GHMC (Greater Hyderabad Municipal Corporation)
-
GHMCలో ఎమ్మెల్యేలు Vs కార్పొరేటర్లు
-
ఫుట్ పాత్ ఆక్రమించిన ఎంపీ సీఎం రమేష్
-
హైదరాబాద్లో బరితెగించిన సీఎం రమేష్ అనుచరులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అనుచరులు బరితెగించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 66లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అక్రమ నిర్మాణానికి పాల్పడ్డాడు. అక్రమంగా నిర్మించిన ఇంటిని జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చే ప్రయత్నం చేశారు. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బందిని సీఎం రమేష్ అనుచరులు అడ్డుకున్నారు. ఈ ఘటన జరుగుతుండగానే సీఎం రమేష్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా, ఇప్పటికే కొంత భాగాన్ని కూల్చిన జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు సాయంతో మిగిలిన అక్రమ నిర్మాణాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చదవండి: (Revenue Deficit: రూ.9,871 కోట్ల నిధులను విడుదల చేసిన కేంద్రం) -
మమత బదిలీ.. మరునాడే నిలిపివేత!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లోని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత బదిలీని మున్సిపల్ పరిపాలన శాఖ ఒక్కరోజులోనే నిలిపివేసింది. ఆమెను ఎల్.బి.నగర్ జోనల్ కమిషనర్గా బదిలీ చేస్తూ ప్రభుత్వకార్యదర్శి సి.సుదర్శన్రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెతోపాటు మరో నలుగురు జీహెచ్ఎంసీ పరిధిలోని జోనల్/అదనపు కమిషనర్లను కూడా బదిలీ చేశారు. అయితే విధుల్లో చేరకముందే బుధవారం సాయంత్రానికల్లా మమత బదిలీని నిలిపివేస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. కూకట్పల్లి జోనల్ కమిషనర్గా బదిలీ అయిన జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ పంకజను తాజాగా ఎల్.బి.నగర్కు మార్చారు. రాష్ట్రవ్యాప్తంగా దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న స్పెషల్, సెలక్షన్ గ్రేడ్, అదనపు డైరెక్టర్, అదనపు కమిషనర్ స్థాయి అధికారులను బదిలీ చేయాలని మున్సిపల్ పరిపాలన శాఖ నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని నగర శివారు జోన్ల కమిషనర్లను తొలుత బదిలీ చేసింది. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవికిరణ్ను ఖైరతాబాద్కు, ప్రధాన కార్యాలయంలో ఉన్న అదనపు కమిషనర్, ఐఏఎస్ అధికారి ప్రియాంకను శేరిలింగంపల్లికి బదిలీ చేశారు. ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్ను నల్లగొండ మున్సిపల్ కమిషనర్గా బదిలీచేశారు. త్వరలోనే మరిన్ని బదిలీలు రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లు, ఏ గ్రేడ్ మున్సిపాలిటీలకు చెందిన కమిషనర్ల పనితీరు ఆధారంగా త్వరలో బదిలీల ప్రక్రియ సాగనుందని సమాచారం. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లతో సత్సంబంధాలు కొనసాగించనివారిపై కూడా బదిలీ వేటు పడే అవకాశముందని తెలుస్తోంది. జీహెచ్ఎంసీతోపాటు శివార్లలో కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు కూడా స్థానభ్రంశం చెందనున్నారు. ఈ మేరకు కసరత్తు పూర్తి చేసిన అధికారులు ఆమోదం కోసం సర్కారుకు ఫైల్ పంపించినట్లు సమాచారం. -
జీహెచ్ఎంసీకి పీఆర్సీ కష్టాలు, ప్రభుత్వం ఆదుకోవాల్సిందే!
సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ వేదికగా సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 30 శాతం ఫిట్మెంట్ జీహెచ్ఎంసీ ఉద్యోగులకు వరంలా కనిపించగా, ఖజానాకు మాత్రం కాస్త భారంగా మారింది. రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లకు పెంపుపై సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మొత్తానికి మోదం..ఖేదం అంటూ రెండు రకాల అభిప్రాయాలు వెలువడ్డాయి. 30 శాతం ఫిట్మెంట్ వల్ల జీహెచ్ఎంసీలోని దాదాపు ఆరువేల మంది రెగ్యులర్ ఉద్యోగులకు, మరో ఏడువేల మంది పెన్షనర్లకు వేతనాలు పెరగనున్నాయి. వీరితోపాటు ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు తదితరులకు సైతం వేతనాలు పెంచుతామని సీఎం హామీ ఇవ్వడంతో వారివీ పెరగ్గలవని భావిస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ ఖజానాపై భారం పడనుంది. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం అందరికీ వెరసి నెలకు దాదాపు రూ.120 కోట్లు వేతనాల కింద చెల్లిస్తున్నారు. ఇలా సంవత్సరానికి దాదాపు రూ.1440 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. సీఎం ప్రకటించిన ఫిట్మెంట్ను వర్తింపచేస్తే నెలకు దాదాపు రూ.36 కోట్ల వంతున సంవత్సరానికి రూ.432 కోట్లు అదనపు భారం పడుతుంది. వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే జీహెచ్ఎంసీ ఉద్యోగులకు కూడా పెరిగే వేతనాలు వర్తింపచేయాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ ఖజానా నుంచే వాటిని చెల్లించాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ వివిధ ప్రాజెక్టులను నెత్తికెత్తుకోవడంతో ఇప్పటికే ప్రతినెలా వేతనాల చెల్లింపులకు తిప్పలు పడుతోంది. గతంలో మొదటివారంలోనే వీటిని చెల్లించేవారు. ప్రస్తుతం నెలాఖరు వరకు జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం కేంద్రం నుంచి ఆర్థిక సంఘం నిధులు రూ.38 కోట్లు, రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి మరో రూ.38 కోట్లు ప్రతినెలా అందుతున్నందున వేతనాలు చెల్లించగలుగుతున్నారు. వేతనాలు పెరగనున్నందున అందుకనుగుణంగా ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సహాయం పెరగనిదే కష్టమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులకూ వర్తింపు.. జీహెచ్ఎంసీ స్థానికసంస్థ అయినా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జీహెచ్ఎంసీ ఉద్యోగులకూ పీఆర్సీ వర్తింపు ఉంటుందని ఉన్నతాధికారులు తెలిపారు. ఫిట్మెంట్ కనుగుణంగా పెరిగే జీతాలు చెల్లించేందుకు స్టాండింగ్ కమిటీ ప్రభుత్వానికి సమాచారమివ్వడం సంప్రదాయం మాత్రమేనని పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో , ఈనెలాఖరున రిటైర్ కావాల్సిన వారు జీహెచ్ఎంసీలో 17 మంది ఉన్నారు. ఈసంవత్సరాంతానికి రిటైర్ కావాల్సిన వారు 236 మంది ఉన్నారు. రిటైర్మెంట్ వయసు పెంపు వల్ల రానున్న మూడేళ్లలో రిటైర్ కానున్న 858 మందికి లబ్ధి కలిగిందని జీహెచ్ఎంసీ పేర్కొంది. రిటైర్మెంట్ వయసు పెంపుపై జీహెచ్ఎంసీలో కొందరు హర్షం వ్యక్తం చేయగా,కొందరు ఎక్కువకాలం పనిచేయాలని తమకు లేదని పెదవి విరిచారు. వేతనాలు, రిటైర్మెంట్ వయసుపెంపుపై మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, పలువురు టీఆర్ఎస్ కార్పొరేటర్లు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వోద్యోగులతోపాటు ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచి సీఎం తన పెద్ద మనసు చాటుకున్నారని కొనియాడారు. మేయర్, తదితరులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. చదవండి: హెచ్ఆర్ఏ తగ్గిస్తే..తగ్గనున్న వేతనాలు -
తెలంగాణలో చాప కింద నీరులా కరోనా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇటు దేశంలో కరోనా ఉధృతి అధికమైంది. అటు పొరుగునే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల్లో మహమ్మారి విజృంభిస్తోంది. ప్రజల్లో నిర్లక్ష్యం ఫలితంగా తెలంగాణలోనూ వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో ఆరు రోజుల వ్యవధితో పోలిస్తే ఇప్పుడు 26 జిల్లాల్లో కేసులు పెరిగాయి. కొన్నిచోట్ల స్వల్పంగా, కొన్నిచోట్ల కాస్తంత ఎక్కువగానే నమోదయ్యాయి. జీహెచ్ఎంసీలో ఈ నెల 8వ తేదీన 31 కరోనా కేసులుండగా, శనివారం 46 నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 8వ తేదీన 10 కేసులుంటే, శనివారం 15 కేసులకు పెరిగాయి. కాగా శనివారం 50,998 మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో 228 మందికి పాజిటివ్ వచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు ఆదివారం ఉదయం బులెటిన్లో వెల్లడించారు. మొత్తం ఇప్పటివరకు 92,00,465 నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 3,01,161 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో శనివారం 152 మంది కోలుకోగా, ఇప్పటివరకు 2,97,515 మంది కోలుకున్నారు. ఈ ఒక్కరోజులో ఒకరు చనిపోగా, మొత్తం కరోనాతో 1,653 మంది మృతి చెందారు. 367 మంది వెంటిలేటర్పై.. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 1,993 కరోనా యాక్టివ్ కేసులుండగా, అందులో ఇళ్లు, కోవిడ్ కేర్ కేంద్రాల్లో 795 మంది ఐసోలేషన్లో ఉన్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.78 శాతం ఉండగా, మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. ఇప్పటివరకు ప్రతీ పది లక్షల జనాభాలో 2,47,191 మందికి పరీక్షలు చేశారు. శనివారం నిర్వహించిన 50,998 కరోనా పరీక్షల్లో 46,067 ప్రభుత్వంలో.. 4,931 ప్రైవేట్లో చేశారు. ఆదివారం లెక్కల ప్రకారం రాష్ట్రంలోని కరోనా రోగుల్లో 590 మంది ఆక్సిజన్ పడకలపై, 367 మంది వెంటిలేటర్/ఐసీయూ పడకలపై చికిత్స పొందుతున్నారు. 2.15 లక్షల మందికి వ్యాక్సిన్.. రాష్ట్రంలో శనివారం నాటికి 60 ఏళ్లు పైబడినవారు, 45–59 ఏళ్ల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కలసి మొత్తం 2,15,980 మంది టీకా వేయించుకున్నారని శ్రీనివాసరావు వెల్లడించారు. ఇక జనవరి 16వ తేదీ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో మొదటి డోస్ టీకా తీసుకున్నవారు 5,27,117 మంది కాగా, రెండో డోస్ టీకా తీసుకున్నవారు 2,22,080 మంది ఉన్నారు. అంటే మొత్తం మొదటి, రెండో డోస్ టీకాల సంఖ్య 7,49,197కు చేరింది. ఇక శనివారం 60 ఏళ్లు పైబడిన 10,539 మందికి, 45–59 ఏళ్ల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో 7,793 మందికి మొదటి డోస్ టీకా ఇచ్చారు. ఇటు 753 మంది వైద్య సిబ్బంది, 474 మంది ఫ్రంట్లైన్ వర్కర్లకు కూడా శనివారం మొదటి డోస్ టీకా ఇచ్చారు. అలాగే ఈ ఒక్కరోజులో 165 మంది వైద్య సిబ్బందికి, 2,693 మంది ఫ్రంట్లైన్ వర్కర్లకు రెండో డోస్ టీకా వేశారు. ఇలా ఒక్కరోజులో మొదటి, రెండో డోస్ టీకా పొందినవారు 22,417 మంది ఉన్నారు. -
సగం ఆస్తి పన్ను మాఫీ
సాక్షి, హైదరాబాద్ : గృహ యజమానులు, వరద బాధితులు, జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బందికి పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు దీపావళి రోజు పండుగ కానుకలు ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో రూ.15 వేలలోపు వార్షిక ఆస్తిపన్ను ఉన్న ఇళ్ల యజమానులకు 2020–21 సంవత్సరానికి సంబంధించి 50 శాతం ఆస్తిపన్ను మాఫీ చేస్తున్నట్టు చెప్పారు. అలాగే, రాష్ట్రంలోని మిగిలిన 140 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో సైతం రూ.10 వేలలోపు ఆస్తిపన్ను ఉన్న వారికీ ఆస్తిపన్నులో 50 శాతం మాఫీ చేస్తున్నామని తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలో 13.72 లక్షల ఇళ్ల యజమానులకు రూ.196.48 కోట్లు, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో 31.40 లక్షల ఇళ్ల యజమానులకు రూ.326.48 కోట్ల రాయితీ లభిస్తుందన్నారు. ఇప్పటికే 2020–21కి సంబంధించిన ఆస్తిపన్నులను చెల్లించిన వారికి సైతం ఈ మాఫీ వర్తిస్తుందని, వచ్చే ఏడాది (2021–22)కి సంబంధించిన వీరి ఆస్తిపన్నులను ఆ మేరకు సర్దుబాటు చేస్తామన్నారు. రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో మంత్రి కేటీఆర్ శనివారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమయ్యారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్తో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, దీనికి తోడు ఇటీవల భారీ వర్షాలు, వరదలతో జీహెచ్ఎంసీతో పాటు చుట్టుపక్కలున్న 15 పురపాలికల ప్రజలు సర్వం కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్నారని, వారి కోసం ఇంకేమైనా చేస్తే బాగుంటుందని గత శుక్రవారం జరి గిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోమంత్రులందరూ సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారని కేటీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో శనివారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమై ఈ మేరకు ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకున్నామన్నారు. కాగా, మంత్రి కేటీఆర్ ప్రకటన మేరకు 50 శాతం ఆస్తిపన్నును మాఫీచేస్తూ అదేరోజు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. మాఫీచేసిన ఆస్తిపన్నును సంబంధిత పురపాలికలకు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మీ–సేవ ద్వారా ‘వరద సాయం’ ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో హైదరాబాద్ నగరం, దాని చుట్టుపక్కల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని మంత్రి కేటీఆర్ తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మోకాల్లోతు నీళ్లున్న ముంపు కాలనీల్లో పర్యటించి ప్రజలకు అండగా నిలిచారని, ఎవరూ అడగక ముందే మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించడానికి రూ.530 కోట్లను విడుదల చేశారని గుర్తుచేశారు. శనివారం నాటికి 4,75,871 కుటుంబాలకు రూ.475 కోట్ల సహాయం పంపిణీ చేశామన్నారు. ఇంకా ప్రభుత్వ సహాయం అందని బాధిత కుటుంబాలు మీ–సేవ కేంద్రాల ద్వారా సహాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులపై విచారణ జరిపి అర్హుల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సహాయాన్ని జమ చేస్తామన్నారు. పేరు, ఇంటి నంబర్, ప్రాంతం, మొబైల్, ఆధార్ నంబర్, పిన్కోడ్, బ్యాంకు ఖాతా నంబర్ వివరాలను దరఖాస్తుతో పాటు అందజేస్తే సరిపోతుందన్నారు. ఈ మేరకు మీ–సేవ కేంద్రాల ద్వారా వరద బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, అర్హుల బ్యాంకు ఖాతాల్లో సహాయాన్ని జమ చేయాలని ఆదేశిస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్కుమార్ ప్రత్యేక మెమో జారీచేశారు. గ్రేటర్ పారిశుద్ధ్య సిబ్బంది వేతనాలు పెంపు జీహెచ్ఎంసీ పారిశుధ్య, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది వేతనాలను రూ.14 వేల నుంచి రూ.17 వేలకు, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు/ఎంటమాలజీ ఫీల్డ్ అసిస్టెంట్ల వేతనాలను రూ.14,500 నుంచి రూ.17,500కు పెంచుతున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దీపావళి కానుకగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కరోనా వచ్చినా పారిశుధ్య, వైద్య సిబ్బంది ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజలకు సేవలందిస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఈ మేరకు వేతనాలను పెంచుతూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. అదనపు ఈపీఎఫ్, ఈఎస్ఐ కలిపి రూ.3 వేల పెంపు వర్తిస్తుందన్నారు. ఫిబ్రవరి 10 వరకు టైం ఉంది.. ‘తొందరేం ఉంది.. ఫిబ్రవరి 10 వరకు మాకు టైం ఉంది.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం.. మీరెందుకు తొందర పడుతున్నారు’అని మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాలను ప్రకటించడంతో ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశాలున్నాయని ఊహాగానాలున్న సమయంలో మంత్రి కేటీఆర్ ఇలా పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. ముందే అనుకున్నట్టు ప్రస్తుత నవంబర్లోషెడ్యూల్ జారీచేస్తారా? లేక కొంత కాలం వేచిచూస్తారా? అన్న అంశంపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
గ్రేటర్లోనే 10 వేల కరోనా కేసులు
సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు 10 వేలు దాటాయ్. శనివారం 888 కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృత్యువాత పడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 13,436 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వీటిలో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 10,150 పాజిటివ్ కేసులున్నాయి. ఇప్పటికే 243 మంది మృతి చెందారు. వీరిలో 206 మందికిపైగా నగరవాసులే. అత్యధిక కేసులు నమోదైన జిల్లాల్లో హైదరాబాద్ తొలిస్థానంలో ఉండగా, రెండో స్థానంలో రంగారెడ్డి, మూడో స్థానంలో మేడ్చల్, నాలుగో స్థానంలో సూర్యాపేట, ఐదోస్థానంలో నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయి. కాగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో కరోనా మృత్యు మృదంగం మోగిస్తోంది. (కోటికి చేరుకున్న కరోనా కేసులు) ఇప్పటికే పలువురు ఉద్యోగులు కరోనా వైరస్ బారిన పడ్డారు. తాజాగా శనివారం ఐడీపీఎల్ లైన్స్ అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) సురేష్ సహా రాజేంద్రనగర్ డివిజన్లో పని చేస్తున్న లైన్ ఇన్స్పెక్టర్ అబ్దుల్హమీద్లు కరోనాతో మృతి చెందారు. సిటీసౌత్ సర్కిల్లో పని చేస్తున్న మరో అసిస్టెంట్ లైన్మెన్ గుండెపోటుతో చనిపోయినట్లు సమాచారం. విద్యుత్ సంస్థలో ఒకేరోజు ముగ్గురు క్షేత్రస్థాయి ఉద్యోగులు మృతి చెందడంతో ఆ విభాగంలో విషాదం నెలకొంది. ఇప్పటికే 300 మంది పోలీసు సిబ్బంది కరోనా వైరస్ బారిన పడగా.. తాజాగా మరో తొమ్మిది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో సీసీఎస్లో 8, సైబర్ క్రైంలో ఒక పాజిటివ్ కేసు నమోదయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేస్తున్న పది మంది ఆరోగ్య మిత్రలకు కరోనా వైరస్ సోకింది. ఉస్మానియా వైద్య కళాశాల పరిధిలో ఇప్పటికే వంద మంది వైద్య సిబ్బంది కరోనా వైరస్ బారిన పడగా, గాంధీలో 30 మంది వైద్య సిబ్బందికి వైరస్ సోకడంతో ఆస్పత్రి వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. శివారులో శివాలు! గ్రేటర్ను ఇప్పటికే బెంబేలెత్తిస్తున్న కోవిడ్.. తాజాగా శివారు మున్సిపాలిటీలను చుట్టేస్తోంది. పాతబస్తీ, ఓల్డ్ మలక్పేట్, జియాగూడ, సబ్జిమండి, మేకల మండి, మలక్పేట గంజ్ మార్కెట్లు కేంద్రంగా కోర్సిటీలో విస్తరించిన వైరస్.. తాజాగా ఔటర్ రింగ్రోడ్డుకు అటు, ఇటుగా ఉన్న శివారు మున్సిపాలిటీల్లో విరుచుకుపడుతోంది. జీహెచ్ఎంసీకి ఆనుకుని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఇన్నర్ రింగ్రోడ్డుకు బయట, ఔటర్ రింగ్రోడ్డుకు లోపల ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలున్నాయి. ఆయా ప్రాంతాల్లో రోజుకు సగటున 50 నుంచి 100 కేసులు నమోదవుతున్నాయి. జల్పల్లిలో అత్యధికంగా 90, బోడుప్పల్లో 35, మీర్పేటలో 28, పీర్జాదిగూడ, నిజాంపేటలో 15 కేసుల చొప్పున నమోదయ్యాయి. బడంగ్పేట్, జవహర్నగర్లో 12, నార్సింగ్లో 11, తుర్కయాం జాల్లో 10 కేసులు నమోదయ్యాయి. బండ్లగూడ జాగీర్, మణికొండలలో 9 కేసుల చొప్పున నమోదు కాగా, పెద్ద అంబర్పేటలో నాలుగు కేసులు వెలుగు చూశాయి. నగరంలోని ప్రధాన ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యులతో పాటు పోలీసు విభాగం, సచివాలయ ఉద్యోగులు, జర్నలిస్టులు సహా ఐటీ, దాని అనుబంధ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో చాలా మంది శివారు మున్సిపాలిటీల్లోనే నివాసం ఉంటున్నారు. విధి నిర్వహణలో భాగంగా వీరంతా రోజూ కోర్సిటీలోని ఆఫీసులకు వెళ్లి వస్తున్నారు. అలాగే శివారు ప్రాంతాల్లోని రైతులు, ఇతర వ్యాపారులు తమ ఉత్పత్తులను నగరంలోని ప్రధాన మార్కెట్లకు తరలించి విక్రయిస్తుంటారు. ఇప్పటి వరకు కోర్íసిÜటీకే పరిమితమైన కరోనా వైరస్.. రాకపోకలు పెరగడంతో శివారు ప్రాంతాలకు విస్తరించింది. ప్రస్తుతం గ్రేటర్తో పోటీ పడుతున్నట్లుగా శివారు జిల్లాల్లో కేసులు పెరుగుతుండటానికి ఇదే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిలిచిన టెస్టులతో పరేషాన్.. కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తుండటంతో గ్రేటర్ హైదరాబాద్ సహా శివారులోని మొత్తం 30 నియోజక వర్గాల్లో 50 వేల టెస్టులు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ మేరకు ఈ నెల 16 నుంచి ఇప్పటి వరకు 36 వేల నమూనాలు సేకరించింది. ప్రస్తుతం ప్రభుత్వ డయాగ్నోస్టిక్స్లో 2,290 టెస్టులు.. ప్రైవేటు ల్యాబ్స్లో 2,160 టెస్టులు చేసే సామర్థ్యం ఉంది. ఇప్పటి వరకు సేకరించిన నమూనాల్లో 30 వేల నమూనాలను పరీక్షించి, రిపోర్టులు జారీ చేసింది. మరికొన్ని నమూనాల రిజల్ట్స్ రావాల్సి ఉంది. ఐసీఎంఆర్ నుంచి అనుమతి పొందిన ప్రైవేటు ల్యాబ్స్ల్లో పరీక్షల నిర్వహణ తీరు అధ్వానంగా ఉన్నట్లు ప్రభుత్వ నిపుణుల కమిటీ గుర్తించింది. ఇప్పటికే టెస్టుల నిర్వహణ సామర్థ్యానికి మించి నమూనాలు వచ్చి చేరడం, మరో వైపు ప్రైవేటు ల్యాబ్స్లో టెస్టుల నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రభుత్వం ఆయా డయాగ్నోస్టిక్స్లో పరీక్షలను నిలిపివేసింది. నమూనాల సేకరణ కూడా ఆపేయడంతో ఇప్పటికే దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్న వారు ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రుల్లోని పడకలు కూడా రోగులతో నిండిపోవడంతో కొత్తగా వైరస్ బారిన పడిన వారికి అడ్మిషన్ దొరకని దుస్థితి. హోం క్వారంటైన్లోనే మూడు వేలకుపైనే.. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 12,349 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలోనే 9,262 కేసులు నమోదు కావడం విశేషం. నగరంలో మార్చి నుంచి మే వరకు 1,616 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. జూన్లో 26 రోజుల్లోనే.. 7,646 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 237 మంది మృతి చెందారు. వీరిలో 200 మందికిపైగా కోర్సిటీ సహా శివారు ప్రాంతాలకు చెందినవారే కావడం గమనార్హం. కరోనా బాధితుల చికిత్స కోసం ప్రభుత్వం 34 కోవిడ్ ఆస్పత్రులను ఎంపిక చేసింది. వీటి పరిధిలో 17,081 పడకలను సిద్ధం చేసినట్లు ప్రకటించింది. వీటిలో 10,970 ఐసోలేషన్ బెడ్స్ ఉండగా.. 3,227 పడకలకు మాత్రమే ఆక్సిజన్ సరఫరా ఫెసిలిటీ ఉంది. 1,448 ఐసీయూ పడకలు ఉండగా, వీటిలో 460 వెంటిలేటర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గాంధీ, కింగ్కోఠి, ఛాతి ఆస్పత్రి, ఆయుర్వేద, నేచర్ క్యూర్, ఉస్మానియా ఆస్పత్రుల్లోని ఐసీయూ, ఐసోలేషన్ పడకలు రోగులతో నిండిపోయాయి. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కొత్తగా వైరస్ బారిన పడిన వారికి అడ్మిషన్ దొరకని పరిస్థితి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు ఖాళీగా లేవు. ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రులు చేర్చుకునేందుకు నిరాకరిస్తున్నాయి. దీంతో ఏ లక్షణాలు లేని పాజిటివ్ బాధితులతో పాటు వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులు కూడా విధిలేని పరిస్థితుల్లో హోం క్వారంటైన్లోనే ఉంటున్నారు. ప్రస్తుతం 7,436 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మూడు వేలకుపైగా కేసులు హోం క్వారంటైన్లో ఉండటం గమనార్హం. -
హైదరాబాద్లో దడపుట్టిస్తున్న కరోనా
సాక్షి, సిటీబ్యూరో : కరోనా పాజిటివ్ కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ రోజుకో సరికొత్త రికార్డు సృష్టిస్తున్నది. తాజాగా శనివారం రికార్డు స్థాయిలో 179 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 11న అత్యధికంగా 175 కేసులు నమోదు కాగా.. తాజాగా కోవిడ్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. అంతేకాదు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4737 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో ఇప్పటి వరకు 182 మంది మృతి చెందారు. 2352 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం 2203 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 80 శాతం మంది గ్రేటర్వాసులే ఉన్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఎక్కువగా వైరస్ బారిన పడుతుండటం ఆందోళన కల్గిస్తోంది. కరోనా విస్తరణ నగరంలో కొనసాగుతోంది. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచి కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మహమ్మారి విస్తరిస్తున్న తీరుపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. (స్వచ్ఛందంగా లాక్డౌన్) ఎల్బీనగర్ : ఎల్బీనగర్ సర్కిళ్ల పరిధిలో శనివారం 4 కరోపా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మన్సూరాబాద్ డివిజన్ లెక్చరర్స్ కాలనీలోని ఎస్వీ హోమ్స్ అపార్టుమెంట్లో ఉండే ఓ వ్యక్తి(37)కి కరోనా పాజిటివ్గా గుర్తించారు. మన్సూరాబాద్లోని శ్లోకా స్కూల్ సమీపంలో నివాసముండే ఓ వ్యక్తి(32)కి, ఇదే డివిజన్కు చెందిన చంద్రపురికాలనీలోని రోడ్ నంబర్–5లో నివాసముండే మరో వ్యక్తి(38)కి కరోనా పాజిటివ్గా గుర్తించారు. సర్కిల్–5లో అష్టలక్ష్మీ టెంపుల్ సమీపంలోని వాసవీకాలనీలోని ఓవ్యక్తి కరోనా బారిన పడ్డారు. ఇతను నగరంలో ఎస్బీఐలో డిప్యూటీ మేనేజర్ పనిచేస్తున్నారు. వీరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రగతి నగర్లో... నిజాంపేట్ : ప్రగతి నగర్లో సాయి భవాని టిఫిన్ సెంటర్ యజమానికి కరోనా ఫాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. పరిసర ప్రాంతాల ప్రజలతోపాటు, కార్పొరేషన్ సిబ్బంది కూడా ఇక్కడి నుంచి టిఫిన్స్ తీసుకెళ్లడంతో ఆందోళన అధికం అవుతోంది. రాంగోపాల్పేట్ డివిజన్లో... రాంగోపాల్పేట్: రాంగోపాల్పేట్ డివిజన్లో ఇద్దరు మహిళలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. వెంగళరావునగర్కు చెందిన ఓ మహిళ(58) జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తుంది. బేగంపేట బ్రాహ్మణవాడిలో విధులు నిర్వహిస్తూ కళ్లు తిరిగి పడిపోయింది. పంజగుట్టలోని నిమ్స్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. ఈఎస్ఐలో ఉచిత వైద్యం అందుబాటులో ఉండగా అక్కడికి తరలించారు. తలకు తీవ్రమైన గాయం కావడంతో సిటీ స్కాన్ కోసం సచివాలయ ప్రాంతంలోని మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్గా నిర్ధారణ అయింది. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని గాస్మండిలో మరో వృద్ధురాలి(62)కి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆమె దీర్ధకాలిక రోగాలతో నిమ్స్లో చికిత్స పొందుతుంది. వైద్యులు ఆమెకు కరోనా టెస్టు చేయగా పాజిటివ్గా తేలింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో... వెంగళరావునగర్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏడుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని జీహెచ్ఎంసీ సర్కిల్–19 ఉప కమిషనర్ ఎ.రమేష్ తెలిపారు. యూసుఫ్గూడ డివిజన్ హైలాంకాలనీలోని బాలుడు(15), అదే ప్రాంతానికి చెందిన యువకుడు(28), శ్రీకృష్ణానగర్లోని మహిళ(33)కు కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. అలాగే రహమత్నగర్ డివిజన్లోని శ్రీరామ్నగర్కు చెందని ఓ యువకుడు(29), బాబా సైలానీనగర్లోని ఓ వ్యక్తి(58), ఓంనగర్కు చెందిన మహిళ(52) మహమ్మారి బారిన పడ్డారన్నారు. బోరబండ డివిజన్ ఎస్ఆర్టీనగర్లోని మహిళ(51) కు కరోనా వచ్చినట్టు డీఎంసీ పేర్కొన్నారు. శేరిలింగంపల్లిలో... శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లిలో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. హఫీజ్పేట్ ప్రేమ్నగర్కు చెందిన టైర్ పంక్ఛర్ చేసే వ్యక్తి(47)కి పాజిటివ్గా రావడంతో చెస్ట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. చందానగర్ రాజేందర్రెడ్డి కాలనీకి చెందిన 57 ఏళ్ల వ్యక్తికి రావడంతో ప్రైవేటు హాస్పిటల్ చికిత్స పొందుతున్నాడు. గచ్చిబౌలికి చెందిన 52 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిజివ్ రావడంతో హోం క్వారంటైన్లో ఉన్నాడు. ఎస్ఆర్నగర్ పీఎస్లో... అమీర్పేట: ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్లో పనిచేసే ఇద్దరు పోలీసులకు పాజిటివ్ ఇచ్చింది. జనరల్ డ్యూటీలో పనిచేసే కానిస్టేబుల్తోపాటు హోంగార్డుకు కరోనా నిర్ధారణ అయింది. చికిత్స నిమిత్తం వారిని ఎర్రగడ్డ ఛాతీ వైద్య ఆస్పత్రికి తరలించారు. బోడుప్పల్లో... బోడుప్పల్: బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో ఐదుగురికి కరోనా పాజిటివ్ రాగా ఓ మహిళ మృతిచెందింది. భాగ్యనగర్ కాలనీలోని స్నేహ నివాస్లో ఉండే ఓ మహిళ (53) కరోనాతో ఆస్పత్రి చికిత్స పొందుతూ మృతిచెందింది. బోడుప్పల్ లెక్చరర్స్ కాలనీలో ఓ టీవీ రిపోర్టర్(42)కు కరోనా సోకింది. వారి కుటుంబంలో భార్య, ఇద్దరు పిల్లలకు కరోనా పాజిటివ్గా తేలడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రకటనలకు కొత్త విధానం
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో అన్ని రకాలైన అడ్వర్టయిమెంట్లకు సంబంధించి కొత్త విధానం అమలులోకి వచ్చింది. నగరంలో ఏర్పాటు చేసే హోర్డింగ్స్పై గరిష్ట ఎత్తును జీహెచ్ఎంసీ నిర్ధేశించింది. హోర్డింగ్స్ 15 అడుగుల ఎత్తును మించి ఉండరాదన్న నిబంధన విధించింది. వాహనాలపై ఏర్పాటు చేసే ప్రకటనలకు కచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాలని జీహెచ్ఎంసీ స్పష్టంగా పేర్కొంది. అలాగే, నాలలు, నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రకటనలను పూర్తిగా నిషేధించింది. అడ్వర్టయిజ్మెంట్స్కు సంబంధించి హోర్డింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు కచ్చితంగా రోడ్డు, ప్రజాభద్రత విధివిధానాలను పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా హోర్డింగ్స్ ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ శనివారం హెచ్చరించింది. (‘ఒకరి బాధకు కారణమవ్వకండి’) -
జీహెచ్ఎంసీ పరిధిలో 427 కరోనా పాజిటివ్ కేసులు
-
పారిశుధ్య కార్మికులకు కరోనా ఎఫెక్ట్!
సాక్షి, హైదరాబాద్: కరోనా కష్టకాలంలో చెత్త సేకరిస్తున్న జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మాస్కులు లేకుండానే వారు చెత్త సేకరణకు వెళ్లడంతో ఇంటి యజమానులు అభ్యంతరం చెప్తున్నారు. వైరస్ నియంత్రణ చర్యలు పాటించకుండా, గుర్తింపు కార్డులు లేకుండా ఇళ్లల్లోకి ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈనేపథ్యంలో కరోనా వైరస్ను దృష్టిలో ఉంచుకుని తమకు గుర్తింపు కార్డులు, మాస్కులు, గ్లౌజులు ఇవ్వాలని జీహెచ్ఎంసీ కోరుతూ మాల్కాజిగిరి జోన్లోని పారిశుధ్య కార్మికులు డిప్యూటీ కమిషనర్కు వినతి పత్రం అందజేసారు. (చదవండి: ఇలాంటివి కూడా చోరీ చేస్తారా..!) లాక్డౌన్ నేపథ్యంలో గుర్తింపు కార్డులు లేవని పోలీసులు తమను ఇబ్బంది పెడుతున్నారని, చెత్త సేకరణకు వెళితే ఇంటి యజమానులు సైతం గుర్తింపు కార్డులు, మాస్కులు ధరించపోతే రావద్దంటున్నారని పారిశుధ్య కార్మికులు వాపోయారు. కాగా, పారిశుధ్య కార్మికులకు స్థానికులు మద్దతుగా నిలిచారు. అధికారులు, ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే చెత్త సేకరణ ఆగిపోతుందని వారు హెచ్చరించారు. (చదవండి: దేశానికి సేవ చేసేందుకు ఎప్పుడూ సిద్ధమే: నటి) -
కరోనా వ్యాప్తి చెందకుండా జీహెచ్ఎంసీ చర్యలు
-
దోమలపై ‘స్మార్ట్’ ఫైట్
సాక్షి, హైదరాబాద్:మస్కీట్.. ఇది దోమల నివారణ యంత్రం. దోమలు నగరంలో ఏయే ప్రాంతాల్లో అధికంగా ఉన్నాయి.. ఏ రకం దోమ వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి.. అనే వివరాలు తెలుసుకు నేందుకు జీహెచ్ఎంసీ దీన్ని వినియోగించనుంది. క్యాచ్, కౌంట్, క్లాసిఫ్ అనే మూడు పనులను ఈ పరికరం చేస్తుంది. మెషీన్లోని సువాసనలతో కూడిన లిక్విడ్, సెన్సర్ల వల్ల దోమలు దీంట్లోకి వస్తాయి. దీంతో ఆయా వాటిలోని దోమలను వర్గీకరించి.. ఫలానా వ్యాధిని కలిగించే దోమలు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. తద్వారా సదరు ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టవచ్చు. నిరోధక చర్యలు చేపట్టాక ఏ మేరకు దోమలు తగ్గాయో కూడా తెలుసుకోవచ్చు. నగరంలో జోన్కొకటి వంతున దీన్ని వినియోగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ తెలిపారు. దీని వ్యయం రూ.60 వేలని చెప్పారు. -
‘నోటీసులుండవు; అక్రమమైతే కూల్చేస్తాం’
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ చట్టంపై రాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మాట్లాడుతూ.. ‘పంచవర్ష ప్రణాళికలను ప్రజాప్రతినిధులు అధ్యయనం చేయాలి. మనది బలమైన పునాదులున్న ప్రజాస్వామ్యం. మున్సిపల్ చట్టాన్ని పారదర్శకంగా రూపొందించాం. నిధులు, అధికారాలు మున్సిపాలిటీలకే. కొన్ని అధికారాలను కలెక్టర్లకు కేటాయించాం. ప్రతి మున్సిపల్ వార్డులో ప్రజాదర్బారు ఉంటుంది. అర్బన్ లోకల్ బాడీస్ కూడా పద్ధతిగా ఉండాలి. ప్రతియేడు రూ.3,200 కోట్ల నిధులు గ్రామాలకు వెళ్తాయి. 500 జనాభా ఉండే పంచాయతీకి కనీసం రూ.5 లక్షలు అందిస్తాం. పట్టణాలకు రూ.2,060 కోట్లు వెళ్తాయి. 500 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే భవనాలకు మున్సిపల్ ఆఫీసుల చట్టూ తిరగాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఇకపై 128 మున్సిపాలిలు ఉంటాయి. నగర పంచాయతీలు ఉండవు. మున్పిపాలిటీల్లో ఆస్తిపన్ను కట్టకుండా అబద్ధాలు చెబితే 25 రెట్ల జరిమానా విధిస్తాం. ఎన్నికల నిర్వహణలో ఈసీకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. కేవలం ఎన్నికల తేదీలను మాత్రమే ప్రభుత్వం ప్రకటిస్తుంది. మున్సిపల్ వ్యవస్థను అవినీతి రహితం చేయడమే లక్ష్యం. 75 చదరపు గజాల్లోపు ఉన్న ఇల్లుకు ఏడాదికి రూ.100 పన్ను చెల్లించాలి. 75 చదరపు గజాల్లోపు జీ+1 కడితే అనుమతి అవసరం లేదు. ఒక్క రూపాయితోనే రిజిస్ట్రేషన్ ఉంటుంది. అక్రమ కట్టడాలను రాష్ట్రంలో ఎక్కడా అనుమంతించం. అక్రమ నిర్మాణమని తెలిస్తే వెంటనే కూల్చేస్తాం. ఎలాంటి నోటీసులు ఇవ్వం’అన్నారు. -
జీహెచ్ఎంసీకి మరో జాతీయ అవార్డు
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి మరో జాతీయస్థాయి అవార్డుకు ఎంపికైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఎక్సలెన్సీ 2018 అవార్డును దక్కించుకుది. నేడు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించగా రాష్ట్రంలోని 13 మందికి అధికారులకు అవార్డులు దక్కగా వీరిలో జీహెచ్ఎంసీ కమీషనర్ డాక్టర్. బి. జనార్ధన్ రెడ్డి కూడా ఉండడం విశేషం. గ్రటర్ హైదరాబాద్లో చేపడుతున్న లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మాణాలకు అతి తక్కువ సమయంలో భూసేకరణ చేయడం సఫలీకృతమైనందుకు కమీషనర్ బి. జనార్ధన్ రెడ్డి ఆయనకు అభినందనలు తెలిపారు. -
పరిశ్రమలపై పెత్తనం ఎందుకు..?
ఐలాను జీహెచ్ఎంసీలో విలీనం చేయడాన్ని ఒప్పుకోం పరిశ్రమల మంత్రికి తేల్చిచెప్పిన తెలంగాణ పారిశ్రామిక వేత్తలు 30 పారిశ్రామికవేత్తల సంఘాలతో జూపల్లి సమావేశం సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక వాడలపై జీహెచ్ఎంసీ పెత్తనాన్ని తగ్గించాలన్న డిమాండ్ పెరుగుతోంది. పారిశ్రామిక ప్రాంతాల్లో ఆస్తిపన్ను వసూళ్లు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ(ఐలా)లను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ఇటీవలి కాలంలో కమిషనర్ సోమేశ్కుమార్ చేస్తున్న ప్రయత్నాలపై పారిశ్రామిక వేత్తలు విరుచుకుపడ్డారు. పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంటే జీహెచ్ఎంసీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని, పారిశ్రామిక వేత్తలను పీడించడమే ధ్యేయంగా వ్యవహరిస్తుందని తెలంగాణ పారిశ్రామిక వేత్తలు ముక్తకంఠంతో ధ్వజమెత్తారు. పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, పరిశ్రమల కమిషనర్ జయేష్ రంజన్లతో సోమవారం సచివాలయంలో తెలంగాణ పారిశ్రామిక వేత్తల సంఘం ఆధ్వర్యంలో 30 సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడం, మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న రూ. 700 కోట్ల మేర రాయితీలను విడుదల చేయడం, నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించడంపై పారిశ్రామిక వేత్తలు హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో పారిశ్రామిక వేత్తలపై జీహెచ్ఎంసీ చేస్తున్న పెత్తనంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గత జులై 22న కేసీఆర్ పారిశ్రామిక వేత్తలతో సమావేశమై ‘ఐలా’ను పటిష్టం చేస్తానని, పరిశ్రమలకు స్వయం ప్రతిపత్తి కాపాడుతామని హామీ ఇచ్చిన విషయాన్ని పారిశ్రామిక వేత్తల సంఘం అధ్యక్షుడు సుధీర్ రెడ్డి గుర్తు చేశారు. అయితే జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ ఐలాను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం ద్వారా పరిశ్రమలపై గుత్తాధిపత్యాన్ని కార్పొరేషన్కు దఖలు చేసేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ పారిశ్రామికవేత్తల సంఘం ప్రతినిధులు ఎస్.వి. రఘు, సుధీర్, పారిశ్రామిక వేత్తల సంఘాల ప్రతినిధులు ఎ.ఎల్.ఎన్.రెడ్డి(జీడిమెట్ల), ఎం.గోపాల్ రెడ్డి(చర్లపల్లి), జనార్దన్ రెడ్డి (పటాన్చెరు), నర్సింగ్రావు(మెదక్), మహిళా పారిశ్రామిక వేత్తల సంఘం అధ్యక్షురాలు సరిత, ఫార్మా ఇండస్ట్రీస్ నుంచి రాజ మౌళి, ఎన్వీ నరేందర్, సూక్ష్మ పరిశ్రమల సంఘం అధ్యక్షుడు లక్ష్మీకాంతయ్య పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ తీరుపై ఆందోళన ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా జీహెచ్ఎంసీ వ్యవహరించడం పట్ల ఇతర సంఘాల ప్రతినిధులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆస్తిపన్ను పేరుతో పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున వసూలు చేస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ రకాల పన్నులు చెల్లిస్తూ పరిశ్రమలను నడుపుతున్న తమకు ఆస్తిపన్నును వాణిజ్య అవసరాల పేరుతో వసూలు చేయడం వల్ల నష్టపోతున్నామని మంత్రి జూపల్లికి వివరించారు. కంపెనీల్లో పనిచేసే కార్మికుల కోసం తాగునీటి కనెక్షన్లు తీసుకుంటే వాటికి కూడా వాణిజ్య అవసరాల టారిఫ్లో బిల్లులు వేస్తున్నారని తెలిపారు. ఐలాను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం, ఆస్తిపన్ను, నీటి పన్నులకు సంబంధించి జీహెచ్ఎంసీ, పురపాలక శాఖలతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్న తెలంగాణ పారిశ్రామిక వేత్తలకు హైదరాబాద్- వరంగల్ పారిశ్రామిక కారిడార్లో వెయ్యి ఎకరాలు కేటాయించి ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే పరిశ్రమలతో సంబంధం ఉన్న వాణిజ్య పన్నుల శాఖ, మునిసిపల్ శాఖ, రిజిస్ట్రేషన్లు, పీసీబీ వంటి విభాగాల అధికారులతో మంత్రి జూపల్లి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రను కోరారు. త్వరలోనే సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తల సమస్యలు పరిష్కరిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. -
ఎంఐఎంతో అంటకాగొద్దు!
