books
-
Bangladesh: షేక్ హసీనా మాయం.. భారత్ సహకారం తుడిచివేత
ఢాకా: బంగ్లాదేశ్ ప్రభుత్వం(Government of Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనాపై తీవ్ర వివక్ష చూపింది. దేశంలోని పాఠ్యపుస్తకాలలో ఆమె పేరును తొలగించింది. పాఠశాల పాఠ్యపుస్తకాలలో ప్రధాన మార్పులు చేసిన దరిమిలా ఈ వివరాలు వెలుగు చూశాయి. ఇదేవిధంగా పాకిస్తాన్ భారతదేశానికి లొంగిపోతున్నట్లు కనిపించే ఒక చారిత్రక ఫోటోను కూడా పాఠ్యాంశాల నుంచి తొలగించారు.గత సంవత్సరం బంగ్లాదేశ్లో చోటుచేసుకున్న పలు అల్లర్ల దరిమిలా షేక్ హసీనా(Sheikh Hasina) బంగ్లాదేశ్ ప్రధానికి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తరువాత అక్కడ ఏర్పడిన నూతన ప్రభుత్వం పాఠశాల పుస్తకాలలో పలు మార్పులు చేసింది. వాటిలో భారతదేశానికి సంబంధించిన వివరాలలో కూడా మార్పులు చేసింది. షేక్ హసీనాకు సంబంధించిన అన్ని చిత్రాలు, అధ్యాయాలను పాఠ్య పుస్తకాల నుంచి పూర్తిగా తొలగించారు. ఇదేవిధంగా బంగ్లాదేశ్ స్వాతంత్ర్య ఉద్యమంలో భారతదేశం పాత్రను తొలగించనప్పటికీ, నాటి ప్రధాని ఇందిరా గాంధీతో పాటు ముజిబురహ్మాన్ ఉన్న ఫోటోలను తొలగించారు.పుస్తకాల వెనుక కవర్ పేజీపై షేక్ హసీనా విద్యార్థుల కోసం అందించిన సందేశాన్ని తొలగించారు. హసీనాపై తిరుగుబాటు జూలై 2024లో ప్రారంభమైంది. ఈ తిరుగుబాటుకు సంబంధించిన ఫొటోలను నూతన పాఠ్యపుస్తకాల వెనుక కవర్ పేజీపై ముద్రించారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ మార్పులను నేషనల్ కరికులం అండ్ టెక్స్ట్బుక్ బోర్డ్ (ఎన్సీటీబీ)చేసింది. ఇందుకోసం బంగ్లాదేశ్ విద్యా మంత్రిత్వ శాఖ 57 మందికి పైగా నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత మాధ్యమిక పాఠశాలలకు చెందిన 441 పుస్తకాలలో ఈ విధమైన మార్పులు చేశారు. 40 కోట్లకు పైగా కొత్త పుస్తకాలు ఇప్పటికే ముద్రితమయ్యాయి.డిసెంబర్ 1971లో భారత్, బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమరయోధులు(Freedom fighters) పాకిస్తాన్కు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. ఫలితంగా బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పాటయ్యింది. దీనిని వివరిస్తూ ఐదవ తరగతి పాఠ్య పుస్తకంలో ఒక అధ్యాయం ఉంది. దీనిలో ఒక చారిత్రక ఛాయాచిత్రం ఉంది. చిత్రంలో పాకిస్తాన్.. భారత్కు లొంగిపోవడాన్ని చూపుతుంది. పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ తమ లొంగుబాటు పత్రాన్ని భారత సైన్యం లెఫ్టినెంట్ జనరల్ జగ్జిత్ సింగ్ అరోరాకు అందిస్తున్నట్లుంది. అయితే ఈ ఫోటోను ఇప్పుడు పాఠ్య పుస్తకాల నుంచి తొలగించారు.ఆరో తరగతి ఇంగ్లీష్ పుస్తకంలో నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ, బంగ్లా ప్రధాని ముజిబురాహ్మాన్ సంయుక్తంగా ఉన్న ఫొటోను తొలగించారు. ఈ ఫొటో ఫిబ్రవరి 6, 1972 నాటిది. ఇంతేకాకుండా బంగ్లా జాతీయ జెండా, జాతీయ గీతాన్ని పుస్తకాల మొదటి పేజీ నుండి తొలగించి వెనుక భాగంలో ముద్రించారు. నిపుణుల బృందం పుస్తకాలలో జాతీయ జెండా, గీతం అవసరం లేదని భావించింది. వీటిని పూర్తిగా తొలగించాలా వద్దా అనేది తర్వాత నిర్ణయిస్తామని విద్యాశాఖాదికారులు తెలిపారు.ఇది కూడా చదవండి: నేటి నుంచి ప్రధాని మోదీ గుజరాత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే.. -
దేవభూమి
గతేడాది డిసెంబర్ 25న మరణించిన మలయాళ మహారచయిత ఎమ్.టి.వాసుదేవన్ నాయర్ తన సాహిత్య జీవితంలో తనను బాగా కదిలించిన ఒక అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన 1976లో తీవ్రమైన అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో ఉన్నారు. అప్పుడో పల్లెటూరతను వచ్చి, ఆయనంటే అభిమానమని చెప్పడమే కాదు, ‘మీరు జబ్బుతో ఉన్నారని తెలిసి సేవ చేయడానికి వచ్చాను. కొన్ని పనులు మగ నర్సులే చేయాల్సి ఉంటుంది. మీకు నయమయే దాకా ఆ పనులు చేస్తాను’ అన్నాడట. మనిషి మానసిక ఘర్షణల మీద ఎక్కువ దృష్టి పెట్టిన ఎమ్టీ విస్తారంగా రాశారు. కథలు, నవలలు, యాత్రా రచనలు, బాల సాహిత్యం, విమర్శతో పాటు సినిమాలకు స్క్రీన్ ప్లే రచనలు చేయడమే కాకుండా, అత్యుత్తమ చిత్రాలు అనదగ్గవాటికి దర్శకత్వమూ వహించారు. కేరళ సంస్కృతి మీద ఆయన ప్రభావం ఎనలేనిది. ఆ పల్లెటూరి మనిషి ఎమ్టీ రచనలు చదవడమే కాదు, ఆయన కోసం తన వ్యవసాయ పనులను ఆపుకొని మరీ వచ్చాడు. ఏ రచయితకైనా తన రచనా ప్రయాణంలోని కష్టాల బరువు దిగిపోయే ఘట్టమిది. సహజంగానే ఆ స్పందనకు వాసుదేవన్ నాయర్ కళ్లు చెమ్మగిల్లాయి. ఇది ఒక గొప్ప రచయితగా వాసుదేవన్ నాయర్కు జరిగిన ఒక విడి అనుభవమే కావొచ్చు; కానీ మలయాళీయుల సాహిత్య సంపన్నతకు అది గుర్తు. పామరులను కూడా సాహిత్యం ఎలా పెనవేసుకుపోయిందో చెప్పడానికి నిదర్శనం. ఎందుకంటే, ఇదే వాసుదేవన్ నాయర్ మరో సందర్భంలో ఒక గ్రామీణుడు ఆయన దగ్గర ఉచితంగా పుస్తకం తీసుకోవడానికి నిరాకరించి, అతడి దగ్గరున్న ముడుతలు పడిన నోట్లు బలవంతంగా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ నేల అలాంటిది. దోస్తోవ్స్కీ లాంటి రష్యన్ రచయిత మీద కూడా ఒక సాధారణ ఆటోడ్రైవర్ తనదైన అభిప్రాయాన్ని కలిగివుంటాడని మురిసిపోయే మలయాళీ సాహిత్యజీవులు ఎందరో! ‘స్వర్గాన్ని నేను ఎప్పుడూ ఒక రకమైన గ్రంథాలయంలా ఊహిస్తాను,’ అంటారు అర్జెంటీనా రచయిత జార్జ్ లూయీ బోర్హెస్. పుస్తకాలను మించిన పెన్నిధి ఏముంది! గ్రంథాలయం అనేది ఒక ఆశ. ఒక దారిదీపం. ఎమ్టీ సహా చాలామంది రచయితలు తాము రచయితలు కావడానికి ఒక కారణంగా ‘ఎక్కువ సమయం లైబ్రరీలో గడపడం’ అని చెబుతారు. అత్యంత ప్రకృతి రమణీయత వల్ల కాబోలు కేరళను దేవభూమి అని పిలుస్తుంటారు. కానీ అక్కడి గ్రంథాలయాల వల్ల కూడా అది దేవభూమి అవుతోంది. రాష్ట్రంలో ఎనిమిది వేలకు పైగా లైబ్రరీలు ఉండటమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ముప్పైకి పైగా పెద్ద సాహిత్య ఉత్సవాలు జరుగుతుంటాయి. దేశంలో ప్రతి పంచాయితీలో దాదాపు ఎనిమిది గ్రంథాలయాలున్న ఏకైక రాష్ట్రం కేరళ. దేశంలో అత్యధిక పబ్లిక్ లైబ్రరీలున్న రాష్ట్రం మహారాష్ట్ర (12,191). తర్వాతి స్థానంలో ఉన్న కేరళ (8,415)తో పోల్చితే మహారాష్ట్ర విస్తీర్ణం సుమారు ఎనిమిదింతలని గ్రహిస్తే కేరళ గొప్పదనం అర్థమవుతుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడిగా కూడా కేరళ సంఖ్యలో నాలుగో వంతైనా లేవు. అక్కడి గిరిజన గ్రామాల్లోనూ కొత్తగా 630 గ్రంథాలయాలను ఏర్పాటుచేయాలని గతేడాది నిర్ణయించారు. కేరళ గ్రంథాలయోద్యమ పితామహుడు పీ.ఎం.పణిక్కర్ వర్ధంతి అయిన జూన్ 19ని అక్కడ ‘రీడింగ్ డే’గా జరుపుతుంటారు. చదవడాన్నీ, చదివే వాతావరణాన్నీ మలయాళీయులు ఎంతగా ప్రోత్సహిస్తున్నారనడానికి ఇది రుజువు. ఈమధ్య ‘కేరళ లెజిస్లేచర్ ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్–2025’ ప్రారంభిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, ‘ప్రపంచ పుస్తక రాజధాని’గా తిరువనంతపురంను ‘యునెస్కో’ గుర్తించాలని కోరింది అందుకే. తమ రాజధాని నగరం ఆ గౌరవానికి పూర్తిగా అర్హమైనదేనని ఆయన ధీమా!గతేడాదే ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో కేరళలోని మరో నగరమైన కోళిక్కోడ్ను ‘సాహిత్య నగరం’గా గుర్తించిన సంగతి ఇక్కడ గుర్తుచేసుకోవాలి. భారత్లో యునెస్కో గౌరవం దక్కించుకున్న తొలి నగరం ఇదే. ఒక్క కోళిక్కోడ్లోనే 600 గ్రంథాలయాలు, రీడింగ్ రూములు ఉన్నాయి. వాసుదేవన్ నాయర్, వైకోం మహమ్మద్ బషీర్, పి.వత్సల లాంటి ఎందరో రచయితలకు కోళిక్కోడ్తో అనుబంధం ఉంది. యునెస్కో మొదలైన 1945లోనే కేరళలో ‘సాహిత్య ప్రవర్ధక సహకార సంఘం’ ఏర్పాటుకావడం ఆ రాష్ట్ర ఘన సాహిత్య వారసత్వాన్ని గుర్తుచేస్తోంది. పుస్తకాల ప్రచురణ కోసం కొంతమంది రచయితలు కలిసి ఏర్పాటుచేసిన ఈ సంఘం సుమారు 8,400 పుస్తకాలను ప్రచురించింది. మలయాళ సినిమా అంతగా వర్ధిల్లుతుండటానికి కూడా ఈ సాహిత్య దన్నే కారణం. అందుకే ప్రముఖ సినీ జర్నలిస్ట్ అనుపమా చోప్రా నవతరం మలయాళ దర్శకులను ఇంటర్వ్యూ చేస్తూ, ‘అసలు మీరు ఏంచదువుతారు? ఏం చూస్తారు?’ అని ప్రశ్నించారు.పుస్తక ప్రేమికులుగా వ్యక్తులు ఉండటం దానికదే విశేషమే. కానీ వ్యవస్థలు పుస్తకాన్ని ప్రేమిస్తే దాని ప్రభావం వేరే ఉంటుంది. ‘పర్వతము ఎంత ఎత్తయి గగన భేద్యమయినా దాని విశాలమైన వక్షస్థలము నుండి చిన్న సెలయేరుగాని ప్రవహించకపోతే ఆ ప్రకృతి సౌందర్యం అసమగ్రంగా ఒంటరిగా శుష్కంగా గోచరిస్తుంది, ’ అంటారు తన ‘జీవనలీల’ పుస్తకంలో కాకాసాహెబ్ కాలేల్కర్. ఒక ఇల్లు ఎంత ఘనంగా నిర్మించినా దానిముందు ఒక పూలచెట్టో, ఒక ఊరు ఎంత పెద్దదయినా దాని మధ్యన ఒక గ్రంథాలయమో లేకపోతే అవి అసంపూర్ణం అవుతాయి. పువ్వులు (ప్రకృతి), పుస్తకాలు (వివేకం) ఉన్న ప్రతిచోటూ దేవభూమే! -
కాంగ్రెస్ వల్లే బీజేపీ గెలిచింది: మమతా బెనర్జీ
కోల్కతా:కాంగ్రెస్ పార్టీపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఫెయిలవడం వల్లే 2024లో ఇండియా కూటమి కేంద్రంలో అధికారం దక్కించుకోలేకపోయిందని విశ్లేషించారు.బంగ్లార్ నిర్బచోన్ ఒ ఆమమ్రా పేరుతో తాను రాసిన మూడు పుస్తకాలను మమతా బెనర్జీ బుధవారం(జనవరి29) విడుదల చేశారు. ‘లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపు కోసం తృణమూల్ కాంగ్రెస్ శాయశక్తులా ప్రయత్నించింది. కూటమిలో పార్టీల అభ్యర్థులు ఒకరిపై ఒకరు పోటీ చేసుకోవడం వల్లే బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ రాణించకపోవడం ఇండియా కూటమి ఓటమికి కారణం’అని 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలపై మమత తన పుస్తకాల్లో లోతుగా విశ్లేషిచారు. -
సు‘దూర’ విద్య!
గుంటూరు ఎడ్యుకేషన్: దూరవిద్య ద్వారా పదో తరగతి, ఇంటర్ కోర్సుల్లో చేరిన అభ్యర్థులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. ఆగస్టులో అడ్మిషన్ పొందిన అభ్యర్థులకు డిసెంబర్ నెలాఖరుకు సైతం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయకుండా ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీఓఎస్ఎస్) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.2024–25 విద్యాసంవత్సరానికి ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నిర్వహించిన అడ్మిషన్ల ద్వారా టెన్త్, ఇంటర్ కోర్సుల్లో దాదాపు లక్ష మంది ప్రవేశం పొందారు. వీరికి వచ్చే ఏడాది మార్చిలో పరీక్షలు జరుగుతాయి. వీరందరికీ ప్రస్తుతం గుంటూరులోని ఏపీఓఎస్ ఎస్ రాష్ట్ర కార్యాలయం నుంచి పాఠ్య పుస్తకాలను పోస్టాఫీసుల ద్వారా పంపుతున్నారు. డిసెంబర్ నెలాఖరుకు సైతం పాఠ్య పుస్తకాలు అందే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇప్పటికి 30 వేల మందికి పైగా పుస్తకాలు అందించినట్టు ఏపీఓఎస్ఎస్ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. -
ట్రంప్ కలం నుంచి జాలువారిన అక్షరాలు
డొనాల్డ్ ట్రంప్ అనగానే వెంటనే గుర్తొచ్చేది అమెరికా అధ్యక్షుడిగానే కదా. ఆయన మంచి రచయితని చాలామందికి తెలియకపోవచ్చు. డబ్బు ఎలా సంపాదించాలి.. అందుకు ఎన్ని మార్గాలున్నాయి.. సమకూరిన డబ్బును ఎలా సమర్థంగా నిర్వహించాలి.. అనే చాలా విషయాలను ప్రస్తావిస్తూ కొన్ని పుస్తకాలు రాశారు. ప్రముఖ పుస్తకం ‘రిచ్డాడ్ పూర్డాడ్’ రచయిత రాబర్ట్ టి కియోసాకీ వంటి వారితో కలిసి సహ రచయితగా కూడా ట్రంప్ కొన్ని పుస్తకాలు రాశారు. డబ్బుకు సంబంధించి ట్రంప్ రాసిన పుస్తకాల వివరాలు కింది విధంగా ఉన్నాయి.1. 1987: ది ఆర్ట్ ఆఫ్ ది డీల్ అనే పుస్తకాన్ని టోనీ ష్వార్ట్జ్ తో కలిసి రాశారు.2. 2004: హౌటు గెట్ రిచ్3. 2004: థింక్ లైక్ బిలియనీర్: ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో ఎబౌట్ సక్సెస్, రియల్ ఎస్టేట్ అండ్ లైఫ్.4. 2005: సర్వైవింగ్ ఎట్ ది టాప్5. 2006: ట్రంప్ 101: ది వే టు సక్సెస్.6. 2006: వై వి వాంట్ యు టు రిచ్ - రాబర్ట్ టి కియోసాకితో కలిసి రాశారు.7. 2007: థింక్ బిగ్ అండ్ కిక్ ఆస్ ఇన్ బిజినెస్ అండ్ లైఫ్8. 2011: ట్రంప్ నెవర్ గివప్: హౌ ఐ టర్న్డ్ మై బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఇన్టు సక్సెస్.9. 2012: మిడాస్ టచ్: వై సమ్ ఎంటర్ప్రెన్యూర్స్ గెట్ రిచ్-అండ్ వై మోస్ట్ డోన్ట్-రాబర్ట్ టి కియోసాకి, మార్క్ బర్నెట్లతో కలిసి రాశారు.10. 2015: క్రిపుల్డ్ అమెరికా: హౌ టు మేక్ అమెరికా గ్రేట్ అగేన్డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే చాలా వ్యాపారాను స్థాపించి సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఆయన దృష్టి సారించిన కొన్ని కీలక వ్యాపారాలు కింది విధంగా ఉన్నాయి.రియల్ ఎస్టేట్ట్రంప్ తండ్రికి చెందిన ట్రంప్ మేనేజ్మెంట్ కంపెనీతో రియల్ ఎస్టేట్లో తన వ్యాపార కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత దానికి ట్రంప్ ఆర్గనైజేషన్గా పేరు మార్చారు. న్యూయార్క్ నగరంలోని ట్రంప్ టవర్, మియామిలోని ట్రంప్ నేషనల్ డోరాల్, ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోతో సహా అనేక స్థిరాస్తులను అభివృద్ధి చేశారు.హోటల్స్ అండ్ రిసార్ట్స్వాషింగ్టన్ డీసీలోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్, మియామీలోని ట్రంప్ నేషనల్ డోరాల్ సహా పలు హోటళ్లు, రిసార్టులను ట్రంప్ నిర్వహిస్తున్నారు.కాసినోలుఅట్లాంటిక్ సిటీలోని ట్రంప్ ప్లాజా, ట్రంప్ తాజ్ మహల్ వంటి ప్రాపర్టీలతో ట్రంప్ క్యాసినో వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అయితే, వీటిలో కొన్ని వెంచర్లు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని చివరకు దివాలా పిటిషన్ దాఖలు చేశాయి.గోల్ఫ్ కోర్సులున్యూజెర్సీలోని బెడ్మినిస్టర్లోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్, స్కాట్లాంట్లోని ట్రంప్ టర్న్బెర్రీతో సహా ప్రపంచవ్యాప్తంగా ట్రంప్నకు అనేక గోల్ఫ్ కోర్సులు ఉన్నాయి.లైసెన్సింగ్, బ్రాండింగ్ట్రంప్ వోడ్కా, ట్రంప్ స్టీక్స్, ట్రంప్ బ్రాండెడ్ దుస్తులు, ఇతర ఉపకరణాలతో సహా వివిధ ఉత్పత్తులు, సర్వీసులకు ట్రంప్ తన పేరుతో లైసెన్స్ తీసుకున్నారు.టీవీ షో2004-2015 వరకు అమెరికాలో ప్రసారమైన రియాలిటీ టీవీ షో ‘ది అప్రెంటిస్’కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.ఇదీ చదవండి: తులం బంగారం ధర ఎలా ఉందంటే..ఇదిలాఉండగా, హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న నేషనల్ బుక్ ఫెస్టివల్కు నగరంలోని చాలా ప్రాంతాల నుంచి పాఠకులు వస్తున్నారు. ఈ పుస్తక ప్రదర్శన గడువు డిసెంబర్ 19 నుంచి 29 వరకు ఉందని నిర్వాహకులు తెలిపారు. -
మంచినీళ్ల కుండ
‘చదువని వాడజ్ఞుండగు! చదివిన సదసద్వివేక చతురత గలుగున్ !’ అంటాడు పోతన తన ఆంధ్ర మహా భాగవతంలో. చదవకపోతే ఏమీ తెలీదు, చదువుకుంటేనే మంచీ చెడుల వివేకం కలుగుతుంది; అందుకే, ‘చదువంగ వలయు జనులకు! చదివించెద నార్యులొద్ద, చదువుము తండ్రీ!’ అని ప్రహ్లాదుడికి తండ్రి హిరణ్యకశ్యపుడితో చెప్పిస్తాడు. నిజంగానే ఆ గురువుల దగ్గరి చదువేదో పూర్తికాగానే, ‘చదివించిరి నను గురువులు! చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు! నే/ జదివినవి గలవు పెక్కులు! చదువులలో మర్మ మెల్ల జదివితి తండ్రీ!’ అని జవాబిస్తాడు ప్రహ్లాదుడు. కొడుకుకు కలిగిన వివేకం తండ్రి కోరుకున్నదేనా అన్నది పక్కనపెడితే, చదువనేది భిన్న ద్వారాలు తెరుస్తుందన్నది నిజం. ప్రహ్లాదుడు పుట్టు వివేకి కాబట్టి, తనకు కావాల్సిన సారాన్ని గ్రహించగలిగాడు. అందరికీ అలాంటి గుణం ఉంటుందా? అందుకే, ‘చదువులన్ని చదివి చాలవివేకియౌ/ కపటికెన్న నెట్లు కలుగు ముక్తి/ దాలిగుంటగుక్క తలచిన చందము’ అన్నాడు వేమన. ‘చదువులెల్ల చదివి సర్వజ్ఞుడై యుండి’నప్పుడు కూడా ఉండే బలహీనతలను ఎత్తిపొడిచాడు. ఆత్మసారం తెలుసుకోవడమే ముఖ్యమన్నాడు.అతడు ‘బాగా చదువుకున్నవాడు’ అంటే లోకాన్ని బాగా అర్థం చేసుకున్నవాడు, పరిణత స్వభావం ఉన్నవాడు, గౌరవనీయుడు, ఒక్క మాటలో వివేకి అని! వివేకం అనేది ఎన్నో గుణాలను మేళవించుకొన్న పెనుగుణమే కావొచ్చు. అయినా అదొక్కటే చాలా? ‘చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా/ చదువు నిరర్థకమ్ము’ అన్నాడు భాస్కర శతకకర్త మారవి వెంకయ్య. ‘బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం/పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!’ అని ప్రశ్నించాడు. కూరకు రుచి తెచ్చే ఉప్పులాగే జీవితంలో ‘యించుక’ రసజ్ఞత ఉండాలి. చాలామందిలో ఆ సున్నితం, ఆ సరస హదయం లోపించడం వల్లే సంబంధాలు బండబారుతున్నాయి. అందుకే వివేకం, రసజ్ఞతలను పెంచే చదువు ముఖ్యం. ఈ చదువు తరగతి చదువు కాదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరగతి గదిలోనే ఇవి అలవడితే అంతకంటే కావాల్సింది ఏముంది! ప్రపంచంలోకి దారి చూపే చదువు, ప్రపంచాన్ని చేరువ చేసే చదువు సాహిత్య రూపంలో ఉంటుంది. ఆ సాహిత్యం మంచి పుస్తకం రూపంలో హస్తభూషణమై ఉంటుంది.మనుషుల వివేకాన్ని కొలవదలిచినవాళ్లు ‘ఇప్పుడు ఏం చదువుతున్నారు?’ అని అడుగుతారు. చదవడం మాత్రమే సరిపోదు, ఆ చదువుతున్నది ఏమిటి? ‘నీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయన్నది విషయం కాదు, నీ దగ్గరున్న పుస్తకాలు ఎంత మంచివి అన్నదే ముఖ్యం’ అంటాడు గ్రీకు తత్వవేత్త సెనెకా. మంచిని ఎలా కొలవాలి? ‘మనల్ని గాయపరిచే, పోటుపొడిచే పుస్తకాలే మనం చదవాలి. తల మీద ఒక్క చరుపు చరిచి మేలుకొలపకపోతే అసలంటూ ఎందుకు చదవడం’ అంటాడు రచయిత ఫ్రాంజ్ కాఫ్కా. చదవడమే పెద్ద విషయం అయిన కాలంలో, దానికి ఇన్ని షరతులా అన్న ప్రశ్న రావడం సహజమే. ఎందుకంటే, ‘నేషనల్ లిటరసీ ట్రస్ట్’ నివేదిక ప్రకారం, భారతీయ చిన్నారుల్లో చదవడం దాదాపు సంక్షోభం స్థాయికి పడిపోయింది. 5–18 ఏళ్లవారిలో కేవలం మూడింట ఒక్కరు మాత్రమే తమ ఖాళీ సమయంలో చదవడాన్ని ఆనందిస్తామని చెప్పారు. కేవలం 20 శాతం మంది మాత్రమే, ప్రతిరోజూ ఏదో ఒకటి చదువుతున్నామని జవాబిచ్చారు. చదివే అలవాటును పెంచకపోతే, వికాసానికి దారులు మూస్తున్నట్టే!ఆధునిక తరానికి చదవడం మీద ఉత్సాహం కలిగించేలా, అయోమయ తరానికి రసజ్ఞత పెంచేలా ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ డిసెంబర్ 19 నుంచి 29 వరకు పాటు కాళోజీ కళాక్షేత్రం (ఎన్టీఆర్ స్టేడియం)లో జరగనుంది. మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి తొమ్మిది వరకు ఇది కొనసాగుతుంది. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, హిందీలో పేరున్న భిన్న ప్రచురణకర్తలు, విక్రేతలు, రచయితల స్టాళ్లు సుమారు 350 వరకు ఏర్పాటవుతాయి. నూతన పుస్తకాల ఆవిష్కరణలు, ఉపన్యాసాలు ఉంటాయి. 1985 నుంచి జరుగుతున్న ఈ బుక్ ఫెయిర్ను ఈసారి పదిహేను లక్షల మంది సందర్శిస్తారని అంచనా. ‘మనం అనేక పండుగలు చేసుకుంటాం. కానీ పుస్తకాల పండుగ ప్రత్యేకమైనది. పెద్ద జాతరలో మంచినీళ్ల కుండ లాంటిది బుక్ ఫెయిర్. ఏ రకమైనా కావొచ్చుగాక, అసలు పుస్తకాల వైపు రాగలిగితే మనిషికి వివేకం, వివేచన పెరుగుతాయి. జీవిత సారాన్ని అందించేదే కదా పుస్తకమంటే! ‘ఏడు తరాలు’ లాంటి నవలకు మనం ఎట్లా కనెక్ట్ అయ్యాం! పుస్తకాలు, అక్షరాలు లేకపోతే మనం ఎక్కడుండేవాళ్లం? అందుకే ఈసారి నచ్చిన, మెచ్చిన, ప్రభావితం చేసిన పుస్తకం అంటూ పుస్తకం కేంద్రకంగా కొన్ని సెషన్లు నిర్వహిస్తున్నాం’ అని చెబుతున్నారు బుక్ ఫెయిర్ అధ్యక్షుడు ‘కవి’ యాకూబ్. అయితే, పుస్తకాల దుకాణాల కన్నా, దగ్గర్లోని బజ్జీల బండికి గిరాకీ ఎక్కువ అనే వ్యంగ్యం మన దగ్గర ఉండనే ఉంది. అన్నింటిలాగే ఇదీ ఒక ఔటింగ్, ఒక వినోదం, బయటికి వెళ్లడానికి ఒక సాకు... లాంటి ప్రతికూల అభిప్రాయాలు ఉండనే ఉన్నాయి. ఏ వంకతో వెళ్లినా దేవుడి దగ్గరికి వెళ్లగానే భక్తిగా కళ్లు మూసుకున్నట్టు, పుస్తకం చూడగానే ఆర్తిగా చేతుల్లోకి తీసుకుంటున్నప్పుడు ఏ కారణంతో వెళ్తేనేం? కాకపోతే వ్యక్తిత్వానికి సరిపడే, వివేకం– రసజ్ఞతలను పెంచే పుస్తకాలను ఎంపిక చేసుకోవడమే పెద్ద పని. దానికోసం కొంత పొల్లు కూడా చదవాల్సి రావొచ్చు. కానీ క్రమంగా ఒక ఇంట్యూషన్ వృద్ధి అవుతుంది. అదే చదువరి పరిణతి. -
డాటర్ ఆఫ్ ఆలియ : రాహా ‘ఆహా’ అంటూ వింటుంది
‘ఆలియా భట్ నటి మాత్రమే కాదు, ఎంటర్ప్రెన్యూర్ కూడా’... ఈ వాక్యానికి కొనసాగింపుగా ‘చక్కని స్టోరీ టెల్లర్’ అనే ప్రశంసను కూడా చేర్చవచ్చు. ఎందుకంటే ఆలియా ప్రతి రాత్రి తన కూతురు రాహాకు ఏదో ఒక పిల్లల పుస్తకం చదివి వినిపిస్తుంది. రాహా ‘ఆహా’ అంటూ వింటుంది.‘తల్లిదండ్రులు తమ పిల్లల కోసం పుస్తకాలు చదవడం అనేది వారి భవిష్యత్కు పెట్టుబడి పెట్టడంలాంటిది’ అంటుది ఆలియాభట్. ‘ఎడ్–ఏ–మమ్మా’ అనే చిల్డ్రన్ బ్రాండ్ (ప్లేవేర్, స్టోరీ బుక్స్, టాయ్స్ అండ్ మోర్) వోనర్ అయినా ఆలియా తన బ్రాండ్లో కొత్త చిల్డ్రన్ బుక్ సిరీస్ను లాంచ్ చేసింది. ‘పిల్లల కోసం తల్లులు స్టోరీ టెల్లింగ్ సెషన్లు నిర్వహించడం అనేది మంచి విధానం’ అంటున్నారు మానసిక నిపుణులు. ‘బెడ్ మీద పిల్లలకు పుస్తకాలు చదివి వినిపించడం అనేది వారి మానసిక వికాసంపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఉచ్చారణలను, కొత్త పదాలను నేర్చుకుంటారు. పిల్లలకు కొత్త విషయాలు తెలియజేయడానికి ఇదొక అద్భుత సాధనం. ఇది పిల్లలతో తల్లిదండ్రుల భావోద్వేగ బంధాన్ని బలోపేతం చేస్తుంది. పిల్లల ఏకాగ్రతను పెంచుతుంది. రోజువారీ షెడ్యూల్లో ప్రతి రాత్రి పుస్తక పఠనాన్ని తప్పనిసరి చేయడం పిల్లల్లో క్రమశిక్షణను పెంచుతుంది’ అంటుంది కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ శృతి వస్త. -
అపురూపమైన పుస్తక నిధి.. బ్రౌన్ గ్రంథాలయం
సాక్షి ప్రతినిధి కడప: ఆంగ్లేయుడైనప్పటికీ తెలుగు భాషపై ఉన్న అభిమానంతో తన ఇంటినే గ్రంథాలయంగా మార్చిన మహనీయుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తెలుగు భాషాభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారు. అటువంటి మహనీయుడి పేరుమీద స్థాపించిన గ్రంథాలయం సాహితీవేత్తల కృషితో అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. దాతల సహకారంతో విలువైన పుస్తకాలు వచ్చి చేరాయి. ప్రస్తుతం రికార్డుల ప్రకారం దాదాపు లక్ష వరకు పుస్తకాలున్నాయి. సాధారణ కథల పుస్తకాలు, కవితా సంకలనాల నుంచి మహా పండితులు రాసిన కావ్యాలు, గ్రంథాలు, అత్యంత విలువైన పరిశోధక గ్రంథాలు ఈ గ్రంథాలయంలో ఉన్నాయి. ఆంగ్ల సాహిత్యానికి సంబంధించిన ప్రముఖ గ్రంథాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కడప నడి»ొడ్డున ఉన్న ఈ గ్రంథాలయం తెలుగు సాహితీ అభిమానులకు సందర్శనీయ స్థలంగా మారింది. కడప నగరంలో నిర్వహించిన జిల్లా రచయితల సంఘం ఉత్సవాలకు అతిథులుగా ప్రముఖ సాహితీవేత్తలు ఆరుద్ర, జీఎన్రెడ్డి, బంగోరె తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా కడపలో బ్రౌన్ నివసించిన శిథిల భవనాన్ని చూడాలని స్థానిక సాహితీవేత్త జానమద్ది హనుమచ్ఛాస్త్రిని కోరారు. దాన్ని చూసిన సాహితీవేత్తలు.. దీన్ని ఇలాగే వదిలేయొద్దని, నిరంతర సాహితీయజ్ఞం సాగిన ఈ పవిత్ర స్థలం భవిష్యత్తులో కూడా విరాజిల్లాలని బ్రౌన్ మహాశయుని పేరిట గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని హనుమచ్చాస్తికి సూచించారు. అందరూ నాటి కలెక్టర్ పీఎల్ సంజీవరెడ్డిని కలిసి విషయం వివరించారు. ఆయన సహకారంతో బ్రౌన్ గ్రంథాలయాన్ని నిరి్మంచాలని నిర్ణయించారు. కలెక్టర్ సహకారంతో స్థానిక సాహితీవేత్తలు, పెద్దలు బ్రౌన్ నివసించిన శిథిల భవనం స్థలాన్ని నాటి సీనియర్ ఆడిటర్ సీకే సంపత్కుమార్ నుంచి కానుకగా తీసుకున్నారు. జానమద్ది హనుమచ్ఛా్రస్తితోపాటు స్థానిక సాహితీవేత్తల సహకారంతో కమిటీ ఏర్పడింది. బ్రౌన్ పేరిట గ్రంథాలయ భవన నిర్మాణం ప్రారంభమైంది. పుస్తక సాగరం పలువురు పుస్తక దాతలు, సాహితీవేత్తలు తమ వద్దనున్న విలువైన పుస్తకాలను గ్రంథాలయానికి అందజేశారు. వల్లూరుకు చెందిన పోలేపల్లె గంగన్న శ్రేష్టి అలియాస్ రాజాశెట్టి అనే దాత ఇచ్చిన కొన్ని పుస్తకాలతో బ్రౌన్ గ్రంథాలయం ప్రారంభమైంది. ప్రస్తుతం రికార్డుల ప్రకారం ఇక్కడ దాదాపు లక్ష వరకు పుస్తకాలున్నాయి. రికార్డులకు ఎక్కాల్సిన పుస్తకాలు మరో 10వేల దాకా ఉన్నాయి. రెండో అంతస్తులో తాళపత్ర గ్రంథాల విభాగం ఉంది. పూర్వం కాగితాలు అందుబాటులో లేనికాలంలో మన పెద్దలు సమాచారాన్ని తాటాకులపై రాసి భద్రపరచేవారు. వీటినే తాళపత్ర గ్రంథాలు అంటారు. అలాంటి ఎన్నో గ్రంథాలు, ముఖ్యంగా 200 సంవత్సరాలకు పూర్వం నాటి తాళపత్ర గ్రంథాలెన్నో ఇక్కడ ఉన్నాయి. పట్టుకుంటే పొడి, పొడిగా రాలిపోయే స్థితిలో ఉన్న పురాతన కాలం నాటి హ్యాండ్మేడ్ పేపర్, ఇతర రకాల కాగితాలు కూడా ఇక్కడ ఉన్నాయి. నిపుణులైన ఉద్యోగులు వీటిని మరో వందేళ్ల పాటు భద్రంగా ఉంచేందుకు కెమికల్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. డిజిటలైజేషన్ కూడా చేసి భావితరాల కోసం వాటిని జాగ్రత్తపరుస్తున్నారు. ఈ గ్రంథాలయంలో రాగి రేకులు కూడా ఉన్నాయి.తాళపత్ర గ్రంథాల కంటే ఎక్కువ రోజులు నిలిచి ఉండేందుకు అప్పట్లో రాగి రేకులపై రాయించేవారు. ఈ గ్రంథాలయాన్ని సందర్శించేవారు తప్పక ఈ తాళపత్ర గ్రంథాల విభాగాన్ని సందర్శిస్తారు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు, సాహితీవేత్తలు ఈ గ్రంథాలయాన్ని సందర్శించారు. ఇతర ప్రాంతాలనుంచి వచ్చే సాహితీవేత్తలు, అధికారులు కూడా ఈ గ్రంథాలయాన్ని సందర్శిస్తుంటారు. తెలుగునాట ఈ గ్రంథాలయం వైఎస్సార్ జిల్లా కీర్తిని నలుదిశలా చాటుతోంది. యేటా దాదాపు 100కు పైగా సాహితీ కార్యక్రమాల నిర్వహణతో బంగోరె, ఆరుద్రల ఆశయం నెరవేరినట్లయింది. ఈ లైబ్రరీలో ఎవరైనా సభ్యత్వం తీసుకోవచ్చు. రూ.500 నగదుతో పాటు రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలు, ఆధారం కోసం ఏదైనా సర్టిఫికెట్ తీసుకుని వచ్చి సభ్యత్వం పొందవచ్చు. వివరాలకు గ్రంథాలయంలో నేరుగా సంప్రదించవచ్చు. అలాగే ఈ గ్రంథాలయాన్ని ఆదివారంతో పాటు, ఇతర సెలవు దినాల్లోనూ సందర్శించవచ్చు. ప్రస్తుతం ఈ గ్రంథాలయానికి యోగి వేమన విశ్వవిద్యాలయం నుంచి ఓ సంచాలకులు ప్రధాన బా«ధ్యులుగా ఉన్నారు. ఇద్దరు సహాయ పరిశోధకులు, మరో ఇద్దరు గ్రంథాలయ సహాయకులు, అటెండర్లు, వాచ్మెన్లు మరో ఐదుగురు సేవలందిస్తున్నారు. విస్తరణ దిశగా... బ్రౌన్ గ్రంథాలయాన్ని విస్తరించాలని పాలకమండలి, అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 20 సెంట్లలో ఉన్న గ్రంథాలయంతో పాటు వెనుక ఉన్న స్థలంలో 25 సెంట్లు కొనుగోలు చేశారు. స్థల దాతలు సీకే సంపత్కుమార్ మనవరాలు మరోమారు తమ వంతు విరాళంగా మరో ఐదు సెంట్ల స్థలాన్ని ఉచితంగా అందజేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రంథాలయాన్ని సందర్శించి విస్తరణ కోసం రూ. 6.50 కోట్ల వరకు నిధులు మంజూరు చేశారు. కొత్త భవనం పూర్తయితే తెలుగు వారికి మరింత అపురూపమైన గ్రంథనిధి అందినట్లవుతుంది. నాటి నుంచి నేటి దాకా... 1987 జనవరి, 22న బ్రౌన్ పేరిట గ్రంథాలయానికి పునాది పడింది. ఆ భవన నిర్మాణాన్ని యజ్ఞంలా భావించారు జానమద్ది. నిధుల సేకరణకు ఒక దశలో ఆయన జోలె పట్టారు. 1996లో మొదటి అంతస్తు పూర్తి కాగా, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సి.నారాయణరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఇచ్చిన నిధుల నుంచి రూ. 5లక్షలతో 2003 అక్టోబర్, 9న రెండో అంతస్తు పూర్తయింది. 1995 నవంబరు, 29న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. సాహితీవేత్త, సమాజ సేవకులు వావిలాల గోపాలకృష్ణయ్య గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. కాలక్రమంలో గ్రంథాలయ నిర్వహణ ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపు కూడా కష్టతరమైంది. నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2005 జనవరి, 27న బ్రౌన్ గ్రంథాలయాన్ని సందర్శించి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని వాగ్దానం చేయడమే కాక, శాశ్వత నిర్వహణ కోసం యోగివేమన విశ్వ విద్యాలయానికి అప్పగించారు. -
దేవుణ్ణి చూసిన వాడు
‘వానలో కలిసిన చీకటి ఆకాశం నుంచి నల్లటి విషంలా కారుతోంది’ అని మొదలవుతుంది తిలక్ ‘దేవుణ్ణి చూసిన వాడు’ కథ. ఆ రాత్రి వానలో ఉలిక్కిపడి లేచిన గవరయ్యకు పెరటి వసారాలో ఏదో మూలుగు. ఏమిటది? లాంతరు తీసుకుని బయటకి వచ్చాడు. హోరుగాలి... భీకర వర్షం... మూలుగుతూ పడి ఉన్న ప్రాణి. లాంతరు ఎత్తి చూసి దిమ్మెరపోయాడు. భార్య. తనను వదిలిపెట్టి వెళ్లిన భార్య. ‘గవరయ్య భార్య లేచిపోయిందట’ అని ఊరంతా గేలి చేయడానికి కారణమైన స్త్రీ. మోసపోయి, నిండు గర్భంతో, నొప్పులు పడుతూ, మొహం చెల్లక వసారాలో పడి ఉంది. దూరంగా మెరుపు మెరిసింది. చెవులు చిల్లులుపడేలా పిడుగు. కాన్పు జరిగిపోయింది. కేర్మని– చేతుల్లోకి తీసుకోగానే సముదాయింపు పొందిన ఆ పసికూన గవరయ్యతో బంధమేసింది. క్షణం ఆలోచించలేదు అతడు. ఆమెను, ఆమె కన్న తనది కాని బిడ్డను లోపలికి తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఊరిపెద్దలు ‘లేచిపోయిందాన్ని ఏలుకుంటావా’ అని వస్తే గవరయ్య ఏం చేశాడు? కత్తి పట్టుకు వచ్చి ‘అడ్డు పడినవాళ్లను అడ్డంగా నరుకుతాను’ అన్నాడు. అతడు మనిషి. దేవుడు. మానవత్వంలో దేవుడిని చూసినవాడు.మధురాంతకం రాజారాం ‘కొండారెడ్డి కూతురు’ అనే కథ రాశారు. ఫ్యాక్షనిస్టు కొండారెడ్డి కూతురు ప్రేమ వివాహం చేసుకుంది. పారిపోయి బతుకుతోంది. చాన్నాళ్ల తర్వాత ఊరి మనుషులు చూడటానికి వచ్చారు. తన మనుషులు. తన తండ్రి దగ్గర పని చేసే మనుషులు. కొండారెడ్డి కూతురు ఎంతో సంతోషపడింది. మర్యాదలు చేసింది. వారి చేసంచుల్లో చాటుగా ఉన్న ఆయుధాలు చూసి అంతలోనే నిశ్చేష్టురాలైంది. తనను, భర్తను చంపుతారన్నమాట. తండ్రి పంపించాడన్న మాట. కాని ఇంటికి వచ్చిన అతిథులను అవమానించవచ్చా? వారి కోసం ఏమిటేమిటో వండింది. కొసరి కొసరి వడ్డించింది. ఊరి ముచ్చట్లు అడిగి చెప్పించుకుంది. ఆ రాత్రి తనకు ఆఖరు రాత్రి. హాలులో కుర్చీ వేసుకుని భర్త గదికి కాపలా కూర్చుంది. వాళ్లు వస్తారు. తనని చంపుతారు. కొండారెడ్డికి పుట్టినందుకు తాను చస్తుంది. కాని భర్తను చంపడానికి వీల్లేదంటుంది. వాళ్లు వచ్చారు. నీడల్లా నిలబడ్డారు. చంపుతారనుకుంటే కాళ్ల మీద పడ్డారు. ‘అమ్మా మేమెందుకొచ్చామో తెలిసీ అన్నం పెట్టావు. చెడ్డ పనులు చేసే రోజు మీ అమ్మ ముఖం చూడకుండా తప్పుకునేవాళ్లం. చూస్తే చేయలేమని. ఇవాళ నీ ముఖం చూస్తూ నిన్నెలా చంపుతా మమ్మా’... ఏడుస్తూ కాళ్లు కడుగుతున్నారు. ఆమె మనిషే. దేవత కాకపోవచ్చు. కాని మానవీయత ఉన్న మనిషి వదనంలో దైవత్వం ఉంటుంది.‘మనందరం దేవుళ్లమే’ అంటాడు ‘సత్యమే శివం’లో కమలహాసన్. ‘సృష్టీ విలయం రెండూ మన చేతుల్లోనే’ అంటాడు ‘సెపియెన్స్’ పుస్తక రచయిత హరారి. ‘నేటి మనిషి రెండు విషయాల వల్ల మనిషి గుణాన్ని కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు. ఒకటి ప్రకృతి విధ్వంసం– రెండు సాంకేతికతను పెంచి తాను మరుగుజ్జుగా మారడం’ అంటాడు హరారి. ప్రకృతికి ఎడంగా జరిగే కొద్ది, పరిసరాల్లో సిమెంటు పెరిగే కొద్ది, నాలుగు గోడల నుంచి నాలుగు గోడలకు అతని దినచర్య మారేకొద్ది సహజమైన మానవ స్పందనలు మొద్దుబారక తప్పదు. పెట్ డాగ్స్ సమక్షంలో అతడు పొందగలుగుతున్నది కొద్దిగా ఓదార్పే. పల్లెలో ప్రకృతిలో ఉన్నప్పుడు గొడ్డూ గోదా, మేకా ఉడుతా, కాకీ పిచుకా అన్నీ అతని స్పందనలను సజీవంగా ఉంచేవి. ‘ఎలా ఉన్నావు?’ నుంచి ‘ఎంత సంపాదిస్తున్నావు?’ను దాటి ‘ఏం కొన్నావు?’కు వచ్చేసరికి అతనిలో మొదలైంది పతనం.‘లాభం’ అనే మాట కనిపించని దారాలతో ఆడించే మాయావి. మనిషిని ఎంత ఓడిస్తే లాభం అంత గెలుస్తుంది. అంతేకాదు ‘మనిషి మీద నమ్మకం పోయింది’ అనే మాటను పుట్టించడం లాభాపేక్ష గల పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రాథమిక అవసరం. మనిషి మీద నమ్మకం పోయేలా... వాణ్ణి అది వస్తుగత, స్వార్థపరమైన, సంపద లాలసలో కూరుకుపోయేలా చేస్తుంది. లాభపడాలంటే, సుఖపడాలంటే చేయవలసింది మానవత్వాన్ని త్యాగం చేయడమే. అది పోగానే వాడు కుటుంబంతో, స్నేహితులతో, సమాజంతో, ప్రకృతితో, మానవాళితో ఎంత దారుణంగా అయినా వ్యవహరించవచ్చు. ‘మనిషి మీద నమ్మకం పోయేలా’ చేస్తే పెట్టుబడిదారీ వ్యవస్థకు మరో లాభం ఏమిటంటే... ఏ మనిషీ మరో మనిషితో కలవడు. సమూహంగా మారడు. తిరుగుబాటు చేయడు. నలుగురు బాగుపడి కోట్ల మంది మలమలమాడే వ్యవస్థకు ఢోకా రానివ్వడు. అందుకే పెట్టుబడిదారీ వ్యవస్థ ‘యుద్ధం’ అనే ముద్దుబిడ్డను పదేపదే కంటూ ఉంటుంది. యుద్ధం మానవత్వానికి అతి పెద్ద విరుగుడు. అయితే మనిషి ఇలాగే ఉంటాడా? ఏ రచయితో అన్నట్టు ‘రగిలిస్తే రాజుకునే మహాఅగ్ని మానవత్వం’. కోల్కతా నిరసనల్లో ఇవాళ అదే చూస్తున్నాం. యుగాలుగా... చితి పెట్టిన ప్రతిసారీ బూడిద నుంచి మానవత్వం తిరిగి జనిస్తూనే ఉంది. కాకుంటే అందుకు కావల్సిన రెక్కలు సాహిత్యమే ఇస్తుందని గ్రహించాలి. తల్లిదండ్రులూ..! మీ పిల్లల్ని ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు తప్పకుండా చేయండి. కాని నాలుగు మంచి పుస్తకాలు చదివించి మొదట మనిషిని చేయండి. ఏ విటమిన్ లేమికి ఏం తినాలి సరే... మానవత్వ లేమి ఉందేమో కనిపెట్టి విరుగుడుగా ఒక పుస్తకం చేతిలో పెట్టండి. ఎక్కడ పుస్తకాలు ఉంటాయో అక్కడ మానవత్వపు ఆవరణం ఏర్పడుతుంది. అదే దేవుడు తిరుగాడే తావు. ప్రపంచ మానవత్వ దినోత్సవ శుభాకాంక్షలు. -
మీ ఇంటి దగ్గర పుస్తకాలను అద్దెకు ఇచ్చే షాపులు ఉన్నాయా?
మన పక్కింటికో, ఎదురింట్లోకో పండగ సెలవులకని ఎవరైనా కొత్తపిల్లలు వచ్చినపుడు మాటా మాటా కలిసినపుడు మీ ఊరు పెద్దదా మా ఊరు పెద్దదా అని ఒక అంచనా వేసుకొవడానికి అడిగే మొదటి ప్రశ్న మీ ఊర్లో సినిమా టాకీసులు ఎన్ని ఉన్నాయి? అని అయి ఉండేది. నా కటువంటి సమస్యే ఎదురయ్యేది కాదు. నాకు కావలసిన భోగట్టా అల్లా మీ ఊర్లో, మీ ఇంటి దగ్గర పుస్తకాలకు అద్దెకు ఇచ్చే షాపులు ఎన్ని ఉన్నాయని మాత్రమే.నాకు ఊహ తెలిసాకా తరుచుగా ఎమ్మిగనూరుకు వెల్తుండే వాడిని. ఊర్లో దిగి మా మేనత్త ఇంటికి వెళ్ళే రిక్షా ఎక్కాకా దారికి అటూ ఇటూ చూస్తూ ఆ ఊరిలో పుస్తకాల బంకులు ఎన్ని ఉన్నాయా ? ఎక్కడెక్కడ ఉన్నాయా అని బుర్రలో గురుతులు పెట్టుకునేవాడిని . మా నూనెపల్లె లో భద్రయ్య బంకు అద్దె పుస్తకాలకు పేరెన్నికది. నూనెపల్లె సెంటరు లో గుర్రాల షెడ్డుకు ఎదురుగా ఉండేదది. ఆ బజారు అంతా కోమట్ల ఇల్లు ఎక్కువగా ఉండేవి. భద్రయ్య గారు కూడా కొమట్లే. ఆయన కొడుకు భాస్కర్ ఆ బంకులో ఎక్కువగా కూచునేవాడు. బంకు సీలింగు కు ఒక చిన్న ప్యాన్ బిగించి ఉండేది. బంకులో ఒక మూల రేడియో కూడా. అక్కడ నాకు పుస్తకాల తరువాత అత్యంత ప్రీతిప్రాత్రమైన వస్తువు బెల్లంపాకపు వేరుసేనగ గట్టా. ఎంతో రుచిగా ఉండేదది . ఇప్పుడు అటువంటి గట్టాలే ఆల్మండ్ హౌస్ లో కనపడతాయి. రూపం ఒకటే కాని ధర మాత్రం హస్తిమశకాంతరం. పుస్తకాలు, గట్టాల తరువాత నాకు ఫేవరెట్ అనదగ్గది గుడ్ డే బిస్కత్తు. గాజు సీసాలలో చక్కగా అమర్చి పెట్టి ఉండేవి. సుతారంగా అల్యూమినియం మూత తిప్పి అడిగిన వారికి బిస్కట్లు ఇచ్చేవాడు భద్రయ్య . అపుడు ఆ సీసాలోనుంచి బిస్కెట్ల వాసన ఎంత కమ్మగా వచ్చేదో. ఇప్పుడు అప్పుడప్పుడూ రత్నదీప్ సూపర్ మార్కెట్ కు ఏదయినా సరుకులు కొనడానికి వెడతానా, బిస్కెట్ కౌంటర్ దగ్గర గుడ్ డే ప్యాకెట్ పుచ్చుకుని ఆ చిన్ననాడు తగిలిన చక్కని వాసన వస్తుందా లేదా అని చూస్తా, రానే రాదు. ఆ వాసన లేని బిస్కెట్ కూడా రుచిగా అనిపించదు నాకు . నేను భద్రయ్య అంగట్లో పుస్తకం తీసుకుంటే కూడా ఉన్న ఫ్రెండ్ ఎవరో ఒకరు బిస్కెటో , బుడ్డల గట్టానో కొనేవాడు అది ఇద్దరం పంచుకుని తినుకుంటూ నడిచే దారిలోనే పుస్తకాన్ని నమిలేస్తూ కదిలేవాడ్ని.పుస్తకాలు అద్దెకిచ్చే షాపులో ఆ గోడల నిండా వందలుగా పుస్తకాలను నిలువ వరుసల్లో నింపేవారు. స్కెచ్చు పెన్నులతో పుస్తకాల మీద పేర్లు రాసి ఉండేవి. ఏ పుస్తకం కోసం కష్టపడి వెదుక్కోనక్కరలేదు. చక్కని చేతి రాతలో ఆ పేర్లు కళ్ళని ఆకర్షించేవి. చాలా షాపుల్లో అయితే పత్రికలో సీరియల్ గా వచ్చిన నవల పేజీలని చించి పుస్తకంగా బైండ్ చేసి అద్దెకు ఇచ్చెవారు. కొత్తగా రిలీజ్ అయిన పుస్తకాలయితే డిమాండ్ ఎక్కువ కాబట్టి వాటిని జనం కంట పడకుండా సెపరేట్ గా ఉంచేవాళ్ళు. నియమిత ఖాతాదారుల కోసం ఆ పుస్తకాలు పక్కకు తీసిపెట్టేవారు. షాపు వాళ్ళు ఏ పుస్తకాన్ని కూడా ఒకటి ఒకటిగా కొనేవాళ్ళు కాదు. ప్రతి పుస్తకం రెండు మూడు ఉండేవి సూపర్ స్టార్లయిన మధుబాబు, మల్లాది, యండమూరి పుస్తకాలయితే అయిదు లెక్కన కొనేవారు. ఆ పుస్తకాలు వచ్చిన కొత్తలో అయిదేం ఖర్మ పది కొన్నా అంత సులువుగా పాఠకుల చేతికి వచ్చేవి కావు. త్రిమూర్తులకు డిమాండ్ ఎక్కువ. ఎవరు ఎంత గీ పెట్టి చచ్చినా ఒకానొక కాలంలో హైస్కూలు పిల్లవాళ్ళ దగ్గరి నుండి సకుటుంబ సపరివారం వరకు తెలిసిన రచయితలంటే వీరే . పెరిగిపెద్దయి అతి పెద్ద చదవరులయిన ఆ రోజుల చదువరులు చాలామందికి అక్షర ప్రాశన చేసింది వీరే. వీరిలో యండమూరి కాస్త హట్ కే. రాసింది కమర్షియల్, పాపులర్ సాహిత్యమే కావచ్చు. అయినా ఆయన తన పుస్తకాల్లో ఎక్కడో ఒకక్కడ బుచ్చిబాబు, తిలక్ , విశ్వనాథ సత్యనారాయణ, చలం... ఇత్యాదుల ప్రస్తావన తెచ్చేవారు. నాకయితే ఈ మహారచయితల తొలి పరిచయం వీరేంద్రనాథ్ గారి పుస్తకాల్లోనే. ఒక పుస్తకంలో ఆయన ఇట్లావాక్యం వ్రాశారు "తెలుగు సాహిత్యంలో ఒకే ఒక హీరో తంగిరాల శంకరప్ప" ఆ వాక్యాన్ని పట్టుకుని నేను పెద్దయ్యాకా శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి సాహిత్యాన్ని మొత్తం చదువుకునే భాగ్యం కలిగింది. లేకుంటే ఎక్కడి చిన్న పల్లె నూనెపల్లె? దానికి అద్భుతమైన సాహిత్యం ఎంతెంత దూరం?షాపు పెట్టాము కదాని వచ్చిన ప్రతి ఒక్కరికి పుస్తకాలు ఇవ్వబడవు. బ్యాంకులో అకవుంట్ తెరవడానికి సాక్షి సంతకం కావాలన్నట్లు, షాపువారికి తెలిసిన వారినెవరినయినా తోడుగా తీసుకెడితేనే పుస్తకాలు ఇస్తారు. లేదా పుస్తకం ధరమొత్తం అడ్వాన్సుగా కట్టాలి. నాకు గుర్తు ఉండి కొందరు 20 రూపాయలు బయానా గా పుచ్చుకునేవారు. అంత డబ్బు ఎలా వస్తుంది? ఎవరు ఇస్తారు? అందుకని నేను ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి అడ్వాన్స్ కట్టే వాణ్ని, అద్దె చెల్లించే వాడిని. పుస్తకాలు నాకు దొంగతనం నేర్పాయి. అలవాటు ఐయింది కదాని ప్రతిఎప్పుడూ దొంగతనం చేయకూడదు. పట్టుబడి పోతాం. అందుకే పుస్తకాలకు అద్దె అప్పు పెట్టడం నేర్చుకున్నాను. ఈ రోజుల్లో చోరీ చేస్తూ పట్టుబడిన పిల్లలు ఎవరైనా పుస్తకాలు కొనడానికి దొంగతనం చేసాను అని ఏడుపుముఖంతో అంటే వాళ్ళని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకోబుద్ది వేస్తోంది. నేను పెరిగి పెద్దయ్యాక ఒకసారి నాకెంతో ఇష్టమైన ఆర్టిస్ట్ పుస్తకాలు కొనడానికి డబ్బులు లేక దిగాలుగా ఉంటే ఏమిటి విషయమని అడిగి తెలుసుకుని చిత్రకారులు శ్రీ బాపు గారు దగ్గరకు పిలిచి ముద్దు పెట్టుకోలేదు కానీ ఇరవైవేల రూపాయలు ఇచ్చి నా ముఖంలో నవ్వు చూశారు . అద్దెకు తీసుకున్న పుస్తకాన్ని తమ వద్దనున్న రిజిస్టరు పుస్తకంలో తేది, సమయం వేసి , మళ్ళీ ఆ పుస్తకాన్ని రేపటి రోజున అదే సమయం లేదా అంతకంటే ముందుగా తెచ్చి ఇస్తే ఒక రోజు అద్దె, రోజు మారిన కొద్దీ అద్దె రెట్టింపు అయ్యేది ,ఒక్కొక్క సారి అద్దె కట్టడానికి కి డబ్బులు లేక పుస్తకాన్ని అట్లానే అట్టిపెట్టేసుకుని పుస్తకం ధరకన్నా ఎక్కువ అద్దె డబ్బులు ఇచ్చిన రోజులు ఉన్నాయి. అప్పుడప్పుడు షాపు యజమానికి ఏదయినా పనిపడో , భోజనానికి వెళ్ళవలసి వచ్చినపుడో పుస్తకాల షాపు మూసి ఉండేది. షాపు మూసి ఉన్నదేమి అని ఖంగారు పడకూడదు. అంగడి చెక్కలకు సన్న సందులు ఉంటాయి . అందు గుండా పుస్తకాన్ని పడెయ్యాలి. షాపు ఆయన తిరిగి వచ్చాక మన పుస్తకం నెంబరు , పేరూ చూసి పుస్తకం ముట్టినట్టుగా పద్దు వేసుకుంటాడు. అద్దె బకాయి రాసుకుంటాడు.మా ఇంటి దగ్గరలోనే, శివశంకర విలాస్ దగ్గర ఒక క్రైస్తవ కుటుంబం పుస్తకాల బంకు పెట్టుకున్నారు. అమ్మా, నాన్న, ఒక అబ్బాయి. ఒకరు లేనప్పుడు ఒకరు ఆ షాపు చూసుకునేవారు. నేను వాళ్లదగ్గర పుస్తకాలు అద్దెకు తీసుకునేవాడిని. యండమూరి వీరేంద్రనాథ్ "’రక్తసింథూరం" పుస్తకం అక్కడే తీసుకున్న గుర్తు నాకు. ఆ పుస్తకానికి చిత్రకారులు చంద్ర గారు వేసిన బొమ్మని చూసి మంత్రముగ్దుణ్ణి అయ్యాను ఆ కాలల్లోనే. ఒకసారి పుస్తకాలకు అద్దె చెల్లించడానికి డబ్బులు లేనప్పుడు ఒక ఉపాయం చేశా. కొడుకు ఆ షాపులో ఉన్నపుడు పుస్తకం తీసుకున్నాను అనుకో, పుస్తకం తిరిగి ఇచ్చేటప్పుడు అతను కాకుండా వాళ్ళ అమ్మగారో , నాయనో ఉన్నప్పుడు పుస్తకం వాపసు ఇచ్చి అద్దె ముందే కట్టా అని చెప్పేవాడిని. కొన్ని సార్లు పుస్తకం అద్దె ముందే కట్టించుకునేవారు. పుస్తకాలు నాకు మోసాన్ని కూడా నేర్పాయి. ఆ కుటుంబం వారు కడు బీదవారు. వారి రూపు, వేసుకున్న బట్టలు ఆ విషయాన్ని యథాతంగా చూపేవి. ఇప్పుడు ఎప్పుడయినా నాకు ఏదయినా అన్యాయం జరిగింది అనిపించినపుడు నేను ఆ కుటుంబాన్ని గుర్తు చేసుకుని వారిని మోసం చేసినందుకు ఇదంతా నాకు తగినదే జరిగింది అనుకుంటాను. ఇపుడు ఆ బంకు వాళ్ళు ఎవరూ కనపడరు కానీ కనపడితే బావుండు, వాళ్ళ చేతులు పట్టుకుని మన్నించమని ప్రాధేయపోయేవాడినే. పుస్తకాల చదువు వలన నేను దొంగతనం, మోసం నేర్చుకుంటే నా ప్రెండు బాషా అనేవాడికి పుస్తకాలు వ్యాపారం నేర్పాయి. ఆ రోజుల్లో ఎంత పెద్ద పుస్తకాన్నయినా ఒక దెబ్బకు గంటా రెండు గంటల్లో చదివేసేవాళ్లం. మరి చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లొక లెక్క. మా బాషాగాడు ఏం చేసేవాడంటే వాడు ఒక పిల్లల పుస్తకాన్ని అద్దెకు తెచ్చుకుని చదివేసి , ఒకోసారి చదవకుండా కూడా మాకు అద్దెకు ఇచ్చేవాడు. గంటకు పావలా పుచ్చుకునేవాడు . షాపులో అయితే పుస్తకాన్ని ఒక గంటకు వెనక్కి ఇచ్చినా, ఒక రోజుకు వెనక్కి ఇచ్చినా రూపాయో, రూపాయిన్నరనో కట్టక తప్పదు . బాషగాడి పావలా పథకం హాయిగా ఉండేది. వాడు ఇచ్చినంత మందికి అద్దెకు ఇచ్చి , అద్దె చెల్లించి ఆ పై దర్జాగా మిగిలిన డబ్బులు జేబులో వేసుకునే వాడు.చిన్న చిన్న బంకుల్లో కుదరదు కానీ, కాస్త పెద్ద షాపుల్లో అయితే పుస్తకాలు చూస్తూన్నట్టుగా నటిస్తూ, షాపు యజమాని తల తిప్పగానే చేతిలో ఉన్న పుస్తకాన్ని చొక్కా ఎత్తి లటుక్కున నిక్కరుకు పొట్టకు మధ్యలో దాచేవాళ్లం. పుస్తకం చదివెయ్యగానే మళ్ళీ వెనక్కి వచ్చి పుస్తకాన్ని ఆ అరల మధ్యనే ఇరికించి వెళ్ళేవాళ్లం. చెప్పుకుంటూ పొతే చాలా సంగతులు ఊరుతూనే ఉంటయి. నిజానికి ఎలా కనుమరుగయ్యాయో, ఎప్పుడు కనుమరుగయ్యాకో కూడా ఊహకు అందడం లేదు ఆ పుస్తకాలని అద్దెకు ఇచ్చే షాపులు. టెంత్ క్లాస్ లోనా? కాదేమో ! ఇంటర్ మీడియట్ లోనా , లేక డిగ్రీ రోజుల్లోనా? ఏమో గుర్తు లేదు. సినిమా థియేటర్ టికెట్ కౌంటర్ బయట నిలబడ్డంత పెద్ద బారు వరుస కాకపోయినా , అద్దె పుస్తకాల షాపు, బంకుల బయట వరుసలో నాలుగురయిదుగురే ఉన్నా, కొత్త నవల కోసం విపరీతమయిన ఒత్తిడి తోనో , నాలుగురోజులుగా తెగ తిరుగుతున్నా ఇంకా దొరకని అభిమాన రచయితా పుస్తకం ఈరోజైనా దొరుకుతుందా లేదా అనే మనోదౌర్బల్యం తోడుగానో నిలబడి ఉండేవారు పాఠకులు. వట్టి అద్దె పుస్తకాలే కాదు. ఊరి మెయిన్ సెంటర్లలోనూ, సందు చివర, వీధి మలుపులో ప్రతిచోటా దినపత్రికలు, వార పత్రికలూ, పక్షపత్రికలు, పిల్లల పత్రికలూ , పాకెట్ నవల్స్ కనపడుతూనే ఉండేవి, ఈరోజు ఒక దినపత్రిక కోసమో, వార పత్రిక కోసమో కిలోమీటర్లకు కిలో మీటర్లు నడిచినా ఒక్క పుస్తకమూ రోడ్డు మీద కనపడుత లేదంటే అత్యంత సాంస్కృతిక లేమి నడుస్తున్న రోజులవి . ఆరోజుల్లో కథలు, నవలలు, పాటలు , పద్యాలు అనేకాలు పుస్తకాలుగా దొరికేవి. రచయితల ముక్కు మొహంతో అవసరం లేని రోజులవి. రాసిందే భాగ్యం. కంటపడిన అచ్చు కాగితమే వరం. ఈ రోజున వద్దన్నా వీధికొక, సందుకోక, నగరం నాలుగు వైపులా రచయితలూ, కవులు ఊరికూరికే కనపడుతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. సరస్వతి మీద ఒట్టు రచయితల పేర్లు తెలుసు , వారు వ్రాసిన ఒక్క వాక్యం కూడా తెలీదు. రాసేవారు మాత్రమే తెలుస్తున్నారు రచన అందడం లేదు . ఏం రాశారో ఆనవాలు లేదు, చూసిన తనని పోల్చుకుంటే చాలన్నంత అల్పసంతోషి అయిపోయినాడు సృజనకారుడు.-అన్వర్ -
జగనన్న విద్యాకానుక రెడీ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కింద ఏటా అందిస్తున్న ఉచిత పుస్తకాలు, యూనిఫారం, బూట్లతో కూడిన కిట్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంచేసింది. ఈ నెల 12న పాఠశాలలు తెరిచిన మొదటిరోజే వాటిని అందించేందుకు సామగ్రిని మండల స్టాక్ పాయింట్లకు చేరవేసింది. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మొదటి సెమిస్టర్లో బోధించే 3.12కోట్ల పాఠ్యపుస్తకాలు మండల స్టాక్ పాయింట్లకు ఇప్పటికే చేరవేశారు. యూనిఫారం సరఫరా శనివారం నుంచి మొదలైంది.వస్తువులను ఒక్కొక్కటిగా స్టాక్ పాయింట్లకు చేర్చిన అనంతరం అక్కడ తరగతుల వారీగా కిట్లను రెడీ చేస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు కిట్లను పంపిణీ చేయగా మిగిలిన 2 లక్షల కిట్లకు అదనంగా ఈ విద్యా సంవత్సరానికి 36లక్షల కిట్లను అధికారులు సిద్ధంచేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా వస్తువులను అందించేలా సరఫరాదారులకు ఆదేశాలు జారీచేశారు.అన్ని సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలు, టోఫెల్ వర్క్బుక్, ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్ పుస్తకంతోపాటు మూడు జతల యూనిఫాం క్లాత్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, ఆక్స్ఫర్డ్ నిఘంటువు.. అదేవిధంగా 1–5 తరగతుల విద్యార్థులకు వర్క్బుక్స్, పిక్టోరియల్ డిక్షనరీ, 6–10 తరగతుల విద్యార్థులకు నోట్బుక్స్, అందించనున్నారు. ఇప్పటివరకు విద్యాకానుక కిట్లో అందించే తొమ్మిది వస్తువుల్లో బూట్లు మినహా మిగిలిన బ్యాగులు, బెల్టులు, సాక్సులు, పాఠ్య, నోటుపుస్తకాలు, వర్క్బుక్స్, డిక్షనరీ వంటి 8 రకాల వస్తువులు 90 శాతం మండల కేంద్రాలకు చేరాయి. ఒకట్రెండు రోజుల్లో బూట్ల సరఫరా చేపట్టనున్నారు. పాఠశాలలకు 3.12 కోట్ల పాఠ్య పుస్తకాలు..ఈ విద్యా సంవత్సరంలో 1–10 తరగతుల విద్యార్థులకు మొత్తం 4.20 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా.. మొదటి సెమిస్టర్కు అవసరమైన 3.12 కోట్ల పుస్తకాలను స్టాక్ పాయింట్లకు పంపించారు. 3–10 తరగతుల వరకు పాఠ్యపుస్తక ముఖచిత్రాలు మార్చారు. ఈనెల 8వ తేదీ నాటికే అన్ని స్కూళ్లలోను విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కిట్లను సిద్ధంచేయాలని పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్ మీడియంలోకి మారడంతో అందుకు తగ్గట్లుగా పుస్తకాల ముద్రణ చేపట్టింది.రాష్ట్రంలో 1,000 ప్రభుత్వ పాఠశాలలు సీబీఎస్ఈలోకి మారిన సంగతి తెలిసిందే. ఈ విధానంలోనే స్టేట్ సిలబస్ పుస్తకాలను అందించనున్నారు. పదో తరగతి సాంఘిక శాస్త్రాన్ని సీబీఎస్ఈ తరహాలో జాగ్రఫీ, ఎకనామిక్స్, చరిత్ర, డెమోక్రటిక్ పాలిటిక్స్ రూపంలో ఎన్సీఈఆర్టీ సిలబస్ను ముద్రించింది. ఫిజికల్ సైన్స్ పుస్తకాలను పూర్తి ఆర్ట్ పేపర్పై ముద్రించారు. ఈ తరహా ముద్రణ చేపట్టడం ఇదేతొలిసారి కావడం విశేషం. ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్స్గా ఇంజినీరింగ్ విద్యార్థులుఈ విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఫ్యూచర్ స్కిల్స్ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. వీరి బోధనకు ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్స్గానూ నియమించింది. ఫ్యూచర్ స్కిల్స్ సిలబస్ను అనుసరించి మొత్తం 4.30 లక్షల పుస్తకాలు ముద్రించి పంపిణీకి సిద్ధంచేసింది. -
దేశంలో లైబ్రరీ విలేజ్ ఎక్కడుంది? ఆ పేరెలా వచ్చింది?
