naxals
-
మాజీలు X మావోయిస్టులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: బస్తర్ అడవుల్లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. సీఆర్పీఎఫ్, స్పెషల్ టాస్క్ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సీఆర్పీఎఫ్–కోబ్రా, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, బస్తర్ ఫైటర్స్, దంతేశ్వరి ఫైటర్స్ తదితర సాయుధ బలగాలు సంయుక్త ఆపరేషన్లు చేస్తూ బస్తర్ అడవుల్లోకి చొచ్చుకుపోతున్నాయి. అయితే భద్రతా దళాలపై మావోయిస్టులు జరిపే దాడుల్లో ఎక్కువగా స్థానికులతో కూడిన డీఆర్జీ యూనిట్ జవాన్లే హతమవుతున్నారు. తాజా ఘటనలో బస్తర్ ఫైటర్స్ కూడా ఉన్నారు. బలగాలకు భారీ నష్టం దేశంలోని విప్లవ శక్తులన్నీ కలిసి 2004లో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)గా ఏర్పడ్డాయి. నేపాల్ నుంచి శ్రీలంక వరకు రెడ్ కారిడార్ లక్ష్యంగా ముందుకు కదిలాయి. దీనికి ప్రతిగా ప్రభుత్వం 2005లో స్థానిక యువతతో సల్వాజుడుం (శాంతి దళం) పేరుతో సాయుధ దళాలను ఏర్పాటు చేసింది. 2007లో మావోయిస్టులు జరిపిన దాడిలో ఏకంగా 55 మంది పోలీసులు చనిపోయారు. ఇందులో 31 మంది సల్వాజుడుం వారే ఉన్నారు. 2008లో ఒడిశా బలిమెల వద్ద జరిగిన దాడిలో 37 మంది గ్రేహౌండ్స్ పోలీసులు హతమయ్యారు. 2007 ఏప్రిల్ 25న చింతల్నార్ దగ్గర బాంబుదాడితో పాటు అంబూష్ ఎటాక్ జరిపారు. ఈ ఘటనలో ఏకంగా 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. సల్వాజుడుం, గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ ఇలా ఏ రూపంలో బలగాలు దండకారణ్యంలోకి వెళ్లినా చేదు ఫలితాలే వచ్చాయి. దీంతో జనంలో జనంలా కలిసిపోయి గెరిల్లా యుద్ధతంత్రంతో మావోలు జరిపే దాడులను సమర్థంగా ఎదుర్కోవడం ప్రభుత్వ భద్రతా దళాలకు తప్పనిసరిగా మారింది. మాజీలతో డీఆర్జీ.. గతంలో సల్వాజుడుంలో పనిచేసిన వారికి జంగిల్ వార్ఫేర్లో శిక్షణ ఇచ్చి డి్రస్టిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్జీ) పేరుతో 2008లో కాంకేర్ తొలి యూనిట్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాలంలో మావోయిజం వైపు ఆకర్షితులై జనమిలీషియా నుంచి దళాల్లో వివిధ హోదాల్లో పనిచేసి లొంగిపోయిన మావోయిస్టులకు ఆశ్రయం కల్పించే సంస్థగా డీఆర్జీ రూపాంతరం చెందింది. జిల్లాకు ఒకటి వంతున 2015 నాటికి బస్తర్, నారాయణ్పూర్, కాంకేర్, దంతెవాడ, కొండెగావ్, బీజాపూర్, సుక్మా మొత్తం ఏడు డీఆర్జీ యూనిట్లు ఏర్పాటయ్యాయి. ప్రతీ యూనిట్లో 500 మంది జవాన్లు పని చేస్తున్నారు. ముందుండేది వీరే.. గతంలో అడవుల్లో నక్సల్స్తో కలిసి పనిచేసిన అనుభవం, స్థానిక అడవులపై అవగాహన, వాగులు దాటడం, గుట్టలు ఎక్కడంలో నేర్పరితనం, అడవుల్లో దొరికే ఆకులు, దుంపలు, కాయల్లో ఆహార పదార్థాలను గుర్తించడం తదితర విషయాల్లో డీఆర్జీ జవాన్లు ప్రత్యేకతను చాటుకున్నారు. దీంతో అడవుల్లో చేపట్టే గాలింపు చర్యల్లో డీఆర్జీ యూనిట్లు కీలకంగా మారాయి. అంతేకాదు పారిశ్రామికీకరణ, పట్టణీకరణ లేక విద్యావకాశాలకు దూరంగా ఉన్న స్థానిక యువతకు వెంటనే లభించే ఉపాధి మార్గంగా డీఆర్జీ యూనిట్లు మారాయి. అయితే జవాన్ల వయోభారం, ఫిజికల్ ఫిట్నెస్ డీఆర్జీ యూనిట్లకు మైనస్గా మారింది.బస్తర్ ఫైటర్స్..డీఆర్జీతో వచ్చిన సానుకూల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని లోకల్ యంగ్ టీమ్తో బస్తర్ ఫైటర్స్ను 2022లో అందుబాటులోకి తెచ్చారు. 300 మందితో కూడిన మొదటి యూనిట్కు నోటిఫికేషన్ ఇస్తే ఏకంగా 40 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాకు 300 మంది జవాన్లతో కూడిన ఏడు యూనిట్లు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఇదే ఊపులో కేవలం మహిళలతో దంతేశ్వరీ ఫైటర్స్ అనే యూనిట్ కూడా మొదలైంది. యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్లో స్థానికేతర దళాలకు సాయమందించే పనిలో ఉన్న ఈ లోకల్ జవాన్లే ఎక్కువగా మావోలు జరిపే దాడుల్లో చనిపోతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
సుక్మా జిల్లాలో మావోయిస్ట్ల అలజడి
ఛత్తీస్గఢ్ : సుక్మా జిల్లాలో నక్సల్స్ అలజడి సృష్టించారు. జేగురుకొండ వారపు సంతలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై నక్సలైట్ల దాడి చేశారు. ఈ దాడిలో జేగురుకొండ పోలీసు స్టేషన్కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. గాయపడ్డ పోలిసుల్ని అత్యవసర చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే జేగురుకొండ పోలీసు స్టేషన్ పరిధిలో వారపు సంతలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై నక్సలైట్ల యాక్షన్ టీమ్ కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లు కరటం దేవా, సోడి కన్నాలకు గాయాలయ్యాయి. వారి వద్ద నుంచి రెండు తుపాకుల్ని అపహరించారు. -
తుల్తులీ ఎన్కౌంటర్ మృతులు 38 మంది
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్గఢ్ చరిత్ర లోనే అతి పెద్దదిగా పరిగణిస్తున్న తుల్తులీ ఎన్కౌంటర్లో రోజులు గడిచేకొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆ రాష్ట్రంలోని అబూజ్మడ్ అడవుల్లో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఈనెల 4న నారాయణపూర్ జిల్లా పరిధిలోని తుల్తులీ, గవాడీ గ్రామాల మధ్య ఎన్కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో తొలి రోజు 31మంది చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు.అందులో 22మందిని గుర్తించగా మిగిలిన వారిని గుర్తించలేకపోయారు. ఘటన జరిగిన 10 రోజుల తర్వాత మావో యిస్టులు లేఖ విడుదల చేస్తూ ఈ ఎదురు కాల్పుల్లో మొత్తం 35మంది చనిపోయినట్లు వెల్లడించారు. ఇక్కడితోనే మృతుల సంఖ్య ఆగిపోతుందని అంతా అనుకున్నారు. అయితే దంతెవాడ ఎస్పీ గౌరవ్రాయ్ శుక్రవారం ఈ ఎన్కౌంటర్పై మరిన్ని వివరాలు వెల్లడించారు. దీని ప్రకారం తుల్తులీ ఎన్కౌంటర్లో మొత్తం 38మంది చనిపోయారని వెల్లడించారు. మృతులపై ఉన్న రివార్డు మొత్తం రూ.2.60 కోట్లుగా ఉంది. -
మానవ హక్కుల్ని కాలరాశారు: అమిత్షా
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మానవహక్కుల్ని నక్సల్స్ దారుణంగా ఉల్లంఘిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్షా ఆరోపించారు. 2026 మార్చికల్లా నక్సల్స్ను అంతంచేస్తామని ప్రకటించారు. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతా పరిస్థితిపై సమీక్ష, నక్సల్స్ ఏరివేతకు ఉమ్మడి వ్యూహం, నక్సల్స్ ప్రభావిత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, అందుకు కేంద్రం సాయం తదితర అంశాలపై సోమవారం అమిత్ షా నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్య కార్యదర్శులు, డీజీపీలు, కేంద్ర మంత్రులు, కేంద్ర సాయుధ బలగాల, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ‘‘దేశంలో గిరిజనులుసహా 8 కోట్ల మంది ప్రజలకు అభివృద్ధి, కనీస సంక్షేమ అవకాశాలు దక్కకుండా నక్సల్స్ దారుణంగా మానవహక్కుల్ని ఉల్లంఘిస్తున్నారు. అటవీ, మారుమూల ప్రాంతాలకు విద్య, ఆరోగ్యం, అనుసంధానత, బ్యాంకింగ్, పోస్టల్ సేవలు అందకుండా అడ్డుకుంటున్నారు. అభివృద్ధికి అవరోధంగా తయారయ్యారు’’ అని అమిత్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘భద్రతాబలగాలు గతంలో రక్షణాత్మక ధోరణిని అవలంభించేవి. ఇప్పుడు దీటుగా సమాధానమిస్తున్నాయి. ఇటీవలికాలంలో బలగాలు ఘన విజయాలను సాధించాయి’’ అని ఇటీవల ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ను అమిత్ షా పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘ నక్సల్స్తో పోరాటం తుది అంకానికి చేరుకుంది. అందరి సహకారంతో 2026 మార్చికల్లా నక్సల్స్ను రూపుమాపుతాం. దీంతో దశాబ్దాల సమస్యకు ముగింపు పలుకుతాం. మావోయిస్టుల ప్రభావిత గిరిజన, ఆదివాసీ ప్రాంతాలకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందిస్తూనే మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి్దపై దృష్టి పెట్టినప్పుడు నక్సలిజాన్ని అడ్డుకోగలం. పోలీస్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర పనితీరు అద్భుతం. ఛత్తీస్గఢ్లో వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయడంలో గ్రేహౌండ్స్ పైచేయి సాధించింది. 2022 ఏడాదిలో గత 30 ఏళ్లలో ఎన్నడూలేనంతగా వామపక్ష ప్రభావిత హింసకారణంగా మరణాలు వందలోపునకు దిగొచ్చాయి. ఇప్పటిదాకా ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీర్, వామపక్ష ప్రభావిత ప్రాంతాల నుంచి 13,000 మంది హింసను వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. ఇకనైనా నక్సల్స్ ఆయుధాలు వీడాలి’’ అని అమిత్ షా పిలుపునిచ్చారు. ఛత్తీస్గఢ్ విజయం స్ఫూర్తిదాయకం‘‘ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అన్ని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో కొత్త అభివృద్ధి ప్రచారాన్ని ప్రారంభించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలను గిరిజ నులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్గఢ్లో ఈఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా 237 మంది నక్సలైట్లు చనిపో యారు. 812 మంది అరెస్టయ్యారు. 723 మంది నక్సలైట్లు లొంగిపోయారు’’ అని వివరించారు. తగ్గిన హింసాత్మక ఘటనలు‘‘ఇటీవలికాలంలో నక్సల్స్ హింసాత్మక ఘటనలు గణనీయంగా తగ్గాయి. నక్సల్స్ హింస ఘటనలు 16,463 నుంచి 7,700కి దిగొచ్చాయి. పౌరులు, భద్రతా సిబ్బంది మరణాలు 70శాతం తగ్గాయి. హింస బారినపడిన జిల్లాల సంఖ్య 96 నుంచి 16కు తగ్గింది. తమ పరిధిలో హింసాత్మక ఘటనలు జరుగుతున్న పోలీసు స్టేషన్ల సంఖ్య 465 నుంచి 171కి తగ్గింది. ఇది కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి ప్రయత్నాల ఫలితం. నక్సలిజం రూపుమాపేందుకు తీసుకునే చర్యల పురోగతిని సీఎంలు నెలకోసారి సమీక్షించాలి. డీజీపీలు ప్రతి 15 రోజులకే సమీక్ష జరపాలి’’ అని అమిత్ సూచించారు. -
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్...
-
ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్
భువనేశ్వర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 8 మంది నక్సలైట్లు మరణించినట్లు సమాచారం. మృతిచెందిన మావోయిస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఘటన జరిగిన ప్రాంతం గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందిఘటనా స్థలం నుంచి హతమైన నక్సలైట్ల మృతదేహాలు, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 6 గంటలకు మొదలైన ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. ఈ నక్సల్స్ ఏరివేత ఆపరేషన్లో మూడు జిల్లాల నుంచి భద్రతా బలగాలు పాల్గొన్నాయి.బీజాపూర్, దంతేవాడ, సుక్మా జిల్లాల నుంచి సుమారు 1200 మంది DRG, STF, COBRA, CRPF సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్లు సమాచారం. అగ్రశ్రేణి నక్సల్స్ నేతలు ఉన్నారన్న సూచనతో ఈ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. బస్తర్ ఐజీ, మూడు జిల్లాల డీఐజీ, ఎస్పీలు ఎన్కౌంటర్పై నిఘా పెట్టారు. -
Bastar Encounter: 29 మంది మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ బస్తర్ అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతిచెందిన 29 మంది నక్సలైట్ల మృతదేహాలకు శవపరీక్ష జరుగుతోందని బస్తర్ రేజం్ ఐజీ సుందరరాజన్ తెలిపారు. ఎన్ కౌంటర్ మృతుల్లో 15 మంది మహిళా మావోయిస్టులు, 14 మంది పురుషు నక్సల్స్ ఉన్నారని పేర్కొన్నారు. డీఆర్జీ, బీఎస్ఎఫ్ జవాన్లు సంయుక్తంగా నక్సల్స్ను చుట్టు ముట్టి మంచి ఫలితాలు సాధించారన్నారు. నాలుగు గంటల పాటు హోరా హోరిగా ఎదురు కాల్పులు జరిగాయని చెప్పారు. దండకారణ్యం మరోమారు నెత్తురోడింది. ఛత్తీస్గఢ్లోని బస్తర్ అడవుల్లో భారీ ఎన్కౌటర్లో భారీ ఎన్కౌటర్తో 29 మంది మావోయిస్టులు మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు కూడా గాయపడ్డారు. బస్తర్ అడవుల్లోని కాంకేరు జిల్లా ఛోట్ బెటియా ప్రాంతంలో ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఏపీకి చెందిన అగ్రనేత సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్రావు ఉన్నారు. ఈయన పై 25 లక్షల రివార్డు ఉంది. ఇద్దరు తెలంగాణ వాసులను కూడా గుర్తించారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్రావు, ఆయన భార్య, ఆదిలాబాద్ జిల్లా హత్నూర్కు చెందిన దాసర్వర్ సుమన అలియాస్ రజిత కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో ఏడు ఏకే–47లు, మూడు ఎల్ఎంజీలు, ఇతర ఆయుధాలు స్వాదీనం చేసుకున్నారు. నెలరోజుల్లో 79 మంది లోక్సభ ఎన్నికల ముంగిట బస్తర్ అడవుల్లో భీతావహ పరిస్థితి నెలకొంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు పట్టుదలగా అడవుల్లోకి చొచ్చుకెళ్తున్నాయి. గడిచిన 30 రోజుల్లో జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీకి చెందిన 79 మంది మరణించారు. వరుస ఎదురుదెబ్బలతో కేంద్ర మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇక ఛత్తీస్గఢ్లో ఈనెల 19న లోక్సభ ఎన్నికల తొలి విడత, 26న రెండో దశ పోలింగ్ జరగనుంది. -
'ది కేరళ స్టోరీ మేకర్స్'.. మరో సెన్సేషనల్ మూవీ వచ్చేస్తోంది!
ది కేరళ స్టోరీ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సుదీప్తో సేన్. అదా శర్మ ప్రధాన పాత్రలో మెప్పించిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. వివాదాలు చుట్టుముట్టినప్పటీకి ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం రిలీజైన దాదాపు 9 నెలల తర్వాత ఓటీటీకి వచ్చింది. ప్రస్తుతం జీ5 స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన వస్తోంది. కేరళలో అమ్మాయిలను బలవంతంగా విదేశాలకు తరలించారన్న నేపథ్యంలో ఈ కథను తెరకెక్కించారు. ది కేరళ స్టోరీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మేకర్స్ మరో కాంట్రవర్షి మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆదాశర్మ- సుదీప్తో సేన్ కాంబినేషన్లో బస్తర్ అనే మరో చిత్రం వస్తోంది. నక్సలిజం ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా చత్తీస్గఢ్లోని బస్తర్లో జరిగిన మారణహోమం ఆధారంగా రూపొందించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ చిత్రంలో ఆదాశర్మ ఐపీఎస్ అధికారి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 15న థియేటర్లలో విడుదల కానుంది. -
అన్నల ఇలాఖాలో.. ఎన్నికల సందడి
కాజీపేట: ఎన్నికలు వచ్చాయంటే హనుమకొండ జిల్లాలోని అనేక గ్రామాల్లో గతంలో భయం భయంగా ఉండేది. ఒకవైపు ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్ట్ నక్సలైట్ల పిలుపు. ఎన్నికల్లో పాల్గొనా లని పోలీసుల కవాతుల మధ్య పల్లె జనాల వెన్నులో వణుకు పుట్టేది. ఎన్నికలు జరగనీయొద్దని నక్సల్స్.. ఎలాగైనా ఎన్నికలు జరిపించాలని పోలీ సుల పట్టు మధ్య గ్రామస్తులు నలిగిపోయే వారు. ఎన్నికలు ముగిసి ప్రశాంతత ఏర్పడే వరకు బిక్కుబిక్కుమంటూ కాలంగడిపే పరిస్థితులు ఉండేవి. తుపాకుల నీడన ఎన్నికలు.. నగరానికి కూతవేటు దూరంలోనే ఉన్న అనేక గ్రామాలు నక్సల్స్ ప్రభావితంగా ఉండేవి. కాజీపేట పట్టణానికి చెందిన క్రాంతిరణదేవ్ అలియాస్ బక్కన్న, మాచర్ల ఏసోబు, కడారి రాములు తదితరుల నేతృత్వంలో శివారు గ్రామాలన్నీ ఎన్నికలకు దూరంగానే ఉండేవి. కాజీపేటకు చుట్టూ పది కిలోమీటర్ల దూరంలోనే ఉన్న పల్లెల్లో ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చి విజయవంతం చేయాలని అన్నలు ప్రయత్నించేవారు. భట్టుపల్లి, తరాలపల్లి, రాంపేట, అయోధ్యపురం, టేకులగూడెం, దర్గా కాజీపేట, కొండపర్తి తదితర గ్రామాల్లో చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా నక్సల్స్కు అండగా నిలిచేవారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కమిటీలో కీలకంగా వ్యవహరిస్తున్న మాచర్ల ఏసోబు అలియాస్ కైలాసం స్వగ్రామం టేకులగూడంలో పరిస్థితులు భయానకంగా ఉండేవి. నక్సల్స్కు షెల్టర్ జోన్లుగా పిలిచే ఈ గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించడమంటే పోలీసులు, అధికారులకు సాహసమనే చెప్పాలి. పోలింగ్ బూతుల వద్ద గ్రామ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరింపజేసి ఎన్నికలను నిర్వహించిన సందర్భాలు అనేకం. కొన్ని సమయాల్లో సాయుధ పోలీసులు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను పోలీంగ్ కేంద్రాలకు తరలించేవారంటే పరిస్థితి ఏవిధంగా ఉండేదో.. అర్ధం చేసుకోవచ్చు. ఎన్నికల సమయంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు గ్రామాల్లో ప్రచారం చేసిన దాఖలాలు కనిపించేవి కావు. పోలీసులు ఎన్నికలకు నెలరోజుల ముందుగా నక్సల్స్ ప్రభావిత గ్రామాల్లో భారీగా కూంబింగ్ నిర్వహించి ఒకే.. అన్న తర్వాతే ఎన్నికల నిర్వాహణకు గ్రీన్ సిగ్నల్ పడేది. నక్సల్స్ ప్రభావిత గ్రామాల్లోని కొన్ని పోలింగ్ బూతుల్లో ఎన్నికల ఏజెంట్గా ఉండేందుకు పలాన పార్టీకి ఓటు వేయాలని ఓటర్లకు చెప్పేందుకు ఇంటింటికీ తిరిగి ఓట్లు అడిగేందుకు సాహసించేవారు కాదంటే అతిశయోక్తికాదు. -
Gaddar Demise: 'అగ్గి గళం' ఆగిపోయింది
వాగ్గేయకారుడా.. కన్నీటి వందనం గోసి గొంగడి పాట కాలి గజ్జెల మోత చేత ఎర్రజెండా పిక్కటిల్లే రేల గొంతుక.. గద్దర్ వసంతకాల మేఘ గర్జన కదనుతొక్కే ప్రజావాహిక జన కేతన.. నవ చేతన.. గద్దర్ పల్లవొక తూటా చరణమొక ఫిరంగి వేదిక పై వాగ్గేయకారుడు పెత్తందార్ల వెన్నులో చలి.. గద్దర్ తెలంగాణ సింగడి దండకారణ్య పచ్చనాకు బొగ్గుబావి దీపం రైతుకూలీ కొడవలి.. గద్దర్ పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం శ్రమజీవి పాదంపై చెరగని పుట్టుమచ్చ అతడు చరిత్ర.. జనగళ యుద్ధనౌక.. గద్దర్ ఈ నేల మళ్లీ కనలేని పాట గద్దర్. మన పాల్ రాబ్సన్. మన విక్టర్ జారా. మన బాబ్ మార్లీ. ఒకే ఒక్కడు గద్దర్. నోరులేని పేదలకు గొంతునిచ్చినవాడా మహా కవీ... అమర గాయకుడా.. నీకు వీడ్కోలు... రేల పూల మాల. సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: తన పాటలతో ప్రజా బాహుళ్యాన్ని ఉర్రూతలూగించిన ప్రజా గాయకుడు గుమ్మడి విఠల్ అలియాస్ గద్దర్ ఇక లేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గత నెల 20న గుండె పోటుతో అమీర్పేటలోని అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో చేరారు. గుండె రక్తనాళాలు మూసుకుపోయినట్టు నిర్ధారించిన వైద్యులు ఈ నెల 3న శస్త్రచికిత్స చేసి సరిచేశారు. కానీ ముందు నుంచే మూత్ర పిండాలు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ‘ఆదివారం ఉదయం అకస్మాత్తుగా రక్తపోటు పెరిగింది. షుగర్ లెవల్స్ పడిపోయాయి. మధ్యాహ్నానికల్లా శరీరంలోని పలు అవయవాలు పనిచేయడం ఆగిపోయాయి. ఆయనను కాపాడేందుకు ప్రయత్నించినా.. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తుదిశ్వాస విడిచారు..’’అని ఆస్పత్రి అధికారులు హెల్త్ బులెటెన్లో వెల్లడించారు. అభిమానుల కోసం ఎల్బీ స్టేడియానికి.. గద్దర్ భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం సాయంత్రం 5 గంటల సమయంలో ఎల్బీ స్టేడియానికి తరలించారు. పెద్ద సంఖ్యలో నేతలు, ప్రజా సంఘాల నాయకులు, అభిమానులు అక్కడికి చేరుకుని నివాళులు అర్పించారు. మంత్రి కేటీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మధుయాష్కీ, ఎమ్మెల్యే సీతక్క, జనసేన అధినేత పవన్కల్యాణ్, ప్రజా గాయకురాలు విమలక్క తదితరులు నివాళి అర్పించి గద్దర్ సతీమణిని ఓదార్చారు. జోహార్ గద్దర్, అమర్ రహే గద్దరన్న అంటూ అభిమానులు చేసిన నినాదాలతో ఎల్బీస్టేడియం హోరెత్తింది. నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు గద్దర్ భౌతికకాయానికి పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు గద్దర్ స్థాపించిన మహాబోధి విద్యాలయంలో సోమవారం సాయంత్రం ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. తొలుత సోమవారం ఉదయం గద్దర్ భౌతికదేహాన్ని అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కు వద్ద కొద్దిసేపు ఉంచి నివాళులు అర్పించనున్నారు. తర్వాత నెక్లెస్రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్దకు, తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు అల్వాల్ వెంకటాపూర్ భూదేవీనగర్లోని ఆయన స్వగహానికి తరలించనున్నారు. అక్కడ స్థానికుల సందర్శనార్థం కాసేపు ఉంచి.. మహాబోధి విద్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బుర్రకథలతో చైతన్య పరుస్తూ.. ఉమ్మడి మెదక్ జిల్లా తూప్రాన్కు చెందిన లక్ష్మమ్మ, శేషయ్య దళిత దంపతులకు 1949లో గద్దర్ జన్మించారు. అసలు పేరు గుమ్మడి విఠల్రావు. సొంత ఊరిలోనే ఏడోతరగతి వరకు చదివిన ఆయన.. తర్వాత నిజామాబాద్ జిల్లా బోధన్లో, వరంగల్లో పైచదువులు కొనసాగగా.. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివారు. గ్రామంలో ఉన్నప్పుడే ఒగ్గుకథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథలు, భాగవత రూపంలో రైతులు, కార్మిక లోకాన్ని చైతన్య పరిచారు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. ఊరూరా తిరిగి బుర్రకథల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకుడు బి.నర్సింగరావు భగత్సింగ్ జయంతి రోజున గద్దర్తో ఒక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. తర్వాత ప్రతి ఆదివారం గద్దర్ తన ప్రదర్శనలు ఇచ్చేవారు. 1971లో నర్సింగరావు ప్రోత్సాహంతో గద్దర్ తన మొదటి పాట ’ఆపరా రిక్షా’రాశాడు. గదర్ అంటే విప్లవం సిక్కు కూలీలు, పనివాళ్లు పెట్టుకున్న పార్టీ పేరు గదర్.. గదర్ అంటే విప్లవం అని అర్థం. దీని నుంచి స్ఫూర్తి పొంది ఆయన రాసిన పాటల మొదటి ఆల్బంకు గదర్ అని పెట్టారు. ఇది ప్రజల్లోకి వెళ్లి ఆయన గద్దర్గా నిలిచిపోయారు. 1975లో కెనరా బ్యాంకులో క్లర్క్గా పనిచేస్తున్న సమయంలోనే ఆయన నక్సల్ మార్గం పట్టారు. 1982లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఉద్యమ బాట పట్టారు. 1985లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు. జన నాట్య మండలిలో చేరారు. ఒగ్గు కథలు, బుర్ర కథల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్లారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చారు. ప్రజా సమస్యలపై పాటల రూపంలో కోట్ల మంది హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. గోచీ,గొంగళి..చేతి కర్ర,ఎర్ర జెండా.. గద్దర్ పాటకు ఎంత ప్రాచుర్యం ఉందో, ఆయన ఆహార్యానికీ అంతే ప్రాముఖ్యత ఉంది. ఒంటిపై చొక్కా లేకుండా గొంగళి కప్పుకుని, ఎర్ర జెండా చుట్టిన కర్రతో, కాళ్లకు గజ్జెలు కట్టి గద్దర్ స్టేజీపై ఆడి, పాడుతుంటే లక్షలాది మంది కళ్లు, చెవులు అప్పగించేసేవారు. జీరబోయిన గొంతుతో పాటకట్టే విధానానికి లక్షల మంది అభిమానులు ఉన్నారు. మావోయిస్టు ఉద్యమానికి దూరమైన తర్వాత గద్దర్ వేషధారణ సైతం మారింది. పలుమార్లు ప్యాంట్, షర్ట్, కోట్లోనూ కనిపించారు. 70 ఏళ్ల వయసులో.. ఓటర్గా నమోదై.. నక్సల్, మావోయిస్టు ఉద్యమ పంథాలో నడిచిన గద్దర్.. బూర్జువా పార్టీల, ఎన్నికల వ్యవస్థలో పాలుపంచుకోబోనంటూ ఓటర్గా కూడా నమోదు చేసుకోలేదు. మావోయిస్టుల నుంచి దూరమైన తర్వాత 2018లో తొలిసారిగా ఓటరుగా నమోదు చేసుకుని.. ఆ ఏడాది డిసెంబర్ 7న జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేశారు. ‘‘పోరాటం అంటే తుపాకుల పట్టుకోవడం కాదు.. తిరుగుబాటు చేయడం అని గుర్తించి ప్రజా జీవితంలోకి వచ్చా. రాజ్యంగమే మనకు రక్ష అన్న విషయాన్ని తెలుసుకుని మొదటిసారి ఓటు హక్కును తీసుకున్నా.. 70 ఏళ్లు నిండాక తొలిసారి ఓటు వేశా. ఓట్ల యుద్ధానికి సిద్ధమయ్యే క్రమంలో గోచీ, గొంగడి, గజ్జెలు జమ్మిచెట్టు మీద పెట్టిన..’’ అని ఆ సమయంలో గద్దర్ ప్రకటించారు. ► తర్వాత ఆయన ‘గద్దర్ ప్రజాపార్టీ’ పేరిట ఒక రాజకీయ పార్టీని కూడా స్ధాపించారు. రాజ్యాంగ పరిరక్షణ దిశగా ఉద్యమాన్ని కొనసాగిస్తానని ప్రకటించారు. మావోయిస్టులు కూడా తమ వ్యూహాన్ని మార్చుకోవాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహాబోధి విద్యాలయ ఏర్పాటు అల్వాల్: స్థిరమైన జీవితం లేదని చాలాచోట్ల వలస కార్మికుల పిల్లలను బడిలో చేర్చుకునేవారు కాదు. దీంతో గద్దర్ అందరికీ విద్య అందించాలన్న సంకల్పంతో భూదేవినగర్లో మహాబోధి విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆయన సతీమణి విమల, కూతురు వెన్నెల ఈ పాఠశాల బాధ్యతలు చూసుకుంటున్నారు. ‘బండెనక బండి కట్టి’తో వెండితెరపైకి.. గద్దర్కు రెండు నంది అవార్డులు ప్రజాగాయకుడు గద్దర్ సినిమా రంగంపైనా తనదైన ముద్ర వేశారు. సాయిచంద్ హీరోగా గౌతమ్ ఘోష్ దర్శకత్వం వహించిన ‘మా భూమి’(1979) సినిమాలో తొలిసారి వెండితెరపై పాట పాడటంతోపాటు నటించారాయన. ఈ సినిమాలో ‘బండెనక బండి కట్టి..’ అనే పాటలో గద్దర్ కనిపిస్తారు. ఆ తర్వాత బి.నర్సింగరావు నటించి, దర్శకత్వం వహించిన ‘రంగుల కల’(1983) చిత్రంలో ఓ ప్రధానపాత్ర పోషించారు. జగపతిబాబు హీరోగా ఎన్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘జై బోలో తెలంగాణ’(2011) మూవీలో కీలకపాత్రలో నటించారాయన. ఆర్.నారాయణమూర్తి నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘దండకారణ్యం’(2016), సుడిగాలి సుదీర్ నటించిన ‘సాఫ్ట్వేర్ సుదీర్’(2019), చిరంజీవి హీరోగా మోహన్రాజా తెరకెక్కించిన ‘గాడ్ ఫాదర్’(2022) సినిమాల్లోనూ నటించారు. ఆర్.నారాయణమూర్తి హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘ఒరేయ్ రిక్షా’ సినిమాలో గద్దర్ పాటరాయగా, ‘వందేమాతరం’ శ్రీనివాస్ స్వరపరిచి, గానం చేసిన ‘మల్లెతీగకు పందిరి వోలే..’ పాట అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని తెలిపే పాటల్లో ఒకటిగా నిలిచింది. ‘జై బోలో తెలంగాణ’ మూవీ కోసం గద్దర్ రాసిన ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా..’ పాట సూపర్ హిట్ అయ్యింది. ఈ రెండు పాటలకు నంది అవార్డులు(రచయిత, గాయకుడుగా) గద్దర్కు వచ్చాయి. విప్లవ ఉద్యమంలో ఉన్నవారు అవార్డులు, రివార్డులు తీసుకోకూడదనే నిబంధన ఉండటంతో నంది అవార్డులు తీసుకోలేదని గద్దర్ ఓ సందర్భంలో చెప్పారు. ఇటీవల విడుదలైన ఆర్.నారాయణమూర్తి ‘యూనివర్సిటీ’ చిత్రంలోనూ ఆయన పాటలు రాశారు. ఇవే కాదు, ఆయన రాసిన మరికొన్ని పాటలు సినిమాల్లో ప్రేక్షకులను అలరించాయి. ‘నేను రాసిన వేల వేల పాటలకు నా భార్య విమలే స్ఫూర్తి అని గద్దర్ గతంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దివంగతనేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి తన పాటలంటే ఎంతో ఇష్టమని, ఆయనపై వ్యతిరేకంగా పాడినా మెచ్చుకునేవారని 2017 జూన్లో ‘మెజార్టీకే రాజ్యాధికారం’అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు కడప వచ్చిన సందర్భంలో గద్దర్ అన్నారు. గద్దర్ నటించిన చివరిచిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. సత్యారెడ్డి లీడ్ రోల్లో నటించి, స్వీయదర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం నేపథ్యంలో రూపొందింది. ఈ మూవీలో గద్దర్ కీలక పాత్ర పోషించడంతో పాటు పాటలు రాశారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. కుటుంబమంటే ఎంతో మమకారం బ్యాంకులో ఉద్యోగం చేస్తు న్న సమయంలోనే గద్దర్ వివాహం చేసుకున్నారు. ఆయన భార్య పేరు విమల. వీరికి ముగ్గురు పిల్లలు. సూర్యకిరణ్, చంద్రకిరణ్ (2003లో అనారోగ్యంతో మరణించారు), కూతురు వెన్నెల. గద్దర్కు సరస్వతిబాయి, శాంతాబాయి, బాలమణిబాయి అని ముగ్గురు అక్కలు. నర్సింగ్రావు అనే అన్న ఉన్నారు. గద్దర్కు కుటుంబమంటే ఎంతో ప్రాణం. భార్య విమల సహకారాన్ని తరచూ గుర్తు చేసుకునేవారు. తాను ఉద్యమంలో ఉన్నప్పుడు కుటుంబానికి, తనకు ఆమె అండగా ఉన్న తీరును చెప్పేవారు. ఆ పాటలు అగ్ని కణాలు.. అమ్మ కష్టం మొదలు సమాజంలో అనేక విషయాలపై పాటలు రాసిన గద్దర్.. రచయితగా తాను రాసిన అనేక పాటలకు అప్పటికప్పుడు పల్లవులు కట్టేవారు. తొలినాళ్లలో కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం వంటి సామాజిక విషయాలపై బుర్ర కథల ద్వారా అవగాహన కల్పించేవారు. తర్వాత స్వయంగా పాటలు రాశారు. 1970వ దశకంలో ఉద్యమానికి బాసటగా నిలిచిన జననాట్యమండలితో కలసి గద్దర్ సామాజికంగా దోపిడీకి గురైన వర్గాలకు గొంతుకగా మారారు. ‘పోదమురో జనసేనతో కలిసి, పోదమురో ఎర్రసేనతో కలిసి..’ అని గద్దర్ రాసి, పాడిన పాట అసంతృప్తితో మండుతున్న యువత నక్సల్ ఉద్యమంలో చేరి తుపాకులు పట్టేలా చేసింది. 1990 ఫిబ్రవరి 18న జననాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ హైదరాబాద్లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్లో నిర్వహించిన సభకు ఏకంగా 2 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. విప్లవానికి ఊపిరినిచ్చి.. ఉద్యమానికి ఊపు తెచ్చి.. గద్దర్ పాట అంటేనే ఒక ఉప్పెన.. మొదట్లో బుర్రకథలతో ప్రజలు చైతన్యాన్ని కలిగించినా, నక్సలైట్ల ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచినా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చినా.. ఆయన గొంతు సైరన్ మోగించేది. దొరలు, పాలకుల దౌర్జన్యాన్ని ఎదిరించడం నేర్పి వేలాది మంది యువత తుపాకులు చేతపట్టేలా చేసింది. శ్రీకాకుళం సీతంపేట నుండి మొదలైన తిరుగుబాటు పాట జగిత్యాల జైత్రయాత్ర, కల్లోల కరీంనగర్ వరకు సాగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి గద్దర్ పాట ప్రాణం పోసింది. ‘అమ్మ తెలంగాణమా.. ఆకలి కేకల రాజ్యామా..’అంటూ ఆయన రాసి, పాడిన పాట.. ధూంధాం కార్యక్రమాలు ఉద్యమకారుల్లో ఉత్సాహం నింపాయి. ప్రతి పల్లె కళాకారుడు గద్దర్ స్ఫూర్తిగా గోచీ, గొంగళి కట్టి నృత్యం చేశారు. ఉద్యమాల్లో అమరులైన వారి కోసం ఏర్పడ్డ బంధుమిత్రుల కమిటీలో గద్దర్ కీలక పాత్ర పోషించారు. ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇదికాదంటూ.. ప్రజాస్వామిక తెలంగాణ కోసం మళ్లీ ఉద్యమాన్ని చేపడతానని ప్రకటించారు. వివిధ పార్టీల నేతలనూ కలిశారు. ఓరుగల్లు నుంచి పొలికేక సాక్షిప్రతినిధి, వరంగల్: పీపుల్స్వార్ పార్టీపై 1990లో ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. అప్పటివరకు అజ్ఞాతంలో ఉన్న పీపుల్స్వార్ నేతలు, లీగల్ కార్యకర్తలు, జననాట్యమండలి, అనుబంధ సంఘాల నాయకులు జనజీవనంలోకి అడుగుపెట్టారు. ఇదే సమయంలో 1990 మే 5, 6 తేదీల్లో వరంగల్ వేదికగా రాష్ట్ర రైతుకూలీ సంఘం మహాసభలు నిర్వహించారు. జననాట్యమండలి నాయకుడు గద్దర్, ఆయన బృందం ప్రకాష్ రెడ్డిపేట ఏరియాలో ఏర్పాటు చేసిన సభావేదికపైన ప్రత్యక్షమైంది. పదిలక్షలకుపైగా జనం హాజరైన ఈ సభలో గద్దర్ బృందం ఆటాపాటా ఉర్రూతలూగించాయి. ‘ధీరులారా శూరులారా.. రాడికల్ శూరులారా.. మీరు కాకమ్మలయ్యి వస్తారా మా బిడ్డలు..’, ‘జై బోలోరే జై బోలో.. అమర వీరులకు జై బోలో.. వీరులకేమో జై బోలో.. ఆహా శూరులకేమో జై బోలో..’అంటూ పాడిన పాటలు ఇప్పటికీ అందరి నోట్లో వినిపిస్తాయి. గద్దర్ ప్రస్థానంలో ఓరుగల్లు మహాసభ చిరస్థాయిగా నిలిచింది. ఎన్కౌంటర్ నుంచి తప్పించిన కానిస్టేబుల్ నక్సల్స్పై తీవ్ర అణచివేత కొనసాగుతున్న 1988–90 మధ్య కాలంలో గద్దర్ పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఓసారి గద్దర్, ఇతర మావోయిస్టులు ఎక్కడ ఉన్నారన్నది పోలీసులకు సమాచారం అందింది. పెద్ద సంఖ్యలో పోలీసులు దాడి చేసి గాలించారు. ఆ సమయంలో గద్దర్ ఓ ఇంటి అటకపై దాక్కున్నారు. ఒక కానిస్టేబుల్ అటకపై గద్దర్ను చూసినా.. ఎవరూ లేరని అబద్ధం చెప్పడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. లేకుంటే గద్దర్ ఆరోజే ఎన్కౌంటర్ అయ్యేవారు, ఆనాడు కాపాడిన కానిస్టేబుల్ దళితుడని తర్వాత గద్దర్ వెల్లడించారు. బతికుంటే.. మళ్లీ వస్తా సాక్షి, నాగర్కర్నూల్: ప్రజాయుద్ధనౌక గద్దర్కు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నల్లమలతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన చివరిసారిగా ఏప్రిల్ 30న నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్లో అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహనీయుల జయంతి ఉత్సవాల ముగింపు సభలో పాల్గొన్నారు. ఈ సభలో గద్దర్ పాట పాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘అచ్చంపేటలో నాలుగు ప్రాణాలు పోయినప్పుడు ఇక్కడికి వచ్చాను. మొదటి తుపాకీ తూట నా గుండెను తాకినప్పుడు.. నెత్తురు కోసం రూ.100 కావాలని నా భార్య పైసలు అడుక్కుంది. మళ్లీ బతికి ఈ ఊరికి వచ్చిన. చివరి ఊపిరి వరకు మీ కోసం పాటుపడతా. పాలమూరుకు పేరు తేవాలి. ఈ నేల కోసం పోరాటం చేయాలి. బతికుంటే మళ్లీ వస్తాను.. మీ పాదాలకు వందనాలు’అంటూ పాట రూపంలో చెప్పారు. ఓయూ స్టూడెంట్ ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ విభాగంలో 1975లో ట్రిపుల్ ఈ పూర్తి చేశారు. నగరంలోని మొజంజాహీ ఎస్సీ హాస్టల్లో ఉంటూ కాలేజీకి చెప్పులు లేకుండా వచ్చేవారని ప్రిన్సిపల్ శ్రీరామ్ వెంకటేష్ తెలిపారు. ఓ హోటల్లో 26 పైసలకు పార్ట్టైంపనిచేస్తూ ఇంజనీరింగ్ పూర్తి చేశారన్నారు. జార్జిరెడ్డి హయాంలో అనేక ఉద్యమాలకు ఓయూ కేంద్రబిందువు అయ్యింది. వామపక్ష ఉద్యమభావజాల వ్యాప్తి కోసం ఇక్కడ జరిగిన అనేక సభలు, సమావేశాలలో జననాట్యమండలి తరపున గద్దర్ పాల్గొన్నారు. మలివిడత తెలంగాణ ఉద్యమ సమయంలో ఓయూలో జరిగిన ప్రతి సభలో పాల్గొని తన ఆటపాటతో విద్యార్థులను ఉత్తేజపరిచేవారు. గద్దర్ జీవితంలో కీలక ఘట్టాలివీ... ► 1972లో బ్యాంకు ఉద్యోగం సాధించారు. ∙1975లో సికింద్రాబాద్లోని వెస్ట్ మారేడ్పల్లిలోని కెనరా బ్యాంకులో ఉద్యోగంలో చేరారు. ► 1975, అక్టోబర్ 9న విమలతో గద్దర్ వివాహం చేసుకున్నారు. ► 1973 నుంచి గద్దర్ పాటలు రాయడం ప్రారంభించారు. ► 1977లో బి. నరసింగరావు ‘మా భూమి’సినిమాలో గద్దర్ ‘బండెనక బండి గట్టి’అనే పాటను పాడారు. 1978లో గద్దర్ మొదటిసారిగా జననాట్యమండలి శిక్షణా తరగతులు నిర్వహించారు. 1980లలో గద్దర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. పీపుల్స్వార్ పార్టీ నిర్ణయం మేరకు 1982లో ఉద్యోగానికి రాజీనామా చేసి జననాట్యమండలి సభ్యునిగా పనిచేశారు. ► 1990 ఫిబ్రవరి 18న తిరిగి బహిరంగ జీవితంలోకి అడుగుపెట్టారు. ► 1995లో పీపుల్స్వార్ పార్టీ గద్దర్ను పార్టీ నుంచి బహిష్కరించింది. పీపుల్స్వార్పార్టీ బహిష్కరణ తర్వాత గద్దర్ కన్నీటి పర్యంతం అయ్యారు. తర్వాత పార్టీ తిరిగి ఆయనను ఆహ్వానించింది. ► 1997 ఏప్రిల్ 6న గద్దర్పై ఆగంతకులు కాల్పులు జరిపారు. ► 1998లో అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా గద్దర్ ఎన్నుకోబడ్డారు. ► 2002లో ప్రభుత్వంతో చర్చల సమయంలో నక్సలైట్స్ గద్దర్, వరవరరావు లను తమ దూతలుగా పంపారు. ► 2010, అక్టోబర్ 9న తెలంగాణ ప్రజాఫ్రంట్ ఛైర్మన్గా గద్దర్ నియమితులయ్యారు. ► 2017లో గద్దర్ మావోయిస్టు పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. చేతిలో ఎర్రజెండా వదిలి..బుద్దుడి జెండా కట్టిన కర్రను చేతిలోకి తీసుకున్నట్టు ఆయన ఆ సందర్భంగా ప్రకటించారు. బతుకుదెరువు నిమిత్తం పాలమూరు నుంచి నగరానికి వలస వచ్చిన నిరుపేద కుటుంబాలకు నేనున్నానంటూ భూదేవినగర్ రైల్వే ట్రాక్ పక్కన వారికి ఆశ్రయం కల్పించి గద్దర్ అండగా నిలిచారు. వందలాది కుటుంబాలు ఆయన నీడలో జీవనం సాగిస్తున్నాయి. గద్దర్ మరణంతో మాకు దిక్కెవరంటూ భూదేవినగర్వాసులు కన్నీటిపర్యంతమవుతున్నారు. – అల్వాల్ -
అర్బన్ నక్సల్స్ గుజరాత్లో పాగా వేయాలని చూస్తున్నారు.. జాగ్రత్త!
గాంధీనగర్: ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అర్బన్ నక్సలైట్లు కొత్త వేశంతో గుజరాత్లోకి రావాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. యువతను నాశనం చేసే వాళ్లను గుజరాతీలు రాష్ట్రంలోకి రానివ్వరని పేర్కొన్నారు. దేశంలోనే తొలి బల్క్ డ్రగ్ పార్కను భారుచ్ జిల్లాలో ప్రారంభించిన అనంతరం ఓ ర్యాలీకి హాజరై మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 'అర్బన్ నక్సలైట్లు గుజరాత్లోకి రావాలని చూస్తున్నారు. వాళ్ల వేషధారణ మార్చుకున్నారు. శక్తిమంతమైన యువతను తప్పుదోవ పట్టించి వాళ్లవైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. యువతరం జీవితాలను నాశనం చేసే వారిని రాష్ట్రంలోకి రానివ్వొద్దు. దేశాన్ని నాశనం చేయడమే వాళ్ల లక్ష్యం. వాళ్లు విదేశీ శక్తుల ఏజేంట్లు. అలాంటి వాళ్ల ముందు గుజరాత్ తలవంచదు. వాళ్లను నాశనం చేస్తుంది.' అని మోదీ అన్నారు. తాను 2014లో ప్రధాని అయినప్పుడు ప్రపంచ ఆర్థిక ర్యాంకుల్లో భారత్ 10 స్థానంలో ఉందని మోదీ గుర్తు చేశారు. ఇప్పుడు ఇంకా బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగి ఐదో ర్యాంకుకు చేరుకుందని పేర్కొన్నారు. అయితే మోదీ అర్బన్ నక్సలైట్లు అని పరోక్షంగా చెప్పింది ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించే అని స్పష్టంగా తెలుస్తోంది. నవంబర్ లేదా డిసెంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని ఆప్ చూస్తోంది. ఇందులో భాగంగానే ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తరచూ గుజరాత్లో పర్యటిస్తున్నారు. ప్రజలు, ప్రత్యేకించి యువతపై హామీల వర్షం కురిపిస్తున్నారు. 27ఏళ్ల బీజేపీ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, మార్పు కోసం తమవైపు చూస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మోదీ ఆప్తో జాగ్రత్తగా ఉండాలని గుజరాతీలకు సూచించారు. చదవండి: ములాయం కన్నుమూత.. ప్రధాని భావోద్వేగం -
ముగ్గురు తెలంగాణ ఎమ్మెల్యేల హత్యకు మావోయిస్టుల ప్లాన్? కానీ,..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉత్తర తెలంగాణలో గోదావరి తీరంలో మావోయిస్టులు అలజడికి వేసిన ప్రణాళికను నిఘావర్గాలు, పోలీసులు ముందుగానే గుర్తించారు. బెల్లంపల్లి, చెన్నూర్, రామగుండం ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్, కోరుకంటి చందర్ను హతమార్చేందుకు రెక్కీ కూడా నిర్వహించినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. కానీ,మావోయిస్టులు ఎలాంటి హింసకూ పాల్పడలేదు. రాష్ట్రస్థాయి నాయకులు ప్రవేశించినప్పటికీ హింసకు పాల్పడకపోవడం వెనుక టైమ్బాంబు తరహాలో దాడి చేసి నింపాదిగా తప్పించుకునే వ్యూహం దాగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సామాజిక, భౌగోళిక కారణాలతో..! రాష్ట్ర భౌగోళిక పరిస్థితులను పరిశీలిస్తే బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాలు మహారాష్ట్ర సరిహద్దును ఆనుకుని ఉంటాయి. ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలపై దాడి చేసి నిమిషాల్లోనే ప్రాణహిత నది దాటి మహారాష్ట్ర అటవీ ప్రాంతంలోకి పారిపోయే వీలుంది. అదే రామగుండం ఏరియా మొత్తం మైదానప్రాంతం. ఇక్కడ ఎలాంటి హింసకు దిగినా వెంటనే పట్టుబడతారు. అందుకే తొలుత చెన్నూరు,బెల్లంపల్లి ఎమ్మెల్యేలను మా వోయిస్టులు లక్ష్యంగా ఎంచుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై వారిలో భిన్నాభిప్రాయా లు వచ్చినట్లు తెలిసింది. ఇద్దరూ దళిత ఎమ్మెల్యేలే కావడంతో వీరిపై దాడికి దిగితే.. ప్రజల్లో వ్యతిరేకత ఎదురవుతుందన్న ఆందోళనతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలిసింది. చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేల విషయంలో సామాజిక కోణం.. రామగుండం ఎమ్మెల్యే విషయంలో భౌగోళిక అననుకూల కారణాలతో రెక్కీ నిర్వహించినా.. దాడికి సాహసించలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అగ్రనేతల రాకతో కలకలం ఉత్తరాన మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, కేంద్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి అలియాస్ ధర్మన్న రాష్ట్రంలోకి ప్రవేశించారన్న సమాచారం నిఘా వర్గాల వద్ద ఉంది. గోదావరికి ఇరువైపులా వీరి పోస్టర్లు వేసి ప్రజలను అప్రమత్తం చేశారు. రాజిరెడ్డి బసంత్నగర్ పరిసరాల్లో సంచరించడం వెనక కారణాలను కూడా గుర్తించారని సమాచారం. రాజిరెడ్డి ఇక్కడ వైద్యం కూడా చేయించుకుని ఉంటాడని భావిస్తున్నారు. ఎన్టీపీసీ, ఎఫ్సీఐ, గోదావరిఖని పారిశ్రామికవాడల్లో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీల్లో సానుభూతిపరులు ఉన్నారని పోలీసులు విశ్వసిస్తున్నారు. సులువుగా సరిహద్దు దాటేలా.. ఎలాగైనా దాడి చేయాలని వచ్చిన మావోయిస్టులు తమ వ్యూహాన్ని మార్చుకున్నట్లు ఖాకీలు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మావోలు సంచలన హత్యలు, బహిరంగ దాడులకు సాహసం చేయలేరు. అలాగని హింసకు పాల్పడరన్న గ్యారంటీ కూడా లేదు. అందుకే ఆర్ఎఫ్సీఎల్ (రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్) కొలువుల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దళారుల్లో ఒక్కరినైనా టైమ్బాంబుతో హతమార్చవచ్చని అనుమానిస్తున్నారు. అది మావోయిస్టు పార్టీకి ఈ ప్రాంతంలో పునర్వైభవంతోపాటు నిధులు, కేడర్ రిక్రూట్మెంట్కు దోహదపడుతుందన్నది వ్యూహం. టైమ్బాంబు పెట్టిన వ్యక్తి అది పేలే లోగా అక్కడ నుంచి తప్పించుకోవచ్చు. అలాగే మావోయిస్టులు క్షేమంగా రాష్ట్ర సరిహద్దులు దాటే వరకూ హత్య లేదా హింస విషయాలు బయటకి రాకుండా జాగ్రత్త పడే అవకాశాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే ఇక్కడ అనుమానితుల కదలికలపై 24 గంటల నిఘా ఉంచారు. -
గోదావరి తీరంలో నక్సల్స్!