టీఆర్ఎస్ మైనారిటీ నేతల కొత్త వాదన ఎంఐఎం దోస్తీతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నష్టమేనంటున్న నాయకులు ముస్లింల్లో పార్టీకి ఆదరణ ఉందని ఇద్దరు మంత్రులకు వివరించిన నేతలు అధినేత కేసీఆర్కు విన్నవించే ప్రయత్నాలు సాక్షి, హైదరాబాద్: మజ్లిస్తో దోస్తీని విడనాడకుంటే పార్టీ ఘోరంగా దెబ్బతింటుందని టీఆర్ఎస్లోని ముస్లిం మైనారిటీ నేతలు కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)ను కైవసం చేసుకోవాలని భావిస్తున్న టీఆర్ఎస్ మహా నగరంలోని ముస్లిం మైనారిటీ ఓట్ల కోసం ఎంఐఎంతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తోంది. అయితే, టీఆర్ఎస్లోని ముస్లిం నేతలకు ఇది మింగుడు పడడం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన చోట విజయం సాధించకున్నా, ఆ తర్వాత ప్రభుత్వం ముస్లింల కోసం చేపట్టిన వివిధ కార్యక్రమాలతో సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన వచ్చిందని వారు చెబుతున్నారు. హైదరాబాద్లో 75 వేల వరకూ ముస్లింలు టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారని, దీనిని బట్టి వారిలో పార్టీకి ఆదరణ ఉందన్న విషయం తేలిపోయిందని అంటున్నారు. ‘గతంలో ఏ పార్టీ ముస్లిం మైనారిటీలకు ఇవ్వనంత గుర్తింపు టీఆర్ఎస్ ఇచ్చింది. ఒక ముస్లిం మైనారిటీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. ముస్లిం యువతుల వివాహ ఖర్చులు భరిస్తోంది. ఏరకంగా చూసినా.. వారి సంక్షేమానికి పెద్ద పీట వేసింది. ఈ పరిస్థితుల్లో ఇంకా ఎంఐఎంతో అంటకాగాల్సిన అవసరం టీఆర్ఎస్కు లేదు..’ అని ఆ పార్టీ మైనారిటీ నాయకులు తమ అగ్రనేతల వద్ద ప్రస్తావించడం మొదలు పెట్టారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, కేటీఆర్లకు ఇదంతా వివరించినట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు వాస్తవ పరిస్థితిని వివరిస్తామని, ఆయన అపాయింట్మెంటు ఖరారు చేయించాలని కూడా వీరు కోరినట్లు తెలిసింది. ఎంఐఎంతో పొత్తు.. పార్టీకి నష్టం.. గతంలో ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ లాభపడలేదని, కాంగ్రెస్ అంతకు ముందు టీడీపీ ఇదే తరహాలో హైదరాబాద్లో దెబ్బతిన్నాయని వీరు గుర్తు చేస్తున్నారు. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి దేవీప్రసాద్ ఓటమికి దారితీసిన కారణాల్లో ఎంఐఎంతో దోస్తీ కూడా ఒకటని పేర్కొంటున్నారు. ముస్లిం మైనారిటీల ఓట్లు పడడమేమో కానీ, హిందువుల ఓట్లు మైనస్ అయ్యాయని విశ్లేషిస్తున్నారు. తమ పార్టీకి ముస్లింలలో మంచి ఆదరణ ఉందని చెపుతున్నారు. పరిస్థితి బాగున్నా ప్రతీ విషయంలో ఎంఐఎంకు పార్టీ అగ్రనాయకత్వం ప్రాధాన్యం ఇవ్వడాన్ని టీఆర్ఎస్ మైనారిటీ నాయకత్వం జీర్ణించుకోలేక పోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తామెలా ఎదుగుతామని వీరు ప్రశ్నిస్తున్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ సొంతంగా బరిలోకి దిగాలన్న అభిప్రాయాన్ని వీరు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో ఎంఐఎంను నమ్ముకోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. ‘‘ఎంఐఎంతో మనకు పొత్తు వద్దు. ఈ విషయంలో సీఎంకు అన్ని అంశాలూ వివరించండి. మాకు సమయం ఇప్పించండి. మా దగ్గర ఉన్న సమాచారం ఆయనకు వివరిస్తాం..’’ అని కొందరు మైనారిటీ నేతలు ఇద్దరు మంత్రులకు తేల్చి చెప్పారని తెలిసింది. -
ఆయనేమైనా మోనార్కా!
తనను తాను నిజాం ఆఫ్ హైదరాబాద్గా భావిస్తున్నట్లుంది జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్కుమార్పై హైకోర్టు ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ సోమేష్ కుమార్పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆయన మోనార్క్లా వ్యవహరిస్తున్నారని, తనను తాను నిజాం ఆఫ్ హైదరాబాద్లా భావిస్తున్నట్లుందని వ్యాఖ్యానించింది. ఆస్తి పన్ను చెల్లించలేదనే నెపంతో తమ విద్యుత్, నీటి కనెక్షన్లను జీహెచ్ఎంసీ తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలను గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్జ్యోతి సేన్గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారించింది. పన్ను చెల్లించలేదంటూ జీహెచ్ఎంసీ అధికారులు తమ ఇంటి విద్యుత్, నీటి కనెక్షన్ను తొలగించారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకురాగా, ఏకంగా తన దుకాణాన్ని సీజ్ చేశారని సుజాత కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. మీ కమిషనర్కు జీహెచ్ఎంసీ చట్టం గురించి తెలుసా? అతని చర్యలను చట్టం సమర్థించడం లేదన్న విషయమైనా తెలుసా? అంటూ జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ‘మీరు విద్యుత్, నీటి కనెక్షన్లు ఇవ్వరు. మీ పని కేవలం ఇళ్ల నుంచి చెత్త సేకరించడమే. మరి మీరు అందివ్వని సదుపాయాలను మీరెలా తొలగిస్తారు? మీరిస్తున్న పన్ను చెల్లింపు నోటీసులను రద్దు చేయాలి. ఇటువంటి చర్యలు ఇలానే కొనసాగితే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనేందుకు మీ కమిషనర్ సిద్ధంగా ఉండాలి.’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మార్చి 19న పన్ను చెల్లింపు నోటీసు జారీ చేసి, ఆ వెంటనే విద్యుత్, నీటి కనెక్షన్లను తొలగించారని తెలుసుకున్న ధర్మాసనం.. ‘మీ కమిషనర్ మోనార్క్లా వ్యవహరిస్తున్నారు. ఆయన్ను ఆయన నిజాం ఆఫ్ హైదరాబాద్గా భావిస్తున్నట్లున్నారు. అతని చర్యలు నిజాం సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి.’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. పిటిషనర్ల కేసులను తిరిగి పునఃపరిశీలించి, మళ్లీ నిర్ణయం తీసుకోవాలని, అలాగే సీజ్ చేసిన సుజాత షాపును తెరవాలని అధికారులను ధర్మాసనం ఆదేశించింది. -
జీహెచ్ఎంసీ ఎన్నికలెప్పుడు?
తేల్చుతారా.. తేల్చమంటారా? రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు హుకుం వారంలోగా ఎన్నికల తేదీని ప్రకటించాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: వార్డుల పునర్విభజన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని గత ఆగస్టులో ఉత్తర్వులిచ్చినా ఇప్పటివరకు ఏం చేశారని రాష్ర్ట ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)కు ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారో నిర్దిష్ట తేదీని వారం రోజుల్లో తెలియజేయాలని సోమవారం ఆదేశించింది. లేదంటే తామే తేదీని నిర్ణయించి, ఆ మేరకు తగిన ఆదేశాలు జారీ చేస్తామని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్జ్యోతి సేన్గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్కుమార్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గడువు ముగిసినప్పటికీ జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని రాజ్యాంగవిరుద్ధంగా ప్రకటించడంతో పాటు స్పెషల్ ఆఫీసర్ల నియామకానికి అవకాశం కల్పిస్తున్న జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 70జీని చట్ట విరుద్ధమని ప్రకటించాలంటూ ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్’ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. స్పెషల్ ఆఫీసర్ల నియామకపు జీవో 186ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని కూడా కోర్టును కోరారు. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు 249 రోజుల గడువు కావాలంటూ జీహెచ్ఎంసీ స్పెషల్ ఆఫీసర్ సోమేశ్కుమార్ కౌంటర్ దాఖలు చేశారని తెలిపారు. వాస్తవానికి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కౌంటర్ ద్వారా తెలియజేయాలని, అయితే తెలివిగా ఆ పని చేయకుండా తప్పించుకుందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. జీహెచ్ఎంసీ పాలక మండలి కాల పరిమితి గడువు గత ఏడాది డిసెంబర్తో ముగిసిందని, రాజ్యాంగం ప్రకారం కాల పరిమితి ముగియడానికి ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డి కలుగజేసుకుంటూ.. రాష్ట్ర విభజన తర్వాత అతి తక్కువ మంది అధికారులతో పని చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం ప్రస్తుతం వార్డుల పునర్విభజనను చేపట్టామని వివరించారు. ఈ పనుల వివరాలను కౌంటర్ ద్వారా కోర్టుకు సోమేశ్కుమార్ తెలిపారని చెప్పారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ.. ‘249 రోజుల్లో ఇప్పటికే 90 రోజులు గడిచిపోయాయి. మీరు ఏం చేయాల్సి ఉందో అది మాత్రమే చెప్పారు. అయినా స్పెషల్ ఆఫీసర్ కౌంటర్ దాఖలు చేయడమేంటి? ప్రభుత్వం దాఖలు చేయాలి కదా..’ అని వ్యాఖ్యానించింది. తమకు ఏ వివరాలు అక్కర్లేదని, ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారో వారం రోజుల్లో(వచ్చే సోమవారంలోగా) చెప్పాలని, లేనిపక్షంలో తామే తేదీని నిర్ణయించి ఉత్తర్వులిస్తామని పేర్కొంది. విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. -
పురపాలికల్లో 744 ఖాళీ పోస్టులు
కేసీఆర్కు పురపాలకశాఖ నివేదికలు సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 67 నగర, పురపాలక సంస్థల్లో మొత్తం 1535 పోస్టులు ఉండగా.. అందులో 744 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రజారోగ్యం, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో మరో 666 పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. వాటర్గ్రిడ్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు శనివారం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పురపాలికల స్థితిగతులతోపాటు ఉద్యోగుల కొరతపై తాజా సమాచారంతో కూడిన నివేదికలను రాష్ట్ర పురపాలకశాఖ ఆయనకు సమర్పించింది. పురపాలక సంస్థల్లోని పరిపాలన, రెవెన్యూ, అకౌంట్స్, ప్రజారోగ్యం-పారిశుద్ధ్యం, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీ పోస్టుల వివరాలను కేటగిరీల వారీగా ఈ నివేదికలో పేర్కొంది. నిబంధనల ప్రకారం పదోన్నతులు, నియామకాల (డెరైక్ట్ రిక్రూట్మెంట్) ద్వారా భర్తీ చేయాల్సిన ఖాళీ పోస్టులను సైతం నివేదికలో పొందుపరిచింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఖాళీల భర్తీపై సీఎం ప్రకటన చేసే అవకాశం లేదు. కోడ్ ముగిశాక ఖాళీల భర్తీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఖాళీ పోస్టుల వివరాలు కేటగిరీల వారీగా... -
రాజధానిలో పట్టుకు ‘గులాబీ’ తంటాలు!
జీహెచ్ఎంసీలో బలోపేతంపై టీఆర్ఎస్ మథనం 10రోజులే గడువున్నా మొదలుకాని సభ్యత్వ నమోదు నగర మంత్రుల మధ్య ఆధిపత్య పోరుతో సతమతం నేడు స్టీరింగ్ కమిటీతో కేసీఆర్ ప్రత్యేక సమావేశం సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్కు రాజధానిలో ఇంకా పట్టు చిక్కడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)పై గులాబీ జెండా ఎగరేయాలని చూస్తున్న ఆ పార్టీ నాయకత్వానికి తాజా పరిణామాలు జీర్ణం కావడం లేదు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉద్యమంగా కొనసాగుతోందని పార్టీ వర్గాలు ఆనందంలో ఉన్నాయి. కానీ, హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో మాత్రం ఇప్పటికీ ఒక్క చోట కూడా సభ్యత్వ నమోదు మొదలు కాలేదు. కాకుంటే 18 నియోజకవర్గాల్లో సమావేశాలు జరిపామని, మంత్రులు కూడా హాజరయ్యారని రాష్ట్ర స్టీరింగ్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రకటించారు. అసలు జీహెచ్ఎంసీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడంలోనే పార్టీ నాయకత్వం ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలను నలుగురు మంత్రులకు పంచి, బాధ్యతలు అప్పజెప్పారు. కానీ ఊపు మాత్రం రాలేదు. 20వ తేదీతో సభ్యత్వ నమోదు గడువు ముగియనుంది. మరోవైపు ఒక్క రోజు కూడా గడువు పెంచబోమని సీఎం కె. చంద్రశేఖర్రావు తొలిరోజే ప్రకటించారు. దీంతో హైదరాబాద్లో పరిస్థితిని తక్షణమే చక్కదిద్దకుంటే అసలుకే ఎసరు వస్తుందన్న ఆందోళనతో మంగళవారం సాయంత్రం తెలంగాణ భవన్లో కేసీఆర్తో సమావేశానికి ఏర్పాట్లు చేశారు. మంత్రుల మధ్య కుదరని సయోధ్య నగరంలో నలుగురు మంత్రులున్నా, ప్రధానంగా అందరి దృష్టి టీడీపీ నుంచి పార్టీలోకి వచ్చిన తలసాని శ్రీనివాసయాదవ్, పద్మారావుగౌడ్పైనే ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీ బాధ్యతలను తలసాని ఆశించారని పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. తలసాని చేరినప్పటి నుంచే పద్మారావుగౌడ్ కొంత ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది. అయితే ఎన్నికల ముందే టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన మైనంపల్లి హనుమంతరావుకు తాత్కాలికంగా స్టీరింగ్ కమిటీ కన్వీనర్ బాధ్యతలు అప్పజె ప్పడంతో పద్మారావుగౌడ్ కూడా కొంత స్థిమితపడ్డారని, అయినా ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్య పోరు మాత్రం సాగుతూనే ఉందని, అది సభ్యత్వ నమోదుపై ప్రభావం చూపిందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. గ్రేటర్ పరిధిలో గులాబీ పార్టీ గెలుచుకున్న స్థానాలు కేవలం మూడే. ఆ తర్వాత తలసాని, తీగల కృష్ణారెడ్డి టీఆర్ ఎస్లోకి రావడంతో ఆ సంఖ్య అయిదుకు పెరిగింది. మొదటి నుంచీ నగరంపై రాజకీయంగా అంతగా పట్టులేని టీఆర్ఎస్ ఈసారి మాత్రం గ్రేటర్పై జెండా ఎగరేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. టీఆర్ఎస్కు అధికార పార్టీ హోదా దక్కడంతో వివిధ పార్టీల నుంచి వలస వచ్చిన ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల సంఖ్య కూడా పెరిగిపోయింది. ఈ కారణంగానే స్టీరింగ్ కమిటీలో స్థానం కోసం పోటీ ఎక్కువైంది. అందుకే ఏకంగా 57 మందిని ఈ కమిటీలోకి తీసుకోవాల్సి వచ్చింది. కార్పొరేటర్లుగా అవకాశం రావాలంటే స్టీరింగ్ కమిటీలో బాధ్యతలు ఉండాలన్న ఆలోచనతో నేతలు పోటీ పడ్డారు. అన్ని నియోజకవర్గాల్లో కొత్త వారి చేరిక ఎక్కువగా ఉండటంతో వారి బలాబలాలను పార్టీ నాయకత్వం అంచనా వేయలేక పోయిందంటున్నారు. దీంతో ఎవరినీ పక్కన పెట్టలేక జంబో కమిటీని ఏర్పాటు చేశారని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్ది, తక్షణం పార్టీని పట్టాలెక్కించడానికి సీఎం కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. స్టీరింగ్ కమిటీ సభ్యులు, నగర పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మంగళవారంనాటి సమావేశానికి హాజరుకానున్నారు. కేసీఆర్ నిర్దేశంతోనైనా సభ్యత్వ నమోదు ఊపందుకుంటుందన్న ఆశాభావం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించాలి
హైకోర్టులో పిల్ సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో ప్రత్యేకాధికారుల పాలనను రద్దు చేసి, ఎన్నికలు నిర్వహించేలా తెలంగాణ ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి పద్మనాభరెడ్డి దాఖలు చేశారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల కమిషన్, జీహెచ్ఎంసీ స్పెషల్ ఆఫీసర్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పాలక మండలి కాల పరిమితి గత ఏడాది డిసెంబర్ 3తో ముగిసిందని, ఆ మరుసటి రోజే ప్రభుత్వం జీహెచ్ఎంసీకి ప్రత్యేకాధికారిని నియమించిందని తెలిపారు. ప్రత్యేకాధికారుల పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ప్రజా ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల సమస్యలు సకాలంలో పరిష్కారం కావడం లేదని తెలిపారు. పాలక మండలి గడువు ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, ఇలా చేయకపోవడం రాజ్యాంగంలోని అధికరణ 243(యూ)కు విరుద్ధమని వివరించారు. ప్రత్యేకాధికారుల పాలనను రద్దు చేసి, 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డులను పునర్విభజన చేసి, ఎన్నికలు నిర్వహించాలని, ఆ మేరకు ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. -
అక్రమ నిర్మాణాన్ని తొలగించిన హీరో వెంకటేశ్
హైదరాబాద్: సినీ హీరో వెంకటేశ్ హైదరాబాద్ ఫిలింనగర్ రోడ్ నంబర్-1లో తన ప్లాట్లో అనుమతులు లేకుండా నిర్మించిన షెడ్డును శనివారం స్వయంగా ఆయనే కూలీలను నియమించుకొని కూల్చివేయించారు. ఫిలింనగర్లోని ప్లాట్ నంబర్-3లో వెంకటేశ్కు ఫ్లాట్ ఉంది. గత కొద్ది రోజులుగా ఈ ఫ్లాట్లో అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతుండటంతో రెండు వారాల క్రితం జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. పక్షం రోజుల్లో వాటిని కూల్చివేయకపోతే తామే కూల్చివేస్తామని నోటీసులో హెచ్చరించారు. దీనికి స్పందించిన వెంకటేశ్ నోటీసు గడువుకు ఒక రోజు ముందే ఆక్రమణలను నేలమట్టం చేయించారు. నిర్మాణాలు కూల్చివేసిన ప్రాంతాన్ని ఫొటోలు తీయించి జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులకు అందించారు. -
నాలాల అభివృద్ధికి కమిటీలు
సమీక్ష సమావేశంలో సోమేశ్కుమార్ సాక్షి, సిటీబ్యూరో: చెరువులు, నాలాల పరిధిలో ఆక్రమణల తొలగింపు.. వాటి అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు అందుకనుగుణంగా తగిన కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధమయ్యారు. తొలి విడతలో భాగంగా ఐదు ప్రధాన నాలాల పరిధిలో వెలసిన ఆక్రమణలను గుర్తించి , వాటిని తొలగించడంతోపాటు సదరు నాలాలను అభివృద్ధి చేసేందుకు తగు కార్యాచరణ సిద్ధం చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఈ అంశాలపై ఆయా విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈపనుల కోసం ఇంజినీరింగ్, టౌన్ప్లానింగ్, భూసేకరణ విభాగాల్లోని అధికారులతో సర్కిళ్ల స్థాయిలో సమన్వయకమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పనుల పర్యవేక్షణకు ప్రతి నాలాకు ప్రత్యేకాధికారిని నియమించనున్నట్లు చెప్పారు. తొలిదశలో మారియట్ హోటల్ నుంచి మూసీకి వెళ్లే హుస్సేన్సాగర్ సర్ప్లస్ నాలా, శేరిలింగంపల్లి నాలా, మీరాలం చెరువు- నూర్ మహ్మద్ట్యాంక్, ముర్కినాలా, కూకట్పల్లి నాలాలకు సంబంధించిన పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అఫ్జల్పార్కు పునరుద్ధరణకు సంబంధించి సమగ్ర ప్రణాళిక రూపొందించాల్సిందిగా కన్సల్టెంట్కు సూచించారు. సమావేశంలో ఈఎన్సీ ధన్సింగ్, చీఫ్ సిటీప్లానర్ దేవేందర్రెడ్డి, అడిషనల్ కమిషనర్లు రామకృష్ణారావు, జయరాజ్కెన్నెడితదితరులు పాల్గొన్నారు. -
ఆ బాధ్యత మీదే
ఔటర్ లోపల నీటి సరఫరా చేయండి సీఎం కేసీఆర్ ఆదేశం జలమండలి పరిధి పెంపు సుమారు రూ.13 వేల కోట్లతో ప్రతిపాదనలు సాక్షి, సిటీబ్యూరో: జలమండలి పరిధి మరింత పెరగనుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రధాన నగరంతో పాటు, శివార్లలో 60 శాతం ప్రాంతాల్లోని 8.60 లక్షల నల్లాలకు నిత్యం340 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్న విషయం విదితమే. తాజాగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల (సుమారు వెయ్యి చదరపు కిలోమీటర్ల పరిధి) ఉన్న అన్ని శివారు మున్సిపల్ సర్కిళ్లు, నగర, గ్రామ పంచాయతీలు, కాలనీలు, బస్తీలకు నిత్యం సుమారు 600 మిలియన్ గ్యాలన్ల మంచినీటిని సరఫరా చేసే బాధ్యత జలమండలి తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గ్రేటర్ వాటర్గ్రిడ్ పథకానికిరూపకల్పన చేస్తున్న నేపథ్యంలో ఔటర్ లోపల మంచినీటి సరఫరా బాధ్యతను జలమండలికే అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను సీఎం ఇటీవల ఆదేశించినట్లు సమాచారం. ఆ మేరకు సుమారు రూ.13 వేల కోట్ల అంచనా వ్యయంతో జలమండలి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఔటర్కు ఆవల, హెచ్ఎండీఏ పరిధిలో నీటి సరఫరా బాధ్యతను గ్రామీణ నీటి సరఫరా విభాగం తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. వెయ్యి చదరపు కిలోమీటర్ల పరిధిలో... జీహెచ్ఎంసీ ప్రస్తుత విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న గ్రోత్ కారిడార్, పాత హుడా పరిధి కలిపితే మరో 375 చదరపు కిలోమీటర్లు ఉంది. అంటే మొత్తంగా వెయ్యి చదరపు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలకు కృష్ణా, గోదావరి, మంజీర, సింగూరు జలాశయాల నీటిని రోజు విడిచి రోజు సరఫరాకు అవసరమైన స్టోరేజి రిజర్వాయర్లు, పంప్హౌస్లు, పైప్లైన్ వ్యవస్థ ఏర్పాటుకు జలమండలి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇందుకు రూ.13 వేల కోట్లు అవుతుందని అంచనాలు సిద్ధం చేసింది. మరో వారం రోజుల్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసి, సీఎంకు నివేదిస్తామని జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. తాజా ప్రతిపాదనలతో ఐటీఐఆర్ ప్రాజెక్టుతో పాటు గ్రేటర్ శివారుల్లో దాహార్తి తీరే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జలమండలి స్వరూపం ఇదే.. ప్రస్తుత జలమండలి పరిధి: 625 చదరపు కిలోమీటర్లు తాజాగా పెరిగిన పరిధి కలిపితే: ఔటర్ రింగ్రోడ్డు లోపల మొత్తం పరిధి వెయ్యి చదరపు కిలోమీటర్లు ప్రస్తుతం నల్లాలు:8.60 లక్షలు ప్రస్తుత నీటి పరిమాణం: 340 మిలియన్ గ్యాలన్లు పరిధి పెరగనున్న నేపథ్యంలో సరఫరా చేసే నీటి పరిమాణం: సుమారు 600 మిలియన్ గ్యాలన్లు పెరగనున్న నల్లా కనెక్షన్ల సంఖ్య: అదనంగా మరో 8 లక్షలు -
శివారు జోరు
పెరగనున్న డివిజన్లు కోర్ ఏరియాలో తగ్గే అవకాశం సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లోని శివారు ప్రాంతాల్లో కొత్త డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. మరోవైపు పాత ఎంసీహెచ్ పరిధిలో .. ముఖ్యంగా పాతబస్తీ లో డివిజన్లు తగ్గే అవకాశాలూ ఉన్నాయి. త్వరలో జీెహ చ్ఎంసీ పాలకవర్గం గడువు ముగియనుండటం.. కోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇవ్వడం.. బుధవారం జీవో జారీ కావడంతోత్వరలోపునర్విభజన ప్రక్రియ ప్రారంభం కానుంది. 2011 జనాభాను బట్టి అన్ని వార్డుల్లో జనాభా సమానంగా ఉండేలా పునర్విభజించాల్సి ఉంది. దీంతో గ్రేటర్లో విలీనమైన శివారు ప్రాంతాల్లో ఎక్కువ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. అదే సమయంలో కోర్ ఏరి యాలో డివిజన్లు తగ్గే అవకాశాలున్నాయి. ప్రభుత్వం గతంలోవెలువరించిన జీవో మేరకు 50 లక్షల జనాభా వరకు 143 డివిజన్లు, అనంతరం ప్రతి 60 వేల జనాభాకు ఒక డివిజన్ వంతున ఏర్పాటు చేయవచ్చు. ఇలా చేశాక మిగిలిన జనాభా 30 వేలకు మించి ఉంటే అదనంగా మరో డివిజన్ను ఏర్పాటు చేయవచ్చు. 30 వేల లోపు ఉంటే ఇరుగుపొరుగు డివిజన్లలో సర్దుబాటు చేయాలి. వీటిని పరిగణనలోకి తీసుకొని 35 వేల జనాభాకు ఒకటి చొప్పున 2011 జనాభా మేరకు 172 డివిజన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంచనా. ఇలా జరిగితే శివారు ప్రాంతాల్లో ఎక్కువ డివిజన్లు రానున్నాయి. అక్కడ కొన్నిచోట్ల 70వేలకు పైగా జనాభా ఉంది. కోర్ ఏరియాలోని కొన్ని డివిజన్లలో 25 వేలకు అటూఇటూగా మాత్రమే ఉంది. ఇలాంటి డివిజన్లలో కొన్ని కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఉత్తర్వులు జారీ.. గ్రేటర్ పునర్విభజనప్రక్రియ పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వం గురువారం జీవో జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలు..ఎన్నికల సంఘం సూచన తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని జీహెచ్ఎంసీ వెంటనే ఈ ప్రక్రియను చేపట్టాల్సిందిగా సూచించింది. ఆ పంచాయతీల సంగతేంటి? జీహెచ్ఎంసీలో విలీనమవుతాయనే ఉద్దేశంతో శివార్లలోని కొన్ని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన జరుగుతుండడంతో ఆ పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వెంటనే పూర్తి చేయాలి: ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇకనైనా ప్రభుత్వం వెంటనే శాస్త్రీయ పద్ధతిలో వార్డుల విభజన చేపట్టాలని ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రిజర్వేషన్ ప్రక్రియను పూర్తిచేసి వీలైనంత త్వరగా సమాచారాన్ని ఎన్నికల సంఘానికి పంపించాలన్నారు. కుంటి సాకులతో ఎన్నికలు ఆలస్యం చేస్తే తాము కోర్టులను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. ఎన్నికలు జాప్యమైతే జీహెచ్ఎంసీ కమిషనర్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సమాన ఓటర్లు ఉండాలి: వీహెచ్ అన్ని డివిజన్లలో సమానంగా ఓటర్లు ఉండేలా పునర్విభజన చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు కోరారు. ఈమేరకు గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్కు లేఖ రాశారు. గతంలో జరిగిన విభజనలో హెచ్చుతగ్గుల వల్ల అసమానతలు చోటుచేసుకునన విషయాన్ని ప్రస్తావించారు. పక్షపాతం లేకుండా చూడండి: బంగారి ప్రకాశ్ తమ పార్టీ నాయకులు హైకోర్టును ఆశ్రయించడంతో పునర్విభజనపై రెండు నెలల క్రితమే హైకోర్టు ఆదేశించినా, అధికారులు జాప్యం చేశారని జీహెచ్ఎంసీలో బీజేపీ పక్ష నాయకుడు బంగారి ప్రకాశ్ అన్నారు. ఇప్పటికైనా జీవో వెలువరించడం ముదావహమంటూ.. వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. వార్డుల మధ్య ఎలాంటి వ్యత్యాసాలు.. రాజకీయ పక్షపాతాలకు తావులేకుండా విభజన పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వచ్చేవారం నుంచే... జీహెచ్ఎంసీలో వార్డుల విభజన ప్రక్రియను అధికారులు వచ్చేవారం ప్రారంభించనున్నారు. అంతకుముందు ఆయా ప్రభుత్వ విభాగాలు, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు, సమావేశాలు నిర్వహించనున్నట్లు కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు. పునర్విభజన సవ్యంగా సాగేందుకు వారి సహకారం తీసుకుంటామని, తమ సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు గురువారం తనను కలిసిన మీడియా ప్రతినిధులకు చెప్పారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వం 1996లోజారీ చేసిన జీవో నెంబరు 570 మేరకు పునర్విభజన చేయనున్నారు. అన్ని వార్డుల్లోనూ జనాభా సమానంగా ఉండాలి. హెచ్చు తగ్గులున్నా అవి పది శాతం లోపునే ఉండాలి. సరిహద్దులనూ పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుత, మార్పు చేయబోయే డివిజన్లను మ్యాపుల రూపంలో, ప్రత్యేక రంగుల్లో ప్రచురించాలి. తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రజాప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలు, వారి సూచనలు, అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోవాలి. వీటితోపాటు మరికొన్ని నియమ నిబంధనలు అమలు చేయాల్సి ఉంది. -
గ్రేటర్లో బలోపేతమవుదాం
జీహెచ్ఎంసీ ఎన్నికల యుద్ధానికి సిద్ధం నగరానికి వైఎస్ చేసినంత మేలు మరెవరూ చేయలేదు పార్టీ హైదరాబాద్ జిల్లా సమావేశంలో పొంగులేటి సాక్షి, సిటీబ్యూరో: దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయాల సాధనకు, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచన మేరకు పార్టీ జెండాను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని తెలంగాణ రాష్ట్ర వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా సమావేశం జిల్లా అధ్యక్షుడు ఆదం విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ గ్రేటర్లో పార్టీని బలోపేతం చేద్దామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. నగరానికి వైఎస్సార్ చేసినంత మేలు ఎవరూ చేయలేదని గుర్తు చేశారు. ప్రజల గుండెల్లో ఆయన చిరస్మరణీయంగా ఉన్నారన్నారు. వైఎస్సార్ పాలన ముందు, వెనుక సీఎంలుగా పనిచేసిన వారితో వైఎస్ పాలనను ప్రజలు పోల్చుకుంటున్నారని తెలిపారు. నాయకులు, కార్యకర్తల సలహామేరకు నడుచుకుంటానని చెప్పారు. అందరికీ అందుబాటులో ఉంటానన్నారు. బస్తీల్లో పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకోవాలని, సమస్యలపై పోరాడాలని సూచించారు. జీహెచ్ఎంసీలో వైసీపీ సత్తా చూపిద్దామన్నారు. సంస్థాగతంగా పార్టీని బస్తీ నుంచి గ్రేటర్ స్థాయి వరకూ బలోపేతం చేద్దామన్నారు. శ్రీనివాసరెడ్డి ప్రసంగం కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపింది. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, సీనియర్ నేత గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధే వైసీపీ లక్ష్యమన్నారు. మైనార్టీ నేత రెహ్మాన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సమస్యలపై అందరం ఏకమై పోరాటం చేయాలన్నారు. సీఎం కేసీఆర్ లోటస్ పాండ్లోని మన కార్యాలయానికి వచ్చి మద్దతు కోరే రోజు వస్తుందన్నారు. స్టేట్ కమిటీ సభ్యుడు నల్లా సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఖమ్మం ఎంపీ, ఎమ్మెల్యేలను చూసి తెలంగాణలో వైసీపీ బలోపేతం అవుతుందన్న భరోసా వచ్చిందన్నారు. నగర ప్రజలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అందుబాటులో ఉంటారని చెప్పారు. ఏ సమస్య వచ్చినా ఆయన తలుపు తట్టవచ్చన్నారు. మరో సభ్యుడు కె. శివకుమార్ మాట్లాడుతూ వైసీపీ తిరుగులేని శక్తిగా ఎదగాలంటే గ్రేటర్ ఎన్నికల్లో గెలవక తప్పదన్నారు. పార్టీ నేత వైఎస్ షర్మిల త్వరలో తెలంగాణలో పర్యటిస్తారని తెలిపారు. గ్రేటర్ ఎన్నికల వాయిదాకు టీఆర్ఎస్ కుట్ర చేస్తోందన్నారు. కారు పంక్చర్ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. కార్పొరేటర్లుగా గెలిచి రెండు మేయర్ స్థానాలను దక్కించుకుందామని పిలుపునిచ్చారు. వైసీపీ గ్రేటర్ అధ్యక్షుడు ఆదం విజయ్ కుమార్ మాట్లాడుతూ ఒక్కొక్క డివిజన్కు 20కు పైబడి బూత్ కమిటీలు వేయాలని కోరారు. పనిచేస్తేనే ప్రజలు గుర్తిస్తారని తెలిపారు. పింఛన్లు రాక, విద్యుత్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. ఈ సమస్యల పరిష్కారానికి పోరాటం చేద్దామన్నారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఇతర పార్టీ నేతలను పార్టీ ట్రేడ్యూనియన్ సిటీ ప్రెసిడెంట్ కరుణా శివకుమార్ గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ స్టేట్ కమిటీ సభ్యుడు కొండా రాఘవరెడ్డి తదితరులు మాట్లాడారు. గ్రేటర్ నాయకులు బి.మోహన్ కుమార్, రవికుమార్, మహమ్మద్, క్రిస్టోలైట్, టి. శ్రీనివాస్, షేక్ కరీముల్లా, శ్యామల, లక్ష్మీ, విజయ్రాజ్, మహేశ్ యాదవ్, గాయకుడు ఎం. రవి, మేరీ, కె. ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పట్లో లేనట్టే?
