Railway police
-
చొరబాటు ప్రయాణం!
సాక్షి, హైదరాబాద్: మయన్మార్ నుంచి అక్రమ మార్గంలో భారత్లోకి చొరబడుతున్న రోహింగ్యాల్లో అనేక మంది నగరంలోనూ ఉంటున్నారా? అనే ప్రశ్నకు ఔననే అంటున్నాయి నిఘా వర్గాలు. వీరిలో అత్యధికులు హైదరాబాద్లోని పాతబస్తీతో పాటు శివారు ప్రాంతాల్లో స్థిరపడుతున్నట్లు చెబుతున్నాయి. కోల్కతాలోని సాంత్రాగచ్చి రైల్వే స్టేషన్లో అక్కడి రైల్వే పోలీసులు బుధవారం నలుగురు రోహింగ్యాలను పట్టుకున్నారు. వీళ్లు ఏళ్ల క్రితం అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చి నగరంలోని పాతబస్తీలో ఉంటున్నారని, తిరిగి బంగ్లాదేశ్ వెళ్లే ప్రయత్నాల్లో అక్కడి పోలీసులకు చిక్కారు. వీరి విచారణలో మయన్మార్ నుంచి భారత్ వరకు సాగుతున్న రోహింగ్యాల ‘ప్రయాణం’ వెలుగులోకి వచ్చింది. అక్కడి అలజడులతో ఇక్కడ దడ... బంగ్లాదేశ్తో పాటు మయన్మార్లో నెలకొన్న అంతర్గత పరిస్థితులపై ఈ అక్రమ వలసదారుల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఆయా దేశాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తిన ప్రతిసారీ.. అనేక మంది రోహింగ్యాలు వాటిని విడిచిపెడుతున్నారు. వీరిలో అత్యధికులు నేరుగా భారత్కు వలస వస్తున్నారు. నగరంలోని పాతబస్తీతో పాటు శివార్లలో స్థిరపడుతున్నారు. తాజాగా మరోసారి బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలు చెలరేగడంతో అక్రమ వలసలు పెరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మాంగ్డో నుంచి టెక్నాఫ్ నగరానికి.. మయన్మార్లోని వివిధ ప్రాంతాలకు చెందిన రోహింగ్యాలు అడవుల వెంట కాలిబాటన నడుస్తూ ఆ దేశంలోని మాంగ్డో అనే ప్రాంతానికి చేరుకుంటున్నారు. రాత్రి వేళల్లో చిన్న చిన్న పడవలపై నఫ్ నదిని దాటుతున్న రోహింగ్యాలను బంగ్లాదేశ్లో ఉన్న దళారులు రిసీవ్ చేసుకుని, భద్రత బలగాల కంట పడకుండా టెక్నాఫ్ అనే నగరానికి తీసుకువెళ్తున్నారు. అక్కడి నుంచి బస్సుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద రోహింగ్యాల శరణార్థి శిబిరం ఉన్న కాక్స్ బజార్కు వీళ్లు వచ్చి చేరుతున్నారు. అక్కడ ఉండగానే అనేక మంది ఐక్యరాజ్య సమితి శరణార్థి కార్డు పొందుతున్నారు. అక్కడ శరణార్థి శిబిరంలో కొన్నాళ్లు తలదాచుకుని బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చేరుకుని అక్కడి నుంచి ఇండో–బంగ్లా సరిహద్దుల్లోని భోమ్రా ప్రాంతానికి బస్సుల్లో వస్తున్నారు. భద్రతా బలగాల కళ్లుగప్పి ఇచ్ఛామతి నది దాటి భారత్లోకి ప్రవేశిస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు లబ్దిదారులుగా... కాక్స్ టౌన్లో పనులు చేసుకుంటే నెలకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకే సంపాదన ఉంటుందని, అదే హైదరాబాద్ లాంటి నగరాల్లో రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదిస్తున్నామని సాంత్రాగచ్చిలో చిక్కిన రోహింగ్యాలు మహ్మద్ ఆలం, రియాసుల్ ఇస్లాం, బేగం దిల్బార్, రబీల్ ఇస్లాం పశ్చిమ బెంగాల్ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. అందుకే నగరానికి అక్రమ వలసదారుల్లో అనేక మంది జీవనోపాధి కోసమే వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ నుంచి అనేక వైపులకు..ఇలా రెండు దేశాల్లోని నదులు దాటి పశ్చిమ బెంగాల్లోని బసిర్హట్ ప్రాంతానికి చేరుకున్న ఈ శరణార్థులు అక్కడ నుంచి హౌరాకు వచ్చి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్తో పాటు బిహార్, జమ్మూ కశ్మీర్లకు వెళ్తున్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఏ ప్రాంతానికి వెళ్లినా తాము పశ్చిమ బెంగాల్ వాసులమంటూ ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారు. అద్దె ఇంటి కరెంట్ బిల్లు ఆధారంగా, వ్యవస్థాగతంగా ఉన్న లోపాలను వాడుకుంటున్న వీళ్లు మీ సేవ కేంద్రాల నిర్వాహకుల సాయంతో ఓటర్ ఐడీలు పొందుతున్నారు. దీని ఆధారంగా ఆధార్, రేషన్ కార్డు, పాస్పోర్ట్ ఇలా వరుసగా గుర్తింపు కార్డులు తీసుకుంటున్నారు. -
రూ.4 కోట్ల విలువైన గంజాయి దహనం
సాక్షి,యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా తుక్కాపురంలో సికింద్రాబాద్ రైల్వే పోలీసులు బుధవారం రూ.4 కోట్ల విలువైన 1,575 కిలోల గంజాయిని దహనం చేశారు. 2021 నుంచి 2023 వరకు సికింద్రాబాద్, వరంగల్, కాచిగూడ, కాజీపేట, నిజామాబాద్, నల్లగొండ, హైదరాబాద్, వికారాబాద్ రైల్వేస్టేషన్ల పరిధిలో ఈ గంజాయిని పట్టుకున్నట్లు రైల్వే ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. కోర్టు ఉత్తర్వుల మేరకు గంజాయిని దశల వారీగా తుక్కాపురంలోని రోమా ఇండస్ట్రీస్ మెడికల్ వేస్టేజ్ కంపెనీలోని బాయిలర్లో వేసి దహనం చేశారు. సికింద్రాబాద్ అర్బన్ పరిధిలో రూ.1,44,75,000 విలువ చేసే 579 కిలోల గంజాయి, సికింద్రాబాద్ రూరల్ పరిధిలో రూ.24,50,000 విలువ చేసే 98.68 కిలోల గంజాయి, ఖాజీపేట డివిజన్లో రూ.2.24 లక్షల విలువ చేసే 896.70 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు రైల్వే ఎస్పీ వివరించారు. ఆస్తులు జప్తు చేస్తాంఎవరైనా గంజాయిని అక్రమంగా రవాణా చేసినా, విక్రయించినా వారి ఆస్తులు జప్తు చేస్తామని రైల్వే ఎస్పీ చందనా దీప్తి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర, ఒడిశా నుంచి గంజాయి దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతోందన్నారు. గంజాయి రవాణాను అరికట్టేందుకు రైల్వే పోలీసులతో రహస్య బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైళ్లలో ఎవరైనా అనుమానాస్పదంగా బ్యాగులు పెడితే వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆమె వెంట రైల్వే డీఎస్పీలు ఎస్.ఎన్. జావేద్ అలీ, టి.కృపాకర్, ఇన్స్పెక్టర్లు, జీఆర్పీ పోలీసులు ఉన్నారు. -
మీ మొబైల్ ఫోన్ పోయిందా..ఇకపై నిశ్చింతగా ఉండండి
-
రూ.3 కోట్ల నగదు పట్టివేత
నక్కపల్లి(అనకాపల్లి జిల్లా)/ఆదోని సెంట్రల్: జాతీయ రహదారిపై వేంపాడు టోల్ప్లాజా వద్ద కారులో తరలిస్తున్న రూ.2,07,50,000 నగదును పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ విభీషణ్రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం రాత్రి వేంపాడు టోల్ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేపట్టామని, తుని నుంచి విశాఖ వెళ్తున్న ఒక కారును ఆపి చూడగా లోపల ఐదు బ్యాగుల్లో రెండుకోట్ల ఏడు లక్షల యాభైవేలరూపాయల నగదు లభించిందన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన వజ్రపు వెంకటేశ్వరరావు,యాదవరాజు కారులో ఈ నగదు తీసుకెళ్తున్నట్లుతెలిపారు. తాము ధాన్యం వ్యాపారం చేస్తున్నట్లు వీరు చెప్పారని, ఈ నగదుకు సంబంధించి ఎటువంటి పత్రాలు చూపించలేదన్నారు. నగదుతోపాటు, కారును కూడా సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రూ. కోటి నగదు స్వాదీనం రైల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.కోటి నగదును స్వాధీనం చసుకున్నట్లు రైల్వే డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీర్ తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని రైల్వే పోలీస్ స్టేషన్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శనివారం అర్ధరాత్రి దాటాక రైల్వే ఎస్పీ చౌడేశ్వరి ఆధ్వర్యంలో గుంతకల్ డివిజన్ పరిధిలో రైళ్లలో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. ఆదోని పట్టణానికి చెందిన కోల్కర్ మహమ్మద్ అనే వ్యక్తి నిజామాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే రైల్లో ప్రయాణిస్తూ ఆదోనిలో దిగాడని, రైల్వే పోలీసులు బ్యాగులు తనిఖీ చేయగా రూ.1,00,95,450 నగదు గుర్తించినట్లు తెలిపారు. విచారణలో అతడు నగదుకు సంబంధించి ఎటువంటి రశీదు అందజేయలేదన్నారు. స్వా«దీనం చేసుకున్న నగదును నిబంధనల మేరకు ఆదాయపు పన్నుశాఖకు అప్పగిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో అక్రమంగా డబ్బులు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటువంటి ఘటనలకు సంబంధించి ప్రయాణికులు 9440627669 నంబర్కు సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి తగిన పారితోషికం అందిస్తామని తెలిపారు. -
ఏ తల్లి కన్న బిడ్డనో.. దర్యాప్తునకు రైల్వేపోలీస్ ప్రత్యేక బృందం!
కామారెడ్డి క్రైం: ఏ తల్లి కన్న బిడ్డనో.. ఏడాదిన్నర వయస్సులో కన్నవారికి దూరమై వారం రోజులుగా ఐసీడీఎస్ అధికారుల సంరక్షణలో ఉంది. కన్నవారి కోసం పరితపిస్తూ దీనంగా చూస్తోంది. గత గురువారం కామారెడ్డి రైల్వే స్టేషన్లో ఓ చిన్నారిని గుర్తు తెలియని మహిళ వదిలేసి వెళ్లిన విషయం తెలిసిందే. తోటి ప్రయాణికులు గమనించి రైల్వే పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఆ చిన్నారి నిజామాబాద్ బాలల సంరక్షణ విభాగం వద్ద ఉంది. అయితే ఆ పాప ఎవరు.. ఆమెను ఎవరు వదిలి వెళ్లారు.. ఎందుకు వదిలేశారు అనే విషయాలు ఇప్పటికీ అంతుపట్టడం లేదు. ఆమెను ఎక్కడి నుంచి, ఎవరు తీసుకుని వచ్చారు అనే విషయాలను తెలుసుకోవడానికి కామారెడ్డి రైల్వే పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. అకోలా రైలు కామారెడ్డికి రాగానే సదరు చిన్నారి రైలులోని మెట్లకు దగ్గరగా కూర్చుని ఏడుస్తుందని కొందరు చెప్పగా, ఓ వృద్ధురాలు రైలు దిగి పాపను ప్లాట్ఫాంపై వదిలి వెళ్లిందని మరి కొందరు చెప్పుకొచ్చారు. వాస్తవం ఏమిటనే దానిపై స్పష్టత రాలేదు. రైల్వే స్టేషన్లోని టికెట్ బుకింగ్ కౌంటర్ దగ్గర మాత్రమే సీసీ కెమెరా ఉంది. ప్లాట్ఫాం పై జరిగే దృశ్యాలు అందులో కనబడవు. దీంతో పాపను కన్న తల్లే వదిలించుకుందా, లేక మరెవరైనా కావాలనే వదిలి వెళ్లారా అనేది తెలియలేదు. మహారాష్ట్రకు చెందిన చిన్నారి మాదిరిగా అనిపించడం తప్ప ఎలాంటి వివరాలు లేవు. కేసు నమోదు చేసి విచారణ బాలల సంరక్షణ ఉల్లంఘన, ఐపీసీ సెక్షన్ 317 కింద రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. రైల్వే స్టేషన్కు ఎవరైనా తీసుకువచ్చారా అనే కోణంలో మొదట విచారించారు. అందుకు ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని మంగళవారం కామారెడ్డిలోని అన్ని కూడళ్లు, రైల్వే స్టేషన్ దారి గుండా ఉండే సీసీ కెమెరాలను అన్నింటినీ పరిశీలించారు. ఎలాంటి ఆధారం దొరకలేదు. దీంతో చిన్నారి రైలులోనే కామారెడ్డికి చేరినట్లు నిర్ధారణకు వచ్చారు. తదుపరి విచారణ నిమిత్తం రైల్వే పోలీసులు అకోలా నుంచి కామారెడ్డి వరకు ఉన్న అన్ని రైల్వే స్టేషన్లు, వాటి పరిసర ప్రాంతాల్లో ఉండే సీసీ ఫుటేజీలను పరిశీలించే పనిలో ఉన్నారు. ఇందు కోసం అకోలా, నాందేడ్, ముత్కేడ్, ఉమ్రి, ధర్మాబాద్, బాసర, నిజామాబాద్ రైల్వే స్టేషన్లలో సీసీ ఫుటేజీల పరిశీలన, విచారణ జరపాల్సి ఉంది. బుధవారం నుంచి ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో ఆయా స్టేషన్లలో విచారణ జరుపనున్నట్లు తెలిసింది. ఎలాగైనా కేసును చేధించి సదరు చిన్నారిని కన్నవారి చెంతకు చేర్చాలనీ, వాస్తవాలను వెలికి తీయాలని కామారెడ్డి రైల్వే పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. -
టూరిస్టులతో గుంజీలు తీయించిన రైల్వే పోలీసులు
పనాజీ: కర్ణాటక గోవా సరిహద్దులో పర్యాటక ప్రాంతమైన దూధ్ సాగర్ జలపాతాలను దగ్గరగా చూసేందుకు నిబంధనలకు విరుద్ధంగా రైల్వే పట్టాలపై నడుచుకుంటూ వెళుతున్న పర్యాటకులను రైల్వే పోలీసులు అడ్డుకుని వారితో గుంజీలు తీయించారు. రైలులో గోవా వెళ్తుండగా మార్గమధ్యలో కిటికీల్లోంచి కనిపించే అందమైన పర్యటక దృశ్యం దూద్ సాగర్ జలపాతాలు. దూరం నుంచి చూస్తేనే అంత ఆహ్లాదంగా ఉండే ఈ జలపాతాలను దగ్గరగా చూడాలని కొందరు ఔత్సాహికులైన పర్యాటకులు ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. గతంలో అడవి గుండా జలపాతాలను చేరేందుకు మార్గం ఉండేది. కానీ ఇటీవల ఇక్కడికి సమీపంలోని మైనాపీ జలపాతాల వద్ద ఇద్దరు వ్యక్తులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో ఈ దోవను మూసివేశారు. దీంతో పర్యాటకులు దూధ్ సాగర్ చేరుకోవడానికి రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్లడం ప్రారంభించారు. అది ఇంకా ప్రమాదమని రైల్వే పోలీసులు అనేకమార్లు పర్యాటకులను హెచ్చరిస్తున్నా వారు దీన్ని పట్టించుకోవడం లేదు. ఆదివారం అయితే వందల కొద్దీ పర్యాటకులు ఈ మార్గం గుండా వెళ్తూ రైల్వే పోలీసుల కంటపడ్డారు.దీంతో చిర్రెత్తుకొచ్చిన రైల్వే పోలీసులు నిబంధనలను అతిక్రమించిన వందల టూరిస్టులతో గుంజీలు తీయించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది. A huge crowd who set out to watch Dudhsagar Waterfalls in Goa were seen on the railway tracks after authorities denied them entry As per social media accounts, some of them were also asked to perform squats by Railway Police personnel as punishment#Dudhsagarwaterfall pic.twitter.com/jh7uzHcJiR — ET NOW (@ETNOWlive) July 16, 2023 దక్షిణ పశ్చిమ రైల్వే వారు ట్విట్టర్ వేదికగా దయచేసి దూధ్ సాగర్ జలపాతాలను రైలులో నుండే చూసి ఆస్వాదించండి. రైలు పట్టాలెక్కి కాదు. అలా చేస్తే ఇకపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. We urge you to savour the beauty of Dudhsagar Falls from WITHIN your coach. Walking on/along tracks not only endangers your own safety but is also an offence under Section 147, 159 of Railway Act. It can also endanger safety of trains. (1/2) pic.twitter.com/Puj7hKh5JF — South Western Railway (@SWRRLY) July 16, 2023 ఇది కూడా చదవండి: విహారం మిగిల్చిన విషాదం.. కళ్ళముందే ఘోరం.. -
రైల్వే పోలీసు అమానుషం.. నిద్రిస్తున్న వారిపై నీళ్లు పోసి..
పూణే: పూణే రైల్వే స్టేషన్లో అమానుషమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. రైలు రావడం ఆలస్యమైన కారణంగానో మరేదైనా కారణం వల్లనో ఆదమరిచి నిద్రిస్తున్న ప్రయాణికులు కొంతమందిని నిద్ర లేపడానికి నిర్దాక్షిణ్యంగా వారి మొహం మీద నీళ్లు చల్లాడు ఓ సీఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్. ఈ దృశ్యాన్ని చరవాణిలో బంధించిన ఓ యువకుడు సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దీనిపై స్పందిస్తూ పూణే డివిజనల్ రైల్వే మేనేజర్ ఇందు దూబే ఇది అమానుషం అన్నారు. రైళ్ల రాకపోకలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియని అనిశ్చితిలో ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో సేదదీరడం సర్వసాధారణంగానే మనం చూస్తూ ఉంటాం. రైల్వే ప్లాట్ ఫారం మీద నిద్రించడం నిబంధనలకు విరుద్ధమే. అయినా ఆ విషయాన్ని అర్ధమయ్యేలా చెప్పడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ ఒక రైల్వే కానిస్టేబుల్ మాత్రం కర్కశంగా వ్యవహరించాడు. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో గాఢంగా నిద్రిస్తున్న ప్రయాణికుల మొహం మీద బాటిల్ తో నీళ్లు కుమ్మరించాడు. దీంతో ఏమైందోనని ఉలిక్కిపడి లేచారు ప్రయాణికులు. వారిలో ఒక పెద్దాయన కూడా ఉన్నారు. మానవత్వాన్ని తుంగలో తొక్కిన ఈ సన్నివేశాన్ని ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో "మానవత్వానికి నివాళులు" అని రాసి పోస్ట్ చేశాడు ఒక యువకుడు. క్షణాల్లో వైరల్ గా మారిన ఈ వీడియోను ముప్పై లక్షల కంటే ఎక్కువ మంది చూశారు. వీరిలో అత్యధికులు రైల్వే కానిస్టేబుల్ పై విమర్శలు గుప్పిస్తూ కామెంట్లు పెడుతున్నారు. RIP Humanity 🥺🥺 Pune Railway Station pic.twitter.com/M9VwSNH0zn — 🇮🇳 Rupen Chowdhury 🚩 (@rupen_chowdhury) June 30, 2023 రైల్వే స్టేషన్లలో ఇతరులకు అడ్డంకిగా ఎక్కడ పెడితే అక్కడ నిద్రించడం నిబంధనలకు విరుద్ధం. ఆ విషయాన్ని వారికి మర్యాదపూర్వకంగానూ, గౌరవంగా అర్ధమయ్యేలా కౌన్సెలింగ్ చెయ్యాలి గానీ ఈ విధంగా మొహాన నీళ్లు చల్లడం తీవ్ర విచారకరమని అన్నారు రైల్వే డివిజనల్ మేనేజర్ ఇందు దూబే. నెటిజన్లు ఈ సంఘటనపై మిశ్రమ స్పందనలు వ్యక్తం చేశారు. కొంతమంది రైల్వే కానిస్టేబుల్ ను నిందించగా మరికొంత మంది అతడికి మద్దతుగా నిలిచారు. ఇది కూడా చదవండి: ఆవుపై సింహం దాడి.. ఆ రైతు ఏం చేశాడంటే.. -
కరెంట్ షాక్తో 40 మంది మృతి?
