mallepally laxmaiah
-
మన ప్రజాస్వామ్యం కాగితపు పులా?
ఉదార ప్రజాస్వామ్య సూచికలో మన దేశం 97వ స్థానంలో, ఎన్నికల ప్రజాస్వామ్య వ్యవస్థల్లో 108వ స్థానంలో ఉందని ‘వి–డెమ్’ నివేదిక చెబుతోంది. బయటి ప్రపంచంలో ప్రజాస్వామ్యం అంటే భావప్రకటనా స్వేచ్ఛ, ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకునే స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్య్రం లాంటి అంశాలు పరిగణనలోకి వస్తాయి. కానీ భారత్ లాంటి దేశంలో ప్రభుత్వాల విధానాలు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని నిర్ణయించలేవు. వేల సంవత్సరాలుగా పాతుకు పోయిన కుల వ్యవస్థ ఈ దేశ పాలననూ, ప్రగతినీ నిర్ణయిస్తున్నది. ప్రజాస్వామిక విధానాలకు ఊతం ప్రజల భావాల్లో ఉంది. కులవ్యవస్థను నిర్మూలించే దిశగా ఒక బలమైన ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళకపోతే, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఒక కాగితపు పులిగా మాత్రమే మిగిలిపోతుంది. భారతదేశం పెద్ద ప్రజాస్వామ్య దేశం. మానవ హక్కులూ, ప్రజాస్వామ్య భావాలూ, సమానత్వ అంశాలూ మేళవింపుగా ఉన్న ఆధునిక రాజ్యాంగం కలిగిన దేశం కూడా. అయితే ఇటీవల ప్రజాస్వామ్య దేశం తన ఉదార ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి నియంతృత్వ పోకడలకు దగ్గరవుతున్నట్టు, ‘వి–డెమ్’ తన పరిశోధనలో తేల్చింది. ఉదార ప్రజాస్వామ్య సూచికలో మన దేశం 97వ స్థానంలో, ఎన్నికల ప్రజాస్వామ్య వ్యవస్థల్లో 108వ స్థానంలోకి వెళ్ళింది. మత స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ, మహిళా స్వేచ్ఛ, ఆదిమ తెగలు, ఇతర వర్గాలకు సంబంధించిన స్వేచ్ఛల్లో మనం ఇతర దేశాలకన్నా వెనుకబడి ఉన్నామన్న విషయాన్ని చాలామంది చాలాసార్లు ప్రస్తావించారు. బయటి ప్రపంచంలో ప్రజాస్వామ్యం అనగానే ఒక ఐదారు అంశాలు ప్రస్తావనకు వస్తాయి. భావప్రకటనా స్వేచ్ఛ, ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకునే స్వేచ్ఛతో పాటు పత్రికా స్వాతంత్య్రం లాంటి అంశాలు పరిగణనలోకి వస్తాయి. స్వీడన్ విశ్వవిద్యాలయాల ఆ«ధ్వర్యంలో నిర్వహిస్తోన్న వి–డెమ్ (విభిన్న ప్రజాస్వామ్యాలు) సర్వే కూడా ప్రభుత్వ పాలనకు సంబంధించిన అంశాలనే పేర్కొంటుంది. అయితే భారత్ సహా మరికొన్ని దక్షిణాసియా దేశాలలో ఈ పరిశీలన మాత్రమే సరిపోదు. ఇక్కడ ప్రభుత్వాల విధానాలు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని నిర్ణయించలేవు. వేల సంవత్సరాలుగా పాతుకుపోయిన కుల వ్యవస్థ ఈ దేశ పాలననూ, ప్రగతినీ నిర్ణయిస్తున్నది. మూల కారణం ప్రస్తుతం మన దేశంలో మోదీ పాలన నియంతృత్వాన్ని అమలు చేస్తున్నదనే విషయం ఎక్కువగా చర్చకు వస్తున్నది. కనీవినీ ఎరుగని రీతిలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నది. రాజ్యాంగ విలువలకు స్థానం లేకుండా పోతున్నది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, ముఖ్యంగా ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీని విధించి అణచివేతను కొనసాగించారు. కానీ ఇందిరాగాంధీ నియంతృత్వానికీ, మోదీ నియంతృత్వానికీ గుణాత్మకమైన తేడా ఉన్నదన్న విషయాన్ని గమనించాల్సి ఉంది. ఇందిరాగాంధీ తన పాలనను కాపాడుకోవడానికి తాత్కాలికంగా నిర్బంధాన్ని అమలు జరిపారు. తదనంతరం తన తప్పు తెలుసుకొని ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు. మోదీ పాలన ప్రజాస్వామ్యాన్ని పాతరేసి, ప్రజలను విభజించి, రాజ్యాంగం ప్రకటించిన ‘మేమంతా భారతీయులం’ అనే భావనకు చరమగీతం పాడుతున్నది. రెండువేల సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న కుల వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి కావాల్సిన చర్యలన్నింటినీ తీసుకుంటున్నది. అయితే మోదీకి గానీ, భారతీయ జనతా పార్టీకి గానీ ఆ ధైర్యం కలగడానికి, అంత బహిరంగంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికి పునాది ఇక్కడి కుల వ్యవస్థలో ఉంది. దానితో పాటు రోజురోజుకీ గుత్తాధిపత్యం వైపు వెళ్ళిపోతున్న ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు ఏర్పడిన ఈ ప్రమాదాన్ని రాజ్యాంగ ముసాయిదాను సమర్థించిన 1949 నవంబర్ 25 రోజున బాబాసాహెబ్ అంబేడ్కర్ బహిరంగంగా దేశం ముందుంచారు. ‘‘ఒక మనిషి, ఒక ఓటు, ఒక విలువ ద్వారా మనం రాజకీయ సమానత్వాన్ని సాధించాం. కానీ సామాజిక, ఆర్థిక రంగాల్లో ఇంకా ఆ తేడాలు కొనసాగుతూనే ఉన్నాయి. సాధ్యమైనంత త్వరలో ఆ వ్యత్యాసాలను తొలగించుకోకపోతే, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది’’ అంటూ ఆనాడు చేసిన హెచ్చరిక ఈరోజు మరింత సత్యంగా కనపడుతున్నది. సోదరభావం కీలకం ఇతర దేశాల ప్రజాస్వామ్య భావనకూ, భారత దేశంలోని ప్రజాస్వామ్య అవగాహనకూ తేడా ఉన్న విషయాన్ని కూడా అంబేడ్కర్ స్పష్టంగా చెప్పారు. 1936లో రాసిన కుల నిర్మూలనలోనే ఆయన తన ఆలోచనలను ప్రపంచం ముందు పెట్టారు. ప్రజాస్వామ్యం అనగానే అది ఎన్నికలు, పాలన, ప్రభుత్వాల విధానాలు అని అనుకోవడం పొరపాటనీ, అది ప్రజల మధ్య ఉండే సంబంధాలను నిర్వచిస్తుందనీ కూడా అంబేడ్కర్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యానికి మూడు ముఖ్యమైన అంశాలను పేర్కొన్నారు. సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం కీలకమని చెపుతూ, ఇందులో అత్యంత ముఖ్యమైనది సోదరత్వం అంటారు. ఇది భారత దేశంలో కొరవడిన అంశమని తేల్చారు. గత డెబ్భై అయిదు సంవత్సరాలుగా అటు కాంగ్రెస్ గానీ, ఇతర పార్టీలు గానీ అంబేడ్కర్ హెచ్చరికలను పట్టించుకోలేదు. కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది. కులవ్యవస్థను నిర్మూలించే ఎటువంటి ప్రయత్నాన్ని గానీ, ప్రణాళికను గానీ కాంగ్రెస్ తన సుదీర్ఘ పాలనలో ఏనాడూ చేయలేదు. కేవలం ఆర్థిక తోడ్పాట్ల వంటివి మాత్రమే ఈ దేశంలో దళితులు, ఆదివాసుల జీవితాల్లో సమూలమైన మార్పులు తీసుకురాలేవనీ, కులవ్యవస్థను కూకటి వేళ్ళతో పెకిలించగలిగే పక్కా ప్రణాళిక అవసరమనీ గుర్తించడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందింది. అదే ఇప్పుడు బీజేపీకి ఆయుధంగా మారింది. ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోకూడదు. భారత దేశంలో ప్రభుత్వాల కన్నా ప్రజలే బలవంతులు. ప్రజల్లో తరతరాలుగా నాటుకొని పోయిన కుల వ్యత్యాసాలు, కుల అసమానతలు ఇక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధం. గత పదేళ్ళలో ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో బీజే పీ ప్రభుత్వం మనగలుగుతుందంటే కులాలలోని విభేదాలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడమే. దానితో పాటు, హిందూ మతంలోని పలు అంశాలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నది. గ్రామాల్లో ఏ కులాలైతే ఆధిపత్యంలో ఉన్నాయో వాటిని తమ బలంగా మార్చుకోవడం, అత్యధిక జనాభా కలిగిన కులాలను సమీకరించడం చూస్తే బీజేపీ ఎత్తుగడ ఏమిటో అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. అదే సమయంలో గత వందల ఏళ్ళుగా ముస్లింలు, హిందువుల మ«ధ్య ఉన్న వైషమ్యాలను ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో చాలా బలంగా వాడుకుంటున్నది. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన మాట నిజమే కానీ, దాని బలమేమీ తగ్గలేదు. కులాల పట్ల ప్రజల్లో ఉన్న భావాలను రెచ్చగొట్టడం ఇటీవలి కాలంలో ప్రభుత్వాల విధానాల్లో, న్యాయస్థానాల తీర్పుల్లో స్పష్టంగా కనపడుతున్నది. ఇటీవల దళితుల్లో పెరిగిన చైతన్యం అత్యాచారాల విషయంలో కేసులు నమోదు కావడానికి ఉపయోగపడింది. ఎస్సీ, ఎస్టీల కేసుల విషయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధిపత్య కులాలకు అండగా నిలబడే ప్రయత్నం చేసింది బీజేపీ. తమ పార్టీ పునాదిగా ఉన్న ఆధిపత్య కులాలను మరింత సంతృప్తి పరిచేందుకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల పేరుతో అసలు రాజ్యాంగాన్నే అపహాస్యం చేసింది. చివరగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో ఉదారవాద ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పాలన వంటి విధానాలు ఏవి అమలు జరగాలన్నా కుల వ్యవస్థ ప్రధానమైన అవరోధం. దీనికి ప్రభుత్వాల బాధ్యత కన్నా, ప్రజల్లో కుల భావనలను తొలగించడం ముఖ్యం. ప్రజల్లో కుల అసమానతల పట్ల సానుకూలత ఉన్నంత వరకూ, గ్రామాల్లో ఇంకా ఈ కులవ్యవస్థ కొనసాగుతున్నంత వరకూ ప్రజాస్వామ్యమనే భావనకు ఆస్కారమే లేదు. తాత్కాలికంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాస్వామిక విధానాలకు ఊతం ప్రజల భావాల్లో ఉంది. అంబేడ్కర్ చెప్పినట్టు, ప్రజాస్వామ్యం, అంటే సమానత్వంతో కూడిన సామాజిక జీవన గమనం కోసం... ప్రభుత్వాల నిర్బంధాలు, నియంతృత్వాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే... ప్రజల్లో ఉన్న కులవ్యవస్థను నిర్మూలించే దిశగా ఒక బలమైన ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళకపోతే, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఒక కాగితపు పులిగా మాత్రమే మిగిలిపోతుంది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
కర్ణాటక ఫలితాన్ని ఎలా చూడాలి?
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది అనడం కన్నా బీజేపీ ఓడింది అనడం కరెక్టు. ఎందుకంటే కాంగ్రెస్ది సంపూర్ణ విజయం అనుకోలేం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని వద్దనుకున్నవాళ్లు కాంగ్రెస్, జేడీ(ఎస్) మధ్య ఎటూ తేల్చుకోలేకపోయారు. ఈసారి మాత్రం కాంగ్రెస్ వైపు వచ్చారంతే! ఇప్పటికీ కర్ణాటకలో బీజేపీ బలమేమీ తగ్గలేదు. కానీ విడిపోయిన ప్రజలను ప్రతిపక్షం వైపు నిలబడేటట్టు చేసి, తన ఓటమిని తానే రాసుకుంది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ ఆర్థిక విధానాలకూ, బీజేపీ అమలు చేస్తున్న విధానాలకూ మౌలికమైన తేడా లేదు. దేశంలో నెలకొన్న అన్ని విషయాలపైనా, ప్రజల క్షేమం, సంక్షేమం, సమగ్రాభివృద్ధి అనేవి కాంగ్రెస్ ఆశయాలైతే, వాటికి అనుగుణమైన విధానాన్ని ప్రకటించాలి. ఇది ప్రజా విజయం. అధికార భారతీయ జనతా పార్టీ ఓటమి. ఇదే ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సారాంశం. అంతేగానీ, ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ విజయమనుకుంటే పొరపాటు. ఇది దేశ వ్యాప్తంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పునరావృతమవుతుందనుకుంటే అంతకన్నా పొరపాటు. అయితే, ఈ ఎన్నికల ఫలితాల వల్ల అంచనాలు తారుమారయ్యే అవకాశం మాత్రం ఉంది. మొదటిగా, ప్రజల విజయం విషయానికి వస్తే– గతంలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీని కాదనుకున్నవాళ్ళు జనతాదళ్ (ఎస్)కు, కాంగ్రెస్కు మధ్యలో నిలిచిపోయారు. ఈ ఎన్నికల్లో వాళ్ళు తెలివిగా చాలా చోట్ల జనతాదళ్(ఎస్)ను పక్కన పెట్టి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. భారతీయ జనతాపార్టీకి వ్యతిరేకంగా జేడీ(ఎస్),కాంగ్రెస్ పోటీలో ఉంటే, బీజేపీని కాదనుకున్న వాళ్ళు కాంగ్రెస్ వైపు మొగ్గారు. గత ఎన్నికల్లో జేడీ(ఎస్) 37 సీట్లలో విజయం సాధిస్తే, ప్రస్తుత ఎన్నికల్లో అది 19కి పడిపోయింది. అంటే సగానికి దిగజారిందని అర్థం. దీనికి కారణం, ప్రజల చతురత తప్ప మరొకటి కాదు. మూడు, నాలుగు పార్టీలు పోటీలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజలు అనుసరించడానికి ఇది ఒక నమూనా. ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్లో బీజేపీ చాలా బలంగా ఉన్నట్టు మనం భావిస్తున్నాం. ఎందుకంటే, పార్లమెంటు ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని రెండుసార్లు నిలబెట్టుకుంది. అది కూడా అత్యంత అధిక సంఖ్యలో. అక్కడ నాలుగు పార్టీలు పోటీ పడుతు న్నాయి. అందులో గత ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ చాలా బలహీనపడింది. కాంగ్రెస్ కూడా అంతంత మాత్రంగానే తన ఉనికిని చాటగలగింది. అయితే అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. 2017లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 312 సీట్లు గెలుచుకోగా, 2022లో దాని బలం 255కు పడిపోయింది. సమాజ్వాదీ పార్టీ 2017 ఎన్నికల్లో 47 స్థానాలకు పరిమితం కాగా, 2022లో 111 స్థానాలకు తన బలాన్ని పెంచుకున్నది. అంటే క్రమంగా సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో బీజేపీకి బలమైన ప్రతిపక్షంగా ఎదుగుతోంది. మిగతా రెండు పార్టీల పరిస్థితిని చూస్తే, ఇది మనకు అర్థం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ 2017 ఎన్నికల్లో 7 స్థానాల్లో గెలిచి, 6.25 శాతం ఓట్లను సాధించుకుంటే, 2022 ఎన్నికల్లో రెండు సీట్లకు పరిమితమై పోయి, 2.33 శాతం ఓట్లను మాత్రమే పొందగలిగింది. బహుజన్ సమాజ్ పార్టీ 2017 ఎన్నికల్లో 22.23 శాతం ఓట్లను సంపాదించి, 19 స్థానాల్లో విజయం సాధించింది. అయితే 2022 ఎన్నికల్లో ఓట్ల శాతం 12.88కి పడిపోగా, కేవలం ఒక్క స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. కాంగ్రెస్, బీఎస్పీ క్రమంగా తమ రాజకీయ బలాలను కోల్పోతున్నట్టు కనిపిస్తున్నది. ఒకవేళ అక్కడ బీజేపీని ఓడించాలనుకునే ప్రజలు సమాజ్ వాదీ పార్టీవైపే మొగ్గితే భారతీయ జనతాపార్టీ ఉత్తరప్రదేశ్లో తన ప్రాధా న్యతను కోల్పోవాల్సి వస్తుంది. అంటే జాతీయస్థాయి ఎన్నికల్లో కూడా బీజేపీ తన ఆధిపత్యాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడక తప్పదు. దానికి ఉదాహరణగా సీట్లు మాత్రమే కాదు, ఓట్ల శాతాన్ని కూడా చూడాలి. సమాజ్వాదీ పార్టీ 2017 ఎన్నికల్లో 21.82 శాతం ఓట్లను పొందితే, 2022 ఎన్నికల్లో అది 32.06 శాతానికి పెరిగింది. అంటే దాదాపు పది శాతానికి పెరిగింది. కాంగ్రెస్, బహుజన సమాజ్వాదీ పార్టీలు ప్రజాదరణ కోల్పోతున్నట్లు, సమాజ్వాది పార్టీ వైపు ప్రజలు వెళుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఇక రెండో విషయం, బీజేపీ ఓటమి: నిజానికి కర్ణాటక రాష్ట్ర చరిత్రలో ఇప్పటికీ ఒకే పార్టీ రెండు పర్యాయాలు అధికారంలోకి రాలేదు. 1985 నుంచి ఇదే చరిత్ర పునరావృతమవుతూ ఉంది. 1985 వరకు కర్ణాటకలో కాంగ్రెస్ పాలన కొనసాగింది. 1985లో మొదటి సారిగా జనతాపార్టీ నాయకత్వంలో రామకృష్ణ హెగ్డే ప్రభుత్వం ఏర్పా టయ్యింది. ఇదే మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం.1994లో జనతాదళ్ 227 సీట్లతో అధికారంలోకి వచ్చింది. 1999లో కాంగ్రెస్, 2004లో జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వం, 2008లో బీజేపీ ప్రభుత్వం, 2013లో మళ్ళీ కాంగ్రెస్, 2018లో మళ్ళీ బీజేపీ అధికారాన్ని అందుకున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది. ఇది కర్ణాటక అసెంబ్లీ చరిత్ర. కర్ణాటక ప్రజలు 1985 నుంచి ఇప్పటి వరకు ఒకే పార్టీకి రెండవసారి అధికారం కట్టబెట్టలేదు. అయితే బీజేపీ ఈ చరిత్రను తిరగరాయాలని ఉవ్విళ్ళూ రింది. అది ప్రజల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసింది. సూటిగా చెప్పాలంటే ముస్లింల మీద వ్యతిరేకతను రెచ్చ గొట్టి, మిగతా ప్రజలందరినీ తమవైపు తిప్పుకోవాలని చూసింది. అందులో భాగంగానే హిజాబ్, అజాన్, ఉమ్మడి సివిల్ కోడ్, పశుసంరక్షణ పేరుతో దాడులు, ఒక రకంగా, ఉత్తర ప్రదేశ్లో అనుసరించిన అన్ని విధానాలను ఇక్కడ అమలు చేయాలని శతవిధాలుగా ప్రయ త్నించింది. కానీ ఆ విషయాలేవీ కర్ణాటక ప్రజలు పట్టించుకోలేద నడానికి ఈ ఫలితాలే నిదర్శనం. ఇది మతాల మధ్య విభజన అయితే – ఇక కులాల మధ్య ముఖ్యంగా ఎస్సీలలో ఉన్న వ్యత్యాసాలను ఉపయోగించుకొని మాదిగల ఓట్లను పొందడం కోసం రిజర్వేషన్ల విభజనను తెరపైకి తీసుకొచ్చింది. అదికూడా ఫలించలేదు. తన ఆర్థిక, సామాజిక కార్య క్రమాలు, అభివృద్ధి పనులను చూపించుకోవడం కాకుండా, ఇటువంటి విభజనతో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలనుకున్నది. ఇప్పటికీ కర్ణాటకలో బీజేపీ బలమేమీ తగ్గలేదు. కానీ విడిపోయిన ప్రజలను ప్రతిపక్షం వైపు నిలబడేటట్టు చేసి, తన ఓటమిని తానే రాసుకుంది బీజేపీ. మూడో విషయం, కాంగ్రెస్ గెలుపు: ఇది బీజేపీ ఓడిపోయి,అందించిన గెలుపు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులైన శివకుమార్, సిద్ధరామయ్య ఐక్య కృషి తోడైనప్పటికీ తనకు తాను గెలిచిన గెలుపు కాదిది. ఎందుకంటే, పదేళ్ళ కిందట దేశంలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఆర్థిక విధానాలకూ, ఇప్పడు బీజేపీ అమలు చేస్తున్న విధానాలకూ మౌలికమైన తేడా లేదు. అయితే ఇటీవల ఆ పార్టీ నాయ కుడు రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మాటలు గత కాంగ్రెస్ విధా నాలకు భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, అదే విధంగా కార్పొరేట్ల గుత్తాధిపత్యం మీద రాహుల్ చేస్తున్న విమర్శల్లో ఆ మార్పును చూడవచ్చు. కానీ అవి పార్టీ విధానంగా ప్రకటించాలి. అదే విధంగా గతంలో తాము అనుసరించిన ఆర్థిక, రాజకీయ విధానాల పైన ఆత్మవిమర్శ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అంబానీలను ఆకాశానికెత్తిన విషయాన్ని గుర్తు చేసుకొని సవరించుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీపై ఉంది. అదే విషయంపై కొన్ని విషయాల్లో వ్యతిరేకించిన జైపాల్రెడ్డి లాంటి నాయ కులు పదవులు కోల్పోవాల్సి వచ్చింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అదే సంవత్సరంలో రాజీవ్ గాంధీ లాంటి నాయకులు అనుసరించిన హిందూత్వ అనుకూల విధానాలను సమీక్షించుకోవాలి. అయితే బీజేపీని కేవలం అధికారం కోసం మాత్రమే వ్యతిరేకించాలనే భావన ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను ఆశించలేం. దేశంలో నెల కొన్న అన్ని విషయాలపైనా, ప్రజల క్షేమం, సంక్షేమం, సమగ్రాభివృద్ధి అనేవి కాంగ్రెస్ ఆశయాలైతే, వాటికి అనుగుణమైన విధానాన్ని ప్రక టించాలి. కేవలం ఎన్నికల సమయంలో, లేదా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని, ఆ తర్వాత దాని ఊసుఎత్తక పోతే, కాంగ్రెస్కు కర్ణాటక లాంటి గెలుపులు కష్టమనే చెప్పాలి.అందుకే ఇకనైనా కాంగ్రెస్ చేసిన తప్పులకు లెంపలేసుకొని, సరికొత్త ప్రజా మార్గాన్ని ఎంచుకోక తప్పదు. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
సకల శక్తుల సాధన సబ్ప్లాన్
2013లో ‘ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టం’ రూపొందడం వెనుక చారిత్రక నేపథ్యం, రాజ్యాంగ రక్షణ, ఉద్యమ సందర్భాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా.. సబ్ప్లాన్ అవసరం, దాని అమలు తీరుతెన్నులపై అసెంబ్లీలో మొదట గళం విప్పింది వైఎస్సార్ అనే వాస్తవాన్ని విస్మరించడానికి లేదు. 2001లో ప్రతిపక్ష నాయకులైన వైఎస్సార్ సబ్ ప్లాన్ గురించి ప్రస్తావించడం వల్లనే ఆ అంశం రాజకీయ ఎజెండాలోకి చేరి, చివరికి చట్టం రూపం దాల్చింది. ఇప్పుడీ చట్టం కాలపరిమితి ముగిసే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని; దాన్ని మరో ఇరవై ఎళ్ళు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆర్డినెన్స్ జారీకి చొరవ చూపడం ముదావహం. దళితుల, ఆదివాసుల అభివృద్ధికి... ఈ చట్టం పొడిగింపు ఉపకరిస్తుంది. ‘‘ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టా నికి 2023 జనవరి 23తో పదేళ్ళ కాలపరిమితి ముగియనున్నందున, ఆ చట్టం లక్ష్యాలు ఇంకా నెరవేరాల్సి ఉన్నందున, ఆ చట్టాన్ని మరో ఇరవై సంవత్సరాలు పొడిగిస్తున్నాం’’ అంటూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జనవరి 22న ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. శాసన సభ, శాసనమండలి సమావేశాలు ఆ సమయానికి జరగటం లేనందువల్ల ఈ ఆర్డినెన్స్ అవసరమైందని కూడా ఆర్డినెన్స్లో పేర్కొన్నారు. మరికొన్ని అవసరమైన మార్పులను సైతం ఇందులో పేర్కొన్నారు. వీటితో పాటు, చట్టం పేరును ఆంధ్ర ప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టం’ అనడానికి బదులుగా ‘ఆంధ్ర ప్రదేశ్ ఎస్సీ కాంపోనెంట్, ఎస్టీ కాంపోనెంట్ చట్టం’గా మార్చారు. గతంలో ఉన్న విధంగా బడ్జెట్లో ప్లాన్, నాన్ ప్లాన్ లేనందువల్ల ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తున్న భాగాన్ని సబ్ప్లాన్కు బదులుగా కాంపోనెంట్గా పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కాలపరిమితి ముగిసే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, దళిత సంఘాల, సంస్థల అభ్యర్థనలను కూడా పరి గణనలోనికి తీసుకొని చట్టం కాలపరిమితిని మరో ఇరవై సంవత్స రాలు పొడిగించాలని నిర్ణయించినందుకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అభినందనీయులు. ఈ చట్టం పట్ల, అదే విధంగా రాజ్యాంగం పట్ల ఆయన తన గౌరవాన్ని ఆచరణాత్మకంగా వ్యక్తం చేయడం ప్రశంసనీయం. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టం– 2013’ రూపొందడం వెనుక చారిత్రక నేపథ్యం, రాజ్యాంగ రక్షణ, ఉద్యమ సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వపరంగా ఎటువంటి నిర్ణయాలు జరగాలన్నా, ప్రగతిశీల చట్టాలు అమలులోకి రావాలన్నా ప్రజల కోర్కెలు, ఉద్యమాలతో పాటు, రాజకీయ పార్టీల, సంస్థల అంగీకారం, రాజ్యాంగపరమైన ఆమోదం తప్పనిసరి. అలాంటి అన్ని రకాల మద్దతులను కూడగట్టిన చట్టాలలో సబ్ప్లాన్ చట్టం ఒకటి. మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు సబ్ప్లాన్ ఉద్యమంతో, చట్టం రూపకల్పనతో పాటు, దాని అమలు విషయంలో భాVýæమున్న వారిలో నేనూ ఒకరిని. సబ్ప్లాన్ అమలు కోసం జరిగిన యత్నాలలో భాగంగా సబ్ప్లాన్ నిధుల దారి మళ్ళింపు, అమలులో లోపాలపై నేను రాసిన వార్తాకథనం 2001 మార్చి 29న ఒక దినపత్రికలో అచ్చయింది. అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ వార్తాకథనాన్ని ఆనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో స్వయంగా పేపర్ని చూపించి మరీ ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భాన్ని చరిత్ర మరువదు. శాసనసభలో ఆనాడు వైఎస్ ప్రస్తావించడంతో అది రాజకీయ ఎజెండాలోకి చేరింది. సబ్ప్లాన్ అవసరం, దాని అమలు తీరుతెన్నులపై మొదట గళం విప్పింది వైఎస్ఆర్ అనే వాస్తవాన్ని ఎన్నటికీ విస్మరించడానికి లేదు. 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్’ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ని కలిసి సమర్థంగా సబ్ప్లాన్ అమలుచేయాలని అభ్యర్థించాం. ఒకవైపు ప్రభుత్వంతో ఈ విషయమై సంప్రదిస్తూనే, రెండోవైపు సబ్ప్లాన్ విషయంలో చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ క్రమంలోనే 2007లో సీపీఎం నాయకత్వంలోని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో సబ్ప్లాన్ అమలు కోసం అప్పటి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు నేతృత్వంలో అక్టోబర్లో నిరాహార దీక్షలు జరిగాయి. ఆ సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ స్పందించి, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ అమలు కోసం నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. ఆ తర్వాత నోడల్ ఏజెన్సీతో పాటు సబ్ ప్లాన్ చట్టం కోసం విశాలమైన ఉద్యమం జరిగింది. దాదాపు 150కి పైగా సంఘాలతో ఏర్పాటైన ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో 2012 మార్చిలో 72 గంటల దీక్ష జరిగింది. ఇందులో కేవీపీఎస్, డీబీఎఫ్, సీడీఎస్, ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్స్ ఫోరం, దళిత, ఆది వాసీ, సంఘాలతో పాటు సీపీఎం, సీపీఐ, టీఆర్ఎస్, బీజేపీ, వైఎస్ ఆర్సీపీ, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ పార్టీలు తమ మద్దతును తెలియజేశాయి. వీటన్నింటితో పాటు, అధికార కాంగ్రెస్ పార్టీలోని ఎస్సీ, ఎస్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉద్యమానికి మద్దతు తెలిపారు. దీనితో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 2012 డిసెంబర్ 2న చట్టం అసెంబ్లీ ఆమోదం పొందింది. గెజిట్లో జనవరి 23 నుంచి అమలులోకి వచ్చింది. ఈ ఉద్యమ ప్రస్థానంలో చాలామంది వ్యక్తులతో పాటు సంస్థలూ పాల్గొన్నాయి. ఆ వివరాలన్నీ ఇక్కడ ప్రస్తావించడం సాధ్యం కాదు. అయితే చట్టం ఏర్పడిన నేపథ్యం అర్థం కావడానికే ఈ ప్రాథమిక విషయాల ప్రస్తావన. సబ్ప్లాన్ అనే ఒక అంశం రూపొందడానికి చారిత్రక నేపథ్యం ఉంది. ఈరోజు షెడ్యూల్డ్ కులాలుగా పిలువబడుతున్న అంటరాని కులాల సామాజిక, విద్య అభివృద్ధి కోసం ప్రత్యేక పాఠశాలలు, పథకాలు ఉండాలని మొదట మాట్లాడిన సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు ఫూలే. బ్రిటిష్ ప్రభుత్వం 1882లో ఏర్పాటు చేసిన హంటర్ కమిషన్కు ఆయన ఇచ్చిన విజ్ఞాపనలో అంటరాని కులాలైన మహర్, మాంగ్, మాతంగ్లకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయా లని కోరారు. భారతదేశంలో ఇది మొట్టమొదటి ఆలోచన. ఆ తర్వాత సాహూ మహారాజ్, శాయాజీరావు గైక్వాడ్లు రిజర్వేషన్లు మొదలు పెట్టారు. అనంతర కాలంలో భారతదేశ చిత్రపటం మీదకి వచ్చిన బాబాసాహెబ్ అంబేడ్కర్ 1927లో బొంబాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్న సమయంలో కౌన్సిల్లో మాట్లాడుతూ, అణగారిన వర్గాలైన అంటరాని కులాల పిల్లల విద్యాభివృద్ధికి ప్రత్యేక హాస్టల్స్ నిర్మించాలని ప్రతిపాదించారు. నేటి మన రెసిడెన్షియల్ పాఠశాలల వ్యవస్థకు అదే పునాది. అలాగే 1932 సెప్టెంబర్ 24న గాంధీ–అంబేడ్కర్ల మధ్య కుదిరిన పూనా ఒడంబడికలోని 9వ అంశంలో అంటరాని కులాల విద్యార్థుల విద్య కోసం ప్రతి రాష్ట్రం, కేంద్రం కళాశాల నిధులను కేటాయించాలని ఉంది. ఇది ఒక రకంగా మొట్టమొదటి బడ్జెట్ ప్రస్తావన. 1944లో బాబాసాహెబ్ అంబేడ్కర్ బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, విదేశీ విద్య ప్రోత్సాహం, ఉద్యోగాల రిజర్వే షన్లు సాధించారు. వీటన్నింటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 1950 జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 46ను చేర్చి ప్రభుత్వాలు షెడ్యూల్డ్ కులాల, తెగల అభివృద్ది కోసం సత్వరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అయితే ప్రప్రథమ ప్రధాని నెహ్రూ కాలంలో ఇటువైపు అడుగులు పడలేదు. 1970 తర్వాత అప్పటి ప్రధాని ఆనాటి రాజకీయ, ఉద్యమ ప్రభావాలతో 1974 ఎస్సీ సబ్ప్లాన్ను, 1980లో ఎస్సీ కాంపోనెంట్ ప్లాన్ను ప్రారంభించారు. 2006లో ఎస్సీ కాంపోనెంట్ ప్లాన్ను ఎస్సీ సబ్ ప్లాన్గా మార్చారు. అయితే ఈ పథకాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. 2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్.రాజశేఖర్ రెడ్డి లేవ నెత్తేంత వరకు దీని గురించిన అవగాహన ఎవ్వరికీ లేదనడంలో సందేహం అక్కర్లేదు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చట్టం ఏర్పడిన తర్వాత కర్ణాటకలో, ఉత్తరాఖండ్, రాజస్థాన్లలో ఇటువంటి చట్టాలు అమలులోకి వచ్చాయి. పంజాబ్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ క్రమంలో.. ఈ ఏడాదితో కాల పరిమితి తీరిన ‘ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టాన్ని మరో ఇరవై ఏళ్లు పొడిగిస్తూ ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహర్రెడ్డి ఆర్డినెన్స్కు చొరవ చూపారు. దళితుల, ఆదివాసుల అభివృద్ధికి... ప్రత్యేకించి నివాస, మౌలిక సదుపాయాల, విద్యావకాశాల మెరుగు కోసం, ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలను చేపట్టడం ద్వారా వారు ప్రగతి సాధించడానికి ఈ చట్టం పొడిగింపు ఉపకరిస్తుంది. ఈ ఉన్నత లక్ష్యసాధనలో మరిన్ని ముందడుగులు పడాలని ఆశిద్దాం. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
మనుషులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో.. !?
భారతదేశంలో మరణానికి ముందు వెనుకల కూడా సనాతనమైన, అమానవీయమైన సాంప్రదాయాలు మనిషిని వెంటాడుతున్నాయి. ఆ సంప్రదాయాల్లో పడి గంజిలో పడ్డ ఈగల్లా బయ టకు రాలేక, అందులో పడి చావలేకా... కొట్టుమిట్టాడుతున్నాం. అద్దె ఇంట్లో ఆత్మీయులు, కుటుంబ సభ్యులు మరణిస్తే కనీసం అక్కడ ఉండి కర్మకాండలు నిర్వహించుకోవడానికి వీలులేని దయనీయ సామాజిక వ్యవస్థలో మనం బతుకుతున్నాం. అందుకే అద్దె ఇంట్లో ఉండేవారు అంతిమ దశలో తమకంటూ సొంత గుడిసె అయినా ఉండాలని కోరుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్లో ఓ తల్లి తన కుమారుణ్ణి ఊరు చివర చిన్న గుడిసె అయినా పరవాలేదు, సొంత ఇల్లు కట్టమని వేడుకుంది. దీంతో ఆమె కుమారుడు లోన్ తీసుకుని సొంతిల్లు కట్టి తల్లి భయాన్ని పోగొట్టాడు. కరీంనగర్ పట్టణంలో బస్వరాజు కనకయ్య, భార తమ్మ అనే రజక దంపతులు ఎన్నో ఏళ్ళుగా తమ చేతనైన పనిచేసుకొని బతుకుతున్నారు. వాళ్లకు ఇద్దరు కూతుళ్ళు. పెద్దమ్మాయి స్వప్న దివ్యాంగురాలు. ఒక కాలు పని చేయదు. రెండో అమ్మాయి సరితకు పెళ్ళయ్యింది. నిజానికి బసవయ్యకు పెళ్లయిన ఒక కుమారుడు ఉన్నా అతడు తొమ్మిదేళ్ల క్రితం గుండె పోటుతో చనిపోయాడు. అప్పుడు కూడా అప్పటి అద్దె ఇంటి యజమాని ఇంటికి రానివ్వలేదు. ఇపుడు బసవరాజు కనకయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడి మరణించాడు. ఆసుపత్రి యాజమాన్యం ఆయన బతికే అవకాశం లేదని, ఇంటికి తీసుకుపోతే బాగుంటుందని చెప్పింది. ఆ స్థితిలో ఉన్న కనకయ్యను ఇంటికి తీసుకుపోతే, ఇంటి యజమానులు రానీయలేదు. గత్యంతరం లేక కరీంనగర్ పట్టణంలోని శ్మశానంలోకి తీసుకెళ్ళారు. ప్రాణం ఉండగానే కనకయ్యను శ్మశానంలోకి తీసుకెళ్ళిన కుటుంబం ఆయన చావుకోసం ఎదురు చూసింది. ఒక రోజు తర్వాత కనకయ్య కన్నుమూశాడు. మరణానంతరం జరగాల్సిన కర్మకాండ అంతా ముగించుకొని మాత్రమే తిరిగిరావాలని ఇంటి యజమాని చెప్పడంతో ఇద్దరు ఆడపిల్లలతో మృతుని భార్య 14 రోజులు శ్మశానంలోనే గడిపింది. హైదరాబాద్లోని అపార్ట్మెంట్లలో ఎవరైనా అద్దెకు ఉండి, అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే, ఆ కాంపౌండ్ నుంచి శవాన్ని తీసివేయాలి. ఒకవేళ ఆసుపత్రిలో మరణిస్తే అటునుంచి అటే సొంత ఊరికైనా తీసుకెళ్ళాలి. లేదా నేరుగా శ్మశానానికి తీసుకెళ్ళాలి. కొన్ని గ్రామాల్లో మరొక వింత సాంప్రదాయం ఉంది. ఎవరైనా అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళి, చికిత్స పొందుతూ మరణిస్తే, ఆ వ్యక్తి మృతదేహాన్ని రానివ్వని గ్రామాలు కూడా ఉన్నాయి. పది సంవత్సరాల క్రితం మంథని దగ్గర్లోని ఒక ఊరి ప్రజలు ఇట్లాగే ప్రవర్తిస్తే, పోలీసుల సహకారంతో ఆ మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్ళి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. దీనికి నేనే ప్రత్యక్ష సాక్షిని. అదేవిధంగా తిరుపతి పట్టణంలో, దాని చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినట్టు, జరుగుతున్నట్టు పాత్రికేయ మిత్రుల ద్వారా తెలిసింది. విశాఖతో పాటు అనేక చోట్ల ఇంటి అద్దె కోసం వచ్చిన వాళ్ళను కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులు ఉంటే ఇంటి యజమానులు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి నిరాకరిస్తున్న పరిస్థితి ఉంది. మనిషికి మరణం తథ్యమనీ, అది ఎప్పుడైనా, ఎవరికైనా రావొచ్చనీ తెలిసి కూడా మనుషులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారనేది అర్థం కాని ప్రశ్న. దీనికి గాను నేను ఎవ్వరినీ నిందించడం లేదు. కానీ దీని గురించి ఆలో చించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాను. ఇటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కొందరు పుట్టించిన సాంప్రదాయాలు కారణమవుతున్నాయని భావించక తప్పదు. ఇంట్లో ఒక మరణం జరిగితే, కొందరు పురోహి తుడిని సంప్రదిస్తుంటారు. ఇటీవల ఇటువంటి వారి సంఖ్య మరింత పెరిగింది. ఆ పురోహితుడు... వ్యక్తి ఏ ముహూర్తంలో చనిపోయాడో నిర్ణయించి దుర్ముహూర్తమైతే, దానికి శాంతి ఉపాయాలు సూచించి, కొన్నిసార్లు కొన్ని నెలల పాటు మరణించిన ఇంటిని విడిచి పెట్టాలని సూచిస్తున్నారు. దీనిని చూసి ఇంటి యజమానులలో... తమ ఇంట్లో వేరే వాళ్ళ మరణం జరగరాదని, మృతదేహాన్ని ఇక్కడపెట్టరాదనే ఛాందస భావనలు కూడా బాగా పెరుగుతున్నాయి. తమ ఇంట్లో పెళ్లి జరగబోతున్న వారు సొంత బంధువుల అంత్యక్రియలకూ హాజరు కావడానికి ఇష్టపడటం లేదు. ఇట్లా మరణం చుట్టూ అల్లుకున్న ఈ ప్రవర్తన మన సమాజం డొల్లతనాన్ని చూపెడుతున్నది. నిజానికి మన రచనలలో, ప్రసంగాల్లో మృత దేహాన్ని పార్థివ దేహం అంటారు. అంటే పంచభూతాలతో నిండిన శరీరం జీవం పోవడం వల్ల... వాయువును, అగ్నిని, నీటిని, తన సహజ స్వభావాన్ని కోల్పోయి కేవలం మట్టిగా మిగిలిందని చెబుతారు. మట్టి మట్టిలో కలుస్తుంది. పంచ భూతాలతో నిండిన శరీరంలో మట్టి మిగిలినందున ఎంతో పవిత్రమైందిగా చూడాలి. కానీ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుండడం వింత సాంప్రదాయంగా భావించొచ్చు. కానీ చావును ఒక భయంకరమైన ఘటనగా చూపించి, దాని చుట్టూ ఒక మూఢనమ్మకాన్ని సృష్టించి, ఆ అంధ విశ్వాసాన్ని సమాజం అంతటా వ్యాప్తి చేస్తున్నారు. ఇటువంటి మూఢ నమ్మకాలను తొలగించకుండా, సమాజంలో మానవత్వాన్ని నింపలేం. ఈ మూఢ నమ్మకాలను ప్రేరేపిస్తున్న వారే ముందుకు వచ్చి, ఇవి సరైనవి కావని చెప్పాలి. లేదా అవి శాస్త్రీయమైనవైతే వాటిని ఆధారాలను, శాస్త్రాలను బయటపెట్టాలి. ఒకవేళ వాళ్ళు ఆ పని చేయలేకపోతే, మానవత్వమున్న ప్రతి ఒక్కరం దీని మీద ఒక కార్యాచరణకు పూనుకోవాలి. అదే విధంగా ప్రభుత్వం వైపు నుంచి రెంట్ కంట్రోల్ యాక్ట్లో కొన్ని మార్పులు చేయాలి. ఇంటి యజమానులు ఇటువంటి అమానవీయ చర్యలకు పాల్పడితే, శిక్షించడానికి వీలుగా ఆ చట్టంలో సవరణలు చేసి, వాళ్ళను శిక్షార్హులుగా చేయాలి. దీని గురించి న్యాయనిపుణులు, ప్రజా ప్రతినిధులు ఆలోచిం చాలి. మన దేశంలో రోజు రోజుకీ పెరుగుతున్న పట్టణీకరణ, అద్దె ఇండ్ల సమస్యలను పెంచుతున్నది. కావున ఇది కోట్ల మంది సమస్య. రాజకీయ పార్టీలు, సంఘాలు మానవత్వంతో తమ పాత్రను నిర్వహించాల్సి ఉంది. (క్లిక్ చేయండి: 66 ఏళ్లుగా సర్వసాధారణం.. ఇప్పుడెందుకు వివాదం!) - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
కట్టుకథలు, అర్ధ సత్యాలు మాత్రమే!
అక్టోబర్ 21న మల్లెపల్లి లక్ష్మయ్య రాసిన ‘ఆ ప్రతిజ్ఞలే మార్గదర్శకాలు’ వ్యాసానికి ఇది స్పందన. గత అరవై ఏళ్లుగా నియోబుద్ధిస్ట్ లాబీ, అంబేడ్కర్వాదులూ అంబేడ్కర్ గురించి కట్టుకథలు, అర్ధసత్యాలు సృష్టించడంలో విజయం సాధించారు. అరుణ్ శౌరి (వర్షిపింగ్ ఫాల్స్ గాడ్స్) తప్ప ఎవరూ అంబేడ్కర్కు సంబంధించిన నిజానిజాలను వెలికితీసే విషయంలో ధైర్యం చేయలేకపోయారు. అంబేడ్కర్ ప్రతి మాటనూ అంబేడ్కర్వాదులూ, నియోబుద్ధిస్టులూ గుడ్డిగా సమర్థిస్తారు. అంబేడ్కర్పై చిన్న విమర్శను కూడా వారు సహించలేరు. వారికి మాత్రం హిందూ మతంపైనా, హిందూ దేవుళ్లపైనా విమర్శలు చేసే వాక్ స్వాతంత్య్రం ఉంది. అంబేడ్కర్ స్వయంగా తన రచనల్లో హిందూ మతం పైనా, బ్రాహ్మణులపైనా తన ద్వేషాన్ని వెళ్లగక్కారు. 1956 అక్టోబర్ 14న అమాయక హిందువులను బౌద్ధ మతంలోకి మారుస్తూ దీక్ష ఇచ్చిన సమయంలో చేయించిన 22 ప్రతిజ్ఞల్లోనూ ఇదే విద్వేషం కనిపిస్తుంది. ఆరోజు అక్కడ చేరినవారందరూ తాము బౌద్ధంలోకి మారుతున్నామనే అనుకున్నారు. బౌద్ధంలో ఈ 22 ప్రతిజ్ఞలు లేవని వారెవరికీ తెలియదు. నిజానికి అంబేడ్కర్ బౌద్ధమతంలోకి మార్చే పేరుతో ఆయనే ఓ సొంత మతాన్ని ఆవిష్కరించారు. – డాక్టర్ పి. కృష్ణమోహన్ రెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్, ఎస్వీయూ -
66 ఏళ్లుగా సర్వసాధారణం.. ఇప్పుడెందుకు వివాదం!
అక్టోబర్ అయిదవ తేదీన బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, మిషన్ జై భీం సంస్థల ఆధ్వర్యంలో పదివేల మందికి పైగా న్యూఢిల్లీలోని అంబేడ్కర్ భవన్లో బౌద్ధ ధమ్మ దీక్ష స్వీకరించారు. అందులో ధమ్మ దీక్ష సంప్రదాయం ప్రకారం, బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన 22 ప్రతిజ్ఞలను పఠించారు. గత 66 ఏళ్లుగా ఎక్కడ బౌద్ధ ధమ్మ దీక్షా సమ్మేళనాలు జరిగినా ఇది సర్వసాధారణంగా జరిగే కార్యక్రమం అయ్యింది. ఇప్పుడు దాన్ని బీజేపీ వివాదాస్పదం చేసి రాజకీయ ప్రయోజనాలను పొందాలనుకుంటోంది. 1950 అక్టోబర్ 14 విజయదశమి నాడు అంబేడ్కర్ నాయకత్వంలో ఐదున్నర లక్షల మంది బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించినప్పుడు... అంబేడ్కర్ రూపొందించిన 22 ప్రతిజ్ఞలను అనుసరిస్తామని అందరూ శపథం చేశారు. అందులో నైతిక సూత్రాలు, నైతిక జీవన విధానంతో పాటు దేవీ దేవతలను పూజించం అనే అంశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, బుద్ధుడు ప్రభోదించిన అష్టాంగ మార్గాన్ని అవలంబిస్తామనే విషయం కూడా ఉంది. అక్టోబర్ 5న జరిగిన బౌద్ధ ధమ్మ దీక్షా స్వీకార ఉత్సవానికి ఢిల్లీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజేంద్రపాల్ గౌతమ్ కూడా హాజరయ్యారు. ఈ విషయాన్ని ఢిల్లీ భారతీయ జనతాపార్టీ నాయకులు వివాదాస్పదం చేశారు. అక్కడ హిందూ దేవుళ్ళని కించపరిచారనీ, దూషించారనీ, అందులో రాజేంద్ర గౌతమ్ భాగమయ్యారనీ ఆరోపించారు. రాజేంద్ర గౌతమ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని, హిందూ వ్యతిరేక పార్టీగా చిత్రీకరించడానికి చేసిన ప్రయత్నమే ఇది. అందులో భాగంగానే రాజేంద్ర గౌతమ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో గుజరాత్లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ ఈ అంశాన్ని ఆప్కు వ్యతిరేకంగా వాడుకోవాలని చూస్తున్నదని భావించిన రాజేంద్ర గౌతమ్ తనకు తానుగానే మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ‘ఈ వివాదాన్ని సృష్టించి, ఆప్ను ఇరకాటంలో పెట్టాలని బీజేపీ భావించింది. అంతే కాకుండా బాబాసాహెబ్ అంబేడ్కర్ను దోషిగా నిలబెట్టాలనీ చూశారు. పదవి, బాబాసాహెబ్ అంబేడ్కర్ అనేవి రెండు విషయాలు నా ముందున్నప్పుడు అంబేడ్కర్ మహోన్నతా శయం మాత్రమే నాకు కనిపించింది. పదవిని వదులుకున్నాను. భవిష్యత్లో మరింత శక్తిమంతంగా అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా గౌతమ బుద్ధుని మార్గంలోనే నడవడానికి నిశ్చ యించుకున్నాను’ అన్నారు. అసలు బాబాసాహెబ్ అంబేడ్కర్ కులాన్ని పెంచి పోషిస్తున్న హిందూ మతాన్ని వీడి, సమత, కరుణ, ప్రేమతో నిండిన బౌద్ధాన్ని స్వీకరించడానికి, ఇప్పటికీ ఈ దేశంలోని దళితులు, ఇతర మానవతావాదులు బౌద్ధాన్ని స్వీకరించడానికీ ఎవరు కారకులు? ఏంటి కారణాలు? అనేది ఆలోచించాలి. అంబేడ్కర్ 1935, అక్టోబర్ 13వ తేదీన పదివేల మంది అణగారిన కులాల పేరుతో పిలవబడే అంటరాని కులాల ప్రజలు పాల్గొన్న సమావేశంలో మాట్లాడుతూ... ‘దురదృష్టవశాత్తూ నేను హిందువుగా జన్మించాను. కానీ హిందువుగా మరణించను. అంతిమ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. హిందూ సమాజంలోని ఆధిపత్యకులాలు పెడుతున్న బాధలు భరించడం ఇంకా అవసరం లేదు. అయితే ఒక మతాన్ని వీడి, మరో మతాన్ని స్వీకరించాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. సమానత్వ హోదా, భద్రత, గౌరవప్రదమైన జీవితం లభించగలిగే ధర్మంలోకి వెళ్ళాలి’ అన్నారు. అదే సందర్భంలో అప్పటికే ఐదేళ్లుగా సాగుతున్న నాసిక్లోని కాలారామ్ దేవాలయ ప్రవేశ ఉద్యమాన్ని అంబేడ్కర్ ప్రస్తావించారు. ఏ మతంలోని దేవాలయాలలోకి మనకు ప్రవేశం లేదో, ఆ మతంలో ఉండాల్సిన అవసరం ఉందా అని బహిరంగంగా ప్రశ్నించారు. అంతేకాకుండా, 1922 మార్చి 20వ తేదీన మహద్లోని చౌదర్ చెరువు నీళ్ళను తాగడానికి సాగించిన సత్యాగ్రహం, ఆ సందర్భంగా మహర్లపై జరిగిన దాడి ఆయన మనస్సులో బలంగా నాటుకుపోయింది. మహద్ చెరువులోని నీళ్లు తాగ డానికి అందరికీ హక్కు ఉన్నదని అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఆధిపత్య కులాలు ఆనాటి మహర్లను చాలా క్రూరంగా కొట్టి, గాయపరిచారు. ఈ ఘటనలు కూడా అంబే డ్కర్ను పెద్దగా బాధించలేదు. కానీ ఆయన 1919 నుంచి 1932 వరకు దాదాపు 13 ఏళ్లపాటూ పోరాడిన ఫలితంగా ప్రకటించిన ‘కమ్యూనల్ అవార్డు’ వల్ల సాధించిన ప్రత్యేక ఎన్నికల హక్కుని వదులు కోవలసి వచ్చినప్పుడు ఎంతో క్షోభ అనుభవించారు. 1932 ఆగస్టు 16వ తేదీన ఆనాటి బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సె మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటిస్తే, పూనాలోని ఎరవాడ జైలులో ఉన్న మహాత్మాగాంధీ దానిని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్తో ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ‘ఇది హిందువులను విభజించడమే’ అనే వాదనను గాంధీజీ ముందుకు తీసుకొచ్చారు. అణగారిన వర్గాల ప్రత్యేక ఎన్నికల విధానాన్ని అంగీకరించనని మొండికేశారు. దీనిని అంబేడ్కర్ తీవ్రంగా ప్రతిఘటించారు. చివరకు హిందూ సంస్థలు, సంఘాలు అంబేడ్కర్ మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. గాంధీజీ ప్రాణానికి ఏమైనా జరిగితే, అణగారిన కులాల భద్రత ప్రమా దంలో పడగలదని భావించిన అంబేడ్కర్ 1932, సెప్టెంబర్ 24వ తేదీన ‘పూనా ఒడంబడిక’కు ఒప్పుకున్నారు. దానివల్ల దళితులు తమ ప్రతినిధులను తాము మాత్రమే ఎన్నుకునే హక్కును కోల్పోయారు. ఈ రోజు మనం చూస్తున్న రిజర్వుడు సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది. ఈ సంఘటన అంబేడ్కర్ను తీవ్రంగా కదిలించింది. ఆలోచింపజేసింది. ఫలితంగా కుల నిర్మూలన ప్రతిపాదన ముందుకు తెచ్చారు. అంటరానివారెవరు, శూద్రులెవరు వంటి అంశాలతో పాటూ ఇంకా హిందూ మతంపైన అనేక రకాలైన అధ్యయనాలూ, బౌద్ధంపైన పరిశోధనలూ చేశారు. 1956 అక్టోబర్ 14వ తేదీన బౌద్ధాన్ని స్వీకరించారు. ఇప్పుడు చెప్పండి... బాబా సాహెబ్ అంబేడ్కర్ హిందూ మతం మీదగానీ, కుల వ్యవస్థ మీదగానీ పోరాటాన్ని తీవ్రంగా పదునెక్కించడానికి ఆనాటి హిందూ పెద్దలు, ప్రత్యేకించి గాంధీ లాంటి వాళ్ళు కారణం కాదా? ఈ నేపథ్యాన్ని అర్థం చేసుకుంటేనే అంబేడ్కరిస్టుల పోకడలు అర్థం అవుతాయి. (క్లిక్: భరత జాతికి ఒక ఆంగ్ల నాడి) రకరకాల కారణాలతో గత 75 సంవత్సరాల్లో 30 వేల మంది దళితులను పొట్టనపెట్టుకున్నారు. 50,000 మందికి పైగా దళిత మహిళలు అత్యాచారాలకు, హత్యలకు గురయ్యారు. ఇప్పటికైనా హిందూ మత పెద్దలు తమ మతాన్ని సంస్కరించుకోకపోతే దళితులకు, కుల అణచివేతకు గురవుతున్న ఇతర బలహీన వర్గాలకు అంబేడ్కర్ 22 ప్రతిజ్ఞలు మాత్రమే మార్గం అవుతాయనడంలో సందేహం లేదు. (క్లిక్: రూపాయి విలువ తగ్గింది, ఎందుకు?) - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
చరిత్ర వక్రీకరణ మహానేరం
చరిత్రను వక్రీకరించడం జనసంహారం చేసే ఆయుధాల కన్నా ప్రమాదకరం. అది ప్రజలను తరతరాలుగా తప్పుదోవ పట్టిస్తుంది. చరిత్ర ఒక జ్ఞాపకం మాత్రమే కాదు, అది భావి తరాలకు మార్గదర్శి. తమ రాజకీయ, ఆర్థిక, సామాజిక అవసరాలకు చరిత్రను ఒక సాధనంగా చూడటమనేది స్వార్థ చింతన. చరిత్రకు మసిపూసి మారేడు కాయ చేయడమనేది ఒక రాజకీయ దృక్పథంగా మారిపోవడం విషాదం. ప్రస్తుతం తెలంగాణ సమాజం అదే విధమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నది. తెలంగాణ విమోచన, విలీనం, విద్రోహం, సమైక్యత అనే వాదాలు, వివాదాలు కొనసాగుతున్నాయి. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం అనేది నిష్పాక్షిక దృష్టితో చూడాల్సిన బాధ్యత తెలంగాణ గడ్డపై ప్రతి ఒక్కరికీ ఉంది.తమ రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను వక్రీకరిస్తోన్న శక్తుల సంఖ్య గణ నీయంగా పెరిగిపోతున్నది. అందుకుగానూ అసత్యాలను, అర్ధ సత్యాలను తమ అస్త్రాలుగా ప్రయోగిస్తున్నారు. సమత, మమత, కరుణ, ప్రేమలకు ప్రతీకగా ఉన్న తెలంగాణ సమాజాన్ని విద్వేషపు విషంతో నింపాలని చూస్తున్నారు. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. హైదరాబాద్ రాష్ట్రం మూడు భాషాప్రాంతాల కలయిక. హిందూ, ముస్లిం, ఇతర సామాజిక వర్గాల సమ్మేళనంతో కలిసి నడిచిన గంగా–జమునా తెహెజీబ్. హైదరాబాద్ రాజ్యం కేవలం ముస్లింలు పాలించినది కాదు. రాజ్యానికి కేంద్రం నిజాం అయితే, గ్రామీణ ప్రాంతాలు హిందూ సామాజిక వర్గానికి చెందిన జమీం దారులు, జాగీర్దారుల కబంధ హస్తాల్లో ఉండేవి. నిజానికి పరోక్షంగా నిజాంలు సాగించిన దుర్మార్గాల కన్నా, ఎందరో జమీందారులు, జాగీర్దారులు సాగించిన అమానుషాలు ఎన్నో రెట్లు ఎక్కువ. కానీ నిజాం పాలన అనగానే కేవలం నిజాం గుర్తుకు రావడమే సహజంగా జరుగుతోంది. ‘మానుకోట’(ఇప్పటి మహబూబాబాద్) జెన్నారెడ్డి ప్రతాపరెడ్డి, విసునూరు రామచంద్రారెడ్డి లాంటి జమీందారులు జరిపిన దారుణాలు మనం చరిత్రలో మరెక్కడా చూడం. వీటన్నింటికీ రజాకార్ల దాడులు, దౌర్జన్యాలు తోడయ్యాయి. హిందూ జమీందార్లు, ముస్లిం రజాకార్లు ఒక కూటమిగా ఏర్పడ్డారు. రజాకార్ ఉద్యమం 1938లో ప్రారంభమైంది. కానీ 1947 నుంచి దౌర్జన్యాలకు వేదికగా తయారైంది. రజాకార్ అంటే స్వయం సేవకులు అని అర్థం. రజాకార్లలో కొందరు హిందువులు కూడా ఉండేవారు. ప్రభుత్వానికి అండగా ఉండడానికి రజాకార్లను వినియోగించాలన్న కొందరు ముస్లిం జమీదారుల ఒత్తిడికి తలొగ్గి వారికి ప్రత్యేకమైన అధికారాలను ప్రకటించారు. దీనితో రజాకార్లు కమ్యూనిస్టులపైనా, ఇతర ఉద్యమకారులపైనా దాడులు కొనసాగించారు. 1947 జూలై 30 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు రజాకార్లు విచ్చలవిడి దౌర్జన్యాలు చేసిన మాట నిజం. వాళ్ళను ప్రతిఘటించి ప్రజలకు రక్షణగా నిలి చింది కమ్యూనిస్టులే. జమీందారుల, భూస్వాముల దౌర్జన్యాలకు పరాకాష్ఠగా నిలిచిన దొడ్డి కొమరయ్య హత్యతో అంటే 1946 జూలై 4న కమ్యూనిస్టులు తమ సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే 1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశం స్వతంత్రమైంది. ఆనాటికి 565 సంస్థానాలు ఉన్నాయి. స్వాతంత్య్రం సిద్ధించేనాటికి హైదరాబాద్ స్వతంత్ర పాలనా ప్రాంతంగా ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు చేసు కొన్నప్పకీ అన్ని విషయాల్లో స్వేచ్ఛగానే నిర్ణయాలు తీసుకునేది. బ్రిటిష్ ప్రభుత్వం తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి తన సైన్యాన్ని హైదరాబాద్లో ఉంచింది. అదే మనం ఇప్పుడు చూస్తోన్న హైదరా బాద్లోని కంటోన్మెంట్. 1947లో స్వాతంత్య్రం పొందిన భారతదేశం అన్ని సంస్థానాలను భారత యూనియన్లో కలపాలని అడిగింది. అందరూ ఒప్పుకున్నారు. కశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు తాము స్వతంత్రంగా ఉంటామని ప్రకటించుకున్నాయి. అందుకుగానూ భారత ప్రభుత్వం, హైదరాబాద్ రాజ్యం ఒక ఒడంబడికను కుదుర్చు కున్నాయి. దానినే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటారు. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చేటప్పుడు కొన్ని నిబంధ నలను పెట్టింది. అందులో ఒకటి, ఇప్పటివరకూ బ్రిటిష్ పాలనలో లేని సంస్థానం అటు పాకిస్తాన్లోగానీ, ఇటు భారతదేశంలో గానీ చేర వచ్చు. లేదా స్వతంత్రంగా ఉండవచ్చు. అయితే నిజాం స్వతంత్ర పాకి స్తాన్ ఆహ్వానాన్ని తిరస్కరించాడు. భారతదేశంతో మాత్రం స్నేహంగా ఉండడానికి అంగీకరించాడు. 1947లో ఉనికిలోకి వచ్చిన రజాకార్ల దాడులను ఆసరాగా తీసుకొని భారత ప్రభుత్వం నిజాం మీద ఆంక్షలను పెంచింది. ఆర్థికంగా దిగ్బంధనం చేసింది. భారత ప్రభుత్వం పెంచుతోన్న ఒత్తిడిని తట్టుకోలేక నిజాం ప్రభుత్వం 1948 ఆగస్టు 9న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని ఆశ్రయించింది. భారత ప్రభుత్వం కొన సాగిస్తున్న ఆంక్షలను ఎత్తివేయాలనీ, తాము స్వతంత్రంగా కొనసాగే అవకాశం కల్పించాలనీ నివేదించింది. అది 1948 ఆగస్టు 21న చర్చలకు వచ్చింది. ఆ అభ్యర్థనను స్వీకరించాలా లేదా అనేది చర్చకు వచ్చినప్పుడు అందులో ఉన్న పది దేశాల్లో ఫ్రాన్స్, అమెరికా, కెనడా, కొలంబియా, సిరియా, బెల్జియం, అర్జెంటీనా అభ్యర్థనను స్వీకరించ డానికి తమ మద్దతును తెలియజేశాయి. రష్యా, చైనా, ఉక్రెయిన్ తటస్థంగా ఉన్నాయి. ఇది 1948 సెప్టెంబర్ 16న జరిగింది. అయితే దానిని ఒక రెండు రోజులు వాయిదా వేయాలని భారత ప్రభుత్వ ప్రతినిధులు తెరవెనుక కథ నడిపారు. అప్పటికే భారత సైన్యం హైదరాబాద్లో సైనిక చర్యలను ప్రారంభించింది. దాదాపు హైదరా బాద్ సంస్థానం పూర్తిగా ఆక్రమణకు గురైంది. తెల్లారితే సెప్టెంబర్ 17. ఆరోజు హైదరాబాద్ను హస్తగతం చేసుకున్నారు. సెప్టెంబర్ 17 మధ్యాహ్నంకల్లా నిజాం చేత భారత ప్రతినిధి కె.ఎం.మున్షీ ఒక ప్రకటన చేయించారు. హైదరాబాద్ ప్రభుత్వం తరఫున భద్రతా మండలిలో చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నామనేది అందు లోని ప్రధానాంశం. సెప్టెంబర్ 12న మొదలుపెట్టిన సైనికదాడి మొదటి లక్ష్యం ఐక్యరాజ్య సమితి నుంచి ఫిర్యాదును వెనక్కి తీసుకునేటట్టు చేయడం. సైనిక చర్య జరిగిన సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు సైన్యం చేతిలో గానీ, అక్కడక్కడా జరిగిన ఘర్షణల్లోగానీ 25 వేల నుంచి 30 వేల మంది వరకు మరణించినట్టు నిజాం ప్రభుత్వం నియమించిన సుందర్లాల్ కమిటీ నివేదిక వెల్లడించింది. ఇది ఒక ఘట్టం. దీనినే మనం విమోచన అంటున్నాము. విమోచన అంటే శత్రువును పదవీ చ్యుతుడిని చేయాలి. కానీ అలా జరగలేదు. నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేరుమీదనే 1950 జనవరి 26 వరకు ప్రభుత్వం నడిచింది. ఆ తర్వాతనే హైదరాబాద్ భారత ప్రభుత్వంలో అధికారికంగా భాగమైంది. 1948 సెప్టెంబర్ 17న నిజాంను లొంగదీసుకున్న తరువాత భారత సైన్యం కమ్యూనిస్టులపై యుద్ధం ప్రకటించింది. అప్పటి వరకు ప్రజలను దోచుకున్న దొరలు, భూస్వాములు, జమీందారులు, జాగీర్దార్లు కమ్యూనిస్టుల పోరాటంతో ఊళ్ళొదిలి పెట్టారు. భారత సైన్యం రావడంతో, కాంగ్రెస్ టోపీలు పెట్టుకొని మళ్ళీ పల్లెలకు వచ్చారు. భారత సైన్యం, భూస్వాములు, గూండాలు కలిసి ఊరూరునీ వల్లకాడుగా మార్చేశారు. 1948 సెప్టెంబర్ 17 నుంచి 1951 అక్టోబర్ సాయుధ పోరాట విరమణ వరకూ దాదాపు 4 వేల మంది కమ్యూనిస్టులతో పాటు, వేలాది మంది సాధారణ ప్రజలు చనిపోయారు. మరి 1948 సెప్టెంబర్ 17న విమోచన అయితే, 1951 వరకు భారత సైన్యం తెలంగాణ పల్లెలపై ప్రకటించిన యుద్ధం ఎవరి విమోచనం కోసం జరిగింది? కాబట్టి సెప్టెంబర్ 17న జరిగింది నిజాం బలవంతపు లొంగుబాటుగానే చరిత్ర మనకు చెబుతున్నది. ఆ తర్వాత మూడేళ్ళ పాటు తెలంగాణ పల్లెల్లో నెత్తురు ప్రవహించింది. అందువల్ల మనం సెప్టెంబర్ 17న జరపాల్సింది సంబురాలు కాదు. మనల్ని మనం సింహావలోకనం చేసుకోవడమే. రజాకార్ల దౌర్జన్యా లనూ, అమానుషాలనూ ఎండగట్టాల్సిన సమయమిదే. కానీ భారత సైన్యం జరిపిన నరమేధాన్ని తక్కువ చేసి చూడటం ముమ్మాటికీ సరికాదు. తెలంగాణ ప్రజలు అటు నిజాం రాజు, జమీందార్లు, దేశ్ముఖ్లు, జాగీర్దార్ల దోపిడీ, దౌర్జన్యాలకు బలైపోయారు. రజాకార్ల అమానుషాలను అనుభవించారు. అదేవిధంగా భారత సైన్యం చేసిన విధ్వంసాన్ని, వినాశనాన్ని కూడా చవిచూశారు. ఇదే వాస్తవం. ఇదే నగ్న సత్యం. - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే కుట్ర
భారత రాజ్యాంగం దానికదే ఒక విప్లవం. రెండు వేల సంవత్సరాలకు పైగా ఉన్న ఒక అసమాన వ్యవస్థ నిర్మాణాన్ని అది బద్దలు చేసింది. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ ఒక్కటి చేయగలిగింది. అయితే కొంతకాలంగా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతియ్యడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగమే రాజ్యాంగ పీఠిక నుంచి ‘సోషలిస్టు’ (సామ్యవాద), ‘సెక్యులర్’ (లౌకికవాద) పదాలను తొలగించాలని సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం! పైగా తన వాదనకు బలం చేకూర్చుకోవడానికి సోషలిస్టు భావనను వ్యతిరేకించినట్టుగా అంబేడ్కర్ మాటలను ఆయన ఉటంకించారు. ఇది అంబేడ్కర్ను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకోవడమే! భారతదేశ చరిత్రను అర్థం చేసుకోవాలంటే, ‘భారత రాజ్యాంగం అమలుకు ముందు, అటు తర్వాత’ అని చూడాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగానికి ముందు ఈ దేశంలో మనుషులంతా ఒక్కటి కాదు. కులాలు, మతాలు, ప్రాంతాలుగా విడివడి ఉన్నారు. కుల సమాజాన్ని సృష్టించి, పెంచి పోషించిన మనువాదం ఒక పరిపాలనాపత్రంగా, అదే శాసనంగా, అదే రాజ్యాంగంగా అమలు అవుతూ సమాజంలో అంత రాలను ఇంకా బలంగా వేళ్ళూనుకొనేలా చేసింది. అలాంటి సంద ర్భంలో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ రాజ్యాంగం ఒక్కటి చేయగలిగింది. అప్పటి వరకు కులాన్ని బట్టి విలువ ఉండేది. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క విలువను మనువాదం ప్రబోధించింది. కానీ భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒకే విలువను కల్పించి, కనీసం దానిలోనైనా ఒక సమానత్వ ప్రపంచాన్ని అందించింది. అందుకే భారత రాజ్యాంగం దానికదే ఒక విప్లవం. రెండు వేల సంవత్సరాలకు పైగా ఉన్న ఒక అసమాన వ్యవస్థ నిర్మాణాన్ని అది బద్దలు చేసింది. అయితే కొంతకాలంగా భారత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తియ్యడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగం గానే గతవారం కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి రాజ్యాంగ పీఠిక నుంచి ‘సోషలిస్టు’(సామ్యవాద), ‘సెక్యులర్’ (లౌకిక వాద) పదాలను తొలగించాలని పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ సెప్టెంబర్ 23న విచారణకు రానున్నది. ఇదే విషయమై, 2020 జూలైలో న్యాయవాది విష్ణు శంకర్ కూడా పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నేతృత్వంలోని ధర్మాసనం ముందు దీన్ని విచారించనున్నారు. సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలు రాజ్యాంగ సభ ద్వారా ఆమోదించిన పీఠికలో లేవనీ, 1976లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వీటిని చేర్చారనీ, రాజ్యాంగ సభ చర్చలలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లాంటి వాళ్ళు కూడా వీటిని వ్యతిరేకించారనీ ఈ పిటిషన్లో పేర్కొ న్నారు. పిటిషనర్గా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి తన వాదనకు బలం చేకూర్చుకోవడానికి బాబాసాహెబ్ అంబేడ్కర్ మాటలను ఉటం కించినట్టు కనిపిస్తున్నది. అయితే, అంబేడ్కర్ మాటలను పరిశీలిస్తే సుబ్రహ్యణ్యస్వామియే అంబేడ్కర్ను తప్పుగా అర్థంచేసుకున్నట్టు కనిపిస్తున్నది. ఆ రోజు సభలో అంబేడ్కర్ మాట్లాడుతూ... ‘‘రాజ్యాం గాన్ని మనం ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రూపొందించు కోవాలి. భవిష్యత్లో ప్రజలు ఎటువంటి విధానాలను అవలంబించా లనుకుంటారో వారికి అవకాశం ఇవ్వాలి. అంతేగానీ ఇప్పుడే అన్ని విషయాలను ముగించకూడదు. అంతేకాకుండా, రాజ్యాంగంలోని నాలుగవ భాగమైన ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచిన అంశాలన్నీ కూడా సోషలిస్టు భావనలను సమర్థిస్తు్తన్నాయనే విషయాన్ని గుర్తుం చుకోవాలి’’ అంటూ రాజ్యాంగ సభకు కేటీ షా ప్రతిపాదించిన సవరణకు సమాధానమిచ్చారు. అంబేడ్కర్ ఎక్కడా, సోషలిస్టు భావనను వ్యతిరేకించింది లేదు. పైగా దాని సారాంశాన్ని ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచినట్టు పేర్కొన్నారు. సరిగ్గా ఇక్కడే అంబేడ్కర్ను అర్థం చేసుకోవడానికి రాజ్యాంగ సభలో మాట్లాడింది మాత్రమే సరిపోదు. ఒకరకంగా అది అప్పటి నాయకుల ఉమ్మడి అభిప్రాయం కూడా కావచ్చు. అయితే అంబేడ్కర్ మొదటినుంచీ సమానత్వ సమాజ స్థాపనకు పాటుపడిన వ్యక్తి. అంతేకాకుండా, రాజ్యాంగ సభలో తాను సభ్యుడిగా ఉంటానో లేదో నని భావించి, 1946లో రాజ్యాంగ సభకు ఒక మెమోరాండంను సమర్పించారు. దానినే ‘స్టేట్స్ అండ్ మైనారిటీస్’ అంటారు. అందులో ప్రభుత్వం సోషలిస్టు విధానాలను అనుసరించాలని, దానికి స్టేట్ సోషలిజం అనే మాటను కూడా ఆయన వాడారు. అందులో ఆర్థికపరమైన అంశాలను పేర్కొంటూ– దేశంలోని భారీ పరిశ్రమలను ప్రభుత్వమే నిర్వహించాలనీ, ఇన్సూరెన్స్ లాంటి ఆర్థిక సంస్థలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలనీ, దేశవ్యాప్తంగా ఉన్న భూములను జాతీయం చేయాలనీ ప్రతిపాదించారు. ఈ విషయాలన్నింటినీ రాజ్యాంగంలో పొందుపరచడానికి తన శాయశక్తులా కృషి చేశారు. అయినా సఫలం కాలేదు. అటువంటి సామాజిక మార్పును కోరుకుని, దాని కోసమే యావత్ జీవితాన్నే ప్రజలకు సమర్పించిన ఓ మహో న్నత వ్యక్తి వ్యాఖ్యలను తప్పుగా, తమ సోషలిస్టు వ్యతిరేక భావాలకు మద్దతుగా వాడుకోవడం విచారకరం. ఈ విషయం అట్లా ఉంచితే, 1976లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ïపీఠికలో ‘సోషలిస్టు, సెక్యులర్’ అనే పదాలను మాత్రమే కాకుండా, ఇంకా చాలా విష యాలను రాజ్యాంగంలో చేర్చారు. అయితే 1977లో జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా విషయాలను 43వ సవరణ ద్వారా తొలగించారు. అయితే రాజ్యాంగ పీఠికలోని ఆ రెండు పదాల జోలికి మాత్రం పోలేదు. ప్రస్తుత పిటిషనర్ సుబ్రహ్యణ్యస్వామి అప్పుడు జనతాపార్టీ లోక్సభ సభ్యుడిగా గెలిచారు. మరి అప్పుడు తన గొంతును ఎందుకు వినిపించలేదో ఆయనకే తెలియాలి. 2008లో ‘గుడ్ గవర్నెన్స్ ఇండియా ఫౌండేషన్’కు చెందిన సంజీవ్ అగర్వాల్ ఇదే విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ నాయకత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిషన్ను తిరస్కరించింది. ‘‘సోషలిజం అనగానే అదేదో కమ్యూనిస్టులకు సొంతమైనట్టు అను కోవడం సరైనది కాదు. ప్రజల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం కూడా అందులో భాగమే’’ అని వ్యాఖ్యానించింది. అందు వల్ల ఆ పదాలను తొలగించాల్సిన అవసరమే లేదని భారత అత్యు న్నత న్యాయస్థానం ఆనాడు కుండ బద్దలుకొట్టింది. ప్రస్తుతం మళ్లీ ఎందుకు ఈ ప్రతిపాదన ముందుకుతెస్తున్నారనేది ప్రశ్న. దీనికి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, సామాజిక విధానాలు... సోషలిస్టు, సెక్యులర్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ పరిశ్రమలను, ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా మైనారిటీ మతాలను, వాటికి సంబంధించిన సంస్థలను వేధిస్తుండడం ఎక్కువైందని అంత ర్జాతీయ సంస్థలు ఎన్నో నివేదికల ద్వారా వెల్లడించాయి. ఎవరైనా ఈ విషయాలన్నింటినీ కోర్టుల్లో సవాల్ చేస్తారని ముందే ఊహించి, వాటిని తొలగిస్తే ఇక నైతికంగా కూడా తమకు ఎదురు ఉండదని భావించి అటువంటి పిటిషన్ను అధికార పార్టీ సభ్యుడే వేయడం జరిగి ఉండొచ్చనే అభిప్రాయానికి రావడవం తప్పేమీకాదు. అదే విధంగా భారత దేశంలో హిందూమతాన్ని అధికార మతంగా చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. దానికి రాజ్యాంగాన్నే మార్చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టు సా«ధువులు, సంతులు స్వయంగా ప్రకటించారు. అందుకనుగుణంగానే ఇప్పటికే ముప్ఫై పేజీల డాక్యుమెంటు రూపొందించినట్టు కూడా ప్రకటించారు. ఇటువంటి నేపథ్యం నుంచి ఈ పీఠికను చూడాల్సి ఉంది. నిజానికి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు సోషలిస్టు, సెక్యులర్ స్ఫూర్తిని బలపరచడమే కాకుండా నిర్దిష్టమైన మార్గాన్ని చూపుతున్నాయి. సోషలిస్టు, సెక్యులర్ పదాలు భారత రాజ్యాంగాన్ని మరింత శక్తిమంతం చేస్తున్నాయే తప్ప ఎటువంటి దుష్ప్రభావాన్నీ కలిగించడం లేదు. భారత రాజ్యాంగ రక్షణ ఈ దేశ సామాజిక ప్రగతికీ, మనుగడకూ ఒక తక్షణ అవసరంగా ఉంది. అందువల్ల రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే ఇటువంటి కుట్రలను భారత సమాజం సహించబోదని ఆశిద్దాం. (చదవండి: చరిత్రను పాతిపెట్టి ఏం బావుకుంటారు?) - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
చిహ్నమే కాదు, స్ఫూర్తీ ముఖ్యమే!
అశోకుడు భారతదేశ చక్రవర్తులలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే ఒక గొప్ప దార్శనికుడు. అశోకుడిది ఒక ఆదర్శవంతమైన పాలన. భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం రాసుకున్న రాజ్యాంగం అశోకుని సంక్షేమ విలువలకు నిలువుటద్దం. భారత జాతీయ పతాకంలో ఉన్న ధర్మ చక్రం, రాజముద్ర లాంటి అశోకుని గుర్తులు మన భారతావని భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. మన జాతీయ చిహ్నాన్ని కొద్దిరోజుల క్రితం నూతన పార్లమెంటు భవనంపై ప్రతిష్ఠించారు. ఇది మంచి నిర్ణయమే. అయితే ప్రతిమలు, వాటి ప్రతిష్ఠలు మాత్రమే కాకుండా, ఎవరి స్ఫూర్తినైతే నింపుకోవాలన్న సదుద్దేశ్యంతో ఆ చిహ్నాలను రూపొందించుకున్నామో, ఆ లక్ష్యాలను ప్రభుత్వాలు మరువకూడదు. ‘‘భారత జాతీయ జెండాలో గతంలో మనం వాడిన చరఖాకు బదులుగా చక్రాన్ని ఉపయోగించాలని ప్రతిపాదిస్తున్నాను. ఇది కేవలం ఒక గుర్తు కాదు. దీని వెనుక ఒక సామాజిక మార్పు, ఒక మహోన్నత వ్యక్తి దాగున్నారు. అతడే అశోకుడు. అశోకుడు భారతదేశ చక్రవర్తులలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే ఒక గొప్ప దార్శనిక చక్రవర్తి. భారత చరిత్రలో అశోకు డిది ఒక ఆదర్శవంతమైన పాలన. అది భారత చరిత్ర పైనే కాదు, ప్రపంచ చరిత్రపైనే గొప్ప ప్రభావాన్ని చూపింది. అది ఒక జాతీయ వాద చరిత్ర కాదు. అశోకుడు తన దూతలను, ప్రతినిధులను ప్రపంచంలోని అనేక దేశాలకు పంపించాడు. అయితే ఆయనది దురా క్రమణ కాంక్ష కాదు. శాంతి సందేశమే ఆయన ఆశయం.’’ జాతీయ పతాకంలో చేర్చాల్సిన ధర్మచక్రాన్ని గురించి 1947 జూలై 22న రాజ్యాంగ సభలో జవహర్లాల్ నెహ్రూ చేసిన వ్యాఖ్యలివి. మన జాతీయ పతాకంలో పొందుపరచిన ధర్మచక్రానికీ, సమ్రాట్ అశోకుడికీ ఉన్న సంబంధం ఏమిటో చాలామందికి తెలుసు. మన దేశ రాజముద్ర, అశోకుని స్తంభంలోని సింహాల చిత్రమని కూడా చాలా మంది ఎరిగినదే. అయితే, అవి ఎలా నిర్మించారు? ఎందుకు నిర్మిం చారు? వాటిని ఎవరు గుర్తించారు? అనే విషయాలు తెలియవు. ఈ తరానికి వాటి ప్రాముఖ్యత తెలియాల్సిన అవసరమున్నది. మన జాతీయ చిహ్నాన్ని కొద్దిరోజుల క్రితం నూతన పార్లమెంటు భవనంపై ప్రతిష్ఠించారు. ఇది మంచి నిర్ణయమే. అయితే ఆ సింహాల నిర్మాణం పైనే వివాదం చెలరేగింది. సౌమ్యంగా, ప్రశాంతంగా కనిపించే సింహా లకు బదులుగా వాటిని ఉగ్రరూపంలో నిర్మించారని పలువురు చరిత్ర కారులు ఆరోపించారు. ప్రతిపక్షాలూ విమర్శలను గుప్పించాయి. బ్రిటిష్ పాలకులు భారత దేశం వచ్చేవరకూ అశోకుని గురించి గానీ, బౌద్ధ చరిత్ర గానీ ప్రచారంలో లేదు. రాత ప్రతుల్లో, ముఖ్యంగా పాళీ భాషలో, సంస్కృత భాషలో బౌద్ధం గురించి వివరాలు ఉండేవి కానీ, ఇతర ఆధారాలు లేవు. 1818 సంవత్సరంలో మొదటిసారిగా బ్రిటిష్ జనరల్ హెన్సీ టైలర్ సాంచి స్థూపాన్నీ, దాని అవశేషాలనూ కనుగొన్నారు. ఆ తర్వాత చాలా కాలానికి, అంటే 1881లో దానిని పదిలపరిచే పని మొదలైంది. 1919 కల్లా పూర్తయ్యింది. ఎప్పుడైతే సాంచిలో ఇటు బౌద్ధ శిల్పాలు, ఇతర అవశేషాలు బయటపడ్డాయో, బౌద్ధ చరిత్ర మీద, అశోకుని పాలన మీద అధ్యయనం జరపాలన్న ఆసక్తి బ్రిటిష్ పురాతత్వ శాస్త్రవేత్తల్లో మొదలైంది. అంతకుముందే సారనాథ్ ప్రాంతంలో కూడా కొన్ని ఆశ్చర్యం గొలిపే శిలావిగ్రహాలు, ఇతర నిర్మాణాలను 1780లో విలియం హోడ్జెస్ అనే చిత్రకారుడు గుర్తించాడు. అక్కడ అతడొక స్థూపాన్ని చూశాడు. కానీ అది బౌద్ధ స్థూపం అని తెలియదు. ఆ తర్వాత 1794లో బెనారస్ కమిషనర్ జోనాధన్ డంకన్ కొన్ని తవ్వకాలు జరి పాడు. కొన్ని ఇటుకలు మాత్రమే అక్కడ దొరికాయి. అయితే 1861లో బ్రిటిష్ భారత పురాతత్వవేత్త లార్డ్ కన్నింగ్హామ్ ఆ స్థూపాన్ని సందర్శించి, తవ్వకాలను ముమ్మరం చేశాడు. ఆ తర్వాత పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ ఎఫ్.ఓర్టల్ ఆనాటి భారత పురాతత్వ సొసైటీ డైరెక్టర్ జనరల్ జాన్ మార్షల్ను ఒప్పించి, 1904–05 సంవత్సరాల మధ్య కాలంలో చేపట్టిన తవ్వకాలలో స్థూపం స్వరూపం బయట పడింది. అందులోని అశోక స్తంభం, ఆ స్తంభంలోని సింహాలు, ఇతర చిహ్నాలు అన్నీ కలిపి భారత రాజముద్రను రూపొందించుకున్నాం. అశోకుని స్థూపంలో ఉన్న సింహాల భాగాన్ని భారత రాజ ముద్రగా 1947 డిసెంబర్ 29వ తేదీన ఆమోదించుకున్నాం. దానిని 1950, జనవరి 26 నుంచి అమలులోకి తెచ్చారు. ఇందులో నాలుగు దిక్కులా సింహాల బొమ్మలను విశ్వాసానికి, శక్తికి, ధైర్యానికి గుర్తు లుగా ప్రతిష్ఠించుకున్నాం. అంతే కాకుండా జాతీయ వృక్షంగా మర్రి చెట్టును నిర్ణయించుకున్నాం. ఇవన్నీ కూడా బౌద్ధ సాంప్రదాయంతో ముడివడి ఉన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అశోక స్తంభ నిర్మాణం కమలం మీదనే జరిగింది. జాతీయ పక్షి నెమలి అశోకుని వంశానికి చిహ్నం. బౌద్ధ సాంప్రదాయం ప్రకారం, మన రాజముద్రలో ఉన్న సింహాలు బుద్ధుని ప్రతీకలుగా భావిస్తారు. ఆయన జన్మించినది శాక్య తెగ. అందుకే సిద్ధార్థుడిగా జన్మించి, గౌతమ బుద్ధునిగా మారిన బుద్ధున్ని శాక్య సింహంగా పిలుస్తారు. స్తంభం పైన నాలుగు సింహా లను ఉంచడమంటే నలుదిక్కులా ఆయన బోధనలను వ్యాప్తి చేయా లనీ, విస్తరించాలనీ అశోకుని ఉద్దేశ్యంగా చరిత్రకారులు భావిస్తారు. అందులో ఏనుగు ఆయన శక్తికీ, ఆయన జన్మ రహస్యానికీ చిహ్నంగా భావిస్తారు. అదేవిధంగా వృషభం ఆయన బలాన్ని సూచిస్తుంది. ఆయన ఇంటినుంచి మహాభినిష్క్రమణ రోజున బుద్ధుడు తీసుకెళ్ళిం దనడానికి సంకేతంగా గుర్రాన్ని భావిస్తున్నారు చరిత్రకారులు. అయితే మౌర్య చక్రవర్తి అశోకుడు బౌద్ధం స్వీకరించిన తర్వాత దాదాపు 84,000 బౌద్ధ నిర్మాణాలను చేపట్టినట్టు బౌద్ధ సాహిత్యం ద్వారా తెలుస్తున్నది. అఫ్గానిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ దాకా, గౌహతి నుంచి కర్ణాటక దాకా భారతదేశమంతటా బౌద్ధాన్ని తన శాసనాల ద్వారా, స్థూపాలు, ఇతర నిర్మాణాల ద్వారా దశదిశలా వ్యాప్తి చేశాడు. అశోకుడు కనుక అటువంటి నిర్మాణాలను చేపట్టి ఉండకపోతే భారత దేశంలో బౌద్ధం పునరుజ్జీవనం పొందడం సాధ్యమయ్యేదే కాదు. బుద్ధుడు జన్మించిన ఈనాటి నేపాల్లోని లుంబిని, జ్ఞానోదయం పొందిన బోధ్ గయ, మొదటి బోధన చేసిన సారనాథ్, నిర్వాణం పొందిన కుశీ నగరం... ఈ రోజు ప్రపంచానికి అందు బాటులో ఉన్నాయంటే అది అశోకుడి దార్శనికత ఫలితమే. బౌద్ధ సాహిత్యంలోని ఈ విషయాలన్నింటినీ విదేశీ బౌద్ధ యాత్రికులు, ప్రత్యేకించి హ్యూయన్త్సాంగ్, పాహియాన్ లాంటి వాళ్లు తమ రచనల్లో పేర్కొన్నారు. బౌద్ధ చారిత్రక ప్రదేశాలను సంద ర్శించినట్టు; అక్కడ చైత్యాలు, విహారాలు, స్థూపాలు ఉన్నట్టు వారు రాశారు. ఆ వివరాలను పరిగణనలోనికి తీసుకొని బ్రిటిష్ పురాతత్వ చరిత్రకారులు తవ్వకాలు జరిపి బౌద్ధ చారిత్రక ఆధారాలను బయట పెట్టారు. ఇంకొక విషయం చెప్పాలి. అశోకుడు వేసిన చాలా శాసనాల్లో తన పేరు నేరుగా లేదు. ‘దేవానాం పియ’(దేవానం ప్రియ) అని మాత్రమే శాసనాల్లో ఉంది. అయితే 1840 సంవత్సరంలో శ్రీలంకలో టర్నల్ అనే రచయిత శ్రీలంక చరిత్ర మహాగ్రంథమైన ‘మహావంశ’లో అశోకుడే దేవానాం పియ అని అని గుర్తించాడు. అశోకుడు కేవలం కొన్ని చారిత్రక నిర్మాణాలకు మాత్రమే పరిమితం కాలేదు. అప్పటి వరకూ కొనసాగుతున్న యజ్ఞ, యాగా దుల హింస, ప్రత్యక్ష దోపిడీ నుంచి బుద్ధుని బోధనల ద్వారా సమాజాన్ని విముక్తం చేశారు. దానివల్ల వృత్తులు, పరిశ్రమలు, వ్యవ సాయం అభివృద్ధి చెందాయి. మూఢనమ్మకాలను వ్యాపింపజేసిన పురోహిత వర్గ ఆధిపత్యాన్ని అశోకుడు నిలువరింపజేశాడు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పురోహిత వర్గం అశోకుడి మీద ఎన్నో రూపాల్లో తప్పుడు ప్రచారాలు చేసింది. కానీ సత్యం జయిస్తుందనే గౌతమ బుద్ధుని ఉవాచ అశోకుడి విషయంలో రుజువైంది. భారత దేశా నికిæస్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం రాసుకున్న రాజ్యాంగం అశో కుని సంక్షేమ విలువలకు నిలువుటద్దం. భారత జాతీయ పతాకంలో ఉన్న ధర్మ చక్రం, రాజముద్ర లాంటి అశోకుని గుర్తులు మన భారతావని భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. అయితే ప్రతిమలు, వాటి ప్రతిష్ఠలు మాత్రమే కాకుండా, ఎవరి స్ఫూర్తినైతే నింపుకోవాలన్న సదుద్దేశ్యంతో ఆ చిహ్నలను రూపొందించు కున్నామో, ఆ లక్ష్యాలను మరువకూడదు. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
దళిత ఉద్యమాలకు ఉగ్రరూపం
యాభై ఏళ్ల కింద మహారాష్ట్రలో మొదలైన ‘దళిత్ పాంథర్’ ఉద్యమ స్ఫూర్తి నేటికీ కొనసాగుతోంది. భారతదేశ ప్రజా ఉద్యమాల్లో, ప్రత్యేకించి దళిత ఉద్యమాల్లో ఇది ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నది. దళిత్ పాంథర్ వివిధ పద్ధతుల్లో దాడులనూ, దౌర్జన్యాలనూ ప్రతిఘటించి, దళితుల్లో ఒక భరోసాను నింపింది. గ్రామాల్లో కులతత్వ దాడులను ప్రత్యక్షంగా ఎదుర్కొని, దళితులకు ఒక రక్షణ కవచంగా నిలిచింది. ఇది మహారాష్ట్రకే పరిమితం కాలేదు; దేశంలోని అన్ని రాష్ట్రాల దళితుల మీద ప్రభావాన్ని కలిగించింది. దానితో పాటు, మరాఠా దళిత సాహిత్యాన్ని దేశానికే మార్గదర్శకంగా మలచడంలో ఈ ఉద్యమం పాత్ర మరువలేనిది. ఆ ప్రభావం ఇతర భాషల దళిత సాహిత్యం మీద కూడా పడింది. శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ స్పీకర్, మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూర్చున్నారు. చర్చలు సాగుతున్నాయి. అంతలో సందర్శకుల గ్యాలరీలో ఏదో అలజడి. ఇద్దరు యువకులు భాస్కర్ గవలి, నారాయణ్ మోరే సభలోకి అగ్నిగోళాలు విసిరారు. అగ్నిగోళాలు విసురుతుండగానే ‘బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్ధిల్లాలి’ అంటూ నినాదాలతో సభ దద్దరిల్లింది. అగ్నిగోళాలు అంటే, కిరోసిన్లో ముంచిన గుడ్డతో చేసిన బంతులు. రాష్ట్ర మంత్రి శంకర్ రావు పాటిల్ రాజీనామ చేయాలని కూడా ఆ యువకులు నినదించారు. అంతేకాకుండా, దళితులకు ప్రత్యేక దేశం కావాలంటూ ప్రచురించిన కరపత్రాలను సభలోకి విసిరారు. ఇది 1972 జూన్ 12న మహారాష్ట్ర శాసనసభలో జరిగిన ఘటన. స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్ ఇండియా పార్లమెంటులో పొగబాంబులు వేసి నినదించిన భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్ల తర్వాత మళ్ళీ ఈ దళిత నాయకులే అటువంటి వీరోచితమైన పనికి పూనుకున్నారు. ఇది జరిగి యాభై సంవత్సరాలు గడిచాయి. ఈ సంఘట నకు ఒక సంస్థ ఆవిర్భావం ప్రధాన కారణం. దాని పేరే, ‘దళిత్ పాంథర్’! ఆ సంస్థ కేవలం మహారాష్ట్రలోనే కాదు, భారతదేశ ప్రజా ఉద్యమాల్లో, ప్రత్యేకించి దళిత ఉద్యమాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నది. అందుకే ఆ సంస్థ స్వర్ణోత్సవాలను దేశ వ్యాప్తంగా దళితులు ఒక ఉద్యమ స్ఫూర్తితో జరుపుకొంటున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన దళిత పాంథర్ స్వర్ణోత్సవాలను ప్రారంభించే అవకాశం నాకు రావడం ఒక గొప్ప అనుభూతిని కలిగించింది. అంతకుమించిన గొప్ప అనుభవాన్నిచ్చింది. ఇద్దరు దళిత యువకులు మహారాష్ట్ర అసెంబ్లీలో అగ్నిగోళాలు విసిరేంతటి సాహసానికి పూనుకోవడానికి రెండు దుస్సంఘటనలు కారణమయ్యాయి. ఒకటి, పుణే జిల్లాలోని బావ్డా గ్రామంలో దళితులను మిగతా కులాలన్నీ ఏకమై వెలివేశాయి. ఆనాటి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శంకర్ రావు సోదరుడు శహాజిరావు పాటిల్ దీనికి నాయకత్వం వహించారు. రెండవది, పర్భని జిల్లా భాహారా గావ్లో ఒక అగ్రవర్ణానికి చెందిన బావి నుంచి ఇద్దరు దళిత మహిళలు నీళ్ళు తోడుకొని తాగుతున్నందుకు వారిని పట్టుకొని నగ్నంగా ఊరేగించారు. ఇది వారి గుండెల్ని మండించింది. ఈ సాహసం చేయడానికీ, దళిత పాంథర్ ఉద్యమం ప్రారంభం కావడానికీ ఆనాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులే కారణం. అప్పటి కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇలయపెరుమాళ్ కమిటీ నివేదిక దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న అత్యాచారాల వివరాలను 1969లో బయటపెట్టింది. 1965లో విచారణ ప్రారంభించిన కమిటీ 1969 జనవరి 30 నాడే నివేదికను పార్లమెంటుకు అందజేసింది. ఆ నివేదిక పార్లమెంటును కుదిపివేసింది. అందులో మహారాష్ట్రకు సంబంధించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇవి యువకులనూ, రచయితలనూ బాగా కదిలించాయి. వీటికి వ్యతిరేకంగా ఒక ప్రతిఘటనను నిర్మించాలనీ, ప్రభుత్వాలకు ఒక గుణపాఠం నేర్పాలనీ ఆ కార్యకర్తలు నిర్ణయించారు. ఈ ఉద్యమ ప్రయత్నంలో జేవీ పవార్, దయా పవార్, అర్జున్ డాంగ్లే, నామ్దేవ్ దసాల్, ప్రహ్లద్ చార త్వంకర్లను మొదటి వ్యక్తులుగా చెబుతున్నారు. ‘ముందుగా ఒక ప్రకటన చేయాలని నిర్ణయించుకుంటున్నాం. దళితులపైన జరుగుతున్న దాడులనూ, దౌర్జన్యాలనూ వివరిస్తూనే, దళితులపై జరుగుతున్న దౌర్జన్యాలను, అన్యాయాలను ప్రభుత్వం అరికట్టకపోతే, చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుంది’ అని ఆ ప్రకటన స్పష్టం చేసింది. దానిమీద రాజా ధాలే, నామ్దేవ్ దసాల్, అర్జున్ డాంగ్లే, భీంరావు షిర్వాలే, ఉమాకాంత్ రణధీర్, గంగాధర్ పంతాల్నే, వామన్ నింబల్కర్, మోరేశ్వర్ వహానే సంతకాలు చేశారు. ఆ విధంగా ప్రారంభమైన దళిత్ పాంథర్ ఉద్యమం 1972 నుంచి 1977 వరకు మరెన్నో ఉద్యమాలకు ఊపిరిపోసింది. ఇదే స్ఫూర్తితో అక్కడక్కడా అనేక దళిత పోరాటాలు సాగాయి. దారుణమైన నిర్బంధాన్నీ, అరెస్టులనూ ఈ ఉద్యమం ఎదుర్కొన్నది. అయితే వివిధ పద్ధతుల్లో దాడులనూ, దౌర్జన్యాలనూ ప్రతిఘటించి, దళితుల్లో ఒక భరోసాను నింపింది. ప్రభుత్వాలను తమ తప్పు తెలుసుకునేటట్టు చేయగలిగింది. కులతత్వాన్ని బోధించే హిందూ శక్తులను ప్రతి ఘటించింది. గ్రామాల్లో కులతత్వ దాడులను ప్రత్యక్షంగా ఎదుర్కొని, దళితులకు ఒక రక్షణ కవచంగా నిలిచింది. 1992 ఆగస్టు 12న ఎరగావ్లో ఒక దళిత రైతును దేవుడికి బలిచ్చిన దారుణమైన అకృత్యం జరిగింది. రామ్దాస్ నార్నవరె అనే దళిత రైతు ఎనిమిది ఎకరాల ఆసామిగా ఉండి, ఆత్మగౌరవంతో తల ఎత్తి నిలబడడం కులతత్వ వాదులకు నచ్చలేదు. అతడిని అత్యంత దారుణంగా ముక్కు, చెవులు కోసి, గొంతు కోసి చంపేశారు. పోస్టు మార్టమ్, పోలీసు కేసు కూడా లేకుండా అతని దేహంతో పాటే ఈ దేశ దళితుడి ఆత్మగౌరవాన్ని భూమిలో పాతేశారు. ఇది తెలిసిన దళితులు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టారు. ప్రభుత్వం దిగివచ్చి శవాన్ని వెలికితీసి పోస్ట్మార్టమ్ నిర్వహిస్తే, నిజాలు బట్టబయలయ్యాయి. అప్పుడు నిందితులను అరెస్టు చేయక తప్పలేదు. పుణే జిల్లా భంగావ్ గ్రామంలో 1973 సెప్టెంబర్ 17న దళిత్ పాంథర్స్ కార్యకర్తలు జరిపిన బహిరంగ సభ ఆ గ్రామంలోని దళితులను ఏకం చేసింది. రాజ్గురు తహశీల్లోని అస్థేడ్ గ్రామంలో దళిత రైతుకు చెందిన 30 ఎకరాల భూమిని సాగుచేయకుండా, తుపాకితో బెదిరించిన భూస్వామిని నిలదీసి ఆ భూమిని ఇప్పించారు. దళిత్ పాంథర్కు చెందిన 92 మంది యువకులు ప్రత్యక్షంగా గ్రామంలోకి వెళ్ళారు. వాళ్ళ మీద అగ్రకులాలు దాడిచేశాయి. వాళ్ళను ప్రతి ఘటించి విజయం సాధించారు. ఇట్లా ఎన్నో సంఘటనల్లో తమదైన మార్గంలో ఉద్యమాన్ని నిర్వహించారు. ఒకానొక దశలో యావత్ దేశానికే మార్గదర్శకంగా నిలిచారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యక్షంగా నిలబడి పోరాటం సాగించడం వల్ల దళితుల్లో ఒక విశ్వాసం ఏర్పడింది. అప్పటికి వివిధ పార్టీలలో ఉన్న దళిత నాయకులు నిర్లిప్తంగా ఉండడం, ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేడ్కర్ స్థాపించిన భారత రిపబ్లికన్ పార్టీ నాయకత్వ అవకాశవాదాన్ని ఈ ఉద్యమం బహిర్గత పరిచింది. శివసేన, కాంగ్రెస్ పార్టీలతో అంటకాగిన ఆర్పీఐ నాయకత్వం దళితులకు దూరమైంది. ఆనాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ పుణే పర్యటనలో దళిత్ పాంథర్స్ ప్రతిఘటనల పిలుపుతో తన ప్రయాణాన్నే మార్చుకోవాల్సి వచ్చింది. దళిత్ పాంథర్ ఉద్యమం ఒక రకంగా నాటి కుల సమాజాన్నీ, దౌర్జన్య కాండనూ సవాల్ చేసింది. ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీలతో అంటకాగకుండా స్వతంత్ర మార్గంలో సాహసోపేతంగా ఉద్యమాన్ని నడిపింది. ఇది మహారాష్ట్రకే పరిమితం కాలేదు. గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తమిళ నాడులలో అన్ని రాష్ట్రాల దళితుల మీద ప్రభావాన్ని కలిగించింది. దానితో పాటు, మరాఠా దళిత సాహిత్యాన్ని దేశానికే మార్గదర్శకంగా మలచడంలో ఈ ఉద్యమం పాత్ర మరువలేనిది. ఆ ప్రభావం ఇతర భాషల దళిత సాహిత్యం మీద కూడా పడింది. ఎంతో మంది దళిత రచయితలు రాసిన తమ స్వీయ చరిత్రలు నూతన సాహిత్య విలు వలకూ, ధోరణులకూ పునాదులు వేశాయి. గత యాభై ఏళ్ళలో దళితుల జీవితాల్లో మార్పు రాలేదని అనలేం. కానీ దాడులు, అత్యాచారాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే, దళిత సమస్యలే అజెండాగా, రాజకీయ అవకాశ వాదంలేని ఒక స్వతంత్ర దళిత ఉద్యమం మళ్ళీ ఆరంభం కావాల్సిన సమయం ఆసన్నమైంది. - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
ఆదివాసీలు అందరికీ ప్రయోజనాలు అందాలి
‘‘ఆదివాసులకు ప్రత్యేక పాలనా ధికారాలు, స్వయం పాలనా వ్యవస్థలు ఉంటాయి. వాళ్ళ ఆర్థిక, సామాజిక పునాదులపై ఆధారపడి మాత్రమే వారి అభివృద్ధి సాగాలి. వాళ్ళ ప్రాంతానికి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నా వాళ్ళ ప్రత్యేక మండళ్ళ అంగీకారం తప్పనిసరిగా ఉండాలి.’’ నవంబర్ 26, 1949న భారత రాజ్యాంగ సభ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇవి. రాజ్యాంగ సభలో ఆదివాసీల తరఫున డిసెంబర్ 16, 1946న స్వయంగా ఆదివాసీ అయిన జైపాల్ సింగ్ ముండా మాట్లాడుతూ... ‘‘నా జాతి ప్రజలను ఆదివాసీయేతరులు నిరంతరం దోపిడీ చేయడం యావత్ దేశ చరిత్ర నిండా కనిపిస్తుంది. అయితే మనం ఈ రోజు నూతన చరిత్రకు శ్రీకారం చుట్టాలి. స్వతంత్ర భారతంలో నా ప్రజలు నిర్లక్ష్యానికి గురికాకుండా సమానత్వం కోసం కృషి చేయాలని రాజ్యాంగ సభనూ, ప్రత్యేకించి ఈ సభ నాయకుడు జవహర్ లాల్ నెహ్రూనూ కోరుతున్నాను’’ అని అన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆది వాసీల రక్షణకు అనేక ఏర్పాట్లు రాజ్యాంగంలో చేసిన విషయమూ తెలిసిందే. బాబూ రాజేంద్రప్రసాద్, జైపాల్ సింగ్ ముండాలు చేసిన వ్యాఖ్యానాలకూ, డిమాండ్లకూ ఈనాటికీ కాలం చెల్లలేదు. వాళ్ళు ఆశించిన వ్యవస్థ గానీ, పరిస్థితులు గానీ ఈనాటికీ ఆవిష్కృతం కాలేదు. 75 ఏళ్ళ స్వాతంత్య్రం గానీ, 72 ఏళ్ళ రాజ్యాంగ రక్షణ గానీ ఇంకా ఆదివాసులకు రావాల్సినంత స్థాయిలో అందుబాటులోకి రాలేదు. సరిగ్గా ఈ సమయంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ నాయకత్వంలోని నేషనల్ డెమోక్రా టిక్ అలయెన్స్ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్మూ పేరును ప్రతిపాదించింది. దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందనేది పరిశీలకుల అభిప్రాయం. ద్రౌపదీ ముర్మూ సంతాల్ తెగకు చెందిన ఆదివాసీ మహిళ. భారతదేశంలోని ఆదివాసీ తెగలలో సంతాల్ తెగ జనాభా రీత్యా మూడవ అతిపెద్ద తెగ. ఆదివాసీ తెగలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యంగా పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, బిహార్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రత్యక్షంగా అధికారంలో లేనందువల్ల అక్కడి ఆదివాసీ ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలుచు కోవడం ద్వారా రాష్ట్రపతి గెలుపును సులభతరం చేసుకోవచ్చునని బీజేపీ భావించి నట్టు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇది నిజమే కావచ్చు. అంతే కాకుండా ఆదివాసుల పట్ల తమ ప్రభుత్వం ఎంతో చేస్తోందనీ, వారికి అనుకూలంగా ఉందని జాతీ యంగా, అంతర్జాతీయంగా చెప్పుకోవడానికి కూడా ద్రౌపదీ ముర్మూని ముందు భాగాన నిలిపి ఉండవచ్చు. అభిప్రాయాలేవైనా, కారణాలేమైనా ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా చేయడానికి బీజేపీ నిర్ణయించడం ఆహ్వానించదగినదే. భారతదేశ రాజకీయ చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన ఘట్టంగా ఉండబోతోంది. ఎన్డీయే ఇప్పటికే ఒక ముస్లింను, ఒక దళితుడిని రాష్ట్రపతిగా అందించింది. అయితే ముస్లింనూ, దళితుడినీ మొదటిగా రాష్ట్రపతిని చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే కావడం విశేషం. ఒక వ్యక్తిని ముఖ్యంగా అణగారిన వర్గాలు, నిర్లక్ష్యానికి గురైన వర్గాలనుంచి ఏదైనా ఒక ముఖ్యమైన స్థానంలో నియమించినా, నిలబెట్టి గెలిపించినా, దాని ప్రయోజనం ఆ వ్యక్తికే పరిమితం కాకూడదనేది ప్రజాస్వామిక సూత్రం. ఒక సమూహానికి ఒక వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తే ఆ వ్యక్తికే కాక ఆ సమూహానికీ ప్రయోజనం చేకూరాలి. ద్రౌపదీ ముర్మూను రాష్ట్రపతిగా గెలిపించాలనే బీజేపీ సంకల్పం కేవలం ద్రౌపదీ ముర్మూ వ్యక్తిగత హోదాను పెంచడం, దానితో రాజకీయ ప్రయోజనం సాధించడం వరకు ఆగిపోకూడదు. ఇప్పటివరకు నిర్లక్ష్యానికి, దోపిడీ, అణచివేతకు గురైన ఆదివాసుల పట్ల ఒక ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరమే కాదు, బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అప్పుడు మాత్రమే బీజేపీకి ఆదివాసుల పట్ల ప్రేమ ఉన్నట్లు అర్థం చేసుకోగలం. మిగతా సమాజంతో పోల్చి చూసినప్పుడు ఇప్పటి వరకు ఆదివాసుల జీవితాల్లో వచ్చిన మార్పు చాలా స్వల్పమే. నిజం మాట్లాడాలంటే శూన్యమనే చెప్పాలి. భారతదేశంలో దాదాపు ఒక లక్షా 50 వేల గూడేలున్నాయి. అందులో చాలా గూడేలకు సరైన మౌలిక వసతులు లేవనే విషయాన్ని నవంబర్ 18, 2019న నాటి ఆదివాసీ శాఖా మంత్రి అర్జున్ ముండా లోక్సభకు తెలియచేశారు. ఇదే సందర్భంలో మరిన్ని వాస్తవాలనూ ఆయన తెలిపారు. భారత్లో మొత్తం గృహాలు 24 కోట్ల 66 లక్షల 92 వేల ఉండగా, ఆదివాసులవి 2 కోట్ల 33 లక్షల ఇళ్ళున్నట్లు, దాదాపు ఒక కోటి యాభై లక్షల ఇళ్ళు సరైన రీతిలో లేవని తెలిపారు. మరుగుదొడ్లు అతి స్వల్పంగా నిర్మాణ మయ్యాయి. 70 శాతం పిల్లలు 10వ తరగతి నుంచే చదువులు మానేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల విషయానికి వస్తే అన్ని తరగతుల్లో కలిపి ఆదివాసీలు 6 శాతానికి మించి లేరు. ఇందులో 4వ తరగతి చిన్నా చితకా ఉద్యోగాలే అధికం. ఆదివాసులు ఎక్కువగా మలేరియా, క్షయ వ్యాధులతో మరణిస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. దేశంలో వంద మంది మలేరియా బారిన పడితే అందులో ఆదివాసులు 30 మంది ఉంటున్నారు. అదివాసీ జనాభాలో ఇది 50 శాతం. పిల్లలకు వ్యాక్సిన్ సదుపాయాలు అందలేకపోవడం వల్ల శిశు మరణాల సంఖ్య చాలా అధికంగా ఉంది. దాదాపు 50 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. క్షయ వ్యాధితో సగటు మరణాలు లక్ష జనాభాకు 256 మరణాలు కాగా, ఆదివాసులలో అవి మూడింతలు అంటే 750కి పైగా ఉన్నాయి. వీటితోపాటు, ఇటీవల దేశాభివృద్ధి పేరుతో ఆదివాసీ ప్రాంతాల్లో వెలుస్తున్న మైనింగ్, రోడ్లు, పరిశ్రమలు, ఇతర ఆదివాసీయేతర వ్యక్తులు నెలకొల్పుతున్న సంస్థల వల్ల లక్షలాది మంది నిరాశ్రయులవుతున్నారు. (క్లిక్: ఆదివాసీ రాష్ట్రపతి కావడానికి ఇన్నేళ్లా?) ద్రౌపదీ ముర్మూను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టిన బీజేపీ, దాని నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఆదివాసీల ప్రగతి, సంక్షేమం పట్ల, వారికి గౌరవంగా జీవించే హక్కును గ్యారంటీ చేసే విషయంలో శ్రద్ధ వహివంచక పోతే ఇది మరొక విఫల ప్రయోగం కాకతప్పదు. (క్లిక్: సిన్హా ఇప్పుడు ముర్మును అని ఏమి లాభం?) - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
రెండూ సామాజిక విప్లవ సిద్ధాంతాలే!