పుస్తకాలు మనిషికి మంచి నేస్తాలని చెబుతుంటారు. పుస్తకాలు మనకు ప్రపంచంలోని సమస్త సమాచారాన్ని అందిస్తాయి. మంచి పుస్తకం మానసిక సంతోషాన్ని కలుగజేస్తుంది. అలాంటి పుస్తకాలకు ఒక గ్రామం నెలవుగా ఉందని, అందుకే ఆ గ్రామానికి లైబ్రరీ విలేజ్ అనే పేరు వచ్చిందనే సంగతి మీకు తెలుసా? ఉత్తరాఖండ్లోని అందమైన పర్వత లోయల మధ్య పుస్తక ప్రపంచం ఉంది. 17,500కు మించిన పుస్తకాల సేకరణ ఇక్కడ కనిపిస్తుంది. రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న అగస్త్యముని బ్లాక్లోని మణిగుహ్ గ్రామం లైబ్రరీ విలేజ్గా పేరు పొందింది. ఇందుకు ‘హమారా గావ్ ఘర్’ ఫౌండేషన్ సహకారం అందించింది. 1,664 మీటర్ల ఎత్తులో ఉన్న మణిగుహ్ గ్రామం ఎంతో అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ 250 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో హోమ్స్టేలు కూడా ఉన్నాయి. 2023, జనవరి 26న హమారా గావ్ ఘర్ ఫౌండేషన్ను నెలకొల్పామని లైబ్రరీ డైరెక్టర్ మహేష్ నేగి మీడియాకు తెలిపారు. ఈ ఫౌండేషన్ లక్ష్యం గ్రామాల్లో విద్యాభివృద్ధిని పెంపొందించడం. గ్రామంలోని ఈ లైబ్రరీలో పుస్తకాలు చదివేందుకు ఎటువంటి రుసుము వసూలు చేయరు. ప్రతిరోజు విద్యార్థుల తమ తరగతులు ముగిసిన తర్వాత లైబ్రరీకి చేరుకుని చదువుకుంటారు. గ్రామంలో లైబ్రరీ ప్రారంభించినప్పుడు మూడు రోజుల పాటు గావ్ ఘర్ మహోత్సవ్ నిర్వహించామని మహేశ్ నేగి తెలిపారు. రైతులు, కవులు, రంగస్థల కళాకారులతో సహా సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో ఉత్తరాఖండ్లోని అనేక ప్రాంతాల్లో లైబ్రరీలు తెరుచుకున్నాయి. కాగా మణిగుహ్లో ఏర్పాటైన లైబ్రరీలో పోటీ పరీక్షలు మొదలుకొని సాహిత్యం వరకూ వివిధ రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. -
విశాఖలో మూడు దారులు పుస్తక పరియ కార్యక్రమం
-
అవగాహనే ప్రధానం
ఏడీహెచ్డీ, సెరిబ్రల్ పాల్సీ, ఇతర మనోవైకల్యాలు ఉన్న పిల్లల మానసిక అభివృద్ధికి బాటలు వేస్తున్నారు హైదరాబాద్ వాసి ఫరీదా రాజ్.స్పెషల్ చిల్డ్రన్కు శిక్షణ ఎలా ఇవ్వాలనే అంశాల మీద టీచర్లకు శిక్షణ ఇచ్చారు. సెంటర్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్, టీచర్ ట్రైనర్, రెమెడియల్ ఎడ్యుకేటర్, రైటర్ అయిన ఫరీదా రాజ్ తన రచనల ద్వారా, అవగాహన సదస్సుల ద్వారా ప్రజలలో అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నారు. పిల్లల్లో వచ్చే డిస్లెక్సియాపై పుస్తకాలు రాసిన ఫరీదా రాజ్ ఇటీవల ‘అన్బ్రేకబుల్ స్పిరిట్ – నావిగేటింగ్ లైఫ్ విత్ ఎమ్మెస్ పేరుతో మల్టిపుల్ స్కెర్లోసిస్పై పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఇది భారతదేశంలో వైద్య లేదా వైద్యేతర వ్యక్తి రాసిన మొట్టమొదటి పుస్తకంగా పేరొందింది. సరైన రోగ నిర్ధారణ, సకాలంలో చికిత్స, సంరక్షణ, కుటుంబ మద్దతుతో వ్యక్తులు సుదీర్ఘమైన, చురుకైన, ఆరోగ్యకరమైన జీవితాలను గడపవచ్చని ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా చెబుతారు ఆమె. ‘‘ఇటీవల చాలా కుటుంబాల్లో తెలియని అలజడిని సృష్టిస్తున్న సమస్య మల్టిపుల్ స్కెర్లోసిస్. దీనిని ఒక జబ్బుగా కాకుండా అవగాహనతో సరిదిద్దాల్సిన అంశంగా గుర్తించాలి. సమస్యతో ఇబ్బంది పడుతున్నవారిని నేరుగా కలిసి, వారి వేదనను, చికిత్సా విధానాలను ఇందులో పొందుపరించాను. స్పెషల్ కిడ్స్ సామర్థ్యాలకు.. నేను స్కూల్ టీచర్గా ఉన్న మొదటి రోజులవి. ట్రైనింగ్ పీరియడ్. క్లాస్రూమ్లో ఉన్నప్పుడు మొదటి రోజే అక్కడి ఓ సంఘటన నన్ను అమితంగా కదిలించింది. ముగ్గురు, నలుగురు పిల్లలు టీచర్ చెబుతున్న విషయంపై ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదు. వారిలో అసహనం స్థాయులు దాటడాన్ని, టీచర్ సహనం కోల్పోవడాన్నీ గమనించాను. ఎదిగే వయసు పిల్లల్లో సహజంగానే చాలా మానసిక ఒత్తిడి ఉంటుంది. ఈ సమస్య యువతలో మరింత ఎక్కువగా ఉండటాన్ని చూస్తుంటాం. వారిలో ఆందోళన కూడా ఒకింత ఎక్కువే. ఇలాంటప్పుడు వారికి మెంటల్ వెల్బీయింగ్ అవసరం. ఇక మానసిక వైకల్యాలు ఉన్న పిల్లల్లోనైతే అందరికీ వీరి పట్ల నిర్లక్ష్యం కూడా ఉంటుంది. ఇలాంటి పిల్లలను చూసుకునేవారికి సరైన గైడెన్స్ ఉండటం లేదని ఆ రోజే అనిపించింది. మనోవైకల్యాలు ఉన్న పిల్లల్లో సామర్థ్యాలను వెలికితీయడానికి, వారిలో విశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రతిరోజూ కృషి చేయాల్సి ఉంటుంది. అభ్యాసంలో వారిని నిమగ్నం చేయడానికి కొత్త కొత్త మార్గాలను కనుక్కోవాలి. దానిపైనే కృషి చేయాలనుకున్నాను. ఆ తర్వాత అందుకు తగిన పరిష్కారాలనూ కనుక్కున్నాను. వందల మంది టీచర్లకు శిక్షణ స్పెషల్ చిల్డ్రన్కు ఎలాంటి శిక్షణ అవసరమో, అందుకు టీచర్ల నైపుణ్యత ఎలా ఉండాలనే దానిపై రెగ్యులర్ సెషన్స్ నిర్వహించాను. ఇది రాష్ట్రస్థాయిలో మంచి మార్పులు తీసుకువచ్చింది. ఉపాధ్యాయులు, నేర్చుకునే ఇబ్బందులు ఉన్న పిల్లల తల్లిదండ్రుల కోసం ఒక హ్యాండ్–బుక్ తీసుకువచ్చాను. జన్యులోపాలపై అవగాహన ముంబైలో పుట్టి పెరిగిన నేను, పెళ్లి తర్వాత హైదరాబాద్లో స్థిరపడ్డాను. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ కి వెళుతున్న తొలినాళ్లలో ఒక రోజు, మానసిక వికలాంగురాలైన పాపతో ఉన్న ఒక మహిళను అక్కడ చూశాను. ఆమెతో మాటలు కలిపితే ఆ పాప ఆమెకు ఏడవ సంతానం అని తెలిసింది. ఆమె ఇతర పిల్లలందరికీ కూడా అదే సమస్య ఉంది. జన్యుపరమైన లోపాల వల్ల పిల్లలకు అలాంటి సమస్య వచ్చిందని ఆ మహిళకు తెలియదు. ఆ విషయం తెలియక జెనెటిక్ కౌన్సెలింగ్ కోసం ఆమె ఎప్పుడూ వెళ్లలేదని తెలుసుకున్నాను. దీంతో ఆ రోజే నిర్ణయించుకున్నాను ఇలాంటి మహిళలకు అవగాహన కల్పించాలని. అప్పటి నుంచి మహిళలకు జన్యుపరమైన కౌన్సెలింగ్స్ చేస్తూ ఉండేదాన్ని. ఈ అంశంపై ఉర్దూ పత్రికతో పాటు జాతీయ స్థాయి పత్రికలలోనూ వీటికి సంబంధించిన కథనాలపై వ్యాసాలు ఇచ్చాను. ఒక్కో అడుగు.. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్గా పని చేయడం నుంచి తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ నుంచి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకునే వరకు చేసిన ఈ ప్రయాణంలో నేర్చుకున్న విషయాలు ఎన్నో. క్యాన్సర్ పట్ల ప్రజలలో అవగాహన కలిగించేందుకు ఆంకాలజిస్టులచే కార్యక్రమాల నిర్వహణ నన్ను ఎంతోమందికి చేరువ చేసింది. మల్టిపుల్ స్కెర్లోసిస్తో బాధపడుతున్న వ్యక్తులను చూసినప్పుడు ప్రజలకు ఈ విషయం పట్ల అవగాహన లేదని అర్థ్ధమైంది. దీంతో సమస్యను ఎదుర్కొంటున్నవారిని కలిసి, కదిలించే కథనాలను పాఠకుల ముందుకు తీసుకువచ్చాను’’ అని వివరించే ఫరీదా రాజ్ మల్టిపుల్ స్కెర్లోసిస్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్కి కార్యనిర్వాహక సభ్యురాలిగా పనిచేస్తున్నారు. లాభాపేక్ష లేని ఈ సంస్థ ద్వారా మల్టిపుల్ స్కెర్లోసిస్ బారిన పడిన వ్యక్తుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. – నిర్మలారెడ్డి -
Lepakshi: రాతిలో పోత పోసిన లేపాక్షి అందాలు
ఆమధ్య “హంపీ వైభవం" పేరిట వరుసగా వ్యాసాలు రాశాను. అప్పుడు మా లేపాక్షి మనసు చిన్నబుచ్చుకుంది. హంపీ గురించి అన్నన్ని పుస్తకాలు ప్రస్తావిస్తూ వ్యాసాలు రాశావే! నిన్ను పెంచిన లేపాక్షి గురించి పరిశోధించి వ్యాసాలు రాయకపోతే ఎలా? అని లేపాక్షి జనం నన్ను నిలదీశారు. వారి నిలదీతలో అర్థముంది. లేపాక్షిమీద తపన ఉంది. నామీద లేపాక్షికి ఉన్న ఆ హక్కును గౌరవిస్తూ... లేపాక్షి మీద పరిశోధించి రాసిన సాధికారికమయిన పుస్తకాలను, వ్యాసాలను సంవత్సరం పాటు సేకరించాను. రెండు, మూడు కావ్యాలు కాలగర్భంలో కలిసిపోవడం వల్ల దొరకలేదు. నాకు దొరికిన ప్రచురితమైన నలభై తెలుగు, కన్నడ, ఇంగ్లీషు లేపాక్షి పుస్తకాల నుంచి ప్రధానంగా మూడింటి ఆధారంగా ఈ వ్యాసాలను రాస్తున్నాను. అవి:- 1. లేపాక్షి: రచయిత- ప్రఖ్యాత చారిత్రక పరిశోధకుడు ఆమంచర్ల గోపాలరావు. ఇంగ్లీషులో దీన్ని మోనో గ్రాఫ్ పరిచయ వ్యాసంగా పేర్కొన్నా పరిశోధన స్థాయి గ్రంథం ఇది. 1969లో ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడెమీ ప్రచురణ. 2. లేపాక్షి ఆలయం: రచయిత- హిస్టరీ ప్రొఫెసర్ వి కామేశ్వర రావు, ఎస్ వీ యూనివర్సిటీ, తిరుపతి. పరిశోధన గ్రంథం. 1987 ప్రచురణ. 3. త్యాగశిల్పం..పద్య, గద్య కావ్యం: కర్ణాటక ఉన్నత న్యాయస్థానంలో కీలకమైన పదవిలో పనిచేస్తుండిన తెలుగు పద్యప్రేమికుడైన లంకా కృష్ణమూర్తి పద్యాలు; లేపాక్షి ఓరియంటల్ కాలేజీలో తెలుగు అధ్యాపకుడు, అష్టావధాని పమిడికాల్వ చెంచు సుబ్బయ్య శర్మ(మా నాన్న) గద్యం. ఇద్దరూ కలిసి రాసినది. 1975 ప్రచురణ. ఈ పుస్తకాలేవీ ఇప్పుడు మార్కెట్లో లేవు. ఇలాంటివి పునర్ముద్రణ కావు. లేపాక్షిలో మిత్రుడు లేపాక్షి రామ్ ప్రసాద్ దగ్గర భద్రంగా ఉంటే కొరియర్లో తెప్పించుకుని...జిరాక్స్ చేసుకుని వారి పుస్తకాలు వారికి మళ్లీ కొరియర్లో వెనక్కు పంపాను. రామ్ ప్రసాద్ తాత వెంకటనారాయణప్ప లేపాక్షికి తొలి సర్పంచ్. ఐదు దశాబ్దాలపాటు లేపాక్షి గుడిని వెలికి తీసుకురావడానికి కల్లూరు సుబ్బారావుతో కలిసి పనిచేశారు. నాకు తెలిసిన ఆవగింజంత భాషా సాహిత్యాలకు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక విషయాలకు లేపాక్షి బీజం. అక్కడ తాకిన ప్రతిదీ శిల్పమే. చూసిన ప్రతిదీ అందమే. రాతిలో పోతపోసిన ఆ అందాలను, ఆనందాలను చెప్పకపోతే... నాకొచ్చిన నాలుగు మాటలకు విలువ ఉండదు. కాబట్టి ఈ ప్రయత్నం. వీరభద్రాలయం లేపాక్షి ఆలయం 16వ శతాబ్దంలో నిర్మితమైనదని మొదట అనుకునేవారు. భారత పురావస్తుతత్వ శాఖ తవ్వకాల్లో బయటపడ్డ శాసనాల ప్రకారం క్రీస్తు శకం 1400 నాటికే లేపాక్షిలో పాపనాశేశ్వర ఆలయం ప్రసిద్ధిలో ఉందని తేలింది. ఇక్కడ వీరభద్రుడు, పాపనాశేశ్వరుడు, దుర్గాదేవి, రఘునాథ స్వామి ప్రధానమైన దేవుళ్లు. "లేపాక్ష్యామ్ పాపనాశనః" అని స్కాంధపురాణంలో ఉన్నది ఈ లేపాక్షి పాపనాశేశ్వర స్వామి ప్రస్తావనే అన్నది ఎక్కువమంది పండితుల అభిప్రాయం. 16వ శతాబ్దిలో విజయనగర రాజులు అచ్యుతదేవరాయలు, అళియరాయల దగ్గర పెనుగొండ మండల కోశాధికారిగా ఉండిన విరుపణ్ణ ఇలవేల్పు వీరభద్రస్వామి. విరుపణ్ణ కలల పంట మనముందున్న ఈ లేపాక్షి కళల పంట. లేపాక్షికి ఆ పేరెలా వచ్చింది? త్రేతాయుగం రామాయణ కథతో లేపాక్షి కథ కూడా మొదలవుతుంది. సీతమ్మను రావణుడు అపహరించుకుని ఆకాశమార్గాన తీసుకువెళుతుంటే జటాయువు అడ్డగించి... యుద్ధం చేస్తుంది. కోపగించిన రావణుడు పక్షికి రెక్కలే బలం కాబట్టి... ఆ రెక్కలను నరికేస్తే చచ్చి పడి ఉంటుందని...రెక్కలను కత్తిరిస్తాడు. జటాయువు రెక్కలు తెగి... రక్తమోడుతూ... నేల కూలుతుంది. సీతాన్వేషణలో భాగంగా చెట్టూ పుట్టా; కొండా కోనా; వాగూ వంకా వెతుకుతూ రామలక్ష్మణులు జటాయువు దగ్గరికి వస్తారు. సీతమ్మ జాడ చెప్పి...రాముడి ఒడిలో జటాయువు కన్ను మూస్తుంది. తమకు మహోపకారం చేసిన జటాయువు అంత్యక్రియలను రామలక్ష్మణులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంలో జటాయువును చూసిన వెను వెంటనే రాముడన్న మాట- “లే! పక్షి!” అదే "లేపాక్షి" అయ్యింది. పమిడికాల్వ మధుసూధన్ -
ఒక ప్రవాహం
మనుషుల మీద లేబుల్స్ వేయడంలో మనకు ఒక సౌలభ్యం ఉంటుంది. దానివల్ల వారిని అంచనా కట్టడానికి ఒక పరిధి ఏర్పడుతుంది. కానీ భూమ్మీద ప్రవాహంలా బతికేవాళ్లు కొందరుంటారు. ఆ ప్రవాహంలో అన్నింటినీ తమలో ఇముడ్చుకుని పోతారు. సాగిపోవడమే వారి లక్షణం. ఆగిపోవడం వారికి తెలియని గుణం. వారు ఏమిటి? అని ప్రశ్న వేసుకున్నప్పుడు, వారు ఏమిటి కాదు? అనే మరో ప్రశ్న ఎదురొస్తుంది. ఆ రెండు ప్రశ్నల మధ్యే వారి జీవితం గురించిన ఒక జవాబు దొరుకుతుంది. 150 ఏళ్ల క్రితం ఫ్రాన్స్ లోని నార్మండీలో జన్మించిన (1873 జనవరి 28) ‘కొలెట్’ ఒక సజీవ ప్రవాహం. చాలా కారణాల వల్ల ఫ్రెంచ్ సమాజపు సాహిత్య సాంస్కృతిక జీవితాన్నీ, తద్వారా ప్రపంచాన్నీ ఆమె ప్రభావితం చేశారు. ‘చెరి’, ‘జిజి’, ‘ద వేగబాండ్’, ‘ద ప్యూర్ అండ్ ది ఇంప్యూర్’ లాంటి రచనలు చేసిన కొలెట్ జీవితం ఆమె రచనలంతే ఆకర్షణీయం. తన పేరును కేవలం ఏకపదంగా రాసుకున్న ‘కొలెట్’ పూర్తి పేరు సిడోనీ–గాబ్రియెల్ కొలెట్. ఆమె జీవితంలోని వివాహపు అధ్యాయం పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీ ఉనికి పరిమితులను చెబుతుంది. కేవలం కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి పద్నాలుగేళ్ల పెద్దయినవాడితో వివాహానికి ఒప్పుకొంది. భర్త హెన్రీ గౌథియర్ విల్లర్స్ కలంపేరు ‘విల్లీ’. సమాజంలో ప్రతిష్ఠ ఉన్నవాడు. అతడి ప్రఖ్యాతి ఎంతటిదంటే ‘ఘోస్టు రైటర్స్’తో పుస్తకాలను రాయిస్తుండేవాడు. ‘‘నీ ప్రాథమిక పాఠశాల జ్ఞాపకాలను కాగితం మీద పెట్టు,’’ అని నూతన వధువుకు కూడా చెప్పాడు. మనోరంజకమైనవి ఉంటే వదిలిపెట్టొద్దనీ, వాటిని తాను ఏదోలా వాడుకుంటాననీ కూడా అన్నాడు. కొలెట్ సహజంగానే రైటర్ మెటీరియల్. ఆమె రాతలను విల్లీ ముందు కొంచెం అనుమానించినా, వాటిని 1900లో ‘క్లాడైన్ ఎట్ స్కూల్’ నవలికగా తెచ్చాడు. ఒక పాఠశాల బాలిక కౌమార దశను వాస్తవికంగా చిత్రించిన ఈ రచనకు వెంటనే పేరొచ్చింది. సాహిత్యంలో కౌమార బాలిక గొంతుక వినిపించింది. ఆత్మ కథాత్మక సాహిత్యానికి పథనిర్ణేత అయ్యింది. వీటి మూల రచయిత్రి కొలెటే అని సాహిత్య లోకం అనంతర కాలపు ఆమె రచనల శైలిని బట్టి నిర్ధారించుకుంది కానీ అప్పటికి అధికారిక రచయిత విల్లీనే. అమ్మకాలు పెరగడంతో భార్య మీద ఒత్తిడి పెట్టాడు. ఒక దశలో గదిలో బంధించి, తర్వాతి ఇన్ స్టాల్మెంట్ ఇచ్చేంతవరకూ విడిచిపెట్టలేదు. ఈ వేధింపులు సహిస్తూనే, కొనసాగింపు నవలికలు ‘క్లాడైన్ ఇన్ పారిస్’, ‘క్లాడైన్ మేరీడ్’ రాసింది కొలెట్. క్లాడైన్ పాత్ర ఎంత హిట్టయ్యిందంటే, ఆ థీమ్తో సిగరెట్లు, లింజెరీ, పెర్ఫ్యూమ్ కూడా విల్లీ ప్రారంభించాడు. విల్లీ ఆమెను సాహిత్యంలోకి ప్రవేశపెట్టినా, మేలుకొన్నాక, ఆయన్ని జీవితంలోంచి బయటికి నెట్టేసింది కొలెట్. కానీ రాయల్టీల డబ్బులు లేకపోవడంతో స్టేజీ నటిగా పనిచేసింది. 1907లో తనే రాసిన ‘ద ఫ్లెష్’ సంగీత రూపకంలో స్టేజీ మీద ఎడమ చన్నును ప్రదర్శించడం పెద్ద కల్లోలం సృష్టించింది. ఇక, ‘మౌలిన్ రూజ్’లో తన స్నేహితురాలు ‘మిస్సీ’ని బహిరంగంగా ముద్దుపెట్టుకోవడం దుమారం లేపింది. ఈ మొదటి ప్రదర్శన తర్వాత పోలీసులు దాన్ని సాగనివ్వలేదు. బహిరంగంగా వాళ్లు తమ లెస్బియన్ బంధం గురించి ప్రకటించడం కూడా అప్పటి సమాజానికి విఘాతంలా తగిలింది. దీనివల్ల ఎవరికీ కంటబడని స్థలాల్లో కొంతకాలం బతకాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, స్వలింగ శృంగార సాహచర్య ప్రదర్శనల తాలూకు ధిక్కార బీజాలు ఇలా మొదలయ్యాయని అనుకోవచ్చు. కొలెట్ అంటే ఒక స్కాండల్. పరస్పర వైరుద్ధ్యంగా కనబడే ఎన్నో అంశాలు ఆమె జీవితంలో కనబడతాయి. ప్రపంచమంతా యూదుల పట్ల పట్టింపుతో ఉన్నప్పుడు, నాజీలతో జట్టుకట్టి, యూదు వ్యతిరేక భావనలు ఉన్న రచనలు చేశారు. తాను ఎంత స్వేచ్ఛగా బతికినప్పటికీ, ఓటు హక్కు కోరే స్త్రీలను కొరడాతో బాదాలన్నారు. జర్నలిస్టుగా పనిచేశారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో యుద్ధరంగం నుంచి వార్తలు పంపారు. ఒక సాహిత్య పత్రికకు సంపాదకురాలిగా పనిచేసినప్పుడు, ఎంతోమంది యువ రచయితలను ప్రోత్సహించారు. సుమారు యాభై పుస్తకాలను వెలువరించిన కొలెట్, పది గంటల పాటు ఏకధాటిగా కూడా రాసేది. ‘‘కొలెట్ స్త్రీవాది అవునో కాదో నిర్ణయించాల్సింది ఆమె కాదు’’ అని ఆమెను స్త్రీవాదిగానే సాహిత్య లోకం తర్వాత గుర్తించింది. సాధారణ మనుషులు కోరుకునే నైతిక చట్రంలోకి ఇమడని కొలెట్ ఒక బైసెక్సువల్. కుమారుడి లాంటి బాలుడితో ప్రణయం కొనసాగించారు. ‘మాంసం’ అనేది ఆమెకు చాలా ఇష్టమైన మాట. వాంఛకు అది సంకేతం. ‘‘ప్రేమ, నా కలానికి బ్రెడ్ అండ్ బటర్’’ అన్నారు. అందం పట్ల ఆమెకు మితిమీరిన పట్టింపు. వృద్ధాప్య ఛాయలు పొడసూపగానే ‘ఫేస్–లిఫ్ట్’ చేయించుకున్నారు. తన శరీరంలో ఏర్పడిన ముడతలను ద్వేషించారు. పాశ్చాత్య దేశాల్లోనూ విడాకులు తీసుకున్నవాళ్లకు మన్నన లేని కాలంలో, రెండు సార్లు విడాకులు తీసుకున్నారు. ఆ కారణంగా ఆమె మరణించినప్పుడు ధార్మిక క్రతువులు నిరాకరించబడ్డాయి. ‘‘చనిపోయిన తర్వాత కూడా కొలెట్ ఎంత సుదీర్ఘకాలం బతికింది!’’ అన్నారు 1967లో జర్నలిస్ట్ జానెట్ ఫ్లానర్. ఆ మాట అన్న యాభై ఏళ్ల తర్వాత కూడా కొలెట్ బతికేవుంది. ఆమె జీవితం ఇప్పటికీ ఆసక్తిగొలుపుతూనే ఉంది. ఆమె మీద పుస్తకాలు, సినిమాలు వస్తూనే ఉన్నాయి. మంచో చెడో కొలెట్ రూపంలో ఒక ఉత్సాహం ఈ భూమ్మీద కొన్నాళ్లు తిరగాడిందని మనం అనుకోవచ్చు. అయినా చెడు అని ఎందుకనాలి! -
పుస్తకం కర్ణభూషణం
పుస్తకం హస్తభూషణమన్నారు; అది చదివే పుస్తకాల గురించి! ఇప్పుడు వినే పుస్తకాలు ప్రాచుర్యాన్ని తెచ్చుకుంటూ కర్ణభూషణంగా మారుతున్నాయి. కాలం చేసే తమాషాలలో ఇదొకటి. మన జీవితమూ, ఊహలూ, ప్రణాళికలూ కాలం వెంబడి సరళరేఖలా సాగుతాయనుకుంటాం. కానీ,దృష్టి వైశాల్యాన్ని పెంచుకుని చూస్తే కాలం మళ్ళీ మళ్ళీ బయలుదేరిన చోటికే వచ్చే చక్రంలా కూడా కనిపిస్తుంది. ‘కాలచక్ర’మనే మాట సర్వత్రా ప్రసిద్ధమే. పుస్తక ప్రపంచంలోకే కనుక ఒకసారి తొంగి చూస్తే, ‘చదువు’ అనే మాట పుస్తకంతో ముడిపడే ప్రచారంలోకి వచ్చింది. పుస్తకాలు లేని కాలంలో; లేదా, అవి జనసామాన్యానికి విరివిగా అందుబాటులోకి రాని రోజుల్లో కథలూ, కవిత్వాలూ, ఇతరేతర జ్ఞానాలూ అన్నీ వినుకలి ద్వారానే అందేవి. దీర్ఘకాలంపాటు ప్రపంచవ్యాప్తంగా సమస్త వాఙ్మయమూ చక్షురక్షరాల మధ్య కాకుండా; వక్తకీ, శ్రోతకీ మధ్య ప్రవహిస్తూ మౌఖిక వాఙ్మ యమనే ముద్ర వేసుకుంది. పుస్తక వ్యాప్తితోనే లిఖిత సాహిత్యమన్న మాట వాడుకలోకి వచ్చింది. కాలచక్రం మళ్ళీ మొదటికొచ్చి, పుస్తకమనే ‘పఠన’ మాధ్యమం స్థానాన్ని, ఇయర్ ఫోన్ రూపంలో తిరిగి వెనకటి ‘శ్రవణ’ మాధ్యమం ఆక్రమించుకుంటున్నట్టు తోస్తోంది. నేటి యువత పుస్తకాన్ని చదవడం కన్నా, వినడాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నట్టు కనిపిస్తోంది. ఆ విధంగా, ‘పుస్తకాలు లేని గది ఆత్మలేని దేహ’మన్న సిసిరో సూక్తిని కొంత సవరించుకోవలసిన అవసరమూ కలుగుతోంది. కనుకలి నుంచి వినుకలికి మారినప్పుడు పుస్తకం కలిగించే అనుభూతి గాఢతలోనూ మార్పు వస్తుందా అన్నది అనుభవంతో మాత్రమే చెప్పగలం. ఏదైనాసరే అంతిమంగా అలవాటు పడడంలోనే ఉంటుంది. మాధ్యమం ఎలాంటిదైనా పుస్తకానికీ మస్తకానికీ పడిన పీటముడి స్థిరమూ, శాశ్వతమనీ మాత్రం నిస్సంశయంగా చెప్పవచ్చు. రాబోయే కాలం అనూహ్యంగా మన అంచనాలను తలకిందులు చేస్తే తప్ప పుస్తకాలతో మన సహజీవనం మరికొన్ని తరాలపాటు నిరాఘాటంగా కొనసాగుతుందనే అనుకోవచ్చు. కాపురంలోలానే పుస్తకాలతో కాపురంలోనూ చేదూ, తీపీ కలగలిసే ఉంటాయి. పుస్తక ప్రియులు వియ్యమందితే ఒక్కోసారి సొంతింటి పుస్తక వారసత్వానికీ, సొంత సేకరణకూ అదనంగా అత్తింటి పుస్తక వారసత్వమూ అంది, పుస్తకాలు ఇబ్బడి ముబ్బడై అల్మైరాలను దాటిపోయి నేల మీద పరచుకుంటూ ఉంటాయి. పుస్తెతోపాటు సంక్రమించిన పుస్తక సంపదా ఇల్లాలికి దినదిన సమస్య అవుతూ ఉంటుంది. పుస్తకాలతో జీవించడం కూడా ఒక పుస్తకానికి సరిపోయే ఇతివృత్త మవుతుంది. బాల్యం నుంచి, వార్ధక్యం వరకూ మనతో ఉండే పుస్తకాలు, ఒక్క పుట కూడా తెరవకుండానే, ఆయా వయోదశల మీదుగా మన అభిరుచులలో వచ్చే తేడాలను బోధిస్తాయి. మనకు పనికిరానివని పక్కన పెట్టిన పుస్తకాలే క్రమంగా మన చదువుల బల్లకెక్కి వెక్కిరిస్తాయి. మన హస్తస్పర్శ కోసం ఏళ్ల తరబడి మౌన తపస్సు చేసే పుస్తకాలే, ఒక్కసారి తెరవగానే అద్భుత ప్రపంచంలోకి మనల్ని లాక్కుపోతాయి. మన ప్రయాణం ఆగినా పుస్తక ప్రయాణం కొన సాగుతూనే ఉంటుంది. కవిత్వానికి ఏదీ అనర్హం కాదని మహాకవి ఉగ్గడించినట్టుగా, చరిత్ర శోధనకూ ఏదీ అనర్హం కాదు. పుస్తక చరిత్రనే తవ్వితే అది కూడా ఎన్నో అవతారాలు ఎత్తుతూ నేటి దశకు వచ్చిన సంగతి అర్థమై రేపటి అవతారం గురించిన దిగులు, గుబుళ్లను తగ్గిస్తుంది. పుస్తకం గురించిన ఊహ క్రీస్తుపూర్వం నాలుగవ సహస్రాబ్ది నాటికే ఉండేది. ప్రాచీన ఈజిప్టు వాసులు మధ్య ఆఫ్రికా, నైలునదీ లోయల్లో పెరిగే ‘పెపారస్’ అనే నీటిమొక్క నుంచి తీసిన మెత్తని బెరడును రాతకు, చిత్రలేఖనానికి ఉపయోగించేవారు. ఈ ‘పెపారస్’ పేరే ‘పేపర్’గా మారి ఇప్పటికీ వ్యవహారంలో ఉంది. ఆంగ్లంలో ‘బుక్’ అనే మాట పుట్టుకా ఇంతే ఆసక్తికరం. యూరప్, ఆసియా అడవుల్లో పెరిగే ‘బచ్’ అనే చెట్టు తాలూకు తెల్లని బెరడును రాతకు ఉపయోగించేవారు. నేటి ఇండో–యూరోపియన్ భాషలకు మాతృక అయిన ప్రోటో–ఇండో–యూరోపియన్ లోని ‘భెరెగ్’, ‘భగో’ అనే మాటలే వివిధ పుత్రికాభాషల్లో ‘బచ్’ గానూ, ‘బీచ్’ గానే కాక; ఇంకా అనేక రూపాంతరాలు చెందుతూ చివరికి ‘బుక్’గా మారాయి. ప్రాచీన భారతదేశంలో రాతకు ఉపయోగించిన ‘భూర్జపత్ర’ మనే సంస్కృత శబ్ద మూలాలు కూడా ‘భెరెగ్’ అనే ప్రోటో–ఇండో–యూరోపియన్ పదంలోనే ఉన్నాయి. క్రీస్తుశకం తొలి శతాబ్దంలో రోమన్లు శిక్షాస్మృతుల రాతకు గొర్రె, మేక చర్మాన్ని వినియో గించేవారు. క్రమంగా తాటియాకులు, రాగిరేకులు రాతకు ఆలంబనమయ్యాయి. క్రీస్తుశకం 2–5 శతాబ్దుల మధ్యలో వచ్చినట్టు చెబుతున్న ‘డైమెండ్ సూత్ర’ తొలి ముద్రితగ్రంథమంటారు. ఇక 15వ శతాబ్దిలో జోహానెస్ గూటెన్బర్గ్ కనిపెట్టిన ముద్రణ యంత్రం పుస్తక ప్రచురణను విప్లవీకరించడం, 16వ శతాబ్దిలో రిచర్డ్ ముల్కాస్టర్ అనే పండితుడు ఎనిమిదివేల మాటలతో తొలి నిఘంటువును ప్రచురించడం వగైరాలు ఇటీవలి చరిత్ర. ఎప్పటికప్పుడు పరిమిత సంఖ్యలో పుస్తకాలను ప్రచురించుకునే నేటి అవకాశాన్ని (ప్రింట్–ఆన్ –ఆర్డర్) ఫ్రెడరిక్ ఫో అనే సైన్సు ఫిక్షన్ రచయిత 1966లోనే ఊహించాడు. ఇంతకీ ఈ పుస్తక స్మరణ దేనికంటే, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పుస్తకాల పండుగ సమీపిస్తోంది. కొన్ని రోజులపాటు జరిగే ఈ పండుగకు ముద్రాపకులు, విక్రేతలు, రచయితలు సమధికోత్సాహంతో సిద్ధమవుతున్నారు. ముద్రిత గ్రంథాల భవిష్యత్తు పట్ల ప్రస్తుతానికి అదే కొండంత భరోసా. -
డిసెంబర్ 28 నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం
వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 28 నుంచి జనవరి 7 వరకు 34వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు టి.మనోహర్నాయుడు, కె.లక్ష్మయ్య చెప్పారు. ఈ ఏడాది కూడా పుస్తక మహోత్సవాన్ని విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పబ్లిషర్స్, డిస్ట్రిబ్యూటర్స్ పాల్గొంటారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన అన్ని రకాల పుస్తకాలు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. చదవండి: పింఛన్ల పంపిణీకి జాతీయ అవార్డు -
డల్లాస్లో తెలుగు గ్రంథాలయం ప్రారంభం
అమెరికాలో తెలుగువారు అధికంగా నివసించే నగరాల్లో ఒకటైన డల్లాస్లో శుక్రవారం సాయంత్రం తెలుగు గ్రంథాలయాన్ని ప్రారంభించారు. డల్లాస్ శివారు లూయిస్విల్లో ప్రవాసాంధ్రుడు మల్లవరపు అనంత్ R2 Realty కార్యాలయంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ గ్రంథాలయాన్ని గాయని ఎస్పీ శైలజ, గాయకుడు ఎస్పీ చరణ్, తానా మాజీ అధ్యక్షుడు డా. తోటకూర ప్రసాద్లు ప్రారంభించారు. ఎస్పీ శైలజ మాట్లాడుతూ అమెరికాలో తెలుగు గ్రంథాలయం ఏర్పాటు చేయడాన్ని హర్షించారు. రోజుకు ఒక పేజీ తెలుగు చదవాలని, తద్వారా మాతృభాషకు దూరం కాకుండా ఉండగలమని అన్నారు. ఎస్పీ చరణ్ మాట్లాడుతూ ఒకప్పుడు అమెరికాలో తెలుగువారంటే డాక్టర్లు గుర్తుకు వచ్చేవారని, కానీ ఇప్పుడు అనంత్ వంటి రియల్టర్లతో పాటు సమాజంలోని విభిన్న కోణాలకు చెందిన ఎందరో అమెరికా వస్తున్నారని తెలుగు భాష పట్ల ఆయనకున్న మక్కువతో ఏర్పాటు చేసిన గ్రంథాలయం అమెరికాలో వెలుగులు పంచాలని ఆకాంక్షించారు. తానా మాజీ అధ్యక్షుడు డా. తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ ఆస్టిన్లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్లో తెలుగు కోర్సుల నిర్వహణ నిమిత్తం తానా నిధుల సేకరణ చేపట్టినప్పుడు ఎస్పీ బాలు విభావరితో అలరించాలని ఆయన ఆశ ధ్యాస శ్వాస తెలుగు భాష అని కొనియాడారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆరు సంపుటాలుగా వెలువరించిన సిరివెన్నెల సమగ్ర సాహిత్యాన్ని శైలజ-చరణ్ల చేతుల మీదుగా ఈ గ్రంథాలయానికి బహుకరించారు. త్వరలోనే తానా ఆధ్వర్యంలో కవిరత్న కొసరాజు రాఘవయ్య చౌదరి సమగ్ర సాహిత్యాన్ని వెలువరిస్తామని ప్రసాద్ తెలిపారు. “ట్యాంక్బండ్పై తెలుగు విగ్రహాల ప్రశస్తి” పేరిట చెన్నపూరి తెలుగు అకాడమీ ప్రచురించిన పుస్తకాన్ని కూడా ఈ సభలో ఆవిష్కరించారు. వేముల లెనిన్, మద్దుకూరి చంద్రహాస్, అనంత్ మల్లవరుపులు కొండేపూడి లక్ష్మీనారాయణ రచించిన “పాడరా ఓ తెలుగువాడా” గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభించారు. అతిథులకు అనంత్ ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి పేరిట స్వదేశంలో పాఠశాల కట్టించానని, అమెరికాలో తన తల్లి పేరిట గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శారద సింగిరెడ్డి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, పరమేష్ దేవినేని, రాజేష్ అడుసుమిల్లి, బీరం సుందరరావు, సురేష్ మండువ, లక్ష్మీ పాలేటి తదితరులు పాల్గొన్నారు. -
Maunika Govardhan: నచ్చేలా మెచ్చేలా ఘనంగా గరిట పట్టేలా
‘తినడం కోసం బతకడం కాదు. బతకడం కోసం తినాలి’ అని కాస్త గంభీరంగా అనుకున్నాసరే, ‘వంటల రుచుల కోసం కూడా బతకవచ్చు సుమీ!’ అనిపిస్తుంది కొన్నిసార్లు. పసందైన వంటకాలు జీవనోత్సాహాన్ని కలిగిస్తాయి. చురుకుదనాన్ని నింపుతాయి. ఇట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని లండన్లో చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకొని చెఫ్గా మారి ప్రవాస భారతీయులకు అపూర్వమైన భారతీయ వంటకాలను పరిచయం చేయడంతో పాటు, వాటిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేదానిపై పుస్తకాలు రాస్తోంది మౌనికా గోవర్ధన్... ముంబైలోని దాదర్ ప్రాంతంలో పుట్టి పెరిగిన మౌనిక ప్రస్తుతం లండన్లో ఉంటోంది. చెఫ్గా సంప్రదాయ భారతీయ వంటకాల రుచులను విదేశీయులకు పరిచయం చేస్తుంది. ‘సులభంగా చేసుకునేలా... ఆరోగ్యంగా ఉండేలా...’ అనేది ఆమె వంటల పాలసీ. ప్రతి కుటుంబానికి తరతరాలుగా తమవైన ప్రత్యేక వంటకాలు ఉంటాయి. కొన్నిసార్లు కాలంతోపాటు అవి కనుమరుగు అవుతుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మౌనిక తమ కుటుంబంలో ఎన్నో తరాల విలువైన వంటకాలను సేకరించింది. పుస్తకాలు, టీవీ కార్యక్రమాలు, లైవ్ ఈవెంట్స్, సోషల్ మీడియా ద్వారా మన వంటకాలకు విదేశాల్లో ప్రాచుర్యం కల్పిస్తోంది. లండన్లో ఉంటున్నప్పటికీ మౌనికకు మన దేశంలోని పాతతరం వంటకాలపై ఆసక్తి తగ్గలేదు. ఏమాత్రం సమయం దొరికినా మన దేశానికి వచ్చి మధ్యప్రదేశ్ నుంచి మణిపుర్ వరకు ఎన్నో ప్రాంతాలకు వెళుతుంటుంది. ‘అందరిలాగే అమ్మ వంటకాలు అంటే నాకు ఇష్టం. అయితే కేవలం ఇష్టానికి పరిమితం కాకుండా అమ్మ చేసే వంటకాలను ఓపిగ్గా నేర్చుకున్నాను. నేను చేసే వంటకాలు కూడా అమ్మకు బాగా నచ్చేవి’ గతాన్ని గుర్తు చేసుకుంది మౌనిక. ఆమె అమెరికాలాంటి దేశాలకు వెళ్లినప్పుడు ప్రవాస భారతీయులతో మాట్లాడుతున్న సందర్భంగా మన వంటకాలను గుర్తు చేస్తున్నప్పుడు వారి నోట్లో నీళ్లు ఊరేవి. ప్రతివ్యక్తికి ‘సోల్ ఫుడ్’ అనేది ఒకటి ఉంటుంది అని చెబుతుంటుంది మౌనిక. మౌనిక తాజాపుస్తకం ‘తందూరీ హోమ్ కుకింగ్’ అద్భుత విజయాన్ని సాధించింది. ఈ పుస్తకంలో రకరకాల రుచికరమైన తందూరీ వంటకాలతో పాటు ఆయా వంటకాల చరిత్రను ఆసక్తికరంగా వివరిస్తుంది మౌనిక. ఇదంతా సరే, కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకొని మరీ మౌనిక ఎందుకు చెఫ్గా మారింది? ఆమె మాటల్లోనే... ‘లండన్లో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో స్నేహితుల కోసం సరదాగా వంటలు చేసి పెట్టేదాన్ని. ఆ వంటకాలు వారికి విపరీతంగా నచ్చేవి. ఆ రుచుల మైమరుపులో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా మరచి పోయేవారు. కుకింగ్ను ప్రొఫెషనల్గా తీసుకుంటే తిరుగులేని విజయం సాధిస్తావు అని చెప్పేవాళ్లు. నేను ఆ మాటలను పెద్దగా సీరియస్గా తీసుకునేదాన్ని కాదు. అయితే పదే పదే ఇలాంటి మాటలు వినిపించడంతో ఒకసారి ట్రై చేద్దామని కార్పొరేట్ జాబ్ను వదులుకొని కుకింగ్ను ఫుల్–టైమ్ జాబ్ చేసుకున్నాను. అయితే ఇది మా కుటుంబ సభ్యులకు నచ్చలేదు. కొందరైతే లండన్కు వెళ్లింది వంటలు చేయడానికా? అని వెక్కిరించారు. దీనికి కారణం కుకింగ్ అనేది వారికి ఒక ప్రొఫెషన్గా కనిపించకపోవడమే. కుకింగ్ అంటే ఇంట్లో ఆడవాళ్లు చేసే పని మాత్రమే అనేది వారి అభిప్రాయం. కుకింగ్కు సంబంధించిన రోల్మోడల్స్ గురించి కూడా వారికి తెలియదు. అయితే తరువాత మాత్రం వారిలో మార్పు వచ్చింది’ అంటుంది మౌనిక. మౌనిక ఇంట్లో ఆ రోజుల్లో ఒకే ఒక వంటల పుస్తకం కనిపించేది. ఆ పుస్తకాన్నే పదేపదే తిరగేసేది అమ్మ, ఈ పుస్తకాలు కూడా కొన్ని వంటకాలకు సంబంధించినవే ఉండేవి. దీన్ని దృష్టిలో పెట్టుకొని వంటలు ఎలా చేయాలో నేర్పించడం కోసం పుస్తకాలు కూడా రాయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా వెబ్సైట్ను మొదలుపెట్టింది. ఆ తరువాత ‘ది న్యూయార్క్ టైమ్స్’ ‘ది డెయిలీ మెయిల్’లో మన వంటకాలను ప్రపంచానికి పరిచయం చేసేది. వంటకాల తయారీలో రెండు దశాబ్దాల అనుభవం ఉన్న మౌనిక ఇండియన్ కిచెన్, థాలీ, తందూరీ హోమ్ కుకింగ్ అనే మూడు పుస్తకాలు రాసింది. ‘వంటలు చేసే సమయంలో నా దృష్టి మొత్తం తయారీ ప్రక్రియపైనే ఉంటుంది. ఆ సమయంలో వేరే విషయాల గురించి ఆలోచించడం తాలూకు ప్రభావం రుచిపై పడుతుంది. అందుకే వంటగదిలోకి వెళ్లినప్పుడు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా భావిస్తాను’ అంటుంది మౌనిక. మౌనిక లండన్లో చదువుకునే రోజుల్లో ‘అన్ని భారతీయ వంటకాలకు ఒకటే రెస్టారెంట్’ అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు కొత్తిమీర దొరకడం గగనంగా ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ‘మన వంటకాల కోసం రెస్టారెంట్లపై మాత్రమే ఆధారపడడం ఎందుకు? ఆడుతూ పాడుతూ మన ఇంట్లో చేసుకోవచ్చు కదా’ అనుకునే ప్రవాస భారతీయులకు మౌనిక గోవర్ధన్ పుస్తకాలు అపురూపంగా మారాయి. చెఫ్గా మౌనికా గోవర్థన్ అపూర్వ విజయానికి కారణం అయ్యాయి. -
నేస్తమా పుస్తకం విందామా!
పుస్తకం హస్తభూషణం అన్నారు.చేతిలో ఉండాల్సిన పుస్తకం ‘ఆడియో బుక్స్’ రూపంలో చెవికి చేరువవుతోంది.వ్యక్తిత్వ వికాసం నుంచి కాల్పనిక సాహిత్యం వరకు పుస్తకాలను ‘ఆడియో బుక్స్’ రూపంలో వినడానికి యూత్ ఆసక్తి ప్రదర్శిస్తోంది. పుస్తకాలు బాగా చదివే అలవాటు ఉన్న బెంగళూరుకు చెందిన విరజ, పుస్తకాల విలువ గురించి తెలుసుకొని వాటిపై ప్రేమ పెంచుకున్న భోపాల్కు చెందిన చైత్రకు పుస్తకాలకు చేరువ కావడానికి ఒకప్పుడు టైమ్ దొరికేది కాదు. ఇప్పుడు మాత్రం వీరిద్దరికి మాత్రమే కాదు యువతరంలోని ఎంతోమందికి పుస్తకాలు దగ్గర కావడానికి ‘టైమ్’ అనేది సమస్య కావడం లేదు. దీనికి కారణం... ఆడియో బుక్స్.మిలీనియల్స్, జెన్జెడ్ జెనరేషన్కు ‘ఆడియో బుక్స్’ హాట్ ఫేవరెట్గా మారాయి.‘ఒక పుస్తకం చదవడానికి రకరకాల కారణాల వల్ల నెల రోజులు పట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆడియో బుక్స్ వారానికి ఒకటి వినగలుగుతున్నాను. వినడం పూర్తయిన వెంటనే ఆ పుస్తకానికి సంబంధించిన నోట్స్ రాసుకుంటాను’ అంటుంది విరజ.గూగుల్ ప్లేలో ఆడియో బుక్స్ సెక్షన్ ప్రారంభమైన కొత్తలో యువత అంత దగ్గర కాలేదు. అయితే ఇప్పుడు దృశ్యం మారింది. వారి ప్రధానమైన ఆసక్తులలో ‘గూగుల్ ఆడియో బుక్స్’ కూడా ఒకటి.గూగుల్ ప్లేలో డబ్బు చెల్లించే ఆడియో బుక్స్తో పాటు చెల్లించనవసరం లేనివి కూడా ఉన్నాయి.‘ఓకే గూగుల్, హూ ఈజ్ అథర్?’ ‘ఓకే గూగుల్, స్టాప్ ప్లేయింగ్ ఇన్ 20 మినిట్స్’...ఇలాంటి కమాండ్స్ గూగుల్ అసిస్టెంట్కు ఇవ్వవచ్చు. గ్లోబల్ ఆడియో బుక్స్ మార్కెట్ లీడర్గా ఉన్న ‘ఆడిబుల్’ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించిన తరువాత ఆడియో బుక్స్కు ఊపు వచ్చింది. రకరకాల వయసుల వారిని దృష్టిలో పెట్టుకొని ‘ఆడిబుల్ ఇండియా’లో వేలాది ఆడియో బుక్స్ను రొమాన్స్, థ్రిల్లర్, ఆధ్మాత్మికం, హారర్, డ్రామా జానర్లలో తీసుకువచ్చారు.ఇంగ్లిష్తో సహా హిందీ, మరాఠీ, ఉర్దూ, బెంగాలీ... మొదలైన భాషలలో ఆడియో బుక్స్ ఉన్నాయి.‘ఆడియో బుక్స్ సక్సెస్ కావడానికి కారణం మన మూలాల్లోనే ఉంది. చిన్నప్పుడు కథలను వినేవాళ్లం’ అంటుంది ముంబైకి చెందిన స్మిత. ఒక పుస్తకం విజయాన్ని అంచనా వేసే ప్రమాణాలలో ఆడియో బుక్స్ కూడా చేరాయి. మాతృభాషలో పుస్తకాలు చదవడానికి ఇబ్బంది పడే యువతరానికి ఆడియో బుక్స్ ఆత్మీయనేస్తాలయ్యాయి.‘పాడ్కాస్ట్తో పాటు ఆడియో బుక్స్కు ఆదరణ పెరిగింది’ అంటున్నాడు ‘వన్ బై టు’ మీడియా కో–ఫౌండర్ రాజేష్ తాహిల్.ఫిక్షన్, రొమాన్స్ జానర్స్ కోసం యాపిల్ బుక్ ‘మాడిసన్’ ‘జాక్సన్’ ‘హెలెన్’ అనే డిజిటల్ నేరేటర్లను క్రియేట్ చేసింది.యూఎస్, యూరోపియన్ దేశాలలో పబ్లిషర్స్కు ఆడియో కంటెంట్ క్రియేట్ చేయడానికి సొంతంగా స్టూడియోలు ఉన్నాయి. మన దేశంలో అలాంటి పరిస్థితి వచ్చినట్లు లేదు. ఒక ఆడియో బుక్కు కనీసం లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా.‘స్పాటిఫై’ అనగానే గుర్తుకు వచ్చేది సంగీతం. ఆడియో బుక్స్ ఆదరణను పసిగట్టిన ఈ డిజిటల్ మ్యూజిక్ సర్వీస్ యూఎస్తో పాటు నాలుగు దేశాల్లో ఆడియో బుక్ ఫీచర్ని ప్రవేశపెట్టింది. మూడు లక్షల ఆడియో బుక్స్ను తీసుకువచ్చిన ‘స్పాటిఫై’ యూజర్ల కోసం ‘ఆడియో కామెంట్’ తీసుకురానుంది.ఆడియో బుక్ ఇండస్ట్రీ ఊపందుకోవడాన్ని గమనించిన పబ్లిషర్లు రానున్న రోజుల్లో ఆడియో బుక్స్ స్పేస్ను పెంచాలనుకుంటున్నారు. క్లాసిక్స్పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.‘గతంతో పోల్చితే ఆడియో బుక్స్ వినడానికి వెచ్చిస్తున్న టైమ్ పెరిగింది’ అంటున్నాడు ‘స్టోరీ టెల్ ఇండియా’ కంట్రీ మేనేజర్ యోగేష్ దశరథ్.ఆడియో బుక్స్ యూత్ను ఆకట్టుకోవడానికి ప్రధాన కారణం ప్రయాణాలలో, బారెడు క్యూలలో నిలబడిన సందర్భాలలో కూడా వాటిని వినే అవకాశం ఉండడం. కొందరైతే వ్యాయామాలు చేస్తూ కూడా ఆడియో బుక్స్ వింటున్నారు.‘ఆడియో బుక్స్ వల్ల పుస్తకం చదివే దృశ్యం అదృశ్యం కానుందా?’ అనే ప్రశ్నకు ఇంజనీరింగ్ స్టూడెంట్ సౌమ్య మాటల్లో జవాబు దొరుకుతుంది.‘పుస్తకం చదవడం అంటేనే నాకు ఇష్టం. అంతమాత్రాన ఆడియో బుక్స్కు దూరం కాలేదు. సమయ సందర్భాలను బట్టి చదవాలా, వినాలా అనేదాన్ని ఎంచుకుంటాను’ అంటుంది సౌమ్య. ఆడియో బుక్ రీడ్ బై సెలబ్రిటీ ఆడియో బుక్స్ విజయంలో పుస్తకంలోని కంటెంట్తో పాటు నేరేటర్ ప్రతిభ కూడా ఆధారపడి ఉంటుంది. వినే కొద్దీ వినాలనుకునే గొంతులు ఆడియో బుక్స్ విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.‘ఆడియో బుక్ రీడ్బై సెలబ్రిటీస్’ ధోరణి మన దేశంలోనూ పెరగనుంది. ఆడియో బుక్ రీడింగ్లో బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ మంచి పేరు తెచ్చుకుంది. వుడీ ఎలెన్ ‘కౌంట్ డ్రాకులా’తో పాటు ఎన్నో పుస్తకాలు ఆమె స్వరంలో యువత మంత్రముగ్ధులై విన్నారు. -
సంస్కృతంలో వాళ్లెందుకు రాయరు?
సంస్కృతాన్ని ఇష్టపడే కొందరు భారతీయ అమెరికన్లు తమ పుస్తకాలను సంస్కృతంలో ఎందుకు రాయరు? వీరు ఆంగ్లంలో రాస్తూనే, ఆ భాషను వలసవాదమంటూ దాడి చేస్తారు. చారిత్రకంగా సంస్కృతాన్ని కొందరు రచయితలే నియంత్రించారు. వారు దాని ప్రాప్యతను, విస్తృతిని పరిమితం చేశారు. శూద్రులకు ఆ భాషలో చదవడానికి, రాయడానికి గల అవకాశాన్ని నిరాకరించారు. కానీ, ఇప్పుడు వాళ్లూ సామాజికపరమైన లేదా విద్యాపరమైన ప్రాముఖ్యం కలిగిన పుస్తకాలు రాయడానికి సంస్కృతాన్ని ఉపయోగించడం లేదు. అలా సంస్కృత అంతర్ధానానికి చైతన్యవంతంగా బాధ్యత వహిస్తున్నారు. అయినా ఆ అంతర్ధానానికి మాత్రం మిగిలిన ప్రపంచాన్ని నిందిస్తూ ఉంటారు. దాదాపుగా భారతీయ అమెరికన్లతో కూడిన రాజీవ్ మల్హోత్రా నేతృత్వంలోని బృందం ఇటీవల ‘టెన్ హెడ్స్ ఆఫ్ రావణ: ఎ క్రిటిక్ ఆఫ్ హిందూఫోబిక్ స్కాలర్స్’ పుస్తకాన్ని ప్రచురించింది. ఇంగ్లిషులో రాసిన ఈ పుస్తకం... ఈ రచయితతో సహా రొమిల్లా థాపర్, ఇర్ఫాన్ హబీబ్, శశిథరూర్, రామచంద్ర గుహ, దేవదత్ పట్నాయక్, షెల్డన్ పొలాక్, వెండీ డోనిగర్, ఆద్రీ త్రూష్కే, మైకేల్ విట్జెల్లను విమర్శించింది. మల్హోత్రా బృందం ఈ పండితులను పౌరాణిక పాత్ర అయిన రావణుడితో పోల్చింది. ఈ పండితులు ప్రాచీన సంస్కృత పుస్తకాలు ప్రబోధించిన ధర్మాన్ని చంపేశారని ఆరోపించింది. ‘చారిత్రక రావణుడికి మల్లే ఈ పండితుల రచనల్లో నేడు చాలామంది హిందువులు అధర్మంగా భావిస్తున్న అంశాలు ఉన్నాయి కాబట్టే ఈ పుస్తకంలో పది మంది సమకాలీన విద్వాంసులను లక్ష్యంగా’ ఎంచుకున్నట్లు మల్హోత్రా తన పరిచయంలో పేర్కొన్నారు. ఈ పుస్తకంలో లక్ష్యంగా ఎంచుకున్న నలుగురు విదేశీ పండితులు సంస్కృత భాషపై కృషి చేశారు. చాలాకాలం వివిధ పాశ్చాత్య విశ్వ విద్యాలయాలలో సంస్కృత భాషను బోధించారు. మరోవైపు, మల్హోత్రాకు అమెరికాలో ‘ఇన్ఫినిటీ ఫౌండేషన్’ అనే ఆర్థిక నెట్వర్క్ ఉంది. ఈ పుస్తకాన్ని ప్రచురించిన ఢిల్లీలోని ‘గరుడ ప్రకాశన్ ’ సంస్థనూ నడుపుతున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే: సంస్కృతాన్ని ఇష్టపడే ఈ భారతీయ అమెరికన్లు తమ పుస్తకాన్ని సంస్కృతంలో ఎందుకు రాయలేదు? వీరు ఆంగ్లంలో రాస్తూనే, ఆ భాషను వలసవాదమంటూ దాడి చేస్తారు. సంస్కృతాన్ని గొప్ప ప్రపంచ సజీవ భాష అంటారు, కానీ ఆ భాషలో ఏ గ్రంథాన్నీ రాయరు. సంస్కృతాన్ని మృత భాష అని షెల్డన్ పొల్లాక్ సరిగ్గానే అన్నారు. తమ దైనందిన జీవితంలో సంస్కృతాన్ని ఉప యోగించే, అందులో భావ వ్యక్తీకరణ చేసే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? ఒక భాషను స్థానికంగా మాట్లాడేవారు లేనప్పుడు భాష మరణిస్తుంది. ఆధిపత్య నియంత్రణను కొనసాగించడానికి సంస్కృతాన్ని ఉపయోగించే వ్యక్తుల సమూహమే ఆ భాషను చంపేసింది. చారిత్రకంగా సంస్కృతాన్ని కొందరు రచయితలే నియంత్రించారు. వారు దాని ప్రాప్యతను లేదా విస్తృతిని పరిమితం చేశారు. శూద్రులకు ఆ భాషలో చదవడానికి లేదా రాయడానికి గల అవకాశాన్ని నిరాకరించారు. సామాజికపరమైన లేదా విద్యాపరమైన ప్రాముఖ్యం కలిగిన పుస్తకాలు రాయడానికి సంస్కృతాన్ని ఇప్పుడు వాళ్లూ ఉపయోగించడం లేదు. అలా సంస్కృత అంతర్ధానానికి చైతన్యవంతంగా బాధ్యత వహిస్తున్నారు. కానీ ఆ అంతర్ధానానికి మిగిలిన ప్రపంచాన్ని నిందిస్తూ ఉంటారు. ఇతర సంస్కృతులకు చెందిన యూదుల వంటివారు తమ ఆధునిక పుస్తకాలను హీబ్రూలో రాస్తున్నారు. యువల్ నోవా హరారీ ప్రభావవంతమైన రచన ‘సేపియన్స్– ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కైండ్’ను మొదట హీబ్రూలోనే రాశారు. అలాగే గ్రీకులు గ్రీకు భాషలో రాస్తారు. అరబ్బులు అరబిక్లోనే రాస్తారు. బ్రాహ్మణ వాదులు మాత్రం సంస్కృతంలో రాయరు. శూద్ర, దళిత, ఆదివాసీ ప్రజానీ కాన్ని మోసం చేయడానికి మాత్రమే సంస్కృతాన్ని పొగడటాన్ని నేటికీ కొనసాగిస్తున్నారా? బ్రాహ్మణవాద మేధావులకు ఆరెస్సెస్, బీజేపీ ఆర్థికంగా, సంస్థాగతంగా మద్దతు ఇస్తున్నాయి. భారతదేశ వ్యవసాయ చేతివృత్తుల చరిత్రను విస్మరిస్తూ సంస్కృత గతాన్ని మాత్రమే వీరు కీర్తిస్తున్నారు. వివిధ విభాగాలలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న జ్ఞానాన్నంతటినీ సంస్కృత గ్రంథాలైన వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, రామాయణం, మహాభారతాల నుండే దొంగిలించారనే భావనను ప్రచారం చేస్తారు. బ్రాహ్మణవాద శాస్త్రవేత్తలు కూడా ఆధునిక విజ్ఞాన శాస్త్రాలన్నీ ప్రాచీన సంస్కృత పుస్తకాలలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పండితుల్లో ఎంతమంది సంస్కృతంలో ఆ పుస్తకాలను చదివారు? సంస్కృతంలో ఇంత అపారమైన సృజనాత్మక శక్తి ఉన్నట్లయితే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న భారతీయ మేధావులు... ప్రపంచ తాత్విక, మే«ధాపరమైన రచనలను హరారీ వంటి వ్యక్తులకు ఎందుకు వదిలివేస్తున్నారు? భారతదేశ చరిత్ర పొడవునా సంస్కృతాన్ని ‘మాతృభాష’గా కాకుండా ‘పితృభాష’గా పరిగణిస్తూ వచ్చారు. సంస్కృతాన్ని ద్విజ కుటుంబాలలో కూడా మాతృభాషగా మారడానికి అనుమతించలేదని గుర్తుంచుకోవాలి. తల్లి, ఆమె బిడ్డల మధ్య సంభాషణతో సహా ఇంటిలో రోజువారీ జీవితంలో ఒక భాషను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే మాత్రమే దానిని ‘మాతృభాష’గా పరిగణించవచ్చు. కులీన గృహాలలో కూడా సంస్కృతాన్ని మాతృభాషగా మారడానికి అనుమతించనప్పుడు, ఉత్పత్తి వర్గాల్లో దాన్ని స్వీకరించే ప్రశ్న తలెత్తదు. ఈ పరిస్థితుల దృష్ట్యా, నాగరికతకు రక్షణకర్తలుగా తమను తాము గుర్తించుకునే ఈ భారతీయ అమెరికన్ల సమూహం... సంస్కృతంలో తమ పుస్తకాలను ఎందుకు రాయడం లేదని ప్రశ్నించాల్సి ఉంది. ఈ బృందం ప్రధానంగా అమెరికా, యూరప్, కెనడా, ఆస్ట్రేలియాల్లో నివసిస్తున్న వ్యక్తులలోని భారతీయ ఆలోచనా విధానాన్ని నిర్వలసీకరించడం, ఆర్థిక వనరులను సమీకరించడం లక్ష్యంగా పెట్టు కుంది. కానీ, భారతదేశంలో స్థాపించిన సంస్కృత పాఠశాలలు,సంస్కృత విశ్వవిద్యాలయాలకు వారు తమ పిల్లలను ఎందుకు పంపరు? బదులుగా వారు తమ పిల్లలను ప్రతిష్ఠాత్మకమైన అమెరికన్ విశ్వవిద్యాలయాలకు మాత్రమే ఎందుకు పంపాలని భావిస్తున్నారు? ‘టెన్ హెడ్స్ ఆఫ్ రావణ’ పుస్తకాన్ని రచించిన ఈ వ్యక్తులు,సంస్కృత పుస్తకాల నుండి వచ్చిన భారతదేశ నాగరికత మా లాంటి ఎవరికీ తెలియదని ఆరోపించారు. నాగరికత అంటే వారి దృష్టిలో అర్థం ఏమిటి? పుస్తకాల ద్వారా నాగరికతను నిర్మించవచ్చా? సంస్కృత పుస్తకాలకు చెందిన ఏదైనా అనువాదాన్ని చదివితే... శూద్ర, దళిత, ఆదివాసీ వర్గాల నుండి సామాజిక శక్తులు ఏవీ లేవని అది సూచిస్తుంది. ఇవి యుద్ధం, యజ్ఞాలు, క్రతువుల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. ఆహార ఉత్పత్తి, సేకరణ, జంతువుల మేతకు చెందిన వ్యవస్థలను ఈ పుస్తకాలలో ఏ కోశానా పొందుపర్చలేదు. ఈ హిందూత్వ రచయితలతో సహా మానవులందరూ శూద్ర వ్యవసాయా ధారిత ప్రజానీకం ఉత్పత్తి చేసే ఆహారంతోనే జీవిస్తున్నారని గుర్తించడం ముఖ్యం. ఆ ‘సంస్కృత యుగం’లో భూమిని పండించిన వారి గురించి, జంతువుల మేత ద్వారా మాంసాన్ని, పాలను ఉత్పత్తి చేసిన వారి గురించి ఎప్పుడూ రాయలేదు. హాస్యాస్పదంగా, ఈ భారతీయ అమెరికన్ కులీన వర్గాలు, ప్రత్యేకించి అమెరికాలో కుల వ్యతిరేక చట్టాలను వ్యతిరేకించే ఇన్ఫినిటీ ఫౌండేషన్ సభ్యులు తమను తాము ‘మేధావులైన క్షత్రియులు’గా పేర్కొంటారు. అది కులతత్వం కాదా? మరోవైపున వీరి సంస్కృత యుగం పట్ల దళితులు, ఆదివాసీలు, శూద్రులకు ఏ మాత్రం ఆసక్తి లేదు. ఇంగ్లిష్ యుగంలోకి వెళ్లాలనీ, జ్ఞానోత్పత్తికి సంబంధించిన అన్ని కేంద్రాల నుండి ఈ శక్తులను స్థానభ్రంశం చేయాలనీ, ఆహార ఉత్పత్తి, జ్ఞానోత్పత్తి మధ్య సంబంధాన్ని ప్రతిష్ఠించాలనీ వారు కోరుకుంటున్నారు. ఇది అమృత్ కాల్ కాదు; నిజానికి ఇది శూద్ర కాలం. ఈ యుగంలో సంస్కృత పుస్తకాలలో వర్ణించినట్లుగా ఉత్పత్తి అనేది లోకువైనది కాదు; ఇక్కడ ఉత్పత్తి చాలా పవిత్రమైనది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
రూప..కంప్యూటర్ ఇంజనీర్ కానీ, పిల్లల కోసం పుస్తకాలు రాస్తుంది
పిల్లల పుస్తకప్రపంచంలో తనదైన ప్రత్యేకత నిలుపుకుంది రూపా పాయ్. ఫాంటసీ–అడ్వెంచర్ పుస్తకాలతో పాటు ‘ది గీతా ఫర్ చిల్డ్రన్’లాంటి భిన్నమైన పుస్తకాన్ని రాసి ప్రశంసలు అందుకుంది. ఈ పుస్తకం ‘క్రాస్వర్డ్ అవార్డ్’ గెలుచుకుంది. మరో భిన్నమైన పుస్తకం ‘ది యోగా సూత్రాస్ ఫర్ చిల్డ్రన్’తో పిల్లలను పలకరించింది బెంగళూరుకు చెందిన రూప... పిల్లల పత్రిక ‘టార్గెట్’తో పాటు లండన్ కేంద్రంగా ప్రచురితమయ్యే ‘ట్రావెల్ ట్రెండ్స్’ మ్యాగజైన్ కోసం ఎన్నో రచనలు చేసింది రూప. అయితే తనకు పిల్లల కోసం రచనలు చేయడం అంటేనే బాగా ఇష్టం. ‘నేను రచయిత్రి కాకపోయి ఉంటే టీచర్ని అయ్యేదాన్ని’ అంటుంది కంప్యూటర్–ఇంజనీరింగ్ చదువుకున్న రూప. చిన్నప్పటి నుంచి పుస్తకాలు తెగ చదివేది. బెంగళూరులోని లైబ్రరీలన్నీ ఆమెకు సుపరిచితమే. చదవగా, చదవగా తనలో కాల్పనిక ప్రపంచం ఒకటి అస్పష్టంగా ఆవిష్కారమయ్యేది. కళ్ల ముందు ఏవేవో పాత్రలు, దృశ్యాలు కదలాడుతుండేవి. కాగితం, కలం పట్టిన తరువాత వాటికి ఒక రూపం ఇచ్చింది. రకరకాల జానర్స్లో రచనలు చేయడం గురించి రూప ఇలా అంటోంది...‘కథ మంచిదైతే, ఆకట్టుకునేలా ఉంటే అది ఏ జానర్ అనేది పిల్లలు పట్టించుకోరు. వారికి కచ్చితంగా హాస్యం ఉండాల్సిందే. ముఖ్యంగా క్లైమాక్స్ అనేది వారికి నచ్చాలి’.‘ది గీతా ఫర్ చిల్డ్రన్’ పుస్తకం రూపకు ఎంతో పేరు తెచ్చింది.‘మన పురాణాలకు సంబంధించిన ఎన్నో సంక్లిష్టమైన విషయాలను పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా రాస్తున్నారు కదా....మరి భగవద్గీత గురించి ఎందుకు రాయకూడదు’ అని ఒకరోజు అడిగింది ఎడిటర్ వత్సల. అయితే అందుకుముందెన్నడూ భగవద్గీతను రూప చదవలేదు. అలా అని ‘నేను రాయలేను’ అనలేదు. ‘ఓకే’ అంటూ రంగంలోకి దిగింది. ‘గీత’ను ఎన్నోసార్లు చదివింది. అనేకసార్లు చదివిన తరువాత ‘గీత గురించి పిల్లలకు చెప్పాలనే ఆలోచన నాకు ఎందుకు రాలేదు’ అనుకుంది.నిజానికి అదొక సవాలు. కానీ ఆ సవాలును ఇష్టంగా స్వీకరించింది రూప. ‘ది గీతా ఫర్ చిల్డ్రన్’ పిల్లలనే కాదు వారి తల్లిదండ్రులను కూడా ఆకట్టుకుంది. ‘మంచి ప్రయత్నం’ అని ప్రశంసించారు.‘ది గీతా ఫర్ చిల్డ్రన్’ పుస్తకం విజయవంతం అయిన తరువాత ‘ఇదే కోవలో మరో పుస్తకం రాస్తే బాగుంటుంది’ అని చాలామంది అడిగారు. అయితే అలా రాస్తే రొడ్డకొట్టుడుగా ఉంటుందని రూపకు ఆనిపించింది. ‘ఇప్పుడు కావాల్సింది మరో విభిన్నమైన పుస్తకం’ అని అనుకుంది. అలా వచ్చిందే...‘సో యూ వాంట్ టు నో ఎబౌట్ ఎకనామిక్స్’ పుస్తకం. ఈ పుస్తకం రావడానికి మరో కారణం ‘గీతను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడంలో విజయం సాధించాను’ అనే ఆత్మవిశ్వాసం. ఈ పుస్తకం తరువాత వచ్చిన ‘రెడీ 99’కి కూడా మంచి స్పందన వచ్చింది. పుస్తకం రాయడానికి రూప అనుసరించే పద్ధతి ఏమిటి? పుస్తకం రాయడానికి ముందు మనసు అనే కాగితంపైనే ఎన్నో వాక్యాలు రాసుకుంటుంది. అక్కడే ఎడిటింగ్ చేసుకుంటుంది. తాను ఎంచుకున్న అంశంపై ఎన్నో పుస్తకాలు చదువుతుంది. ఆ అంశంపై పట్టు ఉన్న వాళ్లతో మాట్లాడుతుంది. విషయ అవగాహన తరువాత పిల్లలను ఆకట్టుకునేలా, అర్థమయ్యేలా ఎలా రాయాలో అనేదానిపై కసరత్తు చేస్తుంది.‘పన్నెండు సంవత్సరాల వయసులో ఒక పిల్లల మాసపత్రికను చూస్తూ...పెద్దయ్యాక ఈ పత్రికకు కథలు రాయాలనుకునేదాన్ని. నా కల నెరవేరింది. ఇంతకంటే అదృష్టం, ఆనందం ఏముంటాయి!’ అంటుంది రూపా పాయ్. పిల్లలకు యోగా సూత్రాలు భగవద్గీత శ్లోకాల సారాంశాన్ని, ఆర్థిక సూత్రాల మర్మాన్ని పుస్తకాల ద్వారా పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా చెప్పిన రూపా పాయ్ తాజా పుస్తకం ‘ది యోగ సూత్రాస్ ఫర్ చిల్డ్రన్’. చిన్నప్పుడు మనసులో పడిన ఒక బీజం మొక్క అవుతుంది. ఆ తరువాత బలమైన చెట్టు అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాసిన పుస్తకం ఇది. ‘మనలో కలిగే రకరకాల భావాలకి మనమే యజమాని’ ‘నేను శరీరాన్ని కాదు. కాని ఈ శరీరమనే అద్భుతమైన నిర్మాణంతో ఈ అద్భుత ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను’ ‘నేను మనసుని కాదు. కానీ మనసు అనే మహా నిర్మాణంలో ఎన్నో అద్భుతాలను అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాను’... ఇలా ఆకట్టుకునే మాటలు ఎన్నో ఉన్న ‘ది యోగ సూత్రాస్ ఫర్ చిల్డ్రన్’ ఆబాలగోపాలానికి ప్రియమైన పుస్తకం అవుతుంది అనడంలో సందేహం లేదు. -
కార్తీక 2.ఒ
కార్తీక వీకే... ఎంతోమంది సాహిత్యాభిమానులకు సుపరిచితమైన పేరు. ‘క్వీన్ ఆఫ్ ఇండియన్ పబ్లిషింగ్’గా కీర్తి అందుకున్న వెస్ట్ల్యాండ్ బుక్స్ (అమెజాన్ కంపెనీ) పబ్లిషర్గా ఎంతోమంది రచయితలను ప్రపంచానికి పరిచయం చేసింది. పాఠకుల నాడి పట్టుకుంది. మారుమూల పల్లె నుంచి హైటెక్ సిటీ వరకు ఏ చిన్న మెరుపు మెరిసినా ఆ మెరుపును అందుకోగలిగింది. కారణాలపై స్పష్టత ఇవ్వకపోయినా అమెజాన్ కంపెనీ వెస్ట్ల్యాండ్ బుక్స్ను మూసివేసింది. ఆ తరువాత ఏమైంది? ‘ప్రతిలిపి’తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది కార్తీక. ఆన్లైన్ ప్లాట్ఫామ్ ‘ప్రతిలిపి’ దేశంలోని పన్నెండు భాషలకు సంబంధించిన సృజనాత్మక రచనలకు, సాహిత్యభిమానుల మధ్య చర్చలకు వేదిక అయింది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ‘ప్రతిలిపి’ వెస్ట్ల్యాండ్ పబ్లిషింగ్, ఎడిటోరియల్, మార్కెటింగ్, సేల్స్ టీమ్ను యథాతథంగా తీసుకొని కొత్త ప్రయాణం మొదలు పెట్టింది. ఈ కొత్త వెంచర్ని ‘వెస్ట్ల్యాండ్ 2.ఒ’ అని పిలుస్తున్నారు. దేశంలోని మోస్ట్ పవర్ఫుల్ ఎడిటర్లలో ఒకరిగా పేరుగాంచిన కార్తీకకు వెస్ట్ల్యాండ్లాగే ‘ప్రతిలిపి’ని పాపులర్ చేయాల్సిన బాధ్యత ఉంది. ‘ప్రతిలిపి పేపర్బ్యాక్స్’ శీర్షికతో తమ యాప్లో పాపులర్ అయిన రచనలను కార్తీక నేతృత్వంలో పుస్తకాలుగా తీసుకు రానుంది ప్రతిలిపి. ‘గతానికి ఇప్పటికీ తేడా ఏమిటంటే అప్పుడు పాపులర్ రచనలను పుస్తకాలుగా ప్రచురించేదాన్ని. ఇప్పుడు యాప్లో పాపులర్ అయిన రచనలను పుస్తకంగా ప్రచురించబోతున్నాను’ అంటుంది కార్తీక. ‘పుస్తకం అంటే కొన్ని పేజీల సముదాయం కాదు. అదొక ప్రపంచం’ అని చెప్పే కార్తీకకు ‘సంప్రదాయ పబ్లిషర్’ అని పేరు ఉంది. అయితే ఇప్పుడు ఈ సంప్రదాయ పబ్లిషర్ ఆడియోబుక్, యాప్, పాడ్కాస్ట్... మొదలైన ఫార్మాట్లలో సాహిత్యాభిమానులకు చేరువ కావడానికి కొత్తదారిలో ప్రయాణం చేస్తుంది. ‘కాలంతోపాటు నడవాలి. కొత్త ఫార్మాట్స్పై అవగాహన పెంచుకోవాలి. ఇది సవాలు మాత్రమే కాదు ఎంతో ఉత్సాహం ఇచ్చే పని కూడా’ అంటుంది కార్తీక. కార్తీకతో కలిసి మరోసారి పనిచేయడానికి రచయితలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఆ ఉత్సాహమే ఆమె బలమని చెప్పాల్సి అవసరం లేదు కదా! వైవిధ్యమే బలం ప్రచురణ రంగానికి వైవిధ్యమే ప్రధాన బలం. అందుకే ఎప్పటికప్పుడు పాఠకుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుంటాను. పాఠకులకు ఎలా చేరువ కావాలనేదానిపై రకరకాలుగా ఆలోచిస్తాను. పాఠకులకు చేరువ కావాలనే లక్ష్యం కోసం వక్రమార్గాల్లో పయనించడం నా సిద్ధాంతం కాదు. సమాజానికి హాని చేసే కంటెంట్ను దగ్గరికి రానివ్వను. వ్యాపారానికి నైతికత అనేది ముఖ్యం. విలువలకు ప్రాధాన్యత ఇస్తాను. ఎంపికకు సంబం«ధించిన విషయంలో కూడా ‘నాదే రైట్’ అనే ధోరణితో కాకుండా ఇతరులతో విస్తృతంగా చర్చిస్తాను. సోకాల్ట్–మెయిన్ స్ట్రీమ్ ఆలోచనలకు పక్కకు జరిగితే ఎంతో అద్భుతమైన ప్రతిభను వెలుగులోకి తీసుకురావచ్చు. నా కెరీర్లో సంతోషకరమైన విషయం ఏమిటంటే యువతలో చదివే వారి సంఖ్య పెరగడం. ‘కొత్త పాఠకులు ఎలాంటి కంటెంట్ను ఇష్టపడుతున్నారు?’ అని తెలుసుకోవడం ముఖ్యం. శక్తిమంతమైన, సృజనాత్మకమైన ఆలోచనలు ఎక్కడో ఒకచోట ఉంటాయి. అవి ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి వెలుగులోకి తీసుకురావడమే పబ్లిషర్ బలం. – కార్తీక వీకే -
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 పుస్తకాలు
-
పుస్తక మర్యాద
ఒక పుస్తకాన్ని చదవడం వేరు, ఆ పుస్తకాన్ని అపురూపంగా చూడటం వేరు. చాలామంది పుస్తకాలను అమర్యాదగా చదువుతారు. అంతే సమానంగా వాటిపట్ల అజాగ్రత్తగా ఉంటారు. పుస్తకాలను వాటి మర్యాదకు తగినట్టుగా గౌరవించడం కూడా ఒక సంస్కృతి! పుస్తకం పేజీలు తీయడం కూడా కొందరు సుతారంగా తీస్తారు; పేజీలు నలగకుండా దాన్నొక పువ్వులా హ్యాండిల్ చేస్తారు. కొందరు నీటుగా బుక్ మార్క్స్ సిద్ధం చేసుకుంటారు. కొందరు చదవడం ఆపిన చోట పేజీ కొసను చిన్నగా మడుచుకుంటారు. ఇక కొందరి పుస్తకం చదవడం పూర్తయ్యేసరికి ఒక బీభత్సం జరిగివుంటుంది. అలాగని పుస్తకం చదువుతూ రాసుకునే నోట్సు దీనికి భిన్నం. అది పుస్తకంతో ఎవరికి వారు చేసుకునే వ్యక్తిగత సంభాషణ. కొందరు కేవలం అండర్లైన్ చేసుకుంటారు. కొందరు పుస్తకం చివర నచ్చిన పేజీ తాలూకు నంబర్ వేసుకుని దానికి సంబంధించిన వ్యాఖ్యో, పొడి మాటో రాసుకుంటారు. ఇలాంటివారికి పుస్తకంలో చివర వచ్చే తెల్ల కాగితాలు చాలా ఉపయుక్తం. పఠనానుభవాన్ని పెంపు చేసుకునేది ఏదైనా పుస్తకాన్ని గౌరవించేదే. అయితే, పుస్తకాన్ని గౌరవిస్తున్నారని చూడగానే ఇట్టే తెలియజేసే అతి ముఖ్యమైన భౌతిక రూప చర్య– దాన్ని బైండు చేయడం. ఈ బైండు చేయించడంలో, స్వయంగా తామే చేసుకోవడంలో కూడా ఎవరి అభిరుచి వారిది. అలాగే పుస్తకం తరహాను బట్టి కూడా ఇది మారొచ్చు. అలాగే బైండింగుకు వాడే మెటీరియల్, అది చేసే పద్ధతులు కూడా చాలా రకాలు. ఏమైనా బైండింగు కూడా దానికదే ఒక కళ. అది కొందరికి బతుకుదెరువు అనేది కూడా ఒక వాస్తవమే. కానీ ప్రపంచంలో గొప్ప బైండింగు కళాకారుల పనితనాన్ని తెలియజేసే పుస్తకాలు కూడా కొన్ని చోట్ల ప్రదర్శనకు ఉన్నాయి. పుస్తకం లోపల వ్యక్తమయ్యే భావాలకు అనుగుణంగా దాన్ని తీర్చిదిద్దాలంటే ఆ బైండరు కూడా మంచి కళాకారుడు అయివుండాలి. ఫ్యోదర్ దోస్తోవ్స్కీ నవల ‘ద పొసెస్డ్’లో జరిగే ఈ ఆసక్తికర సంభాషణ పుస్తకాల పట్ల ప్రపంచం ఇంకా ఎక్కడుందో తెలియజేస్తుంది. ఈ నవలకే వాటి అనువాదకులను బట్టి ‘డెమన్ ్స’, ‘డెవిల్స్’ అని మరో రెండు పేర్లున్నాయి. జీవితంలో ఎన్నో దెబ్బలు తిని, వాస్తవాల చేదును గ్రహించి, బండి బాడుగ కూడా ఇవ్వలేని స్థితిలో చివరకు తానే వదిలేసిన భర్త దగ్గరకు మళ్లీ చేరుతుంది మేరీ. బతకడానికి ఏదైనా మార్గం గురించి ఆలోచిస్తూ, ‘పోనీ పుస్తకాల బైండింగు చేస్తాను’ అంటుంది. అప్పుడు ఆమె భర్త, నవలలో అన్నివిధాలా సంయమనం కలిగిన మనిషి, ‘ఆదర్శాల్లోని’ నిగ్గును తేల్చుకున్న ఇవాన్ షతోవ్ ఆమె భ్రమలు తొలిగేలా ఇలా చెబుతాడు: ‘‘పుస్తకాలను చదవడం, వాటిని బౌండు చేయించడం అనేవి అభివృద్ధికి సంబంధించిన రెండు పూర్తి భిన్న దశలు. మొదట, జనాలు నెమ్మదిగా చదవడానికి అలవాటు పడతారు. దీనికి సహజంగానే శతాబ్దాలు పడుతుంది; కానీ వాళ్లు తమ పుస్తకాలను కాపాడుకోరు. వాటిని నిర్లక్ష్యంగా పడేస్తారు. పుస్తకాలను బైండు చేయించడం అనేది పుస్తకాల పట్ల గౌరవానికి సంకేతం; అది ప్రజలు పుస్తకాలను చదవడానికి ఇష్టపడటమే కాదు, వాళ్లు దాన్ని ఒక ప్రధాన వృత్తిగా భావిస్తున్నారని సూచిస్తుంది. రష్యాలో ఎక్కడా అలాంటి దశకు చేరుకోలేదు. యూరప్లో కొంతకాలంగా తమ పుస్తకాలను బైండింగ్ చేయిస్తున్నారు.’’ 1871–72 కాలంలో రాసిన ఈ నవలలో, సాహిత్యం అత్యంత ఉచ్చస్థితిని అందుకొందనుకునే రష్యా సైతం ఒక దేశంగా చదివే సంస్కతిలో వెనుకబడి ఉందన్నట్టుగా రాశారు దోస్తోవ్స్కీ. ఇంక మిగతా దేశాల పరిస్థితి? ఒక సమాజపు అత్యున్నత స్థితిని కొలవగలిగే ప్రమాణాలు అక్కడి కళలు, వాటి పట్ల జనాల వైఖరి మాత్రమే. దీనికి కూడా ఈ నవలలో దోస్తోవ్స్కీ ద్వారా సమాధానం దొరుకుతుంది. అప్పటి కాలానికి తనను తాను అభ్యుదయ రచయితగా భావించుకొనే పీటర్ వెర్కోవెన్ స్కీ ఇలా ఆవేశపడతాడు: ‘‘బానిసల (సెర్ఫులు) దాస్య విమోచన కంటే కూడా షేక్స్పియర్, రఫేల్ అధికోన్నతులని నేను ఘోషిస్తున్నాను; జాతీయత కంటే అధికోన్నతులు, సామ్యవాదం కంటే అధికోన్నతులు, యువతరం కంటే అధికోన్నతులు, రసాయన శాస్త్రం కంటే అధికోన్నతులు, దాదాపు మానవాళి మొత్తం కంటే అధికోన్నతులు; ఎందుకంటే వాళ్లు ఇప్పటికే సమస్త మానవాళి సాధించిన ఫలం. నిజమైన ఫలం. బహుశా ఇంకెప్పటికీ సాధ్యం కానంతటి అత్యున్నత ఫలం!’’ అలాంటి ఒక కళోన్నత స్థితి లేని సమాజంలో తాను జీవించడానికి కూడా సమ్మతించకపోవచ్చునంటాడు వెర్కోవెన్ స్కీ. ఇది ఆర్ట్ అనేదానికి అత్యున్నత స్థానం ఇచ్చే సాంస్కృతిక కులీనుల అతిశయోక్తిలా కనబడొచ్చు. కానీ కళ అనేదాన్ని మినహాయిస్తే మన జీవితాల్లో మిగిలేది ఏమిటి? మహాశూన్యం. గాఢాంధకారం. అందుకే తమ జీవితాల్లో ఏదో మేరకు కళను సజీవంగా నిలుపుకొన్నవాళ్లు అదృష్టవంతులు. అది తమకు నచ్చిన సీరియళ్లను ఒక పుస్తకంగా కుట్టుకోవడం, తమకు నచ్చిన పుస్తకాలను బైండు చేయించుకోవడం కూడా కావొచ్చు. ఏ రూపంలో ఉన్న అతివాదాన్నయినా దాని మూలాలను, అది పాతుకుపోవడానికి దారితీసే పరిస్థితులను, ఒకప్పుడు తమ వర్గంవాడే అయినా కేవలం ఇప్పుడు ఆ వాదంలోంచి బయటపడ్డాడన్న కారణంగా చంపడానికీ వెనుకాడని మూక మనస్తత్వాన్ని–– ఒక శక్తిమంతమైన సూక్ష్మదర్శినిలో చూసినట్టుగా చిత్రించిన నవల ‘పొసెస్డ్’. విషాదాంతంగా ముగిసే ఈ సామాజిక, రాజకీయ వ్యాఖ్యాన నవల కూడా బైండు చేసుకుని దాచుకోవాల్సిన పుస్తకం. అదే అనితర సాధ్యుడైన దోస్తోవ్స్కీ లాంటి రచయితకు ఇవ్వగలిగే సముచిత మర్యాద! -
స్కూల్ బ్యాగ్స్, బుక్స్ ను పరిశీలించిన సీఎం వైఎస్ జగన్
-
Fact Check: ‘కానుక’పైనా కక్ష సాధింపే.. ‘ఈనాడు’ విషప్రచారం
సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలో ఉండి అబద్ధం చెప్పినా ఈనాడు రామోజీకి అమృత వాక్యంలా వినబడుతుంది. ప్రజలను మోసం చేసినా సరే అదే సరైనది అవుతుంది.. బాబు తప్ప మరే ప్రభుత్వం ప్రజలకు మేలు చేసినా అది నేరంగానే కనిపిస్తుంది.. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం... ప్రభుత్వ విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ జగనన్న విద్యా కానుక పేరుతో మూడేళ్లుగా నాణ్యమైన స్కూలు బ్యాగు లు, పుస్తకాలు, బూట్లు, యూనిఫారం వంటి వస్తువులను అందిస్తోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినా ‘ఈనాడు’కు మాత్రం కడుపుమంటగా ఉంటోంది. అందుకే 2023–24 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందించే విద్యా కానుకపై శనివారం విషం కక్కింది. వాస్తవాలను వక్రీకరించి ‘పిల్లలు తగ్గినా.. కానుక ఖర్చు పెరిగింది’ అంటూ అడ్డగోలుగా ఓ తప్పుడు కథనాన్ని అచ్చేసింది. అదేంటంటే.. ♦ ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఇచ్చే వస్తువుల్లో మరింత నాణ్యత ఉండాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. గత మూడేళ్లలో జగనన్న విద్యాకానుకలో బ్యాగుల నాణ్యతా ప్రమాణాలను సీపెట్ (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ) చూసింది. అయితే, నాణ్యతా ప్రమాణాల నిర్ధారణలో కాకుండా, అన్ని దశల్లోనూ.. అంటే ముడి సరుకు నుంచి బ్యాగుల ఉత్పత్తి, స్టాక్ పాయింట్కు చేరే వరకు అన్ని దశల్లోను పర్యవేక్షణ అవసరమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం మద్దతుతో లాభాపేక్ష లేకుండా నడుస్తున్న ‘క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ విద్యా కానుకలోని వస్తువులను మూడు దశల్లో (ముడిసరుకు నుంచి స్టాక్ పాయింట్ వరకు) నాణ్యత పరీక్షలు చేసి మన్నికైన వస్తువులకు మాత్రమే అనుమతినిస్తుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం డబ్బు వృథా చేసినట్లు కాదు. ♦ సరఫరా చేసిన బ్యాగుల్లో 6 లక్షల బ్యాగులు చినిగిపోతే ప్రభుత్వం తిరిగి మంచి స్టాకును తెప్పించింది. అదనంగా వచ్చిన ఈ బ్యాగులకు ప్రభుత్వం ఒక్క రూపాయి చెల్లించలేదు. ♦ గత ఏడాదికి ఈ ఏడాదికి మార్కెట్ రేటు 6.85 శాతం పెరిగింది. కొలతల్లో మార్పులు, గ్లాసీ ఫినిషింగ్, సాధారణ ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని వస్తువు ధర నిర్ణయం జరుగుతుంది. 2022–23 విద్యా సంవత్సరంలో ఇన్సెట్ పేపర్ ధర టన్నుకు రూ.91,492.24, కవర్ పేపరు ధర టన్ను రూ.99,866.40 ఉండేది. 2023–24 విద్యా సంవత్సరానికి పేపరు సేకరణ కోసం టెండర్లు పిలిస్తే తమిళనాడు ప్రభుత్వ రంగ సంస్థ ‘తమిళనాడు న్యూస్ప్రింట్ అండ్ పేపర్స్ లిమిటెడ్ (టీఎన్పీఎల్) సంస్థ సరఫరాకు ముందుకొచ్చింది. ఈ సంస్థ ఇన్సెట్ పేపర్ ధర టన్ను రూ.1,15,500, కవర్ పేపర్ ధర టన్ను రూ.1,21,000గా టెండర్ వేసింది. ఈ ధర గతేడాది ధరతో పోలిస్తే.. పేపర్ ధర టన్నుకు రూ.24,007 (26.23 శాతం), కవర్ పేపర్ ధర రూ.21,134 (21.16 శాతం) పెరిగింది. ఈ ధరను ప్రభుత్వం అంగీకరించి 15,711 మెట్రిక్ టన్నుల ఇన్సెట్ పేపర్, 1,400 మెట్రిక్ టన్నుల కవర్ పేపర్ను పాఠ్య పుస్తకాలు, వర్క్ పుస్తకాలు, పిక్టోరియల్ డిక్షనరీల ముద్రణకు కొనుగోలు చేసింది. పేపర్ ధర పెరగడంతో పుస్తకాల ధర కూడా స్వల్పంగా పెరిగింది. ♦ ఇక ఈ ఏడాది విద్యార్థులకిచ్చే యూనిఫారం మూడు జతల్లో క్లాత్ పరిమాణం 23 శాతం పెంచడంతో పాటు, ప్లెయిన్ యూనిఫారం నుంచి చెక్ యూనిఫాంకు డిజైన్ మారింది. బ్యాగుల పరిమాణం, నాణ్యత భారీగా పెంచారు. ♦43 లక్షల యూనిట్లకు టెండర్ పిలిచినప్పటికీ బడులు తెరిచే నాటికి వాస్తవ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మాత్రమే వస్తువులను కాంట్రాక్టర్ నుంచి తీసుకుంటారు. దానికి తగ్గట్లుగానే చెల్లింపులు ఉంటాయి. జాతీయ స్థాయిలోను అన్ని వస్తువుల ధరలు 26.23 శాతం పెరిగాయి. ఏటా ధరల పెరుగుదల సహజ ఆర్థిక పరిణామమైనప్పటికీ దీన్ని ‘ఈనాడు’ వక్రీకరించడం దురదృష్టకరం. -
AP: బడిలో బుక్స్ రెడీ.. అక్షర యజ్ఞానికి అంతా సిద్ధం!