గ్రేటర్ ఎన్నికలు వాయిదా? జీహెచ్ఎంసీలో కానరాని హడావుడి ప్రారంభం కాని సర్కిళ్లు, డివిజన్ల పునర్విభజన జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు మరో రెండు నెలల్లో ముగిసిపోతోంది. అయినా గ్రేటర్ యంత్రాంగం ఎన్నికలకు సిద్ధమవుతున్న సూచనలు కనిపించడం లేదు. డివిజన్ల పునర్విభజన... బీసీల గణన వంటి కార్యక్రమాలకు కసరత్తే ప్రారంభం కాలేదు. ఫలితంగా గడువులోగా ఎన్నికలు జరిగే అవకాశాలుకానరావడం లేదు. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. మరో రెండు నెలల్లో పాలకవర్గం గడువు ముగుస్తున్నా ఎన్నికల హడావుడి కనిపించడం లేదు. సర్కిళ్లు, డివిజన్ల పునర్విభజన, రిజర్వేషన్ల అమలుకు బీసీల గణన జరగాల్సి ఉంది. వీటిలో ఏ ఒక్క ప్రక్రియ కూడా ఇంతవరకు ప్రారంభం కాలేదు. దీంతో కొత్త పాలకుల కోసం మరికొంత కాలం వేచి ఉండాల్సిందే. ఎన్నికల్లోగా డివిజన్ల పునర్విభజన చేయాలని కోర్టు సూచింది. ఈ తీర్పును అమలు చేయనిదే ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదు. ఇంతవరకూ జీహెచ్ఎంసీలో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కాలేదు. ప్రభుత్వ ఆదేశాలు అందాకే ఆ ప్రక్రియ ప్రారంభమవుతుందని సంబంధిత అధికారి ఒకరు స్పష్టం చేశారు. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు బీసీ జనగణన చేయాల్సి ఉంది. 2011లో జరిగిన జనగణనలో భాగంగా ఎస్సీ, ఎస్టీలు, స్త్రీ పురుషుల వివరాలు ఉన్నప్పటికీ, బీసీల సమాచారం లేదు. వీటితోపాటు ఓటర్ల జాబితాలోనూ పొరపాట్లు ఉన్నాయి. రెండు చోట్ల ఓట్లున్న వారు భారీ సంఖ్యలో ఉన్నారు. వీరి పేర్లను తొలగించాల్సి ఉంది. డీ డూప్లికేషన్ జరగాల్సి ఉంది. అందుకుగాను జీహెచ్ఎంసీలో ఓటరు కార్డుల అనుసంధానం ప్రక్రియ తాజాగా ప్రారంభమైంది. విభజన పూర్తయ్యాకే.. పరిపాలన సౌలభ్యం కోసం జీహెచ్ఎంసీలో ప్రస్తు తం ఉన్న 18 సర్కిళ్ల స్థానే 30 ఏర్పాటు చేయాలని ప్రసాదరావు కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుత సర్కిళ్లలో కొన్నింట్లో ఎక్కువ డివిజన్లు.. కొన్నింట్లో తక్కువ డివిజన్లు ఉన్నాయి. అన్నిచోట్లా సమాన సంఖ్యలో డివిజన్లు ఉండాలని ప్రసాదరావు కమిటీ సిఫార్సు చేసింది. ఒక్కో సర్కిల్లో ఐదు డివిజన్ల వంతున 150 డివిజన్లు ఉండాలని కమిటీ పేర్కొంది. జనాభాకు అనుగుణంగా పునర్విభజన జరిగితే ప్రస్తుతమున్న డివిజన్ల సంఖ్య 150 నుంచి 180కి పెంచాల్సి ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం. వీటన్నింటిపైనా ఇంతవరకు కసరత్తు ప్రారంభం కాకపోవడం ఒక ఎత్తుకాగా, జీహెచ్ఎంసీని రెండు లేదా మూడు కార్పొరేషన్లుగా మార్చాలనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు నెలల క్రితం వ్యక్తం చేశారు. ఆ అభిప్రాయాన్ని అమలు చేసేందుకు సిద్ధమైతే విభజన జరిగాకే ఎన్నికలకు వెళతారని వేరుగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా వివిధ అంశాల్లో దేనిపైనా ఇంతవరకు స్పష్టత లేకపోవడంతో జీహెచ్ఎంసీ ఎన్నికలకు జాప్యం తప్పేలా లేదు. టీఆర్ఎస్ బలోపేతమయ్యాకే... మరోవైపు ఆర్నెళ్లు ఆలస్యమైనా సరే గ్రేటర్లో టీఆర్ఎస్ బలం పుంజుకున్నాకే ఎన్నికలకు వెళ్లాలనే అభిప్రాయాన్ని కొందరు మంత్రులు ఇటీవల వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు కాగా.. గ్రేటర్ హైదరాబాద్ ఒక ఎత్తు కావడం తెలిసిందే. దీంతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అత్యధిక స్థానాలతో గెలవాలనేది పార్టీ లక్ష్యం. అందుకుగాను ఇతర పార్టీల నేతలను ఆకర్షించే ప్రక్రియ మొదలైంది. ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగానే అత్యధిక సీట్లు పొందేందుకు ఇంకొంత సమయం తీసుకున్నా ఫర్వాలేదనే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ ఎన్నికలు ఆలస్యమయ్యేందుకు దారి తీసేలా ఉన్నాయి. -
నగర కేంద్ర గ్రంథాలయంలో ‘రూ.5 భోజనం’
వివేక్నగర్: నగర కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్, ఎమ్మెల్యే డా.కె.లక్ష్మణ్తో కలసి రూ.5కు భోజన పథకాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ హరేకృష్ణ మూవ్మెంట్ వారి సహకారంతో జీహెచ్ఎంసీ రూ.5కే భోజనాన్ని నగరంలో 15సెంటర్లలో అందిస్తోందన్నారు. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లోంచి గ్రంథాలయానికి వచ్చి చదువుకుంటారని, వారిలో చాలామంది పేదవారు ఉన్నారని అన్నారు. ఇక్కడ రూ.5కే భోజనం ఏర్పాటు చేయడంతో వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే డా.లక్ష్మణ్, స్థానిక కార్పొరేటర్, ఇతర జీహెచ్ఎంసీ అధికారులు భోజన ఏర్పాట్లలో కృషిచేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం 500 మంది విద్యార్థులకు భోజనం అందజేస్తున్నామని, అవసరమైతే వెయ్యి మందికి సరఫరా చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే డా.కే.లక్ష్మణ్ మాట్లాడుతూ బీదవారికి ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు. జీహెచ్ఎంసీ సెస్ నిధులు విడుదల చేయాలి: గ్రంథాలయ చైర్మన్ కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ నుంచి ఆరేళ్లుగా రావాల్సిన లైబ్రరీ సెస్సు దాదాపు రూ.80 కోట్లు ఉందని, దీంతో గ్రంథాలయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. నగరంలోని 86 శాఖా గ్రంథాలయాల్లో విద్యుత్ బిల్లులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు చెల్లించలేని దుస్థితి ఉందన్నారు. సెస్సు విడుదల చేయాలని కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. హరేకృష్ణ మూవ్మెంట్ పీఆర్ఓ రవిలోచన స్వామి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ డా.సత్యనారాయణ, డీఎంసీ యాదగిరిరావు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. -
కొండలా నిధులు..కదలని పనులు
ముందుకు కదలని ప్రాజెక్టులు సదుపాయాలకు నోచని శివారు జనం ప్రాజెక్టులదీ అదే దారి.. మూలుగుతున్న రూ.4వేల కోట్లు ఇదీ ‘గ్రేటర్’ కార్పొరేషన్ తీరు ! ఎక్కడైనా అభివృద్ధి కనిపించలేదంటే నిధులు లేవ నే నిట్టూర్పులు వినిపిస్తాయి. గ్రేటర్లో పరిస్థితి భిన్నం. జీహెచ్ఎంసీలో రూ.వేల కోట్లు నిధులుంటాయ్... ప్రాజెక్టులు కదలనంటాయ్. కార ణమేంటంటే... కార్యశీలురేరీ అని ప్రశ్నిస్తాయి. మనం వెదుక్కునే లోపే కాలంతో పాటే కాసులూ వెనక్కి వెళ్లిపోతాయ్. కావాలంటే జీహెచ్హెంసీలో మూల్గుగుతున్న రూ.నాలుగు వేల కోట్ల నిధులను అడగండి. నిజమేంటో చెబుతాయ్. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అటు కార్పొరేటర్లకు మంజూరు చేసిన అభివృద్ధి నిధులు...ఇటు వివిధ పథకాలకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఖర్చు చేయడం లేదు. ఈ విషయంలో కార్పొరేటర్లు, అధికారులు కూడా నిర్లక్ష్య వైఖరే అవలంబిస్తున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. గ్రేటర్ శివారుప్రాంతాల్లోని 50 మంది కార్పొరేటర్లకు రూ. 2 కోట్లు వంతున, కోర్ ఏరియాలోని 100 మంది కార్పొరేటర్లకు రూ. 1.5 కోట్ల చొప్పున మొత్తం రూ. 250 కోట్లు కేటాయించారు. గత ఆర్థికసంవత్సరం వీరి ఖాతాలోనివే ఖర్చు కానివి మరో రూ. 35 కోట్లున్నాయి. వెరసి మొత్తం 285 కోట్ల కార్పొరేటర్ల నిధులున్నాయి. వీటిల్లో ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరుమాసాల్లో పనులకు రూ. 175 కోట్లు మంజూరు చేశారు. మొత్తం 2,220 పనులు చేయాల్సి ఉంది. సెప్టెంబర్ నెలాఖరులోగా వాటిని పూర్తి చేయాలి. కానీ వీటిల్లో కేవలం రూ. 7 కోట్ల విలువైన 190 పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇక జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు వచ్చే డిసెంబర్ 3 తో ముగిసిపోనుంది. ఈలోగా కార్పొరేటర్లు ఎన్ని పనులు పూర్తి చేయగలరో.. ఇంకెన్ని కోట్లు వారి బడ్జెట్ నిధులు మిగిలిపోనున్నాయో తెలి యని పరిస్థితి నెలకొంది. ఇది కార్పొరేటర్ల నిధులకు సంబంధించిన వ్యవహా రం కాగా జీహెచ్ఎంసీ బడ్జెట్ నిధుల తీరూ ఇలాగే ఉంది. ఏటికేడు బడ్జెట్ నిధులు భారీగా చూపుతున్నప్పటికీ, పనులు మాత్రం జరగడం లేవు. నిధులు మాత్రం గుట్టలుగా ఉన్నప్పటికీ.. పనులు చేయించే సత్తా అటు కార్పొరేటర్లకు, ఇటు అధికారులకు లేకపోవడంతో నిధులు మూలుగుతున్నాయి. మచ్చుకు.. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా...వీటిల్లో ఒక్క శేరిలింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఐదేళ్లుగా మంజూరైన నిధులు.. పనులు, వాటిల్లో పూర్తయిన పనులు.. మిగిలిపోయిన నిధులను ఓ మారు పరిశీలిస్తే ‘గ్రేటర్’ గొప్పతనం తేటతెల్లమవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం శేరిలింగంపల్లికి రూ. 2.43 కోట్లు మంజూరు కాగా, గత ఆగస్టు మొదటి వారం వరకు దాదాపు రూ. 1.17 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇలా జీహెచ్ఎంసీ ఏర్పాటైనప్పటినుంచి దాదాపు ఐదే ళ్లలో ఈనియోజకవర్గానికి మంజూరు చేసిన నిధుల్లో ఇంకా రూ. 216 కోట్లు ఖర్చు కాకుండా మిగిలిపోయాయి. దీనిని పరిగణనలోకి తీసుకొని అంచనా వేసినా... గ్రేటర్లోని 24 నియోజకవర్గాలకు వెరసి దాదాపు రూ. 4000 కోట్ల విలువైన పనులు జరగలేదు. శివార్లలో సమస్యలతో సహవాసం.. గ్రేటర్లోని కోర్ ఏరియా (పాత ఎంసీహెచ్) పరిధిలో రహదారులు, తాగునీరు, విద్యుత్ దీపాల వంటి కనీస సదుపాయలున్నప్పటికీ, గ్రేటర్ ఏర్పాటుతో విలీనమైన శివారు మునిసిపాలిటీల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవు. రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ దీపాలు తదితర సదుపాయాల్లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోర్ ఏరియా వారితో సమానంగా తాము సైతం వివిధ రకాల పన్నులు చెల్లిస్తున్నా తమకెందుకు సదుపాయాలు కల్పించరని శివార్లలోని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులతో పాటుమారుతున్న ప్రాధాన్యాలు శివారు ప్రాంత ప్రజల సమస్యలు తీర్చేందుకు ఒకప్పటి కమిషనర్ సమీర్శర్మ తగు ప్రణాళిక రూపొందించారు. సంపూర్ణ మౌలిక సదుపాయాల కల్పన(టిప్) పథకం కింద వారికి అన్ని సదుపాయాలు కల్పించేందుకు దాదాపు రూ. 925 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. తీరా పనులకు టెండర్లు పిలవాల్సిన సమయంలో ఆయన బదిలీ కావడంతో ఆయన స్థానంలో కమిషనర్గా వచ్చిన కృష్ణబాబు టిప్ను అటకెక్కించారు. ప్రస్తుత కమిషనర్ సోమేశ్కుమార్ రూ. 5కే భోజనం, బస్తీలకు శుద్ధజలం, పబ్లిక్ స్థలాల్లో టాయ్లెట్ల వంటి సంక్షేమ కార్యక్రమాలపై శ్రద్ధ చూపుతున్నట్లుగానే...మౌలిక సదుపాయాలపై కూడా చూపాలని ప్రజలు కోరుతున్నారు. కొసమెరుపు: బహుశా గ్రేటర్లోని అధికారులు, కాంట్రాక్టర్ల వల్ల భారీ పనులు కావడం లేదని గ్రహించి ప్రస్తుత కమిషనర్ సోమేశ్కుమార్ పనులను చిన్నమొత్తాల్లో కాకుండా కనీసం రూ. 100 - రూ. 150 కోట్లకు తగ్గకుండా పైస్థాయి కాంట్రాక్టర్లను పిలవాలని నిర్ణయించారు. తద్వారా జాతీయస్థాయి కాంట్రాక్టర్లు సైతం టెండర్లకు ముందుకొచ్చి పనులు చేయగలరని భావిస్తున్నారు. ఈ ఆలోచనను అమలులోకి తేవడం వల్లయినా పనులు జరుగుతాయో లేదో వేచి చూడాలి. -
సిటీ..పిటీ
గ్రేటర్ ప్రజలకు మౌలిక సదుపాయాలు అంతంతే.. 33 శాతం మందికి మంచినీటి నల్లాలు లేవు.. 32 శాతం మందికి డ్రైనేజీ సౌకర్యం నిల్ శివారు ప్రాంతాలకు తాగునీరు కలే.. మెట్రోపొలిస్ సదస్సు నేపథ్యంలో జీహెచ్ఎంసీ నివేదిక వెల్లడైన కఠోర వాస్తవాలు సాక్షి, సిటీబ్యూరో: పేరుగొప్ప..ఊరు దిబ్బ అన్నచందంగా మారింది మన గ్రేటర్ నగరం పరిస్థితి. దేశంలో ప్రముఖ నగరాల జాబితాలో నాలుగోస్థానం దక్కించుకున్నప్పటికీ ఇక్కడ ప్రజలకు మౌలిక సదుపాయాలు మాత్రం అందనంత దూరంలోనే ఉన్నాయి. అంతర్జాతీయ మెట్రోపొలిస్ సదస్సు జరుగుతున్న నేపథ్యంలో పలు వాస్తవాలను జీహెచ్ఎంసీ నివేదిక రూపంలో విడుదల చేసింది.ఈ నివేదిక ప్రకారం...శివార్లలో మంచినీరు, మురుగునీటి పారుదల సౌకర్యాలు అధ్వానం కాగా... మురికివాడల ప్రజలకు తాగునీటి సౌకర్యం సుదూరంలో ఉంది. గ్రేటర్ పరిధిలో జలమండలి కుళాయి నీటి సౌకర్యం ఉన్న కుటుంబాలు కేవలం 67 శాతమే. మిగతా 33 శాతం మందికి బోరుబావులు, ట్యాంకర్ నీళ్లు, ఫిల్టర్ప్లాంట్లే ఆధారం. శివారు ప్రాంతాల్లో జనం మంచినీటిని కొనుగోలు చేసే దుస్థితి తలెత్తింది. ఇక పేరుగొప్ప హైటెక్సిటీ పరిధిలో సుమారు 32 శాతం మందికి డ్రైనేజీ సౌకర్యం లేక ఆయా కుటుంబాలు మురుగునీటిని సెప్టిక్ ట్యాంకుల్లో నిల్వచేసుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. అంతేకాదు ఉప్పల్, కుత్భుల్లాపూర్, మల్కాజ్గిరి, హయత్నగర్ వంటి శివారు ప్రాంతాల్లోనూ ఇదే దుస్థితి. దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని మహోద్యమంగా చేపడుతున్న తరుణంలో ఇలాంటి వాస్తవాలు వెలుగుచూడడం బాధ్యతాయుత పౌరులను కుంగదీస్తున్నాయి. మరోవైపు మహానగరానికి రోజురోజుకూ వలసలు పెరిగిపోతుండడంతో జనసాంద్రత అనూహ్యంగా పెరుగుతుండడం కలవరపరుస్తోంది. నివేదికలో గ్రేటర్ సిటీకిసంబంధించి పరిశీలనాంశాలివీ... హైదరాబాద్ నగరం ప్రస్తుతం దేశంలో పేరెన్నికగన్న నగరాల్లో నాలుగో స్థానంలో ఉంది. ప్రతి చదరపు కి.మీ.కు 2345 మంది నివసిస్తున్నారు. నగర జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరు సంపాదించే శక్తి కలిగి ఉన్నారు. గ్రేటర్లో శుద్ధిచేసిన నీరు పైప్లైన్ నెట్వర్క్ ద్వారా అందుకుంటున్న కుటుంబాలు: 93.20 శాతం కుళాయి సౌకర్యం ఉన్న కుటుంబాలు: 67 శాతం చేతిపంపులపై ఆధారపడిన కుటుంబాలు: 2.13 శాతం బోర్వెల్స్పై ఆధారపడిన కుటుంబాలు: 5.46 మురికివాడల్లో నివసిస్తున్న వారికి మంచినీటి సౌకర్యం దూరంగా ఉన్న కుటుంబాలు: 36.67 శాతం మరుగుదొడ్డి సౌకర్యం లేని కుటుంబాలు: 3 శాతం డ్రైనేజీ సౌకర్యం ఉన్న కుటుంబాలు: 70 శాతం సెప్టిక్ ట్యాంకుల్లో మురుగునీటిని నిల్వ చేస్తున్న కుటుంబాలు: 30 శాతం -
బలపడిన ద్వైపాక్షిక బంధం
పలు నగరాల మేయర్లతో మంత్రి కేటీఆర్ చర్చలు ప్రజారవాణా, గృహనిర్మాణం, స్మార్ట్ సిటీస్పై చర్చ పరస్పర సహకారానికి అంగీకారం వివరాలు వెల్లడించిన జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ప్రద్యుమ్న సాక్షి, సిటీబ్యూరో: మెరుగైన ప్రజారవాణా, గృహ నిర్మాణం, స్మార్ట్సిటీల నిర్మాణం తదితర అంశాల్లో పలు నగరాలతో ద్వైపాక్షిక చర్చలు ఫలించాయి. హెచ్ఐసీసీలో మెట్రోపొలిస్ సదస్సులో బుధవారం పలు నగరాల మేయర్లతో ఐటీశాఖ మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్, మేయర్ మాజిద్ హుస్సేన్ చర్చలు జరిపారు. చర్చల సారాంశాన్ని జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ప్రద్యుమ్న విలేకరులకు వెల్లడించారు. ఆయా నగరాల మేయర్లతో మంత్రి కేటీఆర్ చర్చించిన వివరాలు ఇలా.. మెట్రోపొలిస్ మేయర్ జీన్పాల్హచాన్తో.. తీరైన పట్టణాభివృద్ధి, స్మార్ట్సిటీల నిర్మాణానికి సహకరించాలని మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణ ప్రాంతంలో ఐటీ, ఫార్మా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలున్నాయన్నారు. మెట్రొపోలిస్ సదస్సులో ఆయా అంశాలపై జరిగిన చర్చలను వేర్వేరుగా డాక్యుమెంట్లను సిద్ధం చేసి అందరికీ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ను జీన్పాల్ హచాన్ ప్యారీస్కు ఆహ్వానించారు. త్వరలో వాతావరణ మార్పులపై ప్యారీస్లో నిర్వహించనున్న సదస్సులో పాల్గొనాలని కోరారు. బెర్లిన్ డిప్యూటీ మేయర్ బర్భరా బెర్నింగర్తో.. స్మార్ట్సిటీల నిర్మాణం,పేదలకు తక్కువ ఖర్చుతో నిర్మించనున్న గృహాలు, వికలాంగులకు చేయూతనిచ్చే విషయంలో బెర్లిన్ నగరం నుంచి సాంకేతిక సహకారం అవసరం ఉందని కేటీఆర్ తెలిపారు. జర్మన్ కంపెనీలు గ్రేటర్ నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం ఉందన్నారు. ఐటీ రంగంలో పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. వచ్చే ఏప్రిల్లో బెర్లిన్లో జరగనున్న మెట్రోపాలిటన్ సొల్యూషన్స్ సదస్సులో పాల్గొనాలని ఆమె కేటీఆర్ను ఆహ్వానించారు. భవిష్యత్లో తెలంగాణ ప్రభుత్వానికి పరస్పర సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె హామీ ఇచ్చారు. మాషాద్ మేయర్ సోలాట్ మోర్తాజావితో.. సంస్కృతి, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారంతోపాటు పట్టణాభివృద్ధిలో ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే అంశాలపై మంత్రి కేటీఆర్ చర్చించారు. ఇరాన్, హైదరాబాద్ నగరాలకు మధ్యనున్న చారిత్రక బంధాన్ని గుర్తు చేసుకున్నారు. మషాద్ నగరం ఏటా 24 మిలియన్ల పర్యాటకులను ఆకర్షిస్తోందన్నారు. ఇరాన్కు తమ నగరం ఆధ్యాత్మిక నగరంగా భాసిల్లుతోందన్నారు. హైదరాబాద్ నుంచి మషాద్కు నేరుగా విమాన సౌకర్యం ఏర్పాటు చేయాలని కేటీఆర్ను కోరారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో పలు ఐటీ కంపెనీలు మషాద్ నగరంలోనూ తమ కార్యాలయాలను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి ఆయనకు తెలిపారు. జోహెన్స్బర్గ్ మేయర్ పార్క్స్ టవ్తో.. నగరాల్లో సురక్షిత భద్రతా ఏర్పాట్లు చేసే అంశంపై మంత్రి కేటీఆర్ చర్చించారు. విశ్వవిద్యాలయాల సౌజన్యంతో సైన్స్పార్క్ల ఏర్పాటుపై అభిప్రాయాలను పంచుకున్నారు. జోహెన్స్బర్గ్ నవనిర్మాణానికి అక్కడ చేపట్టిన సంస్కరణలు, సాధించిన ఫలితాలను అడిగి తెలుసుకున్నారు. స్మార్ట్సిటీల నిర్మాణంపై ఇరువురు నేతలు తమ ఆలోచనలను వివరించారు. జోహెన్స్బర్గ్ సహకారంతో హైదరాబాద్ నగరాన్ని వైఫై నగరంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు. జోహెన్స్బర్గ్ నగరానికి ఐటీ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు. హరిత భవనాల నిర్మాణానికి సంబంధించిన సాంకేతికతను ఇచ్చిపుచ్చుకునేందుకు మంత్రి అంగీకారం తెలిపారు. ఐటీ, ఆర్థిక రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. సావోపోలో మేయర్ రోవేనాతో.. దక్షిణ అమెరికాలోని సాపోలో నగరంలో 11 మిలియన్ల మంది నివసిస్తున్నారని రోవేనా మంత్రి కేటీఆర్కు తెలిపారు. స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్, సాంస్కృతిక రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. నిర్మాణరంగం,పట్టణాల్లో మౌలికవసతుల కల్పన, ఆరోగ్యం, గృహనిర్మాణం, వ్యాక్సీన్ల అభివృద్ధి విషయంలో పర స్పరం సహకరించుకోవాలనే ఆలోచనకు వచ్చారు. పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో గృహనిర్మాణం, పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్, సావోపోలో నగరాల్లో ఉన్న అవకాశాలను చర్చించారు. బార్సిలోనా మేయర్ క్సేవియర్ ట్రయాస్తో.. స్మార్ట్సిటీల నిర్మాణం, ఇంధన భద్రత, సంక్షేమ పథకాల అమలు, ప్రజోపయోగ కార్యక్రమాలు, స్థలాలు, మేనేజ్మెంట్ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. పలు అంశాల్లో బార్సిలోనా సాధించిన విజయాలను ఆయన కేటీఆర్కు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. హైదరాబాద్ నగరాభివృద్ధికి సహకరిస్తామని భరోసా ఇచ్చారు. -
త్వరలో జీహెచ్ఎంసీ టోల్ఫ్రీ 211
మారనున్న జీహెచ్ఎంసీ టోల్ఫ్రీ నెంబర్ ఆస్తిపన్నుకు భవనాల ‘3డి’ మ్యాపింగ్ సాక్షి,సిటీబ్యూరో: ప్రజా ఫిర్యాదులు పరిష్కరించేందుకు ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ టోల్ఫ్రీ నెంబరు(21 11 11 11) ను మరింత సరళీకరించనున్నారు. దీన్ని మరిన్ని తక్కువ డిజిట్లతో త్వరలో ‘211’గా మార్చనున్నారు. ఈమేరకు సోమవారం ముఖ్యమంత్రి వద్ద జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇది అమెరికాలోని న్యూయార్క్లో టోల్ఫ్రీ నెంబరు 311గా ఉందని, నగరంలోనూ ప్రజలకు మరింత సులభంగా గుర్తుండేందుకు 211 నెంబరును అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తిపన్ను లెక్కను మరింత పక్కాగా లెక్కించేందుకు.. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందిన తర్వాత అదనంగా నిర్మించే అక్రమ నిర్మాణాలను గుర్తించేందుకు ‘3డి’ టెక్నాలజీతో మ్యాపింగ్ చేయాలని నిర్ణయించారు. దీన్ని జీఐఎస్తో అనుసంధానిస్తారు. తద్వారా ఆస్తిపన్నును కచ్చితంగా నిర్ధారించడంతో పాటు.. అక్రమంగా వెలిసే నిర్మాణాల పైనా నిఘా ఉంటుందని భావిస్తున్నారు. సమావేశ వివరాలను పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు విలేకరులకు వెల్లడించారు. వెస్ట్జోన్ పరిధిలో త్వరలో 4జీ, వైఫై సేవలు అందుబాటులోకి రానుండగా, గ్రేటర్ నగరమంతా డిసెంబర్ 4లోగా అందుబాటులోకి వస్తాయన్నారు. ఈమేరకు ఎయిర్టెల్, ఎయిర్సెల్, వోడాఫోన్కు అనుమతులిచ్చినట్టు తెలిపారు. సిటీలో బస్ పార్కింగ్కు, ప్రయాణానికి సంబంధించి బార్సిలోనా విధానాన్ని అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. మెట్రో పోలిస్ సదస్సులో చర్చించనున్న ముఖ్యాంశాలకు సంబంధించీ సమావేశంలో ప్రస్తావించారు. శంకుస్థాపన.. ప్రారంభోత్సవం.. దసరా పండుగ రోజున (అక్టోబర్ 3) ఐడీహెచ్ కాలనీలో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు బేగంపేట- బల్కంపేట లింక్ రోడ్డుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోత్సవం చేస్తారని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ తెలిపారు. ఈరోడ్డు అందుబాటులోకి వస్తే కూకట్పల్లి, బాలానగర్, ఫతేనగర్, బల్కంపేట నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లేవారు, అమీర్పేట నుంచి కూకట్పల్లి, సనత్నగర్ల వైపు వెళ్లేవారి ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయన్నారు. ఏడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులు ఎన్నో సమస్యలను అధిగమించి ఇప్పటికి పూర్తయింది. -
అఫ్జల్ పార్కును పునరుద్ధరిస్తాం
మూసీ నది ప్రక్షాళనకు సహకరించండి గ్రేటర్ కమిషనర్ సోమేష్ కుమార్ దత్తాత్రేయనగర్: ఉస్మానియా ఆస్పత్రి వెనుక గేటు వద్ద గల అఫ్జల్ పార్కును పునరుద్ధరించి సుందరంగా తీర్చి దిద్దుతామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్కుమార్ తెలిపారు. మూసీ ఒడ్డున గల చింతచెట్టు 150 మందిని రక్షించి సెప్టెంబర్ 28 నాటికి 106 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం సెంటర్ ఫర్ డెక్కన్ స్టడీస్, ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఇండియాలో తనకు బాగా నచ్చిన చారిత్రక నగరం హైదరాబాద్ అన్నారు. నవాబుల కాలం నాటి ఈ పార్కు గత వైభవాన్ని తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఇందుకోసం వెంటనే కార్యాచరణ ప్రారంభిస్తామన్నారు. అదే విధంగా మూసీ నది ప్రక్షాళనకు అన్ని విభాగాల అధికారులతో పాటు ప్రజల సహకారం అవసరమన్నారు. ముఖ్యంగా ప్రజలు మూసీలో చెత్త వేయకుండా సహకరించాలన్నారు. అనంతరం ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం.వేదకుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్ చరిత్రను మలుపు తిప్పిన 1908 మూసీ నదికి వచ్చిన వరదతో నాటి పాలనా యంత్రాంగం వివిధ రంగాల నిపుణులతో కలిసి పలు పథకాలు చేపట్టిందన్నారు. దీంతో హైదరాబాద్ ఆధునిక సిటీ ప్లానింగ్కు ఒక ఉదాహరణగా మారిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రణాళికా రహిత వృద్ధి కారణంగా సమస్యలు పెరుగుతున్నాయన్నా రు. ఈ నేపథ్యంలోనే సెంటర్ ఫర్ డెక్కన్ స్టడీస్, ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్లు నగర సమస్యలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ డెక్కన్ స్టడీస్ కార్యదర్శి సజ్జద్ షాహిద్, ఏకే హైమద్, జగన్ రెడ్డి, అన్వర్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
తమ్మిడి కుంట సర్వే పూర్తి
రెండు రోజుల్లో సర్కార్కు నివేదిక ఎఫ్టీఎల్ నిర్ధారించనున్న ఇరిగేషన్, సర్వే రికార్డ్స్ అధికారులు గచ్చిబౌలి: ఖానామెట్ సర్వే నంబర్ 36లోని తమ్మిడి కుంట సర్వే రెండో రోజైన శనివారం కూడా కొనసాగింది. రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, ల్యాం డ్ రికార్డ్స్ అధికారులు కుంట పక్కనే గల ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్లోనే ఎక్కువ సమయం సర్వే జరిపారు. సర్వే పూర్త చేసిన అధికారులు ప్రభుత్వానికి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డెరైక్టర్ నరహరి, శేరిలింగంపల్లి సర్వేయర్ మధుసూదన్రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు ఈ సర్వేలో పాల్గొన్నారు. శిల్పారామానికి కేటాయించిన స్థలంపై దృష్టి తమ్మిడికుంట ఎఫ్టీఎల్లో గతంలో శిల్పారామం పార్కింగ్ కోసం రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆ ప్రాంతాన్ని బండ రాళ్లతో పూడ్చిన శిల్పారామం అధికారులు అక్కడ పనిచేసే వారి నివాసానికి కేటాయించారు. సర్వే చేసిన అధికారులు శిల్పారామానికి కేటాయించిన స్థలం ఎంతవరకు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందో తేల్చనున్నారు. రెండు రోజుల్లో నివేదిక: తహశీల్దార్ ఫీల్డ్ సర్వే పూర్తయినప్పటికీ మంగళవారం నాటికి నివేదిక రూపొందించే అవకాశం ఉందని శేరిలింగంపల్లి తహశీల్దార్ విద్యాసాగర్ తెలిపారు. ఎఫ్టీఎల్ను నిర్ధారిస్తే బఫర్ జోన్ తెలిసిపోతుందన్నారు. ఆక్రమణలుంటే చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. -
యంత్రం...గుంతలకు మంత్రం
బెంగళూర్ తరహాలో పూడ్చివేత పరిశీలిస్తున్న జీహెచ్ఎంసీ త్వరలో వినియోగంలోకి సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని రహదారులపై గుంతల (పాట్హోల్స్ను) పూడ్చివేతకు అధునాతన యంత్రాన్ని తీసుకొచ్చేందుకు జీహెచ్ఎంసీ యత్నిస్తోంది. ఈ తరహా పనులకు ఇప్పటికే రోడ్ డాక్టర్ అనే యంత్రాన్ని వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. దీనికంటే మెరుగైన యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు యత్నిస్తోంది. బెంగళూరు, ఢిల్లీల్లో ఈ పనులు నిర్వహిస్తున్న రెండు కాంట్రాక్టు సంస్థలతో జీహెచ్ఎంసీ ఇంజినీర్ ఇన్ చీఫ్ ధన్సింగ్, చీఫ్ ఇంజినీర్ సురేష్కుమార్, తదితరులుశనివారం సమావేశమయ్యారు. కాంట్రాక్టు ప్రతినిధులు ఆయా నగరాల్లో తాము వినియోగిస్తున్న వివిధ రకాల యంత్రాల పనితీరును వారికి వివరించారు. వీటిల్లో గ్రేటర్కు ఏది అనువుగా ఉంటుందనే విషయమై కమిషనర్ సోమేశ్ కుమార్తో చర్చించాక నిర్ణయం తీసుకోనున్నారు. ఆధునిక యంత్రాలతో ఖర్చు చాలా వరకూ తగ్గనున్నట్టు తెలుస్తోంది. బెంగళూర్లో గత ఏడాదిగా ఆధునిక పద్ధతిలో గుంతలు పూడుస్తున్నారు.అక్కడ నాలుగు లేన్ల రోడ్లలో పనులకు కి.మీ.కు ఏడాదికి రూ.85 వేల వంతున చెల్లిస్తున్నారు. నగరంలో అది మరింత తగ్గేందుకు అవకాశం ఉందని ప్రతినిధులు జీహెచ్ఎంసీ అధికారులకు వివరించారు. ఇదీ పనితీరు కెనడా రూపొందించిన పైథాన్-5000 అనే వాహనాన్ని వినియోగించడం ద్వారా మూడు నిమిషాలకో గుంతను పూడ్చి వేయవచ్చని సంబంధిత ప్రతినిధులు తెలిపారు. బెంగళూర్లో గడచిన పది నెలల్లో 1400 గుంతలు పూడ్చి వేశామన్నారు. కెనడా, అమెరికా, బ్రెజిల్లలో ఈ వాహనాలతో రోడ్ల మరమ్మతులు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు గుంతల పూడ్చివే తతో పాటుచదును చేసే పనిని కూడా వెంటనే పూర్తి చేస్తుంది. దీని వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. వర్షం నీటిలో సైతం దీని ద్వారా పనులు చేసేందుకు వీలవుతుంది. దీన్ని వినియోగించేందుకు ఒక్కరున్నా సరిపోతుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో వినియోగిస్తున్న యంత్రాలను ఢిల్లీలో ఉపయోగిస్తున్నారు. జెట్ ప్యాచర్గా వ్యవహరించే దీనితో 15 నిమిషాల్లో గుంతను పూడ్చవచ్చు. నగర రోడ్లకు ఏది ఎక్కువ సదుపాయంగా ఉంటుంది? దేనికి ఎంత ఖర్చవుతుంది? ఒకసారి గుంత పూడ్చాక ఎంతకాలం వరకు మన్నికగా ఉంటుంది తదితర అంశాలు అధ్యయనం చేశాక తగిన యంత్రాలను గ్రేటర్లో వినియోగించాలని యోచిస్తున్నారు. మెట్రోపొలిస్ సదస్సు సమయంలో ఒక వేళ వర్షం కురిస్తే.. దెబ్బతిన్న రోడ్లకు వెనువెంటనే మరమ్మతులు చేసేందుకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయని యోచిస్తున్నారు. వీలైతే ప్రయోగాత్మకంగా వీటి పనితీరును పరిశీలించాలని భావిస్తున్నారు. -
పార్కింగ్కు ‘మార్కింగ్’
పార్కింగ్ లాట్ల వద్ద పూర్తి వివరాలతో బోర్డులు అక్రమ వసూళ్లకు త్వరలో జీహెచ్ఎంసీ చెక్ సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు పక్కన బండి పెడితే చాలు చేతిలో చీటి పెట్టి పార్కింగ్ చార్జ్ వసూలు చేసే అక్రమ దందాకు అడ్డుకట్ట వేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సన్నద్ధమయ్యారు. జీహెచ్ఎంసీ పార్కింగ్ స్థలమేదో, కానిదేదో తెలియకపోవడంతో ఎవరు పడితే వారు చార్జ్ వసూలు చేస్తున్నారు. రహదారులనే పార్కింగ్ లాట్లుగా మార్చిన జీహెచ్ఎంసీ వైఖరిని ఆసరా చేసుకుని, ప్రైవేట్ వ్యక్తులు కూడా నగరంలోని ప్రధాన రహదారులు, వాణిజ్య కూడళ్లలో ఈ దందాకు పాల్పడుతున్నారు. ఇకపై ఈ పరిస్థితి లేకుండా.. జీహెచ్ఎంసీ ఎంపిక చేసిన స్థలాల్లో పార్కింగ్ స్థలం ఎక్కడి నుంచి ఎక్కడి వరకో సూచిస్తూ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు పార్కింగ్ ప్రదేశంలో అవసరమైన మార్కింగ్లు.. పార్కింగ్ ఫీజుల వివరాలతో పాటు సదరు పార్కింగ్ ఏరియాను టెండర్ల ద్వారా జీహెచ్ఎంసీ ఎవరికి కేటాయించారు, తదితర వివరాలు ప్రముఖంగా కన్పించేలా బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. ఇందుకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరించినా.. ప్రజల నుంచి అక్రమంగా వసూలు చేసినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పార్కింగ్ కేటాయించిన స్థలం కంటే అదనపు స్థలాన్ని ఆక్రమించి వసూలు చేస్తున్నా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. తొలిదశలో ఎంపిక చేసిన 47 పార్కింగ్ ఏర్పాట్లలో వీటిని అమల్లోకి తేనున్నట్లు వివరించారు. రెండు మూడు రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఎవరైనా అక్రమ వసూలుకు పాల్పడితే జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసేందుకు సంబంధిత అధికారి ఫోన్ నంబరును కూడా అందుబాటులో ఉంచనున్నారు. జీహెచ్ఎంసీ కాల్సెంటర్కు సైతం (040-21 11 11 11) ఫిర్యాదు చేయవచ్చు. తద్వారా ప్రజలకు పార్కింగ్ బాదుడు తప్పుతుందని అధికారులు భావిస్తున్నారు. పార్కింగ్ లాట్ల వద్ద ఉండాల్సిన వివరాలు.. పార్కింగ్ ఫీజు వివరాలు ప్రముఖంగా కనిపించేలా బోర్డుల ఏర్పాట్లు పార్కింగ్ సదుపాయం వేళల వివరాలు.. ప్రస్తుత రేట్ల మేరకు, పార్కింగ్ ఫీజులు.. నాలుగు చక్రాల వాహనాలకు మొదటి రెండు గంటల వరకు రూ. 10, తర్వాత ప్రతి గంటకు రూ. 5 ద్విచక్ర వాహనాలు మొదటి రెండు గంటలకు రూ. 5. ఆపై గంటకు రూ. 3.మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా, కాంట్రాక్టర్లు తమ ఇష్టానుసారం వసూలు చేస్తున్నారు. దీంతో ఈ ధరల్లోనూ మార్పులు చేసే అవకాశముంది. కొస మెరుపు: దాదాపు రెండేళ్ల క్రితం అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు సైతం ఇలాంటి ప్రకటనే చేశారు. కానీ అప్పట్లో ఇది అమలుకు నోచుకోలేదు. -
నిఘా నేత్రం
నగరంలో 50 వేల సీసీ కెమెరాలు సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నేరాలు నిరోధించే దిశగా జీహెచ్ఎంసీ మరో అడుగు ముందుకేస్తోంది. గ్రేటర్లోని వివిధ మార్గాల్లో రాబోయే వంద రోజుల్లో 50 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రణాళిక ను జీహెచ్సీ స్టాండింగ్ కమిటీ ఆమోదానికి పంపించనున్నారు. అనంతరం రెండు వారాల్లోగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. దీనికి సుమారు రూ.400- 450 కోట్లు ఖర్చు కాగలదని అంచనా. తొలిదశలో గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాలు, షాపింగ్ కాంప్లెక్స్లు, ప్రధాన రహదారులు, మెట్రో రైలు మార్గాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ అంశంపై జీహెచ్ఎంసీ మేయర్ మాజిద్ హుస్సేన్, డిప్యూటీ మేయర్ జి.రాజ్కుమార్, కమిషనర్ సోమేశ్కుమార్, నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డిలు గురువారం సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మేయర్ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ మొత్తం వంద రోజుల్లో పూర్తి కాగలదని చెప్పారు. నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో తొలుత వీటిని ఏర్పాటు చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులకు సూచించారు. తద్వారా నేరాలు తగ్గించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ప్రజాభద్రత బాధ్యత మొత్తం పోలీసులదే కాదని, అన్ని విభాగాల సహాయ సహకారాలు అవసరమని గుర్తు చేశారు. ప్రజాభద్రత చట్టం వల్ల నేరాలు తగ్గుముఖం పడతాయని అభిప్రాయపడ్డారు. వీలైనంత త్వరగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అందుకు కార్పొరేటర్ల పూర్తి సహకారం ఉంటుందని అధికారులకు చెప్పారు. హైదరాబాద్ గ్లోబల్సిటీగా మారే తరుణంలో ప్రజలకు భద్రత కల్పించడం అత్యావశ్యకమన్నారు. సీసీకెమెరాల ప్రాజెక్టుకు వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మేయర్ మాజిద్హుస్సేన్ ప్రకటించారు. భారీ స్థాయిలో వీటిని ఏర్పాటు చేయనుండటం దేశంలో ప్రప్రథమమన్నారు. తొలుత వంద పోలీస్ స్టేషన్ల పరిధిలో, అనంతరం జోన్ల వారీగా వీటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ షాపులు, దుకాణదారులు తమ సంస్థల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడాన్ని తప్పనిసరి చేయాల్సి ఉందన్నారు. ఈ అంశాన్ని ప్రజాభద్రత చట్టంలో పొందుపరిచేం దుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉండే భవనాలు, అపార్ట్మెంట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా గట్టిగా చెబుతున్నామన్నారు. నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి మాట్లాడుతూ, సీసీ కెమెరాలతో తమకు భద్రత ఉందని ఓ వైపు ప్రజలకు విశ్వాసం కల్పించడంతో పాటు మరోవైపు నేరాల తీరును తెలుసుకునేందుకు, నిరోధించేం దుకు పోలీసులకు అవకాశం ఉంటుందన్నారు. కెమెరాల ఆధారంగా త్వరితంగా విచారణ జరిపేందుకు వీలవుతుంద ని చెప్పారు. ఇవి మూడో నేత్రాల్లాంటివని, తద్వారా సంఘ విద్రోహులు, దొంగలు నేరాలు చేసేందుకు భయపడతారన్నారు. సీసీ కెమెరాలను జీహెచ్ఎంసీ, జలమండలి, ట్రాన్స్కో, జెన్కోలతోనూ అనుసంధానం చేయనున్నట్లు చెప్పారు. -
కొలువుల బండి
నిరుద్యోగులకు, సంస్థలకు వారధిగా ‘ఈ-వ్యాన్’ బస్తీలలో దరఖాస్తుల స్వీకరణ ఉద్యోగావకాశాలకు కొత్త మార్గం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహణ సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఓ వైపు ఉద్యోగాల కోసం వేలాది మంది ఎదురు చూస్తున్నారు. రెజ్యూమ్లు పట్టుకొని నిత్యం సంస్థల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు తగిన అర్హతలు ఉన్న అభ్యర్థుల కోసం అనేక సంస్థలు వెదుకుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ ఉభయులకూ అనుసంధానంగా ఉండేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా గత నెల 16న ‘ఈ-వ్యాన్’ అనే కొలువుల బండిని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా అభ్యర్థుల దరఖాస్తులు స్వీకరించే పని ప్రారంభించింది. బస్తీలకు వెళ్లి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఆన్లైన్ ద్వారా వివరాలు నమోదు చేసేలా ‘ఈ-వ్యాన్’ను రూపొందించారు. దీనిలో పేర్ల నమోదుకు నిరుద్యోగులు ఉత్సాహం చూపుతున్నారు. నెల రోజుల్లోనే వివిధ ప్రాంతాలకు చెందిన 1502 మంది ఉద్యోగాలు కావాలంటూ పేర్లు నమోదు చేసుకున్నారు. అభ్యర్థులుఈ-వ్యాన్కు సంబంధించిన కార్యాలయాలకు వెళ్లి కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చు. వీటిని ఈ-జోన్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం మౌలాలి, మల్కాజిగిరి, మూసాపేటల్లో ఈ-జోన్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ కేంద్రాల ద్వారా మరో 262 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఇంకో 12,539 మంది జీహెచ్ఎంసీ ఆన్లైన్ ద్వారా ఉద్యోగాల కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. అదే సమయంలో వివిధ విభాగాల్లో పని చేసేందుకు తగిన అభ్యర్థులు కావాలంటూ 46 సంస్థలు జీహెచ్ఎంసీకి వివరాలు అందజేశాయి. ఆ సంస్థల్లో 1222 ఖాళీలు ఉన్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ అర్హులైన వారిని పంపించింది. దీంతో ఇప్పటి వరకు 49 మందికి ఉద్యోగాలు లభించాయి. వీరిలో టెన్త్, ఇంటర్ నుంచి డిగ్రీ, పీజీల వరకు చదివిన వారు ఉన్నారు. వీరికి నెలకు రూ.6 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం అందుతోంది. సమాచారం ఇవ్వాలి... ఈ-వ్యాన్ ఏ రోజు ఏ ప్రాంతానికి వస్తుందో సమచారం ఉండటం లేదని, ఆ వివరాలు ముందస్తుగా తెలియజేస్తే దరఖాస్తు చేసుకునేవారమని ఆయా బస్తీల్లోని నిరుద్యోగులు నిష్టూరమాడుతున్నారు. అధికారులు ఈమేరకు తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. తద్వారా మరింత మందికి ప్రయోజనం కలుగుతుందని వారంతా అభిప్రాయపడుతున్నారు. -
కొంగొత్త కాంతులు
ఎల్ఈడీ వెలుగులు రూ. 927 కోట్లతో ప్రణాళిక టర్న్కీ పద్ధతిలో చెల్లింపులు ఈఈఎస్ఎల్ భాగస్వామ్యం ఆరు మార్గాల్లో పెలైట్ ప్రాజెక్టుగా అమలు సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ విద్యుత్ విభాగం ఏటా చేస్తున్న ఖర్చులో సింహభాగం కరెంటు చార్జీలకే చెల్లిస్తోంది. అయినప్పటికీ చాలా చోట్ల విద్యుత్ దీపాలు వెలగడం లేదని... కొన్ని చోట్ల గుడ్డిదీపాల్లా ఉన్నాయనే ఫిర్యాదులు అందుతున్నాయి. రహదారులు సరిగా కనిపించనందున తరచూ జనం ప్రమాదాల బారిన పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారంలో భాగంగాగ్రేటర్ నగరంలో ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ యోచిస్తోంది. తద్వారా వెలుగులు పెంచడంతో పాటు విద్యుత్ చార్జీలు గణనీయంగా తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇందుకుగాను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) సేవలు వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ)ల భాగస్వామ్యంతో ఈఈఎస్ఎల్ ఏర్పాటైంది. రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపల్ కార్పొరేషన్ల భాగస్వామ్యంతో నగరాలు, పట్టణాల్లో విద్యుత్ ఆదా చర్యలు అమలులోకితేవడం ఈఈఎస్ఎల్ ఏర్పాటు లక్ష్యం. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ఈఈఎస్ఎల్ అవసరమైన సహకారాన్ని అందిస్తుంది. ఈ ప్రాజెక్టులను టర్న్కీ పద్ధతిలో అమలు చేస్తుంది. ఇప్పటికే 93 స్థానిక సంస్థల్లో ఈఈఎస్ఎల్ పని చేస్తోంది. వాటిలో కోల్కతా, నాసిక్, పుదుచ్చేరి, చండీగఢ్ తదితర నగరాలు ఉన్నాయి. వాటి తరహాలో హైదరాబాద్లోనూ విద్యుత్ ఆదాకు ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. తొమ్మిదేళ్లలో గ్రేటర్ అంతటా ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలనేది ప్రణాళిక. ఏటా రూ.103 కోట్లు వంతున జీహెచ్ఎంసీ ఈఈఎస్ఎల్కు చెల్లించాలని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అంటే ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ. 927 కోట్లు. ఇందులో భాగంగా పెలైట్ ప్రాజెక్టుగా 500-1000 ఎల్ఈడీ లైట్లను ఈఈఎస్ఎల్ ఉచితంగానే ఏర్పాటు చేస్తుంది. వాటి పనితీరును పరిశీలించాక జీహెచ్ఎంసీ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఆ మేరకు ఇటీవల స్టాండింగ్ కమిటీలో తీర్మానించారు. ఈఈఎస్ఎల్దే బాధ్యత ప్రాజెక్టులో భాగంగా పనులన్నీ పూర్తయ్యేంత వరకు నిర్వహణ బాధ్యతలను కూడా ఈఈఎస్ఎల్ నిర్వహిస్తుంది. సాంకేతిక లోపాలు తలెత్తితే లైట్లను మారుస్తుంది. సెంట్రలైజ్డ్ మానిటరింగ్ అండ్ కంట్రోల్ సిస్టం ఏర్పాటు చేస్తుంది. విద్యుత్ వెలుగుల స్థాయి జాతీయ ప్రమాణాల (బీఐఎస్ ప్రమాణాలు, నేషనల్ లైటింగ్ కోడ్) మేరకు ఉండాలి. పెలైట్ ప్రాజెక్టుతో... పెలైట్ ప్రాజెక్టులో భాగంగా ఈఈఎస్ఎల్ వెస్ట్జోన్, సౌత్జోన్లలోని ఆరు మార్గాల్లో 703 స్తంభాలకు 835 ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయనుంది. మెట్రో పోలిస్ సదస్సు జరుగనున్న అక్టోబర్లోగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీటి పనితీరును బట్టి గ్రేటర్ అంతటా విస్తరించేందుకు ఒప్పందం కుదుర్చుకుంటారు. -
చారిత్రక కట్టడాల పరిరక్షణకు రూ.100 కోట్లు
మరమ్మతులు చేపట్టాలని ఆదేశించిన నగర మేయర్ ‘ఖుర్షీద్ జా దేవుడి’ కట్టడాన్ని సందర్శించిన మాజిద్ శాలిబండ : గ్రేటర్ పరిధిలోని చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని నగర మేయర్ మాజీద్ హుస్సేన్ తెలిపారు. కట్టడాల మరమ్మతులు, పరిరక్షణ కోసం జీహెచ్ఎంసీ తరఫున రూ.100 కోట్లు మంజూరు చేశామన్నారు. శనివారం ఆయన చార్మినార్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, జీహెచ్ఎంసీ దక్షిణ మండలం జోనల్ కమిషనర్ ఎం.బాలసుబ్రహ్మణ్యంరెడ్డితో కలిసి చారిత్రక కట్టడమైన ‘ఖుర్షీద్ జా దేవుడి’ని సందర్శించారు. ఈ కట్టడం పెచ్చులూడుతుండడాన్ని గమనించిన మాజిద్ హుస్సేన్ వెంట నే మరమ్మతులు చేపట్టాలని పురావస్తు శాఖ అధికారులకు సూచిం చారు. చారిత్రక కట్టడాలను పరిరక్షించి భవి ష్యత్తు తరానికి అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ తరఫున గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని అన్ని చారిత్రక కట్టడాలకు మరమ్మతులు చేపట్టి వీటికి మరింత వన్నె తెస్తామన్నారు. ఈ పనుల ను కుడా ఆధ్వర్యంలో చేపడతామని తెలిపారు. దారుషిఫాలోని పాత పాస్పోర్టు కార్యాలయాన్ని కూడా ఆయ న సందర్శించారు. కార్యక్రమంలో హుస్సేనీ ఆలం కార్పొరేటర్ మీర్ జుల్ఫీకర్ అలీ, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు, పురావస్తు శాఖ అధికారులు, ఎంఐఎం నాయకులు అసద్ ఖాద్రీ పాల్గొన్నారు. -
సర్వే జనా సుఖినోభవంతు!
