World Health Organization
-
యూఎన్హెచ్ఆర్సీకి ట్రంప్ గుడ్బై
న్యూయార్క్: ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలుగుతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘానికి (యూఎన్హెచ్ఆర్సీ) కూడా గుడ్బై చెప్పారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై మంగళవారం ఆయన సంతకం చేశారు. ‘‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధాలను నిలువరించి అంతర్జాతీయంగా శాంతిభద్రతల స్థాపనకు కృషి చేసే లక్ష్యంతో ఐరాస స్థాపనకు అమెరికా సాయపడింది. కానీ ఐరాసకు చెందిన పలు ఏజెన్సీలు కొంతకాలంగా సంస్థ లక్ష్యానికి భిన్నంగా పని చేస్తున్నాయి. పైగా అమెరికా ప్రయోజనాలనే దెబ్బ తీస్తున్నాయి’’ అంటూ ఉత్తర్వుల్లో తూర్పారబట్టారు. పాలస్తీనా శరణార్థులకు ఆ సంస్థ అందిస్తున్న సాయానికి అమెరికా నిధుల సాయాన్ని తక్షణం నిలిపేయాల్సిందిగా కూడా ట్రంప్ ఆదేశించారు. అంతేకాదు, ఐరాస విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో), పాలస్తీనా శరణార్థుల సహాయ, పనుల సంస్థ (యూఎన్ఆర్డబ్ల్యూఏ)ల్లో కొనసాగడం అవసరమా పరిశీలించాల్సిందిగా కూడా అధికారులకు సూచించారు. ‘‘మానవ హక్కుల ఉల్లంఘనదారులను యూఎన్హెచ్ఆర్సీ కాపాడుతోంది. విదేశీ ఉగ్ర సంస్థలుగా అమెరికా విదేశాంగ శాఖ చాన్నాళ్ల క్రితమే ప్రకటించిన పలు మూకలు నానా ముసుగుల్లో యూఎన్ఆర్ డబ్ల్యూఏలో చొరబడ్డారు. ఇక యునెస్కో తనను తాను సంస్కరించుకోవడంలో నిత్యం విఫల మవుతూనే ఉంది’’ అని ఉత్తర్వుల్లో ట్రంప్ ఆక్షేపించారు. గాజా యుద్ధం విషంలో యూఎన్హెచ్ఆర్సీ తమపై ఉద్దేశపూర్వకంగా బురదజల్లుతోందని ఇజ్రాయెల్, అమెరికా కొంతకాలంగా ఆరోపిస్తుండటం తెలిసిందే. ట్రంప్ తన తొలి హయాంలో కూడా యూఎన్హెచ్ఆర్సీ నుంచి వైదొలగుతూ నిర్ణయం తీసుకున్నారు. యూఎన్ఆర్డబ్ల్యూఏకు నిధులను నిలిపేశారు. -
క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే మద్యం
ఒక నూతన ఆరోగ్య హెచ్చరికతో ఈ నూతన సంవత్సరం మొదలైంది. మద్యం సేవించడం, క్యాన్సర్ ప్రమాదం పెరగడం మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందంటూ అమె రికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి ఒక ప్రకటనను విడుదల చేశారు. అమెరికాలో క్యాన్సర్ను ప్రేరేపించగల మూడో ప్రధాన కారణం ఆల్కహాల్ వినియోగం. ఏ రకమైన ఆల్కహాల్ తీసుకున్నా, అది కనీసం ఏడు రకాల క్యాన్సర్లు (రొమ్ము, పెద్దపేగు, అన్నవాహిక, కాలేయం, నోటి కుహరం, గొంతు, స్వరపేటిక) వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని ఆ ప్రకటన తెలిపింది. అమెరికాలో 16.4 శాతం రొమ్ము క్యాన్సర్ కేసులు ఆల్కహాల్ వినియోగం వల్లే సంభవిస్తున్నాయి. రొమ్ము, నోరు,గొంతు వంటి కొన్ని క్యాన్సర్ల విషయంలో, ‘రోజుకు ఒకటి లేదా అంతకంటే తక్కువసార్లు మద్యం సేవించడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరగవచ్చు’ అని సలహాదారు హెచ్చరిస్తున్నారు. తక్కువ మొత్తంలో మద్యం సేవించడం కూడా కాలేయ మచ్చలు (లివర్ సిర్రోసిస్) వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దోహదం చేస్తుంది. అయితే, మద్యం సేవించడం వల్ల ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం అనేక జీవ, పర్యావరణ, సామాజిక అంశాలపై ఆధారపడి ఉంటుంది.ఎంత తక్కువైనా రిస్కే!శాస్త్రీయ ఆధారాలకు సంబంధించిన క్రమబద్ధమైన మూల్యాంకనం ఆధారంగా, మద్యం సేవించడం వల్ల కలిగే ప్రమాదాలు, హానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) 2023 ప్రకటనను అనుసరించి ఈ సలహా ఇవ్వడమైంది. మద్యం నేరుగా ప్రమాద కరమైన వ్యాధిని కలిగిస్తుంది. మద్యం గణనీయంగా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుంది. ‘ద లాన్సెట్ పబ్లిక్ హెల్త్’లో ప్రచురితమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన, ‘మద్యం వినియోగం విషయానికి వస్తే, ఆరోగ్యాన్ని ప్రభావితం చేయనంతటి తక్కువ మోతాదు అనేది లేనే లేదు’ అని పేర్కొంది.‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్’ సంస్థ, ఆల్కహాల్ను ‘గ్రూప్ 1 కార్సినోజెన్’గా 1980లలో వర్గీకరించింది. ఇది పొగాకు, రేడియేషన్, ఆస్బెస్టాస్ వంటి క్యాన్సర్ కలిగించే పదా ర్థాలలో అత్యంత ప్రమాదకరమైన కేటగిరీ. ఇథనాల్ శరీరంలో ఇంకిపోవడం వల్ల జీవసంబంధమైన విధానాలు క్యాన్సర్కు కారణమవుతాయి. అందువల్ల, ఆల్కహాల్ కలిగిన ఏ పానీయం... అది బీర్, వైన్ లేదా విస్కీ ఏదయినా ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఏ రకమైనా హానికరమే!కొన్ని ఆల్కహాల్ పానీయాలను, ముఖ్యంగా రెడ్ వైన్ను మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందనే అపోహను ఈ ఆధారాలు బద్దలు కొడుతున్నాయి. దశాబ్దాలుగా, మద్య పరిశ్రమ కార్డియాలజిస్టులను ప్రోత్సహించి, మితంగా వైన్ తీసుకోవడం గుండె ఆరోగ్యానికి మంచిదనే భావనను ప్రచారం చేస్తోంది.అలాంటి వాదనలకు ఎటువంటి విశ్వసనీయ శాస్త్రీయ అధ్యయ నమూ లేదని గ్రహించాలి. మరోవైపు, డబ్ల్యూహెచ్ఓ యూరోపియన్ ప్రాంతం నుండి వచ్చిన డేటా ప్రకారం, ఆల్కహాల్ వల్ల వచ్చే క్యాన్సర్లలో సగం వరకు, సాధారణంగా వారానికి ఒక బాటిల్ వైన్ లేదా రెండు బాటిళ్ల బీర్ వంటి ‘తేలికపాటి’, ‘మితమైన’ వినియోగం వల్ల సంభవిస్తు న్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, గుండె జబ్బులు లేదా మధుమేహంపై తేలికపాటి, మితమైన మద్యపానం వల్ల కలిగే ప్రయోజనకరమైన ప్రభావాలను గురించి తెలిపే అధ్యయనాలు లేవు.‘మీరు ఎంత ఎక్కువ తాగితే అంత హానికరం అని మేము కచ్చితంగా చెప్పగలం. మరో మాటలో చెప్పాలంటే, మీరు ఎంత తక్కువ తాగితే అంత సురక్షితం’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థలోని ఆల్కహాల్, అక్రమ మాదకద్రవ్యాల నిపుణురాలు కరీనా ఫెర్రీరా –బోర్జెస్ అన్నారు.హెచ్చరికలు మేలు చేస్తాయా?ఒక వస్తువు వల్ల ప్రభుత్వాలకు గణనీయమైన ఆదాయం వస్తుందని శాస్త్రీయ ఆధారాలు ఉన్నప్పుడు, ఆ వస్తువు ద్వారా కలిగే హానిని తగ్గించడానికి ఉన్న ఎంపికలు ఏమిటి? డబ్ల్యూహెచ్ఓ చేసిన ఆల్కహాల్ ప్రకటన అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాలను ఎత్తిపడుతోంది. అలాగే అందుబాటులో ఉన్న విధాన ఎంపికలను కూడా ప్రభుత్వాలకు అందిస్తోంది. ప్రభుత్వాలు వాటిపై చర్య తీసుకో వలసి ఉంటుంది. మద్యం వినియోగాన్ని తగ్గించడానికి అత్యంత స్పష్టమైన మార్గాలలో ఒకటి ఏమిటంటే, మద్యం సీసాలపై హెచ్చరిక లేబుళ్ల ద్వారా, కలగనున్న హాని గురించి జనానికి అవగా హన కల్పించడం. అమెరికా, కొన్ని యూరోపియన్ దేశాలు ఏమి చేయాలని వివేక్ మూర్తి సూచించిన చర్యలలో ఇది ఒకటి. క్యాన్సర్ ప్రమాదాన్ని లెక్కించడానికి మద్యం వినియోగంపై మార్గ దర్శకాల పరిమితులను తిరిగి నిర్వచించాలని కూడా మూర్తి పిలుపునిచ్చారు.వివిధ దేశాలు పరిశీలిస్తున్న హెచ్చరిక లేబుల్స్ అనేక రకాలుగా ఉన్నాయి. ఆరోగ్యానికి సాధారణ హాని; అధిక వినియోగం, దుర్వి నియోగం వల్ల కలిగే హాని; నిర్దిష్ట సమూహాలకు అంటే తక్కువ వయస్సు గలవారు, గర్భిణులు మొదలైన వారికి వ్యతిరేకంగా సందేశాలు వీటిలో కొన్ని. ఉదాహరణకు, 2026లో ఐర్లాండ్ ప్రవేశ పెట్టాలని భావిస్తున్న హెచ్చరికలో, ‘మద్యం తాగడం వల్ల కాలేయ క్యాన్సర్ వస్తుంది’ అని ఉంది. 2019లో, భారతదేశం హార్డ్ లిక్కర్కు ‘మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం’ అనీ, తక్కువ ఆల్క హాల్ పానీయాలకు ‘సురక్షితంగా ఉండండి, తాగి వాహనం నడపవద్దు’ అని చెప్పే సాధారణ హెచ్చరికలను తప్పనిసరి చేసింది.ఇండియా ఇంకా చేయాల్సిందేమిటి?భారతదేశంలో హెచ్చరిక లేబుళ్లతో పాటు, ఆల్కహాల్ మార్కెటింగ్పై పరిమితులు కూడా అమలులో ఉన్నాయి. వార్తా పత్రికలు, రేడియో, టీవీల్లో ఆల్కహాల్ ప్రకటనలను నిషేధించారు. అయితే ప్రకటనల నిబంధనలలోని లొసుగులను వాడుకుంటూ వాటిపై ప్రకటనలు మరో రూపంలో కొనసాగుతున్నాయి. ఇటీవలి సంవత్సరాలలో, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా రహస్య ప్రకటనలు కొత్త సవాళ్లను కలిగిస్తున్నాయి.పొగాకు లేబుళ్లపై హెచ్చరికల మాదిరిగానే, మద్య పరిశ్రమ, పరిశ్రమ అనుకూల సమూహాలు ఆరోగ్య హెచ్చరిక లేబుళ్లు మద్య వినియోగాన్ని తగ్గించడంలో పెద్దగా ఉపయోగపడవని వాదిస్తు న్నాయి. కానీ, ‘ద లాన్సెట్’లో ప్రచురితమైన ఇటీవలి సమీక్షలో నివేదించినట్లుగా, మద్య ఉత్పత్తులపై హెచ్చరిక లేబుళ్లు అనేక విధాలుగా ఉపయోగకరంగా ఉన్నాయని ఆధారాలు ఎత్తి చూపు తున్నాయి. అవి మద్య సంబంధిత హానిపై అవగాహన పెంచు తాయి, మద్యం వాడకాన్ని సాధారణీకరించకుండా దోహదం చేస్తాయి. పైగా ప్రజలు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయ పడతాయి. తద్వారా ప్రజారోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. హెల్త్ లేబుల్స్ ప్రభావం వాటి రూపకల్పనపై, కంటెంట్పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికైతే, ఆరోగ్య హెచ్చరిక లేబుల్స్కు ప్రామాణీకరణ లేదు. అంతేకాకుండా వాటి కంటెంట్ చాలా సాధారణమైనది. ఇది వినియో గదారులు ఒక అవగాహనకు రావడానికి ఉపయోగపడకపోవచ్చు.దాదాపు ఐదేళ్లుగా భారతదేశం మద్యం ఉత్పత్తులకు సంబంధించిన హెచ్చరిక లేబుళ్లపై నిబంధనలను అమలు చేస్తోంది. ఇది ఎంత ప్రభావవంతంగా ఉందో మనకు ఇంకా తెలియదు. హెచ్చరిక సందే శాల రూపకల్పన, కంటెంట్, వాటిపై వినియోగదారుల అభిప్రా యానికి సంబంధించి మనకు నిరంతర పరిశోధన అవసరం. పొగాకు ఉత్పత్తుల్లో ఆరోగ్య హెచ్చరికలు ప్యాకేజింగ్లో మంచి జాగాతో వివర ణాత్మకంగా ఉంటాయి. దీనికి భిన్నంగా మద్యం సీసాలపై హెచ్చరికలు చిన్న స్థలాన్ని ఆక్రమిస్తాయి, అస్పష్టంగా ఉంటాయి. ఆరోగ్య హెచ్చరికలతో పాటు, హైవేలపై మద్యం అమ్మకాల నియంత్రణ, తక్కువ వయస్సు గల వినియోగదారులకు అమ్మకాలను అరికట్టడం, తాగి వాహనం నడపడం వంటి అదనపు చర్యలను మరింత కఠినంగా అమలు చేయాలి.భారతదేశంలో ఆరోగ్య సంబంధమైన, ఇతర నిబంధనలను నిలిపివేయడానికి నిరంతరం ప్రయత్నిస్తున్న పరిశ్రమ లాబీల నుండి జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. మద్యం వల్ల కలిగే ఆరోగ్య సంరక్షణ పెను భారాన్ని తగ్గించడానికి వివేక్ మూర్తి వంటి మరింత మంది ప్రజారోగ్య ఛాంపియన్లు అవసరం. క్యాన్సర్కీ పొగాకుకీ ఉన్న సంబంధంపై మొదటి హెచ్చరిక కూడా 1964లో ఒక సర్జన్ జనరల్ నుండే వచ్చిందని గుర్తుంచుకోండి.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఇక ఎయిడ్స్కు చరమగీతం!
ఒకప్పుడు మశూచి వ్యాధి బారిన పడి లక్షలమంది మరణించేవారు. అలాగే ప్లేగ్ వ్యాధితో కూడా! అలాంటి భయంకరమైన రోగాలు ఇప్పుడు కలికానికి కూడా లేవు. దీనికి కారణాలు ఆ రోగాలను మట్టుబెట్ట డంలో జరిగిన నిరంతర కృషి.1980వ దశకంలో ఎయిడ్స్ అంటే మరణం. దీని బారిన పడినవారు బతికి ఉన్నా, చచ్చినవారితో సమానం అన్నట్టుగా సమాజం పరిగణించిన రోజులు అవి. హెచ్ఐవీ పాజిటివ్ అని తెలియ గానే గుండెలో బండ పడినట్లే భావించి మానసికంగా మరణా నికి చేరువయ్యేవారు. ఎయిడ్స్ తాకిడికి అమెరికా లాంటి అగ్ర దేశాలు కూడా విలవిలలాడి పోయాయంటే అప్పట్లో ఈ వ్యాధి కలిగించిన భయోత్పాతాన్ని అర్థం చేసుకోవచ్చు. అది ఆనాటి ముఖచిత్రం. ఈనాడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మందే లేదనుకున్న ఈ వ్యాధికి తగిన మందులు లభిస్తున్నాయి. ఇప్పుడు ఎయిడ్స్ ఒక దీర్ఘకాలిక వ్యాధి మాత్రమే! ఎయిడ్స్కు గురి కాకుండా ఎలాగూ కాపాడుకోవచ్చు. ఒకవేళ వచ్చిందని తెలిసినా, 72 గంటల లోపు పోస్ట్ ప్రొఫలాక్సిస్ మందులు వాడి దాని బారి నుంచి బయటపడవచ్చు. తొమ్మిదేళ్ల క్రితమే క్యూబాలో హెచ్ఐవీ ఎయిడ్స్, సిఫిలిస్ వ్యాధులను పూర్తిగా తుడిచి పెట్టారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎయిడ్స్ గురించి భయపడాల్సిన అవసరం ఇక ఎంత మాత్రం లేదని, గట్టిగా ప్రయత్నిస్తే, మొత్తం ప్రపంచానికి ఎయిడ్స్ నుంచి విముక్తి కలిగించవచ్చనే గట్టి సందేశాన్ని ఆ దేశం ప్రపంచ దేశాలకు పంపింది. ఎయిడ్స్ పాజిటివ్ దంపతులు నేడు చికిత్స తీసుకొని, ఆ వ్యాధి లక్షణాలు లేని, ఆరోగ్యవంతమైన పిల్లలను కనవచ్చు. హెచ్ఐవీ పాజిటివ్ వాళ్ళు... ఆ వ్యాధి సోకని వాళ్ళను నిక్షేపంగా వివాహం చేసు కొని, ఎలాంటి భయ సంకోచాలూ లేకుండా హాయిగా కాపు రాలు చేసుకోవచ్చు. అనేక శాస్త్రీయ పరిశోధనల పుణ్యమా అని అలాంటి చికిత్సా పద్ధతులు, ఈనాడు సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చాయి. బీపీ, షుగర్ బాధితులు అతి తక్కువ ఖర్చుతో ప్రతి రోజూ క్రమం తప్పకుండా మాత్రలు వాడుతూ ఆరోగ్యంగా సాధారణ జీవితం గడుపున్న మాదిరిగానే, ఎయిడ్స్ రోగులు కూడా 30 రూపాయలు ఖరీదు చేసే ఒక్క మాత్రను క్రమం తప్పకుండా రోజూ వేసుకుంటూ, తగు విశ్రాంతి, పోషకా హారం తీసుకుంటూ క్రమశిక్షణతో జీవితం గడిపితే, 80 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా జీవించవచ్చు. ఈ విషయాన్ని ప్రఖ్యాత వైద్య జర్నల్ ‘లాన్ సెట్’, ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధక బృందం, పలు అధ్య యన సంస్థలు అధికారికంగా ప్రకటించాయి.వైద్యపరంగా ఇంతటి భరోసా లభిస్తున్నా, ఎయిడ్స్ రోగులు మానసికమైన భయాందోళనలతో చికిత్సకు దూరంగా ఉంటూ అల్లాడిపోతున్నారు. రోజువారీ వాడాల్సిన మాత్రలు తమ దగ్గర ఉంటే పక్కవారికి తెలిస్తే, పరువు పోతుందనే భయంతో సక్రమంగా వాడకుండా కోరి ప్రమా దాన్ని తెచ్చి పెట్టుకుంటున్నారు. ఇంత ప్రగతి సాధించినా ఇప్పటికీ సామాన్యులే కాక, విద్యాధికులైన హెచ్ఐవీ రోగులు కూడా అపోహలు, మూఢ నమ్మకాలతో శాస్త్రీయంగా ఎలాంటి నిర్ధారణ కాని పొడులు, కషాయాలతో వ్యాధిని మరింత ముదరబెట్టుకొంటున్నారు. కొందరు పాము విషం తీసుకుంటే ఈ వ్యాధి తగ్గిపోతుందనే ప్రచారాలు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డిసెంబర్ ఒకటవ తేదీ ప్రపంచ ఎయిడ్స్ దినం కోసం ‘అందరం కలసి శ్రమిద్దాం– ఎయిడ్స్ను నిరోధిద్దాం‘ అన్న నినాదాన్ని ప్రకటించింది. 2030 నాటికి ఎయిడ్స్ లేని ప్రపంచాన్ని సృష్టించడానికి, ఆధునిక చికిత్సా పద్ధతులపై ప్రజల్లో అవగాహన పెంచాలని సంకల్పించింది. హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధి నూటికి నూరుపాళ్ళు నివారించే వీలున్న వ్యాధి కనుక నిరంతరం దీనిపై ప్రజల్లో అవ గాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలి. ఆత్మహత్యల నిరోధానికి కౌన్సెలింగ్ ఇస్తున్న తరహాలోనే ప్రజలకు అందుబాటులో ఎయిడ్స్ కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఒక టోల్ ఫ్రీ నంబరుతో రోగులకు, సలహాలు, సూచనలు ఇచ్చే కార్యక్రమం చేపడితే మరిన్ని సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. తామెవరు అన్నది పైకి తెలిసే అవకాశం ఉండదు కనుక రోగులు నిర్భయంగా, ఎలాంటి సంకోచమూ లేకుండా వైద్యులను సంప్రతించి సక్రమంగా చికిత్స తీసుకునే వీలుంటుంది. నిర్మూలనకు మంచి అవకాశాలు ఉన్న ఎయిడ్స్ వ్యాధి ముప్పును ప్రపంచానికి పూర్తిగా తప్పించాలంటే కలసికట్టు కృషి అవసరం. ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, వైద్యులు పరస్పర సహకారంతో ప్రజల్లో, ప్రత్యేకించి ఎయిడ్స్ బాధితుల్లో చక్కటి అవగాహన కల్పించే ప్రయత్నాలు నిరంతరం చేయగలిగితే... మశూచి, ప్లేగు వ్యాధుల మాదిరిగానే అతి త్వరలోనే ఎయిడ్స్ అనే భయంకర రోగాన్ని ప్రపంచం నుంచి తరిమివేయడం అసాధ్యం ఏమీ కాదు. అలాంటి శుభ దినం త్వరలోనే రాగలదని ఆశిద్దాం. డా‘‘ కూటికుప్పల సూర్యారావు వ్యాసకర్త ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత, అంతర్జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ సభ్యులు ‘ 93811 49295(నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం) -
లక్ష్య సాధన కోరుతున్న చిత్తశుద్ధి
కొన్ని నివేదికలు, గణాంకాలు పాలకులైనా, ప్రజలకైనా గట్టి మేలుకొలుపులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల విడుదల చేసిన ‘ప్రపంచ క్షయవ్యాధి (టీబీ) నివేదిక’ అలాంటిదే. ప్రపంచవ్యాప్త టీబీ కేసుల్లో 26 శాతం భారత్లోనే ఉన్నాయట! ఒక్క గడచిన 2023లోనే మన దేశంలో 25.5 లక్షల కొత్త టీబీ కేసులు నమోదయ్యాయి. 1960లలో టీబీపై నియంత్రణకు ఉపక్రమించినప్పటి నుంచి ఇప్పటి దాకా ఇది అత్యధికం. ఇది మన మత్తు వదిలించే మాట. దానికి తోడు పలు ఔషధాలకు లొంగకుండా తయారైన టీబీ (మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ – ఎండీఆర్ టీబీ) సరికొత్త ప్రజారోగ్య సంక్షోభంగా తయారైంది. ఆ కేసులూ మన దేశంలోనే ఎక్కువన్న సంగతి ఆందోళన కలిగిస్తోంది. పేరుకు 85 శాతానికి పైగా టీబీ రోగులకు చికిత్స చేరువైనా, ఖరీదైన మందులతో సామాన్యుల ఇల్లు, ఒళ్ళు గుల్లవుతున్నాయి. దాదాపు 20 శాతం మంది రోగులు తమ వార్షికా దాయంలో 20 శాతం పైగా ఈ చికిత్సకే ఖర్చు చేస్తున్నారట. దీనికి తోడు కొన్నేళ్ళుగా టీబీ నియంత్రణ నిధులు కూడా 13 లక్షల డాలర్ల మేర తగ్గడం శోచనీయం. ఈ చేదు నిజాలన్నీ అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని మన ప్రభుత్వాలకు గుర్తు చేస్తున్నాయి. గడచిన 2023 లెక్కల ప్రకారం భారత్లో దాదాపు 27 లక్షల టీబీ కేసులున్నట్టు అంచనా. వాటిలో 25.1 లక్షల మంది రోగులు మందులు వాడుతున్నారు. అలా చూస్తే టీబీ సోకినవారిలో నూటికి 85 మందికి పైగా చికిత్స పొందుతూ ఉండడం చెప్పుకోదగ్గ విషయమే. నిరుడు అత్యధిక కేసులు నమోదైన సంగతి పక్కన పెడితే... గత ఎనిమిదేళ్ళలో భారత్లో టీబీ కేసులు 18 శాతం తగ్గినట్టు డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా 8 శాతం మేర కేసులు తగ్గితే, భారత్లో అంతకు రెట్టింపు కన్నా ఎక్కువగా కేసులు తగ్గాయట. సంతోషకరమే. కానీ, అది సరిపోతుందా అన్నది ప్రశ్న. 2025 నాటి కల్లా దేశంలో టీబీ లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్ అనుకున్నది సాధించాలంటే ఇది సరిపోదన్నది నిపుణులు తేల్చిచెబుతున్న నిష్ఠురసత్యం. వ్యాధి నిర్ధారణ పరీక్షల వసతుల్ని మరింత మెరుగుపరచడమే కాక, నిధుల కొరతను తీర్చడం, మరింత మందికి చికిత్స అందించడం లాంటివి చేసినప్పుడే టీబీ నిర్మూలన లక్ష్యం వైపు అడుగులు వేయగలం. ఈ వ్యాధిని కేవలం ఆరోగ్య సమస్యగానే చూడలేం. దారిద్య్రం, పౌష్టికాహార లోపం, అంతంత మాత్రపు ఆరోగ్య వసతులు లాంటి సామాజిక – ఆర్థిక కారణాలూ ఇది ముదరడానికి కారణమని విస్మరించలేం. నిజానికి, గత ఆరు దశాబ్దాల కాలంలో మన దేశంలో టీబీ నిర్మూలన కార్యక్రమం కింద లబ్ధి పొందిన రోగుల సంఖ్య తక్కువేమీ కాదు. ఆ సంఖ్య పెరుగుతోంది. అయితే, ఆర్థికంగా బాగా వెనుక బడినవారికి అందుతున్న సాయం ఇప్పటికీ అంతంత మాత్రమే. టీబీ సోకినవారిలో అయిదోవంతు కన్నా ఎక్కువ మందికి సాయం అందడం లేదని ప్రభుత్వ గణాంకాలే ఒప్పుకుంటున్నాయి. అంత కన్నా విషాదం ఏమిటంటే, టీబీ నిర్మూలన లక్ష్యం గురించి పైకి గొప్పగా చెబుతున్నా, తీరా ఆచ రణలో అందుకు కేటాయించాల్సిన నిధుల్ని గణనీయంగా తగ్గించేస్తూ ఉండడం. లెక్క తీస్తే, 2019లో మన దేశంలో ఈ నిర్మూలన కార్యక్రమానికి 43.26 కోట్ల డాలర్ల కేటాయింపులు ఉండేవి. తీరా గడచిన 2023కు వచ్చేసరికి ఆ నిధుల మొత్తాన్ని 30.28 కోట్ల డాలర్లకు తగ్గించేశారు. ఆలోచనకూ, ఆచరణకూ మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది అచ్చంగా ‘దుత్తలో కూడు దుత్తలోనే ఉండాలి. చంకలో పిల్లాడు మాత్రం దుడ్డులా ఉండాల’న్నట్టుగా ఉంది. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలంటున్నది అందుకే. పైగా, కరోనా అనంతరం, గత ఏడాది ఒక్కసారిగా అన్ని కొత్త టీబీ కేసులు ఎందుకు నమోదయ్యాయో లోతుగా అధ్యయనం చేయాలి. టీబీని నిర్మూలన లక్ష్యం గొప్పదే అయినా అందుకు సవాళ్ళూ అనేకం. ప్రభుత్వం అందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. కృతనిశ్చయంతో ఉన్నా ప్రజల్లో ఈ వ్యాధిపై తగినంత చైతన్యం తీసుకు రాలేకపోతున్నారు. మనకున్న వైద్య వసతులూ అంతంత మాత్రమే. ఇక, పౌష్టికాహార లోపం సైతం టీబీ నిర్మూలనకు పెను అవరోధంగా మారింది. కేవలం పౌష్టికాహార లోపం వల్లనే ఏటా వయోజ నుల్లో 35 నుంచి 45 శాతం మేర కొత్త టీబీ కేసులు వస్తున్నాయని నిరుడు ‘లాన్సెట్’ నివేదిక ఒకటి స్పష్టం చేయడం గమనార్హం. అలాగే, సరిగ్గా మందులు వాడకపోవడం వల్ల కీలక ఔషధాలకు పని చేయకుండా పోయిన ఎండీఆర్–టీబీ కేసుల్లోనూ కేవలం 44 శాతమే తగిన చికిత్సకు నోచుకుంటున్నాయి. అదీ మరింత ఖరీదైన, విషతుల్యమైన వాటిని దీర్ఘకాలం వాడాల్సిన అగత్యం ఏర్పడుతోంది. ఈ సవాళ్ళను అధిగమించడానికి చర్యలు చేపట్టడం అవసరం. అందుకు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, కొత్తగా ఆలోచించక తప్పదు. సరికొత్త వైద్యవిధానాల్ని ఆశ్రయించడమూ ముఖ్యమే.ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాన్ని టీబీ రోగులకు, మరీ ముఖ్యంగా ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నవారికి వర్తించేలా చేయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇది మంచి సూచనే. దేశంలో టీబీ నిర్మూలనకు ఇది దీర్ఘకాలంలో బాగా ఉపకరించే ఆలోచన. రోగుల విషయంలో వ్యక్తి కేంద్రితంగా సమగ్ర వైఖరిని అవలంబించాలని శాస్త్రవేత్తలు చెబుతున్న మాటకు చెవి ఒగ్గాలి. అలాగే, ఫార్మసీ రంగాన్ని పెద్ద ఆదాయ వనరుగా చూస్తున్న పాలకులు వైద్య, ఆరోగ్య రంగంలో కీలకమైన పరిశోధనలకూ, కొత్త ఔషధాలు, చికిత్సలకూ ఏపాటి ప్రోత్సాహమిస్తున్నారు? గణనీయంగా నిధులు కేటాయించి, సమన్వయంతో కృషి చేస్తేనే మన దేశంలో టీబీ నివారణ అయినా, నిర్మూలనైనా సాధ్యమవుతుంది. మానవాళిని పట్టిపీడిస్తున్న ప్రాణాంతక వ్యాధులను సమర్థంగా ఎదుర్కోవాలంటే,ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా నిలబడడమే మార్గం. -
మొబైల్ ఫోన్తో బ్రెయిన్ క్యాన్సర్ రాదు
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ వినియోగిస్తే బ్రెయిన్ క్యాన్సర్ సోకుతుందున్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్లుగా ఉంది. అయితే, ఇది అపోహ మాత్రమేనని, ఎంతమాత్రం నిజం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫోన్కు, బ్రెయిన్ క్యాన్సర్కు మధ్య ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటున్నాయి. ఈ అంశంపై జరిగిన 5 వేలకుపైగా అధ్యయనాలను ఆ్రస్టేలియన్ రేడియేషన్ ప్రొటెక్షన్, న్యూక్లియర్ సేఫ్టీ ఏజెన్సీ(అర్పాన్సా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ పరిశోధకుల బృందం నిశితంగా సమీక్షించింది. ఇందులో 63 అధ్యయనాల వివరాలు 1994 నుంచి 2022 వరకు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. గత రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా వైర్లెస్ టెక్నాలజీ వినియోగం విపరీతంగా పెరిగింది. కానీ, బ్రెయిన్ క్యాన్సర్ కేసులు మాత్రం పెరగలేదని పరిశోధకులు గుర్తించారు. అధ్యయనాల్లో తేలిన ఫలితాల ఆధారంగా వారు ఈ నిర్ధారణకు వచ్చారు. ఇది తగిన సాక్ష్యాధారాల ఆధారంగా జరిగిన చాలా సమగ్రమైన విశ్లేషణ అని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సూచనతో జరిగిన ఈ విశ్లేషణ వివరాలను ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ పత్రికలో ప్రచురించారు. ఫోన్ వాడకంతో తలకు, మెడకు సైతం క్యాన్సర్ సోకుతున్నట్లు ఆధారాలు లేవని వెల్లడించారు. ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ను పదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం ఉపయోగిస్తే బ్రెయిన్ క్యాన్సర్ సోకుతుందని చెప్పలేమని స్పష్టంచేశారు. సాధారణంగా ఫోన్ల నుంచి రేడియో తరంగాలు వెలువడుతాయన్న సంగతి తెలిసిందే. ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంటాం కాబట్టి బ్రెయిన్ క్యాన్సర్ సోకుతుందన్న ప్రచారం దశాబ్దాల క్రితమే మొదలైంది. దీనిపై ప్రజల్లో రకరకాల భయాందోళనలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఫోన్ల నుంచి వెలువడే రేడియో తరంగాల వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందంటూ కొన్ని అధ్యయనాలు సైతం చెప్పాయి. 2011లో డబ్ల్యూహెచ్ఓ అనుబంధ విభాగమైన ఇంటర్నేషన్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్(ఐఏఆర్సీ) సైతం ఇదే విషయం వెల్లడించింది. అయితే, ఈ సంస్థ చాలా పరిమితమైన సమాచారంపై ఆధారపడి ఈ నిర్ధారణకు వచ్చిందని, సమగ్రమై అధ్యయనం చేయలేదని అంతర్జాతీయ పరిశోధకులు తాజాగా తేలి్చచెప్పారు. ఫోన్లతో క్యాన్సర్లు వస్తాయన్న ఆపోహ వీడాలని సూచించారు. -
Israel-Hamas war: గాజాకు 3 రోజుల ఊరట
లండన్: గాజాపై దాడులకు ఇజ్రాయెల్ తాత్కాలిక విరామం ఇచి్చంది. గాజాలో పోలియో వ్యాక్సిన్ డ్రైవ్ కోసం ఇజ్రాయెల్ ఇందుకు అంగీకారం తెలిపిందని ఐరాస ప్రకటించింది. పాతికేళ్ల తరవాత గాజాలో ఓ బాలుడిలో పోలియో వ్యాధిని గుర్తించారు. దీని నివారణకు పిల్లలకు టీకా డ్రైవ్ నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్ణయించింది. దాంతో ఇజ్రాయెల్ ‘మానవతా విరామం’ఇచ్చినట్టు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఉదయం ఆరింటి నుంచి మధ్యాహ్నం మూడింటి దాకా యుద్ధవిరామం ఉండనుంది. ఇది విరామమే తప్ప కాల్పుల విరమణ కాదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. మూడు దశల్లో డ్రైవ్... గాజా స్ట్రిప్ అంతటా సుమారు 6.4 లక్షల మంది పిల్లలకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు డబ్ల్యూహెచ్ఓ సీనియర్ అధికారి రిక్ పీపర్కోర్న్ తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ, యునిసెఫ్, యూఎన్ఆర్డబ్ల్యూఏ సహకారంతో పాలస్తీనా ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇది గాజా మధ్య, దక్షిణ, ఉత్తర భాగాల్లో మూడు దశల్లో జరుగుతుంది. గాజాలో ఇప్పటికే 12.6 లక్షల ఓరల్ పోలియో వ్యాక్సిన్ టైప్ 2 (ఎన్ఓపీవీ 2) డోసులున్నాయి. త్వరలో మరో 4 లక్షల డోసులు రానున్నాయి. వ్యాక్సిన్ ఇచ్చేందుకు 2,000 మందికి పైగా హెల్త్ వర్కర్లకు శిక్షణ ఇచ్చారు. గాజా లోపల వైరస్ వ్యాప్తిని నివారించడానికి స్ట్రిప్ అంతటా 90% వ్యాక్సిన్ కవరేజీ సాధించాలని డబ్ల్యూహెచ్ఓ భావిస్తోంది. అందుకోసం అవసరమైతే మరో రోజు యుద్ధవిరామానికి ఇజ్రాయెల్తో ఒప్పందం కుదిరింది. గాజాలో 2022లో 99% పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగింది. గతేడాది 89%కి తగ్గింది. యుద్ధం వల్ల వ్యాక్సిన్ వేయక అధిక సంఖ్యలో పిల్లలు పోలియో బారిన పడే ప్రమాదముందని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో గాజా స్ట్రిప్లోని 6.5 లక్షలకు పైగా పాలస్తీనా బాలలను రక్షించడానికి అంతర్జాతీయ సంస్థలతో సహకరించేందుకు సిద్ధమని హమాస్ కూడా తెలిపింది. -
అప్పుడు కరోనా.. ఇప్పుడు డెంగీ
సాక్షి, హైదరాబాద్: కరోనా ప్రపంచాన్ని వణికించింది. దాని బారిన పడి లక్షలాది మంది మృత్యువాతపడ్డారు. కోట్లాది మంది ఆసుపత్రులపాలయ్యారు. అనేక కుటుంబాలను కోవిడ్ ఛిన్నా భిన్నం చేసింది. అటువంటి వైరస్ పీడ విరగడైంది. కానీ కరోనా తర్వాత ఇప్పుడు డెంగీ... భారత్ సహా దక్షిణా సియా దేశాలను వణికిస్తోంది. డెంగీ ప్రాణాంతకమై నదిగా పరిణమించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంటెలిజెన్స్ నివేదిక హెచ్చరించింది. ఈ మేరకు తాజాగా నివేదిక విడుదల చేసింది. మొత్తం 47 రకాల జబ్బులపై పరిశోధన చేసి వాటిపై నివేదిక రూపొందించింది. అందులో ఎక్కువ ప్రమాదకరంగా ఉన్న మొదటి 10 వ్యాధుల పేర్లను విడుదల చేసింది. అందులో భారత్లో డెంగీ, నిఫా, పోలియో, డిప్తీరియా, జికా వైరస్, ఫుడ్ పాయిజనింగ్, రేబిస్ వంటివి ఉన్నాయని పేర్కొంది.ప్రజారోగ్యానికి ముప్పుగా ఉన్న వాటిల్లో అంటువ్యాధులు 80 శాతం, ప్రకృతి వైపరీత్యాలు 3 శాతం, రసాయన పరమైనవి 1 శాతం, మిగిలినవన్నీ కలిపి 16 శాతంగా ఉన్నాయి. అంటువ్యాధులే ప్రధానంగా ప్రజారోగ్యానికి పెనుసవాళ్లుగా ఉన్నాయని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసే బులెటిన్లలో కోవిడ్ తర్వాత డెంగీపైనే అత్యధికంగా అలర్ట్ బులెటిన్లు విడుదలయ్యాయి. ఆ తర్వాత ఎబోలా ఉందని వెల్లడించింది. 2023లో ఇండియాలో మళ్లీ కలరా కేసులు వెలుగుచూశాయని తెలిపింది. డెంగీ, కలరా విజృంభి స్తున్నాయనీ... జాగ్రత్తగా ఉండాలని... మౌలిక సదుపాయాలు మెరుగుపరుచుకోవాలని సూచించింది.దక్షిణాసియాలో డెంగీనే ప్రమాదకరంభారత్ వంటి దేశాల్లో డెంగీ వల్ల ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దక్షిణాసియా రీజియన్లో డెంగీనే ప్రధానమైనదిగా పరిణమించిందని పేర్కొంది. బంగ్లాదేశ్లో 2002తో పోలిస్తే 2023లో డెంగీ కేసులు 4.8 రెట్లు పెరిగాయి. అక్కడ మరణాలు 9.3 రెట్లు పెరిగాయి. అలాగే థాయ్లాండ్లో కేసులు 2.3 రెట్లు పెరగ్గా మరణాలు 2.5 రెట్లు పెరిగాయి. వాతావరణ మార్పులు, అకాల వర్షాలు, ఎండలు... తదితర కారణాల వల్ల కూడా డెంగీ ముప్పు పెరుగుతోంది. ఎప్పుడు వర్షాలు కురుస్తా యో.. ఎప్పుడు తీవ్రమైన ఎండలు ఉంటా యో తెలియని పరిస్థితి నెలకొంటోంది. దీనివల్ల అందుకు అవసరమైన ఏర్పా ట్లు కూడా సరిగ్గా చేసే పరిస్థితి ఉండటంలేదు. ఆకస్మిక ఉష్ణోగ్రతల వల్ల కూడా దోమల సంతతి వృద్ధి చెందుతోంది. మరోవైపు పట్టణీ కరణ పెరగడంతో డెంగీ వ్యాప్తి చెందుతోంది. నగరీకరణ వల్ల జనం గుంపులుగా ఉండటం... నీటి నిల్వ, మౌలిక సదు పాయాలు లేకపోవడం, నిర్మా ణాలు ఎక్కువకావడం...తదితర కారణాలతో డెంగీ త్వరగా పాకుతోంది. డెంగీ ఒకసారి మొదలైతే అది సులువుగా వ్యాపిస్తుంది.27 దేశాల్లో ఇన్ఫెక్షన్ వ్యాధులుసోమాలియా, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ సహా 27 దేశాల్లో ఇన్ఫెక్షన్ వ్యాధులు వస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలతో మయన్మార్, సూడాన్ సహా 10 దేశాలు ప్రజారోగ్యంలో సమస్యాత్మకంగా ఉన్నా యి. సామాజిక సమస్యల కారణంగా ప్రజారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న దేశాలు కెమరూన్, మయన్మార్, సిరియా. కాగా, ఇన్ఫ్లూయెంజా కేసు లు బంగ్లాదేశ్లో 2023 ఆగస్టులో, థాయ్లాండ్లో అక్టోబర్లో వెలుగుచూశాయి. నిఫా వైరస్ కేసులు బంగ్లాదేశ్, కేరళలో 2023లో నమోదయ్యాయి. 2023లో కేరళలో ఆరు నిఫా కేసులు నమోదు కాగా రెండు మరణాలు సంభవించాయి. థాయ్లాండ్, ఇండోనేసియాల్లో మంకీఫాక్స్ కేసులు నమోదయ్యాయి.ఇంకా ఆ సంస్థపైనే ఆధారం.. ఏదైనా ప్రజారోగ్య సమస్య తలెత్తితే వాటిని ముందస్తుగా గుర్తించడంలో భారత్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాలు వెనుక బడుతున్నాయి. ఆయా దేశాల్లోని ప్రజా రోగ్య సంస్థలు ప్రమాదాన్ని పసిగట్టడంలేదు. 2004–08 మధ్య ఇండియా వంటి దేశాల్లో ప్రజారోగ్య సమస్యలు తలెత్తితే వాటిలో 93 శాతం మొదటగా గుర్తించి అలర్ట్ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థే. అలాగే 2009–13 మధ్య 63 శాతం, 2014–18 మధ్య కాలంలో 84 శాతం, 2019–23 వరకు 91 శాతం ప్రపంచ ఆరోగ్య సంస్థే వాటిని గుర్తించి అప్రమత్తం చేసింది. అమెరికా వంటి దేశాల్లో సగటున 60–70 శాతం వరకు సంఘటనలను ఆయా స్థానిక ప్రభుత్వాలే గుర్తించి అలర్ట్ అవుతున్నాయి. కానీ మనలాంటి దేశాల్లో అటువంటి వ్యవస్థ నేటికీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది.ఇద్దరిలో ఒకరికి డెంగీ రిస్క్ప్రపంచంలో 2022తో పోలిస్తే 2023లో కోవిడ్ మరణాలు 90 శాతం తగ్గాయి. అయితే ఇప్పుడు భారత్లో డెంగీ వ్యాప్తి పెరిగింది. దేశంలో నిర్మాణాలు జరుగుతున్న 6 శాతం ప్రాంతాల్లో డెంగీ వ్యాప్తి జరుగుతోందని గుర్తించారు. వలసల వల్ల కూడా డెంగీ వ్యాప్తి విస్తరిస్తోంది. వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులోనూ ప్రజారోగ్య సమస్యలు పెరుగుతాయని, ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. డెంగీకి వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం పరిశోధన దశలో ఉంది. – డాక్టర్ కిరణ్ మాదల, గాంధీ మెడికల్ కాలేజీ, హైదరాబాద్ -
Monkeypox: మరో మహమ్మారి.. !
కోవిడ్ మహమ్మారి సృష్టించిన మహావిలయం నుంచి ప్రపంచం పూర్తిగా తేరుకోకముందే ఎంపాక్స్ రూపంలో మరో వైరస్ భూతం భూమండలాన్ని చుట్టేస్తోంది. తొలుత ఆఫ్రికా దేశాలకే పరిమితమైన ఈ వైరస్ తాజాగా రూపాంతరాలు చెంది ప్రాణాంతకంగా పరిణమించింది. ఆఫ్రికాలో ఇన్నేళ్లలో వందలాది మంది మరణాలతో ప్రపంచదేశాలు ఇన్నాళ్లకు అప్రమత్తమయ్యాయి. నిర్లక్ష్యం వహిస్తే మరో మహమ్మారిని స్వయంగా ఆహా్వనించిన వారమవుతామని దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరికలు జారీచేసింది. ఈ మేరకు బుధవారం ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించింది. ఆఫ్రికా ఖండాన్ని దాటి వేరే ఖండాల దేశాల్లోనూ వేగంగా వ్యాపిస్తుండటంతో 2022 ఏడాది తర్వాత తొలిసారిగా డబ్ల్యూహెచ్ఓ ‘గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ’ని ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఆఫ్రికాలో ఈ 7 నెలల్లో∙15,600 కేసులు నమోదయ్యాయి. 537 మంది ఎంపాక్స్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా స్వీడన్, పాకిస్థాన్లకూ వైరస్ పాకింది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి, కట్టడి, నివారణ చర్యలుసహా వ్యాధి పుట్టుపూర్వోత్తరాలను ఒకసారి తెల్సుకుందాం. ఏమిటీ ఎంపాక్స్ వైరస్? 1958లో తొలిసారిగా కోతుల్లో ఈ వైరస్ను కనుగొన్నారు. అందుకే ఈ వైరస్కు మంకీపాక్స్ పేరు స్థిరపడిపోయింది. అప్పట్లో పరిశోధన కోసం డెన్మార్క్కు తరలించిన కోతుల్లో కొత్త రకం వ్యాధి లక్షణాలు కనిపించడంతో ల్యాబ్ పరీక్షలు జరిపి ఈ వైరస్ ఉనికి కనిపెట్టారు. 1970లో కాంగో దేశంలో తొమ్మిదేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకడంతో తొలిసారిగా మనుషుల్లో ఈ వైరస్ను గుర్తించారు. మనుషులు, చిట్టెలుకలకూ వైరస్ సోకడంతో ‘మంకీ’పాక్స్కు బదులు ఎంపాక్స్ అనే పొట్టిపేరును ఖరారుచేశారు. ఆర్థోపాక్స్ వైరస్ రకానికి చెందిన ఎంపాక్స్ సోకితే చర్మం ఎర్రగా మారి పొక్కులు వస్తాయి. సొన చేరి పొక్కులు ఇబ్బంది పెడతాయి. దశాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న మశూచి వ్యాధికి కారణమైన వైరస్, ఎంపాక్స్ ఒకే జాతికి చెందినవి. గోవులకు సోకే గోమశూచి, వసీనియా వంటి వ్యాధులను కల్గించే వైరస్ కూడా ఈ రకానిదే. వైరస్ ఎలా సోకుతుంది? → అప్పటికే వైరస్ సోకిన మనుషులు లేదా జంతువులను తాకినా, వారితో దగ్గరగా గడిపినా వైరస్ సోకుతుంది. → కుక్క లేదా ఇతరత్రా పెంపుడు జంతువులకు వైరస్ సోకితే అవి మనుషులను కరిచినా, తాకినా, వాటి లాలాజలం, రక్తం, ఇతర స్రావాలు అంటుకున్నా వైరస్ సోకుతుంది. → చర్మంపై గాయాలు, శరీర స్రావాలు, తుమ్మినపుడు పడే తుంపర్లు, నోటి లాలాజలం ఇలా వైరస్కు ఆవాసయోగ్యమైన ప్రతి తడి ప్రాంతం నుంచి వైరస్ సోకుతుంది → ఎక్కువసేపు ముఖాన్ని ముఖంతో తాకినా, ముద్దుపెట్టుకున్నా సోకొచ్చు → రోగి వాడిన దుస్తులు, వస్తువులను ముట్టుకున్నా, వాడినా వైరస్ సోకే అవకాశాన్ని కొట్టిపారేయలేం వేటి ద్వారా వ్యాధి వ్యాపిస్తుంది? రోగి వినియోగించిన దుస్తులు, మంచం, టవల్స్, పాత్రలు సాధారణ వ్యక్తి వాడితే అతనికీ వైరస్ వస్తుం లాలాజలం తగిలినా, కరచాలనం చేసినా సోకుతుంది. తల్లి నుంచి బిడ్డకు వైరస్ సంక్రమించవచ్చు. కొత్తగా ఏఏ దేశాల్లో విస్తరించిందికొత్తగా 13 ఆఫ్రికా దేశాల్లో వేగంగా విస్తరిస్తోందని గత వారం గణాంకాల్లో వెల్లడైంది. క్రితంతో పోలిస్తే ఇక్కడ కేసులు 160 శాతం, మరణాలు 19 శాతం పెరగడం గమనార్హం. కొత్త కేసుల్లో 96 శాతం కేసులు ఒక్క కాంగోలోనే గుర్తించారు. ఎంపాక్స్ కొత్త వేరియంట్ రోగుల్లో మరింతగా వ్యాధిని ముదిరేలా చేసి జననాంగాల వద్ద చర్మగాయాలకు కారణమవుతోంది. దీంతో తమకు ఈ వైరస్ సోకిందన్న విషయం కూడా తెలీక చాలా మంది కొత్త వారికి వైరస్ను అంటిస్తున్నారు. 2022 ఏడాదిలో ఎంపాక్స్ క్లాడ్2 రకం వేరియంట్ విజృంభిస్తే ఈసారి క్లాడ్1 వేరియంట్ వేగంగా సంక్రమిస్తోంది. ఈ వేరియంట్ అత్యంత ప్రమాదకరం. లక్షణాలు ఏమిటీ?→ చర్మంపై దద్దుర్లతోపాటు జ్వరం, భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి వస్తాయి. ఒళ్లంతా నీరసంగా ఉంటుంది. గొంతు ఎండిపోతుంది. → మధ్యస్థాయి పొక్కులు పైకి తేలి ఇబ్బంది కల్గిస్తాయి.→ మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి, వణ్యప్రాణుల నుంచి సోకుతుంది. 90 శాతం కేసుల్లో ముఖంపైనా, 75 శాతం కేసుల్లో అరచేతులు, పాదాల మీద, 30 శాతం కేసుల్లో జననాంగాల మీద పొక్కులు వస్తాయి. నీటి బొడిపెలుగా చిన్నగా మొదలై పెద్దవై తర్వాత సొన చేరి ఎర్రగా, నల్లగా మారి పగులుతాయి. వ్యాక్సిన్ ఉందా? అత్యల్ప లక్షణాలు కనిపిస్తే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. ప్రస్తుతానికి ఎంపాక్స్ సోకిన వారికి నిర్ధష్టమైన చికిత్స విధానంగానీ వ్యాక్సిన్గానీ లేవు. మశూచి చికిత్సలో వాడే యాంటీ వైరల్ ఔషధమైన టికోవిరమాట్(టీపీఓఎక్స్ ఎక్స్)ను ఎంపాక్స్ రోగులకు ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. అమెరికాలో మశూచికి వాడే జెనియోస్ డ్రగ్స్నే 18 ఏళ్లు, ఆపైబడిన వయసు రోగులకు ఇస్తున్నారు. కోవిడ్ దెబ్బకు సంపన్న, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాధులు ప్రబలేలోపే నివారణ చర్యలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఆరోగ్యపరంగా నిఘా కార్యక్రమాలు కొనసాగుతున్నాయిగానీ వెనుకబడిన ఆఫ్రికా దేశాల్లో అవేం లేవు. దీంతో వైరస్ వ్యాప్తి ఆగట్లేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మానవుల వల్లే వైరస్ల విజృంభణ!