భారతదేశ సామాజిక నేపథ్యం నుంచి కారల్ మార్క్స్ సిద్ధాంతాన్ని అంబేడ్కర్ తులనాత్మకంగా పరిశీలించారు. బుద్ధుడినీ, మార్క్స్నూ ఒకేస్థాయిలో పోల్చారు. ప్రపంచ ఆవిర్భావంలో దేవుడి ప్రమేయాన్ని బౌద్ధం, మార్క్సిజం... రెండూ నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. ఈ ప్రపంచంలో ఏవీ శాశ్వతం కాదనీ, ఇవి నిత్యం మారుతుంటాయనీ బుద్ధుడు, మార్క్స్ ఇరువురూ చెప్పారు. దాన్ని మార్క్స్ గతి తర్కం అంటే, బుద్ధుడు అనిత్త (అనిత్య) అని పేర్కొన్నారు. ఇక సమాజంలో ఉన్న దుఃఖానికి నివారణా మార్గం బౌద్ధం అన్వేషిస్తే, పేదరికం... దానికి కారణమైన దోపిడీ, దాన్ని నిర్మూలించే మార్గాన్ని మార్క్సిజం చూపెట్టింది. మార్క్స్తో అన్ని విషయాల్లో ఏకీభవిస్తూనే, కార్మిక వర్గ నియంతృత్వాన్ని మాత్రం తీవ్రంగా ఆక్షేపించారు అంబేడ్కర్. ‘ఆధునిక సోషలిజం, కమ్యూనిజంలకు కారల్ మార్క్స్ తండ్రి లాంటి వాడు. ఊహా జనిత సోషలిజాన్ని ఎండగట్టి ఆయన శాస్త్రీయ సోషలిజానికి పునా దులు వేశారు. పెట్టుబడిదారులతో పాటు, ఊహాజనిత సోషలిస్టులకు వ్యతిరేకంగా సిద్ధాంత పోరాటాలు చేశారు. ఈ రెండూ సమాజ ప్రమాదకారులేనని కారల్ మార్క్స్ తేల్చి చెప్పారు. అందుకే కారల్ మార్క్స్ సోషలిస్టు వ్యవస్థను శాస్త్రీయంగా నిర్వచించడంలో ఆద్యుడిగా నిలిచారు’’ అని బాబాసాహెబ్ అంబేడ్కర్ తన ‘బుద్ధ లేదా కారల్ మార్క్స్’ రచనలో పేర్కొన్నారు. 1956 నవంబర్ 20వ తేదీన నేపాల్ లోని ఖాట్మండులో జరిగిన అంతర్జాతీయ బౌద్ధ సమ్మేళనంలో పాల్గొని ఇదే విషయమై విశ్లేషణాత్మక ప్రసంగం చేశారు. అంటే అంబేడ్కర్ మహాపరినిర్వాణం పొందడానికి సరిగ్గా పదిహేను రోజుల ముందు ఈ సమావేశం జరిగింది. భారత దేశ చారిత్రక పరిస్థితులు, సామాజిక నేపథ్యం నుంచి ప్రపంచ శ్రామిక వర్గ మహానేత, కమ్యూనిస్టు వ్యవస్థ నిర్మాత కారల్ మార్క్స్ సిద్ధాంతాన్ని తులనాత్మకంగా అధ్యయనం చేసిన రచనగానీ, ప్రసంగం గానీ మరొకటి లేదని భావిస్తున్నాను. ‘కారల్ మార్క్స్, గౌతమ బుద్ధుని పోల్చి చూపడం చాలామందికి హాస్యాస్పదంగానే అనిపించవచ్చు. దీనికి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మార్క్స్కీ బుద్ధునికీ మధ్య 2,381 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. బుద్ధుడు జన్మించింది క్రీ.పూ.563 కాగా, మార్క్స్ పుట్టింది క్రీ.శ.1818 సంవత్సరం. బుద్ధుడినీ, మార్క్స్నూ ఒకే స్థాయిలో పోలు స్తుంటే, మార్క్సిస్టులకు అపహాస్యంగా అనిపిస్తుంటుంది. ఈ పోలిక చాలా తొందరపాటుగా భావిస్తుండవచ్చు. అయితే మార్క్సిస్టులు తమ అపోహలను పక్కన పెట్టి, కారల్మార్క్స్తో పాటు బుద్ధుని బోధనలనూ, బౌద్ధం ప్రాధాన్యతనూ అధ్యయనం చేస్తే వాళ్ళ ఆలో చనల్లో తప్పనిసరిగా మార్పు వస్తుంది’’ అంటూ బాబాసాహెబ్ తన రచనను మొదలు పెట్టారు. బౌద్ధాన్నీ, మార్క్సిజాన్నీ విడివిడిగా వివరించి, మళ్ళీ పోలికలను, వ్యత్యాసాలను విడదీసి చూపెట్టారు. వీటిని మూడు భాగాలుగా చూడవచ్చు. మొదటిది, తాత్విక విష యాలు, రెండవది, ఆర్థిక–సామాజిక అంశాలు. మూడవది, రాజ కీయ వ్యవస్థల నిర్మాణం. మొదటి అంశమైన తాత్వికతను చూస్తే, కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. అందులో ఈ ప్రపంచ ఆవిర్భావం గురించి చెబుతూ, అందులో దేవుడి ప్రమేయాన్ని ఈ రెండు సిద్ధాంతాలూ నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. మార్క్స్ మానవ పరిణామ క్రమాన్ని డార్విన్, ఇతర శాస్త్రీయ పరిశోధనల ద్వారా ఉదహరిస్తే, అంతకన్నా 2,300 ఏళ్ళ క్రితమే, ఈ విశ్వం తనంతట తానే ఉద్భవించిందనీ, ఇందులో ఎటు వంటి అతీంద్రియ శక్తుల ప్రమేయం లేదనీ తన ‘అగ్గన్న సుత్త’ ప్రసంగంలో గౌతమ బుద్ధుడు పేర్కొన్నారు. ఈ ప్రపంచం ఆవిర్భ వించడం గురించి తెలిపిన విషయం డార్విన్ సిద్ధాంతానికి పునాదిగా కనిపిస్తుంది. ఇక రెండో సామ్యం, ఈ ప్రపంచంలోని వస్తువులు ఏవీ కూడా శాశ్వతం కాదు అనేది. ఇవి నిత్యం మారుతుంటాయి. దీనిని మార్క్స్ గతి తర్కం అంటే, గౌతమ బుద్ధుడు అనిత్త(అనిత్య) అని పేర్కొన్నారు. అంటే అశాశ్వతం అని అర్థం. వస్తువుకు పుట్టుక, నాశనం ఉండదనీ, అది పాత రూపం మార్చుకొని, కొత్తదానిలోకి మారుతుందనీ మార్క్స్ భావం అభావం చెందడంగా భావిస్తే... బుద్ధుడు దానిని పునబ్బవ అని పేర్కొన్నారు. అదేవిధంగా ఇద్దరూ ప్రతి సంఘటనకు కార్యకారణ సంబంధముంటుందని తేల్చారు. బౌద్ధంలో దానిని ‘ప్రతీత్య సముత్పాద’ అంటారు. ఒక సంఘటన జరగడం ఏదో యాదృచ్ఛికం కాదనీ, దానికి కారణాలు ఉంటాయనీ భావం. అంటే సమాజాన్ని గతి తార్కిక దృష్టితో చూడటం అనేది రెండు సిద్ధాంతాలలోనూ ఉంది. సమాజంలోని కష్టాలకూ, సమస్యలకూ రెండు తాత్విక మార్గాలూ పరిష్కారాన్ని కనిపెట్టాయి. సమాజంలో ఉన్న దుఃఖానికి నివారణా మార్గం బౌద్ధం అన్వేషిస్తే, పేదరికం... దానికి కారణమైన దోపిడీ, దాన్ని నిర్మూలించే మార్గాన్ని మార్క్సిజం చూపెట్టింది. ఈ రెండింటిలోనూ సొంత ఆస్తి అనేది ప్రధాన కారణంగా పనిచేసింది. అందుకే బౌద్ధ భిక్కులు ఎవ్వరూ కూడా ఆస్తులనే కాదు, అనవసర వస్తువులను కూడా కలిగి ఉండకూడదనే నిబంధనలు పెట్టారు. సొంత ఆస్తి వ్యవస్థ దోపిడీకీ, పేదరికానికీ కారణమనీ... అందువల్ల సొంత ఆస్తిని నిర్మూలించే కమ్యూన్లను ఏర్పాటు చేయాలనీ మార్క్స్ భావించారు. దానినే గౌతమ బుద్ధుడు బౌద్ధ సంఘాల ద్వారా ఒక నూతన వ్యవస్థను నిర్మించాలని ప్రతిపాదించారు. కమ్యూనిస్టు దేశాల్లో కమ్యూన్లు, సహకార వ్యవస్థలు ప్రజల సామాజిక అభి వృద్ధికి నేతృత్వం వహించాయి. ఆర్థిక, సామాజిక, నైతిక మద్దతును రైతులకూ, కార్మికులకూ అందించాయి. బౌద్ధ సంఘాలు, బౌద్ధారా మాలు కూడా ఆర్థిక సహాకార సంస్థలను నడిపాయి. దానికి సంబం ధించిన ఆధారాలు మనకు బౌద్ధ సాహిత్యంలో దర్శనమిస్తాయి. అయితే సమాజ మార్పునకు వర్గపోరాటాలే మార్గమని మార్క్సిజం భావిస్తే, బౌద్ధం మాత్రం అనివార్యమైతే తప్ప యుద్ధాలు వద్దని తేల్చిచెప్పింది. చాలా మంది బౌద్ధం అనగానే అహింసను ప్రబోధించే మానవ సిద్ధాంతంగా భావిస్తారు. కానీ బౌద్ధం న్యాయం కోసం, ప్రజల రక్షణ కోసం యుద్ధం చేయాల్సి వస్తే వెనుకాడకూడదని తేల్చి చెప్పింది. ఒకదేశ సేనాధిపతి సింహసేనాపతితో బుద్ధుడు జరిపిన సంభాషణలో ఈ విషయం తేల్చి చెప్పారు. ఇది అంగుత్తర నికాయలోని ‘సింహసేనాపతి సుత్తలో ఉంది. మార్క్సిజం లాగానే బౌద్ధం ఆనాటి వైరుధ్యాన్ని కనిపెట్టి మహా విప్లవాన్ని నడిపింది. యజ్ఞయాగాలలో సమాజాన్ని నిట్టనిలువునా దోపిడీ చేస్తూ, ఆనాటి సామాజిక ప్రగతికి అడ్డుగోడలుగా నిలిచిన పురోహిత, వైదిక వ్యవస్థను ఎదుర్కొని సామాజిక విప్లవాన్ని సాధించింది. అందుకే బౌద్ధం భారత దేశ తొలి సామాజిక విప్లవం. అదే విధంగా మార్క్సిజం ఆధునిక ప్రపంచ విప్లవ సిద్ధాంతం. అయితే అంబేడ్కర్ మార్క్సిజంతో తీవ్రంగా విభేదించిన అంశం ‘కార్మిక వర్గ నియంతృత్వ’ వ్యవస్థ. దీన్ని ప్రాథమికంగా మార్క్స్ నిర్వచిస్తే, దానిని రష్యా విప్లవనేత లెనిన్ ఆచరణలో చూపెట్టారు. మార్క్స్ని అన్ని విషయాల్లో ఏకీభవిస్తూనే, కార్మిక వర్గ నియంతృ త్వాన్ని మాత్రం చాలా తీవ్రంగా ఆక్షేపించారు అంబేడ్కర్. బౌద్ధం లోనే తన అభిప్రాయానికి పునాది ఉందని అంబేడ్కర్ పేర్కొన్నారు. గౌతమ బుద్ధుడు ఆనాటి మహాజనపదాల ప్రజాస్వామ్య విలువలను విశ్వసించాడనీ, వాటిని తన విధానంగా ప్రతిపాదించాడనీ అంబేడ్కర్ స్పష్టం చేశారు. ఆనాటి కన్నా ఈనాడు సమాజం ఎంతో ముందుకు పోయిందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి నియంతృత్వమైనా సరియైనది కాదనీ, అది ప్రజలను స్వేచ్ఛకు దూరం చేస్తుందనీ అంబే డ్కర్ భావించారు. మార్క్స్ సిద్ధాంతం ద్వారా ఆర్థిక సమానత్వం వస్తుందనీ, కానీ భారతదేశంలో అంతరాలకి ముఖ్యమైన కులవ్యవస్థ సృష్టించిన కుల వ్యత్యాసాలు సోదరత్వాన్ని అడ్డుకుంటున్నాయనీ అంబేడ్కర్ అభిప్రాయపడ్డారు. ఆ విధంగా ఆ ఒక్క విషయం మినహా భారతదేశ విప్లవ సిద్ధాంతమైన బౌద్ధానికీ, మార్క్సిజానికీ చాలా సామ్యాలున్నాయని అంబేడ్కర్ స్పష్టం చేశారు. భారతదేశ ప్రజలు సామాజిక, రాజకీయ ఆర్థిక సమానతల కోసం జరుపుతున్న పోరా టంలో బౌద్ధం, మార్క్సిజం సిద్ధాంతాల అవసరముందనే విషయాన్ని మనం గమనించాలి. మార్క్సిజం ప్రకారమే, ప్రతి దేశంలో ఉన్న చారిత్రక, సామాజిక పరిస్థితుల దృష్ట్యా వాటికి అనుగుణంగానే చారి త్రక భౌతిక వాదాన్ని రూపొందించుకోవాలని ప్రముఖ మార్క్సిస్టు తత్వవేత్త మార్తా హర్నేకర్ అన్న మాటలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 (నేడు కారల్ మార్క్స్ జయంతి) -
ప్రజాస్వామ్యమే అంబేడ్కర్ భావసారం
బాబాసాహెబ్ అంబేడ్కర్ సాగించిన కార్యాచరణ మీద చాలామంది అసమగ్రమైన అధ్యయనంతో అసందర్భంగా మాట్లాడుతున్నారు. అంబేడ్కర్ ప్రతి విషయాన్నీ అనుభవించి, ఆలోచించాడు. దానికి తగ్గట్టుగా అధ్యయనం సాగించాడు. ఆ అధ్యయనాన్ని అక్షరబద్ధం చేశాడు. ఆయన తన ఆదర్శ సమాజానికి ప్రజాస్వామ్యాన్ని భూమికగా ఎంచుకొని, సమానత్వాన్ని సాధించాలని భావించాడు. ఆయన చేసిన రచనలు, సాగించిన వాదనలు, ఉద్యమాలన్నీ అదే మార్గంలో ఉంటాయి. ఆయన సమానత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న ప్రజాస్వామ్యాన్ని మార్గంగా ఎంచుకున్నాడు. అందుకే అంబేడ్కర్ను అర్థం చేసుకోవాలంటే మనకు అందుబాటులో ఉన్న ఆయన నలభై సంవత్సరాల రచనల్లో కొన్నిటినైనా చదవాలి. ‘భిక్షువులారా! శ్రావస్తిలో ఒకప్పుడు ఒక రోజు... పుట్టుకతో అంధులైన వారిని పిలిచి, ఒక ఏనుగును తెప్పించి, దానిని గుర్తుపట్టమనీ, అది ఏ ఆకారంలో ఉంటుందో చెప్పాలనీ ఆజ్ఞాపించారు. అయితే అంధులు ఒక్కొక్కరు ఏనుగులోని ఒక్కొక్క భాగాన్ని తడిమిచూసి తమ అభిప్రాయాలను వివరించారు. తలను పట్టుకున్న మొదటివాడు అది ఒక కుండలాగా ఉందన్నాడు. చెవి పట్టుకున్న వాడు అది చేటలా ఉందన్నాడు. దంతాన్ని తాకిన వాడు నాగలికర్రుగా అనుకున్నాడు. మరొకరు తొండం ఎడ్ల బండి కాడిలా ఉందన్నాడు. ఆఖరి వాడు తోకను ముట్టుకొని అది రోకలిలా ఉందని చెప్పాడు. వీళ్ళందరు ఏనుగు మొత్తాన్ని తాకలేదు. అది ఎట్లా ఉందో చెప్పలేకపోయారు. వాళ్ళు పుట్టుకతో అంధులు కావడం వల్ల అట్లా అనుకున్నారు. అయితే కండ్లు ఉండి, ధమ్మాన్ని (ధర్మాన్ని) సమగ్రంగా అర్థం చేసుకోలేక చాలా మంది తమకు ఏది తోస్తే అది మాట్లాడుతున్నారు. అటువంటి వాళ్ళకు ఏ ధర్మమైనా అర్థం కాదు. అందుకే ప్రతి చిన్న విషయానికీ వాదోపవాదాలకు రావడం, తమ అజ్ఞానాన్ని జ్ఞానంగా ప్రదర్శించడం చేస్తున్నారు. మీరు అలా చేయకూడదు. ఏదైనా ఒక విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి’’ అంటూ గౌతమ బుద్ధుడు తన శిష్యులకు హితబోధ చేశారు. ఇది బౌద్ధ సాహిత్యంలో తిత్తియసుత్తలో ఉంది. ఆ తర్వాత ఇదే కథ జైన, హిందూ, సూఫీ సాహిత్యంలోకి వెళ్ళింది. చాలా మందికి ఈ కథ తెలుసు. ఏదైనా ఒక విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోకుండా మాట్లాడే వాళ్ళ గురించీ, వాదోపవాదాలు చేసే వాళ్ళను గురించీ ఈ కథ చెప్పడం వింటూంటాం. అయితే ఇక్కడ సందర్భమేమిటనే సందేహం రాక తప్పదు. భారత దేశ సామాజిక గతినీ, స్థితినీ తెలియజేసి, దానిని ఎలా మార్చాలో తన విస్తృతమైన అధ్యయనం ద్వారా తెలియజేసిన భారత సామాజిక విప్లవకారుడు బాబాసాహెబ్ అంబేడ్కర్ విషయంలో ఇటీవల ఇదే జరుగుతున్నది. అంబేడ్కర్ తాత్విక చింతన, ఆయన సాగించిన కార్యాచరణ, జీవిత ఘట్టాలు, ఇట్లా అనేక విషయాలపై చాలామంది అసమగ్రమైన అధ్యయనంతో అసందర్భంగా మాట్లాడుతున్నారు. అయితే ఎవరినీ నిందించడం నా ఉద్దేశ్యం కాదు. కానీ దాని వల్ల అంబేడ్కర్ ప్రధానమైన తాత్విక చింతన, ఆయన సాగించిన సంఘర్షణాయుతమైన జీవన గమనం తప్పుగా అర్థం అవుతుంది. నిజానికి బాబాసాహెబ్ అంబేడ్కర్ తాత్విక కేంద్ర బిందువులను అర్థం చేసుకుంటే, ఆయన మనకు అర్థం అవుతారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఈ దేశపు మూలస్తంభపు పునాదిని కనిపెట్టారు. అందు కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. అంబేడ్కర్ని మనం మేధావిగా చెప్పుకుంటాం. అయితే అది సాధ్యం కావడానికి ఆయన అనుభవం, ఆందోళన, ఆలోచన, అధ్యయనం, అక్షరం, ఆచరణలు ఒకదాని వెంట ఒకటి నడిచాయి. అంబేడ్కర్ ప్రతి విషయాన్నీ అను భవించి, ఆలోచించాడు. దానికి తగ్గట్టుగా అధ్యయనం సాగించాడు. అందుకు తగ్గట్టుగా అధ్యయనాన్ని అక్షరబద్దం చేశాడు. దానిని ఆచరణలో చూపెట్టాడు. తాత్విక వేత్తలు చెప్పినట్టుగా, ప్రపంచాన్ని చాలా మంది అధ్యయనం చేసి, వ్యాఖ్యానిస్తూ ఉంటారు. కానీ మార్చడమెలాగో చెప్పిన వాడే తాత్వికుడు. అటువంటి వాడే అంబేడ్కర్. బాబాసాహెబ్ అంబేడ్కర్ తన కాలేజీ చదువు ముగించుకొని, కొలంబియాలో ఉన్నత చదువుల కోసం వెళ్ళాడు. అక్కడ తన జీవిత అనుభవం ద్వారా ఏర్పడిన ఆందోళనను ఆలోచనలో పెట్టి అధ్యయనం సాగించాడు. అక్కడే తన దృక్పథాన్ని ఒక ఉన్నతమైన మార్గంలో తీర్చిదిద్దుకున్నాడు. 1913 నుంచి 1917 వరకు అంబేడ్కర్ అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేసిన అధ్యయనం ఆయనను ఒక తాత్వికుడిగా తీర్చిదిద్దుకోవడానికి మంచి అవకాశా న్నిచ్చింది. దానికి ప్రధానమైన వ్యక్తి ఆయన గురువు ప్రొఫెసర్ జాన్ డ్యూయీ. పంతొమ్మిదవ, ఇరవైవ శతాబ్దాలలో అమెరికాలోని తాత్వికుల్లో జాన్ డ్యూయీ అగ్రగణ్యుడు. అటువంటి ఒక తాత్వికుడు అంబేడ్కర్కు గురువుగా దొరికాడు. జాన్ డ్యూయీ ప్రధానమైన పరి శోధన డెమోక్రసీ. ప్రజాస్వామ్య భావనను ఆధునికంగా ఆలోచించిన వాడు జాన్ డ్యూయీ. ప్రజాస్వామ్యాన్ని అబ్రహం లింకన్ సహా అనేక మంది పరిపాలనా సంబంధమైన విషయంగా వ్యాఖ్యానిస్తే, జాన్ మాత్రం దానిని ఒక సామాజిక అంశంగా, యావత్ సమాజానికి సంబంధించిన విషయంగా, మానవ సంబంధాలకు విస్తరింపజేశాడు. తన ‘ప్రజాస్వామ్యం – విద్య’ అనే పుస్తకంలో రాసిన విధంగా, ‘‘ప్రజాస్వామ్యం కేవలం పాలనకు సంబంధించిన వ్యవహారం కాదు. ఇది ప్రజల మధ్య, ప్రజల జీవనానికి సంబంధించినది. వారి మధ్య ఉండే సంబంధాలను నిర్దేశించేది’’. అయితే అంబేడ్కర్ తన మొత్తం ప్రయాణంలో ప్రజాస్వామ్య తాత్విక పునాదిని అర్థం చేసుకున్నాడు. బాబాసాహెబ్ అంబేడ్కర్ జాన్ డ్యూయీ నుంచి ప్రేరణ పొందా డనడానికి ‘కుల నిర్మూలన’లో వ్యక్త పరిచిన ప్రాథమిక అభిప్రాయమే నిదర్శనం. అంబేడ్కర్ ప్రజాస్వామ్యాన్ని అన్ని రంగాలకు వర్తించే ఒక తాత్విక శక్తిగా మలుచుకున్నాడు. అంబేడ్కర్ తన నలభై సంవత్సరాల చురుకైన ఉద్యమ జీవితంలో సాగించిన పరిశోధనలు, అమలు చేసిన కార్యాచరణలు దానినే బలపరుస్తున్నాయి. ఆయన 1916లో కులాల పుట్టుక అనే అంశంపై పరిశోధన చేసి, దానిని కుల నిర్మూలనలో ఒక లక్ష్యంగా చేసుకొని, బౌద్ధాన్ని స్వీకరించడం ద్వారా ఒక సామాజిక ప్రజాస్వామ్యంగా మనకు అందించారు. అదే విధంగా 1919లో సౌత్భరో కమిటీ ముందు ప్రభుత్వ నిర్వాహణలో ప్రజల భాగ స్వామ్యం ఉండాలనీ, అందులో అణిచివేతకు గురైన వర్గాలను ప్రత్యే కంగా గుర్తించి తగు ప్రాధాన్యత కల్పించాలనీ ప్రసంగించాడు. సైమన్ కమిషన్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ల ద్వారా దానికి ఒక బలాన్ని చేకూర్చి 1950లో ఆమోదించిన రాజ్యాంగంలో అందుకు తగ్గట్టుగానే చట్టబద్ధత కల్పించాడు. ఇది రాజకీయ ప్రజాస్వామ్యం. అదేవిధంగా 1918లో మొట్టమొదటి ఎకనామిక్ జర్నల్లో ‘థియరీ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్’ అనే వ్యాసంలో వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధిపై మార్గనిర్దేశనం చేశాడు. వ్యవసాయం మీదనే ప్రజలు ఆధారపడటం వల్ల ఆ వ్యవస్థ ఒత్తిడికి గురవుతోందనీ, తన 27వ ఏటనే దేశానికీ, ప్రపంచానికీ మార్గనిర్దేశనం చేశాడు. ఇదే విషయమై పరిశోధన సాగించిన సర్ ఆర్థర్ లూయీస్కు 1954లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. అంటే దాదాపు 36 సంవత్సరాల ముందే అంబేడ్కర్ తన దార్శనికతను ప్రదర్శించాడు. అంతేకాకుండా, 1945లో తాను రాసిన ‘స్టేట్స్ అండ్ మైనారిటీస్’ అన్న డాక్యుమెంటులో దేశంలోని వనరులను, ముఖ్యంగా భూమినీ, భారీ పరిశ్రమలనూ, బ్యాంక్, ఇన్సూరెన్స్ సంస్థల వంటి వాటినీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంచకూడదనీ, వాటిని జాతీయం చేయాలనీ ప్రతిపాదించాడు. అంబేడ్కర్ తన ఆదర్శ సమాజానికి ప్రజాస్వామ్యాన్ని భూమికగా ఎంచుకొని, సమానత్వాన్ని సాధించాలని భావించాడు. అందుకే తాను చేసిన రచనలు, సాగించిన వాదనలు, ఉద్యమాలన్నీ అదే మార్గంలో ఉంటాయి. ఆయన సమానత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న ప్రజాస్వా మ్యాన్ని మార్గంగా ఎంచుకున్నాడు. అందుకే ఆయన లక్ష్యాల్లో సమా నత్వం, స్వేచ్ఛ, సోదరత్వం ముఖ్యమైనవి. వాటి సాధనకు మార్గం సుగమం చేసేదే ప్రజాస్వామ్యం. అందుకే అంబేడ్కర్ను అర్థం చేసుకోవాలంటే మనకు అందుబాటులో ఉన్న ఆయన నలభై సంవత్స రాల రచనల్లో కొన్నిటినైనా మనం చదవాలి. ఆయన మూలసిద్ధాంత మైన ప్రజాస్వామ్య భావనను అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలి. -మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
ఆయుధ వ్యాపారమే అసలు ముద్దాయి
ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని వెనుక కొన్ని అదృశ్య శక్తులు ఉంటాయి. ప్రస్తుతం రష్యా–ఉక్రెయిన్ల మధ్య సాగుతున్న యుద్ధానికి పైకి కనిపిస్తున్న కారణాలకు మించి మరోటున్నది. అమెరికా, మరికొన్ని ఇతర దేశాలూ చేస్తున్న ఆయుధ వ్యాపారమే ఇందుకు అసలు కారణం. ఉక్రెయిన్కి రష్యా బూచిని చూపించి, 2014 నుంచి ఇప్పటి వరకు అమెరికాతోపాటూ కెనడా, చెక్ రిపబ్లిక్, పోలండ్, టర్కీ, యూఏఈ, బ్రిటన్ వంటి దేశాలు ఉక్రెయిన్తో ఆయుధాల వ్యాపారం చేస్తున్నాయి. ఈ దేశాలన్నీ రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోవాలని ఇవ్వాళ ప్రకటనలు గుప్పిస్తున్నాయి. వీటికి చిత్తశుద్ధి ఉంటే ఆయుధ వ్యాపారాన్ని ఆపాలి. ఆయుధ వ్యాపారం ఉన్నంత కాలం... ప్రపంచంలో యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ‘‘యుద్ధం ఒక పెద్ద వ్యాపారం. డబ్బు పెద్ద మొత్తంలో చేతులు మారుతుంటుంది. అంతే కాదు, యుద్ధం ద్వేషాన్నీ, భయాన్నీ, అపనమ్మకాన్నీ పెంచు తుంది. ఈ యుద్ధాల్లో ఎంతో మంది సైనికులు, సాధారణ ప్రజలు అనివార్యంగా అనేక విధాలైన బాధలకు; మానసిక, శారీరక గాయాలకు... చివరకు మృత్యువుకు బలవుతారు’’ అంటూ బ్రిటిష్ సంగీత విద్వాంసుడు జాన్ అండర్సన్ యుద్ధం గురించిన ఒక సజీవ సత్యాన్ని మన కళ్ళ ముందుంచారు. తన యుద్ధాలతో యూరప్ను గడగడ లాడించిన ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టి ‘యుద్ధం హంత కుల వ్యాపారం’ అని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో రాచరికాలు పోయాయి, నియంతృత్వాల స్థానంలో ప్రజాస్వామ్యం నెలకొన్నది. ఈ ఆధునిక యుగంలో యుద్ధం అవసరం మారిపోయింది. 16వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు బ్రిటిష్ వ్యాపారులు భారత దేశంతో పాటు, ప్రపంచం మీద ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి డబ్బు, వ్యాపారంతో పాటు ఆయుధాలనూ నమ్ముకున్నారు. అయితే 1945ల తర్వాత, అంటే రెండవ ప్రపంచయుద్ధం అనంతరం చాలా దేశాలు బ్రిటిష్, ఫ్రెంచి, డచ్ తదితర సామ్రాజ్య వాద విస్తరణ వాదుల నుంచి విముక్తి పొంది, ప్రజాస్వామ్య ప్రభు త్వాలను ఏర్పరుచుకున్నాయి. ఇక ప్రపంచం శాంతియుతంగా సహ జీవనం సాగిస్తుందని అనుకున్నాం. కానీ యుద్ధాలు ఆగలేదు. గతంతో పోలిస్తే యుద్ధాలు తక్కువ జరిగినా ఆయుధ వ్యాపారం ఆగలేదు. ప్రపంచంలోని 36 దేశాలు మినహా మిగతా అన్ని దేశాలూ పెద్ద ఎత్తున సైన్యాలు కలిగి ఉన్నాయి. ఇవన్నీ చాలా చిన్న దేశాలు. కానీ మిగతా దేశాలన్నీ కూడా సైన్యాన్నీ, ఆయుధాలనూ వీలైతే అణ్వాయుధాలనూ కలిగి ఉన్నాయి. అంతర్జాతీయ న్యాయవేదికలు, నిర్దిష్టమైన సరిహద్దులు, ప్రజలు ఎన్నుకుంటున్న ప్రభుత్వాలు ఉన్న సమయంలోనూ యుద్ధాలు తప్పవా? వాస్తవానికి యుద్ధాలు లేని ప్రపంచాన్ని నిర్మించుకునేంత ప్రజాస్వామిక భావజాలం నెలకొని ఉన్నది. కానీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. నిజానికి యుద్ధాలు జరుగుతున్నాయనడం కంటే యుద్ధాలు చేయిస్తున్నారు అనడం సబబుగా ఉంటుంది. ప్రస్తుతం మనం ప్రతిరోజూ ఉక్రెయిన్పై రష్యా దాడిని, దాని పర్యవసానాలను చూస్తున్నాం. ఇప్పటికే లక్షలాది మంది నిరాశ్రయు లయ్యారు. ఎంతోమంది ఆప్తులను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో కూరుకుపోయారు. చివరకు మన తెలుగు విద్యార్థులూ ఎంతో మంది నరకాన్ని అనుభవించారు. రష్యా – ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధంలో పాత్రధారులుగా రష్యా, ఉక్రెయిన్లే కనిపిస్తున్నా... కని పించని కుట్రలు చేస్తోన్న అగ్రరాజ్యం అమెరికా... ఈ యుద్ధంలో ప్రప్రథమ భాగస్వామి అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అమెరికాతో సహా అనేక యూరప్ దేశాలూ ఈ యుద్ధంలో తమ వంతు మంటలు రాజేసినవే! ఈ యుద్ధానికి అసలు కారణం వ్యాపారం. ఎందుకంటే ఉక్రె యిన్కి రష్యా బూచిని చూపించి, అమెరికా తన ఆయుధ వ్యాపారాన్ని సమర్థంగా కొనసాగించుకుంటోంది. ఉక్రెయిన్కి ఆయుధాలు అంట గట్టడంలో అమెరికా చాలాకాలంగా సఫలమౌతోంది. రష్యాతో ఉక్రె యిన్ ఘర్షణలు మొదలైనప్పటి నుంచి అమెరికాతో పాటు అనేక దేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకోవడం పెరిగింది. 2014 నుంచి, ఇప్పటి వరకు కెనడా, చెక్ రిపబ్లిక్, పోలండ్, టర్కీ, యూఏఈ, బ్రిటన్ దేశాలు ఉక్రెయిన్తో ఆయుధాల వ్యాపారం చేస్తున్నాయి. ఇందులో అమెరికా భాగమే అధికం. 1993లో యుఎస్ఎస్ఆర్ నుంచి ఉక్రెయిన్ విడిపోయినప్పుడు ఆ దేశం రక్షణ బడ్జెట్ స్థూల జాతీయోత్పత్తిలో 0.35 శాతం. అంటే 0.12 బిలియన్ డాలర్లన్నమాట. 2014లో అది 3 బిలియన్ డాలర్లకు పెరిగి, స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 2.25 శాతం వరకు పెరిగింది. అంటే దాదాపు 19 రెట్లు రక్షణ బడ్జెట్ పెంచుకోవాల్సి వచ్చింది. 2015 నాటికి 2.96 బిలియన్ డాలర్ల (జీడీపీలో 3.25 శాతం)కు చేరింది. 2019 వచ్చేసరికి ఈ కేటాయింపులు 5.23 బిలియన్ డాలర్ల (జీడీపీలో 4 శాతం)కు చేరుకున్నాయి. 2014 సంవత్సరంలో రష్యాతో ఘర్షణలు ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోవడం ప్రారంభమైంది. ఈ ఘర్షణల వల్ల 2014లో 28.6 శాతం ఉన్న ఉక్రెయిన్లోని పేదరికం 2016కి వచ్చేసరికి 58.6 శాతానికి పెరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి మరింత దిగజారిపోయింది. రెండేళ్ళ క్రితం ప్రపంచాన్ని చుట్టుముట్టిన కోవిడ్ కాలంలో ఎన్నో పరిశ్రమలు దెబ్బతిన్నాయి. కానీ ఆయుధ కర్మాగారాలు లాభాలు గడించాయి. స్వీడన్ రాజధాని స్టాక్హోంలో పనిచేస్తున్న స్టాక్హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన లెక్కల ప్రకారం ప్రపంచంలో ఉన్న వంద అగ్రశ్రేణి కంపెనీలు అత్యధిక లాభాలను ఆర్జించినట్టు తెలియజేసింది. ఈ వంద కంపెనీల్లో అమెరికాకి చెందినవే 48 ఉన్నాయంటే అమెరికా ఆయుధ వ్యాపారం ఎటువంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. అంతే కాకుండా ప్రపంచంలో ఆయుధాలు ఎగుమతి చేస్తున్న పది అగ్రదేశాల్లో అమెరికాది అగ్రస్థానం. 2016–2020 వరకు సేకరించిన గణాంకాల ప్రకారం ప్రపంచంలో ఆయుధాల అమ్మకంలో అమెరికా భాగం 37 శాతంగా ఉంది. 20 శాతంతో రెండో స్థానంలో రష్యా ఉంది. 2011–15 వరకు అమెరికా భాగస్వామ్యం 32 శాతంగా మాత్రమే ఉండేది. 2011–2015 మధ్య రష్యా ఆయుధ వ్యాపార అమ్మకాలు 26 శాతంగా ఉండేవి. దీన్ని బట్టి ఆరు శాతం అమ్మకాలను రష్యా కోల్పోయింది. ఫ్రాన్స్ (8.2 శాతం), జర్మనీ (5.5 శాతం) వరుసగా మూడు, నాలుగు స్థానాలను ఆక్రమించాయి. చైనా (5), బ్రిటన్ (6), స్పెయిన్ (7), ఇజ్రాయెల్ (8), దక్షిణ కొరియా(9), ఇటలీ (10) ఆయుధ వ్యాపారంలో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. డబ్బుల్లో ఆయుధ వ్యాపారాన్ని లెక్కిస్తే, 2020లో ప్రపంచం మొత్తం ఆయుధాలు, రక్షణ మీద పెట్టిన ఖర్చు 1.951 ట్రిలియన్ డాలర్లు. ఇందులో అమెరికా ఒక్కటే చేసిన ఖర్చు 778 బిలియన్ డాలర్లు. ఖర్చులో చైనా 252 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉంది. మనదేశం 72.9 బిలియన్ డాలర్ల ఖర్చుతో మూడవ స్థానాన్ని ఆక్రమించింది. ఆ తర్వాతి స్థానాల్లో రష్యా (61.7 బిలియన్ డాలర్లు), బ్రిటన్ (59.2 బిలియన్ డాలర్లు), సౌదీ అరేబియా (57.5 బిలియన్ డాలర్లు), జపాన్ (49.1 బిలియన్ డాలర్లు), దక్షిణ కొరియా (45.7 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. అయితే ఇందులో ఒక ముఖ్యమైన అంశమేమిటంటే అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, రష్యా లాంటి దేశాలు వ్యాపారం చేసుకోవడానికి పెట్టుబడులు పెట్టి అంతకంతకు ఎక్కువ లాభాలు సంపాదిస్తున్నాయి. కానీ ఇండియా లాంటి పేదదేశం ఆయుధాలను కొనడానికి మాత్రమే లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. ఆయుధాలను దిగుమతి చేసుకుంటోన్న దేశాల్లో సౌదీ అరేబియా, భారత్, ఈజిప్టు, ఆస్ట్రేలియా, చైనా, అల్జీరియా, దక్షిణ కొరియా, ఖతార్, యూఏఈ, పాకిస్తాన్లు వరుసగా మొదటి పది స్థానాల్లో ఉన్నాయి. అంటే అమెరికా యూరప్ దేశాలు తమ ఆయుధాల వ్యాపారానికి ఆసియాను కేంద్రంగా ఉప యోగించుకుంటున్నాయన్నమాట! యుద్ధం ఏదైనా అది లక్షలాది మంది ప్రజల ప్రాణాల హననం. కోట్లాది మందిని దిక్కులేని వారిగా తయారుచేసే దుర్మార్గ వ్యాపార వ్యసనం. యుద్ధం వద్దనుకుంటే ఆయుధ వ్యాపారం ఆగిపోవాలి. ఆయుధాల వ్యాపారం కొనసాగినంత కాలం ఏదో ఒక మూల యుద్ధ జ్వాలలు రగులుతూనే ఉంటాయి. కాదు యుద్ధాన్ని రగిలిస్తూనే ఉంటారు. అందులో పేద దేశాల ప్రజలెప్పుడూ బలౌతూనే ఉంటారు. ఇదే ప్రతి యుద్ధం నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం. - మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
సమానత్వం దిశగా ముందడుగు
భారత దేశ చరిత్రలో భారత రాజ్యాంగమే ఒక మహత్తర విప్లవం. వేల సంవత్సరాలుగా ఉన్న అసమానతలకు రాజ్యాంగం చరమగీతం పాడింది. ప్రజలంతా సమానమేననీ, పౌరులందరూ సమానమైన హక్కులు కలిగి ఉంటారనీ ప్రకటించింది. అయితే ఇప్పటికీ దేవాలయాల్లో దళితులకు ప్రవేశం దొరకని సందర్భాలను చూస్తూనే ఉన్నాం. ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే! వీటి విరుగుడుకు బాబాసాహెబ్ అంబేడ్కర్ ఏనాడో పరిష్కార మార్గాలను సూచించారు. వాటికి అనుగుణంగానే తమిళనాడు ప్రభుత్వం, హిందువులుగా విశ్వాసం కలిగిన అన్ని కులాల వారికీ పూజారు లుగా ఉండే అవకాశం కల్పిస్తోంది. అంతకుమునుపే కేరళ ప్రభుత్వం ఈ బాటలో నడుస్తోంది. కులనిర్మూలనా ఉద్యమంలో ఇవి గొప్ప ముందడుగులు. ఒకే రకమైన నేరం చేసినప్పటికీ శిక్షలు కులాన్ని, వర్ణాన్ని బట్టి ఉంటాయని హిందూ ధర్మశాస్త్రాలు, పురాణాలు, ఇతర వ్యాఖ్యానాల ద్వారా ప్రజల మెదళ్ళలో తరతరాలుగా చొప్పించారు. అందుకే చాతుర్వర్ణాల్లో బ్రాహ్మణులు దైవంతో సమానం కాబట్టి వారిని శిక్షించే అధికారం ఎవరికీ లేదు. క్షత్రియులు ఏది చేసినా రాజ్య రక్షణార్థమై చేస్తారు. అందువల్ల వాళ్ళు శిక్షార్హులు కాదు. వైశ్యులను మందలించాలి, శూద్రులను కఠినంగా శిక్షించాలన్న సూత్రాన్ని వేల సంవత్సరాలుగా ఘోషిస్తూ వస్తున్నారు. దానికి అడ్డు కట్టపడింది సరిగ్గా 1950 జనవరి 26న అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే! భారత రాజ్యాంగం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ప్రజ లంతా సమానమేననీ, పౌరులందరూ సమానావకాశాలు, సమాన హక్కులు కలిగి ఉంటారనీ ప్రకటించింది. దేశ చరిత్రలో భారత రాజ్యాంగమే ఒక విప్లవం. గత రెండువేల సంవత్సరాలకు పైగా భారత దేశంలో ఉన్న ప్రజలను... వర్ణాలుగా, ఆ తర్వాత కులాలుగా విభజించి, ఒకరిపై మరొకరికి ఆధిపత్యం కల్పించి, పుట్టుక ద్వారానే కులం, కులం ద్వారానే గౌరవం, అధికారం కట్టబెట్టిన స్మృతులు, శ్రుతులకు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత కాలం చెల్లిపోవడం సమాజానికి జరిగిన ఒక గొప్ప మేలు. రాజ్యాంగం అమలులోకి రావడం ఒక మహత్తరమైన సందర్భమే అయినా, దాని అమలు మాత్రం ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. అయితే భారత రాజ్యాంగం, దానిపై ఆధారపడి రూపొందించిన చట్టాలు మాత్రం అణగారిన ప్రజలకు ఒక భరోసానిచ్చాయి. రాజ్యాంగ రచనలో కీలక భూమిక పోషించిన బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ సభలో ఒకసారి మాట్లాడుతూ, ‘‘అది ఎంత మంచి రాజ్యాంగం అయినప్పటికీ, అమలు చేసేవాళ్ళకు చిత్తశుద్ధి లేకపోతే అది నిరర్థకమవుతుంది. ఒక వేళ రాజ్యాంగం చెడ్డదైనప్పటికీ, దాన్ని అమలు చేసేవాళ్ళు మంచివాళ్లయితే, ఆ రాజ్యాంగమే తన స్వరూపాన్ని మార్చుకుంటుంది’’ అని ప్రభుత్వాల స్వభావాన్నీ, రాజ్యాంగం అమలు ప్రాధాన్యాన్నీ స్పష్టంగా విడమర్చి చెప్పారు. సరిగ్గా అదే విషయం తమిళనాడులో రుజువైంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు రాజ్యాంగ శక్తిని నిరూపిస్తున్నాయి. తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఉన్న ప్రసిద్ధ చిదంబరం నటరాజ దేవాలయంలో ఒక దళిత మహిళకు జరిగిన అవమానం పైన ప్రభుత్వం స్పందించి, ఇరవై మంది అర్చకులపై కేసును నమోదు చేసింది. చిదంబరం నటరాజ దేవాలయంలో ‘కనకసభ’ ప్రాంగణంలోకి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించిన లక్ష్మి అలియాస్ జయశీల అనే మహిళను పూజారులు అడ్డుకోవడం మాత్రమే కాకుండా, కులం పేరుతో దూషించారని ఆమె పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం పూజారులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తోంది. గతంలో దేవాలయ ప్రవేశాలను నిరోధించిన సంఘటనల్లో ఎన్నో కేసులు నమోదయ్యాయి. కానీ అక్కడ ప్రభుత్వాలు నిజమైన దోషు లను విడిచిపెట్టి, ఎవరెవరి మీదనో కేసులు పెట్టాయి. కానీ తమిళ నాడు ప్రభుత్వం దేవాలయాల మీద గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్న అర్చక వర్గం పైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం సాహసోపేత నిర్ణయం. ఈ సాహసం చేయడానికి ధైర్యాన్ని ఇచ్చింది ప్రాథమిక హక్కులే. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 16, ఆర్టికల్ 17, ఆర్టికల్ 21 – ఇలా ఎన్నెన్నో ఆర్టికల్స్ అసమానతల తొలగింపు లక్ష్యంగా నిర్దేశించుకున్నవి. రాజ్యాంగంలో పొందుపరుచుకున్న ఈ ఆర్టికల్స్ అన్నింటి వెనుక ప్రజలందరికీ సమానమైన, గౌరవప్రదమైన జీవితాలను అందించాలనే ఏకైక లక్ష్యం ఇమిడి ఉంది. వాటి అమలు బాధ్యతను ప్రభుత్వాల చేతికి ఈ ఆర్టికల్స్ అప్పగించాయి. ఇప్పటికీ మన దేశంలోని చాలా గ్రామాల్లో దళితులకు దేవాలయ ప్రవేశం లేదు. ఆధిపత్య కులాలు దేవాలయాలను దళితులకు దూరంగా ఉంచుతున్నాయి. అందువల్ల తమిళనాడు ప్రభుత్వం 2007 సంవత్సరంలో హిందువులుగా విశ్వాసం కలిగి, హిందూ దేవాల యాల్లో పూజలు చేసుకోవాలనుకున్న అన్ని కులాలకు పూజారులుగా ఉండే అవకాశం ఉన్నదని భావించి, అర్హతలను బట్టి వారిని ఎంపిక చేసి, శిక్షణనిచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. అప్పటి ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి ఎంతో పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. కానీ కొంతమంది సనాతనవాదులు ఈ విషయమై కోర్టు కెక్కారు. అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గొగోయ్, జస్టిస్ రమణ ఈ కేసును విచారించి, దేవాలయాల్లో పనిచేయడానికి అవసరమైన సిబ్బందిని, అర్చకవర్గాన్ని ఒక కులానికి మాత్రమే పరి మితం చేయకూడదనీ, హిందువులైన అందరూ హిందూ దేవాల యాల్లో అర్చకులుగా అర్హులేననీ, భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సభ చర్చలను ఉదాహరిస్తూ, 2015 డిసెంబర్ 16న ఒక చరిత్రాత్మక తీర్పునిచ్చారు. అయితే అప్పుడు అధికారంలో ఉన్న ఏఐఏడిఎంకే ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. అయితే 2021లో తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో డీఎంకే హిందూ దేవాలయాల్లో వివక్షకు తావు లేకుండా అర్హులైన అందరినీ అర్చకులుగా నియమిస్తామని తన ప్రణాళికలో ప్రకటించింది. అందుకు అనుగుణంగానే 2021 ఆగస్టు 14న గతంలో శిక్షణ పొందిన అర్చకులను ఉద్యోగాల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అదే విధంగా దక్షిణాదిలో మరొక రాష్ట్రం కేరళ 2017 అక్టోబర్ 5వ తేదీన బ్రాహ్మణేతరులను దేవాలయ పూజారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ రెండు రాష్ట్రాలు భారత రాజ్యాంగంలోని కీలకమైన సమాన హక్కుల అమలుకు ఒక కొత్త దారిని చూపాయి. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై; వాటిని అమలు చేసిన డీఎంకే, సీపీఎం లపై విమర్శలు వచ్చాయి. కానీ అవి వాటిని పట్టించుకోకుండా, రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కులను అమలుచేస్తున్నట్టు ప్రకటించాయి. అయితే అంబేడ్కర్ 1935 డిసెంబర్లో ‘కుల నిర్మూ లన’ పేరుతో ప్రసంగపాఠంలో చాలా విస్తృతంగా కుల సమస్యను గురించి చర్చించారు. ఒక రకంగా భారత దేశ సమాజ మార్పునకు ఈ పుస్తకం ఒక ప్రణాళికను రూపొందించి ఇచ్చింది. కుల సమస్య సమసిపోవడానికి అడ్డంకిగా ఉన్న అంశాలను, పరిష్కారాలను ఎంతో సైద్ధాంతిక అనుభవంతో వివరించారు. కుల నిర్మూలన జరగాలంటే కేవలం కంటితుడుపు చర్యలు మాత్రమే పనికిరావనీ, ముఖ్యంగా ప్రజల మెదళ్ళను కలుషితం చేసిన, చేస్తున్న ధర్మశాస్త్రాలను తిరస్క రించాలనీ, కులాంతర వివాహాలను ప్రోత్సహించాలనీ సూచించారు. అంతేకాకుండా హిందూ కులవ్యవస్థలో ఉన్న అసమానతలను తొల గించడానికి ఒక కార్యక్రమాన్ని కూడా అంబేడ్కర్ ప్రతిపాదించారు. అన్ని ధర్మశాస్త్రాలనూ పక్కన పెట్టి, హిందువులందరికీ ఆమోద యోగ్యంగా ఉండే ఒక గ్రం«థాన్ని రూపొందించాలని సూచించారు. ఒక కులానికే పరిమితమైన పూజారి వ్యవస్థను రద్దు చేయాలనీ, హిందూ మతం అవలంబిస్తోన్న అందరికీ పూజారి అయ్యే అవకాశం ఉండాలనీ ప్రతిపాదించారు. పూజారులు ప్రభుత్వోద్యోగులుగా ఉండాలనీ, ప్రభుత్వమే వారికి శిక్షణనిచ్చి నియమించాలనీ, ప్రభుత్వో ద్యోగులైన ఐసీఎస్(ఇప్పటి ఐఏఎస్) ఉద్యోగాల్లాగా ఒక పద్ధతి ప్రకారం నియామకాలు జరగాలనీ పేర్కొన్నారు. దానికి అనుగుణం గానే రాజ్యాంగంలో సమాన హక్కులు, అవకాశాలను పొందు పరి చారు. 1935లో అంబేడ్కర్ ప్రతిపాదించిన అంశాలు ఇప్పటికైనా రెండు రాష్ట్రాలు అమలులోకి తీసుకురావడానికి చేస్తున్న కృషి... కుల నిర్మూలనా మహోద్యమంలో ఒక ముందడుగు అని చెప్పక తప్పదు! వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
రెండు దేశాల భారత్
ఒకవైపు గిడ్డంగుల్లో ఆహారధాన్యాలు పుచ్చిపోతాయి. మరోవైపు పేద జనపు డొక్కలు తిండిలేక మాడిపోతాయి. ఒకవైపు సంపద పోగుపడి బిలియనీర్ల సంఖ్య ఎగబాకుతుంటుంది. ఆ పక్కనే మరికొన్ని కోట్ల పేదల ఆదాయం పడిపోయి, పేదరికం కూడా పెరిగిపోతుంటుంది. క్షీరసాగర మథనంలో కొందరికే అమృతం దక్కినట్టు స్వాతంత్య్ర ఫలాలు కూడా కొందరికే దక్కాయి. దేశం పేదది కాకపోయినా దేశంలో ఇంకా పేదవాళ్లున్నారు. విలువలకు పేరున్న దేశమైనా కులాల అసమానతలున్నాయి. అందుకే ఈ దేశంలోని వైవిధ్యాలనే కాదు, వైరుద్ధ్యాలనూ తరచి చూసుకోవాలి. జనాల మధ్య అంతరాలను తగ్గించడం ద్వారానే ఈ దేశాన్ని ఒక్కటిగా చేయగలం అని గుర్తించాలి. క్షీర సాగర మథనం. సముద్రం నుంచి అమృతాన్ని వెలికితీసేందుకు ఇటు రాక్షసులు, అటు దేవతలు రెండు వర్గాలు కలిసి శ్రమించి, మంధర పర్వతంతో సముద్రాన్ని మథిస్తారు. అందులోంచి అనేక విశిష్ట వస్తువులు, మనుషులు, జంతువులు, అనంతరం విషం, చిట్టచివరకు అమృతం వచ్చాయి. ఇది అందరికీ తెలిసిన కథే కావొచ్చు. కానీ నేడు ఇదే అత్యంత సందర్భోచితమైన అంశం. ఏ అమృతం కోసమైతే ఇరు వర్గాలు సమంగా శ్రమించాయో, దాని ఫలితాలు మాత్రం ఇరు పక్షాలకీ సమంగా అందలేదు. చావును శాశ్వతంగా తరిమికొట్టే అమృ తాన్ని దేవతలు చేజిక్కించుకుని, మరొక వర్గానికి మత్తులో ముంచెత్తే సురాపానం అంటగట్టారు. దేవతలు కదా ఏం చేసినా చెల్లుతుంది. మరో వర్గం కూడా అంతే శ్రమించినప్పటికీ అసలు ఫలితం దక్కక పోవడం కథలోని సారాంశం. అమృతం అందుకున్న వర్గం మరింత శక్తితో తమ ఆధిపత్యాన్ని నిలుపుకొంటూనే వచ్చింది. మరొక వర్గం కాలక్రమేణా దాడులకూ, దౌర్జన్యాలకూ గురై క్షీణించింది లేదా అధికారగణం చేతిలో బానిసలుగా మారిపోయింది. అసలు విషయానికొద్దాం. భారతదేశం స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. మన భారత ప్రభుత్వం ఈ సంద ర్భాన్ని ‘అమృత్ మహోత్సవ్’ పేరుతో ఘనంగా సెలబ్రేట్ చేసుకోవా లని నిర్ణయించింది. అందుకుగానూ గతేడాది మార్చి 12 నుంచి వచ్చే సంవత్సరం అంటే ఆగస్టు 15, 2023 వరకు ఈ ఉత్సవాలను నిర్వ హిస్తోంది. ఈ ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్ర ప్రయాణంలో పాల్గొన్న ప్రజలందరికీ ఈ ఉత్సవాలను అంకితం చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 75 ఏళ్ల ఉత్సవాలు కాబట్టి అమృత్ మహోత్సవ్ అనే పేరు పెట్టారు కానీ, సరిగ్గా సరిపోయింది అది. అమృతం కోసం సాగర మథనంలో పాల్గొన్న అందరికీ అమృతం అందనట్టే స్వాతంత్య్ర ఫలాలు సైతం కొందరికే దక్కాయన్న విషయానికి ఈ పేరు సరిగ్గా సరిపోతుంది. ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్ర పాలన మన దేశ ప్రజలకు అందించింది ఆకలి, పేదరికం, నిరుద్యోగం, అణచివేత. గత 75 ఏళ్ళలో జరిగిన ఆర్థికాభివృద్ధి, సమకూరిన సంపద, అతికొద్ది మంది సంపన్నుల, ఆధిపత్య వర్గాలకే వెళ్ళి పోయింది. సమాజంలో సంపద సమష్టిగానే వృద్ధి చెందుతుంది. కానీ ఫలితాలు అందరికీ అందడంలో మాత్రమే తేడా ఉంటుంది. మన దేశంలోని కేవలం వందమంది కోటీశ్వరులు 57 లక్షల కోట్ల రూపాయల ధనాన్ని కలిగివున్నారని గ్లోబల్ రిపోర్టు తెలియజేసింది. అంటే ఇది భారతదేశ రెండు సంవత్సరాల ఆర్థిక బడ్జెట్కు సమానమని గుర్తించాలి. అదేవిధంగా 50 శాతం మంది జనాభా కేవలం 6 శాతం సంపదను కలిగి ఉన్నారు. అంతేకాకుండా కేవలం ఒక సంవత్సరంలోనే, అది కూడా కోవిడ్ సమయంలోనే 102 మందిగా ఉన్న కోటీశ్వరులు(బిలియనీర్స్) 142కి పెరిగారు. మార్చి 2020 నుంచి, నవంబర్ 30, 2021 వరకు 23 లక్షల కోట్లు ఉన్న కోటీశ్వరుల సంపద 57.3 లక్షల కోట్లకు చేరినట్టు లెక్కలు చెబు తున్నాయి. అదే విధంగా కోవిడ్ సమయంలోనే ఇప్పటి వరకు ఉన్న పేదలకు అదనంగా, 4.6 కోట్ల మంది పేదరికంలోకి దిగజారి పోయారు. అదేవిధంగా భారత దేశానికి మరొక అవలక్షణం ఉన్నది. అదే కులం. భారత దేశంలో సమకూరిన సంపద కూడా కొన్ని కులాలకే పరిమితమైపోయింది. ఇదే విషయాన్ని నితిన్ కూర్ బర్తి అనే విద్యావేత్త, 1961 నుంచి 2021 వరకు చేసిన అధ్యయనంలో కులాల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు ఉన్నాయనీ, మన దేశంలో ఉన్న ఆధిపత్య కులాలు ఆదాయంలోనూ ఖర్చులోనూ మిగిలిన కులాల కన్నా ముందు వరుసలో ఉన్నాయనీ తేల్చారు. ‘వెల్త్ ఇన్ ఈక్వాలిటీ క్లాస్ అండ్ కాస్ట్ ఇన్ ఇండియా – 1962–2021’ అన్న ఈ పరిశోధనా పత్రాన్ని ఆయన ప్యారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కు 2018లో సమర్పించారు. 2011లోని ఎన్ఎఫ్హెచ్ఎస్ డాటా ప్రకారం, ఒక ఎస్సీ కుటుంబానికి ఒక సంవత్సర ఆదాయం 89 వేలు ఉంటే, ఎస్టీ కుటుంబ వార్షికాదాయం 75 వేలు ఉంది. అదే ఓబీసీల్లో ఇది ఒక లక్షా నాలుగు వేలు. ఇక ఆధిపత్య కులాల్లో ఇది లక్షా 64 వేలు అని నితిన్ తేల్చారు. అదేవిధంగా సంవత్సర ఖర్చు ఎస్సీల్లో 87 వేలు, ఎస్టీల్లో 72 వేలు, ఓబీసీల్లో లక్షా ఎనిమిదివేలు, అగ్రకులాల్లో లక్షా 46 వేలుగా ఆయన లెక్కలు గట్టారు. సాధారణ ప్రజల్లో కూడా ఆర్థిక వ్యత్యాసాలు చాలా ఎక్కువగానే ఉన్నట్టు మనకు ఈ లెక్కలు చెబుతున్నాయి. వీటితో పని లేకుండానే ఏ గ్రామం వెళ్ళినా ఈ తేడాలు మనకు వీధుల్లో దర్శనమిస్తాయి. దళిత కుటుంబాల్లో, వారి ఇళ్లల్లో ఈ విషయాలు అత్యంత స్పష్టంగా మనం గమనించొచ్చు. ఇదే విషయం ఇటీవల మరొక సర్వేలో తేలింది. క్రానిక్ పావర్టీ రీసెర్చ్ సెంటర్ ద్వారా జరిగిన పరిశోధన ద్వారా ఇదే విషయం అక్షరసత్యమని రుజువయ్యింది. పేదరికం అనేది తరతరాలుగా వస్తున్న వారసత్వంగా కొందరికి మారిపోయిందని ఆ సంస్థ నిర్వహించిన సర్వే నిగ్గు తేల్చింది. ఇది భారత దేశానికే పరిమితమైన పరిణామంగా ఆ సంస్థ పేర్కొన్నది. ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాలు, దళిత వాడలు, ఆ వర్గాలకు చెందిన ప్రజలు పేదలుగానే పుట్టి, పేదలు గానే మరణిస్తూ, తమ పిల్లలకు సైతం పేదరికాన్నే వారసత్వంగా ఇచ్చి వెళుతున్నారని ఈ పరిశోధన అభిప్రాయపడింది. ప్రపంచంలో వందమంది పేదలుంటే అందులో 28 మంది మనదేశంలోనే ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. అదేవిధంగా ఆకలితో అలమటించే భారత దేశ ప్రజల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఐక్యరాజ్య సమితిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అధ్యయనం ప్రకారం 18 కోట్ల మంది ఇంకా సరిౖయెన ఆహారం కూడా అందని స్థితిలో బతుకులీడుస్తున్నారని 2020 నివేదికలో పేర్కొన్నారు. ఇంకా మహిళల్లో ఆకలి బాధ తీవ్రస్థాయిలో ఉన్నట్టు కనిపిస్తోంది. 15 నుంచి 49 ఏళ్ళ వయసు ఉన్న మహిళల్లో దాదాపు 51 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ఐదేళ్ళలోపు పిల్లల్లో 35 శాతం మంది సరిౖయెన ఎదుగదలను కలిగిలేరు. ప్రపంచ ఆకలి సూచీలో 116 దేశాల్లో మన ర్యాంకు 101 అని తేల్చారు. అయితే మన దేశంలో ఆహార ధాన్యాల కొరత ఉన్నదనుకుంటే పొరపాటే. బియ్యం, గోధుమల ఉత్పత్తిలో మన దేశం స్వయం సమృద్ధిని సాధించింది. భారత రైతాంగం కష్టపడి పండించిన ఈ ధాన్యమంతా ఎఫ్సీఐ గోదాముల్లో పడి మూలుగుతోంది. కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఇచ్చిన లెక్కల ప్రకారం, గడచిన ఐదేళ్ళలో 38 వేల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు పుచ్చి, పురుగుల పాల య్యాయి. 2021 డిసెంబర్ నాటికి 213 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 378 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు నిల్వ ఉన్నాయి. కానీ ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్ర భారతావనిలో ఇంకా ప్రజలు ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా వరి, గోధుమల లాంటి ఆహారధాన్యాలు పండించిన రైతుకు గిట్టుబాటు ధర లేదు. ఆకలితో కాలే కడుపునకు పిడికెడు అన్నం లేదు. ఇది భారత దేశ అమృతోత్సవ సంబరాల సత్యాలు. భారత దేశంలో క్షీరసాగర మథనం లాంటి సంప్రదాయాలే మనకు ఆద ర్శాలు. ఒక వైపు సంపద, మరోవైపు పేదరికం, ఒకవైపు ఆహార ధాన్యాల నిల్వలు పుచ్చిపోతోన్న స్థితి, మరోవైపు ఆకలితో మలమల లాడే కడుపులు. ఇన్ని సాక్ష్యాలున్నా ఇంకా మనది సమైక్య భారతమని అందామా? ముమ్మాటికీ అనలేం. ఇది వైరుద్ధ్య భారతం. ఇక్కడ ఒక్క భారతం లేదు. ఇవి రెండు భారతాలు. ఇంకా చెప్పాలంటే మరెన్నో భారతాలు. నిజానికి ఈ దేశం పేదది కాదు. ప్రజలే పేదవాళ్ళు. ఈ వైరుద్ధ్యాలు ఇప్పటికైనా మనకు అర్థం కాకపోతే, పరిణామాలు ఎవ్వరూ ఊహించలేరు. అమృతోత్సవాలు జరపడం కాదు, అందరికీ అమృతం అందించే గుణం కావాలి. -మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
పంజాబీయులు మన సహోదరులు
దేశంలోని అన్ని రాష్ట్రాలూ దేనికవే ప్రత్యేకమైనవే అయినా, పంజాబ్ మరింత ప్రత్యేకమైనది. దేశ సరిహద్దులో ఉండటం వల్ల రక్షణ అనేది వారి రక్తంలో కలిసిపోయింది. దానికి సాక్ష్యంగా ఇప్పటికీ దేశ జనాభా ప్రాతిపదికన అత్యధిక శాతం మంది సైన్యంలో కొనసాగుతున్నది అక్కడి నుంచే. స్వాతంత్య్రోద్యమ కాలంలో ఎందరో వీరులు ఇక్కడ ఉదయించారు. హరిత విప్లవం కాలంలో దేశానికి అన్నం గిన్నె అయింది ఈ రాష్ట్రమే. అలాగే ఇటీవలి రైతుల ఉద్యమాన్ని ముందుండి నడిపింది కూడా పంజాబీ రైతులే. అలాంటి వారిని ప్రధాని కాన్వాయ్ను అడ్డుకున్నారని ఆరోపిస్తూ కొంతమంది దేశద్రోహులుగా నిందిస్తున్నారు; ఇది తగని పని. అది వారి సమగ్రతను అనుమానించడమే. వారి త్యాగాల చరిత్రను అవమానించడమే. జనవరి 5వ తేదీన పంజాబ్లోని ఫిరోజ్ పూర్ జిల్లా సమీపంలోని పయరయన గ్రామం దగ్గర ఫ్లైఓవర్ పైన దాదాపు 20 నిమిషాల పాటు ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ నిలిచిపోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న వీరుల సమాధి హుస్సేనివాలా దగ్గర జరిగే సభలో పాల్గొనడానికి వెళుతున్న ప్రధానికి ఎదురైన ఈ ఘటన యావత్ దేశంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైతులు అడ్డుకోవడం వల్లనే ప్రధాని కాన్వాయ్ ముందుకు వెళ్ళలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే రైతాంగ ఉద్య మానికి సారథ్యం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా ఈ వాదనను ఖండించింది. ప్రధాని కాన్వాయ్ను రైతులు అడ్డుకోలేదనీ, ఆ దారిలో ప్రధాని వస్తున్న విషయం కూడా రైతులకు తెలియదనీ కిసాన్ మోర్చా జనవరి 6వ తేదీన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అయితే ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ, నిరసనలు తెలియజేయాలని నిర్ణయించిన మాట నిజమనీ, జనవరి 2వ తేదీన గ్రామస్థాయిలో, 5వ తేదీన జిల్లా స్థాయిలో ప్రదర్శనలు నిర్వహించాలనీ నిర్ణయించినట్టు కూడా ఆ ప్రకటన తెలిపింది. నల్ల చట్టాల రద్దుతో పాటు, ధాన్యపు మద్దతు ధర ప్రకటించాలనీ, రైతులపై మోపిన అక్రమ కేసులను ఎత్తివేయాలనీ, ఇప్పటికీ జైళ్ళలో ఉన్న రైతాంగ నాయకులను విడుదల చేయాలనే డిమాండ్లతో ఈ నిరసనలు చేపట్టామనీ కిసాన్ మోర్చా వెల్లడించింది. కిసాన్ మోర్చా నుంచి వచ్చిన ప్రకటన వల్ల, కొన్ని పత్రికలు రాసిన కథనాల వల్ల రైతులకు నరేంద్ర మోదీ కాన్వాయ్ని అడ్డుకునే ఉద్దేశమే లేదని తెలుస్తున్నది. అయినా కొంతమంది అదేపనిగా ప్రధాని కాన్వాయ్ని అడ్డుకోవడం దేశ ద్రోహమనీ, వీళ్ళంతా జాతి వ్యతిరేకులనీ... ఇంకాస్త ముందుకు వెళ్ళి, సిక్కులు ఇతర దేశాలతో చేతులు కలిపి ప్రధాని పైన దాడి చేయాలనుకొన్నారనీ... ఇలా అనేక అసత్య ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న రైతాంగ ఉద్యమానికి పంజాబ్లోని రైతులు, ప్రత్యేకించి సిక్కులు బలమైన శక్తిగా నిలబడ్డారు. అందువల్లే కావొచ్చు, సిక్కుల పైన గతం నుంచీ కొంత మందికి ఉన్న విద్వేషాన్ని మళ్ళీ మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇది ఎంత మాత్రం సరైనది కాదు. సిక్కులు... ప్రత్యేకించి పంజాబ్ సిక్కులు మనం ఈ రోజు అనుకుంటున్న భారతదేశానికి ఎంతో సేవ చేశారు. ప్రాణాలను తృణప్రాయంగా భావించి బలిదానాలు చేశారు. ఈ రోజు మనం పిలుస్తున్న సిక్కు సంప్రదాయం, లేదా సిక్కు మతం ఆవిర్భవించిందే భారతదేశ రక్షణకు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. భారతదేశానికి పంజాబ్ పశ్చిమంగా ఉండి, నిత్యం దాడులకు, యుద్ధాలకు గురైంది. అయితే వందల ఏండ్లుగా సాగుతున్న విదేశీ దాడులను ఎదుర్కోవాలంటే కుల వ్యవస్థ వల్ల ఉన్న అనైక్యత ఉండకూడదనీ, మూఢనమ్మకాలు సమసి పోవాలనీ, వందల దేవుళ్ళ పేరుతో విభజనకు గురవడం సరికాదనీ గురునానక్ గుర్తించారు. విదేశీ దాడులను ఆపాలన్న ఉన్నత లక్ష్యంతో క్రీ.శ.1469లో గురు నానక్ ప్రారంభించిన సిక్కు సంప్రదాయదాన్ని, ఏడవ గురువైన గురుగోవింద్ సింగ్ ఒక శక్తిమంతమైన మతంగా అభివృద్ధి చేశారు. చదువు, యుద్ధ విద్య, క్రమశిక్షణ, సత్ప్రవర్తనలో కాగిన ఒక జీవన విధానాన్ని గురుగోవింద్ సింగ్ ప్రబోధించారు. వీరివల్లనే భారత దేశం విదేశీయుల దాడులను ప్రత్యేకించి మొఘల్ దాడులను, బ్రిటిష్ దాడులను ఎదుర్కోగలిగింది. శత్రువుల గుండెల్లో భయోత్పాతాన్ని సృష్టించిన సిక్కుల త్యాగా లను చరిత్ర సుస్థిరం చేసింది. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన విప్లవ కారుల్లో సిక్కుల పాత్ర చిరస్మరణీయం. ఉరికొయ్యల ఉయ్యాలలూగుతానని ప్రకటించిన నూనూగు మీసాల షాహీద్ భగత్ సింగ్ త్యాగం వెలకట్టలేనిది. భగత్సింగ్ను ఈ నేల ఏనాటికీ మరువజాలదు. లాల్, బాల్, పాల్ త్రయంలో లాల్గా పిలుచుకునే లాలా లజపతి రాయ్ పంజాబ్ బిడ్డనే విషయాన్ని మరువకూడదు. జలియన్ వాలా బాగ్ మారణకాండకు లండన్ వెళ్లి ప్రతీకారం తీర్చుకున్న ఉద్దండుడు ఉద్ధం సింగ్ సైతం ఈ గడ్డమీది వాడే. భారతదేశ విభజన సందర్భంగా వేలాదిమంది సిక్కులు మత కలహాలకు బలయ్యారు. భారతదేశ స్వాతంత్య్రానంతరం రాజ్యాం గంలో పంజాబ్కు ప్రత్యేకంగా కొన్ని హక్కులు కల్పిస్తామని చెప్పి, ఆనాటి నాయకులు ఇచ్చిన మాట మరిచిపోయారు. దాంతో 1980 ప్రాంతంలో ఖలిస్తాన్ ఉద్యమం బయలుదేరింది. అది క్రమంగా హింసారూపం దాల్చింది. ఎందరో సిక్కు యువకులు టెర్రరిస్టులుగా ముద్రపడి ప్రాణాలు కోల్పోయారు. ఆ పగ, ప్రతీకారమే మన ప్రధాని ఇందిరాగాంధీ ప్రాణాలను బలిగొన్నది. ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీలో సిక్కుల ఊచకోత జరిగింది. అయినప్పటికీ పంజాబ్ ప్రజలు, రైతులు దేశ ఆర్థికాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారు. స్వాతంత్య్రానంతరం దేశం ఎదుర్కొన్న సమస్యల్లో ప్రధానమై నది ఆహార కొరత. అందుకుగాను దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల ఉత్పత్తులను పెంచాలని అప్పటి ప్రభుత్వాలు నూతన వ్యవసాయ విధానాలను ప్రకటించాయి. దానిపేరే సస్యవిప్లవం. అందులో మళ్ళీ మొదటి వరసలో నిలిచింది పంజాబ్, హరియాణా రైతులే. 1970 నాటికి దేశంలోని ఆహార అవసరాలలో 70 శాతం అందించిన రాష్ట్రం పంజాబ్ ప్రాంతమేనంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇది అందరికీ తెలుసు. ఒక రకంగా దేశాన్ని కాపాడింది పంజాబ్ మాత్రమే నంటే అనుమానం అక్కర్లేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు పంజాబ్, హరియాణా దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. అదేవిధంగా మొదటగా చెప్పినట్లుగానే, ఇప్పటికీ దేశ రక్షణ కర్తవ్య నిర్వహణలో పంజాబ్, హరియాణా ప్రజల, ప్రత్యేకించి సిక్కుల పాత్రను విస్మరించలేం. ఇటీవల పార్లమెంటులో ప్రకటించిన సైన్యం వివరాల ప్రకారం మొత్తం దేశ సైన్యం 11 లక్షల 51 వేలు. ఇందులో 89, 088 మంది పంజాబీయులే. ఇది మొత్తం సైన్యంలో 7.7 శాతం. దేశ జనాభాలో పంజాబ్ జనాభా 2.3 శాతం. అంటే జనాభా దామాషా కన్నా 5.4 శాతం అధికంగా పంజాబీలు సైన్యంలో ఉన్నారు. సైన్యంలో పంజాబ్ది రెండోస్థానం. ఉత్తరప్రదేశ్ది మొదటిస్థానం. ఉత్తరప్రదేశ్ నుంచి సైన్యంలో ఉన్నవారు 1,67,000. కానీ దాని జనాభా దేశంలో 16.5 శాతం కాగా, సైన్యంలో వారు ఉన్నది 14.5 శాతం. అంటే జనాభా ప్రాతిపదికన 2 శాతం తక్కువ. అదేవిధంగా హరియాణా నుంచి సైన్యంలో ఉన్నవారి సంఖ్య 65, 978. కాగా దేశా జనాభాలో వారిది 2.09 శాతం. అయినా సైన్యంలో ఉన్నవాళ్లు 5.7 శాతం. అంటే దాదాపు మూడున్నర శాతం అధికం. పంజాబ్, హరి యాణాల్లో ఎక్కువ మంది సిక్కులు ఉన్నారనే విషయాన్ని మరవద్దు. దేశ ఆర్థికాభివృద్ధిలో, దేశ రక్షణలో, దేశభక్తిలో పంజాబ్ది అగ్ర భాగం. అటువంటి దేశభక్తి నరనరాన నింపుకున్న పంజాబ్ ప్రజలను, దేశానికే అన్నం పెట్టిన పంజాబ్ రైతులను దేశ ద్రోహులుగా, జాతి వ్యతిరేకశక్తులుగా ముద్ర వేయడం ఎంత మాత్రం విజ్ఞత అనిపించు కోదు. ప్రధాని కాన్వాయ్ నిలచిపోవడం విషయంపై విచారణ జర గాలి. నిజాలను రాబట్టాలి. అది పోలీసుల పని. కానీ పంజాబ్ రైతులు ఎందుకు ఇంకా ఆగ్రహంతో ఉన్నారో తెలుసుకొని, పరిష్కారాలను కనిపెట్టడం రాజనీతిజ్ఞుల కర్తవ్యం. పాలకులు ప్రజాస్వామ్యయు తంగా ఆలోచించగలగాలి. ఇప్పటికే విద్వేషాలు, వివక్షలు ఎన్నో ప్రతి కూల ఫలితాలను ఇచ్చాయి. ఇప్పటికైనా రాజనీతిజ్ఞతతో వ్యవహరి స్తారో, ప్రజల ఆశలను అడియాసలు చేసి దోషులుగా మిగిలిపోతారో తేల్చుకోవాల్సిందే పాలకులే. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
వివక్షకు విరుగుడు ప్రశ్నించడమే!
ఎన్నిసార్లు మాట్లాడినా ఎంతోకొంత మిగిలిపోయే అంశం – కుల వివక్ష. అది దేశమంతా వేళ్లూనుకుని ఉన్న జాడ్యం. దాన్ని తెగ నరకాలంటే ఆధిపత్య కులాలు తమ ధోరణిని పరిశీలించుకోవాలి. అణిచివేతకు గురయ్యే వాళ్లు ప్రశ్ననే అస్త్రంగా మలుచుకోవాలి. అలా ఎక్కుపెట్టిన ఒక ప్రశ్నారూపమే ‘జై భీమ్’. అయితే విమర్శకులనూ, ప్రేక్షకులనూ ఏకరీతిలో స్పందింపజేసిన ఈ సినిమా తమిళనాడులోని ఒక వర్గాన్ని మాత్రం ఆగ్రహానికి గురిచేసింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన ఈ చిత్రం మీద రాజకీయంగా శక్తిమంతులైన వణ్ణియర్ల కుల సంఘం లేవనెత్తిన అభ్యంతరాల వల్ల... ఆదివాసీ ఇరుళ తెగ, ఇంకా అలాంటి సామాజిక వెలివేతకు గురవుతున్నవారి జీవితం గురించి చేయాల్సిన ఆలోచన పక్కదారి పడుతోంది. అది కీరపాక్కం గ్రామం. తమిళనాడులోని చెంగల్పట్ జిల్లాలోని ఒక పల్లెటూరు. ఆ ఊరికి దగ్గర ఒక గుడిసెల సముదాయం. గుడిసెలపై కప్పి ఉన్న పాలిథీన్ కవర్లు, ప్లాస్టిక్ పేపర్లు వాళ్ళ కటిక దారిద్య్రాన్ని విప్పి చెబుతున్నాయి. ఆ ఇళ్ళల్లోని ఒక ఇంట్లో నాగమ్మ అనే యాభై ఐదేళ్ళ మహిళ ఉంటున్నది. ఆ గూడెం ఊరిలో భాగం కాదు. అక్కడికి వెళ్ళ డానికి రోడ్డు పెద్ద మాట, ఎటువంటి దారీ తెన్నూ లేని వారి జీవితంలానే ఉంటుంది తొవ్వ. ఒక రోజు కొందరు వ్యక్తులు ఏడుపులు, పెడబొబ్బలతో ఒక మనిషిని మోసుకొచ్చారు. ఆ వ్యక్తి చావుకు దగ్గరవుతున్నట్టు వాళ్ళ ఏడుపులని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ గుంపు నాగమ్మ గుడిసె ముందు ఆగింది. నాగమ్మకు వెంటనే విషయం అర్థమైంది. మోసు కొచ్చిన వ్యక్తిని పట్టుకొని చూసింది. పాము కాటు వేసినట్టు గమనించింది. దగ్గర్లో ఉన్న పొదల్లోకి వెళ్ళి ఆకులను తీసుకొచ్చింది. తన వద్ద ఉన్న కొన్ని వేళ్ళు, బెరడులు, ఆకుల్ని కలిపి నూరింది. పసరు పాము కాటు వేసిన చోట పిండింది. నూరిన ముద్దను గాయంపైన కట్టింది. అట్లా రెండు మూడుసార్లు చేసిన తర్వాత ఆ వ్యక్తి కళ్ళు తెరిచాడు. ఈ వైద్యం చేసింది తమిళనాడులోని ఇరుళ ఆదివాసీ తెగకు చెందిన మహిళ. తమిళనాడులో ఉన్న ప్రాచీన ఆదివాసీ తెగలలో ఇది ఒకటి. తమిళనాడులో ముఖ్యంగా యాక్షన్ సినిమాల్లో రాణిస్తున్న సూర్య తీసిన ‘జై భీం’ చిత్రం ఇటీవల ఒక సంచలనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. మానవత్వం ఉన్న ప్రతి మనిషీ ఈ సినిమాను ఇష్టపడ్డారు. ఆ సినిమాలో ఒక ఆదివాసీ వ్యక్తిపై, దొంగతనం నేరం మోపి, పోలీ సులు చిత్రహింసలు పెట్టి చంపేశారు. అయితే ఇది కథ కాదు. నిజంగా జరిగింది. ఆ వ్యక్తి పేరు రాజాకన్నన్. ఆయన ఇరుళ తెగకు చెందిన వాడు. జై భీం చిత్రం కొందరికి కొరకరాని కొయ్యగా కూడా తయారయ్యింది. కోడిగుడ్డుపైన ఈకలు పీకినట్టు ఏదో చేయాలని ప్రయత్నం చేశారు. కొన్ని సన్నివేశాలు, పేర్లు తమ ప్రతిష్టను దెబ్బతీశాయనీ, ఐదు కోట్ల పరువునష్టం చెల్లించాలనీ కోర్టును ఆశ్ర యించారు. వాళ్ళే వణ్ణియర్ కుల సంఘం పెద్దలు. ఆ కుల సంఘానికి మరో పేరు పీఎంకే. పాట్టాళి మక్కళ్ కట్చి. దాని నాయకుడు ఎస్. రామదాసు. ఆయన కూడా ఈ చిత్రంపైన విరుచుకుపడ్డారు. వణ్ణియర్ కుల ప్రతిష్టకూ ఈ చిత్రానికీ ఉన్న సంబంధం ఏమిటి? నిజానికి దీనిని ఎవ్వరూ అంతగా గమనించలేదు. సినిమాలో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. ఆయన పేరు సినిమాలో గురుమూర్తి. ఆ పేరు పెట్టడమే వాళ్ళ తొలి అభ్యంతరం. గురుమూర్తి అనే పేరు వాళ్ల ఒక నాయకుడిని గుర్తు చేస్తుందన్నది వాళ్ళ వాదన. అయితే వాళ్ళ నాయకుడి పేరు జె.గురు. ఆ ఇన్స్పెక్టర్ క్రూరంగా ప్రవర్తిస్తాడు. అందువల్ల తమ నాయకుడి జ్ఞాపకాలు వస్తాయని ఆ సంఘం ఆరోపణ. జె. గురు అనే నాయకుడు రెండుసార్లు శాసనసభ్యుడు. అరియాబారు జిల్లా, జయకొండు నియోజకవర్గం నుంచి పీఏంకే నుంచి ఎన్నికయ్యారు. ఆయనది వణ్ణియర్ సంఘంలో కీలక భూమిక. వీళ్లు ఉత్తర తమిళనాడులో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ సామాజిక వర్గం. జె.గురు అనే వ్యక్తి పదుల కొద్దీ దాడుల్లో పాల్గొన్నాడనడానికి ఆయన మీద నమోదైన కేసులే సాక్ష్యం. ఈ చిత్రంపై వణ్ణియర్ సంఘం చేసిన రెండో ఆరోపణ... సిని మాలో పోలీస్ ఇన్స్పెక్టర్ గురుమూర్తి మాట్లాడుతున్నప్పుడు ఆయన వెనుక ఒక క్యాలెండర్ ఉందనీ, అందులో తమ కుల చిహ్నమైన కలశం ఉన్నదనీ (దీన్ని ఇటీవల సినిమా నుంచి తొలగించారు). నిజా నికి ఈ రెండు విషయాలను ప్రేక్షకులను గమనించనే లేదు. కానీ ఈ సంఘం ఈ చిత్రాన్ని ఎందుకు టార్గెట్ చేసింది అంటే అందుకు తమిళనాడు కుల చరిత్రను తడిమి చూడాల్సిందే. తమిళనాడులో జరుగుతున్న కుల ఘర్షణలు, దళితుల, ఆదివాసులపైన దాడులు చాలా కిరాతకంగా ఉంటున్నాయి. ఉత్తర తమిళనాడులో వణ్ణియర్లు సామాజిక, రాజకీయ ఆధిపత్యాన్ని కలిగివున్నారు. వణ్ణియర్లు అధికంగా ఉన్నచోటే ఇరుళ ఆదివాసీ తెగ కూడా ఉంది. ఇరులు అత్యంత వెనుకబడిన ఆదివాసీ తెగ. ఈ తెగ దేశానికీ, సమాజానికీ ఎంతో మేలు చేసిన విషయం ఎవరికీ తెలియదు. పాము కాటుకు విరుగుడు ఇంజెక్షన్ తయారు చేయడానికి ప్రాథమికమైన ముడిపదార్థం పాము విషం. పామును పట్టుకొని, ప్రాణాలకు తెగించి పాము కోరల నుంచి పాము విషాన్ని తీసి ఇస్తే, దానిని వివిధ పద్ధతుల ద్వారా ప్రాసెస్ చేసి, విషం విరుగుడు ఇంజక్షన్ తయారు చేస్తారు. అంతేకాకుండా, ఈ తెగ గొప్ప వైద్య సాంప్రదాయాన్ని ప్రకృతి నుంచి పుణికి పుచ్చుకుంది. దాదాపు 300 రకాల మందులను తయారు చేసే జ్ఞానం వీరి సొంతం. అయితే ఇప్పటికీ వీరు గ్రామాల్లో నివాసముండరు. నూటికి తొంభై మందికి చదువులేదు. సరైన జీతాలు లేని పద్ధతుల్లో, ఇటుక బట్టీల్లో, రైస్ మిల్లుల్లో పని చేస్తున్నారు. ఇవన్నీ పోను గ్రామాల్లో ఎక్కడ దొంగతనమైనా ముందు ఇరుళ సామాజిక వర్గం వారిని పట్టుకొచ్చి, హింసించడం తమిళనాడులో పాతుకు పోయిన కులాధిపత్యానికి తార్కాణం. ప్రతి సంవత్సరం కొన్ని వందల కేసులు వీళ్ళ మీద నమోదవుతుంటాయి. మగ వాళ్ళ కోసం వచ్చిన పోలీసులు మహిళలను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అత్యా చారాలు జరిపిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇది జై భీం సినిమాలో కూడా చూశాం. ఇరుళ ఆదివాసీ హక్కుల సంఘాలు ఈ విషయాలను ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ఒకవైపు పోలీసులు, రెండో వైపు పల్లెల్లోని ఆధిపత్య కులాలు ఇరుళ తెగ ప్రజలను పెడుతున్న హింస చెప్పనలవి కానిది. వణ్ణియర్ సంఘం నాయకులు ఎటువంటి భయ సంకోచాలు లేకుండా, చట్టాలను, రాజ్యాంగాన్ని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పదేళ్ళ క్రితమే పీఏంకే అధ్యక్షుడు రామదాసు ‘కులాంతర వివాహాలను జరగనివ్వం. ఎవరైనా వణ్ణియర్ కులం పిల్లలతో సంబంధాలు పెట్టుకుంటే తగిన శిక్ష అనుభవిస్తారు’ అని ప్రకటించారు. ఈ సంవత్సరం, సెప్టెంబర్ పదవ తేదీన ఇరుళ తెగకు చెందిన రమేష్, వణ్ణియర్ కులానికి చెందిన మోహన ప్రేమ వివాహం చేసుకున్నారు. ధర్మపురి జిల్లాలోని ఒక గ్రామంలో ఈ సంఘటన జరిగింది. అయితే అమ్మాయి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి, అబ్బాయి తల్లిదండ్రులను పట్టుకొని ఊరికి తీసుకొచ్చి, అబ్బాయి తండ్రిమీద ఆ ఊరిలోని ఆ కులపోళ్ళు బహిరంగంగా మూత్రం పోసిన దారుణ ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. ధర్మపురి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అంటే జై భీం చిత్రంలో మనం చూసింది ఒక్క ఘటన మాత్రమే. ఈ చిత్రం వల్ల తాము చేసిన ఎన్నో దురంతాలు ప్రజల మెదళ్లలోకి వెళతాయని భయపడిన కులోన్మాదులు ఈ చిత్రాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. నిజానికి తమిళనాడులో పంటలను దెబ్బతీస్తున్న ఎలుకలను, గ్రామాల్లో ప్రజల ప్రాణాలకు హానికరంగా మారిన పాములను పట్టుకొని తరతరాలుగా రైతులకు మిత్రులుగా ఉన్న ఇరుళ తెగ మీద జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళు కుల మతోన్మాదాన్ని తుదముట్టించాలి. మానవీయతకు ప్రాణం పోయాలని తపిస్తున్న వాళ్లంతా మరొక్కసారి దళితులు, ఆదివాసీలు ఈ దేశానికీ, సమాజానికీ చేసిన నిస్వార్థమైన సేవలను, అని తరసాధ్యమైన త్యాగాలను గుర్తించాలి. - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
జ్ఞానమనే వెలుగుకు ప్రతిరూపమైన పండుగ
దీపావళి అంటే దీపాల వరుస. పల్లె పట్నం తేడా లేకుండా ప్రతి చోటా, ప్రతి ఇంటా, తమ తాహతకు తగ్గట్టుగా దీపాలను వెలిగిస్తారు. ప్రతి పండుగకు ఒక కథ ఉంటుంది. ఈ పండుగకు కూడా ఒక కథ ఉంది. నరకాసు రుడు అనే రాక్షసుడు వేల మంది మహిళలను చెరబట్టాడనీ, ఇంద్రుని రాజధానిపైన దండెత్తాడనీ, విష్ణువు కృష్ణుడి అవతారమెత్తి నరకాసురుడిని చంపాడనీ, అందుకే దీపావళిని చేస్తున్నారనీ పురాణాలు చెబుతున్నాయి. నరకాసురుడే కాదు, ఎవరైనా ఇంద్రుణ్ణి జయించినా, జయించడానికి ప్రయత్నించినా, విష్ణువును ప్రతిఘ టించినా ఇదేగతి పట్టింది. వీళ్ళంతా అడవుల్లో నివాస ముండేవాళ్ళు. అవతారాలెత్తిన దేవుళ్ళందరూ వీరిని చంపారు. ఆనాడు ఆధిపత్య సంస్కృతిని ప్రతిఘటించి, వైదిక సంప్రదాయాలను నిరసించినవాళ్ళను రకరకాల పేర్లతో చంపేశారు. భారతదేశ చరిత్రలో బౌద్ధం ఒక సామాజిక విప్లవం. యజ్ఞాల పేరుతో సాగుతున్న సామాజిక, ఆర్థిక దోపిడీని నిరోధించడానికి బౌద్ధులు సాగించిన సామాజిక ఉద్యమం ఆనాటి సమాజాన్ని మూఢాచారాల నుంచి విముక్తం చేసింది. బౌద్ధులు ఇళ్లను వదిలి, ప్రజల్లో కలిసిమెలిసి తిరుగుతూ, వాళ్లు పెట్టిన భిక్షను స్వీకరిస్తూ జీవనం గడిపేవాళ్ళు. అయితే ఎనిమిది నెలలు అంటే చలికాలం, వేసవిలో మాత్రమే సంచారం చేసేవాళ్లు. వర్షాకాలం నాలుగు నెలలు, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీయుజం బయటకు వచ్చేవాళ్ళు కాదు. అయితే సిద్ధార్థ గౌతముడు జ్ఞానం పొంది గౌతమబుద్ధుడిగా మారిన తర్వాత 18 సంవత్సరాలకు తాను పుట్టిన ఊరి ప్రజలు ఆహ్వానిస్తే వెళతాడు. ఆయన ఊరికి వస్తున్నాడని ప్రజలంతా సంతోషంతో ఊరంతా దీపాలతో అలం కరించి స్వాగతం పలుకుతారు. ఎందుకంటే, అది అమా వాస్య రోజు. చిమ్మచీకటి. నూనె దీపాలు తప్ప మరొక వెలుగు పరికరం లేదు. అందుకే ప్రతి ఇంటా దీపాలు వెలిగించారు. ఆ తర్వాత ఇది ఒక సంప్రదాయంగా మారింది. ప్రతి సంవత్సరం వర్షవాసం ముగించుకొని గ్రామాలకు, నగరాలకు వస్తున్న బౌద్ధ భిక్కులకు ఇంటింటా దీపాలతో స్వాగతం పలికేవారు. గౌతమ బుద్ధుడు మహాపరినిర్వాణం పొందడానికి కొన్ని నెలల ముందు ఆయన ప్రియ శిష్యులలో ఒకరైన మహామౌద్గాలాయనను బౌద్ధ వ్యతిరేకులు సరిగ్గా వర్షా్షవాసం ముగిసిన రోజు, ప్రజలంతా సంబరాలలో ఉండగా ఒక గుట్టమీద దాడిచేసి కిరాతకంగా హత్య చేశారు. బుద్ధుడి తర్వాత అంతటి విద్వత్తును సంపా దించినవాడు మౌద్గాలాయన. ఆయన మరోపేరు మొగ్గలన్న. ఇది ఆనాటి సమాజాన్ని దుఃఖంలో ముంచింది. అయితే సమ్రాట్ అశోకుడు బౌద్ధాన్ని స్వీక రించిన తర్వాత మళ్ళీ బౌద్ధానికి జీవం పోసినట్టయ్యింది. వర్షా్షవాసం ముగించుకొని వస్తున్న బౌద్ధ భిక్కులను మనుపటిలాగా సంతోషంతో ప్రజలు ఆహ్వానించలేక పోయారు. ఇది గమనించిన అశోకుడు ప్రజల శోకాన్ని పోగొట్టడానికి నిర్ణయించుకున్నాడు. బుద్ధుని బోధనలను, జ్ఞాపకాలను స్థిరంగా ఉంచడానికి తన పాలనా పరిధిలోని 84 వేల గ్రామాలు, పట్టణాల్లో శిలా ఫలకాలను, చైత్యాలను, ఇతర విహారాలను నిర్మించాడు. అందులో భాగంగానే మొగ్గలన్న మహాపరినిర్వాణం పొందిన రోజును ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని వెలుగుగా భావించి, ఆయన ఆలోచనలకు ప్రతిరూపంగా బౌద్ధ స్థలాల్లోనూ, ప్రతి ఇంటా దీపాల వరుసలను పెట్టాలని ప్రకటించాడు. మన పూర్వీకులు మనకు అందించిన జ్ఞానాన్ని మననం చేసుకోవడానికి, వాళ్లను స్మరించుకోవడానికి ధమ్మదీప దానోత్సవం జరుపుకోవాలని చెప్పాడు. ఈ విషయాలన్నీ శ్రీలంక పరిభాషలో రచించిన ‘దీపవంశం’ పుస్తకంలో ఉన్నాయి. ఇది పాళీ బౌద్ధ సాహిత్యమైన ‘అట్టకత’లో నుంచి తీసుకున్నట్లు, ఇది క్రీ.శ. 3, 4 శతాబ్దాల మధ్యలో లిఖితమైనట్టు చరిత్ర చెబుతున్నది. జైనమతంలో కూడా జరుపుకొంటున్న దీపావళికి ఒక ప్రత్యేకమైన స్థానమున్నది. జైన తీర్థంకరులలో 24వ గురువు మహావీరుని మహాపరినిర్వాణం ఇదే రోజున జరిగింది. ఆయన ప్రాణం మనకు వెలుగును అందించిం దనీ, ఆయన దీపమై నిలిచాడనీ భావిస్తూ జైనులు దీపా వళిని ఘనంగా జరుపుకుంటారు. దీపావళిని తమ వ్యాపార, వాణిజ్యాలకు ఆరంభ దినంగా కూడా భావిస్తారు. నరకాసుర వధ గానీ, రాముడు అయోధ్యకు చేరినప్పుడు ప్రజలు దీపావళి జరిపారనే విషయం గానీ చారిత్రకంగా నిర్ధారణ కాలేదు. ఇది తర్వాత అల్లిన కథగా చరిత్రకారులు చెబుతున్నారు. కానీ బౌద్ధ, జైన సాంప్రదా యాలను ప్రజలు ఇప్పటికీ ఆచరిస్తున్నారు. తెలంగాణ జిల్లాల్లోని కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో తమ పూర్వీకుల సమా«ధులను శుభ్రపరిచి, సున్నాలు వేసి, పూలతో అలంకరించి, పటాకులను కాల్చి నివాళి అర్పిం చడం ఇప్పటికీ కొనసాగుతూ వస్తున్నది. అశోకుడు ప్రకటించిన ధర్మదీప దానోత్సవాన్ని బ్రాహ్మణేతర కులాలు, ప్రత్యేకించి దళితులు పాటిస్తున్నారు. బౌద్ధం, జైనం తాత్వికంగా మరణాన్ని అనివార్యమైన విషయంగా భావిస్తాయి. చనిపోయిన వాళ్ళకోసం దుఃఖించడం వ్యర్థ మనే విషయాన్ని బుద్ధుడు స్వయంగా ప్రకటించాడు. అదే విషయాన్ని అశోకుడు తన ఆచరణ ద్వారా బౌద్ధులకు ధమ్మ దీప దానోత్సవాన్ని అందించాడు. అదే ఈరోజు ప్రజలంతా జరుపుకుంటోన్న దీపావళి పండుగ. బౌద్ధ, జైన బోధనలను, వారి ఆచార సంప్రదా యాలను కనుమరుగు చేయడానికే వారి వ్యతిరేకులు దీపావళిని జరుపుకోవడం మొదలైందని చరిత్రను పరిశీలిస్తే అర్థమవుతుంది. సమత, మమత, కరుణ, సమానత్వం, సత్యం లాంటి ఆలోచనలను, ఆచరణను అందించిన బౌద్ధం మనకు ధమ్మదీప దానోత్సవాన్ని కూడా ఇచ్చింది. అందుకే దీపావళి బౌద్ధుల, జైనుల పండుగగా మొదలై ఇప్పుడు అందరూ జరుపుకొంటు న్నారు. బౌద్ధులు, సామాజిక బాధ్యత కలిగినవాళ్లు దీపా వళి రోజున మొగ్గలన్నతో సహా ఎంతో మంది సామాజిక విప్లవకారులను స్మరించుకోవాల్సిన అవసరమున్నది. అందరం మనుషులమేననే భావనను, సమానత్వం, సోద రత్వం అనే మార్గాన్ని అందించిన ధమ్మదీప దానోత్స వాన్ని దీపావళిగా జరుపుకొందాం. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
దళితబంధు ఆపడం చట్టవిరుద్ధం
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 18న జారీచేసిన ఉత్తర్వులను చట్టవిరుద్ధంగా ప్రకటించాలంటూ సామాజిక కార్యకర్త మల్లేపల్లి లక్ష్మయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ‘దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ముందుగా వాసాలమర్రిలో దళితులకు రూ.7.60 కోట్లను గత ఆగస్టు 5న విడుదల చేశారు. అలాగే పైలెట్ ప్రాజెక్టుగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఆగస్టు 16 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. దళితబంధు ఇప్పటికే కొనసాగుతున్న పథకం. హుజూరాబాద్ ఎన్నికలతో సంబంధం లేకపోయినా, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధం కాకపోయినా.. ఎన్నికల కమిషన్ ఈ పథకం అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని ఉత్తర్వులు జారీచేసింది. దళితబంధు పథకాన్ని ఆపాలని ఆదేశించడం దళితుల హక్కులను హరించడమే. పథకం నిలిపివేతపై కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను వెంటనే రద్దు చేయండి’ అని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్లో కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల అధికారి, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర ఎస్సీ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీసీ, ఎండీని ప్రతివాదులుగా చేర్చారు. -
‘దళిత బంధు’వులు ఎవరు?
‘‘ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రధానమైన పార్లమెంటు, అసెం బ్లీల ఎన్నికల ప్రక్రియను నిర్వ హించే ఎన్నికల సంఘం ప్రభుత్వ అధికార యంత్రాంగానికి లోబడ కుండా స్వేచ్ఛగా ఉండాలి. అప్పుడే ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా జరుగుతాయి’’ అని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగ సభలో ఈ విషయంపై 1949 జూన్ 15న జరిగిన చర్చలో వ్యాఖ్యానించారు. ఆ చర్చలో పాల్గొన్న రాజ్యాంగ సభ సభ్యులు కూడా అదే విధమైన అభిప్రా యాన్ని వ్యక్తం చేశారు. అందువల్లనే రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ – 324లో ఎన్నికల సంఘపు విధులు, అధికారాలను వివరించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ మీద రాజకీయ, అధికార జోక్యం ఉండకూడ దని, ఆయనను తొలగించే ప్రక్రియను కఠినతరం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఉన్న విధంగానే నిబం ధనలను కల్పించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ను తొల గించాలంటే పార్లమెంటు నిర్ణయం తీసు కోవాలి. ఆ అధి కారాన్ని రాష్ట్రపతికి గానీ, కేంద్ర మంత్రి వర్గానికిగానీ కల్పించలేదు. ఎంతో దూరదృష్టితో రాజ్యాంగ రచనా సంఘం, అంతిమంగా రాజ్యాంగ సభ మహత్తరమైన నిబంధనలు కల్పించాయి. అయితే, గత డెబ్భై ఏళ్ళలో కొద్దిమంది ప్రధాన ఎన్నికల కమిషనర్లు మాత్రమే కొంత మేరకైనా స్వేచ్ఛగా, స్వతంత్రంగా పనిచేశారు. చాలా మంది అధికారంలో ఉన్న పార్టీకి, ప్రభుత్వానికి అనుకూలంగానే పనిచేశారు. గత మూడు రోజుల కిందట కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఒక నిర్ణయం యావత్ దళిత జాతిని విస్మయానికి గురి చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని ఉప ఎన్నిక జరుగుతున్న హుజూరాబాద్లో నిలిపివేయాలని ఆదేశించింది. భార తీయ జనతాపార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. వాస్తవాలను పరిశీలించకుండా ఎన్నికల సంఘం తీసు కున్న ఈ నిర్ణయం రాజకీయ జోక్యం ప్రకారమే జరిగిందనే వాదనకు బలం చేకూరుతున్నది. ఎందుకంటే, ఈ పథకం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ప్రకటించింది కాదు. తెలంగాణ దళిత బంధు పథకానికి అన్ని రకాల అనుకూలాంశాలే ఉన్నాయి. మొదటగా దీనికి బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. మార్చి18, 2021న ఆర్థిక శాఖా మంత్రి హరీష్రావు ప్రవేశపెట్టిన 2021–22 బడ్జెట్లో దీని ప్రస్తావన ఉంది. ఆ బడ్జెట్ను రాష్ట్ర శాసనసభ ఆమో దించింది. దాని తర్వాత ఒక నిర్దిష్టమైన రూపం ఇవ్వ డానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరిగింది. పది గంటల పాటు సాగిన ఈ సమావేశంలో దళితుల ఆర్థికాభివృద్ధికి చిన్న చిన్న సాయం సరిపోవడం లేదనీ, వారు అనుభవిస్తున్న పేదరికం నుంచి బయటపడటానికి తగిన విధంగా ఆర్థిక సాయం చేయాలనీ నిర్ణయం జరిగింది. ఆ సమావేశంలో నేను కూడా పాల్గొన్నాను. అన్ని రకాల అధికార లాంఛ నాలను పూర్తిచేసుకొని ఆగస్టు 5న యాదాద్రి–భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం, వాసాలమర్రి గ్రామంలో ముఖ్యమంత్రి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఆ గ్రామంలో 76 దళిత కుటుంబాలకు పథకాన్ని వర్తింప జేశారు. వెనువెంటనే వారి వారి ఖాతాల్లోకి పది లక్షలు జమ చేశారు. కొందరు ఇప్పటికే తమ కార్యక్రమాలను ప్రారంభించారు. ఆ తర్వాతనే ఆగస్టు 16వ తేదీన హుజూరాబాద్ నియోజకవర్గానికి దీనిని విస్తరింప జేశారు. ఆ రోజున 15 మందికి లాంఛనంగా చెక్కులు అంద జేశారు. ఇప్పటికి దాదాపు 17,500 మందికి తమ బ్యాంకు ఖాతాల్లో పది లక్షలు జమయ్యాయి. ఇందులో కొంత మంది వ్యాపార, ఉపాధి కార్యక్రమాలు ప్రారంభించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువ డింది సెప్టెంబర్ 29న మాత్రమే. అంటే ఎన్నికల నోటిఫి కేషన్ రావడానికి 50 రోజుల ముందు ఈ పథకం అమలు లోకి వచ్చింది. అంతేకాకుండా, రాష్ట్రంలో మరో నాలుగు నియోజకవర్గాల్లో ఈ పథకం అమలు కోసం మూడు రోజుల క్రితం 18వ తేదీన 250 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం అమలుకు, హుజూరాబాద్ ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదని దీనిని బట్టి అర్థమవుతున్నది. మరో విషయాన్ని మరచి పోకూడదు. హుజూరాబాద్ ఎన్నికలు హోరాహోరీగా జరు గుతున్నాయి. పోటీచేసిన రాజకీయ పార్టీలు తాము మాత్రమే గెలవాలని ప్రయత్నిస్తాయి. ఏ రాజకీయ పార్టీ అయినా తమ వి«ధానాల ద్వారా, తాము చేసిన మంచి పనుల ద్వారా, చేయబోయే పనుల ద్వారా ఓట్లను పొంద వచ్చును. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అనుసరించిన విధానంలో పూర్తి చెడు ఉద్దేశ్య కనిపి స్తున్నది. బీజేపీకి దళితుల పట్ల ఉన్న నిర్లక్ష్య భావన, చిన్న చూపు దీన్ని బట్టి మరోమారు రుజువవుతోంది. 2018 ఎన్నికల ప్రణాళికలో కేంద్రంలో బీజేపీ... ఎస్సీ, ఎస్టీల ప్రస్తావన కూడా చేయకపోవడం యాదృచ్ఛికం కానేకాదు. దానికనుగుణంగానే ఇప్పటి వరకు వాళ్ళ కోసం ఎటు వంటి నూతన పథకాలను ప్రవేశపెట్టలేదు. ఒక్క ఉదాహరణ చెప్తాను. కోవిడ్ సమయంలో వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసులతో పాటు, పారిశుద్ధ్య కార్మి కులు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశారు. లక్షల కోట్లు కోవిడ్ ఉద్దీపన నిధులను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, అత్యల్ప జీతాలు తీసుకునే పారిశుద్ధ్య కార్మికులకు కనీసం ఇన్సెంటివ్గానైనా ఒక్క పైసా ఇచ్చింది లేదు. అంతే కాకుండా గత అయిదేళ్ళుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఇవ్వలేదు. దక్షి ణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో సబ్ప్లాన్ నిధులు ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంతంగానే పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్స్ ఇచ్చాయి. హుజూరాబాద్ విషయంలో భారతీయ జనతా పార్టీ అనుసరించిన దళిత బంధు వ్యతిరేక వైఖరి వివక్షా పూరి తమైనది. బీజేపీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులకు నా మనవి. మీరు ఒకసారి వెనక్కు తిరిగిచూసుకోండి. ఈ ఏడేళ్ళలో ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం ఏ పథకాలు అమలు చేశారో ఆలోచించండి. ఎన్ని నిధులు ఈ అణగారిన వర్గా లకు కేటాయించారో, వాటి ఫలితాలేమిటో సమీక్షించు కోవాల్సిన సందర్భమిది. -మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
అంబేడ్కర్ను సరిగ్గా అర్థం చేసుకోవాలి!
‘‘మహా సామ్రాజ్యాలు, సంకుచిత మనస్తత్వాలు కలిసి మనుగడ సాగించలేవు’’ అన్న అంబేడ్కర్ మాటలు రాజ్యాంగ సభను నివ్వెరపరిచాయి. 18వ శతాబ్దపు ఐరిష్ రాజనీతి తాత్వికుడు ఎడ్మండ్ బర్క్ మాటలను అంబేడ్కర్ తీవ్ర స్వరంతో పలికారు. ఆగస్టు 26, 1949న రాజ్యాంగంలో పొందుపరి చిన ఆర్టికల్ 334పై జరిగిన చర్చను ముగిస్తూ అంబేడ్కర్ చేసిన నిరసన గర్జన అది. షెడ్యూల్డ్ కులాల రాజకీయ హక్కుల కోసం పోరాడిన అంబేడ్కర్కు రాజ్యాంగసభ నిరాశను మిగిల్చింది. దాని పర్యవ సానమే 1955 ఆగస్టు 21న బొంబాయిలో జరిగిన ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కులాల సమాఖ్య, వర్కింగ్ కమిటీ సమావేశంలో... పార్లమెంటు, శాసనసభలు, జిల్లా, పట్టణ స్థాయి స్థానిక సంస్థల్లో ఎస్సీలకు కేటాయించిన రిజర్వుడు సీట్లను ఎత్తివేయాలన్న తీర్మానం. ఈ సమావేశంలో అంబేడ్కర్ కూడా పాల్గొన్నారు. దీనిని కొంతమంది ఎస్సీ రిజర్వేషన్లకే అంబేడ్కర్ వ్యతిరేకమని అర్థం చేసుకుంటున్నారు. అదే సంవత్సరం అంటే 1955 డిసెం బర్ 23న, భాషా ప్రయుక్త రాష్ట్రాలపై రూపొందించిన డాక్యు మెంటులో ‘‘ప్రత్యేక ఓటింగ్ విధానం గానీ, సీట్ల రిజర్వేషన్ గానీ సాధ్యం కానప్పుడు బహుళ సభ్యుల నియోజక వర్గాలు అంటే రెండు లేక మూడు నియోజక వర్గాలు కలిపి ఒకే నియోజక వర్గంగా రూపొందిస్తే అది అల్ప సంఖ్యాకులుగా ఉన్న వారికి భరోసాను ఇస్తుంది. దీనినే క్యుములేటివ్ ఓటింగ్ అంటారు’’ అని ప్రత్యామ్నాయాన్ని సైతం అంబేడ్కర్ సూచించిన విష యాన్ని మర్చిపోవద్దు. బాబాసాహెబ్ రాజ్యాంగ సభలో సభ్యుడిగా వెళ్లిన కారణమే రాజకీయ, సామాజిక హక్కులను పొందుపరచడానికని మరచి పోవద్దు. పార్లమెంటు, అంసెబ్లీలలో రిజర్వేషన్లు పదేళ్ళు మాత్రమే ఉంటాయనే విషయాన్ని అంబేడ్కర్ అంగీకరించలేదు. ‘ఎస్సీ, ఎస్టీల కోసం నిర్దేశించిన రిజర్వేషన్లు పదేళ్ళు ఉండాలని చాలామంది మాట్లాడారు. వాళ్ళందరికీ నేను చెప్పదల్చుకున్నది ఒక్కటే. మహా సామ్రాజ్యాలు, సంకుచిత మనస్తత్వాలు కలిసి మనుగడ సాగించలేవు’ అన్నారు. దీనర్థం పదేళ్ళ పరిమితిని అంగీకరించినట్టా, వ్యతిరేకించినట్టా? 1955లో షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ చేసిన తీర్మానానికీ, రాజ్యాంగం ఆమోదించిన దానికీ మధ్యలో చాలా పరిణామాలు జరిగాయి. అంబేడ్కర్ ఆశించిన రాజకీయ హక్కుల రక్షణకే వల్లభ్ భాయి పటేల్ లాంటి వాళ్ళు ఎసరు పెట్టారు. తాను ప్రతిపాదిస్తున్న ప్రత్యేక ఓటింగ్ విధానం కూడా సాధ్యం కాదేమో అనే అభిప్రాయానికి అంబేడ్కర్ వచ్చారు. 1947 ఆగస్టులో రూపొందించిన రాజ్యాంగ ముసాయిదాలో షెడ్యూల్డ్ కులాలకు, ఇతర మైనారిటీలకు రాజకీయ రక్షణలను చేర్చారు. అంబేడ్కర్ డిమాండ్ చేసిన ప్రత్యేక ఓటింగ్ విధానం ఆమోదం పొందలేదు. అయినప్పటికీ అంబేడ్కర్ రిజర్వుడు సీట్ల విధానానికి ఒప్పు కున్నారు. అప్పుడు పదేళ్ళ పరిమితి లేదు. అయితే పాకిస్తాన్ విభజన జరగడం, గాంధీజీ హత్యకు గురవడంతో సర్దార్ పటేల్ 1947 నాటి ముసాయిదాను తిరగదోడారు. రిజర్వేషన్లనే తీసి వేస్తామని ప్రకటించారు. 1948 ఆగస్టు నాటికి రాజ్యాంగ రచన పూర్తయింది. చర్చలు ముగిశాయి. అంబేడ్కర్ తీవ్ర ఆగ్రహంతో రాజ్యాంగ సభ నుంచి వాకౌట్ చేశారు. అంటరాని వారి సంక్షేమాన్ని హిందువులు ఎట్లా అడ్డుకున్నారో తరతరాల చరిత్ర మరువని విధంగా తాను రాజ్యాంగ సభ నుంచి వాకౌట్ చేస్తున్నా నని ప్రకటించారు. దాంతో దిగివచ్చిన కాంగ్రెస్ నాయకులు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు అంగీకరించారు. అయితే రాజ్యాంగం ఆమోదం సమయంలో పటేల్, నెహ్రూ పదేళ్ళ పాటు మాత్రమే రిజర్వేషన్లు ఉంటాయని చేసిన ప్రసం గాలు అంబేడ్కర్ను బాధించాయి. 1951, 1952లో జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఎటువంటి విజయాలు సాధించలేదు. అంబేడ్కర్ కూడా ఓడి పోయారు. రిజర్వుడు సీట్ల విధానం వల్ల నిజమైన ఎస్సీ ప్రతి నిధుల ఎన్నిక అసాధ్యమనే విషయాన్ని మరోసారి ఆ ఎన్నికలు రుజువు చేశాయి. 1936లో, 1942లో జరిగిన ఎన్నికల్లో ఇదే అను భవం అంబేడ్కర్కు ఎదురైంది. అందుకే 1947లో తయారు చేసిన నమూనా రాజ్యాంగంలో ప్రత్యేక ఓటింగ్ విధానాన్ని ప్రతిపాదించారు. నమూనా రాజ్యాంగానికి ‘స్టేట్స్ అండ్ మైనారి టీస్’ అనే పేరు పెట్టారు. ‘‘ఈ రిజర్వేషన్లు పదేళ్ళే ఉంటాయి. ఆ తర్వాత ఉండవు. అందువల్ల మనం ఐక్యంగా ఉద్యమించాలి. అంతే కాకుండా, హిందువుల దయాదాక్షిణ్యాల మీద ఎన్నికయ్యే ఈ రిజర్వుడు సీట్ల విధానం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం లేదు’’ అంటూ పంజాబ్ ఎన్నికల సభల్లో అంబేడ్కర్ చేసిన ప్రసంగాలు అంబేడ్కర్ సమగ్ర రచనల 17వ సంపుటంలోనే ఉన్నాయి. పనికిరాని రిజర్వేషన్లు, పదేళ్ళే ఉండే రిజర్వేషన్లు ఉంటే ఎంత, పోతే ఎంత అనే అభిప్రాయానికి అంబేడ్కర్ వచ్చారు. దాని ఫలితమే షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ తీర్మానం. ఆ తర్వాత క్యుములేటివ్ ఓటింగ్ విధానాన్ని ఆయన ముందుకు తెచ్చారు. ఈ విధానంలో ఎన్ని నియోజక వర్గాలను కలిపి ఒక్కటిగా చేస్తారో, ప్రతి ఓటరుకు అన్ని ఓట్లు ఉంటాయి. మూడు నియోజకవర్గాలను కలిపితే మూడు ఓట్లు ఉంటాయి. రిజర్వేషన్లు ఉండవు. ఎవరైనా పోటీ చేయొచ్చు. తమ నియోజక వర్గాలకు ప్రతి పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు ఉంటారు. ఒక ఓటరు తన మూడు ఓట్లను ముగ్గురికి ఒక్కొక్క ఓటుగా వేయొచ్చు; ఇద్దరికే వేయొచ్చు; మూడు ఓట్లను ఒక అభ్యర్థికి కూడా వేయొచ్చు. ఎస్సీ అభ్యర్థి ఒక్కడే ఉండే ఆ నియోజక వర్గంలో ఎస్సీలందరూ ఒక్క అభ్యర్థికే తమ మూడు ఓట్లను వేస్తే, తప్పనిసరిగా ఎస్సీ అభ్యర్థి గెలుస్తాడు. అయితే అంబేడ్కర్కి ఈ విధానం మీద ఉద్యమం చేసేంతటి సమయం లేదు. ఆ సమ యంలో ఆయన బౌద్ధంపై కేంద్రీకరించి ఉన్నారు. ఈ ఆలోచన ‘స్టేట్స్, అండ్ మైనారిటీస్’లో కూడా ప్రతిపాదించారు. కానీ అది ప్రచారం పొందలేదు. రిజర్వేషన్ సీట్లు రాజకీయ అధికార భాగస్వామ్యం కోసం నిర్దేశించుకున్న ఒక రూపం. రిజర్వుడు సీట్లు అంబేడ్కర్ రాజకీయ మార్గం కాదు. ఎన్నో మార్గాలను అంబేడ్కర్ వెతికారు. ఆయన నిజమైన లక్ష్యం ఎస్సీలు రాజకీయాధికారంలో భాగం కావడం. ఆ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళేవారు ఆయన ఆలోచనా సరళిని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మల్లెపల్లి లక్ష్మయ్య, వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 81063 22077 -
సాధికారత సాధించని ఒడంబడిక
ఎన్నికల్లో ఇప్పుడు రిజర్వుడు స్థానాలుగా ప్రతిఫలించిన పూనా ఒడంబడిక జరిగి తొమ్మిది దశాబ్దాలు గడిచింది. స్వాతంత్య్ర పూర్వ భారతదేశంలో అంబేడ్కర్కూ, మహాత్మాగాంధీకీ కుదిరిన ఈ ఒడంబడిక గట్టి వాదోపవాదాలకు కేంద్రబిందువైంది. అంటరాని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని, దీనికి నామినేషన్ పద్ధతి కాకుండా, వాళ్ళ ఓట్ల ద్వారా వాళ్లే ప్రతినిధులుగా ఎన్నిక కావాలని అంబేడ్కర్ వాదించారు. ఇది హిందూ సమాజాన్ని మరింత చీల్చుతుందని గాంధీజీ భావించారు. ఈ నేపథ్యంలో ఇద్దరిమధ్యా కుదిరిన, కుదిర్చిన రాజీయే పూనా ఒడంబడిక. ఈ ఒడంబడిక రావడానికి కారణమైన ముందటి, అనంతర పరిణామాలు స్వాతంత్య్ర పోరాటానికి సమాంతరమైన చరిత్ర! ‘‘భారత సామాజిక నిర్మాణం రెండు ముఖ్యమైన భాగాలుగా విభజితమైంది. అందులో ఒకటి వర్ణం, రెండవది అవర్ణం. వర్ణంలో ద్విజులు, ద్విజులు కానివారు ఉంటారు. అవర్ణంలోని వారిని అంటరాని తెగలు, నేరస్థ, ఆదిమ తెగలుగా వర్గీకరించారు. అయితే వర్ణంలోని ద్విజులు, ద్విజులు కానివారి మధ్య విభజన ఉంటుంది. అది పెద్దగా కనిపించని సన్నని పొర. అవర్ణంలోని ఆదిమ తెగలు ఎవరికి వారుగానే జీవిస్తారు. వర్ణంలోని కులాలతో వీరికి అంతగా సంబంధాలుండవు. అయితే వర్ణా నికి బయట అవర్ణులుగా ఉన్న అంటరాని కులాలకు, మిగతా సమా జానికీ మధ్య ఉన్న వైరుధ్యం ఇనుప కంచె లాంటిది. దానిని ఛేదిం చడం అంత సులువు కాదు.’’ బాబాసాహెబ్ అంబేడ్కర్ 1940కి ముందే చేసిన విశ్లేషణ ఇది. ఆ రోజు అంటరాని కులాలుగా పిలిచిన నేటి షెడ్యూల్డ్ కులాలు, రాజకీయ పరిభాషలో దళితులు ఈ సమా జంలో ఇప్పటికీ భాగం కాలేకపోయారు. భారతదేశంలో ప్రజా ప్రభుత్వాల ఏర్పాటు, ప్రజాప్రాతినిధ్యం, ప్రజాస్వామ్య స్థాపన అవగాహనల కోసం 1919లో భారత దేశం సందర్శించిన సౌత్బరో కమిటీ ముందు ఒక ముప్ఫై యేళ్ళ యువ కుడైన అంబేడ్కర్, అమెరికాలో చదివిన ఉన్నత విద్యావంతుడిగా సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. భారతదేశంలో కులాల మధ్య ఉన్న అంతరాలు, ముఖ్యంగా అంటరాని కులాలకూ, ఇతర కులాలకూ మధ్య ఉన్న అసమానతలు ప్రభుత్వాల ఏర్పాటులో ప్రభావం చూప కూడదంటే, అంటరాని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించా లని, దీనికి నామినేషన్ పద్ధతి కాకుండా, వాళ్ళ ఓట్ల ద్వారానే వాళ్ళ ప్రతినిధులుగా ఎన్నిక కావాలని, ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో జరగా లని సూచించారు. అంటే సమాజంలోని విద్యావంతులకు, సంపన్ను లకు, భూస్వాములకు, వ్యాపారస్తులకు మాత్రమే ఓటు హక్కు కల్పిం చడం సరిపోదని, కుల, మత, ప్రాంత భేదం లేకుండా ప్రతి వయో జనుడికీ ఓటు హక్కు కల్పించాలని సౌత్ బరో కమిటీ ముందు ప్రతిపాదించాడు ఆ యువకుడు. ఆ తర్వాత సైమన్ కమిషన్ ముందు, 1930–32 మధ్య జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లలోనూ ఆయన ఇదే అంశాన్ని మరింత శాస్త్రీయ పద్ధతిలో వాదించారు. అప్పటికే ముస్లింలకు, క్రిస్టియన్లకు అమలు జరుగుతున్న ప్రత్యేక ఎన్నిక విధా నాన్ని, అంటే తమ అభ్యర్థులకు తామే ఓట్లు వేసుకునే పద్ధతిని అప్పుడు డిప్రెస్డ్ క్లాసెస్గా పిలుస్తోన్న అంటరాని కులాలకు వర్తిం పజేయాలని వాదించారు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశాలకు గాంధీజీ హాజరుకాలేదు. బాబాసాహెబ్ అంబేడ్కర్ మొదటి సభలో ఈ విషయంపై చేసిన ప్రతిపాదనను విని బెంబేలెత్తిపోయిన గాం«ధీజీ, రెండో సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమావేశంలో గాంధీజీ అత్యంత శ్రద్ధపెట్టిన అంశం డిప్రెస్డ్ క్లాసెస్కు ప్రత్యేక ఎన్నిక విధానాన్ని వ్యతిరేకించడమే. అంబేడ్కర్, గాం«ధీ మధ్య ఈ విషయమై తీవ్ర వాదోపవాదాలు జరి గాయి. అంటరాని కులాలను తరతరాలుగా వెలివేశారని, హిందువు లలో భాగంగా వారిని ఎన్నడూ చూడలేదని, ఆర్థిక, సామాజిక అణచివేతకు గురిచేశారని అంబేడ్కర్ వాదించారు. ఈ కారణంగానే వారికి రాజకీయ హక్కులు, ప్రాతినిధ్యం కావాలని; వారి ప్రతినిధు లను వారే ఎన్నుకునే అవకాశం కల్పించాలని కుండబద్దలు కొట్టారు. లేదంటే, రాజకీయ స్వేచ్ఛకు బదులు దళితులు తరతరాల బానిసత్వా నికి బలి కావాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. అంబేడ్కర్ సూచించి నట్టుగా, అంటరాని కులాలకు ప్రత్యేక ఎన్నిక విధానంలో తమ అభ్యర్థులను తామే ఎన్నుకునే విధానానికి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది. అందుకు అనుగుణంగా నాటి బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ ఒక ఉత్తర్వును జారీచేశారు. దానిపేరే కమ్యూనల్ అవార్డు. అయితే, గాంధీ దీనిని జీర్ణించుకోలేకపోయారు. 1932, మార్చి 11న బ్రిటిష్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఒక లేఖ రాశారు. ‘అంటరాని కులాలకు ప్రత్యేక ఓటింగ్ విధానం కల్పించి, వారి అభ్యర్థిత్వాన్ని వారే ఎన్నుకునే అవకాశాన్ని కల్పిస్తే, నేను ఆమరణ దీక్షకు పూనుకుం టాను’ అన్నారు. రామ్సే మెక్డొనాల్డ్ గాంధీ లేఖకు, ‘‘మీ ఉద్దేశం హిందువులకు, అంటరాని కులాలకు కలిపి ఓటింగ్ ఉండాలని కాదు. హిందువుల మధ్య ఐక్యత సాధించాలని కాదు. అంటరాని కులాల తరఫున శాసనసభలో నలుగురు నిజమైన ప్రజాప్రతినిధులు రాకుండా అడ్డుకోవడమే తప్ప మరొకటి కాదు’’ అని తీవ్రంగా జవాబి వ్వడం గమనించాల్సిన విషయం. రామ్సే మెక్డొనాల్డ్ ఉత్తర్వులకు వ్యతిరేకంగా గాంధీజీ ఆమరణ నిరాహార దీక్ష చేశారు. దానితో కాంగ్రెస్ పార్టీ, హిందూ సంఘాల నాయకులు అంబేడ్కర్ మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. చివరిదాకా అంబేడ్కర్ వాళ్ళ ఆలోచనలకు తలొగ్గలేదు. కానీ, ఒకవేళ గాంధీ ప్రాణాలకు ప్రమాదం ఏర్పడితే గ్రామాల్లో అల్పసంఖ్యాకులుగా ఉన్నవారిపై, అగ్రవర్ణాలు దాడులకు తెగబడతారనే భయంతో రామ్సే మెక్డొనాల్డ్ ఇచ్చిన ఉత్తర్వులను వదులుకోవాల్సి వచ్చింది. దాని స్థానంలో 1932 సెప్టెంబర్ 24వ తేదీన పూనా ఒడంబడిక జరిగింది. పూనా ఒడంబడిక ద్వారా ప్రత్యేక ఓటింగ్, అంటే తమ అభ్యర్థులను తాము మాత్రమే ఎన్నుకునే విధానానికి బదులుగా, రిజర్వుడు నియోజక వర్గాల విధానం అమలులోకి వచ్చింది. ప్రస్తుతం మనం చూస్తున్న రిజర్వుడు స్థానాల ఎన్నికల విధా నంలో కేవలం ఆధిపత్య కులాల, సవర్ణ హిందువుల అంగీకారం ఉన్నవాళ్ళే ఎస్సీ ప్రతినిధులుగా ఎన్నికవుతూ వస్తున్నారు. దళితుల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న వాళ్ళు, కులసమాజానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళు ఎస్సీల ప్రతినిధులు కాలేకపోతున్నారు. కారణం మనందరికీ తెలుసు. ప్రస్తుతం భారత దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు మెజారిటీగా ఆధిపత్య కులాల నాయకత్వంలో ఉన్నాయి. అంతేకాకుండా, ఓటర్లలో నూటికి 70 నుంచి 80 శాతం మంది దళి తులు కానివారే. అందువల్ల కూడా నిజమైన దళిత ప్రజాప్రతి నిధులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నిక కావడం లేదు. ఎవరు కాదన్నా అవునన్నా ఇది నిజం. దీనికి ప్రస్తుతం ఎన్నికవుతున్న ఎస్సీ ప్రజాప్రతినిధులను బాధ్యులను చేయాల్సిన అవసరం లేదు. దీనికి కారణం ఎన్నికల విధానమే తప్ప వ్యక్తులు కాదు. ఒకవేళ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశించినట్టుగా, తమ ప్రతి నిధులను తామే ఎన్నుకునే అవకాశం ఉన్నట్లయితే ఇప్పటికే భారత సామాజిక, రాజకీయ రంగంలో మౌలికమైన మార్పులు వచ్చేవి. కానీ ఎస్సీ ప్రతినిధులందరూ ఈ రోజుకు కూడా అసెంబ్లీలోగానీ, పార్లమెంటులో గానీ దళితుల పక్షాన నోరు విప్పలేని స్థితిలో ఉన్నారు. అప్పుడప్పుడు కొంత మంది మాట్లాడుతుంటారు. వాళ్ళంతా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు. మళ్ళీ వాళ్ళే అధికార పక్షంలోకి వెళ్తే నోటికి తాళాలు పడిపోతాయి. ఇది ఒక కఠోర వాస్తవం. అయితే దీనికి పరిష్కారమేమిటి అనే సందేహం వస్తుంది. తక్షణమైతే ప్రజా ప్రతినిధులు తమలో తాము అవలోకనం చేసు కోవాలి. కనీసం తక్షణ సమస్యలపైనైనా దళితుల పక్షాన నిలబడ టానికి ప్రయత్నించాలి. అంతిమంగా ఈ ఎన్నికల విధానాన్ని మార్చడానికి మళ్ళీ ఒక రాజకీయ ఉద్యమం జరగాలి. తమ ప్రతినిధులను తామే ఎన్నుకునే విధానంపైన ఒక చర్చ జరగాలి. ఇందుకుగాను దళితులు రాజకీయ ఉద్యమానికి సన్నద్ధం కావాలి. సమాజంలోని ప్రజాస్వామిక శక్తులు, అసమానతలు తొలగిపోవాలనే వ్యక్తులు, సంస్థలు, దళిత ప్రజాప్రతినిధుల ఎన్నిక విధానంలో మార్పు కోసం కలిసి రావాలి. లేనట్లయితే సామాజిక ఆర్థిక అసమానతలకు తోడుగా రాజకీయ బానిసత్వం ఇంకా పాతుకుపోయే ప్రమాదం ఉంటుంది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
కొత్త కోణం: అఫ్గాన్ సింహాలు తలవంచేనా!