ఉదయం 7.00 గంటల నుంచి ప్రారంభం ఫిర్యాదులకు కాల్సెంటర్ 040-21 11 11 11 జిరాక్స్లు ఇవ్వనవసరం లేదు సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది. మంగళవారం జరుగనున్న మహాక్రతువుకు రెండు రోజుల ముందు నుంచే ప్రీ విజిట్లు నిర్వహించిన ఎన్యూమరేటర్లు క్షేత్ర స్థాయిలో ఇబ్బందులను గుర్తించారు. ఇంటింటికీ కరపత్రాలు.. అవి అందినట్లుగా స్టిక్కర్లు అతికించారు. తమ ఇళ్లకు ఎన్యూమరేటర్లు రాలేదంటూ వివిధ ప్రాంతాల నుంచి జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు అందుతుండడంతో జీహెచ్ఎంసీ కాల్సెంటర్లోని ఫోన్ లైన్లను 30 నుంచి 50కి పెంచారు. ఆదివారం 13.40 లక్షల ఇళ్లను సందర్శించిన సిబ్బంది .. 2.06 లక్షల ఇళ్లు కొత్తగా వచ్చినట్లు గుర్తించారు. సాక్షి, సిటీబ్యూరో:సర్వేకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని కమిషనర్ చెప్పారు. రెండు రోజుల పాటు సాగిన క్షేత్ర స్థాయి పర్యటనలలో కొన్ని ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయని, అవసరానికి సరిపడా సామగ్రిని సిద్ధం చేశామన్నారు. అదనపు సిబ్బందిని నియమించుకునేందుకు ఎన్యూమరేటర్లకు వెసులుబాటు కల్పించామని చెప్పారు. ఏ ప్రాంతాల్లోనైనా సర్వే జరుగని పక్షంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. సర్వేలో సహకరించేందుకు సహాయ ఎన్యూమరేటర్లుగా విద్యార్థులతోపాటు వివిధ వర్గాల వారిని నియమించుకున్నప్పటికీ..ఎన్యూమరేటరే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కొన్ని ప్రాంతాల్లో సోమవారం ప్రీ విజిట్లకు వెళ్లిన ఎన్యూమరేటర్లు సర్వేను సైతం పూర్తి చేశారు. సర్వేలో భాగంగా వివరాలు అందజేయడమే తప్ప.. జిరాక్స్లు ఇవ్వాల్సిన అవసరం లేదని కమిషనర్ సోమేశ్కుమార్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ వెబ్సైట్ నుంచి సర్వే ఫారాలను 25వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారని కమిషనర్ చెప్పారు. ప్రీ విజిట్లలో దృష్టికొచ్చిన అంశాలు.. అందుకనుగుణంగా తీసుకుంటున్న చర్యలు..ఏర్పాట్లు తదితర అంశాలను కమిషనర్ సోమేశ్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి. పెరిగిన గృహాలు 2011 జనాభా లెక్కల మేరకు గ్రేటర్లో దాదాపు 13 లక్షల ఇళ్లుండగా.. ఇటీవలి సర్వేలో 16.96 లక్షల ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. మరో మూడు లక్షల ఇళ్లు అదనంగా వచ్చినా ఇబ్బందులు లేకుండా సర్వే పూర్తి చేయాలనే ఉద్దేశంతో సిబ్బంది నియామకాలతోపాటు కరపత్రాలు.. స్టిక్కర్లు పంపిణీ చేశారు. ఆదివారం ప్రీ విజిట్లో 13.40 లక్షల ఇళ్ల సర్వే జరగ్గా, అందులో 2.06 లక్షల ఇళ్లు కొత్తగా వచ్చినట్లు గుర్తించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని 21 లక్షల ఇళ్లకు సరిపడా మెటీరియల్ను అందజేశామని కమిషనర్ తెలిపారు. ఇంకా సరఫరా చేస్తున్నామన్నారు. 21,636 ఇళ్లకు తాళాలు ఇంటింటి సర్వేను పురస్కరించుకొని సొంత గ్రామాలకు వెళ్లిన వారూ తక్కువేమీలేరు. ఆదివారం నాటి సర్వేలో 21,636 ఇళ్లకు తాళాలు ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. ఒక్క ఇల్లూ తప్పిపోకూడదనే.. గ్రేటర్ నగర విస్తీర్ణం ఎక్కువగా ఉండటం.. జనసాంద్రత భారీగా ఉండటంతో ఏ ఒక్క ఇల్లు కూడా తప్పిపోకుండా సర్వే నిర్వహించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కమిషనర్ చెప్పారు. మనుషులు చెట్లు కింద ఉన్నా, రోడ్డు పక్కన పొయ్యి ఉన్నా... వారి వివరాలు నమోదు చేయాల్సిందేనన్నారు. ఇది మనుషులకు సంబంధించిన సర్వే తప్ప ఆస్తులకు సంబంధించినది కాదన్నారు. సంచార జాతుల వారి వివరాలూ నమోదు చేస్తామన్నారు. జిరాక్స్లతో పని లేదు ఎన్యూమరేటర్లు సర్వేకు వచ్చినప్పుడు గందరగోళానికి గురి కాకుండా ఉండేందుకు, ఆధార్ కార్డు..ఆస్తిపన్ను నెంబరు(పీటీఐఎన్), బ్యాంక్ అకౌంట్, గ్యాస్ కనెక్షన్ వంటి వాటి నెంబర్లలో పొరపాట్లకు తావులేకుండా చూసేందుకే జిరాక్స్ కాపీలు అందుబాటులో ఉంచుకోవాలని చెబుతున్నాం తప్ప వాటిని సర్వేయర్లకు ఇవ్వాల్సిన అవసరం లేదని కమిషనర్ స్పష్టం చేశారు. కేవలం ఎన్యూమరేటర్ల ధ్రువీకరణ కోసమే జిరాక్స్లు ఉంటే మంచిదనే ఉద్దేశంతో ఈ సూచన చేశామన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకోవాలనడం వెనుక కూడా మరో కారణం లేదన్నారు. బ్యాంకు ఖాతా వివరాలు ప్రజల ఇష్టం .. బ్యాంకు ఖాతా నెంబరు తెలపాలా.. వద్దా అనేది ప్రజల నిర్ణయమేనని, బలవంతం లేదని కమిషనర్ చెప్పారు. ఇచ్చినా తగు భద్రత ఉంటుందని, భయపడాల్సిన పనిలేదని భ రోసా ఇచ్చారు. ఎన్యూమరేటర్కు 40 ఇళ్లు.. ఒక్కో ఎన్యూమరేటర్కు సర్వే చేయాల్సిన ఇళ్లు 40కి మించకుండా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు. అత్యవసర పనుల మీద వెళ్లినవారు.. విదేశాల్లో ఉంటున్న వారికి సంబంధించి ఏవైనా ఆధారాలు చూపితే చాలునన్నారు. ప్రత్యేక సాఫ్ట్వేర్... సమగ్ర కుటుంబ సర్వేలోని వివరాల డేటాబేస్ కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించి, 15 రోజుల్లో కంప్యూటరీకరిస్తామన్నారు. ఈ జాబితా ఆధారంగానే భవిష్యత్లో ఏ పథకానికి ఏ వివరాలు అవసరమవుతాయో వాటిని వినియోగిస్తామన్నారు. బదిలీలైనప్పుడు, ఇల్లు మారినప్పుడు సవరించేందుకు వీలుగా డేటాబేస్లో మార్పులూ చేర్పులకు వీలుంటుందని కమిషనర్ సోమేశ్కుమార్ చెప్పారు. సర్వే కేవలం బీపీఎల్ కుటుంబాలకు సంబంధించినది మాత్రమే కాదని, ఏపీఎల్ కుటుంబాలకూ పనికివచ్చేదన్నారు. సర్వేలో పాల్గొనకుంటే భవిష్యత్లో కొన్ని ప్రయోజనాలు కోల్పోయే అవకాశాలుంటాయన్నారు. ఆర్థిక పరిస్థితి, స్థానికతకు సంబంధించి ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, సర్వేలో ఈ వివరాలు లేవని చెప్పారు. డేటా దుర్వినియోగం జరిగేందుకు ఆస్కారం లేదని, అత్యంత భద్రంగా ఉంటుందన్నారు. సర్వేలో హిజ్రాల వివరాల నమోదుకూ ఏర్పాట్లు ఉన్నాయన్నారు. ఫిర్యాదుల పరంపర... ఆదివారం సాయంత్రం నుంచీ తమ ఇళ్లకు ఎన్యూమరేటర్లు రాలేదంటూ ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. జీహెచ్ఎంసీ కాల్ సెంటర్కు రోజుకు సగటున 300 ఫిర్యాదులు అందేవి. ఆదివారం ఈసంఖ్య 5,616కు చేరింది. సోమవారం రాత్రి 8.40 గంటల వరకు 4776 ఫిర్యాదులు అందాయి. ఫోన్లు నిరంతరం బిజీగా ఉండటంతో చాలామందికి అసలు లైన్లే కలవలేదు. ఈ పరిస్థితిని గుర్తించి కాల్సెంటర్లోని 30 లైన్లకు తోడు అదనంగా మరో 20 లైన్లు పెంచారు. ప్రస్తుతం 50 లైన్లు పని చేస్తున్నాయని కమిషనర్ తెలిపారు. దీంతోపాటు జీహెచ్ఎంసీ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని..స్థానిక డిప్యూటీ కమిషనర్కు సైతం ఫిర్యాదు చేయవచ్చునన్నారు. వెబ్సైట్ కంటే ఫోన్కాల్స్ ద్వారా త్వరితంగా చర్యలకు వీలవుతుంది. సర్వే పరిశీలనకోసం నోడల్ ఆఫీసర్లు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తారు. తమ ఇళ్లకు ఎన్యూమరేటర్లు రాని విషయాన్ని నోడల్ ఆఫీసర్లకు సైతం తెలియజేయవచ్చు. అంతిమ నిర్ణయం ప్రజలదే.. సర్వేలో భాగంగా కుటుంబ వివరాలు.. ఇతరత్రా సమాచారం తెలియజేయవచ్చా? లేదా అనేది అంతిమంగా ప్రజల నిర్ణయమేనని, ఏదీ కచ్చితం కాదన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టబోయే వివిధ పథకాలకు.. ఇతరత్రా అవసరాలకు సర్వే ద్వారా నమోదైన డేటా ఉండటం అవసరమన్నారు. ఉదాహరణకు భవన నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకున్నా.. ఆన్లైన్లో వివరాలు ఉన్నాయోమో చూస్తారని, లేని పక్షంలో ఇబ్బంది ఎదురు కావచ్చన్నారు. కుటుంబానికి సంబంధించిన మొత్తం సమాచారం ఇస్తే మంచిదన్నారు. సర్వే సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరుగుకుండా పోలీసు సహకారాన్ని కోరుతున్నారా అన్న ప్రశ్నకు బదులిస్తూ, 7500 మంది పోలీసులే ఎన్యూమరేటర్లుగా ఉన్నారని తెలిపారు. చాలా ప్రాంతాలకు ఎన్యూమరేటర్లు రాలేదని, ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో.. మేయర్ వార్డులో సైతం చాలామంది ఇళ్లకు ఎన్యూమరేటర్లు రాలేదనగా.. అన్ని ప్రాంతాలకూ వస్తారని, రాని పక్షంలో కాల్సెంటర్, వెబ్సైట్ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని, తగు ఏర్పాట్లు చేస్తామని ఆయన చెప్పారు. ఎన్ని ఏర్పాట్లు చేసినా.. సర్వే జరగకుండా మిగిలిపోయే ఇళ్లుంటే... పరిస్థితేమిటన్న ప్రశ్నకు బదులిస్తూ.. అలాంటి వాటి విషయంపై ఆలోచిస్తామన్నారు. తాళాలు ఉన్న వాటితో పాటు మిగిలిపోయిన ఇళ్ల విషయాలపైనా ప్రభుత్వ నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. -
కూల్చివేతలు ఆగవు
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో కొద్దిరోజులుగా నిలిచిపోయిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఆగిపోలేదని, కొనసాగుతాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలిపారు. ఆదివారం విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, ఈ విషయం స్పష్టం చేశారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్కు ఎలాంటి అనుమతి లేదని, చట్టప్రకారం దానిపై అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. నగరంలోని ఎన్నో ప్రభుత్వ భూములు కబ్జా అయ్యాయని చెబుతూ, కేవలం మూడు కేసుల్లోనే రూ. 50వేల కోట్లకు పైగా ఆస్తులున్నాయన్నారు. సామాన్యుల భవనాలపైనే అధికారులు చర్యలు తీసుకుంటున్నారని ప్రస్తావించగా, దాన్ని ఖండించారు. ఐదారంతస్తులు నిర్మించిన వారు సామాన్యులెలా అవుతారని ఎదురు ప్రశ్నించారు. నగరంలో వాన కురిస్తే నీరు వెళ్లే మార్గం లేదని .. అందుకు కారణాలేమిటని అధికారులను అడిగితే అనుమతి లేని అక్రమ నిర్మాణాలని చెప్పారన్నారు. అందువల్లే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించానని, దాంతో వారు చర్యలకు దిగారన్నారు. -
మిస్డ్కాల్ కొట్టు.. ఉద్యోగం పట్టు
నగరంలో ‘ఈ-వ్యాన్’ సదుపాయం ఉన్న చోటు నుంచే యువతకు ఉద్యోగ అవకాశం పథకాన్ని ప్రారంభించిన మేయర్ మాజిద్ సాక్షి, సిటీబ్యూరో:‘మీరు నిరుద్యోగులా... ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారా?... ఇకపై ఆ అవసరం లేదు. ఉన్న చోటు నుంచే మిస్డ్కాల్ ఇస్తే చాలు ఉద్యోగం కోసం మీ పేరు నమోదైనట్టే.. ఆపై అవసరమైన శిక్షణ.. ఇంటర్వ్యూ.. ఉద్యోగం మీకొచ్చినట్టే’.. ఈ ప్రయోగాత్మక పథకాన్ని జీహెచ్ఎంసీ శనివారం ప్రారంభించింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నగర మేయర్ మాజిద్ హుస్సేన్.. డిప్యూటీ మేయర్ రాజ్కుమార్, కమిషనర్ సోమేశ్కుమార్తో కలిసి జ్యోతి వెలిగించి పథకాన్ని ప్రారంభించారు. టీఎంఐ సంస్థ సాంకేతిక సహకారంతో జీహెచ్ఎంసీ అందుబాటులోకి తెచ్చిన ఈ-వ్యాన్ (ఎంప్లాయ్మెంట్ వ్యాన్)ను కూడా మేయర్ ప్రారంభించారు. మాజిద్ హుస్సేన్ మాట్లాడుతూ.. దేశంలోనే ఏ కార్పొరేషన్ చేయని విధంగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. నిరుద్యోగులు 040-71012014 నెంబర్కు ఫోన్ చేస్తే.. కార్యాలయ పనిదినాల్లో జీహెచ్ఎసీ నుంచి వారికి ఫోన్ కాల్ వెళ్తుందన్నారు. విద్యార్హతలకు తగిన ఉద్యోగాల గురించి వివరించడంతోపాటు కౌన్సెలింగ్ నిర్వహణకు ఈ-జోన్ కార్యాలయాలు ఏర్పాటు చేశామన్నారు. గ్రేటర్లో కనీసం 10 ఈ-వ్యాన్లు, 25 ఈ-జోన్ కేంద్రాలు అవసరమన్నారు. వేదికనుంచే మల్కాజిగిరిలోని ఈ-జోన్ కార్యాలయాన్ని ఆన్లైన్ ద్వారా మేయర్ ప్రారంభించారు. అక్కడున్న నిరుద్యోగులతో మాట్లాడారు. నిరుద్యోగుల కోసం ఎన్నో పథకాలు.. ఈ-వ్యాన్లో ఉండే సదుపాయాలతో నిరుద్యోగుల వివరాలు నమోదు చేస్తారని.. అనంతరం వారి అర్హతలకు తగిన ఉద్యోగాల గురించి ఈ-జోన్ కేంద్రాల్లో తెలుపుతారని, అవసరమైన కౌన్సెలింగ్ ఇస్తారని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ తెలిపారు. ఉద్యోగాలకు సంబంధించిన సమాచారంతోపాటు ఇంటర్వ్యూలను ఎదుర్కొనేందుకు తగిన శిక్షణ కూడా ఇస్తామన్నారు. ఈ-వ్యాన్ ఆయా బస్తీల్లోని నిరుద్యోగులందరినీ ఒక చోటకు చేర్చి వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుందని తెలిపారు. ప్రస్తుతం జోన్కొకటి చొప్పున ఐదు ఈ-వ్యాన్లు పనిచేస్తాయన్నారు. ఈ-వ్యాన్ ద్వారా ఏటా 12వేల మందికి ఉపాధి చూపాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. టీఎంఐ సంస్థ చైర్మన్, ఎండీ మురళీధరన్ మాట్లాడుతూ రానున్న పదేళ్లలో ఐదు లక్షల మందికి ఉపాధి చూపాలని భావిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్, స్పెషల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
అందరి దృష్టి గోల్కొండపైనే..
పంద్రాగస్టు నేపథ్యంలో... బారికేడ్లు, వేదిక,సుందరీకరణ పనులు ముమ్మరం అడుగడుగునా తనిఖీలు వేడుకల ప్రాంతాన్ని సందర్శించిన జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ సాక్షి, సిటీబ్యూరో: పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో అందరి దృష్టి గోల్కొండపై పడింది. ఇందుకు గాను ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అన్ని శాఖల అధికారులు గోల్కొండను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పరిసరాలను చదును చేయడం, సుందరీకరణ పనులు చేపడుతున్నారు. వాహనాల పార్కింగ్, వీఐపీలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోల్కొండకు దారి తీసే మార్గాలను కూడా ముస్తాబు చేస్తున్నారు. గస్తీ ముమ్మరం.. నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను వెస్ట్జోన్ డీసీపీ సత్యనారాయణ పర్యవేక్షిస్తున్నారు. పంద్రాగస్టు రోజున మాసబ్ట్యాంక్ నుంచి గోల్కొండలోని స్వాతంత్ర వేడుకలు జరిగే ప్రదేశం వరకు మొత్తం 26 సెక్టార్లుగా విభజించారు. ఒక్కో సెక్టార్లో నలుగురు సీఐలు, 10 మంది ఎస్ఐలు, 40 మంది కానిస్టేబుళ్లు ఉంటారు. కార్యక్రమానికి హాజరయ్యే వీఐపీలు, వీవీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వాహనాల పార్కింగ్ ప్రదేశాలను ఇప్పటికే గుర్తించారు. వేడుకకు హాజరయ్యే వారి కోసం నానల్నగర్ చౌరస్తా నుంచి టిప్పుసుల్తాన్ బ్రిడ్జి, గొల్కొండ ప్రధాన దర్వాజా నుంచి మకాయిదర్వాజా, బంజారా దర్వాజా నుంచి షేక్పేట్ నాలా ఇలా ఆరు రూట్లను కేటాయించారు. ఎవరు ఏ రూట్లో వెళ్లాలో ముందుగానే పోలీసులు సూచనలతో కూడిన కరపత్రాలు, పాస్లను అందరికి అందజేయనున్నారు. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ముమ్మరం చేశారు. అసలే మిలటరీ ఏరియా కావడం.. ఒక రూట్లో వెళ్లాల్సిన అతిథులు మరో దారిలో వెళ్తే మిలటరీ వారితో తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నందున వాహనాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనే విషయమై ట్రాఫిక్ పోలీసులు అడుగడుగునా రూట్లను సూచించేలా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 45 నిమిషాల పాటు సాగే స్వాతంత్య్ర వేడుకల కోసం బందోబస్తు ఏర్పాటుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్టు డీసీపీ సత్యనారాయణ తెలిపారు. సివిల్ పోలీసులు, ఆర్మ్డ్ రిజర్వు, తెలంగాణ స్పెషల్ పోలీసులతో పాటు గ్రేహౌండ్స్ దళాలు బందోబస్తులో పాల్గొంటున్నాయన్నారు. కోటను సందర్శించిన మేయర్, కమిషనర్ గోల్కొండ : వేడుకలను పురస్కరించుకుని గోల్కొండ కోట ప్రాంతాన్ని శనివారం నగర మేయర్ మాజిద్ హుస్సేన్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్, స్థానిక ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ తదితరులు సందర్శించారు. టోలిచౌకి నుంచి ఏర్పాట్ల పనులు పరిశీలిస్తూ కోటకు వచ్చారు. బంజార దర్వాజ వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులను పూర్తి చేసి ఆ ప్రాంతంలో పూల మొక్కలు నాటాలని వారు ఆదేశించారు. కోటలో సీఎం కేసీఆర్ స్వీకరించే గౌరవ వందనం ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ చేపట్టాల్సిన పనులను అధికారులకు సూచించారు. -
‘గ్రేటర్’లో అదనం
‘సర్వే’లో మరికొన్ని అంశాలు వెబ్సైట్లో నమూనా ఫారం భవనం వివరాలు.. పెంపుడు కుక్కల సమాచారమూ తెలపాల్సిందే నల్లా కనెక్షన్ వివరాలూ ఇవ్వాలి బీపీఎస్ కుటుంబాలు మరింత జాగ్రత్తగా ఉండాలి ‘సాక్షి’తో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 19న రాష్ట్రవ్యాప్తంగా జరుగనున్న ఇంటింటి సర్వేలో భాగంగా గ్రేటర్ ప్రజలు అదనంగా మరికొంత సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. నగరంలో నెల కొన్న పరిస్థితుల దృష్ట్యా ఆస్తిపన్ను, నల్లా కనెక్షన్ వంటి అంశాలు సైతం తెలిసేందుకు వీలుగా గ్రేటర్ అధికారులు వాటిని పొందుపరుస్తున్నారు. తద్వారా అనుమతులు లేకుండా కట్టిన ఇళ్లు.. ఆస్తిపన్ను చెల్లించనివారు.. తదితర వివరాలు సైతం తెలియనున్నాయి. వీటితో పాటు నివాస గృహానికి అనుమతి పొంది, వాణిజ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న భవనాల గుట్టూ రట్టు కానుంది. అక్రమాలకు కళ్లెం వేయడంతో పాటు నిజంగా అర్హులైన వారికి మరింత సమర్థంగా సంక్షేమ పథకాలను అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. త్వరలో సర్వే జరుగనున్న నేపథ్యంలో నగర ప్రజలు అందించాల్సిన అదనపు వివరాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. జీహెచ్ఎంసీ ఏర్పాట్లు తదితర అంశాలను జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వెబ్సైట్లో సర్వే ఫారం సమగ్ర సర్వే ఫారంలో ఏయే అంశాలున్నాయి? వాటిలోని ప్రశ్నలకు సమాధానాలు ఎలా? అప్పటికప్పుడు అవసరమైన సమాచారం తెచ్చేదెలా? వంటి ప్రశ్నలు నగర ప్రజల మెదళ్లను తొలుస్తున్నాయి. ఈ ఇబ్బందులను తొలగించేందుకు సర్వే ఫారాన్ని జీహెచ్ఎంసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ తెలిపారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో వీటిని అందుబాటులో ఉంచుతామన్నారు. దీంతో పాటు కరపత్రాల ద్వారానూ తగిన సమచారం అందిస్తామన్నారు. సర్వేపై ప్రజలకెలాంటి సందేహాలు ఉన్నా... నివృత్తి చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. కాల్ సెంటర్ ద్వారా సాయం సర్వే ప్రశ్నావళికి సంబంధించి ప్రజల సందేహా ల నివృత్తికి జీహెచ్ఎంసీ కాల్సెంటర్ సిబ్బం దికి అవసరమైన శిక్షణ ఇస్తామని కమిషనర్ చె ప్పారు. తద్వారా ప్రజల సందేహాలకు వారు సమాధానాలు చెబుతారన్నారు. జీహెచ్ఎంసీ కాల్సెంటర్ 040-21 11 11 11కు ఫోన్చేసి ప్రజలు తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చునని చెప్పారు. ఇది అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతుంది. బీపీఎల్ కుటుంబాలూ.. తస్మాత్ జాగ్రత్త గ్రేటర్లోని బీపీఎల్ కుటుంబాల వారు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. లేని పక్షంలో ప్రభుత్వం భవిష్యత్లో ప్రవేశపెట్టబోయే సంక్షేమ పథకాలు అందకుండా పోయే ప్రమాదం ఉంది. లేదా ప్రస్తుతం పొందుతున్న పథకాల నుంచి తొలగించే ప్రమాదం ఉంటుంది. అందుకే సరైన వివరాలు అందజేయాలి. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు తప్పనిసరిగా తమ వివరాలను అందజేయాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు వంటివన్నీ జిరాక్స్లు తీయించుకొని ఉండటం మేలు. వీటితో పాటు బ్యాంకు/పోస్టాఫీసు ఖాతాలు ఉంటే వాటి నెంబర్లు తెలియజేయాలి. గ్యాస్ కనెక్షన్లు, దీపం పథకం ప్రయోజనం తదితర వివరాలు తెలియజేయాల్సి ఉంది. అంతేకాదు..భవిష్యత్లో జీహెచ్ఎంసీ తదితర ప్రభుత్వ విభాగాలు అమలు చేయబోయే సంక్షేమ పథకాలన్నింటికీ వీటితో పోల్చి చూస్తారు. ఎక్కడి వారు అక్కడే ఎక్కడ ఉంటున్న వారు అక్కడే తమ వివరాలు నమోదు చేయించాలి. ఉదాహరణకు నగరంలోఉండేవారు ఇక్కడే పేర్లు నమోదు చేయిస్తే.. భవిష్యత్లో అమలయ్యే సంక్షేమ పథకాలకు అర్హులవుతారు. గ్రామాల్లో సంక్షేమ పథకాలు పొం దాలనుకునేవారు (ఇక్కడ తాత్కాలికంగా ఉంటున్నవారు) అక్కడే తమ వివరాలివ్వాలి. తద్వారా అక్కడ పథకాలు పొం దే వీలుంటుంది. నగరంలో ఉంటున్న తమకు గ్రామాల్లో భూములు ఉన్నాయంటున్న వారు..ఎక్కడ నివాసం ఉంటా రో..పథకాలను వినియోగించుకోవాలనుకుంటారోఅక్కడే వివరాలు అందజేయాలి. తప్పనిసరిగా విధులకు వెళ్లాల్సిన వారు.. ఇంట్లో ఉండటం వీలుపడని వారికి (ఆస్పత్రుల్లో చికిత్సలో ఉన్నవారు.. ఇంటర్వ్యూలకు ఇతర ప్రదేశాలకు వె ళ్లినవారు తదితరులు) సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తే ఫారంలోని ‘రిమార్కులు’ కాలమ్లో వాటిని పొందుపరుస్తారు. భార్య లేక భర్త నగరంలో ఉండి.. మిగతా వారు ఇతర ప్రదేశం(వేరే జిల్లా,గ్రామం)లో ఉంటే అక్కడే నమోదు చేయించుకుంటే మంచిదని కమిషనర్ తెలిపారు. నగరంలో తాత్కాలిక నివాసం ఉండేవారు వారి స్వగ్రామాల్లో వివరాలు నమోదు చేయిస్తేనే స్థానికంగా సంక్షేమ పథకాలకు అర్హులవుతారన్నారు. విదేశాల్లో ఉంటున్న వారికి సంబంధించిన సమాచారాన్ని కుటుంబీకులు తెలియజేయవచ్చు. గ్రేటర్ ప్రజలు అదనంగా పొందుపరచాల్సిన అంశాలివీ... 1. భవనం/ఇల్లు ఆస్తిపన్నుకు సంబంధించిన(పీటీఐఎన్) నెంబరు. 2. జలమండలి నుంచి నల్లా కనెక్షన్ ఉందా? ఉంటే క్యాన్ నెంబరు. 3. భవనంలో ఎన్ని అంతస్తులున్నాయి? 4. నివాస భవనమా.. వాణిజ్య భవనమా? 5. కొన్ని అంతస్తుల్లో నివాసాలుండి.. కొన్ని అంతస్తుల్లో వాణిజ్యం జరుగుతోందా? 6. కుక్కలు, ఇతర పెంపుడు జంతువుల వివరాలు. -
లెక్కా పత్రం లేదు
మొక్కుబడిగా సమీక్ష వివరాలివ్వని జీహెచ్ఎంసీ అధికారులు సమీక్ష సోమవారానికి వాయిదా సాక్షి, సిటీబ్యూరో: పేరుకే అది సమీక్ష. ఏ పనులపై సమీక్ష అని ప్రకటించారో ఆ పనులకు సంబంధించి సరైన సమాచారం లేదు. వాటిల్లో ఎన్ని పూర్తయ్యాయో.. ఎన్ని పెండింగ్లో ఉన్నాయో .. పనులు ఏ దశలో ఉన్నాయో వివరాలు లేవు.. జీహెచ్ఎంసీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సోమవారం మేయర్ మాజిద్ హుస్సేన్ నేతృత్వంలో సమీక్ష తీరూ..తెన్నూ. జీహెచ్ఎంసీలో అభివృద్ధి పనులకు సంబంధించి రెండేళ్లుగా పాలకమండలి, స్టాడింగ్ కమిటీ చేసిన తీర్మానాలపై సోమవారం మేయర్ మాజిద్ హుస్సేన్ నేతృత్వంలో సమీక్ష జరిగింది. సమీక్షలో అధికారులు మొక్కుబడిగా వివరాలను అందించారు. రెండేళ్లుగా ఎన్ని తీర్మానాలు చేశారు. వాటిల్లో ఎన్ని పూర్తయ్యాయి..అవి ఏ దశల్లో ఉన్నాయో సమాచారం లేదు. కనీసం ఇచ్చిన అంశాలు.. పనులైనా వరుసక్రమంలో ఉన్నాయా అంటే అదీ లేదు. ఇంజినీరింగ్ విభాగం నుంచి అందిన కొన్ని పనుల చిట్టాను తీసుకొచ్చి వాటినే సభ్యులకు అందజేశారు. సమావేశంలో ఆయా పార్టీల ఫ్లోర్లీడర్లు దిడ్డిరాంబాబు(కాంగ్రెస్), సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి(టీడీపీ), బంగారి ప్రకాశ్(బీజేపీ) , నజీరుద్దీన్(ఎంఐఎం), స్టాండింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. హడావుడిగా ఇచ్చిన కాగితాల్లోని అంశాలను చూడటానికే వారికి సమయం సరిపోలేదు. కనీసం ఒకరోజు ముందుగా వివరాలందజేస్తే.. వాటిని పరిశీలించేందుకు వీలుండేదని ఫ్లోర్లీడర్లు వాపోయారు. సమీక్ష అంశాన్ని పక్కనబె ట్టి కార్పొరేటర్లకు నిధులు పెంచాలని, జోనల్స్థాయిలో మంజూరును రూ. 20 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. పనులను పెద్ద ప్రాజెక్టులుగా చేపట్టాలని.. కనీసం రూ. ఒక్కో ప్రాజెక్టు విలువరూ. 50 కోట్లకు తగ్గకుండా ఉండాలనే కమిషనర్ సోమేశ్కుమార్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఒక్కో కార్పొరేటర్కు 5వేల మొక్కలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్ల పనుల్ని అధికారులు పట్టించుకోవడం లేరని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు సమీక్షించాల్సిన అంశాల్ని విస్మరించారు. కార్పొరేటర్ల బడ్జెట్ నిధుల విడుదలలో ఏయే పనులకు ఎంతమేర నిధులో మార్గదర్శకాలు అవసరం లేదని, కార్పొరేటర్లు ఏ పనులు కావాలంటే అవి చేపట్టాలని పట్టుబట్టారు. తమ బడ్జెట్ నిధుల వినియోగంలో తమకే పూర్తిస్వేచ్ఛ కావాలని డిమాండ్ చేశారు. డంపర్బిన్లు, చెత్త రిక్షాలు తగినన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పనుల్లో జాప్యం లేకుండా ఉండేందుకు సీఈ, ఎస్ఈలనే జోన్లకు పంపించాలని కోరారు. పనులకు సంబంధించి సరైన నివేదిక లేకపోవడం.. ఆయా డిమాండ్లపై గందరగోళం.. నేపథ్యంలో తీర్మానాల అమలు సమీక్షను మేయర్ వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. అధికారులు పూర్తి చేశామని చెబుతున్న పనులకు సంబంధించి నమూనాగా కొన్నింటిని తనిఖీ చేద్దామన్న మేయర్ సవాల్కు అధికారుల నుంచి మౌనమే సమాధానమైనట్లు తెలిసింది. అన్ని ప్రాంతాల్లో లిట్టర్ ఫ్రీ .. స్టాండింగ్ కమిటీకి తెలియకుండా లిట్టర్ఫ్రీని ప్రారంభించారని అధికారులపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లిట్టర్ఫ్రీ విధానాన్ని అన్ని జోన్లలో ప్రవేశపెట్టాలని, కేవలం 23 కి.మీ.లలో కాకుండా దాదాపు 300 కి.మీ.ల మేర చేపట్టాలని అన్ని పార్టీల ఫ్లోర్లీడర్లు కోరారు. వారం రోజుల్లోగా ఈ పనులు చేపట్టాలనడం కోరారు. గ్రేటర్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్ణయించారు. సమగ్ర రహదారుల అభివృద్ధిపనులు త్వరితగతిన పూర్తయ్యేందుకు కొత్త పాలసీని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. రూ. 5 కోట్లకు పైబడిన పనులు చాలా కాలంగా ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయని మేయర్ ప్రస్తావించగా, వాటిని త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని కమిషనర్ సోమేశ్కుమార్ హామీ ఇచ్చారు. సమీక్ష సమావేశంలో డిప్యూటీ మేయర్ జి.రాజ్కుమార్, స్పెషల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
అక్షరాలా లక్షమంది!
సాక్షి, సిటీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే నిర్వహించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. దీనికోసం వివిధ విభాగాల నుంచి సిబ్బందిని కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ విస్తీర్ణం, సర్వేకు కావాల్సిన యంత్రాంగం కొరత తదితర అంశాల నేపథ్యంలో నగరంలో ఈ కార్యక్రమం సాగదనే సంశయాలు నెలకొన్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు వీలునుబట్టి అదే రోజున లేదా మరో తేదీన గ్రేటర్ నగరంలోనూ సామాజిక ఆర్థిక సర్వేకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిసింది. అందుకు అనుగుణంగా జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. వీలైతే ఒకే రోజున.. లేదా రెండు రోజుల పాటు సర్వే నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు అవసరమైన యం త్రాంగం, సర్వేలో ఎవరెవరిని వినియోగించుకోవాలి? ఏయే అంశాలు పొందుపరచాలనే విషయమై జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. జీహెచ్ఎంసీతో పాటు నగరంలోని వివిధ శాఖల ప్రభుత్వోద్యోగులు, పోలీసులు, మిలటరీ బలగాలనూ వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ చెప్పారు. సర్వే విధానంపై కసరత్తు సుమారు 625 చ.కి.మీల మేర విస్తరించిన జీహెచ్ఎంసీ ప్రస్తుత జనాభా 90 లక్షలు దాటింది. దీన్ని పరిగణనలోకి తీసుకొని సుమారు కోటి మంది వివరాలను సేకరించేందుకు లక్ష మంది అవసరమవుతారని జీహెచ్ఎంసీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఒక్కొక్కరు సగటున 25 ఇళ్లలో సర్వే చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. నగరంలో చిరునామాలు గందరగోళంగా ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని, సర్వేకు ఎలాంటి విధానాన్ని పాటించాలనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల పోలింగ్ స్టేషన్ల వారీగా సర్వే జరపాలనే అభిప్రాయాలతో పాటు జనగణన సమయంలో పాటించిన ఎన్యూమరేషన్ బ్లాకుల వారీగా చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలూ పరిశీలనకు వచ్చాయి. ఎన్యూమరేషన్ బ్లాకుల వారీగా అయితే శాస్త్రీయంగా ఉంటుందని భావిస్తున్నారు. ఎన్యూమరేషన్ బ్లాకుల మ్యాపులు ఉన్నందున పని సులువవుతుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో పాటు జీహెచ్ఎంసీలోని ఆస్తి పన్ను విభాగం, అంగన్వాడీల సేవలూ వినియోగించుకోవాలనే ఆలోచన ఉన్నా...వాటి వల్ల తగిన ప్రయోజనం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్నివిధాలా యోగ్యమైన విధానం కోసం ఒకటి రెండు రోజుల పాటు ఆలోచనలు సాగే అవకాశం ఉంది. పూర్తయితే స్టిక్కర్లు సర్వే పూర్తయిన ఇళ్లకు సంబంధించి ఈ విషయం తెలియజేసేలా స్టిక్కర్లు అతికించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ స్లిప్ల పంపిణీలోనూ జీహెచ్ఎంసీ అధికారులు ఈ విధానాన్ని పాటించారు. ఓటరు స్లిప్పులు అందజేసిన వారి ఇళ్లకు స్టిక్కర్లు అతికించారు. ఆ అనుభవంతో ఈసారి మరింత పకడ్బందీగా స్టిక్కర్ల కార్యక్రమాన్ని అమలు చేయగలమని భావిస్తున్నారు. సర్వే విధుల్లో పాల్గొనే లక్ష మందిపై వివిధ స్థాయిల్లో సూపర్వైజర్లు, ఇన్ఛార్జులను నియమించనున్నారు. తమ పరిధిలో సర్వే తీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు అవసరమైన చర్యలు చేపడతారు. -
స్లమ్ ఫ్రీ సిటీకి 72 బస్తీల్లో సర్వే
పూర్తిచేసిన జీహెచ్ఎంసీ సాక్షి, సిటీబ్యూరో: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హామీ మేరకు నగరాన్ని స్లమ్ ఫ్రీ సిటీ చేసే దిశగా జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. తొలి దశలో 72 స్లమ్స్లో సర్వే పూర్తి చేశారు. స్లమ్ ఫ్రీ సిటీలో భాగంగా ఆయా స్లమ్స్లో రెండు పడకగదుల ఇళ్లతోపాటు తాగునీరు, డ్రైనేజీ , విద్యుత్తు.. తదితర మౌలిక సదుపాయాలను సమకూర్చనున్నారు. ఇందులో భాగంగా మూడు రకాలైన ఇళ్లను నిర్మిం చేందుకు జీహెచ్ఎంసీ మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. ప్రస్తుతం నిర్వహించిన సర్వే మేరకు ఇన్సిటు రీ డెవలప్మెంట్కు 52 స్లమ్స్లోని ప్రజలు, ఇన్ సిటు అప్గ్రే డేషన్ కింద ఇళ్ల నిర్మాణాలకు 20 స్లమ్స్ ప్రజలు తమ అంగీకారం తెలిపారు. రీ డెవలప్మెంట్లో భాగంగా ఉన్న ఇళ్లను కూల్చివేసి, అందరికీ సరిపడే ఇళ్లను కొత్తగా నిర్మిస్తారు. అప్గ్రేడేషన్లో భాగంగా.. ఉన్న ఇళ్లకు అవసరమైన మరమ్మతులు చేసి సదుపాయవంతంగా ఆధునీకరిస్తారు. తొలుత నియోజకవర్గానికి ఒకటి , రెండు చొప్పున స్లమ్స్ను ఎంపిక చేయాలని భావించిన అధికారులు ప్రస్తుతం గ్రేటర్లోని ఐదు జోన్లలో గల 1472 మురికివాడల్లో.. 72 స్లమ్స్లో సర్వే పూర్తి చేశారు. సెంట్రల్ జోన్లో 28 స్లమ్స్ రీ డెవలప్మెంట్కు, 5 స్లమ్స్ అప్గ్రేడేషన్కు ప్రజలు ముందుకొచ్చారు. అలాగే నార్త్జోన్లో 3 స్లమ్స్లో రీ డెవలప్మెంట్కు, 4 స్లమ్స్లో అప్గ్రేడేషన్కు, వెస్ట్జోన్లో 18 స్లమ్స్లో అప్గ్రేడేషన్కు, 9 స్లమ్స్లో రీ డెవలప్మెంట్కు ముందుకొచ్చారు. మిగతా జోన్లలోనూ ఆయా స్లమ్స్ను అప్గ్రేడేషన్కు,రీ డెవలప్మెంట్కు ఎంపిక చేశారు. పైలట్ ప్రాజెక్టుగా వీటిలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రతిపాదించిన మూడు విధానాలు ఇలా.. 1. ఇన్సిటు రీ డెవలప్మెంట్: స్లమ్లోని ఇళ్లన్నింటికీ కూల్చివేసి, ఆ స్లమ్లోని అందరికీ సరిపడినన్ని ఇళ్లు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. 2. ఇన్సిటు అప్గ్రెడేషన్: ప్రస్తుతం ఉన్న ఇళ్లకే అదనపు నిర్మాణాలు చేసి అభివృద్ధి పరుస్తారు. 3. రీ లొకేషన్: సమీపంలో ప్రమాదకర పరిశ్రమల వంటివి ఉంటే.. సదరు స్లమ్స్లోని ప్రజలకు ఇతర ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించి ఇస్తారు. జీవనోపాధికి మార్గం చూపుతారు. -
బాధ్యత మరచిభారమా?
