state govt
-
ఆంగ్ల భాషా నైపుణ్యం తప్పనిసరి!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులైన యువతకు ఆంగ్లంలో సరైన నైపుణ్యం లేకపోవడం వారి పోటీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని నీతి ఆయోగ్ వెల్లడించింది. యువతలో భాషా నైపుణ్యాలు పెంపొందించేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేసింది. విద్యార్థులు ఆంగ్లం, ఇతర విదేశీ భాషలపై పట్టుసాధించేలా అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. ఈ మేరకు ఇటీవల ‘రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ద్వారా నాణ్యమైన ఉన్నత విద్య విస్తరణ’పేరిట విడుదల చేసిన నివేదికలో ఆంగ్ల భాష అవసరాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ‘అనేక రాష్ట్రాల్లో, స్థానిక పరిశ్రమలలో పనిచేసే నైపుణ్యం గల వ్యక్తులు, ఇతర మానవ వనరులు ప్రధానంగా రాష్ట్రం బయటి నుంచే వస్తున్నారు. ఈ ధోరణికి ముఖ్య కారణం స్థానిక యువతకు ఆంగ్ల భాషలో నైపుణ్యం తగినంతగా లేకపోవడమే. సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సి ఉంది. విద్యార్థుల ఉపాధి నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, తద్వారా వారు రాష్ట్రంలోనే ఉంటూ జాతీయ స్థాయిలో పోటీపడే స్థాయికి తీసుకెళ్లడం అత్యవసరం’అని తన నివేదికలో పేర్కొంది. ముందున్న రెండు రాష్ట్రాలు ఆంగ్ల భాష అవసరాన్ని గుర్తించడంలో పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలు ముందున్నాయని నివేదికలో పేర్కొంది. పంజాబ్ ప్రభుత్వం 2023లో బ్రిటిష్ కౌన్సిల్ సహకారంతో ఈ దిశగా ప్రయత్నాలను ప్రారంభించిందని తెలిపింది. ఆరు నెలల పాటు ఇంటెన్సివ్ 18–సెషన్ల కోర్సును నిర్వహించడం ద్వారా ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి పెట్టిందని వివరించింది. దాదాపు 5వేల మంది ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఈ పైలట్ ప్రాజెక్ట్తో లాభం కలిగిందని వెల్లడించింది. విస్తరిస్తున్న ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచ స్థాయిలో అభివృధ్ధి చెందేందుకు విద్యార్థులకు అవసరమైన భాషా సామర్థ్యాలను పెంపొందించడంలో పంజాబ్ చొరను నీతిఆయోగ్ ప్రశంసించింది. అదేవిధంగా, కర్ణాటక ప్రభుత్వం 2024లో ప్రారంభించిన కార్యక్రమాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఉన్నత విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం, భాషా నైపుణ్యాలను పెంచడం, విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేసింది. మైక్రోసాఫ్ట్ ఇండియాతో భాగస్వామ్యంతో ‘ఇంగ్లిష్ స్కిల్స్ ఫర్ యూత్’కార్యక్రమం ద్వారా 16 ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లో 5,795 మంది విద్యార్థుల ఆంగ్ల నైపుణ్యాభివృధ్ధికి తోడ్పాటునందిస్తోంది. ‘స్కాలర్స్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ టాలెంట్’కార్యక్రమం ద్వారా ఆరు విశ్వవిద్యాలయాల నుంచి అర్హులైన విద్యార్థులకు లండన్లోని విశ్వవిద్యాలయాలకు రెండు వారాల పాటు పంపి, వారితో అభ్యసించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఆంగ్ల విద్యను ప్రోత్సహించిందని నీతిఆయోగ్ ప్రశంసించింది. -
కేంద్ర అధికారులపై కేసు నమోదుకు.. సీబీఐకి రాష్ట్రాల అనుమతి అవసరం లేదు
న్యూఢిల్లీ: రాష్ట్రాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. జస్టిస్ సీటీ రవి కుమార్, జస్టిస్ రాజేశ్ బిందాల్ల ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ‘ఏ హోదాలో ఉన్నాసరే, ఆ ఇద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు/ కేంద్ర ప్రభుత్వ ఆదీనంలోని సంస్థలు విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం వారిపై తీవ్ర అభియోగాలున్నాయి’అని ధర్మాసనం కుండబద్దలు కొట్టింది. ఆంధ్రప్రదేశ్లో పనిచేసే ఇద్దరు కేంద్ర అధికారులపై అవినీతి ఆరోపణలకు సంబంధించి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–1946 కింద సీబీఐకి గతంలో అనుమతిచ్చిందని, రాష్ట్రం వేరు పడినందున మళ్లీ అనుమతులు అవసరమన్న నిందితుల వాదనతో హైకోర్టు ఏకీభవిస్తూ వారిపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేసింది. దీనిని తప్పుబట్టిన సుప్రీం ధర్మాసనం.. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్కు వర్తించిన అన్ని చట్టాలు కొత్తగా ఏర్పాటైన రెండు రాష్ట్రాలకు యథాప్రకారం కొనసాగుతాయని తేలి్చచెప్పింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదుకు తాజాగా ఎలాంటి అనుమతి అవసరం లేదని తెలిపింది. -
పైసా ప్రీమియం లేకుండా రూ.కోటి ఇన్సూరెన్స్..
అనుకోని సంఘనలు జరిగి కుటుంబ పెద్ద లేదా సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఛిన్నాభిన్నం అవుతుంది. అదే బీమా ఉంటే కుటుంబానికి కొండంత అండగా ఉంటుంది. దీన్ని గుర్తించి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త బీమా పాలసీని ప్రకటించారు. ఇందులో ఉద్యోగులు, వారి కుటుంబీకులు ప్రమాదవశాత్తూ మరణించినా లేదా అంగవైకల్యం పొందినా ఆర్థిక సహాయం అందజేస్తారు.ఈ పథకం కింద అస్సాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి ప్రీమియం లేకుండా అంటే జీరో ప్రీమియంతో జీవిత బీమా, వైకల్య కవరేజీ అందిస్తారు. ఈ పాలసీ కింద రాష్ట్ర ఉద్యోగులకు కోటి రూపాయల వరకు బీమా కవరేజీ లభిస్తుంది.విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించే లేదా వైకల్యానికి గురయ్యే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రక్షణ కోసం ఈ పథకాన్ని రూపొందించినట్లు అస్సాం సీఎం తెలిపారు.ఈ పథకం రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, వరదలు, ఇతర విపత్తుల వల్ల సంభవించే ప్రమాదాలను కవర్ చేస్తుంది. ఈ కొత్త పాలసీలో ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం కలిగినా బాధిత కుటుంబానికి రూ. 1 కోటి, పాక్షిక అంగవైకల్యానికి రూ.80 లక్షలు, అనారోగ్యంతో మరణిస్తే రూ.10 లక్షలు అందజేస్తామని అస్సాం సీఎంఓ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. -
హైకోర్టుకు మరో ఇద్దరు శాశ్వత న్యాయమూర్తులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు వీరి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణారావు శుక్రవారం శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. వీరి నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గురు వారం జీవో జారీ చేస్తే శుక్రవారం వారి ప్రమాణం ఉంటుంది. వీరి చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయిస్తారు. వీరిద్దరినీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల కేంద్రానికి సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు కృష్ణా జిల్లా చల్లపల్లి గ్రామానికి చెందిన విశ్రాంత సబ్ రిజిస్ట్రార్ సోమయ్య, కోటేశ్వరమ్మలకు 1964 ఆగస్టు 30న జన్మించారు. 10వ తరగతి మచిలీపట్నంలోని జైహింద్ హైస్కూల్లో, ఇంటర్మీడియట్ చల్లపల్లిలోని ఎస్ఆర్వైఎస్పీ జూనియర్ కాలేజీలో.. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, న్యాయ విద్యను మచిలీపట్నంలో అభ్యసించారు. 1989 ఏప్రిల్ 5వ తేదీన న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో చేరి ప్రాక్టీస్ చేశారు. 1994లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. 2007లో సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి పొందారు. అనంతరం 2016 నుంచి 2019 వరకు శ్రీకాకుళంలో ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక జడ్జిగా పని చేశారు. అనంతరం తిరుపతిలోని ఫ్యామిలీ కోర్టులో అదనపు జిల్లా న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత గుంటూరు మొదటి అదనపు జిల్లా జడ్జిగా పని చేస్తున్న సమయంలో గతేడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసు మేరకు ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ పి.వెంకట జ్యోతిర్మయి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి గుంటూరు జిల్లా తెనాలిలో పీవీకే శాస్త్రి, బాల త్రిపుర సుందరి దంపతులకు జన్మించారు. డిగ్రీ వరకు తెనాలిలోనే చదివారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. అనంతరం 2008లో నేరుగా జిల్లా జడ్జి కేడర్లో ఎంపికై.. ఫ్యామిలీ కోర్టు, సీబీఐ కోర్టు, వ్యాట్ ట్రైబ్యునల్ ఛైర్మన్, ఎస్సీ ఎస్టీ కోర్టు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2023 జనవరిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అనంతరం ఈ ఏడాది మే 16న ఏపీ హైకోర్టు ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని అనుసరించి సుప్రీంకోర్టు కొలీజియం ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. -
ప్రీస్కూల్స్గా అంగన్వాడీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను క్రమంగా పూర్వ ప్రాథమిక పాఠశాలలు (ప్రీ స్కూల్స్)గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. జాతీయ విద్యా విధానం–2020కు అనుగుణంగా వీటిని అభివృద్ధి చేసేలా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. తొలి విడత కింద ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలో ఉన్న వాటిని ప్రీస్కూల్స్గా అప్గ్రేడ్ చేసే దిశగా చర్యలు వేగవంతం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల సమీపంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల సమాచారాన్ని క్రోడీకరించిన రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ.. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఈ కేంద్రాల ఆధునీకరణకు అవసరమైన మౌలిక వస తులు,నిధులు...తదితర అంశాలతో ప్రతిపాదనలను ప్రాథమికంగా ఖరారు చేశారు. వీటిని ప్రభుత్వ ఆమోదం కోసం పంపినట్లు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో.. జూన్ 6 తర్వాత ప్రభుత్వం ఆమోదం పొందే అవకాశం ఉన్నట్లు తెలిపాయి.వసతులకు రూ.30 కోట్లుప్రస్తుతం తెలంగాణలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు న్నాయి. వీటిలో 15,640 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల పరిధిలో కొనసాగుతున్నాయి. వీటిల్లోనే సూత్రప్రాయంగా ప్రీ స్కూల్ విద్యను అమలు చేసేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాచరణ రూపొందించింది. వీటి పరిధిలోని 3 లక్షల మంది 3 – 6 సంవత్సరాల మధ్యనున్న చిన్నారులకు ప్రీస్కూల్ విద్యను అందించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో భాగంగా కార్పెట్ల కొనుగోలు కోసం రూ.3.57 కోట్లు బడ్జెట్ అవసరమని ప్రతిపాదించింది. పుస్తకాలు, పఠన సామాగ్రి, బుక్ ర్యాక్స్ కోసం రూ.7.53 కోట్లు ప్రతిపాదించింది. ఆయా కేంద్రాలకు కొత్తగా రంగులు వేసేందుకు సమగ్ర శిక్షా విభాగంతో అవగాహన చేసుకుంది. పిల్లలకు ప్రత్యేక యూనిఫాం కోసం రూ.6.90 కోట్లు, ప్రతి అంగన్వాడీ కేంద్రంలో రెండు టేబుల్స్ ఇతర సామాగ్రి ఏర్పాటు కోసం రూ.12.96 కోట్లు ప్రతిపాదించింది. మొత్తంగా రూ.30 కోట్ల విలువైన ప్రతిపాదనలు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రభుత్వానికి సమర్పించింది.కొత్త టీచర్లా? ప్రస్తుత సిబ్బందేనా?ప్రీస్కూల్స్లో విద్యాబోధనకు శిక్షణ పొందిన టీచర్ల ఆవశ్య కత ఉంది. ప్రస్తుతం అంగన్వాడీల్లో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్లు పదో తరగతి అర్హతతో విధుల్లో చేరినవారే. ఈ క్రమంలో ప్రీ ప్రైమరీ విద్యాబోధనకు కొత్తగా టీచర్లను నియ మిస్తారా? లేక ఇప్పుడున్న వారితో నిర్వహిస్తారా? అనే అంశంపై స్పష్టత లేదు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సమర్పించిన ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం దక్కిన తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
పెన్షన్ల చెల్లింపు పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం: హైకోర్టు
సాక్షి, అమరావతి: సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ల విధానాన్ని హైకోర్టు సమర్థించింది. పెన్షన్ల చెల్లింపు పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇందులో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఆర్థికపరమైన అంశాలు ముడిపడి ఉన్న వ్యవహారాల్లో నిర్దిష్టంగా ఫలానా విధంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయస్థానాలు ఆదేశించలేవని పేర్కొంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చాలా స్పష్టంగా చెప్పిందని గుర్తు చేసింది. ఈ మేరకు ఒక కుటుంబంలో బహుళ పెన్షన్ల చెల్లింపుల విషయంలో ప్రభుత్వ నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. వైఎస్సార్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి ప్రభుత్వం 2019 డిసెంబర్లో జీవో 174 జారీ చేసింది. కుటుంబంలో బహుళ పెన్షన్ల చెల్లింపుల విషయంలో కొన్ని నిబంధనలు తెచి్చంది. దీన్ని సవాల్ చేస్తూ న్యాయవాది తాండవ యోగేష్ 2022లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం కౌంటర్లు దాఖలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, సెర్ప్ సీఈవో, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే బహుళ పెన్షన్ల విషయంలో నిబంధనలు రూపొందించిందని ప్రభుత్వ న్యాయవాది వడ్లమూడి కిరణ్ కుమార్ హైకోర్టుకు నివేదించారు. తీర్పులో ముఖ్యాంశాలు ఇవీ.. ఈ గణాంకాలు చూశాక.. ‘కేంద్రం రూ.288 కోట్లు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.19,161 కోట్లు చెల్లిస్తోంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఆసక్తికరమైన గణాంకాలను మా ముందుంచాయి. వృద్ధాప్య పెన్షన్ల కోసం కేంద్రం తన వాటా కింద ఏటా రూ.188.74 కోట్లు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.10,164 కోట్లు చెల్లిస్తోంది. వితంతు పెన్షన్ల కోసం కేంద్రం రూ.91.07 కోట్లు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.4,129.44 కోట్లు ఇస్తోంది. దివ్యాంగులకు కేంద్రం రూ.9.05 కోట్లు ఇస్తుంటే రాష్ట్రం రూ.2,594.31 కోట్లు చెల్లిస్తోంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏటా పెన్షన్ల కింద వివిధ వర్గాలకు మొత్తం రూ.19,161.66 కోట్లు చెల్లిస్తోంది. ఈ గణాంకాలను చూసిన తరువాత జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడంలేదన్న పిటిషనర్ వాదనను మేం ఏమాత్రం అంగీకరించడం లేదు. ప్రభుత్వ నిర్ణయానికే వదిలేస్తున్నాం అశ్వనీకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వృద్ధులకు ఆర్థిక సాయం, పెన్షన్లు, నివాసం, మెడికల్ ఖర్చుల చెల్లింపు విషయంలో సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. వృద్ధుల దయనీయ పరిస్థితిని సానుభూతి కోణంలో పరిశీలించి పెన్షన్ ఇవ్వటాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అయితే పెన్షన్ మంజూరు పూర్తిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో ఉన్న నిధులు, ఆరి్థక పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అంతేకాకుండా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు లోబడి ఉంటుందని తేల్చి చెప్పింది. అందువల్ల పెన్షన్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయాల్లో మేం ఏ రకంగానూ జోక్యం చేసుకోలేం. అది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయానికే వదిలేస్తున్నాం. దివ్యాంగులకు పెన్షన్లు మంజూరులో కుటుంబాన్ని యూనిట్గా పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక కోణంలో ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయం ఇది. దీన్ని పునఃసమీక్షించేందుకు మేం అధికరణ 226 కింద మాకున్న అధికారాన్ని వినియోగించలేం. ఆ నిర్ణయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ విచక్షణకే వదిలేస్తున్నాం.’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
డ్రాప్ అవుట్.. నో చాన్స్!
సాక్షి, అమరావతి: బడి ఈడు పిల్లలందరినీ బడుల్లోకి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో (2023–24) ఇప్పటి వరకు గుర్తించిన 38,677 డ్రాప్ అవుట్ పిల్లలను తిరిగి బడుల్లో చేర్పించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో డ్రాప్ అవుట్ పిల్లలను తిరిగి బడుల్లో చేర్పించడం ఒక సూచికగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా బడి ఈడు పిల్లలందరినీ నూరు శాతం బడుల్లో చేర్పించేలా ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా వలంటీర్ల ద్వారా ప్రత్యేకంగా 5 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలు బడుల్లో ఉన్నారా.. లేక బడి బయట ఉన్నారా అనే అంశంపై సర్వే నిర్వహించడం ద్వారా డ్రాప్ అవుట్ పిల్లలను గుర్తించారు. ఇప్పటి వరకు 38,677 మంది డ్రాప్ అవుట్ పిల్లలను తిరిగి బడుల్లో చేర్పించినట్లు ఇటీవల జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో స్పష్టం చేశారు. 1వ తరగతిలో చేరిన పిల్లలు ఆ మరుసటి సంవత్సరం రెండో తరగతి.. ఆ మరుసటి సంవత్సరం ఆపై తరగతిలో.. ఇలా 8వ తరగతి వరకు చేరుతున్నారా లేక మధ్యలో డ్రాప్ అవుట్ అవుతున్నారా.. అనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహణలో అసలు బడిలో చేరని, డ్రాప్ అవుట్, బాల కార్మికులను గుర్తించి వారి కోసం ప్రత్యేక ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. పిల్లలను బడుల్లో చేర్పించడం ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల ప్రయోజనాలను తల్లిదండ్రులకు వివరించడం ద్వారా అవగాహన కల్పించే చర్యలను ప్రభుత్వం చేపట్టింది. తద్వారా బడి ఈడు పిల్లలందరూ బడుల్లో ఉండేలా ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంది. తద్వారా ఇప్పటి వరకు మొత్తం 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు స్కూల్స్లో నమోదైన విద్యార్థుల సంఖ్య 56,34,974కు చేరింది. ఈ విద్యా సంవత్సరంలో అత్యధికంగా 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బడుల్లో చేరిన పిల్లలు కర్నూలు జిల్లాలో 3,78,564 మంది ఉండగా, ఆ తర్వాత అనంతపురం జిల్లాలో 3,06,667 మంది, నంద్యాల జిల్లాలో 2,29,280 మంది బడుల్లో చేరారు. -
‘ధూపదీప నైవేద్యం’ రూ.10 వేలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధీనంలోని అతి తక్కువ ఆదాయ వనరులున్న చిన్న ఆలయాలకు ధూపదీప నైవేద్యం పథకం కింద నిధులను ప్రభుత్వం పెంచింది. ఆ ఆలయాలకు ఇప్పటివరకు ఇస్తున్న రూ.6 వేలను రూ.10 వేలకు పెంచుతూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ధూపదీప నైవేద్యం పథకం కింద గుర్తించిన 6,541 ఆలయాలకు ఇది వర్తించనుంది. ఈ పథకం ప్రారంభమైన కొత్తలో ఒక్కో ఆలయానికి రూ.2,500 ఇచ్చేవారు. తర్వాత రూ.6 వేలకు పెంచారు. అందులో రూ.2 వేలు ఆలయంలో పూజాదికాల ఖర్చుకు, మిగతా మొత్తాన్ని అర్చకుడి కుటుంబ పోషణ కోసం అందించేవారు. ఇప్పుడీ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచటంతో.. పూజాదికాలకు రూ.4 వేలు, అర్చకుల కుటుంబాలకు రూ.6 వేలు వినియోగించుకునే వీలుంటుందని అంటున్నారు. ఈ పథకం పరిధిలోకి మరిన్ని ఆలయాలను తీసుకురావాలన్న ప్రతిపాదన ఉంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా.. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యుడిగా పాత్రికేయుడు విష్ణుదాస్ శ్రీకాంత్ను నియమిస్తూ ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాంస్కృతిక సారథి కళాకారులకూ ఊరట ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్చించే విధుల్లో ఉన్న సాంస్కృతిక సారథి కళాకారుల వేత నాలను ప్రభుత్వం పెంచింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఊరూరా తిరిగి ప్రజల్లో చైతన్యం కలిగించిన 583 మంది కళాకారులతో.. రాష్ట్ర అవతరణ తర్వాత సాంస్కృతిక సారథి బృందాన్ని ఏర్పా టు చేసిన విషయం తెలిసిందే. వీరికి ప్రస్తుతం రూ.24,514గా ఉన్న వేతనాలను రూ.31,868 చేసింది. 2021 జూన్ 1వ తేదీ నుంచే ఈ పెంపు వర్తిస్తుందని పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల సాంస్కృతిక సారథి కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లో సీఎం కేసీఆర్ చిత్రాలకు స్వర–క్షీరాభిషెకాలు నిర్వహించాలని నిర్ణయించామని కళాకారుల ప్రతినిధులు తెలిపారు. -
కాపెక్స్ వ్యయంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ - వివరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కాపెక్స్ (మూలధనం) వ్యయంలో ఇతర రాష్ట్రాలకంటే కూడా ముందంజలో అగ్రగామిగా అవతరించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) డేటా ప్రకారం.. ఏప్రిల్ - జూన్ కాలంలో ఆంధ్రప్రదేశ్ మూలధన వ్యయంలో రూ. 12,669 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. కాగా FY24కి రాష్ట్ర కాపెక్స్ బడ్జెట్ రూ. 31,061 కోట్లుతో 41 శాతంగా ఉంది. ఇక్కడ తెలుసుకోవలసిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తెలంగాణ మూలధన వ్యయం కూడా గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 8 శాతంతో పోలిస్తే FY24 బడ్జెట్లో 27 శాతానికి పెరిగింది. క్యూ1లో వార్షిక లక్ష్యంలో 20 శాతానికి పైగా సాధించిన ఇతర రాష్ట్రాలుగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఉన్నాయి. 20 రాష్ట్రాల కాపెక్స్ ఖర్చులను విశ్లేషించిన రేటింగ్ ఏజెన్సీ.. మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్లు కలిసి మొదటి త్రైమాసికంలో మొత్తం క్యాపెక్స్లో 56.4 శాతంగా ఉన్నాయని పేర్కొంది. పటిష్టమైన పన్ను వసూళ్లు, వ్యయం తగ్గడం, ముఖ్యంగా మొదటి త్రైమాసికంలో సబ్సిడీలు, జీతాల చెల్లింపుల ద్వారా కాపెక్స్ వృద్ధి కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ తన బడ్జెట్ రెవెన్యూ రాబడిలో క్యూ1లో 22 శాతాన్ని సాధించింది. ఇది క్రితం సంవత్సరం త్రైమాసికంలో 18 శాతంగా ఉంది. గత సంవత్సరంతో పోల్చితే ఈ త్రైమాసికంలో వడ్డీ, పెన్షన్, సబ్సిడీ చెల్లింపులు వంటి వ్యయాలను నియంత్రించడంలో కూడా రాష్ట్రం బాగా పనిచేసింది. -
ఇక అన్ని ప్రయాణాలకూ ఒకే కార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించడానికి వీలుగా ఒకే కార్డును తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు రెండో వారంలోగా ‘కామన్ మొబిలిటీ కార్డు’లను సిద్ధం చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ అంశంపై సచివాలయంలో గురువారం ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రులు... తొలుత హైదరాబాద్లోని ప్రజారవాణా వ్యవస్థ మొత్తానికి కలిపి వినియోగించేలా ఈ కార్డును అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. మొదట మెట్రోరైల్, ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి వీలుగా ఈ కార్డులను జారీ చేస్తామని, సమీప భవిష్యత్తులో ఇదే కార్డుతో ఎంఎంటీఎస్, క్యాబ్ సేవలు, ఆటోలను కూడా వినియోగించుకొనేలా విస్తరి స్తామని మంత్రులు తెలిపారు. పౌరులు వారి ఇతర కార్డుల మాదిరే దీన్ని కొనుగోళ్లకు కూడా వినియోగించేలా వన్ కార్డ్ ఫర్ అల్ నీడ్స్ మాదిరి కామన్ మొబిలిటీ కార్డు ఉండాలని మంత్రులు అధికారులకు సూచించారు. ఈ కార్డుగల ప్రయా ణికులు దేశవ్యాప్తంగా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు వినియోగించేందుకు అవకాశం ఉన్న ప్రతి చోటా వినియోగించుకొనేందుకు అవకాశం ఉంటుందని మంత్రులు తెలిపారు. మరోవైపు కామన్ మొబిలిటీ కార్డుకు ఒక పేరును సూచించాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పౌరుల నుంచి పేర్లను కోరుతూ ట్వీట్ చేశారు. ఈ సమావేశంలో అరవింద్ కుమార్, మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు. -
విలువలే ‘ఇల్లు’వెత్తు ఆస్తి
మంగళగిరి: విలువలే నిలువెత్తు ఆస్తి అని ఆ మహిళ నిరూపించారు. తనకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటిస్థల పట్టాను వెనక్కి ఇస్తూ అధికారులకు లేఖ రాశారు. తనకు ఇప్పటికే ఇల్లు ఉందని, ఈ స్థలం పేదలకు దక్కేలా చూడాలని కోరారు. ఆమె నిజాయితీని అధికారులు, పేదలు ప్రశంసిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. నగర పరిధిలోని యర్రబాలెంకు చెందిన దండిభొట్ల నాగసీత కనకదుర్గ 2019లో సొంతింటి కోసం దరఖాస్తు చేసుకోవడంతో ప్రభుత్వం అర్హురాలిగా గుర్తించింది. ఆ తర్వాత ఆమె భర్త సుబ్రమణ్య శర్మ పేరుతో 100 చదరపు గజాల స్థలం కొని బ్యాంకు రుణం తీసుకుని ఇల్లు నిర్మించుకున్నారు. అప్పటికే ఇంటి స్థలానికి అర్హురాలిగా ఎంపికైన కనకదుర్గ పేరుతో అధికారులు ఇంటిస్థల పట్టాను మంజూరు చేశారు. ఇటీవల పట్టాల పంపిణీ కార్యక్రమంలో అందించారు. అయితే తనకు సొంతిల్లు ఉందని, పేదలకు చెందాల్సిన సెంటు స్థలం తాను పొందడం భావ్యం కాదని భావించిన కనకదుర్గ ఆ పట్టాను వెనక్కి ఇస్తూ అధికారులకు లేఖ రాశారు. అనర్హులైనా.. అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం స్థల పట్టాలు మంజూరు చేస్తోంది. అయితే వీటిని అనర్హులూ తీసుకుంటున్నారు. అప్పటికే తమ పేరు మీద ఆస్తులు, స్థలాలను ఇంట్లో వేరేవారి పేరు మీదకు మార్చి ఇంటిస్థలం, టిడ్కో గృహ పట్టాలు పొందుతున్నారు. ►నగరంలోని ఇందిరానగర్కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు ఇప్పటికి మూడు పారీ్టలు మారి ప్రస్తుతం టీడీపీ కండువా కప్పుకున్నాడు. ఆయనకు అనేక ఆస్తులున్నా తల్లి పేరున ఏ ఆస్తి లేకుండా చేసి టిడ్కో ఇల్లు పొందాడు. ఈ ఉదంతం నగరంలో చర్చనీయాంశమవుతోంది. ► కమర్షియల్ కాంప్లెక్స్తోపాటు నగరంలో మరో రెండు ఇళ్లు ఉన్న ఓ వ్యక్తి తన భార్య పేరున టిడ్కో ఇల్లు పొందడం గమనార్హం. ► యర్రబాలెంలో రెండు అంతస్తుల డాబాలో ఉండే ఓ మహిళ తనకు నెలకు రూ.25వేల వరకు అద్దెల రూపంలో ఆదాయం వస్తున్నా.. ఇంటిస్థల పట్టాను పొందారు. ఇలా అనేక మంది తమ పేర్ల మీద ఆస్తులు లేకుండా చేసుకుని ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే స్థలాలను అర్హులకు దక్కకుండా కాజేస్తున్నారు. ఇవన్నీ తెలిసినా నిబంధనల వల్ల అధికారులూ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కనకదుర్గను ఆదర్శంగా తీసుకుని అనర్హులు పొందిన ఇంటిస్థల పట్టాలను వెనక్కి ఇవ్వాలని అధికారులు, ప్రజలు కోరుతున్నారు. అనర్హులు ఉంటే పట్టాలు రద్దుచేస్తాం పేదల ఇళ్ళ స్థలాలను అనర్హులు పొంది ఉంటే కచ్చితంగా పట్టా రద్దు చేసి చర్యలు తీసుకుంటాం. అనర్హులను ఎంపిక చేసిన సిబ్బందిపైనా చర్యలు తప్పవు. అనర్హులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పట్టాలు వెనక్కి ఇచ్చి పేదలకు దక్కేలా సహకరించాలి. ఇంట్లో ఎవరికైనా స్థలం, ఆస్తి ఉండి స్థలాలు పొందిన అనర్హులు వెంటనే పట్టాలు వెనక్కి ఇవ్వాలి. – జీవీ రామ్ప్రసాద్, తహసీల్దార్, మంగళగిరి -
ఇల్లు కొనుక్కున్నా.. పట్టా వెనక్కి తీసుకోండి
మంగళగిరి: రాష్ట్రంలో ఇల్లులేని పేదవారు ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం పట్టాలు పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా యర్రబాలెంకు చెందిన దండిభొట్ల నాగసీత కనకదుర్గను అధికారులు అర్హురాలిగా గుర్తించి ఇటీవల ఆమెకు పట్టాను అందజేశారు. నిజానికి.. 2019లో తనకు సొంతిల్లు లేకపోవడంతో కనకదుర్గ అందుకోసం దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం తాజాగా అర్హురాలిగా గుర్తించింది. కానీ, 2019 అనంతరం తన భర్త దండిభొట్ల సుబ్రహ్మణ్య శర్మ పేరుతో వున్న వంద చదరపు గజాల స్థలాన్ని విక్రయించి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ను కొనుగోలు చేసి ఈ ఏడాది మార్చి 23న రిజిస్ట్రేషన్ చేయించుకుని అందులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో.. అప్పటికే ఇంటి స్థలానికి అర్హురాలిగా కనకదుర్గను ఎంపిక చేసిన అధికారులు ఆమె పేరున పట్టాను మంజూరుచేసి ఇటీవల అందరితో పాటు అందజేశారు. కానీ, తనకు సొంతిల్లు ఉండగా పేదలకు చెందాల్సిన సెంటు స్థలాన్ని తాను పొందకూడదని కనకదుర్గ గ్రహించి ప్రభుత్వం తనకు కేటాయించిన ఇంటి స్థలాన్ని రద్దుచేసి వేరొక అర్హురాలికి ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారులకు ఆదివారం ఆమె లేఖ రాశారు. -
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని, గతంలో ఇంటర్ విద్యార్థులతో, తాజాగా పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేని కొన్ని పార్టీలు కుట్రలకు తెరలేపాయని పరోక్షంగా బీఆర్ఎస్ను విమర్శించారు. తనపై మోపిన పేపర్ లీకేజీ కేసు ఆ కుట్రలో భాగమే అని విమర్శించారు.ఇది అత్యంత క్లిష్ట సమయమని, పాలకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు ఒడిగడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుట్రలకు భయపడితే 30 లక్షల మంది నిరుద్యోగులు, వారి కుటుంబాల జీవితాలు ప్రమాదంలో పడ్డట్లేనన్నారు. టెన్త్ పేపర్ల లీకేజీకి కుట్ర కేసులో ప్రస్తుతం కరీంనగర్ జైల్లో రిమాండ్లో ఉన్న సంజయ్.. గురువారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని కారాగారం నుంచే పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఒక లేఖ రాశారు. తొలుత పార్టీ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బండి.. పార్టీ నిర్మాణం కోసం శ్రమించిన వాజ్పేయి, డీఎన్ రెడ్డి మొదలు చలపతిరావు, రామారావు, టైగర్ నరేంద్ర, జితేందర్రెడ్డిల సేవలను స్మరించుకున్నారు. నిరుద్యోగుల పక్షాన గళమెత్తినందుకే.. కేసులు, జైళ్లు కొత్తకాదని.. ప్రజల కోసం ఎన్నిసార్లయినా జైలుకు వెళ్లేందుకు, ప్రాణమైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని సంజయ్ పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ లీకేజీలో వైఫల్యాలను, ప్రభుత్వ తప్పిదాలను, ఐటీశాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ కొడుకు పాత్రను ఎత్తిచూపుతూ 30 లక్షల మంది నిరుద్యోగ కుటుంబాల పక్షాన గళమెత్తినందుకే తనను కేసులో ఇరికించారని ఆరోపించారు. నాడు తన స్వార్థం కోసం 27 మంది ఇంటర్మీ డియట్ విద్యార్థులను ప్రభుత్వం బలి తీసుకుందని మండిపడ్డారు. ప్రధాని మోదీ నాకు స్ఫూర్తి ప్రధాని మోదీ తనకు స్ఫూర్తి అని, ఆయన ఈనెల 8న హైదరాబాద్కు వస్తున్నా తాను ఆ సభకు హాజరయ్యే అవకాశం కన్పించకపోవడంతో బాధగా ఉందని సంజయ్ పేర్కొన్నారు. మోదీ సభను కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. శ్యామ్ప్రసాద్.. దీన్ దయాళ్ సిద్ధాంతాలు, వాజ్పేయి త్యాగం, మోదీ ఆశలను నెరవేర్చేందుకు కృషి చేయాలని, కేసీఆర్ సర్కార్ను బొందపెట్టడమే లక్ష్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బిడ్డ, కొడుకుల స్కాంలు బయటపడుతున్నాయి.. బిడ్డ, కొడుకు చేసిన స్కాంలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో నిస్పృహలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం తనను అరెస్టు చేసి జైలుకు పంపడం ద్వారా ఉద్యమాలను అడ్డుకోవాలని చూస్తోందని సంజయ్ ఆరోపించారు. జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ వ్యాఖ్యల నుంచి దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి టీఎస్పీఎస్సీ లీకేజీకి బాధ్యుడైన కేసీఆర్ కొడుకును కేబినెట్ నుండి బర్తరఫ్ చేసేవరకు, నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేవరకు, లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే వరకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని బీజేపీ చీఫ్ పిలుపునిచ్చారు. నియంత పాలనకు చరమ గీతం పాడేదాకా పోరాడదామని అన్నారు. ‘గడీల్లో బందీ అయి విలపిస్తున్న తెలంగాణ తల్లిని బంధ విముక్తి చేయడమే మనందరి లక్ష్యం. అందుకోసం తెగించి కొట్లాడదాం.. రాబందుల రాజకీయ క్రీడ నుండి తెలంగాణ తల్లిని రక్షించుకుందాం. అందుకోసం మీరంతా కదిలిరండి..’అని విజ్ఞప్తి చేశారు. -
తెలంగాణ సహా 4 రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
-
రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం
హుజూర్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను మోసం చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ విమర్శించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని రాజ్యాంగంలో ఉన్నా కొనుగోలు చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజల దాహార్తి తీర్చడానికి రూ.36 వేల కోట్లతో మిషన్ భగీరథ పథకం చేపడితే గ్రామాలకు తాగునీరు అందడంలేదు కానీ కేసీఆర్ కుటుంబం దాహార్తి తీరడానికి ఉపయోగపడిందని విమర్శించారు. పేద విద్యార్థులు చదువుకుంటున్న గురుకులాలకు సొంత భవనాలు నిర్మించడంపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు, దోపిడీని ప్రశ్నించడానికి బీఎస్పీ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. తెలంగాణలో లక్షల కోట్ల సంపద కేసీఆర్ కుటుంబం గుప్పెట్లో బందీ అయిందని, బీఎస్పీ అధికారంలోకి వస్తే వారు దోచుకున్నదంతా పేదలకు పంచుతామని, అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హుజూర్నగర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. -
‘దీక్ష’ను కొనసాగించి తీరుతాం
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం అత్యంత హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా, నిర్బంధాలు విధించినా దీక్షను కొనసాగిస్తామని ప్రకటించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టి తీరుతామన్నారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద గురువారం బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష తలపెట్టిన విషయం తెలిసిందే. దీక్షకు ప్రభు త్వం అనుమతి నిరాకరించిన తర్వాత బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యం గొంతు నులిమే కుట్ర. బీజేపీని అణిచివేసే చర్య. బీజేపీ పేరు వింటేనే సీఎం కేసీఆర్ వెన్నులో వణుకుపుడుతోంది. బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా బడ్జెట్ సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం అందులో భాగమే. అసెంబ్లీలోకి అనుమతించే విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు.. స్పీకర్కు సూచించినా పట్టించుకోలేదు. ట్రాఫిక్ రద్దీ, ప్రజలకు ఇబ్బంది అనే పేరుతో ధర్నా కు పోలీసులు అనుమతి నిరాకరించడం విస్మయం కలిగి స్తోంది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నా చేసినప్పుడు లేని ఇబ్బంది.. బీజేపీ దీక్ష చేపడితేనే వచ్చిందా? ఇది ముమ్మాటికీ పక్షపాత చర్యే. ఈ అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక చర్యలపై ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, ప్రజాసంఘాల నేతలు స్పందించాలి. కేసీఆర్ అవినీతి, కుటుంబ, నియంత పాలనను అంతం చేసేదాకా ఉద్యమిస్తూనే ఉంటాం’అని బండి సంజయ్ స్పష్టం చేశారు. -
ఆ కుటుంబాలకు పరిహారం ఎప్పుడిస్తారు?
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సోకి మృత్యువాతపడిన వారి కుటుంబాలకు ఎప్పటిలోగా పరిహారం అందిస్తారో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కరోనా నియంత్రణకు తగినచర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం మరోసారి విచారించింది. రాష్ట్రవ్యాప్తం గా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, పరిస్థితి అదుపులోనే ఉందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యాలపై విచారణ ముగించాలని కోరారు. ‘‘కరోనాతో మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు పరిహారం పంపిణీ చేశారా.. ఇప్పటివరకు ఎంత మందికిచ్చారు.. ఇంకా ఎన్ని కుటుంబాలకు ఇవ్వాల్సి ఉంది.. తదితర వివరాలతో స్థాయీ నివేదికను ఆరువారాల్లోగా సమర్పించాలని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ రెండోవారానికి వాయిదా వేసింది. కాగా, కరోనా నియంత్రణలో రాష్ట్రప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసిందని ధర్మాసనం అభినందించింది. కరోనా నియంత్రణకు తగినచర్యలు తీసుకుంటూనే ఎప్పటికప్పుడు తమకు పరిస్థితిని వివరించిన ప్రజా ఆరోగ్యవిభాగం డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు పనితీరును ప్రశంసించింది. 1–22వ తేదీల మధ్య 23,526 కేసులు ‘‘జనవరిలో 3.40 శాతం పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 1 నుంచి 22 తేదీల మధ్య 12,41,660 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 23,526 పాజిటివ్ కేసులు(1.89 శాతం) వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 5.78 కోట్ల(105 శాతం) మందికి మొదటిడోసు ఇచ్చాం. 15–17 ఏళ్ల మధ్య యువకుల్లో మొదటి డోసు 15.40(84 శాతం) లక్షల మందికి, 8.18(44 శాతం) లక్షల మందికి రెండోడోసు ఇచ్చాం. రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లో 56,265 బెడ్లు అందుబాటులో ఉండగా, 971 మంది రోగులు మాత్రమే చికిత్స పొందుతున్నారు. 55,294 (98.30 శాతం) బెడ్లు ఖాళీగా ఉన్నాయి. 6 వేల బెడ్లు చిన్నారుల చికిత్స కోసం ఏర్పాటు చేయగా, ఇందులో 4,125 ఆక్సిజన్, 1,875 ఐసీయూ బెడ్లు ఉన్నాయి’’అని డాక్టర్ శ్రీనివాసరావు నివేదికలో పేర్కొన్నారు. ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాం ‘‘హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో భౌతిక తరగతులకు హాజరుకాలేని విద్యార్థుల కోసం ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాం. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం. నిరంతరం పర్యవేక్షిస్తూ పరిస్థితులకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం’’అని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. -
Telangana: అప్పు 41 వేల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సర్కారు అప్పు ఈ ఆర్థిక సంవత్సరం రూ. 40 వేల కోట్ల మార్కును దాటనుంది. గత డిసెంబర్ నాటికే రూ. 39 వేల కోట్ల రుణాలను తీసుకున్న ప్రభుత్వం.. మంగళవారం మరో రూ. 2 వేల కోట్లను సమీకరించేందుకు సిద్ధమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వారా రూ.2 వేల కోట్ల విలువైన బాండ్లను వేలం వేయనుంది. దేశంలోని 12 రాష్ట్రాలకు చెందిన మొత్తం రూ.20,659 కోట్ల విలువైన బాండ్ల వేలానికి ఆర్బీఐ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ మేరకు మంగళవారం జరిగే వేలంలో 12 సంవత్సరాల కాలపరిమితి గల రూ.2 వేల కోట్ల విలువైన రాష్ట్ర ప్రభుత్వ బాండ్లను వేలం వేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఆర్థిక పరపతి మెండుగానే ఉన్న మన రాష్ట్ర బాండ్ల వేలం సులభంగా జరిగిపోతుందని, రూ.2 వేల కోట్ల సమీకరణ పెద్ద కష్టమేం కాదని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. గత అక్టోబర్ నాటికి రూ. 28 వేల కోట్ల అప్పు కాగ్ లెక్కల ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ నాటికి రూ. 28,349 కోట్లను ప్రభుత్వం బహిరంగ రుణాల ద్వారా సేకరించింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ అప్పు రూ.39 వేల కోట్లకు చేరింది. ఇప్పుడు రూ.2 వేల కోట్ల బాండ్ల వేలంతో రూ.40 వేల కోట్ల మార్కు దాటనుంది. ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని పక్కాగా అమలు చేసే రాష్ట్రంగా గుర్తింపు పొందిన తెలంగాణకు రానున్న రెండు నెలల్లో మరో రూ.6 వేల కోట్ల వరకు రుణాన్ని సమీకరించే అవకాశముంది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారమే రూ.47,500 కోట్లను రుణాలుగా సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ మేరకు మిగిలిన మొత్తాన్నీ రుణాల రూపంలో సమీకరించుకుని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిస్తామని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. కరోనా ఎఫెక్ట్తో.. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.31 వేల కోట్లకు పైగా మాత్రమే రుణంగా తీసుకోవాలని వార్షిక బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ కరోనా మిగిల్చిన కష్టాల వల్ల భారీగా అప్పులు తీసుకోవాల్సి వచ్చింది. ఆ ఏడాది మొత్తం రూ.45 వేల కోట్లకు పైనే అప్పు చేయాల్సి వచ్చింది. ఒక్క 2021 జనవరి నెలలోనే రూ. 6 వేల కోట్లు రుణాలను సర్కారు సమీకరించడంతో ఆ ఏడాది అప్పటివరకు రూ.37 వేల కోట్లుగా ఉన్న అప్పు రూ.43 వేల కోట్లు దాటింది. తర్వాతి రెండు నెలల్లో మరో రూ.2,500 కోట్లకు పైగా అప్పులు తీసుకోవడంతో ఆ ఏడాది అప్పులు రూ. 45 వేల కోట్లు దాటాయి. -
ప్రభుత్వ ఉద్యోగులకు ఈసీ బాధ్యతలొద్దు
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నికల కమిషనర్లుగా నియమించొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా అదనపు బాధ్యతలు ఒక ప్రభుత్వ అధికారికి అప్పగించడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని వ్యాఖ్యానించింది. మార్గోవా, మాపుసా, మార్ముగోవా, సంగెం, క్వీపెం మున్సిపల్ ఎన్నికలకు గోవా ఎన్నికల కమిషనర్ ఇచ్చిన నోటిఫికేషన్ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ గోవా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్, జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ హృషీకేష్రాయ్లతో కూడిన ధర్మాసనం విచారించింది. చట్ట ప్రకారం మహిళలకు వార్డులు కేటాయించకపోవడంతో సదరు 5 మున్సిపాల్టీల్లో ఎన్నికలు నిర్వహించొద్దని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే, ఈ సందర్భం గా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల కమిషన్ స్వతంత్రతను రాజీ చేయలేమని, ఎన్నికల కమిషనర్లు స్వతంత్ర వ్యక్తులుగా ఉండాలని, ప్రభుత్వం లో పదవిలో ఉన్న వ్యక్తిని ఏ రాష్ట్రాలూ ఎన్నికల కమిషనర్గా నియమించజాలవని పేర్కొంది. ప్రభుత్వంలో పనిచేస్తున్న వ్యక్తి గోవాలో ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించడం బాధాకరమై న అంశమని ధర్మాసనం అభిప్రాయ పడింది. -
కోవిడ్ ముట్టఢీ రాష్ట్రాల కట్టఢీ
సాక్షి, హైదరాబాద్: దేశంలో కోవిడ్ రోజురోజుకూ విస్తరిస్తుంది. మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో 11 మంది చనిపోయారు. దీంతో కేంద్రం దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించింది. పాజిటివ్ రోగుల సంఖ్య పెరగడంతో కోవిడ్ వ్యాపించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. కోవిడ్ అధికంగా ఉన్న రాష్ట్రాలు సహా ఇతర రాష్ట్రాలూ కోవిడ్ కట్టడికి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. హోం క్వారంటైన్లో ఉన్న వారి కదలికలు కనిపెట్టేందుకు కర్ణాటక సర్కా రు ఫోన్ ద్వారా ట్రాక్ చేస్తోంది. ఒకటి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలను ఒడిశా ప్రభుత్వం రద్దు చేసింది. ఇక మృతుల బంధువులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి పరిహారం అందజేయాలని బిహార్ సర్కారు నిర్ణయించింది. ఇంకా ఏయే రాష్ట్రాలు ఏ చర్యలు తీసుకుంటున్నాయంటే.. ఢిల్లీ: బియ్యం, భోజనం ఉచితం - రైళ్లు, విమానాలు, పబ్లిక్, ప్రైవేట్ బస్సులు బంద్. డీటీసీలోని 50 శాతం బస్సులు అత్యవసర సేవలకు వినియోగం. - నిర్మాణ పనులు బంద్. నిత్యావసర వస్తువులు విక్రయించే కొన్ని మినహా మిగతా అన్ని మార్కెట్లు, దుకాణాలు, పరిశ్రమల బంద్. - సెక్షన్ 144 విధింపు. ఒకచోట పెద్దసంఖ్యలో గుమిగూడటం నిషేధం. అన్ని మత, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలపై నిషేధం. - జామియా, జేఎన్యూ విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోవాలని ఆదేశాలు. ఐఐటీ ఢిల్లీ తరగతుల రద్దు. - 72 లక్షల మంది పేదలకు ఏడున్నర కిలోల చొప్పున బియ్యం ఉచితం. 8.5 లక్షల మందికి రూ.4 వేల నుంచి రూ.5వేల పెన్షన్. - నైట్షెల్టర్లలో అందరికీ ఉచిత భోజనం. - లాక్డౌన్ సమయంలో వేతనాల్లో కోత విధించకూడదని ఆదేశాలు. - క్వారంటైన్ వ్యక్తులు నివసిస్తున్న ఇళ్ల మార్కింగ్. యూపీ: పేదలకు ‘రిలీఫ్’ - క్కువమంది గుమికూడకుండా చర్యలు. నిరంతరం పెట్రోలింగ్. - నోయిడా, గ్రేటర్ నోయిడాలో స్విమ్మింగ్ పూల్స్ మూసివేత, బహిరంగ కార్యక్రమాలు, మత, రాజకీయ సమావేశాలు ఏప్రిల్ 15 వరకు నిషేధం. - ప్రజలకు అవసరమైన సరుకులు, సాయం అందించడానికి పోలీసు వాహనాల వినియోగం. - కోవిడ్ పాజిటి వ్ వచ్చిన వారికి ప్రభుత్వమే ఉచిత వైద్యం అందించి, చికిత్సకయ్యే మొత్తాన్ని భరిస్తుంది. - ఆరోగ్య సేవలకు 108, 102 అంబులెన్సులు.. ఎమర్జెన్సీ వైద్య సేవలకు 250 అడ్వాన్స్ లైఫ్ స పోర్ట్ అంబులెన్సులు.. - ఉపాధి కూలీలు, అం త్యోదయ కార్డుదారులకు, పేదలకు రిలీఫ్ ప్యాకేజీలు.. దినసరి కూలీలకు నిర్ధారిత మొత్తం అందజేత. - ఉద్యోగులు వీలైనంత వరకు ఇళ్ల నుంచే పనిచేయాలని ఆదేశాలు. ప్రభుత్వోద్యోగులకు బయోమెట్రిక్ హాజరు నుంచి మినహాయింపు. - 1 నుంచి 8వ తరగతి వరకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు విద్యార్థులు. మహారాష్ట్ర: చికిత్స కేంద్రాల పెంపు - సినిమా హాళ్లు, జిమ్, పార్కులు మూసివేత. మాల్స్, సినిమా హాళ్లు మార్చి 31 వరకు బంద్. - బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, మందులు, నిత్యావసరాల దుకాణాలు ఓపెన్. - రాష్ట్ర, అన్ని జిల్లాల సరిహద్దుల మూసివేత. రైళ్లు, ప్రజా రవాణా, ప్రైవేటు సర్వీసుల రద్దు. అత్యవసర సేవలకు సిటీ బస్సుల వినియోగం. - ప్రభుత్వ కార్యాలయాల్లో 5 శాతం ఉద్యోగులే పనిచేయాలి. - వైరస్ టెస్టింగ్, చికిత్స సెంటర్ల సంఖ్య పెంపు. - ముంబై, పుణే, నాగ్పూర్ సహా మహారాష్ట్రలోని అన్ని నగరాల్లో 144 సెక్షన్ అమలు. - 1 నుంచి 9వ తరగతి వరకు పరీక్షల వాయిదా. 10, 12 పరీక్షలు యథాతథం. ఐఐటీ బాంబే విద్యార్థులు క్యాంపస్ ఖాళీ చేయాలని ఆదేశాలు. రాజస్తాన్: పూర్తిగా లాక్డౌన్ - జైపూర్, జోధ్పూర్ స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారా లు వాయిదా. అత్యవసర సేవ లు మినహా పూర్తిగా లాక్డౌన్. - పేదలకు మే నెల వరకు ఉచితంగా గోధుమల పంపిణీ. - వీధి వ్యాపారులు, రోజుకూలీల కుటుంబాలకు ఏప్రిల్ 1 నుంచి రెండు నెలల వరకు ఉచితంగా నిత్యావసరాలు. - అత్యవసర సేవలు మినహా ప్రైవేటు ఆఫీసులు, మాల్స్, షాపులు, ఫ్యాక్టరీలు, రవాణా, స్కూళ్లు మూసివేత. ఛత్తీస్గఢ్: ‘అత్యవసరాలు’ మాత్రమే - నగరాల్లో లాక్డౌన్. అన్ని కార్యాలయాలు, రవాణా సేవలు, మిగతా కార్యకలాపాలు రద్దు. - అత్యవసర, నిత్యావసర సేవలు అందుబాటులోనే ఉంటాయి. - కరెంట్, తాగునీరు, వంటగ్యాస్ సరఫరా, పారిశుధ్యం, నిత్యావసరాలు, కమర్షియల్ గూడ్స్ రవాణా సేవలు కొనసాగుతాయి. పశ్చిమబెంగాల్: విద్యాసంస్థల మూత - అత్యవసర, నిత్యావసర సేవలన్నీ కొనసాగింపు. - అన్ని రకాల విద్యాసంస్థలన్నీ ఏప్రిల్ 15 వరకు మూసివేత. బోర్డ్ పరీక్షలు యథాతథం. బిహార్: సీఎం ‘నిధి’ పరిహారం - ఇక్కడ ఆదివారం మొదటి కోవిడ్ మృతి కేసు నమోదైంది. అంతర్రాష్ట్ర రవాణా పూర్తిగా నిలిపివేత. బస్సులు ఎప్పటికప్పుడు శుభ్రం. - జిల్లా హెడ్క్వార్టర్స్, నగర పంచాయతీలన్నింటిలో లాక్డౌన్ అమలు. కోచింగ్ సెంటర్లు, సినిమా హాళ్లు, పబ్లిక్ పార్కులు మూసివేత. - మృతుల బంధువులకు సీఎం సహాయనిధి నుంచి పరిహారం. - పాట్నా హైకోర్ట్ అత్యవసర కేసుల కోసమే పనిచేస్తుంది. ఉత్తరాఖండ్: కూలీ ఖాతాల్లో రూ.1,000 - రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకున్న కూలీల ఖాతాల్లో రూ.1,000 జమ. అత్యవసర సేవలు మినహా మిగతా అన్నిటిపై నిషేధం. - ఆహార, ఆరోగ్య అవసరాలపై దృష్టి.. ఇంటింటికీ వెళ్లి సరుకులు, మందులు అందజేత. ఒడిశా: ఆదేశాలు పాటించకుంటే కేసులు - అన్ని విద్యాసంస్థలూ ఏప్రిల్ 15 వరకు బంద్. పూరీ బీచ్, కోణార్క్ సూర్య మందిరం, చిలక సరస్సు, చంద్రభాగా బీచ్ మూసివేత. - 1 నుంచి 9వ తరగతి వరకు పరీక్షల రద్దు. యూనివర్సిటీల సెమిస్టర్స్ వాయిదా. - ప్రభుత్వ ఆదేశాలు పాటించని వారిపై ఐపీసీ సెక్షన్ల కింద చర్యలు. మధ్యప్రదేశ్: పేదలకు రేషన్ - భోపాల్, జబల్పూర్లో పేద కుటుంబాలకు రేషన్ షాపుల ద్వారా ఈ నెల సరుకులు ఉచితంగా పంపిణీ. - ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో భక్తులకు ప్రవేశం నిషేధం. తమిళనాడు: సరిహద్దులు బంద్ - అన్ని స్కూళ్లు, కాలేజీలు, అమ్యూజ్మెంట్ పార్కులు, థియేటర్లు, స్విమ్మింగ్పూల్స్ మూసివేత. ప్రజా రవాణా రద్దు. - 10, 12 తరగతుల పరీక్షలు కొనసాగుతాయి. - కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ సరిహద్దుల మూత. - రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ. మతపర కార్యక్రమాలు, కాన్ఫరెన్స్లు, బహిరంగ సభలపై నిషేధం. కర్ణాటక: నిఘాలో ‘క్వారంటైన్’ - హోం క్వారంటైన్లో ఉన్న వారి కదలికలు ఫోన్ ద్వారా ట్రాకింగ్. - షాపింగ్ మాల్స్, బార్ల మూసివేత మరో పది రోజుల పొడిగింపు. - కోవిడ్ నియంత్రణ చర్యలకు రూ.200 కోట్ల సహాయ నిధులు విడుదల. కేరళ: పరీక్షలకు ఓకే - 1 నుంచి 7వ తరగతి వరకు సీబీఎస్ఈ, ఐసీ ఎస్ఈ బోర్డ్ స్కూళ్లు మూత. - పది, పన్నెండో తరగతి పరీక్షలు కొనసాగుతాయి. జమ్మూకశ్మీర్: విదేశీయులకు ‘నో’ - విదేశీయులకు ప్రవేశంపై నిషేధం. - రాంబాన్, కిష్త్ వాడ్ సహా కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు. -
గ్రామ స్వరాజ్యం.. సచివాలయాలతో సాకారం
తన భూమికి సంబంధించిన 1బీ ధ్రువపత్రాన్ని చూపుతున్న ఈ రైతు పేరు కురబ మంజునాథ్. ఇతడిది అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం తూర్పు కోడిపల్లి. గ్రామంలో సర్వే నం.90లో 3 ఎకరాల భూమి ఉంది. భూమి 1బీ ధ్రువపత్రం, అడంగల్ కోసం ఆదివారం గ్రామ సచివాలయానికి వచ్చాడు. రైతు అడిగిన ధ్రువపత్రాలను అక్కడి సిబ్బంది వెంటనే అందించారు. దీంతో మంజునాథ్ ఆనందానికి హద్దుల్లేవు. గతంలో కల్యాణదుర్గం వెళ్లి గంటల తరబడి వేచి చూసినా జరగని పనులు ఇప్పుడు తమ గ్రామంలోనే వెంటనే జరగుతుండటంతో సంతోషంగా ఉందని చెప్పాడు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని వెంకట్రాజుపురం ప్రజలు ఏ పనులు కావాలన్నా 32 కిలోమీటర్ల దూరంలోని గ్రామ పంచాయతీకి, లేదంటే 42 కిలోమీటర్ల దూరంలోని మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఉదయం 6 గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటలకు తిరిగి ఇళ్లకు చేరుకునేవారు. ఇప్పుడు వెంకట్రాజుపురంలో గ్రామ సచివాలయం ఏర్పాటైంది. సొంత గ్రామంలోనే అన్ని ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేషన్కార్డు కోసం ఆదివారం గ్రామ సచివాలయంలో దరఖాస్తులు అందజేశారు. సాక్షి, అమరావతి: జాతిపిత మహాత్మాగాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసే దిశగా విప్లవాత్మకమైన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గణతంత్ర దినోత్సవం రోజునే రాష్ట్ర ప్రజలకు వారి సొంత గ్రామాల్లోనే 536 రకాల ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొత్తం 15,002 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా, ఆదివారం నుంచి 14,487 సచివాలయాల్లో ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి లేకుండా ప్రభుత్వ సేవలు అందుతుండడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండల, జిల్లా కేంద్రాల్లో కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థ తప్పిందని చెబుతున్నారు. సమయం, డబ్బు ఆదా అవుతోందని పేర్కొంటున్నారు. ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ ఫలాలు రాష్ట్రంలో కోటిన్నర దాకా కుటుంబాలు ఉండగా, అందులో గ్రామీణ ప్రాంతాల్లోనే కోటి కుటుంబాలు నివసిస్తున్నాయి. 70 ఏళ్లుగా ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా.. వాటి ఫలాలు ప్రజలకు సక్రమంగా అందిన దాఖలాలు లేవు. పథకాలను ప్రజల ముంగిటకు చేర్చే అధికార యంత్రాంగం లేకపోవడమే ఇందుకు కారణం. ఫలితంగా సామాజిక సూచికలు.. పౌష్టికాహారం, ఆరోగ్యం, విద్య, వైద్యం, తాగునీరు, పారిశుధ్యం తదితర అంశాల్లో ఆశించిన ప్రగతి సాధ్యం కాలేదు. ఇలాంటి పరిస్థితిని మార్చాలంటే పరిపాలనను ప్రతి గడప వద్దకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిపాలన వికేంద్రీకరణకు పూనుకున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే గ్రామ, వార్డు స్థాయిలో పనిచేసేందుకు 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించారు. వాటి భర్తీ ప్రక్రియను సైతం స్వల్ప వ్యవధిలోనే విజయవంతంగా పూర్తి చేశారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వ పథకాల ఫలాలను ప్రతి లబ్ధిదారుడికి అందించాలన్న లక్ష్యంతో ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మరో 2.80 లక్షల మంది వలంటీర్లను నియమించారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామ సచివాలయంలో దరఖాస్తుదారుడికి సదరం సర్టిఫికెట్ అందజేస్తున్న సిబ్బంది ఫిర్యాదుల పరిష్కారానికి ‘స్పందన’ ఎక్కడి సమస్య అక్కడే పరిష్కారం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. 80 శాతానికి పైగా ప్రజా సమస్యలను గ్రామ పంచాయతీ స్థాయిలోనే పరిష్కరించాలని.. ప్రజలు మండల, జిల్లా కేంద్రాల్లో ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని ఆదేశించారు. ముఖ్యమంత్రి సంకల్పానికి అనుగుణంగానే గ్రామ–వార్డు సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థతో ప్రజలకు ప్రభుత్వ సేవలు ఇక వారి గ్రామాల్లోనే అందుబాటులోకి వచ్చాయి. అలాగే ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా గ్రామ–వార్డు సచివాలయాల్లో ప్రతిరోజూ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఈ ఫిర్యాదులను అధికారులు ఏ మేరకు పరిష్కరించారన్న దానిపై ప్రభుత్వం ప్రతివారం సమీక్ష నిర్వహించనుంది. మహిళా రక్షణకు పెద్దపీట రాష్ట్రంలో మహిళల రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. పాలన వికేంద్రీకరణ ప్రక్రియలో భాగంగా ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో ఒకరు చొప్పున మహిళా పోలీసులను నియమించింది. ప్రతి 2,000–5,000 మంది జనాభాకు ఒక మహిళా పోలీసు నిత్యం అందుబాటులో ఉంటారు. గ్రామ, వార్డు స్థాయిలో స్థానిక మహిళలు ఎదుర్కొనే సమస్యలకు స్థానికంగానే పరిష్కారం చూపుతారు. లంచాల బెడదకు అడ్డుకట్ట పడినట్టే.. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండితనంపై ప్రజలు విసుగెత్తిపోయారు. గ్రామ, వార్డు సచివాలయాలతో లంచాల బెడదకు దాదాపు అడ్డుకట్ట పడినట్టే. ఎవరైనా ఊళ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి వద్దకు వెళ్లి పని చేసి పెట్టాలని దరఖాస్తు అందజేస్తే కాదనలేని పరిస్థితి ఉంటుంది. ఇక మండల, జిల్లా కేంద్రాల చుట్టూ తిరిగే అవసరం ఉండదు. మండల, జిల్లా కేంద్రాల్లోని అధికారులు వాళ్లు చేయాల్సిన పనిని మరింత సమర్థవంతంగా చేసే వీలుంటుంది. – చంద్రమౌళి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రిటైర్డు కమిషనర్ గ్రామాల రూపురేఖలే మారిపోతాయి గ్రామ సచివాలయ వ్యవస్థతో గ్రామాల రూపురేఖలే మారిపోతాయి. గతంలో ప్రజలు అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అధికారులే ప్రజల చుట్టూ తిరుగుతున్నారు. ఇళ్ల వద్దకొచ్చి సమాచారం తీసుకుంటున్నారు. కావాల్సిన పనులు చేసి పెడుతున్నారు. అవినీతికి ఆస్కారమే లేదు. అధికార వికేంద్రీకరణ దిశగా ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ గొప్ప ముందడుగు. – చిత్తరవు నాగేశ్వరరావు, హైకోర్టు సీనియర్ న్యాయవాది, బార్ కౌన్సిల్ మెంబర్ గ్రామ స్వరాజ్యం వచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల వద్దకే నిజమైన పాలన తెచ్చారు. గ్రామ స్వరాజ్యం అందుబాటులోకి వచ్చింది. సచివాలయాలతో ప్రజల కష్టాలు తీరాయి. ఇక్కడ మా సమస్యలకు పరిష్కారం పొందే అవకాశం కల్పించడం సంతోషకరం. – శ్యామసుందర్రెడ్డి, యు.రాజుపాలెం, వైఎస్సార్ జిల్లా సమయం, డబ్బు ఆదా మా ఊళ్లో గ్రామ సచివాలయం పెట్టడం చాలా సంతోషంగా ఉంది. 1బీ అండగల్, 1బీ సవరణ, వెబ్ల్యాండ్తోపాటు ప్రతి పనికీ మండల కేంద్రమైన కణేకల్లుకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడా సమస్య లేదు. సమయం వృథా కాదు. బస్సు, ఆటో చార్జీలు, భోజనాల ఖర్చులు తప్పుతాయి. మా గ్రామంలోనే అన్ని పనులు జరిగిపోతున్నాయి. – అనంతమ్మ, బెణికల్లు అనంతపురం జిల్లా దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట ప్రభుత్వ పథకాలు పొందాలంటే దళారులను ఆశ్రయించాల్సి వచ్చేది. ప్రతి పనికీ డబ్బులు వసూలు చేసేవారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయాల వల్ల దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట పడుతుంది. వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ప్రతి పనినీ ఉచితంగా చేయించుకోవచ్చు. – దారంశంకర్, గుంటూరు కష్టాలు తప్పుతాయి ఇంతకుముందు ఏ పని కావాలన్నా పంచాయతీ, తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు మేం ఉండే ప్రాంతానికి దగ్గర్లోనే సచివాలయం ప్రారంభించడం సంతోషంగా ఉంది. రేషన్ కార్డు కావాలన్న, పింఛన్ కావాలన్న మీ సేవ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే కష్టాలు తప్పుతాయి. – జొన్నాడ వెంకటరమణ, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా నిజమైన ప్రజా పాలనకు నాంది గ్రామ సచివాలయాలు నిజమైన ప్రజా పాలనకు నాంది పలుకుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం వేలాది ఉద్యోగాలు భర్తీ చేశారు. ఆయన పాలనలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది. – ఎన్ నాగప్రసాద్, బందరు మండలం, కృష్ణా జిల్లా మంచి విధానమిది ఇంతకుముందు ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. దళారులు దోచేసేవారు. సచివాలయాల వల్ల అన్ని రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఖర్చు లేకుండా ఆన్లైన్ ద్వారా పనులు చేయించుకోవచ్చు. చాలా మంచి విధానమిది. – బర్మా వెంకట లలిత కుమారి, బందరు మండలం, కృష్ణా జిల్లా చారిత్రక నిర్ణయం దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటికి తీసుకురావడం చారిత్రక నిర్ణయమే. ఇక ఏ ఒక్క లబ్ధిదారుడూ కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు శ్రమకోర్చి వెళ్లాల్సిన పని లేదు. సేవలను ప్రజలకు దగ్గరకు చేర్చిన సచివాలయ వ్యవస్థ చరిత్ర సృష్టిస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి మంచి గుర్తింపు వస్తుంది. – డాక్టర్ వడిశెట్టి గాయత్రి, మహిళా సైంటిస్ట్, పిఠాపురం, తూ.గోదావరి కలలో కూడా ఊహించలేదు ఇలాంటి గొప్ప పాలన వస్తుందని కలలో కూడా ఊహించలేదు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చారు. గతంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా సామాన్యుల బాధలు పట్టించుకునేవారు కాదు. వ్యయప్రయాసలకోర్చి 10 కిలోమీటర్లు దూరంలోని మీ సేవ కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ బాధలు తగ్గాయి. – ఈశ్వర్రెడ్డి, రైతు, గోపిదిన్నె, చిత్తూరు జిల్లా -
80% ఉద్యోగాలు స్థానికులకే..
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో భర్తీ చేయనున్న 1,26,728 ఉద్యోగాల్లో 80 శాతం పోస్టులను స్థానికులకే కేటాయిస్తారు. మిగిలిన 20 శాతం పోస్టులను ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు. జిల్లాను యూనిట్గా తీసుకుని అభ్యర్థుల స్థానికతను గుర్తిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏడేళ్ల కాలంలో నాలుగేళ్లపాటు ఏ జిల్లాలో చదువుకుంటారో సదరు అభ్యర్థిని స్థానిక కేటగిరీగా గుర్తిస్తారు. ఆ జిల్లాకు కేటాయించిన మొత్తం పోస్టుల్లో 80 శాతం వారితోనే భర్తీ చేస్తారు. ఒక జిల్లాలో ఎక్కువ కాలం చదివి.. వేరే జిల్లాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే ఓపెన్ కేటగిరీలో 20 శాతం మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లో ఈ విషయాలను స్పష్టంగా పేర్కొంది. వయో పరిమితి.. జీతం ఇలా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితి 18నుంచి 42 ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గరిష్ట వయో పరిమితిలో ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్ల సడలింపు అమలు చేస్తారు. సంబంధిత ఉద్యోగంలో ఇప్పటికే ఔట్ సోర్సింగ్లో పని చేస్తున్న వారికి వయో పరిమితిలో వారి సర్వీసు కాలానికి సడలింపు ఇస్తారు. గరిష్ట వయో పరిమితిలో అత్యధికంగా ఐదేళ్ల సడలింపు ఇస్తారు. జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో జరిగే రాత పరీక్ష అనంతరం ఎంపికయ్యే అభ్యర్థికి మొదటి రెండేళ్లు రూ.15 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించి, ఆ తర్వాత పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగి హోదా కల్పిస్తూ బేసిక్ శాలరీ అమలు చేస్తారు. పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులకు రూ.15,030 నుంచి రూ.46,060 మధ్య బేసిక్ శాలరీ నిర్ణయించగా.. మిగిలిన పోస్టులకు రూ.14,600 నుంచి రూ.44,870 మధ్య బేసిక్ శాలరీగా అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. దరఖాస్తు విధానం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం మూడు వెబ్ పోర్టల్స్ను ఏర్పాటు చేసింది. ఏ వెబ్ పోర్టల్ను ఓపెన్ చేసినా.. ఒకే తీరున మొత్తం ఐదు విభాగాలతో కూడిన స్క్రీన్ కనిపిస్తుంది. మొదట నోటిఫికేషన్ అన్న విభాగం ఉంటుంది. దానికి కింద క్లిక్ చేస్తే.. భర్తీ చేసే ఉద్యోగాల వారీగా వివరాలు ఉంటాయి. ఏ ఉద్యోగానికి సంబంధించిన పేరు మీద క్లిక్ చేస్తే.. ఆ ఉద్యోగానికి సంబంధించి జిల్లా వారీగా ఖాళీలు, విద్యార్హత, పరీక్ష విధానం వంటి సమగ్ర వివరాలు ఉంటాయి. వాటి ఆధారంగా అభ్యర్థి తనకు ఆసక్తి ఉన్న ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. స్టెప్–1లో పేర్కొన్న రెండో కాలంలో ఉన్న బటన్ క్లిక్ చేసి అభ్యర్థి పేరు, ఆధార్ వివరాలు లేదా ఇతర గుర్తింపు కార్డు వివరాలతోపాటు మొబైల్ నంబర్, ఫొటోను అప్లోడ్ చేస్తే సంబంధిత అభ్యర్థి ఫోన్ నంబర్కు అతని దరఖాస్తుకు సంబంధించి కేటాయించిన ఐడీ వివరాలు మెసేజ్ అందుతుంది. ఆ ఐడీ వివరాల ప్రకారమే అతడు ఆన్లైన్లో తన దరఖాస్తును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టెప్ –2 విభాగంలోని బటన్ను క్లిక్ చేస్తే.. అభ్యర్థి మొబైల్కు మెసేజ్ ద్వారా అందిన ఐడీ నంబర్ వివరాలు నమోదుకు బాక్స్లు ఉంటాయి. ఐడీ నంబర్ నమోదుతో పాటు తాను ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారనే వివరాలను అక్కడ నమోదు చేస్తే పూర్తి దరఖాస్తు ఫారం నమూనా ఓపెన్ అవుతుంది. తప్పులు లేకుండా దానిని నింపాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారం పూర్తి చేసినట్టు క్లిక్ బటన్ నొక్కే ముందువరకు తప్పులను సరిచేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తులో పేర్కొన్న వివరాలను మార్చడానికి వీలుండదు. నాల్గవ కాలమ్గా అభ్యర్థి దరఖాస్తుకు సంబంధించి చెల్లించాల్సిన ఫీజుల వివరాలు ఉంటాయి. అక్కడ బటన్ క్లిక్ చేసి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చివరన గ్రామ సచివాలయాల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోల వివరాలు ఉన్నాయి. అభ్యర్థికి ఏమైనా సమాచారం కావాలంటే అక్కడ తెలుసుకోవచ్చు. పోస్టుల వారీగా పరీక్ష విధానం.. వివరాలు -
యజ్ఞంలా ‘నివాస స్థలాల’ భూసేకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మందికి నివాస స్థల పట్టాల పంపిణీకి ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తోంది. ఇల్లు గానీ, ఇంటి స్థలం గానీ లేని వారందరికీ వచ్చే తెలుగు సంవత్సరాది(ఉగాది) పర్వదినం సందర్భంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఒకేరోజు 25 లక్షల మందికి నివాస స్థల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఇందుకు అవసరమైన భూమిని సమకూర్చడానికి అధికార యంత్రాంగం కార్యాచరణ ప్రారంభించింది. 25 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీకి 62,500 ఎకరాల భూమి అవసరమని లెక్క తేల్చింది. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రస్తుతం ఇళ్ల స్థలాల పంపిణీకి పనికొచ్చే భూమి ఎంత ఉంది? ఇంకా ఎక్కడెక్కడ ఎంత భూమి సేకరించాలనే దానిపై అధికారులు ప్రాథమిక కసరత్తు చేపట్టారు. అక్టోబరు 2వ తేదీన గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు ఏర్పాటైన తర్వాత ఏయే గ్రామాలు, పట్టణాల్లో ఇళ్లు లేని వారు ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఎంతమందికి నివాస స్థల పట్టాలు ఇవ్వాలో పక్కాగా తేలుతుంది. దీని ప్రకారం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని మినహాయించి, అవసరమైన ప్రైవేట్ భూమిని సేకరించి, పట్టాల పంపిణీకి వీలుగా ప్లాట్లు వేయాల్సి ఉంటుంది. 62,500 ఎకరాలు అవసరం ఒక ఎకరా భూమి 40 మందికి మాత్రమే పట్టాల పంపిణీకి సరిపోతుంది. ఎకరాకు వంద సెంట్లు కాగా, నిబంధనల ప్రకారం ఇందులో 40 సెంట్లు రహదారులు, మురుగు కాలువలు, పార్కులు తదితరాలకు వదిలిపెట్టాల్సి ఉంటుంది. మిగిలిన 60 సెంట్లను ఒక్కొక్కరికి 1.5 సెంట్ల చొప్పున 40 మందికి పంచవచ్చు. ఈ లెక్కన 25 లక్షల మందికి నివాస స్థలాలు ఇవ్వడానికి 62,500 ఎకరాలకుపైగా భూమి అవసరం. ఆక్రమణల్లో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. పరిశ్రమలు స్థాపిస్తామంటూ భూములు తీసుకుని, ఆ తర్వాత ముఖం చాటేసిన సంస్థలకు నోటీసులు జారీచేసి, సదరు భూములను వెనక్కి తీసుకునేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. మొత్తమ్మీద ఇప్పటిదాకా ఉన్న లెక్కల ప్రకారం 8,500 ఎకరాల భూమి ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ప్రభుత్వం వద్ద ఉంది. మిగిలిన 54,000 ఎకరాలను వివిధ మార్గాల్లో సమకూర్చాల్సి ఉంటుంది. ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. భారీస్థాయిలో భూసేకరణ చేయాల్సి ఉన్నందున ప్రభుత్వం ఇందుకోసం ఐఏఎస్ అధికారిని రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనరేట్లో స్పెషల్ కమిషనర్గా నియమించింది. ఆయన ఏయే జిల్లాల్లో ఎంతెంత భూమి కావాలో నివేదిక రూపొందించి, ఆ మేరకు భూసేకరణ కోసం కలెక్టర్లతో నిత్యం సమన్వయం చేసుకుంటారు. పట్టణాల్లో అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీకి భూసేకరణను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సమీక్షించాలి. ఇళ్లు లేని వారి కోసం వచ్చే ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని గృహ నిర్మాణ శాఖకు ముఖ్యమంత్రి భారీ లక్ష్యం నిర్దేశించారు. భూసేకరణ ప్రక్రియ రెవెన్యూ, గృహ నిర్మాణం, సాంఘిక సంక్షేమం, ఆర్థిక తదితర శాఖలతో ముడిపడి ఉంది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ భూ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో రూ.5,000 కోట్లు కేటాయించింది. వివిధ శాఖల సమన్వయంతో భూసేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించడానికి ఓ కమిటీని నియమించింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్సింగ్ అధ్యక్షతన గల ఈ కమిటీలో గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి, రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలో భూసేకరణ కోసం ప్రత్యేకంగా నియమితులైన స్పెషల్ కమిషనర్ సభ్యులుగా ఉన్నారు. లక్ష్యం మేరకు భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యేలా చూడడమే ఈ కమిటీ బాధ్యత. ‘‘25 లక్షల మందికి ఇళ్ల పట్టాల జారీకి కసరత్తు చేస్తున్నాం. పేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న ముఖ్యమంత్రి లక్ష్యం ఎంతో ఉన్నతమైనది. దీనిని నెరవేర్చే దిశగా అధికార యంత్రాంగం అన్ని చర్యలూ తీసుకుంటోంది’’ అని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్సింగ్ చెప్పారు. -
రాళ్ల గుట్టల్ని కూడా వదలరా?
సాక్షి, హైదరాబాద్: ‘చిమ్మ చీకట్లో తడుముకోవద్దు. కానీ మనం చీకట్లో తడుముకుంటున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. హైదరాబాద్ మహానగర స్వరూపాన్ని 1956 నుంచి అంచనా వేసిన నిపుణులు ఉన్నారు. అలాంటి వాళ్ల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోండి. ప్రకృతిపరంగా ఏర్పడిన శిలాసంపదను కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పండి’అని రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలోని బాబా ఫకృద్దీన్ ఔలియా దర్గా (ఫకృద్దీన్ గుట్ట)లో ప్రకృతిసిద్ధమైన శిలా సంపద, ఏక శిలా రూపాలను ధ్వంసం చేస్తున్నారనే ప్రజాహిత వ్యాజ్యంలో ప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించింది. ఫకృద్దీన్ గుట్టను పేల్చి రాళ్లు కొడుతున్నారని, ఆ గుట్టను వారసత్వ సంపదగా గుర్తించేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ ‘సొసైటీ టు సేవ్ రాక్’సంస్థ కార్యదర్శి ఫరూక్ ఖాదర్ దాఖలు చేసిన పిల్ను బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ‘ఇప్పటికే చెరువుల్ని మాయం చేశామని, ఇక రాళ్లను కూడా వదిలిపెట్టమా’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కొండల్ని పేల్చి ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటూపోతే ప్రకృతి వికృతరూపం దాల్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. ఏకశిల, శిలా సంపదలను కాపాడేందుకు తీసుకునే చర్యల్ని వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫకృద్దీన్ గుట్టపై పేలుళ్లను ఆపేశామని, కౌంటర్ దాఖలుకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం కోరడంతో విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది. -
అసెంబ్లీ భవనాలు సరిపోవా?
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న శాసనసభ భవనాలు సరిపోతున్నాయో లేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ శాసనసభ్యుల సంఖ్య 119 మాత్రమే కాబట్టి (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 మంది ఉండేవారు) ఇప్పుడున్న భవనం ఎందుకు సరిపోవడం లేదో వివరించాలని సూచించింది. ఇప్పటి అసెంబ్లీ భవనం సరిపోతున్నప్పుడు కొత్త భవన నిర్మాణం అవసరం ఎందుకో కూడా తెలియజేయాలని పేర్కొంది. ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చి రాష్ట్ర చట్టసభల భవన సముదాయాన్ని నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై బుధవారం కూడా హైకోర్టులో వాదనలు కొనసాగాయి. కొత్తగా అసెంబ్లీ భవనాలు నిర్మించాలనే నిర్ణయానికి అనుగుణంగా ప్లాన్ రూపకల్పన చేశారో లేదో, డిజైన్ రూపొందించిందీ లేనిదీ కూడా గురువారం జరిగే విచారణ సమయంలో తెలియజేయాలని స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చేందుకు హెచ్ఎండీఏ అనుమతి తీసుకున్నారో లేదో కూడా చెప్పాలని కోరింది. హుడా చట్టం ప్రకారం ఎర్రమంజిల్ భవనాన్ని వారసత్వ భవనాల జాబితా నుంచి తొలగించినా హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్లో ఆ నిబంధన కొనసాగుతున్నందున కూల్చివేత విషయమై అనుమతి పొందిందీ లేనిదీ వివరించాలని ఆదేశించింది. అమల్లో ఉండేది కొత్త చట్టమే: ఏఏజీ పాత చట్టం ప్రకారం ఎర్రమంజిల్ భవనాన్ని వారసత్వ భవనాల జాబితా నుంచి తొలగించినందున ఇప్పుడు కొత్త చట్టమే అమల్లో ఉంటుందని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) జె.రామచంద్రరావు వివరించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వస్తుందనేది ఆశాజనక విషయమని, ఆ ఆలయం జాబితాలో చేరిన తర్వాతే రక్షణ లభిస్తుందని పేర్కొంది. ఇక్కడ కూడా హుడా చట్టం కింద వారసత్వ భవనం కాదని చెబుతున్న ప్రభుత్వం.. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం దాని రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే అవుతుందని వ్యాఖ్యానించింది. అయితే, ఒక చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో మరో చట్టాన్ని రూపొందించినప్పుడు కొత్త చట్టమే అమల్లో ఉంటుందని, ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని అదనపు ఏజీ రామచంద్రరావు బదులిచ్చారు. 1960, 2017 చట్టాలు, 13వ నిబంధనలోని విషయాలన్నీ ఒకే అంశానికి చెందినవని, దీనిపై మీమాంస లేదని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రస్తుత అసెంబ్లీ భవనం సరిపోతోందో లేదో, హెచ్ఎండీఏ చట్టం ప్రకారం కొత్త అసెంబ్లీ భవన నిర్మాణానికి అనుమతి తీసుకున్నారో లేదో గురువారం చెప్పాలని ఆదేశించింది. -
పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే..