వాతావరణ సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకే ప్రక్రియ వేగవంతమైంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతూండటం, మంచినీటి లభ్యత తగ్గిపోతూండటం, తమ సహజ ఆవాస ప్రాంతాల నుండి బయటకు మనుషులతోపాటు జంతువులూ కదులుతూండటం వల్ల సమస్య మరింత జటిలమవుతోంది. వాతావరణ మార్పు తీవ్రతను ఎంత కనిష్ఠంగా లెక్క కట్టినా కనీసం మూడు లక్షల వైరస్లు మొట్టమొదటిసారి కొత్త జంతు అతిథిలోకి చేరతాయని అంచనా. క్షీరదాలు, పక్షుల వలస మార్గాలను కృత్రిమ మేధ సాయంతో అంచనా కట్టి... వ్యాధికారక సూక్ష్మజీవులు ఎక్కడెక్కడ అధికం అవుతాయో గుర్తించి తగిన చర్యలు తీసుకోవటం, గట్టి ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం ఇందుకు పరిష్కారం.దేశంలో మళ్లీ ఇప్పుడు వైరస్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఒక పక్క ప్యారిస్లో భారీ మహోత్సవాల మధ్య ఒలింపిక్స్ జరుగుతుండగా... ఇంకోపక్క దేశంలో నిఫా, చాందీపుర వైరస్లు కూడా ఒలింపిక్స్ మాదిరిగానే వార్తల్లోకి ఎక్కుతున్నాయి. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కోవిడ్ కారణంగా ఇప్పటికీ మరణాలు కొనసాగుతున్నట్లు మనల్ని హెచ్చరి స్తుండటం గమనార్హం. వీటన్నింటినీ పక్కనపెట్టినా, సాధారణ జలుబు రూపంలో బోలెడన్ని వైరస్ రకాలు తెరిపి లేకుండా మనిషిని జబ్బున పడేస్తూనే ఉన్నాయి. అనేక వైరస్ వ్యాధులు జంతువుల నుంచి మనుషులకు సోకు తున్నవే. అదేదో జంతువులు మనపై కక్షకట్టి చేస్తున్న పనేమీ కాదు. మానవులు ఆక్రమించుకున్న తమ ఆవాసాలను మళ్లీ సంపాదించు కునే పనిలో ఉన్నాయనీ కాదు. అడవిలో బతికే జంతుజాలాన్ని మనం మన ఆవాసాల్లోకి చేర్చుకున్నాం కాబట్టి! అలాగే మన మధ్యలో ఉన్న జంతువులు అటవీ ప్రాంతాల్లోకి చేరేందుకు తగిన ‘మార్గం’ వేశాము కాబట్టి! అటవీ ప్రాంతాల విచ్చలవిడి విధ్వంసం, పాడి పశువులను పెద్ద ఎత్తున పెంచుతూండటం, రకరకాల పెంపుడు జంతువుల ఎగు మతి, దిగుమతులు, దేశాల మధ్య మనిషి విపరీతంగా తిరిగేస్తూండటం వంటివన్నీ వైరస్లు కూడా మనుషుల్లోకి జొరబడేందుకు అవ కాశాలు పెంచుతున్నాయి. పెరుగుతున్న వేడి... తరుగుతున్న నీరువాతావరణ సంక్షోభం కారణంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకే ప్రక్రియ వేగవంతమైంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతూండటం, మంచినీటి లభ్యత తగ్గిపోతూండటం, తమ సహజ ఆవాస ప్రాంతాల నుండి బయటకు మనుషు లతోపాటు జంతువులూ కదులుతూండటం వల్ల సమస్య మరింత జటిలమవుతోంది. వైరస్లు స్వేచ్ఛగా ఒక జంతువు నుంచి ఇంకో దాంట్లోకి చేరేందుకు ఈ పరిస్థితులు వీలు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే సురక్షితంగా ఉండేందుకు లేదా తీవ్రస్థాయి అనారోగ్యం కలిగించేందుకు వీలు కల్పించే కొత్త కొత్త జంతు అతిథులు వైరస్లకు లభిస్తున్నాయి. సైన్ ్స రచయిత ఎడ్ యంగ్ ఇటీవల ‘ది అట్లాంటిక్’లో రాస్తూ... మనిషి ‘ప్యాండెమిసీన్’ యుగాన్ని సృష్టించుకున్నాడని ప్రస్తుత పరిస్థితిని అభివర్ణించారు. భూమిపై మనిషికి ముందు ఉన్న యుగాన్ని హాలోసీన్ అని, మనిషి పుట్టుక తరువాతి యుగాన్ని ఆంత్రో పసీన్ అని పిలిస్తే... ప్రస్తుత మహమ్మారుల యుగాన్ని ప్యాండెమిసీన్ (పాండమిక్ = మహమ్మారి) అని పిలిచాడన్నమాట. జార్జ్టౌన్ యూనివర్సిటీకి చెందిన గ్లోబల్ ఛేంజ్ జీవశాస్త్రవేత్త కాలిన్ కార్ల్సన్ ఈ మధ్యే ఈ ప్యాండెమిసీన్ కు సంబంధించి భవిష్యత్తు దర్శనం చేయించారు. వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులో ఎలాంటి వైరస్లు మనుషులకు సోకే అవకాశముందో అంచనా కట్టారు. ‘నేచర్’లో ప్రచురితమైన ఈ అంచనా ప్రకారం... మనిషిని ముట్టడించేందుకు అవకాశమున్న వైరస్ల సంఖ్య ఏకంగా పదివేల రకాలు! ప్రస్తుతం వీటిల్లో అత్యధికం జంతువుల్లో మాత్రమే తిరు గుతూ ఉన్నాయి. ప్రకృతి సిద్ధమైన హద్దులు చెరిగిపోతూండటంతో అవి ఇతర జంతువులకు అంటే మనుషులకు కూడా సోకే ప్రమాదం పెరిగింది. వాతావరణ సంక్షోభం కాస్తా జంతువులు, మనుషులు కొత్త ప్రాంతాలకు వలస వెళ్లేలా చేస్తూండటం గోరుచుట్టుపై రోకటిపోటు అన్న చందం అయిందన్నమాట. ఇట్లాంటి పరిస్థితులు వైరస్లకు జాతర లాంటిది అంటే అతిశయోక్తి కాదు. అసలు పరిచయమే లేని బోలెడన్ని వైరస్లు ఒక దగ్గర చేరితే ఎన్ని కొత్త స్నేహాలు, బంధుత్వాలు కలుస్తాయో ఊహించుకోవచ్చు.వినాశకర మార్పులువేర్వేరు వాతావరణ, భూ వినియోగ మార్పు పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కార్ల్సన్ వేసిన అంచనాల ప్రకారం 2070 నాటికి కనీసం 3,139 క్షీరద జాతులు (పాలిచ్చి పెంచే జంతువులు) సహజ ఆవాసాలకు దూరంగా వలస వెళతాయి. ఈ మార్పు కూడా ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని ఎతై ్తన, జీవవైవిధ్య భరిత, జనసాంద్రత అధికంగా ఉన్న చోట్ల జరుగుతుంది. దీనివల్ల జీవజాతుల మధ్య వైరస్ల సంచారం నాలుగు వేల రెట్లు ఎక్కువ అవుతుందని వీరు లెక్క కట్టారు. ఒకప్పుడు పశ్చిమ ఆఫ్రికాకు మాత్రమే పరిమితమైన ఎబోలా వైరస్ ఇప్పుడు ఖండమంతా విస్తరించింది. అలాగే దక్షిణాసియా లోనూ మునుపు నిర్ధారించిన ప్రాంతాలను దాటుకుని వైరస్లు మను షులకు సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాతావరణ మార్పు తీవ్రతను ఎంత కనిష్ఠంగా లెక్క కట్టినా కనీసం మూడు లక్షల వైరస్లు మొట్టమొదటిసారి కొత్త జంతు అతిథిలోకి చేరతాయని కార్ల్సన్ బృందం అంచనా వేస్తోంది. వీటిల్లో 15,000 వరకూ క్షీరదాలు ఉంటాయి. వాస్తవానికి ఈ మార్పిడి ఇప్పటికే మొదలైందని కార్ల్సన్ హెచ్చరిస్తున్నారు. 2100 నాటికి భూమి సగటు ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీ సెల్సియస్ వరకూ పెరగవచ్చునని వాతావరణ శాస్త్రవేత్తలు ప్యారిస్ ఒప్పందంలో చెప్పిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఉష్ణోగ్రతలు ఆ స్థాయికి చేరక ముందే పరిస్థితి ఇలా ఉంటే ఇక చేరితే ఇంకెలా ఉంటుందో ఊహించడం కష్టమే. కనిపించేది కొంతే... పొంచివున్నది ఎంతో!కార్ల్సన్ బృందం చేపట్టిన ఈ అధ్యయనం పేరు ‘ఐస్బర్గ్ స్టడీ’. అంటే పైకి కనిపించే భాగం మాత్రమే. కనిపించనిది ఇంకా చాలానే ఉందన్నమాట. ప్రస్తుతం ఎక్కువ అవుతున్న జూనోటిక్ వ్యాధులు రాగల ప్రమాదాలతో పోలిస్తే చిన్న భాగం మాత్రమేనని అర్థమవుతుంది. క్షీరదాల్లో గబ్బిలాలు జూనోటిక్ వైరస్ల విజృంభణలో ముందు వరసలో ఉన్నాయి. సార్స్ కోవ్–2 కూడా వూహాన్ ప్రాంతంలోని గుహల్లో ఉన్న గబ్బిలాల నుంచి మనుషులకు సోకిందే. ఎక్కువ దూరాలు ప్రయాణించగల సామర్థ్యం వల్ల ఈ గబ్బిలాలు వాతావరణ మార్పులకు వేగంగా స్పందిస్తాయి. వందల కిలోమీటర్ల దూరాన్ని దాటేస్తాయి. తమతోపాటు వైరస్లను కూడా మోసుకొస్తాయి.పండ్లను ఆహారంగా తీసుకుంటాయి కాబట్టి ఈ వైరస్ జాడలు పండ్ల నుంచి మనకూ సోకుతాయన్నమాట. నిఫా వైరస్ ప్రస్థానం కూడా దాదాపుగా ఇలాంటిదే. ఆగ్నేయాసియా ప్రాంతంలో గబ్బిలాల జీవ వైవిధ్యం చాలా ఎక్కువ. ఫలితంగా ఈ ప్రాంతం నుంచి సరికొత్త వ్యాధులు పుట్టుకొచ్చే, వ్యాప్తి చెందే అవకాశం కూడా ఎక్కువే. అయితే జలచరాలు, పక్షుల ద్వారా కూడా వైరస్లు మనిషికి సోక వచ్చు. ఇన్ ఫ్లుయెంజా వైరస్ రకాలకు పక్షులు ఆతిథ్యమిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వాతావరణ మార్పులు అనేవి వ్యవస్థ మొత్తాన్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పుల సమస్యను మనం మరింత తీవ్రతతో పరిష్కరించాల్సిన అవసరాన్ని ఈ ఐస్బర్గ్ స్టడీ స్పష్టం చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదించిన వన్ హెల్త్ (మనుషులతోపాటు పరిసరాల్లోని జంతువులపై కూడా పర్యవేక్షణ) మైక్రోబియల్ నిఘా వ్యవస్థ, వేర్వేరు ప్రాంతాలు, జీవజాతుల సమాచారాన్ని క్రోడీకరించడం వంటివి ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. క్షీరదాలు, పక్షుల వలస మార్గాలను కృత్రిమ మేధ సాయంతో అంచనా కట్టి... బ్యాక్టీరియా, వైరస్ల వంటి వ్యాధికారక సూక్ష్మజీవులు ఎక్కడెక్కడ ఎక్కువ అవుతాయో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తు అవసరాలను సరిగ్గా అంచనా కట్టే ఆరోగ్య వ్యవస్థల ఏర్పాటూ తప్పనిసరి. అప్పుడే కొత్త వ్యాధుల ఆగమనం, వాటిని అడ్డుకోవడం, సమర్థంగా తిప్పికొట్టడం సాధ్య మవుతుంది. కె. శ్రీనాథ్ రెడ్డి వ్యాసకర్త ‘పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ మాజీ అధ్యక్షులు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
డెంగీ హైరిస్క్ ప్రాంతాలు 2,071
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ పంజా విసురుతోంది. దీంతో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈసారి తెలంగాణలో అత్యధికంగా డెంగీ కేసులు నమోదవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో వైద్య,ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 2,071 డెంగీ హైరిస్క్ ప్రాంతాలను గుర్తించింది. ఆ ప్రాంతాల్లో ఏకంగా 65.62 లక్షల మంది జనాభా ఉన్నారని నిర్ధారించడం ఆందోళన కలిగిస్తోంది. గత సంవత్సరాల్లో వచి్చన డెంగీ కేసుల ఆధారంగా ఈ నిర్ధారణకు వచి్చనట్టు వైద్య,ఆరోగ్యశాఖ వెల్లడిస్తూనే, అప్రమత్తమై 33 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసింది.42 డెంగీ పరీక్ష కేంద్రాలు, ఆస్పత్రులు, తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లను గుర్తించి వాటిల్లో సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 53 బ్లడ్ బ్యాంకులను గుర్తించగా, వాటిలో 26 బ్లడ్ బ్యాంకుల్లో ప్లేట్లెట్ యూనిట్లు ఉన్నాయని తెలిపింది. అన్ని జిల్లాల్లోనూ శానిటైజేషన్, నీటినిల్వ ప్రాంతాల్లో దోమలు రాకుండా చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాలని వైద్య,ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినాజడ్.చోంగ్తు ఆదేశాలు జారీ చేశారు.ఈ మేరకు ఆమె శుక్రవారం డెంగీ, సీజనల్ వ్యాధుల పరిస్థితిపై అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ శుక్రవారం డ్రై డే పాటించడంలో భాగంగా ఆశ, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లాలని, నీటిలో డెంగీ కారక దోమల సంతానోత్పత్తిని నివారించాలని కోరారు. లార్వా వ్యాప్తి ఇతర జిల్లాల కంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్ వంటి కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయని వైద్య,ఆరోగ్యశాఖ ప్రకటించింది. జూలై నెలలోనే 800 కేసులు వాతావరణ మార్పులు, వర్షాల నేపథ్యంలో దోమల తీవ్రత కారణంగా డెంగీ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఏడాది జూన్ వరకు రాష్ట్రంలో 1,078 కేసులు నమోదైతే... ఒక్క జూలైలోనే 800 వరకు కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. నీటి నిల్వలు భారీగా పెరుగుతుండటం, పారిశుధ్యలోపం కారణంగా ఆగస్టు, సెపె్టంబరు నెలల్లో డెంగీ బాధితుల సంఖ్య మరింత పెరగవచ్చని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు డెంగీ బాధితులు వస్తున్నారు. ఔట్ పేషెంట్ల సంఖ్య కూడా పెరిగింది. ఇక గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందంటున్నారు. -
డబ్ల్యూహెచ్వో చెప్పినా.. పెడచెవిన..
‘ఈ సీజన్లో తెలంగాణకు డెంగీ ప్రమాదం పొంచి ఉంది. డెంగీ ప్రమాదం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉండగా, డెంగీలోని నాలుగు ప్రధాన వేరియంట్లన్నీ ఇక్కడే కనిపిస్తున్నాయి. డీఈఎన్వీ1, డీఈఎన్వీ2, డీఈఎన్వీ3, డీఈఎన్వీ4 ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు రెండు మూడు వేరియంట్లు కూడా ఒకేసారి రోగులపై దాడి చేసే ప్రమాదం పొంచి ఉంది.’ – రాష్ట్రానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికసాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలకు తగ్గట్టే రాష్ట్రంపై డెంగీ పంజా విసురుతోంది. గతేడాదితో పోలిస్తే ఇప్పుడు పెద్దఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని..ఆస్పత్రుల్లో అవసరమైన కిట్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. కానీ ప్రజారోగ్య సంచాలకుల విభాగం మాత్రం క్షేత్రస్థాయిలో సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందన్న విమర్శలు ఉన్నాయి. గతేడాది మొదటి ఆరు నెలలతో పోలిస్తే..ఈ ఏడాది ఆరు నెలల్లో డెంగీ కేసులు అధికంగా నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ నివేదిక పేర్కొంది.లక్షలాది మందికి జ్వరాలు.. ఆస్పత్రులు కిటకిటరాష్ట్రంలో లక్షలాది మందికి జ్వరాలు సోకాయని వైద్యారోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు తాజాగా ఒక నివేదికను ప్రభుత్వానికి పంపించింది. ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది జ్వరాలతో బాధపడుతున్నారని ఒక వైద్యాధికారి వెల్లడించారు.దీంతో రాష్ట్రంలో జ్వరాలతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. మరోవైపు చికున్గున్యా కేసులు భారీగా నమోదయ్యాయి. చాలామంది రోగులు జ్వరంతో బాధపడుతూ ఒళ్లు నొప్పులు కూడా ఉంటున్నట్టు చెబుతున్నారు. కాగా, ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్లు పెరి గారు. హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రిలో సాధారణ రోజుల్లో 40 మంది వచ్చేవారు..కానీ ఇప్పుడు ఆ సంఖ్య వందకు పెరిగిందని డాక్టర్లు చెబుతున్నారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు వెయ్యిచొప్పున ఓపీ ఉంటోంది.రక్తస్రావం జరిగితే ప్రమాదకరండెంగీని ముందుగా గుర్తించితే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా చికిత్స పొందవచ్చు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. ముక్కు నుంచి కానీ, మలం ద్వారా గానీ, బ్రష్ చేసేప్పుడు పళ్ల మధ్య నుంచి రక్తస్రావం అవుతుంది. ఇలా అధికంగా రక్తస్రావం అయితేనే ప్రమాదకరం. మహిళలకు పీరియడ్స్ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే అదనంగా అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని వారు గుర్తించాలి. అలాంటి సమయాల్లో ప్లేట్లెట్ల సంఖ్య 50 వేలున్నా సరే తప్పనిసరిగా ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. రక్తస్రావం కానప్పుడు 20 వేల వరకు ప్లేట్లెట్లు పడిపోయినా ప్రమాదం కాదు. అప్పుడు ప్రత్యేకంగా ప్లేట్లెట్లు ఎక్కించి రోగిని సాధారణ స్థితికి తీసుకురావొచ్చు.– డాక్టర్ కె.కృష్ణప్రభాకర్, హైదరాబాద్ -
The Lancet Planetary Health journal: ఊపిరి తీస్తున్న వాయు కాలుష్యం
న్యూఢిల్లీ: ఆయువు పోయాల్సిన వాయువు ప్రాణాలు తోడేస్తోంది. వాయువులో ప్రాణాంతకమైన కాలుష్య కారకాలు కలుస్తున్నాయి. ఊపిరి పీలిస్తే శరీరంలోకి చేరిపోయి, అవయవాలను నిర్వీర్యం చేస్తున్నాయి. ఇండియాలోని పది అతిపెద్ద నగరాల్లో సంభవిస్తున్న రోజువారీ మరణాల్లో సగటున 7.2 శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణమని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించిన పరిమితి కంటే హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లోని గాలిలో అత్యంత సూక్ష్మమైన ‘పీఎం 2.5’ ధూళి కణాలు అధికంగా ఉన్నట్లు లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ పత్రిక స్పష్టం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో చాలా మరణాలకు వాయు కాలుష్యమే కారణమవుతున్నట్లు తెలియజేసింది. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న ఉద్గారాలు గాలిని విపరీతంగా కలుషితం చేస్తున్నాయని పేర్కొంది. అధ్యయనం వివరాలను పత్రికలో ప్రచురించారు. 2.5 మైక్రోమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న ధూళి కణాలను ‘పీఎం 2.5 కణాలు’ అంటారు. → భారతదేశంలోని పెద్ద నగరాల్లో నిత్యం వెలువడుతున్న పీఎం 2.5 ధూళి కణాలతో మరణాల ముప్పు నానాటికీ పెరుగుతోందని పరిశోధకులు వెల్లడించారు. → ఇండియాలో వాయు కాలుష్యంపై వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీలోని సెంటర్ ఫర్ క్రానిక్ డిసీజ్ కంట్రోల్తోపాటు పలువురు అంతర్జాతీయ పరిశోధకులు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, కోల్కతా, పుణే, సిమ్లా, వారణాసి నగరాల్లో 2008 నుంచి 2019 దాకా ఈ అధ్యయనం నిర్వహించారు. → క్యూబిక్ మీటర్ గాలిలో పీఎం 2.5 ధూళి కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే రోజువారీ మరణాల సంఖ్య 1.4 శాతం పెరుగుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా మరణాల మప్పు 2.7 శాతం పెరుగుతున్నట్లు తేల్చారు. → ప్రపంచ ఆరోగ్య సంస్థ విధివిధానాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటర్ గాలిలో పీఎం 2.5 కణాలు 15 మైక్రోగ్రాముల లోపు ఉంటే ప్రమాదం లేదు. అంతకంటే మించితే ముప్పు తప్పదు. → భారత వాయు నాణ్యత ప్రమాణాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటర్ గాలిలో పీఎం 2.5 ధూళి కణాలు 60 మైక్రోగ్రాముల లోపు ఉండే ప్రమాదం అంతగా ఉండదు. కానీ, ప్రస్తుతం 75 మైక్రోగ్రాముల కంటే అధికంగానే ఉంటున్నట్లు తేలింది. → క్యూబిక్ మీటర్ గాలిలో పీఎం 2.5 కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే మరణాల రేటు సగటున 3 శాతం దాకా పెరుగుతున్నట్లు గుర్తించారు. → స్థానికంగా వెలువడే ఉద్గారాలు, కాలుష్యంతో పీఎం 2.5 కణాల ఉత్పత్తి పెద్ద ఎత్తున జరుగుతోంది. అందుకే స్థానికంగా కాలుష్యాన్ని సమర్థవంతంగా కట్టడి చేస్తే మరణాల ముప్పు చాలావరకు తగ్గుతుందని సైంటిస్టులు సూచిస్తున్నారు. -
ఒకేసారి 4 వేరియంట్ల దాడి
ఈ సీజన్లో తెలంగాణకు ‘డెంగీ’ ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. కేసుల తీవ్రత ఈసారి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. దేశంలో డెంగీ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు డెంగీ తీవ్రతపై ప్రపంచ ఆరోగ్యసంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. డెంగీలోని నాలుగు ప్రధాన వేరియంట్లు తెలంగాణలోనే కనిపిస్తున్నాయని వెల్లడించింది.డీఈఎన్వీ1, డీఈఎన్వీ2, డీఈఎన్వీ3, డీఈఎన్వీ4 ప్రభావం ఎక్కువగా ఉంటున్నట్టు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. కొన్నిసార్లు రెండుమూడు వేరియంట్లు కూడా ఒకేసారి దాడి చేసే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ఫలితంగా డెంగీ బాధితులు తీవ్రమైన ఇబ్బందులు పడతారని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఆస్పత్రుల్లో అవసరమైన కిట్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 500కు పైగా డెంగీ కేసులు వెలుగు చూడడం గమనార్హం. – సాక్షి, హైదరాబాద్వైద్య పరీక్షలే కీలకం ⇒ డెంగీ నిర్ధారణలో వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటి వాటితో దీనిని నిర్ధారించడం శాస్త్రీయం కాదని వైద్య,ఆరోగ్యశాఖ చెబుతోంది. ⇒ విధిగా అందుబాటులో ఉండే ఐజీఎం పరీక్ష చేయించాలి. ⇒ ప్లేట్లెట్లు 20 వేలలోపు పడిపోతే అది ప్రమా దకరంగా భావిస్తారు. 15 వేల కన్నా తగ్గితే డెంగీ షాక్, డెంగీ మరణాలు సంభవిస్తాయి. ⇒ డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్ల ని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడ వాలి. ⇒ ఎలక్ట్రాల్ పౌడర్, పండ్ల రసాలు రోగికి ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్లెట్లు అదుపు లోకి వస్తాయి. ఇంకా తగ్గకుంటే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలని వైద్య,ఆరోగ్యశాఖ సూచించింది. ⇒ వైరల్ ఫీవర్ నుంచి దూరంగా ఉండాలంటే ఫ్రైడే ను డ్రై డేగా పాటించాలి. ⇒దోమలు కుట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. రాత్రి మాత్రమే కాకుండా పగటిపూట కూడా దోమల మందులు వాడాలి. ⇒స్కూల్ పిల్లలకు దోమలు కుట్టకుండా పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలి. ⇒కాచి వడగాచిన నీటిని తాగాలి. వైరల్ ఫీవర్ వస్తే విపరీతంగా మంచినీరు తాగాలి. పండ్ల రసాలు తీసుకోవాలి. దీనివల్ల ప్లేట్లెట్లు పడిపోకుండా ఉంటుంది.డెంగీ లక్షణాలు⇒డెంగీతో ఉన్నట్టుండి తీవ్రజ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది.⇒కళ్లు తెరవడం కూడా కష్టంగా ఉంటుంది. కదిపితే నొప్పి వస్తుంది. ⇒చర్మంపై దద్దుర్లు అయినట్టు కనిపించడం, కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. ⇒అధిక దాహం, రక్తపోటు పడిపోవడం ఉంటుంది.ముందుగా గుర్తిస్తే ప్రమాదమేమీ ఉండదుఇక డెంగీని ముందుగా గుర్తిస్తే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా వైద్యుల చికిత్స పొందవచ్చని డాక్టర్లు అంటున్నారు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. ముక్కు నుంచి కానీ, మలం ద్వారాగానీ, బ్రష్ చేసేటప్పుడు పళ్ల మధ్య నుంచి రక్తస్రావం అవుతుంది. ఇలా అధికంగా రక్తస్రావం అయితేనే ప్రమాదకరమని చెబుతున్నారు. మహిళలకు పీరియడ్స్ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే అధికంగా అయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దాన్ని వారు గుర్తించాలని సూచిస్తున్నారు.ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ దోపిడీ...ఏటా డెంగీ జ్వరాలతో బాధపడేవారిని ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీ చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. డెంగీ విషయంలో సాధారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోతే 20 వేల వరకు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గినా నష్టంలేదని, అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు 50 వేల వరకు ప్లేట్లెట్లు తగ్గినా ఇబ్బంది లేదని వైద్య నిపుణులు అంటున్నారు. చాలా కేసుల్లో సాధారణ జ్వరానికి చేసే వైద్యమే సరిపోతుందని అంటున్నారు. కానీ అనేక ప్రైవేటు ఆస్పత్రులు 50 వేలకు పైగా ప్లేట్లెట్లు ఉన్నా ఐసీయూలో ఉంచి అదనంగా ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. నాలుగైదు రోజులు ఉంచుకొని రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు కూడా ఫీజులు వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి. సాధారణ విష జ్వరాలకు కూడా నాలుగైదు రోజులు ఆస్పత్రుల్లో ఉంచుకొని రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. డెంగీ ఉన్నా లేకపోయినా కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నాయని, ప్లేట్లెట్లు ఎక్కువున్నా తక్కువ చూపిస్తున్నాయన్న ఫిర్యాదులు సర్కారుకు చేరాయి. -
ఢైలీ రొటీన్ను ఇలా ప్లాన్ చేయండి
ఆర్థిక విషయాలను పకడ్బందీగా నిర్వహించడం ఎంత అవసరమో ఆరోగ్య భరోసానిచ్చే దైనందిన కృత్యాలు నిర్వహించడమూ అంతే అవసరం. ఆర్ఎన్ఎ- డీఎన్ఏ మొదలు గుండె–మెదడు వరకూ ప్రతీ అణువు, కణము శరీరంలో కీలకమే. ఒక్క అణువు విచ్ఛిన్నమైనా అనారోగ్యమే. సుమారుగా 37.2 ట్రిలియన్ కణాల సమూహంతో నిర్మితమైన మానవ దేహం నిద్ర లేచింది మొదలు మళ్లీ నిద్రకు ఉపక్రమించే వరకూ.. అంతవరకూ ఎందుకు నిద్రలో సైతం నిత్య జీవ క్రియలను కొనసాగిస్తుంది. మరి అంతటి అమూల్యమైన శరీరం తన విధులను తాను సక్రమంగా నిర్వర్తించాలంటే అందుకు తగినట్లుగా మన పని విధానం ఉండాలి? అలా ఉండాలంటే మనం ఏం చేయాలి..ఏమిటా పనులు? ఎలా చేయాలి? ఇలాంటి అంశాలపై హైదరాబాదీల కోసం ప్రత్యేక కథనం...– ఆరోగ్య భరోసానిచ్చే నిత్యకృత్యాలపై దృష్టి సారించండి– అందుకు తగ్గట్లుగా మీ పని విధానం, అలవాట్లు మార్చుకోండి– శారీరక, మానసిక, ఆరోగ్య సంరక్షణపై బీ కేర్ ఫుల్– పలు అధ్యయనాల పరిశోధనల్లో ఆసక్తికర అంశాలు వెల్లడిఆహారం ఇలా... పెద్దలకు రోజుకు 1,600–3,000 కేలరీల ఆహారం అవసరం. 19–30 ఏళ్ల మధ్య వయసున్న స్త్రీలకు 1,800–2,400 కేలరీలు, పురుషులకు 2,400–3,000 కేలరీలు, 31–59 ఏళ్ల వయసున్న స్త్రీలకు 1,600–2,200 కేలరీలు, పురుషులకు 2,200–3,000 కేలరీలు అవసరం. అయితే, ఒక వ్యక్తి రోజుకు ఎన్ని కేలరీలు తినాలి అనేది ఆ వ్యక్తి జెండర్, వయస్సు, ఎత్తు, జీవనశైలిని బట్టి మారుతుంది. ఆహారంలో..క్యాల్షియం రోజుకు 1గ్రా, ఫైబర్ రోజుకు 40 గ్రా,–మెగ్నీషియం రోజుకు 410 మిగ్రా, విటమిన్ ఇ రోజుకు 15 మిగ్రా. విటమిన్ సి రోజుకు 75–90 మిగ్రా, విటమిన్ ఎ రోజుకు 600–900 గ్రా, విటమిన్ డి రోజుకు 600 ఐయూ, పొటాషియం రోజుకు 4.7 గ్రా,ప్రొటీన్ రోజుకు 46–56 గ్రా. ఐరన్ రోజుకు 15– 18 గ్రాల వరకూ కావాలి. జాతీయ పరిశోధనా సంస్థ ఐసీఎమ్ఆర్న్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్) సూచనల ప్రకారం..ప్రతి రోజూ తీసుకునే ఆహరంలో ధాన్యాలు–చిరు ధాన్యాలు 250 గ్రా, పప్పులు 85 గ్రా, పాలు–పెరుగు 300గ్రా, కూరగాయలు–ఆకుకూరలు 400 గ్రా, పండ్లు 100 గ్రా, నూనెగింజలు 35 గ్రా, కొవ్వులు–నూనెలు 27 గ్రా ఉండాలి. మెదడుకు మేత కావాలి... విజా్ఞనమే కాకుండా మానసిక స్పందనలపై పుస్తక పఠనం అత్యంత ప్రభావం చూపించేది. రోజుకు 30 నిమిషాల పుస్తక పఠనం లేదా పజిల్స్ సాల్వేషన్ మెదడును యాక్టివ్గా ఉంచుతుంది. హైసూ్కల్, కాలేజ్ విద్యార్థులకు రోజుకు 2–3 గంటల చదువు సరిపోతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. విరామం లేకుండా ఏకధాటిగా చదవడం ఒత్తిడిని పెంచుతుంది. ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే వారి విషయంలో పఠన సమయం వేరుగా ఉంటుంది.ప్రాణవాయువు ప్రాముఖ్యత... మనిషి రోజుకు 550 లీటర్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకోవాలి. పీల్చే గాలిలో 15 శాతం ఆక్సిజన్ ఉంటుంది. కాలుష్యరహిత పరిసరాల్లో రోజూ కొంత సమయం గడపడం ద్వారా తగినంత ఆక్సిజన్ పొందవచ్చు. నవ్వు...కరిగే కొవ్వు... ఓ అధ్యయనం ప్రకారం రోజుకు 10 నుంచి 15 నిమిషాలు నవ్వడం వల్ల దాదాపు 40 కేలరీలు బర్న్ అవుతాయి. నవ్వు తర్వాత 45 నిమిషాల వరకూ కండరాలు రిలాక్స్గా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడం, ఒత్తిడి హార్మోన్లను తగ్గించడం, సహజమైన ఎండార్ఫిన్ విడుదల చేయడం, గుండెపోటు నివారణ తదితర విషయాల్లో మేలు చేస్తుంది. నవ్వడం వల్ల జీవిత కాలం పెరుగుతుందని నార్వే అధ్యయనం వెల్లడించింది. కప్పు కాఫీ... శరీరానికి కెఫిన్లు ప్రమాదకరమే అయినా రోజుకు 400 మిల్లీగ్రాముల వరకూ సురక్షితమని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇది దాదాపు నాలుగు కప్పుల బ్రూ కాఫీ, 10 క్యాన్ల కోలా, రెండు ఎనర్జీ షాట్ డ్రింక్స్లతో లభిస్తుంది. ఈ కెఫిన్ మొదడు, నరాల పనితీరును మెరుగు పరుస్తుంది. అయితే ఎనర్జీ డ్రింక్స్లో కెఫిన్ కంటెంట్లో చాలా తేడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇది రొ‘టీ’న్... రోజుకు సగటున 3 నుంచి 5 కప్పుల చాయ్ ఆరోగ్యకరమే. సాధారణ టీలో ఉండే సమ్మేళనాలకు శరీరం ప్రతిస్పందించే విధానంపై ఆధారపడి ఉంటుంది. అలాగే క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గడం, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. తాగు...ఆగు... రోజుకు 15–30 మి.లీ మించి ఆల్కహాల్ ప్రమాదకరం. బీర్, వైన్, జిన్, విస్కీ వంటి ఆల్కహాల్స్లో ఏదో ఒకటి మాత్రమే సేవించాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఆల్కహాల్ పరిమాణాల్లో తేడాలుంటాయి. మహిళలకు రోజుకు ఒక పానీయం, పురుషులకు రోజుకు రెండు పానీయాల పరిమితి మించకూడదు. వేడి...రెడీ... శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం మానవ శరీరం 36 నుంచి 37.5 సె.. వరకూ వేడిని తట్టుకుంటుంది. ఇది 40సె మించితే ప్రమాదకరం. అతి వేడి డీహైడ్రేషన్తో పాటు ప్రాణాపాయ స్థితికి చేరుకునే అవకాశముంది. అలాగే 21 సె.డిగ్రీల వరకూ చల్లదనాన్ని తట్టుకుంటుంది. సిట్...రైట్ రోజులో 4 గంటల కన్నా మించి కూర్చుంటే ఆరోగ్య సమస్యలు ప్రారంభమై, ఇది 8 గంటలకు చేరితే తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని జస్ట్ స్టాండ్ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఉద్యోగ రీత్యా 8 నుంచి 11 గంటల వరకూ కదలకుండా కూర్చోడం వల్ల ఒబెసిటీ సహా అనేక అనారోగ్యాలు దాడి చేస్తున్నాయి.నిద్రే ఆరోగ్యం... అనేక రకాల శారీరక, మానసిక రుగ్మతలకు నిద్రలేమే ప్రధాన కారణమని పలు అంతర్జాతీయ పరిశోధనలు వెల్లడించాయి. నిద్ర అలవాట్లు, పర్యవసానాల పై మ్యాట్రెస్ మేకర్ వేక్ఫిట్ నిర్వహించిన సర్వేలో భాగంగా నగరంలో 56 శాతం మంది వారి పని వేళల్లో నిద్ర మత్తుతో అవస్థలు పడుతున్నారని తేల్చంది. అంతేకాకుండా నిద్ర లేవగానే రిఫ్రెష్ ఫీలింగ్ అనిపించట్లేదని నగరవాసులు పేర్కొన్నారు. ‘ది గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్కార్డ్ఙ్గా పిలువబడే ఈ సర్వేలో నగరంలో దాదాపు 33 శాతం మంది తమ నిద్రలేమికి కేవలం అర్థరాత్రి వరకూ డిజిటల్ స్క్రీల్లు తిలకించడమే కారణమని తద్వారా 32 శాతం మంది ఉద్యోగాలకు ఆలస్యంగా వెళ్తున్నారని తేల్చారు. ఆరోగ్యకర జీవనానికి రోజూ 7–8 గంటల నిద్ర అవసరం. అయితే వయస్సులను బట్టి కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. 4 నుంచి 12 నెలల చిన్నారులకు 12 నుంచి 16 గంటల పాటు, 1–2 ఏళ్లు... 11–14 గంటలు, 3–5 ఏళ్లు 10–13 గంటలు, 6–12 ఏళ్లు... 9–12 గంటల నిద్ర 13–18 ఏళ్లు.. 8–10 గంటలు... ఆపై వయసు వారికి 7–8గంటలు, పీరియడ్స్లో ఉన్న ఆడవారికి కనీసం 8 గంటల నిద్ర అవసరమని వైద్యులు చెబుతున్నారు. తాగునీరు...ఇదే తీరు... మనిషి మనుగడకు ప్రామాణికం నీరు. శరీరంలో దాదాపు 60 శాతం నీరే ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవనానికి ప్రతీరోజు పురుషులు రోజూ 3.7 లీటర్లు, మహిళలు 2.7 లీటర్ల నీరు తాగాలని ఆరోగ్య నిపుణుల సూచన. ఉష్ణోగ్రత, ఆరోగ్య పరిస్థితులను బట్టి హెచ్చుతగ్గులు అవసరం. సరైన మోతాదులో శరీరానికి నీరు అందకపోవడం రోగకారకంగా మారుతుంది. కేలరీలు కరగాలి...రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయామం శరీరాన్ని చురుగ్గా మార్చుతుంది. ఇందులో భాగంగా జిమ్, ఏరోబిక్, జుంబా వంటివి ఇందుకు ఉపకరిస్తాయి. వారంలో కనీసం..150 నిమిషాలు(రోజుకి 20 ని.) వ్యాయామం చేయాలని హెల్త్ అండ్ హ్యూమన్ సరీ్వసెస్ గైడ్లై ప్రకటించిది. యోగా 20 నిమిషాలు. ధ్యానం 5 నుంచి 20 నిమిషాలు చేయడం మంచి ఫలితాలను అందిస్తుంది. ఇక ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల నడక ఆరోగ్యకరం. సాధారణంగా రోజుకు 10,000 అడుగులు వేయాలని సీడీసీ (సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) సైతం సిఫార్సు చేసింది. ఈత 30 నిమిషాలు, ఆటలైతే 30 నిమిషాల పాటు, సైక్లింగ్ రోజుకు 30 నిమిషాలు సరిపోతుంది. 30 నిమిషాలకు మించి సైకిల్ తొక్కే వారికి మధుమేహం వచ్చే ప్రమాదం 40 శాతం తక్కువని ఫిన్లాండ్ పరిశోధనలో తేలింది. బీ అలర్ట్ సిటీజన్నిద్ర లేచింది మొదలు... ఏమేం పనులు చేయాలి? ఏ టైమ్కి ఎక్కడ ఉండాలి? ఎవర్ని కలవాలి? తదితర పనుల జాబితాను ముందు రోజే సిద్ధం చేసుకునే అలవాటుందా? ఈ ప్రశ్నకు చాలా మంది సిటిజనుల నుంచి అవును అనే సమాధానం వస్తుంది. మరి అదే విధంగా రోజూ ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఎన్ని గంటలు నిద్రపోవాలి? ఎన్ని కేలరీల ఆహారం తీసుకోవాలి? ఎన్ని కేలరీలు ఖర్చు చేయాలి? ఎన్ని గంటలు మొబైల్ చూడాలి?.. వగైరా లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? అని ప్రశి్నస్తే మాత్రం అవును అని బదులిచ్చేవారు అరుదే. ‘స్మార్ట్’గా వాడాలి... మొబైల్, ల్యాప్టాప్ వంటి స్క్రీన్ లను రోజులో 2 గంటల కన్నా ఎక్కువ సమయం చూడటం హానికరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన సూచనల ప్రకారం..సంవత్సరం కంటే తక్కువ వయస్సున్న పిల్లలు మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లకు దూరంగా ఉండాలి. ఐదేళ్లలోపు చిన్నారులు గంటకు మించి ఫోన్ వాడకూడదు. 10 మిలియన్ల రంగులను వేరు చేయగల శక్తి గల మనిషి కన్నుకు ఫోన్ హానికరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉప్పు.. ఎక్కువైతే ముప్పు... శరీర క్రియల కోసం ప్రతిరోజూ 500మి.గ్రా సోడియం (ఉప్పు) అవసరం. ఇది నరాలను ప్రేరేపించడంతో పాటు కండర సంకోచానికీ సహాయం చేస్తుంది. ముఖ్యంగా దేహంలోని నీరు–ఖనిజాల సమతుల్యతను కాపాడుతుంది. అతిగా వాడితే బ్లెడ్ ప్రెజర్, గుండె సమస్యలకు దారితీస్తుంది. ఆరోగ్యానికి...‘పండు’గ రోజువారీ ఆహారంలో 25 నుంచి 30 శాతం పండ్లు ఉండాలనేది ఆరోగ్య నిపుణుల మాట. ద్రవ రూపంలో తీసుకోవాలనుకుంటే... రోజూ 150 మి.లీ లోపు పండ్ల రసాలు తీసుకోవాలి. అతిగా పండ్ల రసాలు సేవించడం వల్ల శరీరంలో గ్లూకోజ్, చక్కెర స్థాయిలు పెరిగే అవకాశముంది. -
సెల్ఫోన్తో హై బీపీ!
సాక్షి, అమరావతి: మొబైల్ ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడితే అధిక రక్తపోటు (హై బీపీ) ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దైనందిన జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సెల్ఫోన్లతో అంతే స్థాయి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.వారానికి 30 నిమిషాలు, అంతకంటే ఎక్కువసేపు మొబైల్ ఫోన్లో మాట్లాడేవారిలో దుష్ప్రభావాలు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయని, ముఖ్యంగా రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుందని తాజా అధ్యయనంలో తేల్చారు. ‘యూరోపియన్ హార్ట్ జర్నల్ – డిజిటల్ హెల్త్’లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. చైనాలోని గ్వాంగ్జౌలోని సదరన్ మెడికల్ వర్సిటీ పరిశోధకులు మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే తక్కువ స్థాయి రేడియో ఫ్రీక్వెన్సీ శక్తి రక్తపోటు పెరుగుదలతో ముడిపడి ఉందని గుర్తించారు.130 కోట్ల మందిలో రక్తపోటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 30–79 సంవత్సరాల వయసు గల దాదాపు 130 కోట్ల మంది అధిక రక్తపోటు సమస్య ఎదుర్కొంటున్నారు. ఇందులో 82 శాతం మంది తక్కువ, మధ్య–ఆదాయ దేశాలలో నివసిస్తున్న వారే. భారత్లో 120 కోట్ల మందికిపైగా మొబైల్ ఫోన్ వినియోగదారులు ఉంటే 22 కోట్ల మంది అధిక రక్తపోటు బాధితులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. రక్తపోటు సమస్య గుండెపోటు, అకాల మరణానికి దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. హైబీపీ వల్ల వచ్చే హైపర్ టెన్షన్, ఇతర సమస్యలపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. తాజా పరిశోధనలో వారంలో 30 నిమిషాల కంటే తక్కువ సమయం ఫోన్లో మాట్లాడే వారితో పోలిస్తే మిగిలిన వారిలో రక్తపోటు వచ్చే ప్రమాదం 12 శాతం ఎక్కువగా ఉంటుందని తేల్చారు. వారానికి ఆరుగంటలకు పైగా ఫోన్లో మాట్లాడేవారిలో రక్తపోటు ప్రమాదం 25 శాతానికి పెరిగింది.కండరాలపై ఒత్తిడి..మెడ, భుజాలు, చేతుల్లో కండరాల నొప్పులు అత్యంత సాధారణ దుష్ప్రభావాలలో ఒకటిగా వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ సేపు ఫోన్ను పట్టుకోవడంతో కండరాలు ఒత్తిడికి గురవడంతో పాటు తీవ్ర తలనొప్పికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఫోన్ను చెవికి చాలా దగ్గరగా పెట్టుకుని మాట్లాడటం, ఇయర్ఫోన్లు్ల, హెడ్ఫోన్లను నిరంతరం ఉపయోగించడంతో టిన్నిటస్ (చెవుల్లో నిరంతరం రింగింగ్ సౌండ్ వినిపించే పరిస్థితి) వంటి చెవి సమస్యలు వస్తాయంటున్నారు. ఫోన్ స్క్రీన్పై ఎక్కువ సేపు చూడటంతో కంటిపై ఒత్తిడి పెరిగిన కళ్లుపొడిబారడం, చూపు మసకబారడం, తలనొప్పి, ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుందని పేర్కొంటున్నారు. -
టైముకు తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
సాక్షి, అమరావతి: సరైన సమయానికి ఆహారం తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులను నివారించవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఉదయం 8 గంటలకు అల్పాహారం.. రాత్రి 8 గంటలకు చివరి భోజనం తీసుకోవడాన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఫ్రాన్స్లోని వర్సిటీ సోర్బన్ ప్యారిస్ నోర్డ్ అధ్యయనంలో భోజన సమయాలకు, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాలకు మధ్య గుట్టును నిర్ధారించింది.ముఖ్యంగా కార్డియోవాసు్కలర్ డిసీజెస్ (సీవీడీ)లో భాగంగా కొరోనరీ హార్ట్ డిసీజ్, సెరెబ్రోవాసు్కలర్ డిసీజ్, రుమాటిక్ హార్ట్ డిసీజ్ ప్రమాదాలను అరికట్టడానికి క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు మేలైన మార్గమని సూచిస్తోంది. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురించిన ఈ ఫ్రెంచ్ అధ్యయనం ప్రకారం రాత్రిపూట ఎక్కువసేపు ఉపవాసంతో ఉంటే హృదయ సంబంధ వ్యాధుల ప్రభావాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. ఇందుకు నిద్రవేళకు దగ్గరగా భారీ భోజనాన్ని తగ్గించాలని హెచ్చరిస్తున్నారు. ఖాళీ కడుపు.. శరీరంలోని వివిధ అవయవాల సిర్కాడియన్ లయలను సరి చేస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా రక్తపోటు నియంత్రణ వంటి కార్డియోమెటబాలిక్ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఈ సిర్కాడియన్ రిథమ్ శరీరంలోని అంతర్గత గడియారంగా పని చేస్తుంది. లేటుగా తింటే చేటే.. అల్పాహారం దాటవేయడం, రోజులో మొదటి ఆహారాన్ని ఆలస్యంగా తీసుకోవడంతో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. ఉదాహరణకు ఉదయం 8 గంటలకు తినేవారి కంటే 9 గంటలకు అల్పాహారం చేసే వ్యక్తికి హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం 6 శాతం ఎక్కువ. ఆలస్యంగా రాత్రి 8 గంటలకు బదులు 9 గంటలకు తినడం వల్ల ముఖ్యంగా మహిళల్లో పోలిస్తే స్ట్రోక్ వంటి సెరెబ్రోవాసు్కలర్ వ్యాధి వచ్చే ప్రమాదం 28 శాతం పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. రాత్రిపూట ఎక్కువ సేపు ఉపవాస సమయం ఉంటే సెరెబ్రోవాసు్కలర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చని, ఉదయం ప్రారంభ భోజనం మెరుగైన ఇన్సులిన్ సెన్సిటివిటీని, ఇన్ఫ్లమేషన్ను నివారించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందని గుర్తించారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడం ద్వారా కాలక్రమేణా హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడి తగ్గి గుండె పనితీరు మెరుగుపడుతుందని చెబుతున్నారు. భోజనం చేసే సమయం నిద్ర నాణ్యతను కూడా ప్రభావతం చేయడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పొంచి ఉంటుందని పేర్కొన్నారు. ఐదో వంతు భారత్లోనే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 నివేదిక ప్రకారం హృదయ సంబంధ వ్యాధుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 1.80 కోట్ల మరణాలు నమోదైతే.. ఇందులో ఐదో వంతు భారత్ నుంచే ఉన్నాయి. ముఖ్యంగా భారతీయ యువతలో గుండె సంబంధిత మరణాలు ఎక్కువయ్యాయి. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అధ్యయనంలోనూ భారత్లో ఒక లక్ష జనాభాకు 272 మంది హృదయ సంబంధ మరణాలు రేటు ఉంది. ఇది ప్రపంచ సగటు 235 కంటే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
లావొక్కింత మితిమీరె!