ముందు పక్కాగా ఏర్పాట్లు చేయండి ప్రజలకు అవగాహన కల్పించండి అప్పుడే కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చు ‘లిట్టర్ ఫ్రీ’పై మేయర్ అభ్యంతరం నగరంలోని ఎంపిక చేసిన మార్గాలను ‘చెత్త రహిత’గా తీర్చిదిద్దాలని... నిబంధనలు ఉల్లంఘించే వారిపై శుక్రవారం నుంచి పెనాల్టీలు విధించాలని జీహెచ్ఎంసీ తీసుకున్న నిర్ణయంపై సాక్షాత్తూ మేయరే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సరైన ఏర్పాట్లు చేయకుండా ప్రజలపై భారం మోపడం తగదని అంటున్నారు. దీన్ని స్టాండింగ్ కమిటీ ఆమోదించలేదని చెబుతున్నారు. మరోవైపు అధికారులు మాత్రం దీనికి స్టాండింగ్ కమిటీ ఆమోదం అవసరం లేదని అంటున్నారు. సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకుండా, అవసరమైనన్ని ప్రదేశాల్లో తగినన్ని డంపర్బిన్లు ఏర్పాటు చేయకుండా ప్రజలపై పెనాల్టీల భారం వేయడం తగదని మేయర్ మహ్మద్ మాజిద్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు. అన్ని లైన్లు, బైలైన్లలో అవసరమైనన్ని చెత్త రిక్షాలను అందుబాటులోకి తీసుకురాకుండా జీహెచ్ఎంసీ కఠిన నిర్ణయాలు తీసుకోవడం తగదని అన్నారు. చెత్తరహిత రహదారులు (లిట్టర్ ఫ్రీ రోడ్స్) పథకం అమలులో భాగంగా ఎంపిక చేసిన మార్గాల్లో చెత్త వేసే వారికి శుక్రవారం నుంచి పెనాల్టీలు విధించనున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించిన నేపథ్యంలో మేయర్ పైవిధంగా స్పందించారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పన్నులు చెల్లిస్తున్న ప్రజలకు తగిన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత కార్పొరేషన్పై ఉందన్నారు. జీహెచ్ఎంసీ తన బాధ్యతలు సక్రమంగా నిర్వహించాక.. చెత్త రహిత వ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పించాక పెనాల్టీలు విధించవచ్చునన్నారు. అవేమీ లేకుండా పెనాల్టీలు తగవన్నారు. గ్రేటర్లో 8 వేల కి.మీ.కు పైగా రహదారులు ఉండగా, కేవలం 23 కి.మీ.కే దీన్ని పరిమితం చేయడం తగదన్నారు. గ్రేటర్లోని అన్ని రహదారులు, ప్రాంతాలను లిట్టర్ ఫ్రీగా చేయాల్సి ఉందన్నారు. రోడ్లన్నిటిపైనా చెత్తాచెదారాలు లేకుండా చూడాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీదేనన్నారు. జీహెచ్ఎంసీ మౌలిక సదుపాయాలు కల్పించిన తరువాత నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. బాధ్యతలు విస్మరించి, ప్రజలపై భారం మోపాలనుకోవడం తగదన్నారు. స్టాండింగ్ కమిటీలో నిర్ణయం తీసుకోలేదు లిట్టర్ ఫ్రీ రోడ్స్పై స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోలేదని మేయర్ వెల్లడించారు. జీహెచ్ఎంసీలో ఏదైనా కార్యక్రమం అమలు చేయాలంటే విధాన నిర్ణయం తీసుకునే అధికారం స్టాండింగ్ కమిటీకే ఉందని గుర్తు చేశారు. స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఎన్నికైన ప్రజాప్రతినిధులే విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందంటూ పరోక్షంగా అధికారుల నిర్ణయాన్ని ఆక్షేపించారు. కేవలం సెంట్రల్ జోన్లోనే కాకుండా జీహెచ్ఎంసీలోని అన్ని జోన్లను, ప్రాంతాలను చెత్త రహితంగా చేయాల్సి ఉందని చెప్పారు. దీనిపై తొలుత ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. కేవలం పత్రికా ప్రకటనలతో అమలు చేయడం సాధ్యం కాదని చెప్పారు. అధికారులు స్టాండింగ్ కమిటీకి జవాబుదారీగా వ్యవహరించాలని హితవు పలికారు. వారు అమలు చేయబోయే ముందు కమిటీ ఆమోదం పొందాలని మేయర్ స్పష్టం చేశారు. ఒక వేళ అధికారులు ఈ విషయాలు పట్టించుకోకపోతే తగు చర్యల కోసం ప్రభుత్వానికి రాస్తామన్నారు. కమిషనరూ సభ్యుడే: కమిషనర్తో మీకు విబేధాలున్నాయా అన్న ప్రశ్నకు మేయర్ బదులిస్తూ.. కమిషనర్ తమ బృందంలోని సభ్యుడే (టీమ్ మెంబరే)నని వ్యాఖ్యానించారు. తమమధ్య ఎలాంటి విబేధాలూ లేవన్నారు. జీహెచ్ఎంసీలోని వారందరూ ఒకే కుటుంబ సభ్యులని అన్నారు. రెండేళ్లకుపైగా తాను మేయర్గా కొనసాగుతున్నానని, ఎవరు కమిషనర్గా ఉన్నా ఎలాంటి తేడాలు రాలేదని చెప్పారు. కమిషనర్ పనితీరుతో ఎలా ఉన్నారన్న ప్రశ్నకు బదులిస్తూ, ఎవరికీ తాను రేటింగ్ ఇవ్వబోనన్నారు. అది జోనల్ అధికారుల పని: కమిషనర్ లిట్టర్ ఫ్రీ కార్యక్రమం జోనల్ స్థాయి అధికారులు చేపడుతున్నదని జీహెచ్ఎంసీ కమిసనర్ సోమేశ్కుమార్ చెప్పారు. మేయర్ సమావేశానంతరం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ అది విధాన నిర్ణయం కాదని తెలిపారు. ఎన్నికలకు ముందే ఈ పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. మేయర్కు, తనకు మధ్య ఎలాంటి విబేధాలు లేవని తెలిపారు. తన విధులు తాను నిర్వర్తిస్తున్నానని స్పష్టం చేశారు. కొన్ని మార్గాలను తొలుత పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని, అక్కడి ఫలితాలను బట్టి నగరమంతా అమలు చేయాలనేదే లక్ష్యమని తెలిపారు. ఎంపిక చేసిన రోడ్లపై చెత్త లేకుండా కాంట్రాక్టు పొందిన సంస్థే పర్యవేక్షిస్తున్నందున ఆ మార్గాల్లో డంపర్బిన్లతో పని లేదన్నారు. రూ.50 లక్షలకు పైబడి రూ.2 కోట్ల వరకు నిధుల మంజూరు బాధ్యత స్టాండింగ్ కమిటీపై ఉంటుందని, చట్టపరమైన, సాధారణంగా జరిగే పనులకు ప్రత్యేకంగా ఆమోదం అవసరం లేదని అభిప్రాయపడ్డారు. స్టాండింగ్ కమిటీ ఏవైనా ప్రతిపాదిస్తే వాటిని ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. ఏవైనా సమస్యలుంటే కూర్చొని పరిష్కరించుకుంటామని, ఇంతవరకు తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని చెప్పారు. అంశాల వారీగా భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమేనన్నారు. ఆగస్టు 1నుంచి పెనాల్టీలు విధిస్తున్నట్లు తాను ఎక్కడా పేర్కొనలేదని, లిఖితపూర్వకంగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. మీ పేరిట పత్రికా ప్రకటన వెలువడిందన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఆ అంశం గురించి తెలుసుకుంటానన్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమం సెంట్రల్జోన్లో ఈపాటికే అమలవుతోందని చెప్పారు. తాను కొత్తగా చేపడుతున్న పథకాలంటూ ప్రత్యేకంగా లేవని, ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న వాటిని పూర్తి చేస్తున్నానని చెప్పారు. ఇది స్పెషల్ డ్రైవ్: డాక్టర్ సత్యనారాయణ, సెంట్రల్ జోన్ కమిషనర్ లిట్టర్ ఫ్రీ పనులు గత ఫిబ్రవరి నుంచే జరుగుతున్నాయని, ప్రజలకు మరింత అవగాహన కలిగించేందుకు త గిన చర్యలు తీసుకుంటున్నామని సెంట్రల్ జోన్ కమిషనర్ డాక్టర్ సత్యనారాయణ చెప్పారు. చెత్త వేసే వారికి జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనల మేరకు పెనాల్టీలు కొత్తగా విధిస్తున్నవి కావని, హైదరాబాద్ను పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు స్పెషల్డ్రైవ్గా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మరికొద్ది రోజుల పాటు ప్రజలకు అవగాహన కల్పించాక చర్యలు చేపడతామన్నారు. -
గ్రేటర్ వార్
మేయర్-కమిషనర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సోమేష్కుమార్ నిర్ణయాలను తప్పుబట్టిన మాజిద్ సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ మేయర్ మాజిద్ హుస్సేన్.. కమిషనర్ సోమేశ్కుమార్ మధ్య పొసగడం లేదా? పైకి బాగానే ఉన్నా.. లోలోన ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతోందనే అనిపిస్తోంది. కమిషనర్ రూ. 5కే భోజన పథకాన్ని ప్రారంభించగా, మేయర్ రూపాయికే టిఫిన్ పథకాన్ని అమలు చేసే యోచన ఉందన్నారు. కమిషనర్ తన చాంబర్ నుంచి కనిపించేలా సీ త్రూ గార్డెన్ను ఏర్పాటు చేసుకోగా.. మేయర్ సైతం తన చాంబర్కు మెరుగులు దిద్దించుకుంటున్నారు. ఇప్ప టి వరకు ఇలా ఒకరి దారిలో ఒకరు నడిచిన వీరు తాజాగా, ఒకరి నిర్ణయాలతో మరొకరు విభేదించే పరిస్థితి నెలకొంది. బుధవారం మేయర్ విలేకరులతో మాట్లాడిన అంశాలు దీనినే నిరూపిస్తున్నాయి. మేయర్ స్పందించారిలా.. ‘రోజుకొక సంక్షేమ పథకాలను ప్రకటించడం సరికాదు. ఇప్పటికే ప్రకటించిన వాటిని పూర్తిగా అమలు చేయడంతో పాటు వర్షాకాలం మొదలైనందున చెత్త, పూడికతీత పనులపై శ్రద్ధ చూపాలి. ఎన్నికైన ప్రజాప్రతినిధుల ఆమోదం పొందాకే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలి. ఓ వైపు నాలాల్లో పూడిక పేరుకుపోయింది. మరోవైపు ప్రతిష్టాత్మక మెట్రోపొలిస్ సదస్సు పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. మొదట వాటిపై శ్రద్ధ చూపాలి’ అని పరోక్షంగా కమిషనర్ తీరుపై మేయర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానికంగా అవసరమైన పనులను ఆయా కాలనీలు, బస్తీల సంఘాలకే అప్పగించే యోచన ఉందని, స్టాండింగ్ కమిటీలో అనుమతి పొందాక దీనిని అమలు చేయనున్నట్లు కమిషనర్ సోమేష్కుమార్ ఇటీవల ప్రకటించారు. ఈ విషయాన్ని తనతో ప్రస్తావించకుండా ప్రకటించడం మేయర్కు రుచించి నట్లు లేదు. దీంతో బుధవారం జీహెచ్ఎంసీలో టీడీపీ పక్ష నాయకుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ మేయర్.. కమిషనర్ నిర్ణయాలను తప్పుబట్టారు. డీసిల్టింగ్ పనులు పూర్తయినట్టు స్థానిక కార్పొరేటర్ల నుంచి సంతృప్తికర లేఖలు పొందాలని సూచిస్తే, పది శాతం కార్పొరేటర్ల నుంచే అందాయన్నారు. డీసిల్టింగ్ పూర్తయిందని ఇంజినీర్లు చెబితే చాలదని, స్థానిక ప్రజాప్రతినిధు లు, ప్రజలు సంతృప్తి చెందాలన్నారు. కార్పొరేటర్ల బడ్జెట్ నుంచి ఒక్కొక్కరు రూ.75 లక్షల మేర జలమండలి చేపట్టే పనుల కోసం విడుదల చేస్తున్నందున సదరు పనులపై శ్రద్ధ చూపాలన్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతల్ని ఎవరూ కాదనరని, కానీ అంతకంటే ముందు ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే ప్లాస్టిక్, రసాయన, తుక్కు నిల్వ పరిశ్రమల వంటి ప్రమాదకర అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టాలంటూ పరోక్షంగా కమిషనర్ చర్యలను తప్పుబట్టారు. భూసేకరణ అంశాలు త్వరగా పరిష్కా రం కావడం లేవని, జీహెచ్ఎంసీ న్యాయవిభాగం నిద్రపోతోందన్నారు. ఆర్ అండ్ బీ రోడ్లు జీహెచ్ఎంసీకి అప్పగించే వరకు ఆ రోడ్లు బాగుపడవని, అధికారులు ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. వచ్చే వారం నుంచి వరుస సమీక్షలు అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మేయర్ మాజిద్ హుస్సేన్ వచ్చే వారం నుంచి విభాగాల వారీగా వరుస సమీక్షలకు సిద్ధమయ్యారు. సోమవారం : స్టాండింగ్ కమిటీ, జనరల్ కౌన్సిల్ తీర్మానాల అమలు మంగళవారం : {పజావాణిలో అందిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారం బుధవారం : ‘ఫేస్ టూ ఫేస్’లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం గురువారం : స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి యూసీడీ పనులపై సమీక్ష శుక్రవారం : పౌరసరఫరాల శాఖ మంత్రిని కలిసి దీపం కనెక్షన్లు, ఇతర అంశాలపై చర్చ. వీలైతే సీఎంను కలిసే యోచన శనివారం : మెట్రోపొలిస్ సదస్సు ఏర్పాట్లు.. పనుల నివేదిక పరిశీలన. వీలునుబట్టి ట్రేడ్ లెసైన్సు ఫీజుల పెంపు, తీర్మాలనాలపై సమీక్ష -
సులువుగా గుర్తించొచ్చు
జీహెచ్ఎంసీ వాహనాలకు బోర్డులు వారంలో 4 రోజులు కూల్చివేతలు సాక్షి, సిటీ బ్యూరో: జీహెచ్ఎంసీ వాహనాలకు ఇకపై బోర్డులు కనిపించబోతున్నాయి. ఇక్కడ చెత్త తరలింపునకే 500కు పైగా వాహనాలు ఉన్నాయి. మలేరియా నిర్మూలన, విపత్తుల నివారణ, టౌన్ప్లానింగ్... ఇలా వివిధ విభాగాల్లో వేయికి పైగా వాహనాలు ఉ న్నాయి. ఏవి ఎక్కడ తిరుగుతున్నాయో తెలియదు. వాటిని ఏఏ పనులకు వినియోగిస్తున్నారో తెలియదు. అధికారుల ప్రయాణాల కోసం అద్దెకు తీసుకున్న వాహనాలు సైతం ఏవి ఎక్కడ ఉంటున్నాయో తెలియదు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీకి చెందిన అన్ని వాహనాలపైనా అవి జీహెచ్ఎంసీవని తెలిసే విధంగా పెద్ద బోర్డులు అమర్చుతున్నారు. ఉదాహరణకు పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన ఉపకరణాలు, సిబ్బంది ఉండే వాహనాలకు అది పారిశుద్ధ్య విభాగానికి చెందిన వాహనమని తెలిసేలా బోర్డులు అమర్చుతున్నారు. త్వరలో జీపీఎస్ను కూడా వినియోగించుకోనున్నారు. అంతేకాదు.. 24 గంటల పాటు పని చేసే జీహెచ్ఎంసీ కాల్సెంటర్ నెంబర్(040- 21 11 11 11)ను కూడా బోర్డుపై పేర్కొంటూ, ప్రజలు తమ ఫిర్యాదులు చేయవచ్చునని సూచిస్తున్నారు. దీనివల్ల చూడగానే అవి జీహెచ్ఎంసీ వాహనాలని, సంబంధిత విభాగానికి చెందినవని ప్రజలకు తెలుస్తాయని కమిషనర్ సోమేశ్ కుమార్ చెప్పారు. అధికారులు వినియోగించే అద్దె వాహనాలపై కూడా (ప్రభుత్వ వాహనం తరహాలో) అది జీహెచ్ఎంసీ వాహనమని తెలిసేలా చిన్న అక్షరాలతో రాయనున్నారు. వివిధ విభాగాలతో సమన్వయం.. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు గ్రేటర్లోని వివిధ విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కమిషనర్ చెప్పారు. ట్రాఫిక్, జలమండలి, విద్యుత్... ఇలా విభిన్నవిభాగాల సహకారం, సమన్వయంతోనే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ట్రాఫిక్ పోలీసులు గుర్తించిన 142 నీటి నిల్వ ప్రాంతాల గురించి తమ ఇంజినీర్లకు వివరాలు అం దజేశామన్నారు. త్వరలోనే వాటి పరిష్కారానికి చర్యలు చేపడతారన్నారు. దాదాపు 150 ప్రదేశాల్లో రహదారుల మరమ్మతుల విషయమై ట్రాఫిక్ విభాగం నుంచి వివరాలు అందాయని, వాటి మరమ్మతులూ చేస్తామన్నారు. నెల రోజుల గడువు గ్రేటర్లో ‘మన ఊరు- మన ప్రణాళిక’ అమలుకు ప్రభుత్వానికి నెల రోజుల గడువు కోరినట్లు సోమేశ్ కుమార్ తెలిపారు. గ్రేటర్లో మూడు జిల్లాలు ఉన్నందున ముగ్గురు అధికారులు ఇన్ఛార్జులుగా ఉన్నారు. ముగ్గురూ సమన్వయంతో ప్రణాళికలు అమలు చేయాల్సి ఉంది. వర్షాలు ప్రారంభమైనందు న తగిన సమయం తీసుకొని అవసరమైన విధి వి ధానాలు రూపొందించాలని భావిస్తున్నట్లు చెప్పారు. నిరంతరం కూల్చివేతలు అక్రమ భవనాల కూల్చివేత నిరంతర ప్రక్రియ అని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ పునరుద్ఘాటించారు. ఇందుకు తగిన ప్రణాళికను రూపొందించామన్నారు. వారంలో నాలుగు రోజుల పాటు కూల్చివేతలు జరుగుతాయి. మంగళ, బుధ, గురు, శని వారాల్లో కూల్చివేతలు కొనసాగిస్తామన్నారు. ఈ నాలుగు రోజుల్లో ప్రతి జోన్లోని ఏదో ఒక సర్కిల్లో కూల్చివేతలు ఉంటాయన్నారు. తమ దృష్టికి వచ్చిన అక్రమాలపై ప్రజలు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇతర సమస్యలపై కాల్సెంటర్కు ఫిర్యాదు చేయవచ్చునన్నారు. ఎన్కన్వెన్షన్ సెంటర్కు సంబంధించి అడ్వొకేట్ జనరల్ సూచన మేరకు వ్యవహరించనున్నట్లు కమిషనర్ చెప్పారు. నిబంధనల మేరకు తగుచర్యలు తీసుకోవచ్చునని హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో చట్టపరమైన వివాదాలు లేకుండా ఉండేందుకు ఆయన సలహా తీసుకుంటున్నామన్నారు. -
ప్రజల చేతికే...ప్రగతి చ్రక్రం
మీ కాలనీలో రోడ్డు బాగా లేదా..? కొత్త రోడ్డు వేయాల్సిందిగా జీహెచ్ఎంసీ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్లు అరుగుతున్నాయా.. ? నో ప్రాబ్లమ్. మీ బస్తీలో పిల్లల పుట్టిన రోజులు, చిన్న చిన్న ఫంక్షన్లు నిర్వహించుకునేందుకు కమ్యూనిటీ హాలు ఉంటే బాగుండేదని అనుకుంటున్నారా ..? ఇకపై చింతించాల్సిన పని లేదు. మీ పరిసరాల్లో ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంది. దానికో ప్రహరీ నిర్మిస్తే పిల్లలకు ఆట స్థలంగానో.. లేదా పార్కుగానో అభివృద్ధి చేయవచ్చుననుకుంటున్నారా..? మీరు చేయాలనుకుంటున్న పనికి సహకారం అందుతుంది. సాక్షి, సిటీబ్యూరో: కాలనీలు.. బస్తీల ప్రజలు తమకు ఏఏ సదుపాయాలు అవసరమని భావిస్తున్నారో వాటిని స్వయంగా వారే చేపట్టేందుకు జీహెచ్ఎంసీ అవకాశం కల్పించబోతోంది. బస్తీ సంఘాలు.. కాలనీ అసోసియేషన్లు.. లేదా పదిమంది బృందంగా ఏర్పడి తమ అవసరాల కోసం తామే పనులు చేసుకుంటామంటే జీెహ చ్ఎంసీ అవకాశం కల్పించనుంది. ప్రజలకు ఉపయోగపడే పనులను వారి భాగస్వామ్యంతోనే చేయించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. దాదాపు రూ.10 నుంచి రూ.20 లక్షలకు మించని పనులను ఇలా ప్రజలకే ఇచ్చేందుకు సంబంధిత అధికారులు యోచిస్తున్నారు. తద్వారా ప్రజలకు అవసరమైన సదుపాయాలు సకాలంలో సమకూరడమే కాకుండా.. పనులు సత్వరం పూర్తవుతాయని భావిస్తున్నారు. అంతేకాదు.. తమ కోసం పనులు చేసుకుంటారు కాబట్టి నాణ్యతలోనూ ప్రజలు రాజీ పడబోరని భావిస్తున్నారు. వివిధ పనులకు సంబంధించి తగిన ప్రతిపాదనలతో ముందుకు వచ్చే వారికి అంచనా వ్యయం, ఇతరత్రా అంశాలను లెక్కించి, జీహెచ్ఎంసీ అధికారులు 80 శాతం మేర నిధులు అందజేస్తారు. మిగతా 20 శాతం నిధులను పనులు పూర్తయ్యాక, క్వాలిటీ కంట్రోల్ పరీక్షల అనంతరం చెల్లిస్తారు. సాంకేతిక పదాల జోలికి పోకుండా, వీలైనంత మేరకు ప్రజలకు అర్థమయ్యే భాషలోనే అంచనాలు రూపొందిస్తారు. ఇలా ఏటా దాదాపు రూ.500 కోట్ల మేర పనులు చేయవచ్చునని అంచనా వేస్తున్నారు. తొలుత ప్రయోగాత్మకంగా 20-30 కాలనీల్లో రూ.10 కోట్ల మేర ఇలాంటి పనులను ప్రజలకు అప్పగించాలని భావిస్తున్నారు. త్వరలో జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదం పొందాక ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ విలేకరులకు తెలిపారు. రెసిడె న్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు(ఆర్డబ్ల్యూఏలు) తాము చేయదలచుకున్న పనుల వివరాలతో ఆన్లైన్ ద్వారా జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేయవచ్చు. అటు నిధుల సద్వినియోగం.. ఇటు అభివృద్ధి జీహెచ్ఎంసీకి దాదాపు రూ.4 వేల కోట్ల బడ్జెట్ ఉంది. కానీ అందులో సగం నిధులు కూడా ఖర్చు కావడం లేదు. సాధారణంగా ఎక్కువ చోట్ల నిధుల లేమి సమస్య ఎదురవుతుంది. జీహెచ్ఎంసీలో పరిస్థితి దీనికి భిన్నం. అందుకు కారణాలనేకం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జీహ చ్ఎంసీ ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు చేస్తున్న పనులను అలా కొనసాగిస్తూనే.. తక్కువ మొత్తాల్లో పూర్తయ్యే పనులను స్థానికులకు, భారీ మొత్తాల్లో చేపట్టాల్సిన వాటిని పెద్ద కాంట్రాక్టు సంస్థలకు అప్పగించే యోచనలో ఉన్నారు. తద్వారా నిధులు వినియోగమై, ప్రజలకు అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. కాలనీలు, బస్తీల్లో ఉండే రిటైర్డు ఇంజినీర్ల వంటి వారి సహకారంతో పనులు నాణ్యతగా జరుగుతాయనేది అధికారుల అభిప్రాయం. ‘మన ఊరు-మన ప్రణాళిక’ తరహాలో నగరంలోని వివిధ డివిజన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ విధానం ఉపకరిస్తుందని అంచనా వేస్తున్నారు. అభివృద్ధి పనుల్లో స్థానికులకు భాగస్వామ్యం కల్పించినట్లూ అవుతుందని భావిస్తున్నారు. పెద్ద పెద్ద పనులకు (రూ.100- రూ.200 కోట్ల వరకు) అంతర్జాతీయ సంస్థలు పాల్గొనేలా టెండర్లు పిలవాలని భావిస్తున్నారు. -
మింగేశారు
ఒక్కటీ..వదల్లేదు.! జీహెచ్ఎంసీ పరిధిలో 169 చెరువుల్లో సర్వే మాయమైన బతుకమ్మ కుంట రికార్డులు కబ్జాకు గురైన దుర్గం చెరువు ఆనవాళ్లే లేని పెద్దబందం, ఖాజాకుంట సర్వేలో విస్తుపోయే వాస్తవాలు నగరంలో చెరువులను కబ్జాదారులు మింగేస్తున్నారు. ప్రజల ఆట, పాటల్లో భాగమైన బతుకమ్మ చెరువు రికార్డుల నుంచి మాయమైంది.. కుతుబ్షాహిల పాలనలో గోల్కొండకు మంచినీళ్లందించిన దుర్గం చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుంది.. పెద్ద బందం, ఖాజా కుంట, నాగిరెడ్డి కుంట ఇలా పలు చెరువులు ఆనవాళ్లు లేకుండా పోయాయి. చాలా చెరువుల్లో భారీ భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు పుట్టుకొచ్చాయి. మాయగాళ్లు చెరువులను మింగేస్తూ కోట్లు గడిస్తుంటే.. సిటిజన్లు మాత్రం గుక్కెడు నీళ్ల కోసం అల్లాడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 169 చెరువులపై జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా సర్వే చేపట్టాయి. ఈ సర్వేలో విస్తుపోయే అంశాలు వెలుగుచూస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 169 చెరువులు, కుంటలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీటి పరిస్థితిపై జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా సర్వే చేపట్టాయి. ఇప్పటి వరకు 133 ప్రాంతాల్లో సర్వే పూర్తయింది. పలుచోట్ల ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు ఆక్రమణలకు పాల్పడితే కొన్ని చోట్ల చెరువు పరిధుల్లోనూ రైతుబజార్లు, కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ పాఠశాలలు నిర్మించారు. ఈ నేపథ్యంలో చెరువుల ఆనవాళ్లే లేకుండా పోయాయి. వాటిలో పెద్దబందం(సూరారం), తూంకుంట (నిజాంపేట), నాగిరెడ్డికుంట (మంచిరేవుల), మైసమ్మకుంట (లాంకోహిల్స్), ఎర్రకుంట (ఐఎస్ సదన్), ఎర్రకుంట (లాలాపేట), ఖాజాకుంట (కూకట్పల్లి)లకు అలుగు కూడా లేకుండా పోయాయి. శ్యామలకుంట (అమీర్పేట), మాసాహెబ్ట్యాంక్ (విజయనగర్కాలనీ), నాగమయ్యకుంట (నల్లకుంట), బొగ్గులకుంట (ఆబిడ్స్)లతో పాటు మరో ఐదు చెరువులు ఆనవాళ్లు లేకుండా పోయాయి. అంబర్పేటలోని బతుకమ్మకుంట రికార్డులు గల్లంతయ్యాయి. సర్వే ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 32 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మకుంట ఉండగా, హైదరాబాద్ జిల్లా రెవెన్యూ యంత్రాంగం మాత్రం అక్కడ చెరువు ఉన్న దాఖలాలే లేవంటూ రెండేళ్ల క్రితం తేల్చింది. అయితే తాజాగా నీటిపారుదల శాఖ చేపట్టిన సర్వేలో బతుకమ్మకుంట అలుగు, తూము, వరద కాలువను గుర్తించి 17 ఎకరాల్లో హద్దులు నిర్ధారించారు. బతుకమ్మకుంటపై న్యాయస్థానాలతో పాటు, లోకాయుక్తలోనూ పలు వ్యాజ్యాలు కొనసాగుతున్నాయి. నీటిపారుదల శాఖ నోటిఫై చేసిన 17 ఎకరాల్లో ప్రస్తుతం మూడు ఎకరాల విస్తీర్ణం మాత్రమే ఖాళీగా ఉండడం గమనార్హం. ఖాజాగూడ, బందం చెరువు అలుగు మొత్తం ఓ సినీ నిర్మాత ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఇది గుర్తించిన అధికార యంత్రాగం సదరు నిర్మాతకు త్వరలో నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 169 చెరువులను గుర్తించిన యంత్రాంగం వాటి పూర్తి స్థాయి నీటిమట్టాలను (ఎఫ్టీఎల్) గుర్తించే పనిని దాదాపు పూర్తి చేసి జీపీఎస్ సహాయంతో శాశ్వత మార్కింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం శాస్త్రీయపద్ధతిలో చేస్తున్న ఎఫ్టీఎల్ మార్కింగ్ను భవిష్యత్తులో ఎవరికి వారు మార్పు చేసేందుకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కబ్జా కోరల్లో... దుర్గం చెరువులో 30 ఎకరాల్లో భారీ నిర్మాణా లు ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చినట్లు సర్వేలో తేలిం ది. కుతుబ్షాహీల కాలంలో గోల్కొండ కోటకు మంచినీటిని అందించేందుకు 160.7 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన దుర్గం చెరువు తాజా సర్వేల్లో 30 ఎకరాలకు పైగా కబ్జాకు గురైనట్లు అంచనాకు వచ్చారు. ఎఫ్టీఎల్ పరిధిలో సుమారుగా రూ. 100 కోట్లకు పైగా విలువైన క్రయవిక్రయాలు జరిగినట్లు భావిస్తున్నారు. జీపీఎస్ సాయంతో ఇప్పటికే ఎఫ్టీఎల్ హద్దులను నిర్ధారించిన అధికారులు చెరు వు తూమును ఇటీవలే మూసేశారు. దీంతో పక్షం రోజులుగా దుర్గం చెరువులోకి వస్తున్న వరద నీటితో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టం వచ్చేంత వరకు తూమును మూసెయ్యాలని నీటిపారుదల శాఖ నిర్ణయించడంతో చెరువు సమీపంలోని భవనాల్లోకి వరద నీరు క్రమంగా చేరుతోంది. -
యాచకులకు ‘గౌరవం’
‘బెగ్గర్ ఫ్రీ సిటీ’ గౌరవ సదన్ల ఏర్పాటుకుసర్కార్ ప్రత్యేక దృష్టి యాచకుల విముక్తికి కార్యాచరణ స్వచ్ఛంద సంస్థల ద్వారా సర్వే ఉపాధి కల్పించే అవకాశం సమీక్షించిన జీహెచ్ఎంసీ కమిషనర్ సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అడుక్కునే వారుండకూడదని సర్కార్ భావిస్తోంది. ఆ వృత్తిని నిషేధించి అందులో ఉన్న వారిని అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. వారికి పలు సంక్షేమ పథకాలు అమలు చేసేం దుకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. ‘బెగ్గర్ ఫ్రీ సిటీ’లో భాగంగా నగరంలో భిక్షాటన చేసే వారిని గుర్తించి వారు ఆ వృత్తి నుంచి బయట పడేలా చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం వారికి ‘గౌరవ్ సదన్’లో ఆశ్రయం కల్పించడంతోపాటు ఆసరాగా నిలవాలని చూస్తోంది. పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇప్పటికే ఓ దఫా యాచకులపై సర్వే చేపట్టింది. ఇప్పటివరకు 16 ట్రాఫిక్ సిగ్నల్స్ జంక్షన్ల వద్ద 239 మంది యాచకులతో మాట్లాడి వివరాలు సేకరించిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆ సమాచారాన్ని జీహెచ్ఎంసీకి అందజేశారు. అయితే సమగ్ర సర్వే జరిపి ఆగస్టు 15లోగా తుది నివేదిక అందజేయాల్సిందిగా జీహెచ్ఎంసీ అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతి నిధులకు సూచించారు. ఒకే పర్యాయంలో యాచకులు తమ మనోభావాల్ని వెల్లడించలేరనే భావనతో మూడు దఫాలుగా సర్వే చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ సూచించారు. ఏయే ప్రాం తాల్లో యాచిస్తున్నారు..?, ఏయే పద్ధతుల్లో వృత్తి కొనసాగిస్తున్నారు..?, రోజుకు సగటు ఆదాయం ఎంత?, వారు చేస్తున్న ఖర్చు?, ప్రస్తుతం ఎక్కడ ఆశ్రయం పొందుతున్నా రు?, సంపాదనతో ఏం చేస్తున్నారు?, ఎలాం టి ఆసరా కోరుకుంటున్నారు..? తదితర వివరాలను తాజాగా చేపట్టే సర్వేలో రాబట్టనున్నారు. ఈ అంశంపై శనివారం ఏపీఐఐసీ వైస్ చైర్మన్ , ఎండీ జయేశ్రంజన్తో కలిసి సోమేశ్కుమార్ స్వచ్ఛంద సంస్థల ప్రతి నిధులు, జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. యాచకుల పునరావాసం కోసం తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా దిగువ కార్యక్రమాలు పూర్తిచేయాల్సిందిగా సూచించారు. ఏయే ట్రాఫిక్ జంక్షన్ల వద్ద యాచకులు అధిక సంఖ్యలో ఉన్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు, యాచకుల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్న జంక్షన్ల వివరాలు. ట్రాఫిక్ పోలీసుల నుంచి జంక్షన్ల వివరాలు సేకరించి యాచకుల బెడద ఎక్కువగా ఉన్న 100 ప్రాంతాలను గుర్తించాలి. ఆయా జంక్షన్లలోని యాచకుల పునరావాస బాధ్యతలను కొన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించడం. అందుకోసం ముందు కు వచ్చే ఔత్సాహిక స్వచ్ఛంద సంస్థలకు ఆగస్టు ఒకటిన శిక్షణ కార్యక్రమం. ఒక్కో ట్రాఫిక్ జంక్షన్కు ఓ కౌన్సెలర్ను నియమించి.. అక్కడి యాచకుల వివరాలతో నివేదిక. యాచకుల ఫొటోతో సహా వ్యక్తిగత వివరాల సేకరణ. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 15లోగా పూర్తిచేయాలి. యాచకులను ఏ విధంగానూ ప్రోత్సహించరాదని, పునరావాసం ద్వారా సమాజంలో వారికి తగిన గౌరవం కల్పించాల్సిందిగా ప్రజలకు సూచిస్తూ వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం. వృద్ధులు, వికలాంగుల కోసం పనిచేస్తున్న ఎన్జీవోలను గుర్తించి.. యాచకుల్లోని వృద్ధు లు, వికలాంగులకు సేవలందించేందుకు భాగస్వాములు కావాల్సిందిగా ప్రకటనల ద్వారా కోరడం. యాచకులకు తగిన ఆశ్రయం కల్పించేం దుకు తొలిదశలో జోన్కు ఒకటి చొప్పున తగిన భవనాలను గుర్తించి.. వాటిని ‘గౌరవ్ సదన్’లుగా తీర్చిదిద్దడం. గౌరవ్ సదన్లలోకి తరలించే వారికి అవసరమైన ఆహారం, దుస్తులు, సబ్బులు, తలనూనెతోపాటు కొంత నగదు ఇవ్వాల్సి ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న వారికి ఉపాధి చూపించాలి. భిక్షాటనలో ఎన్నో వింతలు.. నగరంలో ఎక్కడ చూసినా యాచకులు కన్పిస్తుంటారు. ఆలయాలు.. మసీదులు.. చర్చిలు, బస్టాప్లు, ట్రాఫిక్ సిగ్నళ్లు.. ఫుట్పాత్ల వద్ద వారు తప్పక ఉంటారు. ఇది కొందరికి కడుపు నింపుతుండగా మరికొందరికి ఉపాధి మార్గంగా మారింది. ఇందులో బాలలు, వృద్ధులు, వికలాంగులు ఎక్కుగా కన్పిస్తుంటారు. ఇక వీరి సంపాదన విషయానికొస్తే రోజుకు రూ.200 నుంచి రూ.1,000 వరకు ఉంటున్నట్టు తెలుస్తోంది. అయితే కొందరు మహిళలు పార్ట్టైమ్గా భిక్షాటన చేస్తూ మిగతా సమయంలో వ్యభిచారం చేస్తున్నట్టు సమాచారం. ఒక్కో జంక్షన్ వద్ద ఒక్కోపూట యాచిస్తున్న వారూ ఉన్నారు. ఓ జంక్షన్ నుంచి మరో జంక్షన్కు వెళ్లేం దుకు ఆటోలున్న వారూ ఉన్నారు. యాచక వృత్తి నుంచి వారిని విముక్తి చేసేందుకు జీహెచ్ఎంసీ పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా పలు ట్రాఫిక్ జంక్షన్ల వద్ద నిర్వహించిన తొలి దశ సర్వేలో ఈ విషయాలు వెలుగుచూశాయి. ఏ పనీ చేయలేని అశక్తులు, వికలాంగులతోపాటు పనులు చేయగల శక్తి కలిగిన వారూ ఉన్నారు. సీజన్ను బట్టి కొందరు ఆయా ప్రాంతాల్లో యాచిస్తుంటారు. పండుగలు.. ప్రాంతాలను బట్టి ‘డ్రెస్ కోడ్’ పాటిస్తుంటారు. సంపాదనలో ఒక పూట భోజనం కోసం మాత్రం డబ్బు ఖర్చుచేస్తున్నారు. పగటిపూట భోజనాన్ని అన్నదాన కేంద్రాల్లో చేస్తున్నారు. నగరంలో యాచకవృత్తి చేస్తున్నవారిలో వివిధ ప్రాంతాలకు చెందిన వారున్నారు. వికారాబాద్, శంకర్పల్లి, కంది, షాద్నగర్ తదితర ప్రాంతాల నుంచి రోజూ బస్సులు, ఆటోల్లో వచ్చి ఈ వృత్తి కొనసాగిస్తున్నారు. నగర శివార్లు, పొరుగు జిల్లాల నుంచే కాక అనంతపురం వంటి దూరప్రాంతాల నుంచి వచ్చి యాచిస్తున్న వారు కూడా ఉన్నారు. సమీప జిల్లాల వారు ఉదయం 7 గంటలకు నగరానికి చేరుకొని తిరిగి సాయంత్రం తిరిగి వెళ్తున్నారు. సీజన్లను బట్టి భిక్షాటన కోసం నగరానికి వచ్చేవారు. యాచకుల్లో ఓటరుకార్డులు కలిగిన వారి నుంచి వృద్ధాప్య పెన్షన్లు పొందుతున్నవారు. తాము సంపాదించే సొమ్మును కూడబెట్టి స్థానికుల వద్ద దాచుకుంటున్నారు. కొందరు స్వల్ప సమయాలకు తక్కువ రేటుకు వడ్డీలకు ఇస్తున్నారు. కొసమెరుపు: పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు చాలామంది విముఖత చూపుతున్నారు. ప్రభుత్వ పథకాలపై తమకు నమ్మకం లేదంటున్నారు. -