పంజ్షీర్... యావత్ ప్రపంచంలో మార్మోగుతున్న పేరు. తాలిబన్లకు సైతం చుక్కలు చూపిస్తున్న ఐదు సింహాల గడ్డ. ఆఫ్గాన్ నేలపై ఆధిపత్యాన్ని ససేమిరా సహించని పౌరుషానికి రూపం. ఆ లోయను కైవసం చేసుకున్నామని తాలిబన్లు ప్రకటించినా, చిట్టచివరి యోధుడి చిట్టచివరి రక్తపుబొట్టు నేలలో ఇంకేవరకూ తమను గెలవడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు పంజ్షీర్ పోరాటవీరులు. ప్రపంచం మొత్తం కరుడుగట్టిన తీవ్రవాదుల్లా భావిస్తోన్న తాలిబన్లను ఎదిరించే సత్తా వీరికెలా వచ్చింది? అంతటి ధీరత్వం, తెగింపు, పట్టుదలకు మూలాలు ఏమిటనేదే ఇప్పుడు చర్చించాల్సిన అంశం. పరిపాలన రీత్యా అఫ్గానిస్తాన్లోని ఒక రాష్ట్రం... పంజ్షీర్. అమెరికా సేనలు అఫ్గాన్ను వీడనున్నట్టు ప్రకటించిన తర్వాత యావత్ అఫ్గాన్నూ అవలీలగా ఆక్రమించుకుంది తాలిబన్ సాయుధ సేన. కానీ ఒకే ఒక చిన్న ప్రాంతం మాత్రం ఈ వ్యాసం రాసేనాటికి పూర్తిగా తాలిబన్ల వశం కాలేదు. అమెరికా తయారు చేసిన ఉగ్రవాదం చివరికి అమెరికానే తరిమికొట్టింది. అమెరికా చేసిన తప్పిదం వల్ల అమెరికా వీడి వెళ్ళిన అత్యాధునిక ఆయుధ సంపత్తి, యుద్ధ విమానాలు ఇప్పుడు తాలిబన్ల చేతుల్లో ఉన్నాయి. చైనా, రష్యా, పాకిస్తాన్ అండదండలున్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ పంజ్షీర్లో అడుగు పెట్టలేక పోయారు. కొరకరాని కొయ్యగా మారిన పంజ్షీర్లో చివరగా తాలిబన్లు చేసిన ప్రయత్నం–డ్రోన్ల సాయంతో బాంబుల వర్షం కురిపించడం. నిజానికి తాలిబన్ల బలం ముందు పంజ్షీర్ నిలబడుతుందా? అనేది ప్రశ్నార్థకమే. కానీ గత చరిత్రను తడిమితే, వారెప్పుడూ విదేశీ సైన్యానికి గానీ, స్వదేశీ సేనలకుగానీ లొంగిపోయింది లేదు. ఎంతటి ఘాతుకానికైనా తెగబడి పంజ్షీర్ని వశపర్చుకోజూసినా అది తాలిబన్ల తరంకాలేదు. దీంతో పాకిస్తాన్ సాయంతో యువ కిరణం మసూద్ని మట్టుబెట్టే ప్రయత్నం చేశారు. అఫ్గాన్ మాజీ ఉపా ధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ ఇంటిపై బాంబుల వర్షం కురిపించారు. ఇతర నేతల నివాసాలను కూడా బాంబులతో పేల్చి వేశారు. పంజ్షీర్ గవర్నర్ కార్యాలయంపై జెండా ఎగురవేసి, తాము గెలిచామంటూ సంబరాలు చేసుకున్నారు తాలిబన్లు. మొన్నటివరకూ అఫ్గాన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న అమ్రుల్లా సలేహ్– ‘ఏ దేశమైనా, ఏ ప్రభుత్వమైనా చట్టబద్ధ పాలనను గౌరవించాలి. కానీ హింసను కాదు. పాకిస్తాన్, తాలిబన్లు కలిసి అఫ్గానిస్తాన్ను కబళించడానికి చేస్తున్న ప్రయత్నం ఫలించదు. హింస ముందు అఫ్గాన్ ప్రజలు మోకరిల్లరు’ అంటూ సాహసోపేతమైన ప్రకటన చేశారు. అమ్రుల్లా సలేహ్ పంజ్షీర్ నేలపై పుట్టిన వాడు. ఆ ప్రాంతం నుంచి తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. 80వ దశకంలో సోవియట్ సేనలతో, 90వ దశకంలో తాలిబన్ల పాలన కాలంలో పంజ్షీర్ తరఫున పోరాడిన అహ్మద్ షా మసూద్ కొడుకు అహ్మద్ మసూద్ ప్రజానాయకుడు అయిన అమ్రుల్లాకు అండగా నిల బడ్డాడు. అమ్రుల్లా వ్యూహంతో, మసూద్ నాయకత్వంలో పంజ్షీర్ పోరాడుతోంది. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారనేది ప్రశ్నే కాదు. పంజ్షీర్ల వారసుడు ఒక్కడున్నా ఈ యుద్ధం ముగియదన్నది సత్యం. అఫ్గానిస్తాన్ బహు జాతుల సమ్మేళనం. అనేక గిరిజన తెగల సమాహారం. చాలాకాలం ఈ తెగలు వేటికవే స్వతంత్రంగా బతి కాయి. మెజారిటీగా అందరూ ముస్లింలే అయినప్పటికీ–జీవన విధానం, ఆచార సంప్రదాయాలు, ఇతర విలువల రీత్యా ఎవరికి వారుగానే ఉన్నారు. వీరిలో పష్తూన్, తజిక్స్, హజారాస్, ఉజ్బెక్, బలూచ్, అయిముఖ్, క్విజల్, బాశ్, టర్క్మన్, క్యూజక్, పార్శివాన్, సయ్యద్, కిర్గిజ్, అరబ్ లాంటి ఎన్నో తెగలున్నాయి. ఇందులో పష్తూన్, తజిక్స్, హజారాస్ ప్రధానమైనవి. ప్రస్తుత అఫ్గాన్ జనాభా దాదాపు 3 కోట్ల 80 లక్షలు. ఇందులో 42 శాతం పష్తూన్లే. వీరినే పఠాన్లు అని కూడా అంటారు. తజక్ జనాభా 27 శాతం. హజారాలు 9 శాతం, ఉజ్బెక్లు 4 శాతం, అయిమక్లు 4 శాతం, టర్క్మన్లు 3 శాతం, బలూచ్లు 2 శాతం ఉన్నారు. పష్తూన్లు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. వీరు సంచార జీవనం గడుపుతుంటారు. ఆధు నిక పద్ధతులు అలవాటు కాలేదు. తాలిబన్ల సాయుధ బలగంలో వీరిదే అగ్రభాగం. నాయకత్వ స్థానంలోనూ అధిక సంఖ్యలో ఉన్నారు. జనాభా రీత్యా రెండవ స్థానంలో ఉన్న తజిక్ తెగ ఆధునిక సమాజంగా వృద్ధి చెందింది. మూడవ స్థానంలో ఉన్న హజారా తెగ వ్యవసాయం, పశుపోషణ, గొర్రెల పెంపకంతో జీవనం సాగిస్తోంది. వెయ్యేండ్ల కిందట ప్రపంచాన్ని గడగడలాడించిన చంఘిజ్ఖాన్ వారసులమని వీరు చెప్పుకుంటారు. ఈ మూడు తెగల ప్రభావం ఆఫ్గాన్పై ఉంటుందనేది వాస్తవం. ఈ ఆధిపత్య తెగ పశ్తూన్లకూ, మిగిలిన తెగలకూ మధ్య నిరంతర ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ వైరానికి దశాబ్దాల చరిత్ర ఉంది. మొదటిసారిగా 1975లో ఆనాటి ప్రధానమంత్రి దావూద్ ఖాన్కు వ్యతిరేకంగా పంజ్షీర్ లోయలో తిరుగుబాటు జరిగింది. దావూద్ పష్తూన్ తెగకు చెందిన నాయకుడు. తజక్ తెగకు చెందిన తాహిర్ బదాక్షి నాయకత్వంలో జరిగిన ఈ తిరుగుబాటును వామపక్ష తిరుగుబాటుగా చెపుతారు. అదేవిధంగా ముస్లిముల్లో షియా వర్గానికి చెందిన హజారా నాయకత్వంలో షల్లెహ–ఏ–జిహాద్ పేరుతో 1960ల్లోనే ఒక విప్లవ సంస్థ నిర్మాణం జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ రోజు పంజ్షీర్లో ప్రధా నంగా తజక్, హజారా తెగలు... ప్రధానంగా పష్తూన్ల నాయకత్వంలో ఉన్న తాలిబన్లతో ఘర్షణలో ఉన్నారు. అమెరికా సైన్యం అఫ్గాన్ను ఆక్రమించుకున్న తరువాత, అఫ్గాన్ జాతీయ ప్రభుత్వాన్ని నడిపిం చడంలో పంజ్షీర్ నాయకత్వం ప్రధాన పాత్ర పోషించింది. పంజ్షీర్ తెగలు తాలిబన్లను ఎదిరించి నిలవడానికి, చారిత్రకంగా వస్తున్న జాతుల మధ్య వైరుధ్యాలే ప్రధాన కారణం. పంజ్షీర్ శత్రు దుర్భేధ్యమైనది. ఇది కాబూల్కు 150 కిలోమీటర్ల దూరంలో హిందూకుష్ పర్వతాలను ఆనుకొని ఉన్న ఒక లోయ. ఈ లోయలోకి ప్రవేశించాలంటే ఉన్నది ఒకే ఒక చిన్న మార్గం. ఆ ఏకైక సన్నని తోవగుండానే ఎవరైనా లోనికి పోవాల్సి ఉంటుంది. అది కూడా పంజ్షీర్ నదిని దాటుకొని వెళ్లాలి. పంజ్షీర్ ప్రజలది ప్రత్యేకమైన జీవన విధానం. యుద్ధ విద్య వారి జీవితంలో భాగం. సహజసిద్ధంగా వారసత్వంగా లభించిన ధీరత్వం వీరికి పెట్టని కిరీటం. వేల ఏళ్ళుగా స్వతంత్రంగా జీవనం సాగించిన పంజ్షీర్ ప్రాంతం ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించింది. దానికి కారణం ఈ లోయను పచ్చల మణిహారమని చెపుతారు. అత్యంత విలువైన ఖనిజాలు, పచ్చలు(190 క్యారెట్లు కలిగిన ఎమరాల్డ్) ఇక్కడ లభ్యమవడంతో ఈ ప్రాంతం ఆర్థికంగా ఎదిగింది. మధ్యయుగాల కాలంలోనే వెండి గనులు విస్తారంగా ఉండేవి. క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలోనే ఈ ప్రాంతానికి చెందిన ఐదుగురు నాయకులు, స్వయంగా అన్నదమ్ములు అక్కడి నదిపైన ఆనకట్టను నిర్మించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు. తరతరాలుగా ప్రజలను వరదల నుంచి రక్షించడమే కాకుండా, వ్యవసాయాభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారు. ఆ ఐదుగురు సోదరులనే ఇక్కడి ప్రజలు ఐదు సింహాలుగా, తమ కుల దైవాలుగా కొలుచుకుంటారు. అందుకే ఈ ప్రాంతానికి పంజ్షేర్ అనే పేరొచ్చింది. పంజ్షేర్ కాస్తా వాడుకలో పంజ్షీర్గా ప్రాచుర్యం పొందింది. ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధించడం వల్ల పంజ్షీర్ ప్రజ లకు స్థిరమైన జీవన విధానం అలవాటయ్యింది. దీంతో పట్టణాల నిర్మాణం వైపు మొగ్గుచూపారు. దీనికి భిన్నమైన జీవన విధానం పష్తూన్లది. ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఇప్పటికీ వీరు సంచార జీవనమే సాగిస్తున్నారు. ఇస్లాంలో ఉండే విషయాలను మరింత కఠినంగా, మూఢంగా నమ్ముతారు; ఆచరిస్తారు; ప్రచారం చేస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇతర సమాజంతో, సంప్రదాయాలతో పరస్పర సంబంధాలు లేకపోవడం వలన వెయ్యేళ్ళ కిందటి సంప్ర దాయాలను మక్కీకి మక్కీ అమలు చేస్తున్న పరిస్థితి. తాము మాత్రమే నిజమైన ముస్లింలుగా వారు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదే వైరుధ్యం ఇతర తెగలతో ఘర్షణలకు దారితీస్తోంది. ఆధునిక పద్ధ తుల్లో ముందుకు వెళుతోన్న తజిక్, హజారా తెగలకు పష్తూన్ నాయకత్వంలోని తాలిబన్లు సహజ శత్రువులుగా కనిపిస్తున్నారు. ఒకరకంగా సాంప్రదాయక ఛాందసత్వానికీ, ఆధునిక జీవన విధానానికీ మధ్య జరుగుతున్న పోరాటంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. బలవంతమైన మెజారిటీ వర్గం అణచివేతకు వ్యతిరేకంగా పంజ్షీర్లు తరతరా లుగా సాగిస్తోన్న ఈ పోరాటం... గెరిల్లా యుద్ధ తరహాలో ఉన్న ప్రజా స్వామ్యయుతమైన పోరాటం! - మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు -
రెక్కల గుర్రానికి కీలెరిగి వాతపెట్టాలి
పెగసస్ వైరస్... కోవిడ్ కన్నా ప్రమాదకరం. కేంద్రప్రభుత్వం పెగసస్ వైరస్ను వాడి, వ్యక్తి స్వేచ్ఛను ఎందుకు హరించివేస్తోంది? ఆర్థిక రంగంలో కొనసాగుతున్న కుట్రలను ప్రతిఘటిస్తున్న ప్రజలెవరైనా భారత ప్రభుత్వాలకు శత్రువులే. అందుకే వాళ్ళ మీదకు పెగసస్ రెక్కల గుర్రాన్ని వదులుతున్నారు. ఈ విషయాలపై రాస్తున్న, మాట్లాడుతున్న రచయితలను, జర్నలిస్టులను, సామాజిక కార్యకర్తలను, రాజకీయ నాయకులను రెక్కల గుర్రానికి అప్పజెబుతున్నారు. పెగసస్ రెక్కల గుర్రం... రోగం మాత్రమే. రోగానికి మూలం ఈ దేశ సామాజిక, ఆర్థిక అసమానతలు, వివక్ష, దోపిడీ. అంబేడ్కర్ చెప్పినట్టు... రాజకీయ ప్రజాస్వామ్యానికి రక్షణగా నిలవాలంటే ఆర్థిక, సామాజిక రంగాల్లో ప్రజాస్వామ్యం కోసం కూడా పోరాడాల్సి ఉంటుంది.‘‘జనవరి, 26, 1950 నుంచి మనం ఒక వైరుధ్యాల జీవితంలోకి అడుగిడబోతున్నాం. రాజకీయాల్లో సమానత్వాన్ని, ఆర్థిక, సామాజిక రంగాల్లో అసమానత్వాన్నీ కలిగి ఉన్నాం. ఒక మనిషికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒక విలువ ద్వారా రాజకీయాల్లో ప్రజాస్వామ్యం ఉంది. కానీ ఆర్థిక, సామాజిక రంగాల్లో ఇంకా అసమానతలు కొనసాగుతున్నాయి. ఇవి ఇలాగే కొనసాగితే రాజకీయ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతుంది’’ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ సభ చివరి రోజైన నవంబర్, 25, 1949న చేసిన ప్రసంగంలోని కీలకమైన అంశం ఇది. డెబ్భై ఏళ్ళ క్రితం అంబేడ్కర్ చేసిన ఈ వ్యాఖ్యలను తిరిగి మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. పెగసస్ వైరస్ ద్వారా కొన్ని వందల మంది ప్రముఖుల ఫోన్లను నిఘాలో పెట్టినట్టు రుజువైంది. నిజానికి ఇది కోవిడ్ కన్నా ప్రమాదకరం. నూటికి నూరుపాళ్ళూ ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. అయితే ఎందుకు ఈ ప్రభుత్వం పెగసస్ వైరస్ను వాడి వ్యక్తి స్వేచ్ఛను హరించివేస్తోంది? ఇది కేవలం రాజకీయ ప్రజాస్వామ్యానికి సంబంధించినది మాత్రమే కాదు. ఈ దేశంలో కొనసాగుతున్న ఆర్థిక గుత్తాధిపత్యం, సామాజిక వివక్షలు, అణచివేతలు రోజురోజుకీ వికృత రూపం దాల్చుతున్నాయి. గత కొన్ని వేల ఏళ్ళ నుంచి ప్రజల మధ్య అసమానతలు, వివక్షను పెంచి పోషిస్తోన్న కుల వ్యవస్థను కీర్తించే ప్రయత్నం జరుగుతున్నది. కుల వ్యవస్థ పునాది కలిగిన హిందూ మతం ప్రాముఖ్యతను చాటి చెప్పడానికి కావాల్సిన ప్రచారం ముమ్మరమైంది. అంతేకాకుండా, ఇతర మతాలు, సాంప్రదాయాలు ప్రజావ్యతిరేకమైనవనే అభిప్రాయం కూడా బలంగా ముందుకు తెస్తున్నారు. అంటే సామాజిక అసమానతలను నిర్మూలించే వైపు కాకుండా, రోజురోజుకీ మరింత పెంచే విధంగా ప్రయాణం సాగుతోంది. అలాగే, ఆర్థికంగా కొన్ని కులాలు, వర్గాలు మాత్రమే బలపడేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. అంటే దీనికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ప్రభుత్వం దృష్టిలో శత్రువులుగానే ఉన్నారు. దీంతో ఎవరినైనా తన శక్తితో ఎగరేసుకుపోగలిగే అస్త్రంగా రెక్కల గుర్రం పెగసస్ను ప్రయోగించారు. ఇక రెండో అంశం తాము చేస్తున్న అక్రమ నిఘాను సమర్థించుకోవడానికి ఒక శత్రువును ఎప్పటికప్పుడు సృష్టించడం. అది టెర్రరిజం కావచ్చు. తీవ్రవాదం కావచ్చు, అతివాదం కావచ్చు, ఇతర హింసాత్మక బూచీలేవైనా కావచ్చు. వాటిని బూచీగా చూపి తమ పబ్బం గడుపుకోవడానికి తమ రాజకీయ శత్రువులను అందులోకి లాగడం. పెగసస్ను ప్రవేశపెట్టక ముందే ఇంకా కొన్ని నియంతృత్వ పోకడలను మన ముందుకు తెచ్చిందీ ప్రభుత్వం. అది, పాలనా రంగంలో ఉన్న ప్రజాస్వామ్య విధానాలను పూర్తిగా విస్మరించడం. అదేవిధంగా న్యాయవ్యవస్థలను నిర్వీర్యం చేయడం. దీంతో ప్రజలకు రక్షణగా ఉండాల్సిన వ్యవస్థలను దాదాపు స్తంభింపచేయడం జరిగింది. జరుగుతోంది. అంతేకాకుండా, మెజారిటీ వర్గాలను తమ వైపు నిలబెట్టుకోవడానికి అప్పటికే ప్రజల్లో ఉన్న వైరుధ్యాలను, ద్వేషాలను మరింత పెంచి పోషించడం, ఎటువంటి వ్యాఖ్యలకైనా వెనుకాడకపోవడం జరుగుతోంది. ఒక కులాన్ని, మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం సర్వసాధారణమైంది. దీంతో మెజారిటీ వర్గం ప్రజలను సంతోషపెట్టేం దుకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడుతున్నారు. అంతేకాకుండా, కొన్ని జాతీయ చిహ్నాలను.. గాంధీ, నెహ్రూ లాంటి జాతీయ నాయకులను అభాసుపాలు చేయడానికి సంకోచించడం లేదు. కొన్ని వర్గాల ప్రజలపైన ముఖ్యంగా దళితులపైన, ముస్లింలపైనా దాడులు చేసి, వాటిని తామే మీడియాలో చిత్రీకరించి మరింత వికృతానందాన్ని పొందుతున్నారు. దీనివల్ల ఆ వర్గాలకు వ్యతిరేకంగా ఉన్న మెజారిటీ ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నానికి పూనుకుంటున్నారు. దీనితో పాటు, ప్రస్తుతం భారత ప్రజల్లో ఉన్న సాంస్కృతిక వైవిధ్యానికి భిన్నంగా ఏకీకృత వ్యవస్థని ఏర్పాటు చేసుకునేందుకు తమ సొంత పౌరసత్వ విధానాన్ని ప్రవేశపెట్టడానికి పూనుకుంటున్నారు. వీటన్నింటి తోడ్పాటులో తాము ఊహిస్తున్న, ఆశిస్తున్న ఒక వివక్షాపూరితమైన తమదైన దేశాన్ని నిర్మించే లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పెగసస్ కూడా, పాక్షికంగా కొనసాగుతున్న రాజ కీయ ప్రజాస్వామ్య హక్కులను సైతం నిరాకరించే ప్రయత్నంలో భాగమే. అయితే పెగసస్ ఈ రోజే పుట్టుకొచ్చిన కొత్త దాడి కాదు. ఇది చివరిది కూడా కాదు. భారతీయ సమాజంలో వేళ్ళూనుకొని ఉన్న ఆర్థిక వైరుధ్యాలు, అసమానతలు, వివక్ష కొనసాగినంత కాలం ఈ దేశంలో ఉడుత ఊపులకు సైతం రాజకీయ ప్రజాస్వామ్యం చివురుటాకులా వణికిపోతూనే ఉంటుంది. అందుకే ఈ రోజు మరొక్కసారి, అంబేడ్కర్ సూచించిన నిజమైన ప్రజాస్వామ్యం వైపు సమాజాన్ని నడిపించకుండా ఈ చట్టాలు, నిఘా రెక్కల గుర్రాలు ప్రజల మీద ఎక్కి సవారీ చేస్తూనే ఉంటాయి. అంబేడ్కర్ ప్రజాస్వామ్యం గురించి వివరించిన మాటలను మనం ఇక్కడ స్ఫురణకు తెచ్చుకోవాలి. ‘‘ప్రజాస్వామ్యం ఒక ప్రభుత్వ విధానం, పాలన నుంచి వచ్చేది కాదు. పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా అమలు జరిగేది సంపూర్ణ ప్రజాస్వామ్యం కాదు. సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఉన్న సంబంధాలు ప్రజాస్వామ్య విలువలకు అద్దంపడతాయి’’. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం అనే అంశాలు కీలకమైనవి. ఇందులో స్వేచ్ఛ, సమానత్వం అనే అంశాలు సోదరత్వం అనే భావన మీద ఆధారపడుతూ ఉంటాయనేది అంబేడ్కర్ అభిప్రాయం. ప్రజల మధ్య సోదరత్వం లేకుండా, స్వపర భేదాలు కొనసాగినంత కాలం సమానత్వం, స్వేచ్ఛ అనేవి కూడా సంపూర్ణంగా అమలు జరగవు. ఇదే ఈ రోజు భారతదేశ వాస్తవికత. సామాజికంగా కుల వ్యవస్థ బతికి ఉన్నంతకాలం రాజకీయంగా అమలులో ఉన్న సమానత్వం సరిౖయెన ఫలితాలను ఇవ్వదు. అందువల్లనే రాజకీయ పార్టీలు ప్రజల మధ్య ఉండే ఈ భేదాలను తమ అధికారం కోసం చాలా సమర్థవంతంగా వాడుకుంటున్నాయి. పైగా, ఇటీవల కాలంలో ఆర్థిక రంగంలో వస్తున్న మార్పులు, పెరుగుతున్న అసమానతలు సమాజాన్ని మరింత అగాధంలోకి నెట్టబోతున్నాయి. ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీలు కొన్ని కార్పొరేట్ కంపెనీల ఎదుగుదలకు తోడ్పతున్నాయి. వాటికోసం ప్రజల భూములను, సహజవనరులను ధారాదత్తం చేస్తున్నాయి. దీనిపై తిరుగుబాటు చేస్తున్న ప్రజలు సహజంగానే ప్రభుత్వాలకు దేశ ద్రోహులుగా కనపడతారు. ప్రస్తుత ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వాలు కూడా ఆర్థికాభివృద్ధి పేరుతో ప్రజలను నిరాశ్రయులను చేశాయి. అడవులను స్వాహా చేస్తోన్న కార్పొరేట్ కంపెనీలను, అందుకు కొమ్ముగాస్తోన్న ప్రభుత్వాలను ప్రతిఘటిస్తోన్న ఆదివాసులు, అడవి బిడ్డలు రాజద్రోహులవుతున్నారు. అకారణంగా సంవత్సరాల తరబడి జైళ్ళలో మగ్గుతున్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పడానికి చేసిన కుయత్నాల ఫలితమే సుదీర్ఘ రైతాంగ పోరాటానికి దారితీసిందన్నది ఓ కఠోర సత్యం. దేశాన్ని సుసంపన్నంగా నిలిపే సత్తా ఉన్న రైతన్న ప్రభుత్వాల కుట్రలకు గురికావాల్సిన దుఃస్థితి. అంటే ఆర్థిక రంగంలో కొనసాగుతున్న ఈ కుట్రలను ప్రతిఘటిస్తున్న ప్రజలెవరైనా భారత ప్రభుత్వాలకు శత్రువులే. అందుకే వాళ్ళ మీదికి పెగసస్ రెక్కల గుర్రాన్ని వదులుతున్నారు. ఈ విషయాలపై రాస్తున్న, మాట్లాడుతున్న రచయితలను, జర్నలిస్టులను, సామాజిక కార్యకర్తలను, రాజ కీయనేతలను రెక్కల గుర్రానికి అప్పజెప్పుతున్నారు. పెగసస్ రెక్కల గుర్రం రోగం మాత్రమే. రోగానికి మూలం ఈ దేశ సామాజిక, ఆర్థిక అసమానతలు, వివక్ష, దోపిడీ. పెగసస్ మీద నిరసన తెలుపుతున్న మనందరం అంబేడ్కర్ చెప్పినట్టు.. ఆర్థిక, సామాజిక రంగాల్లో ప్రజాస్వామ్యం కోసం కూడా పోరాడాల్సిందే తప్ప మరో మార్గం లేదు. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
స్కిల్ ఇండియా కావాలంటే...!
‘‘నైపుణ్యంతో కూడిన శక్తితో వ్యక్తులు, సమూహాలు, దేశాలు ప్రగతి పథంలో సుసంపన్నమైన భవిష్యత్తువైపు మరింత ముందుకెళతాయని విశ్వసిస్తున్నాం’’ అని ఐక్యరాజ్య సమితి 2014, నవంబర్లో ప్రకటించింది. ఆ సమయంలో జరిగిన జనరల్ అసెంబ్లీలో ప్రతి సంవత్సరం జూలై 15వ తేదీని ‘ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం’గా జరపాలని కూడా తీర్మానించింది. నిరుద్యోగాన్ని, ఉపాధి సమస్యలను అధిగ మించి, సామాజిక, ఆర్థిక అభివృద్ధి వైపు యువత అడుగులు వేయ డానికి, నైపుణ్య శిక్షణ చాలా అవసరమని గుర్తించారు. అప్పటి నుంచి ప్రతియేటా ఐక్యరాజ్య సమితితో పాటు సభ్య దేశాలన్నీ ఈ రోజుని ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవంగా నిర్వహిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి ఆశించిన విధంగా పరిస్థితుల్లో మార్పులు రావడం లేదు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనుకబడిన దేశాల్లోని యువతరం ఈ నాటికే నైపుణ్యానికి ఆమడ దూరంలో ఆగిపోయింది. ఇటీవల ‘ఐక్యరాజ్య సమితి బాలలనిధి’ (యూనిసెఫ్), గ్లోబల్ బిజినెస్ కో ఎవల్యూషన్ ఫర్ ఎడ్యుకేషన్ (జీబీసీఈ) సంస్థలు సంయుక్తంగా దక్షిణాసియా దేశాల్లో నిర్వహించిన సర్వేలో కొన్ని నిరా శాజనకమైన విషయాలు వెలుగులోకొచ్చాయి. రాబోయే పదిసంవత్స రాల్లో అంటే 2030 నాటికి భారతదేశంలోని యాభైశాతం యువత ఉద్యోగాలకు సరిపోయే విద్య, నైపుణ్యాలను అందుకోలేరని ఆ సర్వే తేల్చి చెప్పింది. అంటే వీరంతా పరిస్థితులకు అనుగుణమైన నైపు ణ్యాన్ని అందుకోలేక ఉద్యోగాలకు దూరమవుతారన్నమాట. వీరెవరికీ 21వ శతాబ్ది ఉద్యోగరంగంలో కావాల్సిన నైపుణ్యాలు లేవు. 2040 నాటికి దక్షిణాసియా నుంచి 180 కోట్ల మంది పాతికేళ్ళు నిండని యువత కార్మిక రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆ సంఖ్యలో తొంబై శాతానికి పైగా మన దేశానికి చెందిన యువ తరమే ఉండనున్నారన్నది ఒక వాస్తవం. అయితే రోజు రోజుకీ పెరిగే శాస్త్ర, సాంకేతిక ప్రగతి కార్మికులు, ఉద్యోగులు, ఇతర వృత్తి వర్గాల నుంచి ఎంతో నైపుణ్యాన్ని ఆశిస్తున్నది. గతంలో లాగా శారీరక శ్రమ ద్వారా జరిగే ఉత్పత్తి, నిర్మాణ, ఇతర అంశాలేవీ భవిష్యత్లో కనిపిం చవు. ఇప్పటికీ మన దేశంలో నైపుణ్యం కలిగిన కార్మికులు, ఉద్యోగులు చాలా తక్కువ. వృత్తి విద్య లాంటి ఇంజనీరింగ్ విద్యనభ్యసించిన యువతీ యువకుల్లో ప్రతి నలుగురిలో ఒకరు మాత్రమే నైపుణ్యం కలిగి ఉన్నారు. ఇక సాధారణ డిగ్రీలు పొందిన వాళ్ళలో ప్రతి పది మందిలో ఒకరు మాత్రమే ఉద్యోగ అర్హత కలిగి ఉన్నారు. మనకు సమీ పంలో ఉన్న చైనా, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో నైపుణ్యం కలిగిన యువతీయువకుల సంఖ్య చాలా ఎక్కువ. ఈ దేశాల్లో తొంభైశాతం వరకు నిపుణులైన కార్మికులు, ఉద్యోగులున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అది మన దేశంలో చాలా తక్కువ. అందువల్లనే ఈ దేశాలు వస్తూత్పత్తి, ఆటోమొబైల్ రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించాయి. జపాన్ సాంకేతిక విజ్ఞానంతో తయారైన కార్లు మన దేశంలోని మార్కెట్లో అత్యధిక భాగాన్ని ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. కొరియా సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఎలక్ట్రిక్, ఎల క్ట్రానిక్ వస్తువులు అందరి ఇళ్ళలోనూ, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది చేతుల్లో దర్శనమిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. అంతేకాకుండా, ఇక ఎంతమాత్రం పాత తరహాలో ఆర్థిక రంగం మనుగడ సాగించలేని స్థితి వచ్చింది. ఇంతకుముందు పేర్కొన్న జీబీసీఈ సంస్థ మరొక అధ్యయన నివేదికను రూపొందించింది. ‘ప్రిపేరింగ్ టుమారోస్ వర్క్ ఫోర్స్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివ ల్యూషన్’ పేరుతో రూపొందిన ఈ నివేదిక ఇప్పటికి మూడు పారి శ్రామిక విప్లవాలు వచ్చాయనీ, నాల్గవ పారిశ్రామిక విప్లవంలోకి అడుగుపెట్టామనీ ప్రకటించింది. అంటే గత మూడు పారిశ్రామిక విప్లవాలలో ఉన్న నైపుణ్యాలన్నీ మార్పు చెందుతాయని, అందుకు అనుగుణంగా ప్రస్తుత యువత మారాలని ఆ నివేదిక స్పష్టం చేసింది. మొదటి పారిశ్రామిక విప్లవంలో యాంత్రీకరణ, ఆవిరి యంత్రాల ప్రభావం, రెండవ పారిశ్రామిక విప్లవంలో భారీ లాభాల రూపకల్పన అంచనాలను తలదన్నే ఉత్పత్తి, మూడవ పారిశ్రామిక విప్లవంలో ఇంటర్నెట్ సాంకేతిక పరిజ్ఞానం, పునరుత్పాదక శక్తి, సమాచార రంగంలో వచ్చిన పెనుమార్పులున్నాయని ఆ నివేదిక తెలియజేసింది. అయితే, నాలుగవ పారిశ్రామిక విప్లవంలో వాటన్నింటినీ జీర్ణించుకొని రోబోటిక్స్, కృత్రిమ మేధో పరిజ్ఞానం, డిజిటలైజే షన్, ఆటోమేషన్ నైపుణ్యాలు ప్రధాన పాత్ర వహించబోతున్నాయి. దానికిఅనుగుణంగానే అన్ని రంగాల్లో ఉన్న ఉద్యోగ, వృత్తి, స్వభావాలే మారిపోతున్నాయి. ఇటీవల చాలా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు భవిష్యత్తులో మనుగడ సాగించే వృత్తులు, విద్యా కోర్సులు ఏవి ఉండ బోతున్నాయనే విషయాన్ని అంచనా వేశారు. ఇంటర్నెట్, కంప్యూటర్ రంగంలో దాదాపు 20 వృత్తులను గుర్తిం చారు. అందులో క్లౌడ్ కంప్యూటరింగ్, యుఎక్స్ డిజైన్ డిజిటల్ జర్న లిజం లాంటి వాటికి భవిష్యత్తు ఉండనున్నట్టు వెల్లడయ్యింది. వ్యవ సాయ రంగంలోనూ, వ్యవసాయ పరిశోధన, ఫీల్డ్ ఆఫీసర్, బయో కెమిస్ట్, క్రాప్ సైన్స్ మేనేజర్, అగ్రికల్చరల్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలకు డిమాండ్ ఉండబోతున్నది. అట్లాగే హెల్త్ కేర్లో నర్స్లకు, ఫిజికల్ థెరఫిస్ట్లకు, రెస్పిరేటరీ థెరపిస్ట్, మసాజ్ థెరపిస్ట్, డాక్టర్ లేని సమ యంలో చూసే మెడికల్ అసిస్టెంట్లకు అవకాశాలు ఉండబోతు న్నాయి. ఉత్పత్తి రంగంలో కూడా చాలా మార్పులు రాబోతున్నాయి. ఎక్కువగా ఆటో మేషన్ వైపు వస్తూత్పత్తి రంగం ప్రయాణించే అవకా శాలు మెండుగా ఉన్నాయి. అయితే కొన్ని ఉద్యోగాలు మనకు భవి ష్యత్తులో కనుమరుగయ్యే అవకాశాలూ కోకొల్లలు. అందులో మొదట వచ్చేది డ్రైవర్లు, కొరియర్, క్లర్క్లు, పైలట్స్, లైబ్రేరియన్లు ఇంకా కొన్ని మాయమైపోవడం స్పష్టమౌతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు, విద్యా నిర్ణే తలు, ఆర్థిక నిపుణులు, రాజకీయ నాయకులు దేశ భవిష్యత్ కోసం యువతను నైపుణ్యం వైపు నడిపించడానికి సిద్ధం కావాలి. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఒక తంతులాగా సాగుతున్నది. అందులో సాధించిన ఫలితాలు పాక్షికమే. అందుకే దీనిని పూర్తిగా సమీక్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన ప్రముఖ ఆర్థిక వేత్త.సి.రంగరాజన్ ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ ‘నైపుణ్య శిక్షణ పాఠశాలలకు, కళాశాలలకు బయట జరగాల్సిందే. కానీ అది సరి పోదు. అది చేయిదాటిపోయినా దానిని సరిచేసుకోవడమే కానీ నిజంగా మన దేశం స్కిల్ ఇండియా కావాలంటే, నైపుణ్య శిక్షణ చదు వులో భాగం కావాలి. పాఠ్యాంశాలలోనే, అంటే పాఠశాల, కళాశాల చదువులోనే నైపుణ్య శిక్షణను భాగం చేయాలి’ అని సూచించారు. చదువు ముగిసిన తర్వాత యువతీయువకులకు ఉద్యోగం కావాలని, స్థిరపడాలన్న తపన ఉంటుంది. అంతే తప్ప మళ్ళీ ఒక శిక్షణ నేర్చుకోవాలనే ఆసక్తి, జిజ్ఞాస తగ్గిపోతుంది. ఇది పాలకులకు అర్థం కావాలి. దాదాపు ఇరవై కోట్ల మంది డిగ్రీలు పుచ్చుకొని నడి వీధుల్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు కావాలి. కానీ తగిన నైపుణ్యం వారికి లేదు. దేశంలో వనరులున్నాయి. వాటిని అభివృద్ధి చేసుకునే నైపుణ్యం లేదు. ఇది వైరుధ్యం. దీనిని పరిష్కారం చేయ కుంటే, ఇంతకుముందు నాలుగవ పారిశ్రామిక విప్లవం స్థానంలో, ఎవ్వరూ ఊహించని అసంతృప్తి సెగలు యావత్ సమా జాన్ని చుట్టు ముట్టడం ఖాయం. ఉద్యోగం, ఉపాధి కరువైన కోట్లాది మంది తిండీ తిప్పలు లేకుండా మనుగడే ప్రశ్నార్థకంగా మారే స్థితి వస్తే, ఆ పరిస్థి తులు ఎలా ఉంటాయో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 (నేడు ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం) -
పెత్తనంపై ధ్యాస తప్ప బాధ్యత పట్టదా?
‘‘కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే’’ అని ఉత్తర భారతదేశంలోని ఆరు రాష్ట్రాల ప్రజలు అభిప్రాయపడ్డారు. ‘ప్రశ్నమ్’, ‘ది ప్రింట్’ సంస్థలు సంయు క్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. బిహార్, హరియాణా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల్లో 14,881 మందిని ఇంటర్వ్యూ చేశారు. ఇందులో 70 శాతం మంది పురుషులు, 30 శాతం మంది మహిళలు. 52 శాతం మంది యువత కాగా, 36 శాతం మంది మధ్య వయస్కులు, 12 శాతం మంది అరవై యేళ్లు దాటినవారు. ఈ ఆరు రాష్ట్రాలలోని 967 అసెంబ్లీ నియోజక వర్గాల ప్రజలు ఇందులో భాగస్వాములయ్యారు. బిహార్లో 41 శాతం మంది కేంద్ర ప్రభుత్వమే కోవిడ్ ఉత్పా తానికీ, ప్రాణ నష్టానికీ ప్రధాన కారణమని భావించగా, 21 శాతం మంది రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఉందని చెప్పారు. అదే సమయంలో 38 శాతం మంది ఇది తమ దురదృష్టమని బాధపడ్డారు. అదేవిధంగా ఉత్తర్ప్రదేశ్లో 46 శాతం కేంద్రాన్నీ, 20 శాతం రాష్ట్రాన్నీ బాధ్యులుగా పేర్కొన్నారు. ఇక్కడ ఇంకొక విచిత్రముంది. ఆరు రాష్ట్రాల్లో సరాసరి 39 శాతం మంది ఇది తమ తలరాత అని పేర్కొన్నారు. అంటే భారత దేశంలో ఖర్మ సిద్ధాంతం ఎంత బలంగా ఉందో అర్థం అవుతుంది. భారతీయులు ఎంతటి విపత్తునైనా తమ తలరాత అనుకునేంతటి బలహీనులుగా మలచడంలో పాలకులు ఎంతగా కృతకృత్యుల య్యారో అర్థం చేసుకోవచ్చు. రాజస్తాన్లో 47 శాతం మంది ప్రభు త్వాలను దీనికి బాధ్యులుగా పేర్కొనలేదు అంటే మనం ఉన్నది ఎలాంటి సమాజమో పూర్తిగా అర్థమౌతుంది. ఇప్పటివరకు దేశంలో 38 కోట్ల 13 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహించగా 2 కోట్ల 95 లక్షలకు పైగా పాజిటివ్గా తేలినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 3 లక్షల 77 వేల మంది మరణించినట్టు ప్రభుత్వం ప్రకటì ంచింది. ఈ లెక్కలు ఏవీ సంపూర్ణ సత్యాలు కావని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ఇటీవల బిహార్, మహారాష్ట్ర ప్రభుత్వాలు తమ లెక్కలను సవరించగా, గతంకన్నా ఎక్కువ మర ణాలు ఉన్నట్టు తేలింది. అదే విధంగా ఈ సర్వేలో 17 శాతం మంది తమ కుటుంబంలో ఎవరో ఒకరు మరణించినట్టు చెప్పారు. అంటే మృతుల సంఖ్య ఇంకా అధికంగా ఉన్నట్లు అంచనావేయొచ్చు. తెలంగాణలో మరణాలు గత రెండు మూడు సంవత్సరాలతో పోలిస్తే చాలా ఎక్కువని తేలింది. జనన, మరణాల నమోదులో తేలిన అంశాన్ని ఒక ఆంగ్ల పత్రిక ఇటీవల వెల్లడించింది. ఉదాహరణకు 2019లో 1,22,102 మంది మరణించగా, 2020లో 1,54,992 మంది చనిపోయినట్టు లెక్కలు చెబుతున్నాయి. 2021 మే నాటికి 76,024 మంది చనిపోయినట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో ఈ మరణాల సంఖ్య అధికంగా నమోదైంది. అన్నింటికన్నా ఘోర మైన విషయం, ఉత్తర్ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో శవాలను దహనం చేయక గంగానదిలో విసిరివేసినట్టు అనేక విజువల్స్, ఫొటోలు బయటకొచ్చాయి. ప్రభుత్వాలు చూపుతోన్న లెక్కలకు కనీసం ఐదు రెట్లు అధికంగా మరణాలు సంభవించినట్టు నిపుణులు అంచనా వేశారు. కోవిడ్ విషయంలో మరొక ముఖ్యమైన అంశం ప్రజల ప్రాణాలతో పాటు, ఆస్తులు కోల్పోవడం, అప్పుల పాలు కావడం. తమ జీవితమంతా రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించినదంతా ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించుకొని, చివరకు ఆప్తుల ప్రాణాలను సైతం దక్కించుకోలేక శవాలను వెంటబెట్టుకొచ్చిన ఘటనలు మన చుట్టూ కోకొల్లలు. శంషాబాద్లోని ఒక కుటుంబంలో ముగ్గురు చనిపోగా, దాదాపు 80 లక్షల రూపాయలు హాస్పిటల్ బిల్లు చెల్లిం చుకోవాల్సి వచ్చింది. ప్రత్యేకించి సెకండ్ వేవ్లో ప్రజలు వెచ్చించిన డబ్బు వేలకోట్లలో ఉంది. ఎవరి బొక్కసాలను నింపింది, దీనిలో ఎవరి వాటా ఎంత? దీనిని వెలికితీయాల్సిన గురుతర బాధ్యత పౌరసమాజంపై ఉంది. మన దేశంలో మొత్తం ఆసుపత్రులు 69,265 కాగా, ఇందులో 43,487 ఆసుపత్రులు ప్రైవేట్లో, 25,778 ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు కర్ణాటక, ఉత్తర్ప్రదేశ్, తెలంగాణ, హరియాణా, మహారాష్ట్ర, కేరళ, పంజాబ్. అదే విధంగా మొత్తం పడకల సంఖ్య 18,99,228 కాగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 11,85,242 ఉన్నాయి. సెకండ్ వేవ్లో దాదాపు 40 రోజులకు పైగా అన్ని ఆసుపత్రులలోని పడకలు, ప్రత్యేకించి ప్రైవేట్ ఆసుపత్రులలో ఖాళీగా లేవు. ఒక అంచనా ప్రకారం ప్రతిరోజూ ఒక పడకకు ప్రైవేట్ ఆసుపత్రులు వసూలు చేసిన డబ్బు 15 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ఉంది. సరాసరి 50 వేల రూపాయలు ఒక పడకకు అనుకుంటే దాదాపు దేశ వ్యాప్తంగా ప్రజలు ప్రైవేట్ ఆసు పత్రులకు సమర్పించుకున్న డబ్బు రెండు లక్షల యాభైవేల కోట్లకు పైనే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ సమయంలో వైద్యం మీద పెట్టిన ఖర్చు చాలా తక్కువ. నిజానికి ప్రభుత్వాలు వాళ్ళు నిర్వ హించిన ప్రభుత్వాసుపత్రులలో వైద్యం అందించడం మినహా ఎటు వంటి సహాయం ప్రజలకు అందించలేకపోయారు. ఇంజెక్షన్లు, ఆక్సి జన్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ను కూడా సమర్థవంతంగా అరికట్ట లేకపోయారు. ఇటువంటి మహమ్మారిని అరికట్టడంలో రాష్ట్రాలకన్నా కేంద్రానిదే ప్రధాన బాధ్యత. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక ట్రాఫిక్ పోలీస్ చేసిన పని కూడా చేయలేకపోయింది. అధికారాలన్నింటినీ తన అధీనంలో పెట్టుకుని, రాష్ట్రాల హక్కులను నిరర్థకంగా మార్చింది. అంతే కాకుండా తాను చేసిన నిర్ణయాలను తానే విస్మరించింది. ఏప్రిల్, 2, 2020న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఒక సర్క్యులర్ను విడుదల చేసింది. 2005లో ఆమోదించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం, కోవిడ్ చికిత్సలో అవసరమయ్యే మాస్కులు, పీపీఈ కిట్లు, గ్లోవ్స్, వెంటిలేటర్స్ను ఉత్పత్తి చేయడం, కొనుగోలు చేయడం, దిగుమతి చేసుకోవడం, పంపిణీ చేయడం లాంటి పనులు కేంద్ర ప్రభుత్వం అధీనంలోని నిపుణుల కమిటీ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు తమకు ఏఏ వస్తువులు ఎన్ని కావాలో నివేదించుకుంటే, కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. ఆక్సిజన్ ఉత్పత్తి, పంపిణీని కూడా కేంద్రం తన చేతుల్లోనే ఉంచుకుంది. దీనివల్ల ఏప్రిల్, మే నెలల్లో జరిగిన అల్లకల్లోలం కళ్ళారా చూశాం. కేంద్ర ప్రభుత్వ అధికార కేంద్రీకరణ వల్ల ఎవ్వరూ ఊహించని జననష్టం, ప్రాణనష్టం వాటి ల్లింది. దీనివల్ల మందులు, ఆక్సిజన్ ఇతర వస్తువులు ఏవీ సరైన సమయంలో ఆసుపత్రులకు అందలేదు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చివరకు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా విఫ లమైన విషయం కేంద్రంలోని ప్రతిపక్షాలకే కాదు, అధికార పక్షానికీ తేటతెల్లం అయ్యింది. అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు, ఉత్తర్ప్రదేశ్లో కుంభమేళా నిర్వహణ అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే కోవిడ్ విపత్తుకి లక్షలాది మంది ప్రజల విలువైన ప్రాణాలు బల య్యాయన్న విషయం ప్రజలకర్థం కావడానికి వేరే ఉదాహరణలు అక్కర్లేదన్నది జగమెరిగిన సత్యం. నిలువునా కూలిన కుటుంబాలు, ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థ, అ«థఃపాతాళానికి కూరుకుపోయిన పేదల బతుకులు, జీవనాధారాన్ని కోల్పోయిన వృద్ధులు, మహిళలు, పిల్లలు, ఉపాధి కరువై ఉరివేసు కుంటున్న ప్రైవేటు ఉద్యోగులు, దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడు తోన్న విద్యారంగం... ఇంతకు మించిన ఉదాహరణలేవీ పాలకుల చిత్తశుద్ధిని అంచనావేసేందుకు ప్రజలకు అవసరం లేదన్నదొక్కటే సంపూర్ణ సత్యం. అందుకే అన్ని లెక్కలూ తేలాలి. అది తేల్చాల్సింది ప్రజలే. మల్లేపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
Krishnapatnam Anandaiah: దేశీయ వైద్యానికి అసలు వారసుడు
మేకలు తినని మొక్కల్లో ఔషధ గుణాలున్నాయని గుర్తించిన గొల్లకులం వారసుడు ఆనందయ్య. తరతరాలుగా ఆయన కుటుంబం మూలికా వైద్యం చేస్తోంది. ఆనందయ్యకు వారసత్వంగా వస్తున్న జ్ఞానాన్ని ఏ ఆయుర్వేద పండితుడూ పరిశీలించలేదు. దానిపై పరిశోధనలు జరపలేదు. ఇట్లా దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇక్కడ ఉన్న దేశీయ వైద్య విధానాన్నంతటినీ సమగ్రంగా అధ్యయనం చేసి, ఆధునిక అల్లోపతి వైద్య విధానాన్ని కూడా పరిగణనలోనికి తీసుకొని ఈ దేశ అవసరాలకు అనుగుణ మైన ఒక నూతన వైద్య విధానాన్ని రూపొందించే అవకాశం మనకు వచ్చింది. ఇప్పటికైనా పాత పాపాలను కడుగుకొని, కొత్త సమాజానికి పునాదులు వేస్తే చరిత్ర మనల్ని కొంతైనా క్షమిస్తుందేమో. కృష్ణపట్నం ఆనందయ్య అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకి చెందిన ఆనందయ్య కరోనా కోసం తయారుచేసి, పంపిణీ చేసిన మందు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశమంతటా చర్చనీయాంశంగా మారింది. ఆయుర్వేదం ఔషధాలు, అల్లోపతి వైద్యంపైన కూడా వాదాలూ, వివాదాలూ తలెత్తాయి. కొంత మంది ఆయుర్వేదం మాత్రమే గొప్ప దంటే, మరికొందరు అది పూర్తిగా అశాస్త్రీయమైనదని కొట్టిపారేశారు. నిజానికి ఏదేశానికైనా తమ దేశ కాలమాన పరిస్థితుల్లో ఆవిర్భవించి, అభివృద్ధి పరుచుకున్న వైద్య విధానం ఒకటుంటుంది. భారతదేశంలో అటువంటి వైద్య విధానం ఉండేది. అదే ఆయుర్వేద సిద్ధ వైద్యం, మూలికా వైద్యం, దీనికి ఇంకా ఎన్నో పేర్లున్నాయి. అయితే వాటి గతి ఎటువంటి పురోగతి లేని నిరర్ధకంగా మారిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఆనందయ్యలు ఎక్కడైతే ఆగిపోయారో అక్కడే భారత వైద్యం స్తంభించిపోయింది. భారత్లోనే కాదు, ప్రపంచమంతటా విస్తరించిన అల్లోపతి లేదా ఆధునిక లేదా, పాశ్చాత్య వైద్యం అనే పేర్లతో పిలుస్తోన్న ఇంగ్లిష్ వైద్యం రోజురోజుకీ నూతన ఆవిష్కరణ లతో మనిషిని చిరాయువు చేసేవైపు పురోగమిస్తోంది. ఎవరికి ఏ అభిప్రాయాలున్నా శాస్త్ర రీత్యా అల్లోపతి అత్యాధునిక విధానాలతో మానవుణ్ణి ఎంతో ఉన్నతస్థాయిలో నిలబెట్టింది. అయితే ఇప్పుడు మన దేశంలో ఉన్న ఆయుర్వేదం, సిద్ధ, మూలికా వైద్యాలు అశాస్త్రీయమైనవని నేను అనదలుచుకోలేదు. కానీ వాటి ఉన్నతిని, పురోభివృద్ధినీ మన సమాజమే అడ్డుకున్నది. మన తల్లిని మనమే హతమార్చినట్టుగా మన వైద్యాన్ని మనమే మట్టు బెట్టాం. చరిత్రను తవ్వితీస్తే అథఃపాతాళంలోకి తొక్కివేసిన మనకిప్ప టికీ ఎంతో విలువైన, ఉపయోగకరమైన వైద్యం బయటపడుతుంది. ఈనాటి ఆధునిక వైద్యమని చెప్పుకుంటున్న అల్లోపతికి, గ్రీకు వైద్య తాత్వికవేత్త గ్రీస్కి చెందిన హిప్పోక్రిటస్, ఆయన గురువు డెమొక్రిటస్ ఆద్యులు. హిప్పోక్రిటస్ క్రీస్తు పూర్వం 4వ శతాబ్దానికి చెందినవాడు. అప్పటివరకు మనిషి కేవలం దైవ ప్రార్థన మీద మాత్రమే ఆధారపడి ఉన్నాడు. ఎటువంటి శాస్త్రీయమైన ఔషధాలు గానీ, వైద్య విధానంగానీ లేవు. అయితే దానిని పూర్తిగా మార్చివేసి, మానవుడు తనను తాను కాపాడుకోగలడని, అందుకు వైద్యం అవసర మని, రోగాలను, రోగకారకాలను, రోగనివారణకు, రోగనిర్మూలన కోసం ఎంతో శ్రమించి ఒక విధానాన్ని రూపొందించారు. దాని పునాదుల మీదనే నేటి అల్లోపతి వైద్య విధానం వృద్ధి చెందింది. ఎన్నో వ్యాధులకు మందులు కనిపెట్టడం మాత్రమే కాదు, మరెన్నో మహ మ్మారులకు వ్యాక్సినేషన్లను కనుగొని మానవాళిని రక్షించింది. అయితే అది వ్యాపారంగా మారి, కంపెనీలు, కార్పొరేట్లు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రజలను దోచుకోవడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతోంది. ఇది వైద్యం తప్పు కాదు, దానిని వ్యాపారంగా మార్చిన కార్పొరేట్లదే ఆ తప్పిదం అని చెప్పక తప్పదు. వాటికి అండగా నిలబడుతున్న ప్రభుత్వాలది కూడా అంతకు మించిన తప్పు. అయితే అల్లోపతి ప్రగతి గురించి అందరికీ తెలుసు. అయితే మన దేశంలో మన దేశీయ వైద్యం ఎందుకు శతాబ్దాల క్రితమే ఆగిపోయింది? ఎందుకు అది ప్రజల వైద్యావసరాలను తీర్చ లేకపోతున్నది? ఇది మనం ఆలోచించుకోవాల్సిన అవసరమున్నది. సరిగ్గా గ్రీస్లో ఆధునిక వైద్యం పురుడుపోసుకున్న కాలంలోనే క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో చరకుడు అనే భారత వైద్య పితా మహుడు చరకసంహిత రాశాడు. దీనిని ఎనిమిది పుస్తకాలుగా, 120 అధ్యాయాలుగా విభజించారు. ఇందులో ఆహారం, పరిశుభ్రత, రోగ నిరోధం, వైద్యం, ఔషధాలు, వైద్యుడు, నర్సు, రోగి అనుసంధానం గురించి వివరంగా రాశారు. ఇది పూర్తిగా ఎంతో అధ్యయనం చేసి, రాసిన పుస్తకం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేమిటంటే, అది బౌద్ధం అనంతరం రాసిన పుస్తకం. అయితే బౌద్ధం సమయంలో వైద్యం ఆచరణలో ఉంది. జీవకుడు అనే వైద్యుడి గురించి బౌద్ధ సాహిత్యం ప్రస్తావించింది. అంతేకాకుండా స్వయంగా బుద్ధుడు వైద్యుడనే ప్రస్తావన కూడా ఉంది. బౌద్ధారామాలు అన్నీ మిగతా విష యాలతో పాటు, ఆరోగ్య కేంద్రాలుగా పనిచేశాయి. బౌద్ధ బిక్కులు వైద్యాన్ని కూడా అనుసరించారు. అప్పటివరకు వేదాలు, మహిమలు తప్ప వైదిక మతాన్ని ఆచరిస్తున్న పురోహిత, బ్రాహ్మణ వర్గం వైద్యంపై దృష్టిపెట్టలేదు. పైగా వైద్యం చేస్తున్న వాళ్ళను సామాజిక వెలివేతకు గురిచేశారు. ఎందుకంటే, రోగాలను, వారి రుగ్మతలను రూపుమాప డానికి వాళ్లందరినీ అంటుకొని వైద్యం చేయాలి. వారిని అంటుకో వడం ద్వారా వాళ్ళు మలినమైపోయారని వైదిక పెద్దలు భావించారు. అయితే బౌద్ధం ప్రభావం ఉన్నంత వరకు వాళ్ళు ఏమీ చేయలేక పోయారు. క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దంలో మౌర్య చక్రవర్తి అశోకుడి మనవడు బృహద్రధుణ్ణి బ్రాహ్మణ వర్గానికి చెందిన పుష్యమిత్ర శుంగుడు హత్య చేసి, బ్రాహ్మణ ఆధిపత్యంతో కూడిన శుంగ వంశ స్థాపన చేశాడు. ఆ తర్వాత మరో బ్రాహ్మణవంశమైన కణ్వ రాజ్యం వచ్చింది. ఈ రెండు రాజ్యాలు బౌద్ధాన్ని దెబ్బతీసి, దాని ప్రగతిశీల విధానాలను తిరగదోడాయి. అందులో భాగంగానే మనుధర్మం వచ్చింది. అందులో వైద్యులను నీచమైన వాళ్ళుగా నిర్ధారించారు. మనుధర్మంలోని మూడవ అధ్యాయంలోని 152వ, 180వ నిబం ధనల్లో వైద్యుడు ఎలాంటి పవిత్ర కార్యక్రమాల్లో, ప్రత్యేకించి యాగాల్లో పాల్గొనకూడదని, అతనికి ఆహారం అందిస్తే అది చీము, నెత్తురుతో సమానమని తీర్మానించారు. అదేవిధంగా 4వ అధ్యాయం లోని 212, 220 నిబంధనల్లో వైద్యునికి తిండి పెట్టకపోవడం మాత్రమే కాదు, ఆయన చేతి తిండిని తినకూడదని కూడా మను« ధర్మం శాసించింది. భారత వైద్యం నేలకరవడానికి ఇది తొలి దెబ్బ. తర్వాత వైదిక మతం బ్రాహ్మణ మతంగా మారి ముందుకు వెళుతున్న సమయంలో అదే ఆయుర్వేదాన్ని తమ సొంతం చేసుకు న్నారు. అయితే వాళ్ళు ఈ వైద్యాన్ని మిగిలిన కులాలకు నేర్పించ కుండా జాగ్రత్తపడ్డారు. దీంతో వైద్యం పూర్తిగా బ్రాహ్మణుల సొంత మైపోయింది. అయితే మిగతా ప్రజలు బౌద్ధుల నుంచి నేర్చుకున్న విజ్ఞానం, తమ అనుభవంతో సంపాదించుకున్న జ్ఞానంతో వైద్యాన్ని అలవర్చుకున్నారు. అందుకే శూద్రులలో మంగలి(నాయీబ్రాహ్మణ) కులం వారు గొప్ప వైద్యులుగా ఆరోజు సేవలందించారు. మంగలి కులానికి చెందిన మహిళలు మంత్రసానులుగా వేల సంవత్సరాలు కోట్లాది మంది నూతన శిశువులకు జన్మనిచ్చారు. అయితే వీళ్ళు కూడా అప్పుడు అంటరాని కులాలుగా పిలుచుకునే మాల, మాదిగల లాంటి వారికి వైద్యం అందించడంలో చొరవచూపడం లేదు. దానితో అనివార్యంగా పంబాల, బైండ్ల వృత్తి ఉనికిలోనికి వచ్చింది. ఆనందయ్య కుటుంబం కూడా తరతరాలుగా మూలికా వైద్యం చేస్తున్నది. ఈయన గొల్లకులానికి చెందినవాడు. గొల్లకులం వారు మేకలు, గొర్రెలు మేపడానికి అడవుల్లోకి వెళ్ళేవారు. అక్కడ మేకలు తినని చెట్లు చిన్న చిన్న మొక్కలు ఉండేవి. వాటిని గమనించడం మొదలుపెట్టారు. వాటిని తమ అనుభవం ద్వారా ఔషధ మొక్కలుగా గుర్తించారు. ఆ వారసత్వమే ఆనందయ్య. అయితే ఆనందయ్యకు వారసత్వంగా వస్తున్న జ్ఞానాన్ని ఏ ఆయుర్వేద పండితుడూ పరిశీలిం చలేదు. దానిపై పరిశోధనలు జరపలేదు. ఇట్లా దేశవ్యాప్తంగా కొన్ని లక్షలమంది ఉన్నారు. ఇక్కడ ఏర్పడిన కుల వ్యవస్థ, బ్రాహ్మణ ఆధి పత్య భావజాలం మన దేశ వైద్యవిధానానికి గొడ్డలిపెట్టుగా మారింది. ఆ విధంగా మన దేశంలో మన వైద్యం తెరమరుగైంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇక్కడ ఉన్న దేశీయ వైద్య విధానాన్నంతటినీ సమగ్రంగా అధ్యయనం చేసి, ఆధునిక అల్లోపతి వైద్య విధానాన్ని కూడా పరిగణనలోనికి తీసుకొని ఈ దేశ అవసరాలకు అనుగుణ మైన ఒక నూతన వైద్య విధానాన్ని రూపొందించే అవకాశం మనకు వచ్చింది. ఇప్పటికైనా పాత పాపాలను కడుగు కొని, కొత్త సమాజానికి పునాదులు వేస్తే చరిత్ర మనల్ని కొంతైనా క్షమిస్తుందేమో. వ్యాసకర్త :మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు 81063 22077 -
వాళ్లను గుర్తించే సంస్కారం లేదా?
ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాల్లో శ్మశానాలలో శవాలు బారులు తీరి ఉండడం, దహన సంస్కారాలకు చోటే దొరక్క పోవడం, కుప్పలుతెప్పలుగా వస్తోన్న శవాలను దహనం చేయడంలో కాటికాపరులు పడుతోన్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. శ్మశానాలకు వచ్చే పోయే వారివల్ల జబ్బులపాలై మరణిస్తోన్న వీరి ప్రాణాలను లెక్కలు కట్టే నాథుడే లేడు. వారి చావులకు ఏ సంస్కారాలూ ఉండవు, ఏ సంస్కారులకీ వారి చావులు పట్టవు. తమ జీవితాలను ఫణంగా పెట్టి దహన సంస్కారాలు చేస్తున్న వాళ్ళమని చెప్పుకోవడానికి గానీ, ఎదుటి వారు నమ్మడానికి గానీ వారికో గుర్తింపు కార్డు లేదు. శ్మశానాల్లో శవాలతో ప్రతిరోజూ చస్తూ బతికే వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాల్సిన అవసరాన్ని ఇప్పటికైనా గుర్తించాలి. ‘‘ఏది నా భార్య. ఏది నా కుమారుడు, నేను ఏకాకిని, కాదు... సర్వజనులూ ఏకాకులే... అన్నదమ్ములున్, ఆలు బిడ్డలున్, కన్నతల్లిదండ్రులున్, స్నేహితుల్, బంధువుల్ వెంటరారు తుదిన్..! వెంటవచ్చునది అదే సత్యం.. అదే యశస్సు’’ ఇవి సత్యహరిశ్చంద్ర పద్యనాటకంలో, హరిశ్చంద్రుడు శ్మశానంలో ఆలపించిన పద్యంలోని కొన్ని పంక్తులు. ప్రముఖ సాహితీ వేత్త బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రాసిన ఈ పద్యం ఈనాటి కోవిడ్ పరిస్థితులకు అద్దం పడుతోంది. మనిషి జీవితం క్షణభంగురమేననీ, ఎంతటి సంపన్నుడైనా తనువు చాలించిన తరువాత ఎవ్వరూ వెంట రారని, ఎంతగా ప్రేమించేవారైనా, గౌరవించేవారైనా చనిపోయిన వాళ్ళతో ఎవ్వరూ మరణించరు అని తేల్చి చెప్పేదే ఈ పద్యం. కానీ, ఈ రోజులు మహా చెడ్డవి. బ్రతుకు మీద భ్రమలు సన్నగా చెరిగిపోతోన్న స్థితి. ఎప్పుడో ఒకప్పుడు వినిపించే చావు మాట ఇప్పుడు ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తూ, సమస్త జనావళిలో విషా దాన్ని నింపుతోంది. చనిపోయిన వారితో చనిపోనక్కర్లేదు, కానీ కనీసం మరణించిన వారి జ్ఞాపకాలను మననం చేసుకుంటూ శ్మశానం దాకా తోడెళ్ళేవారే కరువైన దుస్థితి. ఇంత దయనీయ స్థితిలోనూ మన శరీరం మట్టిలో కలిసిపోయేందుకు తోడ్పడే మనిషి మరొకరుంటారు. అతడే కాటికాపరి. ఇంతటి ఘోర విపత్తులోనూ ఏ బంధమూ, సంబం ధమూ లేకపోయినా, కాటిలో తోడు వస్తున్నది, కట్టెకాలే వరకూ కడ దాకా నిలుస్తున్నదీ కాటికాపరులు మాత్రమే. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో శ్మశానాలకు కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతోన్న శవాలకు శాస్త్రోక్తంగా మంత్రతంత్రాల మధ్య దహన సంస్కారాలు కానిచ్చే పరి స్థితుల్లేవు. కానీ, కాటికాపరులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి వేన వేల శవాల దిబ్బలను అపురూపంగా పేరుస్తున్నారు. ఎంతో శ్రద్ధతో అనామకుల శవాలకు దహన సంస్కారాలు చేస్తున్నారు. ఆయా మతానుసారంగా దహన సంస్కారాలు జరుపుతారు. ఒకరు పూడ్చిపెడితే, మరొకరు కాలుస్తారు. దళితులు సహా కొన్ని శూద్రకులాలు ఖననం చేస్తారు. దహనం కానీ, ఖననం కానీ చిన్న చిన్న పల్లెల్లో, గ్రామాల్లో నదులు, వాగులు, నీటి ప్రవాహాలున్న చోట్ల, నది ఒడ్డున జరుగుతుంటాయి. అక్కడ ప్రత్యేకించి శ్మశానాలు తక్కువ. ఒకవేళ ఉన్నా, ప్రత్యేకించి కాటికాపరులు ఉండరు. అయితే ఇలాంటి చోట్ల కూడా అంటరాని కులాలుగా ముద్రపడిన దళితులతోనే తరతరా లుగా ఆ పనిచేయిస్తుంటారు. దహనమైతే చెట్లు నరికి కట్టెలు బండ్ల కెత్తి, చితిపేర్చి, దహనకార్యక్రమాన్ని నిర్వహించే వరకూ వారే చేస్తారు. ఖననమైతే గోతిని తవ్వి పాతిపెట్టే కార్యక్రమం దళితులే చేస్తారు. అందుకు వారికిచ్చే డబ్బులు అతి స్వల్పం. నగరీకరణ తర్వాత జనాభా పెరుగుతూండడంతో నీటి వనరుల అవకాశాలు తక్కువగా ఉండడం వల్ల ప్రత్యేకించి శ్మశానాలు తప్పని సరి అయ్యాయి. దానితో కొంతమందికి అందులో పనిచేసే అవకాశం వచ్చింది. అందరూ అసహ్యించుకునే పనులు, ఎవ్వరూ సాహసించని పనులు, అందరూ నీచంగా చూసే పనులు చేయాల్సింది మళ్ళీ ఆ దళి తులే. అగ్రవర్ణాల అవసరం వీరికి పని కల్పించింది. అలా దేశ వ్యాప్తంగా ఈ పనిలో ఉంటున్నవాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఇప్పటికీ ఉత్తరాదిలో డోమ్, ఛమార్, మహర్లు. దక్షిణాదిన అయితే మాల, మాదిగ, పరయ, పులియ, హోలియ కులాలు మాత్రమే అంతిమ సంస్కారాలను నిర్వహిస్తారు. మరే కులంవారూ ఈ పనిలో ఇప్పటికీ లేరు. ఉండరు. ఎందుకంటే శవం మన దగ్గర విలువలేనిది. అది భయంగొలిపేది. రోగాలను వెంట తెచ్చేది. అదే భావన వల్ల కావచ్చు. ఇలాంటి భయంగొలిపే పనుల్లో సౌకర్యవంతమైన, సుఖవంతమైన ఇతర వర్గాలుండకపోవడం మన దేశంలోని కుల‘సంస్కారాల్లో’ ఒకటి. దళిత జాతిని నీచంగా చూసే కుసంస్కారమే తప్ప అది మరొ కటి కాదు. ఇదొక్కటే కాదు ప్రమాదకరమైన పనులు, వృత్తులు, అన్నీ మాల, మాదిగల్లాంటి కులాలే చేశాయి. ఇప్పటికీ చేస్తున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్లో మరణిస్తోన్న వారి సంఖ్య చాలా ఎక్కువ. ప్రభుత్వాలు చూపెడుతోన్న లెక్కలు, కాకి లెక్కలన్నది జగమెరిగిన సత్యం. అయితే ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాల్లో శ్మశానాలలో శవాలు బారులు తీరి ఉండడం, దహన సంస్కారాలకు చోటే దొరక్కపోవడం. కుప్పలుతెప్పలుగా వస్తోన్న శవాలను దహనం చేయడంలో కాటికాపరులు పడుతోన్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు, వాస్తవ పరిస్థితులు మరింత దయనీయంగానే ఉంటాయన్నది తెలిసిన విషయమే. ఈ పరిస్థితుల్లో శ్మశానాలకు వచ్చే పోయే వారివల్ల జబ్బులపాలై మరణిస్తోన్న వీరి ప్రాణాలను లెక్కలు కట్టే నాథుడే లేడు. వారి చావులకు ఏ సంస్కారాలూ ఉండవు, ఏ సంస్కారులకీ వారి చావులు పట్టవు. ఇటీవల హైదరాబాద్లోని మల్లె పల్లి ప్రాంతంలో దహన సంస్కారాల్లో ఉన్న కాటికాపరి యువకులు కాస్త విరామం దొరికితే తిండితినేందుకు వెళ్ళి వస్తుంటే, పోలీసులు అడ్డుకొని చేయిచేసుకోవడం గురించి వార్తలొచ్చాయి. కర్ఫ్యూ ఉండటం వల్ల అట్లా చేశామని పోలీసులు చెప్పారు. కానీ వాళ్ళు తమ జీవితాలను ఫణంగా పెట్టి దహన సంస్కారాలు చేస్తున్న వాళ్ళని చెప్పుకోవడానికి గానీ, ఎదుటి వారు నమ్మడానికి గానీ వారికో గుర్తింపు కార్డు లేదు. అది ఇవ్వాలన్న ధ్యాస ఇన్నేళ్ళుగా పాలకులకు పట్టలేదు. శ్మశానాల్లో శవాలతో ప్రతిరోజూ ఛస్తూ బతికే వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాల్సిన అవసరాన్ని ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తించాలి. కుటుంబ సభ్యులే పారిపోతోన్న నేటి సమయంలో ఎటు వంటి రక్షణ కవచాల్లేకుండా, మాస్క్లు, పీపీఈ కిట్ల మాటే లేకుండా, కనీసం సురక్షితమైన మంచి తాగునీటి సౌకర్యం కూడా లేకుండా శ్మశా నాల్లో శవాల్లా విలువలేని బతుకీడుస్తోన్న వారిని గురించి చర్చిం చాల్సిన సమయమిది. వారికో గుర్తింపునివ్వాల్సిన సందర్భమిది. ఆరోగ్య భద్రతకు సంబంధించి ఎటువంటి భరోసా లేదు. వీళ్ళలో నూటికి 95 శాతం మంది ప్రభుత్వ వేతనాలు లేకుండా పని చేస్తున్నారు. సాధారణ సమయాల్లోనైతే, మృతుల కుటుంబాల నుంచో, లేదా అక్కడికి వచ్చిన వారినుంచో పదో పరకో రాలేది. కానీ ఇప్పుడు కోవిడ్ కారణంగా శవమెవరిదో, తెచ్చిందెవరో తెలియని స్థితిలో చనిపోయిన వారితో ఎటువంటి సంబంధం లేని మున్సిపా లిటీ కార్మికులు వాళ్ల భౌతిక కాయాలను మోసుకొస్తోంటే ఇక వారికి డబ్బులిచ్చే నాథుడెవరు? అయినా అక్కడ శవాలు కాలుతూనే ఉంటాయి. బంధు మిత్రుల దుఃఖం తోడుగా రావాల్సిన భౌతిక కాయాలు దిక్కూమొక్కూ లేని శవాల మూటలై చుట్టుముడుతోంటే, వీరు మాత్రం, అది తమకు మాత్రమే దక్కిన భాగ్యంగా.. మరణిస్తోన్న సమస్త మానవాళికీ కాదనకుండా కడసారి సంస్కారాలు నిర్వహి స్తోన్న ఆ చేతులను మరువ తగునా అన్నదే నేటి ప్రశ్న. కానీ కోవిడ్ ఈ సమాజం గొప్ప సాంప్రదాయాలుగా భావి స్తున్నవాటన్నింటినీ తుడిచిపెట్టేసింది. వేదమంత్రాలతో అంతిమ సంస్కారాలు జరగకపోతే, ముక్తి లభించదని నమ్ముతున్న వేద బ్రాహ్మణులు ఈ రోజు శ్మశానాల వైపు కన్నెత్తి చూడడానికే భయపడు తున్నారు. పదులు, వందల సంఖ్యలో ఒకేసారి కాష్టాలు కాలుతోంటే వేదాల ఘోష అక్కడ ఎక్కడా వినిపించడం లేదు. ఢిల్లీలోని ఒక శ్మశాన వాటికలో కాటికాపరి కుటుంబానికి చెందిన ఒక దళిత యువకుడే వేద మంత్రాలు జపిస్తున్నట్లు వార్త వచ్చింది. సమాజంలో ఇటువంటి పాత్రను నిర్వహిస్తోన్న కాటికాపరుల జీవితాల్లో మార్పునకు ఇప్పటి వరకు ఎవ్వరూ దృష్టిసారించిన దాఖలాల్లేవు. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ వృత్తిలో జీవిస్తున్నారు. కొందరి జీవితాలు ఇళ్ళులేక శ్మశా నాల్లోనే పొగచూరిపోతున్నాయి. జబ్బులపాలవుతోన్న వారు ఇంకెం దరో. ఇలాంటి ఎంతోమందికి కనీసం నిలువ నీడలేకపోవడం ప్రభు త్వాల నిర్లక్ష్యానికి ప్రత్యక్ష నిదర్శనంగా భావించక తప్పదు. -మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
ప్రపంచ విప్లవోద్యమ చుక్కాని లెనిన్
‘‘మార్క్స్ తదనంతరం విప్లవ కార్మికోద్యమం ప్రపంచానికి అందించిన గొప్ప మేధావి వి.ఐ. లెనిన్’’ అంటూ 1924లో ఆనాటి హంగేరియన్ తాత్విక వేత్త జార్జి లూకాస్ వ్యాఖ్యానించారు. అలాంటి లెనిన్ పేరు నేడు కొంత తక్కువగా వినిపిస్తుండవచ్చు. ప్రపంచ కార్మికలోకపు వేగుచుక్క లెనిన్ పేరుని స్మరించుకోవడానికి కూడా కొందరు భయపడి ఉండవచ్చు. లేదా కొందరు కావాలనే ఆతని పేరుని మరుగుపర్చే ప్రయత్నంలో ఉండి ఉండవచ్చు. కానీ 20వ శతాబ్దంలో ప్రపంచ గమనాన్ని, కోటానుకోట్ల మానవ మెదళ్ళను కదిలించిన, అనంత జనసమూహాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేసిన పేరు ఇది. 1917లో జార్ చక్రవర్తికి వ్యతిరేకంగా జరిగిన విప్లవ పోరాటం విజయవంతమై, అక్టోబర్ విప్లవంగా ప్రపంచ ప్రసిద్ధికెక్కింది. ఆ విప్లవంలో ఎగిసిపడిన అరుణ పతాకంలో అగుపించిన ఏకైక ప్రతిబింబం లెనిన్. 151 సంవత్సరాల క్రితం.. 1870, ఏప్రిల్ 22న రష్యాలోని సింబిర్క్స్లో లెనిన్ జన్మించారు. ఆయన పూర్తిపేరు వ్లాదిమిర్ ఇల్విచ్ ఉల్వనోవ్ లెనిన్. ఆయన సంపన్న కుటుంబంలోనే జన్మించారు. ఆయన తండ్రి పాఠశాల అధికారిగా పనిచేశారు. లెనిన్ సోదరుడు జార్ చక్రవర్తిపై హత్యాయత్నం చేశాడన్న నేరం మోపి, ఆయనకు 1887లోనే ఉరిశిక్ష విధించారు. లెనిన్ కూడా నిరంకుశ రాచరిక జార్ చక్రవర్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొనడం వల్ల 1897లో కజన్ విశ్వవిద్యాలయం నుంచి ఆయన్ను బహిష్కరించి, సైబీరియాకి పంపించి వేశారు. ఆయన మొదట్లో రష్యన్ సోషల్ డెమొక్రటిక్ లేబర్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆ తర్వాత బోల్షివిక్ గ్రూప్నకు వ్యవస్థాపక నాయకుడయ్యారు. ఆ తర్వాత లెనిన్ అందించిన నాయకత్వం వల్ల ఆయన అవలంబించిన విప్లవ ఎత్తుగడ వల్ల 1917లో జార్ చక్రవర్తి ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత ఆవిర్భవించిన సోవియట్ యూనియన్ సోషలిస్టు రిపబ్లిక్కు చైర్మన్గా ఎన్నికై, 1924లో తుది శ్వాస విడిచేవరకు కొనసాగారు. ఆయన నాయకత్వం, ఆయన రచనలు, విప్లవోద్యమాన్ని విజయపథంలో నడిపించిన ఆయన సారథ్యం ఆనాడు యావత్ ప్రపంచ గమనాన్నే మార్చేందుకు దోహదపడ్డాయి. ఆయన తాత్విక భూమికకు ఆయన రచనలు సాక్ష్యాలు. ముఖ్యంగా రాజ్యం–విప్లవం, కమ్యూనిజం–ఒక బాలారిష్టం, ఒక అడుగు ముందుకు-రెండడుగులు వెనక్కి, సామ్రాజ్యవాదం-పెట్టుబడి దారి విధానపు అత్యున్నత దశ, లాంటి రచనలు ఆనాటి ప్రపంచ కార్మికోద్యమ, ప్రజాస్వామిక, విప్లవోద్యమకారులకు దారిచూపే దివిటీలయ్యాయి. ముఖ్యంగా ‘సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ’ అనే రచన ఈనాటికీ ప్రపంచ ఆర్థిక సిద్ధాంతాలలో అత్యంత అరుదైన రచన. ఆ పుస్తకంలో లెనిన్ ఆనాడు రష్యాలోని పెట్టుబడిదారీ పద్ధతులను, యూరప్లో జరుగుతున్న పెట్టుబడిదారీ పరిణామాలను చాలా లోతుగా అధ్యయనం చేశారు. ఆనాటి సామ్రాజ్యవాద దశను నిర్వచించడానికి ఆయన కొన్ని సూత్రీకరణలు చేశారు. అందులో మొదటిది, ఉత్పత్తిని, పెట్టుబడిని కేంద్రీకృతం చేసే గుత్త సంస్థలను రూపొందించడం, రెండవది, బ్యాంకుల పెట్టుబడిని, పారిశ్రామిక పెట్టుబడులను కలిపివేసి ఫైనాన్షియల్ పెట్టుబడిని తయారుచేయడం, మూడవది, అంతకు ముందు ఎగుమతిచేసే వస్తువులతో పాటు, పెట్టుబడిని ఎగుమతి చేసే విధానాలను మొదలు పెట్టడం, నాలుగవది, అప్పటికే ఏర్పడిన ప్రపంచ పెట్టుబడి గుత్త సంస్థలు భౌగోళికంగా తమలో తాము విభజించుకోవడం, అయిదవది పెట్టుబడి శక్తులు ప్రాంతాల వారీగా తమ ఆధిపత్యాన్ని నెలకొల్పుకోవడం. ఈ అయిదు అంశాలు పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రపంచ వ్యాపితం చేయడానికి ఉపయోగపడ్డాయి. ఈ పుస్తకాన్ని 1916లో లెనిన్ రాశారు. అంటే వందేళ్లు పూర్తయ్యాయి. ఈ రోజు సామ్రాజ్యవాదం రూపు మార్చుకొని ప్రపంచీకరణ అవతారం ఎత్తింది. ఆయా దేశాల్లోని పాలక వర్గాలను తమ అనుచరులుగా మార్చుకొని, ఆ దేశాలలోని ప్రజలను ముఖ్యంగా మధ్య తరగతి వర్గాలను, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వచ్చిన అభివృద్ధితో తయారు చేసిన వస్తు సముదాయం మత్తులో ముంచి వేసి, ఎన్నటికీ బయటపడే వీలులేని, ఆర్థికచట్ర వలయంలోకి తోసివేసి, అంతర్జాతీయ మార్కెట్ను కొల్లగొడుతోంది. ఇప్పుడు మనమంతా ఆ మాయాజాలంలో ఇరుక్కుని కొట్టుమిట్టాడుతున్నాం. 1917లో రష్యాలో విజయం సాధించిన అక్టోబర్ విప్లవం ప్రపంచంలోని అన్ని దేశాల వలసపాలకులపై ఆయా దేశాల ప్రజలు తిరుగుబాటు చేసే విధంగా స్ఫూర్తిని కలిగించింది. కమ్యూనిజాన్ని ఏ కోశానా సమర్థించని మహాత్మాగాంధీ, మానవతా సిద్ధాంతమే తన జీవిత కవితా వస్తువుగా స్వీకరించిన రవీంద్రనాథ్ ఠాగూర్లు కూడా రష్యా విప్లవాన్ని ఆహ్వానించారు. జవహర్లాల్ నెహ్రూ 1920లోనే రష్యాను సందర్శించి ప్రేరణ పొందారు. ఆ తర్వాత జరిపిన కాంగ్రెస్ మహాసభల్లో సోషలిజం ఆవశ్యకతను, సమానత్వ భావనలపై సుదీర్ఘంగా మాట్లాడారు. రష్యా విప్లవం తర్వాతనే ప్రపంచంలోని అన్ని దేశాల్లో ప్రజాస్వామ్య ఉద్యమాలు, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు, జాతుల విముక్తి పోరాటాలు వెల్లువెత్తాయి. చైనా లాంటి ఒక పెద్ద దేశంలో మావో సే టుంగ్ నాయకత్వంలో చైనా విప్లవం విజయవంతమైంది. ‘‘జాతులు విముక్తిని కోరుతున్నాయి, దేశాలు స్వాతంత్య్రాన్ని కోరుతున్నాయి. ప్రజలు విప్లవాన్ని కోరుతున్నారు’’ అంటూ ఆనాటి విప్లవ యుగ ప్రాముఖ్యతను మావో ఉత్తేజకరంగా చాటిచెప్పారు. ఆనాడు లెనిన్ యువతరం కలల నాయకుడిగా నిలిచారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి ఉరికొయ్యలను ముద్దాడిన భగత్సింగ్ కూడా లెనిన్ తాత్విక భావాల పట్ల ఆకర్షితులయ్యారు. భగత్సింగ్కి ఉరిశిక్షను అమలు చేసే ముందు జైలు అధికారులు చివరి కోరిక ఏమిటని అడగ్గా ‘‘నేను లెనిన్ జీవిత చరిత్రను చదువుతున్నాను. అది పూర్తిచేయాలనేదే నా కోరిక’’ అని భగత్ సింగ్ చెప్పిన మాటలు ఆనాటి నుంచి నేటి వరకు యువతరం గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఎన్ని తరాలు మారినా, మరెన్ని వక్ర భాష్యాలు, సిద్ధాంతాలు ఉద్భవించినా ప్రపంచగమనాన్ని మార్చిన వ్యక్తులను ఎవ్వరూ విస్మరించలేరు. మానవజాతి మనుగడ కొనసాగినంత వరకూ, దోపిడీ, పీడనలు తొలగిపోయి, ఎటువంటి వివక్షకూ తావులేని సమసమాజం ఆవిష్కృతం అయ్యేవరకు లెనిన్ అనే మూడక్షరాలు యావత్ సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు (81063 22077) (నేడు లెనిన్ 151వ జయంతి) -
ఉపాధికి ఆమడ దూరంలో విద్య
మన ఇంట్లో, మన ఊళ్లో, మన వీధిలో ఎంతమంది యువకులు పనులు లేక తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవిస్తున్నారనేది మనందరికీ తెలుసు. మన దేశంలో విద్యావంతులుగా చెప్పుకుంటున్న వాళ్లలో నూటికి 90 మంది నైపుణ్యం లేని అక్షరాస్యులు మాత్రమే. ఐక్యరాజ్యసమితి నిర్వచనం ప్రకారం, విద్య అంటే అక్షరాస్యత, చదువు, నైపుణ్యం, నైతిక విలువల శిక్షణ. కానీ మనం చదువును మాత్రమే విద్య అంటున్నాం. పారిశ్రామిక, సాంకేతిక సంస్థల, వ్యాపార వాణిజ్య రంగాలకు అవసరమైన నైపుణ్యాలను అందించే విద్యా వ్యవస్థ రావాలి. అప్పుడే మన దేశ నిరుద్యోగ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. కోట్లాది మంది నిరుద్యోగ యువకులకు భవిష్యత్ మీద ఒక విశ్వాసం కలుగుతుంది. ‘‘షెడ్యూల్డ్ కులాలు ఆర్థికంగా ఎదగడానికి అక్షరాస్యత ఇచ్చే చదువుకన్నా, సాంకేతిక విద్య చాలా ముఖ్యం. సాంకేతిక విద్యను అభ్యసించడం ఈ రోజుల్లో చాలా కష్టం. చాలా ఖర్చుతో కూడుకున్నది. కులతత్వం కలిగిన హిందువులు నైపుణ్యం లేని షెడ్యూల్డ్ కులాలను మరింత దోపిడీకి, అణచివేతకు గురిచేస్తారు. అందువల్ల షెడ్యూల్డ్ కులాలకు భారత ప్రభుత్వం శాస్త్ర, సాంకేతిక విద్యలో అవకాశాలు కల్పించాలి. నిపుణు లుగా తీర్చిదిద్దాలి’’ అంటూ బాబాసాహెబ్ అంబేడ్కర్ 1942 అక్టో బర్ 29వ తేదీన ఆనాటి గవర్నర్ జనరల్కు సమర్పించిన ఒక విజ్ఞాపనలో అభ్యర్థించారు. షెడ్యూల్డ్ కులాల సమస్యలపై ఒక సుదీర్ఘమైన మెమోరాండంను అంబేడ్కర్ సమర్పించారు. అందులో నాలుగు భాగాలున్నాయి. మొదటిది రాజకీయ ప్రతిపాదనలు, రెండోది విద్యా సంబంధమైన కోర్కెలు, మూడోది, నాలుగోది ప్రధానంగా అంటరానితనం వలన ఎదురవుతున్న సమస్యలు, దాడులు అందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి పేర్కొన్నారు. అంతేకాకుండా, కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలను కూడా అంబేడ్కర్ చేశారు. ఆరోజు ఉనికిలో ఉన్న ఎన్నో సాంకేతికమైన పనులను, శిక్షణ లను ఆయన అందులో ప్రస్తావించారు. ‘‘ఆర్ట్స్, న్యాయ సంబం ధమైన చదువులవల్ల ఎక్కువ ప్రయోజనం ఆశించలేం. శాస్త్ర, సాంకే తిక విద్యవల్ల మాత్రమే షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు, హిందూ కులాల విద్యావంతులతో పోటీపడగలరు. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం చొరవచూపి శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విద్యను అభ్యసించ అలవడుతున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ఉపకార వేతనాల ద్వారా సహాయం అందించాలి’’ అని కూడా కోరారు. ఇవి 80 ఏళ్లనాటి మాటలు. కానీ ఈనాటికీ ఇవి అక్షర సత్యాలు. ఈ మాటలు నేడు కేవలం షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు మాత్రమే పరిమితమై లేవు. శాస్త్ర, సాంకేతిక, వృత్తి నైపుణ్యమైన విద్యను అభ్య సించిన కోట్లాది మంది యువకులు నిరుద్యోగంతో లేదా అర్హతకు సంబంధం లేని పనులతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవల వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ప్యూ’ (pew) అనే సంస్థ నిర్వహించిన అధ్య యనం ప్రకారం ఒక కోటీ 80 లక్షల 60 వేల మంది నిరుద్యోగులు ఉన్నారు. అదే విధంగా 39 కోట్ల 30 లక్షల 70 వేల మంది అరకొర పనులతో, చాలీచాలని జీతాలతో జీవితాలు వెళ్లదీస్తున్నారు. ఇవి అవ గాహనకు మాత్రమే. మనందరికీ తెలుసు మన ఇంట్లో, మన ఊళ్లో, మన వీధిలో ఎంతమంది యువకులు పనులు లేక తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవిస్తున్నారనేది. అందుకు చాలా కారణాలున్నాయి. అందులో ముఖ్యమైన అంశం బాబాసాహెబ్ అంబేడ్కర్ 1942లో పేర్కొన్న విషయం. మన దేశంలో నైపుణ్యం కలిగిన యువకులు పనిచేసే సామర్థ్యం కలిగిన వాళ్లలో కేవలం 4.69 శాతం మాత్రమే. అదే చైనాలో 24 శాతం, 52 శాతం అమెరికాలో, 68 శాతం బ్రిటన్లో, 75 శాతం జర్మ నీలో, 80 శాతం జపాన్లో, 96 శాతం దక్షిణ కొరియాలో ఉన్నట్టు ఇటీవలి అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అదే విధంగా 2021లో ప్రకటించిన నిరుద్యోగ గణాంకాల ప్రకారం ఇండియాలో చదువు వారీగా నిరుద్యోగుల శాతం ఉన్నది. అందులో గ్రాడ్యుయేట్లు 16.3 శాతం, పోస్ట్గ్రాడ్యుయేట్లు 14.2 శాతం, సర్టిఫికెట్ కోర్సులు చదివిన వాళ్లలో 11.3 శాతం, డిప్లొమా చేసిన వాళ్లలో 11.1 శాతం నిరుద్యో గులుగా ఉన్నారు. అదేవిధంగా హైస్కూల్ చదివిన వాళ్లలో 7.4 శాతం, ప్రైమరీ చదివిన వాళ్లలో 5.4 శాతం, నిరక్షరాస్యుల్లో 2 శాతం నిరుద్యోగులు ఉన్నారు. ఉన్నత విద్య చదివిన వాళ్లలో ఎక్కువమంది నిరుద్యోగులుగా ఉన్నారని అర్థమవు తోంది. నిరక్షరాస్యులలో 2 శాతం నిరుద్యోగులుగా ఉన్నారు.. చదువు కున్నవాళ్లలో ఎక్కువమంది నిరుద్యోగులుగా ఉన్నారు. దీనికి పెద్దగా అధ్యయనాలు, పరిశోధనలు అవసరం లేదు. అయితే విద్యావంతుల్లో నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉండటానికి ప్రధానమైనది మన విద్యా వ్యవస్థ. మన చదువుల్లో ఎక్కువమంది ఆర్ట్స్ విభాగంలో ఉన్నారు. ఇందులో 30 శాతం మంది విద్యార్థులు ఉండగా, సైన్స్లో 16 శాతం మంది, కామర్స్లో 14 శాతం మంది, ఇంజనీరింగ్లో 12 శాతం మంది, మెడిసిన్లో 3 శాతం, ఐటీలో 2.4 శాతం, 2 శాతం మేనేజ్ మెంట్ కోర్సుల్లో చదువుతున్నట్లుగా ఇటీవల విడుదలైన ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్లో వెల్లడైంది. ఆర్ట్స్, కామర్స్, సైన్స్ రంగాలు కలిసి 60 శాతం మంది చదువుతున్నారు. ఉద్యోగావకాశాలు ఉన్న ఇంజనీరింగ్, మెడిసిన్, ఇన్ఫర్మేషన్ టెక్నా లజీ, మేనేజ్మెంట్ కోర్సులో చాలా తక్కువమంది ఉన్నారు. ఇందులో ఇంజనీరింగ్లో 12 శాతం ఉన్నారు. మనకు తెలుసు మన దేశంలో ఇంజనీరింగ్ చదువులు ఎంత ఉన్నతంగా ఉన్నాయో. మెడిసిన్ మేనే జ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు కొంత మెరుగ్గా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. మన దేశంలో విద్యా వ్యవస్థ ఇటువంటి ప్రణాళిక లేని ఒక అగమ్యగోచరమైన విధానంగా కొనసాగుతున్నది. ఇక్కడ విద్యా వంతులుగా చెప్పుకుంటున్న వాళ్లలో నూటికి 90 మంది నైపుణ్యం లేని అక్షరాస్యులు మాత్రమే. మనం విద్యను తప్పుగా అర్థం చేసుకున్నాం. ఐక్యరాజ్యసమితి నిర్వచనం ప్రకారం, విద్య అంటే అక్షరాస్యత, చదువు, నైపుణ్యం, నైతిక విలువల శిక్షణ. కానీ మనం చదువును మాత్రమే విద్య అంటున్నాం. కోటి విద్యలు కూటి కొరకే అన్న నానుడి మనందరికీ తెలుసు. దానర్థం కోటి చదువులు అని కాదు. కోటి విధాలైన నైపుణ్యం కలిగిన పనులు అని అర్థం. కానీ, మన విద్యా వ్యవస్థ పూర్తిగా వక్రమార్గంలో పయనిస్తున్నది. మన ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాలలోనైనా మంచి చదువును అంది స్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు పేద విద్యా ర్థులకు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మరీ చదువును నేర్పిస్తున్నాయి. ఇంటర్ తర్వాత వాళ్లలో ఎక్కువమంది ఇప్పటివరకు మనం పేర్కొన్న నైపుణ్యంలేని డిగ్రీలు పుచ్చుకున్నారు. ఫలితంగా నిరుద్యోగుల జాబి తాలో చేరుతున్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ప్రభుత్వాల కన్నా అధికంగా తమ పిల్లల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. తమ పిల్లలు పెద్ద చదువులు చదువుతూ మంచి ఉద్యోగం చేస్తారని ఆశించి భంగపడుతున్నారు. ఇటీవల మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సునీల్ లాంటి యువకులు తమ ప్రాణాలను వదులుకుంటున్నారు. కారణం సునీల్∙నైపుణ్యం లేని డిగ్రీ పాస్ కావడమే. లక్షలాదిమంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడు తున్నారు. ప్రైవేట్ రంగంలో కావాల్సిన నైపుణ్యాన్ని విద్యా వ్యవస్థ వారికి అందించలేకపోతున్నది. భవిష్యత్లో చాలా రంగాల్లో అధు నాతన పరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యం కలిగిన యువకులకు మాత్రమే ఉద్యోగాలు ఉండబోతు న్నాయి. ప్రభుత్వాలు తమ పరిపాలన కోసం వేలమందిని తీసు కోవచ్చు. కానీ లక్షల మంది నిరుద్యోగులుగా ఉన్నారు. అందుకే ఈ పరిస్థితి మారాలంటే నిరుద్యోగులుగా ఉన్న యువతకు భరోసా కల్పించి, వారికి సాంకేతికపరమైన శిక్షణను అందించాలి. వారి అభి రుచినిబట్టి ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలి. దానితోపాటు మన విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేయాలి. పారిశ్రామిక, సాంకేతిక సంస్థల, వ్యాపార వాణిజ్య రంగా లకు అవసరమైన నైపుణ్యాలను అందించే విద్యా వ్యవస్థ రావాలి. చాలా ఏళ్లుగా జర్మనీలో అమలు జరుగుతున్న విద్యా వ్యవస్థను అధ్యయనం చేసి, మన దేశానికి అవసరమైన వారితో మనం దానిని అన్వయించుకోగలిగితే, మన దేశ నిరుద్యోగ సమస్యకు ఒక పరి ష్కారం దొరుకుతుంది. కోట్లాదిమంది నిరుద్యోగ యువకులకు భవిష్యత్మీద ఒక విశ్వాసం కలుగుతుంది. అటువైపుగా అందరం ఆలోచించాలి. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
పెట్టుబడి కాదు.. జీవితమే ఉపసంహరణ
పబ్లిక్ రంగ సంస్థల అమ్మకం కొన్ని కార్పొరేట్ల లబ్ధి కోసమే అనుకుంటే పొరపాటే. అంతకన్నా ప్రమాదమేదంటే సామాజిక, ఆర్థిక అసమానతల పెరుగుదల. పబ్లిక్ రంగ సంస్థల విధ్వంసం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోతారు. ఎందుకంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలులో లేవు. అక్కడ ఉద్యోగం చేసే వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉండదు. అంటే 1970కి ముందు ఉన్న కాంట్రాక్టర్ల, కార్పొరేట్ల నిలువు దోపిడీకి మరింత అవకాశం దొరుకుతుంది. ప్రైవేటీకరణ అంటే పెట్టుబడుల ఉపసంహరణ మాత్రమే కాదు. అది ఉపాధి ఉపసంహరణ, జీవిత ఉప సంహరణ. అందువల్ల విశాఖ ఉక్కు కోసం సాగుతున్న ఉద్యమం భారత రైతాంగం చేస్తోన్న పోరాటంలాగా దేశ ప్రయోజనాలలో భాగంగా జరగాలి. ‘‘ప్రజాస్వామ్య దేశాలెన్నుకున్న మార్గంలో బలహీనతలు బహిరంగంగా కనిపిస్తున్నాయి. అశక్తులైన జనసమూహాలు తమ సమష్టి కృషి ద్వారా, శాసనాల ద్వారా ఆర్థికంగా శక్తివంతులైన వారి మీద నియంత్రణ సాధించడం అసా «ధ్యమే. సార్వత్రిక ఓటింగ్ అమలులో ఉన్నా కూడా, శాసన నిర్మాణ సంస్థలు, ప్రభుత్వాలు సంపన్నుల చేతుల్లోనే ఉంటాయి’’ అంటూ బాబాసాహెబ్ అంబేడ్కర్ 1947లో ‘రాష్ట్రాలు–మైనారిటీలు’ అన్న డాక్యుమెంటులో పేర్కొన్నారు. అందులోనే ‘భారీ పరిశ్రమలను, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ లాంటి ఫైనాన్స్ సంస్థలను ప్రభుత్వం మాత్రమే నిర్వహించాలి’ అంటూ పరిష్కారం కూడా సూచించారు. స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగం రూపొందించే ప్రక్రియ ప్రారం భించడానికి ముందు బాబాసాహెబ్ తనదంటూ ఒక రాజ్యాంగ ముసాయిదాను రూపొందించారు. ఆ సమయంలో తాను రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షుడిని అవుతానని ఆయన ఊహించలేదు. అందువల్ల ఒక నమూనా రాజ్యాంగాన్ని∙ఆయన రూపొందించి, రాజ్యాంగ సభకు సమర్పించారు. రాజ్యాంగంలో రాజకీయ హక్కు లతో పాటు, ఆర్థిక పరమైన నిబంధనలను కూడా చేర్చాలని, లేనట్ల యితే సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతాయని ఆయన భావించారు. అయితే తాను ఆశించిన నిబంధనల్లో ఆర్థికపరమైన అంశాలు చోటుచేసుకోలేదు. అయితే రాజ్యాంగంలోని నాలుగవ భాగంలోని ఆదేశిక సూత్రాల్లో కొన్ని ఆర్టికల్స్ను పొందుపరిచారు. అందులో ఆర్టికల్–38 ముఖ్య మైనది. ప్రజల మధ్య అవకాశాల్లో, సదుపాయాల్లో, స్థాయిల్లో అసమా నతలు పెరగకుండా ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలని, ఆ విధంగా ఆర్థిక అసమానతలను నిర్మూలించాలన్నది ఈ ఆర్టికల్ ముఖ్యోద్దేశం. ఆ సందర్భంగా బాబాసాహెబ్ అంబేడ్కర్ మాట్లాడుతూ ‘ప్రజల హక్కు లను హరించి, నియంతృత్వాన్ని నెలకొల్పకుండా ఉండడానికి రాజ కీయ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుకుంటున్నాం. అలాగే ప్రజల్లో ఆర్థిక వనరుల సమాన పంపిణీ జరిగే విధంగా ఆర్థిక ప్రజాస్వామ్యం కోసం ప్రభుత్వాలు కృషిచేయాలి’ అంటూ తన సమానత్వ భావనను, రాజ్యా ధారిత సోషలిజాన్ని అమలు చేయాలని ఆయన సూచించారు. అందుకనుగుణంగానే 1976లో రాజ్యాంగపీఠికలో ‘సోషలిజం’ అనే పదాన్ని చేర్చి కొంత మార్గనిర్దేశనం చేశారు. కానీ ఆ పదం చేర్చిన సమయం ఎమర్జెన్సీ కావడం వల్ల దాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. అయితే ఇందిరాగాంధీ సమయంలోనే అంబేడ్కర్ ఆశిం చినట్టుగా బ్యాంకుల జాతీయం జరిగింది. ఎన్నో పబ్లిక్ రంగ సంస్థ లను నెలకొల్పారు. పబ్లిక్ రంగ సంస్థలను ప్రభుత్వం ఎంతో చారిత్రక అనుభవంతో, ఎందరెందరో తాత్విక వేత్తల ఆలోచనలతో నెలకొ ల్పారు. దేశంలో అప్పటి వరకు ఉన్న బొగ్గు గనులలాంటి ఎన్నో పరిశ్ర మలను జాతీయం చేశారు. దీంతో అప్పటి వరకు చాలా దుర్భరంగా ఉన్న కార్మికుల జీవితాలు చట్టపరమైన రక్షణలోకి, జీవన భద్రతలోకి, వేతనాల గ్యారంటీ వ్యవస్థలోకి మారిపోయాయి. ఈ నేపథ్యంలో మనం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విష యాన్ని చూడాలి. తెలుగు చరిత్ర ఉన్నంత వరకు ‘విశాఖ ఉక్కు– ఆంధ్రుల హక్కు’ నినాదం ప్రతి తెలుగు వాడి మదిలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఎన్నో త్యాగాల, బలిదానాల వల్ల విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉనికిలోకి వచ్చింది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు కంపెనీకి అప్పగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ఈ రోజు ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. ఏపీ బీజేపీ కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించకపోవడం గమనార్హం.అయితే భారత్లో 1947 స్వాతంత్య్రా నికి ముందు ఉన్న పరిశ్రమలు ప్రైవేట్ చేతుల్లోనే ఉన్నాయి. స్వాతం త్య్రానంతరం ఏర్పడిన ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తితో భారీ పరి శ్రమలను ప్రభుత్వాధీనంలోనే ఉంచాయి. అంతే కాకుండా, వందలాది పరిశ్రమలను నూతనంగా నెలకొల్పాయి. కానీ 1990 తర్వాత పీవీ నరసింహారావు ప్రభుత్వం ప్రారంభిం చిన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణవల్ల ఆర్థికరంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అందులో ఖాయిలా పడిన పరిశ్రమలను అమ్మే యాలనే విధానం కూడా ఒకటి. కానీ దానిని మరింతగా మార్చి, ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉండడం వల్ల కొన్ని పరిశ్రమలను అమ్మి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని నిర్ణయించారు. అయితే పీవీ నరసిం హారావు తీసుకున్న ఈ విధాన నిర్ణయం ఆ అయిదేళ్ల కాలంలో అంత వేగంగా ముందుకు పోలేదు. కానీ 1998లో రెండవసారి అధికారం లోకి వచ్చిన వాజ్పేయి ప్రభుత్వం ఏకంగా పెట్టుబడి ఉపసంహరణ మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసింది. దానికి ప్రముఖ జర్నలిస్టు అరుణ్ శౌరిని మంత్రిగా నియమించింది. ఆయన తన హయాంలో అమ్మకా నికి పెట్టిన కొన్ని సంస్థల, హోటల్స్ విషయంలో ‘కాగ్’ తప్పు పట్టింది. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. లాభాల్లో ఉన్న బొంబా యిలోని ఒక హోటల్ను అమ్మిన సంఘటనను ‘కాగ్’ ఉదహరిం చింది. కనీసం టెండర్ విధానాన్ని కూడా పాటించలేదని, తమకు ఇష్ట మైన వాళ్ళకు ఇచ్చారని ‘కాగ్’ బయటపెట్టింది. అయితే మళ్ళీ 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం, పబ్లిక్ రంగ సంస్థలకు అమ్మి వేయడం, లేదా వాటాలను అమ్మడం లాంటి పనులను ఆపివేయ లేదు. కానీ అంత వేగంగా పనులు జరగ లేదు. అయితే మళ్ళీ 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఒక ప్రత్యేక శ్రద్ధతో పబ్లిక్రంగ సంస్థలను నిర్వీర్యం చేయడం, లేదా తెగనమ్మడం లాంటి ప్రజా వ్యతిరేక చర్యలకు పూనుకుంది. అయితే వేగంలోనే తేడాయే తప్ప ఈ రెండు పార్టీల వైఖరికీ ఆలోచనలో తేడా లేదు. ప్రైవేట్ కంపెనీలు, ప్రత్యేకించి బడాబడా కార్పో రేట్లకు జాతి సంపదను, సహజ వనరు లను అప్పనంగా అప్పజెప్పడంలో దొందూదొందే. ఇటీవల కాంగ్రెస్ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ రంగ సంస్థల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలను తప్పు పడుతు న్నట్టు అక్కడక్కడా మాట్లాడుతున్నారు. కానీ అది సరిపోదు. భవిష్య త్తులో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ఆర్థిక విధానాన్ని అమలు చేస్తుందో వివరించాలి. బీజేపీ అధికారంలో లేనప్పుడు వారు కూడా ఇలాంటి మాటలే మాట్లాడారు. కానీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ను తల దన్ని చాలా కర్కశంగా పబ్లిక్ రంగ సంస్థలను ధ్వంసం చేస్తున్నారు. పబ్లిక్ రంగ సంస్థల అమ్మకం కొన్ని కార్పొరేట్లకు మేలు చేయడం కోసం మాత్రమే అనుకుంటే పొరపాటే. అంతకన్నా పెద్ద ప్రమాదం ఈ దేశానికి పొంచివున్నది. అదే సామాజిక, ఆర్థిక అసమానతల పెరుగు దల. ముఖ్యంగా పబ్లిక్ రంగ సంస్థల విధ్వంసం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోతారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలులో లేవు. అంతేకాకుండా ఉద్యోగం చేసే వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉండదు. ఆ విధంగా మళ్ళీ 1970కి ముందు ఉన్న కాంట్రాక్టర్ల, కార్పొరేట్ల నిలువుదోపిడీకి మరింత అవకాశం దొరుకు తుంది. మన దేశంలో 30 ఏళ్లలో ప్రైవేట్ కంపెనీల పెరుగుదల ఊహిం చలేనిది. అందులో కూడా కొన్ని కంపెనీలే ఎక్కువ సంపదను దోచు కుంటున్నాయి. అటువంటి కంపెనీలు ఈ రోజు ప్రభుత్వాల్ని శాసిస్తు న్నాయి. వాళ్ళ ప్రయోజనాలే దేశ ప్రయోజనాలవుతున్నాయి. క్రమంగా కార్పొరేట్లే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాయేమో అనిపి స్తుంది. జాతి సంపదను దోచుకోవడానికి జరుగుతున్న పబ్లిక్ రంగ సంస్థల అమ్మకం, వాటాల విక్రయం, మన రాజకీయ ప్రజాస్వా మ్యాన్ని దెబ్బతీస్తుంది. అందువల్ల విశాఖ ఉక్కు కోసం సాగుతున్న ఉద్యమం భారత రైతాంగం చేస్తోన్న పోరాటంలాగా దేశ ప్రయోజ నాలలో భాగంగా జరగాలి. అటువైపుగా ఉద్యమ శక్తులు ఆలోచించా ల్సిన అవసరం ఉంది. మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
కెడిసేథి; ఒక తరం సైద్ధాంతిక స్వరం
‘‘భారతదేశంలో ఐక్యమయ్యే ప్రక్రియను ఏ శక్తులూ అడ్డుకోలేవు. కానీ ఈ ఐక్యత, విలీనం ప్రభు త్వంతో మాత్రం కాదు. భారత దేశంలోని అశేష ప్రజానీకం, కార్మి కులు, కర్షకులతో మనం కలిసి పనిచేయబోతున్నాం. భూ సంస్కర ణలను అడ్డుకుంటున్న రాచరిక పాలనను మనం అనుసరించ కూడదు. ప్రజలందరూ ఈ నిర్ణయాన్ని హర్షిస్తారు. దేశ రైతాంగంతో పాటు, తెలంగాణ రైతులు కూడా మన వెనుక ఉంటారు. ప్రగతిశీల, ప్రజాస్వామిక శక్తులు, వ్యక్తులు పార్ల మెంటులోనూ, బయటా మనకు మద్దతిస్తారని నేను విశ్వ సిస్తున్నాను.’’ కశ్మీర్ విప్లవోద్యమ నాయకుడు, నక్సలైట్ ఉద్యమనేత కె.డి.సేథి తన 26వ ఏట జమ్మూ–కశ్మీర్ రాజ్యాంగ సభలో చేసిన ప్రసంగ వాక్యాలివి. కె.డి.సేథిగా అందరికీ పరిచ యమున్న క్రిషన్ దేశ్ సేథి జనవరి 28న, తన 93వ ఏట తుదిశ్వాస విడిచారు. ఆయన కశ్మీర్ రాజ్యాంగ సభ సభ్యులలో చివరివాడు. కశ్మీర్ను ఒకవైపు భారతదేశంలో విలీనం చేస్తూనే, తనకంటూ ఒక రాజ్యాంగాన్ని జమ్మూ కశ్మీర్ నిర్మించుకుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిన ఆ రాజ్యాంగ సభలో సేథి అందరికన్నా వయస్సులో చిన్నవారు. అయినప్పటికీ జూన్ 11, 1952న ఆయన చేసిన ప్రసంగం ఎంతో సైద్ధాంతిక చైతన్యాన్ని ప్రదర్శించింది. ‘‘అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు ప్రజా స్వామ్య ప్రభుత్వాలుగా చెప్పుకుంటున్నాయి. కానీ పెట్టుబడి దారులకే ప్రజాస్వామ్య కేంద్రాలు. ప్రజలకు ఓటింగ్ హక్కు ఇవ్వడం మాత్రమే ప్రజాస్వామ్యం కాదు. మనం ఆశిస్తున్నది, విశ్వసిస్తున్నది సామాజిక ప్రజాస్వామ్యం’’ అంటూ ఆయన నిజమైన ప్రజాస్వామ్య విలువలను గుర్తుచేశారు. కె.డి. సేథి జమ్మూ ప్రాంతంలోని మీర్పూర్లో జనవరి 1న 1928లో జన్మించారు. 15 ఏళ్ళ వయస్సులోనే ప్రజా ఉద్యమంలో అడుగుపెట్టారు. తెలుగు ప్రజల ఉద్యమాలు, ప్రత్యేకించి తెలంగాణ సాయుధ పోరాటమంటే ఎనలేని ప్రేమ. 1975లో చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలోని సీపీఐ (ఎంఎల్) పార్టీలో చేరారు. సత్యనారాయణ సింగ్ నాయ కత్వంలో ఉన్న సేథి అంతిమంగా చండ్ర పుల్లారెడ్డితోనే కొనసాగారు. అప్పటి కేంద్ర కమిటీ నాయకులు పైలా వాసుదేవరావుతో పాటు నక్సలైట్ ఉద్యమ నాయకులతో ఎంతో సన్నిహిత సంబంధాలుండేవి. ఐఎఫ్టియూ వ్యవ స్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. అనేక సార్లు తెలుగు రాష్ట్రా నికి వచ్చారు. విప్లవోద్యమంతో సంబంధాలున్న 1977 నాటి కార్యకర్తల్లో ఆయన పేరు తెలియని వారుండరు. చండ్ర పుల్లారెడ్డి మరణానంతరం జరిగిన బహిరంగ సభకు హాజరై హృదయపూర్వక నివాళులు అర్పించారు. సీపీఐ ఎంఎల్ పార్టీలో వచ్చిన చీలికల అనంతరం కూడా విప్లవోద్యమం లోనే కొనసాగారు. ఆయన మొట్టమొదట నేషనల్ కాన్ఫరెన్స్లో ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులైన సర్దార్ బుద్సింగ్, రాజ్ మహమ్మద్ అక్బర్ ఖాన్, మౌలానా అబ్దుల్లా లాంటి సీని యర్ నాయకులతో పనిచేసిన అనుభవం సేథి సొంతం. 1946లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రారంభమైన క్విట్ కశ్మీర్ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. అందుకుగానూ రెండేళ్ళ జైలు జీవితం గడపాల్సి వచ్చింది. కశ్మీర్ మహారాజు రాచరిక పాలనలో సాగిన అకృత్యాలకు, దోపిడీకి వ్యతి రేకంగా సాగిన ఉద్యమంలో కూడా ఆయన పాత్ర మరువ లేనిది. డోగ్రా ప్రాంతంలో భూస్వాములు, వడ్డీ వ్యాపారస్తులు చేసిన దాడులను ప్రతిఘటించడంలోనూ ప్రధాన పాత్ర పోషించారు. రైతులను, కూలీలను ఈ ప్రతిఘటనలో సమీకరించడంలో సఫలీకృతులయ్యారు. 1953లో షేక్ అబ్దుల్లాతో వచ్చిన విభేదాల వల్ల నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి బయటకు వచ్చి, డెమొక్రటిక్ నేషనల్ కాన్ఫరెన్స్ స్థాపించారు. లౌకిక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఇది ఏర్పాటైంది. ప్రారంభం లోనే ఆ పార్టీకి 19 మంది శాసనసభ్యులుండేవారు. అయితే ఆ తర్వాత డెమొక్రటిక్ నేషనల్ కాన్ఫరెన్స్ తగినంత ప్రతి ఘటనను ప్రదర్శించలేకపోవడం వల్ల సీపీఐలో, ఆ తర్వాత సీపీఎంలో, దాని నుంచి సీపీఐ(ఎంఎల్)లో చేరారు. జమ్మూ కశ్మీర్లో ఇప్పటికీ బలమైన ఉద్యోగ సంఘానికి ఆయన నాయకత్వం వహించారు. అదే సమయంలో రాజ కీయపరమైన సిద్ధాంతాలను పత్రికల ద్వారా ప్రజలకు తెలి యజేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కశ్మీర్ విషయంలో ఆయన అభిప్రాయాలు విలువైనవి. ఇటీవల భారతీయ జనతా పార్టీ జమ్మూ–కశ్మీర్ను మూడు భాగాలుగా విభజించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో 1999లో రాసిన ఒక వ్యాసంలో తన వ్యతిరేకతను తెలియజేశారు. ఇది అమెరికా సామ్రాజ్య వాదుల కుట్రగా ఆయన అభివర్ణించారు. 1950లో ఐక్య రాజ్యసమితి నియమించిన డిక్షన్ కమిటీ కశ్మీర్ను విభజిం చాలని సూచించింది. ఇది కశ్మీర్ ప్రజల మనోభావాలకు విరుద్ధమైనదని ఆయన విమర్శించారు. జమ్మూ–కశ్మీర్లోని జమ్మూ, లద్దాఖ్, కశ్మీర్ ప్రాంతాలు సాంస్కృతికంగా, ఆర్థి కంగా ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయనీ, ఈ విభజన కశ్మీర్ సమస్యకు పరిష్కారం కాదనీ అన్నారు. ఈ రోజు కూడా ఈ విభజన సత్ఫలితాలను ఇస్తుందనే విశ్వాసం ఎవరికీ లేదు. అందుకుగానూ ఆయన పరిష్కార మార్గాలు కూడా విడమర్చి చెప్పారు. మొదటిది, పాకిస్తాన్–భారత్ రెండు దేశాలు చిత్తశుద్ధితో చర్చలు జరిపి, కశ్మీర్ విషయంలో ఒక అంగీకారానికి రావాలి. ఇందులో అమెరికాలాంటి సామ్రాజ్యవాద దేశాల ప్రమేయం ససేమిరా ఉండకూడదని హెచ్చరించారు. రెండో విధానం, కశ్మీర్లోని అన్ని ప్రాంతాల, వర్గాల, మతాల ప్రజలతో విస్తృతంగా చర్చించి, కొన్ని పరిష్కారాలను నిర్ధారించాలి. గత ప్రభుత్వాలు గానీ, ప్రస్తుత ప్రభుత్వం గానీ అటువంటి ప్రయత్నం చేయలేదు. చేస్తారనే నమ్మకం కూడా లేదు. కె.డి. సేథీకి భారత ప్రజాస్వామిక, విప్లవోద్యమంలో ఉన్నతమైన స్థానం ఉంది. ఆయన సాగించిన ఉద్యమాలు, చేసిన ఆలోచనలు భవిష్యత్ ప్రజాస్వామిక ఉద్యమాలకు, విప్లవ పోరాటాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి. 20వ శతాబ్దం విప్లవ యోధులలో చివరి హీరోగా, ఎన్నో జ్ఞాప కాలను, అనుభవాలను భారతదేశ పీడిత ప్రజలకు ఆయన అందించారు. ఆ అనుభవాలే వర్తమాన రాజకీయ పరిస్థితు లను ఎదుర్కోవడానికి స్ఫూర్తిగా నిలుస్తాయి. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
రచన, ఆచరణ ఏకమైతేనే సార్థకత
చాలామంది రచయితలు తమకు తోచిందేదో రాసుకుంటూ పోతారు. అలాగే చాలామంది సామాజిక కార్యకర్తలు ఏదో చేయాలనే దానితో చేసుకుంటూ పోతారు. కానీ.. అక్షరం, ఆచరణ ఒకేచోట పోతపోసినట్టు ఉండటం మహాశ్వేతాదేవి విషయంలో సాధ్యమైంది. ఆమె కుర్చీకి పరిమితమైన రచయిత కాదు. ప్రతి రచన వెనుక పరిశోధనా, కృషి ప్రతిబింబిస్తాయి. రచనా వ్యాసంగం కొనసాగిస్తూనే ఉద్యమ ప్రస్థానాన్ని సాగించారు. రచన, ఆచరణ జీవిత పర్యంతమూ జోడెడ్ల లాగా సాగిపోయాయి. ఆదిమ తెగల జీవితాలను మార్చడానికి నిర్దిష్టంగా, నిబద్ధతతో పనిచేశారు. వారికి ఒక అమ్మగా నిలిచారు. యావత్ దేశాన్ని తన సాహితీ చైతన్య స్రవంతిలో ఓలలాడించిన ఆమె అక్షరమక్షరం జనప్రేరితం. అనుభవం, ఆవేదన, ఆలోచన, అన్వేషణ, అక్షరీకరణ, ఆచరణ ఒకేచోట పోతపోసినట్టు ఒకే మనిషిలో ఉండటం సాధారణమైన విషయం కాదు. కానీ మహా శ్వేతాదేవి విషయంలో అది సత్యసాధ్యమైంది. లక్షలాదిమంది తల్లుల పక్షాన పోరాడిన ‘ఒక తల్లి’ ఆమె. యావత్ దేశాన్ని తన సాహితీ చైతన్య స్రవంతిలో ఓలలాడించిన ఆమె అక్షరమక్షరం జనప్రేరితం. తొంభై ఏళ్ళ జీవితంలో ఆమె సాగించినది సాదాసీదా జీవనయానం కాదు. ఆమె జీవితం ఆద్యంతం ఆదివాసీల సొంతం. మహాశ్వేతాదేవి 1926 జనవరి 14న నేటి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో రచయితలైన మనీష్ ఘటక్, ధరిత్రీదేవి బిడ్డగా జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం కోసం ఢాకాలోని మాంటిస్సోరి పాఠశాలలో చేరారు. తదనంతరం వాళ్ల కుటుంబం మిడ్నాపూర్కు, ఆ తర్వాత కలకత్తాకు మారింది. కలకత్తాలోని శాంతినికేతన్లో హైస్కూల్ వరకు చదివారు. రవీంద్రనాథ్ టాగూర్ స్థాపించిన విశ్వభారతిలో బీఏ, కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివారు. ఆంగ్లసాహిత్యం మీద ఆమె తీసుకున్న డిగ్రీ ఆమెలోని సాహితీ జిజ్ఞాసకు అద్దం పడుతుంది. అవార్డులు చిరుకానుకలు వందకు పైగా నవలలు, 20 సంపుటాల కథలు ఆమె కలం నుంచి జాలువారాయి. అంతేకాకుండా సమకాలీన విషయాలపైన అనేక పత్రికలకు వ్యాసాలు రాసి, తన నిరసనను, అభిప్రాయాలను వ్యక్తపరి చారు. సాహితీ లోకానికి చేసిన సేవలకు గుర్తుగా, సామాజిక సేవకు ప్రతిఫలంగా జ్ఞానపీuŠ‡ అవార్డు, సాహిత్య అకాడమీ అవార్డు, సార్క్ లిటెరరీ అవార్డు ఆమెను వరించాయి. 2012లో నోబెల్ బహుమతికి కూడా నామినేట్ అయ్యారు. పద్మశ్రీ, పద్మవిభూషణ్, అంతర్జాతీయ సామాజిక కార్యకర్తలకు ఇచ్చే రామన్ మెగసెసె ఆమెకు చిరుకానుక లుగా మిగిలాయి. ఆమె రచనలలో పాత్రధారులు ఆదివాసులు, మహిళలు, దళి తులు, ఇతర అణగారిన వర్గాల ప్రజలు. వారి జీవితాలను రచనలలో ప్రస్తావించి మాత్రమే ఊరుకోలేదు. ఆదివాసులకు ఒక అమ్మగా నిలిచింది. నక్సలైట్ ఉద్యమాన్ని ఆమె అక్షరీకరించిన తీరు అమోఘం. హజార్ చౌరాసీ కా మా, బషాయి టుడు ఆమెను రచయితగా మాత్రమే కాకుండా, మానవ హక్కుల ఉద్యమకార్యకర్తగా నిల బెట్టాయి. ఆ రెండింటినీ హైదరాబాద్ బుక్ ట్రస్ట్ తెలుగులో ప్రచురించింది. ఆదివాసుల మీద రాసిన ‘అటవీ హక్కులు’ పుస్తకం, ఆదివాసీ స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సాముండా జీవితం ఆధా రంగా ఆదివాసుల చరిత్రను, జీవితాలను దేశానికి పరిచయం చేసింది. ఆమె మొదటి నవలగా వచ్చిన ఝాన్సీ రాణీ జీవిత చరిత్ర ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది. మహాశ్వేతాదేవి కుర్చీకి పరిమితమైన రచయిత కాదు. ప్రతి రచన వెనుక ఆమె పరిశోధనా, కృషి ప్రతిబింబిస్తాయి. ఝాన్సీ లక్ష్మీబాయిపై పుస్తకం రాసేందుకు ఉద్యుక్తమైనప్పుడు లక్ష్మీబాయి నివసించిన ప్రాంతం, యుద్ధం చేసిన భూమిని ప్రత్యక్షంగా దర్శించి, రచన కొన సాగించారు. ఏ రచన చేసినా క్షేత్రస్థాయిలో పరిశోధన చేయకుండా లేరు. ఆమె జీవితం, ఆచరణ, సాహిత్యం మూడూ ఒకదానికొకటి పెన వేసుకుపోయి ఉంటాయి. ఒకవైపు రచనా వ్యాసంగం కొనసాగిస్తూనే రెండోవైపు ఉద్యమ ప్రస్థానాన్ని సాగించారు. 1942–44 మధ్యలో బెంగాల్ను పీడించిన కరువులో బాధితుల సహాయార్థం చేసిన కృషితో ఆమె సామాజిక చైతన్యం మొదలైంది. ఆ కరువులో మరణించిన శవాలను గుర్తించ డంలో, బతికున్న వాళ్లకు ఆహారం, నీళ్ళు అందించడంలో ఆమె సామా జిక సేవకు అంకురార్పణ జరిగింది. అప్పటికి ఆమె వయసు 16 సంవ త్సరాలే. ఆమె రచనలు ప్రారంభించింది 13 సంవత్సరాల వయ సులో. అంటే ఆమె రచన, ఆచరణ జోడెడ్ల లాగా సాగిపోయాయనడా నికి ఇవే నిదర్శనాలు. ఆదివాసుల అమ్మ పశ్చిమ బెంగాల్లోని పురులియా జిల్లాలో ఉన్న సబర్ ఆదిమ జాతి కోసం ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి, వారికి అండదండగా నిలిచారు. ఆమెను ఆ ఆదివాసులు ఎంతో ప్రేమతో ‘సబర్స్ మదర్’ అని పిలుచుకున్నారు. ప్రభుత్వాలు, సంస్థలు ఇచ్చిన ఎన్నెన్నో అవా ర్డులకన్నా ఆదివాసుల అమ్మగా గుర్తింపబడటం ఆమెకు ఎంతో సంతో షాన్ని, సంతృప్తిని మిగిల్చాయి. ‘‘నేను రాసిన అరణ్యేర్ అధికార్ పుస్తకం నన్ను ఆదివాసులకు దగ్గర చేసింది. ఆదివాసుల నాయకుడు చేసిన తిరుగుబాటు దీని ఇతివృత్తం. దీనికి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. ఆదివాసుల తిరుగుబాట్లు, పోరాటాలు చరిత్రలో తగిన స్థానాన్ని పొందలేదు. మొదటిసారి ఇటువంటి విషయాలు సమాజంలోని ఇతర వర్గాలకు అందాయి’’ అంటూ మహాశ్వేతాదేవి ఆదివాసులకు ఒక ఆత్మీయురాలిగా ఎలా మారిందో వెల్లడించారు. ఇక్కడ ఇంకో విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. చాలామంది రచయితలు, సామాజిక కార్యకర్తలు తమ పనిలో ఫలితాలను చూడరు. ఏదో చేయాలనే దానితో చేసుకుంటూ పోతారు. మహా శ్వేతాదేవి పురులియా జిల్లాలోని సబర్ (సవర) ఆదిమ తెగల జీవి తాలను మార్చడానికి నిర్దిష్టంగా, నిబద్ధతతో పనిచేశారు. అందుకోసం పశ్చిమ బెంగాల్ బరావో సంక్షేమ సంఘాన్ని స్థాపించారు. సబర్ ఆదిమ తెగను బరావో అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా, ఆదిమ తెగల ఐక్య సంస్థలను కూడా ఆమె ప్రారంభించారు. ఆదిమ తెగల్లో సబర తెగకు నేరపూరితమైన జాతిగా ముద్రపడింది. బ్రిటిష్ కాలంలో వారిని క్రిమినల్ ట్రయిబ్స్గా వర్గీకరించారు. సబర్ తెగ వేటమీద, ఆహార సేకరణ మీద ఆధారపడి జీవించే వాళ్ళు. వ్యవసాయం, ఇతర వృత్తులు తెలియవు. బ్రిటిష్ వాళ్ళు అటవీ సంపదను దోచుకోవడానికి అన్ని ఆదిమ తెగలలాగానే వీళ్ళను కూడా అడవి నుంచి గెంటివేశారు. అంతేకాకుండా వీరిని దొంగలుగా, దోపిడీదారులుగా, హంతకులుగా ముద్ర వేశారు. దీనితో సమాజంలో వీరిని చిన్నచూపు చూడటం మొద లైంది. అటువంటి దయనీయ స్థితిలో, వివక్షకు, ద్వేషానికి గురవు తున్న సబర్ తెగ జీవన విధానంలో వెలుగు నింపడానికి మహాశ్వేతా దేవి నడుం కట్టారు. తనతో పాటు ఎంతో మందిని సమీకరించారు. ఉద్యోగులు, ఇతన మేధావులు ఆమె కృషికి అండగా నిలిచారు. ఈ మహత్తర కార్యక్రమంలో తమ వంతు ఆర్థికసాయాన్ని అందించి కోల్కత రెడ్లైట్ ఏరియా సెక్స్ వర్కర్లు తోడ్పడటం మరింత విశేషం. పార్టీలు ముఖ్యం కాదు మహాశ్వేతాదేవి భావజాలం రీత్యా కమ్యూనిస్టు. ఆమె మొదటి పోస్ట్ టెలిగ్రఫీ ఉద్యోగం. కానీ కమ్యూనిస్టు అనే కారణంతో ఆ ఉద్యోగం పోయింది. 1967లో ప్రారంభమైన నక్సలైట్ ఉద్యమం ఆమె సంఘీ భావాన్ని నక్సలైట్ భావాలవైపు మళ్ళేలా చేసింది. పశ్చిమ బెంగాల్లో జరిగిన భూసంస్కరణలు కేవలం ధనిక రైతులకే ఉపయోగపడ్డాయ నేది ఆమె అభిప్రాయం. అయితే నక్సలైట్ ఉద్యమంలో అన్ని విష యాలను తాను సమర్థించడం లేదని కూడా ఆమె ప్రకటించారు. అదేవిధంగా 2006 సంవత్సరంలో ఆనాటి పశ్చిమ బెంగాల్ వామపక్ష ప్రభుత్వం టాటా కంపెనీ కోసం రైతుల వద్ద పచ్చని పొలాలు స్వాధీనం చేసుకోవాలని తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిం చారు. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమంలో భాగస్వాముల య్యారు. ఎంతో మంది రచయితలను, కళాకారులను సమీకరించారు. ఒకరకంగా వామపక్ష ప్రభుత్వం అధికారం కోల్పోవడానికి ఈ సంఘ టన ఒక కారణమైంది. ఆమెకు ప్రజలు, ప్రజల సంక్షేమమే ప్రధానం గానీ పార్టీలు, సంస్థలు కాదని ఈ సంఘటన రుజువు చేస్తున్నది. 2016 జూలై 28న తుదిశ్వాస విడిచేవరకు ఆమె నిత్యం ప్రజల శ్వాసగా బతికారు. ఆమె రచనలు బెంగాలీనుంచి ఇంగ్లిష్, జపనీస్తో పాటు దేశంలోని అన్ని భాషలలోకి అనువాదం అయ్యాయి. ముఖ్యంగా స్త్రీవాద రచయితలకు ఆమె ఒక మార్గదర్శిగా నిలిచారు. ఆమె మహిళా జీవితాల గురించి రాసిన రుడాలి, ఛోళీ కే పీచే, ద్రౌపది లాంటి రచనలు ఎందరినో ఉత్తేజపరిచాయి. ఒక మహిళగా తన జీవితాన్ని అడవి బిడ్డలకోసం అర్పించడం ఎందరినో ఉత్తేజపరిచింది. వ్యక్తి్తగత జీవితంకన్నా ఆమె తన సామాజిక కార్యాచరణకే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చిందనేది వాస్తవం. తొంభై ఏళ్ళు మన మధ్య జీవిం చిన మహాశ్వేతాదేవి, ఈ దేశంలో సామాజిక అసమానతలు ఉన్నంత కాలం ఆమె చైతన్యం మనల్ని వెన్నంటే నడిపిస్తుంది. మల్లెపల్లి లక్ష్మయ్య (నేడు మహాశ్వేతాదేవి 94వ జయంతి) వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
కలల్ని భగ్నం చేసిన కాలం
