద్ హై ఔలాద్ బనేగా’... (నువ్వు హిందువువి కావద్దు, ముసల్మానువి కావద్దు, మనిషిగా పుట్టినందున మనిషిగా మిగులు) అని సాహిర్ రాయగా రఫీ పాడి చిరస్మరణీయం చేశాడు. మదన్ మోహన్ ట్యూన్ చేసిన ‘కర్చలే హమ్ ఫిదా’... రఫీ పాడితే నేటికీ సరిహద్దు సైనికులకు తేజోగీతమే. గాంధీజీని బలిగొన్నారన్న వార్త తెలియగానే సంగీత దర్శకులు హన్స్లాల్–భగత్రామ్, గీతకర్త రాజేంద్ర కిషన్ కలిసి ఆయనకు నివాళిగా ‘సునో సునో అయ్ దునియావాలో బాపు కీ ఏ అమర్ కహానీ’ రూపొందిస్తే ఇంకెవరు పాడతారు రఫీ తప్ప! బాపు పాదాల ఎదుట పారిజాతాల కుప్ప గదా ఈ పాట.సరళత్వము, తీయదనము, స్వచ్ఛత... వీటిని ప్రదర్శించడం ద్వారా ముప్పై ఏళ్ల పాటు పాడి కోట్ల మంది అభిమానులను పొందిన అమృత గాయకుడు రఫీ. ‘సుహానీ రాత్ ఢల్ చుకీ, ‘చౌద్వీ కా చాంద్ హో’, ‘బహారో ఫూల్ బర్సావో’, ‘ఓ దునియా కే రఖ్వాలే’, ‘ఖోయా ఖోయా చాంద్’, ‘దీవానా హువా బాదల్’, ‘క్యా హువా తేరా వాదా’... ఈ పాటలకు అంతూ పొంతూ ఉందా? కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు... ఏ ప్రాంతమో ఏ భాషో... అందరూ రఫీ అభిమానులు. రోజువారీ పనిలో, కాయకష్టంలో, సేద తీరే వేళ, వేడుకల్లో రఫీ.. రఫీ... రఫీ! కూతురిని అత్తారింటికి సాగనంపేటప్పుడు ప్రతి తండ్రి తలుచుకుని ఉద్వేగాశ్రువులు రాల్చే పాట ‘బాబుల్ కి దువాయే లేతీ జా’... షంషాద్ బేగం, గీతాదత్, లతా, ఆశా... అందరూ రఫీకి జోడీలే. దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్, షమ్మీ కపూర్, అమితాబ్... అందరూ అభినయకర్తలే. రఫీ పాడటంతో సగం నటన. మిగిలిన సగమే వీరు చేయాల్సి వచ్చేది.55 ఏళ్లకు మరణించాడు రఫీ. రేపటి డిసెంబర్ 24కు శత జయంతి. అయినా ఇన్నాళ్లకూ కాసింత కూడా మరపునకురాని సుర గాయకుడు. పాటనూ, ప్రేమనూ పంచి అందరి చేత ‘రఫీ సాబ్’ అనిపించుకున్నవాడు. ఆయన మృతదేహం ఆస్పత్రిలో ఉంటే ‘భూపిందర్ సింగ్ – రఫీ తమ్ముడు’ అని సంతకం పెట్టి ఇంటికి చేర్చిన గాయకుడు భూపిందర్ది ఏ మతం? చనిపోయిన అన్న రఫీది ఏ మతం? ఆ రోజు ఆకాశం నుంచి ఆగని వర్షం. ఇసుక వేస్తే రాలని జనం. గాంధీ గారు మరణించినప్పుడు ఇంత జనం వచ్చారట. రఫీ శత జయంతి ముగియనున్న ఈ వేళ అందరం వెలికి తీయవలసింది, జాగృత పరచవలసినది ఆయన పంచిన ఈ ప్రేమనే, ప్రేమమయ గీతాలనే! విద్వేష గీతాన్ని ఎవరు ఆలపించాలనుకున్నా కావలించుకుని వినిపిద్దాం రఫీ గీతం – జిందాబాద్ జిందాబాద్ అయ్ మొహబ్బత్ జిందాబాద్. జీతే రహో రఫీ సాబ్! అభీనా జావో ఛోడ్కర్ కె దిల్ అభీ భరా నహీ... -
ఇదేనా అంబేడ్కర్ వారసత్వం!
అనుకున్నట్టే పార్లమెంటు శీతాకాల సమావేశాలు పరస్పర వాగ్యుద్ధాలతో మొదలై ఘర్షణలతో ముగిశాయి. పార్లమెంటు ముఖద్వారం వద్ద అధికార, విపక్ష సభ్యులు ఒకరినొకరు తోసుకోవటం, ఒకరిద్దరు గాయడటం, పోలీసు కేసుల వరకూ పోవటం వంటి పరిణామాలు అందరికీ దిగ్భ్రాంతి కలిగించాయి. తమ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముకేశ్ రాజ్పుత్లు గాయపడ్డారని బీజేపీ అంటున్నది. కాదు... వారే తమను పార్లమెంటులోకి వెళ్లకుండా అడ్డగించారని, ఆ తోపులాటలో కిందపడ్డారని కాంగ్రెస్ చెబుతున్నది. వారు అడ్డగించటం వల్ల తమ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే కూడా గాయపడ్డారని, ముగ్గురు బీజేపీ ఎంపీలు రాహుల్ గాంధీపై భౌతికదాడికి పాల్పడ్డారని వివరి స్తున్నది. రెండు వర్గాలూ అటు స్పీకర్కూ, ఇటు పోలీసులకూ ఫిర్యాదులు చేసుకున్నాయి. నాగా లాండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ సభ్యురాలు కోన్యాక్ తనతో రాహుల్ గాంధీ అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ విషయంలో రాహుల్పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదయ్యే అవకాశం ఉన్నదంటున్నారు. అసెంబ్లీ సమావేశాలప్పుడు ఏదో వివాదం రేకెత్తి ఒకరిపైకొకరు లంఘించటం, ఘర్షణపడటం, కుర్చీలు విసురుకోవటం, దుర్భాషలాడుకోవటం రాష్ట్రాల్లో సర్వసాధారణమైంది. కానీ ఇదేమిటి... దేశమంతటికీ ప్రాతినిధ్యం వహించే అత్యున్నత చట్టసభ ఇంత చట్టుబండలు కావటం ముందూ మునుపూ విన్నామా? సమావేశాల ప్రారంభంలోనే అదానీ వ్యవహారంపై విపక్షాలు పెద్ద రగడ సృష్టించాయి. ఆయనపై అమెరికాలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, అరెస్టు చేస్తారని వచ్చిన వార్తలు నిజం కావని ప్రముఖ న్యాయవాదులు చెప్పాక అది సద్దుమణిగింది. వివాదాలు ఉండొచ్చు... విధానాల విషయంలో విభేదాలుండొచ్చు. కానీ చట్టసభ అనేది అధి కార, విపక్షాలు ప్రజలకు గరిష్టంగా మేలు చేయటానికి గల అవకాశాలను అన్వేషించే వేదిక. తమ నిర్ణయాల పర్యవసానం గుర్తెరగకుండా పాలకపక్షం ప్రవర్తిస్తున్నప్పుడు విపక్షాలు నిరసన గళం వినిపిస్తాయి. అందువల్ల పాలకపక్షం తనను తాను సరిదిద్దుకునే ఆస్కారం కూడా ఉంటుంది. అది లేనప్పుడు కాస్త ఆలస్యం కావొచ్చుగానీ... అధికార పక్షానికి ప్రజలే కళ్లు తెరిపిస్తారు. ఇందిరాగాంధీ ఏలుబడిలో ఎమర్జెన్సీ విధించినప్పుడేమైంది? ఆ తర్వాత వచ్చిన జనతాపార్టీ ప్రభుత్వం ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ఇష్టారాజ్యంగా రద్దుచేసినప్పుడు భంగపాటు తప్పలేదు. ఏకంగా 400 మంది సభ్యుల బలం ఉన్న రాజీవ్గాంధీ ఏకపక్షంగా వ్యవహరించినప్పుడు కూడా ఆయనకు చేదు అను భవాలే ఎదురయ్యాయి. 2020లో వచ్చిన సాగుచట్టాలు కూడా ఎన్డీయే సర్కారు ఉపసంహరించు కోక తప్పలేదు. ఏ విషయంలోనైనా తక్షణమే అమీతుమీ తేల్చుకోవాలనుకునే మనస్తత్వం వల్ల ఉన్న సమస్య కాస్తా మరింత జటిలమవుతున్నది. ఇటీవలి కాలంలో చట్టసభలు బలప్రదర్శన వేదికలవు తున్నాయి. సమస్య ఎదురైనప్పుడు దాని ఆధారంగా అవతలి పక్షం అంతరంగాన్ని బయటపెట్టి ప్రజలు గ్రహించేలా చేయటం అనే మార్గాన్ని వదిలి బాహాబాహీ తలపడటం అనేది దుష్ట సంప్రదాయం. అందువల్ల చట్టసభ అంటే సాధారణ పౌరుల్లో చులకన భావం ఏర్పడటం తప్ప సాధించే దేమీ ఉండదు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను ఎవరు అవమానించారు... ఎవరు నెత్తిన పెట్టుకున్నారన్న విషయమై ఏర్పడిన వివాదం కాస్తా ముదిరి పరస్పరం క్రిమినల్ కేసులు పెట్టుకోవటం వరకూ పోవటం విచారకరం. బీజేపీ ఎంపీలు అప్పటికే బైఠాయించిన ప్రధాన ద్వారంవైపునుంచే పార్లమెంటులోకి ప్రవేశించాలని కాంగ్రెస్ అనుకోవటం వల్ల బాహాబాహీకి దిగే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి వేరే ద్వారంనుంచి వెళ్లమని భద్రతా సిబ్బంది చేసిన సూచనను రాహుల్ గాంధీ బేఖాతరు చేశారని, పైగా ఇతర సభ్యులను రెచ్చగొట్టారని బీజేపీ ఫిర్యాదు సారాంశం. దేశంలో ఏదో ఒకమూల నిత్యమూ సాగిపోతున్న విషాద ఉదంతాలు గమనిస్తే డాక్టర్ అంబే డ్కర్ నిజమైన వారసులెవరన్న అంశంలో భౌతికంగా తలపడిన రెండు పక్షాలూ సిగ్గుపడాల్సి వస్తుంది. ఒకపక్క పార్లమెంటులో ఈ తమాషా నడుస్తుండగానే తన పెళ్లికి ముచ్చటపడి గుర్రంపై ఊరేగుతున్న ఒక దళిత యువకుడిపై ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో ఆధిపత్య కులాలవారు దాడిచేసి కొట్టారన్న వార్త వెలువడింది. ఇది ఏదో యాదృచ్ఛికంగా కులోన్మాదులు చేసిన చర్య కాదు. దశాబ్దాలుగా ఇలాంటి ఘోరాలు సాగుతూనే ఉన్నాయి. తాము ఉపయోగించే బావిలో లేదా చెరువులో దప్పిక తీర్చుకున్నారన్న ఆగ్రహంతో దళితులపై దాడులు చేసే సంస్కృతి ఇంకా పోలేదు. చాలాచోట్ల రెండు గ్లాసుల విధానం ఇంకా సజీవంగా ఉంది. మన రాజ్యాంగం అమల్లోకొచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా చర్చిస్తుండగానే... డాక్టర్ అంబేడ్కర్ వారసత్వం గురించి పార్టీలు పోటీపడుతుండగానే వాస్తవ స్థితిగతులు ఇలా ఉన్నాయి.సైద్ధాంతిక విభేదాలను ఆ స్థాయిలో మాట్లాడుకుంటే, ఆరోగ్యకరమైన చర్చల ద్వారా అన్ని విషయాలనూ ప్రజలకు తేటతెల్లం చేస్తే మెరుగైన ఫలితం వస్తుంది. నిజానిజాలేమిటో అందరూ గ్రహిస్తారు. డాక్టర్ అంబేడ్కర్ తన జీవితకాలమంతా రాజీలేని పోరాటం చేశారు. మెజారిటీ ప్రజానీకం ప్రయోజనాలను దెబ్బతీసే భావాలనూ, చర్యలనూ అడుగడుగునా తీవ్రంగా వ్యతిరేకించారు. ఉద్యమాలు నిర్వహించారు. అంతేతప్ప అవతలిపక్షంపై హింసకు దిగలేదు. ఆయన వారసత్వం తమదేనంటున్నవారు వాస్తవానికి తమ చర్యల ద్వారా ఆ మహనీయుడి స్మృతికీ, ముఖ్యంగా ఆయన నాయకత్వంలో రూపొందిన రాజ్యాంగానికీ అపచారం చేస్తున్నామని గుర్తిస్తే మంచిది. -
కుదుపు రేపే నిర్ణయం
భారత క్రికెట్ రంగంలో బుధవారం ఉరుము లేని పిడుగు పడింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు అయిదు టెస్ట్లు ఆడుతుండగా సిరీస్ మధ్యలోనే అగ్రశ్రేణి భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటించడం అనేకమందిని ఆశ్చర్యపరిచింది. ఆస్ట్రేలియాలో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్లోని మూడో టెస్ట్తో పాటు అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ సైతం ముగిసింది. సంచలనం రేపిన ఈ వార్త పలు అనుమానాలు, ఊహాగానాలకు కూడా తెర తీసింది. తాజాగా పెర్త్, బ్రిస్బేన్ మ్యాచ్లలో తుది జట్టులో స్థానం దక్కకపోవడంతో అశ్విన్ స్వచ్ఛందంగా ఆట నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. ‘సిరీస్లో ఇప్పుడు నా అవసరం లేనట్టయితే, ఆటకు గుడ్బై చెప్పేస్తాను’ అంటూ రిటైర్మెంట్కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మకు ఆయన తేల్చిచెప్పేశారు. ‘ఆడే సత్తా నాలో ఇంకా మిగిలే ఉంది. బహుశా, (ఐపీఎల్ లాంటి) క్లబ్–స్థాయి క్రికెట్లో దాన్ని చూపుతాను. భారత జట్టు తరఫున ఆడడం మాత్రం ఇదే ఆఖరి రోజు’ అన్న అశ్విన్ ప్రకటన క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేని విషయమే. మొత్తం 106 టెస్టుల్లో 537 వికెట్లు సాధించిన అశ్విన్ అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత క్రికెటర్. 132 మ్యాచ్లలో 619 వికెట్లు సాధించిన నిన్నటి తరం అగ్రశ్రేణి స్పిన్నర్ అనిల్ కుంబ్లే తరువాత అలా ద్వితీయ స్థానంలో నిలిచారు అశ్విన్. బంతితోనే కాదు... బ్యాట్తోనూ అరడజను శతకాలు, 14 అర్ధ శతకాలతో 3,503 పరుగులు సాధించిన ఘనత ఆయనది. ఇంకా చెప్పాలంటే, గత 14 ఏళ్ళ పైచిలుకు కాలంలో స్వదేశంలో భారత జట్టు తిరుగులేని శక్తిగా ఎదగడం వెనుక ఈ తమిళ తంబి కీలక పాత్రధారి. ఈ ఏడాది బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఆయన ఏకంగా 11వ సారి మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికై, ప్రపంచ రికార్డును సమం చేశారు. బరిలో ఓర్పు, బంతి విసరడంలో నేర్పు, ప్రత్యర్థిని బోల్తా కొట్టించడంలో నైపుణ్యం ఉన్న తెలివైన ఆటగాడాయన.అందుకే, ఆటలో ఈ అగ్రశ్రేణి ఆఫ్ స్పిన్నర్ చూపే ప్రతిభకు ప్రేక్షకులు జేజేలు పలికారు. ప్రస్తుత భారత జట్టు బౌలర్లలో ప్రత్యేకంగా నిలిచారు. ఏ క్రికెటరైనా విదేశాల్లో కాకుండా సొంతగడ్డపై ఆటకు స్వస్తి పలకాలనుకుంటారు. అది సర్వసాధారణం. ఎందుకంటే, స్వదేశంలో సొంత క్రీడాభిమానుల జయజయ ధ్వానాల మధ్య ఘనంగా వీడ్కోలు పలకవచ్చని భావిస్తారు. కానీ, అశ్విన్ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు. దానికి కారణాలు లేకపోలేదు. ఆడే సత్తా ఉన్న ఏ క్రీడాకారుడైనా బరిలో ఉండాలనుకుంటాడే తప్ప, అవకాశం కోసం నిరీక్షిస్తూ బెంచ్ మీద కూర్చొనే జాబితాలో చేరాలనుకోడు. అది ఎవరికైనా బాధాకరమే. అలాంటిది... టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆరు టెస్ట్ సెంచరీలు, 500కు పైగా వికెట్లు తీసుకొన్న ఏకైక క్రికెటర్కు తరచూ అలాంటి అనుభవం ఎదురైతే? అది మరింత బాధ కలిగిస్తుంది. 38 ఏళ్ళ వయస్సులో, కెరీర్లో కాలం కరిగిపోతున్న వేళ... అశ్విన్కు అది అవమానమూ అనిపించింది. భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా సిరీస్లో మధ్యలో ఆయన హఠాత్తుగా తన రిటైర్మెంట్ ప్రకటించారనుకోవాలి. సరిగ్గా పదేళ్ళ క్రితం 2014 డిసెంబర్లో మరో అగ్రశ్రేణి భారత క్రికెటర్ ధోనీ సైతం ఇలాగే ఆటకు అల్విదా చెప్పారు. ఈ వాస్తవ పరిణామాలన్నీ గమనిస్తూ, క్షేత్రస్థాయి అంశాలను గమనంలోకి తీసుకున్న వారికి మాత్రం అశ్విన్ నిర్ణయం మరీ దిగ్భ్రాంతికరంగా తోచదు. అదే సమయంలో జీవితంలో, ఆటలో అత్యంత కఠినమైన ఈ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కూడా విమర్శల జోలికి పోకుండా, పక్కా జెంటిల్మన్గానే వ్యవహరిస్తూ అశ్విన్ తన నిర్ణయాన్ని ప్రకటించడం చెప్పుకోదగ్గ విషయం. ఆస్ట్రేలియా సిరీస్లోని తొలి మూడు టెస్టుల్లో అడిలైడ్లోని రెండో టెస్ట్లో మాత్రమే అశ్విన్కు జట్టులో స్థానం దక్కింది. ప్రతిభావంతుడైన పాతికేళ్ళ వాషింగ్టన్ సుందర్ అంతకంతకూ ముందు కొస్తూ, అశ్విన్ను పక్కకు జరిపి జట్టులో చోటు సంపాదించుకుంటూ పోతున్నారు. ఫలితంగా అశ్విన్ హుందాగానే పక్కకు తప్పుకున్నారు. వికెట్లు పడగొట్టడంలో పేరున్న ఈ స్పిన్నర్ నిర్ణయం ‘వ్యక్తిగతం’ అని రోహిత్ శర్మ చెప్పారు కానీ రిటైర్మెంట్ ప్రకటన అనంతరం విలేఖరుల ప్రశ్నలు వద్దని అశ్విన్ సున్నితంగానే తప్పుకోవడంతో కంటికి కనిపించని కథలున్నాయనే వాదనకు బలం చేకూరింది. అయితే, అశ్విన్ ఆది నుంచి జట్టు సమష్టి ప్రయోజనాలకై ఆడినవారే. అనేక సందర్భాల్లో సెలెక్టర్ల బంతాటలో వైట్ బాల్ గేమ్స్లో స్థానం దక్కించుకోకున్నా, పట్టుదలతో ఆడుతూ తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పటికీ కనీసం మరో రెండేళ్ళ పాటు అంతర్జాతీయ స్థాయిలో ఆడగల సత్తా ఆయనకుంది. అయినా పక్కకు తప్పుకున్నారు. గతంలో ధోనీ ఆస్ట్రేలియాతోనే మెల్ బోర్న్ టెస్ట్లో హుందాగా టెస్ట్ క్రికెట్ నుంచి పక్కకు తప్పుకొని, యువకులకు దోవ ఇచ్చారు. కార ణాలేమైనా, అశ్విన్ ప్రస్తుతానికి పెదవి విప్పి పెద్దగా చెప్పకుండానే పదవీ విరమణ ప్రకటించారు. పేరు ప్రతిష్ఠలు, డబ్బు అన్నీ కెరీర్లో భాగమైన ఆటగాళ్ళు వాటన్నిటినీ వదులుకొని, రిటైరవుతున్నట్టు చెప్పడం నిజానికి ఎప్పుడూ కష్టమే. అశ్విన్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. కాకుంటే, పైకి గంభీరంగా కనిపిస్తూ భావోద్వేగాల్ని ప్రదర్శించకపోవడం విశేషం. అశ్విన్ వ్యక్తిగతం మాటెలా ఉన్నా, ఆయన నిష్క్రమణతో భారత క్రికెట్ ఇప్పుడో చిత్రమైన సంధి దశలో నిలిచింది. బహుశా, ఈ ప్రతిభావంతుడి తాజా నిర్ణయంతో ఒకప్పటి ఫామ్ కోల్పోయి, తడబడుతున్న రోహిత్ శర్మ, కోహ్లీలు సైతం ఆత్మపరిశీలనలో పడాల్సి రావచ్చు. ఎంతైనా ఆర్ట్ ఆఫ్ ‘లీవింగ్’ కూడా ఆర్ట్ ఆఫ్ ‘లివింగ్’లో భాగమే కదా! వెరసి, అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం అన్వేషణతో పాటు ఆయన నిష్క్రమణకు దారి తీసిన పరిస్థితులపై చర్చ చాలాకాలం కొనసాగడం ఖాయం. -
చర్చ జరగాలి కానీ, ఇలాగా..?
పార్లమెంట్ శీతకాల సమావేశాలు ఈ సోమవారంతో ఆఖరి వారం వ్యవధిలోకి ప్రవేశించాయి. దేశంలో చలి పెరుగుతుంటే, సభలో వాతావరణం మాత్రం వేగంగా వేడెక్కుతోంది. మొన్న నవంబర్ 26న 75 వసంతాలు పూర్తి చేసుకున్న భారత రాజ్యాంగం అమలుపై అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వం చూస్తే ఆ భావనే కలుగుతుంది. లోక్సభలో గత శుక్ర, శనివారాలు రాజ్యాంగ చర్చ జరిగితే, ఈ సోమ, మంగళవారాలు రాజ్యసభలో అది కొనసాగుతోంది. ‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’ బిల్లుకు కావాల్సిన రాజ్యాంగ సవరణ మాట అటుంచితే, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కాక గాంధీల కుటుంబ శ్రేయానికై కాంగ్రెస్ నిస్సిగ్గుగా రాజ్యాంగాన్ని సవరిస్తూ పోయిందని ఆర్థిక మంత్రి ఆరోపించడం తాజాగా అగ్గి రాజేసింది. అనేక జటిల సమస్యలకు రాజ్యాంగ సవరణలే ఏకైక పరిష్కారం అంటూ నెహ్రూకు సాక్షాత్తూ సర్దార్ పటేలే లేఖ రాశారంటూ రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తిప్పికొట్టాల్సి వచ్చింది. వెరసి, భారత గణతంత్రానికి ఆత్మ లాంటి రాజ్యాంగంపై చర్చ పక్కదోవ పట్టి, పార్టీలు బురదజల్లుకొనే ప్రక్రియగా మారిపోయింది. నిజానికి, స్వాతంత్య్రానంతరం భారతదేశ భవితవ్యమెలా ఉంటుందన్న దానిపై బోలెడన్ని అనుమానాలు, జోస్యాలు వెలువడినా, మన రాజ్యాంగం పటాపంచలు చేసింది. నిజానికి, నవ యువ గణతంత్ర రాజ్యంగా మనం అనేక ఒడుదొడుకులను ఎదుర్కొన్నాం. వాటన్నిటినీ తట్టుకొని నిలవడంలోనూ విజయవంతమయ్యాం. భారత రాజ్యాంగం కాలపరీక్షకు నిలిచి, దేశానికి మూలస్తంభంగా నిలిచింది. ఇవాళ అనేక దేశాల్లో, చివరకు సోకాల్డ్ ప్రజాస్వామ్యాల్లోనూ అధికార బదలాయింపులో పలు సమస్యలను ఎదుర్కొంటున్నా, భారత్లో మాత్రం ప్రజాభీష్టాన్ని ప్రతిఫలించే అధికార బదలీ శాంతియుతంగా సాగిపోవడం మన రాజ్యాంగం వేసిన పటిష్ఠమైన పునాదికీ, చూపిన ఆచరణాత్మకమైన మార్గానికీ తార్కాణం. ఈ ఏడున్నర దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో వేర్వేరు రాజకీయ పార్టీలు, కూటములు దేశాన్ని పాలించాయి. 1975లో ఎమర్జెన్సీ విధింపు లాంటి అశనిపాతాలు అడపాదడపా ఎదురైనా, ప్రభుత్వాలన్నీ దేశాన్ని ముందుకే నడిపాయి. క్రియాశీలక సజీవపత్రంగా రాజ్యాంగ రూపకర్తలు సంభావించిన భారత రాజ్యాంగం అంతర్గత సంకల్పబలం, స్థితిస్థాపక చైతన్యంతో నవ భారత అవసరాలకు తగ్గట్టుగా మార్పులతో నిత్య నూతనంగా నిలుస్తూ వచ్చింది. దానికి తగ్గట్టే రాజ్యాంగాన్ని ఇప్పటికి శతాధిక పర్యాయాలు సవరించడం జరిగింది. దేశ సామాజిక, ఆర్థిక ప్రయోజనాలకు తగ్గట్టు దేశం ముందుకు పోయేందుకు అనేక ఏళ్ళుగా భారత రాజ్యాంగం వీలు కల్పిస్తూనే వచ్చింది. అనేక పార్ష్వాలున్న ఈ రాజ్యాంగ ప్రస్థానాన్ని పార్లమెంట్లో చర్చిస్తున్నారంటే, భవిష్యత్తుపై దృష్టి సారిస్తారని భావించాం. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలు, లక్ష్యాలు సాకారమయ్యేందుకు పథ నిర్దేశం జరుగుతుందని ఆశించాం. భారత స్వాతంత్య్ర శతవర్ష సమారోహం సాగే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎలా తీర్చిదిద్దాలన్న దానిపై మేధా మథనం జరపాలని ఆకాంక్షించాం. ఆ దిశలో సామాన్యుల జీవితాలు మెరుగయ్యేలా లక్షించాల్సింది పోయి విమర్శల పర్వానికే చర్చ పరిమితమైపోవడం శోచనీయం. నిజానికి, ఎవరూ విమర్శలకు అతీతులు కారు. గాంధీ, నెహ్రూలైనా అంతే. వారిని విమర్శించ దలుచుకుంటే నేరుగా విమర్శించవచ్చు. అంతేకానీ, రాజ్యాంగంపై చర్చ పేరిట పరోక్షంగా కొంద రిపై బురద జల్లడం ఏమిటన్నది ఒక వాదన. తాజా చర్చ సందర్భంలో అధికార ఎన్డీఏ వర్గీయులు ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగ నిర్మాతల లక్ష్యాలను తప్పుబడుతున్నారని కూడా ఆరోపణ. అయితే, అసలు భావప్రకటనా స్వేచ్ఛపై సహేతుకమైన పరిమితులు పెట్టవచ్చంటూ తొలి రాజ్యాంగ సవరణ తెచ్చింది కాంగ్రెసే అని బీజేపీ ఎత్తిచూపుతోంది. స్వేచ్ఛ ఉండాలి నిజమే కానీ, అన్ని సమయాల్లోనూ అది నిర్నిబంధమైతే కష్టం గనక సహేతుకమైన పరిమితులు విధించవచ్చని అలా ప్రథమ సవరణతో రాజ్యాంగ రూపకర్తలే దిద్దుబాటు బాట పట్టారన్నది కాంగ్రెస్ వర్గీయుల ప్రతివాదన. రాజ్యాంగ అమలుకు అమృతోత్సవ వేళ చర్చ దాని అమలు తీరుతెన్నులు, భవిష్యత్ సవాళ్ళపైనే సాగాల్సింది. సామూహిక ఆత్మపరిశీలనకు దీన్ని అవకాశంగా మలుచుకోవాల్సింది. కానీ, జరుగుతున్నది వేరు. చర్చంతా రాజకీయ రంగు పులుముకొని, నెహ్రూ కుటుంబం, ఎమర్జెన్సీ, మోదీ సర్కార్ చుట్టూ సాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో అవిశ్వాస తీర్మానంపై చర్చ ఫక్కీలోకి జారిపోయింది.1975 ఎమర్జెన్సీలోనైనా, ఇప్పుడు ‘అప్రకటిత ఎమర్జెన్సీ’ ఉందంటున్నా... రెండు సందర్భాల్లో పాలకుల చేతిలో నలిగిపోయింది రాజ్యాంగానికి గుండె లాంటి పౌరుల ప్రాథమిక హక్కులే అని విస్మరించరాదు. ఏళ్ళు గడుస్తున్నకొద్దీ సవాళ్ళు అధికరిస్తున్నాయి. లౌకికవాదం, సమాఖ్య వాదం, న్యాయవ్యవస్థ స్వతంత్రత, దుర్విచక్షణ లేకపోవడం, మైనారిటీల హక్కుల పరిరక్షణ లాంటి రాజ్యాంగ మౌలిక సూత్రాలపైనే ప్రశ్నార్థకాలు పొడసూపుతున్నాయి. సమాన అవకాశాల మాట దేవుడెరుగు, ఆర్థికంగా– సామాజికంగా– లింగపరంగా సమానత్వం సైతం నేటికీ పూజ్యం. అంత రాలు పెరుగుతున్న సమాజంలో అసమానతల నిర్మూలనకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామా? అన్ని పక్షాలూ ఆత్మావలోకనం చేసుకోవాలి. రాజకీయ పత్రం, దేశ రాజకీయాలకు పునాది అయినప్పటికీ, రాజ్యాంగమనేది అదే సమయంలో రాజకీయాలకు అతీతమైనది. దానిపై చర్చలో ప్రధాని సహా అందరూ సంకుచిత రాజకీయాలకే చోటిస్తే ఇంకేమనాలి? ఈ ధోరణి మారాలి. రాజ్యాంగం ఇన్నేళ్ళుగా జాతికి దిక్సూచిగా నిలిచింది. ప్రభుతకూ, పౌరులకూ ప్రజాస్వామ్య ఫర్మానాగా వెలిగింది. ఆ ఉజ్జ్వల స్ఫూర్తికి కట్టుబడడమే సమస్త సమస్యలకూ పరిష్కారం. సామాన్యుల హక్కులకు శ్రీరామరక్ష. -
మంచినీళ్ల కుండ
‘చదువని వాడజ్ఞుండగు! చదివిన సదసద్వివేక చతురత గలుగున్ !’ అంటాడు పోతన తన ఆంధ్ర మహా భాగవతంలో. చదవకపోతే ఏమీ తెలీదు, చదువుకుంటేనే మంచీ చెడుల వివేకం కలుగుతుంది; అందుకే, ‘చదువంగ వలయు జనులకు! చదివించెద నార్యులొద్ద, చదువుము తండ్రీ!’ అని ప్రహ్లాదుడికి తండ్రి హిరణ్యకశ్యపుడితో చెప్పిస్తాడు. నిజంగానే ఆ గురువుల దగ్గరి చదువేదో పూర్తికాగానే, ‘చదివించిరి నను గురువులు! చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు! నే/ జదివినవి గలవు పెక్కులు! చదువులలో మర్మ మెల్ల జదివితి తండ్రీ!’ అని జవాబిస్తాడు ప్రహ్లాదుడు. కొడుకుకు కలిగిన వివేకం తండ్రి కోరుకున్నదేనా అన్నది పక్కనపెడితే, చదువనేది భిన్న ద్వారాలు తెరుస్తుందన్నది నిజం. ప్రహ్లాదుడు పుట్టు వివేకి కాబట్టి, తనకు కావాల్సిన సారాన్ని గ్రహించగలిగాడు. అందరికీ అలాంటి గుణం ఉంటుందా? అందుకే, ‘చదువులన్ని చదివి చాలవివేకియౌ/ కపటికెన్న నెట్లు కలుగు ముక్తి/ దాలిగుంటగుక్క తలచిన చందము’ అన్నాడు వేమన. ‘చదువులెల్ల చదివి సర్వజ్ఞుడై యుండి’నప్పుడు కూడా ఉండే బలహీనతలను ఎత్తిపొడిచాడు. ఆత్మసారం తెలుసుకోవడమే ముఖ్యమన్నాడు.అతడు ‘బాగా చదువుకున్నవాడు’ అంటే లోకాన్ని బాగా అర్థం చేసుకున్నవాడు, పరిణత స్వభావం ఉన్నవాడు, గౌరవనీయుడు, ఒక్క మాటలో వివేకి అని! వివేకం అనేది ఎన్నో గుణాలను మేళవించుకొన్న పెనుగుణమే కావొచ్చు. అయినా అదొక్కటే చాలా? ‘చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా/ చదువు నిరర్థకమ్ము’ అన్నాడు భాస్కర శతకకర్త మారవి వెంకయ్య. ‘బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం/పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!’ అని ప్రశ్నించాడు. కూరకు రుచి తెచ్చే ఉప్పులాగే జీవితంలో ‘యించుక’ రసజ్ఞత ఉండాలి. చాలామందిలో ఆ సున్నితం, ఆ సరస హదయం లోపించడం వల్లే సంబంధాలు బండబారుతున్నాయి. అందుకే వివేకం, రసజ్ఞతలను పెంచే చదువు ముఖ్యం. ఈ చదువు తరగతి చదువు కాదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరగతి గదిలోనే ఇవి అలవడితే అంతకంటే కావాల్సింది ఏముంది! ప్రపంచంలోకి దారి చూపే చదువు, ప్రపంచాన్ని చేరువ చేసే చదువు సాహిత్య రూపంలో ఉంటుంది. ఆ సాహిత్యం మంచి పుస్తకం రూపంలో హస్తభూషణమై ఉంటుంది.మనుషుల వివేకాన్ని కొలవదలిచినవాళ్లు ‘ఇప్పుడు ఏం చదువుతున్నారు?’ అని అడుగుతారు. చదవడం మాత్రమే సరిపోదు, ఆ చదువుతున్నది ఏమిటి? ‘నీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయన్నది విషయం కాదు, నీ దగ్గరున్న పుస్తకాలు ఎంత మంచివి అన్నదే ముఖ్యం’ అంటాడు గ్రీకు తత్వవేత్త సెనెకా. మంచిని ఎలా కొలవాలి? ‘మనల్ని గాయపరిచే, పోటుపొడిచే పుస్తకాలే మనం చదవాలి. తల మీద ఒక్క చరుపు చరిచి మేలుకొలపకపోతే అసలంటూ ఎందుకు చదవడం’ అంటాడు రచయిత ఫ్రాంజ్ కాఫ్కా. చదవడమే పెద్ద విషయం అయిన కాలంలో, దానికి ఇన్ని షరతులా అన్న ప్రశ్న రావడం సహజమే. ఎందుకంటే, ‘నేషనల్ లిటరసీ ట్రస్ట్’ నివేదిక ప్రకారం, భారతీయ చిన్నారుల్లో చదవడం దాదాపు సంక్షోభం స్థాయికి పడిపోయింది. 5–18 ఏళ్లవారిలో కేవలం మూడింట ఒక్కరు మాత్రమే తమ ఖాళీ సమయంలో చదవడాన్ని ఆనందిస్తామని చెప్పారు. కేవలం 20 శాతం మంది మాత్రమే, ప్రతిరోజూ ఏదో ఒకటి చదువుతున్నామని జవాబిచ్చారు. చదివే అలవాటును పెంచకపోతే, వికాసానికి దారులు మూస్తున్నట్టే!ఆధునిక తరానికి చదవడం మీద ఉత్సాహం కలిగించేలా, అయోమయ తరానికి రసజ్ఞత పెంచేలా ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ డిసెంబర్ 19 నుంచి 29 వరకు పాటు కాళోజీ కళాక్షేత్రం (ఎన్టీఆర్ స్టేడియం)లో జరగనుంది. మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి తొమ్మిది వరకు ఇది కొనసాగుతుంది. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, హిందీలో పేరున్న భిన్న ప్రచురణకర్తలు, విక్రేతలు, రచయితల స్టాళ్లు సుమారు 350 వరకు ఏర్పాటవుతాయి. నూతన పుస్తకాల ఆవిష్కరణలు, ఉపన్యాసాలు ఉంటాయి. 1985 నుంచి జరుగుతున్న ఈ బుక్ ఫెయిర్ను ఈసారి పదిహేను లక్షల మంది సందర్శిస్తారని అంచనా. ‘మనం అనేక పండుగలు చేసుకుంటాం. కానీ పుస్తకాల పండుగ ప్రత్యేకమైనది. పెద్ద జాతరలో మంచినీళ్ల కుండ లాంటిది బుక్ ఫెయిర్. ఏ రకమైనా కావొచ్చుగాక, అసలు పుస్తకాల వైపు రాగలిగితే మనిషికి వివేకం, వివేచన పెరుగుతాయి. జీవిత సారాన్ని అందించేదే కదా పుస్తకమంటే! ‘ఏడు తరాలు’ లాంటి నవలకు మనం ఎట్లా కనెక్ట్ అయ్యాం! పుస్తకాలు, అక్షరాలు లేకపోతే మనం ఎక్కడుండేవాళ్లం? అందుకే ఈసారి నచ్చిన, మెచ్చిన, ప్రభావితం చేసిన పుస్తకం అంటూ పుస్తకం కేంద్రకంగా కొన్ని సెషన్లు నిర్వహిస్తున్నాం’ అని చెబుతున్నారు బుక్ ఫెయిర్ అధ్యక్షుడు ‘కవి’ యాకూబ్. అయితే, పుస్తకాల దుకాణాల కన్నా, దగ్గర్లోని బజ్జీల బండికి గిరాకీ ఎక్కువ అనే వ్యంగ్యం మన దగ్గర ఉండనే ఉంది. అన్నింటిలాగే ఇదీ ఒక ఔటింగ్, ఒక వినోదం, బయటికి వెళ్లడానికి ఒక సాకు... లాంటి ప్రతికూల అభిప్రాయాలు ఉండనే ఉన్నాయి. ఏ వంకతో వెళ్లినా దేవుడి దగ్గరికి వెళ్లగానే భక్తిగా కళ్లు మూసుకున్నట్టు, పుస్తకం చూడగానే ఆర్తిగా చేతుల్లోకి తీసుకుంటున్నప్పుడు ఏ కారణంతో వెళ్తేనేం? కాకపోతే వ్యక్తిత్వానికి సరిపడే, వివేకం– రసజ్ఞతలను పెంచే పుస్తకాలను ఎంపిక చేసుకోవడమే పెద్ద పని. దానికోసం కొంత పొల్లు కూడా చదవాల్సి రావొచ్చు. కానీ క్రమంగా ఒక ఇంట్యూషన్ వృద్ధి అవుతుంది. అదే చదువరి పరిణతి. -
‘వేధింపుల’ చట్టానికి కళ్లెం?
మానసిక ఒత్తిళ్లకు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాన్ కెస్లర్ చాన్నాళ్ల క్రితం ఒక అధ్యయనం సందర్భంగా తేల్చారు. మహిళలు ఆ ఒత్తిళ్ల పర్యవసానంగా విషాదంలో మునిగితే మగవాళ్లూ, పిల్లలూ ఆగ్రహావేశాలకు లోనవుతారని చెప్పారు. ఒత్తిళ్లకు స్పందించే విషయంలో పిల్లలూ, మగవాళ్లూ ఒకటేనని ఆమె నిశ్చితాభిప్రాయం. ఈ ధోరణికామె ‘ఇరిటబుల్ మేల్ సిండ్రోమ్’ అని పేరు పెట్టారు. అయితే ప్రతి ఒక్కరూ ఇలాగే ఉంటారని చెప్పలేం. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ తన భార్యతో వచ్చిన తగాదాకు సంబంధించిన కేసుల్లో తనకూ, తన తల్లిదండ్రులకూ ఎదురైన చేదు అనుభవాలను ఏకరువు పెడుతూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. దానికి ముందు విడుదల చేసిన 90 నిమిషాల వీడియో, 24 పేజీల లేఖ ఇప్పుడు న్యాయవ్యవస్థలో సైతం చర్చనీయాంశమయ్యాయి. తనపైనా, తనవాళ్లపైనా పెట్టిన 8 తప్పుడు కేసుల్లో, వాటి వెంబడి మొదలైన వేధింపుల్లో యూపీలోని ఒక ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఉన్నారన్నది ఆ రెండింటి సారాంశం.బలహీనులకు జరిగే అన్యాయాలను నివారించటానికీ, వారిని కాపాడటానికీ కొన్ని ప్రత్యేక చట్టాలూ, చర్యలూ అవసరమవుతాయి. అలాంటి చట్టాలు దుర్వినియోగమైతే అది సమాజ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. ఎందుకంటే ఆ వంకన అసలైన బాధితులకు సకాలంలో న్యాయం దక్కదు సరికదా... బలవంతులకు ఆయుధంగా మారే ప్రమాదం ఉంటుంది. మహిళలపై గృహ హింస క్రమేపీ పెరుగుతున్న వైనాన్ని గమనించి 1983లో భారతీయ శిక్షాస్మృతిలో సెక్షన్ 498ఏ చేర్చారు. అనంతర కాలంలో 2005లో గృహహింస చట్టం వచ్చింది. 498ఏ సెక్షన్ గత ఏడాది తీసు కొచ్చిన భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్)లో సెక్షన్ 84గా ఉంది. అయితే అటుతర్వాత కుటుంబాల్లో మహిళలపై హింస ఆగిందా? లేదనే చెప్పాలి. సమాజంలో కొనసాగే ధోరణులకు స్పందన గానే ఏ చట్టాలైనా వస్తాయి. ఎన్నో ఉదంతాలు చోటుచేసుకున్నాక, మరెన్నో ఉద్యమాలు జరిగాక, నలుమూలల నుంచీ ఒత్తిళ్లు పెరిగాక మాత్రమే ఎంతో ఆలస్యంగా ఇలాంటి చట్టాలు వస్తాయి. బల హీనులకు ఉపయోగపడే అటువంటి చట్టాల్ని దుర్వినియోగం చేసే వారుండటం నిజంగా బాధాకరమే.జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం 498ఏ వంటి చట్టాలు ఈమధ్యకాలంలో దుర్వినియోగమవుతున్న ఉదంతాలు పెరగటంపై ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగత కక్షతో అత్తింటివారిపైనా, భర్తపైనా తప్పుడు కేసులు పెట్టే తీరువల్ల వివాహ వ్యవస్థ నాశన మవుతున్నదని వ్యాఖ్యానించింది. ఇప్పుడే కాదు... 2014లో కూడా సుప్రీంకోర్టు ఒక సంద ర్భంలో ఇలాంటి వ్యాఖ్యానమే చేసింది. ‘భర్తలపై అలిగే భార్యలకు సెక్షన్ 498ఏ రక్షణ కవచంగా కాక ఆయుధంగా ఉపయోగపడుతోంద’ని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇకపై శిక్షాస్మృతిలోని సెక్షన్ 41కి అనుగుణంగా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే తదుపరి చర్యలకు ఉపక్రమించాలని కూడా సూచించింది. నిజమే... ఎలాంటి చట్టాలైనా నిజమైన బాధితులకు ఉపయోగపడినట్టే, అమాయకులను ఇరికించడానికి కూడా దోహదపడుతాయి. చట్టాన్ని వినియోగించేవారిలో, అమలు చేసేవారిలో చిత్తశుద్ధి కొరవడితే జరిగేది ఇదే. ఆ తీర్పు తర్వాత గత పదేళ్లుగా వేధింపుల కేసులు నత్తనడక నడుస్తున్నాయి. అందులో నిజమైన కేసులున్నట్టే అబద్ధపు కేసులు కూడా ఉండొచ్చు. మనది పితృస్వామిక సమాజం కావటంవల్ల పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయి కుటుంబ బాధ్యతలు మీద పడేవరకూ ఏ దశలోనూ ఆడవాళ్లపై హింస మటుమాయమైందని చెప్పలేం. వాస్తవానికి ఇందులో చాలా రకాల హింసను మన చట్టాలు అసలు హింసగానే పరిగణించవు. ఆర్థిక స్తోమత, సమాజంలో హోదా వంటివి కూడా మహిళలను ఈ హింస నుంచి కాపాడలేకపోతున్నాయన్నది వాస్తవం. ఒకనాటి ప్రముఖ నటి జీనత్ అమన్, భారత్లో మొట్టమొదటి లేడీ ఫిట్నెస్ ట్రైనర్గా గుర్తింపు సాధించిన నవాజ్ మోదీలు ఇందుకు ఉదాహరణ. వీరిద్దరూ తమ భర్తల నుంచి తీవ్రమైన గృహహింసను ఎదుర్కొన్నారు. జీనత్కు కంటి కండరాలు దెబ్బతిని కనుగుడ్డు బయటకు రాగా, దాన్ని య«థాస్థితిలో ఉంచటానికి గత నలభైయేళ్లలో ఎన్ని సర్జరీలు చేయించుకున్నా ఫలితం రాలేదు. నూతన శస్త్ర చికిత్స విధానాలు అందుబాటులోకొచ్చి నిరుడు ఆమెకు విముక్తి దొరికింది. ఒకప్పుడు కట్టుబాట్లకు జడిసి, నలుగురిలో చులకనవుతామన్న భయంతో ఉండే మహిళలు ఉన్నత చదువుల వల్లా, వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం రావటం వల్లా మారారు. వరకట్న వేధింపులు, ఇతర రకాల హింసపై కేసులు పెడుతున్నారు. ప్రశ్నిస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే అదే సమయంలో కొందరు దుర్వినియోగం చేస్తున్న మాట కూడా వాస్తవం కావొచ్చు. అలాంటివారిని గుర్తించటానికీ, వారి ఆట కట్టించటానికీ దర్యాప్తు చేసే పోలీసు అధికారుల్లో చిత్తశుద్ధి అవసరం. ఈ విషయంలో న్యాయస్థానాల బాధ్యత కూడా ఉంటుంది. లోటుపాట్లు తప్పనిసరిగా సరిచేయాల్సిందే. కానీ ఆ వంకన అలాంటి కేసుల దర్యాప్తులో జాప్యం చోటు చేసు కోకుండా ఇతరేతర మార్గాలపై దృష్టి సారించాలి. ఎందుకంటే ఏటా ప్రతి లక్షమంది మహిళల్లో దాదాపు ముగ్గురు వరకట్న హింసకు ప్రాణాలు కోల్పోతున్నారని నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం. వరకట్న నిషేధ చట్టం వచ్చి 63 ఏళ్లవుతున్నా ఇదే స్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుత చట్టాలను నీరగార్చకుండానే ఎలాంటి జాగ్రత్తలు అవసరమో ఆలోచించాలి. -
సరైన దిశలో ఒక ప్రయత్నం
ఎట్టకేలకు ఒక అడుగు ముందుకు పడింది. బంగ్లాదేశ్లోని పరిస్థితి పట్ల తన మనోభావాలను భారత్ స్పష్టంగా పంచుకోగలిగింది. బంగ్లాదేశ్లోని మధ్యంతర సర్కారుకు ప్రధాన సలహాదారైన మహమ్మద్ యూనస్, బంగ్లా విదేశాంగ కార్యదర్శి మహమ్మద్ జషీముద్దీన్ తదితరులతో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఢాకాలో సమావేశమవడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయాక రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న వేళ భారత్ నుంచి తొలిసారిగా ఓ ఉన్నతాధికారి బంగ్లా వెళ్ళడం, దౌత్య భేటీ జరపడం విశేషమే. ఇటు హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడం, అటు బంగ్లాలో అల్పసంఖ్యాక హిందువులపై దాడులతో ద్వైపాక్షిక సంబంధాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితుల్లో తాజా భేటీలో ఇరుపక్షాలూ నిర్మొహమాటంగా పరస్పరం అభిప్రాయాలు పంచుకోవడం సరైన దిశలో పడిన అడుగు. హసీనా హయాంతో పోలిస్తే, భారత్ పట్ల పెద్ద సానుకూలత లేని సర్కారు బంగ్లాలో ప్రస్తుతం నెలకొన్నందున తాజా దౌత్యయత్నాలు కీలకం. చారిత్రకంగా మిత్రత్వం, పరస్పర ప్రయోజనాలున్న పొరుగు దేశాలు అపోహలు, అనుమానాలు దూరం చేసుకోవడానికి ఇవి ఏ మేరకు ఉపకరిస్తాయో చూడాలి. బయట ఉద్రిక్త వాతావరణం ఉన్న సమయంలో జరిగిన ఈ చర్చలు మైనారిటీలపైన, హిందూ ఆలయాలపైన దాడులు, రాజద్రోహ నేరంపై హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు సహా అనేక వివాదాస్పద అంశాలపై దృష్టి సారించాయి. రెండు కోట్ల పైగా హిందువులున్న ముస్లిమ్ మెజారిటీ దేశంలో మైనారిటీల భద్రతపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తే, ఆ ఘటనలు రాజకీయమైన వంటూ బంగ్లా వాదించింది. ప్రజల భావోద్వేగాలు, రాజకీయ ప్రయోజనాలు కలగలిసినప్పుడు పరస్పర భిన్న వాదనల మధ్య రాజీ కుదర్చడం కష్టమే. కానీ, విదేశాంగ శాఖ కార్యదర్శుల భేటీతో చిరు ప్రయత్నమైనా సాగడం విశేషం. బంగ్లాదేశ్ సైతం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, జరుగుతున్నదే మిటో గ్రహించి, అసలంటూ సమస్య ఉన్నదని గుర్తించడానికి ఈ భేటీ ప్రేరేపిస్తే మంచిదే. 1971 నాటి బంగ్లాదేశ్ విముక్తి పోరులో భారత్ పాత్ర మరపురానిది. అదే సమయంలో స్వాతంత్య్రం ముందు నుంచి చారిత్రకంగా ఉన్న అనుబంధం రీత్యా సాహిత్య, ఆర్థిక, ఆధ్యాత్మిక, రాజకీయ పరంగా ఆధునిక భారతావని రూపుదిద్దుకోవడంలో బంగాళ ప్రాంతపు భాగ స్వామ్యం అవిస్మరణీయమే. బ్రిటీషు కాలం నుంచి భౌగోళిక రాజకీయాలు, సామాజిక సాంస్కృతిక కారణాలతో ముడిపడిన భారత – బంగ్లా బంధం ఇటీవలి ఉద్రిక్తతల నడుమ నలిగిపోతోంది. ఇరుదేశాల మధ్య 4,096 కి.మీల ఉమ్మడి సరిహద్దుంది. ప్రపంచంలోనే సుదీర్ఘమైన అయిదో సరిహద్దు ఇది. పైగా, చాలా ప్రాంతంలో పూర్తిస్థాయిలో సరిహద్దుల గుర్తింపు జరగనేలేదు. సరిహద్దులో నెలకొన్న పశ్చిమ బెంగాల్లోని ఒక్క పెట్రాపోల్ వద్దనే రెండు దేశాల మధ్య భూమార్గ వాణిజ్యంలో 30 శాతం జరుగుతుంది. ఏటా సుమారు 23 లక్షల మంది సరిహద్దులు దాటి, భారత్కు వైద్య చికిత్సకు వస్తుంటారు. కాబట్టి, ఇటీవలి ఉద్రిక్తతల్ని దాటి వాణిజ్యం, ఇంధనం, సహకారం, సామర్థ్యాల పెంపు దలను బంగ్లా చూడగలగాలి. ఇరుదేశాలూ చేతులు కలిపి అడుగులు వేస్తేనే అభివృద్ధి సాధ్యం. ఉల్లిపాయలు, బంగాళదుంపలు, వెల్లుల్లి లాంటి నిత్యావసర వస్తువుల విషయంలో ఢిల్లీ పైనే ఢాకా ఆధారపడి ఉంది. కానీ, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశం దేశీయ ఉత్పత్తిని పెంచుకొని, ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తోంది. ఇక, బంగ్లా రోగులకు శస్త్రచికిత్స చేసేది లేదంటూ కొన్ని భారతీయ ఆస్పత్రులు అమానవీయంగా, మూర్ఖంగా వ్యవహరించడం సమర్థనీయం కాదు. ఈ చర్యల వల్ల బంగ్లా దేశీయులు ఇప్పుడు మలేసియాను ఆశ్రయిస్తున్నట్టు వార్త. ఇలాంటివన్నీ దీర్ఘకాలంలో భారత ప్రయోజనాలకే దెబ్బ. అసలు మిగతా ప్రపంచంతో భారత వాణిజ్యంతో పోలిస్తే, సరుకుల్లో భారత – బంగ్లాల ద్వైపాక్షిక వాణిజ్యం వేగంగా వృద్ధి చెందింది. అనేక అంశాలు ముడిపడి ఉన్నందున తెగేదాకా లాగడం ఇరుపక్షాలకూ మంచిది కాదు. కొత్త వాస్తవాలను గుర్తించక ఒకవేళ మనం ఇదే వైఖరితో ముందుకు సాగితే చివరకు నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, మాల్దీవులు, మయన్మార్ వరుసలోనే బంగ్లాదేశ్ సైతం ఢిల్లీకి దూరమవుతుంది. పొరుగున మిత్రులెవరూ లేని దుఃస్థితి భారత్కు దాపురిస్తుంది. యూనస్ సారథ్యంలోని ప్రస్తుత బంగ్లా సర్కార్ పాక్కు చేరువవుతోంది. ఇటీవల రెండు దేశాల మధ్య వీసాల ఎత్తివేత, రక్షణ ఒప్పందాలు, కరాచీ నుంచి పాకిస్తానీ సరుకుల రవాణా నౌకను చిట్టగాంగ్ వద్ద లంగరేసుకునేందుకు అనుమతించడం లాంటివి చూస్తే అదే అనిపిస్తోంది. దాదాపు 47 ఏళ్ళ తర్వాత రెండు దేశాల మధ్య నేరుగా సముద్ర నౌకాయాన సంబంధాల పునరుద్ధరణకు ఇది ఒక సూచన. వ్యూహాత్మకంగా సుస్థిర దక్షిణాసియాకు కట్టుబడ్డ భారత్ జాగ్రత్తగా అడుగులు వేయాలి. బంగ్లా అంతర్గత రాజకీయాల్లోకి అతిగా జొరబడి, ప్రస్తుత హయాం నమ్మకాన్ని పోగొట్టు కోరాదు. ఈ పరిస్థితుల్లో భారత విదేశాంగ కార్యదర్శి ఢాకా పర్యటన ఇరుగుపొరుగు బాంధవ్యం, భాగస్వామ్యాల ప్రాధాన్యాన్ని గుర్తించినట్టే అనిపిస్తోంది. బంగ్లా సైతం ముందుగా తన అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దుకోవాలి. ఆ దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటే, మైనారిటీలు సురక్షితంగా ఉంటే, పాత బంధం మళ్ళీ మెరుగవుతుంది. వెరసి, భారత్ – బంగ్లాలు ప్రస్తుతం నాలుగురోడ్ల కూడలిలో నిలిచాయి. మనసు విప్పి మాట్లాడుకొని, పరస్పర ప్రయోజనాల్ని కాపాడుకుంటే మేలు. అలాకాక సహకార మార్గం బదులు సంఘర్షణ పథాన్ని ఎంచుకుంటే ఇరువురికీ చిక్కే! -
ముందున్న సవాలు
21వ శతాబ్దంలో అత్యంత దీర్ఘకాలం సాగిన యుద్ధం... లక్షలాది ప్రజల ప్రాణాలు తీసి, మరెందరినో వలస బాట పట్టించి, శరణార్థులుగా మార్చిన యుద్ధం... ఎట్టకేలకు ఒక ముగింపునకు వచ్చింది. సంక్షుభిత సిరియా చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. అధ్యక్షుడు బషర్ – అల్ – అసద్ పాలనకు ఆదివారం ఆకస్మికంగా తెరపడడంతో సిరియాలో అంతర్యుద్ధం కొత్త మలుపు తిరిగింది. అలెప్పో, హమా, హామ్స్ల తర్వాత డమాస్కస్ సైతం తిరుగుబాటు శక్తుల వశం కావడంతో సిరియా రాజకీయ, సైనిక దృశ్యం సమూలంగా మారిపోనుంది. ఈ పరిణామాల ప్రభావం ఆ ప్రాంతమంతటా కనిపించనుంది. దాదాపు 53 ఏళ్ళ పైచిలుకు నిరంకుశ కుటుంబ పాలన పోయినందుకు సిరియన్లు సంబరాలు చేసుకుంటున్నా, తరువాతి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. తిరుగుబాటు తర్వాత డమాస్కస్లో సాగుతున్న విధ్వంసం, లూటీ దృశ్యాలు 2021లో అఫ్ఘానిస్తాన్లో జరిగిన సంఘటనల్ని తలపిస్తున్నాయి. అక్కడ తాలిబన్ల లానే ఇక్కడ ఇస్లామిస్ట్ బృందాలు సైతం గద్దెనెక్కాక వెనకటి గుణం మానక నిజ స్వభావం చూపిస్తాయని భయాందోళనలు రేగుతున్నాయి. వెరసి, అసలే రగులుతున్న పశ్చిమాసియా కుంపటికి కొత్త సెగ వచ్చి తోడైంది. చరిత్ర గమనిస్తే, ప్రజాగ్రహ ఉద్యమం 2011 మార్చిలోనే సిరియాను తాకింది. ఎప్పటికప్పుడు కూలిపోవడం ఖాయమని భావించినా, అసద్ ఏలుబడి వాటన్నిటినీ తట్టుకొని, దాటుకొని వచ్చింది. జనాగ్రహాన్ని ఎదుర్కొనేందుకు ఆయన తీవ్ర హింసకు పాల్పడ్డారు. స్వదేశీయులపైనే ఒక దశలో రసాయన ఆయుధాలు వాడినట్లు ఆరోపణలూ వచ్చాయి. సిరియాకు ఆయన పీడ ఎప్పుడు వదులుతుందా అని ఎదురుచూస్తున్న పరిస్థితి తెచ్చాయి. దాదాపు దశాబ్ద కాలం దూరం పెట్టాక, అరబ్ ప్రపంచం గత ఏడాది మళ్ళీ చేరదీయడం అసద్కు కలిసొస్తుందని భావించారు. అయితే, అరబ్ రాజ్యాలు తమ స్వలాభం కోసమే ఆ పని చేశాయి. అసద్ పోతే వచ్చే తెలియని దేవత కన్నా తెలిసిన దయ్యం మేలని భావించాయి. వారం రోజుల క్రితం దాకా ఈ పాలనకు చరమగీతం తథ్యమని ఎవరూ ఊహించ లేదు. రష్యా, ఇరాన్, హెజ్బుల్లాల అండతో అసమ్మతిని అణచివేస్తూ, అసద్ అధికారాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. అయితే, కొద్ది రోజుల క్రితం ఒక్కసారిగా మళ్ళీ తిరుగుబాటు బృందాలు విజృంభించడంతో నాటకీయంగా కథ అడ్డం తిరిగింది. ఒక పక్క ఉక్రెయిన్తో పోరాటం నేపథ్యంలో రష్యా వైమానిక సాయం ఉపసంహరించుకోగా, మరోపక్క ఇజ్రాయెల్తో యుద్ధం వల్ల హెజ్బొల్లా వనరులు క్షీణించాయి. ఇదే అదనుగా ఇస్లామిస్ట్ గ్రూప్ హయత్ – తహ్రీర్ అల్ – షామ్ (హెచ్టీఎస్) సారథ్యంలోని తిరుగుబాటుదారులు చకచకా ముందుకు చొచ్చుకువచ్చారు. అసద్కు పట్టున్న ప్రాంతాలన్నీ కైవసం చేసుకుంటూ, ఆఖరికి అధికార పీఠానికి ప్రతీక అయిన డమాస్కస్ను చేజిక్కించుకోవడంతో ఏళ్ళ తరబడి సాగుతున్న నియంతృత్వానికి తెరపడింది. పదవీచ్యుతుడైన అధ్యక్షుడు విమానంలో పలాయనం చిత్తగించాల్సి వచ్చింది. అసద్ పదవీచ్యుతి ప్రభావం ప్రాంతీయంగా గణనీయమైనది. ఆ ప్రాంతంలో ఇంతకాలంగా స్నేహంగా మెలిగిన కీలక దేశం సిరియాలో అనుకూల పాలన పోవడం ఇరాన్కు వ్యూహాత్మకంగా ఇబ్బందికరమే. మరోపక్క హెజ్బుల్లా భవిష్యత్తూ అనిశ్చితిలో పడింది. తిరుగుబాటుదారులకు తెర వెనుక అండగా నిలిచిన టర్కీ ఇప్పుడిక అక్కడ చక్రం తిప్పే సూచనలున్నాయి. అయితే, టర్కీ ప్రయోజనాలకూ, ప్రాంతీయ శక్తులకూ మధ్య వైరుద్ధ్యం తలెత్తితే ఉద్రిక్తతలు పెరుగుతాయి. మానవ హక్కులను సైతం కాలరాస్తున్న నియంతృత్వంపై పోరాటం ఎవరు, ఎక్కడ చేసినా అది సమర్థనీయమే. ప్రపంచం సంతోషించాల్సిన అంశమే. నియంతృత్వం పోయి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడుతుందని ఆశిస్తాం. కానీ, అసద్ పాలన స్థానంలో రానున్న పాలన ఏమిటన్నది ప్రశ్న. ఒకటికి పది సంస్థలు ఈ సాయుధ తిరుగుబాటును నడిపాయని విస్మరించలేం. అసద్ను గద్దె దింపడం సరే కానీ, అనేక వైరుద్ధ్యాలున్న ఇవన్నీ ఒకతాటిపైకి రావడం, రేపు సజావుగా పాలన సాగించడం సాధ్య మేనా అన్నది బేతాళప్రశ్న. తీవ్రవాద అల్ఖైదాకు ఒకప్పటి శాఖ అయిన హెచ్టీఎస్ లాంటి తీవ్ర వాద సంస్థలు తమను తాము జాతీయవాద శక్తులుగా చెప్పుకుంటున్నా, అవి తమ వెనకటి స్వభా వాన్ని వదులుకుంటాయా అన్నదీ అనుమానమే. అదే గనక జరగకపోతే... దశాబ్దాలుగా అల్లాడు తున్న సిరియా, అక్కడి సామాన్యుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టవుతుంది. ఒకప్పటి సంపన్న సిరియా దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురై, అంతర్యుద్ధంలో మగ్గుతూ శిథిలాల కుప్పగా మారింది. అసద్ హయాంలో దాదాపు 1.2 కోట్లమంది దేశం విడిచి పోవాల్సి వచ్చింది. ఉద్రిక్తతా నివారణ జోన్లలో అతి పెద్దదైన ఒక్క ఇడ్లిబ్ ప్రావిన్స్లోనే సుమారు 20 లక్షల మంది శరణార్థులుగా బతుకీడుస్తున్నారు. తాజా పరిణామాలతో ఆ దేశాన్ని రాజకీయంగా, సామాజికంగా ఒక గాడిన పెట్టాల్సిన తరుణమిది. స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్న సిరియన్లు సైతం ఈ భగీరథ ప్రయత్నంలో భాగస్వాములవ్వాలి. అలాగే, ఆంక్షల విధింపుతో అసద్ పతనానికి దోహద పడ్డ పాశ్చాత్య దేశాలు సైతం సిరియా వాసుల కష్టాల తొలగింపుపై దృష్టి పెట్టాలి. తద్వారా వేలాది సిరియన్ శరణార్థులు స్వచ్ఛందంగా స్వదేశానికి వచ్చి, దేశ పునర్నిర్మాణంలో భాగమయ్యే వీలు చిక్కుతుంది. అసద్ పదవీచ్యుతితో సిరియా పునర్నిర్మాణానికి అవకాశం అంది వచ్చినా, అందుకు సవాలక్ష సవాళ్ళున్నాయి. మితవాద, అతివాద బృందాల సమ్మేళనమైన ప్రతిపక్షం సైనిక విజయం నుంచి సమర్థమైన పరిపాలన వైపు అడుగులేయడం ముఖ్యం. అందులో జయాపజయాలను బట్టే సిరియా భవితవ్యం నిర్ణయం కానుంది. అందుకే, రానున్న కొద్ది వారాల పరిణామాలు కీలకం. -
అకాలీల ప్రస్థానం ఎటువైపు?
పంజాబ్లో అవసానదశలో పడిన అకాలీదళ్కు కాయకల్ప చికిత్స చేసి రక్షించటానికి చేసిన ప్రయత్నం కాస్తా ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రాణానికి ముప్పు తెచ్చింది. బుధవారం ఆయనపై కాల్పులు జరపబోయిన ఖలిస్తానీ మిలిటెంట్ నారాయణ్ సింగ్ చౌరాను అక్కడున్నవారు సకాలంలో నిరోధించకపోయివుంటే పంజాబ్లో మరో నెత్తుటి అధ్యాయం మొదలయ్యేది. గత తప్పిదాలకు బాదల్నూ, ఇతర నేతలనూ సిక్కు అత్యున్నత పీఠం అకల్తఖ్త్ మతద్రోహులుగా ప్రకటించి విధించిన శిక్షలు అమలవుతుండగా ఈ ఉదంతం చోటుచేసుకుంది. పంజాబ్ స్థితిగతులు ప్రత్యేకమైనవి. మతమూ, రాజకీయాలూ కలగలిసి పోవటాన్ని వ్యతిరేకించేవారు సైతం ఈ ప్రత్యేకతను గమనించబట్టే అక్కడ అకాలీదళ్ వంటి మధ్యేవాద పక్షం అవసరమని భావిస్తారు. లేనట్టయితే మతాన్ని తలకెక్కించుకున్న అతివాదులది అక్కడ పైచేయి అవుతుందని వారి వాదన. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు అకాలీదళ్ను బలహీనపరచటానికి భింద్రన్వాలే వంటి మిలిటెంట్లకు మొదట్లో అందించిన పరోక్ష ప్రోత్సాహం పంజాబ్కు శాపంగా మారింది. పరిస్థితి చేయిదాటాక అమృత్సర్ స్వర్ణాలయంలో తలదాచుకున్న భింద్రన్వాలేను, అతని ముఠాను అదుపు చేయటానికి సైన్యంతో నిర్వహించిన ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ కాస్తా వికటించి చివరకు ఇందిర ప్రాణాలనే బలితీసుకుంది. ఆ హత్యకు ప్రతీకారమన్నట్టు ఢిల్లీతోసహా దేశంలో అనేకచోట్ల కాంగ్రెస్ నేతలు వెనకుండి సిక్కులపై సాగించిన హత్యాకాండ పర్యవసానంగా ఉగ్రవాద గ్రూపులు పుట్టుకొచ్చాయి. దశాబ్దంపాటు పంజాబ్ కనీవినీ ఎరుగని కల్లోలం చవిచూసింది. వేలాదిమంది అమాయక పౌరులు ఆహుతయ్యారు. ఉగ్రవాదాన్ని అదుపుచేయటం కోసమంటూ భద్రతా బలగాలు సాగించిన ఎన్కౌంటర్లు, అపహరణలు, అదృశ్యాలు సరేసరి. మన దేశంలో నామరూపాల్లేకుండా పోయిన ఆ ఉద్యమం ప్రస్తుతం కెనడాలో సాగిస్తున్న కార్యకలాపాల పర్యవసానమేమిటో కనబడుతూనే వుంది. అయిదుగురు సిక్కు మత పూజారుల అత్యున్నత పీఠం అకల్తఖ్త్ సుఖ్బీర్ సింగ్ బాదల్ను స్వర్ణాలయ ప్రధానద్వారం వద్ద సాధారణ సేవాదార్గా పనిచేయాలని తీర్మానించింది. ఆయన తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానని తెలిపే పలకను మెడలో ధరించారు. ఇతర అకాలీ నేతలకు స్వర్ణాలయంలో అంట్లు తోమటం నుంచి మరుగుదొడ్లు శుభ్రం చేయటం వరకూ వేర్వేరు శిక్షలు విధించింది. ఈ శిక్షలకు 2007–17 మధ్య పంజాబ్లో ఆ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగిన కూటమి సర్కారులోని భాగస్వామ్య పక్షమైన బీజేపీ అత్యుత్సాహం కారణం. పంథ్ కోసం ప్రాణత్యాగాలు చేసిన వ్యక్తులను విస్మరించి, సిక్కులను అనేకవిధాల హింసించి చంపిన రిటైర్డ్ పోలీసు అధికారుల కుటుంబ సభ్యులకు పదవులు పంచిపెట్టడం అకాలీదళ్ నేతలు చేసిన ‘ప్రధాన నేరం’. వీరిలో చాలామంది బీజేపీవారు కాగా, అకాలీ తరఫున ఎంపికైనవారు కూడా ఉన్నారు. అలాగే మతాన్ని అపవిత్రం చేసిన దేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీంపై ఉన్న కేసుల్ని ఆయన కోరకుండానే రద్దుచేయటం, దాన్ని సమర్థించుకోవటానికి తమకు అనుకూలంగా ప్రకటన ఇవ్వాల్సిందిగా జతేదార్లను పిలిపించి ఒత్తిడి చేయటం వంటివి ఇతర ఆరోపణలు. అధికారంలో ఉండగా చేసిన పనులకు అకాలీదళ్ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. 1920లో ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న రైతాంగం దూరమైంది. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా పెరిగింది. దానికితోడు సాగు సంక్షోభం, ఉపాధి లేమివంటì సమస్యలు మధ్యతరగతిని, ఇతర వర్గాలవారినీ అసంతృప్తిలో ముంచెత్తాయి. అందుకే అకాలీలను వరస ఓటములు వెంటాడాయి. పర్యవసానంగా అంతర్గత కుమ్ములాటలు అధికమయ్యాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ రంగప్రవేశం అకాలీని నిలువునా ముంచింది. ఆ పార్టీ మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో అభ్యర్థుల్ని కూడా నిలబెట్టలేకపోయింది. తన భాగస్వామ్య పక్షాన్ని బలహీనపరిచి ఎదగాలని చూసే బీజేపీ ఎత్తుగడలు ఆ రాష్ట్రంలో ఫలించలేదు. అందుకే అకాలీ నేతల ‘తప్పుల’కు తగిన శిక్ష విధించి, వారికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశమీయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ జాఖడ్ గత నెలలో అకల్తఖ్త్కు విజ్ఞప్తి చేశారు. అయితే ఉగ్రవాదం విస్తరిస్తుందన్న సాకుతో రాజకీయాల్లో మత సంస్థల ప్రాబల్యం పెంచటం ఎంతవరకూ సబబన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి ఆప్ ఆగమనం, అది అధికార పీఠాన్ని కైవసం చేసుకోవటం విశ్లేషిస్తే మత రాజకీయాల ప్రాబల్యం బలహీన పడిందన్న అభిప్రాయం కలుగుతుంది. అకాలీదళ్ 1977 తర్వాత బాదల్ కుటుంబ ప్రాబల్యంలోకొచ్చాక రాష్ట్రంలో సిక్కు–నిరంకారీ ఘర్షణలు పెరిగాయి. అటూ ఇటూ పదులకొద్దీ మంది మరణించారు. ఇందిర పుణ్యమా అని ఉగ్రవాదం విస్తరించింది. ఈ అయోమయ పరిస్థితుల్లో 1996లో బీజేపీతో కలిసి ప్రయాణించటానికి నిర్ణయించుకుని మోగాలో జరిగిన పార్టీ సమావేశాల్లో సిక్కు మత మూలాలున్న అకాలీదళ్ను సెక్యులర్ పార్టీగా మారుస్తూ తీర్మానించటం పంథ్ అనుకూల ఓటర్లను క్రమేపీ పార్టీకి దూరం చేసింది. బీజేపీ ఆ పని చేయకపోవటాన్ని అందరూ వేలెత్తి చూపారు. అకాలీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ జోషి పార్టీ తిరిగి పంథ్ అనుకూల వైఖరి తీసుకుని శిక్షలకు తలొగ్గటాన్ని నిరసిస్తూ అకాలీదళ్కు రాజీనామా చేశారు. ఈ అంతర్మథనం బాదల్పై జరిగిన తాజా దాడితో ఏయే మలుపులు తీసుకుంటుందో, అకాలీదళ్ ప్రస్థానం ఎలా కొనసాగుతుందో మున్ముందు చూడాలి. -
బైడెన్ పుత్రవాత్సల్యం
చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉండటం, తలకెత్తుకున్న విలువలను చివరివరకూ శిరోధార్యంగా భావించటం అంత తేలిక కాదు. అధికార వైభోగాల్లో మునిగితేలేవారికి అది ప్రాణాంతకం కూడా. ఇందుకు మినహాయింపు ఎవరని జల్లెడ పడితే ప్రపంచవ్యాప్తంగా వేళ్లమీద లెక్కబెట్టేంత మంది మిగులుతారేమో! అధికార పీఠం నుంచి మరో నెలన్నరలో తప్పుకోబోతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన కుమారుడు హంటర్ బైడెన్కు క్రిమినల్ కేసుల నుంచి విముక్తి కలిగించే ఉత్తర్వులపై ఆదివారం సంతకం చేసిన ఉదంతం ఇప్పుడు అమెరికాలో పెద్ద చర్చనీయాంశమైంది. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డోనాల్డ్ ట్రంప్ అధికార పీఠం అధిష్ఠించాక ఒక్కొక్కరి సంగతీ చూస్తానంటూ వీలైనప్పుడల్లా హూంకరిస్తున్నారు. ప్రత్యేకించి హంటర్ బైడెన్ గురించి కూడా చెప్పారు. మన అధమస్థాయి నేతల్లా ‘రెడ్ బుక్’ అని పేరేమీ పెట్టుకోలేదుగానీ వేధించదల్చుకున్నవారి పేర్లన్నిటినీ ఒక చిట్టాలో రాసుకున్నట్టే కనబడుతోంది. కత్తికి పదును పెట్టుకుంటున్న వైనం కళ్ల ముందే కనబడుతోంది. 2021 జనవరి 6న వాషింగ్టన్లో కీలక వ్యవస్థలన్నీ కొలువుదీరిన కాపిటల్ హిల్లోకి చొరబడి కనీవినీ ఎరుగని విధ్వంసం సృష్టించిన మూకకు క్షమాభిక్ష పెట్టడం ఆయన తొలి ప్రాధాన్యం. ఆ కేసుల్ని దర్యాప్తు చేసినవారినీ, కేసులు దాఖలు చేసిన న్యాయవాదులనూ, వీరి వెనకున్న డెమాక్రటిక్ నేతలనూ జైళ్లపాలు చేయటం ట్రంప్ ఎజెండా. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అయితేనేమి... ఇతర సందర్భాల్లో అయితేనేమి తాను విలువలకు మారు పేరని బైడెన్ ఒకటికి పదిసార్లు చెప్పుకున్నారు. క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుని విచారణ ఎదుర్కొంటున్న తన కుమారుడు హంటర్ బైడెన్కు అధ్యక్షుడిగా విశేషాధికారాలను వినియోగించి క్షమాభిక్ష పెట్టే యోచన లేదని చెప్పారు. నిరుడు హంటర్ను వివిధ అభియోగాల్లో నేరస్తుడని ప్రకటించి, శిక్షాకాలాన్ని తర్వాత ప్రకటిస్తామని న్యాయస్థానం చెప్పినప్పుడు ‘తుది నిర్ణయం ఏదైనా శిరసావహిస్తాను. న్యాయవిచారణ ప్రక్రియను గౌరవిస్తాను’ అని బైడెన్ ప్రకటించారు. ఆర్నెల్ల క్రితం ఇటలీలో జీ–7 సమావేశాల సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో సైతం ఆయన దీన్నే చెప్పారు. మరేమైంది? తన మాటల్ని తానే ఎందుకు మింగేశారు? సరిగ్గా 82 ఏళ్ల వయసులో పదవి నుంచి నిష్క్రమించే వేళ తన డెమాక్రటిక్ పార్టీని ఎందుకని ఇరుకున పడేశారు? తమది పురాతన పరిణత ప్రజాస్వామ్యమని అమెరికన్లు గొప్పలు పోతారు. ఎవరైనా– సామాన్య పౌరులైనా, ఉన్నతస్థాయి నేతలైనా–తమ దేశంలో చట్టం ముందు సమానులేనని చెప్పుకుంటారు. అయితే అదంతా నిజం కాదని అడపా దడపా రుజువవుతూనే ఉంటుంది. పైపైన చూస్తే ఇప్పుడు బైడెన్ చర్య కూడా ఆ తానులో ముక్కేనని అందరూ భావిస్తారు. కానీ ఆయన అందర్నీ మించిపోయాడన్నది డెమాక్రాట్లలోనే వినిపిస్తున్న విమర్శల సారాంశం. ఎందుకంటే ఇంతక్రితం అధ్యక్షులు తమ సన్నిహితులకు క్షమాభిక్ష పెట్టారు తప్ప సంతానానికి ఇలాంటి వెసులుబాటు కల్పించే స్థితి ఏర్పడలేదు. గతంలో జార్జి డబ్లు్య బుష్ అమెరికా రక్షణ మంత్రిగా పనిచేసిన కాస్పర్ వీన్బెర్గర్నూ, మరికొంతమంది అధికారులనూ ఇరాన్–కాంట్రా వ్యవహారంలో నేరారోపణల నుంచి విముక్తం చేశారు. బిల్ క్లింటన్ తన సవతి సోదరుడిని మాదకద్రవ్యాల కేసు నుంచి తప్పించారు. ట్రంప్ మాత్రం 2016–20 మధ్య ఎడాపెడా క్షమాభిక్షలు ప్రకటించారు. అందులో తన అల్లుడు జేర్డ్ కుష్నెర్ తండ్రి చార్లెస్ కుష్నెర్ ఒకరు. ఆయనకు పన్ను ఎగవేత కేసులో రెండేళ్ల శిక్షపడగా క్షమాభిక్ష పెట్టారు. అతన్నిప్పుడు ఫ్రాన్స్ రాయబారిగా కూడా ప్రకటించారు. హంటర్కు క్షమాభిక్ష పెట్టాక విడుదల చేసిన ప్రకటనలో బైడెన్ తన కుమారుణ్ణి కావాలని అన్యాయంగా ఇరికించి విచారణ తంతు సాగించారని ఆరోపించారు. అతణ్ణి జైలుపాలుచేసి మానసికంగా తనను ఛిద్రం చేయాలని చూస్తున్నట్టు అర్థమవుతోందన్నారు. ‘ఇది ఇక్కడితో ఆగుతుందనుకోవటానికి లేద’ని ప్రకటించారు. హంటర్ కేసుల్ని గమనిస్తే జో బైడెన్ది పుత్ర ప్రేమ తప్ప మరేం కాదని సులభంగా తెలుస్తుంది. ఆయన మాదకద్రవ్యాల వినియోగంలో ఒకప్పుడు మునిగి తేలేవాడు. దశాబ్దం క్రితం ఆయనది చీకటి జీవితం. ఒబామా హయాంలో తన తండ్రి ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయానికి హంటర్ కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. అతని ప్రవర్తన బైడెన్కు చాలా తలనొప్పులు తెచ్చిపెట్టింది. తుపాకీ కొనుగోలు చేశాక దాన్ని తన దగ్గర కేవలం 11 రోజులే ఉంచుకుని తిరిగి అధికారులకు అప్పగించి ఉండొచ్చు. కానీ దరఖాస్తు చేసినప్పుడు తన నేర చరిత్ర దాచిపెట్టాడు. మాదక ద్రవ్యాలు వాడుతున్న సంగతిని చెప్పలేదు. పన్ను ఎగవేత కేసు సరేసరి. మొత్తానికి రెండు రకాల న్యాయం అమలవుతున్న వైనం కళ్ల ముందు కనబడుతుండగా అనవసర స్వోత్కర్షలకు పోరాదని ఇకనైనా అమెరికన్లు గుర్తించాల్సివుంది. నిజానికి ఇలాంటి అసమ వ్యవస్థే ట్రంప్ వంటివారి ఆవిర్భావానికి దారితీసింది. ఏదేమైనా విలువల గురించి మాట్లాడే నైతికార్హత డెమాక్రాట్లు కోల్పోయారు. ట్రంప్ మున్ముందు ఏం చేయబోతారో ఎఫ్బీఐ డైరెక్టర్గా కాష్ పటేల్ నియామకమే చెబుతోంది. దాన్ని చూపించి బైడెన్ చర్య హేతుబద్ధమైనదని డెమాక్రాట్లు చెప్పలేరు. పైపెచ్చు వచ్చే నాలుగేళ్లలో తాను చేసే ప్రతి అక్రమాన్నీ సమర్థించుకోవటానికి డోనాల్డ్ ట్రంప్ బైడెన్ను ఉదాహరిస్తుంటే వారు మౌనంగా మిగిలిపోక తప్పదు. -
మానని గాయం
ఆధునిక కాలంలో మనిషి అంతరిక్షాన్ని అందుకోగలిగాడు; చంద్రమండలం మీద అడుగు మోప గలిగాడు; సహజ మేధకు పోటీగా కృత్రిమ మేధను సృష్టించాడు; విశ్వామిత్ర సృష్టిని తలపించేలా మనుషులకు దీటైన మరమనుషులను సృష్టించాడు. ఇంతటి మహత్తర ఘనతలను చూసినప్పుడల్లా ‘మానవుడే మహనీయుడు/ శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మహనీయుడు... జీవకోటి సర్వములో శ్రేష్ఠతముడు మానవుడే!’ అనుకుంటూ గర్వంతో ఉప్పొంగిపోతాం. రేపో మాపో అంగారక గ్రహం మీద ఆవాసాలను ఏర్పాటు చేసే దిశగా మనుషులు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుసుకున్నప్పుడు ఉత్సాహంతో ఉబ్బి తబ్బిబ్బయిపోతాం. మనిషి సాధించిన ఘన విజయాలను ఏకరువు పెట్టాలంటే, ఎన్ని గ్రంథాలైనా చాలవు.చరిత్రలో ఇన్ని ఘన విజయాలు సాధించిన మనిషికి అనాది పరాజయాలు కూడా ఉన్నాయి. ఆధునికత సంతరించుకుని, అంతరిక్ష పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్న మనిషి–అమరత్వాన్ని సాధించే దిశగా కూడా ప్రయత్నాలు సాగిస్తున్నాడు. అయితే, ఆకలి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని నేటికీ కనుక్కోలేకపోవడం మాత్రం ముమ్మాటికీ మనిషి వైఫల్యమే! యుద్ధాలలో ఉపయోగించ డానికి అధునాతన ఆయుధాలను ఎప్పటికప్పుడు తయారు చేయగలుగుతున్న మనిషి – అసలు యుద్ధాల అవసరమే లేని శాంతియుత ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకోలేకపోవడం కూడా వైఫల్యమే! ప్రపంచంలో మనిషికి క్షుద్బాధను మించిన దుర్భర బాధ మరొకటేదీ లేదు. పురాణ సాహిత్యం నుంచి ఆధునిక సాహిత్యం వరకు ఆకలి ప్రస్తావన మనకు విరివిగా కనిపిస్తుంది. తాను ఆకలితో అలమటిస్తున్నా, అతిథికి అన్నం పెట్టి పుణ్యలోకాలకు వెళ్లిన రంతిదేవుడి కథ తెలిసినదే! ఆకలికి తాళలేక కుక్కమాంసం తిన్న విశ్వామిత్రుడి కథ పురాణ విదితమే! ఆకలి బాధ మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది.అందుకు విశ్వామిత్రుడి కథే ఉదాహరణ. పురాణాల్లో అక్షయపాత్రలు పుణ్యాత్ముల ఆకలి తీర్చిన గాథలు ఉన్నాయే గాని, సామాన్యుల ఆకలి తీర్చిన ఉదంతాలు లేవు. ఆకలితో అలమ టిస్తున్నా, త్యాగం చేయడం గొప్ప సుగుణమని చెప్పే పురాణాలు – ఆకలికి శాశ్వత పరిష్కారాన్ని మాత్రం చెప్పలేదు.ఆధునిక సాహిత్యంలో ఆకలి ప్రస్తావనకు కరవు లేదు. స్వాతంత్య్రోద్యమం ఉద్ధృతంగా సాగుతున్న కాలంలో ‘మాకొద్దీ తెల్లదొరతనము’ అని ఎలుగెత్తిన గరిమెళ్ల – ఆ పాటలోనే ‘పన్నెండు దేశాలు పండుతున్నాగాని/ పట్టెడన్నమె లోపమండీ/ ఉప్పు పట్టుకుంటే దోషమండీ/ నోట మట్టి కొట్టుకుపోతామండీ/ అయ్యో కుక్కలతో పోరాడి కూడు తింటామండీ’ అంటారు. స్వాతంత్య్రం రాక ముందు మన దేశంలోని ఆకలి బాధలు అలా ఉండేవి. ప్రపంచమంతా ఆర్థికమాంద్యంతో అతలా కుతలమైన హంగ్రీ థర్టీస్ కాలంలో కలాలతో కవాతు చేసిన కవులందరూ ఆకలి కేకలు వినిపించిన వారే! ‘ఆకలి ఆకలి తెరిచిన/ రౌరవ నరకపు వాకిలి/ హృదయపు మెత్తని చోటుల గీరే జంతువు ఆకలి/... ఈ ఆకలి హోరు ముందు/ పిడుగైనా వినిపించదు/ ఆకలి కమ్మిన కళ్లకు/ ప్రపంచమే కనిపించదు’ అన్న బైరాగి ‘ఆకలి’ కవిత పాఠకులను విచలితులను చేస్తుంది. ‘అన్నపూర్ణ గర్భగుడిని/ ఆకలి గంటలు మ్రోగెను/ ఆరని ఆకలి కీలలు/ భైరవ నాట్యము చేసెను/ ఘోర పరాజ యమా ఇది?/ మానవ మారణ హోమం/ తల్లీ! ఆకలి... ఆకలి!’ అంటూ సోమసుందర్ ఆకలి కేకలు వినిపించారు.‘నేను ఆకలితో ఉన్నాను/ నువ్వు చంద్రుడి వద్దకు వెళ్లావు... నేను తిండిలేక నీరసిస్తున్నాను/ నాకు వాగ్దానాలు మేపుతున్నావు’ అంటూ ఆధునిక శాస్త్ర సాంకేతిక పురోగతి ఒకవైపు, ఆకలి బాధలు మరోవైపుగా ఉన్న ఈ లోకంలో పాలకుల తీరును శ్రీశ్రీ ఎత్తిపొడుస్తారు. ఇప్పటికీ లోకం తీరు పెద్దగా మారలేదు. మానవుడు పంపిన ఉపగ్రహాలు అంగారకుడి వద్దకు వెళ్లినా, ఆకలి బాధలు సమసి పోలేదు; ఆకలి చావులు ఆగిపోలేదు.మనిషి ఘన విజయాల చరిత్రలో ఆకలి, అశాంతి– రెండూ మాయని మరకలు. ఈ రెండు మరకలూ పూర్తిగా చెరిగిపోయేంత వరకు మనిషి ఎన్ని విజయాలు సాధించినా, అవేవీ మానవాళికి ఊరటనూ ఇవ్వలేవు; మానవాళిని ఏమాత్రం ఉద్ధరించనూ లేవు. ఆకలికి, అశాంతికి మూలం మను షుల్లోని అసమానతలే! ప్రపంచంలో అసమానతలు తొలగిపోనంత వరకు ఆకలిని రూపుమాపడం, శాంతిని నెలకొల్పడం అసాధ్యం. నిజానికి సంకల్పం ఉంటే, సాధ్యం కానిదంటూ ఏదీ లేదు గాని, అసమానతలను రూపుమాపే సంకల్పమే ఏ దేశంలోనూ పాలకులకు లేదు. అందువల్లనే ఆకలి, అశాంతి మనుషులను తరతరాలుగా పట్టి పీడిస్తున్నాయి. అకాల మరణాలకు కారణమవుతున్నాయి. ఆకలి వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ దాదాపు పాతికవేల నిండు ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. అంటే, ఏడాదికి సగటున ఏకంగా తొంభై లక్షల మంది ఆకలికి బలైపోతున్నారు. ఆకలితో మరణిస్తున్న వాళ్లలో పసిపిల్లలు కూడా ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న శిశుమరణాల్లో దాదాపు యాభై శాతం ఆకలి చావులే! నాణేనికి ఇదొకవైపు అయితే, మరోవైపు వంద కోట్లమందికి ఆకలి తీర్చడానికి తగినంత ఆహారం ప్రతిరోజూ వృథా అవుతోంది. ఈ పరిస్థితిని గమనించే ‘అన్నపు రాసులు ఒకచోట/ ఆకలి మంటలు ఒకచోట’ అని కాళోజీ వాపోయారు.ప్రపంచ ఆర్థిక శక్తుల్లో ఐదో స్థానంలో ఉన్న మన దేశం– ఆకలి సూచిలో నూట ఐదో స్థానంలో ఉండటం ఒక కఠోర వాస్తవం. అమృతోత్సవ భారతంలో ఆకలి సమస్య ఒక మానని గాయం! -
వ్యక్తిత్వాన్ని దహించలేరు!
ఒక మనిషి వ్యక్తిత్వాన్ని నిట్టనిలువునా దహించడానికి,అడ్డంగా నరికివేయడానికి చాలాకాలంగా కొందరు వ్యూహకర్తలు పడుతున్న ఆపసోపాలను గమనిస్తున్నాము. విషపు కత్తుల్ని విసురుకుంటూ జాగిలాలను విదిలిస్తూ పదమూడేళ్లుగా వారు పడుతున్న ప్రయాసను చూస్తున్నాము. కానీ ఏమైనది? వ్యక్తిత్వం మీద నీలాపనిందలు మోపగలరేమో! బురద చల్ల గలరేమో! మసి పూయగలరేమో! వెలుగు రేకను మబ్బులు కాస్సేపు మాయం చేయగలవేమో! అది త్రుటికాలం మాత్రమే! నిక్కమైన వ్యక్తిత్వాన్ని కూడా మబ్బులు శాశ్వతంగా మాయం చేయలేవు.ఘంటసాల గాత్ర మాధుర్యం కారణంగా భగవద్గీతలోని శ్లోకాలు కొన్ని తెలుగు వారికి బాగా పరిచయమైపోయాయి. ‘‘నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః! ...’’ అనే శ్లోకం కూడా అందులో ఒకటి. ‘ఆత్మ ఎట్టి ఆయుధము చేతనూ ముక్కలు చేయబడదు, అగ్నిచే కాల్చబడదు, నీటిచే తడుప బడదు, వాయువుచే ఎండిపోదు’ అని దాని తాత్పర్యం. వ్యక్తిత్వం కూడా అటువంటిదే! ఎటువంటి ఆయుధం చేతనూ ముక్కలు చేయబడదు. అగ్నిచే కాల్చబడదు.జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వ హనన కార్యక్రమాన్ని ఒక ధారావాహికగా కొనసాగిస్తున్న తీరును గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. తెలుగు నేలపైనున్న ఒక బలమైన వర్గం చాలా ముందుచూపుతో మీడియా రంగంలో బ్రూటల్ డామి నెన్స్ను ఏర్పాటు చేసుకోగలిగింది. ట్రెజర్ హంట్ చేయాలన్నా, పవర్ హంట్ చేయాలన్నా మీడియా కంటే పదునైన ఆయుధం లేదనే సంగతిని ఈ వర్గం గుర్తించింది. ఆయుధం మీద ఆధిపత్యాన్ని సంపాదించగలిగింది. ఎన్టీ రామారావును అధికార పీఠంపై ప్రతిష్ఠించగలిగింది. ఆయన వల్ల తమ వర్గానికి అనుకున్నంత మేలు జరగడం లేదన్న గ్రహింపు కలగగానే చంద్రబాబును ప్రత్యామ్నాయంగా నిలబెట్టిన వైనం సరిగ్గా మూడు దశాబ్దాల కిందటి చరిత్ర.మీడియా తుపాకీ ట్రిగ్గర్ను చంద్రబాబు నొక్కగానే ఎన్టీ రామారావు కుప్పకూలిపోయాడు. అప్పటి నుంచి చంద్రబాబు, ఆయన మిత్ర మీడియా తోడూనీడలా కలిసిపోయారు. ‘నీకింత – నాకింత’ అనే డ్యూయెట్ పాడుకుంటూ రాజ్యాధికారాన్ని వారు అనుభవించసాగారు. ఎదురు నిలబడేవారి మీద మీడియా వెపన్ను గురిపెట్టారు. ఎన్టీ రామారావే వీరి ముందు నిలబడలేకపోవడంతో చాలామంది భయపడ్డారు.ఒక్క రాజశేఖరరెడ్డి మాత్రమే వారిని ధిక్కరించి నిల బడ్డారు. చాలాకాలం పాటు వారిని ఎదిరించారు. విజయాలు సాధించారు. కానీ దురదృష్టం. ఆయన అకాల మరణంతో బాబు కూటమి మళ్లీ బుసలుకొట్టింది. వైఎస్ఆర్ మరణించిన రోజునే తమకు భవిష్యత్తులో దీటైన ప్రత్యర్థి కాగల యువకుడిని వారు గుర్తించగలిగారు. ఆరోజు నుంచే జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారం మొదలైంది. ఇప్పటికి పదిహేనేళ్లు దాటింది.చంద్రబాబు పార్టీ, యెల్లో మీడియాగా పేరుపడ్డ ఆయన మిత్ర మీడియా జగన్మోహన్రెడ్డిపై నిరంతరాయంగా దాడులు జరుపుతూనే ఉన్నది. దేశాల మధ్య జరిగే భీకర యుద్ధాల్లో కూడా కొన్ని నియమాలుంటాయి. శత్రు దేశాల మీద రసాయన బాంబులు వేయడం, విషవాయువుల్ని వెదజల్లడం వంటివి నిషిద్ధం. కానీ యెల్లో మీడియాకు ఇటువంటి విధినిషేధాలేమీ లేవు. జగన్ మోహన్రెడ్డిపై ప్రయోగించని అస్త్రం లేదు. చేయని ప్రచారం లేదు. కానీ జగన్ తట్టుకొన్నారు. తట్టుకొని జనబలంతో నిల బడ్డారు. ఘన విజయాలను నమోదు చేయగలిగారు. ‘అస్త్రములే విఫలమాయె, శస్త్రములే వికలమాయె’ అనుకుంటూ యెల్లో కూటమి నిర్వేద స్థితిలోకి జారిపోయింది. బీజేపీని బతిమాలు కొని వారి అండతో బాబు కూటమి ఒక ‘సాంకేతిక విజయా’న్ని సాధించగలిగింది.సాంకేతిక విజయంతో గద్దెనెక్కిన ఈ ఆరు మాసాల్లో అరడజనుకు పైగా దారుణమైన నిందల్ని జగన్పై మోపి, తమ ‘సూపర్ సిక్స్’ వైఫల్యాన్ని చర్చలోకి రాకుండా నెట్టుకొచ్చే ప్రయత్నం చేశారు. అరడజన్ నిందారోపణలు – ‘సూపర్ సిక్స్’ వైఫల్యాలుగా ఈ ఆరు మాసాల పుణ్యకాలం గడిచిపోయింది. తాజాగా ‘సెకీ’ ఒప్పందంపై ఎల్లో మీడియా దేవతా వస్త్రాలతో ఊరేగుతూ ఎంత కంపరం పుట్టిస్తున్నదో ఇప్పుడు చూస్తున్నాము. ‘సెకీ’ అనేది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నది ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థతో! అదీ వ్యవసాయ రంగానికి నాణ్య మైన, నికరమైన, ఉచిత విద్యుత్ను అందజేయడం కోసం! జగన్ కంటే ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు సౌర విద్యుత్ కోసం ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాన్ని చేసుకున్నారు. ఆ సంస్థలకు ఆయన సగటున యూనిట్కు రూ. 5.90 కట్ట బెట్టారు.జగన్మోహన్రెడ్డి ‘సెకీ’తో చేసుకున్న ఒప్పందం ప్రకారం యూనిట్ ధర రూ.2.49. ఎక్కువ ధర చెల్లిస్తూ ప్రైవేట్ సంస్థలతో చేసుకున్న ఒప్పందంలో స్కామ్ ఉండే అవకాశం ఉంటుందా? సగానికంటే తక్కువ రేటు పెట్టి ప్రభుత్వ సంస్థతో చేసుకునే ఒప్పందంలో స్కామ్ ఉంటుందా? అదనపు ఛార్జీలంటూ దీనికేదో మెలికపెట్టే ప్రయత్నాన్ని యెల్లో మీడియా కొనసాగిస్తున్నది. కానీ దీనికి అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ ఛార్జీ లను వర్తింపచేయడం లేదని ‘సెకీ’ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టంగానే పేర్కొన్నది. పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి వ్యవసాయ విద్యుత్ కోసం చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ అందుకు సహాయకంగా ఈ ఒప్పంద ప్రతిపాదన చేసింది.ఈ ఒప్పందంలోని మూడు కీలక అంశాలను పరిశీలించాలి. మొదటిది: ఇది కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు మధ్య జరిగిన ఒప్పందం మాత్రమే! ఇందులో ఎక్కడా థర్డ్ పార్టీ ప్రమేయం లేదు. రెండు: రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంత తక్కు వగా రూ.2.49కే యూనిట్ సరఫరా చేస్తామని ప్రతిపాదించడం. మూడు: ప్రత్యేక ప్రోత్సాహకం కింద ఈ ఒప్పందానికి అంత ర్రాష్ట్ర రవాణా ఛార్జీలను మినహాయిస్తున్నట్టు చెప్పడం. ఇంత స్పష్టత, పారదర్శకత ఉన్న ఒప్పందం మధ్యలో స్కామ్ ఏ రకంగా దూరుతుంది?‘సెకీ’తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవ డానికి ముందు అదానీ అప్పటి ముఖ్యమంత్రిని కలిశారని అమెరికా దర్యాప్తు సంస్థ చెప్పిందట! యెల్లో మీడియాకు ఇది చాలదా? కోతికి కొబ్బరిచిప్ప దొరికినంత సందడి. జగన్ మోహన్రెడ్డికి అదానీ ముడుపులు అందాయంటూ పతాక శీర్షికలు పెట్టి వార్తలు వేశాయి. ఇంతకంటే నీతిబాహ్యత వేరే ఉంటుందా? అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక ప్రముఖ వ్యక్తి ప్రతిష్ఠతో ఆటలాడుకోవడం కాదా? ‘సెకీ’తో ఒప్పందం, సీఎంను అదానీ కలవడం... రెండూ వేరువేరు విషయాలు. సౌరవిద్యుత్ ఒప్పందానికి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థతో చేసుకున్నది. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ధరకు ఈ ఒప్పందం కుదిరింది. రవాణా ఛార్జీల మినహాయింపు బోనస్. ఇది రాష్ట్రానికి విజయం – లాభదాయకం!ఇక అదానీ గానీ, అంబానీ గానీ, ఇతర పారిశ్రామిక వేత్తలెవరైనా రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రిని కలవడం సర్వసాధారణమైన విషయం. పధ్నాలుగేళ్లు ముఖ్య మంత్రిగా పనిచేసిన చంద్రబాబును అందరికంటే ఎక్కువమందే పారిశ్రామికవేత్తలు కలిసి ఉంటారు. ఆ భేటీలన్నీ స్కామ్ల కోసమే అనుకోవాలా? ఒక వ్యక్తి పట్ల గుడ్డి వ్యతిరేకత, ద్వేషం, పగ పేరుకొనిపోయి ఉంటే తప్ప ఇంత దిగజారుడు ప్రచారం సాధ్యం కాదు.ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో కష్టం వచ్చిపడింది. గద్దెనెక్కి ఆరు మాసాలు కావస్తున్నా ఎన్నికల ముందు వారు హామీ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ పథకాలు ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. నిరుద్యోగ యువతకు నెలకు 3 వేల రూపా యల భృతి ఇస్తామన్నారు. ఇవ్వలేదు సరిగదా ఎప్పటి నుంచి ఇస్తారో కూడా చెప్పలేదు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికీ నెలకు 15 వేలు (నీకు పదిహేను, నీకు పదిహేను ఫేమ్) ఇస్తామ న్నారు. ఇప్పుడు దాని ఊసెత్తడం లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ‘అమ్మ ఒడి’ని ఎత్తిపారేశారు. ప్రతి రైతుకూ ఏటా 20 వేల సాయం చేస్తామన్నారు. ‘రైతు భరోసా’ను ఎత్తేశారు తప్ప కొత్త సాయం గురించిన ఆలోచనే చేయలేదు. ప్రతి మహిళకూ నెలకు 1500 రూపాయలిస్తామన్నారు. అదీ మరిచి పోయారు. ప్రతి మహిళకూ ఉచిత బస్సు ప్రయాణం అదుగో ఇదుగో అనడం తప్ప ఆ బస్సు ఎప్పుడొస్తుందో తెలియదు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీకి గాను ఈ యేడాదికి ఒక్క సిలిండర్తో సరిపెట్టారు. ‘సూపర్ సిక్స్’లోని ఐదు హామీలను అటకెక్కించి ఒక్క దాంట్లో మూడో వంతు నెరవేర్చారన్నమాట!హామీల అమలులో ఈ దారుణ వైఫల్యం పట్ల సహజంగానే ప్రజల్లో అసంతృప్తి బయల్దేరింది. ఇంత కీలకమైన అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం జగన్ వ్యక్తిత్వ హనన కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు జరుగుతున్న ఘటనల ద్వారా అర్థమవుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగానే తాజాగా ‘సెకీ’ ఒప్పందంపై ఓ కపట నాటకాన్ని ప్రదర్శించారు. ఇంతకుముందు తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేసి విజ్ఞుల చేత చీవాట్లు తిన్న తర్వాత తోక ముడిచారు. విజయవాడ వరదల సందర్భంగా పాలనాపరమైన వైఫల్యాన్ని కప్పిపుచ్చి ప్రకాశం బ్యారేజీలో వైసీపీవాళ్లు బోట్లు అడ్డంపెట్టి నగరాన్ని ముంచేశారని హాస్యపూరితమైన ఆరోపణ చేశారు. అప్పుల గణాంకాలపై ఇప్పటికీ పిల్లిమొగ్గలు వేస్తూనే అసత్య ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఇచ్చిన లెక్కలకు విరుద్ధంగా అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. రాష్ట్రంలోని పేదలు, మధ్యతరగతి ప్రజల ఆశలకు ఆలంబనగా నిలబడి రెండు లక్షల డెబ్బయ్ మూడు వేల కోట్ల రూపా యలను వారి అకౌంట్లలోకి బదిలీ చేసిన ‘నవరత్న’ పథకాలను అవహేళన చేస్తూ స్కీములన్నీ స్కాములేనని ప్రచారం చేశారు.జగన్ ఐదేళ్ల పాలననూ, కూటమి సర్కార్ తాజా ఆరు మాసాల పాలననూ జనం బేరీజు వేసుకుంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా ప్రకటించి, జనం ముందు జవాబుదారీ తనాన్ని నిలబెట్టుకున్న జగన్ వ్యక్తిత్వాన్నీ, ఎన్నికల హామీలన్నీ హుష్ కాకీ అంటున్న చంద్రబాబు వ్యక్తిత్వాన్ని జనం పోల్చి చూసుకుంటున్నారు. పేదబిడ్డల బంగారు భవిష్యత్తు కోసం వారి నాణ్యమైన చదువులపై వ్యక్తిగతంగా శ్రద్ధపెట్టిన జగన్ విజన్కూ, పేదలకు ఇంగ్లిష్ మీడియం అవసరం లేదని ఎత్తిపారేసిన చంద్రబాబు విజన్కూ మధ్యనున్న తేడాలోని రహస్యమేమిటో తెలుసుకుంటున్నారు. ప్రజలందరి సాధికార తకు పెద్దపీట వేసిన జగన్ ఫిలాసఫీని, కొద్దిమందికి కొమ్ముకాసే చంద్రబాబు ఫిలాసఫీని ఆమూలాగ్రంగా పరిశీలిస్తున్నారు. ఎల్లకాలం జనం కళ్లకు గంతలు కట్టడం సాధ్యం కాదు. ప్రత్యర్థి వ్యక్తిత్వహననంతో పబ్బం గడుపుకోవాలంటే ప్రతిసారీ కుద రదు. ఇప్పుడు యెల్లో మీడియాకు జగన్ లీగల్ నోటీసులు పంపించారు. ఇక జనంలో చర్చ మొదలవుతుంది. ఇద్దరి వ్యక్తిత్వాల మీద ఆ చర్చ జరగాల్సిందే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
కోర్టులు కదిపిన తేనెతుట్టెలు
దేవుడు అంతటా, అందరిలో ఉన్నాడని నమ్మే గడ్డపై... ఆయనను నిర్ణీత స్థల, కాలాలకే పరిమితం చేసే సంకుచిత రాజకీయ స్వార్థాలు చిచ్చు రేపుతూనే ఉన్నాయి. విభిన్న వర్గాల మధ్య విద్వేషాగ్ని రగిలిస్తున్న ఈ ప్రయత్నాలకు తాజా ఉదాహరణ – యూపీలోని సంభల్ జామా మసీదు వివాదం, దరిమిలా అక్కడ రేగిన హింసాకాండ, ఆస్తి, ప్రాణనష్టం. ఈ ఏడాది జనవరిలో జరిగిన అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపనతో మందిరం – మసీదు వివాదాలు ముగిసిపోతాయని ఎవరైనా ఆశపడితే అది వట్టి అడియాసని మరోసారి తేలిపోయింది. మత రాజకీయాలకూ, వర్గ విభేదాలకూ ప్రార్థనా స్థలాలు కేంద్రాలు కారాదనే సదుద్దేశంతో చేసిన ప్రార్థనా స్థలాల పరిరక్షణ చట్టం–1991 స్ఫూర్తికే విఘాతం కలిగింది. ప్రార్థనా మందిరాల నిర్మాణమూలాలను తెలుసుకోవాలన్న ఒక వర్గం ఉత్సాహం తప్పేమీ కాదంటూ సర్వోన్నత న్యాయస్థానం ఒక దశలో అదాటున చేసిన వ్యాఖ్యలు చివరకు ఇక్కడకు తెచ్చాయి. వివాదం వస్తే చాలు... దేశంలో ప్రతి చిన్న కోర్టూ అనాలోచితంగా సర్వేలకు ఆదేశించేలా ఊతమిచ్చాయి. ఇది అత్యంత దురదృష్టకర పరిణామం. తాజా ఘర్షణలకు కేంద్రమైన సంభల్లోని షాహీ జామా మసీదు 16వ శతాబ్దికి చెందిన రక్షిత జాతీయ కట్టడం. వారణాసిలోని జ్ఞానవాపి, యూపీలోని మథురలో నెలకొన్న ఈద్గా, మధ్యప్రదేశ్ లోని ధార్లో ఉన్న కమాల్ మౌలా మసీదుల్లో లానే దీనిపై రచ్చ మొదలైంది. అక్కడ కేసులు వేసినవారే ఇక్కడా కోర్టుకెక్కారు. మొఘల్ చక్రవర్తి బాబర్ కాలంలో కట్టిన 3 మసీదుల్లో (పానిపట్, అయోధ్య, సంభల్) ఇదొకటి. ప్రాచీన హరిహర మందిర్ స్థలంలో ఈ మసీదును నిర్మించారని పిటిషనర్ల వాదన. జిల్లా కోర్టులో ఈ నెల 19న కేసు వస్తూనే జడ్జి మసీదులో ఫోటో, వీడియో సర్వేకు ఆదేశిస్తూ, 29వ తేదీ కల్లా నివేదిక సైతం సమర్పించాలన్నారు. తొలి సర్వే ప్రశాంతంగా సాగినా, నవంబర్ 24 నాటి రెండో సర్వే భారీ హింసకు దారి తీసింది. సర్వేకు వచ్చినవారిలో కొందరు జై శ్రీరామ్ నినాదాలు చేశారనీ, దాంతో నిరసనకారులు రాళ్ళురువ్వారనీ వార్త. కాల్పుల్లో అయిదుగురు మరణించారు. అమాయకుల ప్రాణాలు, పట్నంలో సామరస్య వాతావరణం గాలికెగిరి పోయాయి.శతాబ్దాల తరబడి అన్ని వర్గాలూ కలసిమెలసి జీవిస్తున్న చోట విద్వేషాగ్ని రగులుకుంది. ఎన్నో ఏళ్ళుగా ఉన్న అయోధ్య, వారణాసి వివాదాలకు భిన్నంగా సంభల్ కథ చిత్రంగా ఈ ఏడాదే తెర మీదకొచ్చింది. పశ్చిమ యూపీలో సంభల్ జిల్లా మూడు దశాబ్దాలుగా సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)కి కంచుకోట. 1980ల నుంచి అక్కడ అధికారం కోసం బర్ఖ్, మెహమూద్ కుటుంబాలు వేర్వేరు పార్టీల పక్షాన పరస్పరం తలపడుతూ వచ్చాయి. తర్వాత 1990ల నుంచి రెండు వర్గాలూ ఎస్పీతోనే అనుబంధం నెరపుతున్నాయి. అధికారంలో పైచేయి కోసం ఒకే పార్టీలోని ఈ రెండు వర్గాల మధ్య పోరాటమే తాజా హింసకు కారణమని బీజేపీ ప్రచారం చేస్తోంది. హిందూ – ముస్లిమ్ల తర్వాత, ఇక ముస్లిమ్లలోని ఉపకులాల మధ్య చీలికలు తీసుకురావడానికే కాషాయ ధ్వజులు ఈ ప్రచారం చేస్తున్నారని ఎస్పీ ఖండిస్తోంది. మొఘల్ శిల్పనిర్మాణ శైలికి ఈ మసీదు ప్రతీకైతే, ఈ సంభల్ ప్రాంతం విష్ణుమూర్తి పదో అవతారమైన కల్కి వచ్చే ప్రదేశమని హిందువుల నమ్మిక. భిన్న విశ్వాసాల మధ్య సొంత లాభం చూసుకొనే కొందరి రాజకీయంతో సమస్య వచ్చి పడింది. నిజానికి, 1947 ఆగస్ట్ 15కి ముందున్న ధార్మిక విశ్వాసాల ప్రకారమే అన్ని ప్రార్థనా ప్రదేశాలూ కొనసాగాలి. ఒక్క అయోధ్య రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదమే దానికి మినహాయింపని దీర్ఘకాలం క్రితమే కేంద్ర సర్కార్ చేసిన 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం. అయోధ్య తరహాలో మరిన్ని సమస్యలు రాకూడదన్నది దాని ప్రధానోద్దేశం. ఏ ప్రార్థనా స్థలాన్నీ పాక్షికంగా కానీ, పూర్తిగా కానీ ఒక మతవిశ్వాసం నుంచి మరోదానికి మార్పిడి చేయరాదనీ, చర్చ పెట్టరాదనీ చట్టంలోని 3వ సెక్షన్ స్పష్టంగా నిషేధించింది. అయితే, ప్రార్థనా స్థలాల ప్రాచీన స్వరూపమేమిటో నిర్ధారించడం చట్టవిరుద్ధం కాదంటూ 2002 మేలో జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు వివాదాలకు సందు ఇచ్చాయి. అనేకచోట్ల చిన్న కోర్టులు మందిర– మసీదు వివాదాలపై విచారణ చేపట్టి, పర్యవసానాలు ఆలోచించకుండా హడావిడిగా సర్వేలకు ఆదేశిస్తున్నాయి. సంభల్ ఘటన తర్వాతా అజ్మీర్లోని ప్రసిద్ధ షరీఫ్ దర్గాను గుడిగా ప్రకటించాలంటూ దాఖలైన కేసును రాజస్థాన్ కోర్ట్ అనుమతించడం ఓ మచ్చుతునక. సమస్యల్ని తేల్చాల్సిన గౌరవ కోర్టులే ఇలా తేనెతుట్టెల్ని కదిలించడం విషాదం.ప్రార్థనాస్థలాల చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీమ్లో ఇప్పటికే నాలుగు పిటిషన్లున్నాయి. దానిపై నిర్ణయానికి కేంద్రం, కోర్ట్ తాత్సారం చేస్తుంటే ఆ లోగా వారణాసి, మథుర, ధార్, సంభల్, తాజాగా అజ్మీర్... ఇలా అనేక చోట్ల అత్యుత్సాహం వ్యక్తమవుతోంది. ఇది శాంతి, సామరస్యాలకు పెను ప్రమాదం. ఈ ప్రయత్నాలను ఆపేందుకు సర్కారు కానీ, సర్వేలపై జోక్యానికి సుప్రీమ్ కానీ ముందుకు రాకపోవడం విడ్డూరం. ఒక వివాదాస్పద స్థలపు ధార్మిక స్వభావ అన్వేషణ చారిత్రక నిర్ధారణ, పురాతత్వ అన్వేషణతో ఆగుతుందనుకుంటే పొరపాటు. అది మత పరంగా, రాజకీయంగా రావణకాష్ఠమవుతుంది. కాశీ, మథురల్లో, ఇప్పుడు సంభల్ జరుగుతున్నది అదే. ‘ప్రతి మసీ దులో శివలింగాన్ని అన్వేషించాల్సిన పని లేద’ంటూ ఆరెస్సెస్ అధినేత రెండేళ్ళ క్రితం అన్నారు కానీ జరుగుతున్నది వేరు. అధికార వర్గాల అండదండలతోనే ఈ విభజన చిచ్చు రగులుతోందన్నదీ చేదు నిజం. 2019 నవంబర్లో ప్రార్థనా స్థలాల చట్టాన్ని సమర్థించిన సుప్రీమ్ మరోసారి గట్టిగా ఆ పని చేయకుంటే కష్టమే. ఓ హిందీ కవి అన్నట్టు, మసీదులు పోనివ్వండి... మందిరాలు పోనివ్వండి... కానీ రక్తపాతం మాత్రం ఆపేయండి. మతాలకు అతీతంగా మనిషినీ, మానవత్వాన్నీ బతకనివ్వండి! -
దారుణ విద్వేష క్రీడ!