సాక్షి, అమరావతి: ఇక నుంచి రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో 75 శాతం ఉద్యోగాలను ప్రభుత్వం స్థానికులకే ఇవ్వనుంది. అంతేకాకుండా ఇప్పటికే ఉన్న పరిశ్రమలు, ఫ్యాక్టరీలు కూడా వచ్చే మూడేళ్లలో 75 శాతం ఉద్యోగాలను కూడా స్థానికులకే ఇచ్చేలా చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ మేరకు సోమవారం శాసనసభలో కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పరిశ్రమలను, ఫ్యాక్టరీలను నెలకొల్పడం ద్వారా రాష్ట్ర యువతకు ఉపాధిని కల్పించాలని నిర్ణయించింది. మరింత సులువుగా వ్యాపారం చేసుకోవడానికి వీలుగా సరళతర విధానాలను రూపొందించనుందని బిల్లులో స్పష్టం చేసింది. విద్యుత్, గనులు, మౌలిక రంగాలు, పోర్టులు ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీవోనోపాధిని కోల్పోయేవారికి అండగా..: పరిశ్రమల స్థాపనకు ప్రైవేట్ వ్యవసాయ భూముల డిమాండ్ పెరిగిపోతోందని, పరిశ్రమలకు భూములిచ్చినవారు తమ భూమితోపాటు జీవనోపాధిని, ఆదాయాన్ని కోల్పోతున్నారని బిల్లులో ప్రభుత్వం స్పష్టం చేసింది. వీరికి ఆ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలనే డిమాండ్ ఉందని పేర్కొంది. అయితే.. పారిశ్రామికవేత్తలు చిన్న చిన్న ఉద్యోగాలకే స్థానికులను పరిమితం చేస్తున్నారని తెలిపింది. దీనివల్ల తక్కువ ఆదాయంతో స్థానిక యువతలో అసంతృప్తి పెరిగిపోతోందని వివరించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో కనీసం 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని చట్టం చేసేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు తెలిపింది. స్థానికత అంటే.. ఏపీతోపాటు జిల్లా, జోన్గా పేర్కొంది. స్థానికంగా తగిన అర్హతలు ఉన్నవారు లేకపోతే పరిశ్రమలు, ఫ్యాక్టరీలు.. ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని, తగిన శిక్షణ ఇచ్చి మూడేళ్లలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటికే ఉన్న పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, పీపీపీ విధానంలోని జాయింట్ వెంచర్ ప్రాజెక్టుల్లో మూడేళ్లలోగా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనల నుంచి మినహాయింపు కోరాలంటే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం మూడు వారాల్లోగా తగిన విచారణ చేసి నిర్ణయం తీసుకుంటుంది. 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు ఇస్తున్నారా? లేదా? అనే అంశాన్ని నోడల్ ఏజెన్సీ ఎప్పటికప్పుడు రికార్డులను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తుంది. 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇస్తున్నవారిపై ఎటువంటి న్యాయస్థానాలకు వెళ్లరాదనే నిబంధన విధించారు. -
అతివలకు అండగా..
సాక్షి, అమరావతి: మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో గడచిన ఐదేళ్లలో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి 82,502 కేసులు నమోదు కాగా.. వాటిలో అత్యాచారాలు, వేధింపులు, దాడులు, అవమానాల వంటి కేసులు 44,780 ఉండటం గమనార్హం. గతేడాది జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది. 2014 నుంచి 2018 డిసెంబర్ వరకు మహిళలపై నేరాలను గమనిస్తే ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మహిళలకు సంపూర్ణ రక్షణ కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే ఉన్న మహిళా పోలీస్ టీమ్లను సమర్థవంతంగా వినియోగించుకోవడంతోపాటు కొత్తగా మరిన్ని చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు విజయవాడ, విశాఖపట్నంతోపాటు పలు ప్రాంతాల్లో 18 యూనిట్లలో ఏర్పాటైన శక్తి టీమ్స్ (మహిళా పోలీస్ కానిస్టేబుళ్ల బృందాలు)ను రాష్ట్రమంతటా విస్తరించనున్నారు. ప్రధానంగా పట్టణాల్లోని విద్యాలయాలు, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద కాపుకాసే మహిళా పోలీస్ టీమ్లు పోకిరిల పనిపట్టనున్నాయి. మహిళలపై దాడులు, ఈవ్టీజింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా ఇవి పనిచేస్తాయి. పోలీస్ వలంటీర్లు, మహిళా మిత్రల నియామకం వివిధ సమస్యల బారిన పడుతున్న మహిళలకు అండగా ఉండేలా ప్రత్యేకంగా మహిళా పోలీస్ వలంటీర్లు, మహిళా మిత్రలను ప్రభుత్వం నియమిస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 18,512 మంది మహిళా పోలీస్ వలంటీర్ల నియామకం, నిర్వహణ కోసం ఈ ఏడాది బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ప్రస్తుతం విజయవాడలో నేర విచారణ, బాధితుల సంరక్షణ కోసం అంతర్జాతీయ ఫౌండేషన్ సహకారంతో మహిళా పోలీస్ వలంటీర్ల వ్యవస్థ నడుస్తోంది. వారితోపాటు రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలకు చెందిన మహిళా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, ఉద్యోగులు, విద్యార్థినులతో ‘మహిళా మిత్ర’ బృందాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మహిళా చైతన్యానికి, వారికి అండగా నిలిచేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. బాలికలు, మహిళల అక్రమ రవాణాకిక చెక్ రాష్ట్రం నలుమూలల నుంచి మహిళల సమస్యలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు యుద్ధప్రాతిపదికన స్పందించి వారికి రక్షణ కల్పించేలా ప్రత్యేక హెల్ప్లైన్ను వినియోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వíßహిస్తున్న హెల్ప్లైన్ 181, ఏపీ పోలీస్ హెల్ప్లైన్ 100, 1090, పోలీస్, అగ్నిమాపక, ఆరోగ్య, ఇతర అత్యవసర సహాయం కోసం హెల్ప్లైన్ 112 నిర్వహిస్తున్నారు. మరోవైపు రాష్ట్రాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్య మానవ అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మహిళలు, బాలికల అక్రమ రవాణాను నివారించేలా ఏలూరు, గుంటూరు, అనంతపురంలలో ఉన్న మూడు ప్రత్యేక యూనిట్లకు జవసత్వాలు కల్పించే ప్రయత్నాలు మొదలయ్యాయి. మరోవైపు సామాజిక మాధ్యమాలు, ఇతర ప్రచార సాధనాల్లో మహిళలు, బాలికలకు సంబంధించిన అసభ్య పోస్టింగ్లు, ట్రోలింగ్లు, కించపరిచే వ్యాఖ్యానాల మూలాలను గుర్తించి అడ్డుకోవడంపైనా ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందుకోసం మహిళలు, చిన్నారులపై సైబర్ క్రైమ్ నిరోధానికి నాలుగు సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ల ఏర్పాటుకు రూ.38.85 లక్షలను బడ్జెట్లో కేటాయించడం విశేషం. -
వార్డు సచివాలయాలు 3,775
సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లో కొత్తగా ఏర్పాటుకానున్న వార్డు సచివాలయాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటి ఏర్పాటు, ఉద్యోగాల భర్తీ, విద్యార్హతలు, బడ్జెట్ కేటాయింపు, విధివిధానాలపై తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వార్డు సచివాలయాల ఏర్పాటుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. పాలనా యంత్రాంగాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో ఈ నూతన వ్యవస్థకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇకపై పట్టణ ప్రజలు తాము నివాసం ఉండే ప్రాంతాలకు కూతవేటు దూరంలోనే ఏర్పాటు కానున్న వార్డు సచివాలయాల్లో ఉద్యోగులను సంప్రదించి, సమస్యలు పరిష్కరించుకునే అవకాశం లభించనుంది. మున్సిపల్ అధికారులు ఇచ్చిన ప్రతిపాదనల మేరకు పట్టణాలు, నగరాల్లో 3,775 వార్డు సచివాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం వార్డుల్లో పని చేస్తున్న ఉద్యోగులతో పాటు 34,350 మందిని కొత్తగా నియమిస్తామని మున్సిపల్ శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు చెప్పారు. పోస్టుల భర్తీకి ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలిపారు. 18 సేవలు 10 విభాగాలుగా విభజన పట్టణాల్లో ప్రతి 4,000 మంది జనాభాకు ఒక వార్డు సచివాలయం ఏర్పాటు కానుంది. ప్రతి 5,000 మందికి ఒక వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని తొలుత అధికారులు భావించారు. అయితే, ప్రజలకు మరింతగా అందుబాటులో ఉండడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సత్వరం అందించాలన్న యోచనతో ప్రతి 4,000 మంది జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పట్టణ ప్రాంత ప్రజలకు ప్రస్తుతం మున్సిపాల్టీలు 18 రకాల సేవలు అందిస్తున్నాయి. అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ, అర్బన్ ప్లానింగ్, రక్షిత మంచినీటి సరఫరా, అగ్నిమాపక సేవలు, పారిశుధ్యం, మురికివాడల అభివృద్ధి, బలహీన వర్గాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, రహదారులు, పార్కుల నిర్మాణాలు, జనన మరణాల నమోదు, వీధిలైట్లు, పార్కింగ్, బస్స్టాఫ్ల ఏర్పాటు వంటి సేవలు అందిస్తున్నాయి. ఇకపై ఈ 18 సేవలను 10 విభాగాలుగా ఏర్పాటు చేసి, ఒక్కో విభాగానికి ఒక్కో కార్యదర్శిని నియమించనున్నారు. వీరు తమ పరిధిలోని వాలంటీర్లతో ఆ విభాగానికి చెందిన సమస్యలను పరిష్కరించడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొస్తారు. వార్డు సచివాలయంలో ఆరోగ్యానికి సంబంధించిన సేవలను వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూకు సంబంధించిన సేవలను రెవెన్యూ శాఖ, మహిళల సంక్షేమం, భద్రతకు సంబంధించిన సేవలను పోలీస్ శాఖ పర్యవేక్షించనున్నాయి. మిగిలిన సేవలన్నింటినీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ పర్యవేక్షిస్తాయి. అభ్యర్థుల ఎంపికకు రాత పరీక్ష వార్డు కార్యదర్శుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వార్డు సచివాలయాల్లో నిర్వహించాల్సిన విధులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. పట్టభద్రులు, ఇంజినీర్లు, పాలిటెక్నిక్లో డిప్లొమా పూర్తి చేసిన వారు, డిగ్రీలో సోషల్వర్క్, నర్సింగ్లో ఫార్మాడి చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ప్రభుత్వం నిర్వహించనున్న రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రూ.629.99 కోట్లు కేటాయింపు వార్డు సచివాలయాల నిర్వహణకు, కొత్తగా నియమితులు కానున్న వార్డు కార్యదర్శులకు శిక్షణ ఇచ్చేందుకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆరు నెలలకు వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం రూ.629.99 కోట్లు కేటాయించింది. ఒక్కో వార్డు కార్యదర్శికి శిక్షణా కాలంలో రూ.15 వేల వేతనం ఇవ్వనున్నారు. వార్డు సచివాలయాల కోసం ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఒక గదిని అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. వార్డు సచివాలయాల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై మున్సిపల్ శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. వార్డు కార్యదర్శుల విధులు - వార్డుల్లో నియమితులైన వాలంటీర్ల విధులను పర్యవేక్షించాలి. - ప్రజల నుంచి వచ్చే వినతులు స్వీకరించాలి. ఆయా విభాగాల సిబ్బందితో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. - లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో తరుచూ పరిశీలించాలి. కొందరు లబ్ధిదారులను సంప్రదించి వారి అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదించాలి. - ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. - ప్రభుత్వ సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ అయ్యే విధంగా చూడాలి. - విద్య, ఆరోగ్యం, పారిశుధ్య పరిస్ధితులపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి. వార్డు వాలంటీర్లు వీటిని సక్రమంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలి. వార్డు కార్యదర్శుల నియామక షెడ్యూల్ - నోటిఫికేషన్: జూలై 22 - దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ: ఆగస్టు 5 - పరీక్షల నిర్వహణ: ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 15 - సర్టిఫికెట్ల పరిశీలన: సెప్టెంబరు 16 నుంచి 18 - ఎంపికైన అభ్యర్థుల జాబితా: సెప్టెంబరు 20 - వార్డు కార్యదర్శులుగా ఎంపికైన వారికి శిక్షణ: సెప్టెంబరు 23 నుంచి 28 - నగరాలు, పట్టణాల్లో వార్డు కార్యదర్శుల కేటాయింపు: సెప్టెంబరు 30 - వార్డు కార్యదర్శుల బాధ్యతలు, ప్రాక్టికల్ తదితరాలపై శిక్షణ: అక్టోబరు 7 నుంచి నవంబరు 16 -
పీఎం–కిసాన్కు 34.51 లక్షల మంది రైతులు
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం–కిసాన్) పథకం లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. ఎన్నికలకు ముందున్న మార్గదర్శకాల్లో మార్పు చేయడంతో అనేకమంది అర్హులయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 34.51 లక్షల మంది రైతులను ఈ పథకంలో లబ్ధిదారులుగా వ్యవసాయ శాఖ వర్గాలు గుర్తించాయి. ఆయా లబ్ధిదారుల వివరాలను పీఎం–కిసాన్ పోర్టల్లో మంగళవారం నమోదు చేసినట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. తొలి విడతలో వీరికి పంపిణీ చేయాల్సిన సొమ్మును ఈ నెలాఖరులో బ్యాంకు ఖాతాల్లో కేంద్రం జమ చేయనుంది. లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం–కిసాన్’పథకాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6 వేల ఆర్థిక సాయం అందిస్తామని, దానిని 3 విడతలుగా (విడతకు రూ.2 వేలు) పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి రాష్ట్రంలో 54.50 లక్షల మంది రైతులున్నారు. పీఎం–కిసాన్ పథకంలో గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 27.42 లక్షల మంది రైతులనే అర్హులుగా గుర్తించి పోర్టల్లో అప్లోడ్ చేశారు. వారిలో మొదటి విడతలో 18.47 లక్షల మంది రైతులకు రూ.369.40 కోట్ల నగదు బదిలీ చేశారు. తొలి విడత పంపిణీ ఈ ఏడాది మార్చిలో జరిగింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్న కారణంతో మే 23 తేదీ వరకు మిగిలిన రైతులకు నగదు బదిలీ చేయలేదు. ఆ తర్వాత రెండో విడతలో 18.58 లక్షల మంది రైతులకు రూ.370.16 కోట్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో 27.42 లక్షల మంది రైతులను పీఎం–కిసాన్ లబ్ధిదారులుగా గుర్తించినప్పటికీ 18 లక్షల మందికిపైగా రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేయగలిగారు. మిగిలిన లబ్ధిదారులను వివిధ రకాల సాంకేతిక కారణాలు చూపించి విస్మరించారు. పెరిగిన లబ్ధిదారులు.. ఈసారి పీఎం–కిసాన్ పథకంలో కొన్ని నియయ నిబంధనలను సడలించారు. కేవలం ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు కాకుండా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు కూడా రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం చేసేలా కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది . దీంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో ఈ లబ్ధిదారుల సంఖ్య 27.42 లక్షలు ఉండగా.. ఇప్పుడు 34.51 లక్షలకు పెరిగింది. కొత్తగా 7.09 లక్షల మందిని ఈ పథకంలో లబ్ధిదారులుగా చేర్చారు. ఈ నెలాఖరులోగా మొదటి విడత డబ్బులు రైతుల ఖాతాలకు బదిలీ చేస్తారు. రెండో విడత సొమ్మును అక్టోబర్లో, మూడో విడత సొమ్మును తర్వాత మేలో పంపిణీ చేసే అవకాశాలున్నాయి. రాష్ట్రం నుంచి లబ్ధిదారులుగా ఎంపికైన రైతులకు నగదు బదిలీ చేయటానికి ఒక్క విడతకు రూ.690.20 కోట్లు కేంద్రం విడుదల చేయాల్సి ఉంటుంది. మూడు విడతల్లో కలిపి రూ.2,070.60 కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రంలోని రైతాంగానికి అందుతాయి. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. -
తొలి ‘స్పందన’కు అర్జీల వెల్లువ
సాక్షి నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్పందన’ కార్యక్రమానికి అన్ని జిల్లాల్లో అనూహ్య స్పందన లభించింది. సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా వినతులు వెల్లువెత్తాయి. ప్రతిచోటా వచ్చిన ప్రతి అర్జీదారుడినీ పలకరించి.. వారికొచ్చిన సమస్యేమిటో అధికారులు తెలుసుకున్నారు. సమస్యను ఎప్పటిలోగా పరిష్కరించగలమో ఆ తేదీని కూడా పేర్కొంటూ రసీదులు ఇవ్వడంతో అర్జీదారులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఈ తరహాలో అధికారులు స్పందించే వారు కాదని, తీసుకున్న అర్జీలు ఏం చేసేవారో కూడా తెలిసేది కాదనీ వినతులిచ్చేందుకు వచ్చిన వారు చెప్పారు. తొలిసారి ప్రతి అర్జీకి పరిష్కార గడువు తేదీని కూడా నిర్దేశిస్తూ రసీదు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. విశాఖపట్నం కలెక్టరేట్లో ముందెన్నడూ లేనివిధంగా 513 అర్జీలు అందగా.. డివిజన్, గ్రామీణ స్థాయిల్లో 1,050కి పైగా దరఖాస్తులు వచ్చాయి. డివిజన్, మండల స్థాయిల్లో ఆర్డీఓలు, తహసీల్దార్లు వినతులు స్వీకరించారు. శ్రీకాకుళం కలెక్టరేట్లో స్పందనకు 354 వినతులు వచ్చాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్కు అవకాశం లేని వినతులు మరో 98 వచ్చాయి. మండలాలు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో నిర్వహించిన కార్యక్రమానికి సుమారు 720 వరకు అర్జీలు వచ్చాయి. విజయనగరం కలెక్టరేట్, పార్వతీపురం ఐటీడీఏతోపాటు అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్తోపాటు ఆర్డీవో, తహసీల్దార్, ఐటీడీఏ, జిల్లా ఎస్పీ, మండల పోలీస్ స్టేషన్లలో స్పందన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 660 అర్జీలు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో 360 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి సుమారు 120 ఫిర్యాదులు అందాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్లో నిర్వహించిన ‘స్పందన’కు 253 అర్జీలు వచ్చాయి. గుంటూరు జిల్లాలో స్పందన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అచ్చంపేట మండలంలో వృద్ధురాలు పట్టాదార్ పాస్ పుస్తకం కోసం వీఆర్వోకు రూ.50 వేలు లంచం ఇచ్చి ఏడాదైనా ఆమె సమస్య పరిష్కారం కాలేదు. స్పందన కార్యక్రమంలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకు మొరపెట్టుకోవడంతో ఆయన వీఆర్వోను పిలిచి మందలించి రెండు రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. జెడ్పీ కార్యాలయంలో నిర్వహించిన కలెక్టర్ గ్రీవెన్స్కు 600 ఫిర్యాదులు, తెనాలి ఆర్డీఓ కార్యాలయంలో 22 ఫిర్యాదులు అందాయి. రూరల్ ఎస్పీ కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి 80కు పైగా అర్జీలు వచ్చాయి. ఒంగోలు కలెక్టరేట్లో స్పందన కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు. వివిధ సమస్యలపై మొత్తం 375 అర్జీలు స్వీకరించినట్టు అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లాలో నిర్వహించిన కార్యక్రమానికి 1,293 అర్జీలు వచ్చాయి. జిల్లా కేంద్రంలో 653 అర్జీలు అందాయి. కర్నూలు కలెక్టరేట్లో స్పందనకు 1,127 దరఖాస్తులు రాగా.. నమోదుకు వీలులేని దరఖాస్తులు కూడా భారీగా అందాయి. కడప కలెక్టరేట్లో నిర్వహించిన స్పందనకు దాదాపు 500 మందికి పైగా వచ్చి సమస్యలను విన్నవించుకున్నారు. చిత్తూరు కలెక్టరేట్, తిరుపతి, మదనపల్లిలోని సబ్ కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతోపాటు అన్ని తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమానికి మొత్తం 2,528 వినతులు వచ్చాయి. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయానికి 996 అర్జీలు రాగా.. అందులో 950 మంది నివాస స్థలాల కోసం వచ్చిన వారే ఉన్నారు. అప్పటికప్పుడు ట్రై సైకిల్ అందజేత నెల్లూరు నగరానికి చెందిన దివ్యాంగుడు మోహన్ ట్రై సైకిల్ కోసం నాలుగు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. చివరకు స్పందన కార్యక్రమానికి హాజరై కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబుకు తన గోడు వెళ్లబోసుకున్నాడు. అతడికి అప్పటికప్పుడు ట్రై సైకిల్ అందజేశారు. ‘స్పందన’ కార్యక్రమంలో ఇంత వేగంగా సమస్య పరిష్కారం అవుతుందని తాను ఊహించలేదని మోహన్ వ్యాఖ్యానించాడు. తక్షణ స్పందనపై హర్షం వ్యక్తం చేశాడు. -
జిల్లా పరిషత్ల పునర్వ్యవస్థీకరణ
సాక్షి, హైదరాబాద్: జిల్లా, మండల పరిషత్ల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జెడ్పీపీలు, ఎంపీపీలకు పోస్టులు, సిబ్బంది కేటాయింపునకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల మొదటివారంలో కొత్త జెడ్పీపీలు, మండల పరిషత్ల నూతన పాలకమండళ్లు ఏర్పడనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వీటికి అనుగుణంగా మొత్తం 32 జెడ్పీపీలు, 539 మండలాల్లో సిబ్బంది కేటాయింపు, సర్దుబాటు, ఇతర అంశాలకు సంబంధించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు. గతంలోని ఉమ్మడి తొమ్మిది జిల్లా పరిషత్లలోని పోస్టులను కొత్తగా ఏర్పడిన 32 జిల్లా పరిషత్లలో సర్దుబా టు చేస్తారు. ప్రస్తుతం 9 జిల్లా పరిషత్లలో 9 మంది జెడ్పీ సీఈవోలు, 9 మంది డిప్యూటీ సీఈవోలు పనిచేస్తున్నారు. తొమ్మిది మంది డిప్యూటీ సీఈవోలను మరో 9 జిల్లాలకు సీఈవోలుగా, మిగిలిన 14 జిల్లాల్లో ఇదివరకే డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతి పొందిన వారిని సీఈవోలుగా నియమించాలని ప్రభుత్వం సూచించింది. తొమ్మిది జెడ్పీలలో 9 మంది అకౌంట్స్ ఆఫీసర్లు (ఏవో) పనిచేస్తున్నందున, మిగిలిన 23 జిల్లాల్లో డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతులు పొందిన వారిని ఏవోలుగా నియమిస్తారు. పాత జెడ్పీపీలకు మంజూరైన పోస్టులన్నీ (రీ అలొకేట్ చేయాల్సిన మినహాయించి) కొత్త జెడ్పీపీలకు కేటాయిస్తారు. పని ఒత్తిడి ప్రాతిపదికన... కొత్త జిల్లాల్లో పని ఒత్తిడి, ఇతర అంశాల ప్రాతిపదికన సిబ్బంది సరళిని అనుసరించి పోస్టులను జెడ్పీపీలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్దేశించింది. దీనికి అనుగుణంగా రీ అలొకేట్ కాని పోస్టుల్లోని ఉద్యోగులంతా కూడా కొత్త జెడ్పీపీల ప్రారంభం నుంచి తమ తమ పోస్టుల్లో ఆయా జెడ్పీ కార్యాలయాల్లో కొనసాగుతారు. వారిని కొత్త జెడ్పీపీలకు ముందస్తు(ప్రొవిజనల్)గా కేటాయించినట్టుగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో కొత్త పరిషత్లకు కేటాయించాల్సిన మేరకు సాధారణ బదిలీలపై నిషేధాన్ని సడలిస్తారు. కొత్త జెడ్పీపీలకు కేటాయించిన వారు, ఆర్డర్ టు సర్వ్ కింద నియమితులైన (పైన పేర్కొన్న విధంగా) ఉద్యోగులు సీనియారిటీ, పదోన్నతులు, సర్వీసు అంశాల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా సంబంధిత ఉమ్మడి జిల్లా/జోనల్/మల్టీ జోనల్ కేడర్లలో పరిపాలనా అవసరాల దృష్ట్యా తాత్కాలికంగా కొనసాగుతారు. సిబ్బంది విభజన... మునుపటి జెడ్పీపీ హెడ్క్వార్టర్గా ఉన్న జిల్లాల కలెక్టర్లు, వాటి పరిధిలో కొత్తగా ఏర్పడిన జిల్లాల కలెక్టర్లను సంప్రదించి సొంత ప్రాంతం, మండలం, సీనియారిటీ ప్రాతిపదికన సిబ్బందిని సర్దుబాటు చేస్తారు. జెడ్పీపీల్లోని మండలాల సంఖ్య నిష్పత్తికి అనుగుణంగా సిబ్బంది సర్దుబాటు ఉంటుంది. జిల్లా పరిషత్లలో అందుబాటులో ఉన్న వాహనాలు, ఫర్నిచర్, మౌలిక వసతులు తదితరాలను కొత్త జెడ్పీపీలకు పాత జిల్లా కేంద్రాల కలెక్టర్లు పంపిణీ చేస్తారు. కొత్త జెడ్పీపీల కోసం భవనాలను (వీలైనంత మేరకు ప్రభుత్వ భవనాల్లోనే) జిల్లా కలెక్టర్లు గుర్తిస్తారు. పాత జెడ్పీపీల్లోని వాహనాలను కూడా కొత్తగా ఏర్పడిన జెడ్పీపీలకు మండలాల సంఖ్య ఆధారంగా కేటాయిస్తారు. మండల పరిషత్లలో... కొత్తగా ఏర్పడిన 112 మండలాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం 539 మండలాలుగా పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో గత మండల ›ప్రజాపరిషత్(ఎంపీపీ) కార్యాలయాల్లోని పోస్టులను కొత్తగా ఏర్పడిన ఎంపీపీల్లో సర్దుబాటు చేస్తారు. కొత్త మండలాల్లో పనిఒత్తిడి, ఇతర అంశాల ప్రాతిపదికన సిబ్బంది సరళిని అనుసరించి కొత్త పోస్టులను కొత్త ఎంపీపీలకు కేటాయిస్తారు. దీనికి అనుగుణంగా రీ అలొకేట్ కాని పోస్టుల్లోని ఉద్యోగులంతా కూడా కొత్త ఎంపీపీల ప్రారంభం నుంచి తమ తమ పోస్టుల్లో ఆయా ఎంపీపీ కార్యాలయాల్లో కొనసాగుతారు. వారిని కొత్త ఎంపీపీలకు ముందస్తు(ప్రొవిజనల్)గా కేటాయించినట్టుగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో కొత్త మండల పరిషత్ల అవసరాల మేరకు సాధారణ బదిలీలపై నిషేధాన్ని సడలిస్తారు. కొత్త పరిషత్లకు కేటాయించినవారు, ఆర్డర్ టు సర్వ్ కింద నియమితులైన (పైన పేర్కొన్న విధంగా) ఉద్యోగులు సీనియారిటీ, పదోన్నతులు, సర్వీసు అంశాల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా సంబంధిత ఉమ్మడి జిల్లా/జోనల్/మల్టీజోనల్ కేడర్లలో పరిపాలనా అవసరాల దృష్ట్యా తాత్కాలికంగా కొనసాగుతారు. రద్దయిన మండలాల్లో పనిచేస్తున్న సిబ్బందిని సమీప మండలాలు లేదా కొత్తగా ఏర్పడిన మండలాల్లో సర్దుబాటు చేస్తారు. కొత్తగా ఏర్పడిన ఎంపీపీల్లో సీనియారిటీ అధారంగా ఈవోపీఆర్డీ, సూపరింటెండెంట్లను ఇన్చార్జి ఎంపీడీవోలుగా జిల్లా కలెక్టర్లు నియమిస్తారు. 32 జెడ్పీపీ చైర్పర్సన్లు, సీఈవోలు, ఇతర సిబ్బంది, 112 ఎంపీపీ అధ్యక్షులు, ఎంపీడీవోలు, ఇతర సిబ్బంది అవసరాలకు తగ్గట్టుగా ఫర్నిచర్ను కేటాయిస్తారు. -
ఎన్నికల తర్వాతే కొత్త మున్సిపల్ చట్టం
-
చట్ట సవరణతో పురపోరు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత మున్సిపల్ చట్టం ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త పురపాలక చట్టం కొలిక్కి రాకపోవడంతో చట్ట సవరణతో వార్డుల సంఖ్యను ఖరారు చేసింది. దీనికి అనుగుణంగా శుక్రవారం అర్డినెన్స్ జారీ చేసింది. జూలై నెలాఖరులోగా ఎన్నికలు జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కృతనిశ్చయంతో ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 138 పట్టణ స్థానిక సంస్థల్లో డివిజన్లు/వార్డుల సంఖ్యను ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న వార్డుల విభజనలో శాస్త్రీయత లోపించినందున వార్డులను హేతుబద్ధీకరిస్తూ పురపాలకశాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు సగటున 1,500 నుంచి 15 వేల జనాభా వరకు ఒక్కో వార్డు ఉండగా దీన్ని పునర్విభజనతో సవరించింది. 2011 లెక్కల ప్రకారం మున్సిపాలిటీల జనాభా, ఓటర్ల నిష్పత్తికి అనుగుణంగా వార్డుల సంఖ్యను ఖరారు చేసింది. వాస్తవానికి కొత్త మున్సిపల్ చట్టం మనుగడలోకి వచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ముసాయిదా చట్టాన్ని కూడా రూపొందించింది. అయితే ఈ చట్టాన్ని పకడ్బందీగా రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కొత్త చట్టం కోసం ఎదురుచూడకుండా ప్రస్తుత చట్టం ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. దీనికి అనుగుణంగా వార్డులను ప్రకటిస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. గణనీయంగా పెరిగిన వార్డులు... సగటున జనాభా, ఓటర్ల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకోవడంతో మున్సిపాలిటీల్లో భారీగా వార్డులు పెరిగాయి. గతంలో 74 మున్సిపాలిటీల పరిధిలో 1,900 వార్డులుండగా ప్రస్తుతం 138 మున్సిపాలిటీలు/కార్పొరేషన్లలో తాజాగా జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం ఈ సంఖ్య 3,385కి చేరింది. ఆర్డినెన్స్కు ముందు ఈ వార్డుల సంఖ్య 2,631గా ఉండేది. చిన్న పురపాలికల్లో 1,000–1,500 ఓటర్లకు ఓ వార్డును సర్కారు ఏర్పాటు చేసింది. ఇక 50 వేల జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో 2,500 నుంచి 3 వేల ఓటర్లకు ఒక వార్డు ఉండనుంది. వరంగల్ మహానగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో వార్డుల సంఖ్య భారీగా పెరిగింది. దాదాపు 8 లక్షల జనాభా ఉన్న ఈ కార్పొరేషన్లో డివిజన్కు దాదాపు 15 వేల ఓటర్లు ఉంటే ఐదు లక్షలలోపు జనాభా ఉన్న మిగతా కార్పొరేషన్లలో సగటున ఆరు నుంచి ఎనిమిది వేల మంది ఓటర్లకు ఒక డివిజన్ను ఖరారు చేసింది. కనిష్టం 10 వార్డులు... గతేడాది ఆగస్టు 2న కొత్తగా 68 మున్సిపాలిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటిలో అతితక్కువ జనాభా ఉన్న మండల కేంద్రాలు కూడా పురపాలికలుగా మారాయి. పట్టణీకరణను పరిగణనలోకి తీసుకున్న సర్కారు భారీగా మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో చిన్న మున్సిపాలిటీల్లో కనిష్టంగా 10 వార్డులు ఏర్పడ్డాయి. అందులో అలంపూర్, వడ్డేపల్లి, భూత్పూర్, అమరచింత, ఆత్మకూరు, చండూరు మున్సిపాలిటీలున్నాయి. -
ఏపీ ఉద్యోగుల బదిలీలకు ఉత్తర్వులు
-
ఉద్యోగుల బదిలీలు నేటి నుంచే..
సాక్షి, అమరావతి : ఉద్యోగుల సాధారణ బదిలీలు మంగళవారం నుంచి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే నెల 5వ తేదీ వరకు ఈ బదిలీలకు అనుమతినివ్వగా.. ప్రస్తుతమున్న నిషేధాన్ని తొలగించారు. తిరిగి వచ్చే నెల 6న నుంచి నిషేధం అమల్లోకి రానుంది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్ సోమవారం జీవో జారీచేశారు. అయితే, ఇప్పటికే విద్యా సంస్థలు ప్రారంభమైనందున అన్ని రకాల విద్యాశాఖలను బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎటువంటి ఆరోపణలకు, ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా ఈ బదిలీల ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా జీవోలో ప్రభుత్వం స్పష్టంచేసింది. ఉద్యోగుల రిక్వెస్ట్, పరిపాలనాపరమైన సౌలభ్యం ప్రాతిపదికగా బదిలీలు చేయాలని అందులో పేర్కొన్నారు. అలాగే, ఐదేళ్ల పాటు ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలన్నారు. ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న మార్గదర్శకాలు ఇవే.. - ఉద్యోగుల బదిలీల్లో 40 శాతం పైగా అంగవైకల్యం సర్టిఫికెట్ గల వారికి ప్రాధాన్యతనివ్వాలి - ఉద్యోగుల పిల్లలు ఎవరైనా మానసిక వైకల్యంతో ఉంటే అలాంటి ఉద్యోగులను సంబంధిత వైద్య సదుపాయం గల ప్రాంతాలకే బదిలీ చేయాలి - క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి జరిగిన భార్యగాని ఆధారపడిన పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నట్లయితే ఆ వైద్య సదుపాయాలున్న చోటకు మాత్రమే సంబంధిత ఉద్యోగులను బదిలీ చేయాలి. - కారుణ్య నియామకాల్లోని వితంతు ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యతనివ్వాలి. - భార్యభర్తల కేసుల్లో భార్య బదిలీకి ప్రాధాన్యత ఇవ్వాలి. అదీ కూడా గతంలో ఈ సదుపాయం పొందినట్లయితే ఎనిమిదేళ్ల తరువాత మాత్రమే అనుమతించాలి. - బదిలీలన్నీ రిక్వెస్ట్ కింద పరిగణనలోకి తీసుకోవాలి. - పదోన్నతులు పొందిన ఉద్యోగులను బదిలీ చేయాలి. అయితే, బదిలీ చేసేచోట సంబంధిత పోస్టు ఉంటేనే చేయాలి. - తొలుత అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను నోటిఫై చేయాలి. వాటిని భర్తీచేశాకే నాన్ ఐటీడీఏ ప్రాంతాల్లో బదిలీలు చేయాలి. - ఐటీడీఏ ప్రాంతాల్లో పనిచేస్తున్న లోకల్ కేడర్, జోనల్ కేడర్ ఉద్యోగులను రెండేళ్లకు పైగా పనిచేసిన ఉద్యోగులను సీనియారిటీ ప్రాతిపదికన బదిలీలకు ప్రాధాన్యతనివ్వాలి. - ఐటీడీఏ ప్రాంతాల్లో పోస్టింగ్లకు ఉద్యోగులు 50 ఏళ్లలోపు వయస్సు గలవారై ఉండాలి. అలాగే, గతంలో ఐటీడీఏలో పనిచేయని వారై ఉండాలి. - ఐటీడీఏ పరిధిలోని మారుమూల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఖాళీలున్నాయి. వీటిని బదిలీల ద్వారా భర్తీచేయడానికి సంబంధిత శాఖాధిపతులు, కలెక్టర్లు ప్రాధాన్యత ఇవ్వాలి. - అన్ని బదిలీలు సంబంధిత అథారిటీ ఆదేశాలు, నిబంధనల మేరకు జరగాలి. - బదిలీ ప్రక్రియకు సంబంధిత శాఖాధిపతి బాధ్యత వహించాలి. ఎటువంటి ఆరోపణలు, ఫిర్యాదులు లేకుండా నిబంధనలను ఉల్లంఘించకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలి. - రెవెన్యూ, ఇతర ఆర్జిత శాఖలైన వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, రవాణా, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలు కూడా ఆయా శాఖల మార్గదర్శకాల మేరకు వచ్చే నెల 5లోగా బదిలీల ప్రక్రియను పూర్తిచేయాలి. - వ్యవసాయ శాఖలో బదిలీలను మాత్రం ఆయా శాఖలకు అనుగుణంగా నిర్వహించుకోవచ్చు. - స్కూలు విద్య, ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ విద్య, సాంకేతిక విద్య, సంక్షేమ శాఖల విద్యా సంస్థలన్నింటిలో బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇప్పటికే విద్యా సంస్థలు ప్రారంభమైనందున వీటిల్లో బదిలీలకు అవకాశం ఇవ్వలేదు. వీరిని బదిలీ చేయరాదు.. - వచ్చే ఏడాది మార్చి 31లోగా పదవీ విరమణ చేసే ఉద్యోగులు.. అలాగే, గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల్లో పనిచేస్తున్న వారికీ బదిలీల నుంచి మినహాయింపు ఉంది. - కంటిచూపు లేని ఉద్యోగులు ప్రత్యేకంగా వారు బదిలీకి రిక్వెస్ట్ చేస్తే తప్ప వారిని బదిలీ చేయరాదు. వారు కోరిన చోట స్పష్టమైన ఖాళీ ఉంటేనే బదిలీ చేయాలి. - ఏసీబీ, విజిలెన్స్ కేసులు పెండింగ్లో ఉన్న ఉద్యోగులతో పాటు ఇతర శాఖాపరమైన ఆరోపణలున్న వారిని కూడా. -
21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం శనివారం బదిలీ చేసింది. ఈ నెల 5వ తేదీన 26 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన సంగతి తెల్సిందే. దీంతో 15 రోజుల వ్యవధిలో రెండు దశల్లో రాష్ట్రంలో 47 మంది ఐపీఎస్లు బదిలీ అయ్యారు. అప్పట్లో బదిలీ చేసిన వారిలో ఐదుగురు మరోసారి బదిలీ అయ్యారు. టీడీపీ హయాంలో ప్రత్యేకంగా డీజీపీ కార్యాలయంలో శాంతిభద్రతల కో ఆర్డినేషన్ ఐజీగా ఉన్న ఘట్టమనేని శ్రీనివాస్ను అనంతపురం పీటీసీకి బదిలీ చేయగా తాజాగా ఆయన్ను పోలీస్ హెడ్క్వార్టర్లో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. కోయ ప్రవీణ్, జీవీజీ అశోక్కుమార్, సర్వశ్రేష్ట త్రిపాఠి, విక్రాంత్ పాటిల్పై ప్రభుత్వం మరోసారి బదిలీ చేసింది. -
5 నెలల సమయం కావాలి..
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు కనీసం 151 రోజులు (5 నెలలు) సమయం కావాలని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం కోరింది. సమీప గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం, మేజర్ గ్రామాలను కొత్త మున్సిపాలిటీలుగా చేసేందుకు, ఆ తర్వాత వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు చేసేందుకు ఆ సమయం పడుతుందని తెలిపింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ అఫిడవిట్ దాఖలు చేశారు. 53 మున్సిపాలిటీలు, 3 మున్సిపల్ కార్పొరేషన్ల పాలకవర్గాల గడువు జూలై 2తో ముగిసిందని, ఈ లోగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు వంటి చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికలు నిర్వహించాల్సిందిగా గతేడాది డిసెంబర్ 31న, ఈ ఏడాది మార్చి 28న ప్రభుత్వానికి లేఖలు రాసినా ఫలితం లేకపోవడంతో కోర్టుకెక్కింది. ఎన్నికల ప్రక్రియ చేపట్టేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కూడా మరో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలను బుధవారం విచారిస్తామని న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావు పేర్కొన్నారు. అన్నింటికీ ఒకేసారి.. కష్టం! 53 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లలో ఒక్క గ్రామపంచాయతీ విలీనం కూడా కాలేదని, వీటి ఎన్నికల విషయంలో ఉత్తర్వులు జారీ చేస్తే అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అఫిడవిట్లో హైకోర్టుకు నివేదించారు. జవహర్నగర్, నిజాంపేట, కొంపల్లి, మణికొండ, నార్సింగ్, బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీలుగా ఈ ఏడాది ఏప్రిల్లో ఏర్పడ్డాయి. బడేపల్లి (జడ్చర్ల) నకిరేకల్ మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు వచ్చే ఏడాది డిసెంబర్ 15 వరకు ఉంది. గుండ్లపోచంపల్లి పాలకవర్గం గడువు జూన్ 1తో ముగిసిందన్నారు. పాలకవర్గాల గడువు ముగిసిపోతున్నందున వాటన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కష్టమవుతుందని కౌంటర్లో తెలిపారు. ‘సమీపంలోని చిన్న గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడం, మేజర్ గ్రామాల్ని కొత్త మున్సిపాలిటీలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని జనవరి 19న జిల్లా కలెక్టర్లను ఆదేశించాం. దీంతో రాష్ట్రంలోని 131 గ్రామాలను సమీపంలోని 42 మున్సిపాలిటీలు, 173 గ్రామాలను 68 మున్సిపాలిటీలుగా మార్చాం. వీటికి ఎన్నికలు నిర్వహించాలంటే ఆయా గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు పూర్తి కావాలి. ఈలోగానే 14 పంచాయతీలను మున్సిపాలిటీలుగా చేయడాన్ని, 28 గ్రామాల్ని మున్సిపాలిటీల్లో విలీనం చేయొద్దన్న రిట్లను గత మార్చి 8న హైకోర్టు తోసిపుచ్చింది’అని అరవింద్ కుమార్ హైకోర్టుకు తెలిపారు. -
నెలకు సరిపడా మందులు ఒకేసారి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బీపీ, షుగర్ రోగులకు ఒకేసారి నెలకు సరిపడా మందులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అసంక్రమిత వ్యాధుల (ఎన్సీడీ) స్క్రీనింగ్ అనంతరం రక్తపోటు, మధుమేహ వ్యాధులకు నెలకు సరిపడా మందులిచ్చే కార్యక్రమం ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అంతేకాదు వారి జీవిత కాలమంతా ఈ మందులను ఉచితంగా అందించనున్నారు. కొనసాగుతోన్న వైద్య పరీక్షలు ప్రస్తుతం రాష్ట్రంలో 30 ఏళ్లు పైబడిన వారికి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎంపిక చేసిన 12 జిల్లాల్లో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ)పై స్క్రీనింగ్ ప్రక్రియ జరుగుతోంది. అలాగే జూన్ చివరి వారం లేదా జులై మాసంలో మరికొన్ని జిల్లాల్లో ఎన్సీడీ స్క్రీనింగ్స్ చేపట్టబోతున్నారు. మొత్తంగా ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ అసంక్రమిత జబ్బుల పరీక్షలను పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ గట్టి పట్టుదలతో ఉంది. జాతీయ ఆరోగ్య మిషన్ కూడా దీనిపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టింది. గ్రామాల్లో ఆశా, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మందులు చాలక అవస్థలు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో 104 వాహనాల ద్వారా పరీక్షలు నిర్వహించి బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు మందు గోలీలు ఇస్తున్నారు. వారానికో పదిరోజులకో సరిపోయేంత మాత్రమే ఇస్తున్నారు. దీంతో 104 ఇచ్చే మందుల మీదే ఆధారపడ్డ పేద రోగులు మళ్లీ మందులు వచ్చేదాకా తీవ్ర అవస్థలు పడుతున్నారు. అంతేకాక ప్రస్తుతం స్క్రీనింగ్ జరిగే జిల్లాల్లో బీపీ ఎక్కువగా ఉన్నవారికి , షుగర్ లెవల్స్ అసాధారణంగా ఉన్నవారికి ఈ డోసులు సరిపోవడం లేదని, అందుకే వారికి బయటనుంచి ట్యాబ్లెట్స్ కొనుక్కోమని చెబుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. మందుల పంపిణీ బాధ్యత ‘ఆశ’లదే బీపీకి రెండు రకాలు, షుగరుకు మూడు రకాల గోలీలు వైద్య ఆరోగ్యశాఖ ఇవ్వబోతోంది. బీపీకి 50 ఎంజీ , 20 ఎంజీ డోసులతో కూడిన ట్యాబ్లెట్లను ఇస్తారు. ప్రతి నెలా మందులు అయిపోయాక వాటిని తిరిగి తెచ్చి ఇచ్చే బాధ్యత స్థానిక ఆశ కార్యకర్తలకు అప్పగించారు. స్థానికంగా ఉండే ఆశ కార్యకర్తల వద్దే ఆ గ్రామంలో ఎంతమంది బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారనే డేటా ఉంటుంది. దాని ఆధారంగా ప్రతి నెలా మందులు ఇవ్వనున్నారు. -
మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించాలి
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో అన్ని వ్యాపారాలను మహిళా సంఘాలే నిర్వహిం చేలా, ఆర్థిక పరిపుష్టిని సాధించేలా కృషి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సూచించారు. రాబోయే రోజుల్లో గ్రామస్థాయిల్లో వివిధ ప్రైవేట్ వ్యాపారులు, ఇతరులు నిర్వహించే పరిశ్రమలన్నీ మహిళా సంఘాలే నిర్వహించేలా ఈ వ్యవస్థ బలోపేతం కావాలనేది రాష్ట్ర ప్రభుత్వ కోరిక అని పేర్కొన్నారు. కల్తీలను నిరోధించేందుకు ఆయా వ్యాపారాలన్నీ కూడా మహిళా సంఘాల ద్వారా చేయించాలని సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకైనా సహాయ, సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. శనివారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలకు (ఎస్హెచ్జీ) బ్యాంకు లింకేజీ కార్యక్రమాన్ని నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, పీఆర్ ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్, సెర్ప్ సీఈవో పౌసమి బసు, ఎస్ఎల్డీసీ చైర్మన్ ఓంప్రకాశ్ మిశ్రా, ఆర్బీఐ మేనేజర్ శంకర్, నాబార్డ్ సీజీఎం విజయ్కుమార్లతో కలిసి 2019–20 ఆర్థిక ఏడాదిలో రూ. 6,584 కోట్లకు బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ అందించేందుకు సంబంధించిన వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ సందరర్భంగా మంత్రి రుణ ప్రణాళిక లక్ష్యాలను వివరించడంతోపాటు ఈ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని మహిళా సంఘాల సభ్యులకు సూచించారు. రుణ లక్ష్యాలకు మించి తమ ప్రభుత్వం సంఘాలకు కార్యక్రమాలు ఇస్తుందని, అందువల్ల అంతకు మించి రుణాలిచ్చేందుకు బ్యాంకులు సహకరించాలని కోరా రు. ప్రతి గ్రామంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయబోతోందన్నారు. ప్రతి గ్రామంలో విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్ను నియమిస్తున్నట్టు, సంఘాల్లోని ప్రతి మహిళ ఏయే కార్యకలాపాలు చేపడుతుందో తెలుసుకోవడంతో పాటు ప్రతి ఇంటికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ తయా రు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు పీఆర్శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్ తెలిపారు. సెర్ప్ ద్వారా చేపడుతున్న కార్యకలాపాలు, తదితర అంశాలను గురించి సీఈవో పౌసమి బసు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మహిళా సంఘాలకు అన్నివిధాలా సహాయ, సహకారాలను అందిస్తామని ఎస్ఎల్బీసీ చైర్మన్ ఓపీ మిశ్రా వెల్లడించారు. సంఘం లోని ఒక్కో మహిళకు ఇచ్చే రుణాల్లో రూ. 25 వేల వరకు ప్రాసెసింగ్ చార్జీలు వసూలు చేయరా దని ఆర్బీఐ నిర్దేశించిందని ఆర్బీఐ మేనేజర్ శంకర్ తెలిపారు. కొన్ని మహిళా సంఘాల సభ్యులు బ్యాంకుల చార్జీలు, ప్రాసెసింగ్ చార్జీలు తగ్గించాలని కోరినపుడు ఆయనపై విధంగా స్పందించారు. 1992లో 500 గ్రూపులతో మొదలైన స్వయం సహాయక సంఘాల ఉద్యమం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 87 లక్షల గ్రూపులకు విస్తరించిందని నాబార్డ్ సీజీఎం విజయ్కుమార్ తెలిపారు. -
నిజాం షుగర్స్ అమ్మకానికి పచ్చజెండా
సాక్షి, హైదరాబాద్: నష్టాలతో మూతపడిన నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ను విక్రయించి.. బ్యాంకులు, ఇతర సంస్థలకు బకాయిలు చెల్లించాల్సిందిగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎస్సీఎల్టీ) ఆదేశించింది. సుమారు 8 దశాబ్దాల చరిత్ర కలిగిన నిజాం షుగర్స్ పునరుద్ధరణ మార్గాలు మూసుకుపోవడంతో ఆస్తుల విక్రయం (లిక్విడేషన్) మినహా మరో మార్గం లేకుండా పోయిందని పేర్కొంది. ఇప్పటికే పరిశ్రమలో ఉత్పత్తి నిలిచిపోవడంతో వేతనాల కోసం ఉద్యోగులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. ఈ నెల 3న తీర్పు వెలువరించిన ట్రిబ్యునల్ గురువారం లిక్విడేషన్కు ఆదేశిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులు అందిన తర్వాత.. తదుపరి కార్యాచరణపై స్పష్టత ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాలని చక్కెర శాఖ అధికారులు నిర్ణయించారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో 1937లో ఏర్పాటు చేసిన నిజాం చక్కెర కర్మాగారం (ఎన్ఎస్ఎల్) సుమారు రెండు దశాబ్దాలుగా నష్టాల బాటలో నడిచింది. నష్టాల నుంచి పరిశ్రమను గట్టెక్కించే నెపంతో 2002లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం డెల్టా పేపర్ మిల్స్కు 51శాతం వాటాను విక్రయించింది. నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్)గా పేరు మార్చుకున్న నిజాం చక్కెర కర్మాగారం.. నష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితి లేకపోవడంతో 2015 డిసెంబర్లో పరిశ్రమను మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. మరోవైపు పరిశ్రమ ఆస్తులను విక్రయించి అప్పులు చెల్లించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎన్డీఎస్ఎల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో రైతుల భాగస్వామ్యంతో సహకార రంగంలో ఎన్డీఎస్ఎల్ను నడిపేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం 2015, ఏప్రిల్లో కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రైవేటు భాగస్వామ్య సంస్థకు చెందిన 51శాతాన్ని టేకోవర్ చేయడంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి, 3 నెలల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా కార్యదర్శుల కమిటీని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓఎంఎస్ 28ను విడుదల చేసింది. ట్రిబ్యునల్ను ఆశ్రయించిన ఎన్డీఎస్ఎల్... బ్యాంకర్ల వద్ద భారీగా అప్పులు పెరిగిపోవడంతో దివాలా పరిశ్రమగా గుర్తించాలని 2017లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, హైదరాబాద్ బెంచ్ను ఎన్డీఎస్ఎల్ ఆశ్రయించింది. అప్పులు తీర్చేందుకు కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిసొల్యూషనల్ ప్రాసెస్ (సీఐఆర్పీ)ని ప్రారంభించాలని కోరింది. ఈ నేపథ్యంలో రుణ దాతలతో (కమిటీ ఆఫ్ క్రెడిటర్స్) సంప్రదింపులు జరిపేందుకు ఆర్.రామకృష్ణ గుప్తా అనే నిపుణుడికి బాధ్యతలు అప్పగించింది. 2017, అక్టోబర్ మొదలుకుని 2018, సెప్టెంబర్ వరకు 11 పర్యాయాలు రుణదాతలతో సంప్రదింపులు జరిపినా.. పునరుద్ధరణ అంశం కొలిక్కి రాలేదు. సహకార రంగంలో పరిశ్రమను పునరుద్ధరించేందుకు ప్రత్యేక ప్రణాళికలతో రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ట్రప్టెన్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీసీ) నిబంధనల మేరకు 2018, సెప్టెంబర్ 19లోపు సమస్యను పరిష్కరించాల్సి ఉండగా.. 12 వారాల పాటు గడువు పొడిగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మరోవైపు పరిశ్రమను కొనుగోలు చేసేందుకు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన కొన్ని సంస్థలు ఆసక్తి చూపాయి. అయితే పరిశ్రమ ఆస్తులు, అప్పులను పరిశీలించిన సంస్థలు చివరి నిమిషంలో వెనుకడుగు వేశాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం: భద్రు మాలోత్ నిజాం చక్కెర కర్మాగారం లిక్విడేషన్ అనుమతికి సంబంధించి ఎన్సీఎల్టీ ఉత్తర్వులు అధికారికంగా అందిన తర్వాత.. ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తామని చక్కెర శాఖ కమిషనర్ భద్రు మాలోత్ ‘సాక్షి’కి వెల్లడించారు. రైతులు, ఉద్యోగులకు నష్టం జరగకుండా పరిశ్రమ పునరుద్ధరణ మార్గాలను అన్వేషిస్తామన్నారు. ఇదిలా ఉంటే ఎన్సీఎల్టీ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు లేదా ఎన్సీఎల్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ను ప్రభుత్వం ఆశ్రయించే సూచనలు కనిపిస్తున్నాయి. లిక్విడేషన్కు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు.. అయితే వరుస ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి గడువులోగా పునరుద్ధరణ ప్రణాళిక అందకపోవడంతో పరిశ్రమ అమ్మకానికి (లిక్విడేషన్) అనుమతిస్తూ ఎన్సీఎల్టీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 12 వారాల గడువును ఇవ్వాలనే రాష్ట్ర ప్రభుత్వ వినతిని ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. రామకృష్ణ గుప్తాకు లిక్విడేటర్గా బాధ్యతలు అప్పగించింది. లిక్విడేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు.. పునరుద్ధరణకు సంబంధించి కొనుగోలుకు ఆసక్తి ఉన్న సంస్థలతో సంప్రదింపులు జరపడంతో పాటు, ప్రభుత్వ స్పందన కోసం కొంత కాలం వేచి చూసే యోచనలో లిక్విడేటర్ ఉన్నట్లు సమాచారం. వివిధ సంస్థలకు రూ.360 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉండగా.. ఆస్తులు కూడా అంతే మొత్తంలో ఉన్నట్లు సమాచారం. లిక్విడేషన్కు ఎన్సీఎల్టీ అనుమతి ఇవ్వడంతో సంస్థపై ఆధారపడిన సుమారు 250 మంది ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. -
సెప్టెంబర్ 15 నాటికి బతుకమ్మ చీరలు
సాక్షి, హైదరాబాద్ : బతుకమ్మ చీరల పంపిణీలో గతంలో తలెత్తిన అవాంతరాలను దృష్టిలో పెట్టుకుని.. ఈ ఏడాది చీరల తయారీని సెప్టెంబర్ 15లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు నిర్దేశించింది. 6.30 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తి జరగాల్సి ఉండటంతో.. ఫిబ్రవరిలోనే చేనేత సహకార సంఘాలకు చీరల తయారీకి చేనేత సహకార సంఘాల సమాఖ్య ఆర్డర్ ఇచ్చింది. గతంతో పోలిస్తే రంగులు, డిజైన్ల ఎంపికలోనూ వైవిధ్యానికి ప్రాధాన్యత ఇస్తూ వివిధ రంగుల్లో 50 రకాలైన చీరలను ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరులోగా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలో 2017 నుంచి అర్హులైన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చీరలు పంపిణీ చేస్తోంది. రెండేళ్లుగా సుమారు 90లక్షల మందికి పైగా ఉచితంగా చీరలు పంపిణీ చేసిన ప్రభుత్వం.. ఈ ఏడాది 95లక్షల చీరల పంపిణీని లక్ష్యంగా నిర్దేశించింది. చీరల తయారీ బాధ్యతను సిరిసిల్లలోని ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు అప్పగించారు. బతుకమ్మ చీరల పంపిణీకి సంబంధించి తొలి ఏడాది.. అనగా 2017లో ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడంతో.. సిరిసిల్ల చేనేత సహకార సంఘాలు సకాలంలో చీరల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించలేక పోయాయి. దీంతో 3.75కోట్ల మీటర్ల వస్త్రాన్ని సిరిసిల్ల మరమగ్గాల మీద సిద్ధం చేయగా, మరో 2.36కోట్ల మీటర్ల వస్త్రాన్ని గుజరాత్లోని సూరత్ నుంచి దిగుమతి చేసుకున్నారు. సూరత్ నుంచి దిగుమతి చేసుకున్న వస్త్రం నాణ్యతపై లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో 2018 బతుకమ్మ చీరల తయారీకి సంబంధించిన ఆర్డర్ను పూర్తిగా సిరిసిల్ల నేత కార్మికులే స్థానికంగా మరమగ్గాలపై సిద్ధం చేశారు. సుమారు 6 కోట్ల మీటర్ల వస్త్రాన్ని సకాలంలో సిద్ధం చేసినా.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బతుకమ్మ చీరల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. దీంతో ఎన్నికలు ముగిసిన తర్వాత గత ఏడాది డిసెంబర్ మూడో వారంలో ఈ చీరల పంపిణీ ప్రారంభించి..ఈ ఏడాది జనవరి వరకు పంపిణీ ప్రక్రియ కొనసాగించారు. టెస్కో ద్వారా రూ.450 కోట్ల ఆర్డర్లు తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘాల సమాఖ్య లిమిటెడ్ (టెస్కో) ద్వారా రాష్ట్రంలోని ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు ఈ ఏడాది సుమారు రూ.450 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కాయి. ఈ ఏడాది రూ.280 కోట్లు బతుకమ్మ చీరల రూపంలో సిరిసిల్ల చేనేత సహకార సంఘాలకు ఆర్డర్ లభించింది. వీటితో పాటు రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా పంపిణీ చేసే వస్త్రాల ఉత్పత్తి ఆర్డర్ కూడా ఈ సంఘాలకే దక్కింది. కేసీఆర్ కిట్ల ద్వారా బాలింతలకు ఇచ్చే చీరలతో పాటు, వివిధ ప్రభుత్వ సంక్షేమ శాఖలకు సంబంధించి దుప్పట్లు, కార్పెట్ల తయారీ ఆర్డర్లను సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ జిల్లాలోని చేనేత సహకార సంఘాలకు అప్పగించారు. ఇదిలా ఉంటే బతుకమ్మ చీరల ద్వారా ఉపాధి పొందుతున్న సిరిసిల్ల చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం నుంచి బకాయిలు సకాలంలో విడుదల కావడం లేదు. గత ఏడాది బతుకమ్మ చీరలు, రంజాన్ వస్త్రాల తయారీకి సంబంధించి టెస్కో నుంచి రూ.25 కోట్ల మేర ఈ సంఘాలకు విడుదల కావాల్సి ఉంది. 95 లక్షల మందికి పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బతుకమ్మ చీరల పంపిణీకి రెండేళ్లుగా అవాంతరాలు ఎదురవుతున్నాయి. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ మూడో వారంలో లబ్ధిదారులకు చీరలు అందేలా చేనేత శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ముదురు రంగులతో కూడిన 50 రకాలైన డిజైన్లను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిపుణులు రూపొందించారు. చీర అంచులు, కొంగు డిజైన్లలో వైవిధ్యం ఉండేలా రూపొందించడంతో పాటు, చీరతో పాటు రవిక బట్టను కూడా అందిస్తారు. ఈ ఏడాది సుమారు 6.30 కోట్ల మీటర్ల వస్త్రం ఉత్పత్తి చేయాలని సిరిసిల్ల చేనేత సహకార సంఘాలకు ఆర్డర్ ఇవ్వగా.. 95లక్షల మందికి చీరలు పంపిణీ చేయనున్నారు. వీటి తయారీ ద్వారా సిరిసిల్లలో 22వేలకు పైగా మరమగ్గాలపై ఆధారపడిన 20వేల మంది చేనేత కార్మికులకు సుమారు ఆరు నెలల పాటు ఉపాధి దక్కనుంది. గతంలో సగటున నెలకు రూ.6 వేల నుంచి రూ.8వేల వరకు వేతనం పొందిన కార్మికులు.. ప్రస్తుత ఆర్డర్లతో సుమారు రూ.20వేల వరకు ఆర్జిస్తున్నారు. -
ఐదింటిపై మూడో కన్ను
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల్లోనే కాదు.. రాజధాని నిర్మాణం, పురపాలక, పంచాయతీరాజ్, రహదారులు భవనాల శాఖల పరిధిలో చేపట్టిన పనుల్లో కూడా జరిగిన అక్రమాల నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు థర్డ్ పార్టీ విచారణ పరిధిని పెంచడంతోపాటు సభ్యుల సంఖ్యను కూడా 5కు పెంచింది. రిటైర్డు ఈఎన్సీలు రోశయ్య, బి.నారాయణరెడ్డి, సుబ్బరాయశర్మ, ఐఐటీ ప్రొఫెసర్ సూర్యప్రకాశ్, నాక్ డైరెక్టర్ పీటర్లను థర్డ్ పార్టీ సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ కానున్నాయి. పేదల ఇళ్లలోనూ కమీషన్ల పర్వం.. టీడీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల తరహాలోనే తాత్కాలిక సచివాలయం, శాశ్వత పరిపాలన భవనాలు, రహదారుల అంచనా వ్యయాలను భారీగా పెంచేసి ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టి భారీగా కమీషన్లు వసూలు చేసుకున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు అంచనా వ్యయాన్ని సగటున కి.మీ.కి రూ.59 కోట్లుగా నిర్ణయించి కాంట్రాక్టర్లకు అప్పగించడమే దీనికి తార్కాణం. తాత్కాలిక సచివాలయం, శాశ్వత భవనాల నిర్మాణ పనుల్లోనూ ఇదే రీతిలో అంచనాలు పెంచేశారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో వాటర్ గ్రిడ్, ఏఐడీబీ (ఆసియా మౌలిక సదుపాయాల అభివృద్ధి బ్యాంకు) రుణంతో చేపట్టిన రహదారుల పనుల్లోనూ అంచనా వ్యయాన్ని పెంచేసి భారీగా దోచుకున్నారు. రహదారులు, భవనాల శాఖ పరిధిలో చేపట్టిన రహదారులు, భవనాల నిర్మాణ పనుల్లోనూ అదే మాదిరిగా దోపిడీ జరిగింది. పురపాలక శాఖలో ప్రధానంగా పీఏంఏవై పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని రూ.20,535 కోట్ల నుంచి రూ.38,265.88 కోట్లకుపైగా పెంచేసి లబ్ధిదారులపై రూ.17,730.88 కోట్ల రుణభారాన్ని మోపి టీడీపీ పెద్దలు కమీషన్లు వసూలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్రమాలను థర్డ్ పార్టీ ద్వారా నిగ్గు తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. థర్డ్ పార్టీ విచారణకు మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఖరారు చేసింది. అవి ఇలా ఉన్నాయి.. - శాఖలవారీగా, ప్రాజెక్టుల వారీగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను థర్డ్ పార్టీ పరిశీలించాలి. - ఒక ప్రాజెక్టు డీపీఆర్ ఆధారంగా అంచనా వ్యయాన్ని ఖరారు చేశారా? లేక డీపీఆర్ను రూపొందించకుండా అంచనా వ్యయాన్ని ఖరారు చేశారా? అన్నది తేల్చాలి. - అంచనా వ్యయాన్ని ఖరారు చేసేటప్పుడు పనుల పరిమాణాన్ని అవసరం లేకున్నా అమాంతం పెంచేశారా? లేదా అనే అంశాన్ని పరిశీలించాలి. - ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) విధానంలో టెండర్ పిలిస్తే ఐబీఎం(ఇంటర్నల్ బెంచ్ మార్క్ కమిటీ)ను, లంప్సమ్(ఎల్ఎస్)–ఓపెన్ విధానంలో టెండర్ పిలిస్తే చీఫ్ ఇంజనీర్స్ కమిటీలను సంప్రదించి అంచనా వ్యయాన్ని ఖరారు చేశారా? లేదా? అనే అంశాన్ని పరిశీలించాలి. - టెండర్ నోటిఫికేషన్ జారీ చేసేటప్పుడు ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు మాత్రమే టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించేలా నిబంధనలు విధించారా? అనే అంశాన్ని తేల్చాలి. - నిబంధనలను అడ్డుపెట్టుకుని కాంట్రాక్టర్లను కట్టడి చేయడం, కుమ్మక్కు చేయడం వల్ల అధిక ధరలకు పనులు కట్టబెట్టారా? లేదా? దీనివల్ల ఖజానాకు ఎంత నష్టం? అన్నది పరిశీలించాలి. - ఇప్పటివరకు చేసిన పనుల నాణ్యతను పరిశీలించాలి. నాణ్యతకు, పరిమాణానికి, బిల్లుల చెల్లింపులకు తేడాలుంటే వాటిని ప్రత్యేకంగా గుర్తించాలి. - శాఖల వారీగా, ప్రాజెక్టుల వారీగా ఈ అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. -
సమష్టిగా అభివృద్ధి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఎన్నికైన జెడ్పీ చైర్పర్సన్లు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి పనిచేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గ్రామపంచాయతీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు అందరు సమష్టిగా పనిచేయాలని సూచించారు. సమష్టి కృషితోనే బంగారు తెలంగాణ సాకారమవుతుందన్నారు. కొత్తగా ఎన్నికైన జెడ్పీ చైర్పర్సన్లు పుట్ట మధు (పెద్దపల్లి), కోవా లక్ష్మి (కుమ్రం భీమ్ ఆసిఫా బాద్), లింగాల కమల్రాజ్ (ఖమ్మం), పద్మ (నాగర్కర్నూలు), లోక్నాథ్రెడ్డి (వనపర్తి), హేమలత (మెదక్), నరేందర్రెడ్డి (నల్లగొండ), సందీప్రెడ్డి(యాదాద్రి భువనగిరి), మంజుశ్రీ (సంగారెడ్డి), సుధీర్కుమార్(వరంగల్ అర్బన్), జ్యోతి (వరంగల్ రూరల్), సంపత్రెడ్డి (జన గామ), కుసుమ జగదీష్ (ములుగు), బిందు (మహబూబాబాద్), శ్రీహర్షిణి (జయశంకర్ భూపాలపల్లి) సోమవారం హైదరాబాద్లో కేటీ ఆర్ను కలిశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, జగదీశ్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్రెడ్డి, వరంగల్ ఉమ్మడి జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మా నర్సింగరావు, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పల్లా రాజేశ్వర్రెడ్డి, సత్యవతి రాథోడ్, వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, సండ్ర వెంక టవీరయ్య, కోనేరు కోనప్ప, గొంగడి సునీత, గండ్ర వెంకటరమణారెడ్డి, శంకర్నాయక్, గ్యాదరి కిషోర్, సుమన్, గువ్వల బాలరాజు, ధర్మారెడ్డి, సతీష్ కుమార్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నన్నపునేని నరేందర్, హరిప్రియ, క్రాంతి కిరణ్ తదితరులు కేటీఆర్ను కలిశారు. -
ఆ ఏర్పాట్లకు ప్రభుత్వం ఎందుకు ఖర్చు చేయొద్దు?
సాక్షి, హైదరాబాద్: బత్తిన సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలకు ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాట్లు చేయరాదని ఎక్కడుందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ బిజినెస్ రూల్ కింద ఖర్చులెలా చేయాలని ఉందో తెలియజేయాలని బాలల హక్కుల సంఘాన్ని నిలదీసింది. అన్ని ప్రభుత్వ శాఖలు చేప ప్రసాదం ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయని, ప్రభుత్వ శాఖలు చేసే ఖర్చుల గురించి ప్రభుత్వం అధికారికంగా వెల్లడించకపోవడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరుతూ ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.అచ్యుత్రావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని శుక్రవారం హైకోర్టు మరోసారి విచారించింది. ప్రజాధనాన్ని ఖర్చు చేసేప్పుడు వాటి గురించి ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలని, ఖర్చు చేసే అంశంపై జవాబుదారీతనం ఉండాలని పిటిషనర్ తరఫు న్యాయవాది సి.దామోదర్రెడ్డి వాదించారు. ప్రభుత్వం ఏ బిజినెస్ రూల్ ప్రకారం ఖర్చు చేయాలో తెలియజేయాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ల ధర్మాసనం ప్రశ్నించింది. పెద్ద సంఖ్యలో జనం వస్తున్నప్పుడు వారికి మంచినీరు, అత్యవసర వైద్యం, విద్యుత్, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు కల్పిస్తే తప్పేంటని అడిగింది. ఆ విధమైన ఏర్పాట్లు చేయడానికి అభ్యంతరం లేదని, అయితే అందుకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చుల గురించే తమకున్న అభ్యంతరమని, ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు చేయకుండానే ఖర్చు చేస్తోందని న్యాయవాది బదులిచ్చారు. ఈ విషయంపై గతంలో లోకాయుక్త ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పగానే ధర్మాసనం కల్పించుకుని.. లోకాయుక్త సిఫార్సు మాత్రమే చేస్తుందని, ఆ సిఫార్సులను కచ్చితంగా అమలు చేయాలని ఏమీ లేదని చెప్పింది. ప్రజావసరాల కోసం పోలీస్, మత్స్య, విద్యుత్, రెవెన్యూ వంటి శాఖల సేవల్ని ఉపయోగించుకోకపోతే, రేపు ఏదైనా జరగరానిది జరిగితే కోర్టులకు వచ్చి ప్రభుత్వ వైఫల్యం చెందిందని వ్యాజ్యాలు వేసే అవకాశాలు ఉంటాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచారణ మూడు వారాలకు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఇక íసిటీ పోలీస్ కమిషనర్ దాఖలు చేసిన అఫిడవిట్లో చేప మందుపై గతంలో దాఖలైన కోర్టు కేసుల తర్వాతే చేప ప్రసాదం పేరుతో బత్తిన సోదరులు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. దీనిని 1845 నుంచి ఇస్తున్నారని, దాని ఫార్ములా గోప్యంగానే ఉంచుతున్నారని, ఆస్తమా తగ్గుతుందనే నమ్మకంతో భారీ సంఖ్యలో వచ్చే వారి కోసం పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. పిటిషనర్ అచ్యుత్రావుపై 2017లో హైదరాబాద్ పాతబస్తీలోని టప్పాచాబుత్రా పోలీస్స్టేషన్లో బాలల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే కేసు ఉందన్నారు. -
పట్టణ ప్రణాళికలు రెడీ!
సాక్షి, హైదరాబాద్: కొత్త పురపాలికలకు రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రణాళికలను రెడీ చేస్తోంది. ప్రణాళికాబద్ధంగా పట్టణీకరణ జరగడానికి దోహదపడే మాస్టర్ప్లాన్లకు తుదిరూపునిస్తోంది. నూతనంగా ఏర్పడ్డ 68 పురపాలికల్లో.. 23 మున్సిపాలిటీలకు మాస్టర్ప్లాన్లను తయారు చేస్తోంది. ఇందులో ఇప్పటికే పెద్దపల్లి పురపాలిక ముసాయిదా మాస్టర్ ప్లాన్కు సర్కారు ఆమోదముద్ర వేసింది. మరో ఏడు మున్సిపాలిటీలకు సంబంధించిన ముసాయిదాలను రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనకు పురపాలక శాఖ పంపింది. పట్టణీకరణ, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రూపొందించే ఈ మాస్టర్ ప్లాన్లో భూ వినియోగంపై స్పష్టతనిస్తోంది. రహదారులకు పెద్దపీట! పట్టణాభివృద్ధికి దిక్సూచిగా చెప్పుకునే మాస్టర్ప్లాన్లో జోనల్ రెగ్యులైజేషన్ను విధిగా పాటించాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీల్లో అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టకుండా బ్రేక్ పడనుంది. నిర్దేశిత జోన్లో మాత్రమే నివాస భవనాలకు అనుమతులు జారీ చేయనున్నారు. రెసిడెన్షియల్ జోన్లో మాత్రమే ఈ కట్టడాలను అనుమతిస్తారు. అలాగే కమర్షియల్ జోన్లో వాణిజ్య కార్యకలాపాలను, రిక్రియేషన్/కన్జర్వేషన్ జోన్ను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. వీటితోపాటు మాస్టర్ప్లాన్ ఇండస్ట్రియల్ జోన్తోపాటు ప్రజావసరాలు, మౌలిక వసతులు, రహదారుల విస్తరణపై కూడా స్పష్టత నివ్వనున్నారు. ఈ మాస్టర్ ప్లాన్కు అనుగుణంగానే ఆయా మున్సిపాలిటీల్లో అనుమతులు జారీ చేయనున్నారు. ప్రభుత్వ పరిశీలనకు ఎనిమిది ఇప్పటికే పెద్దపల్లి మాస్టర్ ప్లాన్కు ప్రభుత్వం ఓకే చెప్పగా.. మహబూబాబాద్, భూపాలపల్లి, అందోల్–జోగిపేట్, దేవరకొండ, కొల్లాపూర్, నాగర్కర్నూలు, అచ్చంపేట పురపాలికల ముసాయిదా మాస్టర్ప్లాన్లు ప్రభుత్వ పరిశీలనకు వెళ్లాయి. ఇవిగాకుండా.. బాదేపల్లి, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక, కల్వకుర్తి, కోదాడ, హుజూర్నగర్, ఐజ, నర్సంపేట, పరకాల, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లెందు, బెల్లంపల్లి, మణుగూరు మున్సిపాలిటీల మాస్టర్ప్లాన్లను డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం (డీటీసీపీ) చకచకా రూపొందిస్తోంది. వీటన్నింటికి త్వరితగతిన ఆమోదముద్ర వేయించడం ద్వారా ఆగస్టు నుంచి మనుగడలోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఇదిలావుండగా, ఇప్పటికే వివిధ నగరాభివృద్ధి సంస్థలు మాస్టర్ప్లాన్లను అమలు చేస్తున్నాయి. తాజాగా ఏర్పడ్డ మున్సిపాలిటీల్లో అధికశాతం వీటి పరిధిలోకి వస్తున్నందున అమలులో ఉన్న మాస్టర్ప్లాన్లే వీటికి వర్తించనున్నాయి. -
గురుకులాల్లో తగ్గనున్న సీట్లు..