ప్రపంచం లావెక్కిపోతోంది. అన్ని దేశాల్లోనూ కలిపి స్థూలకాయుల సంఖ్య ఇప్పటికే అక్షరాలా 100 కోట్లు దాటేసింది! 1990 నుంచే వీరి సంఖ్యలో ఏకంగా నాలుగు రెట్ల పెరుగుదల నమోదైంది. మూడు దశాబ్దాల క్రితం దాకా పెద్దల్లోనే ఎక్కువగా కని్పంచిన ఊబకాయ సమస్య ఇప్పుడు చిన్నారుల్లో కూడా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవితపు ఒత్తిళ్లతో పాటు పౌష్టికాహార లోపం కూడా దీనికి ప్రధాన కారణమేనని తాజా అధ్యయనంలో తేలింది. మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా 2022 నాటికే వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య 88 కోట్లు దాటింది. అలాగే టీనేజీ లోపు వయసు వారిలోనూ 16 కోట్ల పై చిలుకు ఊబకాయంతో బాధపడుతున్నారు. టోంగా, నౌరు, సమోవా తదితర దేశాల్లో మూడొంతులకు పైగా జనం ఊబకాయులేనట! 1990 నుంచి 2022 మధ్య పలు గణాంకాలు తదితరాల ఆధారంగా అధ్యయనం సాగింది. ఈ జాబితాలో అమెరికా కూడా పురుషుల్లో పదో స్థానంలో, మహిళల్లో 36వ స్థానంలో నిలిచింది. ఈ దేశాల్లో అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లే సమస్యకు ప్రధాన కారణమని తేలినట్టు అధ్యయన బృంద సభ్యుడు ప్రొఫెసర్ మజీద్ ఎజాటి వెల్లడించారు. మరోవైపు తక్కువ బరువుతో బాధపడుతున్న వారి సంఖ్యలో 50 శాతం తగ్గదల నమోదైంది. కాకపోతే నిరుపేద దేశాలు, సమాజాల్లో ఇది ఇంకా ప్రబల సమస్యగానే ఉందని అధ్యయనం పేర్కొంది. భారత్లోనూ ఊబకాయుల సంఖ్య 8 కోట్లు దాటినట్టు వెల్లడించింది. తక్షణం మేల్కొనాలి... ఒకప్పుడు ప్రధానంగా పెద్దవాళ్లలోనే కన్పించిన స్థూలకాయ సమస్య ఇప్పుడు స్కూలు వయసు చిన్నారుల్లోనూ ప్రబలమవుతుండటం చాలా ఆందోళనకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గేబ్రయేసస్ అన్నారు. చిన్న వయసులోనే గుర్తించి అరికట్టాల్సిన అవసరాన్ని తాజా సర్వే మరోసారి నొక్కిచెప్పిందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున ముందుకు రావాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆరోగ్యకరమైన ఆహారం, నియమిత వ్యాయామాలు తదితరాలను జీవన శైలిలో భాగంగా మార్చుకోవడం తప్పనిసరన్నారు. పలు దేశాల్లో ప్రధానంగా పౌష్టికాహార లోపమే స్థూలకాయానికి దారి తీస్తోందని అధ్యయనంలో పాలుపంచుకున్న మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్కు చెందిన డాక్టర్ గుహా ప్రదీప అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు, కొవిడ్ కల్లోలం, ఉక్రెయిన్ యుద్ధం వంటివన్నీ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయని వివరించారు. ‘‘ఇవి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఖరీదైన వ్యవహారంగా మార్చేస్తున్నాయి. ఫలితంగా చాలా దేశాల్లో ప్రజలకు చాలీచాలని, నాసిరకం ఆహారం అందుతోంది’’ అని ఆవేదన వెలిబుచ్చారు. ఇలా చేశారు... ► అధ్యయనంలో 1,500 మందికి పైగా రీసెర్చర్లు పాలుపంచుకున్నారు. ► ఎన్సీడీ రిస్క్ ఫ్యాక్టర్ కొలాబరేషన్ పేరిట వీరంతా ప్రపంచ ఆరోగ్య సంస్థతో పని చేశారు. ► ప్రపంచవ్యాప్తంగా 190కి పైగా దేశాల నుంచి ఐదేళ్ల పైబడ్డ 22 కోట్ల మందికి పైగా ప్రజల ఎత్తు, బరువు తదితర శారీరక కొలతలను సేకరించారు. ► ఊబకాయాన్ని నిర్ధారించేందుకు బాడీ మాస్ ఇండెక్స్ను ఆధారంగా తీసుకున్నారు. గణాంకాలివీ... ► ప్రపంచవ్యాప్తంగా వయోజనుల్లో 88 కోట్లు, టీనేజీ, ఆ లోపు వారిలో దాదాపు 16 కోట్ల మంది ఊబకాయులున్నారు. ► వయోజన ఊబకాయుల్లో 50 కోట్లకు పైగా పురుషులు కాగా 38 కోట్ల మంది స్త్రీలు. ► 1990లో వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య 20 కోట్ల లోపే ఉండేది. ► వారిలో స్త్రీలు 13 కోట్లు కాగా 7 కోట్ల మందికి పైగా పురుషులుండేవారు. భారత్లోనూ... భారత్ కూడా ఊబకాయ సమస్యతో బాధపడుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య బాగా పెరుగుతుందటం ఆందోళన కలిగిస్తోంది. వయోజన మహిళల్లో ఊబకాయులు 1990లో కేవలం 1.2 శాతముండగా 2022 నాటికి ఏకంగా 9.8 శాతానికి పెరిగారు. పురుష జనాభాలో ఊబకాయుల సంఖ్య 0.5 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. మొత్తమ్మీద 2022 నాటికి దేశవ్యాప్తంగా 4.4 కోట్ల మహిళలు, 2.6 కోట్ల మంది పురుషులు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా 5–19 ఏళ్ల మధ్య వయసు్కన్న పిల్లల్లో దాదాపు 1.25 కోట్ల మంది ఊబకాయులేనని అధ్యయనంలో తేలింది. 75 లక్షలతో వీరిలో అబ్బాయిల సంఖ్యే ఎక్కువ. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గుర్తిద్దాం... నివారిద్దాం
సాక్షి, హైదరాబాద్: కేన్సర్ మహమ్మారికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా చికిత్స అందించడం కన్నా నివారణ మార్గాలే అత్యంత ప్రామాణికమని కాంటినెంటల్ ఆస్పత్రి వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు. ఒకే రక్త పరీక్షతో కేన్సర్ను ముందస్తుగా గుర్తించేలా కాంటినెంటల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నూతనంగా ‘కేన్సర్ ప్రివెన్షన్ అండ్ ఎర్లీ కేన్సర్ డిటెక్షన్’విభాగాన్ని ఏర్పాటు చేశారు. శనివారం హైదరాబాద్లోని ఓ హోటల్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత కేన్సర్ స్పెషలిస్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ కేన్సర్ ప్రోగ్రామ్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ కరోల్ సికోరా ఈ విభాగాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ గురు ఎన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోనే ప్రఖ్యాత కేన్సర్ సెంటర్ ఎండీ అండర్సన్ కేన్సర్ ఇన్స్టిట్యూట్లో 40 ఏళ్ల పాటు పనిచేసి, ఆ అనుభవాన్నంతా దేశంలోనే సేవలందించాలనే లక్ష్యంతో కాంటినెంటల్ ఆసుపత్రిని స్థాపించానని తెలిపారు. ఇప్పటికే 40 వేల మందిని పైగా కేన్సర్ కోరల నుంచి బయటికి తీసుకొచ్చిన తమ కేన్సర్ కేర్ టీమ్... రాబోయే రోజుల్లో ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా మరింత ఎక్కువ మందిని కేన్సర్ బారి నుంచి కాపాడటమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. లిక్విడ్ బయాప్సీ టెస్ట్తో కేన్సర్ గుర్తింపు ముంబయిలోని టాటా మెమోరియల్ హాస్పిటల్ వంటి సంస్థల్లో కేన్సర్ విభాగంలో 40 ఏళ్లపాటు సేవలందించిన డాక్టర్ జగన్నాథ్ నిర్వహణలో కేన్స ర్ ప్రివెన్షన్ అండ్ ఎర్లీ కేన్సర్ డిటెక్షన్ విభాగం కొనసాగుతుందని గురు ఎన్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగమైన లిక్వి డ్ బయాప్సీ టెస్ట్తో ముందుగా కేన్సర్ను గుర్తించే సామర్థ్యాన్ని అందిస్తుందన్నారు. ఈ మూడు టెస్ట్లతో... ఆస్పత్రిలో మూడు రకాల జన్యు పరీక్షలను ప్రారంభించామని డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు మొదటగా కేన్సర్ ప్రిడిస్పోజిషన్ టెస్ట్... జన్యు అమరిక, వాటిలోని తేడాలను అర్థం చేసుకుని, భవిష్యత్లో ఏ రకమైన కేన్సర్ వ్యాధి బారిన పడతామో ముందుగానే గుర్తిస్తుందన్నారు. రెండోది కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్.. వంశపారంపర్యంగా వచ్చే కేన్సర్లను గుర్తించడానికి ఈ కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ జెనెటిక్ మేకప్ను సమగ్రంగా పరిశీలిస్తుందన్నారు. యూఎస్ఏలోని నేషనల్ కాంప్రహెన్సివ్ కేన్సర్ పేర్కొన్న విధంగా... రొమ్ము కేన్సర్, ఓవరిన్ కేన్సర్, పాంక్రియాటిక్ కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్, కొలొరెక్టల్ కేన్సర్ వంటి ఐదు కేన్సర్లకు కారణం అయ్యే వంశపారంపర్యంగా వచ్చే జన్యువులను ఈ టెస్ట్ ద్వారా గుర్తించవచ్చన్నారు. మూడోది నెక్స్ట్ – జనరేషన్ సీక్వెన్సింగ్ (ఎన్జీఎస్) ఆధారిత సీఎఫ్డీఎన్ఏ పరీక్ష. దీని ద్వారా రక్త ప్రవాహంలో తిరుగుతున్న సెల్ ఫ్రీ డీఎన్ఏను విశ్లేషించి కేన్స ర్ను చాలా ముందుగా గుర్తించవచ్చన్నారు. ఇలా 3 దశల్లో జన్యువులోని కేన్సర్ బారినపడ్డ, పడబోతున్న ప్రాంతాలను ఈ రక్త పరీక్ష ద్వారా చాలా కచ్చితత్వంతో తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ సమగ్ర విశ్లేషణతో కేన్స ర్ చికిత్స మరింత సులభతరం అవుతుందన్నారు. అపోహలను తొలగించాలి: కరోల్ సికోరా ప్రొఫెసర్ కరోల్ సికోరా మాట్లాడుతూ... కేన్సర్ నివారించడం సాధ్యమేనా అనుకునే అపోహలను ప్రయత్నమనే ఒక్క అడుగుతో తొలగించవచ్చన్నారు. ఇలాంటి అద్భుతమైన ప్రయత్నాన్ని మొదలుపెట్టిన కాంటినెంటల్ ఆసుపత్రికి ఆయన అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కాంటినెంటల్ కేన్సర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ జగన్నాధ్, డాక్టర్ రవీంద్రనాథన్, డాక్టర్ ఏవీ సురేష్, అనురాధ తదితరులు పాల్గొన్నారు. అవగాహనతో భయాందోళనలు తొలగింపు.. కేన్సర్ను ఆలస్యంగా గుర్తించడం వల్ల మరణాలు ఎక్కువ చోటుచేసుకుంటున్నాయని అందుకే వీటిపై అవగాహన కల్పించడానికి కాంటినెంటల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డాక్టర్ గురు ఎన్ రెడ్డి వెల్లడించారు. ఆస్పత్రి వైద్యుల నేతృత్వంలో ఫిబ్రవరి నెలలో వందలాది మందికి అవగాహన కల్పించామని చెప్పారు. ఆడవారిలో వచ్చే కేన్సర్లు, లక్షణాలు, జాగ్రత్తలపైన, గ్యాస్ట్రో ఇంటస్టైన్, లివర్ కేన్సర్లపైన ఊపిరితిత్తులు, తల, మెడ కేన్సర్లు, గ్లాడర్, కిడ్నీ, ప్రొస్టేట్, చర్మ కేన్సర్ల పైన అవగాహన కల్పి ంచామన్నారు. మంచి చికిత్సను అందించడమే కాకుండా కేన్సర్ రాకుండా అవగాహన కల్పించడం బాధ్యతగా అలవర్చుకున్నామన్నారు. ఇన్సూరెన్స్ సంస్థలు వారి సేవల్లో కేన్సర్ బాధితులను చేర్చాల్సిన అవసరముందని, 70 శాతం మంది బాధితులు ఆర్థిక సమస్యలతోనే మరణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
వైద్యంలో ఏఐ తప్పులకు బాధ్యులెవరు?
అన్ని రంగాల మాదిరిగానే ఆరోగ్య రంగంలోనూ కృత్రిమ మేధ (ఏఐ) వాడటం మొదలైంది. వ్యాధి నిర్ధారణ, క్లినికల్ కేర్, చికిత్స, రోగుల వైద్య చరిత్రను అక్షరబద్ధం చేయడం, మందుల అభివృద్ధి వంటి పనులకు తగు జాగ్రత్తలతో ‘ఎల్ఎంఎం’లను వాడొచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఆ మేరకు ఆరోగ్య సిబ్బందిపై భారం తగ్గుతుంది. మనిషి మాదిరిగానే స్పందించాలన్నది ఎల్ఎంఎంల తయారీ ఉద్దేశమన్నది తెలిసిందే. అలాంటప్పుడు వీటి ద్వారా తప్పులు జరిగితే బాధ్యత ఎవరిది? ఆరోగ్య సేవలు, ఉత్పత్తులకు అన్వయిస్తున్న నైతిక, మానవ హక్కుల ప్రమాణాలను ఏఐ టెక్నాలజీలు, టూల్స్కు కూడా విస్తరించాలి. భారీ స్థాయిలో ఎల్ఎంఎంలు విడుదలైన ప్రతిసారీ వీటిని కచ్చితంగా ఆడిట్ చేసే ఏర్పాట్లు చేసుకోవాలి. ఛాట్జీపీటీ వంటి కృత్రిమ మేధ(ఏఐ) టూల్స్ వాడకం ఇటీవల బాగా పెరిగింది. అన్ని రంగాల్లో మాదిరిగానే ఆరోగ్య రంగంలోనూ కృత్రిమ మేధ టెక్నా లజీలను వాడటం మొదలుపెట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ఓ) ఈ విషయమై ఒక హెచ్చరిక జారీ చేసింది. ఛాట్జీపీటీ, బార్డ్ వంటి ఎల్ఎంఎం (లార్జ్ మల్టీ–మోడల్ మోడల్స్)లు అందించిన సమాచారం, వీడియోలకు మాత్రమే పరిమితం కాకుండా... అంతకంటే ఎక్కువ విషయాలపై వ్యాఖ్యానించగలవు. మనిషి మాదిరిగానే స్పందించాలన్నది ఎల్ఎంఎంల తయారీ ఉద్దేశమన్నది తెలిసిందే. పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త విషయాలను ఎప్పటికప్పుడు నేర్చు కోవడం ఇవి చేసే పని. ఆరోగ్య రంగంలో వీటిని ఉపయోగించడం వల్ల తప్పుడు సమాచారం, ఏకపక్ష లేదా అసంపూర్తి సమాచారం అందే ప్రమాదాలు ఉంటాయనీ, ఇది మన ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చుననీ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. శిక్షణ ఇచ్చేందుకే తప్పుడు సమాచారాన్ని ఉపయోగిస్తే పరిస్థితి మరింత అధ్వాన్న మవుతుందన్నది ఈ హెచ్చరిక సారాంశం. ముఖ్యంగా జాతి, కులం, మతం వంటి విషయాల్లో ఏఐ టెక్నాలజీలు వివక్షతో కూడిన సమాచా రాన్ని తయారు చేసే ప్రమాదముంది. ఏఐ వాడకం పెరిగిపోతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ 2021లో సాధారణ మార్గదర్శకాలు కొన్నింటిని జారీ చేసింది. అదే సమయంలోనే ఆరోగ్య రంగంలో ఏఐ వాడకంతో రాగల ప్రయోజనాలనూ గుర్తించింది. నైతికత విషయంలో కొన్ని స్థూల మార్గదర్శకాలను సిద్ధం చేసింది. వాటి ప్రకారం... ఏఐ టెక్నాలజీలు స్వయం ప్రతిపత్తిని కాపా డేలా ఉండాలి. మానవ సంక్షేమం, భద్రత, ప్రజాప్రయోజనాలు, పారదర్శకతలకు పెద్దపీట వేయాలి. తెలివిగా ప్రవర్తించడంతోపాటు వివరించేలా ఉండాలి. బాధ్యత స్వీకరించాలి. అందరినీ కలుపుకొని పోవాలి. వివక్ష లేకుండా చూసుకోవాలి. వివరించేలా ఉండటం అంటే... ఏఐ తాలూకూ డిజైన్ , వినియోగం విషయాల్లో దాపరికం లేకుండా తగినంత సమాచారం అందరికీ అందుబాటులో ఉంచడం! పారదర్శకత ఆశించగలమా? ఆరోగ్య రంగంలో ఏఐ వాడకంపై డబ్ల్యూహెచ్ఓ ఇటీవల మరి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఎల్ఎంఎంల ఆవిష్కరణతో ఇవి అనివార్యమయ్యాయి. ఎల్ఎంఎంల వాడకం గురించి అర్థం చేసు కోవాలంటే ఏఐ టెక్నాలజీని సమగ్రంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎల్ఎంఎం టూల్ను అభివృద్ధి చేయడంతో మొదలవుతుంది. అభివృద్ధి చేసేది కార్పొరేట్ కంపెనీ, యూనివర్సిటీ, స్టార్టప్ ఏదైనా కావచ్చు. ఇవన్నీ ఆధారపడేది సమాచార లభ్యత, నైపుణ్యాల పైనే. తరువాతి దశలో అభివృద్ధి చేసిన ఎల్ఎంఎంకు ఓ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అందిస్తారు. లోటుపాట్లను సరిచేయడం, విస్తృత సమాచా రంతో శిక్షణ ఇవ్వడం అన్నమాట. ఎల్ఎంఎంను భారీ సాఫ్ట్వేర్ వ్యవస్థలో భాగం చేయడం కూడా ఈ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ను సిద్ధం చేసే థర్డ్ పార్టీ బాధ్యతే. ఈ పని చేసిన తరువాత ఈ కృత్రిమ మేధ ద్వారా సేవలు అందుతాయి. లేదా ఒక అప్లికేషన్ రెడీ అవుతుంది. ఏఐ టెక్నాలజీ అభివృద్ధి దశల్లో మూడోది వినియోగదారుడికి దీన్ని అందించే డిప్లాయర్. ఆరోగ్య రంగంలో ఈ డిప్లాయర్ ఎక్కువ సందర్భాల్లో ఆసుపత్రి, ప్రభుత్వ ఆరోగ్య సంస్థ లేదా ఫార్మా కంపెనీ అయివుంటుంది. ఈ మూడు దశల్లో నైతికత, నియంత్రణకు సంబంధించిన చాలా ప్రశ్నలు, అంశాలు ఎదురవుతాయి. చాలాసార్లు డెవలపర్ పెద్ద టెక్ కంపెనీ అయి ఉంటుంది. ఎల్ఎంఎంల తయారీకి కావాల్సినన్ని నిధులు, టెక్నాలజీ నైపుణ్యాలు వీరి వద్దే ఉంటాయి. వీటి అభివృద్ధిలో వాడే అల్గారిథమ్స్, వాటి వల్ల రాగల ప్రమాదాల గురించి సామాన్యు లకు తెలిసే అవకాశాలు తక్కువే. కార్పొరేట్ కంపెనీ కాబట్టి పార దర్శకత, నిబద్ధతలను కూడా ఆశించలేము. నియంత్రణ ఎలా? ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్త ప్రభుత్వ నియంత్రణ సంస్థలకు ఒక బెంగ పట్టుకుంది. కొత్తగా అందుబాటులోకి వస్తున్న ఏఐ టూల్స్ ప్రస్తుత న్యాయ, చట్ట వ్యవస్థల్లోకి ఇముడుతాయా? మానవ హక్కు లకు సంబంధించిన అంశాలతోపాటు దేశాల డేటా పరిరక్షణ చట్టాల విషయంలోనూ ఈ సందేహముంది. ఎల్ఎంఎంల ప్రవేశం ఒక రకంగా ప్రభుత్వ, నియంత్రణ సంస్థలు ఏమరుపాటుగా ఉన్న సమయంలో జరిగిందని చెప్పాలి. యూరోపియన్ యూనియన్ విష యాన్నే తీసుకుందాం. ఎల్ఎంఎంలను చేర్చేందుకే వీరు ఆర్టిఫీషియల్ ఇంటె లిజెన్స్ చట్టాన్ని చివరి దశలో మార్చాల్సి వచ్చింది. డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం అల్గారిథమ్స్ ప్రస్తుత చట్ట, న్యాయ వ్యవస్థల పరిధిలోకి చేరే అవకాశం లేదు. మరోవైపు ఎల్ఎంఎంలు కూడా మనుషుల్లా చిత్తభ్రమలకు గురై తప్పుడు సమాచారాన్ని ఇవ్వవచ్చునని ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఇంకో ఆందోళన ఏమిటంటే... ఈ ఎల్ఎంఎంల ద్వారా తప్పులు జరిగితే వాటికి బాధ్యత ఎవరిది? ఇలాంటి తప్పుల కారణంగా జరిగే నష్టం, కలిగే హాని, దుర్వినియోగాలకు ఎవరు బాధ్యులన్న విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. పైగా ఈ ఎల్ఎంఎంలు సైబర్ సెక్యూరిటీ ముప్పులకు అతీతమేమీ కాదు. ఆరోగ్య రంగంలో వీటిని వాడితే రోగుల సమాచారం దుర్వినియోగమయ్యే అవకాశాలు ఎక్కువ. ఆరోగ్య రంగంలో ఏఏ అంశాలకు ఎల్ఎంఎంలను వాడవచ్చు నన్న విషయంపై డబ్ల్యూహెచ్ఓ ఒక స్థూల అంచనాకు వచ్చింది. వ్యాధి నిర్ధారణ, క్లినికల్ కేర్, లక్షణాలను పరిశీలించడం, చికిత్స, పరిపాలన, రోగుల వైద్య చరిత్రను అక్షరబద్ధం చేయడం వంటి పనులు... వైద్య, నర్సింగ్ శిక్షణ, శాస్త్రీయ పరిశోధన, మందుల అభివృద్ధి అన్న అంశాలకు మాత్రమే తగు జాగ్రత్తలతో ఎల్ఎంఎంలను వాడవచ్చునని సూచిస్తోంది. ఈ పనులన్నింటినీ ఎల్ఎంఎంలు చేస్తే ఆరోగ్య సిబ్బందిపై భారం అంతమేరకు తగ్గుతుంది. మరోవైపు ఓ కంపెనీ మెడికల్ ఎల్ఎంఎంను అభివృద్ధి చేసే పనిలో ఉంది. ఇది ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, వైద్యపరమైన సమాచారాన్ని సంక్షి ప్తీకరించడం, అన్నింటినీ కలిపి వైద్యులకు స్థూల నివేదిక ఇవ్వడం వంటి పనులు చేస్తుంది. ఇలాంటివి ఎక్కువైన కొద్దీ వైద్యుడికి, రోగికి మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతింటాయి. మరి ఏం చేయాలి? ఎల్ఎంఎంల వాడకాన్ని పూర్తిగా అడ్డుకోవ డమైతే కాదు. వీటిని అభివృద్ధి చేసే సమయంలో వీలైనంత ఎక్కువ పారదర్శకత తీసుకురావడం ఒకటైతే... వాడకం కూడా బాధ్యతాయు తంగా ఉండేలా చూసుకోవడం మరొకటి. ఈ దిశగా ముందు ప్రభు త్వాలు ఆరోగ్య రంగంలో వినియోగానికి తలపెట్టిన ఎల్ఎంఎంల మదింపు, అనుమతుల కోసం నియంత్రణ సంస్థలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఏఐ వ్యవస్థల అభివృద్ధికి లాభాపేక్ష లేకుండా అందరికీ అందుబాటులో ఉండేలా మౌలిక సదుపాయాలను సమకూర్చాలి. శక్తిమంతమైన కంప్యూటింగ్ వ్యవస్థలు, డేటా సెట్స్ అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్ వ్యక్తులూ వాడుకోగలిగితే తప్పు ఒప్పుల గురించి ఒక స్పష్టమైన అంచనా ఏర్పడుతుంది. ఆరోగ్య సేవలు, ఉత్ప త్తులకు ప్రస్తుతం అన్వయిస్తున్న నైతిక, మానవ హక్కుల ప్రమాణా లను ఏఐ టెక్నాలజీలు, టూల్స్కు కూడా విస్తరించాలి. ఆరోగ్య, వైద్య అంశాలకు సంబంధించి భారీ స్థాయిలో ఎల్ఎంఎంలు విడుదలైన ప్రతిసారి ఏఐ టూల్స్, టెక్నాలజీలను కచ్చితంగా ఆడిట్ చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ఏఐతో వచ్చే లాభాలపై అతిగా అంచనాలూ పెట్టుకోవద్దు; రాగల ముప్పులను తక్కువ చేసి చూడనూ వద్దు. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
World Health Organization: భారత్లో 9 లక్షల క్యాన్సర్ మరణాలు
న్యూఢిల్లీ: భారత్ను క్యాన్సర్ మహమ్మారి కబళిస్తున్న తీరును ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా గణాంకాల్లో వెల్లడించింది. ది ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ గణాంకాల ప్రకారం 2022లో భారత్లో 14.1 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. క్యాన్సర్ కారణంగా 9.1 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. పురుషల్లో పెదవులు, నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్లు సర్వసాధారణమయ్యాయి. రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు మహిళల్లో ఎక్కువయ్యాయి. మొత్తం కొత్త కేసుల్లో 27 శాతం బ్రెస్ట్, 18 శాతం సెరి్వక్స్ యుటెరీ క్యాన్సర్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ సోకి ఐదేళ్లుగా బాధపడుతున్న వారి సంఖ్య 5.3 కోట్లకు చేరిందని నివేదికలో పేర్కొన్నారు. -
నిబద్ధతతోనే కాలుష్య నియంత్రణ
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అరుదుగా మాత్రమే నీలి ఆకాశం కనబడుతోంది. గాలి నాణ్యత తీవ్రతకు ఇదొక సంకేతం. వాయు కాలుష్యం ఇప్పుడు జాతీయ సమస్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, గాల్లోని నలుసు పదార్థాల (పీఎం) సాంద్రత 2.5 పీఎం అయితే, ఒక క్యూబిక్ మీటరుకు 5 మైక్రో గ్రాములు మించకూడదు. ఇది ఢిల్లీ లాంటి నగరంలో 102. ఈ గాలిని పీల్చడం ప్రాణాంతకం. వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి తెచ్చిన ‘జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం’ కొంతమేరకు ఫలితమిస్తున్నా అది సరిపోదు. మానవ కణజాలంలోకి చొచ్చుకుపోయే కాలుష్య కారకాలతో మనం వ్యవహ రిస్తున్నాం. ప్రజారోగ్య దృక్కోణం నుండి చూస్తే ఎంత ప్రగతి అయినా తక్కువే. నిరంతర రాజకీయ నిబద్ధత మాత్రమే మెరుగైన ఫలితాలను ఇస్తుంది. శీతకాలపు నెలల్లో భారీ పొగమంచుతో కప్పబడి ఉండే ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో నీలి ఆకాశం, ప్రకాశవంతమైన సూర్యబింబం అరుదుగా గోచరిస్తుంటాయి. అయితే పేలవమైన గాలి నాణ్యత అనేది ఇప్పుడు జాతీయ సమస్య అయింది. కాకపోతే గత ఐదేళ్లలో, వాయు కాలుష్యం ఒక విధానపరమైన సమస్యగా కూడా గుర్తింపు పొందింది. అయిన ప్పటికీ ‘జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమ’ (ఎన్సీఏపీ) అయిదేళ్ల అంచనాను పరిశీలిస్తే, అర్థవంతమైన, శాశ్వతమైన ప్రయోజనాలను అందించడానికి గట్టి ప్రయత్నాలు అవసరమని తెలుస్తుంది. అపఖ్యాతి పాలైన భారతదేశ గాలి నాణ్యతను పరిష్కరించడానికి తెచ్చిన మొదటి విధానం – 2019లో ప్రారంభించిన ఎన్సీఏపీ. కాలుష్య స్థాయులను, గాలిలోని నలుసు పదార్థాల గాఢతలను ప్రధాన నగరాల్లో 30 నుంచి 20 శాతం తగ్గించాలనే స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించింది. దీనికి కేంద్రం నుండి రూ. 443 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నుండి రూ. 4,400 కోట్ల ప్రారంభ కేటాయింపులు జరిపారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)కి చెందిన నిరంతర పరిసర వాయు నాణ్యతా పర్యవేక్షణ కేంద్రాల విశ్లేషణ (భారత దేశ వాయు నాణ్యతా మానిటర్ల నెట్వర్క్) పురోగతి స్థిరంగా ఉన్నప్ప టికీ, ఎన్సీఏపీని అమలు చేయడంలో వ్యూహాత్మకమైన, సైన్స్ ఆధారిత మార్పుల అవసరం ఉంది. ఉదాహరణకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ గాల్లోని నలుసు పదార్థాల (పర్టిక్యులేట్ మ్యాటర్) సాంద్రతకు పరిమితులు నిర్దేశించింది. 2.5 పీఎం అయితే, ఒక క్యూబిక్ మీటరుకు 5 మైక్రోగ్రాములు, 10 పీఎం అయితే ఒక క్యూబిక్ మీటరుకు 15 మైక్రోగ్రాములు మించకూడదు. ఎన్సీఏపీ అమలయ్యాక, ప్రత్యేకించి 2.5 పీఎం వారణాసిలో 96 నుంచి 26.9 మైక్రోగ్రాములకు తగ్గింది. ఆగ్రాలో 73 నుంచి 33కు, జో«ద్పూర్లో 81.8 నుంచి 40.6కు మెరుగ్గా తగ్గింది. కానీ ఢిల్లీలో మాత్రం 108 నుంచి 102కు మాత్రమే తగ్గింది. పీఎం 2.5 స్థాయుల డేటా 2019–2023 మధ్య 46 నగరాలకు మాత్రమే అందుబాటులో ఉంది. కేవలం 27 నగరాల్లో మాత్రమే తగ్గుదల మెరుగ్గా ఉంది. 10 పీఎం విషయంలో ఐదేళ్ల డేటా కేవలం 46 నగరాలకు అందుబాటులో ఉండగా, అందులో కేవలం 24 నగరాల్లో మాత్రమే మెరుగుదల కనబడింది. 50 శాతం నగరాలు గణనీయమైన అభివృద్ధిని చూపుతున్నా యనీ, ఇది ఎన్సీఏపీ విజయవంతమైన ప్రగతిని సూచిస్తోందనీ ఎవరైనా వాదించవచ్చు. కానీ మనం మానవ కణజాలంలోకి చొచ్చుకుపోయే కాలుష్య కారకాలతో వ్యవహరిస్తున్నాము. పైగా రక్తపోటు, మధుమేహం వంటివాటిని ఇవి మరింత తీవ్రతరం చేయవచ్చు. 2.5 పీఎం రక్త–మెదడు అవరోధాన్ని కూడా దాటవచ్చు. దీర్ఘకాలం అలాంటి గాలిలో మసలితే ప్రాణాంతకం అవుతుంది. కాబట్టి, ప్రజారోగ్య దృక్పథం నుండి చూస్తే మరింత కఠినమైన ప్రగతి అత్యవశ్యం. మరో సమస్య ఏమిటంటే, ఎన్సీఏపీలో సమన్వయం కొరవడింది. ఢిల్లీ లాంటి నగరంలో సరి–బేసి ట్రాఫిక్ను అమలు చేయడం, ‘జాతీయ రాజధాని ప్రాంతం’ నుండి నిబంధనలు పాటించని వాహనాలను తొలగించడం, వ్యర్థాలను బహిరంగంగా కాల్చడాన్ని నిరోధించడం, దుమ్మును తగ్గించడానికి రోడ్లపై నీటిని చల్లడం వంటి చర్యలు అన్నీ అమలవుతున్నాయి. అయినప్పటికీ, కాలుష్యానికి సంబంధించిన ఇవే కారణాలు ఉన్న మిగిలిన ప్రాంతాలకు విస్తరించకుంటే ఈ చర్యలు సరిపోవు. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్లలో పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల దట్టమైన పొగమంచుతో చలి కాలం ప్రారంభం కావడం దీనికి స్పష్టమైన ఉదాహరణ. ఢిల్లీ నగరంలో నమోదైన సుమారు 80 లక్షల వాహనాలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఉష్ణోగ్రతలో తగ్గుదల గాలిలో నిలిచివుండే అణువుల స్థాయులను ప్రమాదకరంగా పెంచుతుంది. ఈ కాక్టెయిల్ను ఢిల్లీ నివాసులు ప్రతి సంవత్సరం కొన్ని వారాల పాటు పీల్చుకుంటున్నారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్) ప్రతి శీతాకాలంలో ఢిల్లీ–జాతీయ రాజధాని ప్రాంతంలో ఊహించిన ప్రతిస్పందనగా అమలులోకి వస్తుంటుంది. అయితే దాని ఆధారాన్ని తగ్గించడమే లక్ష్యం కావాలి. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సజావుగా సమన్వయం లేకపోతే ఈ సమస్య ఇలాగే కొనసాగుతుంది. జాతీయ రాజధాని వెలుపల, సీపీసీబీ పర్యవేక్షణ నెట్వర్క్ అసమానంగా ఉందని మా విశ్లేషణ చూపుతోంది. ఇది మూల్యాంకనానికి వ్యత్యాసాల పొరను జోడిస్తుంది. ముజఫర్పూర్, బిహార్ లాంటి రద్దీ ప్రదేశాలలో కేవలం మూడు మానిటర్లు ఉన్నాయి. అదే ఢిల్లీ అంతటా 37 స్టేషన్లు,ముంబై అంతటా 22, హైదరాబాద్లో 14 స్టేషన్లు ఉన్నప్పుడు మనం తప్పుడు నిర్ధారణలకు వచ్చే ప్రమాదం ఉంది. ప్రామాణిక పర్యవేక్షణ విధానంలో, పోల్చదగిన జనాభా ఉన్న నగరాలు ఒకే విధమైన లేదా కనీసం సారూప్య సంఖ్యలో గాలి నాణ్యత మానిటర్లను కలిగి ఉంటాయి. స్థానిక కాలుష్య మూలాల శాస్త్రీయ అవగాహన ఆధారంగా ఆ స్థానాలు ఉంటాయి. నగరాల కాలుష్య సాంద్రతలు ఒకే పారామి తుల సెట్లో ట్రాక్ చేయబడతాయి. ఇది వాటి గాలి నాణ్యత ధోర ణులపై ‘గ్రాన్యులర్’(కణికీయ) అవగాహనను పెంపొందించడంలో సహాయపడుతుంది. వాయు కాలుష్య ప్రయత్నాలకు సంబంధించిన నిధుల కేటాయింపుల్లో కూడా సమస్యలున్నాయి. తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్న ఢిల్లీకి కేవలం రూ.38 కోట్లు మాత్రమే అందాయి. అందులో అది 10 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. గాలి నాణ్యత చర్యల కోసం వర్తించే నిధులను క్రమబద్ధీకరించడంలో ఇదొక ప్రశ్నగానే ఉండిపోతుంది. గ్రేటర్ ముంబైకి రూ.938 కోట్లు అందగా, దానిలో రూ.660 కోట్లు వినియోగించుకుంది. అయినప్పటికీ, జాతీయ స్వచ్ఛ వాయు పథకం(ఎన్సీఏపీ)లో సానుకూల అంశాలున్నాయి. వీటిలో మొదటిది 2026 నాటికి 10 పీఎం గాలి సాంద్రతలను 40 శాతానికి తగ్గించడం. ఇది ప్రతిష్ఠా త్మకమైన లక్ష్యాన్ని నిర్దేశిస్తోంది. అందుకే దీన్ని ఎన్సీఏపీ అమలు కాని నగరాలకు కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రేటర్ నోయిడా (ఉత్తర ప్రదేశ్), భివాడీ (రాజస్థాన్) వంటివి తీవ్ర కాలుష్య స్థాయులను నివేదించాయి. ఇంకా, రంగాల వారీగా వివరణాత్మక చర్యలు ఉండాలి. ఇటుక బట్టీలు, నిర్మాణాలు, కూల్చివేత ప్రాజెక్టుల వంటి అత్యంత కాలుష్య కారకాలకూ... సిమెంట్, ఉక్కు కర్మాగారాలకూ భిన్నమైన విధానం అవసరం. అదేవిధంగా, ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం మాత్రమే నిర్దిష్ట వయస్సు దాటిన పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధించింది. కానీ దేశవ్యాప్తంగా కఠినమైన, కాలుష్య నియంత్రణ వ్యవస్థ లేక పోతే... ప్రమాణాలను అందుకోని వాహనాలను ఇతర నగరాలకు తరలించే ప్రమాదం ఉంది. అప్పుడు కాలుష్య భారం మారదు. మరీ ముఖ్యంగా, ఎన్సీఏపీ ప్రధాన అంశంగా ప్రజారోగ్యం ఉండాలి. ప్రతి కొలమానాన్ని తప్పనిసరిగా ప్రతిపాదించాలి, చర్చించాలి. అంతే గాకుండా వాయు కాలుష్య కారకాలను తగ్గించడం పట్ల నిర్మాణా త్మకంగా ఉండాలి. మనం ఎన్సీఏపీ రెండవ దశలోకి ప్రవేశించినప్పుడు చాలా ఆశించవచ్చు. ప్రభుత్వం అత్యున్నత స్థాయిలలో సమస్యను అంగీకరించడం అనేది మాత్రం ఇప్పటికి సానుకూలాంశం. కానీ నిరంతర రాజ కీయ నిబద్ధత మాత్రమే బలమైన ఫలితాలను ఇస్తుంది. ఆరతీ ఖోస్లా వ్యాసకర్త న్యూఢిల్లీలోని క్లైమేట్ ట్రెండ్స్ డైరెక్టర్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
డాక్టర్ల చేతికి ‘ఏఐ’స్కోప్!
సాక్షి, హైదరాబాద్: మనను పరీక్షించి, ఆరోగ్య సమస్య ఏమిటో గుర్తించే డాక్టర్లకు స్టెతస్కోప్ ఎలాంటిదో.. ఇకపై కృత్రిమ మేధ (ఏఐ) కూడా అలా అరచేతిలో ఉపకరణం కాబోతోంది. రోగ నిర్ధారణ నుంచి చికిత్సల దాకా వీలైనంత తోడ్పాటు అందించనుంది. భవిష్యత్తులో వైద్యరంగంలో ఏఐ అత్యంత కీలకంగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. ఇప్పటికే రేడియాలజీ, టీబీ, కేన్సర్ వ్యాధుల నిర్ధారణ, చికిత్సల కోసం ఏఐని వినియోగిస్తున్నట్టు గుర్తు చేసింది. ఈ మేరకు ‘వైద్యారోగ్య రంగంలో కృత్రిమ మేధ వాడకం, నిర్వహణ, నైతికతపై డాక్యుమెంట్–2024’ను ఇటీవల విడుదల చేసింది. వ్యాధి నిర్ధారణ, క్రిటికల్ కేర్, క్లిష్టమైన కేసుల్లో వైద్యం చేయడంలో, వైద్య నిర్ధారణ పరీక్షలను సమీక్షించుకోవడంలో కృత్రిమ మేధ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంది. వెంటిలేటర్పై ఉన్న రోగులతో కూడా వారి కుటుంబ సభ్యులు ఏఐ సాయంతో మాట్లాడవచ్చని.. వారికి సంబంధించిన వైద్య నిర్ధారణ పరీక్షల నివేదికలను ఎప్పటికప్పుడు అందుకోవచ్చని తెలిపింది. వైద్యులు కేస్షీట్లో అన్ని వివరాలు రాసినా, వైద్య పరీక్షల రిపోర్టులను పరిశీలించినా.. వాటన్నింటినీ క్రోడీకరించి, అనుసంధానం చేసి చూడటం ఒకింత కష్టమని స్పష్టం చేసింది. అదే ఏఐ ద్వారా డేటా మొత్తాన్ని అనుసంధానం చేస్తే.. సరైన, కచ్చితమైన నిర్ధారణకు రావొచ్చని తెలిపింది. డబ్ల్యూహెచ్ఓ నివేదికలోని ముఖ్యాంశాలివీ.. ♦ రోగుల వివరాలు అన్నింటి నమోదులో ఏఐ ఉపయోగపడుతుంది. ♦ డాక్టర్లు, రోగులు వేర్వేరు భాషల్లో మాట్లాడితే.. ఇతర భాషల్లోకి తర్జుమా చేస్తుంది. దీంతో ప్రపంచంలో ఏ వైద్యులతోనైనా మాట్లాడవచ్చు, చికిత్స పొందవచ్చు. రోగులు వాడిన మందులు, ప్రిస్కిప్షన్లు, వచ్చిన జబ్బులు, లక్షణాలు, ఇతర వివరాలను ఏఐ సాయంతో నమోదు చేసి పెట్టవచ్చు. భవిష్యత్తులో ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే.. సులువుగా వైద్యం చేయడానికి వీలవుతుంది. ♦ వైద్య, నర్సింగ్ విద్యలో విద్యార్థుల స్థాయిని బట్టి బోధనను అందించవచ్చు. వివిధ రోగాలకు సంబంధించిన లక్షణాలను, వైద్య పరీక్షల నివేదికలను ఏఐ సాయంతో వేర్వేరుగా సృష్టించి.. ఎలాంటి పరిస్థితిలో ఏ తరహా చికిత్స ఇవ్వాలన్న శిక్షణ ఇవ్వవచ్చు. ♦ వైద్య పరిశోధన, మందుల తయారీ కోసం చాలా డేటా అవసరం. దానికోసం తీవ్రంగా శోధించాల్సి ఉంటుంది. అదే ఏఐ ఇంటర్నెట్ నుంచి సమాచారాన్ని క్రోడీకరించి అందిస్తుంది. ♦ వేల మంది రోగుల డేటా, వైద్య రిపోర్టులను ఏఐలో పొందుపర్చితే వాటన్నింటినీ విశ్లేషించి, రోగ నిర్ధారణలో సాయం చేయగలదు. ♦ ఒకేసారి లక్ష మంది చెస్ట్ ఎక్స్రేలను పొందుపర్చినా ఏఐ వాటన్నింటినీ విశ్లేíÙంచగలదు. డాక్టర్లకు సమయం కలసి వస్తుంది. చికిత్స సులువు అవుతుంది. స్పెషలిస్టుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం తగ్గుతుంది. ♦ వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 2030 నాటికి కోటి మంది డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కొరత ఏర్పడుతుందని అంచనా. కృత్రిమ మేధను వాడటం వల్ల ఉన్న సిబ్బందితోనే సమస్యను అధిగమించొచ్చు. ♦ యాక్సెంచర్ కంపెనీ నివేదిక ప్రకారం.. ఏఐని సరిగా వాడితే డాక్టర్లకు 40శాతం సమయం ఆదా చేస్తుంది. రోగులకు మరింత నాణ్యమైన సమయం కేటాయించే అవకాశం వస్తుంది. ♦ 2023లో యాక్స్డ్ అనే కంపెనీ కృత్రిమ మేధ సాయంతో ప్రొటీన్లో ఉండే సమాచారాన్ని నిక్షిప్తం చేయడం మొదలుపెట్టింది. ఇప్పటివరకు 60కోట్ల ప్రొటీన్ల సమాచారాన్ని సేకరించింది. ఎన్నో పరిశోధనలకు ఇది ఉపయోగపడుతుంది. ♦ యూఎస్కు చెందిన ఒక కంపెనీ కృత్రిమ మేధకు సంబంధించిన ఒక భాషపై మోడల్ను తీసుకొచ్చింది. జనవరి 2023లో అది ప్రారంభం కాగా.. రెండు నెలల్లో 10 కోట్ల మంది దాన్ని వాడారు. క్లిష్టమైన కేసుల్లో రోగ నిర్ధారణ సులువు అరుదైన, క్లిష్టమైన కేసుల్లో రోగ నిర్ధారణ కష్టంగా మారుతున్న నేపథ్యంలో.. కృత్రిమ మేధ దాన్ని సులువు చేస్తుంది. వైద్య ఆవిష్కరణల వేగం గత 75 ఏళ్లలో 200 రెట్లు పెరిగింది. ఆ వేగాన్ని అందుకోవాలంటే వైద్యులకు సాయం అవసరం. కృత్రిమ మేధ ఆ లోటును పూడ్చగలదు. దీనిని సమర్థవంతంగా వాడితే వైద్యంలో కచ్చితత్వం పెరుగుతుంది. అయితే ఏఐలో కొన్ని అంశాలపై అసమగ్ర సమాచారాన్ని మనం పొందుపరిస్తే.. అది తనకుతాను ఊహించుకొని 3 నుంచి 27శాతం వరకు సొంత నిర్ణయాలు ఇచ్చే అవకాశముంది. ఈ మేరకు కొంత నష్టం వాటిల్లే ప్రమాదమూ ఉంది. ఎక్కువగా టెక్నాలజీపై ఆధారపడితే డాక్టర్లలో నైపుణ్యాలు తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. – డాక్టర్ కిరణ్ మాదల, సైంటిఫిక్ కన్వినర్, ఐఎంఏ, తెలంగాణ -
70 శాతం రోగులకు యాంటీ బయోటిక్స్!
సాక్షి, హైదరాబాద్: యాంటీ బయోటిక్స్ వినియోగాన్ని పరిమితం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో)తో పాటు మరెన్నో వైద్య సంస్థలు సూచిస్తున్నప్పటికీ వాటి వినియోగం ఎంతమాత్రం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా 20 ప్రభుత్వ ఆసుపత్రులలో జాతీయ వ్యాధి నియంత్రణ సంస్థ (ఎన్సీడీసీ) నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం తేలింది. యాంటీ బయోటిక్స్ వినియోగాన్ని అంచనా వేయడానికి ఇప్పటివరకు దేశంలో నిర్వహించిన అతిపెద్ద మల్టీ సెంటర్ పీపీఎస్ (పాయింట్ ప్రెవలెన్స్ సర్వే)ల్లో ఇది ఒకటి. కాగా ఆసుపత్రుల్లో అడ్మిట్ అయిన 10 మంది రోగులలో ఏడుగురికి యాంటీ బయోటిక్స్ను సూచిస్తున్నట్టు (ప్రిస్క్రైబ్) ఈ సర్వే వెల్లడించింది. 70%లో కనీసం 5% మంది నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రకాల యాంటీ బయోటిక్స్ తీసుకుంటున్నారని వెల్లడైంది. వాచ్ గ్రూప్ యాంటీ బయాటిక్సే ఎక్కువ సాధారణంగా రోగులకు ఉపయోగించే 180 రకాల యాంటీబయోటిక్లను, వాటి సామర్థ్యాలకు అనుగుణంగా, వినియోగించాల్సిన తీరుతెన్నులను నిర్ధారించడానికి వాచ్ గ్రూప్ యాంటీ బయాటిక్స్, యాక్సెస్ గ్రూప్ యాంటీ బయాటిక్స్, రిజర్వ్ గ్రూప్ యాంటీ బయాటిక్స్ అంటూ మూడు కేటగిరీలుగా విభజించారు. వీటిలో అత్యధిక సామర్ధ్యం కలిగిన హయ్యర్ రెసిస్టెన్స్ పొటెన్షియల్ కిందకు వచ్చే వాచ్ గ్రూప్ తరహా యాంటీ బయాటిక్స్నే ఎక్కువగా సూచిస్తున్నారని సర్వే నిర్ధారించింది. అదే సమయంలో తక్కువ రెసిస్టెన్స్ పొటెన్షియల్ కలిగిన యాక్సెస్ గ్రూప్ రకాన్ని తక్కువగా సూచిస్తున్నట్టు వెల్లడించింది. యాక్సెస్ గ్రూప్ యాంటీ బయాటిక్స్ ప్రిస్క్రిప్షన్ను రెండు వెబ్సైట్లు మాత్రమే అధికంగా నమోదు చేశాయని తెలిపింది. యాంటీ బయాటిక్స్ కలపడం వల్ల ప్రతికూల ప్రభావం చాలా కేసుల్లో పాలీ ఫార్మసీ (బహుళ ఔషధాలను ఒకే సమయంలో వినియోగించడం) గమనించామని, రెండు యాంటీ బయాటిక్స్ కలపడం వలన ప్రతికూల ప్రభావాలు చూపేందుకు, ఔషధ పరస్పర చర్యల ప్రమాదాన్ని పెంచేందుకు అవకాశం ఉందని పేర్కొంది. ఈ సర్వే నివేదికను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య మంగళవారం విడుదల చేశారు. యాంటీ బయాటిక్స్ అధిక వాడకం వల్ల కలిగే హానిని దృష్టిలో ఉంచుకుని, రిజర్వ్ గ్రూప్ యాంటీ బయాటిక్స్ వినియోగం వీలైనంత తక్కువ స్థాయిలో ఉండేలా చూడాలని ఈ అధ్యయనం ఆసుపత్రులకు సిఫారసు చేసింది. -
భద్రం... బీ కేర్ఫుల్!
