atmakur
-
నంద్యాలలో డయేరియాతో ముగ్గురు మృతి
-
ఆత్మకూరులో డయేరియా కలకలం.. ముగ్గురి మృతి
సాక్షి, నంద్యాల జిల్లా: ఆత్మకూరు పట్టణంలో డయేరియా కలకలం రేపుతోంది. కలుషిత నీరు తాగి ఆత్మకూరు పట్టణంలో మరో వ్యక్తి మృతి చెందాడు. ఇప్పటికే ఆత్మకూరు నీలితొట్టి వీధిలో కలుషిత నీరు తాగిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు.శనివారం రామచంద్రనాయక్ అనే వ్యక్తి కలుషిత నీరు తాగడంతో వాంతులు, విరే చనాలు కావడంతో కర్నూలు ఆసుపత్రికి బంధువులు తరలించారు. కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ కోలుకోలేక అతడు చెందాడు. కలుషిత నీరు ఘటనలో ఇప్పటికి ముగ్గురు బలి కాగా, మరికొంతమంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
YS Jagan: ఐ మిస్ యు గౌతమ్
-
మల్లన్న భక్తులకు తప్పని నడక కష్టాలు
మహాశివరాత్రి పర్వదినం సమీపిస్తోంది. శ్రీశైలం (Srisailam) మల్లన్న దర్శనానికి భక్తులు కాలినడకన బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు. వందలు కాదు.. వేలు కాదు.. లక్షలాది మంది భక్తులు శ్రీశైల క్షేత్రాన్ని ఏటా దర్శించుకుంటున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది ఇప్పటికే శివ మాల ధరించిన భక్తులు తమ దీక్షా కాలాన్ని పూర్తి చేసుకుని నిష్టాగరిష్టులై స్వామి దర్శనానికి వేచి ఉన్నారు. ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు జరగనున్న శివరాత్రి (MahaShivratri) ఉత్సవాలకు ఏర్పాట్లు చేసిన దేవస్థానం, దేవదాయశాఖ అధికారులు పాదయాత్ర భక్తులను మాత్రం విస్మరించినట్లున్నారు. జంగిల్ క్లియరెన్స్, తాగు నీటి ఏర్పాట్లను మొదలే పెట్టకపోవడంతో పాదయాత్ర భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శివయ్యా.. నీ చెంతకు చేరే దారేదయ్యా అంటూ లోలోనే మదన పడుతున్నారు.శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్లాలనుకునే భక్తుల్లో చాలా మంది వెంకటాపురం మీదుగా ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటారు. ఆత్మకూరు నుంచి వెంకటాపురం మీదుగా శ్రీశైలానికి 45 కిలోమీటర్ల దూరం అవుతుంది. 41 రోజులు కఠోర దీక్షలో ఉంటూ, శివనామస్మరణ చేస్తూ, నేలపై నిద్రించి అనునిత్యం శివ నామాన్ని జపించే శివమాలధారులు చివరిగా ఆ శివయ్యను చేరుకునేక్రమంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 20 రోజులకు పైగా భక్తుల రద్దీ కొనసాగే ఈ ఈ 45 కిలోమీట్ల నడక దారిలో జంగిల్ క్లియరెన్స్ను ఇటు శ్రీశైలం దేవస్థానం గానీ.. అటు అటవీశాఖ అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. బొబ్బలెక్కిన కాళ్లకు... గుళక రాళ్లు మరింత అడ్డంకి వెంకటాపురం గ్రామం నుంచి కాస్త దూరం వెళ్లగానే నాగలూటి క్షేత్రం చేరుకుంటారు. ఈక్రమంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. చిన్న దారి, గుబురుగా పెరిగిన చెట్ట కొమ్మలు, రాలిపడిన ఆకుల కింద ముళ్లు భక్తులకు ఇబ్బందిగా మారనున్నాయి. అక్కడ వీరభద్రస్వామిని దర్శించుకుని ఎగువగట్టుకు వెళ్లేక్రమంలో ప్రతి ఐదు లేదా పది నిమిషాలకోసారి మల్లన్నా.. నీ దర్శనం ఎప్పుడంటూ నడవలేక ఆగిపోయే పరిస్థితులున్నాయి. అతికష్టమైనా మెట్లు ఎక్కే భక్తులకు. చెత్తచెదారం కాళ్లకు గుచ్చుకుంటే మాత్రం భరించలేదు. ఎలాగో కష్టపడి గట్టు దిగిన భక్తులకు పెచ్చెరువుకు చేరుకోవడం సులభమే. కానీ సాదులమఠం, సీతమ్మబావి, భీమునికొలను చేరే క్రమంలోనూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా భీముని కొలనులోయలో పడే ప్రమాదముందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అతి కష్టంపై ఒకరి చేయి మరొకరు పట్టుకుని మరో చేత్తో కొండ గట్టును పట్టుకుని ఒక్కొక్కరుగా ముందుకుసాగాల్సిన దుస్థితి ఉంది. భీముని కొలను దిగగానే కైలాస ద్వారానికి వెళ్లే మెట్ల మార్గం మరో ఛాలెంజ్. ఆ తర్వాత కైలాస ద్వారం నుంచి హఠటకేశ్వరం క్షేత్రం చేరే సమయంలోనూ దారి అస్తవ్యస్తంగా ఉంది. ఇలా 45 కిలోమీటర్ల ప్రయాణంలో భక్తుల పాదాలకు గుచ్చుకునే పదునైన కొండరాళ్లు తీవ్ర అంతరాయంగా మారుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి నడిచి రావడంతో అప్పటికే బొబ్బలెక్కిన కాళ్లకు వెదురుబొంగులు, పదునై ఎర్రరాళ్ల కొస వల్ల మరింత కష్టంగా మారుతున్నాయి. శ్రీశైలం దేవస్థానం, అటవీ శాఖ అధికారుల మధ్య సమన్వయం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 32 ఏళ్లకు పైగా శివమాలధారణ ప్రారంభమైనప్పటి నుంచి నడకమార్గం ఎప్పుడూ శుభ్రం చేయకపోవడమే అందుకు నిదర్శనం. శ్రీశైలం దేవస్థానం అధికారులు తూతూ మంత్రంగా నిధులిస్తుండటంతో ఫారెస్టు అధికారులు కూడా అంతే రీతిలో పనులు చేసి చేతులు దులుపేసుకుంటున్నారు. కేవలం నాగలూటి క్షేత్రం వద్ద ఉన్న రెండు కోనేరులను శుభ్రం చేయడం, నాగలూటి వరకు అక్కడక్కడా వెదురుబొంగులు తొలగించడం మినహా.. రహదారి విశాలంగా చేయడం కానీ, నడక దారి భక్తుల కాళ్లకు గుచ్చుకోకుండా రాళ్లను తొలగించడం కానీ చేసిన దాఖలు లేదు. కాగా తాము నిధులిస్తున్నా.. అటవీ శాఖ దేనికి ఖర్చు చేస్తుందో చెప్పడం లేదని దేవస్థానం అధికారులు ఆరోపిస్తున్నారు. దారి పొడవునా జంగిల్ క్లియరెన్స్ చేయాలి శ్రీశైలం క్షేత్రానికి వెంకటాపురం నుంచి పాదయాత్ర కొనసాగించే భక్తులకు ఇబ్బంది లేకుండా కనీసం దారిలో గుచ్చుకునే రాళ్లనైనా తొలగించేందుకు అటవీశాఖ, శ్రీశైలం దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలి. ఏటా భక్తుల కోసం నామమాత్రంగా కొన్ని పనులు చేసి చేతులు దులుపుకోవడం సరికాదు. తప్పనిసరిగా రహదారి వెంట ఇరువైపులా కంప చెట్లను, వెదురుబొంగులను, మొనదేలిన రాళ్లను తొలగించాలి. – విశ్వంభర మద్దుల రమణారెడ్డి, శివస్వామి, ఆత్మకూరు తాగు నీరు ఏర్పాటు చేయాలి యేటేటా శ్రీశైలం మహా క్షేత్రానికి లక్షలాదిగా తరలివెళ్లే శివస్వాములు, భక్తులకు తప్పనిసరిగా అధికారులు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి. ఇప్పటికే నాగలూటి చెంచుగూడెం, పెచ్చెరువు, నాగలూటి వీరభద్రస్వామి క్షేత్రం వద్ద బోర్లు చెడిపోయాయి. అధికారులు స్పందించి మరమ్మతులు చేయడమేగాకుండా ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక చోట తాగునీరు ఏర్పాటు చేయాలి. సాదుల మఠం, సీతమ్మబావి, భీమునికొలను వరకు భక్తులకు నీటి సౌకర్యం కల్పించాలి. – సంజీవరెడ్డి, శివస్వామి, సిద్ధపల్లి గ్రామం -
నన్నారి @ నల్లమల
ఆత్మకూరు: నల్లమల అంటేనే వృక్ష సంపదకు ప్రసిద్ధి. వివిధ వృక్ష జాతులు, ఔషధ మొక్కలకు పెట్టింది పేరు. అలాంటి ఈ అభయారణ్యంలో గిరిజనులకు ఎంతగానో ఉపాధినిస్తున్న నన్నారి (షరబత్) మొక్కలు కనుమరుగవుతున్నాయి. గిరిజనులు ప్రధానంగా నన్నారి, కుంకుడు, చింతపండు, ఇతర జిగురు లాంటి ఫల సేకరణ ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. అయితే నల్లమల అరణ్య పరిధిలో ఒకప్పుడు నన్నారి మొక్కలు ఎక్కడ పడితే అక్కడ విస్తారంగా కనిపించేవి. గిరిజనులు వాటిని సేకరించి, విక్రయించగా వచ్చిన సొమ్ముతో జీవనోపాధి పొందేవారు. ప్రస్తుతం నల్లమలలో వీటి ఉనికికి ప్రమాదం ఏర్పడింది. ప్రస్తుతం గిరిజనులు గూడెం దాటి సుదూర ప్రాంతాలకు వెళ్లి నన్నారి తీగజాతి మొక్కను గుర్తించి, భూమిలో ఉన్న వేర్లను పెకిలించి తీసుకురావాల్సి వస్తోంది. ఎక్కువగా వేసవి సమీపించే ముందు గిరిజనులు నన్నారి వేర్ల సేకరణపై దృష్టి పెడతారు. కిలోల చొప్పున వాటిని విక్రయిస్తారు. వీటితో తయారైన నన్నారి పానీయాన్ని కొన్ని ప్రాంతాల్లో షర్బత్గా, మరికొన్ని ప్రాంతాల్లో సుగంధపాలుగా పిలుస్తారు. నన్నారి వేర్లు రెండు రకాలు. నలుపు, తెలుపు రంగుల్లో ఉంటాయి. నల్లమల పరిధిలో నల్ల రంగులో ఉన్నాయి. కేరళ, కర్ణాటకలోని మైసూరు, ఇతర రాష్ట్రాల్లో తెలుపు రంగులో దొరుకుతాయి. అయితే నల్లమలలో దొరికే వాటికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ నన్నారి చాలా రుచికరంగా ఉంటుంది. పోషక పదార్థాలు కూడా ఎక్కువే. అందువల్ల ఇక్కడి నన్నారి వేర్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. పెంపకానికి కేంద్రం ప్రోత్సాహం నల్లమల అటవీ పరిధిలో అంతరిస్తున్న నన్నారి మొక్కలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నన్నారి మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టింది. నల్లమల పరిధిలో నన్నారి మొక్కల జాతి అంతరిస్తోందన్న విషయం రాష్ట్రపతి దృష్టికి వెళ్లడంతో.. ఈ పంటను ఎలాగైనా కాపాడాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి వందన యోజన అనే పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వార శ్రీశైలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో తొలిసారిగా నన్నారి మొక్కల పెంపకానికి ఐటీడీఏ అధికారులు సన్నద్ధమయ్యారు. ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని కొత్తపల్లి, ఆత్మకూరు గ్రామాల్లో గిరిజనుల ఆధ్వర్యంలో నన్నారి మొక్కల పెంపకాన్ని (నర్సరీ) ప్రారంభించారు. మొక్క నాటిన రెండేళ్లలో భూమిలోకి వేర్లు బలంగా దిగుతాయి. ఆ తర్వాత వాటిని బయటకు పెకలించి, శుభ్రం చేసి విక్రయిస్తారు. కిలో నన్నారి వేర్లను ఉడికించడం ద్వారా 25 లీటర్ల నన్నారిని తయారు చేయవచ్చు. లీటర్ రూ.130 నుంచి రూ.200 చొప్పున మార్కెట్లో డిమాండ్ ఉంది. ఒక లీటర్ నన్నారికి.. సోడా లేదా నీరు, కాస్త నిమ్మరసం కలపడం ద్వారా 20 గ్లాసుల పానీయం తయారవుతుంది. ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజనుల నుంచి నన్నారి వేర్లను సేకరించి, రాష్ట్రంలోని వైజాగ్, ఇతర ప్రాంతాలకు సరఫరా చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.షుగర్ ఫ్రీ నన్నారి నన్నారి అంటేనే రుచికి ప్రతీక. పిల్లలైనా, పెద్దలైనా నన్నారికి దాసోహమే. అలాంటి నన్నారిని చూసిన షుగర్ పేషెంట్లు ఎలాగైనా సరే తాగాలని ఉబలాట పడతారు. అయితే గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుందని కుటుంబ సభ్యులు అభ్యంతరం చెబుతుంటారు. అయితే షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా సేవించేలా ఐటీడీఏ ఆధ్వర్యంలో నన్నారి తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఇప్పటికే ఆత్మకూరు ప్రాంతంలోని చెంచు, గిరిజనులకు శిక్షణ సైతం ఇచ్చారు. మొక్కల నర్సరీ కూడా ప్రారంభించారు. ఒక్కొక్క గ్రూపు నందు 30 మంది చొప్పున చెంచు గిరిజనులు ఉండేలా గ్రూపులను ఏర్పాటు చేశారు. నల్లమల నన్నారి ఉపయోగాలు వేసవిలో దాహార్తి తీరుతుంది. శరీరంలో అధిక వేడిని తగ్గిస్తుంది. మూత్ర సంబంధ సమస్యలకు మందుగా పని చేస్తుంది. వ్యాధి నిరోధకత పెంచుతుంది. హోర్మోన్ల సమతుల్యతను పెంపొందిస్తుంది. జీర్ణ ప్రక్రియ సవ్యంగా సాగేలా చేస్తుంది. శరీర బరువు నియంత్రణలో ఉండేలా ఉపకరిస్తుంది.నన్నారి పెంపకం వల్ల ఆర్థికంగా లబ్ధిఎండాకాలం వ నన్నారి గడ్డల కోసం పారా, పలుగు పట్టుకుని కొండల్లోకి వెళ్లాలి. ఆ మొక్క కనిపించేంత వరకు వెతికి, వెతికి కొండల వెంబడి తిరగాలి. మొక్క కనిపించకపోతే ఇంటికి రావాలి. ఆ మొక్క కనిపిస్తే గడ్డలను తీసుకుని రావాలి. ఇందుకు కొండలో తిరిగేందుకు కూడా పొద్దు పోతుంది. ప్రస్తుతం మొక్కలను ప్రభుత్వం గూడేల్లోనే ఏర్పాటు చేయడంతో మాకు కొండల వెంట తిరిగే ఇబ్బంది ఉండదు. ఆ గడ్డలను అమ్ముకుని జీవనం సాగిస్తాం. గడ్డలు ఎక్కువగా వస్తే ఆర్థికంగా ఎదుగుతాం. -శివలింగమ్మ, చెంచు మహిళ, ఎర్రమఠం గూడెంతిరిగే కష్టం తప్పుతుందిఐటీడీఏ ఆధ్వర్యంలో మా గూడేల్లో నన్నారి నర్సరీ ఏర్పాటు చేయడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ గడ్డలను అమ్ముకుని బతికే అవకాశం పెరుగుతుంది. తద్వారా మాకు ఎంతగానో ఆరి్థకంగా ఉపయోగం ఉంటుంది. లేదంటే కొండల వెంట తిరిగి వెళ్లాలంటే కిలోమీటర్ల కొద్దీ నడచి వెతకాల్సి ఉంటుంది. ప్రస్తుతం వర్షాకాలం ముగిసిన తర్వాత ఈ గడ్డల కోసం ఎంతో దూరం వెళ్లే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం గూడెం దగ్గరలోనే నర్సరీ ఏర్పాటు చేయడం వల్ల గిరిజనులకు జీవనోపాధి లభిస్తుంది. – ఈదమ్మ, బైర్లూటీ గూడెం -
లంచం ఇవ్వలేదని విద్యుత్ సరఫరా నిలిపివేత
ఆత్మకూర్(ఎస్): లంచం ఇవ్వలేదని తన పొలానికి విద్యుత్ లైన్మెన్ కరెంట్ లైన్ కట్ చేశాడని ఆత్మకూర్(ఎస్) మండలం కందగట్ల గ్రామానికి చెందిన రైతు బొల్లం వీరమల్లు ఆరోపించాడు. కందగట్ల, తిమ్మాపురం గ్రామాల మధ్య గల సోలార్ కంపెనీ సమీపంలో తనకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉందని, ఇటీవల కురిసిన వర్షాలకు తన వ్యవసాయ భూమి వద్ద రెండు విద్యుత్ స్తంభాలు ఒరిగి ప్రమాదకరంగా మారడంతో సరిచేయాలని గ్రామ లైన్మెన్ వెంకటయ్యను కోరినట్లు వీరమల్లు తెలిపాడు. ఈ మేరకు ఈ నెల 14వ తేదీన సిబ్బందితో సహా లైన్మెన్ వెంకటయ్య వచ్చి విద్యుత్ స్తంభాలను సరిచేసి రూ.10వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడని బాధిత రైతు ఆరోపించాడు. అంత ఇవ్వలేనని బతిమిలాడడంతో మరుసటి రోజు ఇవ్వాలని గడువు పెట్టాడని, అప్పటికీ ఇవ్వకపోవడంతో ఈ నెల 15వ తేదీన తన పొలానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో శుక్రవారం ఏఈ గౌతమ్కు రాతపూర్వకకంగా ఫిర్యాదు చేసినట్లు వీరమల్లు తెలిపాడు. ఈ విషయమై ఆత్మకూర్(ఎస్) మండల ఏఈ గౌతమ్ను వివరణ కోరగా.. విచారణ చేసి లైన్మెన్పై చర్యలు తీసుకుంటానన్నారు. విద్యుత్ సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు ఇవ్వవద్దన్నారు. అవసరమైతే ప్రభుత్వానికి చెల్లించే లావాదేవీలను డీడీల రూపంలో మాత్రమే తీసుకుంటామని వెల్లడించారు. -
పింఛన్ హామీ తప్పెన్
దివ్యాంగులకు పెంచిన పింఛన్ రూ.6 వేలతో పాటు మూడు నెలలకు రూ.3 వేల చొప్పున బకాయి మొత్తం రూ.9 వేలు కలిపి రూ.15 వేలు చెల్లిస్తాం. – జూన్ 30న రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు ఆత్మకూరు: కూటమి ప్రభుత్వం పింఛన్లపై మాట తప్పింది. గత మూడు నెలల బకాయిలతో కలిపి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. అయితే వృద్ధాప్యం, వితంతు, ఒంటరి మహిళల పింఛన్ల బకాయిలు ఇచ్చిన చంద్రబాబు.. దివ్యాంగుల బకాయిలు ఎగనామం పెట్టారని దివ్యాంగులు వాపోతున్నారు. ఆత్మకూరులోని టెక్కేవీధికి చెందిన, రెండు దశాబ్దాలుగా మంచానికే పరిమితమైన దివ్యాంగురాలు షేక్ షాహీనా (32)కు కేవలం రూ.6 వేలు మాత్రమే చెల్లించారు. ఆమెకు మందులకే నెలకు రూ.7 వేలకు పైగా అవుతోందని ఆమె తల్లిదండ్రులు రజియా, అహమ్మద్బాషా ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని బోయలచిరివెళ్లకు చెందిన మరో దివ్యాంగురాలు రమాదేవి మంచానికే పరిమితమైంది. ఏళ్ల తరబడి ఇతరులపై ఆధారపడి జీవిస్తున్న ఆమెకు నెలకు మందులకే రూ.5 వేలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు ఆమె తండ్రి రాఘవయ్య తెలిపారు. దివ్యాంగుల్లో ఆశలు రేకెత్తించి, ఇచ్చిన మాట తప్పిన కూటమి ప్రభుత్వం పింఛన్ పంపిణీ సమయంలో వారి చేతిలో రూ.6 వేలు మాత్రమే పెట్టడంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటు మంచానికి పరిమితమైన వారికి, డయాలసిస్ బాధితులకు సైతం పెంచిన మొత్తం బకాయిలు చెల్లించలేదని, బాబుకు మాట తప్పడం పరిపాటేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. బాబును నమ్మి మోసపోయామని పలువురు బాధితులు వాపోతున్నారు. -
మేకపాటి విక్రమ్ రెడ్డి ఎన్నికల ప్రచారం
-
హైదరాబాద్ కు చెందిన యువకుడిని కిడ్నాప్ చేసిన దుండగులు
-
అడవి ఒడిలోకి.. పులి పిల్లలు
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ ప్రాంతంలో రెండునెలల క్రితం తల్లి నుంచి వేరుపడి దొరికిన పులి పిల్లల్ని తిరిగి అడవిలో వదిలేందుకు రాష్ట్ర అటవీ శాఖ భారీ ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జూపార్క్లో ఆ నాలుగు పులి పిల్లల్ని ఉంచి సంరక్షిస్తున్నారు. ఎన్టీసీఏ (నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) మార్గదర్శకాల ప్రకారం.. ప్రస్తుతం వాటికి ఆహారం అందించడంతోపాటు శిక్షణ ఇస్తున్నారు. వాటిని ఏడాదిన్నరలోపు తిరిగి అడవిలోకి పంపాల్సి వుంది. దీనికిముందు వాటిని అడవిలో సహజంగా జీవించే పులుల్లా తయారుచేసేందుకు అటవీ శాఖ కసరత్తు చేస్తోంది. ఇలా అడవి నుంచి బయటకు వచ్చిన పులి పిల్లల్ని తిరిగి అడవిలోకి పంపిన అనుభవం ఉన్న మధ్యప్రదేశ్లోని కన్హా, బాంధవ్గఢ్ టైగర్ రిజర్వులను తిరుపతి జూ క్యూరేటర్ సెల్వం, ఎన్ఎస్టీఆర్ (నాగార్జున్సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాజెక్టు) ఆత్మకూరు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ మరికొందరు అధికారుల బృందం పరిశీలించి వచ్చింది. కన్హా రిజర్వులో 36 హెక్టార్లు, బాంధవ్గఢ్ రిజర్వులో 26 హెక్టార్లలో ఇన్సిటు ఎన్క్లోజర్లు ఏర్పాటుచేసి తప్పిపోయి దొరికిన పులి పిల్లలకు శిక్షణ ఇచ్చారు. ఆత్మకూరు ప్రాంతంలోని నల్లమల అడవిలోనే ఇలాంటి ఎన్క్లోజర్ ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. ఎన్క్లోజర్ ఎలా వేశారు, ఎలా నిర్వహించారు, ఎంత ఖర్చయింది, అలాంటి ఎన్క్లోజర్ను ఇక్కడ ఏర్పాటుచేయడానికి ఏం చేయాలనే దానిపై ఈ బృందం ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వనుంది. దాన్నిబట్టి త్వరలో ఎన్క్లోజర్ ఏర్పాటుచేయనున్నారు. 50 జంతువుల్ని వేటాడి తింటేనే పూర్తిగా అడవిలోకి.. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో వంద హెక్టార్లలో నాలుగు పులి పిల్లల కోసం ఇన్సిటు ఎన్క్లోజర్ ఏర్పాటుచేయనున్నారు. నీటి వసతి బాగా ఉండి, వేటాడేందుకు అనువైన జంతువులున్న చోటును అన్వేషిస్తున్నారు. ఆ చోటును గుర్తించిన తర్వాత అక్కడ ఎన్క్లోజర్ ఏర్పాటుచేసి 2, 3 నెలల్లో వాటిని అందులోకి వదిలిపెట్టాలని భావిస్తున్నారు. ఎన్క్లోజర్ను మూడు భాగాలుగా ఏర్పాటుచేయాలని చూస్తున్నారు. మొదట నర్సరీ ఎన్క్లోజర్లో ఉంచి చిన్న జంతువుల్ని వేటాడే అవకాశం కల్పించాలని, ఆ తర్వాత దశల్లో చిన్న, పెద్ద ఎన్క్లోజర్లలో కొద్దిగా పెద్ద జంతువుల్ని వేటాడేలా చేయాలనేది ప్రణాళిక. అదే సమయంలో అడవిలో ఎలుగుబంట్లు, ఇతర జంతువుల బారిన అవి పడకుండా కూడా జాగ్రత్త తీసుకోవాల్సి వుంటుంది. పులి పిల్లలు ఏడాదిన్నరలో ఈ ఎన్క్లోజర్లలో కనీసం 50 జంతువుల్ని చంపి తింటే వాటికి వేట వచ్చినట్లు నిర్ధారించుకుని అడవిలోకి వదిలేస్తారు. జంతువుల్ని చంపలేకపోతే వాటిని తిరిగి జూకి తరలిస్తారు. సాధారణంగా ఈ వేటను తల్లి పులులు పిల్లలకి నేర్పుతాయి. కానీ, ఆ పనిని ఇప్పుడు అటవీ శాఖ చేస్తోంది. ఈ పనిని బాంధవ్గఢ్ టైగర్ రిజర్వులో విజయవంతంగా చేయడంతో అక్కడికెళ్లి అధ్యయనం చేశారు. అక్కడిలాగే నల్లమలలో ఇన్సిటు ఎన్క్లోజర్లు తయారుచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం భారీగా ఖర్చయ్యే పరిస్థితి ఉండడంతో అందుకోసం ఓ దాతను ఒప్పించారు. ఈ ఖర్చును భరించేందుకు ఆ దాత ముందుకు రావడంతో త్వరలో ఎస్వీ జూపార్క్లో పెరుగుతున్న పులి పిల్లలు నల్లమలలో ఇన్సిటు ఎన్క్లోజర్లోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు.. జూపార్క్లోని నాలుగు ఆడ పులి పిల్లలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయి. మూడు కేజీల బరువు ఉన్నప్పుడు దొరికిన వాటి బరువు ఇప్పుడు 14–15 కేజీలకు పెరిగినట్లు అటవీ శాఖాధికారులు తెలిపారు. అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం పులి పిల్లల్ని తిరిగి అడవిలోకి పంపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాం. త్వరలో ఇన్సిటు ఎన్క్లోజర్ ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తున్నాం. అందులో పులి పిల్లలు వేటాడితే అడవిలో వదులుతాం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కావడంతోపాటు మనం ఇంతకుముందు ఎప్పుడూ చేయని పని. అందుకే అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. – మధుసూదన్రెడ్డి, పీసీసీఎఫ్, ఏపీ అటవీ శాఖ -
ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలు అద్భుతం
-
గుండెపోటుతో ఆత్మకూరు సీఐ మృతి
సాక్షి, ఆత్మకూరు(శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): ఆత్మకూరు సీఐ మల్లి నాగేశ్వరరావు (48) గుండెపోటుతో మృతి చెందారు. ఆరు నెలల క్రితమే అమరావతి నుంచి బదిలీపై వచ్చి ఆత్మకూరు సీఐగా బాధ్యతలు చేపట్టారు. విధుల్లో భాగంగా సోమవారం మర్రిపాడు మండలానికి ఓ కేసు విషయమై వెళ్లి విచారణ చేసి వచ్చారు. మధ్యాహ్నం ఇంటికి వెళ్లి భోజనం చేసిన అనంతరం తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. ప్రాథమిక చికిత్స అనంతరం నెల్లూరుకు తరలించే క్రమంలో ఆయన మృతి చెందారు. -
నంద్యాల: పులి కూనలపై కొనసాగుతున్న ఉత్కంఠ
సాక్షి, నంద్యాల జిల్లా: ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మాడాపురం గ్రామంలో పెద్ద పులి కూనల లభ్యమైన ఘటనలో ఉత్కంఠ కొనసాగుతోంది. అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన నాలుగు పులి కూనల్లో... రెండు పులి కూనల ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెస్క్యూ టీమ్ సిబ్బంది పులికూనలను ఆడవిలో వదిలిన కానీ, అక్కడి నుంచి అవి కదలడం లేదు పులికూనలకు పాలు తాగించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నం చేసింది. నాలుగు పులి కూనలను తిరుపతి జూకు తరలించే యోచనలో అటవీ శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్న కారణంగా పులి కూనలు డీహైడ్రేషన్కు గురికావడంతో బైర్లుటి వైల్డ్ లైఫ్ ఆసుపత్రికి అధికారులు తరలించారు. పులి కూనల తల్లీ(పెద్దపులి) ఆచూకీ తెలుసుకునేందుకు ఇన్ఫ్రారెడ్(ట్రాప్) కెమెరాలను టైగర్ ట్రాకర్లు పరిశీలిస్తున్నారు. చదవండి: రాప్తాడులో టీడీపీ కాకిగోల.. సాక్ష్యం ఇదిగో -
ఏపీ విద్యార్థికి రూ.1.2 కోట్ల ప్యాకేజీతో ‘ఇంటెల్’లో ఉద్యోగం
ఆత్మకూరు రూరల్(నెల్లూరు జిల్లా): ఆత్మకూరు యువకుడికి యునైటెడ్ స్టేట్స్ ఇంటెల్ సంస్థలో వార్షిక ప్యాకేజీ రూ.1.2 కోట్లతో కొలువు దక్కింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం పాతజంగాలపల్లికి చెందిన ఈగా మురళీమనోహర్రెడ్డి, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు వెంకట సాయికృష్ణారెడ్డి ఖరక్పూర్ ఐఐటీలో జరిగిన ప్రాంగణ ఎంపికల్లో ఈ ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం ఐఐటీ చివరి సంవత్సరం చదువుతున్న సాయికృష్ణారెడ్డి వచ్చే మే నెలలో ఈ కోర్సు పూర్తి చేసుకుని, ఆగస్టులో యూఎస్కు వెళ్లి ఉద్యోగంలో చేరనున్నారు. ఈ సందర్భంగా మురళీమనోహర్రెడ్డి, లక్ష్మీదేవి దంపతులు మాట్లాడుతూ కాయకష్టం చేసి రైతులుగా తాము సంపాదించిన సొమ్మంతా బిడ్డల భవిష్యత్ కోసమే వెచ్చిస్తున్నామని, వారు ఉన్నత స్థాయిలో ఉండడం కంటే తమకు వేరే కోరికలు లేవని భావోద్వేగానికి గురయ్యారు. చదవండి: సీఎం జగన్ను కలిసిన ‘సిరివెన్నెల’ కుటుంబ సభ్యులు -
ప్రేమజంటపై దాడి కేసులో పురోగతి
అనంతపురం శ్రీకంఠంసర్కిల్/ఆత్మకూరు: ప్రేమజంటపై దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆత్మకూరు మండలం పంపనూరు సిటీ పార్క్ అటవీ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ప్రేమికులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసును ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప సీరియస్గా పరిగణించారు. దీనిని సవాలుగా తీసుకుని ఛేదించాలని దిశ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులును ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పంపనూరు సమీపంలోని వడ్డుపల్లి మిట్ట వద్ద ప్రేమికులపై దాడి చేసిన ముఠా ఆనవాళ్లను 24 గంటల్లోపే పసిగట్టారు. ప్రాథమికంగా సేకరించిన ఆధారాల మేరకు అనంతపురం నగరానికి చెందిన అల్లరి మూకలే దాడులకు కారణంగా గుర్తించారు. అనంతరం వారు అపహరించిన సెల్ఫోన్ నంబర్ ఆధారంగా నిందితులను గుర్తించారు. ఈ క్రమంలోనే నగరంలోని రాజీవ్ కాలనీ, హెచ్చెల్సీ కాలనీకి చెందిన ఇద్దరితో పాటు కంబదూరుకు చెందిన ఓ యువకుడిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఏకాంతం మాటున ప్రమాదం ప్రేమ జంటలకు పంపనూరు సమీపంలోని సిటీ పార్క్ కేంద్రంగా మారింది. ఏకాంతం కోసం సిటీ పార్క్లోని పొదలను ఆశ్రయిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ నెల 23న సిటీ పార్క్ సందర్శనకు వచ్చిన ఓ ప్రేమజంటపై గుర్తు తెలియని యువకులు దాడిచేసి మూడు సెల్ఫోన్లు, రెండు తులాల బంగారు నగలు అపహరించుకెళ్లిన విషయం విదితమే. ఇది మొదటి సారి ఏమీ కాదు! గతంలో ఎన్నో సార్లు ప్రేమజంటలను టార్గెట్ చేసి నగదు, విలువైన వస్తువులు అపహరించుకెళ్లారు. సిటీ పార్క్లో విహరిస్తూ ఎక్కువగా కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు జంటగా సిటీ పార్క్కు వస్తున్నారు. వీరిలో కొందరు మైనర్లు ఉండడం గమనార్హం. కాలేజీకి డుమ్మా కొట్టి పుస్తకాల బ్యాగు పక్కన పడేసి సిటీ పార్క్లో చక్కర్లు కొడుతూ ఏకాంతం కోసం గుట్టల్లోని పొదల మాటుకు వెళుతున్నారు. ఇదే అవకాశంగా కొందరు యువకులు వారిని బెదిరించి లూటీ చేస్తున్నారు. చైతన్యం రావాలి ప్రేమజంటపై దాడి చేసిన వారిని పట్టుకు తీరుతాం. ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక దృష్టి సారించాం. సిటీ పార్క్ ప్రాంతంలో పోలీసుల పహారా పెంచుతున్నాం. కాకపోతే ప్రజల్లో చైతన్యం రావాలి. ఘటన జరిగిన వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి విషయాన్ని పోలీసులకు చేరవేయాలి. ఇది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. – ఆర్ల శ్రీనివాసులు, దిశ డీఎస్పీ యువత జాగ్రత్తగా ఉండాలి పంపనూరు సిటీ పార్కుకు ఎక్కువగా యువత వస్తుంటారు. కనుచూపు మేర అటవీ ప్రాంతం ఉండడంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. యూనిఫాంతో జంటగా వచ్చే విద్యార్థులను, మైనర్లను అటవీ ప్రాంతంలోకి అనుమతించకుండా చర్యలు తీసుకుంటాం. – ఎస్ఐ శ్రీనివాసులు, ఆత్మకూరు (చదవండి: శాస్త్రీయ పద్ధతులతో సమగర దర్యాప్తు) -
Atmakur: కొత్త సొబగులద్దుకున్న వైఎస్సార్ స్మృతివనం
ఆత్మకూరు రూరల్(కర్నూలు జిల్లా): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం కొత్త అందాలను సంతరించుకుంది. ఆత్మకూరు మండలం నల్లకాల్వ గ్రామ శివార్లలో సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుత పచ్చందాల పార్క్గా గుర్తింపు పొందింది. దశాబ్దం కిందట ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఈ థీమ్ ప్రాజెక్ట్ నిధుల కొరతతో అభివృద్ధికి నోచుకోలేక పోయింది. 2019లో వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో స్మృతి వనానికి మహర్దశ వచ్చింది. ఆరునెలల క్రితం ప్రభుత్వం రూ. 2 కోట్లు విడుదల చేసి వివిధ అభివృద్ధి పనులు చేపట్టింది. ఆయా పనులన్నీ ప్రస్తుతం పూర్తి కావడంతో స్మృతివనం కొత్త సొబగులద్దుకుంది. ఆరుబయలు ఆడిటోరియం... పచ్చదనాల ల్యాండ్స్కేప్ చిన్నపాటి శుభకార్యాలు జరుపుకునేందుకు వీలుగా స్మృతివనంలో పచ్చటి కార్పెట్ గ్రాస్తో పరుచుకున్న తిన్నెలను ఏర్పాటు చేశారు. వాటి మీద కూర్చుని కార్యక్రమం తిలకించే విధంగా మినీ వేదిక ఏర్పాటు చేశారు. దీని వెనుక ఒక తెర కూడా ఉండడంతో ఏవైనా రికార్డు చేసిన వీడియోలు, సినిమాలు ప్రదర్శించుకోవచ్చు. అలాగే ఈ ల్యాండ్ స్కేప్ మధ్యలో రెండు గ్రానైట్ శిలా మండపాలు కూడా నిర్మించారు. అక్కడక్కడా గ్రానైట్తో ఏర్పాటైన అరుగులు పర్యాటకులు సేదతీరడానికి అనువుగా ఉన్నాయి. కనువిందుగా పర్యావరణ విజ్ఞాన కేంద్రం పర్యావరణంపై పర్యాటకులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో స్మృతివనంలో పర్యావరణ విజ్ఞానకేంద్రానికి శ్రీకారం చుట్టారు. అయితే, నిధుల కొరతతో దశాబ్ద కాలంగా ఆగిపోయిన ఈ పనులు ఇటీవలే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చారు. జీవకళలొలుకుతున్న పులిప్రతిమలు పర్యావరణ విజ్ఞాన కేంద్రం ముంగిట ఏర్పాటు చేసిన చిరుత పులుల ప్రతిమలు నిజం చిరుతలను చూస్తున్న అనుభూతిని కలిగిస్తున్నాయి. చెట్టుపై ఎక్కి కూర్చున్నట్లుగా వీటిని ఏర్పాటు చేశారు. అలాగే పర్యావరణ విజ్ఞాన కేంద్రంలో సహజ వాతావరణంలో రాజసంగా నిలుచున్న పెద్దపులి ప్రతిమ వీక్షకులను సంభ్రమాశ్చ్యర్యాలకు గురి చేస్తోంది. అంతే కాకుండా విజ్ఞాన కేంద్రపు గోడలకు వేలాడదీసిన కొన్ని వన్యప్రాణుల చిత్రపటాలు చూడ ముచ్చటగొల్పుతున్నాయి. ఈ చిత్రపటాలన్నీ కూడా చేయితిరిగిన చిత్రకారులతో గీయించ బడిన కళాఖండాలు కావడం విశేషం. పిల్లను మోస్తున్న ఎలుగుబంటి, బరక భూములపై పరుగెత్తుతున్న బట్టమేక పక్షి, గడ్డిమైదానంలో కూర్చున్న కణితి, గాల్లో ఎగిరిపోతున్న కృష్ణ జింకల సమూహం, హనీబాడ్జర్ల చిత్రపటాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. రాతిపై జీవజాలం... వైఎస్ఆర్ స్మృతివనంలో ఉన్న పాదచర మార్గాలలో రాతి స్తంభాలపై పలు వన్యప్రాణులు, పక్షులు, సరీసృపాల శిల్పాలను చెక్కించి ఉంచారు. వీటికి సహజ వర్ణాలతో తీర్చిదిద్దడంతో ప్రత్యక్షంగా వాటిని చూస్తున్న అనుభూతి కలుగుతోంది. అదే విధంగా అడవుల్లో ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో తీసిన వన్యప్రాణుల చిత్రాలను ఫ్లెక్సీలుగా తీర్చి దిద్ది పలుచోట్ల ఉంచారు. ఇవి కూడా చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. (క్లిక్: గుడ్లగూబలు దూరం.. అసలు విషయం ఏంటంటే?) -
సీతాకోక చిలుక ‘పడగ విప్పడం’ ఎప్పుడైనా చూశారా?