జీకే వీధి, కోటనందూరు నుంచి నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తొలిరోజే పుస్తకాలను అందచేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. దాదాపు 40 లక్షల మంది విద్యార్థుల కోసం సుమారుగా ఆరు కోట్ల పుస్తకాలను సిద్ధం చేసి స్టాక్ పాయింట్లకు చేర్చడం గమనార్హం. విద్యార్థుల సంఖ్య, కొత్త చేరికలకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలతో పాటు బ్యాగులు, యూనిఫారం, బూట్లు, సాక్సులతో కూడిన ‘జేవీకే’ కిట్లను పాఠశాలలకు రవాణా ఖర్చులు చెల్లించి మరీ చేరవేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు జగనన్న విద్యా కానుక కిట్లలోని వస్తువుల నాణ్యతను విద్యాశాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. స్టాక్ పాయింట్ల వద్ద నాణ్యతను క్షుణ్నంగా పరిశీలించాకే తీసుకుంటున్నారు. ఎక్కడైనా లోపాలున్నట్లు గుర్తిస్తే తిప్పి పంపించి నాణ్యతతో కూడినవి తెప్పిస్తున్నారు. జిల్లా, మండల స్థాయి స్టాక్ పాయింట్లకు చేరిన కిట్ల నాణ్యతను ర్యాండమ్గా పరిశీలించాలని విద్యాశాఖ, సమగ్ర శిక్ష అధికారులను ఆదేశించారు. రెండో సెమిస్టర్కు సైతం.. రాష్ట్రవ్యాప్తంగా 2023–24 విద్యా సంవత్సరం మొదటి సెమిస్టర్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు అవసరమైన 3,54,61,730 పాఠ్య పుస్తకాలు, వర్కు బుక్స్తోపాటు 2,32,46,064 నోటు పుస్తకాలను మండల స్టాక్ పాయింట్లకు చేర్చారు. జూన్ 11 నాటికి వంద శాతం పాఠశాలలకు చేరవేసేలా చర్యలు చేపట్టారు. పుస్తకాల ప్రింటింగ్కు నాణ్యమైన పేపర్ను తమిళనాడు న్యూస్ పేపర్ ప్రింటర్స్ నుంచి కొనుగోలు చేశారు. ఇక ఈ ఏడాది నవంబర్ నుంచి ప్రారంభమయ్యే రెండో సెమిస్టర్ కోసం సైతం ఇప్పటి నుంచే పుస్తకాల ముద్రణ చేపట్టారు. రెండో సెమిస్టర్కి సంబంధించి 1,06,82,403 పుస్తకాలను జూలై చివరి నాటికి విద్యార్థులకు అందించేలా అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు ద్విభాషా పాఠ్య పుస్తకాలు (బైలింగ్యువల్) ముద్రిస్తుండగా రాష్ట్ర సరిహద్దుల్లో చదువుకునే విద్యార్థుల కోసం ఈ ఏడాది ఉర్దూ, కన్నడ, తమిళం, ఒడియా భాషల్లోను పాఠ్యపుస్తకాలను ముద్రించారు. మొత్తం 425 టైటిల్స్తో అత్యధిక సంఖ్యలో పుస్తకాలను తేవడం గమనార్హం. తొమ్మిదో తరగతిలో ఎన్సీఈఆర్టీ.. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యలో ఎన్సీఈఆర్టీ కరిక్యులమ్ను సైతం ప్రవేశపెట్టింది. 2023–24 విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతిలో పూర్తిస్థాయిలో ఎన్సీఈఆర్టీ సిలబస్తో అన్ని సబ్జెక్టుల పుస్తకాలను అందుబాటులోకి తెస్తోంది. దీంతో పాటు ఆరు, ఏడు తరగతుల్లో ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్టులను, ఎనిమిదో తరగతిలో ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టులను ఎన్సీఈఆర్టీ సిలబస్కు అనువుగా మార్చారు. ఈసారి 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకూ వర్క్ బుక్స్ అందించనున్నారు. ఐదు శాతం అదనంగా.. జూన్ 12వ తేదీన 39,95,992 మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేపట్టనున్నారు. ఐదు శాతం అదనంగా అందుబాటులో ఉంచి అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కిట్లలో 34,93,765 బ్యాగులు (88 శాతం) ఇప్పటికే స్టాక్ పాయింట్లకు చేరుకోగా మిగిలినవి రవాణాలో ఉన్నాయి. బూట్లు, సాక్సులు కలిపి 36,26,732 యూనిట్లు (92 శాతం), యూనిఫామ్స్ వంద శాతం, నోటు పుస్తకాలు 83 శాతం, బెల్టులు 92 శాతం, డిక్షనరీలు నూరు శాతం స్టాక్ పాయింట్లకు చేరడంతో పాటు అక్కడి నుంచి అన్ని స్కూళ్లకు చేరాయి. -
Karnataka assembly elections 2023: మోదీ, రాహుల్ను చూసి నేర్చుకోండి!
జంఖాండి: కాంగ్రెస్ నేతలు తనను 91 సార్లు దూషించారన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా స్పందించారు. ‘‘వాటన్నింటినీ కలిపినా ఒక పేజీ అవుతాయేమో. కానీ మీరూ, బీజేపీ నేతలూ మా కుటుంబాన్ని తిట్టిన తిట్లన్నీ రాస్తే పుస్తకాలే కూడా చాలవు! ఆమె ఆదివారం కర్ణాటకలోని బాగల్కోటె జిల్లాలో బహిరంగ సభలో మాట్లాడారు. దేశం కోసం తూటాలకు ఎదురొడ్డటానికి సిద్ధంగా ఉన్న తన సోదరుడు రాహుల్ గాంధీని చూసి నేర్చుకోవాలని మోదీకి సలహా ఇచ్చారు. ‘‘ప్రజాజీవితంలో ఉన్నవారు విమర్శలకు సిద్ధపడాలి. కాంగ్రెస్ తరఫున ప్రధానులుగా ఉన్న ఇందిరా గాంధీ, రాజీవ్గాంధీ దేశం కోసం తూటాలు తిన్నారు. కానీ ప్రజల కష్టాలను వినడానికి బదులు వారికి సొంత బాధలు చెప్పుకుంటూ సానుభూతి కోసం పాకులాడుతున్న మొట్టమొదటి ప్రధాని మోదీయే’’ అంటూ ఎద్దేవా చేశారు. -
శ్రీకాకుళం: ప్రభుత్వం ఇచ్చిన పుస్తకాలు విద్యార్థులకు పంచండి మహాప్రభో
వీరఘట్టం: విద్యార్థులకు ప్రస్తుత విద్యా సంవత్స రంలో పాఠ్యపుస్తకాల పంపిణీలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఏపీ స్టేట్ టెక్ట్స్ బుక్స్ డైరెక్టర్ కె.రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. ఈ నెల 20వ తేదీన విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వీరఘట్టం మండలం రేగులపాడు కేజీబీవీని సందర్శించినప్పుడు 8వ తరగతి విద్యార్థులకు గణిత పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదనే విషయా న్ని గుర్తించారు. దీనికి బాధ్యులను చేస్తూ పార్వతీపురం మన్యం జిల్లా డీఈఓ ఎస్.డి.వి రమణతో పాటు వీరఘట్టం ఎంఈఓ పి.కృష్ణమూర్తి, కేజీబీవీ ఎస్ఓ రోహిణి, జీసీడీఓ రోజారమణిలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పాఠ్యపుస్తకాల పంపిణీ లో లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు కె. రవీంద్రనాధ్రెడ్డి వీరఘట్టం మండలానికి సోమవా రం వచ్చారు. రేగులపాడు కేజీబీవీ, వీరఘట్టం ఎంఈఓ కార్యాలయంతో పాటు పలు ప్రైవేటు పాఠశాలల్లో తనిఖీలు చేశారు. 8వ తరగతి గణిత పాఠ్యపుస్తకాలు వచ్చాయా లేదా అని ఆరా తీశారు. పలు తరగతులకు చెందిన సుమారు రెండు వేలకు పైగా పాఠ్యపుస్తకాలు వీరఘట్టం ఎంఈఓ కార్యాలయంలో పంపిణీ చేయకుండా ఉండడాన్ని ఆయన గుర్తించారు. ఈ పుస్తకాలు ఎందుకు పంపిణీ చేయలేదని ఎంఈఓ కృష్ణమూర్తిని ప్రశ్నించారు. వాస్తవా నికి గత ఏడాది జూలై 25న 533 మంది 8వ తరగతి విద్యార్థులకు 560 పాఠ్యపుస్తకాలు రాగా, వీటిలో 452 తెలుగు మీడియం, 108 ఇంగ్లిషు మీడియం పుస్తకాలు వీరఘట్టం కార్యాలయానికి ఇచ్చినట్టు గుర్తించారు. వీటిలో 108 ఇంగ్లిష్ మీడియం పుస్తకాలు తమకు రాలేదని ఇక్కడ సిబ్బంది అప్పటిలో జిల్లా అధికారులకు ఫోన్లో తెలియజేసారన్నారు. ఆ మేరకు పాఠ్యపుస్తకాలు అందినట్టు రాతపూర్వ కంగా అధికారుల వద్ద రుజువులు ఉన్నాయని చెప్పారు. వీరికి 108 పాఠ్యపుస్తకాలు అందలేదనే విషయానికి రుజువు లేకపోవడంతో చర్యలు తీసు కున్నట్టు స్టేట్ డైరెక్టర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో కొరవడిన పర్యవేక్షణ విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీలో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడిందని స్టేట్ డైరెక్టర్ రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. ఉన్నతస్థాయి అధికారులు వచ్చి పరిశీలించే వరకు ఏయే పుస్తకాలు విద్యార్థుల కు అందజేశామన్న విషయం తెలియకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఒక విద్యార్థికి విద్యా సంవత్సరం చివరి వరకు పాఠ్యపుస్తకాలు ఇవ్వకపోవ డం తప్పుకాదా అని నిలదీశారు. పాఠ్యపుస్తకాల పంపిణీకి ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేస్తుంటే ఇక్కడ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. విద్యార్థులకు పంపిణీ చేయకుండా ఇంకా శ్రీకాకుళం బుక్ డిపోలో 2.18 లక్షల పాఠ్యపుస్తకా లు ఉన్నాయని, ఈ పుస్తకాలను ఎందుకు పంపిణీ చేయలేకపోయారని వారిని అడిగారు. అనంతరం జీసీడీఓ రోజారమణి, ఎంఈఓ కృష్ణమూర్తి, గతంలో ఉన్న ఎంఈఓ నారాయణస్వామి, కేజీబీవీ ఎస్ఓ, శ్రీకాకుళం బుక్స్ డిపో మేనేజర్ తదితరుల నుంచి ఆయన వివరణ తీసుకున్నారు. ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పారు. ఆయన వెంట శ్రీకాకుళం డీఈఓ తిరుమల చైతన్య, పాలకొండ ఉప విద్యాశాఖ అధికారి విజయకుమారి తదితరులు ఉన్నారు. -
సైన్స్ పరికరాలు, స్టడీ మెటీరియల్ అందించిన తానా మహాసభల కన్వీనర్ పొట్లూరి రవి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సహకారంతో కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల ఉన్నత పాఠశాల విద్యార్థులకు మైక్రోస్కోప్ పరికరాలు, పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించారు. విద్యార్థులకు బోధనా పరికరాలు, కంప్యూటర్లు అందించవల్సిందిగా పొట్లూరి రవిని అభ్యర్థించగా వెంటనే స్పందించి మైక్రోస్కోపులు, స్టడీ మెటీరియల్స్ అందించారు. వీటితో పాటే కంప్యూటర్లని కూడా పది రోజుల్లో అందిస్తామని తెలిపారని పాఠశాల బయాలజీ ఉపాధ్యాయుడు గోకారి తెలిపారు. కప్పట్రాళ్ల విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడానికి కృషి చేస్తామని, పాఠశాల విద్యార్థులను ఎన్నారై విద్యార్థులతో ఆన్లైన్లో అనుసంధానం చేసి ఆధునిక సాంకేతికవిద్యను బోధించడానికి కృషి చేస్తామని తానా మహాసభల కన్వీనర్ పొట్లూరి రవి తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వాసుబాబు గోరంట్ల, రామ్ చౌదరిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై ఫౌండేషన్ కోఆర్డినేటర్ ముప్పా రాజశేఖర్, పారిశ్రామికవేత్త అనంత నాయుడు పాల్గొన్నారు. -
పుస్తకం.. ఓ బహుమానం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జాతీయ పుస్తక మహోత్సవం శుక్రవారం సందర్శకులతో పోటెత్తింది. మరో రెండు రోజుల్లో ప్రదర్శన ముగియనున్న దృష్ట్యా పుస్తకప్రియులు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ చివరి నాటికే ముగిసే పుస్తక ప్రదర్శన ఈ ఏడాది నూతన సంవత్సరంలోకి అడుగిడుతోంది. జనవరి ఒకటో తేదీన ప్రదర్శన ముగియనుంది. పుస్తక ప్రియులను విశేషంగా ఆకట్టుకొనే వైవిధ్యభరితమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. 300 స్టాళ్లతో ఈ సంవత్సరం పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఒకవైపు పుస్తక ఆవిష్కరణలు, మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తక సమీక్షలు, అమ్మకాలతో సందడి నెలకొంది. పుస్తక ప్రదర్శన కేవలం పుస్తకాల అమ్మకాలకు మాత్రమే పరిమితం కాకుండా రచయితలను, పాఠకులను ఒకచోట చేర్చే వేదికగా మారింది.ఈ నెల 22వ తేదీన ప్రారంభమైనప్పటి నుంచి పుస్తక ప్రియుల నుంచి అనూహ్యమైన స్పందన కనిపిస్తోందని నిర్వాహకులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ‘కొత్త సంవత్సరం పుస్తక పఠనంతో ప్రారంభం కావాలని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పుస్తకాలు చదవాలనే లక్ష్యంతో జనవరి 1వ తేదీ వరకు ప్రదర్శన ఉండేవిధంగా ఏర్పాటు చేశాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.’ అని బుక్ ఫెయిర్ కమిటీ ఉపాధ్యక్షులు కోయ చంద్రమోహన్ తెలిపారు. గత వారం రోజుల్లో సుమారు 5 లక్షల మందికి పైగా సందర్శకులు తరలివచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఒక వేడుకగా నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శన ఈ సంవత్సరం సైతం అదే పండుగ వాతావరణాన్ని తలపించింది. వైవిధ్యభరితమైన జాతీయ, అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు ఈ ప్రదర్శనలో భాగస్వాములుగా నిలిచాయి. పుస్తక ప్రదర్శనలో యువత పెద్ద సంఖ్యలో కనిపించడం విశేషం. తెలంగాణ పబ్లిషర్స్, తెలుగు అకాడమీ, విశాలాంధ్ర, నవతెలంగాణ, నవోదయ వంటి సంస్థల్లో పోటీ పరీక్షలకు కావలసిన పుస్తకాలను కొనుగోలు చేయడం మొదలుకొని ఎమెస్కో, సేజ్, పెంగ్విన్, నవయుగ, వీక్షణం, అరుణతార వంటి పుస్తక ప్రచురణ సంస్థల స్టాళ్లలో లభించే విలువైన నవలలు, సాహిత్య విశ్లేషణ పుస్తకాల వరకు పాఠకులు ఎంతో ఇష్టంగా కొనుగోలు చేశారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సైతం తరలి వచ్చారు. పుస్తక స్పర్శ గొప్పది డిజిటల్ కంటే పుస్తకస్పర్శ గొప్పది. ప్రస్తుత సమాజం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. మార్కెట్ శక్తులు అలజడిని సృష్టిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మౌలికమైన ఆనందాన్ని ఇచ్చేది పుస్తకమే. బంధువులు, ఆత్మీయులు, స్నేహితుల నుంచి కూడా లభించని సుఖం, సంతోషం పుస్తకం నుంచి లభిస్తాయి. పుస్తకాలను ప్రేమించండి. – గోరటి వెంకన్న, ప్రముఖ గాయకుడు, ఎమ్మెల్సీ -
Hyderabad Book Fair : ఎన్టీఆర్ స్టేడియంలో పుసక్త ప్రియుల సందడి (ఫొటోలు)
-
Telugu Children Books: మణిరత్నాలు ఈ పుస్తకాలు
ఆడుతూ పాడుతూ కాలం గడిపే పిల్లలను అందమైన ఊహా లోకంలోనికి తీసుకెళ్ళేవి కథలు. కథలు వినడమన్నా, చదవడమన్నా పిల్లలకు చాలా ఇష్టం. భావి భారతాన్ని అందంగా ఆవిష్కరించేది బాల సాహిత్యం. నేటి పిల్లలలో నైతికత, సామాజిక భావం, మానవత్వం, సహృదయత, ఆధ్యా త్మికత, క్రమశిక్షణ వంటి సుగుణ లక్షణాలు అలవడాలంటే, వారి కల్మషం లేని మనసులను సాహిత్యం వైపునకు మరల్చాలి. అందుకు సరైన వేదిక బాల సాహిత్యం. పాఠ్యపుస్తకాలు పిల్లలకు విజ్ఞానాన్ని అందిస్తే, కథల పుస్తకాలు వారిలో ఉన్న సృజనాత్మక అంశాలను, జీవన నైపుణ్యాలను అందిస్తాయి. సాహిత్యం ద్వారానే బాలలలో సంపూర్ణ వికాసం కలుగుతుందని వారికోసం అనేక కార్యక్రమాలు నిర్వహించడంలో సదా ముందుంటారు మణికొండ వేద కుమార్. వీరు ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమి’ ఛైర్మన్గా ఉంటూ, దాదాపు మూడు దశాబ్దాలుగా బాల వికాసం కోసం పనిచేస్తున్నారు. ‘బాల చెలిమి’ పత్రిక, ‘బాల చెలిమి’ గ్రంథాలయాలు, నెల నెలా ‘బాల చెలిమి ముచ్చట్లు’ నిర్వహిస్తూ బాల సాహి త్యానికి ఎనలేని సేవ చేస్తున్నారు. తమ అకాడమీ ద్వారా పిల్లలు రాసిన అనేక పుస్తకాలను ముద్రించి, వారి రచనలు వెలుగులోకి తెస్తున్నారు. వేదకుమార్ సంకల్పానికి, బాల సాహితీ వేత్తలు గరిపెళ్లి అశోక్, పత్తిపాక మోహన్ తోడయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బడి పిల్లలు రాసిన కథలను సేకరించారు. గరిపెళ్లి అశోక్ రాష్ట్ర కన్వీనర్గా ఉంటూ, వివిధ జిల్లాల్లోని కన్వీనర్లను సమన్వయపరుస్తూ, ఉపాధ్యాయుల ద్వారా పిల్లలు రాసిన కథలను సేకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 900 కథలు రాగా, కథల కార్యశాలలో పాల్గొన్న నిష్ణాతులైన బాల సాహితీవేత్తలు పలుమార్లు కథలను పరిశీలించి తెలంగాణ ఉమ్మడి పది జిల్లాల వారీగా ప్రచురణ కొరకు కథలను ఎంపిక చేశారు. ( క్లిక్ చేయండి: Writers Meet 2022.. కొత్త రచయితల గట్టి వాగ్దానం) 2020 జనవరి 29న హైదరాబాద్లో పది జిల్లాల బడిపిల్లల కథలను బాలల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు. అలాగే పిల్లల కోసం తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల బాల సాహిత్య రచయితలు రాసిన ‘పెద్దలు రాసిన పిల్లల కథలు’ ఉమ్మడి పది జిల్లాల పేరుతో పది సంకలనాలను అందమైన బొమ్మలతో వెలువరించడమనేది బాల సాహిత్యంలో చరిత్రాత్మక ఘట్టం. ఈ బాల సాహిత్య యాగం తెలంగాణకే పరిమితం కాకూడదని ఆంధ్రప్రదేశ్లోని బడి పిల్లల నుండీ కథల సేకరణ ప్రారంభించడం ముదావహం. (క్లిక్ చేయండి: GN Saibaba Poems.. ఒంటరి గానాలాపన) – దుర్గమ్ భైతి ఉపాధ్యాయులు, సిద్దిపేట -
Hyderabad Book Fair 2023: పుస్తకాల రుతువు
ఆ నల్లటి వరుస కట్టిన అక్షరాల వెంట అక్షువులతో వెంబడిస్తే గుత్తులుగా కాసిన మామిడి పండ్ల చెట్టు కింద అశ్వాన్ని వదిలి సేదతీరుతున్న రాకుమారుడు కనిపిస్తాడు. కొమ్మపై కూచున్న జంట పక్షులు ఏవో అతనికి తెలియాల్సిన రహస్యం మరికాసేపట్లో చెవిన ఊదుతాయి. నల్లటి వరుస కట్టిన ఆ పంక్తుల వెంట పరిగెడితే కొత్త పెళ్లికూతురిని శోభనం రాత్రి చంపడమే వ్రతంగా పెట్టుకున్న రాకుమారుడు ఆ పెళ్లికూతురు మొదలెట్టిన గొలుసు కథల్లో గుడ్లు తేలేసి వ్రతం మరిచి ‘ఆ తర్వాత?’ అనే ప్రశ్నతో జీవితాంతం బతుకు వెళ్లమార్చడం చూస్తాము. కాగితం మీద వరుస కట్టిన పంక్తులు రాముడు కానలకు వెళ్లాక కౌసల్య పడిన శోకమెట్టిదన్న ఆలోచనను ఇస్తాయి. బోధిచెట్టు కింద దేహాన్ని క్షోభ పెట్టుకుంటున్న సిద్ధార్థుని సాక్షాత్కారం కోసం వేచి చూడమంటాయి. కరకు పళ్లు దిగబడి కాలి విముక్తి కోసం ఘీంకారం చేస్తున్న గజేంద్రుని మోక్షానికి శంఖు చక్రాలు వదిలి శ్రీ మహావిష్ణువును పరిగెత్తమంటాయి. రామలింగడు ఈ పంక్తులు పలకడానికే అంబ ఇచ్చిన ఒక చేతి పాలు, మరో చేతి పెరుగును కలిపి గొంతులోకి ఒంపుకున్న వైనం చెబుతాయి. పుటలు కొన్ని శ్రీనాథుని పల్లకీ మోస్తాయి. పుటలు కొన్ని పేదవాడి తెల్లని నవ్వును మల్లెలుగా విరబూస్తాయి. పుటల నిండా వీరుని ధీరకంపనం... వనిత దీక్షా కంకణం... పసిపిల్లల కేరింతలు... యువతీ యువకుల సల్లాపాలు... కన్నీటి ఉప్పదనం... త్యాగపు శౌర్యము... భీరువు ఆక్రందన... ఆలోచనల అలజడి... తేజోమూర్తి జీవన సందేశము. ఒక దేశ ‘తలసరి ఆదాయం’ ఎలా గణిస్తారోగాని ఒక దేశ ‘తలసరి సంస్కారం’ సగటున ఆ దేశపౌరుడు చదివిన పుస్తకాల సంఖ్యను బట్టి అవి ఎలాంటి పుస్తకాలన్న నాణ్యతను బట్టి గణించాలి. ఆహార కొరత వస్తేనో, విదేశీ మారకద్రవ్యం అడుగంటితేనో, ద్రవ్యోల్బణం విజృంభిస్తేనో మాత్రమే ఆ దేశం ప్రమాదంలో పడినట్టు కాదు. ఏ దేశ ప్రజలైతే నిజంగా పుస్తకాలు చదవడం మానేస్తారో, ఇంట పుస్తకాల అల్మారా లేకుండా జీవిస్తారో, ‘పుస్తకమా అది ఏమి’ అని ఫోన్ స్క్రీన్లో తల కూరుస్తారో ఆ దేశం నిజంగా ప్రమాదంలో పడినట్టు! వస్తు ప్రపంచం కంటే పుస్తక ప్రపంచం మేలైనది. ఇంట టివి, ఫ్రిజ్జు, కారు, ఐఫోన్ ఎన్ని కొన్నా మరోటేదో కావాలన్న అత్యాశను, పేడలో పడవేసే పేరాశను కలిగిస్తాయి. పుస్తకాలు? నీ పాదాలకు లేపనం రాసి హిమానీనదాల వరకూ తీసుకెళతాయి. నీ చీకటి కవాటాలను తెరిచి వెలుతురు వాకిళ్ల ఎదుట నిలబెడతాయి. నీ మూఢవిశ్వాసాలకు నువ్వే నవ్వుకునేలా చేస్తాయి. చైతన్యాన్ని కలిగించి నీ నిజస్థితి మీద అంచనా కట్టిస్తాయి. ద్వేషంతో, హైన్యంతో, వ్యవస్థీకృత దుర్లక్షణాలతో బతకాలన్న నీ పట్టుదలను అవి హరిస్తాయి. పుస్తకాలు నిన్ను పెట్రోలు కొట్టించమనవు. ఫుడ్డు ఆర్డర్ పెట్టమనవు. విలాసాలు అమేజాన్ చేయమనవు. అవి కోరేదల్లా తెరిచి చదవమనే! రెండు రాష్ట్రాల్లో 9 కోట్ల తెలుగు జనాభా. ఏ పుస్తకమూ 500 కాపీలు అమ్ముడుపోదు. అంటే కోటికి 100 మంది కూడా పుస్తకాలు కొనరు. సినిమా హీరోల కొరకు టికెట్టు రికార్డు స్థాయిలో కొంటారు. ‘నెక్ట్స్ సినిమా ఏమిటి?’ అని అడుగుతారు. ‘నువ్వు చదివిన పుస్తకం చెప్పు’ అని ఏ హీరోనీ ఎవరూ అడగరు. శ్రీమంతురాలైన సుధామూర్తి తానే శ్రీమంతులుగా భావించే ఒకరి ఇంటికి వెళ్లిందట. ‘అబ్బబ్బ... ఆ ఇంట మణిమాణిక్యాలు వజ్రవైఢూర్యాలు.. బంగారు సింహాసనాలు... అమూల్య కళాకృతులు... ఒక్కటే లోపం. ఒక్క పుస్తకం కనపడలేదు’ అని రాసింది. ఇలాంటి పేదరికంలో ఉన్న శ్రీమంతులు మనలో ఎందరు? పూర్వం తెలుగు ఇళ్లల్లో తప్పనిసరిగా ఎక్కాల పుస్తకం ఉండేది. శతకాలు ఉండేవి. పెద్ద బాలశిక్ష అయినా కనిపించేది. ఒక చిన్న గూటిలో ఇవి కూడా లేని స్థితికి తెలుగుజాతి ఎగబాకింది 10 వేల మంది తెలుగు కవులు ఉన్నారు. పక్క కవి పుస్తకం కొనరు. 5 వేల మంది తెలుగు కథకులు ఉన్నారు. పక్క రచయిత సంకలనం కొనరు. పాఠకుల మీద వంక పెడుతుంటారు. మొదట వీరే పుస్తకాలు కొనరు. రచయిత అంటే ఎవరు? సీనియర్ పాఠకుడు! మంచి కవి కావాలన్నా, మంచి కథకుడు కావాలన్నా మొదట జీవితంలో పాల్గొనాలి అనుభవం కోసం. తర్వాత పుస్తకాలు చదవాలి సాధన కోసం. జీవన స్పర్శ, పుస్తకాల సంపర్కం లేని శుష్కకవులతో, కథకులతో నిండి ఉంది నేటి మెజారిటీ తెలుగు సమాజం. ఇక మన పాఠకులు ‘మా పిల్లలు తెలుగు చదవరు’... ‘మాకు ఈ కథలు, కవిత్వం పడవు’ అంటూ ఉంటారు. నీకు రోటి పచ్చడి ఇష్టమైతే కనీసం రోటి పచ్చళ్ల మీద వచ్చిన పుస్తకమైనా కొను. ఇంట పుస్తకంగా కనపడుతూ ఉంటుంది. డిసెంబర్ 22 నుంచి జనవరి 1 వరకు హైదరాబాద్లో పుస్తకాల రుతువు. అంటే బుక్ ఎగ్జిబిషన్. వందలాది స్టాళ్ళు, వేలాది పుస్తకాలు, ఆవిష్కరణలు, ఉపన్యాసాలు, సాహితీకారుల దర్శనం, మిత్రుల కరచాలనం, చలిగాలుల్లో ఛాయ్తో చేసే కబుర్లు. తెలుగులో ఎందరో రచయితలు, కవులు, బుద్ధిజీవులు... ఈ బుక్ ఎగ్జిబిషన్కు తరలివచ్చే పాఠకుల మీద నమ్మకంతో కొత్త పుస్తకాలను విడుదల చేస్తున్నారు. పాత క్లాసిక్స్ను రీప్రింట్ చేస్తున్నారు. ‘ఈ పుస్తకాలు చదివి ఆనందించండి, ఆస్వాదించండి, ఆలోచించండి’ అని కొమ్ముబూర ఊది మరీ మొరపెట్టుకోనున్నారు. ఈ రుతువులో పాలుపంచుకోండి. పుస్తకాల చెట్టు నీడ ప్రతి ఇంటా పడుగాక! -
చదువులు సాగేదెలా?
సాక్షి, హైదరాబాద్: సర్కారు బడుల్లో పాఠ్య పుస్తకాలే కాదు... ఏకరూప దుస్తులు సైతం అందని ద్రాక్షగా తయారయ్యాయి, ఒకవైపు విద్యార్థులకు పూర్తిస్థాయి పాఠ్య పుస్తకాలు లేకుండానే చదువులు సాగుతుండగా.. యూనిఫాంల జాడ కూడా లేకుండా పోయింది. 2022– 23 విద్యా సంవత్సరం ప్రారంభమై 6 నెలలు గడిచినా 60 శాతం మించి పాఠ్యపుస్తకాలు సరఫరా కాలేదని అధికారుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధాన ప్రచురణ కేంద్రం నుంచి గోదాములకే అరకొర స్టాక్ వచ్చి చేరడంతో పాఠశాలలకు పుస్తకాల సరఫరా అంతంత మాత్రంగా ఉంది. ఇప్పటి వరకు వచి్చన వాటిలో సైతం ఏ ఒక్క తరగతికి సైతం పూర్తి స్థాయి పుస్తకాల సెట్ అందలేనట్లు తెలుస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభంలో పాఠ్యపుస్తకాల పంపిణీ ఆలస్యం కావడంతో అప్పటిదాకా బ్రిడ్జి కోర్సులు నిర్వహించారు. అనంతరం బోధన ప్రారంభించినప్పటికీ పూర్తి స్థాయి పాఠ్య పుస్తకాల కొరత వెంటాడుతోంది. పాత పుస్తకాలతోనే.. గత విద్యా సంవత్సరం ప్రభుత్వ బడుల్లో చాలా తరగతులకు సగం పుస్తకాలే పంపిణీ చేశారు. పాత వాటిని సైతం ఈసారి సేకరించి సర్దుబాటు చేసినా విద్యార్థులందరికీ సరిపోని పరిస్థితి నెలకొంది. కొన్ని పాఠశాలల్లో అయిదుగురు విద్యార్థులను ఒక గ్రూప్గా చేసి వారికి ఒక్కో పాఠ్య పుస్తకాన్ని ఇచ్చి సర్దుబాటు చేశారు. దీంతో చేతిలో పుస్తకాలు లేక విద్యార్థులు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. తోటి విద్యార్థుల పుస్తకాలపై ఆధారపడి చదువులు కొనసాగించడం ఇబ్బందిగా తయారైంది. తరగతి గదిలో బోధన తర్వాత ఇంటివద్ద హోంవర్కు సమస్యగా తయారైంది. పాఠ్య పుస్తకాలపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శాపంగా తయారైంది. 24.73 లక్షలపైనే.. గ్రేటర్లోని హైదరాబాద్–రంగారెడ్డి–మేడ్చల్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ బడులకు సుమారు 24.73 లక్షల పాఠ్యపుస్తకాల అవసరం ఉంటాయని విద్యాశాఖాధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ఇండెంట్ పెట్టారు. అందులో 60 శాతం మాత్రమే ప్రింటింగ్ ప్రెస్ నుంచి గోదాములకు చేరాయి. అందులో సైతం తరగతులకు సంబ ంధించిన అన్ని పాఠ్యపుస్తకాలు అందలేదు. ఈ విద్యా సంవత్సరం ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడంతో ఒకే సా రి ఇంగ్లి‹Ù, తెలుగు మీడియం పుస్తకాల ప్రచురణ తలపెట్టడంతో పూర్తి స్థాయి కోటాకు ఆటంకంగా తయారైంది. ఊసే లేని యూనిఫాంలు.. సర్కారు బడుల విద్యార్థులకు ఇప్పటి వరకు యూనిఫాంల ఊసే లేకుండా పోయింది. విద్యార్థులకు రెండు జతల చొప్పున ఉచితంగా యూనిఫాంలను అందించాల్సి ఉంది. సాధారణంగా వేసవి సెలవుల్లోనే వీటికి అవసరమైన వ్రస్తాన్ని టెస్కో ద్వారా కొనుగోలు చేసి, ఆయా జిల్లాలు, మండలాల వారీగా స్కూళ్లకు అందించాలి. ఈ ఏడాది యూనిఫాంలకు అవసరమైన వస్త్రం కొనుగోలు ప్రక్రియలో తీవ్ర జాప్యం ఏర్పడింది. దీంతో సకాలంలో దుస్తుల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. (చదవండి: ఆ సొమ్మంతా ఎవరికి వెళ్లింది?) -
కొత్త విభాగంలోకి ఫ్లిప్కార్ట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తాజాగా ఆడియో బుక్స్ విభాగంలోకి ప్రవేశించింది. ఇందుకోసం ఆడియో స్ట్రీమింగ్ వేదిక పాకెట్ ఎఫ్ఎంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తన కస్టమర్లకు ఎక్స్క్లూజివ్, లైసెన్స్డ్ ఆడియో బుక్స్ను పాకెట్ ఎఫ్ఎం ద్వారా అందుబాటులోకి తీసుకురానుంది. ఫ్లిప్కార్ట్ ఎఫ్ఎంసీజీ బిజినెస్ హెడ్ కంచన్ మిశ్రా మాట్లాడుతూ.. కోవిడ్ మహమ్మారి సమయంలో ఆడియో బుక్స్ బాగా ప్రాచుర్యం పొందాయని, పాకెట్ ఎఫ్ఎంతో కలిసి రచయితలకు సహకారం అందించడం ద్వారా ఆడియోబుక్స్ తేనున్నామని తెలిపారు.దేశంలో ఇప్పటికే సుమారు 2.5 కోట్ల మంది ఆడియో బుక్స్ను వింటున్నట్టు అంచనా. పాకెట్ ఎఫ్ఎం ప్రతి నెల 1,20,000కిపైగా ఆడియో బుక్స్ను విక్రయిస్తోంది. చదవండి: ITR Filing Deadline: మేమేమైనా మెషిన్లమా? మొత్తుకుంటున్న నెటిజన్లు -
వరుసగా 16వ ఏట దాతృత్వం చాటుకున్న ‘పై ఇంటర్నేషనల్’
బెంగళూరు: దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్, వినియోగ ఉపకరణాల రిటైలర్, పై ఇంటర్నేషనల్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది.సీఎస్ఆర్ చొరవలో భాగంగా వరుసగా 16వ సంవత్సరం విద్యార్థులకు అండగా నిలిచింది. 1.1 లక్షల నోట్బుక్లను విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసింది. విద్య-కేంద్రీకృత CSR కార్యకలాపాలను పురస్కరించుకుని తుమకూరులో 12,226 మంది విద్యార్థులకు 1.1 లక్షల నోట్బుక్లను ఉచితంగా పంపిణీ చేసింది. జూలై 4 తుమకూరులో జరిగిన ఈ పుస్తక పంపిణీ కార్యక్రమంలో పై ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు ఎండీ రాజ్కుమార్ విద్యార్థులకు పుస్తకాలను అందించారు. ఇంకా ఎఫ్డీ మీనా ఆర్ పాయ్, గురుప్రసాద్పై (డైరెక్టర్), పుష్పాపై (డైరెక్టర్), జయశ్రీ (డైరెక్టర్) ఇతర కీలక మేనేజ్మెంట్ బృందం ఈ కార్యక్రమంలో పాల్గొంది. సుమారు 15 పాఠశాలలకు చెందిన విద్యార్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఆర్థిక సంక్షోభం అనేక వ్యాపారాలను ప్రభావితం చేసిన ఈ అనిశ్చిత కాలంలో విద్యార్థులు, పాఠశాలలకు సమయానుకూలంగా అండగా నిలబడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ ప్రకటించింది. 2005లో పై ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు ఎండీ రాజ్కుమార్ ఆధ్వర్యంలో సిద్దగంగ మఠంలో ఈ పుస్తక పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కంపెనీ, బ్రాండ్, రిటైల్ నెట్వర్క్ చాలా వేగంగా విస్తరించిందనీ, ఈ నేపథ్యంలో రాజ్కుమార్ నేతృత్వంలో లక్ష మంది విద్యార్థులకు సాధికారత కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఇప్పటివరకు 22,500 మంది విద్యార్థులకు లబ్ది చేకూరిందని వెల్లడించింది. గత 15 ఏళ్లుగా తుమకూరు,మైసూర్, ఉడిపి, మంగళూరు, కేరళ అంతటా పుస్తకాలను పంపిణీ చేస్తూ, విద్యార్థుల భవిష్యత్ విద్యావకాశాలను అందించడానికి కట్టుబడి ఉన్నామని రాజ్కుమార్ తెలిపారు. ముఖ్యంగా ఆన్లైన్ తరగతుల సమయాల్లో సాధనాలు, వనరులకు ప్రాప్యత అవసరమయ్యే అనేక మంది ఔత్సాహిక విద్యార్థుల విద్యా ప్రయాణంలో భాగమైనందుకు సంతాషాన్ని ప్రకటించారు. సమీప భవిష్యత్తులో ఆధునిక టెక్నాలజీ రాబోతున్న తరుణంగా వాటిని అందించేందుకు వీలుగా రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ను మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. విద్యావకాశాలను అందించడంలోనే కాదు, పర్యావరణం, సీనియర్ సిటిజన్ సంక్షేమ కార్యకలాపాలకు కూడా సాయాన్ని అందిస్తున్నారు రాజ్కుమార్. ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించి కోటి మొక్కలు నాటాలనే లక్ష్యంతో ఇప్పటి వరకు 311 చెట్లను విజయవంతంగా నాటారు. అంతేకాదు వాటి సంరక్షించడంలో ఆయన ముందున్నారు. అలాగే నిరుపేద పిల్లలను దత్తత తీసుకొని విద్యను అందిస్తున్నారు. వీరిలో 33 మంది ఇప్పటివరకు లబ్ధిదారులుగా ఉండటం విశేషం. దీంతోపాటు 1000 మంది సీనియర్ సిటిజన్లకు అధిక నాణ్యత గల జీవన సౌకర్యాన్ని అందించడానికి రోడ్మ్యాప్ను వేయడంతో పాటు, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడం, దాని అవుట్లెట్ల దగ్గర మెరుగైన సౌకర్యాలను అందించడం కూడా బాధ్యత వహిస్తోంది. కాగా రాజ్కుమార్ నేతృత్వంలో 2000లో సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్ మరియు కన్స్యూమర్ డ్యూరబుల్స్ రిటైలింగ్ రంగంలో పై ఇంటర్నేషనల్ ఎంటరై విజయవంతంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతటా 200పైగా అద్భుతమైన షోరూమ్లను నిర్వహిస్తోంది.మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఐటీ, ఫర్నిచర్ ఉత్పత్తులను అందించే పై ఇంటర్నేషనల్ బెంగళూరు, హైదరాబాద్, హాసన్, చిక్కమగళూరు, షిమోగా, మంగళూరు, ఉడిపి, కుందాపూర్, భత్కల్, హుబ్లీ, బెల్గాం, చిత్రదుర్గ, మైసూర్, మాండ్యలలో ఔట్లెట్లను నిర్వహిస్తోంది. (అడ్వర్టోరియల్) గమనిక : sakshi.com నందు వచ్చే ప్రకటనలు అనేక దేశాలు, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుంచి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్తతో ఉత్పత్తులు లేదా సేవల గురించి విచారించి కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు/సేవల నాణ్యత, లోపాల విషయంలో సాక్షి యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈవిషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు. -
ప్రథమ సంగ్రామ గ్రంథాలు! సిపాయిల తిరుగుబాటు పై వచ్చిన గ్రంథాలు
భారతదేశంలో వలస పాలనలోని మరే ఘటన పైనా రానన్ని పుస్తకాలు 1857 తిరుగుబాటుపై వచ్చాయి. సిపాయిల తిరుగుబాటుపై వచ్చిన ప్రతి రచనా ఒక పరిశోధన. 2007లో సిపాయిల తిరుగుబాటుకు 150 ఏళ్లు నిండేనాటికి తొలి స్వాతంత్య్ర సంగ్రామంపై పుస్తకాలు రావడం బాగా తగ్గిపోయింది! అయితే రోజీ లెవలిన్ జోన్స్ అనే బ్రిటన్ రచయిత్రి మాత్రం నూట యాభై ఏళ్ల సందర్భంతో నిమిత్తం లేకుండా ఒక పుస్తకం రాయడం మొదలు పెట్టారు. అందులో 1857 తిరుగుబాటు, అనంతర పరిణామాలను, అప్పటికి పేరింకా పెట్టని ఆ పుస్తకంలో ఆమె రాయదలిచారు. బ్రిటిష్ రచయిత్రికి మన చరిత్ర మీద ఆసక్తి ఏమిటి? నిజానికి లక్నో పై ఆమె ఆసక్తి. 2007 నాటికే ఆ నగరంపై ఆమె అనేక పుస్తకాలను రాశారు. ఆ వరుసలో 1857 తిరుగుబాటు గురించి రాయదలిచారు. మే నెలలో నూటాయాభై ఏళ్ల ఉత్సవాలు అయ్యాక, ఏడాది చివర్లో ఆ పుస్తకం విడుదలయింది. పుస్తకం పేరు : ‘ది గ్రేట్ అప్రైజింగ్ ఇన్ ఇండియా’. తిరుగుబాటుపై ఆనాటి వరకు కాస్త ప్రామాణికంగా ఉన్న పుస్తకం.. కాన్పూర్ ఘటనల ఆధారంగా ఆండ్రూ వార్డ్ రాసిన ‘ది బ్లడ్ సీడ్’ (1985). ఇన్ని పుస్తకాలు రాలేదు! భారతదేశంలో వలస పాలనలోని మరే ఘటన పైనా రానన్ని పుస్తకాలు 1857 తిరుగుబాటుపై వచ్చాయి. ఆ ఉద్ధృతి 20 వ శతాబ్దారంభం నాటికి తగ్గుముఖం పట్టింది. 1947లో సి.ఎల్.రీడ్ ‘మాస్క్ ఆఫ్ ది మ్యూటినీ’ వెలువడింది. అందులో తిరుగుబాటు నాయకుడికి రీడ్ గాంధీ మహాత్ముని స్వభావ శక్తులను ఆపాదించారు. 1947 తర్వాత కొత్తగా వచ్చిన తిరుగుబాటు రచనలు దాదాపుగా లేవు! అప్పటికి ప్రాచుర్యం పొందివున్న వాటిల్లో ‘ది నైట్ రన్నర్స్ ఆఫ్ బెంగాల్’ (జాన్ మాస్టర్స్), ‘ది సీజ్ ఆఫ్ కృష్ణాపూర్’ (జె.జి.ఫార్వెల్) ముఖ్యమైనవి. ‘ది సీజ్ ఆఫ్ కృష్ణాపూర్’ బుకర్ బహుమతి పొందిన నవల. సిపాయిల తిరుగుబాటు పరిసమాప్తమయిందని బ్రిటిష్ పాలకులు 1859 మధ్యలో అధికారికంగా ప్రకటించినప్పటికీ, ఆ ప్రభావం నుంచి కొన్నేళ్లపాటు పూర్తిగా బయట పడలేకపోయారు. ఆధారం ఆత్మకథలు 1857 తర్వాత తిరుగుబాటు నేపథ్యంగా అనేక మంది రచయితలు, చరిత్రకారులు పుస్తకాలు రాశారు. అప్పట్లో సమకాలీన రాజకీయ పరిణామాలపై ఈస్ట్ ఇండియా అధికారులు ఒకరికొకరు రాసుకున్న ఉత్తరాలు, స్మృతి రచనలు, డైరీలు, ప్రత్యక్ష సాక్షుల ఆత్మకథలు ఆ రచనలకు ముఖ్య ఆధారం. వాటిల్లో జె.డబ్లు్య. కాయే ‘హిస్టరీ ఆఫ్ ది సిపాయ్ వార్’ ఒక ప్రామాణిక గ్రంథం అయింది. ‘లండన్ టైమ్స్’ కరస్పాండెంట్ విలియం హోవార్డ్ రసెల్ వార్తా కథనాలు కూడా రచయితలకు బాగా ఉపయోగపడ్డాయి. ఇక 1857 ఘటనలపై ఆనాటి ప్రసిద్ధ కవి ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ రాసిన ప్రతి వాక్యమూ భావోద్వేగ భరితమైనదే. మొత్తం మీద ఓ 70 వరకు ‘తిరుబాటు’ రచనలు వెలువడ్డాయి. సహ రచయితగా చార్లెస్ డికెన్స్ రాసిన ‘పెరిల్స్ ఆఫ్ సర్టెన్ ఇంగ్లిష్ ప్రిజనర్స్’ వీటన్నిటిలో అత్యుత్తమమైనదిగా నిలిచింది. ఇదొక చిన్న నవల. తొలిసారిగా 1857లో ‘హౌస్హోల్డ్ వర్డ్స్’ పత్రిక క్రిస్మస్ సంచికలో వచ్చింది. అందులోని కథంతా మధ్య అమెరికాలో నడిచినప్పటికీ, ప్రధానంగా భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు ఘటనల ఆధారంగా సాగింది. తిరుగుబాటుపై పూర్తిస్థాయిలో వచ్చిన మొదటి నవల ఎడ్వర్డ్ మనీ రాసిన ‘ది వైఫ్ అండ్ ది వార్డ్’ (1859). ‘కాన్పూర్ ఊచకోతతో తిరుగుబాటు నాయకులు మిగలకుండా పోయారు’ అనే ముగింపుతో ఈ పుస్తకం పూర్తవుతుంది. నవలలకు ఆదరణ 1890ల నాటికి తిరుగుబాటు కథాంశంతో 19 నవలలు వచ్చాయి. వీటిల్లో ‘ఆన్ ది ఫేస్ ఆఫ్ ది వాటర్స్’ (ఫ్లోరా యానీ స్టీల్), ‘ఇన్ ది టైమ్స్ ఆఫ్ పెరిల్’ (జి.ఎ.హెన్టీ) మంచి ఆదరణ పొందాయి. హెన్టీని అప్పట్లో జేమ్స్ హాడ్లీ ఛేజ్ అనేవారు. వేర్వేరు కల్లోలిత సందర్భాలను నేపథ్యంగా తీసుకుని బాలుడైన కథానాయకుడితో ఆయన వంద వరకు నవలలు రాశారు. ‘ది ఇండియన్ మ్యూటినీ అండ్ ది బ్రిటిష్ ఇమాజినేషన్’ గ్రంథకర్త గౌతమ్ చక్రవర్తి.. ఈ తిరుగుబాటు నవలలన్నీ ఒక చారిత్రక వ్యవధిలో యాదృచ్ఛికంగా వెలువడినవి కావని అంటారు. ‘‘1890–1990 మధ్య సామ్రాజ్యవాద ధోరణులు బలీయంగా ఉన్నాయి. ఆ సమయంలో వలస పాలక దళాలపై జరిగిన భారతీయ సైనిక తొలి తిరుగుబాటు కార్మిక వర్గాలకు స్ఫూర్తి నిచ్చింది. ఆ స్ఫూర్తికి రచయితలూ ప్రభావితం అయ్యారని గౌతమ్ అంటారు. (చదవండి: సామ్రాజ్య భారతి 1887/1947) -
బిల్గేట్స్ చెబుతున్నాడు.. ఈ సలహా పాటిద్దామా?
ప్రపంచ కుబేరుడిగా సుదీర్ఘ కాలం నంబర్ వన్ స్థానంలో కొనసాగాడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి కొత్త దిశను చూపడమే కాదు ఐటీతో ప్రపంచ గమనాన్నే మార్చేశాడు గేట్స్. బిజినెస్ వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా పుస్తకాలు చదివే అలవాటు ఆయన మానుకోలేదు. రెగ్యులర్గా రకరకాల పుస్తకాలను ఆయన చదువుతూనే ఉంటారు. అందులో బాగా నచ్చినవి, ఆ పుస్తకాలు చదివితే ప్రయోజనం చేకూరుతుందని నమ్మేవాటిని మనకు సజెస్ట్ చేస్తుంటారు. తాజాగా మరికొన్ని పుస్తకాలను ఆయన మనకు సూచించారు. వాటిని చదవడం ఎంతో మంచిదంటున్నారు. 1) ది పవర్ ది పవర్ పుస్తకాన్ని బ్రిటీష్ రచయిత నయోమీ అల్డర్మ్యాన్ రాశారు. ఈ నవల ఫిక్షన్ విభాగంలో 2017లో రిలీజైన ఈ పుస్తకం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఈ పుస్తకం చదవాలంటూ గేట్స్కి ఆయన కూతురు సూచించారట. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, పైకి కనిపించని ఇబ్బందుతుల తదితర అంశాలను ఇందులో బలంగా చెప్పే ప్రయత్నం చేశారు. 2) వై వీ ఆర్ పోలరైజ్డ్ అమెరికన్ జర్నలిస్టు రాసిన మరో పుస్తకం వై వీ ఆర్ పోలరైజ్డ్. అమెరికా రాజకీయలు ప్రధాన ఇతివృత్తంగా ఉండే ఈ ఫిక్షన్ నవల సైకాలజీ మీద కూడా ఫోకస్ చేస్తుంది. 3) ది లింకన్ హైవే అమోర్ టవెల్స్ రాసిన ది లింకన్ హైవే పుస్తకం కూడా చదివి తీరాల్సిందే అంటున్నాడు బిల్గేట్స్. గతంలో అమెర్ టవెల్స్ రాసిన ఏ జెంటిల్మెన్ ఇన్ మాస్కోకి కొనసాగింపుగా ఈ పుస్తకం వచ్చింది. మొదటిదాని కంటే రెండోది మరీ బాగుందంటూ కితాబు ఇచ్చారు బిల్గేట్స్. 4) ది మినిస్ట్రీ ఫర్ ది ఫ్యూచర్ కిమ్ స్టాన్లీ రాబిన్సన్ రాసిన సైన్స్ ఫిక్షన్ నవల ది మినిస్ట్రీ ఫర్ ది ఫ్యూచర్. వాతావరణ మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రస్తుతం నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్తు ఎంత దుర్లభంగా ఉంటుందనే అంశాలను లోతుగా చర్చించిన పుస్తకం ఇది. ప్రకృతి పట్ల మన బాధ్యతను ఈ పుస్తకం గుర్తు చేస్తుందంటున్నారు గేట్స్. 5) హౌ ది వరల్డ్ రియల్లీ వర్క్స్ ప్రముఖ రచయిత వాక్లవ్ స్మిల్ కలం నుంచి జాలువారిన మరో మాస్టర్ పీస్ హౌ ది వరల్డ్ రియల్లీ వర్క్స్. జీవితానికి సంబంధించిన కొన్ని ప్రాథమిక అంశాలు మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి. వాటి ఆధారంగానే మన జీవనశైలి ఏలా మారుతుందనే అంశాలను ఇందులో విపులంగా చర్చించారు. చదవండి: బిల్గేట్స్, ఎలాన్ మస్క్ మాటల యుద్ధం -
నిరుద్యోగుల్ని వేధిస్తున్న అకాడమీ పుస్తకాల కొరత
-
10 రోజుల్లో అందుబాటులోకి..
సాక్షి, హైదరాబాద్: గ్రూప్స్కు సిద్ధమవుతున్న లక్ష లాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న తెలుగు అకాడమీ పుస్తకాలు మరో 10 రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. పుస్తకాల ప్రిటింగ్ కోసం ఎంపిక చేసిన ప్రింటింగ్ ప్రెస్లకు శుక్రవారం ఈ మేరకు అధికారిక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రావతరణ తర్వాత రూపకల్పన చేసిన పుస్తకాలనే ఈసారీ ప్రింటింగ్కు ఇచ్చినట్టు అధికారవర్గాల ద్వారా తెలిసింది. సిలబస్లో మార్పులు చేర్పులేం చేయలేదని, సమయం లేకపోవడం వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని అకాడమీ అధికారులు చెబుతున్నారు. గ్రూప్స్కు అవసరమైన సబ్జెక్టులతో పాటు బీఎడ్, ఇతర పుస్తకాలను ప్రింట్ చేయిస్తున్నారు. మొత్తం 45 రకాల పుస్తకాలను తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రచురించబోతున్నారు. ఈ పుస్తకాలను ప్రింట్ చేయించాలని 2 నెలల క్రితమే నిర్ణయం తీసుకున్నా పేపర్ కొరత, అకాడమీలో నిధుల గోల్మాల్ వ్యవహారంతో ముద్రణ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈలోగా గ్రూప్స్ నోటిఫికేషన్ విడుదలవ్వడంతో అభ్యర్థుల నుంచి డిమాండ్ పెరిగింది. పోటీ పరీక్షల మెటీరియల్కు తెలుగు అకాడమీ పుస్తకాలను అన్నివర్గాలు విశ్వసిస్తాయి. అయితే సరైన సమయంలో పుస్తకాలపై అకాడమీ దృష్టి పెట్టకపోవడం విమర్శలకు దారి తీసింది. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో పుస్తకాల ముద్రణ చేపట్టింది. ముద్రణకు ఇచ్చిన పుస్తకాలు ఇవీ ఆర్థికాభివృద్ధి, పర్యావరణం, భారత రాజ్యాంగం, తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ, విపత్తు నిర్వహణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక నిర్మితి–వివాదాలు–విధానాలు, తెలంగాణ ప్రాచీన చరిత్ర (ముంగిలి), భారత స్వాతంత్రోద్యమ చరిత్ర–3, భారత ప్రభుత్వం రాజకీయాలు–2, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రశ్నల నిధి చరిత్ర, భారత దేశ చరిత్ర–సంస్కృతి, తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, జనరల్ స్టడీస్, భారత ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ అధ్యయనం, అంతర్జాతీయ సంబంధాలు వంటి పుస్తకాలతో పాటు మరికొన్నింటిని అకాడమీ ముద్రణకు పంపింది. -
పుస్తకాలు దానం చేయండి!
మే 5న ఆంధ్రప్రదేశ్లో విద్యా సంవత్సరం ముగుస్తుంది. ప్రతి ఏటా ఏప్రిల్ 23న విద్యాలయాలకి సెలవులు ఇస్తారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ మే 5 వరకు పాఠశాలలు జరగనున్నాయి. సాధారణంగా సెలవులు వచ్చాయంటే విద్యార్థులకు ఎంతో ఆనందం కలుగుతుంది. అయితే పాఠశాల చివరి పనిరోజు వారు ఆనందంలో పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు చించివేసి రహదార్లపై పడవేస్తుంటారు. ముఖ్యంగా ప్రయివేటు విద్యాలయాల్లో ఇటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీని వల్ల చెత్తాచెదారం పెరుగుతుంది. అసలే ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలు డ్రైనేజీలలో నీరు నిల్వ ఉండి, దోమల పెరుగుదలకు కారణం అవుతున్నాయి. లక్షలాది మంది విద్యార్థులు ఒకే రోజు కాగితాలు చించివేయడం వల్ల, పారిశుద్ధ్య కార్మికులకి మరింత పనిభారం పెరుగుతుంది. నేల కాలుష్యం కూడా పెరుగుతుంది. సాధారణ ప్రజలకు కూడా అసౌకర్యంగా ఉంటుంది. (క్లిక్: అనుసంధాన భాషగా హిందీ అవసరం లేదా?) ఈ రోజు ఏ పోటీ పరీక్షల్లోనైనా ప్రాథమిక అంశాలను ఎక్కువగా అడుగుతున్నారు. చాలా మంది విద్యార్థులకు వీటిపై అవగాహన ఉండటం లేదు. ప్రాథమిక అంశాలు ఎక్కువగా కింది తరగతుల పుస్తకాలలోనే ఉంటాయి. పుస్తకాలను పారవేయకుండా వాటిని భద్రపరుచుకునేటట్లు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలి. వీలుంటే వేసవిలో వారి చేత పుస్తక పఠనం చేయించవచ్చు. అలాగే పాఠ్య పుస్తకాలు కొనుక్కోలేని పేద విద్యార్థులకు పుస్తకాలను వితరణ చేయవచ్చు. ఈ చిన్ని సాయమే వారికి పెద్ద చేయూత అవుతుంది. ఫలితంగా చిన్న వయసులోనే విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెరుగుతుంది. – ఎం. రాంప్రదీప్, తిరువూరు -
గ్రూప్–1.. నో స్టాక్
సాక్షి, హైదరాబాద్: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే మెజార్టీ అభ్యర్థులు సాధన చేసే పుస్తకాలు తెలుగు అకాడమీవే. తాజాగా గ్రూప్–1 నోటిఫికేషన్ రావడంతో ఈ పుస్తకాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. తెలుగు అకాడమీ కౌంటర్ వద్ద అభ్యర్థులు క్యూ కడుతున్నారు. అయితే తెలుగు అకాడమీ బుక్ కౌంటర్లో పలు అంశాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో లేవు. దీంతో పుస్తకాల కోసం సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది. డిమాండ్ ఎక్కువ..లభ్యత తక్కువ సబ్జెక్టు ఏదైనా తెలుగు అకాడమీ పుస్తకాలకున్న ప్రాధాన్యతే వేరు. అన్ని అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం, విషయ నిపుణుల విశ్లేషణలతో కూడిన ఆ పుస్తకాలు పోటీ పరీక్షల్లో విజయానికి బాటలు వేస్తాయనే భావన అభ్యర్థుల్లో ఎప్పట్నుంచో ఉంది. కాగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఇటీవల గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదల కావడం.. మొదటి నోటిఫికేషన్లోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఈ ఉద్యోగాలపై ఆసక్తి చూపిస్తున్నారు. మంచి జీతాలతో ప్రైవేటు ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ కొలువులు చేస్తున్న వారు సైతం దీర్ఘకాలిక సెలవులు పెట్టి గ్రూప్–1 నియామకాల కోసం సిద్ధమవుతుండటంతో విపరీతమైన పోటీ ఏర్పడింది. ఈ క్రమంలో పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు సంబంధిత సిలబస్ ఉండే పుస్తకాలు సేకరించే పనిలో పడ్డారు. ఇతర పబ్లికేషన్స్ మాటెలా ఉన్నా తెలుగు అకాడమీ పుస్తకాల లభ్యత సంతృప్తికరంగా లేకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. కొత్తవి రావు.. తెలుగులో లేవు ఇంటర్వ్యూలను తొలగించడంతో గ్రూప్–1 పరీక్ష 900 మార్కులకు పరిమితమైంది. ఇందులో ప్రిలి మినరీ పరీక్షలో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ర్యాంకింగ్లో ఈ మార్కులకు ప్రాధాన్యత లేనప్పటికీ మెయిన్ పరీక్షలకు అర్హత సాధించాలంటే ప్రిలిమ్స్లో మంచి మార్కులు తప్పనిసరి. ఇక జనరల్ ఇంగ్లిష్ పరీక్ష మార్కులు కూడా ర్యాం కింగ్ పరిధిలోకి రావు. ఈ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు తెలుగు అకాడమీలో అందుబాటులో ఉన్నాయి. కీలకమైన మెయిన్ పరీక్షల సబ్జెక్టు పుస్తకాలు, కరెంట్ అఫైర్స్ పుస్తకాల లభ్యత అంతంత మాత్రంగానే ఉంది. మెయిన్ పరీక్షల్లో మొత్తం ఆరు పేపర్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 24 అంశాలతో కూడిన సిలబస్ ఉంది. అయితే కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ వెర్షన్ పుస్తకాలు అందుబాటులో లేవు. చరిత్ర, తెలంగాణ ఉద్యమాలకు సంబంధించిన పుస్తకాలు కేవలం ఇంగ్లిష్ వెర్షన్లో మాత్రమే అం దుబాటులో ఉన్నాయి. హిస్టరీ, హెరిటేజ్, కల్చర్ ఆఫ్ తెలంగాణ పుస్తకాలు లేవు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కొత్త వెర్షన్ కూడా లేదు. అభివృద్ధి, పర్యావరణ సమస్యలకు సంబంధించిన పుస్తకాలు కేవలం ఆంగ్లంలోనే ఉన్నట్లు అభ్యర్థులు చెబుతున్నారు. గ్రూప్–1 నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో అభ్యర్థులకు సమయం అత్యంత కీలకంగా మారింది. ఎన్నాళ్లుగానో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు అందివచ్చిన అవకాశాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు అవసరమైన ప్రతి పుస్తకాన్నీ ఔపోసన పట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు అకాడమీలో లేని పుస్తకాల కోసం ఇతర పబ్లికేషన్ల వైపు పరుగులు పెడుతున్నారు. కొత్త పుస్తకాల స్టాకు రాలేదంటున్నారు పోటీ పరీక్షలకు తెలుగు అకాడమీ పుస్తకాలు ఉత్తమమని మా ప్రొఫెసర్ చెప్పడంతో వాటినే చదువుతున్నాను. ప్రస్తుతం గ్రూప్–1 నోటిఫికేషన్ రావడంతో ఆ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నా. తాజా సమాచారంతో కూడిన పుస్తకాల కోసం నాలుగు రోజులుగా ప్రయత్నిస్తున్నా. కానీ కొత్త పుస్తకాల స్టాకు ఇంకా రాలేదని చెబుతున్నారు. ఎప్పుడు వస్తాయో చెప్పలేకపోతున్నారు. వారి దగ్గర అందుబాటులో ఉన్న పుస్తకాల సెట్ ఒక్కో దానికి రూ.1,150 వసూలు చేస్తున్నారు. – డి. నర్సింగ్రావు, గ్రూప్–1 అభ్యర్థి, హయత్నగర్, రంగారెడ్డి జిల్లా -
కర్ణాటకలో మొఘలుల పాఠ్యాంశాలకు గుడ్బై!
బనశంకరి: కర్ణాటకలో పాఠశాల పుస్తకాల్లో మొఘల్ చక్రవర్తుల పాఠ్యాంశాలు చరిత్రలో కలిసిపోనున్నాయి. టిప్పు సుల్తాన్ పాఠాలను గతంలోనే తొలగించారు. మొఘలుల చరిత్రను తొలగించి, ఆ స్థానంలో దేశం కోసం పోరాడిన హిందూ రాజుల చరిత్రకు పెద్దపీట వేయాలని తీర్మానించినట్లు కర్ణాటక పాఠ్య పుస్తక పునః రచనా సమితి అధ్యక్షుడు రోహిత్ చక్ర తీర్థ బుధవారం తెలిపారు. ‘ఐదు దశాబ్దాలకుపైగా రాజ్యపాలన చేసిన మేటి హిందూ రాణి చెన్న బైరాదేవికి సంబంధించిన పాఠ్యాంశాలకు పుస్తకాల్లో చోటు దక్కలేదు. ఈ అసమానతలను సరిదిద్దే కార్యక్రమాన్ని తమ కమిటీ చేపడుతోంది’ అని చక్ర తీర్థ తెలిపారు. (చదవండి: విషాదం.. పరీక్ష హాల్లో కుప్పకూలిన అనుశ్రీ) -
చదువులో ధ్యానం
ఒక సంస్కృతిని నాశనం చేయడానికి పుస్తకాలను కాల్చే పనిలేదు; జనాన్ని చదవకుండా చూడండి చాలు అంటాడు అమెరికన్ రచయిత రే బ్రాడ్బరీ. ఇదే అర్థం ఇచ్చే వాక్యాన్ని రష్యన్ కవి జోసెఫ్ బ్రాడ్స్కీ ఇంకోలా చెబుతాడు. పుస్తకాన్ని కాల్చడానికి మించిన పెద్ద నేరాలు ఉన్నాయి; అందులో ఒకటి వాటిని చదవకపోవడం! చిరిగిన చొక్కానైనా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అన్న కందుకూరి వీరేశలింగం మనకు ఉండనే ఉన్నారు. చదవడం అనేది ఎంత ప్రాధాన్యత కలిగినదో చెప్పడానికి జార్జ్ ఆర్.ఆర్. మార్టిన్ ఉటంకింపు ఒక్కటి సరిపోతుంది. ప్రపంచాన్ని కుదిపిన ‘ఎ గేమ్ ఆఫ్ థ్రోన్స్’, అది భాగమైన ‘ఎ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్’ సిరీస్ సృష్టికర్త అంటాడు: చనిపోయేలోగా ఒక పాఠకుడు వెయ్యి జీవితాల్ని జీవిస్తాడు. ఎప్పుడూ చదవనివాడు మాత్రం ఒకటే జీవితం గడుపుతాడు. చదవడం అనేది ఒక ఈవెంట్. ఒక పోటీ. స్నేహితుల దగ్గర పుస్తకాలు తెచ్చుకోవడం, దాని గురించి మాట్లాడుకోవడం, లైబ్రరీలు, రీడింగ్ రూములు, అద్దె పుస్తకాల షాపులు, పాత పుస్తకాల షాపులు, అక్కడే నిలబడి పుస్తకంలో ఏ కొన్ని పేజీలనో ఆబగా చదువుకోవడం... అదంతా ఒక పాత కథ. వెయ్యి పేజీల పుస్తకమైనా ఇట్టే ముగిసిపోయేది. దిండు సైజు నవలైనా అసలు బరువయ్యేది కాదు. చదవడం అనేది గొప్ప విషయం అని అర్థమవుతూనే, దానికి దూరమైపోవడం కూడా నిజమని తెలుస్తూనే ఏమీ చేయలేని చిత్రమైన స్థితిలో ఉన్నాం. టెలివిజన్ నన్ను చాలా ఎడ్యుకేట్ చేస్తుంది; ఎవరైనా టీవీ ఆన్ చేసిన ప్రతిసారీ నేను గదిలోకి వెళ్లి పుస్తకం చదువుకుంటాను అన్నాడు వ్యంగ్యంగా గ్రూచో మార్క్స్. దృశ్యం రావడం అనేది చదవడాన్ని దెబ్బకొట్టిందని అందరికీ ఇప్పుడు తెలిసినదాన్నే అందరికీ తెలియకముందే చెప్పాడీ కమెడియన్. వేగవంతమైన రోజువారీ జీవితంలో నెమ్మదిగా సాగే చదువుకు స్థానం లేకుండా పోయింది. ప్రతిదాన్ని కథనంలో పెట్టాలనే సామాజిక మాధ్యమాల ధోరణి పుస్తకం మీద కాసేపు శ్రద్ధగా చూపు నిలపనీయని స్థితికి తెచ్చింది. ఒక అంచనా ప్రకారం, ప్రింటు కాగితాన్ని చదివేవాళ్లు దాన్ని సగం చదివి వదిలేస్తే, అదే అంశాన్ని డిజిటల్లో అయితే ఐదో భాగం చదవడమే ఎక్కువ. అయితే చదవడం అనేది కొంతవరకూ రూపం మార్చుకుంది అని కూడా చెప్పొచ్చు. ఆడియో బుక్ వింటే చదవడం అవుతుందా, అవదా? ఆన్లైన్ క్లాసులు వింటే చదవడం వచ్చినట్టా, కాదా? ఏదైనా పీర్ ప్రెషర్. గొప్ప స్వీడిష్ సినిమా చూసినంత మాత్రాన దాన్ని పంచుకోవడానికి ఎవరూ లేకపోతే మళ్లీ సమూహంలో భాగం కావడానికి బిగ్బాస్ గురించి మాట్లాడవలసిందే. అందుకే ప్రతి మార్పునూ భౌతిక పరిస్థితులే శాసిస్తాయి. ఈ పరిస్థితులు చాలావరకూ సాంకేతికమని చెప్పక తప్పదు. చదవడం మీద ఆసక్తి ఉన్నవాళ్లను కూడా అందులో మునగనీయని స్థితి. పాము మందును పాము విషంలోంచే తయారు చేస్తారు. పోయిన చోటే వెతుకు అన్నట్టుగా, పోవడానికి కారణమైనదే ఇప్పుడు కొత్తగా ఊతం అవుతోంది. ఏ డిజిటల్ మాధ్యమాలైతే చదువును చంపేశాయని భావిస్తున్నామో అవే మళ్లీ పెరగడానికి కారణమవుతున్నాయి. క్లబ్ హౌజ్ పుస్తకాలను చర్చించడానికి ఉపకరిస్తోంది. ఫేస్బుక్ గోడల మీద క థలు, వ్యాసాలు అచ్చవుతున్నాయి. చదివిన పుస్తకాల గురించి మాట్లాడే ‘బుక్టోక్’ విదేశాల్లో బాగా ఆదరణ పొందుతోంది. దీనివలన పుస్తకాల అమ్మకాలు కూడా పెరుగుతున్నాయని చెబుతున్నారు. పుస్తకాలు చదవడం ద్వారా కూడా సెలబ్రిటీలు కావొచ్చని ఇది నిరూపిస్తోంది. టిక్టోక్లో భాగమైన దీన్ని ఇండియాలో కూడా తిరిగి ప్రారంభం కావొచ్చన్న ఆశాభావాన్ని సంస్థ ఉన్నతాధికారి ఒకరు వ్యక్తం చేశారు. దృశ్యం విసుగెత్తి సృజనకు ఉన్న అవధులను గుర్తుతెస్తుంది. స్వీయ ఊహాత్మక ప్రపంచంలోకి వెళ్లాలంటే శబ్దమే దారి. బహుశా, అందువల్లే మళ్లీ ఆడియో బుక్స్ పాపులర్ అవుతున్నాయి. ఇంకొకటి: ఒకప్పుడు లోకానికి మన ముఖాన్ని చూపుకోవడమనే ఉబలాటం ఎక్కువగా ఉంటుంది. అదింక రొటీన్ స్థాయికి వచ్చేశాక, మన ముఖం కనబడటం అనేది ప్రాధా న్యత కోల్పోతుంది. ప్రైవసీ అనేది గొప్ప ప్రివిలేజ్ అవుతుంది. అందుకే ముఖం కనబడకుండా వినగలిగే, మనగలిగే సామాజిక మాధ్యమాలకు ఆదరణ దక్కుతుంది. అప్పుడు చూడటంలో కన్నా చదవడంలోనే ఎక్కువ ఆనందం దొరికే స్థితి వస్తుంది. బహుశా ప్రపంచం ఈ సంధికాలంలో ఉన్నదేమో. ఈ స్థితిని దర్శించే కాబోలు కొందరు చదువరులు అప్పుడే ‘స్లో రీడింగ్’ అనేదాన్ని ప్రచారంలోకి తెస్తున్నారు. ప్రతి అక్షరాన్ని ఆబగా కాకుండా, జీర్ణించుకుంటూ, ఆస్వాదించుకుంటూ చదవమని చెబుతున్నారు. ప్రపంచాన్ని ఒకసారి స్లో మోషన్లో దర్శించండి. ఇంకా స్ఫుటంగా, స్పష్టంగా, దాని అన్ని సూక్ష్మ వివరాలతో, దానిదైన ప్రత్యేకతలతో. మీ చుట్టూ ఉన్నదే మరింత తదేకంగా, ఏకాగ్రతగా చూడటంలో ఎలాంటి ధ్యానస్థితి ఉంటుందో చదవడంలో కూడా అలాంటిదాన్ని అనుభవంలోకి తెచ్చుకొమ్మని సూచిస్తున్నారు. ‘ఆధునిక జీవితంలోని వేగాన్ని తగ్గించుకోవడానికి అనుసరించాల్సిన ప్రతిక్రియల్లో నెమ్మదిగా చదవడం ఒకటి’ అంటాడు కార్ల్ హోనోరే. ‘ఇన్ ప్రెయిజ్ ఆఫ్ స్లో’ అనే పుస్తకాన్ని కూడా రాశాడీ కెనడా పాత్రికేయుడు. ఏ రిజొల్యూషన్స్ చేసుకోవాలా అని ఆలోచిస్తున్నవాళ్లు ఈ రానున్న కొత్త సంవత్సరంలో ఇదొకటి తీర్మానం చేసుకోవచ్చు. చదవడం అనేది ఎటూ ఉంటుంది. కానీ దాని పూర్ణరూపంతో మనలోకి ఇంకేలా చదవాలని ఒక తీర్మానం చేసుకుందాం. ఒక హైకూను చదివినంత మెత్తగా, నెమ్మదిగా చదవడాన్ని ఆనందిద్దాం. -
Hyderabad: 18 నుంచి 27 వరకు బుక్ఫెయిర్
సాక్షి, హైదరాబాద్: పుస్తకం రెక్కలల్లార్చుకొని చదువరి చెంతకు తిరిగి వచ్చేస్తోంది. లక్షలాది మంది సాహితీ ప్రియుల మదిని దోచుకోనుంది. ఈ నెల 18 నుంచి 27 వరకు హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన 34వ వేడుకలు ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభం కానున్నాయి. ఈసారి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ సన్నాహాలు చేపట్టింది. ఏటా సుమారు 330 నుంచి 350 స్టాళ్లతో జాతీయ స్థాయి పుస్తక ప్రచురణ సంస్థలతో నిర్వహిస్తున్న ప్రదర్శనలో ఈ ఏడాది వీటి సంఖ్యను తగ్గించినట్లు నిర్వాహకులు తెలిపారు. కోవిడ్ జాగ్రత్తలను పాటిస్తూ సందర్శకులు పుస్తక ప్రదర్శనలో పాల్గొనేందుకు అనుగుణంగా 250 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. బహుభాషల్లో.. ► అన్ని రాష్ట్రాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు ఈ ప్రదర్శనలో పుస్తకాలను అందుబాటులో ఉంచనున్నాయి. సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలోనూ హైదరాబాద్ ఏటేటా పుస్తకానికి బ్రహ్మరథం పడుతూనే ఉంది. ► విభిన్న జీవన రంగాలకు చెందిన లక్షలాది పుస్తకాల విక్రయాలు జరుగుతున్నాయి. కథ, కవి త్వం, నవల, చరిత్ర వంటి సాహిత్యమే కాకుండా బాలల సాహిత్యం, పోటీ పరీక్షల పుస్తకాలు ఆర్థిక, రాజకీయ పరిణామాలపై వెలుడిన విశ్లేషణ గ్రంథాలు, వ్యక్తిత్వ వికాసం, అకడమిక్ పాఠ్యపుస్తకాలు వంటి వాటికీ పాఠకాదరణ లభిస్తోంది. (చదవండి: కళ్యాణలక్ష్మి: కాసులిస్తేనే.. ‘కానుక’!) ప్రదర్శన వేళలు ఇలా.. ► మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు. ► శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 9 గంటల వరకు. జాగ్రత్తలు పాటించాలి ఎంతో సాహసం చేసి ఏర్పాటు చేస్తున్న ఈ ప్రదర్శనకు సందర్శకులు సహకరించాలి. కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలి. మాస్కులు ధరించి మాత్రమే ప్రదర్శనకు రావాలి. భౌతిక దూరం పాటించాలి. – కోయ చంద్రమోహన్, బుక్ఫెయిర్ కమిటీ -
పుస్తక మహోద్యమాన్ని చేపట్టిన తానా
అట్లాంటా: పుస్తక మహోద్యమాన్ని తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు గురువారం అట్లాంటా నగరంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు స్నేహితులకు వివిధ పుస్తకాలను బహుమతులుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ఆధ్వర్యంలో భద్రాచలంలో ఈ కార్యక్రమం మొదలైందన్నారు. ఈ పుస్తక మహోద్యమానికి సాహితీ సంస్థలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, రచయితలు, పాఠకుల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. ఈ కార్యక్రమం వచ్చే సంక్రాంతి పండుగ వరకు ఒక ఉద్యమంగా మారుతుందన్నారు. పుస్తకాలను కొని మిత్రులకు, బంధువులకు, పిల్లలకు బహుమతులుగా అందించే అక్షరాల పండుగే పుస్తక మహోద్యమమం అని తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర అన్నారు. -
‘శ్రవణ’ మేఘాలు
చదవడం ఏకాంత అనుభవం. వినడం సామూహిక అనుభవం. పాతకాలంలో ఏ గ్రామపెద్దో మర్రిచెట్టు నీడన ప్రపంచ ధోరణిని వైనవైనాలుగా వివరించే వాడు. ఏ పెద్దతాతో చలిమంట కాచుకుంటూ జీవిత అనుభవసారాన్ని పంచేవాడు. వెన్నెల వాకిళ్లలో నులకమంచాల మీద మేను వాల్చిన నాన్నమ్మలు పిల్లలకు కథల మీద కథలు చెప్పేవారు. పూర్వీకులు తాము తెచ్చిన వేటను విందుకు సిద్ధం చేస్తూ, తమ ప్రాచీనుల వీరోచిత గాథలను ఆ మాంసంతో పాటు నంజుకునేవారు. మనిషికీ మనిషికీ మధ్య ఉండాల్సిన సాన్నిహిత్యానికి ఈ వినడం అనే సంబం«ధం ఒక కందెనగా పనికొచ్చేది. ఇవే కథలు, గాథలు రకరకాల కళారూపాలుగా మారి, వాటిని ప్రత్యేకించి చక్కటి గొంతుతో, ఆకట్టుకునే హావభావాలతో ప్రదర్శించే కళాకారులు వచ్చారు. దాంతో వినడం ఒక పరిమిత సమూహ అనుభవ పరిధిని దాటింది. కాలం మారింది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. అక్షరం పుస్తకాల దొంతరలుగా ఆకాశం ఎత్తు పెరిగింది. ఒక మనిషి గొంతును సజీవంగా ఒక యంత్రంలో బంధించడాన్ని లోకం చెవులొగ్గి విన్నది. పదిహేనో శతాబ్దంలో జర్మనీకి చెందిన జాన్ గూటెన్బెర్గ్ అచ్చుయంత్రాన్ని రూపొందించాడు. పంతొమ్మిదో శతాబ్దపు చివరలో ఇటలీకి చెందిన మార్కోనీ రేడియోకు తుదిరూప మిచ్చాడు. మనిషి అంతటితో ఆగలేదు. వినడం పోయింది. చూడటం వచ్చింది. అమెరికాలో టీవీ వచ్చిన కొత్తలో ఈ సుఖకరంగా వినే అవకాశమున్న రేడియోను కాదని, దానికే ముఖం అప్పగించాల్సిన టీవీని ఎవరు చూస్తారని విసుక్కున్నారట అప్పటి పెద్దవాళ్లు. అయినా అది రావడమే కాదు, ప్రపంచమంతటా అలవాటైపోయింది. అక్షరాన్ని, వినడాన్ని మింగేసింది. పెరిగిన సాంకేతికత ఒక్కోసారి ముందుకు వెళ్లడం కోసం, వెనక్కి కూడా ప్రయాణిస్తుంది. ప్రయాణంలో దృశ్యం పనికి రాదు. వంట చేస్తూ గరిట తిప్పుతున్నప్పుడు చూపు ఒక్కచోటే నిలపమంటే కుదరదు. ఒంటరిగా నడుస్తున్నప్పుడు తోడు కాగలిగేది అజ్ఞాత గొంతుకే. కళ్లు మూసుకుని, మగతగా ఒక అనుభవంలోకి, ఒక అనుభూతిలోకి మేలుకోవాలంటే దృశ్యం పనికిరాదు; శ్రవణమే కావాలి. అంధులకు ఏ ఇబ్బందీ కలగకుండా ఉండేందుకుగానూ వాళ్లకోసం మాట్లాడే పుస్తకాలను(ఫోనోగ్రాఫిక్ బుక్స్) సంకల్పించాడు థామస్ ఆల్వా ఎడిసన్ 1877లో. కానీ 1952లో న్యూయార్క్ కేంద్రంగా గల క్యాడ్మాన్ రికార్డ్స్ వాళ్లు కవి డైలాన్ థామస్ కవితలను ఆయన గొంతులోనే చదివించి అమ్మకాలను చేపట్టడంతో ‘ఆడియో బుక్స్’ అనే భావనకు బీజం పడింది. దీంతో చదవడం అనే ప్రక్రియ, వినడం అనే కొత్త రూపంలో జరగడం ప్రారంభమైంది. చెట్టుమీది కాయను, సముద్రంలోని ఉప్పును ఎట్లా కలిపింది సృష్టి! అక్షరాన్నీ, శ్రవణాన్నీ ఎలా ముడివేసింది సాంకేతిక పరిజ్ఞానం! మరి ఆ మేఘాలు అంతటికీ వ్యాపించకుండా ఉంటాయా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆడియో బుక్ మార్కెట్ పరిధిని 2019లో 2.67 బిలియన్ డాలర్లుగా అంచనావేశారు. ఇది ప్రతి సంవత్సరం రెండంకెల వృద్ధిని సాధిస్తోందని తేల్చారు. మన తెలుగు వరకే తీసుకుంటే– శ్రీశ్రీ గొంతులోనే తన కవితలను చదివించిన గూటాల కృష్ణమూర్తి ప్రయత్నం; తన కథలను నేరుగా ఆడియో రూపంలోనే విడుదల చేసిన తుమ్మేటి రఘోత్తమరెడ్డి ఉత్సాహం; తమ రచనలను యూట్యూబ్లో వినిపిస్తున్న కొందరి ఆరాటం లాంటివి విడివిడి సంఘటనలు. కానీ ఐదేళ్ల క్రితం విశ్రాంత ప్రభుత్వోద్యోగి కొండూరు తులసీదాస్ సరదాగా చదువుతూ రికార్డు చేస్తూ పోయిన ‘దాసుభాషితం’ ఇప్పుడు వందలాది టైటిళ్లు, వెయ్యికి పైగా గంటల నిడివి కలిగివుంది. పుస్తకాన్ని చదవమని చేతికిస్తే– చదివే తీరిక లేని కొడుకు తనకోసం చదివి వినిపించమన్నందుకు మొదలైన ఈ తండ్రి ప్రయత్నం ‘తెలుగు సంగీత, సాహిత్య, కళల శ్రవణ భాండాగారం’గా రూపుదిద్దుకుంది. అయితే స్వీడన్కు చెందిన ఆడియో స్ట్రీమింగ్ కంపెనీ ‘స్టోరీటెల్’ నాలుగేళ్లుగా భారతదేశంలో మౌఖిక సంప్రదాయాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తోంది. ఇంగ్లిషు, మరాఠీ, హిందీ, బెంగాలీ, ఒడియా, అస్సామీ, గుజరాతీ, తమిళం, మలయాళంతో పాటు ఇప్పుడు తెలుగు పుస్తకాలు కూడా ఇందులో ఆడియోలుగా రికార్డు అవుతున్నాయి. పాపులర్ సాహిత్యం నుంచి ప్రజా సాహిత్యం దాకా; ఏనుగుల వీరాస్వామయ్య నుంచి ఏకాంత ద్వీపంగా బతికే రచయిత దాకా; స్వయంగా రాసేవారి గొంతుల్లోనూ, గొంతే పెట్టుబడిగా కలిగిన కళాకారుల ద్వారానూ రికార్డ్ అవుతున్నాయి. కనీసం ఐదు లక్షల టైటిల్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. మార్కెట్ దిగ్గజం అమెజాన్ కూడా ‘ఆడిబుల్’ పేరుతో ఈ ఆడియో బుక్స్ రంగంలోకి వచ్చినా ప్రస్తుతం ఇంగ్లి్లష్, హిందీకే పరిమితమైంది. చదవలేకపోవడం ఒక సమస్య అయితే, రకరకాల కారణాల వల్ల చదవడం అనే ప్రక్రియ మీద ఆసక్తి కోల్పోవడం ఇంకో సమస్య. ఈ రెండు కోవల మనుషులకూ ఈ కొత్త విప్లవం గొప్ప తోడు. చదవడంలో ఉత్సాహం పోతే గనక వినడం ద్వారా దాన్ని తిరిగి ఉత్సవం చేసుకోవచ్చు. అన్ని లైట్లూ ఆపేసుకుని, ఆ గొంతును అనుసరించడంలో ఏర్పడే దృశ్యాలను ఆ చీకట్లో సృజించుకోవడం ఒక పద్ధతి; ఇంటిల్లిపాదీ దగ్గరగా కూర్చుని వింటూ, ఒకే అనుభూతి మిగిలినవాళ్ల ముఖాల్లో ఎలా ప్రతిఫలిస్తున్నదో చూస్తూ ఆనందించడం రెండో పద్ధతి. అటు ఏకాంత అనుభవంగానూ, ఇటు సమూహ అనుభవంగానూ ఆనందించగల అవకాశం మనకు ఇప్పుడు ఉన్నది. -
Digital Library: అరచేతిలో పుస్తక భాండాగారం
సాక్షి, కమ్మర్పల్లి(నిజామాబాద్): కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఏడాది నుంచి గ్రంథాలయాలు మూతపడి ఉన్నాయి. ఒకవేళ తెరిచినా పాఠకులు రాలేని పరిస్థితి నెలకొంది. తెరుచుకున్న సమయంలో పాఠకులు రావడానికి ఆసక్తి చూపడం లేదు. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్థులు తమకు కావలసిన పుస్తకాలను చదవలేక పోతున్నారు. సెల్ఫోన్, ఇంటర్నెట్లో మునిగిపోతున్న విద్యార్థులు, యువకులు, ఉద్యోగాన్వేషణలో ఉన్న అభ్యర్థులకు కేంద్రం అరచేతిలోనే విజ్ఞానాన్ని అందించే ‘డిజిటల్ లైబ్రరీ’ని అందుబాటులోకి తెచ్చింది. నిరుద్యోగులు, యువకులు సద్వినియోగం చేసుకునేలా పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను డిజిటలైజేషన్ చేసి ‘నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా’ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. దీంతో అరచేతిలో డిజిటల్ లైబ్రరీ రూపుదిద్దుకుంది. ఇందులో 4 కోట్లకు పైగా పుస్తకాలు పాఠకులకు ఉపయోగపడి, అవసరమయ్యే విజ్ఞానాన్ని పంచనున్నాయి. ఖరగ్పూర్ ఐఐటీ సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అనుమతితో ఖరగ్పూర్ ఐఐటీ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్నెట్లో నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా పేరుతో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసింది. ఇందులో విషయ నిపుణుల వీడియోలను పొందుపరిచారు. పాఠశాల, కళాశాల, ఇంజనీరింగ్, వైద్య, న్యాయ విద్య, సాహిత్యం, సంస్కృతం ఇలా అన్ని రకాల స్టడీ మెటీరియల్ను ఇంగ్లీష్, హిందీతో పాటు, ఇతర భాషల్లో ఆన్లైన్లో నిక్షిప్తం చేశారు. పోటీ పరీక్షలకు కావలసిన అన్ని అంశాలను పొందుపరిచారు. పాఠశాల పుస్తకాలు(సీబీఎస్ఈ సిలబస్), లిట్రేచర్, మెడిసిన్, లా మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ పుస్తకాలు, మత గ్రంథాలు వివిధ భాషల్లో అందుబాటులోకి తెచ్చారు. ఈ పుస్తకాలన్ని పీడీఎఫ్ ఫార్మాట్లో ఉండగా, సైట్ ఒపెన్ చేసి చదువుకోవచ్చు లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వినియోగం ఇలా... స్మార్ట్ ఫోన్, ల్యాప్ట్యాప్ లేదా డెస్క్టాప్ కంప్యూటర్ల ద్వారా డిజిటల్ లైబ్రరీని వినియోగించుకునేలా తీర్చిదిద్దారు. ఇంటర్నెట్ గూగుల్లో ‘నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా’ టైప్ చేస్తే డిజిటల్ లైబ్రరీ తెరుచుకుంటుంది. ఈమెయిల్ ఐడీ ద్వారా లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత మనకు కావలసిన అంశాలను ఎంచుకొని చదువుకోవచ్చు లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లైబ్రరీలో వీడియోల ద్వారా సైతం విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్లో నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అని టైప్ చేసి డిజిటల్ లైబ్రరీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వినియోగదారులు సబ్స్క్రిప్షన్ పెట్టుకుంటే కొత్త పుస్తకాలు అందుబాటులోకి వస్తే ఈ మెయిల్ ద్వారా మెసేజ్ వస్తుంది. ఉమ్మడి జిల్లాలో గ్రంథాలయాల పరిస్థితి... ఉమ్మడి జిల్లాలో 44 గ్రంథాలయాలు ఉండగా, 85 వేల మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. సుమారు 6 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కరోనాకు ముందు ఇవి పాఠకులతో కళకళలాడేవి. కరోనాతో గ్రంథాలయాలు వెలవెలబోయాయి. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు, యువకులకు కేంద్రం అందుబాటులోకి తెచ్చిన డిజిటల్ లైబ్రరీ ఎంతగానో ఉపయోగపడుతుంది. చదవండి: ఫోన్ పోతే ఇలా తేలికగా కనిపెట్టొచ్చని తెలుసా? -
పుస్తక పఠనం ప్రాధాన్యం తెలుసా? ఇలా చదవడం ఎంతో మేలు
మనల్ని కాళ్ళు కదపనీయక, ఇల్లు కదలనీయక కొత్త ప్రపంచంలో విహరింపచేసి కొత్త కొత్త అనుభవాలను, అనుభూతులను మనకు పంచి మన పరిణతికి, మనోవికాసానికి దోహదం చేసే అద్భుత మార్గదర్శకాలు. మనకు సంతోషాన్నిచ్చి, మన బాధను పంచుకునే మన చక్కని నేస్తాలు పుస్తకాలు. ఇప్పుడైతే పుస్తకాలు విరివిగా అందరి చేతుల్లోకి వస్తున్నాయి. కొన్నేళ్ల కిందట, పుస్తకాలు అందరికీ అందుబాటులో ఉండేవి కావు. వార పత్రికలలో ధారా వాహికలను క్రమం తప్పకుండా చదివే అలవాటున్న వారు, నవలలు, కథలు చదివే అభిరుచి ఉన్నవారు, కొనుక్కోలేక గ్రంథాలయాలలో తెచ్చుకుని చదివేవారు. గృహిణులు, సరుకులు కట్టిన కాగితం పొట్లాలమీద ఉండే వార్తలు, కథలు కూడా వంటిల్లు సర్దుకుంటూ ఆసక్తిగా చదివేవారు. పఠ నాభిలాష అంత బాగా ఉండేది. రచయితలు గతించిపోవచ్చు. కాని, పుస్తకాలు నశించవు. శ్రీనాథ, పోతనాది కవులను మనమెవరం చూడలేదు. వాళ్ళ గ్రంథాలు వెలువడి శతాబ్దాలు గడిచేయి. అయినా మనం ఇప్పటికీ చదువుతూనే ఉన్నాం. ఆ గ్రంథాల నుంచి స్ఫూర్తిని పొందుతూనే వున్నాము. వాటిలోని సందేశాలను, నీతులను అనుసరిస్తూనే వున్నాము. శ్రవణం, భాషణం, పఠనం, లిఖితం అనే నాలుగు అభివ్యక్తి నైపుణ్యాలలో పఠన కళ ఒకటి. పుస్తకాలను చదవటం ఒక కళ. వేగంగా చదవాలి. అర్థం చేసుకుంటూ చదవాలి. ప్రారంభించి కొన్ని పేజీలు చదవగానే అది ఉపయోగపడేదేనా, కాలక్షేపానికా అన్నది గ్రహించగలగాలి. ఏవి చదవాలి, ఎలా చదవాలి, ఏవి చదవకూడదు అనేది తెలిసి వుండటం కూడా పఠన కళలో భాగమే! ఎన్ని పుస్తకాలు చదివాము అన్నది ముఖ్యం కాదు. ఎంత బాగా చదివాం, ఎంత లోతుగా చదివామన్నది ముఖ్యం. చదివిన ఒక వాక్యమైనా క్షుణ్ణంగా, లోతుగా చదవాలి. అపుడే మన మనస్సులో అవి నిలిచిపోతాయి. ‘కొన్ని పుస్తకాలను స్పృశించి వదిలేయాలి, కొన్ని జీర్ణించుకోవాలి, కొన్ని నెమరు వేసుకోవాలి’ అని అన్నాడు ప్రసిద్ధ ఆంగ్ల రచయిత బేకన్. పుస్తకాలు ఎలా చదవాలో మహాకవుల, మేధావుల జీవిత చరిత్రలు, డైరీల నుండి గ్రహించవచ్చు. చిరిగిన చొక్కానైనా తొడుక్కో, మంచి పుస్తకం కొనుక్కో’ అనే సూక్తి మనందరకు తెలుసు. కాని, నేటి యువత çపద్ధతి ఇందుకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. బాగా చదివే అలవాటున్నవారిని పుస్తకాల పురుగు అంటారు. అలాంటివారు నిజంగానే తమ డబ్బును బట్టలకు కాకుండా పుస్తకాలు కొనటానికే ఖర్చు చేస్తారు. పుస్తకాలు పాఠకుణ్ణి ఊహలోకంలో, అద్భుత జగత్తులో విహరింపజేస్తాయి. మనను తమతో ప్రయాణింప చేస్తాయి. సంఘటనలు ఆయా ప్రాంతాలకు తమతో తీసుకువెళ్లిపోతాయి. చదువుతున్న సన్నివేశానికి మనం దృశ్య రూపాన్ని కల్పించుకుంటాం. పుస్తకాలు చదవటం శ్వాస పీల్చటం లాంటిది. శ్వాస ఆడకపోతే ప్రాణం నిలవదు. పుస్తకాలు అంతే! ఒక పుస్తకం, ఒక కలం, ఒక ఉపాధ్యాయుడు... ఇవి ఈ ప్రపంచాన్నే మార్చగలవు. ఆస్తులు పోవచ్చు, భవనాలు కూలిపోవచ్చు, కాని పుస్తకాలు నశించవు. పుస్తకాలు లేని ఇల్లు ఆత్మ లేని శరీరం లాంటిది. అశాంతిమయ క్షణాల్లో, నిరాశా నిస్పృహలలో, ఒంటరి తనంలో పుస్తకమే నిజమైన నేస్తం. ప్రాణ స్నేహితులు కూడా ఒకొక్కసారి విభేదాలు వచ్చి మనతో విడిపోవచ్చు. కాని, పుస్తకాలు అనే స్నేహితులు మన సుఖ దుఃఖాలలో మనకు తోడు. ఎంతో వెన్నుదన్ను. ముఖ్యంగా మన బాధలో, మనని ఎప్పుడూ విడిచి పెట్టవు. మౌన మిత్రులు. మనలోని లోపాలను దిద్ది మంచి దారిలో పెడతాయి. మనలో మంచి ప్రవర్తనను ప్రోది చేసే అద్భుత సాధనాలు. శాశ్వతమైన స్నేహితులు. పుస్తకాలు జ్ఞానమనే నిధికి తాళాల్లాంటివి. సంతోషమనే ఇంటికి తలుపు లాంటివి. పుస్తకాలకు పెట్టిన ప్రతిపైసా మంచి పెట్టుబడే. పుస్తకాలు జీవితంలో కొత్తకోణాలను చూపిస్తాయి. ఎలా జీవించాలో మనకు నేర్పిస్తాయి. ఆశావహ దృక్పధాన్ని పెంచుతాయి. మెదడును వికసింప చేసి, స్వతంత్ర ఆలోచనా శక్తిని, విశ్లేషణా సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. సత్యాన్ని శోధింప చేస్తాయి. మేధావి రచయితలు వారి రచనల ద్వారా ఎప్పుడూ జీవించే ఉంటారు. ప్రతి వారికి సొంతం గ్రంధాలయం ఉండాలి. ఇది విలాసం కోసం, ప్రదర్శన కోసం కాదు. జీవితంలో ఇదీ ఒక అవసరం. కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు, ఒక నిఘంటువు, ఒక విజ్ఞాన సర్వస్వం లేని ఇల్లు వెలుతురు రావటానికి కావలసిన కిటికీలు లేని ఇల్లు లాంటిది. ప్రపంచపు గొప్ప సాహిత్యాన్ని చదవటం వల్ల పద సంపద విస్తృతమవుతుంది. వేగంగా పెరిగిపోతున్న వయసులో ఒత్తిడుల నుంచి తప్పించుకోవటానికి గొప్ప ఆధారం పుస్తకాలు. ఎలా చదవాలి? ఒక పెన్సిల్ చేత్తో పట్టుకుని, ముఖ్యమైన వాక్యాల కింద గీత గీస్తూ, అర్థం చేసుకుంటూ చదవాలి. అప్పుడు ఆ పుస్తకంలో హృదయాన్ని వేగంగా సమీక్షించగలమని మేధావులు చెప్పారు. ప్రతిరోజూ ఎంతో కొంత చదవాలి. అది క్రమంగా ఓ అలవాటుగా మారిపోతుంది. రాత్రి పడుకునే ముందు మంచి పుస్తకం ఒక అరగంట చదివితే మనసు ప్రశాంతత పొందుతుంది. మంచి నిద్ర పడుతుంది. పుస్తక పఠనం అలసటలో, ఆవేదనలో, ఆర్తిలో, సుఖంలో, సంతోషంలో ఎప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. పిల్లలకు బాల్యం నుంచే పుస్తకాలు చదవటం అలవాటు చేస్తే వాళ్ళ జీవితంలో అది స్థిర పడిపోతుంది. ♦ పుస్తకాలు చదవటం శ్వాస పీల్చటం లాంటిది. శ్వాస ఆడకపోతే ప్రాణం నిలవదు. పుస్తకాలు అంతే! ఒక పుస్తకం, ఒక కలం, ఒక ఉపాధ్యాయుడు... ఇవి ఈ ప్రపంచాన్నే మార్చగలవు . ♦ సూక్తి సుధ అవకాశాలు సూర్య కిరణాలు వంటివి. వాటిని వీలయినంత త్వరగా దొరక బుచ్చుకోవాలి. ఆలస్యం చేస్తే వాటిని కోల్పోక తప్పదు. – డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి -
విద్యార్థులకు ఆడియో పుస్తకాలు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): కరోనా కారణంగా విద్యార్థులందరూ ఆన్లైన్ విధానంలోనే తరగతులకు హాజరవుతున్నారు. ఇతర సబ్జెక్టులతో పోల్చితే తెలుగు, హిందీ, ఇంగ్లిష్ విషయంలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్లైన్ క్లాసుల్లో ఆయా భాషల పదాల ఉచ్ఛారణను అర్థం చేసుకోలేకపోతున్నారు. తద్వారా విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలు తగ్గుతున్నాయని సిద్దిపేట విద్యాశాఖ గ్రహించింది. విద్యార్థుల్లో పఠనం, శ్రవణం నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంగా ఆడియో పుస్తకాలను రూపొందించింది. వీటిని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు బుధవారం సిద్దిపేటలో ఆవిష్కరించనున్నారు. రూపకల్పన ఇలా.. జాతీయ స్థాయిలో ఎన్సీఈఆర్టీ ఆడియో పుస్తకాలు అందుబాటులో ఉన్నా, రాష్ట్ర స్థాయిలో ఆ తరహా రూపకల్పన జరగలేదు. దీంతో జిల్లా విద్యాశాఖ ఆడియో పుస్తకాల తయారీకి ప్రత్యేక శ్రద్ధ వహించింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఏడుగురు భాషా పండితుల సహకారం తీసుకుంది. వారు తమ మొబైల్ ఫోన్లలో పాఠాలను వాయిస్ రికార్డు చేసి ఆడియో బుక్స్ రూపొందించారు. 3 నుంచి 8వ తరగతి వరకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లోని 154 పాఠాలను 226 ఆడియో పుస్తకాలుగా పొందుపర్చారు. వీటిని సిద్దిపేట విద్యామిత్ర యూట్యూబ్ చానల్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. అందరి సమన్వయంతో.. ఆన్లైన్ విద్యాబోధనతో విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలు తగ్గుతున్నాయనే ఆలోచన నుంచి ఈ ఆడియో పుస్తకాలు రూపుదిద్దుకున్నాయి. ఈ పుస్తకాల ద్వారా విద్యార్థుల్లో భాష నైపుణ్యాలు పెరుగుతాయి. –డా.రమేష్, విద్యాశాఖ జిల్లా సెక్టోరియల్ అధికారి, ఆడియో పుస్తకాల కోఆర్డినేటర్ -
బుక్ లవర్స్కు గుడ్న్యూస్..! నాలుగేళ్ల సబ్స్క్రిప్షన్ కేవలం రూ. 2కే..!