అయిదు నెలలుగా బంగ్లాదేశ్లో అల్పసంఖ్యాకులపై అల్లర్లు సాగుతూనే ఉన్నాయి. హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ ఆ దేశంలో మైనారిటీలు ఎదుర్కొంటున్న పెను సవాళ్ళకు తాజా ఉదాహరణ. మైనారిటీల హక్కుల కోసం బలంగా గళం విప్పే దాస్ బంగ్లాదేశీ జాతీయ పతాకాన్ని అవమానించారంటూ రాజద్రోహ నేరం మోపడం విడ్డూరం. ఆయనను మంగళవారం అరెస్ట్ చేసి, బెయిలివ్వకుండా, పది రోజుల కస్టడీకి పంపడంతో నిరసనలు చెలరేగాయి. సందట్లో సడేమియాగా దుష్టశక్తులు అల్లర్లు రేపి, పొరపాటున ఓ ముస్లిమ్ లాయర్ మరణానికి కారణమై, ఆ పాపం మైనా రిటీల నెత్తిన వేయడంతో ఢాకా మరోసారి భగ్గుమంది. ఆలయాలపై దాడులు, ప్రాణనష్టంతో... మైనారిటీలనూ, భావప్రకటనాస్వేచ్ఛనూ కాపాడాలంటూ బంగ్లాను భారత్ అభ్యర్థించాల్సొచ్చింది.ఇస్లామ్ అధికారిక మతమైనా, లౌకికవాద, ప్రజాస్వామ్య దేశంగా, సమానత్వానికి రాజ్యాంగ బద్ధులమని చెప్పుకొనే బంగ్లా ఆ మాటకు తగ్గట్టు వ్యవహరించడం మానేసి, చాలాకాలమైంది.అందుకు తగ్గట్టే తాజాగా ‘ఇస్కాన్’ను ర్యాడికల్, మత ఛాందసవాద సంస్థ అని బంగ్లా అటార్నీ జనరల్ బుధవారం అభివర్ణించడం ఆందోళనకరం. ‘ఇస్కాన్’ను నిషేధించాలని బంగ్లా యోచిస్తు న్నట్టు వార్త. ఆధ్యాత్మిక చైతన్యం, పీడిత జన సముద్ధరణ కోసం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 దేశాల్లో పనిచేస్తున్న ఒక సంస్థపై అలాంటి నిర్ణయం తీసుకోవాలనుకోవడం అక్షరాలా బుద్ధిహీనతే. దేశంలోని విభిన్న వర్గాల మధ్య సౌహార్దం పెంపొందించి, బాధితులకు న్యాయం చేసి, మానవ హక్కుల్ని కాపాడాల్సిన ప్రభుత్వం ఏ శక్తుల ప్రోద్బలంతో ఇలా మాట్లాడుతోందన్నది ఆశ్చర్యకరం. జూలై నాటి ప్రజా ఉద్యమంతో ఢాకాలో ప్రభుత్వ మార్పు జరిగిపోయింది కానీ, అల్పసంఖ్యాక వర్గాలపై సాగుతున్న దాడులు మాత్రం అప్పటి నుంచి ఆగడం లేదు. మైనారిటీలను పూర్తిగా తరిమేసి, బంగ్లాను హిందూ రహిత దేశంగా మార్చాలనే పన్నాగం దీనికి వెనక ఉందని స్థానిక స్వతంత్ర విశ్లేషకుల మాట. ఈ అల్లర్లు, అల్పసంఖ్యాక హిందువులపై దాడుల వెనుక మత ఛాందస జమాతే ఇస్లామీ ఉందనేది స్పష్టం. హసీనా సర్కారు కాలంలో నిషేధానికి గురైన ఈ ర్యాడికల్ గ్రూపు, అలాగే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)లు యూనస్ యంత్రాంగంలో భాగమే. అసలు ఈ ప్రయత్నమంతా ఇస్లామిక్ షరియత్ను ప్రవేశపెట్టి, బంగ్లాదేశ్ను ప్రజాస్వామ్య ఎన్నికలు, పార్ల మెంట్తో పని లేని దేశంగా మార్చాలనే వ్యూహంలో భాగమని ఒక వాదన వినిపిస్తోంది. అదే గనక నిజమైతే, అత్యంత ప్రమాదకర పరిణామం. పౌరసమాజం, రాజకీయ నేతలు, ప్రజలు కలసి కట్టుగా అలాంటి వ్యూహాలను భగ్నం చేసి, కష్టించి సంపాదించిన స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలి. అసలు అఫ్ఘన్ లాగానే బంగ్లాను తమ ప్రయోగశాలగా చేసుకోవాలని పాశ్చాత్య ప్రపంచం భావిస్తున్నట్టుంది. అప్పుడిక బంగ్లా మరో తీవ్రవాద కేంద్రంగా మారే ప్రమాదముంది. అది భారత్కే కాదు... యావత్ ప్రపంచానికి నష్టం. నిజానికి, ఆసియా – పసిఫిక్ కూటమిలో బంగ్లాను భాగం చేసుకొని, లబ్ధి పొందాలని అమెరికా భావించింది. నిరుటి హసీనా సర్కార్ నో చెప్పడంతో అది కుదరలేదు. మొన్నటి అమెరికా ఎన్నికల్లో కమలా హ్యారిస్ గెలిచి ఉంటే ఏమో కానీ, ట్రంప్ గెలవడంతో బంగ్లా మధ్యంతర సర్కార్ సారథి – ట్రంప్ ద్వేషి ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ట్రంప్ పగ్గాలు చేపట్టాక బంగ్లాపై కఠినవైఖరి అవలంబిస్తారని యూనస్కు తెలుసు. అందుకే, ఆలోగా మైనారిటీలపై అల్లర్లను ఆఖరి అస్త్రంగా చేసుకున్నారట. బంగ్లా ప్రజల ఆశలు, ఆకాంక్షలను గుర్తించి, స్వతంత్ర బంగ్లాదేశ్ అవతరణకు అయిదు దశాబ్దాల పైచిలుకు క్రితం భారత్ అండగా నిలిచింది. కానీ, ఇప్పుడు అదే గడ్డపై భారత వ్యతిరేకత, మైనారిటీలపై ద్వేషాలను స్వార్థపరులు పెంచిపోషించడం విషాదం. దాదాపు 14 ఏళ్ళ పైగా షేక్ హసీనా ఏలుబడిలో నియంత పోకడల వల్ల మానవ హక్కుల ఉల్లంఘన, అణచివేత సాగిందని ఆరోపణలొస్తే, కొత్త హయాం కూడా తక్కువేమీ తినలేదు. విజృంభిస్తున్న విద్వేషం, విధ్వంసం ఢాకాలో పత్రికా స్వాతంత్య్రానికి సైతం ముప్పుగా మారాయి. ‘ప్రథమ్ ఆలో’, ‘ది డైలీ స్టార్’లాంటి స్వతంత్ర పత్రికా రచనకు పేరుపడ్డ పత్రికలపై దాడులు అందుకు ఓ మచ్చుతునక. బాధితు లకు సత్వర న్యాయం కోసం ప్రత్యేక ట్రిబ్యునళ్ళ ఏర్పాటు సహా మైనారిటీల కనీసపాటి ఆకాంక్షల్ని నెరవేర్చడానికి బంగ్లా సర్కార్కు ఉన్న కష్టమేమిటి? హసీనా సర్కార్ను గద్దె దింపినప్పటి నుంచి ఇప్పటికి బంగ్లాలో మైనారిటీలపై 2 వేలకు పైగా దాడులు జరిగాయి. హిందూ, బౌద్ధ, క్రైస్తవ సోదరులపై జరుగుతున్న ఈ దౌర్జన్యకాండను మతపరంగా కాక మానవ హక్కుల పరంగా చూడాలి. అప్పుడే సమస్య తీవ్రత అర్థమవుతుంది. 1930లో బంగ్లాలో 30 శాతం పైగా ఉన్న హిందువులు ఇప్పుడు కేవలం 8 శాతం చిల్లరకు పడిపోయారన్న నిష్ఠుర సత్యం అక్కడ జరుగుతున్నదేమిటో ఎరుకపరుస్తుంది. విద్యుత్ సహా, బియ్యం, పత్తి, చమురు లాంటి అనేక సరుకుల విషయంలోనూ మనపై భారీగా ఆధారపడ్డ బంగ్లా సర్కార్పై ఇకనైనా భారత్ కఠినవైఖరిని అవలంబించాలి. పొరుగు దేశంలో బతుకు భయంలో ఉన్న హిందువులను కాపాడేందుకు క్రియాశీలంగా వ్యవహరించాలి. కేవలం మాటలకు పరిమితం కాకుండా, దౌత్య, వాణిజ్య రంగాల్లో చేయగలిగినదంతా చేయాలి. పేరుకు మాత్రం లౌకికవాదం ముసుగు వేసుకొని, మైనారిటీలకు వ్యతిరేకంగా, తెర వెనుక శక్తుల చేతుల్లో కీలుబొమ్మగా మిగిలిన అసమర్థ యూనస్ సర్కార్పై అంతర్జాతీయంగానూ ఒత్తిడి తేవాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. -
ఎన్నికల మహా పాఠం
తాజా మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమికి ఒకటి, ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి మరొకటితో... పైకి వన్ ఆల్ అనిపించాయి. రెండు చోట్లా గద్దె మీద ఉన్న పార్టీలే అధికారాన్ని నిలబెట్టుకున్నాయి. రెండు విజయాల్లోనూ కొన్ని పోలికలున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలు మునుపటి కన్నా పెద్ద మెజారిటీతో విజయం సాధించాయి. అనేక కారణాలు విజయాన్ని ప్రభావితం చేసినా, ప్రధానంగా సంక్షేమ పథకాలు కీలక భూమిక పోషించాయి. మరీ ముఖ్యంగా, మహిళలకు నగదు బదలీ పథకం గేమ్ ఛేంజరైనట్టు విశ్లేషణ. మహారాష్ట్రలో మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తూ ఏక్నాథ్ శిందే తెచ్చిన ‘ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన’, జార్ఖండ్లో అర్హులైన స్త్రీలకు నెలవారీగా వెయ్యి రూపాయల హేమంత్ సోరెన్ సర్కార్ ‘ముఖ్య మంత్రి మయ్యా సమ్మాన్ యోజన’ వారిని విజయతీరాలకు చేర్చాయి. మరిన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు రావడం ఖాయమని తేల్చేశాయి. భవిష్యత్ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేశాయి. ఎన్నికల్లో గెలుపోటములు సహజమే కావచ్చు. కానీ, మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి సాధించిన మహా విజయం, ప్రతిపక్ష మహావికాస్ ఆఘాడీ (ఎంవీఏ) కూటమి మూటగట్టు కున్న ఘోర పరాజయం మాత్రం ఆశ్చర్యపరుస్తాయి. పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత దాదాపు 9.5 లక్షల ఓట్లు పెరిగాయంటూ వస్తున్న ఆరోపణల మాట ఎలా ఉన్నా, 288 స్థానాల మహారాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ మార్కుకు కేవలం 13 తక్కువగా 132 స్థానాలు బీజేపీ గెలవడం విశేషం. కేవలం అయిదు నెలల క్రితం లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 48 స్థానాలకు గాను 9 మాత్రమే గెల్చిన బీజేపీ, ఆ ప్రాతిపదికన ఇప్పుడు కేవలం 83 సీట్లే గెలవాలి. కానీ, అప్పటి లెక్క కన్నా మరో 49 స్థానాలు అదనంగా తన ఖాతాలో వేసుకోగలిగింది. అంటే, జూన్ నాటి ఎదురు దెబ్బల నుంచి బీజేపీ మళ్ళీ పూర్తిస్థాయిలో పుంజుకుంటే, అప్పట్లో దక్కిన కొద్దిపాటి ఉత్సాహం, ఊపును కాంగ్రెస్ చేజార్చుకుంది. మహారాష్ట్రలో బీజేపీ, కాంగ్రెస్లు 75 స్థానాల్లో ముఖాముఖి పోరుకు దిగితే, హస్తానికి పట్టుమని 10 దక్కడం గమనార్హం. ఇది నిర్ద్వంద్వంగా స్వయంకృతం. కాంగ్రెస్ తప్పిదాలకు కొదవ లేదు. మరాఠీ భాషే తెలియని పెద్దలను పార్టీ పరిశీలకులుగా పంపిన ఘనత ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీది. పరిశీలకులుగానే కాదు... ప్రచారకులుగానూ బయటి జనాభాయే. వచ్చేది హంగ్ అసెంబ్లీ అంటూ పార్టీ అధిష్ఠానానికి వర్తమానం పంపి, ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయించారంటే క్షేత్రస్థాయి వాస్తవాలకు ఎంత దూరంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ‘బటేంగే తో కటేంగే’, ‘ఏక్ హై తో సేఫ్ హై’ లాంటి నినాదాలతో జనంలో భయాన్నీ, అభద్రతనూ పెంచుతూ మహాయుతి కూటమి ప్రచారం హోరెత్తిస్తే, సరైన ప్రచార కథనాన్ని ఎంచుకోవడంలో మహావికాస్ ఆఘాడీ కూటమిలోని మూడు ప్రతిపక్షాలూ విఫలమయ్యాయి. దాదాపు 40 పైచిలుకు స్థానాల్లో ముస్లిమ్ల మద్దతు కోసం చూసుకొని, మెజారిటీ వర్గాలు బీజేపీ వైపు మొగ్గేలా చేశాయి. అలాగే, ‘ఇండియా’ కూటమి ప్రధాన పక్షాలు ఇతర పార్టీలను కలుపుకొని పోవడంలో, కనీసం నియంత్రించడంలో విఫలమయ్యాయి. అలా దాదాపు 17 శాతం ఓట్ షేర్ వచ్చిన ‘ఇతరులు’ కూటమి అవకాశాల్ని దెబ్బ తీశారు.2023 నవంబర్ – డిసెంబర్లలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో ఓటమికి కారణాలను అధ్యయనం చేసేందుకు కాంగ్రెస్ వేసుకున్న అంతర్గత కమిటీలు ఇప్పటికీ తమ నివేదికలు ఇవ్వనేలేదు. ఆ పార్టీలో జవాబుదారీతనం లేకపోవడానికి ఇది ఓ మచ్చుతునక. దూరదృష్టి లేకపోవ డంతో పాటు ఉదాసీనత కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలను పట్టి పడిస్తోంది. ప్రతిపక్షాలకు భిన్నంగా బీజేపీ పటిష్ఠమైన వ్యూహంతో ముందుకు వెళ్ళింది. ఆరెస్సెస్ శతవసంత వత్సరంలో అడుగిడిన వేళ మహారాష్ట్రలో కాషాయ విజయాన్ని కానుకగా అందించాలన్న సంకల్పం సైతం సంఘ్ కార్యకర్తలను లక్ష్యసాధనకు పురిగొల్పింది. పోలింగ్ బూత్ స్థాయి దాకా వెళ్ళి వారు శ్రమించడం ఫలితమిచ్చింది. మహారాష్ట్రలో రాహుల్ గాంధీ పరిమితంగా ప్రచారం చేస్తే, ‘చొరబాటు దారుల’ బూచితో బీజేపీ భయపెట్టిన జార్ఖండ్లో హేమంత్ సోరెన్, ఆయన సతీమణి కల్పన దాదాపు 100 ర్యాలీలలో పాల్గొని విజయసాధనకు శ్రమించాల్సిన విధానం ఏమిటో చూపెట్టారు. ఇటీవల జమ్ము – కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, ఇప్పుడు జార్ఖండ్లో జేఎంఎం భుజాల మీద ఎక్కి, హస్తం విజయకూటమిలో నిలిచింది కానీ, వ్యక్తిగతంగా అది సాధించిన సీట్లు స్వల్పమే. ఈ ఫలితాలు ఆత్మపరిశీలన తప్పనిసరి అని కాంగ్రెస్కు పదే పదే బోధిస్తున్నాయి. రాజ్యాంగ పరిరక్షణ, అధికార బీజేపీ ఆశ్రిత పక్షపాతం లాంటి పాత పాటకు పరిమితం కాకుండా కొత్త పల్లవి అందుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. విజేతగా నిలిచిన బీజేపీ, ముఖ్యంగా మోదీ ఇప్పటికే స్వరం పెంచి, ప్రతిపక్షాలపై విరుచుకు పడుతున్నారు. మోదీ, షాలు మళ్ళీ పట్టు బిగించారు. ఇదే ఊపులో కమలనాథులు ఉమ్మడి పౌరస్మృతి, ఒక దేశం... ఒకే ఎన్నిక, వక్ఫ్ బిల్లు వగైరాలపై వేగం పెంచవచ్చు. బీమా రంగంలో పూర్తి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల లాంటి విపరీత సంస్కరణలకూ గేట్లెత్తే అవకాశం ఉంది. మహారాష్ట్ర పీఠమెక్కే కొత్త దేవేంద్రులకూ చాలా బాధ్యతలున్నాయి. దేశానికి ఆర్థిక కేంద్రంగా, స్థూలజాతీయోత్పత్తిలో దాదాపు 14 శాతం అందించే మహారాష్ట్రలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే, ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడాలి. అవినీతి, నిరుద్యోగం, రైతాంగ సమస్యల లాంటివి ఎన్నికల ప్రచారంలో వెనుకపట్టు పట్టినా, ఇకనైనా ఆ కీలక అంశాలపై దృష్టి పెట్టాలి. వెరసి, మహా ఫలితాల దరిమిలా అధికార, ప్రతిపక్షాలు అందరికీ చేతి నిండా పని ఉంది. -
మీ చేతి ఉన్నివస్త్రం
‘తపాలా బండి గంటల చప్పుడుకు ఏ పడుచు పిల్లయినా నిద్ర లేచినా మళ్లీ అటు తిరిగి పడుకుని తియ్యటి కలలు కంటుంది’ అని ఉంటుంది చెహోవ్ రాసిన ‘ఒక చలి రాత్రి’ కథలో! ఊహించండి. దట్టమైన చలికాలం. రాత్రి మూడు గంటల సమయం. ఏ వెధవ ప్రాణమైనా ముడుక్కుని పడుకుని కాసింత సుఖాన్ని అనుభవించే వేళ. ఒడలు మరిచే వేళ. వెచ్చదనమూ భోగమే అని భావించే వేళ. పొట్టకూటి కోసం, రోజూ చేయాల్సిన పని కోసం తపాలా మూటలను బగ్గీలో వేసుకుని స్టేషనుకు చేర్చక తప్పని మెయిల్మేన్ మనసులో ఎలా ఉంటుంది? నిశ్శబ్దాన్ని కప్పుకొని గాఢ సుషుప్తిలో ఉన్న ఊరి వీధుల గుండా అతడొక్కడే చలికి వణుకుతూ, కన్ను పొడుచుకున్నా కానరాని చీకటిలో వెళుతూ ఉంటే అతడి అంతరంగ జగాన ఏముంటుందో ఆ సమయాన ఇళ్లల్లోని గదుల్లో రగ్గుల చాటున శయనిస్తున్న మనుషులకు తెలుస్తుందా?శ్రీమంతులు కూడా భలే వాళ్లులే! చలి రాత్రుళ్లలో వారికి మజాలు చేయాలనిపిస్తుంది. అతిథులను పిలవాలనిపిస్తుంది. పార్టీలూ గీర్టీలూ. పనివాళ్లను తొందరగా ఇళ్లకు పోండి అంటారా ఏమి? లేటు అవర్సు వరకూ పని చేయాల్సిందే! బయట చలి ఉంటుంది. పాకల్లో పసిపిల్లలు ‘కప్పుకోవడానికి ఇవాళైనా దుప్పటి కొనుక్కుని రా నాన్నా’ అని కోరడం గుర్తుకొస్తూ ఉంటుంది. ఒంటి మీదున్న ఈ కనాకష్టం బట్టలతో ఇంతరాత్రి చలిలో ఇంటికి ఎలా చేరాలనే భీతి ఉంటుంది. వెచ్చటి ద్రవాలు గొంతులో ఒంపుకునే శ్రీమంతులు ‘ఒరే... ఆ రగ్గు పట్టుకుపో’ అంటారా? ‘ఈ పాత స్వెటరు నీ కొడుక్కు తొడుగు’ అని దయతో పారేస్తారా? ఆ సోయి ఉంటే కొందరు ఎప్పటికీ శ్రీమంతులు కాలేరు. పాపం పనివాడు రంగడు పార్టీలో యజమాని ఉండగా ఆ అర్ధరాత్రి రగ్గు దొంగిలిస్తాడు. పేదవాణ్ణి దొంగను చేసింది లోపలి పెద్దమనిషా... బయటి చలా? డి.వెంకట్రామయ్య ‘చలి’ కథ ఇది.దర్శకుడు బి.నరసింగరావు కథలు కూడా రాశారు. ‘చలి’ అనే కథ. నగరానికి వచ్చిన వెంటనే మొగుడు పారిపోతే ఆ వలస కూలీ చంకన బిడ్డతో వీధుల్లో తిరుగుతూ చలిరాత్రి ఎక్కడ తల దాచుకోవాలా అని అంగలారుస్తుంటుంది. అక్కడ నిలబడితే ఎవరో కసురుతారు. ఇక్కడ నిలబడితే ఎవరో తరుముతారు. నోరూ వాయి లేని చెట్టు ‘పిచ్చిదానా... నిలుచుంటే నిలుచో. నీకేం వెచ్చదనం ఇవ్వలేను’ అని చిన్నబోతూ చూస్తుంది. చెట్టు కింద తల్లీబిడ్డా వణుకుతుంటారు. చలి. చెట్టు కింద తల్లీ బిడ్డా కొంకర్లు పోతూ ఉంటారు. శీతలం. చెట్టు సమీపంలోని చాటు అటుగా వచ్చి ఆగిన కారులోని యువతీ యువకులకు మంచి ఏకాంతం కల్పిస్తుంది. బయట చలి మరి. ఒకే తావు. చెట్టు కింద చావుకు దగ్గరపడుతూ తల్లీబిడ్డ. అదే తావులో ఏమీ పట్టని వెచ్చని సరస సల్లాపం. చలి ఒకటే! బహు అర్థాల మానవులు.శతకోటి బీదలకు అనంతకోటి ఉపాయాలు. పేదవాడు బతకాలంటే నోరు పెంచాలి. లేదా కండ పెంచాలి. కండ పెంచిన మల్లయ్య రైల్వేస్టేషన్ దగ్గర సగం కట్టి వదిలేసిన ఇంటి వసారాను ఆక్రమించుకుంటాడు. తక్కిన కాలాల్లో దాని వల్ల లాభం లేదు. చలికాలం వస్తే మాత్రం రాత్రిళ్లు తల దాచుకోవడానికి అలగా జనాలు ఆ వసారా దగ్గరికి వస్తారు. తలకు ఒక్కరూపాయి ఇస్తే వెచ్చగా పడుకునేందుకు చోటు. కొందరి దగ్గర ఆ రూపాయి కూడా ఉండదు. దీనులు. పేదవాడు మల్లయ్య దయ తలుస్తాడా? తరిమి కొడతాడు. లేచిన ప్రతి ఆకాశహర్మ్యం నా ప్రమేయం ఏముందని నంగనాచి ముఖం పెట్టొచ్చుగాని అది ఎవడో ఒక పేదవాడిలో మంచిని చంపి రాక్షసత్వం నింపుతుంది. వి. రాజా రామమోహనరావు ‘చలి వ్యాపారం’ కథ ఇది.చలిరాత్రి ఎప్పటికీ అయిపోదు. అది పేదవాళ్లకు తామెంత నగ్నంగా జీవిస్తున్నారో గుర్తు చేయడానికే వస్తుంది. చలికి వణికే కన్నబిడ్డల్ని చూపి బాధ పెట్టడానికే వస్తుంది. మనందరం మధ్యతరగతి వాళ్లమే. ఇంటి పనిమనిషిని అడుగుదామా ‘అమ్మా... నీ ఇంట ఒక గొంగళన్నా ఉందా... పిల్లలకు ఉన్ని వస్త్రమైనా ఉందా?’.... ‘చలికి వ్యక్తి మృతి’ అని వార్త. మనిషి చలికి ఎందుకు చనిపోతాడు? ప్రభుత్వం అతనికి ఇస్తానన్న ఇల్లు ఇవ్వకపోతే, ఇల్లు ఏర్పాటు చేసుకునేంత ఉపాధి చూపకపోతే, నీ దిక్కులేని బతుకును ఇక్కడ వెళ్లదీయమని వింటర్ షెల్టరైనా చూపకపోతే, తన నిర్లక్ష్యాన్ని తోడు చేసుకుని చలి హత్యలు చేయగలదని గ్రహించకపోతే అప్పుడు ఆ వ్యక్తి ‘చలికి చనిపోయిన వ్యక్తి’గా వార్తలో తేలుతాడు. విలియమ్ సారోయాన్ అనే రచయిత రాస్తాడు– చలి నుంచి కాపాడటానికి కనీసం శవాల మీదున్న వస్త్రాలనైనా తీసివ్వండ్రా అని! అతని కథలో ఒక యువకుడు ఆకలికి తాళలేక ఓవర్కోట్ అమ్మి చలితో చచ్చిపోతాడు.పగిలిన గాజుపెంకుతో కోసినట్టుగా ఉంటుందట చలి. అదంత తీవ్రంగా ఉండేది మను షుల్లో నిర్దయను పెంచడానికా? కాదు! దయను పదింతలు చేయడానికి! పాతదుప్పట్లో, పిల్లలు వాడక వదిలేసిన స్వెటర్లో, నాలుగు కంబళ్లు కొనేంత డబ్బు లేకపోలేదులే అని కొత్తవి కొనో వాటిని స్కూటర్లో, కారులో పడేసి ఆఫీసు నుంచి వచ్చేప్పుడు ఒక్కరంటే ఒక్కరికి ఇచ్చి వస్తే ఎలా ఉంటుందో ఈ చలికాలంలో చూడొద్దా? ఉబ్బెత్తు బ్రాండెడ్ బొంతలో నిద్రపోయే వేళ మన చేతి ఉన్నివస్త్రంతో ఒక్కరైనా నిద్ర పోతున్నారన్న భావన పొందవద్దా? అదిగో... అర్థమైందిలే... మీరు అందుకేగా లేచారు! -
బైడెన్ తప్పుడు నిర్ణయం
అధ్యక్షుడిగా ఉంటూ ఎన్నికల్లో ఓటమిపాలై ప్రత్యర్థికి అధికారం అప్పగించటం మినహా మరేమీ చేయలేని నిస్సహాయ స్థితిలోపడిన నేతను అమెరికా జనం ‘లేమ్ డక్ ప్రెసిడెంట్’ అంటారు. అధ్యక్షుడు జో బైడెన్ అంతకన్నా తక్కువ. ఎందుకంటే ఆయన కనీసం పోటీలో కూడా లేరు. ఎన్నికల ముహూర్తం దగ్గర పడుతుండగా అందరూ బలవంతంగా ఆయన్ను తప్పించి కమలా హారిస్ను బరిలో నిలిపారు. ఆ పార్టీ ఓటమి పాలైంది. ఇక అధికారం బదలాయింపు లాంఛనాలు తప్ప బైడెన్ చేయగలిగేదీ, చేసేదీ ఏమీ ఉండదు. కానీ ఆయన తగుదనమ్మా అంటూ ఉక్రెయిన్కు ఏడాదిన్నర క్రితం ఇచ్చిన అత్యంత శక్తిమంతమైన దీర్ఘశ్రేణి క్షిపణుల్ని వినియోగించటానికి అనుమతినిచ్చారు. దాంతోపాటు తాము సరఫరా చేసిన ప్రమాదకరమైన మందుపాతరలను కూడా వాడుకోవచ్చని ఉక్రెయిన్కు తెలిపారు. యుద్ధం మొదలై వేయిరోజులైన సందర్భంగా అమెరికా సరఫరా చేసిన క్షిపణులను ప్రయోగించి రష్యా భూభాగంలోని బ్రిన్స్క్ ప్రాంతంలోని కరచెవ్ భారీ ఆయుధ గిడ్డంగిని ఉక్రెయిన్ సైన్యం ధ్వంసం చేసింది. దీనికి ప్రతిగా అణ్వాయుధ వినియోగం ముసాయిదాను సవరించినట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. పర్యవసానంగా ప్రపంచం అణ్వస్త్ర యుద్ధం అంచులకు చేరింది. యుద్ధం మొదలయ్యాక కేవలం కొన్ని రోజుల్లో... మహా అయితే కొన్ని నెలల్లో రష్యా పాదాక్రాంతం కావటం ఖాయమన్న తప్పుడు అంచనాలతో ఉక్రెయిన్ను యుద్ధరంగంలోకి నెట్టింది అమెరికాయే. 2014లో పుతిన్ క్రిమియాను స్వాధీనం చేసుకున్నాక వరసగా ఎనిమిదేళ్లపాటు జరిగిన ఘర్షణలు నివారించటానికి 2022లో వాటి మధ్య శాంతి ఒప్పందం ముసాయిదాను అమెరికా, బ్రిటన్లే రూపొందించాయి. చిత్రమేమంటే, ఆ ఒప్పందాన్ని అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ కూడా ఆమోదించాయి. ప్రాథమిక అవగాహన పత్రంపై ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. కానీ ఆఖరి నిమిషంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మనసు మార్చు కున్నారు. ఆ రెండు దేశాల సాయంతో అక్రమంగా అధికారంలోకొచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వారి ఒత్తిడికి లొంగి ఏకపక్షంగా ఒప్పందం నుంచి వైదొలగారు. ఆ తర్వాతే రష్యా దురాక్రమణ యుద్ధా నికి దిగింది. అసలు రెండు నెలల క్రితం నాటి స్థితికీ, ఇప్పటికీ వచ్చిన మార్పేమిటో, ఎందుకు మూడో ప్రపంచయుద్ధం ముప్పు తీసుకొచ్చారో బైడెన్ చెప్పాలి. తాము సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులు స్టార్మ్ షాడోలను రష్యాపై ప్రయోగించటానికి బ్రిటన్ నిరుడు అనుమతించినప్పుడు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ బైడెన్ను తీవ్రంగా హెచ్చరించింది. దీన్ని ఆపనట్టయితే ఇది నాటో–రష్యా యుద్ధంగా పరిణమిస్తుందని వివరించింది. దాంతో బైడెన్కు తత్వం బోధపడి బ్రిటన్ను వారించారు. అంతక్రితం 2022 మార్చిలో రష్యా గగనతలంపై ‘నో ఫ్లైజోన్’ విధించటానికి తమ మిగ్–29 యుద్ధ విమానాలను వాడుకోవచ్చని విదేశాంగమంత్రి బ్లింకెన్ పోలెండ్ను అనుమతించినప్పుడు అమెరికా ప్రతినిధుల సభంతా ఏకమై పెంటగాన్ అభిప్రాయం తర్వాతే నిర్ణయం తీసుకోవాలని వారించారు. దాంతో బైడెన్ ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. ‘నో ఫ్లైజోన్’ విధించటమంటే మూడో ప్రపంచయుద్ధానికి అంకురార్పణ చేసినట్టేనని ఒప్పుకున్నారు. మరి ఇప్పుడేమైంది? తన పార్టీ చిత్తుగా ఓడి, కీలక నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో పడినప్పుడు అనుమతినీయటం అనైతికం, బాధ్యతారాహిత్యం మాత్రమే కాదు... నేరం కూడా. ఒకపక్క జనవరిలో అధ్యక్షుడిగా రానున్న డోనాల్డ్ ట్రంప్ తన మొదటి కర్తవ్యం రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఆపటమేనని ఇప్పటికే ప్రకటించారు. సరిగ్గా ఇలాంటి పనే రిపబ్లికన్ పార్టీకి చెందిన జార్జి బుష్ 1992లో చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలై ఇక 11 నెలల్లో దిగిపోతాననగా సోమాలియా దురాక్రమణకు ఆయన ఆదేశాలిచ్చారు. దాంతో కొత్తగా అధికారంలోకొచ్చిన క్లింటన్ అన్నీ వదిలిపెట్టి దానిపైనే చాన్నాళ్లు దృష్టి సారించాల్సి వచ్చింది. బైడెన్కు సైతం కేవలం 11 వారాలే గడువుంది. కనీసం నిర్ణయం తీసుకునేముందు సెనేట్ను సమావేశపరిచి సలహా తీసుకోవాలన్న ఇంగితం కూడా లేకపోయింది. ఈ నిర్ణయాన్ని పెంటగాన్ సీనియర్ అధికారులు వ్యతిరేకించారంటున్నారు.నిజానికి క్షిపణుల్ని వినియోగించే సామర్థ్యం, సాంకేతిక నైపుణ్యం ఉక్రెయిన్కు లేవు. అమెరికా నిఘా ఉపగ్రహాలు నిర్దిష్ట సమాచారం ఇస్తేనే, దాని ఆధారంగా అమెరికా సైనికాధికారులు రష్యా ఆయుధ గిడ్డంగిని ధ్వంసం చేశారని సాధారణ పరిశీలకులకు సైతం సులభంగా తెలుస్తుంది. రష్యా గ్రహించదనుకోవటం, పాపభారమంతా ఉక్రెయిన్పైనే పడుతుందనుకోవటం తెలివితక్కువతనం. మందుపాతరల వినియోగాన్ని పూర్తిగా ఆపేస్తామని ఐక్యరాజ్యసమితిలోని 161 దేశాలు కుదుర్చుకున్న ఓస్లో ఒడంబడికను అమెరికా, రష్యాలు కాదన్నాయి. ఆ ఒడంబడికకు కారణమైన మందు పాతరల నిరోధ ప్రచార సంస్థకూ, దాని అధ్యక్షుడు జోడీ విలియమ్స్కూ 1997లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. మందుపాతరలివ్వాలన్న బైడెన్ తాజా నిర్వాకంవల్ల ఆ ఒడంబడికపై సంతకం చేసిన ఉక్రెయిన్ అపరాధిగా మారినట్టయింది. మందుపాతరల వల్ల కీయూవ్లోకి చొచ్చుకొస్తున్న రష్యా బలగాల వేగాన్ని కొంతవరకూ నిరోధించవచ్చు. కానీ ఆపటం అసాధ్యం. యుద్ధం పూర్త య్యాక సాధారణ పౌరులు వందలమంది ఏదో ఒక ప్రాంతంలో నిత్యం మందుపాతరలకు బలయ్యే ప్రమాదం ఉంటుంది. బైడెన్ తప్పుడు నిర్ణయాన్ని వెంటనే సరిదిద్దకపోతే ప్రపంచ ప్రజలముందు అమెరికా దోషిగా నిలబడాల్సివస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోరాదని అక్కడి ప్రజానీకం తెలుసు కోవాలి. ప్రభుత్వాన్ని నిలదీయాలి. -
ముందుకు కదలని ముచ్చట
మరో ఏడాది గడిచింది. మరో జీ20 సదస్సు జరిగింది. భారత ప్రధాని మోదీ సహా ప్రపంచ దేశాల పెద్దలు కలిశారన్న మాటే కానీ, ఏం ఒరిగింది? బ్రెజిల్లో రెండు రోజులు జరిగిన సదస్సు తర్వాత వేధిస్తున్న ప్రశ్న ఇది. ఈ 20 అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల కూటమి ఓ సమష్టి తీర్మానం చేసింది కానీ, తీర్మానంలోని భాషపై అర్జెంటీనా అభ్యంతరాలతో ఏకాభిప్రాయ సాధన కుదరలేదు. ఆకలిపై పోరాటానికి ఒప్పందం, ప్రపంచంలో అత్యంత సంపన్నులపై పన్ను లాంటి అంశాలపై సదస్సులో మాటలు సాగాయి. కానీ, ఉక్రెయిన్లో, మధ్యప్రాచ్యంలో... జరుగుతున్న ప్రధాన యుద్ధాల క్రీనీడలు సదస్సుపై పరుచుకున్నాయి. చివరకు సదస్సు చివర జరపాల్సిన విలేఖరుల సమావేశాన్ని సైతం బ్రెజిల్ దేశాధ్యక్షుడు ఆఖరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. రష్యాపై ఉక్రెయిన్ క్షిపణి దాడులు, పరిమిత అణ్వస్త్ర వినియోగానికి మాస్కో సన్నద్ధతతో ఉద్రిక్తతలు పెరిగినా అమెరికా అధ్యక్షుడు ఏమీ మాట్లాడకుండానే పయనమయ్యారు. వెరసి, అధికారులు అంటున్నట్టు ఈ ‘జీ20 సదస్సు చరిత్రలో నిలిచిపోతుంది’ కానీ, గొప్పగా చెప్పుకోవడానికేమీ లేనిదిగానే నిలిచిపోతుంది. మాటలు కోటలు దాటినా, చేతలు గడప దాటడం లేదనడానికి తాజా జీ20 సదస్సు మరో ఉదాహరణ. నిజానికి, పర్యావరణ పరిరక్షణకు కార్యాచరణ, నిధులు అనేవి ఈ సదస్సుకు కేంద్ర బిందువులు. పర్యావరణ మార్పులను ఎదుర్కోవాల్సిన ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ, పరస్పర సహకార ప్రయత్నాలకు కట్టుబడినట్టు సదస్సు పేర్కొంది. కానీ, శిలాజ ఇంధనాల వినియోగం నుంచి క్రమంగా పక్కకు మరలేందుకు స్పష్టమైన ప్రణాళికలేమీ చేయలేకపోయింది. పర్యావరణ పరిరక్షణ నిధులకు సంబంధించీ పురోగతి లేకుండానే ఈ జీ20 ముగిసింది. ప్రపంచ దేశాల నేతలు కృత నిశ్చయాన్ని ప్రకటిస్తూ, బలమైన సూచన ఏదో చేస్తారని ‘కాప్–29’ ఆశించినా, అలాంటిదేమీ జరగనేలేదు. కాకపోతే, ‘జీ20’ సదస్సు తుది తీర్మానంలో నిర్దిష్టమైన ఆర్థిక వాగ్దానాలేమీ లేనప్పటికీ, మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంకుల సంస్కరణలపై దృష్టి పెట్టినందున అది పరోక్షంగా పర్యావరణ నిధులకు ఉపకరిస్తుందని కొందరు నిపుణుల మాట. కాగా, ప్రపంచం నుంచి దారిద్య్రాన్ని పూర్తిగా నిర్మూలించాలంటూ జీ20 దేశాలు వచ్చే అయిదేళ్ళను కాలవ్యవధిగా పెట్టుకోవడం సాధ్యాసాధ్యాలతో సంబంధం లేకపోయినా, సత్సంకల్పమని సంతోషించాలి. 2008 ఆర్థిక సంక్షోభం అనంతరం వాషింగ్టన్లో జరిగిన జీ20 నేతల తొలి సమావేశానికి హాజరయ్యానని గుర్తు చేసుకుంటూ, పదహారేళ్ళ తర్వాత ఇప్పటికీ ప్రపంచం ఘోరమైన పరిస్థితిలో ఉందని బ్రెజిల్ అధ్యక్షుడన్న మాట నిష్ఠురసత్యం. ఆకలి, దారిద్య్రం ఇప్పటికీ పీడిస్తూనే ఉన్నాయి. దీనికి తప్పుడు రాజకీయ నిర్ణయాలే కారణమన్న ఆయన మాట సరైనదే. ఆకలి, దారిద్య్రంపై పోరాటానికి ప్రపంచ కూటమి స్థాపన మంచి ఆలోచనే. కానీ, ఇన్నేళ్ళుగా ఇలాంటివెన్నో సంకల్పాలు చేసుకున్నా, ఎందుకు నిర్వీర్యమయ్యాయన్నది ఆలోచించాల్సిన అంశం. పేరుకు కూటమి అయినా జీ20లోని సభ్య దేశాల మధ్య యుద్ధాలు సహా అనేక అంశాలపై భిన్నాభిప్రాయాలున్నా యన్నది సదస్సు ఆరంభం కాక ముందు నుంచీ తెలిసినదే. అందుకే, ఈ సదస్సును అతిగా అంచనా వేస్తే ఆశాభంగమే. కొన్ని విజయాలున్నా అధిక శాతం అంతర్జాతీయ శక్తుల మధ్య విభేదాలే సదస్సులో బయటపడ్డాయి. ఏ దేశాల పేర్లూ ఎత్తకుండా శాంతి సూక్తులకే జీ20 పరిమితమైంది. సమష్టి లక్ష్యం కోసం పలుదేశాలు కలసి కూటములుగా ఏర్పడుతున్నా, అవి చక్రబంధంలో చిక్కుకొని అడుగు ముందుకేయలేని పరిస్థితి ఉందని అర్థమవుతోంది. ఇటీవలి ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సదస్సు ‘కాప్29’, ఇరవై ఒక్క ఆసియా – పసిఫిక్ దేశ ఆర్థిక వ్యవస్థల వేదిక ‘ఆసియా – పసిఫిక్ ఆర్థిక సహకార మండలి’, జీ20ల్లో ఎదురైన ప్రతిష్టంభనలే అందుకు తార్కాణం. అవి ఇప్పుడు సమష్టి సవాళ్ళను పరిష్కరించే వేదికలుగా లేవు. వ్యాపార సంరక్షణవాద విధానాలు, భౌగోళిక – రాజకీయ శత్రుత్వాల యుద్ధభూములుగా మారిపోయాయి. ఈ వైఫల్యం వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు అశనిపాతం. అమెరికా, యూరోపియన్ యూనియన్ లాంటివి స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతం నుంచి పక్కకు జరిగాయి. ఫలితంగా తక్కువ కూలీ ఖర్చు, సరళమైన పర్యావరణ ప్రమా ణాలున్న వర్ధమాన దేశాలకు మునుపటి సానుకూలత ఇప్పుడు లేదు. పారిశ్రామికీకరణ వేళ సరళ తర నిబంధనలతో లబ్ధి పొందిన పెద్ద దేశాలు, తీరా ఇప్పుడలాంటి ఆర్థిక అవకాశాలేమీ లేకుండానే వర్ధమాన దేశాలను సుస్థిరాభివృద్ధి వైపు నడవాలని కోరడం అన్యాయమే. ప్రపంచాన్ని పీడిస్తున్న అంశాలపై దృష్టి సారించడంలో జీ20 విఫలమవడం విషాదం. పర్యావరణ సంక్షోభం, దారిద్య్రం, ఉత్పాతాల లాంటి అనేక సవాళ్ళు కళ్ళెదుటే ఉన్నా, వాటి పరిష్కారం బదులు రష్యా, చైనాలను ఏకాకుల్ని చేయాలన్నదే జీ7 దేశాల తాపత్రయం కావడమూ తంటా. భౌగోళిక – రాజకీయ వివాదాలు అజెండాను నిర్దేశించడంతో జీ20 ప్రాసంగికతను కోల్పోతోంది. సమాన అవకాశాలు కల్పించేలా కనిపిస్తున్న బ్రిక్స్ లాంటి ప్రత్యామ్నాయ వేదికల వైపు పలు దేశాలు మొగ్గుతున్నది అందుకే. జీ20 లాంటి బహుళ దేశాల వ్యవస్థల కార్యాచరణను ఇతరేతర అంశాలు కమ్మివేస్తే అసలు లక్ష్యానికే చేటు. పరస్పర భిన్నాభిప్రాయాల్ని గౌరవిస్తూనే దేశాలు సద్భావంతో నిర్మాణాత్మక చర్చలు జరిపితే మేలు. ఏ కూటమైనా శక్తిమంతులైన కొందరి వేదికగా కాక, అంద రిదిగా నిలవాలి. పశ్చిమదేశాలు ఆ సంగతి గ్రహిస్తేనే, జీ20 లాంటి వాటికి విలువ. విశ్వ మాన వాళికి ప్రయోజనం. వచ్చే ఏడాది సౌతాఫ్రికాలో జరిగేనాటికైనా జీ20 వైఖరి మారుతుందా? -
విషతుల్య రాజధాని
భారత రాజధాని ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రతి శీతకాలంలానే ఈ ఏడాదీ పాత కథ పునరావృత్తం అయింది. ఒకపక్క పెరిగిన చలికి తోడు ధూళి నిండిన పొగ లాంటి గాలి, కాలుష్య ఉద్గారాలు, పొరుగున ఉన్న పంజాబ్ – హర్యానా లాంటి వ్యవసాయాధారిత రాష్ట్రాల్లో అక్రమంగా సాగుతున్న కొయ్యకాళ్ళ దహనం... అన్నీ కలిసి అతి తీవ్ర వాయు కాలుష్యంగా పరిణమించాయి. వారంగా అదే పరిస్థితి కొనసాగుతూ ఉండడం, వాయునాణ్యతా సూచిక (ఏక్యూఐ) సోమవారం గరిష్ఠంగా దాదాపు 500 మార్కును చేరడంతో సుప్రీమ్ కోర్ట్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. స్కూల్ పిల్లలకు భౌతికంగా తరగతులు నిర్వహించవద్దని ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. చివరకు బాకూలో జరుగుతున్న ఐరాస వాతావరణ సదస్సు సైతం ఈ కాలుష్యాన్ని ఆందోళనకరంగా పరిగణించడం, నిపుణులు దీన్ని ‘ఆరోగ్య అత్యవసర పరిస్థితి’గా ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు తార్కాణం. ఢిల్లీలో సోమవారంæ కాలుష్య స్థాయి దీపావళి నాటి రాత్రి కన్నా దాదాపు 40 శాతం ఎక్కువంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో సగటు పీఎం 2.5 స్థాయి... భారతీయ ప్రమాణాల కన్నా 14 రెట్లు ఎక్కువ, అదే ఐరాస పర్యావరణ పరిరక్షక సంస్థ (యూఎస్ఈపీఏ) నిర్దేశించిన ప్రమాణాల లెక్కలో అయితే 55 రెట్లు ఎక్కువ నమోదైంది. వాయు నాణ్యత ఇంతలా క్షీణించడం పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులున్న వారికి ప్రమాదంగా పరిణమిస్తోంది. పీఎం 10 స్థాయిని బట్టి అంచనా వేసే ధూళి కాలుష్యమూ హెచ్చింది. ఆగ్రాలో కళ్ళు పొడుచుకున్నా కనిపించని దట్టమైన పొగ. తాజ్మహల్ కట్టడం విషవాయు కౌగిలిలో చేరి, దూరం నుంచి చూపరులకు కనిపించడం మానేసి వారమవుతోంది. మాస్కులు లేకుండా వీధుల్లోకి రాలేని పరిస్థితి. వెరసి, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరమనే దుష్కీర్తి ఢిల్లీకి దక్కింది. స్విస్ గ్రూప్ ఐక్యూ ఎయిర్ తేల్చిన ఈ నిష్ఠురసత్యం ఇన్నేళ్ళ మన బాధ్యతా రాహిత్యానికీ, పాలకుల నిష్క్రియాపరత్వానికీ నిదర్శనం. ఆ మాటకొస్తే, 2018లో కానీ, గడచిన 2023లో కానీ ఏడాదిలో ఏ ఒక్కరోజూ ఢిల్లీలో స్వచ్ఛమైన గాలి లేదని రికార్డులు చెబుతున్నాయంటే ఏమనాలి? కాలుష్యం దేశవ్యాప్తంగా ఉందనీ, నివారణ బాధ్యత రాష్ట్రానిదే కాదు కేంద్రానిది కూడా అని ఢిల్లీ ‘ఆప్’ సర్కార్ వాదన. కానీ, ఏటేటా శీతకాలంలో రాజధానిలో పెరుగుతూ పోతున్న ఈ కష్టానికి చెక్ పెట్టడంలో పాలకులు ఎందుకు విఫలమయ్యారంటే జవాబు దొరకదు. విమర్శలు వెల్లువెత్తడంతో ఢిల్లీ సర్కార్ కాలుష్య నిరోధానికి యంత్రాల ద్వారా నీటి తుంపర్లు జల్లడం లాంటి చర్యలు చేపడుతోంది. ఇవేవీ చాలక చివరకు ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లలో కృత్రిమ వర్షాలకు అనుమతి ఇవ్వాలని మరోసారి కేంద్రాన్ని అభ్యర్థిస్తోంది. మేఘమథనం జరిపేందుకు ఇప్పటికే పలుమార్లు కేంద్రాన్ని అనుమతి కోరినా, జవాబు లేదన్నది ‘ఆప్’ ఆరోపణ. ఇలాంటి ప్రయోగాల వల్ల ప్రయోజనమెంత అనేది చర్చనీయాంశమే. అయితే, ప్రజలకు తాత్కాలికంగానైనా ఉపశమనం కలిగించే ఇలాంటి ప్రయత్నాలకు కేంద్రం మొదటే మోకాలడ్డడం సరికాదు. వాయు కాలుష్యం ‘అతి తీవ్ర’ స్థాయులకు చేరిన నేపథ్యంలో ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ (గ్రాప్) నాలుగోదశ చర్యలను కఠినంగా అమలు చేయాలన్నది సుప్రీమ్ తాజా ఆదేశం. పాఠశాలల్ని మూసివేయడం, ఆఫీసుకు రాకుండా ఇంటి వద్ద నుంచే పనిచేయడం, పరిశ్రమల మూసివేత లాంటి చర్యలన్నీ నాలుగో దశ కిందకు వస్తాయి. ముప్పు ముంచుకొస్తున్నా మూడో దశ, నాలుగో దశ చర్యల్లో అధికారులు ఆలస్యం చేశారంటూ సర్వోన్నత న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు షరతులు అమలు చేయాల్సిందేనని కోర్ట్ చెప్పాల్సి వచ్చిందంటే అధికార యంత్రాంగం అలసత్వం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. నిద్ర లేచిన ప్రభుత్వం ఇప్పుడిక ‘గాప్’ నాలుగో దశ కింద వాహనాల రాకపోకలు, భవన నిర్మాణ కార్యకలాపాలపై షరతులు విధించింది. అయితే, దీంతో ఢిల్లీ, పంజాబ్, హర్యానాల్లో దాదాపు 34 లక్షల చిన్న, మధ్యశ్రేణి సంస్థల్లో ఉత్పత్తి దెబ్బతిననుంది. అంటే కాలుష్య పాపం ఆరోగ్యాన్నే కాక ఆర్థికంగానూ కుంగదీస్తుందన్న మాట. ఢిల్లీలో వాహనాల వల్ల అత్యధిక కాలుష్యం సంభవిస్తుంటే, ఎన్సీఆర్లో పరిశ్రమలు ప్రధాన కాలుష్య కారకాలని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (తెరి) 2021లోనే తేల్చింది. అనేకచోట్ల ఇప్పటికీ కట్టెల వాడకం కొనసాగుతోంది. ఇక, పొలాల్లో కొయ్య కాళ్ళ దహనం తాజా దురవస్థకు 40 శాతం కారణమట. అన్నీ కలిసి పీల్చే గాలే విషమయ్యేసరికి, ఢిల్లీ వాసుల ఆయుఃప్రమాణం సగటున ఏడేళ్ళు తగ్గుతోంది. రాజధాని, ఆ పరిసరాల్లోని 3 కోట్ల పైచిలుకు మంది వ్యధ ఇది. నిజానికి, స్వచ్ఛమైన గాలి ప్రాథమిక మానవహక్కని గత నెలతో సహా గత అయిదేళ్ళలో సుప్రీమ్ అనేకసార్లు స్పష్టం చేసింది. వాయునాణ్యతకు చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్ర, రాష్ట్రస్థాయి యంత్రాంగాలను ఆదేశించింది. అయినా జరిగింది తక్కువ. సరైన ప్రాణ వాయువు కూడా అందని ఈ పరిస్థితికి ప్రజల నుంచి పాలకుల దాకా అందరూ బాధ్యులే. కాలుష్య నివారణ, నియంత్రణలకు సృజనాత్మక ఆలోచనలు చేయలేకపోవడం ఘోరం. దాహమేసినప్పుడు బావి తవ్వకుండా ఏడాది పొడుగూతా వ్యూహాత్మకంగా చర్యలు చేపట్టడం అవసరం. ఆధునిక సాంకేతికత, ప్రజారవాణా, ప్రజల అలవాట్లలో మార్పులు సహా అనేక అంశాల్లో రాజకీయ కృత నిశ్చయంతో విధాన నిర్ణేతలు పనిచేయాలి. లేదంటే, సాక్షాత్తూ దేశ రాజధానే నివాసయోగ్యం కాక జనం తరలిపోతుండడం చూసి వికసిత భారత్, లక్షల కోట్ల ఆర్థికవ్యవస్థ లాంటివన్నీ వట్టి గాలి మాటలే అనుకోవాల్సి వస్తుంది. -
రగులుతున్న అగ్నిపర్వతం!
ఏణ్ణర్ధం దాటినా... మణిపుర్ మండుతూనే ఉంది. జాతుల మధ్య ఘర్షణ తగ్గకపోగా, అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా పదిరోజుల క్రితం ఓ కుకీ మహిళ అత్యాచారం – హత్య, దానికి ప్రతిగా మెయితీలపై కుకీ తీవ్రవాదుల దాడులు, చివరకు ఓ సహాయ శిబిరం నుంచి నవంబర్లో అపహరణకు గురైన ఓ పసిబిడ్డతో సహా ఆరుగురు అమాయక మెయితీలు ప్రాణాలు కోల్పోవడం... ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. సీఎం సహా రాష్ట్రంలో ప్రజా ప్రతినిధుల ఇళ్ళపై దాడులతో చివరకు రాష్ట్ర రాజధాని ఇంఫాల్లో కర్ఫ్యూ, ఇంటర్నెట్ స్తంభన, వివాదాస్పదమైన సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం విధింపు, కేంద్రం నుంచి అదనపు బలగాలను పంపడం దాకా వెళ్ళింది. ప్రభుత్వ మనుగుడకు ముప్పేమీ లేకున్నా, బీజేపీ సర్కారుకు తమ మద్దతును ఉపసంహరించుకున్నట్టు నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రకటించడం మిత్రుల్లోనూ బీజేపీ పట్ల పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనం. గత 2023 మేలో హింసాకాండ మొదలైనప్పటి నుంచి జాతుల ఘర్షణల్లో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 60 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఎంతసేపటికీ బాహ్య శక్తులు కారణమంటూ ఆరోపించడం, శుష్కవాగ్దానాలు చేయడమే తప్ప, రాష్ట్రం రావణకాష్ఠమైనా పరిస్థితిని అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. మణిపుర్ సామాజిక – ఆర్థిక జీవితంలో జాతుల ఉనికి అత్యంత కీలకమైనది. దాన్నిబట్టే ఆ ఈశాన్య రాష్ట్రంలో భూములపై హక్కులు, తదనుగుణంగా రాజకీయ సైద్ధాంతిక విభేదాలు రూపు దిద్దుకుంటూ వచ్చాయి. దాదాపు డజనుకు పైగా గిరిజన తెగలను కలిపి, బ్రిటీషు పాలనా కాలంలో కుకీలు అని పేరుపెట్టారు. విభిన్న జాతుల్లో ప్రధానమైనవైన మెయితీ వర్గానికీ, కుకీలకూ మధ్య పాలకులు తమ స్వార్థప్రయోజనాల కోసం అగ్నికి ఆజ్యం పోశారు. అదే అసలు సమస్య. జనరల్ వర్గానికి చెందిన మెయితీలు తమకు కూడా షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) హోదా కల్పించాలని కోరు తున్నారు. అయితే, దానివల్ల తమ ప్రయోజనాలు దెబ్బ తింటాయని కుకీల ఆందోళన. మరోపక్క మిజోరమ్తోనూ, పొరుగున మయన్మార్లోని చిన్ రాష్ట్రంతోనూ జాతి సంబంధాలున్న కుకీల వాంఛ వేరు. మణిపుర్ నుంచి తమ ప్రాంతాన్ని విభజించి, ప్రత్యేక పాలనా వ్యవస్థ ఏర్పాటు చేయాలని వారు బలంగా వాదిస్తున్నారు. ఇది చాలదన్నట్టు మెయితీ వర్గానికి చెందిన మణిపుర్ ప్రస్తుత ముఖ్యమంత్రి బీరేన్సింగ్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ, కుకీలను అణచివేస్తున్నారనే అభిప్రాయం రోజురోజుకూ బలపడుతూ వచ్చింది. ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణమయ్యాయి. కారణాలు ఏమైనా, రాష్ట్రంలోని బీజేపీ పాలిత ప్రభుత్వ సారథి అన్ని వర్గాలనూ ఒక తాటి మీదకు తీసుకురావడంలో విఫలమవడంతో బాధ్యత అంతా కేంద్రం భుజాల మీద పడింది. కేంద్ర హోమ్శాఖ మొన్న అక్టోబర్లో మెయితీ, కుకీల వర్గాల రాజకీయ ప్రతినిధులతో సమావేశం జరిపింది కానీ, శాంతిసాధన దిశగా అడుగులు పడలేదు. ప్రత్యేక శాసనవ్యవస్థతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం తమకు కావాల్సిందేనని కుకీలు భీష్మించుకు కూర్చున్నారు. మణిపుర్ విభజనతో మాత్రమే సాధ్యం. అయితే, కేంద్ర జోక్యంతో సమస్యను పరిష్కరించవచ్చని ఇప్పటికీ కుకీలు భావిస్తున్నారు. ఇంత సంక్షోభంలోనూ అది ఓ సానుకూల అంశం. ఢిల్లీ పెద్దలు దాన్ని వినియోగించుకోవాలి. కానీ, అలా జరుగుతున్నట్టు లేదు. విధానపరంగా, రాజకీయంగా సీఎం విఫలమయ్యారని తెలుస్తున్నా, గద్దె మీది బీరేన్సింగ్ను మార్చడానికి బీజేపీ, కేంద్రంలోని ఆ పార్టీ పెద్దలు ఎందుకు ముందుకు రావడం లేదో తెలియదు. బీరేన్పై అంత ప్రేమ ఎందుకన్నది బేతాళప్రశ్న. డబుల్ ఇంజన్ సర్కార్తో ప్రగతి అంటే ఇదేనా? మణిపుర్ను దేశంలో అంతర్భాగమని వారు అనుకోవట్లేదా? ఈశాన్యంలో పార్టీ విస్తరణపై ఉన్న శ్రద్ధలో కాసింతైనా శాంతిస్థాపనపై కాషాయ పెద్దలకు ఎందుకు లేదు? అంతకంతకూ క్షీణిస్తున్న పరిస్థితులు ప్రభుత్వంతో పాటు రాజకీయ పక్షాలు సైతం బాధ్యతను వదిలేశాయనడానికి సూచన. ఈ సంక్షుభిత ఈశాన్య రాష్ట్రానికి ఇప్పుడు కాస్తంత సాంత్వన కావాలి. బాధిత వర్గాలన్నిటినీ ఓదార్చి, ఉపశమనం కలిగించే పెద్ద మనసు కావాలి. పౌరసమాజాన్ని కూడా భాగస్వామ్యపక్షం చేసి, సమస్యకు రాజకీయ పరిష్కారం చూడడమే మార్గం. అందుకు కేంద్ర సర్కారు ఇప్పటికైనా చిత్తశుద్ధితో చొరవ తీసుకోవాలి. పాలకులు మణిపుర్ను వట్టి శాంతిభద్రతల కోణం నుంచే చూస్తే కష్టం. దాని వల్ల సామాన్య ప్రజానీకానికీ, ఈశాన్య ప్రాంతంలోని సాయుధ బలగాలకూ కష్టాలు పెరుగుతాయి. రాష్ట్రంలో చేజారిన పరిస్థితుల్ని ఇప్పటికైనా చక్కదిద్దేందుకు కేంద్రం ప్రయత్నించకపోతే, అది దేశ సమగ్రతకే ప్రమాదం. పొరుగున మయన్మార్, బంగ్లాదేశ్లలో సంక్షుభిత వాతావరణం నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అప్రమత్తత అత్యవసరం. అనేక సాయుధ తీవ్రవాద గ్రూపులతో, ఇట్టే చొరబాట్లకు చాలా అవకాశం ఉన్న సరిహద్దుల్లో మణిపుర్ ఉందని విస్మరించరాదు. కేవలం సాయుధ బలగాల మోహరింపుతో అక్కడ శాంతి సాధ్యంకాదు. హింసలో తాత్కాలిక విరామాన్ని చూపి, అదే శాంతి అని నమ్మబలకడం మూర్ఖత్వం. అన్ని వర్గాల మధ్య సామరస్యం, సహజీవనం సాగేలా రాజకీయ ఏర్పాటు చేయగలిగితేనే హింసకు తెర పడుతుంది. కేంద్రం ఇప్పటికైనా చిత్తశుద్ధితో అందుకు సర్వశక్తులూ ఒడ్డాలి. లేదంటే, అగ్ని పర్వతం సమీపంలోనే ఉన్నా అలసత్వంతో వ్యవహరిస్తున్నట్టే! దాదాపు 33 లక్షల సోదర భారతీయ జనాభాను స్వార్థ ఆర్థిక, అధికార ప్రయోజనాల కోసం గాలికి వదిలేస్తున్నట్టే! గుజరాత్, ముజఫర్ నగర్, ఢిల్లీ లాంటి అనేక చోట కొద్ది రోజుల్లో హింసకు ముకుతాడు వేయగలిగినచోట ఇన్ని నెలలుగా ఒక రాష్ట్రాన్ని మంటల్లో వదిలేయడం ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ పాలకులకు సిగ్గుచేటు! -
సందిగ్ధ జ్ఞానం
జ్ఞానానికి, అజ్ఞానానికి మధ్య ఉన్నది ‘అ’భేదమే కదా అనుకుంటాం కానీ, ఆ రెండింటికీ మధ్య ఏడు సముద్రాలంత దూరం ఉంది. అజ్ఞానమనే చీకటి ఒడ్డు నుంచి, జిజ్ఞాస అనే అలల మీదుగా, జ్ఞానమనే వెలుగుల తీరం వైపు సాగే ప్రయాణంలో ఆనందమే మనకు తెప్పవుతుంది. అందుకే జ్ఞానానందమనే మాట పుట్టింది. అయితే, ఆ ఆనందాన్ని అంటిపెట్టుకుని ఒక విషాదమూ ఉంటుంది. అది ఏమిటంటే... మన ఊహకు అందనంత వయసున్న ఈ అనంతవిశ్వంలో భూమి ఒక గోళీకాయ కన్నా కూడా చిన్నదనుకుంటే, దానిపై జీవించే మనిషి నలుసుపాటి కూడా చేయడు. అతని అస్తిత్వాన్ని కాలం కొలమానంతో కొలిస్తే అది కొన్ని క్షణాలను మించదు. కనుక అనంతవిశ్వం గురించిన జ్ఞానం సంగతలా ఉంచి, ఈ భూమి గురించి, ఈ భూమి మీద తన మనుగడ గురించిన జ్ఞానం మొత్తాన్నే ఒక మనిషి తన జీవితకాలంలో సంగ్రహించుకోవడం అసాధ్యం. అదీ అసలు విషాదం. మనిషిలో మెదడు ఎప్పుడు వికసించిందో అప్పుడే అతనిలో విశ్వం గురించిన జ్ఞానాన్వేషణ మొదలై, వేలసంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. చంద్రుడి వృద్ధి, క్షయాలను అనుసరించి కాలగణనాన్నీ, ఋతుభ్రమణాన్ని అనుసరించి వేటజంతువుల గుర్తింపునూ మనిషి ప్రారంభించి వాటిని ఒక పొడవాటి ఎముకపై నమోదు చేయడం నక్షత్రాలు, రాశులతో ముడిపడిన జ్యోతిర్విజ్ఞానానికి నాంది అయిందంటారు. ఆపైన మొక్కల సేకరణ నుంచి, పెరటిసాగుకు; అక్కడి నుంచి వ్యవసాయానికి సాగే క్రమంలో ఆహారవిజ్ఞానాన్ని బహుముఖాలుగా విస్తరించుకుంటూ వెళ్ళాడు. రాతిపనిముట్ల తయారీలో సాంకేతికజ్ఞానాన్ని, ఏదో అతీతశక్తి ఈ విశ్వాన్ని సృష్టించి నడిపిస్తోందన్న ఊహ నుంచి మత, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని; నియమ నిబంధనలు, కట్టుబాట్లతో కలసి జీవించడం నుంచి సంస్కృతిని సంతరిస్తూ, నిర్మిస్తూ వచ్చాడు. ఇందులో ప్రతిదీ జ్ఞానాన్వేషణలో మేలి మలుపే; జ్ఞానపు నిచ్చెన నధిరోహించడంలో నిశ్చయాత్మకమైన మెట్టే. నగరాల నిర్మాణం మీదుగా నాగరికతాదిశగా సాగిన ఈ యాత్రలో ఇంతవరకు మనిషి ఎక్కడా మడమ తిప్పింది లేదు; ఆకాశమే హద్దుగా ఆ యాత్ర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయినా సరే, సంపూర్ణజ్ఞానం మనిషికి ఎప్పటికీ అందని ఎండమావిలా ఊరిస్తూనే ఉంది. కనిపించని జ్ఞానచంద్రుడి చీకటిపార్శ్వం అదే. సంకేతాల నుంచి లిపిని అభివృద్ధి చేసుకుని జ్ఞానాన్ని పుస్తక రూపంలో భద్రపరచడం ఈ క్రమంలో మరొక మెరుపుల మజిలీ. మొదట్లో విశ్వసృష్టి, దేవుడు, మతం, ఆధ్యాత్మికత, శాస్త్ర విజ్ఞానం, సాంకేతికజ్ఞానం వగైరా వింగడింపు లేకుండా తనకు తెలిసిన జ్ఞానం మొత్తాన్ని, తనకు తెలిసిన ప్రక్రియలో ఒకేచోట రాశిపోసిన ఉత్సాహం మనిషిది. అందుకే గణితశాస్త్రాన్ని కూడా పద్యాల్లో చెప్పిన పావులూరి మల్లన్నలు మన దేశంలో, మన సాహిత్యంలో కనిపిస్తారు. తర్వాత తర్వాత జ్ఞానం అనేక శాఖలు గల మహావృక్షంగా ఎదిగిపోయి, ఒక మనిషి తన జీవితకాలంలో ఏ ఒక్క శాఖనూ పూర్తిగా తేరి చూసే వీలుకుండా నిలువుగా అడ్డంగా విస్తరించిపోయింది. తన కళ్ళ ముందే ఉన్న, తన నిత్యజీవనంతో ముడిపడి ఉన్న, తన అనుభవంలోకి వచ్చే అనేక విషయాల ఆనుపానులు తెలియకుండానే మనిషి తన జీవితకాలాన్ని ముగించవలసి రావడం కన్నా పెనువిషాదం ఇంక ఏముంటుంది? ప్రసిద్ధ కథారచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య ‘ఇంగువ’ అనే కథలో ఈ విషాదాన్నే ఒకింత హాస్యగంభీరస్ఫోరకంగా చిత్రిస్తారు. అందులో రాజశేఖరం అనే వ్యక్తిని ఇంగువ ఎలా తయారవుతుందనే ప్రశ్న చిరకాలంగా వేధిస్తూ ఉంటుంది. అతను వృద్ధాప్యంలో మంచం పడతాడు. ఒక మిత్రుడు అతణ్ణి చూడడానికి వెడతాడు. రాజశేఖరం అతి కష్టం మీద నోరు తెరచి అదే ప్రశ్న అడుగుతాడు. దానికి సమాధానం తెలుసుకోకుండానే జీవితం చాలిస్తానేమోనన్న బెంగ అతని ముఖంలో కనిపిస్తుంది. మిత్రుడు వెంటనే వెళ్ళి ఇంకో మిత్రుని కలసి సమాధానం కనుక్కొని తిరిగి వస్తాడు. కానీ అప్పటికే రాజశేఖరం కన్నుమూస్తాడు. ఇప్పటిలా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చి, గూగుల్ శోధించి ఉంటే, ‘ఫెరులా’ అనే మొక్క నుంచి పుట్టే జిగురే గట్టిపడి ఇంగువగా తయారవుతుందనీ, ‘అసాఫోటిడా’ అనేది దాని శాస్త్రీయ నామమనీ, ఈ మొక్క ఎక్కువగా ఇరాన్ ఎడారుల్లో, అఫ్ఘానిస్తాన్, ఉజ్బెకిస్తాన్ పర్వతప్రాంతాలలో సాగవుతుందనీ రాజశేఖరం తెలుసుకుని ఉండేవాడు.అలాగని అతనికా అదృష్టం లేకపోయిందనడానికీ వీల్లేదు. ఇంటర్నెట్ ఆధారిత బహుళ మాధ్యమాలతో సమాచారవిప్లవం కొత్తపుంతలు తొక్కిందనుకునే ఈ రోజున కూడా చిన్న చిన్న సందేహాలు తీరకుండానే దేహం చాలించే రాజశేఖరాలు ఉంటూనే ఉన్నారు. జ్ఞానతీరానికి ఏ కొంచెమైనా దగ్గరవడానికి ఏ అత్యాధునిక సాధనాలూ సాయపడడం లేదు. పరిమిత జీవితకాలం అతని నిస్సహాయతను ఇప్పటికీ గుర్తుచేసి వెక్కిరిస్తూనే ఉంది. మరోవైపు సమాచార ఉల్బణం నుంచి నిక్కమైన సమాచారానికి బదులు అసత్యాలు, అర్ధసత్యాలు, వక్రీకరణలు పుట్టుకొచ్చి జ్ఞానాన్వేషణను అజ్ఞానాన్వేషణగా మార్చివేశాయి. అలా వ్యాప్తిలోకి వచ్చినదే ‘ఫేక్’ లేదా నకిలీ సమాచారమనే మాట. నేటి రాజశేఖరాలను వేధిస్తున్నది కేవలం సమాచార రాహిత్యం కాదు, నిజమో, అబద్ధమో తెలియని సమాచార సందిగ్ధం. జ్ఞాన, అజ్ఞానాల మధ్య ఆ మాత్రపు అక్షరభేదాన్ని కూడా తుడిచేసి పూర్తి అభేదాన్ని స్థాపించే యుగంలో ఉన్నాం. అదీ విషాదం! -
బుల్డోజర్ సంస్కృతిపై వేటు!
‘చావుకి పెడితే లంఖణానికి వస్తార’ని నానుడి. కొన్నేళ్లుగా ప్రజాస్వామ్యంలో బుల్డోజర్ స్వామ్యాన్ని జొప్పించి మురిసి ముక్కలవుతున్నవారికి సర్వోన్నత న్యాయస్థానం కీలెరిగి వాత పెట్టింది. నేరం రుజువై శిక్షపడిన లేదా నిందితులుగా ముద్రపడినవారి ఆవాసాలను కూల్చటం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. అలాంటి చేష్టలకు పాల్పడే ప్రభుత్వాధికారులు బాధితులకు పరిహారం చెల్లించటంతోపాటు వారి ఇళ్ల పునర్నిర్మాణానికయ్యే మొత్తం వ్యయాన్ని వ్యక్తిగతంగా భరించాల్సి వుంటుందని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ల ధర్మాసనం తేల్చిచెప్పింది. కూల్చివేతలకు ఏ నిబంధనలు పాటించాలో వివరించే మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని ఉల్లంఘించే అధికారులపై కోర్టు ధిక్కార నేరం కింద చర్యలు తీసుకోవటంతోపాటు వ్యాజ్యాలు కూడా మొదలవుతాయని హెచ్చరించింది. ‘ఇళ్లు కూల్చినప్పుడల్లా నిశిరాత్రిలో నడిరోడ్లపై చిన్నా రులూ, ఆడవాళ్లూ విలపిస్తున్న దృశ్యాలు అరాచకానికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఒకప్పుడు అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కొన్ని విధివిధానాలు పాటించేవారు. నోటీసులిచ్చి సంజాయిషీలు తీసుకుని ఆ తర్వాత చర్యలు ప్రారంభించేవారు. కీడు శంకించినవారు న్యాయస్థానాలను ఆశ్రయించటం, వారికి ఊరట దొరకటం కూడా రివాజే. తమకు నచ్చని అభిప్రాయాలున్నా, ఏదో ఉదంతంలో నిందితులుగా ముద్రపడినా వారి ఇళ్లూ, దుకాణాలూ కూల్చే పాపిష్టి సంస్కృతి ఇటీవలి కాలపు జాడ్యం. సినిమా భాషలో చెప్పాలంటే ఇది ‘పాన్ ఇండియా’ సంస్కృతి! దీనికి ఆద్యుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఉత్తర ప్రదేశ్లో నేర సంస్కృతిని అరికట్టడంలో, సంక్షేమ పథకాలు అర్హులకు అందించటంలో ఆయన విజయం సాధించారని బీజేపీ చెబుతుంటుంది. కానీ అంతకన్నా ‘బుల్డోజర్ బాబా’గా పిలిపించుకోవటం యోగికి, అక్కడి బీజేపీకి ఇష్టం. చూస్తుండగానే ఇది అంటువ్యాధిలా పరిణమించింది. మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, కర్ణాటకల్లో బీజేపీ ప్రభుత్వాలు బుల్డోజర్లతో విధ్వంసానికి దిగాయి. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకున్నాక బాబు ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయాలను బుల్డోజర్లతో కూల్చాలని చూసింది. ఒకటి రెండుచోట్ల ఆ పనిచేసింది కూడా. ఇక తమకు వ్యతిరేకంగా పనిచేశారన్న కక్షతో దిక్కూ మొక్కూలేని పేదల ఇళ్లు సైతం ఇదే రీతిలో ధ్వంసం చేసింది. రాజస్థాన్లో 2022లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా బీజేపీ ఏలుబడిలో ఉన్న రాజ్గఢ్ మున్సిపాలిటీ పరిధిలో ఈ దుశ్చర్య చోటు చేసుకుంది. మహారాష్ట్రలో శివసేన–కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి సర్కారు హయాంలో నిందితుల ఇళ్లనూ, దుకాణాలనూ కూల్చారు. కేంద్రం మాటే చెల్లుబాటయ్యే ఢిల్లీలో జహంగీర్పురా ప్రాంతంలో మతఘర్షణలు జరిగినప్పుడు అనేక ఇళ్లూ, దుకాణాలూ నేలమట్టం చేశారు. బాధితులు సుప్రీంకోర్టు ఉత్తర్వులు పొందేలోగానే విధ్వంసకాండ పూర్తయింది. 2020 నుంచి ముమ్మరమైన ఈ విష సంస్కృతిపై సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరిస్తూనే వచ్చింది. ‘నిందితులు మాత్రమే కాదు, శిక్ష పడినవారి ఇళ్లను సైతం కూల్చడానికి లేదు. ఈ విషయంలో చట్టనిబంధనలు పాటించి తీరాలి’ అని స్పష్టం చేసింది. కానీ ఆ చేష్టలు తగ్గిన దాఖలా లేదు. చుట్టూ మూగేవారు ‘ఆహా ఓహో’ అనొచ్చు. అవతలి మతంవారి ఇళ్లు, దుకాణాలు కూలుతున్నాయంటే తన్మయత్వంలో మునిగే వారుండొచ్చు. ఆఖరికి ఇళ్లు కూల్చిన ఉదంతాల్లో పాలుపంచుకున్న అధికారులు విందులు చేసుకున్న ఉదంతాలు కూడా వెల్లడయ్యాయి. కానీ సమాజంలో అరాచకం ప్రబలకూడదన్న ఉద్దేశంతో రాజ్య వ్యవస్థ ఏర్పడినప్పుడూ... రాజ్యాంగమూ, చట్టాలూ ఉన్నప్పుడూ... రాజ్యవ్యవస్థే తోడేలుగా మారితే దిక్కెవరు? సుప్రీంకోర్టు వద్దుగాక వద్దని చెప్పాక కూడా ఈ పోకడ ఆగలేదంటే ఏమను కోవాలి? ఒక వ్యక్తి నిజంగా తప్పు చేశాడనుకున్నా అతని కుటుంబమంతా అందుకు శిక్ష అనుభవించి తీరాలన్న పట్టుదల నియంతృత్వ పోకడ కాదా? సుప్రీంకోర్టు 95 పేజీల్లో ఇచ్చిన తీర్పు ఎన్నో విధాల ప్రామాణికమైనదీ, చిరస్మరణీయమైనదీ. ‘ఇల్లంటే కేవలం ఒక ఆస్తి కాదు... అది కొందరు వ్యక్తుల, కుటుంబాల సమష్టి ఆకాంక్షల వ్యక్తీకరణ. అది వారి భవిష్యత్తు. వారికి స్థిరత్వాన్నీ, భద్రతనూ చేకూరుస్తూ, సమాజంలో గౌరవం తీసుకొచ్చేది. ఇలాంటి ఇంటిని బలవంతంగా తీసుకోవాలంటే ముందుగా ఇతర ప్రత్యామ్నాయాలేవీ లేవని అధికారులు విశ్వసించాలి’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించిన తీరు అమానవీయత నిండిన పాలకులకు ఏమేరకు అర్థమైందో సంశయమే. ఆ మాటెలా వున్నా కఠిన చర్యలుంటాయన్న హెచ్చరిక వారిని నిలువరించే అవకాశం ఉంది. దేశంలో దిక్కూ మొక్కూలేని కోట్లాదిమంది సామాన్యులకు ఊరటనిచ్చే ఈ తీర్పులో హిందీ భాషా కవి ప్రదీప్ లిఖించిన కవితకు కూడా చోటు దక్కింది. దాని సారాంశం – ‘ఇల్లు, పెరడు ప్రతి ఒక్కరి స్వప్నం. ఆ కలను కోల్పోవడానికి సిద్ధపడతారా ఎవరైనా?’ బ్రిటన్ న్యాయకోవిదుడు లార్డ్ డెన్నింగ్ చేసిన వ్యాఖ్యలను కూడా తీర్పులో ఉటంకించారు. ‘రాజ్యా ధికారాన్ని ధిక్కరించి అతి సామాన్యుడు వేసుకున్న గుడిసె చిరుగాలికే వణికేంత బలహీనమైనది కావొచ్చు. ఈదురుగాలికి ఇట్టే ఎగిరిపోవచ్చు. దాన్ని వర్షం ముంచెత్తవచ్చు. కానీ చట్టనిబంధన అనుమతిస్తే తప్ప ఆ శిథిల నిర్మాణం వాకిలిని అతిక్రమించటానికి ఇంగ్లండ్ రాజుకు సైతం అధికారంలేదు’ అని లార్డ్ డెన్నింగ్ అన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చూశాకైనా తమపై ఏ స్థాయిలో విశ్వాసరాహిత్యం ఏర్పడిందో ప్రభుత్వాలు గ్రహించాలి. నీతిగా, నిజాయితీగా, రాజ్యాంగానికి అనుగుణంగా పాలించటం నేర్చుకోవాలి. -
ఓట్ల వేటలో వాగ్దానవర్షం
మహారాష్ట్రలో ఎన్నికల పర్వం ఇప్పుడు కాక పుట్టిస్తోంది. ఈ 20న జరగనున్న ఎన్నికల కోసం ఇటు బీజేపీ సారథ్యంలో అధికార ‘మహాయుతి’ కూటమి, అటు కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్ష ‘మహా వికాస్ ఆఘాడీ’ (ఎంవీఏ)... రెండూ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు వరాల జల్లు కురిపిస్తున్నాయి. దేశంలోని అత్యంత సంపన్న రాష్ట్రంలో ఇప్పుడు ఉచితాల పోరు సాగుతోంది. గృహాలకు 100 యూనిట్ల మేర కరెంట్ ఉచితం, గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఆడపిల్లలకు ఉచిత టీకాకరణ, మహిళా ఉద్యోగులకు ప్రతి నెలా రెండు రోజులు ఋతుక్రమ సెలవుల లాంటి గ్యారెంటీలతో ఎంవీఏ ముందుకొచ్చింది. ఫలితంగా మహాయుతి సైతం మరింత ఎక్కువ వాగ్దానాలు చేయక తప్పలేదు. దాంతో, ఎన్నికల మేనిఫెస్టోలు కలకలం రేపుతున్నాయి. ఖజానాపై భారం రీత్యా పథకాల సాధ్యాసాధ్యాలపై చర్చ మొదలైంది. దేశాభివృద్ధికి ఉచితాల సంస్కృతి ప్రమాదకరమన్న మోదీ సొంతపార్టీ బీజేపీ సైతం ‘మహా’పోరులో ప్రతిపక్షం బాట పట్టక తప్పలేదు. అయితే, వైరిపక్షం వాగ్దానాలు సాధ్యం కావంటూ ప్రతి పార్టీ పక్కవారిపై ఆరోపణలు చేయడమే విడ్డూరం.మహిళలు, రైతులు, విద్యార్థులు – నిరుద్యోగులైన యువతరం, సీనియర్ సిటిజన్లు... ఇలా వివిధ వర్గాలను లక్ష్యంగా చేసుకొని ఇచ్చిన పోటాపోటీ హామీలు అనేకం. సమాజంలోని వెనుక బడిన వర్గాలను పైకి తీసుకురావడానికీ, అవసరంలో ఉన్నవారికి చేయూత అందించడానికీ సంక్షేమ పథకాలను హామీ ఇవ్వడం, వాటిని చిత్తశుద్ధితో అమలు చేయడం తప్పు కాదు, తప్పనిసరి కూడా! అయితే, ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అమలు చేయడానికి వీలే కాని వాటిని హామీ ఇచ్చినప్పుడే అసలు సమస్య. అధికారంలో ఉండగా అవసరార్థులను పట్టించుకోకుండా, తీరా ఎన్నికల వేళ మేని ఫెస్టోలతో మభ్యపెట్టాలనుకోవడం మరీ దారుణం. ఎన్నికల వాగ్దానపత్రాలపై విమర్శలు వస్తున్నది అందుకే. ఆర్థికభారం సంగతి అటుంచితే, స్త్రీలకు తప్పనిసరి ఋతుక్రమ సెలవు లాంటివి పని ప్రదేశాల్లో వారికే ప్రతికూలంగా మారే ప్రమాదముందని జూలైలో సుప్రీమ్ కోర్ట్ అభిప్రాయపడింది. అయినా, ఆ అంశాన్ని పార్టీలు చేపట్టడం విచిత్రమే. పని గంటల్లో వెసులుబాటు, వర్క్ ఫ్రమ్ హోమ్ తదితర ప్రత్యామ్నాయాలను పట్టించుకోకుండా, జపాన్, స్పెయిన్, ఇండొనేసియా లాంటి చోట్ల ఆదరణకు నోచుకోని పద్ధతిని తెస్తామని హామీ ఇవ్వడం ఒకింత ఆశ్చర్యకరం. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే బలమైన ఓటరు వర్గంగా మహిళలు మారిన సంగతిని పార్టీలు గుర్తించాయి. స్త్రీలు స్వీయ నిర్ణయంతో ఓట్లేస్తున్న ధోరణి పెరుగుతోందనీ గ్రహించాయి. అందుకే, 4.5 కోట్ల మంది మహిళా ఓటర్లున్న మహారాష్ట్రలో రెండు కూటములూ వారిని లక్ష్యంగా చేసుకున్నాయి. లడకీ బెహిన్ యోజన కింద ఇస్తున్న నెలవారీ భృతిని పెంచుతామనీ, స్వయం సహాయక బృందాల్లోని మహిళా సభ్యులకు ‘లఖ్పతీ దీదీ’ పథకంతో చేయూతనిచ్చి, 2027 కల్లా 50 లక్షల మందిని లక్షాధికారిణుల్ని చేస్తామనీ ‘మహాయుతి’ మాట. ఎంవీఏ కూటమి ఏమో ‘మహా లక్ష్మి పథకం’ ద్వారా నెలవారీ ఆర్థికసాయం, ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం వగైరా హామీలి స్తోంది. నిజానికి, పశ్చిమ బెంగాల్లో కన్యాశ్రీ, మధ్యప్రదేశ్లో లాడ్లీ బెహనా యోజన... ఇలా రక రకాల పేర్లతో మహాలక్ష్మి పథకం లాంటివి ఇప్పటికే కొన్నిచోట్ల ఉన్నాయి. ఈ తీపి మాటల్ని అటుంచితే,, మహారాష్ట్రలోని 288 స్థానాలకు గాను రెండు కూటముల పక్షాన కలసి ఈ ఎన్నికల్లో 56 మంది మహిళలే బరిలో ఉన్నారు. లెక్కలు తీస్తే, మొత్తం అభ్యర్థుల్లో స్త్రీల సంఖ్య 10 శాతమే. వెరసి, ఆడవారికి ఉచితాలిచ్చి ఓటర్లుగా వాడుకోవడమే తప్ప, చట్టసభల్లో సరైన భాగస్వామ్యం కల్పించడంలో పార్టీలకు ఆసక్తి లేదు. మహిళా రిజర్వేషన్లను పైకి ఆమోదించినా, ఆచరణలో ఇదీ దుఃస్థితి.పార్లమెంట్కు అతిపెద్ద సంఖ్యలో రాజ్యసభ సభ్యుల్ని పంపే రాష్ట్రాల్లో రెండోది అయినందున మహారాష్ట్ర ఎన్నికలను బీజేపీ కీలకంగా భావిస్తోంది. బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేక చట్టం చేస్తామంటూ కాషాయపార్టీ హిందూత్వ కార్డును విసురుతుంటే, ఓబీసీలు గణనీయంగా ఉన్న రాష్ట్రమైనందున కులగణన, ఉద్యోగాల రిజర్వేషన్లలో 50 శాతం పరిమితి ఎత్తివేత లాంటి మాటలతో ఎంవీఏ సామాజిక న్యాయం నినాదాన్ని భుజానికి ఎత్తుకుంది. ఇక, విభజనవాద నినాదాలైన ‘బటేంగే తో కటేంగే’ (హిందువులు విడిపోతే నష్టపోతాం), ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ (కలసివుంటే భద్రంగా ఉంటాం) మధ్య రైతాంగ సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వగైరా అసలు అంశాలు వెనక్కిపోవడమే విషాదం. స్థూలంగా 6 జోన్లయిన మహారాష్ట్రలో ఆర్థికంగా వెనకబడ్డ విదర్భ, మరాఠ్వాడా, ఉత్తర మహా రాష్ట్ర ప్రాంతానికీ – రెండు, మూడు రెట్లు తలసరి ఆదాయం ఎక్కువుండే ముంబయ్, థానే – కొంకణ్, పశ్చిమ మహారాష్ట్రలకూ మధ్య ఆలోచనలో తేడా ఉంటుంది. మొత్తం స్థానాల్లో నాలుగోవంతు పైగా సీట్లలో ఎప్పుడూ హోరాహోరీ పోరే. అలాగే, మూడోవంతు పైగా స్థానాల్లో విజేత మెజారిటీ కన్నా మూడోస్థానంలో నిలిచిన అభ్యర్థి ఓట్ షేర్ ఎక్కువ. కాబట్టి, ఫలితాల అంచనా అంత సులభం కాదు. రాష్ట్రాన్ని పాలించేది ఎవరన్నది ఒక్కటే కాదు... ఉద్ధవ్ ఠాక్రే, శిందే వర్గాలలో ఎవరిది అసలైన శివసేన అన్నదీ ప్రజలు ఈ ఎన్నికల్లో తీర్పునివ్వనున్నారు. వాగ్దానపర్వంలో ఏ పార్టీని ఎంత నమ్మిందీ చెప్పనున్నారు. తక్షణ ఆర్థిక సహాయం పట్ల గ్రామీణ ఓటర్లు ఆకర్షితులయ్యే అవకాశం కనిపిస్తోంది కానీ, వచ్చే ఏడేళ్ళలో రూ. 2.75 లక్షల కోట్ల అప్పు తీర్చాల్సిన రాష్ట్రంలో రేపు ఏ కూటమి అధికారంలోకి వచ్చినా తమ హామీలను అమలు చేయగలుగుతుందా అన్నది ప్రశ్న. -
నయవంచనకు నకలు పత్రం!