భువనేశ్వర్/న్యూఢిల్లీ: ఒడిశాలో ఘోర రైలు ప్రమాద ఘటనలో ఘటనాస్థలి నుంచి స్వాధీనం చేసుకున్న దాదాపు 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవని తెలుస్తోంది. దుర్ఘటన తాలూకు కొత్త విషయం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. సంబంధిత వివరాలను గవర్నమెంట్ రైల్వే పోలీస్(జీఆర్పీ) మంగళవారం వెల్లడించింది. ‘ప్రమాదం జరిగినపుడు చెల్లాచెదురుగా పడిన బోగీలు పై నుంచి వెళ్తున్న ఓవర్హెడ్ లోటెన్షన్(ఎల్టీ) విద్యుత్ తీగలకు తగిలాయి. దీంతో విద్యుత్ తీగలు తెగి కొన్ని బోగీలపై పడ్డాయి. అప్పటికే ధ్వంసమైన బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులు ఈ విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయి ఉంటారు. అందుకే దాదాపు 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవు’ అని ఎఫ్ఐఆర్లో నమోదుచేసినట్లు సబ్ ఇన్స్పెక్టర్ పి.కుమార్ నాయర్ చెప్పారు. మార్చురీలో వందకుపైగా మృతదేహాలు రైలు ప్రమాదంలో 278 మంది మరణించగా 177 మంది ప్రయాణికుల మృతదేహాలను వారి బంధువులు గుర్తుపట్టారు. దాంతో ఈ మృతదేహాల అప్పగింత ప్రక్రియ పూర్తయింది. తలలు తెగి, ప్రమాదంలో నుజ్జునుజ్జయి అసలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైన మృతదేహాలను.. తమ వారి ఆచూకీ కోసం మార్చురీకి వచ్చిన వారూ గుర్తించలేకపోతున్నారు. ఘటన జరిగిన తర్వాత మృతదేహాలు రెండు మూడు చోట్లకు సరిగా ప్యాక్చేయకుండానే తరలించిన కారణంగా కొంతమేర కుళ్లి దుర్వాసన వస్తున్నాయి. సీబీఐ దర్యాప్తు షురూ ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఈ దుర్ఘటన వెనుక కుట్ర కోణం ఉందంటూ అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు మంగళవారం బాలాసోర్ జిల్లాకు చేరుకున్నారు. బాలాసోర్ రైల్వే పోలీసులు రైల్వే చట్టంలోని ఈ నెల 3న వివిధ సెక్షన్ల కింద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను సీబీఐ అధికారులు స్వీకరించారు. స్థానిక పోలీసులు నమోదు చేసి కేసును దర్యాప్తు ప్రక్రియలో భాగంగా మళ్లీ రిజిస్టర్ చేసి, దాన్ని సొంత ఎఫ్ఐఆర్గా నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు మొదలుపెట్టారు. ఎల్రక్టానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థలో మార్పులు చేయడం వల్లే రైలు ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని రైల్వేశాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. సమగ్ర దర్యాప్తు కోసం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖ కార్యకలాపాలపై తమకు కొంత పరిజ్ఞానం ఉందని సీబీఐ అధికారి ఒకరు చెప్పారు. కేసు దర్యాప్తులో భాగంగా రైలు సెక్యూరిటీ సిబ్బంది, ఫోరెన్సిక్ నిపుణుల సాయం కూడా తీసుకుంటామని తెలిపారు. జాయింట్ డైరెక్టర్ (స్పెషల్ క్రైమ్) విప్లవ్కుమార్ చౌదరి నేతృత్వంలో ఆరుగురు సభ్యుల సీబీఐ బృందం మంగళవారం మధ్యాహ్నం బహనాగ బజార్ రైల్వేస్టేషన్ సమీపంలోని ఘటనా స్థలానికి చేరుకుంది. ఘటనాస్థలి, సిగ్నల్ గదిని క్షుణ్నంగా పరిశీలించింది. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, సిబ్బందిని ప్రశ్నించనుంది. -
పిల్లల అక్రమ రవాణా ముఠా అరెస్టు
సాక్షి, హైదరాబాద్: బాలకార్మికులుగా మార్చేందుకు తరలిస్తున్న పిల్లలను రాష్ట్ర మహిళా భద్రత విభాగం యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ కాపాడింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జీఆర్పీ (గవర్నమెంట్ రైల్వే పోలీస్), ఆర్పీఎఫ్, బచ్పన్ బచావో ఆందోళన్ ఎన్జీఓతో కలసి చేపట్టిన ఈ ఆపరేషన్లో మొత్తం 26 మంది చిన్నారులను కాపాడినట్టు రాష్ట్ర మహిళా భద్రత విభాగం అదనపు డీజీ శిఖాగోయల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన 13 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు పిల్లలను ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లో విజయవాడ నుంచి సికింద్రాబాద్కు తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో అధికారులు ఆ పిల్లలను రక్షించేందుకు ఆపరేషన్ చేపట్టారు. వీరందరినీ హైదరాబాద్లోని వివిధ కర్మాగారాల్లో పనిచేయించేందుకు తీసుకువస్తున్నట్టు అధికారులకు తెలిసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మాటు వేసిన పోలీసులు మొత్తం ఎనిమిది మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 374, 341ల కింద సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పట్టుబడిన నిందితులను పశ్చిమ బెంగాల్కు చెందిన రంజాన్ మోల్లా, షేక్ సైదులు, ప్రియారుల్షేక్, జాకీర్ అలీ, సురోజిత్ సంత్రా, జార్ఖండ్కు చెందిన పింటుదాస్, హైదరాబాద్ చార్మినార్కు చెందిన సుసేన్ తుడు, అబ్దుల్ అల్మాని మోండేల్గా గుర్తించారు. కాపాడిన 26 మంది పిల్లలను సైదాబాద్లోని ప్రభుత్వ హోమ్కు పంపినట్టు అధికారులు తెలిపారు. పిల్లల అక్రమ రవాణా ముఠా సభ్యులను పట్టుకున్న సిబ్బందిని అదనపు డీజీ శిఖాగోయల్ అభినందించారు. -
కూలీ చేతికి రూ. 1.4 లక్షల ఫోన్..ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ఓ రైల్వే కూలీ చేతికి సుమారు రూ. 1.4 లక్షల ఫోన్ దొరికింది. ఐతే అతను ఆ ఫోన్ని నేరుగా రైల్వే పోలీసులకు ఇచ్చేసి తన నిజాయితీని చాటుకున్నాడు. ఈ ఘటన ముంబైలోని దాదర్ స్టేషన్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..దశరత్ దౌండ్ అనే రైల్వే కూలి దాదార్ రైల్వే స్టేషన్లో కూలీగా 30 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అతని రోజువారీ సంపాదన రూ. 300. ఐతే అతను ఎప్పటిలానే ఆరోజు కూడా అమృత్సర్కి వెళ్లే రైలు ఆగి ఉన్న ఫ్లాట్ ఫాం 4 వద్ద తన పనిని ముగించుకుని ఇంటికి పయనమవుతున్నాడు. ఆ క్రమంతో రాత్రి సుమారు 11.40 గంటల సమయంలో ఒక ఖరీదైన ఫోన్ కనిపించింది. అది ఫ్లాట్ఫాంపై నడుస్తుండగా సీటింగ్ ఏరియాలో పడి ఉండటంతో అక్కడున్న ప్రయాణికులను ఆ ఫోన్ గురించి వాకబు చేస్తే మాది కాదనే చెప్పారు. దీంతో దశరత్ నేరుగా రైల్వే పోలీసులకు అసలు విషయం చెప్పి ఆ ఫోన్ని ఇచ్చేశాడు. ఆ తర్వాత పోలీసులు ఆ ఫోన్ ఎవరిదని అని ట్రేస్ చేస్తుండగా..అది అమితాబచ్చన్కి విశ్వసనీయ మేకప్ ఆర్టిస్ట్ దీపక్ సావంత్కి చెందన ఫోన్ అని తేలింది. దీంతో పోలీసులు ఆ ఫోన్ని బాధితుడు సావంత్కి అందజేసి ఈ విషయం చెప్పడంతో అతను ఒక్కాసారిగా ఆశ్చర్యపోయాడు. తన ఫోన్ తనకు తిరిగి లభించినందుకు బహుమతిగా ఆ కూలికి రూ. 1000 కూడా ఇచ్చాడు సావంత్. ఆ కూలీని పోలీసుల తోపాటు సావంత్ కుటుంబం కూడా ఎంతగానో ప్రశంసించింది. ఈ మేరకు కూలీ దశరత్ మాట్లాడుతూ.. ఈ ఘటనను మర్చిపోయానని, సడెన్గా పోలీసుల నుంచి కాల్ రావడంతో ఈ విషయం గురించి తెలిసిందని చెబుతున్నాడు. అయినా తనకు గాడ్జెట్లపై ఎలాంటి అవగాహన లేదని, పైగా తాను ఎవరి వస్తువుని తన వద్ద ఉంచుకోనని చెప్పాడు. ఏదీఏమైనా ఇలాంటి వ్యక్తులు ఉండటం అత్యంత అరుదు. (చదవండి: క్లాస్ రూం చుట్టూ పరిగెత్తించి మరీ టీచర్పై దాడి.. పేరెంట్స్ అరెస్టు) -
అనాథ శవాలకు ఆత్మ బంధువులు
సాక్షి, నెల్లూరు/బారకాసు: నెల్లూరు నగర పరిధిలోని రైల్వే ట్రాక్పై ఛిద్రమైన తల.. కాళ్లు, చేతులు వేర్వేరుగా పడి ఉన్నాయి. చుట్టూ ఈగలు ముసురుతుండగా.. ఆ శవం దుర్వాసన వెదజల్లుతోంది. పోలీసులు సైతం ముక్కుమూసుకుని నిలబడగా.. పెద్దోడు, చిన్నోడు అనే వ్యక్తులు చకచకా వచ్చి శరీర భాగాలను సేకరించారు. వాటన్నిటినీ ఓ దుప్పట్లో కట్టుకుని వాహనంలోకి ఎక్కించారు. అక్కడి నుంచి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత ఛిద్రమైన శవ భాగాలను శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు జరిపారు. కట్టె కాలుతుండగా ఎగిసిపడే చితి మంటలు.. వారి ఔదార్యానికి సలాం చేస్తాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. వేలాది మృతదేహాలకు పెద్దోడు, చిన్నోడు అసామాన్య సేవలందిస్తున్నారు. రైలు బోగీలకు మంటలంటుకున్న వేళ 2011లో నెల్లూరు రైల్వేస్టేషన్లో తమిళనాడు ఎక్స్ప్రెస్ బోగీల్లో మంటలు చెలరేగి ఘోర ప్రమాదం జరిగింది. చాలామంది ప్రయాణికులు అగ్నికీలల్లో చిక్కుకుని గుర్తు పట్టలేనంతగా కాలిపోయారు. ఆ సమయంలో చిన్నోడు, పెద్దో డు కృషి అంతా ఇంతా కాదు. వీరిద్దరి సహకారంతోనే మంటల్లో కాలిపోయిన వారి మృతదే హాలను బోగీల్లోంచి వెలికితీసి రక్త సంబంధీకు లకు అప్పగించారు. కరోనా విజృంభించిన సమ యంలోనూ పెద్దోడు, చిన్నోడు ప్రాణాలకు తెగించి మృతదేహాలకు అంత్యక్రియలు చేయించారు. ఇదీ పెద్దోడు కథ.. విశాఖపట్టణానికి చెందిన బత్తిన గురుమూర్తి (పెద్దోడు) 30 ఏళ్ల క్రితం కుటుంబ కలహాల కారణంగా సొంతూరిని వదిలేసి నెల్లూరు చేరుకున్నాడు. ప్రధాన రైల్వేస్టేషన్లో ఫుట్పాత్నే నివాసంగా మార్చుకుని కడుపు నింపుకునేందుకు చేతనైన పనిచేస్తూ జీవనం సాగిస్తుండగా.. ఓ రోజు రాత్రి రైలు పట్టాలపై శవం ఉందన్న సమాచారం రైల్వే పోలీసులకు అందింది. అర్ధరాత్రి వేళ శవాన్ని ఎవరు తీస్తారని ఎదురుచూస్తున్న సమయంలో వారికి గురుమూర్తి కనిపించాడు. అతడిని నిద్రలేపిన పోలీసులు శవాన్ని తీసుకొచ్చేందుకు రావాలని కోరారు. పెద్దోడు కాదనకుండా శవం ఉన్న ప్రాంతానికి వెళ్లి.. అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహం భాగాలను ఓ సంచిలో వేసుకుని చెక్కబండిపై నెట్టుకుంటూ పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. దీంతో పోలీసులు గురుమూర్తికి రూ.300 ఇచ్చారు. ఆ నగదుతో 4 రోజులపాటు కడుపునింపుకున్న పెద్దోడు మరోసారి కూడా అదే తరహాలో అనాథ మృతదేహాన్ని తరలించాడు. ఇలా మొదలైన ఆయన జీవన ప్రయాణం 30 ఏళ్లుగా అనాథ శవాలకు ఆత్మబంధువుగా.. పోలీసులకు సహాయకారిగా మారాడు. నెల్లూరు నగర పరిసరాల్లో ఎక్కడ ప్రమాదవశాత్తు లేదా ఇతరత్రా కారణాలతో ఎవరైనా మృతి చెందితే పోలీసుల నుంచి ఫోన్కాల్ వచ్చేది పెద్దోడికే. చిన్నోడు ఎవరంటే.. నెల్లూరులోని కొత్తూరుకు చెందిన సురేష్కుమార్ (చిన్నోడు) కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంటి నుంచి వచ్చేశాడు. ప్రధాన రైల్వేస్టేషన్ ఎదుట ఫుట్పాత్నే నివాసంగా మార్చుకున్నాడు. యాచిస్తూ కడుపు నింపుకునే సురేష్కు గురుమూర్తితో స్నేహం ఏర్పడింది. అప్పటినుంచి ఎక్కడ మృతదేహం ఉన్నా పోలీసుల నుంచి పిలుపు రాగానే ఇద్దరూ కలసి వెళ్తున్నారు. అలా చేయడంలోనే తృప్తి అది మంచో చెడో మాకు తెలియదు. శవాలు కనిపిస్తే సాయం చేయాలనిపిస్తుంది. పోలీసులిచ్చే డబ్బు కోసం కాదు. మాకు అందులోనే తృప్తి ఉంటోంది కాబట్టే ఆ పనికి ఒప్పుకుని చేస్తున్నాం. – గురుమూర్తి (పెద్దోడు) అప్పుడప్పుడూ బాధేస్తుంది ఏదైనా ప్రమాదంలో ఎవరైనా చనిపోతే వారి పరిస్థితిని చూసి బాధ కలుగుతుంది. వారి శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా పడి ఉంటాయి. కొన్నిసార్లు కుక్కలు సైతం పీక్కు తింటుంటాయి. కుళ్లి పోయిన శవాలనూ చూస్తుంటాం. ఇలాంటప్పుడు మాకు బాధ కలుగుతుంది. – సురేష్కుమార్ (చిన్నోడు) -
ఓవరాక్షన్.. రియాక్షన్.. రైలు ఆలస్యం జైలుకు పంపింది!
సాక్షి, సిటీబ్యూరో: నగరం నుంచి తన వ్యాపార పనులపై చెన్నై వెళ్లిన ఉదయ్ భాస్కర్ అక్కడి రైల్వే స్టేషన్లో హడావుడి చేశాడు. తాను ప్రయాణించాల్సిన రైలు ఆలస్యం కావడంతో ఆ సమయంలో ‘అధిక మర్యాదలు’ డిమాండ్ చేశాడు. దీనికోసం తాను రైల్వే ఉన్నాధికారి బంధువునంటూ బిల్డప్ ఇచ్చాడు. ఆరా తీసిన జీఆర్పీ పోలీసులు అసలు విషయం తెలుసుకుని రైల్లో ప్రయాణిస్తున్న భాస్కర్ను కట్పాడిలో అరెస్టు చేసి వెనక్కు తీసుకెళ్లారు. శనివారం చోటు చేసుకున్న ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన ఉదయ్ భాస్కర్ అల్యూమినియం వ్యాపారి. వ్యాపార పనుల నిమిత్తం తరచు చెన్నై వెళ్లి వస్తుండేవాడు. ఇటీవల చెన్నై అతను శుక్రవారం రాత్రి నగరానికి తిరిగి వచ్చేందుకు చార్మినార్ ఎక్స్ప్రెస్లో టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నాడు. అయితే ఆ రైలు నిర్దేశిత సమయం కన్నా ఆలస్యంగా బయలుదేరుతున్నట్లు భాస్కర్ తెలుసుకున్నాడు. దీంతో ఆ సమయం వరకు వేచి ఉండటానికి వెయిటింగ్ హాల్ వద్దకు వెళ్లారు. అది అప్పటికే నిండిపోవడంతో సమీపంలో ఉన్న వీఐపీ లాంజ్పై అతడి కన్ను పడింది. దాంట్లోకి ప్రవేశించేందుకు ఉన్నతాధికారి బంధువు అవతారం ఎత్తాడు. తాను రైల్వే బోర్డు చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన వినయ్ కుమార్ త్రిపథి సమీప బంధువునంటూ అక్కడి సిబ్బందికి చెప్పాడు. అది నిజమని నమ్మని వీఐపీ లాంజ్ ఉద్యోగులు లోపలికి అనుమతించారు. రైల్వే ఉద్యోగులపై చిందులు.. ఎంతైనా తమ శాఖకు చెందిన ఉన్నతాధికారి బంధువు కదా అనే ఉద్దేశంతో కాస్త మర్యాదపూర్వకంగా నడుచుకున్నారు. దీంతో భాస్కర్లో కొత్త ఆలోచనలు పుట్టకువచ్చాయి. తనకు దక్కాల్సినంత గౌరవం దక్కట్లేదని, సరైన ఆహారం, పానీయాలు అందించట్లేదంటూ హంగామా చేశాడు. అక్కడ ఉన్న రైల్వే ఉద్యోగులపై చిందులు తొక్కడంతో పాటు దీనిపై తాను త్రిపథికి ఫిర్యాదు చేస్తానని గద్ధించాడు. తనతో మర్యాదగా నడుచుకోని ప్రతి ఒక్కరినీ ఈశాన్య రాష్ట్రాలకు బదిలీ చేయిస్తానంటూ లేనిపోని హడావుడి చేశాడు. చివరకు తన రైలు ఎక్కి హైదరాబాద్కు బయలుదేరాడు. అయితే ఇతడి ఓవర్ యాక్షన్ను గమనించిన రైల్వే ఉద్యోగులకు అనుమానం రావండంతో రిజర్వేషన్ చార్ట్ ఆధారంగా భాస్కర్ వివరాలు సేకరించారు. వీటిని రైల్వే బోర్డు చైర్మన్ కార్యాలయానికి పంపడం ద్వారా అతడికి, త్రిపథికి ఎలాంటి సంబంధం లేదని తెలుసుకున్నారు. దీంతో వీఐపీ లాంజ్ ఉద్యోగులు చెన్నై సెంట్రల్ స్టేషన్లోని గవర్నమెంట్ రైల్వే పోలీసులకు (జీఆర్పీ) ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న జీఆర్పీ ఆ సమయంలో భాస్కర్ ప్రయాణిస్తున్న రైలు కట్పాడి జంక్షన్ సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి అధికారుల సమాచారం ఇవ్వడం ద్వారా రైల్లో ఉన్న భాస్కర్ను దింపించారు. శనివారం ఉదయం కట్పాడి చేరుకున్న జీఆర్పీ బృందం భాస్కర్ను అరెస్టు చేసి చెన్నై తీసుకువెళ్లింది. రైల్వే కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్కు తరలించింది. చదవండి: సైబర్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్న వైద్యుడు -
సికింద్రాబాద్ అల్లర్లు: ‘సాక్షి’ చేతిలో రిమాండ్ రిపోర్ట్.. కీలక అంశాలు వెలుగులోకి..