పారాహుషార్ గంట మరోసారి మోగింది. దేశంలో కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. మే 21 తర్వాత ఎన్నడూ లేనంత అత్యధిక స్థాయిలో 614 కొత్త కరోనా ఇన్ఫెక్షన్ కేసులు వచ్చాయి. కరోనా వైరస్ కొత్త వేరియంట్ జెఎన్.1 కేసు తొలిసారిగా కేరళలో బయటపడిన కొద్దిరోజుల్లోనే ఆ రాష్ట్రంలో నలుగురు బలయ్యారు. ఒక్క బుధవారమే దేశవ్యాప్తంగా 341 కొత్త కోవిడ్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదు కావడం, అందులో 292 కేసులు కేరళ నుంచి వచ్చినవే కావడంతో తక్షణమే అప్రమత్తత అవసరమైంది. ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించాల్సి వచ్చింది. భయాందోళనలకు గురి కానక్కర్లేదు కానీ, జాగ్రత్తలు మాత్రం తప్పవనేది ఇప్పుడు మన ఆరోగ్య మంత్రం. సరిగ్గా మూడేళ్ళ క్రితం మొదలైన కరోనా ఇప్పటికీ ఏదో ఒక రూపంలో మానవాళిని వేధిస్తూనే ఉంది. చిన్నాచితకా అలల్ని పక్కనపెడితే, రెండు ప్రధాన కరోనావేవ్లు మన దేశంలో జన జీవితాన్ని ఎంతగా అతలాకుతలం చేశాయో అందరికీ అనుభవైకవేద్యం. అప్పుడు నేర్చిన పాఠాలే ఇప్పుడు మార్గదర్శకాలు. ఈ మూడేళ్ళ కాలంలో అనేక కరోనా వైరస్ వేరియంట్లు వచ్చాయి. ఆ వరుసలోదే భారత్లో తాజాగా కనిపించిన జెఎన్.1 వేరియంట్. బీఏ.2.86 కుటుంబానికి చెందిన ఈ వైరస్ ఉత్పరివర్తనం ఏడాది పైచిలుకుగా రూపుదిద్దుకొంటూ వచ్చిందట. ఇది ఇప్పటికే సుపరిచితమైన ఒమిక్రాన్లో బలవత్తరమైన వేరియంట్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వివిధ దేశాల్లో ఇప్పటికే ఇది తన విజృంభణ చూపుతోంది. డిసెంబర్ 3 ముందు వారంలో 32 వేల మందికి కరోనా సోకితే, ఆ తరువాతి వారంలో 56 వేల మందికి ఇన్ఫెక్షన్ వచ్చిందని సింగపూర్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మన దేశంలోని కేరళలో ర్యాండమ్ శాంపిళ్ళకు ఆర్టీ–పీసీఆర్ టెస్టులు చేస్తుండగా ఈ జెఎన్.1 వేరియంట్ను గుర్తించారు. మన దగ్గర ఈ వేరియంట్ తొలిసారిగా బయటపడి, కేసులు పెరుగుతుండగానే రాష్ట్రాలన్నిటికీ కేంద్రం తాజాగా మార్గదర్శకావళిని జారీ చేయడం గమనార్హం. పలు రాష్ట్రాలు అప్రమత్తమై ఇప్పటికే సమీక్షా సమావేశాలు జరిపి, మార్గదర్శ కాలను ప్రకటించాయి. కేరళలో పరిస్థితులు, కొత్త జెఎన్.1 వేరియంట్ కేసుల భయంతో కర్ణాటక సర్కార్ 60 ఏళ్ళ పైబడిన వారికి, అనారోగ్య సమస్యలున్నవారికి మాస్కు ధరించడం తప్పని సరి చేసింది. కేరళ సరిహద్దు జిల్లాలలను అప్రమత్తం చేసింది. ప్రజల రాకపోకలు, సమావేశాలపై నియంత్రణలు విధించ లేదన్న మాటే కానీ, కోవిడ్ లక్షణాలున్న వారికి పరీక్షలు చేయించడం పెంచింది. వివిధ దేశాల్లో ఈ వేరియంట్ కనిపిస్తుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ తాజా పరిస్థితులపై దృష్టి సారించింది. దీన్ని ఆసక్తికరమైన వేరియంట్గా పేర్కొంది. ఒమిక్రాన్ తరగతికి చెందినప్పటికీ ఈ వేరియంట్ మరీ ప్రాణాంతకమైనదేమీ కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ టీకా వేసుకోని వారికి సైతం ఈ వేరియంట్ వల్ల ప్రాణహాని ఉండదనీ భరోసా ఇస్తున్నారు. అది కొంత ఊరటనిచ్చే అంశం. అలాగని అశ్రద్ధచూపలేం, అజాగ్రత్త వహించలేం. ఎవరెన్ని చెప్పినా ఆరోగ్యం, ప్రాణరక్షణకు సంబంధించిన విషయం గనక సహజంగానే ఈ వేరియంట్ పట్ల మన దేశంలో ఆరోగ్య నిపుణుల్లో, ప్రజల్లో ఆందోళన నెలకొనడం సహజమే. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు తొందరపడి, కఠిన నియంత్రణలు పెట్టనక్కరలేదు కానీ, మాస్కు ధారణ, చేతుల పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం లాంటి కనీస జాగ్రత్తలు పాటించడమే ప్రజారోగ్యానికి శ్రీరామరక్ష. అసలే వ్యాధినిరోధక శక్తి తగ్గే చలికాలం. దానికి తోడు శబరిమల యాత్ర, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సెలవులతో ప్రయాణాల సీజన్. పైగా వచ్చేది సార్వత్రిక ఎన్నికల సీజన్. ర్యాలీలు, బహి రంగ సభల హంగామా. కరోనా వ్యాప్తికి కలిసొచ్చే ఇన్ని అంశాల మధ్య జాగ్రత్తలను విస్మరించడం ఎలాచూసినా రిస్కే. కట్టుదిట్టమైన ఆరోగ్యవ్యవస్థ, పరీక్షల వల్ల కేరళలో ఎప్పటికప్పుడు భారీగా కరోనా కేసులు బయటపడుతున్నాయి కానీ, అంతటి పరీక్షలు, నిఘా లేని చోట పరిస్థితులు చాప కింద నీరులా ఉండివుండవచ్చు. దురదృష్టమేమంటే, మన దేశంలోనే కాక అనేక ప్రపంచ దేశాల్లో సైతం ఆ మధ్య కోవిడ్ కేసులు తగ్గాక, అధికారికంగా మహమ్మారి ముగిసినట్టు ప్రకటించారే తప్ప తర్వాతి జాగ్రత్తలు తీసుకోవట్లేదు. జీనోమిక్ ప్రాసెసింగ్ టెస్ట్లు సహా వివిధ రూపాల్లో నిఘాను విస్మరించారు. భారత్లో లేబరేటరీ నెట్వర్క్ ‘ఇన్సాకాగ్’ (ఇండియన్ సార్స్–కోవ్–2 జీనోమిక్స్ కన్సార్టియమ్) తగిన స్థాయిలో పనిచేయకపోవడమే అందుకు ఉదాహరణ. గత మూడేళ్ళలో దేశంలో 4.5 కోట్ల మంది కరోనా బారినపడ్డారనీ, 5.33 లక్షల మంది మరణించారనీ సర్కారు వారి తాజా లెక్క. ఈ అధికారిక లెక్కలకు అందని, సామాన్య బాధితుల సంఖ్య ఇంతకు అనేక రెట్లు ఎక్కువే. ఈ పరిస్థితుల్లో టెస్ట్లు ఎంత ఎక్కువగా చేస్తే, కరోనా విజృంభణను అంత త్వరగా పసిగట్టి, చర్యలు చేపట్టవచ్చు. అలాగే, కొత్త వేరియంట్లకు ఇప్పుడున్న టీకాలు ఏ మేరకు పనిచేస్తాయో పరీక్షించాలి. వివిధ దేశాలు ఇప్పటికే కొత్తవాటికి తగ్గట్టు టీకాలను మెరుగు చేస్తు న్నాయి. మన దేశానికీ వాటి అవసరం ఉందేమో శాస్త్రీయ సలహా స్వీకరించాలి. ముంచుకొచ్చే దాకా ఆగకుండా మూడు నెలలకోసారి ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్లు చేయడం మంచిది. అలసత్వం దూర మవుతుంది. అలాగే, కరోనాపై నిరంతర నిఘా సరేసరి. ప్రజానీకానికి సమాచారం చేరవేస్తూ, పొంచివున్న ముప్పుపై అవగాహన పెంచడం ముఖ్యం. ప్రజారోగ్యంపై అన్ని రాష్ట్రాలూ, ప్రభుత్వాలు ఏకతాటిపైకి రావాలి. రాజకీయాలకు అతీతంగా, సమన్వయంతో ఏకోన్ముఖ వైఖరిని అవలంబించాలి. ప్రయాణాలు, జనసమ్మర్దం పెరిగే రానున్న వారాలు కీలకం గనక సన్నద్ధతే సగం మందు! -
గాజా ఒడ్డున విపత్తు వంటకం
సంధి గడువు ముగియగానే... గాజాపై ఇజ్రాయెల్ ఉద్దేశాలు ఎలా ఉండబోతున్నాయన్నది ప్రాధాన్యం సంతరించుకుంది. బెంజమిన్ నెతన్యాహూ ప్రభుత్వం ప్రస్తుతం దక్షిణ గాజాలో తలదాచుకున్న దాదాపు 20 లక్షల మంది గాజా పౌరులను కేవలం 2.5 కిలోమీటర్ల వెడల్పు, 4 కిలోమీటర్ల పొడవు ఉన్న అల్–మవాసి అనే చిన్న ముక్క లాంటి భూభాగంలోకి నెట్టివేయడం గురించి ఆలోచిస్తోందని తెలుస్తోంది. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ ఒక నిర్దిష్ట ఫలితానికి దారితీసే ‘విపత్తు వంటకం’గా అభివర్ణించారు. 1948లో వెస్ట్ బ్యాంక్ నుంచి తమను తరిమేసినప్పుడు తొలిసారి శరణార్థులుగా మారిన గాజా ప్రజలు... ఇప్పుడు అల్–మవాసిలో చిక్కువడిపోతే కనుక రెండోసారి శరణార్థులుగా మారతారు. ఇప్పటివరకు అర్థం అవుతున్నదానిని బట్టి మన దృష్టి ఇజ్రాయెల్కూ, గాజాలోని పాలస్తీనా ప్రజలకూ మధ్య సంబంధాలపైన మాత్రమే కేంద్రీకతం అయి ఉంది. యుద్ధ సమయంలో ఇది అనివార్యంగా జరిగేదే. అయితే మీరు కనుక ఇజ్రాయెలీలకు, పాలస్తీనియన్లకు మధ్య గల విస్తృతమైన సంబంధాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే మాత్రం ఇజ్రాయెల్ తన లక్షల మంది పాలస్తీనా పౌరులను, వారితో పాటుగా 1967 నుంచి చట్టవిరుద్ధంగా తన ఆక్రమణలో ఉంచుకున్న వెస్ట్బ్యాంక్ ప్రాంత పాలస్తీనియన్లతో ఎలా వ్యవహరిస్తూ వస్తున్నదో కూడా తెలుసు కోవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఇస్తున్న కొన్ని వాస్తవాలు బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చు. మొదటిది, ఇజ్రాయెల్ ప్రజాస్వామ్య దేశం. కానీ అది యూదు పౌరులకు మాత్రమే. అక్కడి ‘నేషనల్ స్టేట్ చట్టం – 2018’ యూదు పౌరులకు, దేశంలోని పాలస్తీనా జాతీయులకు మధ్య వివక్షను పాటిస్తోంది. ఉదాహరణకు, ఇజ్రాయెల్లోని ‘పునరాగమన చట్టం’ (లా ఆఫ్ రిటర్న్) ప్రపంచంలోని ఏ మూల నుండి వచ్చిన యూదులైనా అప్రమేయంగా ఇజ్రాయెల్ పౌరసత్వం పొందేందుకు అనుమతిని ఇస్తోంది. కానీ అక్కడే పుట్టి, 1948 నక్బా (జాతి ప్రక్షాళన) విపత్తులో, 1967 యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ను వదిలి వెళ్లిన పాలస్తీనా కుటుంబాల వారికి మాత్రం ఈ హక్కును నిరాకరిస్తుంది. తరలిపోయిన అన్ని పాలస్తీనా కుటుంబాలు తిరిగి స్వదేశానికి వచ్చేందుకు హక్కును కల్పిస్తున్న ఐక్యరాజ్య సమితి 194వ తీర్మానాన్ని ధిక్కరించడమే ఇది. రెండవది–ఎటువంటి అభియోగమూ లేకుండా పాలస్తీనియన్లను నిర్బంధంలోకి తీసుకునేందుకు అనుమతినిచ్చే ‘అడ్మినిస్ట్రేటివ్ డిటెన్షన్ లా’ను ఇజ్రాయెల్ కలిగి ఉంది. ‘అల్ జజీరా’ చెబుతున్న ప్రకారం, ఇజ్రాయెల్ జైళ్లలో 7,200 మంది పాలస్తీనా ఖైదీలు ఉంటే వారిలో 2,200 మంది ఎలాంటి అభియోగమూ లేకుండా అరెస్ట్ అయినవారే. గత వారాంతంలో కాల్పుల విరమణ సందర్భంగా, ఇజ్రాయెల్ ఈ వైపు నుంచి 240 మందిని విడుదల చేస్తూనే, ఆ వైపు నుంచి 310 మందిని నిర్బంధంలోకి తీసుకుంది. 3,100 మంది లేదా 7,200లో 43 శాతం మంది అక్టోబర్ 7 తర్వాత (ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసిన రోజు) అరెస్ట్ అయినవారే. ఇక, వెస్ట్ బ్యాంకు వైపు వెళ్దాం. 1967 నుండి 7,50,000 మంది ఇజ్రాయెలీలు వెస్ట్ బ్యాంక్ అనే పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించి, లోపలి వాళ్లను ఖాళీ చేయించి తాము అక్కడ స్థిరపడిపోయారు. ఇజ్రాయెల్ సైన్యం ఆక్రమణదారులను అడ్డుకోక పోగా, వారికి రక్షణ కల్పించింది. దీనిని నెతన్యాహూ ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది. ఐక్యరాజ్యసమితి గుర్తింపు ఉన్న పాలస్తీనాను కుట్టడానికి వీలుకాని అతుకుల బొంతలా మార్చింది. వెస్ట్ బ్యాంక్కు వలస వచ్చి స్థిరపడిపోయిన ఇజ్రాయెలీలతో ఈ ఏడాది అక్టోబర్ 7 నుంచి జరుగుతున్న హమాస్ ఘర్షణల్లో 240 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు ‘అల్ జజీరా’ నివేదించింది. ‘‘వెస్ట్ బ్యాంక్లో పాలస్తీనియన్లపై జరుగుతున్న తీవ్రవాద హింస ఆగాలని, హింసకు పాల్పడేవారిని జవాబుదారులను చేసి తీరాలని’’ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ నాయకులకు నొక్కి చెప్పి నట్లు ‘వాషింగ్టన్ పోస్ట్’ కథనం పేర్కొంది. కానీ బైడెన్ మాటలను నెతన్యాహూ లెక్క చేయలేదు. ‘‘స్థిరపడిన వారి కదలికల గురించి చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని అధ్యక్షుడు బైడెన్కు చెప్పాను’’ అని పత్రికా సమావేశంలో అన్నారాయన. చివరిగా, çసంధి గడువులన్నీ ఒకసారి ముగిశాక గాజాపై ఇజ్రా యెల్ ఉద్దేశాలు ఎలా ఉంటాయన్నది చూడాల్సిన అంశం. నెత న్యాహూ ప్రభుత్వం ప్రస్తుతం దక్షిణ గాజాలో తలదాచుకున్న సుమారు 20 లక్షల మంది గాజా పౌరులను కేవలం 2.5 కిలోమీటర్ల వెడల్పు, 4 కిలోమీటర్ల పొడవు ఉన్న అల్–మవాసి అనే చిన్న ముక్క లాంటి భూభాగంలోకి నెట్టివేయడం గురించి ఆలోచిస్తూ ఉందన్న విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం ప్రతినిధిని ఉటంకిస్తూ ‘బీబీసీ’ దౌత్య సంబంధాల ప్రతినిధి పాల్ ఆడమ్స్ బహిర్గతం చేశారు. 1948లో వెస్ట్ బ్యాంక్ నుంచి తమను తరిమేసినప్పుడు గాజా ప్రజలు తొలిసారి శరణార్థులుగా మారారు. ఇప్పుడు వారు అల్–మవాసిలో చిక్కు పడిపోతే కనుక రెండోసారి శరణార్థులుగా మారతారు. నిజంగా ఇది అధ్వాన్నమైన స్థితి. పాలస్తీని యన్ల సంక్షేమం కోసం పని చేస్తుండే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యు.ఎన్.ఆర్.డబ్లు్య.ఎ. కమ్యూనికేషన్్స డైరెక్టర్ జూలియెట్ తౌమా... అల్– మవాసి గురించి చెబుతూ ‘అక్కడ ఏమీ లేదు. కేవలం ఇసుక దిబ్బలు, తాటి చెట్లు మాత్రమే’ అని అన్నారు. ఆఖరికి ఇజ్రాయెల్ రక్షణ దళాల ప్రతినిధి అయిన లెఫ్ట్నెంట్ కల్నల్ హెక్ట్ కూడా ‘‘అల్–మవాసి భయానకం కాబోతోంది’’ అన్నారు. అల్–మవాసీలో అవసరం అయిన మౌలిక సదుపాయాలు లేవు. ఆసుపత్రులు లేవు. అంతే కాదు, అత్యధికులు గుడారాలలో నివసించవలసి వస్తుంది. చలికాలం మొదలయ్యాక చలి గజగజ లాడిస్తుంది. తరచు వర్షాలు పడుతుంటాయి. అయినప్పటికీ కూడా... ‘‘మీ ప్రియమైన వారికి అల్–మవాసి అనుకూలమైన పరిస్థితులనే అంది స్తుంది’’ అని ఇజ్రాయెల్ రక్షణ దళానికి చెందిన మరొక ప్రతినిధి అవిచే ఆడ్రయీ చెబుతున్నారు. ‘‘అల్–మవాసికి సదుపాయాలు అందేలా చేయడం సహాయక సంస్థల బాధ్యతే’’నని ఇజ్రాయెలీ అధికారులు అన్నట్లు ‘బీబీసీ’ నివే దించింది. దీనిని బట్టి గాజావాసులను వారి కర్మకు వారిని ఇజ్రాయెల్ వదిలేయబోతున్నట్లు స్పష్టం అవుతోంది. కానీ ఆ మాటను వారు ఒప్పుకోడానికి సుముఖంగా లేరు. ‘‘గాజాలో జరగబోయే ఎలాంటి సురక్షిత ప్రాంత ఏర్పాటులోనూ మేము పాల్పంచుకోబోమని ‘ఐ.రా.స.’కు చెందిన 18 సంస్థలు, ఎన్జీవోలకు చెందిన అధినేతలు ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ ఈ అల్–మవాసి ప్రతి పాదనను... ఒక నిర్దిష్ట ఫలితానికి దారితీసే ‘‘విపత్తు వంటకం’’ అని అభివర్ణించారు. ‘‘సదుపాయాలు, సేవలు అందుబాటులో లేని అంత చిన్న ప్రదేశంలోకి అసంఖ్యాకంగా మనుషులను చేర్చడానికి ప్రయ త్నించడం వల్ల ఇప్పటికే ప్రమాదపుటంచున ఉన్న గాజా పౌరుల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతుంది’’ అని హెచ్చరించారు. ఇక్కడితో నేను ఆగిపోతాను. మీకు చేరని వాస్తవాలను, మన మీడియా వెల్లడించని ఇజ్రాయెల్ ఆలోచనలను మీకు తెలియ జేయడమే నా ఉద్దేశం. ఈసారి ఇజ్రాయెల్ను ఒక వర్ణవివక్ష రాజ్యం అని అనవలసి వచ్చినప్పుడు ఈ మాటలను దన్నుగా చేసుకోండి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఎక్కువ పనిగంటలు ప్రమాదకరం!
యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అన్న మాటలపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అసలు భారత కార్మిక చట్టం, ఫ్యాక్టరీ చట్టం వంటివి ఏం చెబుతున్నాయి, రోజుకి 8 గంటలు పైబడి పని చేస్తే పర్యవసనాలు ఏమిటి వంటి అనేక విష యాలు చర్చించవలసిన అవసరం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో 49 పని గంటల విధానం అమల్లో ఉంది. మన దేశంలో రోజువారి విశ్రాంతి సమయం, వార్షిక సెలవులు కలిపి వారానికి 48 పనిగంటలు మించకుండా ఉండేలా చట్టాలు ఉన్నాయి. మనిషికీ మనిషికీ పని గంటల్లో తేడా; అలాగే డబ్బు, ప్రాంతం, సంస్కృతి, జీవన విధానం వంటి అనేక అంశాలతో పాటు ముఖ్యంగా జీతాలు, లాభాలు ఆధారంగా కూడా ఈ పని గంటలు మారుతూ ఉంటాయి. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో వారి వారి అంగీ కారాన్ని బట్టి కూడా పని గంటలు నిర్దిష్టంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా నియమిత పని గంటలు వారానికి 40 నుంచి 44గా అమలులో ఉన్నాయి. తాత్కాలిక, బదిలీ ఉద్యోగులకు ఒకలాగా; పర్మినెంట్ ఉద్యోగులకు ఒకలాగా, అలాగే రోజుకి ఇన్ని గంటలని వారానికి మొత్తంగా 48 గంటలు మించకుండా పనిగంటలు ఉండాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ చెబుతుంది. ప్రపంచ వ్యాప్తంగా తక్కువ పని గంటలు వున్న దేశం జర్మనీ. ఇక్కడ సంవత్సరానికి 1340 గంటలు పని గంటలుగా ఉంటాయి. మెక్సికో, కొలంబియా, కోస్టారికాలలో ఎక్కువ పనిగంటలు (1886) ఉన్నాయి. భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు అప్పటి వైస్రాయ్ కౌన్సిల్లో లేబర్ మెంబర్గా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కార్మికులకూ, ఉద్యో గులకూ రోజుకు 8 పని గంటలు ఉండాలని 1942లో మొదటిసారి డిమాండ్ చేశారు. అనేక వాదోపవాదాలూ, తర్జనభర్జనల మధ్య వైస్రాయ్ కౌన్సిల్ 9 పనిగంటలు ఉండాలనీ, దీనిలో 30 నిమిషాలు రెండు దఫాలుగా విశ్రాంతి ఉండాలనీ నిర్ణయించారు. ‘1948 ఫ్యాక్టరీ చట్టం’ సెక్షన్ 54 ప్రకారం ఈ తొమ్మిది గంటల పని, విశ్రాంతి సమయాన్ని అంబేడ్కర్ కార్మికుల పక్షాన పోరాడి సాధించారు. ఇటీవల మన దేశంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ‘కర్ణాటక ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు – 2023’ను ఆమోదించడం ద్వారా రోజుకు 12 పని గంటలు ఉండాలని నిర్ణయిం చింది (వారానికి 48 గంటలు మించకుండా). అలాగే భారత కార్మిక మంత్రిత్వ శాఖ రోజుకు12 పనిగంటలు ఉండాలని పార్లమెంట్లో చట్టం చేసినప్పటికీ... ‘ఇండియన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ –1948’ ఓవర్ టైంతో కలిపి 50 నుంచి 60 పని గంటలు దాటకూడదనే నిబంధన కచ్చితంగా పాటించాలని చెప్పింది. 2016లో ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంత ర్జాతీయ కార్మిక సంస్థ అధ్యయనం, అంచనాల ప్రకారం ఎవరైతే వారానికి 55 గంటలు దాటి పని చేస్తారో వారిలో ప్రతి పది మందిలో ఒక కార్మి కుడు గుండె పోటుతో మరణిస్తున్నట్లు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 745,000 మంది కార్మికులు గుండెపోటుతో మరణించినట్లు నివేదిక తెలిపింది. దీనికి కారణం ఎక్కువ పని చేయడమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థల సంయుక్త నివేదిక చెబుతున్నటువంటి సత్యం. పైన ఉదాహరించిన ఎక్కువ గంటలు పని చేయడం వల్ల జరిగిన మరణాలను పరిశీలిస్తే, యువత వారానికి 70గంటలు పని చేస్తే జరిగే నష్టం అంచనా వేయొచ్చు. స్వతంత్ర భారతదేశంలో ఎవరి అభిప్రాయాలు వారు స్వేచ్ఛగా చెప్పవచ్చు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఆయన రంగంలో ఆయన ఆదర్శప్రాయులు. వయస్సు రీత్యా కూడా పెద్దవారు. ఇప్పటికే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో యువత అనేక ఆరోగ్య, మానసిక, కుటుంబ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అనేక వార్తలు నిత్యం చూస్తూనే ఉన్నాం. ఆయన తన అభిప్రాయాలు మెజారిటీ మనోభావాలు దెబ్బతినే విధంగానూ, అశాస్త్రీ యంగానూ వ్యక్తపరిస్తే ఆ ప్రభావం సమాజం మీద కచ్చితంగా ఉంటుంది. యువత మానసిక స్థితి మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక దారుఢ్యం, కుటుంబ నేపథ్యం, పెరిగిన వాతా వరణం వంటివాటిని బట్టి ఉంటుంది. కాబట్టి విధాన నేర్ణేతలు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి. – డా‘‘ గుబ్బల రాంబాబు, ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడు, ఏపీ -
ఆమెపై ఆగని అకృత్యాలు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అని గొప్పగా చెప్తున్నా.. ఆధునికంగా ప్రపంచం ఎంత వేగంగా ముందుకు పయనిస్తున్నా.. మహిళలపై వేధింపులు, హింస తగ్గడం లేదు. వివక్ష అంతరించడం లేదు. పరువు హత్య లు, వరకట్న హత్యలు, అత్యాచారాలు, వేధింపులు.. ఎక్కడా మహిళలకు రక్షణ లేని దుస్థితి. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని ఉజ్జయినిలో జరిగిన సంఘటన దీనికి మరో నిదర్శనం. అత్యాచారానికి గురైన పన్నెండేళ్ల బాలిక భయంతో వణికిపోతూ, అర్ధనగ్నంగా కిలోమీటర్ల దూరం సాయం కోసం పరుగెత్తడం.. సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి. మణిపూర్లో ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసి నగ్నంగా ఊరేగించిన ఘట నా ఇలాంటిదే. పోలీసు వ్యవస్థ ఎంత ఆధునిక పోకడలు పోతున్నా.. దేశంలో ఇంకా అనాగరిక దుష్కృత్యాలు కొనసాగడం ఆందోళనకరం. 2011–2021 మధ్య 87 శాతం పెరుగుదల.. గత దశాబ్దంలో మహిళలపై హింసాత్మక సంఘటనలు దాదాపు 87 శాతం మేర పెరగడం ఏ అభివృద్ధికి సంకేతమన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. మన దేశంలోనేగాక ప్రపంచవ్యాప్తంగా మహిళలపై హింస/వేధింపులు కొనసాగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం.. పోలీస్స్టేషన్లలో నమోదైన కేసుల సంఖ్య ఆధారంగానే 2011లో 2,28,650 మంది మహిళలపై హింసాత్మక ఘటనలు జరిగితే.. 2021నాటికి ఈ సంఖ్య 4,28,478కు అంటే.. 87శాతం మేర పెరగడం ఆందోళనకరం. అయితే దీనిని పోలీసు యంత్రాంగం మరో విధంగా చూస్తున్నట్టు సమాచారం. గతంలో మహిళలు కేసులు పెట్టడానికి ముందుకు వచ్చేవారు కాదని.. పెరిగిన విద్యావకాశాలు, పోలీసుల ఔట్రీచ్ కారణంగా ముందుకొచ్చి కేసులు పెడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. దేశ మహిళా జనాభాలో 7.5శాతం పశ్చిమ బెంగాల్లో ఉంటే.. అక్కడ మహిళలపై జరిగిన నేరాలు 12.7 శాతమని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మహిళలు హింసను భరించాలని దేశంలోని దాదాపు 65శాతం మంది పురుషులు అభిప్రాయంతో ఉన్నారని ‘ఇంటర్నేషనల్ మెన్ అండ్ విమెన్ జెండర్ ఈక్వాలిటీ సర్వే (ఇమేజెస్)’స్పష్టం చేసింది. కుటుంబం కలసి ఉండాలంటే మహిళలు ఈ హింసను భరించాల్సిందేనన్న ధోరణి ప్రమాదకరంగా మారుతోందని పేర్కొంది. ఇక గృహ హింసకు సంబంధించి కుటుంబ పరువు పేరిట చాలా వరకు మహిళలు కేసులు పెట్టడం లేదని నిపుణులు చెప్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. ప్రపంచ మహిళా జనాభాలో కనీసం 33.7% మంది ఏదో ఒక సమయంలో నేరాలు/వేధింపులకు గురైనవారే. పరువు పేరిటహత్యలెన్నో.. దేశంలో ఇటీవలి కాలంలో పరువు హత్యలు పెరిగిపోయాయి.కుటుంబ పెద్దల అంగీకారం లేకుండా ప్రేమించి కుల, మతాంతర వివాహాలు చేసుకుంటున్నవారిని.. పరువుకు భంగం కలిగించారనే భావనతో వారి కుటుంబాలే హత్య చేయిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే ఖాప్ పంచాయతీలు నిర్వహించి మరీ మరణ శాసనాలు లిఖిస్తున్నారు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, హరియాణా, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అత్యాచార దారుణాలు.. మహిళలు, బాలికలపై అత్యాచార ఘటనలూ దారుణంగా పెరుగుతున్నాయి. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం.. గత దశాబ్దకాలంలో ఇలాంటి దారుణాలపై కేసులు బాగా పెరిగాయి. 2008లో దేశంలో 21,467 అత్యాచార కేసులు నమోదవగా.. 2021లో ఈ సంఖ్య 31,677కు పెరిగింది. జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదులు కూడా.. తమపై వేధింపులకుసంబంధించి జాతీయ మహిళా కమిషన్కు వస్తున్న ఫిర్యాదులూపెరిగాయి. 2022లో మొత్తం 33,906 నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. ఇందులో అత్యధికంగా ఒక్క ఉత్తరప్రదేశ్ నుంచే 54.5 శాతం ఫిర్యాదులు ఉండగా.. తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, మహారాష్ట్ర, బిహార్, హరియాణావంటి రాష్ట్రాలు ఉన్నాయి. ప్రజల్లో చైతన్యం పెరిగితేనే ప్రయోజనం దేశంలో మహిళలపై అకృత్యాలు, అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో మహిళలపై హింస మరింత పెరిగి క్రూరమైన రూపాలను సంతరించుకుంటోంది. కరోనా లాక్డౌన్ కాలంలో స్త్రీలపై హింస విపరీతంగా పెరిగినట్టు మేం గమనించాం. మతం పేరిట, ఇతర రూపాల్లో ద్వేషం, విషపూరిత వాతావరణం నెలకొని గతంలోని స్నేహపూర్వక పరిస్థితి లేకుండా పోయింది. ఇది అన్నిరకాల హింసలకూ దారితీస్తోంది. నిర్భయ చట్టం తీసుకొచ్చినపుడు.. స్త్రీల హక్కులేమిటి? వారిపై హింసకు ఎందుకు పాల్పడకూడదన్న అంశాలపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.వెయ్యికోట్లు కేటాయించింది. ఇప్పుడైతే మహిళల హక్కులు అనే స్పృహ లేకుండా చేస్తున్నారు. మíహిళలకు సంబంధించిన రంగాలు, అంశాలపై బడ్జెట్ కేటాయింపులను కూడా తగ్గించడం దురదృష్టకరం. మహిళలపై ఎలాంటి దాడులకు పాల్పడినా తమకేమీ కాదులే అన్న మొండి ధైర్యం హింసకు దారితీస్తోంది. చట్టాలను అమలుచేయాల్సిన పోలీసు, ఇతర వ్యవస్థలు అవినీతితో పారదర్శకతను కోల్పోతున్నాయి. ప్రజల్లో చైతన్యం పెరిగినప్పుడే చట్టాలను అమలు చేసేందుకు ప్రభుత్వాలు దిగొస్తాయి. - వి.సంధ్య సామాజిక కార్యకర్త,పీవోడబ్ల్యూ -
భారత్లో డేంజర్ బెల్స్
సాక్షి, హైదరాబాద్: ప్రొటీన్లు, విటమిన్లు, ఫైబర్ తక్కువగా ఉండి.. కొవ్వులు, చక్కెర, ఉప్పుశాతం అధికంగా ఉండే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ భారతదేశాన్ని ముంచెత్తుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. అధిక కొవ్వు, చక్కెర, ఉప్పులతో కూడిన స్నాక్స్ (హెచ్ఎఫ్ఎస్ఎస్)తో మధుమేహం, అధిక రక్తపోటు సహా పలురకాల దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడుతున్నాయని హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల వినియోగం పెరుగుతుంటే.. అందుకు విరుద్ధంగా భారత్లో హెచ్ఎఫ్ఎస్ఎస్ పెరుగుతుండటం మంచిది కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ది గ్రోత్ ఆఫ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇన్ ఇండియా’అనే పేరుతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం ఒక నివేదిక విడుదల చేసింది. అధిక కొవ్వు, కేలరీలతో.. ♦ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినడంతోపాటు శారీరక శ్రమ తక్కువగా ఉండటం వల్ల గుండె జబ్బులు వస్తాయని డబ్ల్యూహెచ్ఓ నివేదిక స్పష్టం చేసింది. రోజుకు సగటున 1,580 కేలరీలుపైగా శక్తిని అందించే ఆహారం తీసుకోవడం సరికాదని.. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్తో ఎక్కువ కేలరీలు వస్తాయని పేర్కొంది. రోజూ ప్రొటీన్లు 41 నుంచి 57 గ్రాములకు మించి, కొవ్వు 19–32 గ్రాములకు మించి తీసుకుంటే అధిక బరువు సమస్య వస్తుందని తెలిపింది. భారత్లోని ఏడు పెద్ద నగరాల్లో ప్రజలు రోజుకు సగటున 33 గ్రాముల కంటే ఎక్కువ కొవ్వు తీసుకుంటున్నారని.. వాస్తవంగా రోజుకు 20 గ్రాముల లోపే తీసుకోవాలని వెల్లడించింది. కిరాణా షాపులే కొంప ముంచుతున్నాయి ప్రస్తుతం దేశంలో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మార్కెట్ విలువ రూ.3 లక్షల కోట్లు అని.. ఇందులో ఉప్పుతో కూడిన సాల్టీ స్నాక్స్ వ్యాపారమే రూ.60 వేల కోట్లు ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ధాన్యాలు, పప్పులు, నూనెలు, పాల వంటి నిత్యావసరాల మార్కెట్ విలువ రూ.5లక్షల కోట్లు మాత్రమేనని తెలిపింది. 2038 నాటికి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మార్కెట్ రూ.6 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. చిన్న ప్యాకెట్లలో, తక్కువ ధరకు అందుబాటులో ఉంచడం.. ఇలాంటి వాటిలో 70% కిరాణా షాపుల్లోనే దొరుకుతుండటంతో వినియోగం బాగా పెరుగుతోందని పేర్కొంది. గతంలో కంటే కూల్డ్రింక్స్ వాడకం తగ్గినా.. రెడీమేడ్ జ్యూస్, పాల ఆధారిత డ్రింక్ల మార్కెట్ పెరిగిందని తెలిపింది. ♦ పోర్చుగల్లో స్వీట్లు, బేవరేజెస్లపై ప్రత్యేక వినియోగ ట్యాక్స్ పెట్టడంతో 7% విక్రయాలు తగ్గాయని డబ్ల్యూహెచ్ ఓ తెలిపింది. అదే భారత్లో హానికరమైనవైనా, మంచివైనా అన్నింటికీ ఒకే రకంగా జీఎస్టీ ఉంటోందని.. దీనివల్ల హానికరమైన వాటి విక్రయాలు తగ్గడంలేదని పేర్కొంది. ♦భారత్లో చక్కెర తక్కువ ధరలో దొరుకుతుందని, దీనికి ప్రత్యామ్నాయాలను వాడాలంటే పన్నులు ఎక్కువగా ఉంటుండటంతో.. వ్యాపారస్థులు, ప్రజలు చక్కెరనే ఎక్కువగా వాడుతున్నారని వివరించింది. హెచ్ఎఫ్ఎస్ఎస్లో 5 రకాలు 1) చక్కెర సంబంధిత పదార్థాలు: చాక్లెట్స్, బబుల్గమ్స్, లాలిపాప్స్, ఐస్క్రీమ్స్, స్వీట్లు, బిస్కెట్లు, కేక్స్ వంటివి. 2) అధిక ఉప్పుతో కూడినవి: నట్స్, ఆలూ చిప్స్, పాప్కార్న్, పాపడ్ తదితరాలు 3) బేవరేజెస్: సాఫ్ట్ డ్రింక్స్, రెడీమేడ్ జ్యూసులు, రెడీమేడ్ కొబ్బరి నీళ్లు, ఎనర్జీ డ్రింక్స్, ఫ్లేవర్డ్ మిల్క్ వంటివి. 4) రెడీమేడ్ బ్రేక్ ఫాస్ట్: ఓట్స్, కార్న్ఫ్లేక్స్, గ్రనోలా వంటివి 5) మిగతా రెడీమేడ్ ఫుడ్ ఐటమ్స్: డీప్ ప్రాసెస్డ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, చిల్డ్ర్ ఫ్రాజెన్ మీట్, ఫ్రాజెన్ సీఫుడ్, రెడీమేడ్ సూప్లు, కండెన్స్డ్ మిల్క్, లస్సీ, ఇన్స్టంట్ నూడుల్స్, పిజ్జాలు, బర్గర్లు, రెడీమేడ్ రైస్, సాస్లు, కెచప్లు, టేబుల్ సాల్ట్, టమాటా, సోయా డ్రింగ్స్, పెరుగు వంటివి. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్కు దూరంగా ఉండాలి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల కొవ్వులు, ప్రొటీన్లు, చక్కెర, ఉప్పు అధికంగా శరీరంలోకి వెళతాయి. అధిక కొవ్వుతో ఊబకాయం, గుండె జబ్బులు.. అధిక ఉప్పుతో పక్షవాతం, బీపీ వస్తాయి. అధిక ప్రొటీన్లతో కిడ్నీ వ్యాధులు తలెత్తుతాయి. దేశంలో జాతీయ స్థాయిలో ప్రాసెస్డ్ ఫుడ్పై ఎలాంటి విధానం లేదు. ఆరోగ్యకర, అనారోగ్యకర ఆహార పదార్థాలకు సంబంధించి విధివిధానాలు లేవు. ప్రపంచమంతా చక్కెర, ఉప్పు, కొవ్వులు తక్కువగా ఉన్న ఆహారంవైపు మళ్లుతుంటే.. భారత్లో వాటి వినియోగం పెరుగుతోంది. ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్కు దూరంగా ఉండటం మంచిది. – డాక్టర్ కిరణ్ మాదల, సైంటిఫిక్ కమిటీ కన్వినర్, ఐఎంఏ, తెలంగాణ -
యాంటీబయోటిక్స్ కూడా పనిచేయవా?
గుండెల నిండా హాయిగా గాలి పీల్చుకోవాలంటే భయం. మాస్కు లేకుండా ఇల్లు కదలాలంటే భయం, భయం శరీరాన్ని, మెదడుని ఆక్రమించిన కలుషిత గాలి ఇప్పుడు వ్యాధుల నుంచి బయటపడేసే సంజీవిని లాంటి యాంటీబయోటిక్స్ రెసిస్టెన్స్పై ప్రభావం చూపిస్తోంది. వాయు కాలుష్యంతో యాంటీబయోటిక్స్ పని చేయడం లేదని, ప్రపంచవ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య పెరిగిపోతోందని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఢిల్లీకి చెందిన సమత వయసు 40 సంవత్సరాలు. ఒకరోజు హఠాత్తుగా శ్వాస తీసుకోవడం కష్టమైంది. ఆస్తమా అటాక్ అయింది. ఇంట్లో ఎవరికీ లేని ఆస్తమా ఎందుకొచ్చిందా అని ఆందోళనతో ఉంటే మందులు పని చెయ్యకపోవడంతో కుటుంబ సభ్యులు బెంబేలెత్తిపోయారు. చివరికి ఆస్పత్రిలో చేరితే వైద్యులు అతి కష్టమ్మీద ఆమె ప్రాణాలు కాపాడగలిగారు. దీనికంతటికీ కారణం వాయు కాలుష్యం. వాహనాలు, పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం గాల్లో కలిసిపోయి మనుషుల ఊపిరితిత్తులు, గుండె, మెదడుకి పాకుతోంది. వాయు కాలుష్యంతో శ్వాసకోశ సమస్యలు, గుండె వ్యాధులు, కేన్సర్, చివరికి ఆయుఃప్రమాణాలు క్షీణిస్తాయనే మనకి తెలుసు. ఇలాంటి ప్రాణాంతక వ్యాధులకు సంజీవనిలా ఉపయోగపడే యాంటీబయోటిక్స్ పని చేయకుండా వాయుకాలుష్యం చేస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇది పెరిగిపోతే భవిష్యత్లో మనుషుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయన్న ఆందోళనలున్నాయి. కలుషిత గాలితో వచ్చే అనర్థాల్లో తాజాగా యాంటీబయోటిక్ నిరోధకత పెరిగిపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోందని లాన్సెట్ హెల్త్ జర్నల్ అధ్యయనాన్ని ప్రచురించింది. చైనా, యూకేకు చెందిన శాస్త్రవేత్తలు వాయు కాలుష్యం ప్రభావాలపై వివిధ సంస్థలు సేకరించిన గణాంకాల ఆధారంగా యాంటీబయోటిక్స్ పనిచేయకపోవడం అతి పెద్ద పెనుముప్పుగా మారనుందని హెచ్చరించారు. 2000 నుంచి 2018 మధ్య కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ ఎని్వరాన్మెంట్ ఏజెన్సీ, వరల్డ్ బ్యాంక్ సహా 116 దేశాల డేటాను సేకరించి అధ్యయనం చేశారు. ► గాల్లోని సూక్ష్మాతి సూక్ష్మ ధూళి కణాలు పీఎం 2.5 వల్ల యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ పెరిగిపోతోంది. గాలిలో కాలుష్యం 10శాతం పెరిగితే యాంటీబయోటిక్ను నిరోధించే సామర్థ్యం 1.1% పెరుగుతోంది ► ప్రపంచవ్యాప్తంగా 703 కోట్ల మంది ప్రజలు పీఎం 2.5 దు్రష్పభావాలను ఎదుర్కొంటున్నారు. ► గాల్లో పీఎం 2.5 ధూళి కణాలు మనుషుల వెంట్రుక కంటే 30 రెట్లు చిన్న కణాలతో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా యాంటీబయోటిక్ నిరోధకతను ఇవి ఎంత ప్రభావితం చూపిస్తున్నాయన్నది అర్థం చేసుకోవడం దుర్లభంగా మారింది. ► యాంటీబయోటిక్స్ పనిచెయ్యకపోవడానికి ప్రధాన కారణం వాటిని మితి మీరి వాడడం అయినప్పటికీ వాయు కాలుష్యమూ మనుషుల శరీరంలో యాంటీబయోటిక్ నిరోధక బ్యాక్టీరియాను పెంచుతోంది. ► ఆస్పత్రులు, వ్యవసాయ క్షేత్రాలు, వ్యర్థాల శుద్ధి ప్లాంట్లు వంటి వాటి నుంచి యాంటీబయోటిక్లు పని చెయ్యకుండా చేసే కలుషిత గాలి ఎక్కువగా వెలువడుతున్నట్టు అధ్యయనం వివరించింది. ప్రాణం పోసే యాంటీబయోటిక్ ప్రాణమెలా తీస్తుంది? యాంటీబయోటిక్స్ని మితి మీరి వాడకం వల్ల శరీరంలో సహజసిద్ధమైన రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటోంది. దీనివల్ల సూపర్ బగ్స్ ఏర్పడి మంచి బ్యాక్టీరియాను తినేస్తున్నాయి. ఫలితంగా వ్యాధులు సోకినప్పుడు మందులు వేసుకున్నా పని చేయకుండా పోతున్నాయి. యాంటీబయోటిక్స్ పని చెయ్యకపోవడం వల్ల ప్రస్తుతం ఏడాదికి లక్ష మంది మరణిస్తున్నారు. 2050 నాటికి ఈ కారణంతో ప్రపంచ దేశాల్లో అత్యధికమరణాలు సంభవించే ముప్పు ఉంది. -
భారత్ దగ్గు మందు సురక్షితం కాదు: డబ్ల్యూహెచ్వో హెచ్చరిక
జెనీవా: ఇరాక్లో విక్రయిస్తున్న భారత్ తయారీ దగ్గు మందు సురక్షితం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. జలుబు, దగ్గు నివారణ కోసం ‘కోల్డ్ అవుట్’ పేరుతో దగ్గు రూపొందించిన సిరప్ తయారీలో వాడే పదార్థాలు పరిమితికి మించి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. చెన్నైకు చెందిన ఫోర్ట్స్ ల్యాబోరేటరీస్ కంపెనీ తయారు చేసిన కోల్డ్ అవుట్ అనే దగ్గు మందును ఇరాక్కు చెందిన దాబిలైఫ్ ఫార్మాకు విక్రయించింది. ఈ మందులో డైథిలీన్ ఇథలీన్ మోతాదుకు మించి ఉన్నట్టుగా డబ్ల్యూహెచ్ఒ గుర్తించింది. కోల్డ్ అవుట్లో 0.25% డైఇథలీన్, 2.1% ఇథలీన్ గ్లైకాల్లు ఉన్నట్లు తెలిపింది. ఈ దీని వినియోగం సురక్షితం కాదని డబ్ల్యూహెచ్వో సూచించింది చిన్నారులు ఈ మందు తాగితే అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది. తీవ్ర అస్వస్థతకు గురై మరణం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా ఇటీవల భారత్లో తయారైన సిరప్ గురించి డబ్ల్యూహెచ్వో హెచ్చరికలు జారీ చేయడం ఇదే ప్రథమం. కాగా గతంలో భారత్లో తయారైన దగ్గు మందులను ఉపయోగించడం వల్ల ఉజ్బెకిస్థాన్లోని గాంబియాలో 89 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో సిరప్ను ఉజ్బెకిస్థాన్కు సరఫరా చేసిన మరియోన్ బయోటెక్ అనుమతులను భారత్ ప్రభుత్వం రద్దు చేసింది. అంతకముందు కామెరూన్లో చిన్నారుల మృతికి కారణమైన దగ్గు మందు తయారు చేసిన రీమాన్ ల్యాబ్స్ కూడా సిరప్ తయారీలో నాణ్యత పాటించలేదని విచారణలో తేలింది. -
ఆస్పర్టెమ్తో క్యాన్సర్ ముప్పు.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
లియోన్: డైట్ సోడా తదితర ఎన్నో ఆహారపదార్థాల్లో వాడే నాన్ షుగర్ స్వీట్నర్(ఎన్ఎస్ఎస్) ఆస్పర్టెమ్తో కేన్సర్ వచ్చేందుకు అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. తమ అధ్యయనంలో తేలిందని డబ్ల్యూహెచ్వో అనుబంధ విభాగమైన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్(ఐఏఆర్సీ) తెలిపింది. ఆస్పర్టెమ్లో కేన్సర్ కారకాలుండేందుకు అవకాశమున్నట్లు మనుషులు, జంతువులపై జరిపిన అధ్యయనాల్లో తేలిందని ఐఏఆర్సీ తెలిపింది. అయితే, ఆస్పర్టెమ్ పరిమిత వాడకం సురక్షితమేనంటూ ఐరాసలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ), డబ్ల్యూహెచ్వో ఎంపిక చేసిన నిపుణుల కమిటీ నిగ్గు తేల్చింది. దీనిపై డబ్ల్యూహెచ్వో న్యూట్రిషన్ డైరెక్టర్ డాక్టర్ ప్రాన్సెస్కో బ్రాంకా మాట్లాడుతూ.. ఆస్పర్టెమ్ను మొత్తానికే మానేయాలని అనడం లేదు, మితంగా వాడాలని మాత్రమే చెబుతున్నామన్నారు. అత్యధికంగా వాడే వారు మాత్రమే తగ్గించుకోవాల్సి ఉంటుంది. కాస్త ఎక్కువగా వాడినా ఎటుంటి అనర్థాలు ఉండవని బ్రాంకా చెప్పారు. ‘ఆస్పర్టెమ్తో కాలేయ క్యాన్సర్ రావొచ్చనేందుకు మాత్రం ఆధారాలు పరిమితంగానే లభించాయి. ప్రస్తుతం వినియోగించే స్థాయిల్లో ఆస్పర్టెమ్ ప్రమాదకరమని చెప్పేందుకు బలమైన ఆధారం దొరకలేదు. ఆమోదయోగ్యమైన వినియోగ స్థాయిలకు సంబంధించిన మార్గదర్శకాల్లో మార్పులేదు. పరిమితంగా, మార్గదర్శకాలకు లోబడి వాడితే ఆస్పర్టెమ్ వల్ల సాధారణంగా ఎటువంటి హాని కలగదు’అని ఎఫ్డీఏ తెలిపింది. సాధారణంగా రోజుకు 14 కేన్ల వరకు ఆస్పర్టెమ్ ఉన్న డ్రింకులను తాగొచ్చునని కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ స్పీగెల్హాల్టెర్ తెలిపారు. -
మామూలు అరటిపండు కాదు.. ‘సూపర్ బనానా’.. ప్రపంచంలో ఇదే తొలిసారి
‘రోజుకో యాపిల్.. డాక్టర్ను దూరం పెడుతుంద’ని ఓ సామెత ఉంది. అది సీజనల్. రేటు కూడా కాస్త ఎక్కువే. అదే సీజన్తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా అందుబాటులో ఉండేది అరటి పండు. ధర కూడా తక్కువే. మరి యాపిల్లా అరటిపండుతోనూ బోలెడన్ని పోషకాలు అందితే.. తక్కువ ఖర్చుతోనే మంచి ఆరోగ్యం సొంతం. ఈ ఆలోచనతోనే ఉగాండా, ఆ్రస్టేలియా శాస్త్రవేత్తలు బిల్గేట్స్ ఫౌండేషన్ సాయంతో ‘సూపర్ బనానా’ను రూపొందించారు. అతి త్వరలోనే దీనిని అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటించారు. కోట్ల మందికి ప్రయోజనం ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని పేద దేశాల్లో కోట్లాది మంది ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా విటమిన్ ‘ఏ’ లోపంతో చిన్నారుల్లో ఎదుగుదల సరిగా లేకపోవడం, కంటి చూపు దెబ్బతినడం, వ్యాధినిరోధక శక్తి లేక రోగాల పాలవడం వంటి సమస్యలు తలెత్తుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఇప్పటికే పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 19 కోట్ల మంది ఐదేళ్లలోపు చిన్నారులు విటమిన్ ఏ లోపంతో బాధపడుతున్నారని ప్రకటించింది. ఈ క్రమంలోనే విటమిన్ ఏ, ఇతర పోషకాలు అధికంగా ఉండే సూపర్ బనానాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బనానా21 ప్రాజెక్టు పేరిట.. జన్యు మార్పిడితో.. ♦ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్కు చెందినఫౌండేషన్ ఆర్థిక సాయం, ఆ్రస్టేలియా వ్యవసాయ శాస్త్రవేత్త జేమ్స్ డేల్ సహకారంతో ఉగాండా జాతీయ అగ్రికల్చర్ రీసెర్చ్ లేబోరేటరీ శాస్త్రవేత్తలు ‘సూపర్ బనానా’పై 2005లో పరిశోధన చేపట్టారు. ♦ అత్యవసర పోషకాలన్నీ ఉండటంతోపాటు తెగుళ్లు, ఫంగస్లను తట్టుకోవడం, కరువు ప్రాంతాల్లోనూ పండించగలిగేలా నీటి ఎద్దడిని తట్టుకోగలగడం వంటి లక్షణాలు ఉండేలా అరటిని అభివృద్ధి చేశారు. ♦ జన్యు మార్పిడి విధానంలో సుమారు 18 ఏళ్లపరిశోధన తర్వాత.. విటమిన్ ఏ సహా అత్యవసర పోషకాలన్నీ ఉండేలా సరికొత్త వంగడాన్ని అభివృద్ధి చేయగలిగారు. ప్రపంచంలో ఇదే మొదటిసారి.. ఇలా పోషకాలన్నీ ఉండేలా జన్యుమార్పిడి అరటి పండ్లను అభివృద్ధి చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చిన్నారుల జీవితాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. కొత్త అరటి రకం సాగుకు సిద్ధమైనట్టేనని, అనుమతులు రావాల్సి ఉందని వెల్లడించారు. -
మనం మారాల్సిందే!