దొంగ హామీలతో, వక్రమార్గంలో అయిదు నెలలక్రితం అధికారాన్ని చేజిక్కించుకున్న నాటినుంచీ అనామతు పద్దులతో తప్పించుకు తిరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే కూటమి సర్కారు ‘తప్పనిసరి తద్దినం’లా సోమవారం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఘనమైన అంకెలు చూసి జనం నవ్విపోరా అన్న వెరపు లేకుండా రూ. 2,94,427 కోట్లతో ఈ బడ్జెట్ తీసుకొచ్చారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 2.35 లక్షల కోట్లు, మూలధన వ్యయం రూ. 32,712 కోట్లు, ద్రవ్యలోటు రూ. 68,742 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 34,743 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. మొన్నటి ఎన్నికల్లో భూమ్యా కాశాలను ఏకం చేస్తూ మోత మోగించిన సూపర్ సిక్స్ హామీల జాడ లేకుండా... అంచనా వేస్తున్న పన్ను రాబడి రూ. 24,000 కోట్లూ వచ్చే మార్గమేమిటో చెప్పకుండా ఆద్యంతం లొసుగులు, లోపాలతో బడ్జెట్ తీసుకురావడం బాబు సర్కారుకే చెల్లింది. ఈమాత్రం బడ్జెట్ కోసం అయిదు నెలలు ఎందుకు ఆగాల్సివచ్చిందో కూటమి నేతలే చెప్పాలి. 53.58 లక్షలమంది రైతులకు రూ. 20,000 చొప్పున రూ. 10,716.74 కోట్లు కేటాయించాల్సిన ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి కేవలం వెయ్యి కోట్లు మాత్రమే విదిల్చి రైతు సంక్షేమమే లక్ష్యమంటూ బీరాలు పోవటం... 84 లక్షల మంది విద్యార్థులకు ‘తల్లికి వందనం’ పథకం కింద రూ. 12,600 కోట్లు కావాల్సి వుండగా కేవలం రూ. 5,387.03 కోట్లు కేటాయించి ఊరుకోవటం దుస్సాహసానికి పరాకాష్ఠ.రైతులకు జగన్మోహన్ రెడ్డి హయాంలో విజయవంతంగా అమలైన ఉచిత పంటల బీమా పథకానికి ఈ ఖరీఫ్ సీజన్ తర్వాత మంగళం పాడుతున్నట్టు ప్రభుత్వమే చెప్పింది. ఇక రూ. 3 లక్షల వరకూ సున్నావడ్డీ రాయితీ, డ్రిప్ పరికరాలపై 90 శాతం సబ్సిడీ వగైరాల గురించి ప్రస్తావన లేదు. అలాగే ధరల స్థిరీకరణ నిధికీ, ప్రకృతి వైపరీత్యాల నిధికీ ఇచ్చిందేమీ లేదు! అయినా రైతు సంక్షే మానికి కట్టుబడివున్నారట! పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకూ ప్రతి నెలా రూ. 1,500 చొప్పున ఏడాదికి రూ. 18,000 ఇస్తామని చెప్పిన ‘ఆడబిడ్డ’ నిధికి రూ. 32,400 కోట్లు కేటాయించాల్సి వుండగా ఇచ్చింది సున్నా. ఏడాదిలో ఇంటింటికీ మూడు సిలెండర్లు ఉచితమని ఊదరగొట్టిన పథకం కింద కోటీ 54 లక్షల కుటుంబాల కోసం రూ. 4,000 కోట్లు అవసరం కాగా దానికోసం కేటా యించింది కేవలం రూ. 895 కోట్లు! ఈ అరకొర మొత్తంతో ఇంటికో సిలెండరైనా ఇవ్వగలుగు తారా? లబ్ధిదారుల జాబితాకు అడ్డగోలుగా కోత పెడితే తప్ప ఇది అసాధ్యం. నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3,000 చొప్పున ఏడాదిలో కోటిమందికి మొత్తం రూ. 36,000 కోట్లు కావాల్సి వుండగా దాని ఊసే లేదు! జాబ్ క్యాలెండర్, డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు వగైరాల గురించిన ప్రస్తావన లేదు. అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో రూ. 10 లక్షల వరకూ సబ్సిడీ ఇస్తామని చెప్పిన వాగ్దానానికి సైతం చోటులేదు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి తగినన్ని నిధులు కేటాయిస్తే, చెప్పిన రీతిలో సబ్సిడీ సొమ్ము అందిస్తే ఉద్యోగ కల్పన సాధ్యమవుతుంది. కానీ వీటి గురించి మాట్లాడింది లేదు. ఆ రంగానికి బాబు హయాంలో పెట్టిపోయిన బకాయిలు కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలో సైతం చెల్లించి ఆ పరిశ్రమలకు ఊపిరులూదిన జగన్ సర్కారుకూ, ఈ మాయదారి కూటమి ప్రభుత్వానికీ పోలికెక్కడ! యువతకు ఏటా లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ మాట దేవుడెరుగు – మూడు లక్షలమంది వలంటీర్లకు మంగళం పాడినట్టు బడ్జెట్ అధికారికంగా తేల్చి చెప్పింది. కాపు వర్గానికి సైతం మొండిచెయ్యి చూపారు.‘బడ్జెట్ అంటే అంకెల సముదాయం మాత్రమే కాదు... అది మనం పాటిస్తున్న విలువలు, ఆకాంక్షల వ్యక్తీకరణ’ అని ఒకనాటి అమెరికా ఆర్థిక మంత్రి జాకబ్ ల్యూ ఉవాచ. పీఠంపై పేరాశతో మొన్నటి ఎన్నికల్లో ఎడాపెడా వాగ్దానాలిచ్చినవారి నుంచి విలువలేమి ఆశించగలం? వారికి జనం ఆకాంక్షలెలా అర్థమవుతాయి? అందుకే– వంచనాత్మక విన్యాసాలు ఆగలేదు. బడ్జెట్లో అంకెల గారడీ సరే, బయట పారిశ్రామికవేత్తలతో సైతం బాబు అదే మాదిరి స్వోత్కర్షలకు పోయారు. రానున్న రోజుల్లో ఏకంగా 15 శాతం వృద్ధి రేటు సాధిస్తారట! అవకాశాల కల్పనతో సంపద సృష్టించి, పేదల జీవన ప్రమాణాలు పెంచుతారట!! కూటమి సర్కారు గద్దెనెక్కినప్పటి నుంచీ పన్ను రాబడి మైనస్లోకి పోయిందని సాక్షాత్తూ కాగ్ చెప్పింది. జగన్ సర్కారు హయాంలో మొన్న ఏప్రిల్లో పన్ను రాబడిలో దాదాపు 11 శాతం వృద్ధి నమోదు కాగా, ఆ తర్వాత తగ్గటం సంగతలా వుంచి మైనస్లోకి పోయింది. మే నెలలో –2.8 శాతం, ఆ తర్వాత వరసగా –8.9, –5.3, –1.9, –4.5 శాతాలకు పడిపోయిందని కాగ్ నివేదిక బయటపెట్టింది. వాస్తవం ఇలావుంటే పన్ను రాబడి కింద అదనంగా రూ. 24,000 కోట్లు వస్తాయని బడ్జెట్ నమ్మబలుకుతోంది. అంటే రానున్న కాలంలో అదనపు పన్నుల మోత మోగుతుందన్నమాట!జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి గడచిన అయిదేళ్ళూ సాగించిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. కూటమి నేతలు, వారి వందిమాగధ మీడియా నోటికొచ్చినట్టు రూ. 12 లక్షల కోట్లు, రూ. 14 లక్షల కోట్లు అంటూ తప్పుడు ప్రచారాలు చేశారు. తీరా మొన్న మార్చి 31 నాటికి ఆ అప్పు రూ. 6.46 లక్షల కోట్లని తాజా బడ్జెట్ వెల్లడించింది. ఇందులో గ్యారెంటీల కింద తెచ్చిన అప్పు రూ. 1,54,797 కోట్లనూ తీసేస్తే నికరంగా ఉన్నది రూ. 4.91 లక్షల కోట్లు మాత్రమే! నిజానికి ఈ బడ్జెట్ చదివిన ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ఈ విషయంలో గతంలో తప్పుడు ప్రచారం చేశామని క్షమాపణలు చెప్పాలి. కానీ ఆపాటి నిజాయితీ ఆశించటం అత్యాశే. మొత్తానికి నయవంచనకూ, నేల విడిచిన సాముకూ ఈ బడ్జెట్ అసలు సిసలు ఉదాహరణ. -
నిధులు రావాలి! నిశ్చయం కావాలి!
పర్యావరణ మార్పుల సమస్యపై ప్రపంచ దేశాలు మరోసారి చర్చకు కూర్చున్నాయి. పర్యావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) శిఖరాగ్ర సదస్సు ‘కాప్–29’ అజర్బైజాన్లోని బాకూలో సోమవారం మొదలైంది. బొగ్గు, ముడిచమురు, సహజవాయువుల వినియోగం నుంచి దూరం జర గాలని చరిత్రాత్మక ఒప్పందం కుదిరిన ఏడాది తరువాత జరుగుతున్న ఈ 12 రోజుల మేధామథనం అనేక విధాల ప్రాధాన్యం సంతరించుకుంది. గడచిన 2023, ఆ వెంటనే వర్తమాన 2024... ఇలా వరుసగా రెండో ఏడాది కూడా అత్యధిక వేడిమి నిండిన వత్సరంగా రుజువవుతున్న వేళ జరుగు తున్న సదస్సు ఇది. అలాగే, అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన కొద్ది రోజులకే ఇది జరుగుతోంది. పర్యావరణ సంక్షోభం వట్టి నాటకమన్నది ఆది నుంచి ట్రంప్ వైఖరి కావడంతో మిగతా ప్రపంచమంతా బాకూ వైపు ఆసక్తిగా చూస్తోంది. నిజానికి, ఈ 2024 చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతా నామ సంవత్సరం కానున్నట్లు కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్ లాంటి నివేదికలు సూచిస్తున్నాయి. పారిశ్రామికీకరణ ముందు నాటి కన్నా 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర ఉష్ణోగ్రత ఎక్కువైన తొలి ఏడాదే ఇదే కానుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పర్యవసానంగా కరవు, తుపానులు, వరదలు ప్రపంచమంతటిపై ప్రభావం చూపుతున్నాయి. ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కాప్–29 జరుగుతుండడం గమనార్హం. గమనిస్తే, ప్రపంచ కాలుష్య ఉద్గారాలలో ఇప్పటికే చైనా ప్రథమ స్థానంలో, అమెరికా రెండో స్థానంలో ఉంటే, భారత్ మూడో స్థానంలో నిలిచింది. అయితే, ఈసారి సదస్సుకు అమెరికా, చైనా, భారత్, బ్రిటన్, జర్మనీ, బ్రెజిల్, ఫ్రాన్స్ దేశాల అగ్రనేతలు హాజరు కావడం లేదు. అధ్యక్షుడు బైడెన్ రావట్లేదు. కొత్తగా ఎన్నికైన ట్రంప్ ఎలాగూ రారు. అయితేనేం, అమెరికా ప్రభావం ఈ కాప్–29పై అమితంగా ఉండనుంది. నిరుటి చర్చల్లో చేసుకున్న ప్రధాన వాగ్దానానికి కట్టుబడడంలో అనేక దేశాలు విఫలమయ్యాయి. ఉదాహరణకు, అన్ని దేశాల కన్నా అత్యధికంగా ముడిచమురును ఉత్పత్తి చేస్తున్న అమెరికా తన పద్ధతి మార్చుకోనే లేదు. ఇప్పుడు ట్రంప్ గద్దెనెక్కినందున చమురు ఉత్పత్తి, వినియోగం పెరుగుతుందే తప్ప తగ్గే సూచన లేదు. పర్యావరణ పరిరక్షణ చర్యల నుంచి అమెరికా పూర్తి దూరం జరిగినా జరగవచ్చు. ఇది ప్రమాద ఘంటిక. అగ్ర దేశాలు హాజరు కాకున్నా సమస్య తీవ్రతయితే మారదు. వాతావరణ సంక్షోభ నివారణకు మరిన్ని నిధులవసరం. అందుకే, కాప్–29 కొత్త వాతావరణ పరిరక్షణనిధిని ప్రాధాన్యాంశంగా ఎంచుకుంది. వర్ధమాన దేశాలు తమ ఉద్గారాల సమస్యను దీటుగా ఎదుర్కొని, పెరుగుతున్న వాతావరణ ముప్పును వీలైనంత తగ్గించాలంటే ఆ దేశాలకు తగినంత ఆర్థిక సహాయం అవసరం. అందుకు 100 బిలియన్ డాలర్ల వార్షిక లక్ష్యాన్ని 2009లోనే నిర్ణయించారు. 2020 కల్లా దాన్ని చేరాలని భావించారు. కానీ, అంతకంతకూ పెరుగుతున్న వాతావరణ సంక్షోభ పరిస్థితుల మధ్య ఆ నిధులు ఇప్పుడు ఏ మూలకూ రావు. కాబట్టి, వర్తమాన పరిస్థితులకూ, అవసరాలకూ తగ్గట్టు దాన్ని ఇప్పుడు సవరించుకోవాల్సిన పరిస్థితి. భాగస్వామ్య పక్షాలైన 198 దేశాలకూ వీటో ఉన్న నేపథ్యంలో ఏకాభిప్రాయ సాధన సులభమేమీ కాదు. అలాగే, ఈ మొత్తంలో ఎంత మేర ప్రజాధనం సేకరించా లనేది కూడా కీలక ప్రశ్నే. అనేక దేశాలు ఆర్థిక భారంతో ఉన్న వేళ దీని పైనా అందరి వైఖరీ ఒకేలా లేదు. అయితే, చర్యలు చేపట్టడం ఆలస్యమైన కొద్దీ మరింత భారీగా నిధులు అవసరమవుతాయి. నిధులెంత కావాలన్నదే కాదు... వాటిని ఎలా సేకరించాలి, పర్యావరణ మార్పుల కష్టనష్టాల నుంచి కోలుకొనేందుకు దేశాలకు ఎలా ఆ నిధుల్ని పంచాలి, సంక్షోభ పరిష్కారానికి రూపొందించాల్సిన ఆర్థిక వ్యవస్థ ఏమిటనేది కూడా సదస్సులో కీలక చర్చనీయాంశాలే. పర్యావరణ, ఆర్థిక, మానవ నష్టాలను నిరోధించాలంటే పరిస్థితి చేతులు దాటక ముందే ఉద్గారాల్ని తగ్గించడం కీలకం. వాతావరణ ఉత్పాతాలతో విస్తృతంగా నష్టం, పర్యవసానాలు తప్పవు. నష్టం పెరిగిన కొద్దీ ఆ దేశాల పునరుజ్జీవానికి మరింత ఖర్చవుతుంది. ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న పుడమి పరిస్థితి మరింత క్షీణించకుండా ఉండాలంటే, తక్షణ చర్యలు అవసరం. అభివృద్ధి చెందిన దేశాలు గతంలో కోవిడ్–19 సమయంలో తమ పౌరులకూ, వ్యాపారాలకూ అండగా నిలిచేందుకు 48 నెలల్లోనే దాదాపు 8 లక్షల కోట్ల డాలర్లను అందించి, ఆ సవాలును ఎదుర్కొన్నాయి. అప్పటి కోవిడ్లానే ఇప్పుడీ పర్యావరణ మార్పు సమస్యనూ అంతే అత్యవసరంగా చూడడం ముఖ్యం. ప్రజాధనంతో పాటు ప్రైవేట్ రంగ ఆర్థిక సాయం కూడా లేకుంటే కష్టమని కాప్–29 బాధ్యులు సైతం తెగేసి చెబుతున్నారు. హరిత పర్యావరణ నిధి అంటూ పెట్టినా, సమకూరింది తక్కువే. ఇప్పటికైతే ఏటా కనీసం లక్ష కోట్ల డాలర్లు అవసరమంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు బాధ్యతను విస్మరించి వ్యవహరిస్తుండడంతో, వర్ధమాన దేశాల స్వచ్ఛ అభివృద్ధి, దారిద్య్ర నిర్మూలనకు గండి పడుతోంది. అసలు ఆ నిధుల్లోనూ 60 శాతం పైగా రుణాలైతే, 30 శాతం పైగా ఈక్విటీలు. కేవలం 5 శాతమే గ్రాంట్లు. అసలే కునారిల్లుతున్న అనేక పేద దేశాలకు ఇది మోయలేని భారమే. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని, కాప్–29 చర్చించడం ముఖ్యం. బలమైన ఆర్థికవ్యవస్థగా రూపొందుతున్న భారత్ సైతం చొరవ తీసుకోవాలి. హరిత ఇంధన టెక్నాలజీ, పరిశోధన – అభివృద్ధి, తక్కువ ఖర్చు పరిష్కారాల వైపు ప్రపంచం దృష్టి సారించేలా చూడాలి. ఏమైనా, గండం గట్టెక్కాలంటే మరిన్ని నిధులు కావాలి. అదీ వేగంగా అందాలి. వనరుల సమీకరణ సాధ్యమేనని చరిత్ర చెబుతోంది గనక, ఇప్పుడిక రాజకీయ కృతనిశ్చయముందా అన్నదే ప్రశ్న. ఈ 12 రోజుల సదస్సులో దానికి సమాధానం స్పష్టం కానుంది. -
సుదీర్ఘ తగువుకు పాక్షిక ఊరట!
షష్టిపూర్తికి చేరువలో ఉన్న ఒక వివాదాస్పద కేసుకు సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం పాక్షికంగా ముగింపు పలికింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవి నుంచి వైదొలగుతున్న చివరి రోజున ఆయన ఆధ్వర్యంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన మెజారిటీ తీర్పు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)కు మైనారిటీ ప్రతిపత్తి అర్హతలేదన్న 1967 నాటి నిర్ణయాన్ని కొట్టేస్తూనే వేరే ధర్మాసనం దాన్ని నిర్ధారించాలని తెలిపింది. గత తీర్పుకు అనుసరించిన విధానం సరికాదని తేల్చింది. బెంచ్లోని ముగ్గురు సభ్యులు అసమ్మతి తీర్పునిచ్చారు. ఒక వివాదాన్ని ఏళ్ల తరబడి అనిశ్చితిలో పడేస్తే నష్టపోయే వర్గాలుంటాయి. ఏళ్లు గడిచేకొద్దీ సమస్య జటిలమవుతుంది కూడా. జేఎన్యూ మాదిరే ఏఎంయూ కూడా వివాదాల్లో నానుతూ ఉంటుంది. 2014లో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక ఇవి మరింత పెరిగాయి. చిత్రమేమంటే ఈ రెండు యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైనవారిలో చాలామంది సివిల్ సర్వీసులకూ, ఇతర ఉన్నత స్థాయి ఉద్యోగాలకూ ఎంపికవుతుంటారు. పార్టీల్లో, ప్రభుత్వాల్లో, బహుళజాతి సంస్థల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుంటారు. ఏఎంయూది ఒక విషాద చరిత్ర. సమస్యలు కూడా భిన్నమైనవి. సర్ సయ్యద్ మహ్మద్ ఖాన్ అనే విద్యావంతుడు మదర్సాల్లో కేవలం ఇస్లామిక్ విలువల విద్య మాత్రమే లభించటంవల్ల ఆ మతస్తులు అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారని భావించి వాటితోపాటు ఆధునిక విద్యాబోధన ఉండేలా 1877లో స్థాపించిన ఓరియంటల్ కళాశాల ఆరంభంలో ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. మౌల్వీలనుంచీ, మదర్సాలనుంచీ సర్ సయ్యద్కు ప్రతిఘటన తప్పలేదు. ఆధునిక విద్యనందిస్తే పిల్లల మనసులు కలుషితమవుతాయన్న హెచ్చరిక లొచ్చాయి. అన్నిటినీ దృఢచిత్తంతో ఎదుర్కొని ఆధునిక దృక్పథంతో ఏర్పాటు చేసిన ఈ ఉన్నత విద్యాసంస్థపై 147 ఏళ్లు గడిచాక మత ముద్ర పడటం, దాన్నొక సాధారణ వర్సిటీగా పరిగణించా లన్న డిమాండు రావటం ఒక వైచిత్రి. చరిత్ర ఎప్పుడూ వర్తమాన అవసరాలకు అనుగుణంగా కొత్త రూపు తీసుకుంటుంది. అందు వల్లే కావొచ్చు... ఏఎంయూ చుట్టూ ఇన్ని వివాదాలు! 1920లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఓరియంటల్ కళాశాలనూ, ఆ ప్రాంతంలోనే ఉన్న ముస్లిం యూనివర్సిటీ అసోసియేషన్ సంస్థనూ విలీనం చేసి 1920లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని ఏర్పాటుచేసింది. ఆ చట్టంలోని 23వ నిబంధన యూనివర్సిటీ పాలకమండలిలో కేవలం ముస్లింలకు మాత్రమే చోటీయాలని నిర్దేశిస్తోంది. అయితే ముస్లిం విద్యార్థులను మాత్రమే చేర్చుకోవాలన్న నిబంధన లేదు. స్వాతంత్య్రానంతరం 1951లో ఆ చట్టానికి తెచ్చిన రెండు సవరణలు మతపరమైన బోధననూ, పాలకమండలిలో ముస్లింలు మాత్రమే ఉండాలన్న నిబంధననూ రద్దుచేశాయి. ఈ చర్య రాజ్యాంగంలోని 30వ అధికరణతోపాటు మత, సాంస్కృతిక, ఆస్తి అంశాల్లో పూచీపడుతున్న ప్రాథమిక హక్కులను ఉల్లంఘించటమేనంటూ పిటి షన్ దాఖలైంది. అయితే ఆ సవరణలు చెల్లుతాయని 1967లో సుప్రీంకోర్టు అయిదుగురు సభ్యుల బెంచ్ వెలువరించిన తీర్పే ప్రస్తుత వివాదానికి మూలం. వర్సిటీ స్థాపించిందీ, దాన్ని నిర్వహిస్తు న్నదీ ముస్లింలు కాదని ఆ తీర్పు అభిప్రాయపడింది. అయితే అలా మారటం వెనక ముస్లిం పెద్దల కృషి ఉన్నదని అంగీకరించింది. ప్రభుత్వం స్థాపించిన వర్సిటీకి మైనారిటీ ప్రతిపత్తి ఎలా వస్తుందని ప్రశ్నించింది. ఈ తీర్పును వమ్ముచేస్తూ 1981లో ప్రభుత్వం ఏఎంయూ చట్టానికి సవరణలు తెచ్చింది. తిరిగి మైనారిటీ ప్రతిపత్తినిచ్చింది. దాంతో మెడికల్ పీజీలో 50 శాతం సీట్లను ముస్లింలకు కేటాయించాలని పాలకమండలి 2005లో నిర్ణయించింది. దాన్ని అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. నాటి యూపీఏ సర్కారు, పాలకమండలి 2006లో దాఖలు చేసిన అప్పీళ్లను సుప్రీంకోర్టు స్వీకరించినా రిజర్వేషన్ల విధానంపై స్టే విధించింది. ఆనాటినుంచీ అనాథగా పడివున్న ఆ కేసు నిరుడు అక్టో బర్లో జస్టిస్ చంద్రచూడ్ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయటంతో ముందుకు కదిలింది. అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 30వ అధికరణను పరిమితార్థంలో చూసిందనీ, యాంత్రికంగా అన్వయించిందనీ తాజా మెజారిటీ తీర్పు అభిప్రాయపడింది. ఏఎంయూ స్థాపన నేపథ్యం, పరిస్థితులు పరిగణనలోకి తీసుకోవాలి తప్ప తర్వాతకాలంలో వచ్చిన చట్టాన్ని కాదని తెలిపింది. ఈ తీర్పుతో విభేదించిన ముగ్గురు న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలు కూడా ప్రాధాన్యత గలవే. ఇద్దరు సభ్యుల డివిజన్ బెంచ్ అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పుపై మరో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు ఎలా సిఫార్సు చేస్తుందని వారి ప్రశ్న. కేశవానంద భారతి కేసులో 1973 నాటి ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ తీర్పుపై 15 మందితో ధర్మాసనం ఏర్పాటు చేయమని రేపన్నరోజు మరో బెంచ్ ఆదేశిస్తే పరిస్థితేమిటని నిలదీశారు. ఏదేమైనా ఆలస్యమైనకొద్దీ సమస్య ఎంత జటిలమవుతుందో చెప్పటానికి ఏఎంయూ కేసే ఉదాహరణ. ఈ వర్సిటీ స్థలదాత జాట్ రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ అని హిందూ సంస్థలూ... ఆయన నెలకు రూ. 2కు 1929లో లీజుకు మాత్రమే ఇచ్చారని ముస్లింలూ రోడ్డుకెక్కారు. హిందువు ఇచ్చిన స్థలమై నప్పుడు దానికి మైనారిటీ ప్రతిపత్తేమిటన్న ప్రశ్న తలెత్తింది. మైనారిటీ సంస్థలో చదువుకుని ఎదిగి నందుకు కృతజ్ఞతగా లీజుకిచ్చారని, అలా ఇచ్చిన వందమందిలో ఆయనొకరని అవతలి పక్షం వాదించింది. మొత్తానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వల్ల మహేంద్ర పేరిట అక్కడే మరో వర్సిటీ ఏర్పాటైంది. రాజ్యాంగ ధర్మాసనం సూచించిన విధంగా ఏఎంయూ ప్రతిపత్తిపై మరో బెంచ్ ఏర్పాటై తీర్పు వస్తే ప్రస్తుత అనిశ్చితికి తెరపడుతుంది. -
లక్ష్య సాధన కోరుతున్న చిత్తశుద్ధి
కొన్ని నివేదికలు, గణాంకాలు పాలకులైనా, ప్రజలకైనా గట్టి మేలుకొలుపులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల విడుదల చేసిన ‘ప్రపంచ క్షయవ్యాధి (టీబీ) నివేదిక’ అలాంటిదే. ప్రపంచవ్యాప్త టీబీ కేసుల్లో 26 శాతం భారత్లోనే ఉన్నాయట! ఒక్క గడచిన 2023లోనే మన దేశంలో 25.5 లక్షల కొత్త టీబీ కేసులు నమోదయ్యాయి. 1960లలో టీబీపై నియంత్రణకు ఉపక్రమించినప్పటి నుంచి ఇప్పటి దాకా ఇది అత్యధికం. ఇది మన మత్తు వదిలించే మాట. దానికి తోడు పలు ఔషధాలకు లొంగకుండా తయారైన టీబీ (మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ – ఎండీఆర్ టీబీ) సరికొత్త ప్రజారోగ్య సంక్షోభంగా తయారైంది. ఆ కేసులూ మన దేశంలోనే ఎక్కువన్న సంగతి ఆందోళన కలిగిస్తోంది. పేరుకు 85 శాతానికి పైగా టీబీ రోగులకు చికిత్స చేరువైనా, ఖరీదైన మందులతో సామాన్యుల ఇల్లు, ఒళ్ళు గుల్లవుతున్నాయి. దాదాపు 20 శాతం మంది రోగులు తమ వార్షికా దాయంలో 20 శాతం పైగా ఈ చికిత్సకే ఖర్చు చేస్తున్నారట. దీనికి తోడు కొన్నేళ్ళుగా టీబీ నియంత్రణ నిధులు కూడా 13 లక్షల డాలర్ల మేర తగ్గడం శోచనీయం. ఈ చేదు నిజాలన్నీ అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని మన ప్రభుత్వాలకు గుర్తు చేస్తున్నాయి. గడచిన 2023 లెక్కల ప్రకారం భారత్లో దాదాపు 27 లక్షల టీబీ కేసులున్నట్టు అంచనా. వాటిలో 25.1 లక్షల మంది రోగులు మందులు వాడుతున్నారు. అలా చూస్తే టీబీ సోకినవారిలో నూటికి 85 మందికి పైగా చికిత్స పొందుతూ ఉండడం చెప్పుకోదగ్గ విషయమే. నిరుడు అత్యధిక కేసులు నమోదైన సంగతి పక్కన పెడితే... గత ఎనిమిదేళ్ళలో భారత్లో టీబీ కేసులు 18 శాతం తగ్గినట్టు డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా 8 శాతం మేర కేసులు తగ్గితే, భారత్లో అంతకు రెట్టింపు కన్నా ఎక్కువగా కేసులు తగ్గాయట. సంతోషకరమే. కానీ, అది సరిపోతుందా అన్నది ప్రశ్న. 2025 నాటి కల్లా దేశంలో టీబీ లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్ అనుకున్నది సాధించాలంటే ఇది సరిపోదన్నది నిపుణులు తేల్చిచెబుతున్న నిష్ఠురసత్యం. వ్యాధి నిర్ధారణ పరీక్షల వసతుల్ని మరింత మెరుగుపరచడమే కాక, నిధుల కొరతను తీర్చడం, మరింత మందికి చికిత్స అందించడం లాంటివి చేసినప్పుడే టీబీ నిర్మూలన లక్ష్యం వైపు అడుగులు వేయగలం. ఈ వ్యాధిని కేవలం ఆరోగ్య సమస్యగానే చూడలేం. దారిద్య్రం, పౌష్టికాహార లోపం, అంతంత మాత్రపు ఆరోగ్య వసతులు లాంటి సామాజిక – ఆర్థిక కారణాలూ ఇది ముదరడానికి కారణమని విస్మరించలేం. నిజానికి, గత ఆరు దశాబ్దాల కాలంలో మన దేశంలో టీబీ నిర్మూలన కార్యక్రమం కింద లబ్ధి పొందిన రోగుల సంఖ్య తక్కువేమీ కాదు. ఆ సంఖ్య పెరుగుతోంది. అయితే, ఆర్థికంగా బాగా వెనుక బడినవారికి అందుతున్న సాయం ఇప్పటికీ అంతంత మాత్రమే. టీబీ సోకినవారిలో అయిదోవంతు కన్నా ఎక్కువ మందికి సాయం అందడం లేదని ప్రభుత్వ గణాంకాలే ఒప్పుకుంటున్నాయి. అంత కన్నా విషాదం ఏమిటంటే, టీబీ నిర్మూలన లక్ష్యం గురించి పైకి గొప్పగా చెబుతున్నా, తీరా ఆచ రణలో అందుకు కేటాయించాల్సిన నిధుల్ని గణనీయంగా తగ్గించేస్తూ ఉండడం. లెక్క తీస్తే, 2019లో మన దేశంలో ఈ నిర్మూలన కార్యక్రమానికి 43.26 కోట్ల డాలర్ల కేటాయింపులు ఉండేవి. తీరా గడచిన 2023కు వచ్చేసరికి ఆ నిధుల మొత్తాన్ని 30.28 కోట్ల డాలర్లకు తగ్గించేశారు. ఆలోచనకూ, ఆచరణకూ మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది అచ్చంగా ‘దుత్తలో కూడు దుత్తలోనే ఉండాలి. చంకలో పిల్లాడు మాత్రం దుడ్డులా ఉండాల’న్నట్టుగా ఉంది. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలంటున్నది అందుకే. పైగా, కరోనా అనంతరం, గత ఏడాది ఒక్కసారిగా అన్ని కొత్త టీబీ కేసులు ఎందుకు నమోదయ్యాయో లోతుగా అధ్యయనం చేయాలి. టీబీని నిర్మూలన లక్ష్యం గొప్పదే అయినా అందుకు సవాళ్ళూ అనేకం. ప్రభుత్వం అందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. కృతనిశ్చయంతో ఉన్నా ప్రజల్లో ఈ వ్యాధిపై తగినంత చైతన్యం తీసుకు రాలేకపోతున్నారు. మనకున్న వైద్య వసతులూ అంతంత మాత్రమే. ఇక, పౌష్టికాహార లోపం సైతం టీబీ నిర్మూలనకు పెను అవరోధంగా మారింది. కేవలం పౌష్టికాహార లోపం వల్లనే ఏటా వయోజ నుల్లో 35 నుంచి 45 శాతం మేర కొత్త టీబీ కేసులు వస్తున్నాయని నిరుడు ‘లాన్సెట్’ నివేదిక ఒకటి స్పష్టం చేయడం గమనార్హం. అలాగే, సరిగ్గా మందులు వాడకపోవడం వల్ల కీలక ఔషధాలకు పని చేయకుండా పోయిన ఎండీఆర్–టీబీ కేసుల్లోనూ కేవలం 44 శాతమే తగిన చికిత్సకు నోచుకుంటున్నాయి. అదీ మరింత ఖరీదైన, విషతుల్యమైన వాటిని దీర్ఘకాలం వాడాల్సిన అగత్యం ఏర్పడుతోంది. ఈ సవాళ్ళను అధిగమించడానికి చర్యలు చేపట్టడం అవసరం. అందుకు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, కొత్తగా ఆలోచించక తప్పదు. సరికొత్త వైద్యవిధానాల్ని ఆశ్రయించడమూ ముఖ్యమే.ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాన్ని టీబీ రోగులకు, మరీ ముఖ్యంగా ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నవారికి వర్తించేలా చేయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇది మంచి సూచనే. దేశంలో టీబీ నిర్మూలనకు ఇది దీర్ఘకాలంలో బాగా ఉపకరించే ఆలోచన. రోగుల విషయంలో వ్యక్తి కేంద్రితంగా సమగ్ర వైఖరిని అవలంబించాలని శాస్త్రవేత్తలు చెబుతున్న మాటకు చెవి ఒగ్గాలి. అలాగే, ఫార్మసీ రంగాన్ని పెద్ద ఆదాయ వనరుగా చూస్తున్న పాలకులు వైద్య, ఆరోగ్య రంగంలో కీలకమైన పరిశోధనలకూ, కొత్త ఔషధాలు, చికిత్సలకూ ఏపాటి ప్రోత్సాహమిస్తున్నారు? గణనీయంగా నిధులు కేటాయించి, సమన్వయంతో కృషి చేస్తేనే మన దేశంలో టీబీ నివారణ అయినా, నిర్మూలనైనా సాధ్యమవుతుంది. మానవాళిని పట్టిపీడిస్తున్న ప్రాణాంతక వ్యాధులను సమర్థంగా ఎదుర్కోవాలంటే,ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా నిలబడడమే మార్గం. -
ట్రంప్కే అమెరికా పట్టం
అంచనాలను మించిన విజయం ఇది. హోరాహోరీ పోరన్న సర్వేల జోస్యాన్ని తలకిందులు చేసిన ఫలితం ఇది. నవంబర్ 5 జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇటు పాపులర్ ఓటులోనూ, అటు ఎలక్టోరల్ ఓటులోనూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ తిరుగులేని ఆధిక్యం సంపాదించారు. ప్రత్యర్థి, డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్కు అందనంత దూరంలో నిలిచి, అమెరికా 47వ అధ్యక్షుడిగా పీఠం ఖరారు చేసుకున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి మరింత సమయం పట్టనున్నప్పటికీ, ఇప్పటికే ఎలక్టోరల్ కాలేజ్లో కావాల్సిన 270 సీట్ల మెజారిటీని ఆయన దాటేశారు. పన్ను తగ్గింపు సహా ప్రజాకర్షక వాగ్దానాలు, కట్టుదిట్టమెన వాణిజ్య షరతుల విధానం, వలసదారులకు అడ్డుకట్ట లాంటి వాటితో అమెరికాను మళ్ళీ అగ్రస్థానానికి తీసుకువెళతానన్న ట్రంప్ మాటలను అమెరికన్లు విశ్వసించారు. అందుకే, గడచిన రెండు అధ్యక్ష ఎన్నికల్లోనూ ఫలితాన్ని హైజాక్ చేశారంటూ గెలిచిన పార్టీపై ఓడిన పార్టీ చేస్తూ వచ్చిన ఆరోపణలకు ఈసారి తావివ్వకుండా అఖండ విజయం అందించారు. ఇక, తమిళనాడుతో బంధమున్న కమల గెలవకున్నా, తెలుగు మూలాలున్న మనమ్మాయి ఉష భర్త జె.డి. వాన్స్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికవడం భారతీయులకు ఊరట నిచ్చింది. రెండుసార్లు అభిశంసనకు గురై, అనేక క్రిమినల్ కేసులను ఎదుర్కొంటూ, ఒక దశలో అధ్యక్ష పదవికి పోటీ చేయడానికీ అనర్హులవుతారనే ప్రచారం నుంచి పైకి లేచి, 900 పైగా ర్యాలీలతో తమ పార్టీకి తిరుగులేని విజయం కట్టబెట్టడం ట్రంప్ సృష్టించిన చరిత్ర. అలాగే, ఎప్పుడూ డెమోక్రాటిక్ పార్టీకే మద్దతుగా నిలిచే మైనారిటీ ఓటర్లను పెద్ద సంఖ్యలో ఆకర్షించి, అమెరికా దేశీయ రాజకీ యాల్లో కొత్త రాజకీయ పునరేకీకరణకు ఆయన శ్రీకారం చుట్టారు. ఎప్పుడూ డెమోక్రాట్లకు మద్దతుగా నిలుస్తూ వచ్చిన భారతీయ అమెరికన్లు సైతం ఈసారి ఎక్కువగా రిపబ్లికన్ల వైపే మొగ్గడం విశేషం. పీడిస్తున్న ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిరుద్యోగం నుంచి ట్రంప్ బయట పడేస్తారనే ప్రజా భావన కలిసొచ్చింది. ఎన్నికల ప్రచారంలో జరిగిన హత్యాయత్నాల సానుభూతి సరే సరి. ఇలాంటివన్నీ ట్రంప్కు అనుకూలించి, కమల అధ్యక్ష పదవి ఆశలను తలకిందులు చేశాయి. ఉదారవాదులు ఎంత వ్యతిరేకించినా విజయం ట్రంప్నే వరించింది. మహిళల అబార్షన్ హక్కుకు అనుకూలంగా కమల నిలబడడంతో స్త్రీలు ఆమెకు బ్రహ్మరథం పడతారని భావించారు. అది కొంతమేర జరిగింది కానీ, అధ్యక్ష పదవి అందుకోవడానికి అదొక్కటే సరిపోలేదు. శ్వేత మహిళల్లో గతంతో పోలిస్తే కమలకు కొంత మద్దతు పెరిగింది. అయితే, ఆఖరికి ఆ వర్గంలోనూ ట్రంప్కే అధికశాతం ఓట్లు పడ్డాయి. మొత్తం మీద పురుషుల్లో అధికంగా ట్రంప్కూ, మహిళల్లో ఎక్కువగా కమలకూ ఓటు చేశారని తొలి లెక్క. మహిళా నేత ఏలుబడికి అమెరికా సమాజం ఇప్పటికీ సిద్ధంగా లేదనీ, గతంలో హిల్లరీ క్లింటన్కైనా, ఇప్పుడు కమలకైనా ఎన్నికల ఫలితాల్లో ఈ లింగ దుర్విచక్షణ తప్పలేదనీ వినిపిస్తున్నది అందుకే. ఇక, గతంలో పెద్దగా ఓటింగ్లో పాల్గొనరని పేరున్న యువ, పురుష ఓటర్ల వర్గం ఈసారి పెద్దయెత్తున వచ్చి ఓటేయడం,ముఖ్యంగా శ్వేత జాతీయుల్లో అత్యధికులు ట్రంప్కే పట్టం కట్టడం గమనార్హం. ఒక్క నల్ల జాతీ యుల్లో మాత్రమే 78 శాతం మంది పురుషులు, 92 శాతం మంది స్త్రీలు కమలకు ఓటేశారు. అమె రికన్ సమాజంలోని కనిపించని నిట్టనిలువు చీలిక, వర్ణవిచక్షణకు ఇది ప్రతిబింబమని ఓ వాదన. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికవడం, సెనేట్లో రిపబ్లికన్ పార్టీ పూర్తి నియంత్రణ సాధించడం అమెరికా రాజకీయాల్లో అతి పెద్ద మలుపు. 2016లో తెలియకున్నా ఇప్పుడు మళ్ళీ పట్టం కడుతున్నప్పుడు ఆయన వ్యవహారశైలి సహా అన్నీ తెలిసే అమెరికన్లు ఆ నిర్ణయం తీసు కున్నారు. ఇప్పుడిక సెనేట్పై పట్టుతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రజాస్వామ్యయుతంగా ప్రపంచానికి కట్టుబడిన అగ్రరాజ్య విధానం నుంచి పూర్తి భిన్నంగా అమెరికాను ట్రంప్ కొత్త మార్గం పట్టిస్తారని ఒక విశ్లేషణ. అమెరికా జాతీయ ప్రయోజనాల దృక్కోణం నుంచే ప్రపంచాన్ని చూడడం ట్రంప్ పద్ధతి. వాణిజ్య ప్రయోజనాలే గీటురాయిగా ఆయన ముందుకు సాగవచ్చు. అలాగే, ఉక్రెయిన్కు సైనిక సాయం ఆపి, ఆక్రమణ జరిపిన రష్యాతో శాంతి చర్చలు జరపాలన్న ట్రంప్ వైఖరి పర్యవసానం యూరప్ అంతటా ఉంటుందని అక్కడి దేశాలు బెంగపడుతున్నాయి.భారత్కు సంబంధించినంత వరకు ట్రంప్ ఎన్నిక శుభవార్తే. నిజానికి, ప్రస్తుత డెమోక్రాట్ల హయాంలోనూ అమెరికా – భారత సంబంధాలు బాగున్నాయి. అయితే, భారత ప్రధాని మోదీతో ట్రంప్ చిరకాల మైత్రి వల్ల రానున్న రిపబ్లికన్ ప్రభుత్వ ఏలుబడి మనకు మరింత సానుకూలంగా ఉంటుందని ఆశ, అంచనా. ఇతర దేశాల సంగతికొస్తే... ట్రంప్ ఎన్నిక ఇరాన్, బంగ్లాదేశ్ లాంటి వాటికి కష్టాలు తెస్తే, ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహూ లాంటి వారికి ఆనందదాయకం. కమల గద్దెనెక్కితే బాగుండనుకున్న చైనా, ఉక్రెయిన్ల ఆశ నెరవేర లేదు. అమెరికాలోని దాదాపు 1.1 కోట్ల మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపుతానంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ట్రంప్ రానున్న జనవరిలో అధికారం చేపడుతూనే ఆ ఆపరేషన్ను ప్రారంభించనున్నట్టు ఆయన అధికార ప్రతినిధులు బుధవారమే తేల్చేశారు. అంటే, ఆది నుంచి ట్రంప్ దూకుడు చూపనున్నారన్న మాట. అంతర్జాతీయ సంబంధాలు, ప్రపంచ అధికార క్రమాన్నే మార్చేయాలని చూస్తున్న ఆయన ధోరణి అమెరికానూ, మిగతా ప్రపంచాన్నీ ఎటు తీసుకువెళుతుందో వేచి చూడాలి. సమస్యల్ని పరిష్కరి స్తానంటూ ఎన్నికల నినాదం చేసిన ట్రంప్ కొత్తవి సృష్టిస్తే మాత్రం కష్టమే! -
ఆగని ఆగడాలు
ఎంత గట్టిగా చెప్పినా, ఎన్నిసార్లు నిరసన తెలిపినా భారత్కూ, భారతీయులకూ వ్యతిరేకంగా కెనడాలో ఆగడాలు ఆగడం లేదు. ఈ ఉత్తర అమెరికా దేశంలో ఆదివారం జరిగిన సంఘటనలు అందుకు తాజా నిదర్శనం. టొరంటోకి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోని బ్రాంప్టన్లో హిందూ సభ ఆలయం వద్ద పసుపుపచ్చ ఖలిస్తానీ జెండాలు ధరించిన మూకలు హిందూ భక్తులతో, భారతదేశ జెండాలు ధరించినవారితో ఘర్షణకు దిగి, దాడి చేసిన ఘటన ముక్తకంఠంతో ఖండించాల్సిన విషయం. భారత దౌత్యాధికారులు ప్రార్థనా మందిరాన్ని సందర్శిస్తున్నప్పుడు జరిగిన ఈ వ్యవహారాన్ని భారత్ తీవ్రంగా పరిగణించింది. మన ప్రధాని, విదేశాంగ మంత్రి తమ నిరసనను కటువుగానే తెలిపారు. ఖలిస్తానీ మద్దతుదారులైన 25 మంది ఎంపీల అండతో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఘటన ఖండించాల్సి వచ్చింది. అయితే, సాక్షాత్తూ ట్రూడో ప్రాతినిధ్యం వహిస్తున్న లిబరల్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు చంద్ర ఆర్య ఇదంతా ఖలిస్తానీ తీవ్రవాదుల పని అనీ, వారు లక్ష్మణ రేఖ దాటారనీ పేర్కొనడంతో సమస్యకు మూలకారణం సర్కారు వారి సొంత వైఖరిలోనే ఉందని కుండబద్దలు కొట్టినట్టయింది. సీనియర్ సిటిజన్లయిన భారతీయ, కెనడియన్లకు లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి స్థానిక హిందూ సభ మందిరంతో కలసి భారత అధికారులు దౌత్య శిబిరం నిర్వహించిన సందర్భంలో తాజా ఘటనలు జరిగాయి. ఇది మరీ దుస్సహం. అటు బ్రాంప్టన్లోని హిందూ సభ మందిరం, ఇటు సర్రీ లోని లక్ష్మీనారాయణ ఆలయం వద్ద జరిగిన ఘర్షణల్ని చెదురుమదురు ఘటనలు అనుకోలేం. భారత, హిందూ ధర్మ వ్యతిరేక ధోరణితో హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని అల్లరి మూకలు కొన్నేళ్ళుగా దౌర్జన్యాలకు దిగుతున్న వార్తలు తరచూ వింటూనే ఉన్నాం. భారత్కు వ్యతి రేకంగా, ఖలిస్తాన్కు అనుకూలంగా మందిరాల వద్ద గోడలపై రాతలు రాస్తున్న వైనం మీడియాలో చూస్తూనే ఉన్నాం. కెనడాతో భారత్ తన నిరసన తెలిపి, అక్కడి భారతీయులు, ఖలిస్తానీ అనుకూలే తరుల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసినా ఫలితం కనిపించట్లేదు. ట్రూడో సర్కార్ చిత్తశుద్ధి లేమికి ఇది అద్దం పడుతోంది. కెనడాలో ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతధర్మాన్ని స్వేచ్ఛగా, సురక్షితంగా పాటించే హక్కుందని ఆ దేశ ప్రధాని పైకి అంటున్నారు. కానీ లోలోపల సర్కారీఅండ చూసుకొనే ఆ దేశంలో మందిరాలపై ఖలిస్తానీ దాడులు పెరుగుతున్నాయనేది చేదు నిజం. కెనడాలోని పరిణామాలు ఇతరులకేమో కానీ, భారత్కు మాత్రం ఆశ్చర్యకరమేమీ కాదు. నిజం చెప్పాలంటే కొంతకాలంగా, మరీ ముఖ్యంగా గడచిన నాలుగేళ్ళుగా వేర్పాటువాద ఖలిస్తానీ మద్దతుదారులకు కెనడా ఒక కేంద్రంగా తయారైంది. భారత వ్యతిరేకులైన ఈ తీవ్రవాదులకు కెనడా ఆశ్రయం ఇవ్వడమే కాక, వారికి రక్షణగా నిలుస్తోంది. భారత్లో హింస, భయాందోళనల్ని వ్యాపింపజేస్తూ, ఆయుధాలు అందిస్తున్నట్టుగా వీరిలో చాలామందిపై భారత అధికారులు ఇప్పటికే క్రిమినల్ కేసులు పెట్టారు. అయినా సరే, డిజిటల్ మీడియా సహా వివిధ వేదికలపై ఖలిస్తాన్కు మద్దతుగా నిలుస్తూ, భారత వ్యతిరేక ప్రకటనలు చేస్తున్నవారిని కెనడా ప్రభుత్వం ఇంటి అల్లుళ్ళ కన్నా ఎక్కువగా చూసుకుంటోంది. నిజానికి, భారత ప్రభుత్వం కరడుగట్టిన గ్యాంగ్స్టర్లు ఏడుగురి పేర్లను గత ఏడాదే కెనడాకు అందజేసింది. జస్టిన్ ట్రూడో సర్కారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంది. వీటన్నిటి పర్యవసానమే... ఇప్పుడు కెనడాలో హిందువులపై జరుగుతున్న దాడులు. అల్లరి మూకలకు ఆశ్రయం ఇవ్వడం వల్లనే ఇలాంటి హింసాత్మక ఘటనలకు కెనడా నెలవుగా మారిందని ఇప్పుడు ప్రపంచానికి తేటతెల్లమైంది. హిందువులందరూ భారత్కు తిరిగి వెళ్ళిపోవాలని ఖలిస్తానీ గురుపథ్వంత్ సింగ్ పన్నూ గత ఏడాది బాహాటంగానే హెచ్చరించారు. మొన్నటికి మొన్న దీపావళి జరుపుకోరాదనీ బెదిరించారు. బ్రాంప్టన్, వాంకూవర్లలో ఖలిస్తానీ మద్దతుదారులు భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యో దంతాన్ని ఉత్సవంలా చేసుకున్నారు. ఇంత జరుగుతున్నా ట్రూడో సర్కార్ మాటలకే తప్ప చేతలకు దిగలేదు. ఆగడాలను ఆపే ప్రయత్నం చేయనే లేదు. తాజా ఘటనల్లో ఖలిస్తానీ అల్లరి మూకలను ఆపే బదులు కెనడా స్థానిక పోలీసులు మౌనంగా చూస్తూ నిల్చొని, బాధిత హిందూ భక్తులపైనే విరుచుకుపడడం విడ్డూరం. కొందరు పోలీసు ఉద్యోగులు సాధారణ దుస్తుల్లో ఖలిస్తానీ జెండాలతో తిరగడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. రక్షకభటులు ఓ వర్గానికి కొమ్ముకాయడం ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు లేకుండా జరిగే పని కాదు. ఇది భారతీయ కెనడియన్ల భద్రతపై ఆందోళన రేపే అంశం. ట్రూడో అధికారంలోకి వచ్చాక భారత, కెనడా సంబంధాలు అంతకంతకూ క్షీణిస్తూ వస్తున్నా యనేది బహిరంగ రహస్యం. గత ఏడాది కాలంగా సాక్ష్యాధారాలు చూపకుండా భారత్పై కెనడా ఆరోపణలు, మన దేశ ప్రతి విమర్శలు, మొన్న అక్టోబర్లో దౌత్యాధికారుల పరస్పర బహిష్కరణ దాకా అనేక పరిణామాలు సంభవించాయి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ట్రూడో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడానికే మొగ్గు చూపడం చివరకు ద్వైపాక్షిక సంబంధాలు ఇంతగా దెబ్బతినడానికి కారణమవుతోంది. ప్రజాస్వామ్యంలో స్వాతంత్య్రం, భావప్రకటన స్వేచ్ఛ ఉండాల్సిందే కానీ, దాని మాటున తీవ్రవాదుల ఇష్టారాజ్యం సాగనిద్దామనే ధోరణి సరైనది కాదు. ఈ వైఖరి పోనుపోనూ భారత, కెనడా ద్వైపాక్షిక సంబంధాలకే కాదు... చివరకు భవిష్యత్తులో కెనడా సొంత మనుగడకే ముప్పు తేవచ్చు. పాలు పోసి పెంచిన పాము మన ప్రత్యర్థిని మాత్రమే కాటు వేస్తుందనుకోవడం పిచ్చి భ్రమ. ట్రూడో సర్కార్ ఆ సంగతి ఇప్పటికైనా తెలుసుకొంటే మంచిది. -
ఆత్మపరిశీలన అవసరం!
సొంతగడ్డపై చిరకాలంగా భారత క్రికెట్ జట్టు అజేయమైనదనే రికార్డు కుప్పకూలింది. భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ చేతిలో మనవాళ్ళు మొత్తం 3 టెస్టుల్లోనూ ఓటమి పాలయ్యారు. స్వదేశంలో టెస్ట్సిరీస్ను ఇలా 0–3 తేడాతో చేజార్చుకోవడం భారత క్రికెట్చరిత్రలో ఇదే ప్రథమం. కాగా, ఈ సిరీస్ పరాభవంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ర్యాంకింగుల్లో భారత్ అగ్రస్థానం ఆస్ట్రేలియాకు కోల్పోయి, ద్వితీయ స్థానానికి పడిపోయింది. ఆటలో గెలుపోటములు సహజమైనా, ఈ స్థాయి పరాజయం భారత జట్టు అత్యవసరంగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. టీ20ల మోజులో పడి టెస్ట్ క్రికెట్కు అవసరమైన కనీసపాటి సన్నద్ధత అయినా లేకుండానే బరిలోకి దిగిన మన ఆటగాళ్ళ నిర్లక్ష్యాన్ని నిలదీస్తోంది. ఆఖరుసారిగా 2012లో ఇంగ్లండ్కు చెందిన అలస్టయిర్ కుక్ చేతిలో ధోనీ సేన 2–1 తేడాతో టెస్ట్ సిరీస్లో ఓటమి పాలైన తర్వాత గత పుష్కరకాలంగా భారత క్రికెట్ జట్టు స్వదేశంలో ఎన్నడూ మళ్ళీ సిరీస్ను కోల్పోలేదు. భారత జట్టు సారథులు మారుతూ వచ్చినా, 18 టెస్ట్ సిరీస్లలో విజయం మనదే. కివీస్పైనా ఆ ట్రాక్ రికార్డ్ కొనసాగుతుందని అందరూ భావించిన నేపథ్యంలో ఇది ఊహించని ఎదురుదెబ్బ. గత నెలలో బెంగుళూరులో 8 వికెట్ల తేడాతో తొలి టెస్ట్, ఆ వెంటనే పుణేలో 113 పరుగుల తేడాతో మలి టెస్ట్ ఓడిపోయినప్పుడే సిరీస్ చేజారింది. అయితే, ముంబయ్లో జరుగుతున్న ఆఖరి టెస్ట్లోనైనా గెలిచి, భారత జట్టు పరువు నిలుపుకొంటుందని ఆశించారు. చివరకు ఆ ఆశను కూడా వమ్ము చేసి, కివీస్ ముందు మన ఆటగాళ్ళు చేతులెత్తేయడం ఇప్పుడిప్పుడే మర్చిపోలేని ఘోర పరాభవం. ముంబయ్లో 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సైతం ఛేదించలేక ఆదివారం భారత జట్టు 121 పరుగులకే ఆలౌట్ అవడంతో, అవమానకరమైన రీతిలో 0–3 తేడాతో సిరీస్ను పోగొట్టుకోవాల్సి వచ్చింది. కచ్చితంగా ఇది భారత జట్టుకు మేలుకొలుపు. భారత జట్టు వ్యూహరచన లోపాలు కొల్లలు. కివీస్తో బెంగుళూరు టెస్ట్లో టాస్ గెలిచాక మన వాళ్ళు మొదట బ్యాటింగ్ ఎంచుకోవడం అలాంటిదే. బ్యాట్స్మన్ల ఆర్డర్లో అనూహ్య ప్రయోగాల సంగతీ అంతే. ఇక, అవసరం లేకున్నా పుణేలో బంతి సుడులు తిరిగేలా పిచ్ రూపొందించారు. అదీ ప్రత్యర్థి జట్టుకే లాభించింది. కాబట్టి, భారత జట్టులోని మేధాబృందం ఆగి, ఆలోచించాలి. సిరీస్కు ముందు దులీప్ ట్రోఫీలో ఆడాలని చెప్పినా, మరిన్ని వసతుల కోసం అనంతపురం నుంచి బెంగు ళూరుకు వేదిక మార్చినా అగ్రశ్రేణి ఆటగాళ్ళు ముందుకు రాకపోవడం ఘోరం. వారిని అందుకు అనుమతించడం ఒక రకంగా క్రికెట్ బోర్డ్ స్వయంకృతాపరాధమే. దాని పర్యవసానం, సిరీస్ భవిత తొలి టెస్ట్, తొలి ఇన్నింగ్స్లో 46 పరుగుల అత్యల్పస్కోర్కి భారత్ అవుటైనప్పుడే అర్థమైపోయింది. స్పిన్ ఆడడంలో భారత ఆటగాళ్ళు దిట్టలని ప్రతీతి. కానీ, అదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారింది. జట్టులో బెస్ట్ బ్యాట్స్మెన్ అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఇద్దరూ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్లో తరచూ ఔటవుతున్నారనీ, 2021 – 2024 మధ్య సొంత గడ్డపైన స్పిన్ బౌలింగ్లో సాధించిన సగటు పరుగులు 30 మాత్రమేననీ విశ్లేషకులు లెక్కలు తీశారు. అసాధారణ స్పిన్నర్లు కాకున్నా, కివీస్ బౌలర్ల చేతుల్లో భారత ఆటగాళ్ళు టకటకా ఔటవడం చూస్తే, స్పిన్లో మనం మాస్టర్లం కాదని తాజా సిరీస్ ఎత్తిచూపినట్టయింది. అలాగే, ఎర్ర బంతితో ఆడే టెస్ట్లకూ, తెల్ల బంతితో నడిచే టీ20 లకూ మధ్య చాలా తేడా ఉందని ఆటగాళ్ళు గ్రహించాలి. అన్ని బంతులూ ఆడి తీరాలి, పరుగులు చేయాలనే టీ20ల ధోరణితోనే టెస్ట్లు ఆడితే చిక్కులు తప్పవు. 2021లో టెస్ట్ ఓపెనర్గా ఇంగ్లండ్లో సక్సెస్ సాధించిన రోహిత్ మార్చుకున్న టీ20 ధోరణితోనే కివీస్పై ఆడడం వల్ల ఇబ్బంది పడ్డారు. కెప్టెన్గా ఆయనే పరుగులు చేయకపోతే, జట్టు పైన, ఆయన సారథ్యంపైన ఒత్తిడి తప్పదు. గతంలో 2011–12 ఆస్ట్రేలియా పర్యటన భారత జట్టు నుంచి ద్రావిడ్, లక్ష్మణ్ల రిటైర్మెంట్కు దారి తీసింది. చరిత్ర పునరావృతమై, ఇప్పుడు రానున్న టూర్ కోహ్లీ, రోహిత్లకు చివరిది అవుతుందా? చెప్పలేం. అనూహ్యంగా వారిద్దరూ విఫలమైన కివీస్ సిరీస్ పరిస్థితే ఆస్ట్రేలియా టూర్ లోనూ ఎదురైతే, సీనియర్లు రిటైర్ కావాలంటూ ఒత్తిడి పెరుగుతుంది. ఇక, వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపి యన్ షిప్ విషయానికొస్తే, కివీస్ సిరీస్ దెబ్బతో వరల్డ్ టెస్ట్ ర్యాకింగుల్లో మన స్థానం పడిపోయినందున భారత్ ఫైనల్కు చేరడం కష్టమే. ఇంకా చెప్పాలంటే, ఆస్ట్రేలియాను దాని సొంత గడ్డపై 4–0 తేడాతో ఓడిస్తే కానీ, మన ఫైనల్ ఆశ పండదు. ఏ రకంగా చూసినా అసాధ్యమే. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా టూర్లోనైనా మన జట్టు మితిమీరిన ఆలోచనలు, అంచనాలు పక్కనబెట్టి కేవలం ఆడు తున్న టెస్టులపై ఒకదాని వెంట మరొకటిగా దృష్టి పెడితే మేలు. పరిస్థితులు, పిచ్ స్వభావాన్ని బట్టి అప్పటికప్పుడు ఆట తీరును మలుచుకోవాలే తప్ప, ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చి దూకుడు చూపుదామనుకుంటే చిక్కే. మారకపోతే మళ్ళీ కివీస్తో సిరీస్లో లాగా బోర్లా పడక తప్పదు. నిజానికి, భారత్ ఇప్పటికీ మంచి జట్టే. ఆటగాళ్ళలో ప్రతిభకు కొదవ లేదు. అయితే, టాలెంట్ ఎంత ఉన్నా ఆటలో టెంపర్మెంట్ ముఖ్యం. వాటికి తోడు కింద పడినా మళ్ళీ పైకి లేచి సత్తా చాటే చేవ కీలకం. మన జట్టు ఇప్పుడు వీటిని ప్రదర్శించాలి. అందుకోసం తాజా సిరీస్ ఓటమికి కారణాలను ఆత్మపరిశీలన చేసుకోవాలి. భారత క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా 3–0 తేడాతో సిరీస్ను కోల్పోయి, ఈ అధఃపాతాళానికి ఎలా పడిపోయామో స్వీయ విశ్లేషణ జరుపుకోవాలి. టీ20 వరల్డ్ కప్లో విజేతగా నిలిచిన ఆనందాన్ని మర్చిపోక ముందే ఈ పరాజయాన్ని ఎలా కోరి కొని తెచ్చుకున్నామో విశ్లేషించుకోవాలి. ఎంతైనా, పరాజయాలే విజయాలకు మొదటి మెట్టు కదా! -
అజ్ఞాన జ్ఞానం
‘ఆదియందు అక్షరమున్నది’(జాన్ 1:1) అని బైబిల్ వాక్కు. అజ్ఞానం అనాది నుంచి ఉన్నది. సృష్టిలో అజ్ఞానానికి ముందు ఏముందో ఎవరికీ తెలీదు. అజ్ఞానం అమేయమైనది; అజ్ఞానం అప్రమేయమైనది; అజ్ఞానం అనాదినిధనమైనది; అజ్ఞానం అప్రయత్నలబ్ధమైనది; అజ్ఞానం అగాధమైనది; అజ్ఞానం అనంతమైనది; అజ్ఞానం అజరామరమైనది. విచిత్రంగా జ్ఞానాజ్ఞానాల నడుమ ఒక సారూప్యత ఉంది. ఇవి రెండూ అగోచరమైనవే! రెండింటికీ ఒక భేదం కూడా ఉంది. జ్ఞానానికి అవధులు ఉంటాయేమో గాని, అజ్ఞానానికి ఎలాంటి అవధులూ ఉండవు.అజ్ఞానం నుంచి మానవాళికి అప్రయత్నంగా దొరికే ఆస్తి– మూర్ఖత్వం. అజ్ఞానం నుంచి ఉద్భవించడం వల్ల మూర్ఖత్వమూ అనంతమైనదే! ‘అనంతమైనవి రెండే రెండు. ఒకటి: ఈ విశ్వం, రెండు: మనుషుల మూర్ఖత్వం; విశ్వం సంగతి నాకింకా పూర్తిగా తెలీదు’ అన్నాడు ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత అల్బర్ట్ ఐన్స్టీన్. మానవ మూర్ఖత్వానికి గల అనంత తత్త్వం అవగతమయ్యే నాటికి పాపం ఆయన తలపండితుడైపోయాడు. అనంతమైన అజ్ఞాన సాగరాన్ని ఈదులాడి ఒడ్డున పడితే తప్ప జ్ఞానమేమిటో తెలియదు. చాలామందికి అజ్ఞానసాగరంలో ఈదులాడుతూ ఒడ్డునున్న వాళ్ల మీదకు అజ్ఞాన తరంగాలను వెదజల్లుతుంటారు. వాళ్లకదో వేడుక!అజ్ఞానానికి గల అనేక పర్యాయపదాల్లో ‘మాయ’ ఒకటి. ఎవరి అజ్ఞానం వారికి తెలీదు. ఎదుటివారి అజ్ఞానాన్ని గుర్తించడంలో మాత్రం ప్రతి ఒక్కరూ జ్ఞానులే! ప్రవచన ప్రసంగాల్లో అజ్ఞానాన్ని నేరుగా ప్రస్తావిస్తే, శ్రోతల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రవచనకర్తలు అజ్ఞానాన్ని ‘మాయ’ అని సున్నితంగా చెబుతుంటారు. ‘తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మన/ ఛిత్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత’– (4:42) అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి బోధించాడు. అంటే, ‘అజ్ఞానం కలిగిన బుద్ధిలో నిలకడగా ఉన్న ఆత్మ గురించిన సందేహాన్ని జ్ఞానమనే ఖడ్గంతో ఖండించి, తత్త్వజ్ఞానానికి సాధనమైన కర్మయోగాన్ని స్వీకరించు’ అని అర్థం. బుద్ధిలో అజ్ఞానం ఉన్నట్లు శ్రీకృష్ణుడు గుర్తించి చెప్పాడు. కాబట్టి ఆయన జ్ఞాని. అజ్ఞానాన్ని ఖండించడానికి జ్ఞానఖడ్గాన్ని ప్రయోగించాలని ఆయన ఉద్బోధించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడి గీతబోధ విన్న అర్జునుడు మొదలుకొని ఎందరెందరో జ్ఞానఖడ్గానికి పదునుపెట్టి అజ్ఞానాన్ని ఖండిస్తూనే ఉన్నారు. ఖండఖండాల అజ్ఞానం కొన్ని మెదళ్లలోకి చేరి, అఖండంగా పెరిగిపోతుండటమే విడ్డూరం. బహుశా, ఇదే మాయ కావచ్చు!‘ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్’ అని ఇంగ్లిష్ నానుడి. అంటే, అజ్ఞానమే ఆనందమన్నమాట! ఈ నానుడినే కొంత విస్తరిస్తూ, ‘అజ్ఞానమే ఆనందం అంటుంటారు గాని, అజ్ఞానం మన విధికృతం’ అని చెప్పింది అమెరికన్ రచయిత్రి, పాత్రికేయురాలు గేయిల్ లైండ్స్. విధికృతమైన వాటిని ఎవరు మాత్రం తప్పించుకోగలరు? కాబట్టి అజ్ఞానాన్ని కూడా ఎవరూ తప్పించుకోలేరు. అజ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలంటే, జ్ఞానులు ఎంతో ప్రయాసతో ప్రయత్నించవలసి ఉంటుంది. అజ్ఞానులకు ఆ బెడద లేదు. తమకు అప్రయత్నలబ్ధమైన అజ్ఞానానందాన్ని నిక్షేపంగా ఆస్వాదిస్తుంటారు. అజ్ఞానాన్ని గురించి అసలు ఎందుకు తెలుసుకోవాలి? అంటే, జ్ఞానాన్ని పెంచుకోవడానికి అని చెబుతారు చాలామంది. పాపం వాళ్లు చాలా అమాయకులు. అసలు సిసలు ముదురు జ్ఞానులు కొందరు ఉన్నారు. వాళ్లు అజ్ఞానాన్ని గురించి నానా రకాల అధ్యయనాల్లో మునిగి తేలుతూ ఉంటారు. జనబాహుళ్యంలో అజ్ఞాన విస్తరణకు పనికొచ్చే పద్ధతులకు రూపకల్పన చేస్తుంటారు. వాటిని జనాల మీద ప్రయోగిస్తుంటారు. ఇదొక ప్రత్యేక శాస్త్రం. ఇంగ్లిష్లో దీనినే ‘ఆగ్నటాలజీ’ అంటారు. అంటే, అజ్ఞానాధ్యయన శాస్త్రం అన్నమాట! మన దేశంలోని విశ్వవిద్యాలయాలు ఈ శాస్త్రం మీద ఇంకా దృష్టి సారించలేదు గాని, అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లోని పలు విశ్వవిద్యాలయాలు ఈ శాస్త్రం మీద అధ్యయనాలు కొనసాగిస్తున్నాయి. ‘ఆగ్నటాలజీ’ అనే అజ్ఞానాధ్యయన శాస్త్రానికి ఆ పేరుతో పిలవడం ఆలస్యంగా మొదలైంది గాని, అజ్ఞానానికి సంబంధి«ంచిన పరిజ్ఞానం అంతకంటే ముందు నుంచే ఆచరణలో ఉంది. స్కాటిష్ సామాజిక చరిత్రకారుడు అయాన్ బోల్ 1992లో తొలిసారిగా ‘ఆగ్నటాలజీ’ అనే మాటను ప్రయోగించాడు. అమెరికన్ సిగరెట్ తయారీ కంపెనీలు 1969లో ఉద్ధృతంగా చేసిన ప్రచారం ఆగ్నటాలజీకి ఉదాహరణగా నిలుస్తుందని శ్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాబర్ట్ ప్రోక్టర్ తేల్చిచెప్పాడు. కార్పొరేట్ సంస్థల నుంచి రాజకీయ పార్టీల వరకు నానా వర్గాలు ఆగ్నటాలజీ పద్ధతులను ఉపయోగించుకుంటూ, ప్రజల అజ్ఞానానికి జ్ఞాన ఖడ్గాల వల్ల ముప్పు లేకుండా కాపాడుతూ తమ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నాయి.ఇది హైటెక్కు టమారాల యుగం. జ్ఞానం జనాలకు అందుబాటులో లేని సరుకేమీ కాదు. అందుబాటులో ఉన్నంత మాత్రాన జనాలందరూ జ్ఞానాన్ని పొందినట్లు కాదు. ఈ కృత్రిమ మేధ కాలంలో కూడా రాజకీయ, తాత్త్విక అంశాలకు సంబంధించిన జ్ఞానాన్ని జనాలు విశ్వాసాలు, మతాచారాలు, ప్రచారం ద్వారా మాత్రమే పొందుతున్నారు. ఇది విపరీత అజ్ఞాన శకం. పత్రికలు, ప్రసార సాధనాలు, సామాజిక మాధ్యమాలు ఆగ్నటాలజీ ప్రయోగాలకు సాధనాలుగా మారుతున్నాయి. ప్రజలను మాయలో ముంచెత్తుతున్నాయి. ‘మతములన్నియు మాసిపోవును/ జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అన్న గురజాడ ఆశయం ఎక్కడ? అజ్ఞానంపై శాస్త్ర పరిశోధనలు సాగిస్తున్న నేటి పరిస్థితులెక్కడ? -
సిగ్గేస్తున్నది బాబూ!
అది మహారాజాధిరాజ రాజమార్తాండ రాజగండభేరుండ చక్రవర్తులు నివసించదగిన మహాప్రాసాదమట! ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్, హైదరాబాద్లోని ఫలక్నుమా ప్యాలెస్లు దాని ముందు దిగదుడుపట! అంతోటి మహత్తరమైన ప్యాలెస్ను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన నివాసం కోసం నిర్మించుకున్నారట! సామెతలు ఊరికే పుట్టవు. వినేవారు వెర్రివాళ్లయితే చెప్పేవారు చంద్రబాబు అనే నానుడి ఊరికే రాలేదు. చంద్రబాబు ఎప్పుడూ అబద్ధాలే చెబుతారు. ఎందుకంటే నిజం చెబితే ఆయన తల వెయ్యి వక్కలవుతుందనే ముని శాపం ఉన్నదని వైఎస్సార్ విమర్శిస్తుండేవారు. క్లాస్ ఆఫ్ సెవెంటీ ఎయిట్ (’78) బ్యాచ్మేట్స్ కదా! పూర్తి అవగాహనతోనే మాట్లాడి ఉంటారు.రిషికొండలో గత ప్రభుత్వం హయాంలో టూరిజం శాఖ నిర్మించిన భవనాలను శనివారం నాడు చంద్రబాబు సందర్శించారు. ‘ప్రజాస్వామ్యంలో కూడా ఇటువంటి కట్టడాలుంటాయా!’ అంటూ బోలెడంత ఆశ్చర్యాన్ని మీడియా ముందు ఆయన గుమ్మరించారు. ఆ నిర్మాణాలను చూసి దిగ్భ్రాంతికి గురయ్యామని కూడా ఆయన చెప్పారు. ఆయనే చెప్పిన లెక్క ప్రకారం ఆ నిర్మాణాలకయిన ఖర్చు రూ.430 కోట్లు. ఈ భవనాల నిర్మాణాని కంటే ఏడెనిమిదేళ్ల ముందు అమరావతిలో చంద్రబాబు కొన్ని ‘తాత్కాలిక’ భవనాలను నిర్మించారు. అందులో తాత్కాలిక సచివాలయానికే సుమారు వెయ్యి కోట్లు ఖర్చయింది. రిషికొండ నిర్మాణాల కంటే రెండున్నర రెట్లు ఎక్కువ ఖర్చు. ఈ లెక్కన ఆ తాత్కాలిక భవనం అంబర్ ప్యాలెసో, మైసూర్ ప్యాలెసో అయుండాలి.మరి వెయ్యి కోట్ల తాత్కాలిక ప్యాలెస్ను చూసినప్పుడు ఎందుకని దిగ్భ్రాంతి కలుగలేదు? నిర్మాణ సంస్థవారు దిగ్భ్రాంతి కలిగించే హంగూ ఆర్భాటాలను ఇక్కడి నుంచి వేరేచోటుకు తరలించి లెక్క తాత్కాలికంలో రాసేశారా? ఆ లెక్కతో ఏ జూబిలీ హిల్స్ ప్యాలెస్కో నగిషీలు చెక్కారా? ఎందుకని ఆ వెయ్యి కోట్ల తాత్కాలిక భవనం ఏపీ ముఖ్యమంత్రిని నివ్వెరపాటుకు గురి చేయలేకపోయింది? భవనం లోపలికి కూడా వానచినుకులు ప్రవేశించగలిగే వర్ష పారదర్శకత మినహా మరే ప్రత్యేకతా ఈ తాత్కాలిక సచివాలయంలో ప్రజలకు కనిపించలేదు.ముఖ్యమంత్రికి మనస్తాపం కలిగించిన మరో అంశం పర్యావరణ విధ్వంసమట! రుషి పుంగవులు తపస్సు చేసిన రుషికొండను ధ్వంసం చేసి జగన్ సర్కార్ ప్యాలెస్ను కట్టిందట! అసలు రుషికొండకు గుండుకొట్టి పర్యాటకం కోసం ‘హరిత రిసార్ట్స్’ నిర్మించిందే టీడీపీ సర్కార్. పాతబడిన ఆ భవనాలను తొలగించి వాటి స్థానంలో ఈ కొత్త భవనాలను పర్యాటక శాఖ ఆధ్వర్యంలోనే జగన్ సర్కార్ నిర్మించింది. ఈ భవనాలు తాత్కాలికం కాదు. శాశ్వత ప్రభుత్వ భవనాలు. అమరావతిలో ఐకానిక్ భవనాలు నిర్మించాలని చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. అదిగో అటువంటి ఐకానిక్ భవనాన్నే విశాఖలో జగన్ సర్కార్ నిర్మించింది. అమరావతికి లేని హంగు విశాఖకు ఎందుకని ఆయన భావిస్తున్నారేమో!పాత నిర్మాణాల స్థానంలో కొత్తగా ఏయే భవనాలను నిర్మిస్తున్నారో, ఎందుకోసం నిర్మిస్తున్నారో తెలియజేస్తూ 2021లోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు వివరాలు అందజేసింది. కానీ, తెలుగుదేశం, దాని మిత్రపక్షాలు మాత్రం జగన్మోహన్రెడ్డి నివసించడం కోసమే ప్రభుత్వ భవనాన్ని నిర్మిస్తున్నారని ప్రచారం మొదలుపెట్టాయి. ప్రభుత్వ స్థలంలో, ప్రభుత్వ ధనంతో సొంత భవనాన్ని ఎవరైనా ఎట్లా నిర్మించుకుంటారు? కనీస ఇంగిత జ్ఞానం కదా! కానీ, గోబెల్స్ దుష్ప్రచారాలకు ఇంగితంతో పనిలేదు. అవసరార్థం ఏ ప్రచారమైనా చేస్తారు. ఇప్పుడు మళ్లీ ఓ కొత్త అవసరం వచ్చిపడింది. కనుక చంద్రబాబు పనిగట్టుకొని అదే దుష్ప్రచారానికి రంగురంగుల రెక్కలు తొడిగి జనం మీదకు వదిలారు.అలవి కాని హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చారు. ఐదు నెలలు గడిచిపోయాయి. ‘హామీల అమలు ఇంకెప్పుడ’ని పబ్లిక్ వాయిస్ ప్రశ్నించడం మొదలైంది. ఈ వాయిస్ వినిపించగూడదు. అందుకోసం ఇంకెక్కడో ఓ కృత్రిమ వివాదం చిటపటలాడాలి. డైవర్షన్ స్కీమ్ పాహిమాం! అప్పుడెప్పుడో రెండేళ్ల కిందట వైఎస్ విజయమ్మ వాహనానికి జరిగిన ప్రమాదం ఇప్పుడెందుకు వార్తల్లోకి వచ్చింది? తాయెత్తు మహిమ. షర్మిల ఆస్తుల వివాదం ఎందుకొచ్చింది? తిరుపతి లడ్డూలో కల్తీ ఆరోపణలు ఎందుకొచ్చాయి? కృష్ణా వరదల్లో బోట్ల వివాదం ఎందుకు తెరపైకి తెచ్చారు? ఇలాంటివెన్నో తాయెత్తులు, ఎత్తులు ఈ ఐదు మాసాల్లో చూడవలసి వచ్చింది. టాపిక్ డైవర్షనే ఆ తాయెత్తు మంత్రం.పరిపాలన వైఫల్యాలనూ, వాగ్దాన భంగాలనూ ఈ ఎత్తులూ, తాయెత్తులూ ఎంతకాలం కప్పి ఉంచగలవు? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత దారుణమైన శాంతిభద్రతల పరిస్థితి ఎన్నడూ లేదన్న మాట జనం నోట వినబడుతున్నది. వాగ్దానాలు అటక మీద పడుకున్నాయి. నాణ్యమైన విద్యకు, వైద్యానికి పేద వర్గాలను దూరం చేశారు. మహిళా సాధికారత పథకాలను చాపచుట్టేశారు. ఇప్పుడు తాజాగా ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టును బరాజ్ స్థాయికి కుదించాలన్న కేంద్ర ఆదేశాలకు డూడూ బసవన్నలా తలూపి వచ్చారు. ఫలితంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సుదూర స్వప్నంగా మిగిలిపోనున్నది. విశాఖ ఉక్కు భవిష్యత్తు దినదినగండంగా మార్చేస్తున్న కేంద్రం ముందు జోహుకుం అంటున్నారు. అవమాన గాయాలతో ఉత్తరాంధ్ర ప్రజల్లో సెగ రగులుతున్నది. అందుకే విశాఖలో ఈ సరికొత్త డైవర్షన్ తాయెత్తు ప్రయోగం. వెయ్యికోట్లు ఖర్చు పెట్టి నీళ్లుకారే తాత్కాలిక భవనాన్ని నిర్మించిన వ్యక్తి 430 కోట్ల ఖర్చుతో ఐకానిక్ కట్టడాన్ని కడితే ఔరా అని ముక్కున వేలేసుకోవడాన్ని చూసి సిగ్గేస్తున్నది బాబూ! ఏపీలో ముఖ్యమంత్రిగా ఉంటూ హైదరాబాద్ సెవెన్ స్టార్ హోటల్లో కొద్దిరోజులు సకుటుంబ సపరివారంగా గడపడానికి 30 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టిన వ్యక్తి, క్యాంపు కార్యాలయాలకు, వాటి సెక్యూరిటీ ఏర్పాట్లకూ 126 కోట్లు ఖర్చు చేసిన నాయకుని నోట వినిపించిన మాట – రిషికొండలో బాత్ టబ్లకూ, కమోడ్లకూ, ఫ్యాన్లకూ లక్షలు ఖర్చు చేశారని! చచ్చేంత సిగ్గేస్తున్నది బాబూ!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఎట్టకేలకు కదలిక?!
నాలుగేళ్ళ జాప్యం తరువాత ఎట్టకేలకు రథం కదులుతున్నట్టుంది. దేశంలో పదేళ్ళకు ఒకసారి చేయాల్సిన జనగణన ఎలాగైతేనేం వచ్చే 2025లో ముందడుగేసే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర సర్కార్ అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్టు వినిపిస్తోంది. 2026 మార్చి నాటికి ఆ గణాంకాలు అందుబాటులోకి వస్తాయట. 2011 తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకు జరగనున్న ఈ జనగణన, అది అందించే సమాచారం విధానపరమైన నిర్ణయాలు తీసుకొనేందుకు కీలకం. అందుకే, ఇప్పటికైనా ఈ బృహత్ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టాలనుకోవడం ఆహ్వానించదగిన విషయం. ప్రజా సంక్షేమ పథకాల రూపకల్పనతో పాటు పలు రాజకీయ నిర్ణయాలకూ ఈ జనగణన భూమిక కానుంది. జనగణనతో పాటు పనిలో పనిగా కులగణన కూడా జరపాలనే డిమాండ్ ఊపందుకుంది. అలాగే, ఇకపై 2025ను ప్రాతిపదికగా తీసుకొని ప్రతి దశాబ్దం మొదట్లో జరపాల్సిన జనగణన తాలూకు కాలరేఖను 2035, ’45... అలా మారుస్తారనే మాటా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అవసరమైతే అఖిలపక్ష భేటీ జరపాలనే వాదన వస్తున్నది అందుకే. 1881 నుంచి నిర్వహిస్తున్న ఈ జనాభా లెక్కల ప్రక్రియ అసలు 2021లోనే జరగాల్సింది. అయితే, రాజ్యాంగ రీత్యా కేంద్రం పరిధిలోని ఈ ప్రక్రియను కోవిడ్–19 కారణంగా సర్కారు వాయిదా వేసింది. ఆ పైన కరోనా పోయినా ఈ బృహత్తర బాధ్యత నెరవేర్చడానికి మోదీ సర్కార్ ఎందుకో ఉత్సాహం చూపలేదు. పాత కాలపు జనాభా లెక్కలతో ప్రస్తుత ప్రజా అవసరాలను ఎలా తెలుసుకుంటారన్న విమర్శలకూ గురైంది. ఎందుకంటే, కేవలం తలల లెక్కగా కాక జనాభా హెచ్చు తగ్గుల ధోరణులతో పాటు, సామాజిక, ఆర్థిక పరిస్థితులను సైతం అర్థం చేసుకోవడానికి జనగణన కీలకసూచిక. ప్రభుత్వ ప్రాధాన్యాల నిర్ణయం, వనరుల కేటాయింపు, సంక్షేమ పథకాల రూపకల్ప నకు ఉపకరించే సమగ్ర సమాచార సమాహారం. దేశంలోని సంక్లిష్టమైన సామాజిక సమస్యల పరిష్కారానికి ఓ కరదీపిక. కచ్చితమైన సమాచారం ద్వారానే విద్య, వైద్యం, గృహనిర్మాణం, ప్రాథమిక వసతుల్లో అన్ని ప్రాంతాల్లో సమానాభివృద్ధికి సర్కారు జోక్యం చేసుకొనే వీలుంటుంది. అదే సమయంలో రాజకీయ పర్యవసానాలూ అనేకం. నియోజకవర్గాల పునర్విభజనకూ, జనాభా లెక్కలకూ లింకుంది. ‘‘2026 తరువాత జరిగే తొలి జనగణన’’ ఆధారంగా చట్టసభలలో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని 2002లోనే అప్పటి వాజ్పేయి సర్కార్ నిర్ణయించింది. అందువల్ల రాజకీయాల రూపురేఖలను మార్చే జనగణన చర్చోపచర్చలకు కారణమవుతోంది. బీజేపీకి ఆది నుంచి దక్షిణాది కన్నా ఉత్తరాదిలోనే బలం, బలగం ఎక్కువ. జనగణన అనంతరం జనసంఖ్య ఆధారంగా పునర్విభజన జరిగితే... కట్టుదిట్టంగా జనాభా నియంత్రణ చర్యలు చేపట్టిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. పార్లమెంట్ స్థానాల సంఖ్య దక్షిణాదిలో తగ్గి, ఉత్తరాదిలో పెరుగు తుంది. అది కాషాయపార్టీకి అనుకూలంగా మారుతుందనే అనుమానం ఉంది. ప్రజాస్వామ్యమంటే ప్రజాసంఖ్యకు సిసలైన రీతిలో ప్రాతినిధ్యం వహించాలన్నది నిజమే. అంత మాత్రాన కుటుంబ నియంత్రణ పాటించనందుకు గాను అధికారం ఉత్తరాది వైపు మొగ్గడమూ సమర్థనీయం కాదు. 1951 నుంచి మన జనగణనలో ఎస్సీ, ఎస్టీలు మినహా మిగతా కులాల లెక్కలు వేయడం లేదు. కానీ, కులాల వారీ జనాభా ఆధారంగా మెరుగైన ప్రాతినిధ్యం, వనరుల కేటాయింపు జరగాలన్నది దీర్ఘకాలిక డిమాండ్. ఈ న్యాయమైన ప్రజాకాంక్షను కేంద్రం ఇప్పటికైనా పట్టించుకొని తీరాలి. అలాగే, లెక్కల్లో ఆడవాళ్ళ సంఖ్య తేలడంతో చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలుకు మెరుగైన ప్రాతిపదిక సిద్ధమవుతుంది. వీటి వల్ల సామాజిక న్యాయం, సమ్మిళిత ఆర్థిక పురోగతి, స్త్రీ – పురుష సమానత్వ స్పృహతో విధాన నిర్ణయానికీ వీలు చిక్కుతుంది. పైగా, ఈ పర్యాయం జనాభా లెక్కలు తొలిసారిగా డిజిటల్ విధానంలో జరగనున్నందున వివరాలు, విశేషాలు మరింత నిక్కచ్చిగా, వేగంగా అందవచ్చు. సాధారణంగా ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ముందస్తు పరీక్షగా జనాభా లెక్కల సన్నాహక ప్రక్రియ జరుపుతారు. మరుసటేడు ఫిబ్రవరిలో అసలు లెక్కలు జరుపుతారు. 2021 జనాభా లెక్కల కోసం 2019లోనే ఆ ప్రీ–టెస్ట్ జరిపినా, జాప్యమైనందున మళ్ళీ ప్రీ–టెస్ట్ జరపవచ్చు. అధికారిక ప్రకటనతోనే ఈ సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి. అత్యవసరం, అనివార్యమైనప్పటికీ, జనగణన అంశంలో దేశంలో చేపట్టాల్సిన చర్యలూ కొన్ని ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజనలో ఒకరికి మోదం, వేరొకరికి ఖేదం కలగరాదంటే... అమెరికా ఫక్కీలో మన వద్దా వివిధ రాష్ట్రాల మధ్య విద్య, ఉపాధి నిమిత్తం అంతర్గత వలసలను ప్రోత్సహించడం జనసంఖ్య సమతుల్య పంపిణీకి ఒక మార్గమని నిపుణుల మాట. అదే సమయంలో స్థానిక భాష, సంస్కృతుల్లో వలసదారులు కలగలసిపోయేలా ఇంగ్లీషు, హిందీ, స్థానిక భాష – అనే త్రిభాషా సూత్రాన్ని దేశవ్యాప్తంగా అనుసరించాలని మరో సూచన. హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాల వారు సైతం కచ్చితంగా మరో భారతీయ భాష నేర్చుకోవాలనే నియమం ద్వారా భాష, ప్రాంతాలకు అతీతంగా అందరినీ దగ్గర చేయవచ్చు. వెరసి, సమతుల్య జనాభా పంపిణీ, సాంస్కృతిక స్నేహవారధి సాయంతో ఆర్థికంగా, సామాజికంగా సంతులిత ప్రాంతీయాభివృద్ధికి బాటలు వేయవచ్చు. ఈసారికి 2025లో చేసినా, ఇకపై మునుపటిలానే ప్రతి దశాబ్ది ఆరంభంలోనే ఈ ప్రక్రియ చేపట్టడం మేలు. ఏమైనా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలి. ప్రాంతీయ ప్రయోజనాల్లో సమతూకం పాటించాలి. పరస్పర విశ్వాసంతో పాటు పూర్తి చిత్తశుద్ధి అందుకు అవసరం. -
సైబర్ సవాలు
అమృతంతో పాటు హాలాహలం పుట్టిందట. సౌకర్యాలెన్నో తెచ్చిన డిజిటల్ సాంకేతికత విసురు తున్న తాజా సవాళ్ళను చూస్తే అదే గుర్తొస్తుంది. రెచ్చిపోతున్న సైబర్ మోసగాళ్ళు, పెచ్చుమీరు తున్న డిజిటల్ స్కామ్ల సంఖ్యే అందుకు తార్కాణం. ‘డిజిటల్ అరెస్ట్ మోసాల’ బారినపడి ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ రూ. 75 లక్షలు, ఓ పారిశ్రామికవేత్త రూ. 7 కోట్లు నష్టపోయిన కథనాలు అమాయ కుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. చదువు లేని సామాన్యుల దగ్గర నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్న వైనం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. కొత్త సాంకేతికత వచ్చినప్పుడల్లా కొత్త రకం మోసాలూ అంతే వేగంగా ప్రభవించడం ఆది నుంచీ ఉంది. అయితే, అడ్డుకట్ట వేసినప్పుడల్లా మోస గాళ్ళు సైతం తెలివి మీరి కొత్త రీతుల్లో, మరింత సృజనాత్మకంగా మోసాలు చేయడమే పెను సవాలు. అనేక అంశాలతో ముడిపడ్డ దీన్ని గట్టిగా తిప్పికొట్టాలంటే ఏకకాలంలో అనేక స్థాయుల్లో చర్యలు చేపట్టాలి. అందుకు ప్రజా చైతన్యంతో పాటు ప్రభుత్వ క్రియాశీలత ముఖ్యం. సాక్షాత్తూ భారత ప్రధాని సైతం తన నెల వారీ ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసంగంలో తాజాగా ఈ ‘డిజిటల్ అరెస్ట్ మోసాల’ గురించి ప్రస్తావించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. బాధితులను ముందుగా ఫోన్లో సంప్రతించడం, మీ ఆధార్ నంబర్ – ఫోన్ నంబర్పై వెళుతున్న డ్రగ్స్ పార్సిల్ను పట్టుకున్నామనడం, ఆపై వాట్సప్, స్కైప్లలో వీడియో కాల్కు మారడం, తాము నిజమైన పోలీసులమని నమ్మించడం, నకిలీ పత్రాలు చూపి ‘డిజిటల్ అరెస్ట్’ చేసినట్టు బాధితులను భయపెట్టడం, ఆఖరికి వారి కష్టార్జితాన్ని కొల్లగొట్టడం ‘డిజిటల్ అరెస్ట్ మోసాల’ వ్యవహారశైలి. మోసగాళ్ళు తమను తాము పోలీసులుగా, సీబీఐ అధికారులుగా, మాదకద్రవ్యాల నిరోధక శాఖకు చెందినవారిగా, రిజర్వ్ బ్యాంక్ అధికారులుగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులుగా, చివరకు జడ్జీలమని కూడా చెప్పుకుంటూ... అమాయకులపై మానసికంగా ఒత్తిడి తెచ్చి, భయభ్రాంతులకు గురి చేసి ఆఖరికి వారి నుంచి లక్షల రూపాయల కష్టార్జితాన్ని అప్పనంగా కొట్టేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ స్కామ్, ట్రేడింగ్ స్కామ్, పెట్టుబడుల స్కామ్, డేటింగ్ యాప్ల స్కామ్... ఇలా రకరకాల మార్గాల్లో సైబర్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఏటేటా ఈ మోసాలు పెరుగు తున్నాయి. ఒక్క ఈ ఏడాదే కొన్ని వేల డిజిటల్ అరెస్ట్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. రోజూ లెక్కకు మిక్కిలిగా నమోదవుతున్న ఈ సైబర్ నేరాల గణాంకాలు చూస్తే కళ్ళు తిరుగుతాయి. 2021లో 4.52 లక్షల ఫిర్యాదులు వస్తే, 2022లో 9.66 లక్షలు, గత ఏడాది 15.56 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇక, ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే ఏకంగా 7.4 లక్షల ఫిర్యాదులు అందా యని నేషనల్ సైబర్క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ) కథనం.ఆర్థిక నష్టానికొస్తే జనవరి – ఏప్రిల్ మధ్య డిజిటల్ మోసాల వల్ల భారతీయులు రూ. 120 కోట్ల పైగా పోగొట్టుకున్నారు. అలాగే, ట్రేడింగ్ స్కామ్లలో రూ. 1420.48 కోట్లు, పెట్టుబడుల స్కామ్లలో రూ. 222.58 కోట్లు, డేటింగ్ స్కామ్లలో రూ. 13.23 కోట్లు నష్టపోవడం గమనార్హం. చిత్రమేమిటంటే, ఈ డిజిటల్ మోసాల్లో దాదాపు సగం కేసుల్లో మోసగాళ్ళు మయన్మార్, లావోస్, కాంబోడియాల నుంచి కథ నడిపినవారే!గమనిస్తే, గత పదేళ్ళలో భారతీయ మధ్యతరగతి వర్గం వార్షికాదాయం లక్షన్నర – 5 లక్షల స్థాయి నుంచి రూ. 2.5 – 10 లక్షల స్థాయికి మారిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక. సహజంగానే ఆర్థిక స్థాయితో పాటు మధ్యతరగతి అవసరాలు, ఆకాంక్షలూ పెరిగాయి. కాలంతో పాటు జీవితంలోకి చొచ్చుకువచ్చిన డిజిటల్ సాంకేతికతను అందరితో పాటు అందుకోవాల్సిన పరిస్థితి. డిజిటల్ అక్షరాస్యత లేకపోయినా డిజిటల్ చెల్లింపు వేదికలు సహా అన్నీ అనివార్య మయ్యాయి. అయితే, సౌకర్యంతో పాటు సవాలక్ష కొత్త సవాళ్ళనూ ఆధునిక సాంకేతికత విసిరింది. అవగాహన లేమితో సామాన్యుల మొదలు సంపన్నుల దాకా ప్రతి ఒక్కరూ మోసపోతున్న ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నది అందుకే. జీవితమంతా కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము ఇలా మోసాల పాలవుతుండడంతో మధ్యతరగతి సహా అందరిలోనూ ఇప్పుడు భయాందోళనలు హెచ్చాయి. దీన్ని ఎంత సత్వరంగా, సమర్థంగా పరిష్కరిస్తామన్నది కీలకం. ప్రధాని చెప్పినట్టు ‘డిజిటల్గా అరెస్ట్’ చేయడమనేదే మన చట్టంలో లేదు. అసలు ఏ దర్యాప్తు సంస్థా విచారణకు ఫోన్ కాల్, వీడియో కాల్ ద్వారా సంప్రతించదు. కానీ, అలా అబద్ధపు అరెస్ట్తో భయపెట్టి డబ్బు గుంజడం మోసగాళ్ళ పని. అది జనం మనసుల్లో నాటుకొనేలా చేయాలి. డిజిటల్ నిరక్షరాస్యతను పోగొట్టి, సాంకేతికతపై భయాలను తొలగించాలి. సరిగ్గా వాడితే సాంకేతికతలో ఉన్న లాభాలెన్నో గ్రహించేలా చూడాలి. క్షణకాలం సావధానంగా ఆలోచించి, అప్రమత్తమైతే మోస పోమని గుర్తించేలా చేయాలి. ఒకవేళ మోసపోతే, ఎక్కడ, ఎలా తక్షణమే ఫిర్యాదు చేసి, సాంత్వన పొందాలన్నది విస్తృత ప్రచారం చేయాలి. మోసాలను అరికట్టి, అక్రమార్కుల భరతం పట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలను చేపట్టాలి. మన సైబర్ భద్రతా వ్యవస్థను ఎప్పటికప్పుడు తాజా అవస రాలకు అనుగుణంగా నవీకరించాలి. అన్ని రకాల సైబర్ నేరాలపై చర్యల్లో సమన్వయానికి కేంద్రం ఇప్పటికే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐసీ4)ను నెలకొల్పింది. తీరా దాని పేరు మీదే అబద్ధాలు, మోసాలు జరుగుతున్నందున అప్రమత్తత పెంచాలి. అవసరంతో పని లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని అన్నిచోట్లా అడగడాన్నీ, అందించాల్సి రావడాన్నీ నివారించాలి. ఎంతైనా, నిరంతర నిఘా, నిర్దిష్టమైన అవగాహన మాత్రమే సైబర్ మోసాలకు సరైన విరుగుడు. -
ఒక ముందడుగు!
నాలుగేళ్ళ తర్వాత ప్రతిష్టంభనను తొలగించేందుకు తొలి అడుగు పడింది. హిమాలయ సరిహద్దు వెంట కొన్ని వివాదాస్పద ప్రాంతాల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత, చైనాల మధ్య అంగీకారం కుదిరింది. విస్తృతమైన సరిహద్దు వివాదం అలాగే అపరిష్కృతంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో గాల్వాన్ లోయ ఘర్షణలకు ముందున్న పరిస్థితికి తిరిగి వచ్చే అవకాశం ఏర్పడుతోంది. చైనా సైతం పాల్గొన్న ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని వెళ్ళే ముందు గత వారమే ఈ ఒప్పందం గురించి వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ చర్యలు తుది రూపానికి వచ్చాయి. ఒప్పందంలోని మరిన్ని వివరాలు విశదం కావాల్సి ఉన్నప్పటికీ, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల, ఫలితంగా నెలకొనే ప్రాంతీయ సుస్థిరతకు ఇది ఓ సానుకూల పరిణామమని చెప్ప వచ్చు. ఆసియా ఖండంలోని రెండు భారీ శక్తుల మధ్య రాజకీయ, వాణిజ్య సంబంధాల మెరుగు దలకు మళ్ళీ మార్గం సుగమం కానుందని భావించవచ్చు.2020 జూన్లో చైనా సైనిక బలగాలు భారత భూభాగంలోకి చొచ్చుకొని వచ్చాయి. భారత బలగాలు సైతం త్వరితగతిన అందుకు దీటుగా బదులిచ్చాయి. బాహాబాహీ సాగిన ఆ ఘర్షణల్లో రెండు పక్షాల నుంచి గణనీయమైన సంఖ్యలో సైనికులు మరణించారు. గాయపడ్డారు. 1975 తర్వాత రెండు దేశాల మధ్య మళ్ళీ అంతటి ఉద్రిక్తతకు అది కారణమైంది. సరిగ్గా ఆ ఘర్షణలు జరిగిన గాల్వాన్ లోయ ప్రాంతం వద్దే ఇప్పుడు శాంతి, సాంత్వన యత్నానికి శ్రీకారం చుట్టడం ఒక రకంగా శుభపరిణామం. నాలుగేళ్ళ ప్రతిష్టంభన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు ఎంతో కొంత మెరుగయ్యేందుకు ముందడుగు వేసినందుకు ఇరుపక్షాలనూ అభినందించాల్సిందే. ఇరు పక్షాల మధ్య అనేక వారాలుగా సాగిన చర్చల తర్వాత ఈ ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా భారత, చైనా భూభాగాలను విభజించే వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట, తూర్పు లద్దాఖ్ సెక్టార్లోని దెప్సాంగ్, దెమ్ఛోక్ మైదాన ప్రాంతాల్లో భారత, చైనా సైనిక బలగాలను తగ్గించడం ఇప్పటికే మొదలైంది. అలాగే, గతంలో అంగీకరించిన పద్ధతిలోనే గస్తీ పునఃప్రారంభం కానుంది.వ్యూహాత్మకంగా ఇటీవల ‘బ్రిక్స్’ సమిట్ సమయంలోనే ఈ గస్తీ ఒప్పందాల గురించి బయటకు చెప్పడం గమనార్హం. తద్వారా రెండు దేశాల మధ్య వైషమ్యాలను దూరం పెట్టి, ఆర్థిక సహకార పునరుద్ధరణకు బాటలు పరవాలనుకోవడం మంచిదే. అందుకు తగ్గట్లుగా ‘బ్రిక్స్’ సందర్భంగా భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ల మధ్య దాదాపు 50 నిమిషాల పాటు సుహృద్భావ పూర్వక భేటీ జరిగింది. సమావేశానికి కొద్ది రోజుల ముందే కుదిరిన ఈ సరిహద్దు గస్తీ ఒప్పందం, దరిమిలా ఆ భేటీ వల్ల ఉద్రిక్తతలు కొంత సడలడం ఖాయం. అలాగని ఈ ఒప్పందాన్ని కేవలం సైనిక సమన్వయ చర్యగా తక్కువ చేసి చూడడం సరికాదు. రెండు దేశాల మధ్య ఆర్థిక బంధాలనూ, అలాగే అంతర్జాతీయ స్థాయిలో దౌత్య సంబంధాలనూ పునర్ నిర్వచించే సామర్థ్యం కూడా ఈ ఒప్పందానికి ఉంది. అదే సమయంలో ఈ ఒప్పందంతో భారత, చైనాల మధ్య రాత్రికి రాత్రి అపూర్వ సత్సంబంధాలు నెలకొంటాయని అనుకొంటే అత్యాశే. ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నిజానికి, భారత – చైనాలది సుదీర్ఘమైన 3440 కిలోమీటర్ల మేర విస్తరించిన సరిహద్దు. నదులు, సరస్సులు, హిమఖండాలతో కూడిన ఆ దోవలో విభజన రేఖను నిర్దుష్టంగా పేర్కొనడమూ చిక్కే. ఈ పరిస్థితుల్లో భూటాన్ – నేపాల్ల మధ్య సిక్కిమ్లో, అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో, ఇంకా అనేక ప్రాంతాల్లో ఇరుపక్షాల సైనికులు ముఖాముఖి ఎదురుపడి, ఘర్షణకు దిగడం జరుగుతున్నదే. దానికి తోడు భారత భూభాగంలోకి పదేపదే జొరబడుతూ చైనా చూపుతున్న విస్తరణ కాంక్ష తెలియనిదీ కాదు. ఈ పరిస్థితుల్లో ఎల్ఏసీ వెంట రోడ్లు, నివాసాల సహా ప్రాథమిక వసతి సౌకర్యాలను ఇబ్బడిముబ్బడిగా పెంచి, ప్రత్యర్థిపై పైచేయి సాధించాలనే ప్రయత్నం రెండు వైపులా సాగింది. ఆ నేపథ్యమే గాల్వాన్ ఘర్షణకూ దారి తీసింది. రెండు దేశాల మధ్య సాధారణ స్థితి రావాలంటే, తూర్పు లద్దాఖ్కే పరిమితమైన ఒప్పందంతో సరిపోదు. మొత్తం ఎల్ఏసీ వెంట సాధారణ పరిస్థితులకు కృషి సాగాలి. దానికి ఇరుపక్షాలలోనూ చిత్తశుద్ధి ముఖ్యం. డ్రాగన్ సైతం చెప్పేదొకటి, చేసేదొకటి విధానాన్ని ఇకనైనా మానుకోవాలి. భారత్, చైనాలు కేవలం పొరుగుదేశాలే కాదు, ప్రపంచంలోనే అధిక జనాభా గల దేశాలు. కాబట్టి, పరస్పర స్నేహ సౌహార్దాల వల్ల రెండిటికీ లాభమే. భారత అగ్రశ్రేణి వాణిజ్య భాగస్వా ముల్లో అమెరికాతో పాటు చైనా ఒకటి. సరుకుల నుంచి టెలికమ్యూనికేషన్ల హార్డ్వేర్, భారతీయ ఫార్మా రంగానికి ముడి పదార్థాల దాకా అనేకం భారత్కు అందించే అతి పెద్ద వనరు చైనాయే. గాల్వాన్ ఘటన తర్వాత చైనా పెట్టుబడులు, వీసాలు, యాప్లపై మన దేశం సహజంగానే తీవ్ర షరతులు పెట్టింది. అవన్నీ తొలగాలంటే, మళ్ళీ పరస్పరం నమ్మకం పాదుకొనే చర్యలు ముఖ్యం. గస్తీ ఒప్పందం కుదిరింది కదా అని నిర్లక్ష్యం వహించకుండా భారత్ అప్రమత్తంగా ఉండాల్సిందే. అవతలి పక్షాన్ని విశ్వసిస్తూనే, అంతా సజావుగా సాగుతున్నదీ లేనిదీ నిర్ధరించుకోవాల్సిందే. ఒప్పందాల మాట ఎలా ఉన్నా... సరిహద్దు వెంట సన్నద్ధతను మానరాదు. సరిహద్దులో ప్రాథమిక వసతి సౌకర్యాల నిర్మాణాలను కొనసాగించడమే దీర్ఘకాలంలో మన దేశానికి ఉపకరిస్తుంది. ఒకప్పటితో పోలిస్తే భారత్ బలీయంగా తయారైందని గాల్వాన్లో మన సైన్యాల దీటైన జవాబు రుజువు చేసింది. ఆ బలాన్ని కాపాడుకుంటూనే, డ్రాగన్తో బంధాన్ని పటిష్ఠం చేసుకోవడమే మార్గం. -
కాంగ్రెస్కు ‘హరియాణా’ దరువు!