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో రైల్వే పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో రూ.20 కోట్ల నష్టం వాటిల్లినట్టు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. ఏ2 నుంచి ఏ12 వరకు నిందితులు తప్పించుకుని తిరుగుతున్నట్లు రిమాండ్ రిపోర్ట్లో రైల్వే పోలీసులు పేర్కొన్నారు. ‘రైల్వే స్టేషన్ బ్లాక్’ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ రమేష్గా గుర్తించారు. రమేష్ను ఏ3గా రిమాండ్ రిపోర్ట్లో చేర్చారు. చదవండి: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన: మా పిల్లలకు ఏ పాపం తెలియదు..! డిఫెన్స్ కోచింగ్సెంటర్లే అభ్యర్థులను రెచ్చగొట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. రిమాండ్ రిపోర్ట్లో సాయి అకాడమీ సుబ్బారావు పేరు కనిపించలేదు. ఈ నెల 17న మధ్యాహ్నం 12:10కి స్టేషన్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ బ్లాక్ వాట్సాప్ గ్రూప్లో 500 మంది సభ్యులున్నట్లు గుర్తించారు. రిమాండ్ రిపోర్ట్లో మొత్తం 56 మందిని రైల్వే పోలీసులు చేర్చారు. వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టి విధ్వంసానికి కుట్ర పన్నినట్లు పోలీసులు తేల్చారు. -
ప్రైవేటు అకాడమీల సహకారంతోనే విధ్వంసానికి పాల్పడ్డ విద్యార్థులు
-
స్తంభించిన ప్రజా రవాణాతో ఆగమాగం (ఫోటోలు)
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాడి వెనక సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాడి వెనక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రైవేటు అకాడమీల సహకారంతోనే విద్యార్థులు విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అకాడమీల్లోనే కొంతమంది నిరసనకారులకు షల్టర్ ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు. సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు ఆధ్వర్యంలో ఆర్మీ విద్యార్థులు రైల్వేస్టేషన్కి వచ్చినట్లు పోలీసుల విచారణంలో తేలింది. విద్యార్థులకు వాటర్ బాటిల్లు, బటర్ మిల్క్, పులిహోర ప్యాకెట్లను ప్రైవేటు ఆర్మి కోచింగ్ అకాడమీలు సప్లై చేసినట్లు పోలీసులు గుర్తించారు. 10 ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలకు చెందిన నిరసనకారులు ఆందోళనలో పాల్గొన్నట్లు పోలీసులు తేల్చారు. చదవండి: (అగ్నిపథ్ నిరసనలు.. విశాఖ రైల్వేస్టేషన్ మూసివేత) -
Agnipath Protests: రైల్వేస్టేషన్ వదిలి వెళ్లిపోండి.. లేదంటే మళ్లీ కాల్పులు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పోలీసులు కాల్పులు జరిపినా ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. ఆందోళనకారులు రైల్వే పోలీసులపై రాళ్లు రువ్వుతున్నారు. నాలుగు గంటలకు పైగా రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆందోళనకారులు రైల్వేస్టేషన్ వదిలి వెళ్లిపోవాలని రైల్వే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఆందోళన విరమించకపోతే మళ్లీ కాల్పులు జరుపుతామని హెచ్చరించారు. అయితే ఇప్పటికీ రైల్వే ట్రాక్లపై వేలాది మంది నిరసనకారులు ఉన్నారు. చదవండి: (Agnipath Protest: అప్రమత్తమైన రైల్వేశాఖ.. 71 రైళ్లు రద్దు) ఇదిలా ఉంటే, ఆందోనకారులు మాత్రం కాల్పులు జరపాలని ఎవరు ఆర్డర్ ఇచ్చారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'న్యాయం చేయాలని ఆందోళన చేస్తే కాల్పులు జరుపుతారా. న్యాయం అడిగితే చంపేస్తారా' అంటూ విద్యార్థులు రైల్వే పోలీసులపై మండిపడుతున్నారు. చదవండి: (Agnipath Protests Hyderabad: అమిత్షాతో కిషన్ రెడ్డి కీలక భేటీ) -
రైల్వే ప్రయాణికులకు ‘139’ టోల్ ఫ్రీ నంబర్
సాక్షి, అమరావతి: రైల్వే ప్రయాణికులు 139 టోల్ ఫ్రీ నంబర్ను ఉపయోగించుకోవాలని రైల్వే సలహా కమిటీ సూచించింది. రైల్వే పోలీసుల ప్రవర్తనపై సలహా కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. విశాఖపట్నంలో జరిగిన సమావేశం వివరాలను ఈస్ట్ కోస్ట్ రైల్వే అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్(ఆర్పీఎఫ్) సంజయ్ వర్మ మీడియాకు ఒక ప్రకటనలో తెలియజేశారు. రైల్వే ప్రయాణికులకు అవసరమైన సమాచారం, ఫిర్యాదులు, సహకారం కోసం 139 ఉపయోగపడుతుందన్నారు. ఈ టోల్ ఫ్రీ నంబర్పై పెద్ద ఎత్తున ప్రచార, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. రైల్వే పోలీసుల పనితీరుపై ఎలాంటి ఫిర్యాదులు లేవని, వారి పనితీరుపై అభినందనలు కూడా వచ్చాయని తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి సమస్య, ఇబ్బందులు వచ్చినా ప్రతి రైలులోను ఉండే ఆర్పీఎఫ్ సిబ్బందికి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. -
గురజాల అత్యాచార ఘటనపై సమగ్ర దర్యాప్తు
సాక్షి, అమరావతి: గురజాల రైల్వే హాల్ట్లో మహిళపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితులను వెంటనే పట్టుకోవాలని, కేసు దర్యాప్తును ముమ్మ రం చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ రైల్వే పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆమె విజయవాడ రైల్వే ఎస్పీకి లేఖ పంపారు. కేసు నమోదు చేసిన నడికుడి రైల్వే పోలీస్ సీఐ శ్రీనివాసరావుతో ఆమె ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలను ఆరాతీశారు. బాధితురాలి ఆరోగ్యంపై వాకబు చేశారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు రైల్వేతో పాటు పోలీసు శాఖ కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసును శరవేగంగా చేధించాలని కోరారు. బాధితురాలి ఆరోగ్యం కుదుటపడే వరకు ఆమెతోపాటు తనతో ఉన్న చంటిబిడ్డ సంరక్షణ బాధ్యతను మహిళా శిశు సంక్షేమ శాఖ చూసుకోవాలని ఆదేశించారు. -
ఏ జన్మ సంబంధమో..
వారి సావాసం శవాలతో.. వారి సంపాదన అంత్యక్రియలతో.. వారి నిత్య సంభాషణ ముడిపడేది చావుతో.. రైలు పట్టాల నుంచి రుద్రభూమి వరకు వారే. ఆఖరి దశ నుంచి అంత్యక్రియల వరకు వారే. రైలు తాకిడికి ఖండితమైపోయిన దేహాలకు, లోకం కంట పడకుండా పాడైపోయిన శరీరాలకు దిక్కూమొక్కూ వారే. ఎప్పటి రుణానుబంధమో అనాథ మృతదేహాలకు అన్నీ తామే అయ్యి సద్గతులు అందిస్తున్నారు వారు. ఏ జన్మ సంబంధమో వందలాది మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారు. ఈ పని చేసే వారిని ‘తోటి’ అని పిలుస్తారు. కోటికొకరు ఎన్నుకునే ఈ వృత్తిలో జిల్లా వారూ ఉన్నారు. జలుమూరు: రైలు కింద పడి ఒకరు మృతి చెందారు.. తోటీ రావాలి. రైలు ప్రమాదంలో ఒకరి మృతదేహం దొరికింది.. తోటీ రావాలి. ఒకరి శవం గుర్తు పట్టలేని స్థితిలో ఉంది.. తోటీని పిలవాలి. ముక్కలైపోయిన శరీరమొకటి పట్టాల పక్కన ఉంది...తోటీ రావాల్సిందే. శవం అన్న పేరు వినడానికి చాలా మంది భయపడతారు. అనడానికి కూడా ఆందోళన చెందుతారు. చూసేందుకు జంకుతారు. కానీ ఈ తోటీల బతుకంతా శవాలతోనే. జీతమెంత తీసుకుంటారో గానీ ఈ సత్కార్యాలు చేసి బోలెడంత పుణ్యంతో పాటు వారి కుటుంబీకుల ఆశీస్సులు కూడా అందుకుంటున్నారు వీరు. తెలిసిన వారి దహన సంస్కారాల్లో పాల్గొనడానికి మొహమాట పడే రోజుల్లో.. నిత్యం ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న గొప్ప మనుషులు వీరు. అనాథ శవాల పాలిట సంస్కార ప్రదాతలు ఈ ‘తోటీ’లు. పది మంది బృందం శ్రీకాకుళం జిల్లా తిలారు నుంచి శిర్లపాడు (ఇచ్ఛాపురం) వరకు, తిలారు నుంచి విజయనగరం వరకు పది మంది తోటీలు ఈ పని చేస్తుంటారు. స్టేషన్ల మధ్య జరిగే ప్రమాదాల సమాచారం అందుకున్న క్షణాల్లో ఇద్దరు చొప్పున అక్కడ ప్రత్యక్షమై అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. రైలు పట్టాల వెంబడి.. తోటీల అవసరం ఎక్కువగా ఉండేది రైలు పట్టాల వద్దే. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుని మృతదేహాలుగా మారిన వారికి వీరే దిక్కు. ప్రమాదాలు జరిగిన సందర్భాల్లోనూ వీరు ఠక్కున అక్కడ ప్రత్యక్షమవుతారు. సొంత మనుషుల్లా అన్నీ దగ్గరుండి చూసుకుంటారు. మృతదేహం రక్తపు మడుగులో ఉన్నా, కుళ్లిపోయి దుర్వాసన వస్తున్నా ఏ మాత్రం జంకు, సంకోచం లేకుండా అంతిమ సంస్కారాలు జరిపిస్తారు. వృత్తి సంతృప్తినిస్తోంది.. 15 ఏళ్లుగా ఈ వృత్తి చేస్తున్నాను. మొదటి ఏడాదిలో కొంత భయం ఉండేది. ఇప్పుడు అలవాటైపోయింది. గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలకు దహన సంస్కారాలు చేయడం పవిత్రంగా భావిస్తాం. ఈ వృత్తి సంతృప్తినిస్తోంది. – రాజారావు బంధువుల అంత్యక్రియల్లోనూ.. అనాథ శవాలతోపాటు కొన్ని సందర్భాల్లో మా బంధువుల మృతదేహాలకు కూడా దహన సంస్కారాలు చేశాను. అలాంటి సమయాల్లోనే మద్యం అలవాటైపోయింది. తెగిపడిన మృతదేహాలను ఏరి పోగు చేసి ఒక్క చోట చేర్చడానికి ధైర్యం కావాలి. ఈ 17 ఏళ్లలో వందల శవాలకు అంతిమ సంస్కారాలు చేశాను. – వెంకటరావు వారి సేవలు వెలకట్టలేనివి.. తోటీల సేవలు వెలకట్టలేనివి. మేం డబ్బులు ఇచ్చినా అనాథ శవాలకు దహన సంస్కారాలు, పాతిపెట్టడం వంటివి చేయడం సాధారణ విషయం కాదు. కొన్ని సందర్భాల్లో సొంత వారు కూడా దగ్గరకు రాలేని దుస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో వారు ఎంతో ధైర్యం చేసి ముందుకు వచ్చి ఆ పనులు చేస్తున్నారు. వారికి నిజంగా చేతులెక్కి మొక్కాలి – ఎస్.కె షరీఫ్, పలాస జీఆర్పీ ఎస్ఐ -
క్షణం ఆలస్యమై ఉంటే అంతే
సాక్షి, దొడ్డబళ్లాపురం(కర్ణాటక): కదులుతున్న రైలు నుండి పట్టాలపై పడబోయిన ప్రయాణికుడిని రైల్వే పోలీస్ చాకచక్యంతో రక్షించిన సంఘటన కారవార రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన కేంద్ర రక్షణ శాఖ అధికారి బీఎం దేసాయి (59)ని, కారవార రైల్వే పోలీస్ నరేశ్ రక్షించారు. ఆదివారం దేసాయి ఒకటవ ప్లాట్ఫాం మీద ఉన్న లగేజీ తీసుకోవడానికి కదులుతున్న ట్రైన్ నుండి దిగబోతూ కాలుజారి పట్టాలపై పడబోయాడు. అంతలో ఈ దృశ్యాన్ని చూసిన నరేశ్ తక్షణం అప్రమత్తమై దేసాయిని కాపాడాడు. ఈ వీడియోను కొంకణ రైల్వే శాఖ విడుదల చేసి ప్రయాణికులకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. చదవండి: నీ అశ్లీల వీడియో లీక్ చేస్తా.. మంత్రి కొడుక్కి బెదిరింపులు! -
పట్టాలపై మతిస్థిమితం లేని మహిళను కాపాడిన పోలీస్
పాలఘర్: ఈ మధ్య కాలంలో పోలీసులు సామాన్య ప్రజలను కాపాడిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యి నెటిజన్లను ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కోవకు చెందిన మరో వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. పట్టాలపైకి వెళ్లిన మతి స్థిమితం లేని మహిళను ఓ పోలీస్ కాపాడి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని వసాయ్లో చోటు చేసుకుంది. ఇక్కడ సదరు రైల్వే పోలీసు వేగంగా వస్తున్న లోకల్ రైలు నుంచి ఒక మహిళను కాపాడుతున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నెటిజన్లు ఆ రైల్వే పోలీసు అధికారిని తెగ మెచ్చుకుంటూ... కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: రూ. కోటి ఇవ్వు లేదా చంపేస్తాం: గ్యాంగ్స్టర్) వివరాల్లోకెళ్లితే... మతిస్థిమితం లేని ఓ మహిళ వసాయ్ రోడ్ రైల్వే స్టేషన్ వద్ద పట్టాల మధ్య నిలబడి ఉంది. ఈ క్రమంలో దహను-అంధేరి లోకల్ రైలు వస్తోంది. ఆమె ఎంతకు పట్టాలపై నుంచి బయటకు రాకపోవడంతో రైల్వే ఓవర్ బ్రిడ్జిపై ఉన్న పోలీసులు ఆమెను గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యారు. నాయక్ అనే రైల్వే పోలీస్ మోటర్ మ్యాన్కి రైలు ఆపేలా సంకేతం ఇవ్వమన్నాడు. ఈ మేరకు నాయక్ వెంటనే పరుగెత్తికెళ్లి పట్టాలపై ఉన్న ఆమెను ఫ్లాట్ఫాం పైకి లాగేశాడు. ఈలోపే రైలు ఆమె దగ్గరి వరకు వచ్చి ఆగింది. ఆ మతిస్థిమితం లేని మహిళ సుభద్ర సింధేగా గుర్తించినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సకాలంలో స్పందించి ఆమెను కాపాడిన నాయక్ను పోలీస్ ఉన్నత అధికారులు ప్రశంసించారు. (చదవండి: గజేంద్రుడి ఆకలి తీర్చిన వృద్ధురాలు..) -
తిరుపతి: ఒళ్లు గగుర్పొడిచే ఘటన
-
Tirupati: కానిస్టేబుల్ సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే ఘటన
సాక్షి, తిరుపతి: రైలు దిగేటపుడు ఎక్కేటపుడు జాగ్రత్తగా ఉండాలని ఎంత చెబుతున్నా కొందరు పట్టించుకోరు అంతే. అదే నిర్లక్ష్య ధోరణి. కన్ను మూసి తెరిచే లోపు ప్రాణాలు పోతున్నా.. క్షణంపాటు వేచి ఉండేందుకు ఇష్టపడరు. కానీ ఇలాంటి అజాగ్రత్త చర్యల పట్ల చాలా అప్రమత్తంగా ఉంటూ అక్కడి సిబ్బంది ప్రాణదాతలుగా నిలుస్తున్న ఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి తిరుపతి రేల్వే స్టేషన్లో బుధవారం ఉదయం చేసుకుంది. ఈ విషయం తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడవక మానదు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. రైలు ప్లాట్ఫాంపై ఆగుతుండగానే కదులుతున్న రైలు నుంచి ఒక మహిళ హడావిడిగా దిగేందేకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అదుపు తప్పింది. ఈ విషయాన్ని గమనించిన కానిస్టేబుల్ సతీష్ మెరుపు వేగంగా కదిలి ఆమెను వెనుకకు లాగారు. దీంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. లేదంటే రైలుకు, ప్లాట్పాంకు మధ్య ఉన్న గ్యాప్ ద్వారా ఆ మహిళ రైలు పట్టాలపైకి జారి పోయి ఉండేది. మొత్తానికి మహిళ సురక్షితంగా ఉండటంతో రైల్వే సిబ్బంది, తోటి ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సో.. బీకేర్ ఫుల్.. నిదానమే ప్రధానం. -
సికింద్రాబాద్ రైల్వే గ్రౌండ్లో రిపబ్లిక్ డే రిహర్సల్స్
-
భారీ చోరీ కేసును ఛేదించిన రైల్వే పోలీసులు
రేణిగుంట: వైఎస్సార్ జిల్లాకు చెందిన బంగారు నగల వ్యాపారి నగదు బ్యాగు చోరీ కేసును ఛేదించి రూ.23లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే డీఎస్పీ రమేష్బాబు వెల్లడించారు. స్థానిక రైల్వేస్టేషన్ జీఆర్పీ స్టేషన్లో బుధవారం విలేకరులకు రైల్వే డీఎస్పీ తెలిపిన వివరాలు...వైఎస్సార్ జిల్లా శంకరాపురానికి చెందిన నగల వ్యాపారి రేవూరి చౌడయ్య చెన్నైలో ఆభరణాలను కొనేందుకు రూ.61.5లక్షలను బ్యాగులో ఉంచుకుని గరుడాద్రి ఎక్స్ప్రెస్ రైలులో వెళుతుండగా పుత్తూరు స్టేషన్ వద్ద ఈ బ్యాగు చోరీకి గురైంది. ఈ సంఘటన గత ఏడాది అక్టోబర్ 30న చోటుచేసుకుంది. అప్పట్లో బాధితుని ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. రైల్వే డీజీపీ ద్వారకా తిరుమల, ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను నియమించి నిందితుల కోసం గాలించారు. కీలకమైన క్లూలు లభించడంతో ఎస్ఐలు అనిల్కుమార్, రారాజు, ప్రవీణ్కుమార్తో కూడిన సిబ్బంది ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా పొన్నేరి తాలూకా కృష్ణాపురం మెట్టు కాలనీకి చెందిన రాజేంద్రన్ అలియాస్ ఇదయరాజ(26), ఊతుకోటై మండలం సీతంజెరికి చెందిన సుబ్రమణి అలియాస్ బాటిల్ మణి(30)ను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.18.5లక్షల నగదు, 38 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక కిలో వెండి ఆభరణాలు, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, హోం థియేటర్తో సహా మొత్తం రూ.23లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు ఆంటోనీని త్వరలోనే అరెస్ట్ చేస్తామని, నిందితులను నెల్లూరు రైల్వే కోర్టులో హాజరు పరచనున్నట్లు రైల్వే డీఎస్పీ చెప్పారు. కేసు ఛేదనకు కృషి చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు. -
ల్యాప్టాప్లు, ఫోన్లు దొరికాయి.. తీసుకెళ్లండి
సాక్షి, తిరుపతి అర్బన్: తిరుపతి రైల్వే స్టేషన్లోని 4వ ఫ్లాట్ఫాంలో 2015 సంవత్సరం నవంబర్ 18వ తేదీన 7 మొబైల్స్, మూడు ల్యాప్ట్యాప్లు (వివిధ రంగుల్లో, వివిధ కంఫెనీలకు చెందినవి) గుర్తు తెలియని వ్యక్తులు వదిలిపెట్టి వెళ్లారు. ఆమేరకు రైల్వే ప్రభుత్వ పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాగా విశాఖపట్నం మువ్వలపాలెం పోలీస్స్టేషన్ వారు శుక్రవారం వాటిలో ఓ ల్యాప్టాప్, ఓ మొబైల్ ఫోన్కు చెందిన బిల్లులతోపాటు తగిన ఆధారాలతో రావడంతో వారికి తిరుపతి రైల్వే ప్రభుత్వ సీఐ రామకృష్ణ నేతృత్వంలో అందజేశారు. మిగిలిన 6 మొబైల్స్, రెండు ల్యాప్టాప్లకు చెందిన బిల్లులు తగిన ఆధారాలతో సీఐ రామకృష్ణను సంప్రదిస్తే వారికి అందజేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. వివరాలకు 0877 2225347, 94406 27638 సంప్రదించాల్సి ఉందని తెలియజేశారు. (చదవండి: బెడిసికొట్టి జనసేన కిడ్నాప్ డ్రామా) -
రగ్బీ టీం కోసం దొంగయ్యాడు!