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రాథమిక వసతుల సమస్య వేధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో అయిదువందలకు పైగా కొత్త గురుకుల పాఠశాలలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించింది. ఈ క్రమంలో అద్దె భవనాల్లోనే వీటిని స్థాపించగా... ప్రస్తుతం అక్కడ వసతుల సమస్య తలెత్తింది. క్రమంగా తరగతులు పెరుగుతుండటంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.దీంతో తొలుత తీసుకున్న భవనాల విస్తీర్ణం సరిపోకపోవడంతో తరగతుల నిర్వహణ భారంగా మారుతోంది.ఈక్రమంలో 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి సీట్లను సొసైటీలు కోత పెట్టాయి. ఇందులో గిరిజన గురుకుల సొసైటీలో 900సీట్లు, బీసీ గురుకుల సొసైటీలో 400 సీట్లు తగ్గాయి. రెండుకు బదులుగా ఒక సెక్షన్తో... సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రతీ తరగతికి 2 సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్లో 40 మంది వం తున విద్యార్థులకు అడ్మిషన్ ఇస్తారు. ఈక్రమంలో 2019–20కి గాను రాష్ట్రవ్యాప్తంగా 613 గురుకుల పాఠశాలల్లో 47,740 మందికి అడ్మిషన్లు ఇస్తూ ఇటీవల టీజీసెట్ ఆదేశాలిచ్చింది. గత నెలలో నిర్వహించిన అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా వారికి ఆన్లైన్లోనే సీట్లు కేటాయించింది. ఈనెల 31లోగా నిర్దేశిత పాఠశాలల్లో ప్రవేశాలు పొందాలని స్పష్టం చేసింది.వాస్తవానికి 613 గురుకుల పాఠశాలల్లో రెండు సెక్షన్లలో 80 మంది విద్యార్థుల వంతున 49,040 సీట్లు భర్తీ చేయాలి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేవలం 47,740 సీట్లకు సెట్ కన్వీనర్ పరిమితం చేయడం గమనార్హం. ఇందులో 338 బాలికల గురుకులాల్లో 26,370 సీట్లు, 275 జనరల్ గురుకులాల్లో 21,370 సీట్లు భర్తీ చేయనుంది. -
పుస్తకాల మోత..వెన్నుకు వాత
సాక్షి, అమరావతి: బడి పిల్లల పుస్తకాల బరువు తగ్గించాలని గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినా ఏపీ సర్కారు పట్టించుకోలేదు. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలన్నీ జీవోలు జారీచేసి పిల్లల పుస్తకాల బరువును తగ్గించాయి. మన రాష్ట్రం మాత్రం ఈ విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. బాలబాలికల శారీరక, మానసిక ఎదుగుదల అనేది వారికి ఉన్న హక్కు. బరువైన పుస్తకాల సంచులను వీపు మీద మోయటం వల్ల విద్యార్థులు వెన్నుపూస, ఎముకల సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎందరో వైద్యులు, బాలల హక్కుల ఉద్యమకారుల కృషితో కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ పిల్లలు మోసుకెళ్లే సంచులు, ఇంటివద్ద చేసే హోమ్ వర్క్పై మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేస్తే ఆ మార్గదర్శకాలు అమలులోకి వస్తాయి. ఇప్పుడు ఆలస్యం చేస్తే ఈ విద్యా సంవత్సరంలో కూడా పిల్లలు ఆ మోత బరువు నుంచి విముక్తి కాలేరు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం.. తరగతులను బట్టి బ్యాగుల భారం నిర్దేశించారు. కనిష్టంగా కేజీన్నర.. గరిష్టంగా 5 కేజీలు మాత్రమే పుస్తకాల బరువు ఉండాలి. తరగతుల వారీగా నిర్దేశించిన బరువు కంటే ఎక్కువ బరువును విద్యార్థులపై మోపితే స్కూల్ టీచర్లు, యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం వెంటనే ఆదేశాలు ఇవ్వాలి బడి పిల్లలపై మోయలేని పుస్తకాల భారాన్ని తగ్గించాలని కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో జారీ చేయాలి. ఇతర రాష్ట్రాల్లో కేంద్ర మార్గదర్శకాలు అమలవుతున్నాయి. బడులు తెరవటానికి మరో 22 రోజుల గడువు ఉంది. అప్పటిలోగా పుస్తకాల బరువు తగ్గించే జీవో జారీ చేయాలి. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్కు, ముఖ్య కార్యదర్శికి అర్జీలు ఇచ్చాం. అయినా స్పందన లేదు. – బీవీఎస్ కుమార్, చైర్మన్, కృష్ణా జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ -
ఆర్థిక భారం.. లేదు సాయం
సాక్షి, అమరావతి: సామాన్యుడి రవాణా సాధనమైన ఆర్టీసీ బస్సు నష్టాల ఊబిలో కూరుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది. గత ఐదేళ్లుగా నష్టాలు నానాటికీ పెరుగుతుండడం, సర్కారు నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. కాస్త చేయూతనందించి, కష్టాల కడలి నుంచి గట్టెక్కించండి అని పదేపదే విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం కనీసం స్పందించిన పాపానపోలేదని ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించాలంటే ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు చాలా ఏళ్లుగా కోరుతున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సంస్థను కాపాడుకోవాలంటే టిక్కెట్ చార్జీలు పెంచడం మినహా మరో గత్యంతరం లేదని ఆర్టీసీ యాజమాన్యం తేల్చిచెబుతోంది. సంస్థ ఆస్తులు హాంఫట్ ఆర్టీసీపై అప్పుల భారం ప్రస్తుతం రూ.6,445 కోట్లకు చేరింది. నష్టాలు ప్రతిఏటా పెరుగుతూ ఇప్పుడు రూ.1,029 కోట్లకు చేరాయి. ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోకపోగా, సంస్థ ఆస్తులను అస్మదీయులకు అప్పనంగా అప్పగించేసింది. బీవోటీ విధానంలో విలువైన ఆస్తులను కారుచౌకగా కట్టబెట్టి ఆర్టీసీ మనుగడను దెబ్బతీసింది. ప్రభుత్వ ప్రచారానికి, అధికార పార్టీ కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సులను యథేచ్ఛగా వాడుకున్నారు. పోలవరం యాత్రలకు ఆర్టీసీ బస్సులను తిప్పారు. ఇందుకు గాను ఆర్టీసీకి ప్రభుత్వం రూ.75 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ నిధులు జల వనరుల శాఖ విడుదల చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయినా ఇప్పటిదాకా రూపాయి కూడా రాలేదు. ముఖ్యమంత్రి సభలకు, ధర్మపోరాట దీక్షలకు డ్వాక్రా మహిళలను, జనాన్ని తరలించడానికి ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకున్నారు. వాటికి సక్రమంగా బిల్లులు చెల్లించిన దాఖలాలు లేవు. ఫలితంగా ఆర్టీసీ రూ.కోట్లల్లో ఆదాయం కోల్పోయింది. ఆర్టీసీ సొమ్ముతో ముఖ్యమంత్రి సోకులు ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం ఆర్టీసీకి చెందిన రూ.9 కోట్ల నిధులతో అత్యాధునికమైన బుల్లెట్ ప్రూఫ్ బస్సును కొనుగోలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన సుబ్బారావు అనే పొగాకు రైతు తమకు గిట్టుబాటు కల్పించడం లేదు గానీ ముఖ్యమంత్రి కోసం బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఏటా రూ.281 కోట్ల వడ్డీ కట్టాల్సిందే.. ఆర్టీసీపై అప్పుల భారం పెరిగిపోవడంతో రుణాల కోసం బ్యాంక్లను ఆశ్రయించక తప్పడం లేదు. బస్టాండ్లను తనఖా పెట్టి మరీ రుణాలు పొందారు. ప్రస్తుతం బ్యాంకు రుణాలు రూ.2,026 కోట్లు ఉండగా, వీటికి వడ్డీ కింద ప్రతిఏటా రూ.281 కోట్లు బ్యాంకులకు చెల్లిస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ‘హడ్కో’ నుంచి పొందిన రుణం రూ.793 కోట్లు ఉంది. సంస్థకు చెందిన క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ, ప్రావిడెంట్ ఫండ్లో కార్మికులు దాచుకున్న రూ.1,232 కోట్లను ఆర్టీసీ వాడుకుంది. కనీసం ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన యూనిఫాంను మూడేళ్లుగా ఇవ్వడం లేదు. ఎంవీ ట్యాక్స్ ముక్కు పిండి మరీ వసూలు మోటార్ వాహన పన్ను(ఎంవీ ట్యాక్స్) ఆర్టీసీకి పెనుభారంగా పరిణమించింది. ఎంవీ ట్యాక్స్ తగ్గించాలని ఆర్టీసీ యాజమాన్యం పంపిన ప్రతిపాదనలను ప్రతిఏటా ప్రభుత్వం కొట్టిపారేసింది. ఆర్టీసీకి పన్ను మినహాయింపు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఎంవీ ట్యాక్స్ గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ ఆదాయంలో 13 శాతం ఉండేది. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత దాన్ని 7 శాతానికి తగ్గించారు. ప్రస్తుతం నష్టాల్లో కూరుకున్న ఆర్టీసీని ఆదుకోవాలంటే ఎంవీ ట్యాక్స్ నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది. ప్రభుత్వానికి ఏటా రూ.300 కోట్లు ఎంవీ ట్యాక్స్ కింద ఆర్టీసీ ఏటా ప్రభుత్వానికి రూ.300 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఆర్టీసీకి వచ్చే ఆదాయంలో ప్రతి మూడు నెలలకు 7 శాతం వంతున మోటార్ వాహన పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలి. ప్రతి రోజూ ఆర్టీసీకి సగటున రూ.12 కోట్ల ఆదాయం వస్తోంది. అంటే మూడు నెలలకు రూ.1,080 కోట్లు, ఏడాదికి రూ.4,320 కోట్లు. ఈ ఆదాయంలో రూ.302 కోట్ల వరకు ఎంవీ ట్యాక్స్ కింద ప్రభుత్వానికి చెల్లించాలి. 2015–16లో ఎంవీ ట్యాక్స్ రూ.280 కోట్లు ఉండగా, 2018–19 నాటికి అది రూ.316 కోట్లకు చేరింది. డీజిల్ భారం రూ.650 కోట్లు డీజిల్ ధర 2015–16లో లీటర్కు రూ.49 ఉండగా, 2018–19 నాటికి రూ.70.41కి చేరింది. డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా ఆర్టీసీపై భారం పెరిగిపోతోంది. డీజిల్ భారం ఆర్టీసీపై ఈ ఏడాది రూ.650 కోట్లు ఉంది. ఈ భారాన్ని భరించాలని యాజమాన్యం పలుమార్లు వినతి చేసినా ప్రభుత్వం లెక్కచేయలేదు. డీజిల్పై వ్యాట్ 17 వాతం వరకు ప్రభుత్వానికి చెల్లించాలి. దీన్ని తగ్గించాలని కోరుతున్నా సర్కారు ససేమిరా అంటోంది. ధనిక వర్గాలు ప్రయాణించే విమాన ఇంధనంపై ప్రభుత్వం కేవలం 1 శాతమే వ్యాట్ వసూలు చేస్తోంది. మిగిలిన 16 శాతాన్ని ప్రభుత్వమే భరిస్తుండడం గమనార్హం. -
ఫార్మా సిటీ.. వెరీ పిటీ
సాక్షి, హైదరాబాద్: ఫార్మా రంగాన్ని విస్తరించేందుకు హైదరాబాద్ సమీపంలోని 18,304 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోనే తొలి సమీకృత ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం 2015లో ప్రకటించింది. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) పరిధిలో ప్రత్యేక ఉత్తర్వు ద్వారా ‘హైదరాబాద్ ఫార్మా సిటీ లిమిటెడ్’పేరిట స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) కూడా ఏర్పాటు చేశారు. ప్రతిపాదిత ఫార్మా సిటీలో బాహ్య, అంతర్గత మౌలిక సౌకర్యాలు పూర్తి చేసి.. 2019 నాటికి ఔత్సాహిక ఫార్మా సంస్థలకు భూ కేటాయింపులు, అనుమతులు ఇచ్చేలా టీఎస్ఐఐసీ షెడ్యూలు రూపొందించింది. తొలి విడతలో 9,212 ఎకరాలకు గాను 6,719 ఎకరాలను సేకరించగా, మిగతా భూమిని సేకరించడంపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి పెట్టింది. తొలి విడత భూ సేకరణకు హడ్కో ద్వారా టీఎస్ఐఐసీ రూ.725 కోట్లు రుణం తీసుకోవడంతో పాటు, ఫార్మాసిటీలో అంతర్గత మౌలిక సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధుల కోసం ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ)కు ప్రతిపాదనలు సమర్పించింది. మరోవైపు ఫార్మాసిటీ ప్రాజెక్టుకు నిమ్జ్ (జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తుల మండలి) హోదా ఇచ్చేందుకు కేంద్ర పరిశ్రమల శాఖ పరిధిలోని పరిశ్రమల ప్రోత్సాహక, విధాన విభాగం (డిప్) 2017 ఏప్రిల్లో సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. నయా పైసా విదల్చని ‘డిప్’ హైదరాబాద్ ఫార్మాసిటీకి నిమ్జ్ హోదా దక్కడంతో బాహ్య, అంతర్గత మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.6 వేల కోట్లు ఇవ్వాలంటూ కేంద్ర పరిశ్రమల ప్రోత్సాహక, విధాన విభాగం ‘డిప్’కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించింది. ఈ మేరకు నాటి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర పరిశ్రమల మంత్రి కేటీఆర్ వినతిపత్రం కూడా ఇచ్చారు. తొలి విడతలో రూ.1,500 కోట్లు విడుదల చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినా, రెండేళ్లుగా ఫార్మా సిటీకి కేంద్రం నుంచి నయాపైసా విదల్చలేదు. ఫార్మా సిటీ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16,395 కోట్లు కాగా, నిమ్జ్ హోదా ద్వారా కనీసం రూ.6 వేల కోట్లు వస్తాయని అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిధులు సమకూర్చుకుని మౌలిక సౌకర్యాలు కల్పించే పరిస్థితి లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దీంతో 2019 మే నాటికి ఔత్సాహికులకు ఫార్మాసిటీలో భూ కేటాయింపులు చేస్తామనే ప్రకటన ఇప్పట్లో ఆచరణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. వడివడిగా టీఎస్ఐఐసీ అడుగులు... ఫార్మాసిటీ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న టీఎస్ఐఐసీ మొదట్లో వడివడిగా అడుగులు వేసింది. ఫార్మాసిటీని ప్రధాన రహదారులతో అనుసంధానిస్తూ సుమారు రూ.400 కోట్లతో రహదారుల విస్తరణ, విద్యుత్ లైన్ల ఏర్పాటు వంటి పనులు చేపట్టింది. మరోవైపు పర్యావరణ అనుమతులు సాధించడంతో పాటు, సింగపూర్కు చెందిన సుర్బాన జురోంగ్ కన్సల్టెంట్స్ ద్వారా సమీకృత మాస్టర్ ప్లాన్ను రూపొందించింది. మౌలిక సౌకర్యాల కల్పనకు సంబంధించిన ప్రణాళిక తుది దశలో ఉంది. సమీకృత కాలుష్య వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటు (సీఈటీపీ), జీరో లిక్విడ్ డిశ్చార్జి (జడ్ఎల్డీ) ప్లాంట్లను పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్మించేందుకు ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్ను 2017లో విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానించి, 8 కంపెనీలను వడపోతలో ఎంపిక చేశారు. జహీరాబాద్ నిమ్జ్పైనా ప్రభావం... దేశ వ్యాప్తంగా మొత్తం 22 భారీ పారిశ్రామిక వాడలకు నిమ్జ్ హోదా దక్కగా, ఇందులో రాష్ట్రంలో రెండు ఉన్నాయి. ఫార్మాసిటీకి నిమ్జ్ హోదా సూత్రప్రాయంగా దక్కగా, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్జ్కు తుది ఆమోదం లభించింది. అయితే జహీరాబాద్ నిమ్జ్లో మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.3 వేల కోట్లివ్వాలని టీఎస్ఐఐసీ ప్రతిపాదించినా కేంద్రం నుంచి నిధులు విడుదల కావడం లేదు. దీంతో ఫార్మాసిటీ తరహాలో జహీరాబాద్ నిమ్జ్ భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. కేంద్రం నుంచి స్పందన కరువు... ఫార్మా సిటీకి నిమ్జ్ హోదా నేపథ్యంలో మౌలిక సౌకర్యాల కల్పనకు నిధులివ్వాల్సిందిగా టీఎస్ఐఐసీ కేంద్రాన్ని కోరింది. జీరో లిక్విడ్ డిశ్చార్జి గ్రాంటు కోసం కేంద్ర ఎరువులు, రసాయన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫార్మాస్యూటికల్ విభాగానికి ప్రతిపాదనలు సమర్పించింది. సీఈటీపీ నిధుల కోసం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ద్వారా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది. గ్రీన్క్లైమేట్ ఎన్విరాన్మెంట్ ఫండ్ ఇవ్వాలని కేంద్ర పర్యావరణశాఖకూ లేఖ రాసింది. అయితే ప్రతిపాదనలు పంపించి ఏళ్లు గడుస్తున్నా కేంద్రం నుంచి నిధుల విడుదల విషయంలో కనీస స్పందన కానరావడం లేదు. కేంద్రం నుంచి గ్రాంటు విషయంలో స్పష్టత లేకపోవడంతో సీఈటీపీ, జడ్ఎల్డీ ప్లాంట్లను పీపీపీ విధానంలో నిర్మించేందుకు ఎంపిక చేసిన 8 కంపెనీల వడపోత ప్రక్రియను టీఎస్ఐఐసీ నిలిపివేసింది. ఫార్మాసిటీ ప్రత్యేకతలు.. పెట్టుబడుల అంచనా: రూ.64 వేల కోట్లు ఫార్మా ఎగుమతులు (ఏటా): రూ.58 వేల కోట్లు ప్రత్యక్ష ఉపాధి: 1.70 లక్షల మందికి పరోక్ష ఉపాధి: 3.90 లక్షల మందికి కాలుష్య వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటు, మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్, క్వాలిటీ సర్టిఫికేషన్ ల్యాబ్, లాజిస్టిక్ హబ్, నైపుణ్య శిక్షణ కేంద్రం, ఎన్విరాన్ మేనేజ్మెంట్ సెల్, సమీకృత నివాస గృహాల సముదాయం, ఫార్మా ఉత్పత్తి యూనిట్లు వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. వీటితో పాటు ఫార్మా సిటీ ప్రాంగణంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (ఐఐఎస్ఈఆర్) ఏర్పాటుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపారు. -
నత్తనడకన ‘నిమ్జ్’ భూసేకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేసేందుకు జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తుల మండలి ‘నిమ్జ్’ ఏర్పాటుకోసం రాష్ట్రం ప్రభుత్వం చేస్తోన్న భూసేకరణ యత్నాలు ముందుకు సాగడంలేదు. మూడేళ్ల క్రితం ఈ నిమ్జ్ ఏర్పాటుకు 50 చదరపు కిలోమీటర్ల పరిధిలో కచ్చితంగా ఐదువేల హెక్టార్లు (సుమారు 12,500 ఎకరాలు) సేకరించాలని కేంద్రం నిర్దేశించింది. దీనిలో భాగంగా 2016 మార్చి లోగా భారీ పారిశ్రామికవాడ స్థాపనకు అవసరమైన తొలి విడత భూమి ని సేకరిస్తేనే ‘నిమ్జ్’ హోదా దక్కుతుందని షరతు విధించింది. దీంతో నిమ్జ్ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతాన్ని ఎంపిక చేసి భూ సేకరణ ప్రారంభించింది. రాష్ట్రంలో వరుస ఎన్నికలు ఓవైపు, మరోవైపు ప్రభుత్వం చెల్లించే ధర తమకు ఆమోదయో గ్యం కాదంటూ రైతులు చెబుతుండటంతో తొలి విడత భూసేకరణ ప్రక్రియ కొలిక్కి రావట్లేదు. 12,635 ఎకరాలకు గానూ తొలి విడతలో న్యాలకల్ పరిధిలోని ముంగి, రుక్మాపూర్తో పాటు, ఝరాసంగం మండల పరిధిలో బర్దీపూర్, చీలపల్లి, ఎల్గో యి గ్రామాల పరిధిలో 3,501 ఎకరాలు సేకరించాలని రెవెన్యూ విభాగానికి లక్ష్యం విధించారు. 2016లో భూ సేకరణ ప్రక్రియ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు రూ.132.85 కోట్లు వెచ్చించి 2,925 ఎకరాలుసేకరించారు. తొలి విడతలో సేకరించాల్సిన మిగతా 566 ఎకరాల భూమిలో గ్రామ కంఠం, చెరువులు, కుంటలతో పాటు కొన్ని భూములపై కోర్టు కేసులతో భూ సేకరణ ముందుకు సాగడం లేదు. ధర చెల్లింపుపై రైతుల అసంతృప్తి రాష్ట్ర భూ సేకరణ చట్టం 2017లోని జీవో 123 నిబంధనలకు అనుగుణంగా తొలి విడతలో 2,925 ఎకరాల పట్టా, అసైన్మెంట్, ప్రభుత్వ భూములను రెవెన్యూ యంత్రాంగం సేకరించింది. ఎకరాకు అసైన్డ్ భూములకు రూ.3.25 లక్షలు, పట్టా భూములకు రూ.5.65లక్షల చొప్పున చెల్లించారు. అసైన్డ్ భూములకు సంబంధించి కొన్ని చోట్ల రైతులు కబ్జా లో ఉన్నా.. సాంకేతిక అంశాలను కారణంగా చూపు తూ పరిహారం చెల్లించేందుకు అధికారులు నిరాకరించారు. నిమ్జ్ ఏర్పాటు ప్రకటనతో స్థానికంగా ఎకరా భూమి ధర రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల పైనే పలుకుతోంది. దీంతో రైతులు, రైతు కూలీలు ఆందో ళన చెందుతున్నారు. తమకు భూసేకరణపై అవగాహన కల్పించకుండా, హడావుడిగా భూములు తీసుకున్నారని తొలి విడతలో భూములు కోల్పోయిన రైతులు ఆరోపిస్తున్నారు. తమకు చెల్లించాల్సిన పరిహారం పెంచాలని డిమాండు చేస్తున్నారు. ధర పెంచాలంటూ రైతుల ఒత్తిడి రెండు, మూడు విడతల్లో సేకరించే భూముల్లో ఎక్కు వ శాతం పట్టా భూములే ఉన్నాయి. రెండో విడతలో 1,269 ఎకరాల సేకరణ ప్రతిపాదనలను నిమ్జ్ వర్గా లు రెవెన్యూ శాఖకు పంపించాయి. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. దీంతో భూములు అప్పగించాల్సిందిగా కోరుతూ సంబంధిత గ్రామాల్లో జహీరాబాద్ ఆర్డీఓ, రెవెన్యూ అధికారులు సదస్సులు నిర్వహించారు. ఎకరాకు రూ.7 లక్షలు చెల్లిస్తామని రెవెన్యూ అధికారులు చెప్తుండగా, రైతులు మాత్రం భూమి ధరను పెంచాలని డిమాండ్ చేస్తుండటంతో భూ సేకరణ సవాలుగా మారింది. నిమ్జ్ ఏర్పాటైతే కేంద్రం నుంచి వచ్చేవి ఇవి... నిమ్జ్ను జాతీయ రహదారులతో అనుసంధానం, మౌలిక సదుపాయాల కల్పనకు అయ్యే వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం వంద శాతం గ్రాంటు రూపంలో ఇస్తుంది. ఆ తర్వాత పారిశ్రామిక పార్కులో ఏర్పాటయ్యే పరిశ్రమలకు విడిగా ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తుంది. ఈ లెక్కన జహీరాబాద్ నిమ్జ్లో మౌలిక సదుపాయాలకు రూ.3వేల కోట్లు గ్రాంటు రూపంలోనూ.. అందులో ఏర్పాటయ్యే పరిశ్రమలకు రూ.4వేల కోట్ల మేర ప్రోత్సాహకాలు, రాయితీ రూపంలో అందే వీలుంది. -
చిన్న పరిశ్రమకు చేయూత
రాష్ట్రంలో నష్టాల బాటలో ఉన్న పరిశ్రమలను గట్టెక్కించేందుకు అవసరమైన నిధుల సేకరణపై కూడా ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ దృష్టి సారించింది. రాష్ట్రంలో 13,581 చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలుండగా, రూ.1,018 కోట్ల పెట్టుబడితో స్థాపించిన సూక్ష్మ పరిశ్రమలు 62 వేలకు పైగా మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. రూ.76,286 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన చిన్న తరహా పరిశ్రమలు సుమారు 75 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల యజమానుల్లో చాలా మందికి వ్యాపార దక్షత లేకపోవడం, మార్కెటింగ్ ఒడిదుడుకులతో ఆ పరిశ్రమలు కాస్తా నష్టాల బాట పడుతున్నాయి. అయితే ఇందులో సుమారు 3,700 పరిశ్రమలు 6 నెలలుగా కనీసం కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నట్లు ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను తొలి దశలో హెల్త్ క్లినిక్ వడపోస్తున్నది. వీటిలో నిర్వహణ లోపం, మార్కెటింగ్ ఉన్నా వర్కింగ్ క్యాపిటల్ పెట్టే పరిస్థితి లేక నష్టాల్లో కూరుకుపోతున్న పరిశ్రమలను గుర్తిస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ నిధుల సమీకరణపై ప్రత్యేక దృష్టి సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు నష్టాల పాలవ్వకుండా గాడిన పెట్టి దానిపై ఆధారపడిన కార్మికులు నష్టపోకుండా కాపాడేందుకు 2017లో రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్’ను ఏర్పాటు చేసింది. నష్టాల్లో ఉన్న పరిశ్రమల పునరుద్ధరణతో సరిపెట్టకుండా, వాటి వ్యాపార దక్షత పెంచే బాధ్యతను కూడా హెల్త్ క్లినిక్ లిమిటెడ్ (టీఐహెచ్సీఎల్) భుజాలకెత్తుకుంటోంది. తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ టీఎస్ఐడీసీ అడుగుజాడల్లో ఏర్పాటైన టీఐహెచ్సీఎల్ను రూ.100 కోట్ల మూలనిధితో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో రాష్ట్రం తన వంతు వాటాగా రూ.10 కోట్లు, కేంద్రం నుంచి రూ.50 కోట్లు వాటాగా చెల్లించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇప్పటివరకు రూ.7 కోట్లు విడుదల చేసినట్లు సమాచారం. మరో రూ.50 కోట్ల కార్పస్ ఫండ్ను ఏంజెల్ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టులు, బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థల నుంచి సేకరించాలని నిర్ణయించారు. హెల్త్ క్లినిక్ కార్యకలాపాలకు సలహాదారు, మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓతో కూడిన బోర్డుతో పాటు వివిధ రంగాల్లో నిష్ణాతులతో ప్రత్యేక వ్యూహ బృందం కూడా పనిచేస్తోంది. ఏడుగురు సభ్యులున్న ఈ బృందంలో బ్యాంకింగ్, పాలన, పారిశ్రామిక రంగాలకు చెందిన నిపుణులు, అధికారులున్నారు. ఏడాది పాటు పర్యవేక్షణ నష్టాల బాటలో ఉన్న పరిశ్రమలకు ఆర్థికంగా చేయూతనివ్వడంతో పాటు, వాటి పనితీరును ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ఏడాది పాటు పర్యవేక్షిస్తోంది. సదరు పరిశ్రమలకు మార్కెటింగ్, ఉత్పత్తిలో మెళకువలపై కూడా హెల్త్ క్లినిక్ బృందాలు శిక్షణ ఇస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే సత్ఫలితాలు సాధిస్తున్న హెల్త్ క్లినిక్ పనితీరుపై ఇతర రాష్ట్రాల్లోనూ ఆసక్తి పెరుగుతోంది. రుణా గ్రస్త పరిశ్రమలను తిరిగి గాడిలో పెట్టడంపై తమకు సహకారం అందించాల్సిందిగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వినతులు అందుతున్నట్లు హెల్త్ క్లినిక్ అధికారులు చెప్తున్నారు. లోక్సభ ఎన్నికల పర్వం ఇతర రాష్ట్రాల్లోనూ కన్సల్టెన్సీ సేవలు అందించడంపై ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకూ ఎన్ని.. ఇకపై ఎన్ని.. - తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 149 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల పునరుద్ధరణపై ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్ (టీఐహెచ్సీఎల్) దృష్టి సారించింది. - ఇప్పటివరకు 41 పరిశ్రమలను పునరుద్ధరించగా, మరో 14 పరిశ్రమల స్థితిగతులపై అధ్యయనం జరుగుతోంది. పునరుద్ధరించిన పరిశ్రమల్లో అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 23, హైదరాబాద్లో 5, యాదాద్రి భువనగిరిలో 3, వరంగల్ అర్బన్ జిల్లాలో 2 పరిశ్రమలున్నాయి. - ఇక మేడ్చల్, జగిత్యాల, జనగామ, నల్లగొండ, కరీంనగర్ జిల్లాలో ఒక్కో పరిశ్రమను చొప్పున తిరిగి పట్టాలెక్కించారు. వీటిలో ఎక్కువగా మరమగ్గాలు, లోహ వస్తుత్పత్తికి సంబంధించిన పరిశ్రమలే ఉన్నాయి. -
మా సొమ్ములివ్వండి మహాప్రభో..!
సాక్షి, హైదరాబాద్ : దరఖాస్తులు తిరస్కరించి నాలుగేళ్లయినా.. చెల్లించిన సొమ్ము మాత్రం తిరిగి రాలేదు. ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో వెలిసిన కట్టడాల క్రమబద్ధీకరణకు 2015లో రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు జీఓ 58,59ను జారీ చేసింది. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు జీఓ 58 కింద ఉచితంగా స్థలాలను క్రమబద్ధీకరించిన సర్కారు..జీఓ 59 కింద (చెల్లింపు కేటగిరీ)మాత్రం నిర్దేశిత మొత్తాన్ని చెల్లించిన వారికి స్థల యాజమాన్య హక్కులు కల్పించింది. అయితే, జీఓ 59 కింద అనర్హమైన దరఖాస్తుదారుల డబ్బులను రిఫండ్ చేయకుండా మొండికేసింది. తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులకు డబ్బును వాపసు చేయమని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి ఏడాది క్రితం ఉత్తర్వులు జారీ చేసినా జిల్లా కలెక్టర్లు మాత్రం పట్టించుకోవడంలేదు. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు అర్జీలు స్వీకరించిన సమయంలో డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో దరఖాస్తుదారులు నిర్దేశిత మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించారు. ఈ నిధులను కొన్నాళ్లు తమ ఖాతాల్లోనే ఉంచుకున్న తహసీల్దార్లు.. ఏ పద్దు కింద వీటిని డిపాజిట్ చేయాలో తెలియక స్పష్టత కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులు అట్టిపెట్టుకోవడం సరికాదని భావించిన ప్రభుత్వం.. ఆ నిధులను ట్రెజరీల్లో జమ చేయాలని ఆదేశించింది. మూలుగుతున్న రూ.48.56 కోట్లు చెల్లింపు కేటగిరీ కింద స్థలాల క్రమబద్ధీకరణ చేసుకున్న అర్జీలలో 2,761 దరఖాస్తులను ప్రభుత్వం తోసిపుచ్చింది. మార్గదర్శకాలకు అనుగుణంగా లేనివాటిని, రైల్వే, కాందిశీకులు, తదితర కేంద్ర ప్రభుత్వ పరిధిలోని భూములు, ఎఫ్టీఎల్ పరిధిలో వెలిసిన కట్టడాల రెగ్యులరైజ్కు చేసుకున్నవాటిని అనర్హమైనవి తేల్చింది. ఈ మేరకు తిరస్కరణ గురైన దరఖాస్తుదారులకు చెల్లించిన మొత్తాన్ని వాపస్ చేయనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబాబాద్, మెదక్, జోగులాంబ–గద్వాల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో రూ.48.56 కోట్లు ఇవ్వాల్సివుంటుందని లెక్క గట్టింది. దీంతో స్థలాల క్రమబద్ధీకరణకు నోచుకోకపోవడంతో నిరాశకు గురైన అర్జీదారులు కనీసం చెల్లించిన మొత్తమైనా వస్తుందని భావించి తహసీళ్ల చుట్టూ చక్కర్లు కొట్టారు. దరఖాస్తుదారులు కట్టిన మొత్తాన్ని ట్రెజరీల్లో జమ చేసినందున.. ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇస్తే తప్పా తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దరఖాస్తుదారుల ఆవేదనను ఆర్థం చేసుకున్న కలెక్టర్లు రిఫండ్ విషయాన్ని తేల్చాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనికి సానుకూలంగా స్పందించిన సర్కారు.. డబ్బును వాపస్ చేయమంటూ ఉత్తర్వులు జారీ చేసినా.. ఏ పద్దు కింద ట్రెజరీ నుంచి తిరిగి తీసుకోవాలనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఆఖరికి ఈ వ్యవహారంపై స్పష్టతనిస్తూ గతేడాది మే 18న జీఓ 206 జారీ చేసినా.. కలెక్టర్లు ఇప్పటివరకు దరఖాస్తుదారులకు నయాపైసా వెనక్కి ఇవ్వలేదు. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ దరఖాస్తుదారులు చక్కర్లు కొడుతున్నా.. రెవెన్యూ గణం మాత్రం కనికరించడంలేదు. దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్నట్లుగా ప్రభుత్వం ఆదేశాలిచ్చినా.. కలెక్టర్లు మాత్రం స్పందించకోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
‘గురుకుల’ పోస్టుల విభజనకు కమిటీ
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలలకు మంజూరు చేసిన పోస్టుల భర్తీకి గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు(టీఆర్ఈఐఆర్బీ) చర్యలు చేపట్టింది. అయితే, రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చిన కొత్త జోనల్ విధానం ప్రకారం పోస్టులను విభజించాల్సి ఉంది. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయి పోస్టులేమిటనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. పోస్టుల విభజనపై ఇటీవల గురుకుల నియామకాల బోర్డు ప్రభుత్వాన్ని వివరణ కోరగా మీరే తేల్చుకుని వివరాలివ్వాలని సూచించింది. ఈ క్రమంలో పోస్టుల విభజనపై గురుకుల నియామకాల బోర్డు ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసింది. గురుకుల విద్యాసంస్థల సొసైటీల నుంచి ఎనిమిది మంది సీనియర్ అధికారులను ఇందులో నియమించింది. ఉద్యోగాల కేటగిరీ, వర్క్ పర్ఫార్మెన్స్, పేస్కేల్ తదితర అంశాలను ప్రాతిపదికన తీసుకుని పోస్టుల విభజన చేసేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న అన్ని కేటగిరీలతోపాటు సొసైటీ కార్యాలయాలు, రీజినల్ కార్యాలయాల్లోని ఉద్యోగుల సమాచారాన్ని కమిటీ సేకరించి పరిశీలిస్తోంది. పోస్టుల విభజనపై నివేదికను రూపొందించిన తర్వాత ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు గురుకుల నియామకాల బోర్డు కన్వీనర్ నవీన్ నికోలస్ ‘సాక్షి’తో అన్నారు. విభజన పూర్తయితేనే కొత్త నియామకాలు కొత్త జోనల్ విధానం అందుబాటులోకి రావడంతో పోస్టుల విభజన అనివార్యమైంది. దీంతో పోస్టుల విభజన అంశాన్ని పలు శాఖలు ప్రభుత్వానికి వదిలేశాయి. అయితే, గురుకుల పాఠశాలల్లో కొత్త పోస్టులను ప్రభుత్వం మంజూరు చేస్తున్న తరుణంలో సొసైటీ పరిధిలోని పోస్టులను విభజించేందుకు గురుకుల బోర్డు చర్యలు చేపట్టింది. సొసైటీకి ప్రత్యేక సర్వీసు నిబంధనలు ఉండటంతో ఆ మేరకు పోస్టులు విభజించొచ్చనే భావనతో గురుకులబోర్డు చర్యలు వేగవంతం చేసింది. దీంతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి పరిశీలన పూర్తిచేయాలని ఆదేశించింది. వారంలోగా కమిటీ నివేదిక వచ్చే అవకాశం ఉంది. అనంతరం ప్రభుత్వానికి సమర్పించి ఆమోదింపజేసుకోవచ్చని అధికారులు యోచిస్తున్నారు. -
గురుకులాల్లో ‘సమగ్ర వార్షిక ప్రణాళిక’
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాలయాల్లో సమగ్ర విద్యావిధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం గురుకుల సొసైటీల నిర్ణయాలకు తగినట్లుగా ఆయా పాఠశాలల్లో బోధన, బోధనేతర కార్యక్రమాలు సాగుతున్నాయి. కేజీ టు పీజీ విద్యా కార్యక్రమంలో భాగంగా అన్ని గురుకుల పాఠశాలల్లో ఒకే తరహా బోధన, అభ్యసనతోపాటు బోధనేతర కార్యక్రమాలన్నీ ఒకే పద్ధతిలో ఉండాలని నిర్ణయించింది. దీంతో అన్ని గురుకుల సొసైటీలకు సమగ్ర వార్షిక ప్రణాళికను రూపొందించి అమలు చేయాల్సిందిగా సూచించింది. సమగ్ర వార్షిక ప్రణాళిక రూపకల్పనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల సొసైటీ కార్యదర్శులకు సూచనలు చేసింది. ప్రస్తుతం సొసైటీల వారీగా రూపొందించిన ప్రణాళిక ఆధారంగా సమగ్ర ప్రణాళికను తయారు చేస్తారు. జూన్ 1 నుంచే అమలు.. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది పాఠశాల ప్రారంభం నుంచి ముగింపు వరకు చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి అకడమిక్ క్యాలెండర్ తయారు చేస్తారు. ఈ క్యాలెండర్ ఆధారంగా ప్రభుత్వ పాఠశాలల్లో రోజువారీ కార్యక్రమాలు అమలు చేస్తారు. ఇదే తరహాలో గురుకుల విద్యా సంస్థల సొసైటీ సైతం ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళికను తయారు చేస్తుంది. సొసైటీలు ఎవరికివారు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుంటున్నప్పటికీ.. కొన్ని కార్యక్రమాల్లో వ్యత్యాసం ఉండటంతో ఒకే తరహా ఫలితాలు రావడం లేదనే భావన ఉంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అన్ని గురుకుల పాఠశాలల్లో సమగ్ర వార్షిక ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో అన్ని సొసైటీ కార్యదర్శులకు సూచనలు చేసిన ప్రభుత్వం.. ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదించాలని స్పష్టం చేసింది. సొసైటీ కార్యదర్శులు తయారు చేసిన సమగ్ర ప్రణాళికకు ప్రభుత్వ ఆమోదం దక్కిన వెంటనే అమల్లోకి వస్తుంది. జూన్ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండటంతో ఆ రోజు నుంచే సమగ్ర ప్రణాళిక అమలు చేసేలా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఒకే సమయపాలన, ఒకేసారి పరీక్షలు.. సమగ్ర ప్రణాళికతో అన్ని గురుకుల పాఠశాలల పనివేళలు ఒకే తరహాలో ఉంటాయి. విద్యార్థుల డైట్ మెనూ, పాఠ్యాంశ బోధన, అభ్యసనా కార్యక్రమాలు, సమ్మెటివ్, ఫార్మెటివ్ పరీక్షలు కూడా ఒకేసారి జరుగుతాయి. బోధన కార్యక్రమాలతో పాటు బోధనేతర కార్యక్రమాలైన క్రీడలు, ఇతర శిక్షణ కార్యక్రమాలు నిర్ణీత తేదీల్లో ఉండటంతో జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణ సులభతరమవుతుంది. విద్యార్థుల కార్యక్రమాలతోపాటు ఉపాధ్యాయులు కూడా అన్ని సొసైటీలకు కలిపి ఒకేచోట శిక్షణ కార్యక్రమాలు చేపడితే నిధుల వ్యయం కూడా కలసి వస్తుందని భావించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. -
108లో ఆక్సిజన్ లేక రోగి మృతి
పిఠాపురం : 108 వాహనాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి కారణంగా మరో నిండు ప్రాణం బలైపోయింది. వాహనంలో ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. బాధిత కుటుంబీకులు చెప్పిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణం ఇందిరా కాలనీకి చెందిన కూరపాటి చిన గంగరాజుకు భార్య చింతాలమ్మ, ఇద్దరు కుమారులున్నారు. ఆయన కొంతకాలం కిందట అనారోగ్యానికి గురయ్యాడు. కోలుకున్నాక వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున గంగరాజు ఊపిరి ఆడక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఇది గమనించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం మెరుగుపడడంతో ఇంటికి తీసుకువచ్చారు. ఇంతలో శుక్రవారం ఉదయం మళ్లీ అదే పరిస్థితి ఎదురవగా ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, అప్పటికే శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. 108లో అయితే ఆక్సిజన్ ఉంటుందని భావించి ఫోన్ చేశారు. అది రాగానే ఆక్సిజన్ను వెంటనే పెట్టాలని అభ్యర్థించగా.. రెగ్యులేటర్ పనిచేయడంలేదని సిబ్బంది చెప్పారు. దీంతో ఆక్సిజన్ లేకుండానే అందులో తరలిస్తుండగా మార్గమధ్యంలో గంగరాజు మృతిచెందాడు. ఆక్సిజన్ ఉండి ఉంటే మృతిచెంది ఉండేవాడు కాదని బంధువులు రోదిస్తూ చెప్పారు. కాగా, గత కొన్ని రోజులుగా ఆక్సిజన్ ఉపయోగించే రెగ్యులేటర్ పనిచేయడంలేదని, మరమ్మతుల కోసం పై అధికారులకు సమాచారం ఇచ్చామని 108 సిబ్బంది వివరించారు. మరమ్మతులు కాకపోవడంవల్లే ఆక్సిజన్ అందించలేక పోయామన్నారు. -
భూ మార్పిడికి రైతుల మొగ్గు!
సాక్షిప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని చూసిన తర్వాత అన్నదాతల ఆలోచనలు మారుతున్నాయి. వ్యవసాయ భూమి ఉండటం ఎంత లాభదాయకమో ఇప్పుడు వారికి తెలిసివస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో వివిధ కారణాల వల్ల వ్యవసాయ భూములను వ్యవసాయేతర వినియోగం (నాన్ అగ్రికల్చరల్ / నాలా) కోసం మార్పిడి చేసుకున్న రైతులు ఇప్పుడు తిరిగి అవే భూములను వ్యవసాయ భూములుగా మార్చాలంటూ రెవెన్యూ ఉన్నతాధికారులను కోరుతున్నారు. నాన్ అగ్రికల్చరల్ భూమిని అగ్రికల్చర్ భూమిగా మార్చుకునేందుకు పలువురు పట్టాదారులు ముందుకు వస్తున్నారు. గతంలో కంపెనీల నిర్మాణం, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమనో ముందుగానే అగ్రికల్చర్ భూములను నాన్ అగ్రికల్చర్ భూములుగా మార్పిడి చేసుకున్నారు. దీనికోసం ఆయా రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే ఆ భూములు నాన్ అగ్రికల్చర్ భూములుగా మారిపోయాయి. ప్రస్తుతం ఆ భూముల్లో కంపెనీల నిర్మాణం చేపట్టకపోవడంతో పాటు, మరికొన్ని భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేయకపోవడంతో చాలా ప్రాంతాల్లో అలాగే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం పేర ఎకరాకు సంవత్సరానికి రూ.8 వేల చొప్పున గత ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు ఆర్థిక సాయం అందజేసింది. ప్రస్తుతం ఆ మొత్తాన్ని ప్రభుత్వం రూ.10 వేలకు పెంచింది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి పెంచిన డబ్బులు అందనున్నాయి. ఎకరాకు ఒక సీజన్కు రూ.5 వేల చొప్పున సంవత్సరానికి రూ.10 వేలు రైతుకు అందనున్నాయి. దీంతో పాటు గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతు సాధారణ మరణం పొందినా రూ.5 లక్షల బీమా సౌకర్యం వర్తిస్తోంది. రైతుల పిల్లలకు అగ్రికల్చర్ బీఎస్సీ సీట్లలో (పాస్ పుస్తకాలు ఉన్నవారికి ) రిజర్వేషన్ అవకాశం కూడా ఉంది. అదే మాదిరిగా, బంగారు రుణాలపై కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు పెట్టి పొందితే తక్కువ వడ్డీకే రుణాలు అందుతున్నాయి. వాటితో పాటు పంట రుణాలు కూడా బ్యాంకుల నుంచి అతితక్కువ వడ్డీకి వస్తున్నాయి. ఇలా.. వ్యవసాయ భూమి ఉన్న రైతులు ఎన్నో ప్రయోజనాలను పట్టాదారు పాస్ పుస్తకాలతో పొందుతున్నారు. దీంతో పలువురు రైతులు తిరిగి తమ ‘నాలా’భూములను రద్దు చేయించుకుని వ్యవసాయ భూములుగా మార్చుకునేందుకు ముందుకు వస్తున్నారు. నష్టపోతున్న ‘నాలా’యజమానులు కంపెనీల నిర్మాణం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తమ వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకున్న వారు తాము నష్టపోతున్నామన్న భావనకు వచ్చారు. అగ్రికల్చర్ భూమిని నాన్ అగ్రికల్చర్ భూమిగా ఒక సారి మారిస్తే.. ఇక, ఆ భూములకు పట్టాదారు పాస్పుస్తకాలు ఉండవు. పైగా ప్రభుత్వం వ్యవసాయ భూములకు అందించే ఎలాంటి పథకాలు కూడా ఆ యజమానులకు వర్తించవు. నాన్ అగ్రికల్చర్ భూముల్లో పరిశ్రమలు నెలకొల్పితే ఆ పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వం నుండి సబ్సిడీ పొందే అవకాశం ఉంది. కానీ అవి ఏర్పాటు చేయని కారణంగా ఇటు సబ్సిడీ రాకపోవడంతో పాటు వ్యవసాయదారులకు ఇచ్చే పథకాలు కూడా వర్తించకపోవడంతో వారు పునరాలోచనలో పడుతున్నారు. దీంతో అగ్రికల్చర్ భూములను నాన్ అగ్రికల్చర్ భూములుగా మార్చుకున్నవారు తిరిగి వ్యవసాయ భూములుగా మార్చుకునేందుకు ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకుంటున్నారు. సీసీఎల్ఏకు దరఖాస్తులు నల్లగొండ జిల్లా కనగల్ మండలం చర్లగౌరారం శివారులో గట్టు పద్మావతి, యాపాల వెంకట్రెడ్డి అనే ఇద్దరు భూ యజమానుల పేర సర్వే నంబర్ 254లో ఆరున్నర ఎకరాల భూమి ఉంది. గతంలో అక్కడ బయోగ్యాస్ ప్లాంట్ కోసం తమ వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పిడిచేసుకున్నారు. కానీ, అక్కడ ఆ ప్లాంటును నెలకొల్పలేదు. ఫలితంగా ఆ భూమి నాన్ అగ్రికల్చరల్ భూమిగానే కొనసాగుతోంది. దీంతో వీరు అగ్రికల్చర్ భూమిగా మార్చుకునేందుకు సీసీఎల్ఏకు దరఖాస్తు చేసుకున్నారు. వీరే కాకుండా.. వివిధ మండలాల నుంచి నాన్ అగ్రికల్చర్ భూమిని అగ్రికల్చర్ భూమిగా మార్చా లంటూ ఏడాది కాలంగా రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారని జిల్లా రెవెన్యూ అధికార వర్గాలు చెబుతున్నాయి. నాన్ అగ్రికల్చర్ భూముల్లో రైతులు వ్యవసాయం చేసుకోవాలనుకున్నా.. ప్రభుత్వం ఇచ్చే ఉచిత విద్యుత్ను కూడా వాడుకునే అవకాశం ఉండదు. ప్రత్యేక చట్టంచేయాల్సిందే అగ్రికల్చర్ భూమిని నాన్ అగ్రికల్చర్ భూమిగా మార్చేందుకు మాత్రమే చట్టం ఉందని, కానీ.. నాన్ అగ్రికల్చర్ భూమిని తిరిగి అగ్రికల్చర్ భూమిగా మార్చేందుకు చట్టం లేదని, దీనికోసం కొత్త చట్టం చేయాల్సిందేనని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు దరఖాస్తులు పెట్టుకుంటున్నారని, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని అధికారవర్గాలు చెప్పాయి. తాజాగా కొందరు సీసీఎల్ఏకు దరఖాస్తు చేసుకోగా అక్కడినుంచి నల్లగొండ కలెక్టరేట్కు వచ్చిన దరఖాస్తులకు సంబంధించి కూడా అన్ని వివరాలను సీసీఎల్ఏకు రాసి తిరిగి పంపుతున్నట్లు రెవెన్యూ వర్గాలు చెప్పాయి. -
విద్యుత్ డిమాండ్ 14,500 మెగావాట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా భారీగా పెరగనుంది. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా 100 టీఎంసీల నీటిని తరలించి వచ్చే ఖరీఫ్లో కనీసం 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు తొలిసారిగా సాగునీటిని సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ లక్ష్యం మేరకు పనులు సమయానికి పూర్తయితే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంట పొలాలకు గోదావరి జలాలను ఎత్తిపోయడానికి పెద్ద ఎత్తున విద్యుత్ అవసరం కానుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న చిన్నాచితక ఎత్తిపోతల పథకాలకు 1,080 మెగావాట్ల విద్యుత్ను రాష్ట్ర విద్యుత్ సంస్థ (డిస్కం)లు సరఫరా చేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే అదనంగా 600–2,600 మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది. ఈ ప్రాజెక్టు నుంచి నీటి తరలింపు ప్రారంభం కానున్న నేపథ్యం లో వచ్చే జూలై నుంచి రాష్ట్ర విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరుగుతూ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వచ్చే సరికి రికార్డు స్థాయిలో 14,500 మెగావాట్లకు ఎగబాకనుందని రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్కో) అంచనా వేసింది. మార్చి 4న ఏర్పడిన 10,501 మెగావాట్ల విద్యుత్ డిమాండే ఇప్పటివరకు రాష్ట్ర అత్యధిక విద్యుత్ డిమాండ్కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బకు వచ్చే జూలైలో ఈ రికార్డు కనుమరుగు కానుంది. జూలైలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 12,000 మెగావాట్లకు చేరనుంది. బోరు బావుల కింద పంటల సాగు లేకపోవడంతో ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ డిమాండ్ రోజుకు సగటున 8,200 మెగావాట్లకు తగ్గిపోయింది. జూలై నుంచి బోరు బావుల కింద ఉన్న ఆయకట్టుతోపాటు కాళేశ్వరం కొత్త ఆయకట్టుకు నీటి సరఫరా ప్రారంభం కానున్న నేపథ్యం లో రాష్ట్ర విద్యుత్ డిమాండ్ అమాంతం పెరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్ సరఫరా చేయండి.. వచ్చే జూలై నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంటలకు సాగునీటి సరఫరా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యుత్ సంస్థలకు నీటిపారుదలశాఖ విజ్ఞప్తి చేసింది. భక్త రామదాసు, దేవాదుల, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, ఎల్లంపల్లి తదితర ఎత్తిపోతల పథకాలకు ఇప్పటికే విద్యుత్ సంస్థలు గరిష్టంగా 1,080 మెగావాట్ల వరకు విద్యుత్ను సరఫరా చేస్తున్నాయి. కాళేశ్వరం ఎత్తిపో తల కోసం అదనంగా 600–2,600 మెగా వాట్ల విద్యుత్సరఫరా చేయాలని నీటిపారుదలశాఖ కోరింది. ఈ ప్రాజెక్టుకు ఏ నెలలో ఎంత విద్యుత్ అవసరమన్న లెక్కలను అందించింది. ఈ మేరకు విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధమవుతున్నామని తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి. ప్రభాకర్రావు ‘సాక్షి’కి తెలిపారు. వచ్చే జూలై నుంచి అదనంగా 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు టెండర్ల ను పిలిచామన్నారు. నిర్మాణంలో ఉన్న 1,080 మెగావాట్ల భద్రాద్రి విద్యుత్ కేంద్రం నుంచి డిసెంబర్ నాటికి విద్యుదుత్పత్తి ప్రారంభం కానుందన్నారు. డిస్కంలపై తీవ్ర ఆర్థిక భారం! కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కోసం డిస్కంలు ముందస్తుగా భారీ ఎత్తున విద్యుత్ను సమీకరించి పెట్టుకుంటున్నాయి. ఇందుకోసం రూ. వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తి కాకపోయినా లేక ఈ ప్రాజెక్టు కోసం సమీకరించిన విద్యుత్ను పూర్తిగా వాడుకోవడంలో విఫలమైనా డిస్కంలు భారీగా నష్టపోనున్నాయి. డిస్కంలు మరింత సంక్షోభంలో కూరుకుపోనున్నాయి. థర్మల్, సోలార్, జల విద్యుత్ ప్లాంట్లు కలిపి రాష్ట్రం ఇప్పటికే దాదాపుగా 16,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే 9,000 మెగావాట్ల సామర్థ్యంగల థర్మల్ విద్యుత్ ప్లాంట్లను మినహాయిస్తే జల, సౌర విద్యుత్ ప్లాంట్ల నుంచి ఎప్పడు అవసరముంటే అప్పుడు విద్యుదుత్పత్తి చేసుకొని వాడుకోవడానికి అవకాశం లేదు. రాష్ట్రంలో 3,700 మెగావాట్ల సామర్థ్యంగల సౌర విద్యుత్ కేవలం పగటి వేళల్లోనే ఉత్పత్తి అవుతుంది. 2,441 మెగావాట్ల సామర్థ్యంగల జల విద్యుదుత్పత్తి కేంద్రాలున్నా ఆయా జలాశయాల్లో సరిపడా నీటి నిల్వలున్నప్పుడే జలవిద్యుదుత్పత్తికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా కాళేశ్వరం ప్రాజెక్టు అవసరాలను తీర్చడానికి వచ్చే జూలై నుంచి మరో 1,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ను డిస్కంలు కొనుగోలు చేయనున్నాయి. -
వైఎస్సార్సీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేశాం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్ నిజమేనని హైకోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. టెలిగ్రాఫ్ చట్టం 1885లోని సెక్షన్ 5(2)ను అనుసరించే ఆ పని చేశామని తెలిపింది. దీనిపై స్పందించిన హైకోర్టు, ఈ వివరాలను కౌంటర్ రూపంలో లిఖితపూర్వకంగా తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ ఉప్మాక దుర్గా ప్రసాద్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తనతో పాటు తమ పార్టీకి చెందిన నాయకుల ఫోన్లను అధికార పార్టీ కోసం పోలీసులు ట్యాపింగ్ చేస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ పార్టీకి చెందిన ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారో జాబితాను సమర్పించేలా కేంద్ర హోంశాఖ కార్యదర్శి, టెలి కమ్యూనికేషన్స్ కార్యదర్శి, వోడాఫోన్ ఏపీ, తెలంగాణ నోడల్ ఆఫీసర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. అలాగే డీజీపీ ఠాకూర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటెలిజెన్స్ డీజీలను టెలిగ్రాఫ్ చట్టం కింద ప్రాసిక్యూట్ చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, ఏఏ సందర్భాల్లో ట్యాపింగ్ చేయవచ్చో సెక్షన్ 5(2) చెబుతోందని, ఇదే విషయంపై సుప్రీంకోర్టు సైతం స్పష్టమైన తీర్పునిచ్చిందని గుర్తు చేసింది. దీనికి ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, సెక్షన్ 5(2)ను అనుసరించే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పారు. తాము చట్ట ప్రకారమే నడుచుకున్నామని వివరించారు. అయితే ఈ వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఎస్పీ ఇంటెలిజెన్స్, విజయవాడ పేరు మీద గత వారం తమకు ఇచ్చిన సీల్డ్ కవర్ను వెనక్కి ఇచ్చేస్తున్నామని ధర్మాసనం ఏజీకి చెప్పింది. ఆ సీల్డ్ కవర్ను కోర్టు వద్ద ఉంచుకున్నా తమకు అభ్యంతరం లేదని ఏజీ చెప్పగా, ప్రస్తుతం ఆ వివరాలతో తమకు అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేస్తూ విచారణను జూన్ 6కి వాయిదా వేసింది. సెక్షన్ 5(2) చెబుతోంది ఇదే.. 1.దేశ సమగ్రత, సార్వభౌమత్వం 2. దేశ భద్రత 3.విదేశాలతో స్నేహ సంబంధాలు 4. పబ్లిక్ ఆర్డర్ 5.నేర ప్రేరేపణను నిరోధించడం. ఈ ఐదు సందర్భాల్లో మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చునని టెలిగ్రాఫ్ చట్టం చెబుతోంది. ఈ సందర్భాలు మినహా మిగిలిన ఏ సందర్భాల్లోనూ ఫోన్ ట్యాప్ చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పీయూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్పష్టమైన తీర్పునిచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఈ ఐదు సందర్భాలను అనుసరించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు చెబుతోంది. కాని వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ నెంబర్తో పాటు ఇతర వైఎస్సార్సీపీ నేతల ఫోన్ నెంబర్లను కూడా ఉగ్రవాదుల జాబితాలో చేర్చి ట్యాప్ చేయాలని వోడాఫోన్ కంపెనీకి ప్రభుత్వం ఇచ్చింది -
ఇచ్చట ‘మీసేవ’ తిరస్కరించబడును!
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడుకు చెందిన రైతు శివప్రసాద్రెడ్డికి వారసత్వంగా వచ్చిన భూమి ఉంది. ఒక సర్వే నంబరు వెబ్ల్యాండ్లో నమోదు కాకపోవడంతో మీసేవలో దరఖాస్తు చేసుకున్నాడు. ముడుపులు ఇవ్వకపోవడంతో ఆయన దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. వైఎస్సార్ జిల్లా పుల్లంపేట మండలానికి చెందిన శంకర్రెడ్డి (బాధితుడి విజ్ఞపి మేరకు పేరు మార్చాం) మ్యుటేషన్ కోసం రెవెన్యూ రికార్డుల్లో తన పేరు నమోదు చేయాలంటూ నిర్దిష్ట రుసుము చెల్లించి అన్ని ఆధారాల జిరాక్స్ కాపీలతో ‘మీసేవ’ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఎలాంటి కారణాలు చూపకుండానే ఆయన దరఖాస్తును తిరస్కరించారు. సంబంధిత అధికారిని కలవగా ముడుపుల కింద కొంత సొమ్ము తీసుకుని మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంత చేసినా ఇప్పటికీ ఆయన పేరుతో మ్యుటేషన్ కాలేదు. సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లుగా తిరస్కరించిన ‘మీసేవ’ దరఖాస్తుల సంఖ్య 71 లక్షలకుపైమాటే. ఒక్కో దరఖాస్తుకు ప్రజలు సగటున రూ.300 చొప్పున చెల్లించినట్లు లెక్క వేసినా 71 లక్షల అర్జీలను తిరస్కరించడం ద్వారా సర్కారు వసూలు చేసిన సొమ్ము రూ.213 కోట్లకు పైమాటే! ఇక బాధితులు నష్టపోయింది దీనికంటే ఎక్కువే ఉంటుంది. పౌరులకు పనులు జరగని మీసేవ అర్జీలతో ఎవరికి ఉపయోగం? అనే ప్రశ్నలు వస్తున్నాయి. మీసేవలో దరఖాస్తు చేసినా మళ్లీ సంబంధిత కార్యాలయాలకు వెళ్లి ముడుపులు చెల్లిస్తే తప్ప పరిష్కారం కావడం లేదు. రెవెన్యూ, పురపాలక శాఖల్లో ఇలాంటి పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. దీంతో ‘ఎందుకొచ్చిన మీసేవ..?’ అంటూ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనం పారదర్శకతకు మారుపేరంటూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకునే ‘మీసేవ’ తిరస్కరణ సేవగా మారింది. భూముల మ్యుటేషన్, కొలతలు, అదనపు సర్వే నంబరు చేర్పు, వ్యవసాయ ఆదాయ ధ్రువీకరణ పత్రం, భవన నిర్మాణ ప్లాన్ అప్రూవల్ తదితరాల కోసం ‘మీసేవ’ ద్వారా అందే దరఖాస్తులను అధికారులు పెద్ద ఎత్తున తిరస్కరిస్తూ చెత్తబుట్టలో పడేస్తున్నారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మీసేవ తిరస్కరణ అర్జీలు 71 లక్షలు దాటిపోవడం సర్కారు నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. గడువుదాకా పట్టించుకోని సిబ్బంది.. ఏ పని కావాలన్నా లంచాలు చెల్లించాల్సిన పనిలేదని, నిర్దిష్ట రుసుము కట్టి మీసేవ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకుంటే చాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలు ఉత్త డొల్ల అనేందుకు ప్రభుత్వ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్న పౌరులే నిదర్శనం. ఏ శాఖల కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా సమస్యలు తీరలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీసేవలో దరఖాస్తు ఇచ్చినా పట్టించుకునే దిక్కులేక గ్రీవెన్స్సెల్లో అర్జీలు ఇస్తున్నారు. మీసేవ ద్వారా అందే అర్జీలను చాలామంది సిబ్బంది నిర్దిష్ట గడువు వరకు పట్టించుకోకుండా తీరా రెండు మూడు రోజుల ముందు చిన్న చిన్న కారణాలతో తిరస్కరిస్తున్నారు. కొంతమంది సిబ్బంది కనీసం కారణం కూడా చూపకుండానే పక్కన పడేస్తున్నారు. పక్కవారికి పంపితే పరిష్కారమైనట్లా? కొందరు సిబ్బంది తమ వద్దకు వచ్చే అర్జీలను ఇతర ఉద్యోగుల వద్దకు పంపుతూ పరిష్కారమైనట్లు జాబితాలో చేర్చేస్తున్నారు. దీనివల్ల పరిష్కారమైన అర్జీలు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ తంతును చూసి ఉన్నతాధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో వినతులను తిరస్కరించడం దారుణమైతే, ఫైలును పక్క ఉద్యోగికి పంపి పరిష్కారమైనట్లు నమోదు చేయడం మరీ ఘోరమని పేర్కొంటున్నారు. ‘ఈ పరిణామాలు ఏమాత్రం సరికాదు. సరైన కారణాలు చూపకుండా కొందరు, అసలు కారణం పేర్కొనకుండానే మరికొందరు వినతులను తిరస్కరిస్తున్నట్లు నా దృష్టికి కూడా వచ్చింది. నిర్దిష్ట సమయంలో దరఖాస్తు పరిష్కరించకుంటే సంబంధిత ఉద్యోగి పేరు రికార్డుల్లో నమోదవుతుంది. దీని నుంచి తప్పించుకునేందుకు దురుద్దేశపూర్వకంగా తిరస్కరిస్తున్నారని గుర్తించాం. ఇలా జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంది’ అని స్పెషల్ ఛీప్ సెక్రటరీ స్థాయి అధికారి ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. చేతి చమురు వదులుతోంది ‘మీసేవ’ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు రుసుములు, సర్వీసు చార్జీల రూపంలో రూ.వందల్లో చెల్లిస్తున్నారు. అయితే దరఖాస్తుతో పని అయిపోతుం దనుకుంటే పొరపాటే. మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తుకు జత చేసిన పత్రాలు స్పష్టంగా లేవంటూ, జిరాక్స్ కాపీలు ఇవ్వాలని ప్రభుత్వ కార్యాలయాల నుంచి సమాధానం వస్తోంది. దీనికి మరికొంత సొమ్ము చెల్లించాలి. ఇలా మీసేవలో దరఖాస్తు చేసుకుంటే ఒక్కో అర్జీకి సుమారు రూ. 400 దాకా చేతి చమురు వదులుతోంది. ఇవీ ‘మీసేవా’ గణాంకాలు... - 2014 జూన్ నుంచి ఇప్పటివరకు రెవెన్యూ వెబ్సైట్ వెబ్ల్యాండ్లో అదనపు సర్వే నంబరు చేర్పు కోసం 2,41,447 వినతులు రాగా 1,57,365 అర్జీలను తిరస్కరించారు. 82,557 దరఖాస్తులను మాత్రమే అధికారులు ఆమోదించారు. - వ్యవసాయ ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం 69,274 మంది దరఖాస్తు చేసుకోగా 50,913 అర్జీలను ఆమోదించారు. 17,576 వినతులను తిరస్కరించి చెత్తబుట్టలో పడేశారు. - 500 చదరపు అడుగులలోపు ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో కట్టడాల క్రమబద్ధీకరణ కోసం 32,056 అర్జీలు రాగా 3,562 వినతులను మాత్రమే ఆమోదించారు. 20361 దరఖాస్తులను తిరస్కరించారు. - ఆక్రమిత ప్రభుత్వ భూమిలో కట్టడాల క్రమబద్ధీకరణ కోసం 73,783 వినతులు రాగా 3401 అర్జీలు మాత్రమే ఆమోదం పొందాయి. 70,382 దరఖాస్తులను తిరస్కరించారు. - ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం 8,60,440 దరఖాస్తులు రాగా 6,20,070 అర్జీలను ఆమోదించారు. 2,25,711 వినతులు తిరస్కరించారు. - కంప్యూటరైజ్డ్ అడంగల్లో కరెక్షన్ కోసం 40,74,721 వినతులు రాగా 26,97,255 మాత్రమే ఆమోదం పొందాయి. మిగిలిన 13,37,732 అర్జీలు చెత్తబుట్టపాలయ్యాయి. -
రమణీ లలామ..నవలావణ్య సీమ ..
సాక్షి, కొత్తగూడెం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో ఆదివారం శ్రీ సీతారామచంద్రుల వారి కల్యాణం అత్యంత వైభవోపేతంగా జరిగింది. శ్రీరామ.. జయరామ... జయజయ రామ.. నామస్మరణతో భద్రగిరి మార్మోగింది. అర్చకస్వాముల వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ మిథిలా స్టేడియంలో నయనానందకరంగా సాగిన స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తులు పులకించిపోయారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కల్యాణ క్రతువు మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగింది. సీతారాములు ఆశీనులైన మిథిలా స్టేడియం వైకుంఠాన్ని తలపించింది. అర్చకులు తెల్లవారుజామున 2 గంటలకే దేవాలయం తలుపులు తెరిచి స్వామి వారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం తిరువారాధన, నివేదన, శాత్తుమురై, మూలవరులకు అభిషేకం, మంగళా శాసనం జరిపించారు. తర్వాత గర్భగుడిలోని మూలమూర్తులకు కల్యాణం నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పల్లకిలో ఆశీనులను చేసి మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ ఊరేగింపుగా మిథిలా స్టేడియానికి తోడ్కొని వచ్చారు. అక్కడ స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని అత్యంత వైభవోపేతంగా జరిపించారు. సీతారాముల కల్యాణోత్సవ విశిష్టతను, భద్రాద్రి ఆలయ క్షేత్ర ప్రాశస్త్యాన్ని, భక్త రామదాసు సేవలను, ఆయన సీతారాములకు చేయించిన బంగారు ఆభరణాల ప్రాశస్త్యాన్ని వేద పండితులు భక్తులకు వివరించారు. సీతమ్మవారికి ఎక్కడైనా మంగళసూత్రాలు రెండే ఉంటాయని, కానీ భద్రాచలంలో మాత్రం మూడు సూత్రాలు ఉంటాయని, రామదాసు చేయించిన సూత్రం ఇక్కడ అదనంగా ఉంటుందని తెలిపారు. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి సీతారాముల కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాయగా, ఈసీ అనుమతితో స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకొచ్చారు. కాగా, సోమవారం మిథిలా స్టేడియం ప్రాంగణంలో స్వామి కల్యాణోత్సవం జరిగిన మండపంలోనే శ్రీరామ మహా పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు జరగనుంది. ప్రభుత్వం తరఫు న గవర్నర్ నరసింహన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. -
బ్యారేజీలే వారధులు
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగు, తాగునీరే కాకుండా బ్యారేజీలపై నుంచి వాహనాల రాకపోకలు సాగించడానికి వంతెనల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రూ.80 వేల కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ చేసి పనులను చేపట్టారు. ఇందులో భాగంగా ప్రాజెక్టులోని లింకు–1లోని సుందిళ్ల బ్యారేజీ, అన్నారం పంపుహౌస్, అన్నారం బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణాలతోపాటు మూడు బ్యారేజీలపై మూడు వంతెనల పనులు ఊపందుకుని తుదిదశకు చేరాయి. మేడిగడ్డ బ్యారేజీ పైన ఇలా.. కాళేశ్వరంలో మొదటిదశ గోదావరిపై మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్లు కేటాయించింది. ఎల్ అండ్ టీ సంస్థ నిర్మాణ పనులు దక్కించుకుంది. జయశంకర్ భూపాపలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ నుంచి మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలూకా పోచంపల్లి మధ్య గోదావరిపై అడ్డంగా బ్యారేజీ నిర్మిస్తున్నారు. 1628 మీటర్ల పొడవు, 100 మీటర్ల ఎత్తుతో చేపట్టిన ఈ బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 16.1 టీఎంసీలు. బ్యారేజీ నిర్మాణం పూర్తయితే తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రజలకు ప్రాజెక్టు కమ్ వారధిగా కూడా వాహనాల రాకపోకలకు ఉపయోగకరంగా ఉంటుంది. అన్నారం బ్యారేజీపై: ఈ బ్యారేజీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2,148 కోట్లు కేటాయించింది. వంతెనతోపాటు బ్యారేజీని అఫ్కాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్ధ చేపట్టి గడువులోగా పూర్తిచేసింది. ఈ బ్యారేజీ నీటి నిల్వ సామ ర్థ్యం 11 టీఎంసీలు. మహదేవపూర్ మండలం అన్నారం–మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుందరశాల గ్రామాల మధ్య గోదావరిపై అడ్డంగా 66 గేట్లతో 1270 మీటర్ల పొడవుతో అన్నారం బ్యారేజీని నిర్మించారు. వంతెన ద్వారా జయశంకర్, మంచిర్యాల జిల్లాల గోదావరి తీర ప్రాంతాల ప్రజలకు వారధిగా ఉపయోగపడుతుంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం–మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం జైపూర్ మండలం శివ్వారం గోదావరి నదులపై అడ్డంగా సిరిపురం బ్యారేజీ నిర్మాణం చేపట్టారు. కాళేశ్వరం బ్యారేజీలో భాగంగా నిర్మించే ఈ సుందిళ్ల బ్యారేజీని రూ.1,445 కోట్లతో 1.36 కిలోమీటర్ల పొడవుతో చేపట్టారు. చివరి దశ పనులు జరుగుతున్నాయి. రాకపోకలు ఈ నెల చివరి వరకు ప్రారంభం కానున్నాయి. మం«థని–చెన్నూర్ నియోజకవర్గాలకు బ్యారేజీతోపాటు వంతెన అందుబాటులోకి రానుంది. కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణంతో 3 వారధులు అందుబాటులోకి వస్తున్నాయి. గోదావరి, ప్రాణహితపై ప్రజలకు ఐదు వంతెనలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో మంచిర్యాల, జయశంకర్, పెద్దపల్లి, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. -
జీతం ఎగవేసిన సర్కార్ అల్లాడుతున్న చిరుద్యోగులు
సాక్షి, అమరావతి: వేలాది మంది చిరు ఉద్యోగుల జీవితాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, హోంగార్డులు, అగ్నిమాపక సిబ్బంది, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంస్థలు, గురుకులాలు, సర్వశిక్ష అభియాన్, మోడల్ స్కూల్స్ ఉద్యోగులకు నాలుగు నెలల నుంచి వేతనాలను చెల్లించకుండా నిలుపుదల చేయించారు. ఎన్నికల ముందు తన రాజకీయ, స్వార్ధ ఆర్థిక ప్రయోజనాల కోసం వందల కోట్ల నిధులు ప్రభుత్వ ఖజానా నుంచి మళ్లించేశారు. నాలుగు నెలల నుంచి వేతనాలు అందకపో వడంతో ఆ కుటుంబాల జీవనం దుర్భరంగా తయారయ్యింది. మేము ఏమి తినాలి..ఎలా బతకాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లా పాపలతో పస్తులుండలేక వేతనాల కోసం ఆర్థిక శాఖ చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోందని వాపోతున్నారు. చివరకు ఆర్థిక శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకూ వేతనాలు ఇవ్వకుండా నిలుపుదల చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. నాలుగు నెలలుగా వేతనాల్లేవు.. రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యాసంస్థలు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, సర్వశిక్ష అభియాన్, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా నాలుగు నెలలుగా చంద్రబాబు ప్రభుత్వం వేతనాలు నిలిపేసింది. చివరకు పాఠశాలల పిల్లలకు మధ్యాహ్న భోజనం పథకానికి కూడా నిధులు ఇవ్వకుండా బిల్లులను పెండింగ్లో పెట్టింది. ఎన్టీఆర్ వైద్య సేవలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం లేదు. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) బిల్లులను కూడా చెల్లించకుండా పెండింగ్లో పెట్టారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అధికారులకు ఇప్పుడు అద్దె వాహనాలే ఉన్నాయి. స్వయం ఉపాధి కింద యువత బ్యాంకుల ద్వారా కార్లను కొనుక్కుని ప్రభుత్వ శాఖల్లో అద్దెకు తిప్పుతున్నారు. వీరికి కూడా నాలుగు నెలల నుంచి నెలనెలా చెల్లించాల్సిన బిల్లులు చెల్లించకుండా నిలుపుదల చేశారు. పోలీసులకు టీఏ, డీఏలు బంద్ రాష్ట్రంలో వేల సంఖ్యలో పనిచేస్తున్న పోలీసులకు గత ఎనిమిది నెలల నుంచి డీఏ, టీఏలను నిలుపుదల చేశారు. ఇటీవల ఆ ఎనిమిది నెలల టీఏ, డీఏలను విడుదల చేసినట్లే చేసి తిరిగి ఐదు నెలల డీఏ, టీఏ సొమ్ము రూ.70 కోట్లు ఖజానాకు తీసేసుకున్నారు. కేంద్ర నిధులు రూ.5 వేల కోట్లు మళ్లింపు కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం కేంద్రం విడుదల చేసిన రూ.5,000 కోట్ల నిధులను ఆయా పథకాలకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించేసింది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను కూడా ఇతర అవసరాలకు మళ్లించేసింది. ఉప ప్రణాళిక పనులకు, అవసరాలకు నిధులను విడుదల చేయకుండా ఇతర అవసరాలకు ఆ నిధులను వినియోగిస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు ఫిబ్రవరి జీతం బంద్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఇలా ఉంటే.. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 1.25 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగుల ఫిబ్రవరి వేతనాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదు. సకాలంలో వేతన బిల్లులను సమర్పించలేదనే సాంకేతిక కారణం చూపుతున్నారు. దీనిపై ఉద్యోగులు సమగ్ర ఆర్థిక నిర్వహణ సంస్థ (సీఎఫ్ఎంఎస్)ను ప్రశ్నిస్తే.. ఆ నిధులను ఇతర అవసరాలకు వినియోగించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారంటూ అధికారులు చెబుతున్నారని ఒక ఉద్యోగి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పరిషత్ సీఈవోతో సహా అక్కడ పనిచేసే ఉద్యోగులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా, మండల పరిషత్ల ఉద్యోగులకు వేతనాలు అందకపోవడం గమనార్హం. మార్చి గడిచినా రెగ్యులర్ ఉద్యోగులకు కూడా ఇంకా ఫిబ్రవరి వేతనాలు చెల్లించలేదంటే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి తీరు ఎలా ఉందో అర్దం అవుతోందని ఆ ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. రూ.30 వేల కోట్ల బిల్లులు పెండింగ్ ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎంపిక చేసిన రాజకీయ పరమైన, ప్రభుత్వ కాంట్రాక్టర్లకు చెందిన బిల్లులను మాత్రమే చెల్లిస్తున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ ఎమ్మెల్యేలు, వారి నేతలకు చెందిన బిల్లుల చెల్లింపునకు మాత్రమే ఆర్థిక శాఖకు సీఎం అనుమతి ఇస్తున్నారని ఆ వర్గాలు తెలిపాయి. సాధారణంగా చెల్లించాల్సిన అన్ని రకాలు కలిపి కొన్ని లక్షల బిల్లులకు చెందిన రూ.30 వేల కోట్ల బిల్లులను చెల్లించవద్దంటూ ముఖ్యమంత్రి నిలుపుదల చేయించినట్లు సమాచారం. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్కు విలువ లేకుండా సీఎం చెప్పినట్లుగా ఆర్థిక శాఖ అధికారులు నడుచుకోవడాన్ని అధికార యంత్రాంగం తప్పుపడుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిరోజూ ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడుతూ తనకు కావాల్సిన వారికి, తనకు రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలకు మాత్రమే నిధులు విడుదల చేయించడం గమనార్హం. కోడ్ ఉన్నందున అధికారులతో ఎటువంటి సమీక్షలు నిర్వహించరాదని తెలిసినా.. ముఖ్యమంత్రి శుక్రవారం ఆర్థిక శాఖలోని ముగ్గురు అధికారులను తన ఇంటికి పిలిపించుకుని సమీక్ష నిర్వహించడం చర్చనీయాంశమయ్యింది సీఎంవో, ఆర్థిక శాఖలోని ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎందుకు స్పందించడం లేదో అర్ధం కావడం లేదని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. కాన్పు కోసం మంగళసూత్రం తాకట్టు దేవదాయ శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. దీంతో ఒక ఉద్యోగి తన భార్య కాన్పునకు డబ్బులేకపోవడంతో ఆమె మంగళ సూత్రం తాకట్టు పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. పిల్లల పాలు, ఫీజులకు డబ్బుల్లేవు రెగ్యులర్ పోలీసులతో సమానంగా పనిచేస్తున్న హోంగార్డుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. వారికి ఇచ్చే వేతనాలే చాలా తక్కువ. అలాంటి వారికి మూడు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో ఇంటి అద్దె, పాలు, పిల్లల ఫీజులు వంటి నెలనెలా చేయాల్సిన చెల్లింపులకు డబ్బులేక నానా అవస్థలు పడుతున్నారు.పిల్లల పెళ్లిళ్లు ఇతర సొంత అవసరాల కోసం ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ నిధులను ఉపసంహరించుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతివ్వడం లేదు. కంట్రిట్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) కింద ఉద్యోగుల వాటాను వారి వేతనాల నుంచి మినహాయించుకున్న ప్రభుత్వం.. ఆ సొమ్మును సంబంధిత నిధికి జమ చేయకుండా ఇతర అవసరాలకు మళ్లించేసింది. 2017–18కు సంబంధించిన రూ.200.23 కోట్లను సీపీఎస్ నిధికి ప్రభుత్వం జమ చేయలేదని ‘కాగ్’ పేర్కొంది. -
ఈసీ పరిధిలోకి వచ్చే అధికారుల జాబితా ఇవ్వండి
సాక్షి, అమరావతి: ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం పరిధిలోకి వచ్చే అధికారుల జాబితాను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. విధి నిర్వహణను పక్కన పెట్టేసి అధికార పార్టీ సేవలో తరిస్తున్న ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ చేయడంపై చంద్రబాబు ప్రభుత్వం హైకోర్టులో వేసిన పిటిషన్ను ధర్మాసనం బుధవారం విచారించింది. ఎన్నికల సంఘం ఉత్తర్వులను ఏకపక్షంగా ప్రకటించిందని, తదుపరి చర్యలన్నింటినీ నిలిపేయాలని కోరుతూ జీఏడీ కార్యదర్శి శ్రీకాంత్ బుధవారం అత్యవసరంగా లంచ్మోషన్ రూపంలో హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించేందుకు సిద్ధం కాగానే, మరో న్యాయవాది ఎస్. వివేక్ చంద్రశేఖర్ జోక్యం చేసుకుంటూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఈ బదిలీలు చేసిందని, అందువల్ల ఈ వ్యాజ్యంలో తమ వాదనలు కూడా వినాలని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్రెడ్డి హాజరవుతారని, అందువల్ల విచారణను గురువారానికి వాయిదా వేయాలని కోరారు. ఇందుకు ఏజీ శ్రీనివాస్ అభ్యంతరం తెలిపారు. వారి ఫిర్యాదుతో చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో లేదు ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో ఎక్కడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నామని పేర్కొనలేదని ఏజీ తెలిపారు. ఇంటెలిజెన్స్ డీజీతో పాటు ఇద్దరు జిల్లా ఎస్పీలను బదిలీ చేసిందని కోర్టుకు నివేదించారు. ఎస్పీలు ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తారని, అందువల్ల వారి బదిలీకి ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఇంటెలిజెన్స్ డీజీకి ఎన్నికల సంఘం విధులతో ఏమాత్రం సంబంధం ఉండదని, అందువల్ల ఆయన బదిలీ పైనే తమ అభ్యంతరమని తెలిపారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 28(4) ప్రకారం రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ప్రిసైడింగ్ అధికారి, పోలింగ్ అధికారి, ఈ సెక్షన్ కింద నియమితులైన అధికారులు, ఎన్నికల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన పోలీసు అధికారులంతా ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తేదీ నుంచి ఫలితాలు వెలువడే వరకు ఎన్నికల కమిషన్ డిప్యుటేషన్లో ఉంటారని వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్నికల కమిషన్ పరిధిలోకి వచ్చే అధికారుల జాబితాను ఇవ్వాలని కోరింది. -
ఏపీలో ప్రభుత్వ పనితీరు అధ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని ఓటర్లు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న అంశంగా మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్ సంస్థ తేల్చింది. ఓటర్లు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న అంశాల్లో ఏపీ ప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉందని, ఆయా అంశాల్లో ఓటర్లు ఇచ్చిన స్కోరును బట్టి తేలింది. ఐఐఎం–బెంగళూరు ప్రొఫెసర్ త్రిలోచన్ శాస్త్రి ఈ ఫౌండర్ చైర్మన్గా ఉన్న ఏడీఆర్ సంస్థ దేశవ్యాప్తంగా 2018 అక్టోబరు నుంచి 2018 డిసెంబరు మధ్య కాలంలో 534 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 2,73,487 మంది ఓటర్లను సర్వే చేసింది. ఫలితాలను సోమవారం ఇక్కడ విడుదల చేసింది. పాలనాంశాలకు సంబంధించి ఓటర్ల ప్రాధాన్యతలు, ఆయా అంశాల్లో ప్రభుత్వ పనితీరుపై ఓటర్ల రేటింగ్, ఓటింగ్ ప్రవర్తనపై ప్రభావం చూపే కారకాలు అన్న మూడు అంశాలు తేల్చే లక్ష్యంగా ఈ సర్వే నిర్వహించింది. పాలనకు సంబంధించి మొత్తం 31 ప్రాధాన్యతాంశాలను ఓటర్ల ముందుంచి అందులో మొదటి ఐదు ప్రాధాన్యత అంశాలను గుర్తించాలని ఓటర్లను కోరింది. అలాగే ఆయా అంశాలపై ప్రభుత్వ పనితీరును గుడ్, యావరేజీ, బ్యాడ్ అనే మూడుస్థాయిల స్కేల్పై గుర్తించాలని కోరింది. ఐదు మార్కుల్లో ఐదు మార్కులు ఇస్తే గుడ్ అని, మూడు మార్కులు ఇస్తే యావరేజీ అని, 1 మార్కు వస్తే బ్యాడ్ అని పరామితిని నిర్ధేశించింది. దేశవ్యాప్తంగా అత్యధిక ప్రాధాన్యత లభించిన 10 అంశాల్లో మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, ప్రాథమిక అవసరాలు అందించే వైద్యం, తాగునీరు, రోడ్లు, ప్రజారవాణా.. ఈ ఐదు టాప్–5లో నిలిచాయి. అయితే ఆయా అంశాల్లో ఆయా ప్రభుత్వాల పనితీరుపై ఓటర్లు సంతృప్తిగా లేకపోవడం గమనార్హం. ప్రతి అంశంలోనూ యావరేజీ కంటే తక్కువ మార్కులు సాధించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు అద్వానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓటర్లు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన మూడు అంశాల్లో మెరుగైన ఉపాధి/ఉద్యోగ అవకాశాలు, తాగునీరు, మెరుగైన ఆస్పత్రులు/ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. ఈ మూడు అంశాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అద్వానంగా ఉంది. బిలో యావరేజీ స్కోరు(ఐదింట మూడు మార్కుల కంటే తక్కువ) మాత్రమే దక్కించుకోవడం గమనార్హం. మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అనే అంశాన్ని 46.14 శాతం ఓటర్లు ప్రాధాన్యత కలిగిన అంశంగా ఎంచుకోగా, వారు ప్రభుత్వ పనితీరుకు కేవలం 2.10 మార్కులే ఇచ్చారు. తాగునీటి అంశాన్ని 45.25 శాతం మంది ఓటర్లు ప్రాధాన్యతాంశంగా ఎంచుకోగా.. ఆ అంశంలో ప్రభుత్వ పనితీరుపై కేవలం 2.04 మార్కులు మాత్రమే ఇచ్చారు. మెరుగైన ఆస్పత్రులు/ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంశాన్ని 31.40 శాతం మంది ప్రాధాన్యత అంశంగా ఎంచుకోగా.. ఈ అంశంలో ప్రభుత్వ పనితీరుపై కేవలం 2.72 స్కోరు మాత్రమే దక్కించుకుంది. ఏ ఒక్క అంశంలోనూ ప్రభుత్వం యావరేజీ స్కోరును కూడా అందుకోలేదు. ఏపీ గ్రామీణం ఇలా.. పట్టణ ప్రాంతాలు అలా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత ఓటర్లు అత్యంత ప్రాధాన్య అంశాలుగా మూడింటిని ఎంచుకున్నారు. 48 శాతం మంది సాగునీటి లభ్యత, 46 శాతం మంది వ్యవసాయ సబ్సిడీలు(విత్తనాలు, ఎరువులకు), 44 శాతం మంది వ్యవసాయానికి విద్యుత్తు అనే అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే వీరు ఆయా అంశాల్లో ప్రభుత్వానికి ఇచ్చిన మార్కులు యావరేజీ కంటే తక్కువ. మొదటి అంశానికి 2.13 మార్కులు, రెండో అంశానికి 1.99 మార్కులు, మూడో అంశానికి 2.19 మార్కులు ఇచ్చారు. ఇక పట్టణ ప్రాంతంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన మూడు అంశాల్లో మెరుగైన ఉపాధి/ఉద్యోగ అవకాశాలు, తాగునీరు, నీరు, కాలుష్యం. 58 శాతం మంది ఓటర్లు ప్రాధాన్యతగా ఎంచుకున్న మెరుగైన ఉపాధి అవకాశాలు అనే అంశంలో ప్రభుత్వ పనితీరుకు 2.13 మార్కులు ఇచ్చారు. 55 శాతం మంది ఓటర్లు ప్రాధాన్యత అంశంగా ఎంచుకున్న తాగునీటి అంశంలో ప్రభుత్వ పనితీరుకు వారు ఐదు మార్కులకు గానూ 1.91 మాత్రమే ఇచ్చారు. అలాగే నీరు, కాలుష్యం అనే అంశాన్ని 53 శాతం పట్టణ ఓటర్లు ప్రాధాన్యత అంశంగా ఎంచుకోగా.. వారు ఈ అంశంలో ప్రభుత్వ పనితీరుకు 2.19 మార్కులు ఇచ్చారు. ఏ అంశంలోనూ ప్రభుత్వం యావరేజీ స్కోరు కూడా సాధించలేకపోయింది. ఇక ఈ సర్వేలో ఏపీలోని 25 లోక్సభ నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల వారీగా టాప్–3 ప్రాధాన్యత గల అంశాలను ఏడీఆర్ సంస్థ ప్రచురించింది. -
తిరుమల: ఏపీ ప్రభుత్వ వివాదాస్పద నిర్ణయం
సాక్షి, అమరావతి/తిరుమల: కలియుగ ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి నైవేద్యం విషయంలో ఏపీ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ప్రతి సోమవారం మధ్యాహ్న వేళ సమర్పించే నైవేద్యాన్ని ఉదయం ఏడు గంటలకు మార్చింది. దీంతో అప్పటి నుంచి రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో జరిగే నైవేద్యం వరకూ స్వామివారిని 13 గంటలపాటు పస్తు ఉంచుతున్నారు. తిరుమల ఆలయంలో ఉదయం వీవీఐపీ బ్రేక్ దర్శనాలకు వచ్చే వారి సంఖ్య ఇటీవల కాలంలో ముఖ్యంగా సోమవారం బాగా పెరిగిపోతోంది. దీంతో ఎల్–2, ఎల్–3 దర్శనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు శ్రీవారి నైవేద్యం వేళలో కీలక మార్పులు చేస్తూ ఆదివారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. అలాగే ప్రతి సోమవారం స్వామి వారికి మధ్యాహ్న నేవైద్యాన్ని ఉదయం ఏడు గంటలకే పూర్తిచేయాలని అర్చకులను ఆదేశిస్తూ ఆ ఉత్తర్వులో తెలిపింది. ఈ నిర్ణయంపై హిందూ మత ప్రచారకులు మండిపడుతున్నారు. ఇది స్వామి వారికి మహా అపచారం చేయడమే అవుతుందని హెచ్చరిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ మొదలు రాత్రి పవళింపు సేవ వరకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో స్వామివారికి నైవేద్యం సమర్పణ ఉంటుంది. దీనిని త్రికాల నివేదనగా పిలుస్తుంటారు. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ, అర్చన కార్యక్రమాల అనంతరం ఉదయం ఐదున్నర గంటలకు స్వామి వారికి తొలివిడత నైవేద్యం సమర్పిస్తారు. దీనిని ప్రాతఃకాల ఆరాధనగా పిలుస్తారు. తొలి విడత నైవేద్యం అనంతరం వీవీఐపీ బ్రేక్ దర్శనాలు కొనసాగుతాయి. రెండో విడతగా మధ్యాహ్నం మళ్లీ నైవేద్యం సమర్పిస్తారు. మూడో విడతగా రాత్రి 8 గంటలకు జరుగుతుంది. వీవీఐపీ కోటా కింద భారీ సంఖ్యలో ఎల్–2, ఎల్–3 దర్శనాలను మధ్యాహ్నం ఎంతసేపైనా కొనసాగించడానికే ప్రభుత్వం మధ్యాహ్నం నైవేద్యం వేళలలో మార్పులు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారమే ఎందుకంటే.. తిరుమలలో ప్రతి సోమవారం కల్యాణోత్సవ మండపంలో ‘విశేష పూజ’సేవ నిర్వహించాల్సి ఉండటం, అదే రోజు వీవీఐపీ బ్రేక్ దర్శనానికి బాగా డిమాండ్ ఉండటం వంటి కారణాలతో ప్రత్యేకించి సోమవారం స్వామి వారికి మధ్యాహ్న వేళ సమర్పించే నైవేద్య వేళలో మార్పులు తీసుకొచ్చారని చెబుతున్నారు. అలాగే, ఈ ఒక్కరోజు మాత్రం తెల్లవారుజామున తొలి విడత నైవేద్యం అనంతరం ఎల్–1 బ్రేక్ దర్శనాలు కొనసాగించి 7 గంటలకు మధ్యాహ్న నైవేద్యం పూర్తిచేసి ఆ తర్వాత ఎల్–2, ఎల్–3 దర్శనాలను ఎంతసేపైనా కొనసాగిస్తారు. మిగిలిన రోజుల్లో మధ్యాహ్న నైవేద్య కార్యక్రమాలు యథావిధిగానే కొనసాగుతాయి. ప్రభుత్వ తాజా ఆదేశాల కారణంగా ప్రతీ సోమవారం తిరుమలలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఎక్కువసేపు క్యూలలో వేచి ఉండాల్సి వస్తుందని చెబుతున్నారు. అభ్యంతరాలతో ఆగమ సలహా మండలికి సిఫారసు మధ్యాహ్న నైవేద్యం వేళలో మార్పుపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఈ విషయాన్ని పూర్తిస్థాయి పరిశీలనార్ధం ఆగమ సలహా మండలికి సిఫార్సు చేసినట్లు డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. వీరి సలహా వచ్చే వరకు ప్రతి సోమవారం పాత పద్ధతిలోనే మధ్యాహ్న నైవేద్యం నిర్వహిస్తామన్నారు. మరోవైపు.. శ్రీవారి ఆలయంలో ప్రతీ సోమవారం విశేషపూజ నిర్వహణకు తగినంత సమయం కోసం ఆలయ ప్రధాన అర్చకులు, ముగ్గురు ఆగమ పండితులు ఇతర అర్చకుల సలహా మేరకే మధ్యాహ్న నైవేద్యాన్ని సోమవారం ఉ.7 గంటలకు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. -
కేంద్ర, రాష్ట్రాల సఖ్యత!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ సంబంధాలు తరచూ వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో సుమారు మూడేళ్ల తర్వాత అంతర్రాష్ట్ర మండలి సమావేశం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరిగే సమావేశానికి సంబంధించి కేంద్ర హోంశాఖ పరిధిలోని అంతర్రాష్ట్ర మండలి సెక్రటేరియట్ ఇప్పట్నుంచే సన్నాహాలు ప్రారంభించింది. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర–రాష్ట్రాలకు ఉండే హక్కులకు సంబంధించి ఏకీకృత విధానం రూపొందించడంపై దృష్టి సారించింది. అయితే మండలి సమావేశం ఏకపక్షంగా జరపకూడదనే ఉద్దేశంతో ఎజెండా రూపకల్పనకు వీలుగా అంతర్రాష్ట్ర మండలిలో ప్రస్తావించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా మండలి సెక్రటేరియట్ రాష్ట్రాలను కోరింది. అయితే తాము చర్చకు ప్రతిపాదించే అంశాలకు మద్దతుగా అవసరమైన పత్రాలను కూడా జత చేయాలని సూచించింది. కొత్త ట్రిబ్యునల్ లేదు.. జాతీయ హోదా రాలేదు... కేంద్ర, రాష్ట్రాల నడుమ ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించేందుకు 1990లో అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటైంది. దీనికి ప్రధాని అధ్యక్షుడిగా ఉంటారు. ప్రస్తుతం మండలిలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలతోపాటు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ తదితరులు సభ్యులుగా మరో 10 మంది కేంద్ర మంత్రులు శాశ్వత ఆహ్వానితులుగా ఉన్నారు. మండలి చివరి సమావేశం 2016 జూలై 16న జరిగింది. ఆ తర్వాత ఎలాంటి సమావేశాలు జరగలేదు. 2016లో జరిగిన భేటీలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొని వివిధ అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా అంతర్రాష్ట్ర నదీ జలవివాదాలపై ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్స్ నిర్ణీత వ్యవధిలో ఇచ్చే విధంగా నిర్ధేశించాలని, కేంద్రం మరింత నిర్ణయాత్మక పాత్ర వహించాలని ఈ భేటీలో కోరారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు సమాన హక్కులు ఉండేలా రాష్ట్ర వాదనలను ట్రిబ్యునల్ తొలి నుంచీ వినాలని, లేనిపక్షంలో కొత్త ట్రిబ్యునల్ వేసి కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయాలని విన్నవించారు. దీంతోపాటే సాగునీటి రంగంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక భారీ పథకానికి కేంద్రం నిధులివ్వాలని కోరిన కేసీఆర్... కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒక దానిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని విన్నవించారు. అలాగే మిషన్ కాకతీయకు ఆర్థిక సాయం, మిషన్ భగీరథకు కేంద్రం పూచీకత్తు వంటి అంశాలను మండలి భేటీలో కేంద్రం ముందుంచారు. కొత్తగా ఏర్పడిన తమ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో నిధులు (ఏటా రూ. 25 వేల కోట్లు) కేటాయించడంతోపాటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు తాము ఖర్చు చేస్తున్న రూ. 30–40 వేల కోట్ల వల్ల రాష్ట్రంపై పడిన ఆర్థిక భారాన్ని కొంతలో కొంత తగ్గించుకోవడానికి ద్రవ్య పరిపతి యాజమాన్య నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) పరిమితిని పెంచాలని అదే భేటీలో కోరారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచితే ప్రభుత్వంపై పడే ఆర్ధిక భారాన్ని తగ్గించుకునేందుకు దోహదపడుతుందని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. దీనిలో కొన్ని అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. అయితే నదీ జలాల విషయంలో మాత్రం సానుకూలత చూపలేదు. ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ప్రకటించలేదు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో కేంద్రంలో కొలువుదీరే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అంతర్రాష్ట్ర మండలి సమావేశం కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ ప్రత్యేక కార్యదర్శి సంజీవ్ గుప్తా ఇటీవల రాష్ట్ర సీఎస్ ఎస్కే జోషీకి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కౌన్సిల్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే అంశాలకు సంబంధించిన పత్రాలతోపాటు ఇతర రాజ్యాంగ, న్యాయపరమైన సమస్యలకు సంబంధించిన వివరాలు పంపాల్సిందిగా లేఖలో కోరారు. పార్లమెంట్ ద్వారా కేంద్రం రూపొందించిన చట్టాలను రాష్ట్రాల్లో అమలు చేయడంలో ఆయా ప్రభుత్వాల సహాయ సహకారాలపై మండలి సమావేశంలో చర్చిస్తామని లేఖలో తెలిపారు. ఈ నేపథ్యంలో మళ్లీ పాత అంశాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఒత్తిడి తెచ్చే అవకాశాలున్నాయి. -
కోడ్ వేళ ‘దేశం’ ఫుడ్ బకెట్స్
సాక్షి, విశాఖపట్నం: గిరిజనుల ఆరోగ్యం..సంక్షేమం కోసం గడచిన ఐదేళ్లలో ఏనాడు పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వేళ ఎన్నడూ లేని ప్రేమ ఒలకబోస్తుంది. మాతా, శిశు మరణాల్లో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందంటూ జాతీయ ఆరోగ్య సంస్థలు ఘోషిస్తున్నా ఇంతవరకు పట్టించుకోలేదు. అయితే ఎస్టీ కుటుంబాల ఓట్లపై కన్నేసిన ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా ఫుడ్ బకెట్ (గిరి ఆహారభద్రత)పేరిట కొత్త పథకాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఆరు రకాల నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. రెండు కేజీల చోడి(రాగి)పిండి, రెండు కేజీల కందిపప్పు, ఒక లీటర్ పామాయిల్, కేజీ చొప్పున ఉప్పు, వేరుశెనగ, బెల్లం పంపిణీ చేయాలని నిర్ణయిస్తూ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పైగా కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత పాత తేదీతో ఈ ఉత్తర్వులు (సర్క్యులర్ నం.ఎంకేటీజీ/ఎం6/ఫుడ్ బాస్కెట్ /2009, డేట్: 27–02–2019) జారీ చేయడం వివాదాస్పదమవుతోంది. రాష్ట్రంలోని సీతంపేట, పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం, చిత్తూరు, కేఆర్ పురం, శ్రీశైలం ఐటీడీఏల పరిధిలోని 77 మండలాల్లో రెండులక్షల 668 ఎస్టీ కుటుంబాలకు ఫుడ్బాస్కెట్ కిట్లు ఇవ్వాలని నిర్ణయించారు. 24 గంటలు తిరక్కుండానే ఆ సంఖ్యను రెట్టింపు చేస్తూ 4,24,335 ఎస్టీ కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈ మేరకు సరుకులను ఆయా మండలాలకు కేటాయిస్తూ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ ఉత్తర్వులు (ఆర్సీ నం.ఎస్వోడబ్ల్యూ 03–21021(32)/1/2018–జీ, సెక్షన్–సీవోటీడబ్ల్యూ, డేటెడ్: 28–02–2019) జారీచేసింది. అయితే 25–02–2019నుంచి 28–03–2019 వరకు ఈ సరుకులను పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీచేయడం విస్మయం కలిగిస్తోంది. ఆగమేఘాలపై పంపిణీకి కసరత్తు.. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లు పౌర సరఫరాల శాఖ డెప్యూటీ తహసీల్దార్లు, రేషన్ డీలర్లతో సమావేశాలు నిర్వహించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆరు రకాల నిత్యావసరాలను చంద్రన్న సంక్రాంతి కానుక సంచి మాదిరిగా నాన్ వోవెన్ కారీ బ్యాగ్లలో పెట్టి పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కొంతమంది అధికారులు ఎన్నికల నిబంధనల కారణంగా పంపిణీ ప్రక్రియకు అభ్యంతరం వ్యక్తం చేయగా.. పాలకులు ఆదేశించారని, అమలు చేయాల్సిందేనంటూ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ కోడ్ ఉల్లంఘనే.. ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ పాత తేదీలతో ఆదేశాలు జారీ చేస్తూ అధికార ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోంది. ఎస్టీ కుటుంబాల పౌష్టికాహారం, సంక్షేమం ముసుగులో ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయడానికి ఇలాంటి చౌకబారు ఎత్తుగడలకు పాలకులు పాల్పడుతున్నారు. ఎన్నికల కమిషన్ తక్షణం స్పందించి పంపిణీని తాత్కాలికంగా నిలుపుదల చేయాలి. –కాండ్రేగుల వెంకటరమణ, సమాచార హక్కు ఉద్యమకర్త, విశాఖపట్నం -
కాపులకు రిక్త హస్తమే!