ఆకుపచ్చ నగరం
ఆగస్టులో 16.50 లక్షల మొక్కల పంపిణీ కార్పొరేటర్లు, షాపింగ్ మాల్స్, విద్యాసంస్థల ద్వారా సరఫరా ఏర్పాట్లలో జీహెచ్ఎంసీ సాక్షి, సిటీబ్యూరో: కాంక్రీట్ జంగిల్గా మారిన నగరంలో పచ్చదనం కరువైంది. గ్రేటర్ నగరాన్ని హరిత వనంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆదేశాలతో అధికారులు కస రత్తు ప్రారంభించారు. వర్షాకాలం ప్రారం భం కావడంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు మొదటి వారంలో 16.50 లక్షల మొక్క లు పంపిణీ చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు . వీటిని కార్పొరేటర్లు, షాపింగ్ మాల్స్, విద్యా సంస్థల ద్వారా ప్రజలకు సరఫరా చేయనున్నారు. ప్రజలు మక్కువ చూపే మొక్కల్నే పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇళ్ల వద్ద నాటేందుకు 4 లక్షలు, విద్యాసంస్థల్లో నాటేం దుకు 2 లక్షల మొక్కలు పంపిణీ చేయాలని ప్రతిపాదించారు. వీటితోపాటు ప్రభుత్వ ఖాళీ స్థలాలు, జీహెచ్ఎంసీ ఓపెన్ ప్లేస్లు, రోడ్డుకిరువైపులా, ట్రాఫిక్ ఐలాండ్లు, శ్మశానవాటికలు, పెట్రోల్ బంకులు, ఆస్పత్రులు, పార్కులు తదితర ప్రాంతాల్లో మరో 10.50 లక్షలు ఈ సీజన్లో నాటాలని తీర్మానించారు. వీటిని సమకూర్చుకునేందుకు జీహెచ్ఎంసీ జీవవైవిధ్య విభాగం అధికారులు హెచ్ఎండీఏ, జలమండలి, ఔషధ, సుగంధ మొక్కల బోర్డు, సిమాప్,రాజేంద్రనగర్లోని వ్యవసాయ పరిశోధన సంస్థ, సంగారెడ్డిలోని ఫల పరిశోధన కేంద్రాల అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మొక్కలకు రక్షణకుగాను ట్రీగార్డుల్ని కూడా ఏర్పాటు చేస్తారు. అందంగా కనిపించే వివిధ రంగుల పూల మొక్కలను రోడ్ల వెంబడి నాటుతారు. పంపిణీ చేసే మొక్కలు తులసి, ఉసిరి, అలోవీరా, జామ, దానిమ్మ, నారింజ, సపోటా, నిమ్మ, మామిడి, సీతాఫలం తదితర మొక్కలు పంపిణీ చేయనున్నారు. వీటితోపాటు గుల్మొహర్, పగోడ, పెల్టో ఫోరం, తదితర జాతులకు చెందిన మొక్కల్ని కూడా పంపిణీ చేస్తారు. కార్పొరేటర్ల ద్వారా.. గృహాలకు పంపిణీ చేసే 4 లక్షల మొక్కల్లో మూడు లక్షల మొక్కలను కార్పొరేటర్ల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లు ఉన్నాయి. ఒక్కో కార్పొరేటర్ ద్వారా 2వేల మొక్కలు పంపిణీ చేస్తారు. -
అవినీటి కనెక్షన్లు
నల్లా కనెక్షన్ల మంజూరులో చేతివాటం అపార్ట్మెంట్ల కనెక్షన్ల జారీలో గోల్మాల్ క్షేత్రస్థాయి నివేదికలు తారుమారు బ్రిగేడ్, సింగిల్ విండో సిబ్బంది నిర్వాకం లక్షలాది రూపాయలు పక్కదారి? సాక్షి, సిటీబ్యూరో: జలమండలిలోని పలు విభాగాల్లో అవినీతి పేరుకుపోయింది. చేయి తడపనిదే ఏ పనీ కావట్లేదు. కొందరు అధికారులు, సిబ్బంది కక్కుర్తి వల్ల ఖజానాకు పెద్ద మొత్తంలో చిల్లుపడుతోంది. కొందరు అధికారులు బిల్డర్లకు వత్తాసు పలుకుతూ నల్లా కనెక్షన్లను అక్రమంగా జారీ చేస్తున్నారు. అనుమతులకు సంబంధించి అవసరమైన సర్టిఫికెట్లు లేకపోయినా క్షేత్రస్థాయి నివేదికలను తారుమారు చేసి వారి ఫైళ్లను క్లియర్ చేస్తున్నారు. అదే సామాన్యుడిని మాత్రం నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకొంటున్నారు. బహుళ అంతస్తుల భవంతులకు (అపార్ట్మెంట్లకు) నల్లా కనెక్షన్ల జారీ వ్యవహారం జలమండలిలోని కొందరు అధికారులు, గ్రీన్బ్రిగేడ్ గుత్తేదారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. నిబంధనలకు నీళ్లొదిలి నిర్మాణ విస్తీర్ణాన్ని తక్కువ చూపడమే కాక, క్షేత్రస్థాయి నివేదికలను తారుమారు చేసి కనెక్షన్లు జారీ చేసేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో నెలకు వందకుపైగా బహుళ అంతస్తుల భవంతులకు నల్లా కనెక్షన్లు జారీ చేస్తున్న సింగిల్ విండో సెల్ అధికారులు కొందరు, గ్రీన్బ్రిగేడ్ గుత్తేదారులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఒక్కో కనెక్షన్పై రూ.లక్షలు చేతులు మారుతున్నట్టు సమాచారం. అంతా ఇష్టారాజ్యమే.. బహుళ అంతస్తుల భవనాలకు జీహెచ్ఎంసీ జారీ చేసే ఆక్యుపెన్సీ ధ్రువీకరణ పత్రం, ఇంకుడు గుంత, నిర్మాణపరమైన అనుమతులు లేకున్నా నల్లా కనెక్షన్లు జారీ చేస్తున్నారు. జలమండలి పరిధిలో 8.05 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వీటితోపాటు ప్రతి నెలా 1,600 వరకు గృహ వినియోగ, బహుళ అంతస్తుల భవనాలకు కనెక్షన్ల కోసం దరఖాస్తులు వస్తుంటాయి. బహుళ అంతస్తుల భవనానికి నల్లా కనెక్షన్ జారీకి నిర్మాణ విస్తీర్ణాన్ని బట్టి రూ.1.80 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు చార్జీలను జలమండలి వసూలు చేస్తుంది. నిర్మాణ విస్తీర్ణాన్ని కొన్ని చదరపు మీటర్లు తగ్గించి చూపితే బిల్డర్కు రూ.లక్ష మిగులుతాయి. ఇదే అదనుగా సింగిల్ విండో విభాగం సిబ్బంది కొందరు బిల్డర్లకు అనుకూలంగా వ్యవహరించి, జేబులు నింపుకొంటున్నట్టు తెలుస్తోంది. ఇదే తరహాలో క్షేత్రస్థాయి నుంచి నల్లా కనెక్షన్ల జారీకి ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయానికి వచ్చే ఫైళ్లలో అవసరమైన పత్రాలను తారుమారు చేసి, కనెక్షన్ జారీ కమిటీ నుంచి నేరుగా అనుమతులు పొందుతున్నట్టు సమాచారం. ఆ తరువాత గ్రీన్బ్రిగేడ్ సిబ్బంది తక్షణం వాటికి కనెక్షన్ ఏర్పాటు చేయడం అనుమానాలకు తావిస్తోంది. సింగిల్ విండో సిబ్బందికి అనుకూలంగా ఉండే గ్రీన్బ్రిగేడ్ గుత్తేదారులకే ఆ పనులను అప్పగిస్తున్నట్టు సమాచారం. విజి‘లెన్స్’ అవసరం బహుళ అంతస్తుల భవనాలకు జారీ చేస్తోన్న కనెక్షన్లపై విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో విచారణ జరిపిస్తే అక్రమాల డొంక కదులుతుందని దరఖాస్తుదారులు, వినియోగదారులు చెబుతున్నారు. బహుళ అంతస్తుల భవనాలకు నల్లా కనెక్షన్ జారీ వ్యవహారంలో క్షేత్ర స్థాయిలో నివేదిక మొదలు, డీజీఎం, జీఎం, సీజీఎం, ఖైరతాబాద్లోని బోర్డు కార్యాలయం, గ్రీన్బ్రిగేడ్ గుత్తేదారుల స్థాయిలో జరుగుతున్న అక్రమాలు వెలుగు చూడాలంటే విజిలెన్స్ విచారణ తప్పనిసరని వారంటున్నారు. -
కూల్చివేతలు ఆపండి
లేకుంటే మేమే అడ్డుకుంటాం జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ల హెచ్చరిక సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ అధికారులు చేపడుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలను వెంటనే నిలిపి వేయాలని జీహెచ్ఎంసీలోని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీపక్ష నాయకులు డిమాండ్ చేశారు. డిప్యూటీ మేయర్ జి.రాజ్కుమార్ చాంబర్లో మూడు పార్టీల నాయకులు దిడ్డిరాంబాబు, సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బంగారి ప్రకాశ్లు మరికొందరు కార్పొరేటర్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కూల్చివేతలను నిలిపి వేయని పక్షంలో శనివారం నుంచి ఎక్కడ కూల్చివేతలు జరిగితే అక్కడికి వెళ్లి అడ్డుకుంటామని హెచ్చరించారు. అధికారులు బడాబాబుల జోలికి వెళ్లకుండా సామాన్యులపై ప్రతాపం చూపిస్తున్నారని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలకు అధికారులు కూడా బాధ్యులేనన్నారు. ఇందుకు కారకులైన టౌన్ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకోకుండా ప్రజలపై విరుచుకుపడడం సరికాదన్నారు. గతంలో ఏసీబీ దాడుల్లో చిక్కి సస్పెండైన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవడమేకాకుండా పదోన్నతులు కూడా ఇవ్వడం దేనికి సంకేతమని వారు ప్రశ్నించారు. నేడు సీఎం వద్దకు.. కూల్చివేతలను నిలిపివేయాలంటూ అధికారులను ఆదేశించాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్టు సదరు నాయకులు తెలిపారు. ఈ మేరకు శనివారం డిప్యూటీ మేయర్ నేతృత్వంలో పార్టీలకతీతంగా ఫ్లోర్లీడర్లు, కార్పొరేటర్లు సీఎంను కలిసి ప్రజల ఇబ్బందులను వివరిస్తామన్నారు. కూల్చివేతలు నిలిపివేయాలని స్టాండింగ్ కమిటీ చేసిన తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపాలని కమిషనర్ను కోరినట్టు వారు పేర్కొన్నారు. ప్రత్యేక సర్వసభ్య సమావేశం.. కూల్చివేతలను నిలుపుదల చేయని పక్షంలో వచ్చేవారం జీహెచ్ఎంసీ ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏ ర్పాటు చేయాల్సిందిగా మేయర్ను కోరతామని డిప్యూ టీ మేయర్ జి.రాజ్కుమార్, ఆయా పార్టీల నాయకులు దిడ్డిరాంబాబు, సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బంగారి ప్రకాశ్ తెలిపారు. సదరు సమావేశంలో అధికారుల వైఖరిపై తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. పరోక్షంగా.. కమిషనర్ను తప్పించేందుకు తీర్మానం చేయనున్నట్టు సంకేతాలిచ్చారు. జీహెచ్ంఎసీ నిబంధనల మేరకు సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసి.. ప్రభుత్వానికి పంపించవచ్చు. కాగా, అంతిమ నిర్ణయం ప్రభుత్వానిదేనని జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనల్లో నిష్ణాతుడైన ఓ అధికారి తెలిపారు. 33 భవనాల కూల్చివేత.. అక్రమ కట్టడాలను కూల్చివేయడంలో జీహెచ్ఎంసీ అధికారులు వేగం పెంచారు. గత మంగళవారం నుంచి కూల్చివేతలను చేపడుతున్నారు. శుక్రవారం ఆయా ప్రాంతాల్లోని 33 భవనా ల్లో కూల్చివేతలు జరిపారు. ఇందులో తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఫ్లాట్ ఉన్న భవనం కూడా ఉండడం గమనార్హం. ఎల్బీనగర్లోని మన్సూరాబాద్లో ఆయన ఫ్లాట్ ఉన్న భవనంలో పార్కింగ్ కోసం కేటాయించిన స్టిల్ట్ ఫ్లోర్లో నిర్మించిన మూడు గదులను అధికారులు కూలదోశారు. విద్యాసాగర్ గన్మెన్ల కోసం ఈ గదులను నిర్మించినట్టు తెలిసింది. శుక్రవారం మల్లాపూర్, మీర్పేట, ఉప్పల్, చైతన్యపురి, ఎల్బీనగర్ మార్గదర్శికాలనీ, వాసవీకాలనీ, ఉప్పర్పల్లి, అత్తాపూర్, విజయనగర్కాలనీ, ఆగాపురా, మల్లేపల్లి, రామ్కోఠి, నాంపల్లి, నారాయణగూడ, చిక్కడపల్లి, జమిస్తాన్పూర్, కుత్బిగూడ, ఎస్సార్నగర్, మియాపూర్, రామచంద్రాపురం, కూకట్పల్లి గాయత్రీనగర్, కుత్బుల్లాపూర్, చింతల్, అల్వాల్, మల్కాజిగిరి, పద్మారావునగర్ తదితర ప్రాంతాల్లో కూల్చివేతలు నిర్వహించారు. -
కూల్చివేతలు ఆపండి
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో ఏకగ్రీవ తీర్మానం అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వానికి లేఖ రాయాలని సూచన సాక్షి, సిటీబ్యూరో: అక్రమ నిర్మాణాల కూల్చివేతలను జీహెచ్ఎంసీ కొనసాగిస్తోంది. తాజాగా గురువారం నగరంలోని వివిధ సర్కిళ్ల పరిధిలోని 19 భవనాలను టౌన్ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. గడచిన మూడు రోజుల్లో మొత్తం 44 భవనాలను కూల్చివేశారు. అధికారుల ఈ చర్యలపై ప్రజల నుంచి పెద్దయెత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలను ఆదిలోనే అడ్డుకోకుండా.. ఏళ్ల తర్వాత కూల్చివేతలకు దిగడాన్ని తప్పుబడుతున్నారు. ప్రజల నుంచి కార్పొరేటర్లపై ఒత్తిళ్లు పెరగడంతో పలువురు కార్పొరేటర్లు దీనిపై తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్టాండింగ్ కమిటీ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. దీంతో గురువారం మధ్యాహ్నంమేయర్ మాజిద్ హుస్సేన్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు కూల్చివేతలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చర్యను వెంటనే నిలిపివేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. కూల్చివేతకు ముందు.. అక్రమ నిర్మాణాలు ఆదిలోనే అడ్డుకోకుండా ప్రోత్సహించిన సంబంధిత సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ల (ఏసీపీలు)పై చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందిగా కమిషనర్కు సూచించారు. సమావేశంలో స్పెషల్ కమిషనర్లు ఎ.బాబు, పీఎస్ ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు. టీడీపీ కార్పొరేటర్ల ధర్నా కూల్చివేతలను నిలిపివేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ అంతకుముందు టీడీపీ కార్పొరేటర్లు మేయర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కూల్చివేతలకన్నా ముందు అక్రమ భవనాలు రావడానికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఫ్లోర్లీడర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మేయర్కు వినతిపత్రం ఇచ్చారు. ముఖ్యమంత్రికి రాసిన మరో లేఖలో టీడీపీ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో పక్షపాతంతో కూల్చివేతలు చేపట్టారని ఆరోపించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న గ్రేటర్లోని అన్ని ప్రాంతాల్లో జరగుతున్న కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలన్నారు. కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఎక్కడెక్కడ.. అధికారులు గురువారం చర్లపల్లి, సరూర్నగర్, ఎల్బీనగర్, ఆజంపురా, బడాబజార్, జాస్మిన్నగర్, రాంనగర్, మధురానగర్, బంజారాహిల్స్, చందానగర్, మియాపూర్, కూకట్పల్లి, గాజులరామారం, అల్వాల్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లోని భవనాలను నేలమట్టం చేశారు. కూల్చివేతలు యధాతథం: కమిషనర్ ఇదిలా ఉండగా, అక్రమ నిర్మాణాల కూల్చివేతలు యధాతథంగా కొనసాగుతాయని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ స్పష్టం చేశారు. కూల్చివేతలను నిలిపివేయాలని ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. నిబంధనల మేరకు అక్రమ భవనాలన్నింటిపై చర్యలు తీసుకుంటామన్నారు. క్రమబద్ధీకరణను కోరుతూ కార్పొరేటర్ల విజ్ఞప్తిని ప్రభుత్వానికి నివేదించేందుకు తమకు అభ్యంతరం లేదని ఆయన తెలిపారు. పాత పద్ధతిలోనే ట్రేడ్లెసైన్స్ ఫీజు గ్రేటర్లోని అన్ని ప్రాంతాల్లోని దుకాణాలకు ఒకేలా ట్రేడ్లెసైన్సు ఫీజు విధించడాన్ని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ వ్యతిరేకించింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి కొత్తగా చేపట్టిన ఈ విధానాన్ని నిలుపు చేస్తూ పాత పద్ధతినే కొనసాగించాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది. వీటికి ఆమోదం.. కార్పొరేటర్లకు యాపిల్ ఐపాడ్లు, మీడియా ప్రతినిధులకు టాబ్లెట్లు ఇచ్చేందుకు గతంలో ఆమోదించిన తీర్మానం ఉపసంహరణ ప్రభుత్వోద్యోగుల తరహాలో 2014 జనవరి నుంచి జీహెచ్ఎంసీ ఉద్యోగులకు డీఏ పెంపు రూ. 74 లక్షలతో సైనిక్పురి షాపింగ్కాంప్లెక్స్ రెండో అంతస్తు నిర్మాణం జోహ్రాబీ దర్గా నుంచి డీఆర్డీఎల్ వరకు రోడ్డు విస్తరణలో ఆస్తులు కోల్పోయేవారికి పరిహారం. తిరస్కరించినవి.. మోహన్నగర్ నుంచి నాగోల్ చౌరస్తా వరకు సీసీరోడ్డు పనులు. కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కు ప్రహరీగోడ, అంతర్గత రహదారి నిర్మాణపనులు. హైదర్గూడ రింగ్రోడ్డు వద్ద సర్దార్ వల్లభాయిపటేల్ విగ్రహం ఏర్పాటు. దాన్ని తెలంగాణ అమరవీరుల ప్రదేశంగా గుర్తించాలని ప్రతిపాదన. పెండింగ్.. బల్దియా పెట్రోల్ సప్లయ్ కంపెనీకి స్థలం లీజు పొడిగింపు అంశం. 2013- 14 బడ్జెట్ రీ అప్రాప్రియేషన్ చేయాలనే అంశాన్ని వాయిదా వేశారు. 60 వేలపై అయోమయం: నగరంలో 60 వేల అక్రమ నిర్మాణాలున్నాయని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో అన్ని నిర్మాణాలెక్కడ ఉన్నాయో తెలియక జీహెచ్ఎంసీ అధికారులు అమోమయానికి గురవుతున్నారు. బీపీఎస్ పథకం అమల్లో ఉన్నప్పుడు అందిన 2.05 లక్షల దరఖాస్తుల్లో దాదాపు 60 వేల దరఖాస్తుల్ని తిరస్కరించారు. వాటినే సీఎం అక్రమ నిర్మాణాలుగా చెబుతున్నారా అనేది అంతుబట్టక జీహెచ్ఎంసీ అధికారులు తిరిగి అక్రమ నిర్మాణాల లెక్కల్లో పడ్డారు. -
తప్పెవరిది? ముప్పెవరికి?
అక్రమ నిర్మాణాల్లో అందరూ పాత్రధారులే ప్రభుత్వ విభాగాల సమన్వయలేమి.. ప్రజలకు శాపం సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని వివిధ ప్రాంతాల్లో రెండు రోజులుగా జీహెచ్ఎంసీ అధికారులు 25 అక్రమ భవనాలను కూల్చివేశారు. ఈ ప్రక్రియతో ఎప్పుడు ఏ బుల్డోజర్ వచ్చి తమ ఇంటిపై పడుతుందోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఏళ్లకేళ్లు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా చోద్యం చూసిన అధికారులు.. ఉన్నపళంగా విరుచుకుపడుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూల్చివేతల్లో సైతం బడాబాబుల జోలికి పోకుండా చిరుజీవులపైనే ప్రతాపం చూపుతున్నారనే ఆరోపణలున్నాయి. అధికారులు అక్రమాలను ఆదిలోనే అడ్డుకుని ఉంటే నిర్మాణాలే జరిగేవి కావని కొందరు.. అధికారుల లాలూచీ వల్లే అదనపు అంతస్తులు నిర్మించుకున్నామని ఇంకొందరు అంటున్నారు. గ్రేటర్లో ఏళ్లకేళ్లు అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలసినా.. వాటిని అడ్డుకోకుండా అక్రమ మార్గంలోనే నల్లా, విద్యుత్, తదితర కనెక్షన్లు కూడా ఇవ్వడంతో పలువురు అనుమతుల్లేని ఇళ్లు కొనుగోలు చేశారు. ఇప్పుడు జరుగుతున్న కూల్చివేతలతో భీతిల్లుతున్నారు. ఎవరిది తప్పు? జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్, రిజిస్ట్రేషన్ల శాఖల మధ్య సమన్వయ లేమి ప్రజలకు ముప్పు తెస్తోంది. ఎవరికి వారు ఆదాయం కోసం నిబంధనల్ని, సర్కారు ఉత్తర్వుల్ని తుంగలో తొక్కుతుండటంతో అక్రమ నిర్మాణాలకు అంతు లేకుండాపోతోంది. నాలుగు విభాగాల నడుమ సమన్వయం ఉండి.. నిబంధనల్ని కచ్చితంగా అమలు చేస్తే అక్రమ నిర్మాణాలకు ఎవరూ సాహసించేవారు కాదు. పైసా పైసా కూడబెట్టో, అప్పులు తెచ్చో, కాస్త తక్కువ ధరలో వస్తుందనో స్థలాలు కొని నిర్మాణ ఉల్లంఘనలకు పాల్పడిన ప్రజలపై అధికారులు ఇప్పుడు ప్రతాపం చూపుతున్నారు. ఈ అక్రమాలను మొదట్లోనే అడ్డుకొని ఉంటే, ఎవరూ వాటి జోలికి పోయే వారు కాదు. నిర్మాణం నుంచి ప్రారంభిస్తే నల్లా, విద్యుత్ కనెక్షన్, అమ్ముకునే పక్షంలో రిజిస్ట్రేషన్లో సైతం అందినకాడికి దండుకొని ప్రజలకు ‘సహకరించిన’ ఆయా విభాగాల వారు.. ఏళ్లు గడిచాక ఇలా చర్యలకు దిగుతారని ఎవరూ ఊహించలేదు. అమలుకు నోచని నిబంధనలు ఇల్లు నిర్మించాలంటే జీహెచ్ఎంసీ నుంచి అనుమతి పొందాలి. అందుకు అనుగుణంగానే నిర్మాణం పూర్తి చేయాలి. అప్పుడే జీహెచ్ఎంసీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. అక్రమాలను నిరోధించే లక్ష్యంతోనే దీన్ని తప్పనిసరి చేశారు. ఈ సర్టిఫికెట్ లేనిదే కరెంట్, నీరు, డ్రైనేజీ కనెక్షన్లు ఇవ్వమని ప్రకటించారు. కానీ, ఆయా పనులు నిర్వహించే ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం లేదు. లంచాలకు మరిగి ఆక్యుపెన్సీ లేకున్నా నీటి, కరెంట్ కనెక్షన్లు ఇచ్చారు. అమ్మకాల, కొనుగోళ్ల రిజిస్రేషన్లు సైతం జరిగాయి. గడచిన నాలుగేళ్లలో 40 వేల రిజిస్ట్రేషన్ల దాకా జరిగాయి. ఇప్పుడు ఉన్నట్టుండి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చివేస్తామనడంతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆక్యుపెన్సీకి రాని దరఖాస్తులు గడచిన నాలుగేళ్లలో భవన నిర్మాణ అనుతుల కోసం జీహెచ్ ఎంసీకి 50 వేల పైచిలుకు దరఖాస్తులు రాగా, వాటిలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం అందిన దరఖాస్తులు ఆరున్నర వేలు. అంటే డీవియేషన్లు లేని భవనాలెన్నో ఎవరైనా తేలిగ్గానే అంచనా వేసుకోవచ్చు. కూల్చివేతల్లో పక్షపాతం లేదు.. బడాబాబులను వదిలి చిరుజీవుల భవనాలనే కూల్చివేస్తున్నారనడంలో వాస్తవం లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ అన్నారు. గడచిన రెండు రోజుల్లో అక్రమ నిర్మాణాల గురించి జీహెచ్ఎంసీ కాల్సెంటర్కు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులే వందకుపైగా ఉన్నాయన్నారు. తమ కాల్సెంటర్ (040-21 11 11 11)కు ఫోన్ చేసేవారు అక్రమ భవనం ఎక్కడ ఉన్నది, ఏరియా, ఇంటి నెంబరు తదితర వివరాలందజేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు 900 అక్రమ నిర్మాణాలను గుర్తించామని, పక్షపాతానికి తావులేకుండా గ్రేటర్లోని 18 సర్కిళ్లలోనూ కూల్చివేతలు జరుపుతున్నామన్నారు. -
అడుగుకో అగ్నిగుండం
జీహెచ్ఎంసీ ‘ఫైర్’ వెబ్సైట్లో సంస్థల వివరాలు ఎట్టకేలకు కదులుతున్న యంత్రాంగం సాక్షి, సిటీ బ్యూరో: గ్యాస్ సిలిండర్లు పేలడం.. రోడ్లు కుంగడమే కాదు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఎక్కడికెళ్లినా ఏదో రూపంలో ముప్పు పొంచి ఉంటోంది. పాఠశాలలు, ఫంక్షన్ హాళ్లతో పాటు ఇంజినీరింగ్ విద్యా సంస్థల నుంచి మల్టీప్లెక్స్ల దాకా ఎక్కడా భద్రత లేదు. పొరపాటున అగ్ని ప్రమాదం వంటివి జరిగితే తప్పించుకునేందుకు తక్షణ ఏర్పాట్లు లేవు. కనీస రక్షణ చర్యలు అంతకన్నా లేవు. చివరకు ప్రాణాపాయంలో ఆస్పత్రులకు వెళ్తే అక్కడ కూడా గ్యారెంటీ లేదు. గ్రేటర్లోని అనేక ఆస్పత్రులకు కనీస ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేవు. సాధారణ స్థాయి నుంచి భారీ వ్యాపారాలతో రూ.కోట్లు ఆర్జిస్తూ పేరొందిన సంస్థల వరకూ అన్నిటిదీ ఇదే వరుస. పెళ్లిళ్లు, ఇతరత్రా ఫంక్షన్లు నిర్వహించుకునే హాళ్లు, కల్యాణ మండపాల్లో సైతం అగ్ని ప్రమాదాల బారి నుంచి తప్పించుకునేందుకు సేఫ్టీ ఏర్పాట్లంటూ లేవు. సాధారణ ప్రజల నుంచి సైతం ఆస్తిపన్ను, ట్రేడ్ లెసైన్సుల ఫీజుల వంటి వాటిపై శ్రద్ధ చూపే జీహెచ్ఎంసీ.. ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న వాటిపై ఇంతవరకు దృష్టి సారించలేదు. గతంలో పార్క్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు.. పొరుగు రాష్ట్రంలో అగ్నికీలలు ఎగసి పడినప్పుడు హడావుడి చర్యలకు సిద్ధమైనప్పటికీ ఆ తర్వాత మరచిపోయింది. ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేని ఆస్పత్రుల లెసైన్సులు రద్దు చేస్తామని భారీ ప్రకటనలే గుప్పించింది. అగ్నిమాపక విభాగం నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ (ఎన్ఓసీ) తప్పనిసరి అని పేర్కొంది. కానీ క్రమేపీ ఆ విషయాన్ని మరచిపోయింది. దీంతో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు చేస్తున్న వారు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉంటున్నారు. చదువుకునేందుకు విద్యా సంస్థలకు వెళ్లే విద్యార్థుల నుంచి పెళ్లిళ్లకు ఫంక్షన్ హాళ్లకు వెళ్లే వారి దాకా అగ్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ముషీరాబాద్లో కలప దుకాణంలో అగ్ని ప్ర మాదం జరిగినప్పుడు ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడం చూసిన జీహెచ్ఎంసీ అధికారులు ఆ శ్చర్యపోయారు. ప్యారడైజ్ హోటల్లో నూ ఏర్పాట్లు లేకపోవడంపై నోరెళ్లబెట్టారు. ఎట్టకేల కు ఇక ‘సేఫ్టీ లేని సంస్థలను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. ఫైర్సేఫ్టీ ఏర్పాట్లు లేని సంస్థల వివరాలు సేకరించి ప్రజలకు తెలిసేలా వెబ్సైట్లో పెట్టాలన్న జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ సూచన మేరకు సంబంధిత అ ధికారులు ఆ పనుల్లో మునిగారు. ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలతో పాటు ఆస్పత్రులు, ఫంక్షన్ హాళ్లలో ఫైర్సేఫ్టీ ఏర్పాట్లు లేనివి గుర్తించారు. ఆవివరాలను జీహెచ్ఎంసీ వెబ్సైట్లో పొందుపరిచారు. ‘వీటిల్లో ఫైర్సేఫ్టీ ఏర్పాట్లు లేవు.. ఇక అక్కడ మీ పిల్లలను చదివించాలో లేదో మీరే అంచనా వేసుకోండి’ అని సూచిస్తున్నారు. చిన్నస్కూళ్ల నుంచి రూ.లక్షల్లో ఫీజులు గుంజే సంస్థలు సైతం వీ టిలో ఉన్నాయి. ఏయే సంస్థలకు ఈ ఏర్పాట్లు లేవో ఆ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. కఠిన చర్యలు చేపడతాం... ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సంస్థలను చూస్తూ ఊరుకునేది లేదని జీహెచ్ఎంసీ ఫైర్సేఫ్టీ విభాగం అడిషనల్ డెరైక్టర్ పి.వెంకటరమణ హెచ్చరించారు. ఇందులో భాగంగా పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సిందిగా డీఈఓలకు, కళాశాలలపై చర్యలకు కళాశాల విద్య కమిషనర్కు, ఆస్పత్రులపై చర్యలకు జిల్లాల వైద్యాధికారులకు లేఖలు రాశామన్నారు. ఫైర్సేఫ్టీ ఏర్పాట్లు లేని వాటికి అనుమతులు రద్దు చేయాల్సిందిగా కోరామన్నారు. వారు స్పందించని పక్షంలో ఫైర్సేఫ్టీ చట్టం మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మలిదశలో హోటళ్లు, మల్లీప్లెక్స్లు తదితర జనసమ్మర్థం ఎక్కువగా ఉండే సంస్థల సర్వే నిర్వహించి, వాటి వివరాలూ వెబ్సైట్లో పెడతామన్నారు. జీహెచ్ంఎసీ వెబ్సైట్లోని వివరాల మేరకు 946 ఆస్పత్రులు, 634 ఫంక్షన్ హాళ్లు, 178 ఇంజినీరింగ్ కళాశాలలకు ఫైర్సేఫ్టీ ఏర్పాట్లు లేవు. విద్యాసంస్థలూ వేల సంఖ్యలో ఉన్నాయి. -
అర్ధరాత్రి నుంచి జీహెచ్ఎంసీ కార్మికుల సమ్మె
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలోని బీఎంఎస్ యూనియన్కు, అధికారులకు బుధవారం రాత్రి జరిగిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి దిగుతున్నట్లు యూని యన్ అధ్యక్షుడు కె. శంకర్ ప్రకటించారు. జీహెచ్ఎంసీలోని పారిశుధ్య విభాగంలోని కార్మికులతోపాటు రవాణ, ఎంటమాలజీ, బయోడైవర్సిటీ, వెటర్నరీ సహ మొత్తం 13 కేటగిరీల్లోని కార్మికులకు కూడా 27 శాతం ఇంక్రిమెంట్ను ఇవ్వాలనే ప్రధాన డిమాండ్తో పాటు ఇతరత్రా డిమాండ్లను యూనియన్ నాయకులు అధికారుల ముందుంచారు. తమ డిమాండ్లకు అధికారులు అంగీకరించనందున సమ్మె అనివార్యమైందని యూనియన్ నాయకులు శంకర్, శ్యాంబాబు, జి.మల్లికార్జున్,వినయ్కపూర్ చెప్పారు. ఆయా విభాగాలకు చెందిన దాదాపు 8 వేల మంది కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటార న్నారు. సమ్మెకు వెళ్లొద్దు: కమిషనర్ విజ్ఞప్తి రంజాన్ , బోనాల పండుగలు, వర్షాకాలం తరుణంలో బీఎంఎస్ నాయకులు సమ్మె ఆలోచన మానుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ యూనియన్కు విజ్ఞప్తి చేశారు. డిమాండ్ల పరిష్కారానికి అన్ని అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఒక ప్రకటనలో తెలిపారు. విధులను బహిష్కరించే కార్మికులపై ఎస్మా, ఆర్పీ యాక్ట్లకు సైతం వెనుకాడేది లేదన్నారు. నగరం పరిశుభ్రంగా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన జోనల్, డిప్యూటీ కమిషనర్లకు సూచించారు. -
ఇదీ రీతి...ఇంకేం ఖ్యాతి?