పుస్తక ప్రియులకు శుభవార్త..! బుక్ లవర్స్ కోసం అమెజాన్ సరికొత్త ఆఫర్ను ప్రకటించింది. అమెజాన్కు చెందిన అడిబుల్ యాప్ నాలుగు నెలల సబ్స్క్రిప్షన్ కేవలం రూ. 2 కే అందించనుంది. అడిబుల్లో వినియోగదారులు పుస్తకాలను వినవచ్చును. అంతేకాకుండా విభిన్నమైన పాడ్కాస్ట్లను కూడా అడిబుల్ అందిస్తోంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వెబ్సైట్లో ఈ ఆఫర్ను ప్రకటించింది. కాగా ఈ ఆఫర్ కేవలం మొదటిసారి జాయిన్ అయ్యే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. అడిబుల్ సబ్స్క్రీప్షన్ తీసుకుంటే ఆఫ్లైన్లో మీకు నచ్చిన పుస్తకాలను వినొచ్చు. అడిబుల్ సాధారణంగా నెలకు రూ.199 కు అందిస్తోంది. కాగా ఈ ఆఫర్ ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్నవారికి మాత్రమే. -
భళారే బాలుడా..
రొంపిచెర్ల (చిత్తూరు జిల్లా): కరోనా సోకగానే సహజంగా భయపడిపోతాం. ఏమవుతుందో ఎప్పటికి కోలుకుంటామోనని కలత చెందుతాం. కానీ ఆ బాలుడుకి ఆ భయం ఏమాత్రం లేదు. ఎంచక్కా పాఠ్య పుస్తకాలు చదివేస్తూ.. ఐసొలేషన్లో ఉన్న సమయాన్ని అలా సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఎంతో ఏకాగ్రతతో ఓ తరగతి గదిలో కూర్చుని చదువుతున్నట్టుగా ఆ పిల్లవాడు పైతరగతి పుస్తకాలు చదవడాన్ని చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. చిత్తూరు జిల్లా పెద్దమల్లెల పంచాయతీ నాయునిఓడ్డు దళితవాడకు చెందిన మహేష్ కుమారుడు శివమణి(13) కరోనాతో రొంపిచెర్ల ఐసొలేషన్ కేంద్రంలో చేరాడు. పెద్దమల్లెల ఉన్నత పాఠశాలలో 7వ తరగతి పూర్తిచేసిన శివమణి.. ఈ ఏడాది 8వ తరగతిలో చేరాల్సి ఉంది. అయితే విద్యార్థి ఇప్పటి నుంచే చదువుపై దృష్టి మళ్లించాడు. ఐసొలేషన్ కేంద్రానికి వెళ్లేటప్పుడు పాఠ్య పుస్తకాలు వెంట తీసుకెళ్లాడు. అంతేకాదు నిద్రలేచింది మొదలు.. పుస్తకాలు తీసి చదువుకోవడాన్ని చూసి అక్కడున్న వైద్య సిబ్బంది సైతం ముచ్చటపడుతున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రాజేంద్ర తదితరులు విద్యార్ధిని అభినందించారు. -
ఆ సర్జరీ తర్వాత ‘ప్లాస్టిక్ చోప్రా’ అని వెక్కిరించేవారు
ఆకాశమంత జీవితం నిప్పై జ్వలిస్తుంది. నీరై ఎగసిపడుతుంది. ప్రభంజనమై గొంతెత్తుతుంది.ఎప్పడో శేషజీవితంలో పుస్తకం రాసుకుందాం లే...అనుకోకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు పుస్తకాలు రాస్తున్నారు. తమ జీవితాన్ని తెరిచిన పుస్తకం చేస్తున్నారు...పుస్తకం పంచభూతాల సమాహారం క్రాకింగ్ ది కోడ్ మై జర్నీ ఇన్ బాలీవుడ్ –ఆయుష్మాన్ ఖురానా ఆయుష్మాన్ ఖురానా ఎవరు? అనగానే వచ్చే సమాధానం బ్యాక్–టు–బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇస్తున్న హీరో అని! ఈయనలో మంచి రచయితను పరిచయం చేసిన పుస్తకం క్రాకింగ్ ది కోడ్. భార్య తహీర కష్యప్తో కలిసి ఈ పుస్తకం రాశారు. చండీగఢ్ నుంచి ముంబైకు ఎంత దూరమో తెలియదుగానీ ‘జీరో టు హీరో’కు మధ్య దూరం మాత్రం చాలా పెద్దది. అలా అని దూరభయంలోనే ఉంటే కలలు ఎప్పటికీ దూరంగానే ఉంటాయి. ఈ విషయం తెలిసే తన కలల దారిని వెదుక్కుంటూ డ్రీమ్స్ సిటీ ముంబైకి వచ్చాడు ఖురాన. తన ప్రయాణంలో ఎదురైన కష్టాలకు ఈ పుస్తకంలో అక్షర రూపం ఇచ్చాడు. ఫేమ్, మై భీ హీరో, మైనే స్ట్రగులర్ హుమ్, టికెట్ టు బాలీవుడ్...మొదలైన చాప్టర్లు ఈ పుస్తకంలో ఉన్నాయి. కలలు కనేవాళ్లకు, కన్న కలలు నిజం చేసుకోవడానికి భయపడేవాళ్లకు ఈ పుస్తకం అంతులేని ధైర్యం. పుస్తకం నుంచి మంచి వాక్యం: మనలోని ‘నాకు అంతా తెలుసు’ అనే ద్వారం మూతపడితే తప్ప ‘తెలుసుకోవాలి’ అనే ద్వారం తెరుచుకోదు. ది పెరిల్స్ ఆఫ్ బీయింగ్మోడరేట్లీ ఫేమస్ సోహా అలీ ఖాన్ పెద్ద మర్రిచెట్టు కింద చిన్న మొక్క కూడా మొలవదు అంటారు. అదేమిటోగానీ, ఆ పెద్ద నీడ మాటున ‘వ్యక్తిగత ప్రతిభ’ అనేది చాలాసార్లు చిన్నబోతుంది. హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ సినిమాల్లో నటిగా తన ప్రతిభ చాటుకున్న సోహా అలీఖాన్ చాలామంది దృష్టిలో పటౌడీ–షర్మిలా ఠాగూర్ల కూతురు మాత్రమే, ఇంకొందరి దృష్టిలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ సోదరి. ఇలాంటి విచిత్ర పరిస్థితిని హాస్యధోరణిలో రాసి నవ్వించారు సోహా. తన స్కూల్, కాలేజీ జీవిత జ్ఞాపకాలను నెమరేసుకోవడంతో పాటు ఈనాటి సోషల్ మీడియా కల్చర్పై తనదైన శైలిలో రాశారు. పుస్తకం నుంచి మంచి వాక్యం: జీవితం అయిదుసార్లు కుప్పకూల్చితే, పదిసార్లు లేచి నిల్చోవాలి.శక్తినంతా కూడదీసుకొని పోరాడాలి. అమ్మ మియా: ఇషా డియోల్ మాతృత్వం మధురిమపై ఇషా డియోల్ రాసిన అద్భుత పుస్తకం అమ్మ మియా. గర్భం దాల్చినప్పుడు తాను ఎదుర్కొన్న భయాలు, సందేహాలు వాటికి దొరికిన సమాధానాలు, ఇద్దరు పిల్లలు రధ్య, మియరల పెంపకం సంగతులు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇదొక బెస్ట్ పేరెంటింగ్ పుస్తకంగా పేరు తెచ్చుకుంది. స్థూలంగా చెప్పాలంటే న్యూ మదర్స్కు ఇదొక మంచి గైడ్లా ఉపకరిస్తుంది. పుస్తకం నుంచి మంచి వాక్యం: జీవితంలో మంచి విషయాలు అంటే అనుకోకుండా ఎదురయ్యే ఆనందక్షణాలే! అన్ఫినిష్డ్ ప్రియాంక చోప్రా సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి హాలీవుడ్ వరకు ఎదగడం సాధారణ విషయమేమీ కాదు. తన ప్రయాణం నల్లేరు మీద నడక కాదు. తన ప్రస్థానంలో ఎదురైన అవమానాలు, చేసిన పోరాటాలను ‘అన్ఫిన్ఫినిష్డ్’లో రాశారు ప్రియాంక చోప్రా. ఒకానొక రోజు ప్రమాదవశాత్తు పెదవి తెగి రూపమే మారిపోయిన సందర్భంలో ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాల్సి వచ్చింది. ఇక అప్పటి నుంచి ‘ప్లాస్టిక్ చోప్రా’ అనే వెక్కిరింపులు ఎదురయ్యాయి. అయితే ఇవేమీ తన విజయానికి అడ్డుపడలేకపోయాయి. పుస్తకం నుంచి మంచి వాక్యం: నీలాంటి వ్యక్తి నువ్వు మాత్రమే. నీ గురించి బాగా తెలిసిన వ్యక్తి నువ్వు మాత్రమే. నీ బలాల గురించి బాగా తెలిసిన వ్యక్తి కూడా నువ్వు మాత్రమే! -
ట్విటర్లో మహిళలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా!
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్డౌన్తో అన్ని రంగాలు మూతపడటంతో ప్రతి ఒక్కరూ ఇంటికి పరిమితమైన విషయం తెలిసిందే. బయట తిరిగేందుకు వీలు లేకపోవడం, చేయడానికి పని కరువవ్వడంతో సోషల్ మీడియాపై అధిక సమయం వెచ్చించారు. సమాచారానికి, వినోదానికి, కాలక్షేపానికి ఇదే ప్రధాన మార్గంగా అవతారమెత్తింది. దీనిలోనూ ట్విటర్దే పైచేయి. అయితే తాజాగా ఈ మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ఓ సర్వేను నిర్వహించింది. త్వరలో (మార్చి 8న) అంతర్జాతీయ మహిళా దినోత్సవం రాబోతున్న క్రమంలో మహిళపై ఓ పరిశోధన చేసింది. 2019 ఫిబ్రవరి 2021 వరకు భారతీయ మహిళలు ట్విటర్లో ఎక్కువగా ఏం మాట్లాడారనే విషయంపై ఈ సర్వే చేపట్టారు. దీనిలో 10 నగరాల నుంచి ట్విటర్లో 5,22,992 మంది చేసిన ట్వీట్లతోపాటు ట్విట్టర్లోని 700 మంది మహిళలను ఆధారంగా ఈ సర్వే జరిగింది. మరి ఈ ఫలితాల్లో సరికొత్త విషయాలు తెలిశాయి. రీసెర్చ్ ప్రకారం మొత్తంగా తొమ్మిది ముఖ్య అంశాలపై చర్చ ఎక్కువగా జరిగినట్లు తేలింది. ఇందులో అభిరుచులు, ఆసక్తులు టాప్లో నిలిచాయి. వీటి శాతం 24.9 శాతం వాటా కలిసి ఉంది. ఇందులో ఫ్యాషన్, పుస్తకాలు, అందం, వినోదం, సంగీతం, ఆహారం, టెక్నాలజీ, స్పోర్ట్స్ కలిసి ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న విషయాలపై(కరెంట్ అఫైర్స్) 2.08 శాతం మంది మాట్లాడుకున్నారు. ఇక సెలబ్రిటీ మూమెంట్స్పై-14.5 శాతం, కమ్యూనిటీలపై-11.7 శాతం, సామాజిక మార్పుపై-8.7 శాతం మంది మహిళలు చర్చించారు. ట్విట్లలో లైకులు, రిప్లైల విషయానికొస్తే ఎక్కువగా రోజువారీ ముచ్చట్లు, సెలబ్రిటీల మూమెంట్లపై ఎక్కువగా జరిగాయి. ఫ్యాషన్, ఆసక్తులు, కమ్యూనిటీస్, ఛాలెంజ్లపై ఎక్కువగా రీట్వీట్లు చేశారు. చదవండి: ట్విట్టర్ లో సరికొత్త ఫీచర్ ఒక అమ్మాయి కోసం నలుగురు ఫైట్.. లక్కీ డ్రా! -
ఇష్టమైన పుస్తకం
ఒక పుస్తకాన్ని పూర్తిగా చదివినప్పుడు పిల్లల్లో కలిగే ఆనందం, మరో పుస్తకాన్ని చదివేటట్లు ప్రోత్సహిస్తుంది. తమకు ఇష్టమైన పుస్తకాల ప్రపంచంలో పిల్లలను స్వేచ్ఛగా విహరించనివ్వాలి. అక్షరాల సముద్రంలో అలసిపోయే వరకు ఈదనివ్వాలి. ‘పుస్తకాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. జీవితాన్ని మార్చగల శక్తి కలిగిన సాధనం పుస్తకం’. ఈ మాట చెప్పిన అమిత్ సారిన్ ఒక పుస్తకాల దుకాణం యజమాని. గుర్గావ్లో ‘కూల్ స్కూల్’ పేరుతో భారీ పుస్తకాల దుకాణాన్ని నడుపుతున్నాడితడు. అమిత్ ఉద్దేశం పుస్తకాలను అమ్ముకోవడం కాదు. పిల్లలను చదువరులుగా మార్చడం. అతడు తల్లిదండ్రులందరికీ పెద్దబాల శిక్ష సూక్తి వంటి మరో మాట కూడా చెప్తున్నాడు. అదేంటంటే... ‘అక్షరం నేర్చుకున్న ప్రతి వ్యక్తిలోనూ చదువరి లక్షణం ఉంటుంది. ‘మా పిల్లలు క్లాసు పుస్తకాలు తప్ప ఇతర పుస్తకాలను పట్టుకోను కూడా పట్టుకోరు. వాళ్ల చేత క్లాసు పుస్తకాలను చదివించడమే గగనం. ఇక కథల పుస్తకాలు కూడా దగ్గరుండి మరీ ఎక్కడ చదివిస్తాం’ అనే తల్లిదండ్రులు ఎక్కువగానే కనిపిస్తుంటారు. నిజానికి క్లాసు పుస్తకాలు కాకుండా ఇతర పుస్తకాలను పట్టుకోకపోవడం పిల్లలలోపం కాదు. తల్లిదండ్రుల వైఫల్యం అంటారు అమిత్. తమ పిల్లలు ఏ పుస్తకాలను ఇష్టపడుతున్నారో తెలుసుకోలేకపోవడమే ఇందుకు కారణం. పెద్దవాళ్లు తమకు నచ్చిన పుస్తకాలను కొనిచ్చి పిల్లలను చదవమంటారు. ఆసక్తి కలగని పుస్తకాన్ని చదవడం ఎవరికైనా కష్టమే. అలా చేయకుండా కాల్పనిక సాహిత్యం, జానపద కథలు, చారిత్రక కథనాలు... అన్ని రకాల పుస్తకాలను పిల్లలకు చూపించాలి. పది వాక్యాలు చెప్పే విషయాన్ని ఒక చిత్రం చెబుతుంది. ఆకర్షణీయమైన బొమ్మలున్న పుస్తకాలతో పఠనం మొదలు పెట్టించాలి. పుస్తకం మొత్తం పూర్తి చేయగలిగినట్లు కూడా ఉండాలి. ఒక పుస్తకాన్ని పూర్తిగా చదివినప్పుడు పిల్లల్లో కలిగే ఆనందం, మరో పుస్తకాన్ని చదివేటట్లు ప్రోత్సహిస్తుంది. అసంపూర్తిగా వదిలేసినప్పుడు పుస్తక పఠనం మీద నిరాసక్తత ఆవరిస్తుంది. అందుకే వయసుకు తగినట్లు పుస్తకాన్ని ఎంపిక చేయాలని చెబుతాడు అమిత్ సారిన్. నిజమే... చిన్నప్పుడు దాదాపుగా పిల్లలందరూ ఒక రాజు, ఏడుగురు కొడుకులు, ఏడు చేపల కథను విని ఆస్వాదించి ఉంటారు. కొంచెం పెద్దయిన తర్వాత మయూర రాజ్యంలో ఓ యువతి, రాజకుమారుడు, కీలుగుర్రం కథను కూడా ఆసక్తిగా చదివి ఉంటారు. పది– పన్నెండేళ్లకు వాళ్లకంటూ ఒక అభిరుచి స్థిరపడటం మొదలవుతుంది. వాస్తవ కథనాల అన్వేషణ మొదలు పెట్టవచ్చు. ‘అది కాదు ఇది చదువు’ అంటూ పెద్దవాళ్లు తమకిష్టమైన పుస్తకాన్ని పిల్లల చేతిలో పెడితే పిల్లల ముఖం వికసించదు సరికదా వాడిపోతుంది. తమకు ఇష్టమైన పుస్తకాల ప్రపంచంలో పిల్లలను స్వేచ్ఛగా విహరించనివ్వాలి. అక్షరాల సముద్రంలో అలసిపోయే వరకు ఈదనివ్వాలి. అమిత్ సారిన్ చెప్పినట్లు చదువరులు కానివాళ్లు ఉండరు. అక్షరం వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ పఠనాభిలాష ఉండి తీరుతుంది. ఆ అభిలాషను సంతృప్తి పరిచే పుస్తకం దొరక్కపోవడం వల్లనే చదువరులు కాలేకపోతున్నారు. -
స్క్రాప్బుక్లో ఎన్నెన్నో భావాలు
‘మిస్ యూ!’ మిస్సైన ఫీల్ ఏదిరా.. ఎక్కడా?! ‘లవ్ యూ!’ దేవుడా రొటీన్. చంపేయ్ పోనీ. ‘కంగ్రాట్స్!’ ఏ బడి సార్ మీది? మొక్కుబడా? బీడే బేబీ! నాకేనా, ఫోన్లోనా?! జీవం ఉండట్లేదు ఎక్కడా మన ఎక్స్ప్రెషన్స్లో. ఇంకా ఎలా చెప్పాలి? ‘ఇంకా’నా! అసలేం చెప్పారని? హార్ట్ని టచ్ చేశారా? లేదు! అది ముఖ్యం కదా.. ఓ పని చేయండి. మీట్ మిస్ యామినీ పేర్నపాటి. మీ ఫీలింగ్స్ని ఆమె చక్కటి స్క్రాప్బుక్లో పెట్టి ఇస్తారు. ఆ బుక్ని ప్రెజెంట్ చెయ్యండి చాలు. ఎన్నెన్నో భావాలు..ఏవేవో రాగాలు..! ఆత్మీయులకు మరిచిపోలేని కానుక ఇవ్వాలంటే మనం యామిని చేతుల్లో రూపుదిద్దుకునే అరుదైన కళను ఎంచుకోవాల్సిందే. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న అనుబంధాన్ని అందమైన కథగా కళ్లకు కట్టే ఆ కానుక మన కళ్ల ముందు ఎప్పటికీ నిలిచి ఉండే ఓ సజీవ దీపిక. సూక్ష్మ చిత్రాల రూపకల్పనతో అందమైన కానుకలు తయారు చేస్తూ తన కళతో అబ్బురపరుస్తుంది యామిని పేర్నపాటి. హైదరాబాద్కు చెందిన యామిని ఫ్యాషన్ డిజైనింగ్ని వృత్తిగా మార్చుకోవాలని ఆశపడింది. కానీ, తల్లిదండ్రుల ఇష్టం మేరకు బిటెక్ చేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యింది. ఇప్పుడు ప్రత్యేకంగా జీవన సన్నివేశ చిత్రాలను జీవం ఒలికించేలా రూపొందిస్తూ కస్టమైజ్డ్ గిఫ్ట్ మేకింగ్లో అడుగుపెట్టి ఉపాధి పొందుతోంది. ఆ వివరాలను ఇలా కథలా కళ్లకు కట్టింది... ఆన్లైన్ నైపుణ్యాలు.. ‘‘ఐదేళ్ల క్రితం కాలేజీ రోజుల్లో నేషనల్ ఎంటర్ప్రెన్యూర్ నెట్వర్క్లో భాగం అయ్యాను. అప్పుడే సొంతంగా ఉపాధి పొందడం పట్ల ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకునేదాన్ని. డ్రెస్ డిజైనింగ్లోనే కాదు క్విల్లింగ్ జ్యువెలరీ తయారీలోనూ ప్రశంసలు పొందాను. ఫైన్ ఆర్ట్స్లో మాస్టర్స్ చేయాలనుకున్నాను. కానీ, ‘కళ ఒక అభిరుచి. అది తిండి పెట్టదు’ అన్నారు పెద్దలు. అందుకే, ఇంజనీరింగ్ వైపు వెళ్లాను. కానీ, నా అభిరుచిని వదులుకోలేదు. ఆన్లైన్ సాయంతోనే పెయింటింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నాను. ఇన్స్టాగ్రామ్లో ‘క్రియేటివ్ స్టూడియోస్’ పేరుతో పేజీని నిర్వహించాను. అయితే, తమ్ముడు చదువుకు ఫీజు చెల్లించడం కోసం నాన్న కష్టపడుతుండటం చూసి బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో చేరిపోయాను. కానీ, కళ లేని జీవితం అసంపూర్ణమనే భావన రోజూ బాధపెడుతుండేది. ప్రేయసికి బహుమతి నా సహోద్యోగి ఒకరు తన ప్రేయసికి బహుమతి ఇవ్వడానికి మంచి గిఫ్ట్ సూచించమని అడిగాడు. కాలేజీ రోజుల్లో నా ఫ్రెండ్స్కి డిజైన్ చేసి ఇచ్చిన స్క్రాప్ బుక్స్ గుర్తుకువచ్చాయి. నేనే స్వయంగా ఒకటి రూపొందించి ఇస్తే.. అని ఆలోచన వచ్చింది. ‘మీ బంధం ప్రత్యేకత చెప్పమ’ని అడిగాను. అతను చెప్పిన ప్రేమకథను ఆధారం చేసుకుంటూ ఒక అందమైన గిఫ్ట్ను తయారుచేసి ఇచ్చాను. ఆ కళాకృతికి అబ్బురపడి నాకు కొంతమొత్తాన్ని ఇచ్చాడు. ఆ గిఫ్ట్ అతని స్నేహితురాలికి బాగా నచ్చిందని సంతోషంగా చెప్పాడు. ఆ రోజు నేను పొందిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. నాకు ఎక్కడ సంతృప్తి ఉందో.. అదే పని చేస్తే చాలా సంతోషంగా ఉంటానని అర్ధమైంది. అన్నాళ్లూ వదిలేసిన నా కళకు కొత్తగా జీవం పోయాలనుకున్నాను. ఇన్స్టాగ్రామ్లో we_craft16 పేరుతో కొత్త పేజీని రూపొందించాను. ఏడాదిన్నరగా ఈ పేజీని విజయవంతంగా నిర్వహిస్తున్నాను. మొదట రెండు మూడు ఆర్డర్లే! ఇప్పుడు నాకు నెలలో 30 నుంచి 40వరకు ఆర్డర్లు అందుతున్నాయి. కానీ, మొదటి రెండు నెలలు మూడు, నాలుగు ఆర్డర్లు మాత్రమే వచ్చేవి. చాలా నిరాశగా అనిపించేది. ఉద్యోగం చేస్తూనే స్క్రాప్ బుక్ డిజైన్స్ చేసేదాన్ని. ఓ వైపు ఆఫీసు పని భారం, మరొవైపు స్క్రాప్ బుక్ డిజైన్లు. కొన్ని రాత్రులు అస్సలు నిద్రపోయేదాన్నే కాదు. ముందు ఆర్డర్లు విరివిగా రావడం కోసం కస్టమర్లతో ఎలా వ్యవహరించాలో నేర్చుకున్నాను. గిఫ్ట్ బాక్స్ తెరిచి చూసినప్పుడు మనం చెప్పాలనుకున్న విషయం అందులోని సూక్ష్మచిత్రాలతో ఇట్టే అర్ధమైపోవాలి. అందుకోసం చాలా శోధించాను. చాలా కృషి చేశాను. దీంతో కస్టమర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రత్యేకమైన శైలి కస్టమర్లు చెప్పే విషయాలను శ్రద్ధగా వింటాను. వారి మధ్య ఉన్న అందమైన సన్నివేశాన్ని తెలుసుకుంటాను. దానికి తగ్గట్టు క్రాఫ్టింగ్ చేస్తాను. ‘ఈ కళ ఎక్కడ నేర్చుకున్నారు?’ అని అడుగుతుంటారు. ఇది నాకు నేనుగా సృష్టించుకున్న కళ. అలాగని, నా వరకే పరిమితం అవ్వాలనుకోను. మరికొందరిని ఇందులో భాగస్వాములను చేయాలనుకుంటున్నాను. ఎప్పుడూ నా ఆలోచనల శైలిని అప్గ్రేడ్ చేస్తుంటాను కాబట్టి, ఎవరూ దీనిని కాపీ చేయలేరు అని గట్టిగా చెప్పగలను. ఐటి కంపెనీ నాకు చెల్లించే దానికంటే ఎక్కువ సంపాదించగలను అనే నమ్మకం పెరిగింది. నా అభిరుచితోపాటు నా వృత్తిని ఎలా సమతుల్యం చేసుకోవాలో నేర్చుకున్నాను’’ అని యామిని ఆనందంగా వివరించింది. ఉద్యోగం చేసుకుంటూనే నచ్చిన అభిరుచిలో ఉపాధి పొందుతున్న యామిని ఇప్పుడు కళాత్మకంగా రాణిస్తోంది. – నిర్మలారెడ్డి -
మార్పును ప్రతిబింబిస్తున్న పుస్తకాలు
భాషాభివృద్ధిలో ప్రధాన సమస్య ఏదంటే, ఆధునిక శాస్త్రవిజ్ఞానాన్ని సులువుగా వ్యక్తీకరించే కొత్త పదజాలాన్ని స్వీకరించడమే. భాషలోని అక్షరాలను సరళతరం చేయకపోతే, ఉత్పాదక క్షేత్రాల్లో విరివిగా ఉపయోగించే పదాలను స్వీకరించకపోతే, పుస్తక భాషలో ఆదివాసీ ప్రాంతాలకు చెందిన పదాలను చొప్పించకపోతే, తెలుగు సుసంపన్నం కాలేదు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం రూపొందిస్తున్న మిర్రర్ ఇమేజ్ తరహా పుస్తకాల ద్వారా ఎదిగే తరాలు తెలుగుని విస్తృత స్థాయిలో అభివృద్ధి చేయగలవు. రెండు భాషల్లో ఒకే చోట పాఠాన్ని ప్రచురించడం ద్వారా ఒక భాషగా తెలుగు కంటే ఇంగ్లిష్ ఎంత సులభమో అటు విద్యార్థులు,ఇటు ఉపాధ్యాయులూ అర్థం చేసుకోగలరు. ఆంధ్రప్రదేశ్ బోధనకు సంబంధించి భవిష్యత్తులో అత్యంత సృజనాత్మక మదుపుదారుగా మారనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటవ తరగతి నుంచి 6వ తరగతి వరకు కొత్త విప్లవాత్మకమైన విద్యా పథకంతో ముందుకొచ్చింది. రెండుభాషల్లోనూ మిర్రర్ ఇమేజ్ అని చెబుతున్న స్కూల్ పుస్తకాలను ప్రచురించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో విద్యార్థి, ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరించడానికి రాష్ట్రంలో స్కూలు పుస్తకాలని ఇంగ్లిష్, తెలుగు పాఠాలు పక్కపక్కనే ఉండేలా ప్రచురించనున్నారు. రెండు భాషల్లో ఒకే చోట పాఠాన్ని ప్రచురించడం ద్వారా ఒక భాషగా తెలుగు కంటే ఇంగ్లిష్ ఎంత సులభమో అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులూ అర్థం చేసుకోగలరు. భారతీయ భాషల్లో కంటే అక్షరాలు, వాక్య నిర్మాణం రీత్యా ఇంగ్లిష్ను నేర్చుకోవడం చాలా సులభమని వీరు గ్రహిస్తారు. దేశభాషలందు తెలుగు లెస్స అంటూ వీరాలాపన చేసే ఘనాపాఠీలు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు సులువుగా పలికడానికి తగినట్లుగా తెలుగు రాత లిపిని మెరుగుపర్చడంపై ఎన్నడూ దృష్టిపెట్టలేదు. తెలుగు పుస్తకాల్లో రాతరూపంలోని పాఠం ఉత్పత్తి క్షేత్రాల్లో పరస్పరం మాట్లాడుకునే తెలుగు భాషకు సంబంధించినదిగా ఉండదు. పొలం దున్నేటప్పుడు, పంట కోసేటప్పుడు, ఇంట్లోనూ, బయట ఆహార ధాన్యాలను నిల్వచేసేటప్పుడు, ప్రజలు తమకు తెలి సిన ప్రజాభాషలోనే మాట్లాడతారు. కానీ పుస్తకాల్లో రాత పండిత భాషలో ఉంటుంది. చివరకు బ్రాహ్మణ (పురుషులు మాత్రమే పండితులుగా పేరొందుతారు) ఇళ్లలో కూడా సంస్కృతాన్ని మహిళల గృహ, వంటింటి భాషగా అనుమతించలేదు. ఒక్కసారి ఇలాంటి కృతక భాషను తెలుగు అక్షరాల్లోకి దూర్చి ఉత్పాదక వర్గాలపై బలవంతంగా రుద్దినప్పుడు అసలు తప్పు వాస్తవ రూపం దాలుస్తుంది. ఉత్పత్తి క్షేత్రాల్లోనే వికసించిన ఇంగ్లిష్ సరిగ్గా ఇంగ్లిష్ దీనికి వ్యతిరేక దిశలో పరిణమించింది. 14వ శతాబ్ది చివరివరకు ఇంగ్లిష్ అనేది ఇంగ్లండ్లోని రైతుల భాషగా ఉండి చర్చీల్లో ఉపయోగించడానికి అనుమతించేవారు కాదు. చివరకు ఆంగ్లికన్ చర్చీలలో కూడా గ్రీకు, లాటిన్ భాషలనే దైవ భాషలుగా ఆమోదించారు. ఇంగ్లిష్ ఉత్పత్తి క్షేత్రాల్లో పరిణమించి, అభివృద్ధి చెంది తర్వాత పుస్తక భాషగా మారింది. రైతులు మాట్లాడే భాష దేవుని ప్రార్థించే భాషగా మారినప్పుడే, ఇంగ్లిష్ అటు ప్రింట్, ఇటు మాట్లాడే రూపాల్లో సుసంపన్నంగా మారిపోయింది. ఇంగ్లిష్, జర్మన్, ఫ్రెంచ్ వంటి యూరోపియన్ భాషలను ప్రార్థనా భాషలుగా ఆమోదించినప్పుడు మాత్రమే యూరప్ రైతులు, శ్రామికులు ఈ భాషలను చదవడం, రాయడం నేర్చుకున్నారు. ఇది యూరప్ రైతాంగ జీవితంలోనే అతిపెద్ద విప్లవాత్మక పరిణామం అయి కూర్చుంది. ఒక భాషను పవిత్రమైనదిగా ఆమోదించిన తర్వాత మాత్రమే ఆ భాష అభివృద్ధి చెందే క్రమం పూర్తిగా మారిపోతుంది. అదే హిందూ మతంకేసి చూస్తే తెలుగు కానీ మరే ఇతర భాషలు కానీ నేటికీ అతిపెద్ద ఆలయాల్లో కూడా దైవాన్ని ప్రార్థించే భాషగా ఉండవనేది స్పష్టాతిస్పష్టం. ఇది తెలుగును మొదటినుంచీ అభివృద్ధి చెందకుండా నిరోధించిన మరొక ప్రతికూల అంశంగా ఉండిపోయింది. భాషాభివృద్ధిలో మరొక ప్రధాన సమస్య ఏదంటే, వికసిస్తున్న ఆధునిక శాస్త్రవిజ్ఞానాన్ని సులువుగా వ్యక్తీకరించగల కొత్త పదజాలాన్ని స్వీకరించడమే. భాషలోని అక్షరాలను సరళతరం చేయకపోతే, ఉత్పాదక క్షేత్రాల్లో విరివిగా ఉపయోగించే పదాలను స్వీకరించకపోతే, పుస్తక భాషలో ఆదివాసీ ప్రాంతాలకు చెందిన పదాలను చొప్పించకపోతే, తెలుగు çసుసంపన్నం కాదు, కాలేదు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం రూపొందిస్తున్న మిర్రర్ ఇమేజ్ తరహా పుస్తకాల ద్వారా ఎదిగే తరాలు తెలుగుని విస్తృత స్థాయిలో అభివృద్ధి చేయగలవు. సెమిస్టర్ ఒక కొత్త అనుభవం ఆలస్యంగా మొదలవుతున్న ఈ విద్యాసంవత్సరం నుంచి పాఠశాల విద్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెమినార్ సిస్టమ్ను ప్రవేశపెట్టనుంది. పాఠశాల విద్యా స్థాయిలోనే సెమిస్టర్ మోడల్ను ప్రవేశపెట్టడం అనేది భారతీయ పాఠశాల విద్యా చరిత్రలోనే మొట్టమొదటిది. ఒక సంవత్సరంలో పిల్లల పురోగతిని రెండు అసెస్మెంట్ల ద్వారా లెక్కించడం వల్ల పిల్లలు తమపై అంచనా ప్రక్రియను చాలా సులభంగా నిర్వహించగలరు. అందుకే ఇది దీర్ఘకాలంలో చాలా సానుకూల ఫలితాలను అందిస్తుంది. నిజానికి దీన్ని పాఠశాల విద్యలో యూరో– అమెరికనేతర మోడల్గా చెప్పవచ్చు. పైగా ఇదొక విలువైన ప్రయత్నం కూడా. యూరో అమెరికన్ నమూనా తరహాలో భారత్లో ఏ స్థాయిలో కూడా పిల్లలు ఐపాడ్ వంటి రూపంలో సాఫ్ట్ బుక్స్ (ప్రింట్ పుస్తకాలు కాకుండా డిజిటల్ రూపంలో చదవగలగడం) చదివే అలవాటును మన పాఠశాల విద్య ఇంతవరకు అభివృద్ది చెందించలేదు. పుస్తకాల బరువును తగ్గించడం నేటి విద్యావిధాన లక్ష్యం. ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న మిర్రర్ ఇమేజ్ పుస్తకాల బరువు ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఒక సెమిస్టర్ పూర్తి చేసే కాలంలో పిల్లలు కేవలం నాలుగు నెలలకు సంబంధించిన పుస్తకాలను మాత్రమే క్లాసుకు తీసుకురావచ్చు. తద్వారా వారు బరువు మోసే పని తగ్గుతుంది. పిల్లల్లో సృజనాత్మక ఆలోచనా సామర్థ్యాలను, నేర్చుకునే సమర్థతలను మెరుగుపర్చడంలో భారతీయ పాఠశాలల ఉపాధ్యాయులు చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటోంది. ఇంతవరకు భారతీయ విద్యా వ్యవస్థ పాఠాలు గుర్తు పెట్టుకునే లేక వల్లెవేయించే ప్రక్రియలోనే నడుస్తోంది తప్ప పిల్లల్లో సృజనాత్మక ఆలోచనకు అనుమతిం చడం లేదు. కాబట్టి ఇకనైనా పిల్లల్లో సృజనాత్మక చింతన ప్రారంభం కావాలి. 6వ తరగతిని పూర్తి చేసే లోపే వారు కాలంతోపాటు తప్పక ఎదగాలి. స్వయంగా ఇంగ్లిష్లో మాట్లాడే అభ్యాసాన్ని ఇస్తున్న మిర్రర్ ఇమేజ్ పుస్తకాలు టీచర్ వయసు ఏదైనా సరే వారి ఇంగ్లిష్ కమ్యూనికేషన్ను కూడా మెరుగుపరుస్తాయి. ఇది పిల్లలు మాట్లాడే ప్రక్రియకు సాయపడుతుంది. పైగా టీచర్ కంటే ఎక్కువగా నేర్చుకోవడంపై పిల్ల లకు ఆసక్తి ఉంటుంది కనుక ప్రతి విద్యార్థి కూడా ఒక టీచరేనని ఉపాధ్యాయులందరూ గుర్తించాల్సి ఉంటుంది. శ్రమను గౌరవించడం నేర్పే బోధన యూరో–అమెరికన్ వ్యవస్థల్లో పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత పిల్లలు తమ కుటుంబం నుంచి బయటపడి కుటుంబ ఆర్థిక ప్రతిపత్తితో ప్రమేయం లేకుండా తమ సొంత జీవితం గడపాల్సి ఉంటుంది. భారత దేశంలో ఇది సాధ్యం కాదు. ఇక్కడ మనం చైనానుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది. చైనాలోనూ మనకు లాగే భారీస్థాయిలో పిల్లలు పాఠశాలలకు వెళుతుంటారు. పైగా ఒకేరకమైన ఆర్థిక వ్యవస్థ మన రెండు దేశాల్లోనూ ఉంది. కానీ ఆ దేశంలో శ్రమను గౌరవించే బోధన విస్తృత స్థాయిలో కనిపిస్తుంది. భారతదేశంలోనూ శ్రమను గౌరవించడాన్ని బోధించడం అనేది పిల్లలు వంటపని చేయడంతో మొదలు కావాలి. దీన్నే కిచెన్ ఫ్రెండ్లీ అంటున్నారు. 6వ తరగతినుంచి పాఠాలు వంటకు సంబంధించిన పాఠ్యాంశాలతో, శ్రమ ప్రాధాన్యతను గుర్తింప జేసే అంశాలతో ఉండాలి. పిల్లల జెండర్తో నిమిత్తం లేకుండా కుటుంబంలోని పిల్ల లందరికీ తల్లి వంటపనిని, ఇంటి పనిని నిత్యం బోధిస్తూ రావాలి. ఏపీ ప్రభుత్వం అమ్మఒడి పథకంలో భాగంగా తల్లికి నగదు ఇస్తోంది. ఇది తల్లి సానుకూల విద్యను పిల్లలకు బోధించడానికి అవసరమైన సహాయాన్ని అందిస్తుంది. అయితే తల్లిదండ్రులు స్కూల్లో భేటీ అయే సమయంలో వారు తమ పిల్లలకు ఇంటిపనిలో ఉన్న శ్రమను గౌరవించడం ఒక పెద్ద సాంస్కృతిక సంపద అనే విషయాన్ని అర్థం చేయించాలని పాఠశాలలు తప్పకుండా కోరాలి. పిల్లలకు తల్లిదండ్రులు వంటపని, ఇంటిపని నేర్పిస్తున్నారా లేదా అని ఉపాధ్యాయులు నిర్ధారించాలి కూడా. నేర్చుకునే ప్రక్రియలో టీచర్లు తమలోని పురుషాధిక్య ధోరణులను వదిలిపెట్టేయాల్సి ఉంది. ఆ తర్వాత ప్రతి క్లాసులోనూ మట్టి పిసకడం, వ్యవసాయ పనులు చేయడంపై కొన్ని పాఠాలు తప్పక పొందుపర్చాలి. చైనా ఈ పనిని 4వ తరగతినుంచే మొదలుపెడుతోంది. భారతదేశంలో శ్రమను గౌరవించే బోధనను సూత్ర రీత్యా, ఆచరణ రీత్యా ప్రవేశపెట్టడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమతమ సొంత పద్ధతులను చేపట్టవచ్చు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ బోధనకు సంబంధించి భవిష్యత్తులో అత్యంత సృజనాత్మక మదుపుదారుగా మారనుంది. రేపు తన పౌరులకు దేశం గర్వించగిన స్థాయిలో శాస్త్రీయ విద్యను కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అందించనుంది. ప్రొ‘‘ కంచ ఐలయ్య òషెపర్డ్ వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
ట్వింకల్ కన్నాను ఆకట్టుకున్న పుస్తకాలివే..
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య, నటి ట్వింకిల్ కన్నా తన అభిరుచులను సోషల్ మీడియాలో పంచుకుంటూ నెటిజన్లను అలరిస్తుంటారు. పుస్తకాలు చదవడం అంటే ట్వింకల్ కన్నాకు ఎంతో ఇష్టం. తాజాగా టీనేజ్ ప్రేమికుల ఇతివృత్తంతో ‘ఫ్రెంచ్ ఎగ్జిట్’ అనే పుస్తకాన్ని ట్వింకల్ కన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అయితే ఈ పుస్తకంలో టీనేజ్ యువత మైండ్సెట్, వ్యక్తిత్వం తదితర అంశాలను రచయిత చక్కగా వివరించినట్లు తెలిపింది. కేవలం ఫ్రెంచ్ ఎగ్జిట్ పుస్తకం మాత్రమే కాకుండా ‘ది వార్ నెక్స్ట్ డోర్’ అనే పుస్తకాన్ని కూడా ట్వింకల్ కన్నా నెటిజన్లకు సూచించారు. కాగా తన కూతురుతో కలిసి పుస్తకాలను చదవుతానని, పిల్లలకు సంబంధించిన పుస్తకాలను చదవడం వల్ల పిల్లల వ్యక్తిత్వం తెలుసుకోవచ్చని తెలిపారు. కాగా టాలీవుడ్లో వెంకటేశ్ హీరోగా ‘శ్రీను’ సినిమాలో ట్వింకల్ కన్నా హీరోయిన్గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అనేక బాలీవుడ్ సీనిమాలలో ట్వింకల్ కన్నా హీరోయిన్గా నటించారు. చదవండి: నా భార్య బాగా రాస్తుంది.. కానీ చదవను! -
మనుషులు ‘బుక్కయ్యారు’!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి మనుషుల అలవాట్లు, ఆలోచనలను ముమ్మాటికీ మార్చేసింది. జీవనవిధానంలోనూ మార్పును తెచ్చింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అనంతరం వర్క్ ఫ్రం హోమ్ చేయాల్సి రావడం, ఇంట్లోంచి బయటకు అడుగు బయటపెట్టే పరిస్థితి లేకపోవడం, విందులు, వినోదాలు లేకపోవడంతో పిల్లలు, పెద్దలంతా పుస్తకపఠనం వైపు మళ్లుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే... మనుషులు ‘బుక్కయ్యారు’. వ్యక్తిత్వ వికాసం, ఆధ్యాత్మికం,రాజకీయంపై ఆసక్తి లాక్డౌన్ అనంతరం 12 శాతం మంది కొత్తగా పుస్తకపఠనం వైపు మళ్లినట్లు జాతీయ సర్వేలు వెల్లడిస్తున్నాయి. వ్యక్తిత్వ వికాసం, ఆధ్యాత్మికం, దేశ రాజకీయం, ఉన్నత జీవనవిధానం, ఆర్థిక పరిస్థితుల పెరుగుదల వంటివాటిపై ప్రచురితమైన జాతీయ, అంతర్జాతీయ రచయితల పుస్తకాలను చదివేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని నీల్సన్ బుక్ ఇండియా కన్జ్యూమర్ రీసెర్చ్ స్టడీ వెల్లడించింది. పురుషులు రాజకీయం, స్వయం వికాసం, క్రైమ్, థ్రిల్లర్, హిస్టారికల్ ఫిక్షన్, మహిళలు ఫిక్షన్, రొమాన్స్ పుస్తకాలను చదువుతున్నారని వెల్లడించింది. ఇదివరకే పఠన అభిరుచి ఉన్నవారు వారానికి 5 నుంచి 7 గంటలపాటు చదివితే, లాక్డౌన్ తర్వాత 9 గంటలు చదువుతున్నారని వెల్లడించింది. పిల్లలు ఏం చదువుతున్నారంటే... ఎనిమిదేళ్ల వయస్సున్న పిల్లల కోసం చిత్రాలతో కూడిన పుస్తకాలు, జంతువుల కథలు, పంచతంత్ర కథల పుస్తకాలు, 9–17 ఏళ్ల పిల్లల కోసం స్పై, డిటెక్టివ్, మిస్టరీ, క్లాసిక్ కథలు చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. ‘ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్న పెద్ద బాలశిక్ష, మహాభారతం చదివేశా. ‘మీ జీవితం మీ చేతుల్లోనే’, ‘ప్రభావశీలుర అలవాట్లు’అనే పుస్తకాలను ఆన్లైన్లో తెప్పించుకొని చదివా. నాకు పుస్తకాలు చదవాలని కోరిక ఉన్నా ఇన్నాళ్లు తీరికలేక చదవలేదు’అని సంగారెడ్డి పట్టణానికి చెందిన 63 ఏళ్ల కాంతారెడ్డి పేర్కొన్నారు. ‘ఆన్లైన్ క్లాస్లు మధ్యాహ్నానికే పూర్తి అవుతుండటంతో మిగతా సమయంలో వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదువుతూనే, వీడియోలు చూస్తున్నా’అని అక్షయ అనే ఇంటర్ విద్యార్థిని తెలిపింది. ఫ్లిప్కార్ట్లో అమ్ముడుపోతున్న పుస్తకాలివే.. ఫ్లిప్కార్ట్లో గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతా లు, భగవద్గీత, లోపలి మనిషి వంటి పుస్తకాలకు డిమాండ్ ఎక్కువుంది. ఆధ్యాత్మిక ప్రసంగాల వీడియోలు, విజయగాథలు, ధైర్యం, విశ్వాసం, సుహృద్భావాన్ని పెంచే వీడియో సందేశాలకై సెర్చింగ్లు పెరిగాయని సర్వేల ద్వారా తెలుస్తోంది. అమెజాన్లో బెస్ట్ సెల్లింగ్ పుస్తకాలు అమెజాన్లో బెస్ట్ సెల్లింగ్ పుస్తకాల జాబితాలో ఇంగ్లిష్లో ఇండియన్ పాలిటిక్స్ మొదటి స్థానంలో ఉంది. ఇకిగాయి– ద జపనీస్ సీక్రెట్ టు ఎ లాంగ్ అండ్ హ్యాపీ లైఫ్, థింక్ అండ్ గ్రో రిచ్, మై ఫస్ట్ లైబ్రరీ, ద ఆల్కమిస్ట్, 101 పంచతంత్ర కథలు బాగా అమ్ముడుపోయాయి. ఎక్కువ మంది చదివినవాటిలో తెలుగులో వైఎస్ విజయారాజశేఖరరెడ్డి రాసిన ‘నాలో.. నాతో.. వైఎస్సార్’మొదటి స్థానంలో ఉండగా, రిచ్డాడ్–పూర్ డాడ్, సీక్రెట్, శ్రీ గురుచరిత్ర, ఒక యోగి ఆత్మకథ, ఇండియన్ ఎకానమీ, చాణక్యనీతి, అందరినీ ఆకట్టుకునే కళ వంటి పుస్తకాలు ట్రెండింగ్లో ఉన్నాయి. -
ఒక్క క్లిక్ చాలు..
విజయనగరం: కరోనా మహమ్మారి కాలు బయట పెట్టనీయడంలేదు. కాలక్షేపానికి మొబైల్ ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. కానీ పుస్తక ప్రియులు గ్రంథాలయాలకు వెళ్లలేక ఏదో కోల్పోయినట్టు భావిస్తున్నారు. అంతేనా... పోటీపరీక్షలకోసం సన్నద్ధమయ్యే విద్యార్థులు... పాఠశాలలకు వెళ్లలేని విద్యార్థులు... వీరందరిదీ ఇదే సమస్య. వీరికోసమే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన వెబ్సైట్, మొబైల్ యాప్ను రూపొందించింది. అందులో కావలసినన్ని పుస్తకాలను నిక్షిప్తం చేసింది. ఇంకెందుకాలస్యం... వాటినెలా వినియోగించుకోవచ్చో చూద్దాం. మానవ వనరుల మంత్రిత్వశాఖ(ఎంహెచ్ఆర్డీ), జాతీయ గ్రంథాలయ సంస్థ ప్రత్యేకంగా ఎన్డీఎల్ ఇండియా (జాతీయ డిజిటల్ గ్రంథాలయ భారతదేశం) వెబ్సైట్, మొబైల్ యాప్ను రూపొందించారు. ఇందులో పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు అవసరమైన పుస్తకాలను చదువుకోవచ్చు. సివిల్స్, గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల కోసం పుస్తకాలను కొనకుండా, గ్రంథాలయాలకు వెళ్లకుండానే ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇదెంతో ఉపయోగకరం. 4 కోట్లకు పైగా పుస్తకాలు డిజిటల్ గ్రంథాలయంలో ఎన్నో పుస్తకాలు దర్శనమిస్తాయి. తెలుగు సహా.. 12కు పైగా భాషల్లో నాలుగు కోట్లకు పైగా రకరకాల పుస్తకాలు పొందుపరిచారు. ఎందరో ప్రముఖుల కు సంబంధించిన 3 లక్షల వరకు మహానీయుల జీవిత చరిత్ర పుస్తకాలతోపాటు పోటీ పరీక్షల పుస్తకాలు, యూనివర్సిటీలు, పాఠశాల బోర్డుల ప్రశ్నపత్రాలు, సమాధాన పుస్త కాలు, కంప్యూటర్ సైన్స్, బీఎడ్, డీఎడ్, ఛాత్రోపాధ్యాయుల శిక్షణ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పరిశోధన సంస్థలు, ప్రభుత్వరంగ పుస్తకాలతోపాటు సాహిత్య పుస్తకాలను ఇందులో చూడొచ్చు. ఆర్టికల్స్, వీడియో, ఆడియోల రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఎన్డీఎల్ ఇండియా మొబైల్యాప్లో... ఎన్డీఎల్ ఇండియా ద్వారా డిజిటల్ పుస్తకాలను చదువుకోవడం చాలా సులభం. గూగుల్లో ఎన్డీఎల్ ఆఫ్ ఇండియా అని టైప్ చేసి వెబ్ పేజీని ప్రారంభించాలి. అందులో ఈ–మెయిల్ ఐడీ సాయంతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తాము చదువుతున్న విశ్వవిద్యాలయం, అవసరమైన పుస్తకాల జాబితాను ఎంపిక చేసుకోవాలి. తర్వాత రిజిస్ట్రేషన్ నమోదుకు ఇచ్చిన మెయిల్కు గ్రంథాలయం లింక్ వస్తుంది. అందులో క్లిక్ చేసి లాగిన్, పాస్వర్డ్ ఎంటర్ చేసి, అంతర్జాలంలోకి వెళ్లొచ్చు. తర్వాత అవసరమైన పుస్తకాలను ఎంపిక చేసుకొని చదువుకోవచ్చు. లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్లో ఎన్డీఎల్ ఇండియా అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. ఇందులో వెబ్సైట్ మాదిరిగా కాకపోయినా, కొంచెం వేరుగా ఉంటుంది. అయినా అన్నిరకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. ఐఐటీ, జేఈఈ, గేట్ వంటి పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే వారి కోసం ఇందులో ప్రత్యేకంగా ఐచ్ఛికాలను ఏర్పాటు చేశారు. -
బిల్ గేట్స్ సూచించిన ఐదు పుస్తకాలు ఇవే!
కాలంకంటే ముందే పుట్టి, కాలంకంటే ఒకడుగు ముందు నడుస్తున్న మనిషిలా ఉంటారు బిల్ గేట్స్. కాలానికి జలుబు చేయబోతోంది, కాలానికి పలానా పుస్తకాలు మంచి మెడిసిన్ అని కూడా చెబుతుంటారు. వేసవికాల పఠనం కోసం ఇప్పుడు ఆయన 5 పుస్తకాలు సూచించారు. వాటిల్లో ‘నోబెల్’ దంపతులు అభిజిత్ బెనర్జీ, ఎస్తర్ డూఫ్లో రాసిన ‘గుడ్ ఎకనమిక్స్ ఫర్ హార్డ్ టైమ్స్’ కూడా ఉంది. మిగతా నాలుగు.. ది ఛాయిస్ (డాక్టర్ ఎడిట్ ఈవా ఎగర్), క్లౌడ్ ఎట్లాస్ (డేవిడ్ మిట్చెల్), ది రైడ్ ఆఫ్ ఏ లైఫ్ టైమ్ (బాబ్ ఈగర్), ది గ్రేట్ ఇన్ ఫ్లూఎంజా (జాన్ ఎం బ్యారీ). బిల్ గేట్స్ ఏదైనా చెప్పారంటే అందులో మానవాళి శ్రేయస్సు ఉంటుందనే. కోవిడ్ 19 పొంచి ఉందని 2015 లోనే చెప్పారు ఆయన ఒక స్పీచ్లో!! అప్పుడే ఇంకో మాట కూడా చెప్పారు. కనీసం కోటీ యాభై లక్షల మందికి సంక్రమించాక కానీ కోవిడ్ శాంతించదని!! -
సరస్వతీ దేవి నిన్ను వదిలిపెట్టదు..
అమెరికన్ పాప్ సింగర్ సెలెనా గోమెజ్ తాను చేసిన పొరపాటుకు విమర్శలపాలైంది. సెలెనా తాజాగా ప్రఖ్యాత స్పోర్ట్స్ కంపెనీ ‘పూమా’ వాణిజ్య ప్రకటనలో కనిపించింది. ఇందులో పూమా కంపెనీకి చెందిన స్పోర్ట్స్ దుస్తులు ధరించి మంచి ఔట్ఫిట్తో కనిపించింది. చుట్టూరా పుస్తకాలున్న లైబ్రరీలో ఫొటోలు దిగిన సెరెనా పనిలో పనిగా పుస్తకాల దొంతరలపైనా నిలబడి ఫొటోలకు ఫోజిచ్చింది. ఈ చర్యే నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. జ్ఞానాన్ని అందించే పుస్తకాలపై నిలబడటాన్ని పలువురు తీవ్రంగా దుయ్యబట్టారు. ‘భారతీయ సంస్కృతిలో పుస్తకాలకు ప్రత్యేక గౌరవం ఉంది. వాటిని కళ్లకద్దుకుని పూజిస్తారే తప్పితే కాలికిందేసి అవమానించరు’.. ‘తనకు వేరే ప్రదేశమే దొరకలేదా? ఎందుకు ఆ పుస్తకాలపై నిల్చుంది’.. ‘నువ్వు చేసిన తప్పుకు సరస్వతీ దేవీ నిన్ను వదిలిపెట్టదు.. తప్పుకుండా శిక్షించి తీరుతుంది’ అంటూ నెటిజన్లు పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పుస్తకాలు జ్ఞాన సంపదలని, వాటిని అగౌరవపర్చవద్దని మరో నెటిజన్ వేడుకున్నాడు. ప్రస్తుతం సెలెనా పూమా యాడ్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. -
పుస్తకాలు కదా మాట్లాడింది..!