అబ్దుల్ కలాం మన పిల్లలందరినీ కలలు కనమన్నారు. మనం కూడా మన పిల్లలకు అదే నేర్పించాం. కానీ మనం కలలు కంటూనే ఉన్నాం. కానీ మన ప్రభుత్వాలు మన దేశాన్ని కలకాలం కలల్లోనే ఉండేలా చేశాయి. మన పిల్లల స్వప్నాలు సత్యాలు కాలేదు. కానీ మనకు ఈ కరోనా ఒక మేల్కొలుపునిచ్చింది. ప్రభు త్వాల నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేసింది. అయితే కరోనా ఇచ్చిన అనుభవమే రేపటి సమాజ మార్పునకు ఒక హెచ్చరిక కావాలి. మనం వీడ్కోలు పలుకు తున్న 2020 సంవత్సరం తెచ్చిన ఉపద్రవం మనకు అత్యంత కఠినమైన అనుభవాలను మిగిల్చింది. 2020ని సంతోషంగా సాగనంపడమంటే, మన పాలకుల పట్ల మనకున్న భ్రమలను తొలగించి, వాస్తవాలను కళ్ళకు కట్టిన చేదు అనుభవాలు పునరావృతం కాకుండా మేల్కోగలగడమే. ఇదే మనకొక కనువిప్పు. ‘‘కరోనా మహమ్మారి విలయతాండవం చేసిన 2020 ప్రపంచ ప్రజలందరినీ, ప్రత్యే కించి భారతదేశ వాసులందరినీ అభద్రతకు, అశాంతికి గురిచేసింది. అసమానతలను, అగాధాలను సృష్టించింది. ఇటీవల సంవత్సరాలలో వచ్చిన ఉపద్రవాలన్నింటికన్నా కరోనా కల్లోలం మానవాళిని అన్ని రంగాల్లో వెనక్కు నెట్టింది’’అని 2020 సంవత్సరాన్ని సమీక్షిస్తూ, ప్రపంచ బ్యాంకు ఆర్థిక వేత్తలు విశ్లేషించారు. కరోనా సృష్టించిన సంక్షోభం వల్ల కోట్లాది మంది పేదరికంలోకి దిగజారిపోనున్నారు. చాలా దశాబ్దాల తర్వాత పేదరికంపై జరుగు తున్న పోరాటాన్ని ఈ కరోనా వెనక్కు నెట్టివేసింది. గతం కన్నా అధికంగా ప్రజలు పేదరికంలోకి దిగజారిపోతున్నారు. ప్రపంచంలోని చాలా దేశాలలోని ప్రజలు రోజుకు కేవలం 100 రూపాయలకు మించని ఆదాయంతో గడ్డుపరిస్థితుల నెదుర్కోబోతున్నారు. ఇది భవిష్యత్ చిత్రం. ప్రపంచబ్యాంకు నిపుణులు అనేక అంశాలపై సవివరమైన అధ్యయనాలను చేసి, ఎన్నో వివరాలను వెల్లడించారు. ప్రపంచంతో పాటు, భారతదేశంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు సృష్టించిన అసమానతలను కరోనా రెట్టింపు చేసింది. ఈ కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా అదనంగా మరో 8 కోట్ల 80 లక్షల మంది ప్రజలు పేదరికంలోకి జారిపోతున్నారు, ఇందులో అత్యధికంగా భారతదేశంతో సహా దక్షిణాసియా దేశాల ప్రజలున్నట్టు అధ్య యనాలు వెల్లడించాయి. అసంఘటిత రంగం, ప్రత్యేకించి నిర్మాణ రంగం, ఉత్పత్తి రంగాల నుంచి ఎక్కువ మంది ఉపాధి కోల్పోను న్నారని ‘‘పావర్టీ అండ్ షేర్డ్ ప్రాస్పరిటీ రిపోర్టు’’ వెల్లడించింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇటువంటి సంక్షోభం తలెత్తలేదని, ఆరోగ్య రంగంలో బయటపడిన బలహీనతలు, మరణాలు ప్రపంచ వ్యాప్త ఆర్థిక సంక్షోభం విశ్వవ్యాప్తంగా ఉన్న మానవాళిని అతలా కుతలం చేశాయని, ‘‘గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్’’ నివేదిక తెలియజేసింది. కరోనా వల్ల సమాజంలో ఉన్న అసమానతలు, అభద్రత, అశాంతి ముసుగు తొలగించుకొని బయటకొచ్చాయి. మానవాళి ప్రాణ రక్షణకు మాస్క్లు అందించిన కరోనా, పాలకులు వేసుకున్న అభివృద్ధి ముసుగుని నిలువునా తొలగించివేసింది. ఇదే విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక సర్వేలు రుజువు చేశాయి. ముఖ్యంగా ఈ సంక్షోభం వల్ల ప్రజలు ఉపాధినీ, ఉద్యోగాలనూ కోల్పోయి అభద్రతలోకి వెళ్ళిపోయారు. ప్రాణాలు ఉంటాయో పోతాయో అనే భయంతో అశాంతికి గురయ్యారు. ఆయా రంగాల్లో ఉన్న వ్యత్యాసాలు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల భవిష్యత్తుని అగమ్యగోచరంలోకి నెట్టివేశాయి. ఆ పరిస్థితులను తట్టుకోలేక ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వలస కార్మికులు ఉపాధిని కోల్పోయారు. చాలా దేశాలు వలస కార్మికుల విదేశీ మారకద్రవ్యం మీద ఆధారపడి ఉన్నారు. కొన్ని కోట్ల కుటుంబాలు తమ వాళ్ళు పంపి స్తున్న డబ్బుతో జీవితాలను వెళ్లదీస్తున్నారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. 2021 చివరి వరకు విదేశాల నుంచి వచ్చే ఆదాయంలో దాదాపు 14 శాతం తగ్గిపోనున్నది. ఆధునిక చరిత్రలో ఇటువంటిది ఇదే మొదలు. స్వస్థలాలకు వెళ్ళిన వారు ఎక్కువ మంది తిరిగి తాము ప నిచేసే దేశాలకు వెళ్ళే స్థితి లేదని తెలుస్తున్నది. దీంతో పేదరికం మరింత పెరిగే ప్రమాదం ఉన్నది. దీనితో గతంలోలాగా ఆహారం, ఆరోగ్య భద్రత కష్టమవుతుందని వలస కార్మికులు ఆందోళన చెందు తున్నారు. దీంతోపాటు, చాలా కంపెనీలు గతంలో లాగా ఎక్కువ మంది కార్మికులను నియమించుకోవడానికి సిద్ధంగా లేవు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్ల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఏర్పడింది. అంతే కాకుండా భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని, మనుషులమీద ఆధారపడకుండా, సాంకేతిక సహకారంతో కంపెనీలను ఆధునీకరించి కార్మికులను తగ్గించుకోవాలని కంపెనీలు ఆలోచిస్తున్నాయి. భారతదేశంలో దాదాపు 14 కోట్ల మంది వలస కార్మికులున్నారు. వీళ్ళు రాష్ట్రాలను దాటి వెళ్లేవారు. అంటే అంతర్రాష్ట్ర కార్మికులు. వీళ్ళంతా తమ పల్లెల్లో పనులు లేక పొరుగు రాష్ట్రాలకు ప్రత్యేకించి వలసలు వెళ్ళి దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారు. ఇటువంటి పరిస్థితులు గతంలో ఉన్నప్పటికీ కరోనా వల్ల వలస కార్మికుల దీన గాథలు ప్రపంచానికి తెలియవచ్చింది. ఒకరకంగా ఈ దేశం దౌర్భా గ్యస్థితిని బయటపెట్టింది. మరొక సమస్య నేరుగా కరోనాతో ముడి పడి ఉన్న ఆరోగ్యరంగం. మన ఆరోగ్య రంగం ఎదుర్కొంటోన్న అనేక అవరోధాలను కరోనా బహిర్గతం చేసింది. కరోనా వల్ల భయానకమైన స్థితిని ప్రజలే స్వయంగా అనుభవించారు. కానీ ప్రభుత్వాలు చేసింది నామమాత్రమే. ఉపన్యాసాలకు మాత్రమే పరిమితమైన వీరివల్ల ఒరిగిందేమీ లేదు. ప్రభుత్వాలు వైద్యం మీద పెడుతున్న ఖర్చుకన్నా ప్రజలు చేస్తున్న ఖర్చు అనేక రెట్లు అధికం. ఒక అంచనా ప్రకారం, ప్రపంచంలో ప్రజలు వైద్యం కోసం చేస్తున్న ఖర్చు దాదాపు 38 లక్షల కోట్లు. భారతదేశం వాటా ఇందులో చాలా ఎక్కువే. ప్రతి సంవత్సరం ఆరోగ్య సమస్యల వల్ల 90 కోట్ల మంది తీవ్రమైన ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని, 9 కోట్ల మంది పేదరికంలోకి దిగజారిపోతున్నారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. కరోనా సమయంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న కుటుం బాలు సామాజిక వెలివేతకు గురవడం మాత్రమే కాకుండా, లక్షల రూపాయల అప్పుల్లో కూరుకుపోయారు. ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజ లను నిలువుదోపిడీ చేస్తుంటే, ప్రభుత్వాలన్నీ ప్రేక్షక పాత్ర వహించాయి. ప్రభుత్వాలకు దూరదృష్టి లేకపోవడం వల్ల ఇటువంటి దుష్పరిణామాలు సంభవించాయి. మన దేశంలో పదివేల మంది జనాభాకు కేవలం 8 బెడ్లు, పదివేల మంది జనాభాకు 8 మంది డాక్టర్లు ఉన్నారు. దీనితోపాటు, 80 మందికి ఎటువంటి ఆరోగ్యభీమా లేదు. గతంతో పోలిస్తే ప్రభుత్వ ఆసుపత్రులలో ఇచ్చే మందులు చాలా తగ్గిపోయాయి. ఈ పరిస్థితులు కరోనా సమయంలో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. అదే సమయంలో లాక్డౌన్ తొలగించిన తర్వాత ప్రారంభించిన చదువులు మనదేశంలో ఉన్న అసమానతలను బయటపెట్టాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య, పేదలు, ధనికుల మధ్య, మైదాన ప్రాంతాలు, అటవీప్రాంతాల మధ్య ఉన్న తేడాలు మరోసారి తేట తెల్లమయ్యాయి. అంతేకాకుండా సమాజంలో వివక్షకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థినీ విద్యార్థులు కూడా ఆన్లైన్ క్లాసులకు దూరమవుతున్నారు. ఈ విషయాలపై ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోన్న ఒక సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం, 56.01 శాతం విద్యార్థినీ, విద్యా ర్థులకు స్మార్ట్ ఫోన్లు లేవని తేల్చారు. అంటే దాదాపు సగానికిపైగా విద్యార్థులు ఈ సంవత్సరం చదువులకు దూరమైనట్టే. స్మార్ట్ ఫోన్ ఉన్న విద్యార్థులకు చాలా ప్రాంతాల్లో సరిౖయెన నెట్వర్క్ లేనందువల్ల చదువుల్లో అంతరాయం కలిగిందని ఆ సర్వే తెలిపింది. మరికొన్ని సందర్భాల్లో ఆన్లైన్ క్లాసులు విన్నప్పటికీ సరిగ్గా అర్థం కావడం లేదని ఆ సర్వే తేల్చి చెప్పింది. మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం లాంటి వాళ్ళ విజన్–2020 పేరుతో మార్గదర్శకాలను తయారుచేశారు. అబ్దుల్ కలాం మన పిల్లలందరినీ కలలు కనమన్నారు. మనం కూడా మన పిల్లలకు అదే నేర్పించాం. కానీ మనం కలలు కంటూనే ఉన్నాం. కానీ మన ప్రభు త్వాలు మన దేశాన్ని కలకాలం కలల్లోనే ఉండేలా చేశాయి. మన పిల్లల స్వప్నాలు సత్యాలు కాలేదు. కానీ మనకు ఈ కరోనా ఒక మేల్కొ లుపునిచ్చింది. ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేసింది. అయితే కరోనా ఇచ్చిన అనుభవమే రేపటి సమాజ మార్పుకు ఒక హెచ్చరిక కావాలి. మనం వీడ్కోలు పలుకుతున్న 2020 సంవత్సరం తెచ్చిన ఉపద్రవం మనకు జీవితంలో అత్యంత కఠినమైన అనుభవాలను మిగిల్చింది. 2020ని సంతోషంగా సాగనంపడమంటే, మన పాలకుల పట్ల మనకున్న భ్రమలను తొలగించి, వాస్తవాలను కళ్ళకు కట్టిన చేదు అనుభవాలు పునరావృతం కాకుండా మేల్కోగలగడమే. ప్రజలను మభ్యపెట్టి, మాయజేసే విధానాల పట్ల అప్రమత్తంగా ఉండడమే. ఉపాధి, ఉద్యోగ, ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వాలు తమ బాధ్యతను మరిచిన సత్యాన్ని చెంపఛెళ్ళుమనింపిచేలా కొట్టిన ఘనత 2020కే దక్కింది. ఇదే మనకొక కనువిప్పు. ప్రభుత్వాల విషయంలో ప్రజ లకూ, ప్రజల పట్ల వ్యవహరించే తీరులో పాలకులకూ ఇదొక హెచ్చరిక కావాలి. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
అన్నదాతే కాదు, ఉద్యమ దీపధారి
అడవి, నీరు, గనులు, వినిమయ వస్తువుల వ్యాపారం నుంచి మొదలుకొని దేశంలోని మొత్తం భూమిని తమ కబంధ హస్తాల్లోకి తీసుకోవాలని కార్పొరేట్లు చూస్తున్నాయని పంజాబ్ రైతులు నిలదీస్తున్నారు. భారత పౌరులకు, కార్పొరేట్ వ్యవస్థకు మధ్య సాగుతున్న అంతర్గత ఘర్షణను ఈ పోరాటం బహిరంగ పరిచింది. అందుకే ఇప్పుడు జరుగుతున్న ఈ పోరాటం విజయవంతం అవుతుందా, లేక విఫలమవుతుందా? అన్న ప్రశ్నకన్నా ఈ ఉద్యమం చూపుతున్న ప్రభావం గొప్పది. పంట పొలాల్లో పారిన వారి చెమటచుక్కల సాక్షిగా, ఎముకలు కొరికే చలిలో చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో, గుండెనిబ్బరంతో పోరాడు తున్న ఆ రైతాంగాన్ని చరిత్ర ఎన్నడూ మరచిపోదు. ఆ ఉద్యమంలో పాల్గొంటున్న ప్రతీ రైతన్న పోరాట పటిమ చరిత్రలో ఒక శిలాక్షరమై నిలిచి గెలుస్తుంది. ‘‘అధికారంలో ఉన్న వారికన్నా ప్రజాబలం అత్యంత శక్తిమంతమైంది’’. ఇది అక్షర సత్య మనడానికి నేటి భారతావని ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. పంజాబ్ రైతన్నలు మొదలుపెట్టిన పోరాటం ప్రధానంగా ఉత్తర భారతాన్ని చుట్టేసింది. దాదాపు 20 రోజులకు పైగా రైతులంతా దేశ రాజధానిని ముట్టడిస్తున్నారు. ఒకరకంగా చదరంగం ఆటలో సాధారణ సైనికులు రాజుకి చెక్ పెట్టినట్టు సామాన్య రైతులు ఢిల్లీ ప్రభుత్వాన్ని దిగ్బంధిం చారు. ప్రభుత్వాలు, రాజ్యాలు, చక్రవర్తులు అన్ని రకాల పాలనలూ ప్రజాబలం ముందు మోకరిల్లక తప్పలేదనేది చరిత్ర ఎన్నో సార్లు రుజువు చేసింది. అయితే ఈనాడు జరుగుతున్న రైతాంగ ఉద్యమం పైకి కనిపిస్తున్నట్టుగా కేవలం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ప్రత్యేకించి కొత్త చట్టాలకు వ్యతిరేకంగా మాత్రమే కాదు, ఇది భారత దేశాన్ని కబళించేందుకు పూనుకున్న కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం. గతంలో కూడా ఇటువంటి పోరాటాలు జరి గాయి. కొన్ని కంపెనీలకు వ్యతిరేకంగా కూడా ఆ ఉద్యమాలు గళమె త్తాయి. ఇంత సూటిగా, శక్తిమంతంగా ఆ ఉద్యమాలు నిలబడలేదు. పంజాబ్తో సహా యావత్ దేశంలోని రైతాంగం చేస్తున్న ఈ పోరాటం రాబోయే ప్రజా ఉద్యమాలకు ఒక దశ, దిశను చూపిస్తున్నది. భారత రైతాంగం సాగించిన గత పోరాటాలన్నీ కూడా ఆనాటి సామాజిక మార్పునకు పునాదులు వేశాయి. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో అనేక పోరాటాలు జరిగాయి. అందులో బిహార్లోని చంపారన్ పోరాటం ప్రముఖమైనది. బ్రిటిష్ ప్రభుత్వం చంపారన్ వ్యవసాయ చట్టం పేరుతో 1917లో ఒక చట్టాన్ని తెచ్చింది. ఇది రైతులకు పెనుశాపంగా మారింది. ఇందులో ప్రధా నంగా భూమిశిస్తు పెంచి రైతుల గొంతుమీద కత్తిపెట్టారు. నీలిమందు పంటను పెంచాలనే నిబంధనను విధించారు. దీనివల్ల రైతులకు తమకు నచ్చిన పంటను వేసుకునే స్వేచ్ఛ లేకుండా పోయింది. అంతే కాకుండా రైతులకు తక్కువ ధర ఇచ్చి పంటను కొనుక్కునే అధికా రాన్ని ప్రభుత్వం వ్యాపారులకు కట్టబెట్టింది. బ్రిటిష్ వ్యాపారుల ప్రయోజనాల కోసం పంట వేయడం వల్ల అదే పంటను ఇంకా ఎక్కడా అమ్ముకునే అవకాశం రైతులకు లేకుండా పోయింది. దీంతో రైతులు పేదరికంలోకి దిగజారిపోయారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకుడిగా గాంధీజీ భారతదేశంలో అడుగుపెట్టారు. దక్షిణాఫ్రికాలో ప్రారంభించిన అహింసాయుతమైన సత్యాగ్రహ ఉద్య మాన్ని చంపారన్లో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. ఆకలితో, దారిద్య్రంతో అల్లాడుతున్న రైతులకు గాంధీజీ ఒక ఆశాకిరణంగా కనిపించారు. కానీ చౌరీచౌరాలో పోలీస్ స్టేషన్ తగులబడటంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. దీంతో గాంధీ అక్కడ ఉద్య మాన్ని విరమించారు. అయితే చంపారన్ ఉద్యమం భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వ రహస్య ఉద్దేశాన్ని బట్టబయలు చేసింది. తమ వ్యాపార ప్రయోజనాలు, దేశంలోని వనరుల దోపిడీ వారి ప్రధాన లక్ష్యాలని బయటపెట్టింది. అంతేకాకుండా అహింస, సత్యాగ్రహం ద్వారా జాతీయవాదం మరింత బలపడింది. గుజరాత్లోని ఖేడాలో కూడా పత్తి, పొగాకు పండించే రైతులు తీవ్రమైన కరువు కాటకాల్లో చిక్కుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం వారికి ఎటువంటి సహాయం అందించకపోగా, భూమి పన్ను కట్టాల్సిందే నంటూ వేధింపులకు గురిచేసింది. 1919లో గాంధీజీ, వల్లభాయ్ పటేల్, ఎన్.ఎం.జోషి నాయకత్వంలో సత్యాగ్రహం మొదలైంది. బ్రిటిష్ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. అక్కడ పాటిదార్లు ప్రధాన రైతాంగ శక్తి. ఖేడా ఉద్యమం వల్ల భూమిశిస్తు రద్దయింది. గాంధీజీ, వల్లభాయ్ పటేల్ నాయకత్వ బలోపేతానికి కారణమైంది. అదే గుజరాత్లోని బార్దోలి ప్రాంతంలో వరదలతో రైతులు పంటలను పోగొట్టుకున్నారు. అయినా బ్రిటిష్ ప్రభుత్వం భూమిశి స్తును 30 శాతం పెంచింది. తగ్గించడానికి ససేమిరా అంగీకరించ లేదు. దీనికి వ్యతిరేకంగా 1925లో వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో సహాయనిరాకరణ ఉద్యమం ప్రారంభమైంది. బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేయడానికే నిశ్చయించుకుంది. పోలీసు బలగా లను దించింది. అరెస్టులను సాగించింది. అయినా రైతాంగం చాక చక్యంగా ఉద్యమాన్ని కొనసాగించింది. వల్లభాయ్ పటేల్ అందించిన నాయకత్వానికి ప్రతిగా రైతాంగం ఆయనకు ‘సర్దార్’ బిరుదును ఇచ్చింది. ఆ రోజు నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్గా మారిపోయారు. ఈ రెండు ఉద్యమాలు ప్రజల్లో భారత స్వాతంత్య్రకాంక్షను పెంచాయి. కేరళలోని మలబార్ ప్రాంతంలో జరిగిన మొఫ్లా రైతాంగ పోరాటం అక్కడి స్థానిక జమీందారుల దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరే కంగా సాగింది. 1835 నుంచి మొఫ్లా రైతులను అక్కడి భూస్వాములు దోపిడీ చేస్తున్నారు. ఇక్కడ ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది. మొఫ్లా రైతులు మెజారిటీ ముస్లిం రైతులు కాగా, భూస్వాములు హిందువులు. అయితే సమస్య మతపరమైనది కాకపోయినప్పటికీ, అంతిమంగా ఆ రూపం తీసుకున్నది. మొఫ్లా తిరుగుబాటు 1921లో ప్రారంభమైంది. మొదటి ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించలేకపోయింది. ఈ ఉద్యమం ముస్లింలు ప్రారంభించిన ఖిలాఫత్ ఉద్యమం బలపడటానికి, ఒకరకంగా ముస్లింలు ప్రత్యేక శక్తిగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడింది. 1946లో ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటం స్థాని కంగా జమీందార్లకు, జాగీర్దార్లకు వ్యతిరేకంగా ప్రారంభమైంది. వీళ్ళకు అండగా వచ్చిన రజాకార్లకు, వీళ్ళందరినీ కాపాడిన నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగింది. ఈ పోరాటం వల్ల జమీందారు, జాగీర్దారు విధానం పోయి, ఆ భూములను ప్రజలు పంచుకున్నారు. దున్నేవాడికే భూమి అనే నినాదం ఇక్కడే ప్రముఖంగా వినిపించింది. వీటన్నింటితోపాటు, కమ్యూనిస్టు సిద్ధాంతం ఆచరణలో ఎంతో శక్తి కలిగి ఉన్నదని చెప్పడానికి తెలంగాణ సాయుధపోరాటం ఉపయోగ పడింది. భూస్వామ్య, పెత్తందారీ, రాచరిక పాలన స్థానంలో ప్రజా స్వామ్య ప్రభుత్వం ఏర్పడటానికి మార్గం వేసింది తెలంగాణ సాయుధ పోరాటమేనని చెప్పక తప్పదు.భారతదేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత ఆదివాసీ ప్రాంతాల్లో పెల్లుబికిన నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరిలోయ రైతాంగ పోరా టాలు పాలకుల మొద్దునిద్రను వదిలించాయి. ఆ పరంపరంలో ఇప్ప టికీ నక్సలైట్ ఉద్యమాలు సాగుతున్నప్పటికీ, నక్సల్బరీ అనంతరం ప్రభుత్వాలు ఆదివాసుల కోసం ఎన్నో చట్టాలను, పథకాలను తెచ్చాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ ఉద్యమ ప్రభావం సమాజంపై పడిందనేది వాస్తవం. ప్రస్తుతం మనం చూస్తున్న పంజాబ్ నాయకత్వంలోని జాతీయ రైతాంగ పోరాటం కార్పొరేట్లతో భారత ప్రజలు సాగించాల్సిన ప్రత్యక్ష పోరాటానికి తెరలేపింది. 1990 నుంచి ప్రారంభమైన ప్రైవేటీకరణ, సరళీకరణ, విశ్వీకరణలు ఈరోజు కార్పొరేట్ వ్యవస్థగా మారి పోయాయి. పారిశ్రామిక వస్తువుల ఉత్పత్తుల నుంచి, అడవి, నీరు, గనులు, వినిమయ వస్తువుల వ్యాపారం నుంచి మొదలుకొని దేశం లోని మొత్తం భూమిని తమ కబంధ హస్తాల్లోకి తీసుకోవాలని కార్పొ రేట్లు చూస్తున్నాయని పంజాబ్ రైతులు నిలదీస్తున్నారు. ప్రభుత్వాలు, కార్పొరేట్లు వేరువేరనే ముసుగును ప్రస్తుత పోరాటం తొలగించింది. అందుకే ఈ ఉద్యమం సాధారణమైనది కాదు. ఇది చరిత్రాత్మక మైనది. భారత పౌరులకు, కార్పొరేట్ వ్యవస్థకు మధ్య సాగుతున్న అంతర్గత ఘర్షణను ఈ పోరాటం బహిరంగ పరిచింది. గతంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల్లో కార్పొరేట్లను ప్రవే శింపజేయడాన్ని అక్కడి ఆదివాసులు వ్యతిరేకించారు. రెండు సంవ త్సరాల క్రితం నాసిక్ నుంచి 40,000 మంది ఆదివాసీ రైతులు మహా పాదయాత్ర చేసి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తమిళనాడులో, ఆంధ్రాలో ఇంకా అనేక చోట్ల ప్రజలు కార్పొరేట్ కంపెనీలను నిరసిం చారు. పశ్చిమబెంగాల్లోని సింగూరు రైతుల ప్రతిఘటనను కూడా అందులో భాగంగానే చూడాలి. అందుకే ఇప్పుడు జరుగుతున్న ఈ పోరాటం విజయవంతం అవుతుందా, లేక విఫలమవుతుందా? అన్న ప్రశ్నకన్నా ఈ ఉద్యమం చూపుతున్న ప్రభావం గొప్పది. పంట పొలాల్లో పారిన వారి చెమటచుక్కల సాక్షిగా, ఎముకలు కొరికే చలిలో చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో, గుండెనిబ్బరంతో పోరాడుతున్న ఆ రైతాంగాన్ని చరిత్ర ఎన్నడూ మరచిపోదు. ఆ ఉద్యమంలో పాల్గొం టున్న ప్రతీ రైతన్న పోరాట పటిమ చరిత్రలో ఒక శిలాక్షరమై నిలిచి గెలుస్తుంది. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 మల్లెపల్లి లక్ష్మయ్య -
అస్తిత్వం కోసం ఆదివాసీల ఆరాటం
దేశంలోని ఆదివాసీ సంఘాలు, తమ తెగల కోసం ప్రత్యేకంగా ఆదివాసీ మతం పేరుతో జనాభా లెక్కల్లో ప్రత్యేక కాలమ్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాయి. జనాభా గణ న సందర్భంగా ఆదివాసీలను ఇతర మతాల్లో కలపకుండా ప్రత్యేక గుర్తింపు కోడ్ కాలమ్లో చేర్చాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసనసభలో చేసిన తీర్మానం సభ ఆమోదం పొందింది. జార్ఖండ్లోని ఆదివాసీ సంఘాలు మాత్రమే కాకుండా దేశంలోని ఆదివాసీ సంఘాలు కూడా, తమ తెగల కోసం ప్రత్యేకంగా ఆదివాసీ మతం పేరుతో జనాభా లెక్కల్లో ప్రత్యేక కాలమ్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం, జనగణన విభాగం దీన్ని ఆమోదించడం సాధ్యం కాకపోవచ్చు కానీ ఇది ప్రారంభం మాత్రమే. ఇది క్రమంగా ఆదివాసీల అస్తిత్వ ఉద్యమంగా రూపుదిద్దుకోవడం ఖాయం. ‘‘జనాభా లెక్కల్లో ఆదివాసీలను హిందు వుల్లోగానీ, ఏ ఇతర మతాల్లోగానీ చేర్చకూ డదు. వారిని జనాభా లెక్కల్లో ‘సరన’ కోడ్ కాలమ్లో చేర్చాలి. గత నలభై ఏళ్ళుగా ఆదివాసీలు చేస్తున్న ఈ డిమాండ్ని శాసనసభ ఆమో దించాలి’’ అంటూ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసన సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. గత చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా నవంబర్ 11వ తేదీన ఒక రోజు ప్రత్యేక సమావేశం నిర్వ హించి, ఈ తీర్మానాన్ని ఆమోదించారు. ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఈ తీర్మానాన్ని వ్యతిరేకించలేదు. కానీ కొన్ని అభ్యంతరాలను లేవనెత్తింది. సాంకేతికంగా సమస్యలున్నాయని ఆ పార్టీ నాయకులు బాబూలాల్ మరాండి పేర్కొన్నారు. అయితే సరన కోడ్ను జనాభా లెక్కల్లో చేర్చాలనే డిమాండ్ను హేమంత్ సోరెన్ నాయకత్వం వహిస్తున్న జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. అంతేకాదు, ఈ విషయంపైన జార్ఖండ్లోని ఆదివాసీ సంఘాలు మాత్రమే కాకుండా దేశంలోని ఆదివాసీ సంఘాలు, తమ తెగల కోసం ప్రత్యేకంగా ఆదివాసీ మతం (ట్రైబల్ రిలీజియన్) పేరుతో జనాభా లెక్కల్లో ప్రత్యేక కాలమ్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాయి. జార్ఖండ్ శాసనసభ చేసిన తీర్మానం పైన కేంద్ర ప్రభుత్వం, జనాభా గణన విభాగం (సెన్సెస్ డిపార్ట్మెంట్) సానుకూలంగా ఉంటుందని ఎవ్వరూ భావించడం లేదు. అయితే ఇది ప్రారంభం మాత్రమే. మిగతా రాష్ట్రాల్లో ఈ డిమాండ్ ఊపందుకునే అవకాశం మెండుగా ఉంది. ఇది క్రమంగా ఆదివాసీల అస్తిత్వ ఉద్యమంగా రూపుదిద్దుకోవడానికి ఉపయోగపడు తుందన్నది వాస్తవం. భారతదేశంలో 1871లో జనాభా గణన ప్రారంభం అయినప్పటి నుంచి ఆదివాసీలను ‘అబ్ ఆర్జినల్స్’గా పేర్కొన్నారు. 1901 నుంచి 1942 వరకు జనాభా లెక్కల్లో ఆది వాసీలను యానిమిస్ట్స్ అని పేర్కొన్నారు. దానర్థం ‘ప్రకృతి ఆరా ధకులు’ అని. అయితే భారతదేశం స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఆదివాసీలను ప్రత్యేకంగా గుర్తించడం ఆపేశారు. అప్పటి నుంచి వారిని హిందువులుగానో, క్రైస్తవులుగానో లేదా ఇతర మతాల గాటనో కట్టేశారు. నిజానికి చరిత్ర పరిశోధకులుగానీ, మానవ శాస్త్ర నిపుణులుగానీ ఆదివాసీలు ప్రత్యేక మత సాంప్రదాయాలు కలిగిన వారుగానే పేర్కొ న్నారు. ఏ దేశంలోనైనా అడవుల్లో, కొండల్లో నివసించే వారి సాంప్రదా యాలు విభిన్నంగానే ఉంటాయి. వాళ్ళల్లో విగ్రహారాధనగానీ, ఇతర మనుషుల రూపంలో ఉండే దేవుళ్ళు, దేవతలుగానీ ఉండరు. సమస్త ప్రకృతే వారి దైవం. చెట్లు, కొండలు, జంతువులు, పక్షులు, ప్రకృతి లోని ఇతర గాలి, నీరు లాంటివే వారికి ఆరాధ్యదైవాలు. ‘సరన’ అంటే ఒక చెట్టు పేరు. దానిని ‘సాల్ ట్రీ’ అంటారు. అంటే తెలుగులో మద్ది చెట్టు అన్నమాట. ఇది చరిత్రలో కూడా ఎంతో ఆరాధ్య వృక్షంగా వుంది. గౌతమ బుద్ధుడు జన్మించింది, మహాపరి నిర్వాణం పొందింది కూడా ఈ మద్దిచెట్ల మధ్యనే అని బౌద్ధ సాహిత్యం ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు మన దేశంలోని ప్రధాన ఆదివాసీ తెగలన్నీ కూడా ఏదో ఒక రకమైన ప్రకృతి ఆరాధనలోనే ఉన్నాయి. భారతదేశంలోని ప్రధానమైన ఆదివాసీ తెగల్లో సంతాల్ ఒకటి. తమ పూర్వీకుల ఆత్మలే తమకు మంచి, చెడు చేకూరుస్తాయని నమ్ముతారు. అదేవిధంగా ఒక తోటలోని చెట్లలో తమ పూర్వీకులు నివసిస్తుంటారని, తమకు సమీపంలోని కొండల్లో వాళ్ళు కొలువుదీరి ఉంటారని సంతాల్ తెగ నమ్ముతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చెంచులు చెట్లకు ప్రతిరూపంగా గరెలైసమ్మకు పూజ చేస్తారని అంటారు. మన దేశంలోని మరో ప్రధానమైన తెగ గోండ్ తెగ. వీళ్ళు ప్రధానంగా ప్రకృతి ఆరాధకులు. నాగజాతి ఆరాధకులు. నాగోబా జాతర పేరుతో జరిగే జాతర వీరి సాంప్రదాయంలో చాలా ముఖ్యమైన జాతర. వీళ్ళ గూడేల్లో కూడా ఏ హిందూ దేవుళ్ళో, లేదా దేవతల విగ్రహాలో ఉండేవి కావు. వీరిలో మనిషిని బలిచ్చే సాంప్రదాయం ఉండేది. ఎంత శక్తిమంతులను బలిస్తే, అంత ఫలితం ఉంటుందని వీళ్ళు 1 9వ శతాబ్దం వరకు నమ్మేవారు. మరొక తెగ ‘ఖిల్’. వీళ్ళ ప్రకృతి ఆరాధనతో పాటు, మంత్రా లను, తంత్రాలను విశ్వసిస్తారు. కోయ, కొండరెడ్లు, కోంద్, ఇతర తెగలన్నీ గతంలో ప్రకృతి ఆరాధకులుగానే ఉన్నారు. ఇటీవల కొంతకాలంగా, కొందరు క్రైస్తవులుగా, మరికొందరు హిందూ దేవత లను ఆరాధించేవాళ్ళుగా మారిన మాట వాస్తవమే. అయితే ఇటీవల ఆదివాసులలో పెరిగిన రాజకీయ చైతన్యం ఆదివాసీలను తమ అస్తిత్వ ఉద్యమంవైపు అడుగులు వేసేలా చేస్తోండడం ఆహ్వానించదగ్గ పరి ణామం. అయితే వాళ్ళు ఈ దేశంలోని మెజారిటీ మతం కలహించే సమాజం, సంస్థలు, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల నిరాశకు గురవుతున్నారు. రాజ్యాంగంలో వీరిని షెడ్యూల్డ్ తెగలుగా గుర్తిస్తుంటారు. దానికి కొన్ని ప్రాతిపదికలు ఉన్నాయి. అవి 1. భౌగోళికంగా ప్రత్యేక ప్రాంతం, ప్రత్యేకించి అడవులు, కొండలు. 2. ప్రత్యేక భాష, 3. ప్రధాన సమాజానికి భిన్నంగా ప్రాచీన సాంప్రదా యాలు, ప్రత్యేకించి ప్రకృతి ఆరాధన. 4. వెనుకబడిన ఆర్థిక విధానం, ప్రకృతి వనరులపైన ఆధారపడిన జీవన విధానం, 5. ప్రత్యేక తెగగా ఉండడం, 6. అన్ని సమస్యలనూ, వ్యవహారాలనూ వారి సంఘం నేతృత్వంలో పరిష్కరించుకొనే తమదైన ప్రత్యేక పాలనా విధానం. ఈ విధమైన జీవనవిధానాన్ని బట్టి వారిని ఆదివాసీలుగా గుర్తించాలని భారత ప్రభుత్వమే ఎన్నో ఏళ్ళ కిందట నిర్ణయించింది. ఇప్పటికీ ఆదివాసీలు తమ మత విధానాలను వదులుకోలేదని, బయటి ప్రపంచం ప్రభావం కొంత ఉన్నప్పటికీ తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నది వాస్తవం. మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 72 ఏళ్ళు గడిచిపోయాయి. ఎన్నో ప్రణాళికలు, పథకాలు రచించారు. మరెన్నో విధివిధానాలు రూపొందించారు. కానీ అవి మిగతా పేదలు, దళితులతో పాటు, ఆదివాసీలకు అందించాల్సిన స్థాయిలో అంద లేదు. ఇప్పటికీ ఆదివాసీలు అభివృద్ధిలో భాగం కాలేకపోయారు. అంతేకాకుండా, మన ప్రభుత్వాలు, పాలకులు, పెద్దలు అనుసరిస్తున్న అభివృద్ధి విధానాల వల్ల ఆదివాసీలకు ప్రయోజనం చేకూరకపోవడం మాత్రమే కాదు, వారు అభివృద్ధిలో బలిపశువులుగా మారుతున్నారు. గత 30 ఏళ్లనుంచి ఇప్పటి వరకు 3 కోట్ల మంది ఆదివాసీలు నిరాశ్ర యులయ్యారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు, గనులు, బహుళజాతి కంపెనీల వల్ల, తాము వేల ఏళ్ళుగా నివసిస్తోన్న నేలను వీడి, తాము దైవ స్వరూపంగా భావించే భూమిని వదులుకొని, వలసపోతున్నారు. అభివృద్ధి పేరుతో ఆదివాసీలపై జరుగుతోన్న అకృత్యాలెన్నో లెక్కలో లేవు. అంతే కాకుండా రాజ్యాంగంలో పొందు పరిచిన ఐదవ, ఆరవ షెడ్యూల్స్లో ఎన్నో రక్షణలు ఉన్నప్పటికీ ఆచరణలో అవి ఎంత మాత్రం అండగా నిలబడలేకపోతున్నాయి. రాజ్యాంగం అమలుకి వచ్చి ఏడు దశాబ్దాలు దాటిపోయాయి. ఆదివా సీల ప్రగతికి పదికిపైగా కమిషన్లు, కమిటీలు నివేదికలు ఇచ్చాయి. కానీ ఏ ఒక్కటీ కూడా మనస్ఫూర్తిగా, చిత్తశుద్ధితో అమలు చేయలేదు. ఇప్పటికే ఆదివాసీ ప్రాంతాల్లోని పిల్లలు, యువకుల చదువు అంతంత మాత్రంగానే ఉంది. అడవులు, కొండ కోనలు దాటి ఉన్నత విద్యను ఆర్జిస్తున్న వారు, వారి జనాభాలో రెండు శాతం మాత్రమే. అంటు వ్యాధులు, ఇతర సీజనల్ జబ్బులు వారిని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. టి.బి., ఇతర తీవ్రమైన రోగాలతో ప్రతి సంవత్సరం వేలాదిమంది ఆదివాసీలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి ఏడాది ఐదు సంవత్సరాలలోపు పిల్లలు ఒక లక్షా నలభైవేల మంది మృత్యు వాత పడుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అడవిలో లక్షల ఎకరాల భూమి ఉన్నప్పటికీ, ఆదివాసీలు తర తరాలుగా ఆ అడవే జీవితంగా బతుకుతున్నప్పటికీ వారి కాళ్ళకింది నేల వారిది కాదు. వారు జీవిస్తోన్న అడవిపై వారి హక్కు కాగితాలకే పరిమితం. రకరకాల పేర్లతో, అభివృద్ధి పథకాల నెపంతో ఆదివాసీ లకు చెందాల్సిన భూమి మొత్తం అన్యాక్రాంతమౌతోంది. అందుకే అవునన్నా, కాదన్నా జల్, జంగిల్, జమీన్ అనే నినాదం మరింత తీవ్ర తరం అవుతున్నది. భారత సమాజం, భారత ప్రభుత్వం అనుసరి స్తున్న దోపిడీ, నిర్లక్ష్యం ఆదివాసీలను ప్రత్యేక అస్తిత్వం వైపు నడిపిస్తు న్నది. జార్ఖండ్ అసెంబ్లీలో ప్రత్యేక ఆది వాసులను ప్రత్యేక మతంగా గుర్తించాలని చేసిన తీర్మానం భారత సమాజానికి, కేంద్ర ప్రభు త్వాలకు చేసిన ఒక హెచ్చరిక. ఇప్పటికైనా వివక్షకు, విద్వేషానికి, విస్మరణకు గురౌతోన్న కులాల, తెగల విషయంలో సానుకూల దృక్పథం అనుసరించకపోతే ఫలితాలు మన ఆలోచనలకు అందనంత దూరంలో ఉంటాయన్న విషయాన్ని మరువకూడదు. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
ప్రజాస్వామిక స్వేచ్ఛకు లింకన్ మార్గం
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రజాస్వామ్యం క్రమంగా నియంతృత్వం వైపు పయనిస్తోంది. వివిధ దేశాల్లో అమలులో ఉన్న ప్రజాస్వామ్యాన్ని అంచనా వేయడానికి ఎన్నికలు మాత్రమే పరమావ«ధి కావు. ఇందులో ప్రజల భాగస్వామ్యం ఎట్లా ఉన్నదనే విషయానికే అధిక ప్రాధాన్యత. అయితే ఒక అధ్యయనం ప్రకారం ఇండియాతో పాటు, అమెరికా, యూరప్లాంటి గొప్ప ప్రజాస్వామ్య దేశాలు కూడా సంపూర్ణ ప్రజాస్వామ్య దేశాలుగా మార్కులు సంపాదించలేక పోతున్నాయి. భారతదేశంలో ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యానికి ప్రమాదం ఏర్పడింది. భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఎంతో దూరదృష్టితో పొందుపరిచారు. వాటిని అమలు చేయనంతవరకు మన దేశంలో సమానత్వం సిద్ధించదు. ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు. ‘‘ఈ నేల నుంచి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కనుమరుగు కాకూడదు. ఈ జాతి నూతన స్వేచ్ఛకు జన్మనివ్వాలి. అందుకే ప్రభుత్వాలు ప్రజల చేత, ప్రజల కోసం పనిచేయాలి.’’ నవంబర్ 19, 1863న అమెరికాలోని గెట్టిస్బర్గ్ గడ్డమీది నుంచి చేసిన ప్రకటన ఇది. దాదాపు 157 ఏళ్ళనాడు ఆనాటి అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ప్రజాప్రభుత్వమంటే ఏమిటనే విషయాన్ని ప్రపంచానికి విడమర్చి చెప్పారు. అబ్రహాం లింకన్ ఈ ప్రకటన యుద్ధభూమి నుంచి చేసిన సింహ గర్జన. అమెరికా అంతర్యుద్ధం సమయంలో ఈ స్వేచ్ఛా నినాదాన్ని చ్చారు. లింకన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత బానిస విధా నాన్ని రద్దు చేస్తూ చట్టం చేశారు. ఇది అమెరికా దక్షిణ రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చింది. అమెరికా కేంద్ర ప్రభుత్వాన్ని సవాల్ చేసే స్థాయికి చేరింది. దీంతో దక్షిణ, ఉత్తర ప్రాంతాల విభజన జరిగి, అంతర్యుద్ధానికి దారితీసింది. ఇందులో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఒక ప్రభుత్వం యుద్ధం చేయడం ఇదే చరిత్రలో మొదటిసారి, బహుశా చివరిసారి కూడా కావచ్చు. నల్లజాతి ప్రజలను బానిసత్వం నుంచి తప్పించ డానికి ఇటువంటి సాహాసోపేతమైన చర్యకు పూనుకున్న లింకన్ చరిత్రలో ఒక మహోన్నత స్థానాన్ని అలంకరించారు. అయితే ఆయన సాహసమే ఆయన హత్యకు కూడా కారణమైంది. ప్రజాస్వామ్యమంటే ఓటింగ్ జరగడం, ప్రతినిధులు ఎన్నిక కావడం, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడమనే సాధారణ ప్రక్రియ కాదనే విషయాన్ని అబ్రహాం లింకన్ తేల్చి చెప్పారు. అందుకే లింక న్కు ముందు ఎందరెందరో సామాజికవేత్తలు, రాజనీతివేత్తలు ప్రజా స్వామ్యం గురించి ఎన్నో సూత్రీకరణలు చేసినప్పటికీ లింకన్ చేసిన వ్యాఖ్య ప్రపంచానికి ప్రామాణికమైంది. అందుకే నవంబర్ 19 ప్రజా స్వామ్య పునరుజ్జీవనానికి ఒక పునాది వేసింది. చరిత్రకారులు చెపుతు న్నట్టుగా, ప్రజాస్వామ్య భావన గ్రీకు తత్వవేత్తలు అరిస్టాటిల్, ప్లేటో లాంటి వాళ్ళ ఆలోచనల నుంచి పుట్టినప్పటికీ లింకన్కే ఆ గౌరవం దక్కింది. నిజానికి అరిస్టాటిల్, ప్లేటోలకు ముందే మన దేశంలో గౌతమబుద్ధుడు ప్రజాస్వామ్య సూత్రాలను ప్రబోధించాడు. అగ్గన్న సుత్త, కలామ సుత్త, వస్సకర సుత్తలో ప్రభుత్వాలు ఎట్లా వ్యవహ రించాలో, ప్రజల పాత్ర ఎట్లా ఉంటుందో, ఎట్లా ఉండాలో బుద్ధుడు సవివరంగా చెప్పాడు. కానీ మన దేశ చరిత్రకారులు, ప్రధానంగా బౌద్ధదమ్మ వ్యతిరేకులు బుద్ధుడిని ఒక మత ప్రభోదకుడిగా, అహింస, సత్యమనే చిన్న చిన్న విషయాలకు పరిమితం చేశారు. లిచ్చవి జన పదం గురించి వస్సకర సుత్తలో మాట్లాడుతూ, వారి పరిపాలనా విధానం ప్రజలకు ఎంత దగ్గరగా ఉందో బుద్ధుడు వివరిస్తాడు. అయితే ఆధునిక చరిత్రలో వచ్చిన అనేక మార్పుల వల్ల ప్రజాస్వామ్య ఆలోచనలు చాలా ప్రగతిశీలంగా మారాయి. అటువంటి ఫలితమే మనకు లింకన్ మాటల్లో కనిపిస్తుంది. అయితే లింకన్కు జన్మనిచ్చిన అమెరికా గడ్డమీదే ప్రభుత్వాలు ఎటువంటి నిరంకుశ, ఆధిపత్య ధోర ణులతో తమ మనుషులు కానివారిని అణచివేస్తున్నామో చూస్తున్నాం. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమొక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ (ఇంటర్నేషనల్ ఐడియా) సంస్థ ప్రజాస్వామ్య తీరుతెన్ను లపై 2019లో అధ్యయనం జరిపింది. ప్రపంచంలో ఉన్న ఖండాల వారీగా, విడివిడిగా వివిధ దేశాల పనివిధానాలను ఇందులో సమీక్షిం చింది. ‘‘ప్రస్తుతం విభిన్న సంస్కృతులు, పరిస్థితులను కలిగి ఉన్న దేశాల్లో ప్రజాస్వామ్యం వివిధ రూపాల్లో అమలు అవుతున్నది. ప్రపం చానికి మార్గదర్శనం చేసే నాయకత్వం లేదు. నియంతృత్వ ధోరణులు పెరిగిపోతున్నాయి. ఇటువంటి సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఒక ప్రధాన లక్ష్యంగా ఉన్నది. దానికోసం ఈ అధ్యయనం ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నాను’’ అంటూ ఆక్స్ఫామ్, ఇంటర్నేషనల్ ఎగ్జి క్యూటివ్ డైరెక్టర్ విన్నీ బైనయిమే ఈ నివేదికకు ముందుమాటగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం పనితీరును అయిదు ప్రధాన అంశా లుగా విభజించారు. మొదటిది, ప్రాథమిక హక్కులు, రెండవది స్త్రీ సమానత్వం, మూడవది సంక్షేమం, నాలుగోది అవినీతి రహితం, ఐదవది మానవాభివృద్ధి సూచికలు. అంటే ప్రజాస్వామ్యాన్ని అంచనా వేయడానికి ఎన్నికలు మాత్రమే పరమావ«ధి కావనేది దీనర్థం. ఇందులో ప్రజల భాగస్వామ్యం ఎట్లా ఉన్నదనే విషయానికి ఈ రిపోర్టు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలు అన్ని రకాలుగా మార్గ దర్శకాలుగా ఉన్నట్టు నివేదిక తెలిపింది. అయితే, ఇండియాతో పాటు, అమెరికా, యూరప్లాంటి గొప్ప ప్రజాస్వామ్య దేశాలు సంపూర్ణ ప్రజాస్వామ్య దేశాలుగా మార్కులు సంపాదించలేక పోయాయి. భారతదేశంలో ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని ఆ నివేదిక సారాంశం. ప్రభుత్వం అనుసరి స్తున్న అభివృద్ధి నమూనాలను ప్రశ్నిస్తున్న సంఘాలను, సంస్థలను, వ్యక్తులను ప్రభుత్వం సహించని స్థితి ఉన్నదనీ; అందులో భాగంగానే విదేశీ సహాయ క్రమబద్ధీకరణ చట్టం (ఎఫ్సీఆర్ఏ)లో తెచ్చిన మార్పులు, అనేక ప్రజాస్వామిక, స్వచ్ఛంద సంస్థలను పనిచేయలేని స్థితికి తెచ్చాయనీ ఈ నివేదిక అభిప్రాయపడింది. టర్కీ రచయిత, జర్నలిస్ట్ ఈస్ తెమెల్కురన్ రాసిన ‘హౌ టు లూజ్ ఎ కంట్రీ–ద సెవెన్ స్టెప్స్ ఫ్రమ్ డెమొక్రసీ టు డిక్టేటర్షిప్’ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రజాస్వామ్యం క్రమంగా నియంతృత్వంవైపు పయనిస్తున్నదని చెబుతోంది. అందుకు తెమెల్ కురన్ ఏడు అంశాలను ప్రస్తావించారు. అందులో మొదటిది, ప్రజ లకు అనవసరమైన విషయాలపై ఉద్యమ నిర్మాణం జరగడం, అసలు సమస్యలు పక్కదారి పట్టేవిధంగా ప్రజల దృష్టిని మళ్ళించడం; రెండవది, హేతుబద్ధమైన ఆలోచనలు కాకుండా, ప్రజల్లో మూఢ త్వాన్ని పెంచేందుకు శతవిధాలా ప్రయత్నం జరగడం; మూడవది, నిస్సిగ్గుగా వ్యవహరించే తత్వాన్ని ప్రజల మెదళ్ళలో చొప్పించడం, నాల్గవది, పాలనా వ్యవస్థలైన న్యాయ, రాజకీయ యంత్రాంగాలను ధ్వంసం చేయడం; ఐదవది, నాయకుల, సంస్థల అభిప్రాయాల ప్రకారం ప్రజల మనస్సులను తయారుచేయడం. ఆరవది, ఎవరైనా తమ అభిప్రాయాలను తెలియజేస్తే అపహాస్యం చేయడం; ఏడవది, అంతిమంగా తాము ఆలోచించిన మూసలో యావద్దేశాన్ని పోత పోయాలనుకోవడం. ఈ ఏడు అంశాలు ఏ దేశంలో ఉన్నా ఆ దేశం తన ప్రజాస్వామ్యాన్ని కోల్పోతుందని తెమెల్కురన్ చెబుతున్నారు. అమెరికా, యూరప్, ఆసియాలోని చాలా దేశాల్లో ఇటువంటి పార్టీలు, ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని తెమెల్కురన్ తేల్చి చెప్పారు. ఇది మన దేశానికి వర్తింపజేసి చూసుకుంటే, ఆ ప్రమాదం మనల్ని కూడా వెంటాడుతున్నది. ఇక్కడే వేళ్ళూనుకొని ఉన్న కుల వ్యవస్థ వల్ల సామాజిక ఆధిపత్యం, వివక్ష, విద్వేషం కొనసాగు తున్నాయి. ఇదే విషయాన్ని బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని సమర్పిస్తూ, నవంబర్ 25న చేసిన చివరి ప్రసంగంలో ‘‘మన దేశం 1950, జనవరి 26వ తేదీ నుంచి వైరుధ్యంలోకి వెళుతున్నది. రాజకీయంగా సమానత్వం సాధించినప్పటికీ, సామాజిక, ఆర్థిక రంగాల్లో వ్యత్యాసాలు కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని పరిష్క రించాలనుకుంటే, మన దేశం, మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడక తప్పదు’’ అని హెచ్చరించారు. అందుకుగానూ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను, ఆదేశిక సూత్రాలను పొందుపరిచారు. ఆదేశిక సూత్రాలలోని ఆర్టికల్ 38, ఆర్టికల్ 46 ఈ దేశంలోని వివిధ ప్రాంతాల, వివిధ కులాల, తెగల ప్రజల మధ్య ఉన్న అంతరాలను తొలగించే మార్గదర్శకాలు. కానీ వాటిని మన ప్రభుత్వాలు పట్టిం చుకునే స్థితిలో లేవు. పౌరహక్కుల నాయకుడు కె.జి.కన్నాభిరాన్ స్మారకోపన్యాసం చేస్తూ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనకు హెచ్చరికగా, మార్గనిర్దేశంగా ఉంటాయి. ‘‘భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఎంతో దూరదృష్టితో పొందుపరిచారు. వాటిని అమలు చేయనంతవరకు మన దేశంలో సమానత్వం సిద్ధించదు. ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు’’ అన్నారాయన. ఆదేశిక సూత్రాల అమలును పర్యవేక్షిం చడానికి ప్రభుత్వం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆయన చాలాసార్లు మాట్లాడారు. స్మారకోపన్యాసాన్ని ‘లాంగ్ లివ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్’ అంటూ ముగించడం మనల్ని మేల్కొల్పడానికే ననడంలో అతిశయోక్తి లేదు. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
అందరివాడు అంబేడ్కర్
ఎస్సీ, ఎస్టీలతోపాటు బలహీన వర్గాలు అనే పదం అంబేడ్కర్ ఉపయోగించడంలో ఉద్దేశం వెనుకబడిన కులాల కోసమేనని గుర్తుంచుకోవాలి. కొంతమంది దురుద్దేశంతో అంబేడ్కర్పై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారు. అంబేడ్కర్ను ఎస్సీల కోసం మాత్రమే ఆలోచించిన నాయకుడిగా ముద్ర వేస్తున్నారు. ఇది కొన్ని దురదృష్టకరమైన సంఘటనలకు అవకాశం కల్పిస్తున్నది. వెనుకబడిన కులాలకు, బలహీన వర్గాలకు మంచి జరగాలని అంబేడ్కర్ నుంచి మొదలుకొని నేటి దళిత నాయకులు, కార్యకర్తల వరకు అందరూ మనసా వాచా కోరుకుంటున్నారు. అభివృద్ధిలో ఆమడ దూరానికి నెట్టివేసిన దళితులు, ఆదివాసీలూ, బడుగు బలహీన వర్గాలను సమైక్యంగా ముందుకు నడపాలన్నదే అంబేడ్కర్ ఆకాంక్ష. నిజానికి బీసీ వాడల్లో కూడా ఆయన విగ్రహాలను ప్రతిష్టించుకోవాలి. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ –46, బలహీన వర్గాల ప్రయోజనాలను, ప్రత్యేకించి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో ప్రభుత్వానికి సంపూర్ణమైన అధి కారాలను ఇచ్చింది. అందుకు ప్రభుత్వం ఎటువంటి చట్టాలనైనా చేయవచ్చునని రాజ్యాంగం స్పష్టం చేస్తున్నది. పార్లమెంటు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆర్టికల్–15కు సవరణ చేసి బలహీన వర్గాలకు రక్షణ కల్పించాలి’’ అని మొట్టమొదటి రాజ్యాంగ సవరణపై బాబాసాహెబ్ అంబేడ్కర్ అత్యంత స్పష్టంగా మాట్లాడారు. సెప్టెంబర్ 16, 1921న అప్పటి జస్టిస్ పార్టీ ప్రభుత్వం మద్రాసు ప్రెసిడెన్సీలో బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్లు కల్పిస్తూ, 613 నంబర్ కమ్యూనల్ జీఓను విడుదల చేసింది. ఆ రిజర్వేషన్లు రాజ్యాంగం అమ లులోకి రావడానికి ముందూ, ఆ తర్వాతా అమలు జరిగాయి. కానీ జూన్ 7, 1950న చంపకం దొరై రాజన్ మద్రాసు హైకోర్టులో ఈ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాం గంలోని ఆర్టికల్ 15 క్లాజు ప్రకారం, కులం పేరుతో వివక్ష చూపడం, అవకాశాలను నిరాకరించడం సరికాదని వాదించారు. మద్రాసు హైకోర్టు ఆమె వాదనను అంగీకరించింది. సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పుని సమర్థించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. రాజ్యాంగం స్ఫూర్తి నిజానికి అదికాదు. కానీ ఆర్టికల్ 15లో ఉన్న ఆ లొసుగును వాడుకొని రిజర్వేషన్లను కొట్టిపారేశారు. అప్పుడు కేంద్రంలో ప్రధాన మంత్రిగా జవహర్లాల్ నెహ్రూ, న్యాయశాఖ మంత్రిగా అంబేడ్కర్ ఉన్నారు. అందుకే ఆర్టికల్ 15ను సవరించాలని అంబేడ్కర్ సూచిం చారు. దానికి అనుగుణంగానే ఆర్టికల్ను సవరిస్తూ పార్లమెంటులో నెహ్రూ తీర్మానం ప్రవేశపెట్టారు. దానిపై వివరణ ఇస్తూ, అంబేడ్కర్ పైవిధంగా వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 ప్రకారం ప్రభుత్వానికి రిజర్వేషన్లు కొనసాగించే అధికారం ఉందని గట్టిగా వాదించారు. ఒకవేళ ఆ రాజ్యాంగ సవరణ లేకపోతే ఎస్సీ, ఎస్టీలతో సహా బీసీలకు, మహిళలకు ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఎటువంటి రిజర్వేషన్ల అవకాశం ఉండేది కాదు. సామాజిక అసమాన తల నుంచి పాక్షిక విముక్తికి ఉద్దేశించిన ఈ సవరణకు పునాది ఆర్టికల్ 46. రాజ్యాంగంలోని నాలుగవ భాగంలో పొందుపరిచిన ఆదేశిక సూత్రాలలోని ఆర్టికల్–46 ఈ రోజు ఎన్నో సంస్కరణలకు పునాది అన్నది సుస్పష్టం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాంచల్ రాష్ట్రాలు అనుభవిస్తున్న ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ పథకాల చట్టాలకు కూడా ఈ ఆర్టికల్ మాత్రమే ఆధారం. అంటే అంబేడ్కర్ దూరదృష్టితో ఈ ఆర్టికల్ను రాజ్యాంగంలో పొందుపరిచారు. ‘‘బలహీన వర్గాలు ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం విద్య, ఆర్థిక రంగాలలో ప్రత్యేక మైన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత, వాటిని చాలా శ్రద్ధతో శీఘ్రగతిన అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది’’ అంటూ ఆర్టికల్ దిశానిర్దేశం చేస్తున్నది. ఎస్సీ, ఎస్టీలతో పాటు బల హీన వర్గాలు అనే పదం అంబేడ్కర్ ఉపయోగించడంలో ఉద్దేశం వెనుకబడిన కులాల కోసమేనని గుర్తుంచుకోవాలి. కొంత మంది దురుద్దేశంతో అంబేడ్కర్పై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారు. అంబేడ్కర్ను ఎస్సీల కోసం మాత్రమే ఆలోచించిన నాయకుడిగా ముద్ర వేస్తున్నారు. ఇది కొన్ని దురదృష్టకరమైన సంఘటనలకు అవ కాశం కల్పిస్తున్నది. అంతేకాకుండా మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసు కోవాలి. ఇప్పుడు మనం ఓబీసీ(ఇతర వెనుకబడిన వర్గాలు) అని పిలుస్తున్న వారి కోసం అమలులోకి వచ్చిన మండల్ కమిషన్ సిఫా రసులకు పునాది రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 అనేది మర్చిపోవద్దు. ఆయా వర్గాల స్థితిగతులను తెలుసుకోవడానికి జరిగే అధ్యయనానికి ఈ ఆర్టికల్ అవకాశం ఇచ్చింది. దీని ఆధారంగానే మొట్టమొదటి బీసీ కమిషన్ ఏర్పాటైంది. దాని పేరు కాలేకర్ కమిషన్. సామాజికంగా, విద్యా విషయకంగా వెనుకబడిన కులాలను గుర్తించి, అధ్యయనం చేసి, వారి స్థితిగతులను ఈ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పిం చింది. కానీ చాలా సంవత్సరాలు ప్రభుత్వాలు దానిపైన శ్రద్ధ పెట్ట లేదు. మళ్ళీ 1979లో జనతాపార్టీ ప్రభుత్వం బి.పి.మండల్ నాయ కత్వంలో వెనుకబడిన కులాల విద్య, సామాజిక విషయాల అధ్యయ నంపై కమిషన్ను నియమించింది. విద్య, ఉద్యోగ రంగాల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేస్తూ, 1980 డిసెం బర్లో మండల్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కానీ 1990 వరకు దానిపైన ఏ ప్రభుత్వాలు స్పందించలేదు. కేంద్రంలో వి.పి.సింగ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 1990 ఆగస్టు 7వ తేదీన మండల్ కమిషన్ నివేదికను ఆమోదించారు. దీని అమలు కోసం విధివిధానాలను రూపొందించా లని అప్పటి ఉప ప్రధాని దేవీలాల్కు బాధ్యతలు అప్పగించారు. కానీ ఆయన తాత్సారం చేయడంతో ఆ బాధ్యతలను రామ్విలాస్ పాశ్వాన్కు అప్పగించారు. ఆయన దీనిపై చాలా తీవ్రగతిన అధికారులతో సమన్వయం చేసి, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించే పనిని సులభతరం చేశారు. అంతకుముందు బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరాం దీనిపై ఉద్యమం చేపట్టారు. ‘మండల్కో లాగ్వాకర్, నహీతో కుర్సీ ఖాళీ కరో’ అంటూ దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. ఈ రోజు దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్న విద్య, ఉద్యోగ రిజర్వేషన్లకు పునాది రాజ్యాంగంలోని 46, 340 ఆర్టికల్స్. అంతేకాకుండా, మండల్ కమిషన్ సిఫారసులను వ్యతిరేకిస్తూ ఆధిపత్య కులాలు ఆందోళన చేస్తే, దానిని అడ్డుకున్నదీ, మండల్ కమిషన్ సిఫారసులను అమలు జరపాలని ఉద్యమాలు నిర్వహిం చిందీ, దానికి నాయకత్వం వహించిందీ దళిత సంఘాలు, సంస్థలు, కవులు, రచయితలు. ఉత్తర భారతదేశంలో ఈ సందర్భంగా అనేక చోట్ల దళితులపైన దాడులు జరిగిన విషయం గతచరిత్రను తిరగేస్తే అర్థం అవుతుంది. ఇదే సందర్భంలో దళితులపై అనేక తప్పుడు కేసులు సైతం పెట్టారు. వెనుకబడిన కులాలకు, బలహీన వర్గాలకు మంచి జరగాలని అంబేడ్కర్ నుంచి మొదలుకొని నేటి దళిత నాయకులు, కార్యకర్తల వరకు అందరూ మనసా వాచా కోరుకుంటు న్నారు. అభివృద్ధిలో ఆమడ దూరానికి నెట్టివేయబడిన దళితులు, ఆది వాసీలూ, బడుగు బలహీన వర్గాలను సమైక్యంగా ముందుకు నడ పాలన్నదే అంబేడ్కర్ ఆకాంక్ష. కానీ వెనుకబడిన కులాలు మాత్రం గ్రామాల్లో కొన్ని పట్టణాల్లో దళితులపై దాడులు చేస్తూనే ఉన్నారు. కొన్ని చోట్ల అంబేడ్కర్ విగ్రహాలను పెట్టాలని దళితులు నిర్ణయిస్తే, వారిపై అమానుషంగా దాడులు చేస్తున్నారు. గత నెల దసరా రోజున తెలంగాణలోని సిరిసిల్ల రాజన్న జిల్లాలోని రామాజిపేటలో దళితులపైన బి.సి. కులాల దాడి ఇందుకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా గరగ పర్రులో అంబేడ్కర్ విగ్రహం ప్రతిష్టించుకోవాలని దళితులు భావిస్తే, వారిని సామాజికంగా వెలివేశారు. ఇవి రెండు ఉదాహరణలుగా మాత్రమే ప్రస్తావిస్తున్నాను. ఇటువంటి ఘటనలే చాలా చోట్ల జరి గాయి, జరుగుతున్నాయి. రామాజిపేటలో ఇళ్ళపై దాడిచేసి మహిళ లను, పిల్లలను కొట్టడం, వాహనాలను, వస్తువులను ధ్వంసం చేయడం జరిగింది. పోలీసులు సమయానికి వెళ్ళకపోయి ఉంటే, కారంచేడును మించిన మారణకాండ జరిగేదని బాధితులు ఏడుస్తూ చెప్పడం కలవరపరుస్తున్నది. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే మేలు చేశారనే ప్రచారాన్ని ఇకనైనా మానుకోవాలి. నిజానికి దేశ సమగ్రత, సమైక్యత కోసం ఆయన చేసిన కృషి ఎవ్వరూ మరువలేనిది. ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీ)లోని విద్యావంతులు, సంఘాల పెద్దలు తమతమ సామాజిక వర్గాలలోని ప్రజలకు, ప్రత్యేకించి యువకులకు తమ ప్రయోజనాల కోసం పనిచేసిన వాళ్ళ గురించి చెప్పాలి. అంత కన్నా ముఖ్యంగా ప్రజల మధ్య కులాల విభేదాలు ఉన్నాయి. అవి విద్వేషాలుగా మారకూడదు. అసమానతల తొలగింపులో ప్రధాన అడ్డంకిని మరువకూడదు. బలహీనవర్గాల పక్షాన నిలిచి పోరాడిన అంబేడ్కర్ను విస్మరించడం, ఆయన భావజాలాన్ని అడ్డుకోవడం, విగ్రహాలను పెట్టనివ్వకపోవడం ఎంతమాత్రం విజ్ఞత అనిపించు కోదు. చరిత్రను తెలుసుకొని, భవిష్యత్తును నిర్మించుకోవడం వివేక వంతులు చేసే పని. ఇకనైనా కలిసికట్టుగా ప్రయత్నం మొదలవ్వాల్సిన సందర్భమిదే. నిజానికి బీసీల మది మదిలో అంబేడ్కర్ని నిలుపు కోవాలి. బీసీ వాడల్లో ఆయన విగ్రహాలను ప్రతిష్టించుకోవాలి. -మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
దళితులకు ప్రత్యేక నివాసాలు తప్పదా?
‘‘దళితులకు ప్రత్యేక నివాసాలను ఏర్పాటు చేయడం, ఎవరి హక్కులనూ, అధికారా లనూ, అతిక్రమించడం కాదు. వేల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమి ఉపయోగం లేకుండా ఉంది. అటువంటి భూములలో దళితులకు ప్రత్యేక నివాసాలను, ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేసి, నిధులను కేటాయిం చాలి. దక్షిణాఫ్రికాలోని ‘బంటు’ తెగ లాంటి గిరిజన జాతి పరిస్థితికి, షెడ్యూల్డ్ కులాల జీవన పరిస్థితులకు చాలా దగ్గరి పోలిక ఉంది. దక్షిణాఫ్రికా రాజ్యాం గంలో బంటు తెగకు ప్రత్యేక ప్రాంతాల ఏర్పాటు అవకాశాన్ని కల్పిం చారు. కానీ భారత రాజ్యాంగం ముసాయిదాలో అటువంటి ప్రతిపా దన లేకపోవడం ఎందుకో అర్థం కావడం లేదు’’ అని 1946, ఏప్రిల్ 23వ తేదీన బాబాసాహెబ్ అంబేడ్కర్ ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ప్రతిపాదన చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుండొచ్చు. చాలా మందికి మింగుడు పడకపోవచ్చు. ఫర్వాలేదు. కానీ, ఎందుకు అంబే డ్కర్ అటువంటి ప్రతిపాదన చేశాడో ఆలోచించాలి? అదే విధంగా ఇప్పుడు 70 ఏళ్ళ తర్వాత మళ్ళీ దానిని ఎందుకు లేవనెత్త వలసి వచ్చిందో కూడా మనం గుర్తించాలి. గతనెల రోజులుగా ఉత్తరప్రదేశ్ లోని హాథ్రస్ జిల్లా బుల్బరి గ్రామంలో 19 ఏళ్ళ దళిత బాలికపై నలుగురు ఆధిపత్య కులానికి చెందిన యువకులు అత్యాచారం చేసి, చంపడానికి ప్రయత్నించారు. సెప్టెంబర్ 14, 2020 తేదీన పొలంలోకి గడ్డికోసం వెళ్ళిన యువతిని సందీప్, రాము, లవకుశ్, రవి అనే నలు గురు యువకులు ఆమె దుపట్టాను మెడకు బిగించి లాక్కొని వెళ్ళి, సామూహికంగా అత్యాచారానికి పాల్పడినట్లు ఆ దళిత యువతి సోద రుడు పోలీసులకు తెలిపారు. ఈ దాడిలో ఆ యువతి వెన్నెముక పూర్తిగా విరిగిపోయింది. అమ్మాయి అరుస్తుంటే నాలుకను సైతం పీకే సిందా నరహంతక ముఠా. అయినా ఆమె అరుస్తుంటే తల్లి పరిగెత్తు కొని వచ్చింది. అప్పటికే ఆమె పడిపోయి ఉన్నది. ఆమెపై అత్యాచారం చేయబోతుంటే అడ్డుకున్నందుకు దళిత యువతిని క్రూరంగా చిత్ర హింసలకు గురిచేసినట్లు కూడా వైద్యులు నిర్ధారించారు. చివరకు ఆమె చికిత్స పొందుతూ ఢిల్లీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచింది. తమ బిడ్ద చివరి చూపుకూడా దక్కకుండా, అర్ధరాత్రి ఆ యువతి శవాన్ని పోలీ సులే దహనం చేశారు. ఈ ఘటన జరిగిపోయిన తర్వాత పోలీసులు మరో సంచలన అబద్ధాన్ని ప్రకటించారు. పోస్ట్మార్టం రిపోర్టులో ఆమెపైన అత్యా చారం జరగలేదని తేల్చారు. ‘అత్యాచారం జరగకపోతే, ఆమెపైన ఇంతటి క్రూరమైన హింస ఎందుకు జరిగిందనే విషయానికి పోలీసుల దగ్గర సమాధానం లేదు. పోలీసులు ప్రవర్తించిన తీరు ఒక కులం పెంచుకుంటున్న కాపలాదారులు వ్యవహరించిన విధంగానే ఉంది. కానీ ‘రూల్ ఆఫ్ లా’కు కట్టుబడిన యంత్రాంగం విధంగా కనిపిం చడం లేదు. ఈ ఒక్క ఘటనతో ఆగిపోలేదు. ఆ తర్వాత జరిగిన ఘటనలు కూడా చూస్తే, భారత దేశంలో షెడ్యూల్డ్ కులాలుగా పిలువ బడుతున్న దళితులకు ఎంతటి రక్షణ ఉందో మనకు అర్థం కాగలదు. సెప్టెంబర్ 29న, ఉత్తరప్రదేశ్లోని అజ్మీర్ జిల్లా రామ్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దౌరాయి గ్రామంలో ఒక యువతిపై అత్యాచారం జరిగింది. అదే రాష్ట్రంలో బలరాంపూర్లో 22 ఏళ్ళ దళిత యువతిపై ఇద్దరు ఆధిపత్య కులానికి చెందిన యువకులు అత్యాచారం జరిపారు. భదోయి జిల్లాలో 14 ఏళ్ళ దళిత బాలికపై అత్యాచారం జరిపి, హత్య చేశారు. ఆమె తలను ఇటుకలతో కొట్టి ముక్కలు ముక్కలు చేశారు. అంతేగాకుండా గ్యాన్పూర్ ఏరియాలో 44 ఏళ్ళ దళిత వివా హితపై నలుగురు వ్యక్తులు అత్యాచారం జరిపారు. మధ్యప్రదేశ్, బిహార్, రాజస్తాన్ ఇంకా దేశంలోని చాలా రాష్ట్రాల్లో అత్యాచారాలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఇక దళిత యువతుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. దళిత స్త్రీలపై జరుగుతోన్న అత్యాచారాలు నేరాలుగానే పరిగణించని స్థితి. గత నాలుగేళ్ళలో దళిత మహిళలపై జరిగిన అత్యాచారాలను పరిశీలిస్తే, దళితుల జీవితాలు ఎంతటి భయంకర మైన స్థితిలో ఉన్నాయో అర్థం అవుతుంది. దేశం మొత్తంలో 2015లో 2,332 మంది, 2016లో 2,540, 2017లో 2,770, 2018లో 2956 మంది దళిత మహిళలు ఆధిపత్య కులాల పురుష దురహంకారానికి బలైపోయారు. ఇందులో ఉత్తరప్రదేశ్ కుల దురహంకారానిదే అగ్ర స్థానం. 2015లో 444 మంది, 2016లో 557 మంది, 2017లో 549 మంది, 2018లో 526 మంది మహిళలు అత్యాచారానికి బలై పోతు న్నారు. ఇవి కేవలం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు మాత్రమే. అసలు పోలీసు స్టేషన్ మెట్లెక్కడానికి సాహసించని దళిత కుటుం బాలు కోకొల్లలు. దళిత స్త్రీలపై జరుగుతోన్న అత్యాచారాలు అనూ హ్యమైన సంఖ్యలో ఉంటాయన్నది సత్యం. ఇక హత్యలు, కిడ్నాప్లు, దాడుల లాంటి ఘటనలకు దేశంలో ఎక్కడా లెక్కా పత్రం లేదు. మనదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 73 ఏళ్ళు దాటాయి. రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 ఏళ్ళు నిండాయి. కానీ దళితుల రక్షణ విషయంలో ఎటువంటి ప్రగతి లేదు. సమాజం ఆధునిక ఆలోచనలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి సాధిస్తుందని భావి స్తున్నాం. కానీ దళితులపైన జరుగుతున్న దాడులను చూస్తే ఈ దేశంలో దళితులనే వారిని మనుషులుగా చూస్తున్నారా? అనే అను మానం కలగకమానదు. అందుకే అంబేడ్కర్పైన ఉటంకించిన అభి ప్రాయం, ప్రతిపాదించిన పరిష్కారం మళ్ళీ చర్చలోకి తీసుకురాక తప్పలేదు. అంబేడ్కర్ రచనలు, ప్రసంగాలు 9వ భాగంలో ప్రత్యేక నివాసాలు అనే చాప్టర్ ఉంది. అందులో ఆయన పేర్కొన్న ఒక అంశాన్ని ఇక్కడ పేర్కొనడం సబబుగా ఉంటుంది. ‘పోలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థ రెండూ హిందువుల వైపే ఉంటాయి. అందుచేత హిందువులతో పోరాడితే వారికి పోలీసుల నుంచి రక్షణ గానీ, న్యాయమూర్తుల నుండి న్యాయం గానీ లభించదు. వాళ్ళు ఆధిపత్య కులాల పక్షాన్నే ఉంటారు. ఆధిపత్య కులాలకు ఉన్న సామాజిక అండదండలు, ఆర్థిక బలం దళితులకు ఉండవు. అందువల్ల వాళ్ళు ఈ వ్యవస్థ ఫలితాలను అందుకోలేరు’ అన్న అంబేడ్కర్ మాటలు నేటి ప్రభుత్వ వ్యవస్థల పనితీరుకి అద్దంపడుతున్నాయి. అక్షర సత్యాలుగా నిలుస్తున్నాయి. పోలీస్ స్టేషన్లలో నమోదౌతున్న కేసుల సంఖ్య రోజు రోజుకీ తరిగిపోతోంది. ఇటీవల ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిందితులకు అండగా నిలిచింది. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడానికి ముందు విచారణ జరపాలనేది అటువంటి నిబంధన. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. దానితో చాలా కేసుల్లో పోలీసులే బాధితులను బెదిరించి, కేసులే లేకుండా చేసి, నిందితుల కొమ్ముకాస్తున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. అయితే కోర్టుల దాకా వెళ్ళిన కేసులలో కూడా శిక్షలు పడుతున్నవి అత్యంత అరుదనే చెప్పొచ్చు. 2017–18 కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 16.3 శాతం కేసుల్లోనే శిక్షలు పడుతున్నాయి. ఇవన్నీ కింది కోర్టులే. పై కోర్టుల్లో వీటిని కొట్టేస్తున్నారు.. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ చుండూరు కేసు. జిల్లా కోర్టు శిక్షలు విధిస్తే, హైకోర్టు న్యాయమూర్తి దానిని కొట్టివేశారు. ఇంతకన్నా వేరే ఉదాహరణ అక్కర్లేదు. ఇంతేకాకుండా దళితులపైన భౌతిక దాడులే కాకుండా, ఉద్యోగులపై, అధికారులపై వివక్ష, వేధింపులు నిత్యకృత్యంగా మారిపోయాయి. రాజకీయ నాయ కులైన దళితులు కూడా రెండవ శ్రేణి నాయకులుగానే చూడబడుతు న్నారు. పార్టీ నాయకత్వాలకు అడుగులకు మడుగులొత్తకపోతే, ఏ నాయకుడికైనా పుట్టగతుల్లేవు. ఇది ప్రస్తుత దళితుల పరిస్థితి. అందుకే బాబాసాహెబ్ అంబేడ్కర్ లాంటి వాళ్ళు, కనీసం ప్రత్యేక నివాసాల ద్వారానైనా దళితులు భౌతిక హింసకు దూరమవు తారని భావించారు. నాగ్పూర్లో 1942, జూలై, 19 తేదీల్లో జరిగిన అఖిల భారత షెడ్యూల్డ్ కులాల సదస్సులో ఆయన ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ‘హిందువులకు సంబంధం లేకుండా ప్రత్యేకంగా షెడ్యూల్డ్ కులాల నివాసాలను ఏర్పాటు చేయాలి. కొత్త గ్రామాల నిర్మాణం కోసం సెటిల్మెంట్ కమిషన్ని ఏర్పాటు చేయాలి. ప్రభు త్వానికి సంబంధించిన అనాక్రమిత వ్యవసాయ భూముల్ని కమిషన్కు అప్పగించాలి’ ఇట్లా తన ప్రతిపాదనలను అంబేడ్కర్ రాజ్యాంగ సభ ముందుంచారు. కానీ ఇవేవీ రాజ్యాంగంలోకి రాలేదు. ఇప్పుడైనా అటువంటి ప్రతిపాదనను ప్రభుత్వాలు ఆలోచించాలి. ఆధిపత్య కులాలు మెజారిటీగా ఉన్న చోట, దళితులు చాలా తక్కువ జనాభా ఉన్నచోట ఈ దారుణాలు మరింతగా పెరుగుతున్నాయి. కారంచేడు, చుండూరులో దాడిచేసిన సామాజిక వర్గాల జనాభా అధికం. అదేవిధంగా బులాన్గర్ గ్రామంలో అత్యాచారం జరిగిన చోటా కులం బలం ఎక్కువ. అక్కడ దళితుల ఇళ్ళు కేవలం పదిహేను మాత్రమే. అంతే కాకుండా చాలాచోట్ల ఏ కులం వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటారో ఆ కులం వాళ్ళు దాడులకు సిద్ధమౌతున్నారు. దీనికి ఎన్ని ఉదాహరణలైనా చూపించవచ్చు. కనీసం ముందు ఒక ప్రయత్నం చేయవచ్చు. ఎక్కడైతే దళితులు చాలా తక్కువ జనాభాగా ఉన్నారో, వారిని దళితులు అధికంగా ఉన్న చోటుకు మార్చితే కనీసం జన బలంతోనైనా కొంత భద్రత వస్తుం దేమో చూడాలి. ఏది ఏమైనా హాథ్రస్ ఘటన తర్వాత దళితుల్లో ఒకరకమైన ఆవేదన, ఆవేశం బయట పడుతున్నాయి. ఇది ప్రత్యక్ష కార్యాచరణగా ఇప్పుడు బయటపడకపోవచ్చు. కానీ ఇది ఇంతటితో ఆగదు. ఎవరైనా ఈ దేశ సమగ్రత, సమైక్యత గురించి ఆలోచించే ముందు దళితుల రక్షణ, భద్రత గురించి తప్పనిసరిగా ఆలోచించాల్సి ఉంటుంది. అంబేడ్కర్ చేసిన ప్రతిపాదన గురించి ఆలోచించాలి. ఒకవేళ ఆ ప్రతిపాదన సరైంది కాదనుకుంటే, ప్రత్యామ్నాయం ఏంటో చెప్పాల్సి ఉంటుంది. లేదంటే దేశ సమగ్రత, సమైక్యత కేవలం హుళక్కిగానే మిగిలిపోతుంది. హిందూ సమాజం ఏకత్వం గురించి హిందూ మతం ఐక్యత గురించి సంఘాలు, సంస్థలు, పీఠాలు, ట్రస్టులు ఈ విషయాన్ని ఇప్పటికైనా నోరు తెరిచి మాట్లాడితే వినాలని ఉంది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
ఆమె జీవితం అజరామరం
శ్రీకాకుళ సాయుధ పోరాట యోధురాలు పైలా చంద్రక్క జీవితం నిజమైన కమ్యూనిస్టు ఆచర ణకు నిలువెత్తు సాక్ష్యం. 11 ఏళ్ళ పసి వయస్సు నుంచి, తుది శ్వాస విడిచే వరకూ విప్లవమే ఉచ్వాస, నిశ్వాసలుగా బతికారు చంద్రక్క. చంద్రక్క ఏ విశ్వవిద్యాలయాల్లోనూ చదువుకోలేదు. ఇంగ్లిష్ లాంటి భాషల్లో ప్రావీణ్యం సంపాదించలేదు. మార్క్స్, లెనిన్, మావో లాంటి మహామేధావుల రచనలను ఆమూలాగ్రం చదవలేదు. అయినా ఆమె అనుసరించిన, ఆచరించిన మార్గం మేధావులెందరికో సాధ్యం కాలేదు. ఆమె 72 ఏళ్ళ జీవితంలో 12 ఏళ్ళు మినహా మిగిలిన 60 ఏళ్ళు కల లోనూ, మెలకువలోనూ విప్లవాన్నే కాంక్షించింది. ఆచరిం చింది. కుటుంబ బంధాలూ, సామాజిక కట్టుబాట్లూ, నిర్భం ధాలూ, పోలీసుల చిత్రహింసలూ, యావజ్జీవ కారాగార శిక్షలూ వంటి ఏ కక్ష్యలోకీ ఆమెని ఇమడ్చలేకపోయాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా, నిర్భంధాలు వెన్నాడినా, సుదీర్ఘ కాలపు జైలు జీవితాన్ని గడిపినా, పొత్తిళ్ళలోని బిడ్డ దూరమై, పార్టీలో చీలికలు జరిగి ఉద్యమం బలహీనపడినా, ఆరోగ్యం సహకరించక ఎన్నో సార్లు మృత్యువు అంచుల్లోకి వెళ్ళినా, పార్టీని, ఎర్రజెండాను వదల్లేదు. ఉద్యమబాట వీడలేదు. చంద్రక్క ఉద్యమ జీవితంలోకి అడుగుపెట్టేనాటికి శ్రీకాకుళం జిల్లాలో ప్రజల పరిస్థితులు దారుణంగా ఉండేవి. చంద్రక్కది ఉద్దానంలోని రాజాం గ్రామం. అతిపేద కుటుం బంలో కామమ్మ, చిన్నయ్యల ఎనిమిదో సంతానంగా జన్మిం చింది. చిన్నప్పటి నుంచి పెత్తనాన్ని భరించని తత్వమున్న చంద్రక్క మొక్క లకు నీళ్ళు తీసుకురాలేదన్న నెపంతో మాస్టారు బడినుంచి వెళ్ళగొట్టడంతో, చదువుకి స్వస్తి పలికి, ఆ ఊళ్ళోని కమ్యూ నిస్టు గొరకల రాంబాబు చొరవతో రాత్రి పాఠశాలలో చేరింది. శ్రీకాకుళ ఉద్యమ నాయకుడు సుబ్బా రావు పాణిగ్రహి, రాజాంలో ప్రదర్శించిన కళారూపం, జముకుల కథ ఆమె మనస్సులో బలమైన ముద్రవేసింది. కమ్యూనిస్టుల్లో ఉద్యమంలో భాగం కావాలని ఆనాడే చంద్రక్క నిశ్చయానికి వచ్చింది. 1967 ప్రాంతంలో పార్టీ పిలుపు మేరకు పూర్తికాలం కార్యకర్తగా మారారు చంద్రక్క. తొలుత బాలల సంఘంలో అడుగుపెట్టి, మహిళా సంఘం నాయకురాలుగా ఎదిగారు. గరుడభద్రగ్రామంలో పెత్తం దార్లు ఆక్రమించుకొన్న పేదల భూముల్లో పంటలను కోసి, కమ్యూనిస్టులు పేదలకు పంచిపెట్టిన ఘటన శ్రీకాకుళ గిరి జన సాయుధ రైతాంగ పోరాటంలో ఒక మహత్తర ఘట్టం. ఆ తర్వాత చంద్రక్క ‘తెగింపు సంఘం’ నుంచి దళంలో చేరింది. బారువా పోలీస్ స్టేషన్ మీద దాడి చేయాలని నిర్ణ యించుకుంటారు. కానీ పోలీసుల బలం ఎక్కువగా ఉందని తెలుసుకొని, మరుసటిరోజు బాతుపురం భూస్వామి ఇంటి మీద దాడిచేశారు. ఈ దాడిలో ప్రధాన పాత్ర చంద్రక్క, అంకమ్మలదే. భూస్వామి అక్రమంగా దాచుకున్న ప్రామిసరీ నోట్లను చింపివేసి, ధాన్యాన్ని ప్రజలకు పంచిఇచ్చారు. ఈ క్రమంలోనే పైలా వాసుదేవరావు చొరవతో చంద్రక్క పైలా సహచరిణి అయ్యారు. పంచాదికృష్ణమూర్తి, సుబ్బారావు పాణిగ్రాహి, తామాడ గణపతి, అంకమ్మ, సరస్వతి ఈ పెళ్ళి పెద్దలుగా వ్యవహరించారు. దళాల్లో నిబద్ధతతో, నిర్భ యంగా, చురుగ్గా ఉండే చంద్రక్క ఎంతో మంది మహిళా కార్యకర్తలకు, దళ సభ్యులకూ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఇదే సమయంలో చంద్రక్క తల్లి కాబోతోన్న విషయం తెలిసింది. పార్టీ నిర్ణయం మేరకు అబార్షన్ చేయించుకోవ డానికి చంద్రక్క సిద్ధమైంది. కానీ ఏడు నెలల గర్భం కావ డంతో అబార్షన్ ప్రమాదకరమని, వైద్యులు నిరాకరించారు. శ్రీకాకుళ పోరాటం ఉవ్వెత్తున ఎగిసిపడుతోన్న రోజులు, తీవ్రమైన నిర్భంధం మధ్య కొల్లా వెంకయ్య కొడుకు డాక్టర్ రాజమోహన్, చంద్రక్కను హైద రాబాద్లో ఆసుపత్రిలో చేర్చారు. ఆ తరువాత పార్టీతో కాంటాక్టు తెగిపోయింది. పాప పుట్టింది. రోజులు గడుస్తున్నాయి. అన్నం, మంచి నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. జనవరి నెల మంచి శీతాకాలం, విపరీతమైన చలి. కప్పుకోవడానికి దుప్పటి లేదు. బిడ్డ ఒంటిపైన గుడ్డ లేదు. పక్కన వాళ్ళిచ్చిన గౌను తొడిగి తన పైటకొంగుతో పాపకి కప్పుకొని కడుపులో పెట్టుకొనేది. అర్థాకలితో రోజులకు రోజులు ఎదురు చూసింది. ఒక రోజు డాక్టర్ రాజమోహన్ వచ్చి చంద్రక్కను హడావిడిగా ఆసు పత్రిలోంచి తీసుకొచ్చి, ఓ ఇంటికి చేర్చారు. అక్కడి నుంచి పార్టీ నాయకులు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్య మూర్తి, అత్తలూరి మల్లికార్జున్రావు ఉండే డెన్కు చంద్రక్కను తీసుకెళ్ళారు. బిడ్డపుట్టిన చాలా రోజులకు పైలా అక్కడికి వచ్చారు. అప్పటికే బిడ్డను ఎవరికైనా ఇచ్చేయాలని పార్టీ నిర్ణయించింది. బిడ్డని ఎవరికివ్వాలి అనే చర్చ జరిగి నప్పుడు అత్త లూరి మల్లికార్జున్రావు ముందుకు వచ్చి తమ కుటుంబానికి పెంపకానికివ్వాలని సూచించారు. నెల రోజుల బిడ్డని బాపట్ల దగ్గరి చింతలపూడికి పంపించారు. అప్పటికే వారికి 8మంది పిల్లలున్నా, అరుణను చాలా గారాబంగా పెంచారు. వారి పెంచిన ప్రేమకు గుర్తుగా, ప్రేమతో పెంచిన తల్లిదండ్రుల ఇంటిపేరే తనకు కావాలని అత్తలూరి అరుణగా తనను తాను ప్రకటించుకుంది చంద్రక్క బిడ్డ. బిడ్డని ఇచ్చేసిన చంద్రక్క తిరిగి ఉద్యమబాటపట్టింది. 1975, మే 5వ తేదీన శ్రీకాకుళంలో అరెస్టయి, పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురైంది. 13 ఏళ్ళకుపైగా జైలు జీవితం గడిపారు చంద్రక్క. జైలునుంచి విడుదలయ్యాక కూడా తిరిగి ఉద్దానం ప్రజలకోసం పోరాడింది. పైలా వాసు దేవరావు తరఫున వచ్చిన భూమిని సైతం అమ్మివేసి, కూతు రుకో, కుటుంబానికో ఇవ్వలేదు. ఆ డబ్బుతో అమరవీరుల స్మారకార్థం ఆఫీసుని కట్టించింది. తను కట్టించిన ఆఫీసులో ఒక కార్యకర్తగా ఉన్నదే కానీ, యజమానిగా కాదు. ఆమె ఆఫీసు ఒక కమ్యూన్ వంటశాల. ఒక ప్రజావైద్యశాల. పైలా వాసుదేవరావు అమరత్వం తరువాత ఆమె ఆరోగ్యం క్రమంగా దెబ్బతినడం మొదలైంది. అయినా ఆమె లక్ష్య పెట్ట లేదు. చివరకు కోవిడ్ని కూడా తోసిరా జంటూ, మృత్యు వుకు ఎదురెళ్ళారు. నిత్యం ప్రజలు, పార్టీ, ఉద్యమం తప్ప మరే ధ్యాసలేదామెకు. మావో చెప్పినట్టు నిశ్చేతనంగా జీవిం చడం కన్నా ధైర్యంగా మరణించడమే మేలు అనుకున్నారు చంద్రక్క. ఒళ్ళుపుళ్ళుపడి రక్తం స్రవిస్తూన్నప్పుడూ ఆమె ఉద్యమకర్తవ్యానికే ప్రాధాన్యతని చ్చారు. ప్రజలు, ఉద్యమం, పార్టీయే ఊపిరిగా జీవించారు. ఆమె రేపటి తరానికి వేగు చుక్కగా, భవిష్యత్ పోరాటాల ఆశాజ్యోతిగా, ఉద్దానం జనం గుండెల్లో ఎగిరే ఎర్ర జెండాగా చిరస్థాయిగా నిలిచిఉంటారు. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 81063 22077 -
సబ్ప్లాన్ అమలులో చిత్తశుద్ధి లోపం
‘‘అణగారిన వర్గాల, ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీల విద్య, ఆర్థికాభివృద్ధికోసం ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరమున్నది. అన్ని రకాల వివక్షల నుంచి, దోపిడీ నుంచి వారిని విముక్తి చేయాలి’’ అని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 మనకు నిర్దేశిస్తున్నది. మను షులంతా ఒక్కటేననే సమానత్వ భావ నను చట్టబద్ధం చేసింది ఈ రాజ్యాంగం ద్వారానే. అయితే భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 73 ఏండ్లు దాటింది. రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 ఏళ్ళు నిండాయి. అయినా రాజ్యాంగ పూర్తి స్ఫూర్తి మన పాలనలో కనపడడం లేదు. అక్కడక్కడ, అప్పుడప్పుడు కేంద్రంలో, రాష్ట్రాల్లో కొన్ని ప్రభుత్వాలు కొన్ని విధానాలను రూపొందించినప్పటికీ అవి అమ లులో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ఎస్సీ, ఎస్టీల కోసం రూపొందించిన విధానాలు, చట్టాలు పరిమితమైన ఫలితాలను మాత్రమే ఇస్తున్నాయి. అటువంటి విధానమే ఎస్సీ, ఎస్టీల సామాజిక, ఆర్థికాభివృద్ధికోసం ప్రత్యేకించిన నిధుల కేటాయింపులు, బడ్జెట్ విధానాలు. 1974లో మొదటిసారి ట్రైబల్ సబ్ప్లాన్, 1979–80లలో ఎస్సీల కోసం స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ విధా నాలు కూడా అందులో భాగంగా వచ్చినవే. ఆ తర్వాత 2006లో స్పెషల్ కాంపోనెంట్ పేరును షెడ్యూల్ కాస్ట్స్ సబ్ప్లాన్గా మార్చారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటా యింపులు ఉండాలనేది దాని ఉద్దేశం. అయితే 2014లో కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో కొన్ని మార్పులు చేశారు. అప్పటి వరకు ఉన్న ప్లాన్, నాన్ప్లాన్ల పేర్లను తొలగించి, క్యాపిటల్, రెవెన్యూ పేర్లను మాత్రమే ఉంచారు. దీనితో సబ్ప్లాన్ అనే పదం మాయమైపోయింది. అంతే కాకుండా, అప్పటివరకు ఉనికిలో ఉన్న ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ను ఏర్పాటుచేశారు. అప్పటివరకు ప్లానింగ్ కమిషన్ చూస్తున్న కర్తవ్యాలను నీతి ఆయోగ్ కిందకి చేర్చారు. దీంతో ఎస్సీ సబ్ప్లాన్, ట్రైబల్ సబ్ప్లాన్ల మీద సమీక్ష చేయాల్సి వచ్చింది. 2017లో నీతి ఆయోగ్ ఒక కమిటీని వేసింది. అది 2019లో కొన్ని ప్రతిపాదనలు చేసింది. అందులో ఎస్సీ సబ్ప్లాన్ పేరును డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఎస్సీ (డీఏపీఎస్సీ), ట్రైబల్ సబ్ప్లాన్ను డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్(డీఏపీఎస్టీ)గా మార్చారు. అదేవిధంగా మరికొన్ని ప్రతిపాదనలు కూడా చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని చాలా శాఖలు ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించిన డబ్బులను పూర్తిగా ఖర్చుచేయటంలేదని, మరి కొన్ని శాఖలైతే అసలు నిధులను వినియోగించటంలేదని నీతి ఆయోగ్ గుర్తించింది. అంత వరకు అది నిజమే. అంతేకాకుండా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిగణనలోనికి తీసుకొని, ఏఏ శాఖలైతే ఎస్సీ, ఎస్టీల కోసం పథకాలను రూపొం దించి, అమలు చేస్తున్నాయో వాటికి మాత్రమే నిధులను అధి కంగా కేటాయించాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. అంతే కాకుండా నీతి ఆయోగ్ నివేదికలో కూడా బడ్జెట్ నిధులు పక్క దారి పట్టకుండా, ఖర్చు కాకుండా ఉండడం లాంటి చర్యలు జరగ కూడదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలలోని చాలా కులాలు, తెగలు కనీసం అభివృద్ధికి నోచుకోవడం లేదని, వాళ్ల గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉందని నీతి ఆయోగ్ సూచించింది. దీనిపై 2001వ సంవత్సరం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రయత్నం ప్రారంభమైంది. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగా ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించే నిధుల దుర్విని యోగంపై ప్రారంభమైన చర్చ, పరిష్కారం చట్టం మాత్రమేనని, అందుకోసం ఉద్యమించే వరకు వెళ్ళింది. అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు, మీడియా గ్రూప్లన్నీ ముక్తకం ఠంతో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టం కోసం డిమాండ్ చేశాయి. దాని ఫలితంగా, సుదీర్ఘ పోరాటాల అనంతరం 2012లో చట్టం ఆమోదం పొందింది. 2013 జనవరిలో ఈ సబ్ప్లాన్ చట్టం అమలులోకి వచ్చింది. కేంద్రంలో బడ్జెట్లో వచ్చిన మార్పులకను గుణంగా తెలంగాణ ప్రభుత్వం, మరొక చట్టాన్ని ఆమోదించింది. అమలులోకి తెచ్చింది. దానిపేరు ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ యాక్ట్. ఆంధ్రప్రదేశ్లో సైతం సబ్ప్లాన్ చట్టం అమలు అవుతోంది. అక్కడ ఎస్సీ, ఎస్టీలకు అనేక పథకాలు సైతం ప్రవేశపెట్టారు. ఈ చట్టాలలోని అంశాలను అధ్యయనం చేసి, కేంద్ర స్థాయిలో ఒక చట్టాన్ని రూపొందించడానికి నీతి ఆయోగ్ ప్రతిపాదన చేసి ఉంటే బాగుండేది. నీతి ఆయోగ్ ఆశిం చినట్టుగానే ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించిన నిధులు సద్విని యోగం కావాలంటే కొన్ని చర్యలు శీఘ్రగతిన చేపట్టాలి. అందులో ముఖ్య మైనది చట్టం రూపకల్పన. దానితో పాటు ఎస్సీ, ఎస్టీల సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వ బడ్జెట్లలోవారి జనాభా దామాషా ప్రకారం నిధులను కేటాయించాలి. అయితే ఈ నిధులు నేరుగా వివిధ శాఖలకు కేటా యించకుండా, కేటాయించిన మొత్తాన్ని బడ్జెట్ నుంచి తీసి నోడల్ ఏజెన్సీలైన ఎస్సీ, ఎస్టీ డిపార్ట్మెంట్ల ఖాతాలకు జమ చేయాలి. ఎస్సీ, ఎస్టీల కోసం ఏఏ డిపార్ట్మెంట్లైతే పథకాలను రూపొం దిస్తాయో, వాటిని పరిశీలించి నోడల్ ఏజెన్సీలు, ఆయా డిపార్ట్ మెంట్లకు కేటాయించాలి. అంతేకాకుండా ఒక సంవత్సరం కేటా యించిన నిధులు అదే సంవత్సరం ఖర్చు కాకపోతే, మరుసటి ఏడాదికి తిరిగి కేటాయించే విధానాన్ని చట్టంలో పొందుపర్చాలి. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీలలో ఉన్న వివిధ కులాలు, తెగల కోసం ప్రత్యేకించి మరింత వెనుకబడిన కులాల కోసం ప్రత్యేక ప్యాకేజీలు కూడా తయారు చేయాలి. నూటికి 25 శాతంగాఉన్న ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి గత డెబ్భై ఏళ్ళలో ఆశించినంతగా ముందుకు సాగలేదు. విద్య, ఉద్యోగాలు, ఆర్థిక వనరులు, భూమి, గృహ సౌకర్యాలు, మౌలిక సదుపాయాలన్నింటిలో ఇంకా వ్యత్యాసం, అంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. 1974 వరకు ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు కార్యక్రమాలు దళిత వాడలకు, ఆదివాసీ గూడేలకు చేరలేదు. రోడ్లు, విద్యుత్, పాఠశాలలు, వైద్యశాలలు, మంచి నీటి సరఫరా లాంటి సౌకర్యాలు ఈ వర్గాలకు గగన కుసుమాలైనాయి. అందువల్లనే ఆనాటి రాజకీయ నాయకత్వం ప్రత్యేకించి ఇందిరాగాంధీ, కొంతమంది నిబద్ధత కలిగిన పి.ఎస్.కృష్ణన్, ఎస్.ఆర్. శంకరన్ లాంటి అధికారుల చొరవతో ఇటువంటి ఆలోచనలు, ఆచరణ రూపం దాల్చాయి. దీనికి కొంత చారిత్రక నేపథ్యం కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీల కోసం ముఖ్యంగా విద్య కోసం ప్రత్యేక పాఠశాలలు కావాలనే ఆలోచన 1882లోనే సామాజిక విప్లవకారుడు జ్యోతీరావ్ ఫూలే నుంచి మొదలైంది. అదేవిధంగా 1927లో బాబాసాహెబ్ అంబే డ్కర్ బొంబాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్న సమ యంలో బడ్జెట్పై చర్చ జరిగిన సమయంలో ప్రత్యేక హాస్టల్స్ గురించి ప్రస్తావించి, అందుకోసం కొంత మొత్తాన్ని ప్రత్యేకంగా కేటాయించాలని కోరారు. వీటన్నింటి మేళవింపే రాజ్యాంగం లోని ఆర్టికల్–46. దానిఫలితమే సబ్ప్లాన్ల పథకాలు, విధా నాలు. అంటే ఒక పథకం వెనుక ఎంతో చారిత్రక కృషి ఉంటుంది. ప్రభుత్వాలు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా సమాజంలోని అణగారిన వర్గాల కోసం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు పేద వాళ్లకోసమే ఆలోచించాలి. కానీ ఈ రోజు ఇది తల్లకిందులైంది. పేదలు, అణగారిన వర్గాలు, దళితులు, ఆది వాసీలు ప్రభుత్వాల ఎజెండాలో ఎటువంటి ప్రాధాన్యతను సంత రించుకోకపోవడం విచారకరం. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మల్లెపల్లి లక్ష్మయ్య మొబైల్ : 81063 22077 -
కరోనా వారియర్లకు అసలైన స్ఫూర్తి
యుద్ధరంగ సైనిక క్షతగాత్రుల రక్తసిక్త గాయాలపై ఆమె పేరు నిర్లిఖితాక్షరి. గుండెలు దద్దరిల్లే, నిరంతర ధ్వనిజ్వలిత రణ క్షేత్రంలో ఆమె ఒక నిశ్శబ్ద సైనిక. మరఫిరంగులు మిగిల్చిన రక్తసిక్త బాధాతప్త సైనిక హాహాకా రాలు తప్ప, మరేమీ కానరాని కారుచీకట్లలో ఆమె ఓ నిలువెత్తు దీపాక్రాంతి. వందేళ్ళనాడే వైద్యరంగంలో నర్సింగ్ వ్యవస్థ ఆవశ్యకతను విద్యుల్లతలా రాజేసిన ఆశాకిరణం ఫ్లారెన్స్ నైటింగేల్.. నేటి మహావిపత్కాలాన స్మరించుకోదగిన మహిళ. నర్సింగ్ వృత్తిలో దాగివున్న సేవాతత్పరతకు మించిన మానవీయతను ప్రపంచానికి చాటిచెప్పి, ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు ఆద్యురాలిగా నిలిచిన ఫ్లారెన్స్ నైటింగేల్ నూటాయాభయ్యేళ్ళ క్రితం ఈనాటిæ విప త్కాలాన్ని ఊహించలేకున్నా, సమాజరీతినీ, గతినీ మున్ముందుగానే వీక్షించి, భవిష్యత్ తరాల ఆరోగ్య అవసరాన్ని అక్షరాలా ఆనాడే అంచనావేశారు. ఈ ప్రపంచంలో ఇంటింటికీ ఒక నర్సు అవసరం ఉన్నదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటోన్న కరోనా యుద్ధంలో డాక్టర్లతో పాటు, ఎంతో మంది నర్సులు ప్రాణత్యాగాలు చేస్తున్నారు. అయితే వారి లెక్కలు ఎక్కడా దొరకవు కానీ, నిజానికి వందల మంది నర్సులు కోవిడ్ పేషెంట్లను కాపాడటంలో ప్రాణాలు కోల్పోయి వుంటారు. అటువంటి వారికి ఫ్లారెన్స్ నైటింగేల్ ఒక స్ఫూర్తి. సరిగ్గా ఈ రోజు ఆమె 110వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఫ్లారెన్స్ నైటింగేల్ను స్మరించుకోవడమంటే కరోనా యుద్ధంలో ముందు భాగాన ఉండి పోరాడుతోన్న నర్సులకు జేజేలు పలకడమే. పుట్టుకతో పరిమళించిన ఫ్లారెన్స్ నైటింగేల్ నైటింగేల్ 1820, మే 12న ఇటలీలో ఓ బ్రిటిష్ కుటుంబంలో జన్మిం చారు. ఆమె తండ్రి విలియం షోర్ నైటింగేల్ అత్యంత సంపన్నుడు. ఆమె తల్లి ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి నైటింగేల్కి గణితంలో మంచి పట్టుండేది. తొలి నుంచీ ధార్మిక విషయాలపైనా, విద్యపైనే ఆసక్తి ఉండేది. పరోపకారం ఆమెకు పుట్టుకతో వచ్చిన సుగుణం. దైవ సేవకురాలిగా జీవితాంతం గడపాలనీ, ఆయన సూచించిన మానవ సేవలోనే తరించాలని ఆమె భావించారనడానికి ఆమె రాసిన ‘ది హయ్యెస్ట్ ఆనర్ ఈజ్ టు బి గాడ్స్ సర్వెంట్ అండ్ ఫెలో వర్కర్’ అన్న పుస్తకమే సాక్ష్యం. నైటింగేల్ నివసించే ఎస్టేట్ చుట్టుపక్కల, పొరుగు గ్రామాల్లో అనారోగ్యం పాలైన పేద ప్రజలకు సేవచేయడం ఆమెకు ఎంతో తృప్తినిచ్చేది. ఆ పరిస్థి తులే, 17 ఏళ్ళ వయస్సులోనే, జీవితమంతా రోగులకు సేవ చేస్తూ గడపాలనే నిర్ణయం తీసుకునేలా చేశాయి. 16 ఏళ్ళకే ఆమె కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన పెళ్ళి ప్రస్తావనని సున్నితంగా తిర స్కరించారు. తాను నర్సుగానే జీవితం చాలిస్తానని తెగేసి చెప్పారు. మనలాంటి సంపన్నులకు ఈ పని తగదని కుటుంబ సభ్యులు వారిం చినా, సోదరి కన్నీళ్ళు పెట్టినా, ఎవరెన్ని చెప్పినా నైటింగేల్ని తన నిర్ణయం నుంచి కించిత్ కూడా కదలించలేకపోయాయి. 1844లో జర్మనీలోని కైసర్ వెర్త్ పట్టణంలోని, లూథరన్ ఆసుపత్రిలో నైటింగేల్ నర్సింగ్ విద్యార్థిగా చేరారు. 1851లో శిక్షణను ముగించుకొని, ఉన్నత చదువులకోసం, 1853లో పారిస్ వెళ్ళి శిక్షణ పూర్తి చేసుకుని, సెంట్రల్ లండన్లో, ఆసుపత్రిలో సూపరింటెండెంట్గా చేరారు. అది కేవలం పేదల ఆసుపత్రి. ఆ నాటి నుంచి ఆమె తన గురించి ఆలోచించడం మానేశారు. రోగుల సేవకే పునరంకితం అయ్యారు. తనని నడిపించేది మాత్రం ఏసుక్రీస్తేనని ఆమె భావన. ‘‘ఇతర వ్యక్తులతో నన్ను నేను ఎన్నోసార్లు పోల్చి చూసు కున్నాను. విపత్తులు సంభవించినప్పుడు వాళ్ళు సాకులు వెతికి తప్పించుకోజూస్తారు. కానీ నేను మాత్రం వాటిని ఎదుర్కోవడంలో నిమగ్నమైపోతాను. మనం పరిస్థితులను మార్చడానికి సిద్ధం కాకుండా, ఇతరులను విమర్శించడంలో అర్థం లేదు’’ అన్న నైటింగేల్ వ్యాఖ్యల్లో ఎంతో తాత్వికత గోచరిస్తుంది. నిజానికి ఆమె ఒక అసా ధారణ ఆరోగ్యకార్యకర్త. అంతేకాదు గణాంక నిపుణురాలు కూడా. అనేక భాషల్లో ప్రావీణ్యురాలు. ఆమె గొప్పకార్యనిర్వాహకురాలు కూడా. యుద్ధక్షేత్రంలో... క్రిమియాలో రష్యా, బ్రిటన్ల మధ్య సాగుతోన్న యుద్ధ కాలంలో ఆసుపత్రి నిర్వహణా బాధ్యతల్లో నైటింగేల్ సన్నిహిత మిత్రుడు సిడ్నీ హెర్బర్డ్ ఉన్నారు. సైనికాసుపత్రుల్లో ఆనాటికి పరిస్థితి అత్యంత దయ నీయంగా ఉంది. వివిధ రకాల అంటువ్యాధులతోనూ, యుద్ధరం గంలో గాయాలపాలవడంతోనూ అనేక మంది సైనికుల మరణాల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. ఇదే విషయంపై పత్రికల్లో కథనాలు రావడంతో, ప్రజల్లో అలజడి మొదలయ్యింది. దీంతో అక్కడి యుద్ధ కార్యదర్శి టర్కీలోని మిలటరీ ఆసుపత్రిలో పరిస్థితు లను చక్కదిద్దడానికి నర్సుల బృందాన్ని నియమించాలని యుద్ధ కార్యదర్శి భావించారు. అతడు నైటింగేల్ నైపుణ్యం, ఆమె నాయకత్వ లక్షణాలను గురించి అవగాహన ఉన్న సన్నిహిత మిత్రుడు సిడ్నీ హెర్బర్డ్. నైటింగేల్కి ఆçహ్వానం అందింది. 1854లో నైటింగేల్ తన 38 మంది నర్సుల బృందంతో టర్కీలోని యుద్ధక్షేత్రంలోకి అడుగు పెట్టారు. అప్పుడే బ్రిటిష్ సైనిక క్షతగాత్రులకు ఆమె అందించిన అనూ హ్యమైన సేవల ద్వారా తొలిసారి ఫ్లారెన్స్ నైటింగేల్ పేరు వెలుగులోకి వచ్చింది. పరిశుభ్రతపై శ్రద్ధ, రోగుల్లో మనోనిబ్బరం... నైటింగేల్ సైనిక ఆసుపత్రిలోకి అడుగిడిన తక్షణమే సైనికాధికారులకు రోగుల సంఖ్యను బట్టి కొన్ని వందల టవళ్ళు, కొన్ని వందల సబ్బులు, గదులను శుభ్రపరిచేందుకు అవసరమైన, ఆనాటికి అందు బాటులో ఉన్న శానిటరీ వస్తువుల జాబితాను తయారుచేసి ఇచ్చారు. సైనికుల వార్డుల్లో రాత్రుళ్ళు చేతిలో లాంతరు పట్టుకుని రౌండ్స్ వేసేవారామె. అప్పుడే ఆమెను లేడీ విత్ ద ల్యాంప్ అని పిలిచేవారు. రోగుల నిద్రకు ఎంత ప్రాధానత్యనిచ్చేవారంటే వార్డుల్లో నర్సులు నడిచేటప్పుడు వారి గౌను శబ్దం కూడా పేషెంట్ల చెవులకు సోక రాదనేవారు నైటింగేల్. కేవలం వైద్య పరిరక్షకులుగానే కాక సైనికుల కోసం వారి కుటుంబాలకు వేలాది ఉత్తరాలు నైటింగేల్ స్వయంగా రాసి పోస్ట్ చేసేవారు. ఇది రోగుల్లో ఎంతో మానసిక స్థైర్యాన్ని నింపింది. నైటింగేల్ చేపట్టిన చేసిన అనేక సంస్కరణలు సైనికాసుపత్రి మరణాల రేటును, తొలి నెల రోజుల్లోనే 32 శాతం నుంచి 2 శాతానికి తగ్గించాయి. నర్సింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా విప్లవా త్మక మార్పులు తీసుకొచ్చారు. క్రిమియా యుద్ధంలో ఫ్లారెన్స్ వైద్యా రోగ్య రంగంలో చేపట్టిన సంస్కరణలు అమెరికా, కెనడా దేశాలను ఆలోచింపజేశాయి. ఆ దేశాలకు నైటింగేల్ సలహాదారుగా కూడా పని చేశారు. నర్సింగ్ ఆద్యురాలైన నైటింగేల్ శిష్యురాలు లిండా రిచర్డ్, 1870లో అమెరికా తొలి శిక్షణ పొందిన నర్స్గా నియామకం అయ్యారు. పేషెంట్లను దివారాత్రులు కంటికి రెప్పలా కాపాడిన నైటింగేల్ వాడిన ల్యాంప్ని ఇప్పటికీ లండన్ మ్యూజియంలో భద్ర పరిచి ఉంచారు. ప్రకృతి నుంచే మనిషికి ఉపశమనం లభిస్తుందనీ, ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే స్వచ్ఛమైన గాలి, వెలుతురు, సూర్యరశ్మి, సురక్షితమైన నీరు, ప్రత్యేకించి ఎంపిక చేసిన పౌష్టికాహారం, మనసుకి ప్రశాంతత నిచ్చే నిశ్శబ్ద సుఖవంతమైన నిద్ర, అన్నింటికన్నా ముఖ్యంగా వ్యాధి గ్రస్తులను ఉంచే పరిసరాల శుభ్రత అనేవి రోగులకు ఔషధాలకు మించి ఉపశమనాన్నిస్తాయనీ, పరిశోధనాత్మకంగా రుజువుచేసిన ఫ్లారెన్స్ నైటింగేల్ ఎన్విరాన్మెంటల్ థియరీని ప్రవేశపెట్టారు. ఆమె ఈ సిద్ధాంతాన్ని ప్రపంచం ముందుంచిన 150 ఏళ్ళ తరువాత రోగికి అవసరమైన కనీస విషయాలను గురించి ఇప్పుడు యావత్ ప్రపంచం మాట్లాడుతోండటం విచిత్రం. రోగులను అనునిత్యం కంటికి రెప్పలా కాపాడాల్సిన నర్సులకు శిక్షణ తప్పనిసరి అని భావించిన నైటింగేల్ తదనంతర కాలంలో 1860లో లండన్లో తొలి నర్సింగ్ స్కూల్, ‘నైటింగేల్ నర్స్ ట్రైనింగ్ స్కూల్’ని నెలకొల్పారు. అప్పటివరకు నర్సింగ్ అనేది ఒక వృత్తి విభాగంగా లేదు. దానికి ఒక విధి విధా నాల్లేవు. శిక్షణా పద్ధతులు లేవు. క్రిమియా యుద్ధం అనుభవాలతోనే ఆమె నర్సింగ్ విద్యకు రూపకల్పన చేశారు. రెండు ప్రధానమైన అంశా లను ఆమె పరిగణనలోనికి తీసుకున్నారు. దాదాపు 200 పుస్తకాలు రాశారు. ఆమెకు ఎన్నో ఉన్నత పురస్కారాలు లభించాయి. 1883లో రాయల్ రెడ్క్రాస్ నుంచి ‘క్వీన్ విక్టోరియా’ బిరుదుని, 1904లో ఆర్డర్ ఆఫ్ మెరిట్ను అందుకున్నారు. 1910, ఆగస్టు, 13న లండన్లోని తన నివాసంలో ఫ్లారెన్స్ నైటింగేల్ గొంతు శాశ్వతంగా మూగబోయింది. నర్సింగ్ వృత్తిలో అసామాన్య సేవలు అందించిన వారికి 1912లో ఫ్లారెన్స్ నైటింగేల్ పేరున ఒక మెడల్ని ప్రారంభించారు. జనాభా లెక్కల్లో ప్రజల ఆరోగ్యానికి కాలమ్... నూటాయాభై ఏళ్ళక్రితం ఫ్లారెన్స్ నైటింగేల్ నేటికీ అత్యంత అనుసర ణీయమైన, ఒక అద్భుతమైన సూచన చేశారు. జనాభా లెక్కల సమ యంలోనే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిం చాలని బలంగా వాదించారు. ఇది సూచన మాత్రమే కాదు పార్ల మెంటు వరకు తన వాదనని వినిపించేలా చేశారు. అదే జరిగి ఉంటే నిజానికి కోవిడ్లాంటి మహావిపత్కాలంలో ఎంతగానో ఉపయోగ పడేది. ఈ రోజుకీ ఆనాడు ఆమె లేవనెత్తిన అంశం తప్పనిసరిగా ఆచ రణలో ఉంచాల్సిన విషయమన్నది నిర్వివాదాంశం. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మల్లేపల్లి లక్క్ష్మయ్య మొబైల్ : 81063 22077 -
వ్యక్తుల నిర్బంధంతో శాంతి సాధ్యమేనా?
కొత్త కోణం ‘‘ప్రజలే చరిత్ర నిర్మాతలు. సమస్యలు సృష్టించిన భౌతిక పరిస్థితులను మార్చడానికి ప్రజలు సాగించే ప్రయత్నాల నుంచే ఉద్యమాలు ఉద్భవిస్తాయి. ఆ ఉద్యమాల నుంచి, ప్రజాశ్రేణుల నుంచే నాయకులు పుడతారు. ఆ నాయకులే ఉద్యమాలకు ఊపిరిలూదుతారు. అంతేగానీ, ఎవరో కొందరు నాయకుల వల్లనే ఉద్యమాలు రావు. ప్రముఖ చరిత్ర కారుడు ఇ.హెచ్.కార్ చెప్పిన సత్యాలివి. ఇదే చరిత్ర. వర్తమానం. భవిష్యత్తు కూడా. అయితే రాజులు, చక్రవర్తులు, ప్రజా స్వామ్య ప్రభుత్వాలు సైతం వాళ్ళు సృష్టించిన సమస్యలను, సామాజి కార్థిక పరిస్థితులను చక్కదిద్దడానికి బదులు, ఉద్యమాలను అణచి వేయడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు. చివరకు ఎంతటి అమాను షాలకైనా ఒడిగడతారు. అంతిమంగా ప్రజానాయకులను నిర్బంధిస్తే, నిర్మూలిస్తే ఉద్యమాలు సమసిపోతాయని భ్రమిస్తారు. చరిత్ర నిండా ఇవే సాక్ష్యాలు. సంవత్సరంన్నర క్రితం భీమా కోరేగావ్ కేసులో నిర్బంధించిన ప్రముఖ విప్లవ కవి వరవరరావు నిర్బంధం కూడా సరిగ్గా ఇదేకోవకు చెందింది. ఆకలిగొన్న జనం ఆఖరి అస్త్రమే ఉద్యమం. ప్రభుత్వాల, పాలకుల నిర్లక్ష్యం కారణంగా విసిగివేసారిన తాడిత, పీడిత జనం పక్షాన ఆ ఆఖరి క్షణం వరకూ నిలవాలన్నదే బహుశా విప్లవకవి వర వరరావు కల. ఆయన కలలో సైతం ప్రజల గొంతుకై పలవరించారు. ఆయన గొంతు పాలకుల నిజస్వరూపాలను పట్టిచ్చిన జనవాక్కు అయివుండవచ్చు. ఆయన వాక్కు కత్తికన్నా పదునైన ఆయుధమే అవ్వొచ్చు. కానీ ఏ ప్రభుత్వాన్నీ కూల్చే కుట్రలు మాత్రం ఆయన చేయలేదు. 81 ఏళ్ళ సుదీర్ఘజనజీవన యానంలో, ఈ పాలకుల కళ్ళు గప్పి ఆయన ఏ ఆయుధాలూ పట్టిందీ లేదు. ఆయన ప్రతికదలికనూ ప్రభుత్వాల వేనవేల నిఘానేత్రాలు వెంటాడని క్షణం అంతకన్నా లేదు. నిత్యసంఘర్షణనీ జనం పునాదిగానే సాగించారు. నిత్యం జనం మధ్యనే నిలిచిపోరాడారు. నిజానికి వరవరరావు ఏ ఆయుధాలతోనో, ఎక్కడో అడవుల్లోనో దొరికినవాడు కాదు. గత యాభై ఏళ్ళకుపైగా తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరిస్తూ, నోరులేని ఆదివాసీల పక్షాన, దళితుల పక్షాన, సాధారణ జనం పక్షాన కవిత్వం రాస్తూ, రచనలు చేస్తూ, జనమే శ్వాసగా జీవిస్తున్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎందరు భయపెట్టినా, ఏనాడూ తన మార్గాన్ని వీడలేదు. నిర్బంధాలకు వెరువక, నిర్భీతితో, అత్యంత ప్రజాస్వామ్యయుతంగా పాలకులపై తన ప్రశ్నలను సంధిస్తున్నారు. ఆయన ఆచరించిన, ఆచరిస్తున్న సిద్ధాంతం పట్ల ఎవరికైనా వ్యతిరేకత ఉండవచ్చు. నచ్చకపోవచ్చు. దానికి అభ్యంతరం లేదు. ఆయన అభిప్రాయాలను విభేదించే వాళ్ళు, దానిని వాళ్ళ ఆచరణతో, వాళ్ళు అనుసరిస్తోన్న సిద్ధాంతాలతో ఎదుర్కోవాలి. అంతిమంగా ప్రజలను గెలుచుకోవాలి. కానీ ఎనభై ఏళ్ళ వయస్సులో, ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో, చివరకు ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి కోవిడ్–19 బారిన పడిన తర్వాత కూడా ఆయనను ఇంకా ఖైదీగా చెరలో ఉంచుకోవడం ఎంత మాత్రం మానవీయత అనిపించుకోదు. ప్రపంచ దేశాల్లోని ఖైదీలను కోవిడ్ కారణంగా విడిచిపెడుతోంటే, వరవరరావు లాంటి ప్రాణాపాయంలో ఉన్న 80 ఏళ్ళుపైబడిన ప్రజానాయకుడిని జైల్లో నిర్బంధించి, కుటుంబ సభ్యులను కూడా కలవనీయకపోవడం ఆయన జ్ఞాపకాలను కూడా చెరిపెయ్యాలన్న ఆలోచన తప్ప మరొకటి కాదు. వరవరరావు పట్ల ప్రభుత్వం, పోలీసులు ఇంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడానికి కారణం ఎంత మాత్రం హేతుబద్ధమైనది కాదు. ఆయన ఎనభై ఏళ్ళు దాటిన వ్యక్తి. ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన మాటలు తడబడుతున్నాయి. జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారు. జీవిత సహచరినే గుర్తించలేని స్థితి, ఇలాంటి స్థితిలో ఆయన్ను బంధించి ఉంచడంలో అర్థం ఏముంటుంది. ఇంకా ఆయనను ప్రభుత్వం ప్రమాదకారిగా భావించడంలో అర్థం లేదు. అలాగే 90 శాతం శారీరక వైకల్యం కలిగిన సాయిబాబను కూడా నిర్బంధించడం దారుణం. వ్యక్తుల వల్ల ఉద్యమాలు రావు, నాయకుల మాటలతో, రాతలతో ప్రజలు ఆయుధాలు పట్టుకోరు. ఏ ఉద్యమానికైనా భౌతిక పరిస్థితులే కారణం. ఏ వ్యక్తీ ప్రాణాలను ఫణంగా పెట్టి అడవుల్లో ఉంటూ, పోలీసులను, సైనికులను ఎదుర్కొని పోరాడాలని అనుకోడు. అలా ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వారు తమ కోసం అడవిబాట పట్టలేదు. సర్వసుఖాలనూ తృణప్రాయంగా వదులుకొని చావుకైనా సిద్ధమవ్వడమంటేనే నిస్వార్థపరత్వమని అర్థం. అలాంటి వారు ప్రజలకోసం అడవిబాట పడితే, ఆయుధ మార్గాన్ని ఎంచుకుంటే, చేతనైతే ఆ సమస్యలకు పరిష్కారాన్ని ఆలోచించాలి. ప్రజలు మంచి జీవితాన్ని కోరుకుంటారు. అందరికీ సమాన హక్కులుండాలని కోరుకుంటారు. మనుషులంతా చట్టం ముందు ఒక్కటేనని భావిస్తారు. అది అబద్ధమని రుజువైన రోజు ప్రజలకు పాలకుల మీద విశ్వాసం పోతుంది. అందుకే ప్రభుత్వాలే ఈ పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది ఏ ఒక్క ప్రభుత్వం చేసిన తప్పు కాదు. ప్రస్తుత ప్రభుత్వాలతో పాటు గతంలో పాలించిన అన్ని కేంద్ర ప్రభుత్వాలు నక్సలైట్ ఉద్యమాన్ని కేవలం శాంతి భద్రతల సమస్యగా పరిగణించి, అసలు సమస్య పరిష్కారాన్ని దాటవేశాయి. నక్సలైట్ ఉద్యమం ఈనాటిది కాదు గత యాభైయ్యేళ్ళ క్రితం ప్రారంభమైంది. ఇప్పటి సగం జనాభాకు దాని ఆవిర్భావం తెలియదు. అయితే నక్సలైట్ ఉద్యమం నక్సల్బరిలో ప్రారంభమయ్యే నాటికే శ్రీకాకుళం, తెలంగాణల్లోని కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రజా ఉద్యమంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలో 1967 ప్రాంతంలో ఆదివాసులు ఎదుర్కొంటున్న షావుకార్ల దోపిడీ, భూస్వాముల అణచి వేత, గిరిజనుల భూములను రకరకాల పేర్లతో లాక్కోవడం జరిగింది. ఉద్దానంలో భూస్వాములు పేద ప్రజల భూములను దురాక్రమణ చేశారు. దీంతో అక్కడి ప్రజలు భూస్వాములపై తిరగబడ్డారు. అప్పుడే చదువుకొని, కమ్యూనిస్టు భావజాలంతో చైతన్యవంతమైన యువతరం, ప్రత్యేకించి ఉపాధ్యాయ వర్గం ఆదివాసుల పక్షాన నిలబడింది. యావత్ దేశానికే ఈ ఉద్యమం స్ఫూర్తినిచ్చింది. ముందుగా ప్రజలు ఆయుధాలు పట్టుకోలేదు. ఒక ఊరేగింపుపై భూస్వాములు చేసిన దాడిలో ఇద్దరు కార్యకర్తలు కోరన్న, మంగన్నలు చనిపోయారు. ఆ తరువాతనే ఉద్యమాలకు ఆయుధాల అవసరం ఏర్పడింది. ఆత్మరక్షణ కోసం వారు ఆయుధమార్గాన్ని అనుసరించారు. అప్పటికి ప్రజల దగ్గరున్న ఆయుధాలు బరిసెలు, కొడవళ్ళే, వాటితోటే ప్రజలు పోలీసులపై, పాలకులపై తిరగబడ్డారు. ప్రజాఉద్యమం సాయుధంగా మారిన సందర్భాలను ఎందరో చరిత్రకారులు రికార్డు చేశారు. అదే కాలంలో కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో దొరలు, భూస్వాములు కులవివక్ష, అంటరానితనం పాటిస్తూ, అన్ని రకాల వృత్తుల వారినుంచి వెట్టిచాకిరీ చేయించుకోవడం పరిపాటి. మహిళలపై అత్యా చారాలు నిత్యకృత్యంగా మారాయి. 1974–75 ప్రాంతంలో ప్రజలే ముందుగా తిరుగుబాటు చేశారు. అందుకు సిరిసిల్ల ప్రాంతంలోని నిమ్మపల్లి, జగిత్యాల ప్రాంతంలోని మద్దునూరు గ్రామాల ప్రజలు తిరుగుబాట్లే దానికి సాక్ష్యం. ఆ ప్రాంతంలో చదువుకున్న యువకులు నక్సలైట్ రాజకీయాలకు ఆకర్షితులయ్యారు. నక్సలైట్ పార్టీల నాయకత్వంలో తిరుగుబాట్లు చేశారు. వేలాది మంది ప్రజలు ఈ ఉద్య మంలో మమేకం అయ్యారు. దానికి తట్టుకోలేని భూస్వాములు గ్రామాలను వదిలి పట్టణాలకు పారిపోయారు. దీంతో అప్పటి కాంగ్రెస్ నాయకత్వంలోని చిన్నారెడ్డి ప్రభుత్వం 1978 అక్టోబర్లో ఆ ప్రాంతాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించింది. దీంతో గ్రామ గ్రామాన పోలీసులు క్యాంపులు వెలిశాయి. వేలాది మందిని అరెస్టు చేశారు. వందలాది మంది యువకులు పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్ళారు. దీంతో నక్సలైట్ పార్టీలు తమ ఉద్యమాన్ని అజ్ఞతంలో ఉంటూ నడపడం మొదలు పెట్టాయి. 1979, 80 వచ్చే సరికి పోలీసుల దాడులతో పాటు ఎన్కౌంటర్లు మొదలయ్యాయి. నక్సలైట్ సంస్థలు కూడా ఆయుధాలు పట్టినట్టు ప్రకటించుకున్నాయి. క్రమంగా ఉద్యమం ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని గడ్చిరోలికి విస్తరించడానికి ఇంద్రవెల్లి సహా అనేక ఘటనలు కారణమయ్యాయి. దీనర్థం నక్సలైట్ ఉద్యమం ఆవిర్భావానికి, విస్తరణకు భౌతిక పరిస్థితులే కారణం. అంతే కానీ ఏ ఒక్క వ్యక్తీ కారణం కాదు. నక్సలైట్ ఉద్యమానికి మద్దతిస్తున్న వాళ్ళను అరెస్టు చేస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగుతున్న నక్సలైట్ కార్యకలాపాలతో పాటు, గతంలో జరిగిన పరిణామాలన్నింటినీ సమీక్షించుకొని, ప్రజావసరాలకు తగినట్టుగా తమ పాలనను మరల్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికీ దేశంలో చాలా ప్రాంతాల్లో దళితులు, ఆదివాసుల్లో ఎంతో నిరాశా, నిస్పృహలు చోటు చేసుకొని ఉన్నాయి. ఆ అసంతృప్తి ఎటువైపు దారితీస్తుందో తెలియదు. అందుకే ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి దృష్టి పెట్టాలే కానీ, వాటివల్ల ఉద్భవించిన ప్రజాఉద్యమాలను అణచివేసే ప్రయత్నం చేస్తే సమస్య పరిష్కారం కాకపోగా, మరింత జటిలమౌతుందన్నది చరిత్ర చెప్పిన సత్యం. వ్యక్తులను నిర్బంధిస్తేనో, వ్యక్తులపై ప్రతీకార చర్యలకు పాల్పడితే చరిత్ర క్షమించదు. ఎమర్జెన్సీ చీకటి రోజులకు కారణమైన ఇందిరాగాంధీ పేరు పక్కన ఆ మరక ఎప్పటికీ మిగిలే ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వాలు కూడా ఆ పాపం మూటగట్టుకోకూడదనుకుంటే ప్రజాపోరాట యోధుడు, అపర మేధావి, అలుపెరుగని శ్రామికజనపక్షపాతి వరవరరావుని తక్షణమే విడుదల చేయాలి. ఇదే విషయాన్ని ప్రపంచదేశాల్లోని మేధావులెందరో ప్రత్యక్షంగా డిమాండ్ చేశారు. దేశవిదేశాల్లోని 140 మంది మేధావులు, తాత్విక వేత్తలు, నలభైమంది రచయితలు, కవులు వరవర రావుని విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికైన ప్రభుత్వం ఈ విజ్ఞప్తిని అంగీకరించి వరవరరావుని తక్షణం విడుదల చేస్తే శత్రువుని సైతం చేతచిక్కితే హాని కలిగించరాదని నమ్మే ఈ దేశం, ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడాల్సిన పని ఉండదు. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 మల్లెపల్లి లక్ష్మయ్య -
కలరా నుంచి కరోనా దాకా..