గణాంకాలు వాస్తవ పరిస్థితికి సూచికలు. అనేక సందర్భాల్లో భవిష్యత్ దృశ్యాన్ని ముందుగా కళ్ళ ముందు నిలిపి, గాఢనిద్ర నుంచి మేల్కొలిపే అలారం మోతలు. భారతదేశంలో మధుమేహ రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందనీ, అధిక రక్తపోటు సహా జీవనశైలి వ్యాధుల బారిన పడే వారి సంఖ్య అధికమవుతోందనీ తాజా దేశవ్యాప్త సర్వే వెల్లడించిన అంశాలు అలాంటివే. లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ జర్నల్లో ప్రచురితమైన ఈ సర్వేలోని అనేక విషయాలు ఇటు ప్రజల్నీ, అటు ప్రభుత్వాలనూ అప్రమత్తం చేస్తున్నాయి. దేశంలో పెరుగుతున్న మధుమేహం, స్థూలకాయం, అధిక రక్తపోటు లాంటి జీవనశైలి వ్యాధులపై తక్షణ కార్యాచరణ అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. మధుమేహం, అసాంక్రమిక వ్యాధుల (ఎన్సీడీ)పై అతి పెద్ద సర్వే ఇది. ఇందులో 2008 నుంచి 2020 మధ్యకాలంలో దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 20 ఏళ్ళు, ఆ పైబడిన వయసువాళ్ళను దాదాపు 1.13 లక్షల మందిని సర్వే చేశారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిధులతో భారత వైద్య పరిశోధన మండలితో కలసి మద్రాస్ డయాబెటిస్ రిసెర్చ్ ఫౌండేషన్ ఈ అధ్యయనం నిర్వహించింది. ఈ సర్వేలో వెల్లడైన అంశాలు ఆందోళన రేపుతున్నాయి. 2017లో భారతీయుల్లో 7.5 శాతం మందికే మధుమేహం ఉండేది. 2021 నాటికి ఆ సంఖ్య 11.4 శాతానికి, మరో మాటలో 10.1 కోట్ల మందికి పెరిగింది. అలాగే 15.3 శాతం మంది, అంటే 13.6 కోట్ల మంది మధుమేహం వచ్చే ముందస్తు లక్షణాలతో జీవితం సాగిస్తున్నారు. అంటే ‘టైప్–2 డయాబెటిస్’ అన్న మాట. ఇక, దేశంలో 28.6 శాతం (25.4 కోట్ల మంది) సాధారణ స్థూలకాయంతో, 39.5 శాతం (35.1 కోట్ల మంది) ఉదర ప్రాంత స్థూలకాయంతో ఉన్నట్టు తేలింది. చెడ్డ కొవ్వు (ఎల్డీఎల్ కొలెస్ట్రాల్)తో 18.5 కోట్ల మంది అనారోగ్యం పాలవుతున్నారు. నూటికి 35.5 మందిని అధిక రక్తపోటు వేధిస్తోంది. అసాంక్రమిక వ్యాధులు దేశంపై ఎంతటి భారం మోపుతున్నాయో కనుగొనేందుకు గాను దేశంలోని ప్రతి రాష్ట్రాన్నీ అధ్యయనంలో భాగం చేసిన తొలి విస్తృత స్థాయి అధ్యయనం ఇది. దేశంలో ఎక్కువగా మధుమేహం ఉన్న రాష్ట్రాలు – గోవా (26.4 శాతం), పుదుచ్చేరి (26.3 శాతం), కేరళ (25.5 శాతం). అలాగే, షుగర్ వ్యాధిపీడితులు తక్కువగా ఉన్న ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్లలో సైతం వ్యాధిపీడితుల సంఖ్య సర్రున పెరిగే అవకాశం ఉందని ఈ అధ్యయనం హెచ్చరిక. ముందుగా అనుకున్నదాని కన్నా భారత జనాభాలో మధుమేహం అధికంగా ఉందని ఈ సర్వేతో తేలిందని పరిశోధకులు చెబుతున్నారు. ‘ఇది గడియారం ముల్లు ముందుకు కదులుతున్న టైమ్ బాంబ్’ అని ఈ అధ్యయన సారథి అంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో ప్రతి 11 మంది వయోజనుల్లో ఒకరిని మధుమేహం పీడిస్తోందని లెక్క. షుగర్తో గుండె పోటు, అంధత్వం, కిడ్నీల వైఫల్యం ముప్పుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న హెచ్చరిక సరేసరి. ఈ నేపథ్యంలో కాయకష్టం, క్రమబద్ధమైన జీవనశైలి ఉండే గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే, ఆధునిక జీవనశైలి నిండిన పట్టణాల్లోనే మధుమేహం ఎక్కువగా ఉందనేది ఈ అధ్యయన ఫలితం. ఇది ఓ కీలక సూచిక. మనం మార్చుకోవాల్సింది ఏమిటో చెప్పకనే చెబుతున్న కరదీపిక. మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం వగైరా వంశపారంపర్యం, ఆహారపుటలవాట్లు, జీవనశైలి ద్వారా వస్తాయనేది నిపుణుల మాట. జన్యుపరంగా కుటుంబంలోనే ఉంటే ఏమో కానీ, ఇతరులు మాత్రం తినే తిండి, బతికే తీరులో జాగ్రత్తల ద్వారా ఈ అనారోగ్యాలు రాకుండా జాగ్రత్తపడవచ్చు. ఒకవేళ వచ్చినా... జీవనశైలి మార్పులతో యథాపూర్వ ఆరోగ్యాన్ని పొందవచ్చు. వైద్యులు పదేపదే చెబుతున్న సంగతే తాజా అధ్యయనం సైతం తేల్చింది. ఈ మాటను ఇకనైనా చెవికెక్కించుకోవాలి. మారిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నప్పుడు అనివార్యంగా జీవన శైలి మారింది. అది మన ఆహారపుటలవాట్లలో మార్పు తెచ్చింది. చివరకు తెలియకుండా మన ఆరోగ్యాన్ని మనమే బలిపెట్టుకొనే దశకు చేరుకున్నాం. అందుకే ఇకనైనా అనారోగ్యం తెచ్చే ఆహారపుటలవాట్లు, జీవనశైలి సహా అనేకం మనం మార్చుకోవాలి. మరోపక్క అందుకు తగ్గట్టు ప్రజల్లో చైతన్యం పెంచే బాధ్యత ప్రభుత్వాల పైనా ఉంది. అది ఈ అధ్యయనం చెబుతున్న పాఠం. అలాగే, దేశంలో ఆరోగ్య రక్షణ రంగంలో చేయాల్సిన ప్రణాళిక, చేపట్టాల్సిన చర్యలకు ఈ తాజా సర్వే ఫలితాలు మార్గదర్శకమే. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మధుమేహ ధోరణి ఒక స్థిరీకరణ దశకు చేరుకుంటే, అనేక ఇతర రాష్ట్రాల్లో అది పెరుగుతోంది. ఫలితంగా ఆయా రాష్ట్రాల తక్షణ చర్యలకీ అధ్యయనం ఉపకరిస్తుంది. మరోపక్క అన్నిచోట్లా, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య వసతులు మరింత అందుబాటులో ఉండేలా చూడాలి. ఫాస్ట్ఫుడ్ మోజు, సోమరితనం వల్ల పిల్లల్లోనూ జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న వేళ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు ముఖ్యం. ఆరోగ్యకరమైన తిండి, శారీరక శ్రమ వల్ల టైప్–2 మధుమేహాన్ని నూటికి 60 కేసుల్లో తగ్గించవచ్చట. అందుకని ప్రభుత్వాలు పౌరసరఫరా వ్యవస్థ ద్వారా చిరుధాన్యాలు పంపిణీ చేసి, ప్రజలను ఆరోగ్యదాయక ఆహారం వైపు మళ్ళించవచ్చు. ప్రజల్ని అటువైపు ప్రోత్సహించడంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలూ చైతన్యశీల పాత్ర పోషించాలి. ఈ జీవనశైలి వ్యాధులు జాతిని నిర్వీర్యం చేసి, అభివృద్ధిని కబళించే ప్రమాదం పొంచివుంది గనక తక్షణమే తగిన విధానాల రూపకల్పన అవసరం. పరిస్థితులు చేయి దాటక ముందే నష్టనివారణ చర్యలకు నడుంకట్టడం వివేకవంతుల లక్షణం. -
అలర్ట్: ప్రపంచంలో టాప్-20 వాయు కాలుష్య పట్టణాల్లో 14 భారత్లోనే..
ఊపిరాడని పరిస్థితి. శ్వాసకోశ సమస్యలు పట్టిపీడిస్తున్న దుస్థితి. ఎక్కడో ఒక చోటే అని కాదు.. ప్రపంచవ్యాప్తంగా 99 శాతం ప్రజానీకం పీలుస్తున్న గాలి స్వచ్ఛమైనది కాదు. వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 67 లక్షల మందికిపైగానే బలవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించిన నివేదికలోని అంశాలే ఇవి. స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ చేసిన అధ్యయనం ఆధారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. అందులో మన దేశానికి సంబంధించిన కొన్ని దారుణమైన వాస్తవాలనూ వెల్లడించింది. ప్రపంచంలో వాయు కాలుష్యం అత్యధికంగా ఉన్న టాప్–20 నగరాల జాబితాలో ఏకంగా 14 నగరాలు భారతదేశం నుంచే ఉండటం ఆందోళనకరం. ఇందులో దక్షిణాది రాష్ట్రాలేవీ లేకపోవడం కాస్త ఉపశమనం. వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో దానిని తగ్గించే చర్యలు చేపడుతుంటే.. వాటి స్థానంలో కొత్త నగరాలు వచ్చి చేరుతున్నాయి. –సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ ఆరు వేల నగరాల్లో పరిశీలించి.. 2022 సంవత్సరానికి సంబంధించి మొత్తం 117 దేశాల్లోని ఆరు వేల నగరాల్లో వాయు నాణ్యతను పరీక్షించామని.. మరికొన్ని దేశాల్లో వాయు నాణ్యతను పరీక్షించేందుకు సరైన పరికరాలు లేని కారణంగా పరీక్షించలేకపోయామని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. అలాంటి వాటిలో చాలా వాయు కాలుష్యం ఉన్న నగరాలూ ఉండి ఉంటాయని తెలిపింది. తగిన జాగ్రత్తలు తీసుకోలేక.. కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సూక్ష్మ ధూళి కణాలు వంటి వాయు కలుషితాలు తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయి. వేగంగా అభివృద్ధి చెందే క్రమంలో అటవీ సంపదను నాశనం చేస్తుండటం, పరిశ్రమల ఏర్పాటుతో కాలుష్యం పెరుగుతోంది. పరిశ్రమలు విడుదల చేసే వాయు, జల, భూకాలుష్యాలను అరికట్టే చర్యలపై ప్రభుత్వం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చూపుతున్నాయి. ఏదో భోపాల్ దుర్ఘటన వంటివి జరిగినప్పుడు హడావుడి చేయడం, ఆ తర్వాత మిన్నకుండిపోవడం సాధారణమైపోయింది. భద్రతా ప్రమాణాలను ‘గాలి’కి వదిలేయడం వల్ల వాయు కాలుష్యం ప్రజల ప్రాణాలకు అపాయకరంగా మారుతోంది. వంటింటి పొగ ప్రాణాలు తీస్తోంది వాయు కాలుష్యం కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారిలో మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 32 లక్షల మందికిపైగా వంటింటి పొగకు బలవుతున్నట్టు డబ్ల్యూహెచ్వో నివేదికలో పేర్కొంది. ప్రపంచ జనాభాలో మూడో వంతు కుటుంబాలు వంట కోసం కలప, బొగ్గు, పేడ, పంటల వ్యర్థాలను వాడుతున్నాయని.. తద్వారా వెలువడే వాయు కాలుష్యంతో ఊపిరితిత్తులు దెబ్బతిని శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నట్టు వెల్లడించింది. పరిశ్రమలు, వాహన, వంటింటి వాయు కాలుష్యం వల్ల మొత్తంగా ఏటా 67 లక్షల మంది శ్వాసకోశ వ్యాధులతో మృత్యువాత పడుతున్నట్లు తెలిపింది. ఏయే సమస్యలు వస్తున్నాయి? కలుషిత గాలిలోని సూక్ష్మ ధూళి కణాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి శ్వాస సంబంధిత వ్యాధులు తలెత్తుతున్నాయి. వాయు కాలుష్యంతో మరణిస్తున్న వారిలో 32శాతం మంది ఇస్కామిక్ హర్ట్ డిసీజ్తో, 23 శాతం మంది గుండెపోటుతో, 21 శాతం లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, 19 శాతం క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్తో, ఆరు శాతం మంది ఊపిరితిత్తుల కేన్సర్తో మరణిస్తున్నట్టు డబ్ల్యూహెచ్వో నివేదికలో పేర్కొంది. వాయు కాలుష్యం నివారణకు ఏం చేయాలి? ► వాయు కాలుష్యాన్ని నివారించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు సూచనలు కూడా చేసింది. తగిన వాయు నాణ్యతా ప్రమాణాలను అనుసరించాలని స్పష్టం చేసింది. ► వాయు కాలుష్య కారక అంశాలను గుర్తించాలి. వాటి నియంత్రణ చర్యలను ప్రభుత్వ యంత్రాంగం నిత్యం పర్యవేక్షించాలి. ► వంటకు అవసరమైన కాలుష్య రహితమైన, నాణ్యమైన ఇంధనాన్ని సమకూర్చాలి. సురక్షితమైన, సామాన్యులకు అందుబాటులో ఉండే రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలి. పాదచారులకు, సైక్లింగ్ ఫ్రెండ్లీ నెట్వర్క్ కల్పించాలి. ► వాహన కాలుష్యాన్ని అరికట్టేలా కఠిన చట్టాలు తీసుకుని రావాలి. వాటి అమలును నిత్యం పర్యవేక్షించేలా అధికార యంత్రాంగం పనిచేయాలి. ► పరిశ్రమల వ్యర్థాలు, మున్సిపల్ వ్యర్థాల యాజమాన్య నిర్వహణను మరింత పెంచాలి. ► పంట వ్యర్థాలను తగలబెట్టడం ఆపేయాలి. అటవీ అగ్నిప్రమాదాలను అరికట్టాలి. ఉత్తరాది రాష్ట్రాల్లో సమస్య తీవ్రం సూక్ష్మరూపాల్లోని కాలుష్యాలు మనుషుల ఆరోగ్యంపైనే కాకుండా పర్యావరణం, జీవవైవిధ్యం, పశుపక్ష్యాదులు, జంతు జాలం, పొలాలు, వ్యవసాయ ఉత్పత్తులపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కానీ దక్షిణాది రాష్ట్రాలు కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విష వాయువులతోపాటు పీఎం 2.5, పీఎం 10 సూక్ష్మరూపాల్లోని కాలుష్య వ్యాప్తి మనుషుల ఆరోగ్యాన్ని కుంగదీస్తోంది. వాయు కాలుష్యాన్ని తగ్గించే దిశలో ఎవరికి వారు వ్యక్తిగత స్థాయిలో, ప్రభుత్వం, స్వచ్ఛందసంస్థల పరంగా పరిష్కారమార్గాలు ఆలోచించాలి. – ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి, ప్రముఖ పర్యావరణవేత్త హైదరాబాద్లోనూ పెరుగుతున్న కాలుష్యం ఇటీవల సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్బోర్డు డేటాను విశ్లేషిస్తూ గ్రీన్పీస్ ఇండియా విడుదల చేసిన నివేదికలో.. హైదరాబాద్లో పీఎం 10 స్థాయిలు నిర్దేశిత ప్రమాణాల కంటే ఆరేడుశాతం అధికంగా ఉన్నాయి. పరిశ్రమల విస్తరణ, రవాణా పెరగడం, చెత్త తగలబెట్టడం, భారీగా నిర్మాణ కార్యకలాపాల వల్ల వాయు కాలుష్యం పెరుగుతోంది. పర్టిక్యులేట్ మేటర్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, పీఎం 2.5, పీఎం 10 వంటివి ఎక్కువ అవుతున్నాయి. ఇవి ఊపిరితిత్తులపై ప్రభావం చూపి.. శ్వాసకోశ సమస్యలకు కారణమవుతున్నాయి. – హరికిషన్ గోనుగుంట్ల, చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, యశోద ఆస్పత్రి గాలి నాణ్యతను ఎలా నిర్ధారిస్తారు? గాలి నాణ్యతను ‘ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ)’తో కొలుస్తారు. వాతావరణంలో ఒక క్యూబిక్ మీటర్ గాలిలో కెమికల్స్ రియాక్షన్స్తో ఏర్పడిన, లేదా దుమ్ము, ధూళి కణాలు, నిర్మాణ ప్రాంతాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో వెలువడే కాలుష్యాల (పర్టిక్యులేట్ మేటర్)ను లెక్కించి కొలుస్తారు. గంటకోసారి లేదా 8 గంటలకోసారి కొలవడం ద్వారా సగటు ఏక్యూఐని గుర్తిస్తారు. టాప్–20 వాయు కాలుష్య నగరాలు లాహోర్ (పాకిస్తాన్), హోటన్ (చైనా),భివండి, ఢిల్లీ (భారత్), పెషావర్ (పాకిస్తాన్) ఎన్ డీజమేనా (చాద్), దర్భంగా, అసోపూర్, పట్నా, ఘజియాబాద్, ధరెహారా (భారత్), బాగ్దాద్ (ఇరాక్), ఛాప్రా, ముజఫర్నగర్ (భారత్), ఫైసలాబాద్ (పాకిస్తాన్),గ్రేటర్ నోయిడా, బహదూర్ఘర్,ముజఫర్పూర్, ఫరీదాబాద్(భారత్) -
ఔషధ రంగ ప్రక్షాళనే మందు!
ఒంట్లో నలతగా ఉండటం మొదలుకొని ఎలాంటి అనారోగ్య సమస్యలొచ్చినా వైద్యుణ్ణి సంప్రదించటం, తగిన మందు వాడి ఉపశమనం పొందటం సర్వసాధారణం. కానీ ‘కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడిన చందాన’ ఔషధాలుంటే జనం ప్రాణాలు గాల్లో దీపంగా మిగిలిపోయినట్టే. ఔషధ సంస్థలన్నిటినీ అనలేంగానీ కొన్ని సంస్థలు అందరి కళ్లూ కప్పి నాసిరకం ఔషధాల ఎగుమతులతో లాభాలు గడించేందుకు తహతహలాడుతున్న తీరువల్ల మన దేశం పరువు ప్రతిష్ఠలు దెబ్బతింటున్నాయి. ఈ విషయంలో పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ఆలస్యంగానైనా కేంద్ర ప్రభుత్వం సంకల్పించటం సంతోషించదగ్గ విషయం. ఇకపై ఉత్పత్తుల తయారీ ప్రక్రియలో మంచి విధానాలు (జీఎంపీ) పాటిస్తున్నట్టు ధ్రువపడితేనే ఆ ఉత్పత్తులను విడుదల చేయటానికి అంగీకరించాలనీ, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో విడుదల చేయాలనీ కేంద్రం నిర్ణయించింది. ఫార్మా ఉత్పత్తుల్లో మన దేశం విశ్వగురు అయిందని రెండు నెలలక్రితం కేంద్ర ఇంధన శాఖ సహాయమంత్రి భగవత్ కూబా ఘనంగా ప్రకటించారు. కానీ ఇక్కడినుంచి ఎగుమతవుతున్న ఔషధాల వాడకంవల్ల పదులకొద్దీమంది మృత్యువాత పడిన ఉదంతాలు ఆ ఘనతను కాస్తా హరిస్తు న్నాయి. నిరుడు ఆఫ్రికా ఖండ దేశం గాంబియాలో దగ్గుమందు సేవించి 70 మంది పసిపిల్లలు మరణించగా, ఉజ్బెకిస్తాన్లో 19 మంది పిల్లలు చనిపోయారు. భారత్ నుంచి వచ్చిన కొన్ని ఔషధాల ప్రమాణాలు సక్రమంగా లేవని అమెరికా కూడా ప్రకటించింది. ఔషధాల్లో మోతాదుకు మించి రసాయనాలున్నాయని కొన్నిసార్లు, నిర్దేశిత ప్రమాణాల్లో లేవని కొన్నిసార్లు ఫిర్యాదు లొస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో పంపిన ఔషధాలు పంపినట్టు వెనక్కొస్తున్నాయి. నిజానికి గాంబియాకు ఎగుమతయిన దగ్గు మందు మన దేశంలో విక్రయానికి పనికిరాదని నిషేధించారు! అయినా అది నిరాటంకంగా గాంబియాకు చేరుకుంది. వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపమే ఈ దుఃస్థితికి కారణం. దీన్ని ఎంత త్వరగా సరిదిద్దితే అంత మంచిది. ఔషధాల్లో వినియోగించే ముడి పదార్థాలు ప్రామాణికమైనవి అవునో కాదో, అవి నిర్దేశించిన పాళ్లలో ఉన్నాయో లేదో తనిఖీ చేయటం, రోగంనుంచి ఉపశమనమిస్తుందని చేసిన ప్రకటనకు అనుగుణంగా ఆ ఉత్పత్తి ఉందో లేదో నిర్ధారించటం నియంత్రణ వ్యవస్థల పని. అలాంటి సంస్థలు మన దేశంలో 38 వరకూ ఉన్నాయి. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ)తో పాటు రాష్ట్రాల్లో పలుచోట్ల ఔషధ పరీక్ష కేంద్రాలు(సీడీఎల్) ఉన్నాయి. కానీ ఏదీ సక్రమంగా అమలు కావటం లేదని పలుమార్లు రుజువైంది. గాంబియాలోనూ, ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్లోనూ పసివాళ్ల ప్రాణాలు తీసిన దగ్గు, జలుబు మందులను హరియాణాలోని మైడెన్ ఔషధ సంస్థ ఉత్పత్తి చేసింది. ఈ సంస్థ తరచు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంది. తమ ఫ్యాక్టరీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు ఉందని తన వెబ్సైట్లో ఆ సంస్థ ఘనంగా ప్రకటించుకున్నా అదంతా ఉత్తదేనని తేలింది. అయినా ఏ నియంత్రణ విభాగం ఆ ఔషధ సంస్థపై చర్య తీసుకోలేకపోయింది. ఇప్పుడు కొత్తగా అమల్లోకి తెస్తామంటున్న జీఎంపీ అయినా సక్రమంగా అమలు చేయగలిగితే మంచిదే. ఉత్పాదక ప్రక్రియ సక్రమంగా లేకపోతే ఆ ఉత్పత్తులు కాస్తా కొద్ది రోజుల్లోనే దెబ్బతింటాయి. ఔషధాలు రోగం తగ్గించకపోయినా ఎంతోకొంత సరిపెట్టుకోవచ్చుగానీ ప్రాణాలే తీస్తే?! అసలే పౌష్టికాహార లోపం, వాతావరణ కాలుష్యం, విషాహారం తదితరాలు జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. చివరకు ఔషధాలు సైతం ఈ జాబితాలో చేరితే ఇక చెప్పేదేముంది? వాస్తవానికి ఎగుమతి చేసే ఔషధాలకు జీఎంపీ విధానం ఎప్పటినుంచో అమలులో ఉంది. కానీ దాన్ని అమలు చేయటంలోనే అడుగడుగునా నిర్లక్ష్యం కనబడుతోంది. ఔషధాలు ఎగుమతి చేయ దల్చుకున్న ప్రతి దేశమూ తమ ఔషధ సంస్థలు నిర్దిష్టమైన ప్రమాణాలు అమలు చేస్తున్నట్టు నిర్ధారించుకోవాలని గాంబియా విషాద ఉదంతం తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ నాలుగు నెలల క్రితం తెలిపింది. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ముడి పదార్థాల నాణ్యత మొదలు కొని కర్మాగారంలోని పరిసరాలు, యంత్రాలు, సిబ్బంది పాటించే పరిశుభ్రత వరకూ సమస్తం సరిగా ఉన్నాయో లేదో చూడటం ఈ మార్గదర్శకాల సారాంశం. ఉత్పత్తి ప్రక్రియలోని ప్రతి దశలోనూ పాటించే విధానాలను నమోదు చేసేందుకు అవసరమైన నమూనాను ఎవరికి వారు రూపొందించుకోవాలనీ, పకడ్బందీ తనిఖీలతో ఇవన్నీ సక్రమంగా అమలయ్యేలా ఎప్పటికప్పుడు చూడాలనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. కేంద్రం ప్రకటించబోయే జీఎంపీ ఇకపై మన దేశంలో విక్రయించే ఔషధాలకు కూడా వర్తిస్తుందంటున్నారు. మంచిదే. అయితే ఎగుమతయ్యే ఔషధాల విషయంలో చూపిన అలసత్వమే ఇక్కడా కనబడితే అనుకున్న లక్ష్యం నెరవేరదు. కర్మా గారం దాటి బయటికొచ్చే ప్రతి ఔషధమూ అత్యంత ప్రామాణికమైనదన్న విశ్వాసం రోగుల్లో కలగాలి. ఔషధాల తనిఖీ విధానంలో మార్పులు తెస్తే తప్ప దీన్ని సాధించటం కష్టం. మన దేశంలో ఔషధ తయారీ సంస్థలు దాదాపు 30,000 వరకూ ఉన్నాయి. వీటిని సక్రమంగా తనిఖీ చేయాలంటే ఇప్పుడున్న సిబ్బంది ఏమాత్రం సరిపోరు. కనుక కొత్త నియామకాలపై కూడా దృష్టి పెట్టాలి. అలాగే చాలా ఫార్మా సంస్థలు తమ ఉత్పత్తుల ప్రయోగ ఫలితాల వివరాలను బహిరంగపరచటం లేదు. ఏమాత్రం పారదర్శకత పాటించని ఇలాంటి ధోరణులే కొంప ముంచుతున్నాయి. ఔషధ రంగాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తేనే ఈ పరిస్థితి మారుతుంది. -
డేంజర్ ‘లైఫ్స్టైల్’.. 63 శాతం మరణాలకు ఇదే కారణం! షాకింగ్ విషయాలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రపంచీకరణతో ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. పోటీ ప్రపంచంలో అందరి కంటే ముందుండటానికి ఉరుకులపరుగుల జీవితం ప్రతి ఒక్కరికీ నిత్యకృత్యమైపోయింది. ఈ ప్రపంచీకరణతో మనిషి ఆలోచనలు, అలవాట్లు, ఆహారం అన్నీ మారిపోయాయి. మారిన జీవనశైలి తనతోపాటు కొన్ని వ్యాధులను కూడా మోసుకొస్తోంది. దీంతో ఊబకాయం, క్యాన్సర్, గుండెపోటు, శ్వాసకోశ వ్యాధులు అధికమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో మరణిస్తున్న ప్రతి వంద మందిలో 63 శాతం మంది జీవనశైలి వ్యాధులతోనే మృతి చెందుతున్నారు. పొగ తాగడం, మద్యపానం, పోషకాహారలోపం, శారీరక వ్యాయామం లేకపోవడం, మానసిక, పని ఒత్తిళ్లు అనారోగ్యానికి ప్రధాన కారణాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) స్పష్టం చేసింది. 2030లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరు జీవనశైలి వ్యాధులతోనే మరణిస్తారని బాంబు పేల్చింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ప్రతి ఒక్కరికీ ఆందోళన కలిగిస్తోంది. టారీ సర్వేలో ఆందోళనకర అంశాలు అలాగే థాట్ ఆర్బిటరేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (టారీ) దేశంలోని 21 రాష్ట్రాల్లో 2,33,672 మంది వ్యక్తులను, అలాగే 673 ప్రజారోగ్య కార్యాలయాలను పరిశీలించింది. ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. 18 ఏళ్లు దాటిన వారు కూడా జీవనశైలి వ్యాధుల (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్–ఎన్సీడీ) జాబితాలో ఉన్నారు. 35 ఏళ్లు దాటిన వారికి హైపర్టెన్షన్, జీర్ణ సమస్యలు, షుగర్ ఎక్కువగా వస్తున్నాయి. వీటి తర్వాత స్థానంలో క్యాన్సర్ నిలుస్తోంది. దేశంలో 26–59 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరు ఎన్సీడీ జబ్బులతో బాధపడుతున్నారు. ఇది దేశానికి చాలా ఆందోళన కలిగించే అంశమని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారే. వీరు అనారోగ్యానికి గురైతే దేశ భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దీంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ అతుల్ గోయల్ దేశవ్యాప్తంగా వైద్య సంఘాలకు తాజాగా లేఖ రాశారు. జీవనశైలి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పట్టణాలు, మెట్రో నగరాల్లో మరింత ప్రమాదం.. జీవనశైలి వ్యాధులకు గురవుతున్నవారిలో పట్టణాలు, మెట్రో ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. బెంగళూరుకు చెందిన మాక్స్ హెల్త్కేర్ చైర్మన్, ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ అంబరీస్ మిట్టల్ పరిశీలనలో 1970లో దేశంలో పట్టణ ప్రాంతాల్లో 2 శాతం మందికి షుగర్ ఉండేది. 2020లో ఇది 15–20 శాతానికి పెరిగింది. ప్రస్తుతం అది 27 శాతానికి చేరింది. అలాగే మెట్రో నగరాల్లో 35–40 శాతం మందికి షుగర్ జబ్బు ఉంది. ఇదే క్రమంలో నరాల సంబంధిత వ్యాధులు గత 30 ఏళ్లతో పోలి్చతే నాలుగురెట్లు పెరిగాయని న్యూఢిల్లీలోని లేడీ హోర్డింగ్ మెడికల్ కాలేజీ న్యూరాలజీ డిపార్ట్మెంట్ హెచ్వోడీ డాక్టర్ రాజీందర్కే ధనుంజయ పరిశీలనలో తేలింది. అధిక బరువు (ఒబేసిటీ) 2005తో పోలి్చతే 2015లో అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య రెట్టింపయింది. ఇందులో 20.7 శాతం మంది పురుషులు, 18.6 శాతం మంది స్త్రీలు ఉన్నారు. అయితే 2023కు ఈ సంఖ్య మళ్లీ రెట్టింపయింది. శారీరక శ్రమ లేకపోవడమే అధిక బరువుకు ప్రధాన కారణం. మానసిక సమస్యలు దేశం మొత్తం జనాభాలో 10 శాతం మంది పలు రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. 18 ఏళ్ల యువకులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పుడు ఈ సంఖ్య ఏటా 13 శాతం చొప్పున పెరుగుతోంది. దేశంలో కనీసం 15 కోట్ల మంది పలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. తమకు మానసిక సమస్య ఉంది అని గుర్తించలేని స్థితిలో మరో 5 కోట్లమంది దాకా ఉన్నారు. వీరందరికీ సైకియాట్రిస్టుల అవసరం ఉంది. క్యాన్సర్ ప్రమాదకర రసాయనాలు ఉన్న కాస్మోటిక్స్, రసాయనాలతో మిళితమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, వాయు, వాతావరణ కాలుష్యం, మద్యం, పొగాకు, మాంసాహారం ఎక్కువ తీసుకోవడం, కూరగాయలు తక్కువగా తీసుకోవడం వంటి కారణాలతో క్యాన్సర్ రోగుల సంఖ్య ఏటా 5–8 శాతం పెరుగుతోంది. దీంతో ప్రతి ఒక్కరూ ఏడాదిలో ఒక్కసారైనా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జీవన విధానంలోని మార్పులు, సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడంతో 26 శాతం మంది గుండెజబ్బులకు గురవుతున్నారని ‘టారీ’ సర్వే తేల్చింది. పాశ్చాత్య సంస్కృతితో ముప్పు.. మనదేశంలో పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడి రాత్రిళ్లు మరీ ఎక్కువసేపు మెలకువతో ఉంటున్నారు. ఆహార అలవాట్లు, జీవన విధానం కూడా మారిపోయాయి. దీంతో రోగాలు చుట్టుముడుతున్నాయి. ఉదయమే నిద్రలేస్తే ‘కార్టీజాల్’ హార్మోన్ ఉత్పత్తితో బాడీ రిథమ్లో పనిచేస్తుంది. ఆలస్యంగా నిద్రలేస్తే దీని ఉత్పత్తి తగ్గిపోతుంది. రాత్రిళ్లు పనిచేసేవారు పగలు నిద్రపోతున్నారు. ఇది చాలా ప్రమాదం. కచ్చితంగా ప్రతి ఒక్కరూ వ్యాయామానికి సమయం కేటాయించాలి. దీంతో ఎండార్ఫిన్ ఉత్పత్తి అయి మెదడు చురుగ్గా పనిచేయడంతోపాటు ఒత్తిడి తగ్గుతుంది. – డాక్టర్ శ్రీనివాసులు, హెచ్వోడీ, ఎండోక్రైనాలజీ, కర్నూలు ప్రభుత్వాస్పత్రి -
పిల్లలు, మహిళలపై రక్తహీనత పంజా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహిళలు, పిల్లలను రక్తహీనత పట్టి పీడిస్తోంది. తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా పరిణమించింది. 15–49 ఏళ్ల మధ్య వయసు గల మహిళల్లో 57.6 శాతం, ఐదేళ్ల లోపు పిల్లల్లో 70 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ మేరకు తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన నివేదికలో పలు వివరాలు పేర్కొంది. పిల్లల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి 11 హెచ్బీ కంటే తక్కువగా ఉంటే రక్తహీనత కలిగినవారిగా వర్గీకరించారు. అంతకుముందు ఐదేళ్లతో పోల్చినప్పుడు మహిళల్లో రక్తహీనత ఒక శాతం పెరిగింది. 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోల్చినప్పుడు మహిళల రక్తహీనతలో తెలంగాణ 16వ స్థానంలో నిలిచింది. దేశంలో అత్యధికంగా లడక్లో 92.8 శాతం మంది, అత్యంత తక్కువగా లక్ష ద్వీప్లో 25.8 శాతం మంది రక్తహీనత బాధితులున్నారు. ఇదే వయసు గల గర్భి ణుల్లో 53.2 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని నివేదిక తెలిపింది. గర్భిణుల రక్తహీనతలో తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. అంతకుముందు ఐదేళ్లలో గర్భిణుల్లో 48.2 శాతం మంది రక్తహీనత బాధితులు ఉండగా, ఆ తర్వాత ఐదు శాతం పెరిగింది. ఇక 15–19 ఏళ్ల వయస్సుగల బాలికల్లోనూ రక్తహీనత శాతం 64.7 శాతముంది. అంతకుముందు ఐదేళ్లలో అది 59.7 శాతమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం రక్తహీనత 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంటే తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా పరిగణించాలి. పిల్లల్లో అత్యధికం లడాక్.. అత్యల్పం కేరళ రాష్ట్రంలో ఆరు నెలల నుంచి ఐదేళ్లలోపు వయ సు గల 70 శాతం మంది పిల్లలు రక్తహీనత బారినపడ్డారు. 2019–21 మధ్య దేశంలో ఆ వయస్సు పిల్లల్లో అత్యధికంగా లడక్లో 92.5 శాతం మంది, గుజరాత్లో 79.7 శాతం మంది రక్తహీనతకు గురయ్యారు. పిల్లల్లో రక్తహీనత తక్కువగా ఉన్న రాష్ట్రాలు కేరళ (39.4 శాతం), అండమాన్– నికోబార్ దీవులు(40 శాతం), నాగాలాండ్ (42.7 శాతం) మణిపూర్ (42.8 శాతం) ఉన్నాయి. రక్తహీనత బారిన పడిన పి ల్లల విషయంలో తెలంగాణ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఐదేళ్లలోపు పిల్లల్లో జాతీయ సగటు 67.1 శాతం కంటే రాష్ట్రంలో ఎక్కువగా రక్తహీనత బాధితులు ఉన్నారని పేర్కొంది. 2015–16 సంవత్సరంతో పోలిస్తే, 2019–21 మధ్య 9.3 శాతం మేర రక్తహీనత బాధితులు తెలంగాణలో పెరిగారని వెల్లడించింది. ఇవీ కారణాలు.. తల్లి విద్యాస్థాయి, వయస్సు, తల్లిపాలు ఇచ్చే వ్యవధి తదితర కారణాలు పిల్లల్లో రక్తహీనతపై ప్రభావం చూపిస్తాయి. ఇనుము లోపం రక్తహీనతకు అత్యంత సాధారణ కారణం. పౌష్టికాహార లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. డయేరియా, మలేరియా, ఇతర ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రక్తహీనత ప్రమాదాన్ని పెంచుతాయి. వివిధ సామాజిక–ఆర్థిక, సాంస్కృతిక, విశ్వాసాల కారణంగా ఏర్పడే ఆహారపు అలవాట్లు కూడా రక్తహీనతకు కారణమవుతున్నాయి. రక్తహీనత సమస్యను అధిగమించాలంటే పుట్టిన తర్వాత మొదటి వెయ్యి రోజుల్లో తీసుకునే చర్యలు కీలకమైనవని డాక్టర్ కిరణ్ మాదల విశ్లేషించారు. -
కోవిడ్ డేటాను చైనా తొక్కిపెడుతోంది
ఐరాస/జెనీవా: 2020లో వూహాన్ మార్కెట్లో సేకరించిన శాంపిళ్ల డేటాను చైనా తొక్కిపెడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆరోపించింది. కరోనా మూలాలను అంచనా వేయడంలో ఈ సమాచారమే కీలకమని పేర్కొంది. కోవిడ్ పరిశోధనల ఫలితాలను అంతర్జాతీయ సంస్థలతో పంచుకుంటూ పారదర్శకంగా వ్యవహరించాలని హితవు పలికింది. మహమ్మారి పుట్టుకను అర్థం చేసుకోవడం నైతిక, శాస్త్రీయ అవసరమని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రెసియస్ అన్నారు. ‘‘వూహాన్లోని హునాన్ మార్కెట్లో సేకరించిన నమూనాల డేటాను ఈ ఏడాది జనవరి చివర్లో ఆన్లైన్ నుంచి తొలగించారు. దాన్ని తిరిగి అందరికీ అందుబాటులో ఉంచాలని చైనాకు చెప్పాం’’ అన్నారు. చైనాలోని వూహాన్ నగరంలో 2019 ఆఖరులో పుట్టిన కరోనా వైరస్ సార్స్–కోవ్–2 ప్రపంచమంతటా వ్యాపించి, లక్షలాది మరణాలకు కారణంగా మారడం తెలిసిందే. -
కరోనా మూలాల్ని తేల్చాలి: డబ్ల్యూహెచ్ఓ
జెనీవా: కరోనా మూలాలను కనుగొనడం నైతికావసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అభిప్రాయపడింది. అప్పుడు మున్ముందు ఇతర వైరస్లు వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయగలమని తెలిపింది. కోవిడ్–19ని మహమ్మారిగా ప్రకటించి మూడేళ్లు అవుతున్న సందర్భంగా డబ్ల్యూహెచ్ఒ చీఫ్ టెడ్రోస్ అధ్నామ్ ఘెబ్రెయాసెస్ మాట్లాడారు. కరోనాతో లక్షలాది మంది మరణించారని, కొన్ని కోట్ల మంది లాంగ్ కోవిడ్తో ఇబ్బందులు పడుతున్నారని అందుకే ఈ వైరస్ పుట్టుపూర్వోత్తరాలను కనుగొనాల్సిన నైతిక బాధ్యత ఉందని అన్నారు. కరోనా తొలి కేసు వెలుగులోకి వచ్చిన చైనాలోని వూహాన్లో డబ్ల్యూహెచ్ఓ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం 2021లోనే కొన్ని వారాలు గడిపి గబ్బిలాల నుంచి మనుషులకి ఈ వైరస్ సోకిందని నివేదిక సమర్పించింది. మరోవైపు అమెరికా అధ్యయనంలో ఈ వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచి లీక్ అయిందని తేలింది. ఇలా రెండు పరస్పర విరుద్ధమైన వాదనలు ప్రచారంలో ఉండడం వల్ల ప్రజల్లో గందరగోళం నెలకొంది.అందుకే అసలు వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని టెడ్రోస్ చెప్పారు. అత్యంత ప్రమాదకర వైరస్లపై అధ్యయనానికి డబ్ల్యూహెచ్ఒ ఏర్పాటు చేసిన సైంటిఫిక్ అడ్వయిజరీ గ్రూప్ కూడా ఇప్పటివరకు కరోనా వైరస్ పుట్టుకపై ఎలాంటి నిర్ధారణకు రాలేకపోయింది. కీలకమైన డేటా కనిపించడం లేదని కమిటీ అంటోంది. భారత్లో పెరుగుతున్న కరోనా కేసులు దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 113 రోజుల తర్వాత ఒకే రోజు 524 కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,618కి చేరుకుంది. -
నిత్యజీవితంలోని పనులే ఫిజియో వ్యాయామాలైతే...
సాధారణంగా పక్షవాతంతో అవయవాలు చచ్చుబడ్డా లేదా ఇతరత్రా ఏదైనా ప్రమాదం కారణంగా అవయవాల్ని కొద్ది రోజులు పని చేయించలేకపో తే... అవి మళ్లీ నార్మల్గా పని చేయడానికి ఫిజియోథెరపీ వ్యాయామాలు అవసరమవుతాయి. మునపటిలా పని చేయడానికి ఉపకరిస్తాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో వీటినే రీ–హ్యాబ్ వ్యాయామాలని కూడా అంటారు. వ్యాయామం అనగానే ఏదో శ్రమతో కూడిన పని అనీ, ఎలాగోలా తప్పించుకుంటే బెటరని అనిపించేవాళ్ల సంఖ్యే ఎక్కువ. చాలా సందర్భాల్లో కంప్యూటర్ సహాయంతోనో లేదా రొబోటిక్స్ సహాయంతోనో వినోదాత్మకంగా తీర్చిదిద్దిన వ్యాయామాలూ ఎక్కువగానే ఉంటాయి. ఈ కంప్యూటర్ లేదా రొబోటిక్ పద్ధతుల కంటే మనం రోజూ చేసే పనులనే ‘ఫిజియో’ వ్యాయామ పద్ధతులుగా తీర్చిదిద్దడమే మంచిదనీ, అవే ఎక్కువ మేలు చేస్తాయంటున్నారు కొందరు నిపుణులు. రోజువారీ పనులే ‘ఫిజియో’ వ్యాయామరీతులెలా అవుతాయో తెలుసుకుందాం. ఫిజియోవ్యాయామాలు అనగానే ‘పక్షవాతం’లాంటి స్ట్రోక్కు గురై, కోలుకునే ఏ కొందరికి మాత్రమే పరిమితమైనవనే అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ మన మొత్తం దేశ జనాభాలో... ఆ మాటకొస్తే ప్రపంచ జనాభాలోని 15% మందికి ఫిజియో అవసరమనేది ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా. ఒక్క పక్షవాతం వచ్చిన వారే కాదు, ప్రమాదాలకు లోనై మళ్లీ కోలుకునే క్రమంలో తమ అవయవాలను మునుపటిలా కదిలించడానికీ, కొన్ని జబ్బులతో చాలాకాలం పాటు మంచం పట్టి... ఆ తర్వాత మళ్లీ తమ పనులు యధావిధిగా చేసుకోవాలనుకుంటున్నవారికీ, మోకాళ్ల కీలు మార్పిడి చికిత్సల తర్వాత మళ్లీ మునపటిలా నడవాలనీ, జాగింగ్చేయాలనుకునేవారు... ఇలా ప్రపంచమంతటా కనీసం 100 కోట్ల మందికి రీ–హ్యాబ్ అవసరం. వీళ్లే కాదు... గుండెపో టు వచ్చాక కూడా వ్యాయామాలు అవసరం కానీ అవి గుండెపై ఏమాత్రం భారం మోపకుండా ఉండేంత సున్నితంగా ఉంటూనే... శరీరానికి తగినంత పని చెప్పేంత శ్రమతో ఉండాలి. ఈ సున్నితమైన బ్యాలెన్స్ పాటించేలా వ్యాయామాలు రూపొందించడం, చేయించడం ‘ఫిజియోథెరపిస్ట్’ ల పని. వాటిని సైంటిఫిక్గా రూపొందించడం ఎంతో కీలకం. కంప్యూటర్, రొబోటిక్ ఆధారితమైనవి ఎన్నెన్నో... వ్యాయామాల్ని ఉత్సాహంగా చేయడానికి వీలుగా రూపొందించడం కోసం ‘ఫిజియో’లు ఎన్నెన్నో మార్గాలను అన్వేషిస్తుంటారు. ఉదాహరణకు కంప్యూటర్ స్క్రీన్ మీద చుక్కల్ని ఓ వరసలో కలిపి, ఓ ఆకృతి వచ్చేలా చేయడం. లేదా ఏదో టాస్క్ని ఓ నిర్ణీత/నిర్దేశిత పద్ధతుల్లో పూర్తి చేయడం వంటివి. ఒక రకంగా చెప్పా లంటే చిన్నపిల్లలు కంప్యూటర్ గేమ్స్ ఆడి విజయం సాధించనప్పటి థ్రిల్ పొందేలా ఈ కంప్యూటర్ లేదా రొబోటిక్ ఆధారిత ఫిజియో(గేమ్స్) పద్ధతులు ఉంటాయి. ఇవి కూడా చాలావరకు మేలే చేస్తాయి. కంప్యూటర్, రొబోటిక్ వ్యాయామాల్లో పరిమితులు అయితే వాటిలో కొన్ని పరిమితులు ఉండేందుకు అవకాశం ఉంది. 2008లో దాదాపు 330 మందిపై జరిగిన ఓ అధ్యయనంలో ఈ సంగతి రుజువైంది. ఏ వ్యాయామ రీతిలోనైనా... భారం ఎక్కువగా పడుతూ, తక్కువ రిపిటీషన్లతో సమకూరే వ్యాయామం కంటే తక్కువ భారం పడుతూ... ఎక్కువ రిపిటీషన్లతో సమకూరే వ్యాయామంలోనే కండరానికి ఎక్కువ సామర్థ్యం అలవడుతుంది. ఇలా బరువును క్రమంగా పెంచుకుంటూ, దానికి అనుగుణంగానే రిపిటీషన్లను పెంచుతూ పో వడం వల్లనే ప్రయోజనం ఎక్కువ అని అనేక అధ్యయనాలు నిరూపించాయి. అధిగమించడం ఇలా... పైన పేర్కొన్న అధ్యయనం ప్రకారం ఆ పరిమితుల్ని అధిగమించేందుకు కొన్ని దేశీయ పద్ధతులతో వ్యాయామ రీతుల్ని మన నిపుణులు అభివృద్ధి చేశారు. మనం రోజూ చేసే పాత పనుల్నే వ్యాయామ రీతులుగా సరికొత్తగా రూపొందించారు. రొబోటిక్ రీ–హ్యాబ్ ప్రక్రియల్లో కంప్యూటర్ ఆధారంగా కొన్ని డిజైన్లు వచ్చేలా చుక్కల్ని కలపడం, రొబోటిక్ కదలికలతో కండరం బలం పెంచుకున్నా కదలికల నైపుణ్యం తగ్గడం వల్ల ఒనగూరాల్సిన ప్రయోజనం అందదు. కానీ రోజువారీ పనులతో రూపొందించిన పద్ధతులతో చచ్చుబడ్డ కండరానికి బలమూ, నైపుణ్యమూ పెరుగుతాయి. ప్రయోజనమూ ఎక్కువే, స్వావలంబనా సహజమే ఇలాంటి దేశీయ పద్ధతులతో ఓ ప్రయోజనమూ ఉంది. కంప్యూటర్పై ఆటలు చిన్నతనంలో ఆసక్తిగా ఉండవచ్చు. కానీ స్ట్రోక్ లాంటివి మధ్యవయసు దాటాకే వస్తుంటాయి. అందువల్ల ఆ వయసులో కంప్యూటర్పై రొటీన్ సీక్వెన్సింగ్ పనులు బోర్గా అనిపించవచ్చు. కానీ రోజువారీ పనులు చేస్తుండటం, వాటిలో రోజురోజుకూ మెరుగుదల కనిపించడంతో పేషెంట్లకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. పైగా అవి అటు తర్వాత కూడా వారి రోజువారీ జీవితంలో చేసుకోవాల్సిన పనులు కావడంతో స్వావలంబనా, ఎవరిపైనా ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకోగలమన్న ఆత్మవిశ్వాసమూ పెరుగుతాయి. రోజువారీ పద్ధతుల్లో కొన్ని... రోటీలు చేయడం... చచ్చుబడ్డ కండరాల సహాయంతోనే రోటీలు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. రొట్టెలు చేయడంలో అప్పడాల కర్రతో రొట్టెల్ని గుండ్రంగా వచ్చేలా చేయడం. ఇందులో చేతి వేళ్లన్నింటితో పాటు ముంజేయి కండరాలు, మోచేతి కీలు వంటి వాటికి వ్యాయామం సమకూరుతుంది. కూరగాయలు తరగడం పూర్తిగా నైపుణ్యంతో కాకపో యినా... వీలైనంత మేరకు కూరగాయలు తరిగేలా చేయిస్తారు. దాంతో బొటనవేలితో పాటు, కత్తి చుట్టూ మిగతా వేళ్ల గ్రిప్ పెరుగుతుంది. చేయి, ముంజేయి, మోచేతి కండరాలతో పాటు మణికట్టు ఎముకల కదలికలతో చేతికి కావాల్సిన రీ–హ్యాబ్ వ్యాయామం సమకూరుతుంది. ఇది క్రమంగా బలమూ పెంచుతుంది. నైపుణ్యాలను సైతం పెరిగేలా చేస్తుంది. చీర కుచ్చిళ్ల కదలికలతో మహిళల్లో అయితే వారు రీ–హ్యాబ్ కార్యక్రమంలో ఉన్నప్పుడు నైటీ మీదే చీర కట్టుకునేలా ్రపో త్సహించడం. ఈ ప్రక్రియలో చీర కుచ్చిళ్లను అల్లుకునేలా మాటిమాటికీ చేతులు కదిలించేలా చేస్తారు. స్ట్రోక్తో చేతుల్లోని, వేళ్లలోని నరాల కేంద్రం దెబ్బతిన్న వారిలో ఈ వ్యాయామ రీతి వల్ల అతి సున్నితమైన వేలి కండరాలు, వేళ్లకు సప్లై అయ్యే నరాల్లో కదలికల్ని క్రమంగా నింపేలా చూస్తారు. తోట పని ప్రక్రియలు మనం తోట పని చేసేప్పుడు గడ్డపారతో తవ్వడం, పార (స్పేడ్) లాంటి పరికరాలతో మట్టిని నిర్దేశిత రీతిలో పో గుపడేలా చేయడం, కిందపడ్డ ఆకుల్ని కాళ్లలో ఓ పక్కకు తోయడం... ఇవన్నీ పూర్తిస్థాయిలో కాకపో యినా... ఆ పనుల్లో కాళ్లూ, చేతులతో ఎలాంటి కదలికలు అవసరమో, అవే జరిగేలా చూస్తారు. ఇక్కడ నైపుణ్యానికి తావు లేకుండా తొలుత ఆసక్తిగా తోట పనిలో పాలు పంచుకునేలా చేస్తుంటారు. క్రమక్రమంగా ఆయా అవయవాలకు బలం సమకూరడమే కాకుండా... నైపుణ్యమూ పెరుగుతుంది. -డాక్టర్ విజయ్ బత్తిన (పీటీ) ఫిజికల్ మెడిసిన్ అండ్ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్ -
మంచిదేదో 'జంకు' లేకుండా చెప్పాలి!