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మునిసిపల్ పరిధి ముస్తాపురం సమీపంలోని తోటల్లో ఓ వింతైన సీతాకోక చిలుక కనిపించింది. వాయీజ్ అనే వ్యక్తి సమీపంలోని ఓ చెట్టుపై దీనిని చూసి మొదట కంగారు పడ్డాడు. ఆ తర్వాత తేరుకుని దానిని గమనించాడు. దూరం నుంచి చూస్తే అది నాగుపాము పడగను పోలి ఉంది. రెక్కలు విప్పితే దాని శరీరంపై వింతైన కళ్లు మాదిరి ఉన్నాయి. – ఆత్మకూరు (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) -
అధ్వాన్నంగా ఆత్మకూరు - జూరాల ప్రాజెక్ట్ రహదారి
-
Tiger Mating Season: ఏకాంతమైతేనే 'సై'ఆట
ఆత్మకూరు రూరల్: జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు శ్రీశైలం అటవీ రేంజ్ పరిధిలోని ఇష్టకామేశ్వరి పుణ్యక్షేత్రానికి భక్తుల రాకపోకలను తాత్కాలికంగా అటవీ శాఖ నిలిపేసింది. ఇష్టకామేశ్వరి క్షేత్రం ఒక్కటే కాదు.. అన్ని పర్యావరణ పర్యాటక కేంద్రాలనూ ఈ మూడు నెలలు మూసివేశారు. ఇది పెద్ద పులుల సంతానోత్పత్తి సమయం(బ్రీడింగ్ పీరియడ్) అయినందున వాటికి ఏకాంతం కల్పించడమే ఈ ఆంక్షలకు కారణమని అటవీ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పెద్దపులి ఎంతో సిగ్గరి మనస్థత్వం కలిగినది. ఎంతో ఠీవీగా రాజసంతో నడిచే పెద్దపులి తన సంగమ సమయంలో మాత్రం పూర్తిగా ఏకాంతాన్ని కోరుకుంటుంది. అడవిలో ఏ చిన్న అలజడి రేగినా పులులు సంగమంలో పాల్గొనవు. అయితే తరుచూ అడవుల్లో మానవ సంచారం కారణంగా పెద్ద పులుల్లో సంగమించడం తగ్గిపోయి గర్భధారణ అవకాశాలు పడిపోతున్నాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్టీసీఏ(నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) 2015లో పులుల అభయారణ్యాలున్న రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. ఆ మేరకు రుతుపవనాల సమయమైన జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు అభయారణ్యాల్లో మానవ సంచారాన్ని అదుపు చేసే చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఈ ఏడాది జూన్ 1 నుంచి ఈ నిషేధాజ్ఞలను ఎన్ఎస్టీఆర్(నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్), జీబీఎం(గుండ్ల బ్రహ్మేశ్వరం) అభయారణ్యాల పరిధిలో అటవీ శాఖ అమలు చేస్తోంది. దీంతో అభయారణ్యాల పరిధిలోని అన్ని ఎకో టూరిజం రిసార్ట్లు, జంగల్ సఫారీలు, పుణ్యక్షేత్రాలను మూసివేశారు. అవసరం అనుకుంటే ఈ నిషేధాజ్ఞలను మరో రెండు నెలలు కూడా పొడిగించే అవకాశాలున్నాయి. తల్లి తలపైకెక్కిన పులి కూనలు ఆ సమయంలో మనుషుల పైనా దాడి చేసే అవకాశం పులులు సంతానోత్పత్తి సమయాల్లో చాలా ఆవేశపూరితంగా ఉంటాయి. సంగమం సమయంలో ఆవేశంతో మనుషులపై దాడులకు పాల్పడతాయి. అందుకే పులుల సంతానోత్పత్తి కాలంలో నల్లమలలోని అన్ని పర్యాటక, పుణ్యక్షేత్రాలను తాత్కాలికంగా మూసివేయించాం. – అలెన్ చోంగ్ టెరాన్, డీఎఫ్వో, ఆత్మకూరు డివిజన్, నంద్యాల జిల్లా -
Bypoll Results 2022: ముగిసిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ
-
ఆత్మకూర్ బైపోల్.. 62 శాతం పోలింగ్
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సాయుధ బలగాలు
-
ఆత్మకూరులో పోలింగ్ ప్రశాంతం
-
ఆత్మకూరు ఉపఎన్నికల్లో ముగిసిన ప్రచారం
-
నెల్లూరు ఉప ఎన్నిక.. ముగిసిన ప్రచార పర్వం
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రానికి ముగిసింది. దీంతో నియోజకవర్గంలో మైకులు మూగబోయాయి. 23న జరగనున్న పోలింగ్పై అధికారులు దృష్టిపెట్టారు. ఈ మేరకు ఆంధ్ర ఇంజినీరింగ్ కాలేజీలో రిటర్నింగ్ అధికారి హరేంద్రియ ప్రసాద్ ఈవీఎంల పంపిణీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక ఎన్నికల విధుల్లో 1300 మంది సిబ్బంది పాల్గొననున్నారు. 279 పోలింగ్ బూత్లను అధికారులను ఏర్పాటు చేయనున్నారు. 123 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను అధికారులు గుర్తించారు. 123 స్టేషన్ల నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియపై నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికలకు మొత్తం 377 ఈవీఎంలను సిద్ధం చేశారు. మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. -
అత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీకి భంగపాటు తప్పదు: కాకాణి
-
అత్మకూరులో తన ప్రసంగంతో దుమ్ములేపిన అంబటి
-
ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపుతాం
ఆత్మకూరు: మూడేళ్లుగా కులమతాలకు అతీతంగా పారదర్శకంగా లక్షలాది కుటుంబాలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీర్వాదంతో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న మేకపాటి విక్రమ్రెడ్డిని ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని, దివంగత మేకపాటి గౌతమ్రెడ్డి కలలు కన్న అభివృద్ధికి కృషి చేస్తామని పలువురు మంత్రులు అన్నారు. ఆత్మకూరు శాసనసభ ఉప ఎన్నిక మరో రెండు రోజుల్లో జరగనున్న నేపథ్యంలో సోమవారం పార్టీ అభ్యర్థి విక్రమ్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, చెల్లుబోయిన వేణుగోపాల్కృష్ణ, జోగి రమేష్, రాజ్య సభ్యుడు బీద మస్తాన్రావు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి నిర్వహించిన భారీ ర్యాలీతో పట్టణం జనసంద్రమైంది. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు జెండాలు చేతబట్టి వేలాదిగా పాల్గొనడంతో రోడ్లు కిక్కిరిశాయి. బంగ్లా సెంటర్ వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన రహదారి మీదుగా ఎల్ఆర్పల్లి, జేఆర్పేట, సోమశిల రోడ్ సెంటర్, బస్టాండ్, వైశ్య బజారు మీదుగా సత్రం సెంటర్ వరకు సాగింది. మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ మేకపాటి విక్రమ్రెడ్డి ప్రజల సమస్యలను అతి తక్కువ కాలంలో దగ్గరగా పరిశీలించారని, వాటి పరిష్కారానికి, అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారన్నారు. ప్రజలు ఇప్పటికే పార్టీ గుర్తు ఫ్యాన్కు వేసేందుకు స్థిర నిర్ణయం తీసుకున్నారని మెజార్టీ లక్షకుపైగా సాధించేందుకు తాము ప్రచారంలో పాల్గొంటున్నామన్నారు. మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ గౌతమ్రెడ్డి లేనిలోటు తీర్చేలా విక్రమ్రెడ్డి పని చేస్తారని ఆ కుటుంబానికి నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలతో అనుబంధం ఉందని, మచ్చలేని రాజకీయాలు చేస్తున్న వారిని ఆదరించి అభిమానించాలన్నారు. ప్రతిపక్షాలు దిమ్మ తిరిగేలా భారీ మెజార్టీని అందివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దివంగత మంత్రి గౌతమ్రెడ్డి మంచి తనం చూసి ఆయన సోదరుడిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ మైనార్టీలతో పాటు బీసీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనన్నారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్తో పాటు అన్ని వర్గాలకు ఫీజు రీయింబర్స్మెంట్, రాజకీయంగా పదవులు అందించిన ఘనత వైఎస్సార్ కుటుంబానికే దక్కుతుందన్నారు. అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలు తనకు కొత్త అయినా పైనుంచి దీవిస్తున్న అన్న ఆశీర్వాదాలు, ప్రజల అభిమానం, ముఖ్యమంత్రి, మంత్రుల అండదండలు, సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి చేసి చూపుతానన్నారు. గత నెల రోజులుగా చేస్తున్న ప్రచారంలో ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం, సంతృప్తి కనిపిస్తున్నాయని, అమలు అవుతున్న నవరత్నాల పథకాలే శ్రీరామరక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసులురెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి, ద్వారకానాథ్రెడ్డి, హఫీజ్ఖాన్, ఎమ్మెల్సీ బల్లి కల్యాణచక్రవర్తి, జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ జి వెంకట రమణమ్మ, వైస్ చైర్మన్లు డాక్టర్ కేవీ శ్రావణ్కుమార్రెడ్డి, షేక్ సర్ధార్, పార్టీ పట్టణ అధ్యక్షుడు అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, రూరల్ అధ్యక్షుడు జితేంద్రనాగ్రెడ్డి, ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
ఆత్మకూరు ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
నెల్లూరు(అర్బన్): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా చెప్పారు. సోమవారం ఆయన నెల్లూరు కలెక్టరేట్లో నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ చక్రధర్బాబుతో కలిసి మీడియాతో మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులుండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. దివ్యాంగుల కోసం ర్యాంపులు, వీల్ చైర్లు ఏర్పాటు చేశామన్నారు. 279 పోలింగ్ స్టేషన్లలో ఎక్కడైనా సాంకేతిక సమస్య తలెత్తితే వెంటనే సరి చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. దొంగ ఓట్లు పడకుండా.. ఓటర్ల జాబితాలను పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రదర్శించాలని ఆదేశించినట్లు తెలిపారు. 123 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని.. వాటి వద్ద కట్టుదిట్టమైన భద్రతతో పాటు మైక్రో అబ్జర్వు, వీడియో, వెబ్ కాస్టింగ్ లైవ్ తదితరాలను సిద్ధం చేశామని చెప్పారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. వలంటీర్లు కరపత్రాలు పంచినా, ప్రచారం నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జేసీ హరేందిరప్రసాద్, ఎస్పీ విజయరావు, డీఎఫ్వో షణ్ముఖకుమార్, మునిసిపల్ కమిషనర్ జాహ్నవి, ఏఎస్పీ హిమవతి, సెబ్ జేడీ శ్రీలక్ష్మి, డీఆర్వో వెంకటనారాయణమ్మ, డీఎంహెచ్వో డాక్టర్ పెంచలయ్య, డీపీవో ధనలక్ష్మి, డీసీవో తిరుపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో టీడీపీ తొండాట..
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తొండాట ఆడుతోంది. మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ఆకస్మిక మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో సంప్రదాయం ప్రకారం పోటీకి దూరమంటూ ప్రచారం చేసుకుంటూనే మరో వైపు ఓట్లు మాత్రం పక్క పార్టీలకు వేయించాలని రెండు వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీని తమ వైపు తిప్పుకునేందుకు ఆ పార్టీని బలహీనపర్చాలని ఓట్లు వేయొద్దని టీడీపీ నేతలు బాహాటంగానే ప్రచారం చేస్తున్నారు. సాక్షి, నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీకి దూరమంటూనే ఓట్లు వేసేందుకు పోటీలో ఉన్న ఇతరులకు వేసేందుకు లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటోంది. ఇందులో ఓ వర్గం మాత్రం బీఎస్సీ అభ్యర్థికి వేయాలని తీర్మానించుకోగా , మరో వర్గం మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. దీంతో ఓటు విషయంలో కూడా వర్గరాజకీయాలు చేయడంతో ఆ పార్టీ శ్రేణులే నేతల తీరును అసహ్యించుకుంటున్నారు. ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచార ఘట్టం తారాస్థాయికి చేరుకుంది. ఈ నెల 23న పోలింగ్ కావడంతో 21వ తేదీకే ప్రచార ఘట్టం ముగియనుంది. వైఎస్సార్సీపీ మాత్రం ప్రచారంలో దూసుకెళ్తోంది. నియోజకవర్గంలో ఆరు మండలాలు, ఒక మున్సిపాల్టీ ఉండగా మండలానికో మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు ఇన్చార్జ్లుగా నియమించడంతో ఎవరికి వారు ప్రజాక్షేత్రంలో ప్రచారంలో మునిగితేలుతున్నారు. ఎన్నిక రోజున ఓటింగ్ శాతం పెంచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డి మెజార్టీపైనే ఆ పార్టీ నేతలు దృష్టి సారించి ఆ దిశగా పనిచేస్తున్నారు. టీడీపీ ఓట్లు హోల్సేల్ ఈ ఎన్నికల్లో టీడీపీ శ్రేణుల పరిస్థితి ఇరకాటంగా మారింది. ఆ పార్టీలో ఇప్పటికే వర్గ రాజకీయాలు నడుస్తున్నాయి. ఎన్నికల్లో టీడీపీ తరఫున అభ్యర్థి పోటీ చేయలేదు. అధికార పార్టీ వైఎస్సార్సీపీతో పాటు బీజేపీ, బీఎస్పీ, మరో పదకొండు మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ శ్రేణులు మాత్రం ఎవరికి ఓటు వేయాలని సందిగ్ధంలో ఉంటే.. ఆ పార్టీ ఓట్లను ఇతరులకు వేసేందుకు హోల్సేల్ బేరం మాట్లాడుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నియోజకవర్గం టీడీపీలో మూడు వర్గాలు నడుస్తున్నాయి. నియోజకవర్గ ఇన్చార్జి విషయంలో ఆ ముగ్గురు నేతలు తెరపైకి రావడంతో ఆధిష్టానం ఎటూ తేల్చలేక ఇన్చార్జి నియామకం నిలిపేసింది, ప్రస్తుత ఉప ఎన్నికల్లో మాత్రం టీడీపీలో ఓ వర్గ నేత మాత్రం బీఎస్పీ అభ్యర్థికి ఓటు వేయమని తన అనుచర వర్గానికి ఆదేశాలు ఇచ్చారు. మరో వర్గ నేత మాత్రం ప్రస్తుత ఎన్నికల బరిలో తన సొదరుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నాడు. టీడీపీ తరఫున గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యుడిగా ఎన్నికై ఉన్నాడు. అతనే ఈ ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్గా బరిలో దిగడంతో ఆ పార్టీ కూడా అతన్ని సన్పెండ్ చేసింది. అయితే పార్టీ నుంచి బయటకు పంపినా ఆయన ఓ వర్గనేతకు సొదరుడు కావడంతో లోలోన తన సోదరుడికి ఓట్లు వేయించాలని ప్రయత్నాలు మమ్మురం చేసినట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.. దీంతో టీడీపీ శ్రేణులు పోలింగ్పై మల్లగుల్లాలు పడుతున్నారు. బీజేపీ బలం పెరిగితే నష్టమని.. ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయొద్దని టీడీపీ నేతలు బాహాటంగానే ప్రచారం చేస్తున్నారు. టీడీపీ ఓట్లు బీజేపీకి పడితే ఆత్మకూరులో ఆ పార్టీకి ఓటు బలం పెరిగిందని వారు చెప్పుకొస్తారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కుదిరితే ఈ ఓటింగ్ బలం చూపి పొత్తులో భాగంగా సీటు అడిగే ప్రమాదం ఉందని, బీజేపీకి రెండో స్థానం దక్కకుండా ఉండాలని బీఎస్సీకి ఓటు వేయండని ఆ నేత ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. 2004 ఎన్నికల్లో కూడా పొత్తులో భాగంగా బీజేపీకి సీటు కేటాయించారు. అలాంటి పరిస్థితి మరోసారి రాకుండా ఉండాలంటే టీడీపీ ఓటింగ్ బీజేపీకి దూరండా ఉండాలని ఆ పార్టీ శ్రేణులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక జనసేన మాత్రం బీజేపీతో దోస్తితో ఉండడంతో వారు బీజేపీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. -
‘కమలం కమిలిపోయే మెజార్జీ వైఎస్సార్సీపీకి ఇవ్వాలి’
నెల్లూరు జిల్లా: మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95 శాతం నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డిదేనని మంత్రి ఆర్కే రోజా మరోసారి గుర్తుచేశారు. చేజార్ల మండలం యనమదల, ఎర్రబల్లిలోమేకపాటి విక్రమ్రెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న ఆర్కే రోజా.. ఈనెల 23వ తేదీ ఆత్మకూరు ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి కమలం కమిలిపోయేలా మెజార్టీ ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్దారని, అమ్మ ఓడి పథకం పక్క రాష్ట్రాల్లో ఎక్కడా లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు మంత్రి రోజా. ఆరోగ్య శ్రీ ద్వారా కరోనా నుంచి క్యాన్సర్ వరకూ ఉచిత వైద్యం అందిస్తున్న ఏకైక సీఎం జగన్మోహన్రెడ్డి అని పేర్కొన్నారు. -
బీజేపీ వాళ్లు ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారు ??
-
అంతకు మించి.. కమలనాథులకు మంత్రి రోజా పంచులు
-
మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు ఏకపక్షం: చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ
-
సీఎం వైఎస్ జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు: మంత్రి మేరుగు నాగార్జున
-
ప్రతిపక్షాలకు బుద్ధి రావాలి: ఆర్కే రోజా
-
AP: ఆత్మకూరు ఉపఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి
సాక్షి, నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గం ఉపఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి అయ్యింది. ఈ మేరకు వివరాలను వెల్లడించారు రిటర్నింగ్ అధికారి హరేంద్ర ప్రసాద్. ఇవాళ(మంగళవారం) 28 నామినేషన్లకు స్క్రూట్ని ప్రక్రియ జరిగిందని, వివిధ కారణాల వల్ల 13 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని తెలిపారాయన. ఇదిలా ఉంటే.. ఆత్మకూరు ఉపఎన్నికలో ప్రస్తుతానికి పదిహేను మంది ప్రస్తుతం బరిలో ఉన్నారు. ఈ నెల 9వ తేదీ మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. చదవండి: రాజకీయాల్లో మచ్చలేని కుటుంబం అది! -
ఆత్మకూరు బరిలో బీజేపీ.. పరువు పోగొట్టుకోవడం ఎందుకంటున్న పార్టీ కేడర్
సాక్షి, నెల్లూరు: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రధాన ప్రతిపక్షపార్టీ టీడీపీ పోటీలో అభ్యర్థిని నిలబెట్టబోమని ప్రకటించింది. ఇక బీజేపీ మాత్రం పోటీకి అభ్యర్థిని రంగంలోకి దింపింది. స్థానిక కమలం నేతలెవరూ పోటీ చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో స్థానికేతురుడైన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్కుమార్ యాదవ్ను బరిలోకి దింపాల్సి వచ్చింది. కానీ ఉప ఎన్నికల్లో పోటీచేసి పరువు పోగొట్టుకోవడం ఎందుకని ఆ పార్టీ కేడర్ మథన పడుతోంది. ఓట్లు తెచ్చుకోకుంటే.. ఆత్మకూరు నియోజకవర్గంలో ఉప ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మాత్రం ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ ప్రకటన చేసి అభ్యర్థి పేరు ప్రకటించింది. దీంతో పోటీ అనివార్యమైంది. అయితే బీజేపీ ప్రకటనపై ఆ పార్టీలోనే కేడర్ అంతర్మథనం చెందుతోంది. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ఉన్నతమైన రాజకీయ భావాలున్న వ్యక్తిగా పేరు గడించారు. 2014, 2019 ఎన్నికల్లో ఆత్మకూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి ఆ పదవికే వన్నెతెచ్చారు. ఏ రాజకీయ పార్టీని కూడా విమర్శలు చేసేవారు కాదు. హుందా రాజకీయాలకు విలువనిచ్చే వ్యక్తిగా పేరు తెచ్చుకున్న గౌతమ్రెడ్డి మరణాన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా జీర్ణించుకోలేకపోయాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలు సైతం ఆయన చివరిచూపు కోసం తపించారు. అంతటి పేరు ప్రఖ్యాతలున్న నేత స్థానంలో ఆ కుటుంబం నుంచి వచ్చిన ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్రెడ్డి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ పోటీచేయబోమని ప్రకటన చేయగా, బీజేపీ మాత్రం బరిలో ఉంటామని ప్రకటన చేయడంపై ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. పోటీ చేసి చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు తెచ్చుకోకుంటే పార్టీ పరువు పోతుందని బాహాటంగానే చెబుతున్నారు. పార్టీలోనే విమర్శలు 1989లో టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థిగా కర్నాటి ఆంజనేయరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ బి.సుందరరామిరెడ్డిపై పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. 2004 ఎన్నికల్లో కూడా టీడీపీ పోత్తులో భాగంగా బొల్లినేని కృష్ణయ్య బీజేపీ నుంచి పోటీ చేయగా ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి కొమ్మి లక్ష్మయ్య నాయుడు విజయం సాధించారు. ఆపై ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసినా కనీస దరావతు కూడా రాని పరిస్థితి. ప్రస్తుతం వైఎస్సార్సీపీ సంక్షేమ పాలనకు జనం జై కొడుతున్నారు. దీనికితోడు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి సానుభూతి ప్రభంజనంలా పనిచేస్తుంది. ఈ తరుణంలో బీజీపీ పోటీకి సిద్ధపడడంపై ఆ పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఆ కుటుంబానికి రాజకీయాల్లో ఎలాంటి మచ్చలేదు: బాలినేని
సాక్షి, నెల్లూరు: మేకపాటి కుటుంబానికి రాజకీయాల్లో ఎలాంటి మచ్చ లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఆ కుటుంబం ఎంతో కృషి చేసిందన్నారు. ఈ మేరకు బాలినేని మీడియాతో మాట్లాడుతూ.. ఆత్మకూరు అభ్యర్థి ఎంపికకు సంబంధించి రాజమోహన్రెడ్డి నిర్ణయానికి సీఎం జగన్ వదిలేశారు. లక్ష ఓట్ల మెజారిటీ తీసుకువచ్చి గౌతమ్కు ఘనమైన నివాళి ఇస్తాము. రెండేళ్లు మరింత కృషి చేసి 2024 ఎన్నికల్లో మరింత మెజారిటీ సాధిస్తామని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కాగా, జూన్ 23వ తేదీన ఆత్మకూరు ఉప ఎన్నిక జరుగనుండగా, 26వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు. చదవండి: (ఆత్మకూరు ఉప ఎన్నిక: నామినేషన్ దాఖలు చేసిన విక్రమ్రెడ్డి) -
చెరగని గౌతమ ముద్ర
ఎన్నికల క్షేత్రంలో ఆత్మకూరు గడ్డపై మహామహులు తలపడ్డారు. ఏడు దశాబ్దాల చరిత్రలో నేటితరం దివంగత నేత మేకపాటి గౌతమ్రెడ్డి ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో 16 సార్లు ఎన్నికలు జరిగితే.. ఇందులో అత్యధిక మెజార్టీల రికార్డు ఆయనకే సొంతమైంది. అతి స్వల్ప మెజార్టీతో విజయ తీరానికి చేరిన చరిత్రను ఆనం సంజీవరెడ్డి దక్కించుకున్నారు. వరుసగా రెండేసి సార్లు గెలుపొందిన ముగ్గురిలో మేకపాటి గౌతమ్రెడ్డి ఒకరు. ప్రజల మనస్సు దోచిన ఆయన అకాల మరణంతో ఉప ఎన్నికలు తెరపైకి వచ్చాయి. ఉప ఎన్నికల్లోనూ గౌతమ్ ముద్ర సృష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాజకీయ యవనికపై ఎందరో నేతలు వస్తుంటారు.. కానీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న వారు ఒకరో ఇద్దరు ఉంటారు. అందులో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ఒకరు. జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాభిమానాన్ని మూటకట్టుకున్న నేటి తరం నాయకుడు గౌతమ్ చెరగని ముద్ర వేశారు. వరుసగా రెండు దఫాలు అత్యధిక మెజార్టీలు దక్కించుకున్న నేతగా మేకపాటి గౌతమ్రెడ్డి ఈ నియోజకవర్గ చరిత్రలో మిగిలిపోయారు. 1952 నుంచి 2019 వరకు 16 దఫాలు ఎన్నికలు జరిగాయి. తాజాగా ఈ నెల 23న ఉప ఎన్నిక జరగనుంది. నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగడం ఇది రెండు దఫా అవుతుంది. 1958లో తొలిసారి ఆత్మకూరు ఉప ఎన్నికలు రాగా, మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి దివంగతులు కావడంతో రెండో దఫా ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ప్రస్తుతం నామినేషన్లు పర్వం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. అత్యధికం గౌతమ్రెడ్డి.. అతి స్వల్పం సంజీవరెడ్డి ఆత్మకూరు ఎన్నికల చరిత్రలో అత్యధిక మెజార్టీ మేకపాటి గౌతమ్రెడ్డి సొంతం కాగా, అతి స్వల్ప మెజార్టీ ఆనం సంజీవరెడ్డి దక్కాయి. 1958లో బెజవాడ గోపాల్రెడ్డి ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించారు. అప్పట్లో ఆయన సర్వేపల్లిలో కొనసాగుతూ ఆత్మకూరు శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అప్పట్లో ఉప ఎన్నికల అనివార్యమైంది. ఆనం సంజీవరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, తన సమీప ప్రత్యర్థి జీసీ కొండయ్యపై 45 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆనం సంజీవరెడ్డికి 22,358 ఓట్లు లభించగా, పీఎస్పీ అభ్యర్థి జీసీ కొండయ్యకు 22,313 ఓట్లు లభించాయి. ఆత్మకూరు చరిత్రలో ఇది అతి స్వల్ప మెజార్టీగా చరిత్రగా నిలిచిపోయింది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి గౌతమ్రెడ్డి 31,412 ఓట్లు మెజార్టీ లభించింది. రెండో దఫా 2019 ఎన్నికల్లోనూ 22,276 ఓట్ల అత్యధిక మెజార్టీ వచ్చింది. ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీలు ఇవే కావడంతో ఆ రికార్డులు గౌతమ్రెడ్డికి దక్కాయి. స్వల్ప మెజార్టీతో విజయం దక్కించుకున్న వారిలో మరో ఇరువురు ఉన్నారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థి బి సుందరరామిరెడ్డి బీజేపీ అభ్యర్థి కె ఆంజనేయరెడ్డిపై 334 ఓట్లుతో విజయం సాధించారు. 1999లో కాంగ్రెస్ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్య, టీడీపీ అభ్యర్థి కొమ్మి లక్షుమయ్యనాయుడిపై 2,069 ఓట్లతో విజయం సాధించారు. ఇవే తక్కువ మెజార్టీతో అభ్యర్థులు గెలుపొందిన ఎన్నికలు కావడం విశేషం. టీడీపీయేతరులే విజేతలు ఆత్మకూరు నియోజకవర్గం ఆది నుంచి కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా నిలిచిందనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు 7 సార్లు ఎన్నికలు జరిగితే.. 5 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. రెండు సార్లు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. 1983 నుంచి 2019 వరకు 9 సార్లు ఎన్నికలు జరిగితే 1983, 94లో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. నాలుగు సార్లు కాంగ్రెస్, ఒకసారి స్వతంత్ర అభ్యర్థి, రెండు సార్లు వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం దక్కించుకున్నారు. వరుసగా రెండు సార్లు గెలిచిన జాబితాలో ముగ్గురు ఆత్మకూరులో 16 దఫాలుగా ఎన్నికలు జరిగితే.. వరుసగా రెండు సార్లు విజయం సాధించిన వారు ముగ్గురే. ఇందులో మేకపాటి గౌతమ్రెడ్డి ఒకరు. 1958, 1962లో వరుసగా రెండు సార్లు ఆనం సంజీవరెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించారు. 1978లో తొలిసారి విజయం సాధించిన బి సుందరరామిరెడ్డి 1983లో టీడీపీ అభ్యర్థి అనం వెంకటరెడ్డితో తలపడి ఓడిపోయారు. తిరిగి 1985, 89లో వరుసగా కాంగ్రెస్ అభ్యర్థిగా అక్కడి నుంచి సుందరరామిరెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 2014, 19ల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్రెడ్డి వరసగా రెండు సార్లు ఘన విజయం సాధించారు. -
ఆత్మకూరు ఉప ఎన్నిక: నామినేషన్ దాఖలు చేసిన విక్రమ్రెడ్డి
నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా గురువారం విక్రమ్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సీఎం జగన్ చేతుల మీదుగా బుధవారం బీ ఫారం అందుకున్న విక్రమ్రెడ్డి.. నేడు నామినేషన్ దాఖలు చేశారు. విక్రమ్రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డితో పాటు వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. బైపాస్రోడ్డులోని అభయాంజనేయస్వామి ఆలయంలో విక్రమ్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నెల్లూరు సెంటర్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం విక్రమ్రెడ్డి మాట్లాడుతూ.. ‘నామినేషన్కు వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు అందరూ రావడం సంతోషం. ఈ ఎన్నికలు నాకు కొత్త. అయినా సీరియస్గా తీసుకుని పని చేస్తాం. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాం’ అని పేర్కొన్నారు. కాగా, జూన్ 23వ తేదీన ఆత్మకూరు ఉప ఎన్నిక జరుగనుండగా, 26వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు. చదవండి👉 సీఎం జగన్ చేతుల మీదుగా బీ ఫారం అందుకున్న విక్రమ్రెడ్డి -
వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బలపరుద్దాం
ఆత్మకూరు: రాష్ట్రంలో మూడేళ్లుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో సంక్షేమ ఫలాలు వెల్లివిరుస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని సమైక్యంగా బలపరుద్దామని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి కోరారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో స్థానికంగా శ్రీధర్ గార్డెన్స్లో మంగళవారం నియోజకవర్గ స్థాయి వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. రాజమోహన్రెడ్డి మాట్లాడుతూ.. గౌతమ్రెడ్డి ఆకస్మిక మృతితో ఉప ఎన్నికలు జరుగుతాయని కలలో కూడా అనుకోలేదని, ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా మూడేళ్లుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కరోనా కష్టకాలంలోనూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిబాగా లేకున్నా సంక్షేమ పథకాలు ఆగలేదని గుర్తు చేశారు. మూడు మార్లు ఎంపీగా జిల్లా ప్రజలు తనను గెలిపించారని, ఆత్మకూరు నుంచి గౌతమ్రెడ్డికి రెండు సార్లు ఘన విజయం అందించారని ఈ రుణం తీర్చుకోలేనిదన్నారు. ప్రస్తుతం జరగనున్న ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో విక్రమ్రెడ్డి పోటీ చేస్తున్నారని, ఆయన్ను నిండు మనస్సుతో ఆశీర్వదించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. తమ కోడలు శ్రీకీర్తి గౌతమ్రెడ్డి పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఉన్నారని, ఆ ఫౌండేషన్లో తామంతా సభ్యులమేనని, ప్రభుత్వం ద్వారా చేయలేని పనులను ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవచేస్తామని అన్నారు. 2వ తేదీన నామినేషన్ గురువారం మేకపాటి విక్రమ్రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు, నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని రాజమోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ఉదయం 9 నుంచి నిరాడంబరంగా ఆర్డీఓ కార్యాలయం వరకు నాయకులతో కలిసి వెళ్లి 11 గంటల సమయంలో నామినేషన్ దాఖలు చేస్తారన్నారు. ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది: మేకపాటి విక్రమ్రెడ్డి ఇటీవల పార్టీ ఆదేశాల మేరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని పలు మండలాల్లో నిర్వహించినప్పుడు లబ్ధిదారులు తమకు అందుతున్న సంక్షేమ పథకాలను తెలిపి ప్రభుత్వంపై తమకున్న నమ్మకాన్ని వెల్లిబుచ్చారని మేకపాటి విక్రమ్రెడ్డి అన్నారు. కార్యకర్తలు పారీ్టకి స్తంభాల్లాంటి వారని, వారు చేసిన కృషితోనే నాయకులు పదవుల్లోకి వస్తారని, వారి మేలు ఎప్పటికి మరచిపోలేమన్నారు. తొలుత దివంగత మంత్రి గౌతమ్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల శ్రీహరినాయుడు, పార్టీ మండలాల కనీ్వ నర్లు అల్లారెడ్డి ఆనంద్రెడ్డి, పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, రాపూరు వెంకటసుబ్బారెడ్డి, జితేంద్రనాగ్రెడ్డి, తూమాటి విజయభాస్కర్రెడ్డి, బొర్రా సుబ్బిరెడ్డి, నాయకులు గంగవరపు శ్రీనివాసులునాయుడు, కంటాబత్తిన రఘునాథరెడ్డి, ఎంపీపీలు కేతా వేణుగోపాల్రెడ్డి, బోయళ్ల పద్మజారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు పీర్ల పార్థసారథి, మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటమణమ్మ, వైస్ చైర్మన్లు డాక్టర్ కేవీ శ్రావణ్కుమార్, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. -
'గౌతమ్ బాబు చేసిన కార్యక్రమాలను విక్రమ్ ముందుకు తీసుకెళ్తారు'
సాక్షి, నెల్లూరు: ఆత్మకూరు ఉపఎన్నికకు జూన్ 2న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి తెలిపారు. ఈ మేరకు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా కుటుంబంలో అనుకోని విషాదం జరిగింది. విక్రమ్ రెడ్డిని ఆత్మకూరు నుంచి పోటీకి నిలబెట్టాం. గౌతమ్ బాబు చేసిన కార్యక్రమాలను విక్రమ్ ముందుకు తీసుకెళ్తారు అని మాజీ ఎంపీ రాజమోహన్రెడ్డి అన్నారు. ఆత్మకూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డి మాట్లాడుతూ.. గౌతమ్ అన్న ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. సీఎం వైఎస్ జగన్కు ప్రజల ఆశీర్వాదం ఉంది. ప్రభుత్వానికి పూర్తి ఆదరణ ఉంది. సీఎంకి ఉన్న జనాదరణ, గౌతమ్ అన్నపై ఉన్న అశేష అభిమానం భారీ విజయానికి సోపానాలు కానున్నాయని విక్రమ్రెడ్డి తెలిపారు. చదవండి: (2019లో బాలకృష్ణ కూడా తొడలు కొట్టాడు.. ఏమైంది..?: మంత్రి జోగి రమేష్) -
ఆత్మకూరు ఉప ఎన్నికకు పక్కాగా ఏర్పాట్లు
నెల్లూరు(అర్బన్): ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు తెలిపారు. నెల్లూరులోని కలెక్టరేట్లో ఉన్న తిక్కన ప్రాంగణంలో జేసీ హరేంద్ర ప్రసాద్తో కలిసి గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వచ్చే నెల 28వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్నారు. బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వీవీ ప్యాట్స్ సిద్ధం చేశామన్నారు. ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జేసీ హరేంద్ర ప్రసాద్ వ్యవహరిస్తారన్నారు. ప్రత్యేక బృందాల ఏర్పాటు ఓటర్లలో 80 ఏళ్లు పైబడిన వారు 4,981 మంది, విభిన్న ప్రతిభావంతులు 4,777 మంది ఉన్నారని కలెక్టర్ తెలిపారు. వారు సజావుగా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల్లో వీల్ చైర్లు, సహాయకులను ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గంలో 279 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 1,000 ఓట్లుపైబడి ఉంటే అదనపు పోలింగ్ కేంద్రాన్ని పెడతామన్నారు. ఓటర్ల జాబితాను అభ్యర్థులకు, పోలింగ్ ఏజెంట్లకు ఇస్తామన్నారు. 648 బ్యాలెట్ యూనిట్స్ను, 593 కంట్రోల్ యూనిట్స్ను, 583 వీవీ ప్యాట్స్ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఓటరు స్లిప్పులను ఓటర్లకు అందించి ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారులు ఎవరూ పాల్గొనరాదని సూచించారు. ప్రవర్తనా నియమావళి (కోడ్) సక్రమంగా అమలు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా కోవిడ్ నోడల్ అధికారిగా డీఎంహెచ్ఓ డాక్టర్ పెంచలయ్యను నియమించామన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ హిమావతి, డీఆర్వో వెంకట నారాయణమ్మ, కలెక్టరేట్ పరిపాలనాధికారి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ∙ఉప ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ గురువారం అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ చక్రధర్బాబు ఎన్నికల నిర్వహణ గురించి చేపట్టిన చర్యలను వివరించారు. ఈవీఎం యంత్రాల గోదామును తనిఖీ చేశామన్నారు. జేసీ హరేంద్ర ప్రసాద్, ఏఎస్పీ హిమవతి పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో.. నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఆత్మకూరు ఉప ఎన్నిక పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా జిల్లా పోలీసు కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నికల నియమావళిని అందరూ పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. -
Andhra Pradesh: ఆత్మకూరు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఉప ఎన్నికల నగారా మోగింది. వివిధ రాష్ట్రాలలో ఖాళీ ఏర్పడిన పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఆరు రాష్ట్రాల్లో 3 ఎంపీ, 7 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 30న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 6. నామినేషన్ల పరిశీలన జూన్7న. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూన్ 9. జూన్ 23న పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 26న ఫలితాలు వెల్లడిస్తారు. జూన్ 28న ఉప ఎన్నికల షెడ్యూల్ ముగుస్తుంది. కాగా, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉప ఎన్నిక జరిగే స్థానాలు ►ఉత్తర ప్రదేశ్: రెండు ఎంపీ స్థానాలు (రాంపూర్, అజాంఘర్) ►పంజాబ్: ఒక ఎంపీ స్థానం (సంగ్రూర్) ►త్రిపుర: నాలుగు అసెంబ్లీ స్థానాలు (అగర్తల, టౌన్ బోర్డోవళి, సుర్మా, జుబరాజ్నగర్) ► ఆంధ్రప్రదేశ్: ఒక అసెంబ్లీ స్థానం (ఆత్మకూరు) ►ఢిల్లీ: ఒక అసెంబ్లీ స్థానం (రాజిందర్ నగర్) ►జార్ఖండ్: ఒక అసెంబ్లీ స్థానం (మాందార్) -
సామాన్యుడి నుంచి కార్పొరేట్ల వరకు అందరి వాడు..
మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి హఠాన్మరణంతో జిల్లా శోక సంద్రంలో మునిగిపోయింది. మృధుస్వభావి, మానవతావాది, స్నేహశీలి, వివాదారహితుడిగా అందరి ఆత్మబంధువయ్యారు. దశాబ్ద కాలంలోనే రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో రాజకీయాల్లో విభిన్నమైన వ్యక్తిగా బలమైన నేతగా ఎదిగారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా తన రాజకీయ ప్రస్థానంలో సామాన్యుడి నుంచి కార్పొరేట్ల వరకు అందరి వాడయ్యారు. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రిగా జిల్లా అభివృద్ధిలోనే కాకుండా రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అజాత శత్రువు అంతలోనే దిగంతాల్లో ఒరిగిపోయారు. సాక్షి, ఆత్మకూరు (నెల్లూరు): రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి (50) అకాల మరణంతో సింహపురి కన్నీటి సంద్రమైంది. జిల్లా ప్రజలు కఠోర నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి రెండుమార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. రెండో దఫాలో కీలకమైన రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి పదవిని చేపట్టారు. ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగి ఉండే అరుదైన నేతగా ముద్ర వేసుకున్నారు. అందరిని ఆత్మీయంగా పలకరించే గౌతమ్రెడ్డి ఆకస్మిక మృతి వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. జిల్లా వ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. 2013లో ఆత్మకూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న మేకపాటి గౌతమ్ రెడ్డి (ఫైల్) రాజకీయ అరంగ్రేటం నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి పెద్ద కుమారుడు గౌతమ్రెడ్డి. మాంచెస్టర్లో ఎమ్మెస్సీ టెక్స్టైల్స్ పూర్తిచేసి వ్యాపార రంగంలో బిజీగా ఉండేవారు. తన తండ్రి ఒంగోలు, నరసారావుపేట, నెల్లూరు ఎంపీగా పోటీ చేసిన సమయంలో మాత్రమే ప్రచార బాధ్యతలు నిర్వహించేవారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు 2013లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగ్రేటం చేశారు. ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలతో ప్రత్యక్ష పరిచయంతో పాటు నియోజకవర్గ సమస్యలపై అవగాహన కల్పించేకునేందుకు పాదయాత్ర చేపట్టారు. గతంలో ఇలా పాదయాత్ర చేపట్టిన నాయకులే లేకపోవడంతో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో గ్రామ గ్రామాన పాదయాత్రలో పలువురిని పేరు పేరున పలుకరిస్తూ వ్యక్తిగతంగా ప్రజలకు దగ్గరయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా ఆత్మకూరు నుంచి పోటీ చేసి 33 వేల పైచిలుకు మెజార్టీతో ఘన విజయం సాధించారు. అయితే ప్రతిపక్ష శాసన సభ్యుడిగా ఐదేళ్ల పాటు ఆయన నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించేందుకు తన సొంత నిధులు వెచ్చించారు. మరింత ప్రజాభిమాన నేతగా ఎదిగారు. అభివృద్ధికి ప్రణాళికలు 2019లో జరిగిన ఎన్నికల్లో మేకపాటి గౌతమ్రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం నుండే రెండో దఫా 22,500 మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆ వెంటనే రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, చేనేత, జౌళి శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కీలకమైన శాఖలకు మంత్రిగా ఆ శాఖల ప్రగతికి అహర్నిశలు శ్రమిస్తూనే.. మరో వైపు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న మెట్ట ప్రాంతం ఆత్మకూరు నియోజకవర్గంలో శాశ్వత అభివృద్ధికి పునాదులు వేశారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు పలుమార్లు ఆత్మకూరులోనే జాబ్ మేళాలు నిర్వహించారు. ఎందరికో ఉద్యోగావకాశాలు కల్పించారు. ఆత్మకూరును పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నారంపేట వద్ద ఎంఎస్ఎంవీ పార్కు నెలకొల్పారు. ఇక్కడ పలు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎంఓయూలు కుదుర్చుకున్నారు. సాగు, తాగునీటి కష్టాలు తీరుస్తూ.. ఆత్మకూరు నియోజకవర్గంలోనే జలనిధి ఉన్నప్పటికీ రైతుల సాగునీటి వెతలను పాదయాత్ర గుర్తించారు. తాగునీటికి పడుతున్న కష్టాలను తెలుసుకున్నారు. ఆనాడు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ చివరి ఆయకట్టు రైతులకు నీరందేలా చూడాలని పలుమార్లు జలవనరుల శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహించి అమలు చేశారు. గతానికి భిన్నంగా డెల్టాతో సమానంగా సోమశిల జలాలు మెట్ట ప్రాంతాలకు అందేలా చర్యలు చేపట్టారు. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న సోమశిల ఉత్తర కాలువ హైలెవల్ కెనాల్ పనుల్లో అభివృద్ధి సాధించేలా ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించి వేగంగా పనులు జరిగేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఫేజ్–1, ఫేజ్–2 పనులు వేగవంతమయ్యేలా కృషి చేశారు. ఎంజీఆర్ స్వజల్ పథకం ఏర్పాటు చేయించి స్వచ్ఛమైన తాగునీటిని తక్కువ ధరకే మున్సిపల్ ప్రజలకు అందేలా పథకానికి శ్రీకారం చుట్టి, ఆరు నెలలకే ప్రజలకు అందుబాటులో వచ్చేలా చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ప్రజలకు అందుబాటులో.. రాష్ట్ర కీలక శాఖల మంత్రిగా అనునిత్యం బిజీగా ఉండే మేకపాటి గౌతమ్రెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఎంజీర్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఆ నంబరుకు సమస్యలు ఉన్న వారు ఫోన్లో చెబితే వాటి పరిష్కారానికి కృషి చేసేలా ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి ఎన్నో సమస్యలను పరిష్కరించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కోసం ఎక్కువ రోజులు దేశ, విదేశాల్లో పర్యటనలు చేస్తూనే.. నియోజకవర్గ అభివృద్ధి, పాలనలో ఎక్కడా లోపం లేకుండా చూశారు. ఎక్కడ ఉన్న ప్రతి నెలలో అన్ని మండలాల అధికారులు, ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించే వారు. సమస్యల పరిష్కారం, అభివృద్ధికి సూచనలు చేస్తూ, అందుకు అవసరమైన నిధులు సమకూర్చుతుండే వారు. నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 228 మందికి రూ.1.92 కోట్ల సహాయాన్నిఅందించడంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తన వంతు కృషి చేశారు. ఇదే కాక ఎందరికో వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేసిన మంచి వ్యక్తి గౌతమ్ రెడ్డి. -
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్సై లింగయ్య యాదవ్పై వేటు
-
ఊరు కోసం ప్రాణదానం.. గొల్లభామగా మహిమలు
ఆత్మకూరు: సముద్రాన్ని తలపించేలా పేరుకు తగినట్టుగా ఉన్న ‘అనంతసాగరం’ చెరువును 1520వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయల మంత్రి తిమ్మరసుచే నిర్మించబడింది. అనంతరం కొంత కాలానికి ఆయన శిష్యుడు రాయసం కొండ మురసయ్య ఈ చెరువుకు కట్ట నిర్మిస్తుండగా ఓ చోట పెద్ద గండి పడింది. దీంతో గ్రామం నీట మునిగే పరిస్థితి నెలకొంది. గ్రామ పెద్దలు ఏం చేయాలో తెలియక దిక్కు తోచక తలలు పట్టుకున్నారు. ఆ సమయంలో మానవబలి ఇస్తే గండి పూడుతుందని ఆకాశవాణి పలికిందట. అదే సమయంలో గ్రామానికి చెందిన ఓ యాదవ మహిళ ధైర్యంగా ముందుకు వచ్చి ఆ గండిలో నిలబడింది. దీంతో వరద ప్రవాహం నిలిచిపోయిందని, ఆమె త్యాగానికి గుర్తుగా చెరువు కట్టపై శిలను ఏర్పాటు చేసి బలిదానమైన ఆమెకు గుర్తుగా గొల్లభామ శిలగా అప్పట్లో పెద్దలు నామకరణం చేసి పూజలు చేయడం ప్రారంభించారు. ఇప్పటికి గొల్లభామ విగ్రహం వద్ద స్థానికులు ఆది, మంగళవారాల్లో మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఆ గొల్లభామ స్థంభం కింద గుప్త నిధులు ఉన్నాయంటూ పుకార్లు షికార్లు చేయడంతో 2003వ సంవత్సరంలో కొందరు జేసీబీ వంటి యంత్రాలతో తవ్వించేందుకు ప్రయత్నించగా గొల్లభామ శిల మహిమో, మంత్ర మహిమో కాని ఆ జేసీబీ ఆగిపోయి మరమ్మతులకు గురై నిలిచిపోయింది. ఎంత ప్రయత్నించినా నిధుల కోసం గుంత తీయలేని పరిస్థితి నెలకొంది. ఇంతలో తెల్లవారడంతో గ్రామస్తులు వారిని పోలిసులకు పట్టించారు. అప్పటి నుంచి గొల్లభామ మహిమ మరింత విస్తృతమై స్థానికులు మరింత భక్తిప్రపత్తులతో పూజలు నిర్వహిస్తున్నారు. -
అంతరిస్తున్న ఆదిమానవుడు
ఆత్మకూరు రూరల్: హిరణ్యకశిపుడిని సంహరించడానికి ఉగ్ర నారసింహ అవతారమెత్తిన విష్ణుమూర్తి లోక భీకర రౌద్రాన్ని తన అందచందాలతో హరించి ఆయన్ను వరిస్తుంది చెంచులక్ష్మి. పురాణ కాలంలోనే మనకు ఇలా చెంచుల ప్రస్తావన కనిపిస్తుంది.మానవుడి ఆవిర్భావం ప్రస్తుతం ఆఫ్రికాగా పిలవబడే ప్రాంతంలో సంభవిస్తే భూమి ఖండాలుగా విడిపోయిన కాలంలో ఆఫ్రికాఖంఢపు దక్షిణ భాగంలో అతుక్కుని ఉన్న ప్రస్తుత భారత ఉప ఖండపు దక్షిణభాగం ద్వారా మానవుడి విస్తరణ ఆసియా ఖండానికి సాగిందని ఆంత్రపాలజిస్టులు చెబుతున్నారు. తన చంటి పిల్లలతో చెంచు మహిళ అలా భారత దేశంలోకి విస్తరించిన తొలిమానవుడి ఆనవాలు తూర్పు కనుమల్లో భాగమైన నల్లమల అడవుల్లో ఆదిమ గిరిజన చెంచుల రూపంలో నిలిచి ఉంది.జన్యు పరివర్తనం జరగక పోవడంతో చెంచులలో రోగనిరోధక శక్తి నశించి వారి జీవన ప్రమాణం కనిష్ట స్థాయికి చేరుకుంది. చెంచితల్లో అసలే రక్తహీనత,అందులో బాల్యవివాహాల సంఖ్య ఎక్కువే ఈ కారణంతో ప్రతి ప్రసవం ఒక గండంగా గడుపుతు అకాల మరణాలకు గురవుతుంటారు. ఆదిమ గిరిజన లక్షణమైన మద్యపానం చెంచుల్లో ఆహారపు అలవాటుగా కొనసాగుతూ ప్రస్తుతం అది వ్యసన దశకు చేరి చెంచుల మరణాల రేటును పెంచి వారి జాతి అంతరించేపోయే దిశకు తీసుకుపోతోంది. దైనందిన జీవనంలో ఓ చెంచు కుటుంబం చెంచుల ఆవాసప్రాంతం ఆదిమ గిరిజన తెగకు చెందిన చెంచులు తూర్పు కనుమల్లో భాగమైన నల్లమల అడవుల్లో మాత్రమే నివసిస్తున్నారు.ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పూర్వ మహబూబ్ నగర్,కర్నూలు,ప్రకాశం,గుంటూరు జిల్లాల్లో విస్తరించిన నల్లమల అడవుల్లో మాత్రమే వీరి ఉనికి ఉంది. విల్లంబులతో చెంచు యువకుడు జీవనవిధానం అడవుల్లోను , అడవి అంచుల్లో నివాసముండే చెంచులు ఒక ప్రత్యేకమైన డిజైన్లో కనిపించే గుండు గుడిసెల్లో నివాసముంటారు. ఆహార సేకరణ దశలోనే ఉన్న చెంచులు అడవుల్లో దొరికే చిన్నతరహా అటవి ఉత్పత్తుల సేకరణతో జీవనం సాగిస్తారు.భుజాన గొడ్డలి, చేతిలో విల్లంబులు,ముందు నడుస్తు కుక్క,వెనుకనే అనుసరిస్తు భార్య ... ఇది సంప్రదాయ చెంచుకుటుంబం ఆహార సేకరణకు అడవిలోకి నడిచే దృశ్యం. ఉడుముల వంటి చిన్నపాటి జంతువులను వేటాడతారు. చెంచుల బాల్యం ఇపుడిపుడే ప్రభుత్వం ,ఆర్డిటి (రూరల్ డవలప్మెంట్ ట్రస్ట్) వంటి స్వఛ్ఛంధ సంస్థలు కట్టించి ఇస్తున్న ఇళ్లలో నివాసముంటున్నారు. మూఢ నమ్మకాల కారణంగా చెంచులు ఇళ్ళలో శయనించరు.గూడెం మధ్యలో ఏర్పాటు చేసుకున్న వెదురు మంచలపై పడుకుంటారు.అలాగే రాత్రిపూట మైధునం చెంచుల్లో నిషిద్దం. వారు ఆహారసేకరణకు అడవిలో సంచరించే టపుడు పగటి పూట మాత్రమే శృంగారంలో పాల్గొంటారు. చెంచులు అమిత సిగ్గరులు. మైదాన ప్రాంతీయులతో చాలా తక్కువగా మాట్లాడతారు.ఎక్కువగా ఏకాంతాన్ని కోరుకుంటారు.ఈ కారణంగానేమో రెండు సంవత్సరాలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరొనా భూతం చెంచుగూడేల్లోకి చొరబడ లేక పోయింది.ఆహార సేకరణ దశను దాటలేక పోతున్న చెంచులకు ఎంతగా ప్రయత్నించినా వ్యవసాయం ఒంట పట్టడంలేదు. అందుకే చెంచుల పొలాలు గిరిజనేతరుల చేతుల్లోకి వెళుతున్నాయి. చెంచు కుర్రాడి పనితనం కర్నూలు జిల్లాలో చెంచుల స్థితి కర్నూలు జిల్లాలో మొత్తం 12 మండలాల్లో 42 గూడేల్లో చెంచులు నివసిస్తున్నారు. వెలుగోడు పట్టణంలో 1, ఆత్మకూరులో1 ,పాణ్యం మండలంలో 1,చెంచు గూడెం మినహా అన్ని చెంచు గూడేలు అన్ని నల్లమల అడవుల్లోనో, అటవీ సమీప ప్రాంతంలోనో ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం కర్నూలు జిల్లాలో 2133 చెంచు కుటుంబాలు ఉండగా అందులో 4138 మంది పురుషులు,4022 మంది స్త్రీలు కలిపి మొత్తం జనాభా 8,160 గా ఉన్నారు. చెంచుల సాంప్రదాయ నివాసం గుండు గుడిసెలు పలుచనవుతున్నచెంచుగూడేలు చెంచుగూడేల్లో నానాటికి వారి జనాభా తగ్గిపోతు అంతరించి పోయే దశకు చేరుకుంటోంది.ఉదాహరణకు 40ఏళ్ళ కిందట ఆత్మకూరు అటవి డివిజన్లోని పసురుట్ల, రుద్రకోడు చెంచు గూడేలను తరలించి సమీప గ్రామమైన నల్లకాల్వ సమీపంలో పునరావాసం కల్పించారు.నాడు రెండు గూడేలు కలసి 120కి పైగా చెంచులు నల్లకాల్వ చేరారు. ఇపుడు వారి సంఖ్య 35కు మించి లేక పోవడం విషాదం.2011 జనాభా లెక్కల ప్రకారం కర్నూలు జిల్లాలో 8,160 గా కనిపిస్తున్న చెంచుల జనాభా ఇప్పడు తీయబోయే గణాంకాలలో ఎంత పడిపోయేది అర్థం కాని స్థితి ఉంది.అంతరించి పోయే దశలో ఉన్న పులుల సంరక్షణ కోసం పటిష్ట మైన చట్టాలు,చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం అంతరించ బోతున్న ఒక ఆదిమ మానవ జాతి రక్షణ కోసం యుద్దప్రాతిపదికన రంగంలోకి దిగాల్సి ఉంది. మాడపు గింజలు కాల్చుకు తింటున్న చెంచులు చెంచుల కోసం హేమన్ డార్ఫ్ కృషి చెంచుల స్థితిగతులపై ఒక నివేదికను కోరుతూ నాటి బ్రిటీష్ ప్రభుత్వం హేమన్ డార్ఫ్ అనే విశేషజ్ఞుడిని నియమించింది. ఆయన అప్పట్లో నిజాం తెలంగాణాలోను ఆంధ్ర ప్రదేశ్లోను అనేక ఆదిమ గిరిజన తెగలపై పరిశోధనలు జరిపారు.ఆయన ఇచ్చి నివేదిక సారాంశం తోనే అటు నిజాం నవాబు, ఇటు బ్రిటిష్ ప్రభుత్వము నల్లమల అడవులను చెంచుల (అభయారణ్యం)రిజర్వ్గా ప్రకటించింది.వారి సంరక్షణ కోసం ప్రత్యేక చట్టాలు చేశారు. కాని నేడు నల్లమల అంతా పులుల అభయారణ్యంగా మారడం అడవి బిడ్డలైన చెంచులను అడవిని వదలి వెళ్ళాలనే ఒత్తిడికి గురవుతుండడం నేటి విషాదం. కుక్క తోడు ఆదిమ గిరిజన లక్షణం చెంచుల అభివృధ్ధి కోసం ప్రత్యేక ప్రభుత్వ ఏజెన్సీలు చెంచులను అభివృధ్ధి పథంలో తీసుకు వచ్చేందుకు సమీకృతగిరిజనాభి వృధ్ధి సంస్థను శ్రీశైలంలో ఏర్పాటు చేశారు.ఈ ఏజెన్సీ కార్యాచరణలో చెంచుల అభివృధ్ధి కోసం పలు ప్రణాళికలు రచించినా అవి వారిని ఉన్నదశనుంచి మరొ దశకు తీసుకు పోలేని స్థితి నెలకొంది. విద్య, వైద్య రంగాలలో కృషిఅంతంత మాత్రంగానే ఉంది.జాతీయ గ్రామీణ ఉపాధిహామి పథకం చెంచుల ఆకలి తీర్చే వరప్రదాయినిగా ఉంటోంది. అయితే ఈ కార్యక్రమంలో పని కల్పించడంలో అధికారులు అలసత్వం చూపుతారనే విమర్శ ఉంది. పెచ్చెర్వు చెంచు గూడెం ఆదర్శ గిరిజన గ్రామంగా బైర్లూటి ఆత్మకూరు మండల పరిధిలో ఉన్న బైర్లూటి చెంచు గిరిజన గ్రామాన్ని రాష్ట్రప్రభుత్వం ఆదర్శ గ్రామంగా ప్రకటించింది. ఈ ప్రకటణలో ఆంతర్యం గ్రామాన్ని ఆదర్శగ్రామంగా చేయాలని.సకల మౌళిక వసతుల కల్పన ఈ పథకపు ఉద్దేశంగా కనపడుతోంది.రాష్ట్రంలో ఇలా ఆదర్శగ్రామంగా ప్రకటించ బడిన ఆదిమ గిరిజన గ్రామం బైర్లూటి ఒక్కటే కావడం విశేషం. -
బ్యాంక్కు నిద్రలేని రాత్రి: అర్ధరాత్రి పాము హల్చల్
ఆత్మకూరు: బ్యాంక్లో పాము దూరి హల్చల్ చేసింది. అనంతపురము జిల్లా ఆత్మకూరులోని స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శాఖలో శుక్రవారం అర్ధరాత్రి ఓ పాము కలకలం రేపింది. శనివారం తెల్లవారుజాము 4.30 గంటల వరకూ బ్యాంక్ అధికారులు, పోలీసులకు కంటి మీద కునుకులేకుండా చేసింది. బ్యాంక్ మేనేజర్ పరుశురాం, ఏఎస్ఐ వరుణాచారి తెలిపిన మేరకు.. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బ్యాంక్ అలారం ఒక్కసారిగా మోగింది. అప్పటికే అనంతపురంలోని తన గృహంలో నిద్రిస్తున్న బ్యాంక్ మేనేజర్ మొబైల్ ఫోన్లో సైతం అలారం (బ్యాంక్ సైరన్తో అనుసంధానం) మోగడంతో వెంటనే ఆయన అప్రమత్తమై పోలీసులకు, స్థానికంగా ఉన్న బ్యాంక్ సిబ్బందికి సమాచారం అందించారు. ఆగమేఘాలపై బ్యాంక్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే అలారం మోతకు చుట్టుపక్కల వారు నిద్రలేచి బ్యాంక్ చుట్టూ గుమిగూడారు. దొంగలు పడ్డారేమోననే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతుండగా బ్యాంక్ ఉద్యోగులు తలుపులు తీశారు. లోపల అనుమానాస్పద వ్యక్తులు ఎవరూ కనిపించలేదు. క్షుణ్ణంగా గాలించారు. అలారం స్విచ్ వద్ద ఓ పాము కనిపించడంతో దానిని చంపేశారు. అప్పటికే తెల్లవారుజాము 4.30 గంటలైంది. పాము కదలికలతో అలారం స్విచ్ ఆన్ అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
జగిత్యాలలో దెయ్యం చేప.. ఇది వేరే చేపల్నిబతకనివ్వదు!
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని అన్ని చెరువులు దాదాపు నిండుకుండను తలపించాయి. చెరువుల్లో చేపలు పట్టేందుకు మత్య్సకారులు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో ఓ అరుదైన చేప వలకు చిక్కింది. చేపలు పట్టడానికి వెళ్లిన జాలరు గొల్లపెళ్లి రాజనర్సకు అరుదైన వింత చేప తన వలలో పడింది. ఈ విషయాన్ని జిల్లా మత్య్సశాఖ అధికారులకు తెలుపగా.. దీనిని డెవిల్(దెయ్యం) చేప అంటారని, ఇది ఎక్కువుగా సముద్ర జల్లాల్లో మాత్రమే కనిపిస్తుంటుందని అధికారులు తెలిపారు. మన తెలంగాణలోని వాగులో దొరకడం చాలా అరుదు అని పేర్కొన్నారు. కాగా ఈ రకపు డెవిల్ ఫిష్ పై నల్లటి మచ్చలు, ముళ్లు ఉంటాయి. ఈ చేప సుమారు అరకేజీకి పైగానే బరువు ఉంది. తాను ఎన్నో ఏళ్ల నుంచి చేపలు పడుతున్నా ఇలాంటి చేప ఎప్పుడూ చూడలేదని జాలరు రాజనర్సు తెలిపాడు. ఒంటినిండా జీబ్రా రకం గీతలతో కనిపించే ఈ చేపలో తినేందుకు మాంసం ఉండదు. పైగా చేప నిండా ముళ్లు, చర్మం కప్పబడినట్లు ఉంటుంది. సముద్రజాతికి చెందిన ఈ చేప నోరు అడుగు భాగంలో ఉంటుంది. చర్మం అంతా దుప్పటి కప్పబడినట్టు కన్పిస్తుంది. ఈ చేప ఉన్నచోట వేరే చేపలు బతకడం కష్టమని.. తన చుట్టూ ఉన్న మత్స్యాలను ఇది ఆహారంగా తీసుకుంటుందన్నారు. డెవిల్ ఫిష్కు పదునైన దంతాలు ఉండటం వల్ల వలలను సైతం కొరికి వేస్తుందని మత్య్సశాఖ అధికారులు చెబుతున్నారు. -
శ్మశానవాటికలో నిప్పంటించుకుని..
ఆత్మకూరు: పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న ఓ తల్లి శ్మశానవాటికకు వెళ్లి శానిటైజర్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో తల్లీ కూతురు మరణించగా కుమారుడు తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. శ్రీపోట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరుపాళెం సెంటర్లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆత్మకూరు పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. నెల్లూరులోని నవాబుపేట యనమలపాళేనికి చెందిన ఆదినారాయణ తన కుమార్తె వెంకటసుబ్బులు(27)ను తన అక్క కుమారుడైన ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం పేర్లపేట గ్రామానికి చెందిన కొండ్రెడ్డి బాబుకి ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం చేశాడు. వీరికి మహేష్ బాబు (7), మధురవాణి (5) సంతానం. బాబు కర్ణాటకలోని బళ్లారి జిల్లా సిరిగిరి గ్రామంలో పండ్ల తోట కౌలుకు తీసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గురువారం వెంకటసుబ్బులు పిల్లలతో కలిసి బళ్లారి నుంచి నెల్లూరుకు బయల్దేరింది. నెల్లూరుపాళెం సెంటర్లో శుక్రవారం వేకువజామున 4 గంటల సమయంలో బస్సు దిగింది. సెంటర్లో టీ తాగి, అనంతరం వింజమూరు మార్గంలో ఉన్న ముస్లిం శ్మశానవాటికలోకి వెళ్లి పిల్లలతో పాటు తన ఒంటిపై శానిటైజర్ పోసుకుని నిప్పంటించుకుంది. వెంకటసుబ్బులు, మధురవాణి మంటల్లో కాలి మరణించారు. తప్పించుకున్న మహేష్ బాబు భయంతో నెల్లూరుపాళెం సెంటర్కు పరుగెత్తాడు. ఆ సమయంలో పొలాల్లోకి వెళ్తున్న వ్యవసాయ కూలీలు గమనించి కౌన్సిలర్ కామాక్షయ్యనాయుడుకు సమాచారం అందజేశారు. కౌన్సిలర్ స్థానికులతో కలిసి ఘటనా స్థలం వద్దకు వెళ్లి పరిశీలించగా అప్పటికే తల్లి, కుమార్తె మృతి చెంది ఉన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ సోమయ్య, ఎస్సై రవినాయక్ ఘటనా స్థలానికి చేరుకుని మహేష్ ద్వారా వివరాలు తెలుసుకుని బం«ధువులకు సమాచారం అందజేశారు. సొంత మేనల్లుడే తన అల్లుడని, కుటుంబంలో ఎటువంటి కలహాలు లేవని మృతురాలి తండ్రి చెప్పాడు. ఇటీవల అల్లుడు మద్యానికి అలవాటు పడటంతో కుమార్తె వద్దని వారిస్తుండేదని తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు మృతి
సాక్షి, వరంగల్ రూరల్: వరంగల్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ - భూపాలపట్నం రహదారి 163 హైవేపై ఆత్మకూరు మండలం నీరుకుళ్ల వద్ద తుఫాన్ వాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. మృతులు మాడిశెట్టి సాంబలక్ష్మి (65), పాలకుర్తి సరోజన (55), మెహబూబీ (50)గా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం వరంగల్ ఆసుపత్రికి తరలించారు. మరో ఏడుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ములుగు నుంచి వరంగల్ వైపు వస్తున్న తుఫాన్.. వరంగల్ నుంచి దుగ్గొండి వైపు వెళ్తున్న ఆటోను ఢీకొనడంతో అందులో ఉన్న వారంతా చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోగా.. ఆటో నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో డ్రైవర్ సహా 19 మంది కూలీలు ఉన్నారు. వీరంతా ఆత్మకూరు మండల కేంద్రం నుంచి దుగ్గొండి మండలంలోని రంగాపురం గ్రామానికి మిర్చి కోసేందుకు ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యంలో నీరుకుల్ల క్రాస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. -
బైక్ సీటులో పాము.. ఒక్కసారిగా భయాందోళనకు గురై..