సాక్షి, అమరావతి: కాపులను రాష్ట్ర ప్రభుత్వం మరోమారు మోసం చేసింది. సబ్సిడీ రుణాలు అంటూ వారాల తరబడి తిప్పుకుని ఇప్పుడు అయోమయంలో పడేసింది. 2018–19 సంవత్సరానికి గాను ఇప్పటి వరకు ప్రకటించిన లక్ష్యంలో 10 శాతం మందికి (6,630) మాత్రమే రుణాలు ఇచ్చింది. గత ఐదు నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు పదేపదే చెప్పడంతో ఆన్లైన్ ద్వారా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. ఎంపీడీవో కార్యాలయాల వద్ద రెండు దఫాలుగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. దరఖాస్తులు చేసుకునేందుకు వారం రోజులు పని మానుకోవాల్సి వచ్చింది. దరఖాస్తుకు కావాల్సిన సర్టిఫికెట్లు తెచ్చుకునేందుకు మరో వారం తిరగాల్సి వచ్చిందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇంత చేస్తే ఎంపిక చేసిన ఎంపీడీవోలు ఇప్పుడు పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఎన్నిసార్లు వెళ్లి అడిగినా నిధులు మంజూరు కాలేదు కాబట్టి తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. కాపుల జీవనోపాధి మెరుగుకు ఈ రుణాలు కార్పొరేషన్ ద్వారా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2018–19 సంవత్సరానికి 68,787 మందికి రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.687.87 కోట్లు కేటాయించారు. అయితే మండల స్థాయిలో ఇంటర్వ్యూల అనంతరం కలెక్టర్లు రాష్ట్రంలో లక్ష్యానికి మించి 73,401 మందిని ఎంపిక చేశారు. వీరి కోసం రూ. 515.38 కోట్లు రుణాలు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఈ మేరకు కాపు కార్పొరేషన్ 73,109 మందికి సబ్సిడీ విడుదల చేసింది. అయితే రుణాలు ఇచ్చింది మాత్రం కేవలం 6,636 మందికి రూ.49.27 కోట్లు మాత్రమే. అంటే ఇంకా 66,973 మందికి రుణాలు ఇవ్వలేదు. వీరందరు ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే వీరికి ఈ సంవత్సరం రుణాలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈరోజు నుంచి ఎన్నికల హడావుడి మొదలైంది. రుణాలు పంపిణీ చేసే పనిలో ఏ అధికారి కూడా ఉండే అవకాశాలు లేవు. ఎన్నికల కోసం శిక్షణ, డ్యూటీ అలాట్మెంట్ వంటి పనుల్లో బిజీగా ఉంటారు. అందువల్ల ఈ సంవత్సరం రుణాలు ఎగ్గొట్టినట్లేనని చెప్పవచ్చు. నిధులు విడుదల కావాల్సి ఉంది సబ్సిడీ రిలీజ్ చేశాం. త్వరలోనే నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఎంపికైన వారందరికీ రుణాలు పంపిణీ చేస్తాం. ఈనెల 15 నుంచి రుణాలు అందించే కార్యక్రమాన్ని ఆయా బ్యాంకులు చేపడతాయి. సబ్సిడీ నగదు నేరుగా బ్యాంకుల్లో జమవుతుంది. అందువల్ల బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చు. – కోట్ల శివశంకర్రావు, ఎండీ, కాపు కార్పొరేషన్. -
అప్పుల్లోనూ అయ్య బాబోయ్!
సాక్షి, అమరావతి: అప్పులు తేవడంలో మంత్రి నారా లోకేశ్.. తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలోనే పయనిస్తున్నారు. మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టాక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ.. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావడంలో ముందంజలో ఉంది. ఈ శాఖలో అమల్లో ఉన్న కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచే ఏటా రాష్ట్రానికి దాదాపు రూ.10 వేల కోట్లు వస్తున్నాయి. వాటితో పాటు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి రూ.1,000–1,500 కోట్ల దాకా కేటాయింపులు జరుగుతుంటాయి. ఈ నిధులూ సరిపోక 2018 ఏప్రిల్ తర్వాత కేవలం ఒక ఏడాది కాలంలోనే ఆ శాఖ బ్యాంకుల నుంచి ఏకంగా రూ.18,850 కోట్లు అప్పులు తెచ్చింది. ప్రభుత్వం నేరుగా అప్పు తీసుకోకుండా.. అప్పు తేవడం కోసమే అన్నట్టుగా శాఖకు అనుబంధంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల పేరుతో అప్పులు తెస్తున్నారు. వాటికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తోంది. ఈ అప్పులన్నీ సాధారణ ఎన్నికలు జరగడానికి ఐదారు నెలల ముందే కావడం గమనార్హం. ఇప్పటికే గ్రామాల్లోని మంచినీటి పథకాలు, రోడ్లు వంటి వాటిని తాకట్టు పెట్టి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలోని కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పుల నగదును.. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ప్రకటించిన పసుపు–కుంకుమ, అన్నదాత సుఖీభవ వంటి కార్యక్రమాలకు మళ్లించారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. – గ్రామీణ రోడ్ల మరమ్మతుల కోసం రూ.1500 కోట్ల అప్పు అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం, కడప జిల్లాల గ్రామీణ ప్రాంతాల్లోని 16 వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న 5,515 లింకు రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని.. వాటికి మరమ్మతుల కోసమంటూ రూ.1,500 కోట్లు అప్పు తీసుకొస్తోంది. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన(పీఎంజీఎస్వై) అమలుకు కేంద్ర ప్రభుత్వం ఏటా రాష్ట్రానికి కేటాయించిన రూ.400 కోట్లను ప్రత్యేకించి ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు ఖాతాలో ఖర్చు పెడతామని.. ఆ ఖాతాల్లో ఉండే నిధులను సెక్యూరిటీగా పేర్కొంటూ ఆ బ్యాంకు నుంచి రోడ్ కార్పొరేషన్ పేరిట రూ.1,500 కోట్లు అప్పుగా తీసుకుంటున్నారు. ఈ అప్పుకు ప్రభుత్వమే గ్యారంటీ ఉంటుందంటూ ఫిబ్రవరి 8న ఉత్తర్వులు వెలువడ్డాయి. – చిన్న చిన్న రోడ్ల నిర్మాణం కోసం రూ.3,800 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో 250 మంది జనాభా ఉండే చిన్న గ్రామాలకు కొత్తగా తారు రోడ్ల నిర్మాణానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రూ.3,800 కోట్లు అప్పు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్లు కూడా పిలిచారు. ఆ అప్పును కూడా చంద్రబాబు ఎన్నికల ముందు ప్రకటించిన హామీల అమలుకు ఖర్చుచేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోందని చెబుతున్నారు. – మంచినీటి పథకాల పేరుతో రూ.12,380 కోట్ల అప్పు ఎన్నికల ముందు ప్రభుత్వం ఏపీ తాగునీటి సరఫరా కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల నుంచి రూ.12,380 కోట్లు తీసుకొస్తోంది. 13 జిల్లాల్లో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా ప్రతి మనిషికీ 55 లీటర్ల చొప్పున నీటి సరఫరా లక్ష్యంగా వాటర్ గ్రిడ్ పథకం చేపడుతున్నట్టు చంద్రబాబు 2014లో ప్రకటించారు. 2015 అక్టోబర్లోనే అధికారుల బృందాన్ని వివిధ రాష్ట్రాల పర్యటనకు పంపడంతో పాటు.. పథకం అమలుకు రూ.22 వేల కోట్ల ప్రణాళికను సిద్ధం చేసింది. నాలుగేళ్లు దీనిపై మౌనంగా ఉన్న సర్కార్.. ఎన్నికల ముందు ఆ ప్రతిపాదనలకు దుమ్ము దులిపి బ్యాంకుల నుంచి రూ.12,380 కోట్ల అప్పులు తీసుకొస్తోంది. మొదట తయారు చేసిన రూ.22 వేల కోట్ల ప్రతిపాదనలను.. రూ.29 వేల కోట్లకు పెంచి, ఎన్నికల ముందు ఇప్పుడు అందులో మొదట దశలో రూ.15,769 కోట్ల పనులు అమలుకు ప్రభుత్వం అనుమతి తెలిపింది. అందుకుగాను పంచాయతీరాజ్ పరిధిలో ఉండే ఆంధ్రప్రదేశ్ మంచినీటి సరఫరా కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల నుంచి రూ.12,380 కోట్ల అప్పులు తీసుకొస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి పథకాలను తాకట్టు పెట్టి ప్రభుత్వం ఇప్పటికే కొంత అప్పు తీసుకుంది. ఆ డబ్బుతో మంచినీటి పథకాల నిర్మాణ పనులు మొదలు పెట్టనే లేదు. కానీ ఆ నిధులను చంద్రబాబు ఎన్నికల పథకాలకు మళ్లించారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు కోసం రూ.1250 కోట్లు అప్పు.. గ్రామాల్లో కరెంటు స్తంభాలకు ఎప్పటి నుంచి ట్యూబ్ లైట్ వీధి దీపాలు వెలుగుతున్నాయి. లోకేశ్ మంత్రి అయ్యాక తనకు అనుకూలంగా ఉండే కొంత మంది కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం గ్రామాల్లో విద్యుత్ స్తంభాలకు ఇప్పుడున్న ట్యూబ్ లైట్లను తొలగించి.. ఎల్ఈడీ బల్బుల ఏర్పాటుకు పూనుకున్నారు. ఒక్కో ఎల్ఈడీ బల్బుకు ఏడాదికి రూ.450 చొప్పున పదేళ్ల పాటు గ్రామ పంచాయతీ గానీ, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేలా కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.1000 కూడా ఖర్చు కాని ఎల్ఈడీ బల్బుకు కాంట్రాక్టరుకు రూ.4,500 చెల్లించాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 12,918 గ్రామ పంచాయతీల్లో 30 లక్షల కరెంట్ స్తంభాలకు ఎల్ఈడీ బల్బుల ఏర్పాటుకు గానూ కాంట్రాక్టర్లకు పదేళ్ల కాలంలో మొత్తం రూ.1,250 కోట్లు అప్పు తెచ్చి చెల్లించాల్సి ఉంటుంది. -
‘ప్రైవేటు’లో కొనడం కోసమే..
సాక్షి, అమరావతి: ముడుపుల కోసం టీడీపీ ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందనేందుకు అతి తక్కువకు లభించే కేంద్ర విద్యుత్ను వదిలేసి.. ‘ప్రైవేటు’ సంస్థలనుంచి అధిక రేటుకు కొనుగోలు చేయడానికి సమాయత్తమవ్వడమే నిదర్శనంగా నిలుస్తోంది. తమకు బకాయిపడ్డ రూ.3,768 కోట్లు చెల్లించిన తర్వాతే విద్యుత్ సరఫరాపై మాట్లాడాలని కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) ఆంధ్రప్రదేశ్కు నోటీసులు పంపినా.. ప్రభుత్వం స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. బకాయిలు చెల్లించేవరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు నోటీసుల్లో పేర్కొంది. ఈ విషయాన్ని గతంలోనే తెలియజేసినా పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కఠిన నిర్ణయం తీసుకోవడం అనివార్యమైందని తెలిపింది. కాగా, ఇంత సీరియస్గా హెచ్చరించినా ఏమాత్రం స్పందించకపోవడం విద్యుత్ వర్గాలనే విస్మయ పరుస్తోంది. ఎన్టీపీసీ విద్యుత్ ఆగిపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని తెలిసింది. కేంద్ర విద్యుత్ నిలిపివేస్తే బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయాలని ఏపీ ప్రభుత్వం ఉన్నతాధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఎన్టీపీపీసీ విద్యుత్ కేంద్రాలైన సింహాద్రి, రామగుండం, కొరిసి, తాల్చేరు, వల్లూరుతో పాటు పలు కేంద్రాల నుంచి రోజుకు 51 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుతోంది. దీని ధర యూనిట్కు రూ.4 మాత్రమే ఉంటుంది. ఇంత చౌకగా లభించే విద్యుత్ను వదులుకుని మార్కెట్లో యూనిట్ రూ.6 కన్నా తక్కువకు ఇవ్వబోమంటున్న ప్రైవేటు విద్యుత్ను కొనుగోలు చేస్తే ప్రభుత్వానికి విపరీతమైన భారమవుతుందని అధికారులు చెప్పినా ఏమాత్రం విన్పించుకోవడం లేదు. ప్రభుత్వ పెద్దలకు అనుకూలమైన విద్యుత్ ఉత్పత్తిదారులు అధిక రేటుకు విద్యుత్ అమ్మేందుకు సిద్ధంగా ఉన్నారు. వీళ్లంతా ముఖ్యమంత్రిని కలిసి మంతనాలు జరిపినట్టు తెలిసింది. ఎన్నికల ఖర్చుల కోసం కొంత ముట్టజెబుతామని చెప్పినట్టు సమాచారం. ఈ కారణంగానే తక్కువగా వచ్చే కేంద్ర విద్యుత్కు పరోక్షంగా అడ్డుపడుతున్నారని తెలిసింది. రాష్ట్రంలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా రోజుకు 190 మిలియన్ యూనిట్లకు విద్యుత్ డిమాండ్ చేరింది. ఇందులో 51 మిలియన్ యూనిట్ల కేంద్ర విద్యుత్ ఆగిపోతే రోజుకు కనీసం నాలుగు గంటల పాటు రాష్ట్రంలో విద్యుత్ కోత విధించాల్సి వస్తుంది. తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు అందలేదని, ఇతర మార్గాల్లో అప్పులు తెచ్చే వరకూ ఎన్టీపీసీకి బకాయిలు చెల్లించలేమని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారులకు ఎలా చెల్లిస్తారని విద్యుత్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. భయపడుతున్న అధికారులు.. చౌకగా లభించే కేంద్ర విద్యుత్ను కాదని, ప్రైవేటు విద్యుత్ కొనుగోలును ప్రభుత్వం ప్రోత్సహించడాన్ని కొంతమంది విద్యుత్ ఉన్నతాధికారులు వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల తామెక్కడ ఇబ్బందుల్లో పడతామోననే భయం వాళ్లను వెంటాడుతోంది. ఇంధనశాఖ ముఖ్య అధికారి ఒకరు ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లపై లోతుగా అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. కొనుగోలు దిశగా అధికారులు నిర్ణయం తీసుకోలేరని, ప్రభుత్వమే దీనిపై వివరణ ఇవ్వాలని ఆయన లేఖ రాయడంపై ముఖ్యమంత్రి కార్యాలయం కాస్తా గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే విద్యుత్ సమన్వయ కమిటీ చేత తీర్మానం చేయించి పంపాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. ఎన్టీపీసీకి బకాయిలు చెల్లించపోవడానికి సరైన కారణాలు చూపించాల్సి ఉంటుందని, ప్రభుత్వం చెప్పినట్టు వింటే చిక్కుల్లో పడతామని అధికారులు భయపడిపోతున్నారు. -
60 వేల మందికి నైపుణ్య శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన(పీఎంకేవీవై) పథకాన్ని కేంద్రప్రభుత్వం మరింత విస్తృతం చేసింది. ఇప్పటివరకు అంశాలవారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి నిపుణులను తయారు చేస్తుండగా తాజాగా ఆసక్తితో కూడిన వృత్తి నైపుణ్యం దిశగా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో అధికసంఖ్యలో యువతకు నైపుణ్యాన్ని పెంపొందించి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు రాష్ట్రాలవారీగా లక్ష్యాలను నిర్దేశించింది. ఇందులో భాగంగా మన రాష్ట్రానికి 60 వేలమంది యువతకు ప్రాధాన్యత, ఆవశ్యకత ఉన్న రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని సూచించింది. ఈ మేరకు కార్మిక, ఉపాధి కల్పన శాఖ చర్యలు మొదలుపెట్టింది. 2020 నాటికి రాష్ట్రానికి నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది. జిల్లాలకు లక్ష్య నిర్దేశాలు కేంద్రం రాష్ట్రాలకు లక్ష్యాలను నిర్దేశించగా వాటి సాధనకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలవారీ లక్ష్యాలను నిర్దేశించింది. ఈ క్రమంలో యువత, అక్షరాస్యత, నిరుద్యోగం తదితర అంశాలను పరిగణిస్తూ ఉపాధి కల్పన శాఖ 33 జిల్లాలకు లక్ష్యాలను ఖరారు చేసింది. ఈ మేరకు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారులకు సమాచారం అందించింది. జిల్లా స్థాయిలో పీఎంకేవీవై అమలు కమిటీ చైర్మన్గా కలెక్టర్, నోడల్ అధికారిగా జిల్లా ఉపాధి కల్పన అధికారి వ్యవహరిస్తారు. పీఎంకేవీవై కింద దాదాపు 275 రకాల వృత్తులకు సంబంధించి శిక్షణలు ఇస్తున్నారు. ఇందులో 200 గంటల నుంచి 1,200 గంటల వరకు కార్మిక నిబంధనల మేరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. నైపుణ్యాభివృద్ధిశిక్షణ కార్యాక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 127 ట్రైనింగ్ పార్ట్నర్లను ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరికి శిక్షణ, తరగతుల నిర్వహణకు ప్రభుత్వం నిబంధనల మేరకు నిధులు విడుదల చేస్తుంది. ఈ ట్రైనింగ్ పార్ట్నర్లు నిరుద్యోగులను ఎంపిక చేసేందుకు జిల్లాలు, డివిజన్ స్థాయిలో కౌశల్ మేళాలు ఏర్పాటు చేస్తారు. అదేతరహాలో రోజ్గార్ మేళాలు నిర్వహించి ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వడం, నైపుణ్యాన్ని మెరుగుపర్చడం లాంటి కార్యక్రమాలు చేపడతారు. అనంతరం శిక్షణ తీసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందిస్తారు. ప్రాధాన్యత రంగాలు, ఉపాధి మెరుగ్గా ఉండే కంపెనీల్లో ఈ అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పించేలా ఉపాధి కల్పన శాఖ చర్యలు తీసుకుంటుంది. -
రాజధానిలో భూమి తీసుకో..అమ్ముకో
సాక్షి, అమరావతి: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే చిప్ డిజైనింగ్ కంపెనీ సాక్ట్రానిక్స్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీల వర్షం కురిపించింది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో నాలుగు అంతస్థుల భవనంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ కంపెనీకి రాజధాని అమరావతిలో 40 ఎకరాల భూమిని కారుచౌకగా కేటాయించింది. రూ.160 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.20 కోట్లకే కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానిలో ఎకరం భూమి ధరను ప్రభుత్వమే రూ.4 కోట్లుగా గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ, సాక్ట్రానిక్స్కు ఎకరం కేవలం రూ.50 లక్షలకే కేటాయిస్తూ హాడావిడిగా ఉత్తర్వులను జారీ చేసింది. విలువైన భూమి కేటాయించడమే కాకుండా పూర్తిగా అమ్ముకోవడానికి లేదా లీజుకు ఇచ్చుకోవడానికి హక్కులు సైతం కల్పించడం గమనార్హం. అమరావతిలో పరిశ్రమ ఏర్పాటు చేస్తామని సాక్ట్రానిక్స్ దరఖాస్తు చేసుకున్న రెండు నెలల్లోనే శరవేగంతో ఫైల్ ముందుకు కదిలింది. ఆ సంస్థకు అత్యంత తక్కువ ధరకే విలువైన భూమిని కేటాయించడమే కాకుండా భారీగా రాయితీలు కల్పించడం ఉన్నతస్థాయి అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. రాజధానిలో వేలం విధానంలోనే ప్రైవేట్ కంపెనీలకు భూ కేటాయింపులు చేయాలని ఏపీసీఆర్డీఏ స్పష్టంగా చెపుతోంది. కానీ, దాన్ని పక్కన పెట్టి సాక్ట్రానిక్స్కు భూ కేటాయింపులు చేయడం గమనార్హం. రాయితీల్లోనే రూ.250 కోట్ల లబ్ధి 2014–2020 ఎలక్ట్రానిక్స్ పాలసీ ప్రకారం లభించే రాయితీలే కాకుండా ఇంకా అదనపు ప్రయోజనాలను కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అదనపు రాయితీల విలువ రూ.250 కోట్లు ఉంటుందని అధికారులు చెపుతున్నారు. కేవలం ఒక్క భూమిపైనే రూ.140 కోట్ల ప్రయోజనం నేరుగా లభించింది. ఇవికాకుండా ప్రాజెక్టు వ్యయంలో 30 శాతం గ్రాంట్గా ఎకారానికి గరిష్టంగా రూ.30 లక్షలతోపాటు అన్ని గ్రాంట్లు కలిపి గరిష్టంగా రూ.50 కోట్లకు వరకు ఇచ్చారు. ఈ విషయాన్ని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాకుండా ల్యాండ్ కన్వర్జేషన్ చార్జీల నుంచి సైతం మినహాయింపు ఇచ్చారు. ఆంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో 54 ఎకరాల్లోనే అతిపెద్ద క్యాంపస్ నిర్మించింది. ఒక చిన్న చిప్ కంపెనీకి రాజధాని అమరావతిలో ఏకంగా 40 ఎకరాలు కేటాయిచండమే కాకుండా, ఇతరులకు అమ్ముకునే హక్కును కూడా కల్పించడం వెనుక ప్రభుత్వ పెద్దల ప్రయోజనాలు దాగి ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
కేసీఆర్కు అండగా మున్నూరు కాపులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం సీఎం కేసీఆర్కు అండగా నిలిచి బంగారు తెలంగాణ నిర్మాణంలో మున్నూరుకాపులు ముందుంటారని తెలంగాణ మున్నూరుకాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పుటం పురుషోత్తం పటేల్ అన్నారు. కులవృత్తులను కాపాడడంతోపాటు వ్యవసాయదారులకు పథకాలను అమలు చేయడంలో తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో మహాసభ రాష్ట్ర కార్యదర్శి మంగళారపు లక్ష్మణ్, కోశాధికారి ఇసంపెళ్లి వెంకన్న తదితరులతో కలసి ఆయన మాట్లాడారు. ముదిరాజ్లు, గొల్ల కుర్మలు తదితర దళిత బహుజన కుల సోదరులు ఒకవైపు తమ కులవృత్తిని కొనసాగిస్తూనే మరోవైపు వ్యవసాయం చేస్తుంటారని, వారి కులవృత్తులతో పాటు వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. అయితే మున్నూరుకాపుల ఏకైకవృత్తి వ్యవసాయమేనని, ప్రభుత్వం తమకు ప్రత్యేక వెసులుబాటు కల్పించి ఆదుకోవాలని కోరారు. మున్నూరుకాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతోపాటు ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు అందజేయాలని కోరారు. హైదరాబాద్లోని మున్నూరు కాపు మహాసభను దేవాదాయ, ధర్మాదాయ శాఖ నుంచి వేరు చేసి, ఆస్తులను మహాసభకే అప్పగించాలని కోరారు. గౌరవాధ్యక్షుడిగా ప్రకాశ్.. తెలంగాణ మున్నూరుకాపు మహాసభ గౌరవాధ్యక్షుడిగా రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్ను ఎన్నుకున్నట్టు పురుషోత్తం తెలిపారు. టీఎస్పీఎస్సీ సభ్యుడు సి.విఠల్, ముఖ్యమంత్రి ప్రజాసంబంధాల అధికారి రమేశ్ హజారీలను మహాసభ గౌరవ సలహాదారులుగా నియమించినట్టు వెల్లడించారు. మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్గా నీల పద్మ, యూత్ విభాగానికి ఆకుల స్వామి పటేల్, ఐటీ విభాగానికి వెలగపల్లి వామన్రావు, కోకన్వీనర్గా అశోక్, ప్రొఫెషనల్ కన్వీనర్గా మామిడి అశోక్లను నియమించినట్లు తెలిపారు. -
పల్లెలకు పచ్చని శోభ
సాక్షి, హైదరాబాద్: పంచాయతీలు పచ్చదనంతో కళకళలాడనున్నాయి. పరిశుభ్రతకు కేంద్రంగా మారనున్నాయి. పల్లెలన్నీ పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. పచ్చదనం, పరిశుభ్రత ప్రధాన అంశాలుగా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 90 రోజుల ప్రణాళికను విడుదల చేసింది. కొత్తగా ఎన్నికైన గ్రామసర్పంచ్లంతా సమగ్ర కార్యాచరణను కచ్చితంగా అమలు చేయాలని, ప్రతి గ్రామంలో కనీసం ఒక నర్సరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సీఎం ఆదేశాలు.. గ్రామపంచాయతీల్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ఇటీవల సీఎం కేసీఆర్ కొన్ని ఆదేశాలిచ్చారు. వీటిని తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోవాలంటూ, జిల్లా కలెక్టర్లు, జెడ్పీపీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ మెమో జారీచేసింది. పచ్చదనం, పరిశుభ్రతకు చర్యలు చేపట్టడంలో భాగంగా గ్రామాల్లోని వీధులు, మురుగుకాల్వల సంఖ్యను బట్టి తగిన సిబ్బందిని కేటాయించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. వీరి ద్వారా రెగ్యులర్గా వీధులు, కాల్వలు శుభ్రం చేయడానికి పంచాయతీ కార్యదర్శి వెంటనే కార్యకలాపాల పట్టిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది. గ్రామపంచాయతీ, సర్పంచ్లతో పాటు ఈఓపీఆర్డీ, ఎంపీడీవోలు ఈ పనులను పర్యవేక్షించాలని సూచించింది. 100 శాతం పన్నుల వసూలు.. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత కల్పనకు 3 నెలల పాటు వివిధ రూపాల్లో చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా 100 శాతం పన్నుల వసూలుపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు ప్రతి గ్రామసర్పంచ్ చర్యలు తీసుకోవాలని సూచించింది. సర్పంచ్లు, వార్డు సభ్యులు నెలకు కనీసం ఒకసారి శ్రమదానం నిర్వహించి, ఇందులో గ్రామస్తులు కొన్ని గంటల పాటు పాల్గొనేలా కార్యక్రమాలు చేపట్టాలి. చేపట్టాల్సిన కార్యక్రమాలు.. - ప్రతి గ్రామంలో కనీసం ఒక కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేసి, చెత్తంతా తీసుకొచ్చి కంపోస్ట్గా మార్చాలి. - గ్రామాల్లోని ప్రతి ఇంటిలో తడి, పొడి చెత్తను విడివిడిగా పెట్టేందుకు వీలుగా గ్రామపంచాయతీ నిధులతో డబ్డాలు సరఫరా చేయాలి. - ఉపయోగించని, పనికి రాకుండా పోయిన అన్ని బోర్వెల్స్ను, ఓపెన్ వెల్స్ మూసేయాలి. - ప్రతి గ్రామ పంచాయతీలో వైకుంఠధామం (శ్మశానం)ఏర్పాటు కోసం తగిన స్థలం ఎంపికచేయాలి. పంచాయతీ భూములను మొదటి ప్రాధాన్యమివ్వాలి. అందుబాటులో లేకపోతే ఏదైనా శాఖకు సంబంధించిన భూమిని జిల్లా కలెక్టర్ కేటాయిస్తారు. ఇవేమి అందుబాటులో లేనపుడు గరిష్టంగా రూ.5 లక్షల వరకు గ్రామపంచాయతీ నిధులు లేదా ఎమ్మెల్యే నిధి, తదితరాల నుంచి కేటాయించవచ్చు. - ఉపాధి హామీ నిధులతో శ్మశానాల నిర్మా ణ పనులు చేపట్టి ఆరు నెలల్లోగా పూర్తిచేయాలి. పట్టణాల్లో మాదిరిగా కనీస సౌకర్యాలు.. నగరాలు, పట్టణాల్లో మాదిరిగా పంచాయతీల్లోనూ పారిశుధ్యం, వీధి దీపాలు, తదితర మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు గ్రామపంచాయతీలకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు తమ విధులు, బాధ్యతలు, అధికారాలు, చట్టంలో పొందుపరిచిన ఆయా అంశాల గురించి పూర్తిస్థాయి అవగాహన సాధించేందుకు జిల్లా స్థాయిల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణను మార్చి నెలాఖరులోగా పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. -
కోడ్లోనూ కీలక నిర్ణయాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. ఈ సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదన్న నిబంధనలను తోసిరాజంటూ సోమవారం సమావేశమైన మంత్రివర్గం పలు నిర్ణయాలకు ఆమోదముద్ర వేయడం గమనార్హం. ముఖ్యంగా బీసీ కులాలకు చెందిన మూడు కార్పొరేషన్లు ఏర్పాటుచేయడంతో పాటు, రూ.10 కోట్ల మూలధనంతో ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం రవాణా సాధికార సంస్థ ఏర్పాటు, 13 మంది హైకోర్టు జడ్జీలకు 600 చదరపు గజాల చొప్పున స్థలాలతో పాటు హైకోర్టు సిబ్బందికి స్థలాలు, అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు చెల్లింపులు, జర్నలిస్టులకు గృహనిర్మాణాలు, సీఆర్డీఏ పరిధిలో 4వ తరగతి ఉద్యోగులకు కూడా స్థలాలను కేటాయిస్తూ నిబంధనల సవరణ, వివిధ నగరాల్లో చేపట్టే గృహ నిర్మాణాలకు స్థలాలు కేటాయిస్తూ అనేక విధానపరమైన నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇవన్నీ గతంలో తీసుకున్న నిర్ణయాలేనని, వీటిని కేవలం మంత్రివర్గంలో రాటిఫికేషన్ మాత్రమే చేశామంటూ మంత్రి కాల్వ వివరణ ఇచ్చారు. కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు.. - ఏపీ ముదిరాజ్/ముత్రాసి/తెనుగోళ్లు సహకార ఆర్థిక సంస్థలు, ఏపీ నగరాలు/నాగవంశ సహకార ఆర్థిక సంఘం, ఏపీ కల్లు, నీరా గీత కార్మిక సహకార ఆర్థిక సంస్థలు ఏర్పాటు. దీంతో పాటు కొత్తగా ఏర్పాటైన 13 బీసీ కార్పొరేషన్లకు మేనే జింగ్ కమిటీలకుమంత్రి మండలి ఆమోదించింది. - రూ.10 కోట్ల మూలధనంతో ఆటో డ్రైవర్లకు, వాహనాల డ్రైవర్లకు డ్రైవింగ్లో అధునాతన శిక్షణకు రవాణా సాధికారిక సంస్థ ఏర్పాటు. - రూ.పదివేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిట్ల చెల్లింపునకు రూ.250 కోట్ల కేటాయింపు. - సింహాచలం భూములకు సంబంధించి అన్ని ఇబ్బందులు పరిష్కరించాలని నిర్ణయం. మంత్రి యనమల నేతృత్వంలో మంత్రుల సంఘం ఈ సమస్యను పరిష్కరించాలి. - రాజధాని అమరావతిలో హైకోర్టు జడ్జీలు, హైకోర్టు పరిధిలో ఉన్న జిల్లా జడ్జీలు, ఇతర జ్యుడీ షియల్ అధికారులు, హైకోర్టు సిబ్బందికి మార్కె ట్ రేటు ప్రకారం ఇళ్ల స్థలాలు కేటాయించాలని మంత్రిమండలి నిర్ణయం.హైకోర్టు జడ్జీలు ఒకొ క్కరికీ 600 చదరపు గజాలు, రిజిస్ట్రార్ జనరల్, రిజిస్ట్రార్ (ఐటీ, జ్యుడిషియల్)కు 500 చదరపు గజాలు, హైకోర్టు గెజిటెడ్ సిబ్బందికి 200 చద రపు గజాలు, హైకోర్టు నాన్–గెజిటెడ్ సిబ్బందికి 175 చదరపు గజాల కేటాయింపు. - రాజధానిలో కొన్ని ప్రత్యేక వర్గాలకు అవకాశం కల్పించేందుకు అమరావతి భూ కేటాయింపు నిబంధనలు–2017కు సవరణ. - నెల్లూరు జిల్లా గృహాల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కేటాయింపు. ఎస్ఆర్క్యూ కోటాతో సహా కేటాయించిన 18,641 ఇళ్లను సామాజికవర్గాల వారీగా ఇవ్వాలని నిర్ణయం. - కృష్ణాజిల్లా మైలవరం మండలం పొందుగల గ్రామంలో 78.2ఎకరాల్లో టౌన్షిప్ అభివృద్ధికి కేబినెట్ నిర్ణయం. - పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పేదల గృహనిర్మాణానికి 4.3 ఎకరాలు, ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో 4.76 ఎకరాల ప్రభుత్వ భూమి స్థానిక సంస్థలకు బదలాయింపు. - తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరంలో 1.65 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు స్థలాన్ని.. రాజమహేంద్రవరం రూరల్ మండలం మోరంపూడి గ్రామంలో 8.97 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్కు బదలాయింపు. ఇక్కడ అఫర్డబుల్ హౌసింగ్ స్కీమ్ కింద గృహ నిర్మాణాన్ని చేపడతారు. ఇదే జిల్లా పెద్దాపురం డివిజన్ వాలు తిమ్మాపురం గ్రామంలో 31.42 ఎకరాల ప్రభుత్వ స్థలం కూడా అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టు నిమిత్తం పెద్దాపురం మున్సిపాల్టీకి బదలాయిస్తూ మంత్రిమండలి నిర్ణయం. - జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణాన్ని ప్రత్యేక కేటగిరిగా తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశం. బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణానికి ఇచ్చినట్టే జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం, సీఆర్డీఏ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇళ్లు సొంతంగా నిర్మించుకునే పరిస్థితిలో జర్నలిస్టులు లేనందువల్ల భూమిని ప్రభుత్వమే తీసుకుని వారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఆదేశాలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలతో కలిపి, అవసరాన్ని బట్టి జర్నలిస్టుల వెల్ఫేర్ ఫండ్ నుంచి కూడా ఇళ్ల నిర్మాణానికి నిధులను వినియోగించుకోవాలని సూచన. రాజధాని భూముల సంతర్పణ సరళతరం రాజధాని కోసం రైతుల నుంచి సేకరించిన భూమిని కారుచౌకగా తనకు నచ్చిన వారికి నచ్చినట్లు కట్టబెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మరింత సరళతరం చేసేలా నిబంధనలను సవరించింది. కేబినెట్ సమావేశంలో రాజధాని భూ కేటాయింపు నిబంధనలు–2017లో చేసిన సవరణలకు ఆమోదం తెలిపింది. రాజధాని ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెంచే పేరుతో, కొన్ని ప్రత్యేక వర్గాలకు సైతం రాజధానిలో అవకాశం కల్పించే ఉద్దేశంతో ఈ సవరణలు చేస్తున్నట్లు పేర్కొన్నా అవన్నీ కార్పొరేట్ కంపెనీలు, రియల్ ఎస్టేట్, వాణిజ్య సంస్థలకు కట్టబెట్టేందుకే ఈ సవరణలు చేసినట్లు స్పష్టమవుతోంది. జడ్జీలు, జ్యుడీషియల్ ఉద్యోగులు, జర్నలిస్టులు మరికొన్ని వర్గాలకు స్థలాలు కేటాయించే ముసుగులో అయిన వారికీ భూములు కట్టబెట్టేందుకు ఈ సవరణలు చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. ఐటీ కంపెనీలు, హెల్త్ సెంటర్లు, మాల్స్ వంటి వాటికి భూములు కట్టబెట్టేందుకు ఈ సవరణలు చేసినట్లు తెలుస్తోంది. తాజా సవరణల ప్రకారం.. కంపెనీలు, సంస్థలు తమకు కేటాయించిన భూములను అభివృద్ధి చేసినా, చేయకపోయినా అమ్ముకునే వీలు కల్పించింది. -
రాజకీయ ప్రత్యర్థులపై.. ట్యాపింగ్ అస్త్రం!
సాక్షి, అమరావతి బ్యూరో : ‘రాష్ట్రంలో ఏం జరుగుతోంది.. ఎలా జరుగుతోంది.. ఎవరేం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియాలి’....ఇదీ రాష్ట్ర పోలీసు బాస్లకు సీఎం చంద్రబాబు డైరెక్షన్. అందుకు ఆయన జపిస్తున్న మంత్రం.. అమలుచేస్తున్న కుతంత్రం ఫోన్ ట్యాపింగ్. అందుకోసం ఆయన ఇంటెలిజెన్స్ విభాగంలో ఓ ఉన్నతాధికారిని ప్రత్యేకంగా నియమించుకుని పోలీసు ఇంటెలిజెన్స్ వ్యవస్థను అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తున్నారు. అసాంఘిక శక్తుల కట్టడికి ఉద్దేశించిన కాల్ ఇంటర్సెప్టర్ వ్యవస్థను తన రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టారాజ్యంగా వాడుకునేందుకు బరితెగిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులు, ఉన్నతాధికారులే టార్గెట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లజ్జగా అడ్డదారులు తొక్కుతోంది. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థులు, ఉన్నతాధికారులతోపాటు సొంత నేతల కదలికలు, ఫోన్ సంభాషణలను ట్యాపింగ్ చేయమని పోలీసు ఉన్నతాధికారులకు ప్రభుత్వ పెద్దలు విస్పష్టమైన ఆదేశాలిచ్చారు. నిబంధనల ప్రకారం ఫోన్ ట్యాపింగ్కు స్పష్టమైన విధివిధానాలున్నాయి. ఉగ్రవాద సంస్థలు, మావోయిస్టు పార్టీలు, ఇతర అసాంఘిక శక్తుల కట్టడికి మాత్రమే పోలీసులు ఆ పనిచేయాలి. ఎవరి ఫోన్లను ట్యాపింగ్ చేయాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఇచ్చి మరీ అమలుచేయాల్సి ఉందని కేంద్ర టెలిగ్రాఫ్ చట్టం చెబుతోంది. కానీ, ఇందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతోందని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఓటుకు కోట్లు కేసు అనుభవంతో.. పక్కా వ్యవస్థను ఏర్పాటుచేసుకుని మరీ రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్ దారుణానికి పాల్పడుతోంది. తీవ్రవాదులు, అసాంఘిక శక్తుల కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ కేంద్రంగా కాల్ ఇంటర్సెప్టర్ వ్యవస్థ ఉండేది. విభజన అనంతరం మన రాష్ట్రంలో ఆ వ్యవస్థను ఏర్పాటుచేయలేదు. 2015లో తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలుకు చంద్రబాబు ప్రయత్నించిన ఉదంతాన్ని ఈ కాల్ ఇంటర్సెప్టర్ వ్యవస్థ ద్వారానే కేసీఆర్ ప్రభుత్వం బట్టబయలు చేసింది. దాంతో ఉలిక్కిపడ్డ రాష్ట్ర ప్రభుత్వం అప్పటికప్పుడు అమరావతిలో ఈ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో మావోయిస్టుల కట్టడికి కాల్ ఇంటర్సెప్టర్ వ్యవస్థను కొనుగోలుకు అనుమతివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్రం అనుమతితో విదేశాల నుంచి భారీ మొత్తం వెచ్చించి ఈ వ్యవస్థను ఏర్పాటుచేసుకుంది. దీని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏటా అప్డేట్ చేయడానికి కూడా పెద్దఎత్తున ఖర్చుచేస్తోంది. మరి ఇంత భారీగా ప్రజాధనాన్ని వెచ్చిస్తూ నిర్వహిస్తున్న కాల్ ఇంటర్సెప్టర్ వ్యవస్థను భద్రతాపరమైన అంశాలకు కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుండటం అందరినీ విస్మయపరుస్తోంది. ట్యాపింగ్తో విజిలెన్స్ దాడులు కూడా.. కాగా, ఇటీవల విశాఖపట్నంతోపాటు పలు ప్రాంతాల్లో టీడీపీ రాజకీయ ప్రత్యర్థుల వ్యాపార సంస్థలపై విజిలెన్స్ దాడులు నిర్వహించి వేధించడం వెనుక కూడా ఫోన్ ట్యాపింగ్ అంశమే ప్రధాన పాత్ర పోషించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో ఇలా మరింతగా అధికార దుర్వినియోగానికి పాల్పడేందుకు ప్రభుత్వం బరితెగించనుందని కూడా ఆ వర్గాలు చెబుతున్నాయి. అస్మదీయ అధికారుల కనుసన్నల్లో.. ఇంటెలిజెన్స్ విభాగాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఇప్పటికే దుర్వినియోగం చేస్తూ వస్తోంది. మరోవైపు.. ఇంటర్సెప్టర్ వ్యవస్థ అజమాయిషీకి ఈ విభాగంలో అస్మదీయ అధికారులను కూడా ఇటీవలే ప్రత్యేకంగా నియమించింది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ విభాగంలో కీలక ఉన్నతాధికారిగా ఉన్న వ్యక్తి ఫక్తు టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలులో ఈయనే క్రియాశీలంగా వ్యవహరించడం తెలిసిందే. తాజాగా రాజకీయ ప్రత్యర్థులు, ఉన్నతాధికారుల ఫోన్ ట్యాపింగ్ కోసం మరో అస్మదీయ అధికారిని ఇంటెలిజెన్స్ విభాగంలో ప్రభుత్వం నియమించింది. ఈ కాల్ ఇంటర్సెప్టర్ వ్యవస్థ కొనుగోలు చేయడంలో ఆయనే క్రియాశీలంగా వ్యవహరించారు. తరువాత ఆయన పలు జిల్లాల్లో విధులు నిర్వర్తించారు. తాజాగా ఆయన్ని మళ్లీ ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీ చేశారు. కాల్ ఇంటర్సెప్టర్ వ్యవస్థ పనితీరు, ఫోన్ ట్యాపింగ్లపై ఆయనకు పూర్తి అవగాహన ఉన్నందునే ఆయన్ని కీలకస్థానంలో నియమించారు. అంతేకాకుండా.. ఫోన్ ట్యాపింగ్, ఇతర సాంకేతిక అంశాలపై అవగాహన ఉన్న నలుగురు అధికారులను కూడా ఆయన పరిధిలోకి తీసుకువచ్చారు. ఆ బృందం ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఇటీవల ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే.. ఎంతో సమర్థుడిగా గుర్తింపు పొందిన ఓ కలెక్టర్ను హఠాత్తుగా అమరావతికి బదిలీ చేశారు. మరో ఐపీఎస్ అధికారిని లా అండ్ ఆర్డర్ నుంచి అప్రధాన పోస్టుకు మార్చారు. -
పథకాలు రూపొందించేటప్పుడే దోపిడీకి ప్లాన్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘రాష్ట్రంలో అవినీతి సంస్థాగతంగా మారిపోయింది. అవినీతిలో రాష్ట్ర ప్రభుత్వం గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించేలా ఉంది. స్కీమ్లు తయారు చేసినప్పుడే ఏ విధంగా దోచుకోవచ్చో ఆలోచిస్తున్నారు. ఇరిగేషన్, ఆర్అండ్బీ పనుల అంచనాలను పెంచేసి, సీఎం దగ్గరి నుంచి నాయకులు, ఉద్యోగుల వరకూ పర్సంటేజీలు పంచుకుంటున్నారు. ఇసుక, మట్టిని కూడా పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు’’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అజేయ కల్లాం ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ‘సేవ్ ఆంధ్రప్రదేశ్–సేవ్ డెమోక్రసీ’ సదస్సు నిర్వహించారు. పలువురు ప్రముఖులు, మేధావులు, ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు, ఇతర పెద్దలు పాల్గొన్న ఈ సదస్సులో అజేయ కల్లాం ప్రసంగించారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ పరంగా 2014 జూలై నాటికి పోలవరం మనిహా మిగిలిన 23 ప్రాజెక్టులకు రూ.17 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా చేశారని, ప్రస్తుతం రూ.51 వేల కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతోందని, మూడు రెట్లు అధికంగా ఖర్చు పెట్టినా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. హౌసింగ్లో అవినీతికి అంతేలేకుండా పోతోందని విమర్శించారు. పక్క రాష్ట్రం కంటే మన రాష్ట్రంలో చదరపు అడుగుకు అదనంగా రూ.1,000 వరకూ ఖర్చు చేస్తున్నారని చెప్పారు. 10 లక్షల ఇళ్లకు గాను అదనంగా రూ.36,500 కోట్లు ఖర్చు చూపించి, రూ.18,250 కోట్ల దోపిడీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అజేయ కల్లాం ఇంకా ఏం చెప్పారంటే... దిగజారిన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ‘‘ఏపీ విభజనకు ముందు రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీడీపీ)లో వ్యవసాయ రంగం వాటా కేవలం 23 శాతం. విభజన వల్ల 2014 జూలై నాటికి అది 30.2 శాతానికి పెరిగింది. 2017–18 నాటికి ఈ వాటా 34.4 శాతంగా నమోదైనట్లు శ్వేతపత్రంలో ప్రభుత్వం పేర్కొంది. కానీ, పరిశ్రమల రంగం వాటా 22.5 శాతం నుంచి 22.1 శాతానికి దిగజారిపోయింది. సేవా రంగం వాటా కూడా 44.6 శాతం నుంచి 43.5 శాతానికి పడిపోయింది. అభివృద్ధి సూత్రం ఏమిటంటే జీడీపీలో వ్యవసాయ రంగం వాటా తగ్గుతూ పోవాలి. పరిశ్రమలు, సేవా రంగం వాటా పెరగాలి. వాస్తవ లెక్కలు ఇలా ఉంటే గుజరాత్ రాష్ట్రం మన రాష్ట్రాన్ని చూసి అసూయ పడుతోందని, అందుకే ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని చెబుతుంటే నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు కేవలం 20.28 శాతం ఉండగా, గత ఏడాది 28.2 శాతంగా ఉందని ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొనగా, ప్రస్తుతం 29 శాతం వరకు ఉండవచ్చు. అంతకు ముందు 1995–2004 వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో అప్పుల శాతాన్ని స్థూల ఉత్పత్తిలో 29.5 శాతానికి పెంచారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 29.5 శాతం ఉన్న అప్పులను 20.28గా తగ్గించింది. 28 శాతం ఉంటే రెడ్అలెర్ట్. కానీ, ప్రస్తుతం అప్పులను 29 శాతానికి తీసుకువెళ్లి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఆర్బీఐ అనుమతి లేకుండా, కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా బ్యాంకుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తీసుకొస్తున్నారు. ఈ విధంగా నాలుగేళ్లలో బ్యాంకుల ద్వారా తీసుకున్న అప్పు రూ.35 వేల కోట్లుండగా, ప్రస్తుతం మరో రూ.15 వేల కోట్ల అప్పులు చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ అనుమతి లేకుండా, కేంద్రానికి తెలియకుండా తెస్తున్న అప్పులు రూ.50 వేల కోట్లకు చేరనున్నాయి. ముందు చెప్పిన విధంగా 29 శాతానికి ఇది అదనం. దీన్ని కూడా కలుపుకుంటే రాష్ట్రం తీర్చాల్సిన అప్పు స్థూల ఉత్పత్తిలో 34 శాతం దాటుతుంది. దీన్నుంచి బయటపడాలంటే ఏ రాష్ట్రానికైనా కనీసం రెండు దశాబ్దాలు పడుతుంది. చేనేత రంగంలోనూ అదేతీరు చేనేత రంగం పరిస్థితి ప్రస్తుతం చాలా దయనీయంగా ఉంది. ఒక్క వైఎస్సార్ జిల్లాలో 120 చేనేత సొసైటీలున్నాయి. ఆరు వేల మంది సభ్యులు ఉన్నారు. ఆప్కో చైర్మన్గా ఓ వ్యక్తి ఉన్నారు. ఆయన తాలూకు వ్యక్తులతో 80 బోగస్ సొసైటీలు పెట్టి, వాటి ద్వారా బట్ట తయారైనట్టు, 2015–16లో రూ.262.75 కోట్ల విలువైన క్లాత్ను ఆప్కోకు సరఫరా చేసినట్టుగా చూపారు. 11 కంపెనీల నుంచి మీటరు రూ.30కి కొని, రూ.50కి సొసైటీల ద్వారా అమ్ముకుంటున్నారు. 2015 ఏప్రిల్ 1 నుంచి 2018 మార్చి 31 వరకు రూ.75.95 కోట్ల విలువైన బట్ట బోగస్గా సరఫరా చేశారు. వాస్తవంగా రూ.29.63 కోట్ల విలువైన బట్ట మాత్రమే సరఫరా చేశారు. మిగిలినదంతా బయటి నుంచి కొనుగోలు చేసి తెచ్చిన బట్ట’’ అని అజేయ కల్లాం పేర్కొన్నారు. దోపిడీపై ప్రశ్నిస్తే బురద జల్లుతారా?: విజయ్బాబు చంద్రబాబు ప్రభుత్వం గోబెల్స్ ప్రచారానికి దిగుతోందని సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ విజయబాబు అన్నారు. ప్రపంచంలో మాకియవెల్లీ ఇజం అనేది ఒకటుందని, దీనిప్రకారం పదవి కోసం ఏ నీచానికైనా దిగజారుతారని, అవసరమైతే వెన్నుపోటు పొడుస్తారని, సీఎం చంద్రబాబు కూడా ఆ బాటలోనే నడుస్తున్నారని విమర్శించారు. దోపిడీపై ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం బురద జల్లుతోందని మండిపడ్డారు. పోలవరంపై ప్రజలను ఏమారుస్తున్నారు: ఉండవల్లి అరుణ్కుమార్ ‘‘పోలవరం సందర్శన అంటూ లక్షకు పైగా జనాన్ని తరలించి భోజనాలు కూడా పెడుతున్నారు. ఒక్కసారైనా నేను నా సొంత ఖర్చులతో వచ్చి చూస్తాను. ప్రభుత్వం తరపున ఒక్క అధికారి వచ్చి నేను అడిగిన సమాధానాలకు చెప్పండి అని అడుగుతున్నా స్పందించడం లేదు’’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నచ్చిన వ్యక్తులకు పోస్టింగ్లు ఇచ్చి, ప్రజలను ఏమారుస్తున్నారని దుయ్యబట్టారు. 15 శాతం బోగస్ ఓట్లు: వి.లక్ష్మణరెడ్డి అవినీతి చేయడం తప్పు కాదనే భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, ఒక్కో ఎమ్మెల్యే రూ.100 కోట్ల నుంచి రూ.1,000 కోట్లు వరకూ సంపాదించారని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గంలో 25 కోట్లకు పైగా ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదని, నంద్యాల మోడల్ ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని 3.6 కోట్ల ఓట్లల్లో 15 శాతం (60 లక్షల ఓట్లు) బోగస్ ఓట్లు కొనసాగుతున్నాయని, ఆ బోగస్ ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశిస్తాయని చెప్పారు. దీనిపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రంలో అవినీతి శివతాండవం మాజీ సీఎస్ అజేయ కల్లాం పోడూరు: ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా అవినీతి శివతాండవం చేస్తోందని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి’సీఎస్) అజేయ కల్లాం ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో ‘మనకోసం మనం’ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రజాస్వామ్య పరిరక్షణ సదస్సులో ఆయన మాట్లాడారు. నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాలను దోపిడీ కోసమే భారీగా పెంచుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతి అభివృద్ధి పనిలోనూ 30 శాతం నుంచి 40 శాతం కమీషన్లు, లంచాలు రూపంలో దోపిడీ జరుగుతోందని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధంగా జరుగుతున్న ఈ పరిస్థితులన్నింటినీ చక్కదిద్దాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని పిలుపునిచ్చారు. -
విద్యుత్ చార్జీల పెంపు అనివార్యమే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోతున్నాయి. ఓ వైపు డిస్కంల ఆర్థికలోటు ఏడాదికేడాది పెరిగిపోతుండగా, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించిన మేరకు విద్యుత్ రాయితీలు కేటాయించడం లేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎదురైన విద్యుత్ సంక్షోభాన్ని డిస్కంలు కేవలం 6 నెలల్లోనే అధిగమించి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నాయి. దీనికితోడు రాష్ట్రప్రభుత్వ నిర్ణయం మేరకు గతేడాది జనవరి 1 నుంచి వ్యవసాయానికి ఉచిత్విద్యుత్ సరఫరా పథకాన్ని 9 గంటల నుంచి 24 గంటలకు పొడిగించాయి. ఈ చర్యల వల్ల రాష్ట్ర విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోయింది. రాష్ట్ర అవసరాలకు తగ్గట్లు ఎప్పటికప్పుడు ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి అదనపు విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేయాల్సి రావడంతో డిస్కంలపై ఆర్థికభారం పెరిగిపోయింది. దీంతో విద్యుదుత్పత్తి కంపెనీలకు బిల్లుల బకాయిలను సకాలంలో చెల్లించడంలో డిస్కంలు చేతులెత్తేస్తున్నాయి. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి రూ.1,356 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రానికి విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తామని జాతీయ థర్మల్ విద్యుదుత్పత్తి సంస్థ(ఎన్టీపీసీ) గతనెలలో హెచ్చరికలు జారీ చేసింది. మరో ప్రైవేటు కంపెనీకు సైతం రూ.1,000 కోట్ల వరకు బకాయిలను డిస్కంలు చెల్లించాల్సి ఉంది. ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రాయితీలు పెంచి ఆదుకుంటుందని డిస్కంల యాజమాన్యాలు ఆశించాయి. తాజాగా శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో అరకొరగా విద్యుత్ రాయితీ నిధులు కేటాయించడంతో విద్యుత్ సంస్థలు తీవ్ర నిరాశకు గరయ్యాయి. విద్యుత్ చార్జీల పెంపు అనివార్యంగా మారిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. కొంప ముంచిన ఈఆర్సీ లెక్కలు ప్రస్తుత చార్జీలను యథాతథంగా కొనసాగిస్తే 2018–19లో రూ.9,970.98 కోట్ల ఆర్థిక లోటు ఏర్పడనుందని గతేడాది రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)లో డిస్కంలు అంచనా వేశాయి. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే విద్యుత్ రాయితీ నిధులతో కొంతవరకు ఆర్థికలోటు భర్తీ కానుండగా, మిగిలినలోటును విద్యుత్ చార్జీల పెంపుతో పూడ్చుకోవాలని డిస్కంలు భావించాయి. విద్యుత్చార్జీల పెంపునకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. 2018–19 రాష్ట్ర బడ్జెట్లో సైతం డిస్కంలకు ప్రభుత్వం రూ.4,980 కోట్ల విద్యుత్ రాయితీలు మాత్రమే కేటాయించింది. ఈ క్రమంలో ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా వ్యవహరించిన ఈఆర్సీ డిస్కంల ఆర్థికలోటు అంచనాలను రూ.5,980 కోట్లకు కుదించి పాతచార్జీలతోనే వార్షిక టారిఫ్ ఉత్తర్వులను జారీ చేసింది. వచ్చే నెలతో 2018–19 ఆర్థిక సంవత్సరం ముగిసిపోనుండగా, ఇప్పటికే డిస్కంలు రూ.5 వేల కోట్లకుపైగా ద్రవ్యలోటును ఎదుర్కొంటున్నాయని ట్రాన్స్కో అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత చార్జీలనే వచ్చే ఏడాది కొనసాగిస్తే 2019–20లో డిస్కంలు రూ.10 వేల కోట్లకుపైగా ఆర్థికలోటును ఎదుర్కోక తప్పదని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2019–20లో విద్యుత్శాఖకు రూ.4,002 కోట్లను మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ సబ్ నిధులు కలుపుకున్నా విద్యుత్ రాయితీలు రూ.5 వేల కోట్లకు మించవని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన రూ.5 వేల కోట్లకుపైగా ఆర్థికలోటులో కొంతభాగాన్ని అయినా పూడ్చుకోవడానికి విద్యుత్చార్జీల పెంపు తప్పదని చర్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికలు ముగిసిన అనంతరం వచ్చే జూన్లో విద్యుత్చార్జీల పెంపు ప్రతిపాదనలను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించే అవకాశాలున్నాయి. -
ఇనాం భూములకు ఎసరు!
సాక్షి, అమరావతి: అత్యంత విలువైన ఇనాం భూములకు రాష్ట్ర ప్రభుత్వం ఎసరు పెట్టింది. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఇనాం భూములను ఆక్రమించుకుని అనుభవిస్తున్న నేపథ్యంలో విక్రయ హక్కులు కల్పించడం ద్వారా వాటి విలువను భారీగా పెంచేందుకు ఎత్తుగడ వేసింది. ఇందులో భాగంగానే 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ఇనామ్స్ రద్దు, రైత్వారీ చట్టం–1956కు సవరణ ఆర్డినెన్స్ జారీ చేసింది. తద్వారా ఆలయాలు, ధార్మిక సంస్థల సేవకులకు పూర్వం కేవలం అనుభవించడానికే కేటాయించిన భూములు, స్థలాలకు విక్రయ హక్కులు కల్పించినట్లయింది. పూర్వం రాజులు, సేవా సంస్థలు, సేవ, ఆధ్యాత్మిక భావం గల సంపన్నులు ఆలయాలు, ధార్మిక సంస్థలను ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణ కోసం భూములు లాంటి స్థిరాస్తులు రాసి ఇచ్చారు. ఈ ఆలయాల్లో పూజలు చేసే పూజారులు, మేళం వాయించే వాయిద్యకారులు, స్వామివారికి నైవేద్యం కోసం పాలు సమర్పించే ఆవులు మేపేవారు తదితర సేవకులకు ఈ సేవలు చేస్తున్నంతకాలం జీవనాధారం కోసం ఇనాం కింద భూములు ఇచ్చారు. ఈ సేవలు చేస్తున్నంత కాలం మాత్రమే ఈ భూములను అనుభవిస్తూ ఫల, ఇతర ఉత్పత్తులు పొందే హక్కు వీరికి ఉంటుంది. ఇనాం చట్టం రద్దుతో.. 1956లో ప్రభుత్వం ఇనామ్స్ చట్టాన్ని రద్దుచేసింది. దీంతో అప్పట్లో ఇలాంటి భూములను అనుభవిస్తున్న ఇనామీలతోపాటు ఇతరులు కూడా రైత్వారీ పట్టాలు పొందారు. చాలావరకూ ఇవి పట్టణాలు, నగరాల్లో ఉండటంతో వీటి విలువ భారీగా పెరిగింది. రాష్ట్రంలో ఇలా ఆలయ సేవకుల ఇనాం భూములు 24,614 ఎకరాలకు పైగా ఉన్నాయి. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, చిత్తూరు జిల్లాలోని తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు, గుంటూరు లాంటి పట్టణాలు, నగరాల్లో ఈ భూములు ఇళ్లస్థలాలుగా మారాయి. అనధికారిక క్రయ విక్రయాలు కూడా జరిగాయి.దేవాలయ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని, రైత్వారీ పట్టాలు ప్రభుత్వమే ఇవ్వడమంటే దేవాలయ భూములను ధారాదత్తం చేయడమేనని, ఇది అన్యాయమంటూ కొందరు కోర్టుకు వెళ్లారు. ఆలయాల్లో సేవ చేసినంత కాలం అనుభవించడానికి మాత్రమే హక్కు ఉన్న ఇనాం భూములను అమ్ముకోవడం చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆంధప్రదేశ్ ఇనామ్స్ రద్దు, రైత్వారీ పట్టాలుగా మార్పిడి చట్టం–1956కు సవరణ చేసింది. దీన్ని గవర్నర్ ఆమోదం అనంతరం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. ఈ చట్టం 1956 నవంబరు 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లుగా (రెట్రాస్పెక్టివ్ ఎఫెక్టు) 2013 సెప్టెంబరు 26న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం 1956 నుంచి ఈ భూములకు సంబంధించిన క్రయవిక్రయ లావాదేవీలు ఏమీ చెల్లవు. జరిగిన లావాదేవీలన్నీ అనధికారికమే. వీటికి చట్టబద్ధత లేదు. అనగా ఇవి ఇనాం భూముల కిందే ఉంటాయి. ఈ మేరకు ప్రభుత్వం ఈ భూములను బదలాయింపు నిషేధ(పీఓటీ) జాబితాలో 22 ఎ–1 కింద పెట్టింది. హఠాత్తుగా.. పట్టణాలు, నగరాల్లో ఇనాం భూములు ఇళ్ల స్థలాలుగా మారడంతో చాలామంది అధికార పార్టీ నాయకులు వాటిని తక్కువ ధరకే కొనుగోలు చేశారు. నిషేధిత జాబితా నుంచి తొలగించి, క్రయవిక్రయాలకు అనుమతి ఇస్తే వీటి ధర 10 నుంచి 20 రెట్లు వరకూ పెరుగుతుంది. అందుకే ఈ చట్టాన్ని సవరించాలని వారు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. చట్ట సవరణ చేస్తే తమ అధీనంలోని ఆస్తుల విలువ పెరగడంతోపాటు లక్షలాది మంది అనుభవంలో ఉన్న స్థలాలనూ అమ్ముకునే వెసులుబాటు వస్తుందని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం 2013 సెప్టెంబరు 26న గెజిట్ జారీ చేసినప్పటి నుంచే ఈ చట్టం వర్తించేలా ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించింది. దీన్ని కేబినెట్లో పెట్టి ఆమోదముద్ర వేసి, గవర్నర్ అనుమతితో ఆర్డినెన్సు జారీచేశారు. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి శనివారం జీవో జారీ చేశారు. నిబంధనలతో కూడిన గెజిట్ను కూడా శనివారం జారీ చేస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఈ ఇనాం భూములు 1956కు పూర్వస్థితి ప్రకారం ఆలయాలు/ధార్మిక సంస్థల పేరుతో ఉన్నట్లే. తాజాగా ఆర్డినెన్సు జారీతో 2013 సెప్టెంబరు 26వ తేదీ వరకూ జరిగిన క్రయవిక్రయాలు, లావాదేవీలకు చట్టబద్ధత లభిస్తుంది. అప్పటివరకూ కొనుగోలు చేసిన/ అనుభవిస్తున్న వారు ఇక వీటిని అమ్ముకోవచ్చు. అనగా 24,614 ఎకరాలు ఇక ఇనాం భూముల జాబితాలో ఉండవు. ఇందులో 70 శాతం అధికార టీడీపీ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి. -
‘ప్రైవేట్’ కోసం ప్రజలకు టోపీ
రూ. 5,615 కోట్లు భరిస్తే దాదాపు 32,900 కోట్ల రూపాయల విలువైన భారీ కేంద్ర ప్రాజెక్టు మన రాష్ట్రానికొచ్చేది. భారీగా ఉద్యోగాలొచ్చేవి. అయితే ఈ మొత్తం భరించలేమంటూ చంద్రబాబు తేల్చిచెప్పారు. అదేసమయంలో ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ఆయన.. దానికి ఏకంగా రూ. 12,578 కోట్ల అదనపు రాయితీలను ప్రకటించేశారు. రూ.5,615 కోట్లు కట్టే స్థోమత లేదని చెప్పుకున్న ఆయన ప్రైవేటు సంస్థకు రెట్టింపు రాయితీలను ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధమైన చర్యలతో రాష్ట్రం నుంచి మరో భారీ కేంద్ర ప్రాజెక్టు జారిపోయింది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కాకినాడలో రూ.32,900 కోట్లతో భారీ క్రాకర్, పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయడానికి కేంద్రం ముందుకు వచ్చినా ముఖ్యమంత్రి ప్రైవేటు సంస్థకే మొగ్గు చూపారు. కోల్కతాకు చెందిన హల్దియా పెట్రోకెమికల్స్ సంస్థతో వేగంగా ఒప్పందం కుదుర్చుకోవడమే కాకుండా గత నెలలో కాకినాడలో ఆగమేఘాల మీద శంఖుస్థాపన కూడా చేసేశారు. అంతేకాదు పారిశ్రామిక పాలసీ ప్రకారం లభించే రాయితీలు కాకుండా అదనంగా రూ. 12,578 కోట్ల రాయితీలను ఇస్తూ ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ (ఎస్ఐపీబీ) నిర్ణయం తీసుకుంది. హల్దియాకు వివిధ రూపాల్లో ఇస్తున్న భారీ రాయితీలను చూసి అధికారులకే కళ్లుతిరుగుతున్నాయి. ప్రభుత్వం సంస్థను కాదని... రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు హెచ్పీసీఎల్–గెయిల్ కలిసి క్రాకర్, పెట్రో కెమికల్ యూనిట్ పెట్టడానికి 2017లో జరిగిన సీఐఐ పెట్టుబడుల సదస్సులో ఒ్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం కాకినాడ సెజ్లో 2,000 ఎకరాల్లో 1.55 ఎంఎంటీపీఏ సామర్థ్యంతో యూనిట్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. ఈ ప్రాజెక్టు లాభదాకతపై ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ స్టడీలో రూ. 5,615 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అవసరమవుతుందని, ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని, మిగతా అన్ని యూనిట్లలో ఇదే విధానం అనుసరిస్తున్నారని ఆ కేంద్ర సంస్థలు పేర్కొన్నాయి. లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రూ. 5,615 కోట్లు వీజీఎఫ్ కింద ఇచ్చే పరిస్థితిలేదని, ఈ మొత్తాన్ని కూడా కేంద్రమే భరించాలంటూ ముఖ్యమంత్రి పట్టుపడుతూ వచ్చారు. చివరకు ఎన్నికల సమయంలో తామే సొంతంగా ఏర్పాటు చేస్తామంటూ హల్దియాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. భారీ రాయితీలు.. కేంద్ర సంస్థకు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు ప్రైవేటు సంస్థకు రూ. 12,578 కోట్ల ప్రయోజనాలను ఏ విధంగా కల్పిస్తుందంటూ పలువురు పారిశ్రామిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా 2015–20 పాలసీ ప్రకారం లభించే ఇతర రాయితీలు కూడా ఆ ప్రైవేటు సంస్థకు లభిస్తాయని పేర్కొంటున్నారు. ఇదే మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చి ఉంటే రెట్టింపు సామర్థ్యంతో యూనిట్ను ఏర్పాటు చేసేవని, తద్వారా రాష్ట్ర యువతకు ఉద్యోగాలతో పాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా ఆదాయం వచ్చేదని పలువురు ఉన్నతాధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా చేయకుండా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఒక ప్రైవేటు సంస్థకు.. అది కూడా ఎన్నికల ముందు చేయడం పలు అనుమానాలకు తావిస్తోందంటున్నారు. హల్దియా సంస్థ ఈ ప్రాజెక్టుకు ఆమోదం కోసం ఎస్ఐపీబీ డిసెంబర్ 28, డిసెంబర్ 29న వరుసగా రెండుసార్లు సమావేశం కావడం, జనవరి 3న జీవో చేయడం ఆ మరుసటి రోజే కాకినాడలో ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేశారంటే దీని వెనుక ఉన్న శక్తుల గురించి అర్థం చేసుకోవచ్చంటున్నారు. -
ఆ మూడింటికి నో నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: అనర్హత వేటు వల్ల శానసమండలిలో ఖాళీ అయిన 3 స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయబోమని, ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోబోమని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు హామీ ఇచ్చాయి. రెగ్యులర్గా ఖాళీ అయిన స్థానాలకు మాత్రమే రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలి పాయి. ఈ హామీని నమోదు చేసుకున్న న్యా యస్థానం, అనర్హతవేటును సవాలు చేస్తూ తన ముందున్న వ్యాజ్యాలను ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండ రామ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులను కారణంగా చూపుతూ తమపై అనర్హత వేటు వేస్తూ మండలి చైర్మన్ ఇటీవల జారీచేసిన ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, వాటిని రద్దు చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీలు రాములు నాయక్, యాదవరెడ్డిలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. నామినేటెడ్ వ్యక్తికి అనర్హత వర్తించదు.. రాములు నాయక్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్ సామాజిక సేవ కేటగిరి కింద ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారన్నారు. ఆయన ఏ పార్టీ గుర్తుపై గెలుపొందలేదన్నారు. ఏదైనా పార్టీ లేదా ఏదైనా పార్టీ గుర్తుపై గెలిచి ఆ తర్వాత మరోపార్టీలోకి ఫిరాయించినప్పుడు మాత్రమే అనర్హత వర్తిస్తుందని తెలిపారు. పిటిషనర్ ఫలానా పార్టీకి చెందిన వారనేందుకు ఫిర్యాదు లో ఎటువంటి ఆధారాలు చూపలేదన్నారు. నామినేట్ అయిన వ్యక్తికి అనర్హత వర్తించదని చెప్పినా, మండలి చైర్మన్ వినిపించుకోకుండా అనర్హత వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోర్టును కోరారు. యాదవరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మీడియా కథనాల ఆధారంగా పిటిషనర్పై ఫిర్యాదుదారులు మండలి చైర్మన్కు ఫిర్యాదు చేశారన్నారు. ఈ కథనాల్లో ఉన్న వాస్తవం ఎంతో తెలుసుకోకుండా చైర్మన్ పిటిషనర్పై అనర్హత వేటు వేశా రని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార పార్టీలోకి ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసినా మండలి చైర్మన్ పట్టించుకోలేదని, ఇప్పుడు అధికార పార్టీ వారి ఫిర్యాదులపై మాత్రం తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్నారని చెప్పా రు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ, సింగిల్ జడ్జి, ధర్మాసనం, ఆ తరువాత సుప్రీం కోర్టు ఇలా కేసు తేలేటప్పటికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుందని వ్యాఖ్యానించారు. రాములు నాయక్ నామినేషన్తోపాటు ఎన్ని కకు సంబంధించి రికార్డులను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనికి ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, ధర్మాసనం ముందు ఈ రికార్డులను సమర్పిస్తామని చెప్పారు. -
నీళ్లు పారాలంటే నిధులు రావాలి!