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో ఆ రాష్ట్రాల్లో పార్టీలన్నీ అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఒంటరిగా పోటీ చేసి నెగ్గేంత విశ్వాసం ఏ పార్టీకీ లేకపోవటంతో కూటములుగా కదులుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిలో సీట్ల సర్దుబాటు రెండురోజుల క్రితమే కుదరగా, విపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో బుధవారం సర్దుబాటు ప్రక్రియ పూర్తయింది. అయినా అరడజను సీట్లకు సంబంధించి ఇంకా పంచాయతీ తెగలేదు. జార్ఖండ్లో సైతం బీజేపీ, జేఎంఎం శిబిరాల్లో సర్దుబాట్లు ఒక కొలిక్కివచ్చాయి. కేంద్రంలో అధికారం ఉంది గనుక బీజేపీకి పెద్దగా దిగులేమీ లేదు. సొంత పార్టీలో అధిష్టానం మాట చలామణి అవుతుంది. కూటమి పక్షాలు సైతం కాస్త అటూ ఇటూగా బీజేపీకి తలాడిస్తాయి. ఎటొచ్చీ సమస్యంతా కాంగ్రెస్కే. కొత్తగా ఎన్నికలొచ్చి పడినప్పుడల్లా పాత ఖాతాలు ముందేసుకుని ఇంటా బయటా కూడా ఒత్తిళ్లు తెచ్చేవారు ఎక్కువే. మొన్నటి హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ బొక్కబోర్లా పడ్డాక, దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ... సొంత పార్టీలో సరే సరి... కూటముల్లో కూడా కాంగ్రెస్ అధి నేతల మాటకు విలువుండటం లేదు. అందుకు తాజా సర్దుబాట్లు, ఆ సందర్భంగా వచ్చిన విమర్శలు తార్కాణం. హరియాణాలోని 90 స్థానాల్లో బీజేపీ 48 గెల్చుకోగా అంతర్గత పోరుతో సతమతమైన కాంగ్రెస్ 37తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అది మొదలు కశ్మీర్లోని నేషనల్ కాన్ఫరెన్స్ మొదలు కొని యూపీ, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోని మిత్రుల వరకూ అన్నిచోట్లా ఆ పార్టీ పనితీరుపై, దురహంకారంపై విమర్శలు వచ్చిపడ్డాయి. పార్టీ రాష్ట్ర నాయకత్వాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు మిత్రుల ముందుపెట్టగానే వారు అంతెత్తున విరుచుకు పడటంతో కాంగ్రెస్ అధినాయకత్వానికి దిక్కుతోచని స్థితి ఏర్పడింది. హరియాణా ప్రభావం ఏ స్థాయిలో ఉందో మహారాష్ట్ర పంపకాలే రుజువుచేస్తాయి. అక్కడి 288 స్థానాల్లో ఎంవీఏ ప్రధాన పక్షాలు కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్), ఉద్ధవ్ నేతృత్వంలోని యూబీటీ శివసేనలు సమానంగా అంటే 85 సీట్ల చొప్పున పోటీచేయటానికి బుధవారం అంగీకారం కుదిరింది. కూటమిలోని సమాజ్వాదీ, ఆప్, సీపీఐ, సీపీఎం, ఇతరేతర పార్టీల కోసం 18 స్థానాలు విడిచి పెట్టగా, ముంబైలో 3, విదర్భలో 12 స్థానాలు అనిశ్చితిలో ఉన్నాయి. ఈ 15 తమకే ఇవ్వాలన్నది కాంగ్రెస్ డిమాండ్. పాతకాలంలో వేరు. కాంగ్రెస్ మెజారిటీ సీట్లలో పోటీచేసేది. ఎన్సీపీ, ఇతర మిత్ర పక్షాలూ సరిపెట్టుకునేవి. గత అసెంబ్లీ ఎన్నికల సంగతే చూస్తే అప్పట్లో కాంగ్రెస్ 145 చోట్ల పోటీచేసింది. యూపీఏ కూటమిలోని ఎన్సీపీ 123, ఇతరులు 17 తీసుకున్నారు. మరో మూడు ఇతరులకిచ్చారు. అప్పుడు శివసేన బీజేపీతో చెలిమి చేసి 124 తీసుకోగా, బీజేపీ 152 చోట్ల పోటీ చేసింది. ఇలా ప్రతిచోటా హరియాణా భంగపాటు కాంగ్రెస్కు పెద్ద అడ్డంకిగా మారింది. అధినేతలు తమ వారికి హరియాణా సంగతి గుర్తుచేస్తుంటే... మిత్రులు సైతం కాంగ్రెస్కు ఆ బాణీయే వినిపించటం గమనించదగ్గది. తమకు అన్యాయం జరుగుతోందని అధిష్టానానికి మొరపెట్టుకున్న పార్టీ నేతల తరఫున పవార్, ఉద్ధవ్ ఠాక్రేలతో కాంగ్రెస్ సీనియర్ నేతలు మాట్లాడినా పెద్దగా ఫలించక పోవటంతో కూటమి నుంచి బయటకు రావాలన్న ప్రతిపాదన కూడా వచ్చిందంటున్నారు. చివరకు పవార్ జోక్యం తర్వాతైనా ఉద్ధవ్ శివసేన ఆ 15 వదులుకోవటానికి సిద్ధపడటం లేదు. నామినేషన్ల పర్వం ముగిసేనాటికి తిరుగుబాట్లు, కప్పదాట్లు సహజంగానే ఉంటాయి. కానీ బలంగా బేరసారా లాడే స్థితి కాంగ్రెస్కు లేదన్నది వాస్తవం.బీజేపీలో అసమ్మతి స్వరాలు అక్కడక్కడ వినిపిస్తున్నా అవి పట్టించుకోవాల్సినంతగా లేవని ఆ పార్టీ అధినాయకత్వం నిర్ణయానికొచ్చేయటం గమనించదగ్గది. మిత్రుల అసంతృప్తిని సైతం అది బేఖాతరు చేస్తోంది. అంతా సవ్యంగా సాగుతున్నప్పుడూ, అనుకోని విజయాలు సైతం చేజిక్కించు కుంటున్నప్పుడూ సహజంగానే ఎవరినీ లెక్కచేసే పరిస్థితి ఉండదు. పాలక మహాయుతిలో కుదిరిన ఒప్పందం ప్రకారం బీజేపీ 152–155 స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయించగా, షిండే శివసేనకు 78–80 మధ్య, అజిత్ పవార్ ఎన్సీపీకి 52–54 మధ్య ఇవ్వాలన్న అవగాహన కుదిరింది. ఇప్పటికే వంద స్థానాల్లో బీజేపీ తన అభ్యర్థుల్ని కూడా ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీలో అసంతృప్తి లేకపోలేదు. అలాగే మిత్రులనుంచి కూడా సణుగుడు జాస్తిగానే ఉంది. అయినా అందరినీ దారికి తేవొచ్చన్న అభిప్రాయంతోనే బీజేపీ పెద్దలుండటం గమనించదగ్గది.ఇప్పటికే మూడో జాబితా కూడా విడుదల చేసి మొత్తం 41 స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేసు కున్న జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నుంచి కాంగ్రెస్కు 29కి మించి వచ్చేలా లేవు. 81 స్థానా లున్న జార్ఖండ్ రాష్ట్రంలో ఆర్జేడీ, వామపక్షాలకు 11 స్థానాలివ్వాలని నిర్ణయించారు. 9 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న ఉత ్తరప్రదేశ్లో కనీసం మూడైనా సాధించుకోవాలని చూసిన కాంగ్రెస్కు సమాజ్వాదీ నేత అఖిలేష్ యాదవ్నుంచి సానుకూల స్పందన రాకపోవటం కూడా హరి యాణా షాక్ ఫలితమే. అక్కడ రెండు స్థానాలివ్వాలని ఎస్పీ నిర్ణయించినా అసలు పోటీకి దిగరాదని కాంగ్రెస్ అనుకోవటం ఆ పార్టీ దయనీయ స్థితికి నిదర్శనం. పూలమ్మిన చోటే కట్టెలమ్మడం అంటే ఏమిటో కాంగ్రెస్కు అడుగడుగునా అర్థమవుతోంది. అధికారంలో ఉన్నన్నాళ్లూ కన్నూ మిన్నూగానక వ్యవహరిస్తే ఏమవుతుందో ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. తనను తాను సరిదిద్దుకోలేని నిస్సహా యత ఆ పార్టీని ఆవరించటంవల్ల మరోసారి అదే భంగపాటు ఎదురైంది. అందుకు ఎవరిని నిందించగలరు? చేసుకున్నవారికి చేసుకున్నంత! -
అధిక జనాభా వరమా!
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఇష్టమున్నా లేకున్నా జనాభా అంశంపై చర్చ ఊపందుకుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మరో ఏణ్ణర్థంలో ప్రారంభం కావాల్సిన నేపథ్యంలో ఈ చర్చ ఎంతో అవసరమైనదీ, తప్పనిసరైనదీ. అయితే ఇందులో ఇమిడివున్న, దీనితో ముడిపడివున్న అనేకానేక ఇతర విషయాలను కూడా స్పృశిస్తే ఈ చర్చ అర్థవంతంగా ఉంటుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సామూహిక వివాహాల సందర్భంగా సోమవారం కొత్త దంపతుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ‘2026లో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన పుణ్యమా అని చిన్న కుటుంబానికి బదులు ఎక్కువమంది సంతానాన్ని కనాలని ఆశీర్వదించే రోజులొచ్చేశాయి’ అని వ్యాఖ్యానించటం గమనించదగ్గది. తెలుగునాట అష్టయిశ్వర్యాలు లభించాలని దంపతులను ఆశీర్వదించినట్టే తమిళగడ్డపై కొత్త దంపతులకు 16 రకాల సంపదలు చేకూరాలని ఆకాంక్షించటం సంప్రదాయం. ఆ ఆకాంక్షను పొడిగించి ఎక్కువమంది పిల్లల్ని కనాలని ఆశీర్వదించాల్సి వస్తుందన్నది ఆయన చమత్కారం. ఆ మాటల వెనక ఆంతర్యం చిన్నదేమీ కాదు. పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యాక లోక్సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాలూ అమాంతం 753కు చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. అంటే ఒక్కసారిగా 210 స్థానాలు పెరుగుతాయన్న మాట! ఆ నిష్పత్తిలో శాసన సభల్లో సైతం సీట్ల పెరుగుదల ఉంటుంది. జనాభా పెరుగుదల రేటులో తీవ్ర వ్యత్యాసాలు కనబడుతున్న నేపథ్యంలో అధిక జనాభాగల ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ లోక్సభ స్థానాలూ... ఆ పెరుగుదల అంతగా లేని దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సంఖ్యలో స్థానాలూ వస్తాయన్నది ఒక అంచనా. మరో మాటలో చెప్పాలంటే జనాభా నియంత్రణపైనా, విద్యపైనా, ఆర్థికాభివృద్ధిపైనా పెద్దగా దృష్టి పెట్టని రాష్ట్రాలు లాభపడబోతున్నాయన్నమాట!దేశంలో చివరిసారిగా 1976లో పునర్విభజన జరిగింది. ఈ ప్రక్రియ క్రమం తప్పకుండా చేస్తే సమస్యలకు దారి తీయొచ్చన్న కారణంతో 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి పునర్విభజన ప్రక్రియను 2000 వరకూ స్తంభింపజేశారు. అయితే 2001లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా నియోజకవర్గాల పరిధిలోని ప్రాంతాల హేతుబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు. దాని ప్రకారం లోక్సభ స్థానాల సంఖ్య, వాటి పరిధి 2026 తర్వాత జరిగే జనగణన వరకూ మారదు. అయితే ఆ పరిధిలోని అసెంబ్లీ స్థానాలను హేతుబద్ధీకరించవచ్చు. దాని పర్యవసానంగా ఉమ్మడి ఏపీ అసెంబ్లీలోని 294 స్థానాల సంఖ్య మారకపోయినా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో జిల్లాలవారీగా సీట్ల సంఖ్య మారింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాగే జరిగింది.ప్రతి రాష్ట్రానికీ దాని జనాభా నిష్పత్తికి అనుగుణంగా లోక్సభలో ప్రాతినిధ్యం కల్పించాలని మన రాజ్యాంగం నిర్దేశిస్తోంది. దేశంలో ప్రతి ఒక్కరి ఓటు విలువా ఒకేవిధంగా ఉండాలన్నది దీని ఆంతర్యం. 2021లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా వాయిదా వేయక తప్పలేదని కేంద్రం ప్రకటించింది. కనుక వాస్తవ జనాభా ఎంతన్నది తెలియకపోయినా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోని సాంకేతిక బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ సంఖ్యను 142 కోట్లుగా లెక్కేస్తున్నారు. రాష్ట్రాలవారీగా జనాభా ఎంతన్న అంచనాలు కూడా వచ్చాయి. దాన్నే పరిగణనలోకి తీసుకుంటే ఉత్తరప్రదేశ్ నుంచి ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాలు 80 కాస్తా 128కి చేరుతాయి. బిహార్కు ఇప్పుడు 40 స్థానాలున్నాయి. అవి 70కి ఎగబాకుతాయి. అలాగే మధ్యప్రదేశ్కు ఇప్పుడున్న 29 నుంచి 47కూ, రాజస్థాన్కు ప్రస్తుతం ఉన్న 25 కాస్తా 44కు పెరుగుతాయని అంచనా. మహారాష్ట్రకు ప్రస్తుతం 48 ఉండగా అవి 68కి వెళ్లే అవకాశం ఉందంటున్నారు. కానీ అదే సమయంలో జనాభా నియంత్రణలో విజయం సాధించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పెరిగే సీట్ల సంఖ్య స్వల్పంగా ఉంటుంది. దేశ జనాభా వేగంగా పెరుగుతున్నదనీ, ఇదే కొనసాగితే భవిష్యత్తులో అందరికీ చాలినంత ఆహారం లభ్యం కావటం అసాధ్యమన్న అభిప్రాయం ఒకప్పుడుండేది. ఎమర్జెన్సీ రోజుల్లో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించిన ఉదంతాలకు లెక్కేలేదు. మొత్తంగా జనాభా పెరుగుతూనే ఉన్నా, ప్రపంచంలో అత్యధిక జనాభాగల దేశం మనదే అయినా గడిచిన దశాబ్దాల్లో పెరుగుదల రేటు తగ్గింది. ఈ తగ్గుదల సమంగా లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో అధికంగా, ఉత్తరాది రాష్ట్రాల్లో స్వల్పంగా నమోదవుతోంది. ఉదాహరణకు 1951లో తమిళనాడు జనాభా బిహార్ కంటే స్వల్పంగా అధికం. 6 దశాబ్దాల తర్వాత బిహార్ జనాభా తమిళనాడుకన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ!దక్షిణాదిన జనాభా పెరుగుదల పెద్దగా లేకపోవటానికి ఆర్థికాభివృద్ధి, స్త్రీలు బాగా చదువు కోవటం, దారిద్య్రం తగ్గటం ప్రధాన కార ణాలు. దేశ జనాభాలో 18 శాతంగల దక్షిణాది రాష్ట్రాలు దేశ జీడీపీకి 35 శాతం వాటా అందిస్తున్నాయి. కుటుంబాల్లో స్త్రీల నిర్ణయాత్మక పాత్ర ఉత్తరాదితో పోలిస్తే పెరిగింది. కీలకాంశాల్లో ఉత్తరాది రాష్ట్రాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఈ వైఫల్యం వరం కావటం న్యాయమేనా? స్టాలిన్ మాటల ఆంతర్యం అదే. మరికొందరు నేతలు జనాభా పెంచమంటూ ముసిముసి నవ్వులతో సభల్లో చెబుతున్నారు. ఇది నవ్వులాట వ్యవహారం కాదు. పునరుత్పాదక హక్కు పూర్తిగా మహిళలకే ఉండటం, అంతిమ నిర్ణయం వారిదే కావటం కీలకం. అసలు పునర్విభజనకు జనాభా మాత్రమే కాక, ఇతరేతర అభివృద్ధి సూచీలనూ, దేశ ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రాల పాత్రనూ పరిగణనలోకి తీసుకోవటం అవసరం. ఈ విషయంలో విఫలమైతే దక్షిణాది రాష్ట్రాల్లో అసంతృప్తి పెరగటం ఖాయమని కేంద్రం గుర్తించాలి. -
వట్టి బెదిరింపులేనా?
ఇది కనివిని ఎరుగని కథ. వారంరోజుల్లోనే మన విమానాలకు శతాధికంగా బాంబు బెదిరింపు కాల్స్... వివిధ జాతీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలకు చెందిన పలు విమానాలను అర్ధంతరంగా దింపాల్సి రావడం, దారి మళ్ళించడం, చివరకు ఫైటర్ జెట్ల రక్షణ మధ్య తీసుకువెళ్ళాల్సి రావడం జరిగింది. ఈ–మెయిల్, సోషల్ మీడియా అజ్ఞాత పోస్టుల బెదిరింపులతో భారత వైమానిక రంగం ఉలిక్కిపడింది. ఏ బెదిరింపు వచ్చినా నిశితంగా పరీక్షించి, జాగ్రత్త చేపట్టాలన్నది నిబంధన కావడంతో విమానయాన పరిశ్రమపై తాజా బెదిరింపుల ప్రభావం అంతా ఇంతా కాదు. ఖలిస్తానీ తీవ్రవాది గురుపథ్వంత్ సింగ్ పన్నూ సైతం ఎయిరిండియా విమానంపై దాడి చేస్తామనీ, నవంబర్ 1–19 మధ్య ఎయిరిండియాలో ప్రయాణించవద్దనీ హెచ్చరించడంతో కథ కొత్త మలుపు తిరిగింది. పెరుగుతున్న భద్రతా సమస్యలపై విమానయాన శాఖ మల్లగుల్లాలు పడుతోంది. బెదిరింపులకు పాల్పడినవారిపై తీవ్ర శిక్షలు విధించేలా చట్టంలో మార్పులు చేయాలనీ, దోషుల్ని విమానయానం నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని భావిస్తున్నామనీ కేంద్ర మంత్రి మాట. భవిష్యత్తుకు పనికొచ్చే ఆ చర్యల మాటెలా ఉన్న వర్తమానంలో తక్షణ మార్గాంతరమేమిటన్నదే ఇప్పుడు ప్రశ్న.2014 – ’17 మధ్య అంతా కలిపి 120 బాంబు బెదిరింపులే రాగా, ఇప్పుడు ఒక్కవారంలోనే 100కు పైగా బెదిరింపులు రావడం గమనార్హం. విమానాల దారి మళ్ళింపు, తక్షణ ల్యాండింగ్ వల్ల అయ్యే ఇంధన వృథా ఖర్చు, వగైరాలతో ప్రతి బెదిరింపు కాల్ వల్ల ఎయిర్లైన్స్కు రూ. 3 కోట్ల పైగా నష్టమట! ప్రయాణికుల్లో భయాందోళనల్ని పెంచడంతో పాటు ప్రయాణంలో ఆలస్యంతో కీలకమైన పనులు దెబ్బతినడం లాంటివి సరేసరి. రద్దీ ఎక్కువగా ఉండే పండగ సీజన్ కావడంతో కష్టం, నష్టం ఎక్కువ. ఒక్క వారంలోనే వంద బెదిరింపులు వచ్చాయంటే భద్రతా వ్యవస్థలు, సైబర్ సెక్యూరిటీలు ఏం చేస్తున్నట్టు? ఇప్పటి వరకు ఒక మైనర్నీ, అతని తండ్రినీ మాత్రమే అరెస్ట్ చేసినట్టు వార్త. నింది తుల్ని వేగంగా కనిపెట్టి, కఠినచర్యలకు ఎందుకు దిగడం లేదు? అయితే ముష్కరులు, తీవ్రవాదులు వర్చ్యువల్ ప్రైవేట్ నెట్వర్క్ల ద్వారా ఈ నకిలీ బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. దాంతో, వారున్న లొకేషన్ కనిపెట్టలేని పరిస్థితి. ఈ సవాలును అధిగమించేందుకు మార్గాలు అన్వేషించాలి. నిజానికి, విమాన సర్వీసులకే కాదు... కొద్ది నెలలుగా రైల్వేలకూ ఈ బెడద తప్పడం లేదు. రైల్వే ట్రాకుల మీద రాళ్ళు, గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్ నింపిన సీసాల లాంటివి దుండగులు పెడుతున్న ఘటనలు చూస్తున్నాం. ఆ మధ్య అనేక చోట్ల వందేభారత్ ఎక్స్ప్రెస్లను లక్ష్యంగా చేసుకొని రాళ్ళు విసిరిన ఉదంతాలూ చూశాం. ఈ చర్యల వెనుక పెద్ద పన్నాగమే ఉందని విశ్లేషకుల మాట. దేశంలో విమానయాన రంగం వేగంగా దూసుకుపోతోంది. ఒక్క 2023లోనే 15.2 కోట్ల మంది దేశంలో విమానయానం చేశారు. అలాంటిది... ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారత వైమానిక రంగాన్నీ, రైల్వేలనూ గనక అప్రతిష్ఠ పాల్జేస్తే, ఆర్థిక నష్టంతో పాటు భూమి మీదైనా, ఆకాశంలోనైనా సురక్షితంగా ప్రయాణం చేయలేమనే భీతిని దేశ, విదేశీ ప్రయాణికుల్లో పెంచాలన్నది కుట్ర. భయం పెంచి, ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి విద్రోహ చర్యలను తక్షణం అరికట్టాలి. చిత్రమేమిటంటే, ఐరోపా గగనతలంలోనూ భారత విమానయాన సంస్థలకు బెదిరింపులు వస్తున్నాయి. భారత ప్రభుత్వం, గూఢచర్య వ్యవస్థలు ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకుంటే పెను ప్రమాదమే! భారత్కు తీరని నష్టం కలిగించడమే ధ్యేయంగా పెట్టుకొన్న ఖలిస్తానీ తీవ్రవాది గురుపథ్వంత్ సింగ్ పన్నూ ఎయిరిండియా విమానాలను పేల్చేస్తామంటూ గత ఏడాది నవంబర్ లోనూ ఇలానే బెదిరింపులకు దిగాడు. అతను, అతని అనుచరుల ఆనుపానులు, దుశ్చర్యలు తెలిసినప్పటికీ అమెరికా గూఢచారి వ్యవస్థ ఎఫ్బీఐ లాంటివి కళ్ళు మూసుకొని, వారిని కాపాడుతూ వస్తుండడమే విషాదం. మరోపక్క దేశీయ విమానాల్లో సిక్కు ప్రయాణికులు కృపాణాలతో ప్రయాణించడాన్ని నిరోధించేందుకు సుప్రీమ్ కోర్టు సైతం నిరాకరించడంతో, పన్నూ లాంటి వారు దాన్ని అవకాశంగా తీసుకొంటే కష్టమే. ఈ ఖలిస్తానీ తీవ్రవాదులు ఒకటికి రెండు తీవ్రవాద బృందా లను కలుపుకొనిపోతే పెను ప్రమాదమే. దాదాపు పాతికేళ్ళ క్రితం 2001 సెప్టెంబర్ 11న తీవ్ర వాదులు విమానాల హైజాక్తో అమెరికాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రం జంట భవనాల కూల్చి వేతతో సహా 3 వేల మంది మరణానికి కారణమైన ‘9/11’ ఘటనను విస్మరించలేం. ఈ పరిస్థితుల్లో ఈ ముష్కరమూకలకు పరోక్షంగా అండగా నిలుస్తున్న అమెరికా, కెనడాలకు పరిస్థితిని వివరించి, దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకొనే దిశగా భారత ప్రభుత్వం కట్టుదిట్ట మైన చర్యలు చేపట్టాలి. మన ప్రయాణ వ్యవస్థలతో పాటు పౌరుల భద్రత అత్యంత ప్రధానమని తెలియజెప్పాలి. అవసరమైతే అంతర్జాతీయ న్యాయస్థానాన్నీ, ఐరాస భద్రతా మండలినీ ఆశ్రయించాలి. అదే సమయంలో కొద్దివారాల పాటు టెక్నాలజీని తమ చేతుల్లోకి తీసుకోవడం వల్లే ముష్క రులు ‘9/11’ ఘటనకు పాల్పడగలిగారని మర్చిపోరాదు. సాంకేతికంగా ముష్కర చేష్టలకు వీలు కల్పించే ట్రాన్సీవర్స్ లాంటి సాంకేతిక సామగ్రిని ఆన్లైన్లో అమ్మడాన్ని తక్షణం నిషేధించడం అవసరమని నిపుణుల సూచన. అన్నిటి కన్నా ముఖ్యంగా యుద్ధ ప్రాతిపదికన మన విమాన, రైల్వే భద్రతా వ్యవస్థలను పునఃపరిశీలించి, సరికొత్త సవాళ్ళకు అనువుగా పటిష్ఠం చేయాలి. అత్యవసర పరిస్థితిలో అనుసరించాల్సిన ప్రామాణిక ఆచరణ విధానాలను (ఎస్ఓపీ) సిద్ధం చేయాలి. అదే సమయంలో అన్ని ఎయిర్లైన్స్, వివిధ దేశాల వైమానిక రంగాలు ఒక్కటై, సమాలోచనలు జరపాలి. పెరుగుతున్న ముప్పును పరస్పర సహకారం, సమన్వయంతో ఎలా ఎదుర్కోవాలో చూడాలి. -
మేధకు ‘కృత్రిమ’ గ్రహణం
మేధ మనిషికి ఒక వరం; అది ఒక్కోసారి గంద్రగోళంతో నిండడం ఒక శాపం. మేధ సవ్యంగా, స్పష్టంగా పనిచేసిప్పుడు మనిషి ఎన్నో అద్భుతాలు సృష్టించగలడు; అది అయోమయపు డొంకలా, బంకలా మారి వెర్రితలలు వేసినప్పుడు వాటిని తనే కూలదోసుకుని, తనూ పడిపోగలడు. కృత్రిమ మేధగా మనం అనువదించుకునే ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ మనిషి మేధ సృష్టించిన మహాద్భుతాలలో ఒకటి. ఆ కృత్రిమ మేధ తన సృష్టికి మూలమైన మనిషిలోని సహజ మేధను హరించి, తనే అసలు మేధగా మారబోతోందా!? ప్రస్తుతం మానవాళి ముఖాన వేలాడే ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఇది.‘కృత్రిమ మేధ’ ఈరోజున సర్వత్రా చర్చనీయమవుతున్న సాంకేతికాద్భుతం. ఆశాభావాన్ని మించి అది ఆందోళనను రేపడం చూస్తున్నాం. ఇంకోవైపు, అది ఆవిష్కరించే ఫలితాలకు ఆశ్చర్య చకితులమూ అవుతున్నాం. సృష్టికి ప్రతిసృష్టి అనే పౌరాణిక ఊహకు అత్యధునాతన ఉదాహరణ ఇదే. ఇది కృత్రిమమైన కాలో, చెయ్యో అమర్చుకోవడం కాదు, ఏకంగా కృత్రిమ మేధనే తెచ్చి అతికించుకోవడం. మనిషి తన మేధతో చేసే పనులన్నీ కృత్రిమ మేధతో చేయిస్తున్నాడు. సాహిత్య రంగంలోనే చూడండి... ఓ నాలుగైదు వాక్యాల కవితనిచ్చి దానిని కథగా మార్చమని అడిగితే కృత్రిమ మేధ క్షణాలలో మార్చి చూపిస్తోంది. గహనమైన ఓ బృహద్గ్రంథం పేరు మాత్రం ఇచ్చి అందులోని సారాంశాన్ని నాలుగైదు పేరాలలో చెప్పమని అడిగితే చటుక్కున చెబుతోంది. అంతే అవలీలగా, అవ్యవధిగా ఒక భాష నుంచి ఇంకో భాషకు తర్జుమా చేసి అందిస్తోంది. ఆకాశమే హద్దుగా ఏదైనా చేయగలుగుతోంది. అదింకా పూర్తిగా నిర్దుష్టతను, నిర్దిష్టతను తెచ్చుకుని ఉండకపోవచ్చు. కానీ, తెచ్చుకునే రోజూ ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. అదే జరిగి, మనిషి కృత్రిమ మేధకు పూర్తిగా దాసోహమై క్రమంగా తన సహజ మేధను కోల్పోయే పరిస్థితి వస్తుందా; కృత్రిమ మేధే సహజ మేధగా మారుతుందా? ఆసక్తి కన్నా ఎక్కువగా భయాన్ని రేపుతున్న ప్రశ్నలివి. కృత్రిమ మేధే సహజ మేధ కన్నా నాణ్యమైనదయ్యే అవకాశమూ లేకపోలేదు. ఎందుకంటే, సహజ మేధలో ఉండే గంద్రగోళం అందులో ఉండదు. అది ఎల్లవేళలా సూటిగా, స్పష్టంగానే కాదు; సహజ మేధకు సాధ్యం కానంత సత్వరంగా పనిచేస్తుంది. సహజ మేధలా అది అలసిపోవడం,మందగించడం లాంటివి ఉండవు. మనిషి అటువంటి కృత్రిమ మేధపై మరీ ఎక్కువగా ఆధారపడితే ఏమవుతుంది? లక్షల సంవత్సరాల మానవ అస్తిత్వంలో నిరుపయోగాలుగా మిగిలిన అపెండిక్స్, తోకఎముక లాంటి తొమ్మిది శరీర భాగాల సరసనే అతని సహజ మేధ కూడా చేరుతుందా?! ఇది మరీ విపరీత ఊహ అనుకున్నా, సహజ మేధ పదును తగ్గే ప్రమాదం మాత్రం తప్పకుండా ఉంటుంది. వివిధ సాంకేతిక సాధనాల వినియోగం దరిమిలా ఇతర శరీరభాగాల విషయంలో ఇప్పటికే మనకది అనుభవంలోకి వచ్చింది కూడా! ఇటీవలి మరో సాంకేతికాద్భుతమైన ఇంటర్నెట్ ఆధారిత సామాజిక మాధ్యమాలనే చూడండి; సహజ మేధకు పనీ, పదునూ తగ్గుతున్న ఆనవాళ్ళు వాటిలో ఇప్పటికే కనిపిస్తున్నాయి. నేటి శాస్త్రవిజ్ఞాన ఆవిష్కరణలన్నీ యూరప్ వేదికగా మతనిర్బంధాల నుంచి సహజ మేధ బయటపడి సాంçస్కృతిక పునరుజ్జీవన రూపంలో సంపూర్ణ వికాసం చెందుతూ వచ్చిన ఫలితాలేనని మనకు తెలుసు. మన దగ్గర ఉపనిషత్తుల కాలం అలాంటి వికాసాన్ని చూసింది. ఏదైనా ఒక అంశాన్ని అన్ని కోణాల నుంచీ కూలంకషంగా, సవిమర్శకంగా పరిశీలించడం, చర్చించడం, వ్యక్తీకరించడం అనే క్రమశిక్షణ అలా పాదుకుంటూ వచ్చింది. శ్రద్ధతోపాటు, తీరికా అందుకు అవకాశమిచ్చింది. పత్రికల వంటి ఆధునిక మాధ్యమాలలో స్థలకాల పరిమితులు ఆ క్రమశిక్షణను కొంత పలుచన చేసినా,గ్రంథముద్రణ ఆ లోటును చాలావరకూ పూరించగలిగింది. అదే సామాజిక మాధ్యమాలకు వస్తే, భావప్రకటన అనూహ్యమైన ప్రవాహవేగాన్ని తెచ్చుకోవడంతో ఆ క్రమశిక్షణ గణనీయంగా కొడి గట్టడం చూస్తున్నాం. వాటిలో అణువు నుంచి బ్రహ్మాండం వరకూ చర్చకు రాని అంశమే ఉండదు. కాకపోతే... లోతైన అధ్యయనమూ, అవగాహన, బహుముఖ పరిశీలనలకు బదులు రెండు, మూడు వాక్యాల అలవోక వ్యాఖ్యలకూ, పాక్షిక తీర్మానాలకూ, అపరిపక్వ నిర్ధారణలకూ అవి పరిమితమవు తున్నాయి. సహజ మేధలో తప్పిన ఆ క్రమశిక్షణను కృత్రిమమేధ అందిపుచ్చుకుంటున్నందుకు సంతోషించాలా, సహజ మేధ మొద్దుబారుతున్నందుకు విచారించాలా?! సామాజిక మాధ్యమాలు భావప్రకటనను అందరికీ అందుబాటులోకి తేవడం గొప్పే మేలే కానీ; సహజ మేధకు అది చేస్తున్న కీడు సంగతేమిటి? ఎలక్ట్రానిక్ మీడియా సహా అధునాతన మాధ్యమాలు ప్రజాస్వామికమైన చర్చనూ, అధ్యయనాన్నీ పలుచన చేస్తున్న తీరును నీల్ పోస్ట్మన్ అనే అమెరికన్ రచయిత ఎప్పుడో నలభై ఏళ్ల క్రితమే ఎత్తిచూపాడు. అబ్రహాం లింకన్ కాలం నుంచీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో గంటల తరబడి ఎంత కూలంకషంగా వాగ్వాదాలు జరిగేవో; ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక వాటి సమయం ఎలా హరించుకుపోయిందో ‘ఎమ్యూజింగ్ అవర్ సెల్వ్స్ టు డెత్’ అనే పుస్తకంలో ఆయన వివరిస్తాడు. ఆయన ప్రభావం మరెందరి మీదో పడి ప్రచార మాధ్యమాలు సహా అత్యాధునిక సాంకేతిక విజ్ఞాన దుష్ప్రభావాల వైపు చూపు మళ్లించింది. ఆ క్రమంలోనే క్రిస్ హెడ్జెస్ అనే అమెరికా రచయిత ‘ఎంపైర్ ఆఫ్ ఇల్యూజన్’ అనే పుస్తకం వెలువరించాడు. మనం కూడా ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం తోసుకువచ్చిందా?! -
ప్రమాదకర ప్రతిపాదన
విజ్ఞత మరిచినచోట విపరీతాలు చోటుచేసుకోవటంలో వింతేమీ లేదు. కావడ్ యాత్ర సందర్భంగా జారీచేసిన ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం మొన్న జూలైలో ఇచ్చిన తీర్పు అర్థం కాకనో లేక దాన్ని ధిక్కరించే ఉద్దేశమో... ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెండు ఆర్డినెన్సులు తీసుకురావాలని తాజాగా నిర్ణయించింది. ఆహారంలో లేదా పానీయాల్లో ఉమ్మివేయటం లేదా మానవ వ్యర్థాలతో దాన్ని కలుషితపరచటం పదేళ్ల శిక్షకు అర్హమయ్యే నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించటం, విక్రయదారుల పూర్తి వివరాలు అందరికీ కనబడేలా చేయటం ఈ ఆర్డినెన్సుల ఉద్దేశం. ఇప్పుడున్న చట్టం ప్రకారం కల్తీ కారణంగా మరణం సంభవిస్తే బాధ్యులైనవారికి మూడేళ్ల కఠిన శిక్ష విధించవచ్చు. తినే ఆహారపదార్థం రుచిగా, పరిశుభ్రంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరు కుంటారు. అలాంటి ఆహారం దొరికేచోటకే వెళ్తారు. హోటళ్లు మొదలుకొని సైకిళ్లపై తిరుగుతూ అమ్ముకునే విక్రయదారుల వరకూ అందరూ కమ్మనైన ఆహారపదార్థాలు వడ్డించి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఎవరైనా లాభార్జనకు కక్కుర్తిపడి నాసిరకం పదార్థాలను అంటగడితే అలాంటివారి పనిబట్టడానికి రకరకాల చట్టాలున్నాయి. ఆహారకల్తీని అరికట్ట డానికీ, హానికరమైన, కాలంచెల్లిన పదార్థాల విక్రయాన్ని నిరోధించటానికీ హోటళ్లపై, ఇతర దుకాణాలపై విజిలెన్సు విభాగాలు దాడులు నిర్వహిస్తుంటాయి. కేసులు పెడతాయి. అయితే ఇదంతా ఒక క్రమపద్ధతిలో జరగటం లేదని, ప్రభుత్వాలు మొక్కుబడిగా ఈ పనిచేస్తుంటాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఆహారం తిని అస్వస్థతకు గురయి పదుల సంఖ్యలో జనం ఆస్పత్రుల పాలైనప్పుడు ఆదరాబాదరాగా చర్యలు తీసుకోవటం కూడా కనబడుతుంటుంది. హఠాత్తుగా యూపీ సర్కారు ఈ చర్య తీసుకోవటం వెనక ఇలాంటి ఘటన ప్రభావం ఏమైనా ఉందా? పోనీ ఈ మాదిరి ఉదంతాల కారణంగా జనం తరచూ అస్వస్థులవుతున్న లేదా మరణిస్తున్న ఉదంతాలేమైనా గమనించారా? అసలు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకొచ్చాక ఎన్ని హోటళ్లపై, తినుబండారాల విక్రయ సంస్థలపై దాడులు నిర్వహించారు? అక్రమాలకు పాల్పడ్డారని తేలిన ఎంతమందిని శిక్షించారు? ఈ క్రమంలో ప్రస్తుత చట్టాలు నిరుపయోగంగా ఉన్నాయని భావిస్తే తగిన డేటాతో ఆ వివరాలు ప్రజల ముందు ఉంచొచ్చు. అప్పుడు ఒక సమగ్రమైన చట్టం అవసరమేనని అందరూ భావిస్తారు. కానీ యూపీలో జరుగుతున్నది అది కాదు. ఫలానా వర్గంవారు విక్రయించే పండ్లు లేదా ఇతర ఆహారపదార్థాలు అపరిశుభ్రంగా ఉంటాయని, వాటిని కలుషితం చేసి అమ్ముతున్నారని ఆరోపిస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. వాటి ఆధారంగా ప్రభుత్వం ఈ ఆర్డినెన్సులు తీసుకొస్తున్నట్టు కనబడుతోంది. దుశ్చర్యలకు పాల్పడేవారికి మతం, కులం ఉండవు. ఎక్కడో ఒకచోట జరిగిన ఘటనను వీడియో తీసి ఫలానా మతం వారంతా ఇలాగే చేస్తున్నారని వదంతులు వ్యాప్తిచేయటం విద్వేషాలు రెచ్చగొట్టడానికే తోడ్పడతాయి. ఇదే యూపీలోని ఘాజియాబాద్లో ఒక వ్యాపారి ఇంట్లో ఎనిమి దేళ్లుగా వంట మనిషిగా పనిచేస్తున్న రీనా కుమార్ అనే యువతి రోటీల్లో మూత్రాన్ని కలుపుతోందని ఆరోపిస్తూ పోలీసులు బుధవారం ఆరెస్టు చేశారని మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ మధ్య తెలంగాణలో అధికారులు వరస దాడులు నిర్వహించినప్పుడు అనేక హోటళ్లు, తినుబండారాల దుకాణాలు పాచిపోయిన పదార్థాలను అమ్ముతున్నాయని తేలింది. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిలో అన్ని మతాలకూ చెందినవారూ ఉన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఘనంగా జరిగే కావడ్ యాత్ర సమయంలో ఆ మార్గంలోని దుకాణాల్లో విక్రయదారులు తమ పేర్లు, ఇతర వివరాలు కనబడే బోర్డులు ప్రదర్శించాలని పోలీసులు మొన్న జూలైలో నోటీసులిచ్చారు. కావడ్ యాత్రికులు ‘స్వచ్ఛమైన శాకాహారులు’ గనుక అపశ్రుతులు చోటుచేసుకోకుండా ఈ పని చేశామని సంజాయిషీ ఇచ్చారు. దాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దుకాణంలో నచ్చిన, నాణ్యమైన, రుచికరమైన ఆహారం దొరుకుతున్నదో లేదో వినియోగదారులు చూస్తారు తప్ప, వాటి విక్రయదారు ఎవరన్నది పట్టించుకోరు. అలా పట్టించుకోవాలని యూపీ ప్రభుత్వం తహతహలాడుతున్నదని తాజా నిర్వాకం గమనిస్తే అర్థమవుతుంది. వినియోగదారుల విశ్వాసాన్ని పరిరక్షించటమే ఆర్డినెన్సుల ఉద్దేశమన్న ప్రభుత్వ వాదన నమ్మదగ్గదిగా లేదు. ఆ పని విక్రయదారులది! వారిలో అక్రమార్కులుంటే చర్య తీసుకోవటానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోతాయి. చెదురుమదురుగా జరిగిన ఉదంతాలను భూతద్దంలో చూపి జనాన్ని కలవరపెట్టడం సబబు కాదు.సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెనకున్న స్ఫూర్తి అర్థం చేసుకుంటే యూపీ ప్రభుత్వం ఇలాంటి ఆర్డినెన్సుల ఆలోచన చేసేది కాదు. యూపీలో గోసంరక్షణ, లవ్ జీహాద్ తదితర ఆరోపణలతో గుంపు దాడులు, గృహదహనాలు, హత్యోదంతాల వంటివి జరిగాయి. నిందితుల ఇళ్లూ, దుకాణాలూ బుల్డోజర్లతో నేలమట్టం చేయటం కూడా రివాజుగా మారింది. ఎన్కౌంటర్లు సరేసరి. ఆర్డినెన్సుల ప్రతిపాదన ఆ క్రమంలో మరో చర్య కావొచ్చన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధి కరువైందని యువత... ధరలు ఆకాశాన్నంటాయని సామాన్యులు మొత్తుకుంటున్నారు. విద్య, వైద్య రంగాలు పడకేశాయని గగ్గోలు పెడుతున్నారు. వీటిపై సమర్థవంతంగా వ్యవహరించి ప్రజల విశ్వా సాన్ని పొందాల్సివుండగా, ప్రజల్లో పరస్పర అవిశ్వాసాన్ని కలిగించే ఇలాంటి పనులకు పూను కోవటం ఏం న్యాయం? అసలు నేరానికి తగ్గ శిక్ష ఉండాలన్న ఇంగితం కరువైతే ఎలా? ఆర్డినెన్సుల ప్రతిపాదనపై యూపీ సర్కారు పునరాలోచన చేయాలి. -
మరో మహా యుద్ధం!
మరో ఎన్నికల సమరానికి తెర లేచింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తర్వాత దేశంలో అత్యధికంగా 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 13న, మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్కు నవంబర్ 13, 20లలో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టినా, సొంతకాళ్ళపై సర్కారు నడపలేని పరిస్థితి. కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి ఇది కొంత ఊపు తెచ్చినా, తాజా హర్యానా ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ ముచ్చటగా మూడోసారి గద్దెనెక్కడంతో బ్రేకులు పడ్డాయి. ఇక, ఇప్పుడీ మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలతో ఎన్నికల గోదాలో ఈ ఏడాది ఆఖరి పంచ్ ఏ పార్టీది అవుతుందన్నది తేలనుంది. దేశానికి వాణిజ్య కూడలి లాంటి కీలకమైన మహారాష్ట్రలో బీజేపీ సారథ్య మహాయుతి కూటమికీ, శివసేన (ఉద్ధవ్ బాల్ఠాక్రే) – జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ – శరద్పవార్) – కాంగ్రెస్ల మహా వికాస్ ఆఘాడీ (ఎంవీఏ) కూటమికీ మధ్య పోరు రసవత్తరమే. 2019 లోక్సభ ఎన్నికల్లో 48 స్థానాలకు 41 గెలిచిన బీజేపీ – సేన కూటమి, 2024లో 17కే పరిమితమైంది. ఇంత దెబ్బ తగిలినా, కొన్ని నెలలుగా సంక్షేమ పథకాలు, హైవేలపై టోల్ ఫీ రద్దు లాంటి చర్యలతో మహాయుతి, సీఎం ఏక్నాథ్ శిండే రాష్ట్రంలో మళ్ళీ అధికారం నిలుపుకోవాలని చూస్తున్నారు. అయితే, రెండేళ్ళలో రెండు పార్టీలను చీల్చి అనైతిక కూటమితో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేశారనే ప్రజా భావన, అధికారపక్ష వ్యతిరేకత, నిరుద్యోగం, ప్రాంతాల మధ్య అభివృద్ధిలో అంతరాలు ప్రతిపక్షానికే అనుకూలిస్తాయని ఓ అంచనా. ఇక, స్థానిక పార్టీలైన శివసేన, ఎన్సీపీలు రెండుగా చీలాక ఎవరి సత్తా ఏమిటో నిరూపించుకొనేందుకు ఈ అసెంబ్లీ పోరు సిసలైన క్షేత్రస్థాయి పరీక్ష కానుంది. హర్యానాతో బీజేపీ పుంజుకుంటే, ప్రతిపక్ష కూటమిలో ఎక్కువ సీట్లు కోరి పెద్దన్న పాత్ర పోషించాలనుకున్న కాంగ్రెస్ వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి. మోదీ, అమిత్షాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పర్యటిస్తున్న నేపథ్యంలో... విపక్ష కూటమి విభేదాలు మరిచి, సీట్ల సర్దుబాటులో పట్టువిడుపులు చూపి, తమ వ్యూహానికి పదును పెట్టుకోకుంటే చిక్కులు తప్పవు. జార్ఖండ్ అసెంబ్లీకి జేఎంఎంతో కలసి కూటమిగా పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. సీట్ల సర్దుబాటుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, ఇప్పటి దాకా చేసిన అభివృద్ధి పనులు తమను గెలిపిస్తాయని కూటమి నేతలు భావిస్తున్నారు. రెండు విడతల్లో జరగనున్న జార్ఖండ్ ఎన్నికలు ఆసక్తికరమైనవి. వాజ్పేయి హయాంలో 2000లో రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి జార్ఖండ్లో జేఎంఎం అయిదేళ్ళ పూర్తి కాలం అధికారంలో కొనసాగడం ఇదే తొలిసారి. గతంలో ఆ పార్టీ అనేక పర్యాయాలు అధికారంలోకి వచ్చినా, ప్రతిసారీ మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఊపును రాష్ట్రంలో కొనసాగించాలని ‘ఇండియా’ కూటమి ఉబలాటపడుతుంటే, హర్యానా ఫలితాల ఉత్సాహంతో ఈ గిరిజన రాష్ట్రంలో సరికొత్త సామాజిక సమీకరణాల ఆసరాగా అధికారంలోకి రావాలని బీజేపీ కూటమి భావిస్తోంది. ఖనిజ సంపద పుష్కలంగా ఉండే ఈ దక్షిణ బిహార్ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలంటూ ఒకప్పుడు హేమంత్ తండ్రి, జేఎంఎం అధినేత శిబూ సోరెన్ ఉద్యమం చేసి, విజయం సాధించారు. ఆనాటి నుంచి గిరిజన ఓటర్లు ఆ పార్టీకి రాజకీయ అండ. హేమంత్, ఆయన కూటమి ఆ గిరిజన ఓటుబ్యాంకును నమ్ముకున్నారు. దానికి తోడు అక్రమ ఆస్తుల కేసులో హేమంత్ అరెస్ట్ వ్యవహారాన్ని చూపి, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనుల ఆత్మగౌరవ అంశాన్ని లేవనెత్తాలని జేఎంఎం ప్రయత్నం. సంథాల్ పరగణా లాంటి మారుమూల ప్రాంతాల్లో ఆ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంటే, పట్టణ ప్రాంతాల్లో బీజేపీతో ఢీ అంటే ఢీ అనడానికి కాంగ్రెస్ సత్తా ఉపకరిస్తుందని ఆలోచన. ఇక, రాష్ట్రానికి తొలి సీఎం అయిన గిరిజనుడు బాబూలాల్ మరాండీ ప్రతిపక్ష నేతగా తమ వెంట ఉండడం బీజేపీకి కలిసొచ్చే అంశం. 2015 – 2020 మధ్య గిరిజనేతర నాయకత్వంతో ప్రయోగాలు చేసి దెబ్బతిన్న కాషాయపార్టీ పాఠాలు నేర్చుకుంది. ఈసారి స్థానిక వర్గాలతో వ్యూహాత్మక సర్దు బాట్లకు దిగింది. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్తో జట్టు కట్టి కుర్మీ ఓట్లపై కన్నేసింది. మాజీ సీఎం చంపాయ్ సోరెన్ను పార్టీలోకి తీసుకొని గిరిజన ప్రాంతాల్లోకి చొచ్చుకుపోవాలని చూస్తోంది. వెరసి, జార్ఖండ్ ఎన్నికలు సైతం ఆసక్తికరంగా మారాయి. పార్టీల వ్యూహాలు అటుంచితే, ఈవీఎంలపై వివాదం, ఈసీ వ్యవహార శైలిపై అనుమానాలకు మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు లేవు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 4 విడతల పోలింగ్కు సవాలక్ష కారణాలు చెప్పిన ఈసీ ఎక్కువ స్థానాలుండే అసెంబ్లీకి మాత్రం ఒకే విడత పోలింగ్ జరపడం విచిత్రమే. అలాగే, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ మంగళవారం ప్రకటించనున్నారని అస్సామ్ సీఎం హేమంత్ బిశ్వశర్మ ముందే ఎలా చెప్పగలిగారన్నదీ ప్రశ్నార్థకమే. ఇలాంటి వాటి వల్లే ఎన్నికల సంఘం స్వతంత్రత, పని తీరుపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. పోలింగ్ శాతం నుంచి ఫలితాల ప్రకటనపైనా విమర్శలెదుర్కొంటున్న ఈసీ ఇకనైనా పారదర్శకత పెంచుకోవాలి. తన నిజాయతీని నిరూపించుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యంపై నమ్మకం మిగులు తుంది. ఎందుకంటే, ఈ కీలక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు... వచ్చే ఏడాదికి దిక్సూచి కానున్నాయి. వెంటనే వచ్చే ఢిల్లీ, ఆ పైన జరిగే బీహార్ ఎన్నికలకు భూమికను కూడా సిద్ధం చేస్తాయి. -
పొరలు ఒలిచే రచయిత
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ సాహిత్య పురస్కారాన్ని ఈ ఏడాది గెలుచుకోవడం ద్వారా ఆ గౌరవం పొందిన తొలి ఆసియా రచయిత్రిగా నిలిచింది దక్షిణ కొరియాకు చెందిన హాన్ కాంగ్ (సరైన ఉచ్చారణ: హన్ గాన్ ). ప్రతి ఏడాదీ జరిగినట్టుగానే ఈసారీ అందరి అంచనాలు తలకిందులైనాయి. చైనా రచయిత్రి కాన్ షుయె, ఆస్ట్రేలియా రచయిత జెరాల్డ్ మర్నేన్, జపాన్ రచయిత హరూకి మురకామి నుంచి భారత మూలాలున్న సల్మాన్ రష్దీ వరకు ఎవరిని వరించొచ్చనే విషయంలో బెట్టింగ్స్ నడిచాయి. కానీ ‘చారిత్రక విషాదాలను ప్రతిఘటించే, మానవ దుర్బలత్వాన్ని ఎత్తి చూపే తీక్షణమైన కవితాత్మక వచనానికి’గానూ హాన్ కాంగ్కు ఈ పురస్కారాన్ని ప్రకటించింది స్వీడిష్ అకాడెమీ. 2016లో తన కొరియన్ ఆంగ్లానువాద నవల ‘ద వెజిటేరియన్ ’కు ‘ఇంటర్నేషనల్ బుకర్ ప్రెజ్’ గెలుచుకున్న హాన్ కాంగ్ ఆ పురస్కారం పొందిన తొలి కొరియన్ రచయిత కూడా కావడం విశేషం.దక్షిణ కొరియా ప్రసిద్ధ రచయిత హాన్ సుయెంగ్–వొన్ కూతురిగా 1970లో జన్మించిన హాన్ కాంగ్ సాహిత్య ప్రయాణం– మనుషుల్ని మనుషులే పీక్కు తినే ఈ సమాజంలో దానికి విరుగుడు ఏమిటనే శోధనతో మొదలైంది. ‘మనుషులు మొక్కలు కావాల్సిందని నా నమ్మకం’ అంటాడు 28 ఏళ్లకే క్షయ వ్యాధితో మరణించినప్పటికీ కొరియన్ సాహిత్య రంగం మీద ప్రబలమైన ముద్రవేసిన యీ సంగ్. అదొక నిరసన! ప్రస్తుతం సుమారు ఐదు కోట్ల జనాభా ఉన్న దక్షిణ కొరియా చరిత్రలో మాయని మచ్చలైన జపాన్ దురాక్రమణ (1910–45), కొరియన్ యుద్ధం(1950–53) తర్వాత, అలాంటిదే– సైనిక పాలనకు వ్యతిరేకంగా తలెత్తిన విద్యార్థుల తిరుగుబాటు (1980)ను అణచివేసే క్రమంలో జరిగిన ‘మే 18’ ఘటన. కాంగ్కు తొమ్మిదేళ్లున్నప్పడు ఆమె జన్మించిన గ్వాంగ్జు పట్టణం నుంచి వాళ్ల కుటుంబం సియోల్కు వెళ్లిపోయింది. సరిగ్గా నాలుగు నెలల తర్వాత అక్కడ వేలాది విద్యార్థులు, పౌరులు చనిపోయారు. తనకు ప్రత్యక్షంగా అనుభవం లేని ఈ ఘోరాలను పెద్దయ్యాక తెలుసుకునే క్రమంలో అంతులేని పశ్చాత్తాపానికి గురైంది కాంగ్. వాళ్ల కుటుంబం బతికుండటానికీ, ఇంకో కుటుంబం లేకుండాపోవడానికీ కారణమే లేదు. ఒక చిన్న నిర్ణయం వాళ్ల గతిని మార్చింది. గ్వాంగ్జు, ఆష్విట్స్, బోస్నియా– ప్రపంచమంతటా ఇదే హింస. అయితే, గాయాల పాలైనవారికి రక్తం ఇవ్వడం కోసం తమ భద్రతకు కూడా వెరవకుండా వేలాది మంది ఆసుపత్రుల ముందు వరుసలు కట్టిన ఫొటోలు కాంగ్లో ఉద్వేగాన్ని పుట్టించాయి. వర్తమానం గతాన్ని కాపాడుతుందా? బతికున్నవాళ్లు పోయినవాళ్లను కాపాడగలరా? ‘దొరక్కపోయినా జవాబుల కోసం రచయితలు వెతకడం మానరు’. ఎంతటి క్రౌర్యానికైనా మనిషి వెనుదీయడు; అదే సమయంలో, ‘రైల్వే ట్రాక్ మీద పడిపోయిన పసికందును కాపాడటానికి తన ప్రాణాలను సైతం లెక్కించడు’. మనిషిలోని ఈ రెండు ముఖాల ప్రహేళికను చిత్రిస్తూ ‘హ్యూమన్ యాక్ట్స్’ నవల రాసింది కాంగ్. రచనల్లో రాజకీయ ప్రకటనలు చేయాల్సిన అవసరం లేకుండా– మనిషిలోని అంతులేని క్రూరత్వాన్నీ, దాని మరుగునే ఉన్న మృదుత్వాన్నీ తవ్వి తీసింది.పుట్టిన రెండు గంటలకే చనిపోయి తన తల్లిదండ్రులు ఎన్నటికీ బయటపడలేని దుఃఖానికి కారణమైన తను ఎన్నడూ చూడని తన ‘అక్క’ హాన్ కాంగ్కు ఓ పుండులా మిగిలిపోయింది. ‘గాయం అనేది మాన్చుకోవాల్సిందో, బయటపడాల్సిందో కాదు; దాన్ని ఆలింగనం చేసుకోవాలి’ అంటుందామె. కాలం వల్ల, మరణం వల్ల, ఇతర విషాదాల వల్ల మనుషులు ఇతరులతో సంభాషించే శక్తిని కోల్పోతారు. అంధత్వం వల్ల రాయగలిగే, చదవగలిగే సామర్థ్యాన్ని కోల్పోయిన ఒక ప్రాచీన–గ్రీçకు బోధకుడు, తీవ్ర కుటుంబ విషాదాల వల్ల నోరు లేకుండాపోయిన ఆయన విద్యార్థిని పరస్పరం సమాచారాన్ని పంచుకోవడానికి చేరుకునే గౌరవపూరిత సామీప్యతను చిత్రించడానికి ‘గ్రీక్ లెసన్ ్స’ నవల రాసింది కాంగ్. మనిషికీ మనిషికీ మధ్య ఉండాల్సిన ‘నిరంతర మృదు స్పర్శ’ను నొక్కి చెప్పింది. తద్వారా భాషా సూక్ష్మతనూ, గెలుచుకోగలిగే జీవన సౌందర్యాన్నీ పట్టిచూపింది.హాన్ కాంగ్ ఎంత వేగంగా టైప్ చేయగలదంటే, ‘నమ్మండి నమ్మకపోండి’ లాంటి టీవీ షోలో పాల్గొనమని ఆమె మిత్రులు నవ్వుతూ అనేంతగా! ఆమె రచనల్లోని ధారకు సరితూగేట్టుగా టైప్ చేసే క్రమంలో పుట్టిన నొప్పులకు కొన్నాళ్లు వేళ్లు కదపలేని పరిస్థితి వచ్చింది. మణికట్టు నొప్పి వల్ల పెన్నుతోనూ రాయలేదు. కొంతకాలం పెన్నును తిరగేసి పట్టుకుని ఒక్కో అక్షరాన్ని నొక్కుతూ టైప్ చేసేది. కవయిత్రిగా మొదలైన కాంగ్కు సంగీతమూ తెలుసు. పాటలు రాసి, తానే స్వరపరిచి, ముందు వద్దనుకున్నా ఆ తర్వాత ఆ మొత్తం పాడి ఒక పది పాటల సీడీ విడుదల చేసింది. ఆమె రచనల్లోనూ ఈ సంగీతం మిళితమై ఉంటుంది. 1993లో మొదలైన కాంగ్ మూడు దశాబ్దాల సాహిత్య ప్రయాణంలో నవలలు, నవలికలు, కథలు, కవితలు, వ్యాసాలు రాసింది. ఎన్నో పురస్కారాలను అందుకుంది. తరచూ వేధించే తీవ్రమైన తలనొప్పులు తనను అణకువగా ఉంచడంలో సాయపడుతున్నాయంటుంది. ఆమెకు ఒక కొడుకు. నోబెల్ వార్త తెలిసినప్పుడు అతడితో కలిసి కాఫీ తాగుతోందట. 2114 సంవత్సరంలో ప్రచురించనున్న ‘ఫ్యూచర్ లైబ్రరీ ప్రాజెక్ట్’ కోసం ‘డియర్ సన్, మై బిలవ్డ్’ సమర్పించిందామె. అందులో ఏం రాసివుంటుంది? మనిషి హింసను ఎదుర్కొనే సున్నిత ప్రతీకారం మరింత మానవీయతను చూపడమేనని మరోసారి నొక్కి చెప్పివుంటుందా! -
సరికొత్త అధ్యాయమయ్యేనా?!
అక్టోబర్ 8 నాటి ఎన్నికల ఫలితాలు కేంద్రంలోని అధికార ఎన్డీఏ కూటమికీ, ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికీ సమాన స్కోర్లు అందించాయి. హర్యానాలో బీజేపీ, జమ్ము–కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) – కాంగ్రెస్ కూటమి విజయం సాధించడంతో లెక్క సమం అయింది. అయితే, ఈ ఫలితాల అసలు ప్రభావం ఈ అంకెల లెక్కకు మించినది. అన్ని అంచనాలనూ తలకిందులు చేస్తూ... హర్యానాలో వరుసగా మూడోసారి విజయంతో బీజేపీ రికార్డ్ సృష్టించడం ఒక ఎత్తయితే, జమ్ము–కశ్మీ ర్లో దాదాపు ఆరేళ్ళ పైచిలుకు తర్వాత మళ్ళీ ప్రజలెన్నుకున్న ప్రభుత్వం కొలువు తీరనుండడం మరో ఎత్తు. కశ్మీర్ ఎన్నికల ఫలితాలు అనేక కారణాల రీత్యా అత్యంత కీలకమైనవి. వాటి ప్రకంపనలు, ప్రభావం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కావు. లెఫ్టినెంట్ గవర్నర్కు ప్రాధాన్యమిచ్చి, శాసనవ్యవస్థ అధికారానికి రెక్కలు కత్తిరించిన పరిస్థితుల్లో కశ్మీర్లో ప్రభుత్వాన్ని నడపడం కత్తి మీద సాము కానుంది. అదే సమయంలో రాష్ట్రహోదాను పునరుద్ధరించాలన్న ప్రజాకాంక్ష అక్కడి ఎన్నికల ఫలితాల్లోనూ ప్రతిఫలించడంతో ఎన్సీ కూటమి ఆ దిశగా కృషి చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర హోదాపై ఎన్నికల వేళ ఇచ్చిన హామీని కేంద్ర పెద్దలు, బీజేపీ అధినాయకులు నిలబెట్టుకుంటారా, లేక తమ పార్టీ అధికారంలోకి రాలేదు గనక ‘అంతా తూbŒ ’ అనేస్తారా అన్నది చర్చనీయాంశమైంది. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు తర్వాత, రాష్ట్రాన్ని జమ్ము – కశ్మీర్, లద్దాఖ్ అంటూ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జరిగిన తొట్టతొలి ఎన్నికలు ఇవే. ఆసక్తిగా చూస్తుండగా, పోటాపోటీగా, అదే సమయంలో శాంతియుతంగా ఈ ఎన్నికలు సాగడం విశేషం. ఇటీవలి లోక్సభ ఎన్నికల కన్నా 5 శాతం పైచిలుకు ఎక్కువగా, పెద్దయెత్తున 63.9 శాతం వరకు ఓటింగ్ జరగడం గమనార్హం. అంటే, ఎన్నికల ప్రజాస్వామ్యం వైపు ప్రజల మొగ్గు సుస్పష్టం. జనమిచ్చిన మెజారిటీతో కశ్మీర్లో ఇక ఎన్సీ – కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కొలువు తీరనుంది. అతి పెద్ద పార్టీగా అవతరించిన ఎన్సీ పక్షాన ఒమర్ అబ్దుల్లా సీఎం కానున్నారు. ఇలా కశ్మీర్లో ప్రజాస్వామ్యబద్ధ ప్రభుత్వం తిరిగి రావడం ఒక శుభసూచన. ఎన్నికైన సర్కారుండడంతో స్థానిక ప్రజలు తమ కష్టనష్టాల పరిష్కారానికై ప్రజాప్రతినిధుల్ని ఆశ్రయించే వీలు చిక్కింది. అతివాద బీజేపీని ద్వితీయ స్థానానికే పరిమితం చేసి, మితవాద దృక్పథమున్న ఎన్సీకి పట్టం కట్టడం ద్వారా ప్రజాపాలనకై తాము తహతహలాడుతున్నట్టు కశ్మీరీలు చెప్పకనే చెప్పారు. ఒమర్ తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని ఎన్సీ – కాంగ్రెస్ కూటమి కశ్మీర్ లోయ వరకు మొత్తం 47 సీట్లలో 42 స్థానాలను గెలవడం విశేషం. ముస్లిమ్ జనాభా అధికంగా ఉండే లోయలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల స్థానిక ప్రజల వ్యతిరేకతకు అది అద్దం పడుతోంది. ఇక లోయలో ఖాతా తెరవలేకపోయినా, హిందువులు ఎక్కువైన జమ్ములో మాత్రం పోటీ చేసిన 43 సీట్లలో 29 గెలిచి, బీజేపీ తన బలం నిరూపించుకుంది. కాంగ్రెస్ మొత్తం 6 సీట్లలో విజయంతో మూడో స్థానంలో నిలిచింది. మెహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ 3 సీట్లు, ‘ఇంజనీర్’ రషీద్ సారథ్యంలోని వేర్పాటువాద అవామీ ఇత్తెహాద్ పార్టీ ఒక సీటే గెలిచి, బరిలో చతికిలబడ్డాయి. ఒకప్పుడు ఉమ్మడి కశ్మీర్కు సీఎంగా పనిచేసిన ఒమర్ ఇప్పుడు లద్దాఖ్ను విడగొట్టిన తర్వాత ఏర్పడ్డ విభజిత కశ్మీర్కు తొలి సీఎం. కానీ, ప్రభుత్వాన్ని నడపడం సులభం కాదు. సవాళ్ళు తప్పవు. ఆ మాట అంగీకరిస్తూనే, కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు పెట్టుకుంటామనీ, అదే సమయంలో రద్దయిన ప్రత్యేక ప్రతిపత్తి ఆర్టికల్ 370 పునరుద్ధరణకు డిమాండ్ చేస్తూనే ఉంటామనీ ఒమర్ స్పష్టం చేశారు. అది ఆయన అనివార్యత, లోయ ప్రజల ఆకాంక్ష. అయితే అంతకన్నా ముఖ్యం... జనం వర్గాలుగా చీలి, ఓటేసిన నేపథ్యంలో జమ్మూను వేరుగా చూడకుండా కలుపుకొని పోతూ, అక్కడి ప్రజాప్రతినిధులకు క్యాబినెట్లో పెద్దపీట వేయడం! ఆ సంగతి ఒమర్కూ తెలుసు. జమ్ముతో పోలిస్తే కశ్మీర్ లోయలోనే ఎక్కువ స్థానాలొచ్చినా రెండు ప్రాంతాలూ తమకు సమానమే ననీ, అందరి ప్రభుత్వంగా ప్రాంతాల మధ్య అంతరాన్ని తొలగిస్తామనీ ఆయన ప్రకటించారు.ఆర్టికల్ 370 పాత చరిత్ర, తప్పొప్పుల మాట అటుంచితే, అంత కన్నా ముఖ్యమైనది జమ్ము – కశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం! ఎందుకంటే, కేంద్రపాలిత ప్రాంతమయ్యే సరికి 370 రద్దుకు ముందు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నన్ని అధికారాలు ఉండవు. చివరకు పోలీసులు సైతం కేంద్రం కనుసన్నల్లోనే ఉంటారు. ఎన్నికలు పూర్తయి, ప్రజాప్రభుత్వం వచ్చింది గనక, తక్షణమే రాష్ట్రహోదా దిశగా అడుగులేయాలి. గత డిసెంబర్లో సుప్రీమ్కోర్ట్ సైతం సత్వరమే పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని చెప్పిందన్నది గమనార్హం. అన్ని రాజకీయ పక్షాలూ కోరు తున్నట్టు ఆ విషయంలో కేంద్రం తన హామీని నిలబెట్టుకోవాలి. కశ్మీర్లో సైతం అన్ని రాష్ట్ర ప్రభు త్వాల తరహాలోనే కొత్త సర్కార్ పని చేసే వీలు కల్పించాలి. కశ్మీర్కి ప్రత్యేక భౌగోళిక, సాంస్కృతిక చరిత్ర ఉన్న మాట నిజమే కానీ, దాన్ని గుర్తిస్తూనే ఆ ప్రాంతం మిగతా దేశంతో కలసి అడుగులు వేసేలా కృషి సాగాలి. యువతరంలో నిరుద్యోగం దేశంలోనే అధికంగా ఉన్న ఆ ప్రాంత సామాజిక, ఆర్థిక పురోగతి అందుకు కీలకం. అలాగే గత అయిదేళ్ళలో స్థానిక ఆకాంక్షలకు భిన్నంగా తీసుకున్న మైనింగ్, భూసేకరణ లాంటి విధానాల పునఃసమీక్ష అవసరం. లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్రం సహకరిస్తేనే అది సాధ్యం. లేదంటే, ఢిల్లీలో ఆప్ సర్కార్ తరహా కథే కశ్మీర్లో పునరావృతమవుతుంది. ఎన్నికలు జరిపి కూడా ప్రజాతీర్పును తోసిపుచ్చినట్టే అవుతుంది. పైగా, సరిహద్దులో శత్రు వులు పొంచి ఉండే సున్నితమైన ప్రాంతంలో అలాంటి రాజకీయ క్రీడలు ప్రమాదకరం. -
అనుకున్నదొకటి... అయ్యిందొకటి!
నాలుగు రోజుల క్రితం ఎగ్జిట్పోల్స్ అంచనాలు వచ్చాయి. మంగళవారం కౌంటింగ్ మొదల య్యాక ఉదయం 9 గంటల వేళ తొలి ఫలితాల సరళీ వచ్చింది. కానీ, ఆశ్చర్యకరంగా అంతా మారి పోయింది. హర్యానా, జమ్ము–కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలు, ఆశాభావాలు తలకిందుల య్యాయి. పోటాపోటీతో హంగ్ అవుతుందని బీజేపీ ఆశపడ్డ జమ్ము – కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ కూటమి గెలిచింది. హర్యానాలో కాంగ్రెస్దే విజయం అని ఎగ్జిట్పోల్స్ కోడై కూసినచోట అవన్నీ తోసిరాజని విజయంతో బీజేపీ అబ్బురపరిచింది. 1966 హర్యానా ఏర్పాటయ్యాక ఇప్పటి దాకా ఏ పార్టీ సాధించని హ్యాట్రిక్తో రికార్డ్ సృష్టించింది. పార్టీల నుంచి ఎగ్జిట్ పోల్స్ నిర్వాహకుల దాకా ప్రతి ఒక్కరికీ ఈ ఫలితాలు పాఠాలు నేర్పడం గమనార్హం. ఏ ఎన్నికా చిన్నది కాదనీ, ప్రతిదీ కీలకమేననీ, అతి విశ్వాసం పనికిరాదనీ మరోసారి ఈ ఫలితాలు తేల్చాయి. దశాబ్దం తర్వాత, అదీ 2019 ఆగస్ట్లో ఆర్టికల్ 370 రద్దు చేశాక, జమ్ము–కశ్మీర్ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించాక... తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ప్రజాతీర్పు ఆసక్తికరమే. కొన్నేళ్ళుగా ‘నయా కశ్మీర్’గా ఎంతో చేశామని చెప్పుకున్నప్పటికీ, జమ్మూను దాటి కశ్మీర్ లోయలో బీజేపీ తన ప్రభావం చూపలేకపోయింది. దోడా స్థానం గెలిచి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కశ్మీర్లో ఖాతా తెరవడం విశేషం. మరోపక్క హర్యానాలో ‘తిమ్మిని బమ్మిని చేసి బీజేపీ తెచ్చుకున్న గెలుపు’ అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఎన్నికల సంఘం (ఈసీ) వెబ్సైట్ ఫలితాల సరళిని చూపిన తీరు, ఈవీఎంల బ్యాటరీల శాతమూ అనుమానాస్పదమన్నది ఆ పార్టీ ఆక్షేపణ, ఆరోపణ. ఆ మధ్య లోక్ సభ ఎన్నికల్లో లానే ఇప్పుడూ ఈసీ ఆ ఆరోపణల్ని బాధ్యతారహితమంటూ కొట్టిపారేసింది. ఆరోపణల్ని పక్కనబెట్టి అసలు జరిగింది ఇప్పటికైనా పరిశీలించుకోవడం అన్ని వర్గాలకూ కీలకం. కశ్మీర్ సంగతి అటుంచి, హర్యానానే తీసుకుంటే... ‘జవాన్... కిసాన్... పహిల్వాన్’ నినాదంతో ముందుకెళ్ళిన కాంగ్రెస్ హర్యానాలో ఆ అంశాలు బీజేపీని మట్టికరిపిస్తాయని భావిస్తూ వచ్చింది. కానీ, జరిగింది వేరు. పదేళ్ళుగా హర్యానాను పాలిస్తున్న బీజేపీ పట్ల అధికారపక్ష వ్యతిరేకత ఒకటికి రెండింతలు ఉన్నప్పటికీ దాని నుంచి ఎందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ లబ్ధి పొందలేకపోయింది. అందుకు కారణాలను ఇప్పటికైనా ఆత్మావలోకనం చేసుకోవాలి. సమైక్య ప్రతిపక్షంగా బీజేపీకి అడ్డుకట్ట వేయాల్సింది పోయి, కాంగ్రెస్ తన బలాన్ని అతిగా అంచనా వేసుకొని భంగపడింది. ఆప్కి హర్యా నాలో చెప్పుకోదగిన స్థాయిలో ఓటు బ్యాంకు ఉందని తెలిసినా, సీట్ల సర్దుబాటు, పొత్తు విషయంలో కాంగ్రెస్ మొండిపట్టుతో పోవడం గట్టి దెబ్బ తీసింది. ఆప్ సీట్ల డిమాండ్ 20 దగ్గర మొదలై, 10 దగ్గరకు వచ్చి ఆగి, చివరకు 5 స్థానాల దగ్గరకు వచ్చి ఆగినా, పొత్తు పొడవనే లేదు. తప్పక గెలిచే 3 సీట్లిచ్చినా చాలు... ‘ఆప్’ ఓకే అంటుందని తెలిసినా, ఆఖరికి రాహుల్ సైతం పొత్తుకే మొగ్గు చూపినా, కాంగ్రెస్ దూతలు పడనివ్వలేదు. చివరకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అధిష్ఠానం జోక్యం చేసుకొని పరాజయానికి బాధ్యులెవరో చూడాలంటూ కుమారి సెల్జా గొంతు విప్పారు. దీన్నిబట్టి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్లో వర్గవిభేదాలకు కొదవ లేదని అర్థమవుతోంది. సీట్ల పంపిణీ వేళ భూపీందర్ సింగ్ హూడా తన వర్గం వారికే ఎక్కువ సీట్లివ్వడం ఇతర సీనియర్ నేతల్లో అసంతృప్తికి దారి తీసింది. ఆ అంతర్గత కుమ్ములాటలు ఆఖరికి మొత్తంగా రాష్ట్రంలో పరాజయానికీ దారి తీశాయన్నది ప్రాథమిక విశ్లేషణ. కాంగ్రెస్ ప్రధానంగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సహా జాతీయ అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. స్థానిక అంశాలతో పాటు సూక్ష్మపరిశీలనతో ఎన్నికల మేనేజ్మెంట్పై శ్రద్ధ పెట్టడం, సీఎంనూ, కొన్నిచోట్ల అభ్యర్థులనూ మార్చడం కమలనాధులకు కలిసొచ్చింది. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కనిపించని ఆర్ఎస్ఎస్ ఈసారి ప్రభావం చూపింది. అలాగే, ప్రధాని మోదీ సభలు, మాటలు నాన్ – జాట్ వర్గాలను ఆకర్షించాయని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పూర్తిగా జాట్లు – దళితుల ఓట్బ్యాంక్పైనే అతిగా ఆధారపడి, జాట్లు మినహా మిగతా వర్గాలు, ఓబీసీలు కాషాయఛత్రం కింద ఏకమవుతున్న సంగతి కనిపెట్టలేకపోవడం ఘోర తప్పిదమైంది. కాంగ్రెస్ పక్షాన సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై నెలకొన్న గందరగోళం, గతంలో సాగిన హుడా హయాం పట్ల అసంతృప్తి, ఆయనే మళ్ళీ సీఎం కావచ్చనే అభిప్రాయం ఓటర్లను కాంగ్రెస్ వైపు మొగ్గకుండా ఆపింది. మొత్తంగా రెండు పార్టీల మధ్య ఓట్ల శాతంలో తేడా 1 శాతం కన్నా తక్కువే. అయితే, సీట్ల పరంగా బీజేపీ గణనీయ విజయం సొంతం చేసుకోవడం క్షేత్రస్థాయి వ్యూహ∙ఫలితం. ఎగ్జిట్ పోల్స్లో ఓట్ల శాతం అంచనా కాస్త అటూ ఇటూగా అంతేవున్నా, వచ్చే సీట్ల సంఖ్యపై అతిగా జోస్యం చెప్పడం ఎదురుతన్నింది. వెరసి, ఎగ్జిట్ పోల్స్ కచ్చితత్వాన్ని అనుమానంలోకీ, నిర్వాహకుల్ని ఆత్మపరిశీలనలోకీ నెట్టాయి. ఆప్, కాంగ్రెస్ గనక కలసి పోటీ చేసివుంటే, ఆ రాష్ట్ర ఫలితాలు కచ్చితంగా మరోలా ఉండేవని ఓట్ షేర్ శాతాన్ని బట్టి విశ్లేషణ. కశ్మీర్లో వాస్తవం గుర్తించి, పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ఆ పని హర్యానాలో చేయకపోవడమే విడ్డూరం. ఇప్పుడిక రానున్న మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ ఎన్నికలపైకి ఫోకస్ మారనుంది. ఇప్పటికే హర్యానా ఫలితానికి కాంగ్రెస్ను ఆప్ తప్పుబట్టడం మొదలుపెట్టింది. మరి, ఫిబ్రవరిలోగా జరగనున్న ఢిల్లీ ఎన్నికలకైనా ఈ పార్టీలు జత కడతాయో, లేదో చూడాలి. ఏమైనా, తప్పక గెలుస్తారనుకున్న ఎన్నికల్లో సైతం ఆఖరి క్షణంలో కోరి చేతులారా ఓటమి కొని తెచ్చుకోవడం కాంగేయులకు పరిపాటి అయింది. క్షేత్రస్థాయి లోపాల్ని సరిదిద్దక, పోటీకి ముందే గెలుపు ధీమాతో అతిగా వ్యవహరిస్తే ఎవరికైనా ఎదురుదెబ్బలు ఖాయమని గుర్తిస్తే మంచిది. -
ఆకాశంలో సగానికి అన్యాయమా!
దేశం మొత్తాన్ని కుదిపేసిన ‘నిర్భయ’ ఉదంతం తర్వాత నాటి కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ వైవాహిక బంధంలో జరిగే అత్యాచారం (మారిటల్ రేప్) గురించి ప్రస్తావించి దాన్ని నేరంగా గుర్తించాలని సిఫార్సు చేసినప్పుడు ‘మర్యాదస్తులు’ నొచ్చుకున్నారు. ఆ చర్య వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేయదా... వారి పిల్లల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చదా అని చాలామంది ప్రశ్నించారు. ఈ అంశంపై అంతకు చాన్నాళ్ల ముందే వివిధ స్థాయిల్లో చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఆ విషయమై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు దాఖలు చేసిన అఫిడవిట్ మళ్లీ దాన్ని ఎజెండాలో తెచ్చింది. దాంపత్య జీవితంలో ఉండే లైంగిక సంబంధం పరస్పర అన్యోన్యత ఆధారంగా ఏర్పడుతుందనీ, దాన్ని కేవలం ‘సమ్మతి’ అనే పదంలో కుదించటం అసాధ్యమనీ అఫిడవిట్ అంటున్నది. గతంలోని భారత శిక్షాస్మృతి (ఐపీసీ) అయినా, దాని స్థానంలో అమల్లోకొచ్చిన భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) అయినా దాంపత్య జీవితంలో జరిగే అత్యాచారానికి మినహాయింపునిచ్చాయి. అత్యాచారానికి ఎలాంటి శిక్ష విధించాలో ఐపీసీ సెక్షన్ 375 నిర్దేశిస్తూ ఈ నేరానికి పాల్పడే భర్తకు మినహాయింపునిచ్చింది. బీఎన్ఎస్ఎస్లో ఈ సెక్షన్ 63గా మారింది. మినహాయింపు కూడా యధాతథంగా కొనసాగింది. భార్య వయస్సు 18 యేళ్లు దాటిన పక్షంలో భర్త జరిపే అత్యాచారానికి మినహాయింపు ఉంటుందని చట్టం చెబుతోంది. ఈ మినహాయింపును రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటిస్తే మొత్తం వివాహ వ్యవస్థపైనే అది తీవ్ర ప్రభావం చూపగలదని కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్ హెచ్చరిస్తోంది. చట్టంలో ఉన్న మినహాయింపు అత్యాచారం చేయటానికి భర్తకిచ్చే లైసెన్సు కాదంటూనే ఆ అంశాన్ని చట్టంవైపుగా కాక సామాజిక కోణం నుంచి చూడాలని అభిప్రాయపడింది. సంబంధిత పక్షాలన్నిటితో, రాష్ట్రాలతో చర్చించాక చట్టసభ తీసుకోవాల్సిన నిర్ణయం గనుక న్యాయస్థానం జోక్యం చేసుకోరాదని తెలిపింది. భార్య సమ్మతికి రక్షణ కల్పించేందుకు ఇప్పుడున్న చట్టాల్లో ఏర్పాట్లున్నాయనీ, గృహ హింస చట్టంవంటివి రక్షణగా నిలుస్తాయనీ చెప్పింది. నేరం ఒకటే అయినప్పుడు దాన్ని వేర్వేరు చోట్ల వేర్వేరు రకాలుగా ఎలా పరిగణిస్తారు? హత్య జరిగితే అది చోటుచేసుకున్న ప్రాంతాన్ని బట్టి దాన్ని హత్యాయత్నంగా అనుకోగలమా? పరిచితుడో, అపరిచితుడో మహిళపై అత్యాచారం చేస్తే దానికి శిక్ష ఉన్నప్పుడు... భర్త అదే పనిచేసినప్పుడు మినహాయింపు ఇవ్వటం ఏ రకంగా న్యాయం? 2022లో ఢిల్లీ హైకోర్టులో మారిటల్ రేప్పై పిటిషన్ దాఖలైనప్పుడు ఇద్దరు సభ్యుల ధర్మాసనంలో ఒకరు మారిటల్ రేప్ను నేరంగా పరిగణించాలని అభిప్రాయపడితే, అది సరికాదని మరో న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అనంతరం కర్ణాటక, గుజరాత్ హైకోర్టులు రెండూ మారిటల్ రేప్ను నేరంగా గుర్తించాల్సిందేనని తీర్పులు వెలువరించాయి. మన పౌరులైనా, విదేశీ పౌరులైనా చట్టం ముందు అందరూ సమానులనీ, అందరికీ సమానమైన రక్షణ లభిస్తుందనీ రాజ్యాంగంలోని 14వ అధికరణ చెబుతోంది. భర్త చేసే అత్యాచారం నేరంగా పరిగణించకూడదని మినహాయింపునివ్వటం వివాహ బంధంలోని మహిళకు ఈ అధికరణ వర్తించబోదని చెప్పటం కాదా? కానీ కేంద్రం అలా అనుకోవటం లేదు. ఇది పెళ్లయితే స్త్రీ తన హక్కును కోల్పోతుందని పరోక్షంగా చెప్పటం కాదా? మన దేశంలో వివాహ వ్యవస్థను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారన్న అఫిడవిట్ అభిప్రాయంతో విభేదించనవసరం లేదు. అలాగే వివాహ వ్యవస్థకుండే బహుముఖ పార్శా్వల్లో భార్యాభర్తల లైంగిక సంబంధం ఒకటి మాత్రమేనని చేసిన వాదననూ తప్పుబట్టనవసరం లేదు. కానీ సామాజిక విశ్వాసాలకూ, రాజ్యాంగ విలువలకూ మధ్య వైరుద్ధ్యం ఏర్పడినప్పుడు ఒక గణతంత్ర రాజ్యం రాజ్యాంగ విలువలకు మాత్రమే ప్రాధా న్యమివ్వాలి. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. దాదాపు అన్ని సమాజాల్లోనూ భిన్న ఆధిపత్య ధోరణులు అల్లుకుపోయి వుంటాయి. పితృస్వామిక సమాజాల్లో స్త్రీలపై ఆధిపత్యం సాధించటానికి పురుషుడి చేతిలో అత్యాచారం ఒక ఆయుధం. దీన్ని చాలా ముందుగా గుర్తించబట్టే సోవియెట్ యూనియన్ 1926లో మారిటల్ రేప్ను నేరంగా పరిగణిస్తూ చట్టం తీసుకొచ్చింది. ఆ తర్వాత 1950లో జెకోస్లోవేకియా, 1969లో పోలెండ్ ఈ మాదిరి చట్టాలు చేశాయి. ఇవన్నీ అప్పటికి సోషలిస్టు రాజ్యాలు. ప్రస్తుతం దాదాపు 150 దేశాలు మారిటల్ రేప్ను నేరంగా పరిగణిస్తున్నాయి. భార్య లైంగిక స్వయంప్రతిపత్తిని భర్త అయినా సరే దెబ్బతీయరాదనీ, అది నేరపూరిత చర్య అవుతుందనీ ఈ చట్టాలు భావిస్తున్నాయి. సకల ప్రజాస్వామ్య దేశాలకూ భారత్ తల్లిలాంటిదని చెప్పుకుంటున్న మనం మాత్రం మారిటల్ రేప్ విషయంలో ఇంకా తడబాటు ప్రదర్శించటం సబబేనా?దాంపత్య జీవనంలో భర్తలు సాగించే హింసను మన దగ్గర మహిళలు మౌనంగా భరిస్తున్నారు. భరించ శక్యం కాని స్థితి ఏర్పడినప్పుడు మాత్రమే బయటికొస్తున్నారు. భర్త లైంగిక నేరానికి పాల్పడుతున్నాడని వారిలో అతి కొద్దిమంది మాత్రమే వెల్లడిస్తున్నారు. స్నేహ అనే స్వచ్ఛంద సంస్థ డేటా ప్రకారం ముంబైలోని ధారవిలో ఈ సంస్థ ముందు 3,878 ఫిర్యాదులు దాఖలుకాగా అందులో 52.11 శాతం లైంగిక హింసకు సంబంధించినవే. 19.33 శాతంమంది తమ భర్త తమపై పదే పదే అత్యాచారానికి పాల్పడుతున్నాడని తెలిపారని ఆ సంస్థ అంటున్నది. భార్య అభీష్టాన్ని బేఖాతరు చేయటం నేరమన్న స్పృహ పురుషుడిలో కలగాలంటే మారిటల్ రేప్ను నేరంగా పరిగణించటం ఒక్కటే మార్గం. ఇందుకు భిన్నంగా ఆలోచించటం జనాభాలో సగానికి అన్యాయం చేయటమే. -
ప్రాణులు నేర్పే పాఠాలు
ప్రపంచమంతా పచ్చగా ఉందని, తెల్లనివన్నీ పాలని, నల్లనివన్నీ నీళ్లని అనుకుంటే పొరపాటే! రంగు రంగుల లోకంలోనే రకరకాల రాకాసి జంతు ప్రవృత్తులు ఉంటాయి. జంతుతతి నుంచి మనిషి వేరుపడి సహస్రాబ్దాలు గడచిపోయాయి. అయినా, మనుషుల్లోని జంతుప్రవృత్తి పూర్తిగా తొలగిపోలేదు. కొన్ని సందర్భాల్లో జంతువుల కంటే క్రూరంగా, దారుణంగా ప్రవర్తించే మనుషుల ఉదంతాలు వార్తలకెక్కుతుండటం మనకు తెలియనిదేమీ కాదు. ఆకుపచ్చని పచ్చికబయళ్లలో సుతిమెత్తని పచ్చిక మాత్రమే కాదు, విషపూరితమైన పసరిక పాములు కూడా ఉంటాయి. దట్టమైన అడవుల్లో పచ్చని చెట్లూ చేమలు, రంగు రంగుల పువ్వులూ పిట్టలూ పిచుకలూ, జంతువులూ మాత్రమే కాదు, ఏమరుపాటుగా దొరికితే మనుషులను పలారం చేసే క్రూరమృగాలు ఉంటాయి. కసిగా కాటు వేసే కాలసర్పాలు ఉంటాయి. కీకారణ్యాల్లో పొంచి ఉండే ప్రమాదాలన్నీ జనారణ్యంలోనూ ఉంటాయి. జనారణ్యంలో అడుగడుగునా తారసపడే చాలా మంది మనుషుల్లో జంతులక్షణాలు కనిపిస్తాయి. మనుషుల్లోని మేకపోతు గాంభీర్యాలు, గోడమీది పిల్లి వాలకాలు, గుంటనక్క తెలివితేటలు అపరిచితమైనవేమీ కాదు. మనుషుల్లోని జంతులక్షణాలను గుర్తించడం వల్లనే విష్ణుశర్మ ‘పంచతంత్రం’ రాశాడు. జంతు పాత్రల ద్వారా మనుషుల స్వభావాలను తేటతెల్లం చేస్తూ కథలు చెప్పాడు. ‘పంచతంత్రం’ కథలు చిన్నపిల్లలకు కూడా తేలికగా అర్థమవుతాయి. ఆ తర్వాత చాలాకాలానికి జార్జ్ ఆర్వెల్ ‘యానిమల్ ఫామ్’ రాశాడు. ఇది కూడా దాదాపు ‘పంచతంత్రం’లాంటి ప్రయోగమే! ‘పంచతంత్రం’ నాటికి, ‘యానిమల్ ఫామ్’ నాటికి సమాజం చాలా మారింది. ‘యానిమల్ ఫామ్’లో దోపిడీ సమాజంలో నలిగిపోతున్న మనుషుల పరిస్థితిని, శ్రమదోపిడీలో నలిగిపోయేవారి స్వేచ్ఛాభిలాషను, వారి స్వేచ్ఛకు తూట్లు పొడిచే శక్తుల కుతంత్రాలను జంతుపాత్రల ద్వారా ఆర్వెల్ చెప్పాడు. జంతువులను పాత్రలుగా చేసుకుని కథలు చెప్పడం ‘పంచతంత్రం’తోనే మొదలు కాలేదు.‘పంచతంత్రం’ దాదాపుగా క్రీస్తుశకం ఐదో శతాబ్ది నాటిది. అంతకు దాదాపు వెయ్యేళ్ల ముందే– క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దికి చెందిన గ్రీకు బానిస ఈసప్ ఇలాంటి కథలనే ఎన్నో చెప్పాడు. ప్రాచీన రోమన్ సాహిత్యంలోని ‘ఫెడ్రస్ కథలు’, గ్రీకు సాహిత్యంలోని బాబ్రియస్ కథలు ఇలాంటివే!ఫ్రెంచ్ సాహిత్యంలోని ‘లా ఫోంటేన్ ఫేబుల్స్’ కూడా ఇలాంటివే!‘లా ఫోంటేన్ ఫేబుల్స్’ రచయిత జీన్ డి లా ఫోంటేన్ ప్రాచ్య, పాశ్చాత్య దేశాల్లో ప్రచారంలో ఉన్న జంతువుల పాత్రలు ప్రధానంగా ఉన్న కథలను సేకరించి, పదిహేడో శతాబ్దిలో ఈ కథల పుస్తకాలను పన్నెండు భాగాలుగా వెలువరించాడు. జంతువులను ప్రధాన పాత్రలుగా చేసుకున్న ఈసప్ కథలు, పంచతంత్ర కథలు అనేక ప్రపంచ భాషల్లోకి అనువాదం పొందాయి. ఇవి ఈనాటికీ తాజాగానే ఉన్నాయి. ఇప్పటి సమాజంలో సంచ రిస్తున్న మనుషుల స్వభావాలు పంచతంత్ర కథల్లోనూ, ఈసప్ కథల్లోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. మనుషుల స్వభావాలను జంతువులకు ఆపాదించి చెప్పడం సమస్త భాషల సాహిత్యంలోనూ ఒక పురాతన కళాత్మక పద్ధతి. ఓపిక ఉన్న రచయితలు కథలు చెప్పారు. అనుభవం ఉన్నవాళ్లు సామెతలను సృష్టించారు. మన పురాణాల్లోనూ జంతువులు, పక్షులు పాత్రలుగా ఉన్న పిట్ట కథలు కనిపిస్తాయి. బైబిల్లోనూ జంతువుల గురించిన సామెతలు ఉన్నాయి. ‘సోమరీ! చీమల యొద్దకు వెళ్లుము. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును. కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును’– ఇది బైబిల్ సామెతల గ్రంథంలోనిది. చీమను చూసి కష్టపడటం నేర్చుకోవాలని సోమరులకు చేసే హెచ్చరిక ఇది.ప్రాచీన సాహిత్యంలో జంతుపాత్రలు ఉన్న కథలు, జంతువులపై ప్రాచుర్యంలో ఉన్న సామెతలు మానవ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని పెంపొందిస్తాయి. ప్రవర్తన లోపాలను ఎత్తిచూపి, సుతిమెత్తని హెచ్చరికలు చేస్తాయి. వీటిని పూర్తిగా ఆకళింపు చేసుకుంటే చాలు, మనుషులు మనుషుల్లా తయారవడం కష్టమేమీ కాదు. వీటిని పిట్ట కథల్లా కొట్టిపారేసే అతితెలివిపరులు జంతువుల కంటే హీనంగా మిగులుతారు. కానికాలం దాపురించినప్పుడు దిక్కుతోచని గడ్డు పరిస్థితుల్లో చిక్కుకుని, నానా అవస్థలు పడతారు.మహాభారతంలోని ‘కాకి హంస’ల కథ ఒక చిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక రాజ్యంలో ధనికుడైన వర్తకుడు ఉండేవాడు. ప్రతిరోజూ ఒక కాకి అతడి పెరటి గోడ మీద వాలేది. వర్తకుడి పిల్లలు దానికి తమ ఎంగిళ్లు పెట్టేవారు. ఎంగిళ్లు తిన్న కాకి వారికి బాగా మాలిమి అయింది. ఎంగిళ్లు తిని తెగబలిసిన కాకి ఒకనాడు ఏకంగా హంసలతో పందేనికి తెగబడి, భంగపడింది.ఈ కథను కురుక్షేత్రంలో శల్యుడు కర్ణుడికి చెప్పాడు. కర్ణుడికి కథలోని నీతి తలకెక్కలేదు. ఫలితం ఏమైందో మనకు తెలిసిందే! కొందరు ఇప్పటికీ ఎంగిళ్లు తిని బలిసిన కాకుల్లాగే ఎగిరెగిరి పడుతుంటారు. ఇలాంటి స్వభావం ఉన్నవాళ్లు రాజకీయ రంగంలోను, సాహితీ సాంస్కృతిక రంగాల్లోను, వివిధ రకాల వృత్తి ఉద్యోగాల్లోనూ ఉంటారు. ఎవరో పెట్టే ఎంగిలి మెతుకులు తిని బలిసి, విర్రవీగినంత కాలం కాకికి తన బలహీనత ఏమిటో ఎరుక పడనట్లే, ఇలాంటి స్వభావం ఉన్నవారికి ఎప్పటికీ ఈ కథల్లోని మర్మం అవగతం కాదు. మానవ సమాజంలో బతుకుతున్నా, వారు ఎప్పటికీ సంపూర్ణ మానవులు కాలేరు. -
వాయు కాలుష్యంపై మొద్దునిద్ర
దేశ రాజధానిలో 60 శాతం అధికంగా కుంభవృష్టి కురిపించి, వారంరోజులు ఆలస్యంగా నైరుతీ రుతుపవనాలు నిష్క్రమించాయో లేదో అక్కడి వాయు కాలుష్యంపై యథాప్రకారం చర్చ మొదలైంది. వాయు నాణ్యత మెరుగుదలకు తీసుకున్న చర్యలేమిటని గురువారం సర్వోన్నత న్యాయస్థానం హరియాణా, పంజాబ్ ప్రభుత్వాలను నిలదీసింది. వాయు కాలుష్యం ఉగ్రరూపం దాలుస్తోందని, రైతులు పంట వ్యర్థాలు తగులబెట్టకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. గోధుమ పంట చేతికొచ్చాక వ్యర్థాలను తొలగించటం ఖర్చుతో కూడుకున్నదన్న కారణంతో రైతులు అక్కడే తగలబెడతారు. ఆ మంటలకు పంటభూమిలోని పోషకాలు, పంటలు ఏపుగా పెరగడానికి తోడ్పడే సూక్ష్మజీవులు నశిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ వ్యర్థాలను సేకరించి ఇతరేతర పదార్థాలతో మిశ్రమం చేసి సేంద్రియ ఎరువుగా మార్చవచ్చని సూచిస్తున్నారు. కానీ దీన్ని రైతులకు చేరేయ టంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. రైతులకయ్యే వ్యయాన్ని భరిస్తే ఈ సమస్య చాలావరకూ తగ్గుతుందని గతంలో సుప్రీంకోర్టు ఢిల్లీ, పంజాబ్, హరియాణాలకు సలహా ఇచ్చింది. కానీ పట్టించుకున్నవారేరి? దానిసంగతలావుంచి సుప్రీం సూచనతో ఏర్పాటైన కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సీఏక్యూఎం) సమావేశాలే సక్రమంగా జరగటం లేదు. ఆగస్టు నెలాఖరున జరిగిన కమిషన్ సమావేశానికి 11 మంది సభ్యుల్లో అయిదుగురే హాజరయ్యారంటే...అందులో పంట వ్యర్థాల విషయంపై చర్చించనేలేదంటే కమిషన్ తీరుతెన్నులెలా వున్నాయో అర్థం చేసుకోవచ్చు.ఢిల్లీలో సాధారణంగా అక్టోబర్ మధ్యనుంచి వాయు కాలుష్యం పెరగటం మొదలై నవంబర్ నాటికి ఉగ్రరూపం దాలుస్తుంది. పర్యవసానంగా నగర జీవితం అస్తవ్యస్తమవుతుంది. పాఠశాలల పనివేళలు మార్చటం, ప్రభాతవేళ ఆరుబయట వ్యాయామాలు చేయొద్దని పౌరులకు సూచించటం వంటివి మొదలవుతాయి. వాయు కాలుష్యానికి మూలం ఎక్కడుందో గుర్తించటానికే దీర్ఘకాలం పట్టగా, అనంతర చర్యలైనా చురుగ్గా ముందుకు కదలటం లేదు. కాలుష్యంలో 70 శాతం వాటా వాహనాలదేనని ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) తేల్చి కూడా చాన్నాళ్లయింది. ఆ తర్వాతి స్థానం పరిశ్రమలదేనని కూడా ఆ నివేదిక చెప్పింది. కానీ ఆ దిశగా పెద్దగా అడుగులు పడలేదు. మన దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ శక్తిమంతమైనది. దాదాపు అయిదు లక్షల కోట్ల టర్నోవర్ గల ఆ పరిశ్రమ రెండున్నర కోట్లమందికి ఉపాధి కల్పిస్తోంది.అందువల్ల వాటి జోలికి పోయేందుకు ప్రభుత్వాలు సిద్ధపడవు సరికదా... వాహనాల అమ్మకాలు పెరగటానికి, ఆ పరిశ్రమల లాభార్జనకూ భిన్నరూపాల్లో తోడ్పాటునందిస్తాయి. మార్కెట్లోకొచ్చే వాహనాలు కాలుష్య కారకాలుగా ఉంటున్నాయని తేలినా నిర్లిప్తంగా ఉండిపోయిన సందర్భాలు గతంలో కోకొల్లలు. 2005 నుంచి అందుబాటులోకొచ్చిన బీఎస్ 3 (భారత్ స్టేజ్ 3) ప్రమాణాలున్న వాహనాలు అధికంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని ఆరోపణలొచ్చినా చర్య తీసుకునేందుకు ఏ వ్యవస్థా సిద్ధపడలేదు. ఆ ప్రమాణాలతో విడుదలైన ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతోపాటు కార్లు, భారీ కమర్షియల్ వాహనాలపై చర్యలు తీసుకోలేదు. చివరకు సుప్రీంకోర్టే బీఎస్ 3 ప్రమాణాలున్న వాహనాల విక్రయాన్ని 2017లో నిషేధించింది. వీటి సంగతలావుంచి ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచటానికి అవసరమైన పథకాల రూపకల్పన సక్రమంగా ఉండదు. త్వరితగతిన పనులు పూర్తిచేసుకోవాలంటే సొంత వాహనాలే దిక్కన్న అభిప్రాయం పౌరుల్లో స్థిరపడిపోయింది. దీనికి తోడు ప్రజా రవాణా కోసం ఇప్పటికీ చాలా రాష్ట్రాలు డీజిల్ బస్సులే వాడుతున్నాయి. విద్యుత్, సీఎన్జీ వాహనాల వినియోగం మొదలైనా వాటి సంఖ్య స్వల్పం. ఢిల్లీ మెట్రో నిడివి ప్రస్తుతం దాదాపు 400 కిలోమీటర్ల మేర ఉంది. దాన్నింకా పెంచటానికి కృషిచేస్తున్నారు. ఈ సర్వీసును బస్సులతో అనుసంధానించి మారుమూల ప్రాంతాలకు కూడా సులభంగా వెళ్లగలిగే సదుపాయం కల్పిస్తే సొంత వాహనాల వినియోగం తగ్గుతుంది. ఇక ఏదైనా అనుకోనిది జరిగితే తప్ప పరిశ్రమలపై సాధారణంగా ప్రభుత్వాలు చర్యలకు సిద్ధపడవు. నిర్దిష్ట కాల వ్యవధిలో నిర్వహించే తనిఖీలు చాలా సందర్భాల్లో లాంఛనప్రాయమవుతాయి. జరిమానాల వంటివి విధించినా అవి నామ మాత్రంగానే ఉంటున్నాయి. ఉపాధి కల్పనకూ, సంపద వృద్ధి కావటానికీ పరిశ్రమలు అవసరమే. కానీ ప్రజారోగ్యంతో ఆటలాడుకునేవారినీ, చట్టాలను ఉల్లంఘించేవారినీ దండించాల్సిందే. వాయు కాలుష్యంపై విచారణ సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్య గమనించదగ్గది. రుతుపవనాలు నిష్క్రమించి శీతాకాలం ఇంకా ప్రవేశించని అక్టోబర్ నెల ఒకప్పుడు ఢిల్లీలో ఎంతో ఆహ్లాదకరంగా ఉండేదని న్యాయమూర్తులు అన్న మాటల్లో వాస్తవం ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకూ ఉండే ఆ వాతావరణం ఇప్పుడు ఎందుకు మాయమైంది? కారకులెవరు? చిత్తశుద్ధితో ఆలోచించాలి. కాలుష్యంలో తమ బాధ్యత లేదని, పొరుగు రాష్ట్రమే ఈ సమస్యకు కారణమని పంజాబ్, హరియాణా, రాజస్తాన్లు పరస్పరారోపణలు చేసుకోవటం రివాజుగా మారింది. అటు కేంద్రం సైతం మొత్తం భారాన్ని రాష్ట్రాలపై వేసి తప్పుకుంటోంది. ఏతావాతా సమస్య యథాత థంగా మిగిలిపోతున్నది. ఈ వైఖరి సరికాదు. ఇటీవల వెలువడిన లాన్సెట్ నివేదిక వాయు కాలుష్యం వల్ల ఢిల్లీలో ఏటా 12,000మంది మరణిస్తున్నారని తేల్చింది. అందుకే అందరూ మేల్కొ నాల్సిన సమయమిది. ప్రభుత్వాలన్నీ కలిసికట్టుగా కార్యాచరణకు దిగి తమవంతు బాధ్యత నెరవేర్చటంతోపాటు కాలుష్యంపై ప్రజల్లో చైతన్యం కలిగించాలి. -
ప్రమాదంలో ప్రపంచం
వరస సంక్షోభాలతో నిరంతరం నెత్తురోడే పశ్చిమాసియా అందరూ చూస్తుండగానే పూర్తి స్థాయి యుద్ధంలోకి జారుకున్నట్టు కనబడుతోంది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్, మరో ప్రధాన నగరం జెరూసలేంలపై మంగళవారం రాత్రి ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడటం, ఆ వెంటనే హెజ్బొల్లా మిలిటెంట్లు టెల్అవీవ్లోని మొసాద్ ప్రధాన కార్యాలయంపై క్షిపణులతో దాడిచేయటం...ఇజ్రాయెల్కు దన్నుగా తాము సైతం రంగంలోకి దిగుతామని అమెరికా హెచ్చరించటం పరిస్థితులు వికటిస్తున్నాయన్న సంకేతాలిస్తున్నాయి. ఇరాన్–ఇజ్రాయెల్ నేరుగా తలపడటం ఇక లాంఛనం. ఒకపక్క తన కవ్వింపు చర్యలే ఇరాన్ను ప్రతీకారదాడికి పురిగొల్పాయని బట్టబయలైనా ఇరాన్ దాడిని వ్యతిరేకించలేదన్న కారణంతో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ను ‘అవాంఛిత వ్యక్తి’గా ప్రకటించి, తమ దేశంలో అడుగుపెట్టనీయబోమని నిషేధం విధించటం ఇజ్రాయెల్ తెంపరితనానికి నిదర్శనం. శరపరంపరగా వచ్చిపడుతున్న క్షిపణులను పూర్తిగా నిరోధించటం ఇజ్రాయెల్ గర్వంగా చెప్పుకునే రక్షణ ఛత్రం ఐరన్ డోమ్ వల్ల కూడా కాలేదంటే ఇరాన్ దాడి తీవ్రత ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రాణనష్టం పెద్దగా లేకపోయినా భారీ భవనాలు నేలమట్టం కావటం, పౌరులు కకావికలై పరుగులు తీయటం, ప్రభుత్వాదేశాలతో పది లక్షలమంది ప్రజలు బంకర్లలో తలదాచుకోవటం ఇటీవలికాలంలో ఇదే మొదటిసారి. గాజాలో తన లక్ష్యం పూర్తిచేయగలిగానని భావిస్తున్న ఇజ్రాయెల్... రెండురోజుల క్రితం లెబనాన్పై పంజా విసరడం ప్రారంభించింది. హెజ్బొల్లా నేత నస్రల్లాను హతమార్చింది. ఆ సమయానికి ఆయనతో పాటున్న తమ రెవల్యూషనరీ గార్డ్స్ జనరల్ అబ్బాస్ నిల్ఫోరుషాన్ సైతం ప్రాణాలు కోల్పోవటం ఇరాన్ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే అది తాజా దాడికి దిగింది. నిజానికి ఇరాన్ను ఏనాడూ ఇజ్రాయెల్ ప్రశాంతంగా ఉండనీయలేదు. అది అణ్వాయుధ దేశంగా మారవచ్చునన్న భీతితో గూఢచర్యం సాగిస్తూ పేరెన్నికగన్న శాస్త్రవేత్తలను... ప్రభుత్వంలో, సైన్యంలో కీలకపాత్ర పోషిస్తున్న వారిని హతమార్చటం ఇజ్రాయెల్ ఒక విధానంగా పెట్టుకుంది. మొన్న ఏప్రిల్లో సిరియాలోని డమాస్కస్లో ఇజ్రాయెల్ సాగించిన దాడిలో ఇరాన్కు చెందిన సైనిక నిపుణుడు, దౌత్యవేత్త మరణించారు. జూలైలో హెజ్బొల్లా నాయకుడు ఇస్మాయెల్ హనియేను ఇరాన్లో ఉండగా ఇజ్రాయెల్ హతమార్చింది. ఇలాంటి ఉదంతాలు జరిగిన ప్రతిసారీ డ్రోన్లతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగినా వాటివల్ల ఏనాడూ ఇజ్రాయెల్ పెద్దగా నష్టపోలేదు. ఇరాన్ దాడి అనంతరం అంతర్జాతీయ మార్కెట్లో బుధవారం ముడి చమురు ధర భగ్గున మండిన తీరు సమీప భవిష్యత్తులో ముంచుకురాబోతున్న ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తోంది. ఇజ్రా యెల్ దాదాపు ఏడాదికాలంగా అన్ని రకాల వినతులనూ బేఖాతరు చేసి గాజా, వెస్ట్బ్యాంక్లలో సాగిస్తున్న నరమేధం తొలుత పశ్చిమాసియానూ, ఆ తర్వాత ప్రపంచాన్నీ యుద్ధం అంచుల్లోకి నెడుతున్నదని విశ్లేషకులు హెచ్చరిస్తూనే ఉన్నారు. నిరుడు అక్టోబర్ మొదటివారంలో ఇజ్రాయెల్ భూభాగంలోకి హమాస్ మిలిటెంట్లు చొరబడి 1,200 మంది పౌరులను హతమార్చి, మరో 695 మందిని అపహరించుకుపోవటం ద్వారా హమాస్ దుస్సాహసానికి పాల్పడింది. ఇది ఉగ్రవాద చర్యగా ప్రకటించిన దేశాలు సైతం అనంతర ఇజ్రాయెల్ దాడులను అంగీకరించలేదు. ఐక్యరాజ్య సమితి ఖండించింది. అమెరికా కూడా గాజా నరమేధం విరమించుకోవాలని ఇజ్రాయెల్ను కోరిన మాట వాస్తవం. అలాగని అది ఏనాడూ ఇజ్రాయెల్కు ఆయుధ సరఫరా ఆపలేదు. ఫలితంగా ఇంతవరకూ దాదాపు 45,000 మంది గాజా పౌరులు మరణించారని అంటున్నారు. ఒకసారంటూ యుద్ధం మొదలైతే దాని గమనం, ముగింపు ఎవరి చేతుల్లోనూ ఉండవు. దాని తోవ అది వెదుక్కుంటుంది. రెండో ప్రపంచ యుద్ధ పర్యవసానాలు చూశాక మళ్లీ ఆ ఉత్పాతం జరగనీయరాదని ప్రపంచ దేశాలు ప్రతినబూనాయి. ఎందుకంటే ఆ యుద్ధంలో అయిదున్నర కోట్ల మంది సాధారణ పౌరులు, మరో రెండున్నరకోట్లమంది సైనికులు మరణించారు. కోట్లాదిమంది క్షతగాత్రులయ్యారు. ఒక్క సోవియెట్ యూనియన్లోనే దాదాపు రెండున్నర కోట్లమంది మరణించారు. మరో 90 లక్షలమంది వరకూ వ్యాధుల బారినపడ్డారు. కానీ విస్తరణ కాంక్షతో తహతహ లాడే అగ్రరాజ్యాలు తమ ౖ¯ð జం వదులుకోలేదు. ఆ వెనువెంటనే తమకు అలవాటైన యుద్ధ క్రీడ ప్రారంభించాయి. వర్తమాన పరిణామాలు దాని పర్యవసానమే. న్యూయార్క్ టైమ్స్ పరిశోధక పాత్రికేయురాలు అనీ జాకబ్సన్ యుద్ధం వల్ల మానవాళికి కలగబోయే హాని గురించి చెప్పిన అంశాలైనా అగ్రరాజ్యాల కళ్లు తెరిపించాలి. అణ్వాయుధ యుద్ధం కేవలం 72 నిమిషాల్లో భూగోళంపై 60 శాతం జనాభాను తుడిచిపెడుతుందని హెచ్చరించారామె. ఇజ్రాయెల్కు అమెరికా అండదండలున్నట్టే ఇరాన్కు రష్యా, చైనాల ఆశీస్సులున్నాయి. దానికి హమాస్, హిజ్బొల్లా గ్రూపులు, యెమెన్లోని హౌతీలు, ఇరాక్, సిరియాల్లోని షియా మిలిటెంటు సంస్థలూ మరింత దగ్గరవుతాయి. ఇజ్రాయెల్తో సాన్నిహిత్యం నెరపుతున్న ఈజిప్టు, జోర్డాన్లకూ, ఆ తోవనే వెళ్తున్న సౌదీ అరేబియాకూ సంకటస్థితి ఏర్పడుతుంది. ఈ వైరిపక్షాలన్నీ కొంత హెచ్చు తగ్గులతో ప్రపంచాన్ని సర్వనాశనం చేయగల మారణాయుధాలతో సంసిద్ధంగా ఉన్నాయి. అందుకే పాలస్తీనా ఆవిర్భావానికి సహకరించటం, దుందుడుకు విధానాలకు స్వస్తిపలకడం వంటి చర్యలే పశ్చిమాసియాకూ... మొత్తం ప్రపంచానికీ ప్రశాంతతనిస్తాయని ఇజ్రాయెల్ గుర్తించాలి. అమెరికా వివేకంతో మెలిగి సామరస్య ధోరణులకు తోడ్పాటునందించాలి. -
ప్రాణాలతో చెలగాటమా?