జీహెచ్ఎంసీలో భారీగా ఇంజినీర్ల బదిలీలు ఇప్పటికే సిబ్బంది కొరత కొత్తవారి ఊసే లేదు ఉన్న వారికే అదనపు బాధ్యతలు కమిషనర్ నచ్చజెప్పినా వినని సర్కార్ సర్కార్ ఒక్క కలం పోటుతో 24 మంది జీహెచ్ఎంసీ ఇంజనీర్లను బదిలీ చేసింది. రూ.400 కోట్లతో నగరంలో అభివృద్ధి పనులు చేపట్టాల్సిన తరుణంలో ఈ చర్య చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఇంజనీర్ల కొరత ఉన్న సమయంలో అదనంగా నియమించాల్సింది పోయి ఉన్న వారిని బదిలీ చేసింది. అదీగాక వారి స్థానంలో కొత్త వారికి పోస్టింగ్లు ఇవ్వకుండా ఇతరులకు అదనపు బాధ్యతలు అప్పగించడంపై కమిషనర్ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వాదనను ఆలకించని సర్కార్ బదిలీలకే మొగ్గుచూపింది. సాక్షి, సిటీబ్యూరో: విశ్వ ఖ్యాతి గడించేలా హైదరాబాద్ మహా నగరాన్ని తీర్చిదిద్దుతామని ఓ వైపు సర్కార్ చెబుతున్నా.. చర్యలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. హైదరాబాద్ ‘బ్రాండ్ ఇమేజ్’ను సొంతం చేసుకోవాలంటే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అద్దాల్లాంటి రహదారులను నిర్మించాలి. మరోవైపు బోనాలు, రంజాన్ పండుగలు వైభవంగా జరుపుకొనేలా ఏర్పాట్లు చేయాలి. అదీగాక వర్షాకాలం కావడంతో రహదారులకు మరమ్మతులు, ఇతర పనులు చేపట్టాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తగిన సంఖ్యలో అధికారులను నియమించాల్సింది పోయి ఉన్న అధికారులను బదిలీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఇంజినీర్ల బదిలీ వ్యవహారంపై కమిషనర్ సైతం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మహానగరంలో దాదాపు రూ.400 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉంది. నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తి చేసేందుకు ఇప్పటికే జీహెచ్ఎంసీలో తగిన సంఖ్యలో ఇంజినీర్లు లేరు. ఇంజినీర్ల పోస్టులు దాదాపు వంద వరకు భర్తీ కాకుండా ఉన్నాయి. చేయాల్సిన పనులెన్నో ఉన్నా తగినంతమంది ఇంజినీర్లు లేక ఎక్కడి పనులక్కడే మూలుగుతున్నాయి. ఈ దశలో జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న 24 మంది ఇంజినీర్లను ప్రభుత్వం ఒక్క కలంపోటుతో బదిలీ చేసింది. వీరిలో ఆరుగురు సూపరింటెండింగ్ ఇంజినీర్లు, 18 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఉన్నారు. వీరి స్థానే ఇతర ప్రాంతాల వారిని ఇక్కడకు బదిలీ చేసిందా? అంటే అదీ లేదు. దీంతో ఉన్న కొద్దిమందిపైనే మరింత భారం పడనుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో డీఈఈలుగా ఉన్న వారికి ఈఈలుగా, ఈఈలుగా ఉన్నవారికి ఎస్ఈలుగా అదనపు బాధ్యతలు అప్పగించింది. అంటే.. బదిలీ అయిన 24 మంది ఇంజినీర్ల బాధ్యతల్ని జీహెచ్ఎంసీలోని వారే అదనపు భారాన్ని మోయాల్సిన పరిస్థితి. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాల్సిన డీఈఈలు తగినంత మంది లేరు. ఇప్పుడు డీఈఈలకు ఈఈలుగా బాధ్యతలు అప్పగించడంతో వారు రెండు కేట గిరీలకు చెందిన పనులను ఏకకాలంలో చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈఈలు ఎస్ఈలుగా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించాల్సి ఉండటంతో వారిదీ అదే పరిస్థితి. ఇంజినీర్ ఇన్ చీఫ్కే చీఫ్ ఇంజినీర్ బాధ్యతల్ని సైతం అదనంగా అప్పగించారు. ఈ బదిలీల వల్ల అసలే అంతంతమాత్రంగా సాగుతోన్న ఇంజినీరింగ్ పనులు మరింత కుంటుపడనున్నాయి. అంతర్జాతీయ సదస్సు కోసం.. మరోవైపు మెట్రోపొలిస్ సదస్సు కోసం వచ్చే విదేశీ ప్రతినిధులను ఆకట్టుకునేలా రహదారులను తీర్చిదిద్దడమేకాక, పర్యాటక ప్రదేశాలనూ సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులు భావించారు. అందులో భాగంగా పలు పనులు చేపట్టాల్సి ఉంది. ఇంజినీర్లందరినీ ఒకేసారి బదిలీ చేస్తే ఈ పనులకు ఆటంకం కలుగుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని తెలుస్తోంది. బదిలీ అయిన వారి స్థానంలో వేరేవారిని వెంటనే నియమించకపోతే నగరానికి తిప్పలు తప్పవనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. పలు పనులు సగంలో ఉండటాన్ని, కొన్ని పనులు అసలే ప్రారంభం కాకపోవడాన్ని వివరిస్తూ ఇంజినీర్ల బదిలీలను తాత్కాలికంగా నిలిపివేయాల్సిందిగా డిప్యూటీ మేయర్ రాజ్కుమార్ నేతృత్వంలో టీడీపీ పక్ష నాయకుడు శ్రీనివాసరెడ్డి, పలువురు కార్పొరేటర్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు విజ్ఞప్తి చేశారు. ఎక్కువ కష్టపడతాం.. పనులు పూర్తిచేస్తాం.. ఇదిలావుంటే అదనపు బాధ్యతలతో పదోన్నతులు రావడంతో పలువురు ఇంజినీర్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఆంధ్రాప్రాంతానికి చెందిన ఇంజినీర్లు జీహెచ్ఎంసీలో తిష్టవేయడం వల్లే సుదీర్ఘకాలంగా తమకు పదోన్నతులు రాకుండా పోయాయని వారు చెబుతున్నారు. ప్రస్తుతం తమకు లభించిన అవకాశంతో మరింత కష్టపడి సత్తా చాటుతామని వారు పేర్కొంటున్నారు. తెలంగాణ ఇంజినీర్ల సంఘం నాయకులు మోహన్సింగ్, కె.కిషన్లు మాట్లాడుతూ, నయాపైసా, నిమిషం సమయం కూడా ఖర్చు కాకుండా జీహెచ్ఎంసీలో బదిలీలు.. పదోన్నతులు జరిగిన అపూర్వ సందర్భమిదని వారు వ్యాఖ్యానించడం గమనార్హం. -
‘మెట్రోపోలీస్’ ఏర్పాట్లపై సమీక్ష
సాక్షి, సిటీబ్యూరో: వచ్చే అక్టోబర్లో జరుగనున్న మెట్రోపోలీస్ సదస్సును పురస్కరించుకొని 150 కిలోమీటర్ల మేర రహదారి మార్గాలను అభివృద్ధి పరచనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ తెలిపారు. సదరు మార్గాల్లో చేపట్టాల్సిన పనుల గురించి ప్రతిపాదనలందజేయాల్సిందిగా హెచ్ఎంఆర్, ఆర్అండ్బీ, ఎన్హెచ్ అధికారులకు సూచించారు. మెట్రోపోలీస్ సదస్సు ఏర్పాట్లపై గురువారం జీహెచ్ఎంసీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదస్సుకు వచ్చే విదేశీ ప్రతినిధులు పర్యటించే పర్యాటకప్రదేశాలు, షాపింగ్ ప్రాంతాలు, సదస్సు వేదిక తదితర ప్రాంతాలతో సహా 150 కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి పరచనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి నిధులను పొందేందుకు ఈనెల 6లోగా ప్రతిపాదనలందజేయాలన్నారు. సెప్టెంబర్ 15లోగా పనులు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. పనులు చేపట్టే కాంట్రాక్టర్లకు డిఫెక్ట్ లయబిలిటీ వర్తిస్తుందని చెప్పారు. సీఓపీ సదస్సు సందర్భంగా చేపట్టిన పనుల్ని పునరుద్ధరించడంతోపాటు 125 కి.మీ. మేర రహదారి మార్గాలను సీజనల్ ఫ్లవర్స్ మొక్కలతో తీర్చిదిద్దాలని సూచించారు. జూబ్లీహిల్స్ రోడ్డునెం.36 పై శ్రద్ధ వహించాల్సిందిగా హెచ్ఎంఆర్ అధికారులను కోరారు. చారిత్రక ప్రదేశాల్లో రంగులు మారే ప్రత్యేక వీధిదీపాలు ఏర్పాటు చేయాలని టూరిజం అధికారులకు ఆదేశించారు. సమావేశంలో సెంట్రల్ జోన్ కమిషనర్ రోనాల్డ్రాస్, హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
గ్రేటర్కు కొత్త రూపు
పునర్విభజన... జనాభాకు అనుగుణంగా మార్పులు పెరగనున్న డివిజన్ల సంఖ్య రాజకీయ పార్టీల పరిస్థితి తారుమారు ఎన్నికల సంఘం సూచనతో రంగం సిద్ధం చేస్తున్న యంత్రాంగం సాక్షి, సిటీబ్యూరో: జీహెఎంసీలోని డివిజన్ల డీలిమిటేషన్పై ప్రభుత్వం దృష్టి సారించింది. 2011 జనాభా ప్రకారం పునర్విభజన చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. డివిజన్కు 40 వేల మంది మించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. అదే జరిగితే డివిజన్ల సంఖ్య పెరగడంతో పాటు ఆయా డివిజన్లలో రాజకీయ పార్టీల పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు డిసెంబర్ 3తో ముగియనుంది. ఆరు మాసాల వ్యవధి మాత్రమే ఉండడంతో డీలిమిటేషన్.. రిజర్వేషన్ల ఖరారు.. తదితర అంశాలను త్వరతగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలను ఆదేశించారు. రెండు వారాల కిందటే లేఖలు రాయగా ఈ విషయం గురువారం వెలుగుచూసింది. అప్పుడూ.. ఇప్పుడూ.. 2009లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు 2001 జనాభా లెక్కల ఆధారంగా డివిజన్లను విభజించారు. ఎంసీహెచ్గా ఉన్నప్పుడు 100 డివిజన్లుండగా, జీహెచ్ఎంసీగా ఏర్పాటయ్యాక 150 డివిజన్లు అయ్యాయి. వీటి మధ్య సమతుల్యత లేదు. కొన్ని డివిజన్లలో 20 వేల జనాభా.. మరికొన్ని డివిజన్లలో 90 వేల జనాభా ఉంది. దీంతో అభివృద్ధిలో అసమానతలు తలెత్తాయి. డివిజన్ల అభివృద్ధికి కార్పొరేటర్ల నిధులు తదితరమైనవన్నీ అన్ని డివిజన్లకు ఒకే విధంగా కేటాయిస్తున్నారు. దీంతో తక్కువ జనాభా ఉన్న డివిజన్లకు నిధులు మిగిలే పరిస్థితి ఉండగా, ఎక్కువ జనాభా ఉన్న డివిజన్లల్లో అభివృద్ధి కుంటుపడింది. ఈ నేపథ్యంలో.. డివిజన్లన్నింటిలోనూ జనాభా సమానంగా ఉండేలా పునర్వ్యవస్థీకరణ చేయాల్సి ఉంది. ప్రసాదరావు కమిటీ సైతం ఇదే అంశాన్ని పేర్కొంది. ప్రస్తుతమున్న 18 సర్కిళ్లను 30కి పెంచి.. అన్ని సర్కిళ్లలోనూ దాదాపు సమాన సంఖ్యలో డివిజన్లు.. జనాభా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆ మేరకు డివిజన్ల విభజన జరగాల్సి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రేటర్ జనాభా 69,93, 262 కాగా, వీరిలో 35,76,640 మంది పురుషులు, 34,16,622 మంది మహిళలున్నారు. కాగా, ఈ జనాభాకనుగుణంగా వార్డుల పునర్వ్యవస్థీకరణ జరగాల్సి ఉంది. ఈ లెక్కన ప్రస్తుతం ఉన్న డివిజన్ల సంఖ్య పెరగొచ్చు. డివిజన్ల మధ్య జనాభా పదిశాతం వరకు మాత్రం అటూ ఇటూగా ఉండవచ్చు. ఈ ప్రక్రియను జీహెచ్ఎంసీ చేపట్టాల్సి ఉంది. దాదాపు 150 కుటుంబాలకు ఒక బ్లాక్ చొప్పున జీహెచ్ఎంసీలో ఎన్యూమరేషన్ బ్లాక్లున్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకొని డీలిమిటేషన్ జరపాల్సి ఉంటుందని జీహెచ్ఎంసీలోని సంబంధిత అధికారి తెలిపారు. పార్టీల పరిస్థితి తారుమారు! జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే ప్రస్తుతం ఆయా డివిజన్లలో గట్టి పట్టున్న రాజకీయ పార్టీలకు నష్టం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పాతబస్తీ, కోర్ ఏరియాలో కొన్ని డివిజన్లు ఆయా పార్టీల కంచుకోటలుగా ఉన్నాయి. వాటికి బీటలు వారే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయపార్టీల స్పందన ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశమైంది. హెచ్చు.. త గ్గులు.. 2001 జనాభాకు, 2011 జనాభాకు భారీగా వ్యత్యాసం ఉంది. కొన్ని డివిజన్లలోని జనాభా అప్పటికంటే బాగా తగ్గింది. మరికొన్ని డివిజన్లలో గతంలో కంటే భారీగా పెరిగింది. కోర్లోని డివిజన్లలో తగ్గుదల 2 శాతం నుంచి 50 శాతం వరకుండగా, శివార్లలో మాత్రం భారీ పెరుగుదల చోటు చేసుకుంది. కొన్ని డివిజన్లలో వందశాతం కంటే ఎక్కువ జనాభా పెరిగింది. జనాభా పెరిగిన డివిజన్లు దాదాపు 30 వరకుండగా, జనాభా తగ్గిన డివిజన్లు దాదాపు 20 ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఈ వివరాలు నమోదయ్యాయి. డివిజన్కు 40 వేల జనాభా.. ఒకొక్క డివిజన్ పరిధిలో 40 వేల మంది జనాభా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులు యోచిస్తున్నారు. పునర్వ్యవస్థీకరణ, డివిజన్ల ఏర్పాటు విధివిధానాలపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి తమకు ఇంతవరకు ఎలాంటి వర్తమానం అందలేదని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఈ దఫా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంది. 2009లో 150 వార్డులకు ఎన్నికలు జరిగినప్పుడు బీసీ జనరల్కు 33, బీసీ మహిళలకు 17, మహిళలు (జనరల్కు) 28 డివిజన్లు కేటాయించారు. ఓపెన్ కేటగిరీలో 58 డివిజన్లు ఉన్నాయి. జనాభా తగ్గిన డివిజన్లు మూసారాంబాగ్, చాంద్రాయణ గుట్ట, కుర్మగూడ, సలీంనగర్, పత్తర్గట్టి, గౌలిపురా, ఫతేదర్వాజ, శాలిబండ, ఘాన్సిబజార్, జాంబాగ్, గన్ఫౌండ్రి, సుల్తాన్బజార్, గోల్నాక, బాగ్అంబర్పేట, ముషీరాబాద్, గాంధీనగర్, సోమాజిగూడ, శ్రీనగర్కాలనీ, సీతాఫల్మండి, బన్సీలాల్పేట, అడ్డగుట్ట. పెరిగిన డివిజన్లు.. కొత్తపేట, మన్సూరాబాద్, కర్మాన్ఘాట్, చంపాపేట, సరూర్నగర్, ఆర్కేపురం, కంచన్బాగ్, తలాబ్చంచలం, శివరాంపల్లి, మైలార్దేవ్పల్లి, రాజేంద్రనగర్, అత్తాపూర్, టోలిచౌకి, వెంగళ్రావునగర్, బంజారాహిల్స్, రహ్మత్నగర్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, హఫీజ్పేట, చందానగర్, కేపీహెచ్బీకాలనీ, మోతీనగర్, హైదర్నగర్, గాజుల రామారం, జగద్గిరిగుట్ట, షాపూర్నగర్, సూరారంకాలనీ, జీడిమెట్ల, తార్నాక. -
దొంగల బీభత్సం
పోలీసులపై రాళ్ల దాడి ఇద్దరికి గాయాలు తబొల్లారం రైతుబజార్కు ఎదురుగా ఉన్న ఓంసాయి కాలనీలోని మాజీ సైనికుడి ఇంట్లో దుండగులు బీభత్సం సృష్టించారు. బొల్లారం ఇన్స్పెక్టర్ జగన్ తెలిపిన వివరాల ప్రకారం.. సాయికాలనీలో మాజీ బ్రిగేడియర్ జీబీ రెడ్డి, రక్ష దంపతులు నివాసం ఉంటున్నారు. బుధవారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో దొంగలు జీబీ రెడ్డి ఇంటి కిటికీ గ్రిల్స్ తొలగించి చొరబడి ఇళ్లంతా చిందరవందర చేశారు. అదే సమయంలో అటుగా వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు, కొందరు వ్యక్తులను చూసి వారు గోడకు ఆనుకొని నిల్చున్నారు. అనుమానంతో పోలీసులు వారిని ఆరా తీశారు. దీంతో ఆ వ్యక్తులు పారిపోయారు. వారిలో ఒకరిని పోలీసులు పట్టుకున్నారు. తప్పించుకు వెళ్లిన వారు వెనుదిరిగి పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. గాయాలపాలైన పోలీసులు తాము పట్టుకున్న వ్యక్తిని వదిలేశారు. సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ సిబ్బందితో అక్కడికి చేరుకొని దుండగుల కోసం గాలించారు. గాయపడిన పోలీసులు వెంకటేష్, రంగస్వామిని ఆస్పత్రిలో చేర్పించారు. నార్త్ జోన్ డీసీపీ జయలక్ష్మి, మహంకాళి ఏసీపీ మనోహర్, దుండిగల్ ఏసీపీ, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. -
ఉల్లంఘనుల గుండెల్లో గుబులు
నగర వ్యాప్తంగా విస్తరించిన అక్రమ కట్టడాలు ఏటా పెరుగుతోన్న నిర్మాణాలు అధికారులు గుర్తించినవి కొన్నే అంతకు మూడు రెట్లు అధికం.. గురుకుల్ ట్రస్ట్తో మొదలైన కూల్చివేతలు గ్రేటర్ మొత్తంపై దృష్టిసారించనున్న అధికారులు ఆందోళనలో అక్రమార్కులు సాక్షి, సిటీబ్యూరో: అక్రమ కట్టడాల పేరిట చేపట్టిన కూల్చివేతలు గురుకుల్ ట్రస్ట్ భూముల్లోని అయ్యప్ప సొసైటీతోనే ఆగుతుందా లేక నగరంలోని మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందా అనేది ప్రస్తుతం గ్రేటర్లో చర్చనీయాంశమైంది. స్థానికుల నిరసనల మధ్యే గురుకుల్ ట్రస్ట్ పరిధిలో రెండు రోజులుగా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గురుకుల్ సహా గ్రేటర్లోని అక్రమ నిర్మాణాలన్నింటిపై చర్యలు తీసుకోవాలని అధికారులతో సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశించిన దరిమిలా నగరంలోని అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గత ఆరునెలల్లో భారీగా.. ఓటరు నమోదు, సార్వత్రిక ఎన్నికల పనుల్లో జీహెచ్ఎంసీ అధికారులు బిజీగా ఉండడంతో ఆరు నెలలుగా అక్రమ నిర్మాణాలపై పెద్దగా దృష్టి సారించలేదు. ఇదే అదనుగా కొందరు వ్యక్తులు అక్రమ నిర్మాణాలను జోరుగా కొనసాగించారు. గ్రేటర్ పరిధిలో 865 అక్రమ నిర్మాణాలున్నట్టు అధికారులు ఇప్పటికే గుర్తించారు. గడచిన నాలుగేళ్లలో అవి వెలసినట్లు పేర్కొంటున్నా ఇటీవలే ఎక్కువ నిర్మాణాలు జరిగాయి. అధికారుల దృష్టికి రాని కట్టడాలు అంతకు మూడు రెట్లు ఎక్కువే ఉంటాయని అంచనా. దృష్టికొచ్చిన అక్రమ నిర్మాణాల్లో 229 మందిపై అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అయితే వీరికి తగిన శిక్షలు లేకపోవడంతో చట్టాలను ఎవరూ లెక్కచేయట్లేదు. నాలుగేళ్లలో 50 వేల దరఖాస్తులు.. భవన నిర్మాణాల అనుమతుల కోసం నాలుగేళ్లలో జీహెచ్ఎంసీకి 50 వేల దరఖాస్తులు రాగా, వాటిలో 1,500 ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు. ఇక, నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ సెల్లార్లలో ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్న భవంతులకూ కొదవ లేదు. 799 భవనాలు ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడినట్టు గుర్తించిన అధికారులు వాటిల్లో 31 భవనాలను సీజ్ చేశారు. 384 కూల్చివేశారు. 45 మంది యజమానులు కోర్టులను ఆశ్రయించారు. నిర్మాణ అనుమతి పొంది.. అందుకు విరుద్ధంగా నిర్మించిన వారి సంఖ్యా ఎక్కువే ఉంటుంది. అలాంటి వారి నుంచి కాంపౌండింగ్ ఫీజుగా రూ.60.02 కోట్లు వసూలు చేశారు. నాలుగేళ్లలో నిర్మాణానికి అనుమతి పొందినవారు దాదాపు 50 వేల మంది ఉండగా, అందులో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు 6,042 మంది మాత్రమే కావడం గమనార్హం. మిగతా వారంతా నిబంధనలు ఉల్లంఘించిన వారేనని భావించాల్సి వస్తోంది. ఆక్యుపెన్సీకి దరఖాస్తు చేసుకున్న వారిలో సైతం 536 భవనాల్లో ఉల్లంఘనలున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ లెక్కన సక్రమంగా నిర్మాణాలు జరిగిన భవనాలెన్ని ఉంటాయో తేలిగ్గానే అంచనా వేయవచ్చు. అక్రమ నిర్మాణాలపై కొత్త సర్కార్ సీరియస్గా ఉండడంతో అక్రమార్కులు ఆందోళనకు గురవుతున్నారు. -
వాడివేడీగా జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం
సబ్ప్లాన్ అమలు తీరుపై గుర్రు వాడివేడీగా జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ప్రధాన సమస్యలను ప్రస్తావించిన సభ్యులు అభివృద్ధి పనుల్లో జాప్యంపై నిలదీత సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం వాడివేడీగా జరిగింది. పలు సమస్యలపై సభ్యులు అధికారులపై మండిపడ్డారు. నిధులున్నా పనులు చేపట్టడం లేదంటూ నిలదీశారు. నగరంలో అక్రమ కట్టడాలు పెరిగినా పట్టించుకునే వారు లేదని.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పనులు సాగక పోయినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు. ఏ అధికారికి ఏ అధికారముందో తెలియదని, ఏ ఫైలు వచ్చినా తీవ్ర జాప్యం జరుగుతుందంటూ తూర్పారబట్టారు. ఇలా ఆద్యంతం పలు సమస్యలపై కౌన్సిల్ సమావేశం గరంగరంగా సాగింది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్పై సుదీర్ఘ చర్చ జరిగింది. సబ్ప్లాన్పై గరంగరం ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ అమలులో జీహెచ్ఎంసీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నారని, బడ్జెట్లో కేటాయింపులకే పరిమితమవుతున్నారని పలువురు కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. శనివారం జరిగిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్పైనే తొలుత చర్చ ప్రారంభించాలని అన్ని పార్టీల సభ్యులు పట్టుబట్టారు. అజెండాలోని అంశాల వారీగా చర్చను చేపడదామని సభాధ్యక్షుడు మేయర్ చెప్పినా వినిపించుకోకపోవడంతో సబ్ప్లాన్పైనే తొలుత చర్చను ప్రారంభించారు. జీహెచ్ఎంసీ బడ్జెట్లో ఎస్సీలకు రూ.260 కోట్లు, ఎస్టీలకు రూ.94 కోట్ల కేటాయింపులు చూపినా అందులో రూపాయి కూడా ఖర్చు చేయలేదని పలువురు ఆక్షేపించారు. నగరంలో ఎన్నో మురికివాడలున్నాయని, అక్కడుంటున్న ఎస్సీ, ఎస్టీలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఈ నిధులను వినియోగించుకోవాలని సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ సూచించారు. ఇది చాలా సున్నితమైన అంశమని, కచ్చితంగా అమలు చేయాలన్నారు. అధికారుల అశ్రద్ధ కారణంగా గతంలో మురికి వాడల అభివృద్ధికి అందిన దాదాపు రూ.800 కోట్ల నిధులు కూడా వినియోగించుకోలేకపోయారని గుర్తుచేశారు. ఈ అంశాన్ని లేవనెత్తిన మెట్టుగూడ కార్పొరేటర్ ఎమ్మార్ శ్రీనివాస్ మాట్లాడుతూ, సబ్ప్లాన్ నిధులు తన డివిజన్లో పైసా కూడా వినియోగించలేదన్నారు. ఈ నిధులు చట్టబద్ధంగా ఖర్చు చేయాల్సి ఉందన్నారు. ఈ పథకాన్ని అమలు చేయని అధికారులపైనా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లు వెంకటరమణ, కృష్ణ తదితరులు డిమాండ్ చేశారు. ప్రజల నుంచి వివిధ పన్నుల రూపేణా కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నా.. ఎస్సీ, ఎస్టీల కోసం ఖర్చు చేయడం లేదని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్, జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ పక్ష నాయకుడు దిడ్డి రాంబాబు, టీడీపీ పక్ష నాయకుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బీజేపీ పక్ష నాయకుడు బంగారి ప్రకాశ్, పలువురు కార్పొరేటర్లు అధికారుల తీరును ప్రశ్నించారు. వీటిని అమలు చేసే బాధ్యత ఏ విభాగానిదో స్పష్టం చేయాలన్నారు. గత ఏడాది రూ.10 కోట్లు ఖర్చు చేశామని అధికారులు సభకు తప్పుడు సమాచారమిచ్చారంటూ వారు మండిపడ్డారు. ముస్లింలకు కూడా సబ్ప్లాన్ను అమలు చేయాలని ఎంఐఎం కార్పొరేటర్ అలీంబేగ్ కోరారు. కమిషనర్ సోమేశ్కుమార్ స్పందిస్తూ, స్థానిక సంస్థలో నేరుగా దీన్ని అమలు చేసేందుకు లింక్ ఉండదని, ఇతర శాఖల నిధులు కూడా రావాల్సి ఉంటుందన్నారు. అమలుకు ఒక ప్రత్యేక విభాగ అధిపతిని నియమించాల్సి ఉందన్నారు. ఈ ఏడాది పకడ్బందీగా అమలు చే సేందుకు కమిటీని వేసి మార్గదర్శకాలు రూపొందిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ జనాభా 40 శాతం కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో దీన్ని అమలు చేస్తే బాగుంటుందని కమిషనర్ సూచించగా కొందరు సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఇందుకు డివిజన్ను కాకుండా బస్తీని పరిగణనలోకి తీసుకోవాలని సభ్యులు సూచించారు. మేయర్ జోక్యం చేసుకుని ఈ అంశంపై తీర్మానం చేసి సబ్ప్లాన్ చర్చను ముగించారు. పండుగల సందర్భంగా నిధులివ్వండి.. రంజాన్, బోనాలు పండుగల సందర్భంగా ప్రార్థన మందిరాల వద్ద పనులు చేసేందుకు తగిన నిధులు కేటాయించాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించినందున ప్రత్యేక నిధులు కేటాయించాలని బీజేపీ కార్పొరేటర్ ఆలె జితేందర్ డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినందున, నిధులున్నందున తగినన్ని కేటాయించాలని ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్హుస్సేన్ కోరారు. నామినేషన్ల పద్ధతిపై వెంటనే పనులివ్వాలని తలసాని సూచించారు. ఆయా పనుల కు జీహెచ్ఎంసీ, జలమండలి మధ్య సమన్వయం ఉండాలన్నారు. ఏ ఒక్క పనీ జరగడం లేదు.. జీహెచ్ఎంసీలో ఎవరెవరికి ఏయే అధికారాలున్నాయి.. అనే అంశంపై చర్చ సందర్భంగా కమిషనర్ జోనల్, అడిషనల్ కమిషనర్లకు అధికారాలివ్వకుండా వ్యవహరిస్తున్నారని, ప్రతిదానికీ ‘స్పీక్, డిస్కస్’ అని రాస్తుండటంతో ఏ ఒక్కపనీ జరగడం లేదని సభ్యులు ఆరోపించారు. ఏవైనా విభాగాలను తొలగించేటప్పుడు కానీ, ఇతర విధుల్లో నియమిస్తున్నప్పుడు కానీ పాలకమండలికి సమాచారమివ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీ అండ్ టీ విభాగం రద్దు, ఇతర విభాగాల వారిని పన్ను వసూళ్లకు నియమించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అందుకు కమిషనర్ సోమేశ్కుమార్ బదులిస్తూ.. తగిన సమాచారం లేని మూడు, నాలుగు ఫైళ్లకు మాత్రమే స్పీక్, డిస్కస్ అని రాస్తున్నాం తప్ప మిగతావన్నీ ఏ రోజువి ఆ రోజే పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఎక్కడా పనులు ఆగడంలేదన్నారు. గడచిన నాలుగు సంవత్సరాల పనులు, ఈ సంవత్సరం పనులను పోల్చి చూసినా వాస్తవాలు తెలుస్తాయన్నారు. పనులకు మంజూరైన నిధులు, ఖర్చు చేసిన వివరాలు నెలవారీగా చూసినా గతంలోకంటే ఈసారి 20 శాతం ఎక్కువే జరిగాయన్నారు. జీహెచ్ఎంసీ చరిత్రలోనే గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు వెయ్యికోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. కమిషనర్గా తాను కొత్త ప్రాజెక్టులు ప్రవేశపెట్టానో లేదో ఆ అంశాన్ని లేవనెత్తిన వారు ఆత్మవిమర్శ చేసుకుంటే అవగతమవుతుందన్నారు. కొన్ని అంశాలు పాలక మండలికి తెలియజేయకపోవడం అనేది తెలియక జరిగిన పొరపాటు తప్ప కావాలని చేసింది కాదన్నారు. ఈ చర్చ సందర్భంగా టీడీపీ సభ్యులు పలువురు వాకౌట్ చేశారు. పోస్టుల భర్తీ ఏదీ? జీహెచ్ఎంసీకి 2,600 పోస్టులు మంజూరైనా నియామకాలు జరగలేదన్న ఎంఐఎం ఫ్లోర్లీడర్ నజీరుద్దీన్ ప్రశ్నకు కమిషనర్ బదులిస్తూ, వాటిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రం వేరైనందున ఈ పోస్టుల విషయాన్ని ఇటీవల సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్లానని, జేఎన్టీయూ ద్వారా జీహెచ్ఎంసీయే నియామకాలు చేసేందుకు అనుమతించాల్సిందిగా కోరినట్టు తెలిపారు. ఈ అంశంపై త్వరలోనే సీఎం నిర్ణయం తీసుకోనున్నారని చెప్పారు. రహదారుల విస్తరణలో జాప్యమెందుకు? భూసేకరణ జరగనుందున పలు రహదారుల విస్తరణ ముందుకు జరగడం లేదని పలువురు సభ్యులు ప్రస్తావించారు. ఈ అంశంపై మేయర్ మాజిద్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఆర్పీఎఫ్ మార్గంలో భూ సేకరణ పూర్తయినా, కాలేదని ఎందుకు చెప్పారంటూ పలువురు సభ్యులు నిలదీశారు. నష్టపరిహారం పొందినవారు కూడా ఆ ప్రాంతాలను ఖాళీ చేయకపోవడం తమ దృష్టికి వచ్చిందని, కోర్టు వివాదాల్లో 108 కే సులున్నాయని కమిషనర్ చెప్పారు. నెలా రెండు నెలల్లోగా వీటిలో చాలా వరకు క్లియర్ చేస్తామన్నారు. అక్రమ కట్టడాలపై.. అక్రమ కట్టడాల విషయంలో అధికారులు తగుచర్యలు తీసుకోవడం లేరని సభ్యుడు దిడ్డి రాంబాబు తదితరులు అధికారుల తీరును ఆక్షేపించారు. ఇరవై గజాల స్థలంలో ఇళ్లు కట్టుకున్నవారిపై ప్రతాపం చూపుతున్న అధికారులు పెద్ద భవంతుల అక్రమ నిర్మాణదారుల జోలికి వెళ్లడం లేదని విమర్శించారు. బిల్డింగ్ కమిటీలో ఇంజనీర్లను కూడా భాగస్వాములను చేయాలని మరో సభ్యుడు సింగిరెడ్డి కోరారు. దశల వారీగా ఇస్తున్న అనుమతులతో అక్రమాలు పెరుగుతున్నాయని ఎమ్మెల్సీ ప్రభాకర్ చెప్పారు. ఆ కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్లో పెట్టాలి.. జీహెచ్ఎంసీలోని కాంట్రాక్టర్లు సకాలంలో పనులు చేయనందున పలు సమస్యలు తలెత్తుతున్నాయని పలువురు సభ దృష్టికి తెచ్చారు. పనులు చేయించుకునేందుకు వారి కాళ్లు పట్టుకోవాల్సి వస్తోందని టీడీపీ కార్పొరేటర్ సుమలతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల కబంధహస్తాల్లో చిక్కుకుందని బంగారు ప్రకాశ్ ఆరోపించారు. పనులు చేయని వారిని బ్లాక్ లిస్టులోపెట్టి కొత్తవారిని ప్రోత్సహించాలన్నారు. ఒకరికే ఎక్కువ పనులివ్వకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నామని కమిషనర్ బదులిచ్చారు. పనులు త్వరితగతిన జరిగేందుకు నెలకోసారైనా కార్పొరేటర్లతో సమీక్ష సమావేశాలు జరపాలని నిర్ణయించినట్టు చెప్పారు. సమావేశంలో ఇంకా ఎమ్మెల్సీలు జాఫ్రి, వెంకటరావు, ఎండీ సలీం తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల శోభ.. జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం సందర్భంగా ‘ఎన్నికల కళ’ కనిపించింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్స్అఫీషియో సభ్యుల హోదాలో సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగనున్నందున కార్పొరేషన్లో తమ జెండా ఎగుర వేసేందుకు ఇప్పటినుంచే కసరత్తు చేస్తున్నట్టుగా ఆయా పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు సందడి చేశారు. వారిలో కొందరు తమ వాణి వినిపించారు. సభలో పాల్గొన్నవారిలో ఎంపీలు బండారు దత్తాత్రేయ, సీహెచ్ మల్లారెడ్డి, కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, జి.సాయన్న, తలసాని శ్రీనివాస్యాదవ్, జాఫర్హుస్సేన్, మాగంటి గోపీనాథ్, కౌసర్ మొహియుద్దీన్, టి.ప్రకాశ్గౌడ్, కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, ఆరెకపూడి గాంధీలున్నారు. ఆయా పార్టీల నుంచి ఇటీవల టీఆర్ఎస్లో చేరిన కార్పొరేటర్లు సభకు గులాబీ కండువాలతో హాజరయ్యారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన యూసుఫ్గూడ కార్పొరేటర్ మురళీగౌడ్ ‘జై తెలంగాణ’ అంటూ సభలోకి వచ్చారు. సభా గౌరవం పాటించాలి: దత్తాత్రేయ సర్వసభ్య సమావేశం ఉదయం 10 గంట లకని ఆహ్వానం పంపడంతో సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ నిర్ణీత వ్యవధికన్నా ముందుగానే జీహెచ్ఎంసీకీ చేరుకున్నారు. అప్పటికీ చాలామంది అధికారులు రాకపోవడాన్ని గుర్తించారు. అనంతరం స మావేశంలో ప్రసంగిస్తూ.. జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశమంటే హూందాగా వ్యవహరించి సభా గౌరవాన్ని కాపాడాలని ఆయన సూచించారు. తీర్మానాలే అధికం.. సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో మేయర్ మాజిద్ హుస్సేన్ తనదైన శైలిలో పలు తీర్మానాలు చేయించారు. ఆయా అంశాలపై చర్చ సందర్భంగా సభ్యుల నుంచి వెలువడిన ప్రశ్నలకు స్పందిస్తూ మేయర్ తీర్మానం చేద్దామంటూ ప్రకటించారు. ఇలా ఒకటి కాదు.. రెండుకాదు ఏకంగా ఎనిమిది తీర్మానాలు చేశారు. అన్నింటినీ సభ ఏకగ్రీవంగా తీర్మానించిందని ప్రకటించారు. సభ్యుల ప్రశ్నలకు.. అధికారుల సమాధానాలకు మధ్య రచ్చ జరగకుండా మధ్యేమార్గంగా తీర్మానాలతో సభ్యులను శాంతింపచేశారు. ఇవీ తీర్మానాలు.. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు ఖర్చు చేసేందుకు మేయర్ నేతృత్వంలో డిప్యూటీ మేయర్, ఫ్లోర్లీడర్లతో కమిటీ ఏర్పాటు. ఈ కమిటీ తగిన మార్గదర్శకాలు రూపొందించి నిధుల వినియోగం తీరును పర్యవేక్షిస్తుంది. సబ్ప్లాన్కు అనుగుణంగా జీహెచ్ఎంసీ బడ్జెట్ నుంచి ఎస్సీలకు 16.2 శాతం (రూ.260.04 కోట్లు), ఎస్టీలకు 6.6 శాతం (రూ.94.04 కోట్లు)నిధులతో ఎస్సీ, ఎస్టీలుంటు న్న ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. కార్పొరేటర్ల ప్రతిపాదనల మేరకు ఈ పనులు చేపట్టాలి. బోనాలు, రంజాన్ పండుగల సందర్భంగా ఆయా ప్రార్థనాలయాల్లో, వాటి పరిసరాల్లో జీహెచ్ఎంసీ నిధులతో పనులు చేసేందుకు తీర్మానం చేశారు. తమ వార్డుల్లో చేపట్టిన పనుల గురించి కార్పొరేటర్లు పాలకమండలికి తెలియజేయాలి. పనులకు వీలైనంత త్వరగా అంచనాలు రూపొందిం చాలి. ఆస్తిపన్ను వసూళ్లలో లక్ష్యాలు సాధించిన బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, వాల్యుయేషన్ ఆఫీసర్లు, డిప్యూటీ కమిషనర్లకు ప్రోత్సాహకాలు. రహదారి విస్తరణ పనులకు ఆటంకంగా మారిన నిర్మాణాల తొలగింపు. సదరు భవనాలకు సంబంధించి స్టాండింగ్ కమిటీ ద్వారా నష్టపరిహారం మంజూరైన వాటిని 15 రోజుల్లోగా తొలగించాలి. విద్యుత్ స్తం భాల తొలగింపు పనులు 15 రోజుల్లో పూర్తిచేయాలి. కోర్టు కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యం కనబరచిన స్టాండింగ్ కౌన్సిళ్లపై చర్యలు లేదా బాధ్యతల నుంచి తొలగింపు. కేసుల పరి ష్కారానికి స్టాండింగ్ కమిటీ ఆమోదంతో స్పెషల్ స్టాండింగ్ కౌన్సెళ్లను తీసుకోవాలి. రెండు విడతల్లో 2,600 పోస్టుల భర్తీకి ఆర్థిక విభాగం అనుమతిస్తూ ఉత్తుర్వులు జారీ అయి ఏడాది దాటినా నియామకాలు జరగనందున, జీహెచ్ఎంసీ తరఫున నెలరోజు ల్లోగా వాటిని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని కమిషనర్కు సూచన. -
చీపుర్లకూ దిక్కులేదు
కొన్ని మార్గాల్లోనే పారిశుద్ధ్యం.. మిగతా అంతా అధ్వానం ఇదీ జీహెచ్ఎంసీ వ్యవహారం అరిగిపోయిన చీపుర్లు.. చాలీ చాలని పరికరాలు.. వీటితోనే పారిశుద్ధ్య కార్మికులు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. లేకపోతే చర్యలు. దీంతో కార్మికులు నడుములు విరిగిపోతున్నా అరిగిపోయిన చీపుర్లనే ఉపయోగిస్తున్నారు. వారెంత మొత్తుకున్నా నెలల తరబడి చీపుర్లు మాత్రం ఇవ్వరు. అయితే వీఐపీలున్న ప్రాంతాలను మాత్రం ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్టుకు ఇచ్చేసి వారికి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. సాధారణంగానే అవి పరిశుభ్రంగా ఉంటాయి. వాటిలో పెద్దగా కష్టపడాల్సిన అవసరంకూడా ఉండదు. ఇదీ గ్రేటర్పై జీహెచ్ఎంసీకి ఉన్న శ్రద్ధ. సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ నగరంలో పలు రహదారులు పరమ అధ్వానంగా, చెత్తా చెదారాలతో కంపు కొడుతున్నా పట్టించుకోని జీహెచ్ఎంసీ వీఐపీల మార్గాల్లో మాత్రం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టింది. వీఐపీల మార్గాల్లో ఈ పనులు చేసే కాంట్రాక్టు సంస్థకు లక్షల రూపాయలు వెచ్చిస్తున్న జీహెచ్ఎంసీ మిగతా అన్ని మార్గాల్లో వీధులను శుభ్రపరుస్తున్న కార్మికులకు నాలుగైదు నెలలుగా కనీసం చీపుర్లు కూడా ఇవ్వడం లేదు. చీపుర్ల నుంచి మొదలు పెడితే పారిశుద్ధ్య నిర్వహణలో వినియోగించే ఇతరత్రా పరికరాలు సైతం సరఫరా చేయడం లేదు. దీంతో నగరంలోని అనేక ప్రాంతాలు చెత్తమయంగా మారాయి. జీహెచ్ఎంసీ మొత్తానికి వీటిని సరఫరా చేస్తున్నది ఒకే ఒక కాంట్రాక్టరు కావడంతో అవసరమైనన్ని చీపుర్లు సకాలంలో అందడం లేదు.పేరుకు మాత్రం కేంద్రీయ భండార్వంటి సంస్థలు సరఫరా చేస్తున్నా ఒకే వ్యక్తి వాటిని సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. పండుగల వంటి అత్యవసర సమయాల్లో ఆదరాబాదరాగా కొంత సామగ్రి సరఫరా చేయడం మినహా మిగతా సమయంలో చీపుర్లతో సహాఎలాంటి ఉపకరణాలు అందించడం లేరు. దాంతో అరిగిపోయిన చీపుర్లతోనే కార్మికులు తమ నడుములు విరిగేలా పనిచేయాల్సి వస్తోంది. కార్మికులకు ఒక్కొక్కరికి నెలకు రెండేసి చీపుర్లు అవసరం కాగా నాలుగైదు నెలలుగా వాటి సరఫరా లేదు. వీటి పేరిట బిల్లులు మాత్రం జారీ అవుతున్నాయనే ఆరోపణలున్నాయి. కొన్ని మార్గాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల కోసం లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్న జీహెచ్ఎంసీ మిగతా నగరాన్ని గాలి కొదిలేసింది. కాంట్రాక్టుకిచ్చిన మార్గాలు మిగతా వాటితో పోలిస్తే ఎంతో మెరుగైన రహదారులు. ఆ రహదారుల వెంబడి ఉన్న ఫుట్ఫాత్లపై విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, ఇతరత్రా ఆటంకాలు లేకుండా జీహెచ్ఎంసీనే శ్రద్ధ తీసుకుంటోంది. అదే శ్రద్ధను అన్ని మార్గాల్లో చూపితే పారిశుద్ధ్య కార్మికులకు ఎంతో శ్రమ తగ్గుతుంది. అధ్వానపు రహదారులు మాత్రం జీహెచ్ఎంసీ కార్మికులకప్పగించి అందమైన రోడ్ల మార్గాలను కాంట్రాక్టుకివ్వడం విమర్శలకు తావిస్తోంది. ప్రైవేటు కిచ్చిన మార్గాలివే.. మాసాబ్ట్యాంక్ ఫ్లై ఓవర్, బేగంపేట, మాదాపూర్ ప్రాంతాల్లో 24 కిలోమీటర్ల మేర రహదారుల పారిశుధ్య కార్యక్రమాలను ప్రైవేటు కాంట్రాక్టు సంస్థ కప్పగించారు. ఈ కాంట్రాక్టును పొందిన మాక్లియన్ కంపెనీకి తాజ్ గ్రూప్, పార్క్హయత్ వంటి స్టార్హోటళ్లు, సాఫ్ట్వేర్ కంపెనీల్లో తప్ప ఇతర చోట్ల పనులు చేసిన అనుభవం లేదు. కాంట్రాక్టు సంస్థకు సదుపాయంగా ఉండేందుకే ఆ మార్గాల్లో ఫుట్పాత్ల మర్మతులు, రోడ్ల ప్యాచ్వర్క్ పనులు చేపట్టారనే ఆరోపణలున్నాయి. ఆ మార్గాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఏజెన్సీకి రెండు ట్రాలీలు తప్ప తగిన సాల్వెంట్(పారిశుధ్య) ఉపకరణాలు కూడా లేవు. సదరు సంస్థ పనులు చేస్తున్న మార్గాల్లో జీహెచ్ఎంసీ కార్మికులు కూడా పనిచేస్తున్నారు. సదరు సంస్థ ఉదయం 7.30 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే పని చేస్తోంది. మిగతా సమయమంతా జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బందే పనులు చేస్తున్నారు. కాంట్రాక్టు సంస్థ సేకరించిన చెత్తను కూడా తిరిగి జీహెచ్ఎంసీ ట్రాన్స్ఫర్ స్టేషన్స్కే పంపుతున్నారు. అక్కడినుంచి డంపింగ్యార్డుకు తరలించే పనులు జీహెచ్ఎంసీ చేస్తోంది. కాంట్రాక్టు సంస్థకు ఇన్న సదుపాయాలు కల్పిస్తుండగా, జీహెచ్ఎంసీ కార్మికుల అవస్థలు మాత్రం పట్టించుకోవడం లేరు. రెండున్నరేళ్లుగా తగినన్ని పారిశుధ్య ఉపకరణాల్లేవు. నాలుగైదు నెలలుగా కనీసం చీపుర్లు కూడా లేక పారిశుధ్య కార్మికులు పడరాని పాట్లు పడుతున్నారు. చీపుర్లు, పొడవాటి కర్రలు, సున్నం, బ్లీచింగ్, తోపుడు బంండ్లు, రిక్షాలు, గడ్డపారలు, గంప, ఇనుపగంప,యాక్సర్బ్లేడ్లు, సల్కెపార తదితరమైనవి వారికి అవసరం.అయితే అవేవీ అందుబాటుల లేవు. అరిగిపోయిన చీపుర్లతోనే నెలల తరబడి నెట్టుకొస్తున్నారు. అరిగిన చీపుర్లతో వంగి ఊడ్చాల్సి ఉండటంతో వారి నడుములు దెబ్బతింటున్నాయి. సెంట్రల్ స్టోర్ ఉంటే మేలు.. గతంలో ఎంసీహెచ్గా ఉన్నప్పుడు పారిశుద్ధ్యానికి అవసరమైన సామగ్రి సెంట్రల్స్టోర్లో ఎప్పుడూ అందుబాటులో ఉండేది. దాంతో అవసరం మేరకు ఎప్పటికప్పుడు కార్మికులు వాటిని పొందేవారు. వికేంద్రీకరణ పేరిట ఆ విధానాన్ని మర్చారు. పేరుకు వికేంద్రీకరణ జరిగినప్పటికీ, జీహెచ్ఎంసీలోని 18 సర్కిళ్లలో ఎక్కడా కూడా ఉపకరణాలుంచేందుకు తగిన స్థలం లేదు. దాని వల్ల కూడా వస్తువులు స్టాకు ఉండటం లేదు. దీంతో కార్మికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బ్లీచింగ్, సున్నం, చీపుర్లు తప్ప ఇతరత్రా ఉపకరణాలు లేవు. సంవత్సరానికి దాదాపు రూ. 3 కోట్లు వెచ్చిస్తే పారిశుద్ధ్యానికి అవసరమైన ఉపకరణాలన్నీ అందుబాటులో ఉంటాయి. ఏటా ప్రైవేటుకు కోట్లు కుమ్మరించేందుకు సిద్ధమైన జీహెచ్ఎంసీ అధికారులు ఈ అంశాన్ని పరిశీలించాల్సి ఉంది. కాంట్రాక్టు పొందిన సంస్థ ఈ నిబంధనలు అమలు చేయాలి రహదారుల వెంబడి ఉన్న సంస్థలు, దుకాణాలు, ఇళ్ల నుంచి చెత్తను సేకరించాలి. ఫుట్పాత్లపై చెత్త లేకుండా చూడాలి. ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి. ఫుట్పాత్లపై కాగితాలు, వ్యర్థాలు వేయకుండా నిఘా వహించాలి. రోడ్ల మార్గాల్లో పోస్టర్లు, బ్యానర్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఏర్పాటు చేసినా వెంటనే తొలగించాలి. రహదారిని ఎల్లవేళలా చెత్తాచెదారం ఏవీ లేకుండా అందంగా, పరిశుభ్రంగా ఉంచాలి. ఈ కార్యక్రమాన్ని ‘కాంప్రహెన్సివ్ ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్’ (ప్రధాన రహదారుల సమగ్ర నిర్వహణ)గా వ్యవహరిస్తారు. ఆయా సంస్థలు తడి, పొడి చెత్తకు వేర్వేరు డబ్బాలు వినియోగించేలా చూసే బాధ్యత కాంట్రాక్టరుదే. పనితీరుపై ఓఎస్సార్టీ ద్వారా రోజుకు నాలుగుసార్లు ఫొటోలు తీయాలి. ప్రది వంద మీటర్ల దూరానికీ ఈ ఫొటోలు తీయాలి. అవసరమైన స్వీపింగ్ యంత్రాలను జీహెచ్ఎంసీ సమకూరుస్తుంది. ఇవి చేయకుంటే ఒప్పందం ఉల్లంఘించినట్లే.. ఏరోజైనా ఓఎస్సార్టీ ద్వారా ఫొటోలు అప్లోడ్ చేయకుంటే.. తనిఖీల్లో రోడ్డు శుభ్రంగా లేకున్నా.. ఫొటోల్లో శుభ్రంగా లేకున్నా.. అరవై నిమిషాల్లోగా చెత్త, వ్యర్థాలు, డెబ్రిస్ తొలగించనట్లయితే.. గంటలోగా పోస్టర్లు, బ్యానర్లు తొలగించకుంటే వీటిల్లో ఒక్క అంశం(పాయింట్)లో విఫలమైనా నెలవారీ చెల్లింపులో 3 శాతం తగ్గిస్తారు. ఒకే నెలలో 30 పాయింట్లలో ఉల్లంఘనలు జరిగితే చెల్లింపులు పూర్తిగా నిలిపివేస్తారు. నగరమంతా మెరుగుపరుస్తాం : కమిషనర్ సోమేష్ కుమార్ నగరమంతా పరిశుభ్రంగా ఉండాలనేదే లక్ష్యమని. తొలిదశలో భాగంగా సంస్థ పనితీరు అంచనా వేసేందుకు కొన్ని మార్గాలు ప్రైవేటుకిచ్చామని కమిషనర్ సోమేష్కుమార్ తెలిపారు. పనితీరు బాగుంటే మిగతా ప్రాంతంలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని, లేకుంటే నిబంధనల మేరకు సొమ్ము చెల్లించబోమన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వడానికి చీపుర్లు, ఇతర వస్తువులు అందుబాటులోనే ఉన్నాయని అడిషనల్ కమిషనర్(ఆరోగ్యం,పారిశుద్ధ్యం)రవికిరణ్ తెలిపారు. -
గ్రేటర్కు ఇక జలసిరి..!