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రవేశపెట్టిన సత్వర సాగునీటి ప్రాయోజిక కార్యక్రమం(ఏఐబీపీ)లో చేర్చిన రాష్ట్ర ప్రాజెక్టులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం మొండిచేయి చూపింది. ప్రాజెక్టులకు ఆర్థికసాయం చేస్తామని అనేకమార్లు ఊదరగొట్టిన కేంద్రం ఏడాదిగా వాటిపై మౌనం వీడలేదు. 11 ప్రాజెక్టులకు రూ.564 కోట్ల మేర సాయం అందిస్తామని చెప్పి చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా సాగునీటి లక్ష్యాలను నీరుగారుస్తోంది. ఏఐబీపీ కింద రాష్ట్రంలోని కొమురంభీం, గొల్లవాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ–2, దేవాదుల, జగన్నాథ్పూర్, భీమా, వరద కాల్వ ప్రాజెక్టులను కేంద్ర జలవనరుల శాఖ గుర్తించింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసం మొత్తంగా రూ.24,719 కోట్లు అవసరం ఉండగా ఇందులో ఇప్పటికే 19,928 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.7,791 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నిధులకై ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించి ఏఐబీపీ కింద నిధులు సమకూర్చి ఆదుకోవాలని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన జల వనరుల శాఖ కేంద్ర సాయం కింద రూ.4,513.19 కోట్లు ఇచ్చేందుకు సమ్మతించగా, ఇందులో 2017–18 ఆర్థిక సంవత్సరం వరకు రూ.3,949.19 కోట్లు విడుదల చేసింది. ఈ ఏడాది రూ.564.70 సాయం అందించాల్సి ఉంది. ఇందులో అధికంగా దేవాదులకు రూ.496 కోట్లు రావాల్సి ఉంది. నేడు రానున్న కేంద్ర బృందం.. ఏఐబీపీ నిధుల బకాయిలు, ప్రాజెక్టుల పురోగతిపై చర్చించేందుకు కేంద్ర జలవనరుల శాఖ కమిషనర్ ఒహ్రా నేతృత్వంలో బృందం గురువారం రాష్ట్రానికి రానుంది. 21 నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రంలో పర్యటించి ప్రాజెక్టుల పనులను పరిశీలించనుంది. దీంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై అధికారులు కేంద్ర జలవనరుల శాఖ బృందానికి విన్నవించనున్నారు. ఆయకట్టు లక్ష్యాలకు దెబ్బ.. భూసేకరణ సమస్యలు, సహాయ పునరావాసం కొలిక్కి వచ్చినందున ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చెబుతోంది. అయినా నిధులు మాత్రం రావటం లేదు. ఈ ప్రభావం ప్రాజెక్టుల ఆయకట్టు లక్ష్యాలపై పడుతోంది.11 ప్రాజెక్టుల్లో 6.36 లక్షల హెక్టార్లలో ఆయకట్టుకు నీరందించాల్సి ఉండగా, ఇంతవరకు 88,021 హెక్టార్లకే సాగునీరందింది. మరో 3.22 లక్షల హెక్టార్లకు నీరందించేలా పనులు సిద్ధం చేసినా, నీళ్లు రాక ఆయకట్టు సాగుకాలేదు. అయినా ఇంకా 2.26 లక్షల హెక్టార్లకు సాగునీరందించేలా పనులు జరగాల్సి ఉంది. ఇందులో దేవాదుల కిందే .248 లక్షల హెక్టార్లకు సాగునీరు అందించాల్సి ఉన్నా 1.25 లక్షల హెక్టార్లకు నీరందించే పనులు పూర్తయ్యాయి. మిగతా ఆయకట్టుకు ఈ ఖరీఫ్లో నీరందించాల్సి ఉన్నా అది అనుమానంగా ఉంది. ఎస్సారెస్పీ–2లోనూ 1.78లోల హెక్టార్లకు సాగునీరందించాల్సి ఉండగా, 1.38 లక్షల హెక్టార్లకు నీరందించే పనులు పూర్తి అయ్యాయి. మిగతా పనులు ఈ జూన్, జూలై నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర నుంచి 18.10 కోట్ల మేర నిధులు రావాల్సి ఉంది. ఇక భీమా పరిధిలోనే అదే పరిస్థితి నెలకొంది. ఈ నిధులు సకాలంలో అందితేనే వాటి పూర్తిసాధ్యం కానుంది. లేనిపక్షంలో లక్ష్యాలు నీరు గారిపోవడం ఖాయంగా ఉంది. -
‘మంత్రివర్గంలో వారు లేకపోవడం బాధాకరం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎట్టకేలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మంత్రివర్గాన్ని విస్తరించడం సంతోషకరమని, అయితే మంత్రివర్గంలో మహిళలలకు, ఎస్టీలకు స్థానం లేకపోవడం బాధాకరమని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. మంగళవారం ఆయన బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. వారు ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన కొనసాగిస్తారని ఆశిస్తున్నానన్నారు. గతంలో కూడా మహిళా మంత్రి లేకుండానే ప్రభుత్వం నడిచిందని, ప్రతిపక్షాలు ఎంత చెప్పినా సీఎం పట్టించుకోలేదని అన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎంను ఉల్లంఘించి అప్పులు చేస్తోందని, కేంద్ర పథకాలకు అడ్డుకట్ట వేయడం వంటి అంశాలను 15వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లామని దత్తాత్రేయ తెలిపారు. కొత్త రాష్ట్రం అయినందున ఎక్కువ నిధులను కేటాయించాలని, హైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరామన్నారు. ఈ సందర్భంగా ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీసీల ఆత్మగౌరవ సభ పోస్టర్, కరపత్రాన్ని విడుదల చేశారు. -
పేద గిరిజనులకు పక్కా ఇళ్లు!
సాక్షి, హైదరాబాద్: అత్యంత వెనుకబడ్డ గిరిజన తెగ (పీవీటీజీ)ల్లోని కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని గిరిజన సంక్షేమశాఖ నిర్ణయించింది. పీవీటీజీల్లో 4 తెగలున్నాయి. చెంచు, తోటి, కొండ రెడ్డి, కొలామ్ తెగలు అత్యంత వెనుకబడ్డ గిరిజనులుగా కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. దీంతో ఈ తెగల్లోని కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆ శాఖ చర్యలు మొదలుపెట్టింది. పూర్తిగా అటవీ ప్రాంతంలో నివసించే తెగలకు చెందిన వీరు ప్రస్తుతం తాత్కాలిన నివాసాల్లోనే ఉంటున్నప్పటికీ వీరికి అనువైన చోట పక్కా ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వీరి పూర్తిస్థాయి ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం అమలు చేస్తున్న సాంప్రదాయ పరిరక్షణ అభివృద్ధి పథకం నిధులను వినియోగించు కోవాలని గిరిజన సంక్షేమ శాఖ యోచిస్తోంది. నాలుగు తెగల్లో 50 వేల కుటుంబాలు రాష్ట్రంలో 3 ఐటీడీఏలున్నాయి. ఉట్నూరు, ఏటూరు–నాగారం, భద్రాచలం ఐటీడీఏ పరిధిలో పీవీటీ జీ కేటగిరీ కింద దాదాపు 50 వేల కుటుంబాలుంటా యని గిరిజన సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నా యి. ఇందులో దాదాపు 95% మందికి పక్కా ఇళ్లు లేవు. దీంతో అటవీ ప్రాంతాల్లో ఉంటున్న పేద గిరిజనులకు పక్కా ఇళ్లు నిర్మించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. పీవీటీజీల్లో ఉన్న పేద కుటుంబా లన్నింటికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అధికా రులు నిర్ణయించారు. సంఖ్య ఎక్కువగా ఉంటే విడ తల వారీగానైనా పూర్తిస్థాయిలో అర్హులకు న్యాయం చేయాలని భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(ఆర్డీటీ) ఆధ్వర్యంలో అనంత పురంలో గిరిజనులకు పక్కా గృహాలు నిర్మించి ఇచ్చారు. తక్కువ ఖర్చుతో మన్నికైన ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో.. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆ దిశగా చర్చలు జరుపుతోంది. దీనిలో భాగంగా తాజాగా డీఎస్ఎస్ భవన్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులతో గిరిజన సంక్షేమ శాఖ సమావేశం నిర్వహించింది. పీవీటీజీలకు ఎలాంటి ఇళ్లు నిర్మించి ఇస్తే బాగుంటుందనే దానిపై చర్చలు జరిపారు. ఆర్డీటీ రూపొందించిన ఇంటి నమూనాలనూ పరిశీలించా రు. ఒక ఇల్లు నిర్మించాలంటే రూ.3 లక్షల వరకు ఖర్చవుతున్నట్లు అధికారులు అభిప్రాయపడు తున్నారు. ఈనేపథ్యంలో పూర్తిస్థాయిలో చర్చలు జరిపి డిజైన్ రూపొందించాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. -
లక్ష రూపాయల కంపెనీకి 200 ఎకరాలు
సాక్షి, అమరావతి: ఎటువంటి అనుభవం లేకపోయినా కేవలం కాగితంపై ఏర్పాటైన ఒక కంపెనీకి రూ.వందల కోట్ల విలువైన భూమిని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేటాయిస్తుందా? కేవలం రూ.లక్ష మూలధనంతో ఒక కంపెనీని నమోదు చేసుకొని వందల కోట్ల పెట్టుబడితో వేలల్లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఒప్పందం కుదుర్చుకుంటే చాలు.. ముందూవెనుక ఆలోచించకుండా రూ.కోట్ల విలువైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పనంగా ఇచ్చేస్తోంది. అక్టోబర్లో కాగితాలపై ఏర్పాటైన కంపెనీ నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంటే ఫిబ్రవరి 9న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉన్న రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఆమోదిం చడం, ఆ తర్వాత మూడు రోజులకే జీవో విడుదల కావడం వెనువెంటనే జరిగిపోయాయి. ఎన్నికల వేళ మేజెస్ ఎలక్ట్రానిక్ పార్కుకు ప్రభుత్వం కారుచౌకగా కేటాయించిన భూముల వ్యవహారం ఉన్నతా ధికారుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రూ.40 కోట్లకే 200 ఎకరాలు తిరుపతికి అత్యంత సమీపంలో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో మెడికల్ డివైస్ పార్కును ఏర్పాటు చేయడానికి మేజెస్ ఎలక్ట్రానిక్ పార్కుకు 200 ఎకరాలు కేటా యిస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తిరుపతి–శ్రీకాళహస్తి మార్గంలో ప్రస్తుతం ఎకరం రూ.కోటిన్నర పలుకుతున్న భూమిని ఎకరం కేవలం రూ.20 లక్షలకే కేటాయించింది. బహిరంగ మార్కెట్ ధర ప్రకారం.. రూ.300 కోట్లు పలుకుతున్న 200 ఎకరాల భూములను కేవలం రూ.40 కోట్లకే అప్పగించేసింది. అంతేకాకుండా 2014–20 పారిశ్రామిక పాలసీలో లభించే రాయితీలకు అదనంగా మరో రూ.50 కోట్లు ప్రాజెక్టు వ్యయంలో సబ్సిడీగా ఇస్తూ నిర్ణయం తీసుకుంది. చకచకా కదిలిన ఫైలు కేవలం లక్ష రూపాయల మూలధనంతో గతేడాది అక్టోబర్ 24న మొగిలి ఇందు మౌళి (మేనేజింగ్ డైరెక్టర్), బండారు నరసింహారావు, అరగొండ రోహిత్ రెడ్డిలు డైరెక్టర్లుగా మేజెస్ ఎలక్ట్రానిక్ పార్క్ లిమిటెడ్ ఏర్పాటైంది. తిరుపతి సమీపంలో రూ.188 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్ పార్కును ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం నవంబర్ 28న మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక అక్కడ నుంచి ఫైలు అత్యంత వేగంగా కదిలింది. ఫిబ్రవరి 9న ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశం కావడం, 2014–20 పారిశ్రామిక పాలసీకి అదనంగా సబ్సిడీ ధరకే భూమి కేటాయించడం, పెట్టుబడి వ్యయంలో 30 శాతం సబ్సిడీగా ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. ఇది జరిగిన మూడు రోజుల్లోనే దీనికి సంబంధించిన జీవోను పరిశ్రమల శాఖ విడుదల చేయడం గమనార్హం. ఎలాంటి అనుభవం లేకున్నా.. పేరుకు మేజెస్ ఎలక్ట్రానిక్ పార్క్ అని కనిపిస్తున్నా దీని వెనుక దుబాయ్కు చెందిన కంపెనీ కీలకపాత్ర పోషించింది. ప్లాస్టిక్ చెత్త కవర్లు, చెత్తబుట్టలు తయారుచేసే దుబాయ్కు చెందిన అల్ బకరా ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ ఎల్ఎల్సీ; ముఖానికి, తలకి తగిలించుకునే మాస్క్లు తయారు చేసే మెడిక్యూబ్ హెల్త్కేర్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ సిదార్థ ఇన్ఫ్రాటెక్ సర్వీసెస్ లిమిటెడ్లు కలిసి మేజెస్ను ఏర్పాటు చేశాయి. రూ.188 కోట్ల పెట్టుబడితో వైద్య పరికరాల పార్కును అభివృద్ధి చేస్తామని, ఈ పార్క్ ద్వారా 15 వేల మందికి ఉపాధి లభిస్తుందని ఒప్పందంలో పేర్కొన్నారు. కానీ ఈ మూడు సంస్థలకు వైద్య పరికరాల తయారీలో ఎటువంటి అనుభవం లేదు. కేవలం మెడికల్ పార్క్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి కారుచౌకగా ప్రభుత్వం భూమిని కేటాయించినట్లు కనిపిస్తోందని ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులే చెబుతున్నారు. ఎన్నికల ముందు ఇలా ఒక అనామక కంపెనీకి రూ.310 కోట్ల ప్రయోజనాలు కల్పించే విధంగా ప్రభుత్వ పెద్దలు అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకోవడంపై అధికార వర్గాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. -
అవయవదానం.. ఆరేళ్లలో మూడింతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అవయవదానంపై అవగాహన పెరుగుతోంది. ఆరేళ్లలో దాతల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. 2013లో అవయవదానాలు 188 కాగా గతేడాది 573 కు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం జీవన్దాన్ అనే పథకాన్ని 2014లో ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా బ్రెయిన్డెడ్ కేసుల నుంచి అవయవాలు సేకరిస్తారు. వెబ్సైట్లో డోనర్లు తమ పేర్లు నమోదు చేసుకుంటే, వారికి ప్రభుత్వం ఆర్గాన్ డోనర్ కార్డు అందజేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో 2002లో తొలిసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ప్రతి సంవత్సరం వేలాది మంది అవయవాల మార్పిడి కోసం ప్రయత్నించి విఫలమై మరణిస్తున్నారు. దీంతో అవయవదానాలపై మరింత అవగాహన పెరగాల్సి ఉందని వైద్యులు అంటున్నారు. ఎవరు దానం చేయవచ్చు? ఏ ఏ అవయవాలు దానం చేయవచ్చు, ఎవరు చేయవచ్చు అనే సందేహాలున్నాయి. జీవించి ఉండగానే కొన్ని అవయవాలు, వాటి భాగాలను దానం చేయటం ఒక పద్ధతైతే, మరణించిన తర్వాత దానం చేయటం మరో పద్ధతి. ఎవరైనా తాము చనిపోయిన తర్వాత అవయవ దానం చేయాలని సంకల్పిస్తే, అలాంటి వారు తమ రక్త సంబంధీకులు, బంధువుల అనుమతి, అంగీకారంతో అవయవదానపత్రంపై సంతకాలు చేసి అధికారులకు సమర్పించవచ్చు. బ్రెయిన్డెడ్ అయినవారిలో చాలా అవయవాలు అవయవ మార్పిడికి అనువుగా ఉంటాయి. మానవ శరీరంలో ముఖ్యమైన అవయవాలుగా చెప్పుకునే కళ్లు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె కవాటాలు, చర్మం, ఎముకలు, నరాలు తదితర అవయవాలన్నింటిని అవయవ మార్పిడికి ఉపయోగించవచ్చు. మృతి చెందిన వారినుంచి సేకరించిన అవయవాలను ఉపయోగించి అనేకమంది ప్రాణాలను కాపాడవచ్చు. పెరిగిన డిమాండ్... సగమే లభ్యత అవయవ లభ్యత ఎక్కువగా లేనందున మరణాలు జరుగుతూనే ఉన్నాయి. అవస రాలకు, లభ్యతకు పొంతనలేదు. గత ఆరేళ్లలో 4,728 మందికి అవయవాలు అవసరమైతే 2,402 మందికి మాత్రమే వాటిని అందించ గలిగారు. ప్రస్తుతం జీవన్దాన్ నెట్వర్క్తో అనుసంధానమైన ఆస్పత్రులకు రొటేషన్ పద్ధ తుల్లో రోగికి అవయవాలు అందేలా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో ఇలాంటి ఆస్పత్రులు 27 ఉన్నాయి. ఒత్తిళ్లు, పలుకుబడితో అవయవాలు పొందే పరిస్థితి ఎక్కడాలేదు. ఈ 27 ఆస్పత్రుల్లోని రోగుల వివరాలూ, వారి ప్రాధాన్యతల వారీగా అనుసంధానమై ఉన్నాయి. దాంతో కేటాయింపుల్లో ఏమాత్రం పొరపాటుకు తావులేదని జీవన్దాన్ అధికారులు అంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రులతోపాటు నిమ్స్, గాంధీ, ఉస్మానియాల్లోనూ అవయవ మార్పిడులు చేస్తున్నారు. అవయవాలు కావాల్సిన రోగులు కూడా జీవన్దాన్ వెబ్సైట్లో పేర్లు నమోదు చేయించుకోవాలి. వారికి సీరియల్ నంబరు ఇస్తారు. అవయవదానం చేసే కేసులు వచ్చినప్పుడు సీరియల్ నంబర్ ప్రకారం అవకాశం కల్పిస్తారు. ఎముక మజ్జ, కిడ్నీ, కాలేయంలో భాగం, ఊపిరితిత్తుల్లో కొంతభాగం, పాంక్రియాస్లో కొంతభాగం దానం ఇవ్వొచ్చు. ఎముక మజ్జ, కాలేయం, ఊపిరిత్తులు వంటివి రక్త సంబంధీకులవే బాగా పనికొస్తాయి. బ్రెయిన్డెడ్ను ఎలా నిర్ధారిస్తారు? ప్రమాదం వల్లగాని, నివారణకాని వ్యాధి వల్లగాని మనిషి అపస్మారకస్థితిలోకి చేరుకుంటాడు. కృత్రిమ ఆక్సిజన్ ద్వారా రక్త ప్రసరణ జరుగుతున్నప్పటికీ తిరిగి స్పృలోకి రాని స్థితిని బ్రెయిన్ డెడ్గా పేర్కొంటారు. ఆ సమయంలో గుండె స్పందనలూ, ఊపిరితిత్తుల పనితీరు, కిడ్నీలు, కాలేయం సజీవంగానే ఉంటాయి. రోగి ఎట్టి పరిస్థితుల్లోనూ బతికే అవకాశం ఉండదు. ఈ పరిస్థితిని నిర్ధారించాలంటే కొన్ని నిర్దిష్ట నిబంధనలున్నాయి. న్యూరాలజీ, న్యూరోసర్జరీ, అనస్థిసిస్ట్, జనరల్ ఫిజీషియన్లతోపాటు సదరు ఆస్పత్రి సూపరింటెండెంట్లతో కూడిన ఐదుగురు సభ్యులతో కూడిన బృందం కొన్ని నిర్దిష్ట మార్గదర్శకాల ద్వారా బ్రెయిన్డెడ్ అనే విషయాన్ని నిర్ధారణ చేస్తారు. అప్పుడు ఆ బ్రెయిన్డెడ్కు గురైనవారి బంధువులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగమైన ’జీవన్దాన్’బృందం సభ్యులు కలసి, మాట్లాడి వారిని అవయవదానానికి ఒప్పిస్తారు. -
ఒక్క ఐడియాతో అమరావతి నిర్మిస్తున్నాం..
సాక్షి, అమరావతి/ అమరావతి బ్యూరో: ఒక్క ఐడియాతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. భవిష్యత్ తరాలు సంతోషంగా నివసించేలా, సింగపూర్ను మించిన నగరంలా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. విజయవాడలో బుధవారం హ్యాపీ సిటీస్ సదస్సులో చంద్రబాబు ప్రసంగించారు. నాణ్యమైన జీవితం, ఆనందమయ నగర నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం అమరావతిని నిర్మిస్తోందని స్పష్టం చేశారు. తొలుత స్మార్ట్సిటీస్, మౌలిక సదుపాయాలకు సంబంధించిన రెండు అవగాహనా ఒప్పందాలను(ఎంవోయూ) రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. అర్బన్ అసెట్ అండ్ ఇన్ఫ్రా మేనేజ్మెంట్ సిస్టం, అమరావతి రెసిడెంట్ కార్డులను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అమరావతి గ్రీన్ ఫీల్డ్ నగరంగా నిర్మిస్తున్నామని, చాలా కన్సల్టెన్సీలు నగర నిర్మాణంలో సేవలు అందిస్తున్నాయని చెప్పారు. రాజధానిలో 9 సిటీలు, 25 టౌన్షిప్ల నిర్మాణాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మంత్రి పి.నారాయణ, భారత్లో అమెరికా కాన్సూల్ జనరల్ మైఖేల్, బూటాన్లోని థింపూ నగర మేయర్ కిన్లే దోర్జి, ఇంధన కార్యదర్శి అజైన్ జైన్, సీఆర్డీఏ కబిషనర్ చెరుకూరి శ్రీధర్ తదితరులు ప్రసంగించారు. వేదిక నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో రూ.8 వేల కోట్లతో చేపట్టనున్న 30 కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 140 నదులను అనుసంధానిస్తా: చంద్రబాబు ‘ఐదేళ్లుగా రేయింబవళ్లు కష్టపడుతున్నా.. వచ్చే 75 రోజులు నాకోసం కష్టపడండి’ అని ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా.. ఇలా 140 నదులను అనుసంధానం చేసి రాష్ట్రంలో కరవు అనే మాట వినిపించకుండా చేస్తానని చెప్పారు. గుంటూరు జిల్లాలో 10 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించే వైకుంఠపురం బ్యారేజీకి బుధవారం ముఖ్యమంత్రి భూమిపూజ చేసి, శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న అమరావతికి, గుజరాత్లోని అహ్మదాబాద్కు పోలికే లేదని పేర్కొన్నారు. వైకుంఠపురం వద్ద నీటిని నిల్వ చేసి సుందర జలాశయంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రధాని నరేంద్రమోదీని తమ్ముడిగా సంబోధించిన చంద్రబాబు... ఆయనను ఇంటికి సాగనంపుతానని వ్యాఖ్యానించారు. మోదీ వెళ్లిపోతేనే రాష్ట్రానికి హోదా దక్కుతుందన్నారు. -
సాక్షి విలేకరిపై మంత్రి సోమిరెడ్డి చిందులు
సాక్షి, అమరావతి : సాక్షి టీవీ ప్రతినిధి సతీష్పై మంత్రి సోమిరెడ్డి చిందులు తొక్కారు. అన్ని ప్రశ్నలు మీరే ఎందుకు అడుగుతున్నారంటూ ఫైర్ అయ్యారు. వేరే విలేకరులు కూడా ఉన్నారు కదా అంటూ చిర్రుబుర్రులాడారు. రైతు భరోసా కింద కేంద్రం ఇస్తున్న సాయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సాయాన్ని కలిపి మొదటి విడతగా రూ. ఐదువేలు చెక్కు ఒక్కో రైతుకు ఇస్తున్నట్లు మంత్రి చెప్పగానే.. విలేకరి జోక్యం చేసుకుంటూ రబీ పూర్తయింది, ఖరీఫ్ పంట వేయడానికి మరో మూడు నెలల సమయం పడుతుంది. ఇప్పుడు ఎందుకు రైతులకు చెక్లు ఇస్తామంటున్నారని ప్రశ్నించారు. దీనికి మంత్రి సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. విలేకరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..నేనెందుకు సమాధానం చెప్పాలంటూ వేరే అంశంపై మాట్లాడారు. ఈ ఘటన బుధవారం సచివాలయంలోని రెండో బ్లాక్ వద్ద మీడియాతో మంత్రి మాట్లాడుతున్నప్పుడు జరిగింది. -
ఎన్నికల బది‘లీల’లు!
సాక్షి, అమరావతి: త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పెద్దఎత్తున డిప్యూటీ కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఒకేచోట మూడేళ్లకు పైగా ఉంటున్న, ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు ఎవరినీ సొంత జిల్లాల్లో ఉంచరాదని.. మూడేళ్లకుపైగా ఒకే స్థానంలోనూ, గత ఎన్నికల్లో పనిచేసిన ప్రాంతంలోనూ ఉంచరాదని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీఐ) స్పష్టంచేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం బదిలీల ప్రక్రియ చేపట్టింది. మొత్తం 101 మంది డిప్యూటీ కలెక్టర్లకు బదిలీ, పోస్టింగ్ ఉత్తర్వులు ఇస్తూ సాధారణ పరిపాలన (పొలిటికల్) శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీచేశారు. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం ఈ బదిలీల్లో పైరవీలకు పెద్దపీట వేసింది. అనుకూలురైన అధికారులు కావాలంటూ కొందరు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసిన సిఫార్సులకు ఆమోద ముద్ర వేసింది. తమకు నచ్చని అధికారులను ఏడాది కూడా పూర్తికాకపోయినా అప్రధాన పోస్టులకు బదిలీ చేశారు. డిప్యూటీ కలెక్టరు పోస్టులు స్టేట్ కేడర్కు చెందినవైనందున రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బదిలీ చేయవచ్చు. దీనిని అవకాశంగా చేసుకున్న టీడీపీ నేతలు తమకు అనుకూలురును కేటాయించాలని సిఫార్సులు చేశారు. ‘ఫలానా అధికారి మనకు అనుకూలంగా వ్యవహరిస్తాడు. మా జిల్లాలో ఉండటానికి వీల్లేనందున మీ జిల్లాకు వేయించుకో బాగా ఉపయోగపడతాడు’ అని కోస్తాంధ్రకు చెందిన ఒక మంత్రి మరో మంత్రికి సూచించారు. దీంతో ఆ మంత్రి వెంటనే ముఖ్యనేత పేషీలో మాట్లాడి తన జిల్లాకు పోస్టింగ్ వేయించుకున్నారు. ముఖ్యనేత పేషీ ఈ వ్యవహారంలో కీలక భూమిక పోషించిందనే అంశం సచివాలయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బదిలీ ఉత్తర్వులను కూడా సెలవు రోజైన ఆదివారం రాత్రి జారీ చేయడం గమనార్హం. ఈ బదిలీల్లో అప్రధాన పోస్టుల్లో ఉన్న తొమ్మిది మందికి అత్యంత ముఖ్యమైన రెవెన్యూ డివిజనల్ అధికారులు (ఆర్డీవోలు)గా పోస్టింగులు లభించాయి. తహసీల్దార్లకు డిప్యూటి కలెక్టర్లుగా తాత్కాలిక పదోన్నతి కల్పనలో సీనియారిటి, మెరిట్లను కాలరాస్తూ కావాల్సిన వారికి పదోన్నతులు కట్టబెట్టారని విమర్శలు వచ్చిన రెండు మూడు రోజులకే డిప్యూటీ కలెక్టర్ల బదిలీల్లోనూ అలాంటి విమర్శలే వెల్లువెత్తాయి. ఎంపీడీవోల బదిలీల్లోనూ ఇదే తంతు: ఎన్నికల నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ శాఖలోనే రెండు రోజుల క్రితం ఏకంగా 448 మంది ఎంపీడీవోలను బదిలీ చేశారు. అయితే, సీఎం సొంత సామాజికవర్గానికి చెందిన ఎంపీడీవోలను తమకు కావాల్సిన ప్రదేశాల్లోకి బదిలీ చేసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుకూలంగా ఉండరు అన్న వారిని సుదూర ప్రాంతాలకు పంపించారు. ఇందులో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ వర్గాలను టార్గెట్ చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. గుంటూరు జిల్లాలో పనిచేసే ఎంపీడీవోలలో ఎక్కువ మందిని పక్కనే ఉన్న కృష్ణా, ప్రకాశం జిల్లాలకు బదిలీ చేసి, మరికొందరిని తూర్పు గోదావరి జిల్లాకు బదిలీ చేశారు. వారిలో ఏడుగురు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారున్నట్లు సమాచారం. అలాగే, ప్రకాశం జిల్లాలో పనిచేసే ఎంపీడీవోలలో కొందర్ని పక్కనే ఉన్న నెల్లూరు జిల్లాకు బదిలీచేసి, నెల్లూరుకు బదిలీ చేయాలని కోరుకున్న వారిని కర్నూలు జిల్లాకు బదిలీ చేసినట్లు ఆరోపణలున్నాయి. సొంత సామాజిక ఉద్యోగికి అందలం నిబంధనలకు విరుద్ధమని ఐఏఎస్ అధికారి పేర్కొన్నా సీఎం చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు మంత్రి లోకేష్ స్వయంగా జోక్యం చేసుకుని ఓ ఎంపీడీవో ఉద్యోగిని గ్రామీణాభివృద్ధి శాఖకు రెగ్యులర్ ఉద్యోగిగా బదలాయించారు. అంతేకాక.. ఆ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఏకంగా డిప్యూటీ డైరక్టర్ పదవి కట్టబెట్టడం ఆ శాఖలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సొంత సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంవల్లే ఇది జరిగిందని సహచర ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వద్ద ప్రైవేట్ కార్యదర్శి (పీఎస్)గా పనిచేస్తున్న పి. రోశయ్య ఎంపీడీవో అధికారే అయినప్పటికీ.. ఇటీవల కన్ఫర్డ్ ఐఏఎస్ల పదోన్నతుల్లో తనను ఐఏఎస్ హోదాకు ప్రమోట్ చేయాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అందుకు కావాల్సిన అర్హతలు లేని కారణంగా ఆ దరఖాస్తును ప్రభుత్వం పక్కనపెట్టింది. ఇప్పుడు అదే మరో ఎంపీడీవో ఉద్యోగిని పంచాయతీరాజ్ శాఖ నుంచి గ్రామీణాభివృద్ధి శాఖకు రెగ్యులర్ ఉద్యోగిగా బదలాయింపుతోపాటు ఉన్నత పదవిని కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ప్రభుత్వ నిబంధనలు అంగీకరించవని సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్రెడ్డి నోట్ఫైల్లో పేర్కొన్నప్పటికీ మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబు ఇద్దరూ జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే విచక్షణాధికారంతో ఆమోదం తెలిపారు. -
పెంచుకో..దండుకో
-
పోలవరం వ్యయం భారీగా పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి కల్పతరువైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కేంద్రం ఆమోదం లేకుండానే ఏక పక్షంగా పెంచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం హడావిడిగా నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు వ్యయం 2010–11 ధరల మేరకు రూ.16,010 కోట్లు కాగా.. ఇప్పుడు ఏకంగా రూ.55,548.87 కోట్లకు పెంచుతూ సాగునీటి శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ జీవో 21ని జారీ చేశారు. కేంద్రం అనుమతి లేకుండానే ఏకపక్షంగా ప్రాజెక్టు వ్యయాన్ని పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాజెక్టును వివాదాల్లోకి నెట్టి పూర్తి కాకుండా చేసే ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నట్లు ఈ చర్య ద్వారా స్పష్టం అవుతోందని ఇంజినీర్లతో పాటు ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. నేడు ఢిల్లీలో సమావేశం.. అంతలోనే జీవో పోలవరం అంచనా వ్యయం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై సోమవారం కేంద్ర జలవనరుల సంఘం కార్యదర్శి యు.పి.సింగ్ నేతృత్వంలో సాంకేతిక సలహా కమిటీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా సెలవు రోజైనప్పటికీ ఆదివారం అంచనా వ్యయాన్ని పెంచేస్తూ జీవో 21 జారీ చేయడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2017 ఆగస్టులో పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.57,940 కోట్లకు పెంచుతూ, ఇందుకు ఆమోదం తెలపాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అప్పటి నుంచి ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం పోలవరం ప్రాజెక్టు అంచనాల పెంపుపై ఢిల్లీలో సాంకేతిక సలహా కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశానికి ఒక రోజు ముందు ప్రాజెక్టు వ్యయాన్ని రూ.55,548.87 కోట్లకు పెంచుతూ జీవో జారీ చేయడం వెనుక ఏదో దురుద్దేశం ఉన్నట్లు కనిపిస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. జలవనరుల సంఘం ఆమోదిస్తేనే.. పోలవరం నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు.. చివరకు ప్రత్యేక హోదాను కూడా చంద్రబాబు తాకట్టు పెట్టేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడితే కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు అందవనే కారణంతో చంద్రబాబు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణలోకి తెచ్చుకున్నారు. అనంతరం ఇష్టానుసారం ప్రాజెక్టు పనుల అంచనా వ్యయాల్ని పెంచేస్తూ తనకు కావాల్సిన కాంట్రాక్టర్లకు నామినేషన్లపై పనులను అప్పగిస్తూ భారీఎత్తున కమిషన్లు దండుకున్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కావడంతో పెరిగిన అంచనా వ్యయానికి కేంద్ర జలవనరుల సంఘం ఆమోదం అనంతరం కేంద్ర ఆర్థిక శాఖకు పంపుతారు. ఆర్థిక శాఖ అంగీకారంతో ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయాల్సి ఉంది. అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం గమనార్హం. జాతీయ ప్రాజెక్టు అని ప్రస్తావించకుండానే ఆదివారం జారీ చేసిన జీవోలో ఎక్కడా జాతీయ ప్రాజెక్టు అనే పదం వాడకుండా.. కేవలం పోలవరం ప్రాజెక్టుగా పేర్కొనడంపై అధికారులు విస్మయం చెందుతున్నారు. జాతీయ ప్రాజెక్టు అని జీవోలో కచ్చితంగా పేర్కొనాలని, కేవలం పోలవరం ప్రాజెక్టుగా పేర్కొనడం వెనుక దురుద్దేశాలు ఏంటో అర్థం కావడం లేదని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు వ్యయం పెంపు ప్రతిపాదనలను ప్రాజెక్టు ఈఎన్సీ ఈ నెల 8న రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఆ ప్రతిపాదనలను ఆదివారం రాష్ట్ర ఆర్థిక శాఖకు పంపి అనుమతి తీసుకున్నారు. ఆదివారమే ప్రాజెక్టు వ్యయాన్ని రూ.55,548.87 కోట్లకు పెంచుతూ జీవో 21 జారీ చేసేశారు. -
ఖరీదైన హోటళ్లలో 3,500 మందికి ఏసీ గదులు!
సాక్షి, అమరావతి, సాక్షి, న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న తరుణంలో విభజన హామీలు, ఏపీకి ప్రత్యేక హోదా వాగ్దానాన్ని నెరవేర్చాలనే డిమాండ్తో దేశ రాజధానిలో సోమవారం ఒకరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న దీక్ష కోసం హాజరయ్యే వారి కోసం ఖరీదైన ఏసీ హోటళ్లలో 3,500 మందికి వసతి సదుపాయాలు ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు నిర్వహించే దీక్షకు రూ. 10 కోట్ల దాకా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలకు విలాసవంతమైన హోటళ్లలో వసతి కల్పిస్తోంది. ఢిల్లీలో అత్యంత ఖరీదైన హోటల్ రాయల్ ప్లాజాలో 30 గదులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున బుక్ చేశారు. మంత్రులు, వీఐపీలు రెండు రోజులపాటు ఢిల్లీలో ఉంటున్నందున వారి కోసం వీటిని కేటాయించారు. హోటల్ సూర్యలో 200 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ శాఖల చైర్మన్లకు వసతి కల్పిస్తున్నారు. రూ. 1.12 కోట్ల వ్యయంతో అనంతపురం, శ్రీకాకుళం నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్ల ద్వారా వచ్చే వారికి పహార్గంజ్ ప్రాంతంలో ‘ఆన్ యువర్ ఓన్’ (ఓవైఓ) కింద వివిధ హోటళ్లలో 850 గదులను బుక్ చేశారు. కేరళ, మహారాష్ట్ర భవన్లు, టీటీడీ అతిథి గృహం, న్యూఢిల్లీ వైఎంసీఏ టూరిస్ట్ హోటళ్లలో కూడా వందల సంఖ్యలో గదులు బుక్ చేశారు. వీరందరినీ సీఎం చంద్రబాబు దీక్ష చేసే ఏపీ భవన్ వద్దకు తరలించేందుకు ప్రత్యేకంగా 32 బస్సులను ఏర్పాటు చేశారు. 155 మందికి విమాన టిక్కెట్లు.. ధర్నాలో పాల్గొనాలంటూ ప్రభుత్వ ఉద్యో గులపై ఒత్తిడి చేసిన ముఖ్యమంత్రి కార్యాలయం వారిని ఢిల్లీకి తరలించి తిరిగి స్వస్థలాలకు చేర్చేందుకు విమాన టిక్కెట్ల కోసం భారీగా వెచ్చిస్తోంది. ఏపీ ఎన్జీవోల సంఘం నుంచి 29 మందికి, ఏపీ జేఏసీ అమరావతి నుంచి 20 మందికి, ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ నుంచి ఐదుగురికి, ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ నుంచి 18 మందికి విమాన టిక్కెట్లు సిద్ధం చేసింది. లోక్సత్తా, ఆప్ తదితర రాజకీయ పార్టీల నేతలతోపాటు ఉద్యోగ, రాజకీయ, విద్యార్థి సంఘాల నేతలతో కలిపి మొత్తం 155 మందికి విమాన టిక్కెట్లు సమకూర్చింది. ప్రచారం కోసం మరుగుదొడ్లనూ వదల్లేదు.. ఢిల్లీలో సీఎం చంద్రబాబు చేసే ఒక రోజు దీక్షకు ప్రచారం కల్పించేందుకు సెంట్రల్ ఢిల్లీ పరిధిలో ఉన్న పబ్లిక్ టాయ్లెట్లను కూడా వదలకుండా భారీ హోర్డింగులను ఏర్పాటు చేశారు. ఏపీ భవన్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం తరఫునే భారీ ఎత్తున బ్యానర్లు నెలకొల్పారు. వేదిక ఏర్పాటు, హోర్డింగులు ఇతరత్రా ఖర్చులకు రూ. 80 లక్షల వరకు వెచ్చిస్తున్నట్టు ఏపీ భవన్ వర్గాలు తెలిపాయి. సీఎం చంద్రబాబు ఉదయం రాజ్ఘాట్ వద్ద మహాత్ముడికి, ఏపీ భవన్లో అంబేడ్కర్కు నివాళులర్పించి అనంతరం దీక్ష ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. -
వారంలో భారీగా ఐపీఎస్ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వారం రోజుల్లో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగే అవ కాశం కనిపిస్తోంది. రెండు, మూడేళ్లుగా ఒకే చోట పని చేస్తున్న పలువురు అధికారులను లోక్సభ ఎన్నికలకు ముందే బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా ఐజీలు, ఎస్పీలను బదిలీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏర్పాటుకాబోతున్న మరో రెండు నూతన జిల్లాలకు కూడా ఎస్పీలను నియమించేందుకు పోలీస్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. సీనియర్ ఎస్పీలుగా పనిచేస్తున్న వారికి ఇటీవలే ప్రభుత్వం డీఐజీలుగా పదో న్నతి కల్పించింది. వీరికి పోస్టింగ్స్ కల్పించాల్సి ఉంది. 2005 బ్యాచ్కు చెందిన ఎం.రమేశ్, విశ్వప్రసాద్, అవినాష్ మహంతి డీఐజీలుగా పదోన్నతి పొందనున్నారు. ఇక డీఐజీలుగా ఉన్న అధికారులు ప్రభాకర్రావు, సుధీర్ బాబు, అకున్సబర్వాల్, ప్రమోద్కుమార్ ఐజీలు గా పదోన్నతి పొందనున్నారు. ఇక 1994 బ్యాచ్కు చెందిన ఐజీలు శివధర్రెడ్డి, సౌమ్యామిశ్రా, కొత్తకోట శ్రీనివాస్రెడ్డి, షికాగోయల్ అదనపు డీజీపీలుగా పదో న్నతి పొందనున్నారు. పదోన్నతి కాకుండా బదిలీ అయ్యే వారిలో నార్త్జోన్ ఐజీ నాగిరెడ్డి, నగర శాంతి భద్రతల అదనపు కమిషనర్ చౌహాన్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఉన్నట్లు తెలిసింది. పోలీస్ శాఖను వేధిస్తోన్న డీఐజీల కొరతఈ పదోన్నతులతో తీరేలా కనిపిస్తోంది. డీఐజీలుగా ఇప్పటికే కమలాసన్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్, శివకుమార్ పదోన్న తి పొందగా, వీరితో పాటు రమేశ్, విశ్వప్రసాద్, అవినాష్మహంతి డీఐజీ ర్యాంకులోకి చేరబోతున్నారు. -
ఇదేం చిత్రం సారూ..!
ఇల్లందకుంట (హుజూరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకం పనులు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇష్టారాజ్యంగా మారాయి. ఇప్పటి వరకు పట్టణంలో పనులు 60 శాతం కంటే ఎక్కువగా పూర్తి కాలేదు. దీనికి తోడు ఉన్న నిధులు పూర్తికావడంతో సదరు కాంట్రాక్టర్ పనులు చేయకుండా వదిలివేశారు. ఇదిలా ఉండగా పాత వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఆరు నెలల క్రితం పైపులు వేశారు. శనివారం వేరేచోట పైపులు తక్కువగా ఉన్నాయని ప్రొక్లెయిన్తో తీసివేశారు. దాదాపు 300 మీటర్లకుపైగా ఉన్న 30 పైపులను తీసివేశారు. ఆ మార్గంలో ఉన్న కాలనీవాసులు గతంలో వేసుకున్న మంచినీటి పైపులు, డ్రైనేజీ పైపులు ధ్వంసం కావడంతో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
బాబు నహీ ‘కియా’
సాక్షి ప్రతినిధి, అనంతపురం: మీరొక కార్ల కంపెనీ స్థాపించారనుకుందాం.. అది నిర్మాణం కూడా పూర్తి చేసుకోకముందే, ఇంకెక్కడి నుంచో కారును తీసుకొచ్చి, ఇక్కడే తయారు చేశారు చేశామహో అని టముకు వేసుకుంటే చూసేవాళ్లు ఏమనుకుంటారు? కచ్చితంగా మోసగాడనే అనుకుంటారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరు కూడా అలాగే ఉంది. సరిగ్గా ఎన్నికల ముందే చంద్రబాబు కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం తంటాలు పడుతున్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో ఏర్పాటు చేసిన ‘కియా’ మోటార్స్ ప్లాంట్లో వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే ఇక్కడ కార్ల ఉత్పత్తికి మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. అయినా ఈ ప్లాంట్ నుంచి తొలి కారు బయటకు వచ్చేసిందంటూ చంద్రబాబు హడావుడి చేస్తున్నారు. ఇదంతా తన ఘనతేనని ఊరూవాడా ఊదరగొడుతున్నారు. కరువు జిల్లా అనంతపురం రూపురేఖలు సమూలంగా మార్చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారు. దక్షిణ కొరియా నుంచి కారు తెప్పించి, అది ఇక్కడే తయారు చేశామంటూ నిస్సిగ్గుగా తన అనుకూల మీడియా అండతో ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు తీరును చూసి రాష్ట్ర ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అనుబంధ పరిశ్రమలు ఏర్పాటైతేనే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2017 ఏప్రిల్లో ‘కియా’తో అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. 2017లో పెనుగొండ సమీపంలోని ఎర్రమంచి గ్రామం వద్ద కియా కార్ల ప్లాంట్ నిర్మాణం ప్రారంభమైంది. 2019 ద్వితీయార్ధంలో కారును బయటకు తీసుకురావడమే లక్ష్యంగా కియా కంపెనీ పనిచేస్తోంది. ఈ విషయాన్ని 2018 ఫిబ్రవరి 22న జరిగిన ఫ్రేమ్ ఇన్స్టలేషన్ సెరమనీ (కియా రూపకల్పన ప్రక్రియ వేడుక)లో కియా ప్రెసిడెంట్ పార్క్ ప్రకటించారు. మొదట కార్ల విడిభాగాలను దక్షిణ కొరియా నుంచి తెప్పించి, ఇక్కడ వాటిని అమర్చి కార్లను తయారీ చేస్తారు. అనుబంధ పరిశ్రమలు ఏర్పాటైన తర్వాత పూర్తిస్థాయిలో అన్ని పరికరాలను ఇక్కడే తయారు చేసే అవకాశం ఉంది. ఈ పరిశ్రమ ఏర్పాటైతే 3 వేల మందికి ప్రత్యక్షంగా, 7 వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. వృత్తి నైపుణ్యం ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సాంకేతిక విద్యను అభ్యసించి, ‘కియా’కు అవసరమైన వృత్తి నైపుణ్యం ఉంటేనే ఇక్కడ ఉద్యోగాలు ఇస్తారు. ఎన్నికల షెడ్యూల్కు ముందు బాబు హడావుడి కియా ఫ్యాక్టరీకి శంకుస్థాపన తర్వాత 2018 ఫిబ్రవరి 22న ‘ప్రేమ్ ఇన్స్టలేషన్ సెరమనీకి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఏ ఫ్యాక్టరీకైనా భూమిపూజ, శంకుస్థాపన చేస్తారు. ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి బయటకు వచ్చే సమయంలో ప్రారంభోత్సవం చేస్తారు. కానీ, చంద్రబాబు అందుకు భిన్నంగా శంకుస్థాపన, భూమిపూజతోపాటు ఫ్రేమ్ ఇన్స్టలేషన్ సెరమనీలో పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్ నెలరోజుల్లో వెలువడుతుందనగా ‘కియా’ నుంచి కార్లు బయటకు వస్తున్నాయని ప్రచారం చేసుకునేందుకు ‘ట్రయల్ ప్రొడక్షన్ సెరమనీ’ని జనవరి 29న నిర్వహించారు. మరో ఏడాది సమయం తప్పదు కియా కార్ల తయారీ ప్లాంట్లో మిషనరీ అమరికే ఇంకా పూర్తిస్థాయిలో జరగలేదు. మిషనరీ అమరిక నేపథ్యంలో ట్రయల్ ప్రొడక్షన్ వేడుక నిర్వహించారు. కార్లు ఉత్పత్తి అయ్యి, మార్కెట్లోకి వచ్చేందుకు మరో ఆరు నెలలు పడుతుందని చంద్రబాబుతోపాటు కియా ప్రతినిధులు చెబుతున్నా.. నిజానికి మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. కొరియా నుంచి యంత్రాలు రావాల్సి ఉంది. ఏడాదికి 3 లక్షల కార్లు తయారు కావాలంటే, రోజుకు 822 కార్లు ఉత్పత్తి కావాలి. అంటే గంటకు 34 కార్ల చొప్పున సిద్ధం కావాలి. కార్ల తయారీలో ప్రెస్, బాడీఫిట్టింగ్, పెయింట్ తదితర రంగాల్లో 300 రోబోలను అమర్చాల్సి ఉంది. ఇప్పటిదాకా ఒక్క రోబో కూడా సిద్ధం కాలేదు. ఇవన్నీ తెలిసినా కొరియా తెచ్చిన కారులో ‘షికారు’ చేసి, తన అనుకూల మీడియా ద్వారా పచ్చి అబద్ధాలు చంద్రబాబు వల్లెవేస్తుండడం గమనార్హం. ఉద్యోగాల కల్పనలోనూ మోసం ‘కియా’ పరిశ్రమలో 86 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇస్తామని ప్రభుత్వం మొదట్లో ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి స్థానికుల్లో వృత్తి నైపుణ్యం పెంపొందిస్తామని హామీ ఇచ్చింది. కియా సంస్థలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ దాదాపు ముగింపు దశకు వచ్చింది. ప్రత్యక్షంగా కల్పించే 3 వేల ఉద్యోగాల్లో కనీసం 10 శాతం ఉద్యోగాలు కూడా స్థానికులకు ఇవ్వలేదు. ఈ పరిశ్రమ కోసం భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కార్ల తయారీ ప్లాంట్లలో పనిచేస్తున్న సిబ్బందిని తీసుకొచ్చి ఇక్కడ నియమిస్తున్నారు. ఇదేం అన్యాయమని ముఖ్యమంత్రి చంద్రబాబును విలేకరులు ప్రశ్నిస్తే... ‘స్థానికులకే ఉద్యోగాలు కావాలంటే పరిశ్రమలు రావు. వృతి నైపుణ్యం ఉండాలి కదా? అందుకోసం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. భూములు కోల్పోయిన 376 కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం’’ అని చెప్పేసి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం ‘కియా’లో కొందరు స్థానికులకు వాచ్మెన్లు, స్వీపర్లు, టాయిలెట్లు శుభ్రం చేయడం వంటి చిన్నాచితక పనులే దక్కాయి. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని కియా మోటర్స్ ప్లాంటు వద్ద పనులు జరుగుతున్న దృశ్యం ముందే చక్కబెట్టిన మంత్రులు కియా మోటార్స్ పెనుకొండ సమీపంలో ఏర్పాటవుతున్నట్లు ముందుగానే తెలుసుకున్న మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేలు వరదాపురం సూరి, బీకే పార్థసారథి తదితరులు ఎర్రమంచి పరిసర ప్రాంతాల్లో భారీగా భూములు కొనుగోలు చేశారు. ‘కియా’లో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు మొదలైతే ఇక్కడ భూముల ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉంది. ఇది ముందుగానే ఊహించిన టీడీపీ ప్రజాప్రతినిధులు నిరుపేద రైతుల నుంచి అతితక్కువ ధరకు పెద్దఎత్తున భూములు కొనేశారు. -
సీతారామలో కీలక ముందడుగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకంలో మరో కీలక ముందడుగు పడింది. భద్రాద్రి–కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకానికి తుది అటవీ అనుమతులు మంజూరయ్యాయి. అత్యంత కీలకమైన ఈ అనుమతిని మంజూరు చేస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ చెన్నై కార్యాలయం డిప్యూటీ కన్జర్వేటర్ కె.గణేశ్కుమార్ ఉత్తర్వులిచ్చారు. గోదావరి నదిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి నీటిని మళ్లించి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని 6.75 లక్షల ఎకరాలకు నీరందించేందుకు సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టుకోసం సుమారు 20,946.72 ఎకరాల భూసేకరణ జరపాల్సి ఉండగా, అటవీభూమి 3,827.63 ఎకరాలు. ఇందులో మణుగూరు డివిజన్లో 212.95 హెక్టార్లు, పాల్వంచ పరిధిలో 618.95, కొత్తగూడెం డివిజన్ పరిధిలో 369.09, సత్తుపల్లిలో 277.41, ఖమ్మం డివిజన్ పరిధిలో 52.64 హెక్టార్ల భూమి అవసరం ఉంది. ఈ అటవీ భూముల పరిధిలో కాల్వలు, టన్నెళ్లు, పంప్హౌస్లు, విద్యుత్ లైన్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ఈ అటవీ అనుమతులకు స్టేజ్–1 క్లియరెన్స్ గత ఏడాది ఫిబ్రవరిలోనే మంజూరయింది. భూములకు పరిహారాన్ని చెల్లించడంతో బుధవారం తుది స్టేజ్–2 అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే వన్యప్రాణి బోర్డు, పర్యావరణ అనుమతులు సైతం మంజూరు అయ్యాయి. తాజాగా అటవీ అనుమతులకు క్లియరెన్స్ దక్కడంతో పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. -
పసుపు కుంకుమ డప్పు అక్షరాలా అప్పే!
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు పసుపు – కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు ఇస్తామని చెబుతున్న రూ.10 వేలు అప్పుగానేనని మరోసారి తేటతెల్లమైంది. పసుపు – కుంకుమ 2 పథకం కింద డ్వాక్రా సంఘాలకు అందచేయనున్న ఆర్థిక సాయంపై విధివిధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీవో ఎంఎస్ నెంబరు 17 జారీ చేసింది. డ్వాక్రా మహిళలకు అప్పు వ్యక్తిగతంగా ఇవ్వబోమని, సంఘంలోని సభ్యులను బట్టి మూలధన నిధి రూపంలో మూడు విడతల్లో ఇస్తామని అందులో స్పష్టం చేసింది. పొదుపు సంఘాల మహిళలకు ఇస్తామన్న రూ.పది వేలు అప్పుగానే పరిగణించాలని ఈ జీవో ద్వారా పరోక్షంగా పేర్కొనడం గమనార్హం. వ్యక్తిగతంగా కాకుండా గ్రూపునకు మూడు విడతల్లో చెక్కులు జారీ చేస్తామని పేర్కొన్న జీవోలో భాగం అప్పేనని గతంలోనే సర్క్యులర్ జారీ.. పసుపు– కుంకుమ డబ్బులను డ్వాక్రా మహిళలకు వ్యక్తిగతంగా కాకుండా సంఘంలోని సభ్యుల సంఖ్య ఆధారంగా ఒక్కొక్కరికి రూ.పది వేల చొప్పున లెక్కగట్టి ఆ మొత్తాన్ని క్యాపిటల్ గ్రాంట్ (మూలధన నిధి) రూపంలో మూడు విడతల్లో సంబంధిత సంఘం బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు తాజా విధివిధానాల జీవోలో ప్రభుత్వం తెలిపింది. అయితే క్యాపిటల్ గ్రాంట్ రూపంలో పొదుపు సంఘాల ఖాతాలో డబ్బులు జమ చేస్తే వాటిని వినియోగించుకోవాల్సిన తీరుపై గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్– వెలుగు) కొన్ని విధివిధానాలను నిర్దేశిస్తూ 2015 మే 16వ తేదీన ఓ సర్కులర్ను జారీ చేసింది. ఆ సర్కులర్ ప్రకారం క్యాపిటల్ గ్రాంట్ (మూలధన నిధి) రూపంలో సంఘ ఖాతాల్లో జమ అయ్యే నిధులను డ్వాక్రా మహిళలు ఎట్టిపరిస్థితుల్లోనూ పంచుకోకూడదు. ఆ డబ్బులను మూలధన నిధిగా భావించి దాని ద్వారా బ్యాంకుల్లో అప్పు తెచ్చుకుని మహిళలు ఉపాధి అవకాశాలు పెంచుకునేందుకు వినియోగించుకోవాలని సూచించారు. సంఘం ఖాతాలో జమ అయిన ఆ డబ్బులను మహిళలు కావాలనుకుంటే సంఘం నుంచి అప్పుగా తీసుకోవచ్చని ఆ సర్క్యులర్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇచ్చేది అప్పు.. ఎన్నికల కోసం డప్పు మొత్తంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జారీ చేసిన పసుపు – కుంకుమ –2 పథకం విధివిధానాల జీవో, అంతకు ముందు 2015లో సెర్ప్ – వెలుగు సంస్థ జారీ సర్కులర్ ద్వారా డ్వాక్రా సంఘాలకు ఇస్తామంటున్న డబ్బులు ప్రభుత్వ రికార్డుల ప్రకారం అప్పేనని స్పష్టమవుతుంది. అయితే ఎన్నికలు సమీపించడంతో చంద్రబాబు తన మోసం బయటపడకుండా డొంక తిరుగుడుగా వ్యవహరిస్తూ ఇచ్చేది క్యాపిటల్ గ్రాంట్ అని ఒక జీవో, ఆ క్యాపిటల్ గ్రాంట్ను మహిళలు పంచుకుంటే అది అప్పుగా పరిగణించబడుతుందని మరో సర్కులర్ ద్వారా పేర్కొనడం గమనార్హం. రూపాయి కూడా మాఫీ చేయలేదని మంత్రే ఒప్పుకున్నారు.. 2014 ఎన్నికల ముందు తాను అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికలు వచ్చినా ఇప్పటిదాకా ఆయన ఏ ఒక్కరికీ రూపాయి రుణాన్ని కూడా మాఫీ చేయలేదు. సంబంధిత శాఖ మంత్రిగా ఉన్న పరిటాల సునీత 2018 సెప్టెంబరులో శాసనసభకు ఈమేరకు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వడం గమనార్హం. ‘ఉచిత’ ప్రచారం ఓట్ల కోసమే.. చంద్రబాబు 2014లో ఆధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల పేరిట రూ.14,204 కోట్ల దాకా రుణాలున్నాయి. రుణమాఫీ ఆశతో మహిళలు ఏళ్ల తరబడి కిస్తీలు కట్టకపోవడంతో మహిళలు తిరిగి చెల్లించలేనంతగా వడ్డీల భారం పెరిగిపోయింది. డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోగా దీనికి తోడు గత ప్రభుత్వాలు అమలు చేసిన జీరో వడ్డీ పథకానికి కూడా టీడీపీ సర్కారు ఎగనామం పెట్టడంతో ఆ భారం కూడా మహిళలపైనే పడింది. మొత్తంగా ఈ ఐదేళ్లలో దాదాపు రూ. 30 వేల కోట్ల వరకు చంద్రబాబు డ్వాక్రా మహిళలను మోసగించినట్లు అధికార వర్గాల్లో అంచనాలున్నాయి. మళ్లీ ఎన్నికలు రావడంతో రాష్ట్రంలోని 94 లక్షల మంది డ్వాక్రా మహిళల ఓట్ల కోసం పసుపు–కుంకుమ 2 కింద ఒక్కొక్కరికీ పది వేల చొప్పున ఇస్తామంటూ మరో మోసానికి చంద్రబాబు తెర తీశారు. ఇదంతా ఉచితమనే తరహాలో బహిరంగ వేదికల మీద చెబుతూ అందుకు భిన్నంగా అది అప్పేనని పరోక్షంగా అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. పసుపు– కుంకుమ –2 విధి విధానాలు ఇవీ... –జనవరి 18వ తేదీ నాటికి సెర్ప్, మెప్మా రికార్డులో నమోదు చేసుకున్న పొదుపు సంఘాలు అదనపు మూలధన నిధి (క్యాపిటల్ గ్రాంట్) పొందడానికి అర్హులు. –క్యాపిటల్ గ్రాంట్గా ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయాన్ని మహిళలకు వ్యక్తిగతంగా అందజేయరు. సంఘంలోని సభ్యుల సంఖ్యను బట్టి ఆ మొత్తాన్ని రూ.2500 ఒకసారి, రూ.3500 రెండోసారి, మూడోసారి రూ.4000 చొప్పున ఆయా సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఉదాహరణకు ఒక సంఘంలో పది మంది సభ్యులుంటే మొదటి విడతలో బ్యాంకు ఖాతాల్లో రూ. 25 వేలు జమ చేస్తారు. – క్యాపిటల్ గ్రాంట్ను మూడు పోస్టు డేటెడ్ చెక్కులుగా సంఘం పేరిట అందజేస్తారు. సంఘం సభ్యులందరికీ కలిపి ఒక్కో విడతకు ఒక్కొక్క చెక్కునే అందజేస్తారు. – మొదటి విడత చెక్కు ఫిబ్రవరి 1వ తేదీన లేదంటే ఆ తర్వాత చెల్లుబాటు అయ్యేలా, రెండో విడత చెక్కు ఈ ఏడాది మార్చి 8వ తేదీతో, మూడో విడత చెక్కు ఏప్రిల్ 5వతేదీతో చెల్లుబాటు అయ్యేలా ముందుగానే మూడు చెక్కులను పంపిణీ చేస్తారు. – ఫ్రిబవరి మొదటి వారంలో డీఆర్డీఏ సిబ్బంది ద్వారా సంఘాల పేరిట మూడు చెక్కులను మహిళలకు అందజేస్తారు. – ప్రభుత్వం జారీ చేసే చెక్కులకు బ్యాంకుల్లో నేరుగా డబ్బులు చెల్లించకుండా అకౌంట్ పేయీ చెక్కులను జారీ చేస్తారు. మహిళలు ఆ చెక్కులను తమ సంఘం ఖాతాలో తొలుత జమ చేసుకొని ఆ తర్వాత డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. – గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు చెందిన పీడీ బ్యాంకు ఖాతాల ద్వారా డబ్బులను డ్వాక్రా సంఘాల ఖాతాల్లో జమ చేస్తారు. – అర్హుల జాబితాను గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల్లో, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ వార్డు కార్యాలయాల్లో అందరికీ తెలిసేలా అందుబాటులో ఉంచుతారు. – పసుపు–కుంకుమ పథకం గురించి సెర్ప్, మెప్మా విస్తృతంగా ప్రచారం చేయాలి. –చెక్కులు అందని పొదుపు సంఘాలు గ్రామ సమాఖ్య, మండల ఏపీఎంలకు వినతిపత్రాలు సమర్పించాలి. సమగ్ర విచారణ అనంతరం ఆయా సంఘాల అర్హతపై నిర్ణయం తీసుకుంటారు. -
ఆర్టీఓలు కావలెను!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖలో ఆర్టీఓలు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ఏకంగా ఆర్టీఓ పోస్టుల్లో సిబ్బంది లేకపోవడంతో ఇన్చార్జుల పాలనే నడుస్తోంది. దాదాపుగా మూడేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నియామకాలపై దృష్టి సారించకపోవడం గమనార్హం. ఇదే అదనుగా చాలా చోట్ల దళారులు చెలరేగుతున్నారు. నేపథ్యం ఏంటి? 2016 అక్టోబర్ వరకు తెలంగాణలో 10 జిల్లాలు ఉండేవి. వాటికి అనుగుణంగా 10 మంది ఆర్టీఓలు ఉండేవారు. కానీ, 2016 దసరా తర్వాత జిల్లాల సంఖ్య 31కి చేరింది. దీంతో మిగిలిన జిల్లాలకు కొత్తగా ఆర్టీఓలు, ఇతర సిబ్బంది అవసరమయ్యారు. అయితే ఈ మేరకు నియామకాలు చేపట్టలేదు. దీంతో ఆ ఆర్టీఓ అధికారులకే మిగతా కార్యాలయాలను అప్పగించారు. దీంతో వీరిపై తీవ్ర పనిభారం పెరిగింది. అయితే వీరికి బాధ్యతలు అప్పగించిన స్థానంలో ఇన్చార్జులుగా మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు/ అడ్మినిస్ట్రేషన్ సిబ్బందిని ఆర్టీఓలుగా నియమించారు. మరీ కీలకమైన పనులు ఉన్నపుడు మాత్ర మే ఆర్టీఓలు సదరు కార్యాలయాలకు వెళ్తున్నారు. ఇన్చార్జులకు పనిభారం.. ప్రస్తుతం 31 జిల్లాలకు 14 జిల్లాలకు ఆర్టీఓలున్నారు. మిగిలిన 17 జిల్లాలకు మాత్రం ఇన్చార్జులే ఆర్టీఓలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వీరిని డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్టు ఆఫీసర్ (డీటీఓ)లుగా పిలుస్తున్నారు. వీరిలో 9 మంది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, 8 మంది డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్లున్నారు. వాస్తవానికి ఆర్టీఓలుగా పదోన్నతి పొందడానికి వీరిలో చాలామందికి అర్హత ఉంది. మూడేళ్లుగా ఇన్చార్జులుగా విధులు నిర్వర్తిస్తున్నా ప్రభుత్వం పదోన్నతులు కల్పించలేదు. ఇటు పనిభారం పెరగటంతో పాటు కనీసం అలవెన్సులు కూడా పెంచలేదంటూ వాపోతున్నారు. ఇప్పటికైనా అర్హులను ఆర్టీఓలుగా నియమించాలని వారు కోరుతున్నారు. త్వరలో మరో రెండు కొత్త జిల్లాలు.. మరో రెండు కొత్త జిల్లాల (ములుగు, నారాయణ్ పేట్) ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇన్చార్జ్ ఆర్టీఓలుగా ఉన్న 17 జిల్లాలతో పాటు కొత్తగా ఏర్పాటయ్యే 2 కొత్త జిల్లాలకు ఆర్టీఓ అధికారులు అవసరమే. ఏజెంట్లదే హవా.. ఇన్చార్జి ఆర్టీఓలున్న ఆఫీసుల్లో ప్రైవేటు ఏజెంట్లు హల్చల్ చేస్తున్నారు. వీరు ఏకంగా సిబ్బందితో కలసిమెలసి ఉంటున్నారు. సాధారణంగా వివిధ పర్మిట్లకు సంబంధించిన వివిధ స్మార్ట్కార్డులు స్పీడ్ పోస్టు ద్వారా పంపాలి. కానీ, ఈ ఏజెంట్లకు రూ. 200 ఇస్తే చాలు. క్షణాల్లో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, వివిధ రకాల పర్మిట్లు నేరుగా చేతిలో పెడుతున్నారు. గతంలో కింది స్థాయిలో పనిచేసిన సమయంలో ఏజెంట్లతో వీరికున్న సాన్నిహిత్యమే ఇందుకు కారణమన్న విమర్శలున్నాయి. -
‘పోలవరం’ లెక్కలు చెప్పాల్సిందే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, సహాయ, పునరావాస ప్యాకేజీ అమలులో అక్రమాలను నిగ్గుతేల్చేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సిద్ధమైంది. ఇప్పటివరకూ పోలవరం జలాశయం.. కుడి, ఎడమ కాలువల పనుల కోసం సేకరించిన భూమి సర్వే నెంబర్లు, యజమాని పేరు, చెల్లించిన పరిహారం వివరాలు ఇవ్వాలని పీపీఏ సభ్య కార్యదర్శి డాక్టర్ ఆర్కే గుప్తా రాష్ట్ర ప్రభుత్వానికి, పోలవరం భూసేకరణ విభాగం స్పెషల్ కలెక్టర్ సీహెచ్ భానుప్రసాద్కు లేఖ రాశారు. ఇప్పటివరకూ పునరావాసం కల్పించిన నిర్వాసితులు, వ్యక్తిగతంగా వారికి పంపిణీ చేసిన పరిహారం, పునరావాస కాలనీల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటికి చేసిన ఖర్చుల వివరాలు ఇవ్వాలని కోరారు. వివరాలు ఇస్తే అక్రమాలు గుట్టంతా రట్టు అవుతుందని ప్రభుత్వ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. పీపీఏకు ఎలాంటి వివరాలు ఇవ్వొద్దంటూ తమపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తున్నారని పోలవరం భూసేకరణ విభాగం అధికారులు చెబుతుండటం గమనార్హం. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 2010–11 ధరల ప్రకారం.. రూ.16,010.45 కోట్లు. ఇందులో భూసేకరణ, సహాయ, పునరావాస ప్యాకేజీ వ్యయం.. రూ.2,934.42 కోట్లు. 2013–14 ధరల ప్రకారం.. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.57,940.86 కోట్లకు పెంచుతూ ఆగస్టు 17, 2017న రాష్ట్ర ప్రభుత్వం పీపీఏ ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో భూసేకరణ, సహాయ, పునరావాస ప్యాకేజీ వ్యయం.. రూ.33,225.74 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టింది. భూసేకరణ చట్టం 2013 ప్రకారం.. సేకరించిన భూమికి పరిహారం చెల్లించినా, నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ అమలు చేసినా ఇంత వ్యయం చేయాల్సిన అవసరం ఉండదని ఆదిలోనే పీపీఏ స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు పనుల తరహాలోనే భూసేకరణ, సహాయ, పునరావాస ప్యాకేజీల అంచనా వ్యయాన్ని భారీ ఎత్తున పెంచేసి కమీషన్లు పంచుకోవడానికి ప్రభుత్వ పెద్దలు ప్రణాళిక రచించినట్లు గుర్తించింది. కుడి కాలువ అక్రమాలతో ఆరంభం టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో నాలుగు మండలాల్లోని టీడీపీ నేతలు, సానుభూతిపరులైన రైతులకు ఎకరానికి గరిష్టంగా రూ.62 లక్షల చొప్పున పరిహారం పంపిణీ చేసింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం లెక్కగట్టినా ఎకరానికి రూ.20 లక్షలు నుంచి రూ.25 లక్షలకు మించి పరిహారం ఇవ్వడానికి అవకాశం లేదని అధికారవర్గాలు అప్పట్లోనే వెల్లడించాయి. మొత్తం రూ.700 కోట్లను టీడీపీ నేతలు, సానుభూతిపరులకు పరిహారంగా పంపిణీ చేశారు. ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు చేతులు మారినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. పోలవరం జలాశయంలో ముంపునకు గురయ్యే భూమిని 2009కి ముందే సేకరించినా.. సేకరించనట్లు చూపి బినామీ పేర్లతో పరిహారాన్ని టీడీపీ నేతలు కాజేశారు. గిరిజనులకు భూమికి బదులుగా భూమిని పంపిణీ చేసేందుకు జరిపిన భూసేకరణలోనూ, పునరావాస కాలనీల నిర్మాణానికి చేసిన భూసేకరణలోనూ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడి వందలాది కోట్ల రూపాయలను టీడీపీ నేతలు దోచుకున్నారు. వివరాలు ఇవ్వొద్దని ఒత్తిళ్లు పోలవరం జలాశయంలో ముంపునకు గురయ్యే భూమి, కుడి, ఎడమ కాలువల తవ్వకానికి అవసరమైన భూమి వెరసి 1,66,423.27 ఎకరాల భూమిని సేకరించాలి. ఇప్పటివరకూ 1,10,787 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. భూసేకరణకు రూ.5,398.59 కోట్లను ఖర్చు చేసింది. పోలవరం జలాశయంలోముంపునకు గురయ్యే గ్రామాల్లోని 1,05,601 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఇందులో 3,922 కుటుంబాలకు మాత్రమే ఇప్పటివరకూ పునరావాసం కల్పించారు. నిర్వాసితులయ్యే గిరిజనులకు భూమికి బదులుగా భూమి ఇచ్చేందుకు పది వేల ఎకరాలను సేకరించారు. సహాయ, పునరావాస ప్యాకేజీ కింద రూ.802 కోట్లను ఖర్చు చేశారు. మిగిలిన 55,636 ఎకరాల భూమి సేకరణకు రూ.7,208.89 కోట్లు, 1,01,679 మందికి పునరావాసం కల్పించడానికి రూ.19,817 కోట్లు అవసరమని ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ భూసేకరణకు, సహాయ, పునరావాస ప్యాకేజీ అమలుకు చేసిన వ్యయంతోపాటు ఇంకా సేకరించాల్సిన భూమి, పునరావాసం కల్పించాల్సిన నిర్వాసితుల వివరాలు ఇవ్వాలని పీపీఏ కోరింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వివరాల ఆధారంగా క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేయించి అక్రమాల గుట్టును రట్టు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే కుడి కాలువ భూసేకరణలో అక్రమాలపై పక్కాగా ఆధారాలు సేకరించిన పీపీఏ.. జలాశయం, ఎడమ కాలువ భూసేకరణ వ్యవహారంపై దృష్టి పెట్టడంతో ప్రభుత్వ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. అంచనా వ్యయాన్ని రూ.57,940.86 కోట్లకు పెంచుతూ పంపిన ప్రతిపాదనలు మినహా.. పీపీఏకు ఎలాంటి వివరాలు ఇవ్వొద్దంటూ ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని భూసేకరణ విభాగంలో కీలక అధికారి తెలిపారు. -
నిరుద్యోగులను నిండా ముంచేసిన రాష్ట్ర సర్కార్
సాక్షి, అమరావతి: గత ఎన్నికలకు ముందు ‘జాబు రావాలంటే బాబు రావాలి, ఇంటికో ఉద్యోగం’ అనే నినాదాలతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం.. ఐదేళ్ల పదవీకాలంలో ఆ నినాదాలను పూర్తిగా తుంగలోతొక్కింది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిరుద్యోగులను నట్టేట ముంచింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్లో 1,42,825 పోస్టులు ఖాళీ ఉన్నాయని కమలనాథన్ కమిటీ నివేదిక ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ పదవీ విరమణ చేసిన వారి సంఖ్య కలుపుకొంటే మొత్తం ఖాళీలు 2.40 లక్షలకు చేరినట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇప్పటి వరకూ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేసిన పోస్టులు.. కేవలం రెండు వేలు మాత్రమే. ఏటా ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించి 2016 వరకు వాటి ఊసే ఎత్తలేదు. గ్రూప్–1, 2, 3తో పాటు కొన్ని సాంకేతిక పోస్టులు, ఇతర పోస్టులు కలిపి మొత్తం 4,275 ఖాళీల భర్తీకి మాత్రమే 2016లో నోటిఫికేషన్ ఇచ్చింది. వీటికి 15.99 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేశారు. ఇన్ని లక్షల మంది నిరుద్యోగుల్లో కేవలం 2 వేల మందికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు లభించడాన్ని బట్టి చూస్తే నిరుద్యోగులను చంద్రబాబు ఏవిధంగా వంచించారో అర్థమవుతుంది. మరోవైపు రాష్ట్రంలో 5.50 లక్షల మందికిపైగా డీఈడీ, బీఈడీ పూర్తిచేసినవారు ఉన్నారు. రాష్ట్రంలో ఏటా డీఎస్సీ అని చెప్పినా.. ఇప్పటివరకు ఒకే ఒక్క డీఎస్సీని మాత్రమే పూర్తయింది. గత కిరణ్కుమార్ రెడ్డి ప్రభుత్వంలో అనుమతి ఇచ్చిన పోస్టులు పూర్తి చేశాక.. రాష్ట్రంలో ఇంకా 22 వేలకు పైగా టీచర్ ఖాళీలు భర్తీ చేస్తామని చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. అయితే చివరకు ఆ పోస్టుల సంఖ్యను 7,902కు కుదించేసింది. అవిగో నియామకాలు, ఇవిగో వేలాది పోస్టుల భర్తీలు అంటూ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది కానీ, ఈ ఐదేళ్లలో చంద్రబాబు సర్కార్ ఇచ్చిన ఉద్యోగాలు కేవలం రెండు వేలు మాత్రమే. ఇది పూర్తిగా తమ ఆశలతో, ఆశయాలతో ఆడుకోవడం లాంటిదేనని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల కుదింపు ప్రభుత్వ శాఖల్లో మంజూరైన మొత్తం పోస్టులు, ఖాళీల సంఖ్యను ప్రభుత్వం కుదించి చూపిస్తూ నిరుద్యోగులకు పంగనామాలు పెడుతోంది. రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఇప్పటి వరకూ ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల సంఖ్య 2.40 లక్షలుంటే ఖాళీల సంఖ్య కేవలం 77,737 మాత్రమేనని, వీటిలో పైస్థాయిలో ఉండే 20 వేల పోస్టులను రెగ్యులర్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామని తక్కినవాటిలో అవుట్ సోర్సింగ్లో తీసుకుంటామని ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకొంది. ప్రభుత్వ శాఖల్లోని పోస్టులే కాకుండా ఉపాధ్యాయుల పోస్టులనూ రాష్ట్ర ప్రభుత్వం కుదించేసింది. ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ముందు 22 వేలకు పైగా పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి.. చివరకు 7,902కు ఆ సంఖ్యను తగ్గించేసింది. మళ్లీ ఎన్నికల ముందు నిరుద్యోగులను మభ్యపెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం ఎత్తులు వేసింది. 18,450 పోస్టుల భర్తీ అంటూ ప్రచారం చేసింది. ఈ నోటిఫికేషన్లు ఇంకా పూర్తిగా విడుదల కాలేదు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తమను మరోసారి వంచించడానికే ప్రభుత్వం నోటిఫికేషన్ల డ్రామాను తెరపైకి తెచ్చిందని నిరుద్యోగుల ధ్వజమెత్తుతున్నారు. రూల్–7 ఎత్తివేతతో అన్యాయం గతంలో ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్లలోని పోస్టులకు ఎంపికైనవారు చేరకపోయినా, చేరి రాజీనామా చేసినా ఆ పోస్టులను కమిషన్ నిబంధనావళిలోని రూల్–7 ప్రకారం.. మెరిట్ జాబితాలోని తదుపరి అభ్యర్థికి కేటాయించేవారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఈ రూల్ ఎత్తేస్తూ జీవో ఇచ్చారు. రూల్–6ను మాత్రం కొనసాగించారు. రూల్–6.. ప్రకారం మిగిలిపోయిన పోస్టులను మెరిట్ అభ్యర్థులకు ఇవ్వకుండా తదుపరి నోటిఫికేషన్లలోకి మళ్లిస్తారు. ఫలితంగా నిరుద్యోగ అభ్యర్థులను తీరని అన్యాయం జరుగుతోంది. పోస్టులు మిగిలిపోయేలా ప్రభుత్వ నియామక ప్రక్రియ కొనసాగుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం హామీని నమ్మి ఏటా ఉద్యోగ నోటిఫికేషన్లు, డీఎస్సీ వస్తాయన్న ఆశతో రాష్ట్రంలోని లక్షలాది మంది యువత గత నాలుగున్నరేళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. వీరిలో అనేకమంది లక్షల రూపాయలు అప్పులు చేసి కోచింగ్లు కూడా తీసుకున్నారు. అయితే ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిన పోస్టులు అరకొరగా ఉండడం, కొత్త నోటిఫికేషన్లు రాకపోవడంతో వీరంతా తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. వయోపరిమితి దాటిపోయి.. అవకాశాలు కోల్పోయి.. నాలుగున్నరేళ్లుగా నియామకాలు లేకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులు వయోపరిమితి దాటి పోయారు. ఇప్పుడు వారికి ఏ అవకాశం లేక ఏం చేయాలో పాలుపోక ఇబ్బంది పడుతున్నారు. వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచాలన్న అభ్యర్థనను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని లేనిపక్షంలో ప్రతి నిరుద్యోగికి రూ.2 వేల చొప్పున ప్రతినెలా భృతి ఇస్తామన్న హామీని కూడా ప్రభుత్వ నెరవేర్చలేదు. ఎన్నికలకు ముందు ’యువ నేస్తం’ పేరిట నిరుద్యోగ భృతి హామీలో వెయ్యి కుదించి ఇస్తోంది. అయితే భృతికి అర్హుల సంఖ్యను కుదించేశారు. ఇప్పటికే అనేక నిబంధనలు పెట్టడంతో 5 లక్షల మంది మాత్రమే యువనేస్తానికి దరఖాస్తు చేశారు. తాత్కాలిక ఉద్యోగుల తొలగింపు కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా ఆదర్శ రైతులు, గోపాలమిత్ర, వైద్యమిత్ర, ఫీల్డ్ అసిస్టెంట్లు, వయోజన విద్యాకేంద్రాల సమన్వయకర్తలు, మధ్యాహ్న భోజనం కుక్లు, సహాయకులు, ఇలా పలు కేటగిరీల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న దాదాపు 1.5 లక్షల మందిని ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగించింది. కుక్లు, సహాయకులు 80 వేల మంది, వయోజనవిద్య సమన్వయకర్తలు 20 వేల మంది, ఫీల్డ్ అసిస్టెంట్లు 25 వేల మంది ఉన్నారు. వీరందరినీ చంద్రబాబు సర్కార్ తొలగించి రోడ్డున పడేసింది. ఆటో తోలుకుంటున్నా –కోయ శ్రీనివాస్, కొల్లిపర, గుంటూరు జిల్లా నేను డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లవుతోంది. ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో బాడుగకు ఆటో నడుపుకొంటున్నా. యజమానికి అద్దె పోనూ రోజూ రూ. 100 మాత్రమే మిగులుతున్నాయి. ఈ మొత్తంతో నలుగురు కుటుంబ సభ్యులను పోషించడం కష్టంగా ఉంది. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు ఇవ్వలేదు. ఉల్లిపాయలు అమ్ముకుంటున్నా –వి.రామారావు, విజయవాడ నేను 2016లో ఎంబీఏ పూర్తిచేశా. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తాయని అప్పు చేసి విజయవాడలో కోచింగ్ కూడా తీసుకున్నా. ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాను. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసినా రాలేదు. ప్రస్తుతం కుటుంబ పోషణ కోసం ఉల్లిపాయలు అమ్ముకుంటున్నాను. రిజర్వుడ్ అభ్యర్థులకు ‘ఓపెన్’ దెబ్బ! రాష్ట్రంలోని ప్రభుత్వ పోస్టుల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ కేటగిరీల అభ్యర్థులకు రాజ్యాంగపరంగా దక్కాల్సిన హక్కును రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోంది. ప్రత్యేక మినహాయింపులు పొందిన ఆయా కేటగిరీల అభ్యర్థులు వారి రిజర్వుడ్ పోస్టులకే తప్ప ఓపెన్ కేటగిరీ పోస్టులకు ఎంపికచేయకుండా అన్యాయం చేస్తోంది. దీనిపై ఆయా కేటగిరీలకు చెందిన లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తపరుస్తున్నా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కానీ, ప్రభుత్వంలోని పెద్దలు కానీ పట్టించుకోవడంలేదు. స్క్రీనింగ్ టెస్టు నుంచి మెయిన్స్కు ఎంతమందిని ఎంపిక చేయాలి? రిజర్వేషన్లను ఎలా అమలుచేయాలన్నది ప్రభుత్వం నిర్దేశించాలి. కానీ, ఆ అధికారాన్ని ప్రభుత్వం ఇటీవల ఏపీపీఎస్సీకి అప్పగించింది. గతంలో స్క్రీనింగ్ టెస్టు నుంచి మెయిన్స్కు 1 : 50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపికచేసేలా ప్రభుత్వం జీఓలు ఇచ్చి ఏపీపీఎస్సీ ద్వారా అమలుచేయించింది. ఇప్పుడీ అధికారాన్ని కమిషన్కు అప్పగించడమే కాదు.. ఎంతమందిని ఏ నిష్పత్తిలో ఎంపిక చేయాలో కమిషన్ నిర్ణయానికే వదిలేసింది. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వ ముఖ్యులు ఈ కథను తెరవెనుక నుంచి నడిపిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిషన్ ఇస్తున్న నోటిఫికేషన్లలో ఎక్కడా ఎంపిక విధానం ఎలా ఉంటుందో స్పష్టంచేయకుండా గోప్యత పాటిస్తోంది. మరోవైపు.. నిర్ణీత నిష్పత్తిని ముందుగా ప్రకటించి కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులను పెట్టి అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్టు నుంచి ఎంపికచేయాలని ఆయా వర్గాలు డిమాండ్ చేస్తున్నా కమిషన్ పట్టించుకోవడంలేదు. స్క్రీనింగ్ టెస్టు ముగిశాక జనరల్ కటాఫ్ను నిర్ణయించి మెయిన్స్కు మొత్తం ఎంతమంది అభ్యర్థులు అవసరమో ఆ మేరకు ఎంపికచేస్తామని, వారిలో రిజర్వుడ్ అభ్యర్థులు నిష్పత్తిలో లేకపోతే కటాఫ్ తగ్గించి తక్కిన వారిని ఎంపికచేస్తామని చెబుతోంది. ఇలా చెబుతూనే.. ఎంపికైన వారు కేవలం వారి రిజర్వుడ్ పోస్టులకు మాత్రమే పరిమితమవుతారని షరతు విధించింది. దీంతో ఇప్పటికే పలు సంఘాలు సీఎం చంద్రబాబునాయుడిని కలిసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించినా ఫలితంలేదు. కమిషన్ తీరుపై అనుమానాలు కమిషన్ ఇలా చేయడం వెనుక తమకు కావలసిన అభ్యర్థులందరినీ స్క్రీనింగ్ టెస్టు నుంచి మెయిన్స్కు వచ్చేలా చేయడం, ఆ తరువాత వారికి ఇంటర్వ్యూల్లో అత్యధిక మార్కులు వేయడం ద్వారా గ్రూప్–1 సహా ఇతర ముఖ్యమైన పోస్టులను కట్టబెట్టాలన్న వ్యూహం ఉండి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దలే తమ వారి కోసం ఇలా చేయిస్తున్నారని, పూర్తి అధికారాలను కమిషన్కు అప్పగించి దాని ద్వారా తమ పనికానిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వర్సిటీ పోస్టుల్లోనూ ఇదే తంతు ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల్లోని 1,385 బోధనా సిబ్బంది పోస్టుల భర్తీలోనూ రిజర్వుడ్ అభ్యర్థులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ టెస్టు నిర్వహించారు. ఇందులో ఆయా కేటగిరీల వారీగా అర్హత మార్కులు సాధించిన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ ఆయా వర్సిటీలకు సమర్పించింది. ఈ జాబితా ఆధారంగా ఆయా వర్సిటీలు ఇంటర్వ్యూలు నిర్వహించి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇక్కడ కూడా ప్రభుత్వ పెద్దలు ఏపీపీఎస్సీ తరహాలోనే రిజర్వుడ్ అభ్యర్థులకు ఓపెన్ కేటగిరీకి అవకాశంలేకుండా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వాస్తవానికి కేటగిరీల వారీగా నిర్ణయించిన అర్హత మార్కులను అనుసరించి ఎంపికైన వారందరినీ ఓపెన్ కేటగిరీ పోస్టుల ఇంటర్వ్యూలకు పిలవాల్సి ఉన్నా కేవలం తమ వారికి మాత్రమే ఆయా వర్సిటీల ద్వారా ఇంటర్వ్యూ లేఖలను పంపిస్తున్నారు. ఈ విషయం చాలా రహస్యంగా తెరవెనుక జరిగిపోతోందని, అనేక వేలమంది రిజర్వుడ్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలూ బేఖాతర్ 2016 నోటిఫికేషన్ల సమయంలోనే ఏపీపీఎస్సీ ఈ విధంగానే రిజర్వుడ్ అభ్యర్థులను వారి కేటగిరీకి పరిమితం చేస్తూ అన్యాయం చేసిందని అభ్యర్థులు గుర్తుచేస్తున్నారు. కొత్తగా విడుదలయ్యే నోటిఫికేషన్లకు సంబంధించి ప్రభుత్వం వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు ఇంతకుముందు పెంచిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వారికి నిర్దేశించిన పరిమితికి అదనంగా ఈ పెంపు కూడా వర్తించింది. కొన్ని నోటిఫికేషన్ల సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ తదితర అభ్యర్థులు మెరిట్ సాధించి ఇతరులకన్నా అగ్రస్థానంలో ఓపెన్ కేటగిరీ పోస్టులకు అర్హత సాధించినా ఏపీపీఎస్సీ వారిని ఆ పోస్టులకు అనుమతించలేదు. దీనిపై కొందరు అభ్యర్థులు కమిషన్ ఎదుట తమ అభ్యంతరం చెప్పినా ఫలితం లేకుండాపోయింది. చివరకు వారు హైకోర్టును ఆశ్రయించారు. వారిని ఇతరులతో పాటే ఓపెన్ కేటగిరీ పోస్టులకు అనుమతించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. అయినా కమిషన్ ఆ తీర్పును ఖాతరు చేయకుండా ప్రభుత్వ పెద్దల సూచనలతో సుప్రీంకోర్టును ఆశ్రయించిందని అభ్యర్థులు వాపోతున్నారు. ఇటీవల సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి.. కమిషన్కు లేఖ రాసినా కమిషన్ చైర్మన్ దాన్ని బేఖాతరు చేస్తున్నారని అభ్యర్థులు మండిపడుతున్నారు. పైగా, హైకోర్టు తీర్పును పట్టించుకోవాల్సిన అవసరంలేదని ఏపీపీఎస్సీ పేర్కొంటుండడం విశేషం. -
పెండింగ్ డీఏలు ఎప్పుడు చెల్లిస్తారు?