అతను ఓ యువకుడు. ఆ నోటా ఈ నోటా విని ఆ గురువుగారి ఆశ్రమానికి వచ్చాడు. అక్కడే ఉండి వైరాగ్యం, సన్న్యాసం గురించి తెలుసుకోవాలనుకున్నాడు యువకుడు. కానీ ఆ గురువుగారు ఎప్పుడూ ఏదో ఒక విషయాన్ని చెప్తూ ఉండేవారు. శిష్యుడు ఏదైతే తెలుసుకోవాలనుకున్నాడో అది తప్ప మిగిలినవి చెప్పసాగారు గురువుగారు. ఆయన చెప్పే విషయాలు అతనిని ఏమాత్రం ఆకట్టుకోలేదు. అవి అంత ప్రాధాన్యమైనవిగా కూడా అనిపించలేదు. దాంతో శిష్యుడికి గురువుగారి మీద ఒకింత కోపమొచ్చింది. నిరాశానిస్పృహలూ కలిగాయి. అప్పటికీ కొంత కాలం ఉండి ఇక లాభం లేదనుకుని అక్కడినుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ అతను అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు ఓ సంఘటన జరిగింది. ఆ తర్వాత అతను అక్కడినుంచి వెళ్ళనే లేదు. ఇంతకూ ఆ రోజు జరిగిన సంఘటన ఏమిటో చూద్దాం... ఆ రోజు మరొక యువకుడు ఆ గురువుగారి దగ్గరకు వచ్చాడు. అతను ఓ సాధువు. అక్కడున్న వారికి తన గురించి పరిచయం చేసుకున్న ఆ కొత్త సాధువు అందరితోనూ అవీ ఇవీ మాట్లాడుతూ వారి మాటలు వింటూ కొత్త కొత్త విషయాలను ఆసక్తికరంగా చెప్పసాగాడు. ఆధ్యాత్మిక అంశాలపై కనీసం రెండు గంటలపాటు ఆ యువసాధువు మాట్లాడాడు. అందరూ గుడ్లప్పగించి విన్నారు. గురువుగారు కళ్ళు మూసుకుని ఆ యువకుడి మాటలను వినసాగారు. అప్పటికే అక్కడున్న పాత శిష్యుడు ఆ కొత్త సాధువు మాటలు విని తానింతకాలమూ ఆశించింది ఇటువంటి విషయాలనే కదా అని మనసులో అనుకున్నాడు. గురువు అనే వాడు ఇలా ఉండాలని, ఆ కొత్త సాధువుతో వెళ్ళిపోవాలని కూడా నిర్ణయించుకున్నాడు. అక్కడున్న వారందరూ అతని మాటలను ఎంతగానో మెచ్చుకున్నారు. తమకున్న సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఓ రెండు గంటల తర్వాత ఆ కొత్త సాధువు తన ప్రసంగం ఎలా ఉందని గురువుగారిని అడిగాడు ఒకింత గర్వంతో. గురువుగారు కళ్ళు తెరచి ‘‘నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడావు... నేను రెండు గంటలుగా చూస్తున్నాను. నువ్వేం మాట్లాడావు...’’ అని అన్నారు.‘‘అదేంటీ అలా అంటారు... అలాగైతే ఇప్పటి వరకూ మాట్లాడిందెవరని అనుకుంటున్నారు...’’ అని కొత్త సాధువు ప్రశ్నించాడు. ‘‘శాస్త్రాలు మాట్లాడాయి... నువ్వు చదువుకున్న పుస్తకాలు మాట్లాడాయి... నువ్వు నీ స్వీయానుభవం గురించి ఒక్క మాటా మాట్లాడలేదు... అటువంటప్పుడు నీ ప్రసంగంపై నా అభిప్రాయం ఏం చెప్పగలను?’’ అని గురువుగారు ప్రశ్నించారు. ఎప్పటికైనా స్వీయానుభవమే నిజమైనది. దోహదపడేది కూడానూ. – యామిజాల జగదీశ్ -
సెల్ఫీ విత్ 'సక్సెస్'
సక్సెస్... అంటే ఏంటి? ప్రారంభించిన పనిని విజయవంతంగా పూర్తి చేయటం అంటారెవరైనా. మరి వ్యాపారాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోగలిగినంత విజయం చవిచూసిన ‘కాఫీ సిద్ధార్థ’ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు? నిజానికి సక్సెస్ని నిర్వచించటం కష్టం... మారుమూల పల్లె మొదలు అగ్రరాజ్యం అమెరికా వరకు... సక్సెస్ కోసం ఒకటే ఉరుకులు, పరుగులు. ఆటలో గెలుపు, అంకెలు సాధించటంతో సరి. కానీ జీవితంలో గెలుపు సంగతేంటి? ప్రపంచ మానవ సమూహం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఈ గెలుపు పరుగే కారణం. ఒక వ్యాపారం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి మరింతగా విస్తరించడం గెలుపే అయితే, ఆ తర్వాత పతనం కావటం ఓటమిగా భావించాలా.. అసలు గెలుపు సూత్రమేంటి, గెలుపు పరుగు ముగిసేదెక్కడ, సాధించిన ఏ విజయాన్ని ‘సక్సెస్’గా భావించవచ్చు? డబ్బు సంపాదించటమే విజయానికి నిదర్శనమైతే, పూరి గుడిసెలో ఉంటూ సంతోషంగా రోజులు వెళ్లదీసే వ్యక్తి ‘సక్సెస్’ చెందినట్టు కాదా.. ప్రశ్నల పరంపర.. సవాలక్ష సందేహాలకు సమాధానాలు విడమరిచి చెప్పేదెవరు? ‘సెల్ఫీ ఆఫ్ సక్సెస్’ కొద్దిరోజుల క్రితం అమెజాన్ ఆన్లైన్ అంగట్లో హల్చల్ చేసిన పుస్తకం. 166 పేజీలతో ఉన్న ఈ పుస్తకం పేరే కాస్త గమ్మత్తుగా అనిపిస్తోంది కదూ. సెల్ఫీకి లోకం ఫిదా అయిన తరుణంలో విజయమే తన సెల్ఫీని మన ముంగిటకు తెచ్చినట్టు అనిపించేలా విడుదలైన ఆ పుస్తకం తక్కువ సమయంలో ఎక్కువ అమ్మకాలతో ఆకట్టుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం రాసిన ఆ పుస్తకం విడుదలైన 35 రోజుల్లో దాదాపు 20 వేల ప్రతులు అమ్ముడైనట్టు పబ్లిషర్స్ చెప్తున్నారు. కొత్త పుస్తకాల విభాగంలో ఇంత తక్కువ సమయంలో అధిక రేటింగ్ పొందిన తొలి పుస్తకం ఇదేనంటూ అమెజాన్ గుర్తించిందనేది వారి మాట. మరి ఇంత తక్కువ పేజీలున్న ఈ పుస్తకం అంత క్రేజ్ సంపాదించు కోవటానికి కారణం కూడా అంతుచిక్కని ‘విజయ రహస్యమే’. ప్రపంచవ్యాప్తంగా వారివారి రంగాల్లో విజయం సాధించిన వారు అనుసరించిన పద్ధతుల సారాంశాన్ని ఇందులో కళ్లకు కట్టినట్టు వివరించారు. దీంతో పాఠకులు కూడా విజయం అంటే ఇలా వ్యవహరించాలా అన్న తరహాలో ఆలోచించుకునేలా చేసిందా పుస్తకం. విజయం అంటే డబ్బు సంపాదనే కాదు, విజయాన్ని ఆనందించే తత్వం, తోటి వారిని సంతోషపెట్టేలా చేయటం అన్న విషయాన్నీ ఆ విజేతల జీవితాలను చూసి తెలుసుకునేలా చేసింది. గెలుపుపై అవగాహన, గెలుపు ప్రయాణం, గెలుపు అర్థం, గెలుపు తెచ్చే అనర్థ్ధం, గెలుపు పరమార్థం... ఇలా 5 అంకాలుగా ఈ పుస్తకంతో సారాంశం సాగిన తీరు ఆకట్టుకుంది. పుస్తకం అనతికాలంలోనే పాఠకుల ఆదరణ దక్కించుకోవటంతో బుర్రా మరికొన్ని పుస్తకాలను వెలువ రించేందుకు సిద్ధపడ్డారు. సెల్ఫీ ఆఫ్ సక్సెస్ పుస్తకాన్ని తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, గుజరాతీ, బెంగాలీ, హిందీ భాషల్లోకి అనువదించబోతున్నారు. అది విశ్వజనీనమైన సబ్జెక్టు కావటంతో కొరియా, జపాన్, చైనా, పోర్చుగల్, పర్షియా, ఇండోనేషియా తదితర దేశాల్లో కూడా వారి భాషల్లో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఓ వైపు ఈ తర్జుమా తంతు జరుగుతుండగానే, ఈ సక్సెస్ను సమాజంతో జోడించేలా మరికొన్ని పుస్తకాలను వెలువరించే కసరత్తు మొదలుపెట్టారు బుర్రా వెంకటేశం. 3 నెలల్లో.. 2వ పుస్తకం.. విజయంపై ఓ అవగాహన తెచ్చేలా చేసిన సెల్ఫీ ఆఫ్ సక్సెస్ తర్వాత ఉత్తేజం కలిగించే విజయగాథలతో కూడిన రెండో పుస్తకాన్ని తేనున్నట్టు బుర్రా వెంకటేశం చెప్పారు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఆరాధ్యులుగా మారిన వారి జీవిత గాథల సారాంశాలతో కూడిన పుస్తకాన్ని సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. ‘నో వేర్ నవ్ అండ్ హియర్’శీర్షికతో ఉండే ఈ పుస్తకం మరో మూడు నెలల్లో పాఠకుల ముందుకు తేనున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రతికూలతలను కూడా అనుకూలంగా మలుచుకుని విజయాన్ని ఎలా సాధించారన్న విషయాన్ని ఆ పుస్తకం వివరిస్తుందంటున్నారు ఆయన. ఆ తర్వాత.. అసలు జీవితంలో సక్సెస్ ఎంత అవసరం అన్న విషయాన్ని చర్చించే ‘హౌమచ్ సక్సెస్ యూ నీడ్ ఇన్ లైఫ్’పేరుతో సిద్ధాంత గ్రం«థాన్ని వెలువరించనున్నట్టు వెల్లడించారు. అనూహ్య విజయాలు సాధించిన తక్కువ మంది.. ఎక్కువ మందిని ప్రభావితం చేయటం, భారీ విజయాలు సాధించి ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిన వారు, అనంతర వ్యవహారంలో ఎలాంటి ప్రభావానికి లోనయ్యారు... లాంటి విషయాలు ఇందులో వివరించనున్నట్టు పేర్కొన్నారు. ఇక ‘థాంక్యూ ఎనిమీ’ పేరుతో మరో పుస్తకం వస్తుందని, మానవ పరిణామ వికాస క్రమంలో విజయాల పరంపరను ఇందులో వివరించనున్నట్టు వెల్లడించారు. ఇది 30 వేల ఏళ్ల నుంచి ఇప్పటి వరకు మనిషి పట్టుదలగా ఎలాంటి విజయాలు సాధించాడో వివరిస్తుందని పేర్కొన్నారు. ఆ విజయాలకు పురిగొల్పిన సవాళ్లను, అధిగమించిన తీరు ఇది వివరిస్తుందని పేర్కొన్నారు. ఆ తర్వాత సంతోషాన్ని నిర్వచించే మరో పుస్తకం ‘షీ’ పేరుతో వస్తుందన్నారు. స్టోరీ ఆఫ్ హ్యాపీనెస్ బై ఎవరెస్ట్ పేరుతో ఉండే పుస్తకం ఆ ఆంగ్ల పదాల తొలి అక్షరాల పొడి రూపమే షీ (ఎస్హెచ్ఈ)గా ఉంటుందన్నారు. ఎవరెస్టే వివరించినట్టుగా... ఎత్తయిన పర్వతంగా ఉన్న ఎవరెస్టు ప్రపంచాన్ని గంభీరంగా గమనిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. అది అలా విశ్వాన్ని గమనిస్తూ విజయాల గాథను వివరిస్తే ఎలా ఉంటుందనే ఐడియాతో కొత్త పుస్తకాలు వస్తాయన్నారు. తొలి పుస్తకంలో విజయమే పాఠకులతో మాట్లాడుతున్నట్టు ఉండగా, తదుపరి పుస్తకాల్లో ఎవరెస్టు పర్వతం మాట్లాడుతున్నట్టు ఉంటుందని పేర్కొన్నారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా పోటీ తత్వం నెలకొని విజయం కోసం పరుగులు పెట్టే క్రమంలో మానవ సంబంధాలు బాగా దెబ్బతింటున్నాయి. విజయం వైపు పయనంలో సంతోషమే పరమార్థం కావాలి. విజయ కాంక్షలో సంతృప్తి ఎలా అవసరం, దాన్ని స్థిరీకరించుకునే తీరు, ఆ విజయం తనకే కాకుండా, తోటివారికి కూడా ఎలా ఆనందాన్ని పంచాలి అన్న విషయంలో ప్రజలకు కొంత అవగాహన అవసరం. ఆ ఆలోచనలోంచే పుస్తక రచన ప్రారంభించా. ఈ పుస్తకాల అమ్మకంతో వచ్చే లాభాలను నిస్సహాయ వృద్ధుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తా. విజయం తెచ్చే అనర్థాలు కోణం నా తొలి పుస్తకంలో కొత్త విషయం. ఇప్పటివరకు ఎవరూ ఆ కోణంలో రచించలేదు. ఇక రూ.50 వేల కోట్లు ఆర్జించి పెట్టిన హ్యారీపోటర్ పుస్తకాలు కూడా బ్రెయిలీ లిపిలో విడుదల కాలేదు. కానీ నా తొలిపుస్తకాన్ని అంధులు కూడా చదివేలా బ్రెయిలీలో అందుబాటులోకి తెచ్చా’అని వెంకటేశం పేర్కొన్నారు. – సాక్షి, హైదరాబాద్ -
అరచేతిలో ‘e’ జ్ఞానం
సాక్షి, బాపట్ల(గుంటూరు) : శాస్త్ర సాంకేతిక రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆండ్రాయిడ్ సెల్ఫోన్ వచ్చిన తర్వాత ప్రపంచం చిన్నదైపోయింది. ఎక్కడో జరిగిన విషయాలను క్షణాల్లో మన ముందుంచడంతో పాటు, సక్రమంగా ఉపయోగించుకుంటే, చిన్న పిల్లల బొమ్మల దగ్గర నుంచి శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన సమాచారం లభిస్తోంది. ఈ కోవలోనే విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు డిజిటల్ రూపంలో వివిధ వెబ్సైట్లలో లభిస్తున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లి డబ్బు వెచ్చించి పుస్తకాలు కొనుగోలు చేయలేని విద్యార్థులకు ఉచితంగా ఆయా పుస్తకాలను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉండటంతో ‘ఈ’ జ్ఞానం ఎంతో ఉపయోగకరంగా మారింది. గ్రంథాలయ శాఖ పుస్తకాలను డిజిటల్ రూపంలో ఉంచింది. ఇందులో నుంచి చాలా రకాలైన పుస్తకాలను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా పుస్తకాలు అందుబాటులో.. మన దేశంలో 18 శతాబ్దంలో కోల్కతాలో పౌర గ్రంథాలయం, ఇంపీరియర్ గ్రంథాలయాలు ఉన్నాయి. 1953లో ఇంపీరియర్ గ్రంథాలయాన్ని భారత ప్రభుత్వం జాతీయ గ్రంథాలయంగా ప్రకటించింది. ఇక్కడ విలువైన వేలాది పుస్తకాలను భద్రపరిచారు. ఆ గ్రంథాలయంలోని పుస్తకాలను 2002లో ఇంటర్నెట్కు అనుసంధానించారు. ఇంటర్నెట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (బెంగళూరు) వారి సహకారంతో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వెబ్సైట్ను ప్రారంభించింది. అందులో విలువైన పుస్తకాలను డిజిటల్ రూపంలో చదువుకునేందుకు వీలుగా ఉంచింది. తిరిగి ఇచ్చేయవచ్చు ఇంటర్నెట్లో అనేక రకాలైన పుస్తకాలు లభ్యమవుతున్నా కాఫీరైట్ ఉన్న పుస్తకాలు లభించే అవకాశం లేదు. అలాంటి వాటిని కొనుగోలు చేయడం లేదా, అద్దెకు తీసుకునే అవకాశం కల్పించారు. రెంట్ మై టెక్ట్స్, కాఫీ కితాబ్ టెక్టŠస్ బుక్స్ వంటి వెబ్సైట్ల ద్వారా 30 నుంచి 70 శాతం వరకు పుస్తకాలు కొనుగోలు చేయవచ్చు. కొత్త పుస్తకాలు చదవాలంటే వాటిని కొనుగోలు చేసి చదివిన తర్వాత తిరిగి ఇచ్చేస్తే, కొనుగోలు చేసిన ధరలో మనకు 70 శాతం నగదు మళ్లీ ఇచ్చేస్తారు. ఇంజినీరింగ్, మెడికల్ విద్యార్థులకు ఉపయోగం ఇంజినీరింగ్, ఐటీ, మెడికల్ కోర్సులు చాలా ఖరీదైనవి. వాటికి సంబంధించిన పుస్తకాలు మార్కెట్లో కొనుగోలు చేయాలంటే రూ.500 నుంచి రూ.1000 పైనే ధర ఉంటుంది. ఆ ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉం టుంది. ఆయుర్వేదం, యునానీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించి పుస్తకాల ధర అధికంగా ఉన్నా, కొనుగోలు చేయాలన్నా మార్కెట్లో లభ్యమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పైకోర్సులకు సంబంధించి పుస్తకాలను ఈ గ్రంథాలయాల్లో ఉచితంగా చదువుకోవచ్చు. ఐఏఎస్, ఐపీఎస్ కోర్సుల పుస్తకాలు లభ్యం ఐఏఎస్, ఐపీఎస్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు సైతం ఉచితంగా ఈ గ్రంథాలయంలో దొరుకుతాయి. విజ్ఞానానికి పనికివచ్చే ప్రముఖుల జీవిత చరిత్రల పుస్తకాలు, చరిత్రాత్మక, విజ్ఞాన సంబంధం, వినోద సంబంధ పుస్తకాలు చదువుకోవచ్చు. పుస్తకాలు డౌన్లోడ్కు ఉపయోగించే వెబ్సైట్లు ► www.nationallibrary.com ► www.bookbum.com ► www.medicalstudent.com ► www.onlinelibrary.com ► www.rentmytext.com ► www.compitative.com -
పుస్తకాంకితురాలు
ఇప్పటి పిల్లలకు సెల్ఫోన్ లేకపోతే నిమిషం కూడా గడవడం లేదు. స్మార్ట్ఫోన్ చేతిలో లేకపోతే ఏదో కోల్పోయినట్టు ఫీలవుతున్నారు. క్లాస్ బుక్స్ తప్ప కథల పుస్తకాల జోలికిపోయే పిల్లలు చాలా అరుదైపోయారు. కేరళకు చెందిన 12 ఏళ్ల యశోద డి. షెనయ్ మాత్రం ఇందుకు భిన్నం. సెల్ఫోన్ కన్నా చేతిలో పుస్తకం అంటేనే ఈ చిన్నారికి మక్కువ. అంతేనా... పుస్తక పఠనంపై ప్రేమతో ఏకంగా గ్రంథాలయమే నెలకొల్పి, ఉచిత సేవలు అందిస్తోంది. చిన్న వయస్సులోనే ఇంత పెద్ద బాధ్యతను ప్రేమగా నిర్వర్తిస్తోన్న యశోద పేరు అనతికాలంలోనే రాష్ట్రమంతా తెలిసింది. జాతీయ మీడియా ఆమెను ప్రముఖంగా చూపించింది. దేశంలో ‘అతిచిన్న’ లైబ్రేరియన్గా గుర్తింపు పొందింది. కొచ్చిలోని మతన్చెరీ ప్రాంతానికి చెందిన యశోద షెనయ్.. టీడీ హైస్కూల్లో ఏడో తరగతి చదువుతోంది. ఈ ఏడాది రిపబ్లిక్ డే రోజున పాలియరక్కవు ఆలయం సమీపంలో తన సొంత ఇంట్లోని పై అంతస్థులో కొలువుతీర్చిన యశోద గ్రంథాలయాన్ని కేరళ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ డాక్టర్ కేఎస్ రాధాకృష్ణన్ ప్రారంభించారు. ఇక్కడి నుంచి ఎవరైనా ఉచితంగా పుస్తకాలు తీసుకెళ్లి చదువుకోవచ్చు. సభ్యత్వానికి ఎటువంటి ఫీజు లేదు. పుస్తకాలు ఆలస్యంగా తిరిగిచ్చినా జరిమానా చెల్లించక్కర్లేదు. ఎందుకంటే, అసలు తాను ఈ ఉచిత గ్రంథాలయం ఏర్పాటు చేయడానికి లేటు ఫీజే కారణమట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. మూడో తరగతి నుంచే అన్నయ్య అచ్యుత్, అమ్మ బ్రహ్మజ సాయంతో పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్న యశోద కోసం ఆమె తండ్రి దగ్గరలోని లైబ్రరీ నుంచి పుస్తకాలు తెస్తుండేవారు. ఆలస్యంగా పుస్తకాలు తిరిగిచ్చినప్పుడు లేటు ఫీజు చెల్లించడంతో పాటు లైబర్రీ కార్డు కోసం నెల నెలా డబ్బులు కడుతుండటంతో చిన్నారి యశోద మదిలో పలు ప్రశ్నలు మెదిలాయి. డబ్బులు చెల్లించే స్తోమత లేనివారు ఎలా చదువుకుంటారు? ఉచితంగా పుస్తకాలు చదువుకునే అవకాశం లేదా? పుస్తక పఠనానికి పైసలు ఎందుకు? అనే ప్రశ్నలు చిన్నారిని ఆలోచింపజేశాయి. ఎవరో వస్తారని ఎదురు చూడకుండా తానే సొంతంగా ఉచిత గ్రంథాలయం ఏర్పాటు చేసి సామాజిక సేవకు శ్రీకారం చుట్టింది. కుటుంబ సభ్యుల సహకారంతో తన పేరుతో ఏర్పాటు చేసిన ‘యశోద లైబ్రరీ’లో 3,500 వరకు పుస్తకాలు ఉన్నాయి. తన మాతృభాషైన మలయాళం పుస్తకాలకు ఆమె అగ్రపీఠం వేసింది. ఏం పుస్తకాలున్నాయని ఎవరైనా అడిగితే ‘2500 పైగా మలయాళం బుక్స్, వెయ్యి వరకు ఇంగ్లీషు పుస్తకాలున్నాయి. కొంకణి, హిందీ, సంస్కృతం పుస్తకాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉచితంగా ఈ గ్రంథాలయాన్ని అందరూ వినియోగించుకోవచ్చు’ అని ఉత్సాహంగా చెబుతుంది యశోద. 110 మంది సభ్యులున్న ఈ గ్రంథాలయానికి 20 మంది పాఠకులు రెగ్యులర్గా వస్తుంటారు. యశోద అన్నయ్య, ఆమె క్లాస్మేట్స్తో పాటు స్కూల్ టీచర్లు కూడా ఈ లైబ్రరీలో సభ్యత్వం తీసుకోవడం విశేషం. మెట్లు ఎక్కి పైకి వచ్చి చదవలేని వారి కోసం ప్రత్యేకంగా సభ్యత్వ కార్డులు ఇచ్చి ఇంటికే పుస్తకాలు పంపించే ఏర్పాటు చేసి తన మంచి మనసు చాటుకుంది. నాన్న అండదండలు యశోదకు పుస్తక పఠనంపై ఆసక్తి కలగడానికి ఆమె తండ్రి దినేశ్ ఆర్. షెనయ్ కారణం. స్వతహాగా ఆర్టిస్టు అయిన ఆయన ఉచిత గ్రంథాలయం ఏర్పాటు చేస్తానన్న కూతుర్ని ఎంతగానో ప్రోత్సహించారు. తన ఇంటి పై అంతస్థును కూతురి లైబ్రరీ కోసం ఇచ్చేశారు.‘చదువుతూ ఎదుగు. తర్కంతో విజ్ఞానాన్ని సముపార్జించు’ అంటూ కేరళ గంథ్రాలయ ఉద్యమ పితామహుడు పీఎన్ పణిక్కర్ చెప్పిన మాటలను సదా స్మరించుకుంటానని, అలాగే ‘చదివినా చదవకపోయినా నువ్వు ఎదుగుతావు. ఒకవేళ నువ్వు చదువుకుంటే వాటి ఫలాలు అందుకుంటావు. చదువుకోకపోతే జీవితంలో వెనుకబడతావు’ అంటూ కన్ జని మాష్ రాసిన వాక్యాలను అందరూ గుర్తుంచుకుంటే మంచిదని సూచించింది. ఆఘ్రాణిస్తూ చదువుతా లైబ్రరీని చూసుకుంటూ కూర్చుంటే మరి చదువు సంగతేంటని అడిగితే.. ‘నేను స్కూల్కు వెళ్లినప్పుడు అమ్మ, నాన్న, అన్నయ్య ఎవరో ఒకరు లైబ్రరీని చూసుకుంటారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మా లైబ్రరీ పాఠకుల కోసం తెరచివుంటుంద’ని యశోద సమాధానమిచ్చింది. ఆన్లైన్లో పుస్తకాలు చదవడం తనకు ఇష్టముండదని, పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుని చదివిన అనుభూతి ఈ–బుక్స్ రీడింగ్తో రాదని తెలిపింది. ‘పుస్తకం నా చేతికి అందిన వెంటనే ముందుగా దాని వాసనను ఆఘ్రాణిస్తూ ప్రతి పేజీని ఇష్టంగా చదువుతాను. ఇలా అయితేనే చదివినదంతా బుర్రలోకి ఎక్కుతుందని వివరించింది. ఇన్ని మాటలు ఎక్కడ నేర్చావే చిన్నితల్లి అని అడిగామనుకోండి. ‘పుస్తకాలు చదవడం వల్ల’ అంటూ వెంటనే యశోద నుంచి జవాబొస్తుంది. నిజమే అనిపిస్తోంది కదూ! – పోడూరి నాగ శ్రీనివారావు సాక్షి వెబ్ డెస్క్ -
విద్యపై జీఎస్టీ భారం..
సాక్షి, ఇల్లెందుఅర్బన్ : ప్రైవేట్ విద్య రాను రాను మరింత ఖరీదవుతోంది. పేద, మధ్య తరగతి కుటుంబాలు విద్యాభారం మోయలేకపోతున్నాయి. తాము కష్టపడి సంపాదించిదంతా పిల్ల చదువులకే ఖర్చవుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 2018–19 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు కావాల్సిన నోట్ పుస్తకాలు ,యూనిఫాంలపై జీఎస్టీ భారం పడింది. దీంతో గతేడాది కన్నా ఈ ఏడాది నోట్ పుస్తకాలు, దుస్తుల ధరలు భారీగా పెరిగాయి. ఇదే అదునుగా యాజమాన్యాలు జీఎస్టీ పేరుతో సరికొత్త విద్యా వ్యాపారానికి తెరలేపాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెన్సిల్ మొదలుకొని యూనిఫాం,దుస్తుల వరకు ప్రయివేట్ పాఠశాలలు చెప్పిన చోటనే కొనుగోలు చేయాలనే నిబంధనలు విధిస్తుండడంతో తల్లిదండ్రులపై పెద్ద ఎత్తున భారం పడుతుంది. నోట్ పుస్తకాలపై 12శాతం జీఎస్టీ విధించడంతో ఈసారి ఒక్కో నోటు పుస్తకంపై రూ.10 నుంచి రూ.15 వరకు ధరలను పెంచి విక్రయిస్తున్నారు. గతేడాది ఒకటో తరగతి విద్యార్థికి నోటు పుస్తకాలు ,పాఠ్యపుస్తకాలు కొనుగోలు చేస్తే రూ.1200 వరకు ఖర్చయ్యేది. ప్రస్తుతం ఒక్కసారిగా రూ 1500 నుంచి 2వేల లోపు ఖర్చవుతోంది. యూనిఫాం పై ప్రభుత్వం ఐదు శాతం జీఎస్టీ విధించడంతో దుకాణదారులు ఏకంగా దాన్ని 8 నుంచి 10శాతంకు పైగా పెంచి విక్రయిస్తున్నారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు చెప్పిన చోటనే పాఠ్య, నోట్ పుస్తకాలు కొనుగోలు చేయాలి. ఇలా యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు పాఠశాలల యాజమాన్యాలు చెప్పిన బుక్స్టాల్స్లోనే విక్రయించడంతో వచ్చిన కమిషన్లను పాఠశాల యాజమాన్యాలు పంచుకుంటున్నాయని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠ్యపుస్తకాలు, దుస్తులు, టిఫిన్ బాక్సులు ,స్కూలు బ్యాగ్లు, వాటర్ బాటీల్స్ తదితర పిల్లలకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. అయితే గతేడాది కంటే ఈ ఏడాది ప్రతి వస్తువుపై ధర రెండింతలు పెరిగింది. ఇద్దరు పిల్లలున్న తల్లిదండ్రులకు పాఠశాల ఫీజులతో కలిపి సుమారు రూ 70వేలకు పైగా ఖర్చు వచ్చే పరిస్థితి నెలకొంది. జీఎస్టీ కారణంతో కొందరు బుక్స్టాల్స్యాజమాన్యాలు అధిక ధరలు వేసి బిల్లు లేకుండానే విక్రయించడంతో విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనలకు దిగుతున్నారు. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి జీఎస్టీ కంటే అదనంగా పుస్తకాలను విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
అమ్మలా ఉండకూడదు
‘భర్తకు, పిల్లలకు జీవితాన్ని అంకితం చేయడం కన్నా ఇంకా ఎక్కువగా నాకు నా జీవితం కావాలి’. పదమూడూ పద్నాలుగేళ్ల వయసులో యాన్ ఫ్రాంక్ తన డైరీలో రాసుకున్న ఒక వాక్యం ఇది! చిన్నారి యాన్ ఫ్రాంక్ చనిపోయి డెబ్బైనాలుగేళ్లు అవుతోంది. చనిపోయేటప్పుడు పదిహేనేళ్లు ఆ పాపకు. ‘ఎంత కష్టంలో కూడా మనిషి మరణాన్ని కోరుకోకూడదు’ అని యాన్ తన డైరీలో రాసుకుంది! పదమూడవ యేట డైరీ రాయడం విశేషం కాకపోవచ్చు. ఆ వయసుకు అంత పెద్దమాట రాసుకోవడం ఆశ్చర్యమే! యాన్ ఫ్రాంక్ చనిపోలేదు. చనిపోయి ఉంటే ఆమె ఎప్పుడు చనిపోయిందీ చరిత్రలో ఉండేదే. జర్మన్ నాజీల నిర్భంధ శిబిరంలోని అమానుష పరిస్థితులు ఆమెను చంపేశాయి. ఫిబ్రవరిలో, మార్చిలోనో యాన్ చనిపోయిందన్నంత వరకే ప్రపంచానికి తెలుసు. యాన్ పుట్టింది జూన్ 12, 1929. డచ్ సంతతి యూదుల అమ్మాయి యాన్. ఆమె పదమూడవ ఏట ఆమె తండ్రి ఒక డైరీని ఆమెకు కానుకగా ఇచ్చాడు. అది అతడికి వచ్చిన ఆలోచన కాదు. నిజానికి అది డైరీ కూడా కాదు. ఆటోగ్రాఫ్ బుక్. పుట్టిన రోజుకు కొద్ది రోజుల ముందు ఆమ్స్టర్డామ్లో తండ్రీ కూతుళ్లు షాపింగ్కి వెళితే యాన్కి అక్కడ తెలుపు, ఎరుపు రంగుల చదరపు పలకల వస్త్రంతో బౌండ్ చేసిన నోట్బుక్ కనిపించింది. అది ఆటోగ్రాఫ్ బుక్ అని యాన్కి తెలియదు. ‘‘నాకు అది కావాలి నాన్నా’’ అని తండ్రిని అడిగింది. ‘నీ పుట్టిన రోజుకు కొనిస్తాలే’ అని మాట ఇచ్చాడు. మాట ప్రకారం కొనిచ్చాడు. ఆ పుస్తకాన్ని ఎంతో ఆపురూపంగా చూసుకుంది యాన్. అందులో డైరీ రాయడం మొదలుపెట్టింది. రోజూ రాసింది. తేదీలు ముద్రించి ఉండని పుస్తకం అది. తనే తేదీలు వేసుకుని తన ఆలోచనలు రాసుకుంది. నాజీలకు ఆ కుటుంబం పట్టుబడడానికి మూడు రోజుల ముందువరకు యాన్ డైరీలు రాసింది. ఆమె తండ్రి దగ్గర మీప్కీస్ అనే వియన్నా యువతి టైపిస్టుగా పనిచేసేవారు. ఇటీవలే 2010తో తన నూరవ ఏట ఆమె మరణించారు. మీప్కీస్ యాన్కు సన్నిహితురాలు. మీప్కి, యాన్కి వయసులో ఇరవై ఏళ్ల వ్యత్యాసం. యాన్ ఆమెతో అనేక ఆలోచనలు పంచుకునేది. మీప్ కూడా యాన్ డైరీల కోసం తెల్లకాగితాలు అమర్చిపెట్టేవారు. అసలు మీప్ వల్లనే యాన్ డైరీలు వెలుగు చూశాయి. నిర్బంధ శిబిరంలో యాన్ చనిపోయిందని తెలిసినప్పుడు మీప్ కుప్పకూలిపోయారు. యాన్ నింపిన తెల్ల కాగితాలను గుండెకు హత్తుకున్నారు. వాటన్నిటినీ కలిపి యాన్ డైరీగా ముద్రించారు.‘ది డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్’ అనే పేరుతో ఇప్పుడా పుస్తకం ప్రతిదేశంలోనూ అందుబాటులో ఉంది. తెలుగులో కూడా కొన్ని అనువాదాలు న్నాయి. యాన్ తన డైరీని డచ్ భాషలో రాశారు. డచ్లో ‘రహస్యగృహం’ అనే పేరుతో ఆమె డైరీ అచ్చయింది. జర్మన్లు డచ్ని (నెదర్లాండ్స్ని) ఆక్రమించినప్పుడు నాజీలకు దొరక్కుండా ఉండడం కోసం ప్రతి యూదుల ఇల్లు ఒక రహస్యగృహాన్ని ఏర్పాటు చేసుకుంది. యాన్ అలాంటి గృహంలో కూర్చునే డైరీ రాసేది. యాన్ ఫ్రాంక్ డైరీ తొలిసారి 1946లో మార్కెట్లోకి విడుదలైనప్పుడు ‘ఆ.. చిన్న పిల్ల రాసేదేముంటుందిలే’ అని ఎవరూ అనుకోలేదు. ఆ కాలంనాటి పరిస్థితులు ప్రత్యేకమైనవి. అయితే యాన్ రాసిన కొన్ని విషయాలు ఇంకా ప్రత్యేకమైనవి! ఆ పసిదానిలో అంత లోతైన భావనలున్నాయా.. అని పాఠకులు విస్మయం చెందారు. ఇప్పటికీ ఇన్నేళ్ల తర్వాత కూడా యాన్ భావాలు ఈ కాలానికీ వర్తించేలా ఉన్నాయి! 1944 ఏప్రిల్ 5, బుధవారం ఆమె రాసిన డైరీ ఇలా సాగింది : ‘మొత్తానికి నేనొకటి తెలుసుకున్నాను. నా లక్ష్యం నెరవేరాలంటే నేను బాగా చదువుకోవాలి. జర్నలిస్టును కావడం నా లక్ష్యం. నేను రాయగలనని నాకు తెలుసు. కానీ బాగా రాయగలనా అన్నది సందేహం. ఒకవేళ నాకు బుక్స్ గానీ, వార్తాపత్రికలకు వ్యాసాలు గానీ రాసే ప్రావీణ్యం లేకున్నా.. నా కోసం నేను రాసుకుంటాను. అయితే అంతకంటే కూడా ఎక్కువగా నేను సాధించాలి. అమ్మలా నేను జీవించలేను. అమ్మలా, మిసెస్ వాన్డాన్లా, ఇంకా చాలామంది ఆడవాళ్లలా శ్రమకు ఏమాత్రం గుర్తింపు లేకుండా నేను పని చేయలేను. భర్తకు, పిల్లలకు జీవితాన్ని అంకితం చేయడం కన్నా ఇంకా ఎక్కువగా నాకు నా జీవితం కావాలి. సమాజానికి నేనేదైనా చేయాలి. మనుషుల సంతోషానికి నేనొక కారణం కావాలి. అసలు నేనెవరో తెలియనివాళ్ల సంతోషానికి కూడా. చనిపోయాక కూడా నేను జీవించే ఉండాలి. నా లోపల ఉన్నదాన్ని బయటికి వ్యక్తపరిచే రచనాశక్తిని దేవుడు నాకు ప్రసాదించినందుకు ఆయనకు నా కృతజ్ఞతలు. రాసేటప్పుడు అన్ని విచారాలనూ వదిలేస్తాను. నా దుఃఖం మాయమైపోతుంది. నా మనసు పునరుజ్జీవనం పొందుతుంటుంది. అయితే ఒక సందేహం. ఎప్పటికైనా నేను ఒక గొప్ప విషయాన్ని రాయగలనా? ఒక గొప్ప జర్నలిస్టును గానీ, రచయిత్రిని గానీ కాగలనా?..’ అని ఆ వేళ్టి డైరీని ముగించింది యాన్ ఫ్రాంక్. అయితే యాన్ ఒక విషయం తెలుసుకోకుండానే ఈ లోకాన్ని శోకమయం చేసి వెళ్లిపోయింది. అమె గొప్ప జర్నలిస్టు, గొప్ప రచయిత్రి అయినా కాకున్నా గొప్ప మానవతావాదిగా నిలిచిపోయింది. అందుకు ఆమె డైరీలే సజీవ సాక్ష్యాలు. యాన్ తండ్రి తన కూతురికి డైరీని కానుకగా ఇవ్వలేదు. కూతుర్నే డైరీకి కానుకగా ఇచ్చాడు. మానవాళికి ఇది ఒక అందమైన, అపురూపమైన రోజు. -
ప్రగతికి పనిముట్టు పుస్తకం
సందర్భం తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత అనేక రంగాల్లో వినూత్నమైన మార్పులు, ప్రతిరంగాన్ని తీర్చిదిద్దుకునే పునర్నిర్మాణపనులు శరవేగంతో జరుగుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్ బుక్ఫెయిర్ పరిస్థితి ఎలా ఉంటుంది అని వాదన చేసిన వారుకూడా లేకపోలేదు. కానీ రాష్ట్ర అవతరణ తర్వాత హైదరాబాద్ పుస్తకప్రదర్శనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. హైదరాబాద్లోని ‘తెలంగాణ కళాభారతి’ (ఎన్టీఆర్ స్టేడియం) స్థలాన్ని డిసెంబర్ 18 నుంచి 29 వరకు మాకు ఉచితంగా, ఇచ్చింది. గత 30 ఏళ్ల పుస్తకప్రదర్శనలకు ఏ ప్రభుత్వము కూడా ఉచితంగా ఇవ్వలేదు. పుస్తకాలు చదివే ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు అన్నిరకాల సహాయసహకారాలు అందించటం వల్ల గత ఐదేళ్లుగా దేశంలోనే అతిపెద్ద బుక్ఫెయిర్గా నిలిచింది. రాష్ట్రప్రభుత్వం చేసిన మరోసహాయం జిల్లా కేంద్రాలలో మేం నిర్వహించే బుక్ఫెయిర్స్కు కూడా సహకారం అందించటం మరో విశేషం. హైదరాబాద్ లాంటి మహానగ రాలకే పరిమితమైన పుస్తకప్రదర్శనలను గ్రామీణ ప్రాంతాలదాకా మట్టి కాళ్లపాదాల దాకా తీసుకుపోవాలన్న మా సంకల్పాన్ని కేసీఆర్ సహకారంతో నెరవేరింది. దీంతో ఏ జిల్లాకు వెళ్లినా మాకు సహకారం లభిస్తుంది. జూన్ 2 నుంచి జూన్ 9 వరకు ఖమ్మంలో తెలంగాణ అవతరణ దినోత్సవాల సందర్భంగా పుస్తక ప్రదర్శన నిర్వహించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ కర్ణన్ కోరారు. ఇది నాకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కల్గించింది. ఒక రకంగా ఆయనే మా వెంటపడి మరీ బుక్ఫెయిర్ పెట్టించారు. ఎండలు మండిపోతున్నాయి. రోకళ్లు పగిలే రోహిణీకార్తెలో జనం రావటం కష్టమౌతుందన్నా కలెక్టర్ కర్ణన్ పట్టుబట్టి మరీ ఖమ్మంలో పుస్తక ప్రదర్శన పెట్టించారు. ఊహించని విధంగా పుస్తక ప్రియులనుంచి కదలిక వచ్చింది. తెలంగాణ అవతరణోత్సవాల సందర్భంగా ఈ పుస్తక ప్రదర్శన జరపాలన్న కర్ణన్ ప్రతిపాదనను ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ సమర్థించటమే కాదు, ఇక ప్రతిఏడాది ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. పుస్తక ప్రదర్శనకు ప్రతిరోజూ సాయంత్రం ఓ రెండు గంటలు కర్ణన్ స్వయంగా వచ్చి సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది జిల్లా పాలనాయంత్రాంగానికి, ప్రధానంగా విద్యాశాఖకు సంబంధించిన మంచి ప్రేరణనిచ్చింది. అనేకమంది కలెక్టర్లు పుస్తకప్రదర్శనకు మాకు సహ కరించారు. కానీ కర్ణన్లాగా ఇలా పూర్తిగా సహకరిస్తూ తానే నిర్వాహకునిగా మారటం మాత్రం ఆశ్చ్యర్యానందాలను కలిగించింది. ఇదే కాకుండా ఖమ్మం పట్టణంలోని జనం కూడళ్లదగ్గరకు, అపార్ట్ట్మెంట్ల వరకు ఈ పుస్తక ప్రదర్శనలను ఏర్పాటు చేయాలంటున్నారు. మారుమూల గ్రామాలదాకా పుస్తకాలను తీసుకుపోయి జ్ఞాన తెలంగాణ నిర్మాణానికి మా వంతుగా చేయబోయే ఈ చిన్న ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కర్ణన్ ఎంతోసహాయం చేస్తున్నారు. తనేకాకుండా తన తండ్రిని, తనకుటుంబ సభ్యులను, తన పిల్లలను తీసుకుని రోజూ బుక్ఫెయిర్కొచ్చి ప్రేరణ కల్గిస్తున్నారు. పుస్తకాలమీద తనకు ప్రేముండటమేకాదు, ఆ ప్రేమ అందరి మనసుల్లోకి పోవాలన్నది ఆయన తపన. కర్ణన్ పుస్తకప్రేమికుడుగా మారటానికి ఆయన తండ్రి లైబ్రేరియన్ కావటం కూడా ఒక కారణం. కర్ణన్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఖమ్మం జిల్లా వ్యాపితంగా పుస్తక ప్రదర్శనలను ఏర్పాటు చేయబోతున్నాం. ఖమ్మంలో నిర్వహిస్తున్న హైదరాబాద్ పుస్తక ప్రదర్శన కర్ణన్పుస్తక ప్రదర్శనగా మారింది. పుస్తకాలు వర్ధిల్లాలన్న పుస్తక ప్రేమికుల కోరిక ఇలా నెరవేరుతుంది. భవిష్యత్తులో పుస్తక ప్రదర్శనలను సంచార గ్రంధాలయాలుగా మార్చాలి. ఊరూరుకు పుస్తక సంతలను ఏర్పాటు చేయాలి. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఈ ప్రోత్సాహంతో ప్రతిఊరుకు పుస్తక సంతలను నెలకొల్పేందుకు కృషిచేస్తాం. సమాజమార్పుకు, సంఘ ప్రగతికి పుస్తకాలు కూడా పనిముట్లుగా ఉపయోగపడతాయన్న అనేకమంది విజ్ఞుల ఆలోచనకు పుస్తక ప్రదర్శనలు దర్పణాలుగా నిలుస్తాయి. జూలూరీ గౌరీ శంకర్ తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు మొబైల్ : 94401 69896 -
పూలొద్దు.. పుస్తకాలివ్వండి
అంబర్పేట: ‘పూలొద్దు.. పుస్తకాలివ్వండి. పేద విద్యార్థులకు చేయూతనివ్వండి’ అంటూ ఎంపీ కిషన్రెడ్డి నాయకులు, కార్యకర్తలకు సూచించారు. సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొందిన ఆయనకు అభినందనలు తెలిపేందుకు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వస్తున్నారు. అయితే వారందరూ పుష్పగుచ్ఛాలు, శాలువాలు తీసుకురావడంపై ఎంపీ ఇలా స్పందించారు. వీటికి బదులు నోట్ పుస్తకాలు అందజేస్తే అవి తాను పేద విద్యార్థులకు అందజేస్తానని కిషన్రెడ్డి తెలిపారు. కిషన్రెడ్డి సూచనల మేరకు పలువురు అభిమానులు నోట్ పుస్తకాలను అందించి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కిషన్రెడ్డికి నోట్ పుస్తకాలిచ్చి శుభాకాంక్షలు తెలిపాయి. శుభాకాంక్షలు తెలిపిన వారిలో ప్రేమ్నగర్కు చెందిన హైమావతి పాఠశాల కరస్పాండెంట్ నిరంజన్, స్వామి దయానంద పాఠశాల కరస్పాండెంట్ రవికుమార్, బీజేపీ నాయకులు చంద్రశేఖర్, అజయ్కుమార్, శ్రీనివాస్ ముదిరాజ్, శ్యామ్ తదితరులు ఉన్నారు. -
పుస్తకం.. సమస్త ప్రపంచం
వెలుగు చూసిన.. అపూర్వ సాహిత్య సంపద దేవరకద్ర రూరల్ : ఆధునిక ముద్రణా పరిజ్ఞానం అందుబాటులోకి రాకముందే రచయితలు, కవులు, జానపదకళలను ప్రదర్శించే కళాకారులు, శాస్త్రకారులు తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. తాళపత్రాలు (తాటి ఆకులు) విరివిగా వినియోగించి తమ రచనలను భద్రపరిచారు. వీటితోపాటు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో బంగారు, వెండి, రాగి రేకులు, వస్త్రాలపై అమూల్యమైన సమాచారాన్ని లిఖించి ప్రాచీన భాషకు పట్టం కట్టారు. శిలాశాసనాలకు కొదవేలేదు. అరుదైన చర్మలిఖిత ప్రతి పెబ్బేరు ప్రాంతంలో లభించింది. దేవరకద్ర మండలం కౌకుంట్లకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు, యువకవి గుముడాల చక్రవర్తిగౌడ్ జిల్లాలోని రాతప్రతులను సేకరించారు. 700 ఏళ్లనాటి రాతప్రతులు జాతీయ రాతప్రతుల సంస్థ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రాచీన రాతప్రతుల గ్రంథాలయం పర్యవేక్షణలో ఉమ్మడి మహబూబ్నగర్లో ప్రాచీన రాతప్రతుల సర్వే చేపట్టింది. ఈ క్రమంలోనే నారాయణపేటలో 700 ఏళ్ల క్రితం రాసిన ప్రాచీన రాతప్రతులను ఆ ప్రాంత సమన్వయకర్తగా వ్యవహరించిన కవి చందోజీరావు వెలుగులోకి తెచ్చారు. పేటలోని ధనుంజయ దీక్షితుల ఇంట్లో ఈ ప్రతులు లభించాయి. వీటితోపాటు యాగమంత్రాలు, వేదసంహిత రుగ్వేద సహిత వంటి ఎన్నో విలువైన రాతప్రతులు వెలుగుచూశాయి. అలాగే పాలమూరులో కృష్ణశర్మ నివాసంలో 200లకుపైగా తాళపత్ర గ్రంథాలను సమన్వయకర్త గుముడాల చక్రవర్తిగౌడ్ వెలుగులోకి తెచ్చారు. సారస్వత క్షేత్రం పాలమూరు సాహిత్య రంగానికి పెట్టింది పేరు పాలమూరు జిల్లా. తెలుగు సాహిత్యంలో అనేక లబ్ధప్రతిష్టమైన రచనలు ఇక్కడి నుంచి వెలువడ్డాయి. తెలుగులో మొట్టమొదటి రామాయణమైన రంగనాథ రామాయణం వెలువడింది పాలమూరు నుంచే. గోన బుద్దారెడ్డి, కుప్పాంబిక, అప్పకవి, సురభి మాధవరాయులు, ఏలకూచి బాలసరస్వతి, రాసురాట్క్ రవి, బాలసరస్వతి, బుక్కపట్నం శ్రీనివాసాచార్యులు, కేశవ పంతుల నరసింహశాస్త్రితోపాటు గడియారం రామకృష్ణశర్మ, సురవరం ప్రతాప్రెడ్డి, కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, బూర్గుల రామకృష్ణారావు, రుక్పానుపేట రత్నమ్మ, కపిలవాయి లింగమూర్తి వంటి మొదలైన సాహిత్యమూర్తులు ఈ గడ్డకు చెందినవారే. వారంతా అద్భుతమైన కావ్యాలను రచించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. నాటి సంస్థాన కాలం నుంచి నేటి ఆధునిక సాహిత్యం వరకు ఎంతో మంది కవులు, రచయితలు ఆణిముత్యాల్లాంటి పుస్తకాలను వెలువరించారు. జిల్లాలో నెలకోసారి పుస్తకం వెలువరించడం సంప్రదాయంగా వస్తుంది. ఇప్పటికీ వేల సంఖ్యలో పుస్తకాలు వెలువడుతూనే ఉన్నాయి. పుస్తకం.. ఆత్మీయ నేస్తం పుస్తకం మనకో ఆత్మీయ నేస్తం. అదే తోడుంటే ఎంతో మానసిక ధైర్యం ఉన్నట్లే. పుస్తకం మనకో మిత్రుడు, ఒక మార్గదర్శి. పుస్తకాలను నేటితరం యువత చదవడం అలవాటు చేసుకుంటే గొప్ప గొప్ప ఆలోచనలకు పదునుపెట్టి అనేక ఆవిష్కరణలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎంతోమంది ప్రముఖులు పుస్తక జ్ఞానాన్ని సముపార్జించి లబ్ధప్రతిష్టులయ్యారు. పుస్తకమే ఒక విజ్ఞాన సంపద. అందులోని జ్ఞానాన్ని ఆస్వాదిస్తే గొప్ప వ్యక్తులుగా మారే అవకాశం ఉంటుంది. అలాంటి పుస్తకాలను నేటితరం చదివితేనే భవిష్యత్కు బంగారు బాట వేసుకోవచ్చు. అందుకే కందుకూరి ‘చినిగిన చొక్కైనా వేసుకో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో’ అనే సందేశాన్ని నేటితరం ఆచరిస్తే పుస్తకానికి గౌరవం. సాహిత్య రంగానికి ప్రోత్సాహమేదీ? ప్రస్తుతం సాహిత్య రంగానికి ప్రోత్సాహం కరువైంది. కవి పండితులే తమ రచనలను ముద్రించుకొనేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. సెల్ఫోన్, యాంత్రికమైన జీవితానికి అలవాటుపడిన ఈ తరం పుస్తక పఠనంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పిల్లల్లో పుస్తక పఠనాభిలాషను బాల్యం నుంచే అలవర్చాలి. విజ్ఞానం ఎంత ఎదిగినా మన ప్రాచీన సాహిత్య సంపద కాలగర్భంలో కలిసిపోకుండా బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. భాషాభిమానుల సహకారంతో పరిరక్షణకు ముందుకు సాగితే సాంస్కృతిక సాహిత్య సంపదను భావితరాలకు అందించవచ్చు. – గుముడాల చక్రవర్తిగౌడ్, తెలుగు ఉపాధ్యాయుడు, యువకవి, దేవరకద్ర అభిరుచిని పెంపొందించుకోవాలి నేటి ఆధునిక ప్రపంచంలో ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఊపేస్తుంది. ఇంటర్నెట్ ప్రవేశించాక సామాజిక మాధ్యమాల్లో రచనలు విరివిగా వస్తున్నాయి. కానీ, నేటితరం పుస్తకాలకు దూరమవుతున్నారు. మనిషి మానసిక పరిపక్వత చెందాలంటే పుస్తక జ్ఞానం తప్పనిసరి. పుస్తకాలను చదవడం వల్లనే మనిషి అనంతమైన జ్ఞానాన్ని సంపాదించి తన భవిష్యత్ను చక్కగా తీర్చిదిద్దుకుంటాడు. నేటితరం పుస్తక ఆవశ్యకతను గుర్తించి పుస్తక అభిరుచి పెంపొందించుకోవాలి. – డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, పాలమూరు సాహితీ అధ్యక్షుడు -
రారండోయ్
చిలుకూరి దేవపుత్ర స్మారక సాహిత్య పురస్కారాన్ని 2019 సంవత్సరానికిగానూ ఆయన జయంతి సందర్భంగా ఏప్రిల్ 24న అనంతపురంలో నల్లూరి రుక్మిణికి ప్రదానం చేయనున్నారు. నిర్వహణ: చిలుకూరి దీవెన, దేవపుత్ర కుటుంబ సభ్యులు. 31వ ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు–2018ని ‘అద్వంద్వం’ కవి పుప్పాల శ్రీరామ్కు ఏప్రిల్ 28న అనంతపురంలో ప్రదానం చేయనున్నట్టు అవార్డు వ్యవస్థాపకులు డాక్టర్ ఉమ్మడిశెట్టి రాధేయ తెలియ జేస్తున్నారు. ఇందులోనే ఉమ్మడిశెట్టి సత్యాదేవి ప్రతిభా పురస్కారాలను మూలే విజయలక్ష్మి, వాడ్రేవు వీరలక్ష్మి, ఘంటశాల నిర్మల, ప్రతిమ, గండికోట వారిజ, గాయత్రీ రవిశంకర్కు ప్రదానం చేస్తారు. వచన కవిత్వం నుంచి లఘురూప కవిత్వాన్ని వేరుచేసి, దానికో ప్రత్యేక అస్తిత్వాన్ని కల్పించే ఉద్దేశంతో లఘురూప కవితా వేదిక ప్రారంభమైంది. వ్యవస్థాపక అధ్యక్షులు: సుగమ్బాబు. వివరాలకు: 9866651094 ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని పురస్క రించుకుని ఏప్రిల్ 23 ఉదయం 8 గంటలకు కరీంనగర్లోని తెలంగాణ చౌక్ నుండి ‘పుస్తక శోభా యాత్ర’ జరుగుతుంది. ఉదయ సాహితి, తెలంగాణ కళావేదిక, నవ తెలం గాణ పబ్లిషింగ్ హౌజ్ ఆధ్వర్యంలో జరిగే ఈ శోభా యాత్రలో జిల్లాలోని కవులు, సాహితీ ప్రియులు తాము రచించిన లేదా మిత్రులు, ఇతరుల రచనలతో పాల్గొనవచ్చు. రాజాం రచయితల వేదిక సమావేశం ఏప్రిల్ 28న ఉదయం 9.30 గంటలకు శ్రీకాకుళం జిల్లా రాజాంలో గల విద్యానికేతన్ పాఠశాలలో జరుగుతుంది. ‘పద్య నాటకాలు – తిరుపతి వేంకటకవులు’ అనే అంశంపై నేతేటి గణేశ్వరరావు ప్రసంగిస్తారు. -
తుపాకులు, పుస్తకాలు..పెయింటింగ్స్
రాజస్తాన్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో పలువురు అభ్యర్థులు తుపాకులు, లగ్జరీ కార్లు, పెయింటింగులు, పుస్తకాలే తమ ఆస్తులుగా చూపిం చారు. కేంద్ర సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తన దగ్గర 15 తుపాకులు ఉన్నాయని, వాటి విలువ 9 లక్షల రూపాయలని పేర్కొన్నారు. రాథోడ్ పేరొందిన షూటర్ అన్న సంగతి తెలిసిందే. ఈ తుపాకుల్లో పది తనకు బహుమానంగా వచ్చాయని ఆయన అఫిడవిట్లో వివరించారు. జల్వార్–బరన్ నుంచి పోటీలో దిగిన దుష్యంత్ సింగ్ తనకు ఐదు రోల్స్రాయస్ కార్లు ఉన్నాయని పేర్కొంటే, అజ్మీర్ కాంగ్రెస్ అభ్యర్థి రిజు ఝన్ఝన్వాలా 16 లక్షల రూపాయల విలువైన కళాఖండాలను తన ఆస్తులుగా అఫిడవిట్లో ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ తరపున రాజ్సమంద్ నుంచి పోటీ చేస్తున్న జైపూర్ యువరాణి దియా కుమారి తనకు 64.89 లక్షల రూపాయల విలువైన నగలున్నాయని తెలిపారు. ఇక కోటా నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేస్తున్న రాం నారాయణ్ మీనా దగ్గర 25,500 రూపాయల విలువైన పుస్తకాలు ఉన్నాయట. -
జూన్ నాటికి పాఠ్యపుస్తకాలు!
కర్నూలు సిటీ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ ఏడాది పాఠ్యపుస్తకాల కొరత లేకుండా జూన్ నాటికి స్కూల్ పాయింట్లకు చేర్చేందుకు విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. మూడు, నాలుగేళ్లుగా విద్యా సంవత్సరం ప్రారంభమై.. నెలలు గడిచినా పూర్తి స్థాయి పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు చేరలేదు. అరకొర పుస్తకాలతోనే చదువులు కొనసాగించారు. అయితే.. 2019–20 విద్యా సంవత్సరంలో అలాంటి ఇబ్బందులేవీ ఉండకూడదనే ఉద్దేశంతోనే విద్యాశాఖ ఈ ఏడాది జనవరి నుంచే పాఠ్యపుస్తకాలను సిద్ధం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. వేసవి సెలవులు ముగిసే నాటికే ప్రింటర్ల నుంచి జిల్లా కేంద్రానికి, ఇక్కడి నుంచి మండల విద్యా వనరుల కేంద్రాలకు(ఎంఆర్సీలు) పాఠ్య పుస్తకాలను చేర్చి, స్కూళ్లు పునఃప్రారంభమైన వెంటనే విద్యార్థులకు అందజేసే విధంగా చర్యలు చేపడుతోంది. జిల్లాకు చేరిన మొదటివిడత పుస్తకాలు మొదటి విడత పాఠ్య పుస్తకాలు మంగళవారం జిల్లాకు చేరాయి. 2వ తరగతి, 5వ తరగతి, పర్యావరణ విద్యకు సంబంధించిన పుస్తకాలు వచ్చాయి. మొత్తం 61,500 పుస్తకాలు జిల్లాకు చేరినట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. 2019–20 విద్యా సంవత్సరం కొత్తగా ప్రైమరీ తరగతులలో పర్యావరణ విద్యను కూడా ప్రవేశ పెట్టనున్నారు. వీటికి సంబంధించిన పుస్తకాలు ఇప్పటికే ముద్రణ పూర్తయ్యింది. గతంలో కంటే మూడు నెలల ముందుగానే ముద్రణకు టెండర్లు పిలవడం, ప్రింటర్లు సైతం నిర్ధేశించిన సమయానికి ప్రింటింగ్ పూర్తి చేసి మొదటి విడత పుస్తకాలను జిల్లాలకు చేర్చుతున్నారు. కర్నూలు నగరంలోని పాఠ్యపుస్తకాల గోదామును ఆర్జేడీ ప్రతాప్రెడ్డి, డీఈఓ తాహెరా సుల్తానా మంగళవారం తనిఖీ చేశారు. జిల్లాలో 2018 డిసెంబరు యూడైస్ వివరాల ప్రకారం ప్రాథమిక స్కూళ్లు 2,422, ప్రాథమికోన్నత 932, ఉన్నత పాఠశాలలు 985, మొత్తంగా 4,339 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రైమరీ విద్యార్థులు 2,62,069 మంది, అప్పర్ ప్రైమరీ 1,15,844 మంది, హైస్కూల్ విద్యార్థులు 2,87,659 మంది చదువుతున్నారు. ప్రభుత్వ యాజమాన్యాలు, ఎయిడెడ్ స్కూళ్లతో పాటు ఏపీ మోడల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో చదువుతున్న వారికి విద్యాశాఖ ఉచితంగానే పాఠ్య పుస్తకాలను అందజేస్తోంది. గతేడాది ఈ సమయానికి ముద్రణ ప్రక్రియనే మొదలుకాలేదు. ఆలస్యంగా పుస్తకాలు రావడంతో పాత పుస్తకాలతోనే చదువులు కొనసాగించాల్సి రావడంపై విద్యాశాఖ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. యూడైస్ ప్రకారం సరఫరా గతంలో ఎన్ని పుస్తకాలు కావాలో జిల్లా అధికారుల నుంచి వివరాలను తీసుకునేవారు. అయితే.. గత ఏడాది నుంచి విద్యాశాఖనే యూడైస్ ప్రకారం ఏయే జిల్లాకు ఎన్ని పాఠ్యపుస్తకాలు అవసరమో ఆన్లైన్లోని వివరాల ప్రకారం సరఫరా చేస్తోంది. ఈ ఏడాది మే 15 నాటికి 80 శాతం పుస్తకాలు ఎంఆర్సీలకు చేర్చాలని అధికారులు నిర్ణయించారు. కన్నడ మీడియం పుస్తకాలు మాత్రమే కొంత ఆలస్యమయ్యే అవకాశముంది. మొత్తం ఐదు విడతల్లో పుస్తకాలు రానున్నాయి. మొదటి విడత కింద 2,5 తరగతులకు చెందిన ఇంగ్లిష్, ఇంగ్లిష్ వర్క్బుక్స్, పర్యావరణ విద్యకు సంబంధించిన పుస్తకాలు వచ్చాయి. -
బాబులు..బాలలనూ వదల్లేదు
పాలక పార్టీ పెద్దల ప్రచార దాహం శ్రుతి మించుతోంది. ప్రధాన రహదారుల్లో హోర్డింగులు ఏర్పాటు చేసి, ఆర్టీసీ బస్సులపై పథకాలను వివరిస్తూ ప్రచారం పొందడం సరిపోదనుకుని బడి పిల్లలనూ వాడుకుంటున్నారు. వారి పుస్తకాల బ్యాగుల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నక్కా ఆనంద్బాబుల ఫొటోలు ముద్రించి ప్రచారం చేసుకోవడం చూసిన గుంటూరు జనం ఔరా.. అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.– ఫొటో: రామ్గోపాల్ -
కార్పొరేటర్ గారి కవిత్వసభ
‘కవిరత్న’ కత్తుల భద్రయ్య ఎవరి కవిత్వమూ చదవడు. తనది కవిత్వం కాదంటే ఒప్పుకోడు. ‘నన్ను కవి కాదన్నవాడిని కత్తితో పొడుస్తా’ టైపన్నమాట. ఇలాంటి భద్రయ్యకు ఒక ఆదివారం పూట పుస్తకం వేయాలనే ఆలోచన వచ్చింది.తన మిత్రుడు నూకేశ్వర్రావును ఇంటికి పిలిచి, వేడి వేడి చాయ్ పోసి తన మనసులో మాట చెప్పాడు.‘‘భద్రయ్యగారూ...ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. తక్షణం పుస్తకం వేయాల్సిందే’’ అని చాలా గట్టిగా చెప్పాడు నూకేశ్వర్రావు.‘‘అంతేనంటావా!’’ అన్నాడు ఆనందంగా భద్రయ్య.‘‘ముమ్మాటికీ అంతే...’’ అన్నాడు నూకేశ్వర్రావు అంతకంటే ఆనందంగా.వారం తిరిగేలోపే కత్తుల భద్రయ్య కవిత్వం 172 పేజీల పుస్తకంగా వచ్చింది.(గమనిక: ఈ పుస్తకంలో 20 పేజీలు మాత్రమే కవిత్వం....మిగిలిన పేజీలన్నీ ముందుమాటలే) నూకేశ్వర్రావుని ఇంటికి పిలిచి చాయ్ పోసి...‘‘పుస్తకం ఎలా ఉంది?’’ అని అడిగాడు భద్రయ్య.‘‘ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. కొన్ని వందల పుస్తకాలు చూసుంటాను. కానీ ఇంత అందమైన పుస్తకాన్ని చూడలేదంటే నమ్మండి. పుస్తకం వేయడం కూడా ఒక కళ...’’ అంటూ సైకిల్ పంపుతో గ్యాస్ కొట్టడం మొదలుపెట్టాడు నూకేశ్వర్రావు. పొగడ్తలతో భద్రయ్య పొట్ట ఉబ్బిపోయింది.∙∙ రెండో రోజు కూడా టీ టైమ్కు వచ్చాడు నూకేశ్వర్రావు.టీ చప్పరిస్తూ...‘‘పుస్తకాన్ని సైలెంట్గా రిలీజ్ చేయవద్దండి. భారీ ఎత్తున ప్లాన్ చేయాలి’’ సలహా ఇచ్చాడు నూకేశ్వర్రావు.‘‘అలాగే చేద్దాం’’ అన్నాడు భద్రయ్య.సిటీలో పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేశారు.‘‘ఏమయ్యా హాలు చూస్తే ఇంతపెద్దగా ఉంది. అంతమంది జనాలు ఎక్కడి నుంచి వస్తారు?’’ అడిగాడు భద్రయ్య.‘‘మామూలుగానైతే పుస్తకావిష్కరణ సభల్లో స్టేజీ మీద కంటే స్టేజీ కిందే తక్కువ జనాలు ఉంటారు’’ అన్నాడు నూకేశ్వర్రావు.‘‘మరి ఎలా?’’ అడిగాడు భద్రయ్య.‘‘నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉంది...’’ అన్నాడు నూకేశ్వర్రావు.‘‘ఏమిటోయ్ అది?’’ ఆసక్తిగా అడిగాడు భద్రయ్య.‘‘ఏమిలేదండి...పుస్తక ఆవిష్కరణ సభకు ఆహ్వానించే కార్డులో ‘ముఖ్యగమనిక: సభ అనంతరం లక్కీడ్రా ఉంటుంది. మొదటి ముగ్గురు విజేతలకు మిక్సీ, రాకెన్కేక్ జీన్ప్యాంట్, ఎనిమిది వందల రూపాయల విలువైన జియో ఫోన్ ప్రదానం చేయబడుతుంది’ అని ప్రచురిస్తే సరిపోతుంది’’ విలువైన సలహా ఇచ్చాడు నూకేశ్వర్రావు. ‘‘అలాగే’’ అన్నాడు భద్రయ్య.∙∙ ఆరోజు కత్తులవారి పుస్తకావిష్కరణ సభ. ఖైరతాబాద్లోని ‘కర్మ’ ఫంక్షన్హాల్ కిక్కిరిసిపోయిఉంది. హాల్లో ఎంతమంది ఉన్నారో, బయట అంతమంది ఉన్నారు.మేఘాలయ నుంచి భద్రయ్య ఫేస్బుక్ ఫ్రెండ్ జేమ్స్ పాంగ్సాంగ్ కొంగల్ వక్తల్లో ఒకడిగా వచ్చాడు. అతడు మాట్లాడుతూ ఇలా అన్నాడు...‘‘న భూతో న భవిష్యతీ...అంటారు కదా, అలా ఉంది సభ. మా స్టేట్లో ఎంతపెద్ద సాహిత్యసభకైనా పాతికమంది వస్తే మహాగొప్ప. అలాంటిది ఇక్కడ వందలాది మందిని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందో చెప్పలేను. ప్రజలకు సాహిత్యం అంటే ఇంత అభిమానం ఉందని ఇప్పుడే తెలిసింది. ప్రజల అభిరుచికి పాదాభివందనం చేస్తున్నాను’’ అని మాట్లాడి కూర్చున్నాడు పాంగ్సాంగ్ కొంగల్.ఆతరువాత...‘‘మా గల్లీ కార్పొరేటర్ మల్లేశంగారిని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాం’’ అని పిలిచాడు సభానిర్వాహకుడు నూకేశ్వర్రావు.అంతే...పెద్దగా నినాదాలు!‘మల్లేశన్న నాయకత్వం వర్థిల్లాలి’‘మల్లెపువ్వు తెలుపు...మల్లేశన్న గెలుపు’కార్పొరెటర్ మల్లేశం పెళ్లికి వెళ్లినా, చావుకు వెళ్లినా....ఎక్కడికి వెళ్లినా చుట్టూ పదిమంది ఉండాల్సిందే. ఆ పదిమంది...ఛాన్స్ దొరికితే చాలు....ఇలా నినాదాలు ఇస్తుంటారు.మల్లేశం స్టేజీ ఎక్కి మైక్ అందుకున్నాడు.‘‘ఎంత కార్పొరెటర్ అయితే మాత్రం వీడికి కవిత్వం గురించి ఏంతెలుసు!’’ తమలో తాము నిశ్శబ్దంగా గొణుక్కున్నారు. తనకు తెలియని సబ్జెక్ట్ గురించి ఈ కార్పొరేటర్ ఏంమాట్లాడతాడో అనే ఆసక్తి సభికుల్లో నిండిపోయింది.ఆయన ఇలా మాట్లాడారు...‘‘ఈ పుస్తకం రాసినాయిన మనకు జిగ్రీదోస్తు. జాన్జబ్బ. వీళ్ల నాయిన, మా నాయిన ఒకటే బడిల సదువుకున్నరు. కార్పొరేషన్ ఎలక్షన్ల టైమ్లో ‘పెదనాయినా...నీ ఓటు నాకే’ అని అడిగితే...‘నువ్వు అడగాల్నార బద్మాష్...నీకు దప్ప ఎవరకు ఏస్తా!’ అన్నడు. ఆ మంచిమనిషి తమ్ముని కొడుకే ఈ కవి.భద్రన్నకు భరోసా ఇస్తున్న...కంపల్సరిగా మన గవర్నమెంట్ వస్తది. అందరికి న్యాయం జరుగుతది.జరగకపోతే ఊరుకునేది లేదు.నడి బజార్లకొస్తం.న్యాయం జరిగే వరకు ఫైట్ చేస్తాం.ఇవ్వాళ అన్న బుక్కు ఎందుకు రాసిండు? అని నేను ఈ సభాముఖంగా అడుగుతున్నాను.తన కోసమా!తన పిల్లల కోసమా!కానే కాదని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.మన భద్రన్న ప్రజలు భద్రంగా ఉండాలని ఈ పుస్తకం రాసిండు. అంతేగానీ...తన స్వార్థం కోసం ఈ పుస్తకం రాయలేదని మరోసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను’’స్పీచ్ పూర్తయ్యిందో లేదో మళ్లీ నినాదాలు...‘మల్లెపువ్వు తెలుపు...మల్లేశన్న గెలుపు’బాటమ్ లైన్: విమానాలే కాదు సభలు కూడా హైజాక్ అవుతాయి. యాకుబ్ పాషా -
రారండోయ్
ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ కవితా సంపుటి ‘జీవితం ఒక ఉద్యమం’ ఆంగ్లానువాదం ‘లైఫ్ ఈజ్ ఎ మూవ్మెంట్’ ఆవిష్కరణ జనవరి 29న మధ్యాహ్నం 3 గంటలకు తెలుగు విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో జరగనుంది. అనువాదం: స్వాతి శ్రీపాద. సంపాదకుడు: చింతపట్ల సుదర్శన్. ఆవిష్కర్త: నందిని సిధారెడ్డి. నిర్వహణ: తెలుగు విశ్వవిద్యాలయం భాషాభివృద్ధి పీఠం. ‘విప్లవ కవి వరవరరావు కవిత్వంతో ఒక రోజు’ కార్యక్రమం ఫిబ్రవరి 3న ఉదయం 10 నుంచి సాయంత్రం 6:30 వరకు మహబూబ్నగర్లోని రోజ్గార్డెన్ ఫంక్షన్ హాల్(తెలంగాణ చౌరస్తా – బోయపల్లి గేట్ దారిలో)లో జరగనుంది. మూడు సెషన్లుగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రారంభోపన్యాసం: జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి. తొలి సెషన్లో జి.హరగోపాల్, కె.శివారెడ్డి, ఖాదర్, దర్భశయనం శ్రీనివాసాచార్య, పాణి పాల్గొంటారు. నిర్వహణ: పాలమూరు అధ్యయన వేదిక. తంగిరాల సోని కవితాసంపుటి ‘బ్లాక్ వాయిస్’ ఆవిష్కరణ ఫిబ్రవరి 3న సాయంత్రం 5 గంటలకు విజయవాడ, గాంధీనగర్లోని ప్రెస్క్లబ్లో జరగనుంది. ప్రచురణ: సామాజిక పరివర్తన కేంద్రం. ‘మొదటి పేజీ కథలు’ సంపుటానికిగానూ ఎ.ఎన్.జగన్నాథశర్మకు ‘లక్ష రూపాయల’ నగదుతో ‘లక్ష్షీ్మనారాయణ జైనీ జాతీయ సాహితీ పురస్కార (2019)’ ప్రదానం జనవరి 29న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరగనుంది. ముఖ్య అతిథి: నందిని సిధారెడ్డి. నిర్వహణ: జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్. జాగృతి వారపత్రిక ఓ కార్టూన్ల పోటీ నిర్వహిస్తోంది. చక్కటి హాస్యం ఉండాలి. బ్లాక్ అండ్ వైట్లో ఒకరు ఎన్నైనా పంపవచ్చు. మూడు బహుమతులు వరుసగా రూ.5 వేలు, 3 వేలు, 2 వేలు. 500 చొప్పున పది ప్రోత్సాహక బహుమతులు ఉంటా యి. ఫిబ్రవరి 28లోగా పంపాలి. ఫోన్: 9959997204 -
మాల్గుడి నారాయణ్
‘ఏ కోర్సూ నిన్ను ఆర్కే నారాయణ్ చేయలేదు,’ అంటాడు రచయిత జెఫ్రీ ఆర్చర్. చిన్న మనుషులు, చిన్న సంపాదనలు, చిన్న సమస్యలు... పుస్తకం కూడా చిన్నదిగానే ఉండాలి. రెండొందల పేజీలకు మించకూడదు! ‘స్వామి’ ఎంతుంటాడు! కానీ వాడి ఎత్తు భారతదేశం నుంచి ఆఫ్రికానో, అమెరికానో అందుకునేంత. ఉపాధ్యాయుడిగా మొదట్లో పనిచేసిన ఆర్కే(1906–2001)కు ఆ పనిలో అర్థం కనబడలేదు. దాంతో రచయిత అయిపోదామని వాళ్ల బామ్మ దగ్గర ప్రకటించేసి, ముహూర్తం చూసుకుని మరీ నోట్బుక్ ముందేసుకుని కూర్చున్నాడు. ఊహా రైల్వేస్టేషన్ మాల్గుడి తళుక్కుమంది. ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’ పరుగెత్తుకుని వచ్చేశారు. అయితే, స్వామి ఇంగ్లీషులో మాట్లాడతాడు. ఆయన వరకూ అది పరాయిభాష కాదు, పెరిగిన వాతావరణమే అది. పుట్టిన తమిళమంత, పెరిగిన కన్నడమంత అలవోకగా ఇంగ్లీషులో రాశాడు, తొలితరపు భారతీయాంగ్ల రచయిత అయ్యాడు. ప్రతి నాయకుడి పాత్రయినా సరే, దాన్ని నిలబెట్టగలిగేదేదో పట్టుకోవాలి, అంటారాయన. ‘మాల్గుడి డేస్’, ‘ది ఇంగ్లీష్ టీచర్’, ‘ద బాచిలర్ ఆఫ్ ఆర్ట్స్’, ‘మిస్టర్ సంపత్’, ‘ఫినాన్సియల్ ఎక్స్పర్ట్’, ‘వెయిటింగ్ ఫర్ ద మహాత్మ’, ‘ద గైడ్’, ‘ద మ్యాన్ ఈటర్ ఆఫ్ మాల్గుడి’, ‘టాకెటివ్ మ్యాన్’, ‘అండర్ ద బన్యాన్ ట్రీ’, ‘మై డేస్’, ఆయన ఇతర రచనలు. ఆత్మకథాత్మకంగా కనబడే ఆయన పుస్తకాలకు, ‘ఈ కథలో ఏముంది? శక్తివంతమైన క్లైమాక్స్ లేదు. అసలు ఎటు తీసుకెళ్దామని దీన్ని?’ లాంటి ప్రశ్నలు ఎదుర్కొన్నారు. అయినా అదే శైలికి కట్టుబడి ఉండటానికి కారణం, ఇంకోరకంగా నేను రాయలేకపోవడమే, అంటారు. -
ఓ అజ్ఞాత విజ్ఞాని
చెన్నైలో లజ్ సెంటర్ నుంచి ఎల్డామ్స్ రోడ్డు వేవు నడుస్తున్నప్పుడు దారిలో చాలా ప్రసిద్ధ్దమైన అడ్రసులు. ఇంగ్లీషువారికాలంలోనే కోర్టుల్లో వారినే తన ఆంగ్లభాషా వైశిష్ట్యంతో అబ్బుర పరిచిన రైట్ ఆనరబుల్ శ్రీనివాస శాస్త్రి హాలు తగుల్తుంది. అది దాటగానే అమృతాంజనం ఆఫీసు, పక్కన ఆంధ్రదేశ చరిత్రలో భాగమయిన శ్రీభాగ్ ఒడంబడిక జరిగిన శ్రీ భాగ్ బంగళా, తర్వాత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి పార్కు. అయితే అటు వెళ్లేటప్పుడు ఇవేవీ గుర్తుకురావు. శాస్త్రిహాలుకి ముందుగా రోడ్డు పక్క రోడ్డుమీదే గుట్టగా పోసిన కొన్ని లక్షల పాతపుస్తకాల దుకాణం కనిపిస్తుంది. దీనికి గది, తాళాలు, పుస్తకాలకి రక్షణా ఏమీలేదు. ఆరుబయట– రోడ్డుమీదే పరిచిన దుకాణం. ఎండా, వానా, తుఫాన్, గాలి దుమారం ఏది వచ్చినా తట్టుకుంటూ గత అయిదు దశాబ్దాలుగా నడుస్తున్న సెకండ్ హ్యాండ్ దుకాణం. పుస్తకాలమీద పెద్ద టార్పాలిన్ కప్పి ఉంటుంది. ఆ గుట్ట ముందు – తపస్సు చేస్తున్నట్టు ఓ ముసలాయన కూర్చుంటాడు. అతని పేరు ఆళ్వార్. వొంటిమీద షర్టు లేదు. ఆయన పెరియార్ రామస్వామి నాయకర్ భక్తుడు. అందుకని తర్వాతి రోజుల్లో ఆయనలాగ గెడ్డం పెంచాలి. నగరంలో వేలాది మేధావులకు, విద్యార్థులకు, రచయితలకు ఆ గుట్ట ఆటపట్టు. ఎప్పుడూ ఆ గుట్ట చుట్టూ ఖరీదయిన దుస్తులు వేసుకున్న వారూ, మే«ధావులూ పుస్తకాలు తిరగేస్తూ కనిపిస్తారు. రోజర్స్ థెసారెస్ , పాపిలియాన్, షేక్సి ్పయర్ సమగ్ర రచన సర్వస్వం, థామస్ హార్డీ రచనలు –ఇలా వేటి గురించయినా చెప్పగలడు. ఇంకా వైద్యం, ఇంజనీరింగ్, అకౌంటెన్సీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – ఈ విభాగాలలో ఎన్నో అరుదయిన పుస్తకాలు దొరుకు తాయి .ముద్రణలో లేని పుస్తకమా? ఇదొక్కటే అడ్రసు. కస్టమర్లు తప్పిపోయిన పాతమిత్రుడిని కలిసినట్టు పుస్తకాలను కరుచుకువెళ్లడం అక్కడ తరచుగా కనిపించే దృశ్యం. విశేషమేమిటంటే ఐయ్యేయస్ çపరీక్షలకి వెళ్ళే గ్రాడ్యుయేట్లు మధుర, తిరుచ్చి వంటి సుదూరమయిన ప్రాంతాలనుంచి అరుదయిన పుస్తకాలకి ఇక్కడికి వస్తారు. ఈ 50 సంవత్సరాలలో ఆ పుస్తకాల గుట్టకి తరచు వచ్చే కొందరు మహానుభావుల పేర్లు – సుప్రసిద్ధులైన భారతీ దాసన్ ఆయన కస్టమర్. పుళమై పిత్తన్, ముత్తులింగం వంటి కవులు వతనుగా వచ్చే వారు. ఫిలిం ఇండస్ట్రీ నుంచీ సెంథిల్, గౌండర్ మణి, ఎస్. వి. శేఖర్, చో రామస్వామి ఆయన సోదరుడు అంబి తరచు వచ్చేవారు. హీరో జయశంకర్ ఇక్కడ కూర్చుని టీ తాగి వెళ్లేవాడు కొన్ని రోజులు –ఇతను మైసూరు మహారాజా సామరాజ వొడయార్కీ, అప్పటి ముఖ్యమంత్రులు రామస్వామి రెడ్డియార్, అన్నాదురైకి పుస్తకాలు ఇచ్చి వచ్చేవాడు. ఇతని అసలు పేరు ఆర్. కె. నమ్మాళ్వార్. కాని అందరికీ అతను ఆళ్వార్. ఆళ్వార్ షాపు లజ్ దగ్గర పెద్ద బండగుర్తు. ఎప్పుడో 60 ఏళ్ల కిందట కడుపు పట్టుకుని విల్లుపురం దగ్గర వానియం పాలయం నుంచి చెన్నైలో దిగాడు ఆళ్వారు. 1950లో ఇక్కడ ఈ దుకాణానికి ప్రారంభోత్సవం చేశాడు. అప్పటి ముఖ్యమంత్రి –‘‘ఇక్కడ వ్యాపారం చేసుకోవయ్యా’’ అని అనుమతి ఇచ్చారు. ఆ మాట ఇనుపకవచంలాగా సంవత్సరాల తరబడి పోలీసుల బారిన పడకుండా కాపాడింది. రోడ్డుపక్క ఈ పుస్తకాల గుట్ట పోలీçసులకి కన్నెర్రే, ఈ మధ్య ఎవరో పోలీసులమంటూ వచ్చి కొన్ని వేల పుస్తకాలే పట్టుకుపోయారు. మళ్ళీ తిరిగి ఇస్తే ఒట్టు. ఈ పుస్తకాల వ్యాపారానికి ముందు ఆళ్వార్ నెప్ట్యూన్ స్టూడియోలో లైట్ బోయ్గా పనిచేశాడు. కొన్ని సినిమాల్లో నటించాడు – మనోహర, స్వర్గవాసల్, తిలివిషం మొదలైనవి. మరి ఈ లక్షల పుస్తకాలు ఆళ్వార్కి ఎలా చేరుతా యి? కనీసం 10 మంది ఇంటింటికీ తిరిగి పుస్తకాలను కొని తీసుకు వస్తారు. రమణన్ అనే అతను 17 ఏళ్లుగా ఈ పని చేస్తున్నాడు. అతనికిప్పుడు 73 సంవత్సరాలు. ధనరాజ్ అనే కుర్రాడు పాతికేళ్లుగా ఈ పని చేస్తున్నాడు. ఇతని వ్యక్తిగత జీవితం ఇంకా ఆçసక్తికరం. వెనుక ఇంట్లో పని చేసే పనిమనిషి– ‘మేరీ’ని ఆళ్వార్ పెళ్లి చేసుకున్నాడు. ప్రేమా? అని మేరీని అడిగితే సిగ్గుపడింది. విచిత్రమేమిటంటే ఈ మతాతీత వివాహం పెద్దలు చేసినది! మేరీకి ఎప్పుడు పెళ్లయిందో గుర్తు లేదు. ఆ మాటకు వస్తే తన వయస్సు ఎంతో తెలీదు! వాళ్లకి నలుగురమ్మాయిలు. ఒక అమ్మాయికి పెళ్లి చేశారు. ‘‘నేను విజ్ఞానాన్ని పంచుతానని అందరూ అంటారు. ఆ మాట ప్రభుత్వం అనుకుని నా వ్యాపారం సాగనిస్తే మేలు’’ అంటాడు ఆళ్వార్. ఈ మధ్య చాలాసార్లు అటువేపు వెళ్లాను. ఇప్పుడక్కడ పుస్తకాల గుట్టలేదు. ఆళ్వార్ లేడు. ఏమయింది? వారం రోజుల కిందట – తన 95వ యేట – ఆళ్వార్ కన్నుమూశాడు. వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు -
పుస్తక పఠనంతోనే చైతన్యం
సాక్షి, హైదరాబాద్: పుస్తకాలు భాషా, సంస్కృతులకు దర్పణాలని, విజ్ఞాన సముపార్జనలో, సమాజాభివృద్ధిలో కీలకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పుస్తక పఠనం పెరిగి, సమాజంలో చైతన్యం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. 32వ హైదరాబాద్ జాతీయ పుస్తకమహోత్సవ వేడుకలు శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సాంస్కృతిక, పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, తెలంగాణ మీడియా కమిషన్ చైర్మన్ అల్లం నారాయణ, హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్, కార్యదర్శి కోయ చంద్రమోహన్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు ప్రసంగించారు. తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమం అప్పట్లో ప్రజలను చైతన్యవంతులను చేసిందని, మరోసారి ఆ ఉద్యమం రూపుదాల్చా లని అన్నారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛాలయం (శౌచాలయం), ప్రతి పల్లెకూ గ్రంథాలయం నినాదంతోపాటుగా స్వచ్ఛత మరియు పుస్తకాలు చదివే సంస్కృతి విస్తరించాలని సూచించారు. తెలుగు భాషాభిమాని, రచయిత అయిన సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో గ్రంథాలయాల ప్రాధాన్యత పెరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ‘‘అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క, లక్ష మెదళ్ళకు కదలిక’’అన్న కాళోజీ మాటల్ని గుర్తు చేశారు. పుస్తకాలే అండగా నిలిచాయి.... దేశాభివృద్ధి, విజ్ఞాన శాస్త్ర పురోగతి, యుద్ధాలు, శాంతి సుస్థిరతల స్థాపన వంటి అనేక సందర్భా ల్లో సమస్త మానవాళికి పుస్తకాలే అండగా నిలిచాయన్నారు. ఇలాంటి వేడుకల్లోనే కొత్త పుస్తకాల గురించి, కొత్త రచయితల గురించి తెలుసుకోవచ్చునన్నారు. ఆన్లైన్ డిజిటల్ వేదికలు వచ్చినప్పటికీ అచ్చులో అక్షరం విలువ, పరిమళం ఎప్పటికీ వాడిపోవని చెప్పారు. నేషనల్ బుక్ ట్రస్ట్ 1966లో ముంబైలో తొలిసారి పుస్తక ప్రదర్శన నిర్వహించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ బుక్ ఫెయిర్ దేశంలో రెండో స్థానం లో ఉందని, మొదటి స్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తెలంగాణ మొదటిస్థానానికి చేరేలా ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. తెలుగు భాష సాంస్కృతిక, సారస్వత పునరుజ్జీవనానికి, తెలంగాణ వికాసానికి గ్రంథాలయ ఉద్యమం చేసిన కృషిని గుర్తు చేశారు. విద్యార్థులకు మహనీయు ల జీవితాలు, చరిత్రను, సంస్కృతిని, విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను పరిచయం చేయాలని దిశానిర్దేశం చేశారు. పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయడం ద్వారా విజ్ఞానం, మెరుగైన జీవితం తద్వారా మెరుగైన సమాజం సాకారమవుతాయన్నారు. ప్రధాని మోదీ సూచించిన విధంగా వివిధ కార్యక్రమాల్లో మంచి పుస్తకాలను బహుమతులుగా అందజేయాలని సూచించారు. ప్రజల్లో పఠనాసక్తిని పెంచేందుకు పత్రికలు, మీడియా చైతన్యం తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
రారండోయ్
వైరాగ్యం ప్రభాకర్ కథల సంపుటి ‘రెండు తలల పాము’ ఆవిష్కరణ అక్టోబర్ 29న సాయంత్రం 5:30కు కరీంనగర్లోని ఫిలిమ్ భవన్లో జరగనుంది. ఆవిష్కర్త: పత్తిపాక మోహన్. వక్త: బి.వి.ఎన్.స్వామి. నిర్వహణ: తెలంగాణ రచయితల వేదిక, కరీంనగర్ జిల్లా. ‘క్రాంతదర్శి: కందుకూరి’, ‘భారతదేశంలో తెలుగు స్థానం’ పుస్తకాల ఆవిష్కరణ సభ అక్టోబర్ 31న సాయంత్రం 6 గంటలకు న్యూ వుడ్లాండ్స్ హోటల్, మైలాపూరు, చెన్నైలో జరగనుంది. వక్త: రామతీర్థ. నిర్వహణ: చెన్నపురి తెలుగు వాణి. కె.శాంతారావు కవితా సంపుటి ‘మహాబాటసారి’ ఆవిష్కరణ నవంబర్ 3న సాయంత్రం 6 గంటలకు విజయవాడ గవర్నరుపేటలోని ఎం.బి.భవన్ మినీ హాల్లో జరగనుంది. ఆవిష్కర్త: మండలి బుద్ధప్రసాద్. వక్త: దీర్ఘాసి విజయభాస్కర్. నిర్వహణ: ‘వనమాలి–మల్లెతీగ’. ‘లేఖిని’ ఆధ్వర్యంలో రచయిత్రుల కోసం ప్రత్యేకంగా యద్దనపూడి సులోచనారాణి స్మారక కథల పోటీ నిర్వహిస్తున్నట్టు ప్రధాన కార్యదర్శి స్వాతి శ్రీపాద తెలియజేస్తున్నారు. మూడు బహుమతులు వరుసగా 10 వేలు, 8 వేలు, 5 వేలు. ప్రత్యేక బహుమతులు వెయ్యి చొప్పున రెండు. డీటీపీలో ఆరు పేజీలకు మించని కథలను నవంబర్ 30 లోగా పంపాలి. వివరాలకు: 8297248988. చిరునామా. లేఖిని, కేరాఫ్ డాక్టర్ వాసా ప్రభావతి, 11/2ఆర్టీ మున్సిపల్ కాలనీ, మలక్పేట, హైదరాబాద్–36. కర్ణాటక తెలుగు సాహితీ సమాఖ్య అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని(2019 ఫిబ్రవరి 21)ని పురస్కరించుకొని మహాకవి పోతన భాగవతంలోని 2, 3వ స్కంధాలలోని విషయంపై ‘ఛందోబద్ధ గేయ, కవితా పోటీలు’ నిర్వహిస్తోంది. ఎన్నికైన ప్రతి రచనకు రూ.5,000 పురస్కారం. చివరి తేది: 30 డిసెంబర్ 2018. చిరునామా: రాఘవ మాస్టర్, కేరాఫ్ క.తె.సా.స., అంజనాద్రి టవర్స్, మూడో అంతస్తు, బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన, హెచ్ఆర్బీఆర్ లే అవుట్, కళ్యాణ్ నగర్, బెంగుళూరు–560043. మెయిల్: ట్చజజ్చిఠ్చిఛిౌఝఝ్ఛటఛ్ఛిఃజఝ్చజీl.ఛిౌఝ -
పుస్తకాలుంటే.. ఆ మూడు మంచి లక్షణాలు
పుస్తకాలు చదివితే ఏమొస్తుందని కొందరంటారుగానీ ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు మాత్రం కనీసం మూడు ప్రయోజనాలు ఉన్నాయని తేల్చేస్తున్నారు. చిన్నతనం నుంచి పుస్తకాలతో సావాసం చేసిన వాళ్లకు అంకెలు, సమస్య పూరణాలతోపాటు మేధావితనపు సంస్కారం అలవడతాయని వీరు అంటున్నారు. 2011 నుంచి 2015 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.60 లక్షల మందిని సర్వే చేసి మరీ ఈ అధ్యయనం చేశామని జోవానా సికోరా తెలిపారు. సర్వేలో పాల్గొన్న వాళ్లు 25– 65 మధ్య వయస్కులు. పదహారేళ్ల వయసు వచ్చేలోపు ఇంట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? అన్న ప్రశ్నకు వీరంతా సమాధానమిచ్చారు. నార్వే, స్వీడన్, చెచ్నియా వంటి దేశాల్లోని పిల్లల ఇళ్లలో సగటున 200 పుస్తకాలు ఉండగా చిలీ, సింగపూర్, టర్కీ వంటి దేశాల్లో ఈ సంఖ్య 60 మాత్రమే. అందుబాటులో ఉన్న పుస్తకాల సంఖ్యకు తగ్గట్టుగానే ఆయా దేశాల యువకుల మేధోశక్తి కూడా ఉన్నట్లు ఈ పరీక్షల ద్వారా తెలిసింది. -
కొత్తదనం లేదు..