అడ్డగుట్ట: రైల్వే ప్రయాణికులను టార్గెట్ చేసుకొని వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ తాత్కాలిక హోంగార్డును నిజామాబాద్ జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బుధవారం సికింద్రాబాద్లోని రైల్వే ఎస్పీ కార్యాలయంలో దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ అనురాధ మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన మోహన్దేవ్రావు చావన్ (28) నాందేడ్ జిల్లాలో హోంగార్డుగా పని చేస్తున్నాడు. ఒక టీంను తయారు చేసి రగ్బీ ఆడిపించాలనే ఉద్దేశంతో పలువురికి ఉచితంగా కోచింగ్ ఇచ్చేవాడు. ఈ క్రమంలో గేమ్కు సంబంధించి బాల్స్, డ్రెస్లు, ఇతర మెటీరియల్స్కు డబ్బులు లేకపోవడంతో ఈజీ మనీకి అలవాటుపడ్డాడు. నాందేడ్ జిల్లాలోని చిక్కల తండాకు చెందిన ప్రదీప్తో కలసి చైన్ స్నాచింగ్లు ప్రారంభించాడు. ఒకే ట్రైన్లో 8 స్నాచింగ్లు 2019 నుంచి మోహన్దేవ్రావు, ప్రదీప్లు ఒకే ఏడాదిలో 8 చోరీలు చేశారు. బాసర రైల్వే స్టేషన్లో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైలులోనే ఈ స్నాచింగ్లకు పాల్పడ్డారు. ఆభరణాలను ముంబైలో విక్రయించి సొమ్ము చేసుకున్నారు. మిగతా వాటిని విక్రయించేందుకు మోహన్ దేవ్రావు నిజామాబాద్ వచ్చాడు. దీనిపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు స్టేషన్లో అతన్ని పట్టుకున్నారు. విచారణ జరుపగా నేరాలను ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి 116 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1.50 లక్షలు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు ప్రదీప్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. -
ఇదీ ఓ రైల్వే పోలీస్ దీనగాధ..
సాక్షి, మంచిర్యాలక్రైం: ఒక్కటి కాదు.. రెండు కాదు.. సుమారు 250 కిలోమీటర్లు.. 29స్టేషన్లు.. ఆరు జిల్లాలు. వీటన్నిటికీ కలిపే ఒక్కటే పోలీస్స్టేషన్.. ఒకే ఒక్క ఎస్సై. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఆ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా..!! మంచిర్యాల రైల్వే పోలీస్స్టేషన్ (జీఆర్పీ) పరిధిలో ఆరు జిల్లాలు ఉన్నాయి. వీటి పరిధిలో 29 రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్ పరిధి సుమారు 250 కిలోమీటర్లు. మరోవైపు సిబ్బంది కొరత. ఇన్ని సమస్యల మధ్య రైల్వేస్టేషన్ విధులు కొనసాగిస్తోంది. ఎక్కడైనా ఎనిమిది గంటలు విధులు ఉంటే ఇక్కడి సిబ్బంది మాత్రం ఏకంగా 12 గంటలు పనిచేయాల్సి వస్తోంది. సికింద్రాబాద్ మొదలు కాజీపేట వరకు ఉన్న జీఆర్పీ పోలీస్స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బంది కూడా ఎనిమిది గంటలే పనిచేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే పనిష్మెంట్ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. సిబ్బంది లేమితో పర్యవేక్షణ కొరవడింది. ఫలితంగా రైలుమార్గం మీదుగా అక్రమంగా సరుకులు రవాణా అవుతున్నాయి. దొంగతనాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఉప్పల్ రైల్వేస్టేషన్ మొదలు.. సిర్పూర్ టౌన్ స్టేçషన్ వరకు.. ఇటు పెద్దపల్లి నుంచి జగిత్యాల వరకు ఒక్కరే ఎస్సై విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందినవారు ఉప్పల్ మొదలు సిర్పూర్టౌన్, పెద్దపల్లి నుంచి జగిత్యాల రైల్వేస్టేషన్ల మధ్య ఎలాంటి ప్రమాదాలు సంభవించినా.. ఏదైనా సంఘటన చోటుచేసుకున్నా సమాచారం కోసం మంచిర్యాల రైల్వే పోలీస్స్టేషన్ను ఆశ్రయించాల్సి వస్తోంది. సివిల్ పోలీస్ల సౌకర్యాలు ఇలా... సాధారణంగా మండలానికో పోలీస్స్టేషన్ ఉంటుంది. ఆ స్టేషన్ పరిధి సుమారు 25 నుంచి 30కిలోవీుటర్లు. ఎస్సై, ఒకరు లేదా ఇద్దరు ఏస్సైలు, నలుగురు హెడ్కానిస్టేబుళ్లు, 10 మంది కానిస్టేబుళ్లు, నలుగురు హోమ్గార్డులు ఉంటారు. ఎక్కడికి వెళ్లాలన్నా.. ఎస్సైకి వాహనం, సిబ్బందికి ద్విచక్రవానాలను ప్రభుత్వ సమకూర్చింది. అదే రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్న జీఆర్పీ (గవర్నమెంట్ రైల్వేపోలీస్) పోలీసులకు మాత్రం ఎలాంటి సౌకర్యాలూ లేవు. పైగా సివిల్ పోలీస్ స్టేషన్లో కంటే కేసులు ఎక్కువగానే నమోదు అవుతుంటాయి. దూరభారం ఎక్కువగానే ఉంటుంది. కనీసం ఎస్సై స్థాయి అధికారికీ వాహన సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. గుర్తుతెయని మృతదేహాలతో ఇబ్బంది రైలు ప్రమాదాలోŠల్ గుర్తుతెలియని మృతదేహాలు ఎక్కడోచోట కన్పిసూ్తనే ఉంటాయి. ఇలా ఏటా 50మంది వరకు చనిపోతారు. వీటిని ఆసుçపత్రికి తరలించేందుకు.. దహన సంస్కారాలు చేసేందుకు ఒక్కో శవానికి సుమారు రూ.3వేల వరకు ఖర్చవుతుంది. అన్ని పనులూ రైల్వే సిబ్బంది చేయాల్సిందే.\ రైల్వే (జీఆర్పీ) పోలీసుల పరిస్థితి ఇలా.. కాజీపేట నుంచి మహారాష్ట్ర వరకున్న రైలుమార్గంలో మంచిర్యాలలో మాత్రమే రైల్వేస్టేషన్ ఉంది. ఈ స్టేషన్ పరిధిలో ఓ ఎస్సై, ఐదుగురు హెడ్కానిస్టేబుళ్లు, 41 మంది కానిస్టేబుళ్లు కలిపి మొత్తం 47 మంది. దీని పరిధిలో మూడు ఔట్ పోస్టులున్నాయి. రామగుండం, బెల్లంపల్లి, కాగజ్నగర్ స్టేçషన్ల వద్ద ఏర్పాటు చేసిన ఔట్ పోస్టుల్లో ముగ్గురు హెడ్కానిస్టేబుళ్లు పని చేయాల్సి ఉండగా.. ఇద్దరే ఉన్నారు. ఈ మార్గంలో వెళ్తున్న రైళ్లలో దొంగతనాలు, ప్రమాదాలు, ఆత్మహత్యలు, కిడ్నాప్లు, అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. నిత్యం సుమారు 5నుంచి 10 వరకు కేసులు నమోదవుతాయి. 29స్టేషన్ల పరిధిలో 250 కిలోమీటర్ల మధ్య ఏ ప్రమాదం జరిగినా.. దొంగతనం జరిగినా మంచిర్యాల రైల్వేస్టేషన్కు రావాలి్సందే. సంఘటన జరిగిన స్థలానికి రైల్వేపోలీసులు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉప్పల్, సిర్పూర్ టౌన్ వంటి అటవి ప్రాంతాల్లో ఎవరైనా ప్రమాదానికి గురైనా.. ఆత్మహత్య చేసుకున్నా.. మృతదేహాలను పరిశీలించేందుకు వెళ్లాలంటే రైల్వే సిబ్బందికి నరకం కనిపిస్తోంది. సంఘటన జరిగిందని కూడా ఇతర శాఖల అధికారులు కనీసం సమాచారం ఇవ్వరని సిబ్బంది వాపోతున్నారు. గుర్తు తెలియని వారు ప్రమాదానికి గురై చనిపోతే.. మృతదేహాలను తరలించేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోందని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో సొంతంగా ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఇస్తున్న కేసుకు రూ.వె య్యి ఎటూ సరిపోవడం లేదంటున్నారు. ఇబ్బంది పడుతున్న ఆరు జిల్లాల ప్రజలు రైల్వే కేసులపై ఏ అవసరం వచ్చినా.. మంచిర్యాలకు రావాలి్సందే. ఉప్పల్ రైల్వేస్టేషన్ మొదలు సిర్పూర్టౌన్ వరకు, పెద్దపల్లి నుంచి జగిత్యాల వరకు ఉన్న రైలు ట్రాక్పైగానీ.. రైల్లో ఏ ప్రమాదం జరిగినా.. ఫిర్యాదు చేసేందుకు మంచిర్యాలకు రావాలి్సందే. దీంతో ఆరు జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంతోదూరం నుంచి ప్రయాసపడి వస్తే కొన్ని సందర్భాల్లో అధికారులు కలవకపోవడంతో చాలా ఇబ్బంది పడాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. అరకొర సిబ్బంది ఆరు జిల్లాల మీదుగా వెళ్తున్న రైలుమార్గంలో 29 రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఇన్ని స్టేషన్లలో 80 మంది సిబ్బంది పని చేయాల్సి ఉంటుంది. కానీ.. 47మంది మాత్రమే పని చేస్తున్నారు. కాగజ్నగర్, బెల్లంపెల్లి, స్టేషన్లకు ఎస్సై పోస్టు మంజూరు ఉన్నప్పటికీ ఇప్పటికీ భర్తీకాలేదు. మంచిర్యాల జీఆర్పీ పోలీస్స్టేషన్ ఎస్సై ఒక్కరే పర్యవేక్షణ చేయాల్సి వస్తోంది. సిబ్బంది కొరతతో ఎనిమిది గంటలు పనిచేయాల్సి ఉండగా.. 12 గంటలు చే యాల్సి వస్తోంది. ఫలితంగా సిబ్బంది అ నారోగ్యాల పాలవుతున్నామని సిబ్బంది వాపోతున్నారు. -
పాట వింటూ.. ప్రాణాలే కోల్పోయాడు..
ధర్మవరం టౌన్: ఇయర్ ఫోన్ పెట్టుకుని ఎంచక్కా పాటలు వింటూ నడుస్తున్నాడు.. అంతలోనే రైలు పట్టాలు.. సంగీతాస్వాదనలో మైమరచిపోయిన ఆ యువకుడికి రైలు వస్తున్న శబ్ధం వినిపించలేదు. సరిగ్గా పట్టాలు దాటుతుండగా.. రైలు ఢీకొట్టి దుర్మరణం పాలయ్యాడు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని పాతకుంట రైల్వేగేట్ వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని జోగోనికుంటకు చెందిన రమణారెడ్డి, లక్ష్మీదేవిల కుమారుడు సాయికుమార్రెడ్డి(21). ఓ ప్రైవేట్ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో కర్రీస్ తీసుకొచ్చేందుకని వెళ్లి ప్రమాదం బారినపడి అక్కడికక్కడే మృతిచెందాడు. బయటకు వెళ్లిన సాయికుమార్ ఎంతకూ రాకపోవడంతో బంధువులు చుట్టుపక్కల గాలించారు. ఈ క్రమంలో రైల్వే సిబ్బంది రాత్రి 12 గంటల ప్రాంతంలో పట్టాల వద్ద మృతదేహాన్ని గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. మృతుడి చెవిలో ఇయర్ఫోన్ ఇరుక్కుపోయి ఉంది. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సూపర్ ఫాస్ట్ క్షణాల్లో పైకి దూసుకురావడంతో..
రామగుండం: ఔను, ఈ కీమెన్ మృత్యు కోరల్లోకెళ్లి ప్రాణగండం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్ సమీపంలోని కుందనపల్లి రైల్వేగేటు వద్ద చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. కుందనపల్లి రైల్వేగేటు వద్ద కీమెన్ కత్తుల దుర్గయ్యతోపాటు మరికొంత మంది కార్మికులు రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల్లో నిమగ్నమయ్యారు. మూడు రైల్వే ట్రాకుల్లో ఒక ట్రాక్పై పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా గూడ్సు రైలు వస్తుండటంతో మరో ట్రాక్ మీదకు కార్మికులు చేరుకున్నారు. అప్పటికే అతి దగ్గరలో ఉన్న రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ క్షణాల్లో కీమెన్ దుర్గయ్యపై దూసుకొచ్చింది. అప్రమత్తమైన ఆయన ఇంజిన్ కిందకు దూరిపోయాడు. రెండు బోగీలు అతని పైనుంచి వెళ్లాయి. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు భయాందోళన చెందారు. రైలు కో పైలెట్ చాకచక్యంగా వ్యవహరించాడు. సడెన్ బ్రేక్ వేసి రైలును కొద్ది దూరంలో నిలిపివేశాడు. అప్పటికే కీమెన్ పైనుంచి రెండు బోగీలు వెళ్లడంతో బాధితుడు నుజ్జునుజ్జు అయి ఉంటాడని అందరూ భావించారు. కానీ దుర్గయ్య పట్టాల మధ్యలో ప్రాణాలు బిగపట్టుకొని పడుకుని ఉన్నాడు. ఎడమ కాలి ఎముక విరిగి ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అతడిని రైలు కింద నుంచి బయటకు లాగి హుటాహుటిన స్థానిక రైల్వే ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దుర్గయ్యకు ఎలాంటి ప్రాణపాయం లేదని వైద్యులు తెలిపారు. -
బిర్యానీలో చచ్చిన బల్లులను కలుపుతూ....