‘‘మనుగడ కోసం మానవజాతి నిరంతరం సంఘర్షణ జరుపుతూనే ఉంటుంది. అది కూడా మెరుగైన జీవితం కోసం తపనపడు తుంది’’ జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతి పాదించిన ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ చెప్పిన మాటలివి. పంతొమ్మిదవ శతాబ్ది తాత్వికవేత్త, హెర్బర్ట్ స్పెన్సర్ వ్యాఖ్య లను చార్లెస్ డార్విన్ మరింత పదునుగా చెప్పారు. ఆ తర్వాత మార్క్సిస్టు తాత్విక వేత్తలు కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్లు ఆ అవగాహనను రాజ కీయాలకు అన్వయించారు. ఆ రణనినాదమే ‘స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్’. నిరంతర సంఘర్షణ, నిత్య యోచన, సమాజానికి తనను తాను అర్పించుకోగల త్యాగనిరతి వెరసి సమాజ గతిని మార్చగలవు. ఆ సంఘర్షణే మానవాళి పురోభివృద్ధికి తోడ్పడగలదన్న విశ్వాసాన్ని పై వాక్యాలు ధ్రువ పరుస్తున్నాయి. అవి సామాజిక సమస్యలు కావచ్చు. ప్రకృతి వైపరీత్యాలూ కావచ్చు, లేదా మరెన్నో వినాశకర విపత్తులు నిత్యం సమాజాన్ని అతలాకుతలం చేస్తాయి. మనిషి మాత్రం ఆత్మ విశ్వాసాన్ని వదలకుండా, వాటిని అధిగమించేందుకు వ్యక్తిగతంగా, సామాజిక పరంగా ఎన్నో సాహసాలు చేస్తాడు. అది మానవజాతి మహోన్నత లక్షణం. అదే నేటి అభివృద్ధికి కొలమానం. కొన్ని విప త్తులు మనిషి మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తాయి. ఊహించని నష్టాలు సంభవిస్తాయి. అయినా మనిషి విపత్తులను అధిగమించడా నికి తన జీవితాన్ని సైతం ఫణంగా పెట్టి త్యాగాలకు పూనుకుంటాడు. అయితే తన కోసం కాకుండా సమాజం మేలు కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టేవారు అతి కొద్దిమందే ఉంటారు. అటువంటి అరుదైన వారి వల్లనే ఈ సమాజం ఈనాటికీ మనుగడ కొనసాగిస్తోంది. కరోనా లాంటి విలయతాండవాన్ని స్వయంగా అనుభవిస్తోన్న నేటి తరుణంలో చరిత్రపుటల్లో దాగిన, మానవజాతి మనుగడను శాసించే విపత్తులను అధిగమించి, సమాజం పురోగమించేందుకు యత్నించిన ఎందరో మహానుభావుల సాహస చర్యలు మనకళ్ళ ముందు కదలాడుతాయి. 1892 సంవత్సరం జూలై 18వ తేదీన ప్రపంచాన్ని ప్రత్యేకించి ఆసియా, యూరప్ ఖండాలను శవాల గుట్ట లుగా మార్చిన కలరా మహమ్మారికి విరుగుడుగా తాను కనుగొన్న వ్యాక్సిన్ను, మొదటగా తనమీద, తన సన్నిహితులు, మిత్రుల మీద ప్రయోగించి చూసుకున్న వ్లాదిమిర్ హాఫ్కైన్ను స్మరించుకోవడం సందర్భోచితం. తన ప్రాణం కన్నా సమాజ రక్షణ, కోట్లాదిమంది ప్రాణాలు ముఖ్యమని భావించడంవల్ల హఫ్కైన్ ఈ సాహసానికి దిగారు. ఆ ప్రయోగం ఎటువంటి అవరోధాలు లేకుండా విజయవంత మైంది. ఆ ప్రయోగం ఫలప్రదం అవడంతో వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. తత్ఫలితంగా కోట్లాది మంది ప్రాణాలను కాపాడగలిగారు. కలరా మొదటిసారిగా 1817లో బెంగాల్లో ప్రబలింది. 1920 కల్లా భారతదేశమంతటా వ్యాపించింది. ఇందులో ఒక కోటి యాభై లక్షల మంది మరణించారు. మరో రెండు కోట్ల 30 లక్షల మంది 1865–1917 మధ్య కలరా వల్ల ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో రష్యాలో 20 లక్షల మంది మరణించారు. 1817 నుంచి 1923 వరకు ఆరుసార్లు కలరా మహమ్మారి విజృంభించి ప్రపంచాన్ని వణికించింది. ఇందులో కొన్ని కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. 1817–1824 మధ్య మొదటిసారి, 1829–1837 మధ్య రెండవసారి, 1840–1860 మధ్య మూడవసారి, 1863–75 మధ్య నాల్గవసారి, 1881–1896 మధ్య ఐదవసారి, 1899–1923 మధ్య ఆరవసారి, 1961–1975 మధ్య ఏడవసారి కలరా వచ్చింది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 1961–1975 మధ్య ఇండియాలో కలరా విజృంభించలేదు. 1899–1923 మధ్య కలరా విజృంభణ తర్వాత, భారత ప్రజలపైన కలరా అంతగా ప్రభావం చూపలేదు. 1865–1917 మధ్య వచ్చిన కలరా రెండు కోట్ల 30 లక్షల మందిని కబళిస్తే, 1965–1971 మధ్య వచ్చిన కలరా మనలను తాకలేకపోయింది. దీనికి ఏకైక కారణం వ్లాదిమిర్ హాఫ్కైన్ కృషి, పట్టుదల, త్యాగమే. వ్లాదిమిర్ హాఫ్కైన్ జీవితం చాలా సాదాసీదాగా ప్రారంభమైంది. రష్యాలోని ఉక్రెయిన్ ప్రాంతంలో ఉన్న ఓడరేవు పట్టణం ఒడిస్సాలోనే సాగింది. మలరొస్కికి విశ్వవిద్యాలయంలో నేచురల్ సైన్సెస్లో హాఫ్కైన్ పట్టా పొందారు. ఎలిమెచిన్ కాఫ్ అనే జీవశాస్త్రవేత్త ప్రభావం హాఫ్కైన్ మీద పడింది. ఎలిమెచిన్కు నోబెల్ బహుమతి లభించింది. అయితే ఆయన అదే విశ్వవిద్యాలయంలోని మ్యూజియంలో ఉద్యోగిగా చేరారు. జీవసంబంధమైన పరిశోధనలు చేసి, అయిదు పరిశోధనాత్మక పత్రాలను రూపొందించారు. అయితే హాఫ్కైన్లో మరొక కోణం కూడా ఉంది. 1880 ప్రాంతంలో జార్ చక్రవర్తికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు ఉద్యమాలలో హాఫ్కైన్ పాల్గొనేవాడు. అందుకుగాను మూడుసార్లు జైలుకెళ్ళాడు. రష్యా చక్రవర్తి రెండవ అలెగ్జాండర్ను విప్లవ తిరుగు బాటుదారులు హత్య చేసిన సందర్భంగా హాఫ్కైన్ కూడా నిర్బంధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన ప్రత్యక్షంగా అందులో పాల్గొనక పోయినా ఆ సంబంధిత సంస్థతో ఉన్న సంబంధాల వల్ల జైలుకెళ్ళాల్సి వచ్చింది. అయితే జీవశాస్త్ర పరిశోధనలలో ఉన్న ఆసక్తి వల్ల ఆయన 1888లో రష్యాను వదిలిపెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత స్విట్జర్లాండ్ జెనీవాలోని విశ్వవిద్యాలయంలో అధ్యా పకుడిగా చేరారు. వ్యాక్సిన్లకు పితామహుడిగా పేరొందిన లూయీస్ పాశ్చర్ పారిస్లో స్థాపించిన పాశ్చర్ ఇన్స్టిట్యూట్లో చేరారు. అప్ప టికే ప్రపంచాన్ని వణికిస్తోన్న కలరాపైన పరిశోధనలో భాగస్వామి అయ్యారు. కలరా వైరస్కు విరుగుడు కనిపెట్టడంలో హాఫ్కైన్ విజయం సాధించారు. ప్రతివారం జరిగే పారిస్ బయోలజీ సొసైటీ సమావేశం సందర్భంగా 1892లో హాఫ్కైన్ ఈ విషయాన్ని ప్రక టించారు. ఆ తర్వాత హాఫ్కైన్ కుందేళ్ళు, పావురాళ్ళపైన ప్రయోగం చేసి వ్యాక్సిన్ను రుజువు చేశారు. ఆ తర్వాత వెంటనే అంటే 1892వ సంవత్సరం జూలై 18వ తేదీన మనుషులలో ఈ వ్యాక్సిన్ ప్రయోగం చేయాలనుకున్నప్పుడు ప్రయోగానికి తనను, తన రాజకీయ మిత్రు లను హాఫ్కైన్ ఎంచుకున్నారు. ఆ తర్వాతనే ఆయన ఇతరుల మీద ప్రయోగం చేశారు. ఈ వ్యాక్సిన్ పరిశోధనకు సంబంధించిన విషయాలన్నింటినీ బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచురించారు. దీనిని ప్రజలకు అందించ డానికి హాఫ్కైన్ రష్యాతో సహా ఇతర దేశాలను అభ్యర్థించారు. అయితే కేవలం బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మాత్రమే సానుకూల స్పందన లభించింది. అప్పటికి భారతదేశంలో కలరా విజృంభించి, లక్షలాది మంది ప్రాణాలను బలితీసుకొని, విలయతాండవం సృష్టించింది. అందువల్ల దీని క్షేత్ర ప్రయోగం కోసం కలకత్తాను ఎంచుకోవాలని పారిస్లోని బ్రిటిష్ దౌత్యవేత్త లార్డ్ ఫ్రెడరిక్ సూచనతో మార్చిలో కలకత్తాలోని ప్రెసిడెన్సీ హాస్పిటల్లో బ్యాక్టీరియాలజిస్ట్గా చేరారు. అయితే కలకత్తాలోని డాక్టర్లు, హాఫ్కైన్ ప్రయోగాలను అపహాస్యం చేశారు. ఇది అసాధ్యమని పెదవి విరిచారు. చివరకు కొంతమంది హాఫ్కైన్ను హత్య చేయడానికి ప్రయత్నించారు. అయితే ఆ తర్వాత ఆగ్రాలో నూతనంగా స్థాపించిన బాక్టీరియాలాజికల్ లేబొరేటరీ బాధ్య తలు తీసుకొని సైన్యంలోని సిబ్బందిపై, ఇతర పౌరులపై దానిని ఉప యోగించాలని కోరారు. దాదాపు 37,000 మంది భారతీయులపై, 5 వేల మంది బ్రిటిష్ సిబ్బందిపై ఈ వ్యాక్సిన్ ప్రయోగం జరిగింది. దానిశక్తి సామర్థ్యాలపై బ్రిటిష్ ప్రభుత్వం సంతృప్తిని వ్యక్తం చేసింది. 1896 సెప్టెంబర్ చివరలో బొంబాయిలో ప్లేగు వ్యాపించింది. బ్రిటిష్ ప్రభుత్వం హాఫ్కైన్ను అక్కడికి పంపించింది. ప్లేగ్కు కూడా ఆయన మందును తయారుచేసి, ఎంతోమంది ప్రాణాలను కాపా డారు. 1896లోనే హాఫ్కైన్ ఇండియన్ సివిల్ సర్వీసులో చేరారు. అయినప్పటికీ సమాజాన్ని అతలాకుతలం చేస్తోన్న మహమ్మారి రోగాలకు మందులను కనుగొనడంలో తన అవిశ్రాంత కృషిని కొన సాగిస్తూనే వచ్చారు. తన ఈ సర్వీసులో కూడా ఎన్నోరకాల ఔషధా లను కనుగొన్నారు. ఆయన పరిశోధించి కనుగొన్న ప్రతి వ్యాక్సిన్ను మొదట తన మీదనే ప్రయోగం చేసుకోవడం తప్పనిసరి అలవాటుగా మార్చుకోవడం ఆయనలోని దృఢచిత్తానికి నిదర్శనం. 1897లో ఆగాఖాన్ అనే ముస్లిం సంపన్నుడు బొంబాయిలోని ఖుస్సో లాడ్జి భవనాన్ని హాఫ్కైన్ నివాసంగా ఇచ్చాడు. దీనిని కూడా ప్లేగ్ పరిశోధనా కేంద్రంగా మార్చారు. పారిస్లోని పాశ్చర్ ఇన్స్టి ట్యూట్ తరహాలో బొంబాయిలో ఒక సంస్థను నెలకొల్పాలని హాఫ్కైన్ ఆగాఖాన్ను కోరారు. అది స్థాపించడం మాత్రమే కాకుండా, ఆ తర్వాతి కాలంలో దానినే హాఫ్కైన్ ఇన్స్టిట్యూట్గా పేరు మార్చారు. ఆయన భారతదేశంలో 20 ఏళ్లు గడిపి కలరాపై పరిశోధనల్లో విశేష కృషి చేశారు. 1927లో ఆయనను రష్యాలో గొప్పగా సత్కరించారు. రష్యా సోషలిస్టు విప్లవం తర్వాత ఆయన రష్యాలో అడుగుపెట్టారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆయన పేరు మీద ఒక స్టాంప్ను విడుదల చేసి తమ కృతజ్ఞతను ప్రకటించుకుంది. రష్యా ప్రభుత్వం ఆయనను ‘‘మానవాళి రక్షకుడు’’గా ప్రకటించింది. కరోనాను ఎదుర్కోవడానికి కూడా ఎంతోమంది శాస్త్రవేత్తలు, సంస్థలు వ్యాక్సిన్ను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పటి కన్నా ఇప్పుడు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎన్నో ఉన్నతమైన మార్పులు వచ్చాయి. లూయీస్ పాశ్చర్, వ్లాదిమిర్ హాఫ్కైన్ల స్ఫూర్తితో సాగు తున్న ఈ పరిశోధనలు, ప్రయోగాలు విజయవంతం అవుతాయని ఆశిద్దాం. హాఫ్కైన్ లాంటి ఒక శాస్త్రయోధుడినే కాదు, ప్రపంచ జనావళిని ఆదుకునేందుకు ఎందరో, ఎందరెందరో శాస్త్రయోధులను సృష్టించు కోవాల్సిన తక్షణ అవసరం ప్రపంచం ముందుంది. ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే మరెందరో హాఫ్కైన్లు పుట్టుకురావాలని మనసారా కోరుకుందాం. (జూలై 18, హాఫ్కైన్ తనను తాను వ్యాక్సిన్ ప్రయోగానికి సమర్పించుకున్నరోజు) మల్లెపల్లి లక్ష్మయ్య, వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
యుద్ధం కాదు శాంతే పరిష్కారం!
యుద్ధం సమస్యను సృష్టిస్తుందే కానీ, సమస్యను పరిష్కరించదు. యుద్ధానికి చర్చలే పరిష్కారం కానీ, యుద్ధం దేనికీ పరిష్కారం కాజాలదు. అందుకే మహాత్మాగాంధీ యుద్ధం ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాంఛనీయం కాదని తేల్చి చెప్పారు. అయితే ఏ దేశమైనా మరో దేశం దురాక్రమణను సహిం చాల్సిన అవసరం లేదు. నిజానికి రెండు వేల ఏళ్ళనాడే ఏ ఆయుధాలు లేకుండా ప్రేమతో భారత దేశం చైనాను గెలుచుకున్నది. ఇప్పుడు చైనా ప్రజలు మనలాగా తూర్పుకు తిరిగి దండం పెట్టరు. భారత దేశం వైపు నిలబడి నమస్కరిస్తారు. ఎందుకంటే గౌతమ బుద్ధుడు పుట్టిన దేశం, భారత దేశం వారికి పడమరవైపు ఉన్నది. అందుకే ప్రజల మధ్య ఐక్యతను ఏ యుద్ధాలూ వేరుచేయలేవు. ‘‘రెండు దేశాలు యుద్ధానికి తలపడు తోంటే, ఆపాల్సిన బాధ్యత శాంతిని, అహిం సను కోరుకునే వాళ్ళపైనే ఉంటుంది. ఇరు దేశాల పౌరులు కూడా ఆ కర్తవ్యాన్ని తీసుకోవాలి. వ్యక్తులకు ఆ అధికారం లేకపోవచ్చు. ఆ వ్యక్తికి అంత శక్తి కూడా ఉండకపోవచ్చు కూడా. అయినా ఆ ప్రయత్నం చేయాలి. చివరకు యుద్ధంలో పాల్గొంటోన్న సైనికుడు సైతం యుద్ధాన్ని ఎట్లా ఆపాలో ఆలోచించాలి. దానితో, తను మాత్రమే కాదు, తన దేశాన్నీ, తన ప్రజలనూ, యావత్ ప్రపంచాన్ని యుద్ధం నుంచి విముక్తి చేయాలి’’ భారత స్వాతంత్య్ర ఉద్యమ సారథి మహాత్మాగాంధీ అన్న మాటలివి. యుద్ధాలు చేసిన వాళ్ళు, యుద్ధాలు చూసిన వాళ్లు సైతం యుద్ధమంటే అసహ్యించుకున్నారు. యుద్ధాన్ని ప్రారంభించడానికి ముందు ఉన్న కోపం, ద్వేషం, యుద్ధం ముగిసిన తర్వాత వైరాగ్యంగా మారుతుంది. ఇది చరిత్ర పొడవునా కనిపించే కఠోర సత్యం. యుద్ధాన్ని ఆశించే వారు ఈ సజీవ సాక్ష్యాన్ని ఎరుగరు. యావత్ ప్రపంచం కరోనాతో యుద్ధం చేస్తున్నది. మన దేశం కూడా రోజు రోజుకూ ప్రమాదపుటంచుల్లోకి వెళుతోంది. సరిగ్గా ఈ సమయంలోనే భారత్–చైనా సరిహద్దుల్లో జరిగిన అవాంఛనీయ ఘర్షణలో ఇరవైమంది భారత సైనికులు ప్రాణాలొదిలారు. కచ్చి తమైన సంఖ్య తెలియనప్పటికీ చైనా కూడా తగిన మూల్యం చెల్లిం చుకుంది. సరిహద్దుల్లో అప్పుడప్పుడు ఉద్రిక్తతలు తలెత్తడం, చిన్న చిన్న ఘర్షణలు జరగడం సర్వసాధారణం. కానీ ఈసారి అది భారీ నష్టానికి దారితీసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయమై అఖిల పక్ష సమావేశంలో మాట్లాడుతూ, చైనా మన భూభాగంలోకి చొచ్చు కురాలేదని, ఆందోళన అవసరం లేదని, ఒక వేళ చైనా వైపునుంచి ఎటువంటి దాడులు జరిగినా భారత ప్రభుత్వం ఊరుకోజాలదని హెచ్చరించారు. దానికి అన్ని పక్షాలూ మద్దతు పలికాయి. ఇదిలా ఉండగా సమయంలోనే గత వారం అమెరికా విదేశాంగ శాఖా మంత్రి మైక్ పాంపియో జర్మనీలోని బ్రస్సెల్స్లో మాట్లాడుతూ తమ సైన్యాన్ని సగానికి పైగా జర్మనీ నుంచి తరలిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ సైన్యాన్ని ఎక్కడికి పంపిస్తున్నారు అని ఒక విలేకరి ప్రశ్నిం చగా, ఆయన చైనా చేస్తున్న దురాక్రమణ చర్యలను ఎదుర్కోవడానికి దక్షిణాసియాకు పంపిస్తున్నామని జవాబు చెప్పారు. ముఖ్యంగా ఇటీ వల భారత్–చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణను ఆయన ప్రత్యేకంగా ఉదహరించారు. అంతేకాకుండా దక్షిణ చైనా భూభాగంలో ఉన్న సము ద్రంపై కూడా చైనా హక్కులను ప్రకటించుకుంటున్నదని, అందువల్ల చైనా దక్షిణాసియాకు ప్రమాదకారిగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్–భారత్ల మధ్య దౌత్యం నెరపుతానంటూ అమెరికా ఉవ్విళ్ళూరింది. అమెరికా జోక్యాన్ని భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. కాశ్మీర్ విషయంలో ఎవరి జోక్యం అక్కర్లేదని తేల్చి చెప్పింది. కానీ మైక్ పోంపియో చైనాకు వ్యతిరేకంగా, భారత్కు అనుకూలంగా ప్రకటన చేసి వారం దాటినప్పటికీ, భారత ప్రభుత్వం నుంచి స్పందన లేదు. పైగా చైనా యాప్లను నిషేధిస్తు న్నట్టు ప్రధాని ప్రకటించారు. దీనిని పత్రికలు డిజిటల్ స్ట్రైక్గా పేర్కొం టున్నాయి. అంతే కాకుండా చైనా వస్తువులను బహిష్కరించా లనే కొందరి డిమాండ్ కూడా బాగా ప్రచారంలో వుంది. చైనా యుద్ధా నికి కాలు దువ్వితే చేతులు ముడుచుకొని కూర్చోవాలని ఎవ్వరూ చెప్పరు. అది సరైంది కూడా కాదు. కానీ ఇక్కడ అమెరికా జోక్యం పలు అనుమానాలకు దారితీస్తున్నది. ఈ రెండు దేశాల వైరం అమెరికా ఉపయోగించుకునే ప్రమాదం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తన వద్ద నిల్వ ఉన్న ఆయుధాలను అమ్ముకొనేందుకు కూడా అమెరికా యత్ని స్తోంది. అమెరికాని విశ్వసిస్తే మాత్రం మనం తప్పు చేసినవాళ్ళ మవుతాం. ఇప్పటికే మన దేశం కొన్నివేల కోట్లు ఖర్చుచేసి, ఆయుధా లను కొనుగోలు చేస్తున్నది. ప్రపంచంలో ఆయుధాల కొనుగోళ్ళలో మనం రెండవ స్థానంలో ఉన్నాం. భారత్–చైనా మధ్య యుద్ధం జరి గితే దాన్ని, అమెరికా తన వ్యాపారాభివృద్ధి కోసం ఉపయోగించు కోవడానికి సిద్ధంగా ఉంది. రెండో వైపు తన ఆధిపత్యాన్ని ఆసియా దేశాలకు విస్తరింపజేయడానికీ పథకం వేస్తున్నది. వీటితో పాటు మరొక ముఖ్యమైన అంశం ఇందులో దాగి ఉన్నది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్, చైనా దేశాలు బలమైన శక్తులుగా అవతరిస్తున్నాయి. అమెరికా తన మొదటి స్థానాన్ని ఎప్పుడో కోల్పో యింది. 2013వ సంవత్సరం నుంచే జాతీయ స్థూల ఆదాయంలో చైనా మొదటి స్థానంలోకి రాగా, అమెరికా రెండవ స్థానంలోకి దిగ జారింది. 2030 నాటికి ఆ రెండవ స్థానాన్ని భారత దేశం కైవసం చేసు కోబోతోంది. అమెరికా మూడవ స్థానంలోకి వెళ్ళబోతున్నది. ఇది అమె రికాకు మింగుడు పడని విషయం. ఒకవేళ భారత్–చైనాల మధ్య యుద్ధమే జరిగితే భారత్, చైనాలు రెండూ ఆర్థికంగా దెబ్బతింటాయి. ముఖ్యంగా భారత దేశం ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే అమెరికా తన ఆర్థిక ఆధిక్యతను నిలబెట్టుకుని, తను కోరు కున్న స్థానాన్ని చేరుకుంటుంది. రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలను ఇరు దేశాల పౌరులు, దేశభక్తులు గుర్తించాలి. పదిహేడవ శతాబ్దానికి చెందిన కవి, నాటక రచయిత, తత్వవేత్త జాన్ డ్రైడన్ యుద్ధం గురించి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ చక్కగా సరి పోతాయి. ‘యుద్ధం రాజులకు వ్యాపారం. యుద్ధాలు అన్నీ కూడా సంపదల పంపకానికో, పెంపకానికో జరుగుతాయి. అన్ని యుద్ధాల వెనుకా కనిపించని కుట్రలెన్నో దాగుంటాయి’ అంటారాయన. నిజా నికి భారత్–చైనాల మధ్య వైరం కన్నా స్నేహం చాలా బలమైనది. ప్రాచీనమైనది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుంచి చైనా–భారత్ల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు మొదలయ్యాయి. చైనాలో మొదలై రోమ్ వరకు సాగిన సిల్క్ రూట్ వ్యాపారం రెండు దేశాల ఉత్పత్తులను విశ్వవ్యాప్తం చేశాయి. చంద్రగుప్త మౌర్య కాలంలో కూడా చైనాతో భారత దేశానికి వ్యాపార, రాజకీయ సంబంధాలున్నాయి. చైనా నుంచి ప్రపంచానికి దిగుమతి అయిన సిల్క్ వస్త్రాలు మన దేశంలో కూడా చాలా ప్రసిద్ధి. పట్టు పీతాంబరాలు, చీని చీనాంబరాల గురించి మన సాహిత్యంలో మనం ఎన్నో సార్లు చదివాం. అశోకుడు, కనిష్కుడు లాంటి బౌద్ధ చక్రవర్తుల కాలంలో భారత్–చైనా సంబం ధాలు మరింత విస్తరించాయి. భారత్ నుంచి బౌద్ధం ప్రపంచానికి ప్రత్యేకించి దక్షిణాసియాకు విస్తరించడానికి చైనా ఒక మార్గంగా పనిచేసింది. పల్లవ రాజకుమారుడైన బోధి ధర్మ చైనాలో మహాయాన బౌద్ధాన్ని విస్తృతపరిచాడు. కుమార జీవ అనే బౌద్ధ దార్శనికుడు ఎన్నో ముఖ్యమైన బౌద్ధ గ్రంధాలను చైనా భాషలోకి అనువదించి, అక్కడ ఆరాధ్యుడయ్యారు. బోధి ధర్మం నేర్పిన మార్షల్ ఆర్ట్స్ షావోలిన్ టెంపుల్ నిర్మాణానికి, అక్కడ యుద్ధ విద్యలకు ఉపయోగపడింది. అలాగే చైనా యాత్రికులైన షాహియాన్, హుయాన్త్సాంగ్లు భారత దేశంలో పర్యటించి ఆనాటి చరిత్రను నిక్షప్తం చేశారు. చైనా విప్లవంలో భారత దేశం నుంచి పాల్గొన్న డాక్టర్ ద్వారకా నాథ్ కొట్నిస్ను చైనా ప్రజలు ఇప్పటికీ గుండెల్లో పెట్టుకుంటారు. చైనా విప్లవాన్ని భారత ప్రజలు ఎంతగానో గౌరవిస్తారు. యుద్ధం సమస్యను సృష్టిస్తుందే కానీ, సమస్యను పరిష్కరించదు. చివరకు వాదాలు, వివాదాలు అన్నీ చర్చల ద్వారా పరిష్కారం కావాల్సిందే. నిజానికి యుద్ధానికి చర్చలే పరిష్కారం కానీ, యుద్ధం దేనికీ పరి ష్కారం కాజాలదు. అందుకే మహాత్మాగాంధీ యుద్ధం ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాంఛనీయం కాదని తేల్చి చెప్పారు. అయితే ఏ దేశమైనా మరో దేశం దురాక్రమణను సహించాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తిని వేరొక వ్యక్తి, ఒక దేశాన్ని మరో దేశం దోపిడీ చేస్తోంటే, పీడిస్తోంటే దాన్ని సహించాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయితే ఆయా సందర్భాల్లో శాంతి కోసం జరిగే యుద్ధానికి ఓ అర్థం ఉంటుంది. కానీ ప్రభుత్వాల కన్నా ప్రజాభిప్రాయం బలమైనది. శక్తి వంతమైనది. ఆ మాటకొస్తే ప్రజలు ఎప్పుడు యుద్ధాన్ని కోరుకోరు. ఇది సత్యం. నిజానికి రెండు వేల ఏళ్ళనాడే ఏ ఆయుధాలు లేకుండా ప్రేమతో భారత దేశం చైనాను గెలుచుకున్నది. ఇప్పుడు చైనా ప్రజలు మనలాగా తూర్పుకు తిరిగి దండం పెట్టరు. భారత దేశం వైపు నిల బడి నమస్కరిస్తారు. ఎందుకంటే గౌతమ బుద్ధుడు పుట్టిన దేశం, భారతదేశం పడమరవైపు ఉన్నది. అందుకే ప్రజల మధ్య ఐక్యతను ఏ యుద్ధాలూ వేరుచేయలేవు. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
వలసల రీతిలో ‘నిలువుదోపిడీ’ నీతి
కార్మికులను ‘స్థాన బలంలేని బానిసలు’గా తయారుచేయడం. స్థిరమైన పని, సుస్థిరమైన బతుకుదెరువులేకుండా జీవితాన్ని అస్థిరం చేసి, అభద్రతకు గురిచేయడమే ‘ఫుట్ లూజ్ లేబర్’ సిద్ధాంతం. ప్రతినెలా భార్యాపిల్లలకు, తల్లిదండ్రులకు పంపాల్సిన డబ్బులు మాత్రమే కార్మికులకు కనపడతాయి. భారత దేశంలో కార్మికవర్గం ఈరోజు చెల్లాచెదురైంది. దాని విశ్వరూపాన్ని మనం కరోనా వ్యాప్తితో ప్రకటించిన లాక్డౌన్లో చూశాం. ఇంతటి భయంకర పరిస్థితులు ఏర్పడడానికి పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య వర్గాల దోపిడీ, ప్రభుత్వాల నేరపూరిత నిర్లక్ష్యం కారణాలు. వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి కార్మికులను తెచ్చుకోవడం వెనుక ఒక నయా దోపిడీ విధానం ఉన్నది. ‘ఫుట్ లూజ్ లేబర్. ఇది ఒక పదబంధం. కొత్తగా వింటున్నాం. ఇది పదబంధం మాత్రమే అనుకుంటే పొరబడ్డట్టే. ఈ పదం వెనుక ఓ పెద్ద కుట్రే దాగివుంది. యావత్ ప్రపంచంలోని శ్రామిక వర్గాన్నీ, మన లాంటి పేద దేశాలన్నింటినీ అతలాకుతలం చేసిన కుట్ర అది. కరోనా సంక్షోభంతో ఇది చర్చకు వస్తున్నది. లారీలూ, బస్సులూ, రైళ్లూ ఒకటా రెండా దేశంలోని దారులూ... రహదారులన్నీ కోట్లాది మంది నెత్తుటి ముద్దలుగా మారిన వలసకార్మికుల పాదముద్రలే. ఇది ఒక చోటి నుంచి మరోచోటికి మాత్రమే కాదు. నలుదిక్కులనుంచి కదులుతోన్న బాధాతప్త హృదయ జనప్రవాహం. రైళ్ళు నడవడంలేదన్న ధీమాతో రైల్వే ట్రాక్పై అలసి, సొలసి ఆదమరిచి నిద్దరోయిన వారి తలలు తెగిపడ్డాయి. ఉత్తరప్రదేశ్లో ప్రతిరోజూ వలసల దారుల్లో వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేకానేక వలసప్రాణాలు గాలిలో కలసిపోయాయి. దేశంలోనే కానీ, ప్రపంచంలోనే వలస బతుకు వెతలకు వేల ఏళ్ళ చరిత్ర ఉన్నది. శతాబ్దాలుగా ఈ వలసలు సాగుతూనే ఉన్నాయి. ఇందులో బతుకుదెరువు వలసలున్నాయి. బలవంతపు వలసలున్నాయి. ఆక్రమణకోసం వలసలున్నాయి. దురాక్రమణ వలసలు సైతం ఉన్నాయి. కానీ ఈ రోజు జరుగుతున్న వలసల వెనుక ఒక దోపిడీ, కుట్ర దాగిఉంది. అదే నేను ముందు ప్రస్తావించిన ‘ఫుట్ లూజ్ లేబర్’ సిద్ధాంతం. ఈ రోజు దీనినే వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, కాంట్రాక్టర్ల వర్గాలు అనుసరిస్తున్నాయి. ‘ఫుట్ లూజ్ లేబర్’ అంటే ఒక కార్మికుడిని తన సొంత ఊళ్ళోనో, జిల్లాలోనో, రాష్ట్రంలోనో పని ఇవ్వకుండా పొరుగు రాష్ట్రాల వారినో, ఇతర ప్రాంతాల వారినో వెతికితెచ్చుకోవడం. కార్మికులను ‘స్థాన బలంలేని బానిసలు’గా తయారుచేయడం. స్థిరమైన పని, సుస్థిరమైన బతుకుదెరువులేకుండా జీవితాన్ని అస్థిరం చేసి, అభద్రతకు గురిచేయడమే ‘ఫుట్ లూజ్ లేబర్’ సిద్ధాంతం. దీనిని మొదట బయటపెట్టింది జాన్బ్రెమన్. జాన్ బ్రెమన్ డచ్ దేశానికి చెందిన సామాజిక శాస్త్ర పరిశోధకులు. ఈయన అమెస్టర్డమ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేశారు. ‘ఫుట్ లూజ్ లేబర్’ పేరుతో పుస్తకాన్ని రచించారు. 1936లో జన్మించిన జాన్ బ్రెమన్ దాదాపు అర్ధ శతాబ్దం భారత దేశంలోని కార్మికవర్గ జీవితాలపైన సమగ్రమైన పరిశోధన చేశారు. దక్షిణ గుజరాత్లో చేసిన ఆయన అధ్యయనాన్ని గత జనవరిలో ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త జయతీఘోష్ తన సమీక్షలో కొనియాడారు. జాన్ బ్రెమన్ చేసిన అధ్యయనం ఇప్పటివరకూ నిర్లక్ష్యానికి గురైందని, భారతదేశంలో జరుగుతున్న ఆర్థికాభివృద్ధిలో కార్మిక వర్గంపై జరుగుతున్న దోపిడీని, అణచివేతను, అమానుషాన్ని బ్రెమన్ పుస్తకంలో రాసిన విషయాలను జయతీఘోష్ వెల్లడించారు. గతంలో ఉన్న వెట్టిచాకిరీ, బానిస విధానం, కూలీ విధానాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో పారిశ్రామిక వర్గాలు కొత్తగా, నూతన రూపాల్లో తెరమీదికి తీసుకొచ్చా యని బ్రెమన్ రాసిన విషయాలను జయతీఘోష్ ఉదహరించింది. ‘ఫుట్ లూజ్ లేబర్’ విధానాన్ని ఈ రోజు దేశమంతా అమలు చేస్తున్నారు. వలస కార్మిక విధానమే మారిపోయింది. గతంలో వెనుకబడిన ప్రాంతాల నుంచి, పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా రాష్ట్రాలకు కార్మికులు వలసలు వెళ్లేవారు. కానీ ఇప్పుడు అది మారిపోయింది. అభివృద్ధి చెందిన ప్రాంతాలకు వలసకార్మికులు వస్తున్న మాట నిజమే, అయితే వీరికి సొంత గడ్డపై పనులు లభించడంలేదు. నూటికి 80 శాతం కంపెనీలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, హోటళ్ళు, ఇతర సేవాసంస్థలు, చివరకు అతి తక్కువ జీతాలు ఇచ్చే సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే ఉండటం మనం చూడొచ్చు. దీనికి వ్యాపారం, వాణిజ్య, పారిశ్రామిక వర్గాల వాదనలు వేరుగా ఉన్నాయి. స్థానికంగా ఉన్నవాళ్ళకు నైపుణ్యం లేదన్నది వారి నిశ్చితాభిప్రాయం. ఇది పూర్తిగా అబద్ధం. అయితే ఇక్కడి వాళ్ళు ప్రత్యేకించి తెలంగాణకు సంబంధించిన వాళ్ళు గల్ఫ్ దేశాల నిర్మాణాల్లో, వాళ్ళ ఆర్థికాభివృద్ధిలో ఎట్లా ఉపయోగపడుతున్నారు? దుబాయ్లో ఇతర గల్ఫ్ నగరాల్లో నిర్మించిన అద్భుతమైన, అందమైన భవనాలను నిర్మించింది కరీంనగర్ భవననిర్మాణ కార్మికులేననే విషయాన్ని దాచిపెట్టగలమా? అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కార్మికులు అండమాన్ దీవుల్లో, బెంగాల్, ఒడిశాలలో అనేక నిర్మాణ కార్యక్రమాల్లో నిర్వహిస్తున్న పాత్రను విస్మరించగలమా? ఇటీవల హోటల్ రంగం చాలా అభివృద్ధి అయింది. ఈ ఉద్యోగుల్లో స్థానికుల శాతం దాదాపు శూన్యమనే చెప్పాలి. అదేవిధంగా గృహనిర్మాణ రంగం హైదరాబాద్లో ఒక ప్రధాన ఆర్థిక వనరు. దీనిలో కూడా స్థానికులు చాలా తక్కువ. అదేవిధంగా వడ్రంగి, బంగారు నగల తయారీ కూలీలూ, ఇంకా రకరకాల పనుల్లో స్థానికులు లేరు. మధ్య, చిన్న తరహా పరిశ్రమల్లో సైతం స్థానిక కార్మికులకు స్థానం లేదు. భారత దేశంలో కార్మికవర్గం ఈరోజు చెల్లాచెదురైంది. దాని విశ్వరూపాన్ని మనం కరోనా వ్యాప్తితో ప్రకటించిన లాక్డౌన్ లో చూశాం. ఇంతటి భయంకర పరిస్థితులు ఏర్పడడానికి పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య వర్గాల దోపిడీ, ప్రభుత్వాల నేరపూరిత నిర్లక్ష్యం కారణాలు. వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి కార్మికులను తెచ్చుకోవడం వెనుక ఒక నయా దోపిడీ విధానం ఉన్నది. స్థానికేతరులు కావడం వల్ల అక్కడే పడి ఉంటారు. వారితో కావాల్సినన్ని గంటలు గొడ్డుచాకిరీ చేయించు కోవచ్చు. రెండవది, కనీస వేతనాలు అమలు చేయాల్సిన పని ఉండదు. వాళ్లకు అందిస్తున్న ఆహారం, వసతి కూడా చాలా ఘోరంగా ఉంటుంది. దానికి డబ్బులు మినహాయించుకోవచ్చు. అంతే కాకుండా, అన్నింటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే, ఈ వలసకార్మికులకు నోరుండదు. కిమ్మనకుండా చెప్పింది చెప్పినట్టు వింటారు. ఇది ఒకరకంగా బ్రిటిష్వారు అమలుచేసిన బానిస విధానానికి నయాచిత్రం. లేబర్ క్యాంపుల్లో వంద మందికి ఒకటి రెండు టాయ్లెట్స్, బాత్రూంలు, పది అడుగుల గదిలో పదిమందిని కుక్కి, నాసిరకం తిండి పెట్టి, హింసతోకూడిన దోపిడీని అమలుచేయడానికి వలస కార్మికులను తెస్తున్నారు. అంతేకానీ స్థానికంగా నైపుణ్యం లేకకాదు. ఒకవేళ నైపుణ్యం అంతగా లేదనుకుంటే శిక్షణ ఇవ్వడం పెద్ద సమస్య కాదు. కానీ ఆ పనిచేయరు. ఎందుకంటే ఇది నయా బానిసత్వం. అంతేకాకుండా ఈ విధానం మీద ఒక మాఫియా నెట్వర్క్ ఉన్నది. కంపెనీలు, సంస్థలు, వ్యాపార వాణిజ్య సముదాయాలు తాము నేరుగా ఈ కార్మికులను తెప్పించుకోవడానికి మ్యాన్పవర్ సప్లయ్ సంస్థలు వెలిశాయి. వీళ్ళ సబ్కాంట్రాక్టులు తీసుకొని కంపెనీలకు సప్లయ్ చేస్తుంటారు. ఈ సబ్కాంట్రాక్టర్లు ముందుగా కార్మికులకు అడ్వాన్స్ ఇచ్చి, వారి బానిసత్వానికి ముందుగానే ఖరీదు కట్టేస్తారు. ఆ డబ్బుని కార్మికులు తమ ఇంట్లో ఇస్తారు. ఇక్కడికొచ్చాక ఏదైనా ఆరోగ్యం బాగోకపోయినా, కంపెనీలు పట్టించుకోవు. ఒక వేళ అర్ధంతరంగా వెళ్లిపోతే అడ్వాన్స్ తిరిగి చెల్లించాల్సి ఉంటుందనే భయం వెంటాడుతుంది. దాంతో కార్మికులు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా పనుల్లోకి వెళ్తారు. ప్రతినెలా భార్యాపిల్లలకు, తల్లిదండ్రులకు పంపాల్సిన డబ్బులు మాత్రమే కార్మికులకు కనపడతాయి. ఇటీవల వలస కార్మికుల జీవన పరిస్థితులపై, వాళ్ళ కుటుంబ జీవితాలపైనా జరిగిన సర్వేలు భయంకరమైన నిజాలను బయటపెట్టాయి. ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. భార్యా, భర్తలు దూరంగా ఉండడం వల్ల ఎన్నో కాపురాలు విడిపోయాయి. ‘ఫుట్లూజ్’ లేబర్గా మారిన మట్టిమనుషుల బానిస బతుకులు ఒట్టికాళ్ళతో సొంతూళ్ళ బాటపట్టాయి. వేలకిలోమీటర్లు నడిచి నడిచి, దారి మధ్యలోనే ప్రాణాలు కోల్పోయిన వారు కోల్పోగా మిగిలిన వారు అష్టకష్టాలు పడి జీవచ్ఛవాలుగా ఇళ్లకు చేరుతున్నారు. ఇలా ఇళ్లకు చేరినవాళ్లలో అనారోగ్యం బారిన పడి మరణిస్తున్న వారి లెక్కలు ఎవ్వరికీ తెలియదు. తెలుసుకోవాలన్న ప్రయత్నమూ చేయరు. ఈ పరిస్థితి కల్పించింది వ్యాపార, వాణిజ్య వర్గాలు మాత్రమే కాదు. చట్టాలు శాసనాలు చేసి, అమలు చేయాల్సిన ప్రభుత్వాలు కూడా చూసీచూడనట్టు దుర్మార్గమైన విధానాన్ని ప్రోత్సహించాయి. దాదాపు 20 కోట్ల మంది వలసకార్మికులు భారతదేశం రోడ్ల మీదికొస్తేగానీ దాని నిజస్వరూపం మనకు అర్థం కాలేదు. ఇప్పటికైనా ఈ వ్యవస్థ దుర్మార్గానికి స్వస్తి చెప్పి, గౌరవప్రదమైన జీవితాన్ని సాగించే వ్యవస్థను ఏర్పర్చడానికి కృషి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
ముంగిళ్లను ముద్దాడిన వైద్యం
‘‘బౌద్ధం ఒక మతం కాదు. అది ఒక సాధారణ జీవన విధానం మాత్రమే కాదు. అది ఒక నాగరికత. సమాజాన్ని మానవ పురోభివృద్ధివైపు నడిపించి, గతాన్ని సమూలంగా మార్చివేసే వ్యవస్థలను సృష్టించడం నాగరికత. అటువంటి చారిత్రక కర్తవ్యాన్ని బౌద్ధం స్వీకరించి, అమలు చేసి విజయం సాధించింది. అందువల్ల బౌద్ధం ఒక మత వ్యవస్థ కాదు. అది ఒక సంపూర్ణ విప్ల వాన్ని సాధించింది. అందువల్ల ఆ బౌద్ధాన్ని ప్రపంచానికి అందించిన గౌతముడు ఒక సామాజిక విప్లవకారుడు’’ బ్రిటిష్ చరిత్రకారుడు ట్రెవర్ లింగ్ బౌద్ధాన్ని నిర్వచించిన విధానమిది. ‘‘ది బుద్ధ’’అనే పుస్తకంలో ఈ విషయాలను వెల్లడించారు. అంతేకాకుండా, ఈ పుస్తకా నికి సబ్ టైటిల్గా ‘‘ది సోషల్ రెవల్యూషనరీ పొటెన్షియల్ ఆఫ్ బుద్ధిజం’’ అని చేర్చి తన అధ్యయనాన్ని ఆ దిశలో కొనసాగించారు. ట్రెవర్ లింగ్ రాసిన ఈ పుస్తకం, ఆయన చేసిన అధ్యయనం బౌద్ధం పైన ఒక సమగ్ర అవగాహనను అందిస్తుంది. నిజానికి ట్రెవర్ లింగ్ పేర్కొన్న విధంగానే బౌద్ధం ఆనాటి మానవ జీవితంలోని అన్ని రంగాలను సమూలంగా మార్చివేసింది. రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, వైద్య, విద్యారంగాల్లో మానవ జాతి గమనాన్ని ఎన్నెన్నో మార్పులకు గురిచేసింది. మరెన్నో మలుపులు తిప్పింది. రాజకీయ రంగంలో ఆనాటి రాజ్యాల పనితీరుని పునర్నిర్వచించింది. రాజు అంటే సేవకుడనీ, ప్రజాక్షేమమే పాలన అర్థమనీ, ప్రజాసంక్షేమమే పరమావధిగా భావించే అధికార యంత్రాంగాన్ని నిర్మించాలని బౌద్ధం ప్రతిపాదించింది. ప్రజల అభి ప్రాయాలకు, మనోభావాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రజలే కేంద్రంగా అభివృద్ధి జరగాలని బౌద్ధం ప్రతిపాదించింది. రాజు యజ్ఞ, యాగా లతో ప్రజల సొమ్మును బూడిదపాలు చేయకూడదనీ, ప్రజల్లో హేతు వాద భావాలను నింపాలని కూడా బౌద్ధం బోధించింది. ఆనాడే అభివృద్ధి చెందుతోన్న వ్యవసాయానికి యజ్ఞ, యాగాల పేరుతో జరు గుతున్న జంతు బలులు తీవ్ర అవరోధంగా ఉన్న విషయాన్ని బౌద్ధం బయటపెట్టింది. తద్వారా పరిపాలన వ్యవస్థలో ప్రగతిశీల మార్పు లకు బౌద్ధం పునాదులు వేసింది. సామ్రాట్ అశోకుడు, కనిష్కుడు, శ్రీహర్షుడు లాంటి వాళ్ళ పాలన బుద్ధుడి బోధనలకు కార్యరూపాన్ని చ్చింది. బుద్ధుడు కలగన్న ప్రజారంజక పాలనకు నిలువుటద్దంలా నిలిచింది. అదేవిధంగా అప్పుడప్పుడే పుంజుకుంటున్న వృత్తులను ప్రోత్సహించి, వ్యాపార వాణిజ్య రంగాలకు అడ్డంకిగా ఉన్న ఛాందస భావాలను తోసిరాజన్నది మొట్టమొదట బౌద్ధమే. సరిగ్గా ఇదే వర్ణ వ్యవస్థను తిరస్కరించి, ప్రజలందరూ సమానమనే ఒక సమతాభావ నను పాదుకొల్పింది. వీటన్నింటితో పాటు, ప్రజల జీవితంలో అనునిత్యం భాగమైన, అత్యంత కీలకమైన వైద్యం కూడా ప్రజల ముంగిళ్ళను ముద్దాడింది బుద్ధుడి కాలంలోనే. అప్పటివరకు విడివిడిగా ప్రజలు తమకు తాముగా అనుసరిస్తున్న వైద్య వి«ధానం సమాజపరమైంది బౌద్ధం ఫలితంగానే. ముఖ్యంగా సాంప్రదాయక వైద్య విధానమైన ఆయుర్వే దానికి ఒక నిర్మాణాత్మక రూపమిచ్చి వైద్యం ప్రజాసేవలో ప్రధాన భాగమని గుర్తించి అమలు చేసిన ఘనత బౌద్ధానిదేననడంలో సందే హం లేదు. వైద్య విధానాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో క్రోడీకరించిన ఘనత ముమ్మాటికీ బౌద్ధానిదే. అప్పటి వరకు ఏదైనా జబ్బులు వస్తే, కొన్ని ఔషధాలు మాత్రమే ఉండేవి. అంతేకాకుండా దేవతలను పూజిస్తే అన్ని రోగాలు మాయమవుతాయనే అశాస్త్రీయ భావనలు రాజ్యమేలుతున్న కాలంలో బౌద్ధం తన శాస్త్రీయ వైద్యవిధానానికి శ్రీకారం చుట్టింది. బౌద్ధం ప్రధానంగా ఆరోగ్యాన్ని కేవలం శారీరక రుగ్మతగా చూడలేదు. మనస్సు, శరీరం, పరిసరాలు అన్ని కూడా స్వచ్ఛంగా ఉన్నప్పుడే ఆరోగ్యం సరిగ్గా ఉంటుందని బుద్ధుడు భావించి దాన్నే బోధించాడు. దానిని ఆయన బౌద్ధ బిక్కులకు బోధిం చిన వినయపిటకంలోని ఆరవ అధ్యాయంలో భైషజ్య స్కందంలో మనం చూడవచ్చు. ప్రజల ఆరోగ్యానికి సూచనలతో పాటు, వైద్యాన్ని చాలా శాస్త్రీయంగా నిర్ధారించి, నిర్వచించారు. నిజానికి ఔషధాలను ప్రత్యేకంగా సూచిస్తూనే, ఆహారాన్ని సైతం ఔష«ధంగా చూడాలని చెబుతూనే వాటిని కొన్ని విధాలుగా విభజించారు. అందులో నెయ్యి, వెన్న, తేనె, నూనె, చక్కెరను బౌద్ధం ఆహారంగా చూడలేదు. వాటిని ఔషధాలుగా సూచించింది. జంతువుల కొవ్వును సైతం మరో ఔషదంగా బౌద్ధం పేర్కొన్నది. ముఖ్యంగా మూలికలను మంచి ఔషధా లుగా తేల్చింది. అందులో పసుపు, అల్లం, వస, తెల్లవస, అతివసలను శరీరంలో ఉన్న దోషాలను తొలగించే మహాద్భుత ఔషధాలని స్పష్టంగా పేర్కొన్నది. అదేవిధంగా కషాయాలు, ఆకులు కూడా ఔషధాలుగా భావించింది. వేపాకులు, కొడిశె ఆకులు, తులసి ఆకులు, పత్తి ఆకులు, పొట్ల ఆకులు కూడా రోగ నిర్మూలనకు పనికి వస్తాయని నిరూపించింది. ఇలా ఆ అ«ధ్యాయం నిండా మనకు వైద్య విధానం, ఔషధ వినియోగం అన్నింటినీ పొందుపరిచారు. బుద్ధుడి కాలంలోనే జీవకుడు అనే వైద్యుడు ఆనాటి ఆధునిక వైద్య విధానాభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. జీవకుడు మగధరాజు బింబిసారుడి ఆస్థాన వైద్యుడిగా మాత్రమే కాకుండా, గౌతమ బుద్ధుని అధికారిక వైద్యుడిగా ఉంటూ బౌద్ధం వ్యాప్తికి కృషి చేశాడు. వీటన్నింటితో పాటు ఆయుర్వేద వైద్యానికి అక్షర రూపమిచ్చిన మరో ఇద్దరు వైద్య పితామహులు మన చరిత్రలో ఉన్నారు. వారిలో ఒకరు చరకుడు, రెండోవాడు సుశ్రుతుడు. మనకు ఇప్పటి వరకు అందు బాటులో ఉన్న భారత ప్రాచీన వైద్య గ్రంథం చరక సంహిత. చరక సంహిత వినయ పిటకంలోని ఎన్నో అంశాలను తనలో పొందుపరుచు కున్నది. చరకుడు కూడా బౌద్ధ చక్రవర్తి కనిష్కుడి రాజ వైద్యుడు. అతడుæ నిత్యం సంచారిగా ఉంటూ ఉండేవాడని, ఎక్కడా నిలకడగా ఉండ కుండా నిత్యం ప్రజల్లో సంచరిస్తూ వైద్యాన్ని అందించాడని చరిత్ర కారులు చెబుతున్నారు. ఆ తర్వాత వచ్చే సుశ్రుతుడు, ఆయన తద నంతరం ఆయుర్వేదాన్ని అభివృద్ధి పరిచిన వాగ్బాటులు కూడా బౌద్ధ అనుయాయులేనని చరిత్రకారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న కరోనా లాంటి మహావిపత్తులు చరిత్రలో ఎన్నో. వాటిని ఎదుర్కొని ప్రజలను రక్షించిన ఉదాహరణలు బౌద్ధ చరిత్రలో కోకొల్లలు. క్రీస్తు శకం ఒకటవ శతాబ్దంలో తమిళ నాడులో జరిగిన ఒక సంఘటన మనకు బౌద్ధంలో ఇమిడిఉన్న ఉన్నతమైన మానవతా విలువలను పట్టిచూపుతుంది. తమిళనాడు లోని నాగపట్నం ప్రాంతంలో అంబిగామయి అనే బిక్కుని బౌద్ధ ప్రచారం చేస్తుండేది. ఆమె నిత్యం వేపచెట్టుకింద కూర్చుని ధ్యానం చేస్తుండేది. త్రిపిటకాలలో ఆమె పరిపూర్ణ జ్ఞానాన్ని సంపాదించింది. అందువల్ల ఆమె పట్ల ప్రజలకు గౌరవం ఉండేది. ఆ సమయంలో నాగ పట్నంలో వర్షాలు లేక కరువు వచ్చింది. వాటివలన అంటురోగాలు ప్రబలాయి. వందలాది మంది మనుషులు ప్రాణాలు కోల్పోయారు. వేలాది పశువులు చనిపోయాయి. ఆ సమయంలో ఆమె నాగపట్నం వెళ్ళి ‘‘మీరంతా ఆరోగ్యంగా ఉండాలంటే మీ మనస్సును, మీ ఇల్లును, ఊరునీ శుభ్రంగా ఉంచుకోవాలి.’’ అని చెప్పింది. గుగ్గిలం, మైసాచి, సాంభ్రాణి పొగలు వేయాలని, ప్రతి ఇంటికీ వేపాకు తోర ణాలు కట్టాలని వివరించింది. మనసు, దేహం, దేశం శుద్ధి చేసు కోవాలని చెప్పిన విషయమే తిరుమంత్రమైంది. పసుపు, కుంకుమ రాసుకోవాలని, ఇల్లును ఎర్ర మట్టితో అలకాలనీ, వాకిళ్ళలో అలుకు చల్లాలని, సుద్ద ముక్కతో ముగ్గులు పెట్టాలని, పసుపు, కుంకుమలను గడపలకు రాయాలని సూచించింది. ఈ సూచనలే కాకుండా, రోగు లకు చిరుధాన్యాలతో చేసిన అంబలి ఇవ్వాలని కూడా ప్రజలను ఆదేశించింది. దీనితో రోగాలు తగ్గుముఖం పట్టాయి. ఈ విషయాన్ని తమిళ పింగళి నిఘంటువు, జీవగ చింతామణి పుస్తకాలలో ఉన్నట్టు తమిళనాడు దళిత తాత్వికుడు ఆయోతీదాసు తన రచనల్లో పేర్కొన్నారు. అయితే బౌద్ధం సాంప్రదాయాల నుంచి కొన్ని విషయాలను తీసుకొని అభివృద్ధి చేసిన వైద్యం గుప్తుల కాలం వరకు కొనసాగింది. అయితే అక్కడ కూడా మేధోరంగంలో వచ్చిన బ్రాహ్మణాధిపత్యం వైద్యాన్ని కొన్ని కులాలకే పరిమితం చేసింది. అందుకే ఆ తర్వాత ఆయుర్వేదం పుస్తకాలకే పరిమితమై తన ప్రాధాన్యతను కోల్పో యింది. కింది కులాల ప్రజలు తమ సొంత వైద్యాన్ని సృష్టించుకొని జీవించారు. కానీ ఆయుర్వేద ఫలితాలను అందుకోలేకపోయారు. అందుకే ఈ రోజుకీ కూడా ఆయుర్వేదం అభివృద్ధి చెందకపోవడానికి కారణం కొందరి చేతుల్లో బందీ అవడం, వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా పరిశోధనలు జరగని పరిస్థితిలో ఉండడమే. కాగా, ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన అల్లోపతి వైద్యం కార్పొరేట్ చేతుల్లో చిక్కి, ప్రజలందరికీ కాకుండా, సంపన్నులకే ఫలితాలను ఇస్తున్నది. నిజానికి వైద్యం పుట్టింది సేవలో.. దానిని బౌద్ధం ఆచరించి చూపింది. అప్పుడు వర్ణ, కుల వ్యవస్థ, ఈ రోజు వర్గ, కుల వ్యవస్థలు వైద్యాన్ని సేవాభావం నుంచి మరల్చి లాభార్జనే లక్ష్యంగా మార్చివేశాయి. ప్రభుత్వాల ప్ర«థమ ప్రాధాన్యంగా ఉండా ల్సిన ఆరోగ్యం గాలిలో దీపంలా మారింది. డబ్బున్నవాడికే వైద్యం అందుతోంది. పేదవాడి కోపమే కాదు, నిరుపేదలకు అనారోగ్యం కూడా శాపంగా మారింది. ఆనాడు మలేరియా అయినా, ఈనాటి కరోనా అయినా మురికి కూపాలుగా మారిన పేదల జీవితాల్లో పెద్దగా మార్పులేదు. క్వారం టైన్, లాక్డౌన్ లాంటి పెద్ద పెద్ద పదాలు వారికర్థం కావు. వారికర్థ మయ్యేదల్లా వారి తాతముత్తాతల కథల్లో, గా«థల్లో మిళితమైన వైద్యం, బౌద్ధం విప్పిచెప్పిన ఔషధ రహస్యం ప్రకృతిజీవనం. ఆ ప్రకృతినుంచి పుట్టిన పసుపు, వేప, తులసి లాంటి సహజ ఔషధతత్వాన్ని తిరిగి మన జీవితాల్లోకి ఆహ్వానిద్దాం. బౌద్ధం చూపిన మార్గాన్ని అను సరిద్దాం. వైద్యానికి అర్థం పరమార్థం సేవాభావమనే బుద్ధుడి నానుడిని ప్రచారం చేద్దాం. (నేడు బుద్ధ పౌర్ణమి) మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
సార్వత్రిక వైద్యసేవలే విరుగుడు
మనిషికి శారీరక శక్తి ఎలాగో, సమాజానికి ఒక శక్తి అవసరం. ఆ సామాజిక సమైక్య శక్తి లోపమే ఈ రోజు సామూహిక భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. కరోనాతో అగ్రరాజ్యమైన అమెరికా తల్లడిల్లిపోతుంటే ప్రపంచ చిత్రపటంలో అతి చిన్న దేశమైన క్యూబా మాత్రం అమెరికా పక్కనే ఉండి కూడా తట్టుకొని నిలబడింది. ఉత్పత్తితో ముడిపడి ఉన్న లాభంకన్నా ప్రజలందరికీ ఆరోగ్య సేవలు ఉచితంగా అందుబాటులో ఉండేలా చూడటం తన బాధ్యతగా క్యూబా ప్రభుత్వం చేపట్టి గత కొన్ని దశాబ్దాలుగా అద్భుతాలు చేస్తోంది. క్యూబాలాగా ఆలోచించే అవకాశం తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉంది. వైద్య రంగం మీద శ్రద్ధ పెడుతున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ క్యూబా లాంటి ఒక కార్యాచరణ పథకం ఆలోచిస్తే దేశానికే మార్గదర్శకంగా నిలుస్తారనడంలో సందేహం లేదు. ఒక అరవై ఏళ్ల ముసలి తల్లి గత పది సంవత్సరాలుగా కోల్కతాలోని ఒక వీధిలో నడవలేని స్థితిలో వీల్ చెయిర్లో కూర్చుని, అక్కడ పనిచేసే రిక్షా కార్మికులు, ఇతర పనివాళ్లు వేసే డబ్బులతో, ఎవరైనా తినగా మిగిలిన తిండి పెడితే తిని జీవనం కొనసాగిస్తోంది. కానీ ఒక్కసారిగా ఆమె నెత్తిన పిడుగుపడినట్టు, ఈ ప్రపంచం మొత్తాన్ని కారుచీకటి ఆవహిం చినట్టు రోజూ తనకై మహమ్మారి కరోనా ఆ వృద్ధురాలు నివసించే వీధినీ నిర్మానుష్యంగా మార్చేసింది. లాక్డౌన్ కారణంగా ఆ వృద్ధు రాలు సైతం ఇప్పుడు అక్కడ ఎవరికీ కనిపించడం లేదు. ఎక్కడి కెళ్లిందో తెలియదు. కూలీ చేసుకునే వ్యక్తి ఉన్న ఉపాధి కోల్పోయి, వందలమైళ్ల దూరంలోని సొంతూరు చేరుకునేందుకు రవాణా సదు పాయం లేక కాలినడకన పయనమయ్యాడు. ఒంటరిగా కాదు, నడవ లేని తన తల్లిని చక్రాల బండిలో కూర్చోబెట్టుకుని రోజుకి పాతిక కిలో మీటర్ల దూరం తోసుకుంటూ 600 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఉత్తర భారతంలోని ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలను వెంట బెట్టుకుని వందల మైళ్లు నడుస్తూ వెళుతుంటే పసిబిడ్డలు నడవలేక నడవలేక కుంటుతూ ఎక్కడికెళుతున్నామో, ఎందుకెళుతున్నామో తెలియక ఏడు స్తూనే అమ్మని అనుసరిస్తోన్న హృదయవిదారక వీడియో అంతా చూసే ఉంటారు. ఇవి కొన్ని మాత్రమే. ఇలాంటి కోట్లాదిమంది కూలీ నాలీ బతుకులు చెల్లాచెదురైపోయాయి. కరోనాని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలకు లాక్డౌన్ తప్ప మరో మార్గం లేదు. దీనిని ఎవరైనా సమర్థించాల్సిందే. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ప్రస్తుతం ప్రభుత్వాధినేతలను, రాజకీయ పార్టీ లను విమర్శించాల్సిన సమయం కాదు. జాతి మొత్తం కలిసి కట్టుగా మహమ్మారి కరోనాను ఎదుర్కోవడానికి సంసిద్ధం కావాలి. అందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రజలు కూడా సహకరిస్తు న్నారు. అయితే కరోనా తెచ్చిన ఈ ఘోర సంకటం ప్రస్తుతం కొన్ని సమస్యలను మనముందు పెట్టింది. వాటిని మనం ఇప్పటికే అధిగ మించి ఉన్నట్లయితే, ఈరోజు జాతి ఇంతగా కలవర పడాల్సి ఉండేది కాదు. గుండెధైర్యంతో కరోనాను ఎదుర్కోగలిగే వాళ్లం. కానీ, ప్రస్తుతం ఇప్పుడు దేశం ఆ స్థితిలో లేదు. మనిషికి రోగ నిరోధక శక్తి కోసం మనం మాట్లాడుతున్నాం. కానీ, మనిషి సంఘజీవి. వేలాదిమంది, కోట్లాదిమంది కలిస్తే అది ఒక సమాజం. అది ఒక దేశం. ఈరోజు మనిషికి రోగ నిరోధక శక్తి కావాల్సి నట్టే సమాజానికి కూడా రోగ నిరోధక శక్తి కావాలి. సమాజానికి కావాల్సింది శారీరక రోగ నిరోధక శక్తి కాదు. సమాజం ఏ విపత్తుల నైనా, ప్రమాదాలనైనా ఎదుర్కోవడానికి కావాల్సిన సామాజిక శక్తి కావాలి. అది ఇప్పుడు మన దేశానికి లేదు. ఆ సామాజిక సమైక్య శక్తి లోపమే ఈరోజు ప్రభుత్వాల్లో, ప్రజల్లో సామూహిక భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. కరోనా నుంచి బయటపడిన తర్వాత ఒక సమగ్రమైన, దీర్ఘకాలికమైన దేశ ప్రగతి ప్రణాళిక అవసరం. అందులో మొదటిది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన ఆరోగ్య వ్యవస్థ. ఈ రోజు వైద్య ఆరోగ్య రంగంలో ప్రపంచానికే తలమానికంగా నిలుస్తున్న దేశం క్యూబా. క్యూబా సోషలిస్టు దేశంగా అవతరించిన నాటినుంచే ఒక సమగ్రమైన ఆరోగ్య విధానాన్ని అమలు చేయడానికి పూను కున్నది. ‘ఆరోగ్యం కూడా మానవ హక్కులలో భాగమే. ఉత్ప త్తితో ముడిపడి ఉన్న లాభంకన్నా క్యూబా ప్రజలందరికీ ఆరోగ్య సేవలు ఉచితంగా అందుబాటులో ఉండేలా చూడటం ప్రభుత్వ బాధ్యత’ అని 1959లోనే రాసుకున్న రాజ్యాంగంలో పేర్కొన్నారు. గ్రామ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా అన్నిచోట్లా, పర్వత ప్రాంతాల్లో కూడా వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. వందలాదిమంది డాక్టర్లను పర్వత ప్రాంతాలకు, తీర ప్రాంతాలకు పంపించారు. విప్లవం విజ యవంతం అయిన ఐదారేళ్లలోనే ఈ విజయాన్ని సాధించారు. ఆరో గ్యాన్ని, వ్యక్తి గత సమస్యగా కాక ప్రజలందరి సమష్టి అవసరంగా ప్రభుత్వం భావించింది. దీని ఫలితంగా నిర్దిష్ట మైన ప్రాంతానికి, జనా భాకు ఒక డాక్టర్ను నియమించింది. ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థకు రూప కల్పన చేసింది. మొదటి దానిని లావ్టా పట్టణంలో ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టి, తదనంతరం క్యూబా అంతటికీ విస్తరింపజేశారు. ప్రతి 150 కుటుంబాలకు ఒక ఫ్యామిలీ డాక్టర్, ఒక నర్స్ని నియమించారు. దానిని డాక్టర్స్–నర్స్ పథకంగా పిలుస్తారు. రోగాలు వస్తే వైద్యం చేయడం మాత్రమే వీరి బాధ్యత కాదు. ప్రజలు రోగాల బారిన పడకుండా నివారణ చర్యలు చేపట్టేలా వారు ప్రజలను చైతన్య వంతం చేశారు. ఈ నూటయాభై కుటుంబాల వివరాలు వీరివద్ద ఉంటాయి. వీరిలో ఎవరికైనా ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే అవస రమైన చికిత్స అందిస్తారు. ఒకవేళ ఇంకా అదనంగా వైద్యం కావాల్సి వస్తే వారికి ఇంకా మెరుగైన సౌకర్యాలు ఉన్న పాలీ క్లినిక్కు వాళ్లే తీసు కెళతారు. ఈ విధానంలో ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వ నిర్మాణా త్మక బాధ్యత కోసం లాటిన్ అమెరికా మెడికల్ స్కూల్స్ స్థాపించి దాదాపు 72 దేశాలకు చెందిన 30 వేల మందికి పైగా డాక్టర్లను అందిం చింది. ఇందుకుగానూ క్యూబా బడ్జెట్లో భారీ కేటాయింపులను చేస్తు న్నది. ఆ దేశ జీడీపీలో ఆరోగ్యానికి 10.57 శాతం నిధులను కేటాయి స్తుందంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇటీవల కరోనాతో పొరుగుదేశం అగ్ర రాజ్యమైన అమెరికా తల్లడిల్లిపోతుంటే ప్రపంచ చిత్రపటంలో అతి చిన్న దేశమైన క్యూబా మాత్రం తట్టుకొని నిలబడింది. ఇప్పటివరకు 320 కరోనా కేసులు నమోదైతే అందులో 15 మంది కోలుకున్నారు. 8 మంది మాత్రమే మరణించారు. అంతేగాకుండా ఇరాన్, ఇటలీ లాంటి దేశాలకు వందలాది మంది డాక్టర్లను క్యూబా పంపగలిగింది. ఇది ఒక నమూనా మాత్రమే. మన పరిస్థితి ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. అది చిన్న దేశం కాబట్టి అట్లా చేయగలిగిందంటూ తప్పించుకునే ధోరణి మనకు అలవాటు. కానీ మన రాష్ట్రాలు కూడా చిన్నవే. వైద్యంలో రాష్ట్రాలు ఎంతైనా చేయవచ్చు. దానికి ఏ అడ్డంకులూ ఉండవు. వైద్య కళాశాలల అనుమతి లాంటి సమస్యలు ఉన్నా, వాటిని అధిగమించడానికి మార్గాలుంటాయి. ఏపీ, తెలంగాణ సీఎంలు కనుక క్యూబా లాంటి ఒక కార్యాచరణ పథకం ఆలోచిస్తే దేశానికే మార్గదర్శకంగా నిలుస్తా రనడంలో సందేహం లేదు. లాక్డౌన్ తర్వాత మనం ఎదుర్కొన్న మరొక ముఖ్యమైన సమస్య ఉపాధి లేని వారికి ఆహారం సమస్య. వలస కూలీలకు నివాస సమస్య. ఉపాధి సమస్య. ఇది చాలా ముఖ్యమైన సవాల్. మన దేశంలో మూడు కోట్లమంది వలస కార్మికులున్నారు. లాక్డౌన్ తర్వాత వీరంతా నెత్తిమీద తట్టాబుట్టా పెట్టుకొని పారిపోవాల్సి వచ్చింది. దీనితో సోషల్ డిస్టెన్స్ అనే నినాదం బుట్టదాఖలైంది. వేలాదిమంది ఒకే దగ్గర గుమికూడి, రవాణా సౌకర్యాలు లేక రోడ్ల మీద చీమల పుట్టల్లా కుప్పలు కుప్పలుగా జనం నిండిపోతే ఇక సోషల్ డిస్టెన్స్కి అర్థం పరమార్థం ఏమిటో నాకర్థం కాలేదు. ఇన్ని కోట్లమంది ప్రజలు వలస పోవడానికి గ్రామాల్లో ఉపాధి కరువైపోవడమే కారణం. నగరీకరణ ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. పనులు వెతుక్కుంటూ ప్రతి ఒక్కరూ నగరాలకు బయలుదేరారు. గత ఇరవై ఏళ్లలో ప్రతి నగరం, పట్టణ జనాభా రెండింతలు, మూడింతలు అయ్యాయి. అభి వృద్ధిగానీ, విద్య, వైద్య సౌకర్యంగానీ ఒకే దగ్గర కేంద్రీకృతం కావ డంవల్ల నగరాలు జన సముద్రాలుగా తయారయ్యాయి. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెంచడానికి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంతోపాటు, వ్యవసాయాధారిత పరిశ్రమ లను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నోసార్లు మాట్లాడారు. అదే విధంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైతే పట్టణీకరణ పెరిగి భారంగా మారిందో, అక్కడ ఇకమీదట భవన నిర్మాణాలకు అనుమతిని ఇవ్వకూడదు. అదే విధంగా ప్రజలను వలసలు కాకుండా ఉన్న ఊళ్లో కనీసం కాలినడకన చేరుకునే దూరంలో ఉండే విధంగా పనులు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ప్రభుత్వం బడ్జెట్ను మించిన ధనం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పోగుపడి ఉంది. అభివృద్ధిని వికేంద్రీ కరించేసి అన్ని రకాల ఉత్పత్తులకు సంబం ధించిన పరిశ్రమలు స్థాపించడానికి పారిశ్రామికవేత్తలు, వ్యాపార స్తులు ముందుకు రావాలి. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో వనరులకు తగ్గట్టుగా పరిశ్రమలు పెడితే, వారికి లాభాలకు లాభాలూ వస్తాయి. స్థానిక యువతకు ఉపాధి దొరుకుతుంది. కరోనా కల్లోలం ముగిసిన అనంతరమైనా ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలు భారతదేశ ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలైన విద్య, ఉపాధి, ఉద్యోగం, ఆర్థిక స్వయం సమృద్ధి వంటి అంశాలను చాలా ముఖ్యమైనవిగా భావించాలని ఆశిద్దాం. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
ఈ సంఘర్షణ ఇంకెంతకాలం?
భారతదేశంపై దండయాత్రలు చేసి, ఆక్రమించుకున్న ముస్లిం పాలకుల మీద ప్రజల్లో ఉన్న ద్వేష భావాన్ని ప్రస్తుతం ఇక్కడ ఉన్న ముస్లింల మీదికి మళ్లించడం హానికరం. దేశంలో ఉన్న కులాల అంతరాలను ప్రశ్నించకుండా కృత్రిమ ఐక్యతను ప్రదర్శించడం నిష్ప్రయోజనకరం. ముందుగా మనం మన ఇల్లును, మన ప్రజలను ఏకం చేయడానికి పూనుకోకుండా విద్వేషాన్ని ముందుకు తీసుకొస్తే అది ప్రజల మధ్య వైరాలను పెంచే, ఒక ఎడతెగని సంఘర్షణకు దారితీస్తుంది. ‘‘దేశ్కో గద్దరోంకో గోలీమారో సాలోంకో’’ తెల్లని టీషర్టు, తలకు ఆరెంజ్ రిబ్బన్లతో నేటితరం, మనమంతా ఆశలు పెట్టుకున్న మన భావితరమైన యువ తరం ఓ ఉన్మాదావస్థలో పెట్టిన వెర్రికేకలవి. రెండు వారాలక్రితం ఢిల్లీలోని రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లో చేసిన ఈ విద్వేషపూరిత నినాదాల వీడియో సోషల్మీడియాలో హల్చల్ చేసింది. ఈశాన్య ఢిల్లీలో మతకలహాల పేరుతో జరిగిన మారణహోమం మిగిల్చిన విషాదం అంతం కాకముందే మళ్ళీ అదే ద్వేషం ఈ యువతరంలో కనిపించి, మనసున్న ప్రతివారినీ కలవరపరిచింది. గతంలో దేశ మంతా అనేక చోట్ల మతకలహాలు జరిగినప్పటికీ, ఢిల్లీలో మాత్రం ఇంతవరకు హిందూ ముస్లిం ఘర్షణలు లేవు. కానీ ఈసారి జరిగిన అమానుషమైన దాడులు ఢిల్లీ జనసహనాన్ని కూడా పరీక్షించాయి. ఈ విధ్వంసంలో 42 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 200 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. అనేక దుకాణాలు, ఇండ్లు, పాఠశా లలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఒక మసీదు కూడా ఈ విద్వే షాగ్ని జ్వాలలకు కాలిబూడిదైపోయిందని వార్తలొచ్చాయి. వారం రోజుల పాటు ఢిల్లీని ఒక ఉన్మాదంలోకి నడిపించినవారెవ్వరో? అసలా మారణహోమానికి బాధ్యులెవ్వరో తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఎందుకంటే ఏ ప్రాంతంలోనైతే దాడులు జరిగాయో, ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలెవ్వరూ అందులో భాగం కాలేదు. పైగా ఒక వర్గం వారిని మరొక వర్గం రక్షించేందుకు యత్నించారు. వీలున్న ప్రతి ఇంటా మతాతీతంగా ఆశ్రయం పొందారు. ఇరు వర్గాల వారు ఉమ్మ డిగా తమను తాము రక్షించుకోవడానికి పరస్పరం సహకరించు కున్నారు. ఒక సంఘటన కాదు. అనేకానేక సంఘటనలు ప్రజల మధ్య వైషమ్యాలు లేవన్న విషయాన్ని తేల్చి చెపుతున్నాయి. మానవ సంబంధాలు చెక్కుచెదర్లేదని రుజువుచేస్తున్నాయి. ఢిల్లీలో ఆ రాత్రి ఓ ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయిన వృద్ధమాతను రక్షించమని ఆమె బిడ్డలు అమెరికానుంచి ఫోన్చేస్తే, ప్రాణాలకు తెగించి ఆమెను రక్షించింది ఎవరో కాదు. ఒక ముస్లిం. అప్పటికే కుదిరిన ఓ హిందువు వివాహాన్ని ముస్లింలంతా అండగా ఉండి జరిపించిన ఘటన స్థానికుల మధ్య సత్సంబంధాలకు ప్రత్యక్ష సాక్ష్యం. మత సామరస్యానికి మంచి ఉదాహరణ. సీలంపూర్లోని ముస్లింలను కాపాడడానికి అక్కడి దళి తులు ఆ ప్రాంతంలోకి గూండాలు, రౌడీలు ఎవ్వరూ రాకుండా బ్యారి కేడ్లు కట్టి రక్షణగా నిలిచారు. రమేష్ పార్క్ ప్రాంతంలోని హిందు వులు, సిక్కులు ఆ ప్రాంతంలోని ముస్లిం సోదరుల దగ్గరికి వెళ్లి అండగా ఉండడం మరపురాని జ్ఞాపకం. మంజూపూర్ బజరంగబలి మొహల్లాలో బజరంగబలి దేవాలయంలో ముస్లింలకు ఆశ్రయం కల్పించిన హిందువులు తమ సోదరభావాన్ని చాటుకున్నారు. ఇవి మచ్చుకు మాత్రమే. ఇంకా ఎన్నో చోట్ల, ఎంతోమంది, మతాల కతీతంగా ఒకరికొకరు రక్షణగా ఉండి మానవత్వం ఇంకా మిగిలేవుం దని నిరూపించిన సందర్భాలెన్నో. లేకుంటే ఢిల్లీ మత ఘర్షణల్లో మర ణాల సంఖ్య మరింత పెరిగేదన్నది సత్యం. మన దేశంలో ఉన్న 20 కోట్ల మంది ముస్లింలు పరాయిదేశం వాళ్ళేననే ప్రచారం ముమ్మరంగా సాగుతున్నది. భారతదేశం మీద దండయాత్రలు చేసి, ఆక్రమించుకున్న ముస్లిం పాలకుల మీద ఉన్న వ్యతిరేకతను, కోపాన్నీ, ద్వేషభావాన్నీ ప్రస్తుతం ఇక్కడ ఉన్న ముస్లింల మీదికి మళ్లిస్తున్నారు. దానితో కొంత మంది రాజకీయ లబ్ధిని పొందాలని చూస్తున్నారు. మరికొంతమంది హిందూ మతంలో ఉన్న కులాల అంతరాలను ప్రశ్నించకుండా ముస్లిం బూచితో కృత్రిమ ఐక్యతను ప్రదర్శిస్తున్నారు. చరిత్ర క్రమాన్ని పరిశీలిస్తే, ప్రస్తుతం మన దేశంలోనూ మన ఇరుగు పొరుగున ఉన్న ముస్లింలు మన ఆత్మబం«ధువులేనన్నది సత్యం. భారతదేశంలోని ప్రజలు ఇస్లాంలోకి మారడం మహమ్మద్ ప్రవక్త పుట్టకముందు నుంచే అరబ్బు ప్రాంతంలో మొదలైందని చరిత్ర కారులు చెబుతున్నారు. క్రీస్తు పూర్వం నుంచే భారతదేశానికి అరబ్బు దేశాలతో వ్యాపార, వాణిజ్య సంబంధాలుండేవి. చరిత్రకు అందిన సమాచారం ప్రకారం, మొదటగా ఇస్లాంలోకి మారింది కేరళలోని మష్టిలా సామాజిక వర్గం. మలబార్ ప్రాంతంలో విరివిగా లభించే సుగంధ ద్రవ్యాలు, అంటే మసాలాల వ్యాపారం అరబ్బులను విపరీతంగా ఆకర్షించింది. మహమ్మద్ ప్రవక్త ఇస్లాంకు ఒక దశ, దిశను అందించిన తర్వాత కేరళలో కులవివక్షకు గురవుతున్న అంటరాని కులాలు ఇస్లాంలోకి మారాయి. అందుకే దేశంలో ఎస్సీల సగటు జనాభా 16 శాతం ఉంటే, కేరళలో ఎస్సీల జనాభా కేవలం 9 శాతంగా ఉంది. దానర్థం చాలా మంది ఇస్లాంలోకి, క్రైస్తవంలోకి మారిపో యారు. ఇంకా కర్ణాటక, బెంగాల్ వంటి పలుప్రాంతాల్లోనూ అంట రాని కులాల ప్రజలు అవమానాలనుంచి తప్పించుకోవడానికి ఇస్లాం లోకి మారారు. మన హైదరాబాద్లో 1921 నుంచి 1941 మధ్యలో కూడా వేలాది మంది అంటరాని వారు, ముఖ్యంగా మాలలు హైద రాబాద్లో ఇస్లాంను స్వీకరించినట్టు జనాభా లెక్కలు తెలియ జేస్తు న్నాయి. 1911లో 11,37,589 మంది ఉన్న మాలలు, మహర్లు 1931కి వచ్చేసరికి 10,76,539కి తగ్గిపోయారు. అంటే 61,050 సంఖ్య తక్కువైనట్టు లెక్కలు చెబుతున్నాయి. చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. దీనికన్నా ముందుగా ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించాలి. భారతదేశం అనే భావన నిజానికి ఆధునికమైంది. కానీ ఒకానొక కాలంలో ముఖ్యంగా మౌర్యుల కాలంలో ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ నుంచి బర్మా దాకా ఒక రాజ్యం కింద పాలన సాగింది. చక్రవర్తి అనే పదం అప్పుడే వచ్చింది. చంద్రగుప్త మౌర్యుని నుంచి అశోక చక్రవర్తి దాకా ఇది మరింత విస్తరించింది. ఈ రాజ్యంలో ప్రధానంగా బౌద్ధం, జైనం, వేదాలను అనుసరించే సనాతన ధర్మం ఉండేది. దానినే మనం ఇప్పుడు హిందూ మతం అంటున్నాం. అశోకుడి మనవడు బృహద్ర దుడిని చంపి, బ్రాహ్మణ రాజు పుష్యమిత్ర శుంగురుడు పాలన చేపట్టిన తర్వాత బౌద్ధం మీద దాడులు పెరిగాయి. క్రీ.శ.7వ శతాబ్దం తర్వాత మరింతగా బౌద్ధులను ఊచకోత కోశారు. సరిగ్గా ఇదే సమ యంలో ఇస్లాం దండయాత్రలు జరిగాయి. వాళ్ళు కూడా హిందూ దేవాలయాలతో పాటు, బౌద్ధారామాలను ధ్వంసం చేశారు. నలందా విశ్వవిద్యాలయం భస్మీపటలం అందులో భాగమే. ఒకవైపు హిందు వులు, రెండోవైపు ముస్లింల దాడులు బౌద్ధులను నిస్సహాయులను చేశాయి. ఆప్ఘనిస్తాన్, నేటి పాకిస్తాన్, బంగ్లాదేశ్లు ఆనాడు సంపూర్ణ బౌద్ధ దేశాలు. ముస్లింల దండయాత్రలకు, హిందువుల అవమానా లకు పరిష్కారంగా ఇస్లాంలోకి మారిపోయారు. వివక్షను పాటిస్తున్న, కులవ్యవస్థను అనుసరిస్తూన్న హిందూమతం కన్నా, అల్లా ముందు రాజూ పేదా సమానమనే భావనను ప్రచారం చేసిన ఇస్లాంలోకి బౌద్ధులు మారిపోయారు. బౌద్ధానికి ఇస్లాం దగ్గరగా ఉందని ఆనాడు బౌద్ధులు భావించారు. అందుకే ఆనాడు బౌద్ధ దేశా లన్నీ కాశ్మీర్తో సహా ఇస్లాం ప్రాంతాలుగా మారిపోయాయి. ఇంత వివరణ ఎందుకు అవసరమైందంటే ఇక్కడ ప్రస్తుతం ఉన్న ముస్లిం సోదరులందరూ, మన బౌద్ధులు, హిందువుల్లోని అంటరాని కులాలేనన్నది చెప్పడానికే. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను, హిందూ ధర్మాన్ని రక్షించడానికి అనే సాకుతో వీరంతా ముస్లింలుగా ముద్రపడి ఈ రోజు నీకు టెర్రరిస్టులుగా కనపడుతున్నారు. హిందూ మతం ఏనాడూ అక్కున చేర్చుకోకపోగా వేరే మతంలోకి వెళ్ళిన నీ మతస్తులపైనే పగతీర్చుకోవడం వివేకం అనిపించుకోదు. ఇస్లాంలోకి, క్రైస్తవంలోకి మారుతూండడానికి కారణాలు తెలుసుకోకుండా అందుకు కారణమైన కుల వ్యవస్థను నిర్మూలించకుండా, ఇతరులను నిందించినా, ద్వేషించినా ప్రయోజనం శూన్యమే. ఒకవేళ పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాగా హిందువులందర్నీ ముస్లింలలాగే మారుస్తున్నట్టు, మనం ముస్లింలను హిందువులుగా మార్చాలని చూస్తే ఎలా సాధ్య మవుతుంది? ఇస్లాం నుంచి హిందూ మతంలోకి వచ్చినవారిని ఏ కులంలో చేరుస్తాం. ఎందుకంటే హిందూమతమంటేనే కులాలు. ఇది ఒక సమూహం మాత్రమే కాదు. అనేక కులాల సంఘటన. ఇది ఐక్య సంఘటన కూడా కాదు. దేనికదే ఒక సంఘటన. ముందుగా మనం మన ఇల్లును, మన ప్రజలను ఏకం చేయడానికి మన దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటో చెప్పాలి. అప్పుడే ఏ మతమైనా, ఏ ధర్మమైనా రక్షిం పబడుతుంది. లేనట్లయితే ఇది ప్రజల మధ్య వైరాలను పెంచే, ఒక ఎడతెగని సంఘర్షణకు దారితీస్తుంది. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
పదోన్నతుల కోటాలోనూ అన్యాయమే!
భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం కానీ, వాటి అమలులో నిర్లక్ష్యం వహించడం కానీ చాలా తీవ్రమైన తప్పులుగా భావించాలి. ఉద్యోగాల్లో ప్రమోషన్ల అంశం ప్రాథమిక హక్కు కాదనీ, ఈ విషయంలో జోక్యం చేసుకోబోమంటూ వారం రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తిని పూర్తిగా విస్మరించిందనే చెప్పాలి. పైగా రిజర్వేషన్లు అనేవి కొన్ని వర్గాలను, కులాలను సంతృప్తిపరిచే చర్యగా చాలా మంది భావిస్తున్నారు. ఇదేరకమైన అభిప్రాయం న్యాయనిపుణులలో కూడా ఉండడం విచారకరం. ఇప్పుడు భారతదేశంలో ఎస్సీ, ఎస్టీలకు అమలు జరుగుతున్న విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు స్వాతంత్య్రం ముందునుంచే అమలులో ఉన్నాయి. తరతరాలుగా సమాజ వృద్ధిలో రక్తం, చెమటను ధారపోసిన దళితుల పట్ల ఇలాంటి తీర్పులను వెలువరించడం బాధాకరమైన విషయం. ‘మీరు ఇస్తున్న తీర్పుల పట్ల నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. మీరు ఇచ్చే తీర్పులను అంగీకరించవచ్చు. కానీ గౌరవించలేననే విషయాన్ని నేను చాలాసార్లు కరాఖండిగా చెప్పాను. అదే సమయంలో ప్రతి న్యాయవాదికీ అట్లా చెప్పే స్వేచ్ఛ ఉండాలని నేను విశ్వసిస్తున్నాను. సరిగ్గా అదే అభిప్రా యాన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపైన వ్యాఖ్యానించదల్చుకు న్నాను’ అంటూ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగానికి జరిగిన మొదటి సవరణపై 1951, మే 18వ తేదీన పార్లమెంటులో ప్రసం గిస్తున్న సందర్భంలో చేసిన వ్యాఖ్యలివి. అప్పటికి ఆయన కేంద్ర న్యాయశాఖా మంత్రిగా ఉన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం పునాదిగా ఏర్పర్చుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చి ఏడాది దాటక ముందే ఎస్సీ, ఎస్టీలకు అందిస్తున్న విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టులో దాఖలైన పిటిషన్పై హైకోర్టు, సుప్రీంకోర్టులు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పులిచ్చాయి. రిజర్వేషన్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 29ని ఉల్లంఘిస్తున్నాయని న్యాయస్థానాలు తీర్పులిచ్చాయి. అయితే అప్పటికే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టికల్ 15కు సవరణ చేయాలని భావించింది. ఆ సంద ర్భంలోనే బాబాసాహెబ్ అంబేడ్కర్ పైవిధంగా మాట్లాడారు. ఇది నేటి పరిస్థితులకు నూటికి నూరుపాళ్లూ వర్తిస్తుందని నా భావన. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన ప్రతీసారీ, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణలు చేయాల్సి వచ్చింది. అయితే వారం క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరింత ఆందోళనకరంగా ఉన్నది. ఎస్సీ,ఎస్టీల ఉద్యోగాలలో ప్రమోషన్ల విష యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోబోదనీ, అయితే ఉద్యోగాల్లో ప్రమోషన్ల అంశం అసలు ప్రాథమిక హక్కు కాదనీ, రాష్ట్ర ప్రభు త్వాలకు తాము ఆదేశాలివ్వలేమనీ, రాష్ట్రాలు తమకు తాముగా నిర్ణ యాలు తీసుకోవచ్చనీ సుప్రీంకోర్టు ఒక అనూహ్యమైన తీర్పు నిచ్చింది. ఇందులో రెండు విషయాలున్నాయి. ప్రమోషన్ల విషయం పేర్కొన్న ఆర్టికల్ 16(4)ఎ ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి ప్రభుత్వ సర్వీసులలో తగినంత ప్రాతినిధ్యం లేదని ప్రభుత్వం భావించినట్లయితే అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకొని తగువిధమైన నిబంధనలు రూపొందించడానికి ప్రభుత్వానికి ఎటు వంటి ఆటంకాలు ఉండకూడదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులుగా పరిగణిస్తున్నాం. ఇందులో ఆర్టికల్ 32 ప్రకారం, పౌరులెవరికైనా పైన పేర్కొన్న ఆర్టికల్స్ అమలు చేసే విష యంలో ప్రభుత్వాలు విఫలమైనా, నిర్లక్ష్యం వహించినా జోక్యం చేసుకునే హక్కు హైకోర్టు, సుప్రీంకోర్టులకు ఉంటుందనే విషయం న్యాయశాస్త్రం చదివిన ఎవరికైనా అర్థం అవుతుంది. అంతేకాకుండా భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం కానీ, వాటి అమలులో నిర్లక్ష్యం వహించడం కానీ చాలా తీవ్రమైన తప్పు లుగా భావించాలి. అయితే వారం రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ విషయాలను పూర్తిగా విస్మరించిందనే చెప్పాలి. అసలు రిజర్వేషన్లు అనేవి కొన్ని వర్గాలను, కులాలను సంతృప్తి పరిచే చర్యగా చాలా మంది భావిస్తున్నారు. ఇదేరకమైన అభిప్రాయం సాధారణ వ్యక్తులతోపాటు, న్యాయనిపుణులలో కూడా ఉండడం విచారకరం. భారతదేశంలో ఎస్సీ, ఎస్టీలకు అమలు జరుగుతున్న విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు స్వాతంత్య్రం ముందునుంచే అమలులో ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేడ్కర్ 1942లో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో కార్మిక శాఖామంత్రిగా ఉన్నప్పుడు, అప్పటి ప్రభుత్వా ధినేతలను ఒప్పించి, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారు. కానీ ఆరంభం నుంచి ఇప్పటి దాకా ఎస్సీ, ఎస్టీల విద్య, ఉద్యోగ అవకాశాల విషయంలో ఒక తీవ్రమైన వ్యతిరేకత, ద్వేషం సమాజంలో నెలకొని వుంది. దాని ప్రభావం అధికారయంత్రాంగం, న్యాయవ్యవస్థ మీద పడుతున్నది. అందువల్లనే ఇప్పటికీ ఎన్నో తీర్పులు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రావడం మనం చూడవచ్చు. నిజానికి ఏ దేశంలోనైనా కొన్ని వర్గాలకు, తెగలకు ప్రత్యేకమైన రాయితీలు ఉంటాయి. ఇవన్నీ కూడా సామాజిక వివక్షను రూపుమాప డానికి చేసిన, చేస్తున్న ప్రయత్నాలు. వాటి వల్ల ప్రజల మధ్య అంత రాలు తగ్గుతాయన్న ఆశాభావంతో ఆనాటి నుంచి ఈనాటి వరకూ సమాజం ఉంది. అదే ఉద్దేశ్యంతో భారతదేశంలో కూడా అంటరాని కులాలైన ఎస్సీలకూ, అడవుల్లో, కొండల్లో నివసించే ఆదివాసీలైన ఎస్టీలకూ రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. కొన్ని పథకాలను రూపొందించారు. అయితే సమాజంలో ఆధిపత్య కులాల్లో ఉన్నవాళ్ళకు అంటరాని కులాల కోసం అమలు చేస్తున్న రిజర్వేషన్ల పట్ల చాలా ఆగ్రహం ఉన్నది. తమ ఉద్యోగాలను, తమ చదువులు, సీట్లనూ, తమ అవకాశాలనూ వీళ్ళు కొల్లగొడుతున్నారని వారు భావి స్తున్నారు. ముఖ్యంగా గత ఇరవై, ముప్ఫై ఏళ్లలో వచ్చిన యువతరం ఇటువంటి భావాన్ని కలిగి ఉన్నారు. అంతకన్నా ముందుతరం చాలా వివక్షను ప్రదర్శించింది. అప్పుడు ఉద్యోగాల్లో అంత ఎక్కువ మంది కనిపించలేదు. ఇప్పుడు ఉద్యోగాల్లో విద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీలు ఎదిగి వస్తున్నారు. ఇదే కొందరికి మింగుడుపడడంలేదు. సమాజ పరిణామక్రమంపట్ల అవగాహన లేకపోవడం, ఒకవేళ తెలిసినా దానిని అంగీకరించే స్థాయిలేకపోవడం, వాళ్ళ ప్రవర్తనకు కారణం కావచ్చు. ప్రపంచంలో మరెక్కడాలేని విధంగా, ఒక మనిషిని అంటు కోకూడదనే భావన మన దేశంలోనే ఉన్నది. వాళ్ళను ముట్టుకుంటే మైలపడతామనే భావన అందరికీ నరనరానా వ్యాపించి ఉన్నది. ఇప్పటికే గ్రామాల్లో దేవాలయాల్లోకి రానివ్వకపోవడం, దళితులు వంట చేసినా, వస్తువులు అమ్మినా తీసుకోకపోవడం, ఎవరైనా అమ్మా యిలు, అబ్బాయిలు కులాంతర వివాహాలు చేసుకుంటే కూతుళ్ళని కూడా చూడకుండా హత్యచేయడం రోజూ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇవి వేల ఏళ్ళుగా సాగుతున్న అత్యాచారాలు, అంతేకాకుండా వేలమందిని అమానుషంగా హత్యలు చేసిన సమాజం ఇది. అయితే ఇన్ని ఘోరాలకు బలవుతూ కూడా వేల ఏళ్ళ నుంచి సమాజాభివృద్ధికి తమ ప్రాణాలను ధారపోశారు. యాంత్రీకరణ జర గక ముందు అన్ని రకాల వృత్తులకు తోలు పరికరాలను అందించింది అంటరానివారే. చెరువులను నిర్మించి, నిర్వహించి, ప్రాణాలకు తెగించి చెరువులను రక్షించిన వాళ్లూ అంటరానివాళ్ళే. దహన కార్య క్రమాలూ, ఖనన కార్యక్రమాలూ చేసింది వారే. వీధులనూ, వాకి ళ్ళనూ శుభ్రంచేసి యావత్ సమాజం ఆరోగ్యాన్ని కాపాడి, మానవ జాతి మనుగడకు కారణమైందీ ఈ అంటరానివారే. అంటే వ్యవసాయ యుగంలో ప్రాణాలను, ఆరోగ్యాలను ఫణంగా పెట్టింది కూడా ఈ అంటరానివారే. పైగా, పారిశ్రామిక రంగానికి ప్రథమ అవసరాలైన రైల్వేలు, గనులలో ఎండనకా, వాననకా, రక్తాన్ని చెమటగా ధారపో సింది కూడా ఈ అంటరానివారే. 1938లో ఇల్లందు బొగు ్గగనిలో ప్రమాదం జరిగి 42 మంది మరణిస్తే, అధికారులు మినహా మిగతా 37 మంది అంటరానివారే. ఇప్పటికీ మల మూత్రాలను ఒంటినిండా పులుముకొని, ప్రాణాలకు తెగించి మ్యాన్హోల్స్లో దిగుతున్నది కూడా వాళ్లే. నిజానికి వాళ్లు సమాజానికి చేసిన సేవతో పోలిస్తే ప్రస్తుతం అమలుచేస్తున్న రిజర్వేషన్లు ఏ మూలకూ సరిపోవు. ఒకవైపు సమాజ వృద్ధిలో రక్తం, చెమటను ధారపోసిన వీళ్ళను వేల ఏళ్ళుగా పశువుల కన్నా హీనంగా చూస్తున్నారు. అభివృద్ధిపథంలో దూసుకెళు తున్నామనుకుంటోన్న ఈ ఆధునిక, నవీన యుగంలో కూడా ఇలాంటి తీర్పులను వెలువరించడం బాధాకరం. ‘హీరోషీమా, నాగసాకిలపై బాంబులు వేసి, మారణహోమం సృష్టించినందుకు జపాన్ వెళ్ళిన ప్రతి అమెరికా అధ్యక్షుడూ, ఆప్రాంతానికి వెళ్ళి జపాన్ ప్రజలకు క్షమాపణ చెప్పడం ఆనవాయితీ, అమృ త్సర్లోని స్వర్ణదేవాలయం మీద భారత సైన్యం చేసిన దాడిపట్ల పశ్చాత్తాపంతో స్వర్ణదేవాలయాన్ని సందర్శించి ప్రతిప్రధాని విచారం వ్యక్తం చేస్తారు. కానీ రెండువేల ఏళ్ళకుపైగా నూటికి 25 శాతం మంది మీద అమానుషమైన వివక్ష, హత్యలను, అత్యాచారాలను చేస్తున్న హిందూ సమాజంలో మాత్రం ఎటువంటి సానుభూతి కనిపించక పోవడం, కనీసం విచారం వ్యక్తం చేయకపోవడం బాధకలిగిస్తున్నది. ఒక హిందువుగానే నేను తలవంచి దళితులకు క్షమాపణలు చెబు తాను’ అన్న మాజీ ఐఏఎస్ అధికారి కె.ఆర్. వేణుగోపాల్గారి మాట లను హిందూ సమాజం ఒకసారి అవలోకనం చేసుకుంటే యావత్ సమాజం దళితులు, అంటరానివారిపట్ల గౌరవాన్ని ప్రదర్శించగలుగుతుంది. తమ ప్రవర్తన పట్ల పునరాలోచించుకోగలుగుతుంది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
బడుగులకు ఈ బడ్జెట్తో ఒరిగిందేమిటి?