దేశంలోని అత్యున్నత కేంద్రీయ ఔషధ నియంత్రణ అధారిటీ తన తాజా నివేదికలో వెల్లడించిన అంశాలు సంచలనం రేపుతున్నాయి. మనం తరచూ వాడే మందుల్లో 50కి పైగా ఔషధాల నమూనాలు ‘నిర్ణీత నాణ్యతాప్రమాణాలకు తగినట్టు లేనివి’(ఎన్ఎస్క్యూ) అంటూ నివేదిక వెల్లడించింది. జ్వరం, కడుపులో పూత లాంటి వాటికి వాడే ప్యారాసెటమాల్, పాన్–డి మందులతో సహా విటమిన్ సప్లిమెంట్లు, షుగర్ వ్యాధి మాత్రలు, యాంటీ బయాటిక్స్ సైతం ఆ జాబితాలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. నాసిరకం మందులను ఉత్పత్తి చేసినవాటిలో కొన్ని పేరున్న సంస్థల పేర్లూ ఉండేసరికి ఆందోళన రెట్టింపవుతోంది. అమాయక ప్రజల ఆరోగ్యభద్రతకై అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. అదే సమయంలో ఔషధాల తయారీకి ప్రధాన కేంద్రంగా, అంతర్జాతీ యంగా ఔషధాల ఎగుమతిలో అగ్రగామిగా, ‘ప్రపంచానికే మందుల అంగడి’గా భారతదేశానికి గుర్తింపున్న నేపథ్యంలో నాణ్యతపై మనం మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని అర్థమవుతోంది. గత ఏడాదీ 51 ఔషధాలు నాణ్యతా పరీక్షలో విఫలమయ్యాయి. ప్రభుత్వ ఔషధ విభాగం నిరుడు 1,306 నమూనాలను పరీక్షించినప్పుడు, అది బయటపడింది. నిజానికి, భారతదేశంలో ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల నాణ్యత అంశం ‘1940 నాటి ఔషధ, సౌందర్య ఉత్పత్తుల చట్టం’ కిందకు వస్తుంది. ఆ చట్టం ప్రకారమే వీటి పర్యవేక్షణ, నియంత్రణ సాగుతుంది. ఔషధ నియంత్రణ అధికారులు క్రమం తప్పకుండా మార్కెట్ నుంచి ఔషధ నమూనాలను సేకరించి, పరీక్షలు చేస్తుంటారు. చట్టప్రకారం నిర్దేశించిన ప్రమాణాలను పాటించని ఉత్పత్తుల గురించి ప్రతి నెలా నివేదిక విడుదల చేస్తారు. కేంద్రీయ ఔషధ నాణ్యతా నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) సర్వసాధారణంగా ఇలా పరీక్షలు జరపడం, వాటి ఫలితాలనూ – ఆ పరీక్షల్లో తప్పిన మందుల జాబితానూ ఎప్పటి కప్పుడు వెల్లడించడం కచ్చితంగా మంచిదే. అన్ని వర్గాలూ అప్రమత్తమయ్యే వీలు చిక్కుతుంది. అయితే, సామాన్య జనం నిత్యం వాడే యాంటీ బయాటిక్స్, షుగర్, బీపీల మందులు కూడా నిర్ణీత నాణ్యతా ప్రమాణాల్లో విఫలమవుతున్నట్టు ఇటీవలి నివేదికల్లో వెల్లడవడం ఆందోళన రేపుతోంది. పైగా, ప్రమాణాలు పాటించని జాబితాలోని మందులు ఎక్కువవుతూ ఉండడం గమనార్హం. తాజాగా ఈ ఆగస్టులో చేసిన పరీక్షల్లో కొన్ని రకాల సీ విటమిన్, బీ కాంప్లెక్స్ మందులూ నాసి రకమేనని తేలింది. భారతీయ ఔషధ ప్రబంధం నిర్దేశాలకు అనుగుణంగా కొన్ని మందులు ‘విలీన పరీక్ష’లో, మరికొన్ని ‘నీటి పరీక్ష’లో విఫలమైనట్టు అధికారిక కథనం. నాణ్యత మాట అటుంచితే, కొన్ని బ్యాచ్ల ఔషధాలు అచ్చంగా నకిలీవట! ఇది ప్రజల ఆరోగ్యానికి హానికరమే కాక, విశ్వ వేదికపై ఔషధ సరఫరాదారుగా భారతదేశ పేరుప్రతిష్ఠలకు భంగకరం కూడా! సహజంగానే పలు మందుల కంపెనీలు తాము తయారు చేస్తున్నవి అన్ని రకాలుగా నాణ్యమైనవేనంటూ ప్రతిస్పందిస్తున్నాయి. నాణ్యత లేకపోవడానికీ – నకిలీ మందులకూ చాలా తేడా ఉందనీ, దాన్ని స్పష్టంగా గుర్తించాలనీ పేర్కొంటున్నాయి. అది నిజమే కానీ, అసలు అనుమానాలే రాని రీతిలో, లోపరహితంగా మందుల తయారీ బాధ్యత ఆ రంగంలో ఉన్న తమదేనని ఆ సంస్థలు మరువరాదు. ఆ మాటకొస్తే, ఈ రంగానికి ఉన్న ప్రతిష్ఠను కాపాడేందుకు ముందుగా అవే చొరవ తీసుకోవాలి. ఔషధ రంగం మన దేశానికి అత్యంత కీలకమైనది. దేశంలో కనీసం 10 వేల దాకా ఔషధ తయారీ యూనిట్లున్నాయి. దాదాపు 200కు పైగా దేశాలకు భారత్ నుంచి మందులు సరఫరా అవుతుంటాయి. మన ఔషధ విపణి పరిమాణం దాదాపు 5 వేల కోట్ల డాలర్లు. పైగా సరసమైన ధరలకే మందులు అందిస్తున్న పేరున్న మన మార్కెట్ ప్రస్తుతం రెండంకెల వృద్ధి రేటుతో పురోగమిస్తోంది. కోవిడ్ సమయంలోనే కాక, విడిగానూ అనేక రోగాలకు టీకాలు అందించడంలో భారత్ అగ్రశ్రేణిలో నిలిచిందని పాలకులు పదే పదే చెప్పుకొస్తుంటారు. అలాంటప్పుడు మన దగ్గర తయారయ్యే ఔషధాల నాణ్యతపై మరింత అప్రమత్తత తప్పనిసరి కదా! దురదృష్టవశాత్తూ, అందులోనే మనం వెనుకబడుతున్నాం. గ్యాంబియా, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాల్లో సంభవించిన బాలల మరణాలకు భారతీయ తయారీ ఔషధాలే కారణమంటూ ఆ మధ్య అంతర్జాతీయ వివాదాలు తలెత్తిన సంగతి విస్మరించలేం. అంటే బయటపడ్డ కొన్ని మందుల విషయంలోనే కాదు... మొత్తంగా ఔషధతయారీ, నాణ్యత, నియంత్రణ వ్యవస్థపై లోతుగా దృష్టి పెట్టాల్సి ఉంది. ఎగుమతి మాట దేవుడెరుగు... ముందుగా ప్రభుత్వాలకైనా, ఔషధ తయారీ సంస్థలకైనా ప్రజారోగ్య భద్రత ముఖ్యం కావాలి. అందులో ఎవరు రాజీపడినా అమాయకుల ప్రాణాలతో చెలగా టమే. అది సహించరానిది, భరించ లేనిది. అందువల్ల నాసిరకమనీ, నకిలీవనీ తెలిసిన మందులను మార్కెట్ నుంచి వెంటనే వెనక్కి రప్పించాలి. అందుకు చట్టం, తగిన విధివిధానాలు లేకపోలేదు. కానీ, వాటిని ఏ మేరకు అమలు చేస్తున్నారన్నది చెప్పలేని పరిస్థితి. అది మారాలి. అలాగే, నాణ్యతా పరీక్షల్లో లోటుపాట్లు లేకుండా చూడడం కీలకం. పరీక్షల కోసం నమూనాలను ఎప్పుడు తీసుకు న్నదీ, ఎన్ని తీసుకున్నదీ ప్రకటించడం వల్ల మరింత పారదర్శకత నెలకొంటుంది. కొత్త అనుమానా లకు ఆస్కారమివ్వకుండా పోతుంది. విదేశాల్లోనే కాక, ప్రస్తుతం స్వదేశంలోనూ ఔషధాలపై సందే హాలు ముసురుకుంటున్న వేళ ప్రపంచస్థాయి ప్రమాణాలు అందుకొనేలా మన మందుల తయారీ సాగాలి. అవసరమైతే అందుకు అంతర్జాతీయ నియంత్రణ సంస్థలతో కలసి అడుగులు వేయాలి. ఇంటా బయటా మన ఔషధాలు ఆరోగ్యభద్రతకు చిరునామా కావాలే తప్ప రోగుల నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. ఎందుకంటే, మందుల విలువ కన్నా మనుషుల ప్రాణాల విలువ ఎక్కువ! -
ప్రమాదకర యుద్ధక్రీడ
ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడితో ఏడాది క్రితం అక్టోబర్ 7న పశ్చిమాసియాలో చెలరేగిన హింసాత్మక సంఘర్షణ ఇప్పుడు మరో మలుపు తీసుకుంది. ముస్లిమ్లలోని షియా వర్గానికి చెందిన తీవ్రవాద హెజ్బొల్లా బృందానికి 32 ఏళ్ళుగా సారథ్యం వహిస్తున్న అధినేత హసన్ నస్రల్లాను భీకర గగనతల దాడుల ద్వారా ఇజ్రాయెల్ మట్టుబెట్టిన తీరు ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. లెబనాన్లోని ఇటీవలి పేజర్లు, వాకీటాకీల పేలుళ్ళ ఉదంతం మరువక ముందే ఇజ్రాయెల్ మరోసారి తన గూఢచర్య, సైనిక సత్తా చాటిన వైనం ముక్కున వేలేసుకొనేలా చేసింది. లెబనాన్లో తాత్కాలిక కాల్పుల విరమణకు అమెరికా, ఫ్రాన్స్లు గురువారం పిలుపునిచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ దాన్ని సమర్థిస్తున్నారనే అందరూ భావించారు. ఒక్క రోజు గడిచిందో లేదో... ఒకపక్క న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సమావేశం సాగుతుండగానే, మరోపక్క నెతన్యాహూ మాత్రం బీరుట్పై వైమానిక దాడికీ, హెజ్బొల్లా అధినేతను మట్టుబెట్టడానికీ గ్రీన్సిగ్నల్ ఇచ్చేశారు. ఎవరెన్ని చెప్పినా, ఐరాసలో ఎన్ని తీర్మానాలు చేసినా ఘర్షణను కొనసాగించాలనే ఇజ్రాయెల్ మంకుపట్టుతో ముందుకు పోతున్నట్టు తేటతెల్లమైంది. చిత్రమేమిటంటే, లెబనాన్లో కాల్పుల విరమణను బయట తోసిపుచ్చిన నెతన్యాహూ ప్రైవేటుగా మాత్రం అందుకు అంగీకరించారు. అమెరికా, ఫ్రాన్స్ అధికారులు సైతం చెప్పినమాట అదే. తీరా దాడులు మాత్రం నెతన్యాహూ కొనసాగించారు. కొన్ని నెలలుగా ఆయన తీరు అంతే. అమెరికాకు నచ్చే మాటలు పైకి చెబుతారు. కానీ, చివరకు మాత్రం తాను ఏదనుకుంటే అదే చేస్తున్నారు. అమెరికా సైతం పైకి శాంతి వచనాలు చెబుతున్నా, ఇజ్రాయెల్కు ఆయుధాల సరఫరా ఆపలేదు. ఆ ఆయుధాలను వాడుకుంటూ ఇజ్రాయెల్ పేట్రేగిపోతుంటే ఆపుతున్నదీ లేదు. ఇప్పటికే కొన్ని వేల మంది గాజాలో ప్రాణాలు కోల్పోయారు. గత వారంలో లెబనాన్లోనూ వెయ్యిమంది మరణించారు. అక్కడి జనాభాలో దాదాపు అయిదోవంతు మంది నిర్వాసితులయ్యారు. భవనాలపై బాంబు దాడులకు జడిసి, ప్రజలు వీధుల్లో నిద్రిస్తున్న పరిస్థితి. గగనతలం నుంచి బాంబులు ఆగలేదు. భూమార్గంలోనూ ముప్పు తప్పదన్న భయం తప్పడం లేదు. మరోపక్క ఇజ్రాయెల్ చేపట్టిన పని ఇంకా పూర్తి కాలేదని ఆ దేశ ప్రధాని ప్రకటించడంతో ఈ తలనొప్పి తగ్గేలా లేదు.అలాగని హెజ్బొల్లా అధినేత మరణానికి యావత్ లెబనాన్ బాధపడుతోందని అనలేం. తీవ్ర హింసకు పాల్పడి, ఎందరి మరణానికో కారణమైన నస్రల్లా పట్ల లెబనాన్, ఇజ్రాయెల్, సిరియా సహా పలు ప్రాంతాల్లో ప్రజానీకానికి పెద్దగా ప్రేమ ఏమీ లేదు. అరబ్ ప్రపంచంతో పాటు సాక్షాత్తూ లెబనాన్లో సైతం ఆయన మరణానికి సోషల్ మీడియాలో పెద్దయెత్తున ఆనందం వ్యక్తం కావడం గమనార్హం. సిరియన్ నియంత బషర్ అల్–అసద్తో చేతులు కలిపి తమ వద్ద ప్రజాస్వామ్య ఉద్యమాన్ని హెజ్బొల్లా అణిచివేయడంతో వారిలో ఆగ్రహం నెలకొంది. అందుకే ఈ రకమైన భావన వ్యక్తమైంది. లెబనీస్ ప్రభుత్వం ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించి, తద్వారా లెబనీస్ సైన్యం హెజ్బొల్లా చేతుల్లోని దక్షిణ లెబనాన్పై నియంత్రణ సాధించి, సరిహద్దు వెంట శాంతి నెలకొల్పాల నేది వారి అభ్యర్థన. నిజానికి, ఇజ్రాయెల్తో యుద్ధం తాము కోరుకోకపోయినా, ఇరాన్ ఆదేశాలతో లెబనీస్ను నస్రల్లా దీనిలోకి లాగారని వారి వాదన. ఇలాగే సాగితే గాజా భూఖండం లాగా బీరుట్ సైతం ధ్వంసమవుతుందనీ, అంతర్యుద్ధం మళ్ళీ వస్తుందనీ లెబనీయుల భయం. ముందు ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య సంబంధాలు సాధారణస్థితికి రావడం ముఖ్యం. అందుకు సౌదీలూ సిద్ధమే! కాకపోతే, రెండు దేశాల ఏర్పాటనే పరిష్కార సూత్రంతో పశ్చిమ తీరం లోని పాలెస్తీనా అథారిటీతో చర్చలు జరిపేందుకు ఇజ్రాయెల్ ముందుకు రావాలన్నది వారి షరతు. వ్యవహారం అక్కడే పీటముడి పడింది. ఇరాన్కు నెతన్యాహూ హెచ్చరిక, హెజ్బొల్లా నేత హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతొల్లా ఖమేనీ ప్రతిజ్ఞ, ఇరాన్ అండతో పెచ్చరిల్లుతున్న ఇతర వర్గాల వ్యవహారం... అంతా చూస్తుంటే ఇక ఇది అంతులేని కథే! నిజానికి, లెబనాన్, గాజాల్లోని తీవ్రవాద వర్గాలను హతమార్చాలనే ఇజ్రాయెల్ సైనిక విధానం వల్ల తాత్కా లిక లాభాలే తప్ప, శాశ్వత ప్రయోజనం ఉండదు. ఆ మధ్య సాక్షాత్తూ ఇరాన్ రాజధాని టెహరాన్లో హమాస్ నేత ఇస్మాయిల్ హనీయే, ఇప్పుడు బీరుట్లో హెజ్బొల్లా అధినేత, వెంటనే అదే గ్రూపులోని మరో కీలక నేత నబిల్ కౌక్... ఇలా పలువురిని ఇజ్రాయెల్ చంపేసింది. కానీ ఇలాంటి సంస్థల్లో ఒకరు పోతే మరొకరొస్తారు. పైగా ఇజ్రాయెల్ దూకుడు వల్ల ఇరాన్లోని కొత్త సంస్కరణవాద సర్కారూ చేసేదేమీ లేక, తీవ్రంగా ప్రతిస్పందించక తప్పదు. అప్పుడు ముడి మరింత బిగుస్తుంది. అగ్రదేశాల స్వార్థం, ప్రపంచ శాంతికి కృషి చేయాల్సిన అంతర్జాతీయ సంస్థల సంపూర్ణ వైఫల్యం ఈ దీర్ఘకాలిక సమస్యకూ, ఏడాదిగా ఆగని మారణహోమానికీ కారణం. పాలెస్తీనాలో ఇజ్రాయెల్ దురాక్రమణకు వచ్చే ఏడాదిలోగా ముగింపు పలకాలని ఐరాస తీర్మానించిన కొద్దిరోజులకే ఇలా జరిగిందంటే ఏమనాలి! ఐరాసకు కోరలు లేని పరిస్థితుల్లో... ప్రపంచానికి సరికొత్త శాంతిసాధన వ్యవస్థ అవసరం కనిపిస్తోంది. నెతన్యాహూ ఇలాగే తన దూకుడు కొనసాగిస్తే, పశ్చిమాసియాలో పరిస్థితి మరింత దిగజారుతుంది. లెబనాన్లో సైతం మరో గాజాను ఇజ్రాయెల్ సృష్టించక ముందే ప్రపంచ దేశాలు కళ్ళు తెరవాలి. నిర్బంధంగానైనా కాల్పుల విరమణను సాధించాలి. లేదంటే, పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు మరింత విస్తరిస్తాయి. ప్రపంచాన్ని చీకటితో కమ్మేస్తాయి. -
నింద భోజనం
కొన్ని నైతిక బోధలు అన్నిచోట్లా కనబడతాయి. అబద్ధము ఆడరాదు. జీవహింస చేయరాదు... ఇలా! కానీ, వారణాసిలోని కబీర్ జన్మస్థలైన కబీర్ మఠ్కు వెళ్లినప్పుడు అక్కడ కనిపించే మొదటి నైతిక బోధ ‘నిందలు వేయరాదు’ అని! కబీర్ దాస్ తన ప్రబోధాలలో ఎక్కువగా అప్రమత్తం చేసింది నిందలు వేసే వారి గురించే!! ‘వేయిమంది పాపులను కలిసినా ఫరవాలేదు నిందలు వేసే ఒక్కణ్ణి తప్ప. నిందలు వేసే వాని శిరము వేయి పాపాల పుట్ట’ అన్నాడాయన. సిసలైన వేటగాడు ఉత్త చేతులతో ఇంటికొచ్చి నింద అడవి మీద వేయడు. ఆహార సేకరణ కాలంలో అనునిత్యం చెమటోడ్చి, రక్తం చిందించి ఆహారం సేకరించుకోవాల్సి వచ్చినప్పుడు ప్రతి బలహీన పురుషుడు నోటికి నేర్చిన మాట నింద. వేటే దొరకలేదు... నది పొంగింది... తేనెటీగలు తరుముకున్నాయి... బాణం దిగినా సరే పారిపోయింది. తర్వాతి కాలంలో సకల చేతగానితనాలకీ, అగణిత అప్రయోకత్వాలకీ చవటలు వెతుక్కునే అన్ని నిందలకూ కనిపెట్టుకున్న అడ్రస్ ఒకటి ఉంది. దాని పేరు ఖర్మ. నింద ఖర్మ మీద వేస్తే ఆ తర్వాత మన దేశంలో వేరే ఏమీ చేయనక్కర్లేదు. ‘ఏం చేస్తామండీ ఖర్మ’ అని తడవకోసారి అంటూ ఉంటే చాలు. సాఫల్య కర్మల కోసం కాదా కర్మ?అప్రయోజకత్వం అక్కసుకు సింహద్వారం. వైఫల్యం అహంకారానికి గొడ్డుకారం. కళ్లెదుట కష్టపడి పని చేసేవాడు, భార్యాపిల్లలను చక్కగా చూసుకునేవాడు, డబ్బు జాగ్రత్త చేసుకునేవాడు, తెలివిగా మసలుకునేవాడు, వ్యసనాలకు దూరంగా ఉండేవాడు, వచ్చిన విద్యను అంటిపెట్టుకుని ఉండేవాడు, తెగించి కొత్తదారులు కనిపెట్టేవాడు... వీళ్లంతా ముందుకు వెళుతుంటే విజేతలై అధిగమిస్తుంటే ఇవన్నీ చేయలేని, చేయరాని, చేసేందుకు కనీసం ప్రయత్నించి చూడని ప్రతి గాడిదకూ చేతికి అందే మారణాయుధం నింద. గెలిచినవాడిని ఓడించేందుకు ధర్మబద్ధమైన ఏ ఆయుధమూ లేని పరాజితుడు అంతిమంగా ప్రయోగించే పాశుపతాస్త్రం నింద. ఇది టీకా లేని క్రిమి. నాల్కల ద్వారా వ్యాపించే మహమ్మారి.పాఠశాల విద్య తద్వారా తెలుగు భాష ముందుకు సాగడానికి చిన్నయ సూరి ఆవిష్కృతం చేసిన అతి ముఖ్యమైన కృషి ‘బాల వ్యాకరణం’ వేలాదిగా అమ్ముడుపోవడం మొదలుపెట్టాక ఆయన మీద పడ్డ నింద– అది కాపీ రచన అని... అది వేరెవరో పండితుడు రాశాడు అని. చిన్నయ సూరి ఈ గండం నుంచి గట్టెక్కడానికి గురు సమానులైనవారి వైపు ఆశగా చూస్తే వారూ చేసిన పని ‘అవును.. కాపీయే’ అని నిందించడం. ఐదారేళ్లు చిన్నయ సూరి నిందను మోశాక నింద ఓడిపోయింది. చిన్నయ సూరి మిగిలాడు. ఒక వేశ్య రచన చేయుటయా... ఆస్థానాలలో ఆడే దేవదాసి కవిత్వం చెప్పుటయా అని నాటి పెద్దలకు ముద్దు పళని మీద ఆగ్రహం వచ్చింది. ‘లోపల ఏముందో తర్వాత.. ముందు అశ్లీలం అని నింద వేయండి’ అన్నారు. ఆ నిందను జయించి తెలుగు సారస్వతంలో తన స్థానం దక్కించుకోవడానికి ‘రాధికా సాంత్వనం’ ఎంత సాంత్వనం కోల్పోయిందని?తప్పులు, పొరపాట్లు చేయడం మానవ సహజం. పురాణాలూ ఈ సందర్భాలను ఎత్తి చూపాయి. రాముణ్ణి మాయలేడి వెంట పంపి సీత తప్పు చేసింది. ఆ తప్పు వల్ల ఆమెలో ఆందోళన జనించింది. ఆ ఆందోళన ఇంగితం కోల్పోయేలా చేసింది. ఎంతకూ రాని రాముని గురించి పరితపిస్తూ, రక్షణకు వెళ్లమని, ‘నా మీద కన్నేసి నువ్వు కదలడం లేదు కదూ’ అని లక్ష్మణుడి మీద నింద వేసే సరికి అతడు హతాశుడయ్యాడు. తర్వాతి కాలంలో ఈ సీతమ్మే ఘోర నిందను ఎదుర్కొంది. అగ్నిపునీతగా నిలిస్తే తప్ప నింద వదల్లేదు. సకల లీలా మాధవుండైన శ్రీకృష్ణుడు కూడా నిందచేసే లీలకు చకితుడయ్యి జాంబవంతుడితో యుద్ధానికి దిగాడు శమంతకమణి కోసం! ఆ మాటకొస్తే ఆడిన మాట తప్పాడన్న నింద వస్తుందన్న భయం లేకపోతే హరిశ్చంద్రుడు పడేవాడా అన్ని కష్టాలు? దేనికీ జడవనివాణ్ణి జడిసేలా చేయగలదు నింద.నిందలు ఎందుకు వేస్తారు అంటే అది చాలా సులభమైన పని కనుక అంటారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. గుచ్చుకుంటున్న స్వీయ వైఫల్యాలకు కాసింత మలాము రాసుకోవడానికి ఎదుటివారికి మలం పూస్తారు ఇట్టివారు. అక్కసును, ద్వేషాన్నీ గెలుపుగా మార్చుకునేందుకు దేశాలపై, జాతులపై, మతాలపై, కులాలపై, వ్యక్తులపై, సార్థకులపై నిందలు వేస్తారు. నిందకు దండన అనుమతి ఉంది. చేతబడి చేస్తున్నారన్న నింద వేశాక ఊరంతా కలిసి వారిని చంపుతుంటారు. నింద బలిగోరుతుంది. విడిపోయి తమ దారి తాము చూసుకుందామనుకునే తోబుట్టువులు ఇవాళ సుపారీ ఇస్తున్నది నిందకే. నిందలు వేసేవారు పదేపదే నెగెటివ్ ఆలోచనల్లో చిక్కుకుని ఏమీ సాధించలేక చరిత్రహీనులుగా మిగులుతారనడానికి ఆధారాలున్నాయి. నేటి సోషల్ మీడియా అంతా నిందలు వేసే మందబుద్ధు లతో ఎంతగా నిండి ఉందంటే రోజూ వేల కొలది పోస్టుల పాపపుకూడు ఉడికి వడ్డనవుతున్నది. ఈ భోజనానికి ఎగబడుతున్న అమాయకులు ఎందరో. కవులు, రచయితలు ఎప్పుడైనా ఈ దారి తొక్కుతున్నారా ప్రయివేటు సంభాషణలను నిందలతో నింపుతున్నారా, చెక్ చేసుకోవాలి. మొదట నింద వేసినవారు సచ్ఛీలురు అయిపోవడం నింద సమకూర్చే అతి పెద్ద లాభం. అంత మాత్రం చేత నింద వేసిన వారు గెలిచినట్టు కాదు. మోసినవారు ఓడినట్టు కాదు. సదుద్దేశంతో సద్విమర్శ చేసేవారిని ఇంటిలో నాటే చెట్టంత దగ్గరగా ఉంచుకోమన్నాడు కబీర్ దాస్. సమాజం సద్విమర్శతో నిర్మితమవుతుంది. నిందతో కాదు. నింద నిందపడి పాడుగానూ! -
‘తక్షణ న్యాయం’ ప్రమాదకరం
సర్వోన్నత న్యాయస్థానంతో సహా దేశంలో వివిధ హైకోర్టులు అడపా దడపా అక్షింతలు వేస్తున్నా ఎన్కౌంటర్ల జాడ్యం పోయేలా లేదు. ఏ పార్టీ ఏలుబడి ఉందన్నదాంతో నిమిత్తం లేకుండా దాదాపు అన్ని రాష్ట్రాల తీరూ ఇదే. కనీసం స్క్రిప్టు మార్చడానికి కూడా పోలీసులు ప్రయత్నించరు. ముద్దాయిని/ముద్దాయిలను నేరస్థలానికి తీసుకెళ్లినప్పుడో, న్యాయస్థానంలో హాజరు పరచడానికి వెళ్తున్నప్పుడో హఠాత్తుగా తిరుగుబాటు చేసి పోలీసుల నుంచి తుపాకి గుంజుకుని కాల్చబోవటం, ఈలోగా పోలీసులు అప్రమత్తమై ఎదురుకాల్పులు జరపడం వీటన్నిటి సారాంశం. పోలీసులకు స్వల్ప గాయాలు కావటం కూడా అన్నిచోట్లా డిటో. అక్షయ్ షిండే అనే నేరగాడిని మహారాష్ట్ర పోలీసులు హతమార్చిన తీరుపై బొంబాయి హైకోర్టు బుధవారం అనేక సందేహాలు వ్యక్తం చేసింది. వాహనంలో వెళ్తుండగా షిండే తిరగబడి పిస్తోల్ గుంజుకుని కాల్పులు జరిపే సమయంలో నలుగురు పోలీసులున్నా అతగాణ్ణి లొంగదీయలేకపోవటం ఏమిటని ప్రశ్నించింది. అసలు తుపాకులు, పిస్తోళ్లు ఉపయోగించటం తెలియని వ్యక్తి ఆయుధాన్ని అన్లాక్ చేసి కాల్పులు జరపటం ఎలా సాధ్యమని అడిగింది. ఈ ప్రశ్నలు సహేతుకమైనవి.బద్లాపూర్ స్కూల్ ఉదంతం ఘోరమైనది. గత నెల 13న ఒక పాఠశాలలోని మరుగుదొడ్డి వద్ద ఇద్దరు కిండర్గార్టెన్ పిల్లలపై నిందితుడు లైంగిక నేరానికి పాల్పడ్డాడని ఆరోపణ. ఘటనపై పిల్లల తల్లిదండ్రులకు తెలిసి ఫిర్యాదుచేస్తే ముద్దాయిని ఆగస్టు 17న అరెస్టు చేశారు. స్కూల్ యాజ మాన్యంపై చర్యలు ఎందుకు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించాకగానీ ప్రిన్సిపాల్, సంస్థ చైర్మన్, కార్యదర్శిలపై పోక్సో కేసు పెట్టలేదు. ఆ స్కూల్ నిర్వహణ ఎంత ఘోరంగా ఉన్నదో చూస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. అసలు ఆడపిల్లలు ఉపయోగించే మరుగుదొడ్డి వద్ద మహిళను నియమించాలని కూడా వారికి తోచలేదు. వీటన్నిటినీ తనిఖీ చేయాల్సిన విద్యాశాఖ పట్టించుకోలేదు. ఇంతమంది నిర్లక్ష్యం ఫలితంగా ఇద్దరు చిన్నారులు బాధితులుగా మారాక మాత్రం కఠిన చర్య తీసుకున్నట్టు కనబడటం కోసం వక్రమార్గం అనుసరించారు. స్కూల్ నిర్వాహకులు బీజేపీకి కావలసినవారు గనుకే ఎన్కౌంటర్ నాటకం ఆడారని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపణ. నిజానిజాల మాటెలా ఉన్నా ప్రభుత్వాధికారులు మెతగ్గా వ్యవహరించారన్నది మాత్రం వాస్తవం. గత రెండు నెలల్లో మూడు ఎన్కౌంటర్లు జరిపి తమిళనాడు పోలీసులు ముగ్గురు నిందితులను హతమార్చారు. మావోయిస్టుల ప్రభావం అధికంగావున్న ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్లు జరగకపోతే వార్త. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఏలుబడిలో ఎన్కౌంటర్ల జోరు అధికమే. గత ఏడున్న రేళ్లలో యూపీ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు 49 మందిని కాల్చిచంపారు. గత సోమవారమే మరొకరిని హతమార్చి అర్ధ సెంచరీ పూర్తి చేశారని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఎన్కౌంటర్ మృతులంతా అమాయకులనీ, సచ్ఛీలురనీ ఎవరూ అనరు. ఎన్నో ఆరోపణలున్నవారే. కానీ నేర గాళ్లను శిక్షించటానికి ఒక విధానం ఏర్పర్చుకున్నప్పుడూ, దానికి అనుగుణంగా భిన్న వ్యవస్థలు పనిచేస్తున్నప్పుడూ ఇష్టారాజ్యంగా కాల్చిచంపే అధికారం పోలీసులకెక్కడిది? ఇది ఎక్కడికి దారి తీస్తుంది? ఇలాంటి కేసులను విచారించినప్పుడల్లా న్యాయస్థానాలు నిశితంగా ప్రశ్నిస్తున్నాయి. కానీ ఎక్కడా ఇవి ఆగుతున్న దాఖలాలు లేవు. 2006లో ఇద్దరు నిందితులను నవీ ముంబైలో పట్టుకుని వారిలో ఒకరిని ఎన్కౌంటర్ చేసిన కేసులో 12 మంది పోలీసులకు కిందికోర్టు విధించిన యావజ్జీవ శిక్షను బొంబాయి హైకోర్టు ధ్రువీకరించటంతోపాటు కింది కోర్టు నిర్దోషిగా విడిచిపెట్టిన ‘ఎన్కౌంటర్ స్పెషలిస్టు’ ప్రదీప్ శర్మకు కూడా యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది. న్యాయవాది అయిన ఎన్కౌంటర్ మృతుడి సోదరుడు అతను అరెస్టయ్యాక ఉన్నతాధికారులకూ, న్యాయస్థానానికీ టెలిగ్రామ్లు, ఫ్యాక్స్ మెసేజ్లు పంపటం, కాల్ రికార్డులు సేకరించటం పర్యవసానంగా ఇదంతా సాధ్యమైంది. కానీ ఎన్ని కేసుల్లో ఎందరు ఇలా చేయగలుగుతారు?ఎన్కౌంటర్లను వ్యతిరేకించే పౌరహక్కుల సంఘాల నేతలనూ, పౌర సమాజ కార్యకర్తలనూ నేరగాళ్లకు వత్తాసు పలుకుతున్నవారిగా ముద్రేయటం పాలకులకూ, పోలీసులకూ అలవాటు. కొన్ని సందర్భాల్లో ఎన్కౌంటర్లు సాగిస్తున్న పోలీసులను సమాజంలోని భిన్నవర్గాలవారు ప్రశంసించటం కూడా కనబడుతుంది. ‘తక్షణ న్యాయం’ కోరేవారికి ఇది సబబే అనిపించవచ్చు. కానీ ఈ క్రమంలో ప్రభుత్వాల బాధ్యతనూ, జవాబుదారీతనాన్నీ ఉపేక్షించటం లేదా? అసలు పోలీసు కాల్పుల్లో మరణించినవారే నిజమైన దోషులని ఏ ప్రాతిపదికన నమ్మాలి? ఈ ధోరణివల్ల అసలు దోషులు తప్పించుకునే ప్రమాదంతోపాటు మరిన్ని నేరాలు జరగటానికి ఆస్కారం ఉండదా? కోల్ కతాలోని పీజీ కర్ ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఉదంతమే తీసుకుంటే సక్రమంగా దర్యాప్తు జరిగింది గనుకే మాఫియాల ఆధిపత్యం, వారి అండతో ఆసుపత్రి ఉన్నతాధి కారులు సాగిస్తున్న తప్పుడు పనులు బయటపడ్డాయి. నేరాలకు తావులేని వాతావరణం ఏర్పర్చటానికీ, వాటి నియంత్రణకు దోహదపడే చర్యలకూ బదులు నేరగాళ్లను హతమార్చే విధానం సమాజాన్ని బండబారుస్తుంది. అధికారులకు తాము ఏం చేసినా అడిగేవారు లేరన్న భరోసానిస్తుంది. కఠినమైన చట్టాలు, పకడ్బందీ దర్యాప్తు, న్యాయస్థానాల్లో చురుగ్గా విచారణ వంటివి మాత్రమే సమాజ భద్రతకు తోడ్పడతాయి. అది మరిచి ‘తక్షణ న్యాయం’ కోసం వెంపర్లాడటం సరికాదు. -
బాలలకు సుప్రీమ్ రక్షణ!
భారత సర్వోన్నత న్యాయస్థానం సోమవారం చరిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. మద్రాస్ హైకోర్ట్ గతంలో చేసిన తప్పును సరిదిద్దింది. బాలలపై లైంగిక అకృత్య, అశ్లీల దృశ్యాల వీడియోలను డౌన్ లోడ్ చేసినా, కలిగివున్నా, చివరకు చూసినా, సదరు అంశాలపై నిర్ణీత అధికారులకు ఫిర్యాదు చేయకున్నా కూడా పోక్సో, ఐటీ చట్టాల కింద నేరమేనని కుండబద్దలు కొట్టింది. దాదాపు 200 పేజీల తాజా తీర్పుతో బాలలపై లైంగిక అత్యాచారాలను నిరోధించేలా ‘లైంగిక అకృత్యాల నుంచి బాలలకు రక్షణ’ (పోక్సో) చట్టానికి పదును పెట్టింది. పసిపాపల నుంచి ఎదిగిన మైనర్ల వరకు బాలలందరి పైనా దేశంలో అంతకంతకూ అఘాయిత్యాలు పెరుగుతున్న వేళ రానున్న రోజుల్లో ఈ తీర్పు బలమైన ప్రభావం చూపనుంది. ఇంటా బయటా ప్రతిచోటా కామాంధుల బెడద పెచ్చరిల్లిన సమయంలో ఈ సుప్రీమ్ తీర్పు భారతదేశంలోని బాలబాలికలకు భారీ ఊరట, బలమైన అండ. తాజా సుప్రీమ్ కోర్ట్ ఆదేశంతో చైల్డ్ పోర్నోగ్రఫీ సమాచారాన్ని ‘కలిగి ఉండడం’ అనే పదం తాలూకు నిర్వచన పరిధి పెరిగింది. అలాంటి దృశ్యాలను డౌన్లోడ్ చేయకున్నా, పరికరంలో పదిలపరుచుకోకపోయినా... కేవలం చూసినా సరే ఇప్పుడది పోక్సోలోని సెక్షన్ 15 కింద నేరమే అవుతుంది. ఇది కేవలం సాంకేతికపరమైన అంశం కానే కాదు... తీవ్రమైన నేరం. నిజానికి, చైల్డ్ పోర్న్ దృశ్యాల తయారీ, పంపిణీయే నేరమనీ, ఎలక్ట్రానిక్ పరికరాల్లో డౌన్లోడ్ చేసి ప్రైవేటుగా చూసినంత మాత్రాన అది నేరం కిందకు రాదనీ ఆ మధ్య మద్రాస్ హైకోర్ట్ తీర్పునిచ్చింది. మొబైల్లో డౌన్లోడ్ చేసి చూసిన ఓ చెన్నై కుర్రాడిపై నేర విచారణను జనవరి 11న రద్దు చేసింది. దీని వల్ల బాలల సంక్షేమంపై దుష్ప్రభావం పడుతుందని తప్పుబడుతూ వివిధ స్వచ్ఛంద సంస్థల సమాహారమైన ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్’ సుప్రీమ్ గడప తొక్కింది. సింగిల్ జడ్జి ఇచ్చిన సదరు తీర్పు ‘ఘోరమైనది’ అంటూ మార్చిలోనే సుప్రీమ్ తప్పుబట్టింది. మద్రాస్ హైకోర్ట్ తీర్పు ‘అసాధారణ∙తప్పు’ అని సుప్రీమ్ తన తాజా ఆదేశంలో వ్యాఖ్యానించడం గమనార్హం.సుప్రీమ్ తన తాజా ఆదేశంతో ఆ పాత మద్రాస్ హైకోర్ట్ తీర్పును తోసిపుచ్చినట్టయింది. అదే సమయంలో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ అనే పదం నేరాన్ని తేలిక చేస్తున్నట్టు ఉందని భావించింది. ఆ పదాన్ని పరిహరించి, దాని బదులు ‘బాలలపై లైంగిక అకృత్యాలు, దాడుల సమాచారం’ (సీఎస్ఈ ఏఎమ్) అనే పదాన్ని సంబంధిత చట్టాలన్నిటిలో వాడేలా పార్లమెంట్ ఆర్డినెన్స్ తీసుకురావాలని అభ్యర్థించడం విశేషం. ఇకపై న్యాయస్థానాలన్నీ తమ ఆదేశాలు, తీర్పుల్లో ఈ పదాన్నే వాడాలని కూడా సుప్రీమ్ పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, మరో న్యాయమూర్తి జస్టిస్ పార్దీవాలాలతో కూడిన సుప్రీమ్ ధర్మాసనం ఇచ్చిన ఆదేశం, చేసిన అభ్యర్థన ఆలోచించదగినది, స్వాగతించవలసినది. గమనిస్తే, సమస్యంతా చట్టాలలోని అంశాలకు కొన్ని కోర్టులు సంకుచిత అంతరార్థాలు తీయడంతో వస్తోంది. మద్రాస్ హైకోర్ట్లోనూ జరిగింది అదే. తద్వారా బాలలపై సైబర్ నేరాలకు పాల్పడినవారిని శిక్షించడానికి ఉద్దేశించిన చట్టాల ప్రయోజనమే దెబ్బతింటోంది. అందుకే, ఈ విషయంలో కోర్టులు జాగరూకతతో ఉండాలని సుప్రీమ్ ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. గణాంకాలు గమనిస్తే, దేశంలో బాలలపై అకృత్యాలు అంతకంతకూ అధికమవుతున్నాయి. ఒక్క 2022లోనే వాటి సంఖ్య 8.7 శాతం పెరిగింది. అలాంటి ఘటనలు 1.68 లక్షలకు చేరినట్టు జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) మాట. పసివారిపై అఘాయిత్యాలు జరిగినప్పటికీ భయం, సమాజంలో పడే కళంకం, అవగాహన లేమితో ఇంకా అనేక కేసులు వెలుగులోకి రావట్లేదు. పైగా, ఇంట్లో అయినవాళ్ళు, బడిలో ఉద్యోగులు సైతం సాగిస్తున్న ఈ అమానుషాలు పిల్లల మనసులపై జీవితాంతం ప్రభావం చూపుతున్నాయి. పెరిగి పెద్దయినా సరే వారిని ఆ చేదు అనుభవాల నుంచి మానసికంగా బయట పడనీయకుండా చేస్తున్నాయి. వీటన్నిటినీ అరికట్టడానికే 2012లోనే పోక్సో లాంటి కఠినచట్టాలు వచ్చాయి. అయినా, బాలలపై అత్యాచారాలు ఆగక పోవడం విషాదం. సదరు కేసులు పెరుగుతున్నందున ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలంటూ అయిదేళ్ళ క్రితమే సుప్రీమ్ ఆదేశించింది. అయితే, రెగ్యులర్ కోర్ట్లకే జడ్జీలు కరవైన పరిస్థితుల్లో ఇక ఈ ఫాస్ట్ట్రాక్ల కథేమిటో ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. దానికి తోడు చట్టంలోని కఠిన అంశాలకు ఒక్కో హైకోర్ట్ ఒక్కో రకం అర్థం చెబుతూ, వ్యాఖ్యానం చెప్పడం పెను సమస్యయి కూర్చుంది. తాజా తీర్పుతో ఆ పరిస్థితులు కొంతవరకు మారతాయని ఆశించాలి. చట్టాన్ని అతిక్రమిస్తున్న వారికి మేలుకొలుపు. అదే సమయంలో అది అందరికీ స్పష్టమైన సందేశం ఇస్తోంది. అదేమిటంటే – బాలల భద్రత అతి ముఖ్యమైనది! వారి భద్రత కోసమే కోర్టు చట్టానికి మరింత కఠినమైన, కట్టుదిట్టమైన వ్యాఖ్యానం అందించింది. ఇక యూ ట్యూబ్ – గూగుల్ లాంటి వేదికలు, చట్టాన్ని అమలు చేసే వ్యవస్థలు, నిత్యం ఇంటర్నెట్ వాడేవారు అప్రమత్తంగా ఉండక తప్పదు. అలాంటి కంటెంట్ను తక్షణం తొలగించడం, పోలీసులకు ఫిర్యాదు చేయడమే మార్గం. అదే సమయంలో విద్యాలయాల్లో లైంగిక విజ్ఞానాన్ని సమగ్రంగా బోధించి, పిల్లల్లో అవగాహన కల్పించాలంటూ ప్రభుత్వానికి సుప్రీమ్ చేసిన సూచన విలువైనది. బిడియపడకుండా తల్లితండ్రులు, గురువులు పిల్ల లకు విషయాలను వివరించడం మేలు. శారీరకంగా, సామా జికంగా, చట్టపరంగా అవగాహన పెరి గితే అకృత్యాల్ని అడ్డుకోవడం సులభమవుతుంది. ఇలాంటి కేసులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్న సంకేతం సుప్రీమ్ తాజా తీర్పు అందించడం అన్ని విధాలా ఆహ్వానించదగ్గ పరిణామం. -
ఇది స్వర్ణయుగం
ప్రతి రంగంలో కొన్ని చరిత్రాత్మక క్షణాలు ఉంటాయి. చదరంగంలో మన దేశానికిప్పుడు అలాంటి క్షణాలే. బుడాపెస్ట్లో ముగిసిన 45వ చెస్ ఒలింపియాడ్ భారతీయ చదరంగంలోనే కాదు... యావత్ భారత క్రీడారంగ చరిత్రలోనే చిరస్మరణీయం. మన ఆటగాళ్ళు తొలిసారిగా అటు ఓపెన్, ఇటు మహిళల కేటగిరీల్లో బంగారు పతకాలు సాధించి, దేశానికి మరువలేని కానుక ఇచ్చారు. చైనా, సోవియట్ రష్యా తర్వాత చెస్ ఒలింపియాడ్లో ఒకే ఏడాది ఇలా రెండు విభాగాల్లోనూ స్వర్ణాలు గెలిచిన మూడో దేశం మనదే. అలాగే, గుకేశ్, అర్జున్, దివ్య, వంతికల 4 వ్యక్తిగత స్వర్ణాలతో టోర్నీలో భారత్ తిరుగులేని ఆధిక్యాన్ని చాటింది. విశ్వనాథన్ ఆనందన్ బాటలో నడిచిన ఆయన శిష్యబృందం దేశాన్ని సమున్నతంగా నిలిపింది. కేవలం పదేళ్ళ క్రితం ఆశ్చర్యకరంగా కాంస్యం గెలిచి ఒలింపియాడ్లో బోణీ కొట్టిన దేశం, గడచిన 2022లో రెండు విభాగాల్లోనూ కాంస్యాలకే పరిమితమైన దేశం ఇవాళ ఈ స్థాయికి ఎదగడం అసామాన్యం. ఒక్కమాటలో నిన్న మొన్నటి దాకా చెస్లో సాగిన యూరోపియన్ ప్రపంచ ఆధిపత్యానికి తెరపడింది. ఆటకు భవిష్యత్ చిరునామాగా భారత్ ఆవిర్భవించింది. చదరంగంలో అక్షరాలా మన స్వర్ణయుగం ఆరంభమైంది. ఒలింపిక్స్ పోటీల్లో స్థానం లేని చెస్కు సంబంధించినంత వరకు ఈ చెస్ ఒలింపియాడే... ఒలింపిక్స్. అలాంటి అత్యున్నత స్థాయి పోటీల్లో... 193 దేశాలకు చెందిన అంతర్జాతీయ జట్లు పాల్గొన్న ఓపెన్ విభాగంలో, 181 దేశాలు పోటీపడ్డ మహిళా విభాగంలో మన జట్లు స్వర్ణాలు సాధించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రతి దేశం నుంచి అయిదుగురు అగ్రశ్రేణి క్రీడాకారుల జట్లు ఆ యా విభాగాల్లో పోటీ పడతాయి. అలాంటి చోట ఓపెన్ విభాగంలో తొమ్మిదో రౌండ్లో ఉజ్బెకిస్తాన్తో జరిగిన ఆటను డ్రా చేయడం తప్ప, మొత్తం 11 రౌండ్లకు గాను 10 రౌండ్లు మన భారత జట్టు గెలిచింది. టైటిల్ విజేతగా నిలిచింది. అంతేకాక 21 పాయింట్ల రికార్డ్ స్కోర్ సాధించి, రెండోస్థానంలో నిలిచిన 17 పాయింట్ల అమెరికా కన్నా చాలా పైన మనం నిలవడం విశేషం. మహిళా విభాగంలోనూ మొత్తం 11 రౌండ్లలో, ఒక్క 8వ రౌండ్లో పోలండ్తోనే మన జట్టు ఓడింది. అమెరికాతో ఆటను డ్రా చేసి, మొత్తం 19 పాయింట్లు సాధించి, స్వర్ణం సాధించింది. కనివిని ఎరుగని ఈ జంట విజయాల కారణంగానే ఇవాళ మన క్రీడా ప్రపంచం సంబరాలు చేసుకుంటోంది.మొత్తం మీద భారతీయుల ఆటగా పేరొందిన చదరంగంలో ఇప్పుడు మళ్ళీ పుట్టినింటికి పూర్వ వైభవం వచ్చింది. ఈ ఒలింపియాడ్ విజయాలు దేశవ్యాప్తంగా మన యువతరంలో దాగిన చదరంగ ప్రతిభాపాటవాలకు అద్దం పడుతున్నాయి. గుకేశ్ దొమ్మరాజు లాంటి మన ఆటగాళ్ళు కొందరు వ్యక్తిగత స్వర్ణాలు సైతం సాధించడం అందుకు నిదర్శనం. ఒకప్పుడు విశ్వనాథన్ ఆనంద్ లాంటి కొందరి పేర్లే వినిపించిన దేశంలో ఇటీవల దాదాపు 85 మంది గ్రాండ్ మాస్టర్లు ఉద్భవించారు. వారిలో పలువురు 20వ పడిలో వారే. అయిదుసార్లు ప్రపంచ చెస్ ఛాంపియనైన మ్యాగ్నస్ కార్ల్సెన్ను పలుమార్లు ఓడించిన ప్రజ్ఞానంద లాంటి టీనేజ్ వండర్లు మనకున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్లో అగ్రశ్రేణిలో నిలిచిన అర్జున్ ఇరిగైసి, విదిత్ గుజరాతీ, హరికృష్ణ తదితరులు మన పురుషుల జట్టులో ఉన్నారు. అలాగే, అనుభవమున్న కోనేరు హంపి జట్టులో లేకున్నా, ఒకట్రెండు తడబాట్లు ఎదురైనా సరే పట్టువదలక పోరాడి, ఒలింపియాడ్ విజయం సాధించిన ఆడపిల్లల జట్టు ఈ రోజున మనకుంది. అంతకంతకూ పెరుగుతున్న మన బలానికీ, బలగానికీ అది గీటురాయి. పోగుబడ్డ ప్రతిభావంతులకు నిరంతర సాధన, నిరుపమానమైన టీమ్ స్పిరిట్ కూడా తోడై తాజా అందలాన్ని ఎక్కించాయి. అదే సమయంలో మన ప్రస్తుత విజయ పరంపరకు స్ఫూర్తి... ప్రజ్ఞానంద, గుకేశ్ లాంటి పలువురికి చేయూతనిచ్చిన దీప్తి... శిక్షణకు ఎంతో ఖర్చయ్యే ఈ ఆటలో వర్ధిష్ణువులెందరికో స్పాన్సర్షిప్లు దక్కేలా తోడ్పడ్డ తెర వెనుక దీప్తి... 15వ వరల్డ్ చెస్ ఛాంపియనైన విశ్వనాథన్ ఆనంద్ అని మర్చిపోలేం. ప్రతిభ గల పిల్లల్ని తీర్చిదిద్దడానికి వీలుగా ఒక వాతావరణాన్నీ, వ్యవస్థనూ కల్పించిన ఆలిండియా చెస్ ఫెడరేషన్ కృషినీ చెప్పుకొని తీరాలి. పెరిగిన సోషల్ మీడియా, హద్దులు లేని డిజిటల్ వ్యాప్తి సైతం మన యువతరాన్ని చెస్ వైపు ఆకర్షించిందీ నిజమే. భారతీయ స్ట్రీమింగ్ వేదికల్లో బాగా పాపులరైన చెస్బేస్ ఇండియాకు దాదాపు 19 లక్షల మంది సబ్స్క్రైబర్లున్నారు. ఆ వేదిక వివిధ టోర్నీల నిర్వహణతో పాటు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పలువురు ఆటగాళ్ళకు ఆర్థికంగా అండగా నిలవడం చెప్పుకోదగ్గ విషయం. ఇప్పుడీ ఒలింపియాడ్ డబుల్ ధమాకా స్వర్ణాలు చెస్ ప్రాచుర్యంతో పాటు పిల్లల్లో ఆసక్తి పెంచడం ఖాయం. భారత చదరంగానికి ఇది శుభతరుణం. త్వరలో జరిగే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో ప్రస్తుత చైనీస్ ఛాంపియన్తో 18 ఏళ్ళ మన గుకేశ్ పోరు కోసం అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే ఉన్నవారు కాక, కనీసం మరో అరడజను మంది ఒలింపియాడ్లో స్థానం కోసం పోటీపడుతున్న స్థాయికి చేరాం. అయితే, ఇది చాలదు. ఆడపిల్లల్లో మన చెస్ బలగం ఇంకా పెరగాల్సి ఉంది. ఇదే అదనుగా కేంద్రం, రాష్ట్రాలు మరింత ప్రోత్సాహం అందించాలి. పాఠశాలల స్థాయి నుంచే చెస్ పట్ల పిల్లల్లో ఆసక్తిని పెంచాలి. బడుల్లోనే కాక గ్రంథాలయాల్లో, స్థానిక పట్టణ కేంద్రాల్లోనూ చెస్కు వసతులు కల్పించాలి. అలాగే మన దేశంలోనూ అగ్రశ్రేణి టోర్నీలు జరిగేలా చూడాలి. చెన్నై ఇవాళ చదరంగ ప్రతిభకు కేంద్రంగా మారిందంటే తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన చేయూత కారణం. అందరికీ అది ఆదర్శప్రాయం. స్వర్ణయుగం సుదీర్ఘంగా కొనసాగాలంటే ఇలాంటి చర్యలే కీలకం. -
సంక్షోభ లంకపై నెలవంక!
దాదాపు రెండున్నరేళ్లక్రితం విదేశీ రుణాల చెల్లింపులు అసాధ్యమై దివాలా తీసింది మొదలు వరస సంక్షోభాలను చవిచూస్తున్న శ్రీలంకలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. నూతన అధ్యక్షుడిగా సోమవారం పదవీబాధ్యతలు స్వీకరించిన అనూర కుమార దిస్సనాయకే వర్తమాన సంక్షోభ పరంపర నుంచి దేశాన్ని గట్టెక్కిస్తారన్న ఆశలు జనంలో దండిగానే ఉన్నాయి. కనుకనే వారసులవైపే మొగ్గే అలవాటున్న ప్రజానీకం ఈసారి మార్క్సిస్టు అయిన దిస్సనాయకేను ఎంపిక చేసుకున్నారు. 2022లో నిత్యావసరాల కొరత, అధిక ధరలు, పన్నుల మోతతో పాటు దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిపై ఆగ్రహోదగ్రులైన ప్రజలు అధ్యక్ష భవనంపై, పార్లమెంటుపై దాడిచేయటం, నాటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ఆయన పరివారం దేశం విడిచి పరారుకావటం ప్రపంచాన్ని దిగ్భ్రమపరి చాయి. అధ్యక్ష, పార్లమెంటు ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మూడేళ్లలోపే రాజపక్సకు ఈ దుర్గతి పట్టింది. అందుకే దిస్సనాయకే అత్యంత జాగరూకతతో పాలన సాగించి దేశాన్ని ఒడ్డున పడేయాల్సి వుంటుంది. గతంలో ఎంపీగా, మంత్రిగా పనిచేసి ఉండొచ్చుగానీ సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్న దేశానికి సారథ్యం స్వీకరించటం సామాన్యం కాదు. రనిల్ విక్రమసింఘే ప్రభుత్వం పెను ఆర్థిక విపత్తు నుంచి గట్టెక్కడానికి ఐఎంఎఫ్ను ఆశ్రయించినప్పుడు 290 కోట్ల డాలర్ల రుణం మంజూరుచేస్తూ కఠినమైన షరతులు పెట్టింది. పర్యవసానంగా పొదుపు చర్యల పేరుతో జీతాలు, పెన్షన్లు కోత పడ్డాయి. సంక్షేమ పథకాలు అటకెక్కాయి. ప్రజలు అర్ధాకలితో వెళ్లదీస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో వామపక్ష జనతా విముక్తి పెరమున (జేవీపీ) నాయకుడిగా భావసారూప్య పార్టీలతో నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) పేరిట కూటమి ఏర్పరిచి ఘనవిజయం సాధించటం దిస్సనాయకే ఘనత. గత ఎన్నికల్లో కేవలం నాలుగు శాతం ఓట్లతో, పార్లమెంటులో మూడంటే మూడే స్థానాలు గెల్చుకున్న పార్టీ ఈ స్థాయిలో దూసుకురావటం అసాధారణం. కోతలను సరళం చేస్తామన్న ఎన్పీపీ హామీ వోటర్లను విశేషంగా ఆకట్టుకుంది. దానికి తోడు సంప్రదాయపక్షాలు, అవి ఇచ్చే అబద్ధపు హామీలతో జనం విసిగిపోయారు. అందుకే కావొచ్చు... ఈ విజయం ఏ ఒక్కరిదో కాదని దిస్సనాయకే అన్నారు. 2022 నాటి ‘అరగల్య’ (పోరాటం) ఉద్యమంలో జనం సమీకృతులు కావటం వెనక వారిలో గూడుకట్టుకున్న అసంతృప్తితో పాటు జేవీపీ తెర వెనక కృషి కూడా ఉంది. జనాగ్రహాన్ని నిర్మాణాత్మకంగా మలచటంలో, అరాచకం ప్రబలకుండా చూడటంలో ఆ పార్టీ విజయం సాధించింది. అందుకే ఇటీవల బంగ్లాదేశ్లో చోటుచేసుకున్న పరిణామాల వంటివి అక్కడ జరగలేదు. బంగ్లాలో ఇస్లామిక్ తీవ్రవాదుల ఆధిపత్యం పెరగటం, బురఖా ధరించని మహిళలను బహిరంగ ప్రదేశాల్లో కొట్టి హింసించటం పరిపాటైంది. అంతేగాదు... దేశావిర్భావానికి మూల కారణమైన భాష, ప్రాంతం వంటి అస్తిత్వ అంశాలు సైతం బుట్టదాఖలా అవుతున్నాయి. ఆ పరిస్థితి లంకలో తలెత్తకపోవటం, సంక్షోభంలో సైతం రనిల్ ప్రభుత్వం సజావుగా సాగటంలో జేవీపీ పాత్ర కాదనలేనిది.అయితే జేవీపీ చరిత్రలో నెత్తుటి అధ్యాయాలు తక్కువేం కాదు. దాదాపు అరవైయ్యేళ్ల క్రితం ఆవిర్భవించి 70, 80 దశకాల్లో దేశంలో హింసాకాండను ప్రేరేపించిన జేవీపీని తుడిచిపెట్టడానికి ప్రభుత్వాలు చేయని ప్రయత్నమంటూ లేదు. మార్క్సిజాన్ని అనుసరిస్తున్నామని మావో, హోచి మిన్, చేగువేరా తమకు ఆదర్శమంటూనే సింహళ జాతీయవాదాన్ని రెచ్చగొట్టి వేలాదిమంది లంక తమిళులను ఊచకోత కోయటం, వారికి అనుకూలంగా మాట్లాడే వందలాదిమందిని హత మార్చటం జేవీపీ చరిత్రలో మాయని మచ్చ. తమ వైఖరిని వ్యతిరేకించే పాత్రికేయులను సైతం ఆ పార్టీ కాల్చి చంపింది. ప్రేమదాస హయాంలో ఉత్తర తూర్పు ప్రాంతంలో తమిళ టైగర్లనూ, ఉత్తరాన జేవీపీ మిలిటెంట్లనూ ఆయన ప్రభుత్వం అణిచేసింది. పొలిట్ బ్యూరోలో ఒక సభ్యుడు మినహా జేవీపీ నాయకత్వం మొత్తాన్ని అంతం చేసింది. అయితే కనుమరుగైందనుకున్న జేవీపీ క్రమేపీ మళ్లీ బలం పుంజుకున్నా ఎప్పటిలాగే దాన్ని అంతర్గత సంక్షోభాలు చుట్టుముట్టాయి. చివరకు పార్లమెంటరీ పంథాకు మెజారిటీ వర్గం మొగ్గుచూపి భారత–శ్రీలంక సైనిక ఒప్పందాన్ని వ్యతిరేకించిన చంద్రికా కుమారతుంగకు మద్దతునిచ్చింది. ఆమె ప్రభుత్వంలో భాగస్వామి అయింది.చుట్టూతా ఒక్కో దేశమే చైనా ప్రభావంలో పడి భారత వ్యతిరేక రాగం అందుకుంటున్న వర్త మానంలో దిస్సనాయకే గెలుపు మన ప్రభుత్వానికి ఒక రకంగా సమస్యాత్మకమే. మైనారిటీలుగా ఉన్న లంక తమిళులకు స్వయంపాలన ఇచ్చే 13వ రాజ్యాంగ సవరణను అమలు చేయాలని మన దేశం చాన్నాళ్లుగా కోరుతోంది. కానీ రాజపక్స దాన్ని బేఖాతరు చేశారు. దిస్సనాయకే వైఖరి సైతం అదే. అదానీల 450 మెగావాట్ల పవన విద్యుత్ కాంట్రాక్టును రద్దు చేస్తామని ఎన్నికల సభల్లో ఆయన చెప్పాడు. దానికితోడు భావజాలం రీత్యా చైనాకు సన్నిహితుడు. ఆ దేశం ఇచ్చిన అప్పులే దేశాన్ని సంక్షోభంలోకి నెట్టాయని దిస్సనాయకేకు తెలియంది కాదు. 2022 సంక్షోభం అనంతరం మన దేశం లంకకు 400 కోట్ల డాలర్ల అత్యవసర రుణం మంజూరు చేయటంతోపాటు ఐఎంఎఫ్ రుణం రావటంలో కీలకపాత్ర పోషించింది. పదునైన దౌత్యం పరమ శత్రువులను సైతం గెల్చుకోగలదు. మొదట్లో తీవ్ర స్థాయి భారత వ్యతిరేక వైఖరి తీసుకున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమద్ మియిజూ ఇందుకు ఉదాహరణ. అందువల్ల అసాధ్యం కానిదేదీ లేదు. ఇంతవరకూ దిస్సనాయకే ఎత్తుగడలు గమనిస్తే ఆయన సవ్యంగా అడుగులు వేస్తారని అంచనా వేయొచ్చు. -
చర్చ కాదు, రచ్చ
మాట్లాడగలగడం, మేధ వికసించడం మానవ చరిత్రలో మహత్తర ఘట్టాలంటారు శాస్త్రవేత్తలు. అవి లేకపోతే మనిషి మనుగడా, ఆ మనుగడతో పెనవేసుకున్న ప్రపంచమూ ఇప్పటిలా ఉండేవే కావు. మేధ జ్ఞానాన్ని పెంపొందిస్తే, దానిని నలుగురికీ పంచేది మాటే. మాట నేర్చిన తొలిరోజుల్లో దాని ప్రభావానికి ఆశ్చర్య చకితుడైన మనిషి దానికి మహత్తును ఆపాదించి మంత్రంగా మార్చు కున్నాడు. నిత్య జీవనంలో దాని లౌకికమైన విలువనూ గుర్తించాడు. ఒంటరి మనిషిలో స్వగతంగా ఉన్న మాట, మరో మనిషి జత కాగానే సంభాషణ అయింది; మరికొందరు జత పడితే చర్చ అయింది; శ్రోతలు పెరిగిన కొద్దీ ప్రసంగమైంది. వీటిలో ప్రతి ఒక్కటీ జ్ఞానవ్యాప్తికి వాహిక అయింది. చర్చనే వాద, ప్రతివాదమనీ; సంవాదమనీ; ఆంగ్లంలో డిబేట్, డిస్కషన్ అనీ అంటున్నాం. చర్చలేని సందర్భం మానవ జీవితంలో ఉండనే ఉండదు. కుటుంబ స్థాయి నుంచి, దేశస్థాయి వరకూ నిరంతరం చర్చ సాగుతూనే ఉంటుంది. చర్చకు వస్తువు కాని విషయమూ ఉండదు. భూమి సూర్యుడి చుట్టూ తిరిగినట్టే మానవ ప్రపంచం చర్చ చుట్టూ తిరుగుతుంది. దేనినైనా సరే చర్చించే అభ్యాసం మనకు కొత్తది కాదంటూ నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ ‘ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్’(సంవాద భారతీయుడు) అనే పుస్తకమే రాశాడు. రామాయణ, మహాభారతాల్లో, భగవద్గీతలో, ఉపనిషత్తుల్లో చర్చలూ, వాదప్రతివాదాలూ ఎలా సాగాయో ఎత్తిచూపాడు. హెచ్చు, తగ్గుల సమాజంలో కిందిమెట్టు మీద ఉన్న స్త్రీ, పురుషవర్గాల గొంతుకూ మన సంవాద సంప్రదాయం ఎంతోకొంత చోటిచ్చిందన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం వేళ్ళు చర్చలోనే పాతుకున్నాయంటూ, ప్రత్యేకించి మన దేశంలోని రకరకాల అసమానతలను ప్రజాస్వామికంగా పరిష్కరించుకోడానికి మనదైన సంవాద సంప్రదాయం స్ఫూర్తినిస్తుందన్నాడు. రామాయణంలో రాముడికి పట్టాభిషేక నిర్ణయాన్ని దశరథుడు అందిరినీ సంప్రదించే తీసుకుంటాడు. జాబాలికి, రాముడికి జరిగిన సంవాదం మరో ఉదాహరణ. పరలోకం లేదనీ, పితృవాక్పాలన అర్థరహితమనీ, ప్రత్యక్షంగా కనిపించే రాజ్యాన్ని అనుభవించమనీ జాబాలి అన్నప్పుడు రాముడు అతని మాటలు ఖండిస్తూ, నువ్వు చెప్పినట్లు చేస్తే ప్రజలు నన్నే ఆదర్శంగా తీసుకుని విచ్చలవిడిగా సంచరిస్తారంటాడు. విభీషణ శరణాగతి లాంటి ప్రతి సందర్భంలోనూ రాముడు సహచరులతో చర్చించే నిర్ణయం తీసుకుంటాడు. మహాభారతంలో ధర్మరాజు తనను జూదంలో ఒడ్డి ఓడినప్పుడు; తన్నోడి నన్నోడెనా, లేక నన్నోడి తన్నోడెనా అన్న చర్చను ద్రౌపది సభాముఖంగా లేవదీస్తుంది. ధర్మరాజు యుద్ధానికి విముఖుడైనప్పుడు యుద్ధపక్షాన వాదిస్తుంది. బృహదారణ్యకో పనిషత్తులో గార్గి అనే విదుషీమణి యాజ్ఞ్యవల్క్యునితో వాదోపవాదాలు జరిపి ఓటమిని హుందాగా ఒప్పుకుంటుంది. యాజ్ఞ్యవల్క్యునికి, అతని భార్య మైత్రేయికి జరిగిన సంవాదం గురించి కూడా ఉపనిషత్తు చెబుతుంది. ప్రత్యామ్నాయ చింతన నుంచి, ప్రతివాదం నుంచి, ప్రతిపక్షం నుంచే జైన, బౌద్ధ తాత్వికతలు అభివృద్ధి చెందాయి. అద్వైతవాది అయిన శంకరాచార్యుడు, కర్మవాది అయిన మండనమిశ్రునితోనూ, అతని భార్య ఉభయభారతితోనూ రోజుల తరబడి వాదోపవాదాలు జరిపి ఓడిస్తాడు. ఇప్పటిలా ప్రచురణ, ఎలక్ట్రానిక్, ఇంటర్నెట్ ఆధారిత సామాజిక మాధ్యమాలు లేని కాలంలో సైతం మనిషి తనే సంచార మాధ్యమంగా మారి, దూరభారాలను జయించి పండిత పరిషత్తులను మెట్టాడు; వాద, ప్రతివాదాలలో ప్రకర్షను చాటి జ్ఞానవిజ్ఞాన వ్యాప్తికి వేగుచుక్క అయ్యాడు. అలాంటి ఒక పండిత స్పర్థలోనే శ్రీనాథ మహాకవి ‘‘పగుల గొట్టించి తుద్భటవివాద ప్రౌఢి గౌడడిండమభట్టు కంచుఢక్క’’ అని చెప్పుకున్నాడు. నిన్నమొన్నటి వరకూ కాశీ, బెంగాల్లోని నవద్వీపం మొదలైనవి విద్వత్పరీక్షలకు పట్టుగొమ్మలుగా ప్రసిద్ధికెక్కాయి. అయల సోమయాజుల గణపతిశాస్త్రి అనే పండితుడు ఆంధ్రదేశం నుంచి నవద్వీపం వెళ్ళి అక్కడి విద్వజ్జనాన్ని మెప్పించి ‘కావ్యకంఠ’ బిరుదును అందుకొని వచ్చాడు. పురాతన నాగరికతలన్నీ సంవాద సంప్రదాయాన్ని పెంచి పోషించినవే. ప్రాచీన గ్రీకు తాత్వికుడు సోక్రటిస్ అభివృద్ధి చేసిన ప్రశ్నోత్తరాల సంవాద శైలి ‘సోక్రటిక్ డైలాగ్’ పేరిట ఒక వచనరచనా ప్రక్రియగా సారస్వతంలో భాగమైంది. సాంస్కృతిక పునరుజ్జీవనం దరిమిలా యూరప్లో ఆధునిక చర్చారూపాలు అభివృద్ధి చెంది, సంవాద సమాజాలు ఏర్పడి వైజ్ఞానిక వికాసాన్ని కొత్తపుంతలు తొక్కించాయి. సంవాద ప్రక్రియ నిర్దిష్టమైన రూపురేఖలు తెచ్చుకుని పాఠశాల నుంచి, విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యలో భాగమైంది. అందులో పోటీపడే విద్యార్థుల తర్ఫీదుకు శిక్షకులు అవత రించారు. ఆల్ఫ్రెడ్ స్నైడర్, మాక్స్ వెల్ ష్రూనర్ అనే ఇద్దరు శిక్షకులు సంవాదకళను అనేక కోణాల నుంచి చర్చిస్తూ, నిర్వచిస్తూ ‘మెనీ సైడ్స్– డిబేట్ ఎక్రాస్ కరిక్యులమ్’ అనే పుస్తకం వెలువరించారు. ఈ మొత్తం నేపథ్యం నుంచి చూసినప్పుడు మన పరిస్థితే ఆశ్చర్యకరం. రాచరికపు రోజుల్లోనే మనం తీర్చిదిద్దుకున్న సంవాద సంప్రదాయం ప్రజాతంత్రంలో అక్కరకు రాకుండాపోయింది. ఇన్నేళ్ళ ప్రజాస్వామ్యంలో కీలక సంవాద కేంద్రాలైన శాసనసభలకు వేలసంఖ్యలో ప్రతినిధులను పంపుకున్నా, పంపుతున్నా సంవాద విధివిధానాల శిక్షణ అంచెలంచెల విద్యలో ఇప్పటికీ భాగం కాలేదు. ఎక్కడైనా పాఠ్యేతర అంశంగా కొన ఊపిరితో ఉన్నా కార్పొరేట్ చదువులు దానినీ పాడి ఎక్కించాయి. కొత్తగా సామాజిక మాధ్యమాల వెల్లువ సంవాదపు బరిలో ప్రతి ఒకరికీ అవకాశమిచ్చి మేలు చేసినా విధివిధానాల శిక్షణ లేక చర్చ రచ్చగా మారడం; ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు కావలసిన సంవాదం విషవాయువు కావడం చూస్తున్నాం! -
ఒకే ఎన్నిక... అనేక కోణాలు!
కొన్నేళ్ళుగా చెబుతూ వస్తున్న ‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’ ప్రతిపాదనపై కేంద్రంలోని అధికార బీజేపీ మరో అడుగు ముందుకు వేసింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలోని కమిటీ ఈ ప్రతిపాదనపై ఇచ్చిన నివేదికను ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం లాంఛనంగా ఆమోదం తెలపడంతో రథం కదిలింది. ఈ ప్రతిపాదనపై ఓ బిల్లును రానున్న పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు భోగట్టా. దేశంలో లోక్సభకూ, అన్ని రాష్ట్రాల శాసనసభలకూ కలిపి ఒకేసారి ఎన్నికలు జరపడానికి ఉద్దేశించిన ఈ సంక్లిష్ట ప్రతిపాదనపై మొదటి నుంచి భిన్నాభిప్రాయాలు ఉన్నందున తాజా పరిణామాలతో మరోమారు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పైగా ఈ ప్రతిపాదనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీతో రాజ్యాంగ సవరణలు అవసరం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతిపాదనను కేంద్రంతో పాటు రాష్ట్రాలూ ఆమోదించాల్సి ఉంటుంది. వెరసి, రాజ్యాంగపరంగానూ, ఆచరణలోనూ అనేక అవరోధాలున్న ఈ ప్రతిపాదనపై రాగల నెలల్లో పెద్దయెత్తున రచ్చ రేగడం ఖాయం.నిజానికి, ఏకకాలంలో ఎన్నికలనేవి కొత్త ఏమీ కావు. గతంలో ప్రత్యేకంగా నియమం, చట్టం లాంటివేమీ లేకున్నా, 1951 – 52లో మొదటి జనరల్ ఎలక్షన్స్ నాటి నుంచి మన దేశంలో లోక్ సభ, రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు కలిసే జరుగుతుండేవి. అయితే, కాలవ్యవధి పూర్తి కాకుండానే రాష్ట్ర అసెంబ్లీలు రద్దవడం ఎప్పుడైతే మొదలైందో, అప్పుడు 1967 తర్వాత నుంచి కథ మారింది. ఏకకాల ఎన్నికల క్యాలెండర్ మారిపోయింది. పదేళ్ళ క్రితం తొలిసారి అధికారంలోకి వచ్చే ముందే బీజేపీ తన మేనిఫెస్టోలో ‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’ను లక్ష్యంగా పేర్కొంది. అంతకు ముందు సన్నాయినొక్కులు నొక్కినా, బీజేపీ గద్దెనెక్కాక సహజంగానే భారత ఎన్నికల సంఘం ఈ ఆలోచనను సమర్థించింది. అలాగే, లా కమిషన్లు సైతం 1999లో, 2018లో ఈ ఏకకాలపు ఎన్నికల విధానాన్ని పునరుద్ధరించాలన్నాయి. 2015 నాటి పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందు పలు పార్టీలు ఈ ప్రతిపాదనకు మద్దతు నివ్వగా, కొన్ని పార్టీలు మాత్రం వ్యతిరేకించాయి. భిన్నాభిప్రాయాలున్న దీనిపై ఏకాభిప్రాయ సాధన అవసరమని మొదట్లో చెబుతూ వచ్చిన మోదీ సర్కార్, ఆ సంగతి పక్కనపెట్టి ఇటీవల తన అజెండాను ముందుకు నెట్టే ప్రయత్నం చేయడం గమనార్హం. కోవింద్ కమిటీ వేయడం, ఆ కమిటీ ఈ ఏడాది మార్చిలో నివేదిక సమర్పించడం చకచకా జరిగాయి. తొలి దశలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు, ఆ వెంటనే రెండో దశలో 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు – ఇలా రెండు దశలుగా 2029 నుంచి ‘ఒకే ఎన్నిక’ ప్రతిపాదనను అమలు చేయవచ్చని కమిటీ సిఫార్సు చేసింది. ఇప్పుడు కమిటీ నివేదికను క్యాబినెట్ ఆమోదించి, పార్లమెంట్లో చట్టం చేయడానికి సిద్ధమవుతోంది. లోక్సభ ఎన్నికల నిర్వహణకు కేంద్రానికి రూ. 4 వేల కోట్లు ఖర్చవుతుందని లెక్క. ఆ యా రాష్ట్రాల పరిమాణాన్ని బట్టి అసెంబ్లీ ఎన్నికలకు అయ్యే ఖర్చు వేరు. ఈ ప్రభుత్వ అధికారిక ఖర్చు కాక, వివిధ పార్టీలు, అభ్యర్థులు చేసే ఖర్చు అనేక రెట్లు. ఏక కాలపు ఎన్నికల వల్ల ఖర్చులు తగ్గుతాయనీ, తరచూ ఎన్నికలతో పాలన కుంటుపడుతున్నందున దాన్ని నివారించవచ్చనీ, ఒకేసారి ఎన్నికలతో ఓటింగ్ శాతం హెచ్చవుతుందనీ సమర్థకుల వాదన. అయితే, ఏకకాలపు ఎన్నికల కోసం పలు రాష్ట్ర అసెంబ్లీలను ముందుగానే రద్దు చేయాల్సి వస్తుంది. రేపు పొద్దున ఒకేసారి ఎన్నికలు పెట్టినా... ఒకవేళ ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం పడిపోయి మధ్యంతర ఎన్నికలు వస్తే, కేవలం మిగిలిన కాలవ్యవధికే ఎన్నికల ద్వారా కొత్త ప్రభుత్వాన్ని ఎన్ను కోవాలట. ఇలాంటి ప్రతిపాదనలు వట్టి అర్థరహితం. పైగా, ఇది మరింత ఖర్చుకు దారి తీయడమే కాక, అసలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం. అలాగే ఏకకాలపు ఎన్నికల వల్ల స్థానిక, ప్రాంతీయ అంశాలు పక్కకుపోయి, జాతీయ అంశాలదే పైచేయి అవుతుందనీ, చివరకు స్థానిక, చిన్నపార్టీలు కనుమరుగై పోతాయనీ భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవల ఏకకాలంలో హర్యానా, జమ్మూ– కశ్మీర్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు చేయలేమని చేతులె త్తేసిన ఎన్నికల సంఘం రేపు దేశమంతటా ఒకేసారి ఎన్నికలు ఎలా చేయగలుగుతుంది? కొన్ని కోట్ల ఈవీఎంలు, వీవీప్యాట్లు, వేల సంఖ్యలో భద్రతా సిబ్బందిని ఏకకాలంలో సమకూర్చుకోవడం సాధ్యమా? దానికయ్యే ఖర్చుతో పోలిస్తే, ‘ఒకే ఎన్నిక’ వల్ల ఆదా అయ్యేది ఏపాటి? అసలింతకీ కేంద్రంలోని కమలనాథులు ఇప్పుడీ పనిని ఎందుకు భుజాన వేసుకున్నట్టు? అధికార పక్షం సొంత మెజారిటీ ఉన్నప్పుడు ఇట్టే చేయగల పనిని మిత్రపక్షాలపై ఆధారపడిన ప్రభుత్వ హయాంలో తలకెత్తుకున్నదేమిటి? 2015 నాటి ఓ సర్వే ప్రకారం... ఏకకాలంలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 77 శాతం ఓటర్లు రెండింటా ఒకే పార్టీకి ఓటు వేస్తారట. అదే గనక ఆరు నెలల విరామం తర్వాత జరిగితే 61 శాతం మందే ఒకే పార్టీకి ఓటు వేస్తారట. దేశమంతటా ‘డబుల్ ఇంజన్ సర్కార్’కై తహతహలాడుతున్న బీజేపీ ఓటర్ల తాలూకు ఈ ఏకకాలపు ఎన్నికల మనస్తత్వం కలిసొస్తుందని భావిస్తూ ఉండవచ్చు. కానీ, వైవిధ్యానికి నెలవైన సమాఖ్య వ్యవస్థలో కృత్రిమంగా ఏకకేంద్రక స్వభావాన్ని జొప్పించడమే ఇదంతా అని విమర్శ. ఎవరి రాజకీయ, సైద్ధాంతిక వైఖరులు ఏమైనా అనేక అంశాలపై ప్రభావం చూపే ఈ ప్రతిపాదనకు తొందరపడితే సరిపోదు. కాగితంపై అందంగా కనిపించే ఆలోచనకు సైతం ఆచరణలో ఉండే ఇబ్బందులను గమనించాలి. వ్యతిరేకుల వాదన వినాలి. సహేతుకమైన వారి సందేహాల్ని తీర్చాలి. లేదంటే ప్రజాస్వామ్యానికే అర్థం లేదు. -
రాజీనామా వ్యూహం
రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు కీలకం. అందులోనూ ప్రత్యర్థి ఊహించని రీతిలో ఎత్తుగడలు వేయడం మరీ అవసరం. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రథసారథి అరవింద్ కేజ్రీవాల్ ఆ సంగతి ఒంట బట్టించుకున్నారు. ఇమేజ్ పడిపోతోందనుకున్న ప్రతిసారీ ఏదో ఒక ప్రకటన, వినూత్న నిర్ణయంతో మళ్ళీ పుంజుకొనే ఆయన ఈసారీ అదే పద్ధతిని అనుసరించారు. మద్యం పాలసీ కేసు వ్యవహారంలో ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి విడుదలైన రెండు రోజులకే ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ తీసుకున్న అనూహ్య నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. సీఎం పదవి నుంచి వైదొలగాల్సిందిగా బీజేపీ కొన్ని నెలలుగా డిమాండ్ చేస్తున్నా కిమ్మనాస్తిగా ఉన్న కేజ్రీవాల్ ఇప్పుడే ఎందుకీ నిర్ణయం తీసుకున్నారన్నది ఆసక్తి రేపుతోంది. సీనియర్ మంత్రులు ఆతిషి, సౌరభ్ భరద్వాజ్ మొదలు కేజ్రీవాల్ సతీమణి సునీత దాకా స్వల్పకాలిక కొత్త సీఎం ఎవరవుతారనే చర్చ జరుగుతోంది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సోమవారం సమావేశమై చర్చించగా, మంగళవారం ఉదయం కొత్తనేత ఎంపికకై శాసనసభా పక్ష సమావేశం, సాయంత్రం రాజీనామా లేఖ ఇచ్చేందుకు లెఫ్టినెంట్ గవర్నర్తో కేజ్రీవాల్ భేటీ జరగనుండేసరికి ఢిల్లీ రాజకీయం వేడెక్కింది.అసెంబ్లీని అసలు రద్దు చేయాలనే ఆలోచన కూడా ఉన్నా, కొన్నేళ్ళ క్రితం ఆప్ అసెంబ్లీని రద్దు చేసి, తక్షణ ఎన్నికలకు సిఫార్సు చేసినప్పుడు చెవికెక్కించుకోకుండా కేంద్రం తరువాతెప్పుడో తాపీగా ఎన్నికలు పెట్టింది. ఈసారి కూడా ఆ ప్రమాదం ఉన్నందున కేజ్రీవాల్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో తీర్పుతో నిజాయతీ నిరూపించుకొని మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చొంటానంటూ కేజ్రీవాల్ ఆదివారం చేసిన భీషణ ప్రతిజ్ఞ వెనుక బయటకు చెప్పని కారణాలు అనేకం.సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సహా ఆప్ నేతలు పలువురు ఇప్పటికే అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారు. అందుకే... 2011లో అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి ప్రభవించిన పార్టీ తమపై వచ్చిన ఆరోపణల్ని తిప్పికొట్టేందుకు ఎన్నికల మార్గం ఎంచుకుంటోంది. అగ్నిపరీక్షకు సిద్ధం అనడం తెలివైన ఎత్తుగడే. రాజీనామా నిర్ణయం రాజకీయ సిక్సర్ అని కొందరు విశ్లేషకులు అంటున్నది అందుకే. అవినీతి మచ్చను తుడుచుకోవడం దగ్గర నుంచి పెరుగుతున్న అధికారపక్ష వ్యతిరేకతను తగ్గించుకోవడం వరకు అనేక విధాలుగా ఈ నిర్ణయం కేజ్రీవాల్కు ఉపకరించవచ్చు. ప్రతిపక్ష శిబిరం వల్ల పెరిగిన బీజేపీ వ్యతిరేకత నుంచి లబ్ధి పొందనూవచ్చు. నిర్ణీత కాలవ్యవధి ప్రకారం చూసినా వచ్చే ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది గనక అయిదు నెలల ముందు రాజీనామా వల్ల కేజ్రీవాల్ వస్తే లాభమే తప్ప, పోయేదేమీ లేదు. తాజాగా బెయిలిస్తూ, సీఎం ఆఫీసుకు వెళ్ళరాదు, అధికారిక ఫైళ్ళపై సంతకాలు చేయరాదు, కేసుపై బహిరంగ ప్రకటనలు చేయరాదంటూ సుప్రీమ్ కోర్ట్ పెట్టిన కఠిన నిబంధనల రీత్యా కేజ్రీవాల్ ఎలాగూ సీఎంగా వ్యవహరించలేరు. కాబట్టి, పదవికి రాజీనామా చేస్తూ, మహారాష్ట్రతో పాటు నవంబర్లోనే ముందస్తు ఎన్నికలు జరపాలంటూ ఆయన పోరుబాట పట్టారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ‘ప్రతీకార రాజకీయాలు’ చేస్తోందని ఆరోపిస్తూ, బాధితుడిగా తనను తాను చూపించుకోవ డానికి కూడా ఆయనకు ఇదే సరైన సమయం. ఎలాగూ ఎన్నికలు జరిగేంత వరకు ఈ కొద్ది కాలం వేరెవరో సీఎంగా ఉన్నా, చక్రం తిప్పేది కేజ్రీవాలే! కనుక బాధ లేదు. అదీ కాక, మధ్యలో కేంద్ర పాలన ఉన్న ఒక్క ఏడాది మినహా 2013 డిసెంబర్ నుంచి ఢిల్లీని ఏలుతున్నందున ఓటర్లలో వ్యతిరే కత పేరుకుంది. దాని నుంచి తప్పించుకోవడానికీ, క్షేత్రస్థాయిలో జనంతో మమేకమై ముచ్చటగా మూడోసారి పార్టీ విజయావకాశాల్ని మెరుగుపరచడానికీ ఈ రాజీనామా డ్రామా అక్కరకొస్తుంది.అయితే, ఇందులో కొన్ని రిస్కులూ లేకపోలేదు. గడచిన 20 నెలల పైచిలుకు కాలంలో ప్రధాన ఆప్ నేతలు పలువురు ఏదో ఒక అంశంలో జైలుకెళ్ళారు. మద్యం కుంభకోణం వ్యవహారం, కేంద్రం వర్సెస్ ఢిల్లీ సర్కార్ల గొడవ మధ్య పాలన పడకేసింది. ఢిల్లీలో ప్రాథమిక పౌర వసతులు కుప్పకూలాయి. ఆ మధ్య అన్యాయంగా ముంచెత్తిన వాన నీళ్ళలో చిక్కుకొని ఐఏఎస్ శిక్షణార్థులు ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం అందుకు ఓ మచ్చుతునక. బడి చదువులు, ఆరోగ్య వసతులు సమూలంగా మార్చేస్తామంటూ ఆప్ అధికారంలోకి వచ్చినా, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్లో పరిస్థితి తద్విరుద్ధంగా ఉంది. వీటన్నిటి నుంచి జనం దృష్టి మరల్చడం అంత సులభమేమీ కాదు. అసెంబ్లీ రద్దు చేయకుండా నవంబర్లో ఎన్నికలనేవి మాటల్లోనే తప్ప చేతల్లో సాధ్యం కాదు. రద్దు చేసి అడిగినా, నవంబర్లోనే ఎన్నికలు పెట్టడం తప్పనిసరి కాదు. ఒకవేళ నవంబర్లోనే ఎన్నికలొస్తే ఆప్కు సమయం సరిపోతుందా అన్నదీ ప్రశ్నార్థకమే. ఎన్నికలు జాప్యమైతే అనేక ఇతర రాష్ట్రాల్లోని పార్టీలలో లాగే కొత్త సీఎంతో ఆప్లో అసమ్మతి పెరిగే ప్రమాదమూ లేకపోలేదు. ఆప్ ఇప్పుడు కీలకమైన కూడలిలో ఉంది. ఢిల్లీ, ఆ తర్వాత పంజాబ్లలో సత్తా చాటినా, ఇతర రాష్ట్రాలకు విస్తరించడంలో విఫలమైంది. ఇప్పుడు ఢిల్లీలోనే అగ్నిపరీక్షను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పటికే విలాసవంతమైన సీఎం అధికారిక నివాసం, అమలు కాని పథకాలతో జనంలో పలచనైన కేజ్రీవాల్ ప్రతిష్ఠను కూడగట్టుకోవడం కష్టమే. పైగా కేంద్ర, రాష్ట్ర సర్కార్ల మధ్య పెనుగులాటలో ప్రజలు బాధితులవుతున్నారు. కుంటుబడ్డ పాలనతో కష్టాలు చవిచూస్తున్నారు. కేజ్రీవాల్ అవినీతి పరుడా, కాదా అన్నది తేల్చాల్సింది కోర్టు కాగా ప్రజాకోర్టులో నిజాయతీ సర్టిఫికెట్ తెచ్చుకుంటానని ఆయన చెప్పడం నాటకీయంగా బాగుంటుందే కానీ, నికరంగా ప్రజలకు ఒరిగేది శూన్యం. మరి ప్రతి సంక్షోభాన్నీ అవకాశంగా మార్చుకుంటారని పేరున్న కేజ్రీవాల్ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో? -
ప్రపంచ వచనాలు
‘పాప పుణ్యాలనేటటువంటివి/ మీ చేతుల్లో ఉన్నవి/ అయ్యా అంటే స్వర్గం/ ఒరే అంటే నరకం/ కూడల సంగమదేవా!’ ఇది బసవన్న చెప్పిన ఎన్నో వచనాల్లో ఒకటి. కన్నడిగుల విశిష్ట సారస్వతం వారి ‘వచనాలు’. కన్నడ ఉపనిషత్తులుగా ఇవి కీర్తినొందాయి. వీరశైవ భావధార ఉద్ధృతంగా ప్రవ హించిన పన్నెండో శతాబ్దంలో ఇవి వెలువడ్డాయి. ఈ వచనకారులు ఒక్కరు కాదు, లెక్కకు మిక్కిలి. ‘పారేనదికి/ ఒళ్లంతా కాళ్లు/ మండే నిప్పుకి/ ఒళ్లంతా నోళ్లు/ వీచే గాలికి/ ఒళ్లంతా చేతులు/ గుహేశ్వరా/ నీ వాళ్లకి/ ప్రతి అంగం లింగమే’ అన్నాడు అల్లమ ప్రభు. ఛందస్సును అనుసరించకుండా, పాండిత్య ప్రకర్ష లేకుండా, సరళంగా, భావ ప్రధానంగా రాసిన ఈ వచనాలు అందులోని పదాల తూగు వల్ల ఒక లయను కలిగివుంటాయి. కొంతమంది శాస్త్రీయ సంగీత గాయకులు వీటిని ఆలపించడం కద్దు. మానవత్వాన్నీ, కాయక ధర్మాన్నీ ఈ వచనాలు చాటిచెప్పాయి. కులాల మధ్య, స్త్రీ పురుషుల మధ్య తేడాలను నిరసించాయి. జంగముడు ఏ కులానికి, ఏ వృత్తికి చెందినవాడైనప్పటికీ శివునిలా పూజనీయుడే; సహపంక్తి భోజనాదులకు అర్హుడే. ఈ విశాల దృక్పథంతో చెప్పి నందువల్లే వచనాలు భక్తేతరుల ఆదరణనూ చూరగొన్నాయి. వీరశైవ భక్తులను ‘శరణులు’ అన్నారు కాబట్టి, వాళ్లు రాసింది ‘శరణ సాహిత్యం’ అయ్యింది. ఈ సాహిత్యాన్ని మరింతగా ప్రపంచానికి చేరువ చేసే ప్రయత్నాలను బెంగళూరులోని ‘బసవ సమితి’ చేస్తోంది. 173 మంది వచనకారుల ఎంపిక చేసిన 2,500 వచనాలను వివిధ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో భిన్న భాషల్లోకి అనువదింప జేస్తోంది. ఇప్పటికే అరబ్బీ, పర్షియన్ లాంటి సుమారు 30 జాతీయ, అంతర్జాతీయ భాషల్లోకి అనువాదమైన వీటిని 2025 జనవరి కల్లా స్పానిష్, జర్మన్, జపనీస్, చైనీస్, ఫ్రెంచ్, నేపాలీల్లోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. పన్నెండో శతాబ్దంలో కళ్యాణకటకము నేలిన బిజ్జలుని కొలువులో బసవేశ్వరుడు మంత్రిగా పనిచేశాడు. వీరశైవ మతానికి ఎనలేని ప్రాబల్యాన్ని కల్పించాడు. బసవడు ఎంతటి కవియో అంతటి తాత్వికుడు. ‘ఉన్నవాళ్లు/ గుళ్లు గోపురాలు కట్టిస్తారు/ లేనివాణ్ణి/ నేనేమి చెయ్యాలి?/ నా కాళ్ళే స్తంభాలు/ కాయమే కోవెల/ శిరసే బంగారు శిఖరం/ కూడల సంగమదేవా! విను/ చెడితే స్థావరం చెడుతుంది గాని/ జంగమం చెక్కుచెదరదు’ అన్నాడు. బసవన్న స్థాపించిన ఆధ్యాత్మిక సంఘం ‘అనుభవ మంటపం’. దానికి వేదిక ఆయన ఇల్లే. దీనికి అధ్యక్షుడు అల్లమ ప్రభు. అధ్యక్ష సింహాసనం పేరు శూన్య సింహాసనం. అనుభవ మంటపం అనే ఆలోచనే మేధా మథనానికీ, ప్రజాస్వామిక భావమార్పిడికీ ఉత్తేజాన్ని ఇచ్చేది. ఇందులో సుమారు 300 మంది శరణులు పాల్గొనేవారు. వాళ్లలో ‘వీరరాగిణి’ అక్క మహాదేవి సహా 36 మంది స్త్రీలు ఉండటం విశేషం. వీరిలో రకరకాల వృత్తులవాళ్లు ఉన్నారు. ‘కట్టెలమ్ముకొనే మోళిగెయ మారయ్య, చెప్పులు కుట్టే మాదార చెన్నయ్య, తోళ్లు పదునుపెట్టే దోహర కక్కయ్య, బట్టలుతికే మడివాల మాచయ్య, వెదురు బుట్టలల్లే మేదర కేతయ్య, పడవ నడిపే అంబిగర చౌడయ్య...’ వీళ్లు ‘రామనాథా’, ‘సకలేశ్వరదేవా’, ‘అమరగుండ మల్లికార్జునా’, ‘సిద్ధ మల్లికార్జునా’ అంటూ తమ ఇష్టదైవాలను మకుటంగా చేర్చుకొని తమ వచనాలను చెప్పారు. ‘పిడకలు ఏరటంలోనే/ అయిపోతోంది బ్రతుకంతా/ ఇక నేను/ అన్నం వండేదెప్పుడు,/ తినేదెప్పుడు? కూడల సంగమదేవా’ అన్నాడు బసవన్న. ‘సువిశాలమైన కన్నడ సాహిత్య క్షేత్రంలో విహరిస్తుంటే వచనాల దగ్గరకు వచ్చేసరికి మనం ఒక తపోవనంలో అడుగు పెట్టినట్లుగా అనిపిస్తుంది. అక్కడ మనకు తారసపడేవారందరూ రుషులూ, సాధువులే! కల్మషంతో నిండిన మనుషుల అంతరంగాలు శుభ్రపడటానికి వారి బోధలు చాలు అనిపిస్తుంది’ అంటారు ఈ వచనాల్లో కొన్నింటిని ‘మాటన్నది జ్యోతిర్లింగం’గా పాతికేళ్ల క్రితమే తెలుగులోకి అనువదించిన దీవి సుబ్బారావు.తెలుగులో మొట్టమొదట మల్లికార్జున పండితుడు ‘శివతత్వ సారం’లో బసవన్నను స్తుతించాడు. పాల్కురికి సోమనాథుడు ద్విపదల్లో బసవ పురాణము రచించి వీరశైవాన్ని ప్రచారం చేశాడు. ఒక తెలుగు కవి తొలిసారిగా రాసిన స్వతంత్ర పురాణం ఇది. శివభక్తులకు శ్రీశైలం మహోజ్జ్జ్వల సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లింది. బసవన్నకు ముందువాడని చెప్పే దేవర దాసిమయ్య శ్రీశైలం వచ్చి ఆగమాలు, పురాణాలు చదువుకొన్నాడు. అల్లమ ప్రభు శ్రీశైలంలో సమాధి నొందాడు. అక్క మహాదేవి శ్రీశైల కదళీవనంలో కాలం గడిపింది. ‘కొండల్లో కాక కంచెల్లో ఆడుతుందా నెమలి? /కొలనుల్లో కాక కాలువల్లో ఈదుతుందా హంస/ ...చెన్నమల్లికార్జునుడు కాక అన్యుల్ని తలుస్తుందా నా మనస్సు?’ అంటూ తన జీవితాన్ని ఆ చెన్నమల్లికార్జునుడికే అర్పించుకుంది. ‘మిణుగురులు ఎగిరితే/ నా ఆకలిదప్పులు అణగారినాయనుకొంటా/ మబ్బులు కరిగితే/ నా స్నానం కొరకు పంపిన జలమనుకొంటా/ కొండరాయి జారిపడితే/ నా తల్లో తురిమిన పూవనుకొంటా/ నా కంఠం తెగితే/ చెన్నమల్లికార్జునా!/ అది నీకర్పితమనుకొంటా’ అని పాడుకుంది. ఆమె తపస్సు చేసిందని చెప్పే ‘అక్క మహాదేవి గుహలు’ ఏ శ్రీశైల యాత్రికుడికైనా దర్శనీయ స్థలం.‘ఆవగింజంత సుఖానికి/ సాగరమంత సంకటం/ తన్నే కోల్పోయి/ నిధిని సాధించానంటే/ అందమేముంది?/ గుహేశ్వరా’ అన్నాడు అల్లమ ప్రభు. భక్తి పరవశంలో రాసినవైనప్పటికీ, అంతకుమించిన తాత్విక చింతననూ, మానవ స్వభావాన్నీ ఈ వచనాలు ఆవిష్కరించాయి. అంతేనా? ప్రతి భాషా మేలిమి సాహిత్యాన్నీ అలా పూనిక వహించి ఎల్లలు దాటించాలన్న ప్రేరణను కూడా ఇస్తున్నాయి. -
ఎవరికోసం ఈ కృత్రిమ విపత్తు?