ఆత్మకూరు: బైక్ సీటు దెబ్బతినడంతో కొత్త కవరు కుట్టించుకునేందుకు మెకానిక్ షెడ్డుకు వచ్చి సీటును తొలగిస్తుండగా బైక్లో ఓ పాము కనబడడంతో వారు ఆందోళన చెందన సంఘటన ఆత్మకూరు పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. చేజర్ల మండలం భిల్లుపాడు గ్రామానికి చెందిన వేణుగోపాల్ తన బైక్కు సీటు కవరు కుట్టించుకునేందుకు ఆత్మకూరులోని ఆటోనగర్ వద్దకు వచ్చాడు. మెకానిక్ బైక్ సీటును ఊడదీయగా అందులో పాము కనిపించడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. మెకానిక్ మున్వర్ ధైర్యం చేసి పామును బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. దాదాపు గంటకు పైగా పాము వెలుపలికి రాకపోవడంతో చివరకు జాగ్రత్తగా బైక్ విడిభాగాలు ఊడదీసి పామును చంపేశారు. బైక్లో పామును తిలకించేందుకు పలువురు ఆసక్తిగా గుమిగూడారు. చదవండి: జెడ్పీ అధికారులపై టీడీపీ నేతల దౌర్జన్యం డోర్ డెలివరీ సిబ్బందిపై టీడీపీ కార్యకర్తల దాడి -
టార్చ్ వెలుగులో వెళ్లి ప్రాణం పోశాడు
సాక్షి, ఆత్మకూరు: ఓవైపు వర్షం, మరోవైపు చీకటి. ఆ స్థితిలో ఓ వ్యక్తి బైపాస్రోడ్డులో బురదలో పడి ఉన్నాడు. దారిన వెళ్లేవారు కూడా పట్టించుకోని పరిస్థితి. ఆత్మకూరు బైపాస్రోడ్డు శివార్లలో నూతనంగా ఓ అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారు. ఆదివా రం రాత్రి అపార్ట్మెంట్ ఎదురుగా కాలువలో ఓ వ్యక్తి పడిపోయి ఒళ్లంతా బురదమయమై బాధతో మూలుగుతున్నాడు. ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తి 100కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో స్పందించిన జిల్లా పోలీసులు ఆత్మకూరు పోలీసులకు సమాచారం తెలిపారు. ఎస్సై సి.సంతోష్కుమార్రెడ్డి సూచనల మేరకు కానిస్టేబుల్ కె.శ్రీనివాసులు రాత్రి 11.30 గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కాలువలో పడిపోయిన వ్యక్తిని గుర్తించారు. చదవండి: (నెల రోజుల్లో వివాహం.. అర్ధరాత్రి దారుణహత్య) 108కి ఫోన్ చేయగా పట్టణంతోపాటు సమీపంలోని మూడు మండలాల వాహనాలు అందుబాటులో లేకపోవడంతో కానిస్టేబుల్ శ్రీనివాసులు బాధితుడిని గుర్తించేందుకు టార్చ్ వెలుగులో ప్రయత్నించారు. బాధితుడు వెంకట్రావుపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించి, వర్షంలోనే బాధితుడి ఇంటికి వెళ్లి సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఆ యువకుడిని బయటకు తెచ్చారు. మద్యం మత్తులో పడిపోయాడనే అను మానం వ్యక్తం చేసినా, మూర్ఛతో పడిపోయినట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్నారు. ఎట్టకేలకు గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి వైద్య సహాయం అందించారు. తీవ్ర వర్షంలోనూ మానవత్వంతో స్పందించిన కానిస్టేబుల్ శ్రీనివాసులును పలువురు అభినందించారు. చదవండి: (కన్నా..నీ వెంటే మేమంతా..!) -
తీరని విషాదం..!
రోడ్డు ప్రమాదం రూపంలో ఆ కుటుంబాన్ని మృత్యువు కబళించింది. తల్లిదండ్రులు విమానం ఎక్కి..గమ్యస్థానంలో దిగుతుండగానే కోడలు, మనవడు, కుమార్తె, మనవరాలి మరణవార్త వినాల్సి వచ్చింది. అయ్యో దేవుడా..! ఎంత ఘోరం జరిగిపోయెనే! అంటూ బంధువులు, సన్నిహితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎయిర్పోర్టులో తమకు వీడ్కోలు పలికేందుకు వచ్చిన తమ పిల్లలు తాము విమానం దిగేలోగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతారని ఆ తల్లిదండ్రులు ఊహించలేదు. తడ/ఆత్మకూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శుక్రవారం రహదారులు రక్తసిక్తమయ్యాయి. రెండు వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణంపాలయ్యారు. తడ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒంగోలు క్లవ్పేటకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. ఒంగోలుకు చెందిన పందిటి యశ్వంత్ (35) తల్లిదండ్రులు అమెరికా వెళుతున్న సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి గురువారం చెన్నై వెళ్లారు. శుక్రవారం ఉదయం వారిని చెన్నై విమానాశ్రయంలో దింపిన యశ్వంత్ కారు నడుపుకుంటూ తిరుగు పయనమయ్యారు. కారు ఆంధ్రాలోకి ప్రవేశించిన అనంతరం తడ మండలం పన్నంగాడు వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న పాల లారీని వెనుక నుంచి ఢీకొంది. కారులో ఉన్న యశ్వంత్ భార్య అనుసెల్వి (27), కుమారుడు రియాంత్ షరి (ఏడాది బాబు), అక్క మాడుగుల విజయలక్ష్మి (37) అక్కడికక్కడే మృతి చెందారు. యశ్వంత్ తోపాటు అక్క కుమార్తెలు రితిక (12), నమిత (స్మైలీ) (14) తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మాడుగుల నమిత మృతి చెందగా మిగిలిన ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. ఆటోను ఢీకొన్న ఇన్నోవా.. నలుగురు మృతి ఆత్మకూరు మండలంలోని వాశిలి గ్రామ సమీపంలో నెల్లూరు–ముంబై హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఆత్మకూరు నుంచి ఎనిమిది మంది ప్రయాణికులతో ఆటో వాశిలి గ్రామానికి చేరుకుంది. నెల్లూరు–ముంబై జాతీయ రహదారికి పక్కనే ఉన్న గ్రామంలో ప్రయాణికులు ఆటో దిగుతున్న క్రమంలో ఆత్మకూరు నుంచి అత్యంత వేగంగా నెల్లూరుకు వెళుతున్న ఇన్నోవా కారు వెనుకనే వస్తూ ఆటోను ఢీ కొంది. ఘటనలో తీవ్ర గాయాలపాలైన వారిని ఆత్మకూరులోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతూ వాశిలికి చెందిన షేక్ మస్తాన్బీ (62), గురునాథం చిన్నమ్మ (70), నాగులూరు కోటమ్మ (70), అల్లంపాటి కొండారెడ్డి (71) మృతి చెందారు. ఘటనలో మస్తాన్బీ కుమారుడు ఫకీర్సా, కోడలు రమీజ, మనవరాళ్లు సన, సానియా గాయపడ్డారు. ఆటో డ్రైవర్ రసూల్, కోటయ్య, చంద్రశేఖర్, సుశీలమ్మ తీవ్రంగా గాయపడ్డారు. ఇన్నోవా వాహనంలోని ఆత్మకూరుకు చెందిన ఖాదర్బాషా, హరనాథరెడ్డి, నాయబ్రసూల్, ఎం.శ్రీనివాసులు గాయపడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మితిమీరిన వేగం: ఒకరి దుర్మరణం
సాక్షి, నెల్లూరు : మితిమీరిన వేగంతో వస్తున్న ఓ కారు బైక్ను ఢీకొనడంతో ఒకరు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన నగరంలోని ఎన్టీఆర్ నగర్ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. నగరంలోని బీవీనగర్కు చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి జనార్దన్ (65), అయన బావమరిది నాగరాజు తమ కుటుంబ సభ్యులతో కలసి సంతోషంగా సంక్రాంతి పండగను జరుపుకున్నారు. ఇద్దరూ కలసి బైక్లో ఎన్టీఆర్ నగర్కు వెళ్లారు. అక్కడ పని ముగించుకుని తిరిగి జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయలుదేరారు. అదే సమయంలో కావలి వైపు నుంచి మితిమీరిన వేగంతో వస్తున్న ఓ కారు వీరి బైక్ను ఢీకొంది. దీంతో బైక్పై నుంచి జనార్దన్ రోడ్డుపై పడ్డాడు. కారు అతని కాలుపై ఎక్కి సమీపంలోని పొలాల్లోకి దూసుకెళ్లి పోయింది. జనార్దన్ ఎడమకాలు మోకాలి వరకు తెగి రోడ్డుపై పడింది. అతని తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నాగరాజు రోడ్డుపై పడడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న నార్త్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఐ.ఆంజనేయరెడ్డి, ఎస్సై శంకరరావు ఘటనా స్థలాన్నిపరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్నారు. గురువారం జనార్దన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు మార్జిన్లోకి దూసుకెళ్లిన ప్రమాదానికి కారణమైన కారు ఆత్మకూరు: అయ్యప్పస్వామి మకరజ్యోతి దర్శనానికి బైక్లో వెళ్తున్న ఇద్దరు యువకులను ఎదురుగా వస్తున్న కారు వేగంగా ఢీకొనడంతో గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని మురగళ్లలో బుధవారం రాత్రి జరిగింది. బాధితులు, పోలీసుల సమాచారం మేరకు.. బండారుపల్లి గ్రామానికి చెందిన గడ్డం ప్రసాద్, వెంకటప్రతాప్ ఆత్మకూరు పట్టణంలోని కాశీనాయన ఆశ్రమంలో ఉన్న అయ్యప్పస్వామి ఆలయంలో మకరజ్యోతి దర్శనానికి బైక్లో నీటి పారుదల కాలువ కట్ట రోడ్డుపై బయలుదేరారు. మురగళ్ల సమీపంలో మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ వేగంగా ఎదురుగా వస్తూ వీరిని ఢీకొన్నాడు. ఈ ఘటనలో బైక్పై ఉన్న ప్రసాద్, ప్రతాప్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వీరి వెనకే వస్తున్న మరి కొందరు యువకులు గుర్తించి ఆటోలో ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. అయితే కారు డ్రైవర్, అందులో ప్రయాణిస్తున్న వారు ఆటోను అడ్డుకుని తమ కారుకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. యువకులు సర్దుబాటు చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సైతం కారులోని వారికే మద్దతుగా వ్యవహరించారని బాధితులు వాపోయారు. -
డీఆర్డీఓ చైర్మన్కు మాతృవియోగం
సాక్షి, నెల్లూరు: డీఆర్డీఓ చైర్మన్ గుండ్రా సతీష్రెడ్డికి మాతృవియోగం కలిగింది. నెల్లూరులోని స్వగృహంలో నివసిస్తున్న సతీష్ రెడ్డి తల్లి గుండ్రా రంగమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర అస్వస్థత చెందిన ఆమె గురువారం ఉదయం కన్నుమూశారు. రంగమ్మ భౌతికకాయాన్ని ఆమె స్వస్థలమైన ఆత్మకూరు మండలం మహిమలూరుకు నేడు సాయంత్రం తరలించనున్నారు. ఆమె మరణవార్త తెలిసిన సతీష్రెడ్డి కుటుంబ సభ్యులు హుటాహుటిన ఢిల్లీ నుంచి స్వస్థలానికి బయలు దేరారు. రేపు ఉదయం 9 గంటలకు రంగమ్మ అంత్యక్రియలు చేపట్టనున్నారు. -
గుంత రేణుక అరెస్ట్
గద్వాల క్రైం/ఆత్మకూర్: నిషేధిత మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నారనే నెపంతో గుంత రేణుక (ఏ6)ను బుధవారం గద్వాలలోని రామిరెడ్డి స్మారక గ్రంథాలయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆత్మకూర్ కోర్టుకు తరలించారు. జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఎల్కూర్కు చెందిన టీవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగన్న (నాగరాజు) నిషేధిత మావోయిస్టు పార్టీలోకి యువతను నియమిస్తున్నారన్న సమాచారం అందడంతో గత అక్టోబర్ 5న అతడిని అరెస్టు చేశారు. అదే నెల 7, 11న టీవీవీ బలరాం, ఓయూ ప్రొఫెసర్ జగన్ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచి రిమాండ్కు తరలించారు. యువతను చేర్చుకుంటున్నారు.. నిషేధిత మావోయిస్టు పార్టీలోకి యువతను చేర్చుకుంటున్నారన్న సమాచారంతో ఈ కేసులోని ఆరుగురు సానుభూతిపరులను అరెస్టు చేశామని జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ అపూర్వరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు, విధ్వంసకర కార్యకలాపాలను నిర్వహించడానికి, మావోయిస్టు పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రమంతా వారు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. శిల్ప, రమేశ్లకు 14 రోజులు రిమాండ్.. హైదరాబాద్లో ఈ నెల 17న అరెస్టయిన చైతన్య మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చుక్కల శిల్ప, తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచు రమేశ్లను కోర్టు 14 రోజుల రిమాండ్కు ఆదేశించింది. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆత్మకూర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో గద్వాల పోలీసులు వారిని హాజరుపర్చా రు. న్యాయమూర్తి జీవన్ సూరజ్సింగ్ 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో మహబూబ్నగర్ జిల్లా జైలుకు తరలించినట్లు సమాచారం. -
ఉద్రిక్తతల మధ్య కండక్టర్ అంతిమయాత్ర
ఆత్మకూరు: ఆర్టీసీ కండక్టర్ ఏరుకొండ రవీందర్ అంతిమయాత్ర ఆదివారం ఉద్రిక్తతల మధ్య ముగిసింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన కండక్టర్ ఏరుకొండ రవీందర్ (52) గురువారం టీవీ చూస్తూ గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హన్మకొండకు తరలించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్సపొందుతూ శనివా రం అర్ధరాత్రి తర్వాత మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు ఆదివారం ఉద యమే పెద్ద ఎత్తున ఆత్మకూరుకు చేరుకున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకూ ఊరుకునేది లేదని జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ క్రమంలో పోలీసులు కార్మికులను పలుమార్లు అదుపులోకి తీసుకుని వదిలేశారు. కాగా, రవీందర్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి వెళుతున్న పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కార్మికులు ఘెరావ్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మృతుడు రవీందర్ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు, ఎక్స్ గ్రేషియా మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే ధర్మారెడ్డి హామీ ఇచ్చారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ రవీందర్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆర్టీసీ ఆస్తులపై కన్ను పడిందని, కావాలనే కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా ఇష్టారీతిలో మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రిని ఫాలో కాకున్నా.. నిజాంను ఫాలో కావాలన్నారు. నిజాం హయాంలో ఆర్టీసీ ప్రభుత్వంలోనే ఉందని గుర్తుచేశారు. మహిళా కండక్టర్పై చేయిచేసుకున్న సీఐ కండక్టర్ రవీందర్ అంతిమయాత్ర జరుగుతున్న సమయంలో వీఆర్లో ఉన్న సీఐ మధు మహిళా కండక్టర్ భవానీపై చేయిచేసుకోవడం తో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్మికులు మళ్లీ జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. కార్మికులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో భవాని రోడ్డుపై పడిపోవడంతో పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. సీఐ మధు తమకు క్షమాపణ చెప్పే వరకూ కదిలేది లేదని కార్మికులు భీష్మించారు. దీంతో డీసీపీ నాగరాజు, ఏసీపీ శ్రీనివాస్ కార్మికులతో మాట్లా డి శాంతింపచేశారు. సీఐపై చర్య తీసుకుంటా మనడంతో వారు ఆందోళన విరమించారు. -
ఏసీ రూముల్లో బాగా నిద్ర పట్టిందన్న బాధితులు..
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుపరిపాలనను ఓర్వలేక అభాసుపాలు చేయాలనుకున్న టీడీపీ కుటిల రాజకీయాలు బట్టబయలవుతున్నాయి. పునరావాస కేంద్రం పేరుతో చంద్రబాబు నాయుడు చేసిన జిమ్మికులు వెలుగు చూస్తున్నాయి. గుంటూరు జిల్లా పల్నాడులోని ఆత్మకూరులో జరిగిన వ్యక్తిగత సంఘటనకు రాజకీయ రంగు పులిమి టీడీపీ నాటకాలకు తెరలేపింది. పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి నడిపించిన టీడీపీ డ్రామాలు వెలుగు చూస్తుడటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సాక్షి టీవీ నిఘాతో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. పల్నాడు వాసులు వాస్తవాలను వెల్లడించారు. చదవండి: పల్నాడు షో అట్టర్ ఫ్లాప్! పెయిడ్ ఆర్టిస్టులతో పాటు పనిమీద వచ్చినవారితో శిబిరం ఏర్పాటు చేయడం గమనార్హం. మంచి భోజనం,ఏసీ రూముల్లో నిద్రపోవచ్చనే ఉద్దేశంతో కొందరు అమాయకులు శిబిరానికి వెళ్ళారని తెలుస్తోంది. అలాగే బస్సు దొరకని ప్రయాణీకులకు కూడా శిబిరంలో బస ఏర్పాటు చేశారు. శిబిరం దగ్గర ఏం జరుగుతుందో చూద్దామని వెళ్లిన వారినీ కూడా టీడీపీ నేతలు శిబిరం లోపలికి పంపించారు. బియ్యం అమ్ముకున్నారనే ఆరోపణలతో రేషన్ డీలర్ షిప్ రద్దయిన డీలర్లకు కూడా బస కల్పించారు. అలాగే ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చిన కొంతమంది రాత్రి శిబిరంలో నిద్రపోయారు. ఏసీ రూముల్లో బాగా నిద్ర పట్టిందని బాధితులు చెబుతున్నారు. టీడీపీ నాటకానికి ఆత్మకూరు గ్రామస్తులు సహకరించకపోవడంతో కంగుతున్న టీడీపీ..పెయిడ్ ఆర్టిస్టులు, అమాయకులతో డ్రామాను రక్తి కట్టించాలని ప్రయత్నాలు చేసింది. చివరకు వాస్తవాలు బయటకు రావడంతో టీడీపీ అభాసుపాలైంది. చదవండి: ఆత్మకూరులో అసలేం జరిగింది? -
నల్లమలలో వేటగాళ్ల హల్చల్
సాక్షి, కర్నూలు(ఆత్మకూరురూరల్) : నల్లమలలో గురువారం రాత్రి వేటగాళ్ళు రెచ్చిపోయారు. వేటగాళ్ళు నాటుతుపాకీతో రెండు పొడదుప్పు(స్పాటెడ్ డీర్) లను కాల్చి చంపి మాంసంగా మార్చి తరలిస్తూ అటవీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. బైర్లూటీ ఎఫ్ఆర్ఓ శంకరయ్య తెలిపిన మేరకు నలమలలో అలజడి రేపిన ఈ ఘటన వివరాలు.. ఆత్మకూరు అటవీ డివిజన్లోని రుద్రకోడు అటవీ సెక్షన్లో ఉన్న సీతమ్మ పడె ప్రాంతంలో గురువారం రాత్రి గస్తీ తిరుగుతున్న అటవీ సిబ్బందికి కొందరు వేటగాళ్లు సైకిల్పై మాంసాన్ని తరలిస్తూ కనిపించారు. అటవీ సిబ్బంది వారిని వెంటాడి పట్టుకునే యత్నం చేయగా ఇరువురు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. మండలంలోని సిద్దాపురం గ్రామానికి చెందిన డేరంగుల మురళి సైకిల్పై తరలిస్తున్న సుమారు 50 కేజీల దుప్పి మాంసం, ఒక ఎస్బీ ఎంల్ (సింగిల్ బ్యారల్ మజిల్ లోడ్) నాటు తుపాకీతో పట్టుబడ్డాడు. అతన్ని అటవీ అధికారులు ప్రశ్నించగా సిద్దాపురం గ్రామానికి చెందిన కుంచాల రంగన్న, ఆనంద్లతో కలసి నాటుతుపాకితో దుప్పుల మందపై కాల్పులు జరపగా రెండు దుప్పులు మృతిచెందినట్లు తెలిపాడు. వాటిని ముక్కలుగా కట్ చేసి గ్రామాల్లో విక్రయించేందుకు వెళ్తున్నట్లు ఒప్పుకున్నాడు. రుద్రకోడు ఎఫ్బీలో శ్రీనివాసులు నిందితులపై పీఓఆర్ నమోదు చేశారు. పశువైద్యాధికారి రాంసింగ్ దుప్పుల శరీర భాగాలకు పోస్ట్మార్టం నిర్వహించారు. అనంతరం నిందితుడు మురళిని నంద్యాల జెఎఫ్ఎంసీ ముందు హాజరు పరిచగా జూనియర్ సివిల్ జడ్జీ 15 రోజుల రిమాండ్కు ఆదేశించారు. వేటగాళ్లను అరెస్టు చేసిన అధికారుల బృందంలో ఎఫ్ఎస్ఓలు వెంకటరమణ, తాహీర్, ఎఫ్బీఓలు శ్రీనివాసులు, మహబూబ్ బాషా ఉన్నారు. -
పల్నాడు షో అట్టర్ ఫ్లాప్!
చలో ఆత్మకూరు పేరిట టీడీపీ ఆడిన నాటకం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో పార్టీ క్యాడర్ డీలాపడింది. కోడెల కుటుంబం అరాచకాలపై వరుసగా కేసులు నమోదవడం, అసెంబ్లీ ఫర్నిచర్ను కోడెల శివప్రసాదరావు తరలించుకోవడం, యరపతినేని సాగించిన అక్రమ మైనింగ్పై సీబీఐ దర్యాప్తు వ్యవహారం నేపథ్యంలో పార్టీ మారేందుకు క్యాడర్ సిద్ధమైంది. ఈ స్థితిలో పార్టీని కాపాడుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు. కుటుంబ కలహాలు, వ్యక్తిగత గొడవలను అధికార వైఎస్సార్ సీపీకి అంటగడుతూ రచించిన ఈ నాటకానికి ప్రజల నుంచి కనీస స్పందన కూడా కరువైంది. సాక్షి, గుంటూరు: సార్వత్రిక ఎన్నికల్లో 23 స్థానాలకే పరిమితమై టీడీపీ ఘోర పరాజయం పాలైంది. గత ఐదేళ్లలో నాయకులు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కే–ట్యాక్స్లు, అసెంబ్లీ ఫర్నిచర్ దొంగలించడం, ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేయడం వంటి కేసుల్లో మాజీ స్పీకర్ కోడెల కుటుంబం కొట్టుమిట్టాడుతోంది. యరపతినేని అక్రమ మైనింగ్ కేసు విచారణలో సీబీఐ రంగంలోకి దిగబోతోంది. మాజీ మంత్రి ప్రత్తిపాటిని సైతం కేసుల భయం చుట్టుముడుతోంది. దీంతో పల్నాడు సహా, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ క్యాడర్ బీజేపీలోకి జారుకోవడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజల్లో రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. వంద రోజుల్లోనే ఎన్నికలకు ముందు అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జనరంజకమైన పాలన అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీలా పడ్డ క్యాడర్లో చలనం తీసుకురావాలంటే ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేపట్టాలని చంద్రబాబు, ఆ పార్టీ ముఖ్య నాయకులు నిశ్చయించుకున్నారు. చలో ఆత్మకూరుతో నాటకం మొదలు... నారా ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో చంద్రబాబు డైరెక్షన్లో ‘చలో ఆత్మకూరు’ అనే బ్యానర్తో టీడీపీ నాటకం మొదలు పెట్టింది. కుటుంబ కలహాలు, వ్యక్తిగత గొడవలు, గత ఐదేళ్ల పాలనలో అధికారం అండతో అరాచకాలకు పాల్పడి అధికారం కోల్పోవడంతో గ్రామస్తులు ఏం చేస్తారోనని భయపడి గ్రామాలను వదిలిన వారిని కుటుంబానికి రూ.10వేలు ఇస్తామని పునరవాస కేంద్రంలో పోగు చేశారు. పల్నాడులో అరాచకాలు, అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేపట్టారు. అయితే పల్నాడు ప్రాంత ప్రజలు బాబు దుష్ప్రచారాన్ని చూసి చీదరించుకున్నారు. ఇప్పటికే కోడెల, ప్రత్తిపాటి, యరపతినేని అరాచకాలకు పల్నాడు ప్రాంత ప్రతిష్టను దిగజార్చారని, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో లేని అలజడులు సృష్టిస్తున్నారని చంద్రబాబుపై పల్నాడు ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. క్యాడర్లో చలనం లేని వైనం... గత ఐదేళ్ల పాలనలో అధికారం అడ్డుపెట్టుకుని జిల్లాలో ఆ పార్టీ నాయకులు మట్టి నుంచి దేన్ని వదలకుండా దోచుకుతిన్నారు. దీంతో జిల్లాలో రెండు ఎమ్మెల్యే సీట్లకే ఆ పార్టీని జిల్లా ప్రజలు పరిమితం చేశారు. దీంతో క్యాడర్ ఎప్పుడో సర్దుకున్నారు. చంద్రబాబు చలో ఆత్మకూరు పేరుతో హైడ్రామాకు తెరలేపినా క్యాడర్లో ఎటువంటి చలనం రాలేదు. ఇప్పటికే టీడీపీ నాయకులు గత ఐదేళ్లలో చేసిన అరాచకాల కారణంగా గ్రామాల్లో క్యాడర్కు తల ఎత్తుకుని తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేస్తున్న డ్రామాకు మద్దతు పలికితే ఉన్న పరువు కూడా పోతుందని పల్నాడుకు చెందిన టీడీపీ శ్రేణులు చాలా వరకూ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. పల్నాడులో నవ్వులపాలు.. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఏదో జరుగుతోందన్న వాదన లేవనెత్తి పల్నాడు ప్రాంతంలో నవ్వుల పాలయ్యామని ఆ పార్టీ ముఖ్యనాయకులు చర్చించుకుంటున్నారు. ఈ కార్యక్రమంతో కాస్తో కూస్తో ఉన్న క్యాడర్ కూడా పార్టీకి దూరమయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. గత ఐదేళ్లలో మాజీ ఎమ్మెల్యేలు, మంత్రుల ద్వారా లబ్ధి పొందిన వారు మాత్రమే చలో ఆత్మకూరుకు సిద్ధమయ్యారని, నిజమైన కార్యకర్తలు దూరంగా ఉన్నారనే చర్చలు నడుస్తున్నాయి. (చదవండి: ఆత్మకూరులో అసలేం జరిగింది?) -
ఇదీ ఆత్మకూరు అసలు కథ..
-
ఆత్మకూరులో అసలేం జరిగింది?