సాక్షి, సిటీబ్యూరో: జలాశయాల పరిరక్షణపై కొత్త సర్కారు దృష్టి పెట్టడంతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. నగరంలోని వివిధ చెరువులను పరిరక్షించడంతో పాటు వాటి ప్రధాన ఛానళ్ల (ఇన్లెట్స్, ఔట్ లెట్స్)ను పటిష్టపర్చాలని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలు సంయుక్తంగా నిర్ణయించాయి. ఈ నగరం, దాని చుట్టుపక్కల్లోని చెరువులు, వాటి డ్రె యిన్ ఛానళ్ల పరిరక్షణకు అధికార యంత్రాంగం న డుం బిగించింది. ఇందులో భాగంగా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి జోషి ఆధ్వర్యంలో సోమవా రం బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు కార్యాలయంలో ప్రత్యేకం గా సమావేశమై జలాశయాల సంరక్షణపై సుదీర్ఘం గా చర్చించారు. వివిధ చెరువుల్లో కలిసే ప్రధాన డ్రె యిన్ ఛానల్స్(నాలాలు), వాటికి అనుసంధానంగా గొలుసుకట్టుగా ఉన్న చిన్న ఛానళ్లను సర్వే అఫ్ ఇండియా మ్యాపుపై గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరి జోషి అధికారులను ఆదేశించారు. దీని వల్ల చెరువుల సంరక్షణతో పాటు వాటికి వరదనీటి వాహకాలుగా ఉన్న ఛానళ్లను అభివృద్ధి చేసేందుకు వీలవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రధాన చెరువుల ఇన్లెట్స్/ఔట్లెట్స్ పటిష్టానికి సత్వరం చర్యలు చేపట్టాలని సూచించారు. తొలిదశలో.. ఆయా చెరువులకు కలిసే డ్రెయిన్ ఛానళ్ల (నాలాల) వివరాలను సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో పొందు పర్చేందుకు అధికారులు రంగంలోకి దిగారు. తొలిదశలో జీహెచ్ఎంసీ పరిధిలోని 168 చెరువుల వివరాలను మ్యాపుల్లో పొందుపర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కొక్క నాలాకు ఇన్ఫ్లో ఛానళ్లు ఎన్ని ఉన్నా యో గుర్తించి వాటిని పటిష్టపర్చేందుకు చర్యలు చేపడతారు. మలిదశలో హెచ్ఎండీఏ పరిధిలోని వివిధ చెరువుల ప్రధాన ఛానళ్లను కూడా మ్యాప్లో పొం దుపర్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు అవతల ఎన్ని చెరువులు ఉన్నాయన్న దానిపై ఓ ప్రైవేటు ఏజెన్సీతో హెచ్ఎండీఏ సర్వే నిర్వహిస్తోంది. ఇప్పటికే 200 చెరువులకు డీ మార్కేషన్ పూ ర్తి చేసిన సర్వే సంస్థ అందులో 100 చెరువులకు సం బంధించి మ్యాపులు రూపొందించేందుకు డేటాను సిద్ధం చేసింది. మిగతా చెరువుల లెక్కలూ తేల్చాక సంరక్షణ చర్యలపై నివేదిక రూపొందించనుంది. అ యితే, జలాశయాల సంరక్షణకు అవసరమయ్యే ని ధులెలా సమకూర్చుకోవాలన్నది ఇప్పుడు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల మదిని తొలుస్తున్న ప్రశ్న. -
మెట్రో మార్గాల్లో నో ఫికర్
సాక్షి,సిటీబ్యూరో: మెట్రోరైలు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో రోడ్ల వెడల్పు తగ్గి ఇరుకుగా మారినందున ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఆయా మార్గాల్లో ట్రాఫిక్కు ఇబ్బందుల్లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి, అదనపు పోలీసు కమిషనర్(ట్రాఫిక్) జితేందర్లతో కలిసి మెట్రోరైలు కారిడార్-1 లోని నిరంకారి భవన్, లాజరస్ హాస్పిటల్, లక్డికాపూల్-రంగమహల్ జంక్షన్, జాంబాగ్ తదితర ప్రాంతాల్లో కమిషనర్ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లు బలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వస్తున్నది వర్షాకాలం అయినందున బారికేడ్లు బలంగా లేకుంటే ప్రమాదాలకు ఆస్కారముం టుందన్నారు. ప్రజాభద్రత దృష్ట్యా రోడ్ల తవ్వకాలు జరిగిన ప్రదేశాల్లోనూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించారు. పనులు పూర్తయిన ప్రాంతాల్లో బారికేడ్లు తొలగించాలని, పద్ధతి ప్రకారం రోడ్ల రీకార్పెటింగ్ పనులు పూర్తిచేయాలని.. తద్వారా వాహనాలు సాఫీగా ప్రయాణించగలుగుతాయని చెప్పారు. ప్రజలకు అసౌకర్యంగా ఉన్న అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని,మ్యాన్హోల్స్ రోడ్డు ఎత్తుకు సమానంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాదచారుల సదుపాయార్థం కనీసం నాలుగైదు అడుగుల వెడల్పు ఉండేలా ఫుట్పాత్లు ఏర్పాటు చేస్తున్నామంటూ..ఎన్వీఎస్రెడ్డిలు ఎల్అండ్టీఎంఆర్హెచ్ఎల్, జీహెచ్ఎంసీ, హెచ్ఎంఆర్ ఇంజినీర్లు, ఇతరత్రా అధికారులకు కమిషనర్ సోమేశ్కుమార్ తగు సూచనలు చేశారు. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ పి.వెంకటరామిరెడ్డి, జోనల్ కమిషనర్ రోనాల్డ్రాస్, రఘు తదితరులు వీరి వెంట ఉన్నారు. -
‘గ్రేటర్’లో 400 ఆర్వో ప్లాంట్లు
శుద్ధమైన తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు రూ.5కే భోజనం 50 కేంద్రాలకు విస్తరణ 1500 ప్లేస్కూల్స్ ఏర్పాటుకు చర్యలు జీహెచ్ఎంసీ పనులపై మేయర్ సమీక్ష సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా పేదబస్తీల ప్రజలకు శుద్ధమైన తాగునీరందించేందుకు 400 ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సిందిగా మేయర్ మాజిద్ హుస్సేన్ అధికారులకు సూచించారు. కమిషనర్ సోమేశ్కుమార్తో కలిసి శనివారం జీహెచ్ఎంసీ చేపట్టాల్సిన పలు కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1500 ముస్కాన్ (ప్లే స్కూల్) సెంటర్లు, 50 కేంద్రాల్లో రూ. 5లకే భోజనం కార్యక్రమాల అమలుకు తగుచర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు. తాగునీటి సదుపాయం, భవనాలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో తొలిదశ ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. ప్రజలెక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గ్రేటర్లో 50 కేంద్రాల్లో రూ. 5లకే భోజనం అందించే ఏర్పాట్లు చేయాల్సి ఉండగా ప్రస్తుతం 8 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. అడ్డా కార్మికులు, ఆస్పత్రులు, బలహీనవర్గాల ప్రజలుండే ప్రాంతాల్లో కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. ఆర్ఓ ప్లాంట్లు, ముస్కాన్లు, రూ. 5లకే భోజనం ఏర్పాట్లకు సంబంధించిన నివేదికలు బుధవారం లోగా అందించాల్సిందిగా కమిషనర్ సోమేశ్కుమార్ జోనల్ కమిషనర్లకు సూచించారు. 23 నుంచి రోడ్డు కటింగ్లుండవు.. ఈ నెల 23 నుంచి ఎలాంటి రోడ్డు కటింగ్లకు అనుమతించేది లేదని కమిషనర్ స్పష్టం చేశారు. వాటి అనుమతులపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్లో జరుగనున్న మెట్రోపొలిస్ సదస్సు దృష్ట్యా రహదారుల అభివృద్ధి పనులపై శ్రద్ధ చూపాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. లేన్మార్కింగ్, క్యాట్ఐస్, సైనేజీల ఏర్పాటుతోపాటు అన్ని ప్రధాన మార్గాల్లో సెంట్రల్ కంట్రోల్ సిస్టంతో పనిచేసే ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. 81 ఫౌంటెన్లకు అవసరమైన ఏర్పాట్లు చేయడంతోపాటు ఫ్లై ఓవర్లపై లైటింగ్, గ్రీనరీలను పెంచాలన్నారు. హెరిటేజ్ కారిడార్ల వద్ద బస్బేల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా సూచించారు. -
మెట్రో కారిడార్లలో రోడ్ల విస్తరణ వేగవంతం
అధికారులను ఆదేశించిన జీహెచ్ఎంసీ కమిషనర్ సాక్షి,సిటీబ్యూరో: నగరంలో మైట్రో రైలు ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో రహదారుల విస్తరణ వేగవంతం చేయాలని, ఆస్తుల సేకరణ ప్రక్రియను పూర్తిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్కుమార్ టౌన్ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. రహదారి విస్తరణ పనులపై శుక్రవారం హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డితో కలిసి బల్దియా కార్యాలయంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్రెడ్డి మాట్లాడుతూ ..రహదారి విస్తరణకు వీలుగా కారిడార్-1 పరిధిలో మూసాపేట్,అమీర్పేట్,నాంపల్లిలో 38, ఉస్మానియా మెడికల్ కళాశాల, న్యూ మలక్పేట్లలో 25 ఆస్తులను స్వాధీనం చేసుకోవాల్సి ఉందన్నారు. కారిడార్-2 పరిధిలో క్లాక్టవర్, బోయిగూడ వై-జంక్షన్లో 5, ముషీరాబాద్ ఎక్స్రోడ్స్ నుంచి కాచిగూడా ఎక్స్రోడ్స్ వరకు ఉన్న 51 ఆస్తులు, ఎంజీబీఎస్ నుంచి శాలిబండ వరకు 445 ఆస్తులు స్వాధీనం చేసుకోవాల్సి ఉందని తెలిపారు. కారిడార్-3 పరిధిలో మెట్టుగూడ-గ్రీన్ల్యాండ్స్ మార్గంలో 10, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి శిల్పారామం వరకు 12 ఆస్తులు స్వాధీనం చేసుకోవాల్సి ఉందన్నారు. సెల్లార్లు ప్రమాదకరంగా ఉంటే చర్యలు: సోమేష్కుమార్ నగరంలో నిర్మాణంలో ఉన్న భవంతుల సెల్లార్లు ప్రమాదకరంగా ఉంటే పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పాటు నోటీసులు జారీ చేయాలని క మిషనర్ సోమేష్కుమార్ టౌన్ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు. ప్రస్తుతం 18 సర్కిళ్ల పరిధిలో 58 భవంతుల సెల్లార్లు ప్రమాదకరంగా ఉన్నట్లు అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. పురాతన భవంతుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. గ్రేటర్ పరిధిలో సుమారు 1538 పురాతన భవంతులున్నట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు కమిషనర్కు తెలిపారు. వర్షాకాలంలో ఇవి కూలి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత యజమానులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. లేని పక్షంలో సదరు యజమానులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీకి చెందిన ఖాళీ స్థలాల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. భవన నిర్మాణాలకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను తక్షణం పరిష్కరించాలని సూచించారు. ఆక్యుపెన్సీ పత్రాల జారీని వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్లు వెంకటరామిరెడ్డి, టౌన్ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
పునర్నిర్మాణంలోనూ ఉద్యోగులదే కీలకపాత్ర
చిలకలగూడ,న్యూస్లైన్: తెలంగాణ పునర్మిర్మాణంలో కూడా ఉద్యోగులే కీలకపాత్ర పోషించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం స్పష్టంచేశారు. శుక్రవారం జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ అధికారుల ఆధ్వర్యంలో జోనల్ కార్యాలయం వద్ద జరి గిన తెలంగాణ ఆవిర్భావ సంబురాలకు ముఖ్యఅతి థిగా విచ్చేసిన కోదండరాం మాట్లాడారు. ఎందరో త్యా గాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణను బంగారు తెల ంగాణగా మార్చేందుకు ప్రతిఒక్కరూ తమవంతు కృషిచేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఉద్యోగులు సికింద్రాబాద్ క్లాక్టవర్ సమీపంలోని అమరవీ రులస్థూపం వద్ద నివాళులర్పించి జీహెచ్ఎంసీ కార్యాలయం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నాటితరం పోరాటయోధులకు సన్మానం : తెలంగాణ ఆవిర్భావ సంబరాల్లో భాగంగా నాటితరం తెలంగాణ పోరాటయోధులకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. 1969 ఉద్యమంలో ప్రత్యేకరాష్ట్రం కోసం పోరాడిన మాజీ డిప్యూటీమేయర్ మేడం రామచంద్రయ్య, పీజే సూరి, హరినారాయణయాదవ్, రంజిత్సిన్హాలను సికింద్రాబాద్ డీసీ విజయ్రాజ్ శాలువాలు కప్పి సన్మానించారు. మేడం రామచంద్రయ్య మాట్లాడుతూ..‘తనకు 95 ఏళ్లని, ప్రత్యేక తెలంగాణను చూస్తాననుకోలేదని, నాటి ఆశలు నేడు సాకారం కావడం ఎంంతో సంతోషంగా ఉందని’ నాటి ఉద్యమ ఘటనలు గుర్తుచేసుకున్నారు. దుమ్మురేపిన ధూంధాం : తెలంగాణ అవిర్భావ సంబరాల్లో నిర్వహించిన ధూంధాం కార్యక్రమం దుమ్మురేపింది. సాయిచందు నేతృత్వంలో కళాకారులు ఆలపించిన తెలంగాణ ఉద్యమగీతాలు ఆహుతుల్లో మరింత ఉత్సాహం నింపాయి. నాటితరం తెలంగాణ పోరాటయోధులు సైతం చిందేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. -
టీడీపీ ఎత్తుగడ ఫ్లాప్
జీహెచ్ఎంసీ ‘స్టాండింగ్’ ఎన్నికల్లో నెగ్గిన కాంగ్రెస్-ఎంఐఎం కూటమి అన్ని పార్టీల్లో భారీగా క్రాస్ ఓటింగ్ ఈ పాలకమండలి ఉండేది డిసెంబరు 3 వరకే సాక్షి, సిటీబ్యూరో: ఇటీవలే ముగిసిన సార్వత్రిక ఎన్నికల ప్రభావం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లోనూ ప్రతిబింబించింది. ఆ ఎన్నికల మాదిరే భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. అదే తరహాలో పలు ప్రలోభాలు.. ముడుపుల పంపిణీ జరిగినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. క్రాస్ ఓటింగ్పై భారీ నమ్మకంతో ఈసారి ఎలాగైనా స్టాండింగ్ కమిటీలో స్థానం దక్కించుకోవాలనుకున్న టీడీపీ ఎత్తుగడ బెడిసి కొట్టింది. క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్, ఎంఐఎం కూటమికి పడి టీడీపీకి నిరాశ మిగిలింది. గెలిచిన వారిలో అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి కంటే టీడీపీకి రెండు ఓట్లు తక్కువగా వచ్చాయి. మొత్తానికి కాంగ్రెస్- ఎంఐఎం కూటమి ఎప్పటిలాగే విజయాన్ని నమోదు చేసింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎనిమిదిమంది, ఎంఐఎం నుంచి పోటీలో నిలిచిన ఏడుగురు గెలిచారు. టీడీపీ, బీజేపీల నుంచి చెరొకరు పోటీ చేయగా ఇద్దరూ ఓటమి పాలయ్యారు. భారీగా క్రాస్ ఓటింగ్ ఎంతో ఉత్కంఠను రేకెత్తించిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఊహించినట్లుగానే భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. అన్ని పార్టీల్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ఆయా పార్టీలకు దక్కిన ఓట్లను బట్టి తెలుస్తోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు.. తర్వాత పలువురు కార్పొరేటర్లు పార్టీలు మారారు. జీహెచ్ఎంసీ నిబంధనల మేరకు.. కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు అభ్యర్థులు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే ఆ పార్టీ సభ్యులుగానే కొనసాగుతున్నారు. అనంతరం వారు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారినప్పటికీ రికార్డుల్లో అది నమోదు కావడం లేదు. ఆయా పార్టీలు.. నేతలు.. కార్పొరేటర్ల మధ్య అవగాహనతో మాత్రమే పార్టీ మారిన వారిని కొత్తపార్టీ సభ్యులుగా పరిగణిస్తున్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, తదితర సమయాల్లోనూ ఇదే అమలవుతోంది. పోటీ చేసినప్పుడు ఇండిపెండెంట్లుగా పోటీ చేసి.. అనంతరం ఆయా పార్టీల్లోకి మారిన వారిని సదరు పార్టీ సభ్యులుగానే పరిగణిస్తున్నారు. ఇటీవల పలు పార్టీల నుంచి పలువురు ఇతర పార్టీల్లో చేరారు. అలా టీడీపీ నుంచి ఏడుగురు ఇతర పార్టీల్లోకి వెళ్లారు. ఇతర పార్టీల్లోనూ ఈ ఫిరాయింపులున్నాయి. రావాల్సిన ఓట్ల కన్నా ఎక్కువగానే.. ఆయా పార్టీల్లోని కార్పొరేటర్ల తాజా గణాంకాల మేరకు కాంగ్రెస్- ఎంఐఎంల కార్పొరేటర్లు తమ కూటమి అభ్యర్థులకు ఓటేసినట్లయితే ఒక్కో అభ్యర్థికి 90 ఓట్లు రావాల్సి ఉంది. కానీ.. ఇతర పార్టీల నుంచి సైతం భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతో ఆ రెండు పార్టీల అభ్యర్థులకు 103 ఓట్ల నుంచి 123 ఓట్ల వరకు లభించాయి. కూటమిలోని మరో అభ్యర్థికి కేవలం 75 ఓట్లు మాత్రమే లభించాయి. అలాగే టీడీపీ- బీజేపీ పొత్తును పరిగణనలోకి తీసుకుంటే టీడీపీ అభ్యర్థికి 47 ఓట్లు మాత్రమే లభించాలి. కానీ, 73 ఓట్లు వచ్చాయి. అన్ని పార్టీల్లోనూ క్రాస్ ఓటింగ్ జరిగినప్పటికీ, జీహెచ్ఎంసీలోని ఒప్పందం మేరకు కూటమిలోని కాంగ్రెస్- ఎంఐఎం అభ్యర్థులు మాత్రమే గెలవడం విశేషం. జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు వచ్చే డిసెంబర్ 3 వరకే ఉంది. ఈ పాలకమండలిలో ఇదే చివరి స్టాండింగ్ కమిటీ కావడం.. స్టాండింగ్ కమిటీకి 50 లక్షల రూపాయల మేర పనులకు నిధులు మంజూరు చేసే అవకాశం ఉండటంతో ఎలాగైనా స్థానం పొందాలనుకున్న టీడీపీ ఆశ అడియాసే అయింది. ఓటు వేయని మాజీ మేయర్ జీహెచ్ఎంసీలో ప్రాతినిధ్యం వహిస్తున్న 150 మంది కార్పొరేటర్ల నుంచే 15మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు. ఇద్దరు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికై కార్పొరేటర్లుగా రాజీనామా చేశారు. మిగిలిన 148 మంది కార్పొరేటర్లకుగాను 140 మంది శుక్రవారం పోలింగ్లో పాల్గొన్నారు. ఓటు వేయని వారిలో మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి (కాంగ్రెస్)తో సహా ఎనిమిదిమంది కార్పొరేటర్లున్నారు. ఓటు వేయని మిగతా వారిలో నిర్మలా పురుషోత్తంరెడ్డి (కాంగ్రెస్), సీహెచ్ శ్రీనివాస్ (టీడీపీ), అమ్జదుల్లాఖాన్(ఎంబీటీ), ఎంఐఎంకు చెందిన మెరాజ్ అహ్మద్, అరుణలు ఉన్నారు. వీరితోపాటు టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లిన మురళిగౌడ్, ముఠాపద్మలు కూడా ఓటింగ్లో పాల్గొనలేదు. -
ఆవిర్భావ సందడి
కార్యాలయాల్లో పండగ వాతావరణం సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో తెలంగాణ రాష్ర్ట అవతరణ సంబురాలు అంబరాన్నంటాయి. నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసి ఘనంగా అవతరణ వేడుకలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ, జలమండలి, హెచ్ఎండిఏ, కలెక్టరేట్, ఆర్టీసీ, రవాణా, పౌరసరఫరాలు, ఉస్మానియా, గాంధీ, నిమ్స్ తదితర ప్రభుత్వ ఆసుపత్రులు, సీపీడీసీఎల్, విద్యా, రెవెన్యూ, సంక్షేమం తదితర అన్ని కార్యాలయాల్లోనూ అధికారులు, ఉద్యోగులు ఘనంగా కొత్త రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు జాతీయ జెండాను ఎగుర వేశారు. ప్రతిరోజు ఫైళ్లు, ప్రభుత్వ పనులు, పౌరసేవలతో రద్దీగా ఉండే కార్యాలయాల్లో పండుగ వాతావరణం నెలకొంది. అధికారులు, ఉద్యోగులంతా ఒక్కచోట చేరి నూతన రాష్ట్రానికి స్వాగతం పలుకుతూ కేక్లు కట్ చేశారు. ఉద్యోగులు మిఠాయీలు పంచుకొని పరస్పర ఆలింగనాలతో శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. సంతోషంగా రంగులు చల్లుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అంకితభావంతో పని చేస్తామని ఉద్యోగులు ప్రతిన బూనారు. కార్యాలయాలను అందంగా అలంకరించారు. విద్యుత్ దీపాలు వెలుగులు విరజిమ్మాయి. తెలంగాణ సంస్కృతిని చాటుతూ మహిళా ఉద్యోగులు బతుకమ్మలు ఆడారు. బోనమెత్తుకున్నారు. మరోవైపు నగరంలోని ప్రధాన కూడళ్లలోనూ రాష్ర్ట అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచే మొదలైన వేడుకలు సోమవారం కూడా కొనసాగాయి. టీఆర్ఎస్ శ్రేణులు గులాబీ వర్ణశోభితమయ్యాయి. వేడుకల్లో అమరుల త్యాగాలను కొనియాడుతూ పాడిన పాటలు, తెలంగాణ ధూంధాంలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అన్ని చోట్ల ఆటాపాటలతో ప్రజలు కొత్త రాష్ట్రానికి స్వాగతం పలికారు. మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలుగువిశ్వవిద్యాలయం సహా పలు విద్యాకేంద్రాల్లోనూ విద్యార్ధులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్మికశాఖ కమిషనర్ కార్యాలయంలో... దోమలగూడ: ఆర్టీసీ క్రాస్రోడ్డులోని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్బావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత రాష్ట్ర క మిషనర్ డాక్టర్ అశోక్ కేకును కట్ చేసి, తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం బోర్డును ఆవిష్కరించారు. సోమవారం ఉదయం కార్యాలయం ముందు జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ లేబర్ కమిషనర్ సూర్యప్రసాదు, మురళీసాగర్, జాయింట్ లేబర్ కమిషనర్ డాక్టర్ గంగాధర్, డిప్యూటీ లేబర్ కమిషనర్లు నరేష్కుమార్, శ్రీనివాసు, అసిస్టెంట్ లేబర్ కమిషనర్లు చక్రధర్, శ్యాంసుందర్రెడ్డి, కార్మిక శాఖ టీజీఓ అధ్యక్షులు రాజేందర్, ప్రధానకార్యదర్శి పండరీనాథ్, టీఎన్జీవో అధ్యక్షులు చంద్రశేఖర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రేటర్పై చంద్ర ముద్ర
నగరంపై కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ హైదరాబాద్కి గ్లోబల్సిటీ ఇమేజ్ మౌలిక సదుపాయాల కల్పన అందుకే కీలక శాఖలన్నీ ఆయన వద్దే! జీహెచ్ఎంసీ ఎన్నికలపైనా దృష్టి సాక్షి, సిటీబ్యూరో: కొత్త ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నగరంపై ప్రత్యేక దృష్టి సారించారు. హైదరాబాద్కి ఇప్పటికే ఉన్న ఇమేజ్ను మరింత మెరుగుపరిచి గ్లోబల్సిటీ గా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. నగరంపై ‘విజన్’ ఉన్నందునే ఆయన మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖను తన వద్దే ఉంచుకున్నారని నగరంలో ముఖ్య విభాగాలకు బాధ్యత వహిస్తున్న అధికారులు చెబుతున్నారు. దీనికితోడు సీఎంగా ప్రమాణం చేశాక పరేడ్ గ్రౌండ్లో ప్రజలనుద్దేశించి చేసిన తొలి ప్రసంగంలోనూ నగరాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మెరుగైన రవాణా వ్యవస్థ, పేదలందరికీ గృహసదుపాయం కల్పిస్తామన్నారు. సామాన్యులకవసరమైన మౌలిక సదుపాయాలను ప్రస్తావిస్తూనే మరోవైపు అంతర్జాతీయంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను చాటుతామన్నారు. ఈ రెండు లక్ష్యాలతో నగరాన్ని తీర్చిదిద్దే ఉద్దేశంతోనే ఆయన వాటి అమలు బాధ్యతనూ తానే తీసుకున్నారు. అందుకే సదరు విభాగాలను తన వద్దే ఉంచుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో.. మెరుగైన రవాణా వ్యవస్థ, అద్దంలాంటి రోడ్లు, పారిశుధ్యం, 24 గంటలూ విద్యుత్-తాగునీరు, ఇతరత్రా మౌలిక సదుపాయాలు.. ఇవన్నీ సవ్యంగా ఉన్న నగరం ‘అంతర్జాతీయ స్థాయి’ని పొందుతుంది. అప్పుడే పేరెన్నికగన్న సంస్థలు పెట్టుబడులకు ముందుకొస్తాయి. ఈ సదుపాయాల నిర్వహణను చూసే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి విభాగాలన్నీ మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఉన్నాయి. మెట్రోరైలు ప్రాజెక్టు సైతం వీటి పరిధిలోనే ఉంది. అందుకే కేసీఆర్ స్వయంగా తానే శ్రద్ధ చూపేందుకు ఈ శాఖల్ని తనవద్దే ఉంచుకున్నారని చెబుతున్నారు. గ్రేటర్ తాగునీటి అవసరాలు తీర్చే కృష్ణా ప్రాజెక్టు మూడో దశ, గోదావరి మొదటి దశ త్వరలో అందుబాటులోకి రానున్నాయి. మెట్రోరైలు పనుల రెండో దశపై చర్చలు జరుగుతున్నాయి. రూ. 16 వేల కోట్ల విలువైన మెట్రో పనులు 2017 నాటికి పూర్తి కావాల్సి ఉండగా, తొలిదశ వచ్చే ఏడాదికి పూర్తికావాల్సి ఉంది. ఇవన్నీ సజావుగా సాగడంతోపాటు గ్లోబల్సిటీ బ్రాండ్ ఇమేజ్ పొందాలంటే ఐటీ, ఇతర కంపెనీలను ఆకట్టుకోవాలి. కేంద్రం మంజూరు చేసిన ప్రతిష్టాత్మక ఐటీఐఆర్ ప్రాజెక్టును అమలు చేయాల్సి ఉంది. అంతర్జాతీయ నగరమంటే మురికివాడల రహిత నగరంగా ఉండాలి. అందుకే గ్లోబల్ సిటీతో పాటు స్లమ్ఫ్రీ సిటీని కేసీఆర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. స్లమ్ ఫ్రీ సిటీగా మార్చేందుకు ప్రారంభించిన రే పథకం ఏడాదిన్నర క్రితమే నగరంలో ప్రారంభమైనా.. కదలిక లేదు. వీటన్నింటి అమలుకు, తనదైన ముద్ర వేసేందుకే కేసీఆర్ వీటిపై శ్రద్ధ వహిస్తున్నారని తెలుస్తోంది. ‘స్థానిక’ పగ్గాల కోసం.. మరోవైపు త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ జెండా రెపరెపలాడాలన్నా, స్థానిక సంస్థలో పగ్గాలు చేతబట్టాలన్నా వీటన్నింటినీ సక్రమంగా అమలు చేస్తేనే సాధ్యమనే అంచనాలో కేసీఆర్ ఉన్నారు. అందుకే నగరపాలనలో కీలకపాత్ర వహించే విభాగాలను తన వద్దే ఉంచుకున్నారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఐటీఐఆర్తో అభివృద్ధి ఐటీఐఆర్ ప్రాజెక్టుతో ‘మహా’ నగరం అనూహ్యంగా మారిపోనుందని కొత్త సర్కార్ ఆశలు రేకెత్తిస్తోంది. నగరం చుట్టూ అంటే.. ఔటర్ రింగ్ రోడ్డు గ్రోత్ కారిడార్ లోపల సుమారు 202 చ.కి.మీ. మేర 5 జోన్లలో ఐటీఐఆర్ ప్రాజెక్టులు రూపుదిద్దుకొంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అంచనా వేస్తున్నారు. అయితే కేంద్రం నుంచి నిధులు రాబట్టడంపైనే నగరాభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అలాగే హెచ్ఎండీఏ మాస్టర్ప్లాన్లో ఐటీఐఆర్ల కోసం ప్రత్యేకంగా భూ వినియోగాన్ని ప్రతిపాదించలేదు. ఐటీఐఆర్లకు అనుగుణంగా భూ వినియోగం ఉండాలి. ఇందుకోసం కొత్త ప్రభుత్వం బృహత్ ప్రణాళికలో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుల్లో కదలిక వచ్చేనా? ఔటర్ రింగ్రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉంది. నిధులతో పాటు కోర్టు కేసుల పరిష్కారంలోనూ కొత్త ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సి ఉంది మియాపూర్లో ఇంటర్ బస్ టెర్మినల్, శివార్లలో ట్రక్పార్కుల ఏర్పాటు కలగానే మిగిలాయి. వీటికి టెండర్ల ప్రక్రియ పూర్తయినా నిధుల్లేక పనులను పట్టాలెక్కలేదు. బేగంపేట ఎన్టీఆర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వరకు రూ.35 కోట్లతో తలపెట్టిన ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రాణం పోయాల్సి ఉంది పాతబస్తీలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు అతీగతీ లేవు ఇవన్నీ సాకారం కావాలంటే కొత్త ప్రభుత్వం బాగా నిధులు కేటాయించాల్సి ఉంది -
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి నగరం ముస్తాబు
గ్రేటర్ లో సంబురాలకు సకలజనులు సై.. అంబరమంటేలా ఏర్పాట్లు రేపు అర్ధరాత్రి నుంచే షురూ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వారోత్సవాలు ఎంపిక చేసిన ప్రాంతాల్లో మూడురోజుల ఉత్సవాలు తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కల సాకారం అయ్యే సమయం సమీపిస్తోంది. అనేక ఉద్యమాలు, త్యాగాలు, పోరాటాల వల్ల సిద్ధించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని అదిరిపోయేలా చేసుకునేందుకు తెలంగాణ సకలజనులు సన్నద్ధమవుతున్నారు. జూన్ 2న ‘అపాయింటెడ్ డే’ కావడంతో ఆదివారం అర్ధరాత్రి నుంచే సంబరాలు హోరెత్తనున్నాయి. ఉద్యమవనం ఉస్మానియా మొదలుకొని ప్రతి శాఖ, జేఏసీలు, ప్రజా, కుల, విద్యార్థి, ఉద్యోగ, కార్మిక, కళాకారుల సంఘాల ఆధ్వర్యంలో సంబురాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భారీఎత్తున బాణసంచా కాల్చడంతోపాటు మిఠాయిలు పంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సాక్షి,సిటీబ్యూరో: జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని భారీ ఏర్పాట్లకు హైదరాబాద్ మహానగరపాలక సంస్థ(జీహెచ్ఎంసీ) సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఆదేశాల కనుగుణంగా వారంరోజులపాటు వివిధ ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలతో వారోత్సవాలకు ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ వారోత్సవాలను జూన్ 7 వరకు నిర్వహించనున్నారు. ఇందులోభాగంగా జీహెచ్ఎంసీ ప్రధానకార్యాలయంతోపాటు ట్యాంక్బండ్, గన్పార్క్లను విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా అలంకరించనున్నారు. విద్యుత్ వెలుగులతో ఆ ప్రాంతాలను శోభాయమానం చేయనున్నారు. ఇవికాక గ్రేటర్ పరిధిలోని 33 ప్రాంతాల్లో జూన్ 1 నుంచి 3వ తేదీవరకు మూడు రోజుల పాటు ప్రత్యేక విద్యుత్దీపాలంకరణలు చేయనున్నారు. దిగువ ప్రాంతాలను రంగురంగుల విద్యుల్లతలతో తీర్చిదిద్దనున్నారు. 1. తెలుగుతల్లి జంక్షన్ 2. అబిడ్స్ జీపీవో ట్రాఫిక్ ఐలాండ్ 3. జగ్జీవన్రాం ట్రాఫిక్ ఐలాండ్ 4. నీలం సంజీవరెడ్డి విగ్రహం-ఇందిరాగాంధీ ఐలాండ్ 5. బంజారాహిల్స్ రోడ్డునెం.1-జీవీకే (నాగార్జున సర్కిల్) ఐలాండ్6. సిటీసెంటర్(రోడ్డునెం.10)ఐలాండ్ 7. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి- ఎన్టీఆర్ ట్రస్ట్భవన్ 8.నాంపల్లి స్టేషన్ ఐలాండ్ 9.విద్యానగర్ జంక్షన్-ఓయూ ద్వారం 10. రాజ్భవన్రోడ్డు ఐలాండ్ 11. సీఎం క్యాంపు కార్యాలయం-యశోద హాస్పిటల్ ఐలాండ్ 12. జూబ్లీహిల్స్ చెక్పోస్టు 13. టీఆర్ఎస్ కార్యాలయం సమీపంలో ఐలాండ్ 14. సంజీవయ్యపార్కు-ట్యాంక్బండ్ వరకు అన్ని ఐలాండ్లు 15.హిమాయత్నగర్-నారాయణగూడ ఫ్లైఓవర్ ఐలాండ్ 16.మొజాంజాహీ మార్కెట్ 17.క్లాక్టవర్ బిల్డింగ్ ఐలాండ్ 18. నానల్నగర్- టోలిచౌకి ఐలాండ్ 19.లక్డీకపూల్ ఐలాండ్ 20. చాదర్ఘాట్ చౌరస్తా 21. నయాపూల్- మదీనా ఐలాండ్ 22.చార్మినార్-మక్కామసీదు ఐలాండ్ 23.సిటీకాలేజ్ ఐలాండ్ 24. దారుల్షిఫా ఐలాండ్ 25.ఓవైసీ హాస్పిటల్ ఐలాండ్ 26. ఆరాంఘర్ ఐలాండ్ 27.ఎంజీరోడ్డు గాంధీ విగ్రహం 28.సికింద్రాబాద్ క్లాక్టవర్ 29. సికింద్రాబాద్ స్టేషన్ ఐలాండ్ 30 బేగంపేట విమానాశ్రయం ఐలాండ్ 31. ఎల్బీనగర్ ఐలాండ్ 32. ఉప్పల్ ఐలాండ్ 33. శిల్పారామం- కొత్తగూడ వరకున్న ఐలాండ్లు. వివిధ జేఏసీల ఆధ్వర్యంలో గన్పార్క్, గగన్విహార్ , నెక్లెస్రోడ్,ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో కొవ్వొత్తులు,బైక్ర్యాలీలు, జాతీయ జెండా,తెలంగాణా పతాకావిష్కరణలకు సన్నాహాలు చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో సుమారు 200 కూడళ్లలో కనివినీ ఎరగని రీతిలో ఆవిర్భావ వేడుకలను నిర్వహించేందుకు పలు రాజకీయ పార్టీలు,జేఏసీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో తెలంగాణ ఆటాపాటలతో ధూంధాంలు నిర్వహించేందుకు పలువురు టీఆర్ఎస్ నియోజక వర్గాల ఇన్చార్జులు నిర్ణయించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ జూన్ 2వ తేదీ సోమవారం ఉదయం రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మధ్యాహ్నం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా హాజరయ్యే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులతోపాటు ప్రతిపక్ష పార్టీల నేతలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నగర పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏర్పాట్లను కమిషనర్ అనురాగ్శర్మ స్వయంగా పరిశీలించి కిందిస్థాయి అధికారులకు సూచనలిచ్చారు. వీఐపీలు, వీవీఐపీలు పరేడ్గ్రౌండ్స్కు ఎలా చేరుకోవాలి, వారి వాహనాల పార్కింగ్, ఇతరుల వాహనాల పార్కిం గ్ ఏర్పాట్లను అడిగి తెలుసుకోవడంతోపాటు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవంతోపాటు తెలంగాణ అవిర్భావ దినోత్సవ కార్యక్రమం వద్ద తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లను ఆయన అధికారులకు వివరించారు. పరేడ్గ్రౌండ్స్ లో అనువణువున బాంబు స్క్వాడ్ తనిఖీలు చే సింది. అనుమానిత వ్యక్తుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘాపెట్టేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగర పోలీసుశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రిహార్సల్స్ జరిగాయి. కట్టుదిట్టమైన భద్రత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే కార్యక్రమాలకు నగర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పూర్తిచేశారు. తీసుకున్న భద్రతా చర్యలను నగర పోలీసు కమిషనర్ అనురాగ్శర్మ, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేందర్రెడ్డి అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాలను మళ్లించాలని సూచించారు. భారీ హోర్డింగ్లు ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం..ప్రపంచస్థాయి పయనంలో హై దరాబాద్ నగరం’ తదితర నినాదాలతో ఎంపిక చేసిన ప్రాంతా ల్లో 30 భారీ హోర్డింగుల్ని జీహెచ్ఎంసీ తరపున ఏర్పాటు చేయనున్నారు. వీటిపై తెలుగుతల్లి బొమ్మతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటో ఉంటుంది. గన్పార్కు, ట్యాంక్బండ్, రాజ్భవన్, సచివాలయం తదితర ప్రాంతాల్లో ఏడు స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయనున్నారు. కేసీఆర్ నివాసం నుంచి గన్పార్కు, రాజ్భవన్ రోడ్డు నుంచి పరేడ్గ్రౌండ్, సచివాలయం నుంచి బేగంపేట ఫ్లైఓవర్ వరకు ఫుట్పాత్లకు, డివైడర్లకు, సెంట్రల్ మీడియన్లను రంగులతో తీర్చిదిద్దనున్నారు. వేదికల ఏర్పాటు నగరమంతా పండుగ వాతావరణం ప్రతిబింబించేలా ప్రత్యేక ఏర్పాట్లకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. వేదికల ఏర్పాటుకు వీలున్న ప్రదేశాల్లో వేదికలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ చెప్పారు. విద్యుద్దీపాల అలంకరణలతోపాటు పైన పేర్కొన్న అన్ని ప్రాంతాల్లో పరిసరాల్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయడంతోపాటు డెబ్రిస్ తొలగిస్తున్నట్లు చెప్పారు. కలర్ఫుల్ ఫ్లైఓవర్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మధ్యాహ్నం సికింద్రాబాద్ పరేడ్ మైదానలో జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలకు అధికారులు సకల ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ మార్గంలో ఉన్న మూడు ఫ్లైఓవర్లను రంగులమయం చేయనున్నారు. రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. పరేడ్ రహదారి అంతటా భారీ ఫ్లడ్లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మార్గంను ఆనుకొని ప్రభుత్వ కార్యాలయాల భవనాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. సికింద్రాబాద్ క్లాక్టవర్ సమీపంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అమరవీరులకు నివాళులర్పించేందుకు అనేకమంది రానుండడంతో విద్యుత్దీపాలు, ప్రత్యేక పుష్పాలతో అలంకరణ చేస్తున్నారు. -
తారుమారు
తెలంగాణ వారు ఆంధ్రప్రదేశ్కు అక్కడి రాజ్యసభ సభ్యులు ఇక్కడికి ‘లాటరీ’ కేటాయింపులో మారిన వైనం సాక్షి, సిటీబ్యూరో: రాజ్యసభ సభ్యుల్ని లాటరీ పద్ధతిలో ఇరు రాష్ట్రాలకు కేటాయించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు తెలంగాణలో.. తెలంగాణకు చెందిన కొందరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎక్స్అఫీషియో సభ్యుల సంఖ్య కూడా మారనుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఓటర్లుగా ఉండే పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు రాజ్యసభ సభ్యులు కూడా జీహెచ్ఎంసీలో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉంటారు. అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించిన పలువురు రాజ్యసభ సభ్యులు హైదరాబాద్లో ఓటర్లుగా ఉండటంతో వారు జీహెచ్ఎంసీ ఎక్స్అఫీషియో సభ్యులుగా కొనసాగారు. అలాంటి వారిలో కేవీపీ రామచంద్రరావు,సీఎం రమేశ్, నందమూరి హరికృష్ణ, జైరాం రమేశ్ తదితరులున్నారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు లేకపోవడంతో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లాటరీ ద్వారా ఎంపిక చేసిన వారిలో ఉన్న కె. కేశవరావు, ఎంఏ ఖాన్, జైరాం రమేశ్, టి.సుబ్బిరామిరెడ్డి, చిరంజీవిలు జీహెచ్ఎంసీ ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉన్నారు. వారు ఆంధ్రప్రదేశ్ రాష్టానికి ఎంపిక కా వడంతో... తెలంగాణ రాష్ట్రంలో ఉండే అవకాశం లేదు. అంటే.. వారు జీహెచ్ఎంసీలోఎక్స్అఫీషియో సభ్యులు కారు. కాగా, ప్రస్తుత లాటరీలో తెలంగాణ రాష్ట్రానికి ఎంపికైన కేవీపీ రామచంద్రరావు, వి.హనుమంతరావు, రాపోలు ఆనందభాస్కర్, సీఎం రమేశ్లు ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉన్నారు. వారు యథావిధిగా కొనసాగుతారు. కాగా, తెలంగాణ రాష్ట్రానికి ఎంపికైన పాల్వాయి గోవర్ధనరెడ్డి, గుండు సుధారాణి, గరికపాటి మోహనరావులు జీహెచ్ఎంసీలో ఎక్స్అఫీషియో సభ్యులుగా లేరు. వారు గ్రేటర్లో ఓటర్లుగా లేనందున వారి జిల్లాల్లోని స్థానిక సంస్థల్లో ఎక్స్అ ఫీషియో సభ్యులుగా కొనసాగుతారు. కాగా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు ఎంపికైన దేవేందర్గౌడ్ గ్రేటర్కు చెందిన వారైనప్పటికీ జీహెచ్ఎంసీలో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉండే అవకా శం లేదు. జీహెచ్ఎంసీలో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉండేవారు జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశాలకు హా జరై తమ వాణి వినిపించవచ్చు. ప్రజా సమస్యలను ప్రస్తావించవచ్చు. ఆంధ్రప్రదేశ్కు ఎంపికైన మిగతా రాజ్యసభ స భ్యులు రేణుకాచౌదరి, సుజనాచౌదరి, సీతారామలక్ష్మి, జేడీ శీ లంలు ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది.