MJ Akbar
-
ఆత్మవిశ్వాసమిచ్చే తీర్పు
మూడేళ్లక్రితం మన దేశంలో రగుల్కొన్న ‘మీ టూ’ ఉద్యమంలో ఇదొక కీలకమైన మలుపు. పనిచేసేచోట అడుగడుగునా రకరకాల రూపాల్లో వేధింపులు, వివక్ష, అవమానాలు ఎదుర్కొంటూ మౌనంగా కుమిలిపోయే మహిళా లోకానికి ఆత్మసై్థర్యాన్నిచ్చే ఘట్టం. ఎలాంటి సాక్ష్యాధారాలూ లేని లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి, తన పరువు దిగజారుస్తున్నారంటూ సీనియర్ జర్నలిస్టు ప్రియా రమణిపై కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ వేసిన పరువు నష్టం దావా చెల్లుబాటు కాదని ఢిల్లీ కోర్టు బుధవారం ఇచ్చిన తీర్పు ఎన్నదగినది. ఎంజే అక్బర్ పత్రికా సంపాదకుడిగా ఉన్న ప్పుడు తమపై లైంగిక వేధింపులకు పాల్పడేవారని, అసభ్యంగా ప్రవర్తించేవారని పలువురు మహిళలు ఆరోపించారు. అయితే అవన్నీ అబద్ధాలనీ, ఈ అసత్యారోపణలు చేసినవారిపై చట్టపరంగా చర్య తీసుకుంటానని అప్పట్లో అక్బర్ హెచ్చరించారు. చివరకు ప్రియా రమణిపై ఢిల్లీ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ‘మీ టూ’ ఉద్యమం తర్వాత మన దేశంలో తొలిసారి బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా సినీ రంగంలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి గళమెత్తారు. ఆ తర్వాత ఫేస్బుక్ వేదికగా కొందరు మహిళలు తమకెదురైన చేదు అనుభవాలను తెలియజేశారు. అందుకు కారకులెవరో వారి పేర్లతో సహా వెల్లడించారు. అయితే తమ వివ రాలేమిటో, ఆ వేధింపుల స్వభావం ఎటువంటిదో చెప్పకుండా, గోప్యంగా వుండి ఆరోపించే ధోరణి సరికాదని చాలామంది అభిప్రాయపడ్డారు. అది దాదాపు చల్లబడిపోతున్నదని అందరూ అనుకునే సమయంలో ప్రియా రమణి నేరుగా అక్బర్ పేరు వెల్లడించి, ఆయన వల్ల ఎదుర్కొన్న ఇబ్బందుల్ని తెలియజేశారు. విచారణ సందర్భంగా అప్పట్లో తన వయసుకూ, ఆయన వయ సుకూ... ఆ సంస్థలో ఆయనకుండే పలుకుబడికీ... తన నిస్సహాయతకూ మధ్య వున్న వ్యత్యాసాన్ని వివరించారు. ఇవి బయటపెట్టడంలో తనకెలాంటి స్వప్రయోజనాలూ, దురుద్దేశాలూ లేవని చెప్పారు. ఈమధ్య ‘బ్రాస్ నోట్బుక్’ పేరుతో తన ఆత్మకథను వెలువరించిన ప్రముఖ ఆర్థికవేత్త దేవకీ జైన్ 1958లో పాతికేళ్ల వయసులో ఇంగ్లండ్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో తనకెదురైన చేదు అనుభవాలనూ, అవి అనంతర కాలంలో తనపై చూపిన ప్రభావాన్ని వివరించారు. ఆ ప్రొఫెసర్ అసభ్య ప్రవర్తనను ప్రతిఘటించినందుకు ఉద్యోగం కోల్పోవటంతోపాటు తన ఆత్మ విశ్వాసం ఎలా దెబ్బతిన్నదో తెలిపారు. లైంగిక వేధింపులు ఎదుర్కొనే ప్రతి మహిళా ఇలాంటి దుస్థితిలోనే పడతారు. ఢిల్లీ కోర్టు మేజిస్ట్రేట్ అన్నట్టు ఇలాంటి వేధింపులన్నీ మహిళ ఒంటరిగా వున్నప్పుడే జరుగుతాయి. వేధింపులకు పాల్పడే మాయగాళ్లు నలుగురిలో వున్నప్పుడు మర్యాదస్తుల్లా ప్రవ ర్తిస్తారు. మంచివారిలా మెలుగుతారు. అందువల్లే బాధిత మహిళ సహోద్యోగులకు చెప్పడానికి సంశయిస్తుంది. చెప్పినా తననే దోషిగా పరిగణిస్తారన్న భయం ఆమెను ఆవహిస్తుంది. చేస్తున్న ఉద్యోగం పోతుందేమోనని సందేహిస్తుంది. దీర్ఘకాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ దుర్మార్గాన్ని ‘మీ టూ’ ఉద్యమం బద్దలుకొట్టింది. దీనికి ముందు మన దేశంలో ఎవరూ ప్రశ్నిం చలేదని కాదు. రాజస్తాన్ దళిత మహిళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి కొన్ని స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ వర్మ నేతృత్వంలోని ధర్మాసనం 1997లోనే కీలకమైన తీర్పు వెలువరించింది. పనిచేసేచోట మహిళలకు వేధింపులు ఎదురుకాకుండా వుండటానికి తీసు కోవాల్సిన చర్యలేమిటో వివరిస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎలాంటి చేష్టలు లైంగిక వేధింపులకిందికొస్తాయో ఆ మార్గదర్శకాలు వివరించాయి. ఆ తర్వాత పనిచేసేచోట లైంగిక వేధింపుల్ని నిరోధించేందుకు 2013లో ఒక చట్టం వచ్చింది. అయితే విషాదమేమంటే చట్టపరంగా ఎన్ని రక్షణలు కల్పించినా వేధింపులూ, వివక్ష సమసి పోలేదు. అటువంటి మహిళలకు ధైర్యాన్నిచ్చే విధంగా సంస్థలు తగిన చర్యలు తీసుకోకపోవటం, ప్రభుత్వాలు సైతం పట్టనట్టు వ్యవహరించటం అందుకు కారణం. రెండున్నర దశాబ్దాలక్రితం జరిగిందంటూ తనపై ప్రియా రమణి చేసిన ఆరోపణలవల్ల పాత్రికేయుడిగా, పత్రికా సంపాద కుడిగా జీవితపర్యంతం సంపాదించుకున్న పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయంటూ అక్బర్ చేసిన వాదనను మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ పాండే అంగీకరించలేదు. మీ పరువు కోసం ఒక మహిళ జీవించే హక్కును పణంగా పెట్టలేమని ఆయన వ్యాఖ్యానించారు. వేధింపులు ఎదుర్కొనటమేకాక, ముద్దాయిగా బోనులో నిలబడవలసివచ్చిన బాధితురాలి స్థితిగతుల్ని అవగాహన చేసుకుని ఎంతో పరిణతితో మేజిస్ట్రేట్ ఇచ్చిన ఈ తీర్పు ఆహ్వానించదగ్గది. గత రెండేళ్లుగా ఈ కేసు విచారణ కోసం ప్రియా రమణి 50 సార్లు బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లాల్సివచ్చింది. కేసులో ఓడిపోతే చెల్లించాల్సిన పరిహారం సంగతలావుంచి, క్రిమినల్ కేసు ఎదుర్కొనాల్సివచ్చేది. కానీ ఆమె నిబ్బరంగా పోరాడారు. ఆమె తరఫు న్యాయవాది రెబెకా జాన్ సమర్థవంతమైన వాదనలు వినిపించారు. ఢిల్లీ కోర్టు వెలువరించిన తీర్పు పనిచేసే చోట నిత్యం వేధింపులు ఎదుర్కొంటున్న లక్షలాదిమంది బాధిత మహిళలకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. దోషులను బయటికీడ్చేందుకు దోహద పడుతుంది. -
మీటూ కేసు : రామాయణం ప్రస్తావన
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ వేసిన పరువు నష్టం దావా కేసు నుంచి జర్నలిస్టు ప్రియారమణికి విముక్తి లభించింది. 2018లో మీటూ ఉద్యమం నేపథ్యంలో ఎంజే అక్బర్ తనని లైంగికంగా వేధించారంటూ ప్రియారమణి చేసిన ఆరోపణలపై అక్బర్ కోర్టుకెక్కారు. ఆమెపై పరువు నష్టం దావా వేశారు. అయితే ప్రియారమణికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ ఎంజే అక్బర్ వేసిన దావాను ఢిల్లీ కోర్టు బుధవారం కొట్టేసింది. లైంగిక వేధింపులు ఎదుర్కొనే మహిళలకి దశాబ్దాల తర్వాత కూడా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ వేదికలోనైనా తనకు జరిగింది వెల్లడించే హక్కు ఉందని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ పాంజే స్పష్టం చేశారు. తీర్పుని వెలువరించే సమయంలో న్యాయమూర్తి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సంఘంలో హోదా ఉన్న వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడలేదని చెప్పలేమని అన్నారు. ‘‘లైంగిక వేధింపులపై తమ గళం విప్పిన మహిళల్ని శిక్షించలేము. ఒక వ్యక్తి పరువు తీశారని ఫిర్యాదులు వచ్చినా మహిళల్ని శిక్షించడానికి వీల్లేదు. మహిళల మర్యాదని పణంగా పెట్టి సంఘంలో మరో వ్యక్తి పరువుని కాపాడలేము’’ అని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ‘‘లైంగిక వేధింపులతో మహిళల ఆత్మగౌరవం, మర్యాదకి భంగం వాటిల్లుతుంది. తనపై జరిగిన నేరంతో ఆమె తీవ్రమైన మానసిక సమస్యలనెదుర్కొంటుంది. నాలుగు గోడల మధ్య జరిగిన ఘటనలపై ఒక్కోసారి ఆమె పెదవి విప్పలేకపోవచ్చు. ఒక్కో సారి ఆమెకి అన్యాయం జరిగిందని కూడా బాధితురాలికి తెలిసి ఉండకపోవచ్చు. అందుకే లైంగిక వేధింపులకు గురైన మహిళలు దశాబ్డాల తర్వాత కూడా బయట ప్రపంచానికి వెల్లడించవచ్చు’’ అని మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు.‘‘లైంగిక వేధింపులతో బాధితురాలు ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటుందో సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి కూడా మిగిలిన వారిలాగే మన సమాజంలో కలిసిపోతారు. అతనికీ కుటుంబం, బంధువులు, స్నేహితులు ఉంటారు. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలోనే ఉంటారు. ఈ విషయాన్ని అందరూ గ్రహించుకోవాలి’’ అని మేజిస్ట్రేట్ రవీంద్రకుమార్ వ్యాఖ్యానించారు. మహిళల్ని గౌరవించాలంటూ రామాయణ, మహాభారతం వంటి పవిత్ర గ్రంథాలు రాసిన నేలపై వారి పట్ల జరుగుతున్న అకృత్యాలు సిగ్గు చేటు అని వ్యాఖ్యానించారు. మహిళలు ఇక మాట్లాడాలి ఢిల్లీ కోర్టు వెలువరించిన తీర్పు పట్ల ప్రియారమణి హర్షం వ్యక్తం చేశారు. తన గెలుపు మరెందరో మహిళల్ని పెదవి విప్పేలా ప్రోత్సహిస్తుందని ప్రియారమణి వ్యాఖ్యనించారు. ‘‘నేను చేస్తున్న పోరాటం నా ఒక్కదాని కోసం కాదు. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలందరి తరఫున పోరాడుతున్నాను. కేవలం మాట్లాడానని నన్ను ఈ కేసులోకి లాగారు. ఒక బాధితురాలినైన నన్ను ముద్దాయిగా బోనులో నిలబెట్టారు. సమాజంలో పలుకుబడి ఉందని, శక్తిమంతులమని బావించే మగవాళ్లు బాధిత మహిళల్ని కోర్టుకీడ్చడానికి ఇకపై ముందు వెనుక ఆలోచిస్తారు’’ అని ప్రియారమణి అన్నారు. ఈ కేసులో తాను విజయం సాధించేలా శ్రమించిన తన లాయర్లకి ప్రియారమణి ధన్యవాదాలు తెలిపారు. -
మీటూ : కేంద్రమాజీ మంత్రికి షాక్
సాక్షి, న్యూఢిల్లీ : చిత్ర పరిశ్రమలోనే కాక దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన మీటూ ఉద్యమం కేసులో ఢిల్లీ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. కేంద్రమాజీ మంత్రి ఎంజే అక్బర్ తనపై లైంగిక వేదింపులకు పాల్పడ్డారంటూ జర్నలిస్ట్ ప్రియా రమణి చేసిన అరోపణలు అప్పట్లో సంచలనం రేకిత్తించిన విషయం తెలిసిందే. తనపై ప్రియా తప్పుడు ఆరోపణలు చేశారని, తన పరువుకు భంగంకలిగే విధంగా వ్యాఖ్యలు చేశారని ఎంజే అక్బర్ కోర్టును ఆశ్రయించారు. ప్రియా రమణిపై ఢిల్లీ కోర్టులో పరువునష్టం దావా వేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన న్యాయస్థానం బుధవారం కీలక తీర్పునిచ్చింది. బాధితురాలిపై ఎంజే అక్బర్ దాఖలు చేసిన పరువునష్టం దావా పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. తనకు జరిగిన అన్యాయాన్ని బాధితురాలు ఎప్పుడైనా బయటకు చెప్పుకోవచ్చని స్పష్టం చేసింది. ఎంజే అక్బర్ వాదనలతో ఏకీభవించని న్యాయస్థానం.. ఆమె వ్యాఖ్యలతో పిటిషనర్కు పరువు నష్టం జరిగిందని భావించేమని పేర్కొంది. ఈ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. దీంతో ప్రియా రమణికి న్యాయస్థానంలో ఊరట లభించింది. గత ఏడాది అక్టోబర్లో 20 ఏళ్ల క్రితం అక్బర్ తమని లైంగికంగా వేధించారని ఆయన మాజీ సహచర ఉద్యోగులు ప్రియా రమణి, ప్రేరణాసింగ్ బింద్రా, పేరు తెలియని మరో మహిళా జర్నలిస్టు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే వీటిని అవాస్తవమని కొట్టి పారేసిన అక్బర్ జర్నలిస్టు ప్రియా రమణిపై చట్టపరమైన చర్యలకు దిగారు. ఆమె తప్పుడు ఆరోపణలు చేశారంటూ పరువు నష్టం కేసు నమోదు చేశారు. దీనిని తాజాగా ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. కాగా ఎంజే అక్బర్పై వచ్చిన లైంగిక ఆరోపణలు ప్రధానంగా రాజకీయ రంగంలో తీవ్ర చర్చకు దారి తీశాయి. ప్రియా రమణి మొదలు పలువురు మహిళలు అక్బర్పై తీవ్రమైన ఆరోపణలతో మీటూ అంటూ సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చారు. -
‘ఎంతో కోల్పోవాల్సి వస్తుందని తెలుసు’
న్యూఢిల్లీ : పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల గురించి ప్రతీ మహిళ ధైర్యంగా ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉందని ప్రముఖ పాత్రికేయురాలు ప్రియా రమణి అన్నారు. తమను వేధించిన వారికి ఎదురు తిరిగి యుద్ధం చేసినపుడే ఇలాంటి అకృత్యాలు పునరావృతం కాకుండా ఉంటాయని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా పలు రంగాల్లో ప్రకంపనలు రేపిన మీటూ ఉద్యమంలో భాగంగా ప్రముఖ జర్నలిస్టు, మాజీ కేంద్ర మంత్రి ఎంజే అక్బర్పై ప్రియా రమణి గతేడాది సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. జాబ్ ఇంటర్వ్యూలో భాగంగా తనను హోటల్ గదికి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించారు. వికృత చేష్టలతో అక్బర్ తనను మానసికంగా హింసించాడని తెలిపారు. ఈ క్రమంలో ఎంతోమంది మహిళా జర్నలిస్టులు ప్రియను స్పూర్తిగా తీసుకుని అక్బర్ కారణంగా తాము ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి బహిర్గతం చేశారు. దీంతో అక్బర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించింది. చదవండి: #మీటూ : అక్బర్ అత్యాచార పర్వం..వైరల్ స్టోరీ ఈ నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే ప్రియా రమణి తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఎంజే అక్బర్ ఆమెపై పరువు నష్టం దావా వేశారు. ఇందులో భాగంగా ప్రియా రమణి సోమవారం ఢిల్లీ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్బర్ తరఫు న్యాయవాది సంధించిన ప్రశ్నలకు బదులుగా...ఎంజే అక్బర్పై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. ‘ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకునే నేను నిజాలు మాట్లాడాను. మీటూ ఉద్యమంలో భాగంగా నేను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకోవడం ద్వారా.. పని ప్రదేశాల్లో తమకు ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి ప్రతీ మహిళా ధైర్యంగా ముందుకు వస్తారనే ఆశతో నిజాలు మాత్రమే చెప్పాను. ఈ కేసు వల్ల వ్యక్తిగతంగా నేనెంతగానో కోల్పోవాల్సి వస్తుందని నాకు తెలుసు. నిశ్శబ్ధంగా ఉంటే ఇలాంటి కేసుల నుంచి తప్పించుకోవచ్చు. అయితే అది సరైంది కాదు. నన్ను టార్గెట్ చేయడం ద్వారా ‘అక్బర్ బాధితుల’ నోరు మూయించాలనేదే వారి ఉద్దేశం’ అని ప్రియా రమణి న్యాయమూర్తికి విన్నవించారు. -
‘ఆమె నాపై చేసిన ఆరోపణలు అవాస్తవం’
న్యూఢిల్లీ: జర్నలిస్ట్ ప్రియా రమణి తనపై చేసిన ట్వీట్లు, కథనాలు పని ప్రదేశంలో మహిళలపై జరిగే లైంగిక వేధింపుల సమస్యపై దృష్టి సారించడానికి ఉద్దేశించినవిగా పేర్కొనడం తప్పని కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ అన్నారు. ప్రియా రమణిపై దాఖలు చేసిన పరువునష్టం కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం శనివారం అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రియా రమణిని లక్ష్యంగా చేసుకొని తాను పరువునష్టం కేసు వేయలేదని పేర్కొన్నారు. ఈ కేసులో ఏప్రిల్ 10న కోర్టు విచారణకు హాజరైన ప్రియ రమణి తాను చేసిన ఆరోపణలు సరైనవే అన్నట్లు, ఎటువంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదన్నారు. మీటూ ఉద్యమం సందర్భంగా ఎంజే అక్బర్పై లైంగిక ఆరోపణలు చేసిన మొదటి మహిళ ప్రియా రమణి. వేధింపులకు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణల కారణంగా.. 2018, అక్టోబర్ 17న కేంద్ర మంత్రి పదవికి అక్బర్ రాజీనామా చేయవలసి వచ్చింది. -
#మీటూ : ప్రియా రమణికి బెయిల్
న్యూఢిల్లీ : బాలీవుడ్లో తను శ్రీ దత్తా ప్రారంభించిన మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సినిమాల్లో, రాజకీయాల్లో పెద్ద మనుషులుగా చెలామణి అవుతోన్న వారి ముసుగులు తొలగించింది. ఎంజే అక్బర్ ఏకంగా మంత్రి పదవికి రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన మీద ఆరోపణలు చేసిన జర్నలిస్ట్ ప్రియా రమణి మీద అక్బర్ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు సోమవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రియా రమణికి బెయిల్ మంజూరు చేస్తూ పటియాలా హౌస్ కోర్టు తీర్పునిచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా ప్రియా రమణి న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘ఇక ఇప్పుడు నా వంతు.. నా కథను ప్రపంచానికి వినిపించే సమయం వచ్చింది. నిజమే నా ఆయుధం’ అని పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబర్లో 20 ఏళ్ల క్రితం అక్బర్ తమని లైంగికంగా వేధించారని ఆయన మాజీ సహచర ఉద్యోగులు ప్రియా రమణి, ప్రేరణాసింగ్ బింద్రా, పేరు తెలియని మరో మహిళా జర్నలిస్టు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే వీటిని అవాస్తవమని కొట్టి పారేసిన అక్బర్ జర్నలిస్టు ప్రియా రమణిపై చట్టపరమైన చర్యలకు దిగారు. ఆమె తప్పుడు ఆరోపణలు చేశారంటూ పరువు నష్టం కేసు నమోదు చేశారు. (#మీటూ : అక్బర్ అత్యాచార పర్వం..వైరల్ స్టోరీ) -
అది అంగీకార సంబంధం కాదు
వాషింగ్టన్: విదేశాంగ శాఖ మాజీ సహాయమంత్రి, సీనియర్ జర్నలిస్ట్ ఎంజే అక్బర్(67) అధికార దుర్వినియోగం, బలప్రయోగంతో తనపై అత్యాచారం చేశారని నేషనల్ పబ్లిక్ రేడియో చీఫ్ బిజినెస్ ఎడిటర్ పల్లవి గొగోయ్ స్పష్టం చేశారు. పరస్పర అంగీకారంతోనే తామిద్దరి మధ్య 1994లో కొన్ని నెలల పాటు వివాహేతర సంబంధం కొనసాగిందన్న అక్బర్ వాదనను ఆమె ఖండించారు. అక్బర్ చేతిలో తనకు ఎదురైన భయానక అనుభవాలపై పల్లవి వాషింగ్టన్ పోస్ట్కు ఓ కథానాన్ని రాశారు. ఈ నేపథ్యంలో ఆమె ట్విట్టర్లో స్పందిస్తూ.. అక్బర్ లైంగిక వేధింపుల పర్వంపై వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు శుక్రవారం రాసిన వ్యాసంలోని ప్రతి అక్షరానికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. అక్బర్ చేతిలో లైంగికదాడులకు గురైన మహిళలు ముందుకొచ్చి నిజాలను బయటపెట్టాలన్న ఉద్దేశంతోనే తాను మాట్లాతున్నట్లు వెల్లడించారు. తమను అక్బర్ లైంగికంగా వేధించాడని 16 మందికి పైగా మహిళలు ముందుకురావడంతో ఆయన్ను కేంద్రం మంత్రి బాధ్యతల నుంచి ఇటీవల తప్పించిన సంగతి తెలిసిందే. -
అక్బర్పై మరో ‘మీ టూ’
వాషింగ్టన్: ప్రముఖ సంపాదకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్(67) లైంగిక వేధింపులపై మరో బాధితురాలు గళం విప్పారు. 23 ఏళ్ల క్రితం తనపై ఆయన అత్యాచారం చేశారంటూ అమెరికాలోని ప్రముఖ వార్తా సంస్థ ‘నేషనల్ పబ్లిక్ రేడియో’ చీఫ్ బిజినెస్ ఎడిటర్ పల్లవి గొగోయ్ ఆరోపించారు. ఒక వార్తా పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్గా ఉన్న ఆ ‘తెలివైన పాత్రికేయుడు’ హోదాను వాడుకుని తనను వలలో వేసుకున్నారంటూ ‘వాషింగ్టన్ పోస్ట్’లో ఆమె రాసిన వ్యాసం ఇటీవల ప్రచురితమైంది. ఏషియన్ ఏజ్ ఎడిటర్ ఇన్ చీఫ్గా అక్బర్ పనిచేస్తున్న సమయంలో తనపై లైంగికదాడికి, వేధింపులకు పాల్పడ్డారంటూ వాషింగ్టన్ పోస్ట్కు రాసిన వ్యాసంలో పల్లవి గొగోయ్ ఆరోపించారు. జీవితంలో అత్యంత బాధాకరమైన జ్ఞాపకాలని అందులో పేర్కొన్నారు. ‘22 ఏళ్ల వయస్సులో ‘ఏషియన్ ఏజ్’లో చేరా. ఆ సమయంలో అక్బర్ ఎడిటర్ ఇన్ చీఫ్గా ఉండేవారు. ఏడాదిలోనే ఒపీనియన్ ఎడిటోరియల్ పేజీకి ఎడిటర్గా అక్బర్ నేతృత్వంలో పనిచేసే అవకాశం వచ్చింది. ఆయన దగ్గర పనిచేయడం అద్భుతంగా అనిపించేది. ఆయన వాగ్ధాటి చూసి మైమరిచిపోయేదాన్ని. అయితే, నాకెంతో ఇష్టమైన ఆ ఉద్యోగ బాధ్యతను నెరవేర్చే క్రమంలో అందుకు తగ్గ మూల్యం కూడా చెల్లించాల్సి వచ్చింది. ఉద్యోగం నుంచి తీసేస్తా.. 1994 వేసవిలో ఒక రోజు ఒపీనియన్ ఎడిటోరియల్ పేజీకి నేను రాసిన అద్భుతమైన శీర్షికను చూపిద్దామని అక్బర్ ఆఫీసుకు వెళ్లా. నా ప్రతిభను మెచ్చుకుంటూనే ఆయన అకస్మాత్తుగా ముద్దు పెట్టుకున్నారు. నేను వెంటనే వెనుదిరిగి బయటకు వచ్చేశా. ఆందోళనకు, అయోమయానికి గురయ్యా’. అక్బర్ మరోసారి ఆఫీసు పనిపై ముంబై తాజ్ హోటల్ రూంకు పిలిపించుకుని, ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించారు. నేను విడిపించుకుని ఏడ్చుకుంటూ బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా నా ముఖంపై గోళ్లతో రక్కారు’ అని పల్లవి ఆ వ్యాసంలో వివరించారు. మరోసారి ఇలా అడ్డుకుంటే ఉద్యోగం నుంచి తీసేస్తానంటూ బెదిరించారని తెలిపారు. ‘ఓ సారి అసైన్మెంట్ నిమిత్తం జైపూర్కు వెళ్లా. అప్పటికే అక్కడ ఓ హోటల్లో ఉన్న అక్బర్ ఆ కథనంపై చర్చించేందుకు రూంకు రమ్మన్నారు. అక్కడే నాపై అత్యాచారానికి పాల్పడ్డారు. నేనెంత ప్రతిఘటించినా ఆయన బలం ముందు నిలవలేకపోయా. ఈ ఘటనతో తీవ్ర అవమానానికి గురై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేకపోయా. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. చెప్పినా నమ్మరని తెలుసు’ అని పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం ఆయన నాపై మరింత అధికారం చెలాయించ సాగారు. ఆయన చూస్తుండగా నేను తోటి పురుష ఉద్యోగులతో మాట్లాడినా సహించేవారు కాదు’ అని పేర్కొన్నారు. నాపై అలా ఎందుకు పెత్తనం చెలాయించేందుకు అవకాశం ఇచ్చానన్నదే నాకు అర్థం కాలేదు. బహుశా ఉద్యోగం పోతుందని భయపడి ఉంటా. నన్ను నేనే అసహ్యించుకుంటూ కుమిలిపోసాగా’. బ్రిటన్, యూఎస్ పంపిస్తా.. 1994 డిసెంబర్లో ఎన్నికల కవరేజీపై అక్బర్ నన్ను మెచ్చుకున్నారు. అందుకు ప్రతిఫలంగా అమెరికా కానీ, బ్రిటన్ కానీ పంపిస్తానన్నారు. ఆ విధంగానైనా వేధింపులు లేకుండా దూరంగా ఉండొచ్చని ఆశించా. కానీ, ఢిల్లీకి దూరంగా ఉండే అలాంటి చోట్లకు ఎప్పుడనుకుంటే అప్పుడు రావచ్చు. నాతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరించవచ్చన్నది ఆయన వ్యూహమని నేను ఊహించలేదు. లండన్లోని పత్రిక ఆఫీసులో ఓ సహోద్యోగితో మాట్లాడుతుండగా గమనించిన అక్బర్..తిడుతూ నాపై చేయిచేసుకున్నారు. ఓ కత్తెరతోపాటు టేబుల్పై ఉన్న వస్తువులని నాపై విసిరేశారు. వాటి నుంచి కాపాడుకునేందుకు పార్కింగ్ప్లేస్కు పారిపోయా. ఈ ఘటనతో శారీరకంగా, మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్నా. ఈ ఘటన తర్వాత అక్బర్ నన్ను తిరిగి ముంబైకి పిలిపించారు. ఆ తర్వాత నేను ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి న్యూయార్క్లోని ‘డౌజోన్స్’ పత్రికలో చేరాను’ ప్రతిభతో ఎదిగా.. ‘ఇప్పుడు నేను యూఎస్ పౌరురాలిని. ఒక భార్యగా, తల్లిగా ఉంటూ నా పాత్రికేయ వృత్తిని ఆనందంగా కొనసాగిస్తున్నా. ముక్కలైన నా జీవితాన్ని తిరిగి నిర్మించుకున్నా. నా ప్రతిభ, కష్టంతో డౌజోన్స్, బిజినెస్ వీక్, యూఎస్ఏ టుడే, అసోసియేటెడ్ ప్రెస్, సీఎన్ఎన్ వంటి ప్రముఖ సంస్థల్లో పనిచేశా. ప్రస్తుతం నేషనల్ పబ్లిక్ రేడియోలో అత్యున్నత హోదాలో ఉన్నా. మీటూలో పలువురు మహిళలు చేసిన ఆరోపణలను నిరాధారాలంటూ అక్బర్ ఖండించడం, ఒక మహిళపై పరువు నష్టం కేసు వేయడం నాకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదు. అప్పట్లో ఆయన మా శరీరాలపై అధికారం చెలాయించినట్లుగానే, ప్రస్తుతం ’నిజం’ అనే దానికి తనదైన శైలిలో భాష్యం చెప్పాలని చూస్తున్నారు. తీవ్రంగా పరిగణిస్తున్నాం:ఎడిటర్స్ గిల్డ్ ఎడిటర్స్ గిల్డ్ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత సభ్యుడు కూడా అయిన ఎంజే అక్బర్పై తాజాగా వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఎడిటర్స్ గిల్డ్ పేర్కొంది. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాలో ఆయన సభ్యత్వాన్ని కొనసాగించాలా వద్దా అనే విషయాన్ని త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపింది. పరస్పర అంగీకారంతోనే: అక్బర్ పల్లవి గొగోయ్ ఆరోపణలపై అక్బర్ స్పందించారు. ‘అప్పట్లో ఆమెతో లైంగిక సంబంధం పరస్పర అంగీకారంతోనే కొన్ని నెలలపాటు కొనసాగింది. ఆ సంబంధం నా కుటుంబ జీవితంలోనూ కలతలకు కారణమైంది. ఇద్దరి అంగీకారంతోనే ఈ సంబంధం ముగిసింది’ అని పేర్కొన్నారు. అక్బర్ భార్య మల్లిక కూడా పల్లవి ఆరోపణలను ఖండించారు. ఇరవయ్యేళ్ల క్రితం పల్లవి గొగోయ్ మా కుటుంబంలో అపనమ్మకానికి, అసంతృప్తులకు కారణమయ్యారు. అప్పట్లో ఆమె నా భర్తతో నెరిపిన సంబంధం గురించి నాకు తెలుసు. నా భర్తకు అర్ధరాత్రిళ్లు ఆమె ఫోన్ చేసేవారు. నా సమక్షంలోనే అక్బర్తో సన్నిహితంగా మెలిగేవారు. ఇప్పుడు ఆమె అబద్ధం ఎందుకు చెబుతోందో తెలియదు. అబద్ధం ఎప్పటికీ అబద్ధమే’ అని ఆప్రకటనలో పేర్కొన్నారు. -
మీటూ: స్పందించిన ఎంజే అక్బర్ భార్య
-
అక్బర్పై ఆరోపణలు : సంచలన విషయాలు వెల్లడించిన భార్య
న్యూఢిల్లీ : ‘మీటూ ఉద్యమం’లో భాగంగా బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్పై పలువురు మహిళలు లైంగిక ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలో జర్నలిస్ట్గా స్థిరపడిన పల్లవి గొగోయ్.. ఎంజే అక్బర్ పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించారు. అయితే పల్లవి గొగోయ్ చేసిన ఆరోపణలపై ఎంజే అక్బర్తో పాటు ఆయన భార్య మల్లికా అక్బర్ కూడా స్పందించారు. అక్బర్పై ఎంతమంది ఆరోపణలు చేసిన పెదవి విప్పని ఆయన భార్య పల్లవి గొగోయ్ ఆరోపణల విషయంలో మాత్రం తన భర్తకు మద్దతుగా నిలవడమే కాకా ఆమె అబద్దాలు ప్రచారం చేస్తోందంటూ పల్లవి గొగోయ్పై మండి పడ్డారు. పల్లవి గొగోయ్ ఆరోపణలపై స్పందించిన ఎంజె అక్బర్.. ‘1994 సమయంలో పరస్పర అంగీకారంతో మా ఇద్దరి(పల్లవి గొగోయ్, తనకు) మధ్య ఒక బంధం ఉన్న మాట వాస్తవం. ఇది కొన్ని నెలల పాటు కొనసాగింది. మా బంధం గురించి అందరికి తెలుసు. చాలా మంది మా ఇద్దరి గురించి మాట్లాడుకునే వారు. దీని వల్ల నా ఇంటిలో కలతలు కూడా చెలరేగాయి. కొన్నాళ్లకు ఈ బంధం ముగిసింది. అయితే ఈ బంధానికి ఒక మంచి ముగింపు మాత్రం ఇవ్వలేకపోయాము’ అంటూ అక్బర్ చెప్పుకొచ్చారు. అక్బర్ భార్య మల్లికా అక్బర్ మాట్లాడుతూ.. ‘20 ఏళ్ల క్రితం పల్లవి గొగోయ్ మా కాపురంలో కలతలు రేపింది. పల్లవి రాత్రి పూట నా భర్తకు ఫోన్ చేసేది. పబ్లిక్లో నా ముందే నా భర్త మీద ప్రేమ చూపించేది. వీటన్నింటిని చూసిన తర్వాత నాకు వారి బంధం గురించి పూర్తిగా అర్థమయ్యింది. ఈ విషయం గురించి మా భార్యభర్తల మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి. చివరకూ నా భర్తలో మార్పు వచ్చింది. కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు’ అని తెలిపారు. అంతేకాక ఇప్పుడు పల్లవి ఎందుకు ఇలాంటి అబద్దాలు చెప్తుందో తనకు అర్థం కావడం లేదన్నారు. పల్లవి చేసిన ఆరోపణలన్ని అవాస్తవాలేనంటూ ఖండించారు. -
#మీటూ : అక్బర్ అత్యాచార పర్వం..వైరల్ స్టోరీ
సాక్షి, న్యూఢిల్లీ: మీటూ ఉద్యమం భాగంగా బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి ఎంజె అక్బర్పై వచ్చిన లైంగిక ఆరోపణలు ప్రధానంగా రాజకీయ రంగంలో తీవ్ర చర్చకు దారి తీసాయి. జర్నలిస్టు ప్రియా రమణి మొదలు పలువురు మహిళలు అక్బర్పై తీవ్రమైన ఆరోపణలతో మీటూ అంటూ సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా, ప్రియా రమణిపై పరువు నష్టం కేసు లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు ఆయన ఒక పాత్రికేయుడుగా ఎంతటి ప్రతిభావంతుడో.. మహిళలను వేధించడంలో అంతే స్థాయికి దిగజారి ప్రవర్తించేవాడు అనేది ఆయా ఆరోపణల సారాంశం. ఇవన్నీ ఒక ఎత్తయితే.. అమెరికాలో ప్రముఖ జర్నలిస్టుగా స్థిరపడిన, నేషనల్ పబ్లిక్ రేడియోలో చీఫ్ బిజినెస్ ఎడిటర్ పల్లవి గొగోయ్ పంచుకున్న లైంగిక వైధింపులు, అత్యాచారం ఆరోపణలు మరో ఎత్తు. 23 సంవత్సరాలుగా తన గుండెను మెలిపెడుతున్న, తన జీవితంలో అత్యంత బాధాకరమైన జ్ఞాపకాలను వాషింగ్ పోస్ట్లో షేర్ చేశారు. ముఖ్యంగా భారతదేశంలో అక్బర్పై చెలరేగిన ఆరోపణలు, వాటిని ఆయన ఖండించిన తీరు చూసిన తరువాత తన స్టోరీని కూడా చెప్పాలనుకుంటున్నానంటూ ఎడిటర్ ఇన్ ఛీప్గా అక్బర్ తను మానసికంగా, శారీరంగా వేధించిన వైనాన్ని పల్లవి వెల్లడించారు. అక్బర్ చేతిలో లైంగిక వేధింపులకు గురైన మహిళలు మీటూ అంటూ ముందుకు వచ్చిన తీరు, ఆక్రోశం కదిలించింది. అందుకే అక్బర్పై పోరుకు సిద్దమైన మహిళలందరికీ మద్దతుగా తన గాథను చెబుతున్నాన్నారు. ఇకనైనా తానేం చేసినా చెల్లుతుంది అనే అక్బర్ లాంటి వారికి తగిన గుణపాఠం నేర్పాలని ఈ సందర్బంగా ఆమె కోరుకున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశానికి చెందిన విదేశాంగశాఖలో ఒక ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారిగా అక్బర్ పనిచేశారు. బేటీ బచావో అంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న పాలక పార్టీకి ఇప్పటికీ సభ్యుడుగా, ఎంపీగా ఉన్నారని పల్లవి ఎద్దేవా చేశారు. ఏసియన్ ఏజ్లో పనిచేయడానికి వెళ్ళినప్పుడు నాకు 22ఏళ్లు. అక్కడ చాలామంది మహిళలున్నారు. జర్నలిజంలో ఓనమాలు కూడా రాని సమయమది. కొద్దికాలంలోనే, చిన్నవయసులోనే ఏసియన్ ఏజ్లో ఆపోజిట్ ది ఎడిటోరియల్ పేజ్ ఎడిటర్గా పెద్ద బాధ్యత నిర్వహించాను. భారతీయ రాజకీయ ప్రముఖులు, ప్రముఖ రచయితలు, మేధావులు, ముఖ్యంగా జస్వంత్ సింగ్, అరుణ్ శౌరీ, నళినీ సింగ్ వంటి ప్రముఖులతో మాట్లాడేదాన్ని. న్యూఢిల్లీలో ఎంజే అక్బర్ లాంటి గొప్ప జర్నలిస్టుతో పనిచేయడం గర్వంగా భావించే దాన్ని. ఆయన స్థాయికి ఎదగాలని కలలు కనేదాన్ని. కానీ తన కెంతో ఇష్టమైన ఉద్యోగం కోసం భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వచ్చిందంటూ అక్బర్ నిజస్వరూపం గురించి ఈ ఇండో అమెరికన్ జర్నలిస్టు పల్లవి వాషింగ్టన్ పోస్టులో షేర్ చేశారు. మొదటి సంఘటన 1994 సంవత్సరంలో తన పేజీ చూపించడానికి ఆయన క్యాబిన్కి వెళ్లాను. ఆయన నన్నుపొగుడుతూనే. అకస్మాత్తుగా ముద్దుపెట్టుకోవడానికి ముందుకొచ్చాడు. తీవ్ర గందరగోళం, అవమానం మధ్య బయటికి పరుగెత్తాను. ఈ విషయాన్ని నా ఫ్రెండ్ తుషితకు వెంటనే (ఆమె ఒక్కదానికే) చెప్పుకున్నాను. రెండవ సంఘటన కొన్ని నెలల తర్వాత మరో సంఘటన. ఈసారి ముంబైలో. ఒక పత్రికను ప్రారంభించటానికంటూ ముంబైలోని తాజ్ హోటల్లోని తన గదికి అక్బర్ నన్ను పిలిచాడు. అక్కడ మళ్ళీ ముద్దు పెట్టుకోవటానికి వచ్చినప్పుడు , తీవ్రంగా ప్రతిఘటించి పారిపోయాను. ఆ సందర్భంలో హోటల్ దగ్గర పడిపోయాను, దెబ్బలు కూడా తగిలాయి. దీంతో ఢిల్లీకి తిరిగి వచ్చిన తరువాత అక్బర్ నాపై ఎగిసి పడ్డాడు. తనకు లొంగకపోతే ఉద్యోగంనుంచి తీసేస్తానని బెదిరించాడు. అయినా నేను వెరవలేదు. అత్యాచార పర్వం ఉదయం 8 గంటలకే ఆఫీసుకు చేరుకుని పని పూర్తి చేసుకుని, ఎడిటోరియల్ పేజీలు సిద్ధంగా ఉంచి ఆయన్నుంచి తప్పించుకుని పారిపోయేదాన్ని. చాలాసార్లు రిపోర్టింగ్ వెళ్లిపోయేదాన్ని. ఈ క్రమంలోనే ఢిల్లీకి దూరంలో ఒక ప్రేమజంట(వేరు వేరు కులాలు)ను కుటుంబ సభ్యులు ఉరితీసిన భయానక ఉదంతాన్ని రిపోర్ట్ చేయడానికి వెళ్లాను. ఈ ఎసైన్మెంట్ జైపూర్లో పూర్తి చేసుకొని, తిరిగి వచ్చేలోపు అక్బర్నుంచి కాల్. స్టోరీ గురించి మాట్లాడాలని హోటల్కు రమ్మన్నాడు. భయపడుతూనే వెళ్లాను. హోటల్ గదిలో అతను విలాసంగా. మళ్లీ ఎటాక్ చేశాడు. కానీ ఈసారి ఎంత పోరాడినా ఫలితం లేకపోయింది. శారీరకంగా బలవంతుడైన అక్బర్ నన్ను వశం చేసుకుని, రేప్ చేశాడు. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయలేనంత అవమానంతో కుంగిపోయాను. దీని గురించి ఎవరికీ చెప్పలేదు. ఎవరికైనా చెబితే నమ్ముతారా? అసలు హోటల్ గదికి ఎందుకు వెళ్ళానంటూ నన్ను నేను నిందించుకుంటూ మిన్నకుండిపోయాను. దీంతో నాపై మరింత పట్టు బిగించిన అక్బర్ తన దాడి కొనసాగించాడు. పురుష సహోద్యోగులతో మాట్లాడటం చూస్తే చాలు..రెచ్చిపోయేవాడు. డెస్క్లో అందరిముందే గట్టి అరవడం, తిట్టడం చేసేవాడు. జీవితంలో అన్నింటిపైనా పోరాడిన నేను అతనితో ఎందుకు పోరాడలేకపోయాను? ఎందుకంటే..అతను నాకంటే అన్నివిధాలుగా శక్తివంతుడు. ఎన్నడూ ఊహించని ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలీదు. పైగా ఈ విషయంలోఅంతకుముందు పోరాడిన వాళ్లు నాకు ఎవరూ కనిపించలేదు. ఒకపక్క ఉద్యోగం పోతుందన్న భయం. మరోపక్క ఎక్కడో దూరంగా ఉన్న తల్లిదండ్రుల వద్ద నా నిజాయితిని ఎలా నిరూపించుకోవాలన్న ఆవేదన. తెలిసిందల్లా ఒకటే.. నన్ను నేను ద్వేషించుకుంటూ ప్రతిక్షణం చస్తూ బతకడం. రిపోర్టింగ్ కోసం ఎపుడెపుడు దూరంగా పోదామా అని చూస్తూ ఉండేదాన్ని. ఇంతలో డిసెంబరు, 1994 కర్ణాటక ఎన్నికలు వచ్చాయి. ఈ సందర్భంగా పొలిటికల్ రిపోర్టింగ్లో పట్టును, గుర్తింపును, అనుభవాన్ని సాధించాను. దీనికి గుర్తింపుగా విదేశీ కరస్పాండెంట్గా యూఎస్, యూకే పంపిస్తున్నానని అక్బర్ చెప్పాడు. ఆశ్చర్యపోయాను. అలాగైనా అతని వేధింపులనుంచి దూరంగా వెళ్లొచ్చని సంబరపడ్డాను. కానీ అది తప్పని తరువాత తెలిసింది. దూరంగా ఉంటే నాకు రక్షణ ఉండదు కనుక తన వేట నిరాటంకంగా కొనసాగించవచ్చనేది అక్బర్ ప్లాన్. మళ్లీ వేట షురూ. ఒకసారి లండన్ ఆఫీసులో పురుష కొలీగ్తో మాట్లాడుతుండగా నాపై అక్బర్ మరోసారి విరుచుకుపడ్డాడు. డెస్క్లో పేపర్ వెయిట్, కత్తులు, చేతికి ఏది దొరికితే అది తీసుకొని నా మీదకు విసిరి పారేశాడు. దీంతో భయపడి లండన్ ఆఫీసునుంచి పారిపోయి సమీపంలోని ఒక పార్క్లో ఒక గంట దాక్కుని ఇంటికి చేరాను. ఆ మర్నాడు తుషిత, సుపర్నతో నా బాధను షేర్ చేసుకున్నాను. మానసికంగా, శారీరకంగా చితికిపోయాను. దుర్మార్గుడి నుంచి పారిపోతున్నానని చెప్పాను. లండన్ నుంచి వచ్చేయాలనుకుంటున్నానని అమ్మానాన్న, చెల్లికి కూడా చెప్పాను. విదేశీ ప్రతినిధిగా వీసా వుంది కదా అమెరికాలో కొంతమంది సీనియర్ ఎడిటర్ల సాయంతో పని చేసుకుందాం అనుకున్నా..కానీ ఇంతలో ముంబైకి తక్షణమే రమ్మంటూ అక్బర్ ఆజ్ఞాపించాడు. దీంతో ఇక ధైర్యంగా రిజైన్ చేశాను. ఆ తరువాత డౌజోన్స్లో అసిస్టెంట్ రిపోర్టర్గా జాయిన్ అయ్యాను. నేనిష్టపడే జర్నలిజాన్ని దక్కించుకున్నాను. ముక్కలుగా విరిగిపోయిన జీవితాన్ని తిరిగి దక్కించుకున్నాను. కృషి, పట్టుదల, టాలెంట్తో ఉన్నత స్థాయికి ఎదిగాను. ప్రస్తుతం నేషనల్ పబ్లిక్ రేడియోలో ఛీప్గా ఉన్నాను. పెళ్లికి ముందే నా భర్తకు ఇవన్నీ చెప్పాను. ఇపుడు ఇద్దరు బిడ్డలకు తల్లిని. బాధిత మహిళలకు మద్దతుగా ఉండటంతోపాటు యవ్వనంలో ఉన్న నా కొడుకు, కూతురుకోసం కూడా ఇది రాస్తున్నా. ఎవరైనా వేధిస్తున్నపుడు, బాధిస్తున్నపుడు తిరగబడాలని వారూ తెలుసుకోవాలి. నా గురించి ఎవరు ఎలా అయినా అనుకోనీ, ఆ చీకటి క్షణాలనుంచి బయటపడ్డాను. ఇలాగే ముందుకు సాగుతాను. ఇది పల్లవి గొగోయ్ ఆవేదన. మరోవైపు ఈ ఆరోపణలను ఎంజే అక్బర్ తిరస్కరిస్తున్నారని ఆయన న్యాయవాది సందీప్ కపూర్ వెల్లడించారు. -
మీటూ : పరువు నష్టం దావాపై ఈనెల 31న విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : తనను మాజీ కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ లైంగిక వేధింపులకు గురిచేశారని ఆరోపించిన జర్నలిస్ట్ ప్రియా రమణిపై దాఖలైన పరువు నష్టం దావాపై ఢిల్లీ కోర్టులో గురువారం విచారణ ప్రారంభమైంది. 20 ఏళ్ల కిందట ఎంజే అక్బర్ తన పట్ల అసభ్యంగా వ్యవహరించారని ప్రియా రమణి ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రియా రమణి ట్వీట్లతో మాజీ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి అక్బర్ ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతిన్నదని ఆయన తరపు న్యాయవాది గీతా లూథ్రా అడిషనల్ చీఫ్ మెట్రపాలిటన్ మేజిస్ర్టేట్ సమర్ విశాల్కు నివేదించారు. ఈ ఆరోపణల ఫలితంగా అక్బర్ మంత్రి పదవి నుంచి వైదొలిగారని గుర్తుచేశారు. జర్నలిస్టుగా అక్బర్ ప్రతిష్టను ప్రస్తావిస్తూ ఆయన 40 ఏళ్లుగా సంపాదించుకున్న పేరుప్రఖ్యాతులను ఈ ఆరోపణలు దెబ్బతీశాయంటూ ఆయన ఫిర్యాదును కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. తన క్లెయింట్ ప్రతిష్టను దిగజార్చేలా ప్రియా రమణి ట్వీట్ చేశారని, ఆమె రెండో ట్వీట్ను 1200 మంది లైక్ చేశారని, ఇది తన క్లెయింట్ ప్రతిష్టను దెబ్బతీయడమేనని లూథ్రా వాదించారు. జాతీయ, అంతర్జాతీయ మీడియాలో ఈ ట్వీట్లను ప్రస్తావించారని, తన ఆరోపణలను ఆమె నిరూపించలేకపోతే ఈ ట్వీట్లు అక్బర్ ప్రతిష్టను మసకబార్చేవేనని పేర్కొన్నారు. లూథ్రా వాదనలు విన్న అనంతరం అక్టోబర్ 31న అక్బర్ స్టేట్మెంట్ను నమోదు చేయాలని, దీనిపై తాము సంతృప్తికరంగా ఉంటే ప్రియా రమణికి నోటీసులు జారీ చేస్తామని కోర్టు పేర్కొంది. తనపై పలువురు మహిళా జర్నలిస్టులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో ఎంజే అక్బర్ మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అక్బర్ తనపై ఆరోపణలను తోసిపుచ్చుతూ ఇది రాజకీయ కుట్రేనని అభివర్ణించారు. మరోవైపు సత్యమే తనకు బాసటగా నిలుస్తుందని ప్రియా రమణి పేర్కొన్నారు. -
‘మీ టూ’కు తొలి వికెట్
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల్లోకి రాక ముందు వేర్వేరు మీడియా సంస్థల్లో ఎడిటర్గా పనిచేస్తున్న సమయంలో ఆయన లైంగికంగా వేధించారని పలువురు మహిళా జర్నలిస్టులు ఆరోపించడం తెల్సిందే. అక్బర్ రాజీనామాను ప్రధాని మోదీ, ఆ తర్వాత రాష్ట్రపతి కోవింద్ ఆమోదించారు. అక్బర్ రాజీనామా ‘మీటూ’ ఉద్యమ విజయమని మహిళా కార్యకర్తలు అభివర్ణించారు. తాజా పరిణామంలో సత్యం గెలిచిందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. 20 ఏళ్ల కిత్రం తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించిన మహిళా జర్నలిస్టు ప్రియా రమణిపై అక్బర్ దాఖలుచేసిన పరువు నష్టం దావాపై ఢిల్లీలోని పాటియాలా కోర్టులో గురువారం విచారణ ప్రారంభంకానుంది. వ్యక్తిగతంగానే పోరాడుతా.. వ్యక్తిగతంగానే కోర్టులో న్యాయ పోరాటం చేస్తానని అక్బర్ అన్నారు. ‘పదవికి రాజీనామా చేసి నాపై వచ్చిన ఆరోపణల్ని వ్యక్తిగతంగానే కోర్టులో సవాలుచేయడం సరైనదని భావించి రాజీనామా చేశా’ అని అన్నారు. దోవల్ను కలిశాకే నిర్ణయం.. ప్రధానికి సన్నిహితుడిగా పేరొందిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో సమావేశమయ్యాకే అక్బర్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అక్బర్పై ఆరోపణలు చేస్తున్న మహిళల సంఖ్య ఇప్పటికే 20దాటిందని, మరింత మంది ప్రియా రమణికి మద్దతుగా నిలబడే అవకాశాలున్నాయని నిఘా నివేదికలొచ్చాయని అక్బర్కు దోవల్ తెలిపారు. అక్బర్ వేధింపులకు పాల్పడిన వీడియోలూ బయటికొచ్చే చాన్సుందని తెలుస్తోంది. 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్బర్పై∙ఆరోపణలు పార్టీకి నష్టంతెస్తాయని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ప్రధాని సూచనతో అక్బర్ రాజీనామా చేసినట్లు సమాచారం. -
ఎట్టకేలకు రాజీనామా!
‘మీ టూ’ ఆరోపణలను బేఖాతరు చేస్తూ వచ్చిన విదేశాంగ శాఖ సహాయమంత్రి ఎం.జె. అక్బర్ ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. ఒక మహిళా జర్నలిస్టుపై తాను పెట్టిన పరువు నష్టం కేసు విచారణకు రావడానికి ముందురోజు అక్బర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యక్తిగత హోదాలోనే న్యాయస్థానంలో పోరాడి అవన్నీ తప్పుడు ఆరోపణలని రుజువు చేస్తానని ఆయన ఒక ట్వీట్లో తెలిపారు. ఒకరిద్దరు ఆరోపణలు చేస్తే వారికి ఉద్దేశాలను ఆపాదించటం, కొట్టిపారేయటం సులభం. కానీ ఆ బాధితుల సంఖ్య పెరుగుతూ పోతోంది. అంతేకాదు... ‘అవన్నీ వాస్తవం. బాధి తులకు అనుకూలంగా మేం సాక్ష్యం చెబుతామ’ంటూ మరికొందరు ముందుకు రావటంతో అక్బ ర్కు దారులన్నీ మూసుకుపోయాయని చెప్పాలి. ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకోవడంతో ఆయన రాజీనామా చేశారని ఒక కథనం, అది ఆయన సొంత నిర్ణయమేనని మరో కథనం మీడి యాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఏది నిజం... రేపన్న రోజున న్యాయ స్థానాలు ఏం తేలుస్తాయనే అంశాలు అలా ఉంచితే, బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు ఆరోపణలు వచ్చి నప్పుడు ఎలా ప్రవర్తించాలన్న అంశం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ రాఫెల్ వ్యవహారం జోరు కాస్త తగ్గించి, అక్బర్పై స్వరం పెంచి మాట్లా డటంతో ఈ ఎన్నికల సమయంలో బీజేపీకి ఇది నష్టదాయకంగా మారవచ్చునన్న అభిప్రాయం ఏర్పడి ఉండొచ్చు. నిజానికి తనంత తాను రాజీనామా చేయాలనుకుంటే అక్బర్ విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే ఆ పని చేసేవారు. అమెరికా మొదలుకొని మన దేశం వరకూ అన్నిచోట్లా ‘మీ టూ’పై విమర్శలు చేస్తున్నవారు బాధితులు ఇప్పుడే ఎందుకు గొంతెత్తుతున్నారని ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో రిపబ్లికన్లు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఎంపిక చేసిన బ్రెట్ కేవనాపై ఆరోపణలొచ్చిన పర్యవసానంగా దర్యాప్తు జరిగినప్పుడు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఇదే ప్రశ్న వేశారు. కానీ దీన్ని మహిళలంతా సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్పకూడదని ఎదురు ప్రశ్నించారు. నిజానికిది సామాజిక మాధ్యమాల విస్తృతి ఫలితంగానే సాధ్యమైంది. అంతక్రితం బాధిత మహిళ లకు ఉండే అవకాశాలు చాలా పరిమితం. ఆ అవకాశాలు కూడా నిర్దిష్టమైన చట్రానికి లోబడి మాత్రమే ఉంటాయి. విశాఖ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల పర్యవసానంగా మహిళా సిబ్బందికి లైంగిక వేధింపులు ఎదురైతే విచారించి చర్య తీసుకునేందుకు అంతర్గత కమిటీలు ఏర్పాటయ్యాయి. అలాగే ఏ మహిళైనా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి, నేరుగా న్యాయస్థానంలో కేసు దాఖలు చేసేందుకు అవకాశాలున్నాయి. కానీ వీటన్నిటికీ నిర్దిష్టమైన ప్రక్రియ ఉంటుంది. పైగా అలాంటి మహిళలు దాదాపు ఒంటరి పోరాటం జరపాల్సి ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి సమస్యలుండవు. ఒకరి స్వరానికి కొన్ని గంటల్లోనే వందలు, వేల స్వరాలు జత కలుస్తాయి. వారికి నైతిక మద్దతు పుష్కలంగా లభిస్తుంది. అలాగని తాము ఎదుర్కొన్న ఇబ్బందులను, సమస్యలను సామాజిక మాధ్యమాల ద్వారా బయటపెట్టడం బాధిత మహిళలకు అంత సులభమైన విషయమేమీ కాదు. ఆ వేధింపులు ఎంతో మానసిక క్షోభకు గురిచేస్తే తప్ప, ఇక గత్యం తరం లేదనుకుంటే తప్ప వాటిని బయటపెట్టడానికి ఎవరూ సాహసించరు. ఎంతో అభివృద్ధి చెందిందనుకుంటున్న పాశ్చాత్య దేశాల్లోనే హాలీవుడ్ దర్శకుడు హర్వీ వైన్స్టీన్ వంటి ‘సీరియల్ రేపిస్టుల’ అసలు స్వరూపం వెల్లడి కావడానికి దశాబ్దాలు పట్టింది. ఎందుకంటే తమను వేధించే వ్యక్తులతో మాత్రమే కాదు... భిన్న స్థాయిల్లో వారికి అండగా నిలబడే వ్యవస్థలతో కూడా ఆ బాధిత మహిళలు పోరాడవలసి ఉంటుంది. పైగా చాలా సందర్భాల్లో ఆ పోరాటం ఒంటరిగానే సాగిం చాల్సి ఉంటుంది. విలువైన సమయాన్ని, డబ్బును...మొత్తంగా జీవితాన్ని దానికోసమే వెచ్చిం చాల్సి ఉంటుంది. ఈలోగా ఇదంతా ఆమె స్వయంకృతాపరాధమని ముద్ర వేసే ప్రయత్నాలు మొదలవుతాయి. ఒక సమస్యను ఎదుర్కొనడానికి వెళ్తే సవాలక్ష సమస్యలు చుట్టుముడుతున్నపుడు మౌనంగా ఉండటమే శ్రేయస్కరమన్న భావన ఏర్పడుతుంది. సామాజిక మాధ్యమాలు ఇలాంటి అవాంతరాలనూ, అడ్డుగోడలనూ ఛేదించాయి. బాధితులకూ, వారికి అండగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నవారికీ మధ్య వారధి నిర్మించాయి. అందుకే కాస్త ఆలస్యమైంది తప్ప ‘మీ టూ’ మన దేశంలో అన్ని రంగాలనూ ముంచెత్తడం మొదలుపెట్టింది. రాజకీయ పార్టీలు, వాటికి అనుబం ధంగా ఉండే సంఘాలు కూడా దీనికి తలవంచక తప్పని స్థితి ఏర్పడింది. ఆఖరికి బీజేపీ, కాంగ్రె స్లు సైతం ఇన్నాళ్లుగా తమ సంస్థల్లో లైంగిక వేధింపుల ఫిర్యాదులపై విచారణ జరిపేందుకు అవస రమైన యంత్రాంగాలను నెలకొల్పుకొనలేదని వెల్లడైంది. ఇప్పటికిది నగరాల్లోని ఉన్నత వర్గాలకు పరిమితమైన ధోరణిగా కనబడుతున్నా ఇక్కడితో ఇది ఆగుతుందని చెప్పలేం. మన సమాజంలో మహిళలను వేధించే ధోరణి సర్వత్రా ఉన్నప్పుడు, దాని వల్ల బాధితులుగా మారిన వారికి ఈ ఉద్యమ స్ఫూర్తి ఆలస్యంగానైనా చేరకతప్పదు. తమకు జరుగుతున్న అన్యాయాలను మౌనంగా భరించడంకాక ఎలుగెత్తి చాటితే ప్రయోజనం సిద్ధిస్తుం దన్న భరోసా ఏర్పడుతుంది. అక్బర్ వ్యవహార శైలి గురించి ఒకరి తర్వాత ఒకరు బయట పెడుతుండగా అహ్మదాబాద్లోని ఒక సంస్థలో పనిచేసే ప్రొఫెసర్ తనను లైంగికంగా వేధించాడని ఒక యువతి వెల్లడించింది. ప్రముఖ పెయింటర్ జతిన్దాస్ తమతో అసభ్యంగా ప్రవర్తించేవారని నలుగురైదుగురు యువతులు బయటపెట్టారు. ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడిపై ఆరోపణలు రావడంతో అతనితో రాజీనామా చేయించారు. ఏదేమైనా అక్బర్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరో పణలు తీవ్రమైనవి. వాటిలోని నిజానిజాలు నిగ్గుదేలేలోగా ఆయన పదవి నుంచి వైదొలగడమే సరైంది. ఆలస్యంగానైనా అది జరగడం హర్షించదగ్గది. -
#మీటూ : ఎంజె అక్బర్ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులపై వెల్లువెత్తిన ఉద్యమంలో మీటూలో కీలక అడుగు పడింది. లైంగిక వేధింపుల ఆరోపణల్లో పీకల్లోతు కూరుకుపోయిన కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ ఎట్టకేలకు పదవికి రాజీనామా చేశారు. పలు మహిళా జర్నలిస్టులను లైంగికంగా వేధించాడన్న ఆరోపణలు సోషల్ మీడియాలో ప్రకంపనలు పుట్టించాయి. ముందుగా ప్రియరమణి అనే జర్నలిస్టు ఆయనపై ట్విటర్ ద్వారా ఆరోపణల చేశారు. దీంతో అక్బర్ బాధితులు దాదాపు 20 మంది మీటూ అంటూ మీడియా ముందుకు వచ్చారు. తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలను వ్యక్తిగతంగా ఎదుర్కొనేందుకే పదవి నుంచి తప్పుకున్నానని బుధవారం ఎంజేఅక్బర్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే కేంద్రమంత్రిగా దేశానికి సేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్కు ఈ సందర్భంగా అక్బర్ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకే, అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ప్రియరమణిపై అక్బర్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై పలు జర్నలిస్టు సంఘాలు, మహిళా జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీన్ని వెనక్కి తీసుకోవడంతోపాటు, తక్షణమే మంత్రి పదవికి ఎంజె అక్బర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు బీజేపీ అనుబంధ సంస్థ శివసేన కూడా అక్బర్ వ్యవహారంపై మండిపడిన సంగతి తెలిసిందే. ప్రియా రమణి ఏమన్నారు? అటు కేంద్రమంత్రి ఎంజే అక్బర్ రాజీనామాపై మీటూ ఉద్యమ ప్రధాన సారధి ప్రియా రమణి ట్విటర్లో స్పందించారు. ఆయన రాజీనామాతో మహిళలుగా విజయం సాధించాం. కోర్టులో కూడా న్యాయపరంగా విజయం సాధించే రోజు కోసం తాను ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. As women we feel vindicated by MJ Akbar’s resignation. I look forward to the day when I will also get justice in court #metoo — Priya Ramani (@priyaramani) October 17, 2018 -
మోదీ సర్కార్ తీరే వేరు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజె అక్బర్కు వ్యతిరేకంగా లైంగిక వేధింపుల ఆరోపణలు రోజు రోజుకు వెల్లువెత్తుతున్నప్పటికీ ఆయన్ని మంత్రివర్గం నుంచి తొలగించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సుముఖంగా లేదు. ఎవరి నుంచి ఏ అవినీతి ఆరోపణలు వచ్చినా చర్య తీసుకోకుండా భీష్మించుకుని కూర్చోవాలన్నది మోదీ ప్రభుత్వం విధానంగా కనిపిస్తోంది. నాలుగేళ్ల క్రితం మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీపై ఎన్నికల అఫిడవిట్లో విద్యార్హతలు తప్పుగా పేర్కొన్నారన్న ఆరోపణలతో వివాదం చెలరేగింది. మోదీ ప్రభుత్వం ఆమెకే అండగా నిలిచింది. ఇతర కారణాల చేత ఆ తర్వాత ఆమె శాఖను మార్చారు. ఐపీఎల్ స్కామ్లో కూరుకుపోయిన లలిత్ మోదీ దేశం విడిచి పారిపోయేందుకు సహకరించిన కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పెద్ద పెట్టున ఆందోళన చేసినా వారిని మోదీ ప్రభుత్వం తొలగించలేదు. దేశంలోని బ్యాంకులకు 9,400 కోట్ల రూపాయలు ఎగవేసి లండన్ పారిపోయిన విజయ్ మాల్యా విషయంలో అత్యంత నిర్లక్ష్యం వహించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపైనా ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు. పార్లమెంట్ ఆవరణలో జైట్లీని కలుసుకున్న విజయ్ మాల్యా ఆ రోజు సాయంత్రం లండన్ వెళుతున్నట్లు చెప్పినా, ఆయన్ని ఆపేందుకు జైట్లీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నది తెల్సిందే. ఏబీవీపీ తరఫున పోటీ చేసి ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థి సంఘం అధ్యక్షడిగా ఎన్నికైన అంకివ్ బైసో డిగ్రీ పట్టా నకిలీదని తేలినా ఆయనపై చర్య తీసుకోవడానికి బీజేపీ తిరస్కరించింది. అంతెందుకు ప్రధాని నరేంద్ర మోదీపైనే పలు ఆరోపణలు వచ్చాయి. భార్యను వదిలిపెట్టిన ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో బ్రహ్మచారిగా పేర్కొన్నారు. మోదీ ఎంఏ పూర్తి చేయకుండానే చేసినట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారన్నది వివాదాస్పదం అయింది. తనకన్నా వయస్సులో ఎంతో చిన్నదైన యువతిపై అధికార దుర్వినియోగానికి పాల్పడి నిఘా ఏర్పాటు చేశారన్న ఆరోపణలు మోదీపై కొత్త కాదు. మంత్రులు రాజీనామా అవసరం లేదన్న రాజ్నాథ్ ‘మా మంత్రులు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఇది వారి ప్రభుత్వం కాదు. ఇది ఎన్డీయే ప్రభుత్వం. విమర్శలకు తలొగ్గి రాజీనామాలకు, ఉద్వాసనలకు మేము పాల్పడం. అలా చేస్తే విమర్శలు వస్తూనే ఉంటాయి. రాజీనామాలు, ఉద్వాసనలు కొనసాగించాల్సి వస్తుంది. అప్పుడు ప్రభుత్వం బలహీన పడుతుంది. ఈ విషయాన్ని మేము రెండో యూపీఏ ప్రభుత్వం నుంచే నేర్చుకున్నాం....’ అప్పట్లో వసుంధర రాజె, సుష్మా స్వరాజ్ల రాజీనామా డిమాండ్లపై స్పందిస్తూ రాజ్నాథ్ చేసిన వ్యాఖ్యలివి. యూపీఏ హయాంలో మంత్రులు రాజీనామా చేయలేదనా, చేసినందు వల్ల ప్రభుత్వం బలహీన పడిందన్నది ఆయన ఉద్దేశమా ? స్పష్టత లేదు. యూపీఏ హయాంలో తమపై వచ్చిన ఆరోపణలను చట్టబద్ధంగా ఎదుర్కోవడానికి నైతిక బాధ్యత వహించి పలువురు మంత్రులు రాజీనామాలు చేశారు. రాజీనామాల పర్వం లలిత మోదీ ఐపీఎల్ స్కామ్తోని అప్పటి విదేశాంగ సహాయ మంత్రి శశి థరూర్కు ప్రమేయం ఉందని ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనతోని రాజీనామా చేయించింది. ఆ తర్వాత అవినీతి ఆరోపణల కారణంగా కేంద్ర కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక శాఖ మంత్రి ఏ రాజా, జౌళి శాఖ మంత్రి దయానిధి మారన్, రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సాల్, మైక్రో, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ వీరభద్ర సింగ్, పర్యాటక శాఖ మంత్రి సుబోద్ కాంత్ సహాయ్, న్యాయ శాఖ మంత్రి అశ్వణి కుమార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్లు రాజీనామాలు చేశారు. వారిలో కొంత మంది ఇప్పటికే కేసుల నుంచి నిర్దోషులుగా బయటకు రాగా, మరికొందరిపై కేసుల విచారణ ఇప్పటికీ కొనసాగుతోంది. ఎవరికీ శిక్ష పడలేదు. ప్రస్తుతం లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంజె అక్బర్ను తొలగించాల్సిందిగా ఆరెస్సెస్ అధిష్టానం నుంచి మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఎంజె అక్బర్ ముస్లిం అయినందువల్లనే ఆరెస్సెస్ ఒత్తిడి తెస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
మీ బిడ్డలను బీజేపీ నుంచి కాపాడండి
షియోపూర్ (మధ్యప్రదేశ్): కేంద్ర మంత్రి ఎంజే అక్బర్పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. బీజేపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి బిడ్డలను కాపాడుకోవాలన్నారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘బేటీ బచావో, బేటీ పడావో’ నినాదాన్ని ‘బీజేపీ కే మంత్రి ఔర్ ఎమ్మెల్యే సే బేటీ బచావో (బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి అమ్మాయిలను కాపాడండి)’ అనే దానిలా మార్చాలని ఎద్దేవా చేశారు. -
ఇది కేంద్రానికి రమణికి మధ్య పోరాటం!
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఇది ఎంజె అక్బర్ వర్సెస్ నా భార్య ప్రియ (రమణి)కు మధ్య పోరాటం కాదు. అక్బర్ కేంద్ర మంత్రి కనుక యావత్ కేంద్రానికి, అక్బర్ పేర్కొన్న 97 మంది న్యాయవాదులు, నా భార్య మధ్య జరుగుతున్న పోరాటం. ఎక్కడో ఉంటున్న మా ఇంటి చిరునామాను ఒక్క పూటలో పట్టుకున్నారంటే అక్బర్ పవర్ ఏమిటో నాకు తెలుసు. నా భార్య మొదటిసారి అక్బర్ పేరును వెల్లడించినప్పుడు ఎలా స్పందించాలో నాకు అర్థం కాలేదు. ఎక్కడ మా చిన్న, ప్రశాంత జీవితం బలవుతుందేమోనని భయపడ్డాను. అక్బర్ బాధితులు కూడా ఇలాగే భయపడి ఉంటారు. అప్పుడు, అలా భయపడక పోయి ఉంటే వ్యక్తిగత జీవితాలను పక్కన పెడితే ఎంత మంది వృత్తి జీవితాలు దెబ్బ తినేవో! భారత్ లాంటి పురుషాధిక్య సమాజంలో లైంగిక వేధింపులను ఓ రకంగా తమ హక్కుగా పురుషులు భావిస్తున్నారు. మగవాడు మగవాడే, ఆడది ఎక్కడుండాలో అక్కడ ఉండాల్సిందే అన్నది వారి వాదన. బాధితులెప్పుడూ బలహీనులే, భయపడే వారే. అందుకే దేశంలో మహిళలు, పిల్లలపై జరుగుతున్న అత్యాచారల్లో 70 శాతం సంఘటనలు ఫిర్యాదుచేసే వరకు రావడం లేదు. సమాజం ప్రభావం మహిళలపై కూడా కొనసాగుతోంది. భార్యను భర్త కొట్టడం తప్పేమి కాదని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలో 42 శాతం మగవాళ్లు అభిప్రాయపడగా 52 శాతం మంది మహిళలు అభిప్రాయపడ్డారంటే ఆశ్చర్యం. అలాంటి సమాజంలోనే పుట్టి పెరిగింది నా భార్య. తనపై జరిగిన లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదు చేసే ధైర్యం ఆమెకు ఆనాడు లేకపోవచ్చు. మీటూ ఉద్యమం వల్ల ఆలస్యంగానైనా పురుష పుంగవులు లైంగిక ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటికి శిక్షలుండాలన్నదే బాధితుల వాదన. నా భార్య చేస్తున్న పోరాటంలో ప్రతిపక్ష పార్టీలు మద్దతుగా నిలుస్తాయని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే, వారిదంతా ఒక్కటే రాజకీయ కులం. అక్బర్ విషయంలో నా ప్రియ చూపిన ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేక పోయాను. అందుకే ఆమెకు అండగా నిలబడాలనుకున్నాను. ‘నిజం’ ఒక్కటే మాకు కవచం. అదే గెలిపిస్తుందని నమ్మకం. అక్బర్ బాధితులంతా ముందుకొస్తే గెలుపు అంత కష్టం కూడా కాకపోవచ్చు’–––సమర్ హలార్న్కర్. (గమనిక: కేంద్ర మంత్రి ఎంజె అక్బర్ తనపై లైంగిక వేధింపు ఆరోపణలు చేసిన ప్రియా రమిణిపై నేరపూరిత పరువు నష్టం దావా వేయడం పట్ల ఆమె భర్త, ‘ఇండియా స్పెండ్ డాట్ కామ్’ ఎడిటర్ సమర్ హలార్న్కర్ స్పందన ఇది. ముందుగా ట్విట్టర్లో స్పందించిన ఆయన ఆ తర్వాత తమ డాట్కామ్లో పెద్ద వ్యాసమే రాశారు. ఆ వ్యాసంలోని సారాంశాన్నే ఇక్కడ క్లుప్తంగా ఇస్తున్నాం) -
ఎంజె అక్బర్ కేసులో గెలుపెవరిది?
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని విదేశాంగ శాఖ సహాయ మంత్రి, మాజీ సీనియర్ జర్నలిస్ట్ ఎంజె అక్బర్ సోమవారం నాడు ప్రియా రమణిపై నేరపూరిత పరువు నష్టం దావా వేసిన విషయం తెల్సిందే. అందులో ఆయన తన తరపున వాదించడానికి 30 మంది మహిళలు సహా 97 మంది న్యాయవాదులను పేరు పేరున పేర్కొనడం గమనార్హం. అక్బర్పై లైంగిక ఆరోపణలు చేసిన 14 మంది మహిళల్లో ప్రియా రమణి మొదటి వారు. 2017, అక్టోబర్ నెలలో ‘వోగ్ ఇండియా’లో ఓ ఎడిటర్ నీచ ప్రవర్తన గురించి ప్రియా రమణి ఓ ఆర్టికల్ రాశారు. అయితే ఆ వ్యాసంలో ఆమె ఆ ఎడిటర్ పేరును ప్రస్తావించలేదు. ఏడాది అనంతరం అక్టోబర్ 8వ తేదీన ఆ ఎడిటరే ఎంజె అక్బర్ అంటూ ట్వీట్ చేశారు. దాంతో మరో 13 మంది మహిళా జర్నలిస్టులు బయటకు వచ్చి తాము కూడా అక్బర్ లైంగిక వేధింపులకు గురయ్యామని ఆరోపించడం తెల్సిందే. అప్పుడప్పుడు మీడియాను వేధించేందుకు రాజకీయ నాయకులు పరువు నష్టం దావాలు వేయడం మామూలే. ఇప్పుడు తనపై వచ్చిన ఆరోపణలకు అక్బర్ ఏకంగా నేరపూరిత పరువు నష్టం దావా వేశారు. దీని కింద దోషికి జరిమానా లేదా రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. అక్బర్ తన పిటిషన్లో ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించారు. ఒకటి సమాజంలో తన పరువు, ప్రతిష్టను దెబ్బతీయడానికి నిరాధార ఆరోపణలు చేశారని, దీని వెనక రాజకీయ కోణం ఉందన్నది. రెండోది 20 ఏళ్ల క్రితం నిజంగా లైంగిక వేధింపులు జరిగి ఉంటే ఇంతకాలం ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నది. ‘మీటూ’ ఉద్యమంలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మగవాళ్లందరు కూడా ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పటి వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న అంశాన్నే నొక్కి ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు అక్బర్ పెట్టుకున్న 97 మంది న్యాయవాదులకన్నా ఎక్కువ మంది న్యాయవాదులు సమాధానం చెప్పగలరు. ఇందులో ముడివడి ఉన్న మొట్టమొదటి అంశం ‘పవర్ ఈక్వేషన్’. అంటే, ఎవరి అధికారం ఎక్కువ, ఎవరిది తక్కువన్నది. సహజంగా బాధితుల అధికారమే తక్కువుంటుంది. వేధింపుల గురించి ఫిర్యాదు చేస్తే కక్ష సాధింపు చర్యలు ఉంటాయన్న భయం, వ్యక్తిగత, వృత్తి జీవితాలకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందన్న ఆందళన వారిని వెంటాడుతోంది. అందుకనే వారు ఫిర్యాదు చేయడానికి సాహసించలేరు. ఎందుకు కేసు పెట్టరంటే..... ఫిర్యాదు చేయాలన్నా అప్పటికి ‘సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్, రిడ్రెసల్) యాక్ట్’ లేదు. దీన్ని యూపీఏ ప్రభుత్వం 2013లో తీసుకొచ్చింది. ఈ చట్టం రాకముందు లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చే యాలంటే పోలీసుల వద్దకు వెళ్లడం ఒక్కటే మార్గం. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులపై ఫిర్యాదు చేయాలంటే ఎంతో ఒత్తిడి గురికావాల్సి వస్తుంది. వ్యక్తిగత పరువు, ప్రతిష్టలు దెబ్బతీస్తారన్న భయం ఉంటుంది. ఫిర్యాదు చేసిన పెద్దవారిపై చర్యలు తీసుకుంటారన్న నమ్మకం ఉండదు. పలుకుబడిగల వ్యక్తులపై ఫిర్యాదు కోసం పోలీసు స్టేషన్కు వెళితే ఫిర్యాదును తిరస్కరించిన ఉదంతాలను ఇప్పటికీ వింటుంటాం. పైగా చట్టానికూడా పరిమితులు ఉన్నాయి. ఫలానా కేసుకు ఫలానా కాల పరిమితిలోగా ఫిర్యాదులు చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. లైంగిక వేధింపుల కేసే తీసుకుంటే సంఘటన జరిగిన నాటి నుంచి మూడేళ్లలోపే ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. జరిగిన సంఘటన నుంచి తేరుకొని, పోరాడే మనస్తత్వాన్ని సంతరించుకొని, ఫిర్యాదు దాఖలుచేసే ధైర్యాన్ని కూడదీసుకునే వరకే ఈ మూడేళ్ల సమయం గడచిపోవచ్చు. కేసు పెట్టక పోవడం కూడా హక్కే! కేసు దాఖలు చేయడానికి కాల పరిమితి ముగిసి పోయినందున తనపై కేసు కొట్టివేయాలన్నది కూడా అక్బర్ పిటిషన్లో ఓ వాదన. కేసు కొట్టివేస్తే ఆయన నిర్దోషన్నమాట. ఇదంతా తప్పుడు వాదనే అవుతుంది. కేసు పెట్టడం, పెట్టకపోవడమన్నది బాధితురాలి ఇష్టమే కాదు, ఆమె హక్కు కూడా. ఆమె జరిగిన సంఘటన గురించి కేసు దాఖలు చేయలేదు కనుక ఆ సంఘటన గురించి ఆమెకు వెల్లడించే హక్కు లేదంటే ఎలా? నేరాన్ని రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనప్పుడు నేరస్థుడు విడుదలవుతాడు, అలాంటప్పుడు తనకు జరిగిన అన్యాయం గురించి బాధితుడు లేదా బాధితరాలు మాట్లాడకూడదంటే ఎట్లా! జరిగిన సంఘటన నిజమైనప్పుడు పరువు నష్టం దావాను శంకించాల్సిందే! గెలుపోటములు అంతిమంగా ప్రియా రమణి లైంగిక ఆరోపణలు నిజమవుతాయా, ఎంజె అక్బర్ పరువు నష్టం దావా నెగ్గుతుందా? అన్నది ప్రశ్న. ఏ కేసులోనైనా సరే నిజా నిజాలు తేల్చాలంటే చట్ట ప్రకారం అందుకు తగిన ఆధారాలు ఉండాల్సిందే. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించిన ఆధారాలు ఆమె చూపించలేకపోవచ్చు. పైగా సకాలంలో ఫిర్యాదు చేయలేదు. అక్బర్ నమ్ముతున్నది కూడా ఇదే. ఆ తర్వాత ఏకంగా 13 మంది మహిళలు ఆయనపై ఆరోపణలు చేయడం చిన్న విషయమేమీ కాదు. వారు కూడా కోర్టు వర కు వచ్చి సాక్ష్యాలిస్తే కేసు బలపడుతుంది. మొట్టమొదటి సారిగా తన పేరు బయటపెట్టి పరువు తీసిందన్న అక్కసుతోపాటు ఇంకెవరు తనకు వ్యతిరేకంగా బయటకు రావద్దనే ఉద్దేశంతో అక్బర్ పరువు నష్టం దావా వేసినట్లు కనిపిస్తోంది. ఆయన పరువు నష్టం దావాను కూడా ఆయనే నిరూపించుకోవాలి కనుక అది నిలబడే అవకాశం లేదు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు, అందులోనూ జర్నలిస్టులు రాజకీయంగా తనను దెబ్బతీయడానికి కుట్రపన్నారని నిరూపించడం అంత సాధ్యమయ్యే పనేమీ కాదు. -
ముదిరిన ‘మీ టూ’ వ్యవహారం
న్యూఢిల్లీ/ముంబై: భారత సినీ, రాజకీయ, మీడియా రంగాల్లో ‘మీ టూ’ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. పనిప్రదేశంలో తమను వేధించినవారి వివరాలను పలువురు మహిళలు ‘మీ టూ’ పేరుతో వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇలా ఆరోపణలు ఎదుర్కొన్నవారిలో మాజీ జర్నలిస్ట్, విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్, నటులు అలోక్నాథ్, నానా పటేకర్, బాలీవుడ్ దర్శకులు సాజిద్ ఖాన్, సుభాష్ ఘయ్ ఉన్నారు. తమను ఎంజే అక్బర్ వేధించాడని జర్నలిస్ట్ ప్రియా రమణి సహా 11 మంది మహిళా జర్నలిస్టులు ఆరోపించగా, సీనియర్ నటుడు అలోక్నాథ్ తనపై అత్యాచారం చేశాడని దర్శకురాలు, రచయిత్రి వినతా నందా ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రియా రమణిపై కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ సోమవారం ప్రైవేటు క్రిమినల్ పరువునష్టం దావాను దాఖలు చేశారు. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో దాఖలు చేసిన ఈ పిటిషన్లో అక్బర్ న్యాయవాది సందీప్ కుమార్ స్పందిస్తూ.. ‘అక్బర్ జర్నలిస్టుగా సుదీర్ఘకాలం పనిచేశారు. దేశంలో తొలి రాజకీయ వారపత్రికను ఆయనే ప్రారంభించారు. జర్నలిస్ట్ ప్రియా రమణి ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశంతో ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం నా క్లయింట్ తనను వేధించాడని ఇప్పుడు ఆరోపిస్తున్నారు. ఆయన రాజకీయ జీవితాన్ని, పేరు ప్రతిష్టలను దెబ్బతీసేందుకు మీడియాలో ఈ విద్వేషపూరిత ప్రచారం సాగుతోంది. ప్రియా రమణి చర్యలతో అక్బర్ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లడంతో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహచరులతో ఆయన సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అంతేకాకుండా ప్రియా రమణి ఆరోపణలతో నా క్లయింట్ తీవ్ర మానసిక వేదన, ఒత్తిడికి లోనయ్యారు’ అని కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా అక్బర్ తరఫున వాదించేందుకు సిద్ధంగా ఉన్న 97 మంది లాయర్ల పేర్లను సందీప్ కుమార్ కోర్టుకు అందజేశారు. మరోవైపు అక్బర్ పరువునష్టం దావా దాఖలు చేయడంపై స్పందించిన ప్రియా రమణి.. తానూ న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. మరోవైపు తనపై అలోక్నాథ్ పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపించిన రచయిత్రి వినతా నందాపై సివిల్ పరువునష్టం దావా దాఖలైంది. వినతా నందా తనకు బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు నష్టపరిహారంగా రూ.1 చెల్లించాలని కోరుతూ ముంబైలోని దిన్దోషి సెషన్స్ కోర్టులో అలోక్నాథ్ పిటిషన్ దాఖలు చేశారు. గొంతు నొక్కేయాలని చూస్తున్నారు.. లైంగికవేధింపులకు గురైన బాధితుల భయాన్ని, బాధను అక్బర్ ఏమాత్రం పట్టించుకోలేదని ప్రియా రమణి దుయ్యబట్టారు. బెదిరించడం, వేధింపులకు గురిచేయడం ద్వారా బాధితుల గొంతును నొక్కేసేందుకు అక్బర్ యత్నిస్తున్నారని ఆరోపించారు. ఎంజే అక్బర్కు వ్యతిరేకంగా గతంలో గళమెత్తినవారు వృత్తి, వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రియా రమణి అన్నారు. మరోవైపు ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకూ అక్బర్ పదవి నుంచి తప్పుకోవాలని ఇండియన్ వుమెన్స్ ప్రెస్ కోర్(ఐడబ్ల్యూపీసీ), ప్రెస్క్లబ్ ఆఫ్ ఇండియా(పీసీఐ), ప్రెస్ అసోసియేషన్ అండ్ సౌత్ ఏషియన్ వుమెన్ ఇన్ ఇండియా సంయుక్తంగా డిమాండ్ చేశాయి. నిష్పాక్షిక విచారణ జరిగేందుకు వీలుగా అక్బర్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కోరాయి. లైంగిక వేధింపులపై మహిళా ఉద్యోగులు చేసే ఫిర్యాదులను సీరియఎస్గా తీసుకోవాలనీ, వాటిని ఉద్దేశ్యపూర్వక ఫిర్యాదులుగా పరిగణించరాదని విజ్ఞప్తి చేశాయి. కేంద్ర మంత్రి అక్బర్ తక్షణం పదవి నుంచి తప్పుకోవాలని ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ఇంటిముందు ఆందోళనకు దిగారు. జర్నలిస్ట్ దువాపై ఆరోపణలు ది వైర్ వెబ్సైట్ కన్సల్టింగ్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా తనను లైంగికంగా వేధించాడని డాక్యుమెంటరీ దర్శకురాలు నిష్టా జైన్ ఆరోపించింది. తాను 1989లో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వినోద్కు కలుసుకున్నాననీ, తాను కుర్చీలో కూర్చోకముందే అతను సెక్స్ జోక్ వేశాడని తెలిపారు. ‘‘ఓ రోజు కారు పార్కింగ్ ప్రదేశంలో దువా కనిపించాడు. ‘నీతో మాట్లాడాలి. నా కారులో కూర్చో’ అని కోరాడు. తన ప్రవర్తనకు క్షమాపణలు కోరతాడనుకొని కారులో కూర్చోగానే నా మీద పడిపోయి ముఖమంతా ముద్దులు పెట్టాడు. ఎలాగోలా తప్పించుకున్నా’’ అని తెలిపారు. మిత్రపక్షాల అసంతృప్తి సెగ.. సాక్షి ప్రతినిధి న్యూఢిల్లీ: అక్బర్ను తప్పించేందుకు కేంద్రం చొరవ తీసుకోని నేపథ్యంలో మిత్రపక్షాలే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర విదేశాంగ సహాయ మంత్రిగా ఉన్న అక్బర్ వెంటనే పదవి నుంచి దిగిపోవాలనీ, లైంగిక వేధింపు ఆరోపణలపై విచారణను ఎదుర్కోవాలని ఎన్డీయే మిత్రపక్షం జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) డిమాండ్ చేసింది. ‘ఈ విషయంలో అక్బర్ సొంతంగా ఓ నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నా. ఒకవేళ తప్పుకోకుంటే ప్రభుత్వమే మంత్రి బాధ్యతల నుంచి తొలగించాలి’ అని∙జేడీయూ నేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. మరోవైపు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళలపై అక్బర్ న్యాయపోరాటానికి దిగడం కేంద్ర ప్రభుత్వానికి ప్రతికూలంగా మారే అవకాశముందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
#మీటూ : పోరుకు సై, సత్యమే రక్ష
సాక్షి, న్యూఢిల్లీ: మీటూ పేరుతో సాక్షాత్తూ కేంద్రమంత్రిపై లైంగిక ఆరోపణలు చేసి జర్నలిస్టు ప్రియా రమణికి దేశవ్యాప్తంగా మహిళా జర్నలిస్టులనుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఏకంగా 97మంది లాయర్ల సహకారంతో క్రిమినల్ డిఫమేషన్ కేసు దాఖలు చేయడంపై మండిపడుతున్నారు. ముఖ్యంగా 14మందికిపైగా మహిళల ఆరోపణలను కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏమీ పట్టించుకోలేదు. మంత్రిపై ఎలాంటి చర్యల్ని ప్రకటించలేదు. కనీస విచారణ చేపడతామన్న మాటకూడా మాట్లాడలేదనీ ఇది శోచనీయమని విమర్శించారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా అక్బర్ తీసుకున్న చర్య విస్తుగొల్పిందని దుయ్యపట్టారు. 14మంది మహిళలు ఆరోపణలు చేస్తే కేవలం ప్రియా రమణిపైనే ఎందుకు కేసులని కామిని జైశ్వాల్ ప్రశ్నించారు. దీని వెనుక పెద్దకుట్ర దాగా వుందని ఆరోపించారు. మరోవైపు పరువు నష్టం దావాపై ప్రియా రమణి కూడా ట్విటర్ లో స్పందించారు. దీనిపై పోరాడడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. సత్యమే తనకు రక్షణ అని పేర్కొన్నారు. అనేక మంది మహిళలు అతడిపై చేసిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో కేవలం తనను మాత్రమే బెదిరించడం వేధింపుల ద్వారా వారి నోరు మూయించాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. పలు మహిళా జర్నలిస్టు సంఘాలు తాజా పరిణామంపై తీవ్ర ఆగ్రహాన్నివ్యక్తం చేశాయి. తక్షణమే అక్బర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ప్రియా మరణి రమణికి మద్దతుగా దేశాధ్యక్షుడు రామ్ నాద్ కోవింద్కు, ప్రధానమంత్రి నరేంద మోదీకి లేఖ రాస్తూ ఒక ప్రకటన విడుదల చేశాయి. అక్బర్ను పదవినుంచి తొలగించాలని, అలాగే రమణిపై కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసాయి. మరోవైపు మనీ లైఫ్ ఇండియా మేగజైన్ కు ఎడిటర్ గా వ్యవహరిస్తున్న సుచేతా దలాల్... ప్రియరమణితో పాటు 14మంది ఇతర జర్నలిస్టులు కూడా స్థైర్యం కోల్పోరాదని, ఖర్చులకు కూడా వెరువరాదని హితవు పలికారు. జరిగిన అన్యాయంపై పోరాటం చేయాలంటే ఆర్థికంగా కూడా ఎంతో భరించాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ప్రియా రమణి తరఫున వాదించేందుకు ప్రముఖ లాయర్లు చాలా మందే ఉన్నారని, అందుకయ్యే ఖర్చు కూడా తమ శక్తికొద్దీ భరిస్తామని సుచేతా దలాల్ ప్రతిపాదించడంతో... ఆ ట్వీట్ చాలా మంది ఫాలో అవుతూ తాము కూడా మద్దతుగా నిలుస్తామని ప్రకటించడం గమనార్హం. కాగా పలు మహిళా జర్నలిస్టుల లైంగిక ఆరోపణల నేపథ్యంలో కేంద్రమంత్రి ఎంజే అక్బర్ ప్రియా రమణిపై దాదాపు41 పేజీలతో పరువునష్టం దావావేశారు. కరాంజవాలా సంస్థలోని 97మంది లాయర్లు (30మంది మహిళా లాయర్లు) మద్దతుతో ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ దావానునమోదు చేసిన సంగతి తెలిసిందే. Hey @priyaramani and all 14 who have spoke up. Let’s crowd fund your defence. I am sure may top lawyers will help you fight pro bono, but we at @MoneylifeIndia know there are lots of expenses involved! So think about it! Happy to support I am sure thousands of others will too! https://t.co/WmSnOfFKQy — Sucheta Dalal (@suchetadalal) October 15, 2018 My statement pic.twitter.com/1W7M2lDqPN — Priya Ramani (@priyaramani) October 15, 2018 -
ఏది రాజకీయం, ఏది కుట్ర?!
సాక్షి, న్యూఢిల్లీ : ‘బహుత్ హువా నారి పర్ వార్ (మహిళలపై జరిగిన అత్యాచారాలు ఇక చాలు)’ 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ముఖ్య నినాదాల్లో ఒకటి. ఇప్పుడు 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధపడుతున్న బీజేపీని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి ఎంజె అక్బర్పై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఎన్నికల నేపథ్యంలో ఈ ఆరోపణలన్నీ తనపై జరుగుతున్న రాజకీయ కుట్రగా అక్బర్ అభివర్ణించారు. పరువు నష్టం కేసు వేయాలని కూడా నిర్ణయించారు. ఎంత హాస్యాస్పదం! మీడియా మాజీ ఎడిటరైన అక్బర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది ఒకరు కాదు, ఇద్దరు కాదు... ఏకంగా 14 మంది మహిళలు. వారిలో 18 ఏళ్ల యువతి కూడా ఉంది. పైగా వారంతా జర్నలిస్టులు. ప్రియా రమాని, ఘజాల వాహబ్, సబా నక్వీ, మజ్లీ డే పుయ్ కాంప్, శుమా రహా, హరిందర్ బవేజా, శుతాప పాల్, సుపర్ణ శర్మ, అంజు భారతి, మాలిని భూప్తా, కాదంబరి వాడే, కనిక గహ్లాట్, రుత్ డేవిడ్, ప్రేరణ బింద్రా అక్బర్పై ఆరోపణలు చేశారు. వారిలో కొందరు తమపై లైంగిక దాడి జరిపినట్లు చెప్పగా, లైంగిక దాడులకు ప్రయత్నించినట్లు మిగతా వారు ఆరోపించారు. పేర్లను బట్టి చూస్తే వారంతా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారని తెలుస్తోంది. వారంతా కలిసి ఎలాంటి ప్రజా పలుకబడి పునాదులు లేకుండా రాజ్యసభ ద్వారా మంత్రి అయిన అక్బర్పై రాజకీయ కుట్ర పన్నుతారా? ఎంత హాస్యాస్పదం! బీజేపీ నేతలు ఏమంటున్నారు? ఎంజె అక్బర్పై వచ్చిన ఆరోణలపై బీజేపీ నేతలు పలు విధాలుగా స్పందించారు. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించాలని సుబ్రమణియన్ స్వామి అన్నారు. అది ఆయనకు, ఆరోపణలు చేసిన వారికి సంబంధించిన సమస్య, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి ఉమా భారతి వ్యాఖ్యానించారు. లైంగిక ఆరోపణలను చేస్తున్న మహిళలను లక్ష్యంగా పెట్టుకోరాదని, అయితే అక్బర్ గురించి మాట్లాడే స్థానంలో తాను లేనని మరో మహిళా కేంద్ర మంత్రి స్మతి ఇరానీ అన్నారు. లైంగిక ఆరోపణలు చేస్తున్న వారిని తాను నమ్ముతున్నానని, ప్రతి ఫిర్యాది వెనకనుండే బాధను, వ్యధను తాను అర్థం చేసుకోగలనంటూ కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ స్పందించారు. ‘మీటూ’ ఆరోపణలన్నింటిని విచారించేందుకు సీనియర్ జుడీషియల్, లీగల్ వ్యక్తులతోని ఓ కమిటీ వేయాలని తాను ప్రతిపాదిస్తున్నట్లు ఆమె చెప్పారు. (చదవండి : మీటూ సంచలనం : ఎంజే అక్బర్పై లైంగిక ఆరోపణలు) మరోసారి వేధించే అవకాశం ఉంది! అయితే లైంగిక ఆరోపణలు చేసిన మహిళల సమ్మతి ఉన్న కేసుల్లోనే విచారణ జరపాలని రుత్ మనోరమా, అమ్మూ జోసఫ్, గీత లాంటి మహిళా సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు. ఎప్పుడో జరిగిన ఇలాంటి సంఘటలనకు సంబంధించి సరైన ఆధారాలు లభించక పోవచ్చని అలాంటి సందర్భాల్లో విచారణ నుంచి బయటపడే మగవాళ్లు ఫిర్యాదుదారులను వేధించే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి విచారణ కమిటీలకన్నా మహిళల హక్కులను గౌరవించేలా మగవాళ్ల మనస్తత్వాన్ని మార్చే వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా ‘బేటీ బచావో బేటీ పడావో’ నినాదంతోపాటు మహిళలపై జరగుతున్న అన్యాయాలను ఏ నాగరిక ప్రపంచం సహించదంటూ పదే పదే మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గం నుంచి అక్బర్ను తొలగించక పోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో?! -
#మీటూ: 97మంది లాయర్లా..!
సాక్షి, న్యూఢిల్లీ: మీటూ ఆరోపణలుఎదుర్కొంటున్న కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి ఎంజే అక్బర్ న్యాయపోరాటంలో న్యాయవాదుల సంఖ్య తెలిస్తే నోరు వెళ్లబెట్టక తప్పదు. ఒక్కరు కాదు ఇద్దరు ఏకంగా 97మంది న్యాయవాదులు ఈ జాబితాలో ఉన్నారు. జర్నలిస్టు ప్రియా రమణి లైంగిక ఆరోపణల నేపపధ్యంలో ఆయన దాఖలు చేసిన పరువునష్టం దావాను 97మంది న్యాయవాదులు వాదించనున్నారు. ప్రముఖ సంస్థ కరంజావాలాకు చెందిన లాయర్లు ప్రియా రమణికి వ్యతిరేకంగా వాదించనున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో ప్రియా రమణిపై నేరపూరిత ఆరోపణ కేసును సోమవారం నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
#మీటూ : జర్నలిస్టుపై పరువునష్టం కేసు
సాక్షి, న్యూఢిల్లీ: ‘మీటూ’ లో భాగంగా తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ తదుపరి చర్యలకుపక్రమించారు. ఆరోపణలు అన్నీ అవాస్తవమని కొట్టి పారేసిన ఆయన తాజాగా జర్నలిస్టు ప్రియా రమణిపై చట్టపరమైన చర్యలకు దిగారు. ఆమె తప్పుడు ఆరోపణలు చేశారని చేశారంటూ క్రిమినల్ డిఫమేషన్ నమోదు చేశారు. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో సోమవారం ఆయన ఈ కేసు దాఖలు చేశారు. సుదీర్ఘమైన, విలువైన తన కరియర్ను నాశనం చేసేందుకే ప్రియా రమణి తనపై తప్పుడు, హానికరమైన ఆరోపణలు చేశారని ఈ పిటిషన్లో పేర్కొన్నారు. విదేశీ పర్యటనముగించుకొని స్వదేశానికి చేరుకున్న కేంద్రమంత్రి తనపై వచ్చిన ఆరోపణలపై ఆదివారం స్పందించారు. జర్నలిస్ట్గా ఉన్న సమయంలో సహచర మహిళా పాత్రికేయులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలను ఈయన తోసిపుచ్చారు. రాజకీయ కారణాలతో తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, ఆరోపణలు చేస్తున్నవారు సాక్ష్యాలు చూపించాలని డిమాండ్ ఆయన చేశారు. లేదంటే తనపై ఆరోపణలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంజె అక్బర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్పార్టీ డిమాండ్ చేసింది. ఇంత జరుగుతున్నా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నోరు విప్పకపోవడంపై మండిపడుతోంది. కాగా ఎంజే అక్బర్ ది టెలిగ్రాఫ్, ఆసియన్ ఏజ్, ది సండే గార్డియన్ లాంటి ప్రముఖ పత్రికలకు ఎడిటర్గా పనిచేశారు. సంపాదకుడుగా ఉన్నప్పుడు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ విదేశీ మహిళా జర్నలిస్టులతో సహా పలువురు మహిళా పాత్రికేయులు 'మి టూ' ఉద్యమంలో భాగంగా ఆరోపణలు గుప్పించారు. ముఖ్యంగా జర్నలిస్టు ప్రియా రమణి తొలిసారిగా ట్విటర్ వేదికగా ఎంజే అక్బర్పై ఆరోపణలు చేసిన సంగతి విషయం తెలిసిందే. ఎంజే అక్బర్పై లైంగిక వేధింపులు ఆరోపణలు చేసిన 14మంది : ప్రియ రమణి, షుమా రాహా, ప్రేరణ సింగ్, కనికా గెహ్లాట్, సుపర్ణ శర్మ, హరీందర్ బవేజ, సబా నక్వి, షుతప పాల్, గజలా వహాబ్, అంజు భారతి, కాదంబరి వాడే, రూత్ డేవిడ్, మాలిని భూప్తా , మాజైల్ డి పే కంప్. -
అన్నీ అబద్ధాలు.. నిరాధారాలు
న్యూఢిల్లీ: జర్నలిస్ట్గా ఉన్న సమయంలో సహచర మహిళా పాత్రికేయులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ స్పందించారు. వారు తనపై చేసిన ఆరోపణలన్నీ అసత్యాలని, అర్థరహితాలని, అవి తనను అమితంగా బాధించాయని ఆయన పేర్కొన్నారు. విదేశాల్లో అధికారిక పర్యటనలో ఉన్నందువల్లనే ఇప్పటివరకు దీనిపై స్పందించలేదన్నారు. ఆఫ్రికా దేశాల పర్యటన నుంచి తిరిగొచ్చిన కాసేపటికే ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నిరాధార ఆరోపణల కారణంగా తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయబోనని తేల్చి చెప్పారు. తనపై అసత్య ఆరోపణలు చేసినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నానని వెల్లడించారు. త్వరలో సాధారణ ఎన్నికలు జరగబోతున్న కారణంగా, తన ప్రతిష్ట దెబ్బతీసేందుకే ఇలాంటివన్నీ తెరపైకి వస్తున్నాయన్నారు. ’ఎన్నికలు కొన్ని నెలలు మాత్రమే ఉన్న సమయంలో ఈ తుపాను ఎందుకు వచ్చింది?’ అని ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ఇప్పుడు వైరల్ జ్వరంగా మారిందని అక్బర్ వ్యాఖ్యానించారు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా హాలీవుడ్లో ప్రారంభమైన ‘మీ టూ’ ఉద్యమం భారత్లోనూ ఉవ్వెత్తున సాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఎంజే అక్బర్ జర్నలిస్ట్గా ఉన్న సమయంలో వివిధ సమయాల్లో ఆయనతో పాటు జర్నలిస్ట్గా పనిచేసిన 11 మంది మహిళలు ఇటీవల ముందుకువచ్చి.. తమపై అక్బర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. వారిలో ప్రియా రమణి, గజాలా వాహెబ్, షుమ రాహ, అంజు భారతి, శుతుపా పాల్ల ఆరోపణలపై అక్బర్ స్పందించారు. ‘ప్రియా రమణి ఏడాది క్రితం ఓ మ్యాగజీన్లో రాసిన ఓ కథనం ద్వారా ఈ దుష్ప్రచారాన్ని ప్రారంభించారు. అందులో నా పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. ఎందుకంటే అది అసత్య కథనమని ఆమెకూ తెలుసు. ఇటీవల ఈ విషయమై అడిగిన ప్రశ్నకు ఆమె.. ఆయన ఏమీ చేయలేదు కాబట్టే, పేరు ప్రస్తావించలేదని సమాధానమిచ్చారు. నేను తనపై చేయి ఎప్పుడూ వేయలేదని శుతుపా పాల్ చెబ్తున్నారు. నిజానికి నేనేం చేయలేదని షుమ అంటున్నారు. స్విమింగ్ పూల్లో పార్టీ చేసుకున్నామని అంజు భారతి ఆరోపించారు. కానీ నాకు ఈతే రాదు. రమణి, వాహెబ్లు వారు పేర్కొన్న లైంగిక వేధింపుల ఘటన తరువాత కూడా నాతో కలిసి పనిచేశారు. దీన్ని బట్టి ఇవన్నీ అసత్యాలని తెలియడం లేదా?’ అని అక్బర్ వివరణ ఇచ్చారు. ప్రధాని స్పందించాలి: కాంగ్రెస్ మంత్రి ప్రకటనకు కొద్ది సేపటి ముందు కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ విలేకరులతో మాట్లాడుతూ.. సహచర మంత్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ‘ఈ విషయంలో ప్రధాని మోదీ స్పందించాలి. ప్రధాని ఎలాంటి వారనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఈ అంశం ప్రభుత్వ నైతికతకు సంబంధించిందే కాదు, ప్రధానికీ, ఆయన పదవీ గౌరవానికి సంబంధించింది కూడా’ అని అన్నారు. -
లైంగిక ఆరోపణల వెనుక భారీ కుట్ర : ఎంజే అక్బర్
సాక్షి, న్యూఢిల్లీ : తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ స్పందించారు. కొందరు దురుద్దేశపూర్వకంగా కట్టుకథలతో ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం వైరల్గా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన వారిపై న్యాయపరమైన చర్యలు చేపడతానని హెచ్చరించారు. లోక్సభ ఎన్నికలకు ముందు తనపై ఆరోపణలు చేయడం వెనుక భారీ అజెండా ఉందని ఎంజే అక్బర్ ఆరోపించారు. ఎడిటర్గా ఉన్న సమయంలో అక్బర్ తమను వేధించాడని పలువురు మహిళా జర్నలిస్టులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఇప్పటివరకు అధికార బీజేపీ స్పందించలేదు. అయితే, విదేశీ పర్యటనలో ఉన్న అక్బర్ను హుటాహుటిన దేశానికి రప్పించడం వెనుక మీటూ ప్రకంపనలు ఉన్నట్టు తెలుస్తోంది -
మీటూ ప్రకంపనలు.. కేంద్రమంత్రి రాజీనామా?
సాక్షి, న్యూఢిల్లీ : #మీటు ఉద్యమం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ సహాయమంత్రి , బీజేపీ ఎంపీ ఎంజే అక్బర్ తన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఆదివారం నైజీరియా పర్యటన నుంచి తిరిగి వచ్చిన ఆయన.. తనపై వచ్చిన లైంగిక వేధింపులపై ఒక ప్రకటన చేస్తానని మీడియాతో చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన ప్రధాన మంత్రి కార్యాలయానికి తన రాజీనామాను ఈమెయిల్ ద్వారా పంపినట్టు సమాచారం అందుతోంది. అయితే, అక్బర్ రాజీనామాను పీఎంవో కార్యాలయం ఇంకా ధ్రువీకరించలేదు. (మీటూ సంచలనం : ఎంజే అక్బర్పై లైంగిక ఆరోపణలు) ఎడిటర్గా ఉన్న సమయంలో అక్బర్ తమను వేధించాడని పలువురు మహిళా జర్నలిస్టులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఇప్పటివరకు అధికార బీజేపీ స్పందించలేదు. అయితే, విదేశీ పర్యటనలో ఉన్న అక్బర్ను హుటాహుటిన దేశానికి రప్పించడం వెనుక #మీటూ ప్రకంపనలు ఉన్నట్టు తెలుస్తోంది. అక్బర్ను మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మోదీ నిర్ణయం తీసుకుంటారు..! అక్బర్ను మంత్రివర్గంలో కొనసాగించాలా వద్దా అనే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకుంటారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఆయనను పదవిలో కొనసాగించడం కష్టమేనని అంటున్నాయి. మహిళా జర్నలిస్ట్లతో ఆయన అసభ్యకరంగా వ్యహరించినట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రియ రమణి అనే జర్నలిస్ట్ తొలుత అక్బర్ ఆకృత్యాలను వెలుగులోకి తీసుకొచ్చారు. అనంతరం ప్రేరణ సింగ్ బింద్రా, మరికొంతమంది మహిళా జర్నలిస్టులు అక్బర్పై లైంగిక ఆరోపణలు చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఎంజే అక్బర్, ది టెలిగ్రాఫ్, ఆసియన్ ఏజ్, ది సండే గార్డియన్ వంటి ప్రముఖ వార్తా పత్రికలకు ఎడిటర్గా వ్యహరించారు. (‘అక్బర్’పై స్పందించని కేంద్రం) -
ఎం.జె.అక్బర్ (కేంద్ర మంత్రి) రాయని డైరీ
ఫ్లయిట్లో ఉన్నాను. మరికొన్ని గంటల్లో ఇండియాలో ఉంటాను. ఎయిర్ హోస్టెస్ వచ్చింది.. ‘‘ఏమైనా తీసుకుంటారా?’’ అని. ‘‘ఏమైనా తీసుకోవచ్చా’’ అని నవ్వుతూ అడిగాను. ‘‘తీసుకోవచ్చు కానీ, మీకోసం ఏవైతే సిద్ధం చేయబడి ఉంటాయో వాటిలోంచి మాత్రమే మీరు ఏదైనా తీసుకోవలసి ఉంటుంది’’ అని తనూ నవ్వింది. అమ్మాయిలు తెలివిగా ఉంటున్నారు. తెలివి లేని అమ్మాయిలే ‘మీటూ’ అంటూ పాతవన్నీ తవ్వుకుని తలస్నానం చేస్తున్నారు. ఆఫ్రికాలో ఫ్లయిట్ ఎక్కేముందు నాకు తెలియని యంగ్ రిపోర్టర్ ఒకతను ఫోన్ చేశాడు. ‘‘అక్బర్జీ.. ఈ దేశంలో మగవాడికి జీవించే హక్కు లేదా?’’ అని అతడు పెద్దగా ఏడుపు మొదలుపెట్టాడు. ‘‘ఏయ్.. ఆపు’’ అన్నాను. అతడు ఆపలేదు. ‘‘ఏమైందో ఏడ్వకుండా చెప్పు’’ అన్నాను. ‘‘అక్బర్జీ ఈ దేశంలో మగవాడికి..’’ అని మళ్లీ మొదలుపెట్టాడు. ‘‘నా నంబర్ నీకెలా దొరికింది’’ అని కసిరాను. ‘‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా నుంచి సంపాదించాను అక్బర్జీ’’ అన్నాడు. ‘‘ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి కదా నువ్వు నా నంబర్ సంపాదించవలసింది. ఇప్పుడు నేను ఏ పేపర్లో ఉన్నానని ఎడిటర్స్ గిల్డ్కి వెళ్లి అడిగావ్?’’ అని కోప్పడ్డాను. ‘‘ముందు ఎక్స్టర్నల్ మినిస్ట్రీకే వెళ్లాను అక్బర్జీ. స్మృతీజీని అడిగాను మీ నంబర్ కావాలని. ఆలోచించి నిర్ణయం తీసుకుంటానన్నారు’’ అని చెప్పాడు! నాకర్థమైంది. స్మృతీ ఇరానీ ఆలోచించి నిర్ణయం తీసుకోబోతున్నారు. మోదీజీ ఆలోచించి నిర్ణయం తీసుకోబోతున్నారు. సుబ్రహ్మణ్యస్వామి ఒక్కడే ఆలోచించే పని పెట్టుకోలేదు. ‘అక్బర్ని మోదీ మోసుకొచ్చాడు కాబట్టి, మోదీనే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’ అని అంటున్నాడు. ‘‘సర్లే.. ఎందుకు ఫోన్ చేశావో చెప్పు.. ఫ్లయిట్ టైమ్ అవుతోంది’’ అన్నాను. ‘‘ఇక్కడ నా టైమ్ అయిపోయేలా ఉంది అక్బర్జీ’’ అన్నాడు! మళ్లీ ఏడుపు. ఆఫీస్లో తన పక్కన కూర్చునే అమ్మాయిని టచ్ చేశాడట. ఆ అమ్మాయి ‘మీటూ’ అనేసిందట! ‘‘ఉద్యోగం పోయేలా ఉందా?’’ అన్నాను. ‘‘లేదు అక్బర్జీ’’ అన్నాడు. ‘‘కేసు ఫైల్ అయిందా?’’ అన్నాను. ‘‘లేదు అక్బర్జీ’’ అన్నాడు. ‘‘మరెందుకు ఏడుస్తున్నావ్?’’ అన్నాను. ‘‘ట్విట్టర్లో, ఫేస్బుక్లో నేను తనను టచ్ చేశానని రాసింది అక్బర్జీ’’ అన్నాడు. ‘‘అందులో అంతగా ఏడవాల్సిందే ముందీ!’’ అన్నాను. ‘‘పరువు పోయేలా ఉంది అక్బర్జీ’’ అని మళ్లీ స్టార్ట్ చేశాడు. ‘‘ఊరుకోవయ్యా బాబూ.. పరువు పోయేలా ఉంటుంది కానీ అదెక్కడికీ పోదు. ఇంక ఆ పిల్లని టచ్ చెయ్యడం మాని.. నీ పని నువ్వు చూస్కో’’ అని చెప్పాను. ‘‘టచ్ చెయ్యకుండా ఉండలేకపోతున్నాను అక్బర్జీ’’ అన్నాడు. ‘‘సీటు మార్పించుకో’’ అని చెప్పాను. ‘‘గుండె ఆగిపోతుందేమో అక్బర్జీ’’ అన్నాడు. కోపం ఆపుకోలేకపోయాను. ‘‘నువ్వన్నది నిజమే. ఈ దేశంలో మగవాడికి జీవించే హక్కు లేదు. గుండె ఆగి చచ్చిపో’’ అన్నాను. ఢిల్లీలో ఫ్లయిట్ దిగగానే ఓ మహిళా రిపోర్టర్ ఉత్సాహంగా నా మీదకు తోసుకొచ్చింది. ‘‘సార్.. ప్రియ, గజాలా, సబా, షట్ప, సుమ, సుపర్ణ, ప్రేరణ.. లేటెస్టుగా మజ్లీ! వీళ్లందర్నీ మీరు.. మీడియాలో ఉన్నప్పుడు లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరి మీరెప్పుడు రిజైన్ చెయ్యబోతున్నారు సార్?’’ అని అడిగింది. నాకు ఆ కుర్రాడు గుర్తొచ్చాడు. వాడి ఏడుపు గుర్తొచ్చింది. పాపం.. పదేళ్ల తర్వాత చిక్కవలసినవాడు.. బిగినింగ్లోనే బుక్కైపోయాడు. -మాధవ్ శింగరాజు -
మీటూ : బీజేపీ మహిళా నేత సంచలన వ్యాఖ్యలు
భోపాల్ : తమకు ఎదురైన లైంగిక వేధింపులపై అన్ని రంగాలకు చెందిన మహిళలు బాహాటంగా వెల్లడిస్తున్న క్రమంలో మధ్యప్రదేశ్ బీజేపీ మహిళా విభాగం చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీటూ ఉద్యమం స్వాగతించదగినదే అయినా కొందరు మహిళా జర్నలిస్టులు చేస్తున్న ఆరోపణలపై సందేహాలు ముందుకొస్తున్నాయని మధ్యప్రదేశ్ బీజేపీ మహిళా నేత లతా కేల్కర్ వ్యాఖ్యానించారు. విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ఎంజే అక్బర్పై లైంగిక వేధింపుల ఆరోపణలను ప్రస్తావిస్తూ ఈ ఆరోపణలు చేస్తున్న మహిళా పాత్రికేయులు అమాయకులని తాననుకోవడం లేదని, వారు తమను వాడుకునే అవకాశం ఇతరులకు ఇవ్వరని వ్యాఖ్యానించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంజే అక్బర్ను కేబినెట్ నుంచి తొలగిస్తారా అనే ప్రశ్నపై మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు. -
మీటూ : ఆ జెంటిల్మ్యాన్ ముందుకు వచ్చి మాట్లాడాలి
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ‘మీటూ’ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. తప్పు చేసిన వారు ఒప్పుకుని బహిరంగంగా క్షమాపణలు చెబుతుంటే, మరికొంతమంది తామే తప్పు చేయలేదని చెప్పుకొస్తున్నారు. ఇంకా కొంతమంది వారిపై వస్తున్న ఆరోపణలపై స్పందించకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. గత రెండు రోజుల క్రితం విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ గురించి వెలుగులోకి వచ్చిన చీకటి కోణాలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీంతో ఎంజే అక్బర్ రాజీనామా చేయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై స్పందించడానికి విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించకుండా నిరాకరిస్తే.. కేంద్ర జౌళీ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ మాత్రం ఎంజే అక్బర్ ఈ విషయంపై ముందుకొచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనపై వస్తున్న ఆరోపణలపై ఆ జెంటిల్మ్యాన్ ముందుకు వచ్చిన మాట్లాడాలని స్మృతీ ఇరానీ అన్నారు. అంతేకాక, లైంగిక వేధింపులపై ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్న మహిళా జర్నలిస్ట్లను ఆమె అభినందించారు. ఈ విషయంపై మాట్లాడుతున్న మహిళలకు ఆమె సపోర్టు కూడా ఇచ్చారు. ‘వేధింపులకు పాల్పడితే, వారు వర్క్ చేయడానికి వెళ్లలేరు. మహిళలు తమ కలలను సాకారం చేసుకునేందుకు వర్క్ చేయడానికి వెళ్తారు. అలాగే గౌరవప్రదంగా జీవించాలనుకుంటారు. ప్రస్తుతం ఈ విషయంపై పోరాటం చేస్తున్న మహిళలందరికీ న్యాయం వస్తుందని ఆశిస్తున్నా’ అని స్మృతీ ఇరానీ పేర్కొన్నారు. కాగా, గతంలో ఒక పత్రికకు ఎడిటర్గా ఉన్న సమయంలో ఎంజే అక్బర్, తనను లైంగికంగా వేధించాడని ప్రియా రమణి అనే మహిళ జర్నలిస్ట్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రియా రమణి ముందుకు వచ్చిన తర్వాత, మరికొంతమంది మహిళా జర్నలిస్టులు కూడా ఎంజే అక్బర్పై లైంగిక ఆరోపణలు చేశారు. అయితే తనపై వస్తున్న ఆరోపణలపై ఎంజే అక్బర్ ఇప్పటి వరకు స్పందించలేదు. -
‘అక్బర్’పై స్పందించని కేంద్రం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కుంటోంది. ఎంజే అక్బర్ గతంలో పలు పత్రికలకు సంపాదకుడిగా పనిచేస్తున్న కాలంలో తమను లైంగికంగా వేధించాడని పలువురు మహిళా విలేకరులు ఇటీవల ఆరోపించడం తెలిసిందే. అక్బర్పై ఈ ఆరోపణలు చేసిన జర్నలిస్టుల సంఖ్య తాజాగా ఎనిమిదికి పెరిగింది. అయినా అటు ఎంజే అక్బర్ కానీ, ఇటు కేంద్ర మంత్రులు లేదా అధికార బీజేపీ ప్రతినిధులు కానీ ఇప్పటివరకు ఈ ఆరోపణలపై తమ స్పందనను కూడా తెలియజేయకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం మంత్రివర్గ సమావేశం అనంతరం ఆ వివరాలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు వివరిస్తుండగా విలేకరులు అక్బర్పై వచ్చిన ఆరోపణలపై ప్రశ్నించారు. సమాధానం చెప్పేందుకు రవి శంకర్ కూడా నిరాకరించారు. ఈ ఆరోపణలు అక్బర్ మంత్రి పదవిలో ఉన్న కాలానికి సంబంధించినవి కాదు కాబట్టి అధికారికంగా స్పందించకూడదని బీజేపీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయంపై మీడియాతో మాట్లాడకూడదని బీజేపీ తన అధికార ప్రతినిధులకు సూచించినట్లు తెలిసింది. రాజీనామా చేయాలి: కాంగ్రెస్ పలువురికి స్ఫూర్తినిచ్చే స్థానంలో ఉన్న సుష్మ, తన జూనియర్ మంత్రిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని కాంగ్రెస్ పేర్కొంది. ‘తనపై వచ్చిన ఆరోపణలపై అక్బర్ సంతృప్తికరమైన వివరణ అయినా ఇవ్వాలి లేదా మంత్రి పదవికి రాజీనామా చేయాలి’ అని పార్టీ అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. -
‘మీ టూ’పై కేంద్రానికి మౌనమేలనోయి?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ మాజీ జర్నలిస్ట్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజె అక్బర్ తమపైన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నలుగురు మహిళలు చేసిన ఆరోపణలపై ఇప్పటికీ ఆయన మంత్రిత్వ శాఖగానీ, కేంద్ర ప్రభుత్వంగానీ, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీగానీ స్పందించక పోవడం విచిత్రం, విచారకరం. హాలివుడ్, బాలివుడ్ సినిమా రంగాలతోపాటు, మీడియా, కామెడీ, కళా, సాహిత్య రంగాలకు విస్తరించిన ‘మీ టూ’ ఉద్యమం ప్రకంపనలు సష్టిస్తున్న విషయం తెల్సిందే. ఎంజె అక్బర్తోపాటు మీడియా వ్యక్తులపై వస్తున్న లైంగిక ఆరోపణలకు సంబంధించి మహిళలకు ఎడిటర్స్ గిల్డ్ మద్దతు ప్రకటించింది. ఈ ఆరోపణలన్నింటిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలంటూ సంబంధిత విభాగాలను కోరుతూ ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. బాలివుడ్ ప్రముఖ దర్శకుడు వికాస్ బహల్కు వ్యతిరేకంగా వచ్చిన లైంగిక ఆరోపణలకు సంబంధించి ‘ది ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ ఆసోసియేషన్’ నోటీసు జారీ చేసింది. వికాస్ బహల్పై విచారణ జరిపేందుకు ఆయన సహ వ్యవస్థాపకుడిగా ఉన్న ‘ఫాంటమ్ ఫిల్మ్స్’లో విచారణ కమిటీ ఏర్పాటయింది. వికాస్ బహల్పై వచ్చిన లైంగిక ఆరోపణలు క్లియరయ్యేంత వరకు దూరంగా ఉంటానంటూ ‘ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్ (ఎంఏఎంఐ)’కి ప్రముఖ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ రాజీనామా చేశారు. ఆయన ఫాంటమ్ ఫిలిమ్స్ వ్యవస్థాపకుల్లో ఒకరు. లైంగిక ఆరోపణలకు సంబంధించి ‘ఆల్ ఇండియా బకడ్’ గ్రూపు నుంచి లాన్మే భట్ తప్పుకున్నారు. తమలో ఫ్రీలాన్సర్గా కొనసాగుతున్న ఉత్సవ్ చక్రవర్తితో ఇక తమ గ్రూపుతో సంబంధాలు ఉండవని ఆల్ ఇండియా బకడ్ గ్రూప్ ప్రకటించింది. మలయాళి నటుడు, సిపీఎం శాసన సభ్యుడు ముకేశ్పై వచ్చిన లైంగిక వేధింపులపై ఇంతకాలం మౌనం పాటించిన సీపీఎం నాయకత్వం కూడా ఆయనపై విచారణకు సిద్ధమయింది. ఇలా అన్ని సంస్థల్లో వచ్చిన ఆరోపణలపై చర్యలు తీసుకునేందుకు దాదాపు అన్ని సంస్థలు సిద్ధమయ్యాయి. అన్ని సంస్థలకన్నా అతిపెద్ద వ్యవస్థ కలిగిన కేంద్ర ప్రభుత్వం అందరికి ఆదర్శంగా ముందుండాల్సింది ఇలా మౌనం పాటిస్తే ఎలా! ఎవరిపైనైనా సరే చర్యలు తీసుకోవాల్సిందేనంటూ కేంద్ర మంత్రి మేనకాగాంధీకి ఉన్న చొరవ కేంద్రానికి లేదా? -
రాజకీయాలకూ ‘మీటూ’ సెగ
న్యూఢిల్లీ: సినీ రంగాన్ని కుదిపేస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు రాజకీయాల్ని చుట్టుముట్టాయి. కేంద్ర మంత్రి, మాజీ పత్రికా సంపాదకుడు ఎంజే అక్బర్ రాజకీయాల్లోకి రాకముందు జర్నలిస్టుగా పనిచేస్తున్న సమయంలో తమని వేధించారని ముగ్గురు మహిళా జర్నలిస్టులు సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు గుప్పించారు. మరోవైపు, కేరళ ఎమ్మెల్యే(సీపీఎం), మాజీ నటుడు ముకేశ్ 1999లో ఓ షూటింగ్లో తనని వేధించారని బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్ ఆరోపించారు. ప్రముఖ రచయిత, నిర్మాత వింతా నందా..నటుడు అలోక్నాథ్ 19 ఏళ్ల క్రితం తనను రేప్ చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. వెంటనే స్పందించిన సినీ ఆర్టిస్ట్స్ అండ్ టీవీ అసోసియేషన్(సింటా)..అలోక్నాథ్కు షోకాజ్ నోటీసులు పంపుతామని తెలిపింది. మీడియా రంగంలో లైంగిక వేధింపుల ఆరోపణలు వరుసగా వెలుగుచూస్తున్న నేపథ్యంలో ఎడిటర్స్ గిల్డ్..బాధితురాళ్లకు అండగా నిలిచింది. అన్ని ఆరోపణల్లో నిష్పాక్షిక విచారణ చేపట్టాలని మీడియా సంస్థలకు సూచించింది. రంగంలోకి దిగిన జాతీయ మహిళా కమిషన్.. లైంగిక వేధింపుల ఆరోపణలపై సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమైంది. అక్బర్...ఓ ప్రిడేటర్ బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలతో మొదలైన ‘మీటూ’ తరహా ఉద్యమం తీవ్రమైంది. అక్బర్ తమని లైంగికంగా వేధించారని ఆయన మాజీ సహచర ఉద్యోగులు ప్రియా రమణి, ప్రేరణాసింగ్ బింద్రా, పేరు తెలియని మరో మహిళా జర్నలిస్టు ఆరోపించారు. ఫస్ట్పోస్ట్ అనే వెబ్పోర్టల్లో రమణి, పేరు తెలియని రచయిత అక్బర్ను ఉద్దేశించి పెట్టిన పోస్టుల ఆధారంగా ది టెలిగ్రాఫ్ కథనం ప్రచురించింది. ది టెలిగ్రాఫ్కు అక్బర్ వ్యవస్థాపక సంపాదకుడు. 2017లో వోగ్ మేగజీన్కు రాసిన ఓ వ్యాసంలోని విషయాలను రమణి ట్వీట్ చేశారు. ఈ వ్యాసంలో అక్బర్ను ఆమె ప్రిడేటర్ అని సంబోధిస్తూ..ఆయన ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోలేదని పేర్కొన్నారు. ఎడిషన్ పూర్తయ్యాక హోటల్కు పిలిచారు రాత్రి ఎడిషన్ ముగిశాక పని గురించి చర్చించడానికి అక్బర్ హోటల్ గదికి పిలిచారని బింద్రా ట్వీట్ చేశారు. అందుకు నిరాకరించినందుకు నరకం చూపాడని ఆరోపించారు. ‘తప్పుడు ఆరోపణల ఫలితాలు ఏంటో నాకు తెలుసు. నేను వేధింపులు భరించి 17 ఏళ్లు గడిచాయి. వాటిని నిరూపించేందుకు ప్రస్తుతం ఆధారాలు లేవు. గొప్పవాళ్లలో లోపాలుంటాయి. ఫీచర్ బృందం మొత్తం సమావేశమైనప్పుడు అక్బర్ బూతు వ్యాఖ్యలు చేశారు. హోటల్ గదిలో కలవాలని ఆ బృందంలోని వారిని కూడా కోరినట్లు సహచరిణి ఒకరు నాతో అన్నారు. మహారాష్ట్ర సచివాలయంపై వార్తను రాయడానికి వెళ్లినప్పుడు ఓ అధికారి నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఎవరికి ఫిర్యాదుచేయాలో నాకప్పుడు అర్థం కాలేదు. నా ఎడిటర్(అక్బర్) కూ డా అలాంటి వాడే కదా!’ అని ఆమె వాపోయారు. అక్బర్పై వచ్చిన ఆరోపణలపై స్పందిచేందుకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నిరాకరించారు. ఈ వ్యవహారంలో విచారణ చేపడతారా అని విలేకర్లు ప్రశ్నించగా, సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. అక్బర్పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మౌనం సమాధానం కాదని, ప్రధాని మోదీ, సుష్మా స్వరాజ్ నోరు విప్పాలని కోరింది. ది టెలిగ్రాఫ్, సన్డే, ది సండే గార్డియన్, ఏషియన్ ఏజ్, దక్కన్ క్రానికల్ పత్రికలకు అక్బర్ ఎడిటర్గా పనిచేశారు. నా గదినే మార్చేశాడు 1999లో ఓ కార్యక్రమ షూటింగ్ సమయంలో అప్పటి నటుడు, ప్రస్తుత ఎమ్మెల్యే ముకేశ్ తనను వేధించారని బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్ టెస్ జోసెఫ్ ఆరోపించారు. అసలు ఆ కార్యక్రమ షూటింగ్ గురించే తనకు గుర్తులేదని ముకేశ్ కొట్టిపారేశారు. క్విజ్ ప్రోగ్రాం ‘కోటీశ్వర్’ చిత్రీకరణ సమయంలో ముకేశ్..తనను అతని గదికి పిలిపించుకున్నాడని, తరువాత తన గదిని ఆయన గది పక్కకు మార్చారని ట్వీట్ చేశారు. నాటకం వేస్తుండగా అనుచిత ప్రవర్తన 2001లో ఓ నాటకం వేసేటపుడు ప్రముఖ పాటల రచయిత వరుణ్ గ్రోవర్ తనతో తప్పుగా ప్రవర్తించినట్లు బెనారస్ హిందూ వర్సిటీకి చెందిన పూర్వ విద్యార్థిని ఒకరు ఆరోపించారు. ఆమె మాటలను గ్రోవర్ తోసిపుచ్చారు. కు‘సంస్కారి’ అలోక్నాథ్ సంస్కారవంతమైన పాత్రల్లో నటించే అలోక్నాథ్ రెండు దశాబ్దాల క్రితం తనను పలుమార్లు రేప్ చేశాడని ప్రముఖ రచయిత్రి, ‘తారా’ ఫేమ్ వింతా నందా ఆరోపించారు. ఓసారి నందా ఇంటికి పార్టీకి వెళ్లగా మద్యం తాగించి బలాత్కారానికి ఒడిగట్టాడని పేర్కొన్నారు. ‘సాయంత్రం నేను తాగిన పానీయంలో ఏదో మత్తు మందు కలిపారు. రాత్రి 2 తరువాత ఇంటికి బయల్దేరుతుండగా మధ్యలో అలోక్నాథ్ వచ్చి తన కారులో ఎక్కించుకున్నారు. ఆ తరువాత మరింత మద్యం తాగించి రేప్ చేశాడు. తెల్లారి లేచేసరికి చాలా నొప్పిగా అనిపిం చింది. ఈ సంగతిని నా స్నేహితులకు చెబితే మౌనంగా ఉండమన్నారు. అలోక్నాథ్ తన పలుకుబడితో నన్ను భయపెట్టి, తరువాతా పలుమార్లు వేధించారు’ అని వింతా నందా తాను అనుభవించిన క్షోభను వివరించారు. -
మీటూ ఉద్యమం : మగవాళ్లూ బయటకు రావాలి!
సాక్షి, న్యూఢిల్లీ : సమాజంలో స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం తీసుకురావాలనే లక్ష్యంతో నాలుగేళ్ల క్రితం ‘హీ ఫర్ షీ’ ఉద్యమం ప్రారంభమైంది. మహిళలపై జరుగుతున్న హింస గురించి ఈ ఉద్యమంలో చర్చ మొదలయింది. దాన్ని మహిళల సమస్యగా భావించి పురుషులు అంతగా స్పందించలేక పోయారు. లైంగిక వేధింపులపై కూడా చర్చ జరిగింది. చివరకు బాధితురాలి భద్రతకు ఆమెనే బాధ్యత వహించాలనే అభిప్రాయానికి స్త్రీ, పురుషులు రావడంతో ‘హీ ఫర్ షీ’ ఉద్యమం కాస్త చల్లారిపోయింది. ఇప్పుడు భారత్లోని అన్ని రంగాల్లో ముఖ్యంగా బాలీవుడ్, మీడియాలో ‘మీ టూ’ ఉద్యమం ఊపందుకుంది. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ దగ్గరి నుంచి మీడియా మాజీ ఎడిటర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఎంజే అక్బర్ వరకు అందరిపైన లైంగిక వేధింపుల ఆరోపణల పరంపర కొనసాగుతోంది. కొందరేమో క్షమాపణలు చెబుతున్నారు. మరి కొందరు స్పందించేందుకు తిరస్కరిస్తున్నారు. ఇంకొందరు ఖండిస్తున్నారు. పదేళ్ల క్రితం, ఇరవై ఏళ్ల క్రితం జరిగిన లైంగిక వేధింపుల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇన్నాళ్లు వారు ఎందుకు మాట్లాడలేదు ? మహిళలకు మరింత భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ‘సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ప్లేస్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్, రెడ్రెస్సల్) యాక్ట్-2013’ లో తీసుకొచ్చినప్పటికీ వారు ఎందుకు కేసు పెట్టలేదు? అప్పుడు పరువు పోతుందని భయపడ్డారా? ఆ పరువు మరి ఇప్పుడు పోదా? ఈ వయస్సులో పోయినా ఫర్వాలేదా? ‘మీ టూ’ ఉద్యమం కారణంగా ఇప్పుడు ధైర్యంగా బయటకు వచ్చామని చెబుతున్నారా? లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమాజంలో వర్క్ ప్లేస్లో మహిళలు మాత్రమే లైంగిక వేధింపులకు గురవుతున్నారా? మగవాళ్లు గురవడం లేదా? మగవాళ్లు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారని లైంగిక వివక్ష అంశాలపై ఆసక్తికరమైన ఆర్టికల్స్ రాసే మహిళా జర్నలిస్ట్ సుభుహీ సాఫ్వీ చెబుతున్నారు. ఈ సందర్భంగా తన ఒకానొక మిత్రుడికి జరిగిన అనుభవం గురించి ఆమె చెప్పుకొచ్చారు. ఓ మీడియాలో లేడీ బాస్ దగ్గర అతను పనిచేసేవాడట. ఆ లేడీ బాస్ ప్రతి రోజు అతన్ని లైంగికంగా వేధిస్తూ రావడంతో ఓ రోజు అతగాడు హెచ్ఆర్ విభాగానికి ఫిర్యాదు చేశారట. ‘ఇంతకాలం ఎంజాయ్ చేసి, మోజు తీరాక వచ్చి ఫిర్యాదు చేస్తున్నావా?’ అంటూ అతని ఫిర్యాదును స్వీకరించేందుకు వారు తిరస్కరించారట. దాంతో అతగాడు ఉద్యోగం మానేసి మరో మీడియాకు మారిపోయాడట. ‘మీ టూ’ ఉద్యమానికి నాంది పలికిన హాలీవుడ్ నిర్మాత హార్వీ విన్స్టైన్ ఇప్పుడు కోర్టులో కూడా ఇలాగే వాదిస్తున్నారు. ‘నా దగ్గర డబ్బులు తీసుకున్నారు. సినిమా అవకాశాలు పొందారు. ఇష్ట పూర్వకంగానే పడక సుఖం పొందారు. అన్ని తీరాక ఇప్పుడు లేట్ వయస్సులో నాపై అభాండాలు వేస్తున్నారు’ అని ఆయన అమెరికా కోర్టు ముందు చేసిన వాదనలో బలం ఉందా? ఉంటే ఆ వాదన మన బాలీవుడ్ పురుష పుంగవులకు వర్తించదా? అన్నది ఒక్క పక్క చర్చ అయితే, లైంగిక వేధింపులకు గురైన మగవాళ్లు కూడా ఉంటారని, వారంతా ఇప్పుడు ‘వుయ్ టూ’ అంటూ ముందుకు రావాలని సుభుహీ సాఫ్వీ పిలుపునిచ్చారు. డెమీ మూర్, మైఖేల్ డగ్లస్ నటించిన హాలీవుడ్ హిట్ చిత్రం ‘డిస్క్లోజర్’ ఇతివత్తం కూడా మహిళా బాస్ లైంగికంగా వేధించడమే కదా! -
ఎంజే అక్బర్ మమల్ని లైంగికంగా వేధించాడు!!
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతోంది. తమతో అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రముఖుల గుట్టును మహిళా జర్నలిస్ట్లు వెలుగులోకి తీసుకొస్తున్నారు. హాలీవుడ్లో సెగలు పుట్టించిన ఈ మీటూ ఉద్యమం, నేడు మీడియాలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ ఉద్యమ తాకిడి కేంద్ర ప్రభుత్వాన్ని తాకింది. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి, మాజీ ఎడిటర్ ఎంజే అక్బర్పై మహిళా జర్నలిస్ట్లు లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. హోటల్ రూమ్ల్లో ఇంటర్వ్యూ నిర్వహించే సమయంలో, పని గురించే చర్చించే సమయంలో మహిళా జర్నలిస్ట్లతో ఆయన అసభ్యకరంగా వ్యహరించినట్టు తెలిసింది. ప్రియ రమణి అనే జర్నలిస్ట్ తొలుత అక్బర్ ఆకృత్యాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ అనంతరం పలువురు మహిళా జర్నలిస్ట్లు కూడా అక్బర్పై లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. ప్రియ రమణి గతేడాదే ఓ మ్యాగజైన్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. కానీ ఆ సమయంలో పేరును బహిర్గతం చేయలేదు. తాజాగా అక్బరే తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ధృవీకరిస్తూ... ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఒక్కసారిగా సంచలనంగా మారింది. అక్బర్ అసభ్యకరంగా ఫోన్ కాల్స్చేయడంలోనూ, టెక్ట్స్లు పంపించడంలోనూ, అసౌకర్యమైన పొగడ్తలు కురిపించడంలో నిపుణుడని రమణి గతేడాదే తన ఆర్టికల్లో పేర్కొన్నారు. తనకు 23 ఏళ్ల వయసున్నప్పుడు, దక్షిణ ముంబై హోటల్కు తనను జాబ్ ఇంటర్వ్యూకి పిలిచి ఎలా అసభ్యకరంగా ప్రవర్తించాడో తెలిపారు. అయితే ఆ సమయంలో పేరును వెల్లడించలేదు. తనను మద్యం సేవించాల్సిందిగా ఒత్తిడి చేయడంతోపాటు దగ్గరగా కూర్చోవాలని చెప్పారని ఆమె ఆరోపించారు. ఎలాగో అలా ఆ రాత్రి అక్బర్ నుంచి తప్పించుకున్నానని చెప్పారు. ప్రియ రమణి ట్వీట్ తర్వాత పలువురు జర్నలిస్టులు కూడా అక్బర్పై లైంగిక ఆరోపణలు చేశారు. తనతో 17 ఏళ్ల కిందట అక్బర్ ఇలాగే ప్రవర్తించారని, అయితే తన దగ్గర ఆధారాలేమీ లేకపోవడంతో బయటకు రాలేదని ప్రేరణ సింగ్ బింద్రా కూడా ట్వీట్ చేశారు. అక్బర్ ప్రస్తుతం నైజిరియాలో ఉండటంతో, ఆయన ఈ ఆరోపణలపై స్పందించలేదు. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ను అక్బర్పై వస్తున్న ఆరోపణలపై ప్రశ్నించగా.. ఆమె ఏమీ పట్టనట్లు వెళ్లిపోవడం గమనార్హం. ఇవి చాలా తీవ్రమైన ఆరోపణలు.. ఇవి లైంగిక ఆరోపణలు. మీరు ఆయన శాఖకు ఇన్చార్జ్గా ఉన్నారు. ఈ ఆరోపణలపై విచారణ ఉంటుందా అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. సుష్మా మాత్రం స్పందించకుండా వెళ్లిపోయారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఎంజే అక్బర్, ది టెలిగ్రాఫ్, ఆసియన్ ఏజ్, ది సండే గార్డియన్ వంటి ప్రముఖ వార్తా పత్రికలకు ఎడిటర్గా వ్యహరించారు. -
'మీరు ఊహించని ప్రాంతాలకు పాస్పోర్టు సెంటర్'
కోల్కత్తా : పాస్పోర్టు దరఖాస్తు చేసుకోడానికి సామాన్యుడికి భారం కాకూడదని ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పాస్పోర్టు సెంటర్ను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ విజన్ కోసం ప్రభుత్వం ఎంతో కృతనిశ్చయంతో పనిచేస్తుందని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ఎంజే అక్బర్ చెప్పారు. ''పాస్పోర్టు అనేది హక్కు. ఇది బహుమతి కాదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం'' అని ఉత్తర కోల్కత్తాలో బీడాన్ స్ట్రీట్ పోస్టు ఆఫీసులో పోస్టు ఆఫీసు పాస్పోర్టు సేవాకేంద్రా(పీఓపీఎస్కే) ప్రారంభోత్సవ కార్యక్రమంలో చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఎంఈఏ మంత్రి సుష్మాస్వరాజ్ విజన్, సామాన్యుడికి సైతం పాస్పోర్టు సౌకర్యాన్ని అందించడమని, భవిష్యత్తులో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పాస్పోర్టు సెంటర్ వస్తుందని చెప్పారు. ఇదే సమయంలో నాదియా జిల్లా కిషనానగర్లో మరో పీఓపీఎస్కేను కూడా మంత్రి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. గతంలో మీరు ఊహించని ప్రాంతాలకు కూడా పాస్పోర్టు ఆఫీసులు వస్తాయన్నారు. ఒకటిన్నర సంవత్సరం క్రితం ఈ ప్రాజెక్టును ప్రారంభించామని, ప్రస్తుతం ఇది శరవేగంగా దూసుకెళ్తుందని, వచ్చే రోజుల్లో ఈ కార్యక్రమంపై విశేష పెరుగుదల చూస్తారని మంత్రి చెప్పారు. గతంలో పాస్పోర్టు కోసం ప్రజలు అన్వేసించేవారని, కానీ భవిష్యత్తులో పాస్పోర్టు ఆఫీసులే ప్రజల కోసం అన్వేసించేలా చేయాలని ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. అప్పర్ క్లాస్ సేవా నుంచి గరీవ్ సేవాను ఇవ్వాలని తాము కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. ఇలాంటి ఆఫీసులోనే సిలిగురి, డార్జిలింగ్ వంటి ప్రాంతాల్లో కూడా ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. -
అది ముస్లిం లా బోర్డు కాదు.. మగవారి లా బోర్డు: అక్బర్
కోల్కతా: ట్రిపుల్ తలాక్ విషయంలో ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) ముస్లిం లా బోర్డులా కాక మగవారి లా బోర్డులా వ్యవహరిస్తోందని విదేశాంగ శాఖ సహాయమంత్రి ఎంజే అక్బర్ విమర్శించారు. శనివారం ఇక్కడ జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. ఇస్లాం మతం మహిళలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతోందని, దీనికి విరుద్ధంగా తలాక్ విధానం ఉందని ఆరోపించారు. భార్య అనుమతితో సంబంధం లేకుండా విడాకులు మంజూరు చేయడం అమానుషమన్నారు. -
ఉగ్రవాదంపై ఆత్మవంచన సరికాదు
న్యూయార్క్: మానవ మనుగడకే ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదం విషయంలో దేశాలు ఆత్మవంచన చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని భారత్ పేర్కొంది. భారీ సంఖ్యలో శరణార్థుల సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం ఉగ్రవాదమేనని చెప్పింది. ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో శరణార్థులు, వలసదారులపై జరిగిన సదస్సులో విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్ మాట్లాడుతూ, ‘భౌగోళిక రాజకీయాలే సంక్షోభాలకు కేంద్ర బిందువులు. శరణార్థుల ఉద్యమాలకు ప్రధాన కారణం ఉగ్రవాదమేనని ఇవి నిరూపిస్తున్నాయి’ అని అన్నారు. -
‘అణు’ సభ్యత్వం తథ్యం కానీ..
బైలైన్ అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో స్థానం సంపాదిం చాలన్న మన ప్రయత్నంలో గణనీయమైన మార్పు వచ్చింది. ఇప్పుడు సమస్య ‘ఇవ్వాలా’ కాదు, ‘ఎన్నడు’ అనేది. గత ఏడాదిగా భారత్ను సమర్థిస్తూ, అనుకూల ప్రభావాన్ని కలుగజేస్తున్న అమెరికా, అది ఈ ఏడాది చివరికే జరుగుతుందని విశ్వసిస్తోంది. భారత్ సభ్యత్వం అంశం చర్చకు వచ్చిన సియోల్ ప్లీనరీ జరిగిన తర్వాత శ్వేతసౌధమే అది తెలిపింది. అంతిమ నిర్ణయం కోసం వేచి చూడాల్సి ఉంది. ఒకప్పుడు మన దేశ అణు కార్యక్రమం పట్ల జాగరూ కతతోనో లేదా వ్యతిరేకతతోనో ఉండిన కెనడా వంటి దేశాలు ఎన్ఎస్జీ సమావేశానికి ముందు... మన దేశానికి ప్రాధ్యాన్యతా ప్రాతిపదికపై ప్రవేశం కల్పించాలని బహిరం గంగానే వాదించాయి. అవి ఉపయోగించిన పదం ‘‘అతి త్వరగా’’. బ్రిటన్, ఫ్రాన్స్, మాస్కో ప్రభుత్వాలు కల్పించిన ఆటంకం ఏమైనా ఉందంటే అదే. విస్పష్టమైన లక్ష్యాల కోసం అలుపెరగని శక్తిసామర్థ్యాలతో, ఆత్మవిశ్వాసంతో. అంతర్జాతీయ ప్రమాణాల మందకొడి గమనానికి బదు లుగా మన కాలానుగుణ ప్రణాళిక ప్రకారం కృషిని సాగిం చడం మన దౌత్యంలోని నూతన పరిణామం. ఇప్పుడు చైనా తప్ప అన్ని ప్రధాన అణుశక్తులూ మన దేశాన్ని ఎన్ఎస్జీలో చేర్చుకోవాలని కోరుతున్నాయంటే అది ఈ నూతన పరిణామం వల్ల కలిగిన లాభమే తప్ప, యాదృచ్ఛికంగా కలిగినదేమీ కాదు. అంతర్జాతీయ బహుముఖ సంస్థలలో ఏకా భిప్రాయం ఏర్పడటం అవసరమైన ఇలాంటి అంశాలను నిర్వచించకుండా వదిలేసిన కాలమనే బహిరంగ ప్రదేశం లోకి తోసేయడం సంప్రదాయకంగా జరుగుతుంటుంది. యథాతథ స్థితి కన్నా దౌత్యపరమైన ప్రశాంతత మెరుగని చెప్పనవసరం లేదు. క్షిపణి సాంకేతిక పరిజ్ఞాన నియంత్రణ వ్యవస్థ (ఎమ్టీసీఆర్) విషయంలో నెలకొన్న అంతర్జాతీయ జడత్వాన్ని మిత్రుల సహాయంతో ఈ నెల మొదట్లో అధిగ మించాం. 2030 నాటికి 40 శాతం కర్బనేతర విద్యుదు త్పత్తికి కట్టుబడతామని మనం గత ఏడాది పారిస్లో వాతా వరణ మార్పుల విషయమై హామీ ఇచ్చాం. ఆ హామీని సైతం ప్రస్తావిస్తూ అతి జాగ్రత్తగా రూపొందించిన వాద నతో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్ఎస్జీ విషయంలోని యథాతథ స్థితిని సవాలు చేశారు. శ క్తివంతమైన ఆ వాదన బలమైన శత్రువులను సైతం మిత్రులుగా మార్చింది. భారత్ తన శక్తికి మించి మరీ వాతావరణ మార్పుల విష యంలో కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి ప్రపంచం కూడా భారత అణు వ్యాపారానికి మద్దతును తెలిపితీరాలి అనే తర్కాన్ని వారు అర్థం చేసుకున్నారు. ఇక రెండవ కారణం, అణ్వస్త్రవ్యాప్తి నిరోధకత విష యంలో భారత్కు ఉన్న చరిత్ర. చైనా ప్రతిఘటనను ‘‘విధి విధానాలకు సంబంధించిన అటంకాలు’’ అన్నారని మనకు తెలుసు. అవి, పాకిస్తాన్తో తనకున్న వ్యూహాత్మక మైత్రిని పరిరక్షించుకోవాలనే చైనా కోరిక ఫలితం. మిగతా అణు శక్తులలో చేరడానికి ముందు భారత్ అణువ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ)పై సంతకం చేసి తీరాలనేది చైనా లాంఛనప్రాయమైన అభ్యంతరం. అణుశక్తులైన అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్లు ఈ వాదనను అంగీకరించడానికి ఎందుకు తిరస్కరించాయి? అణువ్యాప్తి నిరోధం విష యంలో భారత్ది మచ్చలేని చరిత్ర కాబట్టి. 1950ల నుంచి అణు సామర్థ్యాన్ని పెంపొందించుకుంటున్న భారత్కు వ్యతిరేకంగా ఎన్నడూ ఏ చిన్న గుసగుస వినిపించ లేదు. అందుకు విరుద్ధంగా పాకిస్తాన్కు అణువ్యాప్తి చెందిం చిన చరిత్ర ఉన్నది. 2002 స్టేట్ ఆఫ్ యూనియన్ ప్రసం గంలో నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ పాకిస్తాన్ను అణు ముప్పు ఉన్న ప్రాంతంగా పేర్కొన్నారు. అడ్రియన్ లెవీ అండ్ కాథరిన్ స్కాట్-క్లార్క్లు రచించిన డిసెప్షన్: పాకిస్తాన్, ది యునెటైడ్ స్టేట్స్ అండ్ ది గ్లోబల్ న్యూక్లియార్ వెపన్స్ కాన్స్పిరసీ అనే పుస్తకం ఈ అంశంపై ప్రామాణి కమైనది. ఆ పుస్తకం కవర్ పేజీ పైనే ‘‘అమెరికా సహా యంతో, సాంకేతికతను ఇతర దేశాలకు అందించడం ద్వారా, పునరుజ్జీవితమైన తాలిబన్కు, అల్కాయిదాకు ఆశ్రయం కల్పించడం ద్వారా భారీ అణ్వాయుధ సంపత్తిని సమకూర్చుకుని పాకిస్తాన్ నిజానికి పాశ్చాత్య దేశాలను వంచిం చింది’’ అని ప్రముఖంగా ముద్రించి ఉంటుంది. ‘‘టైఫాయిడ్ మర్ఫీ’’ మారుపేరున్న డాక్టర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ డబ్బుకు ఆశపడి... కొన్నిసార్లు ఆ దురాశకు భావ జాలం ముసుగుతొడిగి మరీ అణు రహస్యాలను అమ్మేశాడు. ఒక అసాధారణమైన డాక్యుమెంటు ఫలితంగా ఖాన్ 2004 ఫిబ్రవరి 4న బహిరంగంగా ఆ విషయాన్ని టెలివి జన్లో అంగీకరించాల్సివచ్చింది. లిబియా, ఉత్తర కొరి యాల వంటి ఖాతాదార్లకు అణు సాంకేతికతను అమ్ముతూ ఖాన్ అణు బ్లాక్ మార్కెట్ను నడిపాడు. ఆయన ఇది ఒంటరిగా చేసి ఉండరనేది స్పష్టమే. కానీ సైన్యం చేత తప్పు చేసినవాడిగా ముద్ర వేయించుకున్నాడు. ‘‘ఖాన్ తన తప్పును అంగీకరించాడు, ఆయన అత్యున్నత సహాయకు లకు అణు వ్యాపారం లేకుండా పోయింది’’ అని నాటి అధ్యక్షుడు బుష్ అన్నారు. ‘‘ఖాన్ నెట్వర్క్కు సంబంధించి తనకు తెలిసిన సమాచారాన్నంతా పంచుకుంటానని, తమ దేశాన్ని తిరిగి మరెన్నడూ అణు వ్యాప్తికి వనరును కానిచ్చేది లేదని అధ్యక్షుడు ముష్రాఫ్ వాగ్దానం చేశారు’’ అని కూడా తెలిపారు. పాకిస్తాన్ అధ్యక్షుడు సైతం తన దేశం తప్పు చేసిందని అంగీకరించాల్సి వచ్చింది. ఖాన్కు నగదు రూపం లోనూ, భౌతికంగానూ కూడా చెల్లింపులు జరిగాయి. అతడ్ని జైలుకు పంపడానికి బదులు ఆ డబ్బునంతా ఆయననే ఉంచుకోనిచ్చి, ప్రశాంతంగా పదవీ విరమణానం తర జీవితం గడపమని పంపేశారు. దీనికి విరుద్ధంగా భారత్ ‘‘అణ్వాయుధ వ్యాప్తి నిరో ధక ఒప్పందంలోని నిబంధనలను, లక్ష్యాలను సాధ్యమై నంత విశాలమైన రీతిలో అమలుపరచడానికి’’ సహకరిం చిందని ఎన్ఎస్జీ 2008లో పేర్కొంది. ఇంతకంటే ఎక్కు వగా చెప్పాల్సినది, ప్రత్యేకించి ఎన్ఎస్జీకి సంబంధించి ఏమీ లేదు. పాకిస్తాన్ను కాపాడటం కోసం భారత్కు వ్యతిరేకంగా అణ్వస్త్రవ్యాప్తి నిరోధం సమస్యను లేవనె త్తడం పూర్తి పరిహాసోక్తి కాకపోయినా, గొప్ప వైచిత్రి అవుతుంది. చైనా అభ్యంతరం సైతం సభ్యత్వ క్రమానికి సంబంధిం చినదే తప్ప మన దేశ అర్హతకు సంబంధించి నది కాకపో వడం కూడా భారత్ విశ్వసనీయతపై సందేహం లేదనే దానికి ఆధారం. దౌత్యం ఒక సుదీర్ఘ క్రీడ. క్షిపణి సాంకేతికత వంటి విష యాల్లో మనం ఫలితాలను వెంటనే సాధించగలుగుతాం. ఎన్ఎస్జీ సభ్యత్వం కేవలం కాలానికి సంబంధించిన సమస్యే, అది కూడా చాలా ఎక్కువ కాలమేమీ కాదు. వ్యాసకర్త: ఎం.జె. అక్బర్ (సీనియర్ సంపాదకులు) పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి -
జడత్వం వీడుతున్న ‘జోగీ’లు
బైలైన్ ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఏమీ కనిపించకపోవడం కూడా కాంగ్రెస్ను ఇందుకు ప్రేరేపించి ఉండవచ్చు. నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలన ద్వితీయ వార్షికోత్సవం నేపథ్యంలో జరిగిన సర్వేల ప్రకారం చూసినా ఆయన వ్యక్తిగత ప్రాభవం ఇప్పటికీ ప్రజలలో అలాగే నిలిచి ఉంది. ఎక్కువ మంది అభిప్రాయమో, లేక గణాంకాలను బట్టో కాకుండా ఆర్థిక వ్యవస్థ పురోగమనం స్పష్టంగా కనిపిస్తోంది. మధ్యప్రదేశ్లో శివరాజ్సింగ్ చౌహాన్ చిరకాలంగా అధికారంలో కొనసాగుతున్నప్పటికీ ఉపఎన్నిక లలో కాంగ్రెస్ను చిత్తు చేయగల సత్తాతోనే ఉన్నారు. ఎన్నికల రాజకీయాలలో సాధించిన విజయం గురించి వివరించడం కష్టమేమీ కాదు. కొన్ని లక్ష్యాల ప్రాతిపదికగా ఆ విజయాన్ని కొలుస్తారు. లక్ష్యాలనేవి స్థూలంగా రెండు. అధికారంలోకి రావడమే ధ్యేయంగా ఎన్నికలకు వెళితే అప్పుడు గెలిచిన స్థానాలను చూస్తారు. పార్టీ ఎదుగుదలే లక్ష్యంగా ఎన్నికలలో పోటీ చేస్తే అప్పుడు ఓట్ల శాతాలను పోల్చి చూసుకుని, ప్రాభవం అనే గ్రాఫ్లో సూచీ ఉత్తర దిశగానో, దక్షిణ దిశగానో ఎత్తుకు వెళ్లిందా లేక, యథాతథంగా సమాంతరంగానే ఉండిపోయిందా అని పరికిస్తారు. ఆ విధంగా 2009 సాధారణ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ విజయంగానే పరిగణిస్తుంది. ఎందుకంటే, ఆ ఎన్నికలలో ఆ పార్టీ 205 స్థానాలు గెలిచి, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1989 నాటి ఎన్నికలను అపజయంగా భావిస్తుంది. ఎందుకంటే, 197 మంది ఎంపీలతో అప్పుడు ప్రతిపక్షంలో కూర్చుంది. ఈ ఫలితాలనే ఓట్ల శాతం ప్రాతిపదికగా విశ్లేషిస్తే మీరు కలవరపడడం అనివార్యం. 1989లో కాంగ్రెస్కు 39 శాతం ఓట్లు దక్కాయి. కానీ అధికారం చేపట్టడంలో విఫలమైంది. అదే 2009 సంవత్సరంలో ఆ పార్టీ 28.55 శాతం ఓట్లు సాధించింది. అయితే అధికారం చేపట్టగలిగింది. ఇది పార్టీ విస్తృతి ఆధారంగా పాక్షికంగా ఇచ్చిన వివరణ. 1989లో కాంగ్రెస్ మొత్తం లోక్సభ స్థానాలకు పోటీ చేసింది. కానీ రెండు దశాబ్దాల తరువాత గణనీయంగా కుంచించుకుపోయి, మిత్రపక్షాల అవసరం కూడా వచ్చింది. అధికారం మాదేనంటూ చాటాలంటే, ఎన్నికలలో అన్ని చోట్లా పోటీ చేసి, పార్లమెంటులో చోటు లేకుండా చేసుకోవడం కంటే, పార్టీ ప్రభావం ఉన్న ఒక ప్రాంతంలో లభించిన సగటు విజయాన్ని గణనీయంగా చూపించడం మంచి ఉపాయం. ప్రభుత్వ వ్యతిరేక సిద్ధాంతంపైనే నమ్మకం ఇప్పుడు అందరికీ ఆసక్తి కలిగిస్తూ చోటు చేసుకున్న పరిణామం ఏమిటంటే, కాంగ్రెస్కు సంబంధించి ఆ పార్టీ ప్రభావం కలిగిన ప్రాంతం, సగటు విజయం - రెండూ కూడా పతనదిశ లోనే ఉన్నాయి. అయితే ఆ పార్టీ అబద్ధపు విశ్లేషణలతో తనను తాను మోసపుచ్చుకోవచ్చు. కానీ ఇలాంటి కొంగజపాలు మనల్ని మరింత లోతైన విశ్లేషణ దగ్గరకు తీసుకు పోలేవు. విశ్లేషకులకీ, రాజకీయవేత్తలకి తేడా ఏమిటంటే, రాజకీయవేత్తలు కేవలం మౌలిక సత్యంతో ప్రతిస్పందిస్తారు. చీర్లీడర్లకు మాత్రం అంకెల గారడీయే నచ్చుతుంది. ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకత అనే సిద్ధాంతాన్ని నమ్ముకుని దింపుడు కల్లం ఆశతో ఉంటుందని పరిశీలకులు ఎవ రైనా వెంటనే ఊిహించవచ్చు. కానీ ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీ చీలికలు పేలికలవుతోంది. అత్యంత ప్రభావశీలురైన కాంగ్రెస్ నాయకులలో నిస్సందే హంగా ఒకరని చెప్పదగిన అజిత్ జోగి తిరుగుబాటు ప్రకటించారు. సొంతంగా ప్రాంతీయ పార్టీ స్థాపించాలన్న యోచనకు వచ్చినట్టు కనిపిస్తున్నారు. అయితే ఆయన అధిష్టానాన్ని బెదిరించడానికే ఇదంతా చేస్తున్నారన్న ఊహాగానాలు లేకపోలేదు. అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీని తమ జాగీరులా ఏలుతున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పాలిట ఆ ఊహాగానం కూడా అశనిపాతం వంటిదే. రెండేళ్ల క్రితం వరకు కూడా అధి ష్టానం రాష్ట్రాల నాయకులను క్రమశిక్షణ గురించి బెదిరించేవారు. అలాగే ఢిల్లీ పెద్దలు పార్టీ వ్యవహారాలపై తీసుకున్న నిర్ణయాలు పసలేనివని ఆనాడు వారు చెప్పలేకపోయారు కూడా. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ఇదంతా ఎందుకు జరుగుతోంది? దీనికి సహజంగా వచ్చే సమాధానం - పార్టీ ఆధిపత్యం సోనియా గాంధీ నుంచి మధ్య వయస్కుడైన ఆమె కుమారుడు రాహుల్కు బదలాయించే ప్రక్రియ సంధిగ్ధంలో పడింది మరి! దండాన్ని కుమారుడికి అప్పగించాలని సోనియా విస్పష్టంగానే ఆశిస్తు న్నారు. కానీ వారసుడి చేతిలో ఆ దండం స్థిరంగా ఉంటుందన్న నమ్మకం పార్టీకి మాత్రం లేదు. కాంగ్రెసేతర ప్రభుత్వాల పట్ల ప్రబలే వ్యతిరేకత కోసం ఎదురు చూడడం తప్ప పార్టీని పునరుద్ధరించే మరో కార్యక్రమం అటు సోనియా గాంధీ వద్దగానీ, ఇటు రాహుల్ గాంధీ వద్దగానీ ఏదీ లేదు. ఇదొక స్తబ్దత ఆధారంగా తయారైన విధానం. ఓటరుకు అభివృద్ధే అత్యున్నత ప్రాథమ్యంగా మారిన కాలంలో మళ్లీ అధికారంలోకి రాగోరుతున్న ఒక ప్రతిపక్షం నిర్వర్తించవలసిన ప్రథమ విధ్యుక్త ధర్మం- ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలను ఓటర్ల ముందుంచడం. కనీసం ఈ ఆలోచన కూడా కాంగ్రెస్ నాయకులకు రావడంలేదు. వారి వ్యూహం ఏమిటంటే దేనిమీద అయినా, ఎవరి మీద అయినా నిర్దాక్షిణ్యంగా దాడి చేయడమే. ఆర్భాటం నుంచి ఎవరైనా కొంత మేలు పొందవచ్చు. కానీ ఓటర్లు ఆకాంక్షిస్తున్నది మాత్రం వారికి ఎలాంటి ప్రత్యామ్నాయం చూపు తారనే. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం హేతుబద్ధ కార్యక్రమమే. కానీ ఎవరి దృష్టినో ఆకర్షించడానికి గొంతు చించుకోవడం మాత్రం నిర్హేతుకమే. కనిపించని ప్రభుత్వ వ్యతిరేకత - అదే కాంగ్రెస్ బాధ ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఏమీ కనిపించకపోవడం కూడా కాంగ్రెస్ను ఇందుకు ప్రేరేపించి ఉండవచ్చు. నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలన ద్వితీయ వార్షికోత్సవం నేపథ్యంలో జరిగిన సర్వేల ప్రకారం చూసినా ఆయన వ్యక్తిగత ప్రాభవం ఇప్పటికీ ప్రజలలో అలాగే నిలిచి ఉంది. ఎక్కువ మంది అభిప్రాయమో, లేక గణాంకాలను బట్టో కాకుండా ఆర్థిక వ్యవస్థ పురో గమనం స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రంలో శివరాజ్సింగ్ చౌహాన్ చిరకాలంగా అధికారంలో కొనసాగుతున్నప్పటికీ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ను చిత్తు చేయగల సత్తాతోనే ఉన్నారు. ఈ వాస్తవాలు చాలామంది కాంగ్రెస్ నాయకులను మౌనం వైపు తిరోగమించేటట్టు చేస్తు న్నాయి. నిస్సహాయ జడత్వం నుంచే వారు ఉపశమనం పొందుతున్నారు. కానీ కాంగ్రెస్ నాయకులంతా అలాంటి జడత్వంలో లేరు. తన స్థాన మేమిటో చెప్పగల ఇటీవలి కాలపు కాంగ్రెస్ నాయకులలో ఒకే ఒకరు అజిత్ జోగి. అసోం సహా, కొన్ని ఈశాన్య రాష్ట్రాలలోను, ఉత్తరాఖండ్లోను కాంగ్రెస్ చీలిపోయింది. కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ నాయకులు ఎటు పోవాలో తోచక పార్టీలోనే కొనసాగుతున్నారు. ఒకప్పుడు దేశాన్ని పాలించిన పార్టీలో ఉండడం కంటే ఒంట రిగా మిగలడంలోనే మంచి భవిష్యత్తును చూసుకుంటున్నారు అజిత్ జోగి. సముద్రపు ఆటుపోట్లలో ఉపరితలం కిందనే విద్యుత్ ప్రవహిస్తుంది. కానీ అది సృష్టించే కల్లోలం తక్కువేమీ కాదు. అయితే ఉపరితలం ప్రశాంతంగా ఉందికాబట్టి వచ్చే నష్టం ఏమీ లేదని నమ్మే కాంగ్రెస్ నేతలు ప్రళయంలో ఓదార్పు పొందుతారు. కానీ అదొక బాధాకరమైన స్మృతి గీతే అవుతుంది. వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, సీనియర్ సంపాదకులు, బీజేపీ అధికార ప్రతినిధి: ఎం.జె. అక్బర్ -
గత గాయాలకు మందు
బైలైన్ క్యూబా. వియత్నాం. హిరోషిమా. బరాక్ ఒబామా మనకు ఏమైనా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారా? నాకైతే అలాగే అనిపిస్తున్నది. అమెరికా చరిత్రలో అనూహ్యమైన ఈ అధ్యక్ష పదవీకాలంలోనే ఈ తరం అమెరి కన్లను వెంటాడిన కొన్నికొన్ని జ్ఞాపకా లనూ, సందిగ్ధాలనూ తనకు సాధ్యమై నంత మేర భూస్థాపితం చేయాలని ఒబామా ప్రయత్నం చేస్తున్నారు. ఆ జ్ఞాపకాలు, సందిగ్ధాలు ఏవంటే: 1945లో నాగసాకి, హిరోషిమాలను సర్వ నాశనం చేసిన అణుబాంబులు, 1960లలో క్యూబా, వియత్నాంల మీద జరిగిన దాడి ఘటనలు. దేశాధ్యక్షునిగా ఆయన ఈ సంఘటనల మీద క్షమాపణలు చెప్పలేరు. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన యోధులకు అది క్షేమకరం కాదు. అలాగే సోవియెట్ యూనియన్కు తీవ్రమైన సవాళ్లు విసరి, కమ్యూనిజం నుంచి ఈ స్వేచ్ఛా ప్రపం చాన్ని రక్షించామని విశ్వసించే వారికి కూడా అది ఆత్మహత్యా సదృశమవుతుంది. కానీ 19 60, 1970లలో పెరిగి పెద్దదైన తరానికి మాత్రం క్యూబా మీద జరిగినది ఓ మూర్ఖపు చర్య, వియత్నాం మీద దాడి ఘోర తప్పిదం. ఇది పూర్తిగా యాదృచ్ఛికం కాకున్నా, బరాక్ ఒబామా పుట్టిన సంవత్సరం, బే ఆఫ్ పిగ్స్ (దక్షిణ క్యూబా) మీద విఫల దాడికి జాన్ఎఫ్ కెన్నెడి ఆమోదించిన సంవ త్సరం కూడా 1961. కొన్ని మాసాల తరువాత క్యూబాలో క్షిపణల గురించిన వివాదం మీద అమెరికా, సోవియెట్ రష్యా అణు సంఘర్షణతో ఈ ప్రపంచాన్ని పేల్చేసినంత పనిచేశాయి. పశ్చాత్తాపం కూడా తగిలిన ఎదురు దెబ్బలకి కొంత సాంత్వన చేకూర్చగలదని ఒబామాకు తెలుసు. అయితే ఇందుకు తాను కూడా కొంత మూల్యం చెల్లించవలసి ఉంటుందని ఆయ నకూ తెలుసు. అందుకు సంబంధించిన ఆత్మలు ప్రార్థనలతో సరిపెట్టుకోవు. వాటిని పూర్తిగా భూస్థాపితం చేయవలసిందే. గతకాలపు విషాదాలను మనం తుడిచిపెట్టలేం. వాటి పర్యవ సానాలను నిరాకరించలేం కూడా. ఒక ఘోర తప్పిదం గురించి బాహాటంగా అంగీకరిస్తే ప్రజలలో గుర్తింపు ఉంటుంది. గడచిన శతాబ్దంలో మనం చూసిన కనీవినీ ఎరుగని రక్తపాతాలు- యుద్ధాలు, వర్ణ వివక్ష, మారణహోమాలతో పోల్చి చూస్తే కామగాటమారు ఉదంతం వాటితో సమంగా మానవాళి మీద పెద్దగా ప్రభావం ఏమీ చూపలేదు. కానీ సిక్కుల మీద అది లోతైన ముద్రను వదిలి వెళ్లింది. 1914లో సిక్కులు ప్రయా ణిస్తున్న కామగాటమారు అనే ఓడను జనంతో అలాగే కెనడా వెనక్కి తిరగ్గొట్టింది. ఇప్పటికీ ఆ గాయం రేగుతూనే ఉంటుంది. ఈ గాయాన్ని మాన్పవలసిన అవసరాన్ని కెనడా యువ ప్రధాని జస్టిన్ ట్రూడో గుర్తించారు. ఇందుకు సంబంధించి ఆచితూచి వేసిన పదాలతో ఆయన ఓ ప్రకటన ఇచ్చారు కూడా. కామగా టమారు నౌకకు, అందులో అప్పుడు ప్రయాణించిన వారు ఎదుర్కొన్న ప్రతి విషాద ఘటనకి కెనడా బాధ్యత వహించలేదు. అయితే ఈ ప్రయాణికులు నిరపాయంగా తిరిగి వలస పోవడానికి వీలు కల్పించని నాటి కెనడా చట్టాలకు మాత్రం మా ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. పర్యవసానంగా ఎదురైన అన్ని విచారకర పరిణామాలకు మాత్రం మమ్మల్ని క్షమించాలి.’’ ఇందులో ముఖ్యాంశం బహిరంగంగా విచారం వ్యక్తం చేయడం. వాస్తవం ఏమిటంటే ఈ పనిచేయడానికి వందేళ్లు పట్టిందంటే, ఇలాంటి విషాదాన్ని గుర్తించడానికి వ్యవస్థలకు ఎంతకాలం పడుతుందో ఇది సూచిస్తుంది. అలాగే ఆ విషాదాలలోని అన్యాయం ఎంతటిదో గమనించడానికి కూడా ఎంత సమయం కావాలో ఇది సూచిస్తుంది. హిరోషిమా, నాగసాకిలలో నిర్మించిన శాంతి స్మారక స్తూపాన్ని సందర్శించడానికి అమెరికా అధ్యక్షుడికి 71 ఏళ్లు పట్టింది. ఇలాంటి వాటి మీద ఆగ్రహం ప్రకటించడం కంటే, నైతిక ప్రమాణాల గురించి మాట్లాడటం కంటే ఇలాంటి ఆలస్యాల వెనుక ఉన్న సంక్లిష్టతలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 1945 నాటికి అమెరికా, జపాన్ అప్పటికి మూడేళ్ల నుంచి ఘోర యుద్ధంలో నిమగ్నమై ఉన్నాయి. ఎవరూ వెనక్కి తగ్గేటట్టు లేరు. కమికాజి అనుభవం దృష్ట్యా (పేలుడు పదార్థాలను నింపిన ఆ పేరు కలిగిన జపాన్ విమానం శత్రు స్థావరం మీద దాడి చేసింది) జరిగే ప్రాణనష్టం గురించి అమెరికా యోచించవలసి వచ్చింది. అయినప్పటికీ హిరోషిమా, నాగసాకిల మీద అణుబాంబుల బీభ త్సం తప్పలేదు. నా అభి ప్రాయం వరకు అమెరికా, జపాన్ల మధ్య సయోధ్య ఇప్పటికి పరిపూర్ణం కాలేదు కానీ, 1950లలోనే ఇందుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఒక ఉత్పాతం కంటే శాంతి గొప్పదన్న వాస్తవాన్ని ఇంత తొంద రగా గుర్తించినందుకు రెండు దేశాలకు చెందిన ప్రజలకు శిరసు వంచి నమ స్కరించాలి. పర్యవసానం గా ప్రపంచం కొంత మెరుగైన స్థితికి చేరింది. చరిత్రలో సరికొత్త అధ్యాయం ఎప్పుడు మొదలవుతుంది? విజయం లేదా పరాజయం ప్రతి అంశాన్ని పరిపూర్ణంగా మార్చి వేసినప్పుడు తప్ప, సరికొత్త అధ్యాయం గురించి చెప్పడం ఎప్పుడూ కష్టమే. ఒక పరిణామం కొనసాగింపు ఎప్పుడూ అస్పష్టంగానే ఉంటుంది. ఒబామాకు క్యూబా సాదర స్వాగతం చెప్పినప్పుడు కూడా అమెరికా ఆ దేశంతో సంబంధాలకు సిద్ధంగా లేదు. నిజానికి కొన్ని ఏళ్ల నుంచి ఆ తలుపులను తట్టలేదు. అయితే ఆ తలుపులు ఇక ఎప్పటికీ తెరిచే ఉంటాయని ఒబామా పర్యటన గట్టిగా చెబుతోంది. అమెరికా-వియత్నాం సంబంధాలలో ఒబామా తాపీగా చేసిన విన్యాసం ఒక కొత్త విధానాన్ని పరిచయం చేస్తున్నది. వియత్నాంకు అమెరికా ఆయుధాలు అమ్మబోతున్నది. వియ త్నాం యుద్ధం కొన్ని దశాబ్దాల క్రితమే ముగిసి ఉండవచ్చు కానీ, విభేదాలకు సంబంధించిన చివరి జాడలు, అంటే అనుమానాలు కూడా ఇప్పుడు సమసిపోయాయి. ఇది 1940లలో కమ్యూనిస్టు యోధుడు హోచిమన్ జపాన్కు వ్యతిరేకంగా అమెరికాతో కలసినప్పుడు ఆ రెండు దేశాల మధ్య కొనసాగిన బంధానికి పూర్తి విరుద్ధమైనది. రెండో ప్రపంచ యుద్ధం ముగియగానే ఐరోపా దేశాలను వలసల నుంచి ఖాళీ చేయవలసిందిగా అమెరికా ఒత్తిడి చేస్తుందని హోచిమన్ భావించారు (ఇలాంటి కారణాలతోనే గాంధీజీ మొదటి ప్రపంచ యుద్ధానికి మద్దతు ఇచ్చారు). కానీ రూజ్వెల్ట్ చనిపోయిన తరువాత ఆయన వారసుడు హ్యారీ ట్రూమన్ వియత్నాం మీదకు ఫ్రాన్స్ను ఉసిగొలిపారు. మిగిలిన కథ అందరికీ తెలుసు. వ్యాసకర్త: ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు బీజేపీ అధికార ప్రతినిధి -
దేవతా వస్త్రాల చక్రవర్తి
బైలైన్ విజయానికి ఎందరో తల్లి దండ్రులు, ఓటమి మాత్రం అనాథ . ఇది మానన సంఘర్షణ మొదలైన నాటి నుంచి రూఢిగా స్థిరపడ్డ సత్యం. ఒకవేళ మీరు ఆ విషయాన్ని మరచిపోయి ఉంటే భారత రాజకీయాలే మీకు దాన్ని గుర్తు చేస్తాయి. మే 21, శనివారంనాడు ఒక జాతీయ పత్రికలో ఆసక్తికర కథనం వచ్చింది. ఇది శుక్రవారం రాసినదో లేక కాంగ్రెస్ను చావు దెబ్బ తీసిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డ ఆ మరునాడు రాసినదో అయి ఉండాలి. తిరిగి అధికా రంలోకి వస్తామని ఆశిస్తున్న అసోం, కేరళలలోనూ, మిత్రుల సహాయంతో అధికారంలోకి రాగలమని నమ్మకం పెట్టుకున్న బెంగాల్, తమిళనాడులలోనూ ఆ పార్టీ కుప్ప కూలింది. గుర్తు చెప్పడానికి నిరాకరించిన ‘ఆధారాల’కు ఆపాదించిన ఆ కథనం ప్రకారం... బెంగాల్లో కమ్యూనిస్టు లతో కూటమికి, కాంగ్రెస్ పార్టీకి ఆచరణలో అధినేతగా వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీ ‘విముఖుడు’. సోనియా గాంధీకి మమతా బెనర్జీతో ఉన్న ‘అత్యంత సన్నిహితత్వం’ కార ణంగా బెంగాల్లో ప్రచారం సాగించ డానికి ఆమె అంతే ‘విముఖం’గా ఉన్నారని సైతం అది జోడించింది. ఆ ‘ఆధారాలు’ తమ పేరేమిటో చెప్పడానికి ఇష్టపడక పోవడం కొంత విచిత్రమే. అయితే ఇదేమీ పరిశోధ నాత్మక పత్రికా రచన కాదు కాబట్టి చెప్పక పోయినా ఫర్వాలేదు. కాంగ్రెస్కు నాయకత్వం వహిస్తున్న కుటుంబ వైఫల్యం బయటపడ్డప్పుడు దాన్ని కాపాడటానికి విధేయతతో కూడిన సమర్థనను ప్రయోగిం చారని దీని అర్థం. ఈ సమర్థన ఉత్త చెత్తవాగుడు. బెంగాల్లో మమతా బెనర్జీని గద్దె దించే మంత్రంగా... రాహుల్ గాంధీయే, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరితో కలసి కుమ్మక్కైఆ కూటమిని నిర్మించారు. ఆయన ప్రయత్నమే సఫలమై ఉంటే, ఇదే కథకులు రాహుల్ను సాటిలేని మేటి వ్యూహకర్తగా ఆకాశానికెత్తేవారు, కాబోయే రాజుగా పట్టం కట్టేవారు. బహుశా పదిహేను రోజుల్లోపలే ఓ ప్రత్యేక ఏఐసీసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయనను పార్టీ అధ్యక్షుణ్ణి చేసేవారు. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ ఎలాంటి విముఖతను కనబరచలేదు. గత వామపక్ష ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యతో కలసి వేదికపై ఆయన చాలా సంతోషంగా కనిపించారు. మమతా బెనర్జీని ‘అవినీతిపరురాలు’గా, ‘అసమర్థు రాలు’గా అభి వర్ణించడంలో కాంగ్రెస్ ప్రత్యేక ఆనందాన్ని పొందింది కూడా. అసలు సమస్య ఈ సమర్థన బూట కపుది కావడం కాదు, నిస్సహాయంగా కాంగ్రెస్ దాన్ని ఆమోదించడం. గెలుపు, ఓటములు ప్రజాస్వామ్యంలో భాగం. ఒక రాజకీయ పార్టీ ఈ రెంటిలో దేనిలోనూ పడి కొట్టుకు పోకూడదు. విజయం కడుపున పొంచి ఉండేటన్ని ప్రమా దాలు ఓటమిలోనూ ఉంటాయి. పేదలకు ప్రయోజనాలను కలిగించే విధానం గల నిజాయితీతో కూడిన మంచి పాల నను అందించడమే విజయం పట్ల విజ్ఞతాయుతమైన ప్రతి స్పందన. ఇది తెలిసిన వారు తిరిగి ఎన్నికవుతారు, తెలి యనివారు ఉన్న అధికారం కోల్పోతారు. ఓటమి పర్యవసానంగా ఉండాల్సింది ఒకే ఒక్కటి... నిజాయితీ. ఇతరుల గురించి కంటే మీ గురించి మీరు నిజాయితీగా ఉండటం అవసరం కావడమే ఇందులో ఉన్న ఇబ్బంది. షేక్స్పియర్ అన్నట్టు దోషం గ్రహాల్లో కాదు, మనలోనే ఉంటుంది . మాటలతో సరిపుచ్చడం, ‘ఆత్మ శోధన’ అనే పదాన్ని, దాని అర్థం దిగజారేంతగా పదే పదే వల్లె వేయడం వల్ల ప్రయోజనమేమీ లేదు. ఇది ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా అదే ఇంకా ఎందుకు సమస్య అవుతుంది? సీనియర్ కాంగ్రెస్ నేత ద్విగిజయ్సింగ్ నిస్సందేహంగా వారి పార్టీకి అంతా మంచే జరగాలని కోరుకునే వ్యక్తి. ఆయన తమ పార్టీకి ‘శస్త్ర చికిత్స’ అవసరమని అంగీకరించారు. అంటే ఆస్పిరిన్ మాత్రతోనో లేదా బ్యాండ్ ఎయిడ్ పట్టీతోనో క్యాన్సర్ వ్యాధిని నయం చేయలేమని అర్థం. అయితే ఉన్న విషయం ఇది. కాంగ్రెస్ నేతలే నిజాయితీగా ఉంటే... వారు తమ కళ్లకు కట్టుకున్న గంతలను విప్పేసి, చక్రవర్తి లేదా చక్రవర్తి వారసునిగా కనిపిస్తున్నవారి ఒంటిపైన బట్టలు లేవని చెప్పి ఉండేవారు. సుప్రసిద్ధై మెన ఆ నీతి కథలో ఒక పసివాడు మాత్రమే ఆ ధైర్యం ప్రదర్శించగలి గాడు. ఎందు కంటే ఆ బాలుడు ఆ చక్రవర్తికి విధేయుడూ కాదు, చక్రవర్తి నుంచి ముందు ముందు తనకు ఏమైనా ప్రయోజనం జరగాలని ఆశిం చడమూ లేదు. కాంగ్రెస్ నాయక- చక్రవర్తి అంటి పెట్టుకుని ఉండేదల్లా ఎలాంటి తర్కమూ లేదా సారమూ లేని ప్రతికూలాత్మకతకే. కాంగ్రెస్ చూడటానికి నిరాక రిస్తున్న దానిని ఓటర్లు గమనించ గలుగుతారు. మీ నాయకుని ప్రత్యేక ఆదేశాలను అనుసరించి పార్లమెంటును స్తంభింపజే యడం ద్వారా ప్రజలకు నష్టాన్ని కలుగజేస్తూ మీ ప్రయోజనాలను ఈడేర్చుకుంటున్నారు. మీరు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తుంటే, వృద్ధి వల్ల లబ్ధిని పొందే ప్రజ లకు దెబ్బ తగులుతోంది, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి సముచితమైన స్థానం ఉంది. ప్రతిపక్షంలేనిదే ప్రజా స్వామ్యం లేదనేదీ నిజమే. అయితే అతి తీవ్రమైన, అర్థరహితమైన ఈ దుర్నీతికి మాత్రం తావు లేదు. హుందాగా వ్యవహరించడం, అతి స్పష్టమైన ప్రత్యా మ్నాయ ఆర్థిక వేదికను చూపడం ద్వారా మాత్రమే మీరు ప్రజలపై సానుకూల ప్రభావాన్ని కలుగజేయగలుగుతారు. ఆ రెంటిలో ఏదీ జరిగేట్టు లేదు. ఈ ఓటమి తర్వాత వెంటనే కొన్ని అసమ్మతి స్వరాలు వినిపిస్తాయి. ఇక ఆ తదుపరి పెడబొబ్బలు పెట్టే సమర్థకులు టీవీల్లో ప్రత్యక్షమై చక్రవర్తి ఏ తప్పూ చేయజాలడని వాదిస్తారు. ఏదో సరైన సమయం చూసి, వానలు పడి కాస్త వాతావరణం చక్కబ డ్డాక, ఓ పూట ఏఐసీసీ సమావేశం జరపి... మనం ఇంతకు ముందు చాలా తరచుగా విన్న సాకులనే ఆమోదిస్తూ తీర్మానం చేసేస్తారు. ఎన్నడూ టైలర్ దగ్గరకు పోకుండానే చక్రవర్తి బతికేయగలుగుతాడు. ఇలా మీరు ఒకసారి తప్పించుకోగలరు. అదృష్ట వంతులైతే ఒకటి కంటే ఎక్కువ సార్లే తప్పించుకో గలుగుతారు. అయితే అది అతి తరచుగా ‘ఒకసారి’గా మారే సమయమూ వస్తుంది. ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి -
త్రిమూర్తుల చిత్త ప్రవృత్తి ప్రకోపం
బైలైన్ ఒక ఇటాలియన్ కోర్టు తీర్పు భారత ప్రజాస్వామ్యాన్ని ఎలా హతమార్చిందో చెప్పగలరా? శక్తివంతమైన ఒక ప్రత్యేక కాంగ్రెస్ ‘‘కుటుంబం’’ తీసుకున్న లంచాలను అనుమతిస్తేనే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుందా? పోలీసులను వారి విధులను నిర్వర్తించమని చెప్పినంత మాత్రాన ప్రజాస్వామ్యాన్ని కాలరాచివేసినట్టేనా? ప్రాచీనులకు పోలికలు బాగా తెలుసు. మనిషి మానసిక స్థితులను వారు శరీరాంతర్గత స్రావాల ఆధారంగా (గ్రీకులు) నాలుగు రకాలుగా లేదా ‘ప్రవృ త్తులు’గా విభజించారు. రక్తం, కఫం, నల్ల పైత్యం, పచ్చ పైత్యం అనే నాలుగూ వారి దృష్టిలో దేహాంతర్గత ద్రవాలు. ప్రజా స్వామ్య వ్యవస్థలో విమర్శను లేదా వ్యతిరేకతను కూడా వాటిలో ఒకటిగా చేర్చడం ఉపయోగకరం. ఎన్డీఏ ప్రభుత్వ ద్వితీయ వార్షికోత్సవం సమీపిస్తుండగా అవన్నీ కలసి ప్రకో పిస్తుండటాన్ని చూస్తుంటే నాకీ విషయం హఠాత్తుగా స్ఫురించింది. మొదటిది, రక్తం. అన్ని శరీరాల్లాగే రాజకీయ వ్యవస్థ కూడా రక్తం నిరంతరాయంగా ప్రవహించనిదే మనజాలదు. ప్రజాస్వామ్య వ్యవస్థ హృదయం, మస్తిష్కాలు ప్రభుత్వ అధీనంలో ఉంటే... అధికారానికి ఎదురు నిలిచే సంస్థల చేతుల్లో అభిప్రాయాలనే రక్తనాళాలుంటాయి. ప్రభుత్వం చేసే ప్రతి తప్పును పట్టి చూసే హక్కు ప్రతిపక్షానికి ఉంది. అతిశయీకరించడం, వక్రీకరించడం ఆ ద్వంద్వ యుద్ధ ఆయుధాలలో భాగం. కఫం, శాంతిని సూచిస్తుంది. ఆర్థిక లేదా రాజకీయ విజ్ఞాన శాస్త్రాలకు చెందిన స్వతంత్ర విశ్లేష కుల ప్రవృత్తి ఇది. వారి తీర్పు ప్రతికూల అంశాలవైపు ఎక్కు వగా మొగ్గు చూపే ధోరణితో ఉంటుంది. అయితే సాను కూల అంశాలపై వారి ప్రశంసల విశ్వసనీయతను అది పెంచుతుంది. అధికారంలో ఉన్నవారు స్వీయ ప్రయోజన ప్రేరితులైతే తప్ప, ఇది వారికి తోడ్పడేదే. విషాదాన్ని సూచించే నల్ల పైత్యం అధికారం పట్ల మీడియా వైఖరిని బహుశా అత్యుత్తమంగా అభివ ర్ణిస్తుంది. పాత్రికేయులు అవహేళన చేయాలని చూస్తుంటారు. అది వారు సంధించే ప్రశ్నలకు వ్యంగ్యంతో కూడిన పదనును, ఉద్వేగాన్ని కలిగిస్తుంది. వారి సవాళ్లకు పోరాటపు మైకం ఉంటుంది. బహుశా ఇది 80% మీడియా విషయంలో నిజం కావచ్చు. దురదృష్టవశాత్తూ ఆ మిగతావారు అవినీతి పరులు. కాబట్టి అంతగా పట్టించుకోవాల్సిన పని లేదు. అమెరికాలో స్వేచ్ఛాయుతమైన పత్రికలు పుట్టినప్పటి నుంచీ ఎల్లో జర్నలిజంపై చర్చ కూడా పుట్టింది. భావ ప్రక టనా స్వేచ్ఛ ఉన్నంత కాలం బహుశా అది కూడా ఉంటుంది. సెన్సార్షిప్ ఒక్కటే దీనికి విరుగుడు అను కుంటాం. కానీ, అది నిజం కాదు. పాఠకులకు లేదా వీక్ష కులకు ఎల్లో జర్నలిజాన్ని తిరస్కరించే సామర్థ్యం ఉంది. అలాంటి అలుగ్గుడ్డలను కొనడాన్ని, చూడటాన్ని మానేసి సర్క్యులేషన్ లేదా టీఆర్పీలు తగ్గిపోయేలా చేయగలరు. నాలుగో ప్రవృత్తి అయిన పచ్చ పైత్యంతోనే ఉంది అసలు పెద్ద సమస్య. కాలేయం నుంచి స్రవించి, పిత్తాశయంలో నిల్వ ఉండే పైత్యం తలకు ఎక్కితే... నిరాశానిస్పృహల వల్ల పెరిగి పెద్దదై దుర్మార్గపూరితంగా, విషపూరితంగా మారి నాలుకకు పాకుతుంది. ఇక ఆ వ్యాధిగ్రస్తులు స్పందించడానికి బదులు ప్రేలాపిస్తుంటారు, వాదించడానికి బదులు ఆరోపిస్తుం టారు, వివరించడానికి బదులు దుమ్మెత్తిపోస్తుంటారు, మాట్లాడటానికి బదులు ఆగ్రహంతో రగులుతుంటారు. ఇప్పటికే ఒక టీవీ ప్రధానికి వ్యతిరేకంగా దుర్మార్గమైన వ్యక్తి గత దాడిని ప్రసారం చేసింది. ఎలాంటి ఆధారాలూ లేని ఆరోపణలను ఏకరువు పెడుతూ తమ దుష్ట బుద్ధిని ఇంతైనా దాచుకోకుండా ఆ దాడి సాగింది. అదృష్టవశాత్తూ, అలాంటి ద్వేషం వారికే శత్రువుగా పరిణమిస్తుంది. దుమ్మెత్తి పోసేవారే చూసేవారికి దుష్టులుగా కనిపిస్తారు. అయితే ఐదవది, కొత్తది అయిన మరో ప్రవృత్తి కూడా ఉంది. ప్రాచీనులు దాన్ని ఎన్నడూ పరిగణనలోకి తీసుకో లేదు. అసంబద్ధ నాటక రంగస్థలం మరింత ఆధునిక పరి ణామం కావడమే అందుకు కారణం కావచ్చు. ఒక ఇటాలి యన్ కోర్టు, భారతదేశంతో వీఐపీ హెలికాప్టర్ల అమ్మకం ఒప్పందం కుదుర్చుకునేందుకు అగస్టా వెస్ట్లాండ్ హెలి కాప్టర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్లు లంచాలు ఇచ్చారని శిక్ష విధిం చింది. ఆ విషయంపై కాంగ్రెస్ స్పందించిన తీరునే ఇందుకు ఉదాహరణగా చూడొచ్చు. లంచాలు ఇచ్చారంటే ఎవరో తీసుకున్నారు. ఆ డబ్బు యూపీఏ ప్రభుత్వంలో పలుకు బడిగల వారికి చేరిందనేది స్వయంవిదితమే. ఇంతవరకు విచారణాధికారులు ఈ లంచాల గొలుసులో అట్టడుగునున్న వారి వరకే చేరారు, అసలు సూత్రధారులను కాదు. కానీ కాంగ్రెస్ యుద్ధ బాకాల హోరును చూస్తుంటే.... అది ఇటాలియన్ కోర్టు మొదటి తీర్పులాగా లేదు, బైబిల్లోని తుది తీర్పులా ఉంది. నేటి ప్రభుత్వం ‘ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తోం’దని ఢిల్లీలో జరిగిన ఓ ప్రదర్శనలో సోనియా గాంధీ ఆరోపిం చారు. అదే ప్రదర్శనలో కాంగ్రెస్ అత్యున్నత నాయక ద్వయం అధికారికంగా నాయక త్రయంగా మారింది. సోనియా, రాహుల్ గాంధీల మధ్య రాబర్ట్ వాద్రా చిత్రాన్ని ఉంచారు. ఒక ఇటాలియన్ కోర్టు తీర్పు భారత ప్రజాస్వా మ్యాన్ని ఎలా హతమార్చిందో చెప్పగలరా? శక్తివంతమైన ఒక ప్రత్యేక కాంగ్రెస్ ‘‘కుటుంబం’’ తీసుకున్న లంచాలను అనుమతిస్తేనే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుందా? ఇంతవరకు మనకు తెలిసింది ఒక ‘‘కుటుంబం’’ అని మాత్రమే. అనుమానితులను ఇంకా విచారించిన తర్వాత మరింత నిర్దిష్ట సమాచారం లభిస్తుందని ఆశించవచ్చు. పోలీసులను వారి విధులను నిర్వర్తించమని చెప్పినంత మాత్రాన ప్రజాస్వామ్యాన్ని కాలరాచివేసినట్టేనా? ఒక పార్టీ నాయకత్వం తన మంచి ప్రవృత్తిని లేదా సంతులనాన్ని కోల్పోతే జరిగేది ఇదేనేమో అనుకుంటాను. కాంగ్రెస్ను ఇప్పడు తమ శాశ్వత నియంత్రణలోకి తీసు కున్న కుటుంబానికి ముప్పు ఏర్పడటం తప్ప మరేదీ ఆ పార్టీని అంత వేగంగా లేచి నిలబడేలా చేయలేదను కుంటాను. ఆ లంచాలు పుచ్చుకున్న వ్యక్తి ఏ క్యాబినెట్ మంత్రో అయ్యుంటే... ఇలా భుజాలెగరేసి, అలా అతన్ని వదిలిపారేసేవారే. కానీ ఈ భుజాల కుదుపుతో పాటూ విన వస్తున్న అరుపులు, పెడబొబ్బలు మనకేదో చెబుతున్నాయి. - ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి. -
కష్టకాలంలో మానవీయ స్పర్శ
బైలైన్ శరణార్థుల విషయంలో యూరప్ మడిగట్టుకుని ఉండలేదని, ఉదాసీనంగా లేదా శత్రుపూరితంగా వ్యవహరించజాలదని పోప్ అన్నారు. ఆయన మత విశ్వాసం ఇతరులను కలుపుకుని పోయేది. మనుషుల బాధల పట్ల ఆయనకున్న పట్టింపు మత విశ్వాసాల సరిహద్దు గోడలను అధిగమించినది. అసలు చెప్పుకోవాల్సిన కథనాలే అతి తరచుగా వార్తల్లో పడి కొట్టుకుపోతుంటాయి. ఉదయం నుంచి రాత్రి వరకు సాగే సుదీర్ఘ సమాచార కవాతులో వార్తలు సైతం కళ్ల ముందు కదలాడుతూ పోయే శీర్షికలుగా మారిపోతాయి. వాటి ప్రాముఖ్యతను కొలిచే పాటి తీరిక, శ్రద్ధ ఎవరికి ఉంటుంది? ఏప్రిల్ 16న ఒక ప్రాముఖ్యత గల ఘటన జరిగింది. ఆ కథనం పూర్తిగా కాకపోయినా, చాలా వరకు దాన్ని చేరవేసే క్రమంలో కొట్టుకుపోయింది. రోమన్ కేథలిక్కుల మత పెద్దయైన హోలీ ఫాదర్ పోప్ ఫ్రాన్సిస్, యుద్ధ విధ్వంసానికి గురైన సిరియా వంటి ముస్లిం దేశాల శరణార్థులను కలుసు కున్నారు. నేడు మరుపున పడిపోయిన ఒకప్పటి సుప్రసిద్ధ గ్రీకు ద్వీపం లెస్బోస్లో ఈ కలయిక జరిగింది. యూరప్ అంచున ఉన్న గ్రీస్, రెండు శతాబ్దాల స్వతంత్ర అస్తిత్వం తర్వాత... మళ్లీ ఆ ఖండపు ముఖ ద్వారంగా మారింది. అయి తే, యూరోపియన్లు మాత్రం గ్రీస్, యూరప్కు రక్షణను కల్పించే అడ్డుగోడగా నిలవా లనే కోరుకున్నారు. ఒకప్పు డు, అట్టోమన్-తురుష్క సేనలు గ్రీస్ను స్థావరంగా చేసుకుని బాల్కన్ దేశాల లోకి చొరబడుతూ, అక్కడి నుంచి శక్తివంతమైన యూరోపియన్ రాజ్యాలపైకి దృష్టిని సారిస్తూ ఉండేవి. నేడు యుద్ధ బీభత్సానికి గురైన ముస్లిం దేశాల ప్రజలు టర్కీని ఆనుకుని ఉన్న లెస్బోస్ను జర్మనీ, స్కాండినేవియాలకు, సుదూరంలోని బ్రిటన్కు చేర్చే హార్బర్గా మార్చారు. 16, 17 శతాబ్దాలలోని యూరోపియన్ దర్బారులు అట్టోమన్ సామ్రాజ్య శక్తి యురేసియా, మధ్యధరా ఆఫ్రికా ప్రాంతాలకు విస్తరించడం గురించి సహేతుకంగానే ఆందోళ న చెందుతుండేవి. పాశ్చాత్య నాటకకర్తలే ఆనాటి జనరంజ క ప్రసార మాధ్యమాల శాసకులు. వారు తురుష్కులను యూరప్ నాగరికతను, సంపదను, సౌందర్యాన్ని కాలరాచి వేయడానికి వేచి చూస్తున్న రాక్షసులుగా చిత్రించారు. ఉదారవాద మేధావి షేక్స్పియర్ ఇందుకు మినహాయింపు. ఈసారి యూరప్లో భయాన్ని రేకెత్తించినది అరబ్బుల వంపు తిరిగిన ఖడ్గాల దండయాత్ర కాదు, వచ్చిపడే జనాభా దండు. ఈ సారి గుంపులు గుంపులుగా వచ్చి పడ్డవారు వేగాశ్వ పదఘట్టనల సంరంభంతో రాలేదు. దుర్బలమైన పడవల్లో శరణార్థులై వచ్చారు. అలా వచ్చే సాధారణ ప్రజలు, పౌరులుగా మారగలుగుతారు. కాబట్టి నేటి ప్రజాస్వామ్య యుగంలో వారు సైతం సైనికులంత గానూ ఆందోళనను రేకెత్తిస్తున్నారు. యూరోపియన్ ప్రభుత్వాలు తొలుత ఈ శరణార్థుల వెల్లువను చూసి బెంబేలెత్తిపోయాయి. మానవీయ స్పందన లకు, పెరుగుతున్న ప్రజాగ్రహానికి మధ్యన అవి ఇరుక్కు పోయి మ్రాన్పడిపోయినట్టనిపించింది. టర్కీతో తీవ్ర దౌత్య కృషి, సరిహద్దు రక్షణ చర్యలను పటిష్టం చేయడం కలసి వాటికి కొంత ఉపశమనాన్ని కలుగజేశాయి. అయితే ఎవరికీ చెందని భారీ శరణార్థుల జనాభా సరిహద్దుల మధ్యన చిక్కుకు పోయి మిగిలింది. తమ మాతృ భూమికి తిరిగి వెళ్లడమనే ఆలోచనకే వారు భయకంపితులౌతున్నారు. అలాంటి ఆపత్కాలంలో పోప్ ఫ్రాన్సిస్ లెస్బోస్లోని ఒక శరణార్థుల శిబిరాన్ని స్వయంగా సందర్శించారు. ఇది, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత మానవ మహా విపత్తని ఆయన అన్నారు. పోప్ మాటలను ఆచితూచి జాగ్రత్తగా వాడటమే కాదు, ఎంతో ఆలోచన చేసిన తర్వాత నే కార్యాచరణకు దిగారు. లండన్ నుంచి వెలువడే ‘సండే టైమ్స్’ పత్రికలో వెలువడ్డ క్రిస్టియన్ లాంబ్ కథనం ప్రకారం... పోప్ శరణార్థులకు మద్దతును వాగ్దానం చేసి వారి సౌఖ్యం కోసం ప్రార్థన చేశారు. డజను మంది ముస్లిం శరణార్థులను వాటికన్ నగరంలోకి స్వీకరించారు. (ఆ 12 మంది డమాస్కస్కు, ఐఎస్ఐఎస్ అదుపులో ఉన్న డయర్ ఎజ్జార్ పట్టణానికి చెందినవారు). దీన్ని మీరు సంకేతాత్మక మైనదిగా కొట్టి పారేయవచ్చు. కానీ, అది సామాన్యుల హృదయాల్లో మారు మోగే శక్తివంతమైన ప్రేమాస్పద చర్య. లాంబ్ కథనానికి జోడించిన అందమైన ఫొటోలో ఒక పిల్లాడు నవ్వుతున్న ఆ మతాధిపతి చేతిని ముద్దాడుతుం డగా.. అతని తల్లి ఉద్వేగంతో కన్నీటిని బిగబడుతూ కనిపి స్తుంది. చెప్పాల్సిన అవసరం ఉన్న దయనీయ కథనాలు ఎన్నో ఉన్న మాట నిజమే. కానీ, ఆశ కూడా ఒక కథనమే. నిజమే, పోప్ ముస్లింలకు స్నేహ హస్తాన్ని చాస్తున్నా రు. ఇంతకు ముందు కూడా ఆయన ఈ పని చేశారు, ఇక ముందూ చేస్తారు. ఆయన మత విశ్వాసం ఇతరులను కలుపుకుని పోయేది. మనుషుల బాధల పట్ల ఆయనకున్న పట్టింపు మత విశ్వాసాల సరిహద్దు గోడలను అధిగమించి నది. నూర్ ఇస్సా, హస్సన్ అనే ఇంజనీర్ల జంట వారి రెండేళ్ల కొడుకు వంటి కుటుంబాల విషయంలో యూరప్ మడిగట్టుకుని ఉండలేదని, ఉదాసీనంగా లేదా శత్రుపూరి తంగా వ్యవహరించజాలదని కూడా ఆయన చెబుతున్నారు. ఆ ముగ్గురి కుటుంబం ఇకపై డమాస్కస్లో కాక వాటికన్ లోనే జీవిస్తుంది. ఐదేళ్ల క్రితం లేదా రెండు, మూడేళ్ల క్రితం సైతం వారు తమ మనుగడలో అలాంటి మలుపు వస్తుం దని ఊహించలేదు. వారెన్నడూ సిరియా వదిలి పోవాలని అనుకోనేలేదు. అత్యంత నిర్దాక్షిణ్యమైన యుద్ధం కారణంగా తీవ్ర విధ్వంసానికి భయంకరమైన ఒంటరితనానికి గురై ఉన్నవారిని వారి దేశం నుంచి తరిమేశారు. అయినా వారు అదృష్టవంతులు. అంతకంటే భిన్నమైన జీవితం కోసం అన్వేషణలో వారిలాంటి వేలాది మంది ప్రాణాలను కోల్పో యారు. యూరప్ ఈ విషాదాన్ని అర్థం చేసుకోలేదని అనడం సమంజసం కాదు. చాలా ప్రభుత్వాలు తాము చేయగలిగినదంతా చేశాయి. ఈ విషయంలో చేసిన కృషికి గానూ జర్మన్ చాన్స్లర్ ఏంజెలా మర్కెల్ వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించాల్సి రావచ్చునేమోగానీ, చరిత్రలో ఆమె ఎన్నటికీ గుర్తుండిపోతారు. కానీ, ఇంకా ఆ నరకంలో తేలుతున్న వారిని ప్రపంచం మరచిపోలేదు. ప్రపంచంలోనే అత్యంత సుప్రసిద్ధ మతానికి పెద్ద అయిన పోప్ మనం వినడానికి సిద్ధంగా లేని ఒక విషయా న్ని కూడా చెప్పారు. మానవత్వానికి అర్థం తెలుసుకోకపోతే మానవులు ఇక మానవులే కారు. నేటి మన నేతల పట్ల సంశయాత్మక దృష్టితో చూడటం ఫ్యాషన్గా మారింది. తర చుగా అందుకు సమంజసమైన కారణాలను సైతం చూపు తుంటారు. మతం, సంశయాత్మకతకు వ్యతిరేకంగా హామీని కల్పించే బీమా కాదు. భగవదాంశ సంభూతునిగా భావించే మత పెద్దే ఆ భగవంతునిలో విశ్వాసాన్ని ప్రదర్శించడాన్ని చూసినప్పుడు... మనం ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవడం, ఆయన దృక్పథాన్ని ప్రశంసించడం తప్పదు. వ్యాసకర్త: ఎం.జె. అక్బర్ (సీనియర్ సంపాదకులు) పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి -
దళిత సాధికారత ఎంత దూరం?
బైలైన్ గాంధీకి గానీ, కాంగ్రెస్ నేతలకు గానీ మొట్టమొదటి రాష్ట్రపతిగా అంబేడ్కర్ అనే ఆలోచన రాకపోవడం ఆసక్తికరం. వైస్రాయి రాజప్రాసాదంలో ఒక దళితుడు ఉండటానికి మించి కుల వ్యవస్థ మానసిక పునాదులను శిథిలం చేసే చర్య మరేదీ ఉండదు. మహాత్మా గాంధీ 1947 మేలో తీవ్ర వ్యక్తిగత విషాదానికి గురయ్యారు. 1935లో సేవాగ్రామ్ ఆశ్రమాన్ని స్థాపించినప్పటి నుంచి అక్కడ సేవలందించిన ఆయన యువ దళిత శిష్యుడు చక్రయ్య, మెదడులోని కణతి కారణంగా మరణించారు. గాంధీ ఆయనను కుటుంబ సభ్యునిగానే భావించేవారు. అందువలన మహాత్ముని దుఃఖం బహిరంగంగానే వ్యక్తమౌతుండేది. జూన్ 2న గాంధీజీ తన ప్రార్థనా సమావేశాన్ని ఒక విప్లవాత్మక సూచనతో ప్రారంభించారు. మొదటగా ఆయన, భారతదేశపు మకుటంలేని మహారాజుగా జవహర్లాల్ నెహ్రూ పేరును ప్రకటిం చారు. బారిస్టర్ కావ డానికి ముందు నెహ్రూ హారో, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నందున ఇంగ్లిష్ వారితో బేరసారాలకు ఆయన అవసరమన్న గాంధీ వాదన ఏమంత పస ఉన్నదేమీ కాదు. అయినా స్వతంత్ర భారత ప్రథమ ప్రధానిగా నెహ్రూ పాత్ర గురించి ఆలోచించాల్సిన పనే లేదనే విషయాన్ని ఆయన ఆ ప్రకటన ద్వారా చెప్పదలుచుకున్నారు. అయితే రెండో పదవి ఇంకా ఖాళీగానే ఉంది. సాంకేతికంగా అది నూతన రాజకీయ వ్యవస్థలో ప్రధాన మంత్రి కంటే కూడా ఉన్నత స్థాయిది. ఆ పదవికి సంబంధించి గాంధీజీ ఇలా అన్నారు: భారత రిపబ్లిక్ ప్రథమ రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సిన సమయం వేగంగా సమీపిస్తోంది. చక్రయ్య బతికి ఉండివుంటే నేనాయన పేరును సూచించి ఉండేవాడిని. ధైర్యవంతురాలు, నిస్వార్థపరురాలు, పరిశుద్ధ హృదయి అయిన (గాంధీ ప్రయోగించిన ఈ పదానికి నేడు కాలదోషం పట్టిపోయి, అక్కడక్కడా దాన్ని మార్చేస్తున్నారు కూడా) దళిత యువతి మన దేశ ప్రథమ రాష్ట్రపతి కావాలని ఆశిస్తున్నాను. ఇదేమీ నిష్ఫల స్వప్నం కాదు...మన భావి రాష్ట్రపతికి ఇంగ్లిష్ రావాల్సిన అవసరమేమీ లేదు. రాజకీయ వ్యవహారాల్లో నిష్ణాతులై, విదేశీ భాషలను కూడా తెలిసిన వారు సహాయకులుగా తోడ్పడతారు. అయితే, ఈ కలలు నిజం కావాలంటే మనం ఒకరిని ఒకరం చంపుకోవడంపై కంటే గ్రామాలపై పూర్తి శ్రద్ధను చూపగలగాలి (కలెక్టెడ్ వర్క్స్, వాల్యూం 95). ఈ ఆలోచన గురించి గాంధీ జూన్ 6న రాజేంద్రప్రసాద్తో జరిపిన సంభాషణలో కూడా చర్చను కొనసాగించారు. అయితే ఆయనే ప్రథమ రాష్ట్రపతి అయ్యారనుకోండి. గాంధీ తన ప్రతిపాదనను ఇలా రూపొందించారు: నాయకులంతా మంత్రివర్గంలో చేరి పోతే ప్రజలతో విస్తృత సంబంధాలను కొనసాగించడం చాలా కష్టమౌతుంది.... అందువల్లనే నేను నా ప్రార్థనా సమావేశ ప్రసంగంలో చక్రయ్యలాంటి దళితుడిని లేదా దళిత యువతిని దేశ ప్రథమ రాష్ట్రపతిగాను, జవహర్లాల్ను ప్రధానిగాను సూచించాను... చక్రయ్య చనిపోయారు కాబట్టి ఒక దళిత మహిళకు ఆ గౌరవం దక్కాలి. కాంగ్రెస్ నేతలకు గాంధీజీ సూచన రుచించలేదు. ఆ చక్రయ్య పేరును కాంగ్రెస్ నేతలలో ఏ ఒక్కరూ తమ గాంధీ స్మృతులలో ఎక్కడా ప్రస్తావించకపోవడం (కనీసం నాకు తెలిసినంతలో) ఆసక్తికరం. బహుశా వారు గాంధీజీ ఆలోచనను ఉన్నత పదవీ బాధ్యతల అవసరాలకు నానాటికీ దూరం అవుతున్న సాధుపుంగవుని విప్లవతత్వంగా కొట్టిపారేసి ఉండవచ్చు. గాంధీ, అలాంటి దళిత సాధికారత గురించి ప్రచారం సాగిస్తూనే వచ్చారు. మనకు దళితుల పాలన కావాలి. దళితుల సేవలు అత్యున్నతమైనవి కాబట్టి వారే అందరిలోకీ అత్యున్నతులు వంటి వ్యాఖ్యలు చేస్తూనే వచ్చారు. గాంధీగానీ, లేదా కాంగ్రెస్ నేతలలో ఎవరైనాగానీ అంబేడ్కర్ మొట్టమొదటి రాష్ట్రపతి కావడమనే ఆలోచనను ఎన్నడూ పరిగణనలోకి తీసుకోకపోవడం ఆసక్తికరం. అంబేడ్కర్కు అందుకు కావాల్సిన అర్హతలే కాదు, ప్రతిష్ట కూడా ఉంది. స్వాతంత్య్రోద్యమంలో స్వతంత్ర పాత్రను నిర్వహించాలని బాబాసాహెబ్ తీసుకున్న నిర్ణయం నాటి కాంగ్రెస్ నేతలకు కోపం కలిగించి ఉండవచ్చు. బాబాసాహెబ్ వారిలో ఒకరు కారు. ఆయనను ఒక స్థాయికి మించి విశ్వసించడానికి నిరాకరించారు. గాంధీ, అంబేడ్కర్లు ఇద్దరికీ దళిత సాధికారతే అత్యున్నత ప్రాధాన్యాంశం. కాకపోతే గాంధీ స్వాతంత్య్రా నికి ప్రథమ స్థానం ఇస్తే, అంబేడ్కర్ దళిత విముక్తికి ప్రథమ స్థానం ఇవ్వడమే వారి మధ్య ఉన్న విభేదం. 1940ల నాటికి, స్వాతంత్య్రం కనుచూపు మేరలోకి వచ్చేసరికి ఆ విభేదం ప్రాధాన్యాన్ని కోల్పోయింది. హిందువులకు, ముస్లింలకు కూడా ఆమోదయోగ్యమైన రాజకీయ వ్యవస్థను రూపొందించే ప్రతిపాదనలను జాగ్రత్తగా రూపొందిం చడంపై అంబేడ్కర్ తన మేధోపరమైన శక్తియుక్తులన్నిటినీ కేంద్రీకరించారు. దేశవిభజనకు అర్థం ఏమిటనే విషయం గురించి కూడా ఆయన లోతుగా ఆలోచించారు. 1940 డిసెంబర్ నాటికే ‘పాకిస్తాన్’ అనే పదం శీర్షికలో భాగంగా ఉన్న మొట్టమొదటి పుస్తకాన్ని ప్రచురించారు. థాట్స్ ఆన్ పాకిస్తాన్ అనే ఆయన పుస్తకం ఆశ్చర్యకరమైన రీతిలో భవిష్యత్ పరిణామాలను ముందుగానే తెలిపింది. వాయవ్య సరిహద్దు, అఫ్ఘానిస్తాన్ల నుంచి భౌగోళిక- రాజకీయ అజెండా గల ఇస్లామిక్ జీహాద్ ముప్పు పెంపొందడం గురించి అంబేడ్కర్ తప్ప మరెవరూ నాడు ఊహించలేకపోయారు. అదే నేడు దేశం ఎదుర్కొంటున్న ప్రధానమైన ముప్పు కావడం విశేషం. సురక్షితమైన సరిహద్దు కంటే సురక్షితమైన సైన్యం మెరుగనే అంబేడ్కర్ సిద్ధాంతం చెప్పుకోదగినది. ఒక్కసారి పాకిస్తాన్ నిజమయ్యాక, ఆయన దృష్టి అంతర్గత సవాళ్లపైకి మళ్లింది. హేయమైన కుల వ్యవస్థ అనే శాపాన్ని చ ట్టరీత్యా నిషేధించగలంగానీ, నిజజీవితం నుంచి నిర్మూలించడం అందుకు భిన్నమైనది. ఉల్లంఘనలకు పరిష్కారాలు లేనిదే హక్కులూ ఉండవు అనే సుప్రసిద్ధ సూత్రీకరణను అంబేడ్కర్ చేశారు. అదే మన రాజ్యాంగానికి క్రియాశీల సూత్రమైంది. రాజ్యాంగాన్ని చూడగలిగేటంత కాలం గాంధీ జీవించలేదు. కానీ ఆయన రాజకీయ సంకేతాత్మకవాదపు శక్తిని గుర్తించగలిగారు. రాజప్రతినిధుల రాజప్రాసాదంలో ఒక దళితుడు ఉండటానికి మించి కులాల అంతస్తుల వ్యవస్థ మానసిక పునాదులను శిథిలం చేసే చర్య మరేదీ ఉండదు. గాంధీ కలను నిజం చేయడానికి మనకు దశాబ్దాలు పట్టింది. ఏమాటకామాటే చెప్పాలి, 1947 నుంచి మనం చాలా దూరమే వచ్చేశాం. అయినా సుప్రసిద్ధ కవి అన్నట్టు, ఇంకా మైళ్ల దూరం వెళ్లాల్సే ఉంది. నాయ కులు కూడా మనుషులే. వారంతా ఏదో ఒక రోజు సుదీర్ఘ నిద్రలోకి పోవాల్సినవారే. కానీ దేశం మాత్రం ఎప్పటికీ జీవిస్తూనే ఉంటుంది. దళిత విముక్తి, ఆర్థిక సాధికారతలను పూర్తిగా సాధించిన నాడే భారతదేశం ఉన్నతిని సాధించగలుగుతుంది. వ్యాసకర్త: ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు పార్లమెంట్ సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి -
‘అనువంశికత’ అంతం ఇలాగే!
బైలైన్ జాతీయవాదం పట్ల నిబద్ధత విషయంలో రాహుల్ రాజీపడ్డ విధంగా మరే కాంగ్రెస్ నేతా రాజీపడలేరని చెప్పగలను. ఒక విద్యార్థి కార్యకర్త... మన సైనికులు యూనిఫామ్లో ఉన్న రేపిస్టులని, సైన్యం మావోయిస్టులకన్నా అధ్వానమైనదని మూర్ఖంగా వ్యాఖ్యానిస్తే... ఉత్సాహంగా వాటికి ఆమోదం తెలిపేటంతటి మూర్ఖత్వాన్ని ఆయన ప్రదర్శించారు. సఫలత శక్తిసామర్థ్యాలకు కొలబద్ద. సంక్షోభం వ్యక్తి లేదా సంస్థ పరిణతికి, అది తిరిగి కోలుకునే శక్తికి పరీక్ష. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్ద విస్ఫోటనాన్ని చవి చూసింది. అది ఆ పార్టీ భావజాల ముసుగును తునాతునకలు చేసి, దాని పునాదులను తూట్లు పొడిచిన చెదలను బహిర్గతం చేశాయి. దేశ చరిత్రలోనే ఉద్విగ్నభరితమైన, ఆకాంక్షాపూరితమైన కాలంలో దాన్ని ముందుకు నడిపించగలిగిన పున రుజ్జీవనామృతాన్ని సూచించే సూక్ష్మబుద్ధియైన నేత ఆవిర్భావం అవసరమైన సమయం అది. అందుకు బదులుగా, కాంగ్రెస్ తన ప్రాణాంతకమైన తప్పును కొనసాగించడాన్నే నమ్ముకుంది. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆ విస్ఫోటనాన్ని వెన్నంటి ఆ పార్టీలో మరిన్ని విస్ఫోటనాలు సంభవించాయి. రాజకీయ పరిస్థితిని అర్థం చేసుకోలేకపోవడం, నడవడికి సంబంధించిన నిర్వహణా దక్షత కొరవడటం కలసి అంతర్గత వివాదాన్ని పగుళ్లుగా, ఆ పగుళ్లు చీలికగా మారేలా విషమింపజేశాయి. ఉత్తరాఖండ్లోని ఆ పార్టీ శిథిలాలు అంత ప్రత్యేకమైనవేమీ కావు. అవి ఒక క్రమంలో భాగం. అస్సాం, అరు ణాచల్ప్రదేశ్ లు అంతకు ముందటి ఉదాహర ణలు. తరుణ్ గొగోయ్ ప్రభుత్వం ఆ చీలికను తట్టుకోగలిగినా, 2014 ఉపద్రవంలో కాంగ్రెస్తో నిలచిన ప్రాంతీయ పార్టీలకు ఆ పార్టీ దీర్ఘకాలిక గందరగోళంలో చిక్కుకు పోయిందని అర్థమైంది. తమ కోసం కేటాయించడానికి రాహుల్ గాంధీకి సమయం లేదని, ఒకవేళ కొన్ని నిముషాల సమయం చిక్కినా ఆయన తమ మాటలు వినడం లేదనేది వారి సాధారణ ఫిర్యాదు. అమెరికాలో రిపబ్లికన్లు ఎలా తమ గందరగోళం నుంచి బయటపడలేక పోతున్నారో గత వారాంతంలో ‘న్యూయార్క్ టైమ్స్’ కాలమిస్టు డేవిడ్ బ్రూక్ విశ్లేషించారు. శాస్త్రీయ విప్లవాల గురించిన థామస్ ఖాన్ సిద్ధాంతాన్ని బ్రూక్ అన్వయించారు. ప్రజాస్వామ్యాన్ని సవివరంగా విశ్లేషించడం కోసం ఆయన మార్క్సిస్టు సిద్ధాంతంలా ధ్వనించే ఆ పదబంధాన్ని ప్రయోగించారు. మేధోపరమైన పురోగతి నిలకడగా సాగదని ఆయన ప్రతిపాదన. అది సాఫల్యతా నమూనా నుంచి అంతా సజావుగా సాగుతున్నట్టుగా అనిపిస్తుండగా, వైరుధ్యాలు, క్రమరాహిత్యాలు బయటపడేసరికి ‘‘నమూనా వెంబడి కొట్టుకుపోవడం’’ దిశగా సాగుతుంది. నమూనా కుప్పకూలేసరికి అది అనివార్యంగా ‘‘నమూనా సంక్షోభం’’గా మారుతుంది: ‘‘నమూనా వైఫల్యానికి అతుకులు వేసే ప్రయత్నాలన్నీ విఫలమౌతాయి. అంతా వ్యథ చెందుతారే తప్ప ఏం చెయ్యాలో ఎవరికీ తెలియదు’’. ఊహింపశక్యంకాని రిపబ్లికన్ పార్టీ ప్రవర్తనకు కారణం ‘‘మానసికంగా ఓటమికిగురవుతుండటం’’, అది విధానపరమైన స్థానభ్రంశానికి, క్రమరాహిత్యానికి దారితీస్తుండట మేనని బ్రూక్స్ ప్రతిపాదన. ‘‘తన చరిత్రను తానే నిరాకరించుకోవడ’’మే అయినా జరిగేది మాత్రం అదే. 2009-2014 మధ్య ఐదేళ్ల కాలంలో తిరిగి ఎన్నిక కావడంతో లభించిన ఆమోదంతో కాంగ్రెస్ పార్టీ సాఫల్యత నుంచి నమూనా సంక్షోభంలోకి జారిపోయింది. దీని గురించి ఆ పార్టీలో అంతులేని వ్యథ ఉంది, స్థానికమైన తేడాల వల్ల ఎవరూ దానికి పరిష్కారాలను అన్వేషించే ప్రయత్నం చేయరు సరికదా అసలు అంగీకరించనే అంగీకరించరు. వంశపారంపర్య పాలన విజయవంతంగా సాగుతున్నప్పుడు అది పదిలంగా ఉంటుంది. కాబట్టి కొంత వెసులుబాటును అనుమతిస్తుంది. ముప్పును ఎదుర్కొంటున్నప్పుడు మాత్రం మేధ తలుపులను మూసేసుకుంటాయి. కాంగ్రెస్ తన చరిత్రను తానే నిరాకరించుకున్న వైనాన్ని ఇటీవలే మనం చూశాం. జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్రను నేను అధ్యయనం చేశాను, ఇందిరాగాంధీ హయాం నుంచి మన్మోహన్సింగ్ దశాబ్దివరకు ఆ ప్రాజెక్టుకు సంపాదకత్వం వహించాను. జాతీయవాదం పట్ల నిబద్ధత విషయంలో రాహుల్ గాంధీ రాజీపడ్డ విధంగా మరే కాంగ్రెస్ నేతా రాజీపడలేరని నేను ఘంటాపథంగా చెప్పగలను. హఠాత్తుగా సుప్రసిద్ధు డైపోయిన ఒక విద్యార్థి కార్యకర్త... భారత సైనికులు యూనిఫామ్లో ఉన్న రేపిస్టులని, భారత సైన్యం మావోయిస్టులకన్నా అధ్వాన్నమైనదని మూర్ఖంగా వ్యాఖ్యానించాడు. దిగ్భ్రాంతిగొలిపే ఆ వ్యాఖ్యలకు ఉత్సాహంగా ఆమోదం తెలిపేటంత మూర్ఖత్వాన్ని రాహుల్ గాంధీ ప్రదర్శిం చారు. భారత ప్రజలకే కాదు, ఆయన పూర్వీకులకు సైతం భారత సైన్యం అంటే ఏమిటో తెలియకుండానే ఆయన మధ్య వయస్కులయ్యారు. ఒక ఎత్తుగడగా చూసినా ఇది ప్రతికూల ఫలితాలనిచ్చేదే. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కోరుకునేవారి పక్షాన నిలిచి కాంగ్రెస్ ఎన్నో ఓట్లను సంపాదించుకోలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత సంక్షోభాలను చీలిక ద్వారా పరిష్కరించుకోగలిగింది. వాటిలో అత్యంత సుప్రసిద్ధమైనది, అత్యంత ఫలదాయకమైనది. 1969లో ఇందిరాగాంధీ చాకచక్యంగా తెచ్చిన చీలికే. అయితే 1969 నాటికి వారసత్వపాలన వల్ల కాంగ్రెస్ చేష్టలుడిగి పోయిలేదనే ముఖ్య విషయాన్ని గుర్తుంచుకోవాలి. 1970ల మధ్యలోనే ఈ జబ్బు మొదలైంది. నేడు కాంగ్రెస్లోని ఆలోచనాపరులైన, సీనియర్ నేతలు జనాంతికంగా చేప్పే ఆ విషయాన్ని, బహిరంగంగా అంగీకరించరు. అలా చేయడం, వారి వ్యక్తిగత అవకాశాలకు సంబంధించి ఆత్మహత్యాసదృశమైనదే. టీఎస్ ఇలియట్ వంశపారంపర్య పాలనలు చివరికి ఎలా అంతమవుతాయని చెప్పి ఉండేవాడో అలాగే... ‘బ్రహ్మాండమైన ధ్వనితో గాక, గుసగుసతోనే అంతమవుతాయి’. (వ్యాసకర్త : ఎంజే అక్బర్, పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి) -
ప్రజాస్వామ్యానికి ‘ట్రంప్’ముంపు
ఒబామా అధ్యక్షునిగా ఎన్నికైన వాస్తవాన్ని జీర్ణించుకోవడమే అసాధ్యం అన్న రీతిలోనే రిపబ్లికన్లు కనిపించారు. వాళ్లు అబద్ధాలను ఆయుధాలుగా ఉపయోగించారు. ఆఖరికి ఆయన జన్మ ధృవీకరణ పత్రం గురించి కూడా కట్టుకథలు అల్లారు. వేలం వెర్రితో ఇలాంటి దుష్ర్పచారానికి పాల్పడిన బృందానికి నాయకుడు ట్రంప్. ఒబామా రెండురకాలుగా బయటి వ్యక్తి అన్నట్టు సూచించారు. ఎలాగంటే - మొదటిది- ఆయన అమెరికన్ కాదు, రెండోది - ఆయన మహమ్మదీయుడు. ఉద్యోగాలంటూ వస్తున్న మెక్సికన్లు, యుద్ధమంటున్న మహమ్మదీయులు అమెరికాకు ‘‘ప్రమాదకరంగా’’ పరిణమించిన నేపథ్యంలో అధ్యక్ష అభ్యర్థిత్వం ట్రంప్కు దక్కడం యాదృచ్ఛికంగా జరిగిందని అనుకోలేం. ఇలాంటి వేలం వెర్రి ప్రతికూల ప్రచారాలు తిరిగి తమకే చేటు చేస్తాయని మన దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా గుర్తిస్తుందా? ప్రధాని నరేంద్ర మోదీ మీద ఆ పార్టీ అవిశ్రాంతంగా సాగిస్తున్న ప్రతికూల ప్రచారంలో ఉద్వేగమే తప్ప, హేతువు లేదు. ఆ విమర్శలన్నీ వ్యక్తిగతమైనవే. మోదీ ప్రతిపాదించినది ఏదైనా సరే, అది ఎప్పటికీ మంచిది కాదు. ఆఖరికి తాను ప్రతిపాదించినది గతంలో యూపీఏ అధికారంలో ఉండగా చేసినదేనని మోదీ చెప్పినా కూడా వారికి పట్టదు. సాధారణ వస్తుసేవల సుంకం బిల్లు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వం పుణ్యమా అని శ్లేష్మంలో పడ్డ ఈగలా కొట్టుకుంటున్నది. వాస్తవాల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా సత్యాన్ని అణచిపెడుతున్నారు. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోతో కలసి గడచిన గురువారం ఉమ్మడి విలేకరుల సమావేశంలో పాల్గొన్నప్పుడు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దీర్ఘాలోచనలో మునిగి ఉన్నట్టు కనిపించారు. ఆయన చురుకైన మేధ అమెరికా అధ్యక్ష ఎన్నికల వ్యవహారాలకు సంబంధించిన పరిమిత డిమాండ్లకు అతీతంగానే ఆలోచిస్తున్నదని స్పష్టంగానే అనిపిస్తుంది. శ్వేత సౌధంలో రెండు దఫాలు కొలువైనప్పటికీ ఒబామా తాత్వికుడైన అమెరికా అధ్యక్షునిగా అవతరించలేకపోయారు. అయితే అధ్యక్షునిగా చివరి దశను పూర్తి చేసుకుంటున్న ఈ కాలంలో మాత్రం సుదీర్ఘకాలంగా అమెరికా రాజకీ యాలలో పూరించకుండా ఉండిపోయిన వెలితిని భర్తీ చేయబోతున్నారు. ఎన్నికైనవారు, కొన్ని విపరీత మినహాయింపులు కాకుండా- తెలివైనవారే అయి ఉంటారు. కానీ వీరిలో కొద్దిమంది మాత్రమే మేధావులు. ఒబామా త్వరలోనే అమెరికాకు చెందిన పిన్న వయస్కుడైన పెద్ద రాజనీతిజ్ఞుడు కాబోతున్నారు. ఇందుకు సంబంధించిన రుజువు ఈ విలేకరుల సమావేశంలోనే కనిపించింది. ఎన్నికల ప్రచారంలో అరుపులూ, కేకలతో హడావిడి చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైతే, అమెరికా- కెనాడా సంబంధాలు ఎలా ఉంటాయి అని ఒక విలేకరి ప్రశ్నించాడు. ఇప్పటికే ఈ అంశం మీద అమెరికాలో ఒక చతురోక్తి బాగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. ఆ పరిస్థితే వస్తే కెనడా అమెరికాకు మరోసారి అద్భుతమైన వలసగా మారు తుందన్నదే ఆ చతురోక్తి. అయితే రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి ఎంపిక వ్యవహారం ఒక కొలిక్కి వచ్చి, ట్రంప్ అవకాశాలు మెరుగుపడుతూ ఉండడంతో, ఈ చచ్చు చతురోక్తి కాస్తా, అమెరికావాసుల పాలిట పీడకల స్థాయికి చేరుతోంది. ఒబామా తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆలోచనకు కూడా రాని కొన్ని అంశాలు ఎందుకు ఎలా పరిగణించదగినవిగా ప్రాముఖ్యంలోకి వచ్చాయి? అధ్యక్ష పదవికి ఎన్నికైన నాటి నుంచి తాను ఏది చెప్పినా, ఏది చేసినా కూడా తప్పే అన్నట్టు రిపబ్లికన్ పార్టీ నిరాఘాటంగా ప్రతికూల ప్రచారం చేయడమే ఇందుకు కారణమని ఒబామా చెప్పారు. ఏ అంశాన్ని కూడా దానిలోని మంచిచెడ్డల మేరకు పరిశీలించలేదు. తాను ఏం చేసినా అది తప్పే. ఒబామాకు ముందు అధ్యక్షులైన వారు కూడా విమర్శలను ఎదుర్కొనకపోలేదు. కానీ వారిలో ఎవరూ ఇలా పరాయి ముద్రతో బాధపడలేదు. ఒబామా ‘ద్వేషం’ అన్న మాటను ఉపయోగించలేదు. కానీ ఆ అర్థం స్ఫురించే విధంగానే మాట్లాడారు. అలాగే ఆయన జాతి గురించిన ప్రస్తావన కూడా చేయలేదు. అయితే తనను ‘ఆక్రమణదారుడు’గానే భావించారన్నట్టు నర్మగర్భంగా చెప్పారు. అసలు ఒబామా అధ్యక్షునిగా ఎన్నికైన వాస్తవాన్ని జీర్ణించుకోవడమే అసాధ్యం అన్న రీతిలోనే రిపబ్లికన్లు కనిపించారు. వాళ్లు అబద్ధాలను ఆయుధాలుగా ఉపయోగించారు. ఆఖరికి ఆయన జన్మ ధృవీకరణ పత్రం గురించి కూడా కట్టుకథలు అల్లారు. వేలం వెర్రితో ఇలాంటి దుష్ర్పచారానికి పాల్పడిన బృందానికి నాయకుడు ట్రంప్. ఒబామా రెండురకాలుగా బయటి వ్యక్తి అన్నట్టు సూచించారు. ఎలాగంటే - మొదటిది- ఆయన అమెరికన్ కాదు, రెండోది - ఆయన మహమ్మదీ యుడు. ఉద్యోగాలంటూ వస్తున్న మెక్సికన్లు, యుద్ధమంటున్న మహ మ్మదీయులు అమెరికాకు ‘‘ప్రమాదకరంగా’’ పరిణమించిన నేపథ్యంలో అధ్యక్ష అభ్యర్థిత్వం ట్రంప్కు దక్కడం యాదృచ్ఛికంగా జరిగిందని అనుకోలేం. అయితే ఈ మతిభ్రమించిన వాచాలత్వాన్నీ, అవాస్తవాలను అమెరికన్లు విశ్వసించలేదు. అందుకే ఒబామా రెండోసారి కూడా అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించారు. కానీ చాలామంది రిపబ్లికన్లు ఈ ధోరణిలోనే వ్యవహరించారు. అందుకే వారు ఇంత వికృతంగా, ఇంత దుస్సాహసంతో మాట్లాడుతున్నప్పటికీ ట్రంప్ అభ్యర్థిత్వం వైపు మొగ్గారు. ఇప్పుడు నమ్మకం కుదరక రిపబ్లికన్ పార్టీ తనను తను గిల్లుకుని చూసుకుంటోంది. అయినా వాస్తవం ఏమిటంటే, ట్రంప్ వారి సృష్టే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవ రిైైనైనా వెర్రి రాజకీయాలు ఊరిస్తూనే ఉంటాయి. కానీ అసభ్య పిల్లచేష్టలతో ఎవరూ మనుగడ సాధించలేరు. ఇలాంటి వేలం వెర్రి ప్రతికూల ప్రచారాలు తిరిగి తమకే చేటు చేస్తాయని మన దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా గుర్తిస్తుందా? ప్రధాని నరేంద్ర మోదీ మీద ఆ పార్టీ అవిశ్రాంతంగా సాగిస్తున్న ప్రతికూల ప్రచా రంలో ఉద్వేగమే తప్ప, హేతువు లేదు. ఆ విమర్శలన్నీ వ్యక్తిగతమైనవే. మోదీ ప్రతిపాదించినది ఏదైనా సరే, అది ఎప్పటికీ మంచిది కాదు. ఆఖరికి తాను ప్రతిపాదించినది గతంలో యూపీఏ అధికారంలో ఉండగా చేసిన దేనని మోదీ చెప్పినా కూడా వారికి పట్టదు. సాధారణ వస్తుసేవల సుంకం బిల్లు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వం పుణ్యమా అని శ్లేష్మంలో పడ్డ ఈగలా కొట్టుకుంటున్నది. వాస్తవాల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా సత్యాన్ని అణచిపెడుతున్నారు. తాజాగా జరిగిన ఉదంతాన్నే తీసుకుందాం. ఈ ఘట్టంలో అపఖ్యాతిని మూటగట్టుకున్న వ్యాపారవేత్త విజయ్మాల్యా దేశం నుంచి పారిపోవడానికి కారణం ప్రస్తుత ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. ఇందులో గమనించవలసిన సున్నితమైన సత్యం ఏమిటంటే, మాల్యాకు చెందిన కింగ్ఫిషర్ అనే మునిగిపోతున్న విమానయాన సంస్థకు కాంగ్రెస్ అధి కారంలో ఉండగానే ప్రభుత్వ బ్యాంకుల నుంచి నిధులు కుమ్మరించేందుకు అనుమతి లభించింది. ఫిబ్రవరి 21, 2012న ఎస్పీఎస్ పన్ను, సంజయ్ సింగ్ అనే ఇద్దరు పత్రికా రచయితలు రాసిన నివేదిక నుంచి ఇక్కడ ఒక అంశాన్ని ఉదహరిస్తున్నాను. భారతీయ స్టేట్ బ్యాంక్ ‘‘విజయ్ మాల్యా కింగ్ఫిషర్ విమానయాన సంస్థ మునిగిపోకుండా కాపాడడానికి మంగళ వారం రూ. 1500 కోట్లు విసిరింది. ఆదాయ పన్ను శాఖ కూడా తన విధా నాన్ని సరళం చేసుకుంది. నష్టాలలో ఉన్న ఆ సంస్థను కాపాడేందుకు ప్రకటించిన ఆర్థిక ప్రణాళికలో భాగంగా స్తంభింప చేసిన ఆ విమానయాన సంస్థ ఖాతాలు తిరిగి చెలామణిలోకి రావడానికి అంగీకరించింది.’’ మాల్యాకు ప్లాటినమ్ చెమ్చాతో అన్నీ నోటికందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఆయన మీద చర్యలు మొదలైనది నిజానికి ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే. ప్రస్తుత వ్యవస్థను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ఇంక ఏమాత్రం సాధ్యం కాదని తెలుసుకున్న తరువాతే మాల్యా హడావిడిగా దేశం విడిచి వెళ్లారు. అతడి మీద చర్యలకు బ్యాంకులకు కూడా ఆదేశాలు వెళ్లాయి. ఇక్కడితో ఈ కథ అయిపోయిందని అనుకోవద్దు. చట్టం దృష్టి చాలా విస్తృతమైనది. మాల్యా ఆచూకీ తెలిసి, హాజరు కావలసిన తేదీకి అతడు కోర్టుకు రాని పక్షంలో ఈ దృష్టిని ప్రభుత్వం కాపాడగలిగితే దాని విస్తృతికి లోటుండదు. ఒబామా ప్రత్యేకంగా చెప్పినట్టు, అసలు బాధ అమెరికా తన విలువలు, ఇంగిత జ్ఞానం- ఈ రెండింటినీ కోల్పోవడం గురించినది కాదు. రిపబ్లికన్ పార్టీ తనకు తాను చేసుకున్న గాయాల నుంచి కోలుకుంటుందా లేదా అన్నదే. ప్రజాస్వామ్యంలో విశ్వసనీయమైన ప్రభుత్వం ఎంత అవసరమో, పొందికైన ప్రతిపక్షం కూడా అంతే అవసరం. ఒక సామెత చెబుతారు, దేవతలు కాలు మోపడానికి కూడా భయపడే చోటికి అవివేకులు వెళతారట. అయితే ప్రజాస్వామ్యానికి ఉన్న శక్తి ఏమిటంటే, అక్కడ అవివేకులు కూడా అభ్యర్థులవుతారు. కానీ ఓటర్లు అంత దయకలిగిన వారేమీ కాదు. కానీ మూర్ఖులను సంతోషంగా భరిస్తున్న రాజకీయ పార్టీలు మాత్రం విశ్వసనీయత విషయంలో చాలా మూల్యం చెల్లించవలసి ఉంటుంది. వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు బీజేపీ అధికార ప్రతినిధి -
అంతరిక్షంలో ఆలాపనలు
మనం ఇప్పుడు హద్దులను చెరిపేసి, జ్ఞానం కొత్త అంచుల దగ్గర ఉన్నాం. ఆవిష్కరణలోని నాటకీయతను చూసినప్పుడు ఎక్కువ ఆశించడం సులభమే. అయితే అతిశయోక్తుల గురించి శాస్త్రవేత్తలు మనలను హెచ్చరిస్తూనే ఉన్నారు. వారు ఈ అవిష్కరణలో ప్రతి అడుగులోను ఎంతో శ్రమించారు. ఆ శ్రమ అనేది ప్రయోగశాలలో కావచ్చు లేదా అబ్జర్వేటరీలో కావచ్చు. అందిన సమాచారాన్ని వాస్తవంగా మలచడానికి కొన్ని జీవితాలు పట్టాయి. ఒక ఆవిష్కరణ గురించిన ఉద్వేగం అందుబాటులో దొరికే సమాధానాలను గమనించడం కంటే, మరిన్ని ప్రశ్నలను సంధించడానికే చూస్తుంది. రెండువేల సంవత్సరాలకు పైగా వినిపించిన ప్రశ్నలు పైథాగరస్ నుంచి ఐన్స్టీన్ను వేరు చేసి చూపాయి. అలాగే ఐన్స్టీన్కీ, విర్గో కొలాబిరేషన్-లీగో బృందాలకీ మధ్య వందేళ్ల పాటు సాగిన ప్రయత్నం ఉంది. తెలుసుకోవాలనుకున్నప్పుడు విజ్ఞానశాస్త్రం నన్ను సదా గజిబిజి చేసిపోయేది. పాఠశాల స్థాయిలో మొదట్లో భౌతికశాస్త్ర పాఠాలు విన్నప్పుడు అంతా గందరగోళంగానే ఉండేది. రసాయనశాస్త్రం కాస్త అర్థమైనప్పుడు ఏదో కుట్ర పన్నుతున్నట్టు ఉండేది. తర్కంతో, అంచనాలతో సాగే గణితం మాత్రం బాగుండేది. కానీ లేని సున్నాతో ఏమైనా లెక్కకట్టాలని చూస్తే దానిని మాత్రం తత్వశాస్త్రంగా పరిగణించాలి. ఇకపోతే, ఒక హోటల్ గదిలో ఈ వారంలోనే ఒక వేకువ నిశ్శబ్ద వేళ అనుకోకుండా టీవీ పెట్టి, ఒక న్యూస్ చానల్ చూస్తున్నాను. హఠాత్తుగా నన్ను వివశత్వంలో ముంచెత్తుతూ భూతభవిష్యద్వర్తమానాలు, ఇంకా అనేక భవిష్యత్తు అంచనాలు కలగలసిన కలగూరగంప వంటి, ఇంకా అంతులేని కథనాలను జోడించుకుని ఓ సైన్స్ విషయం దర్శనమిచ్చింది. గూడు కట్టినట్టున్న ఆ నిశ్శబ్దంలోనే సాహిత్య గుబాళింపు ఉన్న ఒక వాక్యం వినిపించింది. విశ్వాసానికి అతీతమైనదానిని నిరాకరించమని హేతువు చెప్పినప్పుడు మనం దేని గురించి ఎదురు చూడవచ్చునో ఆ వాక్యం చెప్పి, మనోహరమైన వాస్తవం దగ్గరకి తీసుకుపోయింది. అదే- గోళాల సంగీతం. వందకోట్ల కాంతి సంవత్సరాల క్రితం గురుత్వాకర్షణ కారణంగా రెండు కృష్ణబిలాలు డీకొన్నప్పుడు జనించిన అంతరిక్ష సంబంధమైన, మరచిపోలేని శ్రావ్యమైన సంగీతం అందులో విన్నాను. మేధావుల స్థాయిలో చెప్పాలంటే పైథాగరస్ వచ్చి ఐన్స్టీన్ను కలుసుకున్నాడు. ఖగోళంలోని రాశులన్నీ లయాత్మకంగా కదులుతున్నాయని ఆ పురాతన గ్రీకు మార్మిక గణితశాస్త్రవేత్త ఏనాడో ప్రతిపాదించాడు. ఆ రాశులన్నీ కదిలిపోతూ మనిషి చెవులకు సోకని ఒక అనుపమానమైన ఆలాపన చేస్తున్నాయని కూడా చెప్పాడాయన. కవులని సూదంటురాయి వలే ఆకర్షించే ఆ అంశమే గోళాల స్వర సమ్మేళనం. కింది తరాలవారి అద్భుత మేధస్సునూ, ఈ తరం శాస్త్రవేత్తల సాహసోపేతమైన జ్ఞానదీప్తినీ ఒక ప్రేక్షకునిలా వీక్షించే నాలాంటి వ్యక్తి బుద్ధికి ఆ నాదం పదును పెడుతుంది. కొత్త ఆలోచనలు రేకెత్తిస్తుంది. స్థలకాలాలు, ఉనికిల సారం గురించి వినూత్న విశ్లేషణలు ఇచ్చే ఒక ప్రపంచంతో మన బుద్ధిని అనుసంధానింపచేస్తుంది. జీవితం అంటే కాలం గడిచిపోవడమే. అది ఒక శూన్యంలో అర్థంతరంగా ఎక్కడో ముగిసిపోతుంది. ఆ తరువాత ఏమవుతుందన్నది అంతుచిక్కని అంశం. దీనికి సమాధానం కేవలం నిర్దిష్ట విశ్వాసం, సిద్ధాంతాల ద్వారా లభిస్తుంది తప్ప, మనిషి మేధస్సుతో చేసే అనిర్దిష్ట ప్రయత్నంతో కాదు. కానీ, విశ్వంలో గురుత్వాకర్షణతో పాటే, మనిషి చెవికి సోకని కొన్ని శబ్దాలు ఉన్నాయని మేధస్సుతో చే సిన ప్రయత్నంతోనే ఇప్పుడు రుజువైంది. ఇంకో మాటలో చెప్పాలంటే మానవాళి అనుభవాల మౌలిక ధర్మాలు ఎక్కడెక్కడో ఉన్న ఇతర ప్రపంచాలలో కూడా ఉనికిలో ఉన్నాయి. ఇకపై శబ్దం వినడం మనిషి ఇంద్రియాలు చేసే పనులలో ఒకటి మాత్రమే కాదు, ఈ శాశ్వత ఉనికిలో కూడా దాని జాడ ఉంది. ‘లిగో’ (లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రేవిటేషనల్ - వేవ్ అబ్జర్వేటరీ)బృందంలో సభ్యుడు, కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు సబోల్క్స్ మర్కా న్యూయార్క్ టైమ్స్ పత్రికకు చెప్పిన మాటను ఇక్కడ ఉటంకిస్తాను. ‘‘ఈ ఆవిష్కరణ చాలా కాలం తరువాత భౌతికశాస్త్ర పరిశోధన లు సాధించిన అతి గొప్ప పురోగతిగా నేను భావిస్తున్నాను. ఖగోళశాస్త్రంలో వేరే అన్నీ అంశాలు చర్మచక్షువులకు కనిపించేవే. ఇప్పుడు ఈ శాస్త్రానికి వినికిడి శక్తి కూడా వచ్చింది. ఇంతకు ముందు ఇలాంటి శక్తి ఏనాడూ లేదు.’’ఎంతో వాగ్ధాటితో వివరించిన ఈ అంశంలోని లోతైన ఆ భేదం గురించి ఆలోచించండి. దృష్టి మానవుల చూపు ద్వారా ఆవిర్భవిస్తుంది. అది వారి సామర్థ్యం మేరకు ప్రయాణిస్తుంది. నాదం మరెక్కడి నుంచో ఉద్భవిస్తుంది. ఇప్పుడు మనకు తెలిసిన దానిని బట్టి వంద కోట్ల కాంతి సంవత్సరాల క్రితం ఆ నాదం వెలువడింది. కన్ను ఆత్మాశ్రయం లేదా వ్యక్తి అనుభవం. చెవి బాహ్యమైనది. మనం ఇప్పుడు హద్దులను చెరిపేసి, జ్ఞానం కొత్త అంచుల దగ్గర ఉన్నాం. ఆవిష్కరణలోని నాటకీయతను చూసినప్పుడు ఎక్కువ ఆశించడం సులభమే. అయితే ఉత్ప్రేక్షల గురించి, అతిశయోక్తుల గురించి శాస్త్రవేత్తలు మనలను హెచ్చరిస్తూనే ఉన్నారు. వారు ఈ అవిష్కరణలో ప్రతి అడుగులోను ఎంతో శ్రమించారు. ఆ శ్రమ అనేది ప్రయోగశాలలో కావచ్చు లేదా అబ్జర్వేటరీలో కావచ్చు. అందిన సమాచారాన్ని వాస్తవంగా మలచడానికి కొన్ని జీవితాలు పట్టాయి. అయితే తెలియని కోణం వైపు మరో కొత్త అడుగు పడే వరకు ఈ వాస్తవాన్ని కూడా తాత్కాలికమైనదిగానే పరిగణిస్తారు. అలాగే ఒక ఆవిష్కరణని తక్కువ చేసి చూడడం కూడా చాలా సులభం. ఈ ఉద్వేగంలో నేను అతిగా స్పందిస్తూ ఉండాలి. కానీ నేను ఆశావాదంలోని దోషాన్ని చూడడానికే ప్రాధాన్యం ఇస్తాను. ఒక ఆవిష్కరణ గురించిన ఉద్వేగం అందుబాటులో దొరికే సమాధానాలను గమనించడం కంటే, మరిన్ని ప్రశ్నలను సంధించడానికే చూస్తుంది. రెండువేల సంవత్సరాలకు పైగా వినిపించిన ప్రశ్నలు పైథాగరస్ నుంచి ఐన్స్టీన్ను వేరు చేసి చూపాయి. అలాగే ఐన్స్టీన్కీ, విర్గో కొలాబిరేషన్-లీగో బృందాలకీ మధ్య వందేళ్ల పాటు సాగిన ప్రయత్నం ఉంది. ఊహకు కూడా అందని ఈ విశాల విశ్వం నిరీశ్వరవాదుల రచనలు వాదించినట్టు కొన్ని యాదృచ్చిక పరిణామాల మాలిక అనుకోవాలా? అంతకు మించి నైపుణ్యంతో మలచిన ఆకృతి అనకోవాలా? లేకపోతే ఈ భూగోళానికి అందకుండా బయట కాలానుక్రమణికలు ఉన్నాయా? కాలాన్ని వెనక్కు జరపవచ్చన్న వాగ్దానం ద్వారా మన ఊహలు ఎల్లప్పుడూ ప్రభావితమవుతూ వచ్చాయి. అల్బర్ట్ ఐన్స్టీన్ తన భావాలను రూపుదిద్దుతున్నప్పుడు, హెచ్.జి. వెల్స్ ‘ది టైమ్ మిషన్’ను రాస్తూ ఉండేవారు. భారతీయ తత్వశాస్త్రం అన్ని వేళలా కాలాన్ని పునర్జన్మలో విశ్వాసానికి తప్పనిసరి అవ సరంగా ఒక భ్రమగా కొట్టిపారేసింది. కాలంలోని వంపును, చపలతను లిగో శాస్త్రజ్ఞులు నమోదు చేశారు. మన మనస్సు సూచించేదానికంటే ఎక్కువ పరిమాణాలను కాలం కలిగి ఉంది. తర్వాతేమిటి? తర్వాత ఎక్కడ? జ్యోతిషశాస్త్రాన్ని ప్రస్తావించడం అనేది ఉత్కృష్ట స్థితినుంచి పరిహాసాస్పద స్థాయికి దిగజారడమే అవుతుందా? జ్యోతిషశాస్త్రానికి సైన్స్ అంత పరిపక్వత, కచ్చితత్వం ఉండదు కానీ అది సామూహిక అభద్రత కంటే ఎక్కువగా స్పష్టమైన రుజువుగా మన విశ్వాసాల్లో బలంగా నిలిచిపోయింది. మీడియాలో కనిపించే రోజువారీ లేదా వారాంతపు జోస్యాలు, అంచనాలు విస్పష్టంగానే అర్ధరహితమైనవి కానీ అన్ని సంస్కృతులను ఆదేశిస్తున్న జాతకచక్రం పట్ల పూజ్య భావం అనేది విలువ కోల్పోయిన పురాగాధనే సూచిస్తోంది. నాకు సమాధానాలు తెలియవు. ప్రశ్నలు మాత్రమే తెలుసు. వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు: బీజేపీ అధికార ప్రతినిధి - ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు -
సమోసా తిరుగుబాటు
బైలైన్ సమోసా తిరుగుబాటు కంటే కఠోర దండన రాజకీయాల్లో మరొకటి లేదు. ప్రతి రాజకీయ వేత్తకూ ఆ మాత్రం తెలుసు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆయనకు పెద్ద దిక్కు, సూపర్ ముఖ్యమంత్రి అయిన లాలూ ప్రసాద్ యాదవ్లు ఎన్నో ఎన్నికల సమరాలలోనూ, పరిపాలనలోనూ కూడా ఆరితే రిన అనుభవజ్ఞులే. అయినా వారు, పేద వాడి నోటి తిండి నుంచి డబ్బు పిండి ఖజానా కడుపు నింపే పని ఎన్నడూ చేయరాదనే ప్రాథమిక ప్రజాస్వామిక సూత్రాన్ని మరిచి పోవడం ఆశ్చర్యకరం. రోజంతా కష్టపడ్డ పేదవారికి తక్కువ ఖర్చుకే దొరికే కొన్ని క్షణాల సంతోషపు విలాసం... సమోసా, అలాంటి ఇతర సాయంకాలపు చిరు తిండ్లే. బడ్జెట్ పరిభాషలో ‘‘పాపం పన్ను’’గా పిలిచేది ప్రభు త్వానికి క్రమం తప్పక ఆదాయాన్ని సమకూర్చే వనరు. అది, లిక్కరు, సిగరెట్లు వంటి వస్తువులపై విధించే పన్ను. అవును, పరిశుద్ధాత్మకమైన స్థితిలో ఖరీదైన హోటళ్లవంటి విలాసాలకు కూడా వర్తించేలా మీరు ఆ పాపాల జాబి తాను సాగదీయవచ్చు. అంతేగానీ మతి స్తిమితంగా ఉన్న ఏ ఆర్థిక మంత్రీ ఎన్నడూ బీడీ నుంచి డబ్బు పిండడు. బిహార్ ప్రజలు ఇటీవలే తాము అధి కారంలోకి తెచ్చిన ప్రభుత్వం మీద అప్పుడే ఆగ్రహం చెం దరు. కానీ, సమోసా, భుజియా(కారప్పూస వంటిది)ల మీద 13.5 శాతం వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్) విధించడం ఆగ్రహం కంటే మరింత ప్రమాద కరమైన అవహేళనకు తలుపులు తెరుస్తుంది. వ్యంగ్య పరిహాసానికి బిహారీల తర్వాతే ఎవరైనా. సమోసాకు ఉన్న ఆకర్షణే వేరు. వర్గ, జాతి, కుల భేదాలకు అతీతమైన నిజమైన జనబాహుళ్యపు వినియోగ వస్తువు అది. కాబట్టి దాని మీద విధించిన పన్నుపై బిహారీ పరిహాసం కూడా అంత సార్వత్రికంగా వ్యాపించేదే. బహుళజాతి సంస్థల కంటే చాలా ముందే మనవాళ్లు ఫాస్ట్ఫుడ్ను కనిపెట్టారు. అంతేకాదు దాన్ని గృహ పరిశ్రమగా ఉంచాలనే మంచి ఇంగితం కూడా మనకుంది. పేదవాడికి కూడా ఆ వ్యాపారం బతుకు తెరువు కల్పిస్తుంది. సాధారణంగా వాటి ఉత్పత్తిదారు, వినియోగదారు ఇద్దరూ ఒకే సామాజిక ఆర్థిక అంతస్తుకు చెందినవారై ఉంటారు. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి కార్యాలయం తీసుకున్న దేననేది నిర్వివాదం. అయినా నితీశ్ , లాలూ యాదవ్లు ఇద్దరూ వెక్కిరింతలను ఎదుర్కోక తప్పదు. పైగా బిహార్ ఆర్థికమంత్రి పదవి లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ చేతుల్లోనే ఉంది. నితీశ్ బహిరంగంగా చేసే పనులను గురించి లాలూ జనాంతికంగా బిగ్గరగా నవ్వలేని సంద ర్భాల్లో ఇది ఒకటి. సమోసా ప్రతీకారం అతి త్వరగానే బయటపడింది. నితీశ్ ప్రస్తుతం దాన్ని చల్లార్చడం కోసం, ఖరీదైన ప్యాకే జ్డ్ సమోసా మీద పన్ను విధించాలనేదే తమ అభిమత మంటూ రాజకీయ ప్రతిదాడిని రేకెత్తించాలని యత్ని స్తున్నారు. అయితే ప్రజలకు గుర్తుండిపోయేది.... తొలుత పుట్టిన ఆలోచనే తప్ప, ఆ తర్వాత వచ్చినది కాదు. అయినా ఈ సవరణ వంచనేననేది స్పష్టంగానే కనిపి స్తోంది. భుజియా కూడా శిక్షపడ్డ వాటి జాబితాలో ఉంది. తరచి చూస్తే ఈ వ్యవహారం ఇంకా ఇంకా ఆసక్తి కరంగా మారుతోంది. ఉదారణకు, దోమలను పారదోలే మస్కిటో రిపెల్లంట్స్పై పన్ను ఎందుకు విధించినట్టు? దోమలు ఓటు వేయవు, కాటేస్తాయి. ఒక్కోసారి అవి ప్రాణాంతకం అవుతాయి కూడా. బిహార్లో మస్కిటో రిపెల్లంట్స్కు భారీ మార్కెట్ ఉంది, ప్రభుత్వం వాటి నుంచి భారీగా రాబడిని ఆశిస్తోంది. ఒక్క పాట్నా అమ్మ కాల నుంచి లభించే రాబడే ఒక భారీ ప్రభుత్వ శాఖ ఖర్చుకు సరిపోతుంది. రాష్ట్రం అంతటా దోమల స్వైర విహారం సాగుతోంది. బిహార్లో పన్నుల రాబడిని కల్పించే పరిశ్రమలంటూ పెద్దగా చెప్పుకోడానికి ఏమీ లేవు. కాబట్టి పన్ను వేయడానికి వేరే ఏవీ లేవు. అందువలన, ప్రభుత్వం తన గత వైఫల్యాల నుంచే లబ్ధి పొందాలని చూస్తోంది. మాట కూడా దోమలంత వేగంగానే వ్యాపిస్తుంది. రాజకీయాల్లోనైనా లేదా పరిపాలనలోనైనా అనుభ వజ్ఞులైనవారు కూడా ఇంత తెలివిమాలిన పొరపాట్లెలా చేస్తారా? అని ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు చేస్తా రంటే, అధికారంలో ఉండగా సమోసాలకు, కారప్పూసకు డబ్బులు చెల్లించేది వారు కాదు కాబట్టి. వారి సాయం కాలపు టీ, దానితో పాటూ ఉండే ఫలహారాల ఖర్చును పరిపాలన బడ్జెట్ నుంచి చెల్లిస్తారు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ నాగరికంగా భోజ నం చేసే ఉన్నత సమాజానికి చెంది నవారు. మానసికో ల్లాసం కోసమని ఆయన ఒకసారి ప్రజలు ఆరుబయట నిలుచుని తినే ఒక బడ్డీ దగ్గరకు వెళ్లి... మన సమోసాకు సమానమైన ‘కార్నిష్ పై’ తినాలనుకున్నారు. ముందస్తు ఏర్పాట్లతో సాగిన ఆ కార్యక్రమలో కామెరూన్... దాన్ని తినడం ఎలాగో తెలి యక రసాభాస చేశారు. ఆ ప్రజా సంబంధాల కార్య క్రమం అభాసుపాలైంది. బడ్జెట్ను సంతులనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న జార్జ్ ఆస్బోర్న్ తనకు ఆర్థిక మంత్రిగా ఉన్నా, కామెరూన్కు ‘పై’ మీద పన్ను వేయాలనే ఆలోచన ఎన్నడూ రాలేదు. ఆస్బోర్న్ తన లక్ష్య సాధనలో పూర్తిగా సఫలం కాకున్నా, ప్రయత్నమైతే చేశారు. కాబట్టి ఆయనను ఎవరూ తప్పు పట్టలేరు. లాలూ-నితీశ్ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే వెలుగును కోల్పోతున్న సమయంలో సమోసా-భుజియా విషాద ప్రహసనం ప్రదర్శితం కావడానికి కారణాలు హాస్యా స్పదమైనవి మాత్రం కావు. నేరస్తులకు రాజకీయ ఆశ్రయం లభిస్తుండటంతో నేరాలు ప్రతీకారం తీర్చు కోడానికన్నట్టు తిరిగి పేట్రేగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో భయం పెంపొందుతోంది. అధికారులకు లాలూ సమాంతర యంత్రాంగం నుంచి ఆదేశాలు అందుతున్నాయి. నిజమైన అధికార పీఠం ఎక్కడ ఉందో వారికంటే బాగా అర్థం చేసుకోగలవారు మరె వరూ ఉండరు. ఈ సమోసా తిరుగుబాటును అదుపు చేయవచ్చు. కానీ గత జ్ఞాపకాలకు సమోసా తోడు కావడం, నితీశ్ కుమార్ పేరుప్రతిష్టలకు గణనీయమైన నష్టాన్ని కలుగజేస్తుంది. - ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి -
జెంటిల్మన్ క్రికెటర్
బైలైన్: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు ఇప్పుడు మాజీ కెప్టెన్గా మారిన హషీమ్ ఆమ్లాకు జేజేలు పలకండి. కపటత్వంతో కృత్రిమ వినమ్రతను ప్రదర్శించకుండా, తానెంత మంచివాడో చాటుతూ ఉపన్యాసం దంచకుండా తన గురించి తాను నిజాయితీగా చెప్పుకున్న మనిషి ఆమ్లా. కల లాంటి ఆ పదవికి ఎవరూ కోరకుండానే ఆయన రాజీనామా చేశాడు. కెప్టెన్సీ బాధ్యతల వల్ల జట్టు బ్యాటింగ్కు వెన్నెముకగా తాను నిర్వహించాల్సిన కృషికి నష్టం వాటిల్లుతోందనే నిర్ణయానికి రావడంతో ఆమ్లా కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. క్రికెట్ కెప్టెన్లలో చాలా మంది బ్యాట్స్మెన్లే. బ్యాటింగ్, ఆ క్రీడలోని ఏదో ఒక అగ్రకుల అంతస్తుకు చెందినది కావడం అందుకు కారణం కాదు. బాధ ఎక్కువ, గ్లామర్ తక్కువైన బౌలింగ్, కఠోర శ్రమతో కూడిన పని. ఆస్ట్రేలియాకు చెందిన రిచీ బెనాడ్, మన కపిల్దేవ్లాంటి గొప్ప బౌలర్ కెప్టెన్లూ ఉన్నారు (ఇమ్రాన్ ఖాన్ , ఇయాన్ బోథామ్లాంటి ఆల్రౌండర్లు పూర్తిగా భిన్న శ్రేణికి చెందిన వారు). అయినా సెలెక్టర్లు బ్యాట్స్మెన్నే ఎక్కువగా కెప్టెన్లుగా ఎంచుకోవడానికి సజావైన కారణమే ఉంది. సుదీర్ఘమైన ఆ క్రీడలో కెప్టెన్గా మొత్తం ఆట నిర్వహణను అత్యంత అనుకూల దృష్టితో చూసే అవకాశం బ్యాట్స్మెన్కు ఎక్కువగా ఉంటుంది. ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్లో మాత్రమే ఒక కెప్టెన్ను సరిగ్గా పరీక్షించగలం. 20 ఓవర్ల ఆటలో కెప్టెన్ పాత్ర ఫుట్బాల్ కెప్టెన్లాంటిదే. ఇకఒక రోజు మ్యాచ్కు వస్తే, కెప్టెన్ ఆల్రౌండర్ అయితే మంచిదనడానికి సమంజసమైన కారణాలే ఉన్నాయి. కానీఅది వేరే కథ. అతి సుతారమైన ఆటగా క్రికెట్ (టెస్ట్ మ్యాచ్) మెల్లగా సాగే ఆట. ఎత్తుగడలపరమైన మార్పులతోపాటూ వ్యూహాత్మక నిర్ణయాలకు కూడా అవకాశాన్ని కల్పిస్తుంది. టెస్ట్ కెప్టెన్, ఆట పురోగతిని నిరంతరం విశ్లేషించడం అవసరం. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ప్రతి మూడు నాలుగు ఓవర్లకు అలా జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. తన జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పరుగుల వేగాన్ని నియంత్రించడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికా జట్టులో స్థానం సంపాదించినప్పటి నుంచి హషీం ఆమ్లా ఆడుతున్న తీరునుబట్టి చూస్తే అతను ఆలోచనాపరుడైన మనిషి. ఎప్పుడూ క్రీజ్కు నడుచుకుంటూ వెళ్తూనే... ఆయన ఆ ఆటలో పెద్దమనిషిగా మంచి గుర్తింపును సంపాదించుకు న్నాడు. ఇంగ్లండుతో జరుగుతున్న క్లిష్టమైన సిరీస్ మధ్యలో కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాల్సి వచ్చినప్పటి నుంచి ఆయన నడక సుదీర్ఘంగా సాగింది. అదే ఆయన జ్ఞాపకాన్ని నిర్వచించేది. ఆమ్లా నేతృత్వంలో దక్షిణాఫ్రికా ఆట అధ్వానంగా సాగింది. ఇటీవల భారత్లో జరిగిన సిరీస్లో ఆఫ్రికన్లు చిత్తుగా ఓడారు. పిచ్పై వివాదాలు ఆ వాస్తవాన్ని పూర్తిగా దాచలేవు. ఏదిఏమైనా పిచ్ను ఒక ఆధారంగా ఉపయోగించుకోవడం ఆసక్తికరం. రెండు జట్లూ అదే పిచ్పై ఆడాల్సి ఉంటుంది. అది బాగా లేకపోతే ఇద్దరికీ బాగా లేకుండా ఉండాలి. గ్రీన్-టాప్ పిచ్ పేస్ బౌలర్లకు సహాయపడితే పిచ్ని ‘‘చెడగొట్టారని’’ ఎవరూ ‘‘ఆరోపించరు’’. అలాంటప్పుడు బ్రౌన్-టాప్ పిచ్ స్పిన్నర్లకు తోడ్పడి నప్పుడు కామెంటేటర్లు తీవ్రంగా ఎందుకు స్పందిస్తారు? భారత్తో సిరీస్ను కోల్పోయినప్పుడు ఆమ్లా... అయాచితంగా దొరికే అలాంటి సాకులను చూపలేదని గుర్తుంచుకోవడం సముచితం. తన స్కోర్లు స్వల్పంగా ఉండటంతో ఆమ్లా సమస్యలు రెట్టింపయ్యాయి. దక్షిణాఫ్రికాలో ఇప్పుడు జరుగుతున్న సిరీస్లోని తొలి టెస్ట్లో ఇంగ్లండ్ గెలిచినప్పుడూ అదే వరుస కొనసాగింది. రెండవ టెస్ట్లో దక్షిణాఫ్రికా ఆటలోని అన్ని విభాగాల్లోనూ ప్రత్యర్థులపై ఆధిక్యాన్ని ప్రదర్శించి భారీ మొదటి ఇన్నింగ్స్ స్కోర్ను సాధించింది. అయితే ఆమ్లా బ్యాటింగ్కు వచ్చేసరికి ఆ జట్టు దాదాపుగా ఓటమి అంచున ఉంది. అతను సాధించిన డబుల్ సెంచరీ బ్యాట్స్మన్గా ఆయన విలువను పునరుద్ధరించడమే కాదు, కెప్టెన్గా విశ్వసనీయతను కూడా కాపాడింది. తమ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా బాక్స్లో కూచుని కెప్టెన్ చేసేది ఏమీ ఉండదని ఎన్నడూ అనుకోకండి. ఇన్నింగ్స్ పొడవునా అతను ప్రతి ఆటగాడి పాత్రను నిర్వచిస్తుంటాడు. కెప్టెన్ అంటే ఒక్క చేతి సంజ్ఞతోనే నియంత్రించే కాపరి. హషీమ్ ఆమ్లా సరిగ్గా తనపై ఉన్న అనుమానాన్ని నివృత్తి చేసిన సమయంలోనే రాజీనామా చేశాడు. అటు ఆటగాడిగా, ఇటు నాయకునిగా తిరిగి అగ్రస్థానానికి వచ్చాకనే నాయకత్వ బాధ్యతల నుంచి నిష్ర్కమించాడు. కొద్దికాలంపాటూ ఆట బాగోనందుకే సెలెక్టర్లు కెప్టెన్ను శిక్షించేట్టయితే, ఏ కెప్టెనూ మహా అయితే రెండు లేదా మూడు సీజన్లకు మించి మనజాలడు. పోటీ క్రూరంగా ఉండే ఫుట్బాల్లో సైతం యజమానులు, జట్టు విఫలమౌతున్నా మేనేజర్లను మార్చడానికి సమయం తీసుకుంటారు. ఆమ్లాను ఎవరూ ఒత్తిడి చేయకున్నా, తమ జట్టు ప్రయోజనాలకు మంచిదని తనంత తానే అనుకుని రాజీనామా చేశాడు. అలాంటి ఉదాహరణలు ఎన్నో కనబడవు. పేర్లు వద్దుగానీ, కెప్టెన్లకు వారి అధికారం ద్వారా బహిరంగంగానూ, చాటుమాటుగానూ ఆర్థిక ప్రతిఫలాలు లభిస్తాయి. కాబట్టే వారు తమ అధికారాన్ని పట్టుకు వేలాడుతారు. క్రికెట్ను విచిత్రంగా ‘‘పెద్దమనుషుల ఆట’’ అని అభివర్ణిస్తుంటారు. ఇప్పుడు అది అలాగే ఉన్నదని గట్టిగా చెప్పడం తీవ్ర అతిశయీకరణే. ఎక్కడైనా ఉండేట్టే ఇప్పుడు క్రికెట్లో కూడా ఎందరు పెద్దమను షులున్నారో అందరు ఆకతాయిలూ ఉన్నారు. ఇది మంచీ కాదు, చెడూ కాదు. రిపబ్లికన్ యుగంలో విలు వలు లేదా విలువల రాహిత్యం అనేవి ఒక వర్గానికి సం బంధించినవి కావు. ఎవరు ఉత్పత్తులను అమ్ముకోగలి గితే వారికే భారీగా డబ్బు వచ్చిపడుతుంది. అందుకే క్రీడలో ఒక పెద్ద మనిషి కనిపిస్తే అది సంబరపడటానికి కారణమవుతుంది. విధి ప్రతి ఒక్కరికీ వారు ధరించాల్సిన పాత్రను కేటాయిస్తుంది. ఒక ఆదర్శ నమూనా కాగలగడం మాత్రం ఆ వ్యక్తి సాధించాల్సినదే. వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి: ఎం.జె. అక్బర్ -
అనుభవం అయ్యేనా పాఠం?
బైలైన్ పార్లమెంటులో అధికార ప్రతిపక్షాల పాత్రలు ఆసక్తికరంగా తారుమారు కావడమే గత ఏడాదిలో చాలా కాలాన్ని మింగేసింది. ఆగ్రహంతో ఒళ్లు మరచి ఊగిపోయే పరిస్థితులు ఏర్పడటమంటే పార్లమెంటరీ వ్యవస్థ ఆరోగ్యానికి కీడు జరుగుతున్నదని సంకేతం. స్వల్పకాలిక సమావేశాలను నిర్వహించడంలో ప్రభుత్వానికేమైనా స్వార్థ ప్రయోజనాలు ఉండవచ్చునని ఊహించడం తర్కబద్ధమైనదే. పెద్దగా చర్చలేకుండానే చట్టాలు చేసేయడం దానికి ఆదర్శప్రాయం కావచ్చు. ప్రభుత్వాలంటే సువ్యవస్థితమైన పాలనా యంత్రాంగాలు కాబట్టి, అవి కనీస పరిశీలనకు గురవుతూ, గరిష్ట వెసులుబాటును కోరుకుంటాయి. అందుకు బదులుగా ప్రభుత్వంపై ప్రజాభిప్రాయమనే ఒత్తిడిని తెచ్చే వేదికగా పార్లమెంటు అందించే పలు అవకాశాలను ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీయే స్వయంగా కాలరాచివేయాలనే కృత నిశ్చయంతో ప్రవర్తించింది. హేళనగా కూతలు పెట్టడం, గావుకేకలు వేసి అడ్డగించడం ద్వారా కాంగ్రెస్ పదే పదే ప్రశ్నోత్తరాల సమయాన్ని హతం చేసింది. బోర్డింగ్ స్కూల్లో ఇలాంటి ప్రవర్తనకు టర్మ్ ముగిసేసరికి తీవ్రమైన మందలింపులు తప్పవు. కొన్ని బిల్లుల ఆమోదానికి కాంగ్రెస్ సహకరించిన మాట నిజమే. అయితే అవి కూడా చాలా వరకు ప్రతికూల ప్రజాభి ప్రాయమంటే భయంతో పెద్దగా చర్చ లేకుండా ఆమోదించినవే. అయితే కాంగ్రెస్ ఏకాకి కావడం గమనించదగ్గ వాస్తవం. మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ అలాంటి ఎత్తుగడలకు దూరంగా ఉన్నాయి. ఇదేమైనా కాంగ్రె స్ ప్రవర్తనలో ముందు ముందు పెద్దగా తేడాను కలుగజేస్తుందా? నిర్హేతు కమైన వ్యూహం ఏ మలుపు తీసుకుంటుందో ముందుగా చెప్పడం కష్టం. ఈ ఏడాది మాటగా చెప్పుకోవాల్సిన సూక్తి ఒక పెద్ద విషయంగానే విస్తరింపజేయగలిగినది. అయితే మొన్ననే సెలవు పలికి నిష్ర్కమించిన ఏడాది అనుభవంపై ఆధారపడి ఆ సూక్తి ఉత్పన్నార్థాన్ని నిర్మించాల్సి ఉంటుంది. ఫ్రెంచ్ తత్వవేత్త వోల్టేర్ దేవుని పట్ల పెద్దగా విధేయత గలవాడుగా సుప్రసిద్ధుడు కాడు. అయినా ఆయన ఆకాశం వైపు తలెత్తి చూసినప్పుడల్లా భగవంతుడా! అంటూ అత్యంత అర్థస్ఫోరకమైన ఓ మంచి మాట చెప్పేవాడు. ఓసారి ఆయన ‘‘ఓ ప్రభువా, నా శత్రువులను పరిహాసాస్పదులను చేయుము’’ అన్నాడు. ఉత్సాహంగా పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే ప్రజా జీవితంలో ఎవరైనాగానీ అంతకంటే ఎక్కువగా కోరగలిగేది ఏముంది? కాలక్రమానుగుణంగా పుట్టుకొచ్చే ఆందోళనలు కూడా కొన్ని ఇతర చర్చల్లాగే తయారు చేయాల్సినవి. అయితే అవి భోజనానికి అనుబంధంగా ఉండాల్సిన రుచికరమైన పదార్థాలేగానీ, ఆవశ్యకం కానివి. కానీ పసందైన భోజనానికి అవి అనుబంధంగా ఉండాల్సిందే. లిటరరీ క్రిస్మస్ క్రాకర్ (క్రిస్మస్ సందర్భంగా పత్రికలు ఒకప్పుడు ప్రచురిస్తుండే సాహిత్య అనుబంధంలోని చమత్కారాల శీర్షిక) ఏమైపోయింది? లిటరరీ అనే ముందు మాటను బట్టే ఇదేదో టపాకాయలా ఇలా పేలి, అలా చచ్చిపోయేది కాదని తెలుస్తోంది. చమత్కారపూరితమైన ప్రశ్న, అనూహ్యమైన సమాధానం రూపంలో దాగిన మేధోపరమైన సృజనాత్మక పదప్రయోగ చమత్కారం అది. ఆ సమాధానం అర్థం స్ఫురింపజేసేదానికంటే ఒకింత ఎక్కువ అర్థాన్నే అది కలిగి ఉంటుందనేది స్పష్టమే. విసుగుదనం లేదా అంతకంటే అధ్వానమైనదైన నైతికత నుంచి సమాచారాన్ని కాపాడి, బోధించడమేగాక ఉల్లాసపరుస్తుంది. కళలు, పుస్తకాలకు వార్తా పత్రికలు ఎక్కువ స్థలాన్ని కేటాయించి, వాటిని సంకలనపరిస్తే అవే తదుపరి ఏడాదికి పాఠకులకు నూతన సంవత్సర కానుకలవుతాయి. బ్రిటన్ వార్తా పత్రికలు ఇంకా ఆ అద్భుత వినోదానికి శ్రద్ధను, సమయాన్ని కేటాయిస్తున్నాయి. మన దేశం నుంచి అది నిష్ర్కమించడం చింతించాల్సిన విషయం. సీమట పాకాయ పెరిగి పెద్దదై క్విజ్గా మారిందని, అన్ని కాలాలూ అందుబాటులో ఉంటోందని ఆశావాదులు వాదించొచ్చు. అయినా గతంలో ఉండే మంచి ఉండనే ఉంది. అందుకు నేనో ఉదాహరణ చెబుతాను. లీనింగ్ టవర్ ఆఫ్ పీసాను (ఇటలీలోని ఒరిగి ఉండే సుప్రసిద్ధ కట్టడం) నిటారుగా నిలపాలని ఎవరు అనుకుంటారు? ముస్సోలినీ. మరింత విడమర్చి చెప్పాలంటే... ప్రజాస్వామ్యంలేని అధికారం వెర్రి. క్రిస్మస్ ఒక జననానికి సంబంధించినది. అది పరిరక్షకుని పుట్టుకకు సంబంధించిన పండుగ. మనకంటే దురదృష్టవంతులైనవారిపట్ల దయ, దాతృత్వం చూపడమే క్రైస్తవ మత లక్ష్యం. ప్రిసిల్లా చాన్, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్బర్గ్లే 2015 క్రైస్తవులు. వారు తమ తొలి సంతానం పుట్టుక సందర్భాన తమ అపార సంపదలో 99 శాతాన్ని చాన్ జుకెర్బర్గ్ ఇనిషియేటివ్కు ఇచ్చేస్తామని వాగ్దానం చేశారు. అది నమ్మశక్యం కానంతటి మొత్తం. దాదాపు 45 బిలియన్ల (4,500 కోట్లు) డాలర్లు. ఉన్నదున్నట్టుగా చెబుతున్నా, నాకైతే బిలియన్ డాలర్లంటే ఎంతో తెలీదు. 45 బిలియన్లంటే ఓ చిన్న దేశం వార్షిక రాబడంత కావచ్చు. ప్రిసిల్లా, మార్క్లు జీవితంలో వచ్చే జన్మ కోసం బీమా పాలసీలను తీసుకోవాలని ఆరాటపడాల్సిన దశలో లేరు. ఇంకా యవ్వనంలోనే ఉన్నారు. అమెరికాలోని కొత్తా, పాతా బిలియనీర్లలో వారు ఒంటరివారు కారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా 44 బిలియన్ డాలర్ల ట్రస్టు ఆర్థిక సహాయంతో నడిచే గేట్స్ ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ఇతర దేశాలతోపాటూ మన దేశంలో కూడా అద్భుతమైన కృషి చేస్తోంది. భారతదేశంలో అలాంటి బిలియనీర్లు కనబడేదెన్నడు? ఈ ఏడాది అత్యుత్తమ కొటేషన్ ఖ్యాతి మాత్రం మరుపున పడిపోయిన హాలీవుడ్ స్టార్ బర్డ్ రేనాల్డ్స్ ఆత్మకథకే దక్కుతుంది. ఇటీవలే ప్రచురితమైన అందులో ఆయన, అలనాటి గ్లామరస్ నటి జోన్ క్రాఫోడ్ మరణాన్ని గుర్తు తెచ్చుకున్నారు. ఆ రోజు సాయంత్రం జరిగిన ఒక పార్టీకి, క్రాఫోడ్ బద్ధ శత్రువైన మరో నటి బెట్టీ డెవిస్ కూడా హాజరైంది. విలేకర్లతో మాట్లాడుతూ ఆమె ఇలా అంది... ‘‘చనిపోయిన వారి గురించి మంచే తప్ప, చెడు మాట్లాడకూడదు, జోన్ క్రాఫోడ్ చనిపోయింది. మంచిది! ’’ - ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు వ్యాసకర్త బీజేపీ అధికార ప్రతినిధి -
వాతావరణ మార్పు ఆహ్లాదకరం
బైలైన్ ప్రజా చర్చలోకి భయాన్ని ప్రవేశపెట్టి, పరస్పర విద్వేషాగ్నిని రగిల్చే శక్తి యుద్ధోన్మాదులకు ఉంది. అదే భారత్-పాక్ చర్చలకు ప్రమాదకరమైన అడ్డంకి. మోదీ లాహోర్ సందర్శన ముందస్తు సన్నాహంతో వచ్చిన ‘వాతావరణంలోని మార్పు’ కావడంలోనే ఉన్నది అసలు నైపుణ్యమంతా. ఒక్కోసారి చరిత్రంటే కొన్ని ప్రాధాన్యంగల ఘటనల సమా హారమేననిపిస్తుంది. కాబూల్ నుంచి ఢిల్లీకి వెళ్తూ హఠాత్తుగా లాహోర్లో ‘‘దిగాలి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణ యించుకోవడం లాంటి అద్భుత ఘటనలు అతి కొన్నే ఉంటాయి. ఆయన పాకిస్తాన్లో దిగి, ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంటి శుభకార్యానికి వెళ్లిరావడం అక్షరాలా హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడ్డట్టే జరిగింది. ఈ వ్యక్తీకరణ ఆ ఘటనకున్న రాజకీయ పార్శ్వాన్ని కూడా చక్కగా వర్ణిస్తుంది. దీని ప్రభావం ఉపఖండాన్ని దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి కారణం... అది అనూహ్యమైనది, అసాధారణమైనది కావడమే కావచ్చు. అటూ ఇటూ కూడా ఎంతో ధైర్యం, ఊహాత్మకత, నైపుణ్యం అవసరమైన అద్భుత దౌత్య విజయం ఇది. లేకపోతే అనిశ్చితితో ఉండే పాక్ ప్రధాని నవాజ్ ఒక టెలిఫోన్ సంభాషణలో ఆహ్వానాన్ని ఇమిడ్చి ఉండేవారూ కారు, ఆత్మవిశ్వాసం కొరవడిన మన ప్రధాని మోదీ దాన్ని ఆమోదించి ఉండేవారు కారు. సమస్యాత్మకమైన భారత్-పాక్ సంబంధాల కథనంలో ఓ నూతనాధ్యా యాన్ని లిఖించడం ఒక్క రచయిత వల్ల కాని పని. ఇద్దరు రచయితల అవగాహనా ఒకేలా ఉండాల్సి ఉంటుంది. దీని ఫలితం తక్షణమే కనిపించింది. ప్రజాభిప్రాయం తమకు అనుకూలంగా ఉంటుందనే నమ్మకం ఇద్దరు నేతలకూ ఉండి ఉంటుందనడంలో అనుమానమే లేదు. కానీ దానికి లభించిన సానుకూల స్పందన స్థాయి ఇంతగా ఉంటుందని మాత్రం భావించలేదు. రెండు దేశాల మధ్య గత శతాబ్దిలో జరిగిన సంఘర్షణల ఫలితంగా ప్రజల జీవితాల్లో కొరవడ్డ పరస్పర సాంస్కృతిక, బంధుత్వ సంబంధాలను అది పునరావిష్కరించింది. ఎప్పుడో అరుదుగా తప్ప యుద్ధానికి సహేతుకమైన కారణమంటూ లేకపోవడం మానవ ప్రవృత్తిలోని వింత వాస్తవం. ఉపఖండంలోని ప్రజలు యుద్ధం అంటే విసిగిపోయారు. శాంతి వల్ల కలిగే అపార ప్రయోజనాలను గురించి చాలా మంది నేతలకంటే వారికే ఎక్కువ తెలుసు. శాంతి కావాలనే కాంక్ష ఉన్నంత మాత్రాన అది లభించేది కాకపోవడం విషాదకరం. యుద్ధం సాగించడాని కంటే శాంతిని నిలిపి ఉంచడం కోసం ఎక్కువ జాగ్రత్త వహించాల్సి ఉంటుందనేదీ నిజమే. 2014లో తన ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ (దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార సంస్థ) నేతలందరినీ ఆహ్వానిస్తూ ప్రధాని మోదీ తన పదవీ బాధ్యతలను ప్రారంభించారు. తద్వారా ఆయన ఇలాంటి మరో పరిణామాత్మక ప్రాధాన్యంగల ఘటనకు కారకులయ్యారు. అయితే అది స్వార్థ ప్రయోజ నాల కింద సమాధైపోయింది. భారత్ -పాక్ సంబంధాల లో ఇంత త్వరగా మరో ఆరంభం సాధ్యం కావడం అద్భుతమే. ఈ ప్రక్రియకు ద్రోహం చేసేవారితో వ్యవహరి స్తూనే, ఈ సంబంధాలను పట్టిపీడిస్తున్న సంక్లిష్ట సమస్యల పై మధ్యంతరమైన అవ గాహననైనా ఏర్పరచుకోవడానికి కొంత సమయం, ఓపిక అవసరం. ఇప్పటికే ఒక తీవ్రవాదుల కూటమి నవాజ్ను కూలదోయాలని చూస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ కలయిక వల్ల కలిగే ప్రమాదాలేమిటో ఆయనకు తెలుసు. అయితే, పాక్ సైన్యం కూడా ఆయన వెంట ఉన్నదని అనుకోవాల్సి ఉంటుంది. పాక్ ప్రధాన స్రవంతి పార్టీలన్నీ ఈ విషయంలో ఆయనకు మద్దతుగా ఉండటం కూడా అంతే ప్రోత్సాహదాయకమైన వాస్తవం. మన దేశంలో ప్రజలు ప్రధాని వెంటే ఉన్నా, కాంగ్రెస్ లాంటి పార్టీలు దురదృష్టవశాత్తూ జాతీయ ప్రయోజనాలకు, పక్షపాత పూరిత రాజకీయాలకు మధ్య రేఖను గీయలేక, యథా లాపంగా విమర్శిస్తున్నాయి. ఆ పార్టీల నేతల వ్యాఖ్యలు పూర్తి పిల్లతనంతో కూడినవి కావడంలో ఆశ్చర్యం లేదు. మార్క్సిస్టు పార్టీలు చూపిన పరిణతితో దీన్ని పోల్చి చూడండి. సీపీఐ, సీపీఎంలు రెండూ ఆయన చూపిన ఈ చొరవనూ, సంఘర్షణ అనే విషపూరితమైన ఊబి నుంచి తలెత్తిన అవకాశాన్నీ స్వాగతించాయి. ఇలాంటి ప్రాధాన్యంగల ఘటనలు జోస్యవేత్త చక్రం నుంచో ఇంద్రజాలికుని టోపీలోంచో బయటపడేవి కావు. సామెత చెప్పినట్టూ, ఆ జరగాల్సిన క్షణంలోనే అది హఠాత్తుగా ఫలిస్తుంది. అయితే అంతకు ముందే ఎప్పుడో విత్తనాలను నాటి, జాగరూకతతో కూడిన దౌత్యమనే ఎరువును వేసి ఉండాలి. ఈ ఏడాది జూలైలో ఇరువురు నేతలు రష్యాలోని ఊఫాలో సమావేశమైన ప్పుడే దీనికి సన్నాహక కృషి జరిగి ఉండాలి. నవంబర్ 30న పారిస్లో దానికి ఎరువు వేసి ఉంటారు. బ్యాంకాక్లో ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారులు కలుసుకున్నప్పుడే తొలి పచ్చదనం కనిపించింది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ డిసెంబర్లో అఫ్ఘానిస్తాన్లో జరిగిన ‘‘హార్ట్ ఆఫ్ ఆసియా’’ మంత్రుల సదస్సు సందర్భంగా నవాజ్ షరీప్ను కలుసున్నప్పుడు అది మొలకెత్తింది. ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా పదవుల్లోకి వచ్చే రాజకీయవేత్తలు ప్రజల హృదయ స్పందనలను, మనోభా వాలను అర్థం చేసుకోవాలి. అదే వారి గొప్ప బలం. వాతావరణాన్ని పరిపక్వం చెందించాల్సిన ఆవశ్యకతను కూడా వారు అర్థం చేసుకుంటారు. ప్రజా చర్చలోకి భయా న్ని ప్రవేశపెట్టి, పరస్పర విద్వేషాల దావానలాన్ని రగల్చ గలిగే శక్తి యుద్ధోన్మాదులకు ఉంది. అదే భారత్-పాక్ చర్చలకు ప్రమాదకరమైన అడ్డంకిగా ఉంటూ వస్తోంది. ఇది ముందస్తు సన్నాహంతో వచ్చిన ‘వాతావరణంలోని మార్పు’ కావడంలోనే ఉన్నది అసలు నైపుణ్యమంతా. ఈ క్రమమంతా వచ్చే ఏడాది పాక్లో జరగనున్న సార్క్ శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోదీ హాజరు కావడంగా పరిణమిస్తుందని ఆశించవచ్చు. మనం ఓ విష వలయంలో చిక్కుకుపోయి ఉన్నప్పుడు ఏం చేయాలి? అనే చిరకాల ప్రశ్నకు పాత సూఫీ సమాధానం ఒకటుంది. సంప్రదాయకంగా చెప్పే జవాబైతే ఆ విషవలయాన్ని బద్దలుకొట్టి బయటపడాలంటుంది. సూఫీలది అందుకు భిన్నమైన వైఖరి. మరింత పెద్ద వలయాన్ని గీస్తే, యుక్తిగా కదిలే వెసులుబాటు మనకు లభిస్తుందని వారంటారు. సార్కే ఆ పెద్ద వృత్తం. (వ్యాసకర్త : ఎంజే అక్బర్ బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ) -
విసుగెత్తించడమే పరిష్కారం
బైలైన్ భారత్-పాక్ క్రికెట్ సిరీస్ విజయవంతంగా జరగడమే అందరికీ కావాలి. అయితే క్రికెట్ ఒక సంబరం కానట్లయితే, అంతటి ప్రమాదానికి సిద్ధపడాలా? క్రీడ ఆనందం కోసమే తప్ప, యుద్ధానికి ప్రత్యామ్నాయం కాదు. భారత్-పాకిస్తాన్ క్రికెట్ విషయంలో నెలకొన్న బాధా కరమైన ప్రతిష్టంభనకు పరి ష్కారం ఒక్కటే. ఎవరూ పట్టించుకోనంత మహా విసుగెత్తించేదిగా దాన్ని మార్చేయడం. హాకీ ఆ పని ముందే చేసి చూపింది. ఒకానొకప్పడు ఎప్పుడో గతంలో ఒలింపిక్ లేదా ఆసియా హాకీ స్వర్ణం కోసం భారత్, పాక్ జట్లు తలపడుతుంటే ఉపఖండమంతా ఆ క్రీడకు దాసోహమనేది. రెండు జట్లు మొదటి స్థానం కోసం గాక, చివరి స్థానం కోసం పోటీ పడటం మొదలు కావడంతోనే ఆ ఉత్సాహోద్వేగాలన్నీ తుస్సుమని పోయాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య క్రికెట్ గురించిన చర్చ నత్తనడక నడుస్తోంది. అసలు అలాంటి చర్చే సంఘ వ్యతిరేకమైనదన్నట్టుగా సోషల్ మీడియా ఉద్రేకపడుతోంది. భారత్, పాక్లు హాకీ ఆడుతుంటే గుసగుసైనా వినిపించదు. అదే క్రికెట్ అయితే కల్లోలం రేగుతుంది. కాబట్టి సమస్య క్రీడ కాదు, దానికి లభించే ప్రతిస్పందన. ఆసక్తిని చంపేస్తే, వివా దమూసమసిపోతుంది. కాకపోతే ఇరు దేశాల క్రికెట్ జట్లూ విసుగెత్తించ నిరాకరిస్తుండటమే సమస్య. రెండు జట్లూ ఏ శుభ దినానైనా ప్రపంచంలోని ఏ జట్టునైనా ఓడించగలిగేవే. సహజంగానే, ఏదీ నిలకడగా ఆడే బాపతు కాదు. ఉపఖండం స్వభావానికే అది విరుద్ధం. రెండు జట్ల ఆట తీరూ ఊహింపశక్యం కానిదే. అదే ఉద్విగ్నతకు కారణం. భారత్-పాక్ టెస్ట్ సిరీస్ విషయంలోని ఆచర ణాత్మక సమస్యలను గురించి ఆలోచించండి. హాకీ అయితే ఓ రెండు గంటల్లో ఆట ముగిసిపోతుంది. క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఐదు రోజులుంటుంది. సిరీస్ మన దేశంలో జరుగుతుంటే మన మైదానాల అధికారులు ఆట మూడు రోజుల కంటే ముందే ముగిసిపోయేలా చేసి, శాంతిభద్రతల పరిరక్షణలో తమ వంతు కర్త వ్యాన్ని నిర్వర్తిస్తారు. భారత్, పాక్తో ఆడుతున్న ప్పుడు ఆ పద్దెనిమిది గంటల క్రీడా సమయం సైతం అనంతంలా అనిపిస్తుంది. శాంతికాముకులైన పౌరుల ఉద్వేగాలను నియంత్రించడం నిజానికి అతి చిన్న సమస్య. కానీ క్రీడాకారుల భద్రతకు ఎవరూ హామీని కల్పించలేరు. కాబట్టి పాకిస్తాన్ జట్టు పాక్లో ఆడలేదు. ఆ దేశం తన ‘సొంత మైదానాల’ను యునెటైడ్ ఎమిరేట్స్కు ఔట్సోర్స్ చేసింది. పాక్లో క్రికెట్ను అసాధ్యం చేసిన ఉగ్రవాదులు, మరెక్కడైనా పాక్, భారత్తో తలపడుతుంటే చూస్తూ ఊరుకుం టారా? ఆట జరిగేచోట కాకున్నా మరెక్కడైనా దాడి జరిగితే ఏం చేయాలి? మీడియా ఉన్మాదాన్ని రేకె త్తిస్తుంది కాబట్టి, ప్రభుత్వాలు సంతృప్తిపరచే విధా నాన్ని అవలంబిస్తున్నాయని విమర్శలను ఎదుర్కో వాల్సి ఉంటుంది. కాబట్టి ఆటను పూర్తిగా కట్టిపెట్టే యాలా? ఇటీవల ఈ సిరీస్ను ఇంగ్లండ్లో ఏర్పాటు చేయాలనే మాట వినిపిస్తోంది. పారిస్ ఉగ్రదాడి తదుపరి లార్డ్స్లో ఈ ప్రదర్శన జరగడానికి ఆ మైదానం యజమాని ఎమ్సీసీగానీ, బ్రిటన్ గూఢచార సంస్థ ఎమ్16గానీ సుముఖత చూపితే ఆశ్చర్య పోవాల్సిందే. భారత్-పాక్ క్రికెట్లో ఏ మూల చూసినా, ఏదో ఒక ఊహించని సమస్య పొంచి ఉంటుంది. ఉదాహ రణకు, గత టీ20 వరల్డ్ కప్ బంగ్లాదేశ్లో జరిగిన ప్పుడు భారత టీవీ చానళ్లలో చూపిన పలు ప్రకటనలు రెచ్చగొట్టేవిగా, ప్రమాదకరమైనవిగా, వివేకరహిత మైనవిగా, జాతీయోన్మాద పూరితమైనవిగా ఉన్నాయి. అవి లెక్కలేనంతమంది వీక్షకులను భారత్కు వ్యతి రేకంగా మార్చాయి. నాడు జరిగిన నష్టం ఇంకా కనిపిస్తూనే ఉంది. భారత క్రికెట్కు బాధ్యత వహిం చాల్సిన బీసీసీఐ అప్పుడూ దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకునే అవకాశమూ తక్కువే. దానికి పట్టేది ఒక్కటే, కాసుల గలగలలు. ఇక చారిత్రకంగా అత్యంత వివాదాస్పద అంశమైన అంపైరింగ్ను చూద్దాం. అంపైరింగ్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే విషయంలో భారత్ది... తప్పంటూ జరిగితే అది మానవ తప్పిదమే కానిద్ధామనే యంత్ర విధ్వంసకుల(లుడ్డైట్ల) వైఖరే. ఇది మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ వారసత్వంలో భాగం. జనం యంత్రాలను క్షమిస్తారే తప్ప, మనిషిని క్షమించలేరనే చిన్న విషయం పెద్దపెద్ద క్రికెట్ బుర్రలకు ఎందుకు బోధపడదు? యంత్రానికి లంచం ఇవ్వలేం. క్రికెట్ భారీగా డబ్బుతో ముడిపడినదిగా మారడం, దాన్ని అనుసరించి వచ్చిన బెట్టింగ్ తమాషా నేపథ్యంలో ప్రతిచోటా అవినీతి వాసనలు వ్యాపిస్తూనే ఉన్నాయి. అలా అని అంపైర్లు అవినీతి పరులని ఆరోపిస్తున్నట్టు కానే కాదు. వాళ్లు తమపైన తామే నిరంతర నిఘాను ఉంచుకుంటారు. అయితే పుకార్లకు, ఊసుపోని కబుర్లకు వాస్తవాలలో ఆసక్తి ఉండదు. పాక్తో మనం క్రికెట్ ఆడటం అంటూ జరిగితే అది, మనం కూడా మిగతా ప్రపంచంలాగా అనుమానం వస్తే కెమెరాను సంప్రదించడం మొదలు పెట్టాకనే. విసుగెత్తించేటప్పుడైనా నాకు క్రికెట్ అంటే ప్రేమే. అదీ, ఇంగ్లిష్ ప్రీమియర్ ఫుట్బాల్ మాత్రమే టీవీ కొనడానికి నాకు ముఖ్య కారణం. భారత్-పాక్ క్రికెట్ సిరీస్ విజయవంతంగా జరగడం కంటే ఎక్కువ ఎవరూ ఆశించరు. క్రికెట్ ఒక సంబరం కానట్లయితే, అంత ప్రమాదాన్ని ఆహ్వానించాలా? క్రీడ ఆనందం కోసమే తప్ప యుద్ధానికి ప్రత్యామ్నాయం కాదు. క్రీడ అంటే స్త్రీపురుషులు తమ అత్యున్నత స్థాయి ప్రతిభను ప్రదర్శించి, మహోత్కృష్ట మనోహర కళా కౌశలాన్ని ప్రదర్శించే రంగస్థలి. క్రీడ అంటేనే పోటీ పడటం ఉంటుంది. నాటకీయతను అత్యున్నత స్థాయికి చేర్చేది అదే. అయితే వివేకవంతులైన క్రీడాకారులెవరూ పోటీని శత్రుత్వమనే రొచ్చుగుంటలోకి దిగజారిపోని వ్వరు. క్రీడల మౌలిక సూత్రాలకే అది విరుద్ధం. చూస్తు న్నదాన్ని మనం ఆస్వాదించలేకపోతున్నామంటే, అది ఆటే కాదు. ఈ చలికాలంలో భారత్, పాక్తో ఆడాలా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. - ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి. -
కాంగ్రెస్ జీన్స్లోనే ‘అసహనం’: వెంకయ్య
న్యూఢిల్లీ: రాజకీయంగా దెబ్బతిన్న వాళ్లంతా.. ఏం చేయాలో అర్థంకాక అసహనం పేరుతో నాటకాలు చేస్తున్నారని బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ రాష్ట్రపతిని కలవటంలో అర్థం లేదని.. అసహనం అనేది కాంగ్రెస్ జీన్స్లోనే ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. రాష్ట్రపతి దగ్గరకు కాంగ్రెస్ ర్యాలీ చేయటం రాజకీయ నాటకమని మరో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. ఎమర్జెన్సీ, 3వేల మంది సిక్కులను హత్య చేసినపుడు అసహనం ఏమైందని ప్రశ్నించారు. నైతికంగా, రాజకీయంగా దివాలా తీసిన కాంగ్రెస్ నాయకత్వం.. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం మత ఘర్షణలను రెచ్చగొట్టి నిప్పుతో ఆడుకుంటోందని.. బీజేపీ నేత ఎంజే అక్బర్ విమర్శించారు. రాజకీయంగా అస్తిత్వం కోల్పోతున్న కొందరు విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని.. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ విమర్శించారు. అసలు దేశంలో అసహనమే లేదని, భవిష్యత్తులోనూ ఉండదని జైట్లీ అన్నారు. మోదీలో అసహనం లేదని.. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లటం ఆయన నైజమని జమ్మూ కశ్మీర్ సీఎం ముఫ్తీ మహమ్మద్ సయీద్ అన్నారు. కాగా, దేశవ్యాప్తంగా రచయితలు, కళాకారులు అసహనానికి వ్యతిరేకంగా అవార్డులు వెనక్కిచ్చి ఏం సాధిస్తారని సినీనటుడు కమల్ హసన్ ప్రశ్నించారు. అవార్డులు తిరిగివ్వటంలోనూ రాజకీయం ఉందని.. దేశానికి మంచి చేసిన పార్టీకి ఓటు రూపంలో సమాధానం ఇస్తానని తెలిపారు. -
'స్మార్ట్' ప్రజాస్వామ్యం జైత్రయాత్ర
మొబైల్ వీడియో రాజకీయవేత్తల కాళ్ల కింద భూలోక నరకాగ్ని జ్వాలలను రాజేస్తుంది. స్మార్ట్గా మారినది ఫోన్ ఒక్కటే కాదు... ఓటర్లు కూడాను. స్మార్ట్ ఓటర్ లేనిదే స్మార్ట్ ఫోన్ వల్ల ప్రయోజనమేముంది? ఎన్నికల ప్రచారంలో అభ్యర్థి నుంచి తాము ఏం వినాలనుకుంటున్నామో చెప్పగల కళ ఓటర్లకున్నప్పుడు... అదే నిజాన్ని ఓటింగ్ మిషన్ ద్వారా చెప్పడం చాలా సులువు. ఎవరి ఆగ్రహానికో గురయ్యే ప్రమాదాన్ని ఎందుకు ఎదుర్కోవాలి? మొబైల్ ఫోన్ ఎన్ని ఎన్నికలను చూసి ఉంటుంది? దాదాపు దశాబ్ది క్రితమే కారుచౌక కాల్స్, ఎస్ఎమ్ఎస్లు అసాధారణమైన రీతిలో వ్యక్తిగత సమాచార సంబంధాలు జగమంతటికీ విస్తరించాయి. ఈ విస్తరణతోపాటే అది ఒక స్వతంత్ర శక్తిగా ఆవిర్భవించింది. అయితే, స్మార్ట్ ఫోన్లు విరివిగా అందుబాటులోకి వచ్చాకనే ప్రజాస్వామిక చర్చ లో గణనీయ స్థాయి జోక్యం చేసుకోగలిగే శక్తి దానికి సంక్రమించింది. వీడియో కెమెరా దాన్ని అత్యంత శక్తివంతమైన సాధనంగా మార్చింది. 'సెల్ఫీ' (స్వీయ చిత్రం), మొబైల్ ఫోన్ కెమెరాకు సంబంధించిన అత్యంత ఆహ్లాదకరమైన, ప్రయోజనకరమైన అంశం. కుటుంబ అను బంధాలను లేదా స్నేహానుభూతులను శక్తివంతంగా ప్రసారం చేయడం ద్వారా అది కొద్ది కాలంపాటే అయినా దూరాన్ని మటుమా యం చేయగలిగింది. వీడియో ఆ ఆనందాన్ని మరింత ఇనుమడిం పజేసింది. ఇక మొబైల్ వీడియో, ప్రజా నిఘా ఆయుధంగా విరుచు కుపడటానికి ఆ తర్వాత ఎంతో కాలం పట్టలేదు. సాంకేతికత ప్రజాస్వా మ్యాన్ని పునరావిష్కరించడంతో 'డెమ్టెక్'(ప్రజాస్వామ్య సాంకేతికత) విప్లవం సంభవించింది. అలాంటి ప్రతి పరిణామానికి ఒక పేరు అవసరం. ప్రజాస్వామ్యంపై సాంకేతికత ప్రభావానికి తగిన పేరు 'డెమ్టెక్'అనే అనిపిస్తోంది. ఆ పదం ప్రాచుర్యంలోకి వస్తుందని నేను సహజంగానే ఆశిస్తున్నాను. అయితే, నిశ్చల స్వీయ చిత్రమైన సెల్ఫీకంటే విభిన్నమైన వీడియో రికార్డింగ్ను ఏమనడం సముచితం? 'హెల్ఫీ'అంటే ఎలా ఉంటుంది? 'హెల్ఫైర్'(నరకాగ్ని) అనే పదంతో హెల్ఫీకి ఉన్న సన్నిహిత ధ్వన్యానుబంధ ప్రభావం కూడా కలుగు తుంది. మొబైల్ వీడి యో రాజకీయవేత్తల కాళ్ల కింద భూలోక నరకాగ్ని జ్వాలలను రాజేస్తుంది. 24 గంటలూ కెమెరా చూపులో జీవించడమంటే ఏమిటో మన పార్టీలన్నిటి రాజకీయవేత్తలకూ ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. ఇప్పుడు సాగుతున్న బిహార్ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఏ మాత్రం ఆలోచనా లేకుండా తమ వాహనాల దండుతో వేగంగా దూసుకుపోతూ, పౌరులను దురుసుగా పక్కకు నెట్టేయడం కనబడుతోంది. వారు దాన్ని వీడియో కెమెరాల్లో రికార్డ్ చేసి తక్షణమే అందుకు ప్రతీకారం తీర్చుకోవడం చూశాను. ఈ ప్రతీకారం ఇప్పటికైతే పార్టీలకు అతీతంగా తటస్థంగానే ఉన్నా, పోలింగ్ రోజున తప్పక అంతో ఇంతో ప్రభావం చూపుతుంది. రాజకీయవేత్తల ఈ అమాయకత్వం-ఇది అత్యంత దయతో ఉపయో గిస్తున్న పదం- అగమ్యగోచరమైన భవితను వెతుక్కుంటున్న అనామక అభ్యర్థులకే పరిమితం కాలేదు. నేతలకు సైతం ఈ విషయం అర్థం కావడం లేదు. బిహార్ శాసనసభ ఎన్నికల్లో అసాధారణమైనదేదీ జరగకపోవడమే అసాధారణం అవుతుంది. లాలూప్రసాద్ యాదవ్ వంటి వారు ఈ ఎన్నికల చర్చలో, నడవడికలో నాటకీయమైన ప్రమాణాలను నెలకొల్పారు. వాటినే కొలమానంగా తీసుకుని చూసినా... గందరగోళ పడిపోతున్న నితీశ్ కుమా ర్ను ఒక తాంత్రిక బాబా ముద్దు పెట్టుకోడాన్ని వీడియోలో చూడటం... వెర్రి విపరీత స్థాయికి చేరిందనిపించేలా చేస్తుంది. వివేకంగల నాయకుడైన నితీశ్ ఆ తాంత్రికుడి జిత్తులకు పడలేదు. 2014 సార్వత్రిక ఎన్నికల ఘోర పరా జయం నుంచి నితీశ్ ఇంకా కోలుకోక ముందు, ఆ ఏడాది మధ్యలో తీసిన వీడియో అది. ఆ సమయంలో తిరిగి మానసిక స్థయిర్యాన్ని సమకూర్చు కోవడం ఆయనకు అవసరమై ఉంటుంది. అందుకు క్షుద్ర తాంత్రికుడైన ఆ వ్యక్తితో సంబంధాలు పెట్టుకోడానికి సైతం సిద్ధపడి ఉంటారు. అయినాగానీ ఆయన చేసిన దానిలో కొంత అనుమానాస్పద మైనది ఉందనడం సమంజసమే. ఉన్నది ఉన్నట్టుగా విప్పి చెప్పే కె మెరా తనకు సమీపంలోనే ఉన్నదని, అది తనను రికార్డు చేస్తోందని నితీశ్కు ఎంత మాత్రమూ తెలియదు. తన రాజకీయ జీవితం ధ్వంసమై, శకలాలుగా పడి ఉన్న ఆ సమయంలో ఆయన తనకు మంచి భవిష్యత్తు ఉందని జోస్యం చెప్పేవారెవరైనా దొరుకుతారే మోనని వ్యక్తిగతంగానో లేదా రహస్యంగానో ఎవరినో ఒకర్ని కలుసుకోడానికి వెళ్లి ఉంటారు. పర్యవసానం? ఆ గదిలో ఉన్నవారంతా నితీశ్ కుమార్కు నమ్మకస్తులేనని చెప్పనవసరం లేదు. అయినా వారిలోని ఒక వ్యక్తి ఆయన విశ్వాసాన్ని వమ్ముచేశారు. ఈ ఉదంతం, ఈ హెల్ఫీ భీతి రుగత్మకు సంబంధించిన అనుమానాస్పద అంశాన్ని విశదం చేస్తుంది. విశ్వాసం, ప్రలోభాన్ని మించిన పెద్ద బలహీనతని స్పష్టమౌతుంది. రాజకీయాల్లో విశ్వాసం ఎప్పుడూ అధిక మూల్యం చెల్లించా ల్సినదిగానే ఉంటుంది. ఎంతైనా రాజకీయాల చరిత్రంతా విద్రోహాలతో నిండినదే కదా. అందుకు సమకాలీన ఆధారాలకు సైతం కొదవ లేదు. లీకిచ్చిన ఏ కథనం ద్వారానో మాటలపరమైన ద్రోహం జరిగితే, అది పచ్చి అబద్ధమనో లేదా దాన్ని ఖండించో దానివల్ల కలిగే నష్టాన్ని మీరు పరిమితం చేసుకోవచ్చు. కానీ కెమెరా బయటపెట్టే విషయాలను మీరెలా కాదనగలరు? మొబైల్ ఫోన్లు విస్ఫోటనాలను సృష్టించగల సాధనాలు కాగలవు. అందుకే వీఐపీల కార్యాలయాలు చాలా వాటిలో మొబైల్ ఫోన్లపై ఆంక్షలున్నాయి. వీఐపీలు తమ సంభాషణలను సురక్షితంగా చేసుకోవాలని ఈ ఆంక్షలను మరింతగా విస్తరింపజేస్తారు కూడా. ప్రజాస్వామ్యం ఎన్నటికీ అతి సులువైన వ్యవహారంగా మారదు. అదే అందులోని ఉత్తేజకరమైన వాస్తవం. స్మార్ట్(తెలివైనది)గా మారినది ఫోన్ ఒక్కటే కాదు, ఓటర్లు కూడా అలాగే మారారు. నిజమే, స్మార్ట్ ఓటరు లేనిదే స్మార్ట్ ఫోన్ వల్ల ప్రయోజనమేముంది? ఉదాహరణకు, ఎన్నికల ప్రచార సమయంలో అభ్యర్థి నుంచి తాము ఏం వినాలనుకుం టున్నామో చెప్పగల కళ ఓటర్లకున్నప్పుడు... అదే నిజాన్ని ఓటింగ్ మిషన్ ద్వారా చెప్పడం చాలా సులువవుతుంది. అలాంటప్పుడు ఎవరి ఆగ్రహానికో గురయ్యే ప్రమాదాన్ని ఎందుకు ఎదుర్కోవాలి? 'విల్-ఓ'ద-విస్ప్'(వాతావరణ సంబంధ భ్రమాత్మకమైన వెలుగు 'దయ్యపు దీపం') అనే పదబంధానికి కాలదోషం పట్టిపోయింది. ఇంగ్లండు లో ఎక్కువ భాగం ఇంకా చిత్తడి నేలలతోనే నిండి ఉన్న కాలానికి చెందిన పదబంధమది. చిత్తడి నేలల మీద తేలియాడే దయ్యపు వెలుతురు లేదా దీపం అని దాని వాచ్యార్థం. అలంకారికంగానైతే పట్టుకోవడం కష్టమైనది లేదా అసాధ్యమైనది అని అర్థం. ఈ దయ్యపు వెలుతురు పట్టించి పీడించేది అభ్యర్థులను మాత్రమే కాదు. మధ్యస్తులుగా జోక్యం చేసుకునేవారి భారీ సేనను కూడా అది ఆవహిస్తుంది. అందుకు విరుగుడు, వ్యక్తిగత విచారణ కంటే సమష్టి వాస్తవికత ప్రాతిపదికపైన అంచనా వేయడమే సురక్షితం కావచ్చని అర్థం. ఒక వ్యక్తితో సాగించే సంభాషణ తరచుగా దుబాసీతో ఘర్షణగా ముగుస్తుంటుంది. కాబట్టి ఎన్నికల సభ మానసిక స్థితిని లేదా ప్రవర్తనను బట్టి అంచనా వేయడం ఉత్తమం. మనం ఇంకా మొబైల్ ఫోన్ శక్తిసామర్థ్యాల సరిహద్దునే ఉన్నాం. అయినా అదే రాజకీయవేత్తలకు ఆందోళన కలిగిస్తోంది. నేడు దానికున్న సామర్థ్యమే గందరగోళం రేకెత్తిస్తోందంటే, ఈ వినోదం ఇప్పుడే ప్రారం భమైందని మాత్రమే అర్థం. వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి -
మౌనం పాత్రికేయుని శస్త్రం
బైలైన్ ఇంటర్వ్యూ చేయడం ఒక కళ. ఇంటర్వ్యూ ఇస్తున్న వారు దాటవేస్తున్నట్టయితే ఆ జవాబులోని పరస్పర విరుద్ధతను పట్టుకోగలిగే విధంగా ప్రశ్నను మలచగలిగిన ప్రజ్ఞ జర్నలిస్టుకుండాలి. చెప్పకూడదని అనుకున్న దాన్ని కూడా రాబట్టగలిగే మార్గాలుంటాయి. కానీ అది దూకుడుతనం కాదు. టీవీ ఇంటర్వ్యూ అధమ స్థాయికి చేరితే చర్చ కంటే కొట్లాటే ప్రేక్షకు లకు ఆసక్తికరమనే భ్రమతో కేకల పోటీగా మారుతుంది. ప్రశ్నలు సంధించడం మీడియా విధేగానీ దాని స్ఫూర్తి బోనెక్కించి క్రూరంగా విచారించాలనే దుర్బుద్ధిగా దిగజారకూడదు. ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలోనైనా ప్రభుత్వానికి, మీడియాకు మధ్య సంబంధం అత్యంత ఉద్విగ్నభరితమైనదిగానే ఉండ టం ఖాయం. నిజానికి ఆ రెండూ అధికారపు రెండు సమాంతర ధ్రువాలకు ప్రాతినిధ్యం వహించేవే. కానీ అవెన్నడూ నిజంగా విడివిడిగా వేరుపడిపోయి ఉండేవీ కావు. పరిస్థితులను బట్టి వాటి మధ్య సంబంధాల తీరుతెన్నులు మారుతుంటాయి. పరస్పర మెచ్చుకోళ్ల నుంచి అనుమానం, సంశయవాదం, నిరాశావాదం, అత్యంత అధ్వానమైన పరిస్థితుల్లో శత్రుత్వం వరకు అవి మార్పు చెందుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ రెండింటి ప్రయోజనాల మధ్య సంఘర్షణ నెలకొంటుంది. ఇతర సందర్భాల్లో వ్యక్తి ప్రధానంగా మారడంతో వివేకరహితమైన అహం, నిర్ణయం తీసుకోగల శక్తిలో జోక్యం చేసుకుంటుంది. అయితే ఈ రెండు శక్తుల మధ్య అంతర్నిహితమైన అవసరం ఎప్పుడూ ఉంటుంది. ఆ అవసరం వ్యక్తిగతమైనది కావచ్చు లేదా సంస్థాగతమైనది కావచ్చు. అందువలన, ఈ సంబంధాన్ని జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. కానీ చాలా తరచుగా అది నిర్లక్ష్యం వల్ల దెబ్బ తినిపోతుంటుంది. ఈ చర్చను ఇంకా కొనసాగించడానికిముందుగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వానికి సెన్సార్షిప్ విధించడమనే అవకాశం ఉండదు. ‘అయితే’, ‘కానీ’లకు ఈ విషయంలో తావే లేదు. భావ ప్రకటనా స్వేచ్ఛ బేరసారాలకు అతీతమైన హక్కు. జర్నలిజం ఒక వంచకుని నాలుకంత ‘పచ్చ’గా మారిపోయే సందర్భాలూ ఉంటాయి. మరోపక్క ప్రభుత్వాలకు కశ్మీర్ నుంచి కోచి వరకు విస్తరించిన సమస్యల జాబితా ఉన్నా వాటిని చట్టం అనుమతించే ఏకైక రీతిలోనే పరిష్కరించాల్సి ఉంటుంది. క్రూరమైన సెన్సార్ కత్తెరను వాడే అవకాశమే ఉండదు. అయినా సెన్సార్షిప్ అనైతికమైనది, చట్టవిరుద్ధమైనది, ఆచరణసాధ్యం కానిది. ఇక చేయగలిగేది ఏముంటుంది? ప్రజాస్వామ్యంలో ప్రతి అడ్డంకినీ అధిగమించే చుట్టు తిరుగుడు మార్గాలను కనిపెట్టగల నిర్మాణాలుంటాయి. ‘దానికి బదులుగా ఇది’ అనే పద్ధతి ద్వారా వ్యక్తిగతంగా పాత్రికేయులు స్వీయ సెన్సార్షిప్ను విధించుకోడానికి ప్రోత్సాహకాలను అందించడం వాటిలో అత్యంత ప్రముఖమైనది. దీన్ని పట్టుకోవడం కష్టమనేది స్పష్టమే. అయితే ఒక్కసారి అది రుజువయ్యిందీ అంటే ఎప్పటికీ విశ్వసనీయతను కోల్పోవాల్సిరావడమనే ముప్పు దీనితో ఉంది. కోల్పోయిన విశ్వసనీయతను పునరుద్ధరించగల శస్త్ర చికిత్స నిపుణులు లేరు. ఒక మీడియా ఉత్పత్తిపై ప్రేక్షకులు విశ్వాసాన్ని కోల్పోయారంటే, ఆ ప్రచురణ లేదా చానల్ జీవిత చక్రం ముగిసిపోయినట్టే. మీడియాకుండే సాధనాల్లోకెల్లా అత్యంత మౌలికమైనదైన సంభాషణ ద్వారా జర్నలిస్టుకి, రాజకీయ నాయకునికి మధ్య ఉండే సాధారణ సమీకరణం వడపోతకు గురవుతుంది. కొన్ని సందర్భాల్లో అత్యంత ఉపయుక్తమైన సంభాషణ జనాంతికంగా సాగే ముచ్చటే అవుతుంది. అది కూడా హఠాత్తుగానూ, ఆశ్చర్యకరంగానూ జరగొచ్చు. పాత్రికేయునికి, రాజకీయవేత్తకు మధ్య ఉండే అత్యున్నతస్థాయి అనుబంధం ఈ నమ్మకమే. ఈ నమ్మకాన్ని వమ్ముచేసిన ఏ పాత్రికేయుడైనాగానీ మరొక్క రోజు ఆ ఉద్యోగంలో ఉండటానికి కూడా అర్హుడు కాడు. అలాగే, ప్రజాజీవితంలో ఉన్నవారెవరైనాగానీ జనాంతికమైన ముచ్చట పేరిట తప్పుదారి పట్టించడం అవివేకం. ఎందుకంటే అధికారంలో ఉన్నవారెవరూ అన్ని విషయాలూ చెప్పరు. అలా అని తప్పుదారి పట్టించడమో లేదా వక్రీకరించడమో చేయకూడదు. పాత్రికేయులు తమపై ఉంచిన విశ్వాసాన్ని దుర్వినియోగం చేసిన సందర్భాలున్న మాట నిజమే. తద్వారా వారు తమపై నమ్మకం ఉంచిన వారికి చే యగల హాని కంటే తమకే ఎక్కువ హాని చేసుకుంటారు. ఇక బహిరంగ ఇంటర్వ్యూలు మరింత సున్నితమైన సమస్య. దీనికి సంబంధించిన నియమాలు చాలా స్పష్టంగానే ఉంటాయి. అయినాగానీ ఇంటర్వ్యూ చేయడం ఒక సున్నితమైన కళ. ఇంటర్వ్యూ ఇస్తున్న వారు దాటవేసే సమాధానమేదైనా చెప్పేట్టయితే అందులో ఉన్న పరస్పర విరుద్ధతను పట్టుకోగలిగే విధంగా ప్రశ్నను మలచగలిగిన విషయ పరిజ్ఞానం జర్నలిస్టుకు ఉండాలి. స్థిరమైన ప్రశ్నల జాబితాతో వెళ్లి, వేసిన ప్రశ్నకు చెప్పిన సమాధానానికి కొనసాగింపుగా తిరిగి ప్రశ్నించగలిగే చాకచక్యం ఇంటర్వ్యూచేసే జర్నలిస్టుకు ఉండాలి. లేకపోతే ఆ ఇంటర్వ్యూ చాలా నిస్సారమైనదిగా ఉంటుంది. ఇంట ర్వ్యూ ఇచ్చే వ్యక్తి తన ప్రయోజనాలకు సరిపడే మేరకే సమాచారాన్ని ఇవ్వ డానికి సిద్ధంగా ఉంటారని ఆశించడమే సమంజసం. ఆ వ్యక్తి చెప్పాలనుకొని దాన్ని కూడా రాబట్టగలిగేలా ప్రేరేపించే మార్గాలుంటాయి. దూకుడుతనం అందుకు సమాధానం కాదు. ఆరోపణలతో కూడిన ప్రశ్నలు జాగరూకత లేకుండా ప్రత్యుత్తరమిచ్చేలా రెచ్చగొడతాయి. కానీ అనుభవజ్ఞుడైన ఏ రాజకీ యవేత్తయినా ఆ బౌన్సర్లను అలవోకగా తప్పించుకోగలరు. ఈ విషయంలో నాకు నచ్చే పద్ధతి వ్యూహాత్మక మౌనాన్ని ప్రయోగిం చడమే. చేతనైనంత మృదువుగా, స్పష్టంగా ప్రశ్నను అడగండి. దానికి సమా ధానం లభిస్తుంది. ఆ సమాధానం సరిపోలేదని లేదా ఎంచుకుని చెప్పినదిగా ఉందని విశ్వసించేట్టయితే... ఆ సమాధానం పూర్తి కావడం కోసం వేచి చూస్తున్నట్టుగా మౌనం రాజ్యం చేయనియ్యండి. ఈ మౌనంతో వ్యవహరిం చడం ఇంటర్వ్యూ ఇస్తున్నవారికి చాలా కష్టమనిపిస్తుంది. దాదాపు అనివా ర్యంగానే వారు ఆ నిశ్శబ్ద శూన్యాన్ని ఏదో ఒక విషయంతో భర్తీ చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ ఏదో ఒక విషయమే పరిశీలన అవుతుంది లేదా ఇంట ర్వ్యూకి జీవాన్ని తెచ్చే కథనం అవుతుంది. ప్రింట్ మీడియా ప్రధానమైనదిగా ఉన్న కాలంలో ఈ పద్ధతిని ప్రయో గించడం ఎక్కువ సులువైనదిగా ఉండేది. ప్రచురణకు ఉద్దేశించిన ఇంట ర్వ్యూ విషయంలో కాలం దాని పక్షాన ఉంటుంది. టెలివిజన్కున్న శక్తులు అపారమైనవనే మాట నిజమే. కానీ తీవ్ర దుష్ప ర్యవసానాలకు దారితీ యగల ఘోరమైన లోపం కూడా దానికి ఉంది. టీవీలో మౌనానికి స్థలంగానీ, కాలంగానీ ఉండదు. జర్నలిస్టే అనివార్యంగా ఏదో ఒకటి చెబుతూ ఉండక తప్పదు. దీంతో అనివార్యంగానే ఆమె లేదా అతడు ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి తప్పించుకుపోవడానికి అవకాశాన్ని కల్పించక తప్పదు. టెలివిజన్ ఇంటర్వ్యూ అధ్వాన స్థితికి చేరినప్పుడు శ్రోతలకు చర్చ కంటే కొట్లాటే ఎక్కువ ఆసక్తికరమనే భ్రమతో గావుకేకల పోటీని ప్రోత్సహిస్తుంది. ప్రశ్నలు అడగడం మీడియా విధేగానీ ఆ విచారణ స్ఫూర్తి బోనెక్కించి క్రూరంగా విచారించాలనే దుర్బుద్ధిగా దిగజారకూడదు. హేళన చేసేవాడికి ఇంటర్వ్యూ ఇచ్చేవారందరిలాగే రాజకీయవేత్తలు కూడా సహజంగానే దీన్ని అసహ్యించుకుంటారు. జర్నలిస్టు అడిగిన వాటి కంటే తర్వాత చింతిం చాల్సివచ్చే విషయాలను చెప్పాలని తాపత్రయపడటం కూడా రాజకీయ వేత్తలకు ఉంటుంది. ఈ పరిస్థితికి అది కూడా అంతే కారణమని వారికీ బహుశా అర్థమవుతుందని అనుకుంటాను. ‘‘చురక’’ (ఆమోదయోగ్యమైన చురక) అనే పదం నాకు ఆనందం కలిగిస్తుంది. అది ధ్వన్యనుకరణను ప్రతిధ్వనించే సరసమైన పదం. అది సునిశితమైనది, చుర్రుమనిపించేది, అభిరుచికి ఆహ్లాదకరమైనదిగా ఉండేది. అయినాగానీ కుడుతుంది. అలా అని ‘‘చురక’’ కోపం తెప్పించేదిగానీ, చికాకు పుట్టించేదిగానీ, ఆగ్రహం రేకెత్తించేదిగానీ కాదు. దానికి అత్యుత్త మమైన సమాధానం ఏమిటి? నిబ్బరంతో శాంతంగా ఉండటమే. దాన్ని కోల్పోయిన వారు ఇంటర్వ్యూలో చిత్తయినట్టే. వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి ఎం.జె. అక్బర్, సీనియర్ సంపాదకులు -
రాహుల్ చెడిపోయిన పిల్లాడు!
బెంగళూరు: దేశ రాజకీయాల్లో రాహుల్గాంధీ చెడిపోయిన పిల్లాడని, ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని బీజేపీ విమర్శించింది. దేశంలోనే తప్పుదారి పట్టించే వ్యక్తుల్లో రాహుల్ ప్రముఖుడిగా మారాడని ఎద్దేవా చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి ఎంజే అక్బర్ శుక్రవారం బెంగళూరులో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో, విపక్షంలో ఉన్న ఢిల్లీలో రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ బాధ్యతా రహితంగా వ్యవహరిస్తోంది. రాహుల్ భారత రాజకీయాల్లో చెడిపోయిన పిల్లాడు. ఎప్పుడూ వాస్తవాలు మాట్లాడడు. అనుభవం లేదు. తప్పుదారి పట్టించే వ్యక్తుల్లో ప్రముఖుడిగా రోజురోజుకూ మరింతగా స్పష్టమవుతోంది..’’ అని విమర్శించారు. -
'మోదీ, ఒవైసీ భేటీ అవాస్తవం'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీతో భేటీ అయినట్టు వచ్చిన వార్తలను బీజేపీ తోసిపుచ్చింది. ఈ వార్తలు నిరాధారమని, దీనిపై న్యాయపరమైన చర్య తీసుకుంటామని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు ఎంజే అక్బర్ తెలిపారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మోదీ, ఒవైసీ భేటీ జరిగిందని ఒక దినపత్రిక ప్రచురించింది. ఎల్లో జర్నలిజానికి ఈ వార్త మచ్చుతునక అని ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఎంజే అక్బర్ అన్నారు. ఈ వార్త ప్రచురించి పత్రికపై పరువు నష్టం దావా వేస్తామని ఆయన హెచ్చరించారు. విపక్షాలు తమపై కుట్ర చేస్తున్నాయని చెప్పడానికి ఈ వార్తే సాక్ష్యమన్నారు. కాగా, తమ భేటీలో చర్చించిన రహస్యాలను మోదీ, ఒవైసీ ప్రజలకు వెల్లడించాలని జేడీ(యూ) నేత కేసీ త్యాగి డిమాండ్ చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఒవైసీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. -
పేరులోనే ఉన్నది పెన్నిధి
విశ్లేషణ: ఏ ఒక్క పార్టీలోనూ లేదా కూటమిలోనూ పూర్తి లోపరహితమైన సీట్ల పంపిణీ జరగదు. అయితే అది ఏ పక్షాన కల్లోలం సద్దుమణగేలా చేసిందో, ఏ పక్షాన ఫిరాయింపును ప్రేరేపిస్తున్నదో గమనించండి. అగ్రశ్రేణి నేతలు 'మహా కూటమి' లోని ప్రధాన పార్టీలను నిష్ర్కమింపజేయటం ప్రారంభమైంది. ఇది సహజంగానే కొందరిలో ఆగ్రహావేశాలను రగిల్చింది. వాటిని చల్లార్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే ఇది మాసికే గానీ ఐక్యత కాదు. సుపరిపాలనకు మౌలిక ఆవశ్యకత అయిన సుస్థిరతను అది ఓటరుకు అందించలేదు. పేరు అనేది ఉందే అది మహా జిత్తులమారిది. మీరు మీ పేరుకు తగ్గట్టుగా నడుచుకోక తప్పని పరిస్థితిని ఎప్పుడు కల్పిస్తుందో తెలియనే తెలీదు. అందుకే రాజకీయ పార్టీలు తెలివిగా... తర్వాత చింతించడం కంటే ముందే జాగ్రత్తగా ఉండటాన్ని కోరుకుంటాయి. భారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ లేదా సమాజ్వాదీ పార్టీ వంటి పేర్లు పెద్ద పెద్ద లక్ష్యాలను అతి సామాన్యంగా నిర్వచించే బాపతు పేర్లు. ఇక సీపీఐ(ఎమ్) లోని మార్క్సిస్టు అనే భాగం కచ్చితంగా చెప్పేది ఏమిటా అని ఆశ్యర్యం కలుగుతుంటుంది. అయితే అది ఈ చర్చను పెడదోవ పట్టించే అనవసర మైన ఆ సంగతిని అలా ఉంచితే... కూటములు అని పిలిచే చలనశీల మైన వాస్తవాలకు సామాన్యంగా సూటిగా లక్ష్యాన్ని తెలిపే పొట్టి పేరు ఉండటం అవసరం. జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ, యూపీఏలు రెండూ వాటి ఉద్దేశాలను సమంజసమైన రీతిలో వివరించేవే. బిహార్లో ఇటీవల నితీష్కు మార్, లాలూప్రసాద్ యాదవ్, ములాయంసింగ్ యాదవ్, శరద్ పవార్, సోనియా గాంధీలు 'మహా కూటమి' ని నిర్మించారు. అతుకుల బొంతలా ఏర్పాటు చేసిన ఆ కూటమి పగులు బారి ఉండటం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఆ కూటమి తనకే కీడు చేసేటంతటి అతి బృహత్తరమైనది మరి. జ్ఞాపకం స్వల్పకాలిక మే, కానీ మరీ అంత స్వల్పకాలికమైనదేమీ కాదు. ఆ కూటమి ప్రారంభ స్థానం 'మహా విలీనం' ములాయం మూలపురుషునిగా ఏర్పడ్డ ఆ కూటమికి... గతం జ్ఞాపకం మీది మక్కువతో 'జనతా పరివార్' అని నామకరణం చేశారు. జయజయ ధ్వానాల హోరు మధ్య ఆ విషయాన్ని ప్రకటించారు. అది సద్దుమణగక ముందే ఆ కూటమి కాస్తా కుప్ప కూలింది. విలీనానికి బదులుగా బిహార్ ఎన్నికల్లో అంతా కలసి పోటీ చేస్తామంటూ.. వారు అంతటి ఘనమైననదేమీ కాని ప్రత్యామ్నాయాన్ని చూ పారు. అంతా ప్రశాంతంగా ఉన్న ఓ రోజున నితీష్, లాలూప్రసాద్లు శాసన సభ ఎన్నికలకు సీట్ల కేటాయింపును ప్రకటించారు. ఇద్దరు బడా నేతలకు చెరి 100, దీన మౌన ముద్రలో ఉన్న కాంగ్రెస్కు 40, ఏ భాగస్వామైనా ఏరుకోవ చ్చని ఓ మూడు సీట్లను వదిలారు. పవార్ లేదా ములాయం సంప్రదించవ లసిన నేతలని ఎవరూ ఆలోచించలేదు. ఇది సహజంగానే కొందరికి ఆగ్రహావే శాలను కలిగించింది. ఇది రాస్తున్నప్పటికి ఆగ్రహావేశాలను చల్లార్చే ప్రయ త్నాలు సాగుతున్నాయి. కాంగ్రెస్ జాబితా నుంచి 10 సీట్లు తమకు ఇవ్వాలని ములాయం కోరుతున్నారు. ఇది అత్యంత అమోఘమైన ఎత్తుగడ. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. అయితే ఓటరుకు సంబంధించినంత వరకు ఇది మాసిక వేయడమే గానీ ఐక్యత కాదు. సుపరిపాలనకు మౌలిక ఆవశ్యకత అయిన సుస్థిరతను అది అందించలేదు. ఎన్నికల సరళి ఏ దిశను చూపిస్తున్నదో తెలుసుకోవాలనుకునే వారి కోసం అందుకు సంబంధించిన కొన్ని సూచికలను ఇస్తున్నాం. 1. వలసను గమనించండి. ఏ ఒక్క పార్టీలోనూ లేదా కూటమిలోనూ పూర్తి లోపరహితమైన సీట్ల పంపిణీ జరగదు. అయితే అది ఏ పక్షాన కల్లోలం సద్దుమణగేలా చేసిందో, ఏ పక్షాన ఫిరాయింపును పేరేపిస్తున్నదో గమనిం చండి. అగ్రశ్రేణి నేతలు 'మహా కూటమి' లోని ప్రధాన పార్టీలను నిష్ర్కమిం పజేయటం ప్రారంభమైంది. 2. ప్రజాభిప్రాయ సేకరణలను గమనించండి. కానీ అవి తమకు తాముగా చేసుకునే ప్రచారాన్ని బట్టి మాత్రం చూడకండి. అవి సీట్ల అంచనాలను ప్రకటించేటప్పుడు మీలో కొంత సంశయవాదానికి తావు ఉండనివ్వండి. బ్రిటన్ ఎన్నికల అంచనాల పండితులు ప్రపంచంలోనే అత్యంత నిపుణులు. అయినా ఈ వేసవి సార్వత్రిక ఎన్నికల్లో వారి అంచనాలు ఎంతగా తప్పాయంటే...వారింకా టీవీ స్టూడియోల్లో ముక్కలు చెక్కలై పడివున్న తమ అహం శకలాలను ఏరుకుంటూనే ఉన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలు ఓటర్ల అభిప్రాయాలను ప్రతిబింబించడానికి ఉద్దేశించినవి. కానీ చాలా తరచుగా అవి విశ్లేషకులకున్న పక్షపాత వైఖరినే సూచిస్తుంటాయి. ఏది ఏమైనా. మీరు శ్రద్ధగా గమనించాల్సింది మాత్రం ఒక ఎన్నికల సీజనులో జరి పిన పలు అభిప్రాయ సేకరణల్లో ఒక్కో పార్టీకి లభించిన మద్దతు గ్రాఫ్ను. కాలానుగ తంగా వచ్చే హెచ్చుతగ్గులు స్వల్పంగానే ఉండొచ్చు, కానీ అవి ఆ గ్రాఫ్లో నమోదు అవుతాయి. ఒక పక్షాన ఆ గ్రాఫ్ పైకి ఎదుగుతుంటే, మరో పక్షాన దిగువకు దిగజారుతుంటుంది. ఒక్కొక్క అంగుళమే పైకి ఎగబాకే పార్టీని వెన్నంటే విజయాన్ని సాధించిపెట్టే 'గాలి' వీస్తుంటుంది. 3. మాటల్ని జాగ్రత్తగా గమనించండి. మీ స్వంత మాటల్ని కాదు...అవి ఎప్పుడూ ప్రశాతంగా, స్థిరంగా ఉంటాయనే అంతా భావిస్తారు. శ్రద్ధగా గమ నించాల్సింది రాజకీయ నాయకుల మాటలను. స్థిమితత్వాన్ని కోల్పోవడం మొదలుపెట్టిన నాయకులు క్షేత్రస్థాయిలోని ప్రతికూల పరిస్థితుల వేడిమికి ఉక్కిరిబిక్కిరవుతున్నవారై ఉంటారు. ఒక బహిరంగ సభలో నితీష్ కుమార్ చిరచిరలాడి, ఆగ్రహంతో జగడానికి దిగారు. మొబైల్ కెమెరా అనే ప్రమాదక రమైన ఆవిష్కరణ దాన్ని ఖండించే ఆవకాశం ఆయనకు లేకుండా చేసేసింది. ఆ వీడియో క్లిప్పు వైరస్లా సోషల్ మీడియాలో వ్యాపించిపోయింది. 4. కళ్లను గమనించండి. సభకు హాజరయ్యే ప్రజల సంఖ్య లెక్కలోకి వచ్చేదే. అయితే ఓటర్లు ప్రత్యర్థిని గేలి చేయడం కోసం గాక, తమ పక్షానికి హర్షధ్వా నాలు పలకడానికి వెళ్తారు. ప్రధాని నరేంద్ర మోదీ సభలకు హాజరైన వారిలో ఎక్కువ మంది యువతే. అయితే అది కథలో ఓ భాగం మాత్ర మే. అసలు కథ వారి కళ్లల్లో ఉంది. అవి విశ్వాసంతో నిండిన సజీవమైన వెలుగును నింపుకుని ఉన్నాయి. ఆ వెలుగు రవ్వ ఇతరులకు సైతం సోకేది. 5. గెలుపు, ఓటముల మధ్య స్వల్ప తేడాలను, ఆధిక్యతలను గమనించండి. మీరు అలాంటి వివరాల్లోకి వెళ్లే బాపతు రాజకీయ వ్యసనపరులు కాక పోవచ్చు. కానీ నిజం వెల్లడయ్యేది అక్కడే. గత ఎన్నికల్లో గెలుపు, ఓటము లకు మధ్య తేడా 5,000 ఓట్లు ఎక్కువ లేదా తక్కువ ఉన్న నియోజక వర్గాల్లో ఏం జరుగుతోందో పరిశీలించండి. ఫలితాన్ని తారుమారు చేయ డానికి 1 శాతం మొగ్గు సరిపోతుంది. ఆ మాత్రం బలం మీ పక్షానికి చేరితే 5,000 ఓట్ల తేడాతో కోల్పోయిన సీటును 3,000 ఓట్ల తేడాతో గెలుచుకుంటారు. వీటికి నేను ఆరో విషయాన్ని కూడా చేర్చగలను. కానీ అది పూర్తిగా అభ్యర్థులను ఉద్దేశించినది: మీరు మీ జేబుల విషయంలో జాగ్రత్త వహించండి. ఎన్నికల పోరాటానికి డబ్బు అవసరమే. కానీ డబ్బు ఎన్నికల్లో గెలుపును సంపాదించిపెట్టలేదు. ఒత్తిడికి గురైన అభ్యర్థులు ఊహల భూతాలను మనీ పర్సులతో తరిమికొట్టాలని చూస్తుంటారు. కానీ డబ్బు ఎప్పుడూ మీ వెంట తిరిగే వారిని సంపాదించిపెట్టగలదే తప్ప, క్షేత్ర స్థాయి వాస్తవికతపై మాత్రం ఎలాంటి ప్రభావం చూపజాలదు. ప్రజలు ఒకరోజు సంబరం కోసం గాక, మెరుగైన జీవితం కోసం ఓటు వేస్తారు. మీరు సరళమైన పేరున్న కూటమికి ప్రాతినిధ్యం వహించేలా జాగ్రత్త వహించండి. (వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి) -
ఊహాతీతం ఈ అమానుషత్వం
ఈ హత్య ఎందుకు ఇంతగా మనల్ని నిర్విణ్ణులను చేసేసింది? మనమెరిగిన దురాగతాలన్నిటి అనుభవం పరిధికే కాదు, మన ఊహాశక్తికి సైతం మింగుడుపడని అమానుషత్వం ఈ హత్యలో ఉంది కాబట్టి. తల్లీ కూతుళ్ల మధ్య ఉండే అత్యంత పవిత్రమైన నైతిక జీవిత నిబంధనావళిని ఇది నమ్మశక్యం కానివిధంగా మొద్దుబారిపోయేట్టు చేసింది. దురాశతో జీవించేవారు డబ్బుతో రక్షణను కొనుక్కోగలమని విశ్వసిస్తారు. వారి విశ్వాసం నిరాధారమైనది కాదు. ఇంద్రాణి దాదాపుగా తప్పించుకోగలిగిందని ఎన్నటికీ మరవొద్దు. పరిపూర్ణమైన దుష్ట బుద్ధితో చేసిన హత్యకు వశీకరణ శక్తి ఉంటుంది. అంతులేని ఆసక్తితో గత్యంతరం లేనట్టు, అదో వెర్రిలాగా మనం అటే దృష్టి సారిస్తాం. మనోవైజ్ఞానిక విశ్లేషకులే అందుకు కారణాలేమిటో చెప్పగలుగుతారు. నేను మాత్రం నా పరిశీలన గురించే చెప్పగలను. దుష్టత్వం ఎప్పుడూ ఆప్యాయతానురాగాలకు తావేలేని అమానుషత్వంగానే ఉంటుంది. లెక్కలేనన్ని వంచన ల పొరలలో చుట్టేసిన ఉద్వేగ రహితమైన లెక్కలపైనే ఆధారపడి ఉంటుంది. పలుకుబడి కలిగిన హంతకురాలికి కుతంత్రాలు చేయగల సామాజిక బృందాల రక్షణ దొరికితే... ప్రతి అబద్ధమూ సిద్ధాంతంగా చలామణీ అవుతూ ఆధారాల కోసం అన్వేషించే పోలీసు బలగాన్ని తప్పు దారి పట్టిస్తుంది. అంతేకాదు భయానక వినోదం పట్ల ప్రజలలో అంతులేని దుర్దాహాన్ని సైతం ప్రేరే పించి గందరగోళాన్ని సృష్టిస్తుంది. షీనా బోరా హత్య పరిపూర్ణ దుష్టత్వపు ప్రతిరూపం. మీడియాను అతి సులువుగా బురిడీ కొట్టించగలిగినప్పుడూ, పోలీసులు ఘోరంగా రాజీపడిపోయినప్పుడూ తప్ప అబద్ధం ఎంతో కాలం మన జాలదు. మన మీడియాలో తప్పులుంటే ఉండొచ్చు. కానీ దాన్ని వంచించడం అంత తేలికేం కాదు. అది బంతిని తిరిగి అవతలి కోర్టులోకి తోసేయనూ గలదు, గట్టిగా తిప్పి కొట్టనూగలదు. తన సవతి తండ్రి ఉపేంద్ర బోరా తనపై అత్యాచారం చేయడం వల్లనే షీనా పుట్టిందంటూ ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా ప్రచారంలోకి తెచ్చిన తాజా కథనాన్నే తీసుకోండి. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ దీన్ని ప్రధాన ప్రాముఖ్యాన్ని ఇవ్వదగిన విషయంగా పరిగణించింది. అయితే అదే పత్రిక అదే రోజున, ఆగస్టు 29న ఆ ఆరోపణను ఖండిస్తూ... షీనా టీనేజీ వయసు లోనే ఇంద్రాణి పెళ్లాడిన సిద్ధార్థ దాస్కు పుట్టిన కూతురని బోరా చెప్పిన కథనాన్ని (లోపల 17వ పేజీలోనే అయినా) కూడా ఇచ్చింది . ఇక ఈ విషయం తేలిగ్గానే డీఎన్ఏ పరీక్షలతో తేలిపోతుంది. దుమ్మూ ధూళిపై ఓ కథనం తయారవ్వాలంటే గాలిలో దుమారాలు రేగాలి. మీడియాను తప్పు పట్టడం తేలికే. కానీ ప్రజలు దాన్ని ఎంత వరకు తీసుకుపోతే అంతవరకూ అది కూడా పోతుంది. పాఠకులు లేకపోతే కథనమే ఉండదు. ఈ హత్య ఎందుకు మనల్ని ఇంతగా మ్రాన్పడిపోయేలా చేసింది? ఎందుకు నిర్విణ్ణులను చేసేసింది? ఇది కేవలం ఇంకో హత్య మాత్రమే కాదు కాబట్టి. మనమెరిగిన దురాగతాలన్నిటి అనుభవం పరిధికే కాదు, మన ఊహాశక్తికి సైతం ఎంత మాత్రమూ మింగుడుపడనంతటి అమానుషత్వం ఈ హత్యలో ఉంది కాబట్టి. తల్లీ-కూతురు బంధానికి సంబంధించి మానవులలోనైనా లేదా జంతువులలోనైనా ఉండే అత్యంత పవిత్ర నైతిక జీవిత నిబంధనావళిని ఇది నమ్మశక్యం కానంతగా మొద్దుబారిపోయేట్టు చేసింది. హత్యా కథనం బట్టబయలయ్యేసరికి అనుకోకుండా నేను ‘గోల్డెన్ ఏజ్ ఆఫ్ మర్డర్’ అనే చక్కటి పుస్తకాన్ని చదువుతున్నాను. జీకే చెస్టర్స్టన్ నుంచి ఇంగ్లిష్ సాహిత్యానికి అంతుపట్టని హత్యల కాల్పనిక సాహిత్యాన్ని సృష్టించి ఇచ్చిన అగాథా క్రిస్టీ వరకు ఉన్న ఉత్తేజకరమైన బ్రిటిష్ రచయితల తరం గురించి రాసిన పుస్తకమది. క్రిస్టీ నవలల్లోని హ ంతకుడు ఎప్పుడూ ‘‘మనలో ఒకడు’’గా అతి సాధారణంగా ఉండి, అనుమానించడానికి తావేలేని వాడై ఉంటాడు. అసాధారణంగా ప్రవర్తించే ఓ అపరాధ పరిశోధకుడు చివరకు న్యాయం చేస్తాడు. బ్రిటిష్ హంతకులంత ఉపాయంగా వేరెవరూ హత్య చేయలేరు. (వారితో పోల్చదగినదేదీ భారతీయుల్లో లేదు. మన దేశంలో హత్యలు జరగకపోవడం అందుకు కారణం కాదు. హత్యా రహస్యాన్ని ఛేదించగలరనే విషయంలో మనకు నమ్మకం లేకపోవడమే కారణం కావచ్చు.) సామూహిక మారణకాండలో అమెరికన్లను మించినవారు లేరు. అయితే అది భిన్నమైన కథ. క్రిస్టీ రాసిన అంతుబట్టని హత్యల్లో చాలావరకు బ్రిటన్లో వాస్తవంగా జరిగిన ఘటనలపై ఆధారపడి రాసినవేనని తెలిసి ఆశ్చర్యపోయాను. విస్తృతమైన ఆ అపరాధ పరిశోధనా సాహిత్యంలో ఎక్కడా తల్లే తన కడుపున పుట్టిన కూతురిని హత్య చేసిన పుస్తకం లేదు. హఠాత్తుగా ఏదో కోపావేశం కారణంగా చేసిన హత్య కాదు గదా... ఇంద్రాణి చేసిందని ఆరోపిస్తున్నట్టుగా అంత ప్రశాంతంగా, క్రూరంగా కన్నకూతురు షీనాకు ముందుగా మత్తు మందిచ్చి, గొంతు పిసికేసి చంపడం ఎక్కడా కనబడదు. షీనా సోదరుడు మైఖేల్ కూడా ఆమె హిట్ లిస్ట్లో ఉన్నట్టనిపిస్తోంది. మొదటి హత్య నైతికపరమైన నిబంధనావళి నుంచి ఎంతటి స్వేచ్ఛను ప్రసాదిస్తుం దంటే, అనివార్యంగా రెండో హత్యకు దారి తీస్తుంటుందనే సత్యాన్ని క్రిస్టీ నిర్ధారించారు. ఇది ఆ సత్యానికి రుజువుగా కూడా సరిపోతుంది. హత్యలకు వెనుక ఉండే అతి పెద్ద కారణం దురాశ. భయం దాని తర్వాత స్థానంలో నిలుస్తుంది. దురాశతో జీవించేవారు డబ్బుతో రక్షణను కొనుక్కోగలమని విశ్వసిస్తారు. వారి ఆత్మవిశ్వాసానికి కార ణం ఉంది. ఇంద్రాణి దాదాపుగా హత్యా నేరం నుంచి తప్పించుకోగ లిగిందని ఎన్నటికీ మర వొద్దు. మూడేళ్ల క్రితమే ఈ కేసు వెలుగులోకి రావలసింది. శవాన్ని కాల్చేసి వదిలేసిన ప్రాంతానికి సంబంధించిన పోలీసు అధికారికి ఓ ఆదివాసీ గ్రామీణుడు ఆ సమాచారం అందించినా ఆయన పరిశోధించ నిరాకరించారు. ఎందుకు? ఆయన కేమైనా డబ్బు ముట్టజెప్పారా? డబ్బు ఇచ్చివుంటే వారెవరు? రాహుల్ ముఖర్జియా మూడేళ్ల క్రితం ఇచ్చిన ఫిర్యాదును ముంబై పోలీసులు ఎందుకు తేలిగ్గా తీసుకున్నారు? హఠాత్తుగా సంబంధితులందరినీ మౌనం ఆవహించడం నిజంగానే నివ్వెరపోయేలా చేస్తోంది. ఒక అడ్రస్గానీ లేదా ఓ మొబైల్ నంబర్గానీ లేని అమెరికాలోని ఏదో ప్రదేశానికి షీనా వెళ్లడం వల్లే కనబడటం లేదనే చెత్తవాగుడును నమ్మానని సంపన్నవంతుడైన ఇంద్రాణీ భర్త పీటర్ అంటున్నారు. ఈ మూడేళ్లలో ఆయన అమెరికాకు వెళ్లివచ్చే ఉంటారు. ఆమె ఎలా ఉందో కనుక్కునేపాటి ఆసక్తిని సైతం ఆయన కోల్పోయారా? ఇది మింగుడుపడేదేమీ కాదు. షీనా గొంతు నులమడానికి సహాయపడ్డ ఇంద్రాణి రెండో భర్త సంజీవ్ ఖన్నా మౌనం తేలికగానే అర్థం చేసుకోగలిగేది. ఆయన్ను కొనేశారు. ఒకప్పుడు చిన్న వ్యాపారియైన అతగాడు హఠాత్తుగా సంపన్నుడైపోయాడు. డబ్బు దేన్నయినా కొనగలదు, హత్యతో సహా. బహుశా ఈ కేసు కూడా, కొంతకాలం తర్వాతే అయినా న్యాయం... దైవిక న్యాయం అనేది జరుగుతుందని రుజువు చేయగలుగుతుంది. ఒక విధమైన దైవిక శిక్షగా తప్ప వివరించలేని రీతిలో అనుకోకుండా జరిగిన ఘటనల్లో ఒకటి ఈ నిశ్శబ్దాన్ని ఛేదించింది. నరకాన్ని మనం మరణానంతరం భగవంతుడు విధించే శిక్షగా భావిస్తుంటాం. కానీ నరకం ఇక్కడ, ఈ భూమి మీద కూడా ఉండగలదు. ఇంద్రాణి ముఖర్జీ, సంజీవ్ ఖన్నాలు ఇప్పటికే అక్కడికి చేరిపోయారు. ఎంజే అక్బర్ (వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి) -
దురదృష్టానికి ఆహ్వానమా?
పాక్తో చర్చలంటే ఎప్పుడూ అద్దం మీద నడకే. ఎప్పుడు పగులుతుందో ఎవరికీ తెలియదు. మంచే జరగాలని ఆశిస్తూనే అతి కీడుకైనా సిద్ధంకావాలి. మోదీ ప్రధానిగా పదవీ స్వీకారం చేసిననాడే ఆయన వైఖరిని పాక్ ప్రభుత్వం అంగీకరించిందనేది ఇబ్బందికరమైన నిజం. మోదీ వచ్చే ఏడాది పాక్లో జరిగే సార్క్ సమావేశాలకు హాజరుకావడానికి అంగీకరించారు. అది జరిగితే, సార్క్ చరిత్రలోనే శిఖరాయమానంగా నిలుస్తుంది. ఆలోగా జరిగే ఎన్ఎస్ఏల సమావేశం ఆ నిచ్చెనలోని మొదటి మెట్టు అనే ముఖ్య విషయాన్ని పాక్ మరిచిపోకూడదు. భారత్-పాకిస్తాన్ చర్చలు, 2001 ఆగ్రా సమావేశంలో తీవ్రంగా దెబ్బతిన్నప్పటి నుంచి అపస్మారస్థితిలోనే ఉన్నాయి. 2015లో పరిస్థితి మరింత ఘోరంగా దిగజారనుందా? ఉగ్రవాదమే ద్వైపాక్షిక సంబం ధాల్లోని కేంద్ర సమస్యని పాకిస్తాన్ అంగీకరించకపోవడం వల్లనే ఆగ్రా చర్చలు కుప్పకూలాయి. అలా అంగీకరించడమంటే తనపైన తానే నేరారోపణ చేసుకున్నట్టవుతుంది కాబట్టే పాక్ అందుకు నిరాకరిం చింది. చర్చల ఎజెండాపై తలెత్తే ప్రతి వివాదంలోనూ ‘కశ్మీర్ సమస్యను కూడా చర్చించాలి, లేకపోతే...!’ అనే మాట పాక్ నోట రావడమే దాని దాటవేత యత్నానికి విస్పష్టమైన రుజువు. గత 15 ఏళ్లుగా భాష పెద్దగా మారలేదేమో అనిపిస్తుంది. భారత్ కశ్మీర్ సమస్యను చర్చించకపోతే పర్యవసానాలు ఎలా ఉంటాయో దానికి త్వరలోనే తెలిసివస్తుందని సాత్రాజ్ నవాజ్ పాక్లోని ఓ పత్రికా సమావేశంలో అన్నారు. మరోవిధంగా చెప్పాలంటే, హింసాకాండను ప్రజ్వరిల్ల చేసే మీట పాక్ ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నదని, అది తన ఆదేశానుసారం ఎప్పుడు కావాలంటే అప్పుడు హింసాకాండ రేగడం లేదా ఆగడం అనేదాన్ని నియంత్రించగలదని అర్థం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. భారత్గానీ, పాక్గానీ 15 ఏళ్ల క్రితం ఎక్కడున్నాయో అక్కడ లేవు. నేటి పరిస్థితుల్లో సంబంధాలు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్తో వ్యవహరించేటప్పుడు పాక్ అనుసరించే వైఖరిని అలం కారికంగా పోలికకు తెచ్చే వెయ్యి తలల (హైడ్రా) వైఖరి సుపరిచితమైనదే. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సమస్య కూడా అదే. ఇక్కడ ఆ పోలికకు ప్రాముఖ్యం ఉంది. గ్రీక్ పౌరాణిక గాథల్లో హైడ్రా అంటే ఒక తలను నరికితే రెండు తలలు పుట్టుకొచ్చే జల సర్పం. హెర్క్యులిస్ దీనికి పరిష్కారం కనిపెట్టాడు. ఆ పాము తలను తెగనరికి, దాని మెడను తగులబెట్టేశాడు. ఆ పని చేయగల హెర్క్యులిస్ ఎవరూ ఇప్పుడు అందుబాటులో లేరు. ఎందుకంటే నేటి ఈ ఉగ్రవాద సర్పం పాక్ సైన్యంలోని శక్తివంతమైన విభాగాలు పోసే పాలు తాగి బతుకుతోంది. భారత్కు వ్యతిరేకంగా మరో రూపంలో యుద్ధం సాగిస్తున్న ఉగ్రవాద గ్రూపులకున్న విస్తారమైన మౌలికసదుపాయాల సురక్షిత స్థావరాల్లో అది హాయిగా నిదురించగలు గుతోంది. ప్రధానిగా గత పదవీకాలంలో నవాజ్ షరీ్ఫ్ చిత్తశుద్ధితోనే భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని అటల్ బిహారీ వాజపేయితో లాహోర్ సమావేశం జరిపారు. అయితే దాని వెంబడే కార్గిల్ యుద్ధం వచ్చింది. రష్యాలోని ఉఫాలో జరిగిన సమావేశంలో అంతకంటే తక్కువ నాటకీయంగా కుదిరిన అవగాహనకు వ్యతిరేకంగా అదే ముఠా నేడు సీమాంతర ఉగ్రవాదం, కాల్పుల విరమణ ఉల్లంఘనలు తీవ్రమయ్యేలా రెచ్చగొడుతోంది. హైడ్రాను సంతృప్తిపరచే యత్నంలో భాగంగా నవాజ్ షరీఫ్ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) సత్రాజ్ అజీజ్ ... భారత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్తో తన సమావేశం కోసం రూపొందించిన ఎజెండాలో క శ్మీర్ను కూడా పేర్కొన్నారంటూ వాస్తవాలను వక్రీకరించడానికి దిగజారారు. కానీ ఉఫా ఉమ్మడి ప్రకటన పాఠంలో ఎక్కడా కశ్మీర్ ప్రస్తావనే లేదు. ఉగ్రవాదానికి సంబంధించిన అన్ని అంశాలను చర్చకు పెట్టడమంటే దాని అంతరార్థం కశ్మీర్ కూడా వాటిలో ఉంటుందనేనని పాక్ ఇప్పుడు అంటోంది. కానీ అలాంటి ఉమ్మడి ప్రకటనలను అంతరార్థాలతో కూడినవిగా ఎన్నడూ రూపొందించరు. వాటిలో ప్రయోగించే ప్రతి పదం స్పష్టంగా వ్యక్తం చేసే అర్థాన్నిచ్చేదే అయివుంటుంది. కాబట్టి ప్రతి పదంపైనా పోరాటం జరుగుతుంది. కశ్మీర్ను ఆ ప్రకటనలో పేర్కొనలేదూ అంటే అది ఎజెండాలో లేదనే. భారత్, పాకిస్తాన్ల విషయంలో ‘‘చర్చల’’కు కచ్చితమైన అర్థం ఉంది, ఇరుపక్షాలు ‘‘సమగ్ర’’ చర్చలుగా పిలిచే వాటికి అంగీకరించాయి. అలాంటి చర్చలు కశ్మీర్ సహా అన్ని సమస్యలను ఆవరించేవిగానే ఉంటాయి, నిజమే. ఆ ఒప్పుదల నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నడూ వెన క్కు తగ్గింది లేదు. కానీ అజిత్ దోవల్-సత్రాజ్ అజీజ్ సమావేశం ఆ సమగ్ర చర్చల్లో భాగం కాదు. అది ఒక అంతర్జాతీయ సమావేశం సందర్భంగా మోదీ, నవాజ్ల మధ్య విడిగా జరిగిన సంభాషణ నుంచి ఉత్పన్నమైనది. ఉగ్రవాదం పట్ల తీవ్ర ఆందోళన అనే నిర్దిష్ట అంశానికి పరిమితమైనది. కశ్మీర్ మరే మూడో శక్తి (అది విదేశమే అయినా లేదా తమను భారతీయులుగా భావించని ఇతరులు ఎవరైనా) ప్రమేయమూ లేని ద్వైపాక్షిక సమస్య మాత్రమే అనేదే భారత ప్రభుత్వ వైఖరి. ఎన్ఎస్ఏల మధ్య సమావేశం తిరిగి సమగ్ర చర్చలు జరగడానికి ఉన్న అడ్డంకులను తొలగించడానికి రూపొందించినది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో పాకిస్తాన్ నిజాయితీగా ఉన్నట్టయితే... ఉగ్రవాదాన్ని పెంపొందింపజేసేవారు లేదా దాని పట్ల సానుభూతి చూపేవారైన వేర్పాటువాదులకు మద్దతుగా అది సంకేతాలను పంపజాలదు. అలాంటి ధిక్కార విధానం ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేదే తప్ప, ముందు జరగాల్సి ఉన్న విస్తృత చర్చలకు సానుకూలంగా ప్రజాభిప్రాయాన్ని సన్నద్ధం చేయడానికి తోడ్పడేది కాదు. ఏ భారత ఎన్ఎస్ఏనో లేదా విదేశాంగశాఖ కార్యద ర్శో ఇస్లామాబాద్లో సమావేశానికి ముందు బలూచీ వేర్పాటువాదులను కలుసుకోవాలని పట్టుబడితే పాక్ దాన్ని హర్షిస్తుందా? ఇది రాస్తున్నప్పటికి దఢాలున తలుపులు కొట్టుకున్నాయే తప్ప పూర్తిగా మూసుకుపోలేదు. పాక్తో చర్చలంటే ఎప్పుడూ అద్దం మీది నడకే. ఎప్పుడు పగులుతుందో ఎవరికీ తెలియదు. మంచే జరగాలని ఆశిస్తూనే అతి కీడు జరిగినా సరేనని సంసిద్ధం కావాలి. నరేంద్ర మోదీ ప్రధానిగా పదవీ స్వీకారం చేసిననాడే ఆయన ప్రభుత్వపు ఈ వైఖరిని పాక్ ప్రభుత్వం అంగీకరించిందనే ఇబ్బందికరమైన నిజాన్ని చెప్పడానికి ఇది అనువైన సమయం కాకపోవచ్చు. భారత-పాక్ చర్చల్లో ఇది ఆందోళన కరమైన కీలక సమయం. ఉఫా సమావేశాల సందర్భంగా నవాజ్ షరీఫ్, నరేంద్ర మోదీని వచ్చే ఏడాది పాక్ లో జరిగే సార్క్ సమావేశాలకు హాజరు కావాలని ఆహ్వానించారు. మన ప్రధాని అందుకు అంగీకరించారు. ఆ పర్యటన జరిగితే, సార్క్ చరిత్రలోనే అదో అత్యున్నత శిఖరమవుతుంది.ఆ లోగా జరిగే ఎన్ఎస్ఏల మధ్య సమావేశం ఆ కష్టభరితమైన నిచ్చెనలోని మొదటి మెట్టు అనే ముఖ్య విషయాన్ని మరచిపోకూడదు. ప్రతి మెట్టు గురించి జాగ్రత్తగా చర్చించాల్సి ఉంది. అతి కీలక వ్యక్తి దావూద్ ఇబ్రహీం సహా పాక్లోని ఉగ్రవాదులందరి పూర్తి సమాచారాన్ని భారత్ అందిస్తుంది. కాకపోతే భారత్ ఆందోళనలతో పాటూ, దాని సైన్యానికి నిధులను అందించే అమెరికా ఆందోళనలు సైతం ఉపశమించేలా అది కార్యాచరణకు దిగాలి. ఇప్పటికి, 2016కు మధ్య పలుమార్లు కిందామీదా పడటం జరగొచ్చు. కానీ నిచ్చెన మొదటి మెట్టు మీది నుంచే జారి పడిపోతే మాత్రం అది దురదృష్టానికి సాదరంగా ఆహ్వానం పలకడమే అవుతుంది. (వ్యాసకర్త: ఎంజె అక్బర్, పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి) -
భుజంగ ‘సోదర’ పరిష్వంగం
బైలైన్ రాజకీయ కలన గణితంలో లాలూ ప్రాభవం వసివాడి పోయింది. ఒక రాష్ట్ర నాయకుని హోదా నుంచి నేడు ఆయన ఒక కుల నాయకుని స్థాయికి జారిపోయారు. సంప్రదాయక ఓటు బ్యాంకులు క్షీణ ప్రతిఫలాలను ఇస్తున్నాయి. కుల లేదా జాతి విధేయత ఫలాలు కొందరికే పరిమితం. కాబట్టి ఆర్థిక వృద్ధి నేడు కులం లేదా జాతి విధేయతకంటే ముందు నిలుస్తోంది. ఊకదంపుడు మాటలు, దిశ మారాలని బిహార్ కోరుకుంటోంది. కంటికి కనిపించే ఫలితాల ఆశను కలిగించగల పార్టీ వెంటే బిహార్ నడుస్తుంది. శత్రువుల సహోదరత్వానికి కాలం చెల్లింది. అమూల్ వెన్న వ్యాపార ప్రకటనలు పదే పదే ద్వంద్వార్థ పదప్రయోగం (శ్లేష) చేయడం చికాకే. కానీ అంతటి చమత్కార భరితమైన ప్రచార కార్యక్రమం దేన్నయినా శ్రద్ధగా పట్టించుకోవాల్సిందే. అమూల్ ప్రకటనల్లోని మాటలు ప్రజాభిప్రాయం నాడిని కచ్చితంగా అంచనా వేస్తాయి. కాబట్టే అవి అంతగా విజయవంతం అవుతుంటాయి. ‘భజరంగీ భాయిజాన్’ రాజకీయాలు చేసిన లోతైన విభజనపై మానన ఆత్మ స్థయిర్యం సాధించిన విజయోత్సవ వేడుక. ఆ సినిమాను ప్రశంసల్తో ముంచె త్తేవారిలో ఇప్పుడు అమూల్ వాళ్లు కూడా చేరారు. అంటే దీనర్థం, భారత, పాకిస్తాన్ల ప్రజలు తమ రెండు దేశాల మధ్య సమస్యలున్నాయని గుర్తిస్తున్నా, అత్యధికుల సెంటిమెంటు మాత్రం సంఘర్షణకంటే సయోధ్యనే కోరుకుంటోందని గ్రహించడం తేలికే. అలా అని అదేదో ఇప్పుడే జరిగి పోతుంద ని కాదు, ప్రజలు ఆశను కోల్పోలేదని మాత్రమే. అమూల్ తన తదుపరి వ్యాపార ప్రకటన కు ‘భుజంగీ భాయ్జాన్’ శీర్షిక పెట్టి... బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన దీర్ఘకాల శత్రువు, నేటి ‘పెద్దన్న’ లాలూ ప్రసాద్ యాదవ్కు దండ వేస్తున్నట్టు చూపిస్తే బావుం టుందని నా సూచన. భుజంగ్ అంటే సంస్కృతంలో పాము అని, భాయ్జాన్ అంటే ఉర్దూలో అన్న అని అర్థం. అయితే దీనికి కొంత నేపథ్యాన్ని చెప్పడం ఉపయోగకరం. అప్పుడే మరపున పడిపోయిన కొన్ని వారాల క్రితం, నితీష్ కుమార్, లాలూ ప్రసాద్యాదవ్లు ఓ చిన్న మూకీ ప్రహసనాన్ని ప్రదర్శించారు. రాబోయే బిహార్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడం కోసం పరస్పర విరుద్ధమైన తమ రెండు పార్టీల విలీనాన్ని ప్రకటించారు. ఇది, ఒంటరిగా అయితే తమ గెలుపునకు ఎలాంటి అవకాశమూ లేదని బహిరంగంగా అంగీకరించడమే. అలాంటి గత్యంతరం లేని పరిస్థితి సైతం...ఆ విలీనోత్సవ వేడుకల మేళతాళాలు పూర్తిగా సద్దుమణగక ముందే పెళ్లి పథకాలు విచ్ఛిన్నమైపోవడాన్ని నివారించలేకపోయింది. అయితే పెళ్లికి బదులు కలిసి సహజీవనం సాగించడానికి అంగీకారం కుదిరింది. ఎక్కువమంది మంచి కోసం ఎవరో ఒకరు హాలాహలాన్ని మింగక తప్పదంటూ లాలూ ప్రసాద్ యాదవ్ ఈ ఏర్పాటును గురించి తన అనుచరులకు వివరించారు. నితీష్ కుమార్ అప్పుడయితే ఏమీ అనలేదు గానీ, ఆయనకు ఆ వ్యాఖ్య చురుక్కున అంటుకుంది. గతవారం ఆయన ను వారి కూటమిలోని ఇబ్బందుల గురించి ప్రశ్నించగా ‘‘విష సర్పాలు చుట్టుకున్నంత మాత్రాన చందన వృక్షం పరిమళం క్షీణించిపోదు’’ అనే సుప్రసిద్ధ నానుడిని వల్లించారు. తద్వారా ఆయన... లాలూ నా చుట్టూ తిరుగుతూ ఉంటే ఉండొచ్చు, అయినా నా సుగంధం మాత్రం అలాగే పరిమళిస్తుంటుంది అనే సందేశాన్ని పంపారు. దీనికి పర్యవసానంగా తొలుత లాలూ శిబిరం హోరెత్తి పోయింది. దాని పర్యవసానంగా ‘నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు’ అని ప్రకటించి, నితీష్ కుమార్ జూలై 23 అర్ధరాత్రి దాటాక లాలూప్రసాద్ యాదవ్తో సమావేశమయ్యారు. నితీష్, లాలూను తన అగ్రజునిగా అభివర్ణించడంతో సమావేశం ముగిసింది. 'భుజంగ’ సహోదరత్వమంటే ఇదే. ప్రజా జీవితంలో మీరు ఏం చెబుతారనేది ముఖ్యమైనదే. కానీ ప్రజలు దాన్ని ఎలా అర్థం చేసుకుంటారనేదే నిర్ణయాత్మకం. నాలుక జిత్తులమారిది. ఒక్కోసారి మెదడు మాటను విధేయంగా పాటిస్తుంది, ఒక్కోసారి హృదయం మాట వింటుంది, ఇంకొన్ని సార్లు అంతరాంతరాల్లోని సహజాతం మాట వింటుంది. సహజాతం ఉద్వేగపూరితమైన ముడి భావనలను భద్రపరచే గది. నితీష్, లాలూల మధ్య సంబంధం అనేక ఏళ్లుగా విషపూరితమై ఉంది. వ్యక్తిగత ఆశ, మద్దతుదార్ల పునాదులు ప్రత్యామ్నాయ ధ్రువాలు కావడం, రాజనీతి, శైలి, లక్ష్యాల వంటి పలు అంశాలు అందుకు కారణం. ఒకరు మరొకరి సహజాతాన్ని సైతం ద్వేషించుకుంటూనే ఉంటారు. ఒక రాజకీయ కూటమిని ఏర్పరచడానికి మత్తెక్కి ఉద్వేగభరితులై ఉండాల్సిన అవసరమేమీ లేదు, నిజమే. కానీ ఇద్దరు ప్రబల ప్రత్యర్థుల శత్రువుల మధ్యన ఏర్పడే ఎలాంటి భాగస్వామ్యమైనాగానీ ఎన్నడూ స్థిరంగా ఉండదు. అలాంటి వారి మధ్య కూటమి ఏర్పాటంటే ఆందోళన కలగక తప్పదు. ఈ ఎన్నికలు జరగబోతున్నది అభివృద్ధి వాగ్దానం ప్రాతిపదికపైనే. సుస్థిరత అభివృద్ధికి ఆవశ్యమని బిహార్ ఓటర్లకు అర్థమవుతుంది. తొలి మాటల పోరే దాన్ని రుజువు చేసింది. జూలై 25న ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాదవ్లు వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్స వాల సందర్భంగా ఒకే వేదికపై నుంచి మాట్లాడారు. గతంలో ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మంత్రివర్గంలోని రైల్వేశాఖ మంత్రిగా పనిచేసిన నితీష్... వాజ్పేయి ప్రభుత్వం 2004లో మరో ఆరు నెలలు అధికారంలో ఉండివుంటే నేడు ప్రారంభిస్తున్న ఆ పథకం అప్పుడే సాకారమై ఉండేదని అన్నారు. వెంటనే ప్రధాని ఆ మాటను అంగీకరించేసి, ఓ చిన్న ప్రశ్న వేశారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఈ ప్రాజెక్టుకు వెన్నుపోటు పొడి చిందెవరు? సమాధానం లాలూ. సోనియాగాంధీ నేతృత్వంలోని మన్మోహన్సింగ్ మంత్రివర్గంలో రైల్వే మంత్రిగా ఆయన పనిచేశారు. కాబట్టి, బిహార్కు అభివృద్ధిని నిరాకరించిన వ్యక్తి సాంగత్యంతో నితీష్ కుమార్ ఏం చెస్తున్నట్టు? బిహార్ ఎన్నికల ప్రచారంలో ఇది ఒక ప్రధాన చర్చనీయాంశం అవుతుందని మీరు ఏ చింతా లేకుండా పందెం కాయొచ్చు కూడా. నితీష్ వ్యాఖ్యలు ఖండించాల్సిన వాటి కోవలోకి వచ్చేవి కావు. వాటిలో వ్యంగ్యోక్తి ఏమీ లేదు. పైగా పెద్ద ప్రజా సమూహం, మీడియా బృందం, టీవీ వీక్షకుల ముందు ఆయన మాట్లాడారు. చందన వృక్షం మీది భుజంగానికి ఇదే సాక్ష్యం. లాలూ ప్రసాద్ యాదవ్ను ‘‘జంగల్ రాజ్’’ ముఖ్యమంత్రిగా పదేపదే అభివర్ణించినది నితీష్ కుమారే. ఆ వాస్తవాన్ని ఆ ఇద్దరిలో ఎవరైనా మరచారంటే నాకు అనుమానమే. సీట్ల పంపకంతో అంతర్గత ఆధిపత్యం కోసం ఆ ఇద్దరి మధ్య పోరు మొదలవుతుంది. ఇద్దరికిద్దరూ గెలవగలిగే సీట్లు తమకే ఎక్కువగా దక్కడానికి హామీ ఉండాలని ప్రయత్నిస్తారు. రాజకీయ కలన గణితంలో, లాలూ ప్రసాద్ యాదవ్ బ్రాండ్ ప్రాభవం కూడా వసివాడి పోయింది. ఒక రాష్ట్ర నాయకుని హోదా నుంచి ఆయన నేడు ఒక ప్రత్యేక కుల నాయకుని స్థాయికి జారిపోయారు. స్థిర రూప పెట్టుబడులు నిష్ఫలమైనవిగా మారే విధంగానే సంప్రదాయక ఓటు బ్యాంకులు సైతం క్షీణ ప్రతిఫలాలను ఇస్తున్నాయి. కుల లేదా జాతి పరమైన విధేయతా కార్యక్రమం ఫలాలు ఉన్నత శ్రేణిలోని కొందరికే పరిమితం. కాబట్టి ఆర్థిక వృద్ధి నేడు కులం లేదా జాతి విధేయతకంటే ముందు నిలుస్తోంది. ఊకదంపుడు మాటలు, దిశ మారాలని బిహార్ కోరుకుంటోంది. కంటికి కనిపించే ఫలితాల ఆశను కలిగించగల పార్టీ వెంటే బిహార్ నడుస్తుంది. శత్రువుల సహోదరత్వా నికి కాలం చెల్లింది. ఎంజె. అక్బర్ సీనియర్ సంపాదకులు. -
ఎంజె అక్బర్తో ప్రమాణం చేయించిన స్పీకర్
-
దార్శనికతతోనే ఈ ముందడుగు
బైలైన్ భారత్-పాకిస్తాన్ సంబంధాలను ఎల్లప్పుడూ జాగ్రత్తగానూ, ముందు జాగ్రత్తతోనూ నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో రెండవది అత్యంత కీలకమైనది. శాంతి ప్రక్రియకు వెన్నుపోటు పొడిచేవారు ప్రస్తుతం తాత్కాలిక మౌనం పాటిస్తున్నారంతే. సరిహద్దులు నెత్తురోడుతుంటే మొత్తంగా వాతావరణమే పాడైపోతుంది. రెండు దేశాలూ దీన్ని గుర్తించాయి. ఇరుదేశాలు ఇలా శాంతి వైపు మొగ్గడానికి ప్రధాన కారణం భారత్, పాక్ల ప్రజాభిప్రాయం అందుకు బ్రహ్మాండమైన మద్దతును తెలుపుతుండటమే. చరిత్ర, భౌగోళికత, భావజాలం, విద్రోహం, అనిశ్చితి, తప్పుడు అంచనాలలో ప్రతి ఒక్కటీ భారత్-పాకిస్తాన్ సంబంధాలను దుర్బలం చేయగలుగుతాయి. 1947లో, స్వాతంత్య్రం లభించిన పది వారాల్లోగానే పాకిస్తాన్ కశ్మీర్ కోసం మొదటి యుద్ధాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి సమరోత్సాహులు ఇరు దేశాల సదుద్దేశాల శవాన్ని విద్వేషపూరిత వస్త్రంలో చుట్టి, పదేపదే కప్పెట్టేస్తూనే ఉన్నారు. దీంతో ఇరు దేశాల మధ్య ప్రకటిత, అర్ధ ప్రకటిత, అప్రకటితమైనవనే సూక్ష్మ ప్రమాణాలలో యుద్ధం సాగుతూనే ఉంది. అది సత్సంకల్పాలతో కూడిన ప్రయత్నాలను సైతం దుర్బలపరచి, యథాతథ స్థితికి తిరోగమించేలా చేసింది. భారత్, పాకిస్తాన్ల భావజాలాలు ఒకదానికొకటి హానికరమైనవి కాకు న్నా, ఒకరి లక్ష్యాలు మరొకరికి అర్థమయ్యేవి కావు. ఇరు దేశాల మధ్య సంఘ ర్షణపైనే ఆశలు పెట్టుకున్నవారు ద్వైపాక్షిక సమాచార సంబంధాల బాట పొడవునా మందు పాతరలను ఉంచారు. అనిశ్చితి తప్పుడు అంచనాలకు తల్లి. వారసత్వంగా సంక్రమించే సమస్య లెప్పుడూ ప్రమాదపూరితమైనవి గానే ఉంటాయి. వ్యూహాత్మక పర్యావరణ వ్యవస్థకు భవిత బందీగా ఉంటుం ది. కాబట్టే ఒక దేశ రక్షణ మంత్రి అంతటివారే యాథాలాపంగా అణ్వాయు ధాల గురించి ప్రస్తావించేస్తారు. బహుశా అందుకూ సమంజ సమైన కారణమే ఉండొచ్చు. అధినేత శాంతి కపోతం అన్వేషణకు ప్రాధాన్యాన్నిస్తున్న ప్పుడు యుద్ధోన్మాదుల ఆకలిని తీర్చడానికి భీకర సమర నినాదాలను ఉపయోగిస్తుంటారు. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆచితూచి వ్యవహరిస్తుండటాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. క్రితంసారి ఆయన భారత్తో శాంతి కోసం ప్రయత్నించినప్పుడు అధికారాన్ని కోల్పోయారు. అంతేకాదు, సైనిక తిరుగు బాటులో ప్రాణాలు పోయినంత పనైంది. ఆయన తదుపరి అధికారంలోకి వచ్చిన జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ కొంత సమరోత్సాహాన్ని ప్రదర్శించినా, ఆ తర్వాత శాంతి ప్రక్రియ కొనసాగేలా చేయడానికి ప్రయత్నించారు. కానీ, ఆగ్రాలో జరిగిన భారత్-పాకిస్తాన్ శిఖరాగ్ర చర్చల కీలక ఘట్టంలో ఆఖరు నిమిషంలో ధైర్యాన్ని చూపలేకపోయారు. నవాజ్ రాజకీయాలు, దూరదృష్టి ఆయనకు రెండో అవకాశాన్ని ఇచ్చాయి. మరో ప్రయత్నం చేసే సాహసాన్ని ఆయన చూపారు. ఆ వైఫల్యం అనుభవం పాకిస్తాన్, భారత ప్రభుత్వాలు రెంటికీ సాఫల్యం దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో బాగా ఉపయోగపడ్డాయి. ప్రజాస్వామిక లాంఛనాల పటాటోపం సద్దుమణిగాక, భారత ప్రజాభి ప్రాయమనే మహా తెలివైన ధర్మాసనం ఇంకా ఒక కీలక ప్రశ్నకు సమాధానాన్ని కోరుతూనే ఉంటుంది: ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్తో సంబంధాల విషయంలో ఇలా చొరవ చూపడం వల్ల ఆశించిన ఫలితం లభిస్తుందన్న విశ్వాసం ఆయనకు ఉండటం వల్లనేనా? పరస్పర శాంతియుత వాతావరణం లో పేదలకు సౌభాగ్యాన్ని అందించగలిగే విధంగా ‘సార్క్’ను పునరుజ్జీవింప జేయాలనేది ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక యోచన. పాకిస్తాన్తో సత్సంబంధాలు ఈ కలను సాకారం చేయడానికి కావాల్సిన చివరిదీ, కీలకమై నదీ అయిన మౌలిక భాగం. ఢిల్లీలో జరిగిన తన ప్రమాణ స్వీకారానికి సార్క్ నేతలందరినీ ఆహ్వానించడంతోనే మోదీ అందుకు పునాదులను వేశారు. ఆయన చూపిన ఈ చొరవకు నవాజ్ షరీఫ్ దిగ్భ్రాంతి చెంది ఉంటారు. కానీ, ఆ అవకాశాన్ని ఆయన అందిపుచ్చుకున్నారు. మునుపు కూడా జరిగినట్టే శాంతిప్రక్రియకు విఘాతం కలిగించేవారు ఈసారీ జోక్యం చేసుకుంటున్నారు. కానీ మోదీ ఈ విషయంలో తన దృక్పథానికే దృఢంగా అంటిపెట్టుకుని ముందుకు సాగుతున్నారు. అపూర్వ కృషితో సుస్థిర వేగంతో ఆయన ఇతర సార్క్ దేశాలతో భారత్ సంబంధాలను బలోపేతం చేశారు. మోదీ నేపాల్, బంగ్లాదేశ్ పర్యటనలు మన దౌత్యచరిత్రలో ముఖ్య మలుపులుగా మిగిలిపో తాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించకుండా ఉండి ఉండ దు. ఇరుగుపొరుగులను భారత్కు శత్రువులుగా మార్చి చుట్టిముట్టేయ డం అనే దాని పాత దుష్ట వ్యూహం నేడు తలకిందులైంది. దాని స్థానే ‘‘ఒకటి మినహా సార్క్ దేశాలన్నీ’’ అనే గుసగుస నెలకొంది. భారత ప్రభుత్వంలో సైతం ఈ వైఖరికి కొందరు సమర్థకులున్నారు. మనం పాక్ చేసే మరో సాహసాన్ని ఎదుర్కొనడం కంటే ఇప్పుడున్న యథాతథ స్థితిని కొనసాగిస్తేనే పాకిస్తాన్మనకు సురక్షితమైనదిగా ఉంటుందని వారి వాదన. కానీ ప్రధాని సార్క్, ఉపఖండాల భవిత గురించిన కలను వదులుకోడానికి సిద్ధంగా లేరు. అయితే చేతల్లోకి దిగడానికి ముందే పాకిస్తాన్ నుంచి సానుకూల ప్రతిస్పందన ఉంటుందనే నమ్మకం కలగాలనే ముందు జాగ్రత్త వహించాల నేది వివేచన విధించే ముందు షరతు. జనవరి చివరి వారంలో సుబ్రహ్మణ్యం జైశంకర్ను విదేశాంగశాఖ కార్యదర్శిగా నియమిం చారు. ముమ్మరంగా ఉన్న పలు కార్యక్రమాల నడుమ ఆయన చడీ చప్పుడు లేకుండా ఇస్లామాబాద్కు వెళ్లి వచ్చారు. అక్కడ ఏం జరిగిందనేది మనం తెలుసుకోజాలమనేది సుస్పష్టమే. కానీ ఆ తర్వాతి నుంచే తిరిగి ఈ క్రమం ముందుకు కదులుతోం దని ఉహించడానికి పెద్ద తెలివితేటలేం అక్కర్లేదు. ఆగ్రా శిఖరాగ్ర సమావేశంలో ఉగ్రవాదాన్ని నిర్వచించే దగ్గరనే చర్చలు విఫలమయ్యాయి. ఉగ్రవాదానికి అర్థంపై ఏకాభిప్రాయం చాలా కీలకమై నది. దాన్ని నేడు సాధించగలిగారు. పర్యవసానంగా, 2008 ముంబై ఉగ్ర దాడులకు సూత్రధారులుగా ఆరోపణలను ఎదుర్కొంటున్నవారి విచారణను వేగవంతం చేయడానికి పాకిస్తాన్ అంగీకరించింది. అయితే మొత్తంగా ఈ ప్రయత్నాలనన్నిటినీ ఒక కొలిక్కి తెచ్చింది మాత్రం.. ప్రధాని మోదీ 2016 సార్క్ శిఖరాగ్ర సమావేశాలకు పాకిస్తాన్కు వెళ్లాలని నిర్ణయించడమే. ఇప్పుడు రష్యాలోని ఉఫాలో జరిగిన మోదీ-నవాజ్ చర్చలను, 2014నాటి ప్రమాణ స్వీకారంతో ముడిపెట్టేది అదే. విస్తరిస్తున్న సంఘర్షణలకు నిలయంగా ఉన్న ఉపఖండాన్ని ఆర్థిక వృద్ధితో శక్తివంతమైన నూతన ఉపఖండంగా మార్చాలనే మోదీ లక్ష్యంతో ముడిపడిన నిర్ణయమే ఇది. సమస్యలన్నీ పరిష్కారం కాగలవని మతి సరిగా ఉన్నవారెవరూ అనరు. పరస్పర అంగీకారయోగ్యమైన యంత్రాంగాల ద్వారా వాటిని పరిష్కరిం చుకోవచ్చు. వాజ్పేయి 2004లో తిరిగి ఎన్నికై ఉంటే ఆగ్రా శిఖరాగ్ర సమావేశం తదుపరి చేపట్టాల్సిన చర్యగా మరో సమావేశం జరిగి ఉండేదే. జాగ్రత్తగా ఉండటం మాత్రమే సరిపోదు. భారత్-పాకిస్తాన్ సంబం ధాలను ఎల్లప్పుడూ జాగ్రత్తగానూ, ముందు జాగ్రత్తతోనూ నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో రెండవది అత్యంత కీలకమైనది. ఈ శాంతి ప్రక్రియకు వెన్నుపోటు పొడిచేవారు ప్రస్తుతం ఉపాయంగా తాత్కాలిక మౌనం పాటిస్తున్నారే తప్ప మరణించలేదు. సరిహద్దుల్లో సుస్థిరత నెలకొనడమే ఈ క్రమానికి కీలక పరీక్ష అవుతుంది. సరిహద్దులు నెత్తురోడుతుంటే మొత్తంగా వాతావరణమే పాడైపోతుంది. రెండు దేశాలూ దీన్ని గుర్తించాయి. సరిహద్దు ల్లోని ఉద్రిక్తతలను, ఘటనలను కనిష్టం చేయడం కోసం జాతీయ భద్రతా సంస్థల స్థాయిలోనూ, సైనిక స్థాయిలోనూ సమావేశాలకు కార్యక్రమం సిద్ధమైంది. అయితే తీవ్ర స్థాయి ఉగ్రవాద చర్యలు ఈ పరిస్థితిని అంతటినీ అస్థిరతకు గురిచేయగల పర్యవసానాలకు దారితీయగలిగినవి. పైకి చెప్పక పోయినా, ఉన్న అతి పెద్ద ముప్పు అదే. ఇరు దేశాలు ఇలా శాంతి దిశగా ఇలా శక్తియుక్తులను పెద్ద ఎత్తున బదలాయిచడానికి ప్రధాన కారణం భారత్, పాకిస్తాన్లలోని ప్రజాభిప్రాయం అందుకు బ్రహ్మాండమైన మద్దతును తెలుపుతుండటమే.గతాన్ని అధిగమించి ప్రజలు ఎదిగారు. ఎందుకంటే ఇదే భవితను మార్చడానికి ఉన్న ఏకైక మార్గమని వారికి తెలుసు. ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు -
మనం చూడదలుచుకోని నిజం
1947లో ఎక్కడ ప్రారంభించామనే కొలబద్ధతో గాక, 2015కి ఎక్కడికి చేరి ఉండాల్సింది అనే కొలబద్ధతో దేశ ఆర్థిక ఆరోగ్యం, సామాజిక న్యాయం ప్రమాణాలను లెక్కించాల్సి ఉంది. అలా చూస్తే మనమిప్పుడున్నది సంక్షోభపు అంచున కాదు, మహా విపత్తుకు అంచున. సావధానులుకండి. మన వైఫల్యం కషాయపు అడుగు అవశేషాల కటిక చేదు విషయమిది. దేశంలో సగ భాగం ఆకలికి, అర్ధాకలికి మధ్యన ఇరుక్కుని, శిఖరాగ్రానున్న ఐదో వంతు తమ సంతోషాల బుడగలో మహా ఉల్లాసంగా గడుపుతున్నారు. నడమన పీల్చిపిప్పయిపోతున్న మధ్య భాగం గందరగోళంతో, అనిశ్చితంగా... టీవీ సీరియళ్లు తినిపించే ఆశావహ దృక్పథానికి, వీధి తిరుగుబాటు వెల్లువలకు మధ్య తెగ ఊగిసలాడుతోంది. 2015నాటి భారతావని గురించిన ఈ సత్యాలు అత్యంత సమగ్రంగా నిర్వహించిన సామాజిక-ఆర్థిక గణన నుంచి తీసుకున్నవి. అవి సంతృప్తితో కళకళలాడే అతి సుసంపన్న వర్గీయుల సౌందర్యసాధనాలతో అలంకరించి చూపెడుతున్న భారతావని మొహానికి పెద్ద చెంపపెట్టు. దేశంలో ప్రతి ముగ్గురు బాలల్లో ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతున్నవారే. దీన్ని సబ్సహారా (సహారా ఎడారికి దక్షిణాన ఉన్న) దేశాల్లోని ప్రతి ఐదుగురిలో ఒకరితో పోల్చి చూడండి. మన దేశంలో 51%కి శారీరక శ్రమతో కుంగిపోవడమే ఏకైక ఆదాయ వనరు. శారీరక శ్రమంటే జీవనాధార స్థాయి మనుగడకు సమానార్థకం. కాబట్టే నేను ఉద్దేశపూర్వకంగానే శారీరక శ్రమ అన్నాను. 92%గ్రామీణ కుటుంబాలు నెలకు రూ.10,000 కంటే తక్కువతోనే జీవిస్తున్నాయి. వ్యక్తులు కాదు, కుటుంబాలే. మరీ నగ్నంగా చెప్పాలంటే ఇంచుమించు 75 శాతం కుటుంబాలు నెలకు రూ. 5,000 లేదా అంతకంటే తక్కువతోనే బతుకుతున్నాయి. ఈ సర్వే పొడవునా ఒకదాన్ని మించి మరొకటి మరింతగా ఎక్కువ ఆందోళనకరమైన ఇలాంటి గణాంకాల మరకలే ఉన్నాయి. కావాలనుకుంటే, పిల్లల్లో పోషకాహార లోపం 45.1% నుంచి 30.7%కి తగ్గిందని మీరు ఉపశమమంపొందొచ్చు. కానీ దైన్యం నిండిన తల్లుల కళ్లు నిస్సహాయంగా చూస్తుండగానే దారిద్య్రానికి హరించుకుపోతున్న ప్రతి మూడో శిశువు ముందు ఇలాంటి ప్రలాపనలను చేయడం మూర్ఖత్వం. బహుశా ఆ తల్లులు సైతం అప్పటికే తమ పిల్లలంత దుర్బలంగా ఉండి ఉంటారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు యూపీఏ ప్రభుత్వం దేశంలో 30% మాత్రమే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నదంటూ ఒక బూటకపు అంచనాను చలామణి చెయ్యాలని యత్నించింది. ఎన్నికల రాజకీయల సేవలో దారిద్య్ర రేఖను మరికాస్త మింగుడుపడేలా చేయడం కోసం ప్రదర్శించిన గణాంకాల గారడీ అది. 1947లో మనం ఎక్కడ ప్రారంభించామనే కొలబద్ధతో గాక, 2015కి మనం ఎక్కడికి చేరి ఉండాల్సింది అనే కొలబద్ధతో మన దేశ ఆర్థిక ఆరోగ్యాన్ని సామాజిక న్యాయం ప్రమాణాలను లెక్కించాల్సి ఉంది. అలా చూస్తే మనమిప్పుడున్నది సంక్షోభపు అంచున కాదు, మహా విపత్తుకు అంచున. ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రాథమిక అవసరాలైన ఆహారం, ఉపాధుల కోసం తమ హక్కుల పట్ల విశ్వాసంతో ఉన్న ప్రజలు తరాలతరబడి ఇంకా ఎదురు చూడ లేరు. ఆగ్రహావేశానికి అత్యంత శక్తివంతమైన కారణం ఆకలి. కోట్లాది మంది ప్రజలు ఇంకా తలదాచుకోను గూడూ, ఎలాంటి గౌరవమూ, ఏ ఆశా లేక బతుకుతున్నారు. పేదరిక సూచికకు కొలబద్ధగా ప్రపంచం సబ్ సహారన్ ఆఫ్రికాను స్వీకరించింది. కానీ అదొక భ్రమ. మన దక్షిణ ఆసియా ఉపఖండమే నిజానికి పేదరికానికి సరైన నమూనా. అదేపనిగా ఇతరుల్ని చూడటమంటే మనకు మహా ఇష్టం. ఒక్కసారి అద్దంలో మనల్ని మనం తేరిపార చూసుకోవడం అవసరం. మనకది చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. మీకు అంతరాత్మంటూ ఉంటే ఆందోళన కూడా కలుగుతుంది. అయినా మనకు సంతృప్తి కలగడానికి రెండు కారణాలున్నాయి. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ వాస్తవాలను మీడియా ముందుంచేటప్పుడు కుంటిసాకులతో వాటిని సుతి మెత్తగా మార్చే ప్రయత్నించలేదు. పరిష్కారం దిశగా వేసే తొలి అడుగు సమస్యను గుర్తించడమే. నాటకీయతకు ప్రాధాన్యం ఇచ్చి వాస్తవాలను బలిపీఠంపైకి ఎక్కించేస్తుందని మీడియా అతి తరచుగా విమర్శలను ఎదుర్కొంటుంది. కానీ అది ఈ చే దు వాస్తవాల విస్తృతిని, లోతును అర్థం చేసుకున్నాయి. దినపత్రికలు మొదటి పేజీ బ్యానర్ హెడ్డింగులు పెట్టాయి. ఆలోచించదగిన ఈ పోలికను చూడండి. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఈ సర్వేపై పలు కథనాలను ప్రచురించిన రోజున లోపలిపేజీల్లో అది ‘‘భారతీయ టీనేజర్లలో పెరిగిపోయిన ఊబకాయం’’ అనే నివేదికను కూడా ప్రచురించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం గత ఐదేళ్ల కాలంలో స్థూలకాయులైన టీనేజర్లు 13% నుంచి 15%కి పెరిగింది. ఆ కథనంలోని ఈ రెండు వాక్యాలను చూడండి : ‘‘భారత పట్టణాల్లో 1.5 కోట్ల మంది పిల్లలు అధిక బరువుగలవారని అంచనా. అయితే గ్రామీణ భారతంలో ఇది బాగా తక్కువే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.’’ ఇదేంటిలా అని ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. పట్టణాల స్థాయిలో హామ్బర్గర్లను తినగలిగేటంత మిగులు ఆదాయం గ్రామీణ భారతం వద్ద లేదు, అంతే. పేదరికానికి జవాబు వాగాడంబరం కాదు, కావాల్సింది పరిష్కారం. కేంద్రం తలపెట్టిన మూడు పథకాలు ఆశలను రేకెత్తిస్తున్నాయి. భారీ ఎత్తున చేపట్టిన గృహనిర్మాణం, పట్టణ పునరుజ్జీవం, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు దేశంలోని పట్టణాల పటం రూపు రేఖలను మార్చడం కోసం మాత్రమే కాదు. అవి భారీ ఉపాధి కర్మాగారాలు కూడా. నిర్మాణ రంగం పేదలకు భారీ ఎత్తున ఉపాధిని కల్పించగలుతుంది. ఏడాదికి రూ.12 అతి తక్కువ ప్రీమియంతో బీమా పాలసీలు ఎక్కువగా అవసరమైన వారికే సహాయాన్ని అందించడం కోసం ఉద్దేశించిన సానుకూల ప్రభుత్వ జోక్యం. మరుగుదొడ్ల నిర్మాణ కృషి వంటి ఆత్మగౌరవ పథకాలు జీవన నాణ్యతలో తక్షణమే మార్పును తేగలిగినవి. మన ప్రభుత్వం ఉదాసీనంగా ఉండటం లేదా చొరబడిపోయేదిగా ఉండటం మాత్రమే ఎక్కువ. అది సమ్మిళితమైనదిగా మారాలి. గత ప్రభుత్వాలు పేదరికాన్ని సవాలు చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని ఎవరూ అనరు. అవి ఆ ప్రయత్నాలు చేశాయి. కాకపోతే ఆ తక్షణ ఆవశ్యకతను గుర్తించడంలో, స్థాయిలో తేడా ఉంది. పేదరికాన్ని తగ్గించడం, నిర్మూలించడం అనే లక్ష్యాల్లో తేడా ఉంది. ఆకలితో ఉన్నవారు బాగా ఎక్కువ కాలమే వేచి చూశారు, చాలు. కొద్దిమంది భారీ సంపన్నుల చేతుల్లో సంపద పోగుబడటం పెరిగిపోతుండటం ప్రజల అసంతృప్తిని కుతకుతలాడే ఆగ్రహమయ్యేలా వేడెక్కించేస్తోంది. నేటి పెద్దగా ఖర్చులేని కమ్యూనికేషన్ల కాలంలో అసమానతను, అన్యాయాన్ని కప్పిపుచ్చలేరు. చరిత్ర వేచి చూసే గదిలో పేదలు సుదీర్ఘంగానే నిరీక్షించారు. వారికిక ఉద్యోగాలు, విద్య, న్యాయం, గౌరవం కావాలి. లేదంటే వారి ఆగ్రహం పెల్లుబుకుతుంది. (వ్యాసకర్త: ఎంజే అక్బర్, సీనియర్ సంపాదకులు) -
అతడో పాము.. మిమ్మల్నీ కాటేస్తాడు!
ముంబై ఉగ్రదాడుల సూత్రధారి జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ పాము లాంటివాడని, అతడు భారతదేశంతో పాటు చైనాను కూడా కాటేస్తాడని బీజేపీ అధికార ప్రతినిధి, సీనియర్ పాత్రికేయుడు ఎంజే అక్బర్ వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తీవ్రంగానే పరిగణిస్తోందన్నారు. చైనా కూడా వివేకం చూపించి, ఉగ్రవాదాన్ని అర్థం చేసుకుంటుందనే భావిస్తున్నామని ఆయన అన్నారు. ముఖ్యంగా అత్యంత విషపూరితమైన లఖ్వీ లాంటి ఉగ్రవాదులు పాముల్లాంటి వాళ్లని, అత్యంత క్రూరంగా చైనాను కూడా కాటేసే ప్రమాదం ఉందని అక్బర్ చెప్పారు. లఖ్వీని జైలు నుంచి విడుదల చేయడాన్ని ఐక్యరాజ్యసమితిలో భారత్ చేసిన వాదనకు చైనా అడ్డుచెప్పిన నేపథ్యంలో ఎంజే అక్బర్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
కేన్సర్ క్రీనీడల్లో క్రీడారంగం
ఫుట్బాల్, క్రికెట్లలోకి డబ్బు రంగ ప్రవేశం చేయడంతో ఆ రెండు క్రీడలూ రోగగ్రస్తమై పోయాయి. బెట్టింగ్ వంటి పరిశ్రమలు భారీగా బలిసిపోయాయి. కొన్ని చోట్ల అవి చట్టబద్ధమయ్యాయి. చట్టాలు వాస్తవికతకంటే వెనుకబడి ఉన్న చోట గోప్యంగా మారాయి. ఆట తీరులోని స్వల్ప మార్పులకు సైతం అంతంత డబ్బు అందుతుంటే గిరాకీ సరఫరాను ఊరిస్తుంది. తిను, తినిపించు అనే వ్యవస్థ దిగువన ఉన్నవారి సంగతి చూసుకుంటుంది. ఒక క్రీడ విశ్వసనీయతను కోల్పోయిందీ అంటే ఇక దానికి అర్థమే లేకుండా పోతుంది. 20వ శతాబ్దంలో చాలా కాలంపాటు, టికెట్టు దొరకాలేగానీ చూడాల్సిన ఆటంటే పుట్బాలే. ఇక రేడియో ఉందీ అంటే వినాల్సిన ఆట క్రికెట్టే. భారత దేశం హాకీ అనే మూడో మార్గాన్ని నెలకొల్పగలిగేదే. కానీ మొదట్లో హఠా త్తుగా ఆ ఆటకు పట్టిన మహా వైభోగం తదుపరి తుస్సుమని పోయింది. అందుకు కారణాలేమిటనే విషయమై పండితులే ఆసక్తి కనబరచడం లేదు. కాబట్టి ప్రజలకూ అది అంతుబట్టనిదిగానే మిగిలింది. కాలం, క్రికెట్తో పోలి స్తే ఫుట్బాల్ వైపే నిలిచిన సమయమూ ఉండేది. ఫుట్బాల్ తక్కువ సమ యం పట్టే క్రీడ. ఆ క్లుప్తతే ఆటకు అనిశ్చితినెరుగని నెమ్మదికి హామీనిచ్చింది. ఆర్కిటిక్ చల్లదనమో లేదా ఎడారి వేడి వంటి విపరీత పరిస్థితులైతే తప్ప వాతావరణం ఆ ఆటను చెడగొట్టలేదు. క్రికెట్, రష్యన్ నవలలాగా అంతులే నట్టుండేది. ఓ చిరు జల్లు సైతం ఆటకు అంతరాయం కలిగించగలిగేంత అని శ్చితమైనదిగా ఉండేది. దురదృష్టకరమైన ఆ పాత రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్ వారం రోజులపాటూ సాగేది. ఐదు రోజుల మధ్య ఒక రోజు ప్రాక్టీస్ కోసం. ఆ రోజున క్లబ్వాలా క్రికెటర్లు బార్లలో, పానప్రియులు కాని క్రికెట ర్లు దర్శనీయ స్థలాల సందర్శనలో ప్రాక్టీస్ చేసేవారు. ఆరోజుల్లో క్రికెట్ ఉద్యోగస్తులకు ఆచరణ సాధ్యమైన పోటీగా ఉండేది కాదు. జీవితంలో పైకి రావాలనుకునే తాపత్రయం ఉన్న వారెవరికెవరికైనా గానీ క్రికెట్ సూచించదగినదిగా ఉండేది కాదు. కాబట్టే అమెరికన్లు దాన్ని వెర్రి మొర్రిదిగా కొట్టిపారేశారు. ఉద్యోగాలు చేసుకునే దానికి పూర్వ దశలోని యువతే ఎక్కువగా క్రికెట్కు ప్రేక్షకులు. ఇక కులీన వర్గాలకు ఉద్యోగానం తరం కబుర్లు చెప్పుకోడానికి, వాదులాడటానికి అవకాశాన్ని అందించేది. క్రికెట్, ఫుట్బాల్ వర్గ ప్రాతిపదికపై విడిపోయి ఉండేవారు. సర్వ సమ్మతమైన సత్యాలు చాలా వాటిలాగే అది కూడా పాక్షికంగా తప్పు. ఫుట్బాల్ ఆగ్రహావేశంతో కూడిన తెగ స్వభావం కలిగినది. కాబట్టే మన దేశంలో అది కూడా పలు వర్గాలను తప్పుకుని పోయింది. కొన్ని వర్గాలనే ఆవరించి ఉండిపోయింది. కలకత్తాకు చెందిన సంప్రదాయక ఫుట్బాల్ జట్లైన మోహన్ బగాన్, తూర్పు బెంగాల్, మొహమ్మదన్ స్పోర్టింగ్లు జాతిపరంగా పశ్చిమ బెంగాలీలు, తూర్పు బెంగాలీలు, ముస్లింలవి. తెగ వర్గాన్ని తనలో విలీనం చేసుకుంటుంది. న్యాయవాదులు, వంటవాళ్లు భుజా లురాసుకుంటూ సాగుతారు. ఆవేశకావేశాలు మరీ తీవ్రంగా ఉంటాయి. ఏ ‘బారీ మ్యాచ్’కు ముందు రోజైనా, ఆట తర్వాత గంటల తరబడీ సాగే మ్యాచ్ కు ముందటి, తర్వాతి శవపరీక్ష నివేదికలు బెంగాల్లోని పదుల వేల టీ దుకాణాలను పోషించేవి. అదే ఇంగ్లండ్లోనైతే చర్చా ప్రవాహమూ, డబ్బూ కూడా పబ్బులకు చేరేది. భౌగోళికత, విధేయత అనే సమాంతర విశ్వాన్ని అందించింది. తరచూ ఆ విధేయత ఇటు నుంచి అటు మొగ్గుతుండేది. అయినా అదేమీ ఆవేశాలను తగ్గించేది కాదు. జనసమూహం ఒక పతాకం కోసం తపిస్తున్నారంటే ఇక ఆ కేంద్ర బిందువు ఏదైనా అందుకు పనికి వచ్చేదే అవుతుంది. ప్రజాపునాదిని పలు రెట్లు విస్తరింపజేసే మొట్టమొదటి ముఖ్య గుణకం 1960లనాటి ట్రాన్సిస్టర్ల విప్లవం. ఇక టెలివిజన్ విప్లవం దాన్ని చెక్కుచెదరనిదిగా మార్చే సింది. మార్కెట్టున్న చోట మార్కెటింగూ ఉంటుంది. వ్యాపార ప్రకటలున్న చోట డబ్బుంటుంది. డబ్బున్న చోట వృద్ధి, ప్రలోభం ఉంటాయి. ప్రలోభం ఉన్న చోట దాన్ని నిరోధించలేని వారూ ఉంటారు. సంపద అవసరాలను సంతృప్తిపరచి, విలాసాల పట్ల వ్యామోహాన్ని తీర్చి దురాశను తగ్గిస్తుందని తర్కం చెబుతుంది. కానీ మానవులు తార్కిక జీవులు కారు. వారి ప్రవర్తన సహజంగానే అందుకు విరుద్ధంగా ప్రవర్తించేలా చేయగలుగుతుంది. పేదలు తమకున్న దానిలోనే బతకడం నేర్చుకుంటారు. కాబట్టి వారు ధనవంతుల కంటే ఎక్కువ నిజాయితీగా ఉంటారు. ధనవంతులకు బంగారు గోళ్లతో వీపు గోక్కోవాలనే దురద ఎప్పుడూ ఉండేదే. ఫుట్బాల్, క్రికెట్ల పరిధిలోకి డబ్బు ముఖ్యమైనదిగా రంగ ప్రవేశం చేయడంతో ఆ రెండు క్రీడలూ రోగగ్రస్తమై పోయాయి. బెట్టింగ్ వంటి అనుబంధ పరిశ్రమలు భారీ కార్యకలాపాలుగా బలిసిపోయాయి. కాగలిగిన చోట అవి చట్టబద్ధమైనవే అయ్యాయి. చట్టాలు నిజమనే వక్రరేఖకు వెనుకనే మిగిలిపోయిన చోట అవి చాటుమాటు వ్యవహారమయ్యాయి. ఆట తీరులోని అతి స్వల్పమైన మార్పులకు సైతం అంత డబ్బు అందుతుండేటప్పుడు గిరాకీ సరఫరాను ఊరిస్తుంది. క్రీడాకారుల వృత్తి జీవిత కాలం స్వల్పం. వారిలో చాలామంది ఒక్కసారి తమ కెరీర్ ఒక్క ఏడుపుతో అలా మటుమాయమై పోయాక వారి ముందు నిలిచేది శూన్యమే. ఒక జట్టులోని ఏ ఇద్దరు హీరోలకైనా తొమ్మిది మంది త్వరగానే మరపున పడిపోయేవారై ఉంటారు. బెంచ్పైనున్న రెండు డజన్ల మందిని ఎన్నడూ గుర్తుంచుకోరు. ఫుట్బాల్, క్రికెట్ క్రీడలు రెండూ దశాబ్దాలుగా అవినీతి కాన్సర్ వ్యాధితో గుంజుకులాడుతున్నాయి. ఆ వ్యాధికి బలైపోయినవారి జాబితా పొడవైనది. ఒకప్పుడు దక్షిణ ఆఫ్రికా, భారత జాతీయ జట్లకు నాయకత్వం వహించిన తాత్కాలిక హీరోలు కూడా అందులో ఉన్నారు. తప్పులకు యూరోపియన్ ఫుట్బాల్ సమష్టి శిక్షల తీర్పులను అమలు చేసింది. తీర్పు వెలువడే ప్రతి ఒక్క ఘటనకూ పది తప్పించుకున్నాయని నిస్సంకోచంగా అనుకోవచ్చు. ఆ కంపు ఇంకా అలాగే కొడుతూనే ఉండటానికి కారణం అది అత్యున్నత స్థాయికి, పరిపాలనా యంత్రాంగం వరకు చేరతుండటమే. క్రికెట్ లోని అత్యంత శక్తివంతుల పేర్లు బుకీలతో కలసి గదులను పంచుకుంటాయి. తిను, తినిపించు అనే వ్యవస్థ కామెంటేటర్లు, మీడియా పండిత వర్గాలు సహా దిగువన ఉన్నవారందరి సంగతీ చూసుకుంటుంది. పదిహేడేళ్లపాటూ ఫీఫా(అంతర్జాతీయ ఫుట్బాల్ సంఘాల సమాఖ్య) అధిపతిగా ఉన్న సెప్ బ్లాటర్ అధికారంలో ఉండగా డబ్బు రాజ్యమేలింది. ఆయన బండారం కాస్తా బట్టబయలు కావడంతో ప్రపంచ ఫుట్బాల్ గిలగిలలాడుతోంది. అది పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యం. ఒక ప్రపంచ కప్పు మ్యాచ్ ఏర్పాటంటే హోదాకు పాస్పోర్ట్గా మారింది. ఫుట్ బాల్ క్రీడను నియంత్రించే కొందరి గుత్తాధిపత్య ప్రజాస్వామ్యం నుంచి ఆ విశేష హోదాను సంపాదించడంలో విజయవంతమయ్యే మార్గాన్ని కొనుక్కో డానికి ఎందరో సిద్ధంగా ఉంటారు. ఇలా వేలానికి దిగేవాళ్లలో ఆ తర్వాత నష్టపోయేవారు ఎవరూ ఉండరు... ఒక్క ఆ క్రీడ తప్ప. వమాన భారం భరించలేక బ్లాటర్ తన ఖడ్గంపై పడి మరణించలేదు. చాలా మంది పరిస్థితి నరాలు తెగిపడేంత ఉత్కంఠతో ఉన్నది కాబట్టే ఆయన్ని శిఖరం మీది నుంచి నెట్టారు. ఒకప్పుడు క్రీడా స్ఫూర్తికి మూలంగా ఉండిన క్రీడ నేడు వంచనాత్మకతకు మించి మరేదైనా అయితే మనజాలదు. ఒక క్రీడ విశ్వసనీయతను కోల్పోయిందీ అంటే ఇక దానికి అర్థమే లేకుండా పోతుంది. అద్భుత మేధో ప్రమాణాలకు చేరిన అవినీతికి అడ్డుకట్ట వేయడానికి క్రికెట్ చాలానే చేసింది. బ్లాటర్ నిష్ర్కమణైనా ఫుట్బాల్ క్రీడలో రాజును మార్చడానికి మించిన వ్యవస్థాగతమైన మార్పులకు ప్రేరణకాగలదని ఎవరైనాగానీ ఆశించగలరు. అప్పుడే ఫుట్బాల్, క్రికెట్ 21వ శతాబ్దపు ప్రధాన క్రీడలుగా మిగులుతాయి. (వ్యాసకర్త: ఎంజే అక్బర్.. సీనియర్ సంపాదకులు ) -
అక్కడ ఏదీ అసంబద్ధం కాదు
బహుళజాతి సంస్థలన్నీ రంగుల మాయ చేసేవే. వాటి ప్రధాన ధ్యేయం లాభాలు పెంచుకోవడమే. ఈ ప్రకటనలేవీ కూడా పక్షపాత దృష్టిని కల్పించవు, లేదా ప్రోత్సహించవు. అయితే ఎవరి వెర్రితనం మీదనైనా డబ్బు సంపాదించే మార్గాలు ఉంటే వాటిని తప్పనిసరిగా అవి ఉపయోగించుకుంటాయి. అలాగే మన బలహీనతను సొమ్ము చేసుకునే విధంగానే ప్రకటనలలోని కళాత్మకత అంతా ఉంటుంది. సాధారణ ప్రజలకు ఉండే భ్రాంతులను లాభాలుగా మార్చుకునే విద్యలు పెద్ద పెద్ద కంపెనీలకు బాగా తెలుసు. సమకాలీన పట్టణ భారతాన్ని ఈ రెండింటిలో ఏది బాగా దృశ్యీకరించగలుగుతుంది: క్రీడామైదానంలో ప్రజ లు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పటి దృశ్యాలా? ప్రతి ఓవర్ తరువాత ప్రసారంలో విరామం ఇచ్చి, లేదా ఇతర విరామ సమయాలలోనూ చూపించే వ్యాపార ప్రక టనలా? వీటినే ఆడంబరంగా వ్యూహాత్మక విరామాలని కూడా అంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) పూర్వీకులు చాలా ప్రత్యేకమైనవారు. రోమన్ చక్రవర్తులు పౌరులకి ఆహారంతో పాటు, సర్కస్ విన్యాసాలను అందుబాటు లో ఉంచడం ద్వారా తమ ఉనికిని నిలుపుకోవడం ఎలా గో బాగా తెలిసినవారిగా ప్రసిద్ధికెక్కారు. పురుషుడనే వాడు కేవలం ఆహారంతోనే సరిపుచ్చుకుని బతకలేడు. అదే శుభవార్తను ప్రస్తుతకాలంలో ఆడవారి గురించి కూడా చెప్పవచ్చు. ఇవాళ్టి సర్కస్ ఏమిటో సుస్పష్టమే. ఆ సర్కస్ కూడా అదే విధమైన ప్రయోజనకారి కూడా. క్రికె ట్ స్టేడియంను కూడా అచ్చంగా రోమన్ల గతకాలపు కొలోసియంల మాదిరిగానే నిర్మించారు. పాక్షిక పైకప్పు తప్ప మిగిలిన నిర్మాణంలో పెద్ద మార్పేమీ లేదు. అయితే హింసాస్వాదన పట్ల ఆధునిక కాలంలో ఉన్న ఆసక్తిలో కొంచెం భేదం ఉంది. అందుకే, మరీ రోమన్ల కాలంలోని గ్లాడియేటర్ యుద్ధవీరులు ధరించిన కవచాల మాదిరిగా కాకుండా, బ్యాట్స్మెన్ శిరస్త్రాణాలు ధరిస్తున్నారు. చంపుకోవడం ఇప్పుడు నిషిద్ధం కదా! కాబట్టి పైశాచికానం దాన్ని బ్యాట్స్మెన్ (అతడి యుద్ధ విన్యాసాలతో) మరణం కంటే, ఇన్నింగ్స్ మరణం మీదికి మళ్లిస్తున్నారు. అంపైర్కి తన బొటనవేలును నేలవైపు చూపడం కంటే, ఆకాశం వైపు చూపడానికే అధికారం ఉంది. రోమన్ కాలపు లక్షణానికీ, దీనికి పెద్ద తేడా లేదు. పాలక వర్గాలవారు ప్రత్యేకమైన బాక్సులలో కూర్చుని క్రీడను తిలకిస్తారు. పౌరులంతా కింద నుంచి పైవరకు శ్రేణులుగా అమర్చిన ఆసనాల మీద సొగసుగా ఆసీనులై ఉంటారు. కెమెరాలు పౌరుల గురించి మనకి ఏం చెబు తాయి? 21వ శతాబ్దపు యువ భారతీయులు ముమ్మాటికీ వారి తండ్రులూ, మామయ్యల కంటే చాలా బాగుంటా రు. ఇది జీవితంలో ఏదో ఒక దశకు సంబంధించి చెబు తున్నది కూడా కాదు. భవిష్యత్తుతో బంధం వల్ల యువకులు ఎప్పుడూ అందచందాలతో ఉంటారు. కానీ వయ సు మీరిన వారు అద్దానికి బందీలవుతారు. ఆరోగ్యం, వెలుగు మనిషి ఉన్నత స్థితిలో ఉన్న కాలాన్ని ప్రతిబిం బిస్తూ ఉంటాయి. స్త్రీపురుష సమానత్వమన్న ఆలోచనకు సంబంధించి ఒక జాతిగా మనం ఇప్పటికీ దానికి కొంత దూరం గానే ఉన్నాం. అయితే స్త్రీపురుష సహనం మాత్రం ఉంది. దాని గురించి నేను చెప్పదలుచుకున్నాను. 1950, 1960 నాటి సినిమాలలో చూస్తే అమ్మాయిలూ, అబ్బాయిలూ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో కూడా విడివిడిగానే కూర్చుని ఉన్నట్టు కనిపిస్తారు. వీటితో పోల్చుకుంటే నేటి యువతరం ఒకరితో ఒకరు చాలా సన్నిహితంగా ఉంటు న్నారనే చెప్పాలి. దీనిని పరిగణనలోనికి తీసుకోకపోతే ఏ రాజకీయవేత్తకు యువతరం ఓట్లు పడవు. అంటే, నైతిక వర్తనవాదులు ఆమోదించిన కాలం చెల్లిన గతాన్ని తప్ప, నాయకులు మరి దేనినీ గెలుచుకోలేరు. ఇది మంచి వార్త. అయితే భేషజానికి సంబంధించిన వాసనలు మనలను ఇంకా పూర్తిగా వీడిపోలేదు. సంకేతాలను అందుకుని గాలిలో ముద్దులు విసరడానికీ, డబ్బులు తీసుకుని వయ్యారంగా కన్నుగీటడానికి మహిళా చీర్లీడర్ల కిరాయి బృందాన్ని ప్రతి ఒక్క క్రికెట్ జట్టు ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది. అయితే ఈ బృందంలో ఉండే యువతులంతా విదేశీయులే. బుద్ధిమంతులైన మన బాలికలు అలాంటి కురచ బట్టలలో ఎప్పుడూ కనిపించ కూడదు. ప్రతివారూ ఏం చెబుతారు? ఇలాంటి బృందా లలో కలసి నిలబడడానికి మన అమ్మాయిలను అను మతిస్తే, వాళ్లు చీరలు ధరించి ఏదో సంప్రదాయిక విన్యాసం చేస్తారనే. ఆధునిక వస్త్రధారణ, ఆస్వాదించే కన్ను ఇంటర్వ్యూ పరిధికే పరిమితం. చీర్లీడర్లు ఉండే చోటులో వీరిని వెతనక్కరలేదు. అయితే ఇందుకు నిరాశ చెందనక్కరలేదు. ఇవాళో రేపో అనే గానీ, అదీ జరుగు తుంది. దీనికి ఆధారం ఏమిటి? మన వ్యాపార ప్రకటనలే. వాటిలో కనిపిస్తున్న భారతీయ మహిళలు చిన్న చిన్న చెడ్డీలతో కనిపిస్తున్నారు, పురుషుడు అనాఛ్చాదిత వక్షా న్ని ప్రదర్శిస్తున్నాడు. పురుషులు ఉపయోగించే ఒక పెర్ ఫ్యూమ్కు సంబంధించిన ఆ వ్యాపార ప్రకటనలో ఒక పురుషుడు ఠీవిగా కెమెరా కేసి నడిచి వస్తాడు. అతడిని ఒక ఎయిర్ హోస్టెస్ ఆరాధనగా చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె చెప్పే మాట అస్పష్టంగా ఉంటుంది. నీవు మహిళలను ఆకర్షించడానికీ, నిజానికి మహిళలే నిన్ను ఆకర్షించడానికి ఆ పెర్ఫ్యూమ్లో మునిగి తేలితే చాలు నన్నదే దాని భావం. ఆ వ్యాపార ప్రకటన ప్రభావం చూపడం అని వార్యం. లేదంటే అది ప్రసారం కాదు. తెల్లతోలు లేదా శ్వేతవర్ణం దేనినైనా విజయవంతం గా విక్రయించడానికి దోహదపడుతుంది. యూరోపి యన్ బహుళజాతి సంస్థ ఫిలిప్. ఇది తను ఉత్పత్తి చేస్తు న్న ఎలక్ట్రిక్ షేవర్ (గెడ్డం గీసుకునే పరికరం) గురించి ప్రచారం చేయడానికి ఛానెళ్లలో సమయం తీసుకుం టుంది. అందుకు సంబంధించిన వ్యాపార ప్రకటనలో మొదటి దృశ్యం: ముఖమంతా గుబురుతో ముదురు చాక్లెట్ రంగు మనిషి కనిపిస్తాడు. ఇతడు తన గెడ్డాన్ని సంప్రదాయక పద్ధతులలో తొలగించడానికి ప్రయత్నిం చినపుడు అతడి చెంప మీద ఒక మెరుపు వస్తుంది. తరు వాత ఫిలిప్ షేవర్ వస్తుంది. అది అతడి గుబురు గెడ్డాన్ని పరమ సౌఖ్యంగా తొలగించడమే కాదు, ముఖంతో పాటు, భుజాల వరకు కూడా శరీరాన్ని కాంతిమంతం చేస్తుంది. ఈ అద్భుతం పూర్తయ్యే సరికి, అతడి చుబుకం మంచుముద్ద ఒంపు మాదిరిగా నున్నగా తయారవు తుంది. మరుక్షణం అతడు స్థానిక హాలెండ్ వాసిలా రూపుదాలుస్తాడు. నిజానికి అది గెడ్డం గీసుకోవడం అనిపించదు. ఆ పురుషుడు పునరుత్థానం చెందాడని అనిపిస్తుంది. ఈ వ్యాపార ప్రకటన కూడా తన ప్రభావం చూపు తుంది. లేదంటే అసలు ప్రసారం కాదు. దీనిని బట్టి భారతీయులు కూడా శరీరం లోపలే కాదు, బయట కూడా రంగుకు దాసులేనని ఇవన్నీ రుజువు చేస్తున్నాయి. బహుళజాతి సంస్థలన్నీ రంగుల మాయ చేసేవే. వాటి ప్రధాన ధ్యేయం లాభాలు పెంచుకోవడమే. ఈ ప్రకటనలేవీ కూడా పక్షపాత దృష్టిని కల్పించవు, లేదా ప్రోత్సహించవు. అయితే ఎవరి వెర్రితనం మీదనైనా డబ్బు సంపాదించే మార్గాలు ఉంటే వాటిని తప్పని సరిగా అవి ఉపయోగించుకుంటాయి. అలాగే మన బల హీనతను సొమ్ము చేసుకునే విధంగానే ప్రకటనలలోని కళాత్మకత అంతా ఉంటుంది. సాధారణ ప్రజలకు ఉండే భ్రాంతులను లాభాలుగా మార్చుకునే విద్యలు పెద్ద పెద్ద కంపెనీలకు బాగా తెలుసు. కాబట్టి కంపెనీలకు వ్యతిరేకంగా చట్టాలు రూపొందించవద్దు. వినియోగ దారు డనే మన బంగారం మంచిదైతే అదే చాలు. (వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు ఎం.జె.అక్బర్) -
నేతాజీ ఉంటే మన చరిత్ర మరోలా...
-
నేతాజీ ఉంటే మన చరిత్ర మరోలా...
బోస్ మరణించినట్టు రూఢిగా తెలిసి ఉంటే నెహ్రూ ఆయన కుటుంబంపై నిఘా ఎందుకు పెట్టినట్టు? బోస్ నాడు బతికే ఉంటే, ఆయనను ఎక్కడకు తీసుకెళ్లారు? ఎక్కడ మరణించాడు? నిజం...మిత్రదేశాలతో సంబంధాలను దెబ్బతీస్తుందనే అధికారిక వివరణ తప్ప మరేమీ మనకు తెలియదు. - ఎం.జె. అక్బర్, సీనియర్ సంపాదకులు కాలం ఆనాడు బోస్ పక్షాన ఉంది. ఆయనే ఉండి ఉంటే జాతీయస్థాయి ప్రతిపక్ష కూటమికి అయస్కాంతమై నిలిచేవాడు. 1962 సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ను తుడిచిపెట్టేసేవాడు. అదే జరిగితే భారత్పై చైనా దాడి చేసి ఉండేదా? చెప్పలేం. స్వతంత్ర భారత చరిత్ర మరోవిధంగా ఉండేదనేది మాత్రం నిస్సందేహం. ఇంటెలిజెన్స్ సంస్థలుగా పిలిచే గూఢచార సంస్థలు మహా ఇంటెలిజెంటే కాదు, నిగూఢ మైనవి కూడా. రహస్య సమాచారం పేరిట ప్రభుత్వాలు ప్రధాన వ్యక్తి లేదా సమస్య మరణించేంత వరకు మూడు లేదా నాలు గు దశాబ్దాలపాటూ ఫైళ్లను దాచేస్తాయి. అతి కొన్ని సందర్భాల్లో అలా దాచేసిన పత్రాలు బెడిసికొడతాయి. మృతులను మేల్కొల్పుతాయి. అనుభవిస్తున్న అధికారం మూల్యాన్ని చెల్లించి మరీ సంపాదించినదని గుర్తు చేయడానికి మేక్బెత్ విందులో ప్రత్యక్షమైన బాంకో దెయ్యంలా సుభాష్ చంద్రబోస్ హఠాత్తుగా ఇప్పుడు తెరపైకి వచ్చాడు. భారత జాతీయ సైన్యపు (ఐఎన్ఏ) సుప్రసిద్ధ నేత బోస్ పయనిస్తున్న విమానం 1945 ఆగస్టు 18న తైపీలో కూలిపోయిందన్న వార్త యుద్ధకాలపు మబ్బు తెరల మధ్య నుంచి వెలువడింది. అప్పటి నుంచీ ఆయన ఏమయ్యారనే విషయంపై... ‘మృతి’, ‘అదృశ్యం’ అనే రెండు కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. అందులో మొద టిది అధికార వర్గాలు కోరుకున్నది కాగా, రెండోది ప్రజల ఆకాంక్ష. ఒక ఘటనపై వ్యాఖ్యానంలో ఇలాంటి నాటకీ యమైన సంఘర్షణ ఎందుకు? అది అర్థం కావాలంటే 1945 నాటి పరిస్థితులను అర్థం చేసుకోవాలి. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయిన తర్వాత సరిగ్గా మూడు రోజులకు బోస్ విమానం కూలి పోయింది. అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిట న్లతో కూడిన యునెటైడ్ నేషన్స్ జర్మనీ, జపాన్, ఇటలీ లతో కూడిన యాక్సిస్ శక్తులపై విజయాన్ని లాంఛ నంగా ఇంకా ప్రకటించుకోవాల్సి ఉంది. భారత్ కూడా విజయం సాధించిన యూఎన్ కూటమి భాగస్వామే. కానీ భారత ప్రజలను సంప్రదిం చలేదని గాంధీ బ్రిటన్ సాగిస్తున్న యుద్ధానికి కాంగ్రెస్ మద్దతును ఉపసంహరించారు. కానీ చట్టబద్ధ భారత ప్రభుత్వమైన బ్రిటిష్ రాజ్ నేతృత్వంలోని భారత సేనలు ఆ యుద్ధంలో పాల్గొన్నాయి. అవి ఆఫ్రికాలో జర్మనీకి వ్యతి రేకంగా, ఆగ్నేయ ఆసియాలో జపాన్కు వ్యతిరేకంగా పోరాడాయి. అధికారికంగా కాంగ్రెస్ వైఖరి యుద్ధానికి వ్యతిరేకం. అయినా అది బ్రిటిష్ యుద్ధ ప్రయత్నాలను దెబ్బతీయడం, తిరుగుబాటు లేవదీయ డం చేయలేదు. 1939లో గాంధీతో, కాంగ్రెస్తో తెగదెం పులు చేసుకున్న బోస్ ఆ పని చేశాడు. నాటి భారతీయుల, ప్రత్యేకించి యువతరం ఆలోచ నలను బోస్ గొప్పగా ప్రభావితం చేశాడు. అసాధారణ మైన రీతిలో 1941లో ఆయన కలకత్తా నుంచి, బెంగాల్ నుంచి తప్పించుకుని అఫ్ఘానిస్థాన్, మధ్య ఆసియాల మీదుగా బెర్లిన్కు చేరారు. అక్కడ బోస్ ఆక్సిస్ శక్తుల అధినాయకులతో సమావేశమయ్యారు. జలాంతర్గామి లో రహస్యంగా జపాన్కు పయనించి, అక్కడ బందీలు గా ఉన్న భారత సైనిక పటాలాలను కనీవినీ ఎరుగని రీతిలో సంఘటితం చేసి భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. 1857 నాటి ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రా మం పీడకలలు ఇంకా వెన్నాడుతున్న బ్రిటిష్ పాలకు లకు ఆ తదుపరి ఈ ‘తిరుగుబాటు’ కంటే ఎక్కువగా ఆగ్రహం కలగజేసింది మరేమీ లేదు. భారత్లో బ్రిటిష్ పాలన సైన్యం విధేయతపైనే ఆధారపడి ఉంది. ఆ విధేయతకు తూట్లు పడితే బ్రిటిష్ సామ్రాజ్యమే విచ్ఛిన్న మైపోతుందని వారికి తెలుసు. యుద్ధం తర్వాత జరిగిన బొంబాయి నావికాదళం తిరుగుబాటులో బోస్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. నావికా తిరుగుబాటు భారతదేశంలో బ్రిటిష్ వలస పాలన అంతానికి నాంది పలికింది. యుద్ధంలో ఐఎన్ఏ ఓడిపోయి ఉండొచ్చు. కానీ అది ఒక సువర్ణాధ్యాయంగా నమోదైన మరింత పెద్ద విజయాన్ని సాధించింది. బోస్ వంటి యుద్ధ వీరుడ్ని శతాబ్ద కాలంగా నాటి భారతదేశం చూసి ఎరుగదు. 1946లో ఐఎన్ఏ సైన్యాన్ని రాజద్రోహ ఆరోపణపై విచారించినప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడిక క్కడ ప్రజా తిరుగుబాట్లు చెలరేగాయి. భారతీయుల దృష్టిలో వారు ద్రోహులు కారు, అమరజీవులు. నాడు బ్రిటిష్వారు దేశాన్ని విడిచివెళ్లడానికి సిద్ధమే. కానీ వారికి ఇక్కడ అమలు చేయాల్సిన పథకాలున్నా యి. బోస్ దేశంలోలేకపోవడమనే సాధారణాంశం ప్రాతి పదికగా ఆసక్తికరమైన రాజకీయ కుమ్మక్కు జరిగింది. బోస్ బ్రిటిష్ వారికి బద్ధ శత్రువు. కాంగ్రెస్ మచ్చిక చేయడానికి వీలైనదిగా ఉండేది. కానీ బోస్ అలాం టివాడు కాడు. ఆయన భారత జాతీయ సైన్యంలో హిందువులు, ముస్లింలు, సిక్కులను ఉత్తేజకరమైన రీతిలో ఐక్యం చేసి, వారికి నేతృత్వం వహించాడు. ఐఎన్ఏ బోస్ కలలుకన్న భారతావనికి నమూనా అనేది స్పష్టమే. కాబట్టి ఆయన ముస్లిం లీగ్కు అక్కర్లేదు. బోస్ నాడు భారత్లో ఉండి ఉంటే దేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించేవాడు. బోస్ తమ సంస్థలోకి తిరిగి రావడం కాంగ్రెస్కు ఇష్టంలేదనే ది స్పష్టమే. ఎందుకంటే ఆయనే వస్తే వారు నాయకునిగా కోరుకుంటున్న జవహర్లాల్ నెహ్రూకు పోటీదారు అవుతారు. బోస్ చనిపోయాడని రూఢియైతే బోస్ కుటుం బంపై నెహ్రూ నిఘాను ఎందుకు కొనసాగించారు? 1957లో జపాన్ పర్యటనకు వెళ్లినప్పుడు నెహ్రూ ఎందుకు అంతగా గాభరా పడ్డారు? ఆయన గాబరా పడ్డట్టు ఆధార పత్రాలు ఉన్నాయి. బోస్ బతికే ఉంటే, ఆయనను ఎక్కడకు తీసుకె ళ్లారు? ఆయన ఎక్కడ మరణించాడు? నిజమేమిటో మనకు తెలియదు. ఆ నిజం, మిత్రదేశాలతో సంబం ధాలను దెబ్బతీస్తుందనే అధికారిక వివరణ తప్ప మరేమీ మనకు తెలియదు. ఆ మిత్ర దేశాల్లో బ్రిటన్ ఒకటనేది తథ్యం. ఎందుకంటే బోస్కు వ్యతిరేకంగా మన ఇంటెలిజెన్స్ బ్యూరో ఆ దేశ గూఢచార సంస్థతో చేయి కలిపింది. స్టాలిన్ నేతృత్వంలోని సోవియట్ రష్యా సంబం ధాలు దెబ్బతింటాయన్న ఆ రెండో మిత్ర దేశమనే గుసగుస కూడా ఉంది. 1945లో అది బ్రిటన్కు మిత్ర దేశం. బోస్ పాశ్చాత్తాపమెరుగని ఫాసిస్టని స్టాలిన్ ప్రచారం చేసినట్టనిపిస్తుంది. ఏదేమైనా రహస్య ఫైళ్లు బయటపడేవరకు ఆ విషయం మనం ఇదమిత్థంగా తేల్చి చెప్పలేం. రాజకీయ కలన గణితం అంత సరళమైందేమీ కాదు. నెహ్రూ బోస్కంటే ఎనిమిదేళ్లు చిన్నవాడు. కాలం ఆయన పక్షాన ఉంది. ఆయన లేదా ఆయన పార్టీ 1952లో బెంగాల్, ఒరిస్సాలలో అధికారాన్ని గెలుచు కునేది. బోస్, జాతీయస్థాయి ప్రతిపక్ష కూటమి ఏర్పా టుకు అయస్కాంతమై నిలిచేవాడు. 1957 నాటికి కాం గ్రెస్ను గట్టి దెబ్బ తీసి ఉండేవాడు. 1962 సార్వత్రిక ఎన్ని కల నాటికి దాన్ని తుడిచిపెట్టేసేవాడు. అదే జరిగితే భారత్పై చైనా దాడి చేసి ఉండేదా? చెప్పలేం. స్వతంత్ర భారత చరిత్ర మరోవిధంగా ఉండేదనేది మాత్రం నిస్సందేహం. -
‘నేను’గా మారిన ‘ఆప్’
విశ్లేషణ తొలిదశలో పార్టీ నావ మునకేయకుండా ఉండటానికి పనికొచ్చే బరువుగా సైద్ధాంతిక ఆదర్శవాదం పరిమితమైతే మంచిదని కేజ్రీవాల్ భావించారు. పార్టీని పరిరక్షించడానికిగానీ లేదా ప్రభుత్వాన్ని నడపడానికిగానీ అది పనికిరాదని ఆయన నిర్ణయించారు. అధికారం బుట్టలోంచి ఆయన ప్రతి ఎమ్మెల్యేకు ఓ రొట్టె ముక్కనో లేదా చేపనో వేశారు. వారంతా మంత్రులో లేదా పార్లమెంటరీ కార్యదర్శులో అయ్యారు. ఇక వారు చేసే పనేమిటి? ఎవరికి తెలుసు? తలా ఒక కారూ, కార్యాలయమూ, సొంత డబ్బా కొట్టుకునే హక్కూ లభిస్తాయి. ఫ్రాయిడియన్ చింతనలోని ఏ ఉప స్రవంతిలోంచి ‘‘సాలా’’ అనే పదం భారత ఉపఖండమంతా దూషణాత్మక అసమ్మతిగా మారింది? ఇదో పెద్ద చిక్కు ప్రశ్న. మనమంతా కులం, జాతి, మతం, దేశం వంటి భిన్న వర్గాలుగా విడిపోయి ఉండొచ్చు. కానీ ‘‘సాలా’’ పదానికి వచ్చేసరికి మన సాంస్కృతిక, భాషాపరమైన నిబద్ధతలో అపూర్వమైన ఐక్యత ఉంది. మీరు, హిందీ, ఉర్దూ, బెంగాలీ, భోజ్పురీ, పంజాబీ, గుజరాతీ, మరాఠీ తదితర భాషల్లోనూ లేదా ఆరోగ్యకరంగా స్థానికీకరించిన ఇంగ్లిష్లో మాట్లాడినా ‘‘సాలా’’ స్థానం మాత్రం అగౌరవ సూచకాల జాబితాలోనే (బెంగాలీలో ‘‘షాలా’’ అన్నా దాని స్థానం అక్కడే). సర్వవ్యాపితమైన ఆ పదాన్ని రకరకాలుగా ఉచ్చరిం చడంపై యాక్టింగ్ స్కూల్లో ఏకంగా ఒక కోర్సునే నడపొచ్చు. ఎందుకు? నాకు తెలీదు. నిజానికి ఆ పదానికి అర్థం, తనకంటే చిన్నవాడైన బావమరిది అని మాత్రమే. అంతకు మించి అందులో ఉద్రేకాన్ని రేకెత్తించేదేమీ లేదు. అది చాలా కుటుంబాల్లో సర్వసామాన్యంగా కనిపించే బంధుత్వ మే. అయినా ‘‘సాలా’’ మనోవిజ్ఞాన విశ్లేషకులందరి సమష్టి శక్తిసామర్థ్యాలకు సైతం అందని ఏదో లోతైన, చీకటి, మార్మిక అపరాధాన్ని లేదా వాంఛను వ్యక్తం చేస్తోందా? ఏదేమైనా దానికి బహిరంగంగా ఉన్న అర్థం బావమరిదే. అది మాత్రం సుస్పష్టం. ఆగ్రహం లేదా దౌర్జన్యం వల్ల ఒళ్లు మరచిన ఆవేశం ఆవహించి ఉన్నప్పుడు ఆ పద ప్రయోగం ఒక ప్రత్యేక విద్వేషపూరిత భావాన్ని సంత రించుకుంటుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యతరగతి నైతి కతావాదుల పాలిటి అత్యధునాతన కథానాయకుడు. ఇటీవలి కాలంలో ఢిల్లీలో జీవన భద్రతను కోల్పోయినవారి పాలిటి పవిత్ర ఆశాజ్యోతి. అలాం టాయన ఆ పదాన్ని ప్రయోగించారు. అదీ కూడా నేడాయనకు గిట్టకుండా పోయిన ఒకప్పటి సహచరులు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్లకు వ్యతిరేకంగా. పైగా ఆయన తన ఆగ్రహ పదజాలానికి ‘‘కమీనా’’ను (ద్రోహి లేదా నీచుడు) కూడా జోడించారు. తద్వారా వారి సవాలును విషపూరిత విద్రోహంగా కొట్టిపారేశారు. ఆయన గొంతుక నుంచి బుసబుసమంటూ పొంగుకొచ్చిన మాటలు ఎన్నటి నుంచో పేరుకుపోతూ వచ్చి, బద్దలయ్యే అవకాశం కోసం ఎదురు చూస్తున్న లావా. కేజ్రీవాల్, భూషణ్, యాదవ్లు ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటుచేసి, పూర్తిగా స్థానికమైనవైన రెండు ఎన్నికల విజయాలను జాతీయ వార్తలుగా మార్చిన నాయకత్రయం. వారిలో శాంతిభూషణ్ నిశ్శబ్దంగా పనిచేసు కుపోయే సిద్ధాంతవేత్త. కాగా, యోగేంద్ర యాదవ్ ఆ పార్టీ ప్రధాన వ్యూ హకర్త. ఇక కేజ్రీవాల్ బహిరంగ ప్రచారవేత్త కాబట్టి అందరి దృష్టిలో నాయకునిగా గుర్తింపును, విశ్వాసాన్ని చూరగొన్న నేత. భూషణ్, యాదవ్ల సహాయం లేనిదే కేజ్రీవాల్ నేడున్న స్థానానికి చేరగలిగేవారే కాదు. అయితే వైఫల్యం సానుభూతిని రేకెత్తించే చోట విజయం క్రూరమైన దవుతుంది. ఎందుకంటే విజయం అహాన్ని పెంచి పోషిస్తే, ఓటమి ఉద్రే కోద్వేగాలు మొద్దుబారేట్టు చేస్తుంది. ఆందోళనల దశలో కేజ్రీవాల్ తనకు మార్గదర్శకులైన వారితో కలసి బహిరంగ వేదికలను పంచుకోవాల్సివస్తే సంతోషపడేవారు, ఆతురతను సైతం కనబరిచేవారు. అత్యున్నత వేదిక సంగతికి వస్తే అది వేరే కథ. ఆమ్ ఆద్మీకి పొట్టి పేరు‘ఆప్’. అంటే హిందీలో అత్యంత మర్యాదపూర్వకమైన ‘‘మీరు’’ అని అర్థం. ఆనందదాయకమైన ఈ శ్లేషను ఆప్ నేతలు ఓట్లను అభ్యర్థించేటప్పుడు అత్యంత సమర్థవంతంగా ప్రయోగించారు. నేడు అధికారంలో ఉన్న కేజ్రీవాల్ నిర్మొహమాటంగా పంపుతున్న సందేశం ఒక్కటే. ఆప్ ‘‘నేను’’గా మారిపోయింది. ఆమ్ ఆద్మీ ఇక కేజ్రీవాల్ పార్టీ. ఆయన అభీష్టానుసారం ఇతరులంతా పనిచేయాల్సిందే. సమానుల మధ్య ఆయన ప్రథముడు కాడు. ఆయన మాత్రమే ప్రథముడు. ఆపై ఇక ఉండేది ఫుల్స్టాప్ గుర్తు మాత్రమే. ఏ విడాకుల ముచ్చట్లయినా కాసేపే ఉత్సుకతను రేకెత్తిస్తాయి. ఆ తర్వాత మహా విసుగు పుట్టిస్తాయి. చేదు కషాయంలాంటి ఆప్ విడాకుల వ్యవహారం, ఆస్తి హక్కుల వివాదంతో ముడిపడి ఉంది. కాబట్టి ఇంకాస్త ఎక్కవ కాలంపాటూ ఈ ఆసక్తి ఉంటుంది. వివాదాస్పదంగా మారిన ఆప్ ఆస్తుల్లో కపట పవిత్రత కూడా ఒకటి. కాబట్టి వాదోపవాదాలు సైతం ‘నీ కంటే పవిత్రుడను నేనే’ అంటూనే సాగుతాయి. ఆ విషయం ఇప్పటికే కనబడుతోంది కూడా. అయితే నైతికత తమదేనని వాదిస్తున్నది మాత్రం అధికారంలో లేని పక్షమే. కేజ్రీవాల్ పక్షాన ఒక సర్వ సేనాని, 66 మంది సైనికాధికారులు, క్షీణిస్తున్న కాల్బలం ఉన్నాయి. ప్రత్యర్థి వాదనల తిరస్క రణకు నియమ నిబంధనలను అప్పుడే ప్రకటించేశారు. వారి సరికొత్త పవిత్ర ప్రశ్నావళి పేరు ఆచరణతాత్మక రాజకీయాలు. ఈ మార్పు ఇటీవలి ఢిల్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా రూపు దిద్దుకుంది. నాలుగు రూ. 50 లక్షల చెక్కులను కేజ్రీవాల్, కనీసం ఆ డబ్బు ఎక్కడిదని లేదా వాటి మూలమేమిటని కూడా ప్రశ్నించకుండా పుచ్చు కున్నారు. కేజ్రీవాల్ విహారయాత్ర విడిదిలోకి అవి కనుచూపు మేరలో ఏ ఆధారమూ లేకుండా చూసి మరీ నడచి వచ్చాయి. టికెట్లు కోరే అనుమా నాస్పద వ్యక్తుల నుంచి ఆయన డబ్బు స్వీకరించారు. ఇది బాధ్యతాయు తంగా ఆ సంప్రదాయానికి చేసిన సత్కారం. పోలీసులు కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఆయన పార్టీ అభ్యర్థులు పోలింగ్కు ముందు రోజున ఓటర్లకు మద్యం సరఫరా చేశారు. ప్రశాంత్భూషణ్, యోగేంద్రయాదవ్లు ఢిల్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయాన్ని దెబ్బతీయడానికి శాయశక్తులా ప్రయత్నించారని కేజ్రీవాల్ కోపంతో వివర్ణమైన మొహంతో పదేపదే నొక్కి చెబుతుండటం ఆసక్తికరం. అందుకే ‘‘కమీనా’’ పదప్రయోగం. ఇంతకూ వారు ఆప్ విజయాన్ని దెబ్బ తీసే పని ఏం చేశారు? ఎలా చేశారు? ఏ ఎన్నికల సభలోనూ లేదా పత్రికా సమావేశంలోనూ భూషణ్గానీ, యాదవ్గానీ కేజ్రీవాల్కు హానికరమైనది ఏదీ మాట్లాడలేదు. వారు తమ భిన్నాభిప్రాయాలను తమలో అలాగే అట్టిపెట్టుకున్నారు. కాబట్టి వారు కేజ్రీవాల్తో జనాంతికంగా మాట్లాడి నప్పుడు తామంతా నైతిక నిష్ఠకు, విలువలకు కట్టుబడి ఉండాలని చెప్పి ఉండాలి. పారదర్శకతకు కట్టుబడి ఉంటామని వారు ప్రజలకు వాగ్దానం చేశారు. ప్రశాంత్భూషణ్, యోగేంద్ర యాదవ్లు పారదర్శకతే తమ పార్టీ విలక్షణత (యూఎస్పీ) అని భావించారు. (యూఎస్పీ- వినియోగదా రులను విశేషంగా ఆకట్టుకునేలా చేసే తమ ఉత్పత్తి లక్షణం) ఆ ప్రత్యేకత వల్లనే ఓటర్లు తమ పార్టీ పట్ల ఆకర్షితులవుతారని నమ్మారు. కేజ్రీవాల్కు కూడా వారంతగానే తమ పార్టీ యూఎస్పీని లేదా ప్రత్యేకతను నమ్మారు... కాకపోతే అది కేజ్రీవాల్ మాత్రమేనని భావించారు. ఇక మిగతాదంతా శబ్దార్థ శాస్త్ర వాదోపవాదాలే. పార్టీ ఢిల్లీ కేంద్రమైనదిగానే ఉండాలా? లేక విస్తరించేదిగా ఉండాలా? అనేది అసంబద్ధమైనది. రంగప్రవేశంతోనే పార్టీ నావ మునక వేయకుండా ఉండటానికి పనికివచ్చే బరువుగా మాత్రమే సైద్ధాంతిక ఆదర్శవాదం పరిమితమైతేనే మంచిదని కేజ్రీవాల్ భావించారు. పార్టీని పరిరక్షించడా నికిగానీ లేదా ప్రభుత్వాన్ని నడపడానికిగానీ అది పనికిరాదని ఆయన నిర్ణ యించారు. అధికారం బుట్టలోంచి ఆయన ప్రతి ఎమ్మెల్యేకు ఓ రొట్టె ముక్క నో లేదా చేపనో ఇచ్చారు. వారు మంత్రులో లేదా పార్లమెంటరీ కార్య దర్శు లో అయ్యారు. ఇదమిత్థంగా ఈ పార్లమెంటరీ కార్యదర్శులు చేసే పనేమిటి? ఎవరికి తెలుసు? ఎవరికి పట్టింది? వారికి మాత్రం తలా ఒక కారూ, కార్యాలయమూ, సొంత డబ్బా కొట్టుకునే హక్కూ లభిస్తాయి. 2014లో కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఆయన దిలీప్ కుమా ర్ సినిమాలోని ‘‘ఇన్సాన్ కో ఇన్సాన్ సే హో భాయ్ చారా, యెహీ పైగాం హమారా’’ (మనిషికి మనిషితో ఉన్నది సహోదర బంధం, అదే మా సందే శం) అనే పాటను పాడారు. 2015లో ఆయన సంగీతం జోలికె ళ్లకుండా నిగ్ర హం చూపారు. కానీ ఆయన ఈ దిలీప్కుమార్ పాటను పాడి ఉండా ల్సింది: ‘‘సాలా, మైతో సాహబ్ బన్ గయా’’(సాలా, నే నయ్యా యజ మానిని)... అరవింద్ కేజ్రీవాల్ సవరించిన నియమ నిబంధనావళిలో బావమరుదుల గతి ప్రవాస విషాదమే. సంప్రదాయకమైన భ్రష్ట సోదరులెవరికైనా సుస్వాగతం. -
బాపూ చింతనకు చోటుందా?
బైలైన్ నేటి భారతదేశాన్ని చూడండి. మహాత్ముని మాటలు, ముందుచూపు, ప్రవచనాలు లేని లోటు ఎంతగా ఉందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. యుద్ధ బీభత్సాన్ని చవిచూసిన నేలపైన అహింస అత్యంత సమంజసమైన భావనగా కనిపిస్తుంది. కానీ హీనపరిచే పేదరికాన్ని నిర్మూలించడం అంతకంటే తక్కువ ప్రాధాన్యం గలిగినది ఎలా అవుతుంది? మతం పేరిట హత్యలు, అల్లర్లు విచ్చలవిడిగా జరుగుతుండగా... మతాన్ని శాంతి, సామరస్యాల శక్తిగా చూపడం ఎంత కీలకమైనది? మహాత్ముడు జనవరి 2015లో తిరిగి మన పత్రికల్లో దర్శనమిస్తున్నాడు. ఇంచుమించుగా ఇది, జనవరి 2015లో మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ మాతృభూమికి రావడమంతటి స్వాగతించదగిన పరిణామం. 1915, దేశ చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన మైలు రాయిగా నిలిచిపోతుంది. గాంధీజీ జోక్యంతో భారత స్వాతంత్య్ర ఉద్యమం యూరోపియన్ వలస పరిపాలనాశకాన్ని అంతం చేసింది. మూడు వందల ఏళ్లుగా అప్రతిహతంగా సాగుతున్న యూరోపియన్ వలసీకరణ 20వ శతాబ్దం మొదటి దశాబ్దంలో మునుపెన్నడూ లేనంత బలంగా ఉన్నట్టు కని పించింది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యమని అనడం సుప్రసిద్ధం. గాం ధీ దేశానికి తిరిగి వచ్చాక ఏ సామ్రాజ్యంపైనా రవి ఉదయించడం ఎరుగం. 1869లో జన్మించిన గాంధీ 24 ఏళ్ల వయస్సులో అబ్దుల్లా సేథ్ అనే వ్యాపారి తరఫు న్యాయవాదిగా పనిచేయడం కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లారు. మోకాళ్ల కింది వరకు పొడవాటి కోటు, చారల ప్యాంటు, నల్ల తలపాగా, వాచీ, గొలుసు ధరించి ఆయన 1893 జవవరి 23న దర్బన్లో దిగారు. అక్టోబర్ 1901లో ఆయన ఏడాదిపాటు ఇంటికి తిరిగి వచ్చేటప్పటికే దేశం లోని ఉన్నత వర్గాల్లో ఆయన ఖ్యాతి వా్యిప్తి చెందడం ప్రారంభమైంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కలకత్తా సమావేశానికి ఆయన హాజరయ్యారు. వెళ్లేటప్పుడు దిన్షా వాచా (మహాసభకు అధ్యక్షత వహించాల్సిన వారు), ఫిరోజ్షా మెహతా, చిమన్లాల్ సెతల్వాద్ వంటి గొప్ప వ్యక్తులతో పాటూ కలిసి ఒకే రైలులో వెళ్లారు. అక్కడ మొదటి రాత్రి గడిపిన గాంధీ, ఉదయాన్నే వరండాలో ప్రతినిధులు మూత్ర విసర్జన చేసి ఉండటాన్ని చూసి నిర్ఘాంత పోయారు. అప్పటికింకా ‘అంటరానివారు’గానే పరిగణిస్తున్న దళితులు వచ్చే వరకు మిగతా వారిలాగా వేచి చూడలేదు. ఓ చీపురు అందుకొని ఆ పని ఆయనే చేసేశారు. 1901లో ఆయన బాటలో నడచినవారు ఎవరూ లేరు. గాంధేయవాద ఉద్యమం అంతటికీ మూల సారమైన ప్రతిపాదన ఒక్కటే. భారతదేశం ఓడిపోయినది బ్రిటన్ బలాధిక్యత వల్ల కాదు. స్వీయ బలహీనతల వల్ల వంచిత కావడం వల్లనే. అంటరానితనమనే శాపం, అజ్ఞా నం, మూఢవిశ్వాసం అనే చెడులను సమాజం నుంచి నిర్మూలించినప్పుడే దేశం కోలుకొని, ఆరోగ్యాన్ని పుంజుకుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే, అలాంటి కర్తవ్య నిర్దేశనకు నాంది పలికినది కలకత్తాకే చెందిన స్వామి వివేకానంద. ఆ మేధావిని కలుసుకోవాలని గాంధీ బేలూరు మఠానికి వెళ్లారు. కానీ స్వామి అప్పటికే బాగా అస్వస్థులై ఉండటంతో కలుసుకోలేకపో యారు. ‘‘భారతదేశం ‘మ్లేచ్ఛ’ (నీచ జాతి) అనే పదాన్ని కనిపెట్టిననాడే సరిగ్గా దాని పతనం లిఖితమైపోయింది... దేశం గుడిసెలోనే బతుకుతోందని గుర్తుంచు కోండి’’ అన్న వివేకానందుని బోధనను ఆయన అప్పటికే ఆచరిస్తున్నారు. అదే విధమైన ఆలోచన ధ్వనించేలా ‘‘ఇలస్ట్రేటెడ్ లండన్ న్యూస్’’లో (సెప్టెంబర్ 1909) బ్రిటిష్ రచయిత జీకే చెస్టర్టన్, నాటి భారత జాతీయవాదులపై రాసిన ఈ విషయాలను గాంధీ చదివారు: ‘‘నాకు వారం టే విసుగు పుడుతోంది. వారిపట్ల అనుమానం కలుగుతోంది. వారు కోరేది భారతీయమైనదీ కాదు, జాతీయమైనదీ కాదు... ఉదాహరణకు ఒక భారతీ యుడు ఇలా అంటాడు: ‘భారతదేశం తెల్లవారి నుంచి, వారి పనుల నుండి ఎల్లప్పుడూ దూరంగానే ఉండాల్సింది. వారిదైన ప్రతిదాన్లో ఏవో తప్పులు న్నాయి. అంతకంటే మా సొంతవే మేం కోరుకుంటాం... మా జీవిత విధానం మీకు (బ్రిటిష్వారికి) నచ్చకపోతే, మా దారిన మమ్మల్ని వదిలేయండి. వెళ్లండి, మీరిక సెలవు పుచ్చుకోండి.’’ చెస్టర్టన్ చాలా సరిగ్గానూ, ముందుచూపుతోనూ అలా అన్నారు. నిజమైన స్వరాజ్, స్వయంపాలనల మార్గం ఏదో తెలిసిన నిజమైన నేత ఆవిర్భవిస్తాడు. అతి కొందరు భారతీయులు మాత్రమే మాటల్లో పెట్టగలగడం కాదు... ఊహించ గలిగిన విషయాలను ఒక ఇంగ్లిషువాడు చెప్పాడు. గాంధీ జోహన్నెస్బర్గ్లో ప్రాక్టీసు కొనసాగించడానికి తిరిగి వెళ్లారు. కానీ ఆయన మనస్సు, హృదయం మరెన్నడూ భారతదేశాన్ని వీడి వెళ్లింది లేదు. హిందువులలో సంస్కరణ ప్రక్రియకు నేతృత్వం వహించాలంటే, ముందుగా హిందూతత్వాన్ని పూర్తిగా అవగతం చేసుకోవాలని గుర్తించారు. సంస్కృత, ఆంగ్ల భాషలలో భగవద్గీతను అధ్యయనం చేయడంలో మునిగిపోయారు. గీతాభక్తునిగా మారి, పద్దెనిమిది అధ్యాయాలలో పదమూ డింటిని కంఠతా పట్టారు. అందులోని అపరిగ్రహణం అనే (తనకంటూ ఏదీ కోరుకోరాదనే భావన) అంశం ఆయనను వివశుడ్ని చేసింది. భారతదేశం తన స్వీయ పాపాల నుంచి, భరింపశక్యం కాని వలస పాలనా భారం నుంచి విముక్తం కావడానికి పన్నెండేళ్లకు పైగా అత్యంత జాగ్రత్తగా సోపానాలను రూపొందించడం ద్వారా గాంధీజీ అందుకు తనను తాను సన్నద్ధం చేసుకున్నారు. ప్రతి మతానుయాయులకు ఒక నూతన సామాజిక కొలబద్ధను ఇచ్చి, మతాన్ని శక్తివంతమైన సాధనంగా ఆయన మలచారు: ప్రతి మత వ్యవస్థ సారం ఒక్కటే... శాశ్వత సత్వం. కాబట్టి మతం ఐక్యతకు మూలమేగానీ విరోధాలకు కాదు. 1915లో కలకత్తా విశ్వవిద్యాలయంలో, సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో, 1915లో బెనారస్ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవంలో గాంధీ జీ మూడు ప్రధాన ఉపన్యాసాలు చేశారు. 1916లో ఆయన తన రాజకీయ తాత్వికతలోని మూడు మౌలిక సూత్రాలను వివరించారు: 1) అహింస, 2) దేశంలోని అన్ని మతాల వారి మధ్య ఐక్యత, సంస్కరణ, త్యాగం, అంకితభావం, పరిశుభ్రత, 3) భవిష్యత్తు ఆకలితో, దరిద్రంతో అలమటిస్తున్నవారిదే. బెనారస్ విశ్వ విద్యాలయంలో ఆయన, వేదిక మీద ఆశీనులైన ‘‘గొప్పగా అలంకరించుకున్న ప్రభువుల’’ను అపహాస్యం చేశారు. భారత దేశాన్ని పరిరక్షించేది రైతే తప్ప న్యాయవాదులో లేక కులీనులో కారని ఆయన అన్నారు. 1916లో ఇది ఒక విప్లవాత్మక ఆలోచన. వందేళ్ల తర్వాత నేటి భారతదేశాన్ని చూడండి. ఆయన మాటలను, ముందుచూపును, సూత్ర ప్రవ చనాలను మనం ఎంతగా కోల్పోయామోనని ఆశ్చర్యం కలుగుతుంది. యుద్ధ బీభత్సాన్ని చవిచూసిన నేలపైన అహింస అత్యంత సమంజసమైన భావనగా కనిపిస్తుంది. కానీ హీనపరిచే పేదరికాన్ని నిర్మూలించడం అంతకంటే తక్కువ ప్రాధాన్యం గలిగినది ఎలా అవుతుంది? మతం పేరిట హత్యలు, అల్లర్లు విచ్చలవిడిగా జరుగుతుండగా... మతాన్ని శాంతి, సామరస్యాల శక్తిగా చూపడం ఎంత కీలకమైనది? గాంధీ దేశానికి తిరిగి వచ్చిన శతాబ్ది వత్సరంలోనే గాంధీ మొహం ప్రజా ప్రసార మాధ్యమాలలోకి తిరిగి వచ్చింది. ఇక కావాల్సిందల్లా గాంధీ చింతనకు, హృదయానికి చోటే. -
అసాధారణం మోదీ హ్యాట్రిక్
మోదీ వాగ్దానం చేసిన సుదూర గమ్యానికి చేరే దారి సునాయాసమైనదని ఆశించడం అత్యాశ. రాజకీయ వర్గంలోనూ, ప్రభుత్వ యంత్రాంగంలోనూ భారీ ఎత్తున జడత్వం ఉంది. అది అత్యుత్తమ లక్ష్యాలను సైతం నంగితనంగా మార్చేస్తుంది. స్వేచ్ఛ నిరంతర అప్రమత్తతను డిమాండు చేస్తుంది. ఎన్నికల వల్ల శిక్షకు గురవుతామనే భయం, ప్రతిఫలం దక్కుతుందనే ఆశా ఉండటం వల్ల రాజకీయాలు ఇంకా కచ్చితంగానే పనిచేస్తున్నాయి. దురదృష్టవశాత్తూ ప్రభుత్వంలోని ఇతర భాగాలకు ఎన్నికలను విస్తరింపజేయలేం. ప్రజలను నిర్ణేతలుగా వ్యవహరించడానికి అనుమతించలేనప్పుడు వారి తరఫున ప్రధాని ఆ పని చేయాల్సి ఉంటుంది. అభిప్రాయ సేకరణలు, ఎగ్జిట్ పోల్స్ తప్పు కాజాలవని కచ్చితంగా చెప్పగలమా? వాటి మధ్య వ్యక్తమయ్యే ఏకీభావం ఒక ధోరణిని ధ్రువపరుస్తుంది. కానీ అవి ఎందుకైనా మంచిదని తాము పేర్కొనే నిర్దిష్టమైన అంకెలకు 5 శాతం తేడా ఉండే అవకాశాన్ని బ్రాకెట్లలో ఉంచుకుంటాయి. దురదృష్టకరమైన ఆ పాత రోజుల్లో అది కేవలం 3 శాతంగా మాత్రమే ఉండేది. కానీ నేడు వ్యక్తిగత విచక్షణ సాహసానికి సమానార్థకంగా మారింది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలు రెంటిలోనూ బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని పిలుస్తారనడం ఖాయం. అయితే అది తన సొంత బలంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? లేక ఇప్పటి లేదా భవిష్యత్ మిత్రులతో కలిసి ఏర్పాటు చేస్తుందా? అనేది వేరే సంగతి. భారత ఓటర్లు ఓటు చేసినప్పుడల్లా నిర్ణయాత్మకంగానే ఓటు చేస్తారనే విషయాన్ని ఇటీవలి ఎన్నికల చరిత్ర రుజువు చేస్తోంది. 2009 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ అదే జరిగింది. అనిశ్చితికి తావు లేని విధంగా లేదా ‘సంకీర్ణం నిర్బంధాల’వల్ల పరిపాలన కష్టమైందంటూ డాక్టర్ మన్మోహన్ చూపిన సుప్రసిద్ధమైన సాకుకు తావు లేకుండా చేయాలన్నట్టుగా ఓటర్ల తీర్పు ఉంటోంది. భారీ ఎత్తున అవినీతిని అనుమతించ డాన్ని మిత్రపక్షాలు అధికారానికి చెల్లించక తప్పని మూల్యాన్ని చేశాయంటూ డాక్టర్ మన్మోహన్ ఇచ్చిన సుప్రసిద్ధమైన వివరణ ప్రజలకు ఏ మాత్రం రుచించలేదు. రాబర్ట్ వాద్రాకు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేకూర్చిన మేళ్లను లేదా మిత్ర పక్షాల ప్రమేయమే లేని ఆగస్టా హెలికాప్టర్ల కొనుగోలు వంటి వ్యవహారాలలో కూడా ఆయన అనేకమార్లు ఇదే ప్రముఖ పద ప్రయోగాన్ని వాడారు. ఇక స్పష్టంగా కనిపిస్తున్న రెండవ అంశం రాజకీయంగా మరింత ప్రాధాన్యం కలిగిన విషయాన్ని వెల్లడించింది. బీజేపీ ఎంత మంచి ఫలితాలను సాధించిందనే దానితో సంబంధం లేకుండానే కాంగ్రెస్ ఓడిపోయిందనేది నిస్సందేహం. కాంగ్రెస్ తన కున్న రెండు కీలకమైన ప్రాంతీయ దుర్గాల్లో మూడు లేదా నాలుగో స్థానంలో మిగిలే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఓటమికి గురైందనడం బహుశా సుతి మెత్తటి పద ప్రయోగమే కావచ్చు. ఢిల్లీ గద్దె దిశగా తిరిగి సాగించాల్సిన సుదీర్ఘ యాత్రను ప్రారంభించడానికి కాంగ్రెస్కు ఉన్న చిట్టచివరి సరిహద్దు ప్రాంతం మహారాష్ట్రే. కాబట్టి ప్రత్యేకించి అక్కడి ఫలితాలు దానికి ముఖ్యమైనవి. ఓట్ల లెక్కింపు ఇంకా ముగియక ముందే ఆ పార్టీలో అంతర్గత యుద్ధాలు మొదలయ్యాయి. తనకు ముందటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, వారి లాబీలే ఈ ఓటమికి కారణమని పృధ్వీరాజ్ చవాన్ బహిరంగంగానే తప్పు పట్టడం ప్రారంభించారు. ఆయనపై వారి ఎదురు దాడులూ మొదలయ్యాయి. అత్యంత అసమర్థుడైన, చిత్రమైన క్విక్జోటిక్ నేత రాహుల్ గాంధీ. ఆయనకు అండదండగా ఉండి, ప్రోత్సహించినది ఆయన తల్లి సోనియా గాంధీ. ఓటమికి అసలు కారకులు వారిద్దరే. అయినా వారిని తప్పు పట్టే సాహసం మాత్రం ఎవరికీ లేదు. పార్టీ లేదా దేశ ప్రయోజనాలకంటే అత్యున్నత స్థానానికి కుమారుని ఎదుగుదల నిలిచిపోవడమే ముఖ్య సమస్యగా ఆ తల్లి భావిస్తుంది. ఇక హర్యానాకు వస్తే ఎన్నికల మధ్యలో ముఖ్యమంత్రి భూపిందర్ హుడా, వాద్రాకు మేలు చేకూర్చే మరో భూ ఒప్పందానికి ఆమోదం తెలిపినప్పుడే లాంఛనంగా కాంగ్రెస్ ఓటమిని అంగీకరించారు. రాజకీయంగా కుప్పకూలిన పార్టీ శిథిలాల నుండి కాంగ్రెస్ అధికార కుటుంబం మరోసారి వ్యక్తిగత ఆస్తులను ఏరుకోవడం ప్రారంభించింది. నాలుగు నెలల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ అసాధారణమైన మూడు విజయాలను సాధించారు. మేలో బీజేపీకి లోక్సభలో ఉన్న స్థానాలను రెట్టింపు చేయడమే కాదు, 1985 తదుపరి మొదటిసారిగా ఒక్క పార్టీకి ఆధిక్యతను కట్టబెట్టారు. భారత పార్లమెంటరీ చరిత్రలో మరెవరూ అలాంటి భారీ గంతును వేసింది లేదు. రెండు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి చారిత్రాత్మకమైన రీతిలో ఆయన ఆయా శాసనసభలలోని బీజేపీ స్థానాలు పెరిగేలా ఆ పెరుగుదల స్థాయి విస్మయం గొలిపేదిగా ఉంది. ఓటమి గాయాన్ని మిగులుస్తుంది. అయితే విజయం ఆందోళనను కూడా కలిగిస్తుంది. ఎందుకంటే విజయం ఎప్పుడూ ఆకాంక్షల అశ్వాన్ని అధిరోహించే వస్తుంది.శాసనసభలోని అంకెలు ఆవశ్యకమైన బలానికి కొలబద్దే. కానీ అవే సరిపోవు. విషాదకరమైన ఇందిరాగాంధీ హత్య కారణంగా రాజీవ్గాంధీకి బహూశా మరెవరూ గెలుచుకోలేనంత ఎక్కువ మంది ఎంపీలు లోక్సభలో ఉండేవారు. కానీ ఆ సంఖ్య అనుభవానికి పరిహారం కాలేకపోయింది. తరచుగా ఆయన అనవసరమైన జాగ్రత్తకు, అత్యధికమైన నిశ్చితత్వానికి మధ్య ఊగిసలాడేవారు. షాబానో మనోవర్తి కేసు విషయంలో ఆయన చేసినది మౌలికమైన తప్పు. మితవాద లాబీల ప్రేరణతో పూర్తిగా అనవసరమైన జాగ్రత్త వహించి ఆయన దేశం తనపై ఉంచిన నమ్మకాన్ని దెబ్బతీశారు. పైగా ఆ చర్య మార్పు చెందుతున్న మన ఓటరు మానసిక స్థితిని కూడా తప్పుగా అంచనా కట్టింది. శ్రీలంకలో భారత సైనిక జోక్యం ఆవశ్యకమని ఆయన నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. ఇవి రెండూ ఆయన నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులు చేయడానికి రెండు ఉదాహరణ లు. నరేంద్ర మోదీ ప్రధాని పీఠంపైకి పైనుంచి ఊడిపడ్డవారేమీ కాదు. జాతీయ స్థాయి గుర్తింపును పొందగలగడానికి తగినంత విజయవంతగా ఆయన గుజరాత్లో పరిపాలన సాగించారు. తనకు ఏమి కావాలి? అనే విషయంలో ఆయనకు సంతులన దృష్టి ఉంది. ఫలితాలైనా ప్రకటించక ముందే ఆయన రెండవ దశ అయిన ప్రభుత్వం ఏర్పాటును ప్రారంభించారు. అయితే అలా అని ఆయన వాగ్దానం చేసిన సుదూర గమ్యానికి చేరే దారి సునాయాసమైనదని ఆశించడం అత్యాశ. రాజకీయ వర్గంలోనూ, ప్రభుత్వ యంత్రాంగంలోనూ భారీ ఎత్తున జడత్వం ఉంది. అది అత్యుత్తమ లక్ష్యాలను సైతం నంగితనంగా మార్చేస్తుంది. స్వేచ్ఛ నిరంతర అప్రమత్తతను డిమాండు చేస్తుంది. మన దేశ స్వాతంత్య్రానికి సంబంధించి పెద్దగా అప్రమత్తత అవసరం లేదు. పరిపాలన విషయంలో మాత్రం అవసరం. మనలోని ఉన్నత వర్గ స్వభావం జవాబుదారీతనం పట్ల విముఖతను కలిగిస్తుంది. ఎన్నికల వల్ల శిక్షకు గురవుతామనే భయం, ప్రతిఫలం దక్కుతుందనే ఆశా ఉండటం వల్ల రాజకీయాలు ఇంకా కచ్చితంగానే పనిచేస్తున్నాయి. దురదృష్టవశాత్తూ ప్రభుత్వంలోని ఇతర భాగాలకు ఎన్నికలను విస్తరింపజేయలేం. ప్రజలను నిర్ణేతలుగా వ్యవహరించడానికి అనుమతించలేనప్పుడు వారి తరఫున ప్రధాని ఆ పని చేయాల్సి ఉంటుంది. ఎం.జె. అక్బర్ -
ఉభయ తారకం మైత్రీ బంధం
జాతీయ ప్రయోజనాల బంధనాల నుండే అత్యుత్తమ వ్యూహాత్మక భాగస్వామ్యం ఉద్భవిస్తుంది. రెండు దేశాల జాతీయ ప్రయోజనాలు కలగలిసిపోయేది అక్కడే. చాలాకాలంగా భారత్, అమెరికా ప్రభుత్వాల మధ్య విశ్వాసం లోపించడంతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. వాటిని మరమ్మతు చేయడం మోదీ, ఒబామాల ముందున్న సవాలు. ప్రధాని నరేంద్రమోదీ ఐదు రోజుల అమెరికా పర్యటనలో న్యూయార్క్ నగర ప్రజలను ఉద్దేశించి, ఆ దేశ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడను న్నారు. ప్రవాస భారతీయుల్లో ఆయన అప్పుడే ఒక తరానికి సరిపడా ఉద్వేగోత్సాహాలను రేకెత్తించారు. ప్రభుత్వాధికారులు, శాసనకర్తలు, విద్యావేత్తలు. ఇంటెలిజెన్స్ అధికారుల నిలయమైన రాజధాని వాషింగ్టన్ గంభీరమైన, ఉదాసీన నగరం. ఉపన్యాస కళను పునర్ నిర్వచించడాన్ని ప్రారంభించి, ఇటీవలి కాలంలో అరుదైన తీరున దౌత్యనీతిని శక్తివంతం చేస్తున్న అసాధారణ భారతీయ నేత పేరు ఆ నగరంలో సైతం మారు మోగడం మొదలైంది. నరేంద్ర మోదీ, బరాక్ ఒబామాలు ఇద్దరూ అద్భుత వాక్చాతుర్యం కలిగిన ప్రజాస్వామిక ఉపన్యాసకుల విశిష్ట వర్గానికి చెందినవారే. ఆ విషయంలో ప్రధానంగా వారిద్దరూ ఒకరితో ఒకరు పోటీపడాల్సినవారే. భాష ఎంత పురాతనమైనదో ఉపన్యాస కళ కూడా అంతే పురాతనమై నది. ఫ్రెంచి విప్లవ కాలంలో ఆధునికార్థంలో అది ఒక రాజకీయ ఆయుధంగా మారింది. దిగువస్థాయి ప్రజలతో మాట్లాడటమంటేనే గౌరవానికి భంగకరంగా భావించిన ఫ్రాన్స్ రాజును, అతనిని అనుకరించిన ఆయన మంత్రు లను కూలదోసినది అలాంటి వాక్పటిమా శక్తే. రాజుల చెరసాలల్లో బందీగా ఉన్న ఉపన్యాస కళను విప్లవం విడుదల చేసింది. తద్వారా ఉపన్యాస కళ భావాల సేనా శ్రేణుల రక్షణలో వర్తమాన ప్రజాస్వామ్యానికి సుదీర్ఘ పయనం సాగించింది. ఆ సుదీర్ఘ ప్రయాణంలోనే అది సమానత్వవాదాన్ని సుస్థాపితం చేసింది. భారత అమెరికాలు స్వేచ్ఛాభీష్టపు ఖజానాలు మాత్రమే కాదు. అవకాశా లను పెంపొందింపజేసే సుసంపన్నవంతమైన గనులు. దౌత్యం అంటే వైరుధ్యాలను నియంత్రించి, సంఘర్షణను పరిమితం చేసి, సానుకూల అవకాశాలను ఉపయోగించుకుని, సహకారానికి అవకాశాలను సాధ్యమైనంతగా విస్తరింపజేసుకునే కళ. వాణిజ్య నిబంధనల విషయంలో విభేదాల కుదుపులున్నాగానీ, ఈ సానుకూలాంశానికి సంబంధించి బేరసారాలు సాపేక్షికంగా సులువు. గత కొన్నేళ్ల కాలంలో అలాంటి అనుబంధానికి సైతం ప్రేరణ కరువైంది. అయినాగానీ అనంగీకారానికి అవకాశాన్ని కల్పించి, ముందుకు సాగడానికి తగినంతటి సౌహార్ద్రత ఇంకా మిగిలి ఉంది. పాకిస్థాన్లోని అసంఖ్యాకమైన అంతర్గత సంఘర్షణలు మొదలుకొని, ఆఫ్రికా యుద్ధాల దిశగా అసమానంగా విస్తరించి ఉన్న సంక్షుభిత యుద్ధరంగంలో విస్పష్టంగా కనిపిస్తున్న గణనీయమైన ప్రమాదాలు పొంచి చూస్తున్నాయి. ఆ వాస్తవాన్ని గుర్తించే వ్యూహాత్మక భాగస్వామ్యపు సూచికల వివరాలను పొందు పరచడం రెండు దేశాలకు సవాలై నిలుస్తుంది. అటు అమెరికాకు గానీ ఇటు భారత్కు గానీ ఎడబాటు సౌఖ్యమేమీ కాదు. సకల రూపాలలోని శత్రువును అందుకోవడానికి మనం సహకరించుకోవాలి. లేకపోతే వాళ్లే మనల్ని అందుకోవడానికి సహకరించుకుంటారు. ఇవేవీ భౌగోళిక ప్రాంతం కోసం మాత్రమే జరుగుతున్న యుద్ధాలు కావు. స్థలం ఇక్కడ ద్వితీయమైనదే. ప్రధాన యుద్ధం భావజాలానికి సంబంధించినది. మత విశ్వాసాలకు అతీతంగా ప్రతి పౌరుడు సమానమని ప్రజాస్వామ్యం అనే సమ్మిళిత భావన ఎంచుతుంది. తద్విరుద్ధంగా మతరాజ్య వ్యవస్థలో అధికారం ఉగ్రవాదాన్ని శాశ్వత వ్యూహంగా ప్రయోగించే స్వయం నియమితులైన మతోన్మా దుల నియంత్రణలో ఉంటుంది. ఈ యుద్ధాలకు హృదయ స్థానంలో నిలిచేది ఆ రెండు పరస్పర విరుద్ధ భావనల మధ్య జరిగే సంఘర్షణే. సిద్ధాంత రీత్యా, శత్రువు స్వభావం, స్థానాలను గుర్తించడానికి సంబంధించి భారత్, అమెరికాలకు పెద్దగా సమస్యలేమీ లేవు. ఆచరణలో మాత్రం పాకిస్థాన్ అనే సమస్య ఉంది. పాకిస్థాన్ ఇప్పుడు భారత్కు సమస్యలోని అవిభాజ్యమైన భాగంగా మారింది. అమెరికా ఇంకా పాకిస్థాన్ను పరిష్కారంలో భాగంగానే పరిగణిస్తోంది. పాక్లోని అత్యంత శక్తివంతమైన రాజకీయ శక్తియైన సైన్యాన్ని మతరాజ్యవాద మిలిటెన్సీకి వ్యతిరేకంగా ఉపయోగించుకోగలమని అమెరికా భావిస్తోంది. భారత విశ్లేషణ దానికి పూర్తిగా విభిన్నమైనది. పాక్ సైన్యం ఒకవంక అఫ్ఘాన్లో తాలిబన్కు, మిగతా చోట్ల రాడికల్ జీహాదిస్టులకు సహాయం అందిస్తూనే... ఎప్పటికప్పుడు కుంటిసాకులతో ఉపయోగపడగల మిత్రునిగా పెంటగాన్, వైట్హౌస్లను మోసగించడంలో ఆరితేరింది. గత కొన్నేళ్లుగా పాశ్చాత్య దేశాల్లో పాకిస్థాన్కున్న విశ్వసనీయతలో అత్యధిక భాగం తుడిచిపెట్టుకుపోయిన మాట నిజమే. అయితే అదేమీ మటుమాయమై పోలేదు. పాక్ సైన్యం ఒసామాబిన్ లాడెన్కు సురక్షిత స్థావరాన్ని కల్పించడం లేదా హఫీజ్ సయీద్లాంటి ఉగ్రవాదులకు మద్దతునిస్తుండటం నిజాన్ని గుర్తించడానికి సరిపోయే రుజువులని అవి భావించడం లేదు. క్వెట్టాలోని సురక్షిత స్థావరం నుండే అఫ్ఘాన్ తాలిబన్ నేత ముల్లా ఒమర్ అమెరికా, నాటోలకు వ్యతిరేకంగా యుద్ధాన్ని సాగిస్తు న్నాడు. అయినా అమెరికా ప్రభుత్వం పాక్ వల్లె వేసే నీటి బుడగల సిద్ధాంతాలను విశ్వసిస్తుంది. భ్రమల్లో ఉండటం వల్ల ప్రమాదం రోజురోజుకూ పెరుగుతోంది. తాలిబన్ హెల్మాండ్ రాష్ట్రంలో సంప్రదాయక దాడిని ప్రారంభించడానికి సన్నాహాలు చేసేటంతటి ధైర్యాన్ని సమకూర్చుకుందనేది అఫ్ఘానిస్థాన్పై తాజా అంచనా. వాస్తవంగా యుద్ధం చేయగలపాటి సామర్థ్యంగల అఫ్ఘాన్ బలగాల సంఖ్య పది లేదా పదిహేను వేలకు మించదనీ, తీవ్ర ఓటమి ఒక్కటి ఎదురైతే చాలు అఫ్ఘాన్ సైన్యం చెల్లా చెదరైపోయి తమ జాతుల, తెగల దిశలకు మరలిపోతాయని తాలిబన్ నమ్ముతోంది. దీనికి తోడు ఈ ప్రాంతానికి ఇరాక్ నుండి తీవ్రమైన ముప్పు పొంచి ఉంది. అక్కడి సున్నీ ఖలీఫా రాజ్యం అంతర్జాతీయ యుద్ధానికి రెండో స్థావరంగా (తాలిబనీకరణ జరిగిన అఫ్ఘానిస్థాన్తో పాటు) మారాలని కోరుకుంటోంది. ఈ సమస్యకు సంబంధించి ప్రధాని మోదీ ఏ మాత్రం సహకారాన్ని అందిస్తారు లేదా అందించ జూపుతారు లేదా అసలు ఎంత సహకారం అవసరమవుతుంది అనే విషయాన్ని మనం ఇదమిత్థంగా చెప్పలేం. కానీ ఇది భారత్, అమెరికాల మధ్య వ్యూహాత్మక సమీకరణాన్ని అపారంగా బలోపేతం చేయగలిగిన అంశం. జాతీయ ప్రయోజనాల బంధనాల నుండే అత్యుత్తమమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉద్భవిస్తుంది. రెండు దేశాల జాతీయ ప్రయోజనాలు కలగలిసిపోయేది అక్కడే. పసిఫిక్ ప్రాంతంలోని వ్యూహాత్మక సహకారం పతాక శీర్షికలకు దూసుకు పోకపోవటం ఊరట కలిగించే అంశం. అది రెండు దేశాల మధ్య మరో ముఖ్యమైన లంకెను బలోపేతం చేస్తుంది. అయితే శ్వేత సౌధంలో ప్రధాని మోదీ, అధ్యక్షుడు ఒబామాలు కలుసుకునేటప్పుడు వారి ముందు నిలిచే మరో సవాలు కూడా ఉంది. చాలాకాలంగా రెండు ప్రభుత్వాల మధ్య విశ్వాసం లోపించడం కారణంగా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినిపోయాయి. ఇరువురు నేతలు వాటిని మరమ్మతు చేయాల్సి ఉంది. కొన్ని సందర్భాల్లో ఆశ వాస్తవాన్ని మించిన వేగంతో ముందుకు సాగి ఉండొచ్చు. ఉదాసీనత తరచుగా సంభావ్యతను హతమార్చీ ఉండవచ్చు. నరేంద్ర మోదీది ముక్కు సూటి వ్యవహారం. అమెరికా దాన్ని గౌరవిస్తుంది. (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) - ఎం.జె. అక్బర్ -
చరిత్రకు ఎవరైనా ఒక్కటే!
స్కాట్లాండ్ జాతీయవాదులు ఆధిక్యంలో ఉన్నారంటూ గత వారాంతంలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ ఫలితం వెల్లడించడంతో ఇంగ్లండ్ ఉలిక్కిపడింది. నెల క్రితం నిర్వహించిన ఒపీనియన్ పోల్లో స్కాట్లాండ్ జాతీయవాదులు ఇరవై శాతం పాయింట్లు వెనకబడి ఉన్నారు. ఎటూ తేల్చుకోని ఓటర్లలో సగం మంది ఇప్పుడు విభజనకే మొగ్గు చూపుతున్నారని తేలింది. దేశ విభజన అంటే బ్రిటిష్ వాడి కత్తితో మనకు మనం చేసుకున్న లోతైన గాయమని నమ్మే భారతీయుడికి ఆ దేశం గురించిన ఓ ఆలోచన ఎంతో కొంత సంతృప్తిని కలిగించకుండా ఉండదు. సెప్టెంబర్ 18న అక్కడ జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో బ్రిటన్ రెండు ముక్కలుగా చీలిపోవచ్చునన్న ఆలోచన అది. చరిత్రకు న్యాయం జరిగిందని అనిపించడం అరుదే అయినా, ప్రతీకారం లాంటిది ప్రతిధ్వనిస్తున్నప్పటికీ అన్నింటినీ పక్కనపెట్టి జరుగుతున్నది చూసి మనం సంతోషించగలం. ఇంగ్లండ్తో మూడు శతాబ్దాలుగా సాగిస్తున్న ఐక్యతను కొనసాగించే విషయం మీద సెప్టెంబర్ 18న ఓటుతో స్కాట్లాండ్ తన నిర్ణయాన్ని ప్రకటించబోతోంది. ఈ భూమండలం మీద ఎక్కడైనా ఇలాంటి ప్రజాభిప్రాయ సేకరణ ఆవిష్కృతమైందా? బ్రిటన్ ఆత్మాతిశయంతో కూడిన ఒక సమష్టి మనస్తత్వం కలిగిన ఊహాప్రపంచం. రెండుమూడు పార్టీల ఆ దేశ రాజకీయ వ్యవస్థ స్కాట్ ప్రాంత జాతీయవాదులకు ప్రజాభిప్రాయ సేకరణ జరిపేందుకు అవకాశం ఇవ్వడానికి అంగీకరించినందుకు చాలా ఆనందపడింది. స్కాట్లాండ్ వాసులు విభజనకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని సంపూర్ణంగా విశ్వసించడమే ఇందుకు కారణం. ఇలాంటి ధోరణి లండన్ నగరంలో మరీ విపరీతంగా ఉంది. ఎప్పుడూ దిలాసాగా ఉండే లండన్ మేయర్ బోరిస్ జాన్సన్కు ఇతర విషయాల కంటె గ్లాస్గో పబ్లలో కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడడమే ఎక్కువ ఇష్టం. స్కాట్లాండ్లో తగినంత ప్రచారం చేయడం గురించి ప్రధాని డేవిడ్ కామెరూన్ కూడా ఒక వారం క్రితం వరకు పెద్దగా పట్టించుకోలేదు. సంప్రదాయ పంథాలో నడిచే ‘స్పెక్టేటర్’ పత్రిక (ఒకప్పుడు జాన్సన్ ఈ పత్రిక సంపాదకుడు) ప్రముఖ కాలమిస్టుల రచనల నుంచి కొన్ని భాగాలను తీసి ప్రచురించింది. ఆగస్టు మధ్యలో ప్రచురించిన ఈ భాగాలలో కేవలం ‘స్కాట్లాండ్ ముక్క’ అని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు స్కాట్లాండ్లో ఇంకా డోలాయమాన స్థితిలో ఉన్నవారికి విభజనకే ఓటు వేయండి, అంటే ‘ఎస్’ అని చెప్పండి అంటూ ఇంగ్లిష్ ప్రముఖులు సంతకాలు చేసిన లేఖలు కూడా ఇవ్వగలరు. మీ సొంత బీరు, సొంత విమానయానం ఉంటే తప్ప మీది అసలు సిసలు దేశం కాలేదంటూ హాస్య చతురత అతిశయించిన ఆంగ్లేయులు తీర్మానించేశారు. స్కాట్లు స్కాచ్ అంటే ఇష్టపడతారు. అయితే స్కాట్లాండ్ జాతీయవాదులు మొదటిసారి ఆధిక్యంలో ఉన్నా రంటూ గత వారాంతంలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ ఫలితం వెలు వడడంతో ఇంగ్లండ్ ఒక్కసారి ఉలిక్కిపడింది. కానీ, ఒక నెల క్రితం నిర్వహించిన ఒపీనియన్ పోల్లో స్కాట్లాండ్ జాతీయవాదులు ఇరవై శాతం పాయింట్లు వెనకబడి ఉన్నారు. విభజనకు ఓటు వేయాలో, ఐక్యత వైపు మొగ్గాలో ఇంతవరకు తేల్చుకోని ఓటర్లలో సగం మంది, ఇప్పుడు విభజన దిశగానే చూస్తున్నారని తేలింది. అమెరికా కాలనీ నుంచి తిరిగి వచ్చిన కారన్వాలిస్ యుద్ధంలో జార్జి వాషింగ్టన్ గెలిచాడని చెప్పిన క్షణంలో అంతకు ముందెన్నడూ అంత తీవ్రంగా లండన్ బెదిరి ఉండకపోవచ్చు. దృఢమైన వాదనే ఒప్పించ గలిగింది. స్కాట్లాండ్ ఇంగ్లండ్ను వీడిపోలేదు. అది ప్రపంచంలో ఒకటైంది. నిజానికి 18న జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో అత్యధికులు విభజనకు అనుకూలంగా ఓటు వేస్తారన్నది ఇప్పటికీ నిశ్చయమేమీ కాదు. కానీ ఒకటి మాత్రం నిజం. గెలుపును నిర్ణయించే మార్జిన్ ఓట్లు అతి స్వల్పంగానే ఉంటాయి. కాగా, గ్రేట్ బ్రిటన్ బతికి బట్టకట్టగలిగినా కూడా ఒకింత రాజకీయ ఐక్యతతో ఉంటుందే తప్ప, భౌగోళిక ఐక్యతకు నోచుకోదు. స్కాట్లాండ్కు ఎప్పుడూ తనదైన ఒక ఫుట్బాల్ ఆటగాళ్ల బృందం ఉంది. అయితే ఈ బృందం ఇంగ్లండ్ బృందం కంటే ఎప్పుడూ మెరుగ్గా లేదన్నది నిజం. అయినా ఆ క్రీడ ద్వారా ఉనికిని చాటుకోవడానికి వారికి ఉన్న హక్కుకు నీళ్లు వదులుకోవడం మంచిద ని స్కాట్లాండ్ను ఒప్పించడానికి ఇంగ్లండ్ ఏనాడూ ప్రయత్నించలేదు. ఫుట్బాల్ ఆట పురాతనత్వానికి ప్రతీక. దానిని పాలన కోసం చేసుకున్న ఆధునిక ఏర్పాట్లు తుడిచిపెట్టలేవు. తీర్పు మాటెలా ఉన్నా, ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఒక స్ఫూర్తిని పునరుజ్జీవింప చేయవచ్చునని అనిపిస్తుంది. పౌండ్ అనే కరెన్సీతో కొనడం సాధ్యం కాని స్ఫూర్తి అది. కలిపి ఉంచాలన్న తమ ప్రయత్నాలు విఫలమైతే బ్రిటన్ అనుకూల లాబీ గుండె చెదరవచ్చు. ఒకవేళ విజయం ఆ లాబీని వరిస్తే, ఆ విజయాన్ని ఇంకా గుర్తించవలసి ఉన్నప్పటికి కూడా దానికి చాలా మూల్యం చెల్లించి బ్రిటన్ కొనుగోలు చేయవలసి ఉంటుంది. అది బ్రిటన్ చిరకాలం పాటు భరించలేనంత మూల్యం. యాభై లక్షల సమూహంతో సాంస్కృతికంగా, ఆర్థికంగా బలంగా ఉండే ఒక సమాజాన్ని ఏర్పాటు చేసుకోగలిగిన సామర్థ్యం తాము కలిగి ఉన్నామని ఇప్పటికే ఎక్కువ మంది స్కాట్లు నమ్మకానికి వచ్చారు. ఈ రెండు కూడా యునెటైడ్ కింగ్డమ్లో సాధ్యమేనని లండన్ నిర్ధారించవలసి ఉంది. ఇలాంటి స్కాట్లాండ్కు కావలసిన ముద్రను ఎవరు ఎంపిక చేయగలరు? ఒకే పతాకం కింద ఉండాలని ముందు నుంచి చెప్పిన ఇంగ్లిష్ భాషే. ఇక సెప్టెంబర్ 18, 2024న ఇంగ్లండ్లో ఇంగ్లిష్ స్వాతంత్య్రం కోసం బ్రిటన్ ప్రజాభిప్రాయ సేకరణ జరపడానికి ఇక అడ్డం ఏమిటి? ఈ ఆలోచనను కొట్టి పారేయవద్దు. పడుగుపేకల వంటి ఈ దేశాలలో ఇంకా విచిత్రమనిపించే సంఘటనలే చోటు చేసుకున్నాయి. ఇంగ్లండ్, స్కాట్లాండ్ల వైవాహిక జీవితం ఇక ముగిసిన అధ్యాయం. విడాకుల తతంగం విఫలమైతే, అందుకు కారణం ఒక భాగస్వామి దీర్ఘకాలం పాటు మనలేని ఆర్థిక షరతులు విధించడానికి ప్రయత్నిస్తూ ఉండడమే. ఒకప్పుడు ఈ వైవాహిక జీవితం సజావుగా సాగిన మాట నిజమే. ఎందుకంటే ఇంగ్లండ్, స్కాట్లాండ్లు కలసి సంతానాన్ని సృష్టించాయి. ఆ సంతానాన్ని సాకాయి. ఆ సంతానం నుంచి ఆ రెండు ప్రాంతాలు కూడా విశేషంగా లబ్ధి పొందాయి. వాటినే కాలనీలు అని పిలిచారు. సంపద్వంతమైన భారత్ కూడా ఆ కుటుంబంలో ఒకటి. మిగిలిన సంతానం వలెనే భారత్ కూడా పెరిగి పెద్దదై, తన కాళ్ల మీద తాను నిలబడింది. ఈ సంతానం ఇప్పుడు చుట్టం చూపుగానే ఇంగ్లండ్ను చూస్తున్నది. అంత వరకే. ఇప్పుడు భారతీయులు ఎలిజబెత్ అనే పేరు గల అమ్మను చూడ్డం కంటే అంకుల్ని చూడ్డానికి ఎక్కువ తహతహలాడుతున్నారు. ఆయన పేరు శామ్. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరూ బాగానే స్థిరపడ్డారు. కానీ ఒకరికి ఒకరు ఏమీ కానట్టు వ్యవహరిస్తున్నారు. సెంటిమెంట్ అంటే పెద్దగా పట్టింపు లేని స్కాట్లాండ్ ఇప్పుడు మరింత వాస్తవికంగా వ్యవహరించదలిచింది. విభజనకు వేళయిందని భావిస్తోంది. ఇంగ్లండ్ ఇప్పుడు ఎలాంటి భరణం లేకుండానే కొత్త హనీమూన్ కోసం బెదిరిస్తోంది. ఏం జరుగుతుందో మనం చూస్తాం. ప్రాథమికంగా చెప్పాలంటే బంధపు శ్వాస మాత్రం ఆగిపోయింది. దానిని ఇప్పుడు ఖననం చేయకుంటే, తరువాతైనా ఆ పని చేయక తప్పదు. (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) - ఎం.జె. అక్బర్ -
జనహృదయమెరిగిన ప్రధాని
పోటీదారుల కన్నా మెరుగ్గా నిలవటం మోడీకి సమస్య కాదు. ఎన్నికల ప్రచారంలో తాను నెలకొల్పిన అసాధారణ ప్రమాణాలనే ఆయన అధిగమించాల్సి ఉంది. దేశానికి గమ్యాన్ని నిర్దేశించి, ప్రాధాన్యాలను ఎంచుకుని, వాటిని నెరవేర్చగలిగే రూట్ మ్యాప్ను తయారు చేయాల్సి ఉంది. గమ్యం లేకుండా ఎంత ఎగిరినా మిగిలేది సుదీర్ఘ ప్రయాణ ప్రయాసే. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలోని ఉపన్యాస వేదికకు తరలేటప్పుడు ఏ ప్రధానమంత్రి అయినా మూడిట్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవలసి ఉంటుంది. తమ ప్రభుత్వాన్ని ఉద్దేశించే ప్రసంగించడం లేదా తమలో తాము గొణుక్కోవడం లేదా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం. మొదటిది సులువు. ఎందుకంటే ప్రభుత్వమే అందులో కథనమూ, కథకుడూ కూడా. మేం ఇది చేశాం (చప్పట్లు), మేం ఇది చేయబోతున్నాం (తప్పనిసరి చప్పట్లు) అంటూ ఏకరువు పెట్టి స్వీయ ప్రశంసల మిథ్యా సౌఖ్యాన్ని అనుభవించే అవకాశం అందులో ఉంది. ఇక రెండోది, ఆత్మవిశ్వాసం కొరవడటం పర్యవసానమే తప్ప ఆత్మావలోకనం కొరవడటం కాదు. మన్మోహన్ సింగ్ దాన్ని అలవాటుగా మార్చుకున్నారు. తాను సంకోచించవ లసినది చాలానే ఉన్నదని ఆత్మావలోకనం ద్వారానే బహుశా ఆయనకు బోధపడి ఉండాలి. అధినేతతో అనుబంధం చెడి పోయినా ఆమెకు మోకరిల్లక తప్పని విలక్షణమైన ప్రధాని మన్మోహన్. అధికారాన్ని సోనియాగాంధీ, ఆమె చపల చిత్తపు కుమారుడు రాహుల్గాంధీ అనుభవిస్తుండగా, ఆయన బాధ్యతలకు కట్టుబడి ఉండవలసి వచ్చింది. నష్టం వాట్లిలింది దేశానికి. ప్రధాని నరేంద్రమోడీ దేనిని ఎంపిక చేసుకున్నారో చెప్పిన వారికి బహు మానాలు లభించే అవకాశమేమీ లేదు. ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లా డారు. పోటీదారుల కన్నా మెరుగ్గా నిలవటం ఆయన సమస్య కాదు. ముమ్మ రంగా సాగిన ఎన్నికల ప్రచారంలో తాను నెలకొల్పిన అసాధారణ ప్రమాణా లనే ఆయన అధిగమించాల్సి ఉంది. ఇప్పుడాయన గమ్యాన్ని నిర్దేశించాల్సి ఉంది. ఆ దృష్టి నుండీ ప్రాధాన్యాలను ఎంచుకోవాలి. వాటిని నెరవేర్చడానికి తగిన రూట్ మ్యాప్ను తయారు చేసుకోవాలి. గమ్యం అంటూ లేకుండా ఎంత ఎగిరినా సుదీర్ఘ ప్రయాణపు ప్రయాస తప్ప ఎక్కడికీ చేరలేరు. మోడీ అసలు సారం ఏమిటో ఆగస్టు 15 ఉదయాన విన్నాం, కన్నాం. ఆయన హృదయం ఆకాశపు అంచును నిర్దేశిస్తే, బుద్ధి దిక్సూచీలోని అయస్కాంతమైంది. దేశ ప్రగతి ప్రభుత్వ కార్యక్రమమేమీ కాదు, ప్రజలందరి కార్యక్రమం అనే అంశం చుట్టే ఆయన సందేశపు ఉరవడి తిరిగింది. ఒక్క పోలికతో ఆయన ఆ విషయాన్ని చక్కగా చెప్పారు. 125 కోట్ల మంది భారతీయులు ఒక్కొక్కరూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తే, దేశం 125 కోట్ల అడుగులు ముందుకు పోతుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రధాని ప్రసంగం షేర్ హోల్డర్ల వార్షిక సమావేశంలో సమర్పించే పద్దుల చిట్టాలా ఉండేది. మోడీ దానిని నిశిత పరిశీలన అనే ఇరుసుపై తిరుగాడే ముల్లుగా మార్చారు. మన జాతీయ స్వభావంలో ఏవైనా చెడులు ఉంటే వాటిని ఎత్తి చూపటంతోపాటు, అది పేదరికం లేదా లైంగిక వివక్షతతో కూడిన నేరాల వంటి శాపాలు లేదా అప్రతిష్టలపైకి వెలుగును ప్రసరింపచేసింది. ఇది నిరాశావాదం కాదు, వాస్తవిక వాదం. లక్ష్యం సాధించగలిగినది మాత్రమే కాదు, చేతికి అందుబాటులోనే ఉంది అనే విశ్వాసంతో మోడీ దేశ మానసిక స్థితిని మార్చేశారు. ఆ దార్శనికతనే ఆయన ప్రజలకు అందించారు. ఎర్రకోట దగ్గర మారుమోగిన చప్పట్లలో అతి గట్టిగా ధ్వనించినవి టీనేజీ బాలల చప్పట్లే. అవి దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాలలోని కోట్లాది మంది ప్రజల ఆశల ప్రతిధ్వనులు. పెల్లుబికిన ఆనందోత్సాహాలు వివరణకు అందేవే. మన దేశానికి ప్రధానమంత్రి మాత్రమే కాదు, నేత దొరికాడు. ప్రధాని మోడీ ఎవరూ అడగని ప్రశ్నలను లేవనెత్తారు. కూతుళ్లను నిర్లక్ష్యం చేస్తూ మనం కొడుకుల పట్ల ఎందుకు గారం చేస్తున్నాం? ఆడపిల్లలను పిండదశలోనే చిదిమేసే అత్యంత అవమానకరమైన స్థితికి బాధ్యులు ఎవరు? మన ఇళ్లను, వీధులను, దేశాన్ని పరిశుభ్రం చేసుకోవడానికి మనకు చట్టాలు అవసరమా? కుల, మత హింస అనే కాలకూట విషానికి అంతం ఎప్పుడు? ఒక పదేళ్లపాటు సామరస్యాన్ని పాటించి ఫలితాలను మీరే చూడండి అంటూ ఆయన ప్రజలకు సవాలు విసిరారు. ఇలాంటి ప్రశ్నలను సంధించడం బహుశా ఢిల్లీ దర్బారుకు వెలుపలివారికి మాత్రమే సాధ్యమేమో. ప్రధాని మోడీ తనను తాను అలాగే అభివర్ణించుకున్నారు. అందుకే మోడీ ఢిల్లీ దర్బారు లోని భారత ప్రజాస్వామ్యపు అతి శిష్ట వర్గానికి, రాజకీయ-అధికార యంత్రాంగాన్ని నియంత్రించే వర్గం వారికి సంబంధించిన సర్వ సామాన్య సత్యాన్ని విస్పష్టంగా చూడగలరు. తీవ్ర సంస్కరణ తప్ప మరేదీ సరిదిద్దలేనంతగా వారి మధ్య సాగే అంతర్యుద్ధాలు పరిపాలనను పాడు చేశాయని చెప్పగలిగే నాయకత్వం కావాలి. మోడీ అలాంటి నాయకత్వాన్ని అందించగలరు. ప్రణాళికా సంఘం దాని అసలు లక్ష్యానికే కొరగాకుండా పోయింది. ఆ కారణంగానే మోడీ దాని మరణ సంతాప సందేశాన్ని వినిపించారు. అత్యంత తీవ్ర జాతీయ సంక్షోభమైన పేదరికం పట్ల గత పదేళ్లుగా అనుసరించిన స్వయం సంతృప్తికర, నిస్సార వైఖరే, దాని ముఖ్య వైఫల్యం. సామాన్యమైన అంచనాకు సైతం అది కనబడుతుంది. ఆరు దశాబ్దాల ప్రణాళికా బద్ధమైన ఆర్థిక వ్యవస్థలో పేదరిక రేఖకు దిగువనే ఉన్న భారతీయుల సంఖ్య కేవలం అతి స్పల్పంగా, ఏడాదికి అర శాతం (0.5 శాతం) చొప్పున తగ్గుతూ వచ్చింది. ఇది దిగ్భ్రాంతికరమైనదీ, ఆమోదయోగ్యం కానిదీ.రాష్ట్రాలతో సహకారం ద్వారా సమస్యలకు పరిష్కారాలను అన్వేషించాల్సింది పోయి ప్రణాళికా సంఘం రాచరిక ఆదేశాల పరంపరగా శాసించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు అది కేంద్రాన్ని బిచ్చమడుక్కుంటే ఒకటో రెండో మెతుకులు దక్కుతాయని బోధించేది. చట్ట రీత్యా, ఆచరణ రీత్యా కూడా మనది సమాఖ్య దేశం. కొన్ని చిన్న కేంద్రపాలిత ప్రాంతాలను మినహాయిస్తే, దేశంలోని మరే ప్రాంతాన్నీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా పరిపాలించడానికి వీల్లేదు. రాష్ట్ర ప్రభుత్వాల ద్వారానే అభివృద్ధి పనులు అత్యుత్తమంగా సాగుతాయి. కేంద్రం అందుకు దోహదకారే తప్ప నియంత కాదు. ప్రపంచం మారిపోతోంది. మనం దానికి అతీతంగా ఉండలేం. సాంకేతికపరమైన నూతన ఆవిష్కరణలు, అత్యధునాతన వస్తు తయారీ ప్రధానంగా ప్రైవేట్ రంగంలోనే సాగే శకం ఇది. అందువలన మనకు అంతర్జాతీయ సహకారమనే సృజనాత్మక శక్తి అవసరం. పేదరికానికి అత్యుత్తమ విరుగుడు పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలోని ఉపాధి కల్పనే. వ్యక్తిగత సంక్షేమాన్ని అది జాతీయ వృద్ధితో అనుసంధానిస్తుంది. ప్రధాని మోడీ అన్నట్లుగా భారత్ ప్రపంచ వస్తు తయారీరంగ కేంద్రంగా మారడానికి సన్నద్ధమై తీరాలి. కలలు నిజమయ్యేది మేలుకుని ఉన్నప్పుడు మాత్రమేనని ప్రధాని మోడీకి తెలుసు. నిద్రలో నడకతో అద్భుత స్వప్నం దిశగా మీరు ముందుకు పోజాలరు. జాతిని జడత్వం నుంచి మేల్కొల్పగల అభీష్టశక్తి ఆయనకుంది. రానున్న మాసాల్లో అది ఎలాగో మీరు చూస్తారు. (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) - ఎంజే అక్బర్ -
ఎన్ని జన్మలు కావాలి?
సోనియాగాంధీకి ఒకప్పుడు సన్నిహితుడైన నట్వర్సింగ్ ఆమె వ్యక్తిత్వం గురించి, యూపీఏ హయాంలో ఆమె చేసిన అధికార వినియోగం లేదా దుర్వినియోగం గురించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తారు. సోనియా దాచి ఉంచాల్సింది ఏమైనా ఉందా? అనేదే కేంద్ర సమస్య. ‘అవును’ లేదా ‘కాదు’ అనే సరళమైన ఓ చిన్న సమాధానం చెబితే చాలు. ఒక్క వాక్యంలో చెప్పగలిగేదానికి పెద్ద పుస్తకం రాయడం అవసరమా? సోనియాగాంధీ తన జ్ఞాపకాలను గ్రంథస్తం చేయాల్సి ఉండటానికి ప్రశస్తమైన కారణాలెన్నో ఉన్నాయి. కున్వర్ నట్వర్సింగ్ రాసిన ‘ఒక్క జన్మ చాలదు’ ఆత్మకథ మాత్రమే అందుకు కారణంగా సరిపోదు. నేడు సోనియా పాలిటి శాపంగా మారిన నట్వర్సింగ్ ఒకప్పుడు ఆమెకు ‘సన్నిహిత మిత్రుడు.’ సోనియా గాంధీ వ్యక్తిత్వం గురించి, యూపీఏ అధికారంలో ఉన్న 2004-2014 దశాబ్దంలో ఆమె అధికార వినియోగం లేదా దుర్వినియోగం గురించి ఆయన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తారు. ఆయన వెల్లడించిన విషయాలు, చేసిన వ్యాఖ్యలు విశ్వసనీయమైనవిగా అనిపిస్తున్నాయి. కాబట్టే మీడియాలోనూ, ప్రజల్లోనూ అవి కొంత కాక పుట్టించ గలుగుతున్నాయి. అందువల్ల ఆ ప్రశ్నలకు ఎప్పుడో కొన్నేళ్ల తర్వాత కాదు, ఇప్పుడే సోనియా గాంధీ సమాధానం చెప్పాలి. సోనియా దాచి ఉంచాల్సింది ఏమైనా ఉందా? అనేదే కేంద్ర సమస్య. ‘అవును’ లేదా ‘కాదు’ అనే సరళమైన ఓ చిన్న పదంతో సమాధానం చెబితే సరిపోతుంది. సోనియా దాచుకోవాల్సిందేమీ లేకపోతే... ఆమె, ఆమె కూతురు ప్రియాంకాగాంధీ మే నెలలో నట్వర్సింగ్ను కలసి ఆ పుస్తకంలోని కొన్ని భాగాలను తొలగించాలని ఎందుకు ప్రాధేయపడాల్సి వచ్చినట్టు? తన ఒకప్పటి సహచరుడు, సలహాదారు, మిత్రుడు కట్టుకథలను కల్పించారనుకుంటే అందుకు అత్యంత సమర్థవంతమైన తరుణోపాయం ఆమెకుంది. ఆ రచయితపైనా, ప్రచురణకర్తలపైనా పరువు నష్టం దావా వేయవచ్చు. గెలిస్తే భారీగా పరిహారాన్ని కోరవచ్చు. ఆమె తరఫున కోర్టుకు హాజరుకావడానికి పార్టీ పరివారంలో కావాల్సినంత మంది లాయర్లున్నారు. గంటలోగానే కోర్టు నోటీసు పంపవచ్చు. కాంగ్రెస్ ప్రతిస్పందన ఇంతవరకు జనాంతికంగా గుంజాటనపడటానికి లేదా బహిరంగంగా రంకెలేయడానికి మధ్య తారట్లాడుతోంది. టీవీ ముందుకు వచ్చే నిస్సహాయులైన కాంగ్రెస్ అధికారిక ప్రతినిధులు తీవ్ర స్థాయి స్వరాలతో విషయాన్ని దారి మళ్లించే క్రీడకు పాల్పడుతున్నారు. ఢిల్లీ గురించి అడుగుతుంటే ముంబైపై తీవ్ర దాడికి దిగుతారు. విస్తృతంగా ప్రచారం సాగినట్టుగా 2004లో సోనియాగాంధీ తమ అంతరాత్మ ప్రబోధం మేరకే ప్రధాన మంత్రి పదవి వద్దనుకున్నారా? లేక ఆమె కుమారునిలోని భయాల వల్ల కాదన్నారా? అని అడిగి చూడండి. సూటిగా సమాధానం చెప్పక పోగా రచయితపై అంతులేని దూషణలకు దిగుతారు. ఏది ఏమైనా, పులోచ్ ఛటర్జీ అనే ఉన్నత ప్రభుత్వోద్యోగి అధికారిక ఫైళ్లను సోనియాకు చూపిన వైనం ముందు అది వెలవెలబోతుంది. భయపడటం చట్టవిరుద్ధం కాదు. అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించడం మాత్రం చట్టవిరుద్ధం. సోనియాగాంధీకి ఏ ఫైళ్లను చూపిన సంగతి తనకు తెలియదని మన్మోహన్ సింగ్ ప్రశాంతంగా చెప్పొచ్చు. కానీ ఆయన అలా అంటారా? అనరా? అనకపోతే ఆయన కూడా దోషే అవుతారు. సోనియా తనను బలిపశువును చేయాలని అనుకోవడం వల్లనే సద్దాం హుస్సేన్ ‘చమురుకు బదులు ఆహారం’ కార్యక్రమంలో ‘‘కాంట్రాక్టేతర లబ్ధిదారుల’’లో ఒకరిగా చేర్చి 2005లో తనను ఉన్నత పదవి నుంచి, తదుపరి కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించారని నట్వర్సింగ్ ఆరోపించారు. ఆయన అన్నదానిలోని బహువచనం ‘లబ్ధిదారులు’ను గమనించాలి. వారిలో ‘‘ఏఐసీసీ’’ ఉంది. సోనియా, నట్వర్సింగ్పై చేసినంత తీవ్ర దాడిని ఏఐ సీసీలో మరెవరిపైనా, ఎన్నడూ చేయలేదనడం నిస్సందేహం. ఏఐసీసీలో ఇద మిద్దంగా ఎవరు ఆ పాత్రను నిర్వహించారో కనిపెట్టే ప్రయత్నాన్ని సోనియా గానీ లేదా కాంగ్రెస్ గానీ చేసింది లేదు. తర్వాతి కాలంలో టెలికాం లేదా బొగ్గు అవినీతి కుంభకోణాలు బద్దలైనప్పుడు గానీ లేదా ఆమె అల్లుడు రాబర్ట్ వాద్రా గంతులేస్తూ సంపన్నుడైపోయినప్పుడు గానీ ఆమె అలాంటి తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించలేదు. నట్వర్సింగ్ తన గౌరవానికి విలువనిచ్చే మనిషి. దౌత్య రంగలో ఆయన విశిష్టమైన పదవులను నిర్వహించినవారు. మంచి విషయ పరిజ్ఞానం గల వారు. సోనియా, కుటుంబంలోని మూడు తరాలకు ఆయన సన్నిహితుడు. మే సమావేశంలో సోనియా ఆయన తాను పిల్లలతో సైతం పంచుకోలేని విషయాలను పంచుకోగలిగిన ఆంతరంగికుడని కుమార్తె ప్రియాంకాగాంధీకి చెప్పారు. సోనియా, కాంగ్రెస్లు ఆయనను దుష్టునిగానో లేదా కపటిగానో చిత్రించే ప్రయత్నం చేయవచ్చు. కానీ మౌలికమైన ప్రశ్న మాత్రం మాయమై పోదు. ఆయన రాసిన పుస్తకం ఒట్టి చెత్త కుప్పే అయితే, ఆయన ఇంటికి పోయి ప్రాధేయపడటం కోసం ఆమె అంతటి అపారమైన మానసిక ప్రయాస పడి ఉండేవారేనా? తన నైతికతను ముక్కలు చెక్కలు చేసి, నిర్దాక్షిణ్యమైన రాజకీయ యంత్రంలో వేసి తోలు వలిచేయడంతో 2005లో నట్వర్సింగ్ కుంగిపోయా రనేది స్పష్టమే. అలాంటి గాయాల గుర్తులను తాత్వికత దాచలేదు. అయితే ఆయన సార్వత్రిక ఎన్నికలకు ముందే తన పుస్తకాన్ని ప్రచురించడాన్ని అనుమతించ లేదు. తద్వారా ఆయన సోనియాగాంధీకి, కాంగ్రెస్కు గొప్ప మేలు చేశారు. లేకపోతే మరింత ఎక్కువ నష్టం వాటిల్లేది. సోనియాగాంధీ కేవలం కాస్త గడువును సంపాదించుకోవడం కోసం మాత్రమే గాక, నిజంగానే ఆమె వైపు నుంచి తన కథనాన్ని వినిపించదలు చుకుంటే ఓ కరపత్రాన్ని గాక పుస్తకాన్నే తన పేరిట వెలువరిస్తారని ఊహించవచ్చు. ఒకప్పటి చక్రవర్తులు తమ అధికారిక కథన రచనకు అత్యుత్తములైన మేధావులను నియమించేవారు. మొఘల్ చక్రవర్తుల తర్వాత భారత్ను పరిపాలించిన బ్రిటిష్ రాజ్లోని దొరలు, దొరసానులు, దండిగా జ్ఞాపకాలను రచించిన వారు. అది, పదవీ విరమణకు చిట్టచివరి వీడుకోలుకు మధ్యన తప్పక చేయాల్సిన కర్మకాండ. 1947 తర్వాతి వారి వారసులు ‘ఇంగ్లిష్ ఇండియన్లు’ సైతం ఈ రచనా రంగంలో ఏమంత వెనుకబడింది లేదు. అదో గొప్ప వారసత్వం. అధికారాన్ని రుచి చూసినవారికి తమ చారిత్రక ప్రాధాన్యాన్ని కొలిచేది జ్ఞాపకం కొలబద్ధతోనే అని తెలుసు. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు దశలో యాల్టా కాన్ఫరెన్స్ జరిగింది. ఆ సందర్భంగా రోజంతా సాగిన క్లిష్టమైన సంప్రదింపుల తదుపరి ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, జోసెఫ్ స్టాలిన్, విన్స్టన్ చర్చిల్ లు విశ్రాంతిగా గడుపుతుండగా... చరిత్ర తమను గురించి ఎలా అంచనా వేస్తుందోనని రూజ్వెల్డ్ విస్తుపోయారు. రూజ్వెల్డ్ నిరాశావాది, స్టాలిన్ అంతుబట్టనివాడు, చర్చిల్ ఉల్లాసవంతుడు. తనను లిఖించి తన పట్ల చర్చిల్ దయతో ప్రవర్తించాడని చరిత్ర తేల్చి చెప్పింది. దానికి తథాస్తు. (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) ఎంజే అక్బర్ -
‘వారసులు’ శివాజీని మరిచారా?
ప్రజలు గొప్ప కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ఔరంగజేబు చక్రవర్తి 1679లో జిజియా పన్నును విధించాడు. దీన్ని నిరసిస్తూ శివాజీ ఆయనకు ఓ లేఖను పంపాడు. ప్రముఖ చరిత్రకారుడు సర్ జాదూనాథ్ సర్కార్ దాన్ని నమోదు చేశారు. ఔరంగజేబు పూర్వీకులు అక్బర్, జహంగీర్, షాజహాన్లకు సైతం ముస్లిమేతరుల పట్ల వివక్షను చూపే ఆ పన్ను వసూలు అధికారం ఉండేది. ‘‘అయినా వివిధ మతాలకు, ప్రవృత్తులకు ఉదాహరణగా మనుషులందరిని, ఎక్కువ తక్కువలను భగవంతుడే సృష్టించాడని వారు విశ్వసించారు. కాబట్టే మత దురభిమానానికి వారు తమ హృదయాల్లో తావివ్వలేదు.’’ అల్లాను ఖురాన్ ‘‘రబ్ అల్ ముసల్మాన్ (ముస్లింలకు మాత్రమే దేవుడు)అనడానికి బదులుగా రబ్ అల్ అలామిన్, మానవులందరికి దేవుడు అంది... ఏ మనిషి మతం లేదా మతాచారాల పట్ల మత దురభిమానాన్ని ప్రదర్శించడమంటే పవిత్ర గ్రంథంలోని మాటలను మార్చడంతో సమానం....’’ అని శివాజీ గుర్తుంచుకోదగిన రీతిలో మందలించారు. ముఖ్యమైన ఈ లేఖను గురించి జాదూనాథ్ తన ‘శివాజీ అండ్ హిస్ టైమ్స్,’ ‘హిస్టరీ ఆఫ్ ఔరంగజేబు’(మూడవ సంపుటి) గ్రంథాల్లో చర్చించారు. ప్రతి మత విశ్వాసానికి సమాన గౌరవం ఇవ్వడం భారత నాగరికతకు మూల స్తంభం. ఈ సాధారణ నైతిక, సాంస్కృతిక వారసత్వమే మన రిపబ్లిక్కు శాశ్వత ప్రేరణ. 17వ శతాబ్దినాటి శివాజీ లేఖ 20వ శతాబ్దినాటి మన భారత రాజ్యాంగానికి ముందుమాటగా పనిచేస్తుంది. హితోపదేశం చేయడం కాదుగదా ఉపన్యాసం దంచడం సైతం పత్రికలోని ఒక కాలంలో చేయాల్సిన పని కాదు. అయినా శివాజీ లేఖను గుర్తు చేయడం సముచితమయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. ఒక ఎంపీ ఆగ్రహ ప్రకోపం కలుగజేసే ప్రభావం, ఒక చక్రవర్తి ప్రదర్శించే పక్షపాతంతో పోలిస్తే చిన్నదే. మహారాష్ట్రకు చెందిన కొందరు ఎంపీలు ప్రభుత్వ భోజనశాలలో అంగీకారయోగ్యం కాని భోజనాన్ని వడ్డించినందుకు హేతువిరుద్ధంగానూ, దాదాపు స్కూలు పిల్లాడి ఆకాయితనంతోనూ అగ్రహాన్ని వ్యక్తం చేశారు. అది అపరిణత అపరాధమే తప్ప ప్రభుత్వ విధానం కాదు. అయినా గానీ మనం దాన్ని తీవ్రంగా పట్టించుకుని తీరాలి. భారత ప్రజాస్వామ్య సౌధం అసంఖ్యాకమైన వ్యక్తిగత, సమష్టి హక్కులతో నిర్మితమైంది. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్లోని ముస్లిం సర్వర్ నోట్లోకి ఒక ఎంపీ చపాతీని కుక్కాలనుకున్న సందర్భంలో జరిగినట్టుగా... మతం ఒక మనిషి మొహం మీద రాసి ఉండేదేమీ కాదనేది నిజమే. అయితే మానవుని గౌరవమనే భాషను ఏ లిపిలో రాయాలి? శివాజీ తన మతంగా మార్చుకున్న (లౌకికవాద) లిపిలో కాదా? సంబంధిత ఎంపీ శివాజీ వారసత్వాన్ని స్వీకరించినవాడైనప్పుడు ప్రత్యేకించి ఈ ప్రశ్న సందర్భోచితమైనది అవుతుంది. మనం ఇప్పడు మాట్లాడుతున్నది ప్రత్యేకించి ఒక మతం తరఫున కాదు. అంతకంటే సువిశాలమైన పేదల సమూహం పట్ల ఆ ఎంపీ నిస్సిగ్గుగా తలపొగరుతనాన్ని ప్రదర్శించారు. ప్రధాని నరేంద్రమోడీ తన ఎన్నికల ప్రచార కార్యక్రమంలోనూ, లోక్సభలోని తొలి ప్రసంగంలోనూ మూడు మౌలికమైన విషయాలను నొక్కిచెప్పారు. మొట్టమొదటిది, పేదల కోసం పనిచేయడమే ప్రభుత్వం బాధ్యత. రెండవది మైనారిటీలు సహా భారతీయులందరికీ అభివృద్ధి, ఉద్యోగాలు అందాలి (శరీరంలోని ఒక అంగం బలహీనంగా ఉండిపోతే ఆ శరీరాన్ని ఆరోగ్యవంతమైనదని అనలేం. మేం దీనికి కట్టుబడి ఉన్నాం... దీన్ని మేం సంతృప్తి పరచడంగా చూడటం లేదు). ఇక మూడవది, స్వాతంత్య్ర పోరాటాన్ని గాంధీ ప్రజా ఉద్యమంగా మలచిన రీతిలోనే మనం అభివృద్ధిని కూడా ప్రజా ఉద్యమంగా మలచగలిగితేనే భారత్ రెండంకెల వృద్ధితో ఆధునిక దేశంగా మారగలుగుతుంది. బహిరంగ చర్చలోని చంచలత్వం ప్రభుత్వాన్ని ఆ విధానం నుంచి వైదొలగేలా చేసి, దానికి భిన్నమైన ైవె ఖరిని ప్రకటించేట్టు చేయగలుగుతుంది. బహిరంగ చర్చలోని చంచలత అర్థం చేసుకోదగినది కాకపోయినా ఊహించదగినదే. ఎన్నికల ఫలితాలు ఒక భూకంపం. ఆ తదుపరి ప్రకంపనలు కొంతకాలం పాటూ ఇబ్బంది పెట్టక తప్పదు. ఫలితాలపై తమ అభిప్రాయాలకు సమంజసత్వాన్ని ఆపాదించుకునే వెలుపలి పరిధి ఒకటి ఉంటుంది. అవకాశవాదులు ఆ అంచును సంతోషపెట్టి ప్రయోజనాల పంపిణీలో ప్రతిఫలాలను దక్కించుకునే అవకాశాలను మెరుగుపరుచుకోగలమని ఊహిస్తుంటారు. సమ్మిళిత దృక్పథంతో మాత్రమే ఒక ప్రభుత్వం పనిచేయగలుగుతుంది. సదరు ఎంపీ ప్రవర్తన దురదృష్టకరమంటూ హోం మంత్రి రాజ్నాథ్సింగ్ అది అంగీకారయోగ్యంకాదని ధ్వనించి పార్లమెంటుకు నమ్మిక కలిగించగలిగారు. ప్రకటిత విధానం నుంచి వైదొలగడంలో ఆచరణాత్మకమైన ప్రమాదాలున్నాయి. ఓటర్లు కూడా అస్థిరంగా మారవచ్చని రాజకీయవేత్తలకు అనుభవంలోకి రావచ్చు. ఎన్నికల ప్రచార సమయంలో తమకు ఏమి వాగ్దానం చేశారో వాటిని అందించాలని వారు కోరుకుంటారు. అంతేగానీ వాటిని విస్మరించి హఠాత్తుగా మరో పాట అందుకోవడంలో వాళ్లు ఆసక్తిని చూపరు. ఓటర్లు సిద్ధాంతవేత్తలు కారు. వారికి కావాల్సింది ఇళ్లు, విద్యుత్తు, నీరు, కూరగాయల ధరలు తగ్గడం. అది కూడా ఎప్పుడో కాదు, త్వరగా జరగడం కావాలి. వారి ఎన్నికల్లో తమకు నచ్చినవాళ్లను ఎంచుకునే విలాసవంతమైన అవకాశమూ ఉంది, పోటీలో ఉన్న వారిలో మిగతా అందరి కంటే వాటిని అందించగల సామర్థ్యంగల నాయకుడెవరో గుర్తించగల సామర్థ్యం కూడా ఉంది. రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులు ఫలితాలను గణనీయంగా ప్రభావితం చేయగలుతారు. అధికారంతో పాటు బాధ్యతలను కూడా మోయాల్సి ఉంటుంది. ఆ బాధ్యతలను నెరవేర్చడం ద్వారా మాత్రమే ఎవరికైనా గౌరవమూ, పేరు ప్రతిష్టలు వస్తాయి. ఎడారిలాంటి గత కాలపు రాజకీయాలు, భాష, పరిపాలన ఇక గతించిపోయాయనే ఉత్సాహాన్ని నరేంద్ర మోడీ రేకెత్తించగలిగారు. తక్షణమే ఫలితాలు లభించాలని ఎవరూ ఆశించరు. లేదా పరివర్తన అంత సులువైనదని అనుకోరు. వారం లేదా పక్షం రోజుల పాటే అయినా మోడీ తెర వెనుకకు పోతే దేశం ఆయన గైరు హాజరీని గుర్తిస్తుంది. త్వరలోనే ఈ జూలై మాసపు కష్టాలు గడచిపోతాయి. ఆగస్టు నాటికి స్వచ్ఛమైన గాలులు వీయడం అవసరం. (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) ఎంజే అక్బర్ -
అభూత కాల్పనిక ‘దౌత్యం’
పాక్లో సున్నీ ఇస్లామిక్ మతతత్వ మిలిటెన్సీ హింసాత్మాకమైన ఒక్కొక్క అడుగూ వేస్తూ ఆ దేశాన్ని మతం పేరిట అరాచకంలోకి ఈడ్చుతోంది. భారత్ దాని లక్ష్యాలలో ఒకటి. భారత, పాక్ ప్రభుత్వాలు కఠోర వాస్తవాలతో కుస్తీలు పడుతున్నట్టు, నాట్యం చేస్తున్నట్టు నటించడం మానేయక తప్పదు. రుషి పుంగవులను మినహాయిస్తే, రచనా వ్యాపార కార్యకలాపాలలోని ప్రతి ఒక్కరూ... అట్టడుగు భాగాన ఉండే మా బోటి వాళ్లు సహా... కీర్తి ప్రతిష్టల ప్రలోభానికి గురికాకుండా ఉండటం అరుదు.అందులో ఉన్న ప్రమాదం సుస్పష్టమే. ఊహాత్మకత వాస్తవికత సరిహద్దులను దాటిపోగా, మనం ఎవరమో వారిగా గాక ఎవరిలా ఉండాలని ఊహిస్తున్నామో వారిలాగా ప్రవర్తించేట్టు చేస్తుంది. ప్రాయశ్చితం చేసుకోవాల్సిన స్థానానికి చేరుస్తుంది. ఢిల్లీకి చెందిన సంచార ఇంటర్నెట్ కాలమిస్టు వేద ప్రకాశ్ వైదిక్ గత వారంలో పాకిస్థాన్కు వెళ్లి వచ్చి ఓ పదిహేను నిముషాల కీర్తిని ఆర్జించి సంబరపడిపోయారనేది రహస్యమేమీ కాదు. జాతీయవాదపు అసంబద్ధ పరిమితుల నుంచి ఆయన స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. ఫ్రెంచి విప్లవ కాలపు తత్వవేత్త రూసో, కమ్యూనిస్టు మానిఫెస్టో కర్త కార్ల్ మార్క్స్ల సరసన ఆయన తనను తానొక అంతర్జాతీయవాదిగా పునఃప్రతిష్టించుకున్నారు. ట్విటర్లో వైదిక్ తనను తాను అభివ ర్ణించుకున్న తీరది. కాదని వాదించడానికి మనం ఎవరం? స్వేచ్ఛా సంచారియైన ప్రపంచ పౌరుని పాత్రలో వైదిక్ కాశ్మీర్ను సమైక్య స్వతంత్ర దేశంగా మార్చడమే సంక్లిష్టమైన ఆ సమస్యకు పరిష్కారమని సూచించారు. పాకిస్థాన్ కళ్లకు అది వైదిక్ను ఆదర్శ భారతీయుడ్ని చేయగలగడం అర్థం చేసుకోదగినదే. గత పాక్ పర్యటనలో ఇస్లామాబాద్, లాహోర్లలో అయనకు ఘన స్వాగతం పలికారు. మన పొరుగింటి ప్రధాని నవాజ్ షరీఫ్ ఆయనతో కాసేపు ముచ్చటించారు. అంతేకాదు, అత్యంత హేయమైన ఉగ్రవాద రింగ్ లీడర్లలో ఒకడైన హఫీజ్ సయీద్తో కలిసి పరమ సంతుష్టికరమైన విందారగించారు. 2008 ఉగ్రవాద దాడులను చేయించిన హఫీజ్ సయీద్ లాహోర్లో దర్జాగా రాజాలా బతుకుతూనే ఉన్నాడు. అదీ రహస్యమేమీ కాదు. ఢిల్లీకి తిరిగి వచ్చినప్పటి నుండి ఆ విషయాన్ని వినడానికి తీరిక ఉన్న ప్రతి ఒక్కరికీ వైదిక్ వినిపిస్తూనే ఉన్నారు. పాత్రికేయులు వార్తలను బట్టబయలు చేయడానికి బదులుగా తామే తయారు చేయడానికి ప్రయత్నించినప్పుడు తయారయ్యేది సీతాకోక చిలుకల్లాంటి వార్తలే. కాసేపవి మిడిసి పడుతూ అటూ ఇటూ ఎగిరి ఓ ఆవలింతతోనో లేదా భుజాల ఎగురవేతతోనో సత్వర మరణ ప్రాప్తి పొందుతాయి. వైదిక్ కథ విషయంలో సరిగ్గా అదే జరిగింది. కాకపోతే కాంగ్రెస్ దానికున్న స్వంత కారణాలతో రాజకీయ ఔచిత్యాన్ని మరచి మరీ దాన్ని కొనసాగించగలనని భావిస్తోంది. దానితో ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని ఓ దెబ్బ తీయవచ్చని ఆశిస్తోంది. కాంగ్రెస్ చరిత్రలోనే అత్యంత భారీ ఓటమి వల్ల అది ఇంకా సమతూకాన్ని కోల్పోయే ఉన్నట్టుంది. కాబట్టే అది తన మస్తిష్కపు పై మూతను ఇంకా బిగించినట్టు లేదు. ఉగ్రవాదం సమస్యపై ప్రధాని మోడీ పైన దాడి చేయగలమని ఆలోచిస్తున్నదంటేనే ఆ పార్టీ ఇంకా అసమతూకంతోనే ఉన్నదని అర్థం. ఉగ్రవాదంపై నేడు సాగుతున్న జాతీయ యుద్ధంలో మోడీ కంటే మెరుగైన అర్హతలు ఉన్నవారు లేరు. ఆయన గత చరిత్ర, అతి తరుచుగా ఆయన తన సంభాషణల్లో, ఉపన్యాసాల్లో వ్యక్తపరచిన విశ్వాసాలే ఆ విషయాన్ని చెబుతాయి. పాక్ పర్యటనకు వైదిక్తో పాటూ వెళ్లినవారి పేర్లను సరిచూసుకోవాలని కూడా కనీసం కాంగ్రెస్కు పట్టకపోవడం విచిత్రం. అది ఆ పని చేసి ఉంటే... సల్మాన్ ఖుర్షీద్, మణిశంకర్ అయ్యర్ వంటి బడా కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారని గ్రహించి ఉండేదే. మోడీపైన అవిశ్రాంతంగా విమర్శలు గుప్పించినందుకు వారంతా కాంగ్రెస్ ప్రభుత్వంలో కోరుకున్న నియామాకాల అనుగ్రహాన్ని పొందినవారే. ఫ్రీ కిక్ని సెల్ఫ్ గోల్గా మార్చుకున్న ఆ పార్టీ దుస్థితిని ఇది కొంత వరకు తెలియజేస్తుంది. మన్మోహన్ సింగ్ సోనియాగాంధీలు అధికారంలో ఉన్న దశాబ్ద కాలంలో భారత్-పాక్ సంబంధాలను ట్రాక్ 1. ట్రాక్ 2, ట్రాక్ 3 వంటి అట్టహాసపు పదాడంబరపు ముసుగులతో పనిచేసే సంస్థలకు అప్పగించేశారు. అది వారి అధికార కాలపు విషాదాలలో ఒకటి. శాంతి కపోతాలు పోటీలుపడి మరీ పెట్టిన అరుపుల్లో పడి ట్రాక్ 1 అదృశ్యమైపోయింది. అది పాక్ ప్రభుత్వానికి అద్భుతంగా సరిపోయింది. ఉగ్రవాదం గురించి, ప్రత్యేకించి పాక్ సైన్యం. ఇంటెలిజెన్స్ సంస్థల్లోని తన మిత్రులతో కలిసి హఫీజ్ సయీద్ ముంబై ఉగ్ర దాడులను రచించి, నిర్వహించాడు. ఆ సమస్యపై బలమైన ప్రశ్నలకు వేటికీ సమాధానాలను చెప్పకుండానే ైద్వైపాక్షిక సంబంధాల్లోని సంఘర్షణను కొనసాగించడం పాక్ ప్రయోజనాలకు సరిపోయింది. మన జాతీయ ప్రయోజనాలను మంత్రివర్గ కమిటీల వంధిమాగధ స్తోత్రాలుగా నిర్వీర్యం చేసే ఈ క్రీడలో ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్ట పూర్వక భాగస్వామి అయింది. కృత్రిమంగా సృష్టించిన అలాంటి వాతావరణంలో పాక్ తాను చూపదలుచుకున్న మొహాన్నే ప్రదర్శించగలిగింది. భారత సుహృద్భా వపరుల్లో ఎవరికీ తన రెండవ మొహంలో ఆసక్తి లేదని దానికి నమ్మకం కుదిరింది. దాని రెండవ మొహం మరింత హానికరమైనది, అంతకంటే అధ్వానమైనది. ఈశాంతి కపోతాల మధ్యవర్తులు ఉద్దేశపూర్వకంగానే లేదా అనుకోకుండానే పాక్లోని సామాజిక శక్తులలో సంభవిస్తున్న పెను మార్పులను గుర్తించలేదు. పాక్లో హఫీజ్ సయీద్ ఎవరూ ముట్టుకోలేని వ్యక్తిగా ఎదగడానికి కారణం ప్రభుత్వం అతనికి రక్షణను కల్పిస్తుండటం మాత్రమే కాదు. రోజురోజుకూ పాక్లో సున్నీ ఇస్లామిక్ మతతత్వ మిలిటెన్సీ పెరుగుతూ హింసాత్మాకంగా ఒక్కొక్క అడుగే ముందుకు వేస్తూ దేశాన్ని మతం పేరిట అరాచకంలోకి ఈడ్చుతోంది. భారత్ దాని లక్ష్యాలలో ఒకటి. పాక్ షియాల పాలిటి గోరీల దిబ్బగా మారింది. తమను తాము జిహాదీలుగా ప్రకటించుకున్న వారు తమ దృష్టికి భిన్నమైనదిగా కనిపించిన ఏ మత విశ్వాసం మీదకైనా ఆయుధాలను ఎక్కుపెట్టే బాపతు. పాకిస్థాన్ జాతిపిత మొహ్మద్ ఆలీ జిన్నా షియా కావడమే వైచిత్రి. కానీ నేడు ఆ విషయాన్ని మరీ గట్టిగా గుసగుసలాడరాదు. సున్నీ ఇస్లామిక్ మతతత్వవాదులు తదుపరి జిన్నా ఫోటోలపైకి తుపాకులు ఎక్కుపెట్టడం మొదలవుతుంది. ఒక సంక్లిష్ట సమస్యపై అనుసరించిన దివాలాకోరు వైఖరి భారత్-పాక్ సంబంధాలను మూసుకుపోయే దారి చివరికి చేరుస్తుంది. అప్పుడిక ఎక్కడికి పోవాలో ఎవరికీ తెలీదు, నేడు మన సరిహద్దుల్లో స్వల్ప స్థాయి యుద్ధం సాగుతోంది. హఫీజ్ సయీద్ లాంటి వారు మన దేశంలో అంతర్గతంగా మరో కార్చిచ్చును రగల్చడానికి పథకాలు రచిస్తున్నారు. భారత, పాక్ ప్రభుత్వాలు కఠోర వాస్తవాలతో కుస్తీలు పడుతున్నట్టు, నాట్యం చేస్తున్నట్టు నటించడం మానేయక తప్పదు. కుహనా దౌత్యం, అభూత కల్పనల అమ్మకాలు ఇప్పటికే చాలా నష్టం చేకూర్చాయి. (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) ఎంజే అక్బర్ -
కునికిపాటే మేలుకొలుపు
యూపీఏ బడ్జెట్లను ఎన్డీయే కాపీ కొడుతున్నదన్న కాంగ్రెస్ మొట్టమొదటి విమర్శనాస్త్రం నమస్కారబాణంలాంటిది. అదే నిజమైతే కాంగ్రెస్ జైట్లీని ప్రశంసించి ఉండాల్సింది. లేదంటే మన్మోహన్, చిదంబరం రూపొందించిన బడ్జెట్లన్నీ చెత్త కుప్పలేననే కొత్త వైఖరిని ఇప్పుడు కాంగ్రెస్ తీసుకుందా? అత్యంత ఆసక్తికరమైన ‘నిదురిస్తున్న నేత’ ఉదంతానికి సంబంధించి నా సానుభూతంతా రాహుల్ గాంధీపైనే. అలసట కలిగించే ఢిల్లీ వేసవి వేడి గాలులకు భారత ప్రజాస్వామ్య దేవాలయాంతర్భాగంలోని మహత్తరమైన లోక్సభ దర్బారులో నిద్ర అంటువ్యాధిలా ప్రబలిపోతుంది. కొందరి ఉపన్యాసాలు సైతం దాన్ని అడ్డగించలేవు. రాహుల్ కంటే మెరుగైన పార్లమెంటేరియన్లు సైతం.... మధ్యాహ్న భోజనానంతర సమయంలో కడుపులోని మృష్టాన్నం మస్తు, మనస్సులోని మగత కలిసి విషంలాంటి నిద్ర మత్తు ఆవహించేట్టు చేస్తుంటే ఆవలింతలను ఆపుకోవడం కోసం తంటాలు పడాల్సివస్తుండేది. సుదూర గతంలోనైతే ఆ సుఖవంతుల సమాజం దాని అత్యుత్తమ సాంప్రదాయాలననుసరించి ఉద్దేశపూర్వకంగానే ఆ విషయాన్ని జాగ్రత్తగా కాపాడాల్సిన రహస్యంగా భావించి దాచి ఉంచడం రివాజుగా ఉండేది. పార్లమెంటు సభ్యులకు మరింత దృశ్యమాన ఖ్యాతిని ఆర్జించిపెట్టాలని స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ సభలోని ప్రసంగాలను అప్పటికప్పుడే రికార్డు చేసి టీవీలో ప్రసారం చేయడాన్ని అనుమతించారు. బుల్లి తెర వేలుపులుగా వెలిగిపోయేందుకు లభించిన ఆ అవకాశాన్ని ఎంపీలు స్వాగతించారు. కెమెరాలకు హృదయం ఉండదు, వాటికి పనిచెప్పే కెమెరామన్లు స్వభావరీత్యానే కొంటె కోణంగులనే విషయాన్ని వాళ్లు పూర్తిగా గ్రహించలేకపోయారు. ఈ కోణంగులు సరిగ్గా తమకు కావాల్సిన సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఎంతటివారినైనా ఇట్టే పట్టేస్తారు. సభ ధరల పెరుగుదల సమస్యపై చర్చ సాగిస్తుండగా బొజ్జ నిండా పాలు తాగి బజ్జున్న పాపాయిలా రాహుల్ గాఢనిద్రలోకి జారిపోయి వారికి దొరికిపోయాడు. అలాంటి విపరీత దృశ్యాలను కత్తిరించేయడం కోసం రాహుల్ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో నమ్మకస్తులైన నౌకర్లను నియమించుకోవడం మరచినట్టుంది. ఆ శాఖ అధికారులు ఎవరూ చెప్పాల్సిన పని లేకుండానే అలాంటి సందర్భాల్లో స్క్రీన్ను ఖాళీగా ఉంచేసేంతటి ప్రభుభక్తి పరాయణత దేశ రాజధానిలోని అధికార యంత్రాంగపు సంస్కృతి. అయితే అది కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజులనాటి సంగతి. రాహుల్ పవళింపు సేవను చూపిన అదే శాఖ అధికారులు రాహుల్ గనుక మెడను తలపై నిటారుగా నిలిపి అత్యంత సావధానంగా తమ పార్టీ ఎన్డీఏకు వ్యతిరేక ఎదురుదాడికి నాయకత్వం వహిస్తూ ఉండటాన్ని చూపడానికి కూడా సిద్ధంగానే ఉంటారు. ఓటమికి అర్థాన్ని రాహుల్ పూర్తిగా గ్రహించారో లేదో నాకు తెలీదు. కానీ విషాదకరమైన ఆయన పార్లమెంటు కునుకు మాత్రం... శ్లేషాత్మకంగా చెప్పాలంటే మేలు కొలుపు హెచ్చరిక. ఆ మరుసటి రోజు అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించడానికి లేచినప్పుడు పార్లమెంటులో కనిపించిన దృశ్యం మనసుకు హత్తుకుంది. బిడ్డల పట్ల అత్యంత శ్రద్ధ చూపే తల్లిలాగా సోనియాగాంధీ ఇక ఎలాంటి అవకాశాలకు తావివ్వదలుచుకోలేదు. కునికిపాట్లకు దాదాపుగా అవకాశమే లేని ముందు బెంచీల్లో కొడుకును ఆమె తన పక్కనే కూచోబెట్టుకున్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై జరిగిన చర్చకు ప్రధాని నరేంద్రమోడీ సుదీర్ఘ సమాధానం ఇస్తుండగా రాహుల్ మొబైల్ఫోన్ను తుడుచుకుంటూ లే దా మెరుగులు దిద్దుకుంటూ గడిపేశారు. ఈసారి మాత్రం నోట్స్ రాసుకోడం కోసం పెన్నూ, ప్యాడ్లతో సాయుధుడై వచ్చారు, జైట్లీ అనర్గళోపన్యాసం సమయంలో రాహుల్ వాస్తవంగా ఏమి నోట్ చేసుకున్నారనేది తెలుసుకోవడం ఆసక్తికరమే. కానీ ప్రాచీన పత్ర భాండాగారంలో భద్రపరచడానికి ఆ డాక్యుమెంటు లభిస్తుందని అనుకోను. ఏదేమైనా, బడ్జెట్పై కాంగ్రెస్ ప్రతిస్పందనలు ఆ డాక్యుమెంటుకు ఏ మేరకైనా ప్రతిఫలనాలైతే... ఆ పేజీల్లో ఉన్నది పిచ్చిగీతలే అయి ఉండాలి. ప్రజాస్వామ్యం పక్షపాతంతో కూడిన వ్యవహారం. ఆ మేరకు ఎన్డీయే తొలి బడ్జెట్పై కాంగ్రెస్ వ్యతిరేకత ఊహించదగినది, అర్థంచేసుకోదగినది కూడా. కానీ కాంగ్రెస్ మరింత మెరుగైన దాడి వ్యూహాన్నయినా కనీసం చేపట్టాల్సింది. కానీ ప్రతిస్పందన సోమరిగానూ, అసంకల్పితమైనదిగా ఉండి ప్రతికూల ఫలితాలను కలిగించేదిగా సాగింది. యూపీఏ బడ్జెట్లను ఎన్డీయే కాపీ కొట్టడం మాత్రమే చేస్తోందనే దాని మొట్ట మొదటి తూటా నమస్కార బాణంలాంటిది. అది చెప్పేదే నిజమైతే కాంగ్రెస్ జైట్లీని ప్రశంసించి ఉండాల్సింది. లేదంటే మన్మోహన్సింగ్, చిదంబరం రూపొందించిన బడ్జెట్లన్నీ చెత్త కుప్పలేననే కొత్త వైఖరిని కాంగ్రెస్ ఇప్పుడు తీసుకుందా? దూకడానికి ముందు చూడాలి, మాట్లాడటానికి ముందు ఆలోచించాలి. ఆ పార్టీ ప్రచార యంత్రాంగం బడ్జెట్ పేదలకు వ్యతిరేకమైనదనే వాదనను ముందుగానే తయారు చేసి ఉంచడమే ఇలా కాంగ్రెస్ తూటా తుస్సుమనిపోవడానికి కారణమై ఉండాలి. ఇది దిగ్భ్రాంతికరమైన తప్పుడు అంచనా. ఎందుకంటే పేదలలోకెల్లా అతి పేదల అవసరాలను తీర్చలేకపోతే అది ప్రభుత్వమే కాదని ప్రధాని మోడీ నిలకడగా పదే పదే చెబుతూనే ఉన్నారు. సంక్షేమ పథకాలతో పేదలపట్ల సానుకూలమైన మొగ్గును చూపిన అత్యుత్తమమైన రాష్ట్రాలు బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి ప్రభుత్వాలే తప్ప మహారాష్ట్ర, కర్ణాటక వంటి కాంగ్రెస్ రాష్ట్రాలు కావు. బడ్జెట్ ఆ విషయంలో బీజేపీ రాష్ట్రాలపై జరుగుతున్న దుష్ర్పచారం గుట్టు బట్టబయలు చేసింది. బడ్జెట్లో భారీ దూరచ్చదృష్టి పథకాలు లోపించాయనేది రెండో ఆరోపణ. ఇది కూడా కొంత అర్థరహితమైనదే. మోడీ బడ్జెట్లోని ఈ అంశాలను చూడండి: 2022 నాటికి ప్రతి భారతీయునికి సరైన గృహ వసతిని కల్పించడానికి, ప్రతి ఇంటికీ విద్యుత్తును అందించడానికి అది వాగ్దానం చేసింది. వంద కొత్త శివారు నగరాల నిర్మాణానికి ప్రారంభ మూలధన నిధులను కేటాయించింది. హౌసింగ్, రక్షణ రంగాలలో భారీ విదేశీ పెట్టుడులకు దారులు తెరిచింది, రోడ్లు, నదుల అనుసంధానాన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాల పద్దుకు చేర్చి ఆ శాఖ వ్యయాలను విస్తరింపజేసింది, 8 లేదా 9 శాతం వృద్ధిని తిరిగి సాధిస్తామని వాగ్దానం చేసింది. 2019 నాటికి అతి పురాతనమైన గంగా నదిని శుద్ధి చేసే కార్యక్రమంతో పరిశుభ్ర భారత్ సృష్టికి నాంది పలికారు. 2019 మహాత్మా గాంధీ 150వ జన్మదినోత్సవ వత్సరం. కాంగ్రెస్ ప్రభుత్వాలు బరి తెగించి నిర్లక్ష్యంగా చేసిన వ్యయాలతో ఖాళీయైన ఖజానాను లెక్కలోకి తీసుకోక తప్పని తొలి బడ్జెట్కు ఇదంతా తక్కువా? రాజధాని ఢిల్లీలోని పెద్దల ఆలోచన విలక్షణమైనది. ప్రధానంగా అది విద్యుత్ కోతలను ఉత్పాతంగా భావిస్తుంటుంది. కరెంటన్నదే ఎరుగని గుడిసెలోని వారి ఆలోచనకు అది భిన్నమైనది. లూట్యన్ల కాలపు మహా ప్రాసాదాల ఢిల్లీ గురించి పగటి కలలు కనే వారి ఆలోచన నిలవడానికి నీడ లేక మరణిస్తున్నవారి ఆలోచన కంటే భిన్నమైనది. తాగు యోగ్యమైన నీరు దొరక్క గొంతెండిపోతూ ఉండటం లేదా బతికి బట్టకట్టడానికి సరిపడా మెతుకుల కోసం బానిస చాకిరీ చేయటం గాక... పగటి నిద్రకు అవకాశమున్న వారి ఆలోచనలు భిన్నమైనవి.బడ్జెట్లో ఢిల్లీ కంటే భిన్నంగా ఆలోచించే వారికి వాగ్దానం ఉంది. ఆ విషయాన్ని సుస్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఆ దృక్పథమూ ఉంది. ఇక అతి కష్టమైన భాగం ఒక్కటే.... ఈ ప్రభుత్వం దేశం కలలను నెరవేర్చాల్సి ఉండటమే. (వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు) ఎంజే అక్బర్