(పల్నాడు ప్రాంతం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)/సాక్షి, గుంటూరు/మాచర్ల: మూడేళ్ల క్రితం అంగన్వాడీ ఉద్యోగం తెచ్చిన తంటా ఆ పచ్చని పల్లె పేరును ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగేలా చేసింది. ఆ గ్రామంలో ఒకే పార్టీకి చెందిన రెండు కుటుంబాలు వైరి వర్గాలుగా విడిపోయి ఊరొదిలి వెళుతుంటే దానికి టీడీపీ రాజకీయరంగు పులిమింది. పల్నాడు ప్రాంతంలో గెలిచిన రాజకీయ పార్టీకి చెందిన వారిది పైచేయి అవుతుందని ఓడిన పార్టీ వారు కొంతకాలం ఊరొదిలి వెళ్లడం రివాజు. అయితే ఇప్పుడు కుటుంబ తగాదాలను పార్టీ తగాదాలుగా చిత్రీకరిస్తూ, ఊరొదిలి వెళ్లిన వారు వైఎస్సార్ సీపీ బాధితులంటూ ప్రతిపక్ష టీడీపీ యాగీ చేస్తుండటం ఆ ప్రాంత ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి మండలం ఆత్మకూరు గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాలు కొన్నేళ్లుగా ప్రత్యర్థి వర్గాలుగా ఉంటున్నాయి. ఆ వర్గాలకు గ్రామ మాజీ సర్పంచ్ పి.యోసేబు, మండి చార్లెస్ నేతృత్వం వహిస్తున్నారు. యోసేబు స్వయానా చార్లెస్కు పిల్లనిచ్చిన మామ కావడం గమనార్హం. వీరివురూ తొలినాళ్లలో టీడీపీలోనే ఉన్నారు. ఒకే కాలనీలో నివాసం ఉండేవారు. మూడేళ్ల క్రితం గ్రామంలో అంగన్వాడీ పోస్టు తన భార్యకు ఇవ్వాలని చార్లెస్ తన మామపై ఒత్తిడి తెచ్చాడు. అప్పటి టీడీపీ నేతల రాజకీయ కారణాలతో యోసేబు నిరాకరించాడు. దీంతో టీడీపీలోనే రెండు వర్గాలుగా వీరు చీలడంతో ఆధిపత్యం కోసం గొడవలు ఆరంభమయ్యాయి. కొంతకాలానికి తారస్థాయికి చేరాయి. రెండేళ్ల క్రితం సర్పంచ్ యోసేబు కాలనీలో భయోత్పాతం సృష్టించి చార్లెస్ వర్గాన్ని టార్గెట్ చేశాడు. టీడీపీ నేతల ప్రోద్బలంతో చార్లెస్ను ఊరొదిలి వెళ్లేలా చేశాడు. చార్లెస్ కనీసం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వీలులేని పరిస్థితులను టీడీపీ నేతలు కల్పించారు. ఆత్మకూరులో మొహరించిన పోలీసులు గ్రామంలో పెద్దలు చార్లెస్కు మద్దతుగా వచ్చినా.. పోలీస్ అధికారులతో వారిని దుర్భాషలాడించారు. చేసేదేమీ లేని పరిస్థితుల్లో చార్లెస్, అతని అనుచరులకు గ్రామ శివారులో స్థానిక పెద్దలు ఆశ్రయం కల్పించారు. ఎన్నికల రోజు కూడా గ్రామంలో యోసేబు వర్గం చార్లెస్ వర్గంపై దాడులకు యత్నించింది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత గ్రామం ప్రశాంతంగా ఉన్నా.. ప్రతి దాడులేమీ లేకపోయినా.. యోసేబు వర్గం మొత్తం ఊరొదిలి వెళ్లింది. ఆ తర్వాతే గ్రామ శివారులో తలదాచుకున్న చార్లెస్ తన అనుచరులతో కలిసి కాలనీకి వచ్చినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. ప్రశాంతంగా ఉండే ఆత్మకూరు గ్రామంలో అంగన్వాడీ పోస్టు మామా, అల్లుళ్ల మధ్య చిచ్చు రేపిందని చెబుతున్నారు. ఆ తర్వాత పోలీసుల సమక్షంలో రాజీలు జరిగి రెండు వర్గాలు కలిసి సహపంక్తి భోజనాలు చేశారన్నారు. దాడులు జరగలేదు ఆత్మకూరు గ్రామానికి తిరిగి వచ్చిన యోసేబు వర్గంలోని కొందరు అసలు ఏం జరిగిందో ‘సాక్షి’కి వివరించారు. ప్రభుత్వం మారగానే చార్లెస్ వర్గం దాడులు చేస్తారనే భయంతోనే ఊరు వదిలి వెళ్లామని యోసేబు వర్గానికి చెందిన కిన్నెర రాబర్ట్ స్పష్టం చేశాడు. కిన్నెర రాబర్ట్ స్వయానా చార్లెస్కు మేనమామ కూడా. ఇలా ఊరొదిలి వెళ్లడం ఈ ప్రాంతంలో ఆనవాయితీగా వస్తోందని రాబర్ట్ చెప్పాడు. తమపై దాడులు జరగలేదని స్వయంగా యోసేబు కూడా మీడియా ప్రతినిధులకు వివరించారు. తన బంధువును చార్లెస్ భయపెట్టాడని, ఆ తర్వాత తమపై దాడులు జరుగుతాయని భావించి ఊరొదిలి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్ను చూసి.. కాపీ బాబు కుట్ర 1989లో టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హయాంలో గ్రామంలో పూరి పాకలను తగులబెట్టిన ఘటనలు జరిగాయి. అప్పట్లో గ్రామానికి ఎన్టీఆర్ పరామర్శకు వచ్చారు. ఇప్పుడు గ్రామం ప్రశాంతంగా ఉన్నా.. దాడులు ఏవీ జరగకున్నా.. ప్రతిపక్ష నేత చంద్రబాబు పార్టీ ఉనికి కోసం, తమ పార్టీ నేతలు యరపతినేని, కోడెల అక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కుట్రలు రచించారని ఈ ప్రాంతానికి చెందిన పలువురు పేర్కొంటున్నారు. కుట్రలకు పల్నాడు ప్రాంతాన్ని చంద్రబాబు ఎంచుకోవడంపై మండిపడుతున్నారు. పోలీసుల హామీ మేరకు వచ్చాం మా బంధువుల్లోనే వివాదం వల్ల ఆందోళన చెంది బయటకు వెళ్లాం. పోలీసుల హామీ వల్ల తిరిగి గ్రామానికి వచ్చాం. మా మధ్య ఎటువంటి రాజకీయ గొడవలూ లేవు. పోలీసుల చొరవతో మా మధ్య విభేదాలు తొలగిపోయాయి. మేమంతా కలిసికట్టుగానే ఉంటాం. – పేరువాల యోసేబు, టీడీపీ నేత, ఆత్మకూరు మా మధ్య కుటుంబ గొడవలు ఉన్నాయి మా సామాజికవర్గానికి చెందిన వారిలోనే విభేదాలు ఉండి గతంలో గొడవ పడ్డాం. మేమంతా ఒకే కుటుంబానికి చెందినవారం. గత ఐదేళ్లలో అధికారం అండతో మా ప్రత్యర్థి వర్గం మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. ఇటీవల టీడీపీ ఓటమిపాలు కావడంతో మేం వారిపై దాడి చేస్తామోననే భయంతో వారు ఊరు విడిచి వెళ్లారు. మా గొడవలకు రాజకీయాలతో సంబంధం లేదు. – మందా చార్లెస్, ఆత్మకూరు గ్రామంలో రాజకీయ గొడవలు లేవు.. మా గ్రామంలో వైఎస్సార్సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య రాజకీయ గొడవలు లేవు. మేము అందరం కలిసి ఉంటున్నాం. టీడీపీలో ఉన్న ఎస్సీల బంధువర్గంలో విభేదాల వలన చిన్న వివాదాలను పెద్దవిగా చేసి రాజకీయరంగు పులిమారు. మా గ్రామంపై విష ప్రచారం చేయటం దారుణం. – రాయపరెడ్డి, గ్రామపెద్ద, ఆత్మకూరు దాడులు నిరూపిస్తే రాజీనామా చేస్తా ఆత్మకూరు గ్రామంలో ఎస్సీలపై మా పార్టీ నాయకులు దాడి చేశారని, వారి నుంచి ఎస్సీలకు ప్రాణహాని ఉందని, గ్రామంలో వారికి రక్షణ లేదని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. చౌకబారు విమర్శలు చేసి చంద్రబాబు తన ప్రతిష్టను ఇంకా దిగజార్చుకుంటున్నారు. మా పార్టీ వర్గీయులు దాడి చేయడం వల్ల గ్రామంలో ఎస్సీ కుటుంబాలు ఇళ్లను వదిలి వెళ్లిపోయాయని ప్రచారం చేస్తున్న చంద్రబాబుకు సవాల్ విసురుతున్నాను. వైఎస్సార్సీపీ వర్గీయులు దాడి చేయడం వల్లే వాళ్లు గ్రామం విడిచి వెళ్లినట్లయితే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. వాస్తవం కానట్లయితే పల్నాడు ప్రాంత ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. – పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే -
ఎస్ఐ అనురాధ ఫిర్యాదు, నన్నపనేనిపై కేసు
సాక్షి, గుంటూరు : దళిత మహిళా ఎస్ఐని దూషించిన కేసులో టీడీపీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారిపై మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఎస్ఐ అనురాధ ఫిర్యాదుతో 303, 506,509 r/w 34 ఐపీసీ సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా నిన్న చలో ఆత్మకూరు సందర్భంగా ‘ఈ దళితుల వల్లే మాకీ దరిద్రం’ అంటూ నన్నపనేని దూషించిన విషయం తెలిసిందే. దీంతో విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ అనురాధతో పాటు సిబ్బందిపై అసభ్య పదజాల దూషణ, విధులకు ఆటంకం కలిగించినందుకు ఆమెతో పాటు టీడీపీ మహిళ నాయకురాలు సత్యవాణిలపై కేసు నమోదు చేశారు. చదవండి: నోరు పారేసుకున్న నన్నపనేని మరోవైపు ఐపీఎస్ అధికారి విక్రాంత్ పాఠిల్పై ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అనుచిత ప్రవర్తనపై ఎస్ఐ కోటయ్య ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే వైఎస్సార్ నాయకుల ఫిర్యాదుతో శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
దళితుల వల్లే ఈ దరిద్రం.. డీసీపీ యూజ్లెస్ ఫెలో
నాకు రూల్స్ చెప్పొద్దు.. ఎక్స్ట్రాలు చేయొద్దు.. యూజ్లెస్ ఫెలో.. నన్ను ఆపడానికి నీకు ఎవడిచ్చాడు అధికారం. – డీసీపీ విక్రాంత్ పాటిల్ను ఉద్దేశించి టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఈ దళితుల వల్లే మాకీ దరిద్రం. – దళిత మహిళా ఎస్సైని ఉద్దేశించి నన్నపనేని రాజకుమారి, టీడీపీ మహిళా నేతలు సాక్షి, అమరావతి/విజయవాడ: ‘చలో ఆత్మకూరు’ పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడికక్కడ రెచ్చిపోయారు. వీధి రౌడీల్లా మారి పోలీస్ అధికారులపై దౌర్జన్యాలకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా అలజడులు సృష్టించేందుకు యత్నించారు. 144 సెక్షన్ అమల్లో ఉందని, చలో ఆత్మకూరుకు అనుమతి లేదని నచ్చజెప్పబోయిన పోలీసులపై వీరంగమాడారు. ఎక్కడికక్కడ ఆందోళనలు చేయాలని, పోలీసులపై తిరగబడాలని టెలీ కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు టీడీపీ నేతలను రెచ్చగొట్టి ఘర్షణలకు పురిగొల్పారు. బుధవారం చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చిన చంద్రబాబు అలజడులు సృష్టించాలని నూరిపోయడంతో ఉండవల్లి కరకట్టపై ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు రెచ్చిపోయారు. అక్కడ విధుల్లో ఉన్న ఐపీఎస్ అధికారి, విశాఖ డీసీపీ విక్రాంత్ పాటిల్ను ‘యూజ్లెస్ ఫెలో’ అంటూ తిట్టారు. మరోవైపు టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి మంగళగిరిలో దళిత మహిళా ఎస్ఐ అనూరాధను కులం పేరుతో తిడుతూ ‘దళితుల వల్లే ఈ దరిద్రం’ అనడంతో ఎస్ఐ తీవ్ర మనస్తాపం చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిచోట టీడీపీ నాయకులు పోలీసులతో గొడవకు దిగి రభస సృష్టించేందుకు ప్రయత్నించారు. బాబు డైరెక్షన్లో ఉండవల్లిలో హైడ్రామా టీడీపీ నాయకులు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద బుధవారం హైడ్రామా నడిపాయి. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతుందనే కారణంతో అక్కడికి చేరుకున్న పోలీసులు చలో ఆత్మకూరుకు అనుమతి లేదని తెలిపారు. దీంతో లోనికి వెళ్లిపోయిన చంద్రబాబు పార్టీ నాయకులతో ఎప్పటికప్పుడు టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఆందోళనలు ఎలా చేయాలి, ఏ విధంగా ఘర్షణలు సృష్టించాలనే దానిపై సూచనలు ఇచ్చారు. మరోవైపు పోలీసుల తీరును నిరసిస్తూ 12 గంటల నిరాహార దీక్ష చేస్తున్నట్లు మీడియాకు లీకులిచ్చారు. రాష్ట్ర మంతటా దీక్షలు చేయాలని పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 12 గంటల సమమయంలో మళ్లీ బయటకు వచ్చిన చంద్రబాబు ఆత్మకూరు వెళతానంటూ కారు ఎక్కి కూర్చున్నారు. పోలీసులు అప్పటికే ఆయన ఇంటి ప్రధాన గేటు వద్ద మోహరించి బయటకు వెళ్లడానికి అనుమతి లేదని తేల్చిచెప్పారు. అప్పటికే చంద్రబాబు ఇంటి లోపలికి వెళ్లిన పలువురు టీడీపీ నాయకులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. కొద్దిసేపటి తర్వాత చంద్రబాబు లోనికి వెళ్లిపోయి అక్కడున్న నాయకులతో మంతనాలు జరిపారు. అంతకుముందు ఆయన కుమారుడు లోకేష్ను కూడా పోలీసులు బయటకు వెళ్లకుండా అడ్డుకోగా.. ఆయన కూడా వాదులాటకు దిగారు. రెచ్చిపోయిన అచ్చెన్న చంద్రబాబు నివాసం బయట కరకట్ట రోడ్డుపై మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పోలీస్ అధికారులతో వాగ్వివాదానికి దిగి రభస చేశారు. మోటార్ సైకిల్పై చంద్రబాబు నివాసానికి వచ్చిన ఆయన్ను పోలీసులు ఆపి 144వ సెక్షన్ అమల్లో ఉన్నందున లోనికి వెళ్లకూడదని చెప్పారు. దీంతో రెచ్చిపోయిన అచ్చెన్న బిగ్గరగా అరుస్తూ తనకు రూల్స్ చెప్పొద్దంటూ పోలీసులను నెట్టుకుంటూ చంద్రబాబు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. బందోబస్తు విధుల్లో ఉన్న విశాఖ డీసీపీ విక్రాంత్ పాటిల్ ఆయన్ను నిలుపుదల చేశారు. ఆ దశలో అచ్చెన ‘ఎక్స్ట్రాలు’ చేయొద్దని వేలు చూపిస్తూ బెదిరించారు. వెనక్కి వెళ్లిపోవాలని పోలీసులు సర్దిచెబుతున్నా వినకుండా రెచ్చిపోయి విక్రాంత్ పాటిల్ను ‘యూజ్లెస్ ఫెలో. నన్ను ఆపడానికి నీకెవడిచ్చాడు అధికారం’ అని దుర్భాషలాడుతూ తోపులాటకు దిగారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి వ్యానులో ఎక్కించి వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు. దళిత ఎస్ఐని దూషించిన నన్నపనేని టీడీపీ మహిళా నాయకులు మహిళా ఎస్ఐని కులం పేరుతో దూషించి దళితులపై ఉన్న వివక్షను మారోసారి చాటుకున్నారు. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, జవహర్, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, మరికొందరు నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు మంగళగిరి స్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి మరో స్టేషన్కు తరలించేందుకు రెండు వాహనాలను ఏర్పాటు చేయగా.. అందులో ఒకటి పెదకాకాని మహిళా ఎస్ఐ అనురాధ వాహనం. నన్నపనేని రాజకుమారి, వంగలపూడి అనిత, మరో ముగ్గురు మహిళలను ఆ జీప్లో ఎక్కిస్తుండగా.. ‘ఈ దళితుల వల్లే మాకీ దరిద్రం’ అంటూ దూషణకు దిగారు. దీంతో దళిత ఎస్ఐ అనురాధ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ‘దరిద్రులంటూ హేళన చేస్తారా. నేను కష్టపడి ఉద్వోగం సంపాదించుకున్నా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఎస్ఐ అనురాధ చెప్పగా.. సీఐ నరేష్కుమార్ సముదాయించారు. తాను ఈ అవమానాన్ని తట్టుకుని విధులు నిర్వర్తించలేనని, వాహనం నుంచి నాయకులను దించేస్తే వెళ్లిపోతానని చెప్పడంతో సీఐ నరేష్కుమార్ తప్పని పరిస్థితులలో మాజీ మంత్రులను నాయకులను వేరే వాహనంలోకి మార్చారు. ఇంత జరుగుతున్నా టీడీపీ నాయకులు కనీసం తాము అలా అనలేదని కాని, అలా అనడం తప్పు అని కాని చెప్పకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇతర నేతలదీ అదే దారి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరుతుండగా.. ఆమెను బయటకు రావొద్దని పోలీసులు చెప్పారు. పోలీసులను తోసుకుంటూ ఆమె హంగామా సృష్టించారు. ఎంపీ కేశినేని నాని ర్యాలీగా ప్రకాశం బ్యారేజీ వద్దకు రాగా.. ‘కైండ్లీ ర్వికెస్ట్ సార్.. ముందుకు వెళ్లొద్దు’ అంటూ సీఐ కాశీ విశ్వనాథ్ విజ్ఞప్తి చేశారు. ప్రకాశం బ్యారేజీపై తన అనుచరులతో కలిసి బైఠాయించటంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో కేశినేనిని ప్రివెంటివ్ అరెస్ట్ చేశారు. అనంతరం ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకున్న మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్సీ దినేష్రెడ్డి, మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యారావు, కేఈ ప్రభాకర్ను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీలు వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న, అశోక్బాబు, మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, నల్లగట్ల స్వామిదాస్ ఆత్మకూరు వెళ్లేందుకు ప్రయత్నించగా.. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు వారిని ఇళ్లనుంచి బయటకు రానివ్వలేదు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్యను హౌస్ అరెస్ట్ చేశారు. ప్రతిచోట టీడీపీ నాయకులు పోలీసులపై విరుచుకుపడ్డారు. అలజడులు సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించారు. ఎంత రెచ్చగొట్టినా లాఠీ ఎత్తని పోలీసులు టీడీపీ నేతలు ‘చలో ఆత్మకూరు’ పేరిట పోలీసులను ఎంత రెచ్చగొట్టినా కనీసం లాఠీ కూడా ఎత్తకుండా సంయమనం పాటించారు. పల్నాడు ప్రాంతంలో సున్నిత పరిస్థితులు ఉన్నందున పోలీసులు అక్కడ 144 సెక్షన్ విధించారు. ఆత్మకూరు బయలుదేరిన టీడీపీ నాయకులను అక్కడకు వెళ్లకుండా నిలువరించబోతుండగా.. రెచ్చిపోయిన టీడీపీ నేతలు ఐపీఎస్ నుండి ఎస్ఐ స్థాయి అధికారులపైనా విరుచుకుపడ్డారు. పోలీసులు ఎక్కడా తమ పరిధి దాటకుండా ప్రవర్తించి చలో ఆత్మకూరు కార్యక్రమం సందర్భంగా చిన్నపాటి ఘటన కూడా చోటుచేసుకోకుండా నివారించగలిగారు. ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. పల్నాడులో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉన్నందువల్లే ప్రతిపక్ష నేత చంద్రబాబు ముందస్తు గృహ నిర్బంధం చేసినట్లు చెప్పారు. ఇదిలావుండగా.. విధుల్లో ఉన్న ఐపీఎస్ అధికారి విక్రాంతి పాటిల్ను యూజ్లెస్ ఫెలో అంటూ దుర్భాషలాడి పోలీస్ ప్రతిష్టను కించపరచిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షుడు నర్రెడ్డి చంద్రశేఖర్రెడ్డి, గుంటూరు రూరల్ జిల్లా అధ్యక్షుడు టి.మాణిక్యాలరావు డిమాండ్ చేశారు. అచ్చెన్నాయుడిపై కేసు తాడేపల్లి/టెక్కలి: ఐపీఎస్ అధికారి విక్రాంత్ పాటిల్పై ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అనుచిత ప్రవర్తనపై ఎస్ఐ కోటయ్య ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ నాయకుల ఫిర్యాదుతో శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇదిలావుండగా.. స్వార్థ రాజకీయాల కోసం దళితుల మధ్య వివాదాలు సృష్టిస్తున్న ‘చంద్రబాబు గో బ్యాక్’ అంటూ ఎమ్మార్పీఎస్ నాయకులు మాచర్ల పార్క్ సెంటర్లో అంబేడ్కర్ విగ్రహం వద్ద బుధవారం నిరసన వ్యక్తం చేశారు. -
ఛలో ఆత్మకూరు
-
ప్రమాదాలతో సావాసం..
సాక్షి, ఆత్మకూరు: అడవి సంపదపై అక్రమార్కుల కన్ను ఉంటుంది. వీలుదొరికితే కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం కొన్నిసార్లు వారు ఎంతకైనా తెగిస్తుంటారు. వారితో అటవీ సిబ్బంది ఒట్టి చేతులతో పోరాడాల్సి ఉంటుంది. ఆయుధాలు లేకుండా విధులు నిర్వహించడం వారికి కొంత ఇబ్బందికరంగా మారింది. ఎర్రచందనం ఉన్న చోట మాత్రమే అటవీ సిబ్బందికి కొద్దిమేర ఆయుధాలు ఇస్తున్నారు. నాగార్జునసాగర్ –శ్రీశైలం పులుల అభయారణ్యం దేశంలోనే అతిపెద్దది. దీనికి అంతర్జాతీయ పులి చర్మాల స్మగ్లర్లతో ప్రమాదం పొంచి ఉంది. వారి వేటను అడ్డుకునే అటవీ సిబ్బందిని చంపడానికి సైతం స్మగ్లర్లు వెనుకాడారు. 2004 సెప్టెంబర్ 11న కర్ణాటకలో విధులు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి శ్రీనివాస్ను గంధం చెక్కల స్మగ్లర్ వీరప్పన్ నరికి చంపాడు. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆ రోజును అటవీ అమరుల సంస్మరణ దినోత్సవంగా ప్రకటించింది. నాటి నుంచి ప్రతి ఏటా సెప్టెంబర్ 11న అటవీ సిబ్బంది అమరులను స్మరించుకుంటూ సభలు,సమావేశాలు నిర్వహిస్తారు. ప్రమాదాల అంచుల్లో నదిపై పహారా ఆత్మకూరు అటవీ డివిజన్లో కృష్ణానది సంగమేశ్వరం దగ్గర ప్రారంభమై శ్రీశైలం ప్రాజెక్ట్ వరకు అంతర్రాష్ట్ర సరిహద్దుగా ప్రవహిస్తుంటుంది. ఈ నదినే స్మగ్లర్లు వనరుగా ఉపయోగించుకుని అటవీ సంపద దోస్తుంటారు. వారిని నిరోధించడం కోసం అటవీ శాఖ రివర్ పార్టీ పేరుతో నాటు పడవలపై నదిపై పహారా ఏర్పాట్లు చేసింది. ప్రమాదకరమైన ఈ విధులను అటవీ సిబ్బంది ధైర్యంగా నిర్వహిస్తున్నారు. చాలీచాలని జీతం.. అడవిలోనే 24 గంటలు ఉండే అటవీ సిబ్బందికి జీతం మాత్రం అరకొరగా ఇస్తున్నారు. ఒక్కో బేస్ క్యాంపులో కనీసం ఐదుగురు ప్రొటెక్షన్ వాచర్లు ఉన్నారు. వీరికి భోజన సౌకర్యం కల్నిస్తూ రూ. 8వేల లోపు జీతం ఇస్తున్నారు. వారంలో ఒక రోజు మాత్రమే సెలవు ఇస్తారు. కఠినతరమైన విధులైనప్పటికీ ఉద్యోగ భద్రత లేదు. పై అధికారి దయాదాక్షిణ్యాలపై వారి జీవితం ఆధారపడి ఉంటుంది. అటవీ సంరక్షణలో సైతం వారు సగం అటవీ శాఖలో క్రమేపి మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. మొదట్లో కార్యాలయ విధుల్లో మాత్రమే ఉన్న మహిళలు ఇప్పుడు ఏబీవో స్థాయి నుంచి డీఎఫ్ఓల వరకు అన్ని స్థాయిల్లో పని చేస్తున్నారు. ఒంటరిగా అడవుల్లో తిరుగుతూ వారు విధులు నిర్వహించడం కత్తి మీద సామే. ఇటీవల ఎఫ్ఎస్ఓ కావేరి భయపడకుండా వన్యప్రాణి వధ కేసుల్లో నిందితుడైన ఒక వ్యక్తిని పట్టుకుని అటవీశాఖ హెడ్ క్వార్టర్కు తరలించ గలిగింది. గురుతర బాధ్యత మాది అడవులు లేకపోతే మనిషి ఉనికే లేదు. మేము ఆ అటవీని సంరంక్షించే గురుతర బాధ్యత నిర్వహిస్తున్నాము. అయితే, చేతిలో ఆయుధాలు ఉంటే ఎలాంటి భయం లేకుండా విధులు నిర్వహించొచ్చు. –నాగునాయక్, ఎఫ్ఎస్ఓ అమరులకు నివాళులర్పిస్తాం అటవీ సంరక్షణలో ప్రాణాలర్పించిన ఉద్యోగులకు ప్రతి ఏటా నివాళు లర్పిస్తాం. ఇప్పటికీ అటవీ సిబ్బందికి భద్రత లేదు. క్రూర జంతువుల బారినుంచి తప్పించుకునేందుకు రక్షణ ఉపకరణాలను ప్రభుత్వం అందించాలి. –వెంకటరమణ గౌడ్, కోశాధికారి, ఎఫ్ఎస్ఓ, ఎఫ్ఎస్ఓల సంఘం -
రోడ్డు ప్రమాదంలో ఏఎస్సై దుర్మరణం
సాక్షి, నెల్లూరు(ఆత్మకూరు) : ఏఎస్సై రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఆత్మకూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సమ్మెట వెంకటరాజు (56) ఏఎస్సైగా ఆత్మకూరు పోలీసుస్టేషన్లో పనిచేస్తున్నాడు. ఆయన కుటుంబం గూడూరులో ఉంటోంది. విధుల కోసం ఆత్మకూరులో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. గురువారం రాత్రి విధులు పూర్తి చేసుకున్నాడు. అనంతరం శుక్రవారం తెల్లవారుజామున ఐదుగంటల సమయంలో గూడూరుకు వెళ్లేందుకు నెల్లూరుపాళెం వద్ద బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో పామూరుకు అద్దెకు వెళ్లి తిరిగి నెల్లూరుకు వెళుతున్న కారు డ్రైవర్ మోహన్రెడ్డి ఏఎస్సై రాజును ఎక్కించుకున్నాడు. కారు నెల్లూరు – ముంబై రహదారిపై వాశిలి గ్రామ సమీపంలో పంది అడ్డుగా రావడంతో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న గుంతలో బోల్తా పడింది. ఏఎస్సై రాజు తలకు తీవ్ర గాయమై సీట్ల మధ్య ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. నెల్లూరు టౌన్ మూలాపేట ఇరుకళలమ్మ కాలనీకి చెందిన కారు డ్రైవర్ మోహన్రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. 108లో క్షతగాత్రుడిని తొలుత ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు అనంతరం నెల్లూరుకు తరలించారు. రెండునెలల క్రితమే పదోన్నతి మృతుడు ఏఎస్సై ప్రకాశం జిల్లా వాసి. ఆయనకు భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. కాగా ఇటీవల ఏఎస్సైగా పదోన్నతి పొందాడు. మరో రెండునెలల్లో ఎస్సైగా పదోన్నతి వస్తుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న సీఐ పాపారావు, ఎస్సైలు సంతోష్కుమార్రెడ్డి, రోజాలత, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం రాజు మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
అమరావతే రాజధానిగా కొనసాగుతుంది
సాక్షి, నెల్లూరు: అమరావతిలోనే రాజధాని కొనసాగుతుందని ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. రాజధాని ప్రాంతంలో వరద నీళ్లు వచ్చాయని, అప్పటి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని మాత్రమే మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారని ఆయన పేర్కొన్నారు. దీంతో టీడీపీ రాజధానిని మార్చేస్తున్నారంటూ గందరగోళం సృష్టిస్తున్నారన్న మంత్రి మండిపడ్డారు. శివరామకృష్ణన్ కమిటీ కూడా రాజధానికి అమరావతి అనువైన ప్రాంతం కాదని చెప్పిందని ... అయినా చంద్రబాబు అక్కడే రాజధానిగా నిర్ణయించారన్నారు. గురువారం మంత్రి ఆత్మకూరు నియోజకవర్గంలో వాసిలి, నెల్లూరు పాలెం, ఎన్నవాడ గ్రామాల్లో పర్యటించారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన .... ఆత్మకూరు నియోజక వర్గంలోని ప్రజల సమస్యలపై ఏర్పాటు చేసిన ఎంజీఆర్ హెల్ప్లైన్కు ఇప్పటివరకూ 150కిపైగా ఫిర్యాదులు అందాయని తెలిపారు. అందులో 45 సమస్యలను పరిష్కరించామని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలోని మిషన్ భగీరథ తరహాలోనే రాష్ట్రంలో కూడా తాగునీటి కోసం కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో సోమశిల జలాశయం నుంచి జిల్లాలోని ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే సోమశిల జలాశయానికి నీటి కరువు భవిష్యత్తులో ఉండబోదని ఆశాభావం వ్యక్తం చేశారు. -
సాగునీటి సమస్యలు రాకుండా చర్యలు
సాక్షి, నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో రైతులకు సాగునీటి సమస్యలు రాకుండా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని గౌతం రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశానికి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి కూడా హాజరయ్యారు. -
టీడీపీ నేత కబ్జా పర్వం
సాక్షి, ఆత్మకూరు(చేజర్ల): ఆ గ్రామంలో ఆ నేతదే పెత్తనం. ఆయన మాటకు ఎవరైనా ఎదురు చెప్తే ఇక అంతే. గత ప్రభుత్వ కాలంలో అధికార బలంతో మండల స్థాయి అధికారులను లోబరుచుకున్నాడు. దళితులకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూములతో పాటు పెన్నా పొరంబోకు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారు. దర్జాగా లీజుకు ఇచ్చి ఏటా లక్షలాది రూపాయలు జేబులో వేసుకుంటున్నాడు. దళితులు ఎవరైనా ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరిస్తున్నాడు. మాజీ శాసనసభ్యుడి అండతో సదరు టీడీపీ నేత సాగిస్తున్న దాష్టీకానికి స్థానిక వీఆర్వో సైతం మద్దతుగా నిలవడంతో దళితులు ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. చేజర్ల మండలం పుల్లనీళ్లపల్లిలో సర్వే నంబర్లు 183, 185, 191లోని 40 ఎకరాల పెన్నా పొరంబోకును దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో నలబై దళిత కుటుంబాలకు పంపిణీ చేశారు. కొందరికి పాసు పుస్తకాలు సైతం అందజేశారు. మరికొందరికి హద్దులు చూపాల్సి ఉంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ భూములపై కన్నేసిన టీడీపీ నేత దళితుల నుంచి పాసుపుస్తకాలు తీసుకుని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. గ్రామ నాయకుడే కదాని నమ్మిన దళితులు పాసుపుస్తకాలు అందజేశారు. పెన్నా పొరంబోకును సదరు నాయకుడు చదును చేసి తన ఆధీనంలో ఉంచుకుని దర్జాగా వేరుశనగ సాగుకు ఇతర ప్రాంతాల వారికి(రామతీర్థ, అల్లూరు) లీజుకు ఇచ్చాడు. ఏటా ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వివిధ స్థాయిల్లో లీజు దండుకుంటున్నాడని బాధితులు తెలిపారు. గ్రామంలోని శ్మశాన వాటిక వెనుక ఉన్న పెన్నా పొరంబోకు సుమారు 30 ఎకరాలకు పైగా ఆక్రమించి వివిధ బినామీ పేర్లతో పట్టాలు సైతం తెచ్చుకున్నాడు. పొలాల వద్దకు పెన్నా నదిలోనే మెటల్ రోడ్డు సైతం వేసుకున్నాడు. ఈ భూమిలో దర్జాగా విద్యుత్ శాఖ అధికారుల సాయంతో ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయించుకుని మోటార్లు బిగించి ఏటా రెండు పంటలు వేరుశనగ సాగుకు లీజుకు ఇస్తున్నాడు. ఇలా పెన్నా పొరంబోకు 70 ఎకరాలను అధికారం అండతో కబ్జా చేశాడు. సంగం రోడ్డు పక్కనే సర్వే నంబర్ 511లోని 12 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆక్రమించాడు. ఇందులోని 8 ఎకరాలను తాను వేరే వ్యక్తుల వద్ద కొనుగోలు చేసినట్లు చెప్పుకుంటున్నాడు. ఈ భూమి సమీపంలో దళితుడైన సబ్బు పుల్లయ్యకు ఉన్న 4 ఎకరాల భూమిని తన భూమిలో కలిపేసుకున్నాడు. పుల్లయ్య, ఆయన కుమారుడు వెంకటేశ్వర్లు భూమి తమదని, గతంలో బోర్లు సైతం వేసుకున్నామని చెబుతున్నా వారి వేదన అరణ్య రోదనగా మారింది. తహసీల్దార్కు ఫిర్యాదు గత మూడ్రోజుల క్రితం చేజర్ల తహసీల్దార్ విజయజ్యోతికి టీడీపీ నేత భూముల ఆక్రమణపై దళిత యువకుడు ఫిర్యాదు చేశారు. దీంతో తహసీల్దార్ విచారణ జరపాలని స్థానిక వీఆర్వోను ఆదేశించింది. అయితే టీడీపీ నేతకు వత్తాసు పలికే సదరు వీఆర్వో తూతూ మంత్రంగా విచారణ జరిపాడు. టీడీపీ నేత ఆధీనంలో ఉండే భూమి సర్వే నంబరు 179లో ఉందని తహసీల్దార్ను పక్కదారి పట్టించాడు. వీఆర్వో కీలక పాత్ర టీడీపీ నేత కబ్జాల పర్వంలో స్థానికంగా పనిచేస్తున్న వీఆర్వో కీలక సూత్రధారిగా వ్యవహరిస్తున్నాడు. వీఆర్వో ప్రభుత్వ భూములకు బినామీ పేర్లతో పట్టాలు తయారు చేసి అడంగల్లో సైతం నమోదు చేయించి నాయకుడికి అప్పగించాడని దళితులు ఆరోపిస్తున్నారు. సదరు వీఆర్వో ఏడేళ్లుగా గ్రామంలోనే పనిచేస్తున్నాడు. 2016లో ఓ మారు బదిలీ అయినా టీడీపీ నేత అండతో కొద్ది రోజులకే గ్రామానికి మళ్లీ బదిలీ చేయించుకున్నాడు. ఇటీవల ప్రభుత్వం మారడం..తహసీల్దార్ సైతం భూములపై విచారణ జరపాలని ఆదేశించడంతో వేరే ప్రాంతానికి బదిలీ చేయించుకునేందుకు ప్రయత్నిస్తుండడం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవడంతో పాటు తమ భూములను అప్పగించాలని దళితులు వేడుకుంటున్నారు. పాసుపుస్తకం తీసుకుని బెదిరిస్తున్నాడు ప్రభుత్వం భూమితో పాటు పట్టా పాసుపుస్తకం సైతం మంజూరు చేసింది. ఏడాది పాటు సాగు చేసుకున్న తరువాత నా పాసు పుస్తకాన్ని టీడీపీ నాయకుడు తీసుకున్నాడు. ఇప్పుడు భూమి తనదేనని అడుగు పెట్టనీయడం లేదు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి. – ఎం నరసింహులు, పుల్లనీళ్లపల్లి అధికారులు న్యాయం చేయాలి ప్రభుత్వం మంజూరు చేసిన భూమిని టీడీపీ నాయకుడు తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ప్రభుత్వం భూములు మంజూరు చేసినట్లు ఆయనే చెప్పడంతో నమ్మకంతో పట్టించుకోలేదు. తీరా ఇప్పుడు అడిగితే అసలు మీకు హక్కే లేదంటూ దాష్టీకానికి పాల్పడుతున్నాడు. అధికారులు స్పందించి న్యాయం చేయాలి. – బొర్రా పెద్దన్న, పుల్లనీళ్లపల్లి భూమిని ఆక్రమించాడు మా తాతల కాలం నుంచి సర్వేనంబర్ 511లోని భూమిని సాగు చేసుకుంటున్నాం. మూడేళ్ల కిందట బోర్లు సైతం వేయించుకున్నాం. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేత భూమిని ఆక్రమించుకుని అడిగితే దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు. – సబ్బు వెంకటేశ్వర్లు, పుల్లనీళ్లపల్లి భూముల సర్వేకు ఆదేశించాం టీడీపీ నేత అక్రమణలపై బాధితులు ఫిర్యాదు చేశారు. పెన్నా పొరంబోకు భూములపై సర్వే జరపాలని సర్వేయర్కు సూచించాం. ఆక్రమణలను గుర్తించి తొలగించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆర్ఐ, వీఆర్వోలను ఆదేశించాం. –విజయజ్యోతికుమారి, తహసీల్దార్, చేజర్ల -
ఆత్మకూరు గౌతమ్రెడ్డిదే..
సాక్షి, ఆత్మకూరు: మేకపాటి గౌతమ్రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో ఆ పార్టీ సిటింగ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన గౌతమ్రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్యపై 22,963 మెజార్టీతో గెలుపొందారు. గురువారం సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలవడ్డాయి. నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో కౌంటింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి వైఎస్సార్సీపీ ఆధిక్యత ప్రదర్శిస్తూనే వచ్చింది. ప్రతి రౌండ్కు పెరుగుతున్న మెజార్టీని చూసి తెలుగు తమ్ముళ్లు బెంబేలెత్తారు. మొదటి నాలుగు రౌండ్లు పూర్తయ్యాక టీడీపీ నాయకులు ఓటమి తప్పదని నిర్ణయానికి వచ్చారు. టీడీపీ వర్గాలు తాము తప్పనిసరిగా గెలుస్తామని చెప్పిన మండలాల్లోనూ వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. తొలి నుంచి ఊహించినట్లుగానే మర్రిపాడు, అనంతసాగరం మండలాలు, ఆత్మకూరు పట్టణంలో వైఎస్సార్సీపీకి మంచి మెజార్టీ లభించింది. టీడీపీ అభ్యర్థికి చెందిన సొంత మండలమైన చేజర్లలోనూ వారు ఆశించిన స్థాయిలో మెజార్టీ రాకపోవడం గమనార్హం. ఆత్మకూరు రూరల్ మండలంలో టీడీపీ వర్గీయులు మెజార్టీ వస్తుందని ఆర్భాటంగా ప్రకటన చేసినా వైఎస్సార్సీపీకే 700 ఓట్లకు పైగా మెజార్టీ రావడం విశేషం. ఇదే క్రమంలో ఏఎస్పేట, సంగం మండలాల్లోనూ తెలుగుదేశాన్ని తోసిరాజని ఓటర్లు వైఎస్సార్సీపీకే మద్దతుగా నిలిచారు. చంద్రబాబు ఎన్ని గిమ్మిక్కులు చేసినా ఓటర్లు పట్టించుకోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల కౌంటింగ్ ఫలితాలను పరిశీలిస్తే ఆత్మకూరు నియోజకవర్గంలోని 277 బూత్ల్లో జరిగిన అన్ని రౌండ్లలో వైఎస్సార్సీపీ మెజార్టీ సాధించగా కేవలం మూడు రౌండ్లలో మాత్రమే టీడీపీ స్వల్ప ఆధిక్యత కనబరిచింది. గౌతమ్రెడ్డి ఘన విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. మేధరవీధి గిరిజన కాలనీలో పార్టీ నాయకురాలు గంధళ్ల లక్ష్మి ఆధ్వర్యంలో 25 కేజీల కేక్ను కట్ చేశారు. 2014 ఎన్నికల్లో గౌతమ్రెడ్డి 31,412 ఓట్ల విజయం సాధించారు. -
ఆత్మకూరు వీవీ ప్యాట్ స్లిప్లపై సీఈ ఆగ్రహం
-
ద్వివేది ఆగ్రహం
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీప్యాట్ స్లిప్పులు దొరికిన వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు. ఆ స్లిప్పులు పోలింగ్ నాటివి కాదని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా కృష్ణా జిల్లా నూజివీడులో వాడని ఈవీఎంల తరలించిన వ్యవహారంపై స్పందించిన ద్వివేది.. ఈ రెండు వ్యవహారాల్లోనూ అధికారులపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలను ఈవీఎంల కమిషనింగ్ సెంటర్గా మాత్రమే వినియోగించామని, ఆత్మకూరు ఆర్డీవో ఆధీనంలో ఉన్న ఈ కమిషనింగ్ సెంటర్లో బ్యాలెట్ పత్రాలు పెట్టిన తర్వాత చెక్ చేశారని, పోలింగ్కు ముందే ఒక్కో నియోజకవర్గానికి కేటాయించిన ఈవీఎంలలో వెయ్యి ఓట్లను బెల్ ఇంజినీర్లు పోల్ చేశారని, ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకున్న తర్వాత వాటిని పోలింగ్ కేంద్రాలకు తరలించారని తెలిపారు. ఎవరో ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా ఈవీఎంలు కమిషనింగ్ చేసిన సమయంలో వచ్చిన వీవీప్యాట్ స్లిప్పులను బయట పారేశారని, వీవీ ప్యాట్ స్లిప్పుల విషయంలో ఆత్మకూరు ఎన్నికల ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన ఉద్యోగులపై క్రిమినల్ కేసు పెట్టి తక్షణం అరెస్ట్ చేయాలని జిల్లా కలెక్టర్ను సీఈఓ ద్వివేది ఆదేశించారు. ప్రతి నియోజకవర్గం పరిధిలో జరిగే తప్పులకు రిటర్నింగ్ అధికారులే బాధ్యులవుతారని హెచ్చరించారు. ఆ ఈవీఎంల తరలింపుపైనా ఆగ్రహం.. స్ట్రాంగ్ రూమ్ నుంచి వాడని ఈవీఎంలను తరలించడంపై సీఈఓ ద్వివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. నూజివీడు సబ్ కలెక్టర్, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) వెంటనే ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కోరారు. దీంతో దాదాపు గంటన్నరపాటు ఈవీఎంల తరలింపుపై నుజువీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కృష్ణా జిల్లా జేసీ మిషా సింగ్ వివరణ ఇచ్చారు. వినియోగించని, రిజర్వ్ చేసిన ఈవీఎంలను మాత్రమే తరలించామని వారు తెలిపారు. పోలింగ్ కేంద్రాలనుంచి ఈవీఎంలు రాకముందే.. వినియోగించని ఈవీఎంలను ఎందుకు తరలించలేదని ద్వివేది నిలదీశారు. ఈ విషయంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. పొరపాట్లు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
దొరికిన వీవీ ప్యాట్ స్లిప్పులు.. కలకలం!