విజయనగరం, బలిజిపేట: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య కొత్త కుండలో పాత నీరు అన్నచందంగా మారింది. విద్యా సంవత్సరం ఆరంభంలో బీరాలు పలికిన విద్యాశాఖ వాటి అమలులో కొత్తదనం చూపించలేకపోవడంతో ఆకట్టుకోలేకపోయింది. విద్యాశాఖ ఉన్నతాధికారులు ముందుగా ఏయే పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తారన్న వివరాలు సేకరించి ప్రయోగాత్మకంగా ఇంగ్లిష్ మీడియం విద్య ప్రారంభించినా అనుకున్న లక్ష్యం నేరవేరడం లేదు. ఇంగ్లిష్ మీడియం ప్రారంభించినప్పటికీ కొత్త ఉపాధ్యాయులను నియమించలేదు సరికదా.. ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వలేదు. దీంతో విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం విద్య అందకపోవడంతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తామన్న పాలకులు, అధికారుల హామీ నీటిమూటగానే మిగిలిపోయింది. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి మూడు నెలలు గడిచిపోతున్నా కనీసం 1వ తరగతికి అవసమైన పాఠ్య పుస్తకాలు అందించలేకపోయారు. అలాగే ఉపాధ్యాయులను కూడా నియమించలేకపోయారు. ఎటువంటి కొత్తదనం ప్రణాళికలు లేకుండా ఆచరణలోకి దిగడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పటిష్ఠపరిచేందుకు కృషి.. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టాం. దీనిని నిరంతరం కొనసాగిస్తాం. బాలారిష్టాలను తొలగించి పటిష్ఠపరిచేందుకు కృషి చేస్తున్నాం. – శ్రీనివాసరావు, ఎంఈఓ, బలిజిపేట. -
కలాలతో కలలకు ఊపిరి..!
కేరళ విద్యార్థులపై వరదలు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు చెరిపేసే ఈ కార్యక్రమం వినూత్నమేకాదు అందరి ప్రశంసలనూ అందుకుంటోంది. భారీ వర్షాలు, వరదల తదనంతర పరిణామాల్లో భాగంగా ఆ విద్యార్థులు తమకిష్టమైన చదువును కొనసాగించేందుకు భరోసా ఇస్తోంది. వరదనీళ్లలో వారు కోల్పోయిన క్లాస్ పుస్తకాలు, వివిధ సబ్జెకుల వారీగా ఇప్పటికే పూర్తయిన క్లాస్లకు నోట్స్లు (స్టడీమెటీరియల్) రాసి అందించడం ద్వారా వారి చదువులకు ఊపిరిపోస్తున్నారు. అనాథశరణాలయానికి చెందిన పిల్లలిచ్చిన సలహాలు, సూచనలతో కాలికట్కు చెందిన ‘ఇన్క్యుబేషన్’ స్వచ్ఛంద సంస్థ ఈ పనిని భుజానవేసుకుంది ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు చదువు నష్టపోకుండా ఉండేందుకు వరదల్లో వారు కోల్పోయిన క్లాస్ నోట్స్ను అందించేందుకు నడుం బిగించారు. ముందుగా వివిధ తరగతుల విద్యార్థులకు సంబంధించిన క్లాస్నోట్స్ రాసివ్వాలంటూ సామాజికమాధ్యమాల ద్వారా మెసేజ్ పంపించారు. అది వైరల్గా మారింది. ఈ ఆలోచననను వ్యక్తులు, కంపెనీలు, విద్యాసంస్థలు స్వాగతించాయి. వివిధ తరగతులు,సబ్జెక్టుల వారీగా సోషల్ మీడియా వేదికగా పీడీఎఫ్ ఫార్మాట్లో నోట్స్ పంపిణీలోకి వచ్చాయి. ఒకరి నుంచి మరొకరికి ఇవి ఫార్వర్డ్ అయ్యాయి. దీనిపై ఇతరజిల్లాల నుంచి స్పందించే వారి సంఖ్య పెరిగింది. ఒక్క కేరళకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలకు విదేశాలకు కూడా ఈ వినూత్న అభ్యర్థన చేరుకుంది. ఫలితంగా వేలాది పుస్తకాలు గవర్నమెంట్ స్కూళ్ల విద్యార్థులకు పంపిణీ అయ్యాయి. దాదాపు రెండువారాల పాటు కొనసాగించిన క్యాంపెయిన్కు అనూహ్య స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా తమ సంస్థ వివిధ జిల్లాల్లో దాదాపు పదివేలకు పైగా నోట్పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేసినట్టు ‘ఇన్క్యుబేషన్’కు చెదిన నాబీల్ మహ్మద్ తెలియజేశారు. ‘జిరాక్సో, ప్రింట్ చేసిన నోట్ పుస్తకాల కంటే చేతిరాతతో రాసిన పుస్తకాల ద్వారా ప్రేమాభిమానాలు పంచాలనేది మా అభిప్రాయం ’ అని ఈ సంస్థ సమన్వయకర్త ఇల్యాస్ జాన్ తెలిపారు. అనారోగ్యం బారిన పడిన కొందరు ఎంబీబీఎస్ విద్యార్థులు కూడా ఈ నోట్స్రాసి రాయడం ఒక ఎత్తయితే. ఓ శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్న నమితా హర్ష్ అనే మాజీ సాఫ్ట్వేర్ ఉద్యోగిని కూడా ఎనిమిది నోట్పుస్తకాలు రాయడం మరో విశేషం. ఈ నోట్పుస్తకాలను కేరళలోని వివిధ ప్రాంతాలకు ఉచితంగా అందించడానికి కొన్ని కొరియర్ కంపెనీలు ముందుకొచ్చాయి. ఇక రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థయితే పుస్తకాలు రాష్ట్రంలోని అన్ని ›ప్రాంతాలకు రవాణా చేసింది. దీని కోసం వివిధ జిల్లాల్లోని తమ బస్సుడిపోల్లో ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. నోట్స్ రాసే కార్యక్రమంలో తాము పాలుపంచు కుంటామంటూ వివిధ వర్గాల ప్రజల నుంచి ఇప్పటికీ ఈ సంస్థలకు విజ్ఞప్తులు అందుతూనే ఉన్నాయి. -
గోదాము కిరాయి ఇవ్వడం లేదని..
హైదరాబాద్: గోదాము కిరాయి ఇవ్వడం లేదని రూ.3 కోట్ల విలువైన పుస్తకాలను అమ్మేశాడు దాని యజమాని. బాధితుని ఫిర్యాదు మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసిన రాచ కొండ ఎస్వోటీ టీమ్, మల్కాజిగిరి సీసీఎస్ పోలీస్లు 5 లారీల పుస్తకాలను స్వాధీనం చేసుకుని.. నిందితులను రిమాండ్కు తరలించారు. మంగళవారం ఎల్బీనగర్ సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రాచకొండ సీపీ మహేశ్భగవత్ వివరాలు వెల్లడించారు. గాంధీనగర్కు చెందిన నికేతన్ దేవడిగ కాప్రా వంపుగూడ వద్ద గోదామును కిరాయికి తీసుకుని పుస్తకాలు ముద్రిస్తుంటాడు. తెలంగాణతోపాటు ఏపీ, ఛత్తీస్గఢ్కు భారత చరిత్ర, పర్యావరణ శాస్త్రం, అట్లాస్ ఆఫ్ మై వరల్డ్, సైన్స్, పిల్లలు, లైబ్రరీలకు పుస్తకాలు పంపిణీ చేస్తుంటా డు. గోదాము యజమాని నర్సింహారెడ్డికి నెలకు రూ.50 వేలు కిరాయి చెల్లించాలి. నికేతన్ ఆర్థిక పరిస్థితి సరిగా లేక కొంతకాలంగా కిరాయి చెల్లించకపోవడంతో లక్షల్లో బకాయిపడ్డాడు. అయితే నికేతన్ కిరాయి చెల్లించే స్థితిలో లేడని భావించిన నర్సింహారెడ్డి, అతని కుమారుడు శ్రీనివాస్రెడ్డి కలసి ఈ నెల 4న గోదాము తాళం పగలగొట్టి రూ.3.24 కోట్ల విలువైన 10 ట్రక్కుల పుస్తకాలను బేగంపేటలోని ఎంఆర్ బుక్ సెంటర్ నిర్వాహకుడు ఎండీ రజీముద్దీన్కు రూ.15లక్షలకు అమ్మేశారు. రజీముద్దీన్ ముంబై సీఎస్టీ దగ్గరున్న ఆదినాథ్ బుక్ సేల్స్ ధమ్జీకి రూ.22 లక్షలకు అమ్మాడు. బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న రాచకొండ ఎస్వోటీ టీమ్, మల్కాజిగిరి సీసీఎస్ పోలీసులు నర్సింహారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, రజీముద్దీన్ను అరెస్ట్ చేసి ముంబై నుంచి 5 లారీల పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ముంబైలో పుస్తకాలు కొనుగోలు చేసిన ధమ్జీపై కేసు నమోదు చేశారు. -
అద్దె కట్టలేదని.. రూ. 3 కోట్ల పుస్తకాలు కొట్టేశాడు!
సాక్షి, హైదరాబాద్ : అద్దె చెల్లించకపోతే ఇల్లు ఖాళీ చేయిస్తారు, లేదంటే ఏవైన ఖరీదైన వస్తువులను తాకట్టు పెట్టుకుంటారు. కానీ నగరానికి చెందిన ఓ వ్యక్తి మాత్రం ఇందుకు భిన్నంగా అద్దెకున్న వ్యక్తి సామాగ్రిని దొంగతనం చేశాడు. అది కూడా ఏ టీవీనో, బైకో అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే అతడు దొంగతనం చేసింది దాదాపు 3 కోట్ల రూపాయలు విలువ చేసే పుస్తకాలను. వినడానికి కాస్తా విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. వివరాల ప్రకారం నికెథన్ అనే వ్యక్తి పుస్తకాలు విక్రయిస్తుంటాడు. అమ్మకం కోసం తెచ్చిన పుస్తకాలను భద్రపరిచేందుకు నగరానికి చెందిన శ్రీనివాస రెడ్డికి సంబంధించిన గోదాంను అద్దెకు తీసుకున్నాడు. కానీ గత కొన్ని నెలలుగా అద్దె చెల్లించడం లేదు. ఆగ్రహించిన శ్రీనివాస రెడ్డి నికెథన్కు సంబంధించిన దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన పుస్తకాలను దొంగతనం చేశాడు. ఇలా దొంగతనం చేసిన పుస్తకాలను శ్రీనివాస రెడ్డి, బేగం బజార్ కి చెందిన పుస్తక వ్యాపారి రజీయుద్దీన్కి కిలోల చొప్పిన 17 లక్షల రూపాయలకు అమ్మేశాడు. రజీయుద్దీన్ ఆ పుస్తకాలను ముంబైకి చెందిన పుస్తక వ్యాపారి దాంజీకి 22 లక్షల రూపాయలకు విక్రయించాడు. పుస్తకాలు చోరి అయిన విషయం గుర్తించిన నికెథన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నికెథన్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు శ్రీనివాస రెడ్డిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో శ్రీనివాస రెడ్డి తాను, తన తండ్రి నరసింహారెడ్డితో కలిసి నికెథన్ పుస్తకాలను దొంగిలించామని ఒప్పుకున్నాడు. అనంతరం శ్రీనివాస రెడ్డి, అతని తండ్రి నరసింహారెడ్డిలతో పాటు పుస్తకాలు కొన్న రజీయుద్దీన్ కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ విషయం గురించి రాచకొండ సీపీ మహేష్ భగవత్ ‘ఇంత ఖరీదైన పుస్తకాల దొంగను పట్టుకోవడం ఇదే ప్రథమం. గోదాం యజమని నరసింహా రెడ్డి , కుమారుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు రజీయుద్దీన్ను కూడా అరెస్ట్ చేశాం. వీరి వద్ద నుంచి 3.24 కోట్ల రూపాయల ఖరీదైన పుస్తకాలను స్వాధీనం చేసుకున్నాం. వీటిలో ఇండియన్ హిస్టరీ, అట్లాస్ ఆఫ్ మై వరల్డ్ , అవర్ ఎర్త్ , స్పీరిట్ ఆఫ్ ఇండియా బుక్స్ ఉన్నాయి.ఈ పుస్తకాలు అన్ని అత్యంత ఖరీదైన పుస్తకాలుగా గుర్తించాం. వీటి విలువ ఒక్కటి 15 వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకూ ఉంటుంది. మొత్తం ఆరు లారీలు పుస్తకాలు ను స్వాధీనం చేసుకున్నాం’ అని తెలిపారు. -
అరచేతిలో పుస్తక విప్లవం
ఆన్లైన్లో తక్కువ ధరకే పుస్తకాలు అమ్మడానికి, దానం చేయడానికి కూడా అందుబాటులో వెబ్సైట్లుసమాచార, సాంకేతిక రంగంసమాజాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఇటీవలి కాలంలో అన్ని రంగాలనూ శాసిస్తోన్న సాంకేతికత విద్యా రంగాన్ని కూడా ఏలుతోంది. మనకు అవసరమైన పుస్తకాలు కావాలంటే బుక్స్టాల్స్ఆర్డర్ ఇవ్వడం, అవి వచ్చే వరకూఎదురు చూడడం ఇక చరిత్రగామిగిలిపోనుంది. అన్ని రకాల పుస్తకాలు నేడు ఆన్లైన్లో ఉచితంగా అందుబాటులోకి వస్తున్నాయి. మరికొన్ని పుస్తకాలు ఒక్క క్లిక్తో తక్కువ ధరకే అంటే సుమారు 50 శాతం వరకూ తగ్గింపు ధరతో గుమ్మం ముందు వాలిపోతున్నాయి. ఏలూరు (ఆర్ఆర్పేట) : నేడు సివిల్స్, ఐఐటీ. నీట్, జేఈఈ, గ్రూప్స్, స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ఇలా ఎటువంటి ఉన్నత విద్యకు అవసరమైన పుస్తకం కావాలన్నా ఆన్లైన్లో అందుబాటులో ఉంటోంది. అలాగే ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంబీఏలతో పాటు చరిత్ర, రాజనీతి శాస్త్రం, ఎకనామిక్స్, గణితం, ఇంగ్లిష్, సైన్స్, సాహిత్యం వంటి పుస్తకాలు కూడా ఆన్లైన్ సోధనతో వివరాలు క్షణాల్లో మనముందు ప్రత్యక్షమైపోతున్నాయి. కేజీ టు పీజీ.. కేవలం ఉన్నత చదువులకే వెబ్సైట్లు పరిమితం కాలేదు. ఆయా వెబ్సైట్లు కేజీ నుంచి పీజీ చదివే విద్యార్థుల వరకూ అవసరమైన పుస్తకాలను తమలో నిక్షిప్తం చేసుకున్నాయి. ఆఖరికి ప్రీ కేజీ, ప్రీ స్కూల్ చిన్నారులకు కూడా అవసరమైన పుస్తకాలు, కేవలం పాఠ్య పుస్తకాలే కాక వారిలో వివిధ అంశాల్లో చైతన్యం తీసుకువచ్చే సామెతలు, పొడుపు కథలు, ప్రముఖుల జీవిత చరిత్రలు, ఉన్నత స్థానాలు అధిరోహించిన వ్యక్తుల వైఫల్యాలు, విజయగాథలు, వ్యిక్తిత్వ వికాస పుస్తకాలు, ఆర్ట్స్, క్రాఫ్టŠస్ నేర్పే పుస్తకాలు ఆయా వెబ్సైట్లలో దొరుకుతున్నాయి. దేనికైనా రెడీ.. వివిధ కోర్సులు చదివే విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమౌతున్న అభ్యర్థులకు ఆన్లైన్ ఎటువంటి సేవ చేయడానికైనా సిద్ధంగా ఉంటోంది. వారికి కావాల్సిన పుస్తకాలను అందచేయడానికే కాక వారి వద్ద ఉన్న పుస్తకాలను అమ్ముకోవడానికి, ఇతరులు చదివి మిగిలిపోయిన పుస్తకాలను సగం ధరకే అందచేయడానికి, ఇతరుల వద్ద ఉన్న పుస్తకాలను తమకు, తమ వద్ద ఉన్న పుస్తకాలను ఇతరులకు మార్చుకోవడానికి (ఎక్సేంజ్), బాగా ఎక్కువ ధర ఉన్న పుస్తకాలు అద్దెకు తీసుకోవడానికి అవసరమైన సౌకర్యాలను అందిస్తోంది. దీనితో పాటు తాము చదివి తమ వద్ద వృథాగా ఉన్న పుస్తకాలను దానం చేయాలన్నా కూడా ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్లు పనిచేస్తున్నాయి. ఆన్లైన్లో పుస్తకాలు అందించే కొన్ని వెబ్సైట్లు.. తమకు కావాల్సిన పుస్తకాలను ఆన్లైన్లో వెతకడానికి కొన్ని వెబ్సైట్ల వివరాలు ఇవి. అమెజాన్ యూజ్డ్ బుక్ స్టోర్స్, బకెట్ బోల్ట్, యువర్ బుక్ స్టాల్, యో బుక్స్, సెల్ బై బుక్, ఆల్ బుక్స్ ఆన్లైన్, బుక్ అడ్డా, మై కాలేజ్ అడ్డా, బుక్స్ నెటవర్క్, స్టూడెంట్ డెస్క్, శ్వాప్ ద బుక్, బుక్ మై బుక్, బుక్ సెల్ బై, కితాబి వంటి వెబ్ సైట్ల కొన్ని మాత్రమే ఇవి కాక సెకండ్ హ్యాండ్ పుస్తకాల కోసం సెకండ్ హ్యాండ్ బుక్స్ ఇండియా వెబ్సైట్లో శోధించవచ్చు. తమ వద్ద ఉన్న పుస్తకాలను దానం చేయడానికి బడ్జెట్ రీడ్స్, బుక్ చోర్ వెబ్సైట్లను సంప్రదించవచ్చు. తమ వద్ద ఉన్న పుస్తకాలను విక్రయించడానికి బుక్ సెల్లింగ్ హౌస్, పుస్తకాలు అద్దెకు కావాలంటే పుస్తక్ ఖోష్ వంటి వెబ్సైట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. -
ఆ పుస్తకాలు నిషేధించిన పాక్
ఇస్లామాబాద్: పాక్ ప్రభుత్వం పంజాబ్ పరిసర ప్రాంతాల్లోని ప్రైవేట్ పాఠశాల్లో సోషల్ స్టడీస్ పుస్తకాలపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ పుస్తకాల్లో ముద్రించిన పాక్ మ్యాప్లో కశ్మీర్ భూభాగం భారత్లో అంతర్భాగమని చూపిస్తుండటంతో వాటిపై నిషేధానికి ఆదేశాలు జారీ చేసింది. 2, 4, 5, 7, 8 తరగతులు విద్యార్థులకు సంబంధించిన సోషల్ స్టడీస్ పుస్తకాల్లో వివాదాస్పద, అభ్యంతరకరమైన విషయాలు, ముఖ్యంగా పాక్ మ్యాప్ల్లో కశ్మీర్ భారత్లో ఉన్నట్లు గుర్తించినట్లు పంజాబ్ కరికులమ్, టెక్స్ట్బుక్ బోర్డు(పీసీటీబీ) ఒక ప్రకటనలో పేర్కొంది. పంజాబ్ ప్రావిన్స్లో తక్షణమే ఆ పుస్తకాలను నిషేధించాలని పీసీటీబీ మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ ఖయ్యూమ్ ఆయా పాఠశాలలకు సర్క్యూలర్ జారీ చేశారు. విద్యాసంస్థల నిర్వాహకులతో పాటు ఈ ఘోర తప్పిదం చేసిన పబ్లిషర్స్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని లాహోర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రభుత్వ సంస్థ పీసీటీబీ పేర్కొంది. -
ఆసక్తి కలిగిస్తున్న ‘రామాయణ–2020’
సాక్షి, సిటీబ్యూరో : రామాయణాన్ని వర్తమాన పరిస్థితులకు అన్వయం చేస్తూ, చిన్నారులకు చక్కగా అర్థమయ్యేలా పదకొండున్నరేళ్ల బాలుడు మాస్టర్ విక్రమ్ నాగరాజన్ రచించిన ‘రామాయణ–2020’ పుసక్తం చిన్నారుల్లో ఆసక్తి రెకేత్తిస్తోంది. ఆధునిక ప్రపంచానికి రామాయణాన్ని ఎలా అన్వయం చేసుకోవాలో ఈ పుస్తకంలో వివరించడం విశేషం. ఈ పుస్తకాన్ని చమన్న పబ్లికేషన్స్ ప్రచురించింది. వెల రూ.315. పుస్తక రచయిత విక్రమ్ నాగరాజన్ ప్రస్తుతం అమెరికాలో ఆరో తరగతి చదువుతున్నారు. ఇతనికి గణితం, జాగ్రఫీ, జువాలజీ, చరిత్ర, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ తదితర అంశాల్లోనూ ఆసక్తి ఉందని పబ్లికేషన్స్ నిర్వాహకులు ఎం.పట్టాభిరామ్ తెలిపారు. పుస్తక కాపీలకు చమన్న పబ్లికేషన్స్, కేరాఫ్ ఎం.పట్టాభిరామ్, 4ఎఫ్, ముస్సోరీహిల్ కౌంటీ, నిజాంపేట్ మెయిన్ రోడ్, హైదరాబాద్–500090, 9502196347 నెంబర్లో సంప్రదించాలని కోరారు. -
నీడతో ఏడడుగులు
ఆ ఇంట్లో ఉన్నన్ని పుస్తకాలు ఏ ఇంట్లోనూ ఉండవనిపిస్తుంది. ఒక్కో పుస్తకం వెన్ను మీద ఆ పుస్తకం పేరు కనిపించేలా చక్కగా అన్నీ ర్యాకుల్లో నిలబెట్టి ఉంటాయి. ఎవరికి ఇష్టమైంది వాళ్లు తీసుకుని చదువుకుని, మళ్లీ అక్కడే పెట్టేసేలా ఆ అమరిక ఉంటుంది. ఆ ఇంట్లో అన్ని పుస్తకాలున్నా ఆ పుస్తకాలన్నీ చదివినవాళ్లు, చదువుతుండేవాళ్లు ఆ ఇంట్లో ఒక్కరే.. మనోధర్మ. అవన్నీ ఆయన సమకూర్చుకున్నవే. ఆయన భద్రపరిచినవే. సమకూర్చున్నది తనకోసమే అయినా, భద్రపరుస్తున్నది ఎవరికోసమో ఆయన ఎప్పుడూ ఆలోచించలేదు.nమనోధర్మకు అరవై ఏళ్లుంటాయి. గృహస్థుగా అన్ని ధర్మాలూ నెరవేర్చి కాలధర్మానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. సిద్ధం కావడం అంటే, రాబోతున్నదాని కోసం ఎదురుచూడ్డం కాదు. జీవితం ఓ కొలిక్కి వచ్చాక సహజంగా వచ్చే ఆలోచనలకు మనిషి ఎదురు వెళ్లకపోవడం. ఇప్పుడీ కథ మనోధర్మ గురించి కాదు. మనోధర్మ చదవడం కోసం కొన్నేళ్లుగా ఆ ఇంట్లోని ఒక ర్యాకులో ఎదురు చూస్తూ ఉన్న ఒక పుస్తకం గురించి. ముప్పై ఏళ్లుగా మనోధర్మ తన ర్యాకుల్లో ఆ పుస్తకాన్ని చూస్తున్నాడు. ముప్పై ఏళ్లుగా దాన్ని బయటికి తీస్తున్నాడు, మొదటి రెండు పేజీలు తిరగేస్తున్నాడు, తిరిగి లోపల పెట్టేస్తున్నాడు. అంతే తప్ప చదవడం లేదు. ఆ పుస్తకం తన ఇంట్లోకి ఎలా వచ్చిందో అతడికి గుర్తు లేదు. తనైతే తెచ్చి ఉండడని ఆయన అనుకుంటూ ఉంటాడు. ఏమో.. తెచ్చానేమో అని కూడా అప్పుడప్పుడు అనుకుంటాడు. ‘నీడతో ఏడడుగులు’ అనే టైటిల్తో ఉన్న ఆ తెలుగు తర్జుమా పుస్తకం మనోధర్మ పుట్టకముందు నాటిది. పాలు ఎర్రగా మరిగిన రంగులోకి తిరిగి ఉన్నాయి ఆ పుస్తకంలోని పేజీలు. అప్పటికే అది పదమూడో ముద్రణ! అన్ని ముద్రణలు బహుశా ఇంగ్లిష్ వెర్షన్వి అయి ఉంటాయి. ఎవరో పాశ్చాత్యుడు రాశాడు. ఏడడుగులు అన్న సంప్రదాయం పాశ్చాత్యులలో ఉన్నట్లు లేదు. తెలుగు పాఠకులు కనెక్ట్ కావడం కోసం అలా తర్జుమా చేసినట్లున్నారు. ‘నీడతో ఏడడుగులు’ ఏంటోనని మొదటిసారి ముప్పై ఏళ్ల క్రితం ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుని కవరు పేజీ తిప్పాడు మనోధర్మ. ‘దెయ్యంతో కాపురం చేసిన ఓ ధైర్యవంతుడి అనుభవాలు’ అని లోపలి పేజీలో ఉంది. పుస్తకాన్ని విసిరి కొట్టేశాడు. దెయ్యాలంటే అతడికి నమ్మకం లేదు. ఏ పుస్తకాన్నైనా ఒక్కసారైనా పేజీలు తిరగేయకుండా ఉండలేని మనోధర్మ.. నీడతో ఏడడుగుల్ని ఎప్పుడు చేతుల్లోకి తీసుకున్నా మొదటి రెండు పేజీలు మాత్రమే తిప్పేవాడు. అప్పటికే అతడి ఉత్సాహం చచ్చిపోయేది. బొత్తిగా ఆసక్తి లేని పుస్తకాల్ని అతడు కనీసం వెనుక నుంచైనా పేజీలు తిప్పేవాడు. అలాక్కూడా ఈ పుస్తకాన్ని తిప్పలేదు. ఇరవై ఏళ్ల క్రితం ఒకసారి అనుకోకుండా ఆ పుస్తకాన్ని మళ్లీ చదివే ప్రయత్నం చేశాడు మనోధర్మ. పేజీ తిప్పగానే మళ్లీ అదే వాక్యం కనిపించి ఆగిపోయాడు. ‘దెయ్యంతో కాపురం చేసిన ఓ ధైర్యవంతుడి అనుభవాలు’! నవ్వుకున్నాడు. దెయ్యంతో పిరికివాడు కాపురం చేస్తే చదవడానికి ఆసక్తిగా ఉంటుంది కానీ, ధైర్యవంతుడు కాపురం చేస్తే అందులో చదవడానికి ఏముంటుందనుకుని మళ్లీ ఆ పుస్తకాన్ని విసిరికొట్టాడు.ఇప్పుడీ అరవై ఏళ్ల వయసులో మరోసారి ఆ పుస్తకం ఆయన కంట పడింది. కొద్దిసేపు ఆయన ఆ పుస్తకాన్ని చూసీచూడనట్లు ఉండిపోయాడు. ఆ పుస్తకమంటే మనోధర్మకు తేలిక భావం ఏర్పడడానికి కారణం అది దెయ్యాలపై రాసిన పుస్తకం అని మాత్రమే కాదు. ఆడవాళ్లను చులకన చెయ్యడం ఆయనకు ఇష్టం ఉండదు. పుస్తక రచయితకు నిజంగానే దెయ్యంతో కొన్ని అనుభవాలు ఉండొచ్చు. కానీ దెయ్యాన్ని భార్యతో పోలిక తెచ్చే విధంగా టైటిల్ పెట్టడం ఆయనకు నచ్చలేదు. అయితే ఆయనకు తెలియని విషయం, పుస్తకం చదివితేనే గానీ తెలుసుకోలేని విషయం ఏంటంటే.. రచయిత రాసింది తన భార్య గురించే. భార్యను దెయ్యంతో పోల్చాడు తప్ప, దెయ్యాలను భార్యతో పోల్చలేదతను. ఆ సంగతి.. మరో రెండు పేజీలైనా తిరగేస్తే తెలిసి ఉండేది మనోధర్మకు. పుస్తకాన్ని చూసీ చూడనట్లు కాసేపు అలా ఉండిపోయిన మనోధర్మ ఏమనుకున్నాడో ఏమో, ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుని పడక్కుర్చీలోకి జారగిల పడ్డాడు. గుండె ఎందుకో బరువుగా ఉన్నట్లు అనిపించింది. పుస్తకం గానీ గుండెలపై లేదు కదా అని చూసుకున్నాడు. లేదు. తన చేతుల్లోనే ఉంది. చదువుతూ చదువుతూ నిద్రలోకి ఒరిగినప్పుడు మాత్రమే ఆయన గుండెలపై పుస్తకం ఉంటుంది. గుండెలపై ఎంత పెద్ద పుస్తకం ఉన్నా ఎప్పుడూ బరువు అనిపించని మనోధర్మకు ఈ పుస్తకం చేతుల్లో ఉండగానే గుండె బరువుగా అనిపిస్తోంది! ఒకసారి లేచి కూర్చున్నాడు. గుండెల నిండా గాలి పీల్చుకుని మళ్లీ వెనక్కు వాలాడు. పుస్తకం తెరిచి ఎప్పుడూ తిప్పేవి కాకుండా మరో రెండు కొత్త పేజీలు తిప్పాడు. ‘ముందుమాట’ కనిపించింది. అందులో ఇలా ఉంది: ‘మొదటి ముద్రణలో ముందుమాట లేదు. రెండో ముద్రణ నాటికి ముందుమాట రాయవలసిన అవసరం ఏర్పడింది. తర్వాత ప్రతి ముద్రణలోనూ ఈ ముందుమాట ఉంది. అయితే ముందుమాటను ఇక్కడ రాయకపోవడానికి ఒక కారణం ఉంది’.. అని ఉంది! మనోధర్మకు ఏం అర్థం కాలేదు. అక్కడ రాయని దానికి ‘ఇక్కడ రాయడం లేదని చెప్పడం దేనికి? ఎక్కడ రాశాడో చెప్పాలి గానీ’ అనుకున్నాడు. ఇంకో పేజీ తిప్పబోతే నిద్రపట్టేసినట్టుగా అయింది. పుస్తకాన్ని గుండెలపై ఉంచుకుని నిద్రలోకి వెళ్లిపోయాడు. మళ్లీ లేవలేదు మనోధర్మ! ఇంట్లోవాళ్లు వచ్చి చూసే సరికి మనోధర్మ గుండెలపై ఉన్న పుస్తకం ఫ్యాను గాలికి రెపరెపలాడుతూ ఉంది. వెనుక అట్ట పైకి లేచినప్పుడల్లా ఆఖరి పేజీలోని ‘ముందుమాట’ బయటికి కనిపిస్తోంది! చిన్న పేరా అది. ‘విపరీతంగా అమ్ముడుపోతున్న ఈ పుస్తకాన్ని కొన్నవాళ్లే గానీ చదివినవాళ్లు ఒక్కరూ లేరు. తన గురించి నేను రాసినదాన్ని ఎవరూ చదవకుండా నా భార్య అడ్డుకుంటోంది. ఇది నా అనుమానం కాదు. చనిపోయిన నా భార్యే వచ్చి స్వయంగా నాకు చెప్పిన విషయం’ అని రాసి ఉంది. దాని కింద మరో చిన్న వాక్యం.. అతి చిన్న అక్షరాలతో ఉంది. ‘నా భార్య కంట పడకూడదనే.. ఈ ముందుమాటను వెనుక పేజీలో ఉంచాను’. -
పుస్తకాలు చూద్దాం
పుస్తకం ఒక ఊహాచిత్రం. చదివేవారి ఊహాశక్తిని బట్టిఎన్ని ఊహలో అన్ని సినిమాలు.. ఒక్క పుస్తకంలో. మనలో ఉన్న సృజనకు కారణం ఊహే. అక్షరాలు చదువుతుంటేమనసు తెరమీద బొమ్మలు ఆడుతుంటాయి. ఇప్పుడు ఎవరూ చదవటం లేదు కదా! రండి.. పుస్తకాలు చూద్దాం. కాలింగ్ సెహ్మత్ ప్రమాదమని తెలిసినా జీవితాన్ని పణంగా పెట్టి శత్రుదేశం వెళ్లింది ఓ దేశభక్తురాలు. ఆ దేశం డిఫెన్స్ ఆఫీసర్ను వివాహం చేసుకుంది. అక్కడి నుంచి రహస్యాలను భారతదేశం పంపింది. ఈ పాయింట్తో 1971 ఇండో–పాక్ వార్ బ్యాక్డ్రాప్లో సాగే కథనంతో రూపొందిన సినిమా ‘రాజీ’. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో ముఖ్యపాత్రను ఆలియా భట్ పోషించారు. ఈ సినిమా హరీందర్ సిక్కా రాసిన ‘కాలింగ్ సెహ్మత్’ పుస్తకం ఆధారంగా తెరకెక్కింది. ఓ కాశ్మీరి యువతి యదార్థ గాథ ఆధారంగా ఈ పుస్తకాన్ని రచించారట సిక్కా. ఈ శుక్రవారం ‘రాజీ’ విడుదలైంది. జోయా ఫ్యాక్టర్ అమ్మాయితో బ్రేక్ఫాస్ట్ చేసే సెంటిమెంట్ను కంటిన్యూ చేస్తే లక్తో లక్కీగా ఓటమి నుండి తప్పించుకోవచ్చని ప్లాన్ చేశాడు ఓ క్రికెటర్. ఆ సెంటిమెంట్తో రెండు మూడు సార్లు గెలిచాడు కూడా. కానీ బ్రేక్ఫాస్ట్ వ్యవహారం బెడిసి కొట్టింది. నెక్ట్స్ ఏంటీ అంటే.. నెక్ట్స్ ఇయర్ వరకు ఆగాల్సిందే. దుల్కర్ సల్మాన్, సోనమ్ కపూర్ తొలిసారి జంటగా అభిషేక్ శర్మ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ‘జోయా ఫ్యాక్టర్’. క్రికెటర్ నిఖిల్ ఖుడా జోయా సింగ్ సోలంకీ అనే నిజ జీవిత పాత్రల ఆధారంగా రచయిత్రి అనూజా చౌహాన్ పదేళ్ల కిత్రం ‘జోయా ఫ్యాక్టర్’ పుస్తకం రాశారు. దాని ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. థగ్స్ ఆఫ్ హిందోస్తాన్ దయదాక్షిణ్యాలు ఉండవు దోపీడీదారులకు. వాళ్లకు కావాల్సిన దానికోసం ప్రజల ప్రాణాలను తీసేందుకు కూడా వెనకాడరు. 19వ శతకంలో ఫిలిప్ మేడో టైలర్స్ అనే బ్రిటిష్ రచయిత భారతదేశంలోని ధగ్గులు అనే బందిపోట్ల గురించి ‘థగ్గి’ కల్చర్ పై అనే ‘ద కన్ఫెషన్ ఆఫ్ ఎ థగ్’ పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఎంత ప్రాచుర్యం పొందిందంటే అప్పట్లో క్వీన్ విక్టోరియా ఆ పుస్తకం గురించి తెలుసుకున్నారట. ఈ పుస్తకం ఆధారంగా రూపొందుతున్న సినిమాయే ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది నవంబర్లో రిలీజ్ కానుంది. ఇందిర– మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఒక శక్తివంతమైన మహిళగా ఇందిరా గాంధీ భారత రాజకీయాల్లో ఎంత క్రియాశీలకంగా వ్యవహరించారో అందరికీ తెలుసు. దేశ ప్రధానిగా రాజకీయాల్లో ఇందిరాగాంధీ తనదైన ముద్రను వేశారు. ఆమె జీవితం ఆధారంగా అనేక పుస్తకాలు వచ్చినా పాత్రికేయురాలు సాగరిక ఘోష్ రాసిన ‘ఇందిర: ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్’ ఎక్కువ మందిని ఆకర్షించింది. ఇప్పుడా పుస్తకం రైట్స్ను బాలీవుడ్ నటి విద్యాబాలన్ సొంతం చేసుకున్నారట. ‘ఇందిరా గాంధీ పాత్రలో నటించాలన్న ఇంట్రెస్ట్ నాకు ఉంది. ఈ రోల్ చేయడానికి ఎగై్జటింగ్గా ఎదురు చూస్తున్నాను’ అని ఈ మధ్య ఓ సందర్భంలో విద్యాబాలన్ అన్నారు. కనుక ఇందిరాగాంధీని తెర మీద చూసే రోజులు త్వరలోనే రానున్నాయన్న మాట. ద గాళ్ ఆన్ ది ట్రైన్ ట్రైన్లో విండో సీట్ దొరికితే ఫుల్ హ్యాపీ. జర్నీని ఎంజాయ్ చేయొచ్చు అనే ఊహతోనే ట్రైన్ ఎక్కింది ఓ అమ్మాయి. కానీ ఓ దంపతులను చూసి సమస్యలో పడింది. ఎందుకంటే ఆ అమ్మాయి చూసిన భార్యాభర్తల్లో ఒకరు మిస్సింగ్. నెక్ట్స్ ఏంటీ? పౌలా హాకిన్ రాసిన ‘ద గాళ్ ఆన్ ది ట్రైన్’ నవల ఉత్కంఠగా ఉంటుంది. ఈ ఉత్కంఠను సిల్వర్ స్క్రీన్పై హిందీలో చూడాలంటే కొంతటైమ్ పడుతుంది. ఈ పుస్తకం ఆధారంగా రిభు దాస్గుప్తా దర్శకత్వంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ టైటిల్ రోల్లో ఓ సినిమా రూపొందనుంది. అయితే ఇదే కాన్సెప్ట్ ఆధారంగా హాలీవుడ్లో రూపొందిన సినిమా రెండేళ్ల కిత్రం విడుదలైంది. ది ఫ్లైట్ ఆఫ్ ఒసామా బిన్లాడెన్ ఒసామా బిన్లాడెన్.. ఉగ్రవాద ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. 2001లో సెప్టెంబర్ 11న జరిగిన యూఎస్ ఎటాక్స్కు ఒసామా బిన్లాడెన్ కారకుడని ప్రపంచం కోడై కూసింది. అమెరికా ప్రభుత్వం కూడా లాడెన్ను మట్టుబెట్టాలని అనేక ప్లాన్స్ వేసింది. ఆ మధ్య బిన్లాడెన్ హతమయ్యాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బిన్లాడెన్పై ఆండ్రియన్ లెవీ ఖ్యాతీ స్కాట్క్లార్క్స్ రాసిన పుస్తకం ‘‘ది ఎక్సైల్: ది ఫ్లైట్ ఆఫ్ ఒసామా బిన్లాడెన్’’. ఈ పుస్తకం ఆధారంగా ఓ సినిమా రూపొందనుంది. ఈ బుక్ రైట్స్ను జంగిల్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ కొనుగోలు చేసింది. విశాల్ భరద్వాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని టాక్. ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ ప్రేమికులిద్దరూ క్యాన్సర్ పేషెంట్స్. గుర్తొచ్చింది కదూ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘గీతాంజలి’ సినిమా. ఈ సినిమాకు రీమేక్ కాదట కానీ.. బీటౌన్లో ఆల్మోస్ట్ ఇదే కాన్సెప్ట్తో ఓ సినిమా రూపొందనుంది. సుశాంత్సింగ్ రాజ్పుత్, సంజనా సంఘీ జంటగా నటించనున్నారు. ముఖేష్ చబ్రా దర్శకుడు. జాన్గ్రీన్స్ రాసిన రొమాంటిక్ డ్రామా ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. జోష్ భూన్ దర్శకత్వంలో రూపొందిన హాలీవుడ్ మూవీ ‘ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’కు రీమేక్ ఇది. సీరియస్ మెన్ తన కొడుకు గొప్ప ప్రయోజకుడు కావాలని తండ్రి కలలు కనడంలో తప్పు లేదు. కానీ తన కొడుకును గొప్ప తెలివైనవాడిగా అందరికీ చెప్పుకున్నాడు ఓ క్లర్క్. కానీ వాళ్ల అబ్బాయి అంత ప్రతిభావంతుడేం కాదట. మరి.. ఆ పరిస్థితులను ఆ పదేళ్ల అబ్బాయి ఎలా ఫేస్ చేసాడు? ఇలాంటి ఆసక్తికర అంశాల ఆధారంగా జర్నలిస్ట్ మను జోసెఫ్ రాసిన పుస్తకం ‘సిరీయస్ మెన్’. మరో జర్నలిస్ట్–నిర్మాత సెజల్ షా ఈ పుస్తక హక్కులను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఈ పుస్తకం ఆధారంగా సినిమాను తెరకెక్కించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని బీటౌన్ టాక్. టిక్లీ అండ్ లక్ష్మీబాంబ్ పరిస్థితుల ప్రభావం వల్ల ఇద్దరు మహిళలు సెక్స్ వర్కర్స్గా మారాల్సి వచ్చింది. దళారుల ధనదాహానికి దేహం బలి అవుతున్నా ఫలితం మాత్రం దక్కడం లేదు. అందుకే సొంతంగా వారే బిజినెస్ చేద్దాం అనుకున్నారు. తర్వాత ఏమైందనేది కథ. ‘టిక్లీ అండ్ లక్ష్మిబాంబ్’ పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. చిత్రాంగద, సుచిత్రా పిళ్లై, ఉపేంద్ర లిమె, సహర్ష్ కుమార్ శుక్లా నటించనున్నారు. ఈ సినిమాతో ఆదిత్యా కృప్లానీ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ద కన్ఫెషన్ ఆఫ్ సుల్తానా డాకు యునైటెడ్ ప్రావిన్స్ (ఇప్పటి ఉత్తరప్రదేశ్, ఉత్తరాంఖడ్)ను గజగజలాడించాడు ఓ బందిపోటు సుల్తానా డాకు. తుదకు బ్రిటిస్ ఆఫీసర్లకు పట్టుబడి ఉరిశిక్ష అనుభవించాడు. తొమ్మిదేళ్ల కిత్రం సుజిత్ సారాఫ్ రాసిన నవల ‘ద కన్ఫెషన్ ఆఫ్ సుల్తానా డాకు’లో ఈ బందిపోటు గురించి లోకానికి తెలియచేసింది. దాని ఆధారంగా ముధురిత ఆనంద్ ఓ సినిమాను రూపొందిస్తున్నారు. రణ్దీప్ హుడా నటిస్తున్నారు. ఆర్యావతార క్రానికల్ సిరీస్ అమరత్వం గోవింద, కౌరవ, కురుక్షేత్ర.. ఈ మూడు భాగాలను కలిపి ఆర్యావతార క్రానికల్ సిరీస్గా రిలీజ్ చేశారు రచయిత కృష్ణ ఉదయశంకర్. వారియర్ అశ్వద్ధామ జీవితం ఆధారంగా ఈ పుస్తకం కథనం ఉంటుంది. ఈ పుస్తకం హక్కులను హిందీ నిర్మాణ సంస్థ పాంథమ్ ఫిలిమ్స్ సొంతం చేసుకుంది. త్వరలో ఈ హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ సెట్స్పైకి వెళ్లనుందని టాక్. అలాగే ఇండో–అమెరికన్ రచయిత కరణ్ బజాజ్స్ బుక్ ‘జానీ గాన్ డౌన్’ పుస్తకం ఆధారంగా కూడా బాలీవుడ్లో ఓ సినిమా రూపొందనుందని టాక్. బుక్స్ ఆధారంగా తెరకెక్కే చిత్రాలు ఇప్పటికే కొన్ని సెట్స్పైకి వెళ్లాయి మరికొన్ని ఆన్ ద వేలో ఉన్నాయి. ఇంకొన్ని చర్చల్లో ఉన్నాయి. మరి.. ముందు ముందు ఇంకెన్ని పుస్తకాలు సిల్వర్ స్క్రీన్పైకి వస్తాయో వెయిట్ అండ్ సీ. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ దేశప్రధానిగా మన్మోహన్ సింగ్ బాధ్యతలను నిర్వర్తించినప్పుడు కొందరు మెచ్చుకున్నారు. మరికొందరు విమర్శించారు. ఆయన పదవీకాలం ముగిసిన చాన్నాళ్ల తర్వాత ఆయన ఎన్నో గొప్ప పనులు చేశాడని మరికొందరు అర్థం చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారుగా ఉన్న సంజయ్ బారు రాసిన ‘ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ది మేకింగ్ అండ్ అన్మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్’ పుస్తకం సంచలనం సృష్టించింది. దాని ఆధారంగా బాలీవుడ్లో ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రాన్ని విజయ్ గెట్టే తెరకెక్కిస్తున్నారు. మన్మోహన్ సింగ్ పాత్రలో అనుపమ్ఖేర్ నటిస్తున్నారు. డిసెంబర్లో రిలీజ్. -
ఈవారం పుస్తకాలు
ఆశాదోషము (తొలి తెలంగాణ నవల) రచన: బరారు శ్రీనివాస శర్మ; గ్రంథ సేకర్త: నాగలింగ శివయోగి; సంపాదకుడు: డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్; పేజీలు: 194; వెల: 100; ప్రచురణ: పాలమూరు సాహితి, మహబూబ్నగర్; ప్రతులకు: హేరూర్ శోభా విజయ్కుమార్, 3–4–468, రెడ్డి ఉమెన్స్ కళాశాల ఎదురుగా, బర్కత్పుర, హైదరాబాద్–2. ఫోన్: 9849084918 తావొ తె చింగ్ మూలం: లావో త్సు; తెలుగు అనువాదం: దీవి సుబ్బారావు; పేజీలు:100; వెల: 100; ప్రతులకు: నవోదయా బుక్ హౌజ్, కాచిగూడ, హైదరాబాద్. ఫోన్: 9247471361 రాచపాళెం పీఠికలు సంకలనం: డాక్టర్ తన్నీరు నాగేంద్ర; పేజీలు: 200; వెల: 150; ప్రతులకు: సంకలనకర్త, పాల్యం గ్రామం, పమిడి మండలం, అనంతపురం జిల్లా. ఫోన్: 9949344032 తొణకని వాక్యం కోట్ల వెంకటేశ్వర రెడ్డి కవిత్వం; పేజీలు: 176; వెల: 150; ప్రచురణ: ధ్వని ప్రచురణలు, మహబూబ్ నగర్; కవి చిరునామా: 4–31/1/2, భగీరథ కాలనీ, మహబూబ్నగర్. ఫోన్: 9440233261 అభాగ్య జీవనాల భాగ్యనగరం రచన: కవిని ఆలూరి; పేజీలు: 90; వెల: 80; ప్రతులకు: రచయిత్రి, 12–13–773, వీధి నం.1, కిమ్తీ కాలనీ, తార్నాక, సికింద్రాబాద్–17. ఫోన్: 9701605623 -
పాఠశాల విద్యార్థులకు మాట్లాడే పుస్తకాలు
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక తరగతుల విద్యార్థులను చిన్న చిన్న కథలతో ఆకట్టుకునేందుకు, విజ్ఞానాన్ని అందించేందుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. టీచర్లు చెప్పేది వినడం, చదవడం కన్నా అంశాలను మాటలు, పాటల రూపంలో వింటే వారిలో మరింత ఆసక్తి పెంచొచ్చని మాట్లాడే పుస్తకాలను అందుబాటులోకి తేనుంది. యూనిసెఫ్ రూపొందించిన ఈ పుస్తకాలను ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని 200 పాఠశాలలకు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు పాఠశాల విద్య కమిషనర్ కిషన్ వెల్లడించారు. వీటిని తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ముద్రించినట్లు వెల్లడించారు. 10 రకాల అంశాలపై 100 పుస్తకాలను ముద్రించారని, ఒక్కో అంశంపై 10 పుస్తకాలున్నట్లు తెలిపారు. స్వచ్ఛ పర్యావరణం, హరిత పర్యావరణం, బాల కార్మికులు, వ్యక్తిగత పరిశుభ్రత, వ్యక్తిగత భద్రత, బాలికా విద్య, జీవన నైపుణ్యాలు, పెంపుడు జంతువులు, నీటి వనరుల నిర్వహణ, సమతుల ఆహారంపై ముద్రించారు. ఎలా పని చేస్తుందంటే.. డాల్ఫియో టాకింగ్ పెన్ (రీడర్) సహాయంతో పుస్తకంలోని అంశాలు మాటల రూపంలో వినబడతాయి. పేజీలోని అంశాలపై పెన్నును పెడితే ఆ అంశం మా టల రూపంలో వినిపిస్తుంది. అది పాట అయితే పా ్డ్డ్డటగా, కవిత అయితే కవితగా, కథ అయితే కథ చెప్పినట్లుగానే వినిపిస్తుంది. ఏ పదంపై పెడితే అంతవరకే వినిపించేలా లేదా ఒక వరుసపై పెడితే ఆ మొత్తం చదివేలా రీడర్లో మార్పులు చేసుకోవచ్చు. బొమ్మల వద్ద ఉంచితే వాటి సంభాషణ కూడా వినొచ్చు. -
మేం చేస్తాం ఇవ్వండి
ఓర్పు, నేర్పు మహిళలకే అధికం. మగవాళ్లది భుజ బలం అనుకుంటే, మగువలది మనోబలం. కొత్త పని, కష్టమైన పని చేయడానికి మగువ ముందొక దారి వేస్తే, ఆ తర్వాత పురుషుడు ఆ దారిలో పయనించిన సందర్భాలు చరిత్రలో అనేకం కనిపిస్తాయి. 1930లలో యు.ఎస్.లో మారుమూల కొండప్రాంతాల వారికి పుస్తకాలు అందుబాటులో ఉండేవి కాదు. పుస్తకం ఉన్న ఇల్లంటే గొప్ప. స్కూళ్లలో కూడా అంతే. గ్రంథాలయం ఉంటే అది గొప్ప స్కూలు. ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు... ఈ కొండ ప్రాంతాల వారికి పుస్తకాలు సరఫరా చెయ్యడం ఎలా అని చిన్న సమావేశం కూడా ఏర్పాటు చేసి, ఆలోచనలు జరిపారు. మొబైల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అంతా అన్నారు కానీ.. ఆ కొండల్లోకి, గుట్టల్లోకి, మంచు ప్రదేశాల్లోకి వాహనాలు వెళ్లలేవు. ‘సరే అయితే, గుర్రాలపై పంపిద్దాం’ అన్నారు రూజ్వెల్ట్! చదువుకునే వాళ్ల సంఖ్య తగ్గితే అమెరికా అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన ఆందోళన. గుర్రాలైతే సిద్ధంగా ఉన్నాయి. పుస్తకాలూ సిద్ధంగా ఉన్నాయి. మరి గుర్రాలను స్వారీ చేసేవారెవరు? పుస్తకాలను రవాణా చేసేవారెవరు? మొదటైతే మగవాళ్లెవరూ ముందుకు రాలేదు. మగువలే ఉత్సాహంగా వచ్చి ‘మేం చేస్తాం’ అన్నారు! ప్రెసిడెంట్కి సంతోషం వేసింది. గుర్రాలపై స్వారీ చేస్తూ పుస్తకాలు మోసుకెళ్లడం. పాఠశాలలకు ఇవ్వడం. ఇళ్లకు మామూలు పుస్తకాలను చేరవేయడం, వాళ్లు చదివిన పుస్తకాలను తిరిగి తీసుకోవడం, ఎవరైనా పెద్దవాళ్లు చదివి వినిపించ మని కోరితే వారితో కొద్దిసేపు కూర్చొని పుస్తక పఠనం చేయడం.. ఈ బాధ్యతలనన్నింటినీ మహిళలు చక్కగా నిర్వర్తించారు. ‘బుక్ ఉమెన్’ అని వాళ్లకు పేరు. కొండపైన ఉండే కాలనీల్లోకి బుక్ ఉమెన్ వస్తున్నారంటే పండుగ వచ్చినట్లే ఉండేది. 1943 వరకు ఈ గుర్రపు గ్రంథాలయాలు నిరాటంకంగా నడిచాయి. నడవడం కాదు, మహిళలు నడిపించారు. ఆ తర్వాత నిధుల్లేక ఆగిపోయాయి. మహిళలకు అప్పగించిన పని ఏదైనా నిధుల్లేక ఆగిపోవల్సిందే కానీ, నిబద్ధత లేక ఆగిపోయింది ఒక్కటీ కనిపించదు. చరిత్రను తిరగేసి చూడండి. వర్తమానాన్నీ తరచి చూడండి. ఎక్కడా కనిపించదు. దేశాలను ప్రభుత్వాలు నడుపుతాయి. ప్రభుత్వాలను పథకాలు నడుపుతాయి. పథకాలు మహిళలు నడిపితేనే ఫలవంతం అవుతాయి. -
ఐదంతస్తుల్లో 12 లక్షల పుస్తకాలు
పుస్తక పురుగులకు బుక్స్ ఇచ్చి వదిలేస్తే చాలు గంటలు గంటలు అలాగే చదువుకుంటూ ఉండిపోతారు. ఇక ఈ ఫొటోలో ఉండే గ్రంథాలయంలో కానీ వారిని విడిచిపెడితే ఇక ఇంటిముఖం చూడనే చూడరేమో! ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ఆహ్లాదకరమైన గ్రంథాలయాన్ని చైనా ప్రారంభించింది. ఈ గ్రంథాలయాన్ని చూడటానికి రెండు కళ్లూ సరిపోవంటే అతిశయోక్తి కాదేమో! అతిపెద్దగా సర్పిలాకారంలో ఉన్న ఈ గ్రంథాలయ ఆడిటోరియం అక్కడి ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అత్యద్భుతమైన ఆర్కిటెక్చర్ పనితనంతో ఔరా అనిపించేలా నిర్మించారు. చైనా టియాంజిన్లోని బిన్హై కల్చరల్ జిల్లాలో ఈ గ్రంథాలయం ఉంది. దీన్ని టియాంజిన్ అర్బన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్, డచ్ డిజైన్ కంపెనీ ఎంవీఆర్డీవీ సంస్థలు నిర్మించాయి. 34 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో సుమారు ఐదంతస్తుల్లో ఉన్న ఈ గ్రంథాలయంలో 12 లక్షల పుస్తకాలు కొలువై ఉన్నాయి. ఇంత పెద్ద గ్రంథాలయ నిర్మాణం పూర్తి చేయడానికి అక్కడి అధికారులకు మూడేళ్ల సమయం పట్టింది. గ్రౌండ్ ఫ్లోర్ను పుస్తకాలు చదవడానికి, మధ్య భాగం సేద తీరడానికి, చర్చించుకోవడానికి వినియోగిస్తున్నారు. కార్యాలయాలు, కంప్యూటర్, ఆడియో రూములను పైభాగంలో ఏర్పాటు చేశారు. -
పుస్తక ప్రియుల కోసం హోటల్ లైబ్రరీ
కొంతమందికి పుస్తకాలంటే ఎంతో మక్కువ.. పుస్తకాలుంటే చాలు ఇంకేమీ పట్టదు. పుస్తకాలు ఇచ్చి వారిని అలా వదిలేస్తే చాలు చదువుకుంటూ గంటలు గంటలు గడిపేస్తారు. ఈ పుస్తకాల పురుగులు ఏదైనా టూర్ లేదా విహార యాత్రలకు వెళితే తమ బ్యాగులో పుస్తకాలు తప్పకుండా ఉండాల్సిందే. అయితే పోర్చుగల్లోని ఓబిడోస్ అనే గ్రామంలోని లిటరరీ మ్యాన్ ఓబిడోస్ హోటల్కెళ్లే పర్యాటకులకు మాత్రం ఆ అవసరం లేదు.. ఎందుకంటే ఆ హోటలే ఒక చిన్న సైజు గ్రంథాలయం కాబట్టి.. దీన్ని 2015లో ప్రారంభించారు. ఇప్పటివరకు ఈ హోటల్లో దాదాపు 50 వేల పుస్తకాలను అందుబాటులో ఉంచారు. పుస్తకప్రియుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని కొన్ని రోజుల్లో ఆ సంఖ్యను లక్షకు పెంచనున్నట్లు హోటల్ యజమానులు చెబుతున్నారు. ఇందులో పద్య రచనలు, నవలలు, వంటలు, కథల పుస్తకాలతో పాటు దాదాపు అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయంట. అయితే ఇవన్నీ ఇంగ్లిష్ భాషలో ఉన్నాయి. పుస్తకం చదవడం పూర్తవక ముందే హోటల్ రూమ్ను ఖాళీæ చేయాల్సి వచ్చినా ఏం పర్లేదు.. ఎందుకంటే ఆ పుస్తకానికి తగిన ధర చెల్లించి ఎంచక్కా ఇంటికి తీసుకెళ్లే వెసులుబాటు ఆ హోటల్లో ఉంది. అయితే చాలామంది పుస్తక ప్రేమికులు పుస్తకాలను వెంట తీసుకెళ్లడం మానేసి ఆ హోటల్ ఐడియాకు మెచ్చి వారే కొన్ని పుస్తకాలను బహుమతులుగా ఇచ్చి వెళుతున్నారు. అయితే ఆ హోటల్లోని పుస్తకాలను చదవడానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకున్నా.. హోటల్లో ఒక రాత్రి స్టే చేయాలంటే మాత్రం 90 డాలర్లు చెల్లించాలి సుమా..! -
నాకు నచ్చిన ఐదు పుస్తకాలు
అనుక్షణికం (వడ్డెర చండీదాస్) ఆత్మన్యూనతా భావంతో కొట్టుమిట్టాడుతున్న నన్ను శ్రీపతి, గంగినేని రవి, మోహన్రెడ్డి, గాయత్రి, స్వప్నరాగలీన పాత్రలు సేదతీర్చాయని చెప్పడానికి సిగ్గుపడను. రచయిత ఎక్కడా కనబడకుండా పాత్రలతో పలికించిన అనేక భావాలు, ఆ వెల్లడించిన తీరు జీవితంలో నాకెంతో ధైర్యాన్నీ, సంఘం మీద ఒక అవగాహననూ ఇచ్చాయి. అందుకే చండీదాస్ మీద కృతజ్ఞతగా నా కుమార్తె పేరు ‘హిమజ్వాల’ అని పెట్టుకున్నాను. చివరకు మిగిలేది(బుచ్చిబాబు) ‘‘చివరకు మిగిలేది’ చదివే నేను డిగ్రీలోనూ, పీజీలోనూ ఫిలాసఫీ చదివాను’ అంటాడు చండీదాస్. నేను ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడే రేడియోలో విన్నట్లు గుర్తు. తర్వాత రెండేళ్లకు పుస్తకంగానూ చదివాను. ఏదో తెలియని బాధ, అశాంతి, ఒక రకమైన వేదన అనుభవించాను. ఆ తర్వాత ఎన్నోసార్లు చదివాను. ఆ గాఢత తగ్గింది లేదు. ఇప్పటికీ మొదలుపెడితే ఆపలేను. దయానిధి, అమృతం, కోమలి కళ్లెదురుగా కదలాడుతున్నట్లే వుంటుంది. పథేర్ పాంచాలి (బిభూతిభూషణ్ బంధోపాధ్యాయ) పశ్చిమ బెంగాల్లోని ఒక పల్లెలో ఆ పేద బ్రాహ్మణ కుటుంబం, కట్టెలా వుండే ఆ ముసలమ్మ, ఆ ఇల్లాలు బిడ్డలకు ఆహారం పెట్టడానికి పడే తపన, వంట సామగ్రిని విధిలేక విక్రయించడం, అక్క దుర్గ, తమ్ముడు అపు కొత్తగా వచ్చే రైలును వింతగా చూడటం, ఆ ఇంటి యజమాని ఎక్కడో వైదికం చేసుకుంటూ ఇంటికి వచ్చి కూతురి కోసం వెతకడం, భార్య ‘ఇంకెక్కడి కూతురు... జ్వరంతో కాలంచేసిం’దని పొగిలి పొగిలి ఏడవడం, చివరికి వారు ఆ వూరు విడిచి వెళ్లిపోవడంతో క«థ ముగిసేటప్పటికి గుండె బరువెక్కి ఓ పదిరోజులు బ్రతుకు భారంగా గడిచింది. అన్నా కరేనినా (లియో టాల్స్టాయ్) ప్రపంచ సాహిత్యంలో టాల్స్టాయ్ ఎంత గొప్ప రచయితో ‘వార్ అండ్ పీస్’ చదివిన వాళ్లకు తెలుసు. కాని ఒక జీవితం, ఒక సంసారం, ఒక సమాజం అంటే ఏమిటో నాకు తెలియజెప్పిన నవల మాత్రం ‘అన్నా కరేనినా’. ఇంటర్మీడియెట్లో ఉన్నప్పుడే పెద్దగా ఇంగ్లిష్ రాకపోయినా నిఘంటువు పక్కన పెట్టుకుని చదివాను. అన్నాను పీటర్స్బర్గ్ స్టేషన్లో చూసింది మొదలు వ్రోన్స్కీ పడే తపన ఆ తర్వాత జరిగిన కథ ఎంతో పరిణతితో రాశాడు రచయిత. అన్నా కళ్ళలో ఆ గ్రేస్నెస్, ఆ సౌందర్యంలో వుండే నిగూఢమైన ఆకర్షణ, ఆ వివరించిన పద్ధతి అనితర సాధ్యం. చిత్రసుందరి (అఖిలన్) ఈ తమిళ నవలను మధురాంతకం రాజారాం అద్భుతంగా తెలుగులోకి అనువదించారు. అన్నామలై మేనమామ సహాయంతో చదువుకొని, తన ఇష్టాలను కాదనుకొని, కోర్కెలతో అర్రులుచాచే మేనమామ కుమార్తె సుందరిని పెళ్ళాడి, ఆమె అనుమానాలు సాధింపులు పట్టింపులు భరించలేక క్రుంగిపోతాడు. అతడి మీద కసితీర్చుకోవాలని సుందరి ఆత్మహత్యతో అంతమౌతుంది. అన్నా కరేనినాకూ చిత్రసుందరికీ పోలికలున్నాయని అనిపిస్తుంది. డి.రామచంద్రరాజు 9908324214 -
సర్జికల్ దాడులపై ఓ సినిమా, రెండు పుస్తకాలు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్ దాడులు నిర్వహించి సెప్టెంబర్ 28 నాటికి ఏడాది పూర్తయిన వేళ ఈ ఘటనను ఆధారంగా తీసుకుని ఓ చిత్రంతో పాటు రెండు పుస్తకాలు రానున్నాయి. ‘ఉడీ’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి అధియా ధార్ దర్శకత్వం వహిస్తుండగా, రోన్నీ స్క్రూవాలా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భారత బృందానికి నేతృత్వం వహించిన కమాండర్గా విక్కీ కౌశల్ నటిస్తున్నారు. దీంతోపాటు జర్నలిస్ట్, రచయిత నితిన్ గోఖలే రాసిన ‘ఇన్ సెక్యూరింగ్ ఇండియా ది మోదీ వే: పఠాన్ కోట్, సర్జికల్ స్ట్రైక్స్ అండ్ మోర్’ పుస్తకాన్ని శుక్రవారం ఢిల్లీలో ఆవిష్కరించనున్నారు. సర్జికల్ దాడులతోపాటు భారత సైనికుల ప్రదర్శించిన అసమాన సాహసాలతో శివ్ అరూర్, రాహుల్ సింగ్లు రచించిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడ్రన్ మిలటరీ హీరోస్’ పుస్తకం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. -
ఇక ‘ఆంగ్ల’వాడీలు
– అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ – 10 మునిసిపాలిటీల్లో అమలుకు శ్రీకారం – నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో విద్యాబోధన – కార్యకర్తలకు కొనసాగుతున్న శిక్షణ – కిలోమీటర్ పరిధిలోని కేంద్రాలన్నీ ఒకే చోటుకు – బోధనా సామర్థ్యంపై సందేహాలు? అంగన్వాడీ కేంద్రాలు ఇక ఆంగ్ల వాడీలుగా మారనున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లల చదువుపై తల్లిదండ్రుల ఆలోచనల్లో వస్తున్న మార్పులకు పెద్ద పీట వేస్తూ ఆంగ్ల విద్యకు శ్రీకారం చుట్టారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో చిన్నారులకు విద్యాబోధనకు సర్వమూ సిద్ధం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో గత ఏడాదే ఈ తరగతులు ప్రారంభించేందుకు సిద్ధమైనా ఆచరణకు నోచుకోలేకపోయింది. తాజాగా జిల్లాలోని పట్టణ కేంద్రాల్లో ‘ప్రీ స్కూల్’ ఎడ్యుకేషన్ అందించాలని భావించిన సర్కారు అందుకు అనుగుణంగా అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. అంగన్వాడీ కేంద్రాలను మోడల్ కేంద్రాలుగా తీర్చిదిద్దనుంది. - అనంతపురం టౌన్ జిల్లాలో ప్రస్తుతం 17 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 5,126 మెయిన్, మినీ అంగన్వాడీ కేంద్రాలుండగా 4,082 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 3,698 మంది ఆయాలు పని చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలను మినహాయించి పట్టణాల్లో ‘ప్రీ స్కూల్’ ఎడ్యుకేషన్ అందించనున్నారు. ప్రస్తుతానికి అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం, హిందూపురం, రాయదుర్గం, ధర్మవరం, మడకశిర, పెనుకొండ, గుత్తి, తాడిపత్రి, కదిరి మునిసిపాలిటీలను ఎంపిక చేశారు. ఆయా ప్రాంతాల్లో కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకంగా కన్సల్టెంట్ను ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే కదిరిలో రెండ్రోజులు శిక్షణ ముగియగా అనంతపురం అర్బన్ పరిధిలోని కార్యకర్తలకు సీడీపీఓ కార్యాలయ ఆవరణలో శిక్షణ కొనసాగుతోంది. చిన్నారులకు ప్రత్యేక సిలబస్ అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యతో పాటు ఇంగ్లిష్ను సులువుగా నేర్పించడానికి ప్రత్యేక సిలబస్ను రూపొందించారు. ఏబీసీడీలతో పాటు చిన్నచిన్న పదాలు, బొమ్మల గుర్తింపు, రెయిమ్స్తో కూడిన వర్క్బుక్లు వచ్చాయి. వీటిని ఆయా సీడీపీఓ కార్యాలయాల్లో ఉంచారు. అక్కడక్కడా ప్రజాప్రతినిధులతో పంపిణీ చేయిస్తున్నారు. ఇక కార్పొరేట్ విద్యాసంస్థల్లో చేపట్టిన విధంగానే పండుగలు, ప్రత్యేక రోజులను కూడా నిర్వహించాలన్న ఆదేశాలు ఉన్నాయి. ఒకే చోటుకు మూడు కేంద్రాలు ప్రస్తుతం కిలోమీటర్ పరిధిలోపు ఉన్న మూడు అంగన్వాడీ కేంద్రాలను ఒక చోట చేర్చి తరగతులు ప్రారంభించనున్నారు. దీనికోసం ఇప్పటికే కేంద్రాల సంఖ్య, చిన్నారుల సంఖ్యతో అధికారులు నివేదిక తయారు సిద్ధం చేశారు. ఎన్ని విలీనం అవుతాయన్న దానిపై స్పష్టత లేదు కానీ, ఈ వివరాలను మాత్రం ఉన్నతాధికారులకు పంపారు. అక్కడి నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. వయస్సు, విద్యార్హతను బట్టి పిల్లలకు బోధించేందుకు అంగన్వాడీ కార్యకర్తలను కేటాయించనున్నారు. కాగా మూడు కేంద్రాలను ఓ చోట చేరిస్తే సెంటర్లకు వచ్చే పిల్లలు, గర్భిణులు, బాలింతల సంఖ్య తగ్గుతుందన్న భావన వ్యక్తమవుతోంది. అమలుపై సందేహాలు? నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు పాఠాలను బోధించే సామర్థ్యం అంగన్వాడీ కార్యకర్తలకు ఉందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వాస్తవానికి అంగన్వాడీ కార్యకర్తలకు పదో తరగతి విద్యార్హత ఉండాలి. కొన్ని చోట్ల పదో తరగతి ఉత్తీర్ణత కాని వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రవేశపెడుతుండడంతో ఆ మేరకు పిల్లలకు వారు బోధించగలరో లేదో అన్న సందేహం వ్యక్తమవుతోంది. అంగన్వాడీ కేంద్రాలను ఒక చోటుకు చేర్చాక ముగ్గురు కార్యకర్తలు అందుబాటులో ఉంటారు. వారిలో విద్యార్హతలను బట్టి తరగతులు చెప్పేలా చర్యలు తీసుకోనున్నారు. పిల్లల సంఖ్య పెరుగుతుంది అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహించడం వల్ల పిల్లల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తమ పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదవాలన్న తల్లిదండ్రుల ఆశ కూడా నెరవేరుతుంది. కేంద్రాల విలీనానికి సంబంధించి నివేదికను ఉన్నతాధికారులకు పంపాం. చిన్న చిన్న సమస్యలున్నాయి. వాటిని అధిగమించి తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేరుస్తాం. - ఉషాఫణికర్, ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీ సెమిస్టర్ వారీగా తరగతులు ఇంగ్లిష్లో పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించడంపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నాం. చిన్నారుల కోసం సులువైన సిలబస్ను రూపొందించారు. సెమిస్టర్ వారీగా తరగతులు జరుగుతాయి. కేంద్రాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కార్పొరేట్కు దీటుగా విద్యాబోధన ఉంటుందనడంలో సందేహం లేదు. సెంటర్లకు త్వరలోనే టీవీలు కూడా వస్తాయి. ప్రత్యేకంగా రైమ్స్, స్టోరీలు ఇన్స్టాల్ చేసిన పెన్డ్రైవ్లు అందిస్తాం. త్వరలోనే పిల్లలకు దుస్తులు, షూలు వస్తాయన్న ఆదేశాలు ఉన్నాయి. నిరుపేద చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాలు వరంకానున్నాయి. - రాజేశ్వరి, జిల్లా కన్సల్టెంట్ -
నిబంధనలు గాలికి..
► ఎమ్మార్పీ కంటే అధికరేట్లకు పుస్తకాల విక్రయాలు ► కార్పొరేట్ స్కూళ్లలో ఇదీ తీరు ► పట్టించుకోని విద్యాశాఖ అధికారులు పాఠశాలలు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే ఆలయాలు. ప్రసుతం అవి వ్యాపార కేంద్రాలుగా మారాయి. కొన్ని కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు వాటి అర్థం మారుస్తున్నాయి. ఒక్కో తరగతికి ఒక్కో ధర నిర్ణయించి ఎమ్మార్పీ కంటే అధిక రేట్లతో పుస్తకాలను పాఠశాలల్లోనే విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నాయి. టెక్నో, ఈటెక్నో, ఒలింపియాడ్ పేర్లతో మెటీరియల్ తయారు చేసినట్లు చెబుతూ వేలకు వేలు ఫీజులు గుంజుతున్నట్లు విద్యార్థుల తల్లితండ్రులు వాపోతున్నారు. కడప ఎడ్యుకేషన్: ప్రచార ఆర్భాటాలతో ప్రైవేటు సంస్థలు విద్యార్థులను ఆకర్షిస్తాయి. వీరిని పాఠశాలలో చేర్చుకునే సమయంలో కేవలం బోధన ఫీజు మాత్రమే అని చెబుతారు. తర్వాత అసలు కథ మొదలవుతుంది. అడ్మిషన్ ఫీజు చెల్లించాక మిగిలిన రసుంల గురించి వివరించటంతోపాటు పాఠ్యపుస్తకాలు కిట్ పాఠశాలలోనే కొనుగొలు చేయాలని నిబంధనలు పెడుతున్నారు.చేసేదేంలేక అడిగినంత చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు విక్రయించకూడదు. అయితే వీటిని పట్టించుకోకుండా విద్యార్థుల తల్లితండ్రులను దోచుకుంటున్నారు. దడపుట్టిస్తున్న ధరలు: పుస్తకాల ధరలు ఒక్కో పాఠశాలకు ఓ రేటు నిర్ణయించారు. కొన్ని పాఠశాలల్లో నర్సరీ పుస్తకాల కిట్ రూ.15 వందల నుంచి రూ.3 వేలు. యూకేజీకి రూ. 3200, ఎల్కేజీకి రూ. 3500. ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు రూ. 4 వేల నుంచి రూ. 6500 వరకు వసూలు చేస్తున్నారు. ఇక టెక్నో, ఒలింపియాడ్, ఇంటర్నేషనల్ తదితర పేర్లు పెట్టి మరో వెయ్యి నుంచి రెండు వేల వరకు వసూళ్లు చేస్తున్నారు. కొరవడిన పర్యవేక్షణ: నిబంధనలకు విరుద్ధంగా చాలా ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు పుస్తకాలు విక్రయిస్తున్నా విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పాఠ్యççపుస్తకాలు తక్కువ ధరలకు ఇస్తున్నా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో మాత్రం వేలకువేలు గుంజుతూ విద్యార్థుల తల్లితండ్రుల జేబులకు చిల్లులు వేస్తున్నారు. ఇçప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పరిశీలిస్తాం: కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాల్లో పుస్తకాల విక్రయం గురించి కడప డిప్యూటీ డీఈఓ జిలానీబాషాతో మాట్లాడగా సంబంధిత సమస్య మా దృష్టికి రాలేదన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
నొప్పింపక తానొవ్వని పసిడి మనసులు
పుస్తక సమీక్ష సమకాలీన సమాజంలోని అన్ని సమస్యాత్మకమైన కథావస్తువులను తనదైన శైలిలో ఆవిష్కరించి, అందులోని మంచిచెడులు పరిశీలించి, గుణగణాలు చర్చించి, నొప్పింపక తానొవ్వని పరిష్కారాల వైపు ముగించిన ఫీల్ గుడ్ కథలు – సి.ఎస్.రాంబాబు ‘పసిడి మనసులు’ సంపుటిలోని 20 కథలు. ఇతివృత్తం ఎలాంటిదైనా దానిని కథగా మలచి పాఠకుడితో ఆగకుండా చదివించగల కథన కౌశలం వీటి నిండా కనిపిస్తుంది. కాలక్రమంలో వ్యవస్థలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. ఈ మార్పులు కొద్దిమందిని కలవరపరుస్తాయి. కొద్దిమంది కలతలు తీరుస్తాయి. మరికొద్దిమందికి కన్నీరు మిగులుస్తాయి. సరిగ్గా ఇక్కడే రచయిత తన హృదయాన్ని ఆవిష్కరిస్తాడు. కలతలు తీరిన వారిని అభినందిస్తూనే, కలవర పడే వారికి ధైర్యం చెబుతూ కన్నీరు తుడుస్తాడు. సమస్యలు అందరికీ ఎప్పుడూ ఉంటాయి, కానీ వాటిని పరిష్కరించుకోవడం వారి వారి ఆలోచనల మీద, వారి వారి చేతలలో వుంటుంది అని చెబుతుంటాయి, ఇందులోని ఆశావహ దృక్పథం కలిగిన పాత్రలు. ఈ ఇరవై కథల్లోనూ మానవ సంబంధాలే ప్రధాన అంశం. తండ్రులూ కొడుకులూ (పితౄణం, తండ్రీ నిన్ను తలంచి), తల్లీ కొడుకులు, వృద్ధాశ్రమాలు (కాలధర్మం, నిర్ణయం,కోరిక), దయ, జాలి కలిగిన పరోపకారులు (కొత్త పరుగు, మౌనం మాట్లాడింది, ఇరుకు, సమిధలు, పసిడి మనసులు, విశాలాక్షి), సర్దుకు పోయే జీవిత భాగస్వాములు, ఒక మంచిమాటతో మారిపోయే మంచి మనుషులు ఈ కథలలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు. ఇవి ప్రధానంగా పట్టణ, నగర మధ్యతరగతి విద్యావంతుల కుటుంబాలలో వస్తున్న మార్పులను, మారుతున్న కాలంతోపాటూ మారే ఆలోచనా విధానాలను, తరాల మధ్య అంతరాలను, అందులోని వైరుధ్యాలను, వాటివల్ల కలిగే మానసిక సంఘర్షణను చిత్రీకరించిన కథలు. కొత్త పరుగు, అబూమియా, తూరుపు పొద్దు, ఫిడేలు రాగాలు, స్వప్నగీత, ఋణానుబంధం కొంత వైవిధ్యమైన కథలు. మనుషుల్లోని కీర్తి కాంక్షను మంచిపని కోసం ఉపయోగించి విన్ –విన్ సిట్యుయేషన్ను సాధించడమే ‘కొత్త పరుగు’. ‘స్వప్నగీత’లో ఒక ఎన్ఆర్ఐ తన ఊరికోసం ఏదైనా చేయాలి అని పరివర్తన చెందడం ప్రధానం కాగా, ‘ఋణానుబంధం’ యాజమాన్యాల లాభాపేక్ష నిర్ణయాలకు బలైపోయిన కార్మికుని కథ. హైదరాబాద్ లోని మతసామరస్యాన్ని బలపరిచే కథ ‘అబూమియా’. తన సంగీతం కొడుక్కి రాలేదని ‘ఫిడేలు రాగాల’ తండ్రి బాధ పడితే, తన ఇంగ్లీష్ పిచ్చి వల్లే కొడుకు పాడయ్యాడని ‘తూరుపు పొద్దు’ తండ్రి చింతిస్తాడు. ఈ రెండు కథల్లో అతిశయించిన నాటకీయత విజ్ఞులయిన పాఠకులను అంతగా ఆకట్టుకోదు. అయితే తూరుపు పొద్దు కథకు రచయిత ఎంచుకున్న కథావరణం భిన్నంగా వుంది. ఋణానుబంధం, ఫిడేలు రాగాలు కథలలో పాత్రలు చనిపోవడం కేవలం కరుణ రసాత్మకమైన ముగింపు కోసమే అన్నట్టు తోస్తాయి. సరళమైన భాష, కథానుగుణమైన వర్ణనలు, సమయోచిత సంభాషణలు, మంచితనపు గుబాళింపులు ఈ సంపుటిలోని ప్రత్యేకతలు. సమస్యల లోతులను, మూలకారణాలను శోధిస్తూ, వైయక్తిక పరిష్కారాలతోపాటూ వ్యవస్థీకృతమైన పరిష్కారాల దిశగా అన్వేషిస్తూ ఈ రచయిత నుండి మరిన్ని మంచి కథలను ఆశించడం అత్యాశ కాదేమో! పసిడి మనసులు(కథలు); రచన: సి.ఎస్.రాంబాబు; పేజీలు: 168; వెల: 100; ప్రతులకు: రచయిత, 202, కీర్తన హోమ్స్, 11–1–530, మైలార్గడ్డ, సీతాఫల్మండి, హైదరాబాద్–61; ఫోన్: 9490401005 - జి.ఉమ 9849802521 -
ప్రభుత్వ స్కూళ్ళకు పాఠ్యపుస్తకాలు
కర్నూలు సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లకు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా ప్రభుత్వ పాఠ్య పుస్తకాల గోదాము మేనేజర్ శామ్యుల్ పాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2016 డిసెంబర్ యూడైస్ వివరాల ప్రకారం 27,79,971 పాఠ్యపుస్తకాలు అవసరమని, ఇందులో ఉచిత పాఠ్యపుస్తకాలు 21 లక్షలు అవసరమన్నారు. అయితే 351695 పుస్తకాలు పోను, 18.23 లక్షల పుస్తకాలు డీఈఓ ప్రతిపాదనలు చేశారని అన్నారు. మరో 7.71 లక్షల పుస్తకాలు వస్తే సరిపోతుందన్నారు. మొదటి రోజున దేవనకొండకి 45844 పుస్తకాలు అవసరం ఉండగా, 36336 పాఠ్యపుస్తకాలు, ఆస్పరికి 39,796కుగాను, 33,257 , ఆలూరుకు 41,295కుగాను 32,148, ఆదోనికి 1,42,785కు 99,782, హాలహర్వి మండలానికి 28,432కు 18704, హొళగుందకు 37,523 అవసరం కాగా 24,945, కౌతాళం మండలానికి 55,331 పుస్తకాలకు 35,870 ఆయా మండల కేంద్రాలకు పంపిణీ చేశామన్నారు. -
అమ్మో.. చదువుకొనలేం!