సాక్షి, అమరావతి: గత ఏడాది జనవరి.. జులై నుంచి ఇవ్వాల్సిన రెండు విడతల డీఏలను ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టడంపై ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఏడాది దాటినా వీటిని చెల్లించకుండా.. మరోవైపు, అడ్డగోలుగా వందల కోట్ల రూపాయలను అస్మదీయులకు దోచిపెట్టడంపై వారు ప్రభుత్వ పెద్దల వైఖరిని బాహాటంగానే తూర్పారబడుతున్నారు. నిబంధనల మేరకు ఇవ్వాల్సిన డీఏలను ఇవ్వకుండా అడ్వాన్స్ల పేరుతో నిబంధనలను సడలించి మరీ కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తూ ఆ తరువాత కేబినెట్లో ఆమోదింపజేస్తున్నారని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. అదే తరహాలో తమకు కూడా డీఏను ఇచ్చేసి ఆ తరువాత కేబినెట్లో ఆమోదించుకోవచ్చు కదా అని వారు పేర్కొంటున్నారు. సంక్రాంతి పండుగకు ఒక డీఏనైనా మంజూరు చేస్తారని ఎదురుచూశామని, కానీ, ప్రభుత్వం స్పందించలేదని సచివాలయంలో ఓ సీనియర్ ఉద్యోగి వ్యాఖ్యానించారు. అప్పుడూ ఇంతే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఉద్యోగులకు డీఏలను ఇవ్వకుండా పెండింగ్లో పెట్టిన చరిత్ర చంద్రబాబుకు ఉందని.. అలాగే, పెన్షనర్లకు డీఏను ఏకంగా ఎగ్గొట్టారని ఉద్యోగులు గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర్రెడ్డి వాటిని చెల్లించారని.. అంతేకాకుండా, పెన్షనర్లకు డీఏను పునరుద్ధరించారన్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొందని, చంద్రబాబు ఇస్తే ఒక డీఏ మంజూరుచేస్తారని లేదంటే అదీ కూడా చేయరని, ఎన్నికల అనంతరం వచ్చే ప్రభుత్వమే ఇక మాకు దిక్కనే అభిప్రాయాన్ని ఉద్యోగులు వ్యక్తంచేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నెలల తరబడి డీఏలను ఎప్పుడూ పెండింగ్ పెట్టలేదని, అంతేకాకుండా.. 2009 ఎన్నికల ముందు ఐఆర్ కూడా మంజూరు చేశారని వారు గుర్తుచేస్తున్నారు. ఈవెంట్ల పేరుతో దుబారా గత ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఉద్యోగులకు 1.58 శాతం డీఏ ఇవ్వాల్సి ఉందని, నెలకు కేవలం రూ.35 కోట్లే భారం పడుతుందని, కానీ.. ఈ కొద్దిపాటి మొత్తాన్ని కూడా మంజూరు చేయకుండా పెండింగ్లో పెట్టడంపై వారు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. అలాగే, గత ఏడాది జులై నుంచి డిసెంబర్ వరకు ఉద్యోగులకు 2.36 శాతం డీఏ ఇవ్వాల్సి ఉందని, దీనికి కూడా నెలకు రూ.70 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని.. ఇంత చిన్నచిన్న మొత్తాలను ఉద్యోగులకు మంజూరు చేయకుండా ఓపక్క పెండింగ్ పెడుతూ మరోపక్క పెద్దఎత్తున ఈవెంట్ల పేరుతో వందల కోట్ల ప్రజాధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం దుబారా చేస్తోందని ఉద్యోగులు, పెన్షన్లు ఆరోపిస్తున్నారు. 11వ వేతన సవరణ కమిషన్ను సైతం ప్రభుత్వం ఆలస్యంగా నియమించిందని.. ఆ నివేదిక వచ్చేసరికి సమయం పడుతుందని, ఈలోగా మధ్యంతర భృతి ఇవ్వాలన్న తమ డిమాండ్పై కూడా ప్రభుత్వం నోరు మెదపడంలేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. డీఏలే ఇవ్వని సర్కారు మధ్యంతర భృతి ఇస్తుందనే నమ్మకంలేదని, ఒకవేళ ఇచ్చినా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇస్తుంది తప్ప అందులో ఎలాంటి చిత్తశుద్ధి ఉండదని వారంటున్నారు. కేబినెట్లో ఇవ్వకపోతే నిరసన పెండింగ్లోని రెండు డీఏల విషయమై ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి చేయకుండా వారితో కుమ్మక్కవుతున్నారని సచివాలయ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. మధ్యంతర భృతి కోసం కూడా ఆ నేతలు ఒత్తిడి తేవడంలేదన్నారు. వచ్చే కేబినెట్ సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ మంజూరు చేయకపోతే నిరసన కార్యక్రమాలను చేపడతామని వెంకట్రామిరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
అదనం కలిపినా నాలుగు గంటలే!
సాక్షి, అమరావతి: వ్యవసాయదారులకు అందించే ఉచిత విద్యుత్ను రోజుకు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలకు పెంచుతున్నట్టు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఎలా సమకూరుస్తారనే ప్రణాళిక లేకుండా ఎన్నికలకు ముందు హడావుడి ప్రచారానికి దిగటాన్ని విద్యుత్ వర్గాలే విమర్శిస్తున్నాయి. టీడీపీ సర్కారు దీన్ని కేవలం ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొంటున్నారు. తొమ్మిది గంటల పాటు సరఫరా చేసేందుకు అవసరమైన విద్యుత్తు ఎంత? ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఎంత ఖర్చు అవుతుంది? తదితర విషయాలను ప్రభుత్వం ఎక్కడా వివరించలేదని గుర్తు చేస్తున్నారు. నాలుగున్నరేళ్లుగా రైతులకు రోజూ ఏడు గంటల చొప్పున ఉచిత విద్యుత్ ఇస్తున్నామని సర్కార్ చెబుతున్నా వాస్తవ గణాంకాలను పరిశీలిస్తే సగం సమయం కూడా సరఫరా చేయడం లేదని స్పష్టమవుతోంది. ఇప్పుడు అదనంగా ఇస్తామంటున్న కరెంట్ను కలిపినా కూడా ఉచిత విద్యుత్తు సరఫరా నాలుగు గంటలకు మించదని భావిస్తున్నారు. ప్రణాళిక లేకుండా ప్రకటనలు.. వ్యవసాయ విద్యుత్ ఖర్చంతా ప్రభుత్వం సబ్సిడీ రూపంలో విద్యుత్ పంపిణీ సంస్థలకు అందచేయాలి. విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి ఇటీవల సమర్పించిన వార్షిక ఆదాయ అవసర నివేదిక (ఏఆర్ఆర్) ప్రకారం 2019–20లో కనీసం రూ. 8 వేల కోట్ల ఆర్థిక లోటు ఉన్నట్టు డిస్కమ్లు పేర్కొన్నాయి. వ్యవసాయ సబ్సిడీనే రూ. 7 వేల కోట్లకుపైగా ఉంది. ఈ మొత్తంలో ప్రభుత్వం ఎంత ఇస్తుందో లెక్క తేల్చలేదు. 2019–20లో రోజుకు 9 గంటల ఉచిత విద్యుత్కు అయ్యే ఖర్చును కూడా కమిషన్ ఆమోదం కోసం పంపలేదు. ఇవేవీ పట్టించుకోకుండా నోటిమాటగా 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పడం రైతులను మోసగించడమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఇస్తోంది మూడున్నర గంటలే.. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 17 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఒక్కో పంపుసెట్ (5 హెచ్పీ) గంట పాటు పనిచేస్తే 5 యూనిట్ల చొప్పున విద్యుత్ ఖర్చవుతుంది. ప్రభుత్వం ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు చెబుతోంది. అంటే రోజుకు ఒక్కో పంపుసెట్కు 35 యూనిట్లు విద్యుత్ ఖర్చవుతుంది. ఈ లెక్కన 17 లక్షల పంపుసెట్లకు రోజుకు 59 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం. కానీ ప్రభుత్వం ప్రస్తుతం ఏటా సరఫరా చేస్తున్న ఉచిత విద్యుత్ 10,831.44 మిలియన్ యూనిట్లు మాత్రమే కావడం గమనార్హం. అంటే రోజుకు కేవలం 29.67 మిలియన్ యూనిట్లే ఇస్తోందన్నమాట. ఒక్కో పంపుసెట్ ఏడు గంటల పాటు పనిచేసేందుకు రోజుకు 35 యూనిట్లు అవసరం కాగా ప్రభుత్వం ఇచ్చేది 17 యూనిట్లు మాత్రమే. అంటే గంటకు ఒక్కో పంపుసెట్కు 5 యూనిట్ల చొప్పున లెక్కేస్తే కేవలం మూడున్నర గంటల పాటు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదు. కానీ రోజుకు ఏడు గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు నాలుగున్నరేళ్లుగా అబద్ధాలు ప్రచారం చేస్తోంది. అదనపు విద్యుత్తు కలిపినా నాలుగు గంటలే! రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు రోజుకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలంటూ ఒక్కో పంపుసెట్కు రోజుకు 45 యూనిట్ల చొప్పున విద్యుత్ ఇవ్వాలి. అంటే 17 లక్షల పంపుసెట్లకు రోజుకు 76 మిలియన్ యూనిట్లు అందించాలి. ఈ లెక్కన ఏడాదికి 27,922.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అవసరం. కానీ ప్రభుత్వం ప్రస్తుతం ఏటా ఇస్తున్న 10,831.44 మిలియన్ యూనిట్లతో పాటు మరో 1,200 మిలియన్ యూనిట్లు మాత్రమే అదనంగా సరఫరా చేస్తానంటోంది. దీంతో మొత్తం కలిపినా ఉచిత విద్యుత్కు ఇచ్చేది 12,031.44 మిలియన్ యూనిట్లు మాత్రమేనని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో పెంచే విద్యుత్ను కలిపినా రోజుకు నాలుగు గంటల పాటు కూడా ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవ విద్యుత్ వినియోగం, ప్రభుత్వం ఇస్తామనే అదనపు విద్యుత్ సరఫరాకు మధ్య 15,831.06 మిలియన్ యూనిట్ల తేడా ఉంది. ఇంత తేడా ఉంటే 9 గంటల సాగుకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విద్యుత్ వర్గాలే విమర్శిస్తున్నాయి. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
సాక్షి ప్రతినిధి, కడప: ‘‘అన్నా.. ఉద్యోగాలు కోల్పోతున్నాం.. మా కుటుంబాలు వీధిపాలు కానున్నాయి.. పదేళ్లు సేవ చేసినా ఫలితం లేకుండా పోతోంది..’’ అంటూ చిరుద్యోగులు, ‘‘రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వేతర రంగ సంస్థల్లో 3 శాతం రిజర్వేషన్లు కేటాయించాల్సి ఉండగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. మమ్మల్ని ప్రోత్సహించండి..’’ అంటూ దివ్యాంగులు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదట వాపోయారు. వారి విన్నపాలకు స్పందించిన ప్రతిపక్షనేత.. ‘అధైర్యపడొద్దు. అండగా ఉంటాం. తోలుమందం ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. నిబ్బరంగా ఉండాలి’ అని సూచించారు. ఆదివారం వైఎస్సార్ జిల్లా పులివెందుల కార్యాలయంలో ఆయన విన్నపాలను స్వీకరించారు. ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ ఉద్యోగులు, పీహెచ్సీ, నెట్వర్క్ ఆస్పత్రుల వైద్యమిత్రలు, టీం లీడర్లు సంయుక్తంగా కలిసి వారి సమస్యను విన్నవించారు. ‘‘పదేళ్ల పాటు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాం. తక్కువ వేతనాలతో ఎన్టీఆర్ వైద్యసేవ పథకానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చాం. మమ్మల్ని తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ఎత్తుగడలను ప్రదర్శిస్తోంది. హైకోర్టు అనుకూలమైన తీర్పు వెల్లడిస్తే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అర్హత పరీక్షలు నిర్వహించుకోవాలని సుప్రీం సలహా ఇస్తే ఎలాగైనా ఇంటికి పంపాలని సంబంధం లేని ప్రశ్నలతో పరీక్ష నిర్వహించారు. పూర్తిగా నష్టపోయి మేము, మా కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తోంది. ఇదివరకు పనిచేస్తున్న సిబ్బందినే కొనసాగించాలి’’ అని జగన్కు విన్నవించుకున్నారు. ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదు.. వైద్య విధాన పరిషత్ కాంట్రాక్టు కార్మికులు మాట్లాడుతూ కేవలం రూ.3,500 వేతనంతో విధులు నిర్వర్తించామని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి 2009 జూన్ 15న విన్నవిస్తే రూ.2 వేలు జీతం పెంచారని, రెగ్యులర్ చేయాలని కోరగా ఏడాది తర్వాత చేస్తామన్నారని తెలిపారు. ఆయన మరణంతో తర్వాతి ప్రభుత్వాలు పట్టించుకోలేదని విన్నవించారు. అలాగే ప్రభుత్వేతర సంస్థలైన ఏపీఎస్ఆర్టీసీ, ఎపీఎస్ఈబీల్లో దివ్యాంగులకు 3 శాతం రిజర్వేషన్లు కేటాయించి, బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయించేలా కృషి చేయాలని కారుణ్య డిజేబుల్, ఆర్ఫాన్స్ అండ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ సొసైటీ సభ్యులు కోరారు. దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక బహుమతిని రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచాలని కోరారు. అదేవిధంగా పంచాయితీరాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇందిరప్రభ, జలసిరి పథకాలల్లో ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న జియాలజిస్టులు తమకు రూ.10 వేలు జీతం తగ్గించారని వాపోయారు. బాధితుల ఆవేదనను ఓపిగ్గా విన్న తర్వాత ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వారిని సముదాయించారు. ‘‘రాబోవు రోజుల్లో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మీకు అండగా నిలుస్తుంది. ఎలాంటి ఆవేదన పెట్టుకోవద్దు’’ అని సూచించారు. పార్టీ కార్యాలయంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న వైఎస్ జగన్ హైదరాబాద్కు వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర ముగించుకుని వైఎస్సార్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఆదివారం రాత్రి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పులివెందులలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను కలుసుకుంటూ, సమస్యలు వింటూ బిజీ బిజీగా గడిపిన ప్రతిపక్షనేత.. రాత్రి కడప రైల్వే స్టేషన్కు చేరుకుని వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ బయల్దేరారు. రైల్వేస్టేషన్కు కడప ఎమ్మెల్యే అంజద్బాషా, మాజీ ఎంపీ అవినాష్రెడ్డి, కమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లిఖార్జునరెడ్డి వచ్చారు. బిజీబిజీగా గడిపిన ప్రతిపక్షనేత పులివెందులలో మూడోరోజు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బిజీబిజీగా గడిపారు. తన కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచే కార్యకర్తలకు, ప్రజానీకానికి జగన్ అందుబాటులో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. కాగా, నేతలందరితో వైఎస్ జగన్ మమేకమయ్యారు. అనంతపురం, నెల్లూరు జిల్లాల నాయకులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడు నదీంఅహమ్మద్, మాజీ మంత్రులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కలిశారు. ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథరెడ్డి, రాచమల్లు ప్రసాద్రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, ఎస్బీ అంజాద్బాషా, మేయర్ సురేష్బాబు, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, జమ్మలమడుగు సమన్వయకర్త డాక్టర్ సుధీర్రెడ్డి తదితరులు వైఎస్ జగన్తో సమావేశమయ్యారు. -
దేశవ్యాప్త రైతుబంధుతో రాష్ట్రానికి మేలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం ఆలోచిస్తుండటం.. ఈ పథక రూపశిల్పి కేసీఆర్కు ఊరట కల్గించనుంది. కేంద్రమే నిధులు కేటాయిస్తే, రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఉపశమనం కలుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది బడ్జెట్లో ఖరీఫ్, రబీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.12 వేల కోట్లను కేటాయించింది. ఎకరాకు రూ.8 వేల చొప్పున ఆ రెండు సీజన్లలో రైతులకు అందజేసింది. దీని ప్రకారం దాదాపు రూ.11 వేల కోట్లు రైతులకు అందినట్లయింది. వచ్చే ఖరీఫ్, రబీ సీజన్లకు ఎకరాకు రూ.10వేలు ఇస్తామని కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. ఆ ప్రకారం బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. మరోవైపు రుణమాఫీకి దాదాపుగా రూ.20 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వచ్చే బడ్జెట్లో దాదాపు రూ.35 వేల కోట్లు. ఇది కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి తలకుమించిన భారమే. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చే ఆలోచన చేస్తుందని, ఎకరాకు రెండు సీజన్లకు కలిపి రూ.8 వేలు ఇచ్చేలా ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చే రైతుబంధు నిధులు ఎంతో ఊరటనిస్తాయన్న చర్చ జరుగుతోంది. 70% నిధులు కేంద్రం ఇస్తే.. దేశవ్యాప్తంగా రైతుబంధు లాంటి పథకాన్ని ప్రవేశపెట్టే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. అయితే నిధులను మొత్తంగా భరించకపోవచ్చు. వ్యవసాయం రాష్ట్ర పరిధిలోకి వస్తుంది కాబట్టి.. రాష్ట్రాలూ ఈ భారాన్ని కొంతమొత్తంలో పంచుకునే దిశగా కేంద్రం ఈ పథకాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాల్లో అమలు చేసే కేంద్ర పథకాలకు సాధారణంగా 60:40 నిష్పత్తిలో నిధుల కేటాయింపు ఉంటుంది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరిస్తాయి. ఈ పద్ధతిలోనే రైతుబంధు నిధులూ కేటాయించాలని కేంద్రం భావిస్తోందని రాష్ట్ర ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నందున ఈ పథకం కేంద్రమే అమలు చేస్తుందన్న భావన తీసుకురావాలంటే ఎక్కువ మొత్తంలో నిధులు తామే భరిస్తున్నామనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రధాని ప్లాన్ చేస్తున్నారని ఆయన వెల్లడించారు. అందులో భాగంగానే కేంద్రం 70%, రాష్ట్రాలు 30% భరించేలా విధివిధానాలు రూపొందించే అవకాశం ఉండొచ్చన్నారు. ఆ ప్రకారం కేంద్రం ఎకరాకు రూ.8 వేలలో 70%.. అంటే రూ.5,600 భరిస్తుంది. మిగిలిన రూ.2,400 రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలు ఇస్తానని చెప్పింది కాబట్టి కేంద్రం ఇవ్వగా అవసరమైన దానికి అదనంగా రూ. 2 వేలు కలిపితే సరిపోతుంది. ఆ ప్రకారం ఎకరాకు రెండు సీజన్లకు కలిపి రూ.4,400 ఇస్తే సరిపోతుంది. అంటే రెండు సీజన్లకు కలిపి బడ్జెట్లో దాదాపు రూ.7 వేల కోట్లు కేటాయిస్తే సరిపోతుంది. అంటే రూ.15 వేల కోట్లలో ఇవిపోను రూ.8 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి మిగిలే అవకాశముంది. ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తే రూ. 3 లక్షల కోట్లు ఖర్చవుతుందని ఎస్బీఐ పరిశోధన పత్రంలో పేర్కొంది. దేశవ్యాప్తంగా సాగు 34.59 కోట్ల ఎకరాలు కాగా ఆ స్థాయిలోనే ఖర్చవుతుందని తేల్చి చెప్పింది. -
ఎట్టకేలకు ‘గ్రూప్స్’ నోటిఫికేషన్లు
సాక్షి, అమరావతి: ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న దశలో రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్–1, గ్రూప్–2 కేటగిరీ పోస్టులు సహా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1,386 పోస్టుల భర్తీకి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం ఏడు వేరువేరు నోటిఫికేషన్లు జారీచేసింది. ఇందులో గ్రూప్–1లో 169, గ్రూప్–2లో 446, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు 308, పాలిటెక్నిక్ లెక్చరర్లు 405, ఫిషరీస్ డెవలప్మెంట్ అధికారులు 43, అసిస్టెంట్ ఫిషరీస్ ఇన్స్పెక్టర్లు 10, డిప్యూటీ ఎగ్జిక్యూ టివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్లు 5 పోస్టులకు ఈ నోటిఫికేషన్లను విడుదల చేశారు. ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ పరీక్ష ఫీజు, ఆన్లైన్ దరఖాస్తుకు వేర్వేరు తేదీలను కమిషన్ ఆయా నోటిఫికేషన్లలో పొందుపరిచింది. స్క్రీనింగ్ టెస్టు, మెయిన్స్ తేదీలకు సంబంధించిన సమాచారాన్ని, నిబంధనలను కమిషన్ వెబ్సైట్లో ఉంచింది. ప్రభుత్వం అనుమతిం చిన కొత్త ఖాళీలతోపాటు గతంలో భర్తీకాకుండా మిగిలున్న పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్లలో వేర్వేరుగా చూపించారు. ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవోలో పేర్కొన్న కొన్ని కేటగిరీల పోస్టులు నోటిఫికేషన్లలో పెరగ్గా మరికొన్ని పోస్టులు తగ్గాయి. కీలకమైన గ్రూప్–1 పోస్టులు జీవోలో 182 ఉండగా నోటిఫికేషన్లో 169 మాత్రమే చూపించారు. గ్రూప్–2లో జీవోలో 337 పోస్టులను చూపించగా గతంలో మిగిలిన వాటిని కలుపుకుని 446 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 154, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 292 ఉన్నాయి. పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆయా కేటగిరీల్లో దరఖాస్తు చేసే అభ్యర్థుల సంఖ్య 25 వేలు దాటితే స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నారు. ఆన్లైన్ దరఖాస్తుకు గడువు తేదీల్ని కమిషన్ వెబ్సైట్లో పెట్టింది. అలాగే ఈ ఆన్లైన్ దరఖాస్తులకు ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి ఆయా దరఖాస్తుల చివరి గడువుకు ముందు తేదీల్లో అర్థరాత్రి 11.59 గంటల వరకు అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ల విడుదలపై సర్కారు జాప్యం రాష్ట్రంలోని దాదాపుగా 2.40 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తూతూమంత్రంగానే నోటిఫికేషన్లు ఇస్తున్న విషయం తెలిసిందే. ఖాళీలన్నీ భర్తీ చేయడానికి ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 2016లో కానీ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. అది కూడా కేవలం 4,275 పోస్టులకు మాత్రమే ప్రకటనలు ఇచ్చారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు నోటిఫికేషన్ల జాడలేదు. గత నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగులు కోచింగ్లకోసం లక్షలాది రూపాయలు వెచ్చిస్తూ కళ్లుకాయలు కాచేలా ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. వేలాదిమంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోవడంతో నష్టపోయారు. వారంతా ఆందోళనలు చేసినా ఉపయోగం లేకపోయింది. తీరా సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో సర్కారు పోస్టుల భర్తీ అంటూ హడావుడి చేస్తోంది. వివిధ పోస్టుల భర్తీకోసం గత సెప్టెంబర్ 19న జీవో 153ని విడుదల చేసింది. ఒకవైపు ఖాళీలు లక్షల సంఖ్యలో ఉండగా.. ప్రభుత్వం మాత్రం టీచర్, పోలీసు సిబ్బంది సహా 18,450 పోస్టుల భర్తీకి మాత్రమే అనుమతించి నిరుద్యోగులను ఉస్సూరనిపించింది. ఆయా శాఖలు తమకు ఎన్ని పోస్టులు అవసరమో నివేదికలు పంపినా ప్రభుత్వం ఆర్థిక శాఖ ద్వారా మరో కమిటీని వేసి వాటిని సగానికి సగం కుదించేసింది. ఈ పోస్టుల నోటిఫికేషన్లూ వెంటనే వెలువరించలేదు. రిజర్వేషన్లు, రోస్టర్ తదితర సమాచారాన్ని ఏపీపీఎస్సీకి అందించడంలో విపరీత జాప్యం ఫలితంగా నాలుగు నెలల తరువాత కానీ తాజా నోటిఫికేషన్లు రాలేదు. రూల్ 7 ఎత్తివేసి నిరుద్యోగులకు కుచ్చుటోపీ ఇదిలా ఉండగా ప్రభుత్వం ప్రకటించిన పోస్టులకన్నా కొన్ని కేటగిరీల్లో పోస్టులు పెరిగినట్లు చూపుతున్నా అది సర్కారు కనికట్టు మాత్రమే. గతంలో ఏ నోటిఫికేషన్లో అయినా పోస్టుల్లో చేరినవారు రాజీనామా చేసినా, ఇతర కారణాల వల్ల మిగిలిపోయినా ఏపీపీఎస్సీ నిబంధనల్లోని రూల్ 7 ప్రకారం ఆ నోటిఫికేషన్కు సంబంధించిన మెరిట్ జాబితాలోని తదుపరి అభ్యర్థులకు కేటాయించడం జరిగేది. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆ రూల్ 7ను ఎత్తివేయించారు. ఫలితంగా మిగిలిపోయిన పోస్టులు మెరిట్ అభ్యర్థులకు కాకుండా తదుపరి నోటిఫికేషన్లలోకి మళ్లించేలా నిరుద్యోగులకు చంద్రబాబు కుచ్చుటోపీ పెట్టారు. 2016 నోటిఫికేషన్లలో 4,275 పోస్టులు ప్రకటించినా అందులో సగం పోస్టులే భర్తీకాగా తక్కినవన్నీ మెరిట్ అభ్యర్థులకు దక్కకుండా తాజా నోటిఫికేషన్లలో చేరాయి. ఈసారి గ్రూప్–1 పోస్టులు తగ్గిపోయాయి. ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పేర్కొన్న పోస్టుల్లో ఎండీవో పోస్టులు తాజాగా చూపించలేదని, అందువల్లనే ఆ పోస్టులు తగ్గిపోయాయని కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
పేరుకే ఆదరణ..! అంతటా.. నిరాదరణే
దుస్తులు కుట్టే వాళ్లంతా వడ్రంగి పని చేయాలి.. వడ్రంగి పని చేసే వాళ్లు దుస్తులు కుట్టాలి.. ఇస్త్రీ చేసే వాళ్లు సెలూన్ షాపు పెట్టుకోవాలి.. మేళం వాయించే వారు రాళ్లు కొట్టడం నేర్చుకోవాలి.. కంప్యూటర్పై పని చేసే వాళ్లు కుట్టుమిషన్ నేర్చుకోవాలి.. ఇలా చదువుతుంటే విచిత్రంగా అనిపిస్తోంది కదూ! ‘ఆదరణ’ పథకం కింద ఆయా కుల వృత్తుల వారు వారికి కావాల్సిన పరికరాల కోసం దరఖాస్తు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న తీరు ఇలానే ఉంది మరి. వెనుకబడిన తరగతుల వారికి ఊతమందించేలా ఉండాల్సిన ఈ పథకం ఉసూరుమనిపిస్తోంది. ప్రచారార్భాటం.. నాసిరకం పరికరాలు.. అవినీతి.. వెరసి బీసీలకు ఈ ప్రభుత్వం నిరాదరణే మిగిల్చింది. 7 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 25 వేల మందికి తూతూ మంత్రంగా పనికి రాని పరికరాలు అంటగట్టి ఏదో ఉద్ధరించినట్టు డప్పుకొట్టుకుంటోంది. ఆ కొద్దిమందికి కూడా నాసిరకం పరికరాలు అంటగట్టారు. అందులోనూ అవినీతికి పాల్పడ్డారు. సాక్షి, నెట్వర్క్: నాలుగున్నరేళ్ల తర్వాత ఎన్నికలకు ముందు బీసీలను ఆకట్టుకుని వారి వృత్తులకు సంబంధించిన పరికరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం 2003 తర్వాత మరోసారి ప్రవేశపెట్టిన ఆదరణ పథకం అమలులో దారుణంగా విఫలమవుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరికరాల పంపిణీ అంతా బోగస్ అని స్వయంగా లబ్ధిదారులే చెబుతున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలోనూ పరికరాల్లో నాణ్యత లేదని 47.54 శాతం మంది వెల్లడించడం గమనార్హం. పనికిరాని పనిముట్లు ఇవ్వడమే కాకుండా వివిధ వృత్తులకు సంబంధించిన పరికరాలు తెప్పించడంలోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఈ పథకం కింద నవంబర్ 30 నాటికి 6,97,419 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం గత నెల 12న మెగా రుణమేళా నిర్వహించింది. మరో మూడు మేళాలు నిర్వహించి మొత్తం మీద నాలుగు రుణమేళాల్లో 4,02,500 మందికి పరికరాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా మొదటి విడతలో నవంబర్ 30 వరకు 25,093 మందికి మాత్రమే పరికరాలు ఇచ్చింది. ఇందులోనూ సగం మందికిపైగా నాణ్యత లేని పరికరాలు అందాయి. దీంతో దరఖాస్తు చేసుకున్నవారు ఈ నాసిరకం పరికరాలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ప్రభుత్వం నాలుగు లక్షల మందికి పైగా పరికరాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా అందులో 1,87,165 మంది మాత్రమే తమ వంతు వాటా చెల్లించారు. దీన్ని బట్టి ఈ పథకం అమలు తీరు ఎంత దారుణంగా ఉందో అవగతమవుతోంది. లబ్ధిదారుల ఇబ్బందులెన్నో.. ఆదరణ పథకంలో లబ్ధిదారులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ఆన్లైన్లోదరఖాస్తు చేసుకోవడానికి వెళ్తే సర్వర్ ప్రాబ్లం ఉందని మళ్లీ రావాలంటూ మీసేవా కేంద్రాల చుట్టూ తిప్పుకుంటున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉన్నా అనేక సాకులతో కొంతమంది నుంచి దరఖాస్తులు స్వీకరించడం లేదు. ఇప్పటికే నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు మంజూరు చేశామని ఇక కొత్త దరఖాస్తులు స్వీకరించబోమని అధికారులు చెబుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో అర్హులు మిగిలిపోతున్నారు. మరికొంతమందికి వివిధ ధ్రువపత్రాలు తీసుకురావాలని చెబుతుండటంతో వాటికోసం లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండటం లేదు. టీడీపీ నేతలు, గ్రామాల్లో జన్మభూమి కమిటీలు, పట్టణాల్లో మునిసిపల్ కమిటీలు చెప్పినవారినే లబ్ధిదారుల జాబితాలో చేరుస్తున్నారు. టీడీపీ నేతలకు అడిగినంత చెల్లిస్తేనే లబ్ధిదారుల జాబితాలో చోటు దక్కుతోంది. తమ వంతు వాటా, టీడీపీ నేతలు అడిగినంత చెల్లించి నెలలు గడుస్తున్నా వారికి పరికరాలు అందడం లేదు. కొన్నిచోట్ల అధికారులు ఒక్కో యూనిట్కు రెండుసార్లు, మూడుసార్లు కూడా లబ్ధిదారుల నుంచి డీడీలు కట్టించారు. ఉదాహరణకు విశాఖపట్నం జిల్లా తగరపువలసకు చెందిన చిప్పాడ త్రినాథ్ అనే నాయీ బ్రాహ్మణుడు రూ.20 వేల విలువైన యూనిట్ పొందడానికి అర్హత సాధిస్తే అందుకు లబ్ధిదారుని వాటా కింద రూ.2 వేలు చెల్లించాల్సి ఉండగా మొదట రూ.1950, రెండోసారి రూ.1639 కట్టించుకున్నారు. గోవాడ రాజు అనే మరొక వ్యక్తి రూ.30 వేల పనిముట్లు పొందడానికి అర్హత పొందితే అతని వాటా కింద రూ.3 వేలకు బదులుగా.. రూ.3,197, రూ.2,709 కలిపి రూ.5,906 వసూలు చేశారు. ఇప్పటివరకు తక్కువమందికి పరికరాలు అందగా వాటిలో ఎక్కువ శాతం నాసిరకం పరికరాలే. అంతేకాకుండా లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న పరికరాలను కాకుండా వేరేవి ఇస్తున్నారు. కొంతమందికి వారి వృత్తులకు సంబంధం లేనివి కూడా ఇచ్చారు. ఆదరణ పథకాన్ని 125 బీసీ సామాజికవర్గాలకు అందించాల్సి ఉండగా కేవలం 15 సామాజికవర్గాలకే అందించారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నేతల జోక్యమే శాపం.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అధికార పార్టీ నేతల సిఫార్సుల మేరకే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లబ్ధిదారుల ఎంపికకు మండల, మునిసిపాలిటీ స్థాయిలో కమిటీలు ఉన్నాయి. ఈ కమిటీల్లో ఉన్నవారు పూర్తిగా తెలుగుదేశం పార్టీ నేతలే. గరిష్టంగా రూ.30 వేల వరకు ఉన్న యూనిట్లను అధికార పార్టీ నేతలు తమకు అనుకూలురైన వారికి మాత్రమే దక్కేలా చక్రం తిప్పారని స్వయంగా లబ్ధిదారులే చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జన్మభూమి కమిటీల సిఫార్సుల మేరకు టీడీపీ సానుభూతిపరులను మాత్రమే పథకానికి ఎంపిక చేశారని అంటున్నారు. అంతేకాకుండా లబ్ధిదారుల జాబితాలో పేరుండాలంటే ముడుపులు చెల్లించాల్సిందేనంటూ భారీ మొత్తాల్లో వసూళ్లు చేశారని పేర్కొంటున్నారు. ఇక మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు వస్తువుల కొనుగోలులో తమకు అనుకూల కంపెనీలకు టెండర్లు దక్కేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. విజయవాడలోని ఒక్క ఎలక్ట్రానిక్ షోరూమ్కే ఆదరణ పథకం కింద అన్ని వస్తువులను 50 శాతానికిపైగా సరఫరా చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఈ వ్యవహారంలో పలు లోపాయికారీ ఒప్పందాలు జరిగాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదరణ పథకం అంటే.. బీసీల్లో చేతివృత్తుల వారికి పనిముట్లు ఇచ్చి ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు 2003లో చంద్రబాబు ప్రభుత్వం ఆదరణ పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పట్లో దీనికి రూ.34.38 కోట్లు కేటాయించారు. నాడు వెలుగు పథకం అమలు చేయని మండలాల్లో మాత్రమే బీసీలకు పనిముట్లు పంపిణీ చేశారు. కాగా, ఈ ఏడాది అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం ఆదరణ–2 పేరుతో మరోసారి ఈ పథకాన్ని తెరమీదకి తెచ్చింది. 2018–19కి రూ.750 కోట్లు కేటాయించగా కేవలం రూ.50 కోట్లు మాత్రమే విడుదల చేసింది. బీసీల్లో చేతివృత్తులవారు లబ్ధి పొందేందుకు అర్హులు. 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.10 వేలు, 20 వేలు, రూ.30 వేలు ఇలా మూడు యూనిట్లలో దేన్నో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న యూనిట్ మొత్తంలో తన వంతు వాటాగా 10 శాతం నగదు చెల్లించాలి. 20 శాతం మొత్తాన్ని జాతీయ బీసీ ఆర్థికాభివృద్ధి సంస్థ రుణంగా ఇస్తుంది. మిగిలిన 70 శాతం మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుంది. తర్వాత పనిముట్లను అందిస్తారు. తొలి దశలో భాగంగా.. నవంబర్ 12 నుంచి 30 వరకు కేవలం 25,093 మంది మాత్రమే లబ్ధి పొందారు. పరికరాల్లో నాణ్యత లేదు క్షౌరవృత్తిలో ఉన్నవారికి వాయిద్య పరికరాలు ఇస్తామని సీఎం చంద్రబాబు తిరుపతికి వచ్చి గొప్పగా చెప్పి వెళ్లారు. సీఎం కార్యక్రమానికి నాతో పాటు చాలా మందిని తిరుపతి తీసుకెళ్లారు. దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు పరికరాలు ఇవ్వలేదు. నాతో పాటు దరఖాస్తు చేసుకున్నవారిలో ఇద్దరికి ఇచ్చారు. వాటిని పరిశీలిస్తే మార్కెట్లో రూ.2 వేలు ఉంటే ప్రభుత్వం అందజేసిన పరికరం విలువ రూ.7వేలుగా నమోదు చేశారు. రేట్లు అధికంగా చూపుతున్నా పరికరాల నాణ్యత మాత్రం అంతంత మాత్రంగా ఉంది. – ప్రవీణ్కుమార్, చిన్నగొట్టిగల్లు, చిత్తూరు జిల్లా అవినీతిమయం ఆదరణ–2 పథకం అవినీతిమయంగా మారింది. టీడీపీ నేతలు దరఖాస్తులన్నీ వారి ఆధీనంలో ఉంచుకొని వారు చెప్పినవారికే పరికరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలిస్తున్నారు. దీంతో అర్హులకు న్యాయం జరగడం లేదు. పథకం కూడా ఇంతవరకు పూర్తిస్థాయిలో అమలు కాలేదు. – ఉప్పు పాటేశ్వరరావు, లింగముక్కపల్లి, నూజెండ్ల, గుంటూరు జిల్లా ఆన్లైన్లో నమోదు కావడం లేదు నేను గత కొన్నేళ్ల నుంచి వడ్రంగి పనిచేస్తున్నాను. ఆదరణ పథకం కింద పనిముట్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వెళితే సర్వర్ పనిచేయడం లేదని చెబుతున్నారు. ఇలాంటి సాకులతో నా పేరును ఆన్లైన్లో దరఖాస్తు చేయలేదు. –షేక్ నాగూర్, కొలకలూరు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా నగదు చెల్లించినా పరికరాలు ఇవ్వలేదు నేను కొండపల్లిలో వెలుగుమిత్రగా పనిచేస్తున్నా. నా భర్త వెంకటేశ్వరరావు కూలీ. నా భర్త చేసే పనికి చేదోడుగా ఉంటుందని స్కమిషన్కు దరఖాస్తు చేశాను. అధికారులు చెప్పిన మేరకు రూ.810 డీడీ చెల్లించాను. గుంటుపల్లిలో మంత్రి ఉమా చేతుల మీదుగా మిషన్ ఇస్తాం రమ్మని ఫోన్ చేశారు. అక్కడకు వెళితే ఇంటికి పంపిస్తామని చెప్పి వెళ్లిపోమన్నారు. తర్వాత ఎంపీడీవో కార్యాలయంలో కలిస్తే మీ పేరు లిస్టులోనే లేదు రెండో లిస్టులో మంజూరు చేస్తామని చెబుతున్నారు. – పితాని లక్ష్మీ, కొండపల్లి, మైలవరం, కృష్ణా జిల్లా ప్రభుత్వం మోసం చేస్తోంది ఆదరణ పేరుతో ప్రభుత్వం పేదలను మోసం చేస్తోంది. టీడీపీ సానుభూతిపరులకు మాత్రమే పరికరాలు దక్కుతున్నాయి. ఇతరుల నుంచి కనీసం దరఖాస్తులు కూడా స్వీకరించడం లేదు. –పులుకూరి కిరణ్, కొండాయిపాలెం, గుంటూరు జిల్లా రెండు నెలలైనా కుట్టుమిషన్ రాలేదు కుట్టుమిషన్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసి రెండు నెలలైంది. ఇప్పటివరకు కుట్టుమిషన్ మంజూరు చేయలేదు. అధికారులను అడుగుతుంటే నియోజకవర్గానికి కేటాయించిన లక్ష్యం మేరకు పరికరాలను అందజేస్తున్నామని చెబుతున్నారు. లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తున్నారో అర్థం కావడం లేదు. – దొడ్డాకుల వరలక్ష్మి, మండవల్లి, కైకలూరు, కృష్ణా జిల్లా ఆదరణ అంటే చేపల బాక్సులు, కుట్టు మిషన్లేనా? సాంకేతిక అభివృద్ధికి దోహదపడే పనిముట్లు ఇస్తామని ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించింది. కంప్యూటర్ కోసం దరఖాస్తు చేస్తే తిరస్కరించారు. అలాంటప్పుడు నైపుణ్య కేంద్రాల ద్వారా శిక్షణ ఇవ్వడం ఎందుకు? కంప్యూటర్ ఎడ్యుకేషన్ సాంకేతిక విద్య కిందకు రాదా? ఆదరణ అంటే చేపల బాక్సులు, కుట్టు మిషన్లేనా? అవి కూడా తక్కువ ధరవి ఎక్కువకు కోట్ చేసి కాంట్రాక్టర్లకు అనుకూలంగా నాసిరకం పనిముట్లు ఇస్తున్నారు. – జామి అప్పలరాజు, తగరపువలస, విశాఖపట్నం జిల్లా వాషింగ్ మెషీన్ పనిచేయడం లేదు రజకులకు ఆదరణ పథకం కింద వాషింగ్ మెషీన్లు ఇస్తామని ప్రకటించడంతో ఆన్లైన్లో దరఖాస్తు చేశాను. అధికారులు చెప్పిన ప్రకారం రూ.3,500 డీడీ కూడా తీశాక వాషింగ్ మెషీన్ ఇచ్చారు. అయితే మెషీన్ హీట్ ఎక్కడం లేదు. మరికొంత మందికి ఇచ్చిన వాషింగ్ మెషీన్లు కూడా పనిచేయడం లేదని తెలిసింది. – చాకలి శివ, దేవనకొండ, కర్నూలు జిల్లా ప్రభుత్వ ప్రచారం కోసమే.. నేను హెయిర్కటింగ్ సెలూన్ నిర్వహిస్తున్నా. ఆదరణ పరికరాల కోసం రూ.2800 డీడీ చెల్లించాను. అధికారులు ఇచ్చిన కుర్చీలు నాసిరకంగా ఉన్నాయి. కాస్త బలంగా ఉన్నవారు కూర్చుంటే పక్కకు ఒరిగిపోతున్నాయి. ఆదరణ పథకం ప్రభుత్వ ప్రచారం కోసమే. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. – పి.రవిశంకర్, అప్సర సర్కిల్, కడప నాసిరకం పనిముట్లు నాణ్యమైన కుర్చీలు ఇస్తామని చెప్పి నాసిరకం అంటగట్టారు. వాయిద్య పరికరాలు కూడా ఎందుకూ పనికిరానివి సరఫరా చేశారు. ఆదరణ పథకం కింద మంజూరు చేసిన పనిముట్లను చూసి చాలామంది దరఖాస్తు చేయడం లేదు.. దరఖాస్తు చేసినవారు డీడీలు తీయడం లేదు. – ఇ.రవిశంకర్, బార్బర్ షాపు యజమాని, మోచంపేట, కడప వడ్రంగి పనిచేసే నేను ఇస్త్రీపెట్టెతో ఏం చేయాలి? నేను 15 ఏళ్ల నుంచి వడ్రంగి పనిచేస్తున్నాను. ఆదరణ పథకానికి దరఖాస్తు చేసుకున్నా. మోటార్తో కూడిన చెత్రి మిషన్ కావాలని కోరితే అధికారులు ఇస్త్రీ పెట్టె, కుట్టు మిషన్ ఇస్తామన్నారు. వడ్రంగి పనిచేసే నేను ఇస్త్రీపెట్టె, కుట్టుమిషన్తో ఏం చేయాలి? వీటికోసం వడ్రంగి పని వదిలేసి కొత్త పని నేర్చుకోవాలా? – జి.గంగరాజు, తంగెళ్లమూడి, ఏలూరు మండలం, పశ్చిమ గోదావరి ఇప్పటివరకు మంజూరు కాలేదు మాది జగ్గంపేట మండలం జె.కొత్తూరు. రజక వృత్తి చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నాతోపాటు మా అమ్మ సత్యవతి పేరున వాషింగ్ మెషీన్ల కోసం దరఖాస్తు చేసుకుని అక్టోబర్లో మా వాటాగా రూ.3,500 చొప్పున చెల్లించాను. అయితే ఇప్పటివరకు వాషింగ్ మెషీన్లు ఇవ్వలేదు. ఎంపీడీవో కార్యాలయంలో అడిగితే మంజూరు కాలేదన్నారు. – మాయలేటి శ్రీను, జె.కొత్తూరు, జగ్గంపేట మండలం, తూర్పు గోదావరి జిల్లా ఇస్త్రీపెట్టె తీసుకెళ్లమంటున్నారు.. రజకులకు వాషింగ్ మెషీన్లు ఇస్తామని అధికారులు చెప్పడంతో డీడీలు తీయడానికి వెళ్లాం. తీరా వాషింగ్ మెషీన్లు లేవు.. ఇస్త్రీపెట్టెలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. రూ.30 వేల యూనిట్కు ఇస్త్రీపెట్టె తీసుకెళ్లాలని చెప్పడం ఏంటి? పంపిణీ చేసిన వాటిలోనూ 70 శాతం నాసిరకం వస్తువులే. దీనిపై ఆందోళనకు సిద్ధమవుతున్నాం. –పి.కొండయ్య, రజక సంఘం జిల్లా నేత, ప్రకాశం జిల్లా అర్హులకు అందని పనిముట్లు ఆదరణ పథకం కింద అర్హులైన వారికి పనిముట్లు అందని దుస్థితి నెలకొంది. కోడుమూరులో 1500 మంది చేనేత కార్మికులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే అధికారులు కేవలం 100 మందిని మాత్రమే ఎంపిక చేశారు. ఈ 100 మందిలో కూడా 60 శాతం మందికి పనిముట్లు అందలేదు. కేవలం రాజకీయ పలుకుబడి ఉన్నవారు మాత్రమే ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. – కామార్తి చంద్రశేఖర్, చేనేత కార్మికుడు, కోడుమూరు, కర్నూలు జిల్లా కల్లుగీత కార్మికులకు పరికరాలు లేవట ప్రభుత్వం ఆదరణ పరికరాలు ఇçస్తుందని తెలియడంతో దరఖాస్తు చేసుకోవడానికి వెళ్లాను. అయితే కల్లు గీత కార్మికులకు ఎలాంటి పరికరాలు లేవని అధికారులు తిప్పిపంపేశారు. ప్రభుత్వం ఆదరణ పథకం కింద బీసీల్లో అన్ని వర్గాలకు పనిముట్లు ఇస్తున్నామని ఆర్భాటంగా చెప్పుకుంటోంది. కానీ వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. కె.తిరుమలయ్య, చిత్తూరు -
'పేదింటి'పై పెద్ద మనసేదీ?
సాక్షి, అమరావతి : పట్టణాల్లో పేదల ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం మంజూరు చేసే నిధులను తెచ్చుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కానీ, ప్రభుత్వ పెద్దలు మాత్రం ఈ ఇళ్ల నిర్మాణ వ్యయాలను భారీగా పెంచేయడమే కాకుండా ఒక్కో పేదవాడిపై రూ.4లక్షల మేర అప్పుల భారం మోపుతూ కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు పొందడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఇళ్లకు సంబంధించి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అసమగ్ర ప్రతిపాదనలను వచ్చినట్లు ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. 20 కేంద్ర పథకాలకు సంబంధించి అసలు ప్రతిపాదనలే పంపలేదని.. పది పథకాలకు అసమగ్ర ప్రతిపాదనలు కేంద్రానికి వచ్చాయని.. దీంతో కేంద్రం మరిన్ని వివరాలతో పంపాలని కోరినందున వాటిని పంపించేలా చూడాలని తన నివేకలో ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. పట్టణ పేదల ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను పోర్టల్లో అప్లోడ్ చేయడంతోపాటు థర్డ్ పార్టీ తనిఖీ నివేదికను కేంద్రానికి పంపిస్తే రూ.2,169 కోట్లు రాష్ట్రానికి వస్తాయని ఆయన అందులో తెలిపారు. అలాగే, పట్టణ స్వచ్ఛ భారత్ కింద రూ.114కోట్ల నిధుల కోసం క్షేత్రస్థాయి పురోగతి నివేదిక పంపలేదని, ఆ నివేదికను కూడా పంపాల్సిందిగా కేంద్రం కోరినట్లు తెలిపారు. కాగా, నివేదికలో రెసిడెంట్ కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన మరిన్ని అంశాలు.. - ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 2017–18లో రూ.7.31 కోట్ల రాష్ట్ర వాటాను, 2018–19లో రూ.65.17 కోట్ల రాష్ట్ర వాటాను వ్యయం చేయకపోవడాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది. అలాగే.. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆడిట్ నివేదికను సమర్పించకపోవడంతో పాటు కొత్తగా పూర్తిచేసే పనుల ప్రణాళికను పంపించలేదు. - సమగ్ర చేనేత డెవలప్మెంట్ పథకం కింద రాష్ట్ర వాటా 50 శాతం వ్యయం చేసినట్లు డాక్యుమెంట్ను సమర్పిస్తే తదుపరి మార్కెటింగ్ రాయితీని విడుదల చేస్తామని కేంద్రం తెలిపింది. - గిరిజన విద్యార్థుల స్కాలర్షిప్ నిధుల విడుదలకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరానికి చెందిన వినియోగ పత్రాలను సమర్పించాలి. - ఎస్సీ విద్యార్థుల స్కాలర్షిప్ నిధుల కోసం కూడా కేంద్రం కొన్ని వివరాలు అడిగింది. - ఫిషరీస్ మేనేజ్మెంట్కు సంబంధించి గత ఆర్థిక సంవత్సరానికి చెందిన నిధుల వినియోగ పత్రాలను సమర్పించడంతో పాటు పర్యావరణ అనుమతి పత్రాలను ఇవ్వాలి. - ఇ–ఆసుపత్రుల్లో ఎలక్ట్రానిక్ గవర్నెన్స్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ కింద రూ.9 లక్షలను డిపాజిట్ చేయాల్సి ఉంది. - ఇన్స్పెక్షన్ అండ్ సర్టిఫికెట్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు 14వ ఆర్థిక సంఘం నిబంధనల మేరకు ప్రతిపాదనలను పంపాలి. - అలాగే, బీసీల స్కాలర్షిప్లకు సంబంధించి వినియోగ పత్రాలను సమర్పిస్తే డిసెంబర్ 15లోగా కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. -
లోకేశ్ శాఖలో ఒకే రోజు 33 రహస్య జీవోలు జారీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్ మంత్రిగా కొనసాగుతున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఒకే రోజే 33 రహస్య జీవోలు జారీ అయ్యాయి. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే పాలసీ నిర్ణయాలకు అనుగుణంగా జారీ అయ్యే జీవోలను ఎప్పటికప్పుడు అన్లైన్ పోర్టల్ నమోదు చేస్తుంటారు. అయితే సోమవారం ఉదయం నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు పంచాయతీరాజ్ శాఖ మొత్తం 36 జీవోలు జారీ చేయగా, అందులో కేవలం మూడు జీవోల వివరాలను మాత్రమే బహిర్గతం చేసి మిగిలిన జీవోల సమాచారం రహస్యమంటూ పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రభుత్వం రహస్య జీవోలు జారీ చేయడంపై రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఎన్నికలకు ముందు..విశాఖ మెట్రోకు ‘పీపీపీ’
సాక్షి, అమరావతి: ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ మరో జిమ్మిక్కుకు రాష్ట్ర ప్రభుత్వం తెర తీసింది. నాలుగున్నర ఏళ్లు ఏమీ పట్టించుకోని రాష్టప్రభుత్వం.. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రైవేట్ (పీపీపీ) విధానంలో చేపట్టాలని నిర్ణయించింది. ఆసక్తి వ్యక్తీకరణలో ఎంపికైన సంస్థల నుంచి ఇప్పుడు టెండర్లకు దరఖాస్తులను ఆహ్వానించేందుకు అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ (ఏఎంఆర్సీ)కు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఆర్.కరికాలవలవన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ మెట్రో రైలు నిర్మాణ వ్యయం రూ. 8,300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టింది. ఈ వ్యయాన్ని రెండు విభాగాలుగా విభజించారు. సివిల్ నిర్మాణాల వ్యయం 51 శాతం వాటాగా రూ. 4,200 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. ఎలక్ట్రో మెకానికల్ పనుల వ్యయం 49 శాతం వాటాగా రూ. 4,100 కోట్లను డెవలపర్ భరించాల్సి ఉంది. వినూత్న పీపీపీ పద్ధతిలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను విదేశీ ఆర్థిక సంస్థల నుంచి అప్పు చేస్తుంది. ఈ అప్పును తీర్చేందుకు మెట్రో ప్రాజెక్టుకు సమీపంలో 250 ఎకరాలను రియల్ ఎస్టేట్కు ఇవ్వనుంది. ఈ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయం నుంచి అప్పు, వడ్డీ చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఐదు సంస్థలు ఆసక్తి.. విశాఖ మెట్రో రైల్ను మూడు కారిడార్లలో మొత్తం 42.55 కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు. మొత్తం 38 స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇందుకోసం 83 ఎకరాల ప్రభుత్వ భూమి, మరో 12 ఎకరాల ప్రైవేట్ భూమిని సేకరించి కేటాయించనున్నారు. డెవలపర్కు పదేళ్ల కాలానికి నిర్వహణకు రూ. 820 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది. అంతే కాకుండా ఈ ప్రాజెక్టుకు ఎస్జీఎస్టీ కింద రూ. 527 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం డెవలపర్కు రీయింబర్స్మెంట్ చేయనుంది. ఈ ప్రాజెకుకు సంబంధించి ఇప్పటికే అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను ఆహ్వానించగా.. వచ్చిన దరఖాస్తుల్లో ఐదు సంస్థలను ఎంపిక చేసింది. వీటిల్లో అదానీ ఎంటర్ ప్రైజెస్, ట్రైల్ (టాటా)ప్రాజెక్టు, షాపూర్జీ పల్లోంజీ, ఎస్సెల్ ఇన్ ఫ్రా, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ల ఉన్నాయి. ఈ ఐదు సంస్థల నుంచి బిడ్లు దాఖలు ప్రతిపాదనలను, రాయితీ ఒప్పంద పత్రాలను ఆహ్వానించేందుకు ప్రభుత్వం అనుమతించింది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం రూ. 4,200 కోట్ల రుణం మంజూరు చేసేందుకు కొరియన్ ఎగ్జిమ్ బ్యాంకు ముందుకు వచ్చింది. పీపీపీ విధానం ఇలా.. మెట్రో రైలు నిర్మాణానికి ప్రభుత్వం చేస్తున్న అప్పును తీర్చేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం 250 ఎకరాలను ఉచితంగా ఏఎంఆర్సీ కేటాయిస్తుంది. ఆ 250 ఎకరాలను ఏడాదికి ఎకరానికి రూ. 100 లీజుపైన రియల్ ఎస్టేట్కు ఇస్తుంది. ప్రతీ ఏడాది లీజును ఐదు శాతం పెంచనున్నారు. ఈ 250 ఎకరాలను 60 సంవత్సరాల పాటు లీజుకు నిర్మాణ సంస్థకు ఇవ్వనున్నారు. ఈ భూమిలో రియల్ ఎసేŠట్ట్, రెసిడెన్షియల్, ఇండస్ట్రీస్, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తారు. ఇందుకోసం స్పెషల్ పర్పస్ వెహికల్ను ఏర్పాటు చేస్తారు. 250 ఎకరాల్లో వచ్చే ఆదాయంలో 75 శాతం నిర్మాణ సంస్థకు పోగా 25 శాతం అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్కు వస్తుంది. 250 ఎకరాల్లో నిర్మాణాల వ్యయాన్ని డెవలపర్ భరించాలి. పది సంవత్సరాల్లో 250 ఎకరాల్లో నిర్మాణాలకు రూ. 4,350 కోట్లు అవుతుందని అంచనా వేశారు. డెవలపర్కు చెందిన 75 శాతం వాటాకు వచ్చిన భవనాలను, సూపర్ స్ట్రక్చర్స్ను ఇతరులెవ్వరికైనా ఇచ్చేసేందుకు, టైటిల్ను బదిలీ చేసేందుకు అనుమతిస్తారు. ఏఎంఆర్సీకి రానున్న 25 శాతం రెవెన్యూ వాటా చెల్లించడానికి డెవలపర్ ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాను తెరవాలి. మైట్రో రైలు నిర్వహణలో లోటు ఏర్పడితే ఈ ఎస్క్రో అకౌంట్ నుంచి ఏఎంఆర్సీ చెల్లిస్తుంది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ద్వారా ఏఎంఆర్సీకి వచ్చే ఆదాయం నుంచి విదేశీ సంస్థ నుంచి తీసుకుంటున్న అప్పు, వడ్డీని చెల్లించనున్నారు. 250 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా 30 సంవత్సరాల్లో డెవలపర్కు రూ. 15,692 కోట్ల ఆదాయం, అలాగే ఏఎంఆర్సీకి రూ. 7,066 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అయితే చంద్రబాబు ఈ నాలుగున్నరేళ్లు మెట్రో ప్రాజెక్టును పట్టించుకోకుండా ఇపుడు మరో నాలుగు నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలా హడావుడి చేయడం చేయడం ఎన్నికల జిమ్మిక్కేనని విశాఖ ప్రజలు మండిపడుతున్నారు. -
బినామీకి 'బడా నజరానా'
సాక్షి, అమరావతి: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తన బినామీకి బడా నజరానా ఇచ్చారు. పోలవరం జలాశయం నుంచి ఎడమ కాలువకు నీటిని సరఫరా చేసే పనుల్లో (లెప్ట్ సైడ్ కనెక్టివిటీ) మిగిలిపోయిన రూ.90.01 కోట్ల విలువైన పనుల అంచనా వ్యయాన్ని రూ.285.92 కోట్లకు పెంచేసి, వాటిని సూర్య కన్స్ట్రక్షన్స్కు నోటిమాటపై కట్టబెట్టేశారు. దీని ద్వారా రూ.195.91 కోట్ల లబ్ధికి ఎత్తులు వేసినట్లు స్పష్టమవుతోంది. సర్కార్ నుంచి ఎలాంటి అనుమతి లేకున్నా మంత్రి దేవినేని దన్నుతో కాంట్రాక్టర్ పనులు కూడా ప్రారంభించేయడం గమనార్హం..! ఈ వ్యవహారంలో మంత్రి దేవినేనికి భారీ ప్రయోజనం చేకూరినట్లు అధికారవర్గాల్లో చర్చ సాగుతోంది. పోలవరం జలాశయం నుంచి ఎడమ కాలువను అనుసంధానం చేస్తూ నీటిని సరఫరా చేసే పనులను (65వ ప్యాకేజీ) 2005లో రూ.103.91 కోట్లకు యూనిటీ ఇన్ఫ్రా అనే సంస్థ దక్కించుకుంది. ఇందులో రూ.13.92 కోట్ల విలువైన పనులను ఆ సంస్థ పూర్తి చేసింది. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. దాంతో ఆంధ్రప్రదేశ్ డీటైల్డ్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్లో ఆ సంస్థపై వేటు వేయాలన్న పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ప్రతిపాదనపై స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ ఆమోదముద్ర వేసింది. నిబంధనల ప్రకారం మిగిలిపోయిన పనులను టెండర్లు ద్వారా కొత్త కాంట్రాక్టర్కు అప్పగించాలి. అంచనా పెంచేసి.. నోటిమాటపై.. లెఫ్ట్ సైడ్ కనెక్టివిటీ పనుల్లో మిగిలిపోయిన 90.01 కోట్ల విలువైన పనులను తమకు అప్పగిస్తే.. పాత ధరలకే పూర్తి చేస్తామని ఆర్ఎస్సార్ ఇన్ఫ్రా, సూర్య కన్స్ట్రక్షన్స్ ముందుకొచ్చాయని పోలవరం చీఫ్ ఇంజనీర్ జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపారు. ఇదే సమయంలో ఆ పనులు తన బినామీకి చెందిన సూర్య కన్స్ట్రక్షన్కు నామినేషన్ పద్దతిలో అప్పగించాలని మంత్రి దేవినేని ఒత్తిడి తెచ్చినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. పైగా అంచనా వ్యయాన్ని పెంచేయాలని ఒత్తిడి తెచ్చారు. జీవో 22 ప్రకారం ధరల సర్దుబాటును వర్తింపజేస్తే మిగిలిపోయిన పనుల విలువ రూ.126.38 కోట్లకు మించదని అధికారవర్గాలు తేల్చాయి. అయితే అంచనా వ్యయాన్ని పెంచాలంటూ మంత్రి ఒత్తిడి తెచ్చారు. దాంతో పోలవరం అధికారులు 2017–18 (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్) ప్రకారం రూ.285.92 కోట్లకు పెంచేశారు. వాటికి పాత ధరల ముసుగేసి తన బినామీకి నామినేషన్ పద్ధతిలో అప్పగించాలని మంత్రి దేవినేని అధికారులను ఆదేశించారు. ఆ మేరకు అధికారులు జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం అవి ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నాయి. అయితే దన్నుతో సూర్య కన్స్ట్రక్షన్స్ సంస్థ వారం క్రితమే పనులను ప్రారంభించేసింది. కేబినెట్ తీర్మానంతో సక్రమం..: నామినేషన్ పద్ధతిలో రూ.285.92 కోట్ల విలువైన పనులను కాంట్రాక్టర్కు అప్పగించడానికి ఆర్థిక శాఖ అంగీకరించే అవకాశాలు లేవు. దాంతో అక్రమంగా అప్పగించిన ఈ పనులను యథాప్రకారం కేబినెట్లో తీర్మానం ద్వారా సక్రమం చేసుకునేందుకు మంత్రి దేవినేని ఇప్పటికే వ్యూహం సిద్ధం చేశారు. కృష్ణా పుష్కరాల సమయంలో ఇదే కాంట్రాక్టర్కు రూ.52.47 కోట్ల విలువైన పనులను నామినేషన్పై అప్పగించి.. కేబినెట్తో ఆమోదముద్ర వేయించుకున్నారు. పోలవరం ఎడమ కాలువలో ఒకటో ప్యాకేజీ కింద రూ.92.14 కోట్ల విలువైన పనులను ఇదే రీతిలో కట్టబెట్టారు. కృష్ణా డెల్టా ఆధునికీకరణ నిధులు రూ.42.97 కోట్లు మళ్లించి విజయవాడలో తన క్యాంపు కార్యాలయం పనులను నామినేషన్పై అదే కాంట్రాక్టర్కు అప్పగించడం గమనార్హం. -
‘పోలవరం’లో నాణ్యత డొల్లే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రధానంగా హెడ్ వర్క్స్(జలాశయం) పనుల్లో నాణ్యత డొల్లేనని కేంద్ర నిపుణుల కమిటీ తేల్చింది. స్పిల్ వే, స్పిల్ ఛానల్ కాంక్రీట్ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించ లేదని స్పష్టంచేసింది. కనీసం షట్టరింగ్ పనులు కూడా సక్రమంగా చేయలేకపోయారని.. అందుకే స్పిల్ వేలోని పలు బ్లాక్లలో చీలికలు ఏర్పడ్డాయని పేర్కొంది. గోదావరికి గరిష్ఠంగా 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా దిగువకు విడుదల చేసేలా ప్రాజెక్టును నిర్మిస్తుండటంవల్ల స్పిల్ వే (కాంక్రీట్ ఆనకట్ట) పటిష్టతను తేల్చడానికి నాన్–డిస్ట్రక్టివ్ టెస్ట్ (స్పిల్ వే పనుల నుంచి చిన్న కాంక్రీట్ ముద్దలను సేకరించి వాటిని పగులగొట్టి నాణ్యతను తేల్చడం).. టెన్సిల్ స్ట్రెంగ్త్ టెస్ట్ (తన్యత పటుత్వ పరీక్ష) చేసి నాణ్యతపై నివేదిక ఇవ్వాలని కేంద్ర మట్టి రాయి పరిశోధన సంస్థ (సీఎస్ఎంఆర్ఎస్)ను కోరింది. స్పిల్ వేతో పాటు పోలవరం పనుల్లో వినియోగించే సిమెంటు, స్టీల్, ఇసుక, కంకర వంటి వాటి నాణ్యతపై సీఎస్ఎంఆర్ఎస్ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేయాలని నిపుణుల కమిటీ షరతు విధించింది. అలాగే, స్పిల్ వేకు అమర్చే గేట్ల నాణ్యతను శాండ్ బ్లాస్టింగ్ పరీక్ష నిర్వహించి తేల్చాలని సీఎస్ఎంఆర్ఎస్కు సూచించింది. అంతేకాక, స్పిల్ వే, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణంలో నాణ్యత లోపాలు తలెత్తితే ప్రాజెక్టు భద్రతకు పెనుముప్పు ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. ఇదేనా చిత్తశుద్ధి? పోలవరం ప్రాజెక్టును 2019 మార్చి నాటికి పాక్షికంగానూ డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో పూర్తిచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ, క్షేత్రస్థాయిలో సాగుతున్న పనులను పరిశీలిస్తే ప్రాజెక్టును పూర్తిచేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధిలేదని నిపుణుల కమిటీ తేల్చింది. అందుకు ఉదాహరణలనూ వివరించింది. అవి.. – స్పిల్ వే పనుల్లో మొత్తం 18.75 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులకుగానూ అక్టోబరు వరకు 1.72 లక్షల క్యూబిక్ మీటర్లే చేశారు. మిగిలిన 17.03 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేయడానికి అవసరమైన బ్యాచింగ్ ప్లాంట్ లేదు. – కనీసం డిజైన్లను ఇప్పటివరకూ రూపొందించుకోలేదు. – జలాశయంలో 41.15 మీటర్ల కాంటూర్ వరకూ 18,830 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉండగా.. ఇప్పటివరకూ కేవలం 3,922 కుటుంబాలకు మాత్రమే కల్పించారు. – ఎడమ కాలువలో 452 నిర్మాణాలకుగానూ ఇప్పటికీ 306 నిర్మాణాల పనులు ప్రారంభించలేదని.. కుడి కాలువలో 255 నిర్మాణాలకుగానూ 70 నిర్మాణాల పనులు ప్రారంభించలేదు. కనెక్టివిటీస్ పనులు కూడా కొలిక్కి రాలేదు. – ఆయకట్టుకు నీళ్లందించే పిల్ల కాలువ (డిస్ట్రిబ్యూటరీ)ల కోసం ఇప్పటికీ సర్వే, భూసేకరణ పనులు చేయలేదు. వీటిని బట్టి ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏ స్థాయిలో చిత్తశుద్ధి ఉందో తేటతెల్లమవుతోందని నిపుణుల కమిటీ తన నివేదికలో పేర్కొంది. అడిగిన సమాచారం ఇవ్వరెందుకూ? ఇదిలా ఉంటే.. నిపుణుల కమిటీ ఇప్పటికి మూడుసార్లు పోలవరంలో పర్యటించి నివేదిక ఇచ్చిందని.. కానీ అందులోని అంశాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని అనేక సందర్భాల్లో కోరినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడాన్ని తప్పుబట్టింది. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16,010.45 కోట్ల నుంచి రూ.57,940.86 కోట్లకు పెంచిందని.. దానిపై సీడబ్ల్యూసీ వ్యక్తంచేసిన సందేహాలను నివృత్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని పేర్కొంది. దీనివల్లే పనులు గాడి తప్పుతున్నాయని.. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనల ఆమోదంలోనూ జాప్యం చోటుచేసుకుంటోందని స్పష్టం చేసింది. సకాలంలో పూర్తికి అవకాశంలేదు ఇదిలా ఉంటే.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి చూస్తే 2019, డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశంలేదని నిపుణుల కమిటీ తేల్చింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి విధి విధానాలను ఖరారుచేసి, అధికారాలు కల్పిస్తే తప్ప పనులు దారిలోకి వచ్చే అవకాశంలేదని కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్కు గత నెల 30న సీడబ్ల్యూసీ సభ్యులు వైకే శర్మ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా పనులను గాడిలో పెట్టేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. వ్యాప్కోస్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తూ.. సీఎస్ఎంఆర్ఎస్ ద్వారా నాణ్యతను నిర్ధారించుకుంటూ గడువులోగా పూర్తిచేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ కీలక అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. -
ఆరోగ్యశాఖలో అవినీతి నిజమే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిన మాట నిజమేనని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. వైద్య పరికరాల నిర్వహణ పేరిట భారీగా నిధులు దుర్వినియోగం చేశారంటూ ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు జరిపి, నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఏసీబీని ఆదేశించింది. దీంతో ఏసీబీ దర్యాప్తు చేసి, తన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. కొన్ని అంశాలపై స్పష్టత రావాలి రాష్ట్రంలో 1,165 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 195 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 31 ప్రాంతీయ ఆస్పత్రులు, 8 జిల్లా ఆస్పత్రులు, 11 బోధనాసుపత్రుల్లో వైద్య పరికరాల నిర్వహణ పేరిట రూ.కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు ఏసీబీ గుర్తించింది. టెండర్ దశ నుంచే నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంది. ఇంకా కొన్ని అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని, విచారణకు మరో మూడు నెలల గడువు ఇవ్వాలని హైకోర్టును ఏసీబీ కోరింది. అనంతరం తుది నివేదిక ఇస్తామని పేర్కొంది. సింగిల్ బిడ్డర్కే టెండర్ వైద్య పరికరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2015లో టెండర్లు పిలిచింది. ఈ టెండర్లలో కిర్లోస్కర్ టెక్నాలజీస్, రాడిమేజ్ టెక్నాలజీస్, జింటెక్ సాఫ్ట్వేర్, టీబీఎస్ మెడికల్ సర్వీసెస్ సంస్థలు పాల్గొన్నాయి. తొలి మూడు సంస్థలపై ప్రాథమిక దశలోనే అనర్హత వేటు వేశారు. టీబీఎస్ సంస్థనే ఎంపిక చేశారని, నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ బిడ్డర్కే ఇచ్చారని ఏసీబీ తెలిపింది. ఆ సంస్థ పనులు మొదలు పెట్టకుండానే మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద రూ.11.46 కోట్లు చెల్లించారని నివేదికలో వెల్లడించింది. పనిచేయని వైద్య పరికరాలను గుర్తించి, ఆడిట్ చేసిందనే సాకుతో చైన్ సొల్యూషన్స్ అనే సంస్థకు 15 రోజుల్లో రూ.25.56 లక్షలు చెల్లించారని, ఇది నిబంధనలకు విరుద్ధమేనని ఏసీబీ తేల్చిచెప్పింది. వారెంటీ ఉన్నా డబ్బులు తీసుకున్నారు రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో 30 శాతం వైద్య పరికరాలను అసలు గుర్తించకుండానే వాటికి నిర్వహణ పేరుతో డబ్బులు తీసుకున్నట్టు ఏసీబీ విచారణలో తేలింది. కర్నూలు సర్వజనాసుపత్రిలో జెమిని మెడికల్ సర్వీసెస్ అనే సంస్థ 2010లో రూ.1.69 కోట్లతో ఎంఆర్ఐ స్కానర్ను ఏర్పాటు చేసింది. ఈ మెషీన్కు 7 సంవత్సరాలు వారెంటీ ఉంది. ఈ ఎంఆర్ఐ స్కానర్ వారెంటీలో ఉన్నప్పటికీ దీన్ని నిర్వహణ పరిధిలోకి తీసుకొచ్చారు. దీని విలువను రూ.3.5 కోట్లు నిర్ణయించి, 8 శాతం నిర్వహణ చార్జీలు వసూలు చేసినట్టు వెల్లడైంది. -
పోలింగ్, కౌంటింగ్ రోజుల్లో సెలవులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ జరిగే డిసెంబర్ 7న, కౌంటింగ్ నిర్వహించే డిసెంబర్ 11న సెలవులను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ ఎస్.కె.జోషి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సాధారణ సెలవులను ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే అవసరమైన మేరకు ప్రభుత్వ సంస్థలకు సెలవులు ప్రకటించే అధికారాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించారు. కార్మికులు పనిచేసే అన్ని సంస్థలు పోలింగ్ రోజున కచ్చితంగా సెలవు ప్రకటించాలని స్పష్టం చేశారు. -
మరో వంచనకు ‘డిజైన్’!