సాక్షి, నెల్లూరు : ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలలో ఈవీంఎలకు అమర్చిన వీవీ ప్యాట్ స్లిప్పులు దొరకడం కలకలం రేపింది. ఎన్నికల్లో ఏ పార్టీ గుర్తుకు ఓటు వేశారో ఓటరకు తెలిపేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మేషిన్ల (ఈవీఎంల)కు వీవీ ప్యాట్లు అమర్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో దాదాపు 200 వీవీ ప్యాట్ స్లిప్పులు దొరికాయి. ఈ స్లిప్పులను ఆత్మకూరు రిటర్నింగ్ అధికారి సోమవారం పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి ఈవీఎంల వినియోగానికి సంబంధించిన శిక్షణ ఇచ్చినప్పుడు వాడిన స్లిప్పులు ఇవని రిటర్నింగ్ అధికారి తెలిపారు. నిబంధనల ప్రకారం శిక్షణ ఇచ్చినప్పుడు వాడిన వీవీ ప్యాట్ స్లిప్పులను కూడా భద్రపరచాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో వీవీ ప్యాట్ స్లిప్పులు దొరికిన ఘటనపై అధికారులను వివరణ కోరతామని కలెక్టర్ స్పష్టం చేశారు. -
కొరుకుడు బాబా..దొంగ లీల
సాక్షి, ఆత్మకూరు(ఎం) : యాదాద్రిభువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పుల్లాయిగూడెం గ్రామానికి చెందిన కొప్పుల రాంరెడ్డికి 35 ఏళ్ల వ యస్సు ఉంటుంది. నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయంలో ఆశించిన దిగుబడులు లేకపోవడంతో జీవనోపాధికి బొంబా యికి వెళ్లాడు. అక్కడ సాంచాలు నడుపుకుంటూ జీవితం గడిపాడు. తర్వాత స్వగ్రామానికి వచ్చి స్థిరపడ్డాడు. గ్రామంలో అతని కున్న నాలుగు ఎకరాలను సాగు చేస్తున్నాడు. గ్రామంలోని పంచా యతీ కార్యాలయం వద్ద కిరాణం కొట్టును నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇంత చేసినా.. పెద్దగా లాభం లేదనుకున్నాడు. ఎటువంటి పెట్టుబడి లేకుండా డబ్బు సంపాధించాలనుకున్నాడు. అందుకు బాబాగా అవతారం ఎత్తడమే.. మేలని తలచాడు. చెర్వుగట్టు వద్ద.. కొన్ని జిమ్మిక్కులు నేర్చుకుని బాబాగా అవతారం ఎత్తాలనున్న రైతు కొప్పుల రాంరెడ్డి కట్టుబొట్టును మార్చాడు. జుట్టును పెంచాడు. కాషాయపు అడ్డలుంగీ చుట్టాడు. బాబాగా అవతారం ఎత్తాడు. కొన్ని జిమ్మింగ్లు నేర్చుకోవడాని ప్రతి అమవాస్య రోజున చెర్వుగట్టుకు వెళ్లుండేవాడు. అక్కడ శివసత్తుల పూనకాలను గ్రహించసాగాడు. తర్వాత గ్రామానికి వచ్చి పూనకం ఊగుతుంతేవాడు. తన కంటూ కొందరు శిష్యులను తయారు చేసుకున్నాడు. తనకు దైవ శక్తులు అవహించినట్లుగా.. నేనేది చెప్పితే అది జరిగి తీరుతుందని ప్రజల్లో శిష్యుల ద్వార ప్రచారం కల్పించుకున్నాడు. రాంరెడ్డి కాస్తా కొరుకుడుగా బాబాగా.. కొప్పుల రాంరెడ్డి కొరుకుడు బాబాగా మారాడు. కొద్ది రోజులనుంచి కొరుకుడు బాబా దగ్గరకు భ క్తులు రావడం ప్రారంభమైంది. దీర్ఘకాలిక వ్యాధులు, సంతానలేమితో బాధపడుతున్న వారు, వ్యాపార రంగంతో కలిసి రాక ఇబ్బందులు పడుతున్న వారు కొరుకుడు బాబా దగ్గరకు రావడం ప్రారంభమైంది. రానురాను వారి సంఖ్య పెరిగిం ది. గతంలో ప్రతి ఆదివారం మాత్రమే భక్తులను చూసే ఈ కొరుకుడు బాబా ఆదివారంతో పాటు శుక్రవారం కూడా చూడడం ప్రారంభించాడు. భక్తుడిని కొరుకుతున్న కొప్పుల రాంరెడ్డి, భక్తురాలి ఒళ్లంతా వత్తుతున్న దొంగబాబా (ఫైల్) పంటిగాటుతో వికృత చేష్టలు.. తన వద్దకు వచ్చే భక్తులకు చిన్న సమస్య అయితే చిన్న పంటి గాటు, పెద్ద సమస్య అయితే పెద్ద పంటి గాటు చేసేవాడు. వంటి మీద కాషాయం వస్త్రం పరిచి తన పంటితో గాటు వేస్తాడు. అయితే ఇందుకు పీజు రూ.200 నుంచి రూ.500 తీసుకునే వాడు. మగవాళ్లు అయితే పడుకోబెట్టి, ఆడవాళ్లు అయితే నిలబెట్టి శరీమంతా తడుముతూ పండి గాట్లు పెట్టేవాడు. అంతే కాకుండా మీ సమస్య జఠిలంగా ఉంది.. ఇక్కడ పరిష్కారం అయ్యేది కాదు.. మీ ఇంటికి వచ్చి చూడాలని అక్కడకు వెళ్లి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు పలువురు బాధితులు చెబుతున్నారు. కొబ్బరి కాయలు దందా చేస్తున్న భార్య ఓ.. వైపు ఇంట్లో కూర్చొని కొరుకుడా బాబా కొప్పుల రాంరెడ్డి తన పంటి గాట్లతో నాలుగు కాసులు సంపాధిస్తుంటే.. అతడి భార్య కవిత వచ్చే భక్తులకు కొబ్బరికాయలు అమ్ముతూ భర్తకు చేదోడుగా నిలుస్తోంది. కొబ్బరికాయ మార్కెట్లో రూ.18 ఉంటే.. ఇక్కడ రూ.100కు అమ్ముతుంటుంది. కొబ్బరికాయతో పాటు రెండు నిమ్మకాయలు. పసుపు, కుంకుమ ప్యాకెట్ కవరు భక్తులకు అందచేసి రూ.100 తీసుకుంటూ దైవం చాటు దందాగా చేస్తోంది. ఎవరైనా భక్తులు బయట నుంచి కొబ్బరికాయలు తీసుకొస్తే అవి ఇక్కడ పనికి రావు.. బాబా ఆగ్రహానికి గురికా వాల్సి వస్తుందని చెప్పడంతో.. భక్తులు చేసేది లేక రూ.100 పెట్టి కొబ్బరికాయ సెట్ తీసుకునేవారు. ఈ కొరుకుడు బాబా వద్దకు హైదరాబాద్, భువనగిరి, మోత్కూరు, ఆత్మకూరు(ఎం), తిరుమలగిరి నుంచి బాధితులు వచ్చేవారు. వాట్సప్లో వైరల్ కావడంతో.. కొరుకుడు బాబా లీలలు వీడియో ఇటీవల వా ట్సప్లో వైరల్ కావడంతో పోలీసులు స్పందిం చారు. దీంతో కొరుకుడు బాబాను స్థానిక ఎస్ఐ కనకటి యాదగిరి ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్ పి.జ్యోతి ఎదు ట బైండోవర్ చేశారు. దీంతో ఈ కొరుకుడు బా బా లీలలు ఒకోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గ్రామస్తులు కూడా ఇటువంటి కార్యక్రమాలను పోత్సహించొద్దని పోలీసులు హెచ్చరించారు. దీంతో ఈ బాబా ప్రస్తుతం గ్రామంలో ఉండకుండా.. బయట తిరుగుతున్నట్లు సమాచారం. -
ఫోన్లో మరణ వాంగ్మూలం రికార్డు చేసి..
సాక్షి, ఆత్మకూర్ (కొత్తకోట): నాలుగేళ్లుగా ప్రేమించిన అమ్మాయి దూరమైందని కలత చెందిన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఆరేపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్గౌడ్కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కిరణ్కుమార్గౌడ్(25) హైదరాబాద్లోని మెహిదీపట్నంలో ఉంటూ కన్ స్ట్రక్షన్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోని మండలంలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. కానీ అమ్మాయి కిరణ్ ప్రేమను తిరస్కరించింది. అనంతరం హైదరాబాద్లోని నల్లకుంట పోలీస్టేషన్లో, అలాగే షీటీంకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కిరణ్కు కౌన్సిలింగ్ నిర్వహించారు. తీవ్ర మనస్తాపానికి గురైన కిరణ్ ఆత్మహత్యకు పాల్పడుతున్న కారణాలను సూసైడ్ నోట్తోపాటు తన ఫోన్లో మరణ వాంగ్మూలం రికార్డు చేసి యూట్యూబ్, వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశాడు. అనంతరం మండలంలోని శ్రీరాంనగర్ రైల్వేస్టేషన్కు సమీపంలో మధ్యాహ్నం 2.25 గంటలకు ఏపీ సంపర్క్ క్రాంతి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో కిరణ్ మృతదేహం ముక్కలుగా విడిపోయి చాలాదూరం పడిపోయాయి. గద్వాల రైల్వే హెడ్కానిస్టేబుల్ రామకృష్ణ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పాత పట్టాలకు పునర్జీవం
సాక్షి, ఆత్మకూరు (నెల్లూరు): ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరు పాళెం సెంటర్ సమీపంలో జాతీయ రహదారి పక్కనే లక్షలాది రూపాయలు విలువగల ప్రభుత్వ భూమిని (రద్దయిన పట్టాల భూమి) టీడీపీ అభ్యర్థికి సహకరిస్తున్నారని అప్పనంగా కట్టబెట్టిన వైనమిది. వివరాలు.. ఆత్మకూరు పట్టణంలో 1999లో అప్పటి ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు టైలర్లకు ఇళ్ల నివేశన స్థలాలు సర్వే నంబర్ 1906లో పట్టాలు మంజూరు చేయించారు. సుమారు 108 మందికి ఈ పట్టాలు అందచేశారు. స్థలాలు పట్టణానికి దూరంగా ఉండటంతో పట్టాలు అందుకున్న వారెవ్వరూ ఈ స్థలాల గురించి పట్టంచుకోలేదు. అనంతరం ఈ పట్టాలను రద్దు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే ఐదేళ్ల క్రితం ఆత్మకూరు మున్సిపాలిటీగా రూపాంతరం చెందడంతో ఆ స్థలాలకు డిమాండు పెరిగింది. ఈ క్రమంలో ఇటీవల ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో మైనార్టీలను ఆకట్టుకునేందుకు టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తే తిరిగి పట్టాలు వచ్చేలా చేస్తామని వారికి ఆశ చూపారు. దీంతో అభ్యర్థివద్దకు వారందరినీ తీసుకుని వెళ్లి మంతనాలు జరిపారు. దీంతో ఆయన అంగీకారం తెలుపుతూ అధికారులతో మాట్లాడి ఆ స్థలాన్ని చదును చేసేందుకు తన ‘సహకారం’ అందించారు. అంతే సర్వే నంబరు1906లోని రెండు రోజుల వ్యవధిలో రేకుల గదుల ఏర్పాటు, ఇళ్ల నిర్మాణాల పనులు ఊపందుకున్నాయి. దండకాలు షురూ..! అప్పట్లో ప్రభుత్వం పేదలైన టైలర్ కుటుంబాలకు నివేశన స్థలాలు మంజూరు చేసేందుకు పట్టాలు అందజేసింది. అయితే వారు అప్పట్లో నిర్మాణాలు చేపట్టక పోవటంతో అవి రద్దయ్యాయి. తిరిగి ఆ పట్టాలు పొందాలంటే ఒక్కొక్కరూ ఒక్కో పట్టాకు రూ. 2 వేల చొప్పున చెల్లించాలంటూ దళారులు దండకాలు చేపట్టారు. అప్పట్లో 108 మందికి పట్టాలు పంపిణీ చేస్తే ఇప్పుడు అదే స్థలంలో 150 మందికి పైగా పట్టాల కోసం దళారులకు డబ్బులు చెల్లించటం విశేషం. దండకాల్లో భాగంగా నలుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ తరఫున పట్టాల కోసం నగదు చెల్లించటంతో అసలైన లబ్ధిదారులు విస్తు పోతున్నారు. 20 ఏళ్ల క్రితం టైలర్లుగా ఉన్న కొందరు మృతి చెందటం, కొందరు ఊరు విడిచి వెళ్లటం, కొంతమంది వివిధ ఉద్యోగాలలో చేరారు. వారి స్థానంలో కొత్త వారిని చేరుస్తామంటూ సదరు నాయకులు నగదు వసూలు చేశారు. అసలైన పేదలకు అన్యాయం అప్పట్లో టైలర్ వృత్తి చేస్తూ అనారోగ్యానికి గురై పక్షవాతం సోకి జీవనం కోసం సత్రం సెంటర్లో బడ్డీ బంకు పెట్టుకుని జీవనం సాగిస్తున్న వ్యక్తి వద్ద రూ. 2వేలు డిమాండు చేయటంతో అతను ‘తండల్’కు తెచ్చి చెల్లించాడు. ఇదే క్రమంలో బస్టాండు సెంటర్లో ఏళ్ల తరబడి టైలర్ పని చేసి ప్రస్తుతం మంచంలో ఉన్న ఖాజా మస్తాన్, సత్రం సెంటర్లో టైలర్ పని చేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న నజీర్ తదితరులు పేర్లు తొలగించారు. ఇలా ఇష్టారాజ్యంగా అసలైన లబ్ధిదారులను తొలగించి నగదు చెల్లించిన వారికి పట్టాలు మంజూరు చేసేందుకు దళారులు పూనుకోవటం పట్ల పేదలు మండి పడుతున్నారు. దళారులలో ఓ ప్రధాన వ్యక్తి రూ.2 వేలు చొప్పున చెల్లించిన వారికి చీటీలు వేసి డిప్ ద్వారా ఫ్లాట్ నంబర్ కేటాయించటం విశేషం. ఆయన కేటాయించిన మేరకే ఫ్లాట్లు ఇస్తారని ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఉన్నతాధికారులు పరిశీలించి అసలైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరుతున్నారు. ఈ విషయమై మండల తహసీల్దార్ విద్యాసాగరుడుని సంప్రదించగా ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టకపోవటంతో అవి గడువు తీరిన అనంతరం ప్రభుత్వ స్థలాల కిందే లెక్క. అక్కడ నిర్మాణాలు చేపడుతున్న విషయం తెలియటంతో సిబ్బందిని పంపి నిలుపుదల చేయించా. ఇప్పుడు మళ్లీ నిర్మాణాలు చేస్తుంటే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. -
ముక్కిడి గుట్ట శవం
దెయ్యాలు లేవని ఒక్కోసారి గట్టిగా నమ్మాల్సి ఉంటుంది.దెయ్యాలు ఉండుంటే బతికి ఉండగా తమను అన్యాయంగా చంపినవారికి ఊరికే వొదిలి ఉండేవా?ప్రతి మనిషి మనసులో దెయ్యం ఉంటుంది.అది చెడు చేయమని పురిగొల్పుతూ ఉంటుంది.దానికి లొంగితే తాత్కాలిక విజయం.శాశ్వత అపజయం.12 ఆగస్టు 2016.రాత్రి 9.45. రామన్నపేట పోలీస్ స్టేషన్లో ఫోన్ మోగింది.సీఐ ఎత్తాడు.‘ఓకే .. ఇప్పుడే బయల్దేరుతున్నాం..’ అంటూ క్యాప్ను తల మీదుగా సర్దుకున్నాడు. సీఐని గమనించిన సిబ్బంది అలెర్ట్ అయ్యారు. ‘ఆత్మకూరు ఎస్ఐ నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే బయల్దేరాలి’ అన్నాడు సీఐ. క్షణాల్లో అందరూ వెహికిల్లోకి ఎక్కారు.జీపు భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలోని రాఘవాపురం గ్రామానికి హుటాహుటిన చేరుకుంది.పోలీసు జీపు శబ్దం వింటూనే పరుగుపరుగున జనం అక్కడకు చేరుకున్నారు. ‘ఏమైంది?’ దిగుతూనే అడిగాడు సీఐ.‘సార్.. ఆ ముక్కిడిగుట్ట నుంచి భరించలేని వాసన. కుళ్లిపోయిన శవం వాసనలా ఉంది. భరించలేకుండా ఉన్నాం’ చెప్పారు అక్కడ చేరిన జనంలోంచి ఒకరిద్దరు. ‘మీరు మాతో రావల్సి ఉంటుంది. ఏంటో తెలుసుకుందాం..’ అన్నాడు సీఐ.‘అలాగే సార్’ అన్నారు వాళ్లు.జనంతో పాటుగా ముక్కిడిగుట్ట వైపుగా వెళ్లారు పోలీసులు. గాలి వీస్తున్నప్పుడల్లా దుర్వాసన కూడా వేగంగా వస్తోంది. కానీ, ఆ చీకట్లో ఏమీ కనిపించడం లేదు. పైగా చెట్ల పొదలు. టార్చిలైట్ల సాయంతో వెతికి చూశారు. లాభం లేదు.. అయినా వారి ప్రయత్నం మానలేదు.తెలతెలవారుతుండగా చెట్ల పొదల్లో లోయలాగ ఉన్న ప్రాంతంలో ఓ అమ్మాయిæ మృతదేహాన్ని గుర్తించారు. శవం పూర్తిగా కుళ్లిపోయి గుర్తుపట్టరాకుండా ఉంది. శరీరంపై పసుపు రంగు పంజాబీ డ్రెస్ ఉంది. ఆత్మకూరు ఎస్ఐ, రామన్నపేట సీఐ ఇద్దరూ అక్కడే ఉన్నారు. నల్లగొండ నుంచి డాగ్స్క్వాడ్ వచ్చింది. పోలీసు జాగిలం గుట్ట పైన, కింద పరిసరాల చుట్టూ తిరిగింది. అయినా ఎటువంటి ఆధారాలూ దొరకలేదు. అధారాల కోసం శవం ఉన్న ప్రదేశం నుంచి చుట్టూ యాబై గజాల దూరంలో మరోసారి అంగుళం అంగుళం వెతికారు. ఒకచోట పగిలిన ఎర్రటి గాజు ముక్కలు, మరికాస్త దూరంలో ఓ చెప్పుల జతతో పాటు రెండు బస్ టికెట్లుæలభించాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యా జరిగిన ముక్కిడిగుట్టపై దొరికిన బస్ టికెట్ల వివరాలు సేకరిస్తే అవి మహేశ్వరం బస్డిపోకు చెందినవని, ఆగస్టు 7న శంషాబాద్ నుంచి శివరాంపల్లికి ప్రయాణం చేసినవారివి అయి ఉంటాయని తెలిసింది. స్వాధీనం చేసుకున్న బస్ టికెట్ల ఆధారంగా సీఐ, ఎస్ఐ దర్యాప్తు ముమ్మరం చేశారు. మొదట శంషాబాద్ పోలీస్ స్టేషన్కు వారు చేరుకున్నారు. ‘ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వారంలో మిస్సింగ్ కేసులు ఏమైనా ఉన్నాయా’ అని అడిగాడు ఎస్ఐ. వెంటనే ఆ వివరాలు వచ్చాయి.పది రోజుల వ్యవధిలోనే ఐదు మిస్సింగ్ కేసులు నమోదు అయినట్లుగా అక్కడి పోలీసులు తెలిపారు. ఆ ఐదు మిస్సింగ్ కేసులలో ఒక అమ్మాయి ధరించిన దుస్తులు, చెప్పుల జత తమకు లభ్యమైన ఆధారాలతో సరిపోలడంతో హత్యకు గురైన అమ్మాయి 22 ఏళ్ల శివలీలగా గుర్తించారు పోలీసులు.తమ కూతురు మిస్ అయినట్టు శంషాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన శివలీల తల్లిదండ్రులను స్టేషన్కు పిలిపించారు పోలీసులు. వివరాలన్నీ తెలుసుకున్న తల్లీతండ్రీ బోరుమన్నారు. ‘సార్.. ఈ అమ్మాయి మా శివలీలనే. తను అంత దూరం ఎందుకు వెళ్లిందో తెలియదు. ఈ దారుణానికి ఒడిగట్టిందో ఎవరో తెలియదు. ఈ ఏడాదే అమ్మాయి పెళ్లి చేద్దామనుకున్నాం. ఇలా జరిగింది’ కుమిలి కుమిలి ఏడుస్తున్న వారితో ‘చనిపోయిన మీ అమ్మాయిని మేం తెచ్చివ్వలేకపోవచ్చు. కానీ, నేరస్తులు ఎవరో ఎక్కడున్నా పట్టుకు తీరుతాం’ దృఢంగా చెప్పి బయటకు నడిచాడు సీఐ. శివలీలతోపాటు మరో వ్యక్తి ప్రయాణించినట్టు సంఘటన స్థలం వద్ద లభించిన బస్ టికెట్స్ చెబుతున్నాయి. కనుక శివలీలకు ఇతర వ్యక్తులతో ఉన్న పరిచయాల పట్ల ఆరాతీశారు పోలీసులు. శివలీల తల్లిదండ్రుల నుంచి, ఆమె స్నేహితులు, పరిచయస్తుల వద్ద నుంచి మరిన్ని వివరాలు సేకరించారు. ఆ వివరాల్లో శివలీలకు ఒక వ్యక్తితో ఉన్న పరిచయం గురించి పోలీసులకు తెలిసింది. దీంతో ఆ కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. శివలీలతో పరిచయం ఉన్నట్టుగా అనుమానిస్తున్న ఆ వ్యక్తి సెల్ఫోన్పై పోలీసులు దృష్టి సారించారు. ఆగస్టు 20. భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన ముప్పై ఏళ్ల రవి(పేరు మార్చాం)ని అరెస్ట్ చేశారు పోలీసులు. ముందు తనకేమీ తెలియదని బుకాయించిన రవి పోలీసుల విచారణలో అసలు నిజాలు బయటపెట్టాడు. అవి ఇలా ఉన్నాయి.బైక్ మెకానిక్గా అబ్దుల్లాపూర్ మెట్టు వద్ద పనిచేస్తుంటాడు రవి. హత్యకు గురైన శివలీల అబ్దుల్లాపూర్ మెట్టు వద్ద ఉన్న అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలోనే రవికి శివలీలతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆర్నెల్లు కలిసి తిరిగారు. తల్లిదండ్రులు వచ్చినప్పుడల్లా శివలీల పెళ్లి విషయం ప్రస్తావన వచ్చేది. దీంతో తనను పెళ్లి చేసుకోమని, లేకుంటే తమ విషయాన్ని పెద్దవాళ్లతో చెబుతానని శివలీల రవిపై ఒత్తిడి చేయడం ప్రారంభించింది. అయితే, రవికి మూడేళ్ల క్రితమే వివాహం అయింది. ఏడాది వయసున్న కూతురు కూడా ఉంది. తరచూ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్న శివలీలను కొన్నాళ్లు తప్పించుకు తిరిగాడు. కానీ, ఇంకా ఆలశ్యం చేస్తే నేరుగా ఇంటికే వచ్చేస్తానని బెదిరింపులకు దిగడంతో ఆమెనే అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు రవి. శివలీలను మట్టుపెట్టడానికి ఊరికి శివారులో ఉన్న ముక్కిడిగుట్ట సరైన ప్లేస్ అనుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా ప్లాన్ని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు.మహేశ్వరంలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లిన శివలీలకు ఫోన్ చేసి..‘నేను హైదరాబాద్లోనే ఉన్నాను. ఇద్దరం కలిసి మా ఊరు వెళ్దాం. అక్కడ మా ఇంట్లో వాళ్లకు పరిచయం చేస్తాను. అక్కడ మావాళ్లతో మాట్లాడి మన పెళ్లికి ఒప్పిద్దాం. తర్వాత మీ అమ్మనాన్నలతో మాట్లాడుదాం, సరేనా’ అన్నాడు రవి. శివలీల సంతోషంగా ఒప్పుకుంది. ఆగస్టు 7న ఉదయం అమ్మమ్మ వద్దకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయల్దేరింది. ఆమెను మహేశ్వరం బస్డిపోలో కలుసుకున్నాడు రవి. ఇద్దరూ ముందుగా శివరామ్పల్లికి చేరుకున్నారు. అక్కడి నుంచి వలిగొండకు చేరుకుని రెండు రోజులు ఉండిపోయారు. 9 ఆగస్టు రాత్రి 7 గంటల ప్రాంతంలో ముక్కిడిగుట్టకు శివలీలను తీసుకొచ్చాడు రవి.అసలే అటవీ ప్రాంతంలా ఉంది. పైగా చీకటి. జన సంచారం ఏమాత్రం లేదు అక్కడ. ‘ఇంటికని ఇక్కడికెందుకు తీసుకొచ్చావు. బాగా చలిగా కూడా ఉంది’ చుట్టూ చూస్తూ అంది శివలీల. ‘పెళ్లి గురించి అడిగావు కదా. పెళ్లి చేసి పైకి పంపించేద్దామని’ అన్నాడు రవి వెటకారంగా. రవి మాటలకు శివలీలకు కోపం వచ్చింది. ‘ఇంత మోసం చేస్తావా. మీ ఇంటికని చెప్పి ఈ గుట్టకు తీసుకొస్తావా? ఊళ్లోకెళ్లి అందరికీ నీ విషయం చెప్పి నీ బతుకు బజారుకీడుస్తా’ ఆవేశంగా అంటూనే శివలీలఅక్కణ్ణుంచి ఊరి వైపుగా పరిగెత్తబోయింది. కానీ, రవి ఆమెను అడుగు ముందుకు పడనీయకుండా గట్టిగా పట్టుకున్నాడు. శివలీల చున్నీ ఆమె మెడ చుట్టూ గట్టిగా బిగించాడు. ఆ పెనుగులాటలో మహేశ్వరం డిపో బస్ టికెట్లు రవి జేబులో నుంచి పడిపోయాయి. శివలీల చేతి గాజులు పగిలి అక్కడే పడిపోయాయి. కాసేపటికి శివలీల నిర్జీవంగా వాలిపోయింది. శివలీల చనిపోయిందని నిర్ధారించుకున్న రవి పీడ విరగడ అయిందనుకుని ఆమె శరీరాన్ని కొంత దూరం లాక్కెళ్లి అక్కణ్ణుంచి చెట్ల పొదల్లోకి జారవిడిచి, ఊళ్లోకి వెళ్లిపోయాడు. ప్రేమ పేరుతో వంచించి, ఆమెను అడ్డు తొలగించుకోవడానికి హత్య చేసిన రవి ఈ విషయం ఎవరికీ తెలియదనుకున్నాడు. తెలిసే అవకాశమే లేదనుకున్నాడు. కానీ నేరం దాగదని, రవిని జైలుకు పంపించి నిరూపించారు పోలీసులు. – రేగోటి పాండురంగం, సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా -
నిఘాపై నిర్లక్ష్యం
ఆత్మకూరు: జిల్లాలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో పంపనూరు ఒకటి. సర్పరూప సుబ్రమణ్యేశ్వర స్వామి కొలువైన ఈ ఆలయానికి జిల్లా నలుమూలల నుంచే కాక కర్ణాటక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు. ప్రతి ఆది, మంగళవారాల్లో భక్తులు పోటెత్తుతుంటారు. ఎంతోమంది భక్తులు తమ కోర్కెలు నెరవేరాలని ఆలయం చుట్టూ 108 ప్రదక్షణలు చేస్తుంటారు. ఆదాయం రూ.లక్షల్లో ఉన్నప్పటికీ ఆ స్థాయిలో ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. దేవాదాయ శాఖకు సుబ్రమణ్యస్వామి ఆదాయంపై ఉన్న శ్రద్ధ.. ఆలయ అభివృద్ధిపై ఏమాత్రమూ ఉండటం లేదు. ఇక్కడ ఆలయ కమిటీ అనుబంధంగా అన్నదాన కమిటీ ఉన్నాయి. ప్రముఖ ఆలయంగా పేరొందినప్పటికీ ఇక్కడ ఎటువంటి భద్రతా ఏర్పాట్లూ లేవు. భక్తుల భద్రత, చోరీల నివారణ, అక్రమాలకు చెక్ పెట్టేందు కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. గర్భగుడిలో ఏకంగా కుక్కలు, కోతులు సంచరిస్తున్నా పట్టించుకునే నాథులే లేరు. భక్తుల రద్దీ అధికంగా ఉండే ఆది, మంగళ వారాల్లో మాత్రం ఓ కమిటీ సభ్యులు కనిపిస్తుంటారు. పనిచేయని సీసీ కెమెరాలు ఆలయం లోపల తక్కువ సామర్థ్యం కలిగిన తొమ్మిది సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇందులో మూడు పనిచేయడం లేదు. మిగిలిన ఆరు పనిచేస్తున్నప్పటికీ అందులో రికార్డవుతున్న దృశ్యాలలో స్పష్టత ఉండటం లేదు. ఫలితంగా ఎటువంటి ఉపయోగమూ లేకుండా పోతోంది. గర్భగుడి వద్ద సీసీ కెమెరాలు ఊడి గోడలకు వేలాడుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఆలయ ప్రాంగణంలో వాహనాలు నిలిపే చోట, రోడ్డు నుంచి ఆలయం వరకు నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే దీని గురించి ఎవ్వరూ దృష్టి సారించడం లేదు. నిధులు వెనక్కేనా? ఆలయంలో తొమ్మిది సీసీ కెమెరాలు ఉన్నాయి. రెజల్యూషన్/ పిక్సెల్స్ తక్కువ సామర్థ్యం కావడంతో సీసీ ఫుటేజీల్లో ఏమాత్రం స్పష్టత కనిపించడం లేదు. వీటిని తొలగించి కొత్తగా 30 సీసీ కెమెరాల వరకు ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ ఇటీవల రూ.7.50 లక్షల నిధుల మంజూరుకు ఆమోదం తెలిపింది. ఈ పనులు కోసం ఇటీవల ఓపెన్ టెండర్ కూడా పిలిచారు. అయితే ఆ టెండర్ రద్దు అయినట్లు ఈఓ సుధారాణి తెలిపారు. దాతల ద్వారా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించి, మంజూరైన దేవాదాయ నిధులను నొక్కేయాలనే ఆలోచనలో సిబ్బంది ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సకాలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించకపోతే మాత్రం నిధులు వెనక్కుపోయే అవకాశం ఉంది. నెలాఖరులోపు టెండర్లు ఆలయంలససీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎండోమెంట్ వారు రూ.7.50 లక్షలు మంజూరు చేశారు . వాటి కోసం ఇటీవల ఓపెన్ టెండర్లు పిలిచి రద్దు చేయించాం. కాని ఆ టెండర్లు రద్దు అయ్యాయి. ఈ నెల ఆఖరులోపు టెండర్లు పిలుస్తాం. – సుధారాణి, ఈఓ, పంపనూరు కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పాం సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయానికి ప్రతి ఆది, మంగళ వారాల్లో వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. రద్దీని నియంత్రించడానికి ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను పంపుతున్నాం. కానీ దొంగతనాలు, మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని గుర్తించడానికి అనుగుణంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ అధికారులకు చెప్పాం. – సాగర్, ఎస్ఐ, ఆత్మకూరు -
మంత్రి సోమిరెడ్డికి ఝలక్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు ఇన్చార్జి వ్యవహారంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. సోమిరెడ్డి తన అనుచరుడు కన్నబాబును ఇన్చార్జిగా చేయాలని గట్టిగా ప్రయత్నించారు. అయితే పార్టీ అధిష్టానం తాత్కాలిక ఇన్చార్జిగా ఆదాల ప్రభాకర్రెడ్డి నియమించింది. ఇప్పటి వరకూ ఇక్కడ ఇన్చార్జిగా ఉన్న మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో నియోజకవర్గ ఇన్చార్జి కోసం నేతల మధ్య విభేదాలు కొనసాగాయి. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు తమ అనుచరులకు ఇన్చార్జి పదవి కట్టబెట్టాలని పోటీ పడ్డారు. అయితే అందుకు పూర్తి భిన్నంగా నెల్లూరు పార్లమెంట్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ఆదాల ప్రభాకరెడ్డిని నియమిస్తూ పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఆదాల ప్రభాకర్రెడ్డికి పూర్తిగా నియోజకవర్గం కొత్త కావటంతో పార్టీ అంతర్గత విషయాల్లో సమన్వయం చేసుకోవాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రను ఆదేశిచింది. ఈ క్రమంలో సోమవారం మంత్రులతో కలిసి ఆదాల ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో సమావేశం నిర్వహించనున్నారు. గత నెల రోజులుగా అధికార పార్టీలో ఆత్మకూరు నియోజకవర్గ వ్యవహారం రగడ కొనసాగుతుంది. ముఖ్యంగా గతంలో పోటీచేసి ఓడిపోయిన కన్నబాబుకు ఇన్చార్జి పదవి ఇవ్వాలని మంత్రి సోమిరెడ్డి బలంగా ప్రయత్నించారు. డీసీసీ బ్యాంకు చైర్మన్ మెట్టకూరు ధనుంజయరెడ్డికి ఇప్పించాలని ఒక దశలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ప్రయత్నించి చివరికి ఆయన కూడా కన్నబాబుకే మద్దతు పలికారు. మరికొందరు పదవి ఆశించారు. ఈ క్రమంలో ఆత్మకూరు వ్యవహారంపై గత శనివారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమన్వయకమిటీ సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది. ఆత్మకూరు ఇన్చార్జిని కాకుండా ఐదుగురు సభ్యులతో సమన్వయకమిటీ ఏర్పాటు చేయాలని భావించారు. అయితే దీనికి నిరసనగా డీసీసీ బ్యాంకు చైర్మన్ ధనుంజయరెడ్డి గైర్హాజరు కావటం, హాజరైన కన్నబాబు ఆయన వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేయటంతో పార్టీకి కొంత తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో నేతల మధ్య వివాదం సాగుతున్న క్రమంలో చివరకు ఆదాల ప్రభాకర్రెడ్డిని తాత్కాలిక ఇన్చార్జిగా నియమించారు. జిల్లా అధ్యక్షుడిపై పరిశీలకుడు ఫిర్యాదు పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రపై పార్టీ జిల్లా పరిశీలకులు ఎరిక్సన్ బాబు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పార్టీ అంతర్గత విషయాలు చర్చించటానికి, ఇతర పార్టీ కార్యక్రమాల్లో తనకు ప్రాధాన్యం ఇవ్వటం లేదని ఎరిక్సన్ బాబు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. -
ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో దారుణాలు!
సాక్షి, నెల్లూరు: ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వరుస దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు బలవుతున్నాయి. నిన్నటికి నిన్న చిత్తూరు జిల్లా పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వైద్యం అందక బాలింత ప్రాణాలు విడిచారు. తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలోనూ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండు గర్భిణికి వైద్యం అందలేదు. ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మూడురోజులుగా వైద్యులు అందుబాటులో లేరు. దీంతో గర్భిణీకి వైద్యం అందక.. కడుపులోనే శిశువు మృతిచెందింది. బిడ్డ దక్కకపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై భగ్గుమంటున్నారు. పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలోనూ.. ఇక పుత్తూరు పట్టణం ఆచారి వీధికి చెందిన నిఖిలను డెలివరీ కోసం శనివారం పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ప్రసవం అనంతరం అధిక రక్తస్రావం కావడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో ఆదివారం రాత్రి ఆమె మరణించింది. ప్రసవానంతరం సరైన చికిత్స చేయకుండా నిఖిల మరణానికి కారణమయ్యారంటూ ఆస్పత్రి సిబ్బందిపై మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి తీరుకు నిరసనగా రోడ్డుపై ధర్నాకు దిగి ఆందోళన చేపట్టారు. -
ఏసీబీ వలలో అవినీతి అనకొండ
సాక్షి, పులివెందుల : కర్నూలు జిల్లా ఆత్మకూరులో అసిస్టెంట్ సోషల్(బీసీ) వెల్ఫేర్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న రాజకుళ్లాయప్ప పులివెందుల పట్టణంలోని రాఘవేంద్ర థియేటర్ సమీపంలో నివాసముంటున్నాడు. మంగళవారం ఏసీబీ అధికారులు ఆయన ఇంటిపై దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారులు ఏడు బృందాలుగా ఏర్పడి పట్టణంలోని రాజకుళ్లాయప్ప ఇంటితోపాటు మరో రెండు చోట్ల, పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెలో రెండు చోట్ల, కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఒకచోట, వేంపల్లెకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఒకచోట ఏసీబీ అధికారులు ఏక కాలంలో దాడులు చేశారు. ఈ దాడులలో రాజకుళ్లాయప్ప ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ సోదాలు నిరంతరాయంగా కొనసాగాయి. సోదాలలో వేంపల్లె వద్ద 16ఎకరాల వ్యవసాయ క్షేత్రం, ముద్దనూరు మండలం ఉప్పరపల్లె గ్రామం వద్ద 7ఎకరాలు, నల్లపురెడ్డిపల్లెలో 4ఎకరాలు, పులివెందుల, ఎర్రబల్లె ప్రాంతాలలో పలు ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ.20కోట్ల అక్రమాస్తులు రాజకుళ్లాయప్ప కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా కడప ఏసీబీ డీఎస్పీ నాగరాజు మీడియాతో మాట్లాడుతూ రాజకుళ్లాయప్ప ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలపై సోదాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సోదాలలో రాజకుళ్లాయప్పకు 12చోట్ల ప్లాట్లు, ఇళ్లులు, వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఇవేకాకుండా 5.50ఎకరాల భూమి కోర్టు పరిధిలో ఉందన్నారు. ఇటీవలే రాజకుళ్లాయప్ప దాదాపు రూ.3.94కోట్లు అప్పులు చెల్లించినట్లు గుర్తించామన్నారు. అలాగే రాజకుళ్లాయప్ప రూ.51లక్షలు అప్పులు ఇచ్చినట్లు వెల్లడైందన్నారు. అంతేకాకుండా రాజకుళ్లాయప్ప ఆంధ్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ల లాకర్లలో 600గ్రాముల బంగారం, బొలేరో వాహనం, బుల్లెట్ వాహనం, రూ.6లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ దాదాపు ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.6కోట్లు ఉంటుందని.. మార్కెట్ విలువ ప్రకారం రూ.20కోట్లు అవుతుందని ఆయన తెలిపారు. రాజకుళ్లాయప్ప గతంలో పులివెందుల ఎన్జీఓ సంఘ అధ్యక్షుడుగా కూడా పనిచేశారు. ఆ సమయంలో ఆయన పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె బీసీ హాస్టల్లో వార్డెన్గా విధులు నిర్వర్తించేవారు. అప్పట్లో హౌసింగ్ సొసైటీలో ఉద్యోగులకు ప్లాట్లు ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసి పెద్ద ఎత్తున గోల్మాల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడులలో ఏసీబీ డీఎస్పీ నాగరాజుతోపాటు కర్నూలు ఏసీబీ డీఎస్పీ జయరామరాజు, కడప ఏసీబీ ఇన్స్పెక్టర్లు రామచంద్ర, సుధాకర్, కర్నూలు ఏసీబీ ఇన్స్పెక్టర్ నాగభూషణంతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రెవెన్యూ,టీడీపీ నేతల మద్య వివాదం
-
హీటర్ పెట్టుకోబోతే..
ఆత్మకూరు: చలిగా ఉంది కదా వేడి నీళ్లతో స్నానం చేద్దామని హీటర్ పెట్టుకున్నాడు. అదే ఆ చిన్నారిపాలిట మృత్యుపాశమైంది. ఈ విషాద సంఘటన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లిలో ఆదివారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన శ్రవణ్(8) నీళ్లు కాచుకునేందుకు వాటర్ హీటర్ను ప్లగ్లో పెడుతున్నాడు. ఈ క్రమంలో ఎర్త్ అయి విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో అతను అక్కడిక్కడే చనిపోయాడని ఎస్.ఐ రాజు తెలిపారు. మృతుడు అదే గ్రామంలో 4వ తరగతి చదువుతున్నాడు. కాగా, గతేడాదే తండ్రి చనిపోయాడని తెలిసింది. దీంతో దేవరపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
వేసేయ్ పాగా.. కాజేయ్ జాగా!
ప్రభుత్వ పాలన మనదే కదాని తెలుగు తమ్ముళ్లు ఆక్రమణలకు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలే కదా అని పాగా వేసి.. జాగా కాజేస్తున్నారు. అధికారం ముసుగులో ప్రభుత్వ స్థలాల భక్షకులుగా మారుతున్నారు. వారే కాదు వారి బంధువులు సైతం దర్జాగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. నెల్లూరు–ముంబాయి జాతీయ రహదారి ఎన్హెచ్–67పై రోడ్డు పక్క స్థలాలు ఆక్రమించుకుంటూ వ్యాపార గదులు నిర్మించి అడ్వాన్సులు, అద్దెల రూపంలో లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు. ఆత్మకూరు: గత స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మేజర్ పంచాయతీగా ఉన్న ఆత్మకూరు మున్సిపాలిటీగా, ఆ తర్వాత రెవెన్యూ డివిజన్ కేంద్రంగా అభివృద్ధి చెందడంతో అంతే వేగంగా పట్టణంలో ఆక్రమణలు జోరందుకున్నాయి. రాష్ట్ర రహదారిగా ఉన్న నెల్లూరు–ముంబయి రోడ్డు సైతం జాతీయ రహదారిగా మారడంతో ఇటీవల కోట్లాది రూపాయలతో నాలుగు లైన్ల రహదారిగా విస్తరించారు. వాహనాల రద్దీ పెరిగి వ్యాపారాల నిర్వహణకు అనువుగా తయారైంది. ఇదే అదనుగా స్థానిక టీడీపీ నేతలు మున్సిపల్ పాలకవర్గానికి చెందిన కొందరు నాయకులు దర్జాగా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి గదులు నిర్మిస్తున్నారు. గత ఏడాది ఓ నాయకుడు నెల్లూరుపాళెం సెంటర్లో ఐదు గదులతో కాంప్లెక్స్ నిర్మించి అద్దెలకు ఇచ్చేశాడు. ఓ పేదవాడు బతుకుదెరువు కోసం రోడ్డు పక్కన దుకాణం నిర్ధాక్షిణ్యంగా తొలగించిన అధికారులు టీడీపీ నేతల ఆక్రమణల వైపు కన్నెత్తి చూడటం లేదు. అది నీకు.. ఇది నాకు ఆక్రమణల్లోనూ తెలుగు తమ్ముళ్లు సమన్యాయం పాటిస్తున్నారు. పాలకవర్గానికి చెందిన ఓ ముఖ్య నేత అండదండలతో స్థానిక టీడీపీ నాయకులు ఓ కౌన్సిలర్ సమీప బంధువు ఈ ఆక్రమణల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రోడ్డు పక్కన ప్రభుత్వ స్థలాన్ని ప్రధాన రోడ్డుకు అనుసంధానం చేస్తూ చదును చేసేందుకు మట్టి కూడా తొలి సిద్ధంగా ఉంచారు. మరో రెండు రోజుల్లో ఈ స్థలాన్ని చదును చేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ముందుగా ఇలా మట్టి తొలి..ఆ తర్వాత ఆక్రమించడం పరిపాటిగా మారింది. మరెవరూ ఈ స్థలాల జోలికి రాకుండా అడ్డుగా కంపకర్ర సైతం వేశారు. దీనికి తోడు సెంటర్లో కొంత స్థలాన్ని స్థానిక టీడీపీ నేత సొంతంగా ఆక్రమించి గదులు కట్టేందుకు మెటిరియల్ చేర్చేశాడు. ఇలా తెలుగు తమ్ముళ్ల ఆ స్థలం నీకు ఈ స్థలం నాకు మరో స్థలం మన మరో నాయకుడికి అంటూ కేటాయింపులు చేసుకోవడంతో స్థానికులు ఔరా అని ఆశ్చర్యపోతున్నారు. ఈ ఆక్రమణల విషయం మున్సిపల్, రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకునే పరిస్థితి లేదు. మట్టి సైతం ఈ ఆక్రమిత స్థలాల్లో చదును చేసేందుకు తోలిన మట్టి సైతం పట్టణంలోని పాత పంచాయతీ కార్యాలయం లగించిన అనంతరం చదును చేసే క్రమంలో వచ్చిన మట్టిని ఇక్కడకు తరలించారు. ఈ మట్టి తొలగించేందుకు మున్సిపాలిటీ ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది. అయితే ఆ మట్టిని సైతం తెలుగు తమ్ముళ్లు తాము ఆక్రమించిన స్థలాలకు కొంత తోలుకోగా మరికొంత మట్టిని ట్రాక్టర్ రూ.300 చొప్పున అమ్ముకున్నారు. ఇలా బరి తెగించి తెలుగు నేతలు ప్రవరిస్తున్న తీరును చూసి పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పరిశీలించి ఆక్రమణలను నిరోధించాలని ప్రజలు కోరుతున్నారు. ఆక్రమిత స్థలాల్లో బోర్డులు పెడతాం మున్సిపల్ పరిధిలోని నెల్లూరుపాళెం సెంటర్ వద్ద జాతీయ రహదారిపై ఆక్రమిత స్థలాల్లో ప్రభుత్వ స్థలాలనే బోర్డులను ఏర్పాటు చేస్తాం. గతంలో జాతీయ రహదారికి విస్తరించక ముందు అనాదిగా దుకాణాలను పెట్టుకున్న వారికి మాత్రమే అవకాశమిస్తాం. మరెవరైనా కొత్తగా ఏర్పాటు చేస్తా ఉపేక్షించాం. ఆక్రమణలను తొలగిస్తాం. – వీ శ్రీనివాసరావు, కమిషనర్ -
మహిళా సంఘాలపై ఎమ్మెల్యే కక్ష సాధింపు
ఆత్మకూరు: మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. పోలీసులు, అధికారులను ఉసిగొల్పి తమను ఇబ్బంది పెడుతున్నారని వారు వాపోతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఎమ్మెల్యే అండతో పోలీసులు, మునిసిపల్ కమిషనర్ రమేష్బాబు దౌర్జన్యం చేయడంతో ప్రియదర్శిని మహిళా సంఘం అధ్యక్షురాలు షఫివున్ స్పృహ కోల్పోయి ఆస్పత్రి పాలయ్యారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆత్మకూరు పట్టణంలోని రామ్ రహీం రాబర్ట్ పట్టణ మహిళా సమాఖ్య పరిధిలో 36 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో ఆరు సంఘాలు ఎమ్మెల్యేకు మద్దతు తెలుపుతుండగా.. మిగిలిన 30 సంఘాలు వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డికి మద్దతుగా ఉన్నాయి. కాగా..కేవలం ఆరు సంఘాల మద్దతు ఉన్న సరోజ అనే మహిళను ఎమ్మెల్యే అండతో అధికారులు గుట్టుచప్పుడు కాకుండా పట్టణ సమాఖ్య అధ్యక్షురాలిగా ఎన్నిక చేశారు. సరోజ సోమవారం మునిసిపల్ కమిషనర్, పోలీసులను తీసుకెళ్లి మెప్మా కార్యాలయాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించారు. కార్యాలయ తలుపులు మూసి ఉండడంతో తాళం పగులగొట్టేందుకు కమిషనర్ యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న మిగిలిన సంఘాల సభ్యులు అక్కడికి చేరుకున్నారు. కమిషనర్ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గొడవ జరగడంతో షఫివున్ స్పృహ కోల్పోయింది. ఆమెకు బీపీ పడిపోవడంతో వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం షఫివున్ మాట్లాడుతూ శిల్పా చక్రపాణిరెడ్డికి మద్దతు ఇస్తున్నారంటూ తమపై కక్ష సాధిస్తున్నారని వాపోయారు. సంఘాల్లో లక్షలాది రూపాయల పొదుపు డబ్బు ఉందని, వారికి అప్పగిస్తే అక్రమాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. -
ఇంటర్మీడియట్ విద్యార్థి అదృశ్యం
ఆత్మకూరు: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పి.యాలేరుకు చెందిన పూజారి సాయికుమార్ 15 రోజులుగా కనిపించడం లేదు. ఈ మేరకు అతడి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒక్కగానొక్క కుమారుడు ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియరాలేదని విలపిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 73311 43508, 90520 16850, 95730 30173 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. -
ఆత్మకూరులో స్కూల్డ్రింక్స్
మద్యానికి బానిసైన విద్యార్థులు తరగతి గదిలోనే మత్తులో జోగుతున్న వైనం క్రికెట్ బెట్టింగ్, మట్కా ద్వారా మద్యానికి డబ్బు సర్దుబాటు చదువుకోవాల్సిన వయసులో విద్యార్థులు వ్యసనాలకు బానిసలవుతున్నారు. ఏకంగా స్కూల్లోకి హాట్ డ్రింక్స్ తెచ్చుకుంటున్నారు. తరగతి గదిలోనే పూటుగా మద్యం తాగేసి మత్తులో జోగుతున్నారు. రెండు గ్రూపులుగా ఏర్పడి భౌతికదాడులు చేసుకుంటున్నారు. ఉపాధ్యాయులు మందలించినా వారిలో మార్పు రావడం లేదు. ఆత్మకూరు: మండల కేంద్రం ఆత్మకూరులోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో కొందరు పదో తరగతి విద్యార్థులు హద్దులు మీరారు. చదువులు పక్కనపెట్టి జూదాలకు బానిసలుగా మారారు. క్రికెట్ మ్యాచ్లపై బెట్టింగ్ వేస్తూ, మట్కా ఆడుతూ బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. మద్యం కొనుగోలుకు అవసరమైన డబ్బును జూదాల ద్వారా సమకూర్చుకుంటున్నారు. మద్యం మత్తులో.. ఆత్మకూరులో పది రోజులుగా మద్యం దుకాణాన్ని సీజ్ చేయడంతో విద్యార్థులకు మందు అందుబాటులో లేకుండా పోయింది. దీంతో సోమవారం ఉదయం కూడేరుకు వెళ్లి మద్యం కొనుగోలు చేసుకుని వచ్చిన వారు.. పాఠశాల సమయంలోనే ఫుల్గా తాగారు. తరగతి గదిలోనే మద్యం మత్తులో ఉన్న విద్యార్థులను చూసి ఉపాధ్యాయులు దండించారు. వారి తల్లిదండ్రుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినా వారిలో మార్పు మాత్రం కనిపించలేదు. పెడదోవ పడుతున్న విద్యార్థులకు టీసీలు ఇచ్చి బయటకు పంపించాలనే యోచనలో ఉపాధ్యాయులు ఉన్నారు. బయటి వ్యక్తుల ప్రమేయంతోనే.. విద్యార్థులే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండటంపై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఉపాధ్యాయులతో మంగళవారం ఎంపీడీఓ ఆదినారాయణ, ఎంఈఓ నరసింహారెడ్డి, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ కందుల ఓబుళపతి సమావేశమై చర్చించారు. విద్యార్థులు తప్పుదోవలో నడవడానికి దారితీసిన కారణాలపై సమీక్షించారు. పాఠశాల బయట ఉన్న కొందరు జులాయిలతో స్నేహమే ఇందుకు కారణంగా తేల్చారు. దీనిపై కల్పించుకుంటే తమపై దాడులకు సైతం తెగబడేందుకు వారు వెనుకాడడం లేదంటూ ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వాపోయారు. పోలీసుల చర్యలతోనే ఈ సమస్యకు పరిష్కారం దక్కుతుందని, ఆ దిశగా పోలీసుల సాయం తీసుకోవాలని తీర్మానించారు. -
తెలుగుదేశం పార్టీకి 3.65 ఎకరాలు
►గుంటూరు జిల్లా ఆత్మకూరులో పార్టీ రాష్ట్ర కార్యాలయం ►ఎకరానికి ఏడాదికి లీజు రూ.1,000 ►33 ఏళ్ల పాటు లీజు తరువాత 99 ఏళ్లకు లీజు పొడిగింపు ►ఇటీవల కేబినెట్లో నిర్ణయం అమరావతి : రాష్ట్రంలో నిలువ నీడ లేని నిరుపేదలు లక్షల్లో ఉన్నారు. ఇళ్ల స్థలాల కోసం మూడు జన్మభూమి కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి ఇళ్ల స్థలాలను కేటాయించడంపై శ్రద్ధ చూపని తెలుగుదేశం సర్కారు మరోవైపు దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకునే పనిలో పడింది. అధికార తెలుగుదేశం పార్టీకి ప్రతి జిల్లాలో, రాష్ట్రస్థాయిలో వీలైనంత మేర కారుచౌకగా ఆస్తులను సమకూర్చిపెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయిల్లో రాజకీయ పార్టీల కార్యాలయాలకు స్థలాల కేటాయింపునకు ప్రభుత్వం గతేడాది ప్రత్యేకంగా జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి గుంటూరు జిల్లా మంగళగరి మండలం ఆత్మకూరులో 3.65 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. గతనెల 31వ తేదీన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడి పేరుమీద పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఈ భూమిని కేటాయించారు. తొలుత 33 ఏళ్లపాటు లీజుకు కేటాయిస్తూ, ఆ తరువాత లీజును 99 ఏళ్ల వరకు పొడిగించేలా నిర్ణయం తీసుకున్నారు. లీజును ఎకరానికి ఏడాదికి రూ.1,000గా నిర్ధారించారు. జిల్లా కలెక్టర్, సీసీఎల్ఏ సిఫార్సు మేరకు ఆత్మకూరు గ్రామంలోని సర్వే నంబర్లు 392–2లో 0.13 ఎకరాలు, 392–3లో 0.64 ఎకరాలు, 392–4లో 1.80 ఎకరాలు, 392–8లో 0.74 ఎకరాలు, 392–9లో 0.27 ఎకరాలు, 392–10లో 0.07 ఎకరాలను టీడీపీ రాష్ట్ర కార్యాలయం కోసం కేటాయించారు. ఆ భూమి విలువ రూ.7 కోట్లు ఆత్మకూరులో మార్కెట్ విలువ ఎకరానికి రూ.2 కోట్లు ఉందని గుంటూరు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. దీనిప్రకారం టీడీపీకి కేటాయించిన భూమి విలువ రూ.7 కోట్లకు పైగానే ఉంటుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో పార్టీ కార్యాలయాల కోసం ప్రభుత్వ స్థలాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో టీడీపీ కార్యాలయం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరుతో 2,000 చదరపు గజాల స్థలాన్ని ఏడాదికి రూ.25 వేల రూపాయల లీజుకు కేటాయిస్తూ గతేడాది జీవో జారీ చేశారు. అలాగే శ్రీకాకుళం, అనంతపురం, చిత్తూరు తదితర జిల్లాల్లోనూ టీడీపీ కార్యాలయాల కోసం స్థలాలను కేటాయించారు. -
నరేష్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా నిలుస్తుంది
డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ ఆత్మకూరు(ఎం) (ఆలేరు) : ప్రేమ వివాహం చేసుకుని దారుణ హత్యకు గురైన పల్లెర్ల గ్రామానికి చెందిన అంబోజు నరేష్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. బుధవారం మండలంలోని పల్లెర్ల గ్రామాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నరేష్ తల్లిదండ్రులు వెంటకయ్య–ఇందిరమ్మలను పరామర్శించారు. పోలీసులు నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు çశ్రీనివాసరెడ్డి చేతిలో హత్యకు గురయినట్లు వెంకటయ్య తెలిపారు. ఆయన వెంట జెడ్పీటీసీ గంగపురం మల్లేశం, కాంగ్రెస్ మండల అ«ధ్యక్షుడు కొడిత్యాల నరేందర్ గుప్తా, కొరటికల్ సర్పంచ్ కొడిమాల యాదగిరిగౌడ్, ఎంపీటీసీ దిగోజు నర్సింహాచారి, సింగిల్విండో చైర్మన్ జిల్లాల శేఖర్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దసాని సిద్దులు, పాల సంఘం చైర్మన్ జెన్నాయికోడే నాగేష్, మండల ప్రధాన కార్యదర్శి కందడి అనంతరెడ్డి, నాయకులు కట్టెకోల హన్మంతుగౌడ్, పోతగాని మల్లేశంగౌడ్, మహేష్ ఉన్నారు. -
యువతి శీలానికి వెల కట్టిన టీడీపీ నేత!
► అవమాన భారంతో యువతి ఆత్మహత్యాయత్నం ఆత్మకూరు: అసలే ప్రియుడు మోసం చేశాడని బాధలో ఉంటే.. డబ్బులు తీసుకుని గొడవ చేయోద్దంటూ టీడీపీ నేత మధ్యవర్తిత్వం చేశారు. దీంతో మనస్తాపానికి గురైన బాధిత యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని బండారుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి. బండారుపల్లి గ్రామానికి చెందిన కటారి నాగార్జున దర్జీ పనులు చేస్తూ గ్రామంలో ఉంటున్నాడు. సమీప బంధువైన ఓ యువతి(20)ని ప్రేమిస్తున్నానని నమ్మించాడు. తొలుత ఆ యువతి అతడి ప్రేమను నిరాకరించింది. అనంతరం మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండు నెలలకిందట బెంగుళూరుకు తీసుకువెళ్లాడు. ఓ ఇంట్లో కాపురం పెట్టారు. పెళ్లి చేసుకోమని కోరితే ఇదిగో అదిగో అంటూ సాకులు చెప్పేవాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం వీరిద్దరూ బండారుపల్లికి వచ్చారు. గ్రామానికి చెందిన టీడీపీ నేత జోక్యం చేసుకొని పంచాయతీ పెట్టి మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయత్నించాడు. కొంత(రూ.50 వేలు) నగదు ముట్టచెబుతారని, ఎలాగోలా సర్దుకోవాలంటూ యువతికి నచ్చజెప్పే యత్నం చేశారు. న్యాయం కోసం నమ్మి వస్తే పెద్ద మనిషి ఇలా తన శీలానికి వెలకట్టడంతో మనస్తాపానికి లోనై శుక్రవారం పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఇది గమనించిన బంధువులు యువతిని ఆత్మకూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అయితే తనను మోసం చేసిన నాగార్జునను శిక్షించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొంది. నాగార్జున గతంలో కూడా మరొకరిని మోసగించాడని, ఆ కేసులో ఎలాగోలా తప్పించుకుని బయటపడ్డాడని బాధిత యువతి బంధువులు తెలిపారు. -
క్రీడలతోనే మానసికోల్లాసం
ఆత్మకూరు : క్రీడలు మానసికోల్లాసాన్ని కలుగచేస్తాయని ఆత్మకూరు ఎస్ఐ దిలీప్కుమార్ తెలిపారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లాస్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు. అక్కమ్మగార్ల పరుష సందర్భంగా ఈ టోర్నీ నిర్వహిస్తున్నట్లు ఫుట్బాల్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. టోర్నీ 8వ తేదీ వరకు ఉంటుందని, విన్నర్స్కు రూ.10 వేలు కప్పు, రన్నర్స్కు రూ.5 వేలు, కప్పు అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఏïడీïఏఫ్ఏ సభ్యులు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో ఏడీఎఫ్ఏ జిల్లా సెక్రటరీ నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్, ట్రెజరీ భాస్కర్, పీఈటీలు జగదీష్, జగదీశ్వరరెడ్డి, ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ బాషా, ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
నేడు ఉప ఎన్నిక ఫలితాలు
ఆత్మకూరు: ఆత్మకూరు నగర పంచాయతీలో రెండో వార్డుకు జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఉప ఎన్నికలలో 1415 ఓట్లకు గాను 1165 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండు పోలింగ్ బూత్లో రెండు ఏవీఎంల ఏర్పాటు చేశారు. ఒక్కొక్క మిషన్ 10 నిమిషాలలోపే ఫలితాలు వెల్లవడుతుంది. కేవలం అరగంట లోపే ఫలితాలు వెలువడనున్నాయి. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, వైఎస్సార్సీపీ శ్రీశైలం నియోజకవర్గం ఇన్చార్జి బుడ్డా శేషారెడ్డి.. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గెలుపే లక్ష్యంగా ఇద్దరు పట్టుదలతో ఉన్నారు. -
నేడు 2వ వార్డుకు ఉపఎన్నిక
- ఆత్మకూరులో భారీ బందోబస్తు - ప్రతి 14మంది ఓటర్లకు ఓ పోలీస్ - పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఉప ఎన్నిక: ఆత్మకూరు రెండో వార్డు కారణం: వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నబీ మృతి చెందడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు: యూనస్-వైఎస్ఆర్సీపీ నబీరసూల్- టీడీపీ సయ్యద్ మాబూ- కాంగ్రెస్ ఓటర్ల సంఖ్య: 1415 పోలింగ్ కేంద్రం: జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల బందోబస్తులో ఉన్న పోలీసులు: 105 ఆత్మకూరు రూరల్: నగర పంచాయతీ రెండో వార్డుకు ఆదివారం పోలింగ్ జరగనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నబీ..గత ఎన్నికల్లో గెలిచి కొద్ది రోజుల్లోనే గుండె పోటుతో మృతి చెందాడు. దీంతో ఉప ఎన్నిక అవసరమైంది. వార్డుకు త్రిముఖ పోటీ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ పై మీర్ యూనస్ పోటీ చేస్తుండగా టీడీపీ తరఫున నబీరసూల్, కాంగ్రెస్ అభ్యర్థిగా సయ్యద్ మాబు పోటీ చేస్తున్నారు. ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం నాటి నుంచే టీడీపీ దౌర్జన్య కాండకు పాల్పడింది. ప్రత్యర్థి అభ్యర్థులను ఉపసంహరణ చేయించి ఎన్నికను ఏకగ్రీవం చేసుకునే ప్రయత్నం చేసింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి యూనస్పై దాడి చేసి కిడ్నాప్కు పాల్పడింది. అయితే ప్రజలు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. విస్తృత బందోబస్తు ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికలో 1415 మంది ఓటర్లు..ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు 14 మంది ఓటర్లకు ఒక పోలీసు చొప్పున మొత్తం 105 మందిని బందోబస్తు కోసం నియమించారు. వైస్ఆర్సీపీ అభ్యర్థి యూనిస్ను కిడ్నాప్ చేసేందుకు టీడీపీ నాయకులు విఫలయత్నం చేయడం.. ఆత్మకూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కావడంతో జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ స్పందించారు. ఆత్మకూరు వచ్చి రెండో వార్డులో పర్యటించి శాంతిభధ్రతల విషయంలో అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చారు. డీఎస్పీ వినోద్ కుమార్, సీఐ కృష్ణయ్యల ఆధ్వర్యంలో ఐదుగురు ఎస్ఐలు, ఏడుగురు ఏఎస్ఐలు, 32 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, ఇద్దురు మహిళా పోలీసులు, 16 మంది హోం గార్డులు, 40 మంది ఏఆర్ కానిస్టేబుళ్లను బందోబస్తు కోసం నియమించారు. పోలింగ్ బూత్ల పరిశీలిన.. ఉప ఎన్నికల ప్రత్యేకాధికారి.. హంద్రినీవా సుజల స్రవంతి ప్రత్యేక కలెక్టర్ మల్లికార్జునుడు శనివారం పోలింగ్ బూత్లను పరిశీలించారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రెండు బూతులను ఆయన పరిశీలించారు. ఇప్పటికే ఈవీఎంలు పోలింగ్ బూతులకు చేరుకున్నాయి. వేసవి కాలం కావడంతో ఓటర్లు ఇబ్బందుల పడకుండా తగినన్ని షామియానాలు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ప్రత్యేక ఎన్నికల అధికారి వెంట మండల ప్రత్యేకాధికారి సత్యరాజు తహసీల్దార్ రాజశేఖరబాబు, మున్సిపల్ కమిషనర్ ప్రహ్లాద కూడా ఉన్నారు. -
ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరగాలి
– జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఏప్రిల్ 9న ఆత్మకూరు నగర పంచాయతీ రెండో వార్డు ఉప ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ పోలీసులను ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం ఉప ఎన్నిక జరుగుతున్న ఆత్మకూరులో ఆయన పర్యటించారు. పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను పోలీసులకు సూచించారు. ఎన్నికల నిర్వహణలో పోలీసు సిబ్బంది నిష్పక్షపాతంగా ఉండడంతోపాటు కఠినంగా వ్యవహరించాలన్నారు. రాజకీయ పార్టీలు కూడా పోలీసులకు సహకరించాలన్నారు. ఎస్పీ వెంట ఆత్మకూరు సీఐ కృష్ణయ్య, ఎస్ఐలు సుధాకరరెడ్డి, సుబ్బయ్య ఉన్నారు. -
ఆత్మకూర్లో ముగిసిన విలు విద్యా పోటీలు
-
పండుగ శోభ
పంట సాగులో కీలకమైన పశువులంటే అన్నదాతలకు మక్కువ ఎక్కువ. పండుగలు వస్తే వాటి పట్ల మరింత శ్రద్ధ కనబరుస్తుంటారు. ప్రత్యేకించి సంక్రాంతి పండుగ అంటే తమ ఇంట ఉన్న పశువులను ప్రత్యేకంగా అలంకరించి మురిసిపోతుంటారు. ఇందులో భాగంగానే వాటికి సంబంధించి ఇంతకాలం భద్రంగా దాచి ఉంచిన అలంకరణ సామగ్రిని బయటకు తీశారు. వృషభాల కొమ్ములకు రంగులు అద్దడం. రంగురంగుల ఉలన్తో చేసిన కుచ్చులతో సింగారిస్తున్నారు. అద్దాలు పొదిగిన ఫణికట్లను కపాలభాగానికి అమర్చారు. మెడలో గంటల పట్టీ, మెడ కింద నల్లదారాలు, వీపుపై గోపురానికి రంగురంగుల కుచ్చులు... కాళ్లకు గజ్జెలు.. రంగుల ముకుతాడు... ఇలా ప్రత్యేకంగా అలంకరించిన వృషభాలు పల్లెసీమలో పండుగకు నూతన శోభను తీసుకొస్తున్నాయి. - ఆత్మకూరు -
సేంద్రియ ఆకు కూరల విక్రయ కేంద్రం ప్రారంభం
ఆత్మకూరురూరల్: రసాయన మందులు, ఎరువులు ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన కూరగాయలు, ఆకు కూరలు ఆత్మకూరు వాసులకు అందుబాటులోకి వచ్చాయి. ఆత్మకూరు మండలం కరివేన గ్రామంలో 38 ఎకరాల్లో రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్న కాయగూరలు, ఆకు కూరలను అమ్ముకునేందుకు రామ్కి సంస్థ ఆత్మకూరు ఆంధ్రాబ్యాంకు పక్కన ఏర్పాటు చేసిన కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించింది. సేంద్రియ పంట ఉత్పత్తి దారులను సమీకరించి ఏర్పాటు చేసిన సంగమేశ్వర వ్యవసాయ ఉత్పత్తి దారుల కంపెనీ లిమిటెడ్ అన్న సంస్థ ద్వారా ఈ విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. నాబార్డ్ ఆర్థిక సాయంతో పకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్న రామ్కీ సంస్థ ప్రతినిధులు రామిరెడ్డి, ఆంజనేయులు, నాబార్డ్ డీజీఎం నగేష్ కుమార్ చేతుల మీదుగా కేంద్రాన్ని ప్రారంభించారు. -
ముందే పండుగ