బ్రిటిష్వారి తోడ్పాటుతో దళితులకు, బలహీనవర్గాలకు అంబేడ్కర్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, విదేశీ విద్య స్కాలర్షిప్లు రూపొందించారు. కానీ 70 ఏళ్ల తర్వాత కూడా నేటి పాలకుల విధానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఉన్న వెనుకబాటుతనాన్ని ఎంత మాత్రం తొలగించే స్థితిలో లేవు. ఎస్టీ విద్యార్థుల విదేశీ చదువులకు గత నాలుగేళ్ళుగా రెండు కోట్లను మాత్రమే కేటాయిస్తున్నారు. 2 కోట్ల రూపాయల మొత్తంతో ఎంత మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటారో ఆ బడ్జెట్ రూపొందించిన వారే జవాబు చెప్పాలి. ఇది ముమ్మాటికీ దళిత, బలహీన వర్గాల పట్ల పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. దళితులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన అవకాశాలను కాలరాయడమే తప్ప మరొకటి కాదు. కానీ ఇవే ప్రభుత్వాలు ధనిక రైతులకు, పారిశ్రామిక వేత్తలకు, వేలకోట్ల అధిపతులకు ఉపకరించే ఎన్నో సబ్సిడీలను అందిస్తూండటం గమనార్హం. ‘‘సామాజిక అన్యాయం, ఇతర దోపిడీ విధానాల నుంచి బలహీన వర్గాలను ప్రత్యేకించి షెడ్యూల్డ్ కులాలను, తెగలను రక్షించడానికీ, విద్య, ఆర్థిక రంగాల్లో వారిని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, అందుకుగాను ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలి’’ అంటూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్–46 నిర్దేశిస్తున్నది. భారత రాజ్యాంగంలోని నాలుగో భాగమైన ఆదేశిక సూత్రాలలో ఈ విషయాన్ని పొందుపరిచారు. అంటే ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలలో ఈ వర్గాల వారిని తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. దీనర్థం సమాజ ప్రగతికీ, సమాజ పురోగమనానికీ వేసే ప్రతి అడుగులో అట్టడుగున పడినలిగే వర్గం ఒకటుంటుందని గమనంతో వ్యవహరించడం ప్రభుత్వాల బాధ్యత అని నొక్కి చెప్పడమే. అదే విధంగా ఆర్టికల్–38 కూడా మరొక రకమైన ఆదేశాలను ఇచ్చింది. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, వారి జీవితాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ప్రగతిని సాధించడానికి అన్ని రకాల ప్రభుత్వ సంస్థలు కృషిచేయాలని, ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య ఉన్న అసమానతలను తొలగించాలని కూడా ఆర్టికల్ – 38 ఆదేశిస్తున్నది. అంటే ప్రాంతాల మధ్య అభివృద్ధి కార్యక్రమాల్లో నిధుల కేటాయింపుల్లో వ్యత్యాసం చూపకూడదని దాని అర్థం. ఈ అంశాల్లో ఎటువంటి వివక్షా తగదని చెప్పడమే. అయితే ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రజల మధ్య వ్యత్యాసాలను పెంచుతున్నాయ్ కానీ తగ్గించడం లేదు. ముఖ్యంగా బడ్జెట్ కేటాయింపుల్లో దీని ప్రభావం స్పష్టంగా కనపడుతున్నది. ప్రభుత్వాలకు నాయకత్వం వహించే నాయకులు మాట్లాడే మాటలకన్నా, వారు బడ్జెట్ కేటాయింపుల్లో చూపెడుతున్న విషయాలు అసలు అక్షరసత్యాలు. ఎన్ని రకాల మాటలు మాట్లాడినా చివరకు వారి చిత్తశుద్ధి తేలేది బడ్జెట్ వడ్డనలోనే అనేది సత్యం. ముందుగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికీ, వారి అభివృద్ధికీ కేటాయించిన నిధులను పరిశీలిస్తే, ప్రభుత్వాలకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుంది. ఈ రెండు వర్గాలకు కూడా విద్యాభివృద్ధిపైనే నిధుల కేటాయింపులు జరుగుతున్నాయి. అయితే వాటిపైన పెడుతున్న ఖర్చును చూస్తే మనకు అసలు విషయం తెలుస్తుంది. ఇందులో పెద్ద కేటాయింపులు పోస్ట్–మెట్రిక్ స్కాలర్షిప్లే. పదవ తరగతిపైన విద్యనభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులందరూ ఈ స్కాలర్షిప్ల వల్లనే చదువగలుగుతున్నారు. ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కేటాయింపులు చూస్తే, 2017–18లో రూ. 3,414 కోట్లు ఖర్చు చేస్తే, 2019–20లో రూ. 2,926.82 కోట్లు కేటాయించారు. అది 2020–21 సంవత్సరానికి వచ్చేసరికి రూ. 2,987 కోట్లు కేటాయిం చారు. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీల సంక్షేమం కోసం ప్రత్యేకించి కేటాయించింది ఈ ఆర్థిక సంవత్సరం రూ. 7,154 కోట్లు. ఇందులో రూ. 2,987 కోట్లు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లే. అయితే ఈ కేటాయింపులు ఇప్పుడు ఎస్సీ కుటుంబాల్లోని విద్యార్థుల విద్యావకాశాలను ఏవిధంగానూ తీర్చలేవు. అందువల్ల రాష్ట్రప్రభుత్వాల మీద భారం పడుతున్నది. దీనితోపాటు, కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయె¯Œ్స ప్రభుత్వం, రాజీవ్గాంధీ ఫెలోషిప్లు ప్రవేశపెట్టడం వల్ల ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పరిశోధక విద్యనభ్యసించారు. కానీ గత కొన్నేళ్లుగా కేటాయింపులు బాగా తగ్గిపోయాయి. 2019–20లో రూ.360 కోట్లు ఉంటే, ప్రస్తుత సంవత్సరం రూ. 300 కోట్లకు తగ్గించారు. దీనివల్ల రీసెర్చ్ వైపు వెళ్లడానికి ఇష్టపడే విద్యార్థులకు నిరాశే మిగులుతోంది. విదేశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు కూడా ఎటువంటి ప్రోత్సాహం లేదు. గత సంవత్సరం రూ. 20 కోట్లు ఉంటే, ఈ సంవత్సరం అదే అంకెను యథావిధిగా కొనసాగించారు. 2018–19లో దీనికోసం రూ. 15 కోట్లు కేటాయించి రూ. 5.97 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఎస్సీలలోని బాల బాలికల హాస్టల్స్ నిర్మాణం, నిర్వహణకు అందించే మొత్తాలు కూడా ఆశ్చర్యకరంగా తగ్గిపోతున్నాయి. 2017–18 సంవత్సరంలో రూ. 74.91 కోట్లు ఖర్చు చేస్తే, 2018–19లో రూ. 160.5 కోట్లు కేటాయించి దానిని రూ. 36.56 కోట్లకు కుదించి ఖర్చు చేయడం ఎంతటి తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమో అర్థం అవుతుంది. ఈ సంవత్సరం బడ్జెట్ ప్రసంగంలో ఒక ముఖ్యమైన వ్యాఖ్యను మనం చూశాం. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్యక్రమాలలో పారిశుధ్య కార్మికులను ఇక వినియోగించేది లేదని ప్రకటించారు. కానీ అందుకోసం ఆమె ఒక నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేయలేదు. పదిహేనేళ్ళ క్రితం పారిశుద్ధ్య కార్మికుల వ్యవస్థను నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చారు. కానీ దాని అమలు ఇప్పటి వరకు ఒక కొలిక్కి రాలేదు. ఇప్పటికీ ఇంకా ఒక లక్ష మంది వరకు మాన్యువల్ స్కావెంజర్స్ ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఒకవేళ ఆర్థికమంత్రి ప్రకటన నిజం కావాలనుకుంటే అందుకు వారి పునరావాసానికి తగు చర్యలు తీసుకోవాలి. తగిన కార్యక్రమాలు రూపొం దించాలి. అందుకు గాను బడ్జెట్ కావాల్సి ఉంటుంది. అయితే ఇందుకోసం గత కొంతకాలంగా చేస్తోన్న కేటాయింపులు కొంత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. లక్ష మందికి పునరావాసం కల్పించడానికి దాదాపు రూ. 220 కోట్లు కావాలి. కానీ ఈ సంవత్సరం కేటాయిం చింది రూ. 110 కోట్లు మాత్రమే. ఎస్టీ విద్యార్థులు కళాశాల విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించడానికి ఇస్తున్న స్కాలర్షిప్ కింద 2019–20లో రూ. 19.5 కోట్లు కేటాయిస్తే, ఈ సంవత్సరం రూ.8 కోట్లకు కుదించారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఎస్టీలకు గత సంవత్సరం రూ. 440 కోట్లు కేటాయిస్తే, ప్రస్తుత సంవత్సరం దానిని రూ. 400 కోట్లకు కుదించారు. ప్రీమెట్రిక్ స్కాలర్షిప్లు కూడా 1,826 కోట్ల నుంచి రూ. 1,900 కోట్లకు కేటాయించి చేతులు దులుపుకున్నారు. మొత్తం ఆదివాసీల విద్య కోసం గత సంవత్సరం రూ. 2,266 కోట్లు ఉంటే ఈ సంవత్సరం నామమాత్రంగా రూ. 2,300 కోట్లకు కోత కోశారు. ఎస్టీ విద్యార్థుల విదేశాల చదువులకు గత నాలుగేళ్ళుగా రూ.2 కోట్లను మాత్రమే కేటాయిస్తున్నారు. 2 కోట్ల రూపాయల మొత్తంతో ఎంత మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటారో ఆ బడ్జెట్ రూపొందించిన వారే జవాబు చెప్పాలి. ఒక్కొక్క కోర్సుకి కనీసం 20 నుంచి 25 లక్షల ఫీజు ఉంటుందని అంచనా. ఇలా ఎందుకు కేటాయిస్తున్నారో అర్థం కావడంలేదు. ఆదివాసీల ఆర్థికాభివృద్ధికి కేంద్రం అందించే నిధుల దగ్గర ఖాళీస్థలం కనిపించడం చూస్తే ఈ ప్రభుత్వ వనవాసి కళ్యాణం ఎంత అద్భుతంగా ఉందో అర్థం అవుతుంది. హిందువుల సెంటిమెంట్తో రాజకీయంగా బలపడాలని చూస్తున్న ప్రభుత్వం, వారిపట్ల చూపుతున్న శ్రద్ధ చాలా నిరాశను కలుగజేస్తున్నది. జాతీయ స్కాలర్షిప్ల కేటాయింపులు అంటే రీసెర్చ్ స్కాలర్స్ కోసం గత సంవత్సరం రూ. 70 కోట్లు కేటాయిస్తే, ఈ సంవత్సరం రూ. 52 కోట్ల 50 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో ఇటీవల చేర్చిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వాటా కూడా ఉంది. బీసీల విదేశీ చదువులకోసం గత సంవత్సరం రూ. 26 కోట్లు కేటాయిస్తే, ఈ సంవత్సరం రూ. 35 కోట్లకు పెంచారు. ప్రస్తుతం ఇక్కడ ప్రస్తావించిన పథకాలలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, విదేశీ విద్య స్కాలర్షిప్లు బాబా సాహెబ్ అంబేడ్కర్ చొరవతో స్వాతంత్య్రానికి ముందే 1944లో ప్రారంభమయ్యాయి. ఆ రోజుల్లోనే అంబేడ్కర్ బ్రిటిష్ ప్రభుత్వంతో సంప్రదించి ఇటువంటి పథకాలను రూపొందించారు. దాదాపు 70 ఏళ్ల తర్వాత కూడా ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ఎంత మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఉన్న వెనుకబాటుతనాన్ని తొలగించే స్థితిలో లేవు. కానీ ఇవే ప్రభుత్వాలు ధనిక రైతులకు పారిశ్రామిక వేత్తలకు, వేలకోట్ల అధిపతులకు ఉపకరించే ఎన్నో సబ్సిడీలను అందిస్తూండటం గమనార్హం. ఇప్పటికీ 40 శాతానికి పైగా ఉన్న వెనుకబడిన కులాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదంటే, హిందువుల పట్ల, హిందూ సెంటిమెంట్తో రాజకీయాలు నడుపుతోన్న పార్టీకీ, ప్రభుత్వానికీ ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాలు రాజ్యాంగంలో పేర్కొన్న ఎన్నో విషయాలను విస్మరిస్తుంటే ఆర్థిక, సామాజికాభివృద్ధి కోసం నిర్దేశించిన సూత్రాలను కనీసం పట్టించుకున్న పాపానపోవడం లేదు. ఇది ఎంతమాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తినికానీ, రాజ్యాంగబద్ధ పాలనను కానీ అనుసరిస్తున్నట్టుగా భావించలేం. ఇది ముమ్మాటికీ దళిత, బలహీన వర్గాల పట్ల పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. దళితులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన అవకాశాలను కాలరాయడమే తప్ప మరొకటి కాదు. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
సంపద, పేదరికం మధ్య ‘భారతం’
భారతదేశంలో ఆర్థిక వ్యత్యాసాలు చాలా వేగంగా పెరుగుతూ వస్తున్నాయి. రాత్రికి రాత్రే కుబేరులు అపరకుబేరుల్లా మారుతోంటే, పేదవాడు మరింత పేదరికంలోకి కూరుకుపోతున్నాడన్న నానుడి అక్షరసత్యంగా మారింది. ఒక శాతం జనాభా చేతిలో దేశంలోని 73 శాతం సంపద పోగుపడి ఉంది. 67 కోట్లమంది ప్రజల చేతిలో కేవలం ఒకే ఒక్క శాతం సంపద ఉన్నదంటే, దేశంలో ఆర్థిక అంతరాలు ఏ స్థాయిలో కొనసాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. 2050 నాటికి భారత్ ప్రపంచంలోనే రెండో శక్తివంతమైన దేశంగా వృద్ధి చెందనుందని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నా... సంపన్న ఇండియా, పేదరిక భారత్ మధ్య గీత చెరగకపోవడం వాస్తవం. ఇటువంటి పరిస్థితుల్లోనే సోషలిజం, సామాజిక న్యాయం కోసం ఉద్యమాలు ఊపిరిపోసుకుంటాయి. అసమానతల అంతానికి ప్రజాపోరాటాలు వెల్లువెత్తుతాయి. ‘‘రాబోయే ముప్ఫై సంవత్సరాల్లో అంటే 2050 నాటికి భారతదేశం ప్రపంచంలో రెండవ శక్తివంతమైన దేశంగా అభివృద్ధి చెందుతుంది. చైనా యథా వి«ధిగా మొదటి స్థానాన్ని నిలుపుకోగా, అమెరికాను వెనక్కినెట్టి భారత్ ఆ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నది’’ అంటూ ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్(పీడబ్లూ్ల్యసీ) సంస్థ తన నివేదికలో ప్రకటించింది. ఇది భారతదేశ ప్రగతిని సూచిస్తున్న ప్రకటన. కొనుగోలు శక్తి సూచిక ఆధారంగా ఈ రకమైన నిర్ధారణ చేసినట్టు ఆ సంస్థ తెలియజేసింది. ఇ–7 దేశాలైన బ్రెజిల్, చైనా, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, రష్యా, టర్కీ దేశాలు సరాసరి 3.5 శాతం వార్షిక ఆర్థికాభివృద్ధి జరు గుతూ, రాబోయే 30 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబడుతాయని, అందులో ఉన్న భారతదేశం మరింతగా మున్ముం దుకు వెళ్తుందని ఆ సంస్థ అభిప్రాయపడింది. ఇప్పటికే ప్రపంచంలో ఆర్థికంగా ధనిక దేశాలనిపించుకుంటున్న జి–7 దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్,యునైటెడ్ కింగ్డమ్, అమెరికాలు తమ వార్షిక ఆర్థికాభివృద్ధి 1.6 కి తగ్గిపోయి వెనుకబడిపోతాయని కూడా ఆ సంస్థ స్పష్టం చేసింది. ఇ–7 దేశాలు ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 50 శాతాన్ని సొంతం చేసుకుంటాయి, అయితే జి–7 దేశాల వాటా 20 శాతానికి పడిపోతుంది. ఇటువంటి అంచ నాలు భారతదేశంలో ఉన్న మనందరికీ ఆశాజనకంగా కనిపిస్తాయి. కానీ భారతదేశంలో ఉన్న పరిస్థితులు మనకు మరో రకంగా దర్శనమిస్తున్నాయి. ఇటువంటి నివేదికను అందించిన పీడబ్ల్యూసీ సంస్థనే మరికొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ఈ సంద ర్భంగా రాబోయే పరిస్థితులను వివరిస్తూ, ప్రపంచంలో శాస్త్ర, సాంకే తిక రంగాల్లో వస్తోన్న మార్పులు, పెరుగుతున్న ఆర్థిక అంతరాలు, రోజురోజుకీ రెట్టింపవుతోన్న పేదరికం ఆందోళన కలిగిస్తున్నమాట వాస్తవం. అంతే కాకుండా, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో భవిష్యత్లో రాబోతున్న పరిణామాలు ప్రపంచ స్థితిగతులను మార్చివేసే ప్రమాదమున్నదనడంలో కూడా అతిశయోక్తి లేదు. అన్నింటికన్నా ముందుగా ఆందోళన కలిగిస్తున్న విషయాలు ఆర్థిక అంతరాలు. భార తదేశంలో ఈ ఆర్థిక వ్యత్యాసాలు చాలా వేగంగా పెరుగుతూ వస్తు న్నాయి. రాత్రికి రాత్రే కుబేరులు అపరకుబేరుల్లా మారుతోంటే, పేద వాడు మరింత పేదరికంలోకి కూరుకు పోతున్నాడన్న నానుడి అక్షర సత్యంగా మారింది. 2004లో దేశంలో 12 మంది బిలియనీర్లు ఉంటే 2012కి వచ్చేసరికి 46 మంది అయ్యారు. 2017 నాటికి ఆ సంఖ్య 101కి చేరింది. కార్మికుల, ఉద్యోగుల జీతాల పెరుగుదల 2 శాతం ఉంటే, పెట్టుబడిదారుల ఆస్తుల పెరుగుదల ఆరురెట్లు అధికంగా ఉంది. 1991 నుంచి ఈ వ్యత్యాసాలు అత్యంత వేగంగా, అనూ హ్యంగా పెరుగుతూ వచ్చాయి. గత సంవత్సరం ప్రతిరెండు రోజుల కోసారి ఒక బిలియనీర్ పెరిగాడని ఆక్స్ఫామ్ నివేదిక వెల్లడించడాన్ని బట్టి చూస్తే ధనిక, పేదల మధ్య నెలకొన్న ఆర్థిక అగాథాన్ని అంచనా వేసుకోవచ్చు. ఇంకా ఆశ్చర్య కరమైన విషయమేమిటంటే, భారత దేశంలో ఒక శాతం జనాభా చేతిలో దేశంలోని 73 శాతం సంపద పోగుపడి ఉంది. ఇదిలా ఉంటే, 67 కోట్ల జనాభా చేతిలో కేవలం ఒకే ఒక్క శాతం సంపద ఉన్నదంటే, దేశంలో ఆర్థిక అంతరాల స్థాయిని అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయ రంగమైతే, తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఒకవైపు వ్యవసాయం లాభదాయంగా లేదని రైతులే ఆత్మహత్యలు చేసుకుంటుంటే, రెండోవైపు వ్యవసాయంలో పెరుగుతోన్న యాంత్రీ కరణ వల్ల దాదాపు సగానికిపైగా వ్యవసాయ కార్మికులు ఉపాధిని కోల్పోతున్నారు. 1977–78లో జరిగిన 32వ నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం 89 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తుంటే, 2017–18లో జరిగిన సర్వేలో అది 55 శాతానికి పడిపోయింది. ఇది 2050 నాటికి 25.7 శాతానికి పడిపోతుందనీ అంచనా. భవిష్యత్లో వ్యవసాయం ఇప్పుడున్న స్థితిలో ఉంటుందనే ఆశకూడా కనపడటం లేదు. కోట్లాదిమంది రైతుల స్థానంలో పదుల మంది వ్యవసాయ పెట్టు బడిదారులు అడుగుపెట్టే అవకాశం ఉంది. కార్పొరేట్ వ్యవసా యంలో మనుషుల జాడ కనిపించదు, పూర్తిగా యంత్రాలమయం అయిపోతుంది. ఇప్పటికే చాలా పంటల్లో మనుషుల ప్రమేయం తగ్గి పోయింది. కూలీలు ఎక్కువగా అవసరమయ్యే వరిపంట సాగులో అన్ని దశల్లో యంత్రాలు అడుగుపెట్టాయి. వ్యవసాయ సంక్షోభం ఇలాగే కొనసాగితే, చిన్న సన్నకారు రైతులు మాయం కావడం అనివార్యం. ఆ స్థానంలో కార్పొరేట్లు అడుగుపెడితే భూమి మీద పనిచేసే శ్రామికులు కంటికైనా కనిపించరు. అదేవిధంగా పారిశ్రామిక రంగంలో రోజు రోజుకీ కార్మికుల సంఖ్య తగ్గిపోతున్నది. యాంత్రీకరణ స్థానంలో మరింత ఆధుని కమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో వంద మంది చేసే పనిని కేవలం ఒకరు, ఇద్దరితో చేయించుకోగలుగుతున్నారు. అత్యంత ఉన్నతమైన, నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరం అవు తారు. దీనితో దేశంలో నిరుద్యోగం తీవ్రస్థాయికి చేరనుంది. కంప్యూ టర్ రంగంలో వస్తున్న మార్పులు ముఖ్యంగా ఆటోమేషన్ రోబోల రూపకల్పన మరింతగా ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తున్నది. సేవా రంగంలో వైద్యం, విద్యా రంగాల్లో కొన్ని అవకాశాలు కనిపిస్తున్న ప్పటికీ 2050 నాటికి వచ్చే మార్పులు కూడా ఉద్యోగావకాశాల మీద ప్రభావాన్ని కలిగిస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాల విషయాన్ని వది లేస్తే, 2050 నాటికి దాదాపు 70 లక్షల మందికి ఉన్న ఉద్యోగాలు కనుమరుగవుతాయని ప్రహార్ గ్రూప్స్ అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం కొనసాగుతోన్న ఉద్యోగాల కల్పన చూస్తే ఆ పరిస్థితి మనకు అర్థం అవుతుంది. 2011లో తొమ్మిదిలక్షల ఉద్యోగాల కల్పన జరిగితే, 2013లో అది 4.19 లక్షలకు పడిపోయింది. 2015లో 1.35 లక్షలకు ఉపాధికల్పన క్షీణించింది. లేబర్ బ్యూరో సమాచారం ప్రకారం దేశంలో ప్రతి రోజూ 550 మంది ఉద్యోగాలను కోల్పోతున్నారు. ఇటీవల వినపడుతున్న మరో మాట ‘ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్’ఇది భవిష్యత్లో మనుషుల మనుగడకు ప్రమాదకరంగా తయారు కాబోతున్నది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న ఆధునిక మైన మార్పులను ఆహ్వానించాల్సిందే. కానీ మనిషి మనుగడకే ప్రమాదం ఏర్పడితే దానిని మనం ఎట్లా చూడాలి? మొత్తం ఉత్పత్తి, సర్వీసు, ఇతర రంగాలన్నింటిలో వస్తోన్న మార్పుల వల్ల మనకు అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులు కావాల్సి వస్తుంది. 2050 వరకు వంద కోట్ల మంది ఉద్యోగాలు చేయగలిగే వయస్సు వాళ్ళు ఉంటారు. అందులో 30 కోట్ల మందికి మాత్రమే ఉద్యోగాల కల్పన ఉంటుందని భావిస్తున్నారు. అంటే దాదాపు 70 కోట్ల మందికి ఉద్యో గాలు దొరకని దుర్భర పరిస్థితులు అత్యంత సమీపంలో ఉన్నాయి. జనాభాలో 60 శాతానికి పైగా ఎటువంటి ఉత్పత్తిలో పాల్గొనే అవ కాశం లేదు. ఇది చాలా తీవ్రమైన సమస్య. దీనిని పరిష్కరించడం అంత సులువు కాదు. కానీ దీనిని రాజ కీయ సమస్యగా చూస్తున్నారు. దీనికి పరిష్కారంగా వృద్ధాప్య పెన్షన్లు, చౌకధరలకు బియ్యం సప్లయ్ చేస్తున్నారు. ప్రభుత్వాలు ప్రజల నుంచి తిరుగుబాటు రాకుండా ఉండడానికి ఉచితంగా ఆహారం, విద్య, వైద్యం లాంటి అవకాశాలను కల్పిస్తారని అధ్యయ నాలు అంచనా వేస్తున్నాయి. అంటే క్రమంగా మనిషిని ఉత్పత్తి నుంచీ, శ్రమ నుంచీ బయటకులాగి నిర్వీర్యం చేయాలనీ, మొత్తంగా ఉత్పాదక రంగంనుంచి మనిషిని విడదీయాలని చూస్తున్నారు. ఇది మానవ మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తోంది. అయితే మరొక అభి ప్రాయం కూడా బలంగా వినిపిస్తోంది. దేశ సంపదలో, అభివృద్ధిలో భాగస్వాములు కాకుండా ఉన్న 60 శాతం మంది జనాభా ప్రభు త్వాల మీద తిరుగుబాటు చేస్తారనే అభిప్రాయం కూడా ఉంది. ప్రపంచంలో ఇటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. ప్రపంచంలో ఒకనాడు అత్యంత ధనికదేశమైన రోమన్ సామ్రాజ్యం ప్రజల ఆకలి కేకలకు భస్మమైపోయిన చరిత్రను కొంత మంది ప్రస్తావిస్తున్నారు. ప్రజలందరికీ సమాన అవకాశాలూ, ప్రజాస్వామిక హక్కులే లక్ష్యంగా ఏర్పాటయ్యే పార్టీలూ, సంస్థలకు భవిష్యత్లో ప్రజల ఆదరణ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే సోషలిజం, సామాజిక న్యాయం కోసం ఉద్యమాలు ఊపిరి పోసుకుంటాయి. అసమానతల అంతానికి ప్రజాపోరాటాలు వెల్లువెత్తుతాయి. ఆర్థిక సామాజిక అంత రాలూ, దోపిడీ, అవినీతి, వివక్షలతో కూడిన ఈ సమాజంలో మార్పు కోసం మూకుమ్మడిగా ప్రజలు తిరగబడే రోజొకటొస్తుంది. అక్కడ క్కడ విసిరివేయబడినట్టుగా ఉన్న ఉద్యమాలు ఒక్కుమ్మడిగా మారిన ప్పుడు వర్గసమాజం పునాదులు కదులుతాయి. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
కుల నిర్మూలనతోనే భవిష్యత్తు
మనం పరిశుభ్రమైన దుస్తులు ధరించినా, మన మనస్సు, శీలం నిందించడానికి వీలులేనిదైనా మనల్ని అంటరానివారుగా చూస్తూనే ఉన్నారు. కాబట్టి మనం సమసమాజమనే సిద్ధాంతాన్ని ప్రబోధిస్తోన్న బౌద్ధమతంలో చేరాలి. అది మాత్రమే మనుషుల మధ్య విభేదాలను తొలగిస్తుంది అని బీఆర్ అంబేడ్కర్ తన తుది ఉపన్యాసంలో అన్నారు. అంటరానితనం ఏర్పడడానికి నీచమైన వృత్తులు, గోమాంస భక్షణ, మురికిగా ఉండడం లాంటి కారణాలు సహేతుకంగా లేవనీ, బౌద్ధాన్ని పాటిస్తున్న తెగలను హిందూ మతం వెలివేసి, నీచమైన వృత్తులను అంటగట్టిందని వివరించారు. చివరకు 1956 అక్టోబర్14న 5లక్షల మంది సమక్షంలో బౌద్ధం స్వీకరించి సామాజిక విప్లవానికి పునాది వేశారు. కుల నిర్మూలన కోసం అంబేడ్కర్ చేసిన పోరాటం రేపటి భవిష్యత్ భారతావనికి సుస్పష్టమైన మార్గదర్శక వెలుగురేఖగా నిలుస్తుంది. ‘‘మనం పదిహేను వందల సంవత్సరాల నుంచి గ్రామ పొలిమేరల కావల నివసిస్తూ, హిందువులు మనసు మారి మనకు సమానత్వం కల్పిస్తారని ఎదురు చూస్తున్నాం. కానీ ఏ ఒక్కరూ కూడా అంటరానితనం సమసిపోయే విధంగా మనస్ఫూర్తిగా ప్రయత్నించలేదు. కొందరూ అరకొరగా కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అంతేకాక మతం పేరుతో మనం అణగతొక్కబడి శతాబ్దాల తరబడి అంతులేని హింసకూ, అత్యాచారాలకూ గురయ్యాం’’ అంటూ బాబా సాహెబ్ అంబేడ్కర్ బౌద్ధ క్షేత్రమైన సారనాథ్లోని మహాబోధి సంస్థ ఏర్పాటు చేసిన సభలో ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ 25, 1956న అంబేడ్కర్ చేసిన ఉపన్యాసం ఆయన జీవితంలో చివరి ఉప న్యాసం. అంబేడ్కర్ తన చిట్టచివరి ఉపన్యాసంలో తన జీవితాను భవపు సారాన్ని తన ఆవేదనాశ్రువులుగా దేశప్రజల ముందుంచారు. ముఖ్యంగా అంటరాని కులాలకూ సమానత్వ కాంక్షాపరులకూ ఆయన చివరి వ్యాఖ్యోపానంగా ఈ ఉపన్యాసం ఉంటుంది. ‘‘మనం మురికిగా ఉన్నామని, నీచమైన పనులు చేసి జీవిస్తు న్నామని అందుకే దూరముంచామని వందల ఏళ్ళ నుంచి ప్రచారం చేస్తూ వస్తున్నారు. కానీ వాస్తవంలో, ఈ రోజు మనం మురికిగా లేం. అందరిలానే పరిశుభ్రంగా ఉన్నాం. ఒక మనిషి ఇతను అంటరాని వాడు అని ఇప్పుడు మనల్ని మన వస్త్రధారణను బట్టి నిర్ధారించలేని విధంగా ఉన్నాం. అయినప్పటికీ మన కులం తెలిస్తే, మనం పరిశు భ్రమైన దుస్తులు ధరించినా, మర్యాదగల వ్యాపారం చేసినా, మన మనస్సు, శీలం నిందించడానికి వీలులేనిదైనా మనల్ని అంటరాని వారుగా చూస్తూనే ఉన్నారు. కాబట్టి మనం హిందూమతాన్ని విడిచి పెట్టి సమసమాజమనే సిద్ధాంతాన్ని ప్రబోధించిన, ప్రబోధిస్తోన్న బౌద్ధమతంలో చేరాలి. అది మాత్రమే మనుషుల మధ్య విభేదాలను తొలగిస్తుంది.’’ అంటూ అంబేడ్కర్ తన చివరి ఉపన్యాసంలో ప్రబో ధించారు. అంతే కాదు, అంబేడ్కర్ ఇటువంటి నిర్ణయానికి రావడా నికి ఆయన సాగించిన సత్యశోధన, ఉద్యమకార్యాచరణ, శాసన నిర్మాణాలు కారణమయ్యాయి. అమెరికాలోని కొలంబియా వర్సిటీలో ఉన్నత చదువులకు వెళ్ళిన అంబేడ్కర్ 1916, మే, 9వ తేదీన ఆంత్రోపాలజీ సెమినార్లో ‘‘భారతదేశంలో కులాలు’’అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. అందులో కులాల పుట్టుకుకు సంబంధించిన చారిత్రక పరిస్థితులను వివరించారు. వివాహ వ్యవ స్థను ఒక సమూహానికే పరిమితం చేసి, ఒక సమూహాన్ని మరో సమూహంతో కలవకుండా చేసి, తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడా నికి చేసిన ప్రయత్నం కుల వ్యవస్థ ఏర్పాటుకు కారణమయ్యిందన్న విషయాన్ని అంబేడ్కర్ తన పత్రంలో వివరించారు. ఆ తర్వాత అంబేడ్కర్ రాజకీయ అంశాలపైన దృష్టి కేంద్రీకరిం చారు. ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటు కావాలని, అందులో అంటరా నికులాలతో సహా అందరికీ భాగస్వామ్యం ఉండాలని 1919లో మొదటిసారిగా సౌత్బరో కమిటీ ఎదుట ప్రతిపాదించారు. అట్లా సైమన్ కమిషన్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లలో తన వాదనను విని పించారు. 1946లో తన ప్రతిపాదనగా నూతన రాజ్యాంగంలో చేర్చ డానికి వీలుగా ‘స్టేట్స్, మైనారిటీస్’ అనే డాక్యుమెంటును రూపొం దించారు. అయితే కులం పోకుండా ఈ దేశంలో సమానత్వం రాదనే విషయాన్ని అంబేడ్కర్ బలంగా విశ్వసించారు. రాజకీయ హక్కుల కోసం తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే, కుల నిర్మూలనకు, అంట రానితనం రూపుమాపడానికి శక్తివంచన లేకుండా కృషిచేశారు. అప్పటికీ గాంధీలాంటి సంస్కర్తల మాటలు ఆచరణలో ఎట్లా విఫలమవుతున్నాయో చూపడానికి మహద్ చెరువు సత్యాగ్రహం, కాలారామ్ దేవాలయ ప్రవేశ ఉద్యమాన్ని కొనసాగించారు. మహద్ చెరువులోని నీటిని కులమతాలకు అతీతంగా అందరూ వినియోగిం చుకోవాలని, ఆనాటి ప్రభుత్వం అనుమతితో చెరువులోకి అడుగుపె డితే, అస్పృశ్యులపై దాడి చేశారు. మహద్ చెరువు పోరాటం మార్చి 20, 1927లో జరిగింది. తర్వాత మూడేళ్ళకు 1930 మార్చి2న నాసిక్ లోని కాలారామ్ దేవాలయంలోకి అంటరాని కులాల ప్రవేశానికి అంబేడ్కర్ ఉద్యమించారు. అది కూడా విఫలమైంది. అక్కడ కూడా హిందువులు అంబేడ్కర్తో సహా అంటరాని కులాలను దేవాలయం లోకి రానివ్వలేదు. అప్పుడు అంబేడ్కర్ హిందూమతం, దాని స్వభావం గురించి తీవ్రంగా ఆలోచించడం మొదలు పెట్టారు. సరిగ్గా 1930–32 సంవత్సరాల్లో జరిగిన మూడు రౌండ్ టేబుల్ సమావేశాల అనంతరం అంటరాని కులాలకు రాజకీయ హక్కుగా ప్రత్యేక ఓటింగ్ విధానాన్ని అంగీకరిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అప్పటివరకు అంటరాని కులాలను ఉద్ధరించేది తానేనని ప్రకటించుకున్న గాంధీ బ్రిటిష్ ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ, ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు. అప్పుడు తప్పని పరిస్థితుల్లో ప్రత్యేక ఓటింగ్ విధానాన్ని రద్దు చేసుకొని, గాంధీ ప్రతిపాదించిన పూనా ఒడంబడికను అయిష్టంగానే అంబేడ్కర్ ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయం కూడా అంబేడ్కర్ను బాగా కలచివేసింది. ఆ నేపథ్యంలోనే మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో యెవోల అనే పట్టణంలో అక్టోబర్ 12, 1935న జరిగిన అంటరాని కులాల సభలో అంబేడ్కర్ ఒక కీలకమైన ప్రకటన చేశారు. ‘దురదృష్ట వశాత్తూ నేను హిందువుగా జన్మించాను. కానీ నేను హిందువుగా మరణించను’ అని. ఈ ప్రకటన యావత్ దేశాన్ని అతలాకుతలం చేసింది. సమా జంలో సమాన గౌరవం, సమానహక్కుల కోసం జరిపిన పోరాటం ఏ విధంగా నిరర్ధకంగా మారిందో చెపుతూ అంబేడ్కర్ ఆందోళన వెలి బుచ్చారు. ఈ ప్రకటనను ఆ సభకు హాజరైన వేలాదిమంది స్వాగతిం చారు. కానీ, అదే స్థాయిలో అగ్రవర్ణాల నుంచి వ్యతిరేకతను కూడా తీసుకొచ్చింది. గాంధీ ఒక వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ ‘అంబే డ్కర్ ప్రకటన ఆందోళన కలిగిస్తున్నది. ఆయన తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలి. ఆ నిర్ణయం ఫలితం ఇవ్వదు’ అని తెలిపారు. దానికి అంబేడ్కర్ ఘాటైన సమాధానమే చెప్పారు. ‘నేను హిందూ మతాన్ని వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నాను. అంటరానికులాల వారు తామెలా వెళ్ళాలనుకుంటున్నారో వెళ్ళనివ్వండి. ఇది గాంధీకి నా సలహా’ అంటూ గాంధీ అభిప్రాయాన్ని తోసిపుచ్చారు. అదే సమయంలో అంబేడ్కర్ కుల నిర్మూలనకు సంబంధించిన తన సత్యశోధనను ఆపలేదు. అందులో భాగంగానే 1936లో లాహో ర్లోని జాట్పాల్తోడక్ మండల్ సంస్థ ఆహ్వానం మేరకు కుల నిర్మూ లనపై ప్రసంగించడానికి అంబేడ్కర్ అంగీకరించారు. కానీ ఆ సభ జరగలేదు. అయితే ఆ సభ కోసం అంబేడ్కర్ రూపొందించిన డాక్యు మెంట్ ఇప్పటికీ ఒక చర్చకు ప్రాతిపదికగా నిలుస్తున్నది. కుల నిర్మూ లన పుస్తకంలో కులంపై ఎంతో వివరమైన విషయాలను ప్రస్తావి స్తూనే, కొన్ని ప్రతిపాదనలు కూడా చేశారు. తన మొట్టమొదటి పరిశో ధనాపత్రం ‘‘కులాల పుట్టుక’’లో పేర్కొన్న వివాహ వ్యవస్థ కులం బలపడడానికి కారణమైందని వివరిస్తూ కులాంతర వివాహాలు, వర్ణాంతర భోజనాలు జరగాలని ప్రతిపాదించారు. పైగా, కులాన్ని సమర్థిస్తున్న ధర్మశాస్త్రాలను రద్దుచేయాలని కోరారు. వీటితో పాటు, హిందూ మతంలో అందరికీ సమాన హక్కులు ఉండే విధంగా అర్చక వ్యవస్థను ఒక కులానికి పరిమితం చేయరాదని కూడా అంబేడ్కర్ కరాకండీగా చెప్పారు. తన పరిశోధనలను కొనసాగిస్తూనే అంటరాని తనం ఆచరించడానికి గల కారణాలను కనుగొన్నారు. ‘అంటరాని వారెవరు’ అంటూ చేసిన తన శోధనలో ఆయనకు తను ఎటు వెళ్లాలో తెలిసింది. అంటరానితనం ఏర్పడడానికి నీచమైన వృత్తులు, ఆవు మాంసభక్షణ, మురికిగా ఉండడం లాంటి కారణాలు సహేతుకంగా లేవనీ, బౌద్ధాన్ని అవలంబిస్తూ్త హిందూమతంలోనికి తిరిగిరాని తెగలను హిందూ మతం వెలివేసిందని, నీచమైన వృత్తులను అంట గట్టిందని వివరించారు. ఆ విధంగా మళ్ళీ అంటరానివారి సొంత మతమైన బౌద్ధంలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అందుకే 1944 నుంచి బౌద్ధంపై అంబేడ్కర్ అధ్యయనం సాగించారు. చివరకు 1956 అక్టోబర్, 14న ఐదు లక్షల మంది సమక్షంలో బౌద్ధం స్వీకరించి గొప్ప సామాజిక విప్లవానికి పునాదివేశారు. అంబేడ్కర్ బౌద్ధంలోకి వెళ్ళాలనే నిర్ణయానికి కారణం ఛాందస హిందూ వాదమే కానీ అంబే డ్కర్ స్వతహాగా కారణం కాదని అంబేడ్కర్ సామాజిక ప్రయాణం మనకు స్పష్టంగా వివరిస్తుంది. అందుకే కుల నిర్మూలన కోసం అంబే డ్కర్ చేసిన పోరాటం రేపటి భవిష్యత్ భారతావనికి సుస్పష్టమైన మార్గదర్శక వెలుగురేఖగా నిలుస్తుంది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
సామాజిక న్యాయపోరాట యోధుడు
భారతదేశంలో కులమే అన్ని అనర్థాలకు కారణమనే భావాన్ని మదిలో నింపుకొని, సమానత్వం కోసం తుది శ్వాస వరకు పరితపించిన అరుదైన వ్యక్తి పి.ఎస్. కృష్ణన్. ఐఏఎస్ అధికారి అయిన క్షణం నుంచే అంటరాని కులాల దయనీయ స్థితిని మార్చడానికి అవిశ్రాంతంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. దళిత వాడల్లోనే ఉండి, పరిస్థితులను, పరిసరాలను గమనించిన కృష్ణన్ వాటిని ఎట్లా మార్చడమో కూడా తెలుసుకున్నారు. ఎస్సీలకు స్పెషల్ కాంపొనెంట్ ప్లాన్, స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్, అత్యాచారాల నిరోధక చట్టం, మండల్ కమిషన్ సిఫారసుల అమలు వంటి అనేక పథకాల అమలుకు అహరహం కృషి చేసిన పి.ఎస్. కృష్ణన్.. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం జీవితాన్ని వెచ్చిం చిన నిరంతర సామాజిక న్యాయపోరాట యోధుడు. అంబేడ్కర్ మరణించినరోజే ఏపీలో ఐఏఎస్గా బాధ్యతలు చేపట్టిన కృష్ణన్ ఆయన భారాన్ని తన భుజాలపై మోశారు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా సరే దానిని అమలు చేసేవాళ్ళు చెడ్డవాళ్ళైతే, రాజ్యాంగం నిష్ప్రయోజనకరంగా మారుతుంది. అలాగే రాజ్యాంగం ప్రగతినిరోధకమైనప్పుడు కూడా దాన్ని అమలు చేసేవాళ్ళు ప్రగతిశీలురవుతే రాజ్యాంగం గొప్పగా మారుతుంది. ఎప్పటికప్పుడు రాజ్యాంగమనే అతిపెద్ద కొలమానంలో ప్రతిపనిని తరచి చూసుకున్న పాలకులు ప్రజల హృదయాల్లోనే కాదు, చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. కానీ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాధినేతలు తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మలుచుకుంటున్నారంటూ బాబాసాహెబ్ అంబేడ్కర్ 1949 నవంబర్, 25వ తేదీన రాజ్యాంగ సభ చివరి రోజుకు ఒక రోజు ముందు వ్యాఖ్యానించారు. ఏడు దశాబ్దాల క్రితం అంబేడ్కర్ నోట వెలువడిన వాక్కులు ఈ రోజు అక్షరసత్యాలుగా మనముందు ఆవిష్కృతమౌతున్నాయి. రాజ్యాంగాన్ని సైతం తమ రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకుంటున్న పార్టీలూ, రాజకీయ నాయకులూ నేడు కోకొల్లలు. నిజం చెప్పాలంటే కొన్ని పార్టీలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా పాలన చేయడానికి సైతం వెనుకాడడం లేదు. అన్ని ప్రభుత్వాలలో ఈ తరహా ధోరణి కొనసాగుతూనే వచ్చింది. అయితే కొంతమంది ప్రభుత్వాధికారులు తమకున్న మానవీయ దృక్పథంతో రాజ్యాం గాన్ని ఒక ఆయుధంగా వాడుకొని దేశ సామాజిక సమస్యల పరిష్కారానికి నడుంకట్టారు. అలాంటి వారిలో ఇటీవల మన నుంచి భౌతి కంగా దూరమైన పి.ఎస్. కృష్ణన్ ఒకరు. భారత్లో కులమే అన్ని అనర్థాలకు కారణమనే భావాన్ని మదిలో నింపుకొని, సమానత్వం కోసం తుది శ్వాస వరకు పరితపించిన పీఎస్ కృష్ణన్ నవంబర్ పదవ తేదీన మరణించినప్పటికీ, ఆయన చేసిన కృషి తనను సామాజిక న్యాయపోరాటాల్లో ఎప్పటికీ సజీవంగా ఉంచుతుంది. భారత రాజ్యాంగం వెలుగులో ఆయన ప్రారంభించిన ఎన్నో కార్యక్రమాలు, రూపొందించిన ఎన్నో చట్టాలు భారత సమాజాన్ని సమానత్వం వైపు, సామాజిక న్యాయంవైపు నడిపిస్తాయనడానికి సందేహం అక్కర్లేదు. కేరళలోని తిరువనంతపురంలో 1932, డిసెంబర్ 30 వ తేదీన పి.ఎల్.సుబ్రహ్మణ్యన్, అన్నపూర్ణమ్మలకు పి.ఎస్.కృష్ణన్ జన్మించారు. తిరువనంతపురంలో హైస్కూల్ వరకు చదువుసాగించిన కృష్ణన్ ట్రావెన్కోర్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రంలో డిగ్రీ పొందారు. మద్రాసులోని క్రిస్టియన్ కళాశాలలో ఇంగ్లిష్లో మాస్టర్ డిగ్రీ చేసి, కాంచీ పురం సచియప్ప కళాశాలలో ఇంగ్లిష్ అ«ధ్యాపకునిగా పనిచేశారు. ఆయన హైస్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే కేరళలో సామాజిక ఉద్యమాలు ఉవ్వెత్తున సాగుతున్నాయి. నారాయణ గురు, అయ్యంకాళిల ప్రభావం పి.ఎస్.కృష్ణన్పైన పనిచేసింది. అదే సమయంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ సాగిస్తున్న పోరాటాలను కూడా ఆయన పత్రికల్లో చదివి ఆకర్షితులయ్యారు. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ, సామాజిక ప్రభావం, తండ్రి చెప్పిన సత్యాలు ఆయనను చిన్నతనంలోనే సామాజిక వివక్షను, అంటరానితనాన్నీ అర్థం చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి. ఈ విషయాలతో పాటు తాను ప్రత్యక్షంగా చూసిన అసమానతలూ, వివక్ష ఆయన హృదయాన్ని ఎంతగానో రగిల్చాయి. పి.ఎస్.కృష్ణన్ ఐఏఎస్ అధికారి అయిన మరునాటి నుంచే అంటరాని కులాల దయనీయ స్థితిని మార్చడానికి అవిశ్రాంతంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. 1956 మే 2న ఐఏఎస్ శిక్షణ ప్రారంభమైన రెండు నెలల్లోనే ఢిల్లీ సమీపాన ఉన్న అలీపూర్ పంచాయతీ పరిధిలోని బడ్లీ గ్రామానికి అధ్యయనం కోసం వెళ్ళారు. అధ్యయనంకోసం వెళ్ళిన మిగిలిన బృందంతో విడిపోయి ఎస్సీలు నివసించే బస్తీవైపుకి తనకి తెలియకుండానే అడుగులు వేసేవారు. అదే సందర్భంలో ఈశ్వర్ దాస్ అనే దళితుడు శరీరం నిండా పొక్కులు ఉన్న శిశువును ఎత్తుకొని ఉండడం చూసి కృష్ణన్ చలించిపోయాడు. మరుసటిరోజు ఐఏఎస్ ట్రైనింగ్ స్కూల్డాక్టర్ను తీసుకెళ్ళి, ఆ శిశువుకు చికిత్స చేయించారు. ఇది ఆయన ఆలోచనను మరింత పదునెక్కించింది. ఢిల్లీ పరిసరాల్లోనే ఇలా ఉంటే, మారుమూల పల్లెల్లో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందోనని ఆరోజే ఆలోచించారు పి.ఎస్. కృష్ణన్ శిక్షణను ముగించుకున్న కృష్ణన్ 1956లోనే ఆంధ్ర ప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా నియమితులయ్యారు. 1956వ సంవత్సరం భారతదేశం ఒక గొప్ప మేరు పర్వతాన్ని కోల్పోయింది. 1956 డిసెంబర్ 6వ తేదీన బాబాసాహెబ్ అంబేడ్కర్ మహాపరినిర్వాణం పొందారు. అదే సంవత్సరం పీఎస్ కృష్ణన్ ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టడం కాకతాళీయమే కావచ్చు, కానీ ఆ తరువాత ఆ హోదాలో పి.ఎస్. కృష్ణన్ సాధించిన విజయాలను చూస్తే, అంబేడ్కర్ తన బాధ్యతలను పి.ఎస్. కృష్ణన్ భుజస్కంధాలపై ఉంచి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఈ రోజు బలహీన వర్గాల కోసం, ప్రత్యేకించి ఎస్సీల కోసం ఆయన రూపొందించిన పథకాలు, రూపొందించిన చట్టాలను పరిశీలిస్తే మనం ఎవ్వరం కాదనలేం. ఆయన ప్రారంభించిన పథకాలన్నీ, కూడా అనుభవం నుంచి రూపొందినవే. ఊరు బయట ఉన్న దళిత వాడల గాలికూడా తమ మేనుకి సోకనివ్వని అధికారులు అప్పుడే కాదు, ఇప్పటికీ కూడా ఉన్నారు. ఆ రోజు అది ఊహించడానికి కూడా వీలు లేనిది. కానీ పి.ఎస్. కృష్ణన్ ఒక గ్రామం వెళితే ముందుగా అంటరాని కులాలు నివసించే చోటకు వెళ్ళేవారు. వాళ్ళు ఏం తింటే అదే తినడం ఆయన ఒక అలవాటుగా మార్చుకున్నారు. అక్కడే ఉండి, పరిస్థితులను, పరిసరాలను గమనించిన కృష్ణన్ వాటిని ఎట్లా మార్చడమో కూడా తెలుసుకున్నారు. అప్పటివరకు భారత ప్రభుత్వంలో మూడే మూడు పథకాలు ఉండేవి. ఆ పథకాలు కూడా 1949కి ముందు బాబాసాహెబ్ అంబేడ్కర్ బ్రిటిష్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కాలంలో ప్రవేశపెట్టారు. అవి, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, విదేశీ చదువుకు ఉపకారవేతనాలు, ఉద్యోగాలలో రిజర్వేషన్లు. అవి మినహా ప్రభుత్వాలు ఎటువంటి నూతన పథకాలనూ అమలు చేయడం ప్రారంభించలేదు. ఆ విషయాలను గమనించిన పి.ఎస్. కృష్ణన్ రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో భాగమైన ఆర్టికల్ 46 ప్రకారం ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యత ఉన్నదని గుర్తించారు. ‘‘అణగారిన వర్గాలు ప్రత్యేకించి, షెడ్యూల్డ్ కులాలు, తెగలను విద్య, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని, అన్ని రకాల సామాజిక వివక్షల నుంచి, దోపిడీ, పీడనల నుంచి విముక్తి కలిగించాలి’’ అని ఆదేశిక సూత్రం పిఎస్. కృష్ణన్ చేతిలో ఒక బలమైన ఆయుధంగా మారింది. ఒకవైపు దళితుల దయనీయ స్థితి, రెండోవైపు రాజ్యాంగం అండదండలు పి.ఎస్. కృష్ణన్ను ప్రభుత్వాధినేతలపై పోరాడే స్థైర్యాన్నిచ్చాయి. అందుకే వారి సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వాలు రూపొం దిస్తున్న బడ్జెట్లలో ఈ వర్గాలకు తగిన వాటా లభించాలని వాదిం చారు. వారి కోసం ప్రత్యేకమైన ప్రణాళికలు, బడ్జెట్ కేటాయింపులు లేకపోతే, సామాజిక వివక్ష నుంచి వాళ్ళు విముక్తి కాలేరని భావిం చారు. అందుకోసమే మొదటగా ఎస్సీలకోసం స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ ను రూపొందించి కేంద్ర ప్రభుత్వం చేత ఒప్పించారు. 1978 లోనే దీనికి అంకురార్పణ జరిగింది. 1980లో ఇందిరాగాంధీ పాలనలో దీనికి బలమైన పునాదులు పడ్డాయి. ఈ పథకం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో సమాంతరంగా అమలు జరగాలని, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందిస్తున్న పథకాలలో ఏవైనా బడ్జెట్ లోటు ఏర్పడితే స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్(ఎస్సిఏ)ను అందించాలని సూచించారు. అదే విధంగా అత్యాచారాల నిరోధక చట్టం. మండల్ కమిషన్ సిఫారసుల అమలు, బౌద్ధం తీసుకున్న ఎస్సీలకూ, ఎస్టీలకూ అందేవిధంగా జీవోలు అన్నీ ఈయన చేతి నుంచి వచ్చిన సంక్షేమ ఫలాలేనన్న విషయం చాలామందికి తెలియదు. ఎస్సీ, ఎస్టీలలో అభివృద్ధి చెందిన కొన్ని కులాలు మిగతా వారిని తమతో పాటు తీసుకెళ్ళాలనీ, వారికి నాయకత్వం వహించాలని సూచించారు. రిటైరై ఇప్పటికి ఇరవైఏళ్ళు గడిచిపోయింది. కానీ ఆయన తన సంక్షేమ సాధన, సామాజిక న్యాయ సాధన మార్గాన్ని విడిచిపెట్టలేదు. తనకున్న గౌరవాన్ని తనకోసం కాకుండా, ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం వెచ్చించిన నిరంతర సామాజిక న్యాయపోరాట యోధుడు ఆయన. బాబాసాహెబ్ అంబేడ్కర్ చెప్పినట్టు ఇటువంటి వ్యక్తుల చేతుల్లోనే రాజ్యాంగం సంపూర్ణంగా అమలు జరుగుతుంది. ఈ కాలం అధికారులు పీఎస్. కృష్ణన్, ఎస్.ఆర్. శంకరన్ల నుంచి అందిపుచ్చుకోవాల్సింది సరిగ్గా ఇదే మరి. అదేమిటంటే అంకితభావం, నిరంతర దీక్ష అణగారిన వర్గాల అభివృద్ధిపట్ల చిత్తశుద్ధితో పనిచేయడం. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
సార్వత్రిక ఓటుహక్కు ప్రదాత అంబేడ్కర్
‘‘ప్రభుత్వంలో భాగస్వాములు కావడానికి ఉన్న అవకాశాలను ఎవరికీ కూడా నిరాకరించకూడదు. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేసినంత మాత్రానే ప్రజా ప్రభుత్వం అనిపించుకోదు. పాలనలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ప్రజల చేత కూడా ఆ ప్రభుత్వం నిర్వహించబడాలి’’ అని బాబాసాహెబ్ అన్న మాటలకు సరిగ్గా నిండా నూరేళ్ళు. మాంటెగ్ చెమ్స్ఫర్డ్ కమిటీ నియమించిన సౌత్ బరో బృందం ముందు హాజరైన బాబాసాహెబ్ అంబేడ్కర్ 1919లో భారత ప్రజలందరి పక్షాన ఈ ప్రకటన చేశారు. అంబేడ్కర్ రాజకీయ జీవితంలో ఇదే మొట్టమొదటి కార్యాచరణ. భారత ప్రజలకు పరిపాలనలో భాగస్వామ్యం కల్పించాలనే డిమాండ్పైన ఏర్పాౖటెన మాంటెగ్ చెమ్స్ఫర్డ్ కమిటీ అధ్యయనం తర్వాత మరింత అవగాహన కోసం లార్డ్ సౌత్ బరో అధ్యక్షతన ఒక బృందాన్ని నియమించారు. ఆ బృందం అనేక మందిని సంప్రదించి ఒక నివేదికను రూపొందించింది. ఒక అంటరాని యువకుడుగా 1913లో అమెరికాకు వెళ్ళిన అంబేడ్కర్, 1917 మార్చిలో బొంబాయి తిరిగి వచ్చేనాటికి ఒక గొప్ప ప్రజాస్వామికవాదిగా, హక్కుల నాయకుడిగా తనను మలుచుకున్నట్టు మనకు కనిపిస్తాడు. న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తోన్న సమయంలో కూతవేటు దూరంలో ఉన్న హర్లెంలో నల్లజాతి పునరుజ్జీవనోద్యమం పురుడుపోసుకుంటున్నది.. నల్లజాతి బానిసత్వం కన్నా, అంటరానితనం అత్యంత అమానుషమైనదనే విషయాన్ని కూడా ఆయన గ్రహించారు. దీనితో పాటు, అంబేడ్కర్ గురువు జాన్ డ్యూయి మార్గదర్శకత్వం కూడా అంబేడ్కర్ను గొప్ప ప్రజాస్వామ్య వాదిగా రూపుదిద్దుకోవడానికి తోడ్పడింది. జాన్డ్యూయి 20వ శతాబ్దంలో ప్రజాస్వామిక తాత్వికవేత్త. తనవద్ద విద్యను అభ్యసించడం వల్ల అంబేడ్కర్కు ప్రజాస్వామ్యమంటే ఎంతో ఉన్నతమైన అభిప్రాయం ఏర్పడింది. వీటికి తోడుగా, అప్పటికే మహారాష్ట్రలో ఉన్న సామాజిక, రాజకీయ పరిస్థితులు కూడా అంబేడ్కర్ను ఒక గొప్ప నాయకుడిగా రూపుదిద్దుకోవడానికి కారణాలయ్యాయి. 19వ శతాబ్దంలో జ్యోతీరావు ఫూలే సాగించిన కుల వివక్ష వ్యతిరేక పోరాటం అంబేడ్కర్ను ప్రభావితం చేసింది. అందుకే అంబేడ్కర్ జ్యోతీరావుఫూలేను తన గురువుగా కూడా ప్రకటించుకున్నారు. జ్యోతీరావు ఫూలే ఆచరణ, సిద్ధాం తాలతో సామాజిక న్యాయం కోసం నడుంబిగించిన కొల్లాపూర్ సంస్థానాధీశుడు సాహుమహారాజ్ 1902లోనే బ్రాహ్మణేతర వర్గాలందరికీ విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ప్రకటించి, అమలు చేశారు. అంటరాని కులాలకోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. ఈ అంశాలు కూడా అంబేడ్కర్కు ఎంతో ధైర్యాన్నీ, శక్తినీ అందించాయి. ఆయన చిన్ననాటి నుంచి అనుభవించిన అనేకానేక అనుభవాల సారం, సామాజిక పరిస్థితుల కలబోత ప్రపంచదేశాల ఎదుట అంబేడ్కర్ను గొప్ప దార్శనికుడిగా నిలిచేలా చేసింది. బాబాసాహెబ్ అంబేడ్కర్ వంద ఏళ్ళ కిందట అమెరికాలో విద్యను అభ్యసించి. తన వ్యక్తిగత జీవితంకోసం కాకుండా, తాను జన్మించిన సామాజిక వర్గం విముక్తి కోసం సమరం ప్రారంభించడం సౌత్బరో కమిటీతోనే ప్రారంభం అయ్యింది. అయితే అప్పటికే మహారాష్ట్రలో అంటరానికులాల వివక్షపై మహర్షి వి.ఆర్.షిండే నాయకత్వంలో 1906లో ‘డిప్రెస్డ్ క్లాస్ మిషన్’ను ప్రారంభించారు. 1918లో వి.ఆర్.షిండే ఆధ్వర్యంలో బరోడా సంస్థానాధీశుడు సాయాజిరావు గైక్వాడ్ అధ్యక్షతన అఖిల భారతీయ అసృ్పశ్య నివారక్ పరిషత్ సదస్సు జరిగింది. అయితే ఈ సంస్థలు ఏవీ కూడా సౌత్బరో కమిటీ ముందు తమ వాదనలను వినిపించలేదు. అంబేడ్కర్ వ్యక్తిగతంగానే సౌత్ బరో కమిటీ ముందు అంటరానికులాల రాజకీయ హక్కులను మొదటిసారిగా వినిపించారు. ‘కొంకణ్ ప్రాంతంలో అందరూ నడిచే దారుల్లో అంటరాని వాళ్ళు వెళ్ళకూడదు. ఎవరైనా ఆధిపత్య కులాల వ్యక్తి ఎదురుపడితే, తమ నీడ ఆయన మీద పడనంత దూరం జరగాలి అని, ఇది ఒక కేవలం ఒక దృష్టాంతం మాత్రమేనని అంబేడ్కర్ వివరించారు. 1909లో అమలులోకి వచ్చిన చట్టం వల్ల కొన్ని కులాలకు అధికారంలో భాగస్వామ్యం వచ్చిందనీ, ముస్లిలకు ప్రత్యేక ఓటింగ్ విధానమే అమలులోకి వచ్చింది, కానీ, తరతరాలుగా సమాజంలో నుంచి వెలివేతకు గురైన అంటరాని కులాలు ఏనాడూ ఈ సమాజంలో భాగం కాలేకపోయాయనీ అంబేడ్కర్ కమిటీ ముందు వివరిం చారు. ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వం కో–ఆప్ట్ చేస్తే సరిపోతుందని కొందరు చేసిన వాదనను అంబేడ్కర్ తిరస్కరించారు. ప్రజాప్రతినిధులను ప్రజలే ఎన్నుకోవాలి తప్ప, ఇతర కులాల సభ్యులు నియమించడం ప్రజాస్వామ్యం కాబోదనీ, దాని వల్ల ఆయా కులాలకు అనుకూలంగా ఈ ప్రజాప్రతినిధులు మారే ప్రమాదం ఉంటుందనీ, లేదా వారికి అనుకూలంగా ఉండేవారు మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఎంపికయ్యే ప్రమాదాన్ని ఆనాడే అత్యంత స్పష్టంగా అంబేడ్కర్ వాదించారు. సౌత్బరో కమిటీ ముందు అంబేడ్కర్ మూడు ముఖ్యమైన ప్రతిపాదనలు ఉంచారు. 1. అంట రాని కులాల పక్షాన తమ వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు ఎన్నికకాకపోతే, అంటరానితనం నిర్మూలన కాదు. 2. కౌన్సిళ్లలో అంటరాని కులాల ప్రజాప్రతినిధులు ఆధిపత్య కులాలకు సంబంధిం చిన మెజారిటీ సభ్యులని మించకూడదని, ప్రభుత్వమే అంటారని కులాల నుంచి తగు సమర్థులను ఎంపిక చేయాలని అంబేడ్కర్ వాదించారు. 3. అంటరాని కులాలు రాజకీయంగా ఎదగాలంటే, వారి అభ్యర్థుల్ని వారే ఎన్నుకునే విధానం అమలు చేయాలని అంబేడ్కర్ కోరారు. అంతేకాకుండా, ప్రతి పౌరుడికీ చదువు, సంపద కాకుండా ఓటింగ్ హక్కు ఉండాలని వాదించిన తొలి వ్యక్తి కూడా అంబేడ్కరే. అప్పటికీ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 34 ఏళ్ళు గడిచినప్పటికీ ఇటువంటి అత్యంత ప్రధానమైన రాజకీయ డిమాండ్ను చేసిన పాపాన పోలేదు. 1919లో ప్రారంభమైన ఆయన రాజకీయ హక్కుల పోరాటం 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ ఆమోదించిన రాజ్యాంగంతో ఒక దశకు చేరింది. ఒకవైపు అంటరాని కులాల హక్కుల కోసం పోరాడుతూనే రెండో వైపు భారత ప్రజ లందరి తరఫున రాజ్యాంగ సభలో గళమెత్తి, అప్పటికీ ప్రపంచంలోని చాలా దేశాల్లో అమలులో లేని సార్వజనీన ఓటింగ్ హక్కును రాజ్యాంగంలో చేర్చారు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు ఉద్దండులు అందరికీ ఓటింగ్ హక్కును వ్యతిరేకించారు. చివరకు అందరికీ ఓటింగ్ హక్కును అందించిన మహనీయుడిగా అంబేడ్కర్ చరిత్రలో నిలిచిపోయారు. దళిత ప్రజాప్రతినిధులను దళితులే ఎన్నుకోవాలన్న అంబేడ్కర్ తొలి పోరాట నినాదం ఇంకా అసంపూర్తిగానే ఉన్నది. సపరేట్ ఎలక్టోరేట్ విధానం ప్రాధాన్యతను ఎలుగెత్తి చాటిన అంబేడ్కర్ లోతైన దార్శనికత నేటి రాజకీయాల్లో ఎంత కీలకమైనదో రుజువవుతూనే ఉన్నది. సపరేట్ ఎలక్టోరేట్ విధానం లేకపోవడం వల్ల నిజమైన దళిత ప్రతినిధులు ఎన్నిక కావడం లేదు. రాజకీయ పక్షాలను, ఆధిపత్య కులాల ప్రయోజనాలను కాపాడే వాళ్ళు మాత్రమే ఎన్నికవుతున్నారు. ఇప్పటికింకా ఈ రోజు దళిత సమాజం ముందున్న అత్యంత ముఖ్యమైన కర్తవ్యం ఏదైనా ఉందీ అంటే అది సపరేట్ ఎలక్టోరేట్ విధానం కోసం పోరాడటమే. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
అది స్వర్ణయుగమేనా?!
‘‘ఒక చరిత్రకారుడు నిక్కచ్చిగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఉండాలి. భావోద్వేగాలకూ, రాగద్వేషాలకూ అతీతంగా వ్యవహరించాలి. చరిత్రలో నిజాలకు మాత్రమే సముచిత స్థానం ఉంటుంది. సత్యం చరిత్రకు తల్లిలాంటిది. గతంలో జరిగిన సంఘటనకు చరిత్ర సాక్ష్యంగా నిలవడం మాత్రమే కాదు, భవిష్యత్తుకు దిక్సూచిగా మారుతుంది’’ అన్న బాబాసాహెబ్ అంబేడ్కర్ వ్యాఖ్యలు చరిత్ర అధ్యయనానికీ, చారిత్రక గమనాన్ని అర్థం చేసుకోవడానికీ మార్గదర్శకంగా నిలుస్తాయి. భారతదేశ చరిత్రను అత్యంత ప్రతిభతో అధ్యయనం చేసిన మహనీయులలో ఆయన ఒకరు. అయితే ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్షా చరిత్రపై చేసిన వ్యాఖ్యానాలు వేల ఏళ్ళ భారత చరిత్రను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయి. సత్యాన్ని మరుగుపరిచి, అసత్యాలకు పట్టంగట్టేవిగా ఉన్నాయి. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో గతవారం గుప్తుల సామ్రాజ్యంలో ఒక రాజైన స్కందగుప్తునిపై వెలువరించిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ ‘‘భారతదేశ చరిత్రను బ్రిటిష్, మొఘల్ల ఆలోచనా దృక్పథంలో రాశారు. అందుకే చరిత్రను తిరగరాయాలి. గుప్తుల కాలం ఒక స్వర్ణయుగం. అందులో స్కందగుప్తుడు హూణులను ఓడించిన వీరుడు’’ అంటూ అమిత్షా ప్రశంసల వర్షం కురిపించారు. దేశ చరిత్రను అధ్యయనం చేసిన వాళ్లనూ, అప్పటి లిఖితపూర్వకమైన గ్రంథాలను చూసిన వాళ్లనూ ఈ వ్యాఖ్యలు కొంత ఆలోచనలో పడేస్తాయి. చరిత్రను అధ్యయనం చేయడానికి గతంలో రెండే రెండు ఆధారాలు ఉండేవి. ఒకటి సాహిత్యం – అందులో మౌఖిక సాహిత్యం, లిఖిత సాహిత్యం ఉన్నాయి. రెండోది పురాతత్వ శాస్త్ర పరిశోధనలు. కానీ ఇటీవల శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చిన పురోగతి మూడో చారిత్రక అస్త్రంగా అందివచ్చింది. అందువల్ల సత్యాలను దాచేస్తే దాగే పరిస్థితి లేదు. బౌద్ధాన్ని నిలువరించాలనుకున్న వైదిక మత ప్రబోధకులకు గుప్తుల కాలం బలమైన అండదండలను అందిం చింది. క్రీ.శ.మూడవ శతాబ్దం నుంచి ఆరవ శతాబ్దం వరకు కొనసాగిన గుప్తుల సామ్రాజ్యంలో వైదిక మతం తన భావజాలాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి పథకాలు రచించింది. భారత సామాజిక వ్యవస్థను కులాలుగా విడగొట్టి వర్ణవ్యవస్థను పటిష్టం చేసిన మనుధర్మం సంపూర్ణమైన రూపం తీసుకున్నది గుప్తుల కాలంలోనే. అప్పటి వరకు చాలా ప్రయత్నాలు జరిగినప్పటికీ కులాలను విడ గొట్టి ప్రతి కులానికీ ఒక స్పష్టమైన విధివిధానాలను రూపొందించింది ఆకాలంలోనే. దానికి వారు సంస్కృతాన్ని ఒక సాధనంగా వాడుకున్నారు. అప్పటి వరకు బహుళ ప్రాచుర్యంలో ఉన్న పాళి, ప్రాకృతం, పైశాచిలాంటి భాషలను దాదాపు ధ్వంసం చేశారు. తర్వాతనే దేవాల యాలు, వాటిలో ఆరాధనలు పుట్టాయి. అందులో భాగం గానే బౌద్ధాన్ని ఒకవైపు దెబ్బతీస్తూనే, రెండోవైపు గౌతమ బుద్ధుడిని విష్ణువు అవతారంగా ప్రకటించారు. lతపస్సుగానీ, జ్ఞానసముపార్జనగానీ కేవలం బ్రాహ్మణులు చేయాలనే దానికి రామాయణంలో ప్రముఖ స్థానం కల్పించారు. శంబూక వథ అందులో భాగమే. అదే సమయంలో బౌద్ధాన్ని ఇంకా పాటిస్తున్న వాళ్ళను, వైదిక మతాన్ని కుల వ్యవస్థను నిరసిస్తున్న వాళ్ళను అంటరాని వాళ్ళుగా ముద్రవేసి, ఊరవతలికి నెట్టివేశారు. ఆనాడు సమాజంలో వేళ్ళూనుకున్న అదే భావన నేటికీ అంటరానితనపు కుచ్చితత్వాన్ని వెలివాడల రూపంలో కొనసాగిస్తోంది. బౌద్ధులను గ్రామాల్లోనికి రానివ్వద్దని, వారి ముఖం చూడకూడదని నిబంధనలు విధించారు. ఆ సమయంలో రాసిన మృచ్ఛకటికం సంస్కృత నాటకంలో ఇటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంటే గుప్తుల కాలం స్వర్ణయుగం కాదు. అది వర్ణయుగం. వర్ణ వ్యవస్థను కుల వ్యవస్థగా విడగొట్టి సమాజాన్ని మరిన్ని ముక్కలుగా విడగొట్టిన కాలమది. పశ్చిమబెంగాల్లోని ‘‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జినోమిక్స్’’ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టి ట్యూట్’’కు చెందిన ‘‘హ్యూమన్ జెనెటిక్స్ యూనిట్’’లు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో గుప్తుల కాలంలో కుల వ్యవస్థ బలపడిందని తేల్చాయి. అయితే అమిత్షా లాంటి వాళ్ళు ఇటువంటి విష యాలు తెలియక మాట్లాడుతున్నారో, లేదా మళ్లీ ఒకసారి అటువంటి యుగంలోకి తీసుకెళ్ళి కులవ్యవస్థ సరైనదే, దానిని కొనసాగించాలనే అభిప్రాయాన్ని ప్రజల మెదళ్ళలో నాటడానికి ప్రయత్నిస్తున్నారో అన్న ప్రశ్నలు తలెత్తక మానవు. దాదాపు రెండువేల సంవత్సరాలుగా కొనసాగుతున్న కుల వ్యవస్థకు మనువులాంటి వాళ్ళు రూపొందించిన కుల చట్టాలను, చట్రాలను పక్కకు తోసి 1950 సంవత్సరంలో భారత ప్రజలందరూ సమానులేననే ఒక చట్టాన్ని రాజ్యాంగం ద్వారా రూపొందించుకున్నాం. అమిత్ షా లాంటి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు భారత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయనడంలో సందేహం లేదు. ఇటువంటి మాటలు మాట్లాడేముందు చరిత్రను ఆధునిక దృక్పథంతో సత్యం పునాదిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సమాజ రథచక్రాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించాలేగానీ, వెనక్కి తిప్పకూడదు. ఇది వాంఛ నీయం కాదు. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, 81063 22077 -
ప్రాణదాత ఎవరు.. ప్రాణహర్త ఎవరు?
పూనాలోని ఎరవాడ జైలులో మహాత్మాగాంధీ నిరాహారదీక్ష చేస్తున్నారు. మహాత్మా గాంధీ దీక్ష పైనే యావత్ దేశమంతా చర్చిం చుకుంటోన్న సందర్భమది. ఆ దీక్షకు ఓ ప్రత్యేకత ఉన్నది. అంట రాని కులాలకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ఓటింగ్ విధానంపైన గాంధీ నిరసన. ప్రత్యేక ఓటింగ్ విధానం ద్వారా ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించి, వారి శాసనసభలకు వారి ప్రతినిధులను వారు మాత్రమే ఎన్నుకునే అవకాశాన్ని కల్పించిన విధా నమది. ఆ విధానాన్ని అమలు చేస్తే, దేశం విచ్ఛిన్నానికి గురవుతుందని, హిందువులు నిట్టనిలువునా చీలిపోతారని గాంధీ పూర్తిగా వ్యతిరేకించారు. 1932 సెప్టెంబర్ 20న గాంధీ నిరాహారదీక్ష ప్రారంభించారు. ప్రత్యేక ఓటింగ్ విధాన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేంతవరకు తన నిరా హారదీక్ష విరమించేది లేదని గాంధీ స్పష్టం చేశారు. గాంధీ అనుచరులైన మదన్మోహన్ మాలవ్యా, సప్రూ, జయకర్, బాబూ రాజేంద్రప్రసాద్ తదితరులు ప్రత్యేక నియోజక వర్గాలను ఉపసంహరించుకోవాలని, లేనట్లయితే గాంధీ ప్రాణం ప్రమాదంలో పడుతుందని అంబేడ్కర్తో అనేక సార్లు చర్చించారు. అయితే అంటరానికులాలకు లభించిన రాజకీయ హక్కును వదులుకోవడానికి సిద్ధంగా లేనప్పటికీ, రోజు రోజుకీ క్షీణిస్తోన్న గాంధీజీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, కొన్ని మార్పులతో మరొక సరికొత్త విధానానికి అంబేడ్కర్ అంగీకరించారు. దానినే పూనా ఒడంబడిక అని అంటారు. దానితో గాంధీ సెప్టెంబర్ 24వ తేదీన నిరసన దీక్ష విరమించారు. ఇది చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. గాంధీ ప్రాణం కోసం అంబేడ్కర్, అంటరాని కులాలు చేసిన త్యాగం. ప్రత్యేక ఓటింగ్లో ప్రత్యేక నియోజకవర్గాలను వదులుకో వడం వల్ల ఎస్సీ, ఎస్టీ రాజకీయ ప్రతినిధులు తప్పనిసరిగా పార్టీలకు లోబడి ఉండాల్సిన స్థితి. అంతే తప్ప నిజంగా ఎవరైతే సమాజంలో అణచివేతకూ, అన్యాయానికీ గురవు తున్నారో వారి పక్షాన నిలబడలేకపోతున్నారు. ఎవరికి ప్రాతినిధ్యం వహించాలో వారికి ప్రాతినిధ్యం వహించలేక పోతున్నారు. ఈ విషయాలు అంబేడ్కర్ని ఆలోచనలో పడే శాయి. కానీ మానవతా వాదిగా బాబాసాహెబ్ అంబేడ్కర్ తనని తాను తగ్గించుకొని, గాంధీ ప్రాణాలు నిలబెట్టారు. సరిగ్గా దీనికి విరుద్ధంగా జరిగిందే మహాత్మాగాంధీ హత్య. హిందూమత సముద్ధరణ కోసం ఆధునిక కాలంలో అత్యంత ఎక్కువగా ఆలోచించిన వారిలో మోహన్దాస్ కరంచంద్ గాంధీ ప్రముఖులు. ఆయన ఛాందస హిందువు కాకపోయినా, సామాజిక విప్లవకారుడు మాత్రం కాదు. కుల వ్యవస్థను వ్యతిరేకిస్తూనే, అంటరానితనం పోవాలం టూనే, వర్గవ్యవస్థను సమర్థించిన సనాతన వాది. రామ నామాన్ని ఆధునిక ప్రపంచంలో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి ఎంతో మందిని హిందూమతం వైపు ఆకర్షించిన వ్యక్తి గాంధీజీ. అయితే హిందూమతంతో పాటు ఇతర మత విశ్వాసాలను గౌరవించాలని, సహజీవనం చేయాలని, సామరస్యంగా ఉండాలని భావించిన ఆధునికుడు గాంధీజీ. నిజానికి గాంధీ వృత్తిపరమైన జీవితాన్ని ప్రారం భించింది అబ్దుల్లా అనే ఒక ముస్లిం కంపెనీతో. దక్షిణా ఫ్రికాలో ఆ కంపెనీలోనే గాంధీ తొలుత పనిచేశారు. నిజా నికి గాంధీలో అన్నిమతాలను కలుపుకుపోవాలనే ఆలోచ నకు రూపకల్పన జరిగింది దక్షిణాఫ్రికాలోనే. భారత దేశం నుంచి దక్షిణాఫ్రికాలో స్థిరపడిన భారతీయులందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చిన వారు గాంధీజీయే. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలు అందరితో సఖ్యతగా ఉంటూ, భారతీయుల హక్కుల కోసం పోరాడిన అను భవం గాంధీకి ఉన్నది. దక్షిణాఫ్రికా నుంచి భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత ఇదే కార్యాచరణను కొనసాగిం చారు. అందుకే భారతదేశంలో హిందువుల తర్వాత అధిక సంఖ్యలో ఉన్న ముస్లింల సమస్యలను చాలా శ్రద్ధతో పరి శీలించి, సంపూర్ణ మద్దతును అందజేశారు. 1919 నాటి ఖిలాఫత్ ఉద్యమానికి అండదండగా నిలిచారు. అలా ప్రతిచోటా ముస్లింలకు తోడుగా నిలబడ్డాడని హిందూమత సంస్థల వాదన. చివరకు పాకిస్తాన్ విభ జనలో గాంధీ పాత్ర ఉన్నదనే ఆరోపణలు కూడా చేశాయి. దీంతోనే హిందూమత ఆవేశం ఒంటపట్టించుకున్న నాథూరాం గాడ్సే గాంధీజీని కాల్చి చంపారు. హిందువు లపై దాడులను గాంధీ ఖండించలేదని, గాంధీని అంత మొందించడం ఏదో ఉద్రేకంలోనో, క్షణికావేశంలోనో చేసిన హత్యకాదని కూడా ఆయన ప్రకటించారు. నిజానికి గాడ్సే ఇటువంటి చర్యకు పాల్పడటానికి ఆ రోజు మహారాష్ట్రలో హిందూ మహాసభ, హిందూ సంఘటన సంస్థల ప్రచారం కారణం కావచ్చు. తిలక్ నుంచి వీర్సావర్కార్ వరకు హిందువుగా జీవించు, హిందువుగా మరణించు అనే ఒక తీవ్రవాద భావజాలం గాడ్సేను ఈ హత్యకు పురిగొల్పింది. గాంధీ ప్రాణాన్ని కాపాడిన వ్యక్తి గాంధీ భావజాలాన్ని పూర్తిగా నిరసించినవాడు. ఆయన అభిప్రాయాలను తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి అంబేడ్కర్. గాంధీని మహా త్ముడు కాదని ప్రకటించే సాహసం ఆనాటికి ఎవ్వరికీ లేదు. అది అంబేడ్కర్ చేశారు. గాంధీని మిస్టర్ గాంధీ అని పిలి చిన ఏకైక భారతీయుడు కూడా అంబేడ్కరే. అంబేడ్కర్ గానీ, అంబేడ్కర్ వాదులుగానీ, శాంతియుతంగా ప్రజా స్వామ్యయుతంగా సిద్ధాంతాలను, రాజకీయాలను ఎదు ర్కోవాలని భావించిన వాళ్ళు. ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవాలని వాళ్లేనాడూ భావించలేదు. అంబేడ్కర్ గాంధీని తన వాదనలతోనే ఎదుర్కొన్నారు. కానీ హిందు వుల రక్షణ పేరుతో హిందూ మతాన్ని ఆధునికతవైపు తీసు కెళుతూన్న గాంధీని కాల్చి చంపింది కూడా హిందువే కావడం గమనార్హం. భావజాలంపైన వ్యతిరేకత ఉంటే, దానిని వాదన ద్వారా ఓడించాలి. ఎవరివైనా తప్పుడు భావాలనిపిస్తే వాటిని సిద్ధాంతపరంగా ఎండగట్టాలి. అంతేకానీ వ్యక్తు లను నిర్మూలించడం ద్వారా భావజాలాన్ని చంపాలనుకో వడం ఏ మతానికైనా సరైన పరిష్కారం కాదు. ఇటీవల ఈ అసహనం మరింత పెచ్చరిల్లుతున్నది. ఇటీవల గౌరీ లంకేష్, గోవింద్ పన్సారీ, కల్బుర్గిలను ఇదే ఉన్మాదంతో హత్యచేయడం గాడ్సే విద్వేషపూరిత హింసా వారసత్వాన్ని కొనసాగించడమేనని భావించాలి. ఇవాళ మహాత్మా గాంధీ 150వ జయంతి జరుపుకుంటున్న భారత దేశం ఆయనలో ఉన్న సర్వమత సామరస్యం, సోదరభావం, మానవతా దృష్టిని అలవర్చుకుంటే శాంతిబోధకుడు బుద్ధుడు నడయాడిన నేలగా ఈ దేశానికి సార్థకత లభిస్తుంది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
విమర్శిస్తే రాజద్రోహమా?!
తమ భావాలు, రాజకీయాలూ, సిద్ధాంతాలూ మాత్రమే సరైనవనీ, ఇతరుల అభిప్రాయాలన్నీ తప్పేనన్న భావన సమాజాన్ని ఎంతటి తిరోగమనంలోకి నెడుతుందో అర్థం చేసుకోలేకపోతే ఏ ప్రభుత్వమూ ఎంతో కాలం మనుగడ సాగించలేదు. ప్రభుత్వాల మీద ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పే స్వేచ్ఛ ఉంటే, అది ప్రజల కన్నా ప్రభుత్వాలకే ఎక్కువ ప్రయోజనకరం. ఎవరైనా ప్రభుత్వాన్ని, అధికార వ్యవస్థలను విమర్శిస్తే అది రాజద్రోహమని భావిస్తే అది అధికారంలో ఉన్న వారికే చేటు అవుతుంది. వ్యవస్థలపై విమర్శలను అణచివేతతో ఎదుర్కోవాలని భావిస్తే, ప్రజాస్వామ్య పాలనకు బదులు అది పోలీస్ రాజ్యంగా మారిపోగలదు. ఎప్పుడైనా నిరసనను, కోపాన్ని అణచివేస్తే, పెరిగి పెరిగి అది ఒక అగ్నిపర్వతంలా మారుతుంది. అప్పుడు మనల్ని మనం పరిరక్షించుకోవడానికి ఏ చిన్న అవకాశం కూడా మిగలని రోజొకటొస్తుంది. ‘‘అధికార యంత్రాంగం, న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ, సైనిక బలగాలపై చేసే విమర్శలను రాజద్రోహ నేరంగా పరిగణించకూడదు. అది దేశ ద్రోహం కూడా కాదు. ఒకవేళ ఈ వ్యవస్థలపై విమర్శలను అణచి వేతతో ఎదుర్కోవాలని భావిస్తే, ప్రజాస్వామ్య పాలనకు బదులు అది పోలీస్ రాజ్యంగా మారిపోగలదు’’ అని సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ దీపక్గుప్తా అన్న మాటలు ఈ రోజు దేశంలోని ప్రజా స్వామ్య వ్యతిరేకుల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత శనివారం అహ్మదాబాద్లో జరిగిన న్యాయవాదుల సదస్సులో ఆయన మాట్లా డుతూ ‘‘పాత ఆలోచనలలో ఉన్న లోపాలను వ్యతిరేకించడం వల్లనే నూతన అభిప్రాయాలకు పురుడుపోసిన వాళ్లమవుతాం. పాత విధా నాలను కొనసాగించినట్లయితే, నూతన వ్యవస్థలకు అంకురార్పణ జరగనే జరగదు’’ అంటూ ప్రజాస్వామ్య మూలాలను తడిమిచూసే కీలకమైన తాత్విక చర్చకు తెరతీశారు. గత కొన్నేళ్ళుగా, భిన్నాభిప్రాయాలను, భిన్నమైన ఆలోచనలను జాతి ద్రోహంగా, దేశ ద్రోహంగా పరిగణించి, అణచివేత పద్ధతులను అనుసరించడం తీవ్రతరమైంది. అలా ఆలోచించిన వాళ్ళకు ఈ దేశంలో నివసించే హక్కే లేదనే దురాభిప్రాయం సమాజంలోని ఒక వర్గంవారు బలంగా ముందుకుతెస్తున్నారు. ఇటీవల కర్ణాటకకు చెందిన శశికాంత్ సెంథిల్ అనే ఐఏఎస్ అధికారి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ స్వేచ్ఛగా ఇక్కడ అమలు జరగడంలేదని, ఈ దేశంలో ప్రజాస్వామ్య మనుగడ కష్టతరంగా మారిందనీ, రాజీపడుతోన్న పరిస్థితిలో ఉన్నదనీ అందువల్ల తాను ఈ హోదాలో కొనసాగడంలో అర్థం లేదని తేల్చి చెప్పారు. అదే కారణంతో తన పదవిని తృణప్రాయంగా భావిస్తూ, ఒకే ఒక్క కలంపోటుతో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇది శశికాంత్ సెంథిల్ వ్యక్తిగత అభిప్రాయం. ఎవరికైనా నచ్చకపోతే, దాని మీద చర్చచేయవచ్చు. తమ అభిప్రాయాలను కూడా స్వేచ్ఛగా ప్రకటించు కోవచ్చు. ఇందులో తప్పేమీలేదు. కానీ కేరళకు చెందిన బీజేపీ నాయ కుడు ఒకరు, దీని మీద స్పందిస్తూ, శశికాంత్ సెంథిల్కి ఎవరెవరితో సంబంధాలున్నాయో విచారణ జరిపించాలనీ, ఇటువంటి వ్యక్తి పాకిస్తాన్కు వెళ్ళి పోవాలని ప్రకటించడం శాంతాన్ని ప్రబోధించిన బుద్ధుడు నడయాడిన నేలలో ముంచుకొస్తోన్న అశాంతికీ, అసహ నానికి నిదర్శనం. ఎవరైనా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తే అది దేశద్రోహంగా ప్రకటించడమంటే పూర్తిగా ఒక నియంతృత్వ ధోరణిని ప్రదర్శించడమే తప్ప మరొకటి కాదు. అంతేకాకుండా భిన్నమైన రాజకీయాభిప్రాయాలను కలిగి ఉన్నందుకు, ప్రభుత్వ విధానా లను తప్పు పట్టినందుకు, ఎంతో మంది రచయితలపై, విద్యార్థి నాయకు లపై, మే«ధావులపై రాజద్రోహం కేసులు నమోదు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమైనది. రకరకాల కారణాలను చూపి, ప్రభుత్వాలు తమ చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తు న్నాయి. ఇవన్నీ భారత రాజ్యాంగంలో పొందుపరుచుకున్న ప్రాథ మిక హక్కులను సంపూర్ణంగా ఉల్లంఘించడమే తప్ప మరొకటి కాదు. రాజద్రోహం పేరుతో రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి ఉపయోగిస్తున్న చట్టాలు బ్రిటిష్ కాలం నాటివి. బ్రిటిష్ పాలకులు తమ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలూ, తిరుగుబాట్లూ చేయ కుండా నిరోధించడానికి రాజద్రోహం అనే చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టాలు హింసను ప్రేరేపించే వారి పైన ప్రయోగిస్తామని చెప్పినప్పటికీ, ఈ నిర్బంధ చట్టాలు ఎంతో మంది రచయితలపైనా, రాజకీయ కార్యకర్తలపైనా ప్రయోగించారు. దేశ స్వాతంత్య్ర పోరా టాన్ని శాంతియుతంగా, సత్యాగ్రహాల ద్వారా నిర్వహిస్తానని ప్రక టించిన మహత్మాగాంధీపైనే ఈ రాజద్రోహ నేరం మోపి జైలుకి పంపారు. ఆ సందర్భంగా మహాత్మాగాంధీ మాట్లాడుతూ ‘‘ఎవరి కైనా ఒక వ్యక్తి పట్ల, వ్యవస్థ పట్ల అసమ్మతి ఉంటే, ఆ వ్యక్తి తన నిర సనను తెలియజేయడానికి సంపూర్ణ అవకాశముండాలి అన్నారు. కానీ బ్రిటిష్ పాలకులకు కావాల్సింది ప్రజాస్వామ్యం కాదు, వ్యక్తి గత స్వేచ్ఛ అంతకన్నా కాదు. వారి పాలనను రక్షించు కోవడానికి మాత్రమే ఆ చట్టాలను విచ్చలవిడిగా వినియోగించారు. ఎంతో మంది స్వాతంత్య్ర పోరాట వీరులను ఇదే చట్టంకింద జైళ్ళల్లో నిర్బం ధించారు. వీరి కోసమే అండమాన్లాంటి చోట్ల ప్రత్యేక జైళ్ళనే నిర్మిం చారు. అయితే వీటికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు వెల్లువెత్తాయి. గాం«ధీ నాయకత్వంలో శాసనోల్లంఘన, సత్యాగ్రహం లాంటి నిరస నలు అందులో భాగమే. భగత్సింగ్ లాంటి విప్లవ వీరులు బ్రిటిష్ పాలకుల నిర్బంధాన్ని ప్రతిఘటించడానికే ప్రాణత్యాగం చేశారు. ఈ నేపథ్యంలోనే భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఒకచోట చేరి స్వాతంత్య్రంతో కూడిన ప్రజాస్వామ్య రాజ్యాంగం కావాలని తీర్మానించాయి. ఇప్పుడు మనం రాజ్యాంగంలో పొందు పరుచుకున్న ప్రాథమిక హక్కులలో ఎక్కువభాగం ఆ రోజు రూపొం దించినవే. మన రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్ 19 సారాంశం నెహ్రూ కమిటీ నివేదికలో చేర్చారు. నెహ్రూ కమిటీ నివేదికలో నాలుగవభా గంలో నాలుగవ సెక్షన్లో భావప్రకటనా స్వేచ్ఛ సమావేశం హక్కు, సంఘం నిర్మాణం చేసుకునే హక్కులను స్పష్టంగా పేర్కొన్నారు. బ్రిటిష్ పాలకులు భారత ప్రజల స్వేచ్ఛను, జీవించే హక్కును హరి స్తుంటే, దానిని ప్రతిఘటించడానికి, నిరోధించడానికి నూతన రాజ్యాంగం ఇటువంటి హక్కులను ప్రతిపాదించింది. ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేడ్కర్ నాయకత్వంలో రూపొందించిన రాజ్యాం గంలో ఇటువంటి హక్కులన్నింటినీ మరింత శక్తిమంతంగా మార్చారు. భారత రాజ్యాంగం పీఠికలోనే స్వేచ్ఛ, సమానత్వం గురించి ఒక నూతన భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు వేశారు. ఈ రోజు మనం రాజ్యాంగంలో చేర్చుకున్న ఆర్టికల్ 19పైన ఎంతో మంది రాజ్యాంగసభ సభ్యులు సుదీర్ఘంగా చర్చించి స్వేచ్ఛ, స్వాతంత్య్రాల రక్షణ కోసం ప్రాథమిక హక్కులను చేర్చారు. ఆర్టికల్ 21 ద్వారా జీవించే హక్కును ఆర్టికల్ 25 ద్వారా ఏ మతమైనా అనుసరించడానికి, ప్రచారం చేయడానికి పౌరులకు హక్కు ఉంటుం దని పేర్కొన్నారు. ఇది కూడా స్వాతంత్య్ర పోరాట కాలంలో వచ్చిన అనుభవాల సారమే. అటువంటి చరిత్ర కలిగిన ప్రజాస్వామ్య చట్టాలు ఈ రోజు ప్రమాదంలో పడడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. నిజానికి సమాజం ముందుకు సాగాలన్నా, ప్రగతిని సాధించాలన్నా ప్రశ్నించే స్వభావం, విభేదించే స్వాతంత్య్రం ఉండాలి. సోక్రటీస్ లాంటి వాళ్ళు ప్రశ్నించడం నేర్వకపోయి వుంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు పడేవా? చర్చల ద్వారానే ప్రజలు శాంతిగా ఉంటారని భావించి అందుకోసం గౌతమ బుద్ధుడు ఇల్లు వదిలి పెట్టకపోతే భారత దేశం అరాచకంలో అంతమై ఉండేది కాదా? అలాగే అరిస్టాటిల్, ప్లేటో, జీసస్, మహమ్మాల్, గురునానక్, కార్ల్ మార్క్స్, మహాత్మాగాంధీ, అంబేడ్కర్ లాంటి వారు లేకపోతే సమాజ గమనం ఏ తీరాలకు చేరేదో ఊహించలేం. చైనా విప్లవ నాయకులు మావోసేటుంగ్ చెప్పి నట్టు వంద భావాలు ఘర్షణపడనీయండి, వందపూలు వికసించనీ యండి అనే భావన ఇప్పటికీ ఎప్పటికీ ప్రజాస్వామ్యానికి మూల సూత్రం కావాలి. తమ భావాలు, రాజకీయాలూ, సిద్ధాంతాలూ మాత్రమే సరైనవనీ, ఇతరుల అభిప్రాయాలన్నీ తప్పేనన్న భావన సమాజాన్ని ఎంతటి తిరోగమనంలోకి నెడుతుందో అర్థం చేసుకో లేకపోతే ఏ మతం, ఏ ప్రభుత్వం ఎంతో కాలం మనుగడ సాగించడం సాధ్యం కాదు. ప్రభుత్వాల మీద ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పే స్వేచ్ఛ ఉంటే, అది ప్రజల కన్నా ప్రభుత్వాలకే ఎక్కువ ప్రయో జనకరం. కనీసం ఎప్పటికప్పుడు తమ తప్పును తెలుసుకొని కొన్నిం టినైనా సరిదిద్దుకొని ముందుకు సాగే అవకాశం ఉంటుంది. చివరకు రాచరిక పాలనలో సైతం ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేం దుకు రాజులు మారువేషాల్లో తిరిగే వారని చదివాం. అది నిజమైనా, అబద్ధమైనా దాని స్ఫూర్తిని మాత్రం విస్మరించకూడదు. అంతే తప్ప ఎవరైనా ప్రభుత్వాన్ని, అధికార వ్యవస్థలను విమర్శిస్తే అది రాజ ద్రోహమని భావిస్తే అది అధికారంలో ఉన్న వారికే చేటు అవుతుంది. ఎప్పుడైనా నిరసనను, కోపాన్ని అణచివేస్తే, పెరిగి పెరిగి అది ఒక అగ్నిపర్వతంలా మారుతుంది. అప్పుడు మనల్ని మనం పరిరక్షించు కోవడానికి ఏ చిన్న అవకాశం కూడా మిగలని రోజొకటొస్తుంది. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
దేవుళ్లకు జాతులు, కులాలు ఉండవు!
మల్లెపల్లి లక్ష్మయ్యగారి వ్యాసాన్ని బాధతో చదివాను. ఆయన మేధావి. జ్ఞానసంపన్నుడు. కాలానుగుణ మార్పులను సూక్ష్మంగా చూస్తున్నవారు. అలాంటి వ్యక్తి ‘దేవుడికీ తప్పని కులవివక్ష’ అనే వ్యాసం రాయడాన్ని (సాక్షి 29–08–2019) సున్నితంగా తిరస్కరిస్తున్నాను. వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్క కాలంలో సద్గురు రవిదాస్ మహరాజ్ లాంటి అవతార పురుషులు పుడుతూనే ఉన్నారు. వారిని సమాజం గుర్తిం చింది. వారి సందేశాలను భక్తితో స్వీకరించాయి. సాధువుల జాతి, పుట్టుక అడుగకు, వారి జ్ఞానాన్ని స్వీకరించు. ఒరను పట్టించుకోకు కత్తి పదునును చూడు. సంత్ రవిదాస్ జయంతి సమావేశాల్లో చాలాసార్లు నేను పాల్గొన్నాను. ఢిల్లీలో సంత్ రవిదాస్ దేవాలయాన్ని కూలగొట్టినప్పుడు ముందుగా స్పందించిన వాణ్ణి నేనే.. సంత్ రవిదాస్ దళితులకే కాదు.. మానవజాతికే గురుతుల్యులు. 2018 ఏప్రిల్ 16 సాయంత్రం 4 గంటలకు ఒక దళిత శ్రీ వైష్ణవ భక్తుడిని నా భుజాలపై కూర్చోబెట్టుకుని జియాగూడ శ్రీరంగనాథ స్వామి ఆలయంలోనికి మేళతాళాలతో భక్త బృందం వెంటరాగా తీసుకువెళ్లాను. భక్తుల గోవింద నామ స్మరణ, తిరుప్పాణాళ్వారు రచించిన ‘అమలనాది పిరాన్ పాశురగానం,’ అన్నమయ్య రచించిన ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే..’ అనే గానాల మధ్య దేవుడిముందు అందరూ సమానమే అని మరోమారు నిజం చేస్తూ, మునివాహన ఉత్సవం బ్రహ్మాండంగా నిర్వహించాం. భగవద్రామానుజులవారి 1000వ జయంతి సంవత్సరంలో ఈ ఉత్సవం జరగడం విశేషం. వైష్ణవాచార్య గురుపరంపరలో నమ్మాళ్వారు ప్రథమాచార్యులు. నమ్మాళ్వారు శూద్రజాతిలో జన్మించారు. శ్రీవైష్ణవులు పన్నెండుగురు ఆళ్వారులను భక్తితో పూజిస్తారు. పన్నెండు మంది ఆళ్వారులు వివిధ వర్ణాలలో జన్మించి పూజలందుకుంటున్నారు. వీరిలో తిరుప్పాణ్ ఆళ్వార్ దళిత కులానికి చెందినవారు. ఈ పరమ భక్తుడు శ్రీరంగనాథునికి తన జీవితాన్ని అంకితం చేసి శాస్త్రబద్ధ జీవనం చేస్తూ శ్రీరంగంలోని ఆలయం వెలుపలి నుండే రంగనాథుని గుణగానం చేస్తూ ఉండేవారు. పరమ భక్తుడైన ఈ ఆళ్వారుని, ఆలయ అర్చకులైన శ్రీలోక సారంగముని గుర్తించారు. శ్రీరంగనాథుని ఆజ్ఞానుసారం శ్రీలోకసారంగముని తిరుప్పాణాళ్వారుని కలుసుకుని, ఆ భక్తాగ్రేసరుని తన భుజాలపై కూర్చుండబెట్టుకుని ఆలయ ప్రవేశం చేయించమని తనను స్వామి ఆదేశించారని తెలి పారు. దైవాజ్ఞకు ఎదురు చెప్పలేక ఆళ్వారు అంగీకరించారు. ఈ విధంగా ‘మునివాహనునికి’ సంతోషకరమైన స్వామి దర్శనం లభించింది. ఈ సంఘటన దాదాపు 2,700 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు మన సమాజంలో కులాల మధ్య వివక్ష, అగౌరవం అధికంగా కనిపిస్తున్నాయి. కులాల నడుమ చెలరేగుతున్న అగౌరవం, వివక్షతలు తొలగాలనీ, అందరినీ సమానంగా గౌరవించాలన్న సందే శం ఇచ్చే విధంగా, నేను మునివాహన సేవను నిర్వహించాను. ఒక దళిత భక్తుని తిరుప్పాణాళ్వారు వలె నా భుజాలపై కూర్చుండబెట్టుకుని అమలనాది పిరాన్ పఠిస్తూ ఆలయ ప్రవేశం చేశాను. సమాజంలో ఎస్సీ, ఎస్టీ సోదరులపట్ల చూపుతున్న దుర్వ్యవహారం ఆపివేసి, ప్రజ లకు వారిపట్ల గౌరవభావాన్ని ఇనుమడింప చేయడానికి నేను చేసిన చిన్న ప్రయత్నం ఇది. నేను 2018వ సంవత్సరం జూన్ నెలలో గుంటూరులో, జూలై నెలలో నెల్లూరులో ఈ ఉత్సవాన్ని నిర్వహిం చాను. నేను చేసిన ప్రయత్నాలు తప్పుగా మా ధర్మ శాస్త్రజ్ఞులు పరిగణించలేదు. మనువాదులుగా మీరు నిందించిన వారెవరూ నన్ను దూషించలేదు. మల్లెపల్లి లక్ష్మయ్యగారు తమ వ్యాసంలో పేర్కొన్న అంశాలు సనాతన ధర్మం కానీ, రామానుజ సాంప్రదాయం కానీ ఎన్నటికీ ఒప్పుకోవు. కొంతమంది చేసే దుశ్చర్యలకు మొత్తం సమాజాన్ని నిందించే పని చేయడం సబబు కాదు. మనమందరం కలిసి మంచి సమసమాజ స్పృహను, చైతన్యాన్ని లోకంలో ఆవిష్కరిద్దాం. లక్ష్మయ్యగారూ.. మీరూ రండి. ఇదే మా ఆహ్వానం. వ్యాసకర్త: సీఎస్ రంగరాజన్, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు csranga@gmail.com -
కశ్మీరీయులపై ద్వేషమే.. దేశభక్తా?
ఈ రోజు కశ్మీర్ లోయలో నివసిస్తున్న ముస్లింలంతా పరాయి దేశస్తులు కాదు. చాలా కాలం బౌద్ధులు గానే ఉన్న వాళ్ళు ఇటు హిందువుల ఆదరణ లేక, అటు ముస్లిం దండయాత్రలను తట్టుకోలేక ముస్లింలుగా మతమార్పిడి చేసుకున్నారు. కశ్మీర్లో ఈరోజు ముస్లింలుగా ఉంటూ, భారతదేశ మెజారిటీ ప్రజలందరి దృష్టిలో టెర్రరిస్టులుగా, దేశ ద్రోహులుగా పిలువబడుతున్న వాళ్ళంతా ఒకనాటి బౌద్ధులే, హిందువులే అన్నది మరువకూడదు. కశ్మీర్ భూభాగమే మనకి కీర్తి పతాక అయినప్పుడు అక్కడి ప్రజలు ఎట్లా శత్రువులవుతారు? నిజానికి వాళ్లంతా మన ఈ మట్టి బిడ్డలేనని గుర్తించాలి మనం. ఆ నేలను ప్రేమిస్తే, ఆ ప్రజలను కూడా ప్రేమించాలి. ఈ దేశాన్ని పట్టి పీడిస్తోన్న ద్వేషభావాన్ని విడనాడాలంటే దేశమంటే మట్టికాదని అర్థం చేసుకోవాలి. మనుషుల్ని ప్రేమించగలగడమే నిజమైన దేశభక్తి అని గుర్తెరగాలి. ‘‘కశ్మీర్ విషయంలో మనం పోరాడే సమ యమంతా ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు అని వాదించుకుంటున్నాం. నాకు తోచినంత వరకు ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది ముఖ్యం కాదు. ఏది సరైనది అని తేల్చుకోవాలి. నా దృష్టిలో కాశ్మీర్ విభజనే మంచి పరిష్కారం. భారతదేశ విభజన సందర్భంగా చేసినట్లుగానే హిందువులు, బౌద్ధులు ఉన్న ప్రాంతా లను భారతదేశానికీ, ముస్లింలు ఉన్న ప్రాంతాన్ని పాకిస్తాన్కు ఇస్తే సరిపోతుంది. లేదా మీకు ఇష్టమైతే కశ్మీర్ను మూడు భాగాలు చేయండి. కాల్పుల విరమణ జోన్, కశ్మీర్లోయ, జమ్మూ – లదాఖ్ ప్రాంతాలుగా విభజించండి. కశ్మీర్ లోయలో మాత్రమే ప్రజాభి ప్రాయ సేకరణ(ప్లెబిసూట్) జరపండి. తమ ఇష్టప్రకారం నడుచు కునే అవకాశం వారికి ఇవ్వండి’’ అంటూ 1951, అక్టోబర్ 10 న కేంద్రన్యాయశాఖ మంత్రిపదవికి రాజీనామా చేసిన సందర్భంగా బాబా సాహెబ్ అంబేడ్కర్ రాసిన ఉత్తరంలోని వాక్యాలివి. బాబాసాహెబ్ అంబేడ్కర్ రచనలలో 14వ సంపుటి, రెండవ భాగంలో ఈ ఉత్తరం అచ్చయ్యింది. పాకిస్తాన్ వివాదమే విచారకరమని ఆనాడు అంబే డ్కర్ ప్రకటించారు. ఆ సమయంలో తూర్పు పాకిస్తాన్లోని ముస్లిమే తరుల పరిస్థితి గురించి భారతదేశం పట్టించుకోవడం లేదనీ, మన సమయాన్నంతా కశ్మీర్ విషయంలో వెచ్చిస్తున్నామనీ, దీని వల్ల తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్)లో పరిస్థితులను విస్మరిస్తున్నా మన్న అభిప్రాయాన్ని అంబేడ్కర్ వెలిబుచ్చారు. అంతేకాకుండా, 1940 డిసెంబర్లో రాసిన ‘పాకిస్తాన్, భారతదేశ విభజన, పుస్త కంలో పాక్, భారత్ విభజన గురించి చాలా వివరంగా చర్చించారు. భారతదేశ విభజన జరిగితే, బ్రిటిష్ ప్రమేయంలేని ఒక అంత ర్జాతీయ బృందం మధ్యవర్తిత్వంలో విభజన జరగాలని ఆయన ప్రతి పాదించారు. కానీ దానిని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పటి వరకు అంబేడ్కర్ చేసిన సూచనలను ఎవ్వరూ ప్రస్తావించలేదు. ముఖ్యంగా రాజకీయ నిర్ణయాలు చేస్తున్న పార్టీలకు ఇవేమీ పట్టలేదు. కానీ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరును మాత్రం తప్పుడు పద్ధతుల్లో ఉద హరిస్తున్నారు. ఆయన ఎక్కడా ప్రస్తావించని విషయాన్ని తమ రాజ కీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. పది రోజుల క్రితం జరిగిన కశ్మీర్ విభజన, 370 ఆర్టికల్, 35 ఏ ఆర్టికల్ రద్దు సంద ర్భంగా అంబేడ్కర్ని వివాదాల్లోకి లాగారు. జనసంఘ్, ఆరెస్సెస్ సిద్ధాంత కర్తల్లో ఒకరైన బల్రాజ్ మదోక్ పుస్తకంలో, కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని, 370 ఆర్టికల్ని, అంబేడ్కర్ వ్యతిరేకించినట్టు ఉన్న విష యాన్ని తమ అధికార బలంతో అనవసరంగా ప్రచారం చేస్తున్నారు. అంబేడ్కర్ 370 ఆర్టికల్ని వ్యతిరేకించినట్టు ఆయన రచనల్లోగానీ, ప్రసంగాల్లోగానీ ఎక్కడా లేదు. జనసంఘ్ ప్రముఖ నేత రాజ్యాంగ సభ సభ్యులు శ్యాంప్రసాద్ ముఖర్జీతో అంబేడ్కర్ అన్నట్టు బుల్రాజ్ మదోక్ తన పుస్తకంలో రాసుకున్నారు. అయితే దీనికి ఎటువంటి ఆధారాలు లేవు. నిజానికి అంబేడ్కర్ తన అభిప్రాయాలను ఎప్పుడూ దాచుకోలేదు. వ్యక్తులతో ప్రైవేట్గా చర్చించే విషయం లోనూ ఆయన ఎప్పుడూ పరిమితులు విధించుకోలేదు. ఒకవేళ అంబేడ్కర్కు అటువంటి అభిప్రాయమే ఉన్నట్లయితే, 1951, అక్టో బర్లో రాసిన లేఖలో దాన్ని తప్పనిసరిగా పేర్కొనేవాడు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఎల్లప్పుడూ మైనారిటీల భద్రత, రక్షణ, హక్కుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆయన ప్రజాస్వామ్య దృక్పథంలో మైనారిటీల హక్కులనేవి అత్యంత ముఖ్యమైనవి. అవి కులం, మతం, ప్రాంతం, భాష ఏ కోణమైనా కావచ్చు. అందుకే అంబేడ్కర్ నిజమైన ప్రజాస్వామ్య దృక్పథం కలిగి ఉన్నాడని అర్థం చేసుకోవాలి. భారతదేశ భవిష్యత్తు గురించీ, సామాజిక అణచివేత, పీడనల నుంచి విముక్తి కోసం ఆలోచించి, దాని అమలుకోసం అహ రహం శ్రమించిన వారిలో అంబేడ్కర్ అతి కీలకమైన వ్యక్తి. అటు వంటి వ్యక్తి అభిప్రాయాలను తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం సరైన ది కాదు. ప్రస్తుతం కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులకు మనమంతా కశ్మీర్ ప్రజలను బాధ్యులను చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు భారతదేశంలోని చాలా మంది మన సుల్లో కశ్మీర్లో ఉన్న ముస్లింల పట్ల ఒక వ్యతిరేక భావాన్ని నింపారు. ఇది చాలా ఉచ్ఛస్థాయికి చేరింది. కశ్మీర్పై భారత ప్రభుత్వం తీసు కున్న ఆర్టికల్ 370 రద్దు అనే తీవ్రమైన నిర్ణయం ఒక ముఖ్యమైన విషయంగా మారింది. ఇది భారత్ దేశ ప్రజలందరి సమస్యగా మార్చారు. కశ్మీర్ భూభాగం మీద అపారమైన ప్రేమ, భక్తి, అక్కడ నివసిస్తున్న ప్రజల మీద ద్వేషాన్ని మెజారిటీ ప్రజలకు కలిగించారు. అందులో భాగమే 370 ఆర్టికల్ రద్దు. నిజానికి కశ్మీర్లో ఈ రోజు నివసిస్తున్న ప్రజలు ముఖ్యంగా ముస్లింలు అందరూ ఎక్కడో మధ్య ఆసియా నుంచి వచ్చిన వాళ్ళు కాదు. నిజానికి కశ్మీర్ ప్రాంతానికి ఇస్లాం ప్రవేశించింది 14వ శతాబ్దంలో. అంతకు ముందు ఈ ప్రాంతం భారతదేశంలోనే ఆవిర్భ వించిన బౌద్ధం, హిందూ మత సాంప్రదాయాలలోనే ఉంది. క్రీస్తు పూర్వం 3 వేల సంవత్సరాలకు పూర్వం నుంచి ఇక్కడ ప్రజలు నివసిస్తున్నట్టు ఆధారాలున్నాయి. వేదకాలం నుంచి ఇక్కడ జనజీ వనం అభివృద్ధి చెందిందని చరిత్రకారులు భావిస్తున్నారు. అలెగ్జాం డర్ దండయాత్రలను కూడా ఈ ప్రాంతం చవిచూసింది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో సామ్రాట్ అశోకుడు మౌర్య సామ్రాజ్యాన్ని ఇక్కడికి విస్తరింపజేశాడు. అనాటి నుంచే బౌద్ధం ఈ ప్రాంతమం తటా వ్యాప్తి చెందింది. ఆ కాలంలోనే శ్రీనగర్ పట్టణం నిర్మాణ మైంది. క్రీస్తుశకం రెండవ శతాబ్దంలో రాజ్యమేలిన కుషాన్ వంశ రాజైన కనిష్కుడు బౌద్ధానికి మరింత విస్తృత ప్రచారం కల్పించాడు. బౌద్ధం నాలుగవ సంగీతి కశ్మీర్లోనే జరిగింది. క్రీస్తు శకం 502లో సైనిక తిరుగుబాటు చేసి అధికారంలోకి వచ్చిన మిహిరకులుడు అత్యంత పాశవికంగా బౌద్ధులను హతమార్చాడు. ఆ తర్వాత శైవ మతం అక్కడ బాగా వ్యాప్తి చెందింది. ఈ క్రమం చాలా కాలం కొన సాగింది. అయితే ముస్లిం దండయాత్రలు మొదలైంది 1103లో అని చరిత్రకారుడు మొహబిల్హసన్ చెప్పారు. ఇది కూడా స్థానిక రాజులు, సామంతుల మధ్య ఉన్న అనైక్యత వల్లనే ముస్లిం సైన్యాలు కశ్మీర్ను ఆక్రమించుకున్నాయి. ఇది చరిత్ర. ఇదంతా ఇక్కడ ప్రస్తావించడానికి కారణం ఉన్నది. ఈ రోజు కశ్మీర్లోయలో నివసిస్తున్న ముస్లింలంతా పరాయి దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు మొదట వేద సంస్కృతిలో, ఆ తర్వాత బౌద్ధంలో, తదనంతరం హిందువులుగా మారారు. చాలా కాలం బౌద్ధులు గానే ఉన్న వాళ్ళు ఇటువైపు హిందువుల ఆదరణ లేక, అటు వైపు ముస్లిం దండయాత్రలను తట్టుకోలేక ముస్లింలుగా మతమా ర్పిడి చేసుకున్నారు. నేటి అప్గానిస్తాన్, పాకిస్తాన్ దేశాలు ఒకనాటి గాంధార, పెషావర్ రాజ్యాలు. అవన్నీ కూడా బౌద్ధంలోనే వికాసం చెందాయి. కానీ హిందువుల ఊచకోత, ముస్లింల దాడులు కలగలిసి బౌద్ధులందరూ హిందువులుగా, ముస్లింలుగా మారిపోయారు. అందుకే అప్గానిస్తాన్. పాకిస్తాన్, కశ్మీర్, బంగ్లాదేశ్లలో ముస్లింల జనాభా ఆ స్థాయిలో పెరిగింది. అందుకే కశ్మీర్లో ఈరోజు ముస్లిం లుగా ఉంటూ, భారతదేశ మెజారిటీ ప్రజలందరి దృష్టిలో టెర్రరిస్టు లుగా, దేశ ద్రోహులుగా పిలువబడుతున్న వాళ్ళంతా ఒకనాటి బౌద్ధులే, హిందువులే అన్న విషయం మరువకూడదు. వాళ్లంతా తర తరాల నుంచి ఇక్కడి సంస్కృతీ, సాంప్రదాయాలకు నిజమైన వార సులే. ఆధునిక భారతదేశంలో స్వార్థ రాజకీయాల కారణంగా వాళ్ళు భారత దేశానికి శత్రువులుగా కనిపిస్తున్నారు. అందువల్లనే అక్కడ కశ్మీర్ ప్రజలు నిత్యయుద్ధవాతావరణంలో సతమతమౌతోంటే, ఏ క్షణం ఏం జరుగుతుందో అని గుండెలు గుప్పిట్లో పెట్టుకొని ప్రాణభయంతో బతుకులీడుస్తోంటే మనం ఆనందంలో గంతులు వేస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపు 80 వేల మంది కశ్మీరీ ప్రజలు ప్రాణాలు కోల్పోతే మనకు చీమకుట్టినట్టయినా లేదు. కశ్మీర్ భూమి మనకు పవిత్రమైనదైనప్పుడు, ఒట్టి మట్టికే మనం అంత గౌరవం ఇస్తున్నప్పుడు, కశ్మీర్ భూభాగమే మనకి కీర్తి పతాక అయినప్పుడు అక్కడి ప్రజలు ఎట్లా శత్రువులవుతారు? నిజా నికి వాళ్లంతా మన ఈ మట్టి బిడ్డలేనని గుర్తించాలి మనం. ఆ నేలను ప్రేమిస్తే, ఆ ప్రజలను కూడా ప్రేమించాలి. ఈ దేశాన్ని పట్టి పీడిస్తోన్న ద్వేషభావాన్ని విడనాడాలంటే దేశమంటే మట్టికాదని అర్థం చేసుకో వాలి. ఏ భూమిపై నున్న మనుషులైనా మనుషులేననీ, మనుషుల్ని ప్రేమించగలగడమే నిజమైన దేశభక్తి అనీ గుర్తెరిగి మసలుకుంటే మానవత్వం పరిమళిస్తుంది. లేదంటే ఒక కశ్మీర్ కాదు దేశమంతటా కల్లోలాలు పెల్లుబుకుతూనే ఉంటాయి. వ్యాసకర్త : మల్లేపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు. మొబైల్ : 81063 22077 -
నిరంకుశ పోకడకు ఇది నిదర్శనం
లోక్సభలో తాజాగా ఆమోదం పొందిన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) సరిగ్గా ఎమర్జెన్సీ చీకటి రాత్రులను తలపిస్తోంది. ఎమర్జెన్సీలో అకారణంగా అరెస్టుల పాలై నాటి జనసంఘ్, ఆరెస్సెస్లకు చెందిన వేలాది కార్యకర్తల జీవితాలు ఛిద్రమైన చరిత్ర మరవకముందే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపా పేరిట నిరంకుశ చట్టానికి మరిన్ని కోరలు తొడిగి బిల్లుకు ఆమోదం పొందటం గర్హనీయం. వ్యక్తులను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించేందుకు ఈ సవరణ చట్టం అవకాశం ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా నిందితులను అరెస్టు చేయడం, విచారించడం భారతదేశ ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీసే చర్య. ఇంత నిరంకుశ చట్టాన్ని తీసుకొచ్చినా దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించడం అసాధ్యం. టెర్రరిజం, నక్సలిజం మూలాలను పట్టించుకోకుండా క్రూర చట్టాలతో వాటిని అంతం చేయడం అసంభవం, అసాధ్యం. అది 1975. ఎమర్జెన్సీ ప్రకటించిన కాలం. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని ఎస్.కే.బీ.ఆర్ కళాశాలలో నూకల రామచంద్రరావు హిందీ లెక్చరర్. ఆయన స్వతహాగా మంచి వ్యక్తి. తన పని తప్ప ఇతర విషయాల్లో జోక్యం చేసుకొనేవాడు కాదు. కాలేజీలో జరిగే సామాజిక, రాజకీయ అంశాల్లో కనీసం చర్చల్లో కూడా పాల్గొనే తత్వం కాదాయనది. అయితే అదే కళాశాలలో కొంత మంది లెక్చరర్లు సామాజిక విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండేవారు. అందులో ఘనశ్యాంప్రసాద్, నిట్టల రామ దాస్లతో పాటు మరికొందరు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో క్రియాశీలకంగా పనిచేసేవారు. ఎస్.కే.బీ.ఆర్ కళాశాల మీద పోలీసులు నిఘా వేయడానికి అదే కారణం. ఇందులో ఘనశ్యాం ప్రసాద్, నేటి బీజేపీ కీలక నేత రాం మాధవ్కు గురువులాంటి వారని చెపుతుంటారు. అలాగే అమలాపురంలో నూకల రామచంద్రమూర్తి అనే ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఉండేవారు. అయితే ఆయన లెక్చరర్ కాదు. నూకల రామచంద్రమూర్తి పేరు పోలీసుల లిస్టులో ప్రముఖంగా ఉంది. నూకల రామచంద్రమూర్తి, ఎస్.కే.బీ.ఆర్ కళాశాలలో హిందీ లెక్చరర్గా పనిచేస్తోన్న నూకల రామచంద్రరావు ఒక్కరే అని పోలీసులు పొరపాటు పడ్డారు. హిందీ లెక్చరర్ నూకల రామచంద్రరావును ఆనాటికే అమ లులో ఉన్న ‘మీసా’ (ఆంతరంగిక భద్రతా చట్టం) కింద అరెస్టు చేశారు. ఆయనా, ఈయనా ఒకరు కాదని, ఎవ్వరు ఎన్ని విధాలుగా చెప్పి చూసినా ప్రయోజనం లేకపోయింది. దాదాపు పది నెలలకు పైగా ఆ అమాయకుడైన హిందీ లెక్చరర్ని ఆరెస్సెస్ కార్యకర్త స్థానంలో జైల్లో పెట్టారు. ఆయనకు ఆరెస్సెస్తోగానీ, మరే ఇతర సంస్థలతోగానీ సంబంధంలేదు. పది నెలలు ఏ నేరం చేయకుండా, ఎటువంటి రాజ కీయాలతో సంబంధం లేకుండా అక్రమ నిర్బంధంలో ఉన్న రామచం ద్రరావు జైలు నుంచి విడుదలైన తర్వాత తన ఆరోగ్యాన్ని కోల్పోయారు. ఆయన కంటి చూపు పూర్తిగా మందగించింది. అరెస్టుతో పరువు పోయిందని భావించిన రామచంద్రరావు ఆ దిగులుతోనే కన్నుమూ శారు. ఎమర్జెన్సీలో నిర్బంధ చట్టాల ద్వారా అక్రమ నిర్బంధాలకు గురైన వేల మంది అమాయకుల్లో రామచంద్రరావు ఒకరు. అది కేరళ రాష్ట్రం. కాలికట్ పట్టణం. అక్కడి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న రాజన్ను 1976, మార్చి, 1వ తేదీన కేరళ పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల ముందు నక్సలైట్లు పోలీసు స్టేషన్ మీద దాడి చేశారని, అందులో రాజన్ పాల్గొన్నాడని పోలీసుల అభియోగం. నిజానికి ఫిబ్రవరి 28వ తేదీన కాలికట్ ఇంజ నీరింగ్ కాలేజీ విద్యార్థులు తమ కళాశాల ఉత్సవాల్లో ఉన్నారు. అంతే కాకుండా, నక్సలైట్ ఉద్యమంతోగానీ, ఆ దాడితోగానీ రాజన్కు ఎటు వంటి సంబంధమూ లేదు. కానీ పోలీసులు మాత్రం రాజన్ను తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టి చంపేశారు. శవం కూడా దొరకకుండా మాయం చేశారు. ఆ తర్వాత రాజన్ తండ్రి ఎచ్చరవారియర్ హెబియస్కార్పస్ పిటిషన్ వేశారు. రాజన్తో పాటు అరెస్టయి, ఆయనతో పాటు చిత్ర హింసలు అనుభవించిన చంద్రన్ అనే వ్యక్తి ఆ తర్వాత ఈ విషయాలను బయటపెట్టారు. ఎమర్జెన్సీ తర్వాత కేసు విచారణకు వచ్చింది. రాజ న్ను పోలీసులు చిత్ర హింసలు పెట్టి చంపినట్టు రుజువైంది. ఈ మొత్తం వ్యవహారంలో కొంత మంది పోలీసులు నేరస్తులని చివరకు తేలింది. అయితే రాజన్ ప్రాణం మాత్రం తిరిగిరాలేదు. పై రెండు ఘటనలు 1975 నుంచి 1977 వరకు 19 నెలల పాటు కొనసాగిన ఎమర్జెన్సీ చీకటి పాలనకు మచ్చుకి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఎటువంటి విచారణ లేకుండా అమాయకులను పట్టుకెళ్ళి జైళ్ళలో నిర్బంధించి పౌర హక్కులను కాలరాసిన ఆ దుర్భర రాత్రులను ఎవ్వరూ మరచిపోలేరు. ఆ రోజున అమలు జరిపిన నిర్బంధ చట్టాల వల్ల, పోలీసులకూ, భద్రతా బలగాలకూ ఇచ్చిన అపరిమితమైన అధి కారాల వల్లా జరిగిన ఘోరాలివి. ఎమర్జెన్సీలో దాదాపు లక్షమందికి పైగా జైళ్ళలో అక్రమ నిర్బంధాన్ని అనుభవించారు. అందులో ఈ రోజు అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ నాయకులు కూడా చాలా మంది ఉన్నారన్న విషయాన్ని గమనించాలి. ఎల్.కే. అద్వానీ, వాజ్ పేయి, ప్రకాశ్ జవ్దేకర్, బంగారు లక్ష్మణ్, ప్రమోద్ మహాజన్, సిహెచ్ విద్యాసాగర్రావు, జంగారెడ్డిలు ఉన్నారు. అనేక మంది ఇతర పార్టీల నాయకులు సైతం జైళ్ళలో మగ్గారు. ఎమర్జెన్సీలో నిర్బంధానికి గురైన వేలాది మంది నాయకులు ఈ రోజు ఇంకా బతికే ఉన్నారు. నిర్బంధ చట్టాలు దుర్వినియోగం జరిగితే ఎటువంటి అనర్థాలు జరుగుతాయో చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలు. ఎమర్జెన్సీ లాంటి నిర్బంధపాలన వస్తే ప్రతిపక్షాలూ, ఇతర సంఘాలు, సంస్థలు మాత్రమే కాదు. అధికార పార్టీవారు కూడా ఆ దుష్ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది. వారం రోజుల క్రితం లోక్సభలో ఆమోదం పొందిన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) సరిగ్గా ఎమర్జెన్సీ చీకటి రాత్రులను తలపిస్తోంది. పౌరులను అభద్రతాభావంలోకి నెడుతోంది. టెర్రరిజం, హింస ద్వారా హత్యాకాండ చేస్తున్న వ్యక్తులు, సంస్థలూ చట్టం ప్రకారం శిక్షార్హులే. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రజాస్వా మ్యాన్ని కాంక్షిస్తున్న వాళ్ళు, మానవత్వాన్ని ప్రేమిస్తున్న వాళ్ళు, సమాజంలో జరుగుతున్న తప్పులను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్న వాళ్ళు, రక్త పాతంతో, హింసాకాండలతో ఎటువంటి సంబంధమూ లేనివాళ్లు రక్త పాతాన్ని సమర్థించేవాళ్ళూ, సమర్థించని వాళ్ళూ, కొన్ని భావజాలా లను సమర్థిస్తున్నవారు ఈ సమాజంలో ఉన్నారు. అయితే టెర్రరిజాన్ని అణచివేయడానికి ప్రభు త్వాలు తీసుకొచ్చిన చట్టాలు, ఆ చట్టాలకు మరిన్ని సవరణలు మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తిని, రాజ్యాంగ విలువ లను పూర్తిగా విస్మరిస్తున్నాయి. ‘ఉపా’ చట్ట సవరణలలో ముఖ్యమైనవి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్.ఐ.ఏ)కు విస్తృతమైన అధికారాలివ్వడం. అందులో రాష్ట్ర పోలీసులకు సమాచారం లేకుండా, అనుమతి లేకుండా నిందితులను అరెస్టు చేయడం, విచారించడం. ఇది భారత దేశ ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీస్తుందనడంలో సందేహం అక్కర్లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ హక్కులను కోల్పోక తప్పని పరిస్థితి. వ్యక్తులకు మాత్రమే కాదు, రాష్ట్రప్రభుత్వాల మనుగడను సైతం ఇది ప్రశ్నార్ధకంగా మారుస్తోంది. అంతేకాకుండా, గతంలో కొన్ని సంస్థలను ఉగ్రవాద సంస్థలుగా ప్రక టించేవారు. ఇప్పుడు దానితో పాటు, వ్యక్తులను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించే ప్రమాదకర అవకాశాన్ని ఈ సవరణ ఇస్తున్నది. ఏ విచారణా జరగకుండానే, ఆ వ్యక్తి ఉగ్రవాది అనే విషయాన్ని చట్టపరంగా న్యాయ స్థానాలు నిర్ధారించక ముందే ఆస్తులను జప్తు చేయడం, ఇతర రకాలైన పౌరహక్కులన్నింటినీ లాగేసుకోవడం దీని ఉద్దేశ్యం. ఇది పూర్తిగా రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కులను కాలరాయడమే అవు తుంది. వాక్స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛ, సమావేశ హక్కు సహా చివరకు జీవించే హక్కునే ఆ వ్యక్తి కోల్పోయే దారుణమైన పరిస్థితి. చాలావరకు అమాయకులు, రాజకీయ ప్రత్యర్థులు, స్థానిక నాయకులతో శతృత్వం ఉన్న వాళ్ళు అందరూ ఈ చట్టం వల్ల ఇబ్బంది పాలవుతారు. ఎమర్జెన్సీలో బాధితులుగా ఉన్న పార్టీ, సంస్థలు ఇలాంటి చట్టం తేవడం బాధాకరం. ఆ రోజుల్లో ఎన్నివేల మంది ఆరెస్సెస్ కార్యకర్తలు ఇబ్బం దులు పడ్డారో ఇటీవల ఎమర్జెన్సీ దురాగతాల గురించి మాట్లాడిన బీజేపీ నేతలు వెల్లడించారు. ఆ అనుభవాలను గుణపాఠాలుగా తీసు కోవడానికి ఆనాటి బాధిత పక్షం, ఈనాటి అధికార పక్షం సిద్ధంగా లేదు. టెర్రరిజం, నక్సలిజం అనే కార్యకలాపాలను అంతమొందించాలనే ఉద్దేశ్యం కోసమే ఈ చట్టం అవసరమైతే, ఇది సమగ్ర ఫలితాలను ఇవ్వదు. టెర్రరిజం దానికిగల కారణాలకు తగ్గట్టుగా చర్యలు తీసు కోవాలి. అందులో చట్టాలు కూడా భాగమే. కానీ అవి మాత్రమే సమ స్యను పరిష్కరించలేవు. కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి ఇంతకన్నా ఘోరమైన నిర్బంధాన్ని అమలు జరిపారు. కానీ ఫలితం రాలేదు. అక్కడి ప్రజల అభిప్రాయాలకూ, వారి విశ్వాసాలకూ ప్రాధాన్యతనివ్వ కుండా, కశ్మీర్ని భౌగోళికంగా మాత్రమే పరిగణనలోనికి తీసుకోవడం వల్ల ఈనాటికీ అక్కడి ప్రజల మనసులను ఏ ప్రభుత్వం గెలుచుకోలేక పోయింది. అడుగడుగునా నిర్బంధం విధించి సైనిక పాలన చేస్తే సమస్య పరిష్కారమవుతుందా? లేక మరింత చిక్కనై, జటిలం అవుతుందా? అనే విషయాన్ని పాలకులు అర్థం చేసుకోవాలి. నక్సలైట్ సమ స్యను కూడా శాంతి భద్రతల సమస్యగా చూస్తున్నంత కాలం దానికి పరిష్కారం ఉండదు. ఈ రోజు భారతదేశంలో నక్సలైట్ సమస్య ఆయు ధాలు, బాంబుల సమస్యకాదు. అది అడవిలో ఆదివాసీల సమస్య. అక్కడి ఆదివాసులను భారతదేశంలో పౌరులుగానే మనం గుర్తించడం లేదు. వారి విద్య, ఆరోగ్యం, ప్రాథమిక సౌకర్యాలు మనకు ఏ మాత్రం పట్టవు. ఒక రకంగా అక్కడ ప్రభుత్వమే ఉనికిలో లేదు. ఇన్ని విషయాలను వదిలేసి, కేవలం చట్టాలు, పోలీసులు, సైన్యం, నిర్బంధం, అరెస్టులు, జైళ్ళు మాత్రమే టెర్రరిజానికీ, నక్సలిజానికీ పరి ష్కారంగా భావిస్తే, గతంలో లాగానే మరో నిర్బంధ చీకటి భారతాన్ని ప్రభుత్వం కలగంటోందని భావించాల్సి వస్తుంది. పిల్లిని సైతం నిర్బంధంలో ఉంచి హింసిస్తే చావడం కన్నా తిరగబడటమే మేలనుకొంటుం దన్న విషయాన్ని మనం మరువకూడదు. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య; సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
పసిబిడ్డల మరణాల్లోనూ కులవివక్ష
ఆకలికీ, అనారోగ్యానికీ, ఆదాయానికీ, వనరులకూ ఈ దేశంలో కులం ఉందనడంలో అతిశయోక్తి లేదు. కానీ ప్రభుత్వాల ఆర్థిక ప్రణాళికల్లోనూ, బడ్జెట్ కేటాయింపుల్లోనూ కులం ప్రస్ఫుటంగా కనిపిస్తోందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే బడ్జెట్కి సైతం కులం ఉంది అని ఇప్పుడు చెప్పక తప్పదు. నూటికి 80 శాతంగా ఉన్న కులాల్లో చాలా వాటికి వనరులు లేవు, ఆదాయాలు, శ్రమలో భాగం లేదు. చివరకు బడ్జెట్లోనూ భాగం లేదు. ఇదే మన భారత ఆర్థిక రంగం పరుగులు తీస్తున్న వైనం. చందమామపై కాలనీలను కలగంటున్న ఈ రోజుల్లో, గుండెను మార్చి గుండెను అమర్చుతున్న ఈ తరుణంలో మెదడువాపు వ్యాధిలాంటి చిన్నాచితకా వ్యాధులతో సైతం బిహార్లో పసిబిడ్డలు పిట్టల్లా ప్రాణాలు కోల్పోవడాన్ని ఎలా జీర్ణించుకోవాలి? దళితులు, ఆదివాసులు దేశ చిత్రపటం నుంచి కనుమరుగవుతారేమోననే భయం వెంటాడుతోంది. హర్వంశ్పూర్ బిహార్, ముజఫర్ పూర్ ప్రాంతంలోని వైశాలి జిల్లాలోని ఒక కుగ్రామం. చాతురి సాహిని తనకు అత్యంత ప్రియమైన ఇద్దరు కొడు కులను పోగొట్టుకున్నాడు. పెద్ద కొడుకు ప్రిన్స్కు 7 ఏళ్ళు కాగా, చిన్న కొడుకు చోటూకి 2 ఏళ్ళు కూడా నిండలేదు. ఆ ఇద్దరు చిన్నారులు మెదడు వాపు వ్యాధితో మరణించారు. చందమామపై కాలనీలను కలగంటున్న ఈ రోజుల్లో, గుండెను మార్చి గుండెను అమర్చుతున్న ఈ తరుణంలో మెదడువాపు వ్యాధిలాంటి చిన్నాచితకా వ్యాధులతో సైతంపసిబిడ్డల ప్రాణాలు పోవడాన్ని ఎలా జీర్ణించుకోవాలి? అయితే ఇది ఒక్క హర్వంశ్పూర్కు పరిమితమైన విషయం కాదు, సాహినికి మాత్రమే సంబంధించింది కూడా కాదు. గత రెండు నెలల్లో ముజఫర్ పూర్ ప్రాంతంలో 161 మంది పిల్లలు చనిపోయారు. 842 మంది ఈ వ్యాధి బారిన పడి ఆసుపత్రిపాలయ్యారు. చనిపోయిన వారిలో అత్యధిక మంది అట్టడుగు వర్గాలైన దళిత కుటుంబాల నుంచి వచ్చిన వారు. చనిపోయిన వారిలో దళితులు 101 మంది, 47 మంది వెనుకబడిన కులాల వాళ్ళు, 20 మంది ముస్లింలు ఉన్నారు. ఈ లెక్కలను ముజఫర్పూర్లోని దళిత సంఘాల కార్యకర్తలు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ సహకారంతో ఇంటింటికీ తిరిగి సేకరించారు. ప్రభుత్వాలు కేవలం పిల్లల వివరాలు తెలిపాయే కానీ, వారి సామాజిక వర్గం వివరాలు తెలియజేయలేదు. బిహార్లో పిల్లలుచనిపోతున్న సమయంలోనే అక్కడి కార్యకర్తలతో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ సమ న్వయం చేసుకొని ఈ అధ్యయనం చేసింది. అందులో భాగంగానే ఒక గ్రామానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక వివరాలను సేకరించింది. బిహార్లో పిల్లల మరణాలకూ, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు సంబంధం ఉంటుందనే అంచనాయే ఈ అధ్యయనానికి నాంది పలి కింది. ముఖ్యంగా ప్రభుత్వాలు ప్రవేశ పెడుతున్న బడ్జెట్లలో చేస్తున్న కేటాయింపులు ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాల పట్ల, ముఖ్యంగా సామాజిక అసమానతలను తొలగించే ప్రయత్నాల పట్ల వాళ్ళ వైఖరిని స్పష్టం చేస్తాయి. ప్రభుత్వాల కుల వివక్ష ధోరణికి ఈ బడ్జెట్లు అద్దంపడు తున్నాయి. అందుకే ఈ నెల మొదటి వారంలో కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ విశ్లేషణలను ఈ ఘటన వెలుగులోనే పరిశీలించాల్సి ఉంటుంది. హరివంశ్పూర్ గ్రామ పిల్లలు మరణించడానికీ, ఆ గ్రామ సామా జిక, ఆర్థిక పరిస్థితులకూ సంబంధం ఉన్నది. మొదట పిల్లల మరణానికి లిచీ పండ్లు తినడమే కారణమని ప్రచారం చేశారు. కానీ అనేక మంది వైద్య నిపుణులు, వైద్యుల బృందాలు ఈ వాదనను కొట్టి వేశాయి. చివరకు ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా పిల్లల మరణాలకు లిచీ పండ్లు తినడం కారణం కాదని తేల్చేసింది. మెదడువాపు వ్యాధితో ఆసు పత్రిలో చేరిన వాళ్ళలో 90 శాతం మంది ఏడేళ్లలోపు వయస్సు వాళ్ళేనని తేలింది. ఇందులో 135 మంది 3 ఏళ్ల లోపు పిల్లలేనని నిర్ధారించారు. వాళ్ళు కూడా ఈ మరణాలకు పౌష్టికాహార లోపం, కడు దారిద్య్రం కార ణమని తేల్చారు. హరివంశ్పూర్ గ్రామంలో 2 వేల కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామంలో 15 మంది భూమిహార్లకు తప్ప మరెవ్వరికీ వ్యవసాయ భూములు లేవు. ఈ గ్రామంలోని వారందరూ ఈ పదిహేను మంది భూస్వాముల భూములలో పనిచేసి బతకాల్సిందే. ఈ గ్రామం లోని కూలీలందరికీ నెలకు 10 నుంచి 12 రోజులు పని తప్ప వేరే ఉపాధి లేదు. ఈ గ్రామంలోని దాదాపు 30 శాతం మంది యువకులు ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ముంబాయి లాంటి ప్రాంతాలకు వలస వెళ్ళి, బతుకులీడుస్తుంటారు. భారత ప్రభుత్వం లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టినందుకు గర్వపడుతున్నది. సంతోషమే. కానీ భారత ప్రజలు కోట్లా దిమంది ఆకలితో నకనకలాడుతున్నారన్న విషయాన్ని మరుగుపరుస్తు న్నారు. 2018 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం, 119 దేశాల వివరాలు సేకరిస్తే, అందులో 103 వ స్థానంలో భారత్ ఉంది. అయితే ఆకలికీ, అనారోగ్యానికీ, ఆదాయానికీ, వనరులకూ ఈ దేశంలో కులం ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇంకా చెప్పాలంటే ఏడాది మొత్తానికి వర్తించేలా ప్రభుత్వాలు చేసే ఆర్థిక ప్రణాళికల్లోనూ, బడ్జెట్ కేటాయింపుల్లోనూ కులం ప్రస్ఫుటంగా కనిపిస్తోందంటే ఆశ్చర్య పోనక్కర్లేదు. అందుకే బడ్జెట్కి సైతం కులం ఉంది అని ఇప్పుడు చెప్పక తప్పదు. నూటికి 80 శాతంగా ఉన్న కులాల్లో చాలా వాటికి వనరులు లేవు, ఆదాయాలు, శ్రమలో భాగం లేదు. చివరకు బడ్జెట్లో భాగం లేదు. సరిగ్గా ఇదే మన భారత ఆర్థిక రంగం పరుగులు తీస్తున్న వైనమని స్పష్టం అవుతోంది. గత అయిదేళ్ళలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలను అగాధాల అంచులకు నెట్టి వేశాయి. మొత్తం బడ్జెట్లో ఎస్సీల విషయానికొస్తే, 2014 –2015 నుంచి 2019–20లలో కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చూస్తే, 2014– 15లో 2.82 శాతం ఉండగా దాన్ని 2015–16లో 1.72 శాతానికి తగ్గించి, మళ్ళీ 2019–2020లో 2.92కు పెంచారు. ఇది పూర్తిగా ఎస్సీల పట్ల ఒక వివక్షాధోరణికి అద్దం పడుతున్నది. ఎస్టీలకు కూడా 2014–15 లో 1.80 శాతం ఉంటే, 2015–16లో 1.12 శాతానికి తగ్గించి మళ్ళీ 2019–20లో 1.89 శాతానికి పెంచారు. ఇది కూడా అదే వివక్ష, నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఉద్దేశించిన ఎస్సీ సబ్ప్లాన్, ఎస్టీ సబ్ప్లాన్ అమలు కూడా ఇదే ధోరణిలో సాగుతున్నది. ఎస్సీ వెల్ఫేర్ కేటాయింపులు 2017–18లో 5.54, 2018–19లో 5.58, 2019–20లో 6.76గా ఉన్నాయి. నిజానికి 16 శాతం నిధులను ఎస్సీ వెల్ఫేర్కు కేటా యించాలి. ఏ సంవత్సరం కూడా వాళ్ళు సగానికి కూడా చేరుకోలేదు. ఎస్సీ వెల్ఫేర్కు 8 శాతం కేటాయించాల్సి ఉండగా, 2017–18లో 3.38 శాతం, 2018–19లో 3.85 శాతం, 2019–20లో 4.4 శాతం మాత్రమే బడ్జెట్ కేటాయింపులు జరిపారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమంలో ప్రధానమైన అంశం విద్యకు ప్రోత్సాహం. ఇందులో స్కాలర్షిప్స్ అత్యంత ముఖ్య మైన విషయం. ఎస్సీలకు సంబంధించి ప్రీ–మెట్రిక్ స్కాలర్షిప్స్ 2014–15లో 499 కోట్లుగా ఉంటే, 2019–20 వచ్చేసరికి 355 కోట్లకు తగ్గించారు. 2016–17, 2017–18, 2018–19లలో కేటాయింపులు చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. 2016–17లో 50 కోట్లు, 2017– 18లో 50 కోట్లు, 2018–19లో 125 కోట్లు, 2019–20లో ఇది మరింత దిగజారి 109 కోట్లకు తగ్గించడం ఏ సంక్షేమానికి సంకేతమో అర్థం కావడం లేదు. నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్కు కేటాయింపులు కూడా పెంచింది నామమాత్రమే. ఏకలవ్య మోడల్ పాఠశాలలకు గత కొన్ని సంవత్సరాలుగా నిధు లను పూర్తిగా నిలిపివేసిన పరిస్థితీ, ఆశ్రమ పాఠశాలలకు సైతం గత మూడేళ్ళుగా నిధుల కేటాయింపులే లేకపోవడం గమనిస్తే ఈ వర్గాల పట్ల పాలకుల నిర్లక్ష్యం స్పష్టమౌతోంది. స్వచ్ఛభారత్ పేరుతో గొప్పలు చెప్పుకుంటున్న మనం ఆచరణలో అమానవీయ విధానాలను రూపు మాపడంలేదు. కొన్ని రోజుల క్రితం పార్లమెంటులో కేంద్ర మంత్రి రామ్ దాస్ అతల్వాలే ఇచ్చిన సమాధానం ప్రకారం, పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళు, 1993 నుంచి ఇప్పటి వరకు 445 మంది మ్యాన్ హోల్లోకి దిగి ఊపిరాడక చనిపోయారు. గత మూడేళ్ళలో 88 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో తమిళనాడు144, గుజరాత్ 131, కర్ణాటక 75, యూపీలో 71 మంది చనిపోయారు. అయితే వారి సంక్షేమం కోసం గానీ, వారిని ఈ అమానవీయ వృత్తి నుంచి ఇతర వృత్తుల్లోకి తీసుకెళ్ళే పరిస్థితి కానీ, వారి చదువుల పట్ల ప్రభుత్వం చూపుతోన్న శ్రద్ధను కానీ చూస్తే మనం తలదించుకోక తప్పని పరిస్థితి. మాన్యువల్ స్కావెంజర్స్గా పనిచేస్తున్న వాళ్ళ స్వయం ఉపాధి కోసం 2013–14లో 557 కోట్లు కేటాయిస్తే, 2015–16లో 10 కోట్లు, 2018– 19లో 20 కోట్లు, మళ్ళీ 2019–20లో 110 కోట్లు కేటాయించారు. వారి పిల్లల చదువుకోసం 2015–16లో 10 కోట్లు, 2016–17లో 2 కోట్లు, దానిని మళ్ళీ 1 కోటికే పరిమితం చేశారు. మళ్లీ 2019–20లో దాన్ని 5 కోట్లుగా చేశారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో దిక్కుతోచని పరిస్థితి. గత అయిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం, ఎస్సీ, ఎస్టీల పట్ల చూపుతోన్న నిర్లక్ష్యానికి ఇవి మచ్చుకి కొన్ని ఉదాహరణలు మాత్రమే. వీటితో పాటు, భారతదేశంలో ముఖ్యంగా ఉత్తరభారతదేశంలో దళితుల మీద దాడులు పెరిగిపోతున్నాయి. అంటే ఒకవైపుఆర్థికంగా, సామాజికంగా వివక్షకు, అంటరానితనానికీ, వెలివేతకూ గురవుతూనే, రెండోవైపు జీవించే హక్కును కూడా కోల్పోతున్నారు. వీటన్నింటి ప్రతిరూపమే బిహార్లో పసిపిల్లలు పిట్టల్లా రాలిపోవడం. ఈ దేశంలో క్రమంగా అంటరాని కులాలైన దళితులు, ఆది వాసులు భారతదేశ చిత్రపటం నుంచి కను మరుగవుతారేమోననే భయం వెంటాడుతున్నది. భారత లోక్సభలో 112 మంది ఎస్సీ, ఎస్టీ సభ్యులున్నారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రత్యేక హక్కుల కారణంగానే వీరికి ఆ పదవులు దక్కాయి. ఎస్సీ, ఎస్టీల పక్షాన ప్రభు త్వంలో, ప్రభుత్వంతో పోరాడి, సంప్రదించి, ఏదోరకంగా ఎస్సీ, ఎస్టీల సామాన్య ప్రజల హక్కులను, జీవన భద్రతను పరిరక్షించాల్సిన బాధ్యత వారిది. కానీ అటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టు లేదు. ఇది శోచనీయం. వాళ్ళే కాదు. సమాజంలోని ప్రగతిని కాంక్షించే వాళ్లు, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్లు కూడా ఎస్సీ, ఎస్టీలకు జరుగుతున్న వివక్ష, వెలివేతలపై స్పందించాల్సిన తక్షణావశ్యత ఉంది. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 మల్లెపల్లి లక్ష్మయ్య -
సోషలిజానికి సరికొత్త భాష్యం
లాటిన్ అమెరికాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అభిమానులను సంపాదించుకొన్న విప్లవ తాత్వికవేత్త మార్తా హర్నేకర్. విద్యార్థి దశలోనే ఉద్యమ ధారగా మొదలైన ఆమె జీవితం తత్వవేత్తగా, మార్క్సిస్టు మేధావిగా, మహా రచయిత్రిగా, పాత్రికేయురాలిగా, ప్రపంచ ప్రఖ్యాత రచయిత్రిగా ఎదిగిన తీరు ప్రజాస్వామిక కాంక్షాపరులందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది. ఆమె తెలుగు రాష్ట్రాల్లోని మార్క్సిస్టు అభిమానులకు, ప్రజాస్వామిక ఉద్యమకారులకు పరిచయమున్న విప్లవ కంఠం. ప్రజాస్వామ్యం అట్టడుగు స్థాయి నుంచి పటిష్టం చేయడం ద్వారా మాత్రమే సోషలిజం కల సాకారమవుతుందని ఆమె తేల్చి చెప్పారు. నిత్య సంఘర్షణావాది, నిరంతర సత్య శోధకురాలు మార్తా హర్నేకర్ గతనెల 14వ తేదీన తుదిశ్వాస విడవడం ప్రజాస్వామిక అభిమానులకు తీరని లోటు. ‘‘ప్రపంచంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. భారీ సైనిక శక్తి, శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధితో అమెరికాతో సహా అనేక బహుళజాతి కంపెనీలు నూతన దోపిడీ విధానాలను కొనసాగిస్తున్నాయి. దీనితో ప్రజలు మరింత అశక్తులుగా తయారవుతున్నారు. సంపద కొద్దిమంది చేతుల్లోకి చేరిపోతుండడం వల్ల పేదరికం, వివక్ష మరింతగా పెరిగిపోతున్నది’’ అని ఆధునిక మార్క్సిస్టు మేధావి మార్తా హర్నేకర్ చేసిన వ్యాఖ్యలు ఆధునిక సామాజిక స్థితిగతు లకు అద్దం పడుతున్నాయి. మార్క్సిజాన్ని సమకాలీన సమాజానికి అన్వయించడంలో నిరం తరం కృషి చేసిన గొప్ప తాత్విక వేత్త మార్తా హర్నేకర్. విద్యార్థి దశలోనే ఉద్యమధారగా మొదలైన ఆమె జీవితం తత్వవేత్తగా, మార్క్సిస్టు మేధావిగా, మహా రచయిత్రిగా, పాత్రికేయురాలిగా, ప్రపంచ ప్రఖ్యాత రచయిత్రిగా ఎదిగిన తీరు ప్రజాస్వామిక కాంక్షాపరులందరికీ ఆదర్శప్రా యంగా నిలిచింది. మార్తా హర్నేకర్ తెలుగు రాష్ట్రాల్లోని మార్క్సిస్టు అభి మానులకు, ప్రజాస్వామిక ఉద్యమకారులకు పరిచయమున్న విప్లవ కంఠం. తెలంగాణ ఆవిర్భావం తరువాత హైదరాబాద్లో 2014 మార్చిలో ఏర్పాటు చేసిన ‘‘సోషలిజం–ప్రజాస్వామ్యం’’ అంతర్జాతీయ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని నాలుగు రోజుల పాటు ఎన్నో అంశాలపై చర్చించడం తెలంగాణ ఉద్యమకారులకూ, ప్రజాస్వామిక వాదులకూ, విప్లవాభిమానులకూ ఎంతో స్ఫూర్తినిచ్చింది. మార్తాహర్నే కర్ కలం నుంచి వెల్లువెత్తిన సైద్ధాంతిక భేదాభిప్రాయాలూ, సామాజిక అంచనాలూ వంటి వేనవేల రచనలు ఎందరినో ఆలోచింపజేశాయి. ఆమె ప్రపంచ మార్క్సిస్టు మేధావుల్లో ఒక నూతన ఆలోచనలకు పునా దులు వేసిన అగ్రగామి. లాటిన్ అమెరికాలోనే కాక ప్రపంచవాప్తంగా లక్షలాది అభిమానులను సంపాదించుకొన్న విప్లవ తాత్వికవేత్త. మార్తా రాసిన ‘రీ బిల్డ్ ద లెఫ్ట్’ ఎన్నో విమర్శలనెదుర్కొన్నప్పటికీ ప్రపంచవ్యా ప్తంగా కమ్యూనిస్టుల్లో సైద్ధాంతిక చర్చను రేపిన పుస్తకం, మార్క్సిస్టు సైద్ధాంతిక ఆచరణకు సరికొత్త అర్థం చెప్పిన రచన అని చెప్పొచ్చు. అటు వంటి నిత్య సంఘర్షణావాది, నిరంతర సత్య శోధకురాలు మార్తా హర్నే కర్ గతనెల 14వ తేదీన తుది శ్వాస విడవడం ప్రజాస్వామిక అభిమాను లకు తీరని లోటు. మార్తా హర్నేకర్ ఆస్ట్రియన్ మూలాలు కలిగిన కుటుంబంలో 1937లో చిలీలో జన్మించారు. చిలీలోని క్యాథలిక్ విశ్వ విద్యాలయంలో మానసిక శాస్త్రంలో పట్టా పొందారు. ఆ తర్వాత పారి స్లో పోస్ట్ గ్రాడ్యు యేషన్ చేశారు. ప్రముఖ విద్యావేత్త, లూయీస్ ఆల్తూసర్ వద్ద మార్తా హర్నేకర్ శిక్షణ పొందారు. 1963–1968 వరకు పారిస్లో ఉన్న మార్తా ఆనాడు ఉధృతంగా సాగిన పారిస్ విద్యార్థి ఉద్యమం నుంచి స్ఫూర్తిపొం దారు. 1968లో చిలీకి తిరిగి వచ్చిన మార్తా హర్నేకర్ చిలీ విశ్వవిద్యాల యంలో చారిత్రక భౌతికవాదం, రాజకీయా ర్థశాస్త్రం అధ్యాపకురాలిగా పనిచేశారు. 1968లోనే చిలీ సోషలిస్టు పార్టీలో చేరి క్రియాశీలకంగా పని చేసిన అనుభవం ఆమెను సైద్ధాం తికంగా, ఆచరణాత్మకంగా మరింతగా రాటుదేలేలా చేశాయి. కేరళ తర్వాత ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్టు ప్రభుత్వం చిలీలోని అలెండి ప్రభుత్వమే. 1970లో చిలీలో అలెండి ఎన్ని కల ద్వారా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. చిలీ సోషలిస్టు పార్టీ నేత సాల్వడర్ అలెండి నాయకత్వంలో మార్తా పనిచేశారు. అయితే 1973 సెప్టెంబర్ 11న అమెరికా కుట్రలో సైనిక తిరుగుబాటు జరిపి అలెండి ప్రభుత్వాన్ని కూలదోశారు. అలెండి అనుచరులందరినీ హత్య చేయ డమో, జైల్లో పెట్టడమో జరిగింది. మార్తా మాత్రం చిలీ నుంచి తప్పిం చుకొని క్యూబా చేరుకున్నారు. క్యూబాలో ఒక అధ్యయన సంస్థను స్థాపించి, తన పరిశోధనలను, రచనా వ్యాసంగాన్నీ కొనసాగించారు. అంతకు ముందు మార్తా విద్యార్థి దశలో ఉండగానే 1959లో క్యూబాను సందర్శించారు. అప్పటికే క్యూబా విముక్తిని సాధించింది. క్యూబా విప్లవంలో ‘ఎర్రగడ్డం’ యోధుడిగా పేరుపొందిన మాన్యుల్ పినెరోను మార్తా వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ ఒక కూతురు. ఆమె పేరు కమిల. మార్తా భర్త పినెరో 1998లో కారు ప్రమాదంలో మరణించారు. క్యూబాలో ఉన్న సమయంలో మార్తా హర్నేకర్ లాటిన్ అమెరికా చరిత్ర, ఉద్యమాలు, అనుభవాలెన్నింటినో ప్రత్యక్షంగా పాల్గొన్న వారి ద్వారా సేకరించారు. ఆ విధంగా లాటిన్ అమెరికా ఉద్యమాల చరిత్రను ఒక ప్రత్యేక దృష్టితో పరిశీలించారు. మార్క్సిజాన్ని లాటిన్ అమెరికాకు అన్వ యించి ఆమె 80కి పైగా పుస్తకాలు రాశారు. అందులో మొట్టమొదట చెప్పుకోవాల్సింది. ‘చారిత్రక భౌతిక వాదం–ప్రాథమిక సూత్రాలు’ అన్న పుస్తకం. ఈ పుస్తకం 60కి పైగా ముద్రణలు పొందింది. మొదట స్పానిష్లో ప్రచురితమైన ఆ పుస్తకం, ఆ తర్వాత ఇంగ్లిష్తో పాటు ప్రపంచంలోని చాలా భాషల్లోకి అనువాదమైంది. ఆమె రచనల్లో ‘ఎ వరల్డ్ టు బిల్డ్’, ‘ఐడియాస్ ఫర్ స్ట్రగుల్’ వెనిజులా విప్లవనాయకుడు చావెజ్ ఇంటర్వ్యూతో రూపొందిన పుస్తకం, ‘రీ బిల్డింగ్ ద లెఫ్ట్’ పుస్తకాలు ప్రపంచ ప్రఖ్యాతి పొందినవి. చివరి రెండు పుస్తకాలు తెలుగు లోకి కూడా అనువాద మయ్యాయి. మార్తా మార్క్సిస్టు తాత్విక విష యాల వెలుగులో ఆచరణకు సంబంధించిన విషయాలను ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా మార్క్సిస్టు సిద్ధాంతాలతో పనిచేస్తోన్న రాజ కీయ పార్టీల ఆచరణను మార్తా విమర్శనాత్మక దృష్టితో చూశారు. కమ్యూనిస్టు, మార్క్సిస్టు పార్టీల సిద్ధాంత సంక్షోభాన్ని ప్రము ఖంగా ఎత్తిచూపారు. ముఖ్యంగా మూడు అంశాలను ఆమె లేవనెత్తారు. కారల్మార్క్స్ పేర్కొన్న పెట్టుబడిదారీ విధానానికి ప్రస్తుతం కొనసాగు తోన్న పెట్టుబడిదారీ పద్ధతులకూ ఎంతో తేడా ఉన్నదని, దానిని అర్థం చేసుకోవడంలో మార్కిస్టులుగా మనం విఫలమవుతున్నామని పేర్కొన్నారు. పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసిన ఆటోమేషన్, డిజిటల్, కంప్యూ టర్లు, రోబోల పాత్ర గురించి విశ్లేషించుకోవాలని, అవి ఉత్పత్తి నుంచి కార్మిక వర్గాన్ని తొలగిస్తున్న అంశాలను అర్థం చేసు కోవాలని మార్తా అభిప్రాయపడ్డారు. కొద్ది మంది మినహా ప్రపంచం లోని అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు రోజురోజుకూ దిగజారి పోతున్నాయని, గతంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగం పెరిగి పోతున్నదని చెప్పారు. సమాచార విప్లవం పెట్టుబడిదారీ విధానాన్ని ముందుకు తీసుకెళ్ళిందని, సామ్రాజ్యవాదం రూపంలో మార్చుకున్నదే కానీ, కను మరుగు కాలేదని కూడా ఆమె స్పష్టం చేశారు. రెండో అంశంగా, కమ్యూనిస్టుల ఒంటెద్దు పోకడలను ఎత్తిచూ పారు. ప్రపంచంలో కొనసాగుతున్న నయా ఉదారవాదం, ప్రపంచీకర ణకు వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో కలిసివచ్చే శక్తులన్నిం టితో కలిసి పనిచేయాలని, కేవలం కమ్యూనిస్టు సభ్యులతో మాత్రమే విజయం సాధించలేమని ఆమె పేర్కొన్నారు. సోదరభావం, సమస మాజం ఆశించే వాళ్ళు, కార్మిక వర్గ హక్కుల కోసం, ప్రజాస్వామ్య రక్షణ కోసం పోరాడే వాళ్లందరితో కలిసి పోరాడాలని ఆమె స్పష్టం చేశారు. అంతేకాకుండా గత ఉద్యమాల నుంచి, గత సోషలిస్టు ప్రభుత్వాలు, వ్యవస్థలు అందించిన అనుభవాలను అధ్యయనం చేయాలని ఆమె సూచించారు. అందుకు గాను లాటిన్ అమెరికాలో గత రెండు వందల ఏళ్ళుగా సాగుతున్న ఉద్యమాలను మార్తా అధ్యయనం చేశారు. మరొక ముఖ్యమైన విషయాన్ని మార్తా పదే పదే చెపుతుండేవారు. మార్క్సిజంలో అత్యంత ముఖ్యమైన చారిత్రక భౌతిక వాదం గురించి ఆమెది ప్రత్యేకమైన అధ్యయనదృష్టి. చరిత్రను భౌతికవాద దృష్టితో చూడాలని మార్క్సిజం చెపుతున్న మాటను ఆమె గుర్తు చేస్తూ, ఇప్పటి వరకూ చారిత్రక భౌతిక వాదాన్ని యూరప్కే పరిమితం చేసి చూస్తు న్నామని ఆమె విమర్శించారు. ఏ దేశానికి ఆ దేశ ప్రత్యేక సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని విస్మరించడం వల్ల చాలా దేశాల్లో విప్లవాలు విజయం సాధించలేకపోయాయి. మనదేశంలో ఉన్న సామాజిక సమస్యలు, ప్రత్యేకించి కుల వ్యవస్థ ప్రభావాన్ని ఇప్పటికీ కూడా శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషించలేకపోతున్నాము. మార్తా హర్నేకర్ మరొక విషయాన్ని చాలా నిక్కచ్చిగా తేల్చి చెప్పారు. కార్మిక వర్గ నియంతృత్వం ద్వారానే సోషలిజం సాధ్యమవు తుందనే వాదనను ఆమె తిరస్కరించారు. ప్రజాస్వామ్యాన్ని అట్టడుగు స్థాయి నుంచి పటిష్టం చేయడం ద్వారా మాత్రమే సోషలిజం కల సాకారమవుతుందని ఆమె తేల్చి చెప్పారు. ఆ విధంగా మార్క్సిజాన్ని ఆధునిక ప్రజాస్వామ్య ఆలోచనల వెలుగులో విశ్లేషించి నూతన అధ్య యనానికి పునాదులు వేశారు. ఆమె రచనలు, భావాలు ఆధునిక ప్రపం చంలో ఒక నూతన వెలుగును నింపాయి. మార్తా లాటిన్ అమెరికా ఉద్యమాలు, విప్లవాల వెలుగులో అధ్యయనం సాగించినప్పటికీ ఆమె ఆలోచనలు ప్రపంచం లోని మార్క్సిస్టులందరికీ స్ఫూర్తినిస్తున్నాయి. ముఖ్యంగా మార్తా హర్నేకర్ జీవితం, ఉద్యమం, నిత్యం సమాజ మార్పు కోసమే సాగాయి. క్యాన్సర్తో పోరాడుతూ తుదిశ్వాస విడిచిన మార్తా మూసభావనలకు భిన్నంగా, ప్రవాహంతో కొట్టుకుపోకుండా, మారు తున్న సామాజిక ఆర్థిక పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సరికొత్త, ఆచరణాత్మక పద్ధుతులతో మున్ముందుకు సాగాలని కోరు కున్నారు. మార్తా అంకిత భావం, పోరాట దీక్ష, శాస్త్రీయ అధ్యయనశక్తి భవిష్యత్ తరాలకు మార్గదర్శకం అవుతుందని ఆశిస్తున్నా...! వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘మొబైల్ : 81063 22077 మల్లెపల్లి లక్ష్మయ్య -
మనిషిని మింగుతున్న ‘ఆటోమేషన్’
యాంత్రీకరణ మనిషిని ఉత్పత్తికి దూరం చేస్తోంది. ఇది వ్యవసాయ రంగాన్ని మొట్టమొదటిగా కబళించింది. మట్టికీ మనిషికీ ఉన్న సంబంధాన్ని బద్దలు కొట్టింది. గత రెండు వేల ఏళ్లుగా సమాజంలో సంభవించని పరిణామాలు గత ముప్ఫై, నలభై ఏళ్లలో అనూహ్యంగా చోటు చేసుకున్నాయి. ఒకే ఒక్క ట్రాక్టరు వ్యవసాయరంగంలో కొన్ని వందలమంది జీవనోపాధిని మింగేసింది. వ్యవసాయంలో జరిగే అతి చిన్న పనులను కూడా మనిషితో సంబంధం లేని యంత్రాలు చేస్తున్నాయి. నేడు ఆటోమేషన్ అనేది లక్షలాదిమందికి నిజంగానే పనిలేకుండా చేస్తోంది. ప్రజలకు తమ కాళ్లమీద తాము నిలబడి బతికే పరిస్థితిని కల్పించడం, ఉపాధిని ఏర్పర్చడం.. వంద సంక్షేమ చర్యలకంటే మిన్నగా మేలు చేకూర్చుతుంది. మనిషి ప్రగతి, భద్రత, రక్షణ, సంతోషం కేంద్ర బిందువుగా సమాజం అభివృద్ధి చెందడానికి ఇప్పటికైనా ప్రయత్నాలు మొదలవ్వాలి. ‘‘ప్రపంచంలో అనూహ్యమైన పరిణా మాలు జరగబోతున్నాయి. ప్రస్తుతం కొనసా గుతున్న ఆర్థిక అసమానతలు మరింత పెరిగి, ఒక అసాధారణమైన ధనికవర్గం ఏర్పడబోతున్నది. రోజురోజుకు శాస్త్ర, సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులవల్ల మనిషి శరీరం లోని జీన్స్లో కూడా మార్పులు తీసుకొచ్చి, దీర్ఘకాలం జీవించే విధానాలను కనుగొనబోతున్నారు. దాని వల్ల ధనవంతులకే పరిమితమైన ఒక అసాధారణమైన మానవజాతి ఏర్పడనుంది. సమాజంలో దారిద్య్రం అనుభవిస్తున్న వాళ్లు రక్షణ, భద్రత కరువై ప్రపంచపటం నుంచి కనుమరుగవుతారు.’’ ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ సామాజిక, ఆర్థిక అసమా నతలతో కూడిన భవిష్యత్ చిత్రపటాన్ని శాస్త్రీయంగా విశ్లేషించిన చిట్ట చివరి వ్యాఖ్యానమిది. ప్రపంచ పరిణామాలపై స్టీఫెన్ హాకింగ్ జరిపిన పరిశోధనలు అనన్య సామాన్యమైనవి. ‘సుదీర్ఘ ప్రశ్న, సంక్షిప్త సమాధా నాలు’ అనే పుస్తకంలో ఈ విశ్లేషణ చేశారు. ఈ పుస్తకంలో మానవ సమా జాన్ని అతలాకుతలం చేసే ఆర్థిక అసమానతలపై స్పష్టమైన, విలువైన సమాచారాన్ని వెల్లడించారు. దాని ఫలితంగా ఆవిష్కృతమయ్యే ఒక అసాధారణ మానవజాతి గురించి, అదేవిధంగా ఆకలితో, అభద్రతతో కుంగికృశించిపోయే మరొక దీనజాతి గురించి కళ్లకు కట్టినట్లు చూపారు. ఇది వినడానికి కొంత బాధగానే ఉన్నప్పటికీ, ప్రపంచ పరి ణామాలను శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించి చెప్పిన అక్షర సత్యాలివి. నాడు కారల్ మార్క్స్ పెట్టుబడి రూపంలో పెరుగుతున్న అసమానతల గురించి చెప్పిననాడు విమర్శించిన వారున్నారు. మార్క్సిసు ్ట మహానా యకుల సిద్ధాంతాలతో, భావజాలంతో అంతగా సంబంధంలేని ప్రపంచ మేధావి స్టీఫెన్ హాకింగ్ వ్యాఖ్యలు సమాజానికి కనువిప్పు అవుతాయి. మార్క్సిస్టు భావజాలం పనికిరాదని కొట్టిపడేస్తున్న వాళ్లు, ఇటీవల పెరుగుతున్న ఆర్థిక అసమానతలను తొలగించే ఆలోచన చేయలేకపోతున్నారు. ఆర్థిక అసమానతలు భవిష్యత్తులో ప్రపంచాన్ని ధ్వంసం చేయగలవని చెప్పిన స్టీఫెన్ హాకింగ్ హెచ్చరిక మన దేశానికి కూడా వర్తిస్తుంది. ఇందుకు మనదేశంలో జరుగుతున్న పరిణామాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ధనిక, పేదల మధ్య అంబరాల అగాధాలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. తొంబై శాతం ప్రజలు కటిక దారి ద్య్రాన్ని అనుభవిస్తుంటే, కేవలం పదిశాతం మంది బొక్కసాల్లో మానవ జాతి సంపద మొత్తం బందీ అయింది. సమాజంలోని అత్యధికమంది ప్రజలు నిలువనీడలేక, సెంటు భూమి లేక, సహజవనరులపై ఎలాంటి హక్కులూ లేక, కనీస ఉపాధి కరువై, నిజమైన విద్య, నిలకడ కలిగిన ఉపాధి, జీవన భద్రత, సామాజిక సంరక్షణలకు దూరంగా బతుకీడు స్తున్నారు. ఓవైపు ప్రజల జీవితం నిత్య దారిద్య్రంతో కొట్టుమిట్టాడు తుంటే, మరోవైపు మానవ ప్రమేయమే లేని, మానవజాతిని ఉత్పాదక రంగం నుంచి తరిమికొట్టే సరికొత్త అభివృద్ధి నమూనా ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. గత మూడు, నాలుగు దశాబ్దాలుగా సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు, యాంత్రీకరణ మనిషిని ఉత్పత్తికి దూరం చేస్తోంది. ఇదే వ్యవసాయ రంగాన్ని మొట్టమొదటిగా కబళించింది. మట్టికీ మనిషికీ ఉన్న సంబంధాన్ని బద్దలు కొట్టింది. గత రెండు వేల ఏళ్లుగా జరగని పరి ణామాలు గత ముప్ఫై, నలభై ఏళ్లలో జరిగాయి. మానవ జాతిని ఇంతకాలం నిలబెట్టిన వ్యవసాయం కుదేలైంది. యాంత్రీకరణ, ఆధుని కీకరణ ప్రభావంతో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది ఉపాధిని కోల్పోయారు. 1977–78లో 32వ సర్వే ప్రకారం 80 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటే, 2017–18లో జరిపిన సర్వే ప్రకారం వీరు 55 శాతానికి పడిపోయారు. వ్యవసాయ సంక్షోభంతో తొట్టతొలి బాధితులు మహిళలేనన్నది సత్యం. నిజానికి ఒకే ఒక్క ట్రాక్టరు కొన్ని వందలమంది జీవనోపాధిని మింగేసింది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడాన్ని వ్యతిరేకించడం నా ఉద్దేశం కాదు. ట్రాక్టర్ ద్వారా కోత కోయడం, కుప్ప చేయడం, గింజలు రాల్చడం నుంచి పంట రవాణావరకు మనిషితో సంబంధం లేని యంత్రాలు చేస్తున్నాయి. వివిధ రకాల పనులు చేసే రైతులు, కూలీలను పనినుంచి పారదోలాయి. దానిపై ఆధారపడిన మనుషులు కనీసం 2, 3 నెలలపాటు జీవనోపాధిని కోల్పోవాల్సిన దుర్భరస్థితి. మొత్తం వ్యవ సాయ రంగం నుంచి రైతాంగం నిష్క్రమించాల్సిన స్థితి దాపురించింది. వ్యవసాయ రంగం తర్వాత యాంత్రీకరణ చేదు ఫలితాలను చవి చూసిన రంగం నిర్మాణ రంగం. నిర్మాణ రంగంలో ఎంతోమంది పని చేస్తున్నట్టు కనిపించినా అక్కడ మనుషుల ప్రమేయం బాగా తగ్గిపోయిన మాట వాస్తవం. గత నలభై ఏళ్లలో నిర్మాణ రంగం పెరిగిన స్థాయిలో కూలీల వినియోగం జరగలేదు. ముఖ్యంగా సిమెంటు, ఇసుక మిక్సింగ్ చేసే ప్రక్రియ తదితర పనులన్నింటికీ యంత్రాలనే వినియో గిస్తున్నారు. దీని ఫలితంగా జీవనోపాధిని కోల్పోతున్న వేలాదిమంది జీవితం అగమ్య గోచరంగా తయారైంది. ఉన్నచోట పని దొరకక ఊళ్లకు ఊళ్లు ఖాళీచేసి వలసబాట పడుతున్న పేద బతుకులకు అక్కడ కూడా జీవనో పాధి దొరకక దిక్కుతోచని స్థితి. బతుకు భారమైన ప్రజలకు కనీసం ఒకపూట తిండి పెట్టగలిగే జీవన భద్రత కోసం ఉపాధి హామీ పథకం తెచ్చారు. అయితే ఇది కూడా అవినీతికి నెలవుగా మారిపోయింది. అయితే ఇది కూడా శాశ్వత పరిష్కారం కాదు. ప్రజలకు తమ కాళ్లమీద తాము నిలబడి బతికే పరిస్థితిని కల్పించాలి. పెన్షన్లు, రూపాయికి కిలో బియ్యం లాంటి పథకాలు, ఆకలితో అలమటించకుండా ఒక భరోసాను ఇస్తున్నాయి. ఇవి కూడా పేదలను చావకుండా బతికిస్తాయ్గానీ తమ కాళ్లమీద తాము నిలబడే పరిస్థితిని కల్పించవు. రెండోవైపు, ఇప్పు డిప్పుడే శ్రామిక రంగంలో అడుగుపెడుతున్న యువత పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గతంలోలాగా సాంప్రదాయకంగా వచ్చే ఆఫీసు ఉద్యోగాలు, నైపుణ్యం లేని పనుల స్థానంలో కంప్యూటర్లు, యాంత్రీ కరణ, ఆధునికీకరణ ప్రవేశించి సాధారణ డిగ్రీలు, పీజీలు, పీహెచ్డీలు చేసిన లక్షలాదిమంది అగమ్య గోచరమైన స్థితిలో ఉన్నారు. కంప్యూటర్ రంగం మొదటగా ఎంతోమందికి ఆశాకిరణం లాగా కనిపించింది. అది కూడా మసక బారుతున్నది. ఆటోమేషన్ ఈరోజు ఒక భూతంలా వెంటాడుతున్నది. ప్రతిరోజూ కొన్ని పదులకొద్దీ ఉద్యోగులు కంప్యూటర్ రంగం నుంచి నిష్క్రమిస్తున్నారు. దేశంలోని ఉత్పత్తిరం గంలో వచ్చే యాంత్రీకరణ వల్ల నో వేకెన్సీ బోర్డులు పెరుగుతున్నాయి. సర్వీసు రంగం కూడా క్రమంగా స్తబ్దతకు గురవుతోంది. పైగా, దేశంలో శ్రమించగలిగే శక్తి ఉన్న యువతలో నైపుణ్యం కలిగిన వాళ్ల సంఖ్య చాలా అత్యల్పం. మనకంటే చిన్న దేశమైన దక్షిణ కొరియాలో నైపుణ్యం కలిగిన కార్మికుల సంఖ్య 90, జపాన్ 80, జర్మనీ 75, బ్రిటన్ 68, అమెరికా 52 శాతంగా ఉన్నాయి. మన దేశంలో శ్రమ చేయగలిగే శక్తి ఉన్నవాళ్లు ప్రపం చంలోని అన్ని దేశాలతో పోలిస్తే 28 శాతం ఉన్నారు. కానీ నైపుణ్యం స్థాయి మాత్రం కేవలం 4 శాతం మాత్రమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ప్రపంచాన్ని ఆక్రమిస్తున్న సమయంలో మన యువత కనీస నైపుణ్యం దరిదాపుల్లో కూడా లేదు. ఇది నిజానికి అసలు సమస్య. యువతలో వృత్తి నైపుణ్యాలు లేకపోవడానికి మన విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలే కారణం. మనం విద్య అంటే, కేవలం అక్షరాస్యత అని భ్రమిస్తున్నాం. మన పూర్వీకులు కోటి విద్యలు కూటికొరకే అన్నారు. అంటే కోటి చదువులు అని అర్థం కాదు. కోటి పనులు, అంటే ఏ పనైనా తిండి కొరకే అన్న అర్థంలో వాడారు. ఈరోజు మన విద్యార్థులు ఎన్ని డిగ్రీలు పొందినా అందులో వృత్తి నైపుణ్యానికి అర్థం లేదు. అందుకే మన నైపుణ్యం శాతం నాలుగు దాటలేదు. దీనిని సరిజేసుకోకపోతే గ్రామాల్లో, పట్టణాల్లో వృత్తులకు, శ్రమకు దూరమవుతున్న తల్లిదం డ్రులు, వారి వెనుకనే నైపుణ్యంలేని డిగ్రీలు పట్టుకొని మన యువత తయారవుతూనే ఉంటారు. ఈ పరిస్థితులను ఉపయోగించుకొని కొద్ది మంది పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు మొత్తం దేశంలోని సహజ వనరులను, ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టి కొద్దికాలంలోనే వేలకోట్లకు అధిపతులవుతున్నారు. వాళ్లకుగానీ వాళ్లను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వా లకు గానీ దేశ సంపద పెరుగుదలే గీటురాయి. కానీ కోట్లాదిమంది ప్రజలు శ్రమకు, వనరులకు, ఆస్తులకు, ఆదాయాలకు దూరమై పెన్ష న్లతో, ఇతర రీతిలో వచ్చే డబ్బులతో పరాధీనమైన బతుకులు వెళ్లదీస్తు న్నారు. ఈ పరిణామం క్రమంగా ఆస్తులు, ఆదాయాలు, వనరులు అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానంలో మనుషుల ప్రమేయం లేకుండా సాగే ఒక కేంద్రీకృతమైన అభివృద్ధివైపు పయనిస్తున్నది. కోట్లాదిమంది మను షులు ఆకలేస్తే, దాహమేస్తే ప్రభుత్వాలు, కొన్ని దాతృత్వ సంస్థలవైపు నోరెళ్లబెట్టి చూసే పరిస్థితి రానున్నది. ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు రోజురోజుకూ ఎక్కువవుతు న్నాయి. ఈ పరిస్థితులను పెంచి పోషి స్తున్నవాళ్లు ఎలాగూ దీనిని సరి దిద్దలేరు. ప్రజలే ఈ పరిస్థితుల గురించి, ఎవరి దయాదాక్షిణ్యాల మీదనో ఆధారపడే పరిస్థితిని ఎదుర్కోవాలి. సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాలు, పెట్టుబడులు కాకుండా.. మనిషి ప్రగతి, భద్రత, రక్షణ, సంతోషం కేంద్ర బిందువుగా సమాజం అభివృద్ధి చెందడానికి ఇప్పటికైనా ప్రయత్నాలు మొదలవ్వాలి. వ్యాసకర్త : మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
‘సబ్కా విశ్వాస్’లో వాళ్లకు చోటుందా?