ఏలూరు (ఆర్ఆర్పేట) ఇన్నాళ్లూ స్కూలుకు వెళ్లాలంటే పిల్లలు భయపడేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు భయపడుతున్నారు. పిల్లల చదువుకు ఎంత ఫీజు కట్టమంటారో.. బస్సుకు ఎంత చెల్లించమంటారో అని.. ఇక పుస్తకాలు, టై, యూనిఫాం, బెల్టు, షూ.. అంటూ ఎంత బాదేస్తారో అంటూ గుండెల్లో గుబులు. పోనీ ఇవన్నీ బయట తీసుకుందామంటే యాజమాన్యాలు ససేమిరా అంటున్నాయి. ఇలా బడులు తెరిచే రోజులు దగ్గర పడే కొలదీ తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగిపోతోంది. జిల్లాలో చిన్నా చితకా ప్రైవేట్ పాఠశాలలు, ఒక మోస్తరు సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కలిపి సుమారు 1200 ఉన్నాయి. వీటిలో సుమారు 2.20 లక్షల మంది విద్యార్థులు అభ్యాసం చేస్తున్నారు. ఒక్కొక్క విద్యార్థికి ఫీజు కింద సుమారు రూ.6 నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. పుస్తకాలు, యూనిఫాం, టై, బెల్టు, షూ, వంటి సామగ్రి రూపంలో మరో రూ.5 నుంచి 7 వేల వరకూ బాదుడు. పుస్తకాల విషయంలో మరీ దోపిడీ. బహిరంగ మార్కెట్తో పోలిస్తే సుమారు 40 నుంచి 60 శాతం అధికంగా విద్యా సంస్థలు వసూలు చేస్తున్నాయని తల్లిదండ్రుల ఆరోపణ. బహిరంగ మార్కెట్లో పుస్తకాలపై 10 నుంచి 25 శాతం డిస్కౌంట్ ఇస్తుండగా విద్యా సంస్థల్లో మాత్రం ఒక్క రూపాయి కూడా తగ్గించడం లేదు. ఈ పరిస్థితి జిల్లా కేంద్రం ఏలూరుతో పాటు భీమవరం, తణుకు, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, నిడదవోలు వంటి ప్రాంతాల్లో అధికంగా ఉంది. కన్నెత్తి చూడని వాణిజ్య పన్నుల శాఖ చిన్నచిన్న దుకాణాలపై కూడా పన్నులు విధిస్తూ వసూలు చేసే వాణిజ్య పన్నుల శాఖ ప్రైవేటు విద్యా సంస్థల్లో సాగుతున్న ఇటువంటి వ్యాపారంపై కన్నెత్తి చూడ్డంలేదు. జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థలు ఏటా విద్యా సంవత్సరం ఆరంభంలో సుమారు రూ.300 కోట్లపైనే వ్యాపారం చేస్తున్నాయని అంచనా. దానిపై ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయం కూడా రావడం లేదు. ఇదిలా ఉండగా పెద్దనోట్ల రద్దు ప్రభావంతో అధిక మొత్తంలో నగదు అందుబాటులో లేని పరిస్థితి. కాగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో విక్రయిస్తున్న పుస్తకాలు, ఇతర సామగ్రికి చెల్లింపులు చేయడానికి వారి వద్ద స్వైపింగ్ యంత్రాలు కూడా అందుబాటులో లేకపోవడం తల్లిదండ్రులకు విషమ పరీక్ష. జీఓలు ఏం చెబుతున్నాయంటే.. జీవో నెంబర్ ఎంఎస్ 42 ప్రకారం ఫీజులను పెంచాలంటే డిస్ట్రిక్స్ రెగ్యులైజేషన్ కమిటీ అనుమతి తీసుకోవాలి. జీవో నెంబర్ ఎంఎస్ 246 ప్రకారం పాఠశాలల నిర్వాహణలో సమాజాన్ని భాగస్వామ్యం చేయాలి. సీబీఎస్ఈ చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో పేరెంట్ టీచర్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలి. ఈ అసోసియేషన్లలో ఇద్దరు తల్లిదండ్రులకు భాగస్వామ్యం కల్పించాలి. కమిటీ నిర్ణయించిన తరువాతనే ఫీజులను పెంచాలి. జీవో ఎంఎస్ నెంబర్ 1994 జనవరి ఒకటో తేదీ ప్రకారం పాఠశాలలు ఐదు శాతానికి తగ్గకుండా లాభాలను మాత్రమే ఆశించాలి. వసూలు చేసిన ఫీజుల్లో 50 శాతం మొత్తాన్ని ఉపాధ్యాయుల వేతనాలకు చెల్లించాలి. ఏటా వార్షిక నివేదికలు, ఆడిట్ రిపోర్టులను ప్రభుత్వానికి సమర్పించాలి. జీవో ఎంఎస్ నెంబర్ 91 ప్రకారం వన్టైం ఫీజుగా రూ.100, రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.500 రిఫండబుల్ కాషన్ డిపాజిట్ రూ.5 వేలకు మించకుండా తీసుకోవాలి. జీవోలోని సెక్షన్ 1(సీ) ప్రకారం పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాంలను స్కూల్ యాజమాన్యం సూచించే చోటే కొనాలన్న ఖచ్చితమైన నిబంధనలేవీ పెట్టరాదు. వీటి అమ్మకాలకు పాఠశాలల్లో కౌంటర్లు ఏర్పాటు చేయరాదు. విద్యార్ధుల తల్లిదండ్రులకు నచ్చిన షాపుల్లో కొనుగోలు చేయవచ్చు. 2013 మే 16వ తేదీన జారీ చేసిన సీఅండ్డీఎస్ఈ ఆర్సీ నెంబర్ 780 సెక్షన్ ప్రకారం పాఠశాలల బోర్డులపై ఇంటర్నేషనల్, ఐఐటీ, ఒలిపింయాడ్, కాన్సెప్ట్, ఈ టెక్నో వంటివి తగిలించరాదు. కేవలం పాఠశాల అని మాత్రమే పేర్కొనాలి. కానీ ఆ నిబంధనలు పాటించని పలు ప్రైవేట్ విద్యా సంస్థలు ఇప్పటికీ ఆయా పేర్లు పెట్టి తల్లిదండ్రులను ఆకర్షిస్తూ వారిని ఈ విధంగా దోచుకుంటున్నాయని ఆరోపణ. అధికారుల పర్యవేక్షణ కొరవడింది ప్రైవేటు విద్యా సంస్థల్లో జరుగుతున్న ఇటువంటి దోపిడీపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా తెలుగు మీడియంతో పాటు ఇంగ్లిష్ మీడియం కూడా సమాంతరంగా ప్రవేశపెడితే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చే అవకాశం ఉంది. తెల్లరేషన్ కార్డు ఉన్న వారందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలనే నిబంధన విధిస్తే పరిస్థితి మెరుగుపడుతుంది. పువ్వుల ఆంజనేయులు, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు -
అమెజాన్ కన్నా అతనే బెటర్
కోల్కతా: మనకు మార్కెట్లో అందుబాటులోలేని పుస్తకమేకాదు, ప్రపంచంలో ఓ మారు మూల ప్రాంతానికి పరిమితమైన పుస్తకమైనాసరే, కొత్తగా అప్పుడే మార్కెట్లోకి వచ్చిన పుస్తకమే కాదు, ఎప్పుడో కనుమరుగైనా పుస్తకమైనా సరే, చివరకు నిషేధించినదైనాసరే, అవుటాఫ్ స్టాక్ పుస్తకమైనా సరే, మనం కోరుకుంటే ‘అమెజాన్’ కంటే వేగంగా, నమ్మకంగా మనకు తెచ్చిస్తాడు తరుణ్ కుమార్ షా. సాహిత్యం నుంచి సైన్స్ మాగజైన్ వరకు, సిడ్నీ షెల్డన్ నుంచి ఆండ్రీగైడ్ వరకు ఏ పుస్తకమంటే ఆ పుస్తకంతో మనముందు ప్రత్యక్షమవుతాడు తరుణ్ షా. ఇంట్లోనో, ఆషీసులోనోకాదు, గోల్ఫ్కోర్టులో, క్లబ్లో, విమానాశ్రయం లాంజిలో మనం ఎక్కడున్నా అక్కడికి మనల్ని వెతుక్కుంటూ వచ్చి మనం అడిగిన పుస్తకాన్ని అందజేస్తాడు. అందుకనే అతన్ని అందరూ తరుణ్ షా అని పిలుస్తారు. అమెజాన్ వెళ్లని చోటుకు తరుణ్ షా వెళతాడని అంటారు. ఇద్దరు నోబెల్ అవార్డు గ్రహితలు, ఎంతో మంది జ్ఞానపీఠ్ అవార్డు, మరెంతో మంది సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలున్నా కోల్కతా నగరంలో తరుణ్ దా అంటే తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. ప్రముఖ మీడియా కార్యాలయాలు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల వరకు, ఇతరులకు ప్రవేశంలేని అలిపోర్ నుంచి బల్లీగంజ్ బంగ్లా వరకు, హాలివుడ్ లైబ్రరీల నుంచి అకాడమిక్ సంస్థల వరకు ఆయన చొచ్చుకుపోని చోటంటూ ఉండదు. ఎంజే అక్బర్తో సహా ఎంతోమంది ఎడిటర్లు, రితిపర్ణో ఘోష్ లాంటి సినీ దర్శక నిర్మాతలు ఎంతో మందికి ఆయన సుపరిచితం. నాలుగేళ్ల క్రితమే మరణించిన రితిపర్ణో ఘోష్కు పుస్తకాలంటే పంచ ప్రాణాలట. ఆయనకు ఎన్నో పుస్తకాలు సేకరించి అందజేశారట. ఆయన చనిపోయిన తర్వాత రెండువేల పుస్తకాలను వారి కుటుంబ సభ్యులు మన తరుణా దా సమక్షంలోనే సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్కు ఇచ్చారట. ప్రస్తుతం 53వ ఏట అడుగుపెట్టిన తరుణ్ షా గత మూడు దశాబ్దాలుగా సంవత్సరాలుగా ఇదే వ్యాపారం చేస్తున్నారు. ఆయన తండ్రి గోపాల్ లాల్ షాకు 30 ఏళ్ల క్రితం బుక్స్టాల్ ఉండేది. నాటి తరం నుంచే పుస్తకాలు చదివే సంస్కతి అంతరించిపోతుండడంతో పుస్తకాలు కొనేవాళ్లు లేక ఆయన బుక్స్టాల్ను మూసేశారు. ముందుగా మిగిలిపోయిన పుస్తకాలను ఇల్లిల్లు తిరిగి విక్రయించడంలో భాగంగా బయల్దేరిన తరుణ్ దాకు రకరకాల మనస్తత్వం కలిగిన, భిన్న అభిరుచులు కలిగిన పుస్తక అభిమానులు తారసపడ్డారు. వారికి అనుకూలమైన పుస్తకాలను సూచించడంతోపాటు వారికి అవి ఎక్కడున్నా తెచ్చి అమ్మేవారు. పుట్టిన రోజు నుంచి పెళ్లి వేడుకల వరకు ఎలాంటి పుస్తకాలు గిఫ్ట్గా ఇస్తే బాగుంటుందో నగర ప్రజలు ఆయన్ని వాకబు చేసి మరీ తెప్పించుకుంటున్నారు. సింగపూర్లో ఐటీ నిపుణుడిగా పనిచేస్తున్న తన కుమారుడు సహాయంతో తరణ్ షా వివిధ రకాల పుస్తకాలను తెప్పించుకునేందుకు ఇంటర్నెట్ ద్వారా ఓ ప్రత్యేక నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నారు. తన వ్యాపారానికి పెద్దన్నయ్యను కూడా తోడాగా తెచ్చుకున్నారు. ఎక్కడికైనా తరుణ్ షా స్కూటర్పైనే పుస్తకాలను డెలివరి చేస్తారు. ఒక్క ఆంగ్ల, బెంగాలీ పుస్తకాలను మాత్రమే ఆయన విక్రయిస్తున్నారు. అందుకు కారణం పాఠకుల నుంచి వాటికి మాత్రమే డిమాండ్ ఉండడం. సాహిత్యానికి, పాఠకులకు పుట్టిల్లుగా ప్రసిద్ధి చెందిన కోల్కతాలో పఠనాసక్తిని తరుణ్ దా బతికిస్తున్నాడని చెప్పవచ్చు. -
సకాలంలో..సాధ్యమేనా..?
- ఏటా ఇదే మాట ... చేతికి అందని పుస్తకం - ఏ పుస్తకం లేకుండానే నెలలతరబడి కాలక్షేపం - అప్పటి విద్యాశాఖ డైరెక్టర్ కృషి ఫలితం 2014లో మాత్రమే నెరవేరిన లక్ష్యం - ఈ విద్యా సంవత్సరంలోనూ ఎండమావేనా...? - జిల్లాలో 3,190 ప్రాథమిక, 361 ప్రాథమికోన్నత, 634 ఉన్నత పాఠశాలలు, 14 హయ్యర్ సెకండరీ పాఠశాలలు ఉన్నాయి. - ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న సుమారు నాలుగు లక్షల మంది తెలుగు, ఇంగ్లిషు, ఉర్దూ మీడియం విద్యార్థులకు ఈ ఏడాది 24 లక్షల పాఠ్య పుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖ ప్రతిపాదన. - ఇప్పటికే పుస్తక డిపోలో 1.40 లక్షల పుస్తకాలున్నాయి. ఇందులో 40శాతం ఇంగ్లిషు మీడియం, 60 శాతం తెలుగు మీడియం పుస్తకాలు అవసరం. - మార్చి 20తో విద్యా సంవత్సంర ముగుస్తోంది. ఇప్పటి వరకూ కానరాని కొత్త స్టాకు రాయవరం: విద్యార్థికి, ఉపాధ్యాయుడికి పాఠ్య పుస్తకం ఎంతో అవసరం. అటువంటి పాఠ్య పుస్తకాలను సకాలంలో అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ఈ ఏడాది విద్యా సంవత్సరం మార్చి 20తోనే ముగుస్తోంది. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందజేస్తామని ప్రభుత్వం చెప్పే మాట. వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు సకాలంలో అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండగా అవి సకాలంలో చేరుకుంటాయా అనేది సందేహాస్పదంగా ఉంది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఏప్రిల్ నెలాఖరుకు పుస్తకాల గోదాంకు చేరే అవకాశం ఉన్నట్లు ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయి. ఏటా ప్రహసనమే.. ప్రతి ఏటా పాఠ్య పుస్తకాలు సమయానికి విద్యార్థులకు అందడం లేదు. 2014లో మాత్రమే ఫిబ్రవరి నెలలో పాఠ్యపుస్తకాలు పాఠశాలలకు చేరి పంపినీ ప్రహసనంగా మారుతోంది. విద్యా సంవత్సరం ముగియడానికి ముందుగానే పాఠ్య పుస్తకాలు పాఠశాలలకు చేరాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అప్పుడే విద్యా సంవత్సరాన్ని క్రమపద్ధతిలో ప్రారంభించడానికి వీలవుతుందన్నది సుస్పష్టం. పాఠ్య పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా విద్యా సంవత్సరం ప్రారంభమైనా పాఠ్య పుస్తకాలు సకాలంలో విద్యార్థులకు చేరడం లేదు. 2014లో మాత్రమే బడులు తెరిచిన రోజునే పాఠ్య పుస్తకాలు అందజేశారు. అప్పట్లో రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్గా పనిచేసిన పూనం మాలకొండయ్య ముందుచూపుతో వ్యవహరించినందునే పిల్లలకు ప్రయోజనం చేకూరింది. 2015లో ఆగస్టు నాటికి కూడా పాఠశాలలకు పూర్తి స్థాయిలో పుస్తకాలు సమకూరకపోగా, 2016లోనూ అదే పరిస్థితి. ఈ ఏడాదైనా పాఠశాలలు పునఃప్రారంభం నాటికి పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు సరఫరా అవుతాయా? లేదా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 24 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం.. జిల్లాలో 3,190 ప్రాథమిక, 361 ప్రాథమికోన్నత, 634 ఉన్నత పాఠశాలలు, 14 హయ్యర్ సెకండరీ పాఠశాలల విద్యార్థులకు ప్రతీఏటా ఉచితంగా పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. జిల్లాలోని ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న సుమారు నాలుగు లక్షల మంది తెలుగు, ఇంగ్లిషు, ఉర్దూ మీడియం విద్యార్థులకు ఈ ఏడాది 24 లక్షల పాఠ్య పుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖ గుర్తించింది. ఇప్పటికే పుస్తక డిపోలో 1.40 లక్షల పుస్తకాలున్నాయి. ఇందులో 40శాతం ఇంగ్లిషు మీడియం, 60 శాతం తెలుగు మీడియం పుస్తకాలు అవసరమని అధికారులు ప్రతిపాదించారు. జిల్లాకు ఒక్క పుస్తకం రాలేదు.. రాజమహేంద్రవరంలో ఉన్న పుస్తక డిపోకు ఇప్పటి వరకు సంబంధించి ఒక్క పుస్తకం కూడా రాలేదు. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 164 టైటిల్స్ రావాల్సి ఉంది. తెలుగు, ఇంగ్లిషు మీడియంలకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు ఇంకా డిపోలకు చేరాల్సి ఉన్నట్లు డిపో మేనేజర్ జేమ్స్వేరీ ‘సాక్షి’కి తెలిపారు. జిల్లా డిపోకు చేరిన అనంతరం పాఠ్య పుస్తకాలు మండల కేంద్రాలకు చేరవేయాల్సి ఉంటుంది. మండల కేంద్రాలకు పుస్తకాలను చేరవేసేందుకు ప్రతి ఏటా టెండర్ ప్రక్రియను నిర్వహిస్తారు. టెండర్ దక్కించుకున్న వారు పాఠ్య పుస్తకాలను మండల కేంద్రాలకు చేరవేస్తారు. పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చే సమయానికి పూర్తి స్థాయిలో సరఫరా చేస్తే పాఠశాలలు ప్రారంభం తేదీనే విద్యార్థులకు పూర్తి స్థాయిలో అందజేసేందుకు వీలుంటుందని విద్యావేత్తలు భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పుస్తకాల ముద్రణ ప్రారంభం కాలేదని సమాచారం. పుస్తకాల ముద్రణ అనంతరం వచ్చే నెలాఖరుకు జిల్లాలోని పుస్తక డిపోకే చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులకు నివేదించాం... జిల్లాకు 24 లక్షల పుస్తకాలు అవసరమని గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించాం. ఈ నెలాఖరుకు పుస్తక డిపోకు పుస్తకాలు చేరతాయని భావిస్తున్నాం. పుస్తకాలు డిపోకే చేరిన వెంటనే మండల కేంద్రాలకు తరలించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతాం. – ఎస్.అబ్రహం, డీఈవో, కాకినాడ -
స్వచ్ఛభారత్ లక్ష్యంగా ‘మల్లిగాడి మరుగుదొడ్డి’
–పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టిన సర్వశిక్షాభియాన్ -జిల్లాలో 46,516 మంది ఆరో తరగతి విద్యార్థులకు అందజేత భానుగుడి(కాకినాడ) : జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాని పాఠశాలల్లో ఆరోతరగతి విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సర్వశిక్షాభియాన్ ద్వారా కార్టూన్ పుస్తకాల పంపిణీ చేసే కార్యక్రమానికి గురువారం శ్రీకారం చుట్టింది. పరిసరాల పరిశుభ్రతను పాటించాల్సిన ఆవశ్యకతను కార్టూన్లద్వారా తెలియపరుస్తూ 50 పేజీల పుస్తకాన్ని ప్రచురించారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఎంత అవసరమో చిన్నారులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. దైనందిన కార్యక్రమాలలో చిన్నపాటి జాగ్రత్తలు పాటించకుంటే వచ్చే అనర్థాలను స్పష్టంగా వివరించారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డిని నిర్మించాలని ఆరోతరగతి చదువుతున్న మల్లిగాడి పాత్ర ద్వారా తెలియజెప్పారు. ‘స్వచ్ఛభారత్’లో భాగంగా ప్రచురణ అన్ని ప్రభుత్వ యాజమాన్యాలలోని పాఠశాలల్లో 46,516 మంది ఆరోతరగతి విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేస్తున్నాం. జిల్లాలో ఈ పుస్తకంపై ప్రత్యేకంగా ఉపాధ్యాయులతో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. మరో రెండు రోజుల్లో పుస్తకాలన్నీ పాఠశాలలకు చేరతాయి. స్వచ్ఛభారత్లో భాగంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. -మేకా శేషగిరి, రాజీవ్ విద్యామిషన్ పీఓ విద్యార్థుల ద్వారా అవగాహనే లక్ష్యం మరుగుదొడ్ల నిర్మాణ ఆవశ్యకతపై విద్యార్థుల్లో అవగాహన పెంచితే సమాజంలోకి సులువుగా విషయం చేరుతుందనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. పుస్తకాన్ని చదవడానికి వీలుగా, చిన్నచిన్న కొటేషన్ల ద్వారా రూపొందించారు. ప్రతి పాఠశాలకూ పుస్తకాలు చేరేలా చర్యలు తీసుకున్నాం. -చామంతి నాగేశ్వరరావు, ఏఎంఓ, సర్వశిక్షాభియాన్ -
ముందే మేల్కొన్నారు..
• జిల్లాకు చేరుకున్న పాఠ్యపుస్తకాలు • అవసరమైన పాఠ్యపుస్తకాలు 2,92,491 • నేటి వరకు చేరుకున్నవి 1,35,719 • రావాల్సినవి 1,56,772 కరీంనగర్ఎడ్యుకేషన్ : విద్యాశాఖ ముందే మేల్కొంది. ఏటా విద్యాసంవత్సరం ఆరంభమై నెలలు గడిచిన పుస్తకాలు స్కూళ్లకు చేరకపోవడం వంటివి చూశాం. అయితే ఈసారి ఇప్పటికే యాబై శాతం పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. విద్యాసంవత్సరం ఆరంభమయ్యే మార్చి 21 వరకు విద్యార్థులకు పుస్తకాలు అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సర్వశిక్షా అభియాన్, పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా కసరత్తు ప్రారంభించింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలకు సంబంధించిన ప్రతిపాదనలు పంపారు. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇప్పటికే సగం వరకు పుస్తకాలు చేరుకున్నాయి. మార్చి 21 నుంచి విద్యాసంవత్సరం 2017–18 సంవత్సరాన్ని మార్చి 21 నుంచి ప్రారంభించేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ క్యాలెండర్ను విడుదల చేసింది. గత విద్యాసంవత్సరంలో ముందస్తుగానే మొదలుపెట్టాలని ఆలోచించినప్పటికీ సాధ్యంకాలేదు. ఈసారి ఎలాంటి ఆటంకాలు రానీయకుండా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. గతంలో పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం పునర్ప్రారంభమై నెలల గడిచినా పుస్తకాలు చేరకపోయేవి. దీంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడేవారు. మార్కెట్లో డబ్బు పెట్టి పుస్తకాలు కొనుగోలు చేసేవారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరంలో పాఠశాల ప్రారంభం రోజునే అంటే మార్చి 21నే పుస్తకాలు, దుస్తులు అందించేందుకు అధికారులు ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించారు. చేరిన పుస్తకాలు జిల్లాలోని 16 మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ పాఠశాల, కస్తూర్బా పాఠశాలల్లో 27,256 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరి కోసం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు మీడియం, ఉర్దూ మీడియం, ఇంగ్లిష్ మీడియంకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు 2,92,491 అవసరమని జిల్లా విద్యాశాఖాధికారులు రాష్ట్ర అధికారులకు ఇండెంట్ పంపించారు. ఈ నివేదిక ప్రకారం జిల్లాకు గురువారం నాటికి 1,35,719 పాఠ్య పుస్తకాలు చేరాయి. మిగతా 1,55,772 పాఠ్యపుస్తకాలు పది రోజుల్లోగా చేరుకోనున్నాయి. మార్చి మొదటి వారం నుంచి కరీంనగర్ కేంద్రంలోని గోదాం నుంచి పాఠ్యపుస్తకాలను ఆయా మండలాల ఎమ్మార్సీ కేంద్రాలకు అక్కడి నుంచి సంబంధిత పాఠశాలల హెచ్ఎంలకు మార్చి 20లోగా పంపిణీ చేసేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లను చేపట్టారు. ప్రారంభం రోజునే పుస్తకాలు పాఠశాల ప్రారంభమయ్యే మార్చి 21న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేస్తాం. జిల్లాకు కావాల్సిన పాఠ్యపుస్తకాలు మార్చి 10లోగా పూర్తిస్థాయిలో చేరుతాయి. మరో పది రోజుల్లో పంపిణీ పూర్తవుతుంది. పాఠ్యపుస్తకాలు సకాలంలో అందడంతోవిద్యార్థులు వేసవి సెలవుల్లోనూ చదువుకునే అవకాశం ఉంది. – పి.రాజీవ్, డీఈవో -
ఆర్థికాంశాలపై అవగాహనకు జిరోధా ’రూపీ టేల్స్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పిల్లల్లోనూ ఆర్థికాంశాలపై అవగాహన కల్పించే దిశగా డిస్కౌంట్ బ్రోకరేజి సంస్థ జిరోధా రూపీ టేల్స్ పేరిట పుస్తకాల సెట్ను అందుబాటులోకి తెచ్చింది. సంస్థ వైస్ ప్రెసిడెంట్ (ఈక్విటీ రీసెర్చ్ విభాగం) కార్తీక్ రంగప్ప మంగళవారమిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో దీన్ని ఆవిష్కరించారు. పొదుపు, బీమా, బ్యాంకింగ్.. ద్రవ్యోల్బణం, స్టాక్మార్కెట్లు, పన్నులు అంశాలపై ఈ సెట్లో మొత్తం అయిదు పుస్తకాలు ఉంటాయని పుస్తక రచయిత కూడా అయిన కార్తీక్ తెలిపారు. ఏడేళ్ల పైబడిన పిల్లలకు కూడా సులభంగా అర్థమయ్యే విధంగా కథలు, సంభాషణల రూపంలో వీటిని తీర్చిదిద్దినట్లు వివరించారు. మరోవైపు, 2015–16లో క్లయింట్ల సంఖ్య 93 శాతం మేర వృద్ధి చెందిందని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 2.2 లక్షల మంది యూజర్లు ఉన్నారని కార్తీక్ పేర్కొన్నారు. కీలకమార్కెట్లలో ఒకటైన హైదరాబాద్లో వృద్ధి 113 శాతం మేర నమోదు కాగా.. 12,000 మంది పైగా యూజర్లు ఉన్నారని ఆయన వివరించారు. -
అక్షరాలు నేర్పని సాక్షరభారత్
► కొరవడిన పర్యవేక్షణ ► చెత్తకుప్పల్లో పుస్తకాలు ముత్తారం: వయోజనులను విద్యావంతులుగా చేసి దేశంలో అక్షరాస్యతశాతాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాక్షరభారత్ నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పలేకపోతోంది. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేక పోవడంతో సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా మారింది. మండల పరిధిలోని ఏ ఒక్క గ్రామంలో సాక్షరభారత్ కేంద్రాలు పనిచేస్తున్న దాఖలాలు లేవు. గ్రామపంచాయతీకి రెండు చొప్పున 28 సాక్షారభారత్ కేంద్రాలు ఉన్నాయి. ఒక మండల కోఆర్డినేటర్, 28 మంది గ్రామ కోఆర్డినేటర్లు పనిచేస్తున్నారు. మండల కోఆర్డినేటర్కు రూ.8వేలు, గ్రామ కోఆర్డినేటర్కు ఒక్కొక్కరికి రూ.2500 చొప్పున వేతనాలు చెల్లిస్తున్నారు. ఇలా ప్రతీనెలా కేంద్ర ప్రభుత్వం రూ.78వేలు ఖర్చు చేస్తుంది. 2010 సెప్టెంబర్ నుంచి ప్రారంభించగా ఏడు సంవత్సరాలు గడుస్తుండగా ఇప్పటికి దాదాపు రూ.65 లక్షలు పైగా ఖర్చు చేసింది. కనీసం 65 మంది నిరక్షరాస్యులను పూర్తిస్థాయిలో అక్షరాస్యులను చేయలేదనే విమర్శలున్నాయి. అధికారుల రికార్డుల్లో మాత్రం ప్రతీకేంద్రం నిత్యం నిర్వహిస్తున్నట్లు చూపిస్తున్నాయి. నాలుగు సంవత్సరాల క్రితం సాక్షరభారత్ కేంద్రాల్లో ఫర్నీచర్ కొనుగోలు కోసం మంజూరైన సుమారు రూ.1.20లక్షలు గోల్మాల్ జరిగినా సంబంధిత అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ప్రతీ సాక్షరభారత్ కేంద్రానికి కుర్చీలు, జంబుఖానా, క్రీడాసామగ్రి మంజూరు చేయగా వాటిని స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలనే నిబంధన ఉన్నా అవి ఎక్కడికెళ్లాయో ఇప్పటివరకు తెలియడం లేదు. కేంద్రాల నిర్వహణ సరిగా లేకపోవడంతో అక్కడ పంపిణీ చేసిన పుస్తకాలను అభ్యాసకులు చెత్తకుప్పల్లో పడవేస్తున్నారు. దేశంలో అక్షరాస్యతను పెంపొందించాలని కేంద్రప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరుగారిపోతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సాక్షరభారత్ కేంద్రాలు రోజు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
'నాకు సినిమాలకంటే పుస్తకాలే ఎక్కువ'
ముంబయి: తనకు సినిమాలకంటే పుస్తకాలు, అందులో సాహిత్యమే చాలా ముఖ్యం బాలీవుడ్ చిత్రాల దర్శకుడు విశాల్ భరద్వాజ్ అన్నారు. 18వ మామీ చిత్రోత్సవంలో ఆయన బుధవారం మాట్లాడుతూ 'సినిమాల్లోకి సాహిత్యాన్ని తీసుకెళ్లడం చాలా ముఖ్యమైన అంశం. నా వరకు సినిమాలకంటే పుస్తకాలే ముఖ్యమైనవి. ఎందుకంటే.. మీ వద్ద మంచి పుస్తకాలుగానీ, సాహిత్యంగానీ లేకుంటే.. మంచి రచయితలు మనకు ఉండరు. మంచి రచయితలను తయారు చేయాలంటే మంచి పుస్తకాలను ఎప్పుడూ ప్రోత్సహించాల్సిందే. ఎక్కువ సాహిత్యంతో చాలామంచి సినిమాలు రూపొందించవచ్చు' అన్నారు. అలాగే 'ఇప్పుడు జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు తీసే ట్రెండ్ మొదలైంది. అంతకుముందు చేతన భగత్ రాసిన పుస్తకాల ఆధారంగా రెండు సినిమాలు వచ్చాయి. నేను కూడా షేక్ స్పియర్ రచనల ఆధారంగా సినిమాలు తీశాను' అని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది 2017 ఫిబ్రవరి 24న భరద్వాజ్ దర్శకత్వం వహించిన రంగూన్ అనే చిత్రం విడుదలకానున్న విషయం తెలిసిందే. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో కంగనా రనౌత్, సైఫ్ అలీ ఖాన్, షాహిద్ కపూర్ నటిస్తున్నారు. -
మావి మూడు ఏలుబడులే కానీ బతుకొక్కటే
‘రాగెన్నుల రాజ్జెం’కు రాసిన ముందుమాటలోంచి; ప్రచురణ: కృష్ణగిరి జిల్లా రచయితల సంగం; పేజీలు: 120; వెల: 100; ప్రతులకు: అన్ని ముఖ్యమైన పుస్తక కేంద్రాలు. రమేశ్ ఫోన్: +91 8500548142 కృష్ణగిరి జిల్లా రచయితల సంగం (కృష్ణ. ర. సం.) వారు వెలువరిస్తుండే పన్నెండో పొత్తం ఇది. ‘మొరసునాడు కతలు’ పేరుతో వస్తుండే రెండో కూర్పు ఇది. మొరసునాడు ఇప్పటి ఆంధ్ర, కర్నాటక, తమిళనాడులలో మూడు ముక్కలయి నిలిచి ఉంది. చిత్తూరు, అనంతపురం, కృష్ణగిరి పెనువంటెం(జిల్లా)లలో కొంత కొంత; కోలారు, చిన్నబళ్లాపురం, బెంగళూరు నగర, గ్రామ పెనువంటెంలను కలిపితే మొరసునాడు అవుతుంది. మొరసునాడులో నూటికి ఏబయిమంది తెలుగు వాళ్లు ఉంటారు. ఇందులో తమిళనాడుముక్క వాళ్లవి ఆరు కతలుండాయి. ఆంధ్రముక్క వాళ్లవి అయిదు కతలుండాయి. కర్నాటకముక్క నుండి తీసుకొనింది నాలుగు కతల్ని. మూడు ముక్కలయి మూడునాడుల్లో ఉండినా, ఈ తావు బతుకూ బాళూ అంతా ఒకటే. ఈ తావు వాళ్లకి ముక్కెమయిన తిండిపంట రాగులు. వరసగా నాలుగు నాళ్లు రాగిసంగటి దొరకకపోతే వేసట పడిపోతారు. ఈ పదైదు కతలలో రాగిముద్దను తలుచుకోని కతే లేదు. మావి మూడు ఏలుబడులే కానీ బతుకొక్కటే అని చెప్పదలుచుకొంటిమి. దానికే మూడు ముక్కల కతలన్నీ కలగలిపి కూరిస్తిమి. ఈ కూర్పులోని పదైదుమంది రచయితలలో తొమ్మిదిమంది తెలుగువాళ్లు, నలుగురు కన్నడిగులు, ఇద్దురు తమిళులు. పదైదుమందిలో ఆరుగురు దళితులు, ఏడుగురు వెనకబడిన తరగతుల వాళ్లు, ఇద్దురు రైతుబిడ్డలు. దానికే కావచ్చు ఈ కతలన్నీ మన్ను మణము(సువాసన)తో నిండి ఉండాయి. ఏలుబడులు మూడుముక్కలు చేసిన మమ్మల్ని నానుడు(సాహిత్యా)లు అతుకుతుండాయి. రండి, మా రాగెన్నుల రాజ్జెం మీకు ఎదురుకోలు పలుకుతా ఉంది. - స.వెం.రమేశ్ రచయిత కమ్యూనిటీతో జరిపే భావప్రసారం సాహిత్యం (‘కథ-2015’కు రాసిన సంపాదకీయంలోంచి; ప్రచురణ: కథాసాహితి; పేజీలు: 206; వెల: 65; ప్రతులకు: 164, రవి కాలనీ, తిరుమలగిరి, సికింద్రాబాద్-15; ఫోన్: 9849310560) సాహిత్య సృజన మామూలుగా ఏ వ్యక్తి అయినా చేసే పనికాదు. సమాజంలో ముఖ్యమైన భాగంగా ముందున ఉంటూ, సమాజ చలన సూత్రాలను గురించి తనకున్న అవగాహనతో తను జీవిస్తూన్న సమాజం తీరుతెన్నులను లోతుగా పరిశీలిస్తూ విస్పష్టంగా వ్యాఖ్యానించగల వ్యక్తి- అనగా రచయిత కమ్యూనిటీతో జరిపే భావప్రసారం సాహిత్యం. అలా కమ్యూనికేషన్ నెరపడం- అంటే సాహిత్యం సృజియించడం- ఒక రకంగా తన బాధ్యత అనుకుంటాడు రచయిత. నడుస్తూన్న కాలం మౌలిక స్వభావాన్ని దాని రూపం, సారంతో సహా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ, మారని మనిషితనం (్టజ్ఛి ్ఛ్ట్ఛట్చ జీ ్టజ్ఛి ఝ్చ), చరిత్ర వారసత్వం నేటి ప్రపంచంలో ఎలా నెగ్గుకుని వస్తున్నాయో తన రచనల ద్వారా చూపిస్తూ ఆ బాధ్యత నెరవేరుస్తాడు. సాహిత్య సృజన వివిధ ప్రక్రియ(జ్ఛట్ఛ)లలో సాగుతుంది. కథ వాటిల్లో ప్రధానమైనది. నిరంతర పరిణామశీలమైన విశిష్ట సాహితీప్రక్రియ కథ. కథంటే కేవలం కల్పన కాదు, అలాగని పూర్తి వాస్తవమూ కాదు. సాధారణత్వం చెరిగిపోయేలా ఊహను మేళవించి, ఒక యథార్థ జీవిత శకలాన్ని ఉన్నతీకరించి ఆసక్తికరంగా మలచడం- అనగా నిజజీవితంలో అంతవరకూ మన అనుభవంలోకి రాని రీతిలో, మన ఆలోచనకు తట్టని కోణంలో ఒక పరిచితమైన విషయాన్ని లేదా సాధారణ ఘటనను లేదా మామూలు సన్నివేశాన్ని కొత్తగా చూపడం కథ అవుతుంది. ఈ ఆసక్తికరంగా మలిచే కొత్తకోణంలో చూపే పనినే ‘కళ’ అంటాము. కళ అంటే సాధారణ అర్థంలో ప్రకృతి అనుకరణ అని మనకు తెలుసు. ఈస్థటిక్స్ ప్రకారం ఆలోచనలు రేకెత్తించేలా వినూత్న పద్ధతిలో ఆవిష్కృతమయ్యే వాస్తవికత పార్శ్వం అని కూడా మనకు తెలుసు. అలా చూసినప్పుడు కథారచయితని కళాకారుడనే అనాలి. ఎందుకంటే కథ (fiction) ఒక రకంగా వాస్తవమూ, మరోరకంగా వాస్తవాన్ని ధిక్కరించే ఊహాకల్పన కూడా. - ఆడెపు లక్ష్మీపతి -
గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలి
హుజూర్నగర్ : గ్రంథాలయాల అభివృద్ధికి దాతలు చేయూతనందించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అల్లం ప్రభాకర్రెడ్డి కోరారు. బుధవారం పట్టణానికి చెందిన హెచ్ఎస్బీసీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధిర మంజీర అందజేసిన రూ. 5 వేల విలువైన పుస్తకాలను ఆమె తండ్రి మధిర ప్రతాప్రెడ్డి స్థానిక శాఖ గ్రంథాలయానికి అంద జేశారు. అనంతరం ప్రతాప్రెడ్డిని శాలువా, పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో శాఖ గ్రంథాలయ చైర్మన్ కుంట సైదులు, గ్రంథాలయాధికారి మండవ వీరస్వామి, జూలకంటి వాణి, శ్రీనివాస్గౌడ్, ఊరె వెంకయ్య, కనకారెడ్డి, దొడ్డా నర్సింహారావు, వెంకటకృష్ణ, జాఫర్, రాజు, అబ్రహాం, రేణుక, శ్రీను, సీతారాం పాల్గొన్నారు. -
షేక్స్పియర్ రచనల్లో మహిళల పాత్ర
భీమవరం: షేక్స్పియర్ రచనల్లో మహిళల పాత్రలు ఎంతో ప్రభావవంతమైనవి అందువల్ల విద్యార్థులు ప్రతి ఒక్కరూ షేక్స్పియర్ రచనలు తప్పనిసరిగా చదవాలని శాతివాహన విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రామ భాస్కరరావు అన్నారు. భీమవరం ఆర్ఆర్డీఎస్ ప్రభుత్వ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన షేక్స్పియర్ రచనలపై జాతీయస్థాయిలో సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్బంగా సావనీర్ను విడుదల చేశారు. సదస్సుకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సనత్కుమార్ అధ్యక్షత వహించగా పాలకొల్లు దాసరి నారాయణరావు‡ కళాశాల ప్రిన్సిపాల్ నాగమణి, గుంటూరుకు చెందిన రిటైర్డ్ అధ్యాపకురాలు డాక్టర్ వరలక్ష్మి, అక్కిరాజు, రవిశంకర్, స్వరూప, శ్రీలక్ష్మి, పార్వతి, మోజేస్, సుబ్రహ్మణ్యం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
గ్రంథాలయానికి పుస్తకాల బహూకరణ
హుజూర్నగర్: పోటీపరీక్షలకు చెందిన రూ. 5 వేల విలువైన పుస్తకాలను పట్టణానికి చెందిన పలువురు ఆర్యవైశ్య మహిళలు మంగళవారం శాఖా గ్రంథాలయానికి బహూకరించారు. ఈç Üందర్భంగా శాఖా గ్రంథాలయ చైర్మన్ కుంట సైదులు మాట్లాడుతూ నిరుద్యోగులకు ఎంతో ఉపయోగపడే పుస్తకాలను అందజేయడం అభినందనీయమన్నారు. అనంతరం దాతలను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో దాతలు పొట్టుముత్తు సోమలక్ష్మి, తమ్మన సుజాత, కొత్త కళావతి, వంకాయల పద్మావతి, గ్రంథాలయాధికారి వీరస్వామి, ఊరె వెంకయ్య, సైదానాయక్, వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
చెప్పడానికేముంది?
ఒక యువకుడు ఆత్మజ్ఞానం పొందాలనుకున్నాడు. అందుకోసం ఒక మఠాలయానికి వెళ్ళి గురువు అంగీకారంతో అక్కడ చేరాడు. అక్కడ ఉన్న రోజుల్లో బోలెడు పుస్తకాలు చదివాడు. సూత్రాలు తెలుసుకున్నాడు. అన్నింటిలోనూ తర్ఫీదు పొందాడు. తత్త్వవేత్తలతో వాదోపవాదాలు చేసి తనదే పైచేయి అనిపించుకున్నాడు. అయితే ఒకరోజు ఒక గురువు అతనితో చెప్పాడు - ‘‘నువ్వు వొట్టి తర్కశాస్త్రంలో ఆరితేరావు తప్ప నీ దగ్గర సహజ జ్ఞానం లేదు. నీదంతా పుస్తకాలు చదవడం వల్ల అబ్బిన జ్ఞానమే. దానివల్ల ప్రయోజనం లేదు. ఈ జ్ఞానం నువ్వో మేధావంతుడవు అనే గర్వాన్ని మాత్రం ఇస్తుంది. కనుక దేశసంచారం చెయ్యి. అప్పుడు లభించే ప్రపంచానుభవం నీకు అసలైన జ్ఞానాన్ని ఇస్తుంది’’ అని. ఆయన మాటలు విన్న ఆ యువకుడు దేశాటనకెళ్లాడు. మొదటి నెల గడిచింది. గురువుగారికి ఒక ఉత్తరం రాశాడు. ‘‘నా ఉద్వేగానుభూతుల పరిధి పెరిగింది. ఒక్క చోటే ఉండి పొందిన దానికన్నా ఇలా సంచారం వల్ల ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. స్వయంగా చూస్తున్నాను. నేను క్రమంగా ప్రకృతితో మమేకమవుతున్నాను’’ అని ఆ ఉత్తరంలో తెలియజే శాడు. దాన్ని చదివి గురువు మండిపడ్డారు. ఉత్తరాన్ని నలిపి పారేశారు. మరో నెలకి యువకుడు ‘‘దేవుడు అన్ని చోట్లా ఉండటాన్ని తెలుసుకున్నాను’’ అని ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరాన్ని కూడా గురువుగారు చించి విసిరేశారు.మరో నెల గడిచింది. దేశాటన చేస్తున్న యువకుడు ఈసారి పంపిన ఉత్తరంలో ‘‘చుట్టూ జరుగుతున్న సంఘటనలన్నీ ఒక దానికొకటి పెనవేసుకునే ఉంటున్నాయి. ఈ సంఘటనలన్నీ అతని ప్రమేయం లేకుండా జరగడం లేదని తెలుసుకున్నాను’’ అని రాశాడు. గురువుగారు ఆ ఉత్తరాన్నీ పక్కన పడేశారు. తర్వాతి ఉత్తరంలో యువకుడు ‘‘ఆత్మ ఒక్కటే... దానికి జనన మో మరణమో లేదు. మనసు మాత్రమే చలిస్తున్నట్టు సంచరిస్తున్నట్టు తెలుసుకున్నాను’’ అని రాశాడు. గురువుగారు ఒకసారి ముఖాన్ని తుడుచుకున్నారు. ఆ తర్వాత దాదాపు ఏడాది దాటింది. అతని నుంచి తనకేదీ సమాచారం లేకపోవడంతో గురువు అతనికి ఒక కబురంపారు వెంటనే విషయం చెప్పమని. శిష్యుడు పెదవివిరుస్తూ రెండు ముక్కలు రాశాడు. ‘‘విషయం చెప్పడానికి ఏముంది? దీనిగురించి ఎవరు ఆలోచిస్తున్నారు?’’ అని. గురువుగారికి అర్థమైంది. ‘‘భగవంతుడికి కృతజ్ఞతలు’’ చెప్పుకున్నారు గురువుగారు. జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం అన్వేషిస్తున్నాను అనే మాటే ఒట్టి మాట. వృధా ప్రయాస. వె తుకులాట ముగిసిందనుకున్న చోటే మనం దేనికోసం వెతుకుతున్నామో అది ఉంటుంది. - యామిజాల జగదీశ్ -
కథలు కళ్లకు కట్టినట్లు
చిన్నప్పుడు అమ్మానాన్నలు కథలు చెబుతుంటే కథలోని పాత్రలను, వాటి చర్యలను మనమే ఊహించుకునే వాళ్లం. అలా చిన్న వయసులోనే సృజనాత్మకత, ఆలోచనా శక్తి పెంపొందేవి. నేడు విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పుల దృష్ట్యా నూతన బోధనా పద్ధతులు వస్తున్నాయి. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే విధంగా ఫొటోలను, మ్యాప్లను, ఊహా చిత్రాలను పాఠ్యపుస్తకాల్లో పొందుపరుస్తున్నారు. ప్రస్తుతం పాఠ్య పుస్తకాల్లో రంగు రంగుల బొమ్మలను ఉపయోగిస్తూ విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా చూస్తున్నారు. ఆంగ్ల మాధ్యమ పుస్తకాల్లో కథలకు సంబంధించినవే పై ఫొటోలు. కథను కళ్లకు కట్టించినట్లుగా ఉన్నాయి కదా పై చిత్రాలు. ఆంగ్ల మాధ్యమానికి సంబంధించిన 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న వివిధ పాఠ్యపుస్తకాల్లో బోధన అంతా ఇదే శైలిలో సాగుతోంది. – ఆదిలాబాద్ టౌన్ -
పుస్తకాలతో విజ్ఞానం
రాయదుర్గం: పాఠ్య పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలను చదవడం ద్వారా ఎంతో జ్ఞానాన్ని సముపార్జించవచ్చని టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్ కింగ్షుక్నాగ్ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాలలో శుక్రవారం ‘ది అకార్న్ బుక్’ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నతనం నుంచే గ్రంథాలయాన్ని ఉపయోగించుకునే అలవాటు చేసుకోవాలని సూచించారు. చిన్న చిన్న కథలను రాసేలా విద్యార్థులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ అవనీష్ సింగ్, పీపుల్ కంబైన్ డెరెక్టర్ డీవీఆర్కే ప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు. తల్లిదండ్రులు పాల్గొన్నారు. ‘ది అకార్న్ బుక్’ రెండో ఎడిషన్ చిన్న చిన్న కథలను ఒకచోట చేర్చి... పుస్తక రూపం ఇవ్వడాన్ని గత ఏడాది ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాల ప్రారంభించింది. ఆ పుస్తకానికి ‘ది అకార్న్బుక్’ గా నామకరణం చేసింది. గత ఏడాది మొదటి ఎడిషన్ను 65 కథలతో ఆవిష్కరించగా, రెండో ఎడిషన్ను 64 కథలతో రూపొందించారు. ఈ ఏడాది నిర్వహించిన చిన్న కథల పోటీకి నగరంలోని 700 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో 64 కథలు అత్యుత్తమమైనవిగా ఎంపిక చేశారు. అందులో 30 మంది ఓక్రిడ్జ్ పాఠశాలకు చెందినవారు. -
భయం భయంగా... పఠనం
శిథిలావస్థలో గ్రంథాలయం కలగా నూతన భవన నిర్మాణం ఇబ్బందుల్లో పాఠకులు సిర్పూర్(టి) : పెచ్చులూడుతున్న గ్రంథాలయ భవనం పాఠకులకు ప్రాణ సంకటంగా మారింది. విజ్ఞానాన్ని పంచాల్సిన గ్రంథాలయం భయాన్ని పరిచయం చేస్తోంది. గాంధీజీ ‘‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో మంచి పుస్తకం కొనుక్కో’’ అని పుస్తకాల ప్రాముఖ్యతను తెలిపారు. కానీ ఆ మహాత్ముడు నడియాడిన నేల మీద పాలకులు, అధికారులు గ్రంథాలయాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జాతిపితను అవమానపరుస్తున్నారు. పేదవారికి ఎంతగానో ఉపయోగపడుతున్న గ్రామీణ గ్రంథాలయాలను పట్టించుకొనే వారు కరువయ్యారు. ఈ నేపథ్యంలోనే శిథిలావస్థకు చేరిన సిర్పూర్ గ్రంథాలయంపై కథనం... మండల కేంద్రంలోని గ్రంథాలయ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు పాఠకులు. దీంతో గ్రంథాలయానికి వచ్చే పాఠకుల సంఖ్య రోజు రోజుకూ తగ్గుతోంది. 1990లో నిర్మించిన భవనంలోనే నేటికీ శాఖా గ్రంథాలయం కొనసాగుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రంథాలయ భవనానికి మరమ్మతులకు నిధులు మంజూరు కాకపోవడంతో గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరుకుంది. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రంథాలయ సామగ్రి తడుస్తోంది. గ్రంథాలయ భవనం పూర్తిగ శిథిలావస్థకు చేరుకోవడంతో పాఠకులు గ్రంథాలయాన్ని మార్చాలని పలుసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదు అధికారులు. నిర్లక్ష్యం దారి తీస్తోంది నిరాదరణకు... గ్రంథాలయంలో 13,000 పాఠ్య పుస్తకాలు ఉండగా కొన్ని పుస్తకాలు చెదలుపట్టిపోయాయి. అదే విధంగా 25 కుర్చీలు, బల్లలు ఉండగా వాటికి మరమ్మతులు చేపట్టకపోవడంతో 15 కుర్చీలు వినియోగించ లేనంతగా మారాయి. దీంతో ఉన్న సామగ్రితోనే గ్రంథాలయాన్ని నెట్టుకొస్తున్నారు. గ్రంథాలయానికి ప్రతి రోజూ వందల సంఖ్యలో వచ్చే పాఠకులు గ్రంథాలయ భవనం ఎప్పుడు కూలి పోతుందోన నే భయంతో పాఠకులు గ్రంథాలయానికి రావడానికి భయపడుతున్నారు. దీంతో గ్రంథాలయం ఉన్నా నిరుపయోగంగా మారుతోంది. వర్షాకాలంలో భవనం పైకప్పు పెచ్చులూడుతుండడంతో భవనంలోకి రావడానికి పాఠకులు జంకుతున్నారు. అసౌకర్యాల నెలవు... గ్రంథాలయంలో సౌకర్యాలు లేకపోవడంతో పాఠకులుSఇబ్బందులకు గురవుతున్నారు. సరిపడ కుర్చీలు లేకపోవడంతో పాఠకులు ఆరుబయటే నిలబడి పుస్తకాలు చదువుతున్నారు. రెండు సంవత్సరాలుగా గ్రంథాలయానికి నూతన పుస్తకాలు రావడం లేదు. గతంలో పలుసార్లు గ్రంథాలయ శాఖ జిల్లా అధికారులు తనిఖీలు నిర్వహించగా ఆ సమయంలో స్థానికులు సమస్యలను విన్నవించారు. అయినా ఫలితం శూన్యం. నూతన భవన నిర్మాణానికి, సమస్యల పరిష్కారానికి ని«ధులు మంజూరు చేస్తామని హామీలు ఇవ్వడమే తప్ప ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మండల కేంద్రంలో నూతన గ్రంథాలయ భవనం నిర్మించాలని కోరుతున్నారు. -
అందుబాటులో ఐఏఎస్ స్థాయి పుస్తకాలు : కలెక్టర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఐఏఎస్ స్థాయి పుస్తకాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం అన్నారు. సానా వీధిలోని మహాత్మా జ్యోతిరావుపూలే ఆంధ్రప్రదేశ్ బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయానికి కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా విచ్చేశారు. లైబ్రరీ, క్లాసు రూం, కంప్యూటర్ రూమ్లను సందర్శించారు. లైబ్రరీలో విద్యార్థులకు బోధిస్తున్న పుస్తకాలను పరిశీలించారు. పోలీసు కానిస్టేబుల్, బ్యాంకు ఉద్యోగాల స్థాయి పుస్తకాలతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాలకు ఎంపికయ్యే పుస్తకాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇప్పటి వరకు 36 మందికి బ్యాంకు పరీక్షలకు కోచింగ్ ఇవ్వగా, 11 మంది ప్రిలిమ్స్కు ఎంపికైనట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు కె.ధనుంజయరావు తెలిపారు. కానిస్టేబుల్ ఉద్యోగాలుకు సంబంధించి కోచింగ్ను ఈ నెల 16 నుంచి ప్రారంభిస్తామని, 60 మందికి కోచింగ్ ఇవ్వనున్నట్టు తెలిపారు. బలగ ప్రాంతంలో రూ.1.50 కోట్లతో 2.8 ఎకరాల స్థలంలో బీసీ సంక్షేమ భవనం, హాస్టల్, స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. లెబ్రరీని ఎం.కె.ఉదయలక్ష్మి నిర్వహిస్తున్నారని, నాగపుష్పలత ఏఓగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
కాగజ్నగర్ రూరల్ : కాగజ్నగర్ మండలం రాస్పెల్లి జెడ్పి ఉన్నత పాఠశాల విద్యార్థులకు రెండువందల నోటు పుస్తకాలను శుక్రవారం ‘వేకువ’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పంపిణీ చేశారు. ఎన్ఆర్ఐ ఫోరం దుబాయ్లోని ఖతార్లో నివసిస్తున్న అవదూత గణేష్ ఆధ్వర్యంలో ఈ పుస్తకాలు అందజేశారు. విద్యార్థులు నోటు పుస్తకాలను సద్వినియోగపర్చుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఎల్. గాయత్రి, జెడ్పీటీసీ మౌల్కర్ లక్ష్మణ్, ఎంపీటీసీ గజ్జి వాసుదేవ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సుష్మాస్వరాజ్ పొరపాటు చేశారు!
న్యూఢిల్లీః ప్రసిద్ధ రచయిత్రి మహాశ్వేతాదేవి మరణంపట్ల విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ తీవ్ర సంతాపం ప్రకటించారు. అద్భుత రచనలు చేసిన మహాశ్వేతాదేవి సామాజిక న్యాయంకోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు. అయితే ప్రధాని మోదీ ప్రభుత్వంలో ఇతర మంత్రుల మధ్య ఎంతో పేరుగాంచిన ఆమె... రచయిత మహా శ్వేతాదేవి మరణంపై సంతాపం ప్రకటించడంలో మాత్రం తప్పిదం చేశారు. ఎప్పుడూ ఎంతో ఆచితూచి మాట్లాడే సుష్మా... శ్వేతాదేవి రచనలను కోట్ చేయడంలో మాత్రం అనుకోని పొరపాటు చేశారు. విదేశీవ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ అనుకోని తప్పిదం చేశారు. ప్రముఖ రచయిత్రి మహాశ్వేతాదేవి మరణంపట్ల సంతాపం తెలపడంలో భాగంగా ఆమె రచించని రెండు పుస్తకాలను కోడ్ చేసి, తప్పులో కాలేశారు. ఆశాపూర్ణా దేవి రాసిన 'ప్రథమ్ ప్రతిశ్రుతి', 'బకుల్ కథ' పుస్తకాలను.. మహాశ్వేతాదేవి రాసినట్లుగా తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. మహాశ్వేతాదేవి రచరనలు తనపై శాశ్వత ముద్రను వేశాయంటూ సుష్మాస్వరాజ్... శ్వేతా రచించని రెండు పుస్తకాల పేర్లను తన ట్విట్టర్ సందేశంలో రాశారు. అయితే విషయాన్ని ట్విట్టర్ వినియోగదారులు కొందరు చూసి.. తెలిపే వరకూ కూడా ఆమె గమనించలేదు. అనంతరం తప్పును తెలుసుకొన్న సుష్మా.. వెంటనే పుస్తకాల పేర్లను పేర్కొన్న రెండో ట్వీట్ ను డిలీట్ చేశారు. అయితే సుష్మా తన పొరపాటు మెసేజ్ ను వెంటనే డిలీట్ చేసినా.. ప్రజలు మాత్రం ఆమెను వదల్లేదు. ఆమె డిలీట్ చేసిన మెసేజ్ ఫొటోలను పోస్ట్ చేసి, ఇది ఆమె పట్టని తనానికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు. అజ్ఞానానికి నిదర్శనమని అభివర్ణించారు. సామాజసేవకోసం జీవితాన్ని త్యాగం చేసిన మహాశ్వేతాదేవి మరణం విషయం తెలిసిన వెంటనే గొప్ప రచయితను కోల్పోయామంటూ ప్రధాని నరేంద్రమోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా.. ఎంతోమంది ప్రముఖులు, రాజకీయనాయకులు సంతాపం తెలిపిన విషయం విదితమే. -
గ్యారేజీ పాలైన ‘ఆరాధన’
l మూటల్లో మూలుగుతున్న 3 వేల సంచికలు l అన్నవరం దేవస్థానం సిబ్బంది నిర్వాకం అన్నవరం : దేవాదాయ శాఖ 2015 జూలైలో గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని వివిధ ఆధ్యాత్మిక కథనాలతో ప్రచురించిన ‘ఆరాధన’ ప్రత్యేక సంచిక ప్రతులు దేవస్థానం కారు గ్యారేజీలో పడి ఉన్నాయి. ఏకంగా 30 బస్తాలలో మూడువేల పుస్తకాలను మూటలు కట్టి ఎందుకూ పనికిరాని పుస్తకాలలా మూలన పడేశారు. దేవాదాయశాఖ ప్రతి నెలా ‘ఆరాధన’ ఆధ్యాత్మిక మాసపత్రికను ప్రచురిస్తుంది. ఒక్కో సంచిక వెల రూ.25 కాగాఅన్నవరం దేవస్థానానికి ప్రతినెలా ఐదు వేల ప్రతులు పంపిస్తారు. ప్రతి నెలా వచ్చే పుస్తకాలను దేవస్థానం రూ.1,500 వ్రతాలు చేయించుకునే భక్తులకు, నిత్యకల్యాణం భక్తులకు ఉచితంగా ఇచ్చి. మిగిలిన ప్రతుల్ని విక్రయిస్తోంది. ప్రతి నెలా ఎన్నో కొన్ని పుస్తకాలు మిగిలిపోతున్నా వాటితో నిమిత్తం లేకుండా దేవస్థానానికి పంపించిన మొత్తం పుస్తకాలకు సొమ్ము చెల్లిస్తున్నారు. కాగా, 2015 జూలైలో పుష్కరాలకు సంబంధించి ప్రత్యేక సంచికను విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, దేవాదాయశాఖమంత్రి మాణిక్యాలరావు, కమిషనర్ అనూరాధ సందేశాలతో, గోదావరి జిల్లాల్లోని ఆలయాల వివరాలతో రూపొందించిన ఆ సంచిక ప్రతులను గ్యారేజీకి తరలించడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంత్య పుష్కరాల్లో పంపిణీ: ఈఓ కాగా ఆరాధన ప్రత్యేక సంచికలు దేవస్థానానికి పంపించినవి కాదని, పుష్కరాల్లో రాజమండ్రిలో విక్రయించగా మిగిలిన వాటిని గత ఆగస్టులో దేవస్థానానికి పంపివిక్రయించమన్నారని ఈఓ నాగేశ్వరరావు బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. అప్పటికే ఆగస్టు నెల ఆరాధన మార్కెట్లోకి రావడంతో ఈ పుస్తకాలను ఎవరూ కొనలేదని, ఈ పుస్తకాలకు దేవస్థానం నగదు చెల్లించలేదని వివరించారు. ఈ నెల 31న ప్రారంభం కానున్న అంత్యపుష్కరాలలో సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తులకు వీటిని పంపిణీ చేయిస్తామన్నారు. -
విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
కాగజ్నగర్ : విద్యార్థులు కష్టబడి చదవాలని, మంచి మార్కులు సాధించాలని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పిలుపునిచ్చారు. బుధవారం ఓల్డ్ కాలనీలోని ఇక్బాల్ స్కూల్ విద్యార్థులకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉచితంగా నోటు పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని విధాల సహాయం అందిస్తామని, విద్యార్థులు పట్టుదలతో చదివి ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. మైనార్టీ విద్యార్థులకు చేయూతనందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వెల్లడించారు. గతంలో ఇక్బాల్ స్కూల్కు నూతన భవనం మంజూరు చేయించి పూర్తి చేయడం జరిగిందని, అయితే త్వరలోనే మిగిలిన తరగతి గదులను కూడా నిర్మించేందుకు కషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత విద్యార్థులు విద్యలో రాణించి టాపర్లుగా నిలిస్తే తనకు ఎంతగానో సంతోషం కలుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆ వార్డు కౌన్సిలర్ నియాజుద్దీన్ బాబా, టీఆర్ఎస్ నాయకులు దినేష్ అసోపా, స్కూల్ కరస్పాండెంట్ ముక్తియార్ అహ్మద్ రూమి, వైస్ ప్రసిడెంట్ ఇమాముద్దీన్ హబీబ్, కోశాధికారి ఫెరోజ్ ఖాన్, సభ్యులు జాకీర్, హెడ్ మాస్టర్ రజీయా జహా, విద్యార్థులు పాల్గొన్నారు. -
చరిత్ర పుటల్లో 'పంజాబ్ మెయిల్'!
ముంబైః మహరాష్ట్ర రాజధాని ముంబై నగరం నుంచి ప్రయాణీకులను తరలించే 'పంజాబ్ మెయిల్' చరిత్ర పుటల్లో నిలిచింది. ముంబై నుంచి ఫిరోజ్ పూర్ కు ప్రయాణీకులను చేరవేసే పంజాబ్ మెయిల్ 104 ఏళ్ళు పూర్తైన మొదటి భారతీయ రైలుగా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. రైల్వే చరిత్రలో సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించిన రైలుగా గుర్తింపు పొందింది. స్వాతంత్రానికి ముందు 'ది పంజాబ్ లిమిటెడ్' గా పిలిచే మెయిల్ సర్వీస్ ను 1912 లో ప్రారంభించినట్లు ముంబై సెంట్రల్ రైల్వే వెల్లడించిన వివరాలను బట్టి తెలుస్తోంది. అప్పటి బాంబే, ఇప్పటి ముంబై నుంచి పెషావర్ ప్రయాణించే పంజాబ్ మెయిల్ మూలాలు మాత్రం పూర్తిగా లభించలేదు. 1911 ఖర్చు అంచనా కాగితాల ఆధారంగానూ... 1912 అక్టోబర్ 12న రైలు కొద్ది నిమిషాలు ఆలస్యం అవ్వడంపై ప్రయాణీకులు చేసిన ఓ ఫిర్యాదు ఆధారంగానూ... పంజాబ్ మెయిల్ తొలిసారి బల్లార్డ్ పీర్ మోల్ స్టేషన్ నుంచి 1912 జూన్ 1న ప్రారంభమైనట్లు అంచనా. అప్పట్లో ఈ రైలు... ఫ్యామిలీ ప్లానింగ్ పై ప్రధాన ప్రకటనా మెయిల్ గా ఉపయోగపడినట్లు 1968 సెప్టెంబర్ 16 న తీసిన ఓ ఫొటోను బట్టి తెలుస్తోంది. ప్రజల్లో ఫ్యామిలీ ప్లానింగ్ పై అవగాహన పెంచడంలో భాగంగా... ఇద్దరు లేదా ముగ్గురు అన్న మెసేజ్ తో ప్రతిరోజూ ఈ రైలు ప్రయాణం సాగేది. అనంతరం ఇండియాలో ఫ్యామిలీ ప్లానింగ్ పై అవగాహన పెంచడంలో భాగంగా చాలా రైళ్ళలో ఎర్రని త్రిభుజాకారం గుర్తును బర్త్ కంట్రోల్ సింబల్ గా వాడేవారు. అప్పట్లో భారత్ లో 55 కోట్లమంది జనాభా ఉండగా ప్రతి సంవత్సరం ఒక కోటి చొప్పున పెరుగుతూ ఇప్పటికి 150 కోట్లకు చేరింది. -
ఓ గొప్ప చరిత్ర
ఓప్రా విన్ఫ్రేకి ఒక ఉత్తరం రాస్తూ, ‘75 ఏళ్ల తర్వాత ప్రజలు లాప్టాపులూ, సెల్ఫోన్లూ, ఐపాడ్లలో మునిగి తేలుతున్నారు - తమ మెదడుల్ని ఖాళీగదుల్ని చేసుకుని. కానీ నేనింకా పుస్తకాల మధ్యనే ఉన్నాను’ అన్నారు. కాలం మానవ మనోఫలకం మీద చేసిన సంతకం చరిత్ర. ఈ సంతకాలు అనేకం. అపూర్వం. అనూహ్యం. విచిత్రం. విడ్డూరం. మరొకప్పుడు అసంబద్ధమైన విపర్యయం. కొందరు రచయితలు జీవితమంతా పుంఖానుపుంఖాలుగా రచనలు చేస్తారు. చేస్తూనే ఉంటారు. వాళ్లతో పాటే వారి జ్ఞాపకాలూ కాల గర్భంలో కలసి పోతాయి. కొందరు ఇబ్బందిగా, ముక్తసరిగా, క్లుప్తంగా తమ మనసుని పేజీల్లో విప్పుతారు. చరిత్ర వారిని గుండెల్లో పొదువుకుంటుంది. రాసికాదు, వాసి- అన్నది పాత నానుడి. ఒకావిడ 89 సంవత్సరాల కింద పుట్టింది. 35 సంవత్సరాలు ఏమీ రాయాలనుకోలేదు. రాసినా ఏవేవో రాసింది. తన 35వ యేట - తన అనుభవాలు, జ్ఞాప కాలలో నుంచి - ఇద్దరు పసివారి మనసుల్లో ఆలోచనల రూపంగా ఒక నవల పుట్టింది. ఆ నవల ఆమెకే కాదు, ఆమె దేశానికీ, నవలా సాహిత్యానికీ, ఈ దశాబ్దపు రచనలకీ మకుటాయమానమైంది. ఆ రచయిత్రి పేరు హార్పర్ లీ. ఆమె ఇటీవలే కన్నుమూసింది. నల్లవారి పట్ల వివక్ష ఎక్కువగా ఉన్న ఆనాటి అలబామాలో మన్రోవిల్లీ ప్రాంతంలో ఒక నల్లజాతీయుడు తెల్ల జాతి అమ్మాయిని మానభంగం చేశాడన్న తప్పుడు కేసును నల్లవాని తరఫున వాదించిన తెల్ల లాయరు కథ ఇతివృత్తం. అసలు లీ నవలే రాయాలనుకోలేదు. ఎలా రాయాలో తెలీదు. తన 31వ యేట మొదట ఒక నమూనా ప్రతిని రాసింది. ఆమె అదృష్టవశాత్తు ఆ స్క్రిప్ట్ హోహోఫ్ టోర్నీ అనే ఆవిడ చేతిలో పడింది. ఆ రచనలో మంచి నవల లేదు. కాని మంచి నవలకి ప్రాతిపదికను గుర్తు పట్టింది. తర్వాత కేవలం రెండు సంవత్సరాలు లీతో చర్చలు జరిపి సంఘటనలను కుదించి, కత్తిరించి, కుట్టి, సవరణలు చేసి, మళ్లీ మళ్లీ తిప్పి రాయడం సాగుతూ వచ్చింది. ఓసారి విసుగెత్తి తన రచన మీద తనకే తృప్తి లేక ఓ శీతాకాలం రాత్రి చేతిలోని రచనని కిటికీలోంచి బయటకు మంచులో పారేసింది. ఇది తెలిసిన హోహోఫ్ నచ్చ చెప్పి వెంటనే ఆ కాగితాలను వెనక్కు తీసుకురమ్మని ఒత్తిడి చేసింది. ఎట్టకేలకు ఒక నవల రూపుదిద్దుకుంది. ఆ నవల పేరు ‘టు కిల్ ఎ మాకింగ్బర్డ్’. ఆ పుస్తకం కేవలం 4 కోట్ల కాపీలు అమ్ముడుపోయింది. అమెరికాలో 74 శాతం స్కూళ్లలో పాఠ్య పుస్తకమయింది. పులిట్జర్ బహుమతిని దక్కించుకుంది. 1999లో లైబ్రరీ జర్నల్ ఈ నవలని ఈ శతాబ్దపు గొప్ప నవలగా అభివర్ణించింది. తర్వాత 54 సంవత్స రాలు ఏమీ రాయలేదు. హార్పర్ లీ న్యూయార్క్లో ఈస్టర్న్ ఎయిర్లైన్స్లో రిజర్వేషన్ గుమాస్తాగా పనిచేసింది. అప్పటి ఆమె పాప్యులారిటీకి ఒక్క ఉదాహరణ- 1956లో ఒక అభిమాని ఆమెకి ఒక సంవత్సరం పాటు జీతం కలసి వచ్చే పైకం చెక్కు పంపుతూ, ‘మీరు సంవత్సరం పాటు ఉద్యోగాన్ని వదిలి రచనలు చెయ్యండి. క్రిస్టమస్ శుభాకాంక్షలు’ అన్నాడు. 1962లో అప్పటి ప్రముఖ నటుడు గ్రిగరీ పెక్ లాయరుగా నటించిన చిత్రం అమెరికా సినీరంగంలో మరొక చరిత్రను సృష్టించింది. ఆ చిత్రానికి మూడు ఆస్కార్ బహుమతులు, ఉత్తమ నటనకు గ్రిగరీ పెక్కు ఆస్కార్ బహుమతి లభించాయి. విచిత్రం ఏమిటంటే ఆమెకి కీర్తి అన్నా, పరపతి అన్నా, పదిమందిలోకి రావడమన్నా ఇష్టం లేదు. సభల్లో పాల్గొనడం, అవార్డులు, గౌరవాలను స్వీకరించడం ఆమెకి నచ్చదు. ఆమె పెళ్లి చేసుకోలేదు. 2011లో ఒక ఆస్ట్రేలియా పత్రికా సంపాదకుడితో మాట్లాడుతూ, ‘‘ఇక నేనెప్పుడూ రచన చెయ్యను. అందుకు రెండు కారణాలు. 1. ఎంత డబ్బిచ్చినా నా నవల కారణంగా నా మీద వచ్చిన ఒత్తిడి, ప్రచారాన్ని నేను తట్టుకోలేను. 2. నేనేం చెప్పాలనుకున్నానో చెప్పేశాను. దాన్నే మళ్లీ మళ్లీ చెప్పడం నాకిష్టం లేదు’ అన్నారు. 2006 మే 7న ప్రపంచ ప్రఖ్యాత ప్రదర్శకురాలు ఓప్రా విన్ఫ్రేకి ఒక ఉత్తరం రాస్తూ, ‘75 ఏళ్ల తర్వాత ప్రజలు లాప్టాపులూ, సెల్ఫోన్లూ, ఐపాడ్లలో మునిగి తేలుతున్నారు - తమ మెదడుల్ని ఖాళీగదుల్ని చేసుకుని. కానీ నేనింకా పుస్త కాల మధ్యనే ఉన్నాను’ అన్నారు. ముగ్గురు అమెరికా అధ్యక్షులు ఆమెకి తమ దేశపు అత్యున్నత గౌరవంతో సత్కరించారు. చివరి రోజుల్లో చూపు తగ్గి, బొత్తిగా కనిపించక, వినిపించక, జ్ఞాపకాలను మరచిపోతూ, వృద్ధాప్యం మీద పడగా వీల్చైర్లో తిరుగుతూ ఒక శరణాలయంలో, తను పుట్టిన ఊరు మన్రోవిలీలో నిద్రలో కన్నుమూసింది. కిందటి సంవత్సరమే ‘గో సెట్ ఏ వాచ్మేన్’ అనే ఆమె నవల ప్రతి బయటపడింది. కానీ అది మొదటి నవలకి మొదటి రూపమని చాలామంది తేల్చేశారు. అయినా మొదటి రోజుల్లోనే ఆ నవల 2 కోట్ల కాపీలు అమ్ముడుపోయింది. కొందరు చరిత్రను సృష్టిస్తారు. కొందరు తెర వెనుకనే జీవించి, ఏకాకిగా గడిపి, ఒంటరి జీవితాన్నే చరిత్రగా చేసుకుంటారు. కాలం మనోఫలకం మీద చెక్కిన విపర్యయం కూడా చరిత్రే. - గొల్లపూడి మారుతీరావు -
కొత్త ఏడాది మొదలైంది ఇలా..
పుస్తకాలు పట్టాల్సిన చిట్టి చేతులు నీళ్ల బిందెలు మోస్తున్నాయి. అక్షర ముక్కలు నేర్చుకోవాల్సిన వయసులో చిన్నారులు వెట్టి పనులకు అలవాటు పడున్నారు. కొత్త ఏడాది చదువులు ప్రారంభమైనా కొత్త పుస్తకాలు రాకపోవడంతో చిన్నారులు ఇలాంటి పనులు చేయాల్సి వస్తుంది. మంగళవారం జగదేవ్పూర్ ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు మధ్యాహ్న వంట కోసం బిందెలతో నీళ్ల మోస్తున్న దృశ్యాలను ‘సాక్షి’ కెమెరా క్లిక్మనిపింది. - జగదేవ్పూర్ -
'ఖైదీ'రచనల ప్రకంపనలు..
రియల్ ఎస్టేట్ టు రాకెట్ సైన్స్.. సాక్సుల వాడకం నుంచి సాకర్ బెట్టింగ్స్ వరకు.. ఒక్కటేమిటి దేశంలో జరిగిన, జరుగుతున్న, జరగబోతున్న అనేక విషయాలపై ప్రచురితమైన పుస్తకాలు రొమేనియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అలాగని వాటిని రాసింది ఏ శాస్త్రవేత్తలో అనుకుంటే పొరపాటే.. పచ్చి మోసగాళ్లు, అవినీతిలో ఆరితేరి దోషులుగా తేలిన ప్రబుద్ధులు.. ప్రస్తుతం జైలులో ఉంటూ రాసిన పుస్తకాలవి. రచనల ద్వారా శిక్షా కాలాన్ని తగ్గించుకునే వెసులుబాటును తమకు అనుకూలంగా మార్చుకున్న ఆ అక్షర ఖైదీల అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టనున్నట్లు ఆ దేశ న్యాయ శాఖ సోమవారం ప్రకటించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. ప్రస్తుతం యురోపియన్ యూనియన్ లో ఒకటైన రొమేనియా గతంలో యూఎస్ఎస్ఆర్ లో అంతర్భాగంగా ఉండేది. నాటి కమ్యూనిస్టు పాలనలో రాజకీయ ఖైదీలకు జైలులో కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఉండేవి. ఖైదీలు తమ అభిరుచి మేరకు ఎంచుకున్న అంశంపై పుస్తకాలు రాసే వీలుండేది. అలా వారు రాసే ఒక్కో పుస్తకానికిగానూ 30 రోజుల శిక్షా కాలాన్ని తగ్గించేది ప్రభుత్వం. కాల క్రమంలో ఆ ప్రత్యేక సదుపాయాలు పొందేవారిలో బడా బాబులూ చేరిపోయారు. శ్రీమంతులుగా పుట్టి చిన్నచిన్న పనులు కూడా చేయడం చేతకానివాళ్లు కూడా పుస్తకాలు రాసి శిక్షా కాలాన్ని తగ్గించుకోవచ్చన్నమాట. అయితే గడిచిన కొద్ది రోజులుగా ఖైదీలు రాస్తోన్న పుస్తకాల సంఖ్య వందల్లోకి చేరుకుంది. 2014లో ఖైదీలు రాసిన పుస్తకాల సంఖ్య 90కాగా, 2015లో అది 340కి పెరిగింది. ఇటీవలే ఒక ఖైదీ కేవలం ఏడు గంటల్లోనే 2012 పేజీల పుస్తకాన్ని రాసేయటం, మరో ఖైదీ 12 గంటల్లో 189 పేజీల పుస్తకాన్ని మిడికేయటం వివాదాస్పదంగా మారింది. ఖైదీలు రాసే పుస్తకాలు.. యూనివర్సిటీ ఫ్రొఫెసర్లు పరిశీలించిన అంతరం జడ్జి అనుమతితో ప్రచురణకు వెళతాయి. కాగా, జైళ్లలో ఉంటూనే బయట తమ ప్రభావాన్ని చాటుకునే ఖైదీలతో ప్రొఫెసర్లు కుమ్మక్కయ్యారనే విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. నిజానికి ఆ పుస్తకాలేవీ పాఠకాదరణ పొందలేకపోయాయి. రాతలో విషయం లేకున్నా పుంఖాను పుంఖాలుగా పుస్తకాలు రాస్తూ అక్రమ మార్గంలో శిక్షా కాలాన్ని తగ్గించుకోజూసిన ఖైదీల వ్యవహారంపై ప్రారంభమైన దర్యాప్తులు ఇంకెన్ని నిజాలు వెలుగులోకి వస్తాయో వేచిచూడాలిమరి. -
నర్సరీ నుంచి ప్రభుత్వ పాఠ్య పుస్తకాలే
♦ తప్పనిసరి చేయనున్న ఎస్సీఈఆర్టీ ♦ ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలు వినియోగిస్తే చర్యలు సాక్షి, హైదరాబాద్: నర్సరీ విద్యార్థికి బ్యాలెన్స్డ్ డైట్పై ప్రాజెక్టు వర్క్... ఎల్కేజీ విద్యార్థికి జనరల్ నాలెడ్జిపై మరో ప్రాజెక్టు. మాటలే సరిగ్గా రాని వయసులో అశాస్త్రీయ పద్ధతిలో విద్యా బోధన. ఇష్టారాజ్యంగా ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలతో కుస్తీలు. ఆట, పాటలు, అలవాట్లు నేర్పించాల్సిన వయస్సులో ఇష్టారాజ్యంగా చదువులు... పిల్లలపై మానసిక ఒత్తిడి. ఇదీ రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు, ప్లే స్కూళ్లలో ప్రస్తుతం అమలు చేస్తున్న విద్యా విధానం. స్వయంగా విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) అధికారుల పరిశీలనలో వెల్లడైన వాస్తవాలు. అందుకే రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ నుంచి ఇష్టారాజ్యంగా సిలబస్ను అమలును కట్టడి చేసేందుకు ఎస్సీఈఆర్టీ కసరత్తు ప్రారంభించింది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీల్లోనూ ప్రభుత్వం సూచించే సిలబస్నే బోధించేలా చర్యలు చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చింది. 80 శాతం మెదడు అభివృద్ధి చెందే వయసు పిల్లలకు వినడం.. పరిశీలించడం.. మాట్లాడించడం నేర్పించాలన్న మాంటిస్సోరీ విధానాన్ని పక్కనబెట్టి అశాస్త్రీయ విధానాలతో.. అనవసరపు ఒత్తిడిని తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి బోధించాల్సిన సిలబస్ రూపకల్పనకు ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాదు శాస్త్రీయ పద్ధతిలో ప్రభుత్వం రూపొందించే సిలబస్లోనే అన్ని ప్రైవేటు పాఠశాలల్లో బోధన కొనసాగించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి (జూన్) దీనిని పక్కాగా అమలు చే యనుంది. ఇందుకు భిన్నంగా వ్యవహరించే ప్లే స్కూళ్లు, ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలను వినియోగించే పాఠశాలలపై కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధం అవుతోంది. వచ్చే నెలాఖరుకు సిలబస్ రెడీ... ఇటీవల హైదరాబాద్లోని ఓ ప్లేస్కూల్ లిఫ్ట్లో విద్యార్థి పడి మరణించిన నేపథ ్యంలో విద్యాశాఖ ప్లే స్కూళ్లు, ప్రీప్రైమరీ విద్యాబోధన, ప్రైవేటు పాఠశాలల్లో అమలు చేస్తున్న విధానాలపై తీవ్రంగా స్పందించింది. ఇందులో భాగంగాా ప్రతి ప్లేస్కూలూ గుర్తింపు పొందాల్సిందేనని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే దాదాపు అన్ని ప్రైవేటు పాఠశాలల్లోనూ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీల్లో ఆశాస్త్రీయ విధానంలో విద్యా బోధన కొనసాగుతుందని, అది విద్యార్థులపై ఒత్తిడిని పెంచడమే కాకుండా వారి మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్న విషయాన్ని గుర్తించింది. అవసరమైన సిలబస్ను రూపొందించాలని నిర్ణయించింది. దీనిపై త్వరలోనే వివిధ వర్గాలు, ప్రొఫెసర్లు, విద్యావేత్తలతో వర్క్షాప్ నిర్వహించనుంది. అలాగే ప్రస్తుతం వివిధ ప్లేస్కూళ్లు, ప్రైవేటు పాఠశాలలు అమలు చేస్తున్న పబ్లిషర్ల పుస్తకాలను పరిశీలించేందుకు చర్యలు చేపడుతోంది. మరోవైపు కర్ణాటకలో ప్రీప్రైమరీకి బోధించేందుకు రూపొందించిన సిలబస్ను కూడా పరిశీలించి, శాస్త్రీయ పద్ధతిలో సిలబస్ను రూపొందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మొత్తానికి వచ్చే నెలాఖరులోగా సిలబస్ను సిద్ధం చేసి, పుస్తకాల ముద్రణకు చర్యలు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. తద్వారా వచ్చే జూన్ 13న పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి శాస్త్రీయ విధానంలో రూపొందించిన పుస్తకాలను అందుబాటులోకి తే సుకువచ్చేందుకు ఎస్సీఈఆర్టీ చర్యలు చేపడుతోంది. వాటి అమలు పర్యవేక్షణ బాధ్యతలను డీఈవోలు తీసుకోవాలని, అమలు చేయని పాఠశాలలపై కఠిన చర్యలు చేపట్టేలా నిబంధనలు తీసుకురాబోతోంది. -
'పుస్తకాలు జీవితాన్ని మార్చిన సందర్భాలున్నాయి'
-
'పుస్తకాలు జీవితాన్ని మార్చిన సందర్భాలున్నాయి'
విజయవాడ : పుస్తకాలు జీవితాన్ని మార్చిన సందర్భాలు ఉన్నాయని సాక్షి దినపత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి అతిథిగా హాజరైన ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ టాల్స్టాయి వంటి రచయితల ప్రభావం తనపై ఉందని గాంధీజీనే స్వయంగా వెల్లడించారన్నారు. మహాత్ముడి రచనలు మొత్తం ప్రపంచంలో అనేకమందిని ప్రభావితం చేశాయని రామచంద్రమూర్తి ఈ సందర్భంగా గుర్తు చేశారు. పుస్తకాలను అర్థం చేసుకుంటూ, అనుభవిస్తూ చదవాలని, పుస్తక పఠనాన్ని ఒక అలవాటుగా చేసుకోవాలని ఆయన సూచించారు. కాగా 27వ విజయవాడ పుస్తక మహోత్సవం శుక్రవారం స్వరాజ్య మైదానంలో ప్రారంభమైంది. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పుస్తక మహోత్సవ ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశనేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. Sakshi editorial director K Ramachandra murthy, books, Vijayawada Book Festival, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, పుస్తకాలు, విజయవాడ పుస్తక మహోత్సవం -
జుకర్ ఆ 22 పుస్తకాలు చదవాలంటున్నాడు
న్యూయార్క్: మీరు పుస్తకాలను చదువుతున్నారా అని ఎవరైనా అడిగితే.. అలా అడిగిందే తడవుగా నేనా..! పుస్తకాలా..! న్యూస్ పేపర్ చదివే సమయమే లేదుకానీ పుస్తకం చదవడమా అని అంటుంటారు. ఇంకొందరైతే పుస్తకాలు చదవడం అంటే నాకు చాలా ఇష్టం కానీ బిజీ షెడ్యూల్ వల్ల వాటిని చదవలేకపోతున్నానని అంటుంటారు. మరికొందరు ఖాళీగా ఉన్నా అసలు పుస్తకాలు చదవాలనే ఆలోచనే చేయరు. కానీ, ఆయన కొన్ని వేల కోట్లకు అధిపతి.. నేడు ప్రపంచం మొత్తాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఘనుడు, కూతురు పుట్టిందన్న సంతోషంతో తన సంపాదనలో కొంతభాగాన్ని ప్రపంచ సేవలకోసం ఖర్చుచేస్తానని ప్రకటించిన నిస్వార్థపరుడు జూకర్ బర్గ్ మాత్రం పుస్తకాలతో కుస్తీ పట్టండని సలహాలు ఇస్తున్నాడు. అవొక్కటే తనను తాను నిజంగా శోధించుకునే ఏకైక సాధనం అని ఆయన చెబుతున్నారు. 2015లో రెండు వారాలకు కనీసం ఒక పుస్తకాన్ని అయినా చదవాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆయన ఆ లక్ష్యాన్ని చేరుకున్నారు. తాను నిర్ణయించుకున్నట్లుగా మొత్తం 22 పుస్తకాలు చదివారు. మీరు కూడా అలాగే పుస్తకాలు చదవడం లక్ష్యంగా పెట్టుకొని వాటిని సాధిస్తారని ఆయన ఆకాంక్షించారు. తాను చదివిన ఈ 22 పుస్తకాలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని మీరు కూడా చదవండంటూ ఆయన తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. జుకర్ బర్గ్ తప్పక చదవాలని చెప్పిన 22 పుస్తకాలు ఇవే.. ► ది ఐడియా ఫ్యాక్టరీ: బెల్ లాబ్స్ అండ్ గ్రేట్ ఏజ్ ఆఫ్ అమెరికన్ ఇన్నో వేషన్, రచన జాన్ గార్ట్నర్ ► వరల్డ్ ఆర్డర్, రచన: హెన్నీ కిస్సింగర్ ► వై నేషన్స్ ఫెయిల్: డారెన్ అకెమొగ్లు అండ్ జేమ్స్ రాబిన్ సన్ ► ది రేషనల్ ఆప్టిమిస్ట్ రచయిత: మాట్ రిడ్లీ ► పోర్ట్ పోలియోస్ ఆఫ్ ది పూర్, డేరిల్ కొలిన్స్, జోనాధన్ మార్చుచ్ ► ది త్రీ బాండీ ప్రాబ్లెమ్, రచన లి కిక్సిన్ ► జినోమ్, మట్ రిడ్లీ ► ది ముకాద్దిమాహ్, ఐబీఎన్ ఖాల్దన్ ► సెపియన్స్ , యువల్ నో హరారి ► ది వెరైటీస్ ఆఫ్ రిలీజియస్ ఎక్స్పీరియన్స్, విలియం జోన్స్ ► ది న్యూ జిమ్ క్రో, మైఖెల్ అలెగ్జాండర్ ► ది ఎండ్ ఆఫ్ పవర్, మోయిస్ నేయిమ్ ► క్రియేటివిటీ ఇంక్, ఈడీ కాత్ముల్ ► ది బెటర్ యాంగిల్స్ ఆఫ్ అవర్ నేచుర్, స్టీవెన్ పింకర్ ► ఆన్ ఇమ్యూనిటీ, యులా బిస్ ► ది ప్లేయర్ ఆఫ్ గేమ్స్, ఎం బాక్స్ ► గ్యాంగ్ లీడర్ ఫర్ ఏ డే, సుదీర్ వెంకటేశ్ ► ది స్ట్రక్చర్ ఆఫ్ సైంటిఫిక్ రెవల్యూషన్స్ ► ఆర్వెల్ రివెంజ్, పీటర్ హబర్ ► ఎనర్జీ: ఏ బిగినర్ గౌడ్, వాక్లావ్ స్మిల్ ► డీలింగ్ విత్ చైనా, హెన్రీ ఎం పాల్స్న్ ► రేషనల్ రిచువల్ బై మైఖెల్ సుక యంగ్ చ్వే -
గోంగూర పచ్చడి, నెయ్యి అంటే ప్రాణం
న్యూఢిల్లీ ఎప్పుడూ విద్యార్థులతో సందడి సందడిగా ఉండే భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు నెయ్యి, గోంగూర పచ్చడి అంటే ప్రాణం. దక్షిణ భారతదేశ వంటకాలనుఎక్కువగా ఇష్టపడే కలాం ఇడ్లీలు లను చాలా ఇష్టంగా తినేవారట. దేశానికి విశిష్ట సేవలందించి ప్రజల రాష్ట్రపతిగా పేరుగాంచిన ఆయన రాష్ట్రపతిగా ఆయన అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. గొప్పమానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. అన్నిసుగుణాలు ఉన్నపరిపూర్ణ వ్యక్తి కలాం. దేశ విశిష్ట పురస్కారం భారతరత్నను అందుకున్న మూడో రాష్ట్రపతి కలాం. ఆయనకు ప్రకృతి అంటే ప్రాణం. చెట్లు పెంచడం ద్వారా ప్రకృతి సమతుల్యతను కాపాడాలని ఆయన అనేక సందర్భాల్లో ప్రజలకు పిలుపునిచ్చేవారు. ప్రతి ఇల్లూ పచ్చగా కళకళలాడాలని ఆయన కోరుకునేవారు. ఇంటి చుట్టూ చెట్లు పెంచి ప్రశాంతమైన వాతావరణాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించేవారు. పిల్లలంటే వల్లమాలిన అభిమానం. నిత్యం వారికోసం పరితపించేవారు. జీవితంలో ఎన్నడూ క్రమశిక్షణను ఉల్లఘించలేదు. నిత్యం వ్యాయాయం చేసేవారు. చాలా క్రమబద్ధమైన, నియమబద్ధమైన జీవితాన్ని గడిపారు. తద్వారా యువతకు ఉన్నతమైన సందేశాన్నందించారు. ఆయనకు పుస్తకాలు, సంగీతం అన్నా మక్కువ ఎక్కువే. ఈ నేపథ్యంలోనే ఆయన వీణ కూడా నేర్చుకున్నారు. -
సిలబస్ మార్పు సరే.. పుస్తకాలేవీ?