సాక్షిప్రతినిధి, వరంగల్: గోదావరి తీరంలో మళ్లీ మావోయిస్టుల కదలికలు ఉన్నాయా? అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయా? తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులో నక్సల్స్ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందా?.. అంటే నిజమే అంటున్నాయి పోలీసువర్గాలు. ఏటా జరిగే మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నక్సల్స్ వివిధ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉందని రాష్ట్ర ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్లు చెబుతున్నారు. దీనికి తోడు ఏటూరునాగారం, వెంకటాపూర్ ప్రాంతాల్లో బుధవారం మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ పేరిట కరపత్రాలు, వాల్పోస్టర్లు కనిపించడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల సరిహద్దు, గోదావరి తీరంలో డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం సరిహద్దు అడవుల్లో గ్రేహౌండ్స్ బలగాలను మోహరించారు. ఏటా జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు.. మావోయిస్టు పార్టీ ప్రతి ఏడాది జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహిస్తుంది. ఉద్యమంలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 8,700 మందికి పైగా తమ సభ్యులు మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఇటీవల సంవత్సరాల్లో కరోనా, కోవర్టుల కారణంగా ఆ పార్టీ పలువురు ఉద్యమకారులను కోల్పోయింది. ఈ నేపథ్యంలో గురువారం నుంచి అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్టు కరపత్రాల్లో ప్రకటించింది. దీంతో పోలీసులు మూడు రాష్ట్రాల సరిహద్దులో నిఘా పెంచారు. అగ్రనేతల మరణం.. కోలుకోలేని నష్టం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు, తర్వాత కూడా నక్సల్స్పై ప్రభుత్వాల వైఖరి మారలేదు. 2020–22 సంవత్సరాల్లో పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. అగ్ర నాయకులతోపాటు మొత్తం 173 మంది నక్సల్స్ మరణించారు. ఓ వైపు పోలీసు ఎన్కౌంటర్లు, మరోవైపు కరోనా.. మావోయిస్టు పార్టీ కీలక నేతలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు తప్పకుండా నిర్వహించాలని పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ప్రత్యేక బలగాలను రంగంలోకి దించిన తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల ఉన్నతాధికారులు.. అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు. -
అన్నలకు గృహయోగం
వారంతా పోరుబాటలో అడవిబాట పట్టిన అన్నలు. అన్యాయంపై బంధూకు ఎక్కుపెట్టి ప్రజల పక్షాన నిలిచిన విప్లవ వీరులు. కంటి నిండా నిద్రలేక కడుపునిండా తిండిలేక ఇబ్బందులు పడ్డారు. కుటుంబాలకు దూరమై వేదన అనుభవించారు. తిరుగుబాటు యుద్ధంలో ఎందరో తూటాలకు నేలకొరిగారు. కానీ ప్రస్తుతం పాలకులు మారారు..పాలనా మారింది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. అందుకే వారంతా జనావాసంలోకి వచ్చారు. కుటుంబాలతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ సాధారణ జీవితం గడుపుతున్నారు. అలాంటి ‘మాజీ’లకు వైఎస్ జగన్ సర్కార్ అండగా నిలిచింది. నాలుగు ఎకరాల్లో 135 మందికి పట్టాలివ్వగా...వారంతా సొంతింటి కల సాకారం చేసుకుంటున్నారు. సాక్షి, పుట్టపర్తి: లొంగిపోయిన మాజీ నక్సలైట్లకు వైఎస్ జగన్ సర్కార్ అండగా నిలుస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా జీవించే అవకాశం కల్పిస్తోంది. ప్రభుత్వ పథకాలు అందేలా చూడటంతో పాటు సొంతింటి కలను సాకారం చేస్తోంది. ఇందులో భాగంగా పుట్టపర్తి శివారున సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వెనుక భాగాన కప్పలబండ పొలాల్లో సుమారు 5 ఎకరాల్లో లోచెర్ల పెద్దారెడ్డి పేరుతో కాలనీ ఏర్పాటు చేసి 135 మందికి పట్టాలిచ్చింది. లొంగిపోయి.. జనజీవన స్రవంతిలోకి.. ప్రభుత్వాల హామీతో లొంగిపోయిన మాజీ నక్సల్స్ జన జీవన స్రవంతిలో కలిసిపోయారు. అందరిలా జీవించాలనే తపనతో బతుకుతున్నారు. కుటుంబ బాధ్యతలు మీద వేసుకున్నారు. పిల్లలను చదివిస్తున్నారు. రైతులుగా మారి వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ చాలా మందికి నిలువ నీడలేదు. దీంతో అంతా కలిసి వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో 2021 మే నెలలో పట్టాల పంపిణీ జరిగింది. ప్రస్తుతం అందరూ ఓ కాలనీ ఏర్పాటు చేసుకుని ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ప్రస్తుతం కాలనీలో రోడ్డు, విద్యుత్, తాగునీరు సౌకర్యం కల్పించారు. కాలనీ పూర్తి స్థాయిలో ఏర్పడేలోపు ప్రాథమిక పాఠశాలు, కుటీర పరిశ్రమలు స్థాపిస్తే ఉపాధికి ఇబ్బందులు ఉండవని వారు కోరుతున్నారు. అప్పటి బాధలు వర్ణించలేం అజ్ఞాతంలో భాగంగా పదేళ్ల పాటు అడవిలో ఉన్నా. ఆ తర్వాత ప్రభుత్వ చర్యలతో లొంగిపోయాను. ప్రస్తుతం నాపై కేసులేమీ లేవు. వ్యవసాయం చేసుకుంటున్నా. నేను 1999లోనే జన జీవన స్రవంతిలో కలసిపోయాను. అడవిలో ఉన్నప్పటి బాధలు వర్ణించలేనివి. ఎవరికీ అలాంటి బాధలు రాకూడదు. – ఆంజనేయులు, బ్రాహ్మణపల్లి, పుట్టపర్తి ఇల్లు కట్టుకుంటున్నా నేను 2007లో లొంగిపోయాను. ప్రభుత్వంతో పాటు ఎంతో మంది ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయం చేస్తుకుంటూ జీవనం సాగిస్తున్నా. ప్రభుత్వం స్థలం మంజూరు చేయగా...ఇల్లు నిర్మించుకుంటున్నా. – ఎస్.శ్రీనివాసులు, అమగొండపాళెం ప్రభుత్వం గుర్తించింది మా అన్న ఎన్కౌంటర్ అయ్యాడు. వదిన విశాఖపట్నం జైలులో శిక్ష అనుభవిస్తోంది. నేను 1994లోనే లొంగిపోయాను. నాపై కేసులన్నీ కొట్టేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించింది. పట్టాలిచ్చి మాకంటూ కాసింత నీడనిస్తోంది. – ఎం.రంగనాయకులు, గూనిపల్లి, పుట్టపర్తి మంచి రోజులొచ్చాయి 2007లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో లొంగిపోయాను. వైఎస్సార్ హయాంలో ప్రభుత్వ పాలనపై నమ్మకం ఏర్పడింది. ఆయన మరణం తర్వాత కొన్నాళ్లు ఇబ్బందులు పడ్డాం. తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక మంచి రోజులు వచ్చాయి. ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటున్నా. రామాంజి, నార్సింపల్లి, బుక్కపట్నం మండలం ప్రభుత్వ కృషి మరువలేనిది మా నాన్న లోచెర్ల పెద్దారెడ్డి స్వాతంత్య్రం రాక ముందు నుంచి ప్రజా ఉద్యమాలు చేశారు. ఎమర్జెన్సీ తర్వాత నాన్నతో కలిసి నేనూ పదేళ్లు అజ్ఞాతంలో ఉన్నా. 1992లో ప్రజా జీవనంలోకి వచ్చా. కప్పలబండ పొలంలో 4.88 ఎకరాల్లో సుమారు 135 ప్లాట్లు ప్రభుత్వం మాకోసం మంజూరు చేసింది. మాజీ నక్సలైట్ల కాలనీ అని పేరు పెట్టుకున్నాం. అయితే ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి లోచెర్ల పెద్దారెడ్డి కాలనీగా నామకరణం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృషి.. ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి చొరవ మరువలేనిది. – లోచర్ల విజయభాస్కర్రెడ్డి -
అర్ధ శతాబ్దపు జ్ఞాపకం
కొత్తూరు: కొత్తూరు పోలీస్ సర్కిల్ ఇక జ్ఞాపకంగా మిగిలిపోనుంది. 53 ఏళ్ల అనుబంధానికి తెర పడింది. జిల్లాల పునర్విభజన కారణంగా కొత్తూరు పోలీస్ సర్కిల్ను ఎత్తివేశారు. ఇంత వరకు ఇక్కడ పనిచేసిన సీఐ సూర్యచంద్రమౌళిని వీఆర్లో ఉంచారు. కొత్తూరు సర్కిల్ ఎత్తివేయడంతో కొత్తూరు మండలాన్ని పాతపట్నం పోలీస్ సర్కిల్లో విలీనం చేసేందుకు ప్రతిపాదించారు. కొత్తూరు పోలీస్ సర్కిల్ కార్యాలయానికి ఎంతో చరిత్ర ఉంది. జిల్లాలో 1969 ప్రాంతంలో నక్సల్స్ ఉద్యమం ప్రబలంగా ఉండేది. ఆ ఉద్యమాన్ని అణచివేసేందుకు అప్పటి ప్రభుత్వం కొత్తూరు పోలీస్ సర్కిల్ను 1969లో ప్రారంభించింది. నాటి నుంచి ఈ సర్కిల్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగానే ఉంది. ఒడిశా సరిహద్దు కావడంతో మా వోలకు ఈ ప్రాంతంలో పట్టు ఉండేది. దీంతో కొత్తూరు పోలీస్ సర్కిల్ పరిధిలోని పోలీసు సి బ్బంది శాంతిభద్రతల పర్యవేక్షణతో పాటు మావోల కదలికలపై కూడా దృష్టి ఉంచేవారు. కొ త్తూరు పోలీస్ సర్కిల్ పరిధిలో సీతంపేట, భామి ని మండలాలు పార్వతీపురం మన్యం జిల్లాలోకి విలీనం కావడంతో కొత్తూరు సర్కిల్లో కేవలం కొత్తూరు మండలం ఉండిపోయింది. దీంతో సర్కిల్ కార్యాలయాన్ని ఎత్తివేశారు. దీంతో 53 ఏళ్ల అనుబంధం తెగిపోయింది. అయితే కొత్తూరు మండల ప్రజలు పాతపట్నం సర్కిల్కి వెళ్లాలంటే రెండు నుంచి మూడు బస్సులు మారాలి. అధికారులు స్పందించి కొత్తూరు, హిరమండలం మండలాలను ఒక సర్కిల్గా ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. (చదవండి: రూ.3.5 లక్షలు చోరీ) -
ప్రతీకారం తీర్చుకుంటాం.. మంత్రికి మావోయిస్టుల బెదిరింపు లేఖ
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా మంత్రిని టార్గెట్ చేసి బెదిరింపు లేఖను పంపించారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. వివరాల ప్రకారం.. గడ్చిరోలి జిల్లాలో తమ కార్యకర్తలను చంపినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్నాథ్ షిండేకు మావోయిస్టులు బెదిరింపు లేఖను పంపారు. బెదిరింపు లేఖ కలకలం రేపడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆయన నివాసం వద్ద పోలీసులు నిఘాను పెంచారు. ఈ లేఖకు సంబంధించి థానే పోలీసులకు అందిన ఫిర్యాదును దర్యాప్తు చేసేందుకు క్రైమ్ బ్రాంచ్కు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు. చదవండి: దేవతలు నడయాడే భూమిని అవమానిస్తే మీరు సహిస్తారా? ఈ సందర్భంగా మంత్రి షిండే మాట్లాడుతూ.. ఇంతకు ముందు కూడా తనకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయని తెలిపారు. గడ్చిరోలికి మంత్రిగా ఉన్న తాను అక్కడున్న ప్రజలను కాపాడటమే కాకుండా.. జిల్లాను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మావోయిస్టులతో పోరాడాలంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి ఒక్కటే మార్గం షిండే సూచించారు. ఇదిలా ఉండగా.. గతేడాది నవంబర్లో గడ్చిరోలి జిల్లాలో పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టుల టాప్ కమాండర్తో సహా 26 మంది నక్సల్స్ హతమయ్యారు. చదవండి: కేజ్రీవాల్ను ఆంగ్లేయులతో పోల్చిన సీఎం.. దోచుకోవడానికే వస్తున్నాడంటూ.. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల మృతి
చర్ల: ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో ఆదివారం సాయం త్రం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయి స్టులు మృతి చెందారు. జిల్లాలోని అద్వాల్–కుంజేరాల్ అటవీప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు డీఆర్జీ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో కట్టేకల్యాణ్ పోలీస్స్టేషన్ పరిధిలో తారసపడిన మావోయిస్టులు పోలీసులపైకి కాల్పులు జరపగా.. డీఆర్జీ బలగాలు ఎదురుకాల్పులు జరిపినట్టు ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు. గంటపాటు జరిగిన హోరాహోరీ కాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి చెం దారని.. వారిని మావోయిస్టు మిలటరీ ఇంటె లిజెన్స్ చీఫ్ ముసికి రాజే, కట్టేకల్యాణ్ ఏరియా కమిటీ సభ్యురాలు మరకం గీత, నుప్పో జ్యోతిగా గుర్తించామన్నారు. వీరిలో రాజే, గీతపై రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉందని తెలిపారు. ఘటనాస్థలంలో ఒక 12 బోర్ తుపాకీ, రెండు మందుపాతరలు, రెండు బర్మార్లను స్వాధీనం చేసుకున్నాట్టు వెల్లడించారు. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టులు తప్పించుకున్నారని, వారి కోసం కూంబింగ్ ముమ్మరం చేశామని పేర్కొన్నారు. కాగా.. శనివారం రాత్రి 14 మావోయిస్టులు దంతెవాడ పోలీస్స్టేషన్లో ఎదుట లొంగిపోయినట్టు ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. పోలీసులపై దాడులు, రోడ్ల ధ్వంసం, మందుపాతరలు పెట్టడం వంటి కేసుల్లో వారంతా నిందితులుగా ఉన్నారని.. వారికి ప్రభుత్వ పాలసీ ప్రకారం పునరావాసం కల్పిస్తామని తెలిపారు. -
అమిత్ షాతో భేటీలో పాల్గొన్న సీఎం కేసీఆర్, ఏపీ డిప్యూటీ సీఎం సుచరిత
సాక్షి, న్యూఢిల్లీ: వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశం ఆదివారం ఉదయం ప్రారంభమైంది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ ఈ కీలక సమావేశం నిర్వహించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రారంభమైన ఈ సదస్సుకు వామపక్ష తీవ్రవాద ప్రభావితం ఉన్న 10 రాష్ట్రాలు హాజరయ్యాయి. తెలంగాణ, ఏపీతో పాటు చత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లకు చెందిన వారు హాజరయ్యారు. సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరు కావాల్సి ఉండగా అస్వస్థతకు గురవడంతో ఢిల్లీ ప్రయాణం రద్దు చేసుకున్నారు. దీంతో ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. తమ రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదం ప్రస్తుత పరిస్థితి, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయా రాష్ట్రాలు వివరించాయి. -
ఇంటికి రా బిడ్డా.. మావోయిస్టులో ఉన్న కొడుకును కోరిన తల్లి
సాక్షి, చిట్యాల(వరంగల్): మావోయిస్టుల్లో సైతం కరోనా వైరస్ కలవరం సృష్టిస్తుండడం, తాము కూడా వృద్ధాప్యానికి చేరుకున్నామని ఇంటికొచ్చి పని చేస్తూ తమను చూసుకోవాలని మావోయిస్టు నాయకుడు సెరిపల్లి సుధాకర్ తల్లి రాయపోషమ్మ కంటతడి పెట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన సుధాకర్ 2002లో అడవి బాట పట్టాడు. ప్రస్తుతం అనారోగ్యంతో పాటు వృద్ధాప్యంతో బాధపడుతున్నందున ఇంటికి రావాలని ఆమె కోరింది. ఈ మేరకు గురువారం భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, తదితరులు ఆమెను కలిసి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు. ఇక ముందు ఎలాంటి సాయం కావాలన్న పోలీస్శాఖ తరఫున చేస్తామని చెప్పారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని చూసుకునేందుకు సుధాకర్ జనంలోకి వస్తే ప్రభుత్వం తరఫున ఉపాధి కల్పిస్తామని తెలిపారు. చదవండి: కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు -
ఏవోసీబీలో కూంబింగ్ ముమ్మరం
సాక్షి, అమరావతి: ఆంధ్రా–ఒడిశా–ఛత్తీస్గఢ్ (ఏవోసీబీ) సరిహద్దుల్లోని ట్రై జంక్షన్ ప్రాంతంలో పోలీసు బలగాలు విస్తృతంగా కూంబింగ్ చేస్తున్నాయి. మావోయిస్టు అగ్రనేతల కదలికల నేపథ్యంలో మన్యాన్ని జల్లెడపడుతున్నాయి. ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలో మంగళవారం, విశాఖ మన్యంలో బుధవారం జరిగిన వరుస ఎన్కౌంటర్లతో మన్యంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎదురుకాల్పుల నుంచి కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్, రాష్ట్ర కమిటీ సభ్యులు అరుణ్ అలియాస్ మహేందర్రెడ్డి, అరుణ తప్పించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి అర కి.మీ. దూరంలోని మరో ప్రాంతంలో వారు ఉండటంతో కాల్పుల మోత వినగానే తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 40 మంది మావోయిస్టుల రక్షణతో వారు ఏపీ, ఒడిశా, ఛత్తీస్ఘఢ్ సరిహద్దుల్లోని కట్ ఆఫ్ ఏరియాలోని ట్రై జంక్షన్ వైపు వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. అందుకే వారి కోసం మూడు వైపుల నుంచి కుంబింగ్ను ముమ్మరం చేశారు. ట్రై జంక్షన్లోనే అగ్రనేతలు? ఆంధ్రా–ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ (ఏఓబీజెడ్సీ) ఆధ్వర్యంలో మళ్లీ కేడర్ను బలోపేతం చేసుకోవాలని మావోయిస్టులు సన్నద్ధమవుతన్నట్లు నిఘా వర్గాలకు స్పష్టమైన సమాచారం అందింది. జూన్–జులైలలో అందుకోసం పెద్ద ఎత్తున శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నారని కూడా పసిగట్టాయి. దీంతో బస్తర్ కేంద్రంగా మూడు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు గత నెలలో సమావేశమైనట్లు సమాచారం. వరుస లొంగుబాట్లు, ఆనారోగ్య సమస్యలతోపాటు కరోనాతో కూడా మావోయిస్టులు గత కొద్దిరోజులుగా బలహీనపడిన నేపథ్యంలో మరింత కట్టుదిట్టంగా గాలింపు చర్యలు చేపట్టాలని వారు నిర్ణయించారు. శిక్షణా తరగతుల నిర్వహణకు ఇతర ప్రాంతాల నుంచి అగ్రనేతలు వచ్చేవరకు వేచి చూడాలని ముందుగానే నిర్ణయించారు. ఇంతలో అగ్రనేతలు చేరుకున్నారన్న సమాచారం రావడంతో గ్రేహౌండ్స్, కోబ్రా, ఎస్పీఎఫ్, ఐటీబీటీ, బీఎస్ఎఫ్ బలగాలు సంయుక్తంగా జూన్ రెండోవారం నుంచి కూంబింగ్ను విస్తృతం చేశాయి. ఈ నేపథ్యంలో.. ఒడిశాలోని మల్కనగిరి జిల్లాలో సోమ, మంగళవారాల్లో జరిగిన ఎదురుకాల్పుల నుంచి మావోయిస్టులు తప్పించుకోగా.. విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం తీగలంమెట్ట వద్ద బుధవారం ఎన్కౌంటర్లో ఇద్దరు డివిజన్ కమిటీ సభ్యులతోపాటు ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటనలతో మల్కనగిరి, విశాఖ మన్యంలలో ఎన్కౌంటర్లపై మూడు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు సమీక్షించి కూంబింగ్ను విస్తృతం చేయాలని నిర్ణయించారు. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్, రాష్ట్ర కమిటీ సభ్యులు అరుణ్, అరుణలు 40 మంది మావోయిస్టుల రక్షణతో ట్రై జంక్షన్కు చేరుకోవచ్చని భావిస్తున్నారు. దాంతోపాటు ఏఓబీజెడ్సీ ఇన్చార్జ్ డుడుమలతోపాటు మరికొందరు అగ్రనేతలు ఆ ప్రాంతంలోనే ఉండొచ్చన్నది పోలీసు ఉన్నతాధికారుల అంచనా. అగ్రనేతల్లో ఎవరు ఉండొచ్చన్న దానిపై అప్పుడే ఏమీ చెప్పలేమని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కానీ, ఆ ప్రాంతంలో భారీస్థాయిలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని.. ఇన్ఫార్మర్లు చెప్పినదాన్ని బట్టి ఒకరిద్దరు అగ్రనేతలు కూడా ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. దీంతో ఏఓసీబీలో పోలీసు బలగాలు కూంబింగ్ను ముమ్మరం చేశాయి. -
మావోయిస్టుల్లారా.. లొంగిపోండి: డీజీపీ పిలుపు
జయపురం: ఉద్యమం వీడి జనస్రవంతిలో కలిసిపోవాలని రాష్ట్ర డీజీపీ అభయ్ మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా అవిభక్త కొరాపుట్ జిల్లాలో ఆదివారం పర్యటించిన ఆయన నవరంగపూర్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో నెలకొన్న శాంతిభద్రతలపై సు«దీర్ఘ చర్చలు జరిపారు. ముఖ్యంగా ఒడిశా–ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల చర్యలు లేకుండా చూడాలని అధికారులకు ఆయన సూచించారు. అలాగే మావోయిస్టుల దుశ్చర్యల కట్టడికి చేపట్టాల్సిన పలు వ్యూహాలను అధికారులకు వివరించారు. అనంతరం జిల్లాలోని ఆదర్శ పోలీస్స్టేషన్, రిజర్వ్ పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన ఆయా ప్రాంతాల జవానులు, పోలీసుల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడిన ఆయన కరోనా కష్టకాల పరిస్థితులతో భయాందోళనలో ఉన్న ప్రజలను మరింత భీతి కలిగించవద్దని మావోయిస్టులకు సూచించారు. ప్రజలంతా ప్రస్తుతం బాగానే ఉన్నారని, దీనిని అర్థం చేసుకుని స్వచ్ఛందంగా లొంగిపోవాలని మావోయిస్టులను కోరారు. తమ వద్దకు వచ్చిన మావోయిస్టులకు ప్రభుత్వం నుంచి అందే సదుపాయాలన్నీ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. పర్యటనలో ఆయనతో పాటు నవరంగపూర్ ఎస్పీ ప్రహ్లాద్ సహాయి మీనా, విజిలెన్స్ విభాగం డైరెక్టర్ ఆర్.కె.శర్మ, నవరంగపూర్ తహసీల్దారు రవీంద్రకుమార్ రౌత్, పట్టణ పోలీస్ అధికారి తారిక్ అహ్మద్ ఉన్నారు. -
గడ్చిరోలి జిల్లాలో ఎన్కౌంటర్: ఇద్దరు నక్సల్ మృతి
చర్ల: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఎటపల్లి తహశీల్ పరిధిలోని జాంబియా గాటా పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌజాగట్టా అటవీ ప్రాంతంలో బుధవారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు గడ్చిరోలి జిల్లా ఎస్పీ అంకిత్ గోయల్ తెలిపారు. మృతులు వినయ్ లాలూ, వినయ్ నరోట్గా గుర్తించారు. వీరిపై రూ.4 లక్షల రూపాయలు రివార్డ్ ఉందని ఎస్పీ తెలిపారు. మృతుల నుంచి 4 ఎంఎం ఫిస్టల్, పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మావోయిస్టుల వ్యతిరేక నిర్మూలన కార్యక్రమంలో కూంబింగ్ చేస్తున్న సమయంలో పోలీసులను చూసి మావోయిస్టులు కాల్పులు జరిపారని ఎస్పీ అంకిత్ గోయల్ తెలిపారు. వెంటనే పోలీసులు కాల్పులు జరపగా ఇద్దరు మృతి చెందారని చెప్పారు. ఇటీవల పామ్కెగహ పోలీసు శిబిరంపై కాల్పులు జరిపారని, మృతిచెందిన నక్సల్స్పై అనేక కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. సంఘటనా స్థలం నుంచి హెలికాప్టర్లో మృతదేహాలను జిల్లా కేంద్రం గడ్చిరోలికి తరలించారు. కాల్పుల్లో మరణించిన మావోయిస్టులు -
ఇరువైపులా బడుగుజీవులే బలి
సుమారు యాభై ఏళ్లుగా తెలుగునేలపై నక్సలిజం వేళ్లూనుకొని, దాని ఉనికిని ప్రదర్శిస్తూ, సరిహద్దు రాష్ట్రాలకు కూడా విస్తరించింది. గ్రామాల్లో భూస్వాముల ఆగడాలు, వెట్టి చాకిరీలు, స్త్రీలపై అత్యాచారాలు, నిమ్నకులాలపై దౌర్జన్యం, వారి ఎదుగుదలపై కన్నెర్ర... తరాలుగా సాగిన ఉదంతాలు ఉన్నాయి. గ్రామాలకు నక్సల్స్ రాకతో ఎండుటాకులు భగ్గున మండినట్లు బాధిత వర్గాలు వారికి తోడు నిలిచాయి. అన్నం పెట్టాయి, ఆశ్రయమిచ్చాయి. వీరు ముందే వస్తే ఎంత బాగుండేది అనుకున్నాయి కానీ నక్సలిజం పార్లమెంటరీ వ్యవస్థకు విరుద్ధమని, దానికి మద్దతుగా నిలవడం నేరమని తెలీని పరిస్థితి ఉండేది. చూస్తుండగానే గ్రామాలను పోలీసులు, ఇతర భద్రతా దళాలు చుట్టుముట్టి నక్సలైట్లు ఏర్పరచిన సంఘాల్లో ఉన్నవారిని, వారి జెండా పట్టినవారిని, వారి పాటలు పాడినవారిని పట్టుకొని నానా యాతనలకు గురిచేశారు. నక్సలైట్ల రాకతో భూస్వాముల గుండెల్లో కొంత భయం పుట్టిన మాట వాస్తవమే కానీ గ్రామస్తులు ఊహించని ఇబ్బందుల్లో పడ్డారు. యువత బతుకు చిన్నాభిన్నమైంది. ధైర్యమున్నవాడు నక్సల్స్ వెంట వెళ్ళాడు. తప్పించుకోవాలనుకున్నవాడు ముంబై, దుబాయ్ బాట పట్టాడు. పోలీసులు పిల్లల ఆచూకీ కోసం వారి తల్లిదండ్రులను వేధించి, వేధించి వేపుకుతిన్నారు. నక్సలైట్లు ఆత్మరక్షణలో పడి అడవిబాట పట్టారు. ఇక ఎన్కౌంటర్లు మొదలయ్యాయి. తమ ప్రాబల్యమున్న ప్రాంతాల్లో పోలీసులు ఒంటరిగా కనబడితే వారిని నక్సల్స్ పట్టపగలు చంపిన ఘట నలున్నాయి. వీటికి ప్రతీకారంగా నక్సల్స్కి మద్దతుగా నిలిచిన విద్యార్థులను, డాక్టర్లను, అడ్వొకేట్లను, లెక్చరర్లను, ఇతర ఉద్యోగులను పోలీసులు ఆధారాలు దొరకని రీతిలో చంపేసినట్లు వార్తలున్నాయి. దీనితో భయోత్పాతంతో ఆయా పీడిత వర్గాలు నక్సల్స్కి దూరమయ్యాయి. ఇక యుద్ధం పోలీసులు, నక్సలైట్ల మధ్యకు మారింది. నక్సలైట్ల ఏరివేతలో పోలీసులు ఏ హద్దులు దాటినా ప్రభుత్వం వారికి అడ్డు చెప్పలేదనవచ్చు. ఎన్నో ఎన్కౌటర్లు బూటకమనే ఆరోపణలున్నాయి. అటు నక్సలైట్ల పట్టపగలు హత్యలు కోర్టులో రుజువుకానట్లే పోలీసుల చిత్రహింసలకు,కాల్చివేతలకు ఆధారాల్లేవు.పోలీసులు, కేసులు, శారీరక హింస, చావులకు వెరిసి పీడిత వర్గాలు కూడా సర్దుకొని బతకడమే మేలనుకున్నాయి. నక్సల్స్ శక్తి కన్నా పోలీసు బలం, బలగం ఎంతో పెద్దది. ఎంతటి సాయుధ తిరుగుబాటునైనా అణచివేసే సామర్థ్యం దాని కుంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా నక్సలైట్ల సంఖ్యనే లెక్కించి వ్యూహరచన చేస్తోంది. అదే నిష్పత్తితో బలగాల మోహరింపు, నిధుల కేటాయింపు జరుగుతోంది. ఈ క్రమంలో ఇరువైపులా జరుగుతున్న దాడుల్లో ఓసారి నక్సలైట్లయితే, మరోసారి పోలీసు జవాన్లు చనిపోతున్నారు. అంతా పక్కకుపోయి ఈ తూటాలకు బడుగువర్గాల కుటుంబ సభ్యులే సమిధలవుతున్నారు. నక్సలైటుది సింహంపై స్వారీ. అడవిలో ఎంత కాలం తిరిగినా ఏదో ఓ రోజు చివరకు పోలీసు బలగాలకు చిక్కక తప్పదు. ఇంకా విప్లవం, ఉద్యమ నిర్మాణం, ప్రజల మద్దతు కూడగట్టడం ఈ రోజుల్లో సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు. ఉన్నదల్లా ఏరివేత, కాల్చివేతలే. దీనివల్ల వాస్తవ పీడిత వర్గాలకు లాభించేది శూన్యం. పోలీసు, సీఆర్పీఎఫ్ జవాన్లు చాలావరకు కింది తరగతులలో ఆర్థిక బలహీనులే. వేరే గతిలేక ప్రాణాలను గాలిలో దీపంలా పెట్టి నాలుగు డబ్బుల కోసం, కుటుంబ పోషణ కోసం ఈ ఉద్యోగాలు చేస్తున్నారు. ఎదురెదురైనప్పుడు నక్సల్స్ వారిని కాల్చకపోతే, జవాన్లు నక్సల్స్ని కాల్చుతారు. ఇలా ఇరువైపులా చావులు తథ్యం, అనివార్యం అవుతున్నాయి. ఏప్రిల్ 3న ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురు కాల్పుల్లో సీఆర్పీఎఫ్ తదితర విభాగాల జవాన్లు 23 మంది నక్సల్స్ చేతిలో హతమయ్యారు. విధి నిర్వహణలో జవానుకు మిగిలింది చంపడమో, చావడమో.. జవాన్లు చనిపోతే బాధపడేవారున్నట్లే, నక్సల్స్ ప్రాణాలు కోల్పోతే దుఃఖపడేవారు ఉంటారు. ఎందుకంటే అన్నీ ప్రాణాలే.. అందరికీ కుటుంబాలు, బంధుమిత్రులు ఉన్నారు. ఇలా జవాన్లను ఘోరంగా చంపి ఏమి సాధించారు అని ప్రజలు, పత్రికలు నక్సల్స్ని గుండెభారంతో ప్రశ్నిస్తున్నాయి. నిజంగా అది హృదయవిదారక సంఘటన. ప్రాణాలు కోల్పోయిన ఒక్కొక్క జవాను వయసు, కుటుంబం గురించి చదువుతుంటే కళ్ళు చెమర్చుతాయి. అయితే చేటలో తవుడు పోసి కాట్లాట పెట్టిందెవరు అనేది ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యవాదులను అర్బన్ నక్సలైట్లని ముద్రవేసి సోదాలతో బెదరగొడుతోంది. పౌర హక్కుల నేతలను, సామాజిక కార్యకర్తలను, ప్రజా రచయితలను జైళ్లలో కుక్కి హింసిస్తోంది. ఈ విషయంలో ఆలోచనాపరులు ప్రభుత్వాలను ప్రశ్నిం చాలి. విప్లవ సానుభూతిపరులని ఇబ్బందులు పెట్టినంత కాలం నక్సల్స్ చెలరేగిపోయే అవకాశముంది. పేద కుటుంబాల పిల్లలు పోలీసు ఉద్యోగాలు చేసి ఈ ప్రభుత్వాలకు రక్షణగా నిలవవద్దని నక్సల్స్ వాదన. కానీ బ్రిటిష్ సైన్యంలోనూ భారతీయులు పనిచేశారు. అది బతుకుదెరువు సమస్య. మరోవైపు ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటామని హోంమంత్రి అమిత్ షా శపథం చేశారు. మరో నాలుగు రోజుల్లో నలభై మంది నక్సల్స్ పోలీసు కాల్పుల్లో మరణించినట్లు వార్తల్లో రావచ్చు. నేటి జవాన్ల కోసం కన్నీరు కార్చినవారు రాబోయే కాలంలో నక్సల్స్ పోతే ఊరట చెందవచ్చు, కాని రెండు చావులు దిక్కు లేనివే. వీటిని చర్చలతో అరికట్టే బాధ్యత ప్రభుత్వాలదే. ఇరువైపులా చస్తున్న బడుగు ప్రాణాలపై ప్రేముంటే శాంతి వైపు అడుగులేయాలి. వ్యాసకర్త:బి. నర్సన్ కవి రచయిత 94401 28169 -
మావోయిస్టుల కీలక ప్రకటన: రాకేశ్వర్ను విడిచిపెడతాం
ఛత్తీస్గఢ్: బీజాపూర్ ఎన్కౌంటర్పై మావోయిస్టు కమిటీ స్పందించింది. దాడి జరిగిన రెండు రోజుల తర్వాత ఆ కమిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. పోలీసులతో జరిగిన దాడిలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారని ప్రకటించింది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మాపై దాడికి యత్నించాయని తెలిపింది. మావోయిస్టులను పూర్తిగా నియంత్రించేందుకు ప్లాన్ వేశారని పేర్కొంది. పోలీసులు మాకు శత్రువులు కాదు అని మరోసారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పోలీసు మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నట్లు మావోయిస్టు కమిటీ ప్రకటనలో తెలిపింది. బందీగా ఉన్న రాకేశ్వర్ సింగ్ను విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. మధ్యవర్తుల పేర్ల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇస్తే రాకేశ్వర్ను అప్పగిస్తామని ఆ ప్రకటనలో మావోయిస్టులు పేర్కొన్నారు. అప్పటివరకు తమ దగ్గరే రాకేశ్వర్ సురక్షితంగా ఉంటాడని మావోయిస్ట్ కమిటీ స్పష్టం చేసింది. -
నక్సల్స్ పేరుతో గుంటూరులో దోపిడీ
సాక్షి, గుంటూరు: నక్సల్స్ పేరుతో ఓ ముఠా దోపిడీకి పాల్పడింది. వివరాల్లోకెళ్తే.. పిడుగురాళ్ల మండలం గుత్తికొండ అడ్డరోడ్లో ఉన్న భారత్ పెట్రోల్ బంక్పై నక్సల్స్ పేరుతో ముగ్గరు వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు. నక్సల్స్ డ్రెస్లో వచ్చిన ముగ్గురు వ్యక్తులు తుపాకీతో బెదిరించి, పెట్రోల్ బంక్లో పనిచేసే ఉద్యోగులపై దాడిచేసి అక్కడున్న రూ.35,000 అపహరించుకుపోయారు. ఈ క్రమంలో దుండగులు పెట్రోల్ బంక్ అద్దాలను కూడా పగలగొట్టారు. పెట్రోల్ బంక్ సిబ్బందికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ముమ్మరం చేశారు. -
దంతెవాడలో మావోయిస్టుల విధ్వంసం
సాక్షి, ఛత్తీస్గఢ్: దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు మరోసారి విధ్వంసానికి పాల్పడ్డారు. ఎస్సార్ ఫ్లాంట్ వద్ద నిలిపి ఉంచిన వాహనాలను ఆదివారం తగులబెట్టారు. జేసీబీ, డంపర్ సహా తొమ్మిది వాహానాలకు మావోయిస్టులు నిప్పు పెట్టారు. కాగా సుకుమా జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో డీఆర్జీ జవాన్లు, మావోయిస్టుల మధ్య శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనకు నిరసనగా మావోయిస్టులు వాహనాల విధ్వంసానికి పాల్పడ్డారు. -
అమిత్ షా నెక్ట్స్ టార్గెట్ వీరే..
సాక్షి, న్యూఢిల్లీ : తాను అనుకున్నది పక్కా ప్లాన్తో పకడ్బందీగా అమలు చేయడంలో పేరొందిన హోంమంత్రి అమిత్ షా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఆరెస్సెస్ డిమాండ్లను నెరవేర్చడంపై దృష్టి సారించారు. జమ్ము కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370, 35(ఏ) రద్దుతో తన అజెండాను ఆయన ఇప్పటికే విస్పష్టంగా చాటారు. ట్రిపుల్ తలాక్ నిషేధంపైనా అమిత్ షా ఇదే నిబద్ధత కనబరిచారు. ఇక పలు రాష్ర్టాలను కుదిపేస్తున్న నక్సల్స్ సమస్యపైనా అమిత్ షా దృష్టిసారిస్తారని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ నక్సలిజం ప్రధాన సమస్యగా ముందుకొస్తుండటం పట్ల ఆరెస్సెస్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. నక్సలిజం ఎదుర్కొనేందుకు దీటైన బహుముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని ఆరెస్సెస్ కోరుతోంది. అర్బన్ నక్సల్స్ పేరును పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ద్వారా బీజేపీ,ఆరెస్సెస్లు మావోయిస్టుల సానుభూతిపరులను లక్ష్యంగా చేసే వ్యూహానికి పదును పెట్టాయి.మరోవైపు నక్సల్ ప్రభావిత పది రాష్ర్టాల సీఎంలు, పోలీస్ ఉన్నతాధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం భేటీ అయ్యారు. ఈ ఏడాది మేలో కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ర్టాధినేతలతో ఆయన జరిపిన తొలి భేటీ ఇదే కావడం గమనార్హం. వామపక్ష తీవ్రవాద ప్రాబల్యం కలిగిన రాష్ర్టాల ముఖ్యమంత్రులతో సమావేశం ఫలవంతంగా సాగిందని సమావేశానంతరం అమిత్ షా ట్వీట్ చేశారు. నక్సల్స్ను దీటుగా ఎదుర్కొనే వ్యూహాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. మరోవైపు మోదీ ప్రభుత్వ సారథ్యంలో నక్సల్స్ చేపట్టిన హింసాత్మక ఘటనల సంఖ్య 43.4 శాతం తగ్గిందని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. మావోయిస్టుల ఏరివేత కోసం నక్సల్ ప్రభావిత జిల్లాల్లో కీలక మౌలిక సదుపాయాలు, పౌర సేవలను పెంపొందించే అభివృద్ధి ప్రణాళికలకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోంది. -
విశాఖ మన్యంలో ఎదురుకాల్పులు
సాక్షి, విశాఖపట్నం : విశాఖ మన్యంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య సోమవారం ఎదురుకాల్పులు జరిగాయి. జీకే వీధి, కొయ్యూరు మండలాల సరిహద్దులో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. అక్కడి అడవుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారనే సమాచారంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులకు, మావోలకు మధ్య కాల్పులు జరిగనట్టుగా సమాచారం. అయితే ఈ కాల్పులో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతిచెందిన వారిని గిరిజనులుగా అనుమానిస్తున్నారు. . కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏపీలో మావోయిస్టుల సమస్యలపై సబ్ కమిటీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మావోయిస్టుల సమస్యలపై ప్రభుత్వం ఓ సబ్కమిటీని నియమించింది. అర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అధ్యక్షతన ఈ ఉపసంఘం పనిచేయనుంది. ఈ సబ్కమిటీలో హోం, రెవెన్యూ, గిరిజన సంక్షేమం, రోడ్లు, భవనాల శాఖ మంత్రులు సభ్యులుగా ఉంటారు. లొంగిపోయిన నక్సల్స్కు పునరావాసం, తీవ్రవాదంలో చనిపోయిన కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లింపులో విధాన రూపకల్పన, ధ్వంసమైన ఆస్తులకు పరిహారం, నక్సల్స్ సమస్య నియంత్రణకు అనుసరించాల్సిన విధానాల రూపకల్పన, తదితర అంశాలను ఈ సబ్కమిటీ సమీక్షించనుంది. మంత్రివర్గ ఉపసంఘం సిపార్సులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అమలు చేస్తామని జీవోలో పేర్కొంది. -
టీఆర్ఎస్ ఎంపీటీసీ కిడ్నాప్
చర్ల : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బెస్త కొత్తూరులో టీఆర్ఎస్కు చెందిన ఎంపీటీసీ సభ్యుడు నల్లూరి శ్రీనివాసరావును మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం... శ్రీనివారావు ఇంటికి సోమవారం రాత్రి 10 గంటల సమయంలో సుమారు 30 మంది మావోయిస్టులు వచ్చారు. ఇంటి తలుపులు తెరిచే ఉండటంతో నేరుగా బెడ్రూంలోకి వెళ్లి నిద్రిస్తున్న శ్రీనివాసరావును లేపారు. బలవంతంగా బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా భార్య దుర్గ, కుమారుడు ప్రవీణ్కుమార్ అడ్డుపడ్డారు. దీంతో దుర్గకు ఒక మావోయిస్టు తుపాకీ చూపించి బెదిరించాడు. ప్రవీణ్ను కూడా పక్కకు నెడుతుండగా అతడికి మావోయిస్టులకు మధ్య పెనుగులాట జరిగింది. తమకు అడ్డు తగులుతున్నాడనే నెపంతో మరో మావోయిస్టు ప్రవీణ్కుమార్ తలపై కర్రతో బలంగా కొట్టడంతో తల పగిలింది. మరో మావోయిస్టు వచ్చి తుపాకీ చూపించి దుర్గ, ప్రవీణ్కుమార్ను అడ్డగించి శ్రీనివాసరావును బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. మావోయిస్టులు ఒక ద్విచక్రవాహనాన్ని వెంట తెచ్చుకోగా.. వెళ్లే సందర్భంలో ఇంటి బయట ఉన్న శ్రీనివాసరావు ద్విచక్ర వాహనాన్ని కూడా తీసుకెళ్లారు. మావోయిస్టులు తీసుకొచ్చిన ద్విచక్రవాహనంపై ఎక్కించే క్రమంలో నిరాకరించిన శ్రీనివాసరావును అక్కడ కూడా కర్రలతో కొట్టినట్లు తెలిసింది. అక్కడి నుంచి కిష్టారంపాడు మీదుగా దండకారణ్యానికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. శ్రీనివాసరావు ఇంటికి వచ్చిన 30 మంది మావోయిస్టుల్లో 10 మంది వద్ద తుపాకులు, మిగిలిన వారి వద్ద విల్లంబులు, కర్రలు, కత్తులు, గొడ్డళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. -
‘అన్నలు చిన్నారులతో ఆ పనులు చేయిస్తున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : జార్ఖండ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో నక్సల్స్ చిన్నారులను తమ శిబిరాల్లో చేర్చుకుని వారికి సైనిక శిక్షణ ఇస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆయా రాష్ట్రాల్లో నక్సల్స్ చిన్నారులతో వంట పనులు చేయించుకోవడం, భద్రతా దళాల కదలికలపై సమాచారం తెప్పించుకోవడం వంటి పనులు చేస్తున్నారని మంగళవారం లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వకం సమాధానంలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నక్సల్స్ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో జాతీయ విధానం, కార్యాచరణ ప్రణాళికను తీసుకువచ్చిందని దాని ఆధారంగా ఈ సమస్యను ఎదుర్కొంటామని మంత్రి చెప్పారు. నక్సల్స్ను నిరోధించేందుకు ఆయా రాష్ట్రాలకు సీఏపీఎఫ్ బెటాలియన్స్ను మోహరించడం, హెలికాఫ్టర్లు ఇతర సాధనా సంపత్తిని హోం మంత్రిత్వ శాఖ సమకూరుస్తుందని తెలిపారు. -
బరిలోకి ‘దంతేశ్వరి లఢకే’..
రాయ్పూర్ : హింసాత్మక ఘటనలతో పేట్రేగిపోతున్న మావోయిస్టుల కార్యకలాపాలను కట్టడి చేసేందుకు ఛత్తీస్గఢ్ సరికొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. 30 మంది మహిళలతో యాంటీ నక్సల్స్ కమాండో యూనిట్ను ఏర్పాటు చేసింది. నక్సల్స్ చర్యలను సమర్థవంతంగా తిప్పికొట్టే చర్యల్లో భాగంగా ఏర్పాటైన ఈ బృందానికి ‘దంతేశ్వరి లఢకే’ అని నామకరణం చేశారు. మావో ప్రభావిత ప్రాంతాలైన బస్తర్, దంతేవాడ ప్రాంతాల్లో ఈ మహిళా కమాండోల బృందం సేవలు అందించనుంది. ఇక ఈ ప్రత్యేక బృందంలో 10 మంది మాజీ నక్సలైట్లు ఉండటం విశేషం. గతంలో నక్సలైట్లుగా పనిచేసి లొంగిపోయిన మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి.. దంతేశ్వరి బృందంలోకి తీసుకున్నారు. మహిళా సాధికారతకు మరో ఉదాహరణ పురుషులతో కూడిన కమాండోల బృందానికి అనుబంధంగా ఈ మహిళా కమాండోల బృందం సేవలు అందిస్తుందని బస్తర్ ఐజీ వివేకానంద సిన్హా తెలిపారు. వీరంతా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తారని ధీమా వ్యక్తం చేశారు. దంతేశ్వరి లఢకే ఏర్పాటు మహిళా సాధికారితకు మరో ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు అంతకంతకూ తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నారు. పలు హింసాత్మక ఘటనలతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు. మందుపాతరల పేలుళ్లతో బెంబేలెత్తిస్తున్నారు. ఇందులో భాగంగా కొద్ది రోజుల కిందట పోలీస్ వ్యాన్ను పేల్చేసిన ఘటనలో 16 మంది పోలీసులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్ విసురుతున్న మావోల వ్యవహారంలో భద్రతా బలగాలు మరింత పకడ్బందీగా వ్యూహాలు అమలు చేయడంలో నిమగ్నమయ్యాయి. -
ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి
సాక్షి, దంతెవాడ: ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడలోని ఆర్నాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో డీఆర్జీ, ఎస్టీఎఫ్ బృందాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. కూంబింగ్ సమయంలో మావోయిస్టులు ఎదురుపడి కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. మృతుల్లో ఓ మహిళ మావోయిస్టు కూడా ఉండగా, ఘటనా స్థలం నుంచి విప్లవ సాహిత్యంతో పాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. -
గడ్చిరోలి–హెలికాప్టర్ పైలెట్లకు ప్రత్యేక శిక్షణ
సాక్షి, ముంబై: రాష్ట్రంలో రోజురోజు తీవ్ర రూపం దాలుస్తున్న మావోయిస్టుల కార్యకలాపాలకు చమరగీతం పాడేందుకు ఫ్రెంచ్ తయారి ‘హెచ్–145’ అత్య«ధునిక హెలికాప్టర్ కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేగాకుండా ఈ అత్య«ధునిక హెలికాప్టర్ నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వ విమానయాన డైరెక్టర్కు చెందిన ముగ్గురు సీనియర్ పైలెట్లను శిక్షణ నిమిత్తం జర్మనీకి పంపించనుంది. జర్మనీలోని డోనవర్థ్–మాన్చింగ్లో ఈ ముగ్గురు పైలెట్లకు 75 రోజుల పాటు కఠోర శిక్షణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా నక్సలైట్ల ప్రాబల్యమున్న అలాగే అటవి ప్రాంతాల్లో హెలికాప్టర్ను ఎలా నడపాలనే దానిపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. కేవలం శిక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.7.30 లక్షలు ఖర్చు చేయనుంది. శిక్షణ కోసం విదేశాలకు వెళ్లే ముగ్గురిలో చీఫ్ పైలెట్ క్యాప్టన్ సంజయ్ కర్వే, సీనియర్ పైలెట్ క్యాప్టన్ మహేంద్ర దల్వీ, అసిస్టెంటెంట్ పైలెట్ క్యాప్టన్ మోహిత్ శర్మ ఉన్నారు. వీరంత జూన్ ఐదో తేదీన జర్మనికి బయలుదేరుతారు. అక్కడ 75 రోజులపాటు కఠోర శిక్షణ తీసుకున్న తరువాత ఆగస్టు 14వ తేదీ తరువాత తిరిగి స్వరాష్ట్రానికి చేరుకుంటారు. కేవలం అత్యధునిక హెలికాప్టర్ కొనుగోలు చేయగానే సరిపోదు. దాన్ని నడిపే సత్తా ఉండాలనే ఉద్ధేశ్యంతో ముగ్గురు పైలెట్లను ఎంపిక చేసి శిక్షణ కోసం జర్మనీకి పంపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నక్సలైట్ల కార్యకలాపాలను అంతమొందించేందుకు చేపట్టే గాలింపు చర్యల పనుల కోసం గత ఎనిమిదేళ్లుగా పవన్ హంస్ కంపెనీకి చెందిన హెలికాప్టర్లను ప్రభుత్వం అద్దెకు తీసుకుంటుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.25 కోట్లు చెల్లిస్తుంది. దీంతో సొంతంగా ఒక అత్యధునిక హెచ్–145 మోడల్ హెలికాప్టర్ కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీన్ని ఎయిర్ బస్ హెలికాప్టర్ కంపెనీ నుంచి రూ.72.43 కోట్లకు కొనుగోలు చేయనుంది. ఇందులో ఇద్దరు పైలెట్లు, పది మంది ప్రయాణించే సామర్ధ్యం ఉంటుంది. మావోలను ఏరివేయడంతోపాటు ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు సాయం అందించేందుకు కూడా దీన్ని వినియోగించవచ్చు. అందుకు ప్రధాన కారణం ఇందులో స్ట్రేచర్తోపాటు బాధితులకు అందజేసే రకరకాల మందులు, ఇతర వైద్య సామాగ్రి నిల్వచేసే సౌకర్యం ఉంది. గగనతలం నుంచి దృష్టి సారించేందుకు రాష్ట్రంలో నక్సలైట్ల కార్యకలాపాలు రోజు రోజుకు విస్తరిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇటీవల జరిగిన దాడిని బట్టి మావోలు క్రియశీలకంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. దాడులకు, పోలీసును అంతమొందించేందుకు కొత్త కొత్త విధానాలను ఎంచుకుంటున్నారు. కారడవిలో దట్టమైన చెట్ల మధ్య మావోలను గుర్తించాలంటే పోలీసులకు దారి లభించదు. ఇలాంటి సందర్భంలో గగనతలంలోంచి దృష్టి సారించడానికి ఈ హెలికాప్టర్ ఎంతో దోహదపడనుంది. -
బీజేపీ నేత ఇంటిని పేల్చివేసిన నక్సల్స్
పట్నా: సార్వత్రిక ఎన్నికల వేళ నక్సల్స్ ఘాతుకానికి పాల్పడ్డారు. ఎన్నికలను బహిష్కరించాలనే డిమాండ్తో ఓ బీజేపీ నేత ఇంటిని నక్సల్స్ పేల్చివేశారు. వివరాల్లోకి వెళ్తే.. బిహార్లోని దుమారియా గ్రామంలో బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ అనుజ్ కుమార్ సింగ్ నివాసంపై నక్సల్స్ దాడికి తెగబడ్డారు. డైనమైట్ సాయంతో ఇంటిని కూల్చివేశారు. ఈ దాడిలో అనుజ్ నివాసం పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ఘటనలో ఎవరు గాయపడలేదని సమాచారం. ఈ దాడి అనంతరం నక్సల్స్ ఆ ప్రాంతంలో కొన్ని పోస్టర్లను విడిచి వెళ్లారు. లోక్సభ ఎన్నికలను బహిష్కరించాల్సిందిగా వారు అందులో పేర్కొనానరు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. జిల్లా కేంద్రం గయాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుమారియా నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ఉంది. ఈ ప్రాంతంలో నక్సల్స్ కదలికలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వారిని ఎదుర్కొవడం భద్రతా బలగాలకు సవాలుగా మరింది. ఎన్నికల సమయం కావడంతో ఈ ప్రాంతంలో మరింత భద్రత పెంచాలని అధికారులు భావిస్తున్నారు. -
ఛత్తీస్లో ఎన్కౌంటర్
రాయ్పూర్/చర్ల: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మావోయిస్టులు పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులతో గురువారం ఉదయం బీజాపూర్ అటవీ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఈ భారీ ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి పోలీసులు పెద్ద ఎత్తున ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఛత్తీస్గఢ్ రాష్ట్ర డీజీపీ డీఎం అవస్థి మీడియాకు వెల్లడించారు. బీజాపూర్ జిల్లా బైరంగఢ్ పోలీస్స్టేషన్ పరిధిలో మాడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు డివిజనల్ కమిటీ సభ్యులు రాజ్మన్ మందవీ, సుఖ్లాల్లు సుమారు 50 నుంచి 60 మంది సభ్యులతో శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు బుధవారం రాత్రి నుంచి అక్కడ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. గురువారం ఉదయం సుమారు 11 గంటల సమయానికి భద్రతా బలగాలు బోర్గా గ్రామ పరిధిలోకి ప్రవేశించగానే వారిపైకి మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు కూడా మావోయిస్టులపైకి ఎదురు కాల్పులు ప్రారంభించారు. సుమారు రెండున్నర గంటల సేపు జరిగిన ఈ కాల్పుల్లో పదిమంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి లోడ్ చేసిన 11 గన్లు, 315 రివాల్వర్లు, భారీగా మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను గుర్తించాల్సి ఉందని, పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోనూ, ఈ ఏడాదిలోనూ ఇది తొలి ఎన్కౌంటర్ కావడం గమనార్హం. -
జార్ఖండ్లో ఐదుగురు నక్సల్స్ ఎన్కౌంటర్
రాంచీ: జార్ఖండ్లోని కుంతి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసుల చేతిలో నిషేధిత లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎల్ఎఫ్ఐ)కి చెందిన ఐదుగురు నక్సల్స్ హతమయ్యారు. పీఎల్ఎఫ్ఐ.. సీపీఐ (మావోయిస్టు) సంస్థ నుంచి విడిపోయింది. ‘ప్రాథమిక సమాచారం ప్రకారం పీఎల్ఎఫ్ఐకి చెందిన ఐదుగురు నక్సల్స్ మరణించారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు’ అని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఆపరేషన్) ఆశిష్ బాత్రా మంగళవారం వెల్లడించారు. భద్రతా బలగాలకు ఎలాంటి గాయాలు కాలేదన్నారు. కుంతి జిల్లాలోని ముర్హు పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం 6.30 గంటలకు సీఆర్పీఎఫ్భద్రతా బలగాలు, నక్సల్స్ మధ్య కాల్పులు మొదలయ్యాయని తెలిపారు. మరణించిన నక్సల్స్లో ఏరియా కమాండర్ ప్రభు సహాయ్ బోద్ర ఉన్నారని, ఆయనపై రూ.2 లక్షల రివార్డు ఉందని తెలిపారు. ఘటనా స్థలం నుంచి రెండు ఏకే 47 తుపాకులు, రెండు 315 తుపాకులు ఒక 9 ఎం.ఎం. పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. -
ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టుల మృతి
రాంచీ: జార్ఖండ్లోని కుంతీ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందినట్టు అధికారులు ప్రకటించారు. జిల్లాలోని ఆర్కీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో సీఆర్పీఎఫ్, రాష్ట్ర పోలీసులు మంగళవారం సంయుక్తంగా కూంబింగ్ చేపడుతున్న సమయంలో భద్రతా దళాలపై.. మావోయిస్టులు ఆకస్మాత్తుగా కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు వెంటనే వారిపైకి ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా, మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎన్కౌంటర్ ముగిసిన అనంతరం ఆ ప్రాంతంలో రెండు ఏకే-47 రైఫిల్స్, 303 రైఫిల్, మూడు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ ఘటనలో పోలీసులు ఎవరు గాయపడలేదని అధికారులు తెలిపారు. బస్సును దగ్ధం చేసిన మావోయిస్టులు.. సాక్షి, విశాఖ: మల్కాన్గిరి నుంచి మహా పొదర్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సును మావోయిస్టులు దగ్ధం చేశారు. తొలుత బస్సును అడ్డగించిన మావోయిస్టులు అందులో నుంచి ప్రయాణికులను దించేశారు. ఆ తర్వాత బస్సుకు నిప్పంటించారు. బస్సు డ్రైవర్, క్లీనర్ వద్ద సెల్ ఫోన్లు ఉన్నట్టు గుర్తించిన మావోయిస్టులు.. వాటిని తమతో పాటు పట్టుకెళ్లారు. -
నక్సల్స్ దిష్టిబొమ్మల వ్యూహం!