కొత్త కోణం ఈ దేశంలో గత ఐదేళ్ళలో మతం దేవాలయాల్లోనుంచి, అన్నం గిన్నెల్లోకి పొంగిపొర్లింది. ఎవరేం మాట్లాడాలో, ఏం ఆచరించాలో, ఏ సంస్కృతిని అనుసరించాలో, చివరకు ఎవరి అన్నం గిన్నెల్లో ఏముండాలో కూడా ఆధిపత్య మతమో, లేదా హిందుత్వవాదులో నిర్ణయిస్తోన్న దయనీయ పరిస్థితి ఈ దేశంలో 15 శాతంగా ఉన్న ముస్లిం మైనారిటీల వంటగదులను సైతం రక్తసిక్తంగా మార్చేసింది. ఈ నేపథ్యంలో మన దేశంలో మైనారిటీలలో నెలకొన్న ఊహాజనితమైన భయాలను తొలగించాలని సబ్కా సాథ్ సబ్కా వికాస్తో పాటు, సబ్కా విశ్వాస్ కూడా సాధించాలంటూ రెండోసారి అధికార పగ్గాలు చేపడుతోన్న ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి. ముస్లింలలోని భయం నిజం కాదని ధ్వనిస్తున్న ఈప్రకటన మన దేశ ముస్లింలలో విశ్వాసాన్ని ప్రోది చేస్తుందా? అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశం లోని ప్రతి పౌరుడి సంరక్షణకు లౌకికభావన కంచు కవచంలాంటిది. కానీ వ్యక్తి ఆహార్యాన్నీ, ఆహారాన్నీ, సాంప్రదా యాన్నీ, సంస్కృతినీ, గుర్తించి, గౌరవించే కనీస మానవీయ విలువలకి కాలం చెల్లిందనడానికి గడచిన ఐదేళ్ళు ప్రత్యక్షసాక్ష్యంగా నిలుస్తు న్నాయి. మతం మత్తుమందులాంటిదని ఏనాడో చెప్పిన మార్క్సిస్టు మహాజ్ఞాని వ్యాఖ్యలు అక్షరసత్యాలని వేనవేల సంవత్సరాల మత మౌఢ్యం ప్రతిమారూ నిరూపిస్తూనే ఉంది. అది హిందూత్వ భావజాల పునాదులపై అధికారంలోకి వచ్చిన భారతీయ జనతాపార్టీ, దాని అనుబంధ సంస్థలూ మతం యొక్క మూఢత్వాన్నీ, వెర్రితనాన్నీ మరిం తగా సాక్షాత్కరించాయి. బీజేపీ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఈ నాటి వరకూ ఆధిపత్య మతమైన హిందూ మతం మైనారిటీ మత మైన ముస్లిం మతంపైనా, ఇస్లాం మతాన్ని ఆచరిస్తోన్న అత్యంత పేద వర్గమైన ముస్లింలపైనా చెలాయిస్తోన్న ఆధిపత్య చరిత్ర యావత్తు రక్తసిక్తంగా మారింది. ఇలాంటి సందర్భంలో రెండోసారి అధికారపగ్గాలు చేపడుతోన్న ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు ఈదేశంలో సమా నత్వ కాంక్షాపరులందరినీ క్షణకాలం పాటు ఆశ్చర్యానికి గురిచేశాయి. ‘‘మన దేశంలో మైనారిటీలలో నెలకొన్న ఊహాజనితమైన భయా లను తొలగించాలి. సబ్కాసాథ్ సబ్కా వికాస్తో పాటు, సబ్కా విశ్వాస్ కూడా సాధించాలి. మనం ప్రజలందరి ప్రభుత్వంగా పనిచేయాలి’’ అంటూ బీజేపీ అనూహ్య విజయాన్ని కైవసం చేసుకున్న అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త గొంతును విని యావత్ దేశం ఆశ్చర్యపోయింది. ఈ దేశంలో ఇసుమంతైనా సెక్యులర్ భావజాలం బతికి బట్ట కట్టాలని భావించేవారందరికీ ఈ వ్యాఖ్యలు అద్భుతంగా తోయడంలోనూ ఆశ్చర్యం లేదు. ఈ మాటల్లో సత్యమెంత అన్న అను మానం రానివారెవ్వరూ ఉండరని కూడా గతకాలపు చేదు అనుభవాల దొంతరలు నొక్కి చెపుతున్నాయి. అందుకనుగుణంగానే ఈ మాటల్లోనే ఒక తిరకాసు కనిపిస్తున్నది. ఒక మాయాజాలం అంతర్లీనంగా వినిపిస్తూ ఉన్నది. ముస్లిం మైనారిటీల్లో ఊహాజనితమైన భయం ఉన్నదని ఆయన మాటల సారాంశంగా మనం భావించొచ్చు. ముస్లింలలోని భయం నిజం కాదన్నది దానర్థం. ఆ మాటల్లోని అంతరార్థంలో సత్యాసత్యా లను పెద్దగా అన్వేషించాల్సిన పనికూడా లేదు. భారతదేశంలోని పరిస్థి తులను గత అయిదేళ్ళుగా పరిశీలిస్తున్న వారెవరికైనా ఈ మాటల్లోని నిజం వెతకడం అర్థంలేనిపనిగా స్పష్టమౌతుంది. ముఖ్యంగా ముస్లింలు, క్రైస్తవ మైనారిటీల్లో గత కొన్నేళ్ళుగా నెలకొన్న అభద్రతాభావం పెరి గింది. దానికి గత ఐదేళ్ళలో ఆయా మతాలపైనా, మతాన్ని ఆచరిస్తోన్న ప్రజలపైనా అమానుషమైన దాడులూ, దానికి సమర్థనగా లేవనెత్తిన అప్రజాస్వామిక భావజాలాలూ కారణం. ముఖ్యంగా గోసంరక్షణ పేరుతో జరిగిన దాడులు కాకతాళీయం కాదన్న సంగతి జగమెరిగిన సత్యం. ఈ దేశంలో గత ఐదేళ్ళలో మతం దేవాలయాల్లోనుంచి, అన్నం గిన్నెల్లోకి పొంగిపొర్లింది. ఎవరేం మాట్లాడాలో, ఏం ఆచరించాలో, ఏ సంస్కృతిని అనుసరించాలో, చివరకు ఎవరి అన్నం గిన్నెల్లో ఏముం డాలో కూడా ఆధిపత్య మతమో, లేదా ఆ మతాన్ని ఆచరిస్తోన్న పాలకుల నీడలో హిందూత్వవాదులో నిర్ణయిస్తోన్న దయనీయమైన పరిస్థితి ఈ దేశంలో 15 శాతంగా ఉన్న ముస్లిం మైనారిటీల వంటగదులను సైతం రక్తసిక్తంగా మార్చేసింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన అనం తరం అంటే 2018 వరకు జరిపిన అధ్యయనంలో దాదాపు 80 మందికి పైగా హత్యకు గురయ్యారని హ్యూమన్ రైట్స్ వాచ్ పేర్కొన్నది. ఆవుని చంపడాన్ని నిషేధిస్తూ ఉన్న చట్టాలను బీజేపీ ప్రభుత్వాలు మరింత కఠినతరం చేశాయి. కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు గో సంరక్షణ దళాలను ఏర్పాటు చేయడమే కాకుండా వాటికి అపరిమితమైన అధికా రాలను కట్టబెట్టాయి. ఎవరైనా గో హత్యకు పాల్పడినట్టు వారు భావిస్తే, లేదా అనుమానం వస్తే, అది కాదని నిరూపించుకునే బాధ్యత సైతం నిందితులపైనే పెట్టారు. ఇది పూర్తిగా కక్షసాధింపు చర్యే తప్ప మరొకటి కాదు. మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, హరియాణా లాంటి రాష్ట్రాల్లో గో సంరక్షణ దారులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు. 2017లో ఉత్తర ప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన యోగి ఆదిత్యనాథ్ ఏకంగా ముస్లింలు చట్ట ప్రకారం నిర్వహిస్తోన్న ఎన్నో పశువధ శాలలను బలవంతంగా మూసివేయించారు. రాజస్తాన్లో బీజేపీ ప్రభుత్వం ఆవులను అక్ర మంగా తరలిస్తున్నారనే పేరుతో వందలాది మందిని అక్రమంగా నిర్బం ధించింది. గోసంరక్షకులకు అధికారికంగా అండదండలు అందించి, అన ధికారికంగా ప్రోత్సాహమిచ్చి అదే వృత్తిని నమ్ముకొని బతుకుతోన్న వేలా దిమంది నిరుపేద ముస్లింలపై దాడులకు కారణమయ్యింది. దాని ఫలి తమే 2017 ఏప్రిల్లో పెహ్లఖాన్ అనే పాలమ్ముకునే రైతును స్మగ్లింగ్ చేస్తున్నాడనే పేరుతో తీవ్రంగా హింసించిన అమానుష ఘటన అప్పట్లో పెద్ద సంచలనాన్ని రేపింది. గోసంరక్షణ పేరుతో హత్యలకు పాల్పడిన వాళ్ళకు వత్తాసు పలుకుతూ, ఆవులను స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళను తెలిసి నేరం చేస్తున్నట్టు, గో సంరక్షకులూ, గో ఆరాధకులు వాళ్ళను ఆపడానికి ప్రయత్నం చేయడం తప్పుకాదు అంటూ హంతకులకు వత్తాసు పల కడం పాలకుల తీరుకి అద్దం పడుతోంది. 2015 మే నుంచి 2018 డిసెంబర్ మధ్యలో కనీసం 44 మంది ముస్లింలు హత్యకు గురైనట్టు, వీరిలో అత్యధిక భాగం ఆవు మాంసాన్ని రవాణా చేస్తున్నందుకో, లేదా గోవు మాంసాన్ని ఇంట్లో ఉంచుకున్నం దుకో మృత్యువు ఒడిలోకి చేరిన దుస్థితిని హ్యూమన్ రైట్స్ వాచ్ బట్ట బయలు చేసింది. అలాగే దేశంలో జరిగిన మతదాడుల్లో 90 శాతం మోదీ అధికారాన్ని చేపట్టిన తరువాతే జరిగాయని కూడా ఈ రిపోర్టు వెల్లడించింది. గోసంరక్షకుల పేరుతో కొంతమంది ముఠాలుగా తయారై హింసాకాండకు దిగారు. దాడులు చేశారు. హత్యలకు దిగారు. కేవలం గోభక్షకులనే ఒకే ఒక్కపేరుతో నిరుపేద మైనారిటీల దేహాలను చెట్లకు వేళ్ళాడదీశారు. ఈ కుటుంబాల్లోని వారెవరైనా న్యాయం కోసం గొంతు విప్పితే వారినోళ్ళు మూయించడానికి కండబలాన్ని ప్రయోగించడం అత్యంత సహజక్రియగా మారిపోయింది. చావు భయంతో వెనక్కి తగ్గడం తప్ప వారికి వేరే ఆసరా లేకుండా పోయింది. ఎవరైనా సామా జిక కార్యకర్తలో, సంస్థలో బలవంత పెడితే పేరుకి దర్యాప్తు ప్రారం భించి, దానికి సంబం ధించిన ప్రొసీజర్స్ని నిర్లక్ష్యం చేసి, చివరకు నేర స్తులను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించినట్టు కూడా ఈ రిపోర్టు తేల్చి చెప్పింది. ఇక ఛత్తీస్గఢ్ మాజీ సీఎం రమణసింగ్ ఏకంగా ‘‘గోవులను చంపే వారిని మేం ఉరితీస్తాం’’ అంటూ అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. చివరకు రైళ్ళలో ప్రయాణిస్తున్న వారిపై సైతం గోమాంసం తింటున్నా రనే పేరుతో దాడులకు పాల్పడిన ఘటనలు ఎన్నో జరిగాయి. హరియా ణాలో బీఫ్ తింటున్నారన్న కారణంగా ఓ కుటుంబంలోని ఇద్దరు స్త్రీలపై అత్యాచారంచేసి, హత్యచేసిన దారుణ ఘటనలు జరగడం మన రాజ్యాం గంలోని లౌకిక భావనకు ఈ దేశం, ఇక్కడి పాలకులు ఇస్తున్న గౌరవ మెలాంటిదో అర్థం అవుతోంది. ఏదైనా నేరం చేసిన వారు తమ నేరాన్ని బహిరంగంగా చెప్పు కోలేరు. నేరం చేసినందుకు తాము శిక్షించబడతా మేమోననే భయం వారిలో ఉంటుంది కనుక. కానీ గోసంరక్షణ పేరుతో దాడులకు పాల్పడిన వారు తమ నేరాన్ని బహిరంగంగా యూట్యూబ్లో పెట్టుకుంటున్నారు. తాము చేసిన దుశ్చర్యకు విర్రవీగుతున్నారు. ఎందు కంటే వారిని ఆ తరువాత శిక్షించడం కాకుండా హీరోలుగా చూస్తున్న పరిస్థితి ఉందంటున్నారు ఇండియన్ సోషల్ వర్కర్, రచయిత హర్షమం దర్. మూకుమ్మడిగా ముస్లింలను హత్యలు చేసిన గుంపు హత్యాకాం డల్లో దోషులకు శిక్షపడిన దాఖలాలే లేవు. ఆ రోజు ముస్లింల హత్యలకు పాల్పడిన గుంపులకు ఇప్పుడిక హద్దూ పద్దూ ఉండదని మరునాటి నుంచే ప్రారంభమైన దాడులు తేట తెల్లం చేస్తున్నాయి. కాబట్టి ప్రధాని, లేదా భారతీయ జనతా పార్టీ వల్లె వేస్తున్న మాటలకూ, చేతలకూ పొంతనలేదన్న విషయంలో ఏమాత్రం సందేహంలేదు. సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ వినడానికి సొంపుగానే ఉన్నా, అదే విశ్వాసాన్ని ఈ దేశ ముస్లింలలో కలిగించాలంటే హిందుత్వ వాదుల ఆగడాలను పార్టీలు కాదు సమాజమే అడ్డుకట్ట వేయాలి. ఓట్లు దండుకున్న హిందుత్వవాదం వెర్రితలలు వేయకముందే ప్రతి పౌరుడూ మెళకువతో వ్యవహరించక తప్పని పరిస్థితి ఇది. మరో ఐదేళ్ళ పాటు ఈ దేశంలో దళితులూ, మైనారిటీలూ, స్త్రీలూ తమని తాము వ్యక్తులుగా, ఉమ్మడిగా శక్తిని కూడగట్టుకోవాల్సిన సందర్భమిదే. స్వతంత్రపోరాట కాలంలో ఆ తర్వాత కూడా, ఈ దేశంలోని ప్రతి అభివృద్ధిలో వారి చెమ టచుక్కలున్నాయి. శత్రుదేశాలనుంచి ఈ దేశాన్ని రక్షించుకోవడం మొద లుకొని, ఈ జాతిబిడ్డల ప్రాణాలు కాపాడటం కోసం ప్రాణాలర్పించడం వరకు ముస్లింల సేవలు అనన్యసామాన్యమైనవి. ఇక్కడ అడుగడుగునా ఎదురౌతోన్న అవమానాలను దిగమింగుతూ తన భూమిపైనే పరాయి వారుగా జీవిస్తున్న వారిని హత్తుకుని, అక్కున చేర్చుకునే రోజు కోసం భారత దేశస్తుడైన ప్రతి ముస్లిం ఎదురుచూస్తూనే ఉంటాడు. వారికి అండగా హృదయమున్న ప్రతిభారతీయుడూ స్పందిస్తూనే ఉంటాడు. ఇది సత్యం. మల్లేపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
ఉత్తరాది ఆధిపత్యం ప్రమాదకరం
ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య స్వాతంత్య్ర పూర్వ కాలం నుంచీ కొనసాగుతున్న అంతరాలు దేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలపై ఎంతో ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. ప్రధానంగా ఈ రెండు ప్రాంతాలమధ్య ఉన్న మత, సామాజికపరమైన వైవిధ్యాలను వైరుధ్యాలుగా చిత్రీకరిస్తూ ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారు. భాష, సంస్కృతి విషయంలో ఒక ప్రాంతానికి చెందిన కొన్ని వర్గాల ఆలోచనలు, అభిప్రాయాలను యావత్ దేశంపై బలవంతంగా రుద్దే పరిస్థితి తీవ్ర పరిణామాలకు దారి తీయనుంది. ప్రత్యేకించి కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనలో ఉత్తరాది ఆధిపత్య ధోరణి తారస్థాయికి చేరింది. అయితే దక్షిణ భారత దేశాన్ని చిన్నచూపు చూడటంలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ దొందూ దొందే కావడం గమనార్హం. ‘‘భారతదేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య ఎంతో వైవిధ్యం ఉన్నది. ఉత్తర దేశం మూఢనమ్మకాలతో మునిగి ఉంటే, దక్షిణ ప్రాంతం హేతు దృక్పథంతో ఉన్నది. ఉత్తరం ఛాందసవాదంలో ఉంటే, దక్షిణం ప్రగతిశీలమైన బాటలో ఉన్నది. విద్య విషయంలో దక్షిణం ముందడుగు వేస్తుంటే, ఉత్తరభారతం వెనుకబడి ఉంది. సాంస్కృతిక పరంగా దక్షిణం ఆధుని కతను సంతరించుకుంటే, ఉత్తరం ప్రాచీన దశలోనే ఉంది’’ ఇవి 1955 లోనే బాబాసాహెబ్ అంబేడ్కర్ నోటివెంట దొర్లిన అక్షర సత్యాలు. భాషా ప్రయుక్తరాష్ట్రాల విషయమై రాష్ట్రాల పునర్వవ్యస్థీకరణ సంఘానికి అందజేసిన నివేదికలోని అంశమిది. భారతదేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య ఉన్న ఈ వ్యత్యాసం ఎన్నో ఇతర అంశాలను ప్రభా వితం చేస్తుందని అంబేడ్కర్ అంత ముందుగానే ఆలోచించగలిగారు. ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంపైన ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తోందనీ, ఇది ప్రజాస్వామిక దృక్పథానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. దాదాపు ఆరు దశాబ్దాల క్రితమే అంబేడ్కర్ చెప్పిన మాటలు ఈ నాటికీ అక్షరసత్యాలుగా మనముందు సాక్షాత్కరిస్తు న్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య కొనసాగుతున్న ఈ అంతరాలు భారతదేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల మీద ఎంతో ప్రభా వాన్ని కలిగిస్తున్నాయి. ఒకరకంగా ఉత్తర భారతదేశంలో మొలకెత్తిన తిరోగమన భావజాలాలన్నింటినీ దక్షిణాదిపై రుద్దుతున్నట్టు చరిత్ర రుజువుచేస్తోంది. ముఖ్యంగా మతపరమైన, సామాజికపరమైన వైవి«ధ్యా లను వైరుధ్యాలుగా చిత్రీకరిస్తూ ప్రజల మధ్య ఒక ఘర్షణ వాతావర ణాన్ని సృష్టిస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు రెండూ కూడా దక్షిణాది మీద వ్యతిరేక భావాన్ని కలిగి ఉన్నారు. ముఖ్యంగా 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ అనుసరించిన విధా నాలు దక్షిణాదిని కలవరపరుస్తున్నాయి. ఒక ప్రాంతానికి చెందిన కొన్ని వర్గాల ఆలోచనలను, అభిప్రాయాలను యావత్ దేశంపై బలవం తంగా రుద్దే పరిస్థితి దీర్ఘకాలంలో తీవ్రపరిణామాలకు దారితీస్తుందనడా నికి అనేక ఉదాహరణలున్నాయి. ఉత్తరాదిలో ఒక వర్గం ఆలోచనలను, దేశం మొత్తం ఆచరించాలనే ధోరణిని ఈ ప్రభుత్వం ప్రదర్శిస్తున్నది. ఒక మతం ప్రాతిపదికగా దేశాన్ని పాలించాలనుకునే బీజేపీ ప్రభుత్వ విధానాలను దక్షిణ భారత దేశం ఏనాడూ ఆమోదించలేదు. కారణం ఈ నేలకున్న చారిత్రక చైతన్య లక్షణం కావచ్చు. లేదంటే ఈ ప్రాంతంలో ఉద్భవించిన అనేకానేక ఉద్య మాలు కావచ్చు. ఈ ప్రాంతాన్ని ఇవే నిత్యచైతన్యస్రవంతిలో ఓలలాడేలా చేశాయి. మూర్ఖత్వానికీ, మూఢత్వానికీ ఇక్కడ చోటు తక్కువనే చెప్పాలి. దక్షిణాదిలో సాగిన కుల వ్యతిరేక పోరాటాలూ, సాంఘిక సంస్కరణో ద్యమాలూ ఈ ప్రాంత ప్రజలను చైతన్యపథంలో నడిపాయి. హిందూ మతంలోని మూఢవిశ్వాసాలనూ, కుల అణచివేతనూ, వివక్షనూ ఈ ఉద్యమాలు తిప్పికొట్టాయి. అందులో ముఖ్యంగా తమిళనాడులో ఆయో తీదాస్, రామస్వామి నాయకన్, కేరళ అయ్యంకాలి, ఆనాటి హైదరా బాద్ సంస్థానంలో భాగ్యరెడ్డి వర్మ ఆంధ్రప్రాంతంలో త్రిపురనేని రామ స్వామి చౌదరి లాంటి వాళ్ళు ఎంతో స్ఫూర్తిని అందించారు. అయితే సరిగ్గా ఈ చైతన్యమే ఉత్తరాదిలో కొరవడిందని ఆనాడు అంబేడ్కర్ స్పష్టం చేశారు. సరిగ్గా అదే నేడు అడుగడుగునా రుజువ వుతూ వస్తున్నది. ప్రజాస్వామిక వ్యవస్థలో మత స్వేచ్ఛ అనేది ఒక ప్రాథమిక సూత్రం. కానీ బీజేపీ, దాని నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వ శక్తులూ హిందూ మత రక్షణకు బదులుగా, ఇతర మతాలను ధ్వంసం చేయాలనుకోవడం మనకు ఇటీవలికాలంలో అత్యంత ఆందో ళన కలిగించిన అంశం. ఇతర మతాల ప్రజల ఆహారపుటలవాట్ల మీద గోమాంసం పేరుతో వందల మందిపై దాడిచేయడం, కొందరిని హత్య చేయడం మొదలెట్టి దేశమంతటా ఇటువంటి దాడులు జరపాలని భావించారు. కానీ అదిసాధ్యం కాలేదు. దక్షిణ భారతీయులు హిందువు లైనప్పటికీ ఇతర మతాల ఆచార వ్యవహారాలను తక్కువగా చూడలేదు. ఈ ప్రాంత ప్రజల జీవనాధారం మీద దాడిచేయాలనుకోలేదు. ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య ఒకే అంశంపై ఉన్న వ్యత్యాసాన్ని వరల్డ్ వాల్యూ సర్వే బయటపెట్టింది. దీని ప్రకారం హిందూ మతం ఒక్కటే అనుసరిం చదగినదని ఉత్తరాది అధికంగా భావిస్తే, దక్షిణాదిలో దానిని అంగీక రించే వాళ్ళ శాతం తక్కువ. అదేవిధంగా అన్ని మతాలూ సమానమనే భావనలో కానీ, ఇరుగుపొరుగు వాళ్ళు ఇతర మతస్థులు ఉండకూడదనే విషయంలోగానీ, రెండు ప్రాంతాల మధ్య ఎంతో వ్యత్యాసమున్నది. ముఖ్యంగా ముస్లింల పట్ల అవలంబిస్తున్న వైఖరిలో రెండు ప్రాంతాలు భిన్నంగా వ్యవహరిస్తున్నాయని, ఈ సర్వే వెల్లడించింది. ఇటీవల ఎన్నికల సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ హిందూ మతం, హిందూత్వంపై చేసిన వ్యాఖ్యలు కూడా దక్షిణ, ఉత్తర ప్రాంతాల ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ హిందూ మత సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూనే, ముస్లిం ప్రజల సంక్షే మంపై దేశంలో ఏ ప్రభుత్వం చూపించని శ్రద్ధను కనబరుస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ముస్లింలకోసం అమలుచేస్తున్నది. అంతేకాకుండా 200కు పైగా రెసిడెన్షియల్ పాఠశాల లను ముస్లింల కోసం నిర్వహిస్తున్నదంటే ఇది దక్షిణ భారతదేశం అవలంభిస్తున్న మత సహనానికి నిదర్శనం. అట్లాగే కర్నాటక, కేరళ, తమిళనాడులలో తెలంగాణలో లాగా ఇంత ప్రాధాన్యత ఇవ్వకపో యినా, ద్వేషభావం కలిగించలేదు. దీనికి విరుద్ధమైన వైఖరిని బీజేపీ ఉత్తరప్రదేశ్లో అనుసరిస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లోగానీ, ఇటీవల లోక్సభ ఎన్నికల్లోగానీ, ముస్లింలను కనీసం ఒక్కటంటే ఒక్క స్థానం నుంచి కూడా పోటీకి నిలపలేకపోయింది. ఎందుకంటే అక్కడి హిందు వుల్లో కరుడుగట్టిన ముస్లిం వ్యతిరేకతను సొమ్ముచేసుకోవడానికి, ఇతర హిందువుల ఓట్లను రాబట్టుకోవడానికి ముస్లిం వ్యతిరేకతను రాజకీయం చేశారు. చేస్తున్నారు. అదేవిధంగా ఉత్తరభారతదేశ ప్రజాస్వామిక వ్యతి రేక ధోరణిని బాబాసాహెబ్ అంబేడ్కర్ గతంలోనే ఉదహరించారు. యావద్దేశానికి హిందీ అధికార భాషగా ఉండాలనే విషయంలో రాజ్యాంగ సభలో జరిగిన చర్చలో సభ్యులు 78–78 అనే సంఖ్యతో సమం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆనాటి నాయకత్వం తమ పార్టీ సభ్యులతో చర్చలు జరిపి ఒప్పించి, వ్యతిరేకించే వారిలో ఒకరిని సభకు హాజరుకాకుండా చూడడంవల్ల 78–77 తేడాతో హిందీ భాష అధికార భాష కాగలిగింది. రాజకీయంగా కూడా దక్షిణ భారతదేశం ఎప్పుడూ ఉత్తర భారత దేశంపైన ఆధారపడే స్థితిని కల్పించారు. లోక్సభలో ఎక్కువ సీట్లు ఉత్తర భారతదేశంలో ఉండడం వల్ల ఇప్పటికే పీ.వీ.నరసింçహారావు మినహా మరే దక్షిణ భారత నేత కూడా పూర్తికాలం ప్రధానమంత్రిగా కొనసాగలేక పోయారు. దేవెగౌడ కొద్దికాలమే ప్రధాని పదవిలో ఉండగలిగారు. ప్రధానమైన మంత్రిత్వ శాఖలు కూడా ఉత్తర భారతీయులే ఎక్కువగా అధిష్టించారు. రాష్ట్రపతి పాలనగానీ, ప్రభుత్వాలను బర్తరఫ్ చేసే ప్రక్రియ కూడా దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా జరిగిందని రాజ కీయ పరిశీలకులు భావిస్తున్నారు. వీటన్నింటి ఫలితంగానే దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం జరిగిందని భావించక తప్పదు. తెలుగు దేశం పార్టీ ఎన్టీఆర్ హయాంలో కేంద్రానికి వ్యతిరేకంగా ఏర్పడి, తెలుగు ఆత్మగౌరవమనే ప్రాతిపదిక మీద అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రజలు నినదిస్తే, స్పందించకపోవడం వల్లనే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇమడక పోవడంవల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసర మైంది. తమిళనాడులో ఢిల్లీని ఎదిరించే రాజకీయాలతోనే అక్కడి పార్టీలైన డీఎంకే, అన్నాడిఎంకే పనిచేస్తున్నాయి. కర్నాటకలో కూడా జెడీఎస్ ఒక ప్రాంతీయ పార్టీగానే వ్యవహరిస్తున్నది. ఆ పార్టీ నాయకులు కూడా ఢిల్లీలో అవమానానికి గురవుతున్నారు. దేవెగౌడ ఒక సమయంలో ప్రత్యక్షంగా నాతో వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఇక్కడ చెప్పడం సందర్భోచితం అని భావిస్తున్నాను. ప్రధానిగా పదవికి రాజీనామా చేసిన తర్వాత హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఢిల్లీ ఒక నియంతల కుటీరం. అది రాజ కీయంగానూ, నివాసపరంగానూ, సమాజపరంగానూ రాజధానిగా సరిపోదు. దక్షిణాది నాయకులంటే, అక్కడి రాజకీయనాయకత్వానికి మాత్రమే కాదు, అధికార యంత్రాంగం కూడా చాలా చులకనగా చూస్తారు’’ అని వాపోయారు. ఇటువంటి సందర్భాలు దక్షిణాది నాయ కులందరికీ అనుభవమే తప్ప అబద్ధం కాదు. ఇటీవల ఈ ఆధిపత్య ధోరణి, దక్షిణాది రాష్ట్రాల పట్ల చిన్నచూపు మరింత ఎక్కువైందని స్పష్ట మౌతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రావాల్సిన హక్కులు, నిధుల నుంచి పూర్తిగా దాటవేయడం మనం చూస్తూనే ఉన్నాం. కేరళ రాష్ట్రంలో ఘోరమైన వరదలు వచ్చి, వేల కోట్ల నష్టం వాటిల్లి, వంద లాది మంది మృత్యువాత పడితే ఆదుకోవడంలో చూపిన అలక్ష్యం ఎవ రినైనా కుంగదీయకపోదు. ఒకవైపు సామాజిక, సాంస్కృ తిక అంత రాలూ, రెండో వైపు వివక్ష, నియంతృత్వ పోకడలు భవి ష్యత్లో ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య మరింత అగా«థాన్ని సృష్టించక మానవు. రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను, రాజ్యాంగ విలువలను పాలకులూ ప్రజలూ పాటిస్తే ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య; సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
ఝాన్సీ కోటలో మెరిసిన కరవాలం
ప్రథమ భారత మహాసంగ్రామంలో శతృవు కన్నుగప్పి తన రాణిని గెలిపించడానికి కత్తిచివరన నెత్తుటి బొట్టై మెరిసిన వీరవనిత, దళిత సేనాని ఝల్కారి బాయి పేరుని చరిత్ర మరువజాలదు. రాణి లక్ష్మీబాయిని బ్రిటిష్ సైన్యం నుంచి తప్పించడానికి తెగువ చూపిన ఝల్కారి బాయి చివరకు తమ చేతికి చిక్కినప్పుడు ఆమె పట్ల బ్రిటిష్ సేనాని ప్రశంసల వర్షం కురిపించాడు. ‘కనీసం ఒక్కశాతం మంది భారత మహిళలు ఈమెలా ఉంటే బ్రిటిష్ వారు తక్షణమే ఈ దేశాన్ని వీడి ఉండేవారు’ అంటూ తాను వ్యాఖ్యానించడం విశేషం. పరదాల మాటున తప్ప పదిమందిలోకి సైతం స్త్రీలను అనుమతించని కాలంలో ఒక మహిళ యావత్ సామ్రాజ్య దుర్గాసేనకి సేనానిగా ముందు వరుసన నిలబడి తలలు తెగిపడుతున్నా తరగని గుండెనిబ్బరంతో సైన్యంలో సత్తువ నింపిందన్న ఊహకూడా మనకు కలగదు. బానిస సంకెళ్ళ నుంచి, పరాయి పాలన నుంచి విముక్తి కోసం యావత్ భారత ప్రజల స్వేచ్ఛానాదమై నినదించిన ప్రప్రథమ భారత సంగ్రామం ప్రారంభమైన రోజు ఈ రోజు. భారతదేశాన్ని చెరబట్టిన బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తరిమికొట్టేందుకు భారతదేశం నడుం బిగించిన రోజు. విదేశీ దురా క్రమణకు ఎదురొడ్డి నిలిచిన జనసామాన్యులెందరో చరిత్రపుటల్లోకి చేరనే లేదు. అట్టడుగున పడి కాన్పించని అణగారిన వర్గాల జాడే ఏ చరి తకూ అందని అక్షరమయ్యింది. ఇక వేనవేల సైనిక పటాలాలను తుత్తు నియలు చేసి, శత్రువు గుండెల్లో తుఫానులు రేపిన 1857 ప్రథమ భారత సంగ్రామంలో చిందిన నెత్తుటి ధారలెవ్వరివో లెక్కించడం బహుకష్టం. ఇదే తొలిభారత మహాసంగ్రామంలో శత్రువు కన్నుగప్పి తన రాణిని గెలిపించడానికి కత్తిచివరన నెత్తుటి బొటై్ట మెరిసిన వీరవనిత పేరుని చరిత్ర మరువజాలదు. ప్రథమ భారత సంగ్రామం గుర్తుకురాగానే ఝాన్సీ లక్ష్మీబాయి గుర్తుకు వస్తుంది. బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్ళు పరుగెత్తించిన ఝాన్సీ లక్ష్మీబాయి పేరు తలచుకున్న వెంటనే గుర్తురావాల్సిన పేరు ఝల్కారీ బాయి. పరదాల మాటున తప్ప పదిమందిలోకి సైతం స్త్రీలను అను మతించని కాలంలో ఒక మహిళ యావత్ సామ్రాజ్య దుర్గా సేనకి సేనా నిగా ముందువరుసన నిలబడి తలలు తెగిపడుతున్నా తరగని గుండె నిబ్బరంతో సైన్యంలో సత్తువ నింపిన స్త్రీ ఉంటుందన్న ఊహకూడా మనకు కలగదు. అలనాటి వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యానికి నాయకత్వం వహించిన తెగువ గలిగిన ఓ దళిత మహిళను భరత నేల గుండెలకు హత్తుకుంది. ఝల్కారీ బాయితో సహా కొందరు వీరనారీ మణులను ఇక్కడ స్మరించుకోవాల్సి ఉంది. భారత స్వతంత్ర సంగ్రా మంలో పురుషులకు దీటుగా పోరాడిన మహిళలెందరో చరిత్రపుటల్లోకి ఎక్కలేదు. అందులోనూ దళిత, ముస్లిం మహిళల సాహసోపేత పోరా టాలెన్నో మరుగునపడిపోయాయి. అలాంటి వారిలో బేగమ్ హజరత్ మహల్, రాణీ ఝాన్సీ లక్ష్మీబాయి, ఊదా దేవి, అజీజున్ బాయి, ఝల్ కారీ బాయి ప్రముఖులు. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తుదముట్టించ డంలో దళిత మహిళల పాత్ర మరువలేనిది. వీరాంగనల పేరుతో భారత మహిళలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన మహా సంగ్రామంలో పోరాడారు. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ రాణీ, ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యాధ్యక్షురా లిగా పనిచేసిన వీరాంగన ఝల్కారీ బాయి ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన దళిత మహిళ. నిరుపేద కుటుంబానికి చెందిన ఝల్కారీ బాయి ‘కోరి’ సామాజిక వర్గానికి చెందినవారు. 1830 నవంబర్ 22న ఝాన్సీకి దగ్గర్లోని భోజ్లా గ్రామంలో జమునా సింగ్, సడోబా సింగ్లకు జన్మించారు. ఝల్కారీ బాయి తండ్రి మల్లయోధుడు. ఝల్కారీ బాయికి యుక్త వయస్సురాగానే తల్లి మరణించింది. తండ్రి స్వతహాగా మల్లయోధుడు కావడంతో ఆమెకు చిన్నప్పటి నుంచే కత్తిసాము గుర్రపు స్వారీ నేర్పించారు. ఏకైక కుమార్తె అయినప్పటికీ తండ్రి చాటు బిడ్డగా పెరగడం వల్లనో, తండ్రినుంచి వారసత్వంగా వచ్చిన వీరత్వమో కానీ ఝల్కారీ బాయి చిన్ననాటి నుంచే అంతులేని ధైర్యసాహసాలు ప్రదర్శించేవారు. ఆమెలోని ధైర్యసాహసాలూ, మరణాన్ని సైతం లెక్కచేయని తెగువ, మృత్యువుని సైతం కౌగిలించుకునే చేవ కలిగిన ఝల్కారీ బాయి చరిత్రను ఇటీవలి కాలంలో చరిత్రకారులు వెలికి తీయడంతో ఆమె సాహసోపేత జీవితం వెలుగులోకి వచ్చింది. ఒకసారి వంటచెరకు కోసం అడవికి వెళ్ళినప్పుడు చిరుత దాడి చేస్తుంది. తన చేతిలోని గొడ్డలితో చిరుతపై ఝల్కారీ బాయి తిరగబడుతుంది. చేతిలోంచి జారిపడిన గొడ్డలిని లెక్కచేయకుండా చిరుతపై పడి పళ్లతోనూ, గోళ్ళతోనూ దాన్ని చీల్చి చెండాడి రక్తమోడుతూ తిరిగి ఇంటికి చేరిన ఘటన స్థానిక ప్రజ లను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇలాంటివే ఎన్నో సాహసాలు ఈ దళిత వీరవనిత పేరుని పరిసర ప్రాంతాల్లో మారుమోగేలా చేస్తుంది. అలాగే ఒకసారి ఝల్కారీ బాయి ఊరిలోని వ్యాపారి ఇంటిపై దొంగలు పడి దోచుకుంటున్న సమయంలో కూడా ఝల్కారి బాయి ఒంటిచేత్తో దొంగ లతో పోరాడి దుండగులను తరిమి తరిమి కొడుతుంది. ఈ సాహసో పేత చర్యలే ఆమె ఘనతను రాణీ లక్ష్మీబాయి చెవికి సోకేలా చేశాయి. ఝల్కారీ బాయి ఝాన్సీ లక్ష్మీబాయి దృష్టిలో పడటానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఝాన్సీ లక్ష్మీబాయి సామ్రాజ్యంలో ప్రతియేటా దుర్గా పూజ జరిగేది. ఆ పూజాకార్యక్రమానికి మహిళలందరికీ ఆహ్వానం ఉండేది. సహజంగానే నాయకత్వ లక్షణాలున్న ఝల్కారీ బాయి పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు స్థానిక గ్రామప్రజలను వెంటబెట్టుకుని రాణీవాసానికి వెళ్ళినప్పుడు ఝల్కారీ బాయి తొలిసారిగా రాణీ లక్ష్మీ బాయి దృష్టిలో పడుతుంది. స్వతహాగా వీరత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఝల్కారీ బాయిని గురించి ఆ తరువాత అడిగి తెలుసుకున్న ఝాన్సీ రాణీ ఆమెను తరచూ రాణివాసానికి రప్పించుకొని స్వయంగా తానే యుద్ధ విద్యలు నేర్పించినట్టు చరిత్ర చెపుతోంది. వీరాంగనగా పిలువ బడే యుద్ధవనితలతో ఒక సైన్యాన్నే ఏర్పాటు చేసిన ఘనత రాణీ లక్ష్మీ బాయికే చెందుతుంది. అంతేకాదు ఒక మహిళకి అందునా ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన అట్టడుగు వర్గం మహిళకి దేశభద్రతా బాధ్యతలు అప్పగించిన చరిత గతమంతా వెతికినా దొరకదు. ఝాన్సీ లక్ష్మీబాయి మహిళ కావడం వల్లనే దళిత స్త్రీకి అంతటి రక్షణ బాధ్యతలను అప్పగించ గలిగినట్టు భావించొచ్చు. ఆ తరువాత బ్రిటిష్ సైన్యాన్ని దీటుగా ఎదు ర్కొనేందుకు పలు విద్యలు నేర్పించి ఝల్కారీ బాయిని దుర్గాదళ్లో నియమించాలని ఝాన్సీ లక్ష్మీబాయి ఆదేశిస్తారు. అనంతరం రాణీయే స్వయంగా ఆమెకు యుద్ధవిద్యలో ఆరితేరేలా శిక్షణ ఇస్తారు. శరీరాకృతి లోనూ యుద్ధతంత్రంలోనూ ఝాన్సీ లక్ష్మీబాయి పోలికలతో ఉన్న ఝల్ కారీ బాయి ఆ తరువాత రాజ్యంకోసం, ప్రజలకోసం చూపిన సాహసం, చొరవ ఆమె చరిత్రను మౌఖిక సాహిత్యంలో సజీవంగా ఉంచేలా చేశాయి. ఇప్పటికీ ఝాన్సీలోని జానపద గేయాల్లో ఝల్కారీ బాయి జీవన గాథలు, కథలు కథలుగా స్థానిక సంస్కృతిలో భాగమయ్యాయి. 1858 ఏప్రిల్ మాసంలో బ్రిటిష్ సైన్యం రాణివాసంపై దాడిచేసిన ప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. దీంతో ఆమెను యుద్ధరంగం నుంచి తప్పించేందుకు దళిత వీరనారి ఝల్కారీ బాయిచేసిన సాహసం ప్రథమ భారత సంగ్రామంలో జనం మదిలో చెరగని ముద్రవేసింది. ఝాన్సీ లక్ష్మీబాయిలా మారువేషం వేసుకొని యుద్ధరంగంలోకి దూకిన ఝల్కారీ బాయి ఝాన్సీ సైన్యానికి సారథ్యం వహిస్తారు. బ్రిటిష్ జనరల్ హగ్ రోజ్ దరికి చేరగానే ఝల్కారీ బాయి ఝాన్సీ రాణీని తప్పించేందుకు తాను బ్రిటిష్ జనరల్ని కలవాలనుకుం టున్నానని అరుస్తూ చెప్పడంతో బ్రిటిష్వారి దృష్టి ఝల్కారీ బాయిపై పడుతుంది. అదే అదనుగా భావించి ఝాన్సీ లక్ష్మీబాయి తప్పించుకుం టారు. బ్రిటిష్ సైన్యంతో వీరోచితంగా పోరాడుతూ జనరల్ చేతికి చిక్కిన ఝల్కారీ బాయిని ఝాన్సీరాణీగా భావించిన బ్రిటిష్ జనరల్ ‘నిన్నేం చేయాలి’ అని ప్రశ్నించినప్పుడు ఝల్కారీ బాయి ఏ మాత్రం తొణకకుండా ‘ఉరితీయండి’ అని కోరుతుంది. దళిత వీరవనితలో దాగున్న ధైర్యసాహసాలూ, గుండెనిబ్బరం మనల్ని నివ్వెరపరుస్తాయి. బుందేల్ ఖండ్ వీరవనిత సాహసం చూసి హతాశుడైన బ్రిటిష్ సైని కాధికారి ఝల్కారీ బాయిని ఉద్దేశించి ‘‘కనీసం ఒక్కశాతం మంది భారత మహిళలు ఈమెలా ఉంటే బ్రిటిష్ వారు తక్షణమే ఈ దేశాన్ని వీడి ఉండేవారు’’ అంటూ వ్యాఖ్యానించడం దళిత బిడ్డ ఝల్కారీ బాయి తెగువకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. శతాబ్దాల దళితుల చరిత కనుమరుగైనట్టే ఝల్కారీ బాయి చరిత్ర కూడా చరిత్ర మరుగున పడిపోయింది. నిజానికి స్వతంత్ర సంగ్రా మంలో, భారత సమాజ నిర్మాణంలోనూ, అభివృద్ధిలోనూ ఎందరో దళిత మహిళల నెత్తుటి గుర్తులు దాగున్నాయి. జాతీయత పేరుతోనో, మరోపేరుతోనో దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులు సమాజ పురోగతిలో వారి త్యాగాలను చిరునామాను వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఈ సమాజాన్ని తమ దేహపు చెమట చుక్కలతో స్వచ్ఛంగా మార్చుతోంది మరెవ్వరో కాదు.. ఈ దేశంలో దగాపడిన దళిత మహిళ లేనన్నది మర్చిపోకూడదు. మన వేపచెట్టునీ, మన పసుపు గుట్టునీ విప్పి చెప్పింది కూడా బౌద్ధ బిక్కు అయిన ఒక దళిత మహిళే. ఈనేలపై పండిన పసుపు లోని ఔషధగుణాలను గుర్తించి పూజాకార్యక్రమాల్లో దాని వాడకం అవసరాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసింది దళిత మహిళే. మశూచి, ఆటలమ్మలకు విరుగుడు ఔషధగుణాలున్న వేపచెట్టే నని తేల్చి చెప్పింది సైతం ఆ దళిత సామాజికవర్గానికి చెందిన అంబి కామయి అని చరిత్ర చెపుతోంది. వైద్యం మొదలుకొని యుద్ధం వరకు దళిత మహిళల ప్రమేయంలేని చరిత్ర లేదు. దాన్ని మననం చేసుకోవడ మంటే అనాదిగా వారిపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలనడమే. -మల్లెపల్లి లక్ష్మయ్య (నేడు ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం ప్రారంభమైన రోజు) వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
మేనిఫెస్టోల్లో ప్రజాసమస్యలు మాయం
భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యధిక జనాభా సమస్యల ప్రస్తావన మచ్చుకైనా మేనిఫెస్టోల్లో లేకపోవడం విచారకరం. బీజేపీతోసహా రాజకీయ పార్టీల ప్రణాళికల్లోనూ, నేతలు గుప్పిస్తోన్న హామీల్లోనూ ఎక్కడా కూడా ప్రజల నిజమైన సమస్యలను ప్రతిబింబిస్తున్న దాఖలాల్లేవు. ప్రతి ఎన్నికల ప్రచారం వివాదాలకు ఆజ్యం పోయడంతోనే ముగుస్తోంది. మానవాభివృద్ధి నివేదికల్లో మన దేశం చిన్న చిన్న దేశాల కంటే అట్టడుగుస్థానంలో పడిపోయింది. 20 కోట్ల మంది ప్రజలు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో నిద్రపోతున్న దయనీయమైన స్థితి, 19 కోట్ల 60 లక్షల మంది పోషకాహార లోపంతో జీవిస్తుండటం.. ఇవేవీ మేనిఫెస్టోల్లో చోటుచేసుకోకపోవడం గర్హనీయం. ఎవరైతే సమాజగమనాన్ని మార్చడానికి నిరంతరం శ్రమిస్తారో, పరిష్కారమార్గాలకోసం పరితపిస్తారో, తమ కార్యాచరణ ద్వారా ప్రజల జీవితాల్లో పెనుమార్పులకు కారణమవుతారో, వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల మనసుల్లో చిరంజీవులుగా నిలిచిపోతారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. మన దేశంలోనూ, ప్రపంచవ్యాప్తం గానూ ఎందరో త్యాగధనులు దేశ భవిష్యత్తుకోసం తమ జీవితాలను ధారపోశారు. కానీ ఇటీవల మన దేశంలో జరుగుతున్న పరిణామాలనూ, నడుస్తున్న చరిత్రనూ గమనిస్తే నిరాశే మిగులుతుంది. దేశ భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికల పోరు జోరుగా సాగుతోంది. ఎన్నికల్లో పాల్గొనే పార్టీలు చాలా ఉత్సాహంతో, ప్రణాళికలతో ప్రజల్లోకి వెళుతున్నాయి. సభల్లో అధినాయకుల ప్రసంగాల్లోనూ ప్రజలకు హామీలు గుప్పించేస్తున్నారు. అయితే చాలా వరకు రాజకీయ పార్టీల ప్రణాళికల్లోనూ, ఓటర్ల సాక్షిగా నేతలు గుప్పిస్తోన్న హామీల్లోనూ ఎక్కడా కూడా ప్రజల నిజమైన సమస్యలను ప్రతిబింబిస్తున్న దాఖలాల్లేవనడంలో సందేహం అక్కర్లేదు. ప్రజల సమస్యలు పాక్షికంగానే ప్రస్థావనకు వచ్చాయి. కొన్ని ముఖ్యమైన సమస్యలకు వాళ్ళ ప్రణాళికల్లో, ప్రసంగాల్లో చోటు దక్కడంలేదన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రణాళికను గమనిస్తే మరింత ఆందోళన కలుగుతోంది. ఈ దేశంలో అన్ని విషయాలతో పాటు కులం ఒక నిజం. కులం ఒక వర్గీకరణ మాత్రమే కాదు. అది వివక్షకూ, అణచివేతకూ, అసమానతలకూ ప్రతిరూపం. ఇప్పటికీ అంటరానితనానికీ, అవమానాలకూ గురవుతున్న దళితుల విషయంగానీ, సమాజానికి దూరంగా అడవుల్లో నివసిస్తూ, తమ జీవితాలతో పాటు అల్లుకొని వున్న అటవీ సంపదనూ, ఖనిజవనరులనూ కొల్లగొడుతుంటే చూస్తూ నిస్సహాయంగా మిగిలిపోతున్న ఆదివాసుల ఊసుగానీ ఈ ప్రణాళికల్లో కనిపించకపోవడం గమనించాల్సిన విషయం. అలాగే వృత్తులనూ, ఉపాధినీ కోల్పోయి పొట్టచేత పట్టుకొని ఎక్కడెక్కడికో వలసపోతున్న బీసీ కులాల గురించిగానీ, మతం పేరుతో వివక్షకూ, హింసకూ గురవుతున్న మైనారిటీల గురించిగానీ ఎన్నికల ప్రణాళికలు పట్టించుకున్న పాపాన పోలేదు. భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యధిక జనాభా ప్రస్థావన మచ్చుకైనా ప్రణాళికల్లో లేకపోవడం గర్హనీయమైన విషయం. గతంలో ఇదే బీజేపీ ప్రణాళికల్లో మాట వరసకైనా ఈ విషయాలను చేర్చింది. కానీ ఈసారి అవేవీ వీరి దృష్టినైనా తాకకపోవడం విచారకరం. పైగా ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల పేదల కోసం ప్రకటించిన పదిశాతం రిజర్వేషన్ల విషయం మాత్రం చాలా ప్రముఖంగా పేర్కొన్నారు. ఆ పార్టీలో కొనసాగుతున్న ఈ వర్గాల నేతలుగా కొనసాగుతున్న వారు కూడా ఎందుకు నోరు మెదపడంలేదో అర్థం కాని విషయం. పైగా, ఈ దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో పేదరికం, ఆకలి, అభద్రత, ఆరోగ్యం, విద్య లాంటి సమస్యలు కూడా ఏ ఎన్నికల ప్రణాళికలోనూ చర్చకు రావడం లేదు. ప్రపంచ ఆహార భద్రత, పోషకాహార స్థితిగతులపై 2018లో విడుదలైన ఒక నివేదిక ఎన్నో కఠినమైన విషయాలను బయటపెట్టింది. ‘ఆహార, వ్యవసాయ సంస్థ’ అధ్యయనంలో దాదాపు 19 కోట్ల 60 లక్షల మంది పోషకాహార లోపంతో జీవిస్తున్నట్టు తేలింది. 20 కోట్ల మంది ప్రజలు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఉంటున్న దయనీయ స్థితి ఉన్నదని తెలిసింది. దేశంలోని 21 శాతం మంది పిల్లలు వయసుకి తగ్గ శారీరక ఎదుగుదల లేక అనారోగ్యంతో బతుకులీడుస్తున్నారని కూడా ఆ సంస్థ వివరించింది. ప్రపంచవ్యాప్త ఆకలి సూచికలో మన దేశం 103వ స్థానంలో ఉంది. ఈ సంస్థ సర్వే చేసిన దేశాలు 119 మాత్రమే. అంటే మన దేశం అ«ట్టడుగు స్థితిలో 7వ స్థానంలో ఉంది. వీటన్నింటితో పాటు, గ్రామీణ, పట్టణ పేద మహిళలు దాదాపు 51.4 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. తీవ్ర ఆందోళన కలిగించే ఇలాంటి అంశాలేవీ ఈ అతిపెద్ద ఎన్నికల్లో చర్చకు నోచుకోకపోవడం గమనార్హం. చర్చలే జరగకపోతే, మన పొరుగున ఉన్న నేపాల్, బంగ్లాదేశ్ వంటి చిన్న దేశాలు సైతం ఆకలి సూచికలో మనకంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ మార్చిలో విడుదలైన ఏడవ ప్రపంచ సంతోషదాయక నివేదిక మన దేశంలో గూడుకట్టుకున్న దుఃఖాన్ని ప్రతిబింబించింది. మన పొరుగుదేశమైన భూటాన్ ఆలోచన ప్రకారం మనిషికి ఆర్థికంగా అందే ప్రయోజనాలతో పాటు, ప్రజలు సంతోషంగా ఉన్నారా? లేరా? అనేది కూడా పరిశీలించాలనే ప్రయత్నం మొదలైంది. మార్చి 21న ప్రతి సంవత్సరం సంతోష దినోత్సవం జరుపుతూ గత ఏడేళ్ల నుంచి ఐరాస నివేదికలను విడుదల చేస్తున్నది. అందులో మన దేశం మొదటి నుంచీ వెనుకబడే ఉంది. 2013లో 111వ స్థానం, 2015లో 117వ స్థానం, 2016లో 118వ స్థానం, 2017లో 122వ స్థానం, 2018లో 122వ స్థానం. ఇక 2019లో 140వ స్థానానికి పడిపోవడం మన దేశ దుస్థితినీ, ప్రజల్లోని అసంతృప్తినీ చాటిచెపుతోంది. దేశ ప్రజల సంతోషం గ్రాఫ్ విషయంలో పాక్, బంగ్లాదేశ్, లాంటి దేశాలు కూడా మనకన్నా మెరుగ్గా ఉన్నాయి. ఈ నివేదికలో గృహ వసతి, ఆదాయం, విద్య, వైద్యం, పర్యావరణం, ఉద్యోగం, ఉపాధి, ప్రజల మధ్య సంబంధాలు, ఆయుర్దాయం, రక్షణ లాంటి విషయాలను పరిగణనలోనికి తీసుకున్నారు. మన దేశంలో ఆదాయాలు ఎక్కువగా ఉన్న వర్గాలు కూడా సంతోషంగా లేవని ఈ నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా ఆరోగ్యంపై పెరుగుతున్న భారం మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాలను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. పిల్లల విద్య విషయంలో అవుతున్న వ్యయం కూడా ఈ వర్గాలను వేధిస్తున్నది. ముఖ్యంగా నగరీకరణ పెరుగుతుం డటం వల్ల ఏర్పడుతున్న పర్యావరణ సమస్యలు ప్రజలకు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. నగరాలలోకి ఆడపిల్లలను పంపాలనే ఆలోచన కూడా తల్లిదండ్రులను భయపెడుతున్నది. గత ఐదేళ్ళలో భిన్న విశ్వాసాలు, ప్రజల్లో పెరుగుతున్న వైషమ్యాలు కూడా ఈ దేశంలోని ప్రజల్లో నెలకొన్న ఆందోళనకు కారణంగా భావించొచ్చు. వీటన్నింటితో పాటు దేశానికి శక్తివంతమైన మానవ వనరులు మన యువత. ఈ దేశంలోని కోట్లాది మంది యువతీ, యువకులు అభద్రతలో కొట్టుమిట్టాడుతున్నారు. 2018లో మన నిరుద్యోగం రేటు 3.5 శాతం. దాదాపు 40 కోట్ల మంది యువతీయువకులు నిరుద్యోగులుగానే జీవితాలను గడుపుతున్నారు. ఇది మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసే అంశం. ఎందుకంటే, సమాజ స్థితిని తెలియజేసేది యువత ఎదుగుదల మాత్రమే. ఈ ప్రమాదకర పరిస్థితి మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఇన్ని సమస్యలున్నా భారతదేశం పేద దేశం మాత్రం కాదు. ఇది అభివృద్ధి చెందుతున్న దేశమే. స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి మన స్థూల జాతీయదాయం చూస్తే మన దేశ ఆర్థిక పురోగతి అర్థం అవుతుంది. 1951 నుంచి మన సరాసరి స్థూల జాతీయాదాయం 6.21 శాతంగా ఉండింది. కానీ 2010లో 11.40 శాతాన్ని చేరుకొని రికార్డు సృష్టించింది. మన దేశ స్థూల జాతీయాదాయం దాదాపు రెట్టిం పైంది. అయితే ఇది ప్రజల బతుకుల్లో ఎక్కడా కనిపించడంలేదు. మన దేశంలో దేశ సంపద పెరుగుతున్నది. కానీ అది కొద్దిమంది చేతుల్లోకే చేరుతున్నది. ‘పెరుగుతున్న అంతరాలు’ పేరుతో ఆక్స్ఫామ్ అనే అంతర్జాతీయ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, ఆదాయాల్లో అంతరాల గురించి సవివరంగా పేర్కొన్నారు. మనదేశంలోని పార్లమెంటు స్టాండింగ్ కమిటీ 59 వ నివేదికలో ఇదే రకమైన ఆందోళనను వ్యక్త పరిచింది. దేశంలో అంతరాలు 1990 నుంచి పెరగడం ఎక్కువైంది. సరళీకరణ ఆర్థిక విధానాలూ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ వల్ల ఆదాయాల్లో అంతరాలు ఆకాశాన్నంటుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది. 2017లో వెలువరించిన ప్రపంచ సంపద నివేదికలో పేర్కొన్నట్టు, 2002లో పది శాతం మంది చేతుల్లో 52.9 శాతం సంపద ఉండగా, 2012 కి వచ్చేసరికి 62.1 శాతానికి పెరిగింది. అదేవిధంగా 2002లో 15.7 శాతం సంపద కేవలం ఒక్కశాతం మంది చేతుల్లోనే పోగుపడింది. 2012లో అది 25.7 శాతానికి మించి పోయింది. దీనివల్ల దేశంలో ప్రజల్లో ఆకలి, నిరుద్యోగం, అనారోగ్యం పెరిగిపోతున్నది. ఈ విషయాలేవీ కూడా ఈ ఎన్నికల్లో చర్చకు కూడా రాకపోవడం గమనార్హం. దీనికి బలమైన కారణం ఉన్నది. ఈ దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ నాయకులూ, వ్యాపారులూ, పారిశ్రామిక వేత్తలూ, వాణిజ్యవేత్తలూ, అవినీతిమయమైన బ్యూరోక్రసీ ఒక కూటమిగా ఏర్పడింది. దీనితో ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతో ఏర్పడిన బడ్జెట్లూ, సహజ వనరులైన భూమి, అడవి, భూగర్భ సంపద అంతా కొందరి చేతుల్లోకి పోయింది. దానితో లక్షల రూపాయల పెట్టుబడులతో ప్రారంభమవుతున్న వాళ్ళు అనతికాలంలోనే వేలకోట్లకు అధిపతులుగా మారుతున్నారు. ఈ స్థితిలో జరుగుతున్న ఎన్నికలు ప్రజల నిజమైన సమస్యలను ప్రతిబింబించకపోవడంలో ఆశ్చర్యమేమీలేదు. కానీ సమాజం దీన్ని సమస్యగా భావించకపోవడమే నేరమౌతుంది. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 మల్లెపల్లి లక్ష్మయ్య -
ఓటు సిరామరక కాదు.. మన హక్కు
ప్రజలందరికీ ఓటుహక్కు కోసం పోరాడిన బాబాసాహెబ్ అంబేడ్కర్ సార్వత్రిక ఓటింగ్ హక్కు ప్రాథమిక హక్కుల్లో ఉండాలని ప్రతిపాదించారు. కానీ సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ లాంటి వాళ్ళు ఒప్పుకోకుండా ఆర్టికల్ 326గా ఉంచారు. దాని ఫలితాన్ని మనం ఈనాటికీ అనుభవించాల్సి వస్తోంది. ఆ ఒక్కతప్పిదం కారణంగానే అధికారపక్షం ఇష్టారాజ్యంగా ఓట్లను గల్లంతు చేసే పరిస్థితులేర్పడ్డాయి. ఓటు హక్కును ప్రాథమిక హక్కుల్లో చేర్చి ఉంటే కులం పేరుతోనో, మతం పేరుతోనో, తమ వర్గం కాదనో, తమ పార్టీకి చెందిన వాళ్ళు కారనో అవలీలగా వేల సంఖ్యలో ఓట్లను గల్లంతుచేసే దుస్సాహసానికి ఒడిగట్టేవారు కాదు. మగధ రాజ్యంలోని రాజగృహంలో విశ్రాంతి తీసుకొంటున్న శాక్యముని గౌతమ బుద్ధుని దగ్గరికి మగధ దేశరాజు ప్రసేనజిత్తు తన ప్రధాన వస్సకరను పంపించారు. ‘‘వజ్జి రిపబ్లిక్ మీద దాడిచేసి వాళ్ళకు తగు గుణపాఠం చెప్పాలని ప్రసేన జిత్తుకు ఆలోచన ఉందని, ఆ విష యమై మీ సలహా కావాలని రాజు కోరుతున్నారు.’’ అని వస్సకర బుద్ధునితో ప్రస్తావించారు. వజ్జి రిపబ్లిక్ స్వతంత్రంగా పాలన సాగి స్తున్నది. అందువల్ల దానిని జయించి, మగధలో కలుపుకోవాలని ప్రసేన జిత్తు పథకం వేశారు. వస్సకర అడిగిన సలహాకు గౌతమ బుద్దుడు నేరుగా సమాధానం చెప్పలేదు కానీ తన ప్రథమ శిష్యుడైన ఆనందునితో చర్చించాడు. ఈ çసందర్భంగా గౌతమ బుద్ధుడు ఆనందుడిని ఏడు ప్రశ్నలు అడిగాడు. అవి... 1) వజ్జి రిపబ్లిక్ ప్రజలు క్రమం తప్పకుండా సమావేశాలు జరుపుతుంటారా? 2) ఏకపక్షంగా కాకుండా చర్చల ద్వారా సమష్టి నిర్ణయాలు తీసుకుంటారా? 3) మోసంతో కాకుండా, మంచి మార్గంలో వ్యాపారాలను, వృత్తులను సాగిస్తున్నారా? 4) ఒకసారి సమష్టిగా తీసు కున్న నిర్ణయాలను ఉల్లంఘన లేకుండా అమలు చేస్తున్నారా? 5) పెద్దలను గౌరవించి, వారి మాటలకు విలువనిస్తున్నారా? పూర్వకాలం నుంచి తమ పెద్దలు నిర్మించిన ప్రార్థనామందిరాలను కాపాడుకుంటు న్నారా? 6) మహిళలనూ, పిల్లలనూ గౌరవిస్తూ, బాధ్యతగా చూసుకుం టున్నారా? 7) జ్ఞానులకు, గురువులకు రక్షణ కల్పిస్తూ, వారిని గౌర విస్తూ వారు సూచించిన మార్గాలను అనుసరిస్తున్నారా? అని బుద్దుడు, ఆనందుడిని ప్రశ్నించారు. దానికి ఆనందుడు ‘అవును’ అని సమాధా నమిచ్చాడు. మీరు అడిగిన విషయాలన్నింటిలోనూ వారు అగ్రగామి గానే ఉన్నారని ఆనందుడు బదులిచ్చాడు. ఇది విన్న బుద్ధుడు ‘‘వజ్జి ప్రజలు ఆ విషయాలను పాటిస్తున్నంత కాలం వారిది ప్రగతి పథమే తప్ప వారికి పతనం అనేదే లేదని తేల్చి చెపుతాడు. వారిని ఎవరూ జయించలేరని కూడా స్పష్టం చేస్తాడు. మగధరాజు ప్రసేన జిత్తు ప్ర«ధాని వస్సకరకు బుద్ధుని అంతరంగం అర్థమైపోయింది. అదే విషయాన్ని మగధ రాజుకు చెప్పి, వజ్జి రిపబ్లిక్ మీద దాడిని నిలిపి వేశారు. ఒకదేశం గానీ, రాజ్యంగానీ, ప్రాంతంగానీ ప్రగతిదారిలో వెళ్లా లన్నా, విజేతగా నిలబడాలన్నా ప్రజలే కేంద్రబిందువుగా పరిపాలన సాగాలి. అదేవిధంగా పాలనలో ప్రజలు భాగస్వాములు కావాలి. పాలకులకు ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఉండాలి. ప్రజాక్షేమం కోసమే రాజ్యాలు, ప్రభుత్వాలు పనిచేయాలనేది బుద్ధుడి బోధన ఉద్దేశ్యం. ఇటువంటి పాలన కోసం ప్రపంచ చరిత్రలోనూ, భారత రాజకీయ ప్రస్తానంలోనూ ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అటువంటి అనుభవాన్నే మనకు సామ్రాట్ అశోకుని పాలన కూడా అందించింది. అయితే చాలా వందల ఏళ్ళు మన దేశాన్ని నియంతృత్వం, అరాచకం రాజ్యమేలాయి. వాటన్నింటినీ దాటుకొని, అనేకానేక అవరోధాలను అధిగమించి ఈ రోజు భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థలో తన మను గడను కొనసాగిస్తున్నది. అయితే ఇందులో కూడా అనేక లోపాలూ, పరిమితులూ ఉండవచ్చు కానీ ప్రజాస్వామ్య ఆలోచనలతో ఒక నిర్మా ణాత్మకమైన రాజ్యాంగం వెలుగులో మనం పాలన సాగిస్తున్నామన్నది మాత్రం వాస్తవం. అలాంటి ప్రజాస్వామ్య మనుగడకు ఎన్నికల ప్రక్రియ కీలకం. అందులో భాగంగానే మన దేశ పార్లమెంటులో భాగమైన లోక్ సభకు పదిహేడవ సారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో ఓటింగ్ ఒక ముఖ్యమైన అంశం. మన దేశంలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైన సమయంలో ఓటు హక్కు అందరికీ లేదు. అది కొందరి హక్కుగానే ఉండేది. మనదేశంలో మొదటిసారిగా 1920లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు కేవలం విద్యావంతులూ, భూములూ, వ్యాపారాలూ, ఆస్తిపా స్తులూ ఉన్న వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. అయితే సామా న్యుడి ఓటు హక్కుకోసం సార్వత్రిక ఒటింగ్ (వయోజన ఓటింగ్) వచ్చేవరకూ నిరంతరం తపించిన మహానుభావుడు అంబేడ్కర్. భారత ప్రజలను పాలనలో భాగస్వాములను చేయాలనే ఉద్దే శ్యంతో బ్రిటిష్ పాలకులు సౌత్బరో అనే రాజకీయ నిపుణుని నాయ కత్వంలో 1919లో ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ సిఫారసులకు అను గుణంగా బ్రిటిష్ పాలకులు 1920లో ఎన్నికలు నిర్వహించారు. అంట రాని కులాలలో పుట్టి అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువును అభ్యసించి, తన జాతి రక్షణే జీవిత లక్ష్యంగా తుది శ్వాస వరకూ పోరాడిన వ్యక్తి డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్. కేవలం 28 ఏళ్ల వయస్సులో తన జాతి జనుల విముక్తికోసమే కాక దేశంలోని అన్ని వర్గాల ప్రజలకోసం పరితపించారు అంబేడ్కర్. 1919లో సౌత్బరో కమి టీకి సమర్పించిన వినతిపత్రంలో యువ అంబేడ్కర్ తన ప్రజాస్వామ్య తాత్వికతకు పునాదులు వేశారు. ఆ పునాదులే భారతదేశ ప్రజాస్వామ్య సాధనమైన రాజ్యాంగాన్ని రచించడానికి ఆధారమయ్యాయి. అవే పునా దులు నేటికీ మన దేశ ప్రజాస్వామ్య సౌధాన్ని నిలబెట్టడానికి సాధనా లవుతున్నాయి. ప్రజాస్వామ్యమంటే ప్రజలకు ప్రాతినిధ్యం ఉండాలనీ, ఏదో కొద్ది మందికి మాత్రమే ఉండే ఓటు హక్కు నియంతృత్వానికి, కొద్ది మంది ఆలోచనల ప్రకారమే పాలన సాగించే నిరంకుశ విధానానికీ మాత్రమే ఉపయోగపడుతుందనీ అంబేడ్కర్ వాదించారు. అంతేకాకుండా, అంట రానితనం, వివక్షతో తరతరాలుగా దాస్యాన్ని అనుభవిస్తున్న అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలని కూడా ఆయన వాదించారు. కానీ సౌత్ బరో కమిటీ ఆ ప్రాధాన్యతలను తోసిపుచ్చింది. ఆ తర్వాత 1928లో బ్రిటిష్ ప్రభుత్వం సర్ జాన్ సైమన్ ఛైర్మన్గా మరొక కమిటీని భార తదేశానికి పంపించింది. ఆ కమిషన్ను కాంగ్రెస్ పార్టీ బహిష్కరిం చింది. అయితే స్వాతంత్య్రం రావాలనే లక్ష్యంతో పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ నమూనా రాజ్యాంగాన్ని తయారు చేయడానికి మోతీలాల్ నెహ్రూ నాయకత్వంలో 1928 మే నెలలో ఒక కమిటీని వేసింది. అందులో అన్ని పక్షాలకు అవకాశాలను కల్పించారు. సర్ అలీ అమన్, తేజ్ బహదూర్ సఫ్రూ, సుభాష్ చంద్రబోస్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీకి జవహర్ లాల్ నెహ్రూ కార్యదర్శిగా పనిచేశారు. ఇదే కమిటీలో జయకర్, అనీబి సెంట్ కొంత ఆలస్యంగా చేరారు. అయితే ఈ కమిటీ రూపొందించిన ముసాయిదా రాజ్యాంగంలో 21 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత ఆ విషయం గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ బీఆర్ అంబేడ్కర్ 1928లో మళ్ళీ ఒకసారి సైమన్ కమిషన్ ముందు హాజరై అందరికీ ఓటు హక్కు కల్పించాలనే విషయమై మరింత శక్తివంతంగా వినిపించారు. అంతే కాకుండా 1930, 31 సంవత్సరాలలో లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో అణగారిన వర్గాలతోపాటు అందరికీ పాలనలో భాగస్వామ్యం దక్కాలని వాదించారు. అయినా బ్రిటిష్ ప్రభుత్వం అందరికీ ఓటు హక్కు అనే విషయాన్ని పట్టించుకోలేదు. 1935లో మొదటి సారిగా వచ్చిన ‘భారత చట్టం’లోనూ సార్వత్రిక ఓటింగ్కు అవకాశం రాలేదు. 1937లో, 1946లో జరిగిన ఎన్నికల్లో కూడా విద్యా వంతులకు, వ్యాపారులకు, భూస్వాములకు మాత్రమే ఓటు హక్కు కల్పించారు. వాళ్ళ ప్రతినిధులు మాత్రమే పార్లమెంటులో అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1947లో భారతదేశం స్వాతంత్య్రం సాధించడంతో నూతన రాజ్యాంగాన్ని రూపొందించుకునే అవకాశం మనకు దక్కింది. అనేక దేశాల్లో వచ్చిన విప్లవాలు, మార్పులు, పరిణామాలను అర్థం చేసుకొని ఒక రాజ్యాంగం ఆవశ్యకతను గుర్తించి, దాన్ని యుద్ధప్రాతిపదికన లిఖిం చడం మొదలైంది. ఆ రాజ్యాంగ రచనకు అంబేడ్కర్ నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. 1919 నుంచి ఎంతో తపనతో ప్రతి పాదిస్తూ వచ్చిన సార్వత్రిక ఓటింగ్ విధానానికి సుదీర్ఘకాలం తరువాత అవకాశం లభించింది. అంబేడ్కర్ ఆ ఓటింగ్ హక్కును ప్రాథమిక హక్కుల్లో ఉండాలని ప్రతిపాదించారు. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు అందుకు ఒప్పుకోలేదు. కాంగ్రెస్ 1928లో రూపొందిం చిన రాజ్యాంగానికి భిన్నంగా పటేల్ వ్యవహరించారు. సార్వత్రిక ఓటింగ్ హక్కును ప్రాథమిక హక్కుల్లో చేర్చకుండా, ఆర్టికల్ 326గా ఉంచారు. దీనివల్ల కలిగిన నష్టాన్ని తరతరాలుగా సామాన్యుడు భరిస్తూ వస్తున్నాడు. దాని ఫలితాన్ని మనం ఈనాటికీ అనుభవించాల్సి వస్తోంద న్నది తాజా పరిస్థితులను చూస్తే అర్థం అవుతుంది. ఆ ఒక్కతప్పిదం కారణంగానే అధికారపక్షం ఇష్టారాజ్యంగా ఓట్లను గల్లంతు చేసే పరిస్థి తులేర్పడ్డాయి. కులం పేరుతోనో, మతం పేరుతోనో, తమ వర్గం కాదనో, తమ పార్టీకి చెందిన వాళ్ళు కారనో అవలీలగా వేల సంఖ్యలో ఓట్లను గల్లంతుచేసే దుస్సాహసానికి ఒడిగట్టేవారు కాదు. అసలీ దుర్మా ర్గపుటాలోచనలకు అవకాశం ఉండేదే కాదు. ఓటు హక్కును ప్రాథమిక హక్కుల్లో చేర్చి ఉంటే, రాజ్యాంగంలో 226వ ఆర్టికల్ ప్రకారం ఎవరైనా ఓటు హక్కును కోల్పోయి ఉన్నా ఓటరు లిస్టులో తమ పేరు గురించి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసే అవకాశం ఉండేది. ప్రస్తుతం మనం చర్చించుకుంటున్న ఓట్ల గల్లంతు వివాదానికి న్యాయపరమైన పరిష్కారం లభించేది. మన రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కుల్లో చేర్చిన విషయాలపట్ల మాత్రమే హైకోర్టు, సుప్రీంకోర్టులు బాధ్యత వహిస్తాయి. ఆనాడు అంబేడ్కర్ చేసిన ఆలో చనను ఈసారి కొలువుదీరే పార్లమెంటు చర్చించి, సార్వత్రిక ఓటింగ్ను ప్రాథమిక హక్కుల్లో చేర్చే ప్రయత్నం చేయాలి. వ్యాసకర్త : మల్లెపల్లి లక్ష్మయ్య , సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
ఓట్ల తక్కెడలో ట్రిపుల్ తలాక్
మహిళల హక్కుల గురించి బీజేపీ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో ఆలోచిస్తే కేవలం ముస్లిం మహిళల కోసం మాత్రమే ఎందుకు అంతగా తపనపడుతోంది అనేది ప్రశ్న. వివాహ సంబంధాలలో ముస్లిం మహిళలు వివక్షకూ, అణచివేతకూ గురవుతున్నారని బీజేపీ భావించి త్రిపుల్ తలాక్ నిషేధం నిర్ణయం తీసుకుంటే అంతకు పది రెట్లు హిందూ మహిళలు వివక్షకూ, అణచివేతకూ గురవుతోన్న విషయం ఎందుకు పట్టించుకోవడం లేదు అన్నది సమాధానంలేని ప్రశ్న. ముస్లిం వ్యతిరేకతతో హిందువుల ఓట్లను కొల్లగొట్టడానికే దాడులూ, హత్యలూ, చివరకు త్రిపుల్ తలాక్ని కూడా బీజేపీ ఒక ఆయుధంగా వాడుకుంటోంది. తలాక్ తలాక్ తలాక్ ఒకే ఒక్క పదం. మూడు సార్లు ఉచ్చరిస్తే కడదాకా కలిసి నడుస్తానని మాట ఇచ్చిన సహచరిని నడిరోడ్డుమీదికి నెట్టేయొచ్చు. నలు గురు బిడ్డల తల్లినైనా నడిబజారులో నిలబెట్టొచ్చు.ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అప్పటివరకూ తానే సర్వస్వం అని భావించిన ఓ స్త్రీ జీవితాన్ని నిలువునా కూల్చేసే మతపరమైన హక్కు ఇది. జకియా సోమన్, సైరాబానూ, ఇష్రాత్ జహాన్, గుల్షన్ పర్వీన్, అఫ్రీన్ రెహమాన్, అతియా సాబ్రి ఈ ఐదుగురు మహిళలూ ముస్లిం స్త్రీల అస్తిత్వ ప్రతీక. ఇస్లాంని విశ్వసిస్తూనే ముస్లిం మహిళల హక్కులను గుర్తించాలంటూ, మతానికి లోబడి, రాజ్యాంగపరిధిలో ముస్లిం మహిళల హక్కులు కూడా మానవ హక్కుల్లో భాగమేనని ముస్లిం మహిళా ఆందోళన కారులు భావిస్తున్నారు. భారతీయ ముస్లిం మహిళలు స్త్రీపురుష అసమానతలను రూపుమాపేందుకు ట్రిపుల్ తలాక్ రద్దు కూడా మార్గమని భావిస్తున్నారు. భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ ని 2007, జనవరిలో ముంబాయి కేంద్రంగా స్థాపించారు. స్త్రీపురుష వ్యత్యాసాలుండకూడదని, మతంలోనూ స్త్రీపురుష సమానత్వాన్ని పాటించాలన్నది భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ డిమాండ్. స్త్రీ స్వేచ్ఛ అంటే పురుష వ్యతిరేకత కాదు. స్త్రీపురుష సమానత్వం. అలాగే భారత రాజ్యాంగంపైనా మాకు అచంచలమైన విశ్వాసం ఉన్నదని కూడా వారు ప్రకటించారు. నిజానికి ఖురాన్లో తొలిదశలో తలాక్ అనే భావనే లేదు. కాలక్రమంలో దాన్ని సృష్టించారు. అయితే దానికి కొన్ని నిబంధనలున్నాయి. కానీ వాటిని ఎవ్వరూ పాటించడం లేదు. అసలు ఖురాన్ లో స్త్రీలపై ఆధిపత్యానికి తావులేదు.. భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడితే పెద్దల సమక్షంలో చర్చించుకొని కలిసి ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని చెప్పింది. చిట్టచివరి ప్రయత్నం కూడా విఫలమైతే మూడు పర్యాయాలుగా తలాక్ చెప్పా లని చెప్పింది. 90 రోజుల వ్యవధిలో మూడు సార్లు పెద్దల సమక్షంలోనే తలాక్ చెప్పాలి. అలాగే ఆ స్త్రీ ఋతుక్రమంలో ఉండగా, గర్భవతిగా ఉన్నప్పుడు సైతం తలాక్ చెప్పకూడదు. కానీ ఆచరణలో అం దుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. స్త్రీలకు తెలియకుండా కూడా తలాక్ చెప్పేస్తున్నారు. హలాలా... తలాక్తో విడిపోయిన తరువాత ఆ స్త్రీకానీ, పురుషుడు కానీ మనసు మార్చుకొని ఆవేశంలో చెప్పిన తలాక్ని వెనక్కితీసుకునే అవకాశాన్ని హలాలా నియంత్రిస్తోంది. భర్తతో విడిపోయిన తరువాత వాళ్ళిద్దరూ తిరిగికలుసుకోవాలంటే ఆ స్త్రీ మరో పురుషుడిని వివాహమాడిన తరువాతనే రీయూనియన్కి అవకాశం ఉంటుంది. అంతవరకు తలాక్ తీసుకున్న భార్యాభర్తలిద్దరూ ఇష్టపడినా తిరిగి కలిసి ఉండే అవకాశం లేదు. హలాలా ఖాజీలు కేవలం 15 రోజుల్లోనే వివాహం, తలాక్ రెండూ పూర్తి చేసి చిన్నారులను సైతం విదేశీయులకు కట్టబెడుతున్న దుర్మార్గాలు జరుగుతున్నాయన్నది వీరి ఆరోపణ. మెహర్.... ఖురాన్ స్త్రీలకు ఇచ్చిన ప్రత్యేక హక్కు మెహర్. నిఖానామా(పెళ్ళి)సందర్భంగా స్త్రీలకి కొంత డబ్బో, వస్తువులో లేదా ఇళ్లో, వారి స్థాయిని బట్టి వరుడి తరఫున ఇస్తారు. దాన్ని రికార్డు కూడా చేయాలి. కానీ ఎక్కడా అది రికార్డు చేయడంలేదు. 786 రూపా యలు మాత్రమే స్త్రీల చేతిలో పెడుతున్నారు. దీంతో వీరికి నష్టం జరుగుతోంది. ఖులా... ముస్లిం స్త్రీలకి కూడా భర్త నుంచి విడిపోయే హక్కుంది దాని పేరే ఖులా. అయితే ముస్లిం స్త్రీలు విడిపోవాలనుకున్నప్పుడు కూడా భర్త అనుమతి కావాలంటున్నారు. కానీ ఖులా కోరుకున్న స్త్రీకి దానంతట అది దక్కే పరిస్థితి లేదు. అక్కడేమో స్త్రీల ప్రమేయం లేకుండానే తలాక్ చెప్పేస్తారు. ఇక్కడేమో భర్త అనుమతి లేనిదే ఖులా యివ్వరు. ఇటువంటి ముస్లిం మహిళల ఉద్యమాలూ, ఆందోళనల నేపథ్యంలో 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ ఆచారాన్ని నిషేధించాలంటూ కంకణం కట్టుకున్నది. అందులో భాగంగానే చట్ట పరంగా ట్రిపుల్ తలాక్ని నిషేధించడం కోసం పార్లమెంటులో బిల్లుని ప్రవేశపెట్టి లోక్ సభలో ఆమోదింపజేసుకున్నది. అయితే బీజేపీ ట్రిపుల్ తలాక్పై అనుసరిస్తున్న వైఖరిపైనే భిన్నాభిప్రాయాలున్నాయి. ఇది ముస్లిం మహిళల ప్రజాస్వామిక ఆకాంక్షలను నెరవేర్చడానికి తీసుకున్న చర్యా? లేక రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వేసిన ఎత్తుగడా? అనేది గమనించాల్సిన విషయం. మహిళల హక్కుల గురించి బీజేపీ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో ఆలోచిస్తే కేవలం ముస్లిం మహిళల కోసం మాత్రమే ఎందుకు అంతగా తపనపడుతోంది అనేది ప్రశ్న. వివాహ సంబంధాలలో ముస్లిం మహిళలు వివక్షకూ, అణచివేతకూ గురవుతున్నారని బీజేపీ భావిస్తే ట్రిపుల్ తలాక్ నిషేధం నిర్ణయం తీసుకుంటే అంతకు పది రెట్లు హిందూ మహిళలు వివక్షకూ, అణచివేతకూ గురవుతోన్న విషయం ఎందుకు పట్టించుకోవడం లేదన్నది సమాధానంలేని ప్రశ్న. ఇప్పుడున్న లెక్కల ప్రకారం భారత దేశంలో ఇప్పటి వరకు 23 లక్షల మంది మహిళలను వారి భర్తలు ఎటువంటి చట్టపరమైన, న్యాయబద్దమైన విడాకులు లేకుండా వదిలి వెళ్లారు. ఇందులో ముస్లిం మహిళలు కేవలం రెండు లక్షలా 80 వేల మంది మాత్రమే. క్రైస్తవులు 90 వేల మంది. కాగా మిగిలిన వాళ్ళంతా హిందూ మహిళలేనని ఒక సర్వేలో వెల్లడయ్యింది. ఈవిషయాన్ని ధృవపరుస్తూ తమిళనాడులో ధనుష్ కోటి ప్రాంతంలో మత్స్యకారుల మహిళల పరిస్థితిని ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఎటువంటి సమా చారం లేకుండానే భర్తలు ఆ ప్రాంతంలోని మహిళలను సునాయాసంగా వదిలించుకుంటున్నారని ఈ సర్వే ఆధారాలతో సహా నిరూపించింది. అంతేకాకుం డా ఇటీవల పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన ఉద్యోగాలు చేస్తోన్న భర్తలు తమ భార్యలను అవలీలగా భారతదేశంలో వదలిపెట్టి, విదేశాలకు పారిపోతున్నారని జాతీయ మహిళా కమిషన్కు 4000కు పైగా ఫిర్యాదులు అందాయి. ఎన్ఆర్ఐ భర్తల చేతిలో మోసపోతోన్న మహిళలు తమకు న్యాయం చేయా లని కమిషన్ని కోరుతున్నారు. అంతేకాకుండా గత కొన్ని వందల ఏళ్ళుగా హిందూ సాంప్రదాయం ప్రకారం జోగినీలుగా, దేవదాసీలుగా, మాతమ్మలుగా, దుర్భరమైన జీవితాలను గడుపుతోన్న లక్ష లాది మంది దళిత మహిళల పట్ల ఈ ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో మనకు తెలియంది కాదు. అంతేకాకుండా హిందూ సమా జంలో మహిళలు ఇప్పటికీ ద్వితీయ శ్రేణి పౌరులుగానే పరిగణింపబడుతున్నారు. చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ బాల్య వివాహాలు, వరకట్న దురాచారాలూ, గృహహింస, పరువు హత్యలూ అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్నాయి. ముస్లిం మతంలోని మహిళల హక్కుల కోసం మాట్లాడుతున్న ప్రభుత్వాలు హిందూ మహిళల హక్కులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాయో సమాధానం చెప్పాల్సి ఉంది. ట్రిపుల్ తలాక్ ద్వారా ముస్లిం మహిళల మద్దతును, ఓట్లను బీజేపీ ఆశిస్తున్నదని కొందరు భావిస్తున్నారు. నిజానికి ఇది పాక్షిక సత్యమే. ఓ పక్క బీజేపీ ముస్లిం వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ, మరోపక్క ఈ ట్రిపుల్ తలాక్ చట్టం ద్వారా అదే ముస్లిం కుటుంబాల్లోని మహిళలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తుందని భావించడంలో పూర్తిగా నిజంలేదు. ఎందుకంటే ముస్లింల మీద గత నాలుగైదేళ్లుగా జరుగుతున్న దాడులు, హింసా కాండ, అత్యాచారాలు ముస్లిం మహిళలను కూడా ఆలోచింపజేస్తాయి. తమ కన్నబిడ్డల పట్ల, కుటుంబా ల్లోని పురుషులపట్ల బీజేపీ, దాని అనుబంధ సంస్థలు అనుసరిస్తోన్న క్రూరమైన విధానాలు, దాడులు ఆ స్త్రీలకు మనశ్శాంతి లేని జీవితాలను ప్రసాదించాయి. గుజరాత్లో జరిగిన మారణకాండను దీని నుంచి విడదీసి చూడలేం. మొత్తం భారత దేశ స్వాతంత్య్ర చరిత్రలో గత నాలుగైదేండ్లుగా జరిగిన హత్యలను పరిశీలిస్తే 2013లో ముగ్గురు ముస్లింలు మతపరమైన దాడుల వల్ల చనిపోతే, 2018 కి వచ్చేసరికి అది 30 మందికి చేరింది. అంటే ఐదేళ్ళలో ఇది పదిరెట్లు పెరిగినట్టు లెక్క. ఇందులో గోసంరక్షణ నినాదం ఎంతోమంది ముస్లింలపై దాడులకు కారణమైంది. అందువల్ల ముస్లిం మహిళల ఓట్లు బీజేపీ లక్ష్యం కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. నిజానికి బీజేపీకి అటువంటి ఉద్దేశం లేదు. ముస్లిం సమాజాన్ని భారతదేశంలోని హిందువుల ముందు దోషులుగా నిలబెట్టి, సహజంగా ముస్లింల పట్ల హిందువుల్లో ఉన్న వ్యతిరేకతను సొమ్ముచేసుకోవాలని మాత్రమే బీజేపీ భావిస్తోంది. అంతే తప్ప ముస్లింల పట్లగానీ, వారి స్త్రీలపట్లగానీ బీజేపీకి సాను కూలత ఉన్నదనుకోవడం పొరపాటు. ఉత్తరప్ర దేశ్లో 2017 ఎన్నికలకు ముందు బీజేపీ అనుసరించిన ముస్లిం వ్యతిరేకత హిందూ సెంటిమెంట్ సరిౖయెన ఫలితాలను ఇచ్చింది. భారతీయ జనతాపార్టీ ఆ రాష్ట్ర జనాభాలో 19 శాతానికి పైగా ఉన్న ముస్లిం లకు ఒక్క సీటుకూడా ఇవ్వకపోవడం గమనార్హం. అంటే ఉత్తర భారతంలో ముస్లింల పట్ల చారిత్రకంగా చిరకాలంగా ఉన్న సహజ వ్యతిరేకతను ఉపయోగించుకొని, హిందూ సమాజాన్ని సంఘటితం చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ముస్లిం వ్యతిరేకతతో హిందువుల ఓట్లను కొల్ల గొట్టడానికి చేస్తున్న ప్రయత్నాల్లో దాడులూ, హత్యలూ, చివరకు ట్రిపుల్ తలాక్ని కూడా బీజేపీ ఒక ఆయుధంగా వాడుకుంటోంది. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు మొబైల్: 9705566213 -
గాంధీని వెంటాడుతున్న గతం
యావత్ ప్రపంచం గుర్తించి, గౌరవిస్తున్న గాంధీజీ విగ్రహ ఆవిష్కరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఘనాలోని ఒక విశ్వవిద్యాలయం అ«ధ్యాపకులు, విద్యార్థులు పోరాడి తమ క్యాంపస్లో లేకుండా చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. దక్షిణాఫ్రికాలో భారతీయులు నివసిస్తున్న కాలనీలలోనే కాఫిర్లు అయిన నల్లజాతీయులు ఉండడం తమకు అవమాన కరమని, వీళ్ళతో కలిసి జీవించడం వల్ల తమ పిల్లలు కూడా çసరైన జ్ఞానాన్నీ, ఎదుగుదలనూ అందుకోలేరనీ.. గాంధీ 1894 డిసెంబర్ 19న బ్రిటిష్ అధికారులకు రాసిన లేఖను నల్లజాతి ప్రజలు ఇప్పటికీ తీవ్రంగా ఆక్షేపిస్తుండటం గమనార్హం. జాతివివక్ష, వర్ణవివ„ý మూలాలను గాంధీ పరిశీలించలేదని తెలుస్తోంది. మహాత్మాగాంధీ అనే మోహన్దాస్ కరంచంద్ గాంధీకి భారతదేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల నాయకుడిగా పేరు ప్రఖ్యాతులున్నాయి. అనేక ప్రాంతాల్లో ఆయనను ఈనాటికీ స్మరించుకుంటున్నా రనడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టించుకున్న ఆయన నిలువెత్తు విగ్రహాలే ప్రత్యక్ష ఉదాహరణలు. ఆయన అభిప్రాయాలను గౌరవిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నప్పటికీ ఆయన అభిప్రాయాలను వ్యతి రేకిస్తున్న వాళ్ళు సైతం ఉన్నారు. ఆ వ్యతిరేకత వల్లే ఘనా దేశంలోని ఒక విశ్వవిద్యాలయంలో నెలకొ ల్పిన గాంధీ విగ్రహాన్ని తొలగించాలనే ప్రయత్నం సఫలీకృతం అయ్యింది. దాని ఫలితంగానే ఈనెల 15వ తేదీన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆ విశ్వ విద్యాలయం ప్రాంగణం నుంచి తొలగించారు. జూన్ 4, 2016 వ సంవత్సరంలో ఘనాలోని అక్రాలో ఉన్న లెగాన్ క్యాంపస్లో నెలకొల్పిన గాంధీ విగ్రహాన్ని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవి ష్కరించారు. అయితే ఆ విశ్వవిద్యాలయానికి చెందిన ఆఫ్రికన్ స్టడీస్ విభాగం అధ్యాపకులు, విద్యార్థులు గాంధీ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 2016న ఒక వినతి పత్రాన్ని విశ్వవిద్యాలయం అధికా రులకు అందజేసారు. వర్ణ వివక్షను పాటించిన గాంధీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, ఆఫ్రికా ప్రజలను అవమానించడమేనని, ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఆ పిటిషన్ను ఆన్లైన్లో ఉంచి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నల్లజాతి ప్రజల వర్ణ వివక్ష వ్యతిరేక ఉద్యమకారుల మద్దతును కూడగట్టారు. ఈ సంచలన వార్తను అక్కడి పత్రికలూ, టీవీ ఛానళ్ళు విస్తృతంగా ప్రచారం చేసాయి. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో ఆయన అవలం భించిన వర్ణ వివక్ష అనుకూల విధానాలను ఆ పత్రి కలు తీవ్రంగా దుయ్యబట్టాయి. దక్షిణాఫ్రికాలో 1893 నుంచి 1914 వరకు ఉన్న మహాత్మాగాంధీ వర్ణ వివక్షను ప్రోత్సహించే అనేక ప్రసంగాలను, ఉత్తరాలను ఘనా విశ్వవిద్యాలయం ఉద్యమకారులు ఈ పిటిషన్లో ప్రస్తావించారు. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో బ్రిటిష్ అధికారులను సంబోధిస్తూ రాసిన ఉత్తరా లలో నల్లజాతి ప్రజలను కించపరిచే విధంగా ప్రస్తా వన ఉన్నట్టు ఉద్యమకారులు పేర్కొన్నారు. డిసెంబర్ 19, 1894న గాంధీ బ్రిటిష్ అధికారు లను ఉద్దేశిస్తూ ఒక ఉత్తరం రాసారు. భారతీయులు నివసిస్తున్న కాలనీలలోనే కాఫిర్లు అయిన నల్లజాతీ యులు ఉండడం తమకు అవమానకరమని, వీళ్ళతో కలిసి జీవించడం వల్ల తమ పిల్లలు కూడా సరి అయిన జ్ఞానాన్నీ, ఎదుగుదలనూ అందుకోలేరనీ గాంధీ ఆ ఉత్తరంలో పేర్కొన్నారు. అంతేకాకుండా మే 5 1895న మరో సందర్భంగా రాసిన ఉత్తరంలో కూడా నల్లజాతీయులను కాఫిర్ అనే పదంతో సంబోధించారు. సెప్టెంబర్ 26, 1896న మే 27, 1899న రాసిన లేఖల్లో సైతం గాంధీజీ నల్లజాతీయు లను కించపరిచారని ఉద్యమకారులు వివరించారు. కాఫిర్లు అనేపదం నల్లజాతి ప్రజల్లో తీవ్ర ఆక్షేప ణీయం. ఆ పదం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీ యడం మాత్రమే కాకుండా ఎంతో అవమానంగా భావిస్తారు. ఉత్తరాల్లో మాత్రమే కాకుండా ఆచర ణలో కూడా గాంధీ నల్లజాతి ప్రజలను తమకంటే తక్కువ వారిగానే భావించారు. ఆ రోజుల్లో ఉత్తర ప్రత్యుత్తరాలకు ఇతరత్రా సమాచారం చేరవేయడానికి పోస్టాఫీసులే ప్రధాన సాధనాలుగా ఉండేవి. శ్వేతజాతీయుల దురహంకా రానికి చిహ్నంగా శ్వేతజాతీయులకు ఒక ప్రత్యేకమైన క్యూ(లైన్) ఉండేది. నల్లజాతీయులతో కలిపి మిగి లిన వాళ్ళందరికీ కలిపి వేరుగా మరో లైన్ ఉండేది. అందులో భారతీయులతో పాటు ఇతర ఆసియా దేశాలకు చెందిన వారు క్యూలో నిలబడేవారు. భార తీయులకు వేరే క్యూ ఉండాలనీ, తాము నల్లజాతీ యులతో పాటు నిలబడలేమని గాంధీ బ్రిటిష్ ప్రభుత్వానికి వినతి పత్రాన్ని సమర్పించారు. దీంతో ప్రభుత్వం భారతీయులకోసం మూడో క్యూను ఏర్పాటు చేసింది. అదేసమయంలో ప్లేగు వ్యాధి ప్రబలి వందలాది మంది మృత్యువాత పడ్డారు. వేలాది మంది ఆసుపత్రుల పాలయ్యారు. అప్పుడు కూడా గాంధీ రాసిన ఉత్తరంలో, తాము కాఫిర్లయిన నల్లజాతి వారితో సమానంగా ఒకే ఆసుపత్రుల్లో ఉండలేమని వ్యతిరేకతను చాటారు. ఈ సంఘటన లన్నీ ఇప్పుడు ఆఫ్రికాలో చర్చనీయాంశాలుగా మారాయి. గాంధీ వర్ణ వివక్ష అనుకూల వైఖరిని నల్లజాతి ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నారు. శ్వేతజాతీయులతో పాటు అందరికీ సమాన హక్కులు ఉండాలనే భావనకు బదులు, నల్లజాతి ప్రజలను తమకన్నా హీనమైన వారిగా పరిగణించ డంతో పాటు, భారతీయులకు ప్రత్యేకమైన సౌక ర్యాలు, హక్కులు కావాలని కోరడం నల్లజాతి ఉద్య మకారులను ఆగ్రహానికి గురిచేస్తున్నది. ఈ విషయాలతో పాటు మరో ముఖ్యమైన అంశాన్ని కూడా అక్కడి ఉద్యమ కారులు లేవనె త్తారు. బ్రిటిష్ పాలకులకు అక్కడి స్థానిక తెగల నాయకులకు మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. అందులో బోయర్ యుద్ధాలు ముఖ్యమైనవి. 1890 ప్రాంతంలో రెండు బోయర్ యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలలో భారతీయ యువకులను బ్రిటిష్ పాలకుల తరఫున యుద్ధంలో క్షతగాత్రులను మోసు కెళ్ళే స్ట్రెచర్ బేరర్స్గా గాంధీ పంపించారు. అందుకు గాను బ్రిటిష్ పాలకులు గాంధీజీని ప్రశంసలతో ముంచెత్తారు. బోయర్స్ యుద్ధం దక్షిణాఫ్రికా చరి త్రలో ఒక కీలక మలుపుగా భావించొచ్చు. అప్పటి వరకు స్వతంత్రంగా ఉన్న దక్షిణాఫ్రికా నల్లజాతి తెగల సంస్థానాలు బోయర్స్ యుద్ధంలో బ్రిటిష్ పరం అయ్యాయి. ఇది కూడా ఆఫ్రికా ప్రజల మన సుల్లో వ్యతిరేకతను పెంచడానికి కారణమయ్యింది. మహాత్మాగాంధీ 1893లో దక్షిణాఫ్రికాకి వెళ్ళి, 1914లో తిరిగి స్వదేశానికి వచ్చారు. దాదాపు 20 సంవత్సరాల కాలంలో ఆయన అక్కడి భారతీయుల కోసం ముఖ్యంగా వ్యాపారవర్గాల ప్రయోజనం కోసం మాత్రమే పనిచేసాడనే విమర్శలున్నాయి. అంతేకాకుండా బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణకు జరిగిన యుద్ధాల్లో బ్రిటిష్ వారికి అండగా నిలబడ్డాడని కూడా అక్కడి ప్రజలు భావిస్తున్నారు. ‘ది సౌత్ ఆఫ్రికన్ గాంధీ స్ట్రెచర్ బేరర్ ఆఫ్ ఎంపైర్’ అనే పేరుతో అశ్వనీదేశాయ్, గులాంవాహెద్ రాసిన పుస్త కంలో ఈ సంఘటనలతో పాటు అనేక ఉదంతాలూ సందర్భాల ప్రస్తావనలూ ఉన్నాయి. ఈ సంఘటనల వల్ల దక్షిణాఫ్రికాలో గాంధీ అనుసరించిన నల్లజాతి వ్యతిరేక స్వభావం చాలా స్పష్టంగా కనిపించిందని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాకు ఒక న్యాయ వాదిగా వెళ్ళారు. భారతీయ వ్యాపారుల పక్షాన నిల బడే ఉద్యోగం ఆయనకు లభించింది. కానీ అప్పటికే భారతీయులు దక్షిణాఫ్రికాలో తమ ఉపాధి, ఉద్యోగా లను దెబ్బతీస్తున్నారని శ్వేతజాతీయులు భావిం చారు. అందువల్ల భారతీయులు వస్తున్న పడవలను అడ్డుకోవడం, వారిని వెనక్కి పంపాలని డిమాండ్ చేయడం తరచుగా జరిగింది. జనవరి 16, 1897న భారత దేశం నుంచి వచ్చిన ప్రయాణికుల నౌకను అడ్డుకోవడానికి శ్వేతజాతీయులు ప్రయత్నించారు. ఆ సందర్భంగా గాంధీ కూడా అక్కడికి చేరారు. వ్యాపారుల పక్షాన భారతీయ కార్మికులను తీసు కెళ్ళడానికి వచ్చిన గాంధీని శ్వేతజాతీయులు గమ నించారు. అప్పుడు గాంధీపై శ్వేతజాతీయులు దాడి చేయడంతో అక్కడినుంచి తప్పించుకొని, సమీపం లోని పోలీసు స్టేషన్కి వెళ్ళి దాక్కున్నారు. పోలీసు కానిస్టేబుల్ రూపంలో మారువేషంలో అక్కడి నుంచి గాంధీ బయటపడినట్టు పైన పేర్కొన్న పుస్తకంలో ప్రస్తావించారు. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో ఒకపక్క భార తీయుల ప్రయోజనాల కోసం పోరాడుతున్న క్రమంలో నల్లజాతీయులను కించపరుస్తున్నానన్న వాస్తవాన్ని గ్రహించలేకపోయారు. ఆయనలో ఉండే ఆధిపత్య ఆలోచనలకు ఇది ప్రతిరూపమని నల్లజాతి ఉద్యమకారులు భావిస్తున్నారు. చెప్పాలంటే దక్షిణా ఫ్రికాలో ఆయన రెండు దశాబ్దాలపాటు ఉన్నా నల్ల జాతీయుల హక్కుల గురించి ఏనాడూ మాట్లాడలే దనీ, పైపెచ్చు తమను కించపరిచే పదాలను ఆయన ప్రయోగించారని నల్లజాతీయులు భావిస్తున్నారు. అది వారి స్మృతిపథం నుంచి చెరగలేదని ఘనా ఉదంతం చాటుతోంది. పైగా తన అనాలోచిత భావా లతో ఆఫ్రికన్లను కాఫిర్లు అని ఆయన వ్యాఖ్యానిం చిన మాట నిజమేనని గాంధీ మనుమడు రాజ్మో హన్ గాంధీ అంగీకరించారు కూడా. అయితే గాంధీజీ భారత్కు తిరిగి వచ్చిన తర్వాత తన ఈ లోపాన్ని గుర్తించారని చరిత్రకారుల వ్యాఖ్య. అక్కడి అనుభవాలతో భారత్కు తిరిగివచ్చిన తర్వాత అస్పృ స్యతను గాంధీ వ్యతిరేకించారు కానీ జాతి, వర్ణ వివక్ష మూలాల్ని విశ్లేషించి దానికనుగుణంగా సమూల చర్యలు చేపట్టడంలో గాంధీ విఫలమయ్యారు. మన దేశంలో కూడా ఒకవైపు అంటరానితనం పోవాలం టూనే మరోవైపు వర్ణ ధర్మం కొనసాగాలని ఆయన భావించడం ద్వంద్వ స్వభావంగానే పరిగణించాలి. అదే సమయంలో భారత్లో అంటరాని కులాల ప్రజలు తమ హక్కుల కోసం బాబాసాహెబ్ అంబే డ్కర్ నాయకత్వంలో పోరాడుతోంటే ఒకవైపు గాంధీ సానుభూతి ప్రకటిస్తూనే మరోవైపు వారి రాజకీయ సమానత్వం కోసం బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనల్ అవార్డు పేరుతో సెపరేట్ ఎలక్టోరేట్ను ప్రకటిస్తే దాన్ని వ్యతిరేకించడానికి ఈ లోపాలే కారణం. పైగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను రిజర్వ్డ్ స్థానాలకు పరి మితం చేసే ఎన్నికల విధానానికి అంకురార్పణ చేసారు. అంబేడ్కర్ని నయానా, భయానా, ఒప్పించి, పూనా ఒడంబడికను రూపొందించారు. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
కులరహిత సమాజమే ప్రజాస్వామ్యం
అట్టడుగు వర్గాలు, ప్రత్యేకించి అంటరాని కులాల రాజకీయ హక్కులపై 1919లో సౌత్బరో కమిటీ ముందు సుదీర్ఘమైన అభ్యర్థన చేసేనాటికి అంబేడ్కర్ వయస్సు ముప్ఫై ఏళ్లు. ఈ హక్కుల సాధన కోసం మూడు పాయల్లో వ్యూహాత్మకంగా తన ఉద్యమాన్ని కొనసాగించారు. అంబేడ్కర్ షెడ్యూల్డ్ కులాల హక్కుల కోసం తుదిశ్వాస వరకూ పోరాడినప్పటికీ, అంతిమంగా ఒక ప్రజాస్వామ్య సమాజంలోనే దీనికి సంపూర్ణ పరిష్కారం సాధ్యమని బలంగా అభిప్రాయపడ్డారు. భారతదేశంలోని కుల వ్యవస్థను కూకటివేళ్ళతో పెకలించడానికి ఒక మహాప్రజాస్వామ్య ఉద్యమం ప్రారంభం కావాలి. ఈ ఆకాంక్షకు ఆచరణ రూపమివ్వడమే బాబాసాహెబ్కు ఘనమైన నివాళి. ‘‘భారత రాజకీయాల్లో మహాత్మాగాంధీతో పాటు, డాక్టర్ అంబేడ్కర్ మహాగొప్ప వ్యక్తి. హిందూ కులాల్లో పుట్టిన వాళ్ళందరికన్నా మేధావి. ఇటువంటి వ్యక్తుల గొప్ప కృషివల్ల కుల వ్యవస్థతో కూడిన హిందూయిజం దెబ్బతినక తప్పదు. స్వతంత్ర వ్యక్తిత్వం, వివేకం, నిలు వెత్తు నిజాయితీ కలిగిన అంబేడ్కర్ భారతదేశం గర్వించదగ్గ ముద్దు బిడ్డ’’ అంటూ అంబేడ్కర్ని కొనియాడిన వ్యక్తి మరెవరో కాదు రామ్ మనోహర్ లోహియానే. సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన రామ్ మనోహర్ లోహియా అంబేడ్కర్ మరణానంతరం ఆయనపై చేసిన వ్యాఖ్య ఇది. నిజానికి బాబాసాహెబ్ అంబేడ్కర్, రామ్ మనోహర్ లోహియాలు ప్రత్యక్షంగా కలుసుకున్న సందర్భంలేదు. కానీ ఆ ఇద్దరి మధ్యన ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. వారిద్దరి కలయిక కోసం ఏర్పాటు చేసుకున్న సమావేశం జరగక ముందే అంబేడ్కర్ మహాపరి నిర్వాణం చెందారు. తను ప్రారంభించిన ‘మాన్కైండ్’ అనే పత్రికకు రాయాలని కోరుతూ రామ్మనోహర్ లోహియా 1955 డిసెంబర్ పదవ తేదీన అంబేడ్కర్కు ఒక ఉత్తరం రాశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్యా సమ కాలీన రాజకీయాలపై ఉత్తరాల ద్వారా కొంత చర్చ జరిగింది. 1956, అక్టోబర్ 5వ తేదీన అంబేడ్కర్ ఒక ఉత్తరం రాస్తూ, లోహియాతో సమావేశం కావాలనే తన కోరికను వెలి బుచ్చుతారు. కానీ ఆ సమావేశం జరగకుండానే 1956, డిసెంబర్ 6వ తేదీన అంబేడ్కర్ మరణించారు. 1957, జూలై,1వ తేదీన లోహియా, ఆయన సన్నిహిత మిత్రుడు మధు లిమాయేకు రాసిన ఉత్తరంలో పై విధంగా పేర్కొన్నారు. 1891 ఏప్రిల్, 14న జన్మించిన అంబేడ్కర్ తన 26వ ఏట 1915 కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. 1916లో ‘‘కులాల పుట్టుక’’పై ఒక పరిశోధనా పత్రాన్ని సమ ర్పించారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత 1919లో సౌత్బరో కమిటీ ముందు, అట్టడుగు వర్గాల, ప్రత్యేకించి అంటరాని కులాల రాజకీయ హక్కులపై ఒక సుదీర్ఘమైన అభ్యర్థన చేశారు. 1915లో ఆర్థిక శాస్త్రంలో సాధించిన మాస్టర్స్ డిగ్రీతోపాటు, 1927లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి డాక్టరేట్ పొందిన తర్వాత 1946లో స్టేట్స్ అండ్ మైనారిటీస్’’ అనే డాక్యుమెంట్ను రూపొందించారు. గతంలో ఏ పార్టీ, ఏ రాజనీతివేత్తా చెప్పని విధంగా భూమిని జాతీయం చేయాలనీ, పరి శ్రమలను, ఆర్థిక, వాణిజ్య సంస్థ లను ప్రభుత్వమే నిర్వహించాలనీ సూచించిన గొప్ప సామ్యవాది అంబే డ్కర్. 1916లో అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో కులాల పుట్టుకను శోధించే ప్రయత్నం మొదలు పెట్టారు. 1927లో కుల వివక్షకు వ్యతిరేకంగా మహద్ చెరువు సత్యాగ్రహం, కాలారామ్ దేవాలయ ప్రవేశ ఉద్యమాలు ఆయన కార్యా చరణ కొనసాగింపు. 1935లో అంటరానితనం, కుల వివక్ష సమసిపోవా లంటే కుల నిర్మూలనే మార్గమంటూ భారత ప్రజలకు ఒక తాత్విక సైద్ధాంతిక భూమికను అందించారు. ఆ తర్వాత అంటరాని వారెవరు? శూద్రులెవరు? అన్న తన పరిశోధనలను కొనసాగిస్తూ, భారతదేశ కుల సమాజం అంతం కావడానికి బౌద్ధం చక్కటి పరిష్కార మార్గమని భావించి బుద్ధుడిని అనుసరించారు. మూడో అంశంగా, రాజకీయ హక్కులు... 1919లో సౌత్బరో కమిటీ ముందు చేసిన ప్రసంగం మొదలుకొని 1955లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రణాళికను రూపొందించేంతవరకు ఆయన జీవితమంతా ఒక యుద్ధరంగమే. రణక్షేత్రం నుంచే ఆయన ఆలోచనలు సాగాయి. వయో జన ఓటింగ్ హక్కుతోపాటు, అన్ని వర్గాలకు, ప్రత్యేకించి అణగారిన వర్గాలకు రాజకీయ హక్కుల కోసం ఆయన తన సర్వస్వాన్నీ అంకితం చేశారు. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రముఖ విద్యా వేత్త జాన్డ్యూయి మార్గదర్శకత్వంలో అంబేడ్కర్ రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. అప్పటికే అక్కడ జరుగుతున్న నల్లజాతి ప్రజల పోరా టాలు అంబేడ్కర్ను ప్రభావితం చేశాయి. రాజనీతి శాస్త్రంలో ప్రజా స్వామ్య భావనకు ఉన్న గొప్పతనాన్ని జాన్డ్యూయి ద్వారా అంబేడ్కర్ అర్థం చేసుకోగలిగారు. అదే రాజకీయ హక్కుల పోరాట ఉధృతికి అంబేడ్కర్ నడుం కట్టేలా చేసింది. 1919లో సౌత్బరో కమిటీ ముందు ఇచ్చిన వాంగ్మూలం, సైమన్ కమిషన్ పర్య టనలో అంటరానికులాల హక్కులకై గొంతెత్తి చాటారు. ఆ తర్వాత 1931, 32లలో లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు. ప్రత్యేక ఓటింగ్ హక్కు అయిన కమ్యూనల్ అవార్డు సాధించారు. గాంధీ కుట్ర కారణంగా పూనా ఒడంబడిక అనే బృహత్తర కార్య క్రమం నిలిచిపోయింది. దాని ఫలితంగా ప్రత్యేక ఓటింగ్ విధానం లేకుండా పోయింది. అయితే 1935లో మొట్టమొదటిసారిగా ‘భారత చట్టం’(ఇండియన్ యాక్ట్ 1935)ను బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాని ప్రాతిపదికగా, 1937లో జరిగే ఎన్నికల్లో పాల్గొనడం కోసం 1936లో అంబేడ్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ(ఐఎల్పి)ని స్థాపించారు. మహారాష్ట్రలో ఆ పార్టీ 17 స్థానాల్లో పోటీచేయగా, 14 స్థానాల్లో విజయం సాధించింది. అందులో పదకొండు రిజర్వుడ్ స్థానాలుకాగా, మూడు జనరల్ స్థానాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీగా ఉన్నది. అయితే జయప్రకాశ్ నారాయణ్, ఆచార్య నరేంద్ర దేవ్, రామ్ మనోహర్ లోహియా స్థాపించిన కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ మాత్రం అంబేడ్కర్ నాయకత్వం వహిస్తున్న ఇండిపెండెంట్ లేబర్ పార్టీకి మద్దతు పలికింది. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ కేవలం అంటరాని కులాల కోసం ఆవిర్భవించిన పార్టీ కాదు. అంటరాని కులాల హక్కులు, వారి ప్రయోజనాలు ఆ పార్టీకి ముఖ్యమే కానీ అంతకుమించిన విస్తృ తమైన ఆకాంక్షలతో ఆ పార్టీ అవతరించింది. అందుకే కార్మికుల, రైతు కూలీల హక్కులు ఆ పార్టీకి ప్రాథమిక లక్ష్యాలు అయ్యాయి. పరిశ్రమలు పూర్తిగా ప్రభుత్వ అధీనంలో నడవాలనేది ఆ లక్ష్యాల్లో ఒకటి. అంటే ఐఎల్పి కార్మికవర్గ దృక్పథంతో అవతరించిందనేది సుస్పష్టం. 1937 ఎన్నికల తర్వాత కేబినెట్ మిషన్ అనే పేరుతో భారతదేశ రాజకీయ స్వేచ్ఛ, స్వాతంత్య్రం అనే అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన క్రిప్స్ (ఇఖఐ్క్క ) కమిటీ ముందు కూడా అంబేడ్కర్ తన వాదనలను విని పించారు. స్వతంత్ర భారత దేశంలో ఏర్పడే రాజ్యాంగంలో తమకు ప్రత్యేక హక్కులు ఉండాలని నిర్ద్వంద్వంగా ప్రతిపాదించారు. అయితే, ‘‘లేబర్ పార్టీ నాయకుడైన నీకు అంటరాని కులాల కోసం ప్రత్యేకంగా మాట్లాడే హక్కు లేదు’’ అన్న కమిటీ మాటలను పరిగణనలోకి తీసు కొని, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థానంలో ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్ (అఐ ఇఊ)ను స్థాపించారు. దీంతో షెడ్యూల్డ్ కులాల హక్కుల రక్షణ ఈ పార్టీ ప్రాథమిక ఎజెండాగా మారింది. 1942లో ఏర్ప డిన ఈ పార్టీ రాజ్యాంగ సభ ఎన్నికల్లో, 1952 జనరల్ ఎన్నికల్లో పోటీ చేసింది. కొన్ని స్థానాలు గెలిచినప్పటికీ, అనుకున్నంత ఫలితాలు సాధిం చలేకపోయింది. దీనితో మళ్లీ అంబేడ్కర్ రాజకీయ ఉద్యమం నడపడా నికి కేవలం షెడ్యూల్డ్ కులాల పేరుతో పార్టీ నిర్మాణం సరికాదని భావిం చారు. కుల ప్రాతిపదికగా ఏర్పడిన రాజకీయ పార్టీ విస్తృతమైన రాజ కీయ వ్యవస్థను శాసించలేదని అంబేడ్కర్ అభిప్రాయం. అందుకే 1955లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పేరుతో ఒక రాజకీయ పార్టీకి అంకురార్పణ చేయాలని భావించి, ఒక ప్రణాళికను తయారు చేశారు. భారత రాజ్యాంగంలోని పీఠికను ఆర్పీఐ ప్రాథమిక లక్ష్యంగా అంబేడ్కర్ ప్రకటించారు. ప్రణాళికలో ఆ పీఠికను యథాత«థంగా పొందుపరిచారు. ‘‘న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం ఆశయా లుగా కొత్త పార్టీని ప్రకటించారు. కానీ ఆర్పీఐ పార్టీ అంబేడ్కర్ మరణానంతరం మాత్రమే ఉనికిలోకి వచ్చింది. 1952 జనరల్ ఎన్నికల నుంచి అంబేడ్కర్ తన రాజకీయ గమ్యం, గమనం కోసం ప్రయత్నిం చారు. అందులోభాగంగానే సహజ మిత్రుల కోసం అన్వేషించారు. ఆ క్రమంలోనే సోషలిస్టు పార్టీ నాయకులు రామ్ మనోహర్ లోహియాతో అంబేడ్కర్కి సత్సంబంధాలేర్పడ్డాయి. కానీ వాళ్ల కలయిక జరగకుం డానే, వారి రాజకీయ కల సాకారం కాకుండానే అంబేడ్కర్ కన్ను మూయడం పెద్దలోటు. ఆ తర్వాత ఉనికిలోకి వచ్చిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మొదట్లో లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసినప్పటికీ, తర్వాత అంతర్గత కలహాలతో ఉనికినే పోగొట్టుకున్నది. అంబేడ్కర్ తన జీవిత చరమాం కంలో చేసిన రాజకీయ ఆలోచనలు, ఆశించిన కార్యాచరణ ఇంకా పూర్తి కాలేదు. షెడ్యూల్డ్ కులాల హక్కుల కోసం తుదిశ్వాస వరకూ పోరాడి నప్పటికీ, అంతిమంగా ఒక ప్రజాస్వామ్య సమాజంలోనే దీనికి సంపూర్ణ పరిష్కారం సాధ్యమని బలంగా అభిప్రాయపడ్డారు. ఒక మని షికి, ఒక ఓటు, ఒక ఓటు–ఒక విలువ ద్వారా రాజకీయ ప్రజాస్వామ్యం లభిం చినప్పటికీ, ఆర్థిక, సామాజిక అసమానతలు కొనసాగుతున్నాయని, రాజ్యాంగ సభ చివరి సమావేశం సందర్భంగా 1949, నవంబర్ 25న చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. కుల నిర్మూలన ద్వారా సామాజిక ప్రజాస్వామ్యం, ప్రజలందరికీ సమానావకాశాల ద్వారా, పెట్టుబడిదారీ వ్యవస్థ నియంత్రణ, ఆర్థిక ప్రజాస్వామ్యం అందించాలని అంబేడ్కర్ అభిలషించారు. అందుకే భారతదేశంలోని కుల వ్యవస్థను, పెట్టుబడి దారీ వ్యవస్థను కూకటివేళ్ళతో పెకిలించడానికి ఒక మహాప్రజాస్వామ్య ఉద్యమం ప్రారంభం కావాలి. ఈ ఆకాంక్షకు ఆచరణ రూపమివ్వడమే బాబా సాహెబ్కు ఘనమైన నివాళి. (నేడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా) వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు / lmallepalli@gmail.com -