జంక్ ఫుడ్తో వచ్చే అనారోగ్యంపై ప్రజలను హెచ్చరించాలనుకుంటే ఆ హెచ్చరిక ఓ గుర్తు రూపంలో ఉండాలి. ప్యాకేజీ ముందువైపున ముద్రించాలి. వేర్వేరు రంగుల సాయంతో అనారోగ్య స్థాయిని కూడా సూచించగలిగితే ప్రజలు ఓ మోస్తరు ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని లేదా అనారోగ్య కారక ఆహారాన్ని వేర్వేరుగా గుర్తించి నిర్ణయాలు తీసుకునే వీలు ఏర్పడుతుంది. ఇలా గుర్తించడం విజయవంతం కావాలంటే జాతీయ స్థాయిలో పౌష్టికతపై ఓనమాలు దిద్దించాలి. ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. లేదంటే, జంక్ ఫుడ్ తయారీదారులు తమ మార్కెటింగ్ బలం, నియంత్రణ సంస్థల చెలిమి సాయంతో చిరుధాన్యాలు, ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలను కూడా హైజాక్ చేసే ప్రమాదం ఉంది. ఐక్యరాజ్య సమితి ఈ ఏడాదిని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో భారతదేశాన్ని చిరుధాన్యాల ఎగుమతి కేంద్రంగా ప్రపంచానికి పరిచయం చేసేందుకు ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ సిరి ధాన్యాలు మానవ ఆరోగ్యానికి మాత్రమే కాదు, పర్యావరణానికీ మేలు చేసేవి. క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లోనూ పండించగలగడం ఇందుకు కారణం. నిజానికి చిరుధాన్యాలు వందల ఏళ్లుగా భారతీయ ఆహారంలో భాగంగానే ఉన్నాయి. జొన్న, సజ్జ, రాగి వంటివి 1960వ సంవత్సరం వరకూ నలుగురిలో ఒకరు తినేవారు. కానీ, హరిత విప్లవం తరువాత చిరుధాన్యాల వాడకం క్రమేపీ తగ్గిపోయింది. అయితే ఇటీవలి కాలంలో ఈ చిరుధాన్యాలపై ఆసక్తి మళ్లీ పెరుగుతోంది. వాతావరణ మార్పుల ప్రమాదం, మధుమేహం, రక్తపోటు వంటి జీవనశైలి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో చిరు ధాన్యాలను మళ్లీ మన ఆహారంలో భాగం చేసుకోవడం మంచిదని నిపుణులు కొంత కాలంగా సూచిస్తున్న విషయం తెలిసిందే. చిరుధాన్యాల ఉత్పత్తి, వినియోగం తగ్గుతున్న క్రమంలోనే దేశంలో ఆహారపు అలవాట్లూ మారిపోయాయి. శుద్ధి చేసిన ప్యాకేజ్డ్, ‘రెడీ టు ఈట్’ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం మొదలైంది. అప్పట్లో వ్యవసాయ ఉత్పత్తులు పాడవకుండా ఉండేందుకు, ఆహార వృథాను అరికట్టేందుకు ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించా రన్నది మరువరాదు. ఆర్థిక సరళీకరణ విధానాల అమలు ప్యాకేజ్డ్ ఫుడ్ వాడకం మరింత ఎక్కువయ్యేందుకు కారణమైంది. 1991 తరువాత చక్కెర లతో నిండిన పానీయాలు దేశీ మార్కెట్లను ముంచెత్తాయి. అలాగే జంక్ ఫుడ్ అని ఇప్పుడు మనం పిలిచే రకరకాల ఆహార పదార్థాలూ అందుబాటులోకి వచ్చాయి. చక్కెరలు, ఉప్పు, కొవ్వులు ఎక్కువగా ఉన్న అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కాస్తా ఊబకాయం, అసాంక్ర మిక వ్యాధులు ఎక్కువయ్యేందుకు కారణమయ్యాయి. ఈ పరిస్థితుల్లో చిరుధాన్యాలను మళ్లీ ప్రధాన ఆహారంగా మార్చడం పెద్ద సవాలే. ఒక పక్క రైతులు తమ పంటలు, పద్ధతులు మార్చుకునేందుకు తగిన ప్రోత్సాహాలు అందించడం... ఇంకోవైపు వినియోగదారులను చైతన్యపరచడం, వారి ఆహారపు అలవాట్లను మార్చడం ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. భయం ఏమిటంటే... ఎక్కడ ఈ జంక్ ఫుడ్ పరిశ్రమ చిరుధాన్యాలపై ప్రస్తుతమున్న ఆసక్తిని తమకు అనుకూలంగా మార్చుకుంటుందో అని! అసాంక్రమిక వ్యాధులు ప్రబలేందుకు జంక్ ఫుడ్ ఒక కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడైతే స్పష్టం చేసిందో, వీటిని పిల్లలకు అందించేందుకు చేస్తున్న ప్రయత్నాల నియంత్రణకు సూచనలు జారీ చేసిందో... అప్పటినుంచీ జంక్ ఫుడ్ పరిశ్రమ తమ ఉత్పత్తులను ఆరోగ్య కరమైనవనీ, సహజమైనవనీ చెప్పుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. మల్టీ గ్రెయిన్ కుకీలు, చక్కెర తక్కువగా ఉన్న శీతల పానీయాలు, హృదయానికి దోస్తుల్లాటివని చెప్పే వంటనూనెలు, ‘పండ్ల’ రసాలు అని పేర్లు పెట్టి... ఇంట్లో వండుకునే ఆహారానికీ,పండ్లు, కాయగూరలకూ వీటిని ప్రత్యామ్నాయాలుగా చూపే ప్రయత్నం మొదలైంది. చిరుధాన్యాల ద్వారా కూడా ఈ మాయ చేసేందుకు కంపెనీలు కొన్ని ఇప్పటికే హైదరాబాద్లోని ఐసీఏఆర్ –నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ వైపు పరుగులు పెడు తున్నాయి కూడా. జంక్ ఫుడ్ తయారీదారులు తమ ఉత్పత్తుల ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గొప్పగా చెప్పుకొంటూనే కీలక సమాచారాన్ని విని యోగదారుల కంటపడకుండా చూస్తాయి. ఆహారంలోని పదార్థాలు, హానికారక ‘అడిటివ్స్’(కలిపినవి) వివరాలు కనిపించకుండా చేస్తాయి. దేశ నియమ నిబంధనల ప్రకారం ఫుడ్ ప్యాకెట్స్పై ‘పోషక సమా చారం’ తప్పనిసరిగా నిర్దిష్ట పద్ధతిలో ప్రచురించాలి. కొవ్వులు, చక్కెర, పిండిపదార్థాలు ఎంత మోతాదుల్లో ఉన్నాయో తెలపాల్సి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒత్తిడి పుణ్యమా అని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఇప్పుడు ‘ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ న్యూట్రిషన్ లేబలింగ్’ను ప్రతిపాదించింది. సాధారణంగా ప్యాకెట్ వెనుకభాగంలో ఉండే సమాచారాన్ని ముందు కూడా ప్రచురించాలని ఈ ప్రతిపాదన ఉద్దేశం. దీనివల్ల వినియోగదారులకు మరింత సమాచారం అంది ఆరోగ్యకరమైన అల వాట్లు చేసుకుంటా రని అంచనా. శాకాహార, మాంసాహార ఉత్పత్తు లను వేరు చేసేందుకు వాడినట్లు ఇవి కూడా గుర్తుల రూపంలో ఉంటాయి. జంక్ ఫుడ్ కంపెనీలు, ఎఫ్ఎస్ఎస్ఏఐ కావాలని కోరుకుంటున్న స్టార్ రేటింగ్ల విషయంలో ఒక విషయాన్ని ప్రస్తావించాలి. అంత ఆరోగ్యకరం కాదని సూచించేందుకు రెండు స్టార్లను ఇచ్చినప్పుడు కూడా వినియోగదారులు వీటిని తీసుకునేందుకు మొగ్గు చూపు తున్నట్లు అధ్యయనాల ద్వారా తెలిసింది. పైగా ఈ స్టార్ రేటింగులు కొన్ని నియమ నిబంధనలకు లోబడి ఇచ్చేవి కాబట్టి వాటిని పరిశ్రమ వర్గాలు తమకు అనుకూలంగా మర్చుకునే అవకాశముందని అంచనా. వీటికి భిన్నంగా వార్నింగ్ లేబుల్స్(హెచ్చరికలు) మాత్రం అందులో ఉన్న పదార్థాల ఆధారంగా తయారవుతాయి. కుకీలు, పాస్తా, నూడుల్స్ వంటివాటిల్లో కొంత మోతాదులో జొన్నలు, సజ్జలు కలిపి నంత మాత్రాన వాటికి ఆరోగ్యకరమైనవన్న ట్యాగ్ తగిలించాల్సిన అవసరమేమీ లేదు కదా! మరి పోషకాలపై మనకున్న అవగాహన ఎంత? హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్) అంచనా ప్రకారం అది చాలా తక్కువ. ఫుడ్ లేబుల్లోని సమాచారం అప్పు డప్పుడూ చదువుతాము కానీ... కొనుగోళ్ల సమయంలో ఎక్కువగా తయారీ, ఎక్స్పైరీ డేట్లనే చూస్తూంటామని ఎన్ ఐఎన్ నిర్వ హించిన ఒక అధ్యయనంలో అధికులు తెలపడం ఇక్కడ ప్రస్తావ నార్హం. ఇదే సమయంలో శాకాహార, మాంసాహారాలను వేరు చేసేందుకు ఉపయోగించే గుర్తులు మాత్రం బాగా ఉపయోగపడుతున్నట్లు వారు ఒప్పుకొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆహారపు అనారోగ్యతను సూచించేందుకు ట్రాఫిక్ సిగ్నళ్ల మాదిరి గుర్తులను వాడాలని కొంతమంది సూచి స్తున్నారు. కానీ కంపెనీలు మాత్రం ‘హెల్త్ స్టార్ రేటింగ్’ ఉంటే మేలు అంటున్నాయి. అయితే స్టార్ గుర్తు సానుకూలతను సూచిస్తుంది. ఒకట్రెండు అధ్యయనాల ప్రకారం కొందరు బాగా శుద్ధి చేసిన ఆహారం ప్యాకెట్లపై ఎర్రటి గుర్తు పెట్టడం మేలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా జాతీయ పోషకాహార సంస్థ కూడా ప్యాకేజీల ముందువైపు సమాచారం ఇవ్వడం మంచిదేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంటే జంక్ఫుడ్తో వచ్చే అనారోగ్యంపై ప్రజలను హెచ్చరించాలనుకుంటే ఆ హెచ్చరిక ఓ గుర్తు రూపంలో ఉండాలి. ప్యాకేజి ముందువైపున ముద్రించాలి. వేర్వేరు రంగుల సాయంతో అనారోగ్య స్థాయిని కూడా సూచించగలిగితే ప్రజలు ఓ మోస్తరు ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని లేదా అనారోగ్య కారక ఆహారాన్ని వేర్వేరుగా గుర్తించి నిర్ణయాలు తీసుకునే వీలు ఏర్పడుతుంది. ఈ లేబలింగ్ విజయవంతం కావాలంటే జాతీయ స్థాయిలో పౌష్టికతపై ఓనమాలు దిద్దించాలి. ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. లేదంటే జంక్ ఫుడ్ తయారీదారులు తమ మార్కెటింగ్ బలం, నియంత్రణ సంస్థల చెలిమి సాయంతో చిరుధాన్యాలు, ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలను కూడా హైజాక్ చేసే ప్రమాదం ఉంది. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
లైట్ తీస్కోవద్దు.. నాకేమవుతుందనుకుంటే ప్రమాదమే, తస్మాత్ జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: 2022 లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 141.7 కోట్లు. అందులో 20 ఏళ్ల కంటే తక్కువ వయస్సుగలవారు 34 శాతం మంది ఉన్నారు. ఆ వయస్సుగల పిల్లలు, టీనేజర్లు శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా 11–17 ఏళ్ల మధ్య వయస్సుగల వారిలో 74 శాతం మంది శారీరక శ్రమ చేయడం లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. 11–17 ఏళ్ల మధ్య వయస్సువారు రోజుకు కనీసం 60 నిముషాలు కఠిన లేదా మధ్యస్థ వ్యాయామం చేయాలని సూచించింది. ఇక 18 ఏళ్ల పైబడినవారిలో పురుషుల్లో 25 శాతం, మహిళల్లో 40 శాతం శారీరక శ్రమ చేయడంలేదు. అంటే సరాసరి 32.5 శాతం అన్నమాట. వీళ్లు వారానికి 150 నిమిషాలు మధ్యస్థాయి వ్యాయామం లేదా 75 నిమిషాలు కఠిన వ్యాయామం చేయాలి. 70 ఏళ్లు పైబడినవారిలో పురుషులు 38 శాతం, మహిళలు 50 శాతం మంది శారీరక శ్రమ చేయడంలేదు. విచిత్రమేంటంటే... 11–17 ఏళ్ల వయస్సువారికంటే 70 ఏళ్లు పైబడిన వృద్ధులే నిర్ణీతంగా ఎక్కువగా వ్యాయామం చేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీర్ఘకాలిక జబ్బులు... ఏడాదికి రూ. 25,760 కోట్ల ఖర్చు శారీరక శ్రమ చేయకపోవడం వల్ల దేశంలో దీర్ఘకాలిక జబ్బులు, మానసిక జబ్బులు పెరుగుతున్నాయి. ప్రధానంగా గుండెపోటు, పక్షవాతం, షుగర్, బీపీ, ఏడు రకాల క్యాన్సర్లు.. రొమ్ము, పెద్ద పేగు, గర్భసంచి, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్ వస్తాయి. అలాగే మతిమరుపు, కుంగుబాటు జబ్బులు వస్తాయని స్పష్టం చేసింది. దేశంలో జరిగే మరణాల్లో 66 శాతం దీర్ఘకాలిక జబ్బులే కారణమని పేర్కొంది. అందులో 25 శాతం గుండె, 10 శాతం క్యాన్సర్, 15 శాతం ఊపిరితిత్తులు, డయాబెటీస్ వల్ల 4 శాతం, ఇతరత్రా దీర్ఘకాలిక జబ్బులతో 11 శాతం మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొంది. శారీరక శ్రమ చేయకపోవడం వచ్చే ఈ జబ్బులను నయం చేసేందుకు ఏడాదికి ప్రజలు రూ. 25,760 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే పదేళ్లలో వీటివల్ల ప్రజలపై పడే ప్రత్యక్ష భారం రూ. 2.83 లక్షల కోట్లు ఉంటుందని హెచ్చరించింది. వాకింగ్, సైక్లింగ్పై జాతీయ విధానమేదీ? దేశంలో పిల్లలు కేవలం చదువులకే అతుక్కుపోతున్నారు. స్కూలు, కాలేజీల సమయంలో కనీసం 4 అడుగులు వేసే పరిస్థితి కూడా లేదు. స్పోర్ట్స్ వ్యవస్థ కుంటుపడింది. పాఠశాలల్లో నాణ్యమైన శారీరక శ్రమ చేయించే వ్యవస్థ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అసలు జాతీయస్థాయిలో చిన్న పిల్లల్లో శారీరక శ్రమను పర్యవేక్షించే వ్యవస్థ లేదని ఎత్తిచూపింది. వాకింగ్, సైక్లింగ్పై జాతీయ విధానం లేదని తెలిపింది. శారీరక శ్రమను బహిరంగ ప్రదేశాల్లో చేసేలా ప్రోత్సహించాలని, వాకింగ్, సైక్లింగ్ను ప్రోత్సహించాలని పేర్కొంది. పనిచేసే చోట కూడా శారీరక శ్రమను ప్రోత్సహించాలని ఇండియాకు సిఫార్సు చేసింది. రోజుకు 10–12 గంటలు స్థిరంగా కూర్చునే వారిలో ముందస్తు మరణాలు సంభవించే అవకాశం మిగతావారి కంటే 1.5 రెట్లు ఎక్కువ. శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారిలో కిడ్నీ సమస్యలు, కడుపులో మంట, కేన్సర్ వంటివి 10 నుంచి 20 శాతం వరకు తగ్గుతాయి. అధిక బరువు సమస్య తలెత్తదు. షుగర్ వ్యాధిగ్రస్తులకు గుండెజబ్బు మరణాలు 40 శాతం తగ్గుతాయి. శారీరక శ్రమను ప్రోత్సహించాలి డబ్ల్యూహెచ్వో నివేదికలోని అంశాలు ఆలోచించదగినవి.. శారీరక శ్రమ చేసేందుకు పిల్లలను, పెద్దలను ప్రోత్సహించాలి. తద్వారా వారిలో గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఎముకలు బలపడతాయి. మానసిక ఉల్లాసం లభిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరవు. –డాక్టర్ హరిత, వైద్యురాలు, నిజామాబాద్ -
స్మగ్లింగ్ కట్టడికి భారత్ నాయకత్వం వహించాలి
న్యూఢిల్లీ: వస్తు అక్రమ రవాణా (స్మగ్లింగ్) కారణంగా నష్టపోతున్న భారత్ దీనికి వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని ‘థింక్ చేంజ్ ఫోరమ్’ అనే సంస్థ ఓ నివేదికలో సూచించింది. ఈ విధమైన అక్రమ వాణిజ్య విధానాలను నిరోధించడం వల్ల ఏటా 31 బిలియన్ డాలర్లు (రూ.2.54 లక్షల కోట్లు) ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలకు ఆదా అవుతుందని పేర్కొంది. అంతేకాదు, ఏటా 1,64,000 (2030 నుంచి) ముందస్తు మరణాలను కూడా అరికట్టొచ్చని సూచించింది. ఈ మరణాల్లో అధిక భాగం తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లోనే నమోదవుతున్నట్టు తెలిపింది. స్మగుల్డ్ ఉత్పత్తులను వినియోగించే పెద్ద మార్కెట్ల లో భారత్ కూడా ఉందంటూ.. దీని వల్ల ఏటా పెద్ద ఎత్తున ఆదాయం నష్టపోతున్నట్టు వివరించింది. అందుకే ఈ విషయంలో భారత్ ప్రపంచంలో నా యకత్వ పాత్ర పోషించాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. అతి పెద్ద వినియోగ దేశమైన భారత్దు చిట్ట విరుద్ధమైన ఉత్పత్తుల వల్ల నష్టపోతోందని, అంతర్జాతీయంగా దీనిపై సమన్వయానికి ముందుకు రావాలని కోరింది. ఒక్క పొగాకు ఉత్పత్తుల దొంగ రవాణా వల్ల ప్రపంచ దేశాలు ఏటా 40.5 బిలియన్ డాలర్లు (రూ.3.32 లక్షల కోట్లు) నష్టపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. కలసికట్టుగా పోరాడాలి.. అంతర్జాతీయంగా స్మగుల్డ్ వ్యాపారాన్ని కట్టడి చేసేందుకు విదేశాంగ శాఖ, ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని థింక్ చేంజ్ ఫోరమ్ సంస్థ సూచించింది. అభివృద్ధి చెందిన దేశాల కంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు వస్తు అక్రమ రవాణా పెద్ద సవాలుగా ఉన్నట్టు పేర్కొంది. అంతర్జాతీయ బ్రాండ్లు ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాల నుంచే ఉన్నాయని, ఇవి స్మగుల్డ్ కంటే నకిలీ ఉత్పత్తుల సమస్యను ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. ‘‘స్మగ్లింగ్ అనేది వినియోగ దేశం ఆదాయ నష్టపోవడానికి కారణమవుతుంది. అంతర్జాతీయ బ్రాండ్ ఉత్పత్తుల విక్రయాలు పెరుగుతాయి. స్మగుల్డ్ రూపంలో వినియోగదారులకు తక్కువ రేటుకే అందుబాటులోకి వస్తాయి. కనుక స్మగ్లింగ్ అంశంపై భారత్ అంతర్జాతీయంగా ఏకాభిప్రాయానికి కృషి చేయాలి’’అని ఈ నివేదిక సూచించింది. అంతర్జాతీయ వేదికపై స్మగ్లింగ్ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా భారత్ వర్ధమాన దేశాల స్వరాన్ని వినిపించొచ్చని, ప్రపంచ నేతగా తన స్థానాన్ని బలోపేతం చేసుకోవచ్చని పేర్కొంది. బ్రాండెడ్ ఉత్పత్తులు అక్రమ మార్గాల్లో భారత్లోకి వస్తే ఆయా ఉత్పత్తుల కంపెనీల యాజమాన్యాలను బాధ్యులుగా చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రాసిన లేఖలో ఈ ఫోరమ్ సూచించింది. ‘‘ఆయా బ్రాండ్ యజమానాలను కార్పొరేట్ శాఖ శిక్ష విధించాలి. అంతర్జాతీయంగా ఇదొక దురాచారంగా మారింది. పేరొందిన బ్రాండ్లు అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాల్లో తక్కువ కార్యకలాపాలు నిర్వహిస్తు న్నాయి. సబ్సిడరీ ద్వారా నేరుగా భారత్లోకి దిగు మతి చేసుకోకుండా, అవి అంతర్జాతీయ ట్రేడ ర్లు, పంపిణీదారులకు విక్రయిస్తున్నాయి. వారి నుంచి అక్రమ మార్గాల్లో ఉత్పత్తులు అనధికారిక మార్కెట్ల ను చేరుతున్నాయి’’అని నివేదిక పేర్కొంది. -
చెడు కొవ్వుతో చేటు.. ప్రపంచంలో జరిగే మరణాల్లో 60 శాతం అవే..
చెడు కొవ్వుతో గుండె జబ్బులు పెరిగిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ (టీఎఫ్ఏ) ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల వినియోగం వల్ల గుండె రక్తనాళాల్లో చెడు కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. దీంతో గుండెపోటు వచ్చే ప్రమాదాలు ఉంటాయి. ప్రపంచంలో జరిగే మరణాల్లో 60 శాతం గుండెపోటు మరణాలేనని స్పష్టం చేసింది. 2019లో ప్రపంచ వ్యాప్తంగా అనారోగ్యకర ఆహారం వల్ల 80 లక్షల మంది చనిపోయారని పేర్కొంది. భారత్లో 2019లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఆ ఏడాది 1.44 లక్షల మంది టీఎఫ్ఏ అధిక వాడకం వల్ల చనిపోయారు. ఆగ్నేయ ఆసియా దేశాల్లో టీఎఫ్ఏ అధిక వినియోగం వల్ల జరిగిన 1.78 లక్షల మరణాల్లో 80 శాతం భారత్లోనే సంభవించాయి. యూరప్లో 1.25 లక్షల మంది టీఎఫ్ఏ అధిక వినియోగం వల్ల చనిపోయారు. 2022లో నిర్వహించిన పరిశోధనలో ఉజ్బెకిస్తాన్ జనాభాలో 12 శాతం మందికి గుండె జబ్బులు ఉన్నాయని తేలింది. ప్రపంచంలో టీఎఫ్ఏ కారణంగా సంభవించే గుండెపోటు మరణాల్లో ఈజిప్ట్ మొదటి స్థానంలో ఉండగా, భారత్ 11వ స్థానంలో ఉంది. సాక్షి, హైదరాబాద్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ (టీఎఫ్ఏ) అంటే మనం తీసుకునే ఆహారం వల్ల ఏర్పడే కొవ్వు ఆమ్లాలు. ఇది చెడు కొవ్వు. అంటే ఇది ఆరోగ్యానికి హానికరమన్నమాట. గ్రాము ట్రాన్స్ ఫ్యాట్లో 9 కేలరీలుంటాయి. ఆహారంలో ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్ ఉంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్స్ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ను పెంచుతాయి. తద్వారా గుండె జబ్బులు సంభవిస్తాయి. వంటనూనెలు, వేపుళ్లు, ప్యాక్ చేసిన లేదా శుద్ధి చేసిన ఆహారాల్లో టీఎఫ్ఏ ఉంటుంది. కేకులు, కుకీలు, కూల్డ్రింక్స్ వంటి వాటిల్లోనూ ఉంటుంది. బరువు పెరుగుతారు. గుండె జబ్బులతో పాటు మధుమేహం, రక్తపోటు ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. శరీరానికి ట్రాన్స్ ఫ్యాట్ అవసరం లేదు. దాన్ని నివారించాల్సిందే. ప్రతి వంద గ్రాముల ఫ్యాట్లో రెండు శాతానికి మించి, కేలరీల్లో 0.5 శాతానికి మించి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండకూడదని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. ఈ ఏడాది చివరకు టీఎఫ్ఏను పూర్తిగా నియంత్రించాలి ప్రపంచలో 60 దేశాలు టీఎఫ్ఏ నియంత్రణ పరిధిలోకి వచ్చాయి. గతేడాది జనవరిలో భారతదేశం టీఎఫ్ఏ నియంత్రణను అమలులోకి తీసుకొచ్చింది. అన్ని దేశాల్లోనూ ఈ ఏడాది చివరికల్లా టీఎఫ్ఏను నియంత్రించాలని డబ్ల్యూహెచ్ఓ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ ప్రకారం పాక్షికంగా శుద్ధిచేసిన వంట నూనెలను నిషేధించాలి. పూర్తిగా శుద్ధి చేసిన నూనెలను వాడాలి. ఆహార పదార్థాల్లో టీఎఫ్ఏ ఎంత శాతం ఉందో ప్యాకెట్లపై ముద్రించాలి. నూనె, కొవ్వు వినియోగాన్ని తగ్గించాలి. ప్రపంచవ్యాప్తంగా 46 దేశాల్లో ఇప్పటికీ 32 కోట్ల మంది టీఎఫ్ఏ అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటున్నారు. 2019 లెక్కల ప్రకారం గుండెపోటు మరణాల్లో టీఎఫ్ఏ అధిక వాడకం వల్ల ఏఏ దేశాల్లో ఎంత శాతం మరణాలు సంభవిస్తున్నాయంటే.. నివేదికలోని ముఖ్యాంశాలు.. ►మెక్సికోలో కంపెనీలు టీఎఫ్ఏ నియంత్రణ సరిగా చేయకపోతే 40 వేల డాలర్లు జరిమానాగా నిర్ణయించారు. ►ఉజ్బెకిస్తాన్లో పామాయిల్ వినియోగం ఎక్కువగా ఉంది. 2000 సంవత్సరంలో ఆ దేశంలో ఏడాదికి 5 వేల టన్నులు వినియోగం ఉంటే, 2019 నాటికి అది పదిరెట్లకు అంటే 50 వేల టన్నులకు చేరింది. ►ప్రపంచంలోని 500 కోట్ల మంది జనాభా టీఎఫ్ఏ నియంత్రణ అమలు చేయని దేశాల్లో ఉన్నారు. తద్వారా వాళ్లు ప్రమాదంలో ఉన్నారు. ►మన దేశంలో 2013లో టీఎఫ్ఏపై పాక్షిక నియంత్రణ మొదలైంది. 2020 డిసెంబర్లో ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) టీఎఫ్ఏను ఐదు శాతం నుంచి రెండు శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. 2022 జనవరి నుంచి పూర్తిస్థాయి నియంత్రణ చేపట్టింది. ►ఎఫ్ఎస్ఎస్ఏఐ 2020 డిసెంబర్ నుంచి లేబొరేటరీల్లో టెస్టులు మొదలుపెట్టింది. ఇది ఆయిల్ కంపెనీలకు సాంకేతిక పరిజ్ఞానం అందిస్తుంది. ►అంతర్జాతీయంగా లేబొరేటరీలు ఎలా పనిచేస్తున్నాయనే దానిపై డబ్ల్యూహెచ్ఓ 2021లో ఒక అధ్యయనం చేసింది. మన దేశం సహా కెనడా, బ్రెజిల్, టర్కీ, పాకిస్తాన్, పోర్చుగల్, నైజీరియా, శ్రీలంక, చైనా, ఫిజీ, ఫిలిప్పీన్స్ తదితర దేశాల్లో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించే లేబొరేటరీలను పరిశీలించింది. ప్రతి లేబొరేటరీలో ఒకే విధమైన ఆహారపదార్థాలను పరీక్షించినా, వాటి ఫలితాలు మాత్రం ఒకేవిధంగా లేవని గుర్తించింది. దీంతో ఆహార పదార్థాలను పరిశీలించే లేబొరేటరీలపై అనుమానాలు నెలకొన్నాయి. నూనె తగ్గించాలి..పండ్లు, కూరగాయలు తినాలి వంటనూనెలు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి ట్రాన్స్ ఫ్యాట్స్ ఉపయోగపడతాయి. అందుకే వాటిల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. కాబట్టి సగటున మనిషి ఏ రూపంలోనైనా సరే రోజుకు 30 గ్రాములకు మించి వంటనూనెలను వాడకూడదు. ఆవిధంగా టీఎఫ్ఏ వినియోగం తగ్గించాలి. జంక్ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ కూడా తగ్గించాలి. సహజ సిద్ధమైన తాజా ఆహారం తీసుకుంటే కూడా మనం ఈ సమస్య నుండి బయటపడొచ్చు. రోజూ 400 గ్రాములకు తగ్గకుండా కూరగాయలు, పండ్లు తినాలి. నూనె వేపుడులకు దూరంగా ఉండాలి. ఎక్కువసార్లు వేడిచేసిన నూనెలు వాడకూడదు. లేనిపక్షంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి గుండె జబ్బు వస్తుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. – డాక్టర్ గుత్తా సురేష్, ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షుడు -
రాష్ట్రంలో డబ్ల్యూహెచ్వో టీకా కేంద్రం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా మహమ్మారి వల్ల వైద్య రంగంలో ఉన్న లోపాలు ప్రపంచవ్యాప్తంగా కనిపించాయన్నారు, కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో తమ దగ్గర కావాల్సినన్ని వెంటిలేటర్లు లేవని న్యూయార్క్ గవర్నర్ అన్నారని, ఆ పరిస్థితుల్ని అంచనా వేస్తే లైఫ్ సైన్సెస్కు పెద్దపీట వేయాలన్న ఆలోచన కలిగిందన్నారు. ఈ మేరకు చేసిన కృషి వల్ల ప్రపంచంలోకెల్లా మూడో వంతు వ్యాక్సిన్లు తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. తెలంగాణలోనే 40 శాతం ఫార్మసీ ఉత్పత్తులు తయారవుతున్నాయని చెప్పారు. కరోనా తరహాలో మరే ఇతర మహమ్మారులు వచ్చినా ఎదుర్కొనే రీతిలో టీకాలు అవసరమని గుర్తించి ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల ఉత్పత్తి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థను సంప్రదించామని, అందుకు ఆ సంస్థ కూడా ఆసక్తి ప్రదర్శించిందని... త్వరలోనే తెలంగాణలో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ హబ్ను డబ్లు్యహెచ్వో ఏర్పాటు చేయబోతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అత్యధిక వృద్ధి రేటు తెలంగాణలోనే.. దేశంలో అత్యధిక వృద్ధి రేటు తెలంగాణలోనే ఉన్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. కోవిడ్ ఉన్నా.. నోట్ల రద్దు చేసినా.. కేంద్రం సహకరించకున్నా.. తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటులో దూసుకువెళ్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో సమ్మిళిత వార్షిక వృద్ధిరేటు 15 శాతంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఒకవేళ కేంద్రం తమకు సహకరించి ఉంటే తెలంగాణ మరింత వేగంగా వృద్ధి సాధించేదని పేర్కొన్నారు. తెలంగాణ తరహాలో ఇతర రాష్ట్రాలన్నీ పనిచేసుంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే రూ. 5 లక్షల కోట్ల మార్కును దాటేదన్నారు. మోదీ సర్కార్ అప్పు రూ.100 లక్షల కోట్లు.. మోదీ ప్రధాని కావడానికి ముందు దేశ అప్పు రూ. 56 లక్షల కోట్లుగా ఉండగా మోదీ పాలనలో దేశం కొత్తగా రూ. 100 లక్షల కోట్ల మేర అప్పులపాలైనట్లు మంత్రి కేటీఆర్ ఆరోపించారు. గత 8 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ఖజానాకు పన్నుల రూపంలో రూ. 3.68 లక్షల కోట్లు అందించినా తమ ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చింది కేవలం రూ. 1.68 లక్షల కోట్లేనని కేటీఆర్ తెలిపారు. -
భారత్లో దారుణమైన పరిస్థితులు.. దంత ఆరోగ్యంపై ఖర్చు ఇంత తక్కువా?
సాక్షి, హైదరాబాద్: మన దేశంలో దంతాల ఆరోగ్యంపై నిర్లక్ష్యం కనిపిస్తోందని, దీనివల్ల భారీగా నష్టం కలుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసింది. భారత్లో దంత ఆరోగ్యం కోసం ఏటా చేస్తున్న తలసరి సగటు ఖర్చు కేవలం నాలుగు రూపాయలేనని పేర్కొంది. ఈ మేరకు ‘ఓరల్ హెల్త్ ఇన్ ఇండియా’ పేరిట ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. దేశంలో నోటి అనారోగ్యాన్ని ప్రజారోగ్య సమస్యగా గుర్తించ లేదని.. నోరు, దంతాలకు సంబంధించి వచ్చే ఐదు ప్రధాన జబ్బులతో దేశానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ.60 వేల కోట్ల నష్టం వస్తోందని తెలిపింది. ఇండియాలో ఒకటి నుంచి తొమ్మిదేళ్ల మధ్య వయసువారిలో 43.3 శాతం మందికి దంత సమస్యలు ఉన్నాయని తెలిపింది. ఐదేళ్లపైబడిన వారిలో 28.8 శాతం మందికి తేలికపాటి దంత సమస్యలు ఉన్నాయని వివరించింది. 15 ఏళ్లకు పైబడిన వారిలో 21.8 శాతం మందికి తీవ్రమైన దంత సమస్యలు ఉన్నాయని పేర్కొంది. 20 ఏళ్లు దాటినవారిలో దంతాలు లేనివారు నాలుగు శాతం మంది ఉన్నట్టు తెలిపింది. ఇక నోటి, పెదవుల కేన్సర్లకు సంబంధించి 2020లో 1.35 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని. ఇందులో మహిళలు 31,268 మంది, పురుషులు 1.04 లక్షల మంది ఉన్నట్టు డబ్ల్యూహెచ్ఓ నివేదిక వెల్లడించింది. సగటున ప్రతి లక్ష జనాభాలో 9.8 మందికి నోటి, పెదవుల కేన్సర్ కేసులున్నాయని తెలిపింది. ఆల్కహాల్, పొగాకు, పంచదార ఉత్పత్తులే ఈ దంత సమస్యలకు కారణమని పేర్కొంది. డబ్ల్యూహెచ్వో నివేదికలోని పలు కీలక అంశాలివీ ►మన దేశంలో ప్రతి ఒక్కరు వివిధ రూపాల్లో కలిపి రోజుకు సగటున 53.8 గ్రాముల పంచదార వినియోగిస్తున్నారు. ►15 ఏళ్లు పైబడినవారిలో పొగాకు ఉత్పత్తులు వాడేవారు 28.1శాతం కాగా..ఇందులో మహిళలు 13.7 శాతం, పురుషులు 42.4 శాతం. ►15 ఏళ్లు పైబడినవారిలో తలసరి సగటున ఏడాదికి 5.6 లీటర్ల మద్యం తాగుతున్నారు. ఇందులో మహిళలు 1.9 లీటర్లు, పురుషులు 9.1 లీటర్లు తాగుతున్నారు. ►2019 లెక్కల ప్రకారం ఇండియాలో దంత వైద్య సహాయకులు 3,515 మంది, దంతాలను కృత్రిమంగా అమర్చే టెక్నీషియన్లు 3,090 మంది, దంత వైద్యులు 2.71 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ►ఐదేళ్లలో ప్రతి పదివేల జనాభాకు ఇద్దరు మాత్రమే కొత్తగా దంత వైద్యులు అందుబాటులోకి వచ్చారు. ►దేశంలో అధునాతన దంత వైద్యానికి సంబంధించి బీమా సౌకర్యం లేదు. ప్రమాదాలు, ఇతర కారణాలతో దంతాలు పోయినా బీమా సౌకర్యం వర్తించడం లేదు. ►దేశంలో జాతీయ ఓరల్ పాలసీ ఉన్నా దంత ఆరోగ్యంపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగడం లేదు. సమస్య తీవ్రమైతేగానీ బాధితులు పట్టించుకోవడం లేదు. దంత సమస్యలపై ప్రజల్లో అవగాహన తక్కువ మన దేశంలో దంత, గొంతు సమస్యలపై అవగాహన తక్కువ. దంత సమస్యలుంటే సంతులిత ఆహారం తీసుకోలేం. ఇవి దీర్ఘకాలిక జబ్బులకు కారణం అవుతాయి. నోరు, దంతాలను శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు పొగాకు, ఆల్కహాల్, తీపి పదార్థాలకు దూరంగా ఉంటే జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. – డాక్టర్ హరిత మాదల, దంత వైద్యులు, నిజామాబాద్ పొగాకు వినియోగమే ప్రధాన కారణం నోటి కేన్సర్, దంతాల సమస్యలకు చాలా వరకు పొగాకు వినియోగమే ప్రధాన కారణం. ఐసీఎంఆర్ అంచనాల ప్రకారం దేశంలో కేన్సర్తో బాధితుల సంఖ్య 2025 నాటికి దాదాపు 29.8 మిలియన్లకు పెరిగే అవకాశం ఉంది. కేన్సర్ చికిత్సకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు వెచ్చిస్తున్నప్పటికీ.. దాని మూలకారణమైన పొగాకు వినియోగం నియంత్రణపై తగినస్థాయిలో దృష్టి సారించడం లేదు. దేశంలో పొగాకు వినియోగాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. టీనేజ్ పిల్లలు పొగాకు వ్యసనానికి గురికాకుండా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించాలి. – నాగ శిరీష, వలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా -
అప్పుడే అయిపోలేదు.. మంకీపాక్స్పై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు 70వేల మార్కును దాటాయి. కొత్త కేసులు తగ్గుతున్నప్పటికీ నిర్లక్ష్యంగా ఉండొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను హెచ్చరించింది. ఇప్పటివరకు అన్ని దేశాల్లో కలిపి మంకీపాక్స్ బాధితుల సంఖ్య 70వేలు దాటిందని, మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితి ఆరోగ్య సంస్థకు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ నివేదిక సమర్పించారు. అయితే మంకీపాక్స్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇదే అత్యంత ప్రమాదకరమైన దశ అని టెడ్రోస్ హెచ్చరించారు. అమెరికా సహా 21 దేశాల్లో గతవారం కొత్త కేసులు పెరిగినట్లు పేర్కొన్నారు. ఇందులో అమెరికాలోనే 90శాతం కేసులు నమోదైనట్లు వెల్లడించారు. కేసులు తగ్గాయని అజాగ్రత్తగా ఉంటే మహమ్మారి మళ్లీ విజృంభిస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం మంకీపాక్స్ కేసుల్లో అమెరికాలోనే అత్యధికంగా 42వేల కేసులు వెలుగుచూశాయి. యూరప్ దేశాల్లో 25వేల మందికి ఈ వైరస్ సోకింది. భారత్లో ఇప్పటివరకు 14మంది మంకీపాక్స్ బారినపడ్డారు. చదవండి: ఏడుపుగొట్టు సీఈఓ.. బామ్మ చావును కూడా కంపెనీ ప్రమోషన్కే! -
మందులా... మృత్యు గుళికలా!
ఒకే రోజు రెండు విషాద వార్తలు! రెండూ పసిపిల్లలకు సంబంధించినవే. థాయ్లాండ్లోని శిశు సంరక్షణాలయంపై ఉన్మాది బుల్లెట్లు కురిపించి 37 మంది ప్రాణాలు తీశాడు. మన దేశానికి చెందిన మేడెన్ ఫార్మాస్యూటికల్ సంస్థ ఉత్పత్తి చేసిన మందుల కారణంగా ఆఫ్రికా ఖండ దేశమైన గాంబియాలో 66 మంది చిన్నారులు గత నెలలో ప్రాణాలు కోల్పోయారు. మారణాయుధంతో పసికూనలపై విరుచుకుపడిన రాక్షసుడికీ... కేవలం లాభార్జన కాంక్షతో కలుషిత ఉత్పత్తులకు ఔషధమన్న ముద్రేసి అంటగట్టిన సంస్థ యజమానులకూ తేడా ఏమీ లేదు. కొన్ని ఔషధ సంస్థల టక్కుటమార విద్యలపైనా, వాటి ఉత్పత్తులపైనా ప్రజారోగ్య రంగంలో పనిచేస్తున్న దినేష్ ఎస్. ఠాకూర్ వంటి నిపుణులు తరచు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ సరైన పర్యవేక్షణ కొరవడిన చోట అలాంటివారిది అరణ్యరోదనే అవుతోంది. ఇప్పుడు గాంబియా పసిపిల్లల ఉసురు తీసిన మందులకు భారత్లో విక్రయించడానికి అనుమతుల్లేవని అంటున్నారు. మన దేశంలో విక్రయానికి పనికిరాని ఉత్పత్తులు గాంబియాకు ఎలా పోయాయి? అంతర్జాతీయంగా మన పరువు తీసిన ఈ ఉదంతం తర్వాతనైనా పాలకులు మేల్కొనవలసి ఉంది. ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా ప్రాంత దేశాల్లో మన ఫార్మా రంగ సంస్థలదే పైచేయి. ఆఖరికి రష్యా, పోలాండ్, బెలారస్ వంటి దేశాల్లోనూ మన ఔషధాలే కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా మూడోవంతు ఫార్మా ఉత్పత్తులు మన దగ్గర నుంచే ఎగుమతి అవుతున్నాయి. అయినా పటిష్టమైన నియంత్రణ వ్యవస్థ అవసరమని పాలకులు గుర్తించలేదు! పౌష్టికాహారలోపం, వాతావరణ కాలుష్యం, అపరిశుభ్రమైన నీరు, విషాహారం తదితరాలు ప్రజలను రోగాలబారిన పడేస్తాయి. రోగగ్రస్తులకు అందుబాటులో ఉంటున్న ఔషధాలు జబ్బు తగ్గించటం మాట అటుంచి ప్రాణాలు తీయడమంటే అంతకన్నా ఘోరమైన నేరం ఉంటుందా? కానీ చట్టంలో ఉండే లొసుగుల కారణంగా ఈ నేరం నిత్యం జరుగుతూనే ఉంది. ఆఫ్రికా దేశాల్లో, ముఖ్యంగా గాంబియాలో సరైన ఔషధ నియంత్రణ వ్యవస్థ లేదనీ, జవాబుదారీతనం అసలే లేదనీ కొందరంటున్నారు. కానీ మనదగ్గరమటుకు ఏం ఉన్నట్టు? హరియాణాలోని కుండ్లీలో ఉన్న తమ ఫ్యాక్టరీలో ఉన్నతమైన ప్రమాణాలు పాటిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించిందని గాంబియా విషాదం వెల్లడి కాకముందు మేడెన్ ఔషధ సంస్థ వెబ్సైట్ ఘనంగా చెప్పుకొంది. ప్రస్తుతం దాన్ని తొలగించి హరియాణాలోనే ఉన్న మరో ఫ్యాక్టరీకి, హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఫ్యాక్టరీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు దక్కిందని ఆ సంస్థ గొప్పలు పోతోంది. అంతేకాదు... తమకు ఐఎస్ఓ గుర్తింపు కూడా వచ్చిందంటున్నది. మేడెన్ సంస్థ ఫ్యాక్టరీలనుగానీ, దాని ఉత్పత్తులనుగానీ తనిఖీలు చేయలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అటు ఐఎస్ఓ గుర్తింపు పొందిన ఔషధ సంస్థల జాబితాలో మేడెన్ లేనేలేదు. ప్రాణప్రదమైన ఔషధ సంస్థలు ఇలా ఇష్టానుసారం ప్రకటించుకుని జనం ప్రాణాలతో చెలగాటమాడుతుంటే అన్ని వ్యవస్థలూ గుడ్లప్పగించి చూస్తూ ఉండటం విస్మయం కలిగిస్తోంది. ఈ సంస్థపై గత దశాబ్దకాలంలో బిహార్, గుజరాత్, కేరళ, జమ్మూ, కశ్మీర్లు ఫిర్యాదులు చేశాయి. కానీ అవన్నీ నాసిరకమైన మందులకు సంబంధించిన ఫిర్యాదులు. ఇప్పుడు గాంబియా పిల్లల ప్రాణాలు తీసిన దగ్గు, జలుబు మందుల్లో అత్యంత ప్రమాదకరమైన డైథిలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ రసాయనాలు మోతాదుమించి ఉన్నాయని తేల్చారు. ఇవి కిడ్నీలనూ, ఇతర అంగాలనూ తీవ్రంగా దెబ్బతీయటంతో పిల్లలు మరణించారని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. గ్లిసరిన్ను సాంద్రత బాగా తగ్గించి దగ్గు మందుల్లో వినియోగిస్తారు. గ్లిసరిన్తో పోలిస్తే ఈ రెండు రసాయనాలూ చవగ్గా లభిస్తాయని చాలామంది వాటివైపు మొగ్గుతున్నారు. అయితే పెయింట్లు, ఇంకులూ తయారీలో వినియోగించే ఈ రసాయనాలు ఏమాత్రం మోతాదు మించినా ప్రాణాంతకమవుతాయి. ఇప్పుడు గాంబియాలో జరిగింది అదే. మనకు ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్సీఓ) ఉంది. దేశంలో అనేకచోట్ల కేంద్ర ఔషధ పరీక్ష కేంద్రాలు (సీడీఎల్) ఉన్నాయి. రాష్ట్రాల స్థాయిలో ఔషధ తనిఖీ అధికారులున్నారు. దేశం వెలుపలికిపోయే ఔషధాల ప్రమాణాల నిర్ధారణకు సంబంధించి ఎన్నో నిబంధనలున్నాయి. కానీ మేడెన్ సంస్థ ఈ వ్యవస్థల కళ్లు కప్పగలిగింది. 2020లో జమ్మూ, కశ్మీర్లో ఈ దగ్గుమందు 14 మంది ప్రాణాలు తీసినప్పుడు ప్రజారోగ్య రంగ కార్యకర్త దినేష్ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖకు సవివరమైన ఫిర్యాదు పంపితే దర్యాప్తు చేయటం మాట అటుంచి, కనీసం అది అందుకున్నట్టు చెప్పే దిక్కు కూడా లేకపోయిందంటే ఎలాంటి పరిస్థితులున్నాయో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో ఔషధ ప్రమాణాల నిర్ధారణకూ, నియంత్రణకూ 1940 నాటి డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టమే ఆధారం. 2004లో రాన్బాక్సీ సంస్థపై ఆరోపణలు వెల్లువెత్తి, ఆ తర్వాత అమెరికా, యూరోప్ దేశాల నియంత్రణ సంస్థలు గగ్గోలు పెట్టినప్పుడు ఆనాటి పాలకులు ఇదంతా కుట్రగా తేల్చిపారేశారు తప్ప ఫార్మా రంగ సంస్కరణలకు పూనుకోలేదు. వర్తమాన అవసరాలకు తగ్గట్టు కొత్త చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. వర్ధమాన దేశాలకు చవగ్గా ఔషధాలందిస్తుందన్న ఖ్యాతిని నిలుపుకోవాలన్నా, ప్రపంచ ఫార్మా రంగంలో పెరుగుతున్న మన వాటా రక్షించుకోవా లన్నా ఔషధ నియంత్రణ వ్యవస్థ ప్రక్షాళనకు తక్షణం పూనుకోవాలి. లేదంటే మన ప్రతిష్ఠ అడుగంటడం ఖాయం. -
కరోనా కథ ముగిసింది: ప్రపంచ ఆరోగ్య సంస్థ
కరోనా కథ ముగిసింది: ప్రపంచ ఆరోగ్య సంస్థ -
కరోనా కథ ముగిసింది!: డబ్ల్యూహెచ్ఓ
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టించిన కరోనా కథ ముగిసినట్టేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. కోవిడ్–19 తాలూకు అత్యంత భయానకమైన దశ ముగిసిపోయినట్టేనని వెల్లడించింది. ‘‘వైరస్ వెలుగులోకి వచ్చిన రెండున్నరేళ్లకు ఆ మహమ్మారి తోకముడిచే రోజులు వచ్చేశాయి. ఇకపై కేసుల అంతగా పెరుగుదల ఉండదు. అలాగని పూర్తిగా తగ్గి జీరో కేసులకు వచ్చే పరిస్థితి కూడా లేదు’’ అని అంచనా వేసింది. ‘‘రెండున్నరేళ్లుగా మనం చీకటి గుహలో బతుకులు వెళ్లదీస్తున్నాం. ఇప్పుడు గుహ చివర్లో వెలుగు రేఖ కనిపిస్తోంది. అయితే అక్కడికి చేరుకోవడానికి ఇంకా చాలా దూరముంది. అప్రమత్తంగా లేకుంటే ఇంకా ఎన్నో అడ్డంకులు వస్తాయి’’ అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అన్నారు. గురువారం ఆయన ఐరాస సర్వప్రతినిధుల సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ బలహీనపడిపోయిందని అశోకా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ గౌతమ్ మీనన్ కూడా అన్నారు. ఆయన తొలినుంచీ కరోనా కేసుల్ని ప్రపంచవ్యాప్తంగా ట్రాక్ చేస్తున్నారు. కరోనా వైరస్కు మన శరీరాలు అలవాటు పడిపోయాయని, ఇక ఆ వైరస్తో ప్రాణాలు కోల్పోవడం జరగదని ఆయన ధీమాగా చెప్పారు. -
యాంటీ‘భయో’టిక్స్!