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో గత కొన్ని నెలల్లో తీవ్ర ఎదురుదెబ్బలు తిన్న నక్సలైట్లు, భద్రతా దళాలతో పోరాడేందుకు కొత్త వ్యూహాలు పన్నారు. భద్రతా దళ సిబ్బందిని తప్పుదారి పట్టించేందుకు మనుషుల దిష్టిబొమ్మలు, నకిలీ తుపాకులను వారు ఉపయోగిస్తున్నారు. జవాన్లను ఉచ్చులోకి దింపేందుకు వ్యూహాత్మకంగా ఈ దిష్టిబొమ్మలను అడవుల్లో అక్కడక్కడా పెట్టారు. గత ఎనిమిది రోజుల్లోనే సుక్మా జిల్లాలో ఇలాంటి 13 దిష్టిబొమ్మలను స్వాధీనం చేసుకున్నామని ఆ జిల్లా ఎస్పీ అభిషేక్ మీనా తెలిపారు. గత కొన్ని నెలల్లో భద్రతా దళాల ఎన్కౌంటర్లలో భారీ సంఖ్యలో నక్సలైట్లు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఇందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు, తమ ఉనికిని నిలుపుకునేందుకు నక్సల్స్ ఈ కొత్త వ్యూహాన్ని ఎంచుకుని ఉండొచ్చని ఎస్పీ చెప్పారు. వియత్నాం యుద్ధంలో ఇలాంటి పద్ధతిని నాటి సైనికులు వినియోగించారనీ, అయితే నక్సల్స్ ఈ వ్యూహాన్ని అమలు చేయడం మాత్రం ఇదే తొలిసారని మీనా వెల్లడించారు. చింతగుహ అడవుల్లో దొరికిన ఓ దిష్టిబొమ్మ వద్ద అత్యాధునిక పేలుడు పదార్థాన్ని కూడా అమర్చారనీ, సైనికులపై దొంగదాడి చేసేందుకు లేదా వారిని పేలుడు పదార్థాలతో చంపేందుకు నక్సల్స్ ఈ కొత్త వ్యూహానికి తెరతీసి ఉండొచ్చన్నారు. పలు హాలీవుడ్ సినిమాలు, డాక్యుమెంటరీలు చూసి నక్సల్స్ ఈ తరహా కొత్త వ్యూహాలు పన్ని ఉండొచ్చని భద్రతా నిపుణుడొకరు చెప్పారు. పూర్తి వ్యూహం తయారుచేసే ముందు దిష్టిబొమ్మలకు భద్రతా దళ సిబ్బంది ఎలా స్పందిస్తారో తెలుసుకునేందుకే వారు ఇలా చేసి ఉంటారని ఆయన తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్
రాయ్పూర్/చింతూరు (రంపచోడవరం)/చర్ల: ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో నక్సలైట్లు, భద్రతా దళాలకు మధ్య సోమవారం జరిగిన రెండు ఎన్కౌంటర్లలో 9 మంది నక్సల్స్తోపాటు ఇద్దరు పోలీసులు మరణించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులోని సుక్మా జిల్లా దక్షిణ ప్రాంతమైన కిస్తారం, చింతగుహ అడవుల్లో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ‘ఆపరేషన్ ప్రహార్ – ఐV’ పేరిట 1,200 మంది సిబ్బంది మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తుండగా అడవుల్లో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు ఛత్తీస్గఢ్ ప్రత్యేక డీజీపీ (నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలు) డీఎం అవస్థీ చెప్పారు. తెలంగాణ పోలీసులతో కలసి ఛత్తీస్గఢ్ ఎస్టీఎఫ్, డీఆర్జీ దళాలు, సీఆర్పీఎఫ్ అనుబంధ కోబ్రా బృందాలు ఆదివారం రాత్రి తొండమర్క, సలెతోంగ్ గ్రామాలు, సక్లేర్ అడవుల్లో కూంబింగ్ ప్రారంభించారని తెలిపారు. కిస్తారం పోలీస్స్టేషన్ పరిధిలోని సక్లేర్ గ్రామాన్ని డీఆర్జీ భద్రతా దళాలు సోమవారం ఉదయం 9.40 గంటలకు చుట్టుముట్టాయనీ, అక్కడ ఉన్న నక్సల్స్ కాల్పులకు దిగారన్నారు. అనంతరం డీఆర్జీ దళాలు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించగా ఈ ఎన్కౌంటర్లో ఎనిమిది మంది నక్సల్స్తోపాటు దిర్డో రామ, మడివి జోగా అనే ఇద్దరు జవాన్లు కూడా మృతి చెందారు. మృతదేహాలను వాయుసేనకు చెందిన హెలికాప్టర్లో రాయ్పూర్కు తరలించారు. చనిపోయిన నక్సల్స్లో ఇద్దరిని గుర్తించారు. వారిద్దరూ తాటి భీమ, పొడియం రాజే అనీ, వారిద్దరి తలలపై 8 లక్షల బహుమానం ఉందని అధికారులు తెలిపారు. చింతగుహ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్మగుండ గ్రామ సమీపంలో జరిగిన మరో ఎన్కౌంటర్లో కోబ్రా దళాలు ఓ నక్సల్ను అంతం చేశాయి. రెండు ఎన్కౌంటర్ ప్రదేశాల నుంచి పదికి పైగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వా«ధీనం చేసుకున్నామని అవస్థీ చెప్పారు. ఆపరేషన్ ప్రహార్ మొదటి మూడు దశలు రెండేళ్ల క్రితమే పూర్తయ్యాయి. పక్కా సమాచారంతోనే దాడి... త్వరలో జరగనున్న తెలంగాణ ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం, తూర్పు గోదావరి జిల్లాల కార్యదర్శి కొయెడ సాంబయ్య అలియాస్ ఆజాద్ నేతృత్వంలో సమావేశం జరుగుతోందన్న సమాచారంతో ఛత్తీస్ పోలీసులు దాడి నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈనెల 12న ఛత్తీస్లోని మావోప్రాబల్య ప్రాంతంలో ఎన్నికలు ముగియగా తెలంగాణలోని మావోయిస్టు ప్రాంతాలైన భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో డిసెంబర్ 7న ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి కేడర్కు దిశానిర్దేశం చేసేందుకు ఆజాద్ సరిహద్దుల్లో ఓ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఛత్తీస్గఢ్ పోలీసులకు పక్కా సమాచారం అందినట్లు తెలిసింది. ఈ సమయానికి ఆజాద్ సమావేశానికి హాజరు కాలేదని, ఈలోపుగానే బలగాలు ఆ సమావేశంపై దాడి నిర్వహించడంతో 8 మంది మావోలు మృతి చెందినట్లు సమాచారం. -
గన్ వదిలి పెన్ పట్టారు
గడ్చిరోలి: ఆయుధాలతో సహవాసం చేసిన వారంతా ఇప్పుడు కలం, పుస్తకాలతో కుస్తీలు పట్టేందుకు సిద్ధమవుతున్నారు. చదువు విలువ తెలుసుకుని నక్సలిజాన్ని వదిలేసిన యువత, గిరిజనులు ఉన్నత విద్య కొనసాగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మహారాష్ట్రలోని నక్సల్స్ ప్రభావిత గడ్చిరోలి జిల్లాలోని కొందరు మాజీ మావోయిస్టుల గురించే ఈ ఉపోద్ఘాతమంతా. మవోయిస్టుల ప్రాబల్య ప్రాంతం కావడంతో పాటు విద్యా మౌలిక వసతుల లేమి కారణంగా అక్కడి యువత, గిరిజనులు నక్సలిజం వైపు ఆకర్షితులయ్యారు. ఈ ఉద్యమం నుంచి బయటికొచ్చిన కొందరు పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. కుర్కేడా తాలుకాలోని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) స్టడీ సెంటర్..వారికి దూర విద్య ద్వారా ఉన్నత విద్యాభ్యాసం కొనసాగిం చేందుకు అవకాశమిచ్చింది. దీంతో లొంగిపోయిన నక్సల్స్, మధ్యలోనే చదువులు ఆపేసిన 468 మంది వేర్వేరు డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో చేరారు. కుర్కేడా పరిధిలోని 150 గ్రామాల్లో పర్యటించి విద్యాభ్యాసం కొనసాగించాలని యువతను ప్రోత్సహించినట్లు ఇగ్నో స్థానిక సమన్వయకర్త గౌరీ ఉకే చెప్పారు. -
ఓ చేతిలో పుస్తకాల సంచి.. మరో చేతిలో విల్లంబులు!
రాంచీ : ఓ చేత పుస్తకాల సంచి.. మరో చేత విల్లంబులు పట్టుకొని.. అడవి గుండా బిక్కుబిక్కుమంటూ బడికి వెళ్తున్నారు ఈ చిన్నారులు.. జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టు ప్రాబల్యం తీవ్రంగా ఉన్న చకులియాస్ పోచపాని గ్రామానికి చెందిన విద్యార్థులు వీరు. పాఠశాలకు వెళ్లాలంటే రోజూ అడవి మార్గం గుండా వెళ్లాలి. అక్కడ నక్సల్స్ ఉంటారనే భయం.. ఈ దుర్భర పరిస్థితుల నడుమ కూడా చదువును ఆపకూడదనే సంకల్పంతో ఈ చిన్నారులు విల్లు, బాణాలు, గుల్లేరులు చేత పట్టుకొని బడికెళ్తున్నారు. ఈ ప్రాంతంలో చదవాలన్నా.. తమ ప్రాణాలు రక్షించుకోవాలన్నా.. ఆయుధాలు ఉండాల్సిందేని వారు అంటున్నారు. వారి దీనస్థితిని అద్దం పడుతున్న ఈ ఫొటోలను ఏఎన్ఐ ట్వీట్ చేసింది. #Jharkhand: Children of naxal affected Chakulia's Pochpani village carry bow & arrows to school to protect themselves from Naxals. Local says, "The children have to pass through forest area where a number of naxals have been spotted." pic.twitter.com/TJJlSRsTxG — ANI (@ANI) November 12, 2018 -
ఛత్తీస్గడ్లో మావోయిస్టుల ఘాతుకం
-
మావోల ఘాతుకం.. నలుగురు మృతి
దంతెవాడ : ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. దంతేవాడలోని బచేలిలో మావోయిస్టులు బస్సుపై బాంబులతో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులతో పాటూ ఓ సీఐఎస్ఎఫ్ జవాను మృతిచెందారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత పదిరోజుల్లో దంతెవాడలో మావోయిస్టులు దాడి చేయడం ఇది రెండోసారి. అక్టోబరు 30న మీడియా వర్గాలపై మావోయిస్టులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఛత్తీస్గఢ్లో నవంబరు 12న తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశ ఎన్నికలకు నవంబరు 20న పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ శుక్రవారం ఛత్తీస్గఢ్లో పర్యటించనున్నారు. -
ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్ చేసిన నక్సల్స్
సాక్షి, న్యూఢిల్లీ : ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలో యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఇంటర్ రెండో సవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని నక్సలైట్లు బుధవారం కిడ్నాప్ చేశారు. బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు ముగ్గురు నక్సలైట్లను కాల్చి చంపిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగానే యువకున్ని అపహరించినట్టు తెలుస్తోంది. బేజీ నుంచి కొండకు వెళ్తున్నతక కొడుకు కనిపించకుండా పోయాడని యువకుడి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారుప. కాగా, నిన్న ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశ నుంచి నక్సలైట్ల మృత దేహాలను స్వాధీనం చేసుకున్నామనీ, మరో నక్సలైట్ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. భద్రతా బలగాలు చేపట్టిన యాంటి నక్సల్ ఆపరేషన్ సందర్భంగా ఈ ఎన్కౌంటర్ జరిగినట్టు సుకుమా ఎస్పీ అభిషేక్ మీనా తెలిపారు. ఘటనా స్థలం నుంచి నాలుగు నాటు బాంబులు, ఒక రైఫిల్ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. -
ఈ చట్టాలు ఎవరి చుట్టాలు?
నక్సల్స్తో సంబంధాలున్నాయని, ప్రధాని హత్యకు కుట్రపన్నారని చేసిన ఆరోపణల ఆధారంగా కోర్టులో హక్కుల ఉద్యమ నేతలకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సమర్పించడానికి, వారిపై అభియోగాలు రుజువుకావడం లేదా కాకపోవడానికి ముందు పాలకపక్షానికి భారీగా రాజకీయ ప్రయోజనాలు దక్కుతాయి. తమను వ్యతిరే కించే, ప్రశ్నించే, లేదా అసమ్మతి ప్రకటించే వారికి భయోత్పాతం కలిగించే రీతిలో హెచ్చరించడానికే యూఏపీఏ చట్టం కింద అభియోగాలు నమోదు చేస్తారు. ఈ తరహా వేధింపుల చట్టాలు పాలకపక్షానికి రాజకీయ ప్రయోజనం కలిగిస్తాయి. ఈ కేసుల్లో చిక్కుకున్న వారు ఏళ్ల తరబడి విచారణ పేరుతో నిర్బంధంలో మగ్గిపోతుంటారు. చట్టాన్ని తన పని తనను చేసుకోనివ్వండి, అని ఈ రోజుల్లో కొందరు తెలివిగా చెబుతారు. వాస్తవానికి దాడులు, బెదిరింపులు, అరె స్టులతో వేధింపుల ఆట మొదలవుతుంది. చట్టాన్ని ఇష్టమొచ్చినట్టు వంచి తమకు అనుకూలంగా వాడు కుంటారు పాలకులు. మంచి, చెడు మధ్య, చట్ట బద్ధ మైన, చట్ట వ్యతిరేక ప్రవర్తన మధ్య సాక్ష్యాధారాలను బట్టి ఏది న్యాయమైనదో తేల్చడంపైనే చట్టాల అమలు ఆధారపడి ఉంటుంది. ఇటీవల పుణె పోలీ సులు అరెస్టు చేసిన ఐదుగురు హక్కుల ఉద్యమ నేతలు సుధాభరద్వాజ్, గౌతమ్నవలాఖా, అరుణ్ ఫెరీరా, వరవరరావు, వర్నన్ గొన్సాల్వ్స్పై చేసిన ఆరోపణలను బట్టి వారికి నక్సల్స్తో సంబంధా లున్నాయని లేదా భీమా కోరేగావ్ హింసలో వారికి పాత్ర ఉందని లేదా వారంతా కలిసి ప్రధాని హత్యకు కుట్రపన్నారని అనుకోవాలి. కాని, కోర్టులో వారికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సమర్పించడానికి. వారిపై అభియోగాలు రుజువుకావడానికి లేదా కాక పోవడానికి ముందు పాలకపక్షానికి భారీగా రాజ కీయ ప్రయోజనాలు దక్కుతాయి. తమను వ్యతిరే కించే, ప్రశ్నించే, లేదా అసమ్మతి ప్రకటించేవారికి భయోత్పాతం కలిగించే రీతిలో హెచ్చరించడానికే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద అభియోగాలు నమోదు చేస్తారు. అయితే, నేరం నిరూపించడానికి లేదా నిరూపించ లేకపోవడానికి అంత ప్రాధాన్యం ఉండదు. ఉగ్రవాద చర్యలు, సంస్థలు, దేశ ఆర్థిక భద్రతకు ముప్పు తెచ్చే నేరాలూ–ఇవన్నీ యూఏపీఏ పరిధిలోకి వస్తాయి. ఈ చట్టం కింద నిర్బంధంలోకి తీసుకుంటే పోలీసు కస్ట డీలో గరిష్ట కాలం ఉంచవచ్చు. 180 రోజుల వరకూ చార్జిషీటు దాఖలు చేయకపోయినా ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు. అంతేగాక దీని కింద అరెస్టయిన వారికి బెయిలు దొరకడం కష్టం. రుజువుకాని సంబం ధాలపై ఆధారపడి చేసే అభియోగాలను బట్టి నింది తులను దోషులుగా ప్రకటించే అవకాశం కూడా ఎక్కువ ఉంది. 2007లో యూఏపీఏ నిబంధనల కింద అరెస్టుచేసిన వర్నన్ గొన్సాల్వ్స్పై మొత్తం 17 అభియోగాలు నమోదు చేశారు. వీటన్నిటి నుంచి నిర్దోషిగా బయటపడటానికి ముందు ఆయన తన జీవితంలో ఆరేళ్లు జైల్లో గడపాల్సివచ్చింది. కాబట్టి యూఏపీఏ కింద అరెస్టయినవారు ఎవరైనా ఇలాంటి కష్టాలు తప్పవు. మహ్మద్ అమీర్ఖాన్ ఈ చట్టం కింద చేసిన 18 ఆరోపణల నుంచి విముక్తి పొంద డానికి 14 ఏళ్లు జైల్లో ఉన్నారు. ఇంకా మహ్మద్ అబ్దుల్ కలీం వంటి వేలాదిమంది తమ జీవితాల్లో కీలకమైన సమయాన్ని కారాగారాల్లోనే గడపాల్సి వచ్చింది. ఇలాంటి తీర్పులు వచ్చేనాటికి ఈ చట్టం కింద నిర్బంధంలో గడిపిన వ్యక్తులు మానసికంగా, శారీరకంగా నీరసించిపోతారు. యూఏపీఏ కింద అరెస్టు చేయడమే.. నిందితులకు తర్వాత ఎదురయ్యే నిర్బంధం కారణంగా ఓ తరహా క్రమశిక్షణలా, అదుపు చేసే టెక్నాలజీలా పనిచేస్తుంది. ఆగస్టు 28న పైన చెప్పిన ఐదుగురు ప్రముఖులను అరెస్ట్ చేయ డానికి ముందు జూన్లో ఐదుగురిని మహారాష్ట్ర పోలీ సులు అరెస్ట్ చేశారు. జనవరి ఒకటిన భీమా కోరే గావ్లో జరిగిన హింసాకాండకు సంబంధించే ఈ అరెస్టులూ జరిగాయి. గత మూడు నెలల్లో అరెస్టు చేసిన ఈ పది మంది, రెండు మూడేళ్లలో అరెస్టయిన అనేక మంది కూడా ప్రజల కోసం పనిచేసే ఉద్యమ కార్యకర్తలు, లాయర్లు, జర్నలిస్టులు, విద్యావేత్తలు. దేశంలో అత్యంత బలహీన స్థితిలో ఉన్న బడుగు వర్గాలైన ఆదివాసీలు, దళితులు, విచారణ ఖైదీల తర ఫున వారు చట్టబద్ధ పోరాటాలు చేస్తున్నారు. జూన్లో అరెస్టయినా చార్జిషీట్ పెట్టలేదు! యూఏపీఏ చట్టం కింద నిర్బంధంలోకి తీసుకున్న కేసుల్ని పరిశీలిస్తే చాలా విషయాలు అర్థమౌతాయి. భీమా కోరేగావ్ హింసను సాకుగా చూపి జూన్లో అరెస్ట్ చేసిన ఐదుగురిపై ఇంతవరకు అభియోగ పత్రం దాఖలు చేయలేదు. ప్రధానమంత్రి హత్యకు సంబంధించిన కుట్ర కేసులో దర్యాప్తును మూడు నెలలైనా పూర్తి చేయకపోవడం నిజంగా దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఒకవేళ నిందితులపై చేసిన అభియో గాలకు సాక్ష్యాధారాలు సరిగ్గా దొరక్కపోతే రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆధారాలు లేకుండా కొందరిని ఎందుకు లక్ష్యంగా చేసుకుని వారిని జైళ్లలో పెట్టారు? వారు ‘పట్టణ నక్సల్స్’ అనీ దేశాన్ని ‘ముక్కలు ముక్కలు’ చేసే ముఠా అని ముద్ర వేసి పదేపదే ఎందుకు ప్రచారం చేస్తున్నారు? వారిని ఇలా వేధించడం, శిక్షించడం స్వయం ప్రకటిత జాతీయ వాదులకు ఆనందాన్ని, ఊరటను ఇస్తోంది. ప్రాతి నిధ్యం, సమన్యాయ పాలన, స్వేచ్ఛా స్వాతం త్య్రాలు– ఈ మూడు కీలకాంశాలపై ఆధారపడి ప్రజాస్వామ్యం పనిచేస్తుంది. ప్రాతినిధ్యం అంటే కేవలం చట్టసభలకు ప్రతినిధులను ఎన్నుకోవడం మాత్రమే కాదు. అధికారంలో ఉన్న వారితో మాట్లా డటం తెలియని, చట్టాలు ఉపయోగించు కోవడంపై అవగాహన లేని నోరులేని ప్రజల తరఫున పని చేయడం కూడా ప్రాతినిధ్యమనే ముఖ్య విషయం కిందకు వస్తుంది. ఆదివాసీలు, దళితులు, కార్మి కులు వంటి బడుగువర్గాల తరఫున న్యాయస్థానాల్లో పోరా డుతున్న లాయర్లు–సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, సురేంద్ర గాడ్లింగ్, ఉపేంద్ర నాయక్ (ఒడిశా), మురుగన్ (తమిళనాడు), సత్యేంద్ర చౌబే (ఛత్తీస్ గఢ్). వీరందరినీ గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు వేధి స్తూనే ఉన్నాయి. బలహీనవర్గాల ప్రజల తరఫున వాదించకుండా పారిపోయేలా చేయడానికే లాయ ర్లను అరెస్టు చేయడం లేదా అరెస్టు చేస్తామని బెది రించడం, యూఏపీఏ వంటి ఉగ్రవాద నిరోధక చట్టాలు ప్రయోగించడం జరుగుతోంది. దేశంలో అభివృద్ధి ఏకపక్షంగానే ఉంటుందని, ఇలా కొందరికి ప్రగతి ఫలాలు లభించే ఏకపక్ష అభివృద్ధిని ఎవరూ ప్రశ్నించకుండా చేయడమే ఇలాంటి చట్టాల కింద అభియోగాలు మోపి ఉద్యమకారులను, హక్కుల కార్యకర్తలను అరెస్ట్ చేయడం ప్రభుత్వాల ఉద్దేశం. న్యాయపాలన ఎక్కడుంది? ప్రజాస్వామ్యం రెండో ప్రధాన లక్షణం న్యాయ పాలన, చట్టాలు అమలు చేసేవారు జవాబుదారీగా పనిచేయడం. ప్రజల హక్కులు కాపాడటమేగాక, వాటిని హరించే సందర్భాల్లో బాధితులకు తగిన సాయం, ఊరట లభించేలా చేయడమే న్యాయ పాలన లక్ష్యం. ఆదివాసీలు, స్థానిక జాతుల ప్రజలు వారి భూములను కాపాడుకోవడానికి సంబంధించి రాజ్యాంగంలోని ఐదు, ఆరు షెడ్యూలులో ప్రత్యేక చట్టాలు, అటవీ హక్కుల చట్టం(2006) ఉన్నాయి. అటవీ, షెడ్యూల్డ్ ప్రాంతాల భూములను రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు జనంతో సంప్ర దింపులు జరపాలి. ఒడిశా నియంగిరిలో డొంగరియా కోంధుల భూమి విషయంలో సుప్రీంకోర్టు ఈ విషయమే తేల్చిచెప్పింది. కాని, దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఈ చట్టాలు ఉల్లంఘిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వాలను జవాబుదారీగా, బాధ్య తతో మెలిగేలా చేయడం మీడియా విధి. మారు మూల అటవీ ప్రాంతాల్లో చట్టాల ఉల్లంఘనతో ఆది వాసీలకు అన్యాయం జరిగితే సమాచారం సేకరించి, జాతీయ మీడియాకు అందించే జర్నలిస్టులు అనేక కష్టాలు ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి న్యాయమైన సమాచారం జాతీయస్థాయి మీడియా సంస్థలకు చేరకుండా ఆపడానికి అనేక మంది జర్నలిస్టులను ప్రభుత్వాలు, చట్టాలు అమలు చేయాల్సిన ప్రభుత్వ విభాగాలు నానా వేధింపులకు గురిచేస్తున్నాయి. వారిపై నిఘాతోపాటు వారిని బెది రించడం, అరెస్ట్ చేయడం లేదా పనిచేసే ప్రాంతాల నుంచి పంపించేయడం నిత్యం జరిపే వేధింపుల్లో భాగం. ఛత్తీస్గఢ్ ప్రజా భద్రతా చట్టం కింద జర్నలి స్టులు మాలినీ సుబ్రమణ్యం (జగదల్పూర్లోని ఆమె ఇంటిని ధ్వంసం చేశారు, ఊరు వదిలిపోయే వరకూ రాళ్లు విసిరారు), దీపక్ జైస్వాల్, సొమూరూ నాగ్, సంతోష్ యాదవ్లను బస్తర్లో అరెస్ట్ చేశారు. అంతరిస్తున్న స్వాతంత్య్రాలు అనేక స్వాతంత్య్రాల ద్వారా ప్రజాస్వామ్యం పని చేస్తుంది. మాట్లాడే, భావాన్ని వ్యక్తంచేసే, సంఘాలు పెట్టుకునే, అసమ్మతి తెలిపే స్వాతంత్య్రాలు ప్రధా నమైనవి. జన సమీకరణ, అభిప్రాయాలు, ఎజెం డాల మధ్య పోటీ ద్వారా ప్రజాస్వామ్యం చక్కగా పనిచేస్తుంది. అసమ్మతి వ్యక్తీకరణ ప్రజాస్వామ్యానికి అవసరమనే విషయాన్ని సుప్రీంకోర్టు జడ్జి డీవై చంద్రచూడ్ సూటిగా చెప్పారు. ఉదారవాద ప్రజా స్వామ్య వ్యవస్థను అర్థంచేసుకుని ఆయన ఈ విష యంపై వివరణ ఇచ్చారు. అందుకూ అసమ్మతి ప్రజాస్వామ్యానికి సేఫ్టీ వాల్వ్ అనీ, దాన్ని పని చేయనివ్వకపోతే పేలుడు తప్పదని ఆయన హె^è్చ రించారు. చట్టాలు గౌరవించే ప్రజలందరికీ మేలు చూస్తూ జనరంజకంగా సాగాల్సిన ప్రజాస్వా మ్యంలో తరచూ జనం కోసం పనిచేసే వారిని అరె స్టులు, నిర్బంధాలతో ఎందుకు ప్రభుత్వాలే వేధిస్తు న్నాయి? అలాగే, యూఏపీఏ, దానికి ముందు అమలులో ఉండి రద్దయిన ఉగ్రవాద నిరోధక చట్టం, ఉగ్రవాద, విచ్ఛిన్నకర కార్యకలాపాల నిరోధక చట్టం వంటివి ఎందుకు వస్తున్నాయి? అవి కొనసాగడానికి కారణాలేంటి? చట్టాలు గౌరవించే పౌరులను బోధన, న్యాయవాద వృత్తి, రచన, ఉపన్యాసాలు ఇవ్వడం, వార్తా సేకరణ వంటి తమ వృత్తుల్లో కొన సాగకుండా నిరోధించడానికి నిరంతరం వారిని రాక్షస చట్టాలతో వేధించే అధికారం ప్రభుత్వాలకు ఎవరిచ్చారు? అనే కీలక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు పాలకులు తప్పక జవాబు చెప్పాలి. హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, లాయర్లపై వేధిం పులు కొనసాగడాన్ని చూస్తే– పాలకులు తమకు అడ్డంకులు సృష్టిస్తున్నారని భావించేవారిని అడ్డుతొల గించుకుంటారని సూత్రీకరించిన అమెరికా సిద్ధాంత కర్త హెన్రీ గిరోక్స్ గుర్తుకొస్తారు. ప్రజలను అణచి వేసే రాజ్యం భారత కార్పొరేట్ సంస్థల ప్రయోజ నాలు కాపాడటానికే పనిచేస్తుంది. అందుకు అవసర మైతే ఆదివాసీలు, పేదలు, బలహీనవర్గాలను మరింత దుర్భర, దారుణ పరిస్థితుల్లోకి నెట్టడానికి కూడా అనుమతిస్తుంది. రాజశ్రీ చంద్ర రాజనీతి శాస్త్ర విభాగం వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, ఢిల్లీలోని జానకీదేవి మెమోరియల్ కాలేజీ -
కాషాయదళం చేతిలో ఎర్రకార్డు
బాధ్యత గల ఒక కేంద్రమంత్రి మీడియాలో నక్సల్స్ ఉనికి ఉందంటూ తన కుట్ర సిద్ధాంతాన్ని ఆ వ్యవస్థకు ఎలా అంటగడతారు? నా ఆలోచన ప్రకారం భయోత్పాతాన్ని సృష్టించడానికి తీసుకునే చర్యలలో ఇది మొదటిది. రెండవది.. కొందరు వ్యక్తుల మీద ముద్రలు వేయడం, వారిని అపకీర్తి పాలుచేయడం. గడచిన వారం అరెస్టయిన వారంతా ఏ తరహా వ్యక్తులో ఒకసారి పరిశీలిస్తే ‘పట్టణ నక్సల్స్’ సిద్ధాంతాన్ని ముందుకు తేవడం వెనుక ఉన్న కారణం ఊహకు వస్తుంది. అలా అరెస్టయిన వారిలో వశీనాథన్ ఒకరు. ఆయన న్యాయవాది. ట్యుటికోరన్లోని స్టెరిలైట్ సంస్థకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వారికి న్యాయ సహాయం అందిస్తున్న వ్యక్తి ఆయనే. ‘భారత ప్రజాస్వామ్యానికి’ ‘సగం మావోయిస్టు’ ఎంత ప్రమాదకరంగా పరి ణమించాడో చెబుతూ కేంద్రంలో ఏ శాఖా లేని మంత్రి అరుణ్ జైట్లీ ఈ మాసారంభంలో మాట్లాడారు. అజ్ఞాతంలో ఉండి పనిచేసేవారికి ఇలాంటివారు జనజీవన స్రవంతిలో కనిపించే మారు రూపాలేనని కూడా జైట్లీ అభివర్ణించారు. ఎన్డీఏ మీద వ్యతిరేకత ఉన్న కొన్ని పార్టీలు మావోయిస్టును తమ ఆయుధంగా ఎలా చూస్తున్నారో కూడా జైట్లీ ట్వీట్ చేశారు. ఇలాంటి అవలక్షణాన్ని ప్రజలు గుర్తించవలసిన సమయం వచ్చిందని కూడా పేర్కొన్నారు. జీహా దీలు, మావోయిస్టులు రాహుల్ గాంధీ సానుభూతికి నోచుకున్నారంటూ గత వారంలో కూడా కేంద్రమంత్రి ఒక బ్లాగ్ ద్వారా విమర్శలు కురిపించారు. ఇదంతా రాజకీయ వేడి చల్లారిపోకుండా చూడడానికి చేస్తున్న పరోక్ష నింద కింద కనిపిస్తే దీని గురించి ఆలోచించవద్దు. కానీ ఎవరి మీదనైనా జీహాదీ అనుకూలురు, మావోయిస్టు అనుకూలురు అంటూ ముద్రలు వేయడం వెనక ఒక ఉద్దేశమే ఉంది. తద్వారా జాతి వ్యతిరేకులుగా కూడా ముద్ర వేయవచ్చు. అరుణ్ జైట్లీ ఆరోపణ హాస్యాస్పదమని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం అభిప్రాయపడ్డారు. కానీ నేను ఈ రాజకీయ సంఘర్షణ గురించి పట్టించుకోను. కానీ, 2016 నవంబర్లో పెద్ద నోట్ల రద్దు దరిమిలా రెండు మాసాలలోనే ఆర్థిక సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా మావోయిస్టుల వెన్నెముకను ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా విరిచిందో మాత్రం నాకు గుర్తుకొచ్చింది. అదెలాగంటే మావోయిస్టులు తమ నిధులను అడవులలో దాచిపెడతారు. ఆ సొమ్మును వారు రద్దు దరిమిలా బ్యాంకులలో మదుపు చేయలేకపోయారు. అలాగే నోట్లను మార్చుకోలేకపోయారు కూడా. ఈ వాదన నిజమైతే ఇతర పార్టీలతో షరీకవుతూ భారత ప్రభుత్వానికి మావోయిస్టులు పెద్ద బెడదగా పరిణమించారంటూ జైట్లీ చేస్తున్న ఆరోపణ తర్కానికి నిలవదు. అందులో ఒకటి మాత్రమే నిజం కాగలదు. రాహుల్గాంధీని నేను సమర్థించకపోయినా, పార్టీ ఆయనను రక్షిస్తుంది. 2013 మే నెలలో ఛత్తీస్గఢ్లోని దర్భా ఘాటీ దగ్గర జరిగిన దాడిలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రముఖులను ఆ పార్టీ కోల్పోయింది. అలాంటి పార్టీని మావోయిస్టు అనుకూల పార్టీ అని పిలవడం పరోక్ష నింద మరీ పరాకాష్టకు చేరినట్టు ఉంది. 2004లోను తరువాత 2006లోను ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఎంతో ప్రతిభావంతంగా రాష్ట్రాన్ని మావోయిస్టు బెడద నుంచి విముక్తం చేసింది. అందుకు మంచి వ్యూహంతో, సమర్థులైన అధికారులతో ఉపయోగించారు. అలాంటి చరిత్ర కలిగిన పార్టీ ఇప్పుడు నక్సల్స్కు ప్రయోజనం చేకూరాలని కోరుతుందా? బీజేపీ నాయకుడు అరుణ్ జైట్లీ ఒక్కరే మావోయిస్టుల పైన విరుచుకు పడుతున్నారని అనుకోనక్కరలేదు. అలాంటి ఆరోపణలు ఉగ్రవాదులతో నిండి ఉన్న తమిళనాడుకు చెందిన పొన్ రాధాకృష్ణన్ నాలుక అంచున ఒకటిన్నర సంవత్సరాలుగా నర్తిస్తూనే ఉన్నాయి. తమిళనాడులోని అన్నా డీఎంకే ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ, రాష్ట్ర నిఘా వ్యవస్థలు కూడా తన ఆరోపణలను తీవ్రమైనవిగా పరిగణించడంలేదని కేంద్ర మంత్రి కూడా అయిన రాధాకృష్ణన్ వాపోతున్నారు. తాజాగా ఆయన ఆక్రోశం రైతుల మీద వ్యతిరేకత నుంచి, 277 కిలోమీటర్ల సేలం చెన్నై ఎనిమిది లేన్ల జాతీయ రహదారి మీదకి మళ్లినట్టు కనిపిస్తున్నది. ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్ల జాతీయ రహదారిని విస్తరించినప్పటికీ, తమ పొలాలను తీసుకుని దానిని ఎనిమిది లేన్ల గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిగా మార్చడానికి జరుగుతున్న ప్రయత్నాల పట్ల రైతులంతా ఆగ్రహంతో ఉన్నారు. నక్సలైట్లు, మావోయిస్టులు, ముస్లిం ఉగ్రవాదులు, తమిళం పేరుతో వేర్పాటువాదాన్ని ప్రేరేపిస్తున్న ఉగ్రవాద ముఠాలు చాలా సంస్థలలోకి చొరబడ్డారని గడచిన వారంలోనే రాధాకృష్ణన్ విమర్శలు కురిపించారు. ఆయన ఇంకొక అడుగు వేసి ఇలాంటి వారు మీడియాలోకి చొరబడగలిగారని కూడా ఆరోపించారు. అన్ని పథకాలను పక్క దోవ పట్టించడానికే పెద్ద కుట్ర జరుగుతున్నదని ఆయన అంటున్నారు. కన్యాకుమారి నుంచి ఎన్నికైన ఈ ఎంపీ జల్లికట్టు నిరసనల మీద కూడా విమర్శలు చేశారు. 2017 జనవరిలో చెన్నైలోని మెరీనా బీచ్లో జరిగిన ఆందోళన ప్రజల నాడిని పసిగట్టేందుకు తీవ్రవాదులు చేసిన ఒక ప్రయోగమేనని అన్నారాయన. తీవ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించి అణచివేసేందుకు వీలుగా ప్రభుత్వం పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వాలని కూడా ఎంపీ అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను కాపాడాలి గానీ తీవ్రవాదులను కాదని, అలాంటి ప్రభుత్వాల అవసరం ప్రజలకు లేదని ఆయన ప్రకటించారు. ఇంతకీ ఎళప్పాడి పళనిస్వామి ప్రభుత్వం రద్దవుతుందని రాధాకృష్ణన్ సూచనప్రాయంగా చెబుతున్నారా? రాధాకృష్ణన్ మాట లను తీవ్రమైనవిగా పరిగణించడం ఎందుకంటే, ఆయన నరేంద్ర మోదీ మంత్రిమండలిలో సభ్యుడు. ‘ఇలాంటి ప్రభుత్వాల అవసరం లేదు’ అని ఆయన ప్రకటించడం నాకు చాలా వింత అనిపించింది. తమిళనాడులో శాంతిభద్రతల పరిస్థితి డోలాయమానంగా మారిందన్న కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం ఆయన మాటలలో ప్రతిబింబిస్తున్నదా? ఆ రాష్ట్రాన్ని తీవ్రవాదులు ఏలుతున్నట్టు చెప్పే సమాచారం ఏదైనా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారిక సంస్థల ద్వారా సేకరించిందా? అయితే ఇలాంటి సమాచారం ఏదైనా ఉంటే దానిని రాష్ట్ర ప్రభుత్వానికి అందచేయవలసిందని తమిళనాడు మంత్రి డి. జయకుమార్ రాధాకృష్ణన్ను కోరారు. అలాగే తమిళనాడు ప్రభుత్వం తీవ్రవాదుల పని పట్టకపోతే, రాష్ట్రపతి కార్యాలయం స్పందించవలసి ఉంటుందన్న హెచ్చరిక కూడా రాధాకృష్ణన్ మాటలలో ఉందా? స్టెరిలైట్ వ్యతిరేకోద్యమకారులను, సేలం ఎక్స్ప్రెస్ వే వ్యతిరేకులను గడచిన రెండు వారాలుగా వరస పెట్టి అరెస్టు చేయడానికి కారణం ఇదేనా? అయితే ఒకటి. బాధ్యత గల ఒక కేంద్రమంత్రి మీడియాలో నక్సల్స్ ఉనికి ఉందంటూ తన కుట్ర సిద్ధాంతాన్ని ఆ వ్యవస్థకు ఎలా అంటగడతారు? నా ఆలోచన ప్రకారం భయోత్పాతాన్ని సృష్టించడానికి తీసుకునే చర్యలలో ఇది మొదటిది. తరువాత కొందరు వ్యక్తుల మీద ముద్రలు వేయడం, వారిని అపకీర్తి పాలుచేయడం. గడచిన వారం అరెస్టయిన వారంతా ఏ తరహా వ్యక్తులో ఒకసారి పరిశీలిస్తే ‘పట్టణ నక్సల్స్’ సిద్ధాంతాన్ని ముందుకు తేవడం వెనుక ఉన్న కారణం ఊహకు వస్తుంది. అలా అరెస్టయిన వారిలో వశీనాథన్ ఒకరు. ఆయన న్యాయవాది. ట్యుటికోరన్లోని స్టెరిలైట్ సంస్థకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వారికి న్యాయ సహాయం అందిస్తున్న వ్యక్తి ఆయనే. చెరువుల ఉద్యమకారుడు పీయూష్ మనుష్ (ప్రస్తుతం బెయిల్ మీద విడుదలయ్యారు), విద్యార్థి నాయకుడు వాల్రామతి, సేలం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న నటుడు మన్సూర్ అలీఖాన్లకు కూడా వశీనాథన్ న్యాయ సహాయం చేస్తున్నారు. 260 మంది స్టెరిలైట్ వ్యతిరేకోద్యమకారులను అరెస్టు చేసి, మే 22వ తేదీన జరిగిన హింసతో సంబంధం ఉన్నవారిగా పేర్కొంటూ కేసులు నమోదు చేశారు. జాతీయ రహదారి కోసం తన భూమిని తీసుకోవడాన్ని వ్యతిరేకించే ప్రతి రైతును స్థానిక పోలీస్ స్టేషన్లో బంధిస్తున్నారు. నక్సలైట్లు సాధారణంగా అనధికార పంచాయతీల ద్వారా న్యాయం అందిస్తూ ఉంటారు. దురదృష్టం ఏమిటంటే సోషల్ మీడియాను ఉపయోగిం చడం ద్వారా అధికార వ్యవస్థ కూడా సరిగ్గా అదే పనిచేస్తున్నది. కొందరు వ్యక్తులకు పట్టణ నక్సల్స్ అంటూ, జాతి వ్యతిరేకులు అంటూ ముద్ర వేయడానికి ప్రధానంగా ట్వీటర్ను ఉపయోగిస్తున్నారు. పీయూష్ను డబ్బు గుంజే వ్యక్తిగా చిత్రీకరించారు. వాల్రామతిపై నక్సలైట్ అని ముద్ర వేశారు. వీరందరినీ వెనుక ఉండి నడిపించే వ్యక్తిగా వశీనాథన్ను పేర్కొంటున్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యక్తిని అరెస్టు చేసే అధికారం ప్రభుత్వాలకు లేదని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. అయితే వ్యక్తులను అరెస్టు చేయడానికి అనుసరిస్తున్న పద్ధతులే కలవరం కలిగిస్తున్నాయి. ఆ అరెస్టులను గమనిస్తే, నిరసన వ్యక్తం చేస్తే చాలు నిర్బంధం తప్పదన్న సంకేతాలను ఇచ్చే విధంగా ఉన్నాయి. అయితే రెడ్ కారిడార్లో ఉన్న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాలలో నక్సల్ అణచివేత చర్యలలో రెండు దశాబ్దాల పాటు పాలు పంచుకున్న ఒక ఐపీఎస్ అధికారి తమిళనాడులో నక్సల్ జాడలు లేవని చెప్పారు. అడపాదడపా జరిగే సంఘటనలను బట్టి తమిళనాడు–కేరళ జోన్లో నక్సల్స్ చొరబడ్డారని చెప్పడం రెడ్ కార్డును ఉపయోగించుకోవడం తప్ప, మరేమీ కాదని ఆయన అన్నారు. అంటే, ప్రజల గురించి ఎవరు గళం ఎత్తినా, మానవ హక్కులను రక్షించాలని ఎవరు మాట్లాడినా అలాంటి వారందరి మీద పట్టణ నక్సల్స్ అంటూ ముద్ర వేస్తున్నట్టు కనిపిస్తున్నది. శక్తిమంతమైన ఒక కార్పొరేట్ సంస్థకు వ్యతిరేకంగా ఆందోళన మొదలుపెట్టిన వారిని భయభ్రాంతులను చేయడానికే యథేచ్ఛగా అరెస్టులు సాగిస్తున్నారని స్టెరిలైట్ వ్యతిరేకోద్యమానికి నాయకత్వం వహించిన ఫాతిమా బాబు అన్నారు. ఇక్కడే పుట్టి పెరిగినప్పటికీ తన మీద నీచమైన ఆరోపణలు చేస్తూ బురద చల్లుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగాన్ని ఎవరు వ్యతిరేకించినా వారిని వెతికి వెతికి పట్టుకుంటున్నారని హ్యూమన్ రైట్స్ గ్రూప్ పీపుల్స్ వాచ్ నాయకుడు హెన్రీ టిఫాన్ అన్నారు. ఇప్పుడు తాను సేలం వెళితే వెంటనే అరెస్టు చేయడం ఖాయమనీ, తమిళనాడు అత్యంత వేగంగా ఖాకీవనంగా మారిపోతున్నదని, ఈ రాష్ట్రంలో ఎంతమాత్రం ప్రజాస్వామ్యం లేదని చెన్నైలో ఉండే టిఫాన్ చెప్పారు. మావోయిస్టు ముద్ర కూడా చాలినంత బలంగా లేదని భావిస్తే, వేదాంతకు చెందిన స్టెరిలైట్కు వ్యతిరేకంగా అంతర్జాతీయ కుట్ర జరిగిందని చెప్పడానికి బాబా రాందేవ్ రంగంలోకి దిగుతారు. టీఎస్ సుధీర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు ఈ–మెయిల్ : tssmedia10@gmail.com -
హింసకు ప్రగతే పరిష్కారం
భిలాయ్: అన్ని రకాల హింస, కుట్రలకు అభివృద్ధి మాత్రమే ఏకైక పరిష్కారమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గురువారం రూ. 22 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల్ని ప్రారంభించిన అనంతరం ఆయన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో హింసకు పాల్పడుతున్న నక్సల్స్కు స్పష్టమైన సందేశమిచ్చే ప్రయత్నం చేశారు. ప్రజల్లో నమ్మకం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందని, అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు అనేక పథకాల్ని ప్రారంభించాయని అన్నారు. యూపీఏ హయాంలో ఛత్తీస్గఢ్ అభివృద్ధిని పట్టించుకోలేదని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భిలాయ్లో ఐఐటీ ఏర్పాటు చేశామని, మౌలిక వసతులు కల్పిస్తున్నామని ప్రధాని వెల్లడించారు. అంతకుముందు భిలాయ్ ఉక్కు కర్మాగారం ఆధునిక విస్తరణ ప్లాంటును ఆయన ప్రారంభించారు. ఈ కర్మాగారం ఆధునిక భారతదేశ పునాదులను బలోపేతం చేస్తుందని చెప్పారు. అలాగే జగదల్పూర్–రాయ్పూర్ మధ్య విమాన సేవల్ని, నయా రాయ్పూర్లో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న ఛత్తీస్గఢ్లో నెలరోజుల వ్యవధిలో ప్రధాని మోదీ పర్యటించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ‘సహజ వనరుల నుంచి వచ్చే ఆదాయంలో కొంత స్థానిక గిరిజనుల కోసం ఖర్చుపెట్టాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. ఛత్తీస్గఢ్కు అదనంగా రూ. 3 వేల కోట్లు అందాయి. వాటిని ఆస్పత్రులు, పాఠశాలలు, రహదారులు, మరుగుదొడ్ల నిర్మాణానికి ఖర్చు చేస్తారు. గిరిజనులు, వెనకబడ్డ ప్రాంతాల్లో నివసించేవారి ఆదాయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది’ అని ప్రధాని పేర్కొన్నారు. జగదల్పూర్–రాయ్పూర్ మధ్య విమాన సేవల ప్రారంభాన్ని ప్రస్తావిస్తూ.. ‘హవాయ్ జహజ్(విమానం)లో హవాయి చెప్పులు వేసుకుని ఎవరైనా ప్రయాణిస్తే చూడాలనేది నా కల. చిన్న నగరాలు, పట్టణాలకు కూడా విమాన సేవలు అందించడమే మేం ప్రారంభించిన ఉడాన్ పథకం లక్ష్యం. గత ప్రభుత్వం రోడ్లు కూడా నిర్మించని ప్రాంతాల్లో.. ఎన్డీఏ ప్రభుత్వం రోడ్లు, విమానాశ్రయాల్ని నిర్మిస్తోంది. ఇంతకముందు రాయ్పూర్ విమానాశ్రయంలో రోజుకు కేవలం ఆరు విమానాలు ఎగిరేందుకు అవకాశముందేది. ఇప్పుడు 50 విమానాల రాకపోకలకు సామర్థ్యం కల్పించాం’ అని మోదీ చెప్పారు. భిలాయ్ ఐఐటీని సాకారం చేశాం ఎప్పటి నుంచో చత్తీస్గఢ్ రాష్ట్రానికి ఐఐటీ కేటాయించమని సీఎం రమణ్ సింగ్ డిమాండ్ చేసినా యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదని.. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దానిని సాకారం చేశామని చెప్పారు. గతంలో చత్తీస్గఢ్ అంటే అడవులు, గిరిజనులే గుర్తుకు వచ్చే వారని, ఇప్పుడు స్మార్ట్ సిటీ(నయా రాయ్పూర్)కి పేరుగాంచిందన్నారు. బస్తర్ అనగానే బాంబులు, తుపాకీల పేర్లు మాత్రమే వినిపించేదని, ఇప్పుడు జగదల్పూర్లో నిర్మించిన విమానాశ్రయం అందరికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. నవ భారతానికి పునాదులు ఛత్తీస్గఢ్ పర్యటనలో భాగంగా ఆధునికీకరించిన భిలాయ్ స్టీల్ ప్లాంట్ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. నవ భారతానికి ఈ స్టీట్ ప్లాంట్ పునాదులు వేస్తుందని అన్నారు. దాదాపు రూ. 18,800 కోట్లతో విస్తరించిన ఈ స్టీల్ ప్లాంట్ సామర్థ్యం ఏడాదికి 4.7 మిలియన్ టన్నుల నుంచి 7.5 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం వరకూ ఉక్కు పరిశ్రమ ఇబ్బందుల్ని ఎదుర్కొందని, ఇప్పుడు ప్రపంచంలో భారత్ రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి దేశంగా నిలిచిందన్నారు. రూ. 72 వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ల ఆధునీకరణ, విస్తరణ కార్యక్రమంలో భిలాయ్ ప్లాంట్ అభివృద్ధిని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్) చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా దేశంలో ఉక్కు ఉత్పత్తి ఏడాదికి 13 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం 21 మిలియన్ టన్నులకు చేరుతుంది. బస్తర్ జిల్లాకు తొలిసారి విమాన సేవలు భిలాయ్ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగదల్పూర్ నుంచి రాయ్పూర్కు మొదటి విమానాన్ని మోదీ ప్రారంభించారు. దీంతో మావోయిస్టులకు పేరుపడ్డ బస్తర్ జిల్లాకు తొలిసారి విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. -
38 ఏళ్ల ఉద్యమ చరిత్రలో భారీ ఎన్కౌంటర్
-
ఇద్దరు నక్సల్స్ అరెస్ట్
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు నక్సల్స్ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని మద్వి మద్దా(30), బెంజు లఖ్ము(28)గా గుర్తించారు. మద్దాను జంగ్లా పోలీసు స్టేషన్ పరిధిలోను, లఖ్మును ఫర్సేగర్ పోలీసు స్టేషన్ పరిధిలోను మంగళవారం అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసు అధికారి తెలిపారు. వీరిద్దరూ హత్యాయత్నం, దాడులు, నిర్మాణ పనుల్లోని వాహనాల దగ్ధం వంటి నక్సల్స్ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారని వివరించారు. వీరిద్దరిని విచారిస్తున్నామని ఆయన చెప్పారు. -
గెటౌట్ బెటాలియన్
సాక్షి, అమరావతి: రక్షక భటులు అని గొప్పలు చెప్పుకునే పోలీసుల ఆస్తులకే రక్షణ లేకుండా పోతోంది. పర్యాటకం పేరుతో రూ.4 వేల కోట్ల విలువైన పోలీసు ఆస్తులను ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టే మరో భారీ స్కెచ్కు బీజం పడింది. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ఉన్న ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని గురువారం జరిగిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో జాతీయ రహదారి పక్కన, కొండల నడుమ అన్ని విధాలుగా కీలకంగా ఉన్న బెటాలియన్ను వేరొక ప్రాంతానికి తరలించేందుకు నిర్ణయించారు. ఈ ప్రాంతంలోని విలువైన భూముల్లో హోటళ్లు, రిసార్ట్స్ నిర్మించేందుకు ప్రయివేటు వ్యక్తులకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఈ ప్రతిపా దనల వెనుక ‘ప్రభుత్వ పెద్దల’ భారీ స్కెచ్ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని నేపథ్యంలో మంగళగిరి బెటాలియన్ ఉన్న ప్రాంతానికి అతి చేరువలో జాతీయ రహదారి పక్కనే ఇటీవల భారీ రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. ప్రభుత్వ పెద్దలకు అతి సన్నిహితంగా మెలిగే ఎల్ఈపీఎల్ (లింగమనేని), మిడ్వాలీ తదితర ప్రముఖ సంస్థలకు చెందిన బహుళ అంతస్తుల (అపార్టుమెంట్) భవనాల నిర్మాణం వేగంగా సాగుతున్నాయి. దాదాపు 28 అంతస్తుల ఎత్తైన భారీ భవన (అపార్టుమెంట్) సముదాయాలకు ఆనుకుని ఉన్న ఏపీఎస్పీ బెటాలియన్ భూములపై పెద్దల కన్ను పడింది. టూరిజం సాకుతో మొదట ఆ భూములను స్వాధీనం చేసుకుని ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకే ‘ప్రభుత్వ పెద్దలు’ వ్యూహం రచించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా ఉన్న సుమారు రూ.100 కోట్ల విలువైన భూమిలో 72 పోలీస్ క్వార్టర్స్ను తొలగించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం గమనార్హం. నక్సల్స్ అణచివేతకు ఆవిర్భవించిన బెటాలియన్... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నల్లమల అటవీ ప్రాంతంతో పాటు పలు జిల్లాల్లో విస్తరించిన మావోయిస్టులను అణచివేసేందుకు ఆవిర్భవించిన 6వ బెటాలియన్కు 45 ఏళ్ల ఘనచరిత్ర ఉంది. గుంటూరు జిల్లాతో పాటు పలు జిల్లాల్లో విస్తరించిన నల్లమల, తెలంగాణ ప్రాంతంలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్ తదితర జిల్లాల్లో మూవోయిస్టుల తీవ్రత ఉన్న రోజుల్లో కాకినాడ (3వ బెటాలియన్) నుంచి ఆయా ప్రాంతాలకు ప్రత్యేక బలగాలు (స్పెషల్ పోలీస్) రావడానికి తీవ్ర జాప్యం జరిగేది. ఈ నేపథ్యంలోనే నల్లమలకు సమీపంలోని మంగళగిరి ప్రాంతంలో 1972 ఆగస్టు 15న 6వ బెటాలియన్కు శంఖుస్థాపన చేశారు. ఏపీఎస్పీ 2, 3 బెటాలియన్ల నుంచి 125 మంది (ఒక కంపెనీ) చొప్పున బలగాలను అదే ఏడాది సెప్టెంబర్లో ఇక్కడికి తరలించారు. తాడేపల్లి, ఆత్మకూరు, మంగళగిరి స్థానిక సంస్థలతో పాటు అటవీశాఖ (ఫారెస్టు) శాఖకు చెందిన 142.68 ఎకరాలను కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో 1134 జారీ చేసింది. ఫారెస్టు భూములను కూడా బెటాలియన్ కోసం డీనోటిఫై చేశారు. అటు తరువాత 1029 మంది అధికార, సిబ్బందికి సరిపడే క్వార్టర్స్, శిక్షణ ప్రాంతం, ప్రధాన కార్యాలయంతో 6వ బెటాలియన్ రాష్ట్రంలోనే కీలకంగా మారింది. ఇక్కడే పోలీస్ ఉన్నతాధికారులకు క్వార్టర్స్, కీలక కార్యాలయాల నిర్మాణానికి ఇటీవల ప్రతిపాదనలు కూడా జరిగాయి. కిట్లో విషపురుగులు.. రాళ్లపై అవస్థలు: శిరిగిరి గుండయ్య, రిటైర్డ్ ఏఆర్ ఎస్సై మంగళగిరి బెటాలియన్లో విధులు నిర్వహించేందుకు వచ్చిన మేము తొలినాళ్లలో పడ్డ కష్టాలు తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. అటవీప్రాంతంలో చెట్టు, పుట్టలు, రాళ్లతో ఈ ప్రాంతాన్ని మేము ఉండేందుకు అనుకూలంగా మలుచుకునేందుకు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మా కిట్ (బ్యాగ్)లోకి తేళ్లు, పాములు వంటి విషపురుగులు చేరేవి. మంచినీరు కూడా దొరకని ఈ ప్రాంతంలో రాళ్లు, రప్పల్లో విధులు నిర్వర్తించాం. ఎంతో శ్రమ, ఎందరో కృషి ఫలితంగా బెటాలియన్ ఇప్పుడు అన్ని విధాలుగా అనుకూలంగా అభివృద్ధి చెందింది. అటువంటి బెటాలియన్ను ప్రయివేటుకు వ్యక్తులకు అప్పగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం బాధాకరం.తొలగించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం గమనార్హం. నక్సల్స్ అణచివేతకు ఆవిర్భవించిన బెటాలియన్... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నల్లమల అటవీ ప్రాంతంతో పాటు పలు జిల్లాల్లో విస్తరించిన మావోయిస్టులను అణచివేసేందుకు ఆవిర్భవించిన 6వ బెటాలియన్కు 45 ఏళ్ల ఘనచరిత్ర ఉంది. గుంటూరు జిల్లాతో పాటు పలు జిల్లాల్లో విస్తరించిన నల్లమల, తెలంగాణ ప్రాంతంలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్ తదితర జిల్లాల్లో మూవోయిస్టుల తీవ్రత ఉన్న రోజుల్లో కాకినాడ (3వ బెటాలియన్) నుంచి ఆయా ప్రాంతాలకు ప్రత్యేక బలగాలు (స్పెషల్ పోలీస్) రావడానికి తీవ్ర జాప్యం జరిగేది. ఈ నేపథ్యంలోనే నల్లమలకు సమీపంలోని మంగళగిరి ప్రాంతంలో 1972 ఆగస్టు 15న 6వ బెటాలియన్కు శంఖుస్థాపన చేశారు. ఏపీఎస్పీ 2, 3 బెటాలియన్ల నుంచి 125 మంది (ఒక కంపెనీ) చొప్పున బలగాలను అదే ఏడాది సెప్టెంబర్లో ఇక్కడికి తరలించారు. తాడేపల్లి, ఆత్మకూరు, మంగళగిరి స్థానిక సంస్థలతో పాటు అటవీశాఖ (ఫారెస్టు) శాఖకు చెందిన 142.68 ఎకరాలను కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో 1134 జారీ చేసింది. ఫారెస్టు భూములను కూడా బెటాలియన్ కోసం డీనోటిఫై చేశారు. అటు తరువాత 1029 మంది అధికార, సిబ్బందికి సరిపడే క్వార్టర్స్, శిక్షణ ప్రాంతం, ప్రధాన కార్యాలయంతో 6వ బెటాలియన్ రాష్ట్రంలోనే కీలకంగా మారింది. ఇక్కడే పోలీస్ ఉన్నతాధికారులకు క్వార్టర్స్, కీలక కార్యాలయాల నిర్మాణానికి ఇటీవల ప్రతిపాదనలు కూడా జరిగాయి. ఆ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశాం.. ప్రభుత్వ నిర్ణయం బాధాకరం మంగళగిరి బెటాలియన్లో విధులు నిర్వహించేందుకు వచ్చిన మేము తొలినాళ్లలో పడ్డ కష్టాలు తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. అటవీప్రాంతంలో చెట్టు, పుట్టలు, రాళ్లతో ఈ ప్రాంతాన్ని మేము ఉండేందుకు అనుకూలంగా మలుచుకునేందుకు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మా కిట్ (బ్యాగ్)లోకి తేళ్లు, పాములు వంటి విషపురుగులు చేరేవి. మంచినీరు కూడా దొరకని ఈ ప్రాంతంలో రాళ్లు, రప్పల్లో విధులు నిర్వర్తించాం. ఎంతో శ్రమ, ఎందరో కృషి ఫలితంగా బెటాలియన్ ఇప్పుడు అన్ని విధాలుగా అనుకూలంగా అభివృద్ధి చెందింది. అటువంటి బెటాలియన్ను ప్రయివేటుకు వ్యక్తులకు అప్పగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం బాధాకరం. – శిరిగిరి గుండయ్య, రిటైర్డ్ ఏఆర్ ఎస్సై -
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్... మావోయిస్టులు మృతి
రాయ్పూర్ : చత్తీస్గడ్ రాష్ట్రంలోని రాజ్నంద్గావ్ జిల్లాలో బుధవారం అర్థరాత్రి పోలీసులు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. టిబెట్ బార్డర్ ఫోర్స్, చత్తీస్గడ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కోండ్గావ్ పోలీస్స్టేషన్ పరిధిలో కోపెన్ కడ్కా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్లు జిల్లా ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు. మృతులను మహేశ్(ఏరియా కమిటీ మెంబర్), రాకేశ్(లోకల్ ఆర్గనైజింగ్ స్కాడ్ ఏసీఎం), రంజిత్ పల్లెమడి డిప్యూటీ కమాండర్లుగా గుర్తించారు. మృతులు ఒక్కొక్కరిపై రూ. 5 లక్షల రివార్డు ఉందని ఎస్పీ వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి మందుగుండు సామాగ్రి, ఒక ఏకే 47, ఒక ఇన్శ్రా రైఫిల్, ఒక ఎస్ఎల్ఆర్ను స్వాధీనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వారందరూ బస్తర్ ప్రాంతానికి చెందినవారని తెలిపారు. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. -
నక్సల్స్ పేరిట మాజీ సర్పంచ్పై కాల్పులు
ఇబ్రహీంపట్నం: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్లో శుక్రవారం అర్ధరాత్రి నక్సల్స్ పేరిట మాజీ సర్పంచ్ సుంకె రాజన్న(55)పై కొందరు కాల్పులు జరిపారు. శుక్రవారం రాత్రి 11.15 గంటలకు నక్సల్స్ పేరుతో మాజీ సర్పంచ్ సుంకె రాజన్న ఇంటికి ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు. ఒకరు ఇంటి బయట కాపలా ఉండగా.. మిగిలిన ఇద్దరు ఇంటి లోపలికి ప్రవేశించారు. ‘మేం నక్సలైట్లం.. గ్రామంలో రాజన్న అందరిని బెదిరిస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు.. ఏడి వాడు’ అంటూ తీవ్ర స్వరంతో కుటుంబీకులను మందలించారు. ఆ తర్వాత రాజన్న నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి షార్ట్ వెపన్తో ఓ రౌండ్ కాల్చి పారిపోయారు. మెట్పల్లి పోలీసులు వచ్చి రాజన్నను కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. భూవివాదమే కారణమా? గ్రామానికి చెందిన చెదలు రాజేందర్, ఆయన తండ్రి చెదలు భూమన్నతో గ్రామ శివారులోని 3.03 ఎకరాల భూమిపై రాజన్నకు 15 ఏళ్ల నుంచి భూవివాదం ఉంది. సుంకె రాజన్న ఆ భూమి కోసం హైకోర్టును ఆశ్రయించగా.. ఏడాది క్రితం భూమి రాజన్నకే చెందుతుందని తీర్పు వచ్చింది. చికిత్స పొందుతున్న రాజన్న తనపై చెదలు రాజేందర్, భూమన్నలే దాడి చేయించారని ఆరోపించాడు. వారి నుంచి తనకు ప్రాణ హాని ఉందని గతంలో రాజన్న పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రాజన్న కుమారుడు దివాకర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామ్నాయక్ తెలిపారు. -
గౌరీలంకేష్ను హత్య చేసింది ఎవరు?
నక్సలైట్ల హస్తముండొచ్చు అంటున్న సోదరుడు హిందుత్వ అతివాదులపైనా అనుమానం సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్ట్, సామాజికవేత్త గౌరీలంకేశ్ హత్యపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆమెను ఎవరు హత్య చేశారో తెలుసుకోవడానికి సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గౌరీలంకేశ్ సోదరుడు ఇంద్రజిత్ లంకేశ్ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. గౌరీలంకేశ్కు నక్సలైట్ల నుంచి బెదిరింపులు, విద్వేష లేఖలు అందాయనే విషయాన్ని పోలీసులు తనకు తెలిపారని ఆయన వెల్లడించారు. ఆమె హత్య వెనుక నక్సలైట్ల కోణం ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వంతో కలిసి గౌరీలంకేశ్ చురుగ్గా పనిచేశారని, ఆమె ఇలా చేయడం నక్సలైట్లకు గిట్టలేదని తెలిపారు. 'పలువురు నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడంలో ఆమె సఫలమయ్యారు. దీనివల్ల ఆమెకు బెదిరింపు లేఖలు, విద్వేష మెయిళ్లు అందాయి' అని వివరించారు. అంతేకాకుండా మావోయిస్టులెవరూ జనజీవన స్రవంతిలో కలువకూడదని హెచ్చరిస్తూ నక్సలైట్లు కర్ణాటకలో పాంఫ్లెట్లు కూడా పంచారని గుర్తుచేశారు. అయితే, తనకు బెదిరింపులు వస్తున్న విషయాన్ని ఆమె తమకు తెలుపలేదని చెప్పారు. కొన్నిరోజుల కిందట గౌరీలంకేశ్తో సీఎం సిద్దరామయ్య సమావేశమయ్యారని, అప్పుడు కూడా తనకు బెదిరింపులు వస్తున్న విషయాన్ని ఆమె సీఎంకు తెలుపలేదని చెప్పారు. ఆమె హత్య వెనుక నక్సలైట్ కోణముందా? లేక హిందు అతివాద కోణముందా? దర్యాప్తులోనే తేల్చాలని ఆయన అన్నారు. సోదరి గౌరీతో తనకు భావజాల విభేదాలు ఉండేవని, అయితే, తను నమ్మిన భావజాలానికి కట్టుబడు నిలబడిన ఫైర్బ్రాండ్ వ్యక్తిత్వం ఆమెదని ఇంద్రజిత్ ప్రశంసించారు. కర్ణాటకలో జరిగిన హేతువాది, మాజీ ప్రొఫెసర్ ఎంఎం కల్బుర్గి హత్య తరహాలోనే గౌరీలంకేశ్ను చంపేయడంతో ఈ ఘటన వెనుక హిందుత్వ అతివాదుల హస్తముండొచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఎంఎం కల్బుర్గి హత్యకేసులో కర్ణాటక పోలీసులు ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఈ నేపథ్యంలో గౌరీలంకేశ్ హత్యకేసు కర్ణాటక పోలీసులపై ఒత్తిడి పెంచుతోంది. -
నక్సల్స్పై ఇక సమరమే!
-
నక్సల్స్పై సమరమే!
మరింత కఠినంగా, దూకుడుగా ముందుకెళ్లాలి ► ‘సమాధాన్’ వ్యూహాన్ని సూచించిన కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ ► ఢిల్లీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. నక్సల్స్ వ్యతిరేక కార్యక్రమాల్లో మరింత కఠినంగా, దూకుడుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ వె ల్లడించారు. ఢిల్లీలో సోమవారం ప్రారంభమైన మావో యిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల రెండ్రోజుల సదస్సులో రాజ్నాథ్ ప్రారంభోపన్యాసం చేశారు. ‘మన విధానాల్లో దూకుడు పెంచాలి. మన ఆలోచనల్లో, వ్యూహాల్లో, బలగాల మోహరింపులో, వ్యూహాల అమలులో, మావోయిస్టు ప్రభావిత ప్రాంతా ల్లో రోడ్ల నిర్మాణంలో ఈ దూకుడు కనిపించాలి. మితిమీరిన ఆత్మరక్షణతో ఉండటం వల్లే కార్యాచరణలో పక్కాగా వ్యవహరించలేకపోతున్నాం’ అని కేంద్ర హోంమంత్రి స్పష్టం చేశారు. నక్సల్స్ ఏరివేతకు రాష్ట్రాలే బాధ్యత తీసుకోవాలన్నారు. ఆర్థికంగా దెబ్బతీస్తే సరి..: ‘మావోయిస్టుల ఆర్థిక వనరులను దెబ్బకొట్టడమే ఈ పోరాటంలో అత్యంత కీలకం. సరిపోయేన్ని ఆర్థిక వనరులున్నప్పుడే వారు ఆయుధాలు కొంటారు. అందుకే ఆర్థిక వనరులను దెబ్బతీయటం చాలా అవసరం’ అని రాజ్నాథ్ తెలిపారు. మావోలను అణిచివేసేందుకు ‘సమాధాన్’ (SAMADHAN) వ్యూహా న్ని రాజ్నాథ్ చెప్పారు. ఎస్– స్మార్ట్ నాయకత్వం (స్మార్ట్ లీడర్ షిప్ , ఏ– దూకుడైన వ్యూహం (అగ్రెసివ్ స్ట్రాటజీ), ఎం–ప్రేరణ, శిక్షణ (మోటివేషన్ అండ్ ట్రైనింగ్, ఏ–కార్యాచరణలో కనిపించే ఇంటెలిజెన్స్ (యాక్షనబుల్ ఇంటెలిజెన్స్), డీ–డాష్బోర్డు ఆధారిత కేపీఐ (కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్)లు, కేఆర్ఏ (కీ రిజల్ట్ ఏరియా)లు, హెచ్– ఆధునిక సాంకేతికత వినియోగం (హార్నెసింగ్ టెక్నాలజీ), ఏ–ప్రతి విభాగానికి ప్రత్యేక కార్యాచరణ (యాక్షన్ ప్లాన్ ఫర్ ఈచ్ థియేటర్), ఎన్– ఆర్థిక వనరులు అందకుండా చేయట (నో యాక్సెస్ టు ఫైనాన్సింగ్)మే సమాధాన్ వ్యూహమని వివరించారు. ఏపీ, తెలంగాణ నుంచి: మావో తీవ్రవాదం ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాదని, ఇది జాతీయ సమస్యని ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఈ సమావేశంలో తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏపీలో గ్రేహౌం డ్స్ ఏర్పాటుకు నిధులు కేటాయించాలని చినరాజప్ప కేంద్రాన్ని కోరారు. ఏపీ,తెలంగాణ మధ్య భద్రత విష యంలో సమన్వయ లోపం లేదని ఏపీ డీజీపీ సాంబశివరావు చెప్పారు. తమకు మరిన్ని బలగాలను కేటా యించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ సమావేశంలో తెలంగాణ తరపున పాల్గొన్న డీజీపీ అనురాగ్ శర్మ.. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో మావో సమస్య ఉందన్నారు. అదనపు బలగాలపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. నక్సల్స్ ఏరివేతకు ఆర్మీ నో! మావోలతో పోరాడుతున్న సాయుధ బలగాలకోసం ఏర్పాటుచేసే క్యాంపుల్లో అన్ని వసతులూ ఉండాలని రాజ్నాథ్ ఆదేశించారు. తెలుగు రాష్ట్రాల మాదిరిగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ అన్ని మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో ఉండాలన్నారు. కాగా, నక్సల్స్ వ్యతిరేక కార్యక్రమాల్లో ఆర్మీని వినియోగించబోమని హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహరిషి చెప్పారు. మావోల ఏరివేతకు 2వేల మంది కోబ్రా కమాండోలను సుక్మా జిల్లాలో రంగంలోకి దించనున్నట్లు సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారి తెలిపారు. పశ్చిమబెంగా ల్, బిహార్, మధ్యప్రదేశ్, తెలంగాణల్లో ఉన్న ఈ కోబ్రాలను సుక్మాకు పంపుతామన్నారు. -
ఇద్దరు నక్సల్ కమాండర్లు హతం
మృతుల్లో ఒకరు తెలంగాణ వ్యక్తి రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని సుక్మాలో 25 మంది భద్రతా సిబ్బందిని పొట్టన పెట్టుకున్న మావోయిస్టుల దాడి సమయంలో సీఆర్పీఎఫ్ జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు నక్సల్ కమాండర్లు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఒకరు తెలంగాణలోని భద్రాద్రి జిల్లాకు చెందిన రవి అని, మరొకరు ఛత్తీసగఢ్ బీజాపూర్ జిల్లాకు చెందిన అనిల్ అని తెలిపారు. ఏప్రిల్ 24న జరిగిన ఎన్కౌంటర్ తరువాత సీఆర్పీపీఎఫ్, ఛత్తీస్గఢ్ పోలీసులు 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయం తెలిసింది. ఆ దాడి వెనక వీరిలో కొందరి పాత్ర ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు పేర్కొన్నారు. విచారణ పూర్తయిన తరువాత వారిని అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెడతామని చెప్పారు. -
సీఆర్పీఎఫ్కు ఎట్టకేలకు అధిపతి దొరికారు!
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు సీఆర్పీఎఫ్కు అధిపతిని నియమించింది. సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్గా రాజీవ్ రాయ్ భట్నాగర్ను కేంద్ర హోంశాఖ బుధవారం నియమించింది. రాయ్ 1983 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అధికారి. రెండురోజుల కిందట సుక్మాలో మావోయిస్టులు జరిపిన మెరుపుదాడిలో 25మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో కేంద్రం తీరును కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై విమర్శించారు. సీఆర్పీఎఫ్కు ఇప్పటివరకు పూర్తికాలం అధిపతిని నియమించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. సీఆర్పీఎఫ్ గత డైరెక్టర్ జనరల్ దుర్గా ప్రసాద్ ఫిబ్రవరి 28వ తేదీన పదవీ విరమణ చేశారు. అంతకు నెల రోజుల ముందే వారసుడిని నియమించాలి. కానీ కేంద్ర హోం శాఖ నిన్నటివరకు నిర్ణయం తీసుకోలేదు. పెద్ద నోట్ల రద్దుతో మావోయిస్టుల వెన్నుముక విరిగిపోయిందని, మరో దిక్కులేక దాదాపు 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. ఇది తప్పుడు ప్రకటనని తర్వాత తేలింది. సుక్మా దాడి నేపథ్యంలో సీఆర్పీఎఫ్కు వెంటనే అధిపతిని నియమించినట్టు తెలుస్తోంది. అలాగే ఇండో-టిబేటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ)కి 1983 బ్యాచ్కు చెందిన ఆర్కే ప్రచండ నియమితులయ్యారు. -
నిర్లక్ష్యమే జవాన్ల ప్రాణాలను తీసింది
చత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో సోమవారం సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు జరిపిన ఆకస్మిక దాడిలో 25 మంది జవాన్లు మరణించడానికి విధుల నిర్వహణలో జవాన్లు నిర్లక్ష్యం వహించడంతోపాటు కేంద్ర ప్రభుత్వ వైఫల్యమూ ఉంది. ఆ రోజున రోడ్డు నిర్మాణ పనులకు రక్షణగా ఉన్న బృందంలోని 36 మంది జవాన్లలో ఇద్దరు, ముగ్గురు మినహా అందరూ ఒకేసారి భోజనానికి వెళ్లారు. భోజనానంతరం విశ్రాంతి తీసుకుంటుండగా, అదే అదనుగా భావించిన మావోయిస్టులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. సీఆర్పీఎఫ్లోని 76వ బెటాలియన్కు చెందిన 99 మంది జవాన్లు మూడు బృందాలుగా విడిపోయి రోడ్డు నిర్మాణ పనులకు కాపలా కాస్తున్నారు. ఒక్కో బందంలో 30 నుంచి 36 మంది జవాన్లు ఉన్నారు. ఒక్కో బృందంలోని సభ్యులు భోజన విరామానికి వెళ్లాలంటే అతి తక్కువ సంఖ్యలో వెళ్లాలి. దాన్నే ఆపరేషన్ అప్రమత్తత అంటారు. అలా అప్రమత్తంగా వ్యవహరించక పోవడం వల్ల అనసరంగా ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. 2010లో పొరుగునున్న దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు జరిపిన దాడిలో 74 మంది జవాన్లు మరణించడానికి కారణం కూడా ఆపరేషన్ నిబంధనలను పాటించక పోవడమే కారణం. ఆ రోజున తెల్లవారు జామున మావోయిస్టులు దాడి జరిపినప్పుడు ఎక్కువ మంది జవాన్లు గాఢ నిద్రలో ఉన్నారు. ఆ తర్వాత రెండు నెలలకే అలసి పోయిన జవాన్ల బృందం కలసికట్టుగా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుంటే మావోయిస్టులు కాల్పులు జరపడంతో 26 మంది జవాన్లు మరణించారు. ముగ్గురు, నలుగురు చొప్పున బృందాలుగా విడిపోయి వెళ్లాల్సిన జవాన్లు అలా చేయకుండా ఒకే గుంపుగా వెళ్లడం ఒక పొరపాటైతే వెళ్లిన దారినే వెనక్కి రావడం రెండో పొరపాటు. గుణపాఠం నేర్చుకోలేదు ఈ రెండు సంఘటనల నుంచి కూడా గుణపాఠం నేర్చుకోకపోవడం వల్లనే ఈ రోజున కూడా ఎక్కువ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని సుక్మా జిల్లాలో మావోయిస్టులు దాడి జరిపిన ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన సీనియర్ అధికారులు బుధవారం మీడియాకు తెలిపారు. తాము కూడా మావోయిస్టులపైకి ఎదురు కాల్పులు జరిపామని గాయాలతో బయటపడిన జవాన్లు చెప్పిన మాటలను వారి సీనియర్ అధికారులే నమ్మడం లేదు. 12 ఏకే–47 రైఫిళ్లు, 31 ఇన్సాస్ రైఫిళ్లు, 3000 బుల్లెట్లను సంఘటన స్థలం నుంచి మావోయిస్టులు ఎత్తుకెళ్లారంటే ఎదురు కాల్పులు జరిగి ఉండే అవకాశం లేదు. సీఆర్పీఎఫ్కు అధిపతి లేరు సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ దుర్గా ప్రసాద్ ఫిబ్రవరి 28వ తేదీన పదవీ విరమణ చేశారు. అంతకు నెల రోజుల ముందే వారసుడిని నియమించాలి. కానీ ఇప్పటి వరకు కూడా ఈ విషయంలో కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకోలేదు. పెద్ద నోట్ల రద్దుతో మావోయిస్టుల వెన్నుముక విరిగిపోయిందని, మరో దిక్కులేక దాదాపు 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. ఇది తప్పుడు ప్రకటనని తర్వాత తేలింది. -
ఇద్దరు మావో కొరియర్ల అరెస్టు
చర్ల(ఖమ్మం జిల్లా): మావోయిస్టులు మందుపాతర్లను అమర్చేందుకు వినియోగించే ఎలక్ట్రిక్ వైరు బండిళ్లను తరలిస్తున్న ఇద్దరు కొరియర్లను చర్ల పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. చర్ల ఎస్సై తాళ్లపల్లి సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... మండల కేంద్రమైన చర్లలో గాంధీ సెంటర్ సమీపంలోఅనుమానస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులకి తీసుకున్నారు. విచారణలో ఒకరిది చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్జిల్లా కారేపల్లికి చెందిన మడివి కోసా అని, మరొకరిది అదే జిల్లాలోని చండ్రంబోరు గ్రామానికి చెందిన మడకం కములు అలియాస్ మహేష్గా వెల్లడించారని ఆయన తెలిపారు. వారి నుంచి రెండు వైర్ బండిళ్లు లభ్యమైనట్లు ఆయన చెప్పారు. మావోయిస్టు నేతలు హరిభూషన్, దామోదర్, ఆజాద్ ఆదేశాల మేరకు రూ.40 వేలతో మహబూబాబాద్లోని మోహన్ అనే ఎలక్ట్రికల్ షాపు యజమాని వద్ద నుంచి 3 వేల మీటర్ల పొడవు గల 8 వైరు బండిళ్లను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నట్లు అంగీకరించారని ఆయన తెలిపారు. వీరిద్దరు పామేడు లోకల్ ఆర్గనేజేషన్ స్వా్కడ్ కమాండర్ కమలక్క నేతృత్వంలో పని చేస్తున్నట్లు వెల్లడించారని ఆయన చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు ఎస్సై తాళ్లపల్లి సత్యనారాయణ తెలిపారు. -
సాధువుకు గుండు గీయించిన నక్సల్స్
న్యూడెమోక్రసీ అజ్ఞాత దళం చర్యపై సాధువు ఆవేదన బయ్యారం: నూతన ప్రజాస్వామిక విప్లవ పంథాలో పయనిస్తున్న కామ్రేడ్లు గిరిజన సాధువుపై కన్నెర్ర చేశారు. సాధువు మూలంగా తమ పార్టీ వైపు ప్రజలు వచ్చేందుకు భయపడుతున్నారనే ఆగ్రహంతో ఏకంగా 30 సంవత్సరాల పాటు పెంచుకున్న సాధువు జుట్టును కత్తిరించి గుండు చేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని కిష్టాపురం గ్రామానికి చెందిన బాధితుడు గుగులోత్ సోమ్లా తెలిపిన వివరాలు ప్రకారం... సోమ్లా తన వంశపారపర్యంగా వస్తున్న ఆచారం ప్రకారం సాధువుగా మారి జుట్టును పెంచుకుంటూ ఇంటి వద్ద నిర్మించిన గుడిలో సేవాలాల్ మహరాజ్, వెంకటేశ్వరస్వామిలకు పూజలు నిర్వహిస్తుంటాడు. న్యూడెమోక్రసీలో చీలికరాక ముందు సోమ్లా ఆ పార్టీ సానుభూతిపరునిగా కొనసాగాడు. పార్టీలో చీలిక అనంతరం రాయలవర్గంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం చంద్రన్న వర్గానికి చెందిన అజ్ఞాత నాయకుడు అశోకన్న పిలుస్తున్నారని ఓ వ్యక్తి వచ్చి సోమ్లాను గ్రామ సమీపంలో ఉన్న అడవిలోకి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న ఆ పార్టీ బయ్యారం ఏరియా దళ కమాండర్ కుమార్ సోమ్లాను రాయల వర్గానికి ఆర్గనైజర్గా పనిచేస్తున్నావా అని ప్రశ్నించగా తాను ఆర్గనైజర్ను కాదని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాని తెలిపాడు. ఆ తరువాత జుట్టు ఎందుకు పెంచుకుంటున్నావని నీ జుట్టుకు భయపడి మా పార్టీలోకి ఎవరూ రావటం లేదని ఆగ్రహంతో సోమ్లా చేతులను వెనుకకు విరిచి కట్టివేశాడు. ఆ తరువాత జుట్టు, గడ్డంను బ్లేడుతో గీశారని సోమ్లా చెప్పాడు. సంవత్సరాల తరబడి దేవునిపై నమ్మకంతో పెంచుకున్న జుట్టు వెంట్రుకలను తనకు ఇస్తే దేవునికి సమర్పిస్తానని బతిమిలాడినప్పటికీ కనికరించలేదని సోమ్లా కన్నీటి పర్యంతమయ్యాడు. -
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్: ఇద్దరు నక్సల్స్ మృతి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. పురంగోల్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులు ఒకరికొకరు ఎదురుపడిన సందర్భంలో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. సంఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రిని, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. -
ఎదురుకాల్పులు.. స్థానికుడు మృతి
రాయిపూర్(ఛత్తీస్గఢ్): ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక గ్రామస్తుడు చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ వద్ద కూంబింగ్ నుంచి తిరిగి వస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా దళాలు కూడా కాల్పులు జరిపాయి. దీంతో మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. అనంతరం ఆ ప్రాంతంలో గాలించగా బాసగూడ గ్రామానికి చెందిన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఒకరు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారని బిజాపూర్ ఎస్పీ కె.ఎల్.ధ్రువ్ తెలిపారు. మృతుడిని పూనెం నందుగా, క్షతగాత్రుడిని కాకెన్ సుక్లుగా గుర్తించారు. అయితే, వీరిద్దరూ మావోయిస్టులకు చెందిన జన్మిలీషియాకు చెందిన వారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఛత్తీస్గఢ్లో పేలుడు: జవాన్లకు గాయాలు
భద్రాచలం: తెలంగాణ సరిహద్దుల్లో సోమవారం జరిగిన పేలుడు ఘటనలో ఇద్దరు జవాన్లు గాయాలపాలయ్యారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా చింతలనార్ సమీపంలో కూంబింగ్ చేస్తున్న జవాన్లే లక్ష్యంగా మావోయిస్టులు పేలుళ్లు జరిపారు. రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో జరిగిన పేలుడులో 74వ బెటాలియన్కు చెందిన ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. -
నోట్ల రద్దు: నక్సలైట్లకు షాక్..!