భోపాల్ దుర్ఘటనకు ఇప్పుడు సరిగ్గా నలభయ్యేళ్ల వయసు. భారత చరిత్రలోని విషాద ఉదంతాల్లో అదొకటి. నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలు బలిగొన్నందుకు గాను కంపెనీ యాజమాన్యంపై ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదైంది. తమ నిర్లక్ష్యం కారణంగా లేదా చర్యల కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు ఉండే అవకాశం ఉందని తెలిసి కూడా ముందుకు వెళ్లడాన్ని నేర శిక్షాస్మృతి 'culpable homicide'గా పరిగణిస్తుంది. ఐపీసీ స్థానంలో ‘భారత న్యాయ సంహిత’ (బీఎన్ఎస్) అమల్లోకి వచ్చిన తర్వాత, తీవ్రమైన నిర్లక్ష్యం కారణంగా జరిగే ప్రాణనష్టం సెక్షన్ 106 కిందకు వస్తుందని చెబు తున్నారు. కారకులకు పదేళ్లు జైలు, జరిమానా కూడా ఉండ వచ్చు.ప్రతి పౌరుడికీ జీవించే హక్కు ఉన్నది. భారత రాజ్యాంగం ఈ హక్కును ప్రాథమిక హక్కుగా (Article 21, Right to life) గుర్తించింది. దీన్ని ఉల్లంఘించే అధికారం ఏ వ్యక్తికి గానీ, వ్యవస్థకు గానీ, ప్రభుత్వానికి గానీ లేదు. నిర్లక్ష్యం వల్లనో, ఉద్దేశ పూర్వకంగానో పౌరుల ప్రాణాలను బలిగొనే ప్రభుత్వాలు అధికారంలో కొనసాగడం రాజ్యాంగ విరుద్ధం. రెండు వారాల కింద విజయవాడ నగరం ఎదుర్కొన్న ఆకస్మిక వరదల కారణంగా డజన్లకొద్దీ ప్రాణాలు పోయాయి. మూడు లక్షల కుటుంబాలు తమ సమస్తాన్నీ కోల్పోయాయి. పదేళ్ల కష్టార్జితాన్ని కోల్పోయి, కట్టుబట్టలతో మిగిలామని ఆ కుటుంబాలు రోదిస్తున్నాయి.విజయవాడ ఆకస్మిక వరదలను ‘ప్రకృతి విపత్తు’ కోటాలో వేసేయలేము. వీటిని నివారించడానికి ఉన్న అవకాశాలను బాధ్యులైన వారు వినియోగించలేదు. బహుశా అందువల్లనే ఈ వరదలను ‘మ్యాన్ మేడ్ ఫ్లడ్స్’గా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి అభివర్ణించారు. కచ్చితంగా ఈ విషాదం మానవ కల్పితమే! ఈ మానవ కల్పిత విషాదం వెనుక ప్రభుత్వ నిర్లక్షం ఉన్నది. పరిపాలనా వైఫల్యం ఉన్నది. పాలకుల దురుద్దేశం కూడా దాగున్నది. జరిగిన పరిణామాలను క్రమానుగతంగా పరిశీలిస్తే ఈ సంగతి ఎవరికైనా తేటతెల్లమవుతుంది.ఆగస్టు 28వ తేదీ బుధవారం నాడు భారత వాతావరణ శాఖ (ఐఎమ్డి) వారు ఒక నివేదికను విడుదల చేశారు. బంగా ళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం రాబోయే రెండు రోజుల్లో ఆంధ్ర, ఒడిషాలపై ప్రభావం చూపబోతున్నదనే అంశం కూడా ఈ నివేదికలో ఉన్నది. వాతావరణ నివేదికల్లో తుపాను సంబంధిత హెచ్చరికలు వెలువడగానే తీరప్రాంత రాష్ట్రాలు తక్షణం స్పందించి సమీక్ష జరపడం రివాజు. పైగా గుజరాత్ తర్వాత అత్యంత పొడవైన సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ తుపాను హెచ్చరికలపై స్పందన వేగంగా ఉండాలి. కానీ ప్రభుత్వ పెద్దలు గానీ, అధికార యంత్రాంగం గానీ ఈ హెచ్చరికను పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు.ఆ మరుసటిరోజు ఆగస్టు 29న ఐఎమ్డీ రెండో నివేదికను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు గురువారం రాత్రి నుంచి శనివారం వరకు పడతాయని నివేదిక హెచ్చరించింది. ఐఎమ్డీతోపాటు ‘ఆంధ్ర ప్రదేశ్ వెదర్మ్యాన్’, ‘తెలంగాణ వెదర్మ్యాన్’ కూడా ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. వాతావరణ శాస్త్రవేత్తలైన ఈ యువకులు ‘వెదర్మ్యాన్’ పేరుతో అత్యంత కచ్చితత్వంతో కూడిన హెచ్చరికలు జారీచేస్తూ ఇటీవలి కాలంలో సంచలనం సృష్టిస్తున్నారు. ‘ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్’ సాయి ప్రణీత్ 29న డిప్యూటీ సీఎంను ట్యాగ్ చేస్తూ నివేదికను విడుదల చేశారు. విజయనగరం నుంచి పల్నాడు జిల్లా వరకు అన్ని జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని, ముఖ్యంగా శనివారం నాడు అతి భారీ వర్షా లుంటాయి కనుక పాఠశాలలకు ముందుగానే సెలవు ప్రకటించాలని పవన్ కల్యాణ్కు ఆయన విజ్ఞప్తి చేశారు.వరుస హెచ్చరికలున్నప్పటికీ ప్రభుత్వ పెద్దలు పెడచెవిన పెట్టారు. అధికార యంత్రాంగం చేష్టలుడిగి కూర్చున్నది. రాజకీయ – అధికార ముఖ్యులందరూ వీకెండ్ మూడ్లోకి, చలో హైదరాబాద్ మోడ్లోకి వెళ్లిపోయారు. రిజర్వాయర్లలో ‘ఫ్లడ్ కుషన్’ మెయింటెయిన్ చేయలేదని జగన్మోహన్రెడ్డి పదేపదే ఆరోపిస్తున్నట్టు నదుల్లో వరద నియంత్రణ చర్యలను యంత్రాంగం గాలికి వదిలేసింది. భారీ వర్ష సూచనలున్నప్పుడు నిండుగా ఉన్న రిజర్వాయర్ల నీటిని కొంత మేరకు దిగువకు విడుదల చేసి వచ్చే వరద ప్రవాహానికి కొంత కుషన్ ఏర్పాటు చేసుకుంటారు. ఈ ప్రోటోకాల్ను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా ప్రకాశం బ్యారేజికి రికార్డు స్థాయి వరద చేరి పరిస్థితిని సంక్లిష్టం చేసింది. దీని ప్రభావం బుడమేరు మీద, రాజ ధాని ప్రాంతం మీద కూడా పడింది.బుడమేరు అనే వాగుకు ఎప్పటినుంచో ‘బెజవాడ దుఃఖ దాయని’ అనే పేరున్నది. విజయవాడకు ఉత్తర దిక్కున ఉన్న ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతం నుంచి ఈ వాగు దక్షిణా భిముఖంగా ప్రవహించి, నగరానికి వాయవ్య దిక్కున ఉన్న వెలగలేరు అనేచోట తూర్పు వైపు తిరిగి, పలు వంపులు తిరు గుతూ నగరం మీదుగా కొల్లేరు దాకా పారుతుంది. విజయ వాడకు వరద ముప్పును నియంత్రించడం కోసం వెలగలేరు మలుపు దగ్గర బుడమేరుపై గేట్లు బిగించారు. వరద ప్రవాహాన్ని దక్షిణం వైపు మళ్లిస్తూ ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిలోకి పారేలా ‘బుడమేరు డైవర్షన్ కెనాల్’ (బీడీసీ) ఏర్పాటు చేశారు. దిగువన ఇబ్రహీంపట్నం దగ్గరున్న విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కోసం ఏర్పాటైన కూలింగ్ కెనాల్తోనే ఈ బీడీసీని అనుసంధానించారు. పోలవరం కుడికాల్వను కూడా వెలగలేరు వద్ద బీడీసీతో కలిపేశారు. ఈ బుడమేరు డైవర్షన్ కెనాల్ సామర్థ్యం 15 వేల క్యూసె క్కులని చెబుతారు. కానీ అంతకుముందే అక్కడ వీటీపీఎస్ కూలింగ్ కెనాల్పై చంద్రబాబు ఓ యెల్లో మీడియా ప్రముఖునికి ఇచ్చిన పవర్ ప్లాంట్ కారణంగా ఐదు వేల క్యూసెక్కులకు మించి అక్కడ ప్రవహించే అవకాశం లేదని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు. బుడమేరు వరదెత్తిన రోజుల్లో గరిష్ఠ స్థాయిలో ఆ ప్రవాహాన్ని బీడీసీలోకి మళ్లిస్తే విజయవాడకు వరద ముప్పు తగ్గుతుంది. ఆ గరిష్ఠ స్థాయి మళ్లింపునకు అడ్డుగా ఉన్న పవర్ ప్లాంట్ను తొలగించడానికి గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగినా కోర్టు›స్టేల వల్ల సాధ్యం కాలేదు.ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుడమేరులో 45 వేల క్యూసెక్కుల వరద రాబోతున్నదని శనివారం మధ్యా హ్నానికి ముందే స్థానిక ఇరిగేషన్ ఇంజనీర్లు అంచనా వేసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్టు చెబుతున్నారు. బుడ మేరు రెగ్యులేటర్ డీఈ మాధవనాయక్ ‘సాక్షి’ టీవీతో ఆన్ రికార్డు ఈ విషయాన్ని నిర్ధారించారు. బీడీఎస్ సామర్థ్యం 15 వేల క్యూసెక్కులే కనుక అనివార్యంగా బుడమేరు గేట్లను శని వారం సాయంత్రానికల్లా ఎత్తవలసి ఉంటుందని కూడా వారు ఉన్నతాధికారులకు చేరవేశారు. ‘పైస్థాయి’ వారు వెంటనేస్పందించి గేట్లు ఎత్తడంపై నిర్ణయం తీసుకొని ఉంటే విజయ వాడలోని బుడమేరు ముంపు ప్రాంత ప్రజలను తరలించడానికి సరిపోయే సమయం ఉండేది. రాబోతున్న వరదను గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి అవకాశం ఉండేది. ప్రొటో కాల్ ప్రకారం గేట్లు ఎత్తడానికి పన్నెండు గంటల ముందు ప్రజ లను అప్రమత్తం చేయాలి. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి.ఇవన్నీ జరగాలంటే వాతావరణ హెచ్చరికలు వెలువడి నప్పుడే ఇరిగేషన్, రెవెన్యూ, హోంశాఖ ఉన్నతాధికారులతో ప్రభుత్వ పెద్దలు సమీక్షా సమావేశం జరిపి నిర్ణయాలు తీసు కోవాలి. అది జరగలేదు. తీరా కృష్ణానదిలో వరద పెరిగి చంద్ర బాబు కరకట్ట నివాసంలోకి కూడా నీళ్లు రావడంతో ఆయన కలెక్టరేట్లోకి తన బసను మార్చుకున్నారు. అప్పటికే బుడమేరు పరిస్థితి భయానకంగా ఉన్నట్లు సమాచారం ఉన్నది. ఆ సమ యంలో తీరిగ్గా మూడు శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. బుడమేరు గేట్లపై ఏం నిర్ణయం తీసు కున్నారో ఎవరికీ తెలియదు. ఎటువంటి ప్రకటనా వెలువడ లేదు. పునరావాస శిబిరాలు ఏర్పాటు కాలేదు. ప్రజలకు హెచ్చరి కలు జారీ కాలేదు. వారిని తరలించే ప్రయత్నాలూ జరగలేదు.మూడు లక్షలమందిని వరద ముంచేసిన తర్వాత వారం రోజులకు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పి సిసోడియా ఒక భయంకరమైన విషయాన్ని బయటపెట్టారు. ఒక రోజు ముందుగానే వరద సంగతి తమకు తెలుసనీ, కానీ రెండు లక్షల కుటుంబాలను ఆ ప్రాంతం నుంచి తరలించడం సాధ్యమయ్యే పని కాదు కనుక ప్రజలను హెచ్చరించలేదని చెప్పారు. ఇంత కంటే దిగ్భ్రాంతికరమైన విషయం ఇంకోటి ఉంటుందా? ఇంత కన్నా బాధ్యతా రాహిత్యం ఉంటుందా? ఇదే కదా నేరపూరిత నిర్లక్ష్యం! ఇదే కదా ఉద్దేశపూర్వకంగా ప్రజల ప్రాణాలను బలి పెట్టడం! ఇది కేవలం ఆ ఉన్నతాధికారి నిర్ణయం మాత్రమే అను కోలేము కదా! అత్యున్నత స్థాయి నిర్ణయాన్నే ఆయన వెల్లడించి ఉంటారు కదా!హెచ్చరికలు లేకుండా, ఏర్పాట్లు లేకుండా బుడమేరు గేట్లెత్తి లక్షలాదిమందిని వరదపాలు చేయాలనే నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రేరేపించిన పరిస్థితులేమిటి? శనివారం మధ్యా హ్నానికే ప్రకాశం బ్యారేజీలోకి దాదాపు 8 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుకున్నది. కరకట్ట మొదటి అంతస్తుల్లోకి ప్రవేశించింది. బ్యారేజీ దగ్గర కృష్ణానది బెడ్ లెవెల్ సముద్ర మట్టానికి 11.24 మీటర్లు. రాజధాని ప్రాంతం గుండా పారే కొండవీటి వాగు ఉండవల్లి దగ్గరున్న కృష్ణానది తూము ద్వారా నదిలో కలుస్తుంది. అక్కడ దాని బెడ్ లెవెల్ 11 మీటర్లు. ఐదారు లక్షల క్యూసెక్కుల ప్రవాహం గనుక బ్యారేజీ దగ్గర ఉన్నట్లయితే కొండవీడు వాగు కృష్ణలో కలవడానికి బదులు కృష్ణ నీళ్లు వాగు లోకి ఎగదన్నుతాయి. కొండవీడు వాగు మోసుకొచ్చే వరదను రాజధాని ప్రాంతంలో నియంత్రించడం కోసం ఒక లిఫ్టును ఏర్పాటు చేశారు. దాని సామర్థ్యం ఐదువేల క్యూసెక్కులు మాత్రమే. కృష్ణాలో ప్రవాహం పెరిగి వాగులోకి ఎగదన్నడం ఎక్కువైతే అమరావతి డ్రీమ్ ప్రాజెక్టుకు కోలుకోలేని డ్యామేజ్ అవుతుంది. బ్యారేజీలో కొంచెం ఎగువన నదికి మరోవైపున బుడమేరు డైవర్షన్ కెనాల్ కృష్ణానదిలో కలుస్తున్నది. ఈ బుడ మేరు నీళ్లనే కృష్ణలో కలిపి కృష్ణా–గోదావరి నదుల అనుసంధా నాన్ని పూర్తి చేశానని గతంలో చంద్రబాబు ప్రకటించిన సంగతి చాలామందికి గుర్తుండే ఉంటుంది. దీనికే ఆయన ‘పవిత్ర సంగమం’ అనే నామకరణం చేశారు.ఇక్కడ కృష్ణానది, బుడమేరు కాలువల బెడ్లెవెల్ సమానంగా ఉంటుంది. ఫలితంగా కృష్ణా ప్రవాహం వేగంగా కాల్వ లోకి ఎగదన్నడం మొదలైంది. మరోపక్క బుడమేరు గేట్లు మూసి ఉన్నందువలన వరద మొత్తం డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణ వైపు పరుగెత్తుతున్నది. పవర్ ప్లాంట్ కారణంగా ఇరుకైన కాలువ తట్టుకోలేక గట్టుకు గండ్లు పడి కృష్ణా జలాలు పడమటి దిక్కు నుంచి విజయవాడ వైపు మళ్లాయి. శనివారం రాత్రి పడిన ఈ గండ్లనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూడ్చలేకపోయిందని అధికార పార్టీ ప్రచారంలో పెట్టింది. గేట్లు ఎత్తితే బుడమేరు వరద ఎదురు రాకుండా కృష్ణా వరద స్వేచ్ఛగా ఎగదన్నడం వలన బ్యారేజీ నీటిమట్టం ప్రమాదకరంగా పెరగకుండా నియంత్రించవచ్చనే ఆలోచన కూడా కారణం కావచ్చు. రాత్రి పూట చెప్పాపెట్టకుండా గేట్లు ఎత్తేశారు. బుడమేరు వరద బెజవాడపై ఉత్తరం దిక్కు నుంచి విరుచుకుపడింది.శనివారం మధ్యాహ్నానికే నిర్ణయం తీసుకొని, చాటింపు వేయించి ప్రజలను తరలించి ఉన్నట్లయితే పెను ఉత్పాతం నివారించడం సాధ్యమయ్యేది. కానీ ఈ ఏర్పాట్లు చేయడానికి యంత్రాంగం సన్నద్ధంగా లేదు. నేరపూరిత నిర్లక్ష్యం కారణంగా కిమ్మనాస్తిగా స్తంభించిపోయింది. పెద్దల ఆయువుపట్టుకే దెబ్బ తగలబోతోందన్న ఆలోచన రాగానే విజయవాడను బలిపెట్టడా నికి సిద్ధమైనట్టుగా ఈ పరిణామాలు కనిపిస్తున్నాయి.ప్రభుత్వ ఘోరవైఫల్యం, దూరదృష్టి లేకపోవడం, పాలనా యంత్రాంగ నిస్తేజం, ఆపైన పెద్దల సొంత ప్రయోజనాలు... వెరసి విజయవాడ వీధుల్లో కన్నీటి కెరటాలు ఎగసిపడ్డాయి. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వారం రోజుల పాటు ప్రభుత్వ పెద్దలు పడినపాట్లు అన్నీ ఇన్నీ కావు. విష్ణుమూర్తి అవతారాల మాదిరిగా కొన్నిసార్లు పడవల మీద, కొన్నిసార్లు బుల్డోజర్లపై, మరికొన్ని సార్లు కాలినడకన ప్రయాణిస్తూ ముఖ్యమంత్రి ప్రజ లకు అభివాదాలు చేస్తూ కనిపించారు. వర్షంలోనే గండ్లు పూడ్చుతూ కనిపించే మంత్రుల ఫొటోలు, వీడియోలు దర్శన మిచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన ఫోటోల్లో, డ్రోన్ల ద్వారా ఇంటింటికి ఆహారం సరఫరా దృశ్యాలు ప్రచారంలోకి వచ్చాయి.ప్రవాహంలో కొట్టుకుపోయేవాడికి గడ్డిపోచ కనిపించి నట్టుగా వైఫల్యాల సుడిలో కొట్టుమిట్టాడుతున్న సర్కార్కు ప్రకాశం బ్యారేజీ దగ్గరకు కొట్టుకొచ్చిన బోట్లు కనిపించాయి. ఈ బోట్లను వైసీపీ వాళ్లే ప్రయోగించారనీ, ఈ బోట్ల కారణంగానే బెజవాడ మునిగిందనే డైవర్షన్ స్కీమును ముందుకు తెచ్చారు. బురదను కడుక్కోవాలి కనుక అవతలి పక్షం వారు కూడా బోట్లు టీడీపీ వారివేననే సాక్ష్యాలను ముందుకు తెచ్చారు. ఈ బోట్ల కాట్లాట నడుమ అసలైన కారణాలను మరుగున పడేయడమే ప్రభుత్వ పెద్దల లక్ష్యం. వారి లక్ష్యం ఏదైనా కావచ్చు, ప్రజల ప్రాణాలను బలిగొనే నేరపూరిత నిర్లక్ష్యాలను ఉపేక్షించడం ప్రజాస్వామ్యానికి హితం కాదు. ప్రభుత్వాల చేతగానితనాన్ని సహించడం కూడా క్షేమం కాదు. జరిగిన విధ్వంసంపై కేసులు నమోదు కావాలి. ఈ విషాదానికి కేవలం నిర్లక్ష్యం, చేతగాని తనాలే కారణాలా? మరేదైనా లోతైన కారణం ఉన్నదా అనే కోణంలో విచారణ జరగాలి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఈ బద్ధకం వదిలేద్దాం!
ఆరోగ్యమే మహాభాగ్యమంటాం. ఆరోగ్యంగా ఉండేందుకు కనీసపాటి శ్రమైనా చేస్తున్నామా? శారీరక శ్రమ, క్రమం తప్పని కదలికల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిసినా, భారతీయులు బద్ధకపు జీవనశైలినే అనుసరిస్తున్నారట. క్రియాశీలక జీవనవిధానానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కొన్ని మార్గదర్శకాలు పేర్కొంది. కానీ, మన దేశం నుంచి 20 కోట్ల మంది (15.5 కోట్ల మంది వయోజనులు, 4.5 కోట్ల మంది కౌమార వయస్కులు) వాటిని పాటించడంలో విఫలమవుతున్నారు. డాల్బెర్గ్ వారి ‘స్టేట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ’ (సాపా) నివేదిక తాజాగా ఈ సంగతి వెల్లడించింది. ఈ నివేదిక ఆందోళన కలిగించడమే కాక, ఆటలు, వ్యాయామం విషయంలో భారతీయులు శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. నిజానికి, ఇలాంటి జాతీయ స్థాయి సర్వే జరగడం ఇదే తొలిసారి. మేధావుల బృందమైన ‘డాల్ బెర్గ్ అడ్వైజర్స్’, స్వచ్ఛంద సంస్థ ‘స్పోర్ట్స్ అండ్ సొసైటీ యాక్సలరేటర్’ సంయుక్తంగా జరిపిన ఈ అధ్యయనం అనేక ఆందోళనకరమైన ధోరణులను వెల్లడించింది. మన దేశంలో వయోజనుల్లోని కాస్తంత పెద్దవారిలో 48 శాతం మంది ఆటల లాంటి శారీరక శ్రమ చేసేందుకు తమ వయసు మీద పడింది అనేస్తున్నారట. ఇంకా చిత్రం ఆటలు ఆడపిల్లలకు సురక్షితం కాదన్న అభిప్రాయంలో 45 శాతం మంది ఉన్నారట. అలాగే, శారీరక శ్రమ చేయడం ఋతుస్రావ మహిళలకు నష్టదాయకమనీ, ఒంటికి దెబ్బలు తగిలితే వివాహ అవకాశాలు దెబ్బ తింటాయనీ, భౌతిక శ్రమ వల్ల పెళ్ళయిన అమ్మాయిలకు గర్భస్రావం అవుతుందనీ... ఇలా రకరకాల దురభిప్రాయాలు నెలకొన్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో... అలాగే పురుషులతో పోలిస్తే మహిళల్లో శారీరక శ్రమ బాగా తక్కువవడం గమనార్హం. దీనికి కారణాలు లేకపోలేదు. శారీరక శ్రమ చేసేందుకు అనుకూలంగా ఉద్యానాలు, మైదానాల లాంటి బహిరంగ ప్రదేశాలు పట్టణాల్లో కరవై పోయాయి.అందువల్ల గ్రామాలతో పోల్చి చూసినప్పుడు పట్టణాల్లో శారీరక శ్రమ రాహిత్యం రెట్టింపు ఉంటోంది. నగర జనాభా మరీ అతి సున్నితంగా తయారైంది. ఇక, మన భారతీయ మహిళల్లో... నూటికి 75 మందికి రకరకాల ఇంటిపనుల్లోనే సమయమంతా గడిచిపోతుంది. ఫలితంగా వారికి వ్యాయామం చేసేందుకు తీరిక దొరకని పరిస్థితి. ఈ కారణాలన్నీ కలిసి కొంప ముంచుతున్నాయి. జీవనశైలి వ్యాధులకు దారి తీస్తున్నాయి. చాలామంది రోజూ నడుస్తున్నామంటారు. నడక వల్ల ప్రయోజనాలు ఉన్నాయి కానీ, ఆరోగ్యవంతమైన శరీరానికి అదొక్కటే సరిపోదని నిపుణుల ఉవాచ. తాజా సర్వే ఒక్కటే కాదు... ప్రతిష్ఠాత్మక ‘లాన్సెట్’ పత్రికలో ఇటీవలే ప్రచురితమైన మరో అధ్యయనం సైతం భారతీయ వయోజనుల్లో నూటికి 50 మంది శారీరకంగా తగినంత శ్రమ చేయట్లేదని పేర్కొంది. అంతంత మాత్రపు శారీరక శ్రమతోనే వయోజనులు సరిపెట్టుకొంటున్న ధోరణి ఉన్నతాదాయాలుండే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రధానంగా కనిపిస్తోంది. ఆ తరువాత రెండోస్థానంలో దక్షిణాసియా ప్రాంతం నిలిచింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సహా పలువురు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం చెబుతున్న మాట. ఆందోళనకరమైన అంశం ఏమిటంటే... మన దేశంలోని వయోజనుల (కనీసం 18 ఏళ్ళు, ఆపైన ఉన్నవారి)లో పెద్దగా శారీరక శ్రమ చేయని సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 2000 నాటికి అలాంటివారు 22 శాతం పైచిలుకు ఉంటే, 2010 నాటికి వారు 34 శాతం దాకా పెరిగారు. 2022 నాటికి 50 శాతం దాకా చేరారు. ఇలాగే కొనసాగితే... 2030 నాటికల్లా ఇలాంటివాళ్ళు ఏకంగా 60 శాతానికి చేరతారని అంచనా. ఇది శారీరక, మానసిక ఆరోగ్యపరంగానే కాదు... సామాజికంగానూ ప్రమాదఘంటికే!రోజూ బద్ధకంగా, శారీరక శ్రమ లేకుండా గడిపేస్తుంటే... మధుమేహం, గుండెజబ్బు వచ్చే ముప్పుంది. నిజానికి, ఎంతసేపూ కదలకుండా కూర్చొనే జీవనశైలి, శారీరక శ్రమ అంతకంతకూ తగ్గిపోవడం వల్ల ప్రపంచమంతటా ఈ జబ్బుల బారినపడుతున్నవారు పెరుగుతున్నారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై భారం పడుతోందని డబ్ల్యూహెచ్ఓ మాట. అంతేకాదు... ఈ బద్ధకపు జీవన విధానం వల్ల మన దేశంలో దాదాపు 25.4 కోట్లమందికి పైగా స్థూలకాయంతో, 18.5 కోట్ల మంది దాకా ‘చెడు కొలెస్ట్రాల్’తో బాధపడుతున్నట్టు వెల్లడైంది. ఆరోగ్యానికే కాదు... దేశ ఆర్థిక బలిమికీ శారీరకంగా చురుకుదనం అత్యంత కీలకం. మన దేశ జనాభా మొత్తం శ్రమకు నడుంబిగిస్తే, 2047 నాటికి దేశ స్థూల జాతీయోత్పత్తి రూ. 15 ట్రిలియన్లు దాటిపోతుందని అంచనా. స్థూలకాయం, లాంటి జబ్బులు తగ్గడమే కాదు, వాటి కోసం ఖర్చు చేస్తున్న రూ. 30 ట్రిలియన్లు ఆదా అవుతాయి. లెక్కతీస్తే, ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మంది తగిన శారీరక శ్రమ చేయక చెరుపు చేస్తున్నారు, చేసుకుంటున్నారు. ఇక, డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల్ని బట్టి చూసినా శారీరక శ్రమరాహిత్యం అత్యధికంగా ఉన్న 195 దేశాల్లో భారత్ 12వ స్థానంలో నిలిచిందని ‘లాన్సెట్’ అధ్యయనం. రోజువారీ వ్యాయామంతో సమయం వృథా అనీ, ర్యాంకుల చదువులతోనే జీవితంలో పైకి వస్తామనీ, ఆటలు అందుకు ఆటంకమనీ భావించే తల్లితండ్రుల ఆలోచనా ధోరణి ఇకనైనా మారాల్సి ఉంది. మనమైనా, మన దేశమైనా పైకి రావాలంటే... మనుషుల శారీరక, మానసిక ఆరోగ్యమే కీలకం. ప్రభుత్వాలు అది గుర్తించి ఆటలతో మేళవించిన విద్యా ప్రణాళికను తప్పనిసరి చేయాలి. పౌరుల కోసం వ్యాయామ కేంద్రాల వసతులూ పెంచాలి. ఎందుకంటే, జీవన సౌంద ర్యమే కాదు... జగమంతటినీ లక్ష్మీనివాసంగా మార్చే మహత్తూ శ్రమశక్తిదే మరి! -
Haryana: ఆసక్తికరమైన పోరు
జమ్మూ– కశ్మీర్లో తొలి విడత పోలింగ్కు మరొక్క వారమే మిగిలింది. హర్యానాలో నామినేషన్ల దాఖలుకు గడువు నేటితో ముగియనుంది. ఈ పరిస్థితుల్లో కశ్మీర్లో ప్రచారం ఊపందుకుంటుంటే, హర్యానాలో అభ్యర్థుల ఖరారు తుది అంకానికి చేరింది. కశ్మీర్ను అటుంచితే... కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ల మధ్య సీట్ల సర్దుబాటు విఫలమవడంతో హర్యానా ఆసక్తి రేపుతోంది. బహుముఖ పోటీ అనివార్యమయ్యేసరికి పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ఆప్ ఒంటరి పోరుకు దిగడమే కాక, మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కలాయత్ లాంటి చోట్ల గెలిచిన ఊపుతో, సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న స్థానాల్లో అభ్యర్థుల్ని నిలిపి, పట్టణ ప్రాంతాలకే కాక మిగతా చోట్లకూ తన ఉనికిని విస్తరించు కోవాలని సాహసిస్తోంది. వీధికెక్కి పోరాడినా, లైంగిక వేధింపుల సమస్యను పరిష్కరించని కేంద్ర సర్కార్ వైఖరితో విసిగిన రెజ్లర్లు వినేశ్ ఫోగట్, బజ్రంగ్ పూనియాలు కాంగ్రెస్లో చేరడంతో రాజకీయం మరింత వేడెక్కింది. మహిళా రెజ్లర్లపై జనంలో సానుభూతి, పాలకుల నిర్లక్ష్యంతో రైతుల ఆగ్రహం, జాట్లు సహా వివిధ వర్గాల్లో అసంతృప్తి మధ్య అధికార బీజేపీ ఎదురీదుతోంది.మొత్తం 90 స్థానాలకు గాను కాషాయపార్టీ ఇప్పటికే 87 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. మిగతా 3 స్థానాలను హర్యానా లోక్హిత్ పార్టీ (హెచ్ఎల్పీ) లాంటి చిరు మిత్రపక్షాల కోసం అట్టి పెట్టింది. అభ్యర్థుల ప్రకటనపై పార్టీలో తీవ్ర అసంతృప్తి చెలరేగింది. తొలి విడత అభ్యర్థుల జాబితా ప్రకటనతోనే అసంతృప్తి జ్వాలలు రగిలినా, రెండో విడత జాబితా కూడా ప్రకటించేసరికి అది మరింత పైకి ఎగసింది. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకూ, మంత్రులకూ, మాజీ మంత్రులకూ టికెట్లు నిరాకరించేసరికి సమస్య పెద్దదైంది. పార్టీ రాష్ట్ర శాఖ ఆఫీస్ బేరర్ల మొదలు పలువురు సీనియర్ నాయకులు రాజీనామా చేయడం గమనార్హం. బీజేపీ హర్యానా శాఖ వైస్ ప్రెసిడెంటైన మాజీ డిప్యూటీ స్పీకర్, అలాగే రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి, కొందరు మంత్రులు, మాజీ మంత్రులు సైతం అసెంబ్లీ టికెట్ దక్కలేదని కినుక వహించి, పార్టీని వీడారంటే పరిస్థితిని అర్థం చేసు కోవచ్చు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అసలైన కార్యకర్తల్ని నిర్లక్ష్యం చేసి, పనిచేయనివారికీ, అసలు ఆ నియోజకవర్గ పౌరులే కానివారికీ సీట్లు కేటాయిస్తోందని సొంత పార్టీ వారే ఆరోపిస్తున్నారు. నిజానికి ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) చెందిన నయబ్ సైనీని కొంతకాలం క్రితం సీఎంను చేశాక హర్యానాలో పార్టీ గ్రాఫ్ కొంత పెరిగింది. ఇప్పుడూ సైనీనే సీఎం అభ్యర్థిగా చూపుతూ బీజేపీ ఎన్నికలకు వెళుతోంది. అయితే, ఆచరణలో మాత్రం ఆయన ప్రమేయం పెద్దగా లేకుండానే బీజేపీ టికెట్ల కేటాయింపు ప్రక్రియ జరిగిపోయిందని చెబుతున్నారు. ఏళ్ళ తరబడిగా పార్టీ కోసం పనిచేస్తున్నవారిని కాదని కొత్తవారికీ, ఇతర పార్టీల నుంచి ఫిరాయించి వచ్చిన వారికీ బీజేపీ పట్టం కట్టడం సైతం రేపు ఎన్నికల్లో పార్టీని కొంత దెబ్బ తీయవచ్చు. దానికి తోడు పార్టీలో అంతర్గత విభేదాలు, ఆశావహ సీఎం అభ్యర్థుల తాకిడి ఉండనే ఉన్నాయి. పదేళ్ళుగా అధికారంలో కొనసాగాక బీజేపీకి ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం చిత్రమే. ఈసారి ఎన్నికల్లోనూ గెలిచి, వరు సగా మూడోసారి గద్దెనెక్కాలని చూస్తున్న కాషాయపార్టీకి ఇప్పుడది సులభం కాకపోవచ్చు. కాంగ్రెస్ పుంజుకున్నట్టు కనిపిస్తోంది. పైగా ఎన్నికలంటే ఎక్కడైనా అధికార పక్షం పట్ల వ్యతిరేకత సహజం. బీజేపీలోని వర్గవిభేదాలు, రైతులు – జాట్ల లాంటి వర్గాలతో సహా గ్రామీణ ప్రాంతాల్లో దాని పట్ల అసంతృప్తి కనిపిస్తున్నాయి. ఇవన్నీ కలసి అక్టోబర్ 8న పోలింగ్లో విపక్షానికి అనుకూలించవచ్చు.లోక్సభ ఎన్నికల ఫలితాల సరళి, ప్రాథమిక ఒపీనియన్ పోల్స్ను బట్టి చూస్తే, కాంగ్రెస్కు కొంత అనుకూలత కనిపిస్తోంది. కానీ, అంతర్గత విభేదాలు ఆ పార్టీనీ పీడిస్తున్నాయి. స్వతంత్రు లుగా బరిలోకి దిగే అసమ్మతులతో అన్ని పార్టీలకూ చిక్కే. మరోపక్క ఎన్నికలిప్పుడు బీజేపీ,కాంగ్రెస్, ఆప్ల మధ్య త్రిముఖ పోటీ కావడంతో అధికారపక్ష వ్యతిరేక ఓటు ఏ మేరకు చీలుతుంది, అది బీజేపీకి ఎంత మేర లాభిస్తుంది అన్నది ఆసక్తికరం. గతంలోకి వెళితే –∙2019 ఎన్నికల్లో హర్యా నాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అంతకు పదేళ్ళ ముందూ అలాగే జరిగింది. అలాంటి పరిస్థితుల్లో చిన్న పార్టీల వారు, స్వతంత్రులు కీలకమవుతారు. ఈ ‘ఇతరులు’ పాతికేళ్ళ క్రితం 30 శాతం ఓట్లు సాధిస్తే, క్రితంసారి అది 18 శాతానికి పడిపోయింది. అయితేనేం, ప్రతిసారీ వారు 8 నుంచి 16 సీట్ల మధ్య గెలుస్తున్నారని మర్చిపోలేం. 2009లో కాంగ్రెస్ స్వతంత్రులు, చిన్న పార్టీల మద్దతుతోనే గద్దెనెక్కింది. 2019లో బీజేపీ సైతం జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)తో ఎన్నికల అనంతర పొత్తుతోనే అధికారం చేపట్టింది. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో ‘ఇతరుల’కు 8 శాతం ఓట్లే వచ్చినా, స్థానిక అంశాలు ప్రధానమయ్యే అసెంబ్లీ ఎన్నికల్లో వారి పాత్ర గణనీయమవుతుంది. కాకపోతే, స్థానికమైన జేజేపీ గ్రామీణ ప్రాంతాల్లోని తన పట్టును నిలుపుకోలేకపోతోందనీ, సాంప్ర దాయిక రైతు ఓటర్లున్న ఇండియన్ నేషనల్ లోక్దళ్ (ఐఎన్ఎల్డీ) బలం ప్రస్తుతం కొద్ది స్థానాలకే పరిమితమనీ విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో పెరుగుతున్న నిరుద్యోగం, లోపించిన పారిశ్రామికీకరణ, వివాదాస్పద అగ్నిపథ్ పథకం లాంటి అంశాలు బీజేపీని వెనక్కి లాగుతున్నాయి. హర్యానా జనాభా 20 శాతం దళితులే. తాజా లోక్సభ ఎన్నికల్లో వారిలో 68 శాతం మంది, అలాగే సగానికి పైగా ఓబీసీలు ‘ఇండియా’ కూటమికి మద్దతునిచ్చినట్టు విశ్లేషణ. ఇప్పుడూ అదే ధోరణి కొనసాగి, జాట్లు సహా ఇతర చిరకాల సమర్థక వర్గాల నుంచి విపక్షానికే మద్దతుంటే... అధికార పక్షా నికి చిక్కులు తప్పకపోవచ్చు. నిరుడు కర్ణాటక లానే ఇప్పుడు హర్యానాలో బీజేపీకి శృంగభంగం జరగవచ్చు. అక్టోబర్ 5న జరగనున్న ఎన్నికలు బీజేపీ ప్రతిష్ఠకు పెనుసవాలుగా మారింది అందుకే! -
ప్రజాభీష్టానికి పాతర
వేసవి ఒలింపిక్స్, పారాలింపిక్స్ – రెండూ పూర్తవడంతో ఫ్రాన్స్లో ఆటల వేడి ముగిసిందేమో కానీ, రాజకీయ క్రీడ మాత్రం బాగా వేడెక్కింది. కన్జర్వేటివ్ రిపబ్లికన్స్ పార్టీ నేత మిషెల్ బార్నియెర్ను దేశ ప్రధానిగా నియమిస్తున్నట్టు ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ గడచిన గురువారం చేసిన ప్రకటనతో రచ్చ రేగుతోంది. కొద్ది నెలల క్రితం జూన్ 9న పార్లమెంట్ దిగువ సభను రద్దు చేసి, ఆకస్మిక ఎన్నికలు ప్రకటించి, దేశాన్ని రాజకీయ ప్రతిష్టంభనకు గురి చేసిన మెక్రాన్ తీరా ఎన్నికల ఫలితాలొచ్చిన 60 రోజుల తర్వాత తాపీగా ప్రజాతీర్పుకు భిన్నంగా నాలుగో స్థానంలో నిలిచిన పార్టీ వ్యక్తిని ప్రధానమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లయిన దేశంలో జరిగిన ఈ అపహాస్యమే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఆగ్రహించిన వేలాది జనం వీధుల్లోకి వచ్చి, ప్రదర్శనలకు దిగింది అందుకే. కొత్త ప్రధాని సారథ్యంలో సరికొత్త ప్రభుత్వం కొలువు తీరుతుంది కానీ, రాజకీయ సంక్షోభం అంచున ఉన్న దేశానికి సారథ్యం వహించడం అగ్నిపరీక్షే. వెరసి ఫ్రాన్స్లో అనిశ్చితి తొలగకపోగా, మరింత పెరగనుండడమే వైచిత్రి. నిజానికి, ఫ్రాన్స్లో జూలైలో రెండో విడత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తీవ్ర మితవాద పక్షమైన ‘నేషనల్ ర్యాలీ’నీ, అలాగే మెక్రాన్కు చెందిన ‘రినైజెన్స్ బ్లాక్’నూ వెనక్కి నెట్టారు. వామపక్ష కూటమి ‘న్యూ పాపులర్ ఫ్రంట్’ (ఎన్ఎఫ్పీ)కి అధిక మద్దతు ప్రకటించారు. అయితే, ఎన్ఎఫ్పీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్ పార్లమెంట్ ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ లేని విధంగా ఇన్నాళ్ళుగా కొత్త ప్రభుత్వమేదీ లేకుండానే మెక్రాన్ కథ నడిపారు. పైగా, అధ్యక్షుడిగా తనకున్న విశేషాధికారాన్ని వాడి, వామపక్ష కూటమి ప్రతిపాదించిన అభ్యర్థు లెవరినీ ప్రధానిగా అంగీకరించలేదు. చివరకు ఎన్నికల్లోని ప్రజా తీర్పును అగౌరవిస్తూ, నాలుగో స్థానంలోని పార్టీ తాలూకు వ్యక్తిని ప్రధానిగా దేశాధ్యక్షుడు ఎంపిక చేయడం ఓటర్లకు, అందునా యువతరానికి అమితమైన ఆగ్రహం కలిగించింది. దాని పర్యవసానమే – వేలాదిగా జనం వీధు ల్లోకి రావడం! ఒక రకంగా ఈ ప్రధానమంత్రి ఎంపిక ‘ఎన్నికల చోరీ’ అని పేర్కొంటూ, ఏకంగా దేశాధ్యక్షుడు మెక్రాన్కే ఉద్వాసన పలకాలంటూ వాదించే స్థాయికి పరిస్థితి వెళ్ళింది. ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ లేని పరిస్థితుల్లో ఉన్నంతలో అధిక స్థానాలున్న కూటమికే పగ్గాలు అప్పగించడం విహితమని స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వ సిద్ధాంతాలను ప్రవచించిన ఘన ప్రజాస్వామ్యం నుంచి ఎవరైనా ఆశిస్తారు. కానీ, 2017 నుంచి విభజన రాజకీయాలు చేస్తున్న ప్రెసి డెంట్ మెక్రాన్ ఎన్నికలలో తన పార్టీ కింద పడ్డా తనదే పైచేయిగా వ్యవహరించారు. వరుసగా చేస్తూ వస్తున్న తప్పుల్ని కొనసాగిస్తూ ఇష్టారీతిన వ్యవహరించారు. ఆ మాటకొస్తే, రాజకీయాల పట్ల నమ్మకం క్షీణింపజేసే ఇలాంటి చర్యల వల్లనే ఫ్రాన్స్ సహా యూరప్ అంతటా తీవ్ర మితవాదం పైకి ఎగసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఆధిక్యం కనబరిచినవారికి కనీసం ఏకాభిప్రాయ సాధనకైనా అవకాశమివ్వకుండా అధ్యక్షుడు తన పదవీకాలపు లెక్కలతో తోచిన ఎంపికలు చేయడం అవివేకం. తీవ్ర మితవాదానికీ, దాని జాత్యహంకార, విదేశీయతా విముఖ సిద్ధాంతానికీ పట్టం కట్టరాదన్న ప్రజాభీష్టానికి వ్యతిరేకం. ఈ కొత్త సర్కార్ కింగ్ మేకర్లయిన తీవ్ర మితవాదుల మద్దతుపై ఆధార పడక తప్పని స్థితి. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో అధ్యక్షుడు దేశాన్ని మళ్ళీ చిక్కుల్లోకి నెట్టారు. అలాగని ప్రధానిగా ఎంపికైన 73 ఏళ్ళ బార్నియెర్ మరీ అనామకుడేమీ కాదు. బ్రెగ్జిట్పై యూరోపియన్ యూనియన్ పక్షాన గతంలో సంప్రతింపులకు సారథ్యం చేసిన వ్యక్తి. ఏకాభిప్రాయ సాధనలో ప్రసిద్ధుడు. రాజకీయ – సైద్ధాంతిక విభేదాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోగలి గినవాడు. ముగ్గురు దేశాధ్యక్షుల హయాంలో మంత్రిగా చేసిన ఆయనది యూరోపియన్ అనుకూల వైఖరి. అది వామపక్షాలకు నచ్చవచ్చు. ఇక, వలసల నియంత్రణకు మరింత కఠినమైన నిబంధనలు ఉండాలన్న వాదననే బార్నియెర్ సమర్థిస్తున్నారు. అది కన్జర్వేటివ్లకు నచ్చే అంశం. ప్రభుత్వ భవితవ్యంపై అనిశ్చితి నెలకొనడంతో... ప్రధానిగా ఇలాంటి వ్యక్తే సరైనవాడని మెక్రాన్ ఎంచు కున్నారట. కానీ, ఫ్రెంచ్ సమాజం నుంచి ఆమోదం లభించడం, రాజకీయంగా విజయం సాధించడం మెక్రాన్, బార్నియెర్లు ఇద్దరికీ అంత సులభమేమీ కాదు. సుదీర్ఘంగా శ్రమించక తప్పదు. యూకేతో బ్రెగ్జిట్ ఒప్పందం వేళ చేసినట్టే... ఇప్పుడూ ఏదో ఒక రాజీ మార్గంలో, అందరి మధ్య సహకారం సాగేలా కొత్త ప్రధాని చేయగలుగుతారా అన్నది ఆసక్తికరమైన అంశం. వచ్చే 7 నుంచి 12 ఏళ్ళ లోగా ఫ్రాన్స్ తన ప్రభుత్వ లోటును 10 వేల కోట్లు యూరోల పైగా తగ్గించనట్లయితే, ఇటలీ లాగానే ఫ్రాన్స్ సైతం అప్పుల సుడిగుండంలో చిక్కుకుపోతుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అక్టోబర్ 1లోగా కొత్త ప్రధాని, ఆర్థిక మంత్రితో కలసి 2025 బడ్జెట్ ముసాయిదాతో బిల్లుకు రూపకల్పన చేయాల్సి ఉంది. అది అతి కీలకమైన మొదటి అడుగు. అదే సమయంలో దేశాన్ని ఒక్క తాటి మీదకు తీసుకురావడానికే తాను పగ్గాలు చేపట్టినట్టు ఫ్రెంచ్ ప్రజానీకానికి ఆయన నచ్చజెప్పగలగాలి. ఏమైనా, ప్రజలు, పార్టీల మధ్య నెలకొన్న తీవ్ర స్థాయి విభేదాలతో ఫ్రెంచ్ రిపబ్లిక్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉంది. అది ఈ ఘన ప్రజాస్వామ్యా నికి పెను ముప్పు. ఆ ప్రమాదాన్ని తప్పించడంతో పాటు ఇంకా అనేక సమస్యలను కొత్త ప్రధాని నేతృత్వంలోని ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంది. ఇప్పటికే పాలన పూర్తిగా అటకెక్కిన ఫ్రాన్స్ను ఆ దేశపు అతి పెద్ద వయసు ప్రధాని, అధ్యక్షుడు కలసి ఎలా ముందుకు నడిపిస్తారో వేచి చూడాలి. -
జగమంతా దగా చేసినా
పెద్దగా ఏమీ మార్పు ఉండదు. తెల్లవారి టీకొట్టు దగ్గర పెద్దమనిషి ఎప్పటిలాగే న్యూస్పేపర్ని మడతపెట్టి చదువుతుంటాడు. పిల్లల్ని తీసుకెళ్లే స్కూల్బస్ వారిని గోలగోలగా మోసుకెళుతూ ఉంటుంది. సూర్యుడు ప్రసరింప చేస్తున్న ఎండ జామచెట్టుపై పడి కింద నీడను పరుస్తూ ఉంటుంది. చెరువులో నీళ్లు అదే నిమ్మళంతో ఉంటాయి. లీవులున్నా పెట్టలేని ఉద్యోగాల హాజరీకి అందరూ తయారవుతూ ఉంటారు. వారికై వంటగదుల్లో సాగే ఇల్లాళ్ల హడావిడి ఏమీ మారదు. ఢిల్లీలో తెల్లవారుతుంది. ముంబైలో తెల్లవారుతుంది. పాలకులు పట్టు పరుపుల మీద నుంచి లేచి పనుల్లో పడతారు. సకల మానవ జీవన వ్యాపారాలకు చీమైనా కుట్టదు. కబురు తెలిసిన కొందరు ఆత్మీయులు కూడా ‘తొందరగా టిఫెను పెట్టు. తినేసి వెళతాను’ అనే బయలుదేరుతారు. మీరు ఆత్మహత్య చేసుకుని మరణించారు. అది మీకూ మీ ఇంటికీ. మిగిలిన లోకానికి ఏంటట?ఆత్మహత్య చేసుకుని మరణించిన రైతుకు ఏ శిక్షా విధించలేక ‘పోయి నీ కుటుంబం ఎలా ఉందో చూసిరా’ అని పంపిస్తాడు దేవుడు– అదే శిక్షగా. చేసిన అప్పుకు ఎడ్లు జమ అయితే పొలంలో భార్యే ఎద్దులా కష్టపడుతూ ఉంటుంది. బడికెళ్లాల్సిన కూతురు తల్లికి సాయం చేస్తూ ‘మా... అందుకే నిన్ను నాన్న తిడతాండె. చూడు... పడిన చోట నాలుగైదు ఇత్తనాలు పడినాయి. లేనిచోట్ల లేనే లేవు. ఇట్లేనా ఇత్తనమేసేది’ అని తండ్రిని తలుచుకుంటూ ఆరిందాలా గద్దిస్తూ ఉంటుంది. భర్త గుర్తొచ్చిన తల్లి బొరుమని పొలంలో కూలబడుతుంది. గాలిరూపంలో ఉన్న రైతు అది చూసి ఎంత లబలబలాడినా ఏమొస్తుంది– ప్రాణమే వదులుకొని వచ్చేసినాక. బండి నారాయణ స్వామి కథ ‘రంకె’ ఇది.మొన్న హైదరాబాద్లో ఒక తండ్రి– చిన్న టీకొట్టు నడుపుకునే తండ్రి– స్కూలుకెళ్లకుండా హఠం చేస్తున్న పిల్లల్ని కొట్టి, ఎందుకు కొట్టానా అని తీవ్రమైన కలతతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడా పిల్లలకు స్కూలుకు వెళ్లమని చెప్పే తండ్రి లేడు. స్కూల్ ఫీజు కట్టే తండ్రి లేడు. ఏ రాత్రో కొట్టు కట్టేసి ఇల్లు చేరి నిద్రపోతున్న పిల్లల్ని చూసి భార్యతో ‘నిద్రపోయారా పిల్లలూ’ అనడుగుతూ ప్రేమగా వారి తలను నిమిరే తండ్రి లేడు. ఖాళీ టీకొట్టు ఉంది. దాని ముందు ట్రాఫిక్కు ఏమెరగనట్టుగా ఉంది. ఇరుగు పొరుగు షాపులలో బేరాలు యథావిధిగా జరుగుతూనే ఉన్నాయి. అతడు లేడు. అతనికీ– ఇంటికీ.మృత్యువుకు మోహగుణం ఉంటుంది. ‘నా పరిష్వంగంలోకిరా విముక్తి సుఖం ఇస్తాను’ అని పిలుస్తూ ఉంటుంది. అందుకోసం అది సముద్రంలోని నీలి కెరటాలకు మరింత నీలిమ ఇస్తుంది. నది ప్రవాహానికి మరింత చిక్కదనం ఇస్తుంది. దూకే వరకు బావినీళ్లను మెరుపు అద్దంలా మారుస్తుంది. పురుగుల మందుకు ఎంత రుచి ఇస్తుందో. ధగధగమని మండే మంటకు మంచుకంటే చల్లనైన గుణం ఉంటుందనే ప్రలోభం కలిగిస్తుంది. ఒక్క మృత్యువు. వేయి ఆకర్షణలు. కాని జీవితానికి వేయిన్నొక్కటి. ఆ ఒక్కటికై బతకాలి.‘మృత్యువా... నీవొక అందమైన కవితా పంక్తివి. నిను కలుస్తాననే వాగ్దానాన్ని మరువను’ అంటాడు ‘ఆనంద్’ సినిమాలో రాజేష్ ఖన్నా. జీవితం అంటే ఏమిటి? చనిపోవడానికి ముందు దొరికే కాసింత సమయం. కేన్సర్ డయాగ్నసిస్ అయ్యి రెండు మూడు నెలల్లో పోతానని తెలిశాక ఆనంద్ ప్రతి నిమిషం జీవించడానికి ఉబలాటపడతాడు. తెలిసినవారినీ తెలియనివారినీ తన అభిమానంలో ముంచెత్తుతాడు. బతికేది కాసిన్ని రోజులే అయినా గాఢంగా ఎన్నటికీ మరువనంతగా ముద్రలేసి వెళతాడు. చావు ఎప్పుడో తెలిసిన అతడే, జబ్బు మనిషి అతడే అలా బతికితే ఇవాళ్టికి అంతా బాగున్న మనం ఎలా బతకాలి?అవునండీ. భార్యాభర్తల మధ్య కీచులాటలు వస్తాయి. డబ్బుల కటాకటీ ఉంటుంది. బాస్ నరకం చూపుతుంటాడు. స్నేహితులు ద్రోహం చేస్తారు. బంధువులు వంచిస్తారు. సొంత తోబుట్టువులు ఊహించని నొప్పి కలిగిస్తారు. అనారోగ్యాలు ఉంటాయి. పంటల్లో నష్టం వస్తుంది. అయితే? చనిపోవడమేనా? ఇవాళ్టిని ఇవాళ్టితో ముగించడమేనా? ఎవరు ఇచ్చారు ఈ హక్కు? ఎవరి ఆమోదంతో తీసుకున్నారు ఈ నిర్ణయం? ‘ఆత్మహత్య మహాపాతకం’ అంది హిందూ ధర్మం. ‘ఏ ఆయుధంతో ఆత్మహత్య చేసుకున్నాడో అదే ఆయుధంతో పైన దండింపబడతాడు’ అంది ఇస్లాం ధర్మం. బతికి ఉండగా బతకడానికి చేసిన అన్ని తప్పొప్పులకైనా కన్సిడరేషన్ ఉందిగాని ఆత్మహత్య చేసుకుంటే నేరుగా నరకానికే. చచ్చాక సుఖపడదామనుకునే వారికి పైన ఎన్ని చచ్చే చావులు ఉన్నాయో ఏం తెలుసు? దాని బదులు బతకొచ్చుగా హాయిగా? ఏమిటి... పరువు పోయిందా... చచ్చిపోతారా? మన పరువును ఎంచేంత పరువు ఈ సమాజానికి ఉందంటారా ఇప్పుడు?‘మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు’ అన్నాడు సిరివెన్నెల. సెప్టెంబర్ 10– ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం. అసలు ఈ పేరే సరి కాదు. దీనిని ‘ప్రపంచ జీవన కాంక్షా దినోత్సవం’ అని మార్చాలి. జీవనకాంక్ష... ఇదే కావాల్సింది. ఎవరూ కష్టాలకు మినహాయింపు కాదు. ఎవరినీ సవాళ్లు ఒదిలిపెట్టవు. ఉక్కిరిబిక్కిరి అయ్యే క్షణాల వాయిదాలవారీ పంపకమే జీవితం. ఇది అందరికీ తెలుసు. అందుకే అర్ధంతరంగా మరణించిన వారికి గౌరవం లేదు. ‘ఏం.. మేం బతకట్లేదా.. చచ్చేం సాధించాలి గనక’ అనుకుంటారు. అందుకే ఓడినా సరే బతికి తీరాలి. సినారె అంటాడు– ‘జగమంతా దగా చేసినా చివురంత ఆశను చూడు... గోరంత దీపం కొండంత వెలుగు... చివురంత ఆశ జగమంత వెలుగు’. ఏం మహాశయా... బతికేద్దామా? బతుకుదాం లేద్దూ! -
ఏది ధర్మం? దేనికి రక్షణ?
చట్టం విరుద్ధం కానంత వరకు ఎవరేమి చేయాలో, ఎవరేం తినాలో చెప్పడానికి వేరొకరికి ఏమి హక్కు ఉంటుంది? కొద్దిరోజుల వ్యవధిలో హర్యానాలో వరసగా జరిగిన రెండు విచక్షణా రహిత హత్యలు ఆ మౌలిక ప్రశ్ననే మరోమారు ముందుకు తెచ్చాయి. ధర్మం పేరిట విద్వేషాన్ని నింపుకొని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొంటున్న స్వయం ప్రకటిత గోరక్షకులతో దేశానికున్న ముప్పును గుర్తుచేశాయి. పన్నెండో తరగతి చదువుతున్న 19 ఏళ్ళ టీనేజ్ కుర్రాడు ఆర్యన్ మిశ్రా హర్యానాలోని ఆగస్ట్ 24న మిత్రులతో కలసి కారులో వస్తుండగా, గోమాంసం రవాణా చేస్తున్నాడనే అనుమానంతో సాయుధ మూకలు 50 కిలోమీటర్ల దూరం ఛేజ్ చేసి మరీ, ఫరీదాబాద్ వద్ద అతణ్ణి కాల్చి చంపిన ఘటన అమానుషం. అలాగే, గొడ్డుమాంసం తింటున్నాడనే అనుమానంతో ఆగస్ట్ 27న చర్ఖీ దాద్రీ వద్ద 26 ఏళ్ళ వలస కార్మికుడు సబీర్ మాలిక్ను కొందరు సోకాల్డ్ ధర్మపరిరక్షకులు కొట్టి చంపిన తీరు నిర్ఘాంతపరుస్తోంది. సాక్షాత్తూ హర్యానా సీఎం సైతం ‘సెంటిమెంట్లు దెబ్బతింటే, ఎవరినైనా ఎలా ఆపగల’మంటూ బాధ్యతారహితంగా వ్యాఖ్యానించడం దీనికి పరాకాష్ఠ. ఇలాంటి పాలక వర్గాల భావజాలం కారణంగానే దాదాపు దశాబ్ద కాలంగా దేశంలో గోరక్షణ పేరిట హింస సాధారణమైపోయింది. సోమవారం మహారాష్ట్రలో ఓ రైలులో పశుమాంసం తీసుకెళు తున్న ఓ వృద్ధుడిపై మూకదాడి అందుకు మచ్చుతునక. అయితే, తాజా దాడులు మైనారిటీలపై హింస పెచ్చరిల్లుతున్న వైనాన్ని పట్టిచూపడమే కాక, ఈ మతపరమైన అసహనంపై విస్తృత చర్చను లేవనెత్తాయి. ఫరీదాబాద్ ఘటనలో చనిపోయింది అమాయక హిందువంటూ రచ్చ చేస్తున్న వాళ్ళు ఆ పోయిన ప్రాణాలు ముస్లిమ్వైనా ఇలాగే స్పందిస్తారా అన్నది ధర్మసందేహం. అప్పుడే ఇలా స్పందించి ఉంటే, దేశంలో అసలు గోరక్షణ పేరిట పరిస్థితులు ఇంత దూరం వచ్చేవి కావేమో! ప్రధాని మోదీ సైతం పశువుల వ్యాపారులపై, పశు మాంసం తినేవారిపై దాడులను గతంలో ఖండించక పోలేదు. కానీ, నోరొకటి మాట్లాడుతుంటే నొసలొకటి చెబుతున్నట్టుగా... అధికార బీజేపీ ఊదరగొ డుతున్న హిందూ జాతీయవాదం గోరక్షణ పేరిట దాడుల్ని పెంచిపోషించిందన్నది నిష్ఠురసత్యం. ఆర్యన్ ఘటనపై నిరసనలు వెల్లువెత్తే సరికి, ప్రభుత్వం సైతం దిద్దుబాటు చర్యలకు దిగకతప్పలేదు. ఛాందసవాద గోరక్షకుల జాబితా సిద్ధం చేస్తున్నట్టు పోలీసులు గురువారం ప్రకటించారు. గతంలోకి వెళితే, 2012– 2018 మధ్య కాలంలో గోరక్షణ పేరిట దేశవ్యాప్తంగా 120 దాకా హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి. ఆ హింసలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు కూడా అత్యధిక ఘటనలు ఉత్తర ప్రదేశ్లోనే జరగడం గమనార్హం. గడచిన ఏడెనిమిదేళ్ళుగా ఉత్తర ప్రదేశ్లోనే కాక హర్యానా, బిహార్, రాజస్థాన్, జార్ఖండ్ తదితర అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో గోసంర క్షకుల పేరిట హింస పెచ్చరిల్లుతూ వస్తోంది. ఈ ‘గోరక్షక ముఠాల’ దాడులు భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలనే దెబ్బతీస్తున్నాయి. నిజానికి, 19వ శతాబ్దం ద్వితీయార్ధం నుంచే మన దేశంలో గోహత్యపై చర్చ, అడపాదడపా హింస సాగుతూనే వచ్చాయి. ‘హిందువేతరులపై హిందూ ధర్మాన్ని రుద్ద కూడద’ని దేశ విభజన సందర్భంగా సాక్షాత్తూ గాంధీ సైతం నొక్కిచెప్పాల్సి వచ్చింది. భారతదేశం లౌకికవాద గణతంత్ర రాజ్యమనే స్ఫూర్తిని నిలబెట్టడం కోసం రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన సంఘం సైతం గోరక్షణను తమ డ్రాఫ్టులో చేర్చలేదు. గోరక్షణను ప్రాథ మిక హక్కుగా చేర్చాలన్న వాదనను తోసిపుచ్చి, దాన్ని ఆదేశిక సూత్రాల్లోనే చేర్చారని చరిత్ర. భారత ప్రజాస్వామ్య సౌధాన్ని నిర్మించిన మన పెద్దలు వివేకంతో వ్యవహరించి, మెజారిటీ ప్రజల ఒత్తిడికి తలొగ్గలేదు. భావోద్వేగభరిత ధార్మిక అంశాల కన్నా దేశంలోని లౌకికవాద చట్టాన్ని సమున్నతమని చేతలతో చాటారు. హిందూ ధర్మంలో గోవును పవిత్రమైనదిగా పూజిస్తాం. తప్పు లేదు. మరి, అదే ధర్మం మనిషిలో దేవుణ్ణి చూడమన్న మాటను గౌరవించవద్దా? దాదాపు 24 రాష్ట్రాల్లో గోవుల అక్రమ అమ్మకం, వధను నిషేధిస్తూ రకరకాల నియంత్రణలున్నాయి. కానీ, వీటిని అడ్డం పెట్టుకొని కొన్ని అతివాద బృందాలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని, హత్యలకు పాల్పడడం, మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి, విద్వేషాలు పెంచడం సహిద్దామా? భరిద్దామా? ఈ రకమైన హిందూ జాతీయవాదంతో దేశం ఎటు పోతుంది? దేశంలోని 20 కోట్ల పైగా ముస్లిమ్లను వేరుగా చూస్తూ, ఈ సమాజంలో తాము మరింత మైనారిటీలుగా మిగిలిపోయామనే భావన కల్పించడం సామాజిక సమైక్యతను దెబ్బతీయదా? అది పొరుగున పొంచిన శత్రువులకు ఊతం కాదా?సంఘమంటేనే విభిన్న వర్గాలు, భావాలు, సంస్కృతులు, అలవాట్ల సమ్మేళనమనే ప్రాథమిక అంశాన్ని అందరూ గుర్తెరిగేలా చేయాలి. వైమనస్యాలు పెంచి సామరస్యాన్ని దెబ్బతీస్తే మొదటికే మోసం. అందులోనూ మూగజీవాల్ని అడ్డం పెట్టుకొని ప్రదర్శిస్తున్న మతోన్మాదం రాజకీయ ప్రేరేపి తమైనది కావడం పెను ప్రమాదఘంటిక. రాజ్యాంగ నైతికతకే విఘాతం కలిగిస్తున్న ఈ చర్యలతో చివరకు సత్ పౌరులనూ, అమాయకులనూ హింసించడం మరింత విషాదం. సుప్రీమ్ కోర్ట్ సైతం ఈ రకమైన హింసను సహించరాదని పదే పదే ఆదేశించినా, పాలకవర్గ రాజకీయాలకు ఆశ్రితులైన దోషులు తప్పించుకుంటూనే ఉన్నారు. స్థానిక నేతలుగా ఎదిగి, చట్టసభల్లో స్థానం సంపాదించు కొని, ప్రజాస్వామ్య విలువల్ని పరిహాసప్రాయం చేస్తున్నారు. పశువుల్ని కాపాడే మిషతో మనిషే మృగంగా మారుతున్న ఈ ధోరణికి ఇకనైనా పాలకులు అడ్డుకట్ట వేయాలి. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకై దీన్ని ఇలాగే వదిలిస్తే ఆఖరికి ఆవుల రక్షణ పేరిట ఆటవిక రాజ్యం నెలకొంటుంది. -
మళ్ళీ మంటలు
మూడు నెలలుగా కాస్తంత ప్రశాంతత నెలకొన్నట్టుందనుకొనే లోగా కథ మళ్ళీ మొదటి కొచ్చింది. మణిపుర్లో శాంతి మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. కల్లోలిత ఈశాన్య రాష్ట్రంలో మెయితీల ప్రాబల్య మున్న కొన్ని ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో మునుపెన్నడూ లేని డ్రోన్ దాడులతో దేశం ఉలిక్కి పడింది. ఇప్పటి దాకా భావిస్తున్నట్టు ఇది కేవలం రెండు వర్గాల మధ్య జాతి, మతఘర్షణలే అనుకోవడానికి వీల్లేదని తేలిపోయింది. ముందుగా వేసుకున్న ఒక పథకం ప్రకారం, వ్యవస్థీకృతంగా సాగిస్తున్న యుద్ధనేరాల స్థాయికి దాడులు చేరిపోయాయి. మణిపుర్లో ఘర్షణలు తగ్గిపోయాయంటూ ప్రధాని మోదీ చెప్పిన మాటల్లో పస లేదని క్షేత్రస్థాయి సంఘటనలతో స్పష్టమైంది. పైగా భారత భూభాగం లోపలే, సాక్షాత్తూ దేశ పౌరులపైనే ఇలా సైనిక వ్యూహంతో డ్రోన్ దాడులు మొత్తం ఈ ప్రాంతాన్నే భయంలోకి నెట్టి, అస్థిరపరచే కుట్రగా కనిపిస్తోంది. మయన్మార్లో జుంటాపై ప్రజాస్వామ్య అనుకూల వేర్పాటువాదులు సాగించే ఈ యుద్ధతంత్రం ఇక్కడ దర్శన మివ్వడం సరిహద్దుల ఆవల ప్రమేయాన్ని చూపుతోంది. ఇది ఆందోళనకరమైన పరిణామం. అత్యాధునిక సాంకేతిక జ్ఞానంతో కూడిన డ్రోన్ల ద్వారా తీవ్రవాదులు రాకెట్ చోదిత గ్రెనేడ్లను ప్రయోగించడంతో ఆదివారం పలువురు గాయపడ్డారు. సోమవారం సైతం మరో గ్రామంపై ఇదే పద్ధతిలో డ్రోన్ దాడులు జరిగాయి. మణిపుర్లో హింస కొంతకాలం నుంచి ఉన్నదే అయినా, ఇలా పౌరులపై డ్రోన్లతో బాంబులు జారవిడవడం ఇదే తొలిసారి. అదీ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్సింగ్కు వ్యతిరేకంగా గిరిజనుల ఆధిక్యం ఉన్న కొన్ని జిల్లాల్లో కుకీ – జో వర్గాలు నిరసన ప్రదర్శనలు జరి పిన మర్నాడే ఈ ఘటనలు జరగడం గమనార్హం. యుద్ధాల్లో వాడే ఇలాంటి వ్యూహాలను ఇలా అనూహ్యంగా అందరిపై ప్రయోగించి, ఉద్రిక్తతల్ని పెంచినది కుకీలే అన్నది పోలీసుల ఆరోపణ. అదెలా ఉన్నా, ఇది మన నిఘా సంస్థల వైఫల్యానికీ, తీవ్రవాదుల కట్టడిలో మన భద్రతాదళాల వైఫల్యానికీ మచ్చుతునక. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం మణిపుర్లో జరిగిన డ్రోన్ దాడులను నిశితంగా అధ్యయనం చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. తీవ్ర వాదులు ఎలాంటి డ్రోన్లను వాడారన్నది మొదలు పలు అంశాలను ఈ కమిటీ నిశితంగా పరిశీలించనుంది. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా నివారించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టా లన్న దానిపై నివేదిక సమర్పించనుంది. అయితే గతేడాది మేలో మొదలైన హింసాకాండ చివరకు ఈ స్థాయికి చేరిందంటే, ఇప్పటికీ చల్లారలేదంటే తప్పు ఎక్కడున్నట్టు? ఉద్రిక్తతల్ని చల్లార్చి, విభేదాలు సమసిపోయేలా చూడడంలో స్థానిక పాలనా యంత్రాంగం ఇన్ని నెలలుగా విఫలమైందన్న మాట. కొండ ప్రాంతాలకూ, లోయ ప్రాంతాలకూ మధ్య బఫర్ జోన్లు పెట్టి, భద్రతాదళాల మోహరింపుతో శాశ్వతంగా శాంతి భద్రతల్ని కాపాడగలమని పాలకులు భావిస్తే పిచ్చితనం.అసమర్థ పాలనతో పాటు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి బీరేన్సింగ్ మాత్రం కుర్చీ పట్టుకొని వేలాడుతూ, ఆ మధ్య కూడా గొప్పలు చెప్పారు. తాము నియమించిన శాంతిదూతలు గణనీయమైన పురోగతి సాధించారనీ, ఆరు నెలల్లో శాంతి తిరిగి నెలకొంటుందనీ ఊదరగొట్టారు. ఆ మాటలన్నీ నీటిమూటలేనని తాజా ఘటనలు ఋజువు చేశాయి. పైపెచ్చు, తాజాగా ఆధునిక సాంకేతికత సాయంతో, అత్యాధునిక ఆయుధాలతో సాగుతున్న దాడులను బట్టి చూస్తే, కొన్ని వర్గాలకు దేశం వెలుపల నుంచి అన్ని రకాల వనరులు అందుతున్నట్టు అనుమానం బలపడుతోంది. దేశ సమగ్రత, సార్వభౌమత్వానికే ముప్పుగా పరిణమించే ఇలాంటి పరిస్థితుల్లో పాలకులు కుంభకర్ణ నిద్ర పోతే పెను ప్రమాదం. శతాబ్దాలుగా అనేక సంక్షోభాలను ఎదుర్కొని, తమ మట్టినీ, మనుగడనూ కాపాడుకొన్న చరిత్ర మణిపుర్ ప్రజలది. అలాంటి ప్రాంతాన్ని పేరుకు మాత్రమే భారత్లో భూభాగంగా చూడక, ఆ ప్రాంత ప్రజల బాగోగులు, అక్కడి శాంతి సుస్థిరతలు తాము పట్టించుకుంటామని పాలకులు నిరూపించుకోవాల్సిన సమయమిది. 2023 నుంచి కుకీలు, మెయితీల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం అట్టుడుకుతోంది. ఎక్కడ ఏ వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉంటే, అక్కడ అది ఆ వర్గపు అడ్డాగా ఇప్పటికే మణిపుర్ అనేక జోన్లుగా అనధికారంగా చీలిపోయింది. ఇంటిలోని ఈ గుండెల మీద కుంపటి చాలదన్నట్టు, ఆ పక్కనే మన దేశానికి సరిహద్దులు సైతం అంతే ఉద్రిక్తంగా తయారయ్యాయి. జుంటాకూ, తిరుగు బాటుదారులకు మధ్య ఘర్షణలతో మయన్మార్ రగులుతోంది. ఇటీవలి రాజకీయ సంక్షోభంతో పొరుగున బంగ్లాదేశ్తో వ్యవహారం అస్తుబిస్తుగా ఉంది. ఈ గందరగోళ భూభౌగోళిక వాతావరణం మణిపుర్ వ్యవహారాన్ని మరింత సున్నితంగా మార్చేస్తోంది. అంతా బాగానే ఉందనడం మాని, ఇప్పటికైనా బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ తాము అనుసరిస్తున్న ధోరణిని పునస్సమీక్షించుకోవాలి. మణిపుర్ మరో యుద్ధభూమిగా మిగిలిపోకూడదనుకుంటే, మన పాలకులకు కావాల్సింది రాజకీయ దృఢసంకల్పం, చిత్తశుద్ధి. దేశ అంతర్గత భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదాన్ని గమనించి, తక్షణ నష్టనివారణ చర్యలు చేపట్టాలి. ఏ ఒక్క వర్గానికో కొమ్ము కాయడం మాని, పెద్దన్న తరహాలో అన్ని వర్గాల ప్రజల మధ్య స్నేహ సౌహార్దాలు నెలకొనేలా నిజాయతీగా కృషి చేయాలి. సంబంధిత వర్గాలన్నిటితో రాజకీయ చర్చలు సాగించాలి. ఘర్షణల్ని పెంచిపోషిస్తున్న అంతర్లీన అంశాలను గుర్తించి, వాటిని ముందుగా పరిష్కరించాలి. తాత్కాలిక సర్దుబాటు కాక శాశ్వత శాంతిస్థాపనకై చర్చించాలి. ఇప్పటికైనా పాలకులు వివేకాన్ని చూపగలిగితే, మణిపుర్ను మంటల్లో నుంచి బయటపడేయవచ్చు. లేదంటే దేశమంతటికీ కష్టం, నష్టం. -
కలాపోసన
‘ఆ.. మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాలయ్యా! ఉత్తికే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటది?’– ‘ముత్యాలముగ్గు’ సినిమాలో కాంట్రాక్టరు పాత్రధారి రావు గోపాలరావు పలికిన అమృతవాక్కులివి. ముళ్లపూడి వెంకటరమణ కలం నుంచి తూటాల్లా వెలువడిన మాటలివి. తెలుగునాట అమిత జనాదరణ పొందిన పది సినిమా డైలాగుల జాబితాను ఎవరైనా రూపొందిస్తే, ఈ డైలాగుకు అందులో తప్పకుండా చోటు దక్కి తీరుతుంది. నిజమే! ఊరకే తిని తొంగున్నట్లయితే, మనిషికీ గొడ్డుకూ ఏమాత్రం తేడా ఉండదు. గొడ్డుకు లేని బుద్ధి మనిషికి ఉంది. మనిషిని ఇతర జంతుతతి నుంచి వేరు చేసేది ఆలోచనా శక్తి మాత్రమే! ఆలోచనకు పదునుపెట్టే సాధనం సృజనాత్మకత. మనిషిలోని సృజనాత్మకతకు ఫలితాలే కళలు.కొందరికి జన్మతః కళాభినివేశం ఉంటుంది. అలాంటివారు సునాయాసంగా కళలను కైవసం చేసుకోగలుగుతారు. ఇంకొందరు అభిరుచితో సాధన చేసి కళల్లో రాణిస్తారు. అభినివేశం, సాధన లేకున్నా, చాలామంది కళలను ఆస్వాదిస్తారు. కలిగిన ఆసాములు కళలను ఆదరిస్తారు. కళలు అరవై నాలుగు అని వాత్సా్యయనుడు చెప్పాడు. వీటిలో చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, నృత్యం, కవిత్వం అనే అయిదు కళలూ లలితకళలుగా గుర్తింపు పొందాయి.లలితకళలు మనుషుల భావోద్వేగాల అభివ్యక్తికి అందమైన సాధనాలు. మనుషులు తమ ఆలోచనలను, ఆనంద విషాదాది భావోద్వేగాలను; తమ కాల్పనిక ఊహాజగత్తులోని విశేషాలను, తమ సృజనాత్మకతను ఇతరులతో పంచుకోవడానికి కళలను ప్రదర్శిస్తారు. పురాతన నాగరికతలు ఊపిరి పోసుకోక మునుపటి నుంచే మనుషులు కళల ద్వారా తమ ఉద్వేగాలను చాటుకోవడం మొదలుపెట్టారు. మాటలాడటం ఇంకా నేర్చుకోని ఆనాటి మానవులు బొమ్మల ద్వారా తమ ఆలోచనలను వెల్లడించేవారు. పాతరాతి యుగం మానవులు రాతిగుహల గోడల మీద చిత్రించిన చిత్రాలే ఇందుకు ఆనవాళ్లు. నాగరికతలు మొదలైన నాటి నుంచి నేటి వరకు కళలకు– ముఖ్యంగా లలితకళలకు జనాదరణ ఉంది. కళలు ఏవైనా సరే, వాటి ప్రయోజనం ఒక్కటే – ఆత్మప్రక్షాళన. ‘దైనందిన జీవితంలో మన ఆత్మలపై పేరుకున్న ధూళిని శుభ్రం చేయడమే కళ ప్రయోజనం’ అంటాడు ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో. కళలు భావోద్వేగాల ప్రసారమాధ్యమాలు మాత్రమే కాదు, ఆత్మప్రక్షాళనకు ఉపకరించే సాధనాలు కూడా! కళలు మనుషుల జీవితాలను సౌందర్యభరితం చేస్తాయి. కళలు విలువలు నేర్పుతాయి. దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లతో అలజడికి గురైన మనసుకు సాంత్వన నిస్తాయి. కళలు జీవితాన్ని చైతన్యవంతం చేస్తాయి. ఇంతేకాదు, కళలు సామాజిక అన్యాయాలను ఎత్తి చూపుతాయి. ఆలోచన రేకెత్తిస్తాయి. ఆత్మవిమర్శ దిశగా మనుషులను ప్రేరేపి స్తాయి. కళలు సమాజాన్ని మరింత నాగరికంగా, ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి. సమాజంలోని రకరకాల సంస్కృతులకు చెందిన సమూహాల గుండెచప్పుడును వినిపిస్తాయి. కళలు సామాజిక మార్పులకు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి.‘కళ చాలా విశాలమైనది. మనుషుల తెలివి చాలా ఇరుకైనది’ అంటాడు ఇంగ్లిష్ కవి అలెగ్జాండర్ పోప్. ప్రపంచం తీరుతెన్నులను చూస్తుంటే, ఆయన మాట నిజమేననిపిస్తుంది. సామాజిక మార్పులకు ఉత్ప్రేరకాలుగా పనికొచ్చే లక్షణం కళలకు ఎంతో కొంత ఉన్నమాట వాస్తవమే అయినా, ప్రపంచవ్యాప్తంగా కళాకారులు అసంఖ్యాకంగా కళాసృజన కొనసాగిస్తూ వస్తున్నా, ఈ ప్రపంచం మారాల్సిన పద్ధతిలో ఇంకా మారలేదు. మనుషుల కురచ బుద్ధులు కూడా మారలేదు. బహుశా, జనాభాలోని అత్యధికులు కళలను ఒంటబట్టించుకోకపోవడమే ఇందుకు కారణం కావచ్చు. కళలకు ఆదరణలేని దేశాలు నిరంతరం అలజడులు, అశాంతితో అలమటించే పరిస్థితులను చూస్తూనే ఉన్నాయి. అఫ్గానిస్తాన్లోని తాలిబన్ నాయకులు సంగీత ప్రదర్శనలపై నిషేధాజ్ఞలు విధించారు. అక్కడి పరిస్థితులు మనకు తెలియనివి కావు. చిత్రకళా ప్రదర్శనలపై నానా రకాల ఆంక్షలు ఉన్న ఉత్తర కొరియా పరిస్థితులు కూడా మనకు తెలిసినవే! స్వేచ్ఛ లేనిచోట కళలకు ఊపిరాడదు. ఇక స్వేచ్ఛే ఊపిరిగా బతికే కళాకారుల పరిస్థితి ఆంక్షలున్న చోట ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. నియంతృత్వ దేశాల్లో మాత్రమే కాదు, ప్రజాస్వామ్య దేశాలుగా చెప్పుకుంటున్న చాలా దేశాల్లోనూ కళాకారులు పూర్తి స్వేచ్ఛను అనుభవిస్తున్న పరిస్థితులు లేవు.కళలన్నీ కళాకారుల ఆత్మావిష్కరణలే! అందుకే, ‘అన్ని కళలూ కళాకారుల ఆత్మకథలే! ముత్యం ఆల్చిప్ప ఆత్మకథ’ అంటాడు ఇటాలియన్ దర్శకుడు ఫెడెరికో ఫెలినీ. ఆంక్షలు లేనిచోట మాత్రమే కళాకారుల ఆత్మావిష్కరణకు అవకాశాలు అపరిమితంగా ఉంటాయి. కాల ప్రవాహంలో ప్రపంచంలోని మిగిలిన మార్పులతో పాటే కళలు కూడా మారుతూ వస్తున్నాయి. కళల్లో ప్రాచీన కళ, ఆధునిక కళ అనేవి కాలానికి సంబంధించిన కొండగుర్తులు మాత్రమే! కళల అస్తిత్వం నిరంతరం.స్వేచ్ఛలేని పరిస్థితుల వల్ల కొన్నిచోట్ల, ఆధునిక జీవనశైలిలోని తీరిక దొరకని పరిస్థితుల వల్ల కొన్నిచోట్ల మనుషులు కళలకు దూరమవుతున్నారు. దొరికే కొద్దిపాటి తీరిక సమయాన్ని టీవీ, స్మార్ట్ఫోన్ వంటివి అందించే యాంత్రిక వినోదంతో సరిపెట్టుకుంటున్నారు. ఫలితంగా మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే, కళాస్వాదన, కళా సాధనల వల్ల మనుషుల్లో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఇటీవల బ్రిటిష్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. మరందుకే మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాల! లేకపోతే బతుకులు గొడ్డుదేరిపోవూ! -
ఇదొక నిశ్శబ్ద విధ్వంసం!
విశాఖ నగరం సమీపంలోని భీమ్లీలో అదొక ప్రభుత్వ పాఠశాల. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం నాడు ఆ బడిని సందర్శించారు. ఓ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను పలకరించారు. ‘మీరు ముందుగా ఏ భాషలో మాట్లాడుకుంటారు... తెలుగులోనా, ఇంగ్లీషులోనా?’ అని అడి గారు. అక్కడున్న విద్యార్థినులు తడుముకోకుండా ‘ఇంగ్లీషు లోనే’ అని సమాధానమిచ్చారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఆసక్తి కరంగా ఉన్నదని కూడా వారు చెప్పారు. ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న పేద వర్గాల పిల్లల గుండెల్లో గూడు కట్టుకున్న ఆకాంక్షలకు ఈ ఘటన అద్దం పట్టింది.అంతకు ముందు రోజు గిడుగు రామమూర్తి పంతులు జయంతి సభ విజయవాడలో జరిగింది. ఆ సభలో రాష్ట్ర ముఖ్య మంత్రి, ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి తెలుగు భాషతోనే జీవితమని మరోసారి చెప్పు కొచ్చారు. జీతం కోసం ఇంగ్లీషు కూడా నేర్పిస్తామని తన ఉభయ భాషాభిమానాన్ని కూడా వెల్లడించారు. ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవలసిన ధర్మ సూక్ష్మం ఒకటున్నది. జీతం కోసం నేర్చుకునే ఇంగ్లీష్ ప్రైవేట్ స్కూళ్లకు, ‘జీవితం’ కోసం నేర్చుకునే తెలుగు ప్రభుత్వ స్కూళ్లకు ప్రత్యేకం.తొంభై శాతానికి పైగా ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లీషు మీడి యమే ఉంటుందన్న సంగతి జగమెరిగిన సత్యమే! కనుక తెలుగు భాషను రక్షించి పోషించవలసిన బాధ్యత ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలది, కష్టజీవులైన వారి తల్లిదండ్రులది. మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర్నుంచీ ఈ బాధ్యతను వారు తమ భుజాల మీద మోస్తూనే వస్తున్నారు. మన తెలుగు జాతి లోని సంపన్న శ్రేణివారు, ఉన్నతోద్యోగులు, క్రీమీ లేయర్లోని ఓ పదిమంది కూడిన ప్రతిచోట ఏ భాషలో మాట్లాడుకుంటారు? నిస్సందేహంగా ఇంగ్లీషులోనే! వారు ఇంగ్లీషులోనే పలక రించుకుంటారు. ఇంగ్లీషులోనే తుమ్ముతారు, ఇంగ్లీషులోనే దగ్గు తారు. తెలుగు భాషా సంస్కృతులను రక్షించవలసిన అవస రాన్ని సామాన్య ప్రజలకు వారే గుర్తు చేస్తుంటారు.కొద్దిమంది పండితుల చేతుల్లోనే బందీ ఆయిన తెలుగు సాహిత్యాన్ని విముక్తం చేసి సామాన్య ప్రజలకు అర్థమయ్యే వ్యవహారిక భాషలో రచనలు జరగాలని ఉద్యమించి గెలిచిన యోధుడు గిడుగు రామమూర్తి పంతులు. ఆయన నుంచి తీసు కోవలసిన స్ఫూర్తి ఏమిటి? ఉన్నత స్థానాలను అధిరోహించే అవకాశాలను కల్పిస్తున్న ఇంగ్లీషు మీడియాన్ని సంపన్న శ్రేణికే పరిమితం చేయకుండా సమస్త ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పడం కాదా? అటువంటి సంకల్పమే గదా పంతులు గారికి ఇవ్వదగిన నిజమైన నివాళి!మనకు కొంతమంది స్వయం ప్రకటిత తెలుగు పెద్ద లున్నారు. వృద్ధనారీ పతివ్రతల వంటివారు. తెలుగు మీడియంలోనే చదువుకోవాలని పదేపదే గుర్తు చేస్తుంటారు. ఆ పిలుపు ప్రభుత్వ బడులకూ, బడుగు వర్గాలకే వర్తిస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ వర్గాలను ఉత్తేజితం చేయడం కోసం తమ జీవితమే వారికొక సందేశమని చెబుతారు. తెలుగులోనే చదువుకోవడం వల్ల తాము దిగ్గజాలుగా ఎదిగామనీ, ‘మీరు కూడా తెలుగులోనే చదవండి, మా అంతటివారు అవుతార’ని ఊదరగొడుతుంటారు. అసలు పరభాషా మాధ్యమంలో చదువుకున్నంత మాత్రాన మాతృభాష అంతరించిపోతుందనే వాదనే నిర్హేతుకమైనది. సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి సోదరులు, పీవీ నరసింహారావు, కాళోజి నారాయణరావు, డాక్టర్ సి. నారాయణరెడ్డి, వట్టికోట ఆళ్వార్ స్వామి తదితరు లంతా ఉర్దూ మీడియంలో చదివి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినవారే. మన తాజా తెలుగు పెద్దలతో పోల్చితే మహాదిగ్గజాలే.ఇదొక్క ఇంగ్లీషు మీడియం గొడవ మాత్రమే కాదు. నాణ్యమైన విద్య, సరైన వసతులు, పర్యవేక్షణ, బోధనా పద్ధతులు... వగైరాలన్నింటిలోనూ ప్రభుత్వ పాఠశాలల ప్రమా ణాలు పడిపోతూ వస్తున్నాయి. గత మూడు దశాబ్దాలుగా ఈ పరిణామం వేగవంతమైంది. ఇందుకు ప్రధాన కారణం మన పాలకులు. పేద, మధ్యతరగతి పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడానికి పెట్టుబడి పెట్టడం మన ‘సంస్కరణోత్తర’ రాజకీయ వేత్తలకు ఇష్టంలేదు. ఈ కేట గిరీలో ముందు వరసన నిలిచిన రాజకీయవేత్త చంద్రబాబు. విద్య, వైద్యం మాత్రమే కాదు... ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వకూడదనే ఫిలాసఫీ ఆయనది. ‘మనసులో మాట’ అనే పేరుతో ఆయన రచించిన పుస్తకం నిండా ఈ ఫిలాసఫీయే ఉంటుంది. ఐదేళ్లకు పూర్వం విభజిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఈ తత్వధారను వారబోస్తూనే వచ్చారు. ‘ఉచిత విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రభుత్వ స్కూళ్లలో సదుపాయాలుండవు. డబ్బులున్న వాళ్లు ప్రయివేటు స్కూళ్లలో చదువుకోండి. అక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అన్నీ బాగుంటాయ’ని ఆయన ఉద్బోధించేవారు.వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యా సంస్కరణలు ప్రారంభించిన తర్వాత చంద్రబాబుతో పాటు ఆయన మీడియా కూడా విమర్శల వర్షం కురిపిస్తూనే వచ్చింది. ఒకేసారి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే పిల్లలకు అర్థం కాకుండా పోతుందని గగ్గోలు పెట్టారు. కానీ, బైలింగ్వల్ పాఠ్యపుస్తకాల ప్రయోగంతో ఈ సమస్యను ప్రభుత్వం అవలీలగా అధిగమించిందని విద్యా రంగ నిపుణులు పలువురు కొనియాడారు. చంద్రబాబు ప్రభుత్వం రాగానే ప్రభుత్వ స్కూళ్ల వైభవం అంతరించిపోతుందన్న అంచనా ప్రజల్లో చాలామందికి ముందే ఉన్నది. కనుకనే ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు టీసీలు తీసుకుని ప్రైవేట్ బడుల్లో చేరిపోయారు. పూర్తి వివరాలు రాలేదు గానీ, ఈ సంఖ్య మూడు లక్షలకు పైగానే ఉండొచ్చని అంచనా.ప్రజలు ఊహించినట్టుగానే చంద్రబాబు ప్రభుత్వం సర్కారు బళ్లపై దాడిని ప్రారంభించింది. ‘అమ్మ ఒడి’ ఇవ్వలేదు. ‘వసతి దీవెన’ లేదు, ‘విద్యా కానుక’ లేదు. ‘మధ్యాహ్న భోజనం’, ‘గోరు ముద్దలు’ గాడి తప్పాయి. ఇంగ్లీష్ ప్రమాణాలు పెంచేందుకు ఉద్దేశించిన ‘టోఫెల్’ పరీక్షను తొలగించారు. వెయ్యి స్కూళ్లల్లో అమలవుతున్న సీబీఎస్ఈ సిలబస్ను ఎత్తేశారు. ఉచితంగా లభించాల్సిన అంతర్జాతీయ స్థాయి ఐబీ సిలబస్ను అటకెక్కించారు. కార్పొరేట్ స్కూళ్లకు మేలు చేయడం కోసమే ఇటువంటి చర్యలు చేపడుతున్నారనే ఆరోపణలు బలపడుతున్నాయి. నేడో రేపో ఇంగ్లీష్ మీడియానికి కూడా వీడ్కోలు చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యామంత్రి లోకేశ్కు విశాఖ బాలికలు తమ గుండెచప్పుడును వినిపించారు.పేద ప్రజానీకం బిడ్డలకు కూడా అత్యున్నత ప్రమాణాలు కలిగిన నాణ్యమైన విద్య అందాలన్న లక్ష్యంతో జగన్ ప్రభుత్వం విద్యా సమీక్షా కేంద్రాల (వీఎస్కే)ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు, విద్యార్థులు – ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజనం నిర్వహణ, స్టూడెంట్ కిట్స్ పంపిణీ, ట్యాబులు, ఐఎఫ్పీల నిర్వహణ వగైరా అంశాలపై నిరంతర పర్యవేక్షణ చేయడం ఈ వీఎస్కేల పని. ఇప్పుడా పనులేవీ వీఎస్కేలు చేయవలసిన అవసరం లేదని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు, ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఈ ప్రభుత్వం ఏం చేయనున్నదో తెలుసుకోవడానికి!ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహణ తీరుతెన్నులపై ఈ ఒక్క నెల రోజుల్లోనే డజన్కు పైగా విషాదకర వార్తలు వెలువడ్డాయి. నూజివీడు ట్రిపుల్ ఐటీలో చదువుతున్న విద్యార్థుల్లో 566 మంది కేవలం మూడు రోజుల్లోనే ఆస్పత్రి పాలయ్యారు. జ్వరం, కడుపునొప్పి, విరేచనాలు, వాంతులతో ఆ విద్యార్థులు తల్లడిల్లారు. విజయనగరంలోని ఓ ఆశ్రమ విద్యార్థులు 21 మంది ఆస్పత్రి పాలయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ కేజీబీవీలో 20 మంది వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల ఆరోగ్యంపై ఈ ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉన్నదో ఈ సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారి వరకు సంక్షేమ హాస్టల్స్ను నిరంతరం తనిఖీ చేసేలా ఒక ప్రత్యేక కార్య క్రమాన్ని జగన్ ప్రభుత్వం తయారు చేసింది. ఆ కార్యక్రమాన్ని చాప చుట్టేసిన ఫలితమే ఈ నెల రోజుల్లో జరిగిన దుర్ఘటనలు. హాస్టల్స్లో వుండే విద్యార్థుల వసతి, వైద్య సౌకర్యాలపై జీవో నెంబర్ 46 కింద గత ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ఉద్దేశపూర్వకంగానే కూటమి ప్రభుత్వం ఆ మార్గదర్శకాలను విస్మరించింది. ఎందుకంటే పేద ప్రజలకు నాణ్యమైన విద్య అనేది ఈ ప్రభుత్వం ఎజెండా కాదు. ఉచితంగా ఉత్తమ విద్యను అంద జేయడం ఈ ప్రభుత్వ ఫిలాసఫీ కాదు. అది జగన్ ప్రభుత్వ ఫిలాసఫీ, జగన్ ప్రభుత్వం ఎజెండా. పేద వర్గాల ప్రజలను సాధికార శక్తులుగా మలచడానికి జగన్ ప్రభుత్వం ప్రారంభించిన నాణ్యమైన ఉచిత విద్యపై కూటమి సర్కార్ దాడిని ప్రారంభించింది. నిశ్చబ్దంగా ఒక మహా విధ్వంసానికి శ్రీకారం చుట్టింది. జగన్ ప్రభుత్వం విద్యారంగంలో నిశ్శబ్ద విప్లవాన్ని ప్రారంభిస్తే, బాబు సర్కార్ అదే రంగంలో నిశ్శబ్ద విధ్వంసాన్ని మొదలుపెట్టింది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
కటకటాల్లో టెలిగ్రామ్ చీఫ్
ఆయనేమీ అమెరికా సైనికుల అకృత్యాలను ఆన్లైన్లో రచ్చకీడ్చిన జులియన్ అసాంజ్ కాదు. దేశదేశాల్లోని కోట్లాదిమంది పౌరులపై నిఘా ఉంచుతున్న అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ) తీరుతెన్నులను బట్టబయలు చేసి రష్యాలో తలదాచుకుంటున్న ఎడ్వర్డ్ స్నోడెన్ కాదు. ఆయన వేలాది కోట్ల డాలర్ల విలువైన అతి పెద్ద మెసేజింగ్ సంస్థ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ ద్యురోవ్. రెండు రోజుల క్రితం ఫ్రాన్స్ పోలీసులు పారిస్లో ఆయన్ను అరెస్టు చేసి నిర్బంధించారని తెలియగానే ట్విటర్, టెస్లా సంస్థల అధిపతి ఎలాన్ మస్క్ ఖండించారు. పావెల్ విడు దల కోసం ట్విటర్ వేదికగా ‘ఫ్రీ పావెల్’ ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రపంచాధినేతల్లో ఎంతో పలుకుబడిగల మస్క్ గతంలో ఎప్పుడూ ఇలాంటి వివాదాల జోలికిపోలేదు. ఆరు నూరైనా... ఎలాంటి పర్యవసానాలూ, పరిణామాలూ ఎదురైనా పౌరుల భావప్రకటనా స్వేచ్ఛ ఉండితీరాలని వాదించటంలో పావెల్కి ఎవరూ సాటిరారు. నిజానికి అది వివాదాస్పదం కావటంతోనే అతను జైలుపాలయ్యాడు. కారణాలు వెల్లడి కాకపోయినా పసివాళ్లతో రూపొందించిన బూతుచిత్రాల పంపిణీకీ, మాదకద్రవ్య ముఠాల కార్యకలాపాలకూ, ఉగ్రవాద కార్యకలాపాలకూ, అక్రమమార్గాల్లో ద్రవ్య చలామణీకీ టెలిగ్రామ్ అవకాశమిస్తోందన్నది చాన్నాళ్లుగా ఉంటున్న అభియోగాల సారాంశం. భావప్రకటనా స్వేచ్ఛకు ఏమేరకు హద్దులుండాలి... దానివల్ల ఎదురయ్యే దుష్పరిణామాలకు బాధ్యులెవరు... ఈ విషయంలో ప్రభుత్వాల ప్రమేయాన్ని ఎంతవరకూ అనుమతించాలి వంటి ప్రశ్నలు ఎప్పటినుంచో అందరినీ వేధిస్తున్నాయి. ఇప్పుడు పావెల్ అరెస్టుతో అవి మరింత ప్రము ఖంగా చర్చకొస్తున్నాయి. పావెల్ రష్యా పౌరుడని పేరునిబట్టి ఎవరైనా గుర్తుపడతారు. అయితే ప్రస్తుతం ఆయనకు ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాల పౌరసత్వం ఉంది. అసమ్మతిని అణిచేయటంలో సిద్ధహస్తుడైన రష్యా అధ్యక్షుడు పుతిన్ చాన్నాళ్లుగా అతన్ని బంధించాలని ప్రయత్నిస్తున్నారు. పావెల్ను అప్పగించాలని, కనీసం మాట్లాడటానికి అనుమతించాలని తాజాగా ఫ్రాన్స్ను రష్యా డిమాండ్ చేస్తోంది. 2011లో రష్యా నిర్వహించిన ఎన్నికలు పూర్తిగా బోగస్ అంటూ బయ ల్దేరిన ‘మంచు విప్లవం’ (స్నో రివల్యూషన్) దేశం నలుమూలలా విస్తరించటానికి పావెల్ దోహద పడ్డాడు. ఆ క్రమంలో ఏర్పడిన మెసేజింగ్ యాప్ కాస్తా తర్వాతకాలంలో టెలిగ్రామ్గా రూపుదిద్దు కుంది. పావెల్ ఉక్రెయిన్లో రష్యా దురాక్రమణను ఖండించే అభిప్రాయాలకు చోటిచ్చాడు.అంతేకాదు... ఇజ్రాయెల్ గాజాలో సాగిస్తున్న అకృత్యాలను బట్టబయలు చేసే వీడియోలను వెల్లడించేందుకు అనుమతించాడు. ఇతర దిగ్గజ సంస్థలు మొహం చాటేసిన ఈ అకృత్యాలు టెలి గ్రామ్ లేకపోతే బాహ్య ప్రపంచానికి బహుశా తెలిసేవి కాదు. వాట్సాప్ వంటి ఇతర సంస్థలకు లేని వెసులుబాటు– రెండు లక్షలమందితో గ్రూప్ నిర్వహించటం– టెలిగ్రామ్లోనే సాధ్యం. అయితే ఇందువల్ల అనర్థాలు తలెత్తటం కూడా వాస్తవం. ఆమధ్య పారిస్, బెర్లిన్ నగరాల్లో పేలుళ్లకు, దాడులకు ఉగ్రవాద సంస్థ ఐఎస్ టెలిగ్రామ్ యాప్ను వాడుకుంది. ఆ తర్వాత సంస్థ సాంకేతిక సిబ్బంది దాన్ని కట్టడిచేశారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు చోటీయని వ్యవస్థ ఏర్పర్చు కోవాలని, నేరగాళ్ల ఆనుపానులు ఎప్పటికప్పుడు తమకు అందించాలని అనేక దేశాలు టెలిగ్రామ్ను కోరుతున్నాయి. యూరప్ దేశాలు ఈయూ డిజిటల్ సర్వీసుల చట్టాన్ని రెండేళ్ల క్రితం తీసు కొచ్చాయి. పర్యవసానంగా చాలా మాధ్యమ సంస్థలు దారికొచ్చాయి. కృత్రిమ మేధ (ఏఐ) ఆధా రంగా ‘అవాంఛిత’ సందేశాలను జల్లెడ పడుతున్నాయి. వాటిని నిలిపేస్తున్నాయి. అయితే సమస్యే మంటే... ఈ వంకన అనేక మాధ్యమాలు సహేతుకమైన అసమ్మతికి కూడా తలుపులు వేస్తున్నాయి. నియంతలకు వంత పాడుతున్నాయి. కొన్ని సంస్థలైతే సంకేత నిక్షిప్త సందేశాల(ఎన్క్రిప్షన్)కు అవకాశమున్నదని పైకి చెబుతూ తమ వినియోగదారుల ఆనుపానులు తెలుసుకోవటానికి ప్రభు త్వాలకు అవకాశమిస్తున్నాయి. కానీ టెలిగ్రామ్ లొంగటం లేదు. ప్రతి దేశంలోనూ స్థానిక చట్టాల లొసుగులను వాడుకుని బయటపడుతోంది. అలాగని తన వేదికపై వినియోగదారులు పరస్పరం పంపుకునే సందేశాలు టెలిగ్రామ్కు తెలియక కాదు. వాటిని అవసరమనుకున్నప్పుడల్లా చూస్తోంది. భావప్రకటనా స్వేచ్ఛకూ, బాధ్యతకూ మధ్య సన్నని విభజన రేఖ ఉంటుంది. స్వేచ్ఛ మాటున వదంతులు సృష్టించటం, అల్లర్లకు ఆజ్యం పోయటం ఎవరు చేసినా తప్పే అవుతుంది. అలాంటి వారు చట్టం ముందు తలవంచాల్సిందే. ఆ మధ్య గోరక్షణ పేరుతో బృందాలు ఏర్పడి వ్యక్తులను కొట్టిచంపిన ఉదంతాలు పెరిగాక సందేశాల పంపిణీపై వాట్సాప్ అనేక పరిమితులు విధించింది. మన దేశంలో టెలిగ్రామ్కు 50 లక్షలమంది చందాదారులున్నారు. మాదకద్రవ్యాలు, జూదం, బెది రించి డబ్బులు గుంజుకోవటం వంటి కార్యకలాపాలకు అది వేదిక వుతున్నదని మన ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇటీవల నీట్ ప్రశ్నపత్రాల లీకు పుణ్యం టెలిగ్రామ్దే. కేంద్ర హోంశాఖ నేతృత్వంలోని ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ఆ వ్యవహారాలపై దృష్టి సారించింది. ఇది ఒక కొలిక్కి వస్తే టెలిగ్రామ్ నిషేధానికి కూడా గురికావొచ్చన్నది విశ్లేషకుల అంచనా. ఏదేమైనా తనవల్ల సమాజానికి నష్టం కలుగుతున్నదని గ్రహించాక టెలిగ్రామ్ బాధ్యత గుర్తెరగవలసింది. కనీసం ఆ పని ఇప్పుడైనా జరగాలి. అదే సమయంలో ఆ వంకన ప్రభుత్వాలు సహేతుక విమర్శ లకూ, అసమ్మతికీ పాతరేయకుండా చూడటం ప్రజాస్వామికవాదుల కర్తవ్యం. -
మాయరోగం... మరోసారి!