సాక్షి, హైదరాబాద్: తుమ్మినా..దగ్గినా..నీరసమున్నా..ఆయాసమున్నా.. వొళ్లు నొప్పులు.. వైరల్ జ్వరం.. ఏదైనా ఒక్కటే మందు..యాంటీబయాటిక్. ఇలా చిన్నాచితకా రోగానికీ యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడటం చాలామందికి అలవాటై పోతోంది. చివరి అస్త్రంగా వాడాల్సిన వాటిని తొలిదశలోనే వాడేస్తున్నారు. వైద్యులు సూచించక పోయినా కొందరు సొంతంగా వాడుతున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా ఇష్టారాజ్యంగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల, నిజంగా అవసరమైనప్పుడు వాడినా అవి పనిచేయని పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అంటే అప్పటికే మనుషుల్లో వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మ క్రిములకు యాంటీబయాటిక్స్ను తట్టుకునే శక్తి (యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్) వచ్చి ఉంటుందన్న మాట. వ్యవసాయ పంటలకు విచ్చలవిడిగా పురుగుమందులను (యాంటీబయాటిక్స్) చల్లుతున్నారు. అధిక పాల ఉత్పత్తి కోసం పాడి పశువులకు ఇంజెక్షన్లు (యాంటీబయాటిక్స్) ఇస్తున్నారు. ఈ విధమైన ఆహారం, పాలు తీసుకోవడం ద్వారా అప్పటికే మానవ శరీరంలో అధిక శాతం యాంటీబయాటిక్స్ ఉంటున్నాయని అధ్యయనాలు స్పష్టం చేస్తుండటం గమనార్హం. 280 కోట్ల యాంటీబయాటిక్స్ ప్యాక్ల విక్రయం దేశంలో 2019లో 85 రకాలకు సంబంధించిన 280 కోట్ల యాంటీబయాటిక్స్ ప్యాక్లు అమ్ముడుపోయినట్లు లాన్సెట్ జర్నల్ తెలిపింది. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, బోస్టన్ యూనివర్సిటీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ యాంటీబయాటిక్స్పై చేసిన అధ్యయనం ఇటీవల లాన్సెట్లో ప్రచురితమైంది. ఇందులో 28 యాంటీబయాటిక్స్ను అత్యవసర మందుల జాబితాలో పెట్టారు. మిగితావి సాధారణ జాబితాలో ఉన్నాయి. కేంద్ర ఔషధ నాణ్యత నియంత్రణ సంస్థ (సీడీఎస్సీవో) అనుమతి ఇచ్చిన యాంటీబయాటిక్స్ కేవలం 19 శాతమే కాగా మిగిలిన 81 శాతం రాష్ట్రాల ఔషధ నియంత్రణ సంస్థల పరిధిలో అమ్ముతున్నారు. వాస్తవానికి దేశంలోని చాలా కాంబినేషన్ యాంటీబయాటిక్స్ను వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. రెండు మూడురకాలకు చెందిన యాంటీ బయాటిక్స్ను కలిపి (కాంబినేషన్) వాడటం సరైంది కాదని పేర్కొంది. కాంబినేషన్ మందులను కుష్టు, క్షయ వంటి వ్యాధులకు వాడాలి. కానీ మన వద్ద చిన్న చిన్న రోగాలకు కూడా కాంబినేషన్ ఔషధాలు వాడుతున్నారు. ఒకటి అవసరమైనచోట రెండు వాడటం వల్ల కూడా ఆ మందు పనిచేయని పరిస్థితి వస్తుంది. అయినా కంపెనీలు ఇష్టమొచ్చినట్లుగా మార్కెటింగ్ చేసుకుంటున్నాయి. ఔషధాల నియంత్రణలో ఉన్న లోపాలను ఆధారం చేసుకొని దందా నిర్వహిస్తున్నాయి. అమ్ముడవుతున్న యాంటీబయాటిక్స్లో 85–90 శాతం ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రాక్టీషనర్లు రాస్తున్నవేనని అధ్యయనం తేల్చిచెప్పింది. ఆహారం ద్వారానే అత్యధిక శాతం యాంటీబయాటిక్స్! ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనం ప్రకారం మన దేశంలో మాంసం, పాలు, పాల పదార్థాలు, గుడ్లు, వివిధ రకాల పంటల (ఆహార పదార్ధాలు) వినియోగం ద్వారా 80 శాతం యాంటీబయాటిక్స్ మానవ శరీరంలోకి వెళ్తున్నాయని తేల్చింది. చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు బ్లడ్ ఇన్ఫెక్షన్లుగా మారితే, అక్కడున్న పెన్సిలిన్కు సంబంధించిన యాంటిబయాటిక్కు లొంగని పరిస్థితులు 65 శాతం ఉంటున్నట్లు తెలిపింది. దీంతో డోసు ఎక్కువున్న యాంటీబయాటిక్స్ వాడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే ఉదర ఇన్ఫెక్షన్ బ్లడ్ ఇన్ఫెక్షన్గా మారితే.. యాంటీబయాటిక్స్కు లొంగని పరిస్థితులు 85 శాతం ఉంటున్నట్లు పేర్కొంది. శుభ్రత పాటించకపోవడంతో చేటు యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడటానికి ఇన్ఫెక్షన్లే ప్రధాన కారణం. ఇప్పటికీ 54 శాతం ఇళ్లల్లో శుచీ శుభ్రత పాటించడం లేదు. సబ్బుతో చేతిని కడుక్కోలేని స్థితి ఉన్న ఇళ్లు 32 శాతం ఉన్నాయి. నీటి వసతి లేని ఆసుపత్రులు ఆరు శాతం ఉన్నాయి. పారిశుధ్యం సరిగా పాటించని ఆసుపత్రులు 22 శాతం ఉన్నాయి. వ్యర్థాలను సరిగా నిర్వీర్యం చేయని ఆసుపత్రులు 27 శాతం ఉన్నాయి. ఇలాంటి కారణాల వల్ల ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. వివిధ దశల్లో 90 రకాల వ్యాక్సిన్లు యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించేలా, ఇన్ఫెక్షన్ రాకుండా చూసేలా ప్రపంచవ్యాప్తంగా 90 రకాల వ్యాక్సిన్ల తయారీ వివిధ దశల్లో ఉంది. చాలారకాల యాంటీబయాటిక్స్కు లొంగని, మొండి ఇన్ఫెక్షన్లకు కారణమైన బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్లు రాకుండా నిరోధించేందుకు ఈ వ్యాక్సిన్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్నాయి. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
మంకీపాక్స్ అలానే సోకదు... ఒక్కోసారి..: డబ్ల్యూహెచ్ఓ
జెనీవా: మంకీపాక్స్ కేసులు వేగవంతంగా పెరుగుతన్న నేపథ్యంలో ప్రజల్లో ఎలాంటి వివక్షతకు దారితీస్తోందోనని డబ్ల్యూహెచ్ఓ అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఈ విషయమై డబ్ల్యూహెచ్ఓ టెక్నికల్ లీడ్ డాక్టర్ రోసముండ్ లూయిస్ జెనీవాలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...ఈ వ్యాధికి సంబంధించిన తీవ్రమైన హాని ఏమి లేదని స్పష్టం చేశారు. ఇది స్వలింగ సంపర్కం వల్లే వచ్చిందే కానీ అందరకీ అలానే ఈ వ్యాధి సంక్రమించదని కూడా తేల్చి చెప్పారు. ప్రస్తుతం దాదాపు 75కు పైగా దేశాల్లో సుమారు 16 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఐతే వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ మంకీపాక్స్ వ్యాధిని సరైన వ్యూహాలతో నియత్రించవచ్చు. అంతేకాదు మంకీపాక్స్ వ్యాధి ఉన్న వ్యక్తితో కలిసి ఉండటం, అతని వస్తువులు వాడటం, లైంగికి సంబంధం పెట్టుకోవడం వంటి తదితరాల వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ వ్యాధి గురించి ప్రజలను ఆందోళన చెందకూడదని, లైంగికంగా సంక్రమించే వ్యాధులపై అవగాహన పెంపొందించు కోవాలని సూచించారు. సమర్ధవంతమైన వ్యూహాలతో ఈ వ్యాధి వ్యాప్తిని నియంత్రించగలమని విశ్వసిస్తున్నాని అని నొక్కి చెప్పారు. అంతేకాదు ఈ వ్యాధి కారణంగా ప్రజలు సమాజంలో వివక్షతకు గురికాకుండా ఉండేలా ఈ వ్యాధి పేరు త్వరితగతిన మార్చాలని డబ్ల్యూహెచ్ఓ యోచిస్తున్నట్లు తెలిపింది. (చదవండి: మంకీపాక్స్ వద్దు.. మరో పేరు పెట్టండి! డబ్ల్యూహెచ్వోకు లేఖ) -
Monkeypox: మంకీపాక్స్పై కేంద్ర ఆరోగ్య శాఖ హైలెవల్ మీటింగ్
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్రం అప్రమత్తమైంది. దీనిపై చర్చించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ జరనల్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరిగింది. మంకీపాక్స్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించిన మరునాడే సమావేశం జరగడం గమనార్హం. ఈ భేటీలో మంకీపాక్స్ నివారణకు, ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించినట్లు తెలుస్తోంది. దేశంలో కరోనా తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న సమయంలో మరో కొత్త వ్యాధి వెలుగుచూస్తుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఢిల్లీలో ఆదివారం నమోదైన కొత్త కేసుతో కలిపి దేశంలో మొత్తం మంకీపాక్స్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. అయితే తాజాగా ఈ వ్యాధి సోకిన 34 ఏళ్ల వ్యక్తికి విదేశాల్లో పర్యటించిన చరిత్ర లేదు. జ్వరం, చర్మంపై దద్దుర్లతో రెండు రోజుల క్రితం ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో చేరాడు. శాంపిల్స్ సేకరించి పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించగా.. ఆదివారం వచ్చిన రిపోర్టులో పాజిటివ్ అని తేలింది. ఈ వ్యక్తికి ప్రత్యేక శిబిరంలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెప్పారు. అంతకుముందు నమోదైన మూడు మంకీపాక్స్ కేసులు కేరళలోనే వెలుగుచుశాయి. వీరిలో ఇద్దరు యూఏఈలో పర్యటించగా.. ఒకరు దుబాయ్ నుంచి వచ్చారు. మంకీపాక్స్ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా శనివారం ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓ. అన్ని దేశాలు అప్రమత్తమై తక్షణమే వేగవంతమైన చర్యలు చేపట్టాలని సూచించింది. అంతర్జాతీయ సమాజమంతా ఏకమై ఈ వ్యాధిపై పోరాడాలని, వ్యాక్సిన్లు, మందుల సాయం అందించుకోవాలని పేర్కొంది. చదవండి: సోనియా గాంధీ గురించి అలా మాట్లాడుతారా? బీజేపీ యాంటీ వుమెన్ -
జలుబు లాగే కరోనా
సాక్షి, హైదరాబాద్: ‘కరోనా కథ ముగిసింది. అది ఎండమిక్ (వైరస్ వ్యాప్తి తీవ్రత తగ్గడం) దశకు చేరుకుంది. ఇక నుంచి అది కేవలం సాధారణ జ్వరం, జలుబు మాదిరిగానే ఉండనుంది. ఒక సీజనల్ వ్యాధిగా మారిపోయింది. దాని గురించి పట్టించుకోవాల్సిన పనిలేదు. అయితే వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. ఇది వ్యాక్సిన్ ద్వారానే సాధ్యమైందని, కాబట్టి టీకా తప్పకుండా వేసుకోవాలని సూచించారు. ఒకవేళ కరోనా కొత్త వేరియంట్ వస్తే మాత్రం ఎలా ఉంటుందో చూడాలని చెప్పారు. శ్రీనివాసరావు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు వేలకు పైగా క్రియాశీలక కేసులుంటే, అందులో 50 మంది వరకు మాత్రమే ఆసుపత్రుల్లో ఉన్నారన్నారు. మరణాలు సున్నా స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. కరోనా, టీబీ సహా జలుబు, జ్వరం, డెంగీ తదితర సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కోసం మాస్క్ ధరించాలని సూచించారు. లక్షణాలున్నవారు ఐదు రోజులు ఐసోలేషన్లో ఉండాలని, తర్వాత ఎవరి పనులు వారు చేసుకోవచ్చని, కాంటాక్ట్ ట్రేసింగ్ అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసిందన్నారు. వర్షాలు తగ్గాక వ్యాధులు విజృంభిస్తాయి రాష్ట్రంలో బ్యాక్టీరియా, వైరస్ల ప్రభావం పెరగడంతో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని శ్రీనివాసరావు అన్నారు. ‘వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు తగ్గిన తర్వాత వ్యాధులు విజృంభిస్తాయి. ఇప్పటికే డెంగీ కేసులు భారీగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 1,184 డెంగీ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లో 516, కరీంనగర్లో 84, ఖమ్మంలో 82, మహబూబ్నగర్లో 54, మేడ్చల్లో 55, పెద్దపల్లిలో 40, సంగారెడ్డిలో 97 చొప్పున దాదాపు అన్ని జిల్లాల్లో డెంగీ వ్యాప్తి చెందుతోంది. ఒక్క జూన్లోనే 565 డెంగీ కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. అంతేగాక జూలైలో తొలి పది రోజుల్లోనే 222 కేసులొచ్చాయి. 2019 తర్వాత మళ్లీ 2022లో డెంగీ కేసుల్లో పెరుగుదల ఉంది. దీంతోపాటు జనవరి నుంచి ఇప్పటివరకు 203 మలేరియా కేసులూ తేలాయి’ అని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే యాంటీ లార్వా ఆపరేషన్లు, దోమ తెరల పంపిణీని ప్రారంభించిందన్నారు. నీళ్ల విరేచనాల కేసులు 6 వేలు నమోదయ్యాయని, జిగట విరేచనాల కేసులు ఈ నెలలో 600 నమోదయ్యాయని తెలిపారు. టైఫాయిడ్ కేసులూ భారీగా వచ్చాయన్నారు. టైఫాయిడ్ కేసులన్నీ పానీపూరీ తినడం వల్ల వచ్చినవేనని స్పష్టంచేశారు. అన్ని సీజనల్ వ్యాధుల లక్షణాలన్నీ ఒకేలా.. కరోనా సహా అన్ని రకాల సీజనల్ వ్యాధుల లక్షణాలన్నీ ఒకేవిధంగా ఉంటాయని, ఏమాత్రం అనుమానమున్నా పరీక్షలు చేయించుకోవాలని, లక్షణాలను బట్టి వైద్యం తీసుకోవాలని శ్రీనివాసరావు చెప్పారు. ఈ లక్షణాలున్నవారు ఇళ్లలోనే ఐసోలేషన్లో ఉండాలని, తద్వారా ఇతరులకు వ్యాపించకుండా చూడాలన్నారు. 10–20 వేల వరకు ప్లేట్లెట్లు తగ్గినా రోగిని రక్షించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఫ్రైడే డ్రై డే కార్యక్రమం చేపట్టాలని కోరారు. వేడి వేడి ఆహారం తీసుకోవాలన్నారు. నీరు రంగు మారితే తప్పక కాచి చల్లార్చాకే తాగాలన్నారు. నిర్దేశిత తేదీ కంటే ముందే గర్భిణులు ఆసుపత్రుల్లో చేరాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజల బలహీనతను సొమ్ము చేసుకోవద్దని హెచ్చరించారు. కోవిడ్ సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులపై ఫిర్యాదులు వస్తే వాట్సాప్ నంబర్కు ఫిర్యాదు చేయొచ్చని చెప్పామని, ఇప్పుడు కూడా 9154170960కు ఫిర్యాదు చేయాలని కోరారు. అవసరమైతే తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, టెస్టింగ్ కిట్లను అందుబాటులో ఉంచామన్నారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ పూర్తయిందని, సీఎం ఆధ్వర్యంలో త్వరలో కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. వారందరికీ హెల్త్ కార్డులు ఇస్తామని తెలిపారు. -
ఆశాదీపాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆశావర్కర్స్కు ‘గ్లోబల్ హెల్త్లీడర్స్’ పురస్కారం ప్రకటించింది. ఈ సందర్భంగా వారి గురించి... కోవిడ్ సంక్షోభంలో ప్రపంచం తుఫానులో చిగురుటాకులా వణికిపోతున్న సమయంలో వారు ధైర్యంగా ముందడుగు వేశారు. కదం తొక్కుతూ, పదం పాడుతూ కదిలారు. బాటలు నడిచీ, పేటలు కడచీ, నదీనదాలు, అడవులు, కొండలు, ఎడారులా మనకు అడ్డంకి అంటూ ఏటికి ఎదురీదారు. మృత్యుభయకంపిత ముఖాల్లో బతుకు ఆశ కలిగించారు... గుజరాత్లోని వాజీపూర్ వెయ్యికి పైగా గడపల ఊరు. ఈ ఊరికి నలభై రెండు సంవత్సరాల లక్ష్మీ వాఘేలా అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ (ఆశ). ఆమె ఊరంతటికీ అమ్మలాంటిది. మహిళలు తమ ఆరోగ్య సమస్యలను నిస్సంకోచంగా లక్ష్షి్మ దగ్గర చెప్పుకుంటారు. ఇద్దరు బిడ్డలకు తల్లి అయిన లక్ష్మి కోవిడ్ సమయంలో ఉదయం అయిదింటికి లేచి ఉద్యోగ విధులు నిర్వర్తించడానికి బయలుదేరేది. ‘బయట పరిస్థితి ఏమీ బాగలేదు. ఉద్యోగం కంటే బతికి ఉండడం ముఖ్యం కదా. ఉద్యోగం వదిలెయ్’ అని చుట్టాలుపక్కాలు చాలామంది చెప్పారు. అయితే వారి మాట పట్టించుకోలేదు. ఆమె దృష్టిలో తాను చేస్తున్నది ఉద్యోగం కాదు. సమాజసేవలో భాగం కావడం. వ్యాక్సినేషన్ సమాచారానికి సంబంధించి డోర్–టు–డోర్ సర్వేలు, కాంటాక్ట్ ట్రేసింగ్, పరీక్షలు చేయించుకోవడానికి భయపడేవారిని ఒప్పించడం, కోవిడ్ బాధితులకు నిరంతరం ధైర్యం చెప్పడం, అత్యవసర మందులను సరఫరా చేయడం... ఒకటారెండా ఊపిరి సలపనంత పని ఉండేది. అయితే ఎప్పుడూ చిరాకు పడింది లేదు. వెనక్కి తగ్గింది లేదు. ‘డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చే క్రమంలో అందరూ నన్ను అనుమానంగా చూసేవారు. ఎప్పుడూ ఆత్మీయంగా పలకరించేవాళ్లు కూడా భయపడి దూరం దూరంగా వెళ్లిపోయేవారు. ఇది చూసి నాలో నేను నవ్వుకునేదాన్ని’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది లక్ష్మీ వాఘేలా. ఉత్తర్ప్రదేశ్లోని చాలా గ్రామాల్లో ఆశా కార్యకర్తలపై దాడులు జరిగాయి. మంచిపని కోసం వెళితే చెడు ఎదురయ్యేది. అయినా సరే భయపడుతూనో, బాధ పడుతూనో వెనక్కి వెళ్లలేదు. భయంతో వెనక దాక్కున్న వారిని ముందుకు తీసుకువచ్చారు. వారికి పరీక్షలు చేయించారు. ‘కోవిడ్ సమయంలో ఆశా వర్కర్స్ కనిపించగానే ముఖం మీదే తలుపు వేసేవారు. అలాంటి అవమానాలను మనసులోకి తీసుకోకుండా చాలా ఓపికగా బాధ్యతలు నిర్వర్తించారు. తమ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ప్రజలకు సేవలు చేస్తూ చనిపోయిన కార్యకర్తలు కూడా ఉన్నారు’ అంటుంది నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆశా వర్కర్స్ జనరల్ సెక్రటరీ బీవీ విజయలక్ష్మి. కేరళలోని కరింగరి గిరిజన ప్రాంతాలలోని పల్లెలపై వైద్య అధికారులు దృష్టి సారించే వారు కాదు. అయితే విచిత్ర వచ్చిన తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది. 23 సంవత్సరాల విచిత్ర ఓ ఆశా వర్కర్. ప్రతి ఇంటికీ వెళ్లేది. వారి క్షేమ సమాచారాలు కనుక్కునేది. కోవిడ్ సమయంలో తాను ఆరునెలల గర్భిణి, ఇల్లు దాటి వెళ్లవద్దని ప్రతి ఒక్కరూ చెప్పారు. కొందరైతే... ‘నీకు వచ్చే కొద్దిపాటి నెల జీతం కోసం ఆశ పడితే...జరగరానిది జరిగితే పరిస్థితి ఏమిటీ’ అని విసుక్కునేవారు. ‘అన్నీ తెలిసిన వాళ్లు, బాగా చదువుకున్నవాళ్లే కోవిడ్ బారిన పడుతున్నారు. పాపం ఆ అడవి బిడ్డలలో చాలామందికి ఏమీ తెలియదు. వారిని జాగ్రత్త పరచడం, సహాయంగా ఉండడం అవసరం’ అంటూ బ్యాగ్ సర్దుకొని డ్యూటీకి బయలుదేరేది విచిత్ర. ఎన్నో గిరిజన గ్రామాలకు విచిత్ర బయటి నుంచి వచ్చిన ఉద్యోగి కాదు. తమ ఇంటిబిడ్డ. ఏ ఒక్కరోజైనా ఆమె రాకపోతే ఆందోళనగా తన గురించి ఆరా తీసేవారు. గుజరాత్లోని లక్ష్మీ వాఘేలా నుంచి కేరళలోని విచిత్ర వరకు ఎందరెందరో ఆశా ఉద్యమకారులు తమ వృత్తి నిబద్ధత చాటుకుంటూ జేజేలు అందుకున్నారు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆశావర్కర్స్కు ప్రతిష్ఠాత్మకమైన ‘గ్లోబల్ హెల్త్ లీడర్స్’ పురస్కారాన్ని ప్రకటించింది. -
14 దేశాలు, 100కిపైగా కేసులు
వాషింగ్టన్/లండన్: యూరప్, అమెరికాలను వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్ 12 దేశాలకు విస్తరించింది. తాజాగా ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్ల్లో మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చినట్టుగా నిర్ధారించాయి. కేవలం 10 రోజుల్లోనే 14 దేశాల్లో 100 పైగా కేసులు నమోదు కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలా ఈ కేసులు విస్తరించడం అసాధారణమని వ్యాఖ్యానించింది. భారత్ కూడా ఈ వైరస్ వ్యాప్తిపై అప్రమత్తమైంది. వైరస్ విస్తరిస్తున్న తీరుని పర్యవేక్షిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నైజీరియా నుంచి బ్రిటన్కు వచ్చిన ఒక వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు తొలుత మే 7న గుర్తించారు. ఆఫ్రికా, పశ్చిమ దేశాల్లో మంకీపాక్ సాధారణమే అయినప్పటికీ గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో విస్తరించలేదు. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, ఇటలీ, స్వీడన్, యూకే, అమెరికాలలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఏమిటీ మంకీపాక్స్?: స్మాల్ పాక్స్ (మశూచి) తరహా ఇన్ఫెక్షన్ ఇది. మశూచితో పోల్చి చూస్తే తక్కువ తీవ్రత ఉంటుంది. ఆఫ్రికాలో వన్యప్రాణుల నుంచి మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ తొలుత వెలుగులోకి వచ్చింది. 1958లో తొలిసారిగా కోతుల్లో దీనిని గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు. 1970ల్లో మనుషుల్లో మొదటిసారి మంకీపాక్స్ కనిపించింది. లక్షణాలివే..: జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువ, గ్లాండ్స్లో వాపు వంటివి మొదట కనిపిస్తాయి. అయిదు రోజులకి మశూచి వ్యాధి మాదిరిగా శరీరమంతా బొబ్బలు వస్తాయి. ఇవి తగ్గడానికి కనీసం నాలుగు వారాలు పడుతుంది. ఎలా వ్యాపిస్తుంది?:తుంపర్ల ద్వారా, మంకీపాక్స్ బాధితులకు అతి సమీపంగా మెలిగినా వ్యాపిస్తుంది. రోగుల దుస్తులు ముట్టుకున్నా, వారితో కలిసి బెడ్పై పడుకున్నా సోకుతుంది. చికిత్స ఎలా?:ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు. యాంటీవైరల్ డ్రగ్స్ వాడతారు. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ కూడా పని చేస్తుంది. వైద్య సదుపాయాలు అంతగా లేని ఆఫ్రికా దేశాల్లో ప్రతీ పది మందిలో ఒకరు ఈ వ్యాధితో చనిపోతున్నారు. -
అంతటా పొల్యూషన్.. ఏదీ సొల్యూషన్!
పొద్దున, సాయంత్రం చల్లగాలి.. వారానికోసారి పార్కులోని చెట్ల గాలి.. ఆఫీసులు, ఇళ్లలో ఏసీ గాలి.. ఇలా ఏ గాలి అయినా ఒకటేనట. ఊరుదాటి వెళితే స్వచ్ఛమైన గాలి దొరుకుతుందన్నదీ ఉత్త మాటేనట. ఇక్కడా, అక్కడా అని కాదు.. భూమ్మీద ఉన్న 700 కోట్ల మంది జనాభాలో 99 శాతం కలుషిత గాలే పీల్చుకుంటున్నారట. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. కరోనా మహమ్మారిని చూసి భయపడుతున్నాంగానీ.. అంతకంటే వేగంగా కాలుష్యం లక్షల మంది ప్రాణాలు తీస్తోందని పేర్కొంది. మరి డబ్ల్యూహెచ్వో హెచ్చరికలు, సూచనలేమిటో చూద్దామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ నాలుగేళ్లలో మరింత పెరిగి.. గాలిలో ఏయే కలుషితాలు గరిష్టంగా ఎంతవరకు ఉండవచ్చనే దానిపై డబ్ల్యూహెచ్వో నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించింది. కానీ ప్రపంచంలో చాలా దేశాల్లో గాలి ఈ ప్రమాణాల మేరకు లేదని డబ్ల్యూహెచ్వో తాజా నివేదికలో హెచ్చరించింది. అధిక ఆదాయ దేశాల్లోని నగరాల్లో ఐదో వంతు మాత్రమే కాలుష్య పరిమితుల్లో ఉంటే.. పేద దేశాల్లో ఒక శాతం మాత్రమే తక్కువ కాలుష్యంతో ఉన్నాయని తెలిపింది. ఈ కలుషిత గాలి పీల్చడం వల్ల కోట్ల మందికి గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. భూమ్మీద నాలుగేళ్ల కింద 90శాతంగా ఉన్న ఉన్న కాలుష్య ప్రభావ ప్రాంతం.. ఇప్పుడు 99 శాతానికి చేరిందని తెలిపింది. తూర్పు మధ్యధరా, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో గాలి నాణ్యత మరింత తక్కువగా ఉందని స్పష్టం చేసింది. ఈ కాలుష్యం వల్ల ఏటా లక్షల మంది చనిపోతున్నారని, మరెంతో మంది అనారోగ్యాలతో బాధపడుతున్నారని డబ్ల్యూహెచ్వో పర్యావరణ డైరెక్టర్ డాక్టర్ మరియా నీరా వెల్లడించారు. పెట్టుబడులు వాతావరణంలో కాలుష్యాన్ని పెంచుతున్నాయే తప్ప.. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన గాలిని అందించడం లేదని పేర్కొన్నారు. వేగంగా పెరుగుతున్న కలుషితాలు మనుషులు ఏడాదిపాటు పీల్చేగాలిలో 2.5 పీఎం రేణువులు 5 గ్రాములకంటే ఎక్కువ ఉండొద్దు, 10 పీఎం రేణువులు 15 గ్రాములు దాటకూడదు. నైట్రోజన్ ఆక్సైడ్ సాంద్రత ఏడాదికి పదిగ్రాముల కంటే ఎక్కువగా ఉండకూడదు. కానీ చాలా వరకు అధికాదాయ దేశాల్లోని నగరాలు ఈ స్థాయిలను ఎప్పుడో దాటి ప్రమాదకర స్థితికి వెళ్లిపోయాయని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. తక్కువ ఆదాయ దేశాల్లోని నగరాల్లో ఈ పరిస్థితి కొంత తక్కువగా ఉందని వెల్లడించింది. నైట్రోజన్ ఆక్సైడ్ స్థాయి విషయంలో పేద, ధనిక తేడా లేదని.. అన్ని దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని తెలిపింది. మొత్తంగా 4 వేల నగరాల్లోని 77 శాతం ప్రజలు నైట్రోజన్ ఆక్సైడ్ స్థాయి ఎక్కువున్న గాలినే పీలుస్తున్నారని వెల్లడించింది. తక్కువ స్థాయి వాయు కాలుష్య కారకాలు కూడా గణనీయమైన హానిని కలిగిస్తున్నాయని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో కర్బన ఉద్గారాలను, శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటే తప్ప గాలి కాలుష్య స్థాయిని తగ్గించలేమని స్పష్టం చేసింది. ►పీఎం అంటే పర్టిక్యులేట్ మేటర్ (అత్యంత సూక్ష్మమైన దుమ్ము, ధూళి కణాలు). 2.5 మైక్రోమీటర్లకన్నా చిన్నవాటిని పీఎం 2.5, 10 మైక్రోమీటర్ల పరిమాణం ఉన్నవి పీఎం 10గా పేర్కొంటారు. నిర్మాణాలు జరుగుతున్న చోట, కచ్చారోడ్లు, వ్యవసాయ క్షేత్రాలు, మంటలు, వివిధ రకాల పొగల నుంచి ఇవి ఏర్పడుతాయి. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజైన్ ఆక్సైడ్ వంటి ప్రమాదకర వాయువులు పవర్ ప్లాంట్లు, పరిశ్రమలు, వాహనాల నుంచి ఎక్కువగా వెలువడతాయి. శిలాజ ఇంధనాలపై ఆధారపడొద్దు ‘ఒక మహమ్మారి నుండి బయటపడ్డామనుకుంటే... కాలుష్యాన్ని పెంచుకుంటూ, మనం నివారించగల మరణాలను కూడా కొని తచ్చుకుంటున్నాం. వాయు కాలుష్యం కారణంగా మంచి ఆరోగ్యాన్ని కోల్పోవడం ఆమోదయోగ్యం కాదు. వాతావరణ మార్పులు, కాలుష్యం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను పరిష్కరించాల్సిన అవశ్యకత ఇప్పుడు మన ముందుంది. శిలాజ ఇంధనాలపై తక్కువ ఆధారపడే ప్రపంచం అవసరం’ అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ వ్యాఖ్యానించారు. 117 దేశాల్లో పరిశీలన చేసి.. డబ్ల్యూహెచ్వో 117 దేశాల్లోని 6 వేల నగరాల్లో కాలుష్య డేటాను పరిశీలించింది. వాహనాలు, రోడ్ ట్రాఫిక్ వల్ల ప్రమాదకరమైన నైట్రోజన్ ఆక్సైడ్ పెరిగిపోతోందంది. ప్రమాదకర దుమ్ము, ధూళి రేణువుల శాతం పెరిగిందని తెలిపింది. ఇవి గాలి ద్వారా ఊపిరితిత్తుల్లోకి, తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థలోకి చేరుతున్నాయని.. రక్తపోటు, శ్వాస సంబంధిత సమస్యలు, కేన్సర్లకు కారణమవుతున్నాయని తేల్చి చెప్పింది. దుమ్ము, ధూళికి తోడు నైట్రోజన్ ఆక్సైడ్ పెరగడంతో.. ఆస్తమా, దగ్గు, శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నట్లు హెచ్చరించింది. రవాణా, విద్యుత్, సాగు కోసం అధికంగా ఇంధనాన్ని కాల్చడమే కాలుష్యానికి ప్రధాన కారణమని తెలిపింది. ఇబ్బంది పడేవాళ్లెవరు..? కాలుష్యం వల్ల ఎక్కువగా ఊపిరితిత్తులు, గుండె సంబంధిత, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ఇబ్బంది పడతారు. వృద్ధులు, పిల్లలు, గర్భిణులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు అధికంగా ప్రభావితమవుతారు. ►కాలుష్యంతో తాత్కాలికంగా.. తలనొప్పి, ముక్కు, గొంతు, కళ్లు మంటలు, దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, న్యుమోనియా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు వస్తాయి. ►దీర్ఘకాలికంగా.. కేంద్రనాడీ వ్యవస్థపై ప్రభావంతో తలనొప్పి, యాంగ్జైటీ , గుండె సంబంధిత జబ్బుల పెరుగుదల, ఆస్తమా, కేన్సర్, శ్వాసకోశ ఇబ్బందులు, కాలేయం, ప్లీహం, రక్త ప్రసరణపై ప్రభావం వంటివి తలెత్తుతాయి. మనమేం చేయొచ్చు ►వాహనాల వాడకాన్ని వీలైనంతగా తగ్గించడం. ►కరోనాతో సంబంధం లేకుండా మాస్క్ ధరించే అలవాటు కొనసాగించడం. ►దుమ్ము, ధూళి ఇంట్లోకి రాకుండా చూసుకోవడం. ►రద్దీగా ఉన్న ప్రదేశాలకు వెళ్లినప్పుడు కలుషి తాల నుంచి రక్షణ పొందేలా ఏర్పాట్లు చేసుకోవడం. -
99 శాతం ప్రజలు పీల్చేది కలుషిత గాలే!
జెనీవా: ప్రపంచంలోని 99 శాతం జనాభా కలుషిత గాలి పీలుస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దాదాపు జనాభా మొత్తం ప్రమాణాలకు తగినట్లుగా లేని గాలినే పీలుస్తున్నారని, దీన్ని నివారించాలంటే వెంటనే శిలాజ ఇంధన వాడకాన్ని తగ్గించాలని సూచించింది. ఈ ఇంధన వాడకాలతో వాయుకాలుష్యం ఏర్పడుతోందని, దీనివల్ల రక్త సంబంధ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు ప్రబలి ఏటా 70 లక్షల మరణాలు జరుగుతున్నాయని తెలిపింది. గాల్లో పీఎం 2.5, పీఎం10 అనే పర్టిక్యులేట్ మేటర్ను ఆధారంగా చేసుకొని వాయునాణ్యతను సంస్థ నిర్ధారిస్తుంది. భారత్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాలు తక్షణమే కర్బన ఉద్గారాల స్థాయిల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని, పర్యావరణహిత ఇంధన వాడకాన్ని ప్రోత్సహించాలంది. -
కొత్త వేరియంట్ల ముప్పు అధికమే!
జెనీవా: ఒమిక్రాన్ వేరియంట్తోనే మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగిపోయినట్లు భావించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు చెందిన కోవిడ్–19 టెక్నికల్ లీడ్ మారియా వాన్ కెర్ఖోవ్ చెప్పారు. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ముప్పు అధికంగానే ఉందని తెలిపారు. ఒమిక్రాన్లోని నాలుగు వేర్వేరు వెర్షన్లను క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. వైరస్ ఎన్నో రకాలుగా మార్పులకు గురవుతోందని, ఉత్పర్తివర్తనాలు సంభవిస్తున్నాయని, కొత్త వేరియంట్ల పుట్టుకకు అవకాశాలు ఎన్నో రెట్లు ఉన్నట్లు గుర్తించామని వివరించారు. కరోనా కొత్త వేరియంట్ల బారి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే సరిపోదని, నియంత్రణ చర్యలు కచ్చితంగా పాటించాలని సూచించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకొనే చర్యలు కచ్చితంగా చేపట్టాలన్నారు. కరోనా కేసులు 17 శాతం తగ్గాయ్ అంతకుముందు వారంతో పోలిస్తే కోవిడ్–19 పాజిటివ్ కేసులు గత వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 17 శాతం తగ్గాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. కరోనా సంబంధిత మరణాలు 7 శాతం తగ్గిపోయానని తెలిపింది. అమెరికాలో పాజిటివ్ కేసులు ఏకంగా 50 శాతం పడిపోయాయని పేర్కొంది. ఈ మేరకు తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. మొత్తం కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులే 97 శాతం ఉన్నాయని వివరించింది. మిగతా 3 శాతం కేసులు డెల్టా వేరియంట్కు సంబంధించినవేనని నివేదికలో ప్రస్తావించింది. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఒమిక్రాన్ ఉనికిని గుర్తించారని స్పష్టం చేసింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 6 వరకూ ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 1.9 కోట్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 68,000 మంది మరణించారని తెలియజేసింది. కోవిడ్ నియంత్రణకు కొత్త కాంబో డ్రగ్! కోవిడ్–19 వ్యాప్తి నియంత్రణకు ప్రయోగాత్మక ఔషధం బ్రెక్వినార్ను రెమ్డెసివిర్ లేదా మోల్నుపిరవిర్తో కలిపి ఇస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నట్లు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో నిర్వహించిన అధ్యయనంలో గుర్తించారు. ఈ అధ్యయనం వివరాలను నేచర్ పత్రికలో ప్రచురించారు. రెమ్డెసివిర్ లేదా మోల్నుపిరవిర్ను వేర్వేరుగా ఇచ్చినప్పటి కంటే బ్రెక్వినార్ కాంబినేషన్తో ఇస్తే వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటున్నట్లు అధ్యయనకర్తలు తేల్చారు. అయితే, ఈ కాం బో డ్రగ్పై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంది. -
కేసులు పెరుగుతున్నా.. మరణాలు తక్కువే!
న్యూయార్క్: గత వారం ప్రపంచవ్యాప్తంగా 2.1 కోట్ల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని, మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి అత్యధిక వారపు కేసులు ఇవేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. అయితే మరణాల సంఖ్య స్థిరంగా 50వేలకు పైగా కొనసాగుతున్నాయని పేర్కొన్నది. కొత్త కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల సంఖ్య 5 శాతం పెరిగిందని, కొన్ని ప్రాంతాల్లోనే పెరుగుదల కనిపిస్తోందని, మొత్తంగా చూస్తే పెరుగుదల రేటు మందగిస్తున్నట్లు వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో 39శాతంతో అత్యధికంగా కేసులు పెరిగాయని, ఆగ్నేయాసియాలో 36 శాతం పెరిగిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, అమెరికాలలో మరణాలు పెరిగాయని, ఇతర ప్రాంతాలలో తగ్గాయని వివరించింది. ప్రజలంతా కరోనా నిబంధనలను పాటించి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని సూచించింది. దేశాలన్నీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని కోరింది. -
ఒమిక్రాన్ చివరి వేరియెంట్ అనుకోలేం
జెనివా: కరోనా ఎండమిక్ దశకి వచ్చేశామని ప్రపంచ దేశాలు భావిస్తే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధ్నామ్ ఘెబ్రెయాసస్ హెచ్చరించారు. కరోనా వైరస్ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. సోమవారం జరిగిన డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో మాట్లాడుతూ తొమ్మిది వారాల కిందట ఒమిక్రాన్ వేరియెంట్ని గుర్తిస్తే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల మంది వైరస్ బారిన పడినట్టు తమకు నివేదికలు అందాయన్నారు. 2020 ఏడాది మొత్తంగా నమోదైన కేసుల కంటే ఇది ఎక్కువని చెప్పారు. కరోనా పరిస్థితులు దేశ దేశానికి మారిపోతున్నాయని చెప్పిన టెడ్రోస్ ఈ ఏడాది చివరి నాటికల్లా కోవిడ్–19 అత్యవసర పరిస్థితి నుంచి బయటపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రపంచదేశాలన్నీ కలసికట్టుగా కృషి చేస్తే కరోనా తుది దశకు చేరుకుంటామన్నారు. స్వల్పంగా తగ్గిన రోజువారీ కేసులు భారత్లో రోజు వారీ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 3,06,064 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. 22,49,335కి యాక్టివ్ కేసులు చేరుకున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 20.75 నమో దు కాగా, వీక్లీ పాజిటివిటీ రేటు 17.03గా ఉంది. శరద్ పవార్కు కరోనా ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు కరోనా సోకింది. డాక్టర్ల సూచన ప్రకారం చికిత్స తీసుకుంటున్నానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పవార్ ట్వీట్ చేశారు. 81 సంవత్సరాల పవార్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ సైతం ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానికి పవార్ కృతజ్ఞతలు తెలిపారు. తనను ఇటీవల కలిసినవారంతా కరోనా పరీక్ష చేయించుకోవాలని పవార్ సూచించారు. ఇటీవలే కరోనా సోకి ఆస్పత్రిలో చేరిన పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ సోమవారం డిశ్చార్జయ్యారు. -
మరో రెండు కోవిడ్ ఔషధాలకు డబ్ల్యూహెచ్ ఆమోదం
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ రోగులకు చికిత్స అందించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు ఔషధాలకు ఆమోద ముద్ర వేసింది. రుమటైడ్ కీళ్ల నొప్పుల నివారణకు ఎలి లిల్లీ కంపెనీ తయారు చేసిన మెడిసిన్, గ్లాక్సోస్మిత్క్లేన్ కంపెనీ మోనో క్లోనల్ యాంటీబాడీ థెరపీలను కోవిడ్ రోగులకు ఇవ్వడానికి డబ్ల్యూహెచ్ఓ నిపుణులు అంగీకరించారు. లిల్లీ కంపెనీకి చెందిన బారిక్టినిబ్ ఔషధం కరోనా తీవ్రంగా సోకిన వారి ప్రాణాలు కాపాడుతుందని, వారికి వెంటిలేటర్ అవసరం లేకుండా చేస్తుందని డబ్ల్యూహెచ్ఓ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. స్టెరాయిడ్స్తో పాటు కీళ్ల నొప్పులకు వాడే ఈ ఔషధాన్ని ఇస్తే మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపింది. ఇప్పటికే బారిక్టినిబ్ను అమెరికా, యూరప్లలో గత ఏడాది మే నుంచి అత్యవసర సమయాల్లో వినియోగిస్తున్నారు. కరోనాతో ఇబ్బంది పడుతూ ఆస్పత్రిలో చేరే అవసరం ఉన్న వారికి గ్లాక్సో కంపెనీకి చెందిన మోనోకల్నల్ యాంటీబాడీ ట్రీట్మెంట్ ఇవ్వొచ్చునని స్పష్టం చేసింది. -
ఒమిక్రాన్, డెల్టాల సునామీ.. డబ్ల్యూహెచ్వో ఆందోళన
బెర్లిన్: ఒమిక్రాన్, డెల్టా వేరియెంట్లు కలిసి సునామీ సృష్టిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) డైరెక్టర్ జనరల్ ట్రెడోస్ అధనామ్ గెబ్రెయెసస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘అధిక వ్యాప్తి కలిగిన ఒమిక్రాన్ ప్రబలుతుంటే... అదే సమయంలో డెల్టా కేసులూ పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇవి రెండూ కలిపి కేసుల సునామీ సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పనిభారంతో బాగా అలసిపోయిన వైద్యులు, నర్సింగ్ సిబ్బందిపై ఈ సునామీ మరింత ఒత్తిడిని పెంచుతుంద’ని విలేకరుల సమావేశంలో అధనామ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒమిక్రాన్తో ముప్పు తక్కువని ప్రాథమిక గణాంకాలు సూచించినా... అదే నిజమని అప్పుడే స్థిర అభిప్రాయానికి రావడం తొందరపాటే అవుతుందని పేర్కొన్నారు. మరింత విశ్లేషణ జరిగాకే ఒమిక్రాన్ తీవ్రతపై పూర్తి స్పష్టతకు రావొచ్చన్నారు. అమెరికాలో ఒమిక్రాన్ ఇప్పటికే ప్రధాన వేరియెంట్గా మారగా... యూరప్లోని కొన్ని దేశాల్లోనూ ఒమిక్రాన్ బాగా ప్రబలుతోంది. ఒమిక్రాన్తో ముప్పు ఇప్పటికైతే తీవ్రమేనని డబ్ల్యూహెచ్వో తమ వారాపు నివేదికలో పేర్కొంది. డిసెంబరు 20–26 వరకు ప్రపంచవ్యాప్తంగా 49.9 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్వో తెలిపింది. అంటే రోజుకు సగటున 7.12 లక్షల కొత్త కేసులొచ్చాయి. అంతకుముందు వారంతో పోలిస్తే 11 శాతం కేసులు పెరిగాయి. అమెరికాలో గడిచిన 24 గంటల్లో 3.56 లక్షల కేసులు రాగా, ఫ్రాన్స్లో ఇదివరకూ ఎప్పుడూ లేనంత ఎక్కువగా.. రికార్డు స్థాయిలో 2.08 లక్షల కేసులు నమోదయ్యాయి. యూకేలో 1.29 లక్షల కేసులు వచ్చాయి. చదవండి: (Hyderabad New Year Events: సిటీ పోలీసుల కీలక ఆదేశాలు) -
కోవోవ్యాక్స్, మొల్న్యుపిరావర్ అత్యవసర వాడుకకు సిఫార్సు
న్యూఢిల్లీ: కరోనాను అరికట్టే ప్రక్రియలో సీరమ్ సంస్థ తయారీ కోవోవ్యాక్స్ టీకాను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు అనుమతించవచ్చని సీడీఎస్సీఓకు చెందిన నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. అదేవిధంగా కరోనా చికిత్సలో మొల్న్యుపిరావర్ మాత్రల ఉత్పత్తి, అత్యవసర వినియోగ అనుమతికి కూడా పచ్చజెండా ఊపింది. కోవోవ్యాక్స్పై నిపుణుల కమిటీ రెండుమార్లు పరిశీలన జరిపి చివరకు కొన్ని పరిస్థితుల్లో అత్యవసరంగా వాడేందుకు అనుమతించవచ్చని సిఫార్సు చేసింది. ఇప్పటికే ఈ టీకా ఎమర్జన్సీ వాడుకకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంగీకరించింది. కరోనా సోకిన వయోజనుల్లో ఆక్సిజన్ స్థాయి పడిపోయి, రిస్కు పెరిగిన సందర్భాల్లో మొల్న్యుపిరావర్ను వినియోగించవచ్చని నిపుణుల కమిటీ సూచించింది. ఈ ఔషధాన్ని డా. రెడ్డీస్ సహా పలు కంపెనీ కన్సార్టియం ఉత్పత్తి చేస్తోంది. ఐదు రోజుల కన్నా ఎక్కువ రోజులు దీన్ని వాడకూడదని, గర్భిణీలకు ఇవ్వకూడదని కమిటీ సిఫార్సు చేసింది. -
దక్షిణాఫ్రికాకు డబ్ల్యూహెచ్వో బృందం
జోహన్నస్బర్గ్: కరోనా వైరస్లోని ఒమిక్రాన్ వేరియెంట్తో దక్షిణాఫ్రికా ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) బృందం ఆ దేశానికి వెళ్లింది. ఒమిక్రాన్ వేరియెంట్కి కేంద్రమైన గౌటాంగ్ ప్రావిన్స్లో కేసుల్ని పర్యవేక్షించడానికి డబ్ల్యూహెచ్ఒ తన బృందాన్ని పంపించింది. కరోనా బాధితులతో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించి పరీక్షలను అత్యధికంగా నిర్వహించడానికి ఈ బృందం దక్షిణాఫ్రికాకు వెళ్లినట్టుగా డబ్ల్యూహెచ్వో రీజనల్ డైరెక్టర్ ఫర్ ఆఫ్రికా డాక్టర్ సలామ్ గూయె చెప్పారు. దేశంలోని కేసుల్లో 80 శాతం దక్షిణాఫ్రికా ఎకనామిక్ హబ్ అయిన గౌంటెంగ్ ప్రావిన్స్లో వెలుగు చూశాయి. 10–14 ఏళ్ల వారిలో అధిక కేసులు దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియెంట్ విశ్వరూపం చూపిస్తోంది. నవంబర్ మొదట్లో రోజుకి 200 నుంచి 300 కేసులు నమోదైతే గురువారం ఒక్క రోజే దక్షిణాఫ్రికాలో 11,500 కొత్త కేసులు వెలుగులోకి రావడం ఆందోళన పుట్టిస్తోంది. ఎక్కువగా 10–14 ఏళ్ల వారికి సోకుతున్నాయి. 5ఏళ్లలోపు పిల్లలు ఆస్పత్రి పాలవుతున్నారని దక్షిణాఫ్రికా అధికారులు చెప్పారు. కొత్త వేరియెంట్ గురించి దక్షిణాఫ్రికా హెచ్చరించిన వారం రోజుల్లోనే 5రెట్లు ఎక్కువ కేసులు నమోదవడం దడ పుట్టిస్తోంది. శ్రీలంకలోనూ ఒమిక్రాన్.. శ్రీలంకలో తొలిసారిగా శుక్రవారం ఒమిక్రాన్ కేసు నమోదైంది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ వేరియెంట్ సోకినట్టు తేలిందని, అతను కుటుంబ సభ్యులతో క్వారంటైన్లో ఉన్నాడని ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు అమెరికాలో ఒమిక్రాన్ వేరియెంట్ బ యటపడడంతో ప్రజలందరూ బూస్టర్ డోసుల్ని తీసుకోవాలని అధ్యక్షుడు జో బైడెన్ పిలుపునిచ్చారు. విదేశాల నుంచి వచ్చిన వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ లేకుండానే కరోనాను కట్టడి చేస్తామని బైడెన్ చెప్పారు. -
దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్.. 9 రోజుల్లోనే 30 దేశాలకు..