సందర్భం విద్యార్థుల జీవితాల తో పాలకులు చెలగా టం ఆడుతున్నారు. అధునాతన చరిత్రను విద్యార్థులకు అందిం చాల్సిన విషయం మం చిదే. కాని విద్యా సంవ త్సరం ప్రారంభమైన ప్పటికీ నేటికీ ఇంటర్ ద్వితీయ సంవత్సరం పుస్తకాలను ముద్రించ లేదు. ప్రతి ఏటా సిలబస్ మార్చటం. సరైన సమ యంలో పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అంది వ్వకపోవడం ఇంటర్ బోర్డుకు పరిపాటిగా మారింది. జూనియర్ కాలేజీలు ప్రారంభమై నెలా 10 రోజులు గడిచిపోయినప్పటికీ ద్వితీయ సం వత్సరం ఇంటర్ హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ (హెచ్ఈసీ) ఇంటర్ కామర్స్ విద్యార్థులకు క్లాసులు నిర్వహించలేక కాలం వెళ్లదీస్తున్నారు. 2015-16 విద్యా సంవత్సరానికి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పాఠ్యపుస్తకాలను మార్చు తున్నట్లు 8 నెలల ముందుగానే ప్రకటించారు. పౌరనీతి, అర్థశాస్త్రం, వాణిజ్యశాస్త్రం, చరిత్ర భూగోళశాస్త్రం, మనస్తత్వశాస్త్రం (సైకాలజీ) వంటి పాఠ్యపుస్తకాలను మార్చుతున్నట్లు 2014 లోనే ప్రకటించారు. కానీ వెంటనే పాఠ్య పుస్తకా లను ముద్రించటం ఎందువల్లనో మరిచిపో యారు. ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్ను 2014-15 సంవత్సరంలో మార్చారు. అప్పుడు 6 నెలలు గడిచాక, విద్యార్థులు, తల్లిదండ్రులు గొడవ చేశాక పుస్తకాలను మార్కెట్కు విడుదల చేశారు. తాజాగా మొదటి సంవత్సరం ద్వితీయ భాష సిలబస్ మారిందని సమాచారం అందిం చారు. దీంతో ఇంటర్ చదివే విద్యార్థులు గందర గోళంలో పడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వాల ఆదేశాల ప్రకారం జూన్ మొదటి తేదీ నుండే పాఠాలు బోధించాల్సి ఉంది. కాని మారిన సిలబస్కు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటి వరకు ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించక పోవడం వల్ల రెండు రాష్ట్రాల్లోని 12 లక్షల మంది విద్యార్థులు ‘పరేషాన్’ అవుతున్నారు. ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థులకు ఇది అమూల్యమైన సమయం. పైగా ఏఏ పా ఠ్యాంశానికి ఎంత వెయిటేజీ ఇస్తారో తెలియరావ టం లేదు. అత్యధిక మార్కుల కోసం శ్రమించే ద్వితీయ సంవత్సరం విద్యార్థుల గొంతులో వెల క్కాయ పడినట్లు తయారైంది వ్యవహారం. సిల బస్ కమిటీ ఉంటుంది. ముద్రణ కమిటీ ఉంటుం ది. పాఠ్య పుస్తకాల పంపిణీకి కమిటీలు ఉంటా యి. అన్ని రకాల కమిటీలు, అధికారుల సమీక్షలు ఉంటాయి. అన్ని చర్యలు తీసుకుంటారు. అయి నా అంగట్లో అన్నీ ఉన్నా ‘ఇంటర్ బోర్డు’ నోట్లో శని ఉంది అనే ప్రచారం విద్యార్థులు వ్యక్తం చేస్తు న్నారు. ఇప్పటికైనా ఇంటర్ అధికారులు మారిన పాఠ్యపుస్తకాల సిలబస్ను తక్షణమే ప్రకటించాలి. మారిన ఇంటర్ పాఠ్యపుస్తకాలను మార్కెట్లోకి విడుదల చేయాలి. ఆలస్యానికి కారకుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. - రావుల రాజేశం, వ్యాసకర్త లెక్చరర్ జమ్మికుంట మొబైల్: 9848811424 -
చేయాల్సింది ఎంతో ఉంది
రాష్ట్రపతి భవన్పై ప్రణబ్ న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో ఇంకా తాను చేయాల్సింది ఎంతో ఉందని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. రాష్ట్రపతిగా ఆయన మూడేళ్ల పదవీకాలాన్ని శనివారంతో పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎస్టేట్లోపల ‘ఆయుష్ వెల్నెస్ సెంటర్’ను ప్రణబ్ శనివారం ప్రారంభించారు. ప్రజలకవసరమైన ప్రాథమిక అంశాల విషయంలో ఏదో ఒకటి చేయాలన్నది తన ఆలోచనగా పేర్కొన్నారు. అందుకే రాష్ట్రపతి ఎస్టేట్లో స్వచ్ఛ భారత్, భేటీ బచాబో, భేటీ పడావో వంటి ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయాలని భావించినట్టు తెలిపారు. ‘నామినేషన్ పత్రాలు(రాష్ట్రపతి పదవికోసం) దాఖలు చేసేటప్పుడు ఓ సహచరుడు మాట్లాడుతూ సుదీర్ఘకాలంపాటు క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగిన నేను అక్కడ(రాష్ట్రపతి భవన్లో) ఏం చేయగలనని అన్నారు. క్రియాశీలకమైన జీవితం నుంచి నిస్సారమైన జీవితంతో కూడిన ప్రదేశంలోకి అడుగుపెడుతున్నారని నన్ను ఉద్దేశించి అన్నారు. కానీ ఆయన చెప్పిన రీతిలో పరిస్థితి లేదని నేను తెలుసుకున్నా. ఇక్కడ ఎంతో చేయవచ్చు. ఇక్కడ(రాష్ట్రపతి ఎస్టేట్) ఏడువేల మంది, వారి కుటుంబాలు ఉంటున్నాయి. వారికోసం ఎన్నో వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరముంది’ అని పేర్కొన్నారు. అందువల్లే ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా వెనువెంటనే దానిని రాష్ట్రపతి భవన్లో అమలు చేయాలని నిర్ణయించానని తెలిపారు. ప్రణబ్కు మోదీ అభినందనలు.. రాష్ట్రపతిగా మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న ప్రణబ్ ముఖర్జీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ప్రణబ్ అపార అనుభవం, తెలివితేటలు దేశానికి ఎంతో లబ్ధి చేకూర్చాయని ట్విట్టర్లో ఆయన ప్రశంసలు కురిపించారు. -
రావిశాస్త్రిని గాంచిన వేళ
జ్ఞాపకం నాకు గుర్తున్నమటుకు నా మెడిసిన్ సబ్జక్టు పుస్తకాలు కాకుండా రిపీటెడ్గా చదివింది రావిశాస్త్రినే! ‘‘ఇది ఇందూదేసెం! ఈ దేసంలోనే గాదు, ఏ దేసంల అయినసరె పోలీసోడంటే గొప్ప డేంజిరిస్ మనిసని తెలుసుకో! ఊరికి ఒక్కడే గూండా ఉండాలా, ఆడు పోలీసోడే అవాల. అప్పుడె రాజ్జెం ఏ అల్లర్లు లేకండ సేంతిబద్రతలు సక్కగ ఉంటయ్. అంచేత్త ఏటంతే, పులికి మీసాల్లాగినట్లు పోలీసోడితో దొంగసరసం జెయ్యకు! సాలా డేంజరు!...’’ ఈ వాక్యాలు ఎవరివో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా రాయడం ఒక్క రావిశాస్త్రికి మాత్రమే సాధ్యం. ఇది ‘మూడుకథల బంగారం’లో సూర్రావెడ్డు బంగారిగాడికి చేసిన ఉపదేశం. ఒక పద్ధతిగా, ప్రశాంతంగా, హాయిగా, నింపాదిగా సాగిపోతున్న నా జీవితం - ఒక్కసారిగా పెద్ద కుదుపుకు లోనయ్యింది. అందుక్కారణం రావిశాస్త్రి! నేను హౌజ్ సర్జన్సీలో ఉండగా ‘ఆరుసారా కథలు’ చదివాను. ఆ భాషా, ఆ వచనం, ఆ భావం... దిమ్మ తిరిగిపోయింది. అంతకుముందు వరకు స్థిరంగా, గంభీరంగా నిలబడే అక్షరాల్ని చదివాను గానీ - లేడిలా చెంగుచెంగునా పరుగులు తీస్తూ, పాములా సరసరా మెలికలు తిరిగే వచనాన్ని నేనెప్పుడూ చదవలేదు. ఆ తరువాత రావిశాస్త్రిని ఒక్కపేజీ కూడా వదల్లేదు. నాకు గుర్తున్నమటుకు నా మెడిసిన్ సబ్జక్టు పుస్తకాలు కాకుండా రిపీటెడ్గా చదివింది రావిశాస్త్రినే! విశాఖపట్నం వెళ్లాలి, రావిశాస్త్రిని కలవాలి. ఎలా? ఎలా? ఎలా? నాకు విశాఖపట్నం వెళ్లడం సమస్య కాదు, కానీ రావిశాస్త్రిని ఎలా కలవాలి? అందుగ్గాను ఎవర్ని పట్టుకోవాలి? ఇదే సమస్య. ‘రావిశాస్త్రిని కలిసి ఏం మాట్లాడతావోయ్?’ ‘అయ్యా! దేవుణ్ని దర్శనం చేసుకోవాలి. కుదిర్తే కాళ్లమీద పడి మొక్కాలి. అంతేగానీ - దేవుడితో మాట్లాడాలనుకోవడం అత్యాశ!’ ఈ రకమైన ఆలోచనల్లో వుండగా - విశాఖ ప్రయాణం ఒకరోజు రాత్రికి రాత్రే హడావుడిగా పెట్టుకోవలసొచ్చింది. కారణం - మా సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ ఈఎన్బీ శర్మగారి అవసానదశ. పనిలో పనిగా రావిశాస్త్రిని కూడా కలవాలనే ఎజెండా కూడా నా ప్రోగ్రాంలో చేర్చాను. ఆ రోజంతా రావిశాస్త్రి ఇంటి ముందు బీటేసినా లాభం లేకపోయింది. కొన్నాళ్లకి నా అదృష్టం ధనలక్ష్మీ లాటరీ టికెట్టులా తలుపు తట్టింది. రావిశాస్త్రి ఒక పుస్తకావిష్కరణ సభకి గుంటూరు రావడం జరిగింది. చివరిక్షణంలో సమాచారం తెలుసుకున్న నేను ‘భలే మంచిరోజు, పసందైన రోజు’ అని మనసులో పాడుకుంటూ ఉరుకుపరుగులతో ఏకాదండయ్య హాలు(హిందూ కాలేజ్ ఆడిటోరియం) దగ్గరికి చేరుకున్నాను. అక్కడ హాల్ బయట ఓ పదిమంది నిలబడి కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. నేనూ ఓ పక్కగా నించుని రావిశాస్త్రి కోసం ఎదురుచూడసాగాను. ఒక్కొక్కళ్లుగా సభా స్థలానికి చేరుకుంటున్నారు. ‘ఇంతకీ రావిశాస్త్రి రాలేదా?’ కొద్దిగా అనుమానం, ఇంకొద్దిగా నిరాశ. ఓ పది నిమిషాలకి - అరచేతుల చొక్కా టక్ చేసుకుని - తెల్లటి వ్యక్తి, నల్లటి ఫ్రేమ్ కళ్లద్దాలతో నిదానంగా నడుచుకుంటూ ఆవరణలోకి రావడం కనిపించింది. ఆ వ్యక్తి ఎవరో నాకెవ్వరూ చెప్పనక్కర్లేదు. ఆ వ్యక్తి నాకు అనేక ఫొటోల ద్వారా చిరపరిచితం. ఆయనే రావిశాస్త్రి! క్షణాలు లెక్కపెట్టుకుంటూ ఎంతో ఉద్వేగంగా రావిశాస్త్రి కోసం ఎదురుచూసిన నేను - తీరా ఆయన వచ్చేసరికి చేష్టలుడిగి నిలబడిపొయ్యాను. ఈలోపు కొందరు ఆయనతో మాట్లాడ్డం మొదలెట్టారు. రావిశాస్త్రినే గమనిస్తూ ఆయనకి సాధ్యమైనంత సమీపంలో నిలబడ్డాను. ఈలోపు నేను మెడికల్ డాక్టర్నని ఆయనకెవరో చెప్పారు. నాకేసి చూస్తూ ‘మా చెల్లెలు నిర్మల తెలుసా?’ అనడిగారు. ‘తెలుసు. వారు నాకు ఫార్మకాలజీ పరీక్షలో ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ సార్’ అని బదులిచ్చాను. మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇంతే! రావిశాస్త్రి పక్కన చాలాసేపు గడిపాను (నిలబడ్డాను). ఒక్కమాట మాట్లాడలేదు. ఎవరెవరో ఏంటేంటో అడుగుతున్నారు. అవన్నీ - ‘రాజు-మహిషి’ ఎప్పుడు పూర్తిచేస్తారు? ‘రత్తాలు రాంబాబు’ని పూర్తిచెయ్యకుండా ఎందుకు వదిలేశారు?’ వంటి రొటీన్ ప్రశ్నలే. అవన్నీ నా మనసులో మెదలాడే ప్రశ్నలే! అయితే - నాకు వాళ్ల సంభాషణ చికాకు కలిగించింది. ‘రావిశాస్త్రి నావాడు, నాకు మాత్రమే చెందినవాడు, నా మనిషిని ఇబ్బంది పెడతారెందుకు? అసలిక్కడ మీకేం పని? పోండి పోండి!’ నేను తెలివైనవాణ్ని. అందుకే కళ్లు పత్తికాయల్లా చేసుకుని రావిశాస్త్రినే చూస్తూ ప్రతిక్షణం నా మనసులో ముద్రించుకున్నాను. ఎందుకంటే - నాకు తెలుసు. ఆ క్షణాలు నా జీవితంలో అమూల్యమైనవిగా కాబోతున్నాయని. అందుకే ఈ రోజుకీ రావిశాస్త్రి నాకు అతి దగ్గరలో నిలబడి ఉన్నట్లుగా అనుభూతి చెందుతాను. ఈ అనుభూతి నాకు ఎంతో ఆనందాన్ని, మరెంతో తృప్తిని కలిగిస్తుంది. ఒక్కోసారి అనిపిస్తుంది - నేనారోజు రావిశాస్త్రి ముందు ఎందుకలా నిలబడిపోయాను? ఒక మహోన్నత శిఖరం ముందు నిలబడ్డప్పుడు ఆ దృశ్య సౌందర్యానికి స్పెల్బౌండ్ అయిపోయి... చేష్టలుడిగి నిలబడిపోతాం. ఆ రోజు నా స్థితి అట్లాంటిదేనా? అయ్యుండొచ్చు! వై.వి.రమణ yaramana.blogspot.in (వ్యాసకర్త సైకియాట్రిస్ట్). -
పాపాఘ్ని కథలు
మా వూళ్లో వొక నది వుంది. దాని పేరు పాపాఘ్ని. నదిని చూస్తూ వుండిపోవడమంటే నాకిష్టం అది నిండినా సరే, ఎండినా సరే! ఇసుకలో ఎగిరెగిరి ఆడుకుంటూ ఉన్నప్పుడు చనిపోయిన శవాన్ని పాడెగా మోసుకుంటూ యేట్లోకి వస్తున్నవాళ్లని చూసి భయంభయంగా కంపచెట్ల వెనుక దాక్కోవడం గుర్తు. ఇష్టంకు భయంకు మధ్య యేరు. ఎంతవాడైనా చేరాల్సిన చివరి మజిలి యేరే కదా! వేంపల్లిలో పాపాఘ్ని నదికి ఆనుకొని ఎత్తయిన కొండపైన కొలువైన ‘ఎద్దుల కొండ్రాయుడు’ మా ఇంటి దేవుడు. గుట్టపైనుంచి నదిని చూస్తే దాని వొంపు సొంపులన్నీ పచ్చటి వరిపైర్లతో కలిసి దివ్యలోక అనుభూతి కల్గుతుంది. పావురాళ్లగుట్ట దగ్గర బ్రిడ్జి దాటుకున్న తర్వాత గండి వీరాంజనేయస్వామిని దర్శించుకుంటే - అక్కడి బండరాళ్లు రాసుకునేవాళ్లకు రామాయణం అంత కత చెప్తాయి. కుడివైపు కొండల మోట్లో బైరాగుల తత్వాలు, సిద్ధుల మంత్రాలు, సన్యాసుల మృత్యు నిరీక్షణ జీవితం నేర్పిస్తాయి. కురూపిగా కనరిల్లుతున్న వాళ్ల పాపాలు పోగొట్టి పవిత్రులుగా చేయగలిగిన యేరుగా పాపాఘ్ని (పాపాలు+అగ్ని)కి పేరు. ఎన్నో పాపాలు చేసి కురూపిగా మారిన ఒక రాజు ఇక్కడ తపస్సు చేయగా అతడి శాపాన్ని పోగొట్టి విముక్తం ప్రసాదించిన నదిగా ఒక ఐతిహ్యం. నంది కొండల్లో పుట్టి పెన్నా నదికి ఉపనదిగా మారుతూ కమలాపురం వద్ద దానితో జత కలుస్తుంది. మార్గ మధ్యంలో చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లోని దారుల వెంట ప్రయాణిస్తుంది. ఎంతో జీవాన్ని నింపి, జీవితాన్ని పండిస్తుంది. నది దారెంబడి నాగరికతతో పాటూ ఇప్పుడు జరుగుతున్న విధ్వంసాన్ని రికార్డు చేయడం కోసం ఈ 30 కథలు రాశాను. ప్రొక్లెయినర్తో ఇసుకను తవ్వి ట్రాక్టర్లతో తరలించుకొని కాంక్రీటు రాజ్యాల నిర్మాణం జరుగుతోంది. కరువు మేఘాలు కమ్ముకున్న నేల ఎలా వుంటుందో చెప్పడానికి ఈ కథలు రాశాను. కడప మాండలికాన్ని విస్తృత స్థాయిలో ఆవిష్కరించాలనే నా ప్రయత్నం ఇలా సాకారమైంది. - డాక్టర్ వేంపల్లి గంగాధర్ ఫోన్: 9440074893 ఎందుకు రాశానంటే? పాపాఘ్ని కథలు; పేజీలు: 152; వెల: 110, ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, గిరిప్రసాద్ భవన్, బండ్లగూడ(నాగోల్), జి.ఎస్.ఐ. పోస్టు, హైదరాబాద్-68; ఫోన్: 24224458 - వేంపల్లి గంగాధర్ కూలీలకే వీరస్వర్గం - కళింగ నానీలు కళింగ యుద్ధం పద్మనాభ యుద్ధం బొబ్బిలి యుద్ధం కూలీలకే వీరస్వర్గం కరిగి నీరవుతోంది యారాడ కొండ శ్రీశ్రీ లేడన్న చింత భలే చిత్రం మానవజీవితం కర్రమంచం నుంచి కర్రలమంచం మీదికి భూమి బల్లపరుపే పతంజలి పోయినా గోపాత్రుళ్లు పోలేదు - డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు ఫోన్: 8187897201 అచ్చతెలుగు అన్నమయ్య అన్నమయ్య సంకీర్తనల్లోని అచ్చతెలుగును తెలియజెప్పే పుస్తకం ‘అన్నమయ్య అచ్చతెలుగు’ (పేజీలు: 152; వెల: 80). క్షీరాన్నాన్ని పాలకూడు అంటాడు అన్నమయ్య. శుభవార్తను మేలుసుద్ది చేస్తాడు. ప్రతిబింబాన్ని నీడరూపుగానూ, శూరుడిని పోటుబంటుగానూ వ్యవహరిస్తాడు. డబుల్ బెడ్ను జమిలి పాన్పు చేస్తాడు. అగ్రిమెంట్ను బాసపత్రిక అని రాస్తాడు. ‘ఒకవైపు ప్రబంధ కవులు సంస్కృత బహుళమైన దీర్ఘసమాస రచనను ఆదరిస్తూ రచనలు చేస్తున్న కాలంలో ధైర్యంతో అచ్చ తెలుగుకూ, మాండలికానికీ, వ్యావహారానికీ పట్టంకట్టి తన సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకుపోయిన మహానుభావుడు అన్నమయ్య’. అలాంటి అన్నమయ్య సంకీర్తనల్లోని అచ్చతెలుగు మాటలను ఒక చోట కూర్చారు ఆచార్య రవ్వా శ్రీహరి, అన్నమయ్య సంకీర్తన వాఙ్ఞయ పదకోశానికి పని చేసిన అనుభవంతో. అదే అనుభవంతో అన్నమయ్య ఎన్ని రకాల చూపుల్నీ, ఎన్ని రకాల సిగ్గుల్నీ, ఎన్ని రకాల వలపుల్నీ వర్ణించాడో పట్టిక చేస్తూ ‘అన్నమయ్య నవ్వులు’(పేజీలు: 72; వెల: 40) గా మరో పుస్తకాన్నీ తెచ్చారు. పలుచని నవ్వు, పాలవంటి నవ్వు, పున్నమ వెన్నెల నవ్వు, బింకపు నవ్వు, ముత్యపు నవ్వు, ముగ్గుల నవ్వు, నెయ్యపు నవ్వు, చిక్కటి నవ్వు, చిందేటి నవ్వు, కులుకు నవ్వు, కప్పురపు నవ్వు, పచ్చి నవ్వు, కమ్మటి నవ్వు... ఇట్లా ఆయా సందర్భాల్లోని భేదాన్ని ‘సుమారు 240 రకాలు’గా వర్ణించాడు అన్నమయ్య. అలాగే, తలపోత సిగ్గు, తెగరాని సిగ్గు, నాటకపు సిగ్గు, నినుపు సిగ్గు, లేత సిగ్గు, వాటపు సిగ్గు... అన్ని నవ్వులు, సిగ్గులు తెలియకపోయినా కనీసం ఎన్ని ఉండేవో తెలుసుకోవచ్చు ఈ చిరుపొత్తంతో (ప్రతులకు: నవోదయ పబ్లికేషన్స్, హైదరాబాద్; ఫోన్: 040-24652387)! - శేషసాయి -
'బుల్లెట్లు కాదు.. పుస్తకాలందించండి'
లండన్: బుల్లెట్ల సమాజం నుంచి బయటపడటం ఒక్క విద్య ద్వారానే సాధ్యం అని పాకిస్థాన్ బాలికల అక్షర సాహసి, నోబెల్ బహుమతి విజేత యూసఫ్ జాయ్ మలాలా పేర్కొంది. ప్రపంచ నేతలంతా బుల్లెట్ల నుంచి దూరంగా జరిగి పుస్తకాలనే ఎంచుకోవాలని సూచించింది. 12 ఏళ్ల బాలికలందరికీ నిర్బంధ విద్యను అందించేలా కృషిచేయాల్సిందిగా ఆమె కోరింది. టెలిగ్రాఫ్లో ప్రపంచ నేతలను ఉద్దేశిస్తూ మలాలా ఒక సంక్షిప్త సందేశాన్ని తెలియజేసింది. తానింకా టీనేజర్ అయినప్పటికీ ఒక బ్రహ్మాండమైన ఆశను కలిగి ఉన్నానని, పన్నెండేళ్ల లోపు బాలికలందరికి కచ్చితంగా ఉచిత విద్యను అందించగలమన్న నమ్మకం తనకు ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే, అది ఎప్పుడు చేద్దామనే విషయంలో ప్రతిఒక్కరు ఒక అంతిమ ఆలోచనకు రావాల్సిన అవసరం ఉందని సూచించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇప్పుడిప్పుడే విద్యార్థినులు బడిబాట పడుతున్నారని, సెకండరీ విద్యకు చేరేవారి సంఖ్య కూడా పెరుగుతోందని మలాలా గుర్తు చేసింది. అయితే, సెకండరీ స్థాయిలోనే విద్యను ఆపేసే బాలికలు ఉన్న దేశాలు చాలా ఉన్నాయని, ఆ దేశాలు కూడా ఈ విషయంలో ఎలాంటి ఆందోళన లేకుండా ఉన్నాయని ఇది కాస్తంత గమనించాల్సిన విషయం అని మలాలా సూచించింది. -
సేవా కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు
నెల్లూరు : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శనివారం పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శనివారం వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. సీటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విద్యార్థులకు పుస్తకాలు ఉచితంగా అందజేశారు. అలాగే వెంకటేశ్వరపురంలో ఆయన వాటర్ ట్యాంక్ను ప్రారంభించారు. -
చదువుల సీజన్లో పుస్తకాల అడ్డా..
కేజీ టు పీజీ.. కేరాఫ్ కోఠి సెకండ్హ్యాండ్ పుస్తకాలకు ప్రత్యేక సెల్లార్ సుల్తాన్బజార్: విద్యాసంవత్సరం ప్రారంభమైందంటే విద్యార్థులకు పుస్తకాల కోసం ఒకటే టెన్షన్. ఏ షాప్కు వెళ్లినా కొన్ని పుస్తకాలు దొరుకుతాయి. మరికొన్ని ఉండవు. ఎక్కడికెళ్లినా ఇదే సమస్య ఎదురవుతుంది. సమయానికి పుస్తకాలు దొరక్క తల్ల్లిదండ్రులు సైతం హైరానా పడతారు. కానీ ఏ పుస్తకం కావాలన్నా.. అందరూ చూపించే దారి కేరాఫ్ ‘కోఠి’. కేజీ నుంచి పీజీ వరకు.. ఏ పుస్తకం కావాలన్నా ఆ ప్రాంతం పేరే చెబుతారు. ఇప్పుడు పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులకు పైతరగతులకు కావాల్సిన పుస్తకాల అన్వేషణ మొదలైంది. కొత్త టెక్ట్స్, నోటు పుస్తకాలు, ఇతర స్టేషనరీ కొనుగోలు చేసేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు కోఠిలోని పుస్తకాల దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. కోఠి, సుల్తాన్బజార్, ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో ఉన్న పుస్తకాల దుకాణాల్లో దొరకని స్టేషనరీ అంటూ ఉండదు. పోటీ పరీక్షల పుస్తకాలు సైతం.. కోఠిలోని పుస్తకాల దుకాణాలలో కేజీ నుంచి పీజీ వరకు టెక్ట్స్ పుస్తకాలు లభ్యమవుతాయి. అంతేగాక ఎంసెట్, లాసెట్, డైట్సెట్, ఎడ్సెట్, ఏఐఈఈఈ.. ఇతర అన్ని పోటీ పరీక్షల పుస్తకాలు సైతం ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వేసవి తర్వాత వర్షకాలంలో ఇక్కడ ‘పుస్తకాల సీజన్’గా పిలుస్తూ ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తూ వ్యాపారులు విద్యార్థులను, వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. కిలోల్లో నోటు పుస్తకాలు.. చిత్తు కాగితాలు కిలోలుగా అమ్మే ఈ రోజుల్లో నోటు పుస్తకాలు సైతం కిలోల్లో కొనవచ్చంటే అశ్చర్యపోతారు. కానీ కోఠిలో ఏ షాప్కు వెళ్లినా నోటు పుస్తకాలను కిలో లెక్కన అమ్ముతారు. చాలామందికి ఇది తెలియకపోయినా ఇక్కడ సీజనల్ వ్యాపారంలో భాగంగా వ్యాపారులు ఈ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఒక్క నోటు పుస్తకం కనీస ధర రూ.30 ఉంటే.. ఈ మొత్తానికి మూడు పుస్తకాలు సొంతం చేసుకోవచ్చు. దీంతో విద్యార్థులు ‘కిలో’ పుస్తకాలంటే ఆస్తకి చూపుతున్నారు. సెకండ్ హ్యాండ్ బుక్స్ కూడా.. అందరూ కొత్త టెక్ట్స్ పుస్తకాలు కొనలేరు.. ఇలాంటి విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలను సగం ధరలో కూడా ఇక్కడ దొరుకుతాయి. పేరుకు సెకండ్ హ్యాండే గాని.. చాలావరకు కొత్త పుస్తకాలే ఉంటాయి. కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా కిందనున్న సెల్లార్లో ఇలాంటి దుకాణాలే ఉన్నాయి. ఒకటో తరగతి నుంచి ఇంజినీరింగ్, మెడిసిన్ ఇతర కోర్సుల పుస్తకాలు సగం ధరలో విక్రయిస్తున్నారు. రూ. 1200 ఉన్న పుస్తకం ఇక్కడ కేవలం రూ.400కు పొందవచ్చు. -
నా కాసిని పుస్తకాలు
ఇష్టమైన దేవుడి ఫొటోలాగా, గోడకు వాలి మరీ పలకరించే బిళోరి అద్దంలాగా, నిద్ర లేచీ లేవగానే పుస్తకాలు ఎదురుగ్గా కనిపిస్తే, రోజు సవ్యంగా మొదలైనట్టనిపిస్తుంది. గోడకు పెట్టిన కొయ్య అమరికలో నా కాసిని పుస్తకాలనూ తొలి వెలుగులో చూసుకుని, అక్షర స్పర్శను అనుభవించి, రోజులోకి అడుగుపెడతాను. కళ్లు నులుముకు చూడగానే నా కంటికి తగిలేది ‘ఆంధ్ర వాచస్పత్యము’. ప్రతిపదార్థ పర్యాయపద నిఘంటువు నిర్మాత కోట్ర శ్యామల కామశాస్త్రి. నాన్న నాకిచ్చిన కాసిని పుస్తకాలలో వాచస్పత్యము నాలుగు సంపుటాలు, వావిళ్లవారి పోతన భాగవతం, ముద్దుకృష్ణ వైతాళికులు తొలి ముద్రణ, విశ్వనాథ ఏకవీర ఉన్నాయి. ‘ద మిస్టరీస్ ఆఫ్ మొఘల్ కోర్ట్’ పేరుతో వచ్చిన పుస్తకానికి మొసలికంటి సంజీవరావు చక్కని తెలుగు అనువాదం ‘మొగలాయి దర్బారు’. ఇదీ నాలుగు భాగాలు. దీని సరసన మరో గొప్ప అనువాదం ‘చెంఘిజ్ ఖాన్’. అడివి బాపిరాజు నవల ‘నారాయణరావు’. అరవై ఏళ్ల కిందట, మా అమ్మ రోజూ మధ్యాహ్నం వేళ పడమటి మెట్లలో కూచుని చదువుతూ ఉండేది. నలుగురైదుగురు అమ్మలక్కలు చెవులప్పగించి వింటూ లీనమైపోయేవారు. అమ్మ గుర్తుగా పెట్టుకునే నెమలికన్నుని అప్పుడప్పుడు నే సొంతం చేసుకునేవాణ్ని. గుర్తుపెట్టుకున్న అమ్మ నాల్రోజులు చదివినవే చదివి రంజింపజేసేది. ఇవన్నీ ఆ పుస్తకానికి పట్టుకుని ఉన్న నా జ్ఞాపకాలు. నేను యిష్టపడి సేకరించుకున్నవి, మహారచయితలు తమ చేవ్రాలుతో యిచ్చిన పుస్తకాలంటే మరీ ప్రాణం. దేవులపల్లి, హనుమచ్ఛాస్త్రి, భుజంగరాయశర్మ, గోపీచంద్ ‘తత్త్వవేత్తలు’, సంజీవదేవ్ ‘రసరేఖలు’ - వాటి వెన్ను తడితే వారంతా నా వెన్ను నిమిరి దీవిస్తున్నట్టనిపిస్తుంది. జనరల్ సర్ ఆర్థర్ కాటన్ జీవితాన్ని, కృషిని రంగరించి ఆయన కుమార్తె లేడీ హోప్ రాసిన బృహత్ గ్రంథం ఫెదర్ వెయిట్ కాగితం మీద లండన్లో అచ్చయింది. పుస్తకాన్ని తెరిస్తే గోదావరి గలగలలు వినిపిస్తాయి. రేగడి నేలల్ని చిగురింపజేసిన మహనీయుడు. పక్కన నేదునూరి గంగాధరం పదానికో నెత్తురుబొట్టుగా సేకరించి, సంకలించిన ‘మిన్నేరు’, ‘మున్నీరు’. అవి తొలినాళ్ల జానపద గేయ రత్నావళులు. నిండు వేసవిలో మావూరి తాటి తోపులో బొటనవేలుతో ముంజలు తోడుకు తింటున్న స్పృహ కలిగిస్తాయి. అభినవ పోతన వానమామలై వరదాచార్యులు రచించిన మహాకావ్యం పోతన చరిత్రము కలిగివుండటం నా భాగ్యంగా భావిస్తాను. భారతి వజ్రోత్సవ సంచిక, విజయ విలాసం హృదయోల్లాస వ్యాఖ్య, శ్రీపాద అనుభవాలూ, రెడ్డి సంచిక - అరలో చూసుకోవడం నిత్యానందం. శ్రీకాళహస్తీశ్వర శతకం పారాయణ గ్రంథం. మునివేళ్లు తగలగానే డబుల్ రీడ్ హార్మణీ ‘‘పరబ్రహ్మ! పరమేశ్వర’’ వినిపిస్తుంది. ఎందుకంటే అవి గయోపాఖ్యానం, వుద్యోగ విజయాలు పద్యనాటకాలు. నా మిత్రుడు ఎప్పుడూ అంటుంటాడు - ‘‘మహాప్రస్థానం, అమృతం కురిసిన రాత్రి, జాషువా ‘గబ్బిలం’, విశ్వనాథ ‘తెలుగు రుతువులు’ నా దగ్గర లేవు. అవి అపౌరుషేయాలు, నా నోటికొచ్చు. అలాగే వచనంలో మల్లాది రామకృష్ణశాస్త్రి, ముళ్లపూడి’’ అని. రుద్రకవి అష్టకాలు, అందుకు బాపు వర్ణచిత్రాలు, ఆరుద్ర ముందుమాటలు ముప్పేట అల్లుకున్న మొగలిరేకుల పూలజడలా తోస్తుంది ‘జనార్దనాష్టకమ్’. మరుక్షణం పూలజడతో సరాగాలాడుకున్న వేకువజాములు స్ఫురిస్తాయి. నా సాటివారు, పలుకున్న సమకాలికులు రాసినవి కాసిని నాకు శుభోదయం పలుకుతాయి. ఆ వరుసలోనే కవితాప్రసాద్ ‘ఒంటరి పూలబుట్ట’ నిలిచివుంది. గుండె తాళాన్ని నొక్కి/ ప్రాణం తాళం చెవులు/ తీసికెళ్లిపోయావు అన్న పంక్తులు కన్నీటి తెరలు కమ్మించాయి. నేను తేరుకుని సూటిగా ప్రశ్నించాను - మీలాంటి సరసులు, సంస్కారులు చేసే పనేనా యిది? దత్తపదిలో యింకా రెండు పాదాలు చెప్పనే లేదు. పూర్తిగా సమస్య పూరించనే లేదు. ఘంటానాదం లెక్క ఎక్కడ? నిషిద్ధాక్షరి వదిలేశారు. పృచ్ఛకులకేం చెబుతారు. నాకెరుకే, పుణ్యలోకంలో ఠీవిగా మీ ఆశువులతో తేనెవానలు కురిపిస్తూ వుండివుంటారు. అస్తు!మహారచయితలు తమ చేవ్రాలుతో యిచ్చిన పుస్తకాలంటే మరీ ప్రాణం. వాటి వెన్ను తడితే వారంతా నా వెన్ను నిమిరి దీవిస్తున్నట్టనిపిస్తుంది. -
ఇక యాప్తో ఉచితంగా ఎన్సీఈఆర్టీ పుస్తకాలు
న్యూఢిల్లీ: ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతిలోపు చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. ఇక జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎన్సీఈఆర్టీ) పుస్తకాలను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా స్టడీ మెటీరియల్ను కూడా విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం ఎన్సీఈఆర్టీ డేటాబేస్ను సృష్టించడమే కాకుండా డౌన్లోడ్కు వీలుగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేసే యాప్ను రూపొందించింది. స్మార్ట్ఫోన్ను ఉపయోగించి ఈ యాప్ ద్వారా కావాల్సిన పుస్తకాన్ని లేదా పాఠ్యాంశాన్ని, స్టడీ మెటీరియల్ను (ఇంగ్లీషు లేదా హిందీ భాషల్లో) డౌన్లోడ్ చేసుకోవడమే కాకుండా, ఇదే ప్లాట్ఫామ్పై విద్యార్థులు ఓ బృందంగా ఏర్పడి సబ్జెక్ట్ గురించి, అందులోని డౌట్స్ గురించి చర్చించే అవకాశం కూడా ఉంది. ఈ యాప్ను జూన్ రెండో వారం నుంచి అందుబాటులోని తెస్తున్నట్టు ఎన్సీఈఆర్టీ యాక్టింగ్ డెరైక్టర్ వినోద్ కుమార్ త్రిపాఠి శనివారం మీడియాకు తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు, ట్యూషన్లకు వెళ్లి చదువుకోలేని పేద విద్యార్థులకు, టీచర్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాలను ఉపయోగించకుండా ఇతర పుస్తకాలను ఉపయోగిస్తున్న పాఠశాలలను దృష్టిలో పెట్టుకొని కూడా తాము మరో డేటాబేస్ను కూడా ఏర్పాటు చేస్తున్నామని, ఆ పాఠశాలలు ఉపయోగిస్తున్న పుస్తకాలను, పాఠ్యాంశాలను డేటాబేస్లోకి ఎక్కిస్తున్నామని త్రిపాఠి తెలిపారు. ఈ కార్యక్రమం కూడా జూన్ రెండోవారంలోగా పూర్తవుతుందని, ఇదే యాప్ను ఉపయోగించి జూన్ మూడవ వారం నుంచి ఆ పుస్తకాలను కూడా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన వివరించారు. ఈ యాప్ ద్వారా భాష, తరగతి, సబ్జెక్ట్, టాపిక్, చాప్టర్లను ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉందని ఆయన చెప్పారు. ఇలస్ట్రేషన్లు, డయాగ్రామ్స్తో ఎప్పటికప్పుడు తాము డేటాబేస్ను అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. -
ఈసారికి మినహాయింపునివ్వండి
పాఠ్యపుస్తకాలపై ఉప ముఖ్యమంత్రికి ప్రైవేటు స్కూళ్ల సంఘం విజ్ఞప్తి హైదరాబాద్: ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలు ఇన్నాళ్లు విద్యార్థులకు అందుబాటులో లేనందునే ప్రైవేటు పబ్లిషర్లు ముద్రించిన పుస్తకాలను ప్రాథమిక పాఠశాలల్లో వినియోగించామని ప్రైవేటు పాఠశాలల సంఘం పేర్కొంది. మంగళవారం సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులు సచివాలయంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిశారు. ఇప్పటికే విద్యార్థులు ప్రైవేటు పుస్తకాలను కొనుగోలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠ్య పుస్తకాలనే వినియోగించాలన్న నిబంధన నుంచి ఈసారికి మినహాయింపునివ్వాలని కోరారు. ఆ నిబంధన అమలు చేస్తే విద్యార్థుల తల్లిదండ్రులు నష్టపోతారని, మినహాయింపునిస్తే వచ్చే ఏడాది నుంచి పక్కాగా అమలు చేస్తామని పేర్కొన్నారు. కాగా, సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీనివాసరెడ్డి, కార్యదర్శిగా శేఖర్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్గా శేఖర్రెడ్డి, కోశాధికారిగా భూపాల్రావు, కేంద్ర ప్రతినిధిగా జేఎస్ పరంజ్యోతి, అసోసియేట్ అధ్యక్షులుగా రాజారెడ్డి, రవిశంకర్, నర్సింహగౌడ్, చంద్రన్న, అధికార ప్రతినిధిగా శేషుకుమార్ తదితరులు ఎన్నికయ్యారు. -
కంప్యూటర్లు, టీవీలకు అతుక్కుపోకండి
స్కూల్ లేదు.. హోంవర్క్ గోల అంతకంటే లేదు.. అసైన్మెంట్లు చేయాల్సిన అవసరం అసలే లేదు.. పుస్తకాలు ముందేసుకుని చదవాల్సిన పని లేదు.. ఎందుకంటే సమ్మర్లో సెలవులు ఇచ్చింది ఎంజాయ్ చేయడానికే కదా.. ఎంచక్కా సెలవుల్లో కంప్యూటర్లకు, టీవీలకు అతుక్కుని కూర్చుందామనుకునే పిల్లలపై పెద్దలు ఓ లుక్కేయాల్సిందే. లేకుంటే మీ పిల్లలను అందరూ ‘లడ్డూ’ అని పిలవాల్సి వస్తుంది. రోజుకు మూడు నాలుగు గంటలు టీవీ, కంప్యూటర్లకు అతుక్కుపోవడం, సరైన వ్యాయామం లేకపోవడంతో.. పిల్లలు బెలూన్లలా ఉబ్బిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. రెండు గంటల కంటే ఎక్కువగా టీవీ చూస్తే కంటి జబ్బులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్న విషయాన్ని గుర్తించాలి. ఒంటికి వ్యాయామం అవసరం ఎలాగూ సెలవులే కదా అని అస్తమానం రిమోట్ పట్టుకుని వీడియో, ఇండోర్ గేమ్స్ ఆడటం.. విసుగనిపిస్తే నెట్బ్రౌజింగ్ చేయడం, సినిమా సీడీలతో కాలక్షేపం మితిమీరితే ఇబ్బందేమరి. ఇరవై నాలుగ్గంటలూ కుర్చీలు, సోఫాలకు అత్తుక్కుపోయి టీవీలు, కంప్యూటర్ల ఆటలకే పరిమితం కావొద్దు. ఒంటికి కాస్త వ్యాయామం కూడా ఇవ్వాలి. ఫ్రిజ్ నిండా వేసవి రుచులు నింపుకొని, టీవీలు, కంప్యూటర్లతో ఆటలాడుతూ మధ్యమధ్యలో ఎంచక్కా చిరుతిళ్లు లాగించేస్తే ఆరోగ్యం పాడవడంతో పాటు లావెక్కిపోతారు. దీంతో స్కూళ్లు మొదలవగానే తోటి విద్యార్థులు ఎగతాళి చేసే ప్రమాదం ఉంది. శరీరానికి శ్రమ ఇవ్వాలి. అప్పుడప్పుడు బయటకు వెళ్లి పరుగెత్తాలి, నడవాలి, పిల్లలతో కలిసి సరదాగా ఆడుకోవాలి. - సాక్షి, విజయవాడ -
చదువు'కొన' లేక కొడుకును పోగొట్టుకున్నారు!
చదువు కొననంత మాత్రాన నిండు ప్రాణాలు పోతాయని.. ఆ చదువురాని తల్లిదండ్రులకు తెలియదు! అందుకే కొడుకు పుస్తకాలు అడిగినప్పుడు కొనివ్వలేమని తెగేసి చెప్పారు. పుస్తకాలు కొనాల్సిందేనని మంకుపట్టుపట్టిన 14 ఏళ్ల కొడుకు.. పంతం నెరవేరలేదని ఒంటికి నిప్పంటించుకొని చనిపోయాడు. 'దహన సంస్కారాలకోసం ఎలాగూ అప్పుచేయాల్సిందే.. అదేదో ముందే చేసుంటే కొడుకు బతికుండేవాడేనే..' అంటూ మిన్నంటేలా దోరిస్తున్నారు తల్లిదండ్రులు! స్థానికులు సహా పోలీసులనూ కంటతడి పెట్టించిన ఈ ఘటన బీహార్లోని చంపారన్ జిల్లా కతారి గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానిక ప్రభుత్వ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోన్న అఫ్రోజ్ అజ్మల్.. కొత్త పుస్తకాలు కొనివ్వమని తల్లిదండ్రుల్ని కోరాడు. కూలి పనికి వెళితే తప్ప పొట్టనిండని తాము రూ.1500 పెట్టి పుస్తకాలు కొనివ్వలేమని బదులిచ్చారు. దీంతో అజ్మల్ ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతోపాటు పుస్తకాలు కూడా ఉచితమే కదా మరి ఇలా ఎందుకు జరిగిందంటే.. ఉచిత పుస్తకాల ముద్రణ, సరఫరాలో అవినీతి చోటుచేసుకోవడంతో పిల్లలకు పుస్తకాలు అందడంలేదు. ఇదే అంశంపై బీహార్ అసెంబ్లీలో రభస కూడా జరిగింది. -
పుస్తకాలు చూపని ప్రపంచం...
13-19 కేరెంటింగ్ అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?! ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19... పరీక్షల భయంతోనే రోజులు గడచిపోతున్నాయి. ఇంకో వారం రోజులు గడిస్తే చాలు.. పుస్తకాల్లేని ప్రపంచంలో కొన్నాళ్లపాటు ఉల్లాసంగా గడపవచ్చు అనే ఆలోచన పిల్లల మెదళ్లలో తొంగిచూస్తూనే ఉంది. సెలవుల్లో వారి ఉల్లాసపు స్థాయిని పెంచాలంటే ఇప్పటి నుంచే సరైన ప్రణాళిక అవసరం. లేదంటే, బద్దకంతో అమూల్యమైన వేసవి దినాలు ఇట్టే గడిచిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కిక్కిరిసిన తరగతి గదుల్లో విద్యార్థులు ఇన్నాళ్లూ పుస్తకాలతో కుస్తీ పట్టారు. పుస్తకాల్లో చదివి కంఠతా పట్టిన పాఠాలను ఇక ఆరుబయట సమాజాన్ని చూసి నేర్చుకునే అవకాశం వస్తే.. ప్రపంచమనే కుటుంబంలో రేపటి తరం చేరాలనుకుంటే పుస్తకాలు చూపని లోకంలోకి నేడే ప్రయాణానికి సిద్ధపడాలి. హెరిటేజ్ వాక్... హెరిటేజ్ క్లబ్... మన జాతి వారసత్వ సంపదను తిలకించేందుకు, తెలుసుకునేందుకు, సంరక్షించేందుకు పయనమైతే అదే ‘హెరిటేజ్ వాక్’ అవుతుంది. ఇందుకోసం కొంతమంది ఒక సమూహంగా ఏర్పడితే ‘హెరిటేజ్ క్లబ్’ అవుతుంది. ఇప్పుడు చరిత్ర పండితులు కొత్తమార్గాలను ఎంచుకున్నారు. వందల ఏళ్ల నాటి అద్భుత కట్టడాలను చూసేందుకే కాదు, అందమైన ప్రకృతిసిద్ధ ప్రదేశాలను సందర్శించడానికీ సమూహాలుగా సిద్ధపడుతున్నారు. ఇందులో టీనేజర్స్నీ భాగస్థులను చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పటికే హెరిటేజ్ క్లబ్స్ పేరిట ఆన్లైన్ సాయంతో కలుసుకునేవారి సంఖ్యా పెరుగుతోంది. సామాజికంగా ఎంతో మేలు... ఇంట్లో ఒకరు లేక ఇద్దరు ఉన్న నేటి కాలంలో సామాజికస్పృహ తగ్గుతుందనే చెప్పాలి. బంధుమిత్రులు కలుసుకోవడం కూడా తగ్గిపోతున్న ఈ రోజుల్లో కొంత మంది ఒకే అంశంపై ఒకే చోట కలుసుకోవడం, చర్చించుకోవడం, ఒక నూతన ప్రదేశాన్ని చూడటానికి వెళ్లడం వల్ల కొత్త పరిచయాలు పెరుగుతాయి. మానసిక పరిణతి వికసిస్తుంది. హెరిటేజ్ వాక్లలో పాల్గొనడం వల్ల ఆర్థిక అవగాహన, కార్యక్రమ నిర్వహణ చాతుర్యం, సృజనాత్మకత.. ఇవన్నీ పెరుగతాయి. నలుగురితో కలిసి తిరగడం వల్ల సామాజిక బాధ్యత కూడా అలవడుతుంది. చర్చలు, వినోదకార్యక్రమాల వల్ల ఏర్పడిన వాతావరణం మనుషుల మధ్య బంధాలను బలోపేతం చేస్తుంది. అనారోగ్యానికి దూరం దూరం... అంతర్జాలంతో ప్రపంచం కుగ్రామంగా మారిన ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు యువతను గడపదాటనీయడం లేదు. అదేపనిగా టీవీ, ఇంటర్నెంట్, ఫోన్లతో కాలక్షేపం చేయడం వల్ల ఊబకాయం తద్వారా అది తెచ్చే అనారోగ్యం బాధించకుండా ఉండదు. అదే ఇలాంటి హిస్టారికల్ వాక్స్లో నడక, సైక్లింగ్ వంటివి తప్పనిసరి అవుతాయి. దీంతో దేహదారుఢ్యం పెరిగే అవకాశం ఉంది. కెనడాలో హిస్టారికల్ వాక్స్ వల్ల అన్ని వయసుల వారిలో స్పృహ పెరిగింది. అక్కడ ప్రతి ముగ్గురు టీనేజర్లలో ఒకరు యూత్ మీట్లలో పాల్గొంటున్నారు. దీని వల్ల యువతరంలో ఆరోగ్యకరమైన ఎదుగుదల పెరుగుతుందన్నది స్పష్టమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కౌమారంలో ఉన్న పిల్లల్లో శారీరక చురుకుదనం లేకపోవడం వల్ల ఎన్నో రోగాలకు చేరువవుతున్నారని దీంట్లో టైప్ 2 డయాబెటిస్ ప్రధానంగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే వీరిలో హైపర్టెన్షన్, ఉబకాయం, ఆందోళన, ఒత్తిడులూ పెరుగుతున్నాయి. వీటన్నింటికీ ముగింపు పలకాలంటే హిస్టారికల్ వాక్స్ పట్ల సరైన అవగాహన పెరగాలంటున్నారు నిపుణులు. మనదైన సంపదకు రక్షణ... మన దేశంలో అందమైన పచ్చని మైదానాలు, గొప్పదైన సంస్కృతి, వారసత్వ సంపద.. ఎంతగానో ఉంది. అంతేనా, నాటి రాచప్రభను కళ్లకు కట్టే పట్టణాలు, విభిన్న ఆచారాలు అబ్బురపరుస్తాయి. యంత్రపరికరాలు లేని రోజుల్లో కట్టిన భవన నిర్మాణాల ఆకృతులు, అక్కడి సంస్కృతిని కళ్లకు కట్టినట్టు తెలియజేవచ్చు. వెళ్లిన ప్రాంతం, అక్కడి చారిత్రక నేపథ్యం, నేటి సంస్కృతి, నిర్మాణ కౌశలం, సాంఘిక, సాంస్కృతిక చరిత్ర, భాష, వేషధారణ.. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవడం వల్ల ఆ విద్యార్థిలో సంరక్షరణ చర్యలవైపూ దృష్టి మళ్లుతుంది. పల్లె పట్టణంగా మారిన వైనం, లేదా పూర్తిగా ధ్వంసమైన శిథిల నిర్మాణాలు, సంస్కృతి, సంప్రదాయం, తత్వం, మూఢనమ్మకాల మీదా అవగాహన కలుగుతుంది. వీటి నుంచి నేర్చుకోదగిన అంశాలెన్నో ఉంటాయి. ఎక్కడ నుంచి మొదలుపెట్టాలి... విద్యార్థులు గ్రూప్ల ప్రకారం కలవాలి. ఇందుకు స్కూల్, కాలేజీ స్థాయిలో ఉన్న స్నేహబృందాలు కలిస్తే మరీ మంచిది. ముందుగా సందర్శించవలసిన స్థలాల జాబితాను తయారుచేసుకోవాలి. ఆ తర్వాత వాటి ప్రాధాన్యత గురించి కొంత ముందే అవగాహన ఏర్పరుచుకోవాలి. ఏదో ఒక వర్క్షాప్, ఒక వాక్ అని సంప్రదాయ ధోరణిలో గ్రూప్గా ఏర్పడితే చాలదు. తాము అనుకున్న లక్ష్యం నెరవేరేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఇందుకు తమ టీచర్లు, తల్లిదండ్రుల సహాయం తీసుకోవాలి. అవగాహన కోసం కార్యక్రమాలు... మన చారిత్రక కట్టడాలు, సంస్కృతిని నేరుగా చూస్తే పిల్లల్లో ఎంతో ఆసక్తి పుడుతుంది. అలాగే పల్లెలకు ప్రయాణం అవ్వాలి. మనకే సొంతమైన చేనేత, అక్కడి జీవనశైలిని తెలుసుకోవాలంటే వీవర్స్ కమ్యూనిటీ ఉన్న పల్లెలను సందర్శించాలి. విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొనే కార్యక్రమాలను ఈ వేసవికి రూపొందించబోతున్నాం. వర్క్షాప్స్ నిర్వహించబోతున్నాం. దీంట్లో భాగంగా చారిత్రక కట్టడాల సందర్శన, సంస్కృతి, మ్యూజియమ్ గైడింగ్.. వంటి వాటిపై అవగాహన కల్పిస్తాం. వారి వారి ఆసక్తులను విద్యార్థులు ఒక గ్రూప్గా ఏర్పడి తమ సంఖ్య ఎంత ఉందో తెలిపితే దానిని బట్టి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. ఇన్టాక్ నుంచి ఇన్నాళ్లూ ఇతర రాష్ట్రాలలో హెరిటేజ్ వాక్స్ చేశాం. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలలో చేయాలని నిశ్చయించాం. ఇందుకు ఆసక్తిగలవారు సంప్రదించవచ్చు. దాదాపుగా అన్నీ ఒక రోజు కార్యక్రమాలే ఉంటాయి. స్పందనను బట్టి రోజులను పెంచుతాం. విద్యార్థులు ఎవరైనా చారిత్రక నేపథ్యంతో డాక్యుమెంటరీలు తీస్తే వాటిలో సరైనవి ఎంపిక చేసి జజీఝజ్టీజీఛీజ్చీ ఆన్లైన్ పోర్టల్కు అప్లోడ్ చేస్తాం. - అనురాధారెడ్డి, హైదరాబాద్ ఇన్టాక్ కన్వినర్ -
బుక్ స్టేల్
పుస్తకం.. మనలను మనం తెలుసుకోవడానికే కాదు... ప్రపంచాన్ని అర్థం చేసుకోగలిగే మాధ్యమం. అలాంటి ఎన్నో పుస్తకాలకు కేంద్రం ఎఎ హుస్సేన్ అండ్ కో. నిత్యం సందడిగా ఉండే అబిడ్స్లో... సంతోష్ సప్నా సినిమా హాల్ పక్కన ప్రశాంతంగా కొలువుదీరి ఉంటుందా బుక్మార్క్. హైదరాబాద్ చరిత్రను తనతో మోస్తున్న ఈ విజ్ఞానఖని.. మరికొన్ని రోజుల్లో కనుమరుగవ్వనుంది. కార ణాలేమైనా... గతం కాబోతోన్న ఈ వర్తమానం మహాప్రస్థానం... ..:: కట్ట కవిత నిజాం కాలంలో సర్జన్ అయిన సర్ అబ్దుల్ హుస్సేన్ అరస్తుయార్జంగ్ బహదూర్ మనవడు... ఎం.రియాజత్ హుస్సేన్ అరస్తుకు స్టాంప్స్, కాయిన్స్ అండ్ కరెన్సీ సేకరణ హాబీ. మంచి రీడర్ కూడా. ఆయన 1949లో ఈ బుక్షాప్ను ఏర్పాటు చేశారు. ఆ తరువాత ఆయన కొడుకు షౌకత్ హుస్సేన్... ఆ బాధ్యతలను తీసుకున్నారు. మొదట ఇంపోర్టెడ్ బుక్స్ కోసమే ఏర్పాటైనా.. ఆ తరువాత పిల్లల బుక్స్తో పాపులరైంది. ఆయన కస్టమర్స్ను మెస్మరైజ్ చేసేవారు. పుస్తకాలతో పాటు ఆయన మాటతీరు కస్టమర్స్ను మళ్లీ మళ్లీ షాప్కి రప్పించేది. 1966లో షౌకత్ హుస్సేన్ అనారోగ్యం పాలవ్వడంతో బుక్షాప్ మేనేజ్మెంట్ తన చేతుల్లోకి తీసుకున్నాడు ఆయన కొడుకు ఆసిఫ్ హుస్సేన్ అరస్తు. దొరకని పుస్తకం లేదు.. గ్రౌండ్ఫ్లోర్లో ఫస్ట్ పోర్షన్ బుక్స్... సెకండ్ పోర్షన్ గ్రీటింగ్ కార్డ్స్... ఫస్ట్ఫ్లోర్ మొత్తం పిల్లల పుస్తకాలే. భారతీయ ప్రముఖ రచయితల రచనలు... రెలిజియస్, సెల్ఫ్ డెవలప్మెంట్, హెల్త్ అండ్ ఫిట్నెస్, ఆటోబయోగ్రఫీస్ లిటరేచర్లో ఫిక్షన్, నాన్ ఫిక్షన్, ఫిలింస్, స్పోర్ట్ రిలేటెడ్ రిఫరెన్స్ మెటీరియల్... ఇలా దొరకని ఇంగ్లిష్ పుస్తకమంటూ ఉండదక్కడ. ఇక్కడికి వచ్చి పుస్తకం దొరకక నిరాశతో వెళ్లిపోయిన కస్టమర్ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఒక్క పుస్తకాలే కాదు... ఒకప్పుడు గ్రీటింగ్కార్డ్స్, పోస్ట్కార్డ్స్ కూడా ఇక్కడ దొరికేవి. 30 ఏళ్ల అనుబంధం... ఒక్క కస్టమర్స్కే కాదు... ఇందులో పనిచేసే సిబ్బందికీ షాప్తో ఉన్న అనుబంధం విడదీయరానిది. సిటీ కాలేజ్లో ఎస్ఎస్సి పూర్తి చేసిన జావీద్ అన్సారీ 30 ఏళ్ల కిందట ఈ బుక్స్టోర్లో చేరాడు. ఆయన జీవితమంతా ఇక్కడే గడిచిపోయింది. మెహిదీపట్నంలో ఉండే అన్సారీకి నలుగురు బిడ్డలు. ఆయన అంతగా చదువుకోకపోయినా... పిల్లలందరినీ మంచి చదువులు చదివించాడు. అన్సారీ మూడో కూతురు డాక్టర్ కూడా. ‘ఇక్కడ పనిచేయడం వల్లే చదువు, నాలెడ్జ్ ప్రాధాన్యత తెలిసొచ్చిందేమో. అందుకే నా పిల్లలను కూడా చదివించగలిగాననుకుంటా’ అంటాడు ఆయన. ఇంతమంచి పుస్తకాల షాప్ మళ్లీ హైదరాబాద్లో ఏర్పడడం అసంభవమనే చెబుతాడు. పిల్లలుగా ఇక్కడ పుస్తకాలు కొని చదివిన వారు తమ పిల్లలను తీసుకొచ్చి ఇక్కడే ‘నేను చిన్నప్పుడు పుస్తకాలు కొన్నాను’ అని తమ బాల్యం గురించి చెబుతుంటారు. ఇలాంటి ఎన్ని అనుభూతులో ఈ షాప్తో ముడిపడి ఉన్నాయి! కరువైన ఆసక్తి... ఇంతటి చరిత్ర ఉన్న ఈ బుక్షాప్.. మొబైల్ ఫోన్స్ విప్లవం, ఇంటర్నెట్ మాయాజాలంతో తన మార్క్ను కోల్పోయింది. ‘ఆన్లైన్ సేల్స్తో కస్టమర్స్ తగ్గారు. నెట్లో ఆర్డర్ చేస్తే పుస్తకం నట్టింటికే వచ్చి చేరుతోంది. ఇంతకుముందులా బుక్స్ కొనడానికి జనం ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు. గతంలో పేరెంట్స్ పాకెట్ మనీ ఇస్తే.. పుస్తకం కొనడానికి దాచిపెట్టేవాళ్లు పిల్లలు. కొత్త పుస్తకం వచ్చిందంటే హాట్కేక్లా అమ్ముడుపోయేది. ఫీల్డ్, చదివే డిగ్రీతో సంబంధం లేకుండా మంచి పుస్తకాలు కొనేవారు. ఇక పరిశోధనలు చేయాలనుకున్నవాళ్లు... పుస్తకాలవైపే చూసేవారు. మరి ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. వీటన్నింటికీ తోడు... వక్ఫ్ భూములకు చెందిన ఈ బిల్డింగ్ పెచ్చులూడుతోంది. శిథిలావస్థలో ఉన్న భవనాన్ని కూల్చి షాపింగ్మాల్ కట్టే ఆలోచనలో ఉన్నారు’ అని ఆవేదనగా చెప్పారు ఆసిఫ్. లెజెండరీ స్టోర్.. నిజాం వారసులతోపాటు.. హైకోర్టు జడ్జెస్, సురేష్ ఒబెరాయ్, రేఖలాంటి సెలబ్రిటీస్ ఈ బుక్షాప్కు తరచూ వచ్చేవాళ్లు. ఇక ఎంఎఫ్ హుస్సేన్ అయితే ఇక్కడికొచ్చిన ప్రతిసారీ.. ఓ మంచి పుస్తకం తీసుకోవడంతోపాటు షౌకత్ హుస్సేన్తో కూర్చుని చాయ్ తాగకుండా వెళ్లకపోయేవారు. సన్నీడేస్ పుస్తకం రిలీజైన టైమ్లో సునీల్ గవాస్కర్ కూడా ఈ బుక్మార్క్లో అడుగుపెట్టారు. అంతేనా బాలీవుడ్ లెజెండరీ దిలీప్కుమార్కీ నచ్చిన బుక్షాప్ ఇది. ఇంతటి ప్రాముఖ్యమున్న బుక్షాప్ను క్లోజ్ చేసిన తరువాత... ఏం చేయాలన్న భయం తనను వెంటాడుతోంది అంటున్నారు ఆసిఫ్. ఈ పుస్తకాల సముద్రాన్ని ఎలా పారబోయడం అని ఆందోళన చెందుతున్నారు! చెరిగిపోతున్న జ్ఞాపకం... నేను హైదరాబాద్కు రాకముందు... వరంగల్లో ఉన్నప్పుడే ఎఎ హుస్సేన్ బుక్స్టోర్ గురించి విన్నాను. డాక్టర్ రామనాథంగారు మంచి చదువరి. 85లో ఆయన ఎన్కౌంటర్ అవడానికి ముందువరకు ఆయన ఏ పుస్తక మైనా ఎఎ హుస్సేన్ నుంచి తెప్పించుకున్నా అని చెప్పేవారు. అట్లా ఒక్క హైదరాబాద్కే కాదు... తెలంగాణ అంతటికీ సుపరిచితమైన బుక్స్టాల్. ఆ రోజుల్లో ఇతర బుక్షాప్స్లో ఇంగ్లిష్ పుస్తకాలు దొరికేవి కావు. ప్రగతి శీల భావాలున్నవాళ్లకు, మొత్తంగా సాహితీకారుల ఇంగ్లీష్ సాహిత్య అవసరాలకు కేంద్రం అది. 80-90ల్లో ప్రధానమైన బుక్షాప్ అంటే ఎఎ హుస్సేన్ మాత్రమే. నేను 82లో ఎం.ఎ కోసం హైదరాబాద్కి వచ్చాక మొదట వెళ్లిన షాప్స్లో అది ఒకటి. కొత్త ఇంగ్లిష్ పుస్తకాల కోసం అక్కడికే వెళ్లేవాడిని. అట్లాంటి షాప్ మూతపడటమంటే ఒక జ్ఞాపకం చెరిగిపోవడం. - ఎన్. వేణుగోపాల్, ఎడిటర్, ‘వీక్షణం’ ఏదో బాధ... మెథడిస్ట్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నప్పటి నుంచే నాకు ఈ బుక్షాప్తో పరిచయం. ఉన్నత విద్య, ఉద్యోగ రీత్యా.. దాదాపు 45 ఏళ్లు దేశానికి దూరంగా ఉన్నా. మళ్లీ హైదరాబాద్కు వచ్చాక.. అబిడ్స్లో మళ్లీ గుర్తించగలిగింది అంటే ఈ బుక్షాప్నే. ఎన్నో వచ్చాయి... ఎన్నో పోయాయి.. మిగిలింది ఒక్కటే ఎఎ హుస్సేన్ బుక్షాప్. బాల్యంలో ఎన్నో స్మృతులకు నిలయమైన ఈ స్టోర్ మూతపడుతోందంటే ఎంతో బాధ కలుగుతోంది. అందుకే ఏదో ఒకటి కొందామని వచ్చా. - డాక్టర్ డి.ఎస్.రావ్, చిక్కడపల్లి -
ఆరు రుచుల పుస్తకాలు...
ఉగాది ప్రత్యేకం పదార్థానికే కాదు పుస్తకానికి కూడా ఒక రుచి ఉంటుంది. తీపి, కారం, వగరు, చేదు... జీవితంలోని ఈ రుచులన్నింటినీ పుస్తకాలు చూపిస్తాయి. అవి ఎదురైనప్పుడు వాటిని ఎలా స్వీకరించాలో ఎంతవరకు స్వీకరించాలో ఎలా తప్పుకుపోవాలో ఎలా వాటిని ఎదిరించి నిలవాలో సూచిస్తాయి. ఉగాదికీ సాహిత్యానికీ మధ్య ఉన్న బంధం రుతువుకూ చివురుకూ ఉన్న బంధం. తెలుగువారు ఉగాది రాగానే పూతతో పాటు పద్యాన్ని కూడా గుర్తు చేసుకుంటారు. అసలు సిసలు తెలుగు సారస్వతాన్ని తలచుకుని గర్వపడతారు. ప్రహసనంగా మారిన వాటిని హాస్యమాడి పండగ పూట కాసింత వినోదిస్తారు. ఉగాది కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ పేజీల్లో అవన్నీ ఉన్నాయి. ఆరు రుచుల పేర్లు చెప్పగానే ఆ రుచికి తగ్గ పుస్తకాన్ని ఇక్కడ కొందరు రచయితలు పంచుకున్నారు. పాప్యులర్ రచయితలు వారికి నచ్చిన ఆరు పుస్తకాలను ఎంచి చూపారు. పండగపూట ఇవన్నీ తేలికపాటి ఆరగింపులు. చిరు జలదరింపులు. చిత్తగించండి. తీపి మోహనవంశీ... సాహిత్యంలో తీపి అంటే నాకు లత రాసిన ‘మోహనవంశీ’యే గుర్తుకు వస్తుంది. లత వాక్యం, రచనను ఆమె నిర్వహించే తీరు అద్భుతం. అంత తీయగా ఎవరైనా రాయగలరా? తియ్యటి పాయసంలాంటి ప్రేమ మాధుర్యాన్ని వొంపి, జీవన మధువునంతా నింపి ఆమె ఆ రచన చేసిందా అనిపిస్తుంది. జీవితంలోని అన్ని ప్రశ్నలకూ తాత్విక సమాధానం తీయని వలపులో ఉందని చెప్పడానికే లత ఈ మధుర కావ్యం రాసి ఉండవచ్చు. ఈ నవలలోని రాధకానీ, ఆమె ప్రేమకానీ ఒక ఊహే కావచ్చు. కృష్ణుడిని దైవత్వ పీఠం నుంచి తొలగించి రాధ మనోవేదిక మీద ఒక ప్రేమికుడిగా కూర్చోబెట్టడమూ ఊహే కావచ్చు. కాని, ఆ ఊహలోని తియ్యదనం మాత్రం నిజం. ప్రేమ గురించి ఉమర్ ఖయ్యాం మొదలు ఎందరు కవులు చెప్పినా ఆ పాటలన్నీ అందమైన వచనంలోకి మారింది మాత్రం లత మోహనవంశీలోనే. అందుకే ఆమె లత. తెలుగు లత. - కల్పనా రెంటాల, రచయిత్రి చేదు మహాప్రస్థానం జీవితంలోనూ సాహిత్యంలోనూ చేదునిజాన్ని చెప్పిన కవిత్వం ‘మహాప్రస్థానం’. ఇంతటి చేదును ఇంతకు మునుపు ఎవరైనా చూశారా? ఎలాంటి చేదు ఇది? కడుపులో చేతులు పెట్టి దేవినట్టు అనిపించే చేదు. అంతవరకూ కవిత్వం అంటే కమనీయంగా రమణీయంగా ఉండాలని అనుకుంటూ ఉన్న నాకు ఈ పుస్తకం ఉలిక్కిపడేలా చేసింది. ‘చేదువిషం జీవఫలం’ అంటూ భయోద్విగ్నంగా జాగృతం చేసింది. ఆకలేసి కేకలేసే అభాగ్యులను, పతితులను, బాధాసర్పదష్టులను విముక్తంచేయమని పిలుపునిచ్చిన ఆ కవిత్వాన్ని ప్రతి ఒక్కరూ నాలుక మీద చేదుగా రాసుకోవాలి. అప్పుడే సత్యం పలకడం సాధ్యమవుతుంది. తాంబూల సేవనంలో ఉన్న కవిత్వాన్ని వేపమండలతో చరిచి మేల్కొల్పిన శ్రీశ్రీ ధన్యుడు. - సింగమనేని నారాయణ, కథా రచయిత కారం ఖాకీవనం కారం అనగానే నాకు వెంటనే గుర్తుకొచ్చేది పతంజలి వచనం. అది ఒక్కోసారి మామిడికాయ ముక్కకి అద్దినట్టుగా ఉంటుంది. మరోసారి పుండు మీద జల్లినట్టుగా ఉంటుంది. ఇంకోసారి కళ్లలో కొట్టినట్టుగా ఉంటుంది. పతంజలి ప్రతి రచనా ఒక రకం కారమే. ‘దిక్కుమాలిన కాలేజీ’లో ఆగ్రహానికి ఒక ఈస్థటికల్ పవర్ కనిపిస్తుంది. ‘ఖాకీవనం’లో కనిపించేది ఆగ్రహ వ్యాకరణం. ‘పతంజలి భాష్యం’లో కనిపించేది కోప కారణం. అయితే ఈ వ్యవస్థ మీదా వ్యక్తుల మీదా ఈ రాజ్యం మీదా మళ్లీ మళ్లీ కోపం తెచ్చుకోవాలంటే మాత్రం ‘ఖాకీవనం’లోకి వెళ్లిపోతాను. కోపాన్ని ఎన్ని ప్రతీకల్లో ఎంత దూరం చెప్పవచ్చో తనని తాను పరీక్షించుకోడానికి ఆయన ఈ నవల రాశారా అనిపిస్తుంది. అప్పటి దాకా మన సాహిత్యంలో కోప వ్యాకరణం లేదని కాదు. చాలా ఉంది. శ్రీపాద నుంచి చలం దాకా దూర్జటి నుంచి దిగంబర కవుల దాకా... కాని కోపాన్ని కోపంగానే పొగరు గానే వ్యక్తం చేయాలి అనుకొని దానికి కావలసిన సామగ్రిని సిద్ధం చేసినవాడు మాత్రం పతంజలి. - అఫ్సర్, కవి వగరు పితృవనం వగరు... ఈ రుచి అనగానే నాకు కాటూరి విజయసారథి గుర్తుకు వస్తారు. ఆయన నవల ‘పితృవనం’ తెలుగులో చాలా మంచి నవల నా దృష్టిలో. ఆయన కాంట్రిబ్యూషన్ గురించి ఎవరైనా మాట్లాడారో లేదో నాకు తెలియదు. బ్రాహ్మణుల శవాలను మోసే ఒక నిరుపేద బ్రాహ్మణుడి కథ అది. ఆ రోజుల్లోనే పదివేల రూపాయల బహుమతి గెలుచుకుంది. విజయసారథి చాలా జోవియెల్. బాగా నవ్వించేవాడు. కర్నూలు ఆల్ ఇండియా రేడియోలో పనిచేయడానికి వచ్చినప్పుడు మంచి స్నేహితుడయ్యాడు. ‘నేనూ చీకటి’ నవలను అచ్చుకు పంపకముందు కొంత చదివి వినిపిస్తే చాలా మెచ్చుకున్నాడు. ఆ తర్వాత అతడికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ‘నేనూ చీకటి’... ఆంధ్రప్రభలో సీరియలైజ్ అవుతున్నదని ఉత్తరం రాశాను. జవాబు లేదు. రెండు నెలల తర్వాత వాళ్లబ్బాయి సమాధానం రాశాడు- మీకు రిప్లై ఇవ్వడానికి నాన్న లేరు... చనిపోయారు అని. ఎందుకనో ఇది జరిగి చాలారోజులైనా కరక్కాయ కొరికినట్టుగా... ఇంకా గొంతు దిగనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. -కాశీభట్ల వేణుగోపాల్, నవలా రచయిత పులుపు కన్యాశుల్కం... గట్టి పులుపు తగిలితే ఒళ్లు జిల్లుమంటుంది. జలదరిస్తుంది. ఒక్క మధురవాణికి తప్ప అలాంటి పులుపు, జలదరింపు తక్కిన తన అన్ని పాత్రలకూ ఇచ్చాడు గురజాడ కన్యాశుల్కంలో. ఆలోచించి చూడండి అందులో పులుపు తగలని పాత్ర ఉందా? అగ్నిహోత్రావధాన్లు, లుబ్ధావధాన్లు, రామప్ప పంతులు, గిరీశం, వెంకటేశం, కరకట శాస్త్రి, బుచ్చమ్మ... అందరికీ తగిలింది. ఇది యాసిడ్ దాడి లాంటిది కాదు. బుగ్గ మీద చిటికేసి చక్కదిద్దడం. దారికి తేవడం. గురజాడ ఆత్మ మధురవాణిలోనే ఉందంటారు చాలామంది. నండూరి రామమోహనరావుగారు తనకే గనక అధికారం ఉంటే విజయనగరంలో మధురవాణి విగ్రహం పెడతానని అనేవారు. తమిళులు ‘కన్నగి’ పాత్రను అలా చెన్నై మెరీనా బీచ్లో ప్రతిష్టించుకున్నారు. మనం ఆ పని చేయలేదు. ఏ విషయం గురించైనా అసలు మనకు పులుపు తగిలితే కదా. - శ్రీరమణ, రచయిత ఉప్పు యమకూపం ఉప్పు చాలా ముఖ్యమైన రుచి. సమతూకం పాటించాల్సిన రుచి. జీవితంలో దీనిని శృంగారంతో పోల్చవచ్చు. అది ఎక్కువైనా కష్టమే. అసలు లేకపోయినా నిస్సారమే. శృంగారంతో ముడిపడ్డ కుటుంబ వ్యవస్థ సజావుగా సాగాలంటే బయట వ్యభిచార వ్యవస్థ నడవక తప్పదు అని చాలామంది వాదిస్తారు. ఆ వ్యభిచార వ్యవస్థ విశ్వరూపాన్ని చూపించే నవల కుప్రిన్ రాసిన ‘యమకూపం’. చాలాఏళ్ల క్రితం చదివినా ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. మన బయటి జీవితాల్లో ఉండే దొంతరలన్నింటినీ కుప్రిన్ ఒక వేశ్యావాటికలోని వీధిలో చూపించి మనల్ని ఆలోచింపచేస్తాడు. వ్యభిచారం పోవాలి అని పైకి ఎంత అరచినా సాధ్యం కాదు. మూలాలు చూడాలి. ఈ ప్రపంచంలో ఆయుధ వ్యాపారం తర్వాత రెండో స్థానంలో నిలిచింది స్త్రీల వ్యాపారమేనట. ఎంత విషాదం. సోషల్ రిలవెన్స్ పోతే ఏ పుస్తకమైనా మూలబడుతుంది. యమకూపం అలా మూలపడాలని నేను కోరుకుంటాను. కాని మరో వందేళ్లకూ సాధ్యమయ్యేలా లేదు. - విమల, కవి