అవును... మళ్ళీ మరో మాయరోగం బయటకొచ్చింది. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ (ఎంపాక్స్) తాజాగా విజృంభించింది. స్వీడన్ నుంచి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ దాకా అనేక ప్రాంతాలకు విస్తరించింది. ఫలితంగా, ప్రపంచం మరోసారి ఉలిక్కిపడింది. దీన్ని ఆందోళన చెందా ల్సిన అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా రెండేళ్ళలోనే రెండోసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించాల్సొచ్చింది. భారత్ సైతం ఎయిర్పోర్ట్లు, ఆస్పత్రుల్ని అప్రమత్తం చేసి, కాంగో సహా మధ్య ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల ఆరోగ్యంపై కన్నేసింది. మాస్కుల ధారణ, చేతుల పరిశుభ్రత, గుంపుల్లో తిరగకపోవడం లాంటి ముందుజాగ్రత్తలే శ్రీరామ రక్ష అని మంకీపాక్స్ మరోసారి గుర్తుతెచ్చింది. తరచూ తలెత్తుతున్న ఈ వైరస్ల రీత్యా ఔషధ పరి శోధన, ఆరోగ్య వసతుల కల్పనపై మరింత పెట్టుబడి పెట్టాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది. ప్రపంచంపై ఎంపాక్స్ పంజా విసరడం ఇప్పటికిది మూడోసారి. అసలు 15 నెలల పైచిలుకు క్రితం ఇది ఇక ఆందోళన చెందాల్సినది కాదని డబ్ల్యూహెచ్ఓ తేల్చింది. తీరా ఇటీవల కొద్ది వారాలుగా వైరస్ పునర్ విజృంభణతో ఆగస్ట్ 14న మరోసారి అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సి వచ్చింది. దీనికి కారణం లేకపోలేదు.2023 సెప్టెంబర్ నుంచి కేసులు పెరుగుతున్నాయి. పైగా గతంలో 2022–23లో ప్రపంచాన్ని చుట్టుముట్టినప్పటితో పోలిస్తే, ఈసారి జన్యుపరంగా విభిన్నమైన వైరస్ (క్లాడ్ 1బి వేరియంట్) దీనికి కారణమవుతోంది. ఈ సాంక్రమిక వ్యాధి గతంలో ఒకరి నుంచి మరొకరికి లైంగిక సంపర్కం ద్వారానే వ్యాపించేది. కొత్త వేరియంట్ ఇప్పుడు రోగితో స్పర్శ, దగ్గరగా మాట్లాడడం, రోగి వాడిన దుస్తులు, దుప్పట్లు వాడడం ద్వారా కూడా వ్యాపిస్తున్నట్టు నిపుణుల మాట. మరణాల రేటూ మునుపటి కన్నా పెరిగింది. ఈ ఒక్క ఏడాదే 116కి పైగా దేశాల్లో 15,600కి పైగా కేసులు నమోదయ్యాయి. 500 పైచిలుకు మంది ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్రికాలో నిరుటితో పోలిస్తే ఇప్పుడు మరణాలు 160 శాతం పెరిగాయి. ప్రపంచంలో దాదాపు 70 లక్షల మందికి పైగా మరణానికి కారణమైన కోవిడ్ లానే మంకీపాక్స్కూ జనం భయపడుతున్నది అందుకే!ఏడాది ౖక్రితం అత్యవసర పరిస్థితిని ఎత్తివేసినప్పుడే ఎంపాక్స్పై దీర్ఘకాలిక నిఘా, నియంత్రణ ప్రణాళికలు అవసరమని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ వ్యాధి సాంక్రమిక రోగ విజ్ఞానంపై ఇంకా పూర్తిగా అవగాహన లేదంటూ ప్రజారోగ్య నిపుణులు, వైరస్ శాస్త్రవేత్తలు సైతం హెచ్చరించారు. అయినా సరే ఈ రోగాన్ని కనిపెట్టే పరీక్షల్ని మెరుగుపరచడం, టీకాలు – యాంటీ వైరల్ మందులకు సంబంధించి క్లినికల్ పరీక్షలపై దృష్టి పెట్టడం, టీకాల తయారీని విస్తరించడం లాంటి చర్యలేవీ ఆచరణలో పెట్టలేదు. ఈ అంతర్జాతీయ నిర్లక్ష్యమే ఇప్పుడు శాపమైంది. ఇవాళ్టికీ మంకీపాక్స్కు టీకాల సరఫరా పరిమితం. నియంత్రణకు కోటి డోసుల అవసరం ఉంటే, 2.1 లక్షల డోసులే తక్షణం అందుబాటులో ఉన్నాయట. డోసులు దానం చేస్తామని యూరోపియన్ యూనియన్, అమెరికాలు వాగ్దానం చేశాయి కానీ, వ్యాక్సిన్లపై ఇప్పటికీ కొన్ని అధికాదాయ దేశాల గుత్తాధిపత్యమే సాగుతోంది. అత్యవసరంలో ఉన్న అనేక దేశాలకు అది పెద్ద దెబ్బ. ఆఫ్రికాలో అవసరమున్నా యూరోపియన్ దేశాల్లోనే టీకాలను మోహరించడమే అందుకు ఉదాహరణ. కోవిడ్ కాలంలో లానే ఇప్పుడూ పేదదేశాలకు సాంకేతికత బదలాయింపు జరగట్లేదు. టీకాలకై పెనగులాట తప్పట్లేదు. మహమ్మా రుల కట్టడికి ఒక సమానత్వ ఒప్పందంపై ప్రపంచ దేశాలు విఫలమైతే దెబ్బతినేది ప్రజారోగ్యమే!మన దేశంలోనూ ఈ ఏడాది మంకీపాక్స్ కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులేవీ లేవనీ, మన దగ్గర ఇది పెద్దయెత్తున రాకపోవచ్చనీ అంచనా. అయినా అప్రమత్తత తప్పదు. కేంద్రం ఇప్పటికే ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిపి, చర్యలు ప్రారంభించింది. రోగ నిర్ధారణ వసతు లతో పాటు, ఆరోగ్య బృందాల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది. అక్కడితో ఆగకుండా ప్రజల్లో చైతన్యం కల్పించాలి. రాష్ట్రాలతో అన్ని రకాల కీలక సమాచారాన్ని పంచుకోవాలి. నిజానికి, ఇలాంటి వైరస్ల విజృంభణ వేళ వ్యవహరించాల్సిన తీరుపై కోవిడ్ విలువైన పాఠాలే నేర్పింది. ఇన్ఫెక్షన్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. అలాగే, కేసుల వివరాలను సమగ్రంగా నమోదు చేయాలి. ప్రాథమిక అంశాలే అనిపించినా, ఇవే అతి ముఖ్యం. కోవిడ్లో లాగా కాక ఈసారైనా రోగ నిర్ధారణ కిట్లు, టీకాలు వర్ధమాన దేశాలకు సక్రమంగా చేరితేనే ఉపయోగం. సరిహద్దులు దాటి సులభంగా విస్తరించే ఇలాంటి మాయదారి రోగాలను కట్టడి చేయాలంటే అన్నిచోట్లా సమస్థాయిలో ప్రయత్నాలు జరగడం కీలకం. వ్యాధి సోకిన, సోకే అవకాశం ఉన్న వర్గాలన్నిటికీ టీకాలు అందుబాటులో ఉంచి, సంరక్షణ చేపట్టేలా ఆర్థిక, విధానపరమైన అండదండలు కావాలి. సత్వర, కీలక చర్యలు చేపట్టడమే ముఖ్యమనేది కోవిడ్ నేర్పింది. అందులోనూ ఇలాంటి మాయరోగాలకు ముకుతాడు వేయాలంటే, తొలి 100 రోజుల్లోని ఆచరణే అతి ముఖ్యం. ఎప్పటికప్పుడు స్వరూప స్వభావాల్ని మార్చుకుంటున్న ఎంపాక్స్ ఆఫ్రికా సమస్య, కేసులు బయట పడ్డ కొన్ని దేశాల తలనొప్పి అనుకుంటే పొరపాటు. ఇది ప్రపంచానికే ముప్పు అని ముందు గుర్తించాలి. ‘ఇది మరో కరోనా కాదు’ అంటూ డబ్ల్యూహెచ్ఓ అంటున్నా, వైరస్ విజృంభణ ధోరణులు భయపెడుతున్నాయి. టీకాలు, చికిత్సలు లేకుండా ఆఫ్రికా దేశాలను వాటి ఖర్మానికి వదిలేయడం దుస్సహం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ సమన్వయంతో కట్టడికి కృషి చేయాలి. అత్యవసర ఆరోగ్య పరిస్థితి అని ప్రకటించడంలోని అసలు ఉద్దేశం అదే! జంతుజాల వైరస్లు పదే పదే ఎందుకు తలెత్తుతున్నాయో దృష్టి పెట్టాల్సి ఉంది. విస్మరిస్తే మనకే కష్టం, నష్టం. పారాహుషార్! -
ఎట్టకేలకు ఒక కదలిక
రథం కదులుతోంది. ఎప్పుడో జరగాల్సిన పనిలో ఇప్పటికైనా అడుగులు ముందుకు పడుతున్నాయి. దేశంలో జనాభా లెక్కల పని ఎట్టకేలకు మరికొద్ది రోజుల్లోనే సెప్టెంబర్లో ఆరంభ మవుతోంది. ఆ మేరకు ఇటీవల వెలువడ్డ సమాచారం పెద్ద ఊరట. ప్రతి పదేళ్ళకు ఒకసారి జరగాల్సిన ఈ జనగణన యజ్ఞం నిజానికి 2021లోనే జరగాల్సి ఉంది. కోవిడ్ సహా అనేక సాకులతో ప్రభుత్వం సాచివేత ధోరణి ప్రదర్శిస్తూ వచ్చింది. అయితే, భారత్ లాంటి వర్ధమాన దేశానికి జనగణన మినహా ప్రత్యామ్నాయ మార్గాలలో ఆ స్థాయి సమాచారం అందుబాటులో లేదు. ఉన్నా అది అంత నమ్మదగినదీ కాదు. అందుకే జనాభా పరంగా, సామాజిక – ఆర్థికపరంగా దేశ సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించడానికి కొన్ని దశాబ్దాలుగా జనగణన అత్యంత కీలకమైనది.అలాంటి జనగణన ప్రక్రియ ఇప్పుడు మళ్ళీ పట్టాలెక్కుతోంది. వచ్చే నెల (సెప్టెంబర్)లో ఆరంభ మయ్యే ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు ఏణ్ణర్ధ కాలం పడుతుందని ప్రభుత్వం మాట. జనగణన అనేది పలువురు పొరబడుతున్నట్టు కేవలం గణాంకాల సేకరణ కాదు. అది సుపరి పాలనకు మూలస్తంభం. దేశం ఎదుర్కొనే సామాజిక, ఆర్థిక సవాళ్ళకు పరిష్కారాలు కనుగొనేందుకు మార్గదర్శి. పట్టణీకరణ, ప్రాథమిక వసతుల అభివృద్ధి మొదలు సాంఘిక సంక్షేమం, ఆర్థిక ప్రణాళిక వరకు ప్రతి అంశం పైనా సరైన విధాన నిర్ణయాలకు ఈ సమాచారమే కీలకం. నిజానికి, జనాభా లెక్కల సేకరణలో కేంద్ర సర్కార్ చేసిన సుదీర్ఘ జాప్యం చాలాకాలంగా విమర్శలకు గురవుతోంది. ప్రైవేట్వారే కాదు... సర్కారీ ఆర్థిక నిపుణులు సైతం విమర్శకుల్లో ఉండడం గమనార్హం. పాత జనాభా లెక్కల ఆధారంగానే ఇప్పటికీ ఆరోగ్యం, ఆర్థిక అంశాలు, చివరకు ద్రవ్యోల్బణం రేటు, ఉపాధి లెక్కల లాంటివన్నీ గణిస్తూ ఉండడం వల్ల కచ్చితత్వం లోపిస్తోంది. డేటా లోపంతో కనీసం 15 కీలక అంశాలపై దుష్ప్రభావం పడింది. అదే ఈ నిపుణులందరి బాధ. పుష్కర కాలం క్రితపు లెక్కలపై ఆధారపడే సరికి అంతా లోపభూయిష్టమైంది. దాదాపు 10 కోట్ల మంది పౌర సరఫరా వ్యవస్థకు వెలుపలే ఆహారభద్రత లేకుండా మిగిలిపోయారు. ఇళ్ళు, శ్రామికుల సంఖ్య ఆధారంగా రాష్ట్రాలకు కేంద్రం కేటాయించే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులపైనా దెబ్బ పడింది. చివరకు నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ వారి సర్వేల నాణ్యత కూడా దెబ్బతింది. అంతెందుకు... జనాభాలో చైనాను భారత్ దాటేసి, ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా అవతరించినట్టు ఐరాస నివేదిక గత ఏడాది ప్రకటించింది. దాన్ని ఖరారు చేయడానికో, కాదనడానికో, ఆ జనాభా లెక్కకు అనుగణంగా అవసరమైన చర్యలు చేపట్టాడానికో కూడా మన వద్ద నిర్దుష్టమైన గణాంకాలు లేని పరిస్థితి. అలాంటి లోపాలన్నీ సరిదిద్దుకోవడానికి ఇప్పుడిది సదవకాశం. అదే సమయంలో జనగణనలో భాగంగా మన జనాభా తాలూకు కులగణన కూడా చేయడం అత్యవసరం. దేశంలోని ప్రధాన పార్టీలన్నీ కోరుతున్నది అదే. తద్వారా జనసంఖ్యలో ఏ సామాజిక వర్గం వంతు ఎంత, ఏయే వర్గాల స్థితిగతులు ఏమిటి, ఏ వర్గాలు ఎంతగా వెనకబడి ఉన్నాయి తదితర భోగట్టా తేటతెల్లమవుతుంది. కులాలు, ఉపకులాలతో పాటు వర్తమానంలో కనుమరుగైపోతున్న ఆశ్రిత కులాల లెక్కలూ వెలికివస్తాయి. వెనుకబడిన వర్గాలకు చేయూతనిచ్చేలా పాలకులు పాలసీలు చేయడానికీ వీలవుతుంది. ప్రణాళిక, పాలన, చట్టాల రూపకల్పన సహా అనేక ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్షకూ, నిర్వహణకూ ఈ సమాచారమంతా ఉపకరిస్తుంది. తాజా జనగణన రాజకీయంగానూ ప్రధానమే. దేశంలోని అన్ని స్థాయుల చట్టసభలలో నియో జక వర్గాల పునర్విభజన, రిజర్వేషన్కు ఈ కొత్త లెక్కలే ఆధారమవుతాయి. అంటే, అసెంబ్లీ, పార్ల మెంట్ స్థానాల సంఖ్య మారిపోనుంది. ఈ లెక్కన దక్షిణాదితో పోలిస్తే జనాభా నియంత్రణ అంతగా లేని ఉత్తరాదిలో మరిన్ని చట్టసభా స్థానాలు వస్తాయి. ఫలితంగా అధికార సమీకరణాలూ మారి పోతాయి. ఇంతటి ముఖ్యమైనది కాబట్టే... ఇలాంటి అధికారిక గణాంక వ్యవస్థను ప్రభుత్వ, రాజ కీయ జోక్యాలకు వీలైనంత దూరంగా ఉంచడం శ్రేయస్కరం. మారిన కాలానికి అనుగుణంగా కొత్త జనగణన రూపురేఖలూ మారుతున్నాయట. ప్రధానంగా డిజిటల్ పద్ధతిలో, అదీ స్వీయ నమోదు పద్ధతిలో జనగణన సాగనుంది. గతంలో స్త్రీ, పురుషుల వివరాలనే దఖలు పరిస్తే, ఇప్పుడు తొలి సారిగా ట్రాన్స్జెండర్ల వివరాలనూ ప్రత్యేకంగా నమోదు చేయనున్నారు. అలాగే, ఎస్సీ, ఎస్టీలే కాక ‘ఇతర వెనుకబడిన వర్గాలు’ అంటూ వివరాలు విడిగా నింపనున్నారట. ఏమైతేనేం, ఇన్నేళ్ళ తరువాతైనా జనాభా లెక్కల ప్రక్రియను మళ్ళీ చేపట్టడం హర్షణీయం. అతి ముఖ్యమైన బృహత్ యజ్ఞాన్ని ఇక నుంచైనా ఎప్పటికప్పుడు నిర్ణీత సమయానికే నిర్వహించడం అత్యవసరం. తద్వారానే కచ్చితమైన డేటా దేశంలో పాలనా యంత్రాంగానికి అందుబాటులోకి వస్తుంది. 2026 మార్చి కల్లా ఈ జనగణన ఫలితాలను సమర్పించేందుకు కేంద్ర శాఖలు ఇప్పటికే నిర్ణీత కాలవ్యవధి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. దీంతో, 2011 నుంచి అప్పటి దాకా... అంటే 15 ఏళ్ళ కాలవ్యవధిలోని సమాచారం చేతిలోకి వస్తుంది. అయితే, ఈసారి జరిగిన జాప్యం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. దేశం ముందుకు సాగడానికి దాని సమూహ స్వరూప స్వభావాలు దానికైనా తెలిసి ఉండడం ముఖ్యం. అలాంటి సమాచార సేకరణ, వినియోగంలో అంతరాయాలు రాకుండా జాగ్రత్తపడాలి. ఊహించని ఆటంకాలు ఎదురైనా ఇబ్బంది పడకుండా ఉండేలా జనాభాపై సమగ్ర సమాచారం అందించే కట్టుదిట్టమైన వ్యవస్థలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి ప్రయత్నాలు జరగడానికి ఇదే తరుణం. -
‘భూత్’ బంగ్లా సర్కార్!
మాజీ ముఖ్యమంత్రిని భూతంతో పోల్చారు చంద్ర బాబు. ఆ భూతం మళ్లీ వస్తా వస్తా అంటున్నదనీ, దాన్ని భూస్థాపితం చేయాలంటూ చెలరేగిపోయారు. ఇంకా కిందకు జారి మాట్లాడారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాతో ఉన్న వ్యక్తిని భూతంతో పోల్చితే అవే హోదాలు ఇంకా ఎక్కువకాలం అనుభవించిన తాను ఏమవుతారు? భూతమా... దయ్యమా? ఆయనీమధ్య తాను ’95 మోడల్ ముఖ్యమంత్రినని పదేపదే చెప్పుకుంటున్నారు. ఆ 95 మోడల్ అంటే నిజంగా జనాన్ని పీల్చి పిప్పిచేసిన దయ్యాలమర్రి పాలనే! ప్రజలకు ఉచితంగా ఏదీ ఇవ్వకూడదంటూ నీతి శతకాలు రచించిన పాలకుడే నైన్టీ ఫైవ్ మోడల్. ధర్మాస్పత్రిలో జ్వరం బిళ్లకు సైతం యూజర్ ఛార్జీలు వసూలు చేసిన చేటుకాలమే 95 టూ 2004. ఆ తొమ్మిదేళ్ల కాలం ఉమ్మడి రాష్ట్ర రైతాంగ చరిత్రలో ఒక భీతావహ అధ్యాయం. నాగేటి చాళ్లలో క్షుద్ర విత్తనాలు మొలకెత్తిన కాలం. చేలల్లో చావు కంకులు విరగ్గాసిన కాలం. వేలాది రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడిన రోజులు. 95 మోడల్కు వ్యవసాయం ఓ దండగమారి పని. అందువల్లనే ఆ మోడల్ అమలు చేసిన విధానాలు వ్యవసాయ రంగంలో విధ్వంసాన్ని సృష్టించాయి.’95 మోడల్నని చెప్పుకోవడమే కాదు, ఆ దారిలో ఇప్పుడు కూడా పయనిస్తున్నారు! ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో ఎరువుల కోసం రైతుల క్యూలైన్లు కన్పిస్తు న్నాయి. ‘అమూల్’ రంగప్రవేశంతో అధికాదాయం సంపాదించిన పాడి రైతుల నోట్లో అప్పుడే మట్టిపడింది. ‘అమూల్’ను రంగం నుంచి తప్పిస్తున్నారు. పోటీ లేక పోవడంతో హెరిటేజ్ తదితర సంస్థలు సేకరణ ధరను తగ్గిస్తున్నాయి.దేశంలోని ప్రస్తుత సీనియర్ మోస్ట్ రాజకీయవేత్తల్లో ఆయన ఒకరు. ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఫోర్–ఓ (4.0) వెర్షన్. పదిహేనేళ్లపాటు మాజీ ముఖ్యమంత్రి అనే ట్యాగ్లైన్తో తిరిగారు. ఇంతటి అనుభవశాలి ఎందుకో కలవరపడుతున్నారు. అభద్రతా భావంతో తత్తరపాటుకు గురవుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి పేరు వింటేనే ఆయన సర్వేంద్రియాలు సంక్షో భానికి లోనవుతున్నవి. విజ్ఞత విలుప్తమైపోతున్నది. ఆయన జనంలోకి వెళితే ఈయన జ్వరపీడితుడవుతున్నారు. ఆ వేడికి భాష మరిగిపోతున్నది.విశాఖ సమీపంలో జరిగిన ఫార్మా కంపెనీ దుర్ఘటన సంద ర్భాన్నే తీసుకుందాము. బాధిత కుటుంబాలను ఓదార్చడానికి మాజీ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లారు. చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరినీ అనునయించి ధైర్యం చెప్పారు. అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు. ఆయన రాకను పురస్కరించుకొని వేలాది జనం అక్కడ గుమిగూడారు. ఈ పరిణామం ముఖ్యమంత్రికి ఆగ్రహం తెప్పించింది. ఆ తర్వాత కాసేపటికి జరిగిన ఒక గ్రామ సభలో ఆయన మాటలు అదుపు తప్పాయి.మాజీ ముఖ్యమంత్రిని భూతంతో పోల్చారు. ఆ భూతం మళ్లీ వస్తా వస్తా అంటున్నదనీ, దాన్ని భూస్థాపితం చేయా లంటూ చెలరేగిపోయారు. ఇంకా కిందకు జారి మాట్లాడారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాతో ఉన్న వ్యక్తిని భూతంతో పోల్చితే అవే హోదాలు ఇంకా ఎక్కువకాలం అనుభవించిన తాను ఏమవు తారు? భూతమా... దయ్యమా? ఆయనీమధ్య తాను ’95 మోడల్ ముఖ్యమంత్రినని పదేపదే చెప్పుకుంటున్నారు. ఆ 95 మోడల్ అంటే నిజంగా జనాన్ని పీల్చి పిప్పిచేసిన దయ్యాలమర్రి పాలనే!ప్రజలకు ఉచితంగా ఏదీ ఇవ్వకూడదంటూ నీతి శతకాలు రచించిన పాలకుడే నైన్టీ ఫైవ్ మోడల్. ధర్మాస్పత్రిలో జ్వరం బిళ్లకు సైతం యూజర్ ఛార్జీలు వసూలు చేసిన చేటుకాలమే 95 టూ 2004. ఆ తొమ్మిదేళ్ల కాలం ఉమ్మడి రాష్ట్ర రైతాంగ చరిత్రలో ఒక భీతావహ అధ్యాయం. నాగేటి చాళ్లలో క్షుద్ర విత్తనాలు మొల కెత్తిన కాలం. చేలల్లో చావు కంకులు విరగ్గాసిన కాలం. వేలాది రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడిన రోజులు. 95 మోడల్కు వ్యవసాయం ఓ దండగమారి పని. అందువల్లనే ఆ మోడల్ అమలు చేసిన విధానాలు వ్యవసాయ రంగంలో విధ్వంసాన్ని సృష్టించాయి.’95 మోడల్నని చెప్పుకోవడమే కాదు, ఆ దారిలో ఇప్పుడు కూడా పయనిస్తున్నారు! ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో ఎరువుల కోసం రైతుల క్యూలైన్లు కన్పిస్తున్నాయి. ‘అమూల్’ రంగప్రవేశంతో అధికాదాయం సంపాదించిన పాడి రైతుల నోట్లో అప్పుడే మట్టిపడింది. ‘అమూల్’ను రంగం నుంచి తప్పిస్తున్నారు. పోటీ లేకపోవడంతో హెరిటేజ్ తదితర సంస్థలు సేకరణ ధరను తగ్గిస్తున్నాయి. రెండున్నర మాసాల్లోనే ‘95 మోడల్’ చూపెట్టిన చిన్న ఝలక్ మాత్రమే ఇది. ముందున్నది అసలైన నిజరూప దర్శనం.పేదలకు ఉచితంగా ఏదీ ఇవ్వకూడదు, ప్రైవేట్ గద్దలకు మాత్రం సమస్త వనరులను దోచిపెట్టాలన్నది ఆ మోడల్ నిత్యం జపించే తిరుమంత్రం. అందుకే ‘అమ్మ ఒడి’ ఆగిపోయింది. అందుకే ‘రైతు భరోసా’ ఆగిపోయింది. ‘విద్యా దీవెన’, ‘విద్యా కానుక’లు ఆగిపోయాయి. పంటల బీమా, మత్స్యకార భరోసా వెనక్కు మళ్లాయి. ఇంటి దగ్గర దర్జాగా పెన్షన్లు తీసు కున్న అవ్వాతాతలను నాయకుల ఇళ్ల ముందు నిలబెట్టుకుంటున్నారు. నిరుపేదల బిడ్డలు సైతం సంపన్న శ్రేణితో సమానంగా అంతర్జాతీయ స్థాయి విద్యను అభ్యసించడానికి అంది వచ్చిన అవకాశాన్ని ఈ ’95 మోడల్ వచ్చీరాగానే తన్ని తగలేసింది. ఐబీ సిలబస్ను అటకెక్కించారు. ఇంగ్లిషు మీడియం ఉపసంహరణకు రంగం సిద్ధమైంది.పేదలు, బలహీనవర్గాలు, మహిళల సాధికారత కోసం కార్యక్రమాలు చేపట్టినందుకే మాజీ ముఖ్యమంత్రిని మన ‘95 మోడల్’ భూతంగా పరిగణిస్తున్నది. ఈ ధోరణి కొత్త కాదు. పేద ప్రజల పక్షాన నినదించిన ప్రతి గొంతుకనూ దయ్యాలు, భూతాల గొంతుకగా బ్రాండింగ్ చేయడం, దుష్ప్రచారానికి ఒడి గట్టడం శతాబ్దాలకు పూర్వమే ప్రారంభమైంది. 1848లో కార్ల్ మార్క్స్ ప్రచురించిన కమ్యూనిస్టు మేనిఫెస్టో ‘యూరోప్ను కమ్యూనిస్టు భూతం వెంటాడుతున్నది’ అనే వాక్యంతో ప్రారంభమైంది. కమ్యూనిస్టు భావజాలాన్ని భూతంగా భావించే నాటి పాలక ప్రతిపక్ష పార్టీలకు హెచ్చరికగా మార్క్స్ ఈ వాక్యాన్ని రాశారు.ఇప్పుడూ అంతే! ఐదేళ్ల కాలంలో రెండు లక్షల డెబ్బయ్ వేల కోట్ల ప్రజా ధనాన్ని ప్రజల అకౌంట్లలోకే బదిలీ చేసి అణ గారిన జీవితాలనూ, వాటితోపాటు ఆర్థిక వ్యవస్థను కూడా ఉద్దీపింపజేసిన దార్శనిక పాలనను భూతాల పరిపాలనగా ప్రచారం చేస్తున్నారు. వైద్యాన్ని ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ, ప్రజా వైద్య విధానాన్ని రూపొందించిన ప్రభుత్వానిది భూతాల పాలనట! దాన్నిప్పుడు ప్రైవేట్ పెట్టు బడికి తాకట్టు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు ప్రగతిశీలమట! దయ్యాలు వేదాలు వల్లించడమంటే అచ్చంగా ఇదే కదా! ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు అదే పని చేస్తున్నారు.ఏ ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేసిందనే అంశంపై చర్చ జరపడం ఒక భాగం. ఎవరిది ప్రజాస్వామ్య రాజ కీయమో, ఎవరిది దయ్యాలు – భూతాల రాజకీయమో తేల్చడా నికి ఇంకో చర్చ కూడా ఉన్నది. వారు ఏ రకంగా అధికారంలోకి వచ్చారన్నది పరిశీలించడానికి ఈ చర్చ జరగాలి. ఈ ముఖ్యమంత్రి తొలి రౌండ్లో ఏవిధంగా అధికారంలోకి వచ్చారన్నది జగమెరిగిన వెన్నుపోటు కథ. పార్టీ ఆయన స్థాపించినది కాదు. ఎమ్మెల్యేలను గెలిపించిందీ ఆయన కాదు. వదంతులను ప్రచారం చేసి, ఎమ్మెల్యేలను ‘వైస్రాయ్’లో నిర్బంధించి, మీడియాతో కుమ్మక్కయి, రాజ్యాంగ వ్యవస్థలను మచ్చిక చేసు కుని దొడ్డిదారిన అధికార పీఠమెక్కారు. మాజీ ముఖ్యమంత్రి రాజకీయ ప్రస్థానం ఇందుకు పూర్తిగా భిన్నమైన ప్రయాణం. ఆయనే స్వయంగా పార్టీని నిర్మించుకున్నారు. ఇందుకు భారీ మూల్యాన్ని ఆయన చెల్లించుకోవలసి వచ్చింది.అయినా తలొగ్గ కుండా జనంలోకి వెళ్లారు. అలవికాని వాగ్దానాలను చేయడానికి నిరాకరించి కోరి ఓటమిని తెచ్చుకున్నారు. ప్రతిపక్షంలో ఐదేళ్లు గట్టిగా నిలబడి ఒంటరి పోరాటంతోనే ముఖ్యమంత్రి అయ్యారు. భూతం ఎవరు? రాచబాటలో వచ్చినవారా? దొడ్డి దారిన ప్రవేశించిన వారా?ప్రస్తుత ముఖ్యమంత్రి ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో నాలుగో దఫా ఎలా అధికారంలోకి వచ్చారు? పెంపుడు మీడియాను ఉసిగొలిపి పాత ప్రభుత్వంపై అవాకులు చెవాకులు ప్రచారం చేశారు. సరిపోలేదు. కాళ్లావేళ్లా పడి ఎన్డీఏ కూటమిలో చేరారు. ఎన్నికల సంఘాన్ని అదుపులో పెట్టుకున్నారు. ఇది కూడా సరిపోలేదని స్వతంత్ర పరిశోధకులు, సంస్థలు బల్లగుద్ది చెబుతున్నాయి. పోలింగ్ జరిగిన రోజు రాత్రి 8 గంటలకు ఆంధ్రప్రదేశ్లో 68 శాతానికి పైగా ఓట్లు పోలైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.ఆ తర్వాత తీరిగ్గా నాలుగు రోజుల సమయం తీసుకొని 81 శాతం పోలైనట్టు ప్రకటించింది. ఇది అసాధార ణమని ‘ఓట్ ఫర్ డెమోక్రసీ’ (వీఎఫ్డీ) అనే సంస్థ వాదిస్తున్నది. గతంలో ఎన్నడూ ఈ తేడా ఒక శాతం కన్నా అధికంగా ఉండేది కాదు. ఈసారి ఏపీలో అది 12.5 శాతంగా నమోదైంది. ఈవీ ఎమ్ల మాయాజాలమే ఈ అధిక ఓట్ల నమోదుకు ప్రధాన కార ణమని వీఎఫ్డీ ఆరోపిస్తున్నది. ఎన్డీఏ మౌత్పీస్గా పనిచేసే ఓ జాతీయ చానల్ కూడా నిన్న ప్రసారం చేసిన ఒక సర్వే వివరాల్లో చంద్రబాబుకు 44 శాతం ప్రజల మద్దతున్నట్టు తేల్చింది. కూటమికి పడిన 56 శాతం ఓట్లలో ఇది 12 శాతం కోత. వీఎఫ్డీ చెబుతున్న అక్రమ ఓట్లకు ఈ నంబర్ సరిపోతున్నది.వీఎఫ్డీ ఈ వ్యవహారంపై ఒక సమగ్రమైన రిపోర్టును విడుదల చేసి, నెలరోజులు దాటినా ఇప్పటివరకూ ఎన్నికలసంఘం స్పందించలేదు. ఈ కృత్రిమ అధిక ఓట్ల నమోదు కార ణంగా కేంద్రంలోనూ, ఏపీ, ఒడిషాల్లోనూ గెలవాల్సిన పక్షాలు ఓడిపోయాయి. పోలింగ్ శాతంపై కొన్ని రోజుల తర్వాత చేసిన తుది ప్రకటనకూ, లెక్కించిన ఓట్లకూ కూడా తేడాలున్నాయి. సుమారు 390 లోక్సభ నియోజకవర్గాల్లో ఈ తేడాలున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. కొన్ని నియోజకవర్గాల్లో లెక్కించిన ఓట్లు పోలయినట్టు ప్రకటించిన ఓట్ల కంటే తక్కువున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువున్నాయి. ఇదెలా సాధ్యం? ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్లలో దయ్యాలు, భూతాలు దూరితేనే సాధ్యమవుతుంది.ఆ దయ్యాలూ, భూతాలు ఎట్లా దూరాయన్న రహస్యం విజేతలకు మాత్రమే తెలుస్తుంది.వారికి అనుబంధంగా పని చేసిన ఎన్నికల సంఘానికి మాత్రమే తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఈ అంశంపై పలువురు మేధావులు గొంతెత్తి మాట్లాడారు. చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అయినా ఎన్నికల సంఘం మాత్రం నోరు విప్పలేదు. పైపెచ్చు, అనుమానం ఉన్న నియో జకవర్గాల్లో 5 శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలని సుప్రీంకోర్టు చెప్పిన విషయంపై కూడా ఈసీ వక్రభాష్యాలు చెబుతున్నది. ఈవీఎమ్లపై అధికారికంగా ఫిర్యాదులు చేసిన అభ్యర్థులను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తేవడం కూడా పలు అను మానాలకు తావిచ్చింది. ఏపీలో ఎన్డీఏ కూటమి కూడా ఈఅంశంపై నోటికి తాళం వేసుకున్నది. కచ్చితంగా ఏదో జరిగిందన్నది అఖిలాంధ్ర ప్రజల నిశ్చితాభిప్రాయం. ఎన్నికల హామీల నుంచి, ఈవీఎమ్ల బాగోతం నుంచి పక్కదారి పట్టించే ప్రయత్నాల్లో కూటమి పెద్దల మాటలూ, చేతలు అదుపు తప్పుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థిని భూస్థాపితం చేసి పైకి రాకుండా కాంక్రీట్ పోయాలనే పైశాచిక ఆలోచనలు చెలరేగు తున్నాయి.vardhelli1959@gmail.comవర్దెల్లిమురళి -
సుప్రీమ్ ‘అభయ’మ్!
హేయమైన కోల్కతా హత్యాచార ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం స్వచ్ఛందంగా జోక్యం చేసుకోవడం వ్యవస్థలపై సడలుతున్న నమ్మకాన్ని కాస్త నిలబెట్టింది. విధినిర్వహణలోని వైద్యశిక్షణార్థి జీవితాన్ని చిదిమేసిన ఆగస్ట్ 9 నాటి ఉదంతంతో వైద్యసేవకుల భద్రత, ఇతర అంశాలకు సంబంధించి సిఫార్సులు చేసేందుకు నేషనల్ టాస్క్ఫోర్స్ (ఎన్టీఎఫ్)ను సుప్రీమ్ కోర్టు మంగళవారం ఏర్పాటు చేసింది. సంతృప్తి చెందక జాతీయస్థాయిలో జూనియర్ డాక్టర్లు నిరసనలు కొనసాగిస్తున్నా అసలంటూ రోగాన్ని గుర్తించి, మందు కనుగొనే ప్రయత్నమైనా జరుగుతున్నందుకు సంతోషించాలి. ప్రముఖ డాక్టర్ల సారథ్యంలోని ఈ టాస్క్ఫోర్స్ మహిళలు సురక్షితంగా పని చేసేందుకు చేపట్టాల్సిన సమూల సంస్కరణలపై సిఫార్సులు చేయనుంది. కోర్ట్ ఆదేశించినట్టు మూడు వారాల్లో మధ్యంతర నివేదిక, రెండు నెలల్లో తుది నివేదిక సమర్పించాల్సి ఉంది. దేశంలో నూటికి 80 ప్రజారోగ్య వసతుల్లో నిర్ణీత ప్రమాణాలైనా లేవని జాతీయ హెల్త్ మిషనే చెబుతోంది. ఈ పరిస్థితుల్లో పనిప్రదేశంలో సురక్షిత వాతావరణ కల్పనకు ఒక విధాన ఏర్పాటుకు జాతీయ వైద్యసంఘం గత వారమే వైద్యకళాశాలలకూ, ఆస్పత్రులకూ నోటీసిచ్చింది. వైద్యులకు విశ్రాంతి గదులు, నిఘాకు సీసీ టీవీలు కరవైన మన ఆరోగ్య వ్యవస్థకు ఇప్పుడు టాస్క్ఫోర్స్ సిఫా ర్సుల చికిత్స చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగానే ఆడవాళ్ళు నైట్డ్యూటీలలో లేకుండా చూడాలని బెంగాల్ సర్కార్, ఒకవేళ డ్యూటీలో ఆడవాళ్ళుంటే వారికి తోడుండేలా చూడాలని కేంద్ర సర్కార్ సూచనలివ్వడం విడ్డూరం. శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యం తక్కువున్న దేశంలో దాన్ని మరింత తగ్గించే ఇలాంటి ఆదేశాలు తిరోగమన «ఆలోచనా ధోరణికి అద్దం పడుతున్నాయి.కోల్కతా ‘అభయ’ ఘటన, చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగం చేతగానితనంపై దేశమంతటా ప్రజాగ్రహం పెల్లుబుకుతుంటే... పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ యంత్రాంగం దృష్టి అంతా విమర్శకుల నోళ్ళు మూయించడంపై ఉండడం విషాదం. నిరసనకారులపై ‘రాజ్యాధికారం’ ప్రయోగించే కన్నా దేశవ్యాప్తంగా లోలోపలి భావోద్వేగాలు బయటపడుతున్న వేళ వారితో మరింత సున్నితంగా వ్యవహరించాలని సాక్షాత్తూ సుప్రీమ్ కోర్ట్ హితవు చెప్పాల్సి వచ్చింది. అదే సమయంలో – ఘటన జరిగిన ఆర్జీ కార్ ఆస్పత్రికి అప్పట్లో ప్రిన్సిపాల్గా వ్యవహరించిన వ్యక్తిపై తీవ్రమైన ఆరోపణలున్నా ప్రభుత్వ పెద్దలు ఆయనను కాపాడాలని చూడడం నీచం. సదరు వ్యక్తి మానవ అక్రమ రవాణాకూ, బలవంతపు వసూళ్ళకూ పాల్పడినట్టు ఆయన మాజీ సహచరులే ఆరోపిస్తున్నారు. ఇక, ఆస్పత్రిలో సాగిన అవినీతి, అక్రమాలపై కథనాలైతే కొల్లలు. అటు సీబీఐ దర్యాప్తు, ఇటు సుప్రీమ్ సొంత చొరవతో కేసులో ఇంకెన్ని లోతైన అంశాలు బయటపెడతాయో తెలీదు. ఇక, తాజాగా ఆసుపత్రికి భద్రతగా సీఐఎస్ఎఫ్ దళాల పహారా పెట్టాల్సి రావడం పోగొట్టుకున్న నమ్మకానికి పరాకాష్ఠ.అసలు మన దేశంలో ప్రతి వంద మంది డాక్టర్లలో 75 మంది సాధారణంగా రోగులు, వారి బంధువుల నుంచి ఏదో ఒక విధమైన హింస, దాడులను ఎదుర్కొన్నవారే. అమెరికాలో ఆ సంఖ్య 47 శాతమే. ఇలాంటి అనేక కారణాల రీత్యానే రెండేళ్ళ క్రితం 2022లో ప్రవేశపెట్టిన ‘ఆరోగ్య వృత్తి నిపుణులు, సంస్థలపై హింసా నిరోధక బిల్లు’ను తక్షణం ఆమోదించి, అమలు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. నిజానికి, 2007 నుంచి మన దేశంలో మెడికల్ ప్రొటెక్షన్ యాక్ట్ (ఎంపీఏ) ఉంది. 23 రాష్ట్రాలు దాన్ని తమదైన రూపంలో అమలు చేస్తున్నాయి. ఆరోగ్య సేవకుల భద్రత నిమిత్తం అలా ఇప్పటికే చట్టాలున్నా ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయన్నది వేరే కథ. పైగా, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకం శిక్ష. అంతటా ఒకే విధమైన నమూనా చట్టం అమలయ్యేలా చూడాల్సి ఉంది. అయితే, కేవలం చట్టాలతో పరిస్థితి చక్కబడుతుందనీ, దాడుల నుంచి వైద్యులను కాపాడగల మనీ అనుకోవడం కూడా పొరపాటే. ప్రజారోగ్య సేవకుల భద్రత అనేది దీర్ఘకాలిక ప్రణాళికతో సాగాల్సిన ప్రభుత్వ విధానం. మున్ముందుగా ఉన్నతమైన వైద్యవృత్తికీ, వైద్యులకూ సమాజంలో గౌరవం ఇనుమడించే వాతావరణం పెంపొందించాలి. రోగులకు ప్రాణదాతలై రాత్రీ పగలూ లేకుండా శ్రమించే వైద్యులకు జీతభత్యాలే కాదు... మెరుగైన పని పరిస్థితులు కల్పించడం కనీస బాధ్యత. ఆరోగ్య రంగానికి నిధుల పెంపుతో పాటు ‘అభయ’ లాంటివారు 36 గంటలు ఆపకుండా పని చేయాల్సిన అవస్థ తప్పించేలా తగినంతమంది వైద్య సిబ్బందిని తీసుకోవాలి. ప్రభుత్వాలు, వైద్య సంస్థలు సమష్టిగా దీని మీద దృష్టి పెట్టాలి. సుప్రీమ్ చెప్పినట్టు ఆస్పత్రుల్లో లైంగిక వేధింపుల నిరో ధక చట్టం (పోష్) వర్తిస్తుందని గుర్తించాలి. ఇవాళ్టికీ జూనియర్ డాక్టర్లు అమానవీయ పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తున్న తీరును గుర్తించి, ముందు అక్కడ నుంచే మార్పు మొదలుపెట్టాలి. కోల్కతా ఘటనపై ఆందోళన ఆగక ముందే, మహారాష్ట్రలోని బద్లాపూర్లో బడిలో చదువుకుంటున్న ఇద్దరు కిండర్గార్టెన్ చిన్నారుల్ని కాపలాదారు రూపంలోని ఓ మానవ మృగం కాటేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కుళ్ళిన వ్యవస్థలోని విలువల పతనాన్ని మరోమారు నగ్నంగా నిలబె ట్టింది. ఈ వరుస ఘటనలు ఆందోళనతో పాటు సత్వర కార్యాచరణ అవసరాన్ని పెంచుతున్నాయి. ‘బాగా చదువుకోవాలి. బంగారు పతకం సాధించాలి. పెద్ద ఆసుపత్రుల్లో పనిచేయాలి. అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలి’ అంటూ డైరీలో ఆఖరిరోజున సైతం రాసుకున్న ఓ మధ్యతరగతి అమ్మాయి కలల్ని చిదిమేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాల్సిందే. ఈ ఘటనలకు మూలకారణమవుతున్న వ్యవస్థాగత లోపాల్ని సరిదిద్దాల్సిందే! సుప్రీమ్ తీసుకున్న చొరవ, పాలకుల చర్యలు అందుకు దోహదపడితేనే అభం శుభం తెలియని ‘అభయ’లెందరికో ఆత్మశాంతి. -
బయటపడ్డ బహిరంగ రహస్యం
ప్రపంచమంతా మలయాళ సినిమాలను పొగుడుతూ, తాజా జాతీయ అవార్డుల్లోనూ దేశమంతటిలోకీ ఉత్తమ సినిమాగా మలయాళ చిత్రమే నిలిచిన పరిస్థితుల్లో... ఆ పరిశ్రమలో పైకి కనిపిస్తున్న మంచితో పాటు కనిపించని దుర్లక్షణాలూ అనేకం ఉన్నాయని బహిర్గతమైంది. మలయాళ సినీ పరిశ్రమలో మహిళల స్థితిగతులపై కేరళ ప్రభుత్వం 2017 జూలైలో వేసిన హేమ కమిటీ నివేదిక బయటకు రావడంతో తేనెతుట్టె కదిలింది. నాలుగేళ్ళ పైచిలుకుగా కేరళ ప్రభుత్వం గుట్టుగానే అట్టి పెట్టిన ఈ నివేదిక న్యాయస్థానంలో, రాష్ట్ర సమాచార కమిషన్లో అనేక పోరాటాల అనంతరం సోమవారం బాహ్యప్రపంచానికి అందుబాటులోకి వచ్చింది. సున్నిత సమాచారం, వ్యక్తుల వివరాల పేజీలను మినహాయించి బయటకొచ్చిన మిగతా నివేదిక అంశాలపై దేశవ్యాప్త చర్చ రేగుతోంది. ఏడెనిమిదేళ్ళ క్రితమే అంతర్జాతీయంగా ‘మీ టూ’ ఉద్యమం, ఆపైన భారత సినీరంగంలోనూ ‘క్యాస్టింగ్ కౌచ్’ వివాదాలు, ఆడవాళ్ళు పని కావాలంటే లైంగిక లబ్ధి కలిగించేలా ‘కమిట్మెంట్’ ఇచ్చి, ‘కాంప్రమైజ్’ కావాల్సి వస్తోందనే ఆరోపణలు చూశాం. అయినా సరే... మలయాళ నటులు, పరిశ్రమ నిపుణుల్ని పలువురిని ఇంటర్వ్యూ చేసి హేమ కమిటీ వెల్లడించిన అంశాలు నివ్వెర పరుస్తున్నాయి. సెట్లో స్త్రీలపై లైంగిక వేధింపులు, తాగివచ్చి వారు బస చేసిన గది తలుపులు కొట్టడాలు, 10–15 మంది శక్తిమంతమైన లాబీ గుప్పెట్లో మలయాళ చిత్రసీమ లాంటి సంగతులను కమిటీ కుండబద్దలు కొట్టింది. కోల్కతాలో విధినిర్వహణలో డాక్టర్పై హత్యాచార ఘటనతో అట్టుడుకుతున్న దేశంలో సినీరంగ స్త్రీల పరిస్థితీ ఏమంత భిన్నంగా లేదని తేలిపోయింది.అత్యంత సంచలన అంశాలేమీ బయటపెట్టకుండా కమిటీ పెద్దమనిషి తరహాలో నివేదికను ఇచ్చిందనే అధిక్షేపణలూ లేకపోలేదు. ఆ మాటెలా ఉన్నా పరిశ్రమలోని అవాంఛనీయ ధోరణుల్ని బయటపెట్టి, ప్రజాక్షేత్రంలో వాటిపై చర్చ లేవనెత్తడంలో విజయం సాధించింది. స్టెనోగ్రాఫర్ కానీ, కనీస ఇతర సౌకర్యాలు కానీ లేకున్నా సరే, అనేక అవరోధాలను అధిగమించి మరీ ఈ కమిటీ 233 పేజీల నివేదిక సిద్ధం చేసింది. నివేదికలో బలాబలాలు ఏమైనప్పటికీ, సినీసీమలోని చీకటి కోణంపై దర్యాప్తు జరిపి ఇలాంటి నివేదిక ఒకటి వెలువడడం దేశంలో ఇదే తొలిసారి. నిజానికి, అనివార్య పరిస్థితుల్లోనే ప్రభుత్వం ఈ సంఘాన్ని వేయాల్సి వచ్చింది. ఓ ప్రముఖ నటిని కిడ్నాప్ చేసి, హీరో దిలీప్ కదులుతున్న కారులో జరిపిన లైంగిక అత్యాచారంతో 2017 ఫిబ్రవరిలో మలయాళ చిత్రసీమ అట్టుడికింది. రాష్ట్రమంతా నిరసనలు, ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ బృందం డిమాండ్ల మేరకు కేరళ సర్కార్ రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి కె. హేమ సారథ్యంలో త్రిసభ్య సంఘం వేయక తప్పలేదు. తెలుగు టి శారద కూడా అందులో మెంబరే! ఆ కమిటీ 2019 డిసెంబర్ 31కే తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఉద్యమకారులు పదే పదే అభ్యర్థించినా, సినిమావాళ్ళ ప్రైవసీకి భంగమంటూ సర్కార్ ఇన్నేళ్ళుగా ఆ నివేదికను తొక్కిపెట్టింది. అదేమంటే, అది న్యాయవిచారణ సంఘం కాదు గనక నివేదిక బయటపెట్టాల్సిన బాధ్యత లేదు పొమ్మంది. నివేదిక విడుదలను ఆపాలన్న ఓ నటి అభ్యర్థనను సైతం హైకోర్ట్ తాజాగా తోసిపుచ్చడంతో... చివరకు నివేదిక బహిర్గతమైంది. తళుకుబెళుకుల సినీరంగానికి అంచున... సహజంగానే అనేక బలహీనతల నీలి నీడలు పరుచుకొని ఉంటాయని ప్రపంచానికి తెలుసు. అది ఒక్క మలయాళ సినీసీమకే పరిమితం కాదు. అందం, ఆనందం, ఆర్థిక ప్రయోజనం, పదుగురిలో పాపులారిటీ, పలుకుబడి పోగుబడినందున అన్ని భాషల సినీ రంగాల్లోనూ ఉన్నదే! కాకపోతే, తొందరపడి ఎవరూ బాహాటంగా ప్రస్తావించని చేదు నిజమది. లైంగిక వేధింపులు సహా ఆవేదన కలిగించే అనుభవాలు అనేకమున్నా, ఆడవాళ్ళు ఆ మాట బయటకు చెప్పరు. చెబితే పరిశ్రమలో అప్రకటిత నిషేధం సహా ఇంకా అనేక ఇతర వేధింపులు తప్పని దుఃస్థితి. ఆది నుంచి ఈ రుగ్మతలు ఉన్నవే. ‘సినీరంగంలో స్త్రీలు నిత్యం ఎదుర్కొంటున్న భూతం లైంగిక వేధింపులు’ అని కమిటీ తెగేసి చెప్పడంతో మేడిపండు పగిలింది. మన యావత్ భారతీయ సినీ రంగానికి ఇది ఒక మేలుకొలుపు. అన్ని భాషల్లోనూ కలల వ్యాపారంలో కొనసాగుతున్న పితృస్వామ్య భావజాలం, లైంగిక దుర్విచక్షణ, వేతన వ్యత్యాసాలు సహా అనేక అవలక్షణాలపై మనకు చెంపపెట్టు. చిత్రం ఏమిటంటే, ప్రైవేట్ పరిశ్రమల్లో పని పరిస్థితులకు సైతం ప్రభుత్వ షరతులు, చట్టాలు వర్తిస్తాయి. ఎప్పుడో సినీరంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించినట్టు కేంద్ర సర్కార్ ప్రకటించినా దాని వల్ల ఒనగూడిన ప్రయోజనాలేవో అర్థం కాదు. కళ, వ్యాపారపు కల కలగలిసిన సృజనశీల పరిశ్రమకు చట్టాలు చేయడం అంత సులభం కాకపోవచ్చు. కానీ, మగవారితో సమానంగా ఆడవారికి వేతనం మాట దేవుడెరుగు... మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకొనే మరుగు స్థలాల లాంటి కనీస వసతులైనా కల్పించలేమా? సమ్మతితో పని లేకుండా ఆడవారితో ఎలాగైనా ప్రవర్తించవచ్చని భావిస్తున్న పని ప్రదేశంలో తగినంత బాధ్యత, భద్రత పెంపొందించేలా చేయలేమా? సమాజంగా మనం, సర్కారుగా పాలకులు సినీ పరిశ్రమపై ఆలోచించాల్సిన ఇలాంటి అంశాలు అనేకం. ఎప్పటి నుంచో ప్రత్యేక సినిమా విధానం తెస్తామని ఊరిస్తున్న కేరళ సర్కార్ సినీసీమలో వేతన ఒప్పందాలు, భద్రత అమలుకు సంబంధించి హేమ కమిటీ సిఫార్సులపై ఇకనైనా దృష్టి పెట్టాలి. పనిచేయడానికి ఒకమ్మాయి ఇంటి గడప దాటి వచ్చిందంటే సర్వం సమర్పించడానికి సిద్ధమైనట్టేనని చూసే పురుషాహంకార దృష్టి ఇకనైనా మారాలి. అన్ని పనిప్రదేశాల లానే సినీ రంగంలోనూ స్త్రీలకు సురక్షితమైన, భద్రమైన వాతావరణం కల్పించడం అంతర్జాతీయ స్థాయికి ఎదిగామని భుజాలు ఎగరేస్తున్న మన సినీ పరిశ్రమ కనీస బాధ్యత. -
లంకలో ఎన్నికల సందడి
చాన్నాళ్లుగా అందరూ ఎదురుచూస్తున్న శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. వచ్చే నెల 21న జరగబోతున్న ఎన్నికల్లో 39 మంది అభ్యర్థులు ఖరారయ్యారు. శ్రీలంక దివాలా తీసి ఎంతటి విపత్కర పరిస్థితులో చిక్కుకున్నదో అందరికీ తెలుసు. 2022లో అధ్యక్ష భవనంపై, పార్లమెంటుపై ప్రజానీకం దాడి చేయటంతో అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ఆయన కుటుంబ పరివారం దేశం విడిచి పరారయ్యారు. అంతకు మూడేళ్ల ముందు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గొటబయ, ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రధానిగా ఆయన సోదరుడు మహిందా రాజపక్స తిరుగులేని మెజారిటీతో ఎన్నికయ్యారు. ఈమధ్య బంగ్లాదేశ్లో అచ్చం ఇలాంటి ఘటనలే జరిగి ప్రధాని షేక్ హసీనాకు పదవీభ్రష్టత్వం తప్పలేదు. రెండేళ్లనాటి శ్రీలంక పరిణామాలు చూశాకైనా ఆమె జాగ్రత్తగా అడుగులు వేసివుంటే ఇలా జరిగేది కాదు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉన్నవారు తమ గతాన్ని మాత్రమే కాదు... బంగ్లాదేశ్ వర్తమానాన్ని కూడా గమనంలోకి తీసుకోవాల్సివుంటుంది. ఏవో సాకులు చెప్పి ఎన్నికలు వాయిదా వేసే సంస్కృతి శ్రీలంకలో ఏనాటి నుంచో కొనసాగు తోంది. ప్రస్తుత అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే ప్రధానిగా ఉన్నప్పుడు 2017లో ప్రొవిన్షియల్ కౌన్సిళ్ల ఎన్నికలను వాయిదా వేశారు. అప్పటికి ఏడేళ్ల నుంచి ఇదే వరస. చిత్రమేమంటే 2022లో అంతగా జనాగ్రహం చవిచూశాక కూడా దేశంలో ఎన్నాళ్ల నుంచో మూలనపడివున్న స్థానిక సంస్థల ఎన్నికలను నిధులు లేవన్న కారణంతో విక్రమసింఘే వాయిదా వేశారు. నిజానికి అధ్యక్ష ఎన్నికలు సైతం ఈ మాదిరే ‘వాయిదా’ తోవన పోతాయని చాలామంది అనుకున్నారు. వెంటనే ఎన్నికలు జరపాలంటూ వివిధ వర్గాలనుంచి నిరుడు డిమాండ్ వచ్చింది. కానీ దేశం ఇంకా ఆర్థికంగా కోలుకోలేదన్న కారణాన్ని చూపి వాయిదా వేశారు. మొత్తానికి ఎన్నికల కోలాహలం మొదలైంది.రెండున్నర దశాబ్దాల తర్వాత మొదటిసారిగా రాజపక్స కుటుంబం హవా లేకుండా ఎన్నికలు జరగబోతున్నాయి. తన కుటుంబం కోల్పోయిన పరువు ప్రతిష్ఠలను పునరుద్ధరించటమే ధ్యేయంగా మాజీ ప్రధాని మహిందా రాజపక్స తనయుడు 38యేళ్ల నామల్ రాజపక్స శ్రీలంక పొదుజన పెరమున(ఎస్ఎల్పీపీ) తరఫున పోటీ చేస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు రనిల్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అయిదు దశాబ్దాలు యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్పీ) నాయకుడిగావున్నా స్వతంత్రుడిగా నిలబడ్డారు. గతంలో యూఎన్పీని చీల్చి సమగి జన బల వేగయ (ఎస్జేబీ) పార్టీని స్థాపించి ప్రస్తుతం పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సజిత్ ప్రేమదాస కూడా అధ్యక్ష స్థానానికి పోటీపడుతున్నారు. అయితే ఇతరుల కన్నా వామపక్ష అనుకూల నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ (ఎన్పీపీ) అధినేత అనూర కుమార దిస్సానాయకే విజయావకాశాలు ఎక్కువని లంకలో ప్రధాన సర్వే సంస్థ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ పాలసీ (ఐహెచ్పీ) చెబుతోంది. అదే నిజమైతే దేశ రాజకీయాలు కొత్త మలుపు తిరగటం ఖాయం. మొదటి నుంచీ ఎస్ఎల్పీపీ, యూఎన్ పీలే ప్రధాన పక్షాలుగా పోటీపడుతున్నాయి. కానీ 2020 పార్లమెంటు ఎన్నికలకు ముందు సజిత్ ప్రేమదాస నిష్క్రమించాక ఆ పార్టీ దయనీయ స్థితిలో పడిపోయింది. ఆ ఎన్నికల్లో యూఎన్పీకి దక్కింది కేవలం ఒక్క స్థానం మాత్రమే. దశాబ్దాలుగా అనుసరించిన విధానాల వల్ల దేశం ఆర్థికంగా చాలా గడ్డు స్థితిలో పడిందన్నది వాస్తవం. ముఖ్యంగా రాజపక్స సోదరుల హయాంలో తమిళ టైగర్లను అణిచేయటానికి సాయం చేసిన దగ్గర్నుంచి చైనా పలుకుబడి విస్తరించింది. ఆ తర్వాత మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థికసాయం అందించే నెపంతో అది భారీయెత్తున అప్పులిచ్చింది. క్రికెట్ స్టేడియం, విమానాశ్రయం, హంబన్తోటా నౌకాశ్రయం వంటివన్నీ చైనా నిర్మాణరంగ నిపుణుల నేతృత్వంలో కళ్లు చెదిరే రీతిలో నిర్మించారు. కానీ వీటి బకాయిలు తీర్చడానికొచ్చేసరికి అంతా తారుమారైంది. చివరకు హంబన్తోటాలో అనుకున్న రీతిలో కార్యకలాపాలు పుంజుకోకపోవటంతో దాన్ని చైనాకే 99 యేళ్ల లీజుకు ఇవ్వాల్సివచ్చింది. దేశాన్ని చైనాకు తాకట్టు పెడుతున్నారని విపక్షాలు చేసిన ఆరోపణలన్నీ రాజపక్స సోదరులు తీసుకొచ్చిన మెజారిటీవాదం, దేశభద్రత వగైరా అంశాలతో కొట్టుకు పోయాయి. కానీ మూడేళ్లకే ప్రజలకు తత్వం బోధపడి తిరుగుబాటు చేశారు. 2022లో దేశం దివాలా తీశాక అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) దాదాపు 300 కోట్ల డాలర్ల రుణం ఇచ్చింది. అయితే ఆర్థిక రంగంలో పెనుమార్పులు తీసుకురావాలన్న షరతు విధించింది. వ్యవస్థాగత సర్దు బాట్ల పేరుతో ఆ ప్రక్రియ ప్రస్తుతం అమలవుతోంది కూడా. కనుక ఎన్నికల అనంతరం విజేత ఎవ రైనా ఈ ప్రక్రియను కొనసాగించాల్సిందే. ప్రస్తుత అభ్యర్థుల్లో ఎన్పీపీ అధినేత అనూర కుమార దిస్సానాయకే ఒక్కరే అవినీతి మరక అంటని నేత. కావడానికి వామపక్ష అనుకూల సంస్థే అయినా సింహళ జాతీయవాదాన్ని ప్రవచించే జనతా విముక్తి పెరుమున రాజకీయ విభాగమే ఎన్పీపీ. ఒకపక్క తన పూర్వపు ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని చూసే చైనా... మొదటి నుంచీ లంకకు అన్ని విధాలా తోడ్పడుతున్న భారత్ ఈ ఎన్నికల సరళిని జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఇప్పటికే బంగ్లాలో భారత్ అనుకూల నేత హసీనా పదవి కోల్పోయారు. ఇదే అదనుగా లంకలో మళ్లీ తన హవా కొనసాగించాలని చైనా చూస్తోంది. అయితే చైనా వల్లే అప్పుల ఊబిలో కూరుకుని నిండా మునిగిన లంకలో అదంత సులభం కాదు. ఏదేమైనా జనామోదంతో ఏర్పడే ప్రభుత్వం వల్లే శ్రీలంక ప్రస్తుత కష్టాలు తీరతాయి. -
ఏ వాస్తవాలు దాచడానికి?
లక్షలాది మంది భారతీయ మహిళల లాగే, నేను ఆగ్రహంతో రగిలిపోయాను, విచారంతో కుంగిపోయాను. ఒక యువతిని తన పని ప్రదేశంలో బహుశా ఆమెకు తెలిసిన పురుషులే క్రూరంగా హింసించి చంపారనే ఆలోచన నన్ను వెంటాడుతోంది. కోల్కతా యువ వైద్యు రాలిపై లైంగిక దాడి ఘటనలో, ఆమె శవం గురించి ఇప్పుడు మనకు తెలిసిన భయానక వివరాలను నేను చెప్పలేను. అర్ధనగ్నంగా కనిపించింది. ఆమె కాళ్లు విరిగిపోయాయి. ఆమె జననాంగాలు, రెండు కళ్ల నుంచి విపరీతంగా రక్తస్రావం అయ్యింది. తల నుంచి పాదాల వరకు రక్త సిక్త గాయాలయ్యాయి. ఈ సాక్ష్యం సామూహిక అత్యాచారం అని వైద్యులు నమ్ముతున్నారు. తన కుమార్తె మృతదేహాన్ని చూడటానికి మూడు గంటలు వేచిచూడాల్సి వచ్చిన తండ్రి ఈ వివరాలను పంచుకున్నారు. ఆ తండ్రిగా మిమ్మల్ని ఊహించుకోండి. అది మీ బిడ్డ గురించి మీకు ఉన్న చివరి జ్ఞాపకం అని ఆలోచించండి.కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఘటన, సంస్థా గతంగా స్త్రీల పట్ల ఉన్న ద్వేషానికీ, దుర్మార్గానికీ భయంకరమైన ఉదాహరణ. అత్యాచారం తర్వాత ఏమి జరిగిందనేది మరింత అసహ్యకరమైనది. జరిగిన ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నాలు నేరాన్ని మరింతగా పెంచాయి.ఈ కేసును అర్థం చేసుకోవాలంటే, మనం వైద్య కళాశాల ప్రిన్సిపల్, ఇప్పుడు తొలగించబడిన సందీప్ ఘోష్ అనే వ్యక్తి గురించి మాట్లాడాలి. మొదట, మెడికల్ కాలేజీ అధిపతిగా, దాడి జరగడానికి ఆయనే జవాబుదారీగా ఉంటాడు. ప్రత్యేకించి ఇది బయటి వ్యక్తి చేసిన పని కాదనీ, కాలేజీ లోపలి వారు చేసిన పనేననీ వైద్యులు చెబుతున్నారు. 36 గంటల షిఫ్ట్ ముగించు కున్న తర్వాత బాధితురాలు విశ్రాంతి తీసుకుంటున్న సెమినార్ హాల్ ఎక్కడ ఉందో బయటి వ్యక్తికి తెలిసే అవకాశం లేదని వైద్యులు సూచిస్తున్నారు. లైంగిక దాడికి, హత్యకు గురైన రాత్రి బాధితురాలి కారును కూడా ధ్వంసం చేశారని నిరసన తెలిపిన వైద్యులు చెబుతున్నారు.ఆమెకు ఏదో తెలిసివుండటం వల్ల ఆమె నోటిని శాశ్వతంగా మూసివేశారా? సందీప్ ఘోష్ మొదట తన వ్యాఖ్యలలో ఆమెను నిందించాడు. ఆ రాత్రి సమయంలో సెమినార్ హాల్లో ఆమె ఉండటాన్ని తప్పు పట్టాడు. ఆ నిర్లిప్తత సరిపోనట్లు, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అధికారులు ఆమె కుటుంబానికి తమ కుమార్తె ఆత్మహత్యతో చనిపోయిందని చెప్పారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాని నయవంచన. అసలు ఆమె కుటుంబంతో ఘోష్ వ్యక్తిగతంగా ఎందుకు సమాచారం పంచుకోలేదు? పైగా మౌనంగా ఉండేందుకు పోలీసులు తమకు డబ్బు ఇవ్వజూపారని కుటుంబ సభ్యులు వైద్యులకు తెలిపారు.దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, యువ వైద్యురాలు తన కుమార్తె లాంటిదని ఆయన ఆ తర్వాత పేర్కొన్నప్పటికీ,ఈ అంశంపై ఘోష్ కనీసం ఫిర్యాదు కూడా చేయలేదు. వెంటనే ఆయన పోలీసులను ఎందుకు పిలిపించలేదు? కోల్కతా హైకోర్టు కూడా ఇప్పుడు ఆయన ప్రవర్తనపై ఈ ప్రశ్ననే లేవ నెత్తింది.ఈ విచిత్రమైన ప్రతిస్పందనలు సాక్ష్యాలను తారుమారు చేశాయనే అనుమానాలను మరింతగా పెంచాయి. నేరం జరిగిన స్థలానికి చాలా సమీపంలో సాధారణ నిర్మాణపని, మరమ్మత్తు పనులు జరుగుతున్నట్లు చూపించే వీడియో కనిపించింది. ఫోరె న్సిక్స్ కోసం ఆ ప్రాంతాన్ని రింగ్ ఫెన్స్ చేయాలని ఘోష్ అను కోలేదా? తన మొత్తం ఆలోచన అంతా సాక్ష్యం ఎట్టి పరిస్థితు ల్లోనూ దొరకకూడదనే కోణంలో ఉండిందా?ఇంత దారుణ ఘటన నేపథ్యంలో ఘోష్ను కనీసం పదవి నుండి తొలగిస్తారని మీరు అనుకుంటారు. బదులుగా ఏమి జరిగిందో ఊహించండి. ఆయన మరొక మెడికల్ కాలేజీకి అధిపతిగా బదిలీ చేయబడ్డారు. అయితే ఈ కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు ఆయన కార్యాలయానికి తాళం వేసి ఉంచడమే కాకుండా, అతగాడి కొత్త మాయవేషాలను ప్రారంభించడానికి అనుమతించబోమని తేల్చి చెప్పారు. రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే ఆయనకు మరో ఉద్యోగం ఎందు కిచ్చారు? అంతే కాదు, ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ నాయకులు... ఒక శాసనసభ్యుడు, ఒక మంత్రి... విద్యార్థులతో మాట్లాడటానికి కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీకి వచ్చి ఘోష్కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను నిలిపివేయమని కోరినట్లు పశ్చిమ బెంగాల్ మీడియా నివేదించింది.ఘోష్ను అంత శక్తిమంతంగా మార్చింది ఏమిటి? ఆయన గతంలో వివాదాల మధ్యనే మూడుసార్లు బదిలీ చేయబడ్డాడు. విద్యార్థులు, వైద్యులు ఆయన్ని ఒక విధమైన స్థానిక మాఫియాగా పేర్కొంటారు. ఎట్టకేలకు అతడిని హైకోర్టు తొలగించింది. అతని పక్షాన వాదించడానికి ప్రభుత్వ న్యాయవాదిని ఎందుకు పంపారని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనికి సంబంధించి ఇతర ప్రశ్నలు కూడా పెరుగుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ వద్ద నిరసన తెలుపుతున్న వైద్యులపై దాడికి దుండగులను ఎవరు పంపారు?బాధితురాలి పట్ల వ్యవహరించిన విధంగానే తమపై కూడా అత్యాచారం చేస్తామని ఆకతాయిలు బెదిరించారని నర్సింగ్ సిబ్బంది నాతో అన్నారు. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయా రనీ, దీంతో తమను తామే రక్షించుకోవలసి వచ్చిందనీ నేను మాట్లాడిన యువ మహిళా వైద్యులు చెప్పారు. ఆకతాయిలు ఎమర్జెన్సీ గదిని ధ్వంసం చేయడంతో సహా కనుచూపు మేరలో ఉన్నవన్నీ ధ్వంసం చేయడాన్ని వాళ్లు చూశారు. బోల్తా పడిన ఆంబులెన్స్ని చూశారు. హాస్టల్లోకి ప్రవేశించడానికి పురుషులు పైపులు, గోడల మీదుగా పైకి ఎగబాకటం చూశారు.ఈ ఆకతాయిలు ఎవరనేది బయటపడినప్పటికీ, ఈ దాడి ఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. వృత్తిపర మైన కలల కోసం స్త్రీలు వెయ్యిమంది రాక్షసులతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. వారి పని ప్రదేశం కూడా సురక్షితంగా లేక పోతే, ఉద్యోగాల్లో చేరేలా అది మహిళలకు ప్రేరణనివ్వలేదు.బర్ఖా దత్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
మళ్లీ తెరపైకి పౌరస్మృతి
వరసగా మూడోసారి గద్దెనెక్కిన తర్వాత ఎర్రకోట బురుజులపై నుంచి చేసిన తొలి ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలకమైన అంశాలు ప్రస్తావించారు. అందులో ప్రధానమైనది ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ). ఇప్పుడున్న ‘మతతత్వ పౌరస్మృతి’ స్థానంలో ‘సెక్యులర్ పౌరస్మృతి’ రావా ల్సిన అవసరం ఉందన్నది మోదీ నిశ్చితాభిప్రాయం. నిజానికి ఇదేమీ కొత్త కాదు. ఇంతక్రితం సైతం పలు సందర్భాల్లో యూసీసీ గురించి ఆయన మాట్లాడారు. నిరుడు జూన్లో మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన బీజేపీ కార్యకర్తల సదస్సులో దీనిపై ఆయన గొంతెత్తారు. ఆ మాటకొస్తే పూర్వపు జనసంఘ్ నుంచీ బీజేపీ దీన్ని తరచూ చెబుతోంది. కనుక ఇందులో కొత్త ఏమున్నదని అనిపించవచ్చు. అయితే గతంలో ప్రస్తావించటానికీ, ఇప్పుడు మాట్లాడటానికీ మధ్య మౌలికంగా వ్యత్యాస ముంది. గత పదేళ్ల నుంచి ఆయన ఎన్డీయే ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నా బీజేపీకి సొంతంగానే పాలించగల సత్తా ఉండేది. ఇప్పుడు కూటమి పక్షాలపై ఆధారపడక తప్పనిస్థితి వచ్చింది. ప్రధాని తాజా ప్రసంగంలో ఇంకా అవినీతి, మహిళల భద్రత, ఒకే దేశం–ఒకేసారి ఎన్నికలు వంటివి కూడా చోటుచేసుకున్నాయి. నిజానికి ఎర్రకోట బురుజు ప్రసంగం లాంఛనమైన అర్థంలో విధాన ప్రకట నేమీ కాదు. కానీ రాగల అయిదేళ్ల కాలంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చేయదల్చుకున్నదేమి టన్న విషయంలో ఆయన స్పష్టతతో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. మనం పూర్తి స్థాయి సెక్యులర్ దేశంగా మనుగడ సాగించాలని తొలి ప్రధాని నెహ్రూ మొదలు కొని స్వాతంత్య్రోద్యమ నాయకులందరూ భావించారు. యూసీసీ గురించి రాజ్యాంగ నిర్ణాయక సభలో లోతైన చర్చే జరిగింది. రాజ్యాంగసభ అధ్యక్షుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సైతం యూసీసీ ఉండితీరాలని కోరుకున్నారు. సభ్యుల్లో కొందరు వ్యతిరేకిస్తే... అనుకూలంగా మాట్లాడినవారిలో సైతం కొందరు ఇది అనువైన సమయం కాదన్నారు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు భిన్నమై నవి. దేశ విభజన సమయంలో ఇరుపక్కలా మతోన్మాదులు చెలరేగిపోయారు. నెత్తురుటేర్లు పారించారు. పరస్పర అవిశ్వాసం, అపనమ్మకం ప్రబలటంతో ఇళ్లూ, వాకిళ్లూ, ఆస్తులూ అన్నీ వదిలి లక్షల కుటుంబాలు ఇటునుంచి అటు... అటునుంచి ఇటూ వలసబాట పట్టారు. అదే సమయంలో పాకి స్తాన్ ఆవిర్భావానికి కారకుడైన మహమ్మద్ అలీ జిన్నా మరింత రెచ్చగొట్టే ప్రకటన చేశారు. భారత్లో ముస్లింలకు మనుగడ ఉండబోదని, వారిని అన్ని విధాలా అణిచేస్తారని దాని సారాంశం. అలాంటి సమయంలో యూసీసీని తీసుకొస్తే అనవసర అపోహలు బయల్దేరి పరిస్థితి మరింత జటిలమవుతుందని అందరూ అనుకున్నారు. అందువల్లే హక్కుల్లో భాగం కావాల్సిన యూసీసీ కాస్తా 44వ అధికరణ కింద ఆదేశిక సూత్రాల్లో చేరింది. ఆ సూత్రాలన్నీ ప్రభుత్వాలు నెరవేర్చాల్సిన అంశాలు. అయినా ఇతర అధికరణాల అమలు కోసం వెళ్లినట్టుగా కోర్టుకు పోయి వాటి అమలుకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరటం సాధ్యం కాదు. అందువల్లే సుప్రీంకోర్టు వివిధ తీర్పుల్లో యూసీసీని తీసుకురావలసిన అవసరాన్ని పాలకులకు గుర్తుచేసి ఊరుకుంది. చిత్రమేమంటే పర స్పర పూరకాలు కావలసిన హక్కులూ, ఆదేశిక సూత్రాలూ కొన్ని సందర్భాల్లో విభేదించుకుంటాయి. ఉదాహరణకు 25 నుంచి 28వ అధికరణ వరకూ పౌరులకుండే మత స్వేచ్ఛ గురించి మాట్లాడ తాయి. ఆదేశిక సూత్రాల్లో ఒకటైన యూసీసీపై చట్టం తెస్తే సహజంగానే అది మత స్వేచ్ఛను హరించినట్టవుతుంది. కనుక ఈ రెండింటి మధ్యా సమన్వయం సాధించాలి. గతంలో చాలా సందర్భాల్లో ఇలా చేయకతప్పలేదు. ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ ప్రభావితం కాని రీతిలో ఆ పని చేయాలి. ఆ సంగతలా ఉంచి యూసీసీ తీసుకురాదల్చుకుంటే ఇస్లామ్ను అనుసరించేవారికి మాత్రమే కాదు... హిందూ, క్రైస్తవ, పార్సీ మతస్థులపైనా ప్రభావం పడుతుంది. కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చుగానీ దాదాపు అన్ని మతాలూ స్త్రీల విషయంలో వివక్షాపూరితంగానే ఉన్నాయి.ముఖ్యంగా వ్యక్తిగత (పర్సనల్) చట్టాలకొచ్చేసరికి ఇది బాహాటంగా కనబడుతుంది. వీటి మూలాలు వందలు, వేల ఏళ్ల నుంచి పరంపరగా వస్తూవున్న సంప్రదాయాల్లో ఉండటం, మారు తున్న కాలానికి అనుగుణంగా సవరించుకోవటానికి సిద్ధపడకపోవటం సమస్య. వివాహం, విడా కులు, పునర్వివాహం, వారసత్వం, ఆస్తి హక్కు, బహుభార్యాత్వం వంటి అంశాల్లో స్త్రీలకు వివక్ష ఎదురవుతోంది. అయితే రాజ్యాంగం హామీ ఇచ్చిన లింగసమానత్వం లేని పక్షంలో అలాంటి చట్టా లను సుప్రీంకోర్టు కొట్టివేసిన సందర్భాలున్నాయి. పార్శీల్లో అన్య మతస్థుణ్ణి పెళ్లాడిన మహిళలకు వారసత్వ ఆస్తిలో భాగం ఇవ్వరు. పార్శీ పురుషుడికి అది వర్తించదు. అన్ని అంశాలనూ సవివరంగా చర్చించేందుకూ... అన్ని మతాచారాల వివక్షను తొలగించటానికీ సిద్ధపడుతున్నారన్న అభిప్రాయం కలిగిస్తే యూసీసీ రూపకల్పన సమస్యేమీ కాదు. దానికి ముందు మైనారిటీల విశ్వాసం పొందాలి. కోల్కతాలో ఇటీవల మహిళా జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య నేపథ్యంలో మహిళల భద్రత అంశాన్ని మోదీ ప్రస్తావించారు. ఇక భారత్లో అవినీతి పెచ్చుమీరిందని గణాంకాలు వెల్లడి స్తున్న నేపథ్యంలో కఠినంగా ఉంటామన్న సంకేతాలిచ్చారు. కానీ అలాంటి ఆరోపణలున్న నేతలు బీజేపీలోనో, దాని మిత్రపక్షంగానో ఉన్నప్పుడూ... వారిపై కేసుల దర్యాప్తు మందగిస్తున్నప్పుడూ దీన్ని జనం ఎంతవరకూ విశ్వసించగలరన్నది ఆలోచించుకోవాలి. మొత్తానికి యూసీసీ అంశాన్ని ప్రధాని మరోసారి తెరపైకి తెచ్చారు. ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఎటువంటి స్పందన వస్తుందో, ఎన్డీయే కూటమిలోని ఇతర పక్షాల వైఖరి ఏ విధంగా ఉంటుందో మున్ముందు తెలుస్తుంది. -
మీడియా స్వేచ్ఛకు కళ్లెమా!
వక్ఫ్ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేయకతప్పని పక్షం రోజుల్లోనే ప్రస్తుతం భిన్నవర్గాల పరిశీలనలో ఉన్నదని చెబుతున్న బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్లు ముసాయిదాను కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వెనక్కి తీసుకుంది. కారణమేదైనా ఇది ఆహ్వానించ దగ్గ పరిణామం. ఈ బిల్లు తొలి ముసాయిదా నిరుడు నవంబర్లో విడుదల చేయగా దానిపై వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామని చెబుతూ గత నెల రెండో ముసాయిదా తీసుకొచ్చారు. తాజాగా దాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు. వచ్చే అక్టోబర్ 15 వరకూ ముసా యిదా బిల్లుపై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోంది. బహుశా శీతా కాల సమావేశాలనాటికి దీనికి తుదిరూపం ఇవ్వాలన్నది పాలకుల ఉద్దేశం కావొచ్చు. డిజిటల్ మీడియా ప్రస్తుతం ఊహకందని రీతిలో విస్తరించింది. 1959లో ప్రయోగాత్మకంగా ఢిల్లీలో ప్రారంభించిన టెలివిజన్ ప్రసారసేవలు 80వ దశకం చివరినాటికి కొత్త పుంతలు తొక్కాయి. స్టార్ టీవీ, ఎంటీవీ, బీబీసీ, సీఎన్ఎన్ వగైరాలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రస్తుతం యూట్యూబ్, ఫేస్బుక్, ట్విటర్వంటి సామాజిక మాధ్యమాలతోపాటు ఓటీటీలు వచ్చాయి. వాట్సాప్, టెలిగ్రామ్ వంటివి సరేసరి. అన్నింటా మంచీ చెడూ ఉన్నట్టే వీటివల్ల కూడా సమస్యలు ఎదురువుతూ ఉండొచ్చు. అవి దుష్పరిణామాలకు దారితీయటం నిజమే కావొచ్చు. అందుకు తగిన చట్టాలు తీసుకు రావటం కూడా తప్పేమీ కాదు. కానీ ఈ మాధ్యమాలను నియంత్రించే పేరిట భావప్రకటనా స్వేచ్ఛకు కళ్లెం వేయాలనుకోవటం, అసమ్మతిని అణిచేయాలనుకోవటం ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ ముసాయిదా బిల్లు చేస్తున్నది అదే. గతంలో కేబుల్ రంగం హవా నడిచినప్పుడు వీక్షకులకు ఇష్టం ఉన్నా లేకున్నా అనేక చానెళ్లు వచ్చిపడేవి. వర్తమానంలో అలా కాదు. ఏం చూడాలో, వద్దో నిర్ణయించుకునే స్వేచ్ఛ వీక్షకులకు ఉంటుంది. పార్టీలకు అమ్ముడుపోయిన చానెళ్లు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని అర్థమయ్యాక జనం వాటిని చూడటం మానుకుంటున్నారు. ఆన్లైన్లో ప్రత్యామ్నాయాలను వెదుక్కుంటున్నారు. తమకు నచ్చిన, తాము తెలుసుకోవాలనుకుంటున్న విషయం ఉన్నదనుకుంటేనే ఆన్లైన్లో లభ్య మయ్యే వీడియోలను వీక్షిస్తారు. వార్తా విశ్లేషణలను చదువుతారు. ఒక అంశంపై ఎవరెవరి అభిప్రా యాలు ఎలావున్నాయో తెలుసుకుంటారు. ఈ క్రమంలో సహజంగానే ప్రజలను పక్కదోవపట్టించేవాళ్లు ఉంటారు. అశ్లీలతనూ, దుర్భాషలనూ గుప్పించేవారుంటారు. తప్పుడు కథనాలను ప్రసారం చేసేవారూ ఉంటారు. అలాంటివారిపై తగిన చర్యలు తీసుకోవటాన్ని ఎవరూ కాదనరు. కానీ నిజాయితీగా అభిప్రాయాలు వ్యక్తీకరించేవారిని కూడా వారితో సమంచేసి శిక్షించే ధోరణి ఎంతవరకూ సబబు? అత్యధిక వీక్షకుల్ని రాబట్టుకుంటున్న ఆన్లైన్ మాధ్యమాలకు సైతం ముసా యిదాలో ఏముందో అధికారికంగా తెలియదు. అనేకానేక ఆన్లైన్ చానెళ్లు, ఇతర ప్రచురణ మాధ్య మాలూ సభ్యులుగా ఉన్న డిజిపబ్ వంటి స్వయంనియంత్రణ సంస్థలకే ఈ ముసాయిదాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి వర్తమానమూ లేదు. మరి కేంద్రం ఇంతవరకూ సాగించామంటున్న సంప్రదింపులు ఎవరితో జరిగినట్టు? రెండు మూడు ఓటీటీ యాజమాన్యాలనో, కార్పొరేట్ రంగ ఆధిపత్యంలో సాగుతున్న ఇతర మాధ్యమాలనో, తాము నిపుణులుగా భావించేవారినో సంప్రదిస్తే సరిపోతుందా? సాగు చట్టాల విషయంలోనూ లక్షలాదిమంది రైతులతో, వేలాది సంఘాలతో చర్చించామని అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. చివరకు ఏమైంది? రైతులు పట్టుదలగా పోరాడాక వెనక్కు తీసుకోకతప్పలేదు. సమస్యేమంటే...ట్విటర్లో లక్షల్లో అనుయాయులున్న రాజకీయ నాయకులు మొదలుకొని ధ్రువ్రాఠివంటి పాపులర్ యూట్యూబర్ల వరకూ... ఎంతో నిబద్ధతతో సీనియర్ జర్నలిస్టులు నడిపే మాధ్యమాలవరకూ అందరినీ ముసాయిదా బిల్లు ఒకే గాటన కడు తోంది. ఆఖరికి పత్రికలూ, చానెళ్లూ అనుబంధంగా నడుపుతున్న డిజిటల్ మాధ్యమాలు సైతం ఈ పరిధిలోకొస్తాయి. పైగా ఈ కార్యకలాపాలు క్రిమినల్ చట్టాల పరిధిలోకి కూడా వెళ్లి అనేక కేసులు దాఖలవుతాయి. అరెస్టయితే బెయిల్ దుర్లభమవుతుంది. తటస్థంగా విశ్లేషణలందిస్తూ వేలల్లోనో, లక్షల్లోనో వీక్షకుల్ని సంపాదించుకుంటున్న వ్యక్తులు కూడా ఈ బిల్లు చట్టమైతే అనేకానేక పత్రాలు దాఖలుచేయాల్సివస్తుంది. అంతేకాదు...ఒక గ్రీవెన్స్ అధికారిని నియమించుకోవటం, స్వీయ మదింపు కమిటీని ఏర్పాటుచేసుకోవటం తప్పనిసరవుతుంది. ఈ వ్యయాన్నంతా వీక్షకులనుంచి వసూలు చేయటం సాధ్యమేనా? అసలు వచ్చే ఆదాయం ఎంత? పైగా తప్పుడు కథనాలు ప్రసారం చేశారనుకుంటే వారెంట్ లేకుండా దాడులు చేసి పరికరాలను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభు త్వాలకు వస్తుందంటున్నారు.ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించి విపక్షాలను జైళ్లలో కుక్కి అసమ్మతిని అణి చేశారని బీజేపీ తరచు చెబుతుంటుంది. రాజ్యాంగాన్ని హత్య చేసిన రోజుగా ప్రతియేటా జూన్ 25ను పాటించాలని కూడా పిలుపునిచ్చింది. అలాంటి పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ ముసాయిదాను తీసుకురావటం, దాన్ని బహిరంగపరచకపోవటం వింత కాదా? మన పొరుగు నున్న బంగ్లాదేశ్లో హసీనా హయాంలో ఇలాంటి చట్టాన్నే తీసుకొచ్చారు. కానీ అక్కడ నిరసన వెల్లువ ఆగిందా? తమ నిర్ణయాలపై సామాన్యులు ఏమనుకుంటున్నారో, వారిలోవున్న అసంతృప్తి ఏమిటో తెలుసుకోవటానికి డిజిటల్ మీడియా తోడ్పడుతుంది. అది పాలకులకే మంచిది. మీడియా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టయిన ఇలాంటి ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవటం ఉత్తమం. -
సీబీఐ దర్యాప్తే సరైంది!
దేశవ్యాప్తంగా వైద్యవర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు రగిల్చిన కోల్కతా వైద్య కళాశాల అనుబంధ ఆస్పత్రి ఉదంతంపై సీబీఐ దర్యాప్తునకు కోల్కతా హైకోర్టు మంగళవారం ఆదేశాలివ్వటం అన్ని విధాలా సబబైనది. జూనియర్ డాక్టర్గా పనిచేస్తున్న పీజీ విద్యార్థిని మొన్న శుక్రవారం వేకువ జామున ఒక దుండగుడి అఘాయిత్యానికి బలైంది. ఈ కేసు విషయంలో గత అయిదురోజులుగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో సందేహాలు తీర్చకపోగా... మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. దుండగుడిని అరెస్టు చేశామంటున్న పోలీసుల ప్రకటనపై అటు మెడికో కుటుంబ సభ్యులు, ఇటు వైద్య విద్యార్థులు, సిబ్బంది సంతృప్తి చెందలేదు. హత్య, అత్యాచారం ఉదంతంలో కచ్చితంగా ఇతరుల ప్రమేయం ఉందని మొత్తుకున్నారు. కానీ పోలీసులు పట్టనట్టే ఉన్నారు. అసలు ఆస్పత్రి పాలకవర్గం, లేదా ప్రిన్సిపాల్ ఇంతవరకూ ఈ ఉదంతంలో ఫిర్యాదు దాఖలు చేయలేదు. కనీసం వారిని పిలిచి ప్రశ్నించినవారూ లేరు. ఆరు రోజుల్లో... అంటే వచ్చే ఆదివారంలోగా నిగ్గు తేల్చకపోతే కేసును సీబీఐకి అప్పగిస్తానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చ రించారు. కానీ హైకోర్టు భిన్నంగా ఆలోచించింది. ఇందులో జాప్యం జరిగినకొద్దీ సాక్ష్యాధారాలు మాయమవుతాయని, దోషులు తప్పించుకునే అవకాశం ఉన్నదని భావించింది.కొన్ని నేరాలు సమాజాన్ని తీవ్రంగా కలచివేస్తాయి. మనుషులుగా అసలు మన ఉనికిపైనే సందేహం రేకెత్తిస్తాయి. సరిగ్గా పన్నెండేళ్ల క్రితం దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న నిర్భయ ఉదంతం అటువంటిదే! ప్రజలంతా ఉద్యమించిన పర్యవసానంగా ఆ విషయంలో నాటి కేంద్ర ప్రభుత్వం చురుగ్గా కదిలి కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చింది. నేరగాళ్లకు ఉరితో సహా కఠినశిక్షలు అమలుచేసింది. కానీ ఆ తర్వాత కూడా నేరాలు తగ్గలేదు. దీనికి కారణం కేవలం ప్రభుత్వాల అలసత్వం మాత్రమే! నేరగాళ్లను వెనువెంటనే శిక్షించేలా పకడ్బందీ దర్యాప్తు జరగకపోవటం అన్ని చోట్లా కనబడుతోంది. కేవలం చట్టాలు మాత్రమే సరిపోవనీ, వాటిపై అవగాహన కల్పించి, ఆపత్కాలంలో మహిళలు తక్షణం ఆశ్రయించే సదుపాయం అమల్లోకి తేవాలని ప్రభుత్వాలు అను కోలేదు. తెలంగాణలో షీ టీమ్స్ అయినా, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన దిశ యాప్, దిశ చట్టమైనా మహిళలకు ఎంతో తోడ్పాటుగా నిలిచాయి. ముఖ్యంగా ఏపీలో దిశ యాప్ వల్ల నేరాలను నివారించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కోల్కతా ఆస్పత్రిలో ఉన్న అస్తవ్యస్త పరిస్థితి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకపక్క దేశవ్యాప్తంగా లైంగిక నేరాలు పెరిగాయని తెలుస్తూనే ఉన్నా మహిళా సిబ్బంది భద్రతకూ, రక్షణకూ ఆస్పత్రి ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అక్కడి పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది. నేరగాడు సంజయ్ రాయ్ పోలీస్ వలంటీర్గా ఉంటూ ఆస్పత్రిలో ఎక్కడికైనా యథేచ్ఛగా వెళ్తాడని అందరూ చెబుతున్న మాట. ఆఖరికి మహిళా వైద్య సిబ్బంది విశ్రాంతి తీసుకునే ప్రాంతానికి కూడా నిశిరాత్రి అతగాడు వెళ్లగలిగాడంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ జూనియర్ డాక్టర్ 36 గంటలు అవిశ్రాంతంగా రోగులకు సేవలందించి అలసి నిదిరిస్తున్న వేళ నేరగాడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తోటి సిబ్బంది అంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు జరిగినప్పుడు సేవలందించటానికి నమోదు చేసుకున్న నేరగాడికి ఆస్పత్రిలో సంచరించే స్వేచ్ఛ ఎవరిచ్చారో తేలాల్సివుంది. గర్భిణి అయిన భార్యను హింసించిన ఉదంతంలో వచ్చిన ఫిర్యాదుపై రెండేళ్లుగా పోలీసులు పట్టించుకోలేదంటే అతగాడి పలుకుబడిని అంచనావేయొచ్చు. అప్పుడే చర్య తీసుకుంటే ఈ ఘోరం జరిగేదా? తమ కుటుంబాల్లో వైద్య అవస రాలున్నప్పుడల్లా ఆస్పత్రిలో అన్నీ అందేలా చూస్తున్నాడన్న ఏకైక కారణంతో పోలీసులు అతడిని చూసీచూడనట్టు వదిలేశారని చాలామంది చెబుతున్న మాట. తాము తీసుకున్న వలంటీర్ల నడవడి ఎలావుంటున్నదో, వారిని కొనసాగించాలో లేదో సమీక్షించుకునే సంస్కృతి లేకపోవటం ఎటువంటి ఘోరాలకూ, నేరాలకూ దారితీస్తుందో అంచనా వేయలేనంత స్థితిలో పోలీసులుండటం ఆశ్చర్య కరం. నిజానికి లోతైన దర్యాప్తు జరిగితే తమ లోపాలు కూడా బయటపడతాయన్న ఏకైక కారణంతోనే గత అయిదురోజులుగా కోల్కతా పోలీసులు దర్యాప్తు డ్రామా కొనసాగిస్తున్నారనుకోవాలి. చదువు పూర్తయ్యాక ఇతర రంగాల్లో వెనువెంటనే స్థిరపడే అవకాశం ఉన్నా దాన్ని కాదనుకుని పలువురు విద్యార్థులు ఎన్నో సవాళ్లతో కూడిన, దీర్ఘకాలం పట్టే వైద్యవిద్యకు మొగ్గుచూపుతారు. సమాజం పట్లా, మనుషుల పట్లా ఎంతో సేవాభావం, ప్రేమ ఉంటే తప్ప ఇది సాధ్యంకాదు. కానీ అలాంటివారికి ఆ రంగంలో సరైన గౌరవ మర్యాదలు లభిస్తున్నాయా? వారి భద్రతకు సక్రమమైన చర్యలు తీసుకుంటున్నారా? ఈ విషయంలో జూనియర్ డాక్టర్లు తరచు చెప్పే అంశాలు అంత సంతృప్తికరంగా లేవు. వారి శ్రమకు తగ్గ వేతనాలు అందవు. అవి కూడా నిర్దిష్ట సమయానికి రాని దుఃస్థితి చాలాచోట్ల ఉంటున్నది. వేళకాని వేళల్లో సైతం అవిశ్రాంతంగా పనిచేసేవారికి కనీసం కాసే పయినా భద్రంగా నిద్రపోయే సౌకర్యం ఆస్పత్రి పాలకవర్గం కల్పించలేకపోయిందంటే, ఆ విష యంలో సీనియర్లు శ్రద్ధ పెట్టలేదంటే ఏమనుకోవాలి? పెత్తనం చలాయించటానికి ఉబలాటపడే వారు తాము కూడా ఒకప్పుడు జూనియర్లమనీ, వారిని కంటికి రెప్పలా చూసుకోవాలనీ భావించక పోవటం విషాదం. సహ సిబ్బంది పట్లా, వారి దురవస్థలపట్లా సహానుభూతి లేనివారి వల్లే ఇలాంటి దురంతాలు చోటు చేసుకుంటున్నాయి. కోల్కతా ఆస్పత్రి ఉదంతమైనా అటువంటి వారి కళ్లు తెరిపించాలి. వైద్యసిబ్బంది రక్షణకూ, భద్రతకూ దేశవ్యాప్తంగా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి. -
చేయాల్సింది చాలావుంది!