సాక్షి, గుంతకల్లు: బల్లి పడిని బిర్యానీని ఇచ్చారంటూ రైల్వే క్యాంటీన్ నిర్వాహకులను బెంబేలెత్తించి, నగదు దండుకోవాలనుకున్న ఓ ప్రయాణికుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం మధ్యాహ్నం ఛత్రపతి శివాజీ టర్మినల్–కోయంబత్తూరుకు వెళ్లే కుర్లా ఎక్స్ప్రెస్ గుంతకల్లు రైల్వే జంక్షన్కు చేరుకుంది. అందులో ప్రయాణిస్తున్న సుందర్పాల్ అనే ప్రయాణికుడు 4వ ప్లాట్ఫారంలో ఉన్న మారయ్య రైల్వే క్యాంటీన్లో వెజ్ బిర్యానీ కొనుగోలు చేశాడు. అనంతరం అందులో బల్లి పడిందంటూ నేరుగా వెళ్లి డిప్యూటీ రైల్వే స్టేషన్ మాస్టర్ జార్జ్, కమర్షియల్ మేనేజర్ అనూక్కు ఫిర్యాదు చేశాడు. కంగారు పడ్డ వారు వెంటనే రైల్వే ఆస్పత్రి వైద్యురాలు భార్గవిని పిలిపించి ప్రాథమిక చికిత్స చేయించారు. అదే సమయంలో రైల్వే అధికారులు విచారణ చేపట్టగా అసలు విషయం వెల్లడైంది. బాధితుడిగా భావిస్తున్న సుందర్పాల్ పచ్చి మోసగాడుగా రైల్వే అధికారులు తేలింది. కావాలనే అన్నంలో చచ్చిన బల్లులను కలిపి రైల్వే క్యాంటీన్ యజమానుల బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజేవాడిగా తెలుసుకున్నారు. ఇదే విషయాన్ని డీసీఎం కుమార్గౌరవ్, సీటీఐ వై.ప్రసాద్ స్పష్టం చేశారు. నాలుగు రోజుల క్రితం జబల్పూర్ రైల్వేస్టేషన్లో ఇలానే సమోసలో బల్లి వేసి నాటకమాడి ఆ కాంట్రాక్టర్ నుంచి రూ.30వేలు గుంజినట్లుగా తేలిందన్నారు. తిరిగి గుంతకల్లులోనూ అదే తరహాలో కాంట్రాక్టర్ను బెదిరించి రూ. 5 వేలు డిమాండ్ చేశాడని, దీనిపై అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం వెలుగు చూసిందని వివరించారు. రైల్వే అధికారులు విచారణలో తాను వేసింది బల్లి కాదని సముద్రపు చేప అంటూ సుందర్పాల్ ధ్రువీకరించాడు. డబ్బు కోసం నాలుగైదు ప్రదేశాల్లో ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు అంగీకరించాడని పేర్కొన్నారు. -
పోలీస్ వేషంలో టీడీపీ నేత దోపిడీ
కావలి (నెల్లూరు): అతడో టీడీపీ నాయకుడు. బంగారం బిస్కెట్లను అక్రమంగా తరలించే ముఠాలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. బంగారం బిస్కెట్లు కొనేందుకు వెళ్లే వారినుంచి పోలీస్ వేషంలో నగదు దోపిడీ చేయడం మొదలుపెట్టాడు. ఇదే తరహాలో రూ.56 లక్షలు ఎత్తుకెళ్లాడు. వ్యాపారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు కీలక సూత్రధారైన, నెల్లూరు జిల్లా కావలి మండలం చెన్నాయపాళెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మర్రి రవిని అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారం మేరకు రూ.36 లక్షలను రికవరీ చేశారు. వివరాల్లోకి వెళితే.. కావలిలో కొందరు బంగారు వ్యాపారులు పన్నులు చెల్లించకుండా, బిల్లులు లేకుండా చెన్నైలో బంగారం బిస్కెట్లు కొనుగోలు చేసి కావలిలో విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక వ్యాపారి బంగారం బిస్కెట్లు కొనుగోలు నిమిత్తం సీజన్ బాయ్కి రూ.56 లక్షలు ఇచ్చాడు. పోలీసులు, ఐటీ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు వీలుగా ఇద్దరు మహిళలను తోడుగా పంపించాడు. ఆ ముగ్గురూ చెన్నై వెళ్లేందుకు బుధవారం కావలిలో నవజీవన్ ఎక్స్ప్రెస్ ఎక్కారు. రైలు నెల్లూరు రైల్వే స్టేషన్కు చేరుకోగా.. పోలీసులమంటూ కొందరు అగంతకులు ఆ ముగ్గుర్నీ అటకాయించారు. భయపెట్టి వారివద్ద ఉన్న రూ.56 లక్షలను దోచుకెళ్లారు. సదరు వ్యాపారి పోలీసులను ఆశ్రయించగా.. సీజన్ బాయ్తోపాటు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. మహిళల్లో ఒకరి ఫోన్ నుంచి టీడీపీ నాయకుడు మర్రి రవి ఫోన్కు పెద్దఎత్తున కాల్స్ వెళ్లినట్టు గుర్తించారు. మర్రి రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆదివారం అతడిని వెంటబెట్టుకుని చెన్నాయపాళెం గ్రామానికి వెళ్లారు. గ్రామంలో అతడు చూపించిన ప్రదేశాల నుంచి రూ.22 లక్షలు, కావలిలో రూ.14 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన రూ.20 లక్షలు ఎక్కడ దాచాడనే దానిపై విచారణ జరుపుతున్నారు. సూత్రధారి రవి.. పాత్రధారి మహిళ టీడీపీ నాయకుడు మర్రి రవి సెంట్రింగ్ సామగ్రిని బాడుగకు ఇచ్చే వ్యాపారంతో పాటు కూలీలతో సెంట్రింగ్ కాంట్రాక్ట్ పనులు చేయిస్తుంటాడు. ఈ క్రమంలో భర్తకు దూరమైన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కాగా, ఆ మహిళకు చెన్నై నుంచి బిల్లులు లేకుండా బంగారం బిస్కెట్లు తీసుకొచ్చే ఒక వ్యాపారితో సంబంధాలున్నాయి. మర్రి రవితో సాన్నిహిత్యం ఏర్పడినప్పటి నుంచి అతని ఒత్తిడి మేరకు.. తరచూ బంగారం కొనేందుకు తీసుకెళ్లిన సొమ్ము పోలీసులకు పట్టుబడిందంటూ వ్యాపారికి టోకరా వేస్తుండేది. ఇలా స్కెచ్చేశాడు ఈ నేపథ్యంలో మర్రి రవి దోపిడీకి ఓ బృందాన్ని తయారు చేశాడు. బంగారం కొనేందుకు ఎవరెవరు వెళుతున్నారు, ఎప్పుడు వెళుతున్నారు. బస్సులో వెళ్తున్నారా, కారులోనా లేక రైలులో ప్రయాణిస్తున్నారా, ఏ సమయానికి ఎక్కడ ఉన్నారనే వివరాలను సదరు మహిళ ఫోన్ద్వారా మర్రి రవికి చేరువేస్తుండేది. దానిని బట్టి రవి వారిని వెంబడించి.. పోలీసులమని భయపెట్టి నగదు ఎత్తుకెళ్లేవాడు. ఇదే తరహాలో స్కెచ్ వేసి బుధవారం చెన్నైకు వెళ్తున్న వారినుంచి రూ.56 లక్షలు దోపిడీ చేసినట్టు పోలీసులు నిర్థారణకు వచ్చారు. కేసు దర్యాప్తులో ఉంది. -
రైల్వే పోలీసుల నిజాయితీ
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): విశాఖపట్నం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది తమ నిజాయితీని చాటుకున్నారు. ఆదివారం తెలవారుజామున విశాఖపట్నం చేరుకున్న ఫలక్నామా ఎక్స్ప్రెస్లో బి – 3 సీట్ నెం.12లో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలు తన విలువైన బ్యాగ్ను మరచిపోయారు. విధి నిర్వహణలో ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది ఏఎస్ఐ పి.సి.యమ్.రావు, హెడ్ కానిస్టేబుల్ వై.బక్కయ్య తనిఖీలలో ఈ బ్యాగ్ను గుర్తించారు. బ్యాగ్లో 70వేల నగదు, 10తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇవి గుంటూరు నుంచి వస్తున్న నగరానికి చెందిన వై.సరస్వతిగా గుర్తించారు. రైలు దిగే కంగారులో ఆమె బ్యాగ్ మరిచిపోయిందని గుర్తించిన ఆర్పీఎఫ్ సిబ్బంది సీట్ నెంబర్ ఆధారంగా పిలిపించి ఆమెకు బ్యాగ్ను అందజేశారు. ఆర్పీఎఫ్ సిబ్బంది నిజాయితీని డివిజినల్ స్థాయిలో గుర్తించి సత్కరిస్తారని, ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ ఆర్కే రావు తెలిపారు. -
తెలంగాణ పోలీస్ యాప్తో ఇంటికి చేరిన అస్సాం బాలిక
సాక్షి, హైదరాబాద్: ఏడాదిన్నర కిందట తప్పిపోయిన అస్సాం బాలికను తెలంగాణ పోలీస్ రూపొందించిన ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ఇంటికి చేర్చింది. అస్సాంలోని లక్మీపూర్ బోగినోడి గ్రామానికి చెందిన అంజలి టిగ్గా(16) 2017, ఆగస్టులో ఇంటి నుంచి తప్పిపోయి ఢిల్లీకి చేరి అక్కడ నెల రోజుల పాటు కార్మికురాలిగా పనిచేసింది. పనిచేస్తున్న చోట ఇతర కార్మికులందరూ కలిసి మళ్లీ తనను అస్సోం పంపించారు. అస్సాం రైల్వే స్టేషన్కు చేరిన అంజలి ఇంటికి వెళ్లేందుకు భయపడి సోనిత్పూర్లో ఏదైనా పనిచేసుకుని జీవించాలని నిర్ణయించుకుంది. అయితే, రైల్వే స్టేషన్లో అంజలిని గుర్తించిన రైల్వే పోలీసులు ఆమెను చైల్డ్, ఉమెన్ కేర్ (సీడబ్ల్యూసీ) సంస్థ ప్రతినిధులకు అప్పగించారు. తెలంగాణ పోలీసులు తయారుచేసిన ఫేస్ రికగ్నైజ్ యాప్లోని డేటా బేస్ ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రా ల్లో అదృశ్యమైన వారి ఫొటోలు, వివరాలు అందుబాటులో ఉన్నాయి. తల్లిదండ్రుల వివరాలు చెప్పేందుకు అంజలి నిరాకరించగా అక్కడి సంస్థ ప్రతినిధులు ఆమె ఫొటోలను తెలంగాణ పోలీస్ రూపొందించిన ఫేస్ రికగ్నైజేషన్ డేటా బేస్లో సరిపోల్చి చూశారు. దీంతో అంజలి అడ్రస్ అందుబాటులో ఉండగా ఆమెను ఆదివారం అస్సాంలోని బోగినోడిలో ఉన్న తల్లిదండ్రులకు అప్పగించినట్లు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతిలక్రా ఒక ప్రకటనలో వెల్లడించారు. -
రైలు నుంచి దూకిన దంపతులు
ఏలూరు టౌన్: ఆకతాయిల లైంగిక వేధింపులు తాళలేక భయాందోళనకు గురైన దంపతులు కదులుతున్న రైలు నుంచి దూకడంతో భర్తకు స్వల్ప గాయం కాగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పవర్పేట రైల్వే స్టేషన్లో ఆదివారం జరిగింది. పశ్చిమ బెంగాల్లోని ఆలీపూర్ జిల్లా జయగామ్ గ్రామానికి చెందిన బికాస్ రాయ్, పింకీ రాయ్ దంపతులు. రెండేళ్లుగా వారిద్దరూ తెలంగాణలోని సికింద్రాబాద్లో ఒక ప్రైవేట్ ప్లాస్టిక్ పైపుల కంపెనీలో పనిచేస్తున్నారు. పింకీ రాయ్ గర్భిణి కావటంతో వారు స్వగ్రామం వెళ్ళేందుకు సికింద్రాబాద్లో సికింద్రాబాద్–గౌహతి వెళ్లే రైలు జనరల్ బోగీలో ఆదివారం ఉదయం ఎక్కారు. అదే బోగీలో ప్రయాణిస్తున్న బీహార్కు చెందిన కొందరు యువకులు వీరిద్దరినీ వేధించడం మొదలెట్టారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు రైలు ఏలూరులోని పవర్పేట రైల్వేస్టేషన్లో మెల్లగా వెళ్తూ ఉండగా బాధితులు దిగేందుకు యత్నించారు. ఈ దశలో బికాస్ దిగుతుండగా, పింకీని యువకులు నెట్టి వేసినట్లు బికాస్ పోలీసులకు చెప్పాడు. కాగా ఆకతాయిలను రైల్వే పోలీసులు విశాఖలో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
అట్టపెట్టెలో అరవైఐదు లక్షలు!
సాక్షి, హైదరాబాద్: అది హైదరాబాద్లోని నాంపల్లి రైల్వే స్టేషన్ సాయంత్రం 4 కావస్తోంది. ముంబై వెళ్లేందుకు నలుగురు వ్యక్తులు ప్లాట్ఫాంపై కొన్ని అట్టపెట్టెలతో నిలుచుని ఉన్నారు. పది నుంచి ఇరవై బాక్సులను రైల్లో ఎక్కించేందుకు సిద్ధపడుతుండగా రైల్వే పోలీసులు వచ్చి వాటిల్లో రెండు బాక్సులను తెరచి చూశారు. అట్టపెట్టెల్లో పైన ఎల్ఈడీ బల్బులు వాటి కింద నోట్ల కట్టల్ని చూసి షాక్ అయ్యారు. తర్వాత అన్ని బాక్సుల్లో ఉన్న రూ.65 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు విచారణ ప్రారంభించారు. జనరల్ రైల్వే పోలీసు విభాగం ఎస్పీ అశోక్కుమార్, డీఎస్పీ రాజేంద్రప్రసాద్ వెంటనే రంగంలోకి దిగారు. హవాలా కాదు..: ఈ నెల 5న వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై రైల్వే పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ముందు హవా లా డబ్బుగా భావించినా విచారణలో ఆసక్తికరమైన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన పలు ఫైనాన్స్ సంస్థలు హైదరాబాద్లోని బేగంబజార్లో జీరో దందా చేస్తున్న వ్యాపారులకు ఏటా రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు అప్పులిచ్చాయి. వీటికి సంబంధించి ప్రతి నెలా చెల్లించాల్సిన వడ్డీ డబ్బులను ఈ విధంగా పంపిస్తున్నారు. ముంబైకి చెందిన 4 ప్రధాన ఫైనాన్స్ కంపెనీలు బేగంబజార్ నుంచి వడ్డీ సొమ్మును రెండున్నరేళ్లుగా ఇదే రీతిలో తీసుకెళ్తున్నట్లు విచారణలో తేలింది. ఎలాంటి సందేహం రాకుండా ఉండేందుకు వడ్డీ వ్యాపార మాఫియా ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నట్లు బయటపడింది. వడ్డీకిచ్చిన సొమ్ముకు లీగల్గా లెక్కాపత్రం లేకపోవడంతో తిరిగి వసూలు చేసుకునే వ్యవహారాన్నీ చీకటి మార్గం లోనే చలామణీ చేస్తున్నట్లు గుర్తించారు. ఆంధ్రా పార్శిల్స్ కేంద్రంగా.. పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బాలపై ఉస్మాన్గంజ్లోని ఆంధ్రా పార్శిల్స్ సర్వీసెస్కు చెందిన ప్యాకింగులుండటం అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు అరెస్ట్ చేసిన నలుగురు ఏజెన్సీ వ్యక్తులు బిహార్కు చెందిన వారు కావడం, వీరంతా ఆంధ్రా పార్శిల్స్ సర్వీస్లో పనిచేస్తుండటం వడ్డీ మాఫియా వ్యవహారంలో కీలకంగా మారింది. ఆంధ్రా పార్శిల్స్ పేరుతో హవాలా సొమ్ము రవాణా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్రా పార్శిల్స్ మేనేజర్ లాల్జీ పరారీలో ఉండటంతో కేసులో అతడే కీలక సూత్రధారి అని భావిస్తున్నారు. అతడు నేరుగా వెళ్లకుండా వడ్డీ డబ్బులను ఈ రకంగా ముంబై ఫైనాన్స్ కంపెనీలకు చేరవేస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ నుంచే కాకుండా ఆంధ్రా పార్శిల్స్ పేరుతో దేశవ్యాప్తంగా ఇంకా ఎన్ని ప్రాంతాల నుంచి ఇలాంటి దందా సాగుతుందో విచారణలో తెలుసుకుంటామని, లాల్జీ కోసం తమ బృందాలు వెతుకుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ముంబైకి చెందిన ఫైనాన్షియర్లు, బేగంబజార్కు చెందిన వ్యాపారుల జాబితా కూడా తేలాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. -
గుంటూరు స్టేషన్లో హల్చల్ : ఆమె ఎవరు?
సాక్షి, గుంటూరు: గుంటూరు రైల్వేస్టేషన్లో ఆదివారం ఓ మహిళ తిట్లదండకం అందుకున్న ఘటనపై రైల్వే పోలీసులు స్పందించారు. రైల్వే సిబ్బందిని ఇష్టమొచ్చినట్టు తిట్టిన యువతిని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. సకాలంలో తనకు టికెట్టు ఇవ్వకపోవడంతో రైలు మిస్సయిందన్న కోపంతో ఓ యువతి రైల్వే అధికారిని నోటికొచ్చిన తిట్టిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా రైల్వే పోలీసులపైనా ఒంటికాలిపై లేచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏం జరిగింది.. ఓ మహిళ టికెట్టు తీసుకోవడానికి గుంటూరు రైల్వే స్టేషన్ కౌంటర్లో నిలబడింది. అయితే అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగి సకాలంలో టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆమెకు వెళ్లాల్సిన ట్రైన్ కాస్తా వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన మహిళ.. తాను ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలంటూ రైల్వే సిబ్బంది నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ.. ఉద్యోగులపై తిట్ల దండకాన్ని అందుకుంది. ‘పోలీసు అయితే ఏం చేస్తారు...? నా వెంట్రుక కూడా పీకలేరు... చెప్పుతో కొడతా లం... ఇక్కడే కూర్చుంటా.. ఎవడు వస్తాడో రండిరా... ’ అంటూ నోటికొచ్చినట్టు రైల్వే సిబ్బందిని బూతులు తిట్టింది. సమస్య తెలుసుకోవడానికి వచ్చిన రైల్వే పోలీసును కూడా చెడామడా వాయించేసింది. ఇప్పుడు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. (వీడియోలో ప్రసార అర్హం కాని పదాలను తొలగించాం) -
రెండు రైళ్లలో దోపిడీ దొంగల బీభత్సం
గుత్తి: అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రాయలసీమ, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైళ్లలోకి చొరబడి ప్రయాణికులను బెదిరించి నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. గురువారం రాత్రి గుత్తి రైల్వే జంక్షన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రైల్వే పోలీసులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు నుంచి కాచిగూడ (12798) వెళ్లే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైలు అర్ధరాత్రి 12 గంటలకు గుత్తి జంక్షన్ పరిధిలోని జూటూరు–రాయలచెరువు స్టేషన్ సమీపంలోకి వస్తున్న సమయంలో దొంగల గుంపు సిగ్నలింగ్ వ్యవస్థను ధ్వంసం చేశారు. దీంతో రెడ్ సిగ్నల్ కనిపించక లోకో పైలెట్ రైలును నిలిపి వేశాడు. వెంటనే సుమారు 10 నుంచి 15 మంది దుండగులు రైల్లోకి చొరబడ్డారు. ఎస్–10, 11, 12 ఏసీ బోగీల్లోకి చొరబడి ప్రయాణికులను కొట్టి, మారణాయుధాలు చూపి బంగారు ఆభరణాలను, నగదును ఎత్తుకెళ్లారు. సుమారు అరగంట పాటు దుండగులు ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారు. ఆ సమయంలో యర్రగుంట్లకు చెందిన ఇద్దరు జీఆర్పీ పోలీసులు ఎస్కార్ట్గా ఉన్నా దొంగలను నిలువరించలేకపోయారు. ఆ తర్వాత గంటకే గుత్తికి సమీపంలోనే రాయలసీమ ఎక్స్ప్రెస్ (నిజామబాద్ నుంచి తిరుపతి వెళ్లే రైలు నం.12794)లో కూడా దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. జక్కలచెరువు రైల్వే స్టేషన్ సమీపంలోకి రైలు రాగానే దొంగలు సిగ్నలింగ్ వ్యవస్థను ధ్వంసం చేశారు. దీంతో లోకో పైలెట్ రైలును నిలిపేశాడు. ఆ వెంటనే దొంగలు ఎస్–4, 5, 6, 12 బోగీల్లోకి చొరబడ్డారు. ప్రయాణికులను బెదిరించి నగదు, బంగారు ఆభరణాలను అపహరించారు. ఎస్కార్ట్ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైల్లో నగదు, బంగారు ఆభరణాలు దోపిడీ దొంగలు ఎత్తుకెళ్లారని హైదరాబాద్ బేగం బజారుకు చెందిన ప్రయాణికులు చంద్రమోహన్, జయప్రకాశ్, నాందేడ్కు చెందిన నితిన్ ఎరివార్, ఫాతిమా, రేష్మా గుత్తి జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.10వేల నగదు, 11 తులాల బంగారు ఆభరణాలు అపహరించినట్లు పేర్కొన్నారు. రాయలసీమ ఎక్స్ప్రెస్ రైల్లో జరిగిన చోరీపై కొందరు ప్రయాణికులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్కార్ట్ పోలీసులు ఉన్నా దోపిడీ దొంగలను నిలువరించలేకపోవడంపై ప్రయాణికులు మండిపడ్డారు. కాగా బేగంబజార్కు చెందిన రేష్మా(23) మెడలోంచి 11 తులాలు, నాందేడ్కు చెందిన మయూరి వద్దనుంచి 1 తులం, కడపకు చెందిన ఫాతీమా వద్ద బ్యాగులో నుంచి రూ.10 వేల నగదు దోపిడీ చేశారు. రైలు కాచిగూడ రైల్వే స్టేషన్లో ఆగగానే శుక్రవారం వారు రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మెడలో చైన్ లాక్కెళ్లారు అర్ధరాత్రి సమయం కావడంతో నాతో పాటు ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నాం. దొంగలు దొంగలు అనే అరుపులు వినిపించడంతో ఉలిక్కి పడి లేచాను. అప్పటికే దొంగలు నా ముందు నిలబడి ఉన్నారు. మెడలోని చైన్ లాక్కున్నారు. అరిస్తే చంపుతామని బెదిరించారు. – జయప్రకాశ్, హైదరాబాద్ చంపుతామని బెదిరించారు ఏసీ బోగీలో ప్రయాణిస్తున్నాను. కాపాడండీ కాపాడండీ అంటూ అరుపులు వినిపించాయి. లేచి చూసే సరికి సుమారు 10 మంది దొంగలు ప్రయాణికుల వద్ద నుంచి బంగారు ఆభరణాలను లాక్కెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు చాలా భయమేసింది. చంపుతారని భయపడ్డా. వెంటనే నా ఉంగరం, వాచీ, కొంత నగదు దొంగలకు ఇచ్చేశాను. – చంద్రమోహన్, హైదరాబాద్ -
వారే ఒక సైన్యం
సాక్షి, నంద్యాల(ఎడ్యుకేషన్) : ఇనుప కండలు, ఉక్కు నరాలు కలిగిన పది మంది యువకులు చాలు నాకు. దేశాన్ని పునర్నిర్మించటానికి, అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లటానికి. తన మాటలతో యువతను ఉత్తేజ పరిచారు స్వామి వివేకానంద. కొంత మంది యువకులు వారిని ఆదర్శంగా తీసుకొని తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. వివిధ పోటీపరీక్షల కోసం యువకులకు ఉచితంగా శిక్షణనిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కూడా తోడు కావడంతో వివేకానందుల వారి ఆలోచనలకు ప్రాణం పోశారు. కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకొని వివిధ రకాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తుంది. ఆ శిక్షణలో రాటుదేలిన పలువురు నేడు అత్యున్నత స్థాయిలో పదవులను అలంకరించారు. నంద్యాలలోని నాగకృష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆద్వర్యంలో ఏపీపిఎస్సీ నిర్వహించే గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, వీఆర్ఓ ఉద్యోగాలకు నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించబడును. కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడునని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. అలాగే రైల్వే బోర్డ్ నిర్వహించే గ్రూప్-సి, గ్రూప్-డి, రైల్వే పోలీసు ఉద్యోగాలకు జూలై 16న తరగతులు ప్రారంభం. ఉపాధ్యాయ పరీక్షల కోసం డీఎస్సీ తరగతులను జూలై 18న తరగతులు ప్రారంభిస్తామని, ఈ అవకాశాన్ని ప్రతి పేద విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సంస్థ నిర్వాహకులు గిరీష్ బాబు తెలిపారు. అభ్యర్థులకు తెల్లరేషన్ కార్డు కలిగి ఉంటే వారికి నెలకు 1000 స్టయిఫండ్(శిక్షణ భృతి) కల్పించబడును. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వసతితో పాటు బోజన సౌకర్యం కల్పించబడునని తెలిపారు. తరగతులు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 6గం. వరకు నిర్వహించబడును. శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్ అందించబడునని సంస్థ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అప్లికేషన్లు లభించు స్థలం..శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నంద్యాల. మరింత సమాచారం కోసం 99850 41168 నెంబర్ను సంప్రదించగలరు. -
రైలు బాత్రూమ్లో ప్రయాణికుడి ఆత్మహత్య
సాక్షి, అల్లిపురం(విశా ఖ దక్షిణ) : తిరుపతి – విశాఖ స్పెషల్ ఎక్స్ప్రెస్ బాత్రూమ్లో గుర్తు తెలి యని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రభుత్వ రైల్వే పోలీసులు బుధవారం గుర్తించా రు. రైల్వే పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం... తిరుపతి–విశాఖ స్పెషల్ ఎక్స్ప్రెస్(08574)లోని బాత్రూమ్లో సుమా రు 50 సంవత్సరాల వయసు గల వ్యక్తి ఉరి వేసుకున్నట్లు ఉదయం 10గంటల సమయంలో ఫిర్యాదు అందింది. దీంతో ఆర్పీఎఫ్ ఎస్ ఐ ఎల్.రమణ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీసులను 0891–2746211, 94402252 77, 9440627547 సంప్రదించాలని కోరారు. -
అడ్డుగా ఉన్నాడని అంతం చేయించింది!