లతెహార్: కేంద్ర ప్రభుత్వం సంచలన రీతిలో రూ.500, రూ.1000 నోట్లను ఆకస్మికంగా రద్దుచేయడంతో మావోయిస్టులతోపాటు ఇతర నక్సలైట్ గ్రూపులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాయని, పాత నోట్లను మార్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారని జార్ఖండ్ పోలీసులు తెలిపారు. వివిధ రూపాల్లో వసూళ్ల ద్వారా సేకరించిన డబ్బును.. ఆదివాసీ గిరిజనుల సహాయంతో మార్చుకునేందుకు నక్సలైట్లు ప్రయత్నిస్తున్నట్లు, ఈ క్రమంలో కొందరు చట్టానికి చిక్కినట్లు లతెహార్(జార్ఖండ్) ఎస్పీ అనూప్ బిర్తరే బుధవారం మీడియాకు వెల్లడించారు. జార్ఖండ్ లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన లతెహార్, చుట్టుపక్కల జిల్లాల్లో నక్సలైట్ల నోట్ల మార్పిడిపై నిఘా పెంచామని ఎస్పీ పేర్కొన్నారు. బ్యాంకులో జమచేసే మొత్తంపై ఆంక్షలున్న నేపథ్యంలో గిరిజనుల ద్వారా నక్సలైట్లు నగదును మార్చుకుంటున్నారని తెలిసింది. కనీసం నోటు విలువను కూడా చెప్పలేని ఓ గిరిజన మహిళ రెండు రోజుల కిందట లతేహార్ లోని ప్రభుత్వ బ్యాంకుకు వచ్చి.. తన జనధన్ ఖాతాలో రూ.4.5 లక్షలు జమ చేసేందుకు ప్రయత్నించిందని, అయితే బ్యాంక్ అధికారులు పాన్ కార్డు అడగటంతో కంగారుపడిన ఆమె.. డిపాజిట్ చేయకుండానే వెనుదిరిగి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. మావోయిస్టు అనుబంధంగా అసోంలో పనిచేస్తున్న నక్సలైట్ గ్రూపు కూడా నోట్ల మార్పిడికి విఫల యత్నం చేసిందని, ఈ క్రమంలో భారీ నగదు కలిగిఉన్న ఇద్దరిని అరెస్ట్ చేశారని పోలీసులు పేర్కొన్నారు. నక్సలైట్లు పలువురిని బెదిరించి, బలవంతపు వసూళ్ల ద్వారా డబ్బు సేకరిస్తారు కనుక అలాంటి సొమ్మును మార్పిడి చేసేందుకు సహకరించేవారు కూడా నేరస్తులే అవుతారని, ఎట్టిపరిస్థితుల్లోనూ అలాంటివారిని వదిలిపెట్టబోమని పోలీసులు అంటున్నారు. నోట్ల కష్టాల నుంచి గట్టెకేందుకు నక్సలైట్లు గిరిజనులనే కాక కమిషన్ ఏజెంట్లను సైతం సంప్రదిస్తున్నట్లు సమాచారం. 20 లేదా 30 శాతం కమిషన్ తీసుకుని నక్సలైట్ల దగ్గరున్న పాత నోట్లు మార్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు తమకు ఆధారాలు లభించాయని, దీంతో జిల్లా వ్యప్తంగా తనిఖీలు ముమ్మరం చేసినట్లు ఎస్పీ అనూప్ చెప్పారు. -
నోయిడాలో ఆరుగురు మాయిస్టుల అరెస్ట్
నోయిడాలో ఆరుగురు మాయిస్టుల అరెస్ట్ నోయిడా : ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ అధికారులు గతరాత్రి ఆరుగురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు. హిందాన్ విహార్లో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందటంతో ఏటీఎస్ అధికారులు మెరుపు దాడి చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఏటీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిలో ఆరు పిస్టోల్స్, 50 కార్టిడ్జ్స్, మూడు కార్లు, 125 డిటోనేటర్లు, 2 ల్యాప్టాప్లను ఉన్నాయి. అరెస్ట్ అయిన మావోయిస్టులు బాంబుల తయారీలో నిపుణులని ఏటీఎస్ అధికారులు వెల్లడించారు. ఢిల్లీ - ఎన్సీఆర్ పరిధిలో దాడులకు పాల్పడేందుకు వారు కుట్ర చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. అరెస్ట్ అయినవారిలో పీడబ్ల్యూజీ కమాండర్ ప్రదీప్ కుమార్ సింగ్ ఉన్నట్లు సమాచారం. ఇతడు 2012 నుంచి అజ్ఞాతంలో ఉన్నాడు. కాగా అరెస్ట్లను ఏటీఎస్ ఐజీ అసీమ్ అరుణ్ ధ్రువీకరించారు. విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు. -
ఏఓబీలో భయాందోళన
సీలేరు: ఏఓబీ సరిహద్దు నల్లమల్ల అడవుల తర్వాత అంతటి పేరు పొందిన ఈ అటవీ ప్రాంతంలో మంగళవారం అతి దగ్గర నుంచి రెండు హెలీకాప్టర్లు గిరిజన గ్రామాల ఇళ్లపై నుంచి చక్కర్లు కొట్టడంతో ఒక్కసారిగా గిరిజనులు ఉలిక్కిపడ్డారు. నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకున్నాయి. మరో 3 రోజుల్లో మావోయిస్టు వారోత్సవాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ హెలీకాప్టర్లు చక్కర్లు కొట్టడంతో ప్రజల అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. మంగళవారం మధ్యాహ్నాం 12 గంటల కు రెండు హెలీకాప్టర్లు ఒకదాని వెంట మరొకటి చక్కర్లు కొట్టుకుని తూర్పు అటవీ ప్రాంతాల వైపు వెళ్ళాయి. అవే హెలీకాప్టర్లు మళ్ళీ 5.30 సమయంలో తిరిగి అవే గ్రామాలవైపు ఒడిశా అటవీ ప్రాంతాల వైపు వెళ్ళాయి. వీటిని చూసి స్థానాకులు మళ్ళీ ఏదో ప్రమాదం జరిగిందని తీవ్ర భయాందోళన చెందారు. మావోయిస్టు వారోత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ముందుగానే ఈ హెలీకాప్టర్లతో సర్వే చేస్తున్నారని పలువురు చర్చించుకున్నారు. -
ఐటీబీపీ క్యాంపుపై మావోయిస్టుల కాల్పులు
ఛత్తీస్ గఢ్: ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) క్యాంపుపై మావోయిస్టులు రాకెట్లు, భారీ ఆయుధాలతో కాల్పులకు తెగబడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండంగల్ జిల్లాలోని రాన్ పాల్ ప్రాంతంలో 41 వ ఐటీబీపీ పోలీసు క్యాంపుపై అర్దరాత్రి మూడు వైపుల నుంచి చుట్టు ముట్టి, భారీ ఆయుధాలతో్ మావో్లు కాల్పులకు తెగబడ్డారు. కాల్పులు తెల్లవారు జామున మూడు గంటల వరకు జరిగాయి. ఇరు వర్గాలు 600 రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం మావోలు వారు అడవుల్లోకి పారి పోయారు. ఇందులో దాదాపు 100 మంది మావోలు పాల్గొన్నట్టు సమాచారం. -
ఉగ్రవేటలో ఇక మహిళా దళం
అజ్మీర్: ఉగ్రవాదులు, నక్సల్స్ వేటలో ఇక నుంచి మహిళా రక్షక దళం కూడా తన పాత్రను పోషించనుంది. సెంట్రల్ రిజర్వ్ పొలీస్ ఫోర్స్ (సీఆర్పీఫ్) 232 మహిళా బెటాలియన్ కు చెందిన 567 మంది మహిళలు నలభై నాలుగు వారాల కఠిన శిక్షణ పూర్తి చేసుకొని అజ్మీర్ లో అవుట్ పరేడ్ ను నిర్వహించారు. ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు తమ వంతు పాత్ర పోషిస్తామని వారు శపథం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్నసీఆర్ పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కే దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఉగ్రవాద నిర్మూలనలో ఆత్మవిశ్వాసంతో పోరాడాలని పిలుపునిచ్చారు. నక్సల్ ను వేటాడేందుకు మహిళా రక్షక దళం ప్రత్యేక శిక్షణ తీసుకుంది. కరాటే, యుద్ధ విద్యల్లో ప్రావీణ్యం సంపాదించిన వీరు ఆయుధాలు లేకున్నా పోరాటం చేయగలరు. -
డిప్యూటీ కమాండర్ శ్యాం నివాస్ మృతి
హైదరాబాద్: 20 రోజుల క్రితం చత్తీస్గడ్లో నక్సల్స్ దాడిలో తీవ్రంగా గాయపడిన డిప్యూటీ కమాండర్ శ్యాం నివాస్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 10 గంటలకు తుదిశ్వాస విడిచారు. సమాచారం అందుకున్న వెంటనే హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్శర్మ ఆస్పత్రికి చేరుకుని ఆయన మృతదే హానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా హోం మంత్రి నాయిని మాట్లాడుతూ శ్యాం నివాస్ ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు శాయశక్తుల కృషి చే శారన్నారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అతని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరుపున రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామన్నారు. -
‘రెడ్ కారిడార్’కు సీఆర్పీఎఫ్ గండి
గుర్గావ్: ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బిహార్లోని తమ ప్రభావ ప్రాంతాలను కలుపుకుని పశుపతి (నేపాల్) నుంచి తిరుపతి వరకు రెడ్ కారిడార్ ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలను నక్సల్స్ ధ్వంసం చేసినట్లు సీఆర్పీఎఫ్ ప్రకటించింది. సీఆర్పీఎఫ్ను మరింత బలోపేతం చేసేందుకు 2016-17 ఆర్థిక సంవత్సరంలో మరో నాలుగు బెటాలియన్లను ఏర్పాటుచేయటంతోపాటు మౌలిక వసతులను మరింతగా పెంచుకోనున్నట్లు సీఆర్పీఎఫ్ తాజా మాజీ డీజీ ప్రకాశ్ మిశ్రా వెల్లడించారు. -
నేడు తుదిదశ పోలింగ్
15 జిల్లాల్లో జెడ్పీ, టీపీ ఎన్నికలు 17,698 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు ఎన్నికల నిర్వహణకు తరలివెళ్లిన లక్షమంది సిబ్బంది ఎన్నికలను బహిష్కరించాలని పోస్టర్లు విడుదల చేసిన నక్సల్స్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు బెంగళూరు: జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ముఖ్య ఘట్టమైన పోలింగ్ నేడు(శనివారం) జరగనుంది. మొత్తం 15 జిల్లాల్లో జరగనున్న తుది దశ పోలింగ్కు ఎన్నికల కమిషన్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. చిక్కమగళూరు, దక్షిణ కన్నడ, ఉడుపి, హాసన్, కొడగు, మండ్య, మైసూరు, చామరాజనగర, బీదర్, బళ్లారి, రాయచూరు, కల్బుర్గి, యాదగిరి, కొప్పాళ, విజయపుర జిల్లాల్లో శనివారం పోలింగ్ జరగనుంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఇక మొత్తం 15 జిల్లాలకు గాను 531 జిల్లా పంచాయతీ స్థానాలు, 1,939 తాలూకా పంచాయతీలకు సంబంధించి మొత్తం 17,698 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 4,097 కేంద్రాలను సమస్యాత్మక (సెన్సిటీవ్), 3,626 కేంద్రాలను అతి సమస్యాత్మక ప్రాంతాలుగా (హైపర్ సెన్సీటీవిటీ) అధికారులు గుర్తించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలపై ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ అక్కడి అభ్యర్థులతో పాటు వారి అనుచరుల పై గట్టి నిఘాను ఏర్పాటు చేసింది. 15 జిల్లాల్లో ఎన్నికల విధుల కోసం 1,00,243 మంది సిబ్బంది పనిచేయనున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రత పెంపు.... ఇక నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన ఉడుపి, హాసన్, రాయచూరు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధిక సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. అవసరమైన చోట బీఎస్ఎఫ్ బలగాలను సైతం మోహరించారు. నక్సల్స్ పేరిట పోస్టర్లు..... ఇక చిక్కమగళూరు జిల్లాలోని శృంగేరి తాలూకా బుకుడె బయలు గ్రామంలో ‘ఎన్నికలను బహిష్కరించాల్సిందిగా కోరుతూ నక్సల్స్ పేరిట వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ‘గ్రామాల్లో తాగునీటి సౌకర్యం, సరైన రోడ్డు సౌకర్యం, విద్యుత్ వంటివి కల్పించే వరకు ఓటు వేయడానికి వెళ్లకండి, ఎన్నికలను బహిష్కరించండి’ అని రాసి ఉన్న పోస్టర్లు ఈ ప్రాంతంలో వెలిసినట్లు గుర్తించిన శృంగేరి పోలీసులు పరిసర ప్రాంతాల్లో నక్సల్స్ జాడ కోసం కూంబింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. -
స్వగ్రామానికి మావో దంపతుల మృతదేహాలు
వరంగల్: ఒడిశాలో మూడు రోజుల క్రితం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు నేత సుశీల్కుమార్, ఆయన భార్య సోని మృతదేహాలు వరంగల్కు చేరుకున్నాయి. సుశీల్కుమార్ స్వగ్రామం నర్సంపేట మండలం భాంజిపేటలో గురువారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగనున్నాయి. పోలీసులు ప్రత్యేక అంబులెన్సులో మృతదేహాలను భాంజీపేటకు తీసుకువచ్చారు. కాగా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎన్ఓజీ) గత ఆదివారం జరిపిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు దంపతులు ప్రాణాలు కోల్పోయారు. సుశీల్ కళింగ్ నగర్ డివిజన్ కమిటీ కార్యదర్శి, ఆయనకు వ్యతిరేకంగా పలు ఠాణాల్లో 50కి పైబడి కేసులు పెండింగ్లో ఉన్నాయి. -
ఒడిశాలో మావోయిస్టు దంపతుల మృతి
భువనేశ్వర్: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎన్ఓజీ) ఎదురు కాల్పుల్లో మావోయిస్టు దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలో మావోయిస్టు సుశీల్ అలియాస్ వీరన్న అలియాస్ పుట్టపాక కుమారస్వామి, ఆయన భార్య భార్య సోనీ మృతి చెందారు. వీరన్న స్వస్థలం వరంగల్ జిల్లా. కాగా అనుగుల్, దేవ్గడ్ సరిహద్దు బారొకోట్ సమితీ పచేరీపాణి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, ఎన్ఓజీ దళా మధ్య ఆదివారం కాల్పులు జరిగాయి. నెల రోజుల వ్యవధిలో అనుగుల్ జిల్లాలో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరగడం వరుసగా ఇది మూడోసారి. మావోయిస్టు దంపతులకు వ్యతిరేకంగా పలు కేసులు పెండింగ్లో ఉన్నట్లు రాష్ట్ర డీజీపీ కేబీ సింఘ్ తెలిపారు. ఆదివారం జరిగిన కాల్పుల్లో వీరి మృతిని ధ్రువీకరించారు. మృతదేహాలను అనుగుల్ జిల్లా పల్లొటొహొడాకు తరలించారు. సుశీల్ కళింగ్ నగర్ డివిజన్ కమిటీ కార్యదర్శి, ఆయనకు వ్యతిరేకంగా పలు ఠాణాల్లో 50కి పైబడి కేసులు పెండింగ్లో ఉన్నాయి. అనుగుల్, దేవ్గడ్, రాయగడ, గజపతి జిల్లాల్లో 30 హత్య కేసులు పెండింగ్లో ఉన్నట్లు డీజీపీ వివరించారు. సుశీల్పై రూ.20 లక్షలు, అతని భార్యపై రూ.5 లక్షల రివార్డు ఉందని తెలిపారు. -
ఎంపీ కవితకు బుల్లెట్ప్రూఫ్ వాహనం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవితకు రాష్ట్ర ప్రభుత్వం బుల్లెట్ప్రూఫ్ వాహనం సమకూర్చింది. భద్రతా కారణాల రీత్యానే కవితకు ఈ వాహనం కేటాయించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో నక్సల్స్ కదలికలు ఎక్కువకావడం, పైగా ఆమెకు వారి నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలనుంచి సమాచారం రావడంతో ఆమె భద్రతను అధికారులు సమీక్షించారు. కవిత సీఎం కుమార్తె.., పార్లమెంటు సభ్యురాలు కూడా కావడంతో సెక్యూరిటీ విభాగం భద్రతను కట్టుదిట్టం చేసింది. -
ఇదో పోలీసుల ‘లొంగుబాటు’ డ్రామా!
రాయ్పూర్: నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న చత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో 26 మంది మావోయిస్టులు లొంగిపోయారంటూ పోలీసు ఉన్నతాధికారులు మీడియా సమావేశం పెట్ట మరీ గర్వంగా చెప్పుకోగా, ఇది మావోయిస్టులకు వ్యతిరేకంగా సాగిస్తున్న పోరులో పోలీసులు సాధించిన ఘన విజయమంటూ కొన్ని జాతీయ వార్తా పత్రికలు డిసెంబర్ 9వ తేదీన ఆ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి. కానీ వాస్తవాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. లొంగిపోయిన 26 మందిలో ఎవరూ మావోయిస్టులు కాదు. కనీసం సానుభూతిపరులు కూడా లేరట. అదంతా పోలీసు ఉన్నతాధికారుల స్క్రీన్ ప్లే ప్రకారం జరిగిన హైడ్రామా అని తాజాగా మీడియా దర్యాప్తులో వెల్లడైంది. సుక్మా జిల్లాలోని చింతల్నార్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల మెకానిక్ బుద్రుకు డిసెండర్ 8వ తేదీన దోర్నపాల్ పోలీస్ స్టేషన్కు రావాల్సిందిగా అంతకుముందు రోజు కబురొచ్చింది. తనపై 2010 నాటి పాత రేప్ కేసు ఒకటి పెండింగ్లో ఉండడంతో పోలీసుల ఆదేశం మేరకు 45 కిలోమీటర్ల దూరంలోని దోర్నపాల్ పోలీసు స్టేషన్కు బుద్రు వెళ్లాడు. అక్కడ పోలీసులు ‘మావోయిస్టుగా లొంగిపోతావా లేదా రేప్ కేసులో అరెస్ట్ చేయమంటావా?, పైగా మావోయిస్టుగా లొంగిపోతే పదివేల రూపాయల జీవన భృతి కూడా లభిస్తుంది’ అని బెదరించారు. అసహాయుడైన బుద్రు అలాగే చేశాడు. చింతల్నార్లోనే ఓ చిన్న వ్యాపారం చేసుకుంటున్న రమేశ్ అనే 24 ఏళ్ల యువకుడికి మావోయిస్టులు హత్య చేసినట్టుగా భావిస్తున్న ప్రత్యేక పోలీసు అధికారి నగేష్ హత్య కేసులో ఇరికిస్తామంటూ పోలీసులు ఫిక్స్ చేశారు. ఇక గోవింద్ అనే మరో షాప్ కీపర్ను ఇలాంటి ఆరోపణలతో ఠాణాకు పోలీసులు పిలిపించారు. ఎప్పడో గోవింద్ షాప్ ముందు నక్సలైట్లు ఓ వ్యక్తిని చంపిన కేసులో అతను ప్రత్యక్ష సాక్షి. అతనికి మావోయిస్టులతో ఎలాంటి సంబంధాలు లేవు. సాక్షిగా ఉన్న అతడు విచారణలో దోషిగా తేలాడని కేసు మారుస్తామంటూ పోలీసులు బెదిరించారు. చేసేదేమిలేక మావోయిస్టుగా లొంగిపోయేందుకు గోవింద్ కూడా అంగీకరించాడు. పోలీసుల ఆదేశం మేరకు బుద్రు, రమేశ్, గోవింద్లు డిసెంబర్ 8వ తేదీన దోర్నపాల్, చింతల్నార్ గ్రామాలకు మధ్యనున్న పోలంపల్లి పోలీసు స్టేషన్కు చేరుకున్నారు. అప్పటికే అక్కడ 23 మంది యువకులు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వాళ్లను కూడా ఇలాగే పాత కేసులు లేదా తప్పుడు కేసుల్లో ఇరికించినట్టు బుద్రు, రమేశ్, గోవింద్లకు తెలిసిపోయింది. బస్తర్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్ఆర్పీ కల్లూరి, పోలీసు, పౌర ఉన్నతాధికారుల సమక్షంలో మావోయిస్టుల లొంగుబాటు డ్రామా రసవత్తరంగా నడిచింది. పోలీసులు ఎలా చెబితే అలా నడుచు కోవాల్సిన దారుణ పరిస్థితుల్లో తాము బతుకుతున్నామని, అందుకే ఈ లొంగుబాటు నాటకానికి లొంగిపోవాల్సి వచ్చిందని చింతల్నార్ వాసులు వాపోతున్నారు. నక్సల్స్ ఏరివేత పేరిట 2011లో భద్రతా దళాలు ప్రజల ఇళ్లను, దుకాణాలను తగులబెట్టినప్పటి నుంచి వారు మరీ భయపడుతున్నారు. 2010లో మావోయిస్టులు 76 మంది భద్రతా సిబ్బందిని కాల్చి చంపిన సంఘటను ప్రతీకారంగా భద్రతా సిబ్బంది ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ లొంగుబాటు నాటకం గురించి ఆ ఏరియా పోలీస్ సూపరింటెండెంట్ డీ. శ్రావణ్ వద్దకు తీసుకెళ్లగా ఏదీ నాటకం కాదని, అంతా వాస్తవమేనంటూ సమర్ధించుకున్నారు. కేవలం ఆయుధాలు పట్టుకున్న మావోయిస్టులే కాదని, మావోయిస్టు సానుభూతిపరులైన, మావోయిస్టు సిద్ధాంతపరమైన ఆలోచన కలిగివున్న వారు కూడా చట్టం ముందు నేరస్థులేనని ఆయన కొత్త సిద్ధాంతం చెప్పారు. పైగా మావోయిస్టులుగా లొంగిపోయిన వారికి పదివేల రూపాయలు అందజేశామని, ఇందిర ఆవాస్ యోజన పథకం కింద వాళ్లకు ఇళ్లు కూడా ఇస్తున్నామని చెప్పారు. ఇప్పుడు వాళ్లంతా ఇంటికెళ్లి హాయిగా ఉన్నారని, లేకపోతే ఈ పాటికి అరెస్టై జైళ్లలో ఊచలు లెక్కబెట్బేరాని వ్యాఖ్యానించారు. వారిపైన కేసులను ఎత్తివేస్తారా? అన్న మీడియా ప్రశ్నకు కేసులు ఎత్తివేయడం కుదరదని, ఆ కేసుల పట్ల ఉదాసీన వైఖరిని అవలంబిస్తామని చెప్పారు. -
సినిమా చూపిస్తా మామ...
రాంచి: ప్రభుత్వ వ్యవస్థకు, అందులో భాగమైన పోలీసు వ్యవస్థకు వ్యతిరేకంగా ఇంతకాలం మావోయిస్టులు లేదా మావో సానుభూతిపరులు సినిమాలు తీస్తూ వచ్చారు. భారత్లోని మావోయిస్టుల్లో సామాజిక మార్పు తీసుకరావడానికి పోలీసులే మావోయిస్టులపై తొలిసారిగా సినిమా తీశారు. ఇదో విశేషమైతే దాదాపు డజను మంది నిజమైన పోలీసు అధికారులే ఇందులో నటించడం మరో విశేషం. మావోయిస్టుల ప్రభావం నుంచి ప్రజలను తప్పించడంలో భాగంగా వారితో మమేకమయ్యేందుకు ఇప్పటివరకు పోలీసులు చాలా వేశాలే వేశారు. ముఖ్యంగా మావోయిస్టుల ప్రభావం ఎక్కువ ఉన్న జార్ఖండ్, ఒరిస్సా రాష్ట్రల్లో ప్రజలతో కలసి ఆటల పోటీల్లో పాల్గొన్నారు. మావోయిస్టుల ప్రభావం నుంచి ప్రజలను దూరం చేసేందుకు నాటకాలు, రూపకాలు వేశారు. ఇప్పుడు నేరుగా మావోయిస్టులనే ప్రభావితం చేసి హింసామార్గాన్ని వదిలిపెట్టి వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకరావడానికి వారినే ఇతివృత్తంగా చేసుకొని సినిమా తీశారు. ‘ప్రత్యవర్తన్ ’(హోం కమింగ్-ట్యాగ్) టైటిల్తో జార్ఖండ్ పోలీసులు తీసిన ఈ చిత్రంలో జార్ఖండ్కు చెందిన ఐపీఎస్ అధికారులు పలువురితోపాటు మాజీ డీజీపీ రాజీవ్ కుమార్ సినిమాలో డీజీపీగా నటించారు. స్థానిక మల్టీప్లెక్స్లో గురువారం సాయంత్రం ఈ చిత్రం ప్రీమియర్ ప్రదర్శించారు. ప్రజల వీక్షణ కోసం నవంబర్ 13వ తేదీన విడుదల చేస్తున్నారు. పార్టీ సిద్ధాంతం నుంచి మావోయిస్టులు గాడి తప్పుతున్నారని భావిస్తున్న ఓ మావోయిస్టు జోనల్ కమాండర్ జీవితం చుట్టూ చిత్రం కథ నడుస్తుంది. ఎన్నో మలుపులు ఉండే ఈ చిత్రంలో ప్రేక్షకులను ఆకర్షించేందుకు ఓ ప్రేమ కథను కూడా జోడించారు. ఓ మావోయిస్టు యువకుడు రేప్కు గురవుతున్న ఓ అమ్మాయిని రక్షించి ఆమెకు దగ్గరవుతాడు. రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడాలనే తన నాయకుల అంచనాలకు, ప్రేమకు మధ్య నలిగిపోతాడు. జనజీవన స్రవంతిలోకి తీసుకరావడం కోసం మావోయిస్టులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఓ సినిమా తీయాలనే ఆలోచన జార్ఖండ్ డీజీపీగా ఉన్నప్పుడు రాజీవ్ కుమార్కు 2013లోనే వచ్చింది. ఆ ఆలోచన ఇప్పుడు సాకారమైంది. నిమూ భౌమిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రముఖ సింగర్ షాన్ ఇంపైన పాటలు పాడారు.శ్రీల మజుందార్, మౌసమీ భట్టాచార్య, ఇషాన్, సైకత్ ఛటర్జీ తదితరులు కూడా నటించారు. -
గోదారి వెంబడి భారీ జాతీయ రహదారి
నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లోకి పోలీసులు సులభంగా వెళ్లే వ్యూహం తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల అనుసంధానం రాష్ట్రంలో ఖమ్మం జిల్లా సారపాక నుంచి ఆదిలాబాద్ జిల్లా కౌటాల వరకు సాక్షి, హైదరాబాద్: నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు పోలీసులు సులభంగా చేరుకునేందుకు కేంద్రం కొత్త వ్యూహం రచిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ జాతీయ రహదారి నిర్మాణానికిసిద్ధమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను అనుసంధానిస్తూ గోదావరి నది తీరం వెంబడి ఈ భారీ రహదారి రూపుదిద్దుకోనుంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన డీజీపీల సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు రాగా కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ దీనికి ఆమోదముద్ర వేశారు. అనంతరం కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ కూడా ఈ జాతీయ రహదారికి పచ్చజెండా ఊపారు. ఈ రోడ్డులో భాగంగా తెలంగాణలో భద్రాచలం సమీపంలోని సారపాక నుంచి ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రం వరకు 400 కి.మీ. మేర నిర్మించనున్నారు. దీనికి రూ.2 వేల కోట్లకు పైగా వ్యయమవుతుందని అంచనా. ఇటీవల సీఎం కేసీఆర్ ఢిల్లీలో గడ్కారీతో భేటీ అయినప్పుడు తెలంగాణ భూభాగంలో రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. దీనిపై జాతీయ రహదారుల విభాగం సమగ్ర సమాచార నివేదిక (డీపీఆర్) తయారీలో నిమగ్నమైంది. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాన్ని బుధవారం రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. ఆ సమయంలో ఈ ప్రస్తావన వచ్చింది. వెంటనే ప్రతిపాదనలు రూపొందించి ఢిల్లీకి పంపాలని, ఇప్పటికే పెండింగులో ఉన్న 1,487 కి.మీ. తెలంగాణ జాతీయ రహదారుల ప్రతిపాదనలతో కలిపి కేంద్రం పచ్చజెండా ఊపనుందని వెల్లడించారు. గోదావరి వంతెనలతో అనుసంధానం ఇటీవలి కాలంలో గోదావరి నదిపై అన్ని ప్రధాన ప్రాంతాల్లో వంతెనల నిర్మాణం జరుగుతోంది. వీటిని అనుసంధానిస్తూ ఈ జాతీయ రహదారి రూపుదిద్దుకుంటుంది. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే ఒక రాష్ట్ర సరిహద్దు నుంచి మరో రాష్ట్రంలోకి పోలీసు బలగాలు సులభంగా వెళ్లేందుకు వీలవుతుందని హోంశాఖ భావిస్తోంది. దీంతోపాటు గోదావరిలో జలరవాణాకు కేంద్రం భారీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నందున దానికి కూడా ఈ రోడ్డు అనుకూలంగా ఉంటుంది. గోదావరిని ఆసరా చేసుకుని పర్యాటక రంగ అభివృద్ధికీ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో సారపాక, మణుగూరు, ఏటూరునాగారం, తుపాకుల గూడెం, కాళేశ్వరం, సిర్పూర్, కౌటాలను అనుసంధానిస్తూ ఈ 400 కి.మీ. రోడ్డు నిర్మాణం కానుంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రోడ్ల నిర్మాణంలో వేగం మందగించడంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే పనుల వేగాన్ని పెంచాలని సమీక్షలో అధికారులను ఆదేశించారు. -
తీవ్రవాద ప్రభావిత జిల్లాలుగా విశాఖ, ఖమ్మం
న్యూఢిల్లీ: వచ్చే నెల 3న నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశం కానున్నారు. నక్సల్స్ విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. మొత్తం 7 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, సీఎస్లు, డీజీపీలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. నక్సల్స్ ప్రభావాన్ని తగ్గించే దిశగా ప్రయత్నాలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఏపీ, తెలంగాణలతో పాటు ఒడిసా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలలో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉంది. మొత్తంగా ఏడు రాష్ట్రాల్లో కలిపి 31 జిల్లాలలో నక్సల్స్ ప్రభావం అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఏపీలో విశాఖ, తెలంగాణలో ఖమ్మం అతి తీవ్రవాద ప్రభావిత జిల్లాలుగా కేంద్ర హోంశాఖ అధికారులు పరిగణిస్తున్నారు. -
పోలీసులు, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు
రాయ్పూర్: చత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో సోమవారం పోలీసులు, నక్సల్స్కు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. బీజాపూర్ ఎడిషనల్ ఎస్పీ ఇందిర కళ్యాన్ తెలిపిన వివరాల ప్రకారం.. బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపైకి నక్సల్స్ ఒక్కసారిగా కాల్పులతో దాడికి పాల్పడడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. దీంతో మావోయిస్టులు దండకారణ్యంలోకి పారిపోయారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో నక్సల్స్కు సంబంధించిన బాంబులు, బ్యాగులు, పోస్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో రక్తపు మరకలు ఉన్నాయని.. మావోయిస్టులు గాయపడి లేదా మరనించి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.