ఛిద్రమైన దశాబ్దాల ఉద్దానం కల
తిత్లీ తుఫాను బీభత్సం ఒకేఒక్క రాత్రిలో ఉద్దానం ప్రజల జీవితాలను చెల్లాచెదురు చేసింది. ఐదారు దశాబ్దాల వారి కలలను ఛిద్రం చేసింది. 1,91,012 ఎకరాల తోటలు ధ్వంసమయ్యాయి. ఇందులో జీడితోటల శాతమే అధికం. రైతులు ధ్వంసమైన పంటల్ని తలచుకొని భవిష్యత్తుని ఊహించుకోవడానికి కూడా భయపడుతున్నారు. మరో పదేళ్ళ పాటు ఏం తిని బతకాలంటూ వారు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉద్దానంలో తిత్లీ విధ్వంసం వల్ల జరిగిన నష్టాన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. అలా జరగకపోతే శతాబ్దాల చరిత్ర కలిగిన ఉద్దానం రూపు రేఖలే మారిపోయే ప్రమాదం ఉంది. ఉద్దానం...ఇది ఒక ఊరు కాదు. ఉద్యమాల ఊపిరి. భారత చరిత్రనే మలుపుతిప్పిన పేరు ఇది. ఎండిన డొక్కలూ, ఎముకల గూళ్ళ లాంటి దేహాలతో దోపిడీపై తిరగబడ్డ ఉద్దానం ప్రాంత ప్రజల నెత్తుటి త్యాగాలు చరిత్ర మరువజాలనిది. నక్సల్బరీకి సమకాలీనంగానూ, నక్సల్బరీ కొనసాగింపుగానూ దోపిడీపె దండెత్తి నెత్తురు చిందించిన శ్రీకాకుళ రైతాంగ పోరాటాలన్నీ ఉద్దానం పచ్చనాకు సాక్షిగా జరిగినవే. తీరప్రాంతంలోని ప్రతి ఇసుకరేణువూ అవే పోరాట కథలను వినిపి స్తుంది. అదే చైతన్యాన్ని ప్రదర్శిస్తుంది. కానీ మొన్నటి తిత్లీ తుఫాను అక్కడి పేదల మదినిండిన ఉద్దానం జాడలను చెరిపేసింది. కనుచూపు మేరలో పచ్చటి జీడితోటలతో కళకళలాడే ఉద్దానమిప్పుడు ఎండినమో డులతో శ్మశానాన్ని తలపిస్తోంది. అందమైన అక్కుపల్లి, మెట్టూరు, గడూరు మామిడిపల్లి, రాజాం, మర్రిపాడు, బొడ్డపాడు, మాకన్నపల్లి, నీలావతి, రంగోయి, లాంటి ఎన్నో పల్లెలు తిత్లీ తుఫానుతో తీరని శోకాన్ని మూటగట్టుకుని ఊళ్ళకు ఊళ్ళే వల్లకాడుగా మారిపోయాయి. పచ్చని పొదలు పరచుకున్న ఉద్దానం తిత్లీ తుఫానుతో అతలాకు తలమైంది. మొత్తం 38 మండలాల్లో 50 వేల ఇళ్ళు నేలమట్టమ య్యాయి. 38 వేలకు పైగా పశువులు మరణించాయి. 2,500కు పైగా దుకాణాలు ధ్వంసమయ్యాయి. లక్షలాది ఎకరాల పంటలూ, తోటలూ పెనుతుఫాను తాకిడికి తుడిచిపెట్టుకుపోయాయి. ప్రకృతికే పచ్చతో రణం కట్టినట్టుండే ఉద్దానం అదే ప్రకృతి విలయతాండవంతో మరు భూమిగా మారింది. ఇప్పుడక్కడ మిగిలిందంతా çశ్మశాన నిశ్శబ్దమే. ఐదారు దశాబ్దాల పాటు రెక్కలుముక్కలు చేసుకుని పెంచుకున్న జీడి మామిడీ, పనస, మునగ, కొబ్బరి తోటలు పెనుతుఫాను తాకిడికి తుడి చిపెట్టుకుపోయాయి. చుక్కనీరు దొరకని చోట తమ చెమటనే రక్తంగా «ధారబోసి కాపాడుకున్న తోటలు సర్వనాశనం అయ్యాయి. ఒంటినిండా గుడై్డనా కట్టుకోవడం తెలియని అమాయక జన ఉద్దానమిప్పుడు ఆకలి దప్పులతో అల్లాడిపోయే రోజొచ్చింది. ఉద్దానంలో మూడు రకాల పంట భూములుంటాయి. మెట్టభూ ములు, గుడ్డి(ఇసుక నేలలు), పల్లపు భూములు. మెట్ట భూముల్లో పంటలు పూర్తిగా వర్షాధారమైనవే. ఇక్కడన్నీ ఇసుకనేలలే కాబట్టి జీడి తోటల పెంపకం చాలా ఎక్కువ. ఇది అక్కడి ప్రజలకు ప్రధానమైన వ్యాపార పంట. గ్రామంలోనే తోట ఉందా? తోటలోనే గ్రామం ఉందా అన్నది తేల్చుకోలేని విధంగా పల్లెలన్నీ పచ్చనాకు పందిళ్ళలా ఉంటాయి. ఈ తోటలు దట్టమైన అడవిని మరిపిస్తుంటాయి. ఒక చెట్టు మరుగైతే మనిషి అలికిడిని గుర్తించడం మహాకష్టం. అక్కడి నీటి ఎద్దడిని అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. కింద పెద్ద అండా లాంటిది పెట్టి అందులో నించోబెట్టి పిల్లలకు స్నానం చేయించేవారు. స్నానం చేసేటప్పుడు అండాలో పడిన నీటితో గిన్నెలు కడుక్కునేవారు. ఈlకరువు ప్రాంతంలో లక్షలాది ఎకరాల్లో పచ్చదనం నింపేందుకు ఆ ప్రాంత ప్రజలు పడ్డ కష్టం అనన్యసామాన్యమైనది. ఎడారిని తలపించే ఇసుక భూములు, ఉప్పునీటిమయమైన సము ద్రతీర పొలాలు. అక్కడి ఇసుకతిన్నెల్లాంటి భూముల్లో సాధారణ పంటలు పండే అవకాశమే లేదు. అందువల్లే అక్కడ జీడి, కొబ్బరి లాంటివి మాత్రమే సేద్యానుకూలంగా ఉంటాయి. అందులో కీలకం జీడిమామిడే. శ్రీకాకుళం ప్రాంతానికి జీడిపంట తొలిసారిగా 1950లో పరిచయం అయ్యింది. ఆ తరువాత 1970 నుంచి జీడితోటల పెంపకం ఊపందుకుంది. అయితే జీడి తోటల పెంపకం దక్షిణ అమెరికాలో ప్రారంభమైంది. 16వ శతాబ్దంలో పోర్చుగీసు ద్వారా బ్రెజిల్ నుంచి ఈ పంటను భారత దేశానికి తీసుకువచ్చారు. కేరళలోని మలబారు తీర ప్రాంతంలో జీడిమామిడిని తొలిసారిగా సాగుచేశారు. అప్పటి నుంచి ఈ పంట భారతదేశంలోని తీరప్రాంతాలన్నింటికీ విస్తరించింది. 1960– 61లో భారత్లో 1,76,000 హెక్టార్లలో పంట సాగుచేయగా, 2006– 07లో 8,54,000 హెక్టార్లలో జీడిమామిడి సాగుచేశారు. కేవలం 40 ఏళ్ళలో సాగులోకి వచ్చిన భూమి 8 రెట్లు పెరిగింది. అదే తరహాలో శ్రీకాకుళం ఉద్దానంలో కూడా జీడిమామిడి సాగు విస్తృతంగా పెరిగింది. 1970 ప్రాంతంలో చాలా తక్కువ మంది రైతులు జీడిమామిడిని సాగుచేసేవారు. అయితే రైతులను దళారీలు, షావుకారులూ, ఊరి పెద్దలు ముప్పేట దోపిడీ చేసేవారు. తిండి దొరకని పరిస్థితుల్లో రైతులు ముందుగా అప్పులు తెచ్చుకునేవారు. ముందుగా అప్పు పేరుతో డబ్బులు ఇచ్చి జీడిపిక్కలను బస్తాల్లో నింపుకుని వెళ్ళేవారు. కొలత ల్లోనూ, తూకాల్లోనూ అంతులేని దోపిడీ ఉండేది. 1960 చివరి దశలో ప్రారంభమైన నక్సలైటు ఉద్యమం షావుకార్ల, మధ్య దళారీల దోపిడీకి అడ్డుకట్ట వేసింది. నక్సలైటు ఉద్యమ చైతన్యంతో దోపిడీదారులను తరిమికొట్టగలిగారు. వారి చైతన్యానికి తగ్గట్టుగా వ్యవసాయపద్ధతు ల్లోనూ నైపుణ్యం పెరిగింది. జీడితోటల పెంపకంలో మెళకువలు నేర్చు కున్నారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో 1985 నాటికి 28,000 హెక్టా ర్లలో జీడిమామిడి సాగు అయితే 2001 కల్లా అది 60,000 హెక్టార్లకు పెరిగింది. ఈ రోజు అది లక్షలాది హెక్టార్లకు విస్తరించింది. అయితే తిత్లీ తుఫాను బీభత్సం ఒకేఒక్క రాత్రిలో ఉద్దానం ప్రజల జీవితాలను చెల్లాచెదురు చేసింది. ఐదారు దశాబ్దాల వారి కలలను ఛిద్రం చేసింది. 1,91,012 ఎకరాల తోటలు ధ్వంసమయ్యాయి. ఇందులో జీడితోటల శాతమే అధికం. 1,18,757 మంది రైతుల జీవి తాలు విధ్వంసానికి గురయ్యాయి. అయితే ఏపీ ప్రభుత్వం జీడితోటల నష్టానికి ఇస్తున్న పరిహారం హెక్టారుకు కేవలం 30,000 రూపాయలు. ఎకరాకు 12,000 రూపాయల్ని నష్టపరిహారంగా చంద్రబాబు ప్రభుత్వం దయతల్చి ఇస్తామని ప్రకటించింది. కొబ్బరి తోటలు, అరటి తోటలకు కూడా ఇదేరకమైన భిక్షాప్రాయమైన నష్టపరిహారాన్ని ఖరారు చేశారు. కొబ్బరి చెట్టుకు ఒక్కింటికి 1,500 రూపాయల నష్టపరిహారం ప్రకటిం చారు. ఒకవైపు రైతులకు ప్రకటించిన నష్ట పరిహారం ఏమాత్రం న్యాయ బద్ధంగా లేదు. అంతేకాదు ఏజెన్సీ ప్రాంతంలో పోడు చేసుకుంటున్న ఆదివాసీల దగ్గర భూములకు పట్టాలుండవు. దీన్ని సాకుగా తీసుకుని ప్రభుత్వం వారి నష్టపరిహారానికి ఎగనామం పెట్టింది. ప్రభుత్వం పేద లకు ఇచ్చిన అసైన్డ్ భూములలోని పంటలకు కూడా నష్టపరిహారం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వాలు కేవలం కంటి తుడుపుగానే వ్యవహరిస్తున్నాయనడానికి ఇంతకంటే నిదర్శనం అక్క ర్లేదు. ఇటీవల తిత్లీ ప్రభావిత గ్రామాలను చూసినప్పుడు అక్కడి రైతులు చెప్పిన మాటలు వింటుంటే వాస్తవ అంచనాలకు ప్రభుత్వాల ఆలో చనలు ఎంత దూరంగా ఉన్నాయో అర్థం అవుతుంది. ఒక జీడి తోటలో మొక్కలు నాటిన తరువాత మొదటి ఫలసాయం అందడానికి కనీసం 5 ఏళ్ళు పడుతుంది. ప్రస్తుతం ధ్వంసమైన తోటల స్థాయి చేరడానికి కనీసం 12 సంత్సరాలకు పైగా పడుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం మొక్కలు కొనడానికి కాదుగదా «ధ్వంసమైన చెట్లను తొల గించడానికి కూడా సరిపోదు. మొక్కలు నాటి ఐదేళ్లపాటు ప్రతి మొక్కనీ బతికించుకోవడానికి బొట్టుబొట్టుగా నీటి చుక్కలను పట్టుకొచ్చి ప్రాణప్ర దంగా పెంచడానికి కనీసం ఇద్దరు మనుషులు నిరంతరం కష్టపడాలి. దీనికి ప్రతి కూలీకి ఒక్కొక్కరికి నెలకు పదివేల రూపాయల చొప్పున లెక్కవేస్తే ఏడాదికి 2,40,000 రూపాయలు అవసరమవుతాయి. ఐదేళ్లకు 12 లక్షల రూపాయలు అవుతాయి. ఇంకా ఎరువులు, విత్తనాలు, పురు గుమందుల ఖర్చు అదనం. ఈ లెక్కన కనీసం ఒక ఎకరం జీడితోటలో ఐదేళ్లలో మొదటి ఫలసాయం అందడానికి కనీసం 15 లక్షలు ఖర్చు అవుతుంది. కానీ ఏపీ ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా 30 వేల రూపా యలిచ్చి మొసలి కన్నీరు కార్చింది. అయితే ప్రస్తుతం జీడితోటల యజమానులుగా ఉన్న రైతులు ఎవ్వరూ అంతటి ఆర్థిక స్థోమత కలిగిన వారు కాదు. అంతా ఒక ఎకరం నుంచి రెండెకరాల లోపున్న చిన్నసన్నకారు రైతులే. ప్రతి కుటుంబం నుంచి ఎవరో ఒకరు అండమాన్ నికోబార్ దీవులకో, దుబాయ్కో, బర్మాకో వలసెళ్ళి రెక్కలు ముక్కలు చేసుకుంటే కానీ ఇక్కడి జీడిపంటకీ, ఆ కుటుంబాలకీ ఆధారం ఉండదు. రైతులు «ధ్వంసమైన పంటల్ని తల చుకుని భవిష్యత్తుని ఊహించుకోవడానికి కూడా భయపడుతున్నారు. మరో పదేళ్ళపాటు ఏం తిని బతకాలంటూ వారు కన్నీరుమున్నీరవుతు న్నారు. తిత్లీ విధ్వంసం వల్ల జరిగిన నష్టాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిం చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేసిన డిమాండ్ నూటికి నూరుపాళ్ళూ సరైనది. ప్రభుత్వం గనక ఆ బాధ్యత తీసుకోకపోతే ఉద్దానం రూపు రేఖలే మారిపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం సాయం చేయకపోతే వాళ్ళు సొంత డబ్బుతో దాన్ని బాగుచేసుకోలేరు. బాగుచేసుకోకపోతే అనివార్యంగా తాము నమ్ము కున్న భూములన్నింటినీ తెగనమ్ముకోక తప్పని దయనీయ స్థితి. చిన్న సన్న కారు రైతుల కష్టంతో తడిసిన ఆ భూములన్నీ బడాభూస్వాముల, పెట్టు బడి దారుల చేతుల్లోకి పోవడానికి ఎంతో కాలం పట్టదు. ఉద్దానం పచ్చటి పంటపొలాలన్నీ రేపు కార్పొరేట్ల చేతుల్లోకి జారిపోయే ప్రమాదం ఉంది. అయితే జీడిపంట నాశనమవడంతో దానిపై ఆధా రపడిన జీడిపిక్కల పరిశ్రమల్లో రోజుకూలీలుగా పనిచేసే పలాసలోని 30,000 మందికి పైగా ప్రజలకు తిండికూడా దొరకని పరిస్థితి దాపురిం చనుంది. వ్యాపారంపై ఆధారపడి జీవిస్తోన్న మరో పాతిక వేల మంది భవిష్యత్తు అంధకారంగా మారింది. నిత్యజనసంచారంతో సజీవంగా కళకళలాడే ఉద్దానం పల్లెజనం వలసబాటపట్టి కాశీబుగ్గ, పలాస లాంటి పట్టణాలు జీవకళను కోల్పోయే ప్రమాదం ఉంది. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు : మల్లెపల్లి లక్ష్మయ్య lmallepalli@gmail.com -
కాపాడుకోవాల్సిన లౌకిక కాంక్ష
‘‘నేను ఇస్లామిక్ పాకిస్తాన్లో బతకను. లౌకిక భారత దేశంలో జీవిస్తాను’’ అన్న సాహిర్ లూథియాన్వీ ప్రకటన ఆయనలోని అద్భుతమైన లౌకిక కాంక్షాపరుడిని మనకు పరిచయం చేస్తుంది. ఆయన ప్రతి అక్షరం అణచివేతపై ఎక్కుపెట్టిన విల్లంబే. ఆయన ప్రేమగీతాల్లో సైతం స్త్రీల పక్షపాత ధోరణి గోచరిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే ఆయనొక వర్గదృక్పథాన్ని పుణికి పుచ్చుకున్న కమ్యూనిస్టు, స్త్రీల అస్తిత్వాన్ని చాటిచెప్పిన ఫెమినిస్టు. ఈనాటి సమాజానికి సాహిర్ లూథియాన్వీ వదిలివెళ్ళిన లౌకిక అభ్యుదయ, ప్రజాస్వామ్య వారసత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ‘‘తూ హిందూ బనేగాన ముసల్మాన్ బనేగా ఇన్సాన్కీ అవులాద్ హై ఇన్సాన్ బనేగా’’ దాదాపు ఆరు దశాబ్దాల క్రితం ఈ పాట యావత్ భారతదేశాన్నీ ఓ కుదుపు కుదిపింది. ‘దూల్ కా ఫూల్’ అనే హిందీ చిత్రంలో ప్రముఖ ఉర్దూ కవి సాహిర్ లూథియాన్వీ కలం నుంచి జాలువారిన సినీగీతమిది. ఇదే పాటలో మాలిక్నే హర్ ఇన్సాన్ కో/ఇన్సాన్ బనాయా హమ్నే ఉసే హిందూ యా ముసల్మాన్ బనాయా/ కుద్రత్ నే తో హమే బక్సీ థీ ఏకీ ధర్తీ హమ్ నే కహీ భారత్ /కహీ ఇరాన్ బనాయా! ఈ గేయం కవి సాహిర్ లూథియాన్వీలోని గొప్ప మానవీయ దృక్పథానికి అద్దం పడుతుంది. దూల్ కా ఫూల్ చిత్రం 1959లో అప్పటికి భారత దేశంలోనూ, పాకిస్తాన్లోనూ అల్లర్లు జరిగి చేదు జ్ఞాపకాలను మూటగట్టుకున్న సందర్భంలోనిది. లక్షలాది మంది ప్రజలు, వేలాది కుటుంబాలు ఉన్న ఇళ్లనీ, కన్న తల్లుల్నీ వదిలి కొంపాగోడూ వెతుక్కుంటూ దేశాన్ని వీడి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలోనే దూల్ కా ఫూల్ చిత్రం తీసారు. ఈ చిత్రం ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగిన సంఘర్షణ. పెళ్ళి కాకముందే తల్లి అయిన ప్రేమికురాలు తన ప్రేమను అంగీకరించి ఇరువురికీ పుట్టిన బిడ్డను తమ బిడ్డగా అంగీకరించి స్వీకరించాల్సిందిగా ప్రియుడిని కోరుతుంది. అతను నిరాకరించడంతో ఆమె సమాజానికి భయపడి తన ఆరు నెలల పసికందును పట్టణం సమీపంలోని ఓ చిట్టడివిలో వదిలి వెళుతుంది. అదే తోవలో వెళుతోన్న ఒక ముస్లిం వ్యక్తి ఆ పసివాడిని వెంటతీసుకువెళ్లి కంటికి రెప్పలా కాపాడుకొని పెంచి పెద్దచేస్తాడు. కులమేదో, మతమేదో కూడా తెలియని ఆ అనాథ బాలుడిని పెంచుకున్నందుకు అతడిని ఇస్లాం మత పెద్దలు వెలివేస్తారు. వెలివేతను లెక్కచేయని ఆ ముస్లిం వ్యక్తి ఆ పిల్లవాడిని తనతో తీసుకెళతాడు. పైగా ఆ పిల్లవాడికి రోషన్ అనే హిందూ పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. ఆ సందర్భంలోనే చిత్రీకరించిన పాట ఇది. హిందూ ముస్లిం అనేవి మనుషులు గీసుకున్న విభజన రేఖలేననే సందేశాన్ని ఈ పాటలో కవి లూథియాన్వీ వెలిబుచ్చుతాడు. ఇప్పటికీ ఈ మతాల విభజనరేఖని చెరపలేని సమాజానికి అరవైయేళ్ళ క్రితమే సర్వమానవ సౌభ్రాతృత్వ సందేశాన్నిచ్చిన లూథియాన్వీ జీవితం కూడా సరిగ్గా ఇదే ఒరవడిలోంచి రావడం యాదృచ్ఛికమే కావచ్చు. నాటికీ, నేటికీ లూథియాన్వీ... ప్రేమకూ, ప్రేమికులకూ పాటల పట్టాభిషేకం కట్టినవాడు. అటువంటి సాహిర్ లూథియాన్వీ జీవితం గురించి తెలిసిన వారు బహుతక్కువనే చెప్పాలి. లూథి యాన్వీ అసలు పేరు అబ్దుల్ హయీ. సాహిర్ లూథి యాన్వీ ఆయన కలంపేరు. ఆయన లూథియానాలో జన్మించడం వల్ల లూథియాన్వీ అయ్యాడు. కవిత్వం రాయడం వల్ల సాహిర్ అయ్యాడు. సాహిర్ లూథి యాన్వీగా మారిన అబ్దుల్ హయీ మార్చి 8, 1921న జన్మించాడు. తల్లి సర్దార్ బీబీ. ఆయన తండ్రి ఫజల్ మహమ్మద్. ఫజల్ మహమ్మద్ అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన వాడు. తన సంపదకు వారసుడు కావాలనే కారణంతో 11 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. అందులో సాహిర్ లూథియాన్వీ తల్లి సర్దార్ బీబీ ఒకరు. లూథియాన్వీ తల్లి సామాజిక, ఆర్థిక నేపథ్యం ఫజల్ మహమ్మద్ కుటుంబానికి నచ్చలేదు. దాంతో తమ వివాహ సంబంధాన్ని ఫజల్ మహమ్మద్ నిరాకరించాడు. దాంతో సర్దార్ బీబీ కోర్టుకు వెళ్ళింది. కోర్టుకి వెళ్ళకముందే ఫజల్ ద్వారా సర్దార్ బీబీ గర్భందాల్చింది. కింది కోర్టులో ఆమె వీగిపోయింది. లూథియాన్వీని తన కొడుకుగా ఫజల్ మహమ్మద్ అంగీకరించలేదు. బీబీ మాత్రం తన పట్టువదల్లేదు. లాహోర్లోని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పై కోర్టు ఫజలుద్దీన్ సాహిర్ లూథియాన్వీకి తండ్రి అని నిర్ధారించింది. సాహిర్ ఫజలుద్దీన్కు నిజమైన వారసుడని ప్రకటించింది. తల్లి అయిన సర్దార్ బీబీని సాహిర్ సంరక్షకురాలిగా ఉండాలని ఆదేశించింది. సాహిర్ లూథియాన్వీని చంపడానికి సైతం ప్రయత్నిస్తారు. దీంతో సర్దార్ బీబీ తన కొడుకు సాహిర్ లూథియాన్వీని తీసుకొని బతుకుదెరువుకోసం అజ్ఞాత జీవితంలోకి వెళుతుంది. అందుకే సాహిర్ లూథియాన్వీ కవిత్వం తన తల్లి జీవితంలో అనుభవించిన కష్టాలతో పాటు వేనవేల స్త్రీల జీవి తాల్లో ముసురుకున్న సవాలక్ష సమస్యల్ని ప్రతిబింబిస్తుంది. సాహిర్ లూథియానాలో తన చదువుని కొనసాగించారు. కాలేజీ రోజుల్లోనే 1947 సంవత్సరంలో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా నిలబడినందుకు కాలేజీ నుంచి యాజమాన్యం బహిష్కరించింది. లూథియానాలోని సతీష్ చందర్ ధావన్ ప్రభుత్వ కళాశాలలో ఆయన ఒక రోజు ఇచ్చిన ఉపన్యాసం ఆయన జీవితాన్ని మార్చివేసింది. చదువుని మధ్యలోనే ఆపివేసిన సాహిర్ తననూ, తన తల్లినీ పోషిం చుకోవడానికి చిన్నా చితకా ఉద్యోగాలెన్నో చేసాడు. కానీ ఆయన తన కవితాకాంక్షను మాత్రం వదులుకోలేదు. చేదుజ్ఞాపకాలు(బిట్టర్నెస్) పేరుతో కవితా సంపుటిని ప్రచురించారు. ఈ కవితా సంపుటి ప్రచురణతో సాహిర్ లూథియాన్వీ సాహితీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఆయన నాలుగు ఉర్దూ పత్రికలకి ఎడిటర్గా పనిచేసారు. అందులో ఆదాబ్ యే లతీఫ్, సహకార్, ప్రిత్లరీ, సవేరా పత్రికలు ఈయన సంపాదకత్వంలో విజయవంతంగా నడిచాయి. ఆ సందర్భంలోనే భారత కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంస్థ అయిన అభ్యుదయ రచయితల సంఘంలో సభ్యుడిగా చేరారు. కమ్యూనిస్టు భావజాల ప్రభావంతో రాసిన రాతలు అప్పటి పాకిస్తాన్ ప్రభుత్వానికి కంట గింపుగా మారాయి. 1949లో ఆయనను అరెస్టు చేయడానికి పోలీసులు వారంట్తో వచ్చారు. దాంతో సాహిర్ ఢిల్లీ పారిపోయాడు. ఆ సందర్భంలోనే ‘‘నేను ఇస్లామిక్ పాకిస్తాన్లో బతకను. లౌకిక భారత దేశంలో జీవిస్తాను’’ అన్న సాహిర్ లూథియాన్వీ ప్రకటన ఆయనలోని అద్భుతమైన లౌకిక కాంక్షాపరుడిని మనకు పరి చయం చేస్తుంది. సాహిర్ లూథియాన్వీ సినీగేయ రచయితగానే ప్రపంచానికి పరిచయం. అయితే ఆయనలో పరవళ్ళు తొక్కిన అభ్యుదయ ప్రజాకవిత్వం గురించి మాత్రం కొందరికే తెలుసు. ఆయన ఢిల్లీ నుంచి ముంబాయికి మారినప్పుడు, సినిమాలలో పాటలు రాయాలని నిర్ణయించుకున్నప్పుడు అభ్యుదయ రచయితల సంఘంలోని ఆయన మిత్రులు ఆయనపై విమర్శల వర్షం కురిపించారు. అయితే చిత్రపరిశ్రమకు బయట ఆయన రాసిన కవిత్వం మాత్రమే ఆ విమర్శలకు సరైన సమాధానం అయ్యింది. విమర్శకులెవ్వరూ ఆ తరువాత నోరుమెదపలేదు. సాహిర్ లూథియాన్వీ కవిత్వంలో పైన పేర్కొన్నట్టుగానే మహిళల జీవితం ఒక కోణం అయితే పేదలు, కార్మికులు, అనాథలు మరో పార్శ్వంగా ఆయన కవితాలోకాన్ని ఆశ్రయిస్తారు. పెట్టుబడిదారీ విధానం, దోపిడీ, వివక్ష, అణచివేత, ఇవన్నీ ఆయనకు బద్ధ శత్రువులు. తాజ్మహల్ అందచందాలనూ, చలువరాతి సోయగాలనూ పొగిడిన కవులే మనకెంతో మంది కనిపిస్తారు. ఈ కట్టడం ప్రేమకు చిహ్నమే కావచ్చు. రాజుల గొప్పతనమే కావచ్చు. కానీ తాజ్మహల్ నిర్మాణంలో శ్రమజీవుల నెత్తుటి ధారలను కవిత్వాం తరంగంలోకి ఇంకించింది మాత్రం సాహిర్ లూథి యాన్వీనే. నూతన సంవత్సర వేడుకల్లో మునిగి తేలుతూ సంబరాలు చేసుకుంటున్న వాళ్ళకార్లను వెంబడించే పేదపిల్లల గురించి రాస్తాడు. రెండవ ప్రపంచ యుద్ధం విధ్వంసాన్ని కళ్ళారా చూసిన సాహిర్ లూథియాన్వీ యుద్ధాన్ని తీవ్రస్వరంతో ద్వేషిస్తాడు. యుద్ధం ఒక సమస్య మాత్రమే. అది సమాధానం కాదు అని ప్రకటించిన లూథి యాన్వీ యుద్ధం ఈ రోజు రక్తపాతాన్ని సృష్టిస్తే, రేపు అది ఆకలినీ, ఆర్తనాదాల్నీ బహూకరిస్తుందంటాడు. పేద, అణగారిన వర్గాల జీవితాల్లోని ప్రతి చీకటి కోణాన్నీ తడిమి చూసినవాడు సాహిర్. పీడితులకూ, పేదలకూ రేపటి కలల సౌధాన్ని నిర్మించుకోవడానికి ఏకమౌదాం రండి అంటూ పిలుపునిస్తాడు. ఈనాటి సమాజానికి సాహిర్ లూథియాన్వీ వదిలివెళ్ళిన లౌకిక అభ్యుదయ, ప్రజాస్వామ్య వారసత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం భారతదేశంలో నెలకొన్న పరిస్థితులు సాహిర్ స్వప్నాన్ని చిన్నాభిన్నం చేసేవిగా ఉన్నాయి. మతాల మధ్య, సాంప్రదాయాల మధ్య, అగాధాలను సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకుంటున్న శక్తులు నానాటికీ విజృంభిస్తున్నాయి. ఇవి భారతదేశ వారసత్వ భావనలను ధ్వంసం చేస్తోన్న పరిణామాలు. సరిగ్గా ఇక్కడే సాహిర్ లూథియాన్వీ మనకు ఒక వెలుగుదివ్వెలా కనిపిస్తాడు. పాకిస్తాన్ నుంచి ఇండియాకు పారిపోయి వచ్చిన సమయంలో ఆయన అన్న మాటలు మనకు ప్రతిక్షణం గుర్తుకు రావాలి. అంతేకాదు ఆ మాటల అంతస్సారం మనకు మార్గదర్శకం కావాలి. లౌకిక భారతావనిలో జీవిస్తాను అని ప్రకటించిన సాహిర్ లూథియాన్వీ వ్యాఖ్యలు మనకాదర్శం కావాలి. సాహిర్ లూథియాన్వీ తల్లి కూడా ఎంతో సాహసోపేతమైన జీవితాన్ని గడిపింది. అదే సాహసం తన కొడుక్కి వారసత్వంగా అందించింది. అదే ఆయనను నిజాయితీగా, నిర్భీతితో ఎదిగేలా చేసింది. ఆయనలో అత్యంత మానవీయతను నాటింది. అతడిని శ్రామిక జనపక్షపాతిగా నిలిపింది. ఎంత ఎత్తుకెదిగినా తన పునాదిని మరువకుండా చేసింది. కష్టజీవుల కన్నీళ్ళను తడిమి చూసింది. ఆయన ప్రతి అక్షరం అణచివేతపై ఎక్కుపెట్టిన విల్లంబే. ఆయన ప్రేమగీతాల్లో సైతం స్త్రీల పక్షపాత ధోరణి గోచరిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే ఆయనొక వర్గదృక్పథాన్ని పుణికి పుచ్చుకున్న కమ్యూనిస్టు, స్త్రీల అస్తిత్వాన్ని చాటిచెప్పిన ఫెమినిస్టు. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు ఈ–మెయిల్ : lmallepalli@gmail.com -
నిబద్ధతకు నిలువెత్తు సంతకం!
జీవితమంతా ప్రజలకు నిబద్ధులై ఉండే అరుదైన అధికారుల గురించి ఆలోచిస్తే మొట్టమొదట మన కళ్లముందు కదలాడే ప్రత్యక్ష రూపం ఎస్.ఆర్. శంకరన్దే. 1974 ప్రాంతంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దళితుల, ఆదివాసీల విషయంలో చేసిన కీలక నిర్ణయాలు, శంకరన్ లాంటి అభ్యుదయ అధికారుల చేతిలో శక్తివంతమైన ఆయుధాలుగా మారాయి. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాక దళిత, ఆదివాసీల అభ్యున్నతికి బాటలు వేసే అత్యంత సాహసోపేత మైన నిర్ణయాలెన్నో చేసిన ఎస్.ఆర్. శంకరన్ ఒక్క ఏడాదిలోనే దాదాపు 120 ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం ఐఏఎస్ అధికారుల చరిత్రలో అరుదైన సందర్భం. భారత రాజ్యాంగం అత్యున్నతమైనది. విశిష్టమై నది. అధిపతులూ, అధికా రులూ, పరిపాలకులూ ఈ దేశంలో ఎంతటి అత్యు న్నత పదవిలో ఉన్న వారైనా భారత రాజ్యాంగానికి బద్ధులైæ ఉండాల్సిందే. భారతదేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడి, పాలనను కొనసాగించే వ్యవ స్థలు మూడు. అందులో ఒకటి శాసన వ్యవస్థ. రెండు అధికార వ్యవస్థ. మూడు న్యాయ వ్యవస్థ. ఈ మూడింటిలో శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ కేవలం విధానాలూ, చట్టాల, రూపకల్పనలో ప్రధాన పాత్ర వహిస్తాయి. కానీ శాసన న్యాయ వ్యవస్థలు అంతగా ప్రజలకి చేరువ కావు. అయితే అధికార వ్యవస్థ నిత్యం ప్రజలమధ్యే ఉండాల్సి ఉంటుంది. వీరె ప్పుడూ ప్రజలకు, రాజ్యాంగానికీ మాత్రమే జవాబు దారీగా ఉండాలి. ప్రభుత్వంలోని బ్యూరోక్రాట్స్ కానీ, అధికారంలో ఉన్న పెద్దలెవరైనా, ఇతర ఆధి పత్యశక్తుల ఆజ్ఞలకు లోబడి పనిచేయాల్సిన అవ సరం లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రభుత్వా లను నడిపే ముఖ్యమంత్రులనూ, మంత్రులనూ ఎది రించి రాజ్యాంగం అమలుకోసం నిలబడే శక్తిసామ ర్థ్యాలు వీరికి కావాలి. జీవితమంతా ప్రజలకు నిబద్ధులై ఉండే అరుదైన అధికారుల గురించి ఆలోచిస్తే మొట్టమొ దట మన కళ్లముందు కదలాడే ప్రత్యక్ష రూపం ఎస్ఆర్ శంకరన్దే. ప్రభుత్వాలు, రాజ్యాంగం, న్యాయ వ్యవస్థా, ఇతర పాలనా విభాగాలేవైనా వాటి కర్తవ్య నిర్వహణ అణగారిన వర్గాల సమస్యల పరి ష్కారంలోనే ప్రతిబింబిస్తుందని మనస్ఫూర్తిగా నమ్మి నవాడు. తాను బతికి ఉన్నంత కాలం అట్టడుగు వర్గాల, దళితుల అభివృద్ధి కోసం నిర్విరామంగా కృషి చేసారు. పేదలు, అత్యంత నిరుపేదలు అనే ఊహాజనితమైన ఆవిష్కరణలను తిప్పికొట్టి అన్ని రకాల పేదరికాలనూ, వివక్షనూ ఎదుర్కొంటున్న వర్గం కేవలం అంటరాని కులాలేనని తేల్చి చెప్పారు. పామరుల చెంతకు పాలనావ్యవస్థ పామరుల చెంతకు పాలనావ్యవస్థను పరుగులు పెట్టించిన ఘనత ఎస్.ఆర్. శంకరన్దేనంటే అతి శయోక్తికాదు. తమిళనాడులోని తంజావూరులో 1934, అక్టోబర్ 22న ఆయన జన్మించారు. మదు రైలో కామర్స్లో డిగ్రీ పూర్తిచేశారు. ఆయన ఐఏ ఎస్లో చేరకముందు లెక్చరర్గా కొంత కాలం పని చేశారు. 1956లో ఐఏఎస్లో చేరిన శంకరన్ 1959లో కర్నూలు జిల్లా నంద్యాల సబ్ కలెక్టర్గానూ, నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్గానూ పనిచేశారు. తరువాత కేంద్ర ప్రభుత్వ సర్వీసులోకి వెళ్ళారు. 1971–73లో కేంద్ర ఉక్కు, గనుల శాఖామంత్రిగా ఉన్న కుమార మంగళంకు స్పెషల్ అసిస్టెంట్గా కూడా పనిచేశారు. బొగ్గు గనులను జాతీయం చేసే కార్యక్రమంలో ఎస్.ఆర్. శంకరన్ పాత్ర అత్యంత కీలకమైనది. బొగ్గుగని కార్మికులు బానిసలుగా జీవి స్తున్న స్థితిలో వారికి రాజ్యాంగపరమైన హక్కులను కల్పించడంలో శంకరన్ కృతకృత్యులయ్యారు. సాంఘిక సంక్షేమానికి ఆద్యుడు కారణాలేవైనప్పటికీ 1974 ప్రాంతంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దళితుల, ఆదివాసీల విషయంలో చేసిన కీలక నిర్ణయాలు, ఎస్సీ, ఎస్టీల పట్ల అను సరించిన వైఖరి శంకరన్ లాంటి అభ్యుదయ అధికా రుల చేతిలో శక్తివంతమైన ఆయుధంగా మారాయి. హైదరాబాద్లో 1976లో నిర్వహించిన హరిజన కాన్ఫరెన్స్ హరిజన పదం వాడకం అవమానకరమైన దనీ, దాన్ని ఇకపై వాడకూడదనీ తీర్మానించింది. తదనంతర కాలంలో ఆ తీర్మానమే ప్రభుత్వ ఉత్త ర్వుగా రూపుదిద్దుకుంది. అప్పటినుంచి ప్రభుత్వ రికార్డుల్లో హరిజన అనే పదం స్థానంలో షెడ్యూల్డ్ కులాలు అని చేర్చారు. ఈ సదస్సులో ఎస్సీల సమ స్యపై దాదాపు 322 సిఫారసులను సూచించారు. అందులో 224 తీర్మానాలు ఆమోదించారు. ఆంధ్ర ప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దళిత, ఆది వాసీల అభ్యున్నతికి బాటలు వేసే అత్యంత సాహ సోపేత మైన నిర్ణయాలెన్నో చేసిన ఎస్.ఆర్. శంకరన్ ఒక్క ఏడాదిలోనే దాదాపు 120 ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం ఐఏఎస్ అధికారుల చరిత్రలో అరు దైన సందర్భం.120 జీఓల్లో 100కి పైగా శంకరన్గారి సింగిల్ సిగ్నేచర్తో ఉండడం నిజాయితీ కలిగిన, పాలనాధికారులకు ఒక గొప్ప సందేశాన్నిస్తోంది. హరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ పేరును సాంఘిక సంక్షేమ శాఖగా మార్పు చేయడం జీఓల్లో ఒకటి. దళితుల, ఆదివాసీల గురించి జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో సైతం అత్యంత స్పష్టంగా వివక్ష కనిపిస్తూంటుంది. వీరికోసం ప్రభుత్వం నిర్మించి ఇస్తోన్న ఇళ్లన్నీ వెలివేసినట్టు ఊరుచివరే నిర్మిస్తారు. గ్రామం వెలుపల కాకుండా, గ్రామం మధ్యలోనే వీరి ఇళ్ళు నిర్మించాలనీ, దళితుల వాడల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలనీ, రేషన్ షాపు లను దళితులకే కేటాయించాలనీ, దళితుల పిల్లలకు పౌష్ఠికాహారం, గ్రామ పంచాయతీల్లో దళిత మహిళ లకు రిజర్వేషన్లు, ఒంటరి దళిత మహిళలకు ఇండ్ల స్థలాలు, కులాంతర వివాహాలకు ప్రోత్సాహకాలు, వ్యాపార, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో శిక్షణ, ఇనాం భూములకు పట్టాలు, ప్రభుత్వ హౌజింగ్ కాలనీల్లో దళితులకు ఇండ్ల కేటాయింపుల్లో ప్రాధాన్యం, స్థానిక సంస్థల బడ్జెట్లో 15 శాతం నిధులను దళితుల అభివృద్ధికి ప్రత్యేకించి కేటాయిం చడం కుల నిర్మూలన అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చడం, దళిత వాడల్లో విద్యుదీకరణ, పబ్లిక్ స్కూల్స్లో రిజర్వేషన్లు దళిత వాడల్లో పాఠశాలల ఏర్పాటు లాంటివి వంద జీవోల్లో కొన్ని మాత్రమే. రెండో వైపు షెడ్యూల్డ్ తెగలైన ఆదివాసీలకు అభివృద్ధిపై కూడా ఆయన దృష్టి సారించారు. ఆది వాసీల కోసం ప్రత్యేక సమీకృత ఆదివాసీ అభివృద్ధి సంస్థ (ఐటిడిఎ)లను ఏర్పాటు చేయడంలో శంకరన్ కృషి మరువలేనిది. పైగా ఎస్సీ, ఎస్టీ పిల్లలకు మెరుగైన విద్యనందించే లక్ష్యంతో ప్రత్యేక హాస్టల్స్ను ప్రారంభించిన ఘనత కూడా శంకరన్దే. 1976లో వచ్చిన వెట్టిచాకిరీ నిషేధ చట్టం ఆయన కృషి ఫలి తమే. ఎందరినో భూస్వాముల చెర నుంచి విముక్తి చేసి పునరావాసం కల్పించారు. ఈ విషయమై 1978లో అధికారంలోనికి వచ్చిన ముఖ్యమంత్రి మర్రిచెన్నారెడ్డితో వచ్చిన విభేదాల కారణంగా త్రిపుర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బదిలీపై వెళ్ళారు. అక్కడ కేంద్ర పారామిలిటరీ దళాల అరా చకాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎంతో కృషి చేశారు. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేప ట్టిన అనంతరం ఆయన తిరిగి మన రాష్ట్రానికి వచ్చారు. సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్య తలు స్వీకరించారు. రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు, స్కాలర్షిప్ల పెంపుదల, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల అమలు కోసం కృషి చేసారు. 1985లో ప్రకాశం జిల్లా కారంచేడులో జరిగిన దారు ణానికి చలించిపోయిన ఎస్ఆర్.శంకరన్ ప్రభుత్వ పెద్దలను ధిక్కరించి కూడా కొన్ని సాహసోపేత నిర్ణయాలు చేసారు. నక్సలైట్లతో చర్చలు పదవీ విరమణ తర్వాత మూడు ముఖ్యమైన విష యాలలో క్రియాశీలకంగా ఆయన పనిచేశారు. అందులో పౌరస్పందన వేదిక (కన్సర్డ్న్ సిటిజన్స్ కమిటీ) ఒకటి. ప్రభుత్వానికీ నక్సలైట్లకూ మధ్య జరుగుతోన్న పోరులో కోల్పోతున్న పౌరుల ప్రాణా లను కాపాడేందుకు మానవీయ దృక్పథంతో మేధా వులను కూడగట్టి పౌరస్పందన వేదికను ఏర్పరి చారు. 1997లో ఏర్పాటైన ఈ వేదిక ప్రభుత్వానికీ నక్సలైట్ల మధ్య చర్చలు జరగడానికి తీవ్రంగా కృషి చేసింది. దాని ఫలితంగా 2004లో అధికారంలోకి వచ్చిన వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో నక్స లైట్లను చర్చలకు ఆహ్వానించడం భారతదేశ చరిత్ర లోనే అరుదైన సంఘటన. ఆ తర్వాత ఆయన దృష్టి మొత్తం పాకీపనివారి విముక్తిపై సారించారు. దళిత మావన హక్కుల కార్యకర్త బెజవాడ విల్సన్తో కలిసి సఫాయి కర్మచారీ ఆందోళన్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ప్రారంభమైన ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేయడం కోసం శంకరన్ చేసిన ప్రయత్నం అద్వితీయమైనది. ప్రభుత్వ పాలనలో తన అనుభవాన్ని ఉపయోగించి ఆ సమస్యపై దేశ వ్యాప్తంగా చర్చకు తెరదీసారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చే విధంగా సుప్రీంకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఆ ఉద్యమం వల్ల చేతితో మలం ఎత్తే అమానవీయ పని నుంచి ఎందరో బయటపడ్డారు. శంకరన్ ప్రధాన పాత్రధారిగా ప్రారంభమైన సఫాయి కర్మచారీ ఆందోళన్కు అంతర్జాతీయ గుర్తింపు రావడమే కాకుండా, దాని కన్వీనర్ బెజ వాడ విల్సన్కు రామన్ మెగసెసే అవార్డు రావడం శంకరన్ కృషిలో భాగంగా భావించాలి. పెళ్ళి తన లక్ష్యానికి అవరోధం అవుతుందని భావించి వ్యక్తిగత జీవితాన్నే త్యజించినవాడు. 2008 అక్టోబర్ 7వ తేదీన అశేష దళిత ప్రజానీకానికి వీడ్కోలు పలు కుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకున్న ఆస్తి మిత్రులు కొనిచ్చిన ఓ చిన్న ఫ్లాటు, ఆయన పుస్తకాలు మాత్రమే. నిస్వార్థ నిరాడంబర అభినవ బౌద్ధుడు ఎస్ఆర్.శంకరన్. ఆయన కృషికి గుర్తుగా పద్మభూషణ్ అవార్డు అతన్ని వరించి వస్తే సున్ని తంగా తిరస్కరించారు. కేంద్ర రాష్ట్రాల్లో శంకరన్ లాంటి నిబద్ధత కలిగిన అధికారులు చాలా అరుదనే చెప్పాలి. శంకరన్ ఆశయాలను ఈతరం అధికారులు పుణికిపుచ్చుకోవాల్సిన సందర్భమిదే. (అక్టోబర్ 22న ఎస్ఆర్.శంకరన్ జయంతి) మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 -
కులతత్వంపై యుద్ధారావం ‘ప్రణయ్’
రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అందించిన అవకాశాల వల్ల అన్ని కులాల బిడ్డలూ ఒకే చోట చదువుకుని, ఉద్యోగాలు చేసే అవకాశాలొచ్చాయి. దీంతో కులాల గోడలను పెకిలించుకొని స్వేచ్ఛావిహంగాలై పిల్లలు ఎగురుతున్నారు. చాలా మంది పిల్లలు తమ మనసుని చంపుకుని ఇంకా కులాల కుంపట్లోనే మాడిపోతున్నారు. కొద్ది మంది మాత్రమే ప్రణయ్, అమృతల్లాగా కులరక్కసి కోరలు పీకడానికి రక్తతర్పణకి సైతం వెనకాడటంలేదు. ఇది కులం గోడలను తునాతునకలు చేయడానికి వేసిన తొలి సమ్మెట దెబ్బ. కులం అనే మురికి అడ్డుపడినంత మాత్రాన ఆధునికతను అందిపుచ్చుకుంటోన్న యువతరం అంతరంగ మహాప్రవాహాన్ని ఎవరు మాత్రం అడ్డుకోగలరు? ‘‘1950 జనవరి 26 తేదీ నుంచి మనం వైరుధ్యాల జీవితంలోనికి అడుగుపెట్టబోతున్నాం. రాజకీయాలలో సమానత్వాన్నీ, సామాజిక ఆర్థిక రంగాలలో అసమానత్వాన్నీ ఎదు ర్కోబోతున్నాం. ఒక మనిషి, ఒక ఓటు. ఒక ఓటు, ఒక విలువ అనే సూత్రంతో రాజకీయాల్లో సమా నత్వం సిద్ధిస్తున్నా, సామాజిక, ఆర్థిక రంగాల్లో ఇంకా కొనసాగుతోన్న అసమానత్వం ఒక మనిషికి ఒక విలువ అనే సూత్రాన్ని నిరాకరిస్తోంది. ఎంతకాలం మనం ఈ వైరుధ్యాల జీవితాలను కొనసాగించాలి? ఎంత కాలం సామాజిక, ఆర్థిక రంగాల్లో సమాన త్వాన్ని నిరాకరిస్తాం. ఇదే విధానం కొనసాగితే మనం సాధించుకున్న రాజకీయ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. సాధ్యమైనంత త్వరలో మనం ఈ వైరుధ్యాలను తొలగించాలి. లేదంటే ఎంతో శ్రమకోర్చి రాజ్యాంగ సభ నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య సౌధాన్ని అసమానతలతో కుంగి, కృశించిపోతోన్న ప్రజలు పేల్చి వేస్తారు’’.. దాదాపు ఏడు దశాబ్దాల క్రితం భారత రాజ్యాంగ సభలో బాబాసాహెబ్ అంబేడ్కర్ భవిష్యత్ అసమాన సమాజాన్ని ఉద్దేశించి చేసిన హెచ్చ రిక ఇది. ఈ దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన రాజకీయ పార్టీలూ, దేశానికి దిశానిర్దేశం చేస్తామం టోన్న మేధావి వర్గాలూ ఈ హెచ్చరికను ఇసుమం తైనా లక్ష్యపెట్టలేదు. దేశవ్యాప్తంగా దశాబ్దాలుగా దళి తులపైనా, ఆదివాసీలపైనా, మహిళలపైనా, మైనార్టీ లపైనా దాడులూ హత్యలూ, అత్యాచారాలూ కొనసా గుతూనే ఉన్నాయి. దళిత బిడ్డల నెత్తురు ఏరులై ప్రవ హిస్తూనే ఉంది. కుప్పలుపడిన శతాబ్దాల హింసా శకలాల్లో నల్గొండ జిల్లా దళిత బిడ్డ ప్రణయ్ హత్య కూడా ఒకటి. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ కుటిలత్వం తెలియని అమృత, ఈ సమాజంలో కులం కన్నబిడ్డల కంఠాలను తెగనరికేందుకు సైతం వెనకాడదని తెలియని ఓ అగ్రకుల యువతి, ప్రేమని మించింది ఈ ప్రపంచంలో మరొకటుండదని మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తి, ఆధునికతతోనో, చైతన్యమో తన ప్రేమ విషయంలో అత్యంత పరిణతి ప్రదర్శించింది. తన మాట కాదన్న తల్లిదండ్రుల కుల దురహంకా రాన్ని తలదన్ని తను కోరుకున్న వ్యక్తి చెంతకు చేరింది. ఎందరో అభివృద్ధికాముకులు తమ బిడ్డల విషయంలోసైతం చేయలేని సాహసాన్ని ఆమె చేసి చూపించింది. సమాజం దృష్టిలో కులం తక్కువ వాణ్ణి చేసుకున్నానన్న అపరాధ భావన ఆమెకు ఏ కోశానా లేదు. తన కులాంతర వివాహాన్ని దాచి పెట్టాలన్న అభిప్రాయం అంతకన్నా లేదు. అందుకే తన ఆనందాన్ని రిసెప్షన్ రూపంలో పంచుకుంది. బహుశా గుట్టుచప్పుడు కాకుండా ఎక్కడో చోట పడి ఉంటే తండ్రిలోని కర్కశత్వం అంత త్వరగా బయట పడేది కాదేమో, కానీ తన కళ్లెదుటే కులం తక్కువ వాణ్ణి పెళ్ళి చేసుకొని తన హర్షాతిరేకాలను ప్రకటిం చిన కూతురి ఆనందాన్ని సహించలేకపోయాడు. డబ్బుమదంతో విర్ర వీగుతోన్న అమృత తండ్రి, కూతుర్ని నమ్మించి, మోసగించి కోటి రూపాయలు సుపారీ ఇచ్చి మరీ నడిరోడ్డుపై అల్లుడి తలను తెగ నరికించాడు. ఈ ఘటనను సమాజం తమకి నచ్చి నట్టుగా, కులం పట్ల తమతమ అవగాహనకు తగ్గ ట్టుగా అర్థం చేసుకుంది. దేశవ్యాప్తంగా ప్రగతిశీల భావాలుగలవారు దీన్ని నిర్ద్వంద్వంగా నిరసించారు. ప్రతిఘటించారు. అయితే ఇది మొదటిదీ, ఇదే చివ రిదీ కూడా కాదు. నల్గొండ ఘాతుకపు నీలినీడలు మనని వీడి పోక ముందే హైదరాబాదు నగరం నడి బొడ్డున కన్న తండ్రే కూతురి తలతెగనరికిన పాశవిక చర్య ఆధునిక సమాజపు ఆనవాళ్ళను మధ్యయుగా లంతటి వెనక్కి తరిమికొట్టింది. ఇక్కడ అమృత తండ్రో, లేదామరో వ్యక్తో కారణం కానేకాదు... తర తరాలుగా ఈ నేలలో ఇంకిన దళితుల నెత్తురంతా కులరక్కసి కారణంగానే. ఈ సమాజాన్ని అగాధం లోకి తోసేస్తోన్న కుల రాకాసి ప్రభావాన్ని ఇప్పటి కింకా తక్కువ చేసి చూడటం మనలో పాతుకుపో యిన అగ్రకుల భావజాలానికి నిదర్శనం. ఒక్కమా టలో చెప్పాలంటే దళిత బిడ్డల హత్యలన్నీ కుల వ్యవస్థలో దాగి ఉన్న ఆధిపత్యానికీ, నిరంకుశత్వా నికీ, హింసాప్రవృత్తికీ ప్రత్యక్ష సాక్ష్యం. అందుకే దీన్ని వ్యక్తుల నేరస్వభావంగా కాకుండా కుల వ్యవస్థ అమానుష హత్యాకాండగా అర్థం చేసుకోవాలి. కుల వ్యవస్థ పుట్టుక, విస్తరణ, ప్రభావం చివరకు దాని నిర్మూలన గురించి అంబేడ్కర్ చాలా శాస్త్రీయంగా విశ్లేషిస్తారు. తనకు తానుగా బంధించుకున్న ఒక పంజరంగా కులాన్ని వర్ణిస్తారాయన. కులం పునాదులను కాపాడుకునేందుకు తన వర్గం వారిని ఉన్నతులుగానూ, ఇతరులను నీచులుగానూ చూసే స్వభావాన్ని ఇది సంతరించుకుంది. ప్రతిష్టను, పరు వునీ ఉన్నతమైన విలువల్లో కాక కులం మూలాల్లో వెతుక్కునే స్వభావం ఎంతటి అమానుషానికైనా ఒడి గట్టే క్రూరత్వానికి కారణం. కులం హిందూ ధర్మశాస్త్రాల పునాదుల్లోంచి పుట్టింది. ఒక కులం వాడు ఇంకొక కులం వాడిని నాయకుడిగా ఒప్పు కోడు. అమృత తండ్రి మారుతీరావు తన నేరాన్ని బహిరంగంగా ఒప్పుకున్నప్పటికీ, అదే కులానికి చెందిన పెద్దలు ఊరేగింపు చేసి, కూతురిని చంపి దోషిగా నిలిచిన వ్యక్తిని పరామర్శించి, ఓ నేరస్తుడికి అండగా నిలుస్తామని బహిరంగంగా ప్రకటించారు. ఇది ఇటీవలి కాలంలో పొడసూపుతోన్న ఓ నీచమైన సంస్కృతికి తార్కాణం. తన కులంవాడు ఎంత చెడ్డవాడైనా వాడికోసం నిలబడటమే కులం యొక్క బలంగా చలామణీ అవుతోంది. భారత రాజ్యాంగం అందించిన సమానత్వ హక్కులూ, ప్రజాస్వామ్య భావనలూ దేశపు రూపు రేఖలను మార్చబోతున్నాయి. దేశవ్యాప్తంగా జరుగు తోన్న పరిణామాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తోన్న మార్పులు, ఆధునికతతో ప్రజాస్వామ్య భావనలను సమాజం పుణికిపుచ్చుకుంటోంది. అందులో భాగంగానే ప్రణయ్, అమృతలాంటి యువతీయువకుల కులాంతర, మతాంతర వివా హాలు ఈ కుల వ్యవస్థపై ఒక తిరుగుబాటుగానే భావించాలి. అణగారిన వర్గాలు తలలు ఎగరేస్తే తలలు తెగిపడతాయనే విషయం కొత్తది కాదు. అయినా తలెత్తుకుని తిరగడానికి దళితబిడ్డలు, వారి జీవితాల్లోకి వస్తోన్న దళితేతరుల బిడ్డలు ఒక్క క్షణం తటపటాయించడం లేదు. ఇదే కులం పునాదులను పెకిలించే ఆధునిక ప్రజాస్వామ్య ఉప్పెనై, మనువాద సనాతన సాంప్రదాయాల మురికిని తుడిచిపెట్టేం దుకు సిద్ధమౌతోంది. రాజ్యాంగ రక్షణ లేనప్పుడు, నగరాలూ, పట్ట ణాల అభివృద్ధి కానప్పుడు, పారిశ్రామిక రంగం ఉనికిలోలేనప్పుడు గ్రామాల్లో ఏ కులానికి ఆ కులం తమ తమ వృత్తులలో మునిగి ఉండేవి. కులాల మధ్య సంబంధాలకు తావేలేదు. అంటరానివారికి గ్రామాల్లో ప్రవేశం లేదు. కానీ పరిస్థితి మారింది. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అందించిన అవకాశాల వల్ల అన్ని కులాల బిడ్డలూ ఒకే చోట చదువుకుని, ఉద్యోగాలు చేసే అవకాశాలొచ్చాయి. దీంతో కులాల గోడలను పెకలించుకుని స్వేచ్ఛా విహంగాలై పిల్లలు ఎగురుతున్నారు. చాలా మంది పిల్లలు తమ మన సుని చంపుకుని ఇంకా కులాల కుంపట్లోనే మాడి పోతున్నారు. కొద్దిమంది మాత్రమే ప్రణయ్, అమృ తల్లాగా కులరక్కసి కోరలు పీకడానికి రక్త తర్పణకి సైతం వెనకాడటంలేదు. కులాంతర వివా హాలను ఒక మార్పుగా మాత్రమే చూడటం తప్పు. ఇది కులం గోడలను తునాతునకలు చేయడానికి వేసిన తొలి సమ్మెట దెబ్బ. కులం అనే మురికి అడ్డుపడి నంత మాత్రాన ఆధునికతను అందిపుచ్చుకుంటోన్న యువతరం అంతరంగ మహాప్రవాహాన్ని ఎవరు మాత్రం అడ్డుకోగలరు? సోషల్ మీడియా సాక్షిగా కులాలకతీతంగా పెల్లుబుకుతోన్న ప్రగతిశీల భావ జాలం ఆ«ధునికతరం అంతరంగాన్ని ఆవిష్కరి స్తోంది. దీన్నే ప్రణయ్ సహచరి అమృత చేపట్టిన కులవ్యతిరేకోద్యమం రుజువుచేసింది. కానీ ప్రభుత్వాలూ, రాజకీయ పార్టీలూ, మేధావి వర్గం కుల వ్యవస్థ నిర్మూలనా కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాయి. రాజ్యాంగంలో ఉన్న రక్షణల ఆధా రంగా ఎన్నో చట్టాలు రూపొందినా వాటి అమలులో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టమే దానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఆ చట్టం ఉద్దేశమే నేరాల నిరోధం. కానీ ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు చట్టం స్ఫూర్తినే దెబ్బతీస్తున్నారు. ప్రణయ్ విషయంలో సైతం పోలీ సులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదనేది సుస్పష్టం. దేశవ్యాప్తంగా ఇదే స్థితి. రాజకీయ పార్టీలు కులం విషయంలో తలదూర్చితే తమ ఓట్లు రాలవనే భయంతో కుల నిర్మూలన అనే రాజ్యాంగ లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మేధావి వర్గం కూడా ప్రేక్షక పాత్రనే వహించడం బాధాకరం. వందేళ్ళ క్రితం బొంబాయి ప్రెసిడెన్సీలో ఆధిపత్య కులాలకు చెందిన ఆనాటి ప్రముఖులు ‘ఆల్ ఇండియా యాంటీ అన్ టచ్బులిటీ మానిఫెస్టో’ విడుదల చేసారు. డిప్రెస్డ్ క్లాస్ మిషన్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ నాయకత్వంలో ముంబాయిలో 1918 మార్చి 23, 24 తేదీల్లో జరిగిన సభ ఆనాడు అంటరాని కులాలకు తమ మద్దతును ప్రకటించింది. ఈ సమావేశానికి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు విఠల్భాయ్ పటేల్, ఎమ్మార్ జైకర్, బిపిన్ చంద్రపాల్ లాంటి ప్రముఖులు హాజరయ్యారు. డాక్టర్ హరోల్డ్ మన్, రవీంద్రనాథ్ ఠాగూర్, ద్వారకాపీఠం శంకరాచార్య, డాక్టర్ కురాటకోటి లాంటి వారు అంటరానితనానికి వ్యతిరేకంగా సందేశాలను పంపారు. వీరంతా దళితే తరులేనని అర్థం చేసుకోవాలి. ఇదే స్పందన తక్షణా వసరం. కులం ఒక మానసిక రుగ్మత. కేవలం అంట రాని కులాలే దీన్ని తొలగించుకుంటే సరిపోదు. ఆధి పత్య కులాలతో సహా అందరూ కులతత్వాన్ని వది లించుకుని మానవీయ విలువలనే పరువుప్రతిష్ట లుగా భావించాల్సిన తరుణమిది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 -
‘దళిత్’ రణనినాదంపై ఆంక్షలా?
ఈ దేశంలో వ్యక్తుల, లేదా సంస్థల పేర్లు సైతం పాలకుల ఆంక్షల సంకెళ్ళ మధ్య బందీ అవుతోన్న నిర్బంధ పరిస్థితులు మన కళ్ళెదుటే తాండవిస్తున్నాయి. నిజానికి ‘దళిత్’ అనే పదం ఏ ఒక్కరికీ నష్టం కలిగించే అంశం కాదు. లేదా ఎవరినీ కించపరిచేది అంతకన్నా కాదు. ఎవరైనా ఆ పదం వాడదలుచుకోకపోతే అది వారి ఇష్టం. దానికి ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైతే అది తమ రణనినాదం అనుకుంటున్నారో అటువంటి వారిమీద ఆంక్షలు విధించడం ఫాసిస్ట్ చర్య తప్ప మరొకటి కాదు. అంటరాని కులాలు ఒక్కటిగా ఉండడం, ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడటం అధికారంలో ఉన్న శక్తులు సహించలేకపోతున్నాయి. నీ విశాలాకాశంలోని సూర్యచంద్రులని నాకి మ్మని అడగలేదు/ విస్తరిం చిన నీ ఆస్తులూ, నీ భూములూ నేనడగనేలేదు/ నీవు కట్టుకున్న విలాసవంతమైన భవనాలూ, ఆకాశ హార్మ్యాలూ నాకక్కర్లేదు/ నీ ఉత్సవాలనూ, పండుగ లనూ, నీ దేవుళ్ళని కూడా నేనేనాడూ ఆశించలేదు/ నీ కులాలూ, నీ జాతులూ నాకక్కర్లేదు సుమా!/ కనీసం నీ తల్లులూ, నీ చెల్లెళ్ళూ, నీ కూతుళ్ళనీ కన్నెత్తిసైతం చూడలేదు/నేనడిగిందొక్కటే.. నేను కోరుకున్నదీ అదొ క్కటే నా హక్కులు../అదే నన్ను నన్నుగా, ఒక మని షిగా చూసే నా జన్మహక్కునే నేనడుగుతున్నాను... మరాఠీ దళిత కవుల సంకలనం ‘పాయిజన్ బ్రెడ్’ లోని పంక్తులివి. దళిత పాంథర్స్ ఉద్యమ చైతన్య స్ఫూర్తి ఆధిపత్యంపై గురిపెట్టిన అక్షరశూలాలివి. సరిగ్గా నాలుగు దశాబ్దాల కిందట శతాబ్దాల అణచి వేతపై ధిక్కారాన్ని ప్రకటించిన ఒకే ఒక్క పదం ‘దళిత్’. కాలిధూళికన్నా హీనంగా చూడబడ్డ ఓ సమూహాన్ని సమీకరించి పెనుఉప్పెనై ఎగిసిపడేలా చేసిందీ ఆ పదమే. 1972లో ముంబాయిలో కొందరు దళిత యువకులు సంయుక్తంగా ‘దళిత్ పాంథర్స్’ అనే ఒక సంస్థను ఏర్పర్చుకున్నారు. ఆ తదుపరి సంవత్సరం 1973 ఆగస్టు 15వ తేదీన దాదాపు 200 మందికి పైగా యువకులు నల్లజెండాలు ఎగురవేసి నిరసన ప్రకటన చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సరిగ్గా 26 ఏళ్ళ తరువాత బూటకపు స్వాతంత్య్రం తమకు ఒరగబెట్టిందేమీలేదని భారత వినీలాకాశంలో నల్లజెండాలు ఎగురవేసారు. అనంతరం ‘దళిత్ పాంథర్స్’ ఉద్యమం మహారాష్ట్ర మొత్తం విస్తరించింది. ఎందరో దళిత కవులనూ, రచయిత లనూ సృష్టించింది. ఆ తరువాత అంటరాని కులాల సమీకరణకూ, సంఘటిత పోరాటానికీ ‘దళిత్’ అనే పదం ఓ ప్రతిఘటనా సంకేతంగా మారింది. అనం తర కాలంలో ఆ పదమే సమానత్వ శక్తిగా అవతరిం చింది. దేశవ్యాప్తంగా ‘దళిత్ పాంథర్స్’ సంస్థ కూడా శాఖోపశాఖలుగా విస్తరించింది. వేయికిపైగా కులా లుగా విభజనకు గురైన అంటరాని వారిని ఏకం చేసింది. దేశం నలుమూలల నుంచి ఎవరు ఎక్కడ కలిసినా అంటరాని కులాల గుర్తింపు దళిత్ అనే మూడక్షరాల్లో సంపూర్ణంగా ఒదిగిపోయింది. మొట్టమొదటిగా దళిత్ అనే పదాన్ని వివక్షల నేపథ్యంలో జ్యోతీబా ఫూలే ఉపయోగించినట్టు పరి శోధకులు చెప్తున్నారు. కానీ సంఘం నిర్మాణానికి ఈ పేరును మొట్టమొదట వాడిన స్థలం హైదరాబాద్ కావడం విశేషం. 1947 జూలై 20 వతేదీన ‘దళిత్ జాతీయ సంఘ్’ పేరుతో ఒక సంఘాన్ని హైదరా బాద్లో ఏర్పాటు చేశారు. అప్పటి వరకు విడివడి ఉన్న ‘ఆదిహిందూ ఇండిపెండెంట్ లీగ్’, ‘అరుంధ తీయ మహాసభ’, ‘డిప్రెస్డ్ క్లాసెస్ కాంగ్రెస్’, ‘ఇండి పెండెంట్ షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్’, ‘హరిజన్ అసోసియేషన్’లు కలిసి ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంఘాల ప్రతినిధులందరూ హైదరాబాద్ స్వాతంత్య్ర సమరయోధుడు స్వామి రామానంద తీర్థ ఇంట్లో సమావేశమై హైదరాబాద్ దళిత నాయకుడు అరిగె రామస్వామి కన్వీనర్గా 15 మందితో ఒక కమిటీని కూడా ఏర్పర్చుకున్నారు. ఈ సంఘం ఏర్పాటు ఆనాటి అంటరాని కులాల సంఘ టితత్వానికి ఒక చిరునామాగా మారింది. సరిగ్గా ఇదేరకమైన ఐక్యత మహారాష్ట్రలోని దళిత యువకులకు అవసరమైంది. బాబాసాహెబ్ అంబేడ్కర్ మరణానంతరం ఏర్పడిన ‘రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా’ దళితుల పక్షాన నిలబడి పోరాటం చేయకపోవడం మాత్రమే కాకుండా అస్తి త్వాన్ని సైతం కోల్పోయి ముక్కలు చెక్కలై దళితుల్లో నిరాశానిస్పృహలను నింపింది. అదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంటరాని కులాలను నిర్ల క్ష్యం చేయడంతోపాటు ఇటీవలి కాలంలో దళితులపై గ్రామాల్లో పట్టణాల్లో జరుగుతున్న దాడులను ఏమాత్రం అరికట్టలేకపోయింది. దీంతో మరొక ఉద్యమ అవసరాన్ని దళిత యువతరం గుర్తించింది. ఒకవైపు దేశంలోని దళితుల జీవన పరిస్థితులు ఈ సంఘం ఆవిర్భావానికి ఒక కారణం అయితే, 1960 ప్రాంతంలో అమెరికాలో పెల్లుబికిన పౌరహక్కుల ఉద్యమం నేపథ్యంలో వచ్చిన ‘బ్లాక్ పాంథర్స్ పార్టీ’ ఇక్కడి ‘దళిత్ పాంథర్స్’ ఉద్యమానికి తక్షణ ప్రేర ణగా నిలిచింది. ఒకరకంగా మహారాష్ట్రలోని ‘దళిత్ పాంథర్స్’ ఉద్యమ తరహాలోనే అనేక ప్రాంతాల్లో అనేక రూపాల్లో దళితుల్లో నిరసనజ్వాలలు పెల్లుబి కాయి. దేశంలో కూడా ఆనాడు వివిధ ప్రాంతాల్లో నక్సలైటు ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. ఈ ఉద్య మానికి ఆనాటి దళితుల్లో, ఆదివాసీల్లో ఉన్న అసం తృప్తే ప్రధాన కారణం. అదే కాలంలో 1960, 70 దశకాల్లో వచ్చిన మహత్తర ఉద్యమాల్లో ‘దళిత్ పాంథర్స్ ఉద్యమం’ కూడా దళితుల చైతన్యస్థా యిలో అనూహ్యమైన మార్పులు తెచ్చింది. గత కొంతకాలంగా ‘దళిత్’ అనే పదంమీద నిషేధం విధించడానికి కొంతమంది కారణాలను వెతుకుతున్నారు. ఇటీవల నాగ్పూర్ హైకోర్ట్ బెంచ్లో ఒక దళితుడి చేతనే ‘దళిత్’ అనే పదాన్ని వాడుకలో నుంచి తీసివేయాలంటూ పిటిషన్ వేయిం చారు. అంతటితో ఆగకుండా ‘దళిత్’ అనే పదాన్ని ప్రసార మాధ్యమాల్లో వాడకూడదనే ఉచిత సల హాను కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార శాఖ ఆదే శాల రూపంలో జారీ చేసింది. ఇది యాదృచ్ఛికమైన చర్యకాదు. ఈ పదానికున్న శక్తిని నిరోధించే లక్ష్యంతో కావాలనే దీని వాడకాన్ని అడ్డుకునే కుట్ర చేసారు. దేశంలోకి బ్రిటిష్ వారు రాకముందు ప్రజ లంతా కులాల పేరుతోనే ఉనికిలో ఉన్నారు. అంట రాని కులాలు కూడా వందల సంఖ్యలో విభజనకు గురై వివిధ పేర్లతో వాడుకలో ఉన్నాయి. 1911 జనాభా లెక్కల్లో ‘డిప్రెస్డ్ క్లాసెస్’గా తొలిసారిగా ఒకచోటికి చేర్చారు. ఆ తరువాత 1935 భారత చట్టం ఏర్పడిన తరువాత వాటిని ‘షెడ్యూల్డ్ కాస్ట్’గా మార్చారు. ఇప్పటికీ అదే పేరు రాజ్యాంగంలోనూ, ఇతర అధికారిక కార్యకలాపాల్లో కొనసాగుతూ వస్తోంది. ఇక్కడ ఎవరికీ ఎటువంటి అభ్యంతరం లేదు. ఇక్కడే ఇంకో విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. భారత స్వాతంత్య్రోద్యమ నాయకుడు గాంధీ కూడా అంటరాని కులాలకు ఒక పేరు పెట్టారు. అదే ‘హరిజన్’. ఆ పేరుని అంబేడ్కర్తో సహా అనేక మంది వ్యతిరేకించారు. 1970 తరువాత వచ్చిన దళిత చైతన్యం ఆ పేరును అధికార కార్య కలాపాల్లో వాడకూడదని డిమాండ్ చేసింది. దానితో ప్రభుత్వాలు తలొగ్గి హరిజన్ అనే పేరుని తొలగిస్తూ తీర్మానం చేయాల్సి వచ్చింది. ఇంతటితో హరిజన్ పద వాడకం చట్ట విరుద్ధంగా మారింది. ‘హరిజన్’ అంటే అవ్వ అయ్య లేని బిడ్డ అని అర్థం. తల్లి దండ్రులు లేకుండా దేవుడికి పుట్టినవాడని అర్థం. ఈ హరిజన్ అనే పేరుని అంటరాని కులాల వారికి ఇత రులు పెట్టారు. కానీ ‘దళిత్’ అనే పదం తమకు తాముగా, తమ ఆత్మగౌరవ పతాకగా, తమ అస్తి త్వానికి సంకేతంగా, తిరుగుబాటు నినాదంగా దళి తులు పెట్టుకున్నారు. భారత స్వాతంత్రోద్యమంలో ‘షాహీద్’ భగత్ సింగ్ ఇచ్చిన ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదం లాగా ‘దళిత్’ అనే పదానికి వీరంతా భయకంపితు లవుతున్నారనడానికి ఇదొక ఉదాహరణ. దళితో ద్యమ ఉప్పెనలో తమ ఉనికి ఎక్కడ కొట్టుకుపో తుందోనని బెంబేలెత్తి పోతున్నారు. అందువల్లనే ‘దళిత్’ అనే పదాన్ని ముందుగా అధికారిక కార్యకలా పాల్లో ఆ తర్వాత ప్రసార మాధ్యమాల్లో వాడకూడ దని ఆజ్ఞలు జారీ చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ అప్ర జాస్వామికం. ఈ దేశంలో వ్యక్తుల, లేదా సంస్థల పేర్లు సైతం పాలకుల ఆంక్షల సంకెళ్ళ మధ్య బందీ అవుతోన్న నిర్బంధ పరిస్థితులు మన కళ్ళెదుటే తాండవిస్తున్నాయి. నిజానికి ‘దళిత్’ అనే పదం ఏ ఒక్కరికీ నష్టం కలిగించే అంశం కాదు. లేదా ఎవరినీ కించపరిచేది అంతకన్నా కాదు. ఎవరైనా ఆ పదం వాడదలుచుకోకపోతే అది వారి ఇష్టం. దానికి ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఎవ రైతే అది తమ రణనినాదం అనుకుంటున్నారో అటు వంటి వారిమీద ఆంక్షలు విధించడం ఫాసిస్ట్ చర్య తప్ప మరొకటి కాదు. నిజానికి ‘దళిత్’ అనే పదం 1241 అంటరాని కులాలను ఒక్కతాటిపైకి తెచ్చిన బలీయమైన ఐక్య నినాదం. అంటరాని కులాలు ఒక్కటిగా ఉండడం ఆ శక్తి ప్రభుత్వానికీ ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడటం అధికారంలో ఉన్న శక్తులు సహించలేకపోతున్నాయి. కేరళ నుంచి కాశ్మీర్ వరకు మణిపూర్ నుంచి గుజరాత్ వరకు అంటరాని కులా లను సమైక్యపరిచే అంతులేని శక్తి కేవలం ఆ ఒక్క దళిత పదానికే ఉంది. ఇటీవల ఎస్సీ ఎస్టీ అత్యాచా రాల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశా లకు వ్యతిరేకంగా అంటరాని కులాలన్నింటినీ ఐక్యం చేసింది కేవలం దళిత పదమే. ఈ ఐక్యతాశక్తి దేశం లోని మరే సామాజిక వర్గానికీ లేదు. అందువల్ల ఈ ఐక్యతా నినాదాన్ని దెబ్బగొట్టే ప్రయత్నంలో భాగం గానే ‘దళిత్’ అనే పదంపై ప్రత్యక్ష, పరోక్ష నిషేధా లను విధిస్తున్నారు. అయితే, ఈ నిషేధాలకు దళిత శక్తి తలొగ్గే అవకాశం లేదు. దళితులు నడచివచ్చిన గత చరిత్రంతా రక్తసిక్తమే. ఎన్నో దాడులు, దమన కాండలు, అన్యాయాలూ, అణచివేతలూ అమానుషా లకు తిరుగుబాటుగా, ప్రతిఘటనగా వచ్చిందే దళిత నినాదం. భారతదేశంలోని వివక్షనూ, అణచివేతనూ, ఇలాంటివే కుట్రలనూ తూర్పారబట్టి, ఆధిపత్య భావ జాలాన్ని జల్లెడ బట్టి ఒక విముక్తి సిద్ధాంతాన్ని అంబే డ్కర్ దళితులకు అందించాడు. అందుకే దళితులు ఒంటరి కాదు. దళితులకు అందివచ్చిన పోరాట పతాకం జైభీం. అంబేడ్కర్ పేరుతో మారుమోగే ఈ నినాదం దేశంలోని దళితులందరినీ ఒక్కటి చేసింది. దళిత అస్తిత్వం, అంబేడ్కర్ తాత్విక సిద్ధాంతం, జైభీం నినాదం కోటానుకోట్ల దళిత ప్రజల హృద యాలనుంచి వేరు చేయడం అసాధ్యం అన్న సత్యాన్ని పాలకులు గ్రహించాలి. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 -
ఆ అరెస్టులే అసలైన కుట్ర
ఈ దేశంలో ఆదివాసీలను ఎన్కౌంటర్ల పేరుతో మట్టుబెట్టినప్పుడు, వారి హక్కులను కాలరాసినప్పుడు, వరవరరావు, గౌతం నవ్లఖా, ఆయనతో పాటు అరెస్టయిన వారు ఆదివాసీలకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు కూడగట్టారు. నరేంద్రమోదీ హత్యకు సంబంధించి బయటపడిందంటున్న మావోయిస్టుల ఉత్తరం నిజమైంది కాదనీ, మానవహక్కుల, ప్రజాసంఘాల నేతలను అరెస్టు చేయడానికి సృష్టించిన ఉత్తరమని పలువురు న్యాయకోవిదులూ, మేధావులూ ప్రకటించారు. అలాంటప్పుడు ఈ అరెస్టులకు కారణం ఉండాలి. మావోయిస్టులకు మద్దతునిచ్చేవారికి ఇలా హెచ్చరిక జారీచేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఇదెంతమాత్రం వాంఛనీయం కాదు. హత్యలు, అత్యాచా రాలూ, అవమానాలూ భరిస్తూ ఉన్నంతకాలం ఏ విధమైన ఘర్షణ లేదు. సరిగ్గా ఇదే మహారాష్ట్రలో భీమా కోరేగావ్ స్ఫూర్తియాత్ర సందర్భంగా జరిగిన ఘటనలకు వర్తిస్తుంది. పీష్వాల అకృత్యాలు సహిం చిన మహార్, చమార్ లాంటి నాటి అంటరాని కులాలు 1818 జనవరి 1న ప్రతిఘటనా దాడికి పూనుకున్నాయి. కేవలం అయిదు వందల మంది కొన్నివేల మంది పీష్వా సైన్యాన్ని మట్టుబెట్టారు. ఇది చరిత్ర. అలాంటి విజయగాథను మననం చేసుకొని, స్ఫూర్తి పొందడానికి లక్షలాది మంది దళితులు దేశం నలుమూలల నుంచి కోరేగావ్ జైత్రయాత్రకు బయలుదేరారు. భీమా నదికి దక్షిణం వైపున ఉన్న భీమాకోరేగావ్ స్తూపం వద్ద దళితులు ఎంతో ప్రశాంతంగా పది కిలోమీటర్లకు పైగా నడిచివెళ్లి నివాళులర్పించారు. భీమా నదికి రెండోవైపు అంటే ఉత్తరం వైపు భీమాకోరేగావ్ యాత్రకు కదలివస్తోన్న దళితులపై దాడి జరిగింది. వధూబద్రుకా గ్రామంలో కొంత మంది ఆధిపత్య కులాలు కాషాయజెండా లతో, ఇనుపరాడ్లు, రాళ్లతో పొలాల్లో దాగి దాడికి దిగారు. ఊహించని ఈ దాడికి తట్టుకోలేని దళితులు చెల్లాచెదురయ్యారు. అక్కడ ఉన్న వాహనాలను తగు లబెట్టారు. ఈ గ్రామాల అగ్రకులాలకు తోడుగా పొరుగున ఉన్న సన్నావాడి, శిఖరాపూర్ గ్రామాల ఆధిపత్య కులాలు దాడిలో భాగమయ్యాయి. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాహుల్ పతంగే ఆసుపత్రిలో మరణించారు. ఈ దాడి హఠాత్తుగా జరిగింది కాదని, ముందస్తు పథకం ప్రకారమే జరిగిందని స్థానికులు చెప్పారు. రెండు రోజుల ముందే డిసెంబర్ 29న వధూబద్రుకా గ్రామంలో అక్కడి దళితులు నిర్మిం చుకున్న ఒక అమరవీరుని సమాధిని ఆధిపత్య కులాలు కూల్చివేశాయి. అంతకు ముందు మూడు నెలలుగా భీమాకోరేగావ్ విజయయాత్రపై చర్చ జరుగుతోంది. భీమాకోరేగావ్ దళితులు తలెత్తుకొని నిలబడటం ఆధిపత్య కులాలకు కంటగింపుగా తయారైంది. అదే ఈ దాడికి కారణం. దీనికిపై దేశంలోని అనేక ప్రాంతాలు నిరసనలతో భగ్గుమ న్నాయి. మహారాష్ట్రలోని అన్ని జిల్లాల్లోని దళితులు, ఆదివాసీలు రాష్ట్రం మొత్తాన్ని దిగ్బంధనం చేశారు. ముంబైని స్తంభింపజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేలాది మంది దళిత యువకులు భీమా కోరేగావ్ జైత్రయాత్ర సందర్భంగా జరిగిన దాడిని ప్రతిఘటించడం మనకు కనిపిస్తుంది. పూనా– ముంబై ప్రాంతమే కాకుండా మరాఠ్వాడా, విదర్భ లాంటి ప్రాంతాలు కూడా అట్టుడికిపోయాయి. ఈ ప్రతిఘటనను అణచడానికి వేలాది మంది పోలీ సులను రంగంలోకి దింపారు. కానీ రాహుల్ పతం గేని హత్య చేసిన సంభాజీ భీడే, మిలింద్ ఎగ్బోటేను మాత్రం అరెస్టు చేయలేదు. ఈ విషయమై పార్ల మెంటులో సైతం చర్చ జరిగింది. తర్వాత కేవలం మిలింద్ ఎగ్బోటేను మాత్రమే అదుపులోకి తీసుకొని బెయిల్పై విడిచిపెట్టారు. హిందూ సంఘ నాయ కుడు సంభాజీ భీడేను ఇప్పటి వరకు అరెస్టు చేయ లేదు. విచారించనూ లేదు. ఈయన ప్రధాని నరేంద్ర మోదీ గురువు అంటారు. మరో విచిత్రం ఏమిటంటే జనవరి ఒకటవ తేదీన హత్యకు గురైన దళిత యువ కుడు రాహుల్ని చంపింది హిందూ సంఘ కార్య కర్తలు కాదని, దళిత యువకులే హత్యచేశారని పోలీ సులు మరో కథ అల్లారు. సుప్రీం ఆదేశంతో దళితుల్లో ఆందోళన మహారాష్ట్రలో ఈ ఉద్యమ జ్వాలలు చల్లారకముందే ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద ప్రభు త్వోద్యోగులనూ, ఇతరులనూ ముందస్తుగా అరెస్టు చేయకూడదని మార్చిలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పరిణామం దేశంలోని మొత్తం దళితులను ఆందో ళనకు గురిచేసింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, రాజస్తాన్, బిహార్, ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో దళితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఏప్రిల్ రెండున దళిత సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ దళిత ఉద్యమ శక్తిని నిరూపించింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏకకంఠంతో దళితులు సుప్రీంకోర్టు తీర్పుని నిరసించారు. భారత్ బంద్ సందర్భంగా ఉత్తరప్రదేశ్, మ«ధ్యప్రదేశ్, రాజస్తాన్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వందలాది యువకులు అరెస్టయ్యారు. రోడ్ల మీదకు వచ్చిన యువతీయువ కులను వారి కులం పేరు అడిగి మరీ వ్యాన్లలోకి ఎక్కించి జైళ్ళలోకి తోశారు. ఈ రెండు సంఘటనలతో ఖంగుతిన్న కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ∙ఉద్య మాన్ని అణచివేయాలని ఆలోచించింది. నేరుగా దళి తులను లక్ష్యంగా చేసుకుని నిర్బంధం ప్రయోగిస్తే ఎన్నికల్లో తమకు వ్యతిరేక ఫలితాలు వస్తాయని భావించిన పాలకులు దానికి మరో మార్గం అన్వే షించారు. అందుకు భీమాకోరేగావ్ హింసాకాండ అనే పదం సృష్టించారు. మీడియా ద్వారా దీన్ని ప్రచారంలోకి తెచ్చారు. ఎల్గార్పరిషత్ జరిపిన సమా వేశాన్ని దానికి మద్దతుగా చూపించారు. భీమా కోరే గావ్ ద్విశత వార్షికోత్సవ స్ఫూర్తియాత్ర సందర్భంగా కొన్ని ప్రజాసంఘాలు కలిసి డిసెంబర్ 31న పుణే లోని శనివార్వాడలో సభ ఏర్పాటు చేశాయి. కోరే గావ్ స్ఫూర్తి కొనసాగించాలనే లక్ష్యంతో ఈ సభను ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు ముందే చెప్పారు. గుజరాత్ దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీ, జేఎ న్యూ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖాలిద్, రోహిత్ వేముల తల్లి రాధిక సహా కొంత మంది దళిత నాయకులు ఈ సభకు హాజరయ్యారు. జనవరి ఒక టిన దళితులపై దాడి తర్వాత జరిగిన దళితుల నిరసన ప్రదర్శనలకు ఈ సభకు సంబంధం ఉందని, ఎల్గార్ పరిషత్ సభలో చేసిన ఉపన్యాసాలే హింసా కాండకు కారణమయ్యాయని పోలీసులు ముందుగా ప్రకటించారు. ఈ ఎల్గార్ పరిషత్ సభలకు ఆర్థిక సహకారాన్నీ మావోయిస్టు్టలు అందించారని ప్రచా రం చేసిన పోలీసులు జూన్ నెలలో ఐదుగురు కార్య కర్తలను మావోయిస్టుల పేరుతో అరెస్టు చేశారు. దాడి చేసింది దళితులు కాదు! భీమాకోరేగావ్ జైత్రయాత్ర సందర్భంగా భీమా నదికి ఉత్తర భాగంలో దాడి చేసింది దళితులు కాదు. కాషాయజెండాలతో, ఇనుపరాడ్లు, రాళ్లతో దాడిచే సిన వారు స్థానిక ఆధిపత్య కులాల వ్యక్తులేనని పత్రికలూ, మీడియా ఘోషించాయి. ఒకవేళ ఎల్గార్ పరిషత్ ఉపన్యాసాలే హింసాకాండకు కారణమైతే భీమా నదికి దక్షిణ భాగంలో వెల్లువెత్తిన జనసంద్రం మొత్తం పుణేనే భస్మీపటలం చేయగలిగేది. కోరేగావ్ భీమా నదికి దక్షిణభాగంలో దళిత యువకుడు రాహుల్ హత్యానంతరం కూడా దళితులు హింసకు పాల్పడలేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసన తెలిపారు. లక్షలాది మంది దళితుల స్ఫూర్తికార్య క్రమాన్ని నిర్వహించింది అఖిల భారత సమతాసైనిక్ దళ్. ఎల్గార్ పరిషత్కు, భీమా కోరేగావ్ స్ఫూర్తి కార్యక్రమానికీ ఎలాంటి సంబంధమూ లేదు. ఎల్గార్ పరిషత్ సమావేశం జరిగింది డిసెంబర్ 31 సాయం త్రం. దళిత యువకుడు రాహుల్ హత్య జరిగిన గ్రామంలో డిసెంబర్ 29వ తేదీన దళితులు నిర్మిం చిన స్మారక చిహ్నాన్ని ఆధిపత్య కులాలు ధ్వంసం చేశాయి. అంటే ఆ సమావేశానికి ముందే దళితులపై పరోక్ష దాడులు ప్రారంభమయ్యాయి. ఎలాంటి ఆధారంలేని ఎల్గార్ పరిషత్ కార్య క్రమాన్ని ఆసరా చేసుకొని మానవ హక్కుల సంఘాలు, పౌరహక్కుల సంఘాల నాయకులపైన పోలీసులు దాడులు చేశారు. ఆ దాడుల్లో ప్రధాని మోదీని హత్యచేయడానికి కుట్ర పన్నుతున్నారన డానికి ఆధారం లభ్యమైందని పోలీసులు ఢిల్లీలోని రోమా విల్సన్ గది నుంచి ఒక ఉత్తరం దొరికినట్టు ప్రకటించారు. ఇదే సందర్భంగా ముంబైలో సుధీర్ ధవలేను, నాగ్పూర్లో సోమాసేన్, మహేష్ రావత్, సురేంద్ర గాడ్లింగ్ను ఏప్రిల్ 17న అరెస్టు చేశారు. హైదరాబాద్లో విరసం నేతlవరవరరావు, ఢిల్లీలో న్యాయవాది, పౌర హక్కుల నాయకుడూ, జర్నలిస్టు, రచయిత గౌతం నవ్లఖా, ఫరీదాబాద్లో సుధా భరద్వాజ్, రాంచీ నుంచి ఆదివాసీ హక్కుల నాయ కుడు స్టాన్ స్వామి, ముంబై నుంచి అరుణ్ ఫెరీరాను అరెస్టు చేశారు. ఏప్రిల్ 2న భారత్ బంద్ తర్వాత ఈ అరెస్టులు జరగడం, దానికి భీమాకోరే గావ్ను ముడి పెట్టడం చూస్తే ఈ చర్యల వెనుక దాగి ఉన్న కుట్ర బహిర్గతమవుతోంది. విప్లవకవి వరవరరావు అరవై ఏళ్లుగా విప్లవో ద్యమంలో ఉంటూ ప్రజాఉద్యమాల్లో మమేకమ య్యారు. ఆదివాసీల పక్షాన పోరాడుతున్నారు. ధిక్కారస్వరమైన వరవరరావుని బయటలేకుండా చేయడమే లక్ష్యంగా ఈ అరెస్టుల తతంగం జరిగిం దన్నది వాస్తవం. ఈ దేశంలో ఆదివాసీలను ఎన్ కౌంటర్ల పేరుతో మట్టుబెట్టినప్పుడు, వారి హక్కు లను కాలరాసినప్పుడు, వారిపై అత్యాచారాలు చేసి నప్పుడు వరవరరావు, గౌతం నవ్లాఖా, ఆయనతో పాటు అరెస్టయిన వారు ఆదివాసీలకు ప్రపంచ వ్యాప్తంగా మద్దతు కూడగట్టారు. నరేంద్రమోదీ హత్యకు సంబంధించి బయట పడిందంటున్న మావోయిస్టుల ఉత్తరం నిజమైంది కాదనీ, మానవహక్కులు, ప్రజాసంఘాల నాయ కులనూ అరెస్టు చేయడానికి సృష్టించిన ఉత్తరమని పలువురు న్యాయకోవిదులూ, మేధావులూ ప్రకటిం చారు. అలాంటప్పుడు ఈ అరెస్టులకు కారణం ఉండాలి. మావోయిస్టులకు సమాజంలో మద్దతు నిచ్చేవారికి ఇలా హెచ్చరిక జారీచేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఇంకా దళితులు, ఆదివాసీలు పోరాడుతోంటే వారికి మావోయిస్టులతో సంబంధాలను అంటగట్టి అణచివేయడం కూడా రెండో ప్రయోజనంగా భావి స్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్లో భీం ఆర్మీ ఉద్యమానికి మావోయిస్టుల అండ ఉందనే నెపంతో ఆ సంస్థ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ని ఏడాదికి పైగా జైల్లో పెట్టారు. దళితులు, ఆదివాసీలు ఎదురు తిరిగినప్పుడల్లా వారిని ఉగ్రవాదులుగా, తీవ్రవాదులుగా ముద్ర వేస్తున్నారు. ఇదెంత మాత్రం వాంఛనీయం కాదు. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 మల్లెపల్లి లక్ష్మయ్య -
అయోధ్య వివాదంలో కొత్త మలుపు
చరిత్రను తవ్వడం, అన్వేషించడం, అందులో ఏది లభ్యమైనా జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించాలి. ఏ సంస్థకో, మతానికో దానిమీద గుత్తాధిపత్యం ఉండకూడదు. మత విశ్వాసాలు, రాజకీయ ఎత్తుగడలు, వారి వారి ప్రయోజనాలు బాబరీ మసీదు సమస్యకు పరిష్కారం కావు. అట్లాగైతే చాలా మతాలకు చెందిన ప్రార్థనాలయాలు వేరే మతాల, సంస్థల పునాదులమీద నిర్మాణమై ఉన్నవేనన్న సత్యాన్ని ఒప్పుకోక తప్పదు. కూలగొట్టడం, తిరిగి నిర్మించడం ఎంత మాత్రం అభిలషణీయం కాదు. శాంతి సామరస్యం, ప్రేమ, కరుణల పుట్టినిల్లుగా భాసిల్లుతోన్న ఈ దేశంలో హింసకు తావుండకూడదు. ప్రజలు సృష్టించిన చరిత్రనీ, సంస్కృతినీ ప్రజలపరం చేయాలి. ‘‘అయోధ్యలో దాదాపు వంద బౌద్ధ ఆరామాలు ఉన్నాయి. అందులో 3000 మందికి పైగా బౌద్ధబిక్కులు కార్యకలాపాలు నిర్వ హిస్తున్నారు. వారు మహాయాన, హీనయాన మార్గా లకు సంబం«ధించిన ఎన్నో విషయాలను నేర్చుకుం టున్నారు. ఈ నగరంలో పురాతన బౌద్ధారామం ఉంది. ఇందులో బౌద్ధ తాత్వికులలో ప్రముఖుడైన వసుబంధు ప్రసంగించేవారు. అనేక అంశాలపై అధ్యయనాలను కొనసాగించారు. అంతేకాకుండా ఎన్నో గ్రంథాలను ఆయన ఇక్కడే రచించారు’’ అని చైనా బౌద్ధ యాత్రికుడూ, చరిత్రకారుడూ అయిన హుయాన్త్సాంగ్ తన యాత్ర డైరీలో పేర్కొన్నారు. క్రీస్తు శకం 629 నుంచి 645 వరకు ఆయన భారత దేశంలో పర్యటించారు. అంతకుముందు కూడా చైనాకి చెందిన పాహియాన్ భారతదేశంలోని అనేక బౌద్ధ ప్రదేశాలను సందర్శించారు. ఆయన సైతం తన డైరీలో కోసల రాజ్యం గురించీ, అందులో ఉన్న శ్రావస్తి, సాకేత పట్టణాలను గురించీ ప్రస్తావించడం మనం గమనించవచ్చు. అయోధ్యకు మరో పేరు సాకేతనగరమని చరిత్రకారులు నిర్ధారించారు. కోసల రాజ్యం బుద్ధుడి తాత్వికతను అందిపుచ్చుకు న్నట్టు బౌద్ధగ్రంథాలు చెపుతున్నాయి. గౌతమ బుద్ధుడు కోసల రాజ్యంలో ఎక్కువ సమయాన్ని గడి పినట్టు కూడా ఆ గ్రంథాల ప్రస్తావనవల్ల తెలుస్తు న్నది. వీటన్నింటి రీత్యా కోసల రాజ్యంలోని సాకేత (అయోధ్య) పట్టణం బౌద్ధం విస్తరణలో, బౌద్ధ భావ నల సంరక్షణలో కీలకపాత్ర పోషించింది. సరిగ్గా ఇదే విషయం బాబ్రీమసీదు వివాదం కొత్త మలుపునకు దారితీస్తున్నదనడానికి సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషనే ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గత నెల 23వ తేదీన వినీత్ కుమా ర్మౌర్య దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు స్వీకరించింది. అయోధ్యలో ప్రస్తుత వివాదాస్పద స్థలంలో బౌద్ధ ఆరామం ఉండేదని, దానిని పరి రక్షించి, చారిత్రక వారసత్వాన్ని కాపాడాలని వినీత్ కుమార్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. వినీత్ కుమార్ మౌర్య ఫైజాబాద్ జిల్లా కజియానాకు చెంది నవాడు. గతంలో లక్నో హైకోర్టులో ఈ విషయమై విచారణ జరుగుతున్న సమయంలో కూడా కొన్ని బౌద్ధ సంఘాలు, బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశ యాల వెలుగులో పనిచేస్తున్న కొన్ని సంస్థలు కూడా పిటిషన్లు సమర్పించాయి. వీటిని ఆనాడు పరిగణన లోనికి తీసుకోలేదు. వినీత్ కుమార్ పట్టుదల పరి శోధనల ఆధారంగా ఒక సమగ్రమైన పిటిషన్ను తయారుచేసి దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు ఆయన పిటిషన్ను ఈ విచారణలో భాగం చేసింది. ఇది ఈ రోజు చరిత్ర మరుగున పడిన ఒక ముఖ్యౖ మెన అంశాన్ని బహిర్గతం చేసేందుకు తోడ్పడుతుం దని చాలామంది ఎదురుచూస్తున్నారు. వినీత్ కుమార్ సమర్పించిన పిటిషన్లో ఒక చరిత్ర క్రమం మనకు దర్శనమిస్తుంది. గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం అయిన తర్వాత ఎక్కువ కాలం కోసల దేశంలోని శ్రావస్తిలో, సాకేతలో గడిపిన ట్టు ఆయన తన పిటిషన్లో కూడా పేర్కొన్నారు. చైనా బౌద్ధ యాత్రికులు పాహియాన్, హుయాన్ త్సాంగ్లు రాసిన డైరీలలో కూడా ఈ విషయాలు న్నాయి. ఈ విషయాలన్నీ ముందుగా చైనా భాషలో లిఖతమైనాయి. ఆ తర్వాత ఇంగ్లీషులోకి అనువాదం జరిగింది. పాహియాన్ రాసిన ‘‘ఎ రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్’’ అనే పుస్తకంలోని 20వ అధ్యా యంలో ఈ విషయాలున్నాయి. ఆయన తన ప్రయా ణంలో కోసలను సందర్శించినట్టు, అక్కడ బౌద్ధం గొప్పతనాన్ని చూసినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా హుయాన్త్సాంగ్ రాసిన ‘‘బుద్ధిస్ట్ రికార్డ్ ఆఫ్ ద వెస్టర్న్ వరల్డ్’’లోని అయోధ్య అనే అధ్యాయంలో కూడా చాలా వివరాలున్నాయి. అయోధ్యలోని ఒక పెద్ద బౌద్ధ ఆరామం పక్కన పడిపోయిన గోడలు కనిపించాయనీ, అవి వసుబంధు నివసించిన స్థల మని కూడా ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. అయోధ్య పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో అశో కుడు నిర్మించిన 200 అడుగుల స్తూపమున్నదని కూడా అందులో ఉదహరించారు. ఈ స్తూపం నిర్మిం చిన చోటనే గౌతమ బుద్ధుడు ఏడు రోజుల పాటు తన బోధనలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళా డనీ, అందుకు గుర్తుగానే అశోకుడు ఈ స్తూపాన్ని సైతం నిర్మించారనీ ఆయన పేర్కొన్నాడు. అదే విధంగా సంఘారామానికి రెండు న్నర కిలోమీటర్ల దూరంలో తథాగత గౌతమబుద్ధుని అస్థికలతో నిర్మిం చిన స్తూపమున్నది. ఆరామానికి వాయవ్యంలో బుద్ధుని అస్థికలతో మరొక స్తూపం నిర్మాణం జరిగి నట్టు, దాని ఆనవాళ్ళను సైతం హుయాన్త్సాంగ్ కనుగొనడం విశేషం. అదే దిశలో మరొక బోధనా సమావేశ మందిరం ఉన్నట్టు కూడా ఆయన తన పుస్త కంలో పేర్కొన్నారు. ఇలా ఒకటేమిటి.. అయోధ్యలో నడ యాడిన బుద్ధుడి ఆనవాళ్ళెన్నింటినో పట్టిఇ చ్చిన ఘనత హుయాన్త్సాంగ్కే దక్కుతుంది. పాహియాన్, హుయాన్త్సాంగ్ డైరీల్లోని చారి త్రక విషయాల ఆధారంగా బ్రిటిష్ పురాతత్వ శాస్త్ర వేత్త కన్నింగ్హామ్ చేపట్టిన తవ్వకాల్లో ఎన్నో బౌద్ధ అవశేషాలు బయటపడ్డాయి. అయోధ్యలో కూడా బౌద్ధ అవశేషాలున్నాయని కన్నింగ్హామ్ తన పరి శోధనలో తేల్చారు. 1862–63లో జరిగిన ఈ సర్వే తర్వాత మళ్ళీ 1889–1891 కాలంలో మరో అధ్య యనానికి కన్నింగ్హామ్ నడుంకట్టారు. అప్పుడు సైతం అదే నిర్ధారణకు వచ్చారు. మరో పురాతత్వ శాస్త్రవేత్త ఎ.కె.నారాయణ్ చేసిన సర్వే కూడా వీటినే ధ్రువపరిచింది. అంతే కాకుండా, బాబ్రీమసీదు వివా దాస్పద స్థలంలో లభించిన 14 స్తంభాలను బౌద్ధాన్ని ఆదరించి, ఆచరించిన, బుద్ధుడి అనుయాయులైన రాజులు నిర్మించినట్టు పరిశోధకులు భావిస్తున్నారు. ఈ స్థలంలో దొరికిన మరొక శిల్పం ఈ వాదనలను బలపరు స్తున్నది. అయోధ్యపైన ఎ.ఘోష్ సంపాదకత్వం వహిం చిన ‘‘ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ ఆర్కియా లజీ’’ పదకొండవ సంపుటిలో కూడా బౌద్ధ, జైన గ్రంథాల నుంచి ప్రస్తావనలున్నాయి. ఇప్పటి వరకు జరిగిన తవ్వకాల్లో రాముడికి గానీ, హిందూ దేవాల యాలకు కానీ సంబంధించిన ఎటువంటి ఆధా రాలూ లభించలేదని పిటిషనర్ వినీత్ కుమార్ చాలా స్పష్టంగానే పేర్కొన్నారు. ఇటువంటి ముఖ్యమైన విషయాలను అలహాబాద్, లక్నో హైకోర్టు బెంచ్లు విస్మరించాయని కూడా వినీత్ పిటిషన్లో పేర్కొ న్నారు. సారనాథ్, కుషీనగర్, కపిలవస్తు, శ్రావస్తి లాగా వివాదాస్పదమైన స్థలాన్ని బౌద్ధవిహార్గా ప్రకటించి, పరిరక్షించాలని వినీత్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బౌద్ధతాత్వికత దీనిని ధ్వంసం చేసి, మరొక దానిని ఆక్రమించుకోవాలని భావించలేదని, ఇప్పుడు కూడా అక్కడ బౌద్ధ విహారాన్ని నిర్మించా లని తాము కోరడం లేదనీ, దానిని పరిరక్షించాలని మాత్రమే కోర్టును అభ్యర్థిస్తున్నామని, వినీత్ ఫోన్ సంభాషణలో వెల్లడించారు. అదేవిధంగా ఆ స్థలాన్ని ఎవరో ఒకరికి కేటాయించడం వల్ల వైషమ్యాలు పెరి గిపోయి, హింస ప్రజ్వరిల్లగలదని, దానిని నివారించ డానికి చారిత్రక ఆధారాలను మాత్రమే సత్యాలుగా స్వీకరించాలని ఆయన కోరుతున్నారు. ఇదే సంవత్సరం జనవరిలో ‘సాక్షి’ ఎడిటోరి యల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తితో పాటు ఇంకా ఇద్దరు మిత్రులతో కలిసి నేపాల్లోని బుద్ధుని జన్మ స్థలమైన లుంబిని, ఆయన మహాపరినిర్వాణం పొందిన కుషినగర్తో సహా అయోధ్యలోని వివాదా స్పద స్థలాన్ని చూసే అవకాశం ఈ రచయితకు వచ్చింది. లుంబిని, కుషీనగర్లలో జరిగిన సంపూర్ణ తవ్వకాలవల్ల ఎన్నో చారిత్రక అవశేషాలు బయట పడ్డాయి. కానీ ఈ స్థలం 1885 నుంచి వివాదంలో ఉండటం వల్ల పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు నిర్వహించలేకపోయారు. దానివల్ల చరిత్ర భూగ ర్భంలోనే నిక్షిప్తమై ఉన్నది. ఈ వివాదంపై మహంత్ రఘుబర్ దాస్ ఫైజాబాద్ సబ్ జడ్జి కోర్టులో పిటిషన్ వేస్తూ, ఆ ప్రాంతంలో దేవాలయాలు కడతామని కోరారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ వివాదం సమసి పోలేదు. క్రీ.శ.ఏడవ శతాబ్దంలో భారత ఉపఖండం మొత్తం పర్యటించిన హుయాన్త్సాంగ్ పేర్కొన్న అయోధ్య విశేషాల ఆధారంగా తవ్వకాలు నిర్వహిస్తే ఎన్నో విషయాలు బయటకు వస్తాయి. సాంకేతిక పరిజ్ఞానం వల్ల నేరుగా తవ్వకాలు చేయాల్సిన అవ సరంలేదు. హైదరాబాద్లోని ఎన్.జి.ఆర్.ఐ. లాంటి సంస్థలు తవ్వకాలు జరపకుండానే భూమిలోపల ఉన్న కట్టడాలు, నిర్మాణాల స్వరూపాలను కనుగొనే సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్నాయి. ప్రపంచంలో అన్ని ప్రాంతాలను గుప్పిట్లో పెట్టుకున్న గూగుల్ లాంటి సంస్థలు కూడా ఇటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. ఇప్పటికే పాహియాన్, హుయాన్త్సాంగ్ యాత్రలు, బౌద్ధ సాహిత్యంలోని పాళీగ్రంథాలు, కొన్ని సంస్కృత పుస్తకాలు, కన్నింగ్హామ్, కార్నైజ్, నారాయణ్లాంటి పురాతత్వ శాస్త్రవేత్తలు ఈ విష యంలో మార్గనిర్దేశనం చేశారు. అటువంటి ఆధా రాల పునాదిగా చేసుకొని భారతదేశంలోని వారే కాకుండా, ప్రపంచంలోని ప్రఖ్యాతిగాంచిన పురాత త్వశాస్త్రవేత్తలతో ఒక కమిటీ వేసి, తవ్వకాలు జరిపిం చడం మంచిదేమో ఆలోచించాలి. దీనికి చరిత్రను తవ్వడం, అన్వేషించడం, అందులో ఏది లభ్యమైనా జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించడం జర గాలి. ఏ సంస్థకో, మతానికో దానిమీద గుత్తాధి పత్యం ఉండకూడదు. బాబరీ మసీదు వివాదానికి ఇది మాత్రమే పరిష్కారం. దీనికి మత విశ్వాసాలు, రాజకీయ ఎత్తుగడలు, ప్రయోజనాలు పరిష్కారం కావు. కూలగొట్టడం, నూతన కట్టడాలు తేవడం ఎంత మాత్రం అభిలషణీయం కాదు. శాంతి, సామ రస్యం, ప్రేమ, కరుణ పుట్టిన ఈ దేశంలో హింసకు తావుండకుండా, కలహాలకు స్థానం లేకుండా ప్రజలు సృష్టించిన చరిత్రనీ, సంస్కృతినీ, వారసత్వ సంప దనూ ప్రజలపరం చేయాలి. వారికే వాటిపైన సర్వ హక్కులూ ఉండాలి. మల్లెపల్లి లక్ష్మయ్య(వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్ : 97055 66213