హైదరాబాద్: ప్రియుడి వ్యామోహంలో పడిన భార్య అడ్డుగా ఉన్న భర్తను అంతం చేయాలని భావించింది. ఈ ‘బాధ్యతల్ని’ తీసుకున్న ప్రియుడు ఓ పాత నేరగాడికి రూ.2 లక్షలకు సుపారీ ఇచ్చాడు. రైలు పట్టాల వద్ద హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మరోవైపు తన భర్త కనిపించట్లేదంటూ ఆ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాంపల్లి రైల్వే పోలీస్స్టేషన్లో అనుమానాస్పద మృతిగా, ఎస్సార్నగర్ ఠాణాలో అదృశ్యంగా నమోదైన ఈ కేసుల్ని సనత్నగర్ పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు సంబంధించి ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు బాలానగర్ డీసీపీ సాయిశేఖర్ మంగళవారం వెల్లడించారు. భర్తే అడ్డుగా మారాడని భావించి.. బోరబండ స్వరాజ్నగర్కు చెందిన ఎండీ ఖాజా(46)కు అదే ప్రాంతానికి చెందిన సలేహా బేగం(26)తో 2007లో వివాహమైంది. వీరికి నవాజ్(9), లతీఫ్(7) కుమారులున్నారు. సమీపంలోని ఓ మాంసం దుకాణంలో పనిచేసే ఎండీ తబ్రేజ్ఖురేషీ(33)తో సలేహాకు కొన్నాళ్ల క్రితం ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. విషయం తెలిసిన ఖాజా అనేకసార్లు భార్యను మందలించ డంతో పాటు తబ్రేజ్తోనూ గొడవపడ్డాడు. ఈ పరిణామాలతో భర్తే అడ్డుగా మారుతున్నాడని భావించిన సలేహా.. అతడిని అంతం చేయా లని ఖురేషీతో చెప్పింది. దీనికోసం ఇతగాడు బోరబండ సఫ్దర్నగర్కు చెందిన పాత నేరస్తుడు సయ్యద్ ముజీబ్ను సంప్రదించాడు. ఖాజాను చంపేస్తే రూ.2 లక్షలు చెల్లిస్తానంటూ ఒప్పందం కుదుర్చుకుని రూ.30 వేలు అడ్వా న్స్ ఇచ్చాడు. రంగంలోకి దిగిన ముజీబ్.. ఖాజా తరచూ వెళ్లే మద్యం దుకాణాలకే వెళ్తూ స్నేహం చేశాడు. దీంతో వీరిద్దరూ కలసి మద్యం తాగడం మొదలైంది. హత్యచేసిన ప్రాంతంలో రక్తం మరో ముగ్గురితో రంగంలోకి దిగి.. ఖాజాను హత్య చేయాలని నిర్ణయించుకున్న ముజీబ్ అందుకు సహకరించడానికి బోరబండకు చెందిన ఎండీ అయాజ్, ఎర్రగడ్డకు చెందిన మీర్జా అక్బర్ బేగ్, బోరబండ సైట్ 3 అంబేడ్కర్నగర్కు చెందిన షేక్ జహీర్తో ఒప్పందం చేసుకున్నాడు. ఫిబ్రవరి 20న మాదాపూర్లోని ఓ మద్యం దుకాణానికి వెళ్లిన ముజీబ్, ఖాజా.. అక్కడ మద్యం ఖరీదు చేసి, పర్మిట్రూమ్లో కూర్చుని తాగారు. తిరిగి వస్తూ మద్యం, బీరు ఖరీదు చేశారు. సమీ పంలో వేచి ఉన్న రియాజ్, అక్బర్, జహీర్ వీరిని అనుసరించారు. రాత్రి 9.40 సమయంలో బోరబండ వివేకానందనగర్ కమాన్ వద్ద ఆగిన ముజీబ్, ఖాజా తమ వెంట ఉన్న మద్యం తాగాలని భావించారు. ఇక్కడైతే పోలీసుల కంటపడతామని చెప్పిన ముజీబ్.. ఖాజాను సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు తీసుకువెళ్లి ఎక్కువ మద్యం తాగేలా చేశాడు. చంపేసి రైలు పట్టాలపై పడేసి.. ఖాజా మద్యం మత్తులోకి జారుకోవడంతో మిగిలిన ముగ్గురినీ పిలిచిన ముజీబ్.. వారితో కలసి బండరాయితో ఖాజాను చంపేసి.. మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ముఖాన్ని నుజ్జునుజ్జు చేశారు. మద్యం మత్తులో పట్టాలు దాటుతూ రైలు ఢీ కొట్టడంతో చనిపోయినట్లు చిత్రీకరించడానికి మృతదేహాన్ని పట్టాలపై పడేశారు. రైళ్ల రాకపోకల ధాటికి మృతదేహం ఛిద్రమైంది. బోరబండ–హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ల మధ్య ఓ మృతదేహం పడి ఉన్నట్లు ఓ మహిళ ఫిబ్రవరి 21న నాంపల్లి రైల్వే పోలీస్స్టేషన్కు సమాచారమిచ్చింది. ఘటనాస్థలికి వచ్చిన రైల్వే పోలీసులు ఇది ప్రమాదంగా భావించినా.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇది జరిగిన తర్వాత ఓ వారం పాటు భర్త కోసం గాలిస్తున్నట్లు నటించిన సలేహా.. ఆపై ఎస్సార్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. అనుమానం పుట్టించిన గాయాలు.. మృతదేహానికి పంచనామా నిర్వహించిన రైల్వే పోలీసులు పోస్టుమార్టం సైతం చేయించారు. హతుడి తలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ గాయాలు ఉన్నట్లు ఈ నివేదికలు స్పష్టం చేశాయి. అనుమానం వచ్చిన పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించగా.. మృతదేహం లభించిన ప్రాంతానికి సమీపంలో ట్రాక్ పక్కన రక్తపు మడుగు, ఇతర ఆధారాలను గుర్తించి హత్యగా తేల్చారు. మిస్సింగ్ కేసు వీరి దృష్టికి రావడంతో హతుడు ఖాజాగా గుర్తించారు. మృతదేహం లభించిన ప్రాంతం సనత్నగర్ ఠాణా పరిధిలోకి రావడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు. సనత్నగర్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో పాటు స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం సాలేహా పాత్రను అనుమానించారు. ఆమె కాల్ డిటేల్స్లో ఖాజా తర్వాత ఎక్కువగా తబ్రేజ్తో మాట్లాడినట్లు తేలింది. లోతుగా ఆరా తీయగా.. ఖాజా హత్య జరిగిన రోజు వీరిలో ఎవరెవరు? ఎక్కడెక్కడ ఉన్నారు? అనే వివరాలు ఆరా తీశారు. తబ్రేజ్ ఎక్కువగా ముజీబ్తో ఫోన్లో సంప్రదించడం.. ముజీ బ్ హత్యాస్థలంలో ఉన్నట్లు అతడి సెల్ఫోన్ డిటేల్స్ బయటపెట్టడంతో అనుమానాలు బలపడ్డాయి. దీంతో ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. కేసు కొలిక్కి రావడంతో మిగిలిన ముగ్గురు నిందితుల్నీ పోలీసులు పట్టుకున్నారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన బాలానగర్ ఏసీపీ గోవర్ధన్, సనత్నగర్ ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డిలను డీసీపీ అభినందించారు. ఖాజా ఇంటి ఎదురుగానే అతడి భార్య సలేహా తల్లిదండ్రులు నివసిస్తుంటారు. తండ్రి హత్యకు గురికావ డం, తల్లి జైలుకెళ్లడంతో వీరి కుమారులు నవాజ్, లతీఫ్లను వారికి అప్పగించారు. వివరాలు వెల్లడిస్తున్న బాలానగర్ డీసీపీ సాయిశేఖర్. చిత్రంలో నిందితులు -
పట్టాలు.. కటకటాలు!
సాక్షి, హైదరాబాద్: రైలు పట్టాలపై నిలబడి సెల్ఫీ తీసుకోవాలనుకుంటున్నారా.. పరుగులు పెట్టే ట్రైన్ పక్కన నిలబడి సెల్ఫీ తీసుకోవడం క్రేజీగా భావిస్తున్నారా.. అయితే జైలు శిక్షకూ సిద్ధంగా ఉండాల్సిందే. రైళ్లు, రైల్వే స్టేషన్లు, బోగీలపై నించొని సెల్ఫీలు తీసుకొనే సెల్ఫీరాయుళ్లను కట్టడి చేసేందుకు రైల్వే పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. రైల్వే చట్టాలకు పదును పెడుతున్నారు. అక్రమంగా పట్టాలు దాటే వారిని, సెల్ఫీలు దిగేవారిని నియంత్రించేందుకు జైలు శిక్ష విధించేలా కేసులు నమోదు చేయడమే సరైన చర్యగా భావిస్తున్నట్లు రైల్వే పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. పటిష్టంగా చట్టాల అమలు... ఇటీవల నగరంలోని భరత్నగర్ రైల్వేస్టేషన్ వద్ద దూసుకొస్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్ పక్కన నించొని సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన శివ అనే యువకుడి ఉదంతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సదరు నిందితుడికి కేవలం రూ.500 జరిమానా విధించి వదిలేశారు. అయితే రైల్వే చట్టం 147 ప్రకారం రూ.500 నుంచి రూ.1,000 వరకు జరిమానా విధించడంతో పాటు 6 నెలల జైలూ విధించే అవకాశం ఉన్నా చాలా వరకు జరిమానాలకే పరిమితమవుతున్నారు. ఇక నుంచి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు రైల్వే పోలీస్ డీఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ప్రమాదాల నివారణకు చర్యలు రైల్వే ట్రాక్లపై ఏటా వందలాది ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకునేవారు కొందరైతే ఇలా సెల్ఫీల కోసం, పట్టాలు దాటేందుకు ట్రాక్పైకి వచ్చి రైళ్లు ఢీకొని మృత్యువాత పడుతున్నవారు మరికొందరు. ప్రమాద మృతులకు దక్షిణమధ్య రైల్వే రూ.8 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తోంది. ఏటా సుమారు రూ.25 కోట్ల వరకు పరిహారం రూపంలో వెచ్చిస్తున్నట్లు అంచనా. మృత్యువాత పడిన తరువాత బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వడం కంటే అసలు ప్రమాదాలే జరగకుండా చర్యలు తీసుకోవడం మంచిదని రైల్వే పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
పోలీసుల దాష్టీకం.. వీడియో వైరల్..!
సాక్షి, అనంతపురం: బెంగుళూరు-కాచిగూడ ఎక్స్ప్రెస్లో చోటుచేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. వివరాలివి.. గుత్తి రైల్వే స్టేషన్లో సురేష్ అనే ప్రయాణికుడు జనరల్ టిక్కెట్తో స్లీపర్ కోచ్ ఎక్కబోయాడు. ఇది గమనించిన రైల్వే పోలీసులు అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. పోలీస్ దాడి చేసిన దృశ్యాలను తోటి ప్రయాణికులు వీడియో చిత్రీకరించారు. ఆ వీడియోలో పోలీస్ సురేష్ను లాఠీతో దాడి చేసిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ప్రయాణికుడు చెబుతున్న వినిపించుకోకుండా అలానే దాడి చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ ఘటనపై ప్రయాణికుడు సురేష్ మాట్లాడుతూ.. తాను ఎలాంటి తప్పు చేయలేదని తెలిపాడు. అకారణంగా నన్ను రైల్వే పోలీసులు కొట్టారని తన బాధను వ్యక్తం చేశాడు. ఈ దాడిపై తోటి ప్రయాణికులు కూడా తీవ్ర ఆగ్రహనికి గురయ్యారు. -
జారి పడ్డారా..? హతమార్చి పడేశారా..?
సాక్షి, గుంటూరు : గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలో కలకలం రేగింది. నడికుడి జంక్షన్లోని రైల్వేట్రాక్ పై బుధవారం మూడు మృతదేహాలు బయటపడ్డాయి. ట్రాక్పై మూడు కిలోమీటర్ల పరిధిలో మృతదేహాలను రైల్వే పోలీసులు గుర్తించారు. నడికూడి రైల్వేస్టేషన్, కేశానుపల్లి, గోగులపాడు సమీపంలో ఈ మూడు గుర్తు తెలియని మృతదేహాలు పడి ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అసులు నడికుడి జంక్షన్లో ఏం జరిగిందనే దానిపై దర్యాప్తు ముమ్మరం చేశారు. రైల్లో నుంచి జారి పడ్డారా? లేక హతమార్చి పడేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
మాకూ హృదయం ఉంది..
సాక్షి, వరంగల్: ఖాకీ అంటే వారిలో కరకుదనం ఉంటుందనుకుంటాం. కానీ మాకూ హృదయముంది.. మేమూ చేతనైన సేవ చేస్తాం అని చాటిచెప్పారు రైల్వే పోలీసులు. అస్వస్థతకు గురైన ఓ ప్రయాణికుడికి సత్వరం వైద్య చికిత్సలందించేందుకు రైల్వే స్టేషన్ మేనేజర్తో కలిసి సాయపడి మానవత్వం చాటుకున్నారు. ఈ సంఘటన వరంగల్ రైల్వే స్టేషన్లో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జస్పూర్నగర్ జిల్లా కట్టసార్ గ్రామానికి చెందిన శంకర్రామ్(19) కేరళలోని ఓ టైర్లు తయారీ కంపెనీలో వర్కర్గా పనిచేస్తున్నాడు. తన గ్రామానికి వెళ్లేందుకు కోర్బా ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నాడు. రైలు ఖమ్మం దాటగానే అతనికి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దీంతో సీటులోనే కూలబడి అల్లాడిపోతుండగా తోటి ప్రయాణికులు రైల్వే టీటీఈకు చెప్పారు. ఆయన వరంగల్ రైల్వే స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. స్టేషన్ మేనేజర్ వెంటనే 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వారు స్టేషన్కు చేరారు. ప్లాట్ఫామ్-2లో రైలు ఆగగానే అక్కడ వేచి ఉన్న స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వర్లు, జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రాజేందర్, ఆర్పీఎఫ్ హెచ్సీ రాజిరెడ్డి, పీసీలు సదానందం, రియాజ్, సంజీవరావు, హోంగార్డు చిమ్నా నాయక్లు శంకర్రామ్ను చేతులమీద మోసుకుని ప్లాట్ఫాం-1పై ఉన్న108 వాహనం వద్దకు చేర్చారు. 108 సిబ్బంది తగిన చికిత్స అందిస్తూ ఎంజీఎంకు తరలించారు. పోలీసులు సకాలంలో స్పందించడంపట్ల ప్రయాణికులు వారిని అభినందించారు. శంకర్రామ్కు సంబంధించిన సమాచారాన్ని అతని కుటుంబ సభ్యులకు అందజేసినట్లు పోలీసులు తెలిపారు. -
రెండు కిలోల బంగారం పట్టివేత
విజయవాడ: నెల్లూరు నుంచి అక్రమంగా తరలిస్తున్న రెండు కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులోని ప్రియాంక జ్యువెలరీ నుంచి కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు ఆభరణాల తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కేరళ ఎక్స్ప్రెస్ లో గురువారం ఉదయం రెండు కిలోల ఆభరణాలతో వచ్చిన నితీష్, నందకిషోర్లను చాకచక్యంగా వ్యవహరించి రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు వివరించారు. -
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో 120 కిలోల గంజాయి పట్టివేత
హైదరాబాద్: రైళ్లలో జరుగుతున్న గంజాయి అక్రమ రవాణాను జీఆర్పీ బృందం క్రమంగా అడ్డుకట్ట వేస్తోంది. ఈ నెల 12న ఒక క్వింటాలు గంజా యిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని రిమాండ్కు తరలించిన రైల్వే పోలీసులు సోమవారం 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని మరో ముగ్గురిని రిమాండ్కు తరలించారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ ఎస్.చంద్రయ్య, ఎస్ఐలు బి.ప్రమోద్కుమార్, నాగే«శ్వర్రెడ్డి, వీరలింగం నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక బృందం ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు వచ్చిన లోకమాన్యతిలక్ ఎక్స్ప్రెస్ రైలులో తనిఖీలు నిర్వహించింది. జనరల్ బోగీలో అనుమానాస్పదంగా లగేజీ బ్యాగులు కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను తనిఖీ చేయగా వారివద్ద 120 కిలోల గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిని ఒడిశా నుంచి ముంబైకి రవాణా చేస్తున్నట్లు నిందితులు బసుదేబ్(40), సంజయ్ కుమా ర్(21), గౌరవ్ చంచన్(40) పోలీసుల విచారణలో అంగీకరించారు. -
పోలీసుల బాహాబాహీ.. వీడియో వైరల్
లక్నో: ఉత్తరప్రదేశ్లో రెండు విభాగాలకు చెందిన ఇద్దరు పోలీసులు గొడవపడి పరస్పరం ముష్టిఘాతాలతో చెలరేగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే గొడవకు కారణం తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు.ఈ ఘటన గురువారం మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్లోని మౌ రైల్వేష్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. జాతీయ మీడియా ఏజెన్సీ వివరాల ప్రకారం.. ఓ రైలులో ఉత్తరప్రదేశ్ పోలీసు, రైల్వే పోలీసు ప్రయాణిస్తున్నారు. వీళ్లు ఓ ఖైదీని వారణాసి నుంచి రైలులో తీసుకొస్తున్నారు. రైలు మౌ స్టేషన్ సమీపానికి రాగానే ఆ కంపార్ట్మెంట్లో గందరగోళం నెలకొంది. ఆ ఖైదీ తప్పించుకునేందుకు పోలీసుల కళ్లుగప్పి రైలు దిగాడు. వెంటనే యూపీ పోలీసు ఖైదీని పట్టుకునేందుకు బయలుదేరుతున్న రైల్లోంచి దూకే యత్నం చేశాడు. ఇంతలోనే రైల్వే పోలీసు జనరల్ పోలీసును అడ్డుకుని వద్దని వారించాడు. క్షణాల్లో రైల్వే పోలీసు జనరల్ పోలీసును కొట్టడం మొదలుపెట్టాడు. ఆపై యూపీ పోలీసు తిరగబడి రైల్వే పోలీసు దాడిని అడ్డుకుని అతడిని కొట్టాడు. ఇంతలో ఓ వ్యక్తి చైన్ లాగేసరికి రైలు ఆగింది. అక్కడే ఉన్న ఓవ్యక్తి సెల్ఫోన్లో చిత్రీకరించిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ఉన్నతాధికారుల దృష్టికి విషయం వెళ్లి సీరియస్ అయ్యారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఖైదీ విషయంలో గొడవపడ్డట్లు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
పోలీసుల బాహాబాహీ.. వీడియో వైరల్
-
రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు
సికింద్రాబాద్: రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను రైల్వే పోలీసులు మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 22 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. దొంగ బంగారం కొన్నందుకు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
రైళ్లో మద్యం తరలింపు: ముగ్గురు అరెస్ట్
బెల్లంపల్లి: అనుమతులకు విరుద్ధంగా రైళ్లో మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 576 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు వెళ్తున్న రైల్లో తనిఖీలు చేపట్టిన రైల్వే ఎస్సై బన్సిలాల్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. -
చోరీలకు పాల్పడుతున్న హిజ్రాల అరెస్ట్
విశాఖపట్నం (పెదవాల్తేరు): రైళ్లలో యాచిస్తూ ప్రయాణికుల నుంచి విలువైన వస్తువులు, నగదు తస్కరిస్తున్న ఇద్దరి హిజ్రాలపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. రైల్వే డీఎస్పీ మధుసూదన్రావు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం నుంచి దువ్వాడ స్టేషన్ మధ్యలో ప్రయాణికుల నుంచి యాచిస్తున్నట్లు నటించి హిజ్రాలు పాలూరి వెంకట్ అలియాస్ జెనీలియా(23), పరపతి అనిల్ అలియాస్ సుక్కూ(23) కొద్ది రోజులుగా చోరీలకు పాల్పడుతున్నారు. గురువారం వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి నుంచి విలువైన వస్తువులు, రూ.28,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి, రిమాండ్కు తరలించామని డీఎస్పీ తెలిపారు. -
అది హత్యే!
శాంతిభద్రతల విభాగానికి వీరభద్రం కేసు బదలాయింపు నెల్లూరు (క్రైమ్) : సమాచార హక్కు రక్షణ సమాఖ్య జిల్లా కన్వీనర్ పుత్తా వీరభద్రయ్య (46)ది హత్యేనని రైల్వే పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. దీంతో మరో రెండు, మూడు రోజుల్లో ఈ కేసును విచారణ నిమిత్తం రైల్వే పోలీసులు శాంతిభద్రతల విభాగానికి బదిలీ చేయనున్నట్లు సమాచారం. నెల్లూరు ఉస్మాన్సాబ్పేటకు చెందిన పుత్తా వీరభద్రయ్య జనవరి ఆఖరిలో ఆంధ్ర సమాచార హక్కు రక్షణ సమాఖ్య జిల్లా కన్వీనర్గా నియమితులయ్యారు. అప్పటి నుంచి పలుశాఖల్లో అవినీతి, అక్రమాలను బయట పెట్టేందుకు చర్యలు చేపట్టారు. రెడ్క్రాస్ రక్తనిధితో పాటు క్యాన్సర్ ఆస్పత్రుల్లో జరిగిన అవినీతిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు చేశారు. దానిపై కలెక్టర్ విచారణ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 19వ తేదీ తెల్లవారు జామున నెల్లూరు మాగుంట లేఅవుట్ సమీపంలోని రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో ఆయన మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. తొలుత ప్రమాదంగా అందరూ భావించినప్పటికీ మృతుడి గొంతును కోసి ఉండటం, తలకు తీవ్రగాయాలై ఉండటాన్ని గమనించి ఇది హత్యగా అనుమానించారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు దుండగులు యత్నించారని అక్కడి పరిస్థితులను బట్టి భావించారు. అయితే పోస్టుమార్టం నిర్వహించిన వైద్య సిబ్బంది సైతం అది హత్యేనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. భద్రయ్య హత్యపై రాష్ట్రస్థాయి పోలీసు ఉన్నతాధికారులు సైతం స్వయంగా ఆరా తీశారు. ఈ నేపథ్యంలో నెల్లూరు రైల్వేపోలీసులు ఈ కేసును గుంతకల్ రైల్వే ఎస్పీ కార్యాలయానికి పంపారు. రైల్వే ఎస్పీ సుబ్బారావు కేసు పరిశీలన అనంతరం నెల్లూరు శాంతిభద్రతల విభాగానికి కేసు బదిలీ చేసే అవకాశం ఉంది. -
చీకట్లో చితికిన బతుకులు
-
చీకట్లో చితికిన బతుకులు
హీరాఖండ్ ప్రమాదంలో 40 మంది మృత్యువాత.. 71 మందికిపైగా గాయాలు మృతుల్లో అత్యధికులు ఒడిశా, ఛత్తీస్గఢ్ వారే మృతుల్లో అత్యధికులు ఒడిశా, చత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారేనని తూర్పు కోస్తా రైల్వే వెల్లడించింది. వీరిలో 23 మందిని గుర్తించారు. 17 మందిని గుర్తించాల్సి ఉంది. మృతుల్లో ఎం. కృష్ణ (35), పి.శ్రీను (25), బి.కమల (50), గాయత్రి సాహు (14), దిలీప్ కేఆర్ రౌత్ (51), టీకే మైంజ్ (45), సోము అన్నమ్మ, విష్ణుప్రసాద్ సాహు, రాజన్ నాయక్ (18), సుభాష్ సీహెచ్ సాహు (60), ఎస్.రేణుక, పి.పోలి (35), జశోద పండిట్, రాంప్రసాద్ పండిట్, కె.రేవతి (16), మండల్ బలరామ్, సుబా భారతి సాహు, తపన్కుమార్ ప్రధాన్ (26), కార్తీక్ సాహు (21), రాధ (8), పూలన్దేవి, కె.రవికుమార్ (20) (విజయనగరం), బెడుధర్ బోయి ఉన్నారు. ప్రమాదం నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఘటనా స్థలం కూనేరు నుంచి ఒక ప్రత్యేక పాసింజరు రైలును 13 బోగీలతో రాయగడ, టిట్లాఘర్, సంబల్పూర్, అంగుల్ల మీదుగా భువనేశ్వర్కు నడిపింది. క్షతగాత్రులను బరంపురం, భవానీపాట్నా, తదితర ప్రాంతాలకు పంపడానికి వీలుగా 13 బస్సులను ఏర్పాటు చేసింది. ప్రమాదానికి గురైన హిరాఖండ్ ఎక్స్ప్రెస్ ఇంజన్, బోగీలను పట్టాలపై నుంచి తొలగించే పని సాయాంత్రానికి పూర్తి అయింది. కూనేరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి/ సాక్షి, విశాఖపట్నం : విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరులో శనివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 40 మంది ప్రాణాలు వదిలారు. దాదాపు 71 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో సగం మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను రాయఘడ రైల్వే ఆస్పత్రి, విజయనగరం జిల్లా పార్వతీపురం ఏరియా, విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రులకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. నాలుగు జనరల్ బోగీలు, రెండు స్లీపర్ బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో రెండు ఏసీ బోగీలు దెబ్బతిన్నాయి. రైల్వే, పోలీస్, అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. ప్రయాణికులను కార్లు, బస్సుల్లో సురక్షిత ప్రాంతాలకు, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. తర్వాత ఒక్కొక్కటిగా 40 మృతదేహాలను వెలికి తీశారు. బోగీల్లో మరికొన్ని మృతదేహాలను వెలికి తీయాల్సి ఉంది. నుజ్జునుజ్జు అయిన బోగీల మధ్య చిక్కుకుపోవడంతో వెలికి తీయడం కష్టంగా మారింది. సహాయక బృందాలు గ్యాస్ కట్టర్లతో బోగీలను కోసి మృతదేహాలను వెలికి తీస్తున్నాయి. ప్రమాద తీవ్రత, జరిగిన తీరును బట్టి విద్రోహుల హస్తం ఉండవచ్చని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ కమిటీతో అధ్యయనం చేయిస్తామని ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం ఉమేష్ సింగ్ వెల్లడించారు. ప్రమాదం జరిగిందిలా.. జగదల్పూర్ నుంచి శనివారం రాత్రి 7.55 గంటలకు రైలు బయలు దేరింది. కొమరాడ మండలం కూనేరు వద్ద పట్టాలు తప్పి.. ఆ పక్కనే ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొంటూ దూసుకుపోయింది. ఆ వేగానికి పట్టాలపై నుంచి బోగీలు 20 మీటర్ల దూరం రైల్వే స్థలంలోకి వెళ్లిపడిపోయాయి. బోగీలు ఒకదానికొకటి గుద్దు కోవడంతో నుజ్జునుజ్జయ్యాయి. పట్టాలు ముక్కలు ముక్కలుగా విరిగిపోయి బోగీల్లోకి చొచ్చుకొచ్చాయి. హీరాఖండ్ ఎక్స్ప్రెస్ రెండవ ట్రాక్ మీదుగా వెళుతోంది. ఈ ట్రాక్లో విద్యుత్ లైన్లు ఇటీవలే ఏర్పాటు చేశారు. ఇంకా సరఫరా ఇవ్వలేదు. దీంతో ఈ లైన్లో డీజిల్ ఇంజిన్లతోనే రైళ్లు నడుపుతున్నారు. విజయనగరం వచ్చేంత వరకు హీరాఖండ్ ఎక్స్ప్రెస్ డీజిల్ ఇంజన్తోనే నడుస్తుంది. విజయనగరంలో ఎలక్ట్రికల్ ఇంజిన్ను జత చేస్తారు. ఇదే కొంత వరకు ప్రాణనష్టాన్ని తగ్గించింది. ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ లైన్లకు సరఫరా ఉండి ఉంటే మరికొందరు ప్రయాణికులు హై టెన్షన్ విద్యుత్ షాక్కు గురయ్యి ప్రాణాలు వదిలేవారు. కాగా, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సహాయక కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొన్నారు. బాధితులకు సహకరిస్తాం: నవీన్ భువనేశ్వర్: హీరాఖండ్ ఎక్స్ప్రెస్ ప్రమాద బాధితులకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందజేస్తామని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆదివారం ప్రకటించారు. ఆయన సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి, పరిస్థితిని పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఫోన్లో మాట్లాడినట్లు నవీన్ పట్నాయక్ తెలిపారు. కాగా, హీరాఖండ్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు ఒడిశా ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఒడిశాకు చెందిన ప్రయాణికులకే ఈ పరిహారం వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య ప్రసాద్ పాఢి తెలిపారు. రూ.2 లక్షల చొప్పున పరిహారం రైల్వే జీఎం ఉమేశ్సింగ్ ప్రకటన హీరాఖండ్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు ఈస్ట్కోస్ట్ రైల్వే(భువనేశ్వర్) జీఎం ఉమేశ్సింగ్ ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, పాక్షికంగా గాయపడిన వారికి రూ.25 వేల పరిహారం అందిస్తామన్నారు. ప్రమాదం వెనుక సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని పూర్తిగా.. మరికొన్ని పాక్షికంగా జగదల్పూర్ నుంచి భువనేశ్వర్ వెళ్లున్న హిరాఖండ్ ఎక్స్ప్రెస్ విజయనగరం జిల్లా కూనేరు వద్ద పట్టాలు తప్పిన నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ఇంకొన్ని రైళ్లను దారి మళ్లించారు. పోలీసుల అదుపులో గార్డు, డ్రైవర్ సాలూరు: హీరాఖండ్ ఎక్స్ప్రెస్ ఘటనపై విచారణలో భాగంగా రైలు డ్రైవర్ డి. ఎన్.రాజు, గార్డు ఎల్.లక్ష్మణ్ను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు రైలు డ్రైవర్ నిరాకరించాడు. -
రైలు ఢీకొని యువకుడి మృతి
రైలు ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన సంఘటన నగరంలోని రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవుపల్లి రైల్వే గేట్ సమీపంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి రైలు కిందపడ్డాడా లేక ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతిచెందాడా అనే కోణంలో పోలీసులు దృష్టి సారిస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. -
రైల్లో నుంచి జారిపడి యువకుడి మృతి
పరుగులు తీస్తున్న రైలు బండిలో నుంచి జారిపడి యువకుడు మృతిచెందిన సంఘటన రాజమహేంద్రవరంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. గోదావరి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న దాడి శివ అనే యువకుడు ప్రమాదవశాత్తు రైల్లో నుంచి జారిపడి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మధ్య ప్రదేశ్లో రైల్వేపోలీసుల రాక్షసత్వం
-
భారీ ఎత్తున గంజాయి స్వాధీనం
♦ రైలులో తరలిస్తున్న గంజాయి పట్టివేత ♦ ఏడు బ్యాగుల్లో రూ. 20 లక్షలు విలువచేసే గంజాయి స్వాధీనం ♦ కోణార్క్ ఎక్స్ప్రెస్లో రవాణా! ♦ రైల్వే పోలీసుల అదుపులో ఒడిశా యువకులు ♦ రెండేళ్లలో ఇది మూడో ఘటన తాండూరు: భారీ ఎత్తున గంజాయిని రంగారెడ్డి జిల్లాలోని తాండూరులో రైల్వే పోలీసులు పట్టుకున్నారు. రైలులో తరలిస్తుండగా సుమారు రూ. 20 లక్షలు విలువచేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఒడిశాకు చెందిన ఏడుగురు యువకులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. భువనేశ్వర్-ముంబై వరకు నడిచే కోణార్క్ ఎక్స్ప్రెస్ గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తాండూరు రైల్వేస్టేషన్కు చేరుకుంది. ఈ రైలులో వచ్చినట్లుగా భావిస్తున్న ఒడిశాకు చెందిన ఏడుగురు యువకులు పెద్ద బ్యాగులతో తాండూరులో దిగారు. అందరూ ఫ్లాట్ఫామ్పై వేర్వేరుగా ఉన్నారు. ఓ యువకుడి తీరుతో అనుమానం వచ్చిన రైల్వే పోలీసులు అతడి దగ్గరకు వెళ్లి వివరాలు అడిగితే తడబడ్డాడు. బ్యాగులో ఏముందని ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పలేదు. దీంతో రైల్వే పోలీసులందరూ అప్రమత్తమయ్యారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా ఇంకా కొందరు ఉన్నారని సమాధానం ఇచ్చాడు. పోలీసులు గాలించి అందరినీ అదుపులోకి తీసుకొని వారి నుంచి ఏడు బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. తాండూరు నుంచి సాయంత్రం 5 గంటలకు రాజ్కోట్ ఎక్స్ప్రెస్లో సూరత్ వెళుతున్నట్టు పోలీసుల విచారణలో యువకులు వెల్లడించారు. ఈ మేరకు ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు రైల్వే అవుట్ పోస్టు హెడ్ కానిస్టేబుల్ రాజు సికింద్రాబాద్లోని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఎంత మేరకు గంజాయి పట్టుకున్నారు.. యువకుల వివరాలు వెల్లడించడానికి రైల్వే పోలీసులు సుముఖత చూపలేదు. తహసీల్దార్తోపాటు రైల్వే ఉన్నతాధికారులు వచ్చిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని హెడ్కానిస్టేబుల్ రాజు చెప్పారు. గడిచిన రెండేళ్లలో గంజాయిని రైల్వే పోలీసులు పట్టుకోవడం ఇది మూడోసారి. గతంలో రెండుసార్లు ఇదే కోణార్క్ ఎక్స్ప్రెస్లో పెద్ద ఎత్తున్న గంజాయిని తరలిస్తుండగా రైల్వే పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పట్టుకున్న గంజాయి ఇచ్చాపురం నుంచి రవాణా సాగిస్తున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.20 లక్షలు ఉంటుందని సమాచారం. -
ఈస్ట్కోస్ట్ రైలుకు బాంబు బెదిరింపు
ఏలూరు: ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు సమాచారం గురువారం తీవ్ర కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టి.. బాంబు లేదని నిర్ధారించడంతో భద్రతా సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. . ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్ ఏలూరుకు చేరుకోగానే ఓ అగంతకుడు రైల్వే పోలీసులకు రైలులో బాంబు ఉందని సమాచారం అందించాడు. దీంతో భద్రతా సిబ్బంది రైల్లోని బోగీలను క్షుణ్ణంగా తనిఖీలు చేసి బాంబు లేకపోవడంతో ఇది ఆకతాయిల పనిగా గుర్తించారు. అనంతరం రైలు యధావిధిగా బయలుదేరింది. అయితే ఫోన్ చేసిన ఆకతాయి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. -
రైలు కింద పడి వ్యక్తి మృతి
జహీరాబాద్: మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం అల్లీపూర్ గ్రామ సమీపంలో రైలు కింద పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. రైలు కింద పడటంతో వ్యక్తి శరీరం నుజ్జునుజ్జయింది. వ్యక్తి ఎవరన్నది గుర్తుపట్టడం చాలా కష్టంగా మారింది. చనిపోయిన వ్యక్తి వయసు దాదాపు 35 ఏళ్లు ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రైల్వేస్టేషన్లో రేషన్ బియ్యం పట్టివేత
మండలంలోని రేచినిరోడ్ రైల్వేస్టేషన్లో తాండూర్ రెవెన్యూ, పోలీసులు అధికారులు బుధవారం సంయుక్తంగా దాడులు నిర్వహించి 49.80 క్వింటాళ్ల బియ్యం రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. నిత్యం రేషన్ బియ్యం మహారాష్ట్రకు తరలిస్తున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. రామగిరి రైలు వచ్చి స్టేషన్లో ఆగిన వెంటనే దాడి చేశారు. అప్పటికే రేషన్ బియ్యం రైల్లో ఎక్కించడం, మరికొన్ని సంచులు ప్లాట్ఫాంపై ఉండడంతో సిబ్బంది రైల్లో ఉన్న బియ్యం సంచులను కిందికి దించారు. బియ్యాన్ని తరలించే వ్యక్తులు పారిపోయూరు. 164 సంచుల్లో 49.80 క్వింటాళ్ల బియ్యం పట్టుబడ్డాయి. వీటిని ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించారు. దాడుల్లో తహశీల్దార్ రామచంద్రయ్య, తాండూర్ ఎస్సై అశోక్కుమార్, ఎన్ఫోర్స్మెంట్ డెప్యూటీ తహసీల్దార్లు మునీర్, రియాజ్, వీఆర్వోలు, వీఆర్ఏలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆదర్శంగా నిలిచిన రైల్వే పోలీసులు
ఓ ప్రయాణీకుడు రైల్లో పోగొట్టుకున్న పర్సును తిరిగి అతనికి అప్పగించి కాచిగూడ రైల్వే పోలీసులు తమ నిజాయితిని చాటుకుని పది మందికి ఆదర్శంగా నిలిచారు. రైల్వే హెడ్కానిస్టేబుల్ ఆర్.లాలియానాయక్ తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ జిల్లా గిర్మాజిపేటకు చెందిన టీచర్ కె.రాజేశ్వర్రావు (48) యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైల్లో బోగినెంబర్ బి1 సీట్ నెంబర్ 18,19 బెర్త్లలో తన తమ్ముడు కూచన వినోద్కుమార్తో కలిసి ఈ నెల 21వ తేదీన యశ్వంత్పూర్ నుంచి కాచిగూడకు ప్రయాణం చేసిన సందర్భంలో మని పర్సు పోగోట్టుకున్నాడు. రైలు దిగి కూకట్పల్లిలోని తమ్ముని ఇంటికి వెళ్లిపోయాడు. రైల్వే పోలీసులు యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైలును తనిఖీ చేస్తుండగా పర్స్ దొరికింది. పర్స్లో ఉన్న ఐడి కార్డు, ఏటిఎం కార్డుల ఆధారంగా బాధితుడు రాజేశ్వర్రావుకు పోన్ చేసి పర్స్ దొరికిన విషయాన్ని రైల్వే పోలీసులు తెలియజేశారు. పర్సులో రూ.5,280 నగదు, ఏటిఎం కార్డు, డ్రై వింగ్ లెసైన్స్ తదితర వస్తువులు ఉన్నవి. రాజేశ్వర్రావు రైల్వే పోలీస్ స్టేషన్కు వచ్చి పర్సులో అన్ని వస్తువులు ఉన్నవని లిఖిత పూర్వకంగా వ్రాసి పోలీస్స్టేషన్లో ఇచ్చి పర్సును తీసుకుని వెళ్లాడు. తన పర్సుతో పాటు విలువైన వస్తువులను తనకు అప్పగించినిజాయితీ చాటుకున్న రైల్వే పోలీసులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. -