ప్యారిస్ వేసవి విశ్వక్రీడా సంరంభం ముగిసింది. దాదాపు 850 పతకాలు విజేతలను వరించిన ఈ 2024 ఒలింపిక్స్లో 10 ప్రపంచ రికార్డులు, 32 ఒలింపిక్ రికార్డులతో సహా మొత్తం 42 రికార్డులు బద్దలయ్యాయి. మరి, భారత్ సాధించినదేమిటి అన్నప్పుడే ఆశ నిరాశలు దోబూచులాడతాయి. 117 మంది అథ్లెట్లతో, 16 క్రీడాంశాల్లో పోటీపడుతూ భారత ఒలింపిక్ బృందం ఎన్నో ఆశలతో విశ్వ వేదికపై అడుగుపెట్టింది. ఈసారి రెండంకెల్లో పతకాలు సాధిస్తామనే ఆకాంక్షను బలంగా వెలి బుచ్చింది. తీరా ఒలింపిక్స్ ముగిసేవేళకు అరడజను పతకాలతోనే (5 కాంస్యం, 1 రజతం) తృప్తి పడాల్సి వచ్చింది. గడచిన 2020 టోక్యో ఒలింపిక్స్లో సాధించిన 7 పతకాల అత్యుత్తమ ప్రదర్శనతో పోలిస్తే... ఇది ఒకటి తక్కువే. ఈ సంరంభంలో మొత్తం 84 దేశాలు పాల్గొంటే, ప్రపంచంలో అత్యధికంగా 145 కోట్ల జనాభా గల మన దేశం పతకాల పట్టికలో 71వ స్థానంలో నిలిచింది. మన పతకాలు, జనాభా నిష్పత్తి చూస్తే, ప్రతి 25 కోట్ల మందికి ఒక్క పతకం వచ్చిందన్న మాట. ‘ఖేలో ఇండియా’ పేరిట కోట్లు ఖర్చుచేస్తున్నామంటున్న పాలకులు ఆత్మశోధనకు దిగాల్సిన అంశమిది.ఫ్రాన్స్లో రాజకీయ సంక్షోభం, పొంచివున్న దాడుల పట్ల భద్రతా సిబ్బంది భయం, ఫ్రెంచ్ ప్రజానీకంలో పెద్దగా ఉత్సాహం లేకపోవడం... వీటన్నిటి మధ్య ప్యారిస్ ఒలింపిక్స్ సరిగ్గా జరుగు తాయో జరగవో అని అందరూ అనుమానపడ్డారు. అన్నిటినీ అధిగమించి ఈ విశ్వ క్రీడోత్సవం విజయవంతంగా ముగిసింది. పైగా, అస్తుబిస్తుగా ఉన్న ఫ్రెంచ్ ఆర్థిక వ్యవస్థకు ఇప్పుడు అత్యవ సరమైన కొత్త ఉత్సాహమూ నింపింది. క్రితంసారి కోవిడ్ మూలంగా టోక్యోలో ప్రేక్షకులు లేకుండానే పోటీలు నిర్వహించిన నేపథ్యంలో ఈసారి స్పాన్సర్లు, బ్రాడ్కాస్టర్ల నుంచి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి ఒత్తిడి ఉంది. నిర్వాహకులు మొత్తం ప్యారిస్ను ఓపెన్–ఎయిర్ ఒలింపిక్ క్రీడాంగణంగా మార్చేసి, అందరూ ఆహ్వానితులే అనడంతో ఊహించని రీతిలో ఇది దిగ్విజయమైంది. పోటీల్లో పాల్గొన్న ఒకరిద్దరు క్రీడాకారుల జెండర్ అంశం, భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ అనర్హత వ్యవహారం లాంటివి మినహా ఈ ప్యారిస్ ఒలింపిక్స్ అతిగా వివాదాస్పదం కాలేదనే చెప్పాలి. ఉక్రెయిన్, గాజా లాంటి భౌగోళిక రాజకీయ అంశాలు, అలాగే అమెరికాలో ఎన్నికల వేడి, బ్రిటన్లో అల్లర్లు, బంగ్లాదేశ్లో సంక్షోభం లాంటివి పతాక శీర్షికలను ఆక్రమించేసరికి ఒలింపిక్స్ వివాదాలు వెనుకపట్టు పట్టాయనీ ఒప్పుకోక తప్పదు. ప్యారిస్ వేసవి ఒలింపిక్స్కు తెర పడింది కానీ, ఈ ఆగస్ట్ 28 నుంచి అక్కడే పారా ఒలింపిక్స్–2024 జరగనుంది. తదుపరి 2028 వేసవి ఒలింపిక్స్కు లాస్ ఏంజెల్స్ సిద్ధమవుతోంది. కేవలం రెండే పతకాలు సాధించిన 2016 నాటి రియో ఒలింపిక్స్తో పోలిస్తే, భారత్ మెరుగైన మాట నిజమే. అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్, మహిళా బ్యాడ్మింటన్లో వెనుకబడినా టేబుల్ టెన్నిస్, షూటింగ్లలో కాస్త ముందంజ వేశామన్నదీ కాదనలేం. ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించి, ఆ ఘనత సాధించిన తొలి భారతీయ షూటర్గా 22 ఏళ్ళ మనూ భాకర్ చరిత్ర సృష్టించారు. గోల్కీపర్ శ్రీజేశ్ సహా హాకీ బృందమంతా సర్వశక్తులూ ఒడ్డి, వరుసగా రెండో ఒలింపిక్స్లోనూ పతకం సాధించింది. ఇక ఈ ఒలింపిక్స్లో ఊరించి చేజారిన పతకాలూ చాలా ఉన్నాయి. భారత మల్లయోధురాలు వినేశ్ ఫోగట్ సంచలన విజయాలు నమోదు చేసినా, వంద గ్రాముల అధిక బరువు రూపంలో దురదృష్టం వెన్నాడకపోతే స్వర్ణం, లేదంటే కనీసం రజతం మన ఖాతాలో ఉండేవి. షట్లర్ లక్ష్యసేన్, అలాగే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటర్ అర్జున్ బబుతా సహా కనీసం 6 సందర్భాల్లో మనవాళ్ళు ఆఖరి క్షణంలో నాలుగో స్థానానికి పరిమితమ య్యారు. లేదంటే పతకాల పట్టికలో మన దేశం మరింత ఎగబాకేదే. పతకాలు, విజయాల మాటెలా ఉన్నా, మన మార్కెటింగ్ విపణికి కొన్ని కొత్త ముఖాలు దొరికాయి. గాయాల నుంచి ఫీనిక్స్ పక్షిలా లేచిన నీరజ్ చోప్రా, పీవీ సింధుల మొదలు నిలకడగా ఏళ్ళ తరబడి ఆడిన శ్రీజేశ్, రెండు పతకాల విజేత మనూ భాకర్, బ్యాడ్మింటన్ క్రేజ్ లక్ష్యసేన్ దాకా పలువురు బ్రాండ్లకు ప్రీతిపాత్రులయ్యారు. కానీ ఇది సరిపోతుందా? ఆర్చరీ, బాక్సింగ్ సహా పలు అంశాల్లో నిరాశాజనక ప్రదర్శన మాటే మిటి? మిశ్రమ భావోద్వేగాలు రేగుతున్నది అందుకే. ఇప్పటికైనా మన ప్రాధాన్యాలను సరి చేసుకో వాలి. అత్యధిక జనాభా గల దేశంగా ప్రతిభకు కొదవ లేదు. ప్రతిభావంతుల్ని గుర్తించి, ప్రోత్సహించి, సరైన రీతిలో తీర్చిదిద్దడమే కరవు. మనకొచ్చిన 6 పతకాల్లో 4 దేశ విస్తీర్ణంలో 1.4 శాతమే ఉండే హర్యానా సంపాదించి పెట్టినవే. అంటే, మొత్తం పతకాల్లో హర్యానా ఒక్కదాని వాటా 66 శాతం. మరి, మిగతా దేశం సంగతి ఏమిటి? అక్కడి పరిస్థితులేమిటి? ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థ మనదని జబ్బలు చరుచుకుంటున్న పాలకులు ఇవాళ్టికీ క్రీడలకు సరైన రీతిలో వస తులు, వనరులు ఇవ్వట్లేదు. పేరొచ్చాక సాయం చేస్తే సరిపోదు. క్షేత్రస్థాయిలో ఆటగాళ్ళకు నారు పోసి, నీరు పెట్టాలి. మన క్రీడా సంఘాలు, ప్రాధికార సంస్థలు రాజకీయ నేతల గుప్పెట్లో ఇరుక్కుపోవడం పెను విషాదం. పతకాలకై పోరాడాల్సిన ఆటగాళ్ళు లైంగిక వేధింపులు సహా అనేక సమస్యలపై రోడ్డెక్కి పోరాడాల్సిన పరిస్థితిని కల్పించడం మన ప్రభుత్వాల తప్పు కాదా? క్రీడా సంస్కృతిని పెంచి పోషించడానికి బదులు రాజకీయాల క్రీనీడలో ఆటను భ్రష్టు పట్టిస్తే, పతకాలు వచ్చేదెట్లా? అంతర్జాతీయ స్థాయిలో విజయానికి దూరదృష్టి, సరైన వ్యూహం, నిరంతరం పెట్టుబడి, స్పష్టమైన క్రీడా విధానం రాష్ట్ర స్థాయి నుంచే కీలకం. ఆ దిశగా ఆలోచించాలే తప్ప దాహమేసినప్పుడు బావి తవ్వితే కష్టం. అందుకే, 1900 తర్వాత నూటపాతికేళ్ళలో ఒలింపిక్స్లో ఇది మన రెండో అత్యుత్తమ ప్రదర్శన. ఇకనైనా అపూర్వ క్రీడాదేశంగా మనం అవతరించాలంటే, పాలకులు చేయాల్సింది చాలా ఉంది. -
దేశ‘భుక్తి’ గేయం
ఎప్పటి గురజాడ! ఎప్పటి దేశభక్తి గీతం! నూటపాతికేళ్ళ క్రితం నాటి ఆ గీతం ఇన్ని కోట్ల తెలుగుప్రజల పెదాలపై ఎన్ని కోట్ల సార్లు నర్తించి ఉంటుంది! ‘దేశమును ప్రేమించుమన్నా’ అని చెప్పే ఆ గీతం నిత్యస్మరణనే కాదు, నిరంతరాచరణను ఉద్బోధించడం లేదా? అది కాలభేదాలను దాటి నూతనత్వాన్ని తెచ్చుకునే సముజ్వలపాఠం కాదా? దాని సారమూ, సందేశమూ జాతి జనులలో ఇప్పటికైనా ఇంకాయా? మనదేశం లాంటి జనతంత్ర వ్యవస్థలో రాజకీయ, ఆర్థిక, సామాజికాది అన్ని రంగాలకూ ఎప్పటికీ దిశానిర్దేశం చేసే మహిమాన్విత మంత్రం ఆ గీతం! అరవై అయిదు పంక్తుల ఆ గీతంలో మనకు ఎంత చటుక్కున గుర్తొస్తాయో, అంతే అలవోకగా మరచిపోయే పంక్తులు రెండే; అవి, ‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’! ఆ కవితాహారంలో అవే మణిపూసలైన మహావాక్యాలు. దేశాన్ని మట్టిగానూ, భూభాగంగానూ చూడడమే పరిపాటి కాగా, మనుషులుగా గుర్తించిన గురజాడ తన కాలానికి ఎన్నో మన్వంతరాలు ముందున్నాడు. దేశమంటే మనుషులని ఎలుగెత్తి చాటడంలో వేల సంవత్సరాల వెనక్కీ వెళ్లగలిగిన విలక్షణ క్రాంతదర్శి ఆయన. దేశమూ, రాజ్యమూ అనే భావనే అంకురించని గణసమాజంలో అస్తిత్వానికి మనిషే మణిదీపమూ, కొలమానమూనూ... గురజాడ గీతోపదేశానికి పూర్తి వ్యతిరేకదిశలో నేటి మన ప్రజాస్వామికగమనం సాగుతున్న వైనాన్ని ఆ గీతంలోని ప్రతి చరణమూ ఛెళ్ళున చరచి చెబుతుంది. వొట్టి మాటలు కట్టిపెట్టి, గట్టి మేలు తలపెట్టమంటాడాయన. మంచి గతమున కొంచెమే, మందగించక ముందుకడుగేయమంటాడు. వ్యర్థకలహం వద్దనీ, కత్తి వైరం కాల్చమనీ హితవు చెబుతాడు. దేశాభిమానపు గొప్పలు మానేసి జనానికి నికరంగా పనికొచ్చేది చేసి చూపమంటాడు. దేశస్థులంతా చెట్టపట్టాలు వేసుకు నడవాలనీ, అన్ని జాతులూ, మతాలూ అన్నదమ్ముల్లా మెలగాలనీ సందేశిస్తాడు. మతం వేరైనా మనసులొకటై మనుషులుండాలంటాడు. దేశమనే దొడ్డవృక్షం ప్రేమలనే పూలెత్తాలనీ, ఆ చెట్టు మూలం నరుల చెమటతో తడిసి ధనమనే పంట పండించాలనీ స్వప్నిస్తాడు... మరో రెండురోజుల్లో 78వ స్వాతంత్య్ర దినోత్సవానికి ముస్తాబవుతున్న భారత జనతంత్ర ప్రస్థానం గురజాడ చూపిన జాడకు ఏ కొంచెమైనా దగ్గరగా ఉందా? వొట్టి మాటల వరదలో గట్టి మేలు గడ్డిపరక అయింది. మంచి అంతా గతంలోనే ఉందని చెప్పి జనాన్ని వెనకడుగు పట్టించడమే రాజకీయమైంది. దేశం వ్యర్థకలహాలు, కత్తివైరాలతో సంకుల సమరాంగణమైంది. జనాన్ని చీల్చి పాలించడమే అధికార పరమపదానికి సోపానమైంది. దేశమనే దొడ్డవృక్షం ప్రేమలనే పూలెత్తడం లేదు; వైర, విద్వేషాల విరితావులు వీస్తోంది. ఆ చెట్టు మూలం మనుషుల చెమటతో తడిసి ధనమనే పంట పండించాలన్న కవి ఆశాభావం, ఇప్పటికీ గట్టిగా వేటుపడని నిరుద్యోగపు జడలమర్రి కింద నిలువునా సమాధి అయే ఉంది. దేశమంటే మనుషులనే కాదు, ఆ మనుషులకు ఏది అత్యవసరమో గురజాడ ఉద్ఘాటిస్తాడు. తిండి కలిగితె కండ కలదోయ్, కండగలవాడేను మనిషోయని, మనిషిని నిర్వచిస్తాడు; ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడుతుందంటాడు; మనిషి సంపూర్ణ జవసత్త్వాలతో హుందాగా శిరసెత్తుకు జీవిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వామి అవడానికీ, తిండిపుష్టికీ ఉన్న అన్యోన్య సంబంధాన్ని ఆనాడే నొక్కిచెబుతాడు. అటువంటిది, యావత్ప్రజలకూ పుష్టికరమైన ఆహారాన్ని సమకూర్చే లక్ష్యానికి ఇప్పటికీ యోజనాల దూరంలోనే ఉన్నాం. పోషకాహార లోపంతో ఉసూరుమంటున్న ప్రపంచ బాలల్లో 50 శాతం భారత్లోనే ఉన్నారనీ, కేవలం పదిశాతం మందికే పోషకాహారం అందుతోందనీ గణాంకాలు చెబుతున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 ప్రకారం, అయిదేళ్ళ లోపు వయసు పిల్లల్లో శారీరకమైన ఎదుగుదల లోపించినవారు 35 శాతానికి పైగా, బలహీనులు దాదాపు 20 శాతమూ ఉన్నారు. రక్తహీనతను ఎదుర్కొంటున్న పురుషులు, మహిళలు, పిల్లల శాతం గరిష్ఠంగా 67 నుంచి కనిష్ఠంగా 25 వరకూ ఉంది. 2023 లెక్కల ప్రకారమే మన దేశంలో 74 శాతం మందికి ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేదు. ప్రపంచ ఆకలి సూచిలో భారత్ స్థానం ఆందోళన గొలుపుతూ 28.7 దగ్గర ఉంది. భారత్ త్వరలోనే 5 ట్రిలియన్ల ఆర్థికత అవుతుందనీ, ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థికతలలో మూడవది కాబోతోందనీ పాలకులు అరచేతి స్వర్గాలు ఆవిష్కరిస్తుంటే అసలు నిజాలు ఇలా నిలువునా వెక్కిరిస్తున్నాయి. ఇప్పటికీ దేశ జనాభాలో సగానికి పైగా, 81 కోట్లమంది నెలకు అయిదు కిలోల రేషన్ పైనే ఆధారపడుతున్నారు. ఈ మాత్రానికీ నోచుకోని వలస, అసంఘటిత రంగ శ్రామికులు 8 కోట్లమంది ఉన్నారు. జనాభా లెక్కల సేకరణ సకాలంలో జరిగి ఉంటే ఈ సంఖ్య ఇంకా పెరిగేదంటున్నారు. కోవిడ్ దరిమిలా వీరిని కూడా ఆహార భద్రతా చట్టం కిందికి తేవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరయ్యాయి. పైగా తాజా బడ్జెట్లో ఆహార సబ్సిడీపై ఇంకా కోత పడింది. పోషకాహార లోపం వల్ల భారత్ తన స్థూల జాతీయోత్పత్తిలో ఏకంగా 4 శాతం నష్టపోతోంది. తిండికి, కండకు, మనిషికి; దేశాభివృద్ధిలో మనిషి పాత్రకు ఉన్న అన్యోన్యాన్ని ఆనాడే చెప్పిన గురజాడది ఎంత గొప్ప ముందుచూపు! దేశభక్తిని, దేశభుక్తితో మేళవించిన గురజాడ గీతం అంతర్జాతీయ గీతమే కాగలిగినదైనా రాష్ట్రీయ గీతం కూడా కాకపోవడం విషాదం కాదూ!? -
ఇది రాజ్యాంగంపై దాడే!
ఆకతాయిల పని కాదది. పథకం ప్రకారమే జరిగింది. ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే జరిగింది. అదేదో చాటుమాటు ప్రాంతం కాదు. నిర్జన ప్రదేశం కాదు. విజయవాడ నడిగడ్డ. నగరంలోనే ఏక్ నంబర్ బిజినెస్ రాస్తా. బందర్ రోడ్. రాత్రి తొమ్మిది గంటల వేళ ఆ రోడ్డు మీద ప్రవహించే రణగొణ పీక్ స్థాయిలో ఉంటుంది. అటువంటి సమయంలో అంబేడ్కర్ స్మృతివనం లోకి కొందరు వ్యక్తులు ‘పనిముట్ల’తో ప్రవేశించి, సందర్శకు లను వెళ్లగొట్టి, లైట్లార్పేసి దాడికి తెగబడ్డారంటే... ఈ దాడికి స్వయానా పోలీసు యంత్రాంగమే కాపు కాసిందంటే... అధికార పీఠం అండదండలు లేవని ఎలా అనుకోగలం? అందుకే ఈ దాడి రాజ్య ప్రేరేపితం.మీడియా ప్రతినిధులతోపాటు పలువురు పురజనులు హుటాహుటిన అక్కడికి చేరుకోకపోతే ఆ దాడి ఎంతదూరం వెళ్లేదో? టాప్ ప్రయారిటీ టాస్క్గా అక్కడున్న మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి పేరును తొలగించగలిగారు. ఇంకా ముందు కెళ్లడం జనం రాకతో కుదరలేదు. స్మృతి వనంలోకి దొంగల్లా ప్రవేశించి, లైట్లార్పేసి దాడికి తెగబడుతున్న వైనంపై సమా చారం అందించినా వెంటనే పోలీసులు స్పందించకపోవడం ఏమిటి? ప్రతిపక్ష నాయకుడి పేరునే కదా తొలగించింది... విగ్రహంపై దాడి జరగలేదు కదా అనే సన్నాయి నొక్కులు పాలక పార్టీ తైనాతీల నోటి వెంట వినబడుతున్నాయి. ఈ లెక్కన ప్రతిపక్షాలకు చెందిన వారి ఇళ్లల్లో అక్రమంగా ప్రవేశించి దొంగతనం చేసినా ఫరవాలేదన్న మాట. పోలీసులు రక్షణ కూడా కల్పిస్తారేమో! నంద్యాల జిలాల్లో ఒక వైసీపీ కార్యకకర్తను పబ్లిగ్గా తెగనరుకుతుంటే ఆ హంతకులకు రక్షణగా పోలీసులు నిలబడిన వైపరీత్యాన్ని కూడా ఈ వారమే చూడవలసి వచ్చింది. ఏపీలో కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చిందా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగ అంతస్సారం... సర్వమానవ సమతావాదం. ఈ సిద్ధాంతానికీ ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలిస్తున్న ఎన్డీఏ కూటమి భావజాలానికీ అస్సలు పొసగదు. కూటమి పెద్దన్న భారతీయ జనతా పార్టీకి ఏ మాత్రం గిట్టదు. బీజేపీ తోలుబొమ్మను ఆడించే తెర వెనుక ఆరెస్సెస్కు అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మార్చే యాలన్నది చిరకాల వాంఛ. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించింది. నాలుగు రోజుల్లోనే (నవంబర్ 30) ఆరెస్సెస్ అధికార పత్రిక ‘ఆర్గనైజర్’ దాన్ని ఆడిపోసుకోవడం మొదలుపెట్టింది.భారత రాజ్యాంగంలో భారతీయతే లేదని ‘ఆర్గనైజర్’ దుయ్యబట్టింది. ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలైన స్పార్టాకు లైకర్గస్లాగా, ఏథెన్స్కు సోలాన్ లాగా భారత్కు మనువు ఉండగా, ఆయన రూపొందించిన మనుస్మృతి ఉండగా ఈ రాజ్యాంగమెందుకని ‘ఆర్గనైజర్’ ప్రశ్నించింది. ఈ మనుధర్మ శాస్త్రం ఎటువంటిదో తెలిసిందే కదా! అసమానతలతో కూడిన కుల వ్యవస్థను సమర్థించిన శాస్త్రం. దళితులనైతే వర్ణవ్యవస్థకు ఆవల బహిష్కృతులుగా, అస్పృశ్యులుగా పరిగణించిన న్యాయ సంహిత ఇది. స్త్రీలకు స్వాతంత్య్రం అవసరం లేదని కూడా మనుస్మృతి అభిప్రాయపడింది. ‘పితా రక్షతి కౌమారే, భర్తా రక్షతి యౌవనే, రక్షంతి స్థవిరే పుత్రా, న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ (బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కుమా రుని రక్షణలో ఉండాలి. స్త్రీలకు స్వతంత్రత అవసరం లేదు)... ఇదీ మనుస్మృతి!ఇటువంటి మనుధర్మ సంహిత భారత రాజ్యాంగంగా ఉండాలని ఒక్క ‘ఆర్గనైజర్’ మాత్రమే కోరుకోలేదు. ఆరెస్సెస్ సిద్ధాంతవేత్తగా ప్రసిద్ధుడైన గురు గోల్వాల్కర్ (బంచ్ ఆఫ్ థాట్స్), ఆరెస్సెస్కు ప్రాతఃస్మరణీయుడైన వినాయక్రావు దామోదర్ సావర్కర్లు కూడా వివిధ సందర్భాల్లో అభిలషించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తొలి రోజుల్లోనే కాదు, ఆ తర్వాతి కాలంలో కూడా ఆరెస్సెస్ అభిప్రాయం మారలేదని ప్రముఖ కన్నడ రచయిత దేవనూర్ మహాదేవ ఆరెస్సెస్పై రాసిన ఒక చిన్న పుస్తకంలో నిరూపించారు. ఆ సంస్థ 1993 జనవరిలో విడుదల చేసిన శ్వేతపత్రంలో భారత రాజ్యాంగాన్ని ‘విదేశీ భావాలతో కూడిన హిందూ వ్యతిరేక సంహిత’గా అభిశంసించారని మహాదేవ రాశారు.ఆరెస్సెస్ అనే సంస్థ ప్రస్తుతం మూడు అంతర్లీన లక్ష్యాల కోసం పనిచేస్తున్నదని మహాదేవ వివరించారు. భారతదేశ ఫెడ రల్ స్వభావానికి విరుద్ధంగా కేంద్రీకృత అధికార స్థాపన మొదటి లక్ష్యం. ఇక రెండవది – మనుధర్మ శాస్త్రం ప్రబోధించిన వర్ణాశ్రమ ధర్మం. అసమానతలతో కూడిన కుల వ్యవస్థను కాపాడటం – సమాజంపై ఆర్యుల ఆధిపత్యాన్ని రుద్దడం మూడవది. ఆర్యులంటే ఎవరు? వర్ణాశ్రమంలో వారి స్థానాలేమిటి? తదితర అంశాలపై వివరణలు అవసరం కాకపోవచ్చు. ఇదిగో ఈ మూడు లక్ష్యాల సాధనలో భాగంగానే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పాఠ్య పుస్తకాల సిలబస్ సవరణ, మతాంతీకరణ వ్యతిరేక బిల్లును తేవడం తదితర చర్యలు చేపట్టిందని మహాదేవ అభియోగం.స్థూలంగా మనుషులంతా సమానం కాదని మనుధర్మ శాస్త్రం అభిప్రాయపడుతుంది. మనుషుల్లో కొందరు ఉత్తమ జాతులవారు, కొందరు నీచ జాతులవారు. ఈ నీచ జాతుల వారు ఉత్తమ జాతులను సేవిస్తూ జీవించాలి. అన్ని జాతుల్లోనూ పురుషుల స్థాయి ఎక్కువ. స్త్రీల స్థాయి తక్కువ. పురుషుల అడుగుజాడల్లో వారి పాదధూళిని తలదాల్చుతూ స్త్రీలు మనుగడ సాగించాలి. ఇటువంటి మనువాద తుప్పు భావాలను చీల్చి చెండాడుతూ మనుషులంతా ఒక్కటేనని చాటిచెప్పిన నవీన ధర్మ శాస్త్రం అంబేడ్కర్ విరచిత భారత రాజ్యాంగం. ఇటువంటి రాజ్యాంగంతో మనువాదులు రాజీపడటం అంత సులభసాధ్య మేమీ కాదు. అందుకే గడిచిన డెబ్బయ్ ఐదేళ్లుగా ఈ రాజ్యాంగంపై, దాన్ని రచించిన బాబాసాహెబ్పై వివిధ రూపాల్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. రాజకీయ రంగంలో మనువాదుల ప్రాబల్యం కారణంగానే రాజ్యాంగాన్ని తు.చ. తప్పకుండా అమలు చేయడం ఇప్పటి దాకా సాధ్యం కాలేదు.ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబు నాయకత్వం మొదలైన దగ్గర నుంచీ తెలుగుదేశం పార్టీలో వచ్చిన భావజాల మార్పు దాన్ని బీజేపీకి సహజ మిత్రపక్షంగా మార్చింది. కాకుల్ని కొట్టి గద్దలకు వేయడం ఆ పార్టీ ఆర్థిక సిద్ధాంతంగా మారింది. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో నిజాం షుగర్స్, ఆంధ్ర పేపర్, ఆల్విన్, రిపబ్లిక్ ఫోర్జ్ తదితర 56 ప్రభుత్వ రంగ సంస్థలను చంద్రబాబు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడమో, మూసివేయడమో చేశారు. ప్రైవేట్ వ్యక్తులు బాగా బలిస్తే... వారి దగ్గర నుంచి జారిపడే చిల్లరతో పేదలు బతికేస్తారనే ట్రికిల్డౌన్ ఆర్థిక సిద్ధాంతం చంద్రబాబుది. భారత రాజ్యాంగం కోరుకున్న పేదల సాధికారతతో ఈ ఆర్థిక సిద్ధాంతా నికి సాపత్యం కుదరదు.పేద వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యనూ, వైద్యాన్నీ ఆయన అందనీయలేదు. కనీస వైద్య సేవలు కూడా ఉచితంగా అందడానికి వీల్లేదని యూజర్ ఛార్జీలను ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆయనదే! వరస కరువుకాటకాలతో, నకిలీ ఎరువులు, పురుగుల మందుల వాడకంతో చితికిపోయిన రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వడానికి వీల్లేదని ఆయన చెప్పిన పాఠాలు ఎప్పటికీ తెలుగు ప్రజలు మరిచిపోరు. విభజిత రాష్ట్ర ముఖ్య మంత్రిగా కూడా ఈ ఆర్థిక విధానాలకే ఆయన కట్టుబడి ఉన్నారు. ఆర్థిక రంగంలోనే కాదు, సామాజిక రంగంలోనూ ఆయన భావజాలానికీ, మనుస్మృతికీ మధ్యన పెద్దగా తేడాలుండవు. తన కులతత్వ ఆలోచనలు, పురుషాహంకార అభిప్రాయా లను దాచుకోవడం కూడా ఆయనకు సాధ్యపడలేదు. విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీసీల తోకలు కత్తిరిస్తానని ఆయన బహిరంగంగానే బెదిరించారు. ‘ఎస్సీ కులాల్లో పుట్టా లని ఎవరు కోరుకుంటార’ని ప్రెస్మీట్లోనే ఈసడించు కున్నారు. ‘న్యాయస్థానాల్లో జడ్జీ పదవులకు బీసీలు పనికిరారం’టూ కేంద్రానికి లేఖలు రాశారు. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా’ అని తన మనువాద భావాలను బయటపెట్టుకున్నారు.ఈ మనువాద రాజకీయాలకు పూర్తి భిన్నంగా గడిచిన ఐదేళ్ల జగన్మోహన్రెడ్డి పరిపాలన సాగింది. భారత రాజ్యాంగ లక్ష్యాల సాధన ఆశయంగా, సుస్థిర అభివృద్ధి ధ్యేయంగా సాగిన ఆయన ఐదేళ్ల పరిపాలన దేశం ముందు ఒక ఆదర్శ నమూనాను ఆవిష్కరించింది. ఈ నమూనాపై జరిగిన విద్వేషపూరిత విష ప్రచారం బహుశా ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఎప్పుడూ జరిగి ఉండదు. సమాజంలోని పేదవర్గాల సంక్షే మానికీ, మధ్య తరగతి కలల సాకారానికీ, మహిళల సాధికా రతకూ మనువాద సంపన్న వర్గాలు మనస్ఫూర్తిగా సహకరించవు. ఈ వర్గాలను చంద్రబాబు ఏకం చేసుకున్నారు. వారి వద్ద నున్న సకల అస్త్ర శస్త్రాలు, హంగు ఆర్భాటాలతో యుద్ధానికి దిగారు. విద్వేషపు విషవాయువులతో కార్పెట్ బాంబింగ్ చేశారు. ఒక్కో నియోజకవర్గం ఒక్కో భోపాల్ మాదిరిగా విష వాయువులతో ఉక్కిరి బిక్కిరైంది.విష ప్రచారాన్ని కొంతమందైనా నమ్మి ఉండవచ్చు. అరచేతిలో చూపెట్టిన వైకుంఠానికి మరికొంతమంది మోస పోయి ఉండవచ్చు. వోట్ ఫర్ డెమోక్రసీ (వీఎఫ్డీ), అసోసి యేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థలు బల్లగుద్ది చెబుతున్నట్టుగా ఈవీఎమ్లలో మాయాజాలం జరిగి ఉండ వచ్చు. ఈ మాయాజాలంలో దేశంలోనే అత్యధికంగా యాభై లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నట్టు వీఎఫ్డీ వాదిస్తున్నది. కారణమేదైనా చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అలవాటు ప్రకారం చేతిలోని వైకుంఠాన్ని చెట్టెక్కించారు. ముసుగు చీల్చు కొని మనువాదం బయటకొచ్చింది.మహిళా సాధికారతపై దాడి జరిగింది. ‘అమ్మ ఒడి’, ‘చేయూత’ వగైరా పథకాలు ఆగిపోయాయి. పేద విద్యార్థుల నాణ్యమైన చదువుపై దాడి జరిగింది. జగనన్న విద్యా కానుక, మధ్యాహ్న భోజనం, రీయింబర్స్మెంట్, వసతి దీవెన తదితర కార్యక్రమాలు పట్టాలు తప్పాయి. ‘ఫ్యామిలీ డాక్టర్’ మాయ మయ్యాడు. ‘ఆరోగ్యశ్రీ’నీ నీరుకార్చారు. పాలనా వికేంద్రీకర ణకు చాపచుట్టారు. వలంటీర్ వ్యవస్థ మాయమైంది. ఆర్బీకేల సేవలు ఆవిరయ్యాయి. విత్తనాల కోసం ఐదేళ్ల తర్వాత రైతులు మళ్లీ క్యూలైన్లలో రోజుల తరబడి నిలబడుతున్నారు. జగన్ మోహన్రెడ్డి ప్రారంభించిన ప్రభుత్వ వైద్యశాలలపై ప్రైవేటీ కరణ కత్తి వేలాడుతున్నది. కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్ర రహదారులపై సైతం టోల్ వసూలుకు రంగం సిద్ధమైంది. రాజ్యాంగ లక్ష్యాలపై వరసగా దాడులు జరుగుతున్నాయి. అంబే డ్కర్ స్మృతివనంపై జరిగిన దాడిని ఒక ప్రతీకాత్మక దాడిగానే పరిగణించాలి. విజయవాడ నడిబొడ్డున ఆకాశమెత్తు అంబేడ్క రుడి మహాశిల్పాన్ని జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేశారు. ఇది ఆంధ్రా మనువాదుల్లో కడుపు మంటకు కారణమైంది. నలభ య్యేళ్ల నాటి కారంచేడు కండకావరం తిమ్మిరి ఇంకా వదల్లేదు. జగన్మోహన్రెడ్డి పేరును తొలగించి కొంత ఆనందాన్ని పొంది ఉండవచ్చు. ముందు ముందు మరిన్ని దాడులు జరగవచ్చు. ఆ దాడుల అసలు లక్ష్యం – భారత రాజ్యాంగం మాత్రమే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
గూగుల్పై కన్నెర్ర!
అతిథిగా వచ్చి అడిగినవన్నీ గుక్క తిప్పుకోకుండా చెబుతున్న సిద్ధుణ్ణి చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయిన ప్రవరాఖ్యుడు ‘సృష్టికర్త బ్రహ్మకైనా నేర్వశక్యంగాని ఇన్ని సంగతులు తమరికెలా సాధ్య మయ్యాయ’ని ఎంతో వినయంగా అడుగుతాడు ‘మనుచరిత్ర’ కావ్యంలో. ఈ ఆధునాతన యుగంలో ఆ సిద్ధుణ్ణి మించిపోయి, అడిగిన అరక్షణంలో అన్నిటినీ గూగుల్ ఏకరువు పెడుతోంది. అసలు గూగుల్ లేకపోతే మనకు చాలా విషయాలు తెలిసేవికాదని, మన జ్ఞానానికి ఎన్నో పరిమితులుండేవని ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది విశ్వసిస్తారు. అంతటి గూగుల్పై అమెరికా ఫెడరల్ న్యాయ స్థానం రూపంలో పిడుగుపడింది. ఈ సంస్థ గుత్తాధిపత్య పోకడలు పోతోందని న్యాయ స్థానం తీర్పునిచ్చింది. పోటీదారులందరికీ సమానావకాశాలు ఉండితీరాలన్న స్వేచ్ఛా మార్కెట్ సూత్రాలకు తిలోదకాలిచ్చి, చట్ట ఉల్లంఘనలకు పాల్పడి వక్రమార్గంలో లాభార్జనకు పాల్పడుతున్నదని తేల్చి చెప్పింది. సంస్థపై ఏ చర్యలు తీసుకోవాలన్నది న్యాయస్థానం ఇంకా చెప్పలేదు. అయితే దాన్ని భిన్న సంస్థలుగా విభజించాలని ఆదేశించటంతో సహా ఎలాంటి చర్యలనైనా సూచించే అవకాశం ఉంది. అసలు ఒక టెక్ దిగ్గజంగా, మహాసంస్థగా వెలిగిపోతున్న గూగుల్ ఏడెనిమిదేళ్ల క్రితం ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ ‘ఆల్ఫాబెట్’లో ఒదిగి చిన్నబోయింది. ఇప్పటికే అమెజాన్, మెటా, యాపిల్ వగైరా భారీ కార్పొరేట్ కంపెనీలపై నడుస్తున్న వ్యాజ్యాలకు తాజా తీర్పు ప్రమాణంగా మారుతుందన్నది గుత్తాధిపత్య నిరోధక చట్టాల నిపుణులంటున్న మాట. నిజానికి మైక్రోసాఫ్ట్పై 2000 సంవత్సరంలో వెలువడిన యాంటీట్రస్ట్ తీర్పు ప్రస్తుత గూగుల్ కేసును ప్రభావితం చేసింది. ఈ కేసు పరిష్కారానికి ఏం చేయాలన్న అంశంపై ప్రభుత్వమూ, గూగుల్ మాట్లాడుకోవాలని, వచ్చే నెల 6 నాటికి నిర్ణయం తెలపాలని న్యాయమూర్తి చెప్పారు. ఈ తీర్పుపై గూగుల్ ఎటూ అప్పీల్కి పోతుంది.గూగుల్పై వచ్చిన ఆరోపణలు కొట్టివేయదగ్గవి కాదు. తన సెర్చ్ ఇంజన్ను సెల్ఫోన్లలో, బ్రౌజర్లలో అమర్చేలా యాపిల్తో సహా అనేక స్మార్ట్ ఫోన్ కంపెనీలకూ, బ్రౌజర్ కంపెనీలకూ గూగుల్ ఒక్క 2021లోనే 2,600 కోట్ల డాలర్లు చెల్లించిందని, ఇందువల్ల ఇతర సంస్థలు భారీగా నష్టపోయాయని ఆ అభియోగాల సారాంశం. ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వినియోగ దారుల్లో 90 శాతం మంది గూగుల్ సెర్చ్ ఇంజన్పైనే ఆధారపడుతున్నారు. అయితే వినియోగదారులను తాము నియంత్రించటమో, నిర్బంధించటమో చేయటం లేదని... ఎందులో మెరుగైన ఫలితా లొస్తాయో తేల్చుకుని స్వచ్ఛంగా తమను ఎంచుకుంటున్నారని గూగుల్ వాదించింది. వర్తమానంలో ఇంటర్నెట్ తెరిచాక సాగే అత్యంత ప్రధాన వ్యాపకం శోధించటమే. అయితే సెల్ఫోన్ తయారీ దార్లకూ, బ్రౌజర్ కంపెనీలకూ భారీ చెల్లింపులు చేసి గూగుల్ సెర్చ్ ఇంజన్ను చేర్చాక వాటిని వినియోగించేవారికి అంతకన్నా గత్యంతరం ఏముంటుందని న్యాయమూర్తి వేసిన ప్రశ్న సహేతుక మైనది. నిజానికి గూగుల్తోపాటు బింజ్తో సహా డజను వరకూ సెర్చ్ ఇంజన్ సంస్థలున్నాయి. కానీ అనేక ఏళ్లుగా గూగుల్ తెరచాటుగా సాగిస్తున్న గుత్తాధిపత్యం పర్యవసానంగా వాటికంత ప్రాధాన్యం లేకుండా పోయింది. ఆసక్తికరమైన విషయాన్నీ, అవసరమైన సమాచారాన్నీ సేకరించటానికి వినియోగదారుల్లో అత్యధికులు యధాలాపంగా ఆధారపడేది గూగులే. దాంతో పోలిస్తే వ్యక్తిగత గోప్యత మొదలుకొని అనేక అంశాల్లో ఇతర సంస్థల తీరు ఎంతో మెరుగ్గా ఉన్నదని టెక్ నిపుణులు చెబుతున్న మాట. వినియోగదారులు ఎలాంటి అంశాల గురించి ఆరా తీస్తున్నారన్న డేటా అత్యంత కీలకమైనది. ఈ క్రమంలో వినియోగదారుల ఇష్టానిష్టాలూ... వారి అలవాట్లు, ఆసక్తులకు సంబంధించిన సమాచారం వివిధ ఉత్పాదక సంస్థలకు చాలా అవసరం. వినియోగదారులకు తెలియకుండా ఈ వివరాలన్నీ గూగుల్ అమ్ముకుంటున్నదని చాన్నాళ్లుగా వినబడుతోంది. దాంతోపాటు ఈ రంగంలో గుత్తాధిపత్యం ఉండటాన్ని ఆసరా చేసుకుని వాణిజ్య ప్రకటనకర్తలు చెల్లించే రుసుమును అపారంగా పెంచుతోంది. వివిధ విషయాలూ, పదాలూ ఆధారంగా సెర్చ్ ఇంజన్లకు వినియోగించే క్రమసూత్రాలు (అల్గారిథమ్స్) ఏమిటన్నది గూగుల్ అత్యంత రహస్యంగా ఉంచుతోంది. అమెరికాలో దాఖలైన ఈ కేసులో ఆసక్తికరమైన అంశం ఉంది. మున్ముందు ఎన్నో సంస్థల భవితవ్యాన్ని ప్రభావితం చేసే ఈ కేసులో వ్యాజ్యాన్ని ఎదుర్కొన్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాదిరే తీర్పునిచ్చిన న్యాయమూర్తి అమిత్ మెహతా కూడా భారతీయుడే. యాంటీట్రస్ట్ చట్టం నిజానికి 19వ శతాబ్దం నాటిది. పారిశ్రామికరంగం భిన్నరంగాల్లో ఎదగటానికి గుత్తాధిపత్యం పెను అవరోధమని భావించి అప్పట్లో యాంటీట్రస్ట్ చట్టాన్ని తీసుకొచ్చారు. 1970లలో ఐబీఎం మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లు, ఆ తర్వాత 1990లలో మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ వ్యవస్థ పైనా ఇలాంటి వ్యాజ్యాలే పడ్డాయి. అవి భారీగా పరిహారాలు చెల్లించుకున్నాయి. మెయిన్ఫ్రేమ్ మార్కెట్ ఇప్పుడు దాదాపు లేదు. గూగుల్ రాకతో మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్యం కూడా అంతరించింది. అలాగే ప్రాసెసర్ల మార్కెట్లో వెలుగులీనిన ఇంటెల్ ప్రభ కూడా మరోపక్క క్షీణిస్తోంది. మారిన పరిస్థితులను అందిపుచ్చుకోలేకపోవటం, కొత్త రంగాలకు విస్తరించటానికి బద్ధకించటం లాంటివి వీటి వర్తమాన అవస్థకు ప్రధానంగా చెప్పుకోవాల్సిన కొన్ని కారణాలు. గూగుల్ వ్యవహారాన్ని కూడా మార్కెట్ శక్తులకే వదిలేస్తే కాగల కార్యం అవే తీరుస్తాయనీ, గత కాలపు చట్టాలతో నియంత్రించటం వ్యర్థమనీ వాదించేవారికి కూడా కొదవ లేదు. అయితే నియంత్రణ వ్యవస్థలు లేకపోతే కొత్త సంస్థల ఆవిర్భావం సాధ్యమేనా? ఏది ఏమైనా తాజా తీర్పు పర్యవసానాలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయన్నది వాస్తవం. -
చెదిరిన స్వప్నం
భారత్ బంగారు కల నెరవేరడానికి మరికొన్ని గంటల దూరంలో మాత్రమే ఉన్నామని మన క్రీడాభిమానులు ఉత్కంఠతో వేచిచూస్తున్న వేళ హఠాత్తుగా అంతా తలకిందులైంది. రెజ్లింగ్లో ఒకేరోజు దిగ్గజ క్రీడాకారిణులనదగ్గ ముగ్గురిని అవలీలగా జయించి, చరిత్ర సృష్టించి బుధవారం పతాక శీర్షికలకెక్కిన మన రెజ్లింగ్ స్టార్ వినేశ్ ఫోగాట్పై చివరాఖరిలో అనర్హత వేటు పడింది.అంతర్జాతీయ క్రీడలు బహు చిత్రమైనవి. ఎవరి అంచనాలకూ అందనివి. ప్రపంచ శిఖరాగ్రంపై ఎవరినైనా ప్రతిష్ఠించగలవు... అధఃపాతాళానికి తొక్కి నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయేలా కూడా చేయగలవు. కేవలం 24 గంటల వ్యవధిలో పరస్పర విరుద్ధమైన ఈ రెండు అనుభవాలనూ వినేశ్ చవిచూడాల్సివచ్చింది. క్రీడారంగంలో దేశాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచటానికీ.., స్ఫూర్తి రగల్చడానికీ ఉద్దేశించిన ఇలాంటి సందర్భాల్లో ముందంజలో నిలిచి మాతృదేశానికి మరిచిపోలేని విజయాన్నందించాలని క్రీడాకారులంతా తపిస్తారు. తమ తమ నైపుణ్యాలకు పదునుపెట్టుకుంటారు. నిజానికి ఇలాంటి వారందరికీ వినేశ్ తలమానికమైనది. ప్రధాని చెప్పినట్టు సవాళ్లకు ఎదు రొడ్డి పోరాడే స్వభావం ఆమెది. ఒక్క రెజ్లింగ్లో మాత్రమే కాదు... దశాబ్దాలుగా దేశ క్రీడా రంగాన్ని పట్టిపీడిస్తున్న లింగ వివక్షపైనా, లైంగిక వేధింపులపైనా సివంగిలా తిరగబడిన చరిత్ర ఆమెది. తోటి క్రీడాకారిణులకు ఎదురవుతున్న లైంగిక హింసపై నిరుడు దాదాపు నెలన్నరపాటు ఢిల్లీ వీధుల్లో పోరాడి... అరెస్టులూ, అవమానాలూ, లాఠీ దెబ్బలూ, చంపేస్తామన్న బెదిరింపులూ సహిస్తూ భరిస్తూ మొక్కవోని ఉక్కు సంకల్పాన్ని ప్రదర్శించింది. ఆటల బరిలోనే కాదు... తేడా వస్తే అధికార మదంపైనా పోరాడతానన్న సందేశం పంపింది. ఒక దశలో ఇతర క్రీడాకారులతోపాటు తనకొచ్చిన అవార్డులన్నీ వెనక్కివ్వాలని, పతకాలను గంగానదిలో పడేయాలని నిర్ణయించుకుంది. ఏ రంగంలోనైనా మహిళలు రాణించడమంటే అంత సులువేం కాదు. గడప లోపలే కాదు, వెలుపల సైతం అడుగడుగడుగునా అవరోధాలూ, అడ్డంకులూ ఉంటాయి. క్రీడారంగంలో ఇవి మరిన్ని రెట్లు అధికం. సమస్యలను ఎదుర్కొనటంతో పాటు అవి కలిగించే భావోద్వేగాలను అధిగమించి, గాయపడిన మనసును ఓదార్చుకుంటూ తాను ఎంచుకున్న క్రీడాంశంలో ఏకాగ్రత సాధించి నైపుణ్యాన్ని పెంచుకోవాలి. ఎంత కష్టం! కానీ వినేశ్ దృఢంగా నిలబడింది. తనేమిటో నిరూపించుకుంది. కనుకనే ప్రస్తుత ఒలింపిక్ చాంపియన్, ఏకంగా మూడుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన జపాన్ క్రీడాకారిణి సుసాకి యుయుపై 3–2 తేడాతో గెలిచి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచింది. బరిలో ఇంతవరకూ ఓటమే చవిచూడని నంబర్ వన్ యుయు నిజానికి ఈ పోరులో అందరి ఫేవరెట్. అటుపై ప్రతిభావంతులుగా పేరొందిన ఉక్రెయిన్, క్యూబా క్రీడా దిగ్గజాలను కూడా వినేశ్ సునాయాసంగా అధిగమించింది. బుధవారం అమెరికా క్రీడాకారిణి సారా హిల్డెర్బ్రాంట్తో తలపడబోతున్న తరుణంలో ఉండాల్సిన 50 కిలోల బరువు కంటే కేవలం వందగ్రాములు అధికంగా ఉందన్న కారణంతో వినేశ్ను అనర్హురాలిగా ప్రకటించటం దురదృష్ట కరం. గతంలోనూ ఆమెకు బరిలో సమస్యలు తప్పలేదు. వరసగా 2016, 2020 ఒలింపిక్స్ పోటీల్లో బరి నుంచి నిష్క్రమించాల్సి వచ్చిన వినేశ్పై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. అసలు 2016లో మోకాలి గాయం అయ్యాక ఇక ఆమె క్రీడలకు స్వస్తి చెప్పక తప్పదని అనుకున్నారు. దానికి తోడు నిరుడు గాయానికి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. నిరసనోద్యమం సరేసరి. వీటన్నిటినీ అధిగమించి ఆమె మ్యాట్పైకొచ్చింది. అచిరకాలంలోనే అద్భుతంగా రాణించింది. మంగళవారం నాటి ఆటను చూసినవారంతా ఫైనల్లో ఆమె స్వర్ణం చేజిక్కించుకోవటం ఖాయమని అనుకుంటుండగా ఊహించని విపరిణామమిది. ఒలింపిక్స్ చరిత్రలో భారతీయ క్రీడాకారులకు ఎన్నడూ ఎదురు కాని అనుభవమిది.వినేశ్ అనర్హత వెనక కుట్ర కోణం ఉండొచ్చని, ఆమెను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బృందం అలసత్వాన్ని ప్రదర్శించిందని సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కుట్రకోణం వెలికితీయాలంటూ లోక్సభలో విపక్షం వాకౌట్ కూడా చేసింది. అయితే మన ఒలింపిక్ అసోసియేషన్ ఆమె బరువు తగ్గడానికి ముందురోజు రాత్రంతా ఏమేం చేయాల్సి వచ్చిందో ఏకరువు పెడుతోంది. ఆ మాటెలావున్నా ఒలింపిక్స్లో అనుసరించే నిబంధనలు అత్యంత కఠినమైనవవి. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నిబంధనల్లోని 11వ అధికరణ ప్రకారం నిర్దిష్టమైన బరువు దాటితే క్రీడాకారులను అనుమతించే ప్రసక్తే లేదంటున్నారు. మంగళవారం ఇటలీ క్రీడాకారిణి లియుజీకి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఈ నిబంధనలపై ఇప్పటికి రెండుసార్లు ఒలింపిక్స్ అనుభవం గల వినేశ్కు గానీ, నిరంతరం అదే పనిలో ఉండే మన బృందానికి గానీ అవగాహన లేకపోవటం ఆశ్చర్యకరమే. ఈ విషయంలో వినేశ్ను ఎవరైనా పక్క దోవ పట్టించి వుంటారా అనేది ఆమె చెబితే గానీ తెలిసే అవకాశం లేదు. ఆటపైనే సర్వశక్తులూ ఒడ్డాల్సిన క్రీడాకారులకు ఇతరేతర సమస్యలు ఎదురుకావటం విచారించదగ్గ విషయం. వినేశ్కు నిరుడు చేదు అనుభవాలు ఎదురుకాకపోతే కుట్ర ఆరోపణలు వచ్చి ఉండేవే కాదు. మొత్తానికి మన దేశానికి తలమానికమనదగ్గ క్రీడాకారులను ఎలా గౌరవించుకోవాలో, ఎంత అపురూపంగా చూసు కోవాలో తాజా ఉదంతం తెలియజెబుతోంది. దీన్నుంచి గుణపాఠం నేర్వగలిగితేనే అంతర్జాతీయ క్రీడా యవనికపై మనం తళుకులీనగలమని గ్రహించాలి. రాజకీయ సంకెళ్ల నుంచి క్రీడా వ్యవస్థలను విముక్తం చేయాలి. -
విషప్రచారపు కోరల్లో...
చేతిలోని కత్తిని మంచికి వాడవచ్చు, చేయాలనుకుంటే చెడు కూడా చేయవచ్చు. మరి, ప్రపంచాన్ని చేతిలోకి తీసుకొచ్చిన స్మార్ట్ఫోన్నీ, అందులోని సోషల్ మీడియా వేదికల్నీ ఇప్పుడు మనం దేనికి వాడుతున్నట్టు? దాని దుర్వినియోగం, విషప్రచారం తాలూకు విపరిణామాల ఫలితం యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ప్రత్యక్షంగా అనుభవిస్తోంది. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ, విభిన్న వర్గాల మధ్య అనుమానాలు సహా ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న బ్రిటన్ సోషల్ మీడియా సాక్షిగా తీవ్రతర మితవాద బృందాల అసత్య ప్రచారం వల్ల అల్లర్లు, దహనాలతో అట్టుడుకుతోంది. మనసును కదిలించే ముగ్గురు పసిపిల్లల పాశవిక హత్య కారణంగా వారం క్రితం మొదలైన ఈ హింసాత్మక నిరసనల్ని అదుపు చేయడానికి పాలనా యంత్రాంగం కిందా మీదా అవుతోంది. చివరకు యూకేలో ‘అంతర్యుద్ధం అనివార్యం’ అంటూ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు దుందు డుకు వ్యాఖ్యలు చేస్తుంటే, బ్రిటన్ కొత్త ప్రధాని కీర్ స్టార్మర్ ఖండించాల్సిన పరిస్థితి. ఇటీవలే పగ్గాలు పట్టిన లేబర్ పార్టీ ప్రభుత్వానికి తాజా పరిణామాలు సవాలుగా మారాయి. ఇంగ్లండ్ వాయవ్య ప్రాంతంలోని సౌత్పోర్ట్లో జూలై 29న ఓ డ్యాన్స్ క్లాస్లో ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులపై ఓ ఆగంతకుడు కత్తితో దాడి చేసి చంపిన దారుణ సంఘటన చివరకు దేశమంతటా కార్చిచ్చుకు దారి తీయడం నమ్మశక్యం కాని నిజం. దాడి చేసిన వ్యక్తి వలసదారు, మైనారిటీ మతస్థుడు, గత ఏడాదే ఒక చిన్న పడవలో బ్రిటన్లో ప్రవేశించాడు అంటూ అంతర్జాలంలో అసత్యాలు ప్రచారమయ్యాయి. అదే అదనుగా వలసదారులకూ, ముస్లిమ్లకూ వ్యతిరేకంగా నిరస నలు చేయాలంటూ తీవ్రతర మితవాద బృందాలు సామాజిక మాధ్యమ వేదికలైన ‘ఎక్స్’ వగైరాల్లో పిలుపునిచ్చాయి. నిజానికి, పిల్లలపై కత్తి దాడికి పాల్పడింది ముస్లిమ్ వలసదారు కాదనీ, రువాండాకు చెందిన తల్లితండ్రులకు జన్మించిన ఓ 17 ఏళ్ళ క్రైస్తవ టీనేజర్ అనీ అధికారులు గుర్తించారు. ఆ పసిపాపల్ని చంపడమే కాక, గతంలోనూ కనీసం పదిసార్లు ఆ కుర్రాడు హత్యాయత్నాలకు పాల్పడి నట్టు పోలీసులు గుర్తించారు. అరెస్టు కూడా చేశారు. అయితే, నిజం ఇంటి గడప దాటే లోపల అబద్ధం ఊరంతా షికారు చేసింది. హంతకుడి గురించి పుకార్లు, విద్వేష నిరసనల పిలుపులు విస్తృతంగా విషాన్ని విరజిమ్మాయి. సోషల్మీడియా లోని వివాదాస్పద ఇన్ఫ్లుయెన్సర్ల తప్పుడు కథనాలతో మసీదులు, శరణార్థులకు నీడనిచ్చిన హోటళ్ళే లక్ష్యంగా దాడులు సాగాయి. చివరకు గడచిన దశాబ్ద కాలం పైచిలుకుగా యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో ఎన్నడెరుగని స్థాయిలో అల్లర్లు, దహనకాండ, లూటీలకు ఆజ్యం పోశాయి. జూలై 30 నుంచి దేశవ్యాప్తంగా సాగుతున్న ఘర్షణల్లో ఇప్పటికి కనీసం 400 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినా పరిస్థితులు చక్కబడలేదు. చివరకు లండన్లోని భారత హైకమిషన్ సైతం బ్రిటన్కు వచ్చే భారత జాతీయులు జాగ్రత్తగా ఉండాలని మంగళవారం సూచనలు జారీ చేయాల్సి వచ్చింది. నైజీరియా, మలేసియా, ఇండొనేషియా సహా పలు దేశాలు అదే పని చేశాయి. ప్రపంచమంతటా సత్వర సమాచార, వ్యాఖ్యా ప్రసారానికి ఉపయోగపడాల్సిన వాట్సప్ మొదలు ‘ఎక్స్’ దాకా సోషల్ మీడియా వేదికలన్నీ తుంటరుల చేతిలో అదుపు లేని ఆయుధాలుగా మారడం విషాదం. వాటిలోని విద్వేషపూరిత అసత్యాలు, రెచ్చేగొట్టే మాటలకు ఎవరు, ఎక్కడ, ఎలా అడ్డుకట్ట వేయగలరో అర్థం కాని పరిస్థితి. బ్రిటన్లో సాంకేతిక శాఖ మంత్రి సైతం గూగుల్, ఎక్స్, టిక్టాక్, మెటా సంస్థల ప్రతినిధులతో సమావేశమై, అసత్య సమాచారం వ్యాపించకుండా ఆపడంలో ఆ సంస్థల బాధ్యతను మరోసారి నొక్కిచెప్పాల్సి వచ్చింది. అసలు అలాంటి అంశాలను తొలగించే బాధ్యత, భారం ఆ యా సోషల్ మీడియా సంస్థలదేనని బ్రిటన్ సర్కార్ కొంత కాలంగా ఒత్తిడి పెట్టాలని చూస్తోంది. తాజా ఘర్షణలతో ప్రభుత్వం ఆగి, తన వంతుగా తానూ బాధ్యత తీసుకోక తప్పదు. నిజానికి, ‘బ్రెగ్జిట్’ తర్వాత నుంచి బ్రిటీషు సమాజం నిలువునా చీలిపోయింది. ఈ చీలిక లకు మునుపటి కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వాలు హ్రస్వ దృష్టితో అనుసరించిన విధానాలు తోడయ్యే సరికి పెను ప్రభావం పడింది. అన్నీ కలసి తాజా దాడులుగా విస్ఫోటించాయి.ఈ హింసను అదుపు చేసి, శాంతిభద్రతల్ని పునరుద్ధరించడం స్టార్మర్ సర్కారుకు సవాలే. కానీ, తీవ్రతర మితవాదులు రేపుతున్న విద్వేషం, విదేశీయుల పట్ల వైముఖ్యానికి కళ్ళెం వేయడం అసలు సిసలు ఛాలెంజ్. మొత్తం వచ్చిన ఓట్ల రీత్యా బ్రిటన్ తాజా ఎన్నికల్లో తీవ్రతర మితవాద రాజకీయ పార్టీ ‘రిఫార్మ్ యూకే’ మూడోస్థానంలో నిలిచింది. అంటే, దేశంలోని రాజకీయ, ఆర్థిక అనిశ్చితుల మధ్య దానికి ఆ మేరకు మద్దతుందన్న మాట. అదే సమయంలో పాలనలో మార్పు కోరిన జనం బ్రిటన్ పునర్నిర్మాణ వాగ్దానం చూసి స్టార్మర్కు ఓటేశారు. పాత పాలన సమస్యలకు తోడు ప్రస్తుత పరిస్థితుల్లో వలసలు, మితవాద జనాకర్షక విధానాల లాంటి సంక్లిష్ట అంశాలపై ఆయన ఆచితూచి అడుగేయక తప్పదు. చరిత్రలో వలసరాజ్య పాలనకు పేరొందిన బ్రిటన్లో ఇప్పుడు వలసదారులపై రచ్చ రేగడమే వైచిత్రి. పొట్ట చేతబట్టుకొని శరణు కోరి వచ్చినవారినే అన్నిటికీ కారణమని నిందించడం, అకారణ శత్రుత్వం వహించడం బ్రిటన్కు శోభనివ్వదు. అసత్య కథనాల పట్ల జనచైతన్యంతో పాటు జనజీవన స్రవంతిలో వలసజీవులు కలిసిపోయే విధానాలకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వడం ముఖ్యం. వాటివల్లే అపోహలు, ప్రతికూలభావాలు పోతాయి. విధ్వంసకారులపై కఠిన చర్యలు తీసు కుంటూనే సరైన నాయకత్వం, సహానుభూతితో వ్యవహరించాలి. మతవైరాలకు తావివ్వక న్యాయం, సమానత్వానికి నిలబడడమే ఇప్పుడు బ్రిటన్ మరింత పటిష్ఠంగా ముందుకు నడవడానికి మార్గం. -
సంక్షుభిత బంగాళం
భయపడినంతా అయింది. బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. హింసాత్మకంగా మారిన విద్యార్థుల నిరసనలు, వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం మధ్య అవామీ లీగ్ పార్టీ సారథి షేక్ హసీనా ప్రధానిగా రాజీనామా చేసి, సైనిక విమానంలో దేశం విడిచిపోవాల్సి వచ్చింది. పాకిస్తాన్కు వ్యతిరేకంగా సాగిన 1971 నాటి బంగ్లాదేశ్ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నవారి కుటుంబ సభ్యు లకు ప్రభుత్వోద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించిన వివాదాస్పద కోటా విధానంపై మొదలైన రచ్చ చివరకు ఇంతకు దారి తీసింది. జూలైలో ఢాకా యూనివర్సిటీలో ఆరంభమైన విద్యార్థుల నిరసన ప్రదర్శనలు ఇంతలు అంతలై, ఘర్షణలకు దారి తీశాయి. గత నెలలోనూ, అలాగే ఈ ఆదివారమూ కలిపి 300 మందికి పైగా అమాయకుల ప్రాణాలు పోవడంతో బంగ్లాలో పరిస్థితులు వేగంగా మారాయి. గత నెలలో సుప్రీమ్ కోర్ట్ జోక్యం చేసుకొని, అన్నీ కలిపి 56 శాతమున్న రిజర్వేషన్లను 7 శాతానికి తగ్గించినప్పుడు నిరసనలు తగ్గి, ప్రశాంతత నెలకొంటుందని భావించారు. అప్పటికి కాస్త ఆగినట్టనిపించినా, మృతుల కుటుంబాలకు న్యాయం పేరిట మళ్ళీ నిరసనలు రేగాయి. ప్రభుత్వ అనుకూల, ప్రతికూల వర్గాల మధ్య మళ్ళీ రేగిన ఘర్షణల్లో ఒక్క ఆదివారమే 100 మంది దాకా చనిపోవడం, విద్యార్థుల ‘చలో ఢాకా’ ప్రదర్శన నేపథ్యంలో అగ్నిపర్వతం బద్దలైంది. క్షేత్రస్థాయిలో ప్రజల మనోభావాలను గుర్తించకుండా, నిరంకుశంగా వ్యవహరిస్తే ఎంతటి పాపు లర్ నేతకైనా ఎలాంటి దురవస్థ తలెత్తుతుందో సోమవారం నాటి దృశ్యాలు కళ్ళకు కట్టాయి. దేశ వ్యాప్త కర్ఫ్యూ, ఇంటర్నెట్ సేవల సస్పెన్షన్ విధించినా ఢాకాలో రోడ్ల నిండా జనం, ప్రధాని నివా సాన్ని వారు చుట్టుముట్టిన తీరు, హసీనా రాజీనామా, విలాసవంతమైన ఆమె నివాసంలోకి జనం చొచ్చుకుపోయి లూటీ సాగించిన తీరు చూస్తుంటే... సరిగ్గా రెండేళ్ళ క్రితం 2022 జూలైలో శ్రీలంకలో అధ్యక్షుడు రాజపక్సేకు ఎదురైన ఘటనలు గుర్తుకొస్తాయి. దేశాలు, ప్రజలు వేరైనా, రెండు ఘటనల్లోనూ నిరంకుశ పాలన, అవినీతి, ఆశ్రిత పక్షపాతాలే ఇంతటి జనాగ్రహానికి కారణమయ్యా యని మరిచిపోరాదు. అయితే, బంగ్లాలో రెచ్చిపోయిన జనం ప్రధాని నివాసంలోకే కాక, ఆఖరికి దేశ పార్లమెంట్లోకి చొరబడి యథేచ్ఛగా ప్రవర్తించడం విస్మయం కలిగిస్తుంది. షేక్ హసీనా తండ్రి, బంగ్లాదేశ్ జాతిపిత అయిన ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని సైతం ధ్వంసం చేయడం, బంగబంధు మ్యూజియమ్ను తగలబెట్టడం, అధికార అవామీ లీగ్ ఆఫీసులకూ – పోలీస్ స్టేషన్లకూ – ప్రభుత్వ ఆఫీసులకూ నిప్పు పెట్టడం ప్రజాస్వామ్య వాదులకు ఆవేదన, ఆందోళన కలిగించక మానవు. అయిదు దశాబ్దాల స్వతంత్ర బంగాళం ఇటీవలెన్నడూ చూడని హింస, రాజకీయ సంక్షోభం ఇది. ఒక రకంగా ఇది అయిదుసార్లు బంగ్లా ప్రధానిగా వ్యవహరించిన 76 ఏళ్ళ హసీనా స్వయంకృతం. 2009 జనవరి నుంచి పదహారేళ్ళుగా నిర్విరామంగా అధికారంలో ఉన్న ఈ ఉక్కుమహిళ అనేక సంక్షోభాలనూ, హత్యాయత్నాలనూ దాటి వచ్చి, దేశాన్ని ఆర్థికంగా పైకి తెచ్చిన మాట నిజమే. ఒక దశలో ఇస్లామిక్ ప్రపంచంలో ప్రజాస్వామ్య, లౌకికవాదాలకు నమూనాగా తెచ్చుకున్న పేరూ పెద్దదే. కానీ, ప్రతిపక్ష నేతల్ని జైలులో పెట్టి, విమర్శకులను దేశద్రోహులుగా చిత్రించి, చట్టంతో పని లేకుండా ప్రత్యర్థుల్ని అడ్డు తొలగించుకుంటూ వచ్చి అభిమానుల్లో సైతం అప్రతిష్ఠ తెచ్చుకున్నారు. కోవిడ్ అనంతర పరిస్థితులు, రష్యా – ఉక్రెయిన్ యుద్ధంతో ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమైంది. పెరిగిన ధరలు, పెచ్చుమీరిన నిరుద్యోగం, అణచివేతలతో అన్ని వర్గాల్లో అసంతృప్తి పేరుకుంది. పైగా, గడచిన రెండు తడవలుగా బంగ్లా ఎన్నికలు పరిహాసప్రాయమయ్యాయి. ముఖ్యంగా ఈ ఏటి జన వరి ఎన్నికలు వట్టి రిగ్గింగ్ అనే ఆరోపణలూ వచ్చాయి. ఇప్పుడామె రాజీనామాతో రోడ్డు మీద కొచ్చి ఆడామగా ఆనందిస్తున్న తీరు చూస్తే మార్పుకై జనం ఎంతగా మొహం వాచారో అర్థమవుతుంది. హసీనా రాజీనామాతో ప్రస్తుతం బంగ్లాదేశ్ సైన్యం కనుసన్నల్లోకి వెళ్ళింది. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆర్మీ ఛీఫ్ సమావేశమైనట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత ఆందోళనలకు అడ్డుకట్ట వేసి పరిస్థితిని చక్కదిద్దుతామనీ, త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటవుతుందనీ ఆర్మీ ఛీఫ్ ప్రకటించారు. అయితే, అది అంత సులభమేనా? దేశమంతా అల్లకల్లోలంగా ఉంది. పాలనా యంత్రాంగం పూర్తిగా పడకేసింది. సాక్షాత్తూ సైన్యం ఎదుటే ప్రదర్శకులు రెచ్చిపోతున్న దృశ్యాలూ కనిపించాయి. గత వారం నిషేధానికి గురైన జమాతే ఇస్లామీ వర్గీయులు సహా ఇంతకాలం అణచివేతకు గురైన ప్రతిపక్షాల మద్దతుదారులూ రోడ్డెక్కడంతో నిరసనకారుల్లో అందరూ విద్యార్థులే అనుకోలేం. అనూహ్య విధ్వంసం చూస్తుంటే, అసాంఘిక శక్తులు చేరాయన్న అనుమానాలూ వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ పరిణామాలు భారత్పై చూపే ప్రభావమూ ఎక్కువే. కొన్నేళ్ళుగా భారత అనుకూల హసీనా ఏలుబడి మనకు కలిసొచ్చింది. ఇప్పుడిక ప్రతికూల పార్టీలు అక్కడ అధికారంలోకి వస్తే చిక్కులు తప్పవు. మళ్ళీ ఒకప్పటిలా సరిహద్దులో తీవ్రవాద సంస్థల పీడ పెరుగుతుంది. అవి అక్కడ తిష్ఠ వేసి, మన ఈశాన్య రాష్ట్రాల్లో సమస్యలు సృష్టిస్తాయి. చొరబాట్లూ ఎక్కువవుతాయి. కోటీ 30 లక్షల మంది హిందువులున్న బంగ్లాలో భారత మైనారిటీల భద్రత ప్రశ్నార్థకమవుతుంది. హసీనా ఉండగానే వారి పైన దాడులు తప్పలేదు. ఇక, ఛాందసవాద, ప్రతికూల శక్తులు గద్దెనెక్కితే పరిస్థితి ఎలా ఉంటుందో? అలాగే, ఢాకా దృశ్యాలను చూస్తే, ఇదే అదనుగా తీవ్రవాద శక్తులు విజృంభించ కుండా బంగ్లా సమాజం అప్రమత్తం కావాలనిపిస్తోంది. ముందుగా శాంతిభద్రతలు నెలకొనడం అవసరం. ఎలాంటి సర్కారుతో సాగాలి, మళ్ళీ ఎన్నికలు లాంటివన్నీ ఆ తర్వాతే! అది పూర్తిగా ఆ దేశ అంతర్గత వ్యవహారం, ప్రజాభీష్టం. ఏమైనా రానున్నరోజులు బంగ్లాకే కాదు భారత్కూ కీలకం. -
నిద్రారాక్షసం
కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర లేకుండా రోజుల తరబడి గడపడం అసాధ్యం. బొందిలో ప్రాణం నిలిచి ఉండాలంటే, ఈ రెండూ తప్పనిసరి. తిండి, నిద్ర మనుషులకే కాదు, జంతువులకూ అవసరమే! జంతువులకు నిద్ర ముంచుకొచ్చినప్పుడు నిద్రపోవడమే తెలుసు గాని, నిద్ర గురించి ఆలోచించడం తెలీదు. మనం మనుషులం. జంతువులతో పోల్చుకుంటే జ్ఞానులం. ‘ఆహార నిద్రా భయ మైథునాని/ సామాన్య మేతత్పశుభిర్నరాణాం/ జ్ఞానం హి తేషా మధికో విశేషో/ జ్ఞానేన హీన్యా పశుభిస్సమానాః’ అని పూర్వకవి సంస్కృతంలో పలికాడు. ఆహార నిద్రా భయ మైథునాలు మనుషులకు, జంతువులకు సమానమే! మిగిలిన జంతు సమూహం నుంచి మనిషిని వేరు చేసే లక్షణం జ్ఞానం మాత్రమే! జ్ఞానమే గనుక లేకుంటే, మనుషులకు, జంతువులకు తేడా ఏమీ ఉండదు.అందువల్ల జంతువుల కంటే జ్ఞానులైన మనుషులకు నానా విషయాలలో అవసర పరిజ్ఞానమూ అనవసర పరిజ్ఞానమూ సహజ లక్షణం. అందులో భాగంగానే మనుషులకు నిద్ర గురించిన పరిజ్ఞానం ఉండటం అంతే సహజం. నిద్ర ఎప్పుడు రావడం సహజమో, ఎంతసేపు నిద్రపోవాలో, సుఖనిద్రకు ఎలాంటి పరిసరాలు, పరిస్థితులు అనుకూలిస్తాయో మనుషులకు బాగా తెలుసు. బహుశా, ఈ జ్ఞానభారం వల్లనే నిద్రలేమి సమస్యలు కూడా మనుషుల్లోనే ఎక్కువ. ‘ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు’ అని మనకో నానుడి ఉంది. కొంత వరకు ఆ మాట నిజమే కావచ్చు గాని, సర్వసుఖాలు అందుబాటులో ఉన్నా, కంటి నిండా కునుకు లేక తిప్పలు పడే మనుషులు ప్రపంచమంతటా లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. ‘నిద్ర మంచిది, మరణం మెరుగైనది; అయితే, అత్యుత్తమమైనదేదీ ఇంకా పుట్టలేదు’ అని జర్మన్ కవి, రచయిత హేన్రిక్ హేనీ అన్నాడు. మరణాన్ని మనవాళ్లు శాశ్వతనిద్రగా అభివర్ణిస్తారు. శాశ్వతనిద్రలోకి జారుకునేలోగా మనిషికి జీవనయాత్ర తప్పదు. జీవనయాత్ర సజావుగా సాగడానికి ప్రతిరోజూ తగినంత నిద్ర అవసరం. ప్రశాంతమైన నిద్రతోనే మనశ్శరీరాలు జవజీవాలను పుంజుకుంటాయి. దైనందిన నిత్య నైమిత్తిక కార్యకలాపాలకు సంసిద్ధమవుతాయి. రోజంతా పనిచేసి అలసి సొలసిన శరీరానికి విశ్రాంతి, మనసుకు ప్రశాంతత అవసరం. ఈ రెండూ నిద్రతోనే దొరుకుతాయి. అయితే, సంక్లిష్టమయమైన ఆధునిక జీవనశైలి మనుషులను నిద్రకు దూరం చేస్తోంది. ‘కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది/ కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది’ అన్నాడు మనసుకవి ఆత్రేయ. మనసుకు కుదురు లేనప్పుడు పట్టేది చెదురు మదురు నిద్రే! చెదురు మదురు నిద్రలో తీపికలలు కాదు, పీడకలలు వస్తాయి. ‘కంటికి నిద్రవచ్చునె? సుఖంబగునె రతికేళి? జిహ్వకున్/ వంటక మిందునే? యితర వైభవముల్ పదివేలు మానసం/బంటునె? మానుషంబుగల యట్టి మనుష్యున కెట్టివానికిన్/ గంటకుడైన శాత్రవుడొకండు తనంతటి వాడు గల్గినన్’ అన్నాడు శ్రీనాథుడు. ఈ పద్యం ‘కాశీఖండం’లోనిది. ఇది వింధ్యుడి స్వగతం. వింధ్యుడికి సమ ఉజ్జీ మేరువు. సూర్యుడు మేరువు చుట్టూ ప్రదక్షిణంగా పయనిస్తాడు. దేవతలు మేరుపర్వతాన్నే గౌరవిస్తారు. మేరువు కన్నా తానేమీ తక్కువ కాకున్నా, తనకు దక్కని గౌరవం మేరువుకు దక్కడం పట్ల అసూయతో రగిలిపోయే వింధ్యుడి కంటికి కునుకు పట్టకపోవడం సహజమే కదా! పురాణాల్లో మేరువు, వింధ్య పర్వతాలే అయినా, శ్రీనాథుడు రాసిన ఈ పద్యం మాత్రం మానవ ప్రవృత్తులకు అద్దం పడుతుంది. నిద్రను కరవు చేసే అనేకానేక కారణాల్లో సమ ఉజ్జీ అయిన ప్రత్యర్థితో తలెత్తే స్పర్థ కూడా ఒకటి.నిద్ర పట్ల అవగాహన మనుషులకు ప్రాచీనకాలం నుంచి ఉండేది. నిద్రకు భంగం కలిగించే అంశాలు, ప్రశాంతమైన నిద్ర ఆవశ్యకతను నాటి మానవులు బాగానే గుర్తించారు. ప్రాచీన నాగరికతలలో నిద్రను దేవతగా ఆరాధించేవారు. కావ్య పురాణేతిహాసాల్లో నిద్ర ప్రస్తావన విరివిగా కనిపిస్తుంది. రామాయణంలో కుంభకర్ణుడి నిద్ర, ఊర్మిళాదేవి నిద్ర సుదీర్ఘకాల నిద్రలకు ఉదాహరణలు. ఆకలి దప్పులను, నిద్రను జయించడానికి విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బల అతిబల విద్యలను ఉపదేశించిన ఉదంతం కూడా రామాయణంలో ఉంది. అరణ్యవాస కాలంలోను, లంకలో రామరావణ యుద్ధకాలంలోను బల అతిబల విద్యలు లక్ష్మణుడికి బాగా అక్కరకు వచ్చాయి. అరణ్యవాసానికి వెళ్లినది మొదలుకొని, రావణ సంహారం తర్వాత శ్రీరామ పట్టాభిషేకం వరకు లక్ష్మణుడు నిద్రపోలేదు. అంతకాలమూ అతడి అర్ధాంగి ఊర్మిళ నిద్రపోతూనే ఉంది. సరిగా రామ పట్టాభిషేకం జరుగుతుండగా, లక్ష్మణుడికి నిద్ర ముంచుకొచ్చి రెప్పలు మూతబడ్డాయి. అప్పుడు తన అవస్థకు తానే నవ్వుకున్నాడు లక్ష్మణుడు. పట్టాభిషేక సమయంలో లక్ష్మణుడు నవ్విన నవ్వును అక్కడ ఉన్న ప్రముఖుల్లో ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం చేసుకున్నారు. అదంతా వేరే కథ. పురాణాల ప్రకారం నిద్రకు దూరంగా ఎక్కువకాలం గడిపిన రికార్డు లక్ష్మణుడిదే! అయితే, నూయెన్ న్యోక్ మై కిమ్ అనే యాభయ్యేళ్ల వియత్నాం మహిళ గడచిన ముప్పయ్యేళ్లుగా కనీసం నిమిషమైనా నిద్రపోలేదట! ఇన్నాళ్లుగా నిద్రపోకున్నా, ఆమె ఆరోగ్యంగా ఉండటం చూసి వైద్యులు సైతం విస్తుపోతున్నారు. ఈ నిద్రలేని నీలాంబరి ఉదంతం ఒక నిద్రారాక్షసం. -
పశ్చిమాసియా ఓ మందు పాతర!
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్పై దాడికి ఇరాన్ సన్నాహాలు చేస్తున్నట్టు తాజా వార్తలు సూచిస్తున్నాయి. పశ్చిమాసియాలో తిష్ఠవేసి ఉన్న అమెరికా సైన్యాలు కూడా ఇజ్రాయెల్కు రక్షణగా నిలవడానికి మోహరింపు మొదలుపెట్టాయి. ఇరాన్లో ఆ దేశపు అతిథిగా ఉన్న సమయంలో హమాస్ రాజకీయ విభాగపు నేతను హతం చేయడం ద్వారా ఇజ్రాయెల్ పెద్ద సవాల్నే విసిరింది. గత అక్టోబర్ మాసంలో ఇజ్రాయెల్ పౌరులపై దాడి చేసిన హమాస్ దుస్సాహసం కంటే ఈ చర్య తక్కువదేమీ కాదు. ఇది ఇరాన్కు విసిరిన సవాల్! ఇజ్జత్ కా సవాల్గా ఈ చర్యను ఇరాన్ పరిగణించకుండా ఉంటుందని భావించలేము.ఇజ్రాయెల్ పాల్పడిన దుశ్చర్యకు కఠిన శిక్ష తప్పదనీ, ప్రతీకారం తీర్చుకుంటామనీ ఇరాన్ సుప్రీమ్ లీడర్ ఆయతుల్లా ఖమేనీ ఇప్పటికే ప్రకటించారు. ఇరాన్ యుద్ధంలో పాల్గొనడమంటే పశ్చిమాసియాలోని పలు ఉగ్రవాద సంస్థలు కూడా దాని వెన్నంటి ఉన్నట్టే! హమాస్తో పాటు లెబనాన్లో హెజ్బుల్లా, ఇరాక్, సిరియాల్లోని షియా మిలిషియాలు, యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు కూడా యుద్ధంలో పాల్గొంటారు. హౌతీ తిరుగుబాటుదారుల తడాఖా ఏమిటో ఇప్పటికే ప్రపంచ వాణిజ్యం చవిచూసింది.గాజాపై ఇజ్రాయెల్ ప్రారంభించిన ప్రతీకార దాడుల తర్వాత ఇరాన్ ఆదేశాల మేరకు యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. యూరప్ – ఆసియా దేశాల మధ్య జరిగే నౌకా వ్యాపారంలో సింహభాగం సూయెజ్ కెనాల్ ద్వారానే జరుగుతుంది. ఇది ప్రపంచ నౌకా వాణిజ్యంలో 30 శాతం. విలువ లక్ష కోట్ల డాలర్లు. యూరప్ వాణిజ్య నౌకలు మధ్యధరా సముద్రం నుంచి సూయెజ్ కెనాల్ ద్వారా ఎర్ర సముద్రంలోకి ప్రవేశించి ‘ఆఫ్రికా కొమ్ము’ (హార్న్ ఆఫ్ ఆఫ్రికా)గా పిలుచుకునే సోమాలీ ద్వీపకల్పానికి – అరబ్ ద్వీపకల్పానికి మధ్యనున్న సన్నని దారిగుండా బంగాళాఖాతంలోకీ, అక్కడి నుంచి హిందూ మహాసముద్రంలోకీ ప్రవేశిస్తాయి. అరబ్ ద్వీపకల్పానికి బంగాళాఖాతపు అంచున ఉన్న దేశం యెమెన్. యెమెన్లోని షియా తిరుగుబాటుదారులనే ‘హౌతీ’లుగా పిలుస్తున్నారు. హౌతీల దాడులకు భయపడి సూయజ్ నౌకా వాణిజ్యంలో 90 శాతం ఆగిపోయింది. యూరప్ నుంచి అట్లాంటిక్ సముద్రం ద్వారా ఆఫ్రికా ఖండపు ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ అంచును చుట్టి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించడానికి ఈ నౌకలకు రెండు వారాల అదనపు సమయం పట్టింది. భారీగా అదనపు వ్యయాన్ని భరించాల్సి వచ్చింది. వాణిజ్యాల్లోని అదనపు భారాన్ని అంతిమంగా మోయాల్సింది వినియోగదారులైన ప్రజలే! హౌతీల దాడుల ప్రభావం 50 దేశాల నౌకా వాణిజ్యంపై పడిందని గత జనవరిలోనే వైట్హౌస్ ప్రకటించింది.ఇరాన్ – ఇజ్రాయెల్ల మధ్యన నిజంగానే యుద్ధం ప్రారంభమైతే దాని విధ్వంసకర ప్రభావాన్ని మొత్తం ప్రపంచమే ఎదుర్కోవలసి వస్తుంది. ఇక ఆ ప్రాంతపు సంక్షోభం గురించి చెప్పవలసిన అవసరమే లేదు. ఇజ్రాయెల్ జరిపిన గాజా దాడుల్లోనే 40 వేలమంది చనిపోయారు. పుష్కర కాలం కింద ప్రారంభమైన సిరియా అంతర్యుద్ధంలో ఇప్పటివరకు నాలుగు లక్షలమంది ప్రాణాలు పోగొట్టుకున్నట్టు అంచనా. తీవ్రమైన మానవతా హననాన్ని ఈ ప్రాంతం చవిచూసింది. ఉన్న ఊరు విడిచిపోయినవారూ, కన్నబిడ్డల్ని అనాథల్ని చేసినవారూ లక్షల సంఖ్యలో ఉన్నారు. ఒక దశలో మధ్యధరా సముద్రపు అలల మీద శవాలు తేలియాడిన విషాద సన్నివేశాలను కూడా ప్రపంచం చూసింది. ఇక ఆర్థిక వ్యవస్థల విధ్వంసం, లక్షలాది ప్రజలు శరణార్థులుగా వలస వెళ్లడాలు యుద్ధ దేశాల్లో షరా మామూలే!పశ్చిమాసియా సంక్షోభంతో కానీ, దాని కారణాలతోగానీ ఎటువంటి సంబంధం లేని భారతదేశం కూడా యుద్ధం ప్రారంభమైతే తీవ్ర సంకట పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. హమాస్ నాయకుడు ఇస్మాయెల్ హనియా హత్య జరిగి మూడు రోజులు గడిచినా భారతదేశం నుంచి ఖండన మండనల వంటి అధికారిక ప్రకటనలేమీ రాలేదు. ‘వ్యూహాత్మక నిశ్శబ్దాన్ని’ పాటిస్తున్నామనుకోవాలి. నిజంగా కూడా భారత్ పరిస్థితి అటువంటిదే! రెండు దేశాలతో మనకు మంచి సంబంధాలున్నాయి. అంతకు మించి రెండు దేశాలతో అవసరాలు కూడా ఉన్నాయి.ఇరాన్తో భారత స్నేహ సంబంధాలు తరతరాల నాటివి. ఇరాన్ మీద అమెరికా ఆంక్షలు విధించిన సమయంలో మిత్రదేశంగా మనం బాసటగా నిలబడనప్పటికీ ‘చాబహార్ పోర్టు’ నిర్మాణ బాధ్యతలను మనకే అప్పగించి సౌహార్దం చాటుకున్న దేశం ఇరాన్. ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్తో కూడా భారత్ బంధం బాగా బలపడింది. భద్రత, మిలిటరీ వంటి అంశాల్లో రెండు దేశాల మధ్య స్నేహ ఒడంబడికలున్నాయి. భారతదేశ ఇంధన అవసరాల్లో అత్యధిక భాగం పశ్చిమాసియానే తీరుస్తున్నది. ఈ ప్రాంతంలోని దాదాపు అన్ని దేశాలతోనూ భారత్కు దౌత్య సంబంధాలున్నాయి.కొన్ని లక్షలమంది భారతీయులు ఈ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. ఏటా మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా ఈ ప్రవాసులు భారత్కు పంపిస్తున్నారు. ప్రవాసుల భద్రత పట్ల కూడా భారత్కు ఆందోళన ఉంటుంది. ఇటీవలనే యూఏఈ, జోర్డాన్, గ్రీస్లతో కలిసి ‘ఇండియా – మిడిల్ ఈస్ట్ – యూరోప్ ఎకనామిక్ కారిడార్’ను కూడా భారత్ ప్రారంభించింది. ఉద్రిక్తతల కారణంగా ఈ నడవా ఇంకా నడకను మొదలుపెట్టలేకపోయింది. ఇజ్రాయెల్, యూఏఈ, అమెరికాలతో కలిసి ఏర్పాటు చేసుకున్న ‘ఐ టూ – యూ టూ’ ప్లాన్ పరిస్థితి కూడా ఇంతే!ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి రెండు ధ్రువాల ప్రపంచంలో ఏ దేశమైనా ఏదో ఓ కూటమి వైపు మొగ్గవలసిన పరిస్థితులుండేవి. అలీన దేశాలకు కూడా మినహాయింపు లేదు. ఇప్పుడున్న పరిస్థితులను ఏకధ్రువ ప్రపంచంగా కూడా పిలువలేము. ఇది దేశాల మధ్య కీలక భాగస్వామ్యాల యుగం. భౌగోళిక – రాజకీయ, భౌగోళిక – ఆర్థిక అవసరాలను బట్టి ప్రాంతీయంగానూ, ఖండాంతర స్థాయుల్లోనూ ఈ వ్యూహాత్మక లేదా కీలక భాగస్వామ్య కూటములు ఏర్పాటవుతున్నాయి. ఇటువంటి భాగస్వామ్యాలు పశ్చిమాసియా దేశాలతో కూడా భారత్కున్నాయి. ప్రపంచంలోని మరే ఇతర ప్రాంతంలో తలెత్తే సంక్షోభం కంటే కూడా పశ్చిమాసియా సంక్షోభమే భారత్పై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఈ ప్రాంతంలో జరిగే యుద్ధం భారత్కు నిజంగా పీడకలే! కానీ, ఒక దేశపు దుశ్చర్యను ఖండించలేని స్థితిలో ఉన్న భారత్ యుద్ధాన్ని ఆపగలదని ఆశించలేము.ఇజ్రాయెల్... అమెరికా మాట వింటుంది. రష్యా – చైనాల మాటను ఇరాన్ వినే అవకాశం ఉంది. ఈ మూడు దేశాలు కలిసి సంయుక్తంగా యుద్ధాన్ని నివారించేందుకు పూనుకుంటాయా? అది సాధ్యమయ్యే పనేనా? అసలు యుద్ధం జరగకూడదని ఈ మూడు దేశాలు కోరుకుంటున్నాయా అనేది ముఖ్యమైన ప్రశ్న. యుద్ధం జరిగితే రష్యాకు పోయేదేమీ ఉండకపోవచ్చు. ఇరాన్, సిరియాలు మిత్ర దేశాలు. వాటికి కావలసిన ఆయుధాలను నూటికి నూరు శాతం రష్యానే ఎగుమతి చేస్తున్నది. ఇప్పటికే ఆయుధ ఎగుమతులు తగ్గిపోయిన రష్యాకు ఇదో ఊరటే! కోల్పోయిన ఒకనాటి ప్రాధాన్యత మళ్లీ ఆ ప్రాంతంలో దక్కడం కంటే కావల్సిందేముంది! ఉక్రెయిన్కు అండగా నిలబడిన అమెరికాకు పశ్చిమాసియాలో పాఠం చెప్పే అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటుంది?దేశాల మధ్య ఉద్రిక్తతలు, వైషమ్యాలు ఉండే పరిస్థితులపై చైనా, అమెరికాలకు అభ్యంతరాలు ఉండకపోవచ్చు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి యుద్ధాన్ని కోరుకోకపోవచ్చు. అమెరికాకు ఈ ప్రాంతంలో సైన్యం ఉన్నది. సైనిక స్థావరాలున్నాయి. ఇజ్రాయెల్ వంటి బలమైన శిష్య దేశాలు, సౌదీ వంటి మిత్ర దేశాలున్నాయి. వాటితో ప్రయోజనాలున్నాయి. ఇక్కడ యథాతథ స్థితి కొనసాగడం అమెరికాకు అవసరం. ఇక్కడి బలాబలాల సమతూకం చెదిరితే ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావం పడుతుంది.యుద్ధమే జరిగితే ఇజ్రాయెల్కు అండగా నిలవక తప్పని స్థితి అమెరికాది. ఒకవేళ అలా నిలబడకపోయినట్టయితే ప్రపంచవ్యాప్తంగా అమెరికా కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందాలు, ముఖ్యంగా చైనాకు వ్యతిరేకంగా ఇండో – పసిఫిక్లో కుదిరిన ఒప్పందాల్లో భాగస్వాములు అమెరికాను విశ్వసించకపోయే అవకాశం ఉంటుంది. సొంత దేశంలోని యూదు లాబీ అభీష్టానికి వ్యతిరేకంగా రాజకీయ నిర్ణయాలు అమెరికా తీసుకోగలదా అన్నది కూడా సందేహమే. కనుక యుద్ధంలో అమెరికా పాత్ర ఉంటుంది.ఇజ్రాయెల్తో పాటు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, ఖతార్ తదితర దేశాలు పశ్చిమాసియాలో అమెరికాకు సన్నిహితంగా ఉంటాయి. ఈ దేశాలతో అమెరికాకు బలమైన వాణిజ్య, సహకార సంబంధాలున్నాయి. యుద్ధం ఇజ్రాయెల్ వర్సెస్ అరబ్ ఘర్షణగా మారితే ఈ మిత్రదేశాలకు కొంత ఇబ్బందికరంగా పరిణమించవచ్చు. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ఈ మధ్యకాలంలో అమెరికా విద్యార్థులు పెద్ద ఎత్తున గళం విప్పుతున్నారు. కాన్వొకేషన్ కార్యక్రమాలను పాలస్తీనా అనుకూల నినాదాలతో హోరెత్తించారు. దేశంలోని యూదు లాబీకి దీటుగా వ్యతిరేక శక్తులు కూడా బలపడుతున్న సూచనల నేపథ్యంలో ఈ యుద్ధం అధికార పార్టీ డెమోక్రట్ల పుట్టిని ఎన్నికల్లో ముంచినా ముంచవచ్చు.ఏ రకంగా ఆలోచించినా యుద్ధ నివారణే అమెరికాకు ప్రస్తుత అవసరం. అందుకు ఇరాన్ను నియంత్రించవలసిన అవసరం ఉన్నది. రష్యా సహకారంతో చైనా ఈ పని చేయాలని అమెరికా కోరిక. చైనాకు ‘బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్’లో భాగమైన మౌలిక వసతుల ప్రాజెక్టులపై ఈ దేశాల్లో ఒప్పందాలున్నాయి. పశ్చిమాసియా యుద్ధం ఆర్థిక కారణాల రీత్యా చైనాకు కూడా ఆమోదయోగ్యం కాదని అమెరికా అంచనా. పశ్చిమాసియా సంక్షోభంలో అమెరికా కూరుకొనిపోయినట్లయితే ఇండో – పసిఫిక్లో తమను దిగ్బంధం చేసే ప్రయత్నాలు వెనుకడుగు వేస్తాయని చైనా దౌత్య నిపుణులు అంచనా వేసుకుంటే ఆశ్చర్యపడవలసిన పనిలేదు. ఇస్మాయెల్ హనియా హత్యను కూడా చైనా గట్టిగానే ఖండించింది. ఈ కోణంలో చూసినప్పుడు యుద్ధ నివారణకు చైనా చొరవ చూపే అవకాశాలు చాలా తక్కువ.పెత్తందారీ దేశాల ఎత్తుగడలు ఏ రకంగా ఉన్నా పశ్చిమాసియా ఇప్పుడు పేలడానికి సిద్ధంగా ఉన్న ఒక మందుపాతర లాగా కనిపిస్తున్నది. పర్షియా, మెసపుటోమియా, ఫొనీషియన్, ఈజిప్టు నైలునదీ నాగరికతలు విలసిల్లిన చారిత్రక ధన్యభూమి ఇప్పుడు దగ్ధగీతాన్ని వినిపిస్తున్నది. ప్రపంచ జనాభాలో పశ్చిమాసియా వాటా రెండున్నర శాతం దాటదు. కానీ 30 శాతం ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న ప్రాంతం ఇదే! సగటున తొమ్మిది శాతం జీడీపీని ఈ దేశాలు ఆయుధాల కోసం తగలేస్తున్నాయి. రష్యా మార్కెట్ ఇరాన్, సిరియాలు మాత్రమే! మిగతా మార్కెటంతా అమెరికాదే! ఈ దేశాలు ఆయుధాల మీద ఏటా వెచ్చిస్తున్న ఐదు లక్షల కోట్ల రూపాయల్లో భీముని వాటా అమెరికాదే. ఒకపక్క తుపాకులు చేరవేస్తూ, ‘కాల్చుకోకండి ప్లీజ్... జస్ట్ ఆడుకోండి’ అంటే కుదురుతుందా? అందుకే అమెరికా శాంతి ప్రబోధాలకు పెద్దగా విలువ ఉండదు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
పునః సమీక్ష జరగాలి!
కొద్దివారాలుగా కొనసాగుతున్న వివాదం కీలక ఘట్టానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా వైద్యవిద్యా కళాశాలల్లో ప్రవేశం కోసం ఏటా జరిపే జాతీయస్థాయి పరీక్ష ‘నీట్’లో అక్రమాలు జరిగాయన్న అంశంపై విచారణ చేస్తున్న దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నపత్రాల లీకైనమాట నిజమంటూనే, వ్యవస్థీకృతంగా భారీస్థాయిలో లీకులు జరగనందున పునఃపరీక్ష జరపాల్సిన అవసరం లేదని తేల్చే సింది. ‘నీట్’ వివాదంతో నెలన్నరగా నిద్ర లేని రాత్రులు గడుపుతున్న విద్యార్థులకూ, వారి తల్లితండ్రులకూ ఇది ఒకింత ఊరట, మరింత స్పష్టత. అభ్యర్థుల మానసిక ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని, దాదాపు 23 లక్షల మందికి పైగా హాజరైన పరీక్షను మళ్ళీ నిర్వహించాలని అనుకోకపోవడం మంచిదే. అయితే పేపర్ లీకులు, ఒకదాని బదులు మరొక ప్రశ్నపత్రం ఇవ్వడం, ఒకరి బదులు మరొకరు పరీక్షలు రాయడం, నిర్ణీత కేంద్రాల నుంచి మునుపెన్నడూ లేనంత మంది టాపర్లుగా అవతరించడం – ఇలా ‘నీట్’ నిర్వహణలో ఈసారి వివిధ స్థాయుల్లో జరిగిన అవకతవకలు అనేకం. వీటన్నిటితో వ్యవస్థపై ఏర్పడ్డ అపనమ్మకాన్ని తొలగించడం ఎలా అన్నది ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న. మొదట అసలు లోపాలు లేవని వాదించి, ఆనక తప్పుల్ని అంగీకరించినా కీలక చర్యలు చేపట్ట డానికి కార్యనిర్వాహక వ్యవస్థ వెనకాడడం చూశాం. చివరకు న్యాయవ్యవస్థ జోక్యంతో ప్రక్షాళన అవసరమనే అంశం చర్చకు వచ్చింది. సుప్రీమ్కోర్ట్ ఆదేశాలతో ‘జాతీయ పరీక్షా సంస్థ’ (ఎన్టీఏ) ‘నీట్’ పరీక్షా ఫలితాలను సవరించి, గురువారం ప్రకటించాల్సి వచ్చింది. భౌతికశాస్త్రంలో ఒక ప్రశ్నకు రెండు జవాబులూ సరైనవేనంటూ విద్యార్థులకు ఈ ఏటి పరీక్షలో గ్రేస్ మార్కులు కలిపిన ఘనత ‘నీట్’ది. అత్యధిక సంఖ్యలో టాపర్లు రావడానికీ అదే కారణమైంది. సదరు వివాదాస్పద ప్రశ్నకు సరైన జవాబు ఒకటేనంటూ సుప్రీమ్ జోక్యం తర్వాత ఐఐటీ – ఢిల్లీ నిపుణుల సంఘం ఖరారు చేసింది. దాంతో అయిదేసి మార్కులు కోతపడి, దాదాపు 4.2 లక్షల మంది విద్యార్థుల మార్కులు మారాయి. జూన్ 4న తొలుత ఫలితాలు ప్రకటించినప్పుడు టాప్ స్కోరర్ల సంఖ్య 61 కాగా, ఇప్పుడీ వివాదాలు, విచారణలు, మార్పుల తర్వాత అది 17కు తగ్గింది. మార్కులు, దరి మిలా ర్యాంకుల్లో మార్పులతో తాజా జాబితాను ఎన్టీఏ విడుదల చేయాల్సి వచ్చింది. పునఃపరీక్షఉండదని కోర్ట్ తేల్చేయడంతో, సవరించిన ర్యాంకుల్ని బట్టి ఇప్పుడిక ప్రవేశాలు జరVýæనున్నాయి. ఎంబీబీఎస్ చదువు కోసం పెట్టిన ఈ దేశవ్యాప్త ‘నీట్ – యూజీ’ పరీక్షలు లోపభూయిష్ఠమనీ, మరీ ముఖ్యంగా స్థానిక విద్యార్థుల అవకాశాలకు హానికరమనీ రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమైన ‘నీట్’ వద్దంటూ తమిళనాడు కొన్నేళ్ళుగా పోరాడుతుంటే, పశ్చిమ బెంగాల్ సైతం బుధవారం గొంతు కలిపింది. తాజాగా కర్ణాటక అసెంబ్లీ సైతం ‘నీట్’ వద్దని గురువారం బిల్లును ఆమోదించింది. సొంతంగా రాష్ట్రస్థాయి మెడికల్ ఎంట్రన్ టెస్ట్ పెడతామంటూ తీర్మానించింది. అది చట్టపరంగా సాధ్యమేనా, కేంద్రం, సుప్రీమ్ కోర్ట్ ఏమంటాయన్నది పక్కన పెడితే, ‘నీట్’ పట్ల పెరుగుతున్న అపనమ్మకం, రాష్ట్రాల్లో అసంతృప్తికి ఇది నిదర్శనం. అసలు ఒకప్పుడు ఎక్కడికక్కడ రాష్ట్రస్థాయి ప్రవేశపరీక్షలే ఉండేవి. దేశంలో వైద్యవిద్య చదవదలచిన పిల్లలు ప్రతి రాష్ట్రంలో పరీక్షలు రాసే ఈ శ్రమ, ఖర్చును తప్పించడం కోసం జాతీయస్థాయిలో అందరికీ ఒకే పరీక్ష ‘నీట్’ను ప్రవేశపెట్టారు. మంచి ఆలోచనగా మొదలైనా, ఆచరణలో అది అవకతవకలకు ఆస్కారమిస్తూ, విద్యార్థుల్ని మరింత ఒత్తిడికి గురి చేసేదిగా మారడమే విషాదం. మళ్ళీ పరీక్ష జరపనక్కర లేదని సుప్రీమ్ ప్రకటించింది కానీ, అసలు తప్పులేమీ జరగలేదని మాత్రం అనలేదని గుర్తించాలి. ఇప్పటికైతే పాట్నా, హజారీబాగ్ – ఈ రెండుచోట్లా పేపర్ లీకైనట్టు కోర్టు నిర్ధరించింది. అలాగే, మరిన్ని వివరాలు తవ్వి తీసేందుకు సీబీఐ దర్యాప్తు కొనసాగుతుందనీ స్పష్టం చేసింది. విద్యార్థుల కౌన్సిలింగ్ వగైరా కొనసాగించవచ్చని అనుమతిస్తూనే, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఎదురవకుండా, పరీక్షల నిర్వహణ మరింత మెరుగ్గా ఎలా నిర్వహించాలన్న దానిపై మార్గదర్శకాలు రానున్నట్టు పేర్కొంది. అభ్యర్థుల బంగారు భవిష్యత్తు ఆధారపడిన పరీక్ష లపై ఎన్టీఏలో నిర్లక్ష్యం ఎంతగా పేరుకుందో ఇటీవలి ‘నీట్’, యూజీసీ– నెట్ వివాదాలే నిదర్శనం. పరీక్షా కేంద్రాల ఎంపిక మొదలు కీలకమైన పనిని బిడ్డింగ్లో అవుట్ సోర్సింగ్కు అప్పగించడం దాకా లోపాలు అనేకం. అసలు ముందుగా ఎన్టీఏను ప్రక్షాళన చేయాలంటున్నది అందుకే. ‘నీట్’ సంగతే తీసుకున్నా పెన్ను– పేపర్ల విధానం నుంచి కంప్యూటర్ ఆధారిత ఆఫ్లైన్ పరీక్షకు మారాలని నిపుణుల మాట. ‘జేఈఈ’లో లాగా రెండంచెల పరీక్షా విధానం ఉండాలనే సూచనా వినిపిస్తోంది. సంపూర్ణ అధ్యయనం, సమగ్ర చర్చతో తగిన చర్యలు చేపట్టడం ఇక భవిష్యత్ కార్యాచరణ కావాలి. అసలు ఇవాళ దేశంలో అనేకచోట్ల చదువుల్లో పరీక్షా పత్రాల మొదలు పోటీపరీక్షల ప్రశ్నపత్నాల వరకు అన్నీ విపణిలో యథేచ్ఛగా లభిస్తున్న దుఃస్థితి. ఈ లీకుల జాడ్యాన్ని అరికట్టకపోతే ప్రతిభకు పట్టం అనే మాటకు అర్థం లేకుండా పోతుంది. రకరకాల పేపర్ లీకులతో తరచూ వార్తల్లో నిలుస్తున్న బిహార్ సైతం ఎట్టకేలకు లీకు వీరులను కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వ పరీక్షల (అక్రమాల నిరోధక) బిల్లును అసెంబ్లీలో బుధవారం ఆమోదించింది. అన్నిచోట్లా ఇలాంటి కఠిన చట్టాలు అవస రమే. అయితే, అమలులో చిత్తశుద్ధి, అంతకన్నా ముందు ఆ చట్టాల దాకా పరిస్థితిని రానివ్వ కుండా లీకులకు అడ్డుకట్ట వేయడం ముఖ్యం. ‘నీట్’ పునర్నిర్వహణకు కోర్టు ఆదేశించకున్నా, తప్పులు జరిగాయని తేటతెల్లమైంది గనక మన పరీక్షా వ్యవస్థలు, విధానాలపై పునఃసమీక్ష, ప్రక్షాళనకు దిగాలి. అదీ పారదర్శకంగా జరగాలి. ‘నీట్’ లీకువీరులకు కఠిన శిక్షతో అందుకు శ్రీకారం చుట్టాలి.