సాక్షి, అమరావతి: వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణ పనుల్లో మరోసారి వంచనకు రంగం సిద్ధమైంది! ఈ పనులకు ఇప్పటికే రెండుసార్లు టెండర్ నోటిఫికేషన్లు జారీ చేసినా ఓ కాంట్రాక్టర్ ఎత్తుగడలతో రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అంచనాలు భారీగా పెంచి మూడోసారి టెండర్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. పోలవరం పనులను నామినేషన్పై అప్పగించిన కాంట్రాక్టర్కే దీన్ని కూడా కట్టబెట్టేలా ప్రణాళిక రచిస్తున్నారు. సర్కారు పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఐబీఎం(ఇంటర్నల్ బెంచ్ మార్క్)ను రూ.1,376 కోట్లకు పెంచేసి టెండర్ నోటిఫికేషన్ జారీకి కసరత్తు చేస్తున్నారు. అక్రమాలను గతంలోనే బహిర్గతం చేసిన ‘సాక్షి’ రాజధాని అమరావతిలో తాగు, పారిశ్రామిక నీటి అవసరాల కోసం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి 21 కి.మీ. ఎగువన వైకుంఠపురం వద్ద పది టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణ పనులకు పనులకు రూ.801.8 కోట్ల అంచనా వ్యయంతో జూలై 9న ఎల్ఎస్(లంప్సమ్)–ఓపెన్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ అయింది. అయితే పనుల అంచనా వ్యయాన్ని పెంచాలంటూ ముఖ్యనేతపై కాంట్రాక్టర్ ఒత్తిడి తేవటంతో టెండర్ నోటిఫికేషన్ రద్దు చేశారు. బ్యారేజీ పనులతోపాటు రాజధానికి 10 క్యూమెక్కుల నీటిని తరలించే పథకానికి రూ.1,213 కోట్లను ఐబీఎంగా నిర్ణయించి సెప్టెంబరు 5న టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. అంచనాల్లో చోటు చేసుకున్న అక్రమాలను ‘వైకుంఠపురంలో రూ.400 కోట్లు గోవిందా’ శీర్షికన సెప్టెంబరు 7న, ‘వైకుంఠపురం అంచనాల్లో వంచన’ శీర్షికన సెప్టెంబరు 18న ప్రచురించిన కథనాల ద్వారా ‘సాక్షి’ బహిర్గతం చేసింది. ఈ కథనాలపై స్పందించిన ఉన్నతాధికారులు అంచనా వ్యయం ఖరారుపై విచారణ జరిపారు. మట్టి పేరుతో మోసం! బ్యారేజీ నిర్మాణ ప్రాంతానికి సమీపంలోనే మట్టి దొరుకుతున్నా 32 కి.మీ. దూరం నుంచి తరలించాలంటూ రవాణా ఖర్చుల రూపంలోనే రూ.47.19 కోట్లను ఉత్తినే కాంట్రాక్టర్కు ఇచ్చేయడానికి ఎత్తుగడ వేసినట్లు విచారణలో వెల్లడైంది. గైడర్ వాల్స్ అవసరం లేకున్నా చేపట్టాలని చూపడం ద్వారా రూ.150 కోట్లు అంచనా వ్యయం పెంచినట్లు గుర్తించారు. స్పిల్వే కుడి వైపున 600 మీటర్ల పొడవున మట్టికట్ట నిర్మిస్తే సరిపోతుందని, దీన్ని 1,732 మీటర్లకు పెంచడం ద్వారా అంచనా వ్యయం రూ.200 కోట్ల మేర పెరిగిందని తేలింది. ఈ నేపథ్యంలో అంచనాలను రూ.397.19 కోట్ల మేర తగ్గించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కానీ ఉన్నతస్థాయి ఒత్తిళ్లతో పూర్తి స్థాయిలో విచారించి అక్రమాలను నిగ్గు తేల్చకుండా కేవలం రూ.150 కోట్ల మేర మాత్రం కోత వేసి రూ.1,063 కోట్లను ఐబీఎంగా ఖరారు చేసి టెక్నికల్ బిడ్ తెరిచిన రోజు ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని భావించారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 6వతేదీన టెక్నికల్ బిడ్ తెరవగా అంచనా వ్యయం తగ్గించారని పసిగట్టిన ముఖ్యనేత కోటరీలోని ప్రధాన కాంట్రాక్టర్ ఎవరూ షెడ్యూలు దాఖలు చేయకుండా చక్రం తిప్పారు. దీంతో మళ్లీ టెండర్ను రద్దు చేశారు. కోటరీ కాంట్రాక్టర్కే ఈ పనులు కూడా.. బ్యారేజీ పనులకు మళ్లీ టెండర్ పిలవడానికి కసరత్తు చేస్తున్న అధికారులతో ఇటీవల సమావేశమైన ముఖ్యనేత అంచనా వ్యయాన్ని పెంచాలంటూ ఒత్తిడి తెచ్చారు. పోలవరంలో నామినేషన్పై భారీ ఎత్తున పనులు చేస్తున్న కాంట్రాక్టర్కే ఈ పనులు కూడా దక్కే నిబంధనలతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు. దీంతో ఇక చేసేది లేక అంచనా వ్యయం పెంచడానికి అధికారులు సాకులు వెతుకుతున్నారు. డిజైన్లో భారీ మార్పులంటున్న అధికారులు వ్యాప్కోస్ రూపొందించిన బ్యారేజీ డిజైన్ సక్రమంగా లేదని చెబుతున్న అధికారులు అందులో భారీ మార్పులు చేసినట్లు పేర్కొంటున్నారు. దీన్ని సాకుగా చూపిస్తూ వైకుంఠపురం బ్యారేజీ పనుల ఐబీఎంను రూ.1,376 కోట్లకు పెంచి ముఖ్యనేత సూచించిన నిబంధనలతో మూడోసారి టెండర్ నోటిఫికేషన్ సన్నాహాలు చేస్తున్నారు. అంటే బ్యారేజీ పనుల అంచనా వ్యయం దాదాపు రూ.575 కోట్లు పెరిగినట్లు స్పష్టం అవుతోంది. ఈ పనులను కోటరీ కాంట్రాక్టర్కే అప్పగించి భారీ ఎత్తున లబ్ధి పొందేందుకు ముఖ్యనేత సిద్ధమయ్యారు. -
ఉద్దానంపై సర్కార్ నిర్లక్ష్యం
కవిటి/సోంపేట: తిత్లీ తుపానుతో కకావికలమైన ఉద్దానం ప్రాంతంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భీకర తుపానుకు సర్వస్వం కోల్పోయిన కొబ్బరి రైతులకు ఇచ్చే పరిహారం విషయంలో కూడా పట్టనట్టు వ్యవహరిస్తోందన్నారు. శాసనమండలిలో వైఎస్సార్సీపీ ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రీజనల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు, పలువురు పార్టీ నేతలు కవిటి, సోంపేట మండలాల్లో సోమవారం పర్యటించారు. కవిటిలో ఉమారెడ్డి, ధర్మాన మాట్లాడుతూ.. ప్రజలకు తాగునీరు కూడా అందించలేని నిస్సహాయ స్థితిలో, కరెంటు అందించలేని దుస్థితిలో పాలన దిగజారిందన్నారు. తుపాను బాధితులను ఆదుకోవడంలో సర్కార్ తీరుకు నిరసనగా స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. ప్రభుత్వం ప్రకటించిన సాయం విషయంలో ఏ ఒక్క రైతు కూడా సంతృప్తిగా లేరన్నారు. కొబ్బరి చెట్టుకు 1200 రూపాయల పరిహారం ప్రకటన కంటితుడుపు చర్యగా ఉందని ఉమ్మారెడ్డి విమర్శించా రు. సుమారు తొమ్మిదేళ్ల పాటు ఎటువంటి ఫలసాయం దక్కని రైతుకు ఇంత టి ఘోరమైన పరిహార ప్రకటన ముఖ్య మంత్రి చేయడం దురదృష్టకరమన్నారు. కనీసం చెట్టుకు రూ.5000 అందించాలని వైఎస్సార్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ఉద్దానం ప్రాంతంలో సంభవించిన తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. సీఎం చంద్రబాబు నుంచి పలువురు మంత్రులు వచ్చినా ప్రజల దాహార్తిని తీర్చేందుకు అవసరమైన మంచినీటిని అందించడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారని.. అందుకే ప్రజలు ఆగ్రహావేశాలతో భగ్గుమంటున్నారన్నారు. నష్టపరిహారాల ప్రకటనలో కూడా కొబ్బరిరైతు పట్ల ప్రభుత్వ వివక్షత వ్యక్తమైందనిన్నారు. ఈ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, ఇచ్ఛాపురం సమన్వయకర్త పిరియా సాయిరాజ్, రాష్ట్రకార్యదర్శి నర్తు రామారావు, మామిడి శ్రీకాంత్, కంచిలి ఎంపీపీ ఇప్పిలి లోలాక్షి, కంచిలి జెడ్పీటీసీ సభ్యుడు జామి జయ,ఇచ్ఛాపురం మున్సి పల్ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మి , సాడి శ్యాంప్రసాద్రెడ్డి, డాక్టర్ దాస్, మంగి గణపతి, పిఎం తిలక్, హనుమంతు కిరణ్కుమార్ తదితర నేతలు పాల్గొన్నారు. ఆ సాయం సరిపోదు వైఎస్సార్ సీపీ నేతల ఎదుట వాపోయిన సోంపేట, కంచిలి రైతులు సోంపేట/కంచిలి: తుపాను దెబ్బకు పూర్తిగా నష్ట పోయామని, ప్రభుత్వం అందజేస్తామన్న సహాయం ఎటూ సరిపోదని కంచిలి మండలం కుత్తుమ, సోంపేట మండలం రుషికుడ్డ, కొర్లాం గ్రామం రైతులు వైఎస్సార్ సీపీ నేతల ఎదుట వాపోయారు. సోంపేట, కంచిలి మండలాల్లో ధర్మాన ప్రసాదరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శ్రీకాకుళం జిల్లా పార్ల మెంటరీ నియోజకవర్గ సమన్వయక్తర దువ్వాడ శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాస్, పిరియా సాయిరాజ్, రాష్ట్ర కార్యదర్శి నర్తు రామారావు పర్యటించి నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగాగా రైతులతో ఉమ్మారెడ్డి, ధర్మాన మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తామన్న నష్ట పరిహారం సరిపోతుందా అని ఆరా తీశారు. దీనికి వారు స్పందిస్తూ ప్రభుత్వం ప్రకటించిన సాయం ఎటూ సరిపోదన్నారు. రైతులను ఆదుకోవడం ప్రభుత్వం తరం కాదని వాపోయారు. కుత్తుమ గ్రామానికి చెందిన రైతులు మన్మథరావు, జి.వైకుంఠరావు, రవి, బొన్నయ్య తదితరులు మాట్లాడుతూ తుపానుతో తీవ్రంగా నష్టపోయామన్నారు. ఎకరానికి సుమారు 50 కొబ్బరి చెట్లు వరకు నేలకొరిగా యని, ఉన్న చెట్లు కూడా పూర్తిగా పాడైపోయావన్నారు. పది సంవత్సరాల వరకు రైతులకు ఎటువంటి ఆదాయం ఉండదని ఆవేదన చెప్పారు. రైతులను ఆదుకోవాలంటే రైతు కమిటీలతో సమావేశం నిర్వహించి.. ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఎటువంటి సంప్రదింపులు జరపకుండా కొబ్బరి చెట్టుకు రూ. 1200 రూపాయలు ప్రకటించడం దారుణమన్నారు. తుపాను వచ్చి నాలుగు రోజులు కావస్తున్నా ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందలేదన్నారు. కార్యక్రమంలో జెడ్పీటసీ మాజీ సభ్యుడు డాక్టర్ ఎన్.దాసు, ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్మన్ పిలక రాజ్యలక్ష్మి, మాజీ ఎంపీపీ మంగి గణపతి, మండల కమిటీ అధ్యక్షుడు తడక జోగారావు, కంచిలి ఎంపీపీ ఇప్పిలి లోలాక్షి, ఎంపీపీ ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు, ఉలాల శేషుయాదవ్, పూడి నేతాజి, రజనికుమార్ దొలాయి, మడ్డు రాజారావు, మార్పు సూర్యం, త్రినాథ, రవి పాల్గొన్నారు. -
చేబదుళ్లు..తడిసి మోపెడు!
సాక్షి, అమరావతి: ఆర్థిక అవసరాలతో తెలిసిన వారి దగ్గర చేబదుళ్లు తీసుకోవడం సహజమే. ఇలా చేసిన అప్పును వారం పది రోజుల్లో లేదా వీలైనంత త్వరగా తీర్చేస్తాం. కొద్ది రోజులే కావడంతో ఇలాంటి వాటికి వడ్డీ ఉండదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అసాధారణ రీతిలో చేబదుళ్లకు కూడా రూ. వందల కోట్లలో వడ్డీలు కడుతోంది. గడువులోగా చేబదుళ్లు తిరిగి చెల్లించకపోవడమే దీనికి కారణం. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే! రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నాలుగో ఆర్థిక సంవత్సరంలో కూడా చేబదుళ్లు చేయడం, అందుకు వడ్డీలు చెల్లించడంలో రికార్డు సృష్టించింది. నాలుగేళ్లలో చేబదుళ్లకు వడ్డీ కింద ఏకంగా రూ.124.72 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. 2017–18లో కూడా చేబదుళ్ల జోరు కొనసాగిందని కాగ్ స్పష్టం చేసింది. అప్పులు చేసి వాటిని ఆస్తుల కల్పనకు కాకుండా ఇతర అవసరాల కోసం పప్పు బెల్లాలకు వ్యయం చేస్తోంది. దీంతో ఆస్తులు తరిగిపోయి అప్పుల శాతం భారీగా పెరిగిపోతోంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో చేబదుళ్ల కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.45,860.75 కోట్లు తీసుకున్నట్లు ‘కాగ్’ నిర్ధారించింది. దీన్ని సకాలంలో చెల్లించకపోవడంతో ఖజానాపై వడ్డీల భారం పడింది. చేబదుళ్లకు వడ్డీలు చెల్లించడం అంటే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఎంత అస్తవ్యస్థంగా ఉందో తేటతెల్లం అవుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చేబదుళ్లకు వడ్డీ చెల్లించే పరిస్థితి కల్పించడం అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని ఆర్థిక శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 14 రోజుల్లోగా చెల్లిస్తే వడ్డీ ఉండదు..: ఆర్బీఐ అన్ని రాష్ట్రాలకు వేస్ అండ్ మీన్స్ (చేబదుళ్లు) సౌకర్యం కల్పిస్తుంది. ఖజానాలో పైసా లేకపోయినా అత్యవసరాల కోసం వేస్ అండ్ మీన్స్ రూపంలో ఆర్బీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లను వినియోగించుకోవచ్చు. ఈ మొత్తాన్ని సకాలంలో 14 రోజుల్లోగా చెల్లించాలి. 14 రోజుల గడువు దాటితే వడ్డీ కట్టాల్సి ఉంటుంది. వేస్ అండ్ మీన్స్ పరిమితి దాటితే తరువాత ఓవర్ డ్రాప్టుకు వెళ్లాల్సి వస్తుంది. బడ్జెట్ అంచనాలను మించి రెవెన్యూ, ద్రవ్య లోటు వరుసగా నాలుగో ఏడాది కూడా చంద్రబాబు సర్కారు అప్పులు చేసి ఆస్తుల కల్పనకు కాకుండా రెవెన్యూ రంగాలకు వ్యయం చేసింది. దీంతో అప్పులు పెరిగిపోతున్నాయి కానీ ఆస్తులు కానరావడం లేదు. ఫలితంగా రాష్ట్ర ఆర్థికవ్యవస్థ పరాధీనంలోకి వెళ్లిపోతుంది. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.25,452 కోట్ల మేర అప్పులు చేయగా ఆస్తుల కల్పనకు కేవలం రూ.14,127.03 కోట్లనే వ్యయం చేశారు. అంటే మిగిలిన అప్పును రెవెన్యూ రంగాలకు వ్యయం చేసినట్లైంది. అలాగే బడ్జెట్ అంచనాలను మించి రెవెన్యూ, ద్రవ్య లోటు ఏర్పడింది. 2017–18 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల్లో రెవెన్యూ లోటు –415.80 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించగా ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత రెవెన్యూ లోటు –16,772.83 కోట్ల రూపాయలకు చేరుకుంది. బడ్జెట్ అంచనాల్లో ద్రవ్య లోటు –23,054.44 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించగా ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత ద్రవ్య లోటు –33,591.92 కోట్ల రూపాయలుగా తేలింది. ద్రవ్య, రెవెన్యూ లోటులు ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) నిబంధనలకు మించి ఉండటం గమనార్హం. ఆ రికార్డు బాబుదే.. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో కూడా ఏడాదిలోని 365 రోజుల్లో అత్యధికంగా 230 రోజులు చేబదుళ్లలోనే గడిపిన చరిత్ర ఉంది. ఆ తొమ్మిదేళ్లలో ఉమ్మడి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఇప్పుడు కూడా మళ్లీ అదే తరహాలో ఆయన పాలన కొనసాగుతోంది. చేబదుళ్లను సకాలంలో చెల్లించకపోవడంతో వడ్డీ చెల్లించే పరిస్థితి కల్పించిన ఘనత దేశంలో ఏ ముఖ్యమంత్రికి దక్కదని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
నిరుద్యోగ యువతను వంచించిన చంద్రబాబు
-
దగాపడ్డ.. యువనేస్తమా!
నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో నిరుద్యోగులను నిండా ముంచేసిన సీఎం చంద్రబాబు సర్కారు ఇప్పుడు ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు ఎంపిక చేసుకున్న ప్రైవేట్ శిక్షణ సంస్థల జేబులు నింపి కమీషన్లు కాజేసే ఎత్తుగడ వేసింది. ఇందులో భాగంగానే నిరుద్యోగులకు అరకొరగా భృతి పేరుతో మంగళవారం హడావుడి చేసింది. కనీసం కేబినెట్ భేటీలో ప్రకటించిన సంఖ్య ప్రకారమైనా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఆ సమావేశం నిర్ణయాలనే అపహాస్యం పాలు చేసింది. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలోని 1.70 కోట్ల కుటుంబాలకు ఉద్యోగం / నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉంది. పలు దఫాలుగా నిరుద్యోగుల సంఖ్యను కుదించి వడపోసిన సర్కారు చివరకు 12 లక్షల మందికిపైగా భృతికి అర్హులని తేల్చింది. కనీసం ఈ ప్రకారమైనా భృతి ఇవ్వకపోగా 4 లక్షల మందికి మాత్రమే చెల్లిస్తామంటూ జీవో ఇచ్చింది. అయితే ఇందులోనూ సగం మంది మాత్రమే ఇప్పటిదాకా భృతికి అర్హులంటూ తేల్చడం గమనార్హం. మరోవైపు నిరుద్యోగులకు ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ కింద నెలకు రూ.వెయ్యి ఇస్తామంటున్న సర్కారు వారికి నైపుణ్యాల పెంపుపై శిక్షణ పేరుతో ప్రైవేట్ సంస్థలకు నెలకు రూ.12 వేల చొప్పున రూ.480 కోట్ల దాకా చెల్లించేందుకు సిద్ధపడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, అమరావతి: గత ఎన్నికల ముందు ఇంటికో జాబు ఇస్తామని, జాబు ఇవ్వకుంటే నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగులందరికీ భృతి చెల్లిస్తామంటూ చంద్రబాబు సంతకంతో కూడిన పత్రాలను ఇంటింటికి పంపిణీ చేయడం తెలిసిందే. నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగ భృతి కింద పైసా ఇవ్వకపోగా ఇప్పుడు ఎన్నికల ముందు కేవలం నాలుగు లక్షల మందికి నెలకు రూ.వెయ్యి చొప్పున భృతి చెల్లించేందుకు అక్టోబర్ నెలకు రూ.40 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. భృతి కింద నిరుద్యోగులకు నెలకు కేవలం రూ.వెయ్యి ఇవ్వనుండగా వారికి శిక్షణ ఇచ్చేందుకు ప్రైవేట్ సంస్థలకు మాత్రం నెలకు రూ.12,000 చెల్లించనుండటం గమనార్హం. నిరుద్యోగికి భృతి కింద నెలకు రూ.వెయ్యి మాత్రమే ఇవ్వడమేమిటో.. వారికి శిక్షణ ఇచ్చే ప్రైవేట్ సంస్థలకు నెలకు రూ.12,000 చొప్పున ఇవ్వడమేమిటో అర్థం కావడం లేదని, ఇదంతా చూస్తుంటే పెద్దఎత్తున దోపిడీకి తెరతీసినట్లు తెలిసిపోతోందని అధికార యంత్రాంగం వ్యాఖ్యానిస్తోంది. ఇవ్వాల్సింది 1.70 కోట్ల మందికి.. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.70 కోట్ల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం లేదంటే నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పలు షరతులతో నిరుద్యోగ యువత సంఖ్యను భారీగా తగ్గించేసింది. తొలుత నిరుద్యోగ భృతికి 10 లక్షల మంది అర్హులని ప్రకటించింది. ఆ తర్వాత కేబినెట్ సమావేశంలో 12,26,333 మంది భృతికి అర్హులని తేల్చింది. అయితే ఇప్పుడు ఈ ప్రకారం కూడా నిరుద్యోగులకు భృతి ఇవ్వడం లేదు. సోమవారం వరకు 2.10 లక్షల మంది భృతికి అర్హులని తేల్చింది. 1.86 లక్షల మందికి రూ.వెయ్యి చొప్పున ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. భృతిలోనూ కమీషన్ల పర్వం.. జీవో ప్రకారం భృతి కింద 4 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.40 కోట్లు చెల్లించనుండగా వారికి శిక్షణ ఇచ్చే ప్రైవేట్ సంస్థలకు మాత్రం నెలకు రూ.12,000 చొప్పున రూ.480 కోట్లను సర్కారు చెల్లించనుంది. ఇక్కడ దోపిడీకి ఎత్తుగడ వేశారనేది వెల్లడవుతోందని, ఆఖరికి నిరుద్యోగుల అరకొర భృతిలోనూ కమీషన్లను వదలడం లేదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. నిరుద్యోగ భృతి కింద పరిపాలనా వ్యయం కోసం పది శాతం నిధులను జిల్లాస్థాయిలో, మరో పది శాతం నిధులను రాష్ట్రస్థాయిలో వ్యయం చేయాలని నిర్ణయించారు. ఇక ఈ పథకం ప్రచారం కోసం ఏకంగా రూ.6.40 కోట్ల వ్యయం చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. ఇదంతా ఎన్నికల ముందు హడావిడి తప్ప నిరుద్యోగులకు ఆర్థిక సాయం, పథకాన్ని అమలు చేయాలనే చిత్తశుద్ధి కానరావడం లేదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో భృతి కోసం కేటాయించిన రూ.వెయ్యి కోట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ప్లాన్ల నుంచి వెచ్చించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రైవేట్ సంస్థలకు నెలకు రూ.12 వేలు కేబినెట్లో పేర్కొన్న లెక్కల మేరకు 12.26 లక్షల మందికి నెలకు రూ.వెయ్యి చొప్పున భృతి ఇవ్వడానికి రూ.122 కోట్ల వ్యయం అవుతుందని, 6 నెలలపాటు దీన్ని అమలు చేయడానికి రూ.732 కోట్ల వ్యయమవుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇక భృతి చెల్లించే 12.26 లక్షల మందికి శిక్షణ ఇచ్చేందుకు నెలకు ఒక్కో నిరుద్యోగికి రూ.12,000 చొప్పున వ్యయం అవుతుందని పేర్కొంది. అంటే ప్రైవేట్ సంస్థల్లో నెల పాటు శిక్షణ కోసం రూ.1,500 కోట్ల వ్యయమవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఇప్పుడు అక్టోబర్లో కేవలం నాలుగు లక్షల మందికే భృతి ఇచ్చేందుకు రూ.40 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నాలుగు లక్షల మందికి శిక్షణ కోసం నెలకు రూ.12,000 చొప్పున ప్రైవేట్ శిక్షణ సంస్థలకు ప్రభుత్వం చెల్లిస్తుంది. -
పోస్టులు పెంచకుంటే ఆత్మహత్యలు
గుంటూరు ఈస్ట్/ కాకినాడ సిటీ: ప్రభుత్వం పీఈటీ పోస్టులు పెంచాలని, లేకుంటే మూకుమ్మడి ఆత్మహత్యలకు పాల్పడతామని నిరుద్యోగ అభ్యర్థులు హెచ్చరించారు. గుంటూరు, కాకినాడల్లో వాటర్ ట్యాంకుల పైకి ఎక్కి ఆందోళన చేపట్టారు. గుంటూరులో వీరి నిరసనపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆందోళనకు దిగినవారిని మహిళా అభ్యర్థులని కూడా చూడకుండా పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వాహనాల్లో పడేశారు. వివరాలిలా ఉన్నాయి.. సోమవారం అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన పీఈటీ అభ్యర్థులు గుంటూరు చేరుకున్నారు. 1,056 పీఈటీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆనందపేటలోని మున్సిపల్ వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకున్నారు. అభ్యర్థుల్లో కొందరు ట్యాంక్ పైకి ఎక్కి తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ నినదించారు. మిగిలిన వారు పోలీసులు పైకి వెళ్లకుండా మెట్ల వద్ద అడ్డుగా నిలబడి ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. నిరసన ఉధృతరూపం దాల్చడంతో ఆర్డీఓ వీరబ్రహ్మం, ఆర్జేడీ శ్రీనివాసరెడ్డి, డీఈఓ గంగాభవాని, డీఎస్పీ కండే శ్రీనివాసులు ఘటనాస్థలానికి చేరుకుని వారితో చర్చించినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తే నిరసన విరమిస్తామని, లేదంటే ట్యాంక్పై నుంచి దూకి ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం తమకు ద్రోహం చేసిందంటూ మండిపడ్డారు.రాష్ట్ర నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయ సంఘ ఉపాధ్యక్షుడు పి.రమేష్, ఇతర నాయకులు హరికృష్ణ, లక్ష్మణ్, అజరత్రెడ్డి మాట్లాతూ.. ప్రభుత్వం 1,056 పీఈటీ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పడంతో నిరుపేద కుటుంబాలకు చెందిన వేలాదిమంది అభ్యర్థులు అంతవరకు చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాలు మానివేశారన్నారు. ఒక్కొక్కరు సుమారు రెండు లక్షల రూపాయలు వెచ్చించి శిక్షణ తీసుకున్నారని, టెట్ పరీక్ష అర్హత పొందిన మహిళా అభ్యర్థులు శారీరకç దారుఢ్య పరీక్షల కోసం గర్భస్రావాలు సైతం చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తీరా ప్రభుత్వం 47 పోస్టులనే ప్రకటించడంతో విజయనగరం, కృష్ణా జిల్లాలకు చెందిన ఇద్దరు అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారని వారు గుర్తు చేశారు. పోలీసుల దౌర్జన్యం సాయంత్రం 4గంటల సమయంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు జి.రామన్న నేతృత్వంలో నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు పీఈటీ అభ్యర్థులను వాహనాల్లో ఎక్కించి స్టేషన్కు తరలించే ప్రయత్నం చేశారు. ట్యాంక్ మెట్ల వద్ద నిరసన తెలుపుతున్న మహిళా అభ్యర్థులను ఈడ్చుకుంటూ తీసుకెళ్లడంతో వారు పెద్దపెట్టున రోదించారు. ట్యాంక్పై ఉన్న మహిళా అభ్యర్థులు తాము కిందకు దిగబోమని, ఆత్మహత్య చేసుకుంటామంటూ పోలీసుల చేతుల్లో నుంచి తప్పించుకుని దూకేందుకు ప్రయత్నించడంతో వారి మధ్య తీవ్ర పెనుగులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో అనంతపురం జిల్లాకు చెందిన లక్ష్మీ, మరికొందరు అభ్యర్థులు స్వల్పంగా గాయపడ్డారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించారు. విద్యా శాఖ మంత్రి ప్రకటించిన విధంగా 1,056 పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇలావుండగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కూడా సుమారు 100 మంది పీఈటీలు ఆందోళనకు దిగారు. కుళాయి చెరువు ఆవరణలోని ఓవర్హెడ్ ట్యాంకు ఎక్కి తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరసన కొనసాగించారు. అర్బన్ తహసీల్దార్ వరాలయ్య, పోలీసు ఉన్నతాధికారులు వారితో చర్చించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటూ నచ్చచెప్పడంతో అభ్యర్థులు ఆందోళన విరమించారు. -
అమరావతి బాండ్లతో...మరో 500 కోట్లు అప్పు
సాక్షి, అమరావతి: ఇటీవల అత్యధిక వడ్డీకి అమరావతి బాండ్లు పేరుతో రూ. 2,000 కోట్లు అప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సీఆర్డీఏ ద్వారా మరో రూ. 500 కోట్ల అప్పు చేయించాలని నిర్ణయించింది. ఇందుకోసం పబ్లిక్ ఇష్యూకు వెళ్లబోతోంది. ఈ అప్పు చేసేందుకు లీడ్ మేనేజర్ను ఎంపిక చేసేందుకు సీఆర్డీఏ ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను ఆహ్వానించింది. ముగ్గురు మర్చంట్ బ్యాంకర్లతో లీడ్ మేనేజర్ను నియమించాలని ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులో సీఆర్డీఏ స్పష్టం చేసింది. లీడ్ మేనేజర్ ఫీజును దరఖాస్తుల ద్వారా తెలియజేయాల్సిందిగా సీఆర్డీఏ తెలిపింది. ఎంపిక చేసిన లీడ్ మేనేజర్ దళారిగా వ్యవహరిస్తారు. ఇటీవల అమరావతి బాండ్లు జారీచేసిన సమయంలో దళారీగా వ్యవహరించిన సంస్థకు రూ. 17 కోట్లను సీఆర్డీఏ చెల్లించిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో అమరావతి బాండ్లు పబ్లిక్ ఇష్యూ లీడ్ మేనేజర్కు కూడా ఫీజు రూపంలో సీఆర్డీఏ చెల్లించనుంది. అమరావతి బాండ్లు పబ్లిక్ ఇష్యూకు అవసరమైన అన్ని ఏర్పాట్లను లీడ్ మేనేజర్ చేయాల్సి ఉంటుంది. ఒకే విడత గానీ లేదా రెండు మూడు విడతల్లో గానీ బాండ్లు ద్వారా పబ్లిక్ ఇష్యూకు వెళ్లనున్నట్లు సీఆర్డీఏ పేర్కొంది. ఈ బాండ్లు కాలపరిమితి మూడేళ్ల నుంచి 15 ఏళ్ల వరకు ఉంటుందని తెలిపింది. లీడ్ మేనేజర్ ఎంపిక కోసం బిడ్లు దాఖలకు వచ్చే నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చారు. అదేరోజు సాయంత్రం 5.30 గంటలకు బిడ్లు తెరవనున్నట్లు సీఆర్డీఏ పేర్కొంది. ఇందుకు సంబంధించి ఈ నెల 25వ తేదీన ప్రీబిడ్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఆర్డీఏ పేర్కొంది. అమరావతి బాండ్లు పేరిట పబ్లిక్ ఇష్యూ ద్వారా జారీ చేసే బాండ్లను ఎవ్వరైనా వ్యక్తులు, సంస్థలు కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. ఇటీవల సీఆర్డీఏ రూ. 2000 కోట్లు అప్పునకు జారీ చేసిన బాండ్లకు 10.32 శాతం వడ్డీని నిర్ణయించిన విషయం తెలిసిందే. పెద్ద మొత్తంలో వడ్డీ ఇవ్వడంతో పాటు అసలుకు, వడ్డీకి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. దీంతో అప్పు ఇచ్చేందుకు ఆర్థిక సంస్థలు ముందుకు వచ్చాయి. ఒక పక్కన వాణిజ్య బ్యాంకుల్లో 8 నుంచి 9 శాతం వడ్డీకి అప్పులు పుడుతుంటే అమరావతి బాండ్ల పేరుతో అత్యధికంగా 10.32 శాతం వడ్డీకి అప్పు తేవడంపై పలు విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయినా సరే ఇప్పుడు మరోసారి అమరావతి బాండ్లు పబ్లిక్ ఇష్యూకు వెళ్లాలని సీఆర్డీఏ నిర్ణయించడం గమనార్హం. -
పెట్రో మంటలు
నర్సంపేట (వరంగల్) : ఆయిల్ కంపెనీలు పెట్రో, డీజిల్ ధరలను ఇష్టారాజ్యంగా పెంచుతుండడం సామాన్యులను ఆందోళనకు గురి చేస్తోంది. అంతర్జాతీయ చమురు మార్కెట్లో పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు తడిసి మోపెడవుతుండడంతో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. పెరుగుతున్న ధరలు నిత్యావసర సరకుల ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. 24 గంటలకోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ సామాన్యుల నడ్డి విరిచేస్తున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల సంక్షేమాన్ని ఆలోచించాల్సిన పాలకులు.. ఆ వైపు దృష్టి సారించడం లేదు. దీంతో ఎలా బతకాలని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. పెరుగుతున్న ధరలు ఆటోడ్రైవర్లతోపాటు ఆర్టీసీ, ఇతర ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ వాహనదారులపై ఆర్థిక భారం మోపుతున్నాయి. రవాణా చార్జీలు పెంచలేక.. ఆటో, ఇతర వాహనాలు నడిపించడం మానలేక నరకయాతన అనుభవిస్తున్నారు. కేవలం రోజువారి సంపాదనపై ఆధారపడుతూ కుటుంబాలను పోషించుకుంటున్న ఆటోవాలాలు లాభాల కంటే నష్టాలనే ఎక్కువగా చవిచూస్తున్నారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు పది ట్రిప్పులు రవాణా చేసినా.. పైసా మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెరుగుదలతో ట్రాన్స్పోర్ట్ చార్జీలు తడిసిమోపడై నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని సామాన్యులు ఆం దోళన చెందుతున్నారు. రోజు రూ.60 లక్షలకుపైగా భారం జిల్లావ్యాప్తంగా 43 పెట్రోల్ బంకులు ఉండగా.. పెరుగుతున్న ధరలతో జిల్లావాసులపై రోజుకు రూ.60 లక్షలకుపైగానే అదనపు భారం పడుతోంది. సెప్టెంబర్ ఆరంభంలోనే పెట్రోల్ లీటర్కు 50 పైసలు పెరగడంతో ఆందోళన కలిగిస్తోంది. 2018 ఫిబ్రవరి నుం చి ఇప్పటి వరకు లీటరు డీజిల్పై రూ.9.87, పెట్రోల్పై రూ.8.19 పైసలు పెరిగింది. ఏడు నెలల కాలంలోనే లీటర్ ధర రూ.10 వరకు పెరుగుతూ సామాన్యులను కంగారు పెట్టిస్తోంది. దీంతో వాహన చోదకులు ఇబ్బందిపడడమేగాక పెట్రోల్ బంకు యజమానులు సైతం అవస్థలు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే.. నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటడం ఖాయంగా కనిపిస్తోంది. ధరల పెంపు మోయలేని భారం సామాన్య ప్రజలు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ద్విచక్ర వాహనాల వినియోగం పెరిగిన తరుణంలో పెట్రోలు ధరలు మోయలేని భారంగా మారాయి. సామాన్యుల అవసరాలను గుర్తెరిగి వీలైనంత వరకు ధరలను తగ్గించి ఆదుకోవాలి. శ్రీలత, ఉపాధ్యాయురాలు ఆదాయం సగం పడిపోయింది.. మేము గతంలో రోజంతా ఆటో నడిపితే రూ.600 లాభం ఉండేది. ఈ మధ్య పెరుగుతూ వస్తున్న డీజిల్ ధరలతో ఆదాయం 300కు పడిపోయింది. మళ్లీ డీజీల్ ధరలు పెరుగుతాయని తెలుస్తాంది. ఇట్లయితే వచ్చే రోజుల్లో ఆటో నడుపుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. ప్రభుత్వాలు డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గిస్తే బాగుంటుంది. –కారోజు నగేష్, ఆటో డ్రైవర్ -
దీపావళికి కొత్త కలెక్టరేట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుకు కసరత్తులు ముమ్మరం చేస్తున్న దరిమిలా తన పథకాల్లో దూకుడు పెంచింది. ఎన్నికల కోసం వెళ్లేలోగా ఇచ్చిన హామీల్లో దాదాపు అన్నీ పూర్తిచేసి చూపించే వెళ్లాలన్న పట్టుదలతో ఉంది. అందుకే, కీలక పథకాలు వేగిరపరచాలని సీఎం పేషీ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందులో కొత్త జిల్లాల కలెక్టరేట్ భవనాలు కూడా ఉన్నాయి. 2016లో దసరాకు కొత్త జిల్లాల ప్రకటన చేసిన సీఎం కేసీఆర్ ఉమ్మడి 10 జిల్లాలను 31 జిల్లాలకు పెంచిన సంగతి తెలిసిందే. వీటిలో మొత్తం 27 కలెక్టరేట్లకు కొత్త భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్మాణ బాధ్యతలను ఆర్ అండ్ బీ చూస్తోంది. సీఎం పేషీ నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో అధికారులు చురుగ్గా కదులుతున్నారు. దీపావళికి ప్రారంభమయ్యేవి ఇవే.. వాస్తవానికి 2017లోనే ఈ భవనాల నిర్మాణాలు మొదలయ్యాయి. వీటిలో జగిత్యాల, ఆసిఫాబాద్, కొత్తగూడెం, మేడ్చల్ కలెక్టరేట్ల నిర్మాణాలు కొలిక్కి వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ దీపావళికి ఈ నాలుగు భవనాలను ప్రారంభించి, మిగిలినవి ఎన్నికల నాటికి ప్రారంభించాలని సీఎం పట్టుదలతో ఉన్నారని సమాచారం. ఈ మేరకు ఆర్ అండ్బీ పనులు పూర్తి చేసేందుకు సమాయత్తమైంది. కాగా వికారాబాద్, యాదాద్రి, రంగారెడ్డి, కామారెడ్డి, సిద్ధిపేట, జనగాం, వనపర్తి జిల్లాల భవనాల నిర్మాణాలు వేగంగానే సాగుతున్నాయి. వాటిని డిసెంబరులో లేదా మార్చిలో ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ ఏడు జిల్లాల కొత్త భవనాలు ఎన్నికలకు ముందే అందుబాటులోకి వస్తాయని అధికారులు అంటున్నారు. మందకొడిగా నడుస్తున్నవి ఇవే..! మరోవైపు మిగిలిన కలెక్టరేట్ భవనాలు ఇంకా నత్తనడకన సాగుతుండటం అధికారులను కలవరపెడుతోంది. వాస్తవానికి ఇవన్నీ బహుళ అంతస్తులు. వీటిని ఏడాదిలోపు పూర్తి చేయాల్సి రావడం కష్టమే. పెద్దపల్లి, నిజామాబాద్, వరంగల్ అర్బన్, సూర్యాపేట, మెదక్, మహబూబ్నగర్, భూపాలపల్లి, నిర్మల్, గద్వాల, నాగర్కర్నూల్, మహబూబాబాద్, సిరిసిల్ల, మంచిర్యాల, ఖమ్మం మొత్తం 14 జిల్లాల భవనాల పనులు మందకొడిగా సాగుతున్నాయి. వీటికి స్థలసేకరణ, టెండర్ల ఖరారు ఇతర సాంకేతిక కారణాలు ఉన్నాయి. దీంతో ఈ పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పనులే మొదలు కానివి.. సాంకేతిక కారణాలతో వరంగల్ రూరల్ కలెక్టరేట్ భవన నిర్మాణం ఇంకా మొదలు కాలేదు. కరీంనగర్ కలెక్టరేట్కు ఇంకా స్థలం కేటాయింపు ఖరారు కావాలి. దీంతో ఈ రెండు జిల్లాల కలెక్టరేట్ల నిర్మాణాలు చాలా వెనకబడి ఉన్నాయి. -
దళారీ గద్దలు
బరిగెల శివకుమార్ అనే యువకుడు ఉద్యోగంపై ఆశతో ప్రశాంత్నగర్కు చెందిన వ్యక్తిని నమ్మి రూ.4 లక్షలు సమర్పించుకున్నాడు. శివకుమార్ లాంటి బాధితులు సదర వ్యక్తి ఖాతాలో ఎందరు ఉన్నారో లెక్కలేదు. అతడిని డబ్బుల కోసం నిలదీసిన బాధితులపైనే అట్రాసిటీ కేసులు పెట్టి ముప్పుతిప్పలు పెట్టిన ఘన చరిత్ర అతడికి ఉంది. కాజీపేట రహమత్ నగర్కు చెందిన తేలు సారంగపాణిది మరో గాథ. అన్న కొడుకు ఇంజనీరింగ్ చదివి ఇంటి వద్ద పనీపాట లేకుండా ఉంటున్నాడు.. ఏదైనా అవకాశం ఉంటే చూడు అంటూ పరిచయం ఉన్న వ్యక్తితో బాధను పంచుకున్నాడు. దీన్ని అవకాశంగా తీసుకున్న సదరు వ్యక్తి నేరుగా విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం పంపిస్తానంటూ రూ.7.50 లక్షలు వసూలు చేసి నట్టేట ముంచాడు. అడగబోతే మాటలతో ఎదురుదాడి చేశాడు. చేసేది లేక పోలీసులను ఆశ్రయించి సగం డబ్బులను వసూలు చేసుకోవడంలో సఫలీకృతుడైన బాధితుడిపై ఇంకా సదరు దళారీ ఎదురుదాడి ఆగకపోవడం గమనార్హం. కాజీపేట (వరంగల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల వివిధ శాఖల్లోని ఉద్యోగాల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్లు కొంతమంది దళారులకు వరంగా మారుతున్నాయి. నిరుద్యోగుల అమాయకత్వం, ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలన్న ఆశ బ్రోకర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. రెగ్యులర్ ఉద్యోగాలకు ఓ రేటు, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు మరో రేట్ను ఫిక్స్ చేసి మొదట పెద్ద మొత్తంలో అడ్వాన్స్గా వసూలు చేస్తున్నట్లు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లు వెత్తుతున్నాయి. ఇటీవల అటవీ శాఖ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్(ఎఫ్బీఓ), సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేయడమేగాక రాతపరీక్ష కూడా నిర్వహించింది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని 1:3 నిష్పత్తిలో ఎంపిక చేసి వారికి మెడికల్ టెస్ట్లు, ఇతర ఈవెంట్లకు అర్హులుగా నిర్ధారించింది. రాతపరీక్ష నెగ్గి ఈ పరీక్షల కోసం వేచి చూస్తున్న వారిలో చాలామంది దళారుల బారినపడినట్లు తెలిసింది. ఎలాగూ రాత పరీక్ష నెగ్గినందున ఎన్ని డబ్బులు పెట్టయినా కొలువు సంపాదించుకుందామని ఆశపడుతున్న వారు దళారుల వలలో చిక్కుకుంటున్నారు. దళారులకు సంబంధిత శాఖలో ఒకరిద్దరు అధికారులతో పరిచయాలు ఉండడం, అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండడంతో వారిని నిరుద్యోగులు నమ్ముతూ లక్షలాది రూపాయలు చెల్లించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే వైద్య, ఆరోగ్యశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల్లో కూడా ఇటీవల కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇందులోనూ దళారులు రంగ ప్రవేశం చేసి నిరుద్యోగులకు వల విసిరినట్లు తెలిసింది. దీనికి తో డు ఇటీవల వివిధ శాఖల్లో జరుగుతున్న ఔట్సో ర్సింగ్ ఉద్యోగ నియామకాల వ్యవహారంపై పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. హైదరాబాద్కు చెంది న కొన్ని ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు తమకున్న రాజకీయ పలుకుబడితో గుట్టుచప్పుడు కాకుండా నియామకాలు చేస్తున్నాయి. వీరు ఆయా ప్రాంతాల్లోని తమ ఏజెంట్ల ద్వారా అభ్యర్థులను నియమించి వారి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రైల్వేలో కొలువులపై... రెగ్యులర్ ప్రాతిపదికన రైల్వేశాఖలో భర్తీ చేయబోతున్న ఏఎల్పీ, టెక్నీషియన్, గ్రూప్–డీ ఉద్యోగాల కోసం నిరుద్యోగుల నుంచి పోటీ తీవ్రంగా ఉంది. ఇటీవల రాత పరీక్షలు ప్రారంభం కావడంతో ఫలితాలు అనుకూలంగా రావడం కోసం పైరవీలు చేస్తామంటూ దళారులు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో పోస్టుకు దాదాపు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఒప్పందం కుదుర్చుకొని అడ్వాన్స్గా రూ.2 లక్షలు లేదా రూ.3 లక్షలు తీసుకుంటున్నట్లు ప్రచారం. నియామక ప్రక్రియ పకడ్బందీగా జరుగుతున్నప్పటికీ అభ్యర్థుల అత్యాశ, దళారుల మాయమాటల కారణంగా చెల్లింపులు జరుగుతున్నాయంటున్నారు. ఔట్సోర్సింగ్, అంగన్వాడీ కొలువులకు.. వివిధ శాఖల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు లక్షలాది రూపాయలు డిమాండ్ ఉంది. ఇటీవల వివిధ శాఖల్లో ఉద్యోగాలను భర్తీచేయడానికి కొన్ని ఏజెన్సీలు నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి భర్తీ చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. నిబంధనల ప్రకారం నోటిఫికేషన్లుగానీ, రోస్టర్ విధానం అమలు చేయకుండా ఈ సంస్థలు రహస్యంగా భర్తీ వ్యవహారాలు నడుపుతున్నాయి. అంగన్వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీకి అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన పూర్తికావడంతో తమకు ప్రభుత్వ పెద్దల అండ ఉందని చెబుతూ కొందరు దళారులు అమాయకులను వంచిస్తున్నారు. టీచర్ పోస్టుకు రూ.లక్ష, ఆయా పోస్టుకు రూ.50 వేల చొప్పున ఇప్పటికే కొందరు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతపెద్ద ఎత్తున దళారులు సాగిస్తున్న ఈ అక్రమ వ్యవహారాలపై సంబంధిత శాఖల అధికారులు ఇప్పటికైనా దృష్టిసారించి అమాయకులు నష్టపోకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.. నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో నమ్మించి మోసం చేసే వ్యక్తులపట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. పారదర్శకంగా ఉద్యోగాల నియామకాల ప్రక్రియ జరుగుతున్నందున దళారులను ఆశ్రయించి మోసపోవద్దు. అలాగే పోలీస్ స్టేషన్లో నిర్దిష్ట ఆధారాలతో ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేసి విచారణ జరుపుతాం. – సీహెచ్.అజయ్, సీఐ, కాజీపేట -
భూసేకరణ జీవో చెల్లదు
తాటిచెట్లపాలెం (విశాఖపట్నం): రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా వేల ఎకరాలు భూసేకరణ చేస్తోందని, ఇది సరైన పద్ధతిలో జరగట్లేదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 2018 మార్చిలో విడుదల చేసిన జీవో నంబర్ 118, పార్లమెంట్ చట్టం 113కు పూర్తి వ్యతిరేకమన్నారు. విశాఖపట్నంలోని పౌరగ్రంథాలయంలో శుక్రవారం ‘భూసేకరణ– పరిష్కారం’ అనే అంశంపై జరిగిన సెమినార్లో జస్టిస్ గోపాలగౌడ మాట్లాడారు. భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయన విమర్శలుగుప్పించారు. ప్రభుత్వం భూసేకరణ చేయాల్సి వస్తే ముందుగా గ్రామసభ ఆమోదం పొందాలని, ప్రజల అభిప్రాయాలు సేకరించాల్సి ఉంటుందని, ఆ తర్వాత వారికి తగు నష్టపరిహారం, ప్రతిగా స్థలం ఇవ్వాలని, అలాగే బాధితులకు జీవనాధారం చూపించాల్సి ఉందని వివరించారు. భూసేకరణ అనేది హౌసింగ్ స్కీం కోసమైతే అక్కడి పరిస్థితులు నివాసయోగ్యతకు అనుకూలంగా ఉండాలని, పర్యావరణ అనుమతులు ఉండాలని పార్లమెంట్లో చేసిన చట్టంలో స్పష్టంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో ఆమెదం పొందాలంటే గవర్నర్ అనుమతి ఉండాలని, కానీ ఇష్టానుసారంగా చేసిన ఆ జీవో చెల్లదని, అలాంటి జీవో బంగాళాఖాతంలో కలిపేయడమేనని వ్యాఖ్యానించారు. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేస్తే అది రాష్ట్రపతి ఆమోదం పొందాలని కాని ఇక్కడ అలాంటి నిబంధనలేవీ పాటించలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవేమీ పాటించకుండా పారిశ్రామిక కారిడార్ల, విశ్వవిద్యాలయాలు, రహదారుల పేరిట పేద, మధ్య తరగతుల రైతుల నుంచి బలవంతంగా లక్షల, వేల ఎకరాలు భూసేకరణ చేస్తోందని జస్టిస్ గోపాలగౌడ దుయ్యబట్టారు. రైతుల్ని వేధిస్తూ భూసేకరణ రాష్ట్రంలో పెట్రో యూనివర్సిటీకి 250 ఎకరాలు అవసరమైతే దీని పేరిట 750 ఎకరాలు సేకరించేందుకు కుట్రపన్నుతున్నారని జస్టిస్ గోపాలగౌడ పేర్కొన్నారు. అయితే దీని కోసం ఇంతవరకు పర్యావరణ అనుమతులు కూడా తీసుకోలేదని వివరించారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు రాజ్యాంగాన్ని కాపాడాలని, కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం బలవంతంగా ప్రజల్ని, రైతుల్ని వేధిస్తూ భూసేకరణ చేస్తోందన్నారు. అభివృద్ధికి ఎవరూ ఆటంకం కాదని, కానీ అభివృద్ధి పేరిట సంవృద్ధిగా పంటలు పండే వేల, లక్షల ఎకరాలు సేకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. రైతులంతా ఏకమై పోరాడితే అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. కొందరు రైతులకు పట్టాలు లేనందున వారికి తక్కువ నష్టపరిహారం ఇచ్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అయితే వారు దశాబ్దాలుగా ఆ భూమిని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, అలాంటి సందర్భంలో ఆ భూములకు వారే హక్కుదారులని చట్టం చెబుతోందన్నారు. ప్రభుత్వాలు ప్రజలను కాపాడడానికి ఉండాలిగాని వారిని బిచ్చగాళ్లను చేయడానికి కాదని తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం పనిచేసేది కేవలం పట్టణ ప్రజల కోసమేనా? గ్రామీణులు, రైతుల కష్టాలు పట్టవా అని ప్రశ్నించారు. సమావేశంలో íసీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్.నరసింగరావు, సీపీఐ నేతలు గంగారాం, కె.లోకనాథం, బాధిత రైతులు పాల్గొన్నారు. ఓటుతో బుద్ధి చెప్పాలి! పారిశ్రామిక ప్రాంతం కోసం భూసేకరణ చేయదలిస్తే ఆ ప్రాంతంలో ఎంత మందికి ఉపాధి దొరుకుతుంది.. లాభనష్టాలు, ప్రాజెక్టు రిపోర్టులు తదితర అంశాలతో, వివిధ శాఖల అనుమతులతో మాత్రమే చేయాల్సి ఉంటుందని జస్టిస్ గోపాలగౌడ తెలిపారు. మన దేశ జనాభాలో 70 శాతం మంది గ్రామీణులేనని, వీరి జీవనాధారం పాడి పంటలు, ఫలసాయమేనని వివరించారు. మరి అలాంటి సాగు భూముల్ని బలవంతంగా ప్రభుత్వాలు తీసేసుకుంటే ప్రజలు ఏం చేయాలని ప్రశ్నించారు. ప్రజలంతా ఏకమై అలాంటి నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపిచ్చారు. -
11 మంది ఐఏఎస్ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. 5 రోజుల క్రితం ముగ్గురిని బదిలీ చేసిన ప్రభుత్వం మంగళవారం మరో 11 మంది ఐఏఎస్లకు స్థానచలనం కల్పించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా సిద్ధిపేట కలెక్టర్గా పని చేస్తున్న పి.వెంకట్రామిరెడ్డి.. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్య జిల్లా రాజన్నసిరిసిల్ల కలెక్టర్గా బదిలీ అయ్యారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్గా పని చేస్తున్న డి.కృష్ణభాస్కర్ను సిద్దిపేట జిల్లా కలెక్టర్గా బదిలీ చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలిని బదిలీ చేసిన ప్రభుత్వం కొత్తగా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్రావును హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా నియమించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణాకు ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు. భూ పరిపాలన(సీసీఎల్ఏ) డైరెక్టర్ వాకాటి కరుణ ప్రస్తుతం అదనపు బాధ్యతలో ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. వాకాటి కరుణకు మరో అదనపు బాధ్యతగా ఉన్న రిజిస్ట్రేషన్, స్టాంప్స్ కమిషనర్ పోస్టులో సైతం ప్రభుత్వం ఇటీవలే పూర్తి స్థాయి అధికారిని నియమించింది. ఆగస్టు 31లోపు మరికొందరు ఐఎస్ఎస్ల బదిలీలు ఉంటాయని తెలుస్తోంది. మరికొంత మంది కలెక్టర్లతోపాటు, వివిధ శాఖల కమిషనర్లు, ముఖ్యకార్యదర్శుల పేర్లు తదుపరి బదిలీల జాబితాలో ఉండనున్నాయి. ఎన్నికల ప్రక్రియ వల్లే... 2019 సాధారణ ఎన్నికల ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలోనే కలెక్టర్ల బదిలీలు అనివార్యమయ్యాయి. సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్రియ చేపట్టింది. సెప్టెంబర్ 1న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించనుంది. అనంతరం అభ్యంతరాలు, ప్రతిపాదనల స్వీకరణ, పరిష్కారాల ప్రక్రియ ఉంటుంది. సాధారణంగా జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. ఓటర్ల జాబితా అభ్యంతరాలు, స్వీకరణ ప్రక్రియలో నిమగ్నమైన అధికారులను సెప్టెంబర్ 1 తర్వాత బదిలీ చేయడం కుదరదు. తప్పనిసరి పరిస్థితుల్లో బదిలీ చేయాలంటే కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను బదిలీ చేసినట్లు తెలిసింది. -
ఎన్నికల హామీలు నెరవేర్చాలని ధర్నా
పాన్గల్: ఎన్నికల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీల అమలు చేయడంలో విఫలమయ్యాయని, ఇందుకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. మహబూబ్నగర్ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కళావతమ్మ, శ్రీరామ్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం, జీఎస్టీ విధించడం, పెద్దనోట్లు రద్దు వంటి వాటితో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూపంపిణీ, కేజీ టూ పీజీ ఉచిత విద్య, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు తదితర హామీలు నెరవేర్చలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగానే ఈ ధర్నాలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిప్రతాన్ని తహసీల్దార్ అలెగ్జాండర్కు అందజేశారు. నాయకులు గోపాల్, శివకుమార్, రమణ, పెంటయ్య, నరసింహ్మ, బాలపీరు, కుర్మయ్య, తిరుపతయ్య, చెన్నమ్మ పాల్గొన్నారు. -
గోదావరిలో విషాదం
-
కన్నీరే.. గోదారై
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రెండో శనివారం.. పాఠశాలలకు సెలవు రోజు.. విద్యార్థులు ఇంటి వద్ద ఆడుతూ పాడుతూ ఆనందంగా గడపాల్సిన సమయం. కానీ, ‘వనం–మనం’ కార్యక్రమంలో తప్పనిస రిగా పాల్గొనాలంటూ సెలవును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం ఆ చిన్నారుల పాలిట మృత్యుపాశంగా మారింది. ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని నాటు పడవలో ఇంటికి తిరిగి వస్తూ గోదావరి నదీ పాయలో ప్రమాదానికి గురయ్యారు. ఆరుగురు విద్యార్థినులు, ఒక మహిళ నీటిలో గల్లంతయ్యారు. అక్కడికి సమీపంలోనే సముద్రం ఉండడంతో వారి ఆచూకీపై ఆందోళన నెలకొంది. తూర్పు గోదావరి జిల్లాలో శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలో కేవలం 8 నెలల వ్యవధిలో 4 ఘోర పడవ ప్రమాదాలు జరగడం గమనార్హం. అమాయకులు బలైపోతున్నా ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడం లేదు. పదో తరగతి లోపు విద్యార్థినులే.. గోదావరి నదిలో మే 15వ తేదీన లాంచీ బోల్తా పడి 19 మంది గిరిజనులు జలసమాధి అయిన ఘటన మరువక ముందే.. తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద శనివారం గోదావరి పాయ అయిన వృద్ధ గౌతమిలో నాటు పడవ ప్రమాదానికి గురైంది. పశువుల్లంక నుంచి సలాదివారిపాలెం లంకకు దాదాపు 30 మందితో బయల్దేరిన నాటు పడవ మొండిల్లంక రేవు వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్ను ఢీకొట్టి ఓ పక్కకు ఒరిగిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో ఆరుగురు విద్యార్థినులే. వారంతా పదో తరగతి లోపు చదువుతున్న వారే. మిగిలిన 23 మందిని స్థానికులు కాపాడారు. ఆచూకీ దొరికేనా? ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానిక అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, బాధితుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. రాత్రి కావడంతో గాలింపు చర్యలను నిలిపివేశారు. సముద్రానికి దగ్గరగా ఉండే వృద్ధ గౌతమి పాయ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి వస్తున్న గోదావరి వరద నీరు ఈ పాయ గుండానే సముద్రంలో కలుస్తోంది. దీంతో గల్లంతైన వారి ఆచూకీ అంత సులువుగా దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ప్రమాదం జరిగిందిలా.. పశువుల్లంక నుంచి సలాదివారిపాలెం లంక, శేరి లంక, కొత్త లంక గ్రామాలకు వెళ్లేందుకు మొండిల్లంక రేవు వద్ద 30 మంది నాటు పడవ ఎక్కారు. పడవ డ్రైవర్ సాయంత్రం 4.05 గంటలకు ఇంజిన్ స్టార్ట్ చేశారు. కాసేపు మొరాయించిన ఇంజిన్ కొద్దిసేపటికి పనిచేయడం ప్రారంభించింది. ఒడ్డు నుంచి 150 మీటర్ల దూరం వెళ్లాక మళ్లీ ఆగిపోయింది. సరిగ్గా అదే ప్రదేశంలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో పడవ అదుపు తప్పింది. పక్కనే నిర్మాణంలో ఉన్న వంతెన మూడో పిల్లర్ను ఢీకొని ఒక్కసారిగా ఒరిగిపోయింది. తీవ్ర ఆందోళనకు గురైన ప్రయాణికులు ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నించారు. వెంటనే పిల్లర్ బేస్పైకి ఏడుగురు ఎక్కారు. మిగిలినవారు కూడా పిల్లర్ బేస్ పైకి ఎక్కేందుకు ప్రయత్నించగా పడవ మరింత కిందికి ఒరిగిపోయింది. దీంతో 17 మంది నదిలో పడిపోయారు. మరో ఆరుగురు పడవలోనే ఉండిపోయారు. సరిగ్గా అదే సమయానికి వంతెన నిర్మాణ పనుల సూపర్వైజర్ మధుబాబు నదిలోని ఓ పంటుపై ఉన్నారు. ప్రమాదాన్ని ప్రత్యక్షంగా గమనించిన ఆయన తక్షణమే ఆవలి ఒడ్డుకు వెళ్లి తమ కంపెనీకి చెందిన ఇంజిన్ బోటులో పడవ మునిగిన చోటుకు వచ్చి కొందరిని రక్షించారు. అప్పటికే వీపున స్కూల్ బ్యాగులతో ఉన్న విద్యార్థినులు నీటిలో మునిగిపోతూ చేతులు ఊపుతున్నారు. మధుబాబు వారి చేతులు పట్టుకుని పైకి లాగారు. అలా దాదాపు పది మందిని రక్షించారు. నదిలో బోటు ఒరిగిపోవడాన్ని గమనించిన శేరిలంక వాసి కొండేపూడి సంజీవ్ మరో పడవలో వెళ్లి ఆరుగురిని రక్షించారు. ప్రమాదానికి గురైన పడవను నడుపుతున్న డ్రైవర్ సలాది వెంకటేశ్వరరావు సురక్షితంగా తప్పించుకున్నాడు. నీటిలో ఒరిగిన పడవ నదీ ప్రవాహ వేగానికి కిలోమీటర్ మేర కొట్టుకుపోయి శేరిలంక వైపు ఆగింది. వాస్తవానికి ఈ పడవ కేవలం 15 మంది ప్రయాణించడానికే సరిపోతుంది. కానీ, రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులతోపాటు మరో ఎనిమిది మోటార్ సైకిళ్లను ఎక్కించారు. బాధితులకు తక్షణమే సహాయం అందించాలి పడవ ప్రమాదంపై ప్రభుత్వానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విజ్ఞప్తి సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లాలో పడవ ప్రమాదంపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణమే సహాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఘటనా స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిందిగా జిల్లా పార్టీ నాయకులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు వైఎస్సార్ సీపీ నేతల పరామర్శ మండపేట: అనపర్తి నియోజకవర్గం గొల్లలమామిడాడలో పాదయాత్రలో ఉన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్కు పడవ ప్రమాదం ఘటన సమాచారం అందడంతో తక్షణమే అక్కడకు వెళ్లాలని పార్టీ నాయకులను ఆదేశించారు. ఎమ్మెల్సీ, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గం జిల్లా అధ్యక్షుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పొన్నాడ సతీష్, చెల్లుబోయిన శ్రీనివాస్, నాయకులు కర్రి పాపారాయుడులు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. సముద్రంలో కూడా గాలించాలి పడవ ప్రమాదం నదీ ముఖ ద్వారం వద్ద జరిగిన నేపథ్యంలో గల్లంతైన వారికోసం గోదావరి నదిలోనే కాకుండా సముద్రంలో కూడా కోస్ట్గార్డ్, హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టాలని పిల్లి సుభాష్చంద్రబోస్ సూచించారు. ఘటనా స్థలం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవుల నిర్వహణపై పర్యవేక్షణ కొరవడిందని, నిబంధనలు మేరకు వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పవన్, రఘువీరా దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంక దగ్గర గోదావరి నదిలో చోటు చేసుకున్న పడవ ప్రమాద ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పడవ ప్రమాదాలు జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. పుస్తకాల బ్యాగే ప్రాణాలు కాపాడింది.. పశువుల్లంక జెడ్పీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాను. స్కూల్ ముగించుకుని అందరితోపాటు ఇంటికి చేరుకునేందుకు పడవ ఎక్కాను. కొంత దూరం వెళ్లేసరికి ప్రమాదం జరిగింది. పడవ ఒరిగిపోవడంతో గోదావరిలో పడిపోయాను. నా భుజానికి తగిలించుకున్న స్కూల్ బ్యాగ్ నన్ను నీటిలో తేలేలా చేసింది. దీంతో బ్యాగ్ను వదలకుండా పట్టుకుని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేయగా ఇంతలో నన్ను ఎవరో రక్షించారు. – జ్ఞానకుమార్ గల్లంతైనవారు వీరే.. పడవ ప్రమాదంలో గల్లంతైన వారిలో ఐ.పోలవరం మండలం సలాదివారిపాలేనికి చెందిన సుంకర శ్రీజ (పదో తరగతి), కె.గంగవరం మండలం శేరిలంకకు చెందిన కొండేపూడి రమ్య (పదో తరగతి), పోలిశెట్టి వీరమనీషా (పదో తరగతి), తిరుకోటి ప్రియ (ఎనిమిదో తరగతి), పోలిశెట్టి అనూష (తొమ్మిదో తరగతి), పోలిశెట్టి సుచిత్ర (ఆరో తరగతి)తోపాటు వివాహిత గెల్లా నాగమణి (30) ఉన్నారు. ప్రమాద సమయంలో బోటులో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది గల్లంతయ్యారన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే తప్ప వాస్తవ సంఖ్య ఎంత అన్నది చెప్పలేమని అధికారులు అంటున్నారు. నా బిడ్డ ఏమైపోయిందో.. కళ్ల ముందు మహలక్ష్మిలా తిరిగే మనవరాలు ఒక్కసారిగా కనిపించక ఓ అమ్మమ్మ ఆవేదన. స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఇంటి పనుల్లో చేదోడు వాదోడుగా ఉండే కుమార్తె ఏమైందో తెలియక ఓ తల్లి బాధ. చదువే ప్రాణంగా భావించే కుమార్తెలు కానరాక ఓ తండ్రి కలవరం. ఇవీ ప్రమాదం ప్రాంతంలో కనిపించిన విషాద దృశ్యాలు. పడవ ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ కానరాక ఆవేదనతో బంధువుల చేస్తున్న ఆక్రందనలు అక్కడి వారందరినీ కదిలించివేస్తున్నాయి. ఉన్నత చదువులు చదివి తమను కష్టాల నుంచి గట్టెక్కిస్తారని భావించిన తల్లిదండ్రులు.. తమ పిల్లలు ఇప్పుడు కానరావడంలేదని, తాము ఏం చేయాలని ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. చదువుల కోసం విద్యార్థులైనా, సరుకుల కోసం పెద్దలైనా, ఉపాధి పనులు కోసం కూలీలైనా నిత్యం గోదారి దాటి వెళ్లాల్సిందేనని, నాటు పడవల్లో గోదావరి దాటడం దినదిన గండమేనని వారు చెబుతున్నారు. నా మనవరాలు ఎలా ఉందయ్యా.. నా మనవరాలు ఎలా ఉందో చెప్పండయ్యా అంటూ బోటు ప్రమాదంలో గల్లంతైన సుంకర శ్రీజ అమ్మమ్మ సిగిరెడ్డి సత్యవతి విలపించిన తీరు అక్కడి వారందరినీ కంట తడి పెట్టించింది. ప్రమాదం విషయం తెలుసుకున్న సత్యవతితో పాటు ఇతర కుటుంబ సభ్యులు గోదావరి ఒడ్డుకు చేరుకుని విలపించారు. శ్రీజ ఎక్కడుందో తెలపండంటూ కనిపించిన వారిని సత్యవతి అడగడం కలిచివేసింది. – సిగిరెడ్డి సత్యవతి, గల్లంతైన సుంకర శ్రీజ అమ్మమ్మ ఆరుగురిని రక్షించాను.. స్కూల్కు వెళ్లిన నా కుమారుడు వెంకటరుషి ఇంటికి తీసుకువెళ్లేందుకు గోదావరి ఒడ్డుకు వెళ్లాను. ఇంతలో ఒక పడవ ఆ ఒడ్డు నుంచి వస్తూ కనిపించింది. ఇందులో నా కొడుకు ఉన్నాడని ఎదురు చూస్తుండగా వచ్చే పడవ ఒక్కసారిగా ప్రమాదానికి గురయింది. ఏం జరిగిందో తెలిసేలోపే కొంత మంది గోదావరిలో పడిపోవడం కనిపించింది. కొందరు పిల్లర్ ఎక్కడం గమనించిన నేను వెంటనే గోదావరిలోకి దూకి ప్రమాద స్థలానికి చేరుకుని ఆరుగురిని రక్షించాను. – కొండేపూడి సంజీవ్, ప్రత్యక్ష సాక్షి, శేరిలంక. యథావిధిగా స్కూల్కు సెలవిచ్చి ఉంటే.. ప్రతీ రెండో శనివారం స్కూల్కు సెలవిచ్చేవారు. ఏదో వన మహోత్సవమట.. మొక్కలు నాటాలనీ ఈ శనివారం పిల్లల్ని స్కూల్కు రమ్మన్నారు. సెలవు ఇచ్చి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. నా ఇద్దరు పిల్లలు గల్లంతయ్యేవారు కాదు. నా ముగ్గురు కుమార్తెల్లో అనూష, సుచిత్రలకు చదువంటే ప్రాణం. ఇద్దరు పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఏం చేయాలో పాలుపోవడంలేదు. – గల్లంతైన అనూష, సుచిత్ర తండ్రి పోలిశెట్టి మాచర్రావు పరిమితికి మించి జనాన్ని ఎక్కించుకున్నారు.. పడవలో పరిమితికి మించి జనాన్ని ఎక్కించుకున్నందువల్లే ప్రమాదం జరిగింది. ఇదే పరిస్థితి రోజూ ఉంటుంది. మనుషులనే కాకుండా వాహనాలను, గేదెలను పడవలో ఎక్కిస్తారు. నది ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు కూడా కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. ప్రమాదంలో నా మరదలు గెల్లా నాగమణి, అన్నయ్య కూతురు రమ్య గల్లంతయ్యారు. రమ్య పాఠశాలకు, మరదలు నాగమణి కిరాణా సరుకులు కోసం వెళ్లారు. – బాధితుడు కొండేపూడి చంటిబాబు మృత్యుంజయులు.. పశువుల్లంక మొండి రేవులో జరిగిన పడవ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యుంజయులుగా బయటపడ్డారు. కె.గంగవరం మండలం శేరిల్లంకకు చెందిన గుర్రాల ఫణికుమార్ భార్య సుగుణ, రెండేళ్ల కుమార్తె సిరితో కలిసి స్వగ్రామానికి వెళ్లేందుకు పడవ ఎక్కారు. పడవ ఒక్కసారిగా ప్రమాదానికి గురికావడంతో సుగుణ తాను వేసుకున్న జర్కిన్లో రెండేళ్ల పిల్లను పెట్టుకుని ప్రాణాపాయ స్థితిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంది. అయితే సిరి తీవ్ర అస్వస్థతకు గురయింది. చిన్నారిని ముమ్మిడివరం ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స అనంతరం కోలుకుంటోంది. -
కేంద్రం నిధులతో టీఆర్ఎస్ సోకులు
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ఇస్తున్న నిధులను దారి మళ్లించి రాష్ట్ర ప్రభుత్వం సోకులు చేసుకుంటోందని బీజేపీ శాసన సభాపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన దుర్వినియోగం, కేంద్రానికి పేరు రాకుండా చేసిన కుట్రలపై ప్రజల్లో ఎండగట్టాలని సోమవారం నిర్ణయించింది. బీజేపీ శాసన సభాపక్ష నేత జి.కిషన్రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలోని కార్యాలయంలో సోమవారం సమావేశం జరిగింది. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ ప్రభాకర్, రాజాసింగ్, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్రావు ఈ సమావేశానికి హాజరయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జూలై 13న రాష్ట్ర పర్యటనకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. హైదరాబాద్లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, జన చైతన్యయాత్ర, పరిపూర్ణానందస్వామి అరెస్టుపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్సీ ఎన్.రామచందర్రావు మాట్లాడుతూ.. ఈ నెల 13న అమిత్ షా హైదరాబాద్లో పర్యటించి, పార్టీ విస్తరణ వ్యూహాలను పరిశీలిస్తారని వెల్లడించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, బలోపేతం గురించి సూచనలు చేస్తారని వివరించారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్కు చేరుకుని, సాయంత్రం దాకా పార్టీ బలోపేతంపైనే చర్చిస్తారని చెప్పారు. రాష్ట్రంలోని 8 వేల మంది శక్తి ప్రముఖ్లతో ఉదయమే అమిత్షా సమావేశం ఉంటుందని వెల్లడించారు. పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల్లో పనిచేస్తున్న పార్టీ పూర్తికాలపు కార్యకర్తల (హోల్టైమర్లు)తో ఆ తర్వాత సమావేశం ఉంటుందన్నారు. రాష్ట్ర పార్టీ కోర్కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులతో సాయంత్రం సమావేశమవుతారని వెల్లడించారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం వంటి కీలక అంశాలపై షా చర్చిస్తారని చెప్పారు. హైదరాబాద్లో పార్టీ బలోపేతానికి కొందరు ప్రముఖులు, ముఖ్యులతో సమావేశమవుతారని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను రాష్ట్ర ప్రజలకు తెలియకుండా, టీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నిధుల దుర్వినియోగాన్ని ప్రజల్లో ఎండగడతామని పేర్కొన్నారు. కేంద్ర పథకాలు, విడుదల చేసిన నిధుల వివరాలను వివరిస్తామన్నారు. రాష్ట్రంలో 14 రోజుల పాటు జరిగిన జన చైతన్యయాత్రపై ఈ సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. ఈ యాత్రతో బీజేపీకి ఊపు వచ్చిందని, పార్టీ శ్రేణల్లోనూ ఉత్సాహం వచ్చిందని సమావేశంలో అభిప్రాయపడినట్లు చెప్పారు. వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరడానికి చాలా మంది సిద్దంగా ఉన్నారని చెప్పారు. దీనిపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదన్నారు. పరిపూర్ణానంద స్వామిని నిర్బంధించడం అప్రజాస్వామికమని ఖండించారు. స్వామి గృహనిర్బంధం అప్రజాస్వామికం: లక్ష్మణ్ శాంతియుతంగా పాదయాత్ర చేస్తానని ప్రకటించిన పరిపూర్ణానంద స్వామిని గృహనిర్బంధం చేయడం అప్రజాస్వామికమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఖండించారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్రలు, నిరసన ప్రదర్శనలు చేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. హిందువులపై, హిందూమతంపై, హిందువులు ఆరాధించే దేవుళ్లపై కొందరు చేస్తున్న అహంకారంగా కించపరిచే వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకోవడం సరైంది కాదని మండిపడ్డారు. -
నా స్థలంలో అన్న క్యాంటీన్ ఎలా పెడతారు?
పెద్దాపురం: ప్రైవేట్ స్థలంలో ‘అన్న క్యాంటీన్’ ఎలా ఏర్పాటు చేస్తారంటూ అధికారులను ఓ మహిళ నిలదీసింది. పట్టణంలో ఇంకెక్కడ స్థలం లేదా అని ప్రశ్నించింది. పేదల స్థలమే కావాల్సి వచ్చిందా అని బోరున విలపించింది. అయినా కూడా అధికారులు పట్టించుకోకుండా ఆమె స్థలంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడంతో ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఈ ఘటన ఆదివారం తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో జరిగింది. పట్టణానికి చెందిన జాలా కన్య మరియ, జాలా పుష్పల తండ్రికి ప్రభుత్వం 1983లో స్థానిక మున్సిపల్ సెంటర్లో రెండున్నర సెంట్లు ఇచ్చింది. అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామంటూ మున్సిపల్ అధికారులు ఆదివారం ఆ స్థలం వద్దకు వచ్చారు. దీంతో మరియ అధికారులను అడ్డుకుంది. అయినా కూడా వారు వినకపోవడంతో పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంతలో స్థానికులు, ఆమెను అడ్డకున్నారు. విషయం తెలుసుకున్న పెద్దాపురం ఎస్ఐ కృష్ణ భగవాన్ ఘటనాస్థలికి చేరుకుని ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు నిర్మించుకోకపోతే.. ఆ స్థలాన్ని ప్రభుత్వ అవసరాలకు వాడుకోవచ్చని అధికారులు చెప్పారు. అందుకే ఆ స్థలంలో క్యాంటీన్ ఏర్పాటు చేయాలనుకున్నామన్నారు. కాగా, రోడ్డు విస్తరణ వల్ల ఇంటి నిర్మాణం ఆలస్యమైందని బాధితురాలు చెప్పింది. విస్తరణలో పోగా మిగిలిన స్థలంలో ఇల్లు నిర్మించుకుందామనుకుంటే.. ప్రభుత్వమిలా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామనడం ఎంత వరకు సమంజసమని బాధితురాలి సోదరి కరుణ ఆవేదన వ్యక్తం చేసింది. పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, టీపీవో భాస్కరరావులు ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు. -
దళిత తేజం ఇదేనా..?
ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు.. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్య దళితులు చదువుకోరు.. శుభ్రంగా ఉండరు.. మంత్రి ఆదినారాయణరెడ్డి ఆగస్టు 15న అన్న మాటలు మాదిగ (నా..కొ..)లు అస్సలు చదవరు.. బాగుపడరు.. పరీక్ష రాసి వస్తున్న ఓ దళిత విద్యార్థిని ఉద్దేశించి మే 10న ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య చేసిన వివాదాస్పద కామెంట్.. సీఎంకి, ఆయన సహచరులకు దళితులపై ఉన్న ప్రేమకు ఈ వ్యాఖ్యలే నిదర్శనాలు.. - పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో దళితులపై సాంఘిక బహిష్కరణ విధించారు.. - విశాఖ జిల్లా జర్రిపోతులపాలెంలో దళిత మహిళ ఇల్లు ఖాళీచేయలేదన్న సాకుతో అందరూ చూస్తుండగా వీధుల్లో దుస్తులు ఊడిపోయేలా ఈడ్చి ఈడ్చి కొట్టారు. - కర్నూలు జిల్లాలోని ఒక ఊరిలో శ్మశానంలో గొయ్యి తవ్వలేదని ఎస్సీ కాలనీలో రోడ్లు ధ్వంసం చేసి, కుళాయిలు పీకేశారు..రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇవి మచ్చుతునకలు..కానీ దళితులపై తమకు అపారమైన ప్రేమ ఉందని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి తహతహలాడుతున్నారు. నెల్లూరు జిల్లాలో ‘దళిత తేజం’ పేరుతో రాష్ట్రప్రభుత్వం శనివారం ఓ కార్యక్రమం నిర్వహిస్తోంది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతీ దళిత వాడలో దళితుల్లో చైతన్యం రగిలించేందుకు, వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను వివరించేందుకు ఉద్దేశించిన ‘దళిత తేజం’ కార్యక్రమం శనివారం నెల్లూరులో జరగనుంది. సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీలపై దాడులు ఎక్కువయ్యాయని అంబేడ్కర్ను సైతం అవమానపర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఎంతోమంది దళిత ఉద్యోగులు వేదనకు గురవుతున్నారని ఆ వర్గాలకు చెందిన నేతలు మండిపడుతున్నారు. ఇందుకు నాలుగేళ్లలో చోటుచేసుకున్న అనేక సంఘటనలను సైతం ఉదహరిస్తున్నారు. - పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో దళితులను సాంఘిక బహిష్కరణ చేశారు. - శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో దళిత యువకుడిని ఎస్సై కొట్టి హింసించారు. - విజయనగరం జిల్లా ముదువలసలో జన్మభూమి సభలో సమర్పించేందుకు అర్జీలు రాసుకుంటున్న దళితులను టీడీపీ వారు కొట్టారు. ఇందులో ఎమ్మెల్యే నారాయణస్వామి కుమారుడు నిందితుడు. - అలాగే, విశాఖ జిల్లా జర్రిపోతులపాలెంలో ఒక దళిత మహిళ ఇల్లు ఖాళీచేయలేదని తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు అందరూ చూస్తుండగా వీధుల్లో దుస్తులు ఊడిపోయాలా ఈడ్చి ఈడ్చి కొట్టారు. - కృష్ణాజిల్లా బందరులో ఈనెల 9, 10, 11 తేదీల్లో ప్రభుత్వం నిర్వహించిన బీచ్ ఫెస్టివల్లో ఆటలు ఆడుతున్న మల్లేశం గ్రామానికి చెందిన కొందరు దళిత యువకులను పోలీసులు నాలుగు రోజులు స్టేషన్లు మార్చి మార్చి మరీ కొట్టారు. - ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరపల్లిలో 20 దళిత కుటుంబాలకు చెందిన భూమిని నీరు–చెట్టు కార్యక్రమం కింద స్వాధీనం చేసుకుని రాత్రికి రాత్రి మట్టి తోలారు. టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు బలవంతంగా ఈ పనిచేయించినట్లు దళితులు కేసు పెట్టారు. - చిత్తూరు జిల్లా మునగపాలెం ఎస్సీ కాలనీలో బైక్ హారన్ కొట్టారని ఒక యువకుడిని గ్రామంలోని కొందరు కొట్టగా కేసు పెట్టారు. దీంతో దళితవాడను సాంఘిక బహిష్కరణకు గురిచేశారు. - అనంతపురం జిల్లా పరిగి మండలం వన్నంపల్లి గ్రామంలో అన్ని కులాల వారు చందాలు వేసుకుని గుడి నిర్మించారు. గుడిలో విగ్రహ ప్రతిష్టాపనకు దళితులు వచ్చేందుకు వీల్లేదని అడ్డుకోవడంతో ఎదురుతిరిగిన దళితులను సాంఘిక బíßహిష్కరణకు గురిచేశారు. - కర్నూలు జిల్లా నక్కలదిన్నె శ్మశానంలో గొయ్యి తవ్వేందుకు దళితులు రాలేదని ఎస్సీ కాలనీలో రోడ్లు ధ్వంసం చేసి, తాగునీటి కుళాయిలు పీకేశారు. ఈ సంఘటనలన్నీ ఎస్సీ, ఎస్టీ కమిషన్లో నమోదయ్యాయి. అలాగే, నాలుగేళ్లుగా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరగకపోవడం గమనార్హం. స్మృతివనం పేరుతో అంబేడ్కర్కు అవమానం అమరావతిలో 25 ఎకరాల స్థలంలో అంబేడ్కర్ స్మృతివనం నిర్మిస్తున్నామని, అక్కడ 125 అడుగుల ఎత్తులో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తున్నామని సీఎం ఘనంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇందుకు గతేడాది ఏప్రిల్ 14న భూమి పూజ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 14న శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటివరకు ఒక్క ఇటుకా పడలేదు. అలాగే, రెండేళ్లుగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆదేశాలు గాలిలో కలిసిపోయాయి. గుంటూరుకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి రవి ఎంతోకాలం కోర్టుల చుట్టూ తిరిగి ప్రమోషన్ రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. సబ్ప్లాన్ నిధులు పక్కదోవ సబ్ప్లాన్ నిధులు పక్కదోవ పడుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయానికి నిధులు అవసరమైనప్పుడల్లా సబ్ప్లాన్ నుంచి వినియోగిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు ముఖ్యమంత్రి విమానంలో వెళ్ళిన ఖర్చులు కూడా సబ్ప్లాన్ నిధులనే వెచ్చించడం విశేషం. ఇదిలా ఉంటే.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఏర్పాటుచేసిన సంక్షేమ హాస్టళ్లను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఎంతోమంది పేద దళిత విద్యార్థులు విద్యకు దూరమయ్యారు. అలాగే, రెండువేల వరకు ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నప్పటికీ నాలుగేళ్లుగా అవి భర్తీకి నోచుకోలేదు. ఈ నేపథ్యంలో దళిత తేజం పేరుతో శనివారం నెల్లూరు జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుండడంపై ఆయా వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పలుచోట్ల దళితులపై జరిగిన దాడుల్లో నిందితులను అరెస్టుచేయని టీడీపీ సర్కార్ శనివారం నెల్లూరులో ‘దళిత తేజం’ నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దళిత తేజం సిగ్గుచేటు దళితులపై ఇటీవల జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలు, సాంఘిక బహిష్కరణలు చేస్తున్నా ప్రధాన నిందితులను అరెస్టు చేయని టీడీపీ ప్రభుత్వం దళిత తేజం నిర్వహించడం సిగ్గుచేటు. – ఆండ్ర మాల్యాద్రి,ప్రధాన కార్యదర్శి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం దళిత నిస్తేజం ఏంచేశారని దళిత తేజం నిర్వహిస్తున్నారు? ఎన్ఆర్ఈజీఎస్, 14వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చుచేసి రోడ్లు, డ్రైనేజీ కాలువలు అక్కడక్కడ కట్టిస్తే దళిత తేజం అవుతుందా? ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని సుమారు ఆరువేల స్కూళ్లు మూసివేశారు. విద్య, వైద్యం నిర్వీర్యమైంది. దళితులు ఉండే ప్రాంతాల్లో ఉచిత వైద్యం లేదు. – ఆదిమూలం సురేష్, ఎమ్మెల్యే, సంతనూతపాడు, ప్రకాశం జిల్లా. గాడాంధకారమే.. రాష్ట్రంలో దళిత తేజం లేదు, దళిత గాడాంధకారమే ఉంది. దళితుల్లో ఒక్కరికి కూడా ఎకరా పొలం ఇవ్వలేదు. ఇళ్లు, ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు. కృష్ణానది ఒడ్డున ఉన్న అనేకమంది దళితులను అక్కడి నుంచి ఖాళీ చేయించి రోడ్డున పడేశారు. టీడీపీకి దళితులు అందమైన సమాధి కడతారు. – దారా సాంబయ్య, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు -
నాగంకు గన్మెన్ల ఉపసంహరణ
సాక్షి, నాగర్కర్నూల్: మాజీ మంత్రి, ఇటీవల కాంగ్రెస్లో చేరిన నాగం జనార్దన్రెడ్డికి ఉన్న ఇద్దరు గన్మెన్లను రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉపసంహరించుకుంది. దీనికి సంబంధించి నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ సన్ప్రీత్సింగ్ ఆదేశాలు జారీ చేయడంతో గన్మెన్లు విధులకు హాజరు కాలేదు. విషయం తెలుసుకున్న నాగం జనార్దన్రెడ్డి, ఎస్పీ సన్ప్రీత్సింగ్తో మాట్లాడగా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారని తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వంపై గతంలో కోర్టుల్లో పలు కేసులు వేసిన నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలంటూ నాగం పోలీస్ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. కాగా, నాగంకు ప్రాణహాని ఉన్నట్లు ఎలాంటి సంకేతాలు లేవని, నిఘా సంస్థల నివేదిక ఆధారంగానే గన్మెన్లను ఉపసంహరించామని పోలీస్ శాఖకు చెందిన ఓ అధికారి వివరించారు. అవసరమైతే పెయిడ్ గన్మెన్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. తనకు ప్రజల నుంచి వస్తున్న మద్దతును చూసి ఓర్వలేకనే రాష్ట్ర ప్రభుత్వం గన్మెన్లను తొలగించిందని నాగం ఆరోపించారు. -
చిరుద్యోగులపై పిడుగుపాటు
సాక్షి, అమరావతి: వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ సాక్షర భారత్ పథకంలో భాగంగా రాష్ట్రంలోని ‘ఏపీ స్టేట్ లిటరసీ మిషన్ అథారిటీ’ పరిధిలో పని చేస్తున్న 20,503 మంది జిల్లా, మండల, గ్రామ సమన్వయకర్తల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది. వారిని విధుల నుంచి తొలగిం చింది. ఆ స్థానంలో అధికార పార్టీ కార్యకర్తలను నియమించి, వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం పొందేలా వ్యూహం రచించింది. సాక్షర భారత్ ఉద్యోగులం దరినీ తొలగించాలని వయోజన విద్యావిభాగం డైరెక్టర్ను ఆదేశిస్తూ జూన్ 1న రాష్ట్ర ప్రభుత్వం మెమో (నం.574896/ ప్రోగ్రాం–3/2017) జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని సమన్వయకర్తలను విధుల నుంచి తొలగిస్తున్నట్లు వయోజన విద్యా విభాగం డైరక్టర్ ఎం.అమ్మాజీరావు జూన్ 14న సర్క్యులర్ మెమో (నెంబర్ 600) విడుదల చేశారు. నిధులు కేంద్ర ప్రభుత్వానివే... సాక్షర భారత్ సమన్వయకర్తలు 15 ఏళ్లుగా తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్నారు. గ్రామ సమన్వయకర్తలకు నెలకు రూ.2,000, మండల, జిల్లా సమన్వయకర్తలకు రూ.6,000 చొప్పున గౌరవ వేతనం అందుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల నుంచే రాష్ట్ర ప్రభుత్వం ఈ వేతనాలు చెల్లిస్తోంది. ఇన్నాళ్లూ అరకొర వేతనంతో జీవనం సాగించిన 20,503 మంది సమన్వయకర్తలపై రాష్ట్ర సర్కారు వేటు వేసింది. తొలగింపునకు గురైన సమన్వయకర్తల్లో 15 నుంచి 20 ఏళ్లకుపైగా సేవలందిస్తున్నవారు ఉన్నారు. తమకొచ్చే వేతనం అత్యంత స్వల్పమే అయినా ఏనాటికైనా పెరుగుతుందని ఆశగా ఎదురు చూస్తున్న వారిని ప్రభుత్వం ఒక్క కలం పోటుతో తొలగించింది. ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు తప్ప మిగిలిన 10 జిల్లాల్లో సాక్షర భారత్ కార్యక్రమం అమలవుతోంది. నెలకు రూ.4.5 కోట్లు ఇవ్వలేరా? రాష్ట్రవ్యాప్తంగా 9,979 సాక్షర భారత్ కేంద్రాల్లో పనిచేస్తున్న 19,959 గ్రామ, 504 మంది మండల, 40 మంది జిల్లా సమన్వయకర్తలను తొలగించారు. విచిత్రం ఏమిటంటే ఈ ఉద్యోగులను మార్చి 31 నుంచి తొలగించేలా రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1న ఆదేశాలు ఇవ్వగా, జూన్ 14న వయోజన విద్యా విభాగం డైరక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 31 నుంచి తొలగించినట్లు ఉత్తర్వులు ఇచ్చినా ఈ మూడు నెలల కాలంలో వీరితో ప్రభుత్వం పనులు చేయించుకుంది. వీరికి గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు రూ.25 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. మార్చి 31 నుంచి విధుల నుంచి తొలగిస్తున్నట్లు మూడు రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏప్రిల్, మే నెలలతోపాటు జూన్లో పనిచేసిన రోజులకు వేతనాన్ని కోల్పోనున్నారు. మొత్తం బకాయిలు కలిపితే రూ.33 కోట్లు అవుతుంది. ఈ బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం అకస్మాత్తుగా రోడ్డున పడేసింది. వేతనాల కోసం అడిగితే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేదని, తామేం చేయలేమని వయోజన విద్యా విభాగం అధికారులు చేతులెత్తేస్తున్నారు. కేంద్రం 2017 సెప్టెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి నిధులిచ్చింది. ఆయా నిధుల ఖర్చుకు సంబంధించిన వినియోగపత్రాలను(యూసీ)లను రాష్ట్రం సమర్పించలేదు. దీంతో కేంద్రం నుంచి నిధులు రావడం ఆగిపోయింది. సాక్షర భారత్ ఉద్యోగులందరికీ ఇచ్చే వేతనం నెలకు రూ.4.5 కోట్లు మాత్రమే. ప్రత్యేక విమానాల్లో విదేశీ యాత్రల కోసం రూ.వందల కోట్లు ఖర్చు పెడుతున్న పాలకులు తమకు అరకొర వేతనాలు సైతం ఇవ్వకుండా, విధుల నుంచి తొలగించడం ఏమిటని సాక్షర భారత్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక టీడీపీ కార్యకర్తలే సమన్వయకర్తలు సాక్షర భారత్ను కేంద్రం నిధులు ఇవ్వకపోవడం వల్లే సమన్వయకర్తలను తొలగించామని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం యూసీలు ఇవ్వనందువల్లే కేంద్రం నుంచి నిధులు రావడం లేదు. సాక్షర భారత్ అమలు కోసం కేంద్రం ఇచ్చిన సొమ్మును రాష్ట్ర సర్కారు దారి మళ్లించింది. ఈ సంగతి బయటపడుతుందనే భయంతోనే యూసీలు ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో సాక్షర భారత్ కార్యక్రమం యథాతథంగా కొనసాగుతోంది. కేంద్రం నిధులు విడుదల చేయకున్నా అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలే నిధులు సమకూరుస్తూ సమన్వయకర్తలకు వేతనాలు చెల్లిస్తున్నాయి. కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8 నెలలుగా జీతాలు ఇవ్వకుండా మొండిచేయి చూపింది. ఏకంగా విధుల నుంచి తొలగించింది. ఈ వ్యవహారంలో టీడీపీ ప్రభుత్వ ఆంతర్యం మరోలా ఉన్నట్లు తెలుస్తోంది. తొలగింపునకు గురైన సాక్షర భారత్ సమన్వయకర్తల స్థానంలో అధికార పార్టీ కార్యకర్తలను నియమించి, వారికి ప్రభుత్వ ఖజానా నుంచి ప్రతినెల వేతనాలు చెల్లించేలా తెరవెనుక పావులు కదుపుతున్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేసేందుకు, రానున్న ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేసేందుకు వీరిని ఉపయోగించుకోనున్నట్లు తెలిసింది. అర్ధాంతరంగా తొలగిస్తే ఎలా బతకాలి? ‘‘సాక్షర భారత్ సమన్వయకర్తలతో ప్రభుత్వం చాలా ఏళ్లుగా పని చేయించుకుంటోంది. ఇప్పుడు అర్ధాంతరంగా విధుల నుంచి తొలగిస్తే వారి కుటుంబాలు ఎలా జీవించాలి? ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. తొలగింపు ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఉద్యోగులకు వేతన బకాయిలు చెల్లించాలి. ఎప్పటిలాగే విధుల్లో కొనసాగించాలి’’ – విష్ణువర్దన్రెడ్డి, రాష్ట్ర సాక్షర భారత్ సమన్వయకర్తల సంఘం గౌరవాధ్యక్షుడు మమ్మల్ని ఆదుకోకపోతే పోరాటాలే శరణ్యం ‘‘రాష్ట్ర ప్రభుత్వం సాక్షర భారత్ సమన్వయకర్తల పట్ల దారుణంగా వ్యవహరించింది. ప్రభుత్వం అప్పగించిన విధులన్నీ నిర్వర్తించాం. 15–20 ఏళ్లుగా పని చేస్తున్న వేలాది మందిని తొలగించి రోడ్డున పడేయడం అన్యాయం. తొలగింపు ఉత్తర్వులను ఉపసంహరించుకొని, బకాయిలు చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలి. లేకపోతే ఆందోళనలు, పోరాటాలకు దిగడం తప్ప మరో మార్గం లేదు’’ – సిద్ధారెడ్డి, అధ్యక్షుడు, రాష్ట్ర సాక్షర భారత్ సమన్వయకర్తల సంఘం అకస్మాత్తుగా తొలగించడం అన్యాయం ‘‘ప్రభుత్వం మాకు చెల్లించే వేతనాలు స్వల్పమే అయినా దీన్నే నమ్ముకొని చిత్తశుద్ధితో పని చేస్తున్నాం. సాక్షరతా కార్యక్రమాలతోపాటు ప్రభుత్వం అప్పగించే ఇతర విధులనూ నిర్వర్తిస్తున్నాం. గత ఏడాది అక్టోబర్ నుంచి వేతనాలు ఇవ్వకపోయినా పని చేస్తున్నాం. ఇప్పుడు అకస్మాత్తుగా తొలగిస్తున్నామని చెప్పడం అన్యాయం. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మమ్మల్ని యథావిధిగా విధుల్లో కొనసాగించాలి. వేతన బకాయిలను వెంటనే చెల్లించాలి’’ – పీఎస్సార్ శాస్త్రి, రాష్ట్ర సాక్షర భారత్ సమన్వయకర్తల సంఘం కోశాధికారి గ్రామ స్థాయి సమన్వయకర్తలు 19,959 మండల స్థాయి సమన్వయకర్తలు 504 జిల్లా స్థాయి సమన్వయకర్తలు 40 నెలకు జీతాల ఖర్చు 4.5 కోట్లు -
యోధుడికి ‘ఆత్మకథ’ బహుమతి
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో రజాకర్లకు వ్యతిరేకంగా బందూక్ పట్టుకుని పోరాడిన యోధుడు మా తాతయ్య. ఆయన రాసిన ఆత్మకథను తన 88వ పుట్టిన రోజున (జూన్ 17) ఆవిష్కరించి తాతయ్యను సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాం. మీరు ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారా’’అంటూ మంత్రి కె.తారకరామారావుకు 17 ఏళ్ల నిధిరెడ్డి మే 4న ట్విట్టర్ ద్వారా సందేశం పంపింది. సరిగ్గా 2 నిమిషాల అనంతరం కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ‘‘తప్పకుండా చేద్దాం. అలాంటి పోరాట యోధుడి కోసం నేను మీ ఇంటికి వస్తాను’’అని బదులిచ్చారు. వివరాలు పంపాలంటూ కొద్ది నిమిషాల తర్వా త కేటీఆర్ ఆఫీసు నుంచి మెసేజ్ వచ్చింది. కట్ చేస్తే..: ఆదివారం హైదరాబాద్ హబ్సిగూడలోని స్ట్రీట్ నం.7లో ఉంటున్న తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మిట్ట యాదవరెడ్డి ఇంటికి కేటీఆర్ స్వయంగా వచ్చారు. నడవలేని స్థితిలో మంచంపై ఉన్న యాదవరెడ్డిని ఆప్యాయంగా పలకరించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జ్ఞాపికను అందించారు. కుటుంబీకుల సమక్షంలో యాదవరెడ్డి కేక్ కట్ చేయగా, కేటీఆర్ కేక్ తినిపించారు. గతంలో ఆయన చేసిన కార్యక్రమా లను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆయన రచించిన ‘నా జ్ఞాపకాలు’ ఆత్మకథను కేటీఆర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రి జగదీశ్రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. భావి తరాలకు స్ఫూర్తి: కేటీఆర్ మిట్ట యాదవ రెడ్డి మాట్లాడుతూ.. అనుక్షణం రాష్ట్రం కోసమే తపించానని అన్నారు. కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం సిద్ధించడం, అభివృద్ధి దిశగా నడవడంపై సంతోషం వ్యక్తం చేశారు. కేటీఆర్ కూడా పరిశ్రమలు, ఐటీ రంగంలో అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, యాదవరెడ్డి వంటి యోధుల పోరాటమే భావి తరాల కు స్ఫూర్తి అన్నారు. చరిత్రను చూసిన యాద వరెడ్డి వంటి పెద్దల ప్రశంసలు తమను మరిం త స్ఫూర్తితో ముందుకు నడుపుతాయన్నారు. మిట్ట యాదవరెడ్డి నేపథ్యం: జనగామ, సూర్యాపేట తాలూకాల సంగమ ప్రదేశం వెలిశాల గ్రామంలో జన్మించిన యాదవరెడ్డి 1945–47లో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. 1947 ఆగస్టులో జాతీయ జెండా ఎగురవేసి, నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నందుకు అరెస్టయ్యారు. జైలు నుంచి విడుదలై తెలంగాణ సాయుధ రైతాంగ పోరా టంలో చేరి రజాకార్లకు వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరులో చేరారు. జనవరి 1948లో తాటికొండ గ్రామం వద్ద రజాకార్లు, నైజాం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో పాల్గొన్నారు. సాయు ధ పోలీసులు, రజాకర్లు మూకుమ్మడిగా దాడి చేయడం.. యాదవరెడ్డి దళం వద్ద మందుగుండు అయిపోవడంతో అరెస్ట్ అయ్యారు. చర్మం వలిచి, సూదులతో గుచ్చినా దళం ఆచూకీ కానీ, తోటీ కామ్రేడ్ల వివరాలు కానీ చెప్పని ధీశాలి ఆయన. 1951లో జైలు నుంచి విడుదలయ్యారు. ఆర్థికశాస్త్రంలో ఎంఏ, పీహె చ్డీ పూర్తి చేసి ఓయూలో అధ్యాపకుడిగా పని చేశారు. సోషల్ౖ సెన్స్ విభాగానికి డీన్గా రిటైర్ అయ్యి హబ్సిగూడలో నివాసముంటున్నారు. -
పార్టీ పనులకు ప్రభుత్వ ఉద్యోగాలు
సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలన్న ఏకైక లక్ష్యంతో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. సహజ న్యాయ సూత్రాలను తుంగలో తొక్కుతోంది. జన్మభూమి కమిటీల పేరుతో ఇప్పటికే స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తమకు అనుకూలంగా ఉండే డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలను ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించుకుని, నిస్సిగ్గుగా పార్టీ పనులకు వాడుకుంటోంది. ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లిస్తామంటూ మహిళలను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకోవడం బహూశా ఎక్కడా ఉండదేమో! టీడీపీ ప్రచారానికి, అక్రమ మార్గాల్లో ఎన్నికల్లో గెలవడానికి 4.46 లక్షల మంది డ్వాక్రా మహిళలను ప్రభుత్వం సాధికార మిత్రలుగా నియమించింది. వీరు పూర్తిస్థాయిలో అధికార పార్టీ ఏజెంట్లుగా పనిచేయనున్నారు. సాధికార మిత్రల శిక్షణకు, ప్రతినెలా వీరితో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిం చేందుకు అయ్యే ఖర్చులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల నుంచే చెల్లిస్తుండడం గమనార్హం. టీడీపీకి ఓట్లు వేయించాలట! ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయడమే సాధికార మిత్రల విధి అని పైకి చెబుతున్నా.. అసలు పని మాత్రం వేరే ఉంది. ముఖ్యమంత్రి అప్పగించిన విధి ఏమిటంటే.. సాధికార మిత్రలు తమకు కేటాయించిన 35 కుటుంబాల సమగ్ర సమాచారాన్ని స్థానిక టీడీపీ నేతలకు చేరవేయాలి. ఆయా కుటుంబాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలి. ప్రభుత్వ ఘనకార్యాలను వివరిస్తూనే ప్రతిపక్షాల గురించి వీలైనంత మేర దుష్ప్రచారం సాగించాలి. వచ్చే ఎన్నికల్లో టీడీపీకే ఓట్లు వేసేలా జనాన్ని సన్నద్ధం చేయాలి. అంతేకాకుండా సాధికార మిత్రల బ్యాంకు ఖాతాల వివరాలను ప్రభుత్వం సేకరించినట్లు తెలిసింది. దీని వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో వారి బ్యాంకు ఖాతాలకు భారీ మొత్తంలో నగదును బదిలీ చేసి, ఆ సొమ్మంతా సాధికార మిత్రల పరిధిలోని కుటుంబాలకు చేరేలా వ్యూహ రచన చేసినట్లు తెలుస్తోంది. సాధికార మిత్రలకు త్వరలో సర్కారు ఖజానా నుంచే వేతనాలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. 4.46 లక్షల మంది నియామకం రెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పల్స్ సర్వేలో 1,32,28,199 కుటుంబాలు తమ వివరాలను నమోదు చేసుకున్నాయి. ఆయా కుటుంబాలను 35 చొప్పున ఒక క్లస్టర్గా 4,66,624 క్లస్టర్లుగా వర్గీకరించారు. అందులో 4,46,529 క్లస్టర్లకు నాలుగు నెలల క్రితమే సాధికార మిత్రలను ప్రభుత్వం నియమించింది. సాధికార మిత్రల శిక్షణకు, ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు రాకపోకలకు దారి ఖర్చులను ప్రభుత్వం భరిస్తోంది. 4.46 లక్షల మంది సాధికార మిత్రలకు శిక్షణ ఇవ్వడానికి, ప్రతినెలా వారితో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించేందుకు అయ్యే ఖర్చులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల నుంచే చెల్లిస్తున్నారు. ఎన్ఆర్ఎల్ఎం నిధులకు ఎసరు పొదుపు, స్వయం ఉపాధి అవకాశాలపై డ్వాక్రా మహిళల్లో అవగాహన పెంచే కార్యక్రమాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా అన్ని రాష్ట్రాలకూ నిధులు అందజేస్తోంది. వీటిని ఎన్ఆర్ఎల్ఎం నిధులు అంటారు. కేంద్రం గత ఏడాది ఆంధ్రప్రదేశ్కు రూ.57 కోట్లు ఇచ్చింది. ఈ ఏడాది మరో రూ.47 కోట్లు ఇచ్చేందుకు అనుమతి తెలిపింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. సాధికార మిత్రల శిక్షణకు, జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటనలకు వారు హాజరయ్యేందుకు ఖర్చు పెడుతోంది. ముఖ్యమంత్రి నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రతినెలా 300 మంది సాధికా>ర మిత్రలను జిల్లాల నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. కేంద్రమిచ్చే ఎన్ఆర్ఎల్ఎమ్ నిధులనే ఇందుకోసం ఖర్చు చేస్తున్నారు. సాధికార మిత్రల రవాణా ఖర్చులకు కేంద్రమిచ్చే నిధులనే వాడుకోవాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అధికార పార్టీ అనుకూలురే మిత్రలు సాధికార మిత్రలుగా ఎవరిని నియమించాలి? అనేదానిపై ప్రభుత్వ పెద్దలు ముందుగానే జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ పథకాలు, చర్యలపై వ్యతిరేక భావం ఉన్న డ్వాక్రా మహిళలను నియమించవద్దని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించే వారినే సాధికార మిత్రలుగా నియమించాలని దిశానిర్దేశం చేశారు. స్థానికంగా ఉండే టీడీపీ నేతలు కూడా తమకు అనుకూలమైన వారే సాధికార మిత్రలుగా ఎంపికయ్యేలా జాగ్రత్త పడ్డారు. ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)లో ముఖ్యమంత్రి సెక్రటరీగా పనిచేస్తున్న ఓ అధికారి ఈ నెల 11వ తేదీన విజయవాడలో కొందరు సాధికార మిత్రలతో గోప్యంగా సమావేశం నిర్వహించారు. ఓట్లు కొల్లగొట్టే కుతంత్రం రాష్ట్రంలో ప్రతి కుటుంబం వివరాలను ప్రభుత్వం ఇప్పటికే పల్స్ సర్వేలో సేకరించింది. ఇప్పుడు సాధికార మిత్రల ద్వారా కుటుంబాల వారీగా సమగ్ర సమాచారం రాబడుతోంది. కులం, కుటుంబానికి ఉన్న భూమి, ఆ కుటుంబం వివిధ పథకాల కింద ప్రభుత్వం నుంచి పొందుతున్న లబ్ధి వంటి వివరాలను సేకరిస్తోంది. దీనిద్వారా సదరు కుటుంబం ఆర్థిక పరిస్థితి ఏమిటి? వారి ఓట్లు కొల్లగొట్టాలంటే ఏం చేయాలన్నది టీడీపీ నేతలకు తెలిసిపోనుంది. డ్వాక్రా మహిళలే కాబట్టి కేంద్ర నిధులు వాడుతున్నాం.. ‘‘రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను ప్రచారం చేయడానికే సాధికార మిత్రలను నియమించింది. వీరంతా డ్వాక్రా మహిళలే కాబట్టి కేంద్రమిచ్చే ఎన్ఆర్ఎల్ఎం నిధులను సాధికార మిత్రల శిక్షణ కోసం ఖర్చు పెడుతున్నాం’’ – కృష్ణమోహన్, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) సీఈవో -
దీక్ష.. ప్రయాణికులకు శిక్ష
సాక్షి, అమరావతి/ సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డున బెంజిసర్కిల్ జంక్షన్లో నిర్వహించిన నవనిర్మాణ దీక్షకు జనస్పందన లేకపోయినా.. భారీ ఎత్తున చేసిన ఏర్పాట్లతో ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. జాతీయ రహదారిపై భారీ టెంట్లు వేసి ఈ దీక్షా సభ నిర్వహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ రహదారిపై దూరప్రాంతాలకు కార్లు, బస్సుల్లో వెళ్లే వారు నరకయాతన అనుభవించారు. ఈ సభ కోసం శుక్రవారం రాత్రి నుంచే విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తమిళనాడు, కోల్కతా, హైదరాబాద్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ను నగరానికి 50 కిలోమీటర్లే అవతలే దారిమళ్లించారు. ఆంక్షల కారణంగా నగరంలోని ప్రజలు చిన్నచిన్న మార్గాల్లో చుట్టుతిరిగి వెళ్లాల్సి వచ్చింది. దీంతో ట్రాఫిక్ మొత్తం జామ్ అయి స్థానికులు నానా ఇబ్బందులు పడ్డారు. ఇటీవలే మహానాడు పేరుతో మూడురోజులు ట్రాఫిక్ ఆంక్షలు విధించినపుడు ఇబ్బందులు పడ్డామని మళ్లీ ఇప్పుడు నవనిర్మాణ దీక్ష పేరుతో ఇబ్బంది పెట్టారని జనం వాపోయారు. కార్యక్రమం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. అయితే దీక్ష కార్యక్రమాన్ని హడావుడిగా 10.30 గంటలకే ముగించేశారు. సమావేశం ముగిసిన వెంటనే ట్రాఫిక్ను క్లియర్చేయడానికి పోలీసు సిబ్బందే బారికేడ్లు, టెంట్లు తొలగించారు. జన స్పందన కరువు.. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి పదేపదే ప్రజలకు పిలుపునిచ్చినా పార్టీ కార్యకర్తలు, అధికార యంత్రాంగం తప్ప ప్రజలెవరూ పట్టించుకోలేదు. సభా ప్రాంగణంలో వేయడానికి తీసుకొచ్చిన కుర్చీలను చాలామటుకు తీసుకొచ్చిన లారీల్లోనే ఉంచేశారు. కృష్ణా జిల్లా నలుమూలల నుంచి డ్వాక్రా మహిళలు, అంగన్వాడీలు, ఉపాధి హామీ కూలీలు, విద్యార్థులను తరలించేందుకు 350కి పైగా బస్సులు ఏర్పాటు చేశారు. కానీ ఆ బస్సుల్లో ఎక్కేందుకు గ్రామాల్లో చాలామంది నిరాకరించారు. దీంతో ఉపాధి కూలీలను బలవంతంగా బస్సులు ఎక్కించి తీసుకొచ్చారు. వచ్చిన వారిలో చాలామంది ముఖ్యమంత్రి ప్రసంగం మొదలుకాగానే లేచివెళ్లిపోవడం కనిపించింది. వారిని ఆపడానికి అధికారులు కిందామీదా పడాల్సివచ్చింది. ఈ సభకు 25 వేల మందికిపైగా జనం వస్తారని అధికారులు, టీడీపీ నాయకులు ప్రచారం చేసినా కనీస స్పందన కూడా రాలేదు. నవ నిర్మాణ దీక్షకు ప్రజల నుంచి స్పందన లేదని టీడీపీ నాయకులే చర్చించుకుంటున్నారు. జిల్లాల్లోనూ ఈ దీక్షా సభలు విఫలమయ్యాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో సమారు 18 వేల చోట్ల ఈ సభలు జరుపుతామని ప్రకటించి వాటికి నోడల్ అధికారులను నియమించినా మొక్కుబడిగా అక్కడక్కడా జరిగాయి. ఉపాధి కూలీల తరలింపు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఉపాధి కూలీలను గ్రామాల్లో ఫీల్డు అసిస్టెంట్లు పని ప్రాంతాలకు తీసుకెళ్లకుండా, సీఎం నవనిర్మాణ దీక్ష కోసం బస్సుల్లో తరలించారు. జిల్లా ఉన్నతాధికారులు మండల, గ్రామ స్థాయిలో జన సమీకరణకు అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. తెల్లవారుజామున నాలుగు గంటలకే బస్సులు గ్రామాలకు చేరాయి. ఉపాధి కూలీలను ఈ బస్సుల్లో ఎక్కించారు. కృష్ణా జిల్లా ముసునూరు, గన్నవరం మండలం నుంచి తరలించిన కూలీలు శిబిరం వద్ద కనిపించారు. వారు ఉపాధి పనులకు హాజరైనట్లు రికార్డుల్లో నమోదు చేయడం గమనార్హం. -
పాలకుల పాపాలతో రాష్ట్రానికి అశాంతి
సాక్షి, చెన్నై: అర్చక వారసత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం ఆగమ శాస్త్ర విరుద్ధమని టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పేర్కొన్నారు. హిందూ మతాన్ని కనుమరుగు చేసేందుకు భారీ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తిరుమలలో భక్తులకు శ్రీవారి సేవ దక్కకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియమ నిబంధనలు తెలియని వారిని అధికారులుగా నియమించి ఆలయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అతి పెద్ద తప్పు చేస్తోందని, ఈ పద్ధతి మారాలని హెచ్చరించారు. రమణ దీక్షితులు మంగళవారం చెన్నైలో మీడియాతో మాట్లాడారు. స్వామివారిని తాకే శాస్త్రాధికారం ఒక్క ఆగమ అర్చకులకు మాత్రమే ఉందన్నారు. స్వామివారికి కైంకర్యమే మహాపుణ్యం అన్నారు. తిరుమల ఆలయంలో రాజకీయాలు సరికాదని, పాలకుల పాపాల కారణంగా రాష్ట్రానికి, భక్తులకు అశాంతితో పాటు స్వామివారి ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇంతకాలం అవమానాలు భరించామని, ఇక ఓపిక లేదన్నారు. ప్రధాన అర్చకుడిగా ఉన్న తనకే తిరుమల శ్రీవారి ఆభరణాల వివరాలు తెలియడం లేదని రమణ దీక్షితులు పేర్కొన్నారు. ఆభరణాల వివరాలు, ఆలయ లెక్కలను బహిర్గతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్వామివారి ఆగ్రహం వల్లే పిడుగులు అధికార బలంతో ఆలయ నియమ నిబంధనలను మార్చేస్తున్నారని రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా వారు, రాజకీయ నాయకుల కోసం భజన చేస్తూ ఆలయాన్ని భ్రష్టు పట్టిస్తున్న వారూ ఉన్నారన్నారు. తోమాల సేవ లాంటి ముఖ్య సేవలకు కూడా బలం, బలగంతో వచ్చేస్తున్నారని, శాస్త్ర విరుద్ధంగా నిర్వహిస్తూ మహాపచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయంలో పెరుగుతున్న మహాపచారాల కారణంగానే పిడుగులు, ఉరుములు ప్రజలను భయకంపితులను చేస్తున్నాయన్నారు. ఇది స్వామివారి ఆగ్రహమేనని స్పష్టం చేశారు. స్వామివారి సేవకంటే తమ వారి సేవకోసం కైంకర్యాల సమయాలను తగ్గించి మమ అనిపిస్తున్నారని ఆరోపించారు. ఇది మహాపాపం అని హెచ్చరించారు. 1996 వరకు వంశపారంపర్యంగా స్వామివారి ఆభరణాలను సంరక్షిస్తూ వచ్చామని అయితే ఇప్పుడు వాటికి లెక్కలు, జవాబులు చెప్పే వాళ్లే కరువయ్యారన్నారు. అసలు స్వామివారి ఆభరణాలు అన్నీ భద్రంగా ఉన్నాయా..? అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. కట్టడాలు, ఆచారాలు కనుమరుగు చేసే యత్నం శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి సమర్పించిన ఆభరణాల పరిస్థితి ఏమిటో? అని రమణ దీక్షితులు ప్రశ్నించారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి నియమించిన ఐఏఎస్ అధికారి అప్పట్లో వెయ్యికాళ్ల మండపం కూల్చివేశారన్నారు. ఇది ఆగమశాస్త్రాలకు విరుద్ధమని పోరాడామని, ఇప్పుడు ఆ ఆనవాళ్లు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామివారి రథమండపం కోసం కూడా పోరాడినా రక్షించుకోలేక పోయామన్నారు. స్వామికి పాలకులు చేసిన మహా అపరాధాల్లో ఇది కూడా ఒకటిగా పేర్కొన్నారు. భావితరాలకు వారసత్వ నిర్మాణాలు, ఆచారాలు కనిపించకుండా ఈ ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. మాస్టర్ ప్లాన్ అనే నినాదంతో ఆలయాన్ని, ఆగమ శాస్త్రాలను కాలరాసి ఏకంగా హిందుమతాన్ని కనుమరుగు చేసే భారీ కుట్ర జరుగుతున్నట్టుందని ఆందోళన వ్యక్తంచేశారు. విస్తరణ పేరిట సర్వనాశనం విస్తరణ పేరుతో స్వామివారి ఆలయాన్ని సర్వనాశనం చేస్తున్నారని రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. పురావస్తు శాఖ ద్వారా ఆలయాన్ని పరిశీలిస్తామంటే దాన్ని కూడా రాజకీయం చేశారని పేర్కొన్నారు. టీటీడీపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరుతూ రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి , హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రాలు పంపారన్నారు. హుండీ ఆదాయం స్వామివారి సేవకోసం మాత్రమేనని, అయితే, అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు తమ ఊరిలో కల్యాణ మండపం నిర్మించుకునేందుకు రూ.10 కోట్లు అడుగుతున్నారంటే ప్రభుత్వం తీరు ఎలా ఉందో తేటతెల్లం అవుతోందన్నారు. అధికార పక్షం కనుసన్నల్లో జరుగుతున్న అవినీతి నుంచి ఆలయాన్ని, స్వామివారిని కాపాడుకోవడం కోసం తాము పోరాడుతూనే ఉంటామని ప్రకటించారు. తమతోపాటు భక్తులు కూడా స్వామివారిని కాపాడుకోవాల్సి ఉందన్నారు. రాజకీయ నాయకులు, అధికారులు తమ స్వార్థం కోసం సేవల సమయాలను కుదించి, అర్చకులను బెదిరించి పబ్బం గడుపుకుంటున్నారన్నారు. ఇలాంటి పిచ్చి చేష్టల వల్ల స్వామివారి ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. పాలకుల పాపాల కారణంగా రాష్ట్రానికి, భక్తులకు అశాంతితో పాటు స్వామివారి ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. రాజకీయ నాయకులే ఆలయాన్ని భ్రష్టు పటిస్తున్నారన్నారు. దేవాలయాలకు రాజకీయాల నుంచి విముక్తి కల్గించాల్సి ఉందన్నారు. సీబీఐతో విచారణ జరిపించాలి... స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని సైతం వ్యాపార కేంద్రంగా మారుస్తున్నారని రమణ దీక్షితులు పేర్కొన్నారు. అతి ప్రాచీన ఆలయాన్ని కేంద్ర నిపుణుల కమిటీతో పరిరక్షించాలని కోరారు. పురావస్తు, ఆగమ శాస్త్ర పండితులు, ఆభరణాల నిపుణులు, స్వామివారి సేవే పరమావధిగా భావించే సీనియర్ అధికారులను ఈ కమిటీలో నియమించాలని సూచించారు. తిరుమల ఆలయంలోకి అన్యమతస్తుల ప్రవేశ విషయాన్ని రాజకీయాల విచక్షణకే వదలి పెడుతున్నామన్నారు. చరిత్ర తెలియని పాలకమండలి అధికారుల వల్ల ఆలయ ప్రతిష్ట మంట కలుస్తోందన్నారు. తిరుమల ఆలయంలో సాగుతున్న వ్యవహారాలపై సీబీఐతో విచారణ జరిపించాలని రమణ దీక్షితులు కోరారు. -
భారీగా ఐఏఎస్ల బదిలీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. అలాగే వెయిటింగ్లో ఉన్న పలువురు ఐఏఎస్లకు పోస్టింగ్లు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్, విజయనగరం జిల్లాలకు కొత్త కలెక్టర్లు నియమితులయ్యారు. వైఎస్సార్ జిల్లా కలెక్టర్గా చేవూరు హరికిరణ్, విజయనగరం జిల్లాకలెక్టర్గా ఎం.హరి జవహర్లాల్ నియ మితులయ్యారు. ప్రస్తుతం వైఎస్సార్ జిల్లా కలెక్టర్గా ఉన్న టి.బాబూరావు నాయు డును గిరిజన కో–ఆపరేటివ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా బదిలీ చేశారు. విజయనగరం జిల్లా కలెక్టర్గా ప్రస్తుతం పనిచేస్తున్న వివేక్ యాదవ్ను ఎస్సీ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా బదిలీ చేశారు. -
ఖాకీలకు రెండో నెలా తప్పని నిరీక్షణ
సాక్షి, అమరావతి: జీతాల కోసం రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు పడిగాపులు పడాల్సిన దుస్థితి వరుసగా రెండో నెల కూడా నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపుకోసం చేపట్టిన కొత్త పద్ధతి ‘సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ(సీఎఫ్ఎంఎస్)’ కారణంగా వేతనాల చెల్లింపులో జాప్యం జరుగుతుండడంతో పోలీసులు గగ్గోలు పెడుతున్నారు. ఏప్రిల్ 1 నుంచి జీతాలు చెల్లింపును సీఎఫ్ఎంఎస్ పద్ధతిలో చేపట్టడం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా అమల్లోకి తీసుకొచ్చిన ఈ సీఎఫ్ఎంఎస్ దారుణంగా విఫలమైంది. దీంతో సకాలంలో వేతనాలందక రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులతోపాటు పోలీసులూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్లోనూ ఇదే పరిస్థితి.. గత ఏప్రిల్ నెలలోనూ ఇదేరకమైన ఇబ్బంది నెలకొంది. గత నెల ఫస్ట్ తారీఖున పోలీసుల బ్యాంకు ఖాతాలకు జమ కావాల్సిన జీతాలు పదో తేదీ వరకు రాలేదు. దీంతో నెలవారీ ఖర్చులు, అద్దెలు, అప్పుల చెల్లింపులకు పోలీసులు పడిన అవస్థలు అన్నీఇన్నీ కావు. ఇప్పుడు మే నెల ఒకటో తేదీన మరలా అదే పరిస్థితి. ఫస్ట్ తారీఖున పోలీసులందరికీ జీతాలు బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. గత నెలలో సాంకేతిక సమస్యలతో జీతాలు ఆలస్యమవగా.. వాటిని అధిగమించి ఈ నెలలోనైనా ఒకటో తేదీనే జీతాలు వస్తాయని పోలీసులు ఆశించారు. కానీ వారికి నిరాశే ఎదురైంది. మే నెల నాలుగో తేదీ వస్తున్నా జీతాలు జమ కాని పరిస్థితి. మూడో తేదీ నాటికి రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో మాత్రమే పోలీసులకు జీతాలు జమవగా, చాలా జిల్లాల్లో వేతనాలు పడలేదు. వైఎస్సార్, చిత్తూరు, కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో జీతాలు ఇంకా బ్యాంకు ఖాతాల్లో పడలేదు. ఈ మేరకు ఆయా జిల్లాల ఎస్పీలకు, రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి సమాచారమందింది. దీనిపై పోలీసుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో.. వేతనాలను జమ చేయడంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించడంపై అధికారులు దృష్టి పెట్టారు. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో శుక్రవారంలోపు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో 6వ తేదీ రాత్రికి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 7వ తేదీ రాత్రి 12 గంటల్లోపు, రాయలసీమ జిల్లాల్లోని వారికి 8వ తేదీ నాటికి కచ్చితంగా జీతాలు జమ చేసేలా చర్యలు చేపట్టారు. అయితే వారి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందనేది వేచిచూడాల్సిందే. సమన్వయలోపమేనా? రాష్ట్రంలో దాదాపు 80 వేల మంది అధికారులు, సిబ్బందిని కలిగివున్న పోలీసు శాఖలో వేతనాలు సకాలంలో అందకపోవడానికి సమన్వయలోపమే కారణమని పోలీసులు చెబుతున్నారు. పోలీసు శాఖలో ప్రత్యేకంగా ఏడీజీ(స్వయం ప్రతిపత్తి) ఉన్న గ్రేహౌండ్స్, ఇంటెలిజెన్స్ విభాగాల్లో అధికారులు, సిబ్బంది మే ఒకటవ తేదీనే జీతాలు తీసుకున్నారని అంటున్నారు. అదే పోలీసు శాఖలో మూడవ తేదీ దాటుతున్నా పలు జిల్లాల్లోని వారికి జీతాలు అందకపోవడానికి కారణమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. నిజానికి ప్రతి జిల్లా నుంచి సిబ్బంది వివరాలను సేకరించి పోలీసు శాఖలోని ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్(పీఅండ్ఎల్) విభాగం ఐజీ సీఎఫ్ఎంఎస్ ద్వారా డీజీపీకి పంపాల్సి ఉంటుంది. దీనిపై డీజీపీ ఆన్లైన్లో డిజిటల్ సంతకం చేసి సీఎఫ్ఎంఎస్ ద్వారా పంపాలి. ఆపై జిల్లాలవారీగా యూజర్ నేమ్, పాస్వర్డ్లను ఇస్తారు. అయితే ఈ ప్రక్రియలో జాప్యం కారణంగా నేరుగా ట్రెజరీకి జీతాల బిల్లులు పంపి అక్కడ సీఎఫ్ఎంఎస్ విధానంలోకి మార్చి.. ఆర్బీఐ అనుమతికి పంపి, అటు తరువాత బ్యాంకుల ద్వారా వ్యక్తిగత ఖాతాలకు జమ చేయాల్సి రావడంతో జాప్యం జరుగుతోందని సిబ్బంది వాపోతున్నారు. -
నీరు-చెట్టు కింద పచ్చ నేతలకు మేత
-
‘పచ్చ’ నేతలకు మేత
ఈఫొటో చూశారా.. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం కూచివారిపల్లి వద్ద టీడీపీ నేత ఒకరు నీరు–చెట్లు పనుల్లో నిబంధనలకు విరుద్ధంగా బండరాళ్లను వినియోగించి చెక్ డ్యామ్ నిర్మించారు. దీనిపై గ్రామ ప్రజలు ఫిర్యాదు మేరకు తనిఖీలు జరిపిన అధికారులు అక్రమాలు జరిగినట్లు గుర్తించి రూ.9.6 లక్షల బిల్లు చెల్లింపును నిలిపివేశారు. ఇక్కడ ఒక్కచోటే కాదు.. నీరు–చెట్టు పనుల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో రూ.1,341.7 కోట్ల బిల్లుల చెల్లింపులను అధికారులు నిలిపివేశారు. తాజాగా ‘సైకిల్ యాత్ర’కు స్పందన లేకపోవటంతో అధికార పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు సిద్ధమైన రాష్ట్ర సర్కారు నీరు–చెట్టు బకాయిలను తక్షణమే చెల్లించాలని ఆదేశించింది. 2018–19 బడ్జెట్లో నీరు–చెట్టుకు కేటాయించిన రూ.500 కోట్లు బకాయిలకు సరిపోనందున అదనంగా రూ.900 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం ఆగమేఘాలపై నిర్ణయించారు. సీఎఫ్ఎంఎస్ (కాంప్రహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్)లో ప్రత్యేకంగా మినహాయింపులు ఇచ్చి బిల్లులు చెల్లించాలని ఆదేశించటంపై అధికార వర్గాలే విస్తుపోతున్నాయి. – సాక్షి, అమరావతి సాక్షి, అమరావతి: నారు పోసినవాడే నీరు పోస్తాడనే మాదిరిగా ‘నీరు–చెట్టు’ పథకంలో నిబంధనలు గట్టున పెట్టి టీడీపీ నేతలు, కార్యకర్తలకు రూ.1341.7 కోట్ల బిల్లులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సీఎఫ్ఎంస్ విధానం నుంచి ప్రత్యేకంగా మినహాయింపులు ఇచ్చి మరీ శనివారం నుంచి బిల్లులు మంజూరు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయటం గమనార్హం. సీఎం చంద్రబాబు పిలుపునిచ్చినా టీడీపీ నేతలు, కార్యకర్తలు నియోజకవర్గాల్లో సైకిల్ యాత్రలలో పాల్గొనకపోవడంతో ఈ ఎత్తుగడ వేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.12,722.46 కోట్ల ఇతర నిధులు ఖర్చు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక జలసంరక్షణ పేరుతో నీరు–చెట్టు పథకాన్ని చేపట్టింది. జలవనరుల శాఖ, ఉపాధిహామీ నిధులనూ దీనికి వెచ్చించింది. గత నాలుగేళ్లలో ఉపాధిహామీ నిధులు రూ.8,592.16 కోట్లు, అటవీశాఖ నిధులు రూ.132.42 కోట్లు, జలవనరుల శాఖ నుంచి రూ.3,997.88 కోట్లు వెరసి రూ.12,722.46 కోట్లను నీరు–చెట్టుకు ఖర్చు చేశారు. ఇందులో రూ.11,380.76 కోట్ల బిల్లులు చెల్లించగా మరో రూ.1341.7 కోట్ల మేర బకాయిపడ్డారు. అక్రమాలు జరిగినట్లు అధికారులు చెబుతున్నా పట్టించుకోకుండా ఇప్పుడు వీటిని చెల్లించేందుకు సర్కారు సిద్ధమైంది. నామినేషన్పై పార్టీ కార్యకర్తలకు పనులు ఏదైనా ఒక పని చేపట్టాలంటే సాంకేతిక, పరిపాలన అనుమతి అవసరం. తర్వాత టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు ఆ పనులను అప్పగిస్తారు. నీరు–చెట్టు పథకంలో మాత్రం నిబంధనలను తుంగలో తొక్కారు. రూ.పది లక్షల విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో టీడీపీ కార్యకర్తలకు కట్టబెట్టేశారు. ముందస్తుగా అనుమతి తీసుకోకుండా టీడీపీ కార్యకర్తలు పనులు ప్రారంభించేశారు. చెరువుల్లో పూడికతీత తీయకపోయినా తీసినట్లు, మరమ్మతులు చేయకున్నా చేసినట్లు చూపి బిల్లులు చేసుకున్నారు. పూడిక తీసిన మట్టిని అమ్ముకుని వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. భారీ నీటిపారుదల విభాగంలోనూ నీరు–చెట్టు కింద పనులు చేపట్టడంపై అధికారవర్గాలే నివ్వెరపోయాయి. అక్రమాలు జరిగాయని చెబుతున్నా.. నీరు–చెట్టు పనుల్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని జలవనరులు, ఆర్థికశాఖ అధికారులు తేల్చారు. 2017–18లో చేపట్టిన రూ.1,948.65 కోట్ల విలువైన పనులను తూతూ మంత్రంగా చేయటం, కొన్నిచోట్ల అసలు పనులే చేయకుండా బిల్లులు చెల్లించాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఒత్తిడి తెచ్చినా అధికారులు అంగీకరించలేదు. దీనిపై సీఎం చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో చేసేదిలేక గతేడాది రూ.922.95 కోట్ల బిల్లులు చెల్లించేశారు. మరో రూ.1025.7 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. 2018–19లో ఇప్పటివరకూ చేసిన పనులకు రూ.316 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. సైకిల్ యాత్రకు బకాయిల టానిక్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూ సైకిల్ యాత్ర చేపట్టాలన్న సీఎం చంద్రబాబు పిలుపుపట్ల టీడీపీ శ్రేణులు సానుకూలంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో నీరు–చెట్టు బకాయి బిల్లులు చెల్లిస్తే కార్యకర్తలు ఉత్సాహంగా సైకిల్ యాత్రలో పాల్గొంటారని టీడీపీ ఎమ్మెల్యేలు సూచించారు. దీంతో ఈ బిల్లులు తక్షణమే చెల్లించాలంటూ అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. మరోవైపు నీరు–చెట్టు కింద బకాయిపడిన బిల్లులను వెంటనే చెల్లించాలని ఇటీవల శాసనసభ సమావేశాల్లో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా డిమాండ్ చేశారు. నాసిరకం పనులకు బిల్లులు - కర్నూలు జిల్లాలో సుంకేశుల బ్యారేజీ మరమ్మతు పనులను రూ.8.66 కోట్లతో నీరు–చెట్టు కింద చేపట్టి ఓ టీడీపీ నేతకు అప్పగించారు. ఇదే బ్యారేజీలో రూ.31 లక్షల విలువైన పనిని మరో టీడీపీ నేతకు అప్పగించారు. బ్యారేజీకి తూతూమంత్రంగా మరమ్మతులు చేసిన టీడీపీ కార్యకర్తలకు రూ.8.91 కోట్లు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. - నంద్యాల ఉపఎన్నికల నోటిఫికేషన్కు ముందు కుందూ నదిలో రెండో కి.మీ. నుంచి 7.90 కి.మీ. వరకూ పూడికతీత పనులను రూ.8.25 కోట్లతో చేపట్టారు. ఓ టీడీపీ నేతకు వీటిని కట్టబెట్టారు. పూడిక తీత పూర్తి స్థాయిలో తీయకున్నా తీసినట్లు చూపి బిల్లులు చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. - శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే సుభద్రాపురం, నారాయణపురం, మెలియాపుట్టి ఎత్తిపోతల పథకాల పనులను రూ.21.32 కోట్లతో చేపట్టారు. వీటిని నాసిరకంగా చేసిన టీడీపీ కార్యకర్తలకు బిల్లులు చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. అత్యధిక పనులకు అనుమతులు లేవు సీఎఫ్ఎంఎస్ విధానం ప్రకారం ప్రస్తుతం బిల్లులు చెల్లించాలి. పరిపాలనా అనుమతి, సాంకేతిక అనుమతి, ఎం–బుక్ల్లో స్పష్టంగా రికార్డు చేసిన పనులకు మాత్రమే సీఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లులు చెల్లించవచ్చు. ఇందులో ఏ ఒక్క అనుమతి లేకున్నా బిల్లులు చెల్లించడానికి సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్వేర్ అనుమతించదు. నీరు–చెట్టు కింద చేపట్టిన అత్యధిక శాతం పనులకు పరిపాలన, సాంకేతిక అనుమతులు లేవు. పనులు చేయకపోవటంతో ఎం–బుక్ల్లో కూడా సక్రమంగా రికార్డు చేయలేదు. అంటే.. అక్రమాలు జరిగినట్లు స్పష్టమవుతోంది. ఇదే అంశాన్ని అధికారులు ప్రస్తావించటంతో సీఎంఎఎస్ విధానంలో నిబంధనలు సడలించి బిల్లులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
తెలుగు అమలు చేయకపోతే గుర్తింపు రద్దు!
సాక్షి, హైదరాబాద్: తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయని పాఠశాలల గుర్తింపును రద్దు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు మార్గదర్శకాల్లో నిబంధనను పొందుపరిచేందుకు కసరత్తు మొదలైంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేసేందుకు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ చట్టానికి అనుగుణంగా ప్రస్తుతం నిబంధనలను, మార్గదర్శకాల రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. తెలుగు అమలు కమిటీకి బాధ్యతలు.. ఈ మార్గదర్శకాల రూపకల్పన బాధ్యతలను గతంలోనే ఏర్పాటు చేసిన తెలుగు అమలు కమిటీకి అప్పగించింది. అలాగే 1వ తరగతి, 6వ తరగతి నుంచి ప్రవేశపెట్టనున్న తెలుగు సబ్జెక్టులో ఉండాల్సిన అంశాల రూపకల్పన బాధ్యతలను కూడా ఆ కమిటీకే కట్టబెట్టింది. వాస్తవానికి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ) ఆ బాధ్యతలను చేపట్టాల్సి ఉన్నా మొదటి నుంచి తప్పనిసరిగా తెలుగు అమలుకు సంబంధించిన వ్యవహారాలను తెలుగు వర్సిటీ ప్రొఫెసర్ సత్యనారాయణ నేతృత్వంలోని కమిటీనే చూస్తోంది. ఆ కమిటీలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ శేషుకుమారి, తెలుగు అకా డమీ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి సభ్యులుగా ఉండటంతో పుస్తకాల రూపకల్పన బాధ్యతలను దానికే అప్పగించింది. చట్టానికి అనుగుణంగానే నిబంధనలు.. చట్టానికి అనుగుణంగా నిబంధనలను రూపొందించేందుకు కమిటీ కసరత్తు చేస్తోంది. తప్పనిసరిగా తెలుగును అమలు చేయని పాఠశాలలపై ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశం చట్టంలో లేనందునా.. జరిమానాలు వంటి అంశాల జోలికి వెళ్లే అవకాశం లేదు. అయితే చట్టాలను అమలు చేసే బాధ్యత విద్యా శాఖదే. రాష్ట్రంలోని విద్యా సంస్థలు చట్టాలను అమలు చేయకపోతే ఆయా పాఠశాలల గుర్తింపును రద్దు చేసే అధికారం పాఠశాల విద్యాశాఖకు ఉంది. ఈ నేపథ్యంలో తప్పనిసరి తెలుగును అమలు చేయని పాఠశాలలపై గుర్తింపు రద్దు అస్త్రం ప్రయోగించేలా నిబంధనలను సిద్ధం చేసేందుకు చర్యలు చేపడుతోంది. అయితే రాష్ట్ర సిలబస్ స్కూళ్ల వరకు ఈ నిబంధనను పక్కాగా అమలు చేసే వీలున్నా.. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్ స్కూళ్లలో అమలు చేయకపోతే పరిస్థితి ఏంటన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఆయా స్కూళ్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) ఇస్తుంది. మరోవైపు రాష్ట్రంలోని సీబీఎస్ఈ స్కూళ్లపైనా రాష్ట్ర ప్రభుత్వానికి అజమాయిషీ ఉంటుందని ఇదివరకే సీబీఎస్ఈ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలలపై ఎన్వోసీ రద్దుతోపాటు మరిన్ని చర్యలు చేపట్టేలా నిబంధనలను రూపొందించాలని అధికారులు భావిస్తున్నారు. కమిటీ కన్వీనర్గా కిషన్ రాష్ట్రంలో 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలని మొదట్లో నిర్ణయించిన సమయంలో ఇంటర్మీడియెట్ విద్య కమిషనర్ను ప్రభుత్వం నియమించిన కమిటీకి కన్వీనర్గా వేశారు. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ను మినహాయించి పదో తరగతి వరకే తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలని ప్రభుత్వం చట్టం చేసింది. ఈ నేపథ్యంలో నిబంధనల రూపకల్పన కమిటీకి పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ను కన్వీనర్గా నియమించనుంది. ఈ మేరకు త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది. -
రాష్ట్రంలో 1,13,380 వార్డులు
సాక్షి, హైదరాబాద్: కొత్త పంచాయతీలు, వార్డుల సంఖ్యపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. పునర్విభజన ప్రకారం జిల్లాల వారీగా గ్రామపంచాయతీలు, వార్డుల సంఖ్యను పేర్కొంటూ తాజా సమాచారాన్ని శనివారం వెల్లడించింది. అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 12,751 గ్రామపంచాయతీలు, 1,13,380 వార్డులు ఉన్నాయి. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 844, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాల్లో అతి తక్కువగా 61 గ్రామపంచాయతీలు ఉన్నాయి. గతంలో ఒక గ్రామపంచాయతీలో ఒకటి, అంతకంటే ఎక్కువ రెవెన్యూ గ్రామాలు ఉండేవి. పునర్విభజన తర్వాత ఒక రెవెన్యూ గ్రామంలో ఒకటి కంటే ఎక్కువగా గ్రామాలు ఉన్నాయి. గతంలో 500 జనాభాకంటే ఎక్కువ ఉన్న ఆవాసాలు మాత్రమే గ్రామపంచాయతీలుగా ఉండేది. భౌగోళిక పరిస్థితుల ఆధారంగా గ్రామపంచాయతీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 300 కంటే తక్కువ జనాభా ఉన్న ఆవాసాలు సైతం గ్రామ పంచాయతీలుగా మారాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం 26 గ్రామ పంచాయతీలలో 300 కంటే తక్కువ జనాభా ఉంది. ఈ గ్రామాల్లో 210 నుంచి 230 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే ఈ గ్రామ పంచాయతీలలో ఐదుగురు మాత్రమే వార్డు సభ్యులు ఉంటారు. వీరిలోనే ఒకరు ఉపసర్పంచ్గా ఎన్నికవుతారు. -
టీజేఎస్ సభకు అనుమతివ్వండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఈ నెల 29న సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన ఆవిర్భావ సభకు అనుమతిచ్చే విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. దీంతో అనుమతికి పోలీసులకు దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులకు స్పష్టం చేసింది. మూడు రోజుల్లో సభకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఎల్బీనగర్ డీసీపీని ఆదేశించింది. సభలో మాట్లాడే వ్యక్తులు, పాల్గొనే వారి సంఖ్య పోలీసులకు చెప్పాలని నిర్వాహకులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామమూర్తి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీజేఎస్ ఆవిర్భావ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం సోమవారం మరోసారి విచారణకు వచ్చింది. 29న సరూర్నగర్ స్టేడియంలో ఆవిర్భావ సభ నిర్వహించుకునేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది ఎస్.శరత్కుమార్ స్పష్టం చేశారు. ఆ స్టేడియం సామర్థ్యం 5 వేలు మాత్రమేనని, పూర్తిస్థాయి తనిఖీల తర్వాతే లోపలికి వెళ్లేందుకు అనుమతిస్తామన్నారు. అయితే ఈ వాదనపై పిటిషనర్ తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి తోసిపుచ్చారు. స్టేడియం సామర్థ్యం లక్షలో ఉందన్నారు. -
ప్రతి విద్యార్థి లెక్క.. ఇక పక్కా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి సంబం ధించిన వివరాలను పక్కాగా సేకరించాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఆధార్ అను సంధానం చేపట్టినా, పూర్తిస్థాయిలో చేయలేక పోవడం, ఆధార్ను బయట పెట్టొద్దన్న నిబంధనల నేపథ్యంలో విద్యా శాఖ ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థికి ఒక యూనిక్ ఐడెంటిటీ నంబర్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థి గతేడాది ఎక్కడ చదివాడు.. ప్రస్తుతం ఎక్కడ చదువుతున్నాడు.. అన్న వివరాలను తెలుసుకు నేందుకు ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ (ఈటీసీ) విధానం అమలు చేయాలని నిర్ణయించింది. దీనికి యూనిక్ ఐడీని అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థులు ఒక స్కూల్ నుంచి మరో స్కూల్కు వెళ్లినా.. వేరే జిల్లాకు వెళ్లినా.. వేరే రాష్ట్రానికి వెళ్లినా ఆన్లైన్లో యూనిక్ ఐడీ ద్వారా గుర్తించేలా ఏర్పాట్లు చేస్తోంది. దీనిద్వారా విద్యార్థులు డ్రాపౌట్ అయ్యారు.. ఎందరి కుటుంబాలు వలస వెళ్లాయనే వివరాలను తెలుసుకునేందుకు దోహదపడుతుందని భావిస్తోంది. ఆధార్ అనుసంధానం అంతంతగానే.. రాష్ట్రంలోని 40,841 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 58,36,310 మంది విద్యార్థులు చదువుతున్నారు. 30,082 ప్రభుత్వ పాఠశాలల్లో 27,60,761 మంది, 10,759 ప్రైవేటు పాఠశాలల్లో 30,75,549 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆధార్ అనుసంధానం బాగానే జరిగినా ఎక్కువ శాతం ప్రైవేటు పాఠశాలల్లో పూర్తిగా జరగలేదు. ఆయా పాఠశాలల్లోని విద్యార్థులందరూ ఆధార్ నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న 58,36,310 మంది విద్యార్థుల్లో ఇప్పటివరకు 53,09,163 మంది విద్యార్థులకే ఆధార్ నమోదు పూర్తయింది. మరో 5 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఆధార్ లేదు. వారిని గుర్తించి ఆధార్ నమోదు చేయించేలా విద్యా శాఖ చర్యలు చేపడుతోంది. ఆధార్ నమోదు పూర్తి చేసినా, దాన్ని బయటపెట్టే అవకాశం లేకపోవడం, విద్యార్థులను ట్రాక్ చేయడానికి దాన్ని ఉపయోగించడానికి వీల్లేని పరిస్థితుల్లో యూనిక్ ఐడీ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. కేంద్ర నిర్ణయం నేపథ్యంలో.. పాఠశాలల్లో విద్యార్థులందరి ఆధార్ నమోదైనా కాకపోయినా ఆధార్ గోప్యత పాటించాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో ఆధార్ కలిగిన ప్రతి ఒక్కరికి వర్చువల్ ఐడీని ఇచ్చేలా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) కసరత్తు చేస్తోంది. పాఠశాలల విద్యార్థులకు మాత్రం యూనిక్ ఐడీని ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో ఆ దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు ఈటీసీ విధానం అమల్లోకి తెచ్చి యూనిక్ ఐడీతో అనుసంధానం చేయాలని నిర్ణయించింది. దీనిద్వారా విద్యార్థుల పూర్తి వివరాలు తెలుసుకుని, తగిన చర్యలు చేపట్టొచ్చని విద్యా శాఖ భావిస్తోంది. -
జగన్తోనే ప్రత్యేక హోదా సజీవం
తిరుపతి మంగళం/యూనివర్సిటీ క్యాంపస్: ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉద్యమం ఇప్పటివరకు సజీవంగా ఉందంటే అందుకు కారణం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనాయకులు భూమన అభినయ్ విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వారం రోజులుగా తిరుపతి తుడా సర్కిల్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద శుక్రవారం ప్రత్యేక హోదా అడగని గాడిద, ప్రత్యేక హోదా కల్పించని గాడిద అంటూ పార్టీ యువజన విభాగం జిల్లా, నగర అధ్యక్షులు బాలిశెట్టి కిషోర్, బండ్ల లక్ష్మీపతి ఆధ్వర్యంలో రెండు గాడిదలకు బోర్డులు తగిలించి వినూత్న నిరసన తెలిపారు. భూమన అభినయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కన్నా చంద్రబాబుతోపాటు వారి ఎంపీలకు పదవులే మిన్న అన్నట్లుగా వ్యవహరిస్తున్నారే తప్ప ప్రత్యేక హోదా కోసం రోడ్డుపైకి వచ్చి నినదించడంలేదని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుంటే లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు లేక, కూలిపనులు, భిక్షాటన చేసుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు బాలిశెట్టి కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తును కేంద్రానికి తాకట్టుపెట్టిన చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నగర అధ్యక్షులు పాలగిరి ప్రతాప్రెడ్డి, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, పార్టీ నాయకులు ఎస్కే.బాబు, కేతం జయచంద్రారెడ్డి, జ్యోతిప్రకాష్, రాజేంద్ర, పుల్లయ్య, కోటూరు ఆంజినేయులు,పాముల రమేష్రెడ్డి, దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి, తాలూరి ప్రసాద్, ఆమోస్బాబు, జీవకోన శ్రీనివాసులు, శివాచ్చారి, వంశీ, గోపాల్రెడ్డి, గీత, రమణమ్మ, శాంతారెడ్డి, పుణీత, కవితమ్మ పాల్గొన్నారు. కూలి పని చేసి విద్యార్థుల నిరసన ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఎస్వీయూలో వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు శుక్రవారం కూలీ పనిచేసి నిరసన తెలిపారు. ఎస్వీయూలో భవన నిర్మాణ పని చేసి ఆందోళన చేశారు. విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక హోదా రాకపోతే విద్యార్థులు కూలీ పనిచేసుకోవాల్సిందేనని వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. హోదా కోసం ఎంపీ పదవులకు రాజీనామా చేసి, ఆమరణ దీక్ష చేసిన వైఎస్సార్ సీపీ ఎంపీలు చరిత్రలో నిలిచిపోతారన్నారు. వారిని చూసి 5 కోట్ల మంది గర్విస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సుధీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ నాయక్, నరేంద్ర, హేమంత్కుమార్ రెడ్డి, సుధాకర్, సతీష్, శివకృష్ణ పాల్గొన్నారు. -
మందుపై ముందుచూపు!
సాక్షి, అమరావతి: అధికార పార్టీ నేతల కనుసన్నల్లోని లిక్కర్ లాబీకి దాసోహమైన రాష్ట్ర ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే బార్లకు ఐదేళ్ల పాటు (2022 వరకు) వ్యాపారం చేసుకునేందుకు లైసెన్సులు ఇచ్చిన సర్కారు సార్వత్రిక ఎన్నికలకు ముందుగా మద్యం షాపులకు కూడా ఐదేళ్ల పాటు లైసెన్సులు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. రెన్యువల్ స్థానంలో ఐదేళ్ల పాటు పొడిగింపు గతేడాది ప్రకటించిన మద్యం పాలసీ ప్రకారం మద్యం దుకాణాలకు రెండేళ్లకు లైసెన్సులు జారీ చేశారు. ఈ ఏడాది జూన్ నెలాఖరున రాష్ట్రంలోని 4,380 మద్యం షాపులకు లైసెన్సులు ఏడాది పాటు రెన్యువల్ చేయాల్సి ఉంది. అయితే రెన్యువల్ స్ధానంలో ఐదేళ్ల పాటు మద్యం లైసెన్సులు పొడిగించేలా ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించినట్లు విశ్వసనీయ సమాచారం. లైసెన్సు పొడిగింపు రాజకీయ కారణాలతో ముడిపడి ఉన్నట్లు అధికార వర్గాలే వెల్లడించడం గమనార్హం. మద్యం వ్యాపారులతో ప్రభుత్వం లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని వారి వ్యాపారానికి ఆటంకాలు లేకుండా లైసెన్సు కాలపరిమితి పొడిగించనుందని అధికారులు చెబుతున్నారు. ఇందుకుగాను మద్యం వ్యాపారుల నుంచి ఐదేళ్ల లైసెన్సు ఫీజు ఒకేసారి వసూలు చేయనున్నారు. ఒకేసారి రూ.2,500 కోట్లు గతేడాది రాష్ట్రంలోని మద్యం షాపుల నుంచి లైసెన్సు ఫీజుల రూపంలో రూ.500 కోట్ల ఆదాయం లభించింది. ఇప్పుడు ఐదేళ్లకు ఒకేసారి వసూలు చేస్తే సుమారుగా రూ.2,500 కోట్లకు పైగా ఆదాయం సర్కారుకు సమకూరుతుంది. అధికార పార్టీకి చెందిన వారే అధిక శాతం మద్యం షాపులు నిర్వహిస్తున్నారు. లాటరీ విధానంలో షాపులు దక్కించుకున్న వారిని బెదిరించి గుడ్విల్ చెల్లించి అధికార పార్టీ నేతలు స్వాధీనం చేసుకున్నారు. అధికార పార్టీ ముఖ్యులే తెర వెనుక ఉండి సిండికేట్లుగా జత కట్టారు. 2019 జూన్తో మద్యం దుకాణాల లైసెన్సుల కాలపరిమితి ముగుస్తుంది. అయితే వీరి వ్యాపారానికి ఆటంకాల్లేకుండా 2023 వరకు మద్యం వ్యాపారం చేసుకునేలా లైసెన్సు ఫీజు వసూలు చేసేలా ప్రతిపాదనలు రూపొందించారు. మరో ఐదేళ్లు... రాబోయే ఐదేళ్ల పాటు మద్యం వ్యాపారం ఆటంకాల్లేకుండా కొనసాగించేందుకు వీలుగా ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం లైసెన్సీలకు సమాచారం అందించింది. కొద్ది రోజుల క్రితం మద్యం విక్రయాలపై కమీషన్ 18 శాతం పెంచాలని సిండికేట్లు సర్కారు పెద్దల్ని కలిశారు. మార్జిన్ పెంచాల్సిందేనని చిత్తూరు, అనంతపురం, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో మద్యం షాపులు బంద్ చేసి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో వారిని బుజ్జగించి లైసెన్సులు ఐదేళ్ల పాటు పొడిగిస్తామని సర్కారు పెద్దలు హామీనిచ్చినట్లు సమాచారం. మద్యం వ్యాపారులకు ప్రోత్సాహం గతేడాది బార్లకు లైసెన్సులు 2022 వరకు ఇచ్చి లైసెన్సు ఫీజుల్ని గణనీయంగా తగ్గించారు. గతంలో 50 వేల జనాభా వరకు బార్ల లైసెన్సు ఫీజు రూ.25 లక్షలు ఉండేది. దీన్ని రూ.2 లక్షలకు తగ్గించారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.8 లక్షలు కలిపి మొత్తం రూ.10 లక్షలు లైసెన్సు ఫీజుగా నిర్ణయించారు. 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న పట్టణాలు, నగరాల్లో లైసెన్సు ఫీజు రూ.40 లక్షలు ఉండేది. ఈ ఫీజును రిజిస్ట్రేషన్ ఛార్జి, లైసెన్సు ఫీజు కలిపి రూ.20 లక్షలుగా నిర్ణయించారు. ఐదు లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.50 లక్షలుగా ఉన్న లైసెన్సు ఫీజును తగ్గించి కేవలం రూ.30 లక్షలే వసూలు చేశారు. మద్యం షాపులకు కూడా లైసెన్సు ఫీజులు తగ్గించి వ్యాపారాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. -
నియోజకవర్గం నుంచి 100 మంది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీకి నియోజకవర్గానికి 100 మంది చొప్పున ఆహ్వానించాలని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ఈ మేరకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం 100 మంది వరకు వివిధ స్థాయి ల్లోని పార్టీ నేతలను ఆహ్వానించనున్నారు. ఆహ్వానితుల జాబితాను ఖరారు చేశారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, రాష్ట్ర పార్టీ కార్యవర్గం, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, నగర పాలక సంస్థల మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, డీసీఎంఎస్ చైర్మన్లు, గ్రంథాలయ సంస్థ, పట్టణాభివృద్ధి సంస్థ, మార్కెట్ కమిటీల చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, నియోజకవర్గాల బాధ్యులు, అనుబంధ సంఘాల రాష్ట్ర, జిల్లా బాధ్యులు, రీజినల్ మహిళా ఆర్గనైజర్లను ఈ ప్లీనరీకి ఆహ్వానిస్తున్నారు. మొత్తంగా 12 వేల నుంచి 15 వేల మంది హాజరుకానున్నారు. 9 కమిటీలు.. ప్లీనరీని విజయవంతంగా నిర్వహించేందుకు 9 కమిటీలను ఏర్పాటు చేశారు. ప్లీనరీ వేదికగా ఉన్న మేడ్చల్, రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులకు ఈ కమిటీల్లో ప్రధాన భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆరుగురితో ఏర్పాటు చేసిన తీర్మానాల కమిటీతో కలుపుకుని.. మొత్తంగా 9 కమిటీల బాధ్యులు, తమకు అప్పగించిన పనులకు సంబంధించిన ఏర్పాట్లు చేయడానికి రంగంలోకి దిగారు. పకడ్బందీ ఏర్పాట్లు టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవమైన ఈ నెల 27న కొంపల్లిలోని జీబీఆర్ కల్చరల్ సెంటర్లో ప్లీనరీ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. పార్కింగ్, ప్రతినిధుల నమోదు, భోజనాలకు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించేలా సాంçస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్లో అనుమతించిన ప్రాంతాల్లో హోర్డింగులు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేయనున్నారు. ప్లీనరీ ఆహ్వానితులు ఈనెల 27న ఉదయం 10 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకోవాలని సీఎం కేసీఆర్ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి సూచించారు. ప్లీనరీ నిర్వహణ కమిటీలివి.. తీర్మానాల కమిటీ: కె.కేశవరావు(పార్లమెంటరీ పార్టీ నేత) ఆహ్వాన కమిటీ: పట్నం మహేందర్ రెడ్డి (రవాణా శాఖ మంత్రి), సీహెచ్ మల్లారెడ్డి (ఎంపీ) సభా ప్రాంగణం, వేదిక: గ్యాదరి బాలమల్లు (టీఎస్ఐఐసీ చైర్మన్), శంభీపూర్ రాజు (ఎమ్మెల్సీ) ప్రతినిధుల నమోదు, పార్కింగ్: కె.పి.వివేకానంద గౌడ్ (ఎమ్మెల్యే), ఎం.సుధీర్ రెడ్డి (ఎమ్మెల్యే), సీహెచ్ కనకారెడ్డి (ఎమ్మెల్యే) నగర అలంకరణ: బొంతు రామ్మోహన్ (జీహెచ్ఎంసీ మేయర్) వలంటరీ కమిటీ: మైనంపల్లి హన్మంతరావు (ఎమ్మెల్సీ), బాబా ఫసీయుద్ధీన్ (జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్), చిరుమళ్ల రాకేశ్(టీఎస్టీఎస్సీ చైర్మన్) భోజన కమిటీ: మాధవరం కృష్ణారావు (ఎమ్మెల్యే) మీడియా కో ఆర్డినేటర్లు: బాల్క సుమన్ (ఎంపీ), కర్నె ప్రభాకర్ (ఎమ్మెల్సీ), మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి సాంస్కృతిక కమిటీ: రసమయి బాలకిషన్ (సాంస్కృతిక సారథి చైర్మన్) -
‘పెళ్లి కానుక’లో తీవ్ర జాప్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఇచ్చే ఆర్థిక సాయం పంపిణీ గాడితప్పుతోంది. పెళ్లి నాటికి వధువు చేతికి అందాల్సిన నగదు సాయం ఏడాది గడిచినా అందని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ పథకంపై గంపెడాశలు పెట్టుకున్న దరఖాస్తుదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాల కింద లబ్ధిదారులకు తొలుత రూ. 51 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించిన సర్కారు...గతేడాది నగదు సాయాన్ని రూ. 75,116కు, తాజా బడ్జెట్లో ఏకంగా రూ. 1,00,116కు పెంచేసింది. ఈ నెల ప్రారంభం నుంచి పెంచిన మొత్తం అమల్లోకి రానుంది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద నగదు సాయం భారీగా ఉండటంతో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. కానీ దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల నిర్ధారణ ప్రక్రియలో అధికారులు తాత్సారం చేస్తుండటంతో లబ్ధిదారులకు ఆర్థిక సాయం సకాలంలో అందడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 57 వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలు బాధ్యత తొలుత సంక్షేమశాఖలే నిర్వహించగా పారదర్శకత కోణంలో వాటి అమలు, పర్యవేక్షణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగానికి అప్పగించింది. అంతేకాకుండా లబ్ధిదారుల అర్హత నిర్ధారణలో శాసనసభ్యులను భాగస్వాములుగా చేసింది. దీంతో ఈ రెండు కేటగిరీల్లో పరిశీలన పూర్తయితేనే అర్హత తేలనుంది. ఈ నిబంధన పంపిణీ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. మీ–సేవా కేంద్రాల ద్వారా వచ్చే దరఖాస్తులు నేరుగా సంబంధిత తహసీల్దార్ యూజర్ ఐడీలోకి చేరతాయి. అనంతరం వాటిని సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించాలి. ధ్రువపత్రాలు, పెళ్లి జరిగిన తీరును నిర్ధారించి తహసీల్దార్కు నివేదిక ఇవ్వాలి. ఆ వివరాలను సంబంధిత శాసనసభ్యులకు పంపాక అర్హుల ఎంపిక పూర్తవుతుంది. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న దరఖాస్తుల్లో ఎక్కువ భాగం తహసీల్దార్ల వద్దే ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. నెలలకొద్దీ నిరీక్షణే... : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారుల ఎంపిక విషయంలో వీఆర్వోల నుంచి నివేదికలు అందుతున్నప్పటికీ భూ రికార్డుల ప్రక్షాళన నిర్వహణలో తహసీల్దార్లు తీరిక లేకుండా ఉండటంతో దరఖాస్తులు పెండింగ్లో పడుతున్నాయి.ఈ పథకాల కింద అర్హత సాధించినప్పటికీ ఖజానాపై ఆంక్షలుండటంతో లబ్ధిదారులకు సాయం అందడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 57 వేల పెండింగ్ దరఖాస్తులకు గాను రూ. 372.25 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు అంచనా. ఖజానాశాఖ నిధులు విడుదల చేసినప్పటికీ చెక్కుల పంపిణీలోనూ ఆలస్యమవుతోంది.ఎమ్మెల్యేలకు సమయం లేకపోవడంతో పంపిణీ వాయిదా వేస్తున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో లబ్ధిదారులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. -
లేని పోస్టులోకి సీనియర్ ఐపీఎస్ బదిలీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవలి ఐపీఎస్ల బదిలీల్లో జరిగిన ఓ పరిణామం తాజాగా వెలుగులోకి వచ్చింది. రోడ్ సేఫ్టీ, రైల్వే డీజీగా పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్ కృష్ణప్రసాద్ను రోడ్ సేఫ్టీ అథారిటీ డీజీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. రాష్ట్రంలో ఈ పోస్టు ఇప్పటివరకు లేదని సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) అధికారులు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ పోస్టు ఉండేదని, అది కూడా ఏపీకి అలాట్ అయ్యిందన్నారు. లేని పోస్టులోకి సీనియర్ అధికారిని నియమించడంపై ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జీఏడీ కింద పనిచేసే దీనికి ఉమ్మడి రాష్ట్రంలో సచివాలయంలోనే కార్యాలయం ఉండేది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో ఈ పోస్టు, ఆఫీస్ లేకపోవడంతో డీజీ కృష్ణప్రసాద్ తన పాత చాంబర్లోనే కొనసాగుతున్నారు. మరోవైపు కృష్ణప్రసాద్ స్థానంలో అదనపు డీజీపీ సందీప్ శాండిల్యను ప్రభుత్వం నియమించింది. అయితే కృష్ణప్రసాద్కు పోస్టు, ఆఫీస్ కేటాయిస్తేగానీ సందీప్ శాండిల్య జాయిన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.