రైలు కిందపడి యువతి ఆత్మహత్య
బాడంగి: రైలు కింద పడి ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం బాడంగి మెయిన్రోడ్డు పక్కన నివసిస్తున్న ఏకల ఎండయ్య, రాములమ్మకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో ఒక కుమార్తెకు పెళ్లికాగా రెండోకుమార్తె సత్యవతికి వివాహం కావలసి ఉంది. ఆమె ఖాళీ మద్యం సీసాల క్లీనింగ్ప్లాంట్లో దినవేతన కార్మికురాలిగా పనిచేస్తోంది. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం ఆలయ దర్శనానంతరం పనికి వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పి బయల్దేరింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాడంగి రైల్వేగేటు సమీపంలో విజయనగరం వైపునుంచి బొబ్బిలి వెళ్తున్న నాగావలి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. రైలు డ్రైవర్ విజయనగరం పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు విజయనగరం రైల్వే ఎస్ఐ ఖగేశ్వరరావు ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. అనంతరం సత్యవతి ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై ఆమె తల్లిదండ్రులను ఆరా తీశారు. సత్యవతి మృతదేహాన్ని శవపరీక్ష కోసం బొబ్బిలి తరలించారు.కుమార్తె అఘాయిత్యంతో తల్లిదండ్రులిద్దరు రోదిస్తున్నారు. -
చిన్నారులను చేరదీసిన రైల్వే పోలీసులు
రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు చిన్నారులను కాచిగూడ రైల్వే పోలీసులు చేరదీసి 1098 దివ్యదిశ స్వచంద సేవా సంస్థకు అప్పగించారు. రైల్వే ఎస్ఐ రామారావు తెలిపిన వివరాల ప్రకారం... సైయిదా (4) తండ్రి నిఖా, వెస్ట్ బెంగాల్కు చెందిన అసన్ (12) తండ్రి అక్భర్, సాహిల్ (8) తండ్రి మోహీదుద్దీన్లు కాచిగూడ రైల్వే స్టేషన్లో గురువారం తిరుగుతుండగా వారిని చేరదీశారు. రైల్వే పోలీసులు వివరాలు నమోదు చేసుకుని వారిని బాలల వసతి గృహానికి పంపించారు. -
రైలు కిందపడి ఇద్దరు మృతి
గిద్దలూరు(ప్రకాశంజిల్లా): రైలు కిందపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున గిద్దలూరు మండలంలోని కృష్ణపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. మృతుల్లో ఒకరు అనంతపురం జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటకు చెందిన వ్యక్తిగా రైల్వే పోలీసులు గుర్తించారు. ఇరవై సంవత్సరాల వయసు ఉన్న గుర్తు తెలియని యువకుడి మృతదేహం ఉంది. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పేపర్ బాయ్ పై రైల్వే పోలీసుల దాడి
♦ వికారాబాద్ పీఎస్లో బాధితుడి ఫిర్యాదు ♦ డబ్బులు ఇవ్వకపోవడంతో కొట్టారని ఆరోపణ వికారాబాద్ రూరల్: రైలులో వార్త పత్రికలు విక్రయించే యువకున్ని రైల్వే పోలీసులు చితక బాదిన సంఘటన వికారాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. దీనిపై బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. తాండూరు పట్టణానికి చెందిన యువకుడు ఫార్జన్ ఇటీవలే ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు రాశాడు. రైల్వే స్టేషన్లో వార్త పత్రికలు విక్రయిస్తూ కుటుంబానికి ఆసరగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఉదయం యశ్వంత్పూర్ రైలులో వార్త పత్రికలు అమ్ముతూ తాండూరు నుంచి వికారాబాద్ వైపు వస్తున్నాడు. రైల్లో తాను పేపర్లు అమ్ముతూ వస్తున్న సమయంలో ఇద్దరు రైల్వే కానిస్టేబుళ్లు అతన్ని రూ.2 వేలు లంచంగా అడిగారని ఫిర్యాదు చేశాడు. తాను డబ్బులు ఇవ్వకపోవడంతో విచక్షణా రహితంగా చితకబాదారని పేర్కొన్నారు. సుమారు 20 నిమిషాల పాటు ఇష్టానుసారంగా దాడిచేశారని బోరుమన్నాడు. -
నిశ్చితార్థం రోజే యువకుడి ఆత్మహత్య
జమ్మికుంట : నిశ్చితార్థం రోజు ఓ యువకుడు రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జమ్మికుంటలో ఆదివారం జరిగింది. మృతుడి వద్ద లభించిన ఆధారాలతో రామగుండం జీఆర్పీ ఇన్చార్జి ఎస్సై బషీరొద్దీన్ వివరాలు వెల్లడించారు. వీణవంక మండం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆకుదారి చంద్రమౌళి(26) దూరవిద్యావిధానంలో డిగ్రీ చదువుతూ హైదరాబాద్లో సీసీ కెమెరాలు బిగించే పనులు చేస్తున్నాడు. కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు చంద్ర మౌళికి వివాహం చేయాలని నిర్ణయించారు. ఆదివారం నిశ్చితార్థానికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. శనివారం సాయంత్రం చంద్రమౌళి కొత్త బట్టలు తెచ్చుకునేందుకు హన్మకొండ వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరాడు. రాత్రి వరకు ఇంటికి రాలేదు. ఆదివారం తెల్లవారుజామున జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని పరిశీలించారు. స్థానికంగా లభించిన ఆధారాలతో పోతిరెడ్డిపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. పెళ్లి ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నట్లు జీఆర్పీ ఇన్చార్జి ఎస్సై తెలిపారు. బంధువులకు మృతదేహన్ని అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
రైలు కింద పడి తల్లీకూతుళ్లు ఆత్మహత్య
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా రామకృష్ణాపూర్లో శుక్రవారం తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది. రైలు కిందపడి తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ మృతదేహాలు రైలు ఇంజన్లో చిక్కుకున్నాయి. ఆ విషయాన్ని గమనించిన రైలు ఇంజన్ డ్రైవర్... రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మంచిర్యాలలో తల్లీకూతుళ్ల మృతదేహాలను రైల్వే పోలీసులు... ఇంజన్లో నుంచి వెలికి తీశారు. అనంతరం మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యువకుడి ఆత్మహత్య
కుటుంబ కలహాలతో విసిగిపోయిన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా ఆత్మకూరు మండలం ఖానాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీను(27) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో సతమతమవుతున్నాడు. ఈ రోజు ఉదయం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పాసింజర్ రైలులో మహిళ మృతదేహం
గుంటూరు- కాచిగూడ పాసింజర్ రైలులో ఓ గుర్తు తెలియని మహిళ మృత దేహం వెలుగు చూసింది. మహిళను దారుణంగా హత్య చేసిన దుండగులు గోనెసంచిలో కుక్కి రైలు బాత్రూమ్లో వదిలేసి వెళ్లినట్టు తెలుస్తోంది. శనివారం అర్ధరాత్రి కాచిగూడ చేరుకున్న రైలులో ప్రయాణికులు దిగిపోయిన తర్వాత సిబ్బంది తనిఖీ చేయగా మృతదేహం బయటపడింది. రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. -
బిహార్ దొంగల గ్యాంగ్ అరెస్టు
రైళ్లలో ప్రయాణిస్తూ దొంగతనాలు, దోపిడీలకు పాల్పడే బిహార్ గ్యాంగ్ విశాఖ రైల్వే పోలీసులకు చిక్కింది. శనివారం మధ్యాహ్నం కాకినాడ- విశాఖ ప్యాసింజర్ రైలు నుంచి దిగిన ఆరుగురు సభ్యుల బిహార్ ముఠాను జీఆర్పీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు నేతృత్వంలో సిబ్బంది పట్టుకున్నారు. వారి నుంచి రూ.6 లక్షల విలువ చేసే 250 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్టేషన్కు తరలించి, దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు ఎక్కుతుండగా జారిపడి యువకుడి మృతి
కర్నూలు(వెల్దుర్తి): రైలు ఎక్కుతుండగా జారిపడి యువకుడు మృతిచెందిన సంఘటన వెల్దుర్తి రైల్వే స్టేషన్ లో ఆదివారం ఉదయం జరిగింది. వెల్దుర్తి పట్టణానికి చెందిన మాలిక్(22) అనే యువకుడు కర్నూలులోని ఓ మిత్రుడి ఇంట్లో పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. రైల్వేపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
దురంతో ఎక్స్ప్రెస్లో ఆభరణాలు దోపిడీ
దురంతో ఎక్స్ప్రెస్లో ఓ ప్రయాణికుడి ఆభరణాలను దుండగులు దోచుకున్నారు. ప్రాథమిక సమచారం మేరకు... విశాఖ గీతం వర్సిటీలో మెడికల్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ కేఎల్వీ రావు సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి దురంతో ఎక్స్ప్రెస్లో విశాఖపట్నం బయల్దేరారు. మంగళవారం ఉదయం రైలు అనకాపల్లికి చేరుకున్న సమయంలో ప్రొఫెసర్ రావు తన బ్యాగు చూసుకోగా అందులోని బంగారు ఆభరణాల బాక్స్ కనిపించలేదు. దీంతో విశాఖలో రైలు దిగిన తర్వాత రావు ప్రభుత్వ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 84 గ్రాముల బంగారు ఆభరణాలు ఉంచిన బాక్స్ చోరీ జరిగినట్టు పేర్కొన్నారు. -
పెళ్లి రోజే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
రాయదుర్గంటౌన్ : వివాహం జరగాల్సిన రోజే ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన రాయదుర్గం పట్టణంలో ఆదివారం జరిగింది. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం...పట్టణంలోని కేబీ ప్యాలెస్ థియేటర్ ప్రాంతంలో నివాసముంటున్న జాఫర్సాబ్ కుమారుడు మహబూబ్ బాషా(35). కూలి పనులు చేసుకుని జీవనం సాగించే బాషాకు ఆదివారం బళ్లారిలో వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో అతను శనివారం సాయంత్రం అదృశ్యమయ్యారు. ఆదివారం ఉదయం బీటీపీ రోడ్డు చింతతోపు సమీపంలోని రైల్వేట్రాక్పై శవమై తేలారు. తలసగభాగం కోసుకుపోయింది. కాళ్లకు బలమైన గాయాలు ఉన్నాయి. ఇది ఆత్మహత్య, హత్య, ప్రమాదవశాత్తు రైలు నుంచి జారీ పడి మృతి చెందరా అనే కోణంలో స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి గతంలో రెండు సార్లు వివాహం జరిగింది. ఆ ఇద్దరు భార్యలు అనారోగ్యంతో మృతి చెందినట్లు సమాచారం. -
రైలు కిందపడి వివాహిత ఆత్మహత్య
ఏలూరు(పశ్చిమగోదావరి): వివాహిత రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రైల్వే ఫైఓవర్ వద్ద ఆదివారం ఉదయం జరిగింది. వివరాలు.. పెదపాడు మండలం పాత ముప్పర్రుకి చెందిన ముర్రాపు శ్వేత(24)కు అదే గ్రామానికి చెందిన రమేశ్(27)తో నాలుగేళ్ల కిందట వివాహమైంది. ఆదివారం గుడికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకి వచ్చిన శ్వేత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
నిజామాబాద్లో వివాహితపై గ్యాంగ్ రేప్?
నిజామాబాద్ క్రైం: నిజామాబాద్లో ఓ మహిళపై దుండగులు గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. బోధన్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన భర్తతో కలసి ఆదివారం రాత్రి కృష్ణ ఎక్స్ప్రెస్లో నిజామాబాద్కు చేరుకుంది. బోధన్కు వెళ్లేందుకు వాహనాలు లేకపోవడంతో స్టేషన్లోనే ఉండిపోయారు. రాత్రి ఆకలి బాధ తీర్చుకునేందుకు స్టేషన్ బయటకు వస్తుండగా నలుగురు యువకులు భర్తను కత్తితో బెదిరించి, ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె వద్ద ఉన్న రూ.1,600 నగదును దోచుకున్నారు. దుస్తులు చిరిగి పోవడంతో ఆ మహిళ అక్కడే నైటీ వేసుకుంది. అనంతరం భార్యభర్తలు.. నలుగురు యువకులతో వాగ్వాదానికి రోడ్డుపైకి వచ్చారు. అటువైపు వెళ్తున్న రైల్వే కానిస్టేబుల్ వారి వద్దకు వెళ్లి విషయం తెలుసుకున్నాడు. తనపై గ్యాంగ్రేప్ జరిగిందని, ఈ ఇద్దరు యువకులు ఉన్నారంటూ వెనుక నుంచి వస్తున్న వారిని చూపించింది. ఆ కానిస్టేబుల్ ఇద్దరిని పట్టుకోగా, మరో ఇద్దరి పారిపోయారు. ఒకటో టౌన్ ఎస్హెచ్వో గోవర్దన గిరి వచ్చి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. పలు అనుమానాలు.. రైల్వేస్టేషన్లో అర్ధరాత్రి రైలు దిగిన భార్యభర్తలు స్టేషన్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రధాన మార్గం ఉండగా చెట్లపొదల నుంచి రావడం.. పోలీసుల విచారణలో ఆమె పొంతన లేని సమాధానం చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యులు పరీక్షలు జరిపి.. వారు సేకరించిన నమునాలను హైదరాబాద్ ల్యాబ్కు పంపారు. మహిళపై సామూహిక లైంగిక దాడి జరిగిందని ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న మహిళ సంఘాలు ఆస్పత్రికి చేరుకున్నాయి. సదరు మహిళ పొంతన లేని సమాధానం చెప్పడంతో వారు వెనుతిరిగి వెళ్లిపోయారు. -
వివాహితపై గ్యాంగ్రేప్
-
అంతు ‘చిక్కని’ నేరాలు
క్రైం (కడప అర్బన్ ) : కడప నగరం ఒన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో సియోన్ పురంలో నివసిస్తున్న పాలగిరి శివతేజారెడ్డి, పద్మావతి, ఎల్లారెడ్డిల ఏకైక కుమారుడు. తన స్నేహితుడు లోకేష్నాయక్తో పాటు 2014 ఆగష్టు 4 వతేదీన కడప- కృష్ణాపురం రైల్వే ట్రాక్ మధ్యలో మృతదేహాలై తేలారు. ఈ సంఘటన అప్పట్లో జిల్లాలో సంచలనం కలిగించింది. తమ బిడ్డల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శివతేజారెడ్డి తల్లి పద్మావతి రైల్వే పోలీసులు, జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. తాలూకా పోలీసులకు దర్యాప్తు కోసం బదిలీ చేశారు. కడప నగరంలోని ఒన్టౌన్ పోలీస్స్టేషన్లో హౌసింగ్ బోర్డు కాలనీలో నివసిస్తున్న సుభాన్ సాహెబ్ భార్య షేక్ షఫీవూన్ 2014 సెప్టెంబర్ నుంచి కన్పించడంలేదు. ఆమె ఆచూకీ ఇంత వరకు తెలియలేదు. తన భార్యను ఓవ్యక్తి తీసుకుని వెళ్లాడనీ ఫిర్యాదులో పేర్కొన్నాడు. 2014 ఆగష్టు 7వ తేదీన కడప కోఆపరేటివ్ కాలనీకి చెందిన పాలెం భాస్కర్ రెడ్డి అదృశ్యమయ్యారు. ఇంత వరకు ఆచూకీ లభించలేదు. ఆయన సమీప బంధువు, రిటైర్డ్ అదనపు ఎస్పీ రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే. అనేక కేసుల్లో మిస్టరీ వీడడం లేదు. జిల్లాలో రెండేళ్లుగా ఆచూకీ తెలియని కేసులు, దర్యాప్తు కొనసాగుతున్న కేసులు కోకొల్లలుగా ఉన్నాయి. వీటిల్లో కొన్ని కేసులు దర్యాప్తుకు చేరువలో ఉన్నాయి. కొన్నికేసుల్లో వివిధ వర్గాల ఒత్తిళ్ల నేపథ్యంలో దర్యాప్తు నత్తనడకన సాగుతున్నాయి. కడప నగరంలోని వివిధ స్టేషన్లలోని కేసులు పరిశీలిస్తే దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కడప నాగరాజు పేటలోని మహిళా వికాస పరస్పర సహకార సొసైటీ సీఈవో వేలూరు సూర్యనారాయణ భార్య శైలజ తన భర్త 2013 అక్టోబర్ 19 నుంచి కన్పించడం లేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో, కేసు నమోదు చేశారు. రూ 12 కోట్లు కుంభకోణానికి పాల్పడి దాదాపు రెండు వేలకు మంది పైగా మహిళలు తాము దాచుకున్న డబ్బు వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంస్థకు సంబంధించిన వ్యవహారంపై పలు కేసులు నమోదయ్యాయి. ఈకేసుపై సీఈవో ఆచూకీ తెలిసినా, సంస్థకు సంబంధించిన అధికారులను, డెరైక్టర్లను లోతుగా విచారిస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుంది. ఈ కేసును ఇప్పటికే కడప సీసీఎస్ పోలీసులకు దర్యాప్తు కోసం అప్పగించారు. ఇప్పటివరకు సదరు కేసుపై పోలీసులు అంతగా శ్రద్ధ చూపడంలేదనీ విమర్శలు గుప్పిస్తున్నాయి. కడప నగరంలోని ద్వారకా నగరంలో తన బంధువుల దగ్గర నివసిస్తున్న మేకల గోపీనాథ్ జూన్ 26వ తేదీనుంచి కన్పించడంలేదనీ, ఆస్తి విషయమై బంధువులు కన్పించకుండా చేశారనీ ఆరోపిస్తూ, గోపీనాథ్ భార్య వందన ఫిర్యాదు చేశారు. కడప చిన్నచౌకు పోలీసుస్టేషన్ పరిధిలో గత ఏడాది వాసవి ఎన్క్లేవ్లో రామలక్షుమ్మ, రామసుబ్బారెడ్డిల ఇంటిలో జరిగిన దోపిడీపై ఇప్పటివరకు పురోగతి లేదు. అలాగే రిమ్స్ పోలీసుస్టేషన్ పరిధిలో తిలక్నగర్లో ఓ పాడుబడ్డ ఇంటిలో బాంబు పేలుడు సంభవించింది. ఆ కేసులో ఇంతవరకు పరిష్కారం కాలేదు. ఆ సంఘటనలో చిన్నారులు గాయపడ్డారు. ఇంకా కడప నగరంలో దోపిడీలు, దొంగతనాలు, చైన్స్నాచింగ్లు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాలూకా పోలీసుస్టేషన్ పరిధిలో ఇండిక్యాష్ ఏటీఎంపై దుండగులు దాడి చేసి నానా బీభత్సం సృష్టించి ఏటీఎంనే ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సంఘటనపై విచారణ కొనసాగుతోంది.