జోహెన్నెస్బర్గ్/లండన్: దక్షిణాఫ్రికాలో తొలిసారిగా నవంబర్ 24న బయటపడిన ఒమిక్రాన్ వేరియెంట్ తొమ్మిది రోజుల్లోనే భారత్సహా 30 దేశాలకు వ్యాప్తి చెందింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 375 ఒమిక్రాన్ కేసుల్ని గుర్తించారు. డెల్టా కంటే అయిదు రెట్ల వేగంతో ఈ వేరియెంట్ వ్యాపిస్తూ ఉండడం దడ పుట్టిస్తోంది. దక్షిణాఫ్రికాలో అత్యధికంగా 183 కేసులు బయటపడితే, ఆ తర్వాత స్థానాల్లో 50కి పైగా కేసులతో నార్వే, 33 కేసులతో ఘనా, 32 కేసులతో బ్రిటన్ ఉన్నాయి. నార్వేలో క్రిస్మస్ పార్టీకి వెళ్లిన వారికి ఈ వైరస్ సోకినట్టుగా అధికారులు వెల్లడించారు. దీని వ్యాప్తి చాలా విస్తృతంగా ఉండడంతో వేరియెంట్ ఆఫ్ కన్సర్న్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్తో పాటు ఫ్రాన్స్లో ఈ కొత్త వేరియెంట్ గురువారమే బయటపడింది. మరికొద్ది వారాల్లో కేసుల తీవ్రత అత్యధిక స్థాయికి చేరుకుంటుందని భావిస్తున్నట్టుగా ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. దక్షిణాఫ్రికా తర్వాత యూరప్ దేశాల్లో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. వచ్చే కొద్ది నెలల్లో యూరప్లో నమోదయ్యే కేసుల్లో సగానికి పైగా ఒమిక్రాన్ వేరియెంట్వే ఉంటాయని యూరోపియన్ యూనియన్ హెల్త్ ఏజెన్సీ ఈసీడీసీ అంచనా వేస్తోంది. యువతకే అధికంగా.. ఒమిక్రాన్ తీవ్రత ఎలా ఉంటుందన్న దానిపై శాస్త్రవేత్తలు నిర్ధిష్టమైన అంచనాకు రాలేకపోతున్నారు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో యువతకే అత్యధికంగా ఈ వేరియెంట్ సోకుతూ ఉందని, వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల ప్రస్తుతానికి స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. వివిధ దేశాల కఠిన నిబంధనలు ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తి చెందుతూ ఉండడంతో వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం, ఇతర నిబంధనల్ని కఠినతరం చేయడంపై వివిధ దేశాలు దృష్టి సారించాయి. లాక్డౌన్, మార్కెట్లు మూసేయడం కంటే వ్యాక్సినేషన్, మాస్కులు సహా కోవిడ్–19 నిబంధనలు పాటించడం ద్వారా ఈ మహమ్మారిని ఎదుర్కోవాలని వివిధ దేశాలు నిర్ణయించాయి. ► వ్యాక్సిన్ తీసుకోని వారి కదలికలను జర్మనీ పరిమితం చేసింది. నిత్యావసరాల దుకాణాలకు తప్పితే అలాంటి వారిని మరే ఇతర స్టోర్లు, మాల్స్, పబ్బులు, క్లబ్బులు, సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతించబోమని జర్మనీ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ గురువారం ప్రకటించారు. దేశంలో పరిస్థితి సీరియస్గా ఉందని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడాన్ని తప్పనసరి చేయడాన్ని పార్లమెంటు పరిశీలిస్తుందని తెలిపారు. గత 24 గంటల్లో 70 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ► 60 ఏళ్లకు పైబడిన వారు టీకా తీసుకోవడానికి నిరాకరిస్తే వారి నెలవారీ పెన్షన్ నాలుగో వంతు కోత వేసే యోచనలో గ్రీస్ ప్రభుత్వం ఉంది.పెన్షన్లో నెలకు 100 యూరోల(రూ.8,471) కోత పడనుంది. 60 ఏళ్లు పైబడిన వారిలో ఇంకా 17 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోకపోవడంతో ప్రభుత్వం ఈ జరిమానా అస్త్రం ప్రయోగించింది. ► స్లోవేకియా మాత్రం 60 ఏళ్లు పైబడిన వారు వ్యాక్సినేషన్ పూర్తిచేసుకుంటే 500 యూరోలు (రూ.42,355) బోనస్గా ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది. ► లాక్డౌన్లకి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్న నెదర్లాండ్స్లో నిరసన ప్రదర్శనల్ని ప్రభుత్వం కఠినంగా అణచివేస్తోంది. ► అమెరికా బూస్టర్ డోసుల్ని కూడా ఇస్తోంది. రెండు డోసులు పూర్తయినప్పటికీ కరోనా నుంచి మరింత రక్షణ కోసం బూస్టర్ డోసులు ఇస్తోంది. ► ఒమిక్రాన్ సోకిన వ్యక్తులతో ఎవరు సన్నిహితంగా మెలిగారనేది సదరు రోగుల ఫోన్లపై నిఘా పెట్టడం ద్వారా ఇజ్రాయెల్ తెలసుకుంటోంది. గోప్యత హక్కుకు ఇది భంగకరమని హక్కుల సంఘాలు ధ్వజమెత్తడంతో గురువారం దీన్ని ఆపివేసింది. ► 18 ఏళ్లు పైబడిన వారు ఆరునెలలకు ఒకసారి బూస్టర్ డోస్ను తీసుకోవడాన్ని చిలీ తప్పనసరి చేసింది. అప్పుడే పాస్ రెన్యువల్ అవుతుంది. ఈ పాస్ లేకపోతే రెస్టారెంట్లు, హోటళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్లలేరు. -
దక్షిణాఫ్రికా ‘దడ’.. కొమ్ములు విరుచుకుంటున్న కొత్త వేరియెంట్
లండన్/ జొహన్నెస్బర్గ్: అబ్బో... ఎన్నో వేరియెంట్లను చూసేశాం. అలసిపోయాం... ఇక కరోనాతో సహజీవనం మనకు అలవాటైపోయిందని ఒక రకమైన నిశ్చింతకు వచ్చాం. ఇంతలోనే దక్షిణాఫ్రికా మరో బాంబు పేల్చింది. ‘బి.1.1.529’ అనే ప్రమాదకరమైన వేరియెంట్ వెలుగుచూసిందని, పలు మ్యూటెంట్ల సమ్మేళనంగా (అసాధారణ ఉత్పరివర్తనాల సమూహంగా) ఇది కనపడుతోందని లండన్లోని ఇంపీరియల్ కాలేజీ వైరాలజిస్టు డాక్టర్ టామ్ పీకాక్ వెల్లడించారు. మానవ శరీరంలోని రోగనిరోధక శక్తిని ఏమార్చగలదని, మరింత వేగంగా వ్యాప్తిచెందగలదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దక్షిణాఫ్రికా, బోట్స్వనాల్లో ఈ రకానికి చెందిన 100 కేసులను గుర్తించినట్లు తెలిపారు. బి.1.1.529 ఎంతటి ప్రమాదకరం, దీని మూలంగా ఎదురయ్యే విపరిణామాలు ఎలా ఉండనున్నాయనేది అంచనా వేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) శాస్త్రవేత్తలు గురువారం సమావేశమయ్యారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న, హెచ్ఐవీ/ ఎయిడ్స్ సోకి చికిత్స పొందని వ్యక్తి శరీరంలో ఈ మ్యూటెంట్ అభివృద్ధి చెంది ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఏమేరకు వేగంగా వ్యాప్తి చెందగలదు, ఎంతటి హానికరమనేది ప్రస్తుత దశలో ఏమీ చెప్పలేమని దక్షిణాఫ్రికా జాతీయ అంటువ్యాధుల కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. తమ శాస్త్రవేత్తలు అహోరాత్రులు శ్రమిస్తూ.. దీని పరిణామక్రమాన్ని నిశితంగా గమనిస్తున్నారని పేర్కొంది. హాంగ్కాంగ్లోనూ ఈ వేరియెంట్ కేసులు బయటపడ్డాయి. ► దీంట్లో ఏకంగా 32 మ్యూటేషన్లు ఉన్నాయి. ► కె417ఎన్– కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలను ఏమార్చగలదు ► ఈ484ఏ– యాంటీబాడీలకు చిక్కదు ► ఎన్440కే– యాంటీబాడీలను బొల్తా కొట్టించగలదు ► ఎన్501వై.. వైరస్ వ్యాప్తిని వేగవంతం చేస్తుంది. ► ఈ వైరస్ కొమ్ముల్లో మరే దాంట్లోనూ లేనన్ని మ్యూటేషన్లు ఉన్నాయి. ► ప్రస్తుత వ్యాక్సిన్ల ద్వారా ఉత్పత్తయ్యే యాంటీబాడీలు ఇప్పటిదాకా వ్యాప్తిలో ఉన్న వేరియెంట్లనే (వైరస్పై ఉండే కొమ్ములనే) గుర్తుపట్టగలవు ► కాబట్టి ఇది తేలిగ్గా యాంటీబాడీలు కల్పించే రక్షణను తప్పించుకొని శరీరంలో వ్యాప్తి చెందగలదు. అక్కడి నుంచి వచ్చేవారితో జాగ్రత్త కొత్త వేరియెంట్ అనవాళ్లు బయటపడ్డ దక్షిణాఫ్రికా, బోట్వ్సానా, హాంగ్కాంగ్ల నుంచి వచ్చే ప్రయాణికులకు క్షుణ్ణంగా పరీక్షించాలని, టెస్టులు ముమ్మరం చేయాలని భారత ప్రభుత్వం గురువారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రదేశాలకు ఆదేశాలు జారీచేసింది. ఈ దేశాల మీదుగా (వయా) వస్తున్న వారినీ కఠిన పరీక్షల తర్వాతే అనుమతించాలని సూచించింది. అందరి శాంపిల్స్ తీసుకొని జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్లకు పంపాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు రాసిన లేఖలో కోరారు. -
డబ్ల్యూహెచ్ఓ చీఫ్గా టెడ్రోస్ ఏకగ్రీవ ఎన్నిక
జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్గా టెడ్రోస్ అధ్నామ్ ఘెబ్రెయాసస్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. నామినేషన్లకు గడువు ముగిసిన తర్వాత టెడ్రోస్ పేరు మొదట్లో ఉండగా ఆయన అభ్యర్థిత్వానికి ఫ్రాన్స్, జర్మనీ మద్దతునిచ్చాయి. ఇథియోపియాకు చెందిన టెడ్రోస్ డబ్ల్యూహెచ్ఓకి సారథ్యం వహించిన మొట్టమొదటి ఆఫ్రికన్. -
‘కరోనా’ మూలాలపై అన్వేషణ!
జెనీవా: భూగోళాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మూలాలను కనుక్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) మరోసారి గట్టి ప్రయత్నం చేస్తోంది. ఈ వైరస్ చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి లీకయిందా? లేక సహజ సిద్ధంగానే సంక్రమించిందా? అన్న దిశగా ఇప్పటి వరకు జరిపిన విచారణ అసంపూర్తిగా ముగిసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో వివిధ వైరస్ల గుట్టుని నిగ్గు తేల్చడానికి శాస్త్రవేత్తల బృందాన్ని డబ్ల్యూహెచ్ఓ ఏర్పాటు చేసింది. ఈ బృందం కరోనా వైరస్తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల్లో వ్యాప్తి చెందుతున్న వైరస్ల పుట్టుకపై అధ్యయనం చేయనుంది. అంతేకాకుండా ఈ తరహా వైరస్ల పుట్టుకపై అధ్యయనాలు ఎలా చేయాలో సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు కొన్ని మార్గదర్శకాలను సైతం రూపొందిస్తుంది. ఈ బృందంలో పాలుపంచుకోవడానికి ఆసక్తి చూపుతూ ప్రపంచవ్యాప్తంగా 700 దరఖాస్తులు రాగా, అందులో 25 పేర్లను డబ్ల్యూహెచ్ఓ ఎంపిక చేసింది. బృంద సభ్యుల పేర్లతో త్వరలో తుది జాబితాను వెల్లడించనుంది. ఇదే ఆఖరి అవకాశం డబ్ల్యూహెచ్ఓ సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఫర్ ది ఆరిజన్స్ ఆఫ్ నోవెల్ పాథోజెన్స్(సాగో) అని పిలిచే ఈ ప్రతిపాదిత బృందంలో ఒక భారతీయ శాస్త్రవేత్తకి సైతం చోటు లభించడం విశేషం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నుంచి గత ఏడాదే పదవీ విరమణ పొందిన శాస్త్రవేత్త డాక్టర్ రామన్ గంగఖేడ్కర్ డబ్ల్యూహెచ్ఓ బృందంలో పని చేసే అవకాశం ఉంది. అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టే నిపుణుడిగా రామన్కు పేరుంది. ఐసీఎంఆర్లో పనిచేస్తూ రెండేళ్ల పాటు నిఫా వైరస్, కరోనా వైరస్లను ఎదుర్కోవడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. హెచ్ఐవీ–ఎయిడ్స్పై ఆయన చేసిన పరిశోధనలకు గాను పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. కరోనాతో పాటు వివిధ వైరస్ల గుట్టుమట్లను తెలుసుకునేందుకు సైంటిస్టులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్న డబ్ల్యూహెచ్ఓ వారిచ్చే సూచనల మేరకు నడుచుకోనుంది. కరోనా వైరస్ మూలాలను కనుక్కోవడానికి ఇదే ఆఖరి అవకాశం అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ అధా్నమ్ ఘెబ్రాయసిస్ అన్నారు. గత బృందంలో సభ్యులుగా ఉండి, చైనాలో పర్యటించిన ఆరుగురు శాస్త్రవేత్తలకు ఈసారి కూడా చోటు కల్పించారు. కాగా డబ్ల్యూహెచ్ఓ విచారణలో ఏమైనా రాజకీయపరమైన అవకతవకలు జరిగితే సహించేది లేదని చైనా హెచ్చరించింది. డబ్ల్యూహెచ్ఓ బృందానికి శాస్త్రీయంగా మద్దతు ఇస్తామే తప్ప రాజకీయం చేస్తే ఊరుకోబోమని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ తేల్చి చెప్పారు. -
అక్టోబరు 15 గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే : కరోనాకు చెక్ పెడదాం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన విధ్వంసంఅంతా కాదు. లక్షలాదిమందిని పొట్టన పెట్టుకున్న ఈ కరోనా మన దరికి రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు ఒక్కటే మార్గం. ముఖ్యంగా ముఖానికి మాస్క్ ధరించడంతోపాటు ఎల్లవేళలా చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కరోనా కష్టకాలంలో పెద్ద నగరాలు, మారు మూల పల్లెల దాకా పెద్దలతో పాటు చిన్నారుల కూడా దీనిపై అవగాహన పెంచాలంటున్నారు నిపుణులు. ఫలితంగా అనేక ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు. అక్టోబరు 15 గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే సందర్భంగా.. స్పెషల్ స్టోరీ. గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే 2021 థీమ్ : 2008 లో తొలిసారిగా గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే జరిగింది. ప్రతీ సంవత్సరం, గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే ఒక థీమ్తో జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ "మన భవిష్యత్తు మన చేతుల్లో- కలిసికట్టుగా ముందుకు సాగుదాం’’. జాతీయ ఆరోగ్య మిషన్ డేటా ప్రకారం, భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు లక్ష మంది పిల్లలు అతిసారం కారణంగా మరణిస్తున్నారు. హ్యాండ్ వాష్ చేయడం వల్ల డయేరియా మరణాల రేటును 40 శాతానికి పైగా తగ్గించవచ్చు: యునిసెఫ్ -
ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మసీ కేంద్రంగా భారత్
న్యూఢిల్లీ: స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏళ్లలో భారత్ ఆరోగ్య రంగంలో ఎనలేని పురోగతి సాధించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామి నాథన్ ప్రశంసించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మసీ కేంద్రంగా అవతరించిందని అన్నారు. ఎన్డీటీవీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆది వారం ఆన్లైన్ ద్వారా ఆమె పాల్గొన్నారు. పోలియో నిర్మూలన, మాతా శిశు సంరక్షణ కోసం వేసే వ్యాక్సిన్ల ద్వారా భారత్ ఆరోగ్య రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించిందని కొనియా డారు. అయితే కరోనా దెబ్బతో ఇతర అనారోగ్య సమస్యలకు భారత్ సహా ఇతర దేశాల్లో కూడా చికిత్స దొరకక పోవడం విచారకరమని అన్నారు. భారత్లో పౌష్టికాహార లోపంతో అయిదేళ్ల లోపు చిన్నారులు అధికంగా మృత్యువాత పడుతున్నారని యూనిసెఫ్ నివేదికను ప్రస్తావించిన ఆమె కరోనా ఈ దుస్థితిని మరింత తీవ్రం చేసిందని అన్నారు. కరోనా సంక్షోభంతో భారత్ సహా చాలా దేశాల్లో పేదరికం పెరిగిపోయిందని, పౌష్టికాహారం లభిం చక ఎన్నో వ్యాధులు చుట్టుముడుతున్నాయన్నారు. -
డబ్ల్యూహెచ్వో కీలక సూచనలు.. ఇకపై నర్సులూ..
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక వైద్యంలో నర్సులకు స్థానం కల్పించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. మందుల చీటీ (ప్రిస్కిప్షన్) రాసే అవకాశం కల్పించాలని పేర్కొంది. ఈ మేరకు మన దేశానికి కొన్ని సూచనలు చేస్తూ నివేదిక విడుదల చేసింది. బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ పూర్తయిన నర్సులకు ఆరు నెలల శిక్షణ ఇచ్చి వారితో మందులు ఇప్పించవచ్చని తెలిపింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్లకు ప్రత్యేకంగా నిర్ణీత కోర్సు చేసినవారికి ప్రిస్కిప్షన్ రాసే అవకాశం కల్పించారు. ఆ రాష్ట్రంలో రూరల్ మెడికల్ అటెండర్ (ఆర్ఎంఏ) వ్యవస్థ ఉంది. వారికి కొన్ని రకాల మందులు రాసే అధికారం, వైద్యం చేసేందుకు అవకాశం కల్పిం చారు. ఎసిడిటీ మందులు, యాంటీబయోటిక్స్, టీబీ, మలేరియా, లెప్రసీ, అమీబియాసిస్, గజ్జి, తామర, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, వైరస్కు సంబంధించిన మందులు ఇవ్వొచ్చు. వాంతులు, జ్వరాలు, నొప్పు లు, విరేచనాలు, ఆస్తమా, దగ్గు, గర్భం ఆపే మందులు, విటమిన్లు, సాధారణ ప్రసవాలు జరిగాక మందులను ఇచ్చే అవకాశం ఆర్ఎంఏలకు ఇచ్చారు. వాళ్లే కొన్ని ఆపరేషన్లు చేస్తున్నారు. దెబ్బతగిలితే కుట్లు వేయడం, కాలిన గాయాలకు డ్రెసిం గ్ చేయడం, ఎముకలు విరిగితే కట్లు కట్టడం, ప్రమాదం జరిగితే రక్తస్రావం జరగకుండా చేయడం, ప్రసవాలు చేయడం, ప్రసవాల్లో చిన్నచిన్న సమస్యలు వస్తే వాటికి చికిత్స చేయడం, రక్తస్రావాలు జరిగితే ఆపడం వంటివి చేయాలి. అయితే పోస్ట్మార్టం, మెడికల్ లీగల్ కేసులు వంటి వాటిలో నర్సులకు అవకాశం కల్పించలేదు. ఇలా చత్తీస్ఘడ్ మాదిరిగా దేశవ్యాప్తంగా అమలుచేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ)లో మిడ్ లెవల్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు మందుల చీటీ ఇవ్వొచ్చని ఉంది. ఆ ప్రకారం నర్సులకు కూడా అవకాశం కల్పించాలని సూచించింది. డాక్టర్ల కొరత ఉన్నందున... కోవిడ్ వల్ల దేశంలో డాక్టర్లు ఆయా చికిత్సలపై దృష్టి సారించాల్సి వచ్చింది. పైగా భారత్లో డాక్టర్లు కొరత ఉంది. 11 వేల మందికి ఒక ప్రభుత్వ డాక్టర్ ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. వెయ్యి జనాభాకు ఒక డాక్టర్ ఉండాలి. తక్కువ ఉన్నందున ఆ కొరతను నర్సులతో పూడ్చవచ్చు. దేశంలో యూనివర్సల్ హెల్త్ కేర్ను తీసుకురావాలని భావిస్తున్నారు. కాబట్టి వైద్య సిబ్బందిని వాడుకోవాలి. వైద్య పరిశోధనల్లో తేలిందేంటంటే.. ప్రాథమిక ఆరోగ్యంలో నర్సులు, వైద్యులు చేసే వైద్యంలో పెద్దగా తేడా లేదు. డాక్టర్లు, నర్సులు చేసిన చికిత్సలు సమానంగా ఉన్నాయి. అంతేకాదు అమెరికాలో శిక్షణ పొందిన నర్సులు వైద్యంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మరికొన్ని అంశాలు ►నర్సులు రోగంపై సొంతంగా నిర్ణయం తీసుకొని మందులు ఇవ్వడం లేదా డాక్టర్ పర్యవేక్షణలో ఇవ్వడం లేదా రెండు పద్ధతుల్లో ఇవ్వడం వంటివి చేయవచ్చు. యూకే, యూఎస్, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్లో ఈ పరిస్థితి ఉంది. పోలండ్లో మాస్టర్ నర్సింగ్ కోర్సు చేసినవారికి మందులు ఇచ్చే అవకాశం కల్పించారు. డెన్మార్క్లో డాక్టర్ పర్యవేక్షణలో నర్సులు మందులు ఇచ్చే పరిస్థితి ఉంది. ►భారత్లో దశల వారీగా కొన్ని నిర్ణీత జబ్బులకు మందులు ఇచ్చే అవకాశం కల్పించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ►ప్రస్తుతం ఇండియాలో మెడికల్ ప్రాక్టీషనర్లు మాత్రమే మందులు ఇవ్వాలన్న నిబంధన ఉంది. దాన్ని సవరించాలి. ఆ ప్రకారం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ట్ యాక్ట్–1940ని సవరించాలి. అలాగే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ యాక్ట్–1947ను సవరిస్తూ, వారికి అధికారాలు కల్పించాలి. ఎన్ఎంసీ–2019 యాక్ట్లో కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్ జాబితాలో నర్సులను చేర్చాలి. ►నర్సింగ్ విద్యలో పెనుమార్పులు తీసుకురావాలి. ప్రాక్టీస్ చేయడానికి ముందు వారికి శిక్షణ ఇవ్వాలి. ప్రస్తుతం మాస్టర్ నర్సింగ్లో నర్స్ ప్రాక్టీషనర్ ఇన్ క్రిటికల్ కేర్ అనే కోర్సు ఉంది. దాని తరహాలో నర్సింగ్లో కోర్సు పెట్టాలి. ►కొన్ని మందులతో ప్రారంభించి వాటిని పెంచుకుంటూ పోవాలి. ప్రాథమిక వైద్యం డిగ్రీ నర్సింగ్లోనే కోర్సు ఉండాలి. ïజిల్లా, మెడికల్ కాలేజీల్లో పనిచేసే వారికోసం పీజీ లెవల్లో ప్రత్యేక కోర్సు ఉండాలి. -
Covid-19:అసలైన కరోనా వ్యాక్సిన్లను గుర్తించడం ఇలా..
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్లకు నకిలీలు పుట్టుకురావడం ఆందోళన కలిగిస్తోంది. నకిలీ వ్యాక్సిన్లతో ఆరోగ్యానికి ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో నకిలీ కోవిïÙల్డ్ వ్యాక్సిన్లను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) రెండు వారాల క్రితం వెల్లడించింది. ఈ నేపథ్యంలో అసలైన టీకాలను కనిపెట్టడం ఎలా అన్నదానిపై కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. భారత్లో ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుతి్నక్–వి టీకాలను ప్రజలకు ఇస్తున్నారు. కోవిషీల్డ్ను పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్, కోవాగ్జిన్ను హైదరాబాద్లోని భారత్ బయోటెక్ సంస్థ ఉత్పత్తి చేస్తున్నాయి. అసలైన టీకాలను ఎలా గుర్తించాలో చూద్దాం.. కోవిషీల్డ్ ► లేబుల్ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ► వయల్పై అల్యూమినియం మూత పైభాగం కూడా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ► ట్రేడ్మార్కుతో సహా కోవిషీల్డ్ అనే బ్రాండ్ నేమ్ స్పష్టంగా కనిపిస్తుంది. ► జనరిక్ పేరు బోల్డ్ ఆక్షరాల్లో కాకుండా సాధారణంగా ఉంటుంది. ► సీజీఎస్ నాట్ ఫర్ సేల్ అని ముద్రించి ఉంటే అసలైనదిగా గుర్తించాలి. ► వయల్పై లేబుల్ అతికి ఉన్నచోట ఎస్ఐఐ లోగో కనిపిస్తుంది. ► ఎస్ఐఐ లోగో నిట్టనిలువుగా కాకుండా కొంత వంపుగా ఉంటుంది. ► లేబుల్పై కొన్ని అక్షరాలను ప్రత్యేకమైన తెల్ల సిరాతో ముద్రిస్తారు. ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. సులభంగా చదవొచ్చు. ► మొత్తం లేబుల్పై తేనెపట్టు లాంటి చిత్రం ఒక ప్రత్యేకమైన కోణంలో చూస్తే కనిపిస్తుంది. కోవాగ్జిన్ ► లేబుల్పై డీఎన్ఏ నిర్మాణం లాంటి చిత్రం అతినీలలోహిత కాంతిలోనే కనిపిస్తుంది. ► లేబుల్పై సూక్ష్మమైన చుక్కలతో కోవాగ్జిన్ అని రాసి ఉంటుంది. కోవాగ్జిన్ అని రాసి ఉన్న హోలోగ్రామ్ కూడా అతికించి ఉంటుంది. -
టీకాలకు లొంగని ఎంయూ వేరియంట్: డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
WHO Warns On MU Variant Of Covid 19 జెనీవా: కోవిడ్–19 మహమ్మారిలో ప్రమాదకరమైన కొత్త రకాలు పుట్టుకొస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఎంయూ (బి.1.621) అనే కొత్త వేరియంట్ను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ టీకాలకు లొంగడం కష్టమన్న సంకేతాలు కనిపిస్తున్నాయని హెచ్చరించింది. అంటే ఇప్పుడు అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్లను తట్టుకొనే శక్తి ఈ కొత్త వేరియంట్కు మెండుగా ఉందని తెలిపింది. బి.1.621 వేరియంట్ కరోనాను తొలుత ఈ ఏడాది జనవరిలో కొలంబియాలో గుర్తించారు. అనంతరం యూరప్తోపాటు అమెరికా, యూకే, హాంకాంగ్లో ఈ వేరియంట్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదైనట్లు డబ్ల్యూహెచ్ఓ తాజాగా తమ వీక్లీ బులెటిన్లో వెల్లడించింది. (చదవండి: న్యూయార్క్లో తుపాను బీభత్సం) ఇప్పటిదాకా 39 దేశాల్లో ఎంయూ రకం కరోనా ఆనవాళ్లను గుర్తించినట్లు పేర్కొంది. ఎంయూ అనేది నిశితంగా గమనించిదగ్గ (వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్) వేరియంట్ అని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో ఎంయూ వేరియంట్ కేసులు 0.1 శాతం కంటే తక్కువగానే ఉన్నాయి. కొలంబియా, ఈక్వెడార్లో మాత్రం దీని తీవ్రత అధికంగా కనిపిస్తోంది. ఎంయూ వేరియంట్ను డబ్ల్యూహెచ్ఓ ఆగస్టు 30న వాచ్లిస్టులో చేర్చింది. దక్షిణాఫ్రికాలో బయటపడిన బీటా వేరియంట్ తరహాలోనే ఎంయూ వేరియంట్ సైతం మనుషుల్లో రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకుంటున్నట్లు తమ ప్రాథమిక అధ్యయనంలో తేలిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. (చదవండి: కొత్త ప్లాన్తో ముందుకొస్తున్న టీఎస్ఆర్టీసీ..!) -
పాఠశాలలు ప్రారంభించాల్సిందే: డబ్ల్యూహెచ్వో చీఫ్ సైంటిస్ట్
జెనీవా: కరోనా వైరస్ ముప్పు ఉన్నప్పటికీ పాఠశాలలు ప్రారంభించడానికే ప్రపంచ దేశాలన్నీ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ పిలుపునిచ్చారు. కరోనా వైరస్ ప్రభావం పరోక్షంగా విద్యారంగంపై తీవ్రస్థాయిలో ఉందని చెప్పారు. కోవిడ్–19 ఉందని పిల్లల్ని నాలుగ్గోడల మధ్య ఉంచితే దీర్ఘకాలంలో వారిలో మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్–19 నిబంధనలన్నీ పాటిస్తూ, సకల జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలలను పునఃప్రారంభించడమే మంచిదన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులతో పాటు సిబ్బంది అందరికీ వ్యాక్సిన్లు తప్పనిసరిగా ఇవ్వాలని, ఇండోర్ సమావేశాలకి దూరంగా ఉండాలని సూచిస్తూ సౌమ్య స్వామినాథన్ ట్వీట్ చేశారు. భారత్లో కోట్ల మంది పిల్లలు హఠాత్తుగా స్కూలుకి వెళ్లడం మానేశారని, దీంతో వారి చదువు బాగా దెబ్బతిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలపై మూడో వేవ్ ప్రభావం చూపిస్తుందని అనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవన్నారు. ఆరునెలలు జాగ్రత్తలు పాటించాలి ‘నాకు తెలుసు అందరూ అలిసిపోయారు. ప్రతీ ఒక్కరూ బంధుమిత్రుల్ని కలుసుకోవాలని, విందు వినోదాలు ఏర్పాటు చేసుకోవాలని తహతహలాడుతున్నారు. కాస్త ఓపిక వహించాలి. మరో ఆరు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పటికి వ్యాక్సినేషన్ ఎక్కువ మందికి ఇవ్వడం పూర్తయితే నెమ్మదిగా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయి’ అని అన్నారు. -
కోవాగ్జిన్పై ఆరు వారాల్లో నిర్ణయం
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవాగ్జిన్ కోవిడ్ టీకాకు వచ్చే ఆరు వారాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర వినియోగ అనుమతిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్ఓ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. సెంటర్ ఫర్ సైన్స్అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) ఏర్పాటు చేసిన ఒక వెబినార్లో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడారు. డబ్ల్యూహెచ్ఓ అత్యవసర వినియోగ జాబితా(ఈయూఎల్)లో ఏదైనా కొత్త టీకాను చేర్చాలంటే అది నిర్దేశిత పనితీరు స్థాయిని చేరుకోవాల్సి ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. కనీసం మూడు నుంచి నాలుగు ట్రయల్స్కు చెందిన వివరాలను డబ్ల్యూహెచ్ఓకు అందించాలని తెలిపారు. డబ్ల్యూహెచ్ఓలోని నిపుణుల సలహా బృందం ఆయా సమాచారాన్ని విశ్లేషించి అనుమతుల జారీపై తమ సూచనలు ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. కోవాగ్జిన్కు చెందిన సమాచారం ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓకు చేరిందని అని తెలిపారు. నెలన్నరలోగా కోవాగ్జిన్ అత్యవసర వినియోగ జాబితాలో చేరే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఫైజర్/బయోఎన్టెక్, ఆస్ట్రాజెనెకా–ఎస్కే బయో/ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆస్ట్రాజెనెకా ఈయూ, జాన్సెన్, మోడెర్నా, సినోఫార్మ్ టీకాలను డబ్ల్యూహెచ్వో తమ ఈయూఎల్ జాబితాలో ఇప్పటికే చేర్చింది. మరో 105 వ్యాక్సిన్లు కూడా వివిధ దశల ట్రయల్స్లో ఉన్నాయని వెల్లడించారు. అందులో 27 వ్యాక్సిన్లు మూడు/నాలుగు ట్రయల్స్ను దాటాయని పేర్కొన్నారు. మరో 184 వ్యాక్సిన్లు ప్రీ క్లినికల్ దశలో ఉన్నాయని చెప్పారు. ఇటీవల డెల్టా వేరియంట్ తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ, జాగ్రత్తలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. -
డెల్టా ఉంది.. ల్యామ్డా వచ్చేసింది?
కొత్తా దేవుడండి.. కొంగొత్తా దేవుడండి... అప్పుడెప్పుడో వచ్చిన తెలుగు సినిమా పాట పల్లవిది! ఇప్పుడు తరచూ దీన్ని మార్చి పాడుకోవాల్సిన పరిస్థితి! ఎందుకంటారా? ఏముందీ.. ఇంకో కొత్త కరోనా రూపాంతరితం అవతరించిందట! ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్లు ఎక్కడికీ పోలేదు కానీ... పాతికకుపైగా దేశాల్లో ఇప్పుడు ల్యామ్డా కలకలం మొదలైంది! కంగారేమీ లేదు లెండి.. ప్రస్తుతానికి దీంతో ముప్పు తక్కువే. దేశంలో రెండో దశ కరోనాలో విధ్వంసం సృష్టించిన డెల్టా రూపాంతరితం ఇప్పుడు ఇతర దేశాల్లో విజృంభిస్తూంటే.. కొన్ని దేశాల్లో ల్యామ్డా ఆందోళన రేకెత్తిస్తోంది. నిజానికి ఇది కొత్తగా కనుక్కున్న రూపాంతరితం ఏమీ కాదు. గత ఏడాది ఆగస్టులోనే దక్షిణ అమెరికా దేశమైన పెరూలో దీన్ని గుర్తించారు. ఆ తరువాత అది సుమారు 30 దేశాలకు విస్తరిం చింది కూడా. కానీ ఇప్పటివరకూ భారత్లో ఈ కొత్త రూపాంతరిత వైరస్ సోకిన వారు ఎవరూ లేరు. గత నెల 14న ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్గా ప్రకటించింది. అప్పటివరకూ దీనికున్న సాంకేతిక నామం సి.37. కరోనా వచ్చిన తరువాత గుర్తించిన ఏడవ వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్ ఇది. మనకేమైనా ప్రమాదమా? భారత్తోపాటు, మన ఇరుగుపొరగు దేశాల్లోనూ ఇప్పటివరకూ ల్యామ్డా రూపాంతరితాన్ని గుర్తించలేదు. ఆసియా మొత్తమ్మీద ఒక్క ఇజ్రాయెల్లోనే దీన్ని గుర్తించారు. అయితే యూరోపియన్ దేశాలు కొన్నింటిలో ఈ వైరస్ ఉన్న కారణంగా, ఆ దేశాల నుంచి భారత్కు రాకపోకలు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్న నేపథ్యంలో ల్యామ్డాపై కొంచెం జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యాక్సీన్లు వేసుకున్న వారికీ ఈ వైరస్ సోకే అవకాశం ఉండటం కొంత ఆందోళన కలిగించే విషయమే. మూక నిరోధకతకు దగ్గరగా ఉన్న యూరోపియన్ దేశాల్లో కూడా మళ్లీ మళ్లీ కేసులు ఎక్కువ అవుతూండటం గమనించాల్సిన అంశం. లక్షణాలేమిటి? ల్యామ్డాను ఇప్పటివరకూ 30 దేశాల్లో గుర్తించారు. డెల్టా రూపాంతరితం మాదిరిగానే వేగంగా వ్యాపిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని రూఢీ చేసేందుకు ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం ఈ అధ్యయనాలు జరుగుతున్నాయి. పెరూతోపాటు దక్షిణ అమెరికాలోని పలు దేశాల్లో నమోదైన కేసుల్లో ల్యామ్డావే ఎక్కువ. ఒక దశలో పెరూలో నమోదైన కేసుల్లో 80 శాతం ఈ రూపాంతరితానివే కావడం గమనార్హం. ఇటీవలే యునైటెడ్ కింగ్డమ్లో అంతర్జాతీయ ప్రయాణాలు చేసే ఆరుగురికి ఈ వైరస్ సోకింది. ఫ్రాన్స్, జర్మ నీ, ఇటలీ వంటి యూరోపియన్ దేశాలతోపాటు ఆస్ట్రేలియాలోనూ దీని ఉనికిని గుర్తించారు. జన్యుమార్పులేమిటి? వైరస్ పరిణామ క్రమంలో మ్యుటేషన్లు (జన్యుమార్పులు) సహజం. అయితే ఈ మ్యుటేషన్లు అన్నీ ప్రమాదకరం కాదు. ల్యామ్డా విషయానికి వస్తే దీని కొమ్ము ప్రొటీన్లో ఏడు ముఖ్యమైన జన్యుమార్పులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. డెల్టాలో ఈ సంఖ్య మూడు మాత్రమే. కొమ్ము ప్రొటీన్లో కీలకమైన మార్పులు జరిగాయి కాబట్టి ఈ వైరస్ డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తుందని, యాంటీబాడీలను (సహజంగా పుట్టేవైనా.. వ్యాక్సిన్ ద్వారా శరీరంలో ఉత్పత్తి అయ్యేవైనా) నిరోధించగలదని కొంతమంది అంచనా వేస్తున్నారు. చిలీలో ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ల్యామ్డా రూపాంతరితం యూకే, బ్రెజిల్లలో ముందుగా గుర్తించిన ఆల్ఫా కంటే ఎక్కువ నిరోధకత (యాంటీబాడీలకు) కలిగి ఉన్నట్లు తెలిసింది. చైనా వ్యాక్సిన్ సైనోవ్యాక్కు ల్యామ్డా స్పందించడం లేదని కూడా స్పష్టమైంది. అయితే పూర్తిస్థాయి అంచనాకు వచ్చేందుకు మరింత విస్తృత స్థాయిలో ఈ రూపాంతరితం తాలూకూ జన్యుక్రమాలను నమోదు చేసి పరిశీలించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కరోనా వేరియంట్లపై ‘డెల్టా’దే ఆధిపత్యం
ఐరాస/జెనీవా: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాల్లో కోవిడ్–19 వైరస్ డెల్టా వేరియంట్ వ్యాప్తిలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తెలియజేసింది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్న ఈ వేరియంట్ రాబోయే రోజుల్లో ఆధిపత్య (డామినెంట్) వేరియంట్గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 2021 జూన్ 29 నాటికి 96 దేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు బయటపడ్డాయని తెలిపింది. వాస్తవానికి ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉంటుందని పేర్కొంది. కరోనా వేరియంట్లను గుర్తించేందుకు అవసరమైన సీక్వెన్సింగ్ కెపాసిటీ చాలా దేశాల్లో పరిమితంగానే ఉందని వివరించింది. డెల్టా రకం కరోనా వల్ల పాజిటివ్ కేసులతోపాటు ఆసుపత్రుల్లో చేరే బాధితుల సంఖ్య పెరుగుతోందని వివరించింది. డెల్టా వ్యాప్తి తీరును గమనిస్తే ఇది రాబోయే కొన్ని నెలల్లో ఇతర అన్ని కరోనా వేరియంట్లను అధిగమించే పరిస్థితి ఉందని స్పష్టం చేసింది. కరోనా నియంత్రణ విషయంలో ప్రస్తుతం పాటిస్తున్న జాగ్రత్తలు, అమలు చేస్తున్న చర్యలు డెల్టాతో సహా ఆందోళనకరమైన వేరియంట్ల(వీఓసీ) నియంత్రణకు సైతం చక్కగా ఉపయోగపడుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ వెల్ల డించింది. ఆందోళనకరమైన వేరియంట్ల వ్యాప్తి పెరుగుతోందంటే అర్థం నియంత్రణ చర్యలను దీర్ఘకాలం కొనసాగించడమేనని తేల్చిచెప్పింది. వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని సూచించింది. నియంత్రణ చర్యలను గాలికొదిలేయడం వల్లే.. ఇప్పటివరకు గుర్తించిన కరోనా వేరియంట్లలో డెల్టా రకం వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్గా గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అడానోమ్ ఘెబ్రెయెసుస్ గతవారమే ప్రకటించారు. కరోనా వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతున్న దేశాల్లో ఇది అమిత వేగంతో వ్యాప్తి చెందుతోందని చెప్పారు. ఈ పరిణామం పట్ల ప్రపంచ దేశాలతోపాటు తాము కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. కొన్ని దేశాలను కరోనా ఆంక్షలను సడలించాయని, నియంత్రణ చర్యలను గాలికొదిలేశాయని, దీనివల్లే ప్రమాదకర వేరియంట్లు పంజా విసురుతున్నాయని పేర్కొన్నారు. తాజా గణాంకాల ప్రకారం.. అల్ఫా వేరియంట్ కేసులు 172 దేశాల్లో బయటపడ్డాయి. బీటా వేరియంట్ ఉనికి 120 దేశాల్లో వెలుగు చూసింది. ఇక గామా వేరియంట్ 72 దేశాల్లో, డెల్టా వేరియంట్ 96 దేశాల్లో వ్యాప్తి చెందుతున్నాయి. -
పారదర్శకంగా రాష్ట్రాలకు టీకా పంపిణీ
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు కోవిడ్–19 టీకా కేటాయింపులో వివక్ష కొనసాగుతోందంటూ మీడియాలో వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. జనాభా, కేసుల తీవ్రత, వినియోగ సామర్థ్యం, వృథా వంటి అంశాల ప్రాతిపదిక రాష్ట్రాలకు వ్యాక్సిన్లను పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వివరించింది. రాష్ట్రాలకు వ్యాక్సిన్ పంపిణీ పారదర్శకంగా లేదంటూ వస్తున్న ఆరోపణలు నిరాధారాలని తెలిపింది. కేంద్రం అమలు చేస్తున్న జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు, ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న మేలైన విధానాలు, శాస్త్రీయంగా, వివిధ అధ్యయనాల ఆధారంగా రూపుదిద్దుకుందని ఆరోగ్యశాఖ వివరించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సమన్వయంతో ఈ కార్యక్రమం సమర్థనీయంగా, ప్రభావవంతంగా అమలవుతోందని వెల్లడించింది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సమన్వయం చేసుకుంటూ.. సరఫరా చేసిన, వినియోగించిన, నిల్వ ఉన్న టీకా డోసుల వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తున్నట్లు తెలిపింది. చదవండి: వచ్చే 10–12 ఏళ్లలో ప్రపంచంలోనే టాప్–3లో ఉండాలి -
బాల భారతం.. బలహీనం
న్యూఢిల్లీ: భారత్లో కరోనా మహమ్మారి విసిరిన పంజాకు లక్షల కుటుంబాల ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఎన్నో కుటుంబాలు పేదరికంలోకి జారిపోయాయి. ఫలితంగా ఆయా కుటుంబాల్లోని పిల్లలకు సరైన పోషకాహారం అందడం లేదు. బాల భారతం బలహీనంగా మారుతోంది. దేశంలో గత ఏడాది నవంబర్ నాటికి ఆరు నెలల నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారుల్లో 9,27,606 మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు తేలిందని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ వెల్లడించింది. బాధితుల్లో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్, బిహార్లోనే ఉన్నారని తెలియజేసింది. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చింది. పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల గణాంకాలను విడుదల చేసింది. దీనిప్రకారం.. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 3,98,359 మంది, బిహార్లో 2,79,427 మంది బాధిత బాలలు ఉన్నారు. లద్దాఖ్, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మధ్యప్రదేశ్లో తీవ్రమైన పోషకాహార కొరతను ఎదుర్కొంటున్న చిన్నారులెవరూ లేకపోవడం గమనార్హం. అనారోగ్య ముప్పు అధికం ఎత్తుకు తగిన బరువు లేకుండా... చాలా బలహీనంగా ఉంటే తీవ్రమైన పోషకాహార లోపంగా (ఎస్ఏఎం) ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్వచించింది. ఈ సమస్యతో బాధపడుతున్న చిన్నారులు ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ బరువు ఉంటారు. వారిలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. అందువల్ల సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే.. అలాంటి వారికి ఏదైనా వ్యాధి సోకితే మరణించే అవకాశాలు 9 రెట్లు అధికంగా ఉంటాయి. కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్న బాలల సంఖ్య ఇంకా పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ‘‘దేశంలో కరోనా మహమ్మారి వల్ల చాలామంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోతున్నారు. నిరుద్యోగ సమస్య వేగంగా పెరుగుతోంది. ఆర్థిక సంక్షోభం ఇప్పటికే మొదలయ్యింది. ఫలితంగా ఆకలి రక్కసి కాటేస్తోంది. ఆకలి ఉన్నచోట పోషకాహార సమస్య కచ్చితంగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేయాలి’’అని హెచ్ఏక్యూ సెంటర్ ఫర్ చైల్డ్ రైట్స్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు ఇనాక్షీ గంగూలీ సూచించారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ గణాంకాల ప్రకారం.. 2020 నవంబర్ నాటికి ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు చిన్నారుల్లో తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నవారు మహారాష్ట్రలో 70,665 మంది, గుజరాత్లో 45,749, ఛత్తీస్గఢ్లో 37,249, ఒడిశాలో 15,595, తమిళనాడులో 12,489, జార్ఖండ్లో 12,059, ఆంధ్రప్రదేశ్లో 11,210, తెలంగాణలో 9,045, అస్సాంలో 7,218, కర్ణాటకలో 6,899, కేరళలో 6,188, రాజస్తాన్లో 5,732 మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 10 లక్షలకు పైగా అంగన్వాడీ కేంద్రాల నుంచి ఈ సమాచారం సేకరించారు. పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడంలో అంగన్వాడీ కేంద్రాలదే కీలక బాధ్యత అని ఇనాక్షీ గంగూలీ చెప్పారు. చిన్నారులు, కౌమార బాలికలు, మహిళల్లో పోషకాహార సమస్యను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం 2018లో పోషన్ అభియాన్ పథకాన్ని ప్రారంభించింది.