ఆత్మకూరు : సంక్రాంతి పండుగ ముందు వచ్చిందేమిటీ?! ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ లోని విట్స్ కళాశాల ఆవరణకు సోమవారం వెళ్లి్లన వారందరికీ ఇదే భావన కలిగింది. మహిళలు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని ఆవరణ మొత్తాన్ని ముగ్గులతో నింపేయడమే దీనికి కారణం! సాక్షి–విట్స్ ఆధ్వర్యాన విట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ముగ్గుల పోటీలు జరిగాయి. ఈ పోటీలకు పెద్దసంఖ్యలో మహిళలు హాజరై రంగవల్లులు తీర్చిదిద్దడంతో కోలాహలం నెలకొంది. ఈ మేరకు హాజరైన పోలీసు కమిçషనర్ సుధీర్బాబు మాట్లాడుతూ వరంగల్ మహిళల్లో ఆత్మవిశ్వాసం ఎక్కువని అన్నారు. మహిళల్లో ఉత్సాహం నింపడానికి ‘సాక్షి’ ముగ్గుల పోటీలు నిర్వహించడ ం అభినందనీయమన్నారు. పోటీల్లో విద్యార్థులు ఎక్కువగా పాల్గొనడాన్ని చూస్తే మన సంస్కృతి, సంప్రదాయాలు ముందు తరాలకు అందుతున్నట్లుగా భావించాల్సి వస్తోందని తెలిపారు. సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయండి మహిళల రక్షణ కోసం వరంగల్ పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యాన అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని సీపీ సుధీర్బా బు తెలిపారు. ఇటీవల నిర్వహించిన స్వ శక్తి కార్యక్రమానికి గిన్నిస్బుక్లో చోటుదక్కడం వరంగల్ మహిళలకు గర్వకారణమన్నారు. అలాగే, మహిళలకు సమస్య ఎదురైతే 94910 89257 వాట్సప్ నం బర్కు మెసేజ్ పంపాలని సూచించారు. కార్యక్రమంలో విట్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.శ్యాంకుమార్, డైరెక్టర్ మహేష్, ఎం పీడీఓ నర్మద, తహసీల్దార్ సరిత, సాక్షి రీజనల్ మేనేజర్ రాంచంద్రారెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ భద్రారెడ్డి, సాక్షి టీవీ కరస్పాండెంట్ శ్రీధర్రెడ్డి, పరకాల సీఐ జాన్ నర్సింహులు, ఎస్సై లు విఠల్, రవిందర్ పాల్గొన్నారు. -
మేమొస్తే లక్ష ఎకరాలకు నీరు
-
నేడు ఆత్మకూరులో ‘రైతుపోరు’
అనంతపురం: రైతులను విస్మరిస్తున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శుక్రవారం ఆత్మకూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆధ్వర్యంలో ‘రైతుపోరు’ సభ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 3 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని మండలాలతో పాటు సమీప నియోజకవర్గాల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. పార్టీ జిల్లా పరిశీలకులు, రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, రోజా, పార్టీ జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్మన్ కవిత తదితరులు హాజరవుతారని ప్రకాష్రెడ్డి తెలిపారు. -
ఆర్నెళ్లలో సంపూర్ణ రుణమాఫీ చేయాలి
– 27 టీఎంసీల నీటిలెక్కలు చెప్పు సునీతమ్మా.. – 6న ఆత్మకూరులో రైతు సదస్సు – హాజరుకానున్న ఎంపీ మిథున్రెడ్డి, మాజీ ఎంపీ అనంత, ఎమ్మెల్యేలు విశ్వ, రోజా – రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అనంతపురం : జిల్లా రైతులకు ప్రభుత్వం ఆర్నెళ్లలో సంపూర్ణ రుణమాఫీ చేయాలని రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్లుగా జిల్లా అంతా కరువు ప్రాంతంగా ప్రకటిస్తున్నారని, ఇక్కడి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సంపూర్ణ రుణమాఫీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో వేరుశనగ నష్టపోయారని, అయితే.. ప్రభుత్వం రెయిన్గన్ల ద్వారా పంటను కాపాడామని అబద్ధాలు చెబుతూ ఏడు లక్షల ఎకరాలకు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. అలాకాకుండా వేరుశనగ సాగు చేసిన ప్రతి రైతుకూ ఎకరాకు రూ. 15 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాతావరణ బీమా పోనూ తక్కిన మొత్తాన్ని ఇన్పుట్ సబ్సిడీగా ఇస్తామని ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. హంద్రీ–నీవా డిస్ట్రిబ్యూటరీలు ఆర్నెళ్లలో పూర్తి చేసి ఖరీఫ్ నాటికి నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు. రైతులు, ప్రజా సమస్యలపై రాప్తాడు నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో నెలకో సదస్సు ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 6న సాయంత్రం మూడు గంటలకు ఆత్మకూరులో సదస్సు నిర్వహిస్తామన్నారు. పార్టీ జిల్లా పరిశీలకులు, రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, రోజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్మన్ కవిత తదితరులు హాజరవుతారన్నారు. వామపక్ష పార్టీల మద్దతు కూడా కోరుతున్నట్లు చెప్పారు. మంత్రి నీటి లెక్కలు చెప్పాలి జిల్లాకు 27 టీఎంసీల నీళ్లు తెచ్చామని చెబుతున్న మంత్రి పరిటాల సునీత ఆ నీటిని ఎక్కడ వాడారు, ఎన్ని ఎకరాల్లో పంటలు పండించారో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రకాష్రెడ్డి డిమాండ్ చేశారు. రాప్తాడు నియోజకవర్గానికి 0.7 టీఎంసీ మాత్రమే తెచ్చారని, ఇందుకు మంత్రి సిగ్గుతో తల దించుకోవాలని అన్నారు. నియోజకవర్గంలో పీఏబీఆర్ కుడికాలువ కింద 50 వేల ఎకరాలు, హంద్రీ–నీవా కింద 70 వేల ఎకరాలకు నీళ్లివ్వాల్సి ఉందన్నారు. ఇందుకోసం 12 టీఎంసీలు అవసరమన్నారు.అలాగే హిందూపురం, కదిరి, పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లో మరో 1.50 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలంటే మొత్తం 20 టీఎంసీలు అవసరమన్నారు. అయితే.. 0.7 టీఎంసీ మాత్రమే తెచ్చి వైఎస్సార్సీపీ నాయకులను విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. పొలాలకు నీళ్లివ్వాలని రైతులు అడుగుతుంటే కాలువ వెంట పోతున్న నీటిలో గంగపూజ చేస్తే ఏం లాభమని ప్రశ్నించారు. సమావేశంలో కనగానపల్లి జెడ్పీటీసీ సభ్యుడు బిల్లే ఈశ్వరయ్య, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చంద్రశేఖర్రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు పెన్నోబులేసు, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేంద్రరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు సుబ్బారెడ్డి, ఆత్మకూరు మండల కన్వీనర్ నరసింహారెడ్డి, సింగిల్విండో అధ్యక్షుడు వాసుదేవరెడ్డి, యువజన విభాగం నాయకుడు వరప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ఆత్మకూరు : వై.కొత్తపల్లి వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రమణానాయక్ (35) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కనగానపల్లి మండలం తరగకుంట తండాకు చెందిన రమణా నాయక్ మరో నలుగురితో కలిసి సోమవారం బెళుగుప్ప మండలం కాలువపల్లి వద్ద ఆలయ నిర్మాణ పనులను పరిశీలించేందుకు ఇన్నోవా వాహనంలో వెళ్లారు. అదే రోజు రాత్రి తిరిగి అక్కడి నుంచి అనంతపురం వెళ్తుండగా ఆత్మకూరు మండలం వై.కొత్తపల్లి వద్దకు రాగానే ఇన్నోవా వాహనం టైరు పంక్చర్ కావడంతో అదుతుప్పి ప్రమాదానికి గురైంది. డ్రైవింగ్ చేస్తున్న రమణానాయక్కు తీవ్రంగా గాయపడ్డారు. వాహనంలో ఉన్న నలుగురు వ్యక్తులు వెంటనే 108కు సమాచారం అందించగా రమణానాయక్ను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గ మధ్యంలో రమణానాయక్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని అనంతపురం ఆస్పత్రికి తరలించారు. -
హత్యాయత్నంలో కేసులో పోలీసుల ముందడుగు
సీసీ కెమెరా ద్వారా నిందితుల గుర్తింపు ఆత్మకూరు రూరల్: ఆత్మకూరు పట్టణంలో ఆదివారం సంచలనం సృష్టించిన న్యాయవాది హత్యాయత్నం కేసులో పోలీసులు నిందితులను గుర్తించినట్లు సమాచారం. సంఘటన స్థలం సమీపంలోని పెట్రోలు బంక్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ను సోవారం పోలసులు పరిశీలించారు. ఈ ఫుటేజ్లలో న్యాయవాది అజ్మతుల్లాను కారుతో ఢీకొట్టించి రోడ్డుపై ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించినట్లు తెలుస్తోంది. ఆత్మకూరు సీఐ కృష్ణయ్య సంఘటన స్థలం చుట్టు పక్కల ఉన్న వారిని దర్యాప్తులో భాగంగా ప్రశ్నించారు. అయితే పెట్రోలు బంక్ సిబ్బంది, హోటళ్ల యజమానులు ఈ విషయంలో మౌనం పాటించారు. ఽఘటన జరిగిన ప్రాంతంలోని హోటల్ను ఆదివారం సాయంత్రం నుంచే మూసివేశారు. ఈకేసును వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితును త్వరలోనే అరెస్ట్ చేస్తామని సీఐ తెలిపారు. -
విజేత ఆత్మకూరు జట్టు
బ్యాట్స్మన్ రూపేష్ ఆల్ రౌండ్ ప్రతిభ అనంతపురం సప్తగిరి సర్కిల్ : సెంట్రల్ జోన్ క్రికెట్ బాలుర పోటీల్లో ఆత్మకూరు జట్టు విజేతగా నిలిచింది. బ్యాట్స్మన్ రూపేష్ ఆల్రౌండ్ ప్రతిభతో జట్టుకు విజయాన్నందించాడు. బుధవారం నగరంలోని ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానం, కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానాల్లో మ్యాచ్లు జరిగాయి. క్వార్టర్ ఫైనల్లో ఆత్మకూరు, పెనుకొండ జట్లు తలపడగా ఆత్మకూరు జట్టు విజయం సాధించింది. మరో మ్యాచ్లో ముదిగుబ్బ, తాడిపత్రి జట్లు తలపడగా ముదిగుబ్బ జట్టు గెలుపొందింది. సెమీఫైనల్లో విన్సెంట్ డీ పాల్ అనంతపురం, పీవీఎస్ ముదిగుబ్బ జట్లు తలపడగా 24 పరుగులతో ముదిగుబ్బ జట్టు విజయం సా«ధించింది. మరో సెమీఫైనల్లో కదిరి వాల్మీకి జట్టుపై ఆత్మకూరు జట్టు 12 పరుగుల తేడాతో విజయదుందుభి మోగించింది. ఫైనల్లో ఆత్మకూరు జట్టు, పీవీఎస్ ముదిగుబ్బ జట్లు తలపడ్డాయి. ఆత్మకూరు జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 109 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన పీవీఎస్ ముదిగుబ్బ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 80 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఆత్మకూరు జట్టు 29 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. జట్టులో రూపేష్ 21 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్ల సహాయంతో 58 పరుగులు సాధించాడు. ఆత్మకూరు జట్టు విజయానికి రూపేష్ చేసిన పరుగుల వరదే కీలకం. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో పెనుకొండపై 28, కదిరి జట్టుపై 41 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. గురువారం ఆర్ట్స్ కళాశాల, కొత్తూరు ఉన్నత పాఠశాల క్రీడా మైదానాల్లో బాల. బాలికల ఫుట్బాల్ పోటీలు జరుగుతాయని సెంట్రల్ జోన్ కార్యదర్శి శంకరన్న, పీఈటీ వేణుకుమార్లు తెలిపారు. కార్యక్రమంలో పీఈటీలు బాషా, రాగేష్, సిద్ధన్న తదితరులు పాల్గొన్నారు. -
ట్రాన్స్పోర్టు కార్యాలయంలో స్వైపింగ్ మిషన్లు
ఆత్మకూరురూరల్ : ఆత్మకూరు రోడ్డు ట్రాన్స్పోర్టు అధారిటీ కార్యాలయంలో స్వైప్మిషన్లు ఏర్పాటుచేసినట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు తెలిపారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని నెల్లూరుపాళెం వద్దనున్న కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నగదు రహిత లావాదేవీలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో వీటిని ఏర్పాటుచేశామన్నారు. లైసెన్సుల కోసం చెల్లించే ఫీజులు, అపరాధరుసుం స్వైపింగ్ మిషన్ల ద్వారా చెల్లించాల్సి ఉంటుందన్నారు. కాగా సరైన పత్రాలు లేకుండా సరుకు రవాణా చేస్తున్న వాహనాల నుంచి రూ.40 వేలు అపరాధరుసుం శుక్రవారం వసూలు చేసినట్లు మాధవరావు తెలిపారు. -
ఏపూరులో దొంగల బీభత్సం
ఆత్మకూర్ (ఎస్) : మండల పరిధిలోని ఏపూరు గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా మూడిళ్లలో చోరీకి పాల్పడి నగదుతో పాటు బంగారు ఆభరణాలు అపహరించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ... గ్రామానికి చెందిన తొండల శ్రీను, ఎస్కే.సత్తార్, కాశబోరుున భద్రమ్మ ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో వరుసగా ఈ ఇళ్లలో దుండగులు చొరబడ్డారు. తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న వస్తువులను చిందరవందరగా పడేశారు. తొండల శ్రీను ఇంట్లో బీరువాను పగులగొట్టి రూ.20 వేల నగదు, 3 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. ఈ ఇంటికి ఎదురుగా ఏపూరు ప్రధాన రహదారిపై ఉన్న భద్రమ్మ గృహంలో రూ.7వేలను దొంగిలించారు. తొండల శ్రీను ఇంటి పక్కనే ఉన్న సత్తార్ ఇంటికి సంబంధించిన ఇంటి తాళాలు పగులగొట్టారు. ఇంట్లో ఏమీ లేకపోవడంతో వస్తువులు, దుస్తులు చిందరవందరంగా పడేసి వెళ్లారు. పక్కా సమాచారం ప్రకారమేనా ? చోరీ జరిగిన ఇళ్లలో బాధితులు ఎవరూ లేరు. అందరి ఇళ్లకు తాళాలు వేసి ఉండడంతో తెలిసిన వారి పనేనా అనే అనుమానం వ్యక్తమవుతోంది. తొండల శ్రీను గ్రామంలో కూల్డ్రింక్ షాపు నిర్వహిస్తూ 20 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో కాలు, చేయి విరిగి గ్రామంలోని తమ పాత ఇంట్లో శ్రీను దంపతులు ఇద్దరూ తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. అలాగే సత్తార్ తన ఇంటి సమీపంలోని పాత ఇంట్లో రాత్రి సమయంలో నిద్రిస్తున్నారు. కాశబోయిన భద్రమ్మ తన బంధువుల ఇంటికి వెళ్లగా ఈ విషయాన్ని పూర్తిగా గమనించిన దుండగులు పక్కా సమాచారం మేరకు చోరీకి పాల్పడినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలా వెలుగులోకి ... అర్ధరాత్రి సమయంలో ఈ మూడు ఇళ్లలో చోరీ జరగగా ఉదయం 6 గంటల సమయంలో విషయం వెలుగులోకి వచ్చింది. చుట్టూ పక్కల ఇళ్ల వారు నిద్రలేచి తాళాలు పగులగొట్టడం చూసి బాధితులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ హరికృష్ణ సిబ్బందితో కలిసి చోరీ జరిగిన ఇళ్ల పరిసరాలను పరిశీలించారు. దుండగులు వదిలేసిన కర్రలు, కండువాలను స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ నుంచి క్లూస్టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. అంతర్ రాష్ట్ర ముఠా పనేనా ? ఈ చోరీ అంతర్ రాష్ట్ర ముఠా పనేనని పోలీసులు భావిస్తున్నారు. మండల పరిధిలోని ఏపూరుతో పాటు నూతనకల్ మండలం అలుగునూరు, వరంగల్ జిల్లా తిరుమలయపాలెం గ్రామాల్లో అదే రాత్రి చోరీలు జరిగాయి. దీంతో స్థానిక పరిస్థితులు తెలిసిన అంతర్ రాష్ట్ర ముఠా చోరీకీ పాల్పడినట్లు పోలీసులు భావించి ఆ దిశగా విచారణ చేపడుతున్నారు. -
ఆత్మకూరు సి.ఐ పై సస్పెన్షన్ వేటు
కర్నూలు: ఆత్మకూరు సీఐ దివాకర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి ఆరోపణలు రావడంతో కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ విచారణ జరిపించారు. ఆత్మకూరు పట్టణంలోని కేఎస్ఆర్ గోడౌన్లో ఆ ప్రాంత రైతులు ధాన్యాన్ని నిల్వ చేసుకున్నారు. గోడౌన్ యజమాని రైతులకు తెలియకుండా ధాన్యాన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. కొంత కాలం తర్వాత ఈ విషయాన్ని తెలుసుకున్న రైతులు ఆత్మకూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ దివాకర్రెడ్డి గోడౌన్ యజమానిని పిలిపించి పెద్ద ఎత్తున డబ్బు డిమాండ్ చేశాడు. ఇదే విషయాన్ని రైతులు డీఐజీకి ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపించారు. వాస్తవమేనని విచారణలో వెల్లడి కావడంతో సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కూడా అవినీతి ఆరోపణలపై ఆరుగురు సీఐలు, ముగ్గురు ఎస్ఐలు వీఆర్కు వెళ్లిన సంగతి తెలిసిందే. -
పొగాకు సాగులో జాగ్రత్తలు పాటించాలి
రీజినల్ మేనేజర్ రత్నసాగర్ మర్రిపాడు: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పొగాకు రైతులు సాగులో తగు జాగ్రత్తలు పాటించాలని భారత పొగాకు బోర్డు రీజనల్ మేనేజర్ రత్నసాగర్ పేర్కొన్నారు. డీసీపల్లి, కలిగిరి పొగాకు బోర్డు వేలం కేంద్రాల పరిధిలోని పొగాకు తోటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో డీసీపల్లి, కలిగిరి పొగాకు బోర్డు వేలం కేంద్రాల పరిధిలో 3,992 మంది రైతులకు పొగాకు పండించేందుకు 3,180 బ్యారెన్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. అందుకు గాను 7,683 హెక్టార్లలో నాట్లు వేసేందుకు బోర్డు అనుమతిని ఇచ్చిందని తెలిపారు. దాంట్లో 10.8 మిలియన్ కిలోల పొగాకు పండించాలని సూచించినప్పటికీ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనీసం సగభాగం కూడా వేసే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో 199 హెక్టార్లలో మాత్రమే పొగాకు సాగు చేశారని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో నాట్లు వేసిన 190 హెక్టార్లలో కూడా 60 హెక్టార్లలో మొక్కలన్ని మాడిపోయి చనిపోయాయని అన్నారు. గత సంవత్సరం ఇదే సమయంలో 3130 హెక్టార్లలో పొగాకు నాట్లు వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రెండు తడులు నీళ్లు కలిపి పొగాకు నాట్లు వేసినప్పటికీ దిగుబడి పెరిగే అవకాశం కూడా లేదని పేర్కొన్నారు. వేలం కేంద్రం పరిధిలో డీసీపల్లి, ఖాన్సాహెబ్పేట, బంట్లపల్లి, కోనసముద్రం, మర్రిపాడు గ్రామాల్లో తోటలను పరిశీలించారు. వారి వెంట క్షేత్రాధికారులు గిరిరాజ్కుమార్, బెనర్జీ, పొగాకు బోర్డు క్షేత్ర సహాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
లావాదేవీలు ఆన్లైన్లో చేయండి
జెడ్పీ సీఈఓ రామిరెడ్డి ఆత్మకూరురూరల్ : రిటైల్ వ్యాపారులందరూ హోల్సేల్ లావాదేవీలను ఆన్లైన్ ద్వారా నిర్వహించాలని జిల్లా పరిషత్ సీఈఓ రామిరెడ్డి అన్నారు. ప్రస్తుతం రూ.500, 1000 నోట్లు రద్దుతో ప్రజలు పడుతున్న కరెన్సీ కష్టాలపై వ్యాపారుల అభిప్రాయాలు, వారి ఇక్కట్లు తెలుసుకునేందుకు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్ద నోట్లు చెల్లక కొంత మేర వ్యాపారాలు దెబ్బతిన్న విషయం వాస్తవేమేనన్నారు. ఆన్లైన్లో లావాదేవీలు చేస్తే కొంతమేర ఇబ్బందులు తగ్గుతాయన్నారు. రేషన్షాపు డీలర్లు స్వైప్ మిషన్లు ఉపయోగిస్తే ఇక్కట్లు తగ్గుతాయని సూచించారు. ఇబ్బంది పడుతున్నాం. ఈ సమావేశంలో సంగం, ఆత్మకూరు, ఏఎస్పేట తదితర మండలాలకు చెందిన వ్యాపారులు, పెట్రోల్ బంకు నిర్వాహకులు, డీలర్ల సంఘం అధ్యక్షులు, పొదుపు సభ్యులు పాల్గొని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తాము పడుతున్న ఇబ్బందులను ఏకరవు పెట్టారు. కొత్త రూ.100, 500 నోట్లు విడుదల చేస్తే ఇంత ఇబ్బందులు ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు డాక్టర్ ఏ నిర్మలాదేవి, రమణయ్య, ఆత్మకూరు తహసీల్దారు సారంగపాణీ, ఏఈలు శాంతకుమార్, శ్రీనివాసరావు, సీడీపీఓ ఉషారాణీ, ఎంఈఓ మణిప్రసాద్, డీటీ శేషయ్య, సూపరింటెండ్ శ్రీనివాసులు, ఈవోపీఆర్డీ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
ఆటో ఢీకొని వ్యక్తి దుర్మరణం
అనంతసాగరం (సోమశిల) : మితిమీరిన వేగంతో వెళ్తున్న ఓ ఆటో ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన అనంతసాగరంలో బుధవారం రాత్రి జరిగింది. ఏఎస్ఐ శ్రీనివాసరావు కథనం మేరకు.. అనంతసాగరానికి చెందిన సిద్దవటం పెంచలయ్య (47) బస్టాండ్ సమీపంలోని æతన ఇంటి నుంచి రోడ్డు మీదకు వస్తుండగా మండలంలోని లింగంగుంటకు చెందిన ఆటో బస్టాండ్ వైపు వెళ్తూ ఢీ కొంది. తీవ్రంగా గాయపడిన పెంచలయ్యను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందాడు. ఆటోడ్రైవర్ సంఘటనా స్థలం నుంచి డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కూలీ పనులు చేసుకుని జీవనం సాగించేవాడు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో కుటుంబలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
జామాయిల్ తోట దగ్ధం
రూ.20 లక్షలకు పైగా నష్టం గిరిజన కుటుంబాల ఆవేదన ఆత్మకూరురూరల్ : గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో గిరిజనులకు చెందిన సుమారు 48 ఎకరాల్లో జామాయిల్ తోటలు దగ్ధమైన సంఘటన మండలంలోని రామస్వామిపల్లిలో శనివారం జరిగింది. బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గిరిజనులు 20 కుటుంబాలకు 15 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం భూ పంపిణీలో భాగంగా కుటుంబానికి 2.50 ఎకరాల చొప్పున భూమి పంపిణీ చేసింది. అప్పటి నుంచి గిరిజనులు వివిధ రకాల పైర్లు సాగు చేసుకుంటున్న క్రమంలో నష్టాలకు గురికావడంతో సులభంగా ఉండే జామాయిల్ తోటలను సాగు చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అన్ని గిరిజన కుటుంబాలు కొందరు రైతుల సహకారంతో జామాయిల్ తోటలు సాగు చేసుకుంటున్నారు. గత వారం రోజుల క్రితం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గిరిజనులకు చెందిన ఈ భూముల్లో కొందరితో కలిసి సర్వే చేశాడు. ఇదేంటని ప్రశ్నించిన గిరిజనులకు ఈ భూముల్లో తమ భూములు సైతం కలిసి ఉన్నాయని, అందుకే సర్వే చేస్తున్నట్లు చెప్పాడని బాధిత గిరిజనులు తెలిపారు. అయితే ఇది జరిగిన వారం రోజుల లోపే జామాయిల్ తోటలు దగ్ధం కావడంతో రూ.20 లక్షలకు పైగా నష్టం సంభవించిన గిరిజన కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇది ఎవరో కావాలని చేసిన విద్రోహ ఫలితమేనని వాపోతున్నారు. సమాచారం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు సిబ్బంది పరిశీలించారు. -
వంద రోజులు పని కల్పించాల్సిందే
డ్వామా పీడీ హరిత అనంతసాగరం(సోమశిల) : జాతీయ ఉపాధిహామీ పథకంలో ప్రతి కూలీకి వంద రోజులు పని కల్పించాలని డ్వామా పీడీ హరిత తెలిపారు. మండల కేంద్రమైన అనంతసాగరంలో గురువారం అనంతసాగరం, మర్రిపాడు, ఆత్మకూరు మండలాలకు చెందిన జాతీయ ఉపాధి హామీ సిబ్బందితో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తొలుత ఇస్కపల్లి, మినగల్లు, పాతదేరాయపల్లి తదతర గ్రామాల్లో ఆమె పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కూలీకి రూ.131 కూలి వస్తోందని, అయితే ఆ మొత్తం రూ.160కు తగ్గకుండా చూడాలన్నారు. ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు మండలాలు ఫాంపాండ్స్ నిర్మాణ లక్ష్యంలో వెనకంజలో ఉన్నాయన్నారు. జిల్లాలో 10 వేల పాండ్స్ లక్ష్యం కాగా ఈ మూడు మండలాలల్లో ఆరువేలు ఏర్పాటుచేయాలన్నారు. నాడెప్ కంపోస్టు తొట్టెలు ప్రతి గ్రామంలో కనీసం 25కి తగ్గకుండా ఏర్పాటుకావాలన్నారు. సమావేశంలో ఆత్మకూరు డ్వామా ఏపీడీ మృదుల, ఎంపీడీఓలు ఐజాక్ ప్రవీణ్, రమేష్, ఏపీఓలు దయానంద్, లక్ష్మీనర్సయ్య, మురళీ పాల్గొన్నారు. -
స్వచ్ఛభారత్కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి
జిల్లా పరిషత్ సీఈఓ రామిరెడ్డి ఆత్మకూరురూరల్ : పంచాయతీ కార్యదర్శులు స్వచ్ఛభారత్కు అధిక ప్రాధాన్యం ఇస్తూ గ్రామాల్లో నూరుశాతం మరుగుదొడ్ల నిర్మాణం జరిగేలా చూడాలని జిల్లా పరిషత్ సీఈఓ రామిరెడ్డి అన్నారు. ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం ఎంపీడీఓ నిర్మలాదేవితో కలిసి పంచాయతీ కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2015–16 ఏడాదికి పంచాయతీల జమా ఖర్చుల వివరాలు (క్రియోసాఫ్ట్) ఏ మేరకు పూర్తి చేసింది పరిశీలించారు. ఇంకా నమోదు చేయని వారిని మరో వారం రోజుల్లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్ కోసం 14వ ఆర్థిక సంఘం నిధుల్లో ఒక్కోదానికి రూ.850 చొప్పున చెల్లించాలని ఆదేశించారు. ఇప్పటికీ పంచాయతీ, మున్సిపాలిటీలో 38 అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం లేదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ చంద్రశేఖర్, సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఎంఈఓ మణిప్రసాద్, సీడీపీఓ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
మాతాశిశు మరణాలు అరికట్టడమే లక్ష్యం
సంగం : మాతాశిశు మరణాలను అరికట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నామని డీఎంహెచ్ఓ వరసుందరం తెలిపారు. మండల కేంద్రంలోని సంగం పీహెచ్సీని బుధవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రతి గర్భిణి స్త్రీకి నాలుగో నెల నుంచి 9వ నెల వరకు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో ప్రస్తుతం 4,500 మంది గర్భిణులు ఉన్నారన్నారు. వీరి ఆరోగ్యాన్ని వైద్యారోగ్యశాఖ అనుక్షణం పరీశిలిస్తోందని చెప్పారు. బాల్య వివాహాలను తమ శాఖ సిబ్బందితో పాటు అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు అరికట్టాలన్నారు. త్వరలో ఖాళీగా ఉన్న ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. సంగం మండలంలో 108 సౌకర్యం లేకపోవడంతో వెంటనే 108 వాహనాన్ని సంగంకు సమకూర్చాలని ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు డాక్టర్ రాగిణి, హెచ్ఈఓ హజరత్తయ్య పాల్గొన్నారు. -
ఓడీఎఫ్ గ్రామాలకు నిధులు మంజూరు
ఆత్మకూరు(అనుమసముద్రంపేట) : ఆత్మకూరు మండలంలోని 10 ఓడీఎఫ్ గ్రామాల్లో సంపూర్ణ మరుగుదొడ్ల పఽథకం పూర్తయిందని దీంతో ప్రభుత్వం రూ.21 లక్షల మంజూరు చేసిందని జెడ్పీ సీఈఓ రామిరెడ్డి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఆయన ఆత్మగౌరవంపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మరుగుదొడ్ల నిర్మాణంపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ నెలాఖరులోపు రెండో విడత ఓడీఎఫ్ గ్రామాల్లో మరుగుదొడ్లు పూర్తిచేయాలన్నారు. పమిడిపాడు, రావులకొల్లు, చెర్లోయడవల్లి, నాగులపాడు, నారంపేట, వెన్నవాడ, కనుపూరుపల్లి, బండారుపల్లి, నల్లపరెడ్డిపల్లి, మురగళ్ల గ్రామాలను మొదటి విడతలో ఓడీఎఫ్గా చేసి పూర్తి చేశామన్నారు. ఎంఆర్సీ పరిశీలన ఆర్డీఓ కార్యాలయం వెనుకవైపున ఉన్న నూతన ఎంఆర్సీ భవనాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవనం నాసిరకంగా నిర్మించారని, ప్రారంభానికి ముందే పగుళ్లు ఇవ్వడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. అధ్యక్షులు కేతా విజయభాస్కర్రెడ్డి, యానాదిరెడ్డి, రామిరెడ్డి మోహన్రెడ్డి, అధికారులుపాల్గొన్నారు. -
యువ ఇంజినీర్ దుర్మరణం
పంజాబ్లో ఆత్మకూరు యువకుడి విషాదం శోకసముద్రంలో కుటుంబ సభ్యులు ఆత్మకూరురూరల్ : ఆత్మకూరు జేఆర్పేటకు చెందిన పోతల శ్రీకాంత్ (22) అనే యువ ఇంజనీరు సర్టిఫికెట్ల కోసం తాను చదివిన పంజాబ్లోని కళాశాలకు వెళ్లి ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. పట్టణంలోని జేఆర్పేటకు చెందిన పోతల శీనయ్య తన ఇద్దరు కుమారులను ఇంజనీరింగ్ చదివించాడు. రెండో కుమారుడు శ్రీకాంత్ పంజాబ్ రాష్ట్రం జలంధర్ జిల్లాలోని లవ్లీ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్ కళాశాలలో గతేడాది ఇంజినీరింగ్ çపూర్తి చేశాడు. ఇటీవల బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరు ఉద్యోగం కోసం సర్టిఫికెట్లు కోసం నాలుగు రోజుల క్రితం జలంధర్కు వెళ్లాడు. అయితే మంగళవారం ఉదయం అతని తండ్రికి శ్రీకాంత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని ఫోన్ వచ్చింది. శ్రీకాంత్, అతని మిత్రులు కలసి సోమవారం పిక్నెక్కు వెళ్లగా, అక్కడ జరిగిన కారు ప్రమాదంలో శ్రీకాంత్ మృతి చెందినట్లు తెలిపారు. అయితే కారులో ప్రయాణించిన మరెవ్వరికి గాయాలు లేకపోవడం, మృతి చెందిన శ్రీకాంత్ తల వెనుక భాగంలో బలమైన గాయం మాత్రమే తగిలి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో తన కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. చేతికి అందివచ్చిన శ్రీకాంత్ మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. గతేడాది శ్రీకాంత్ తల్లి సైతం రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. శ్రీకాంత్ మృతదేహాన్ని గురువారం ఆత్మకూరుకు తీసుకురానున్నారు. -
పేలిన సిలిండర్–రెండు ఇళ్లు దగ్ధం
ఆత్మకూరురూరల్ : ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో గిరిజనులకు చెందిన రెండు పూరిళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతైన సంఘటన మండలంలోని చెర్లోయడవల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. గ్రామంలోని గిరిజన కాలనీకి చెందిన పొంతగిరి రాజయ్య, పొంతగిరి పెంచలమ్మలు పూరిగుడిసెల్లో నివసిస్తున్నారు. రాజయ్య భార్య కుమారి గురువారం మధ్యాహ్నం ఇంట్లో వంట చేస్తున్న సమయంలో గ్యాస్ పైప్ నుంచి మంటలు రావడంతో భయప వెంటనే తన బిడ్డనుì తీసుకుని వెలుపలికి పరుగెత్తింది. కొంతసేపటికి మంటలు అంటుకుని సిలిండర్ పెద్ద శబ్దంతో పేలి దూరంగా పడింది. సమీపంలోని పెంచలమ్మ గుడిసెకు సైతం మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. కట్టుబట్టలు తప్ప మిగిలిన సరుకులు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ సమయంలో మనుషులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న ఎంపీపీ సిద్ధం సుష్మ కుటుంబసభ్యులు బాధిత కుటుంబీకులకు భోజన వసతి కల్పించి 60 కేజీల బియ్యం, కొంత నగదును అందజేశారు. గ్రామసర్పంచ్ కేతా విజయభాస్కర్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. తహశీల్దారు సారంగపాణి వీఆర్వోను నివేదిక అందజేయాలని కోరారు. -
జాతీయ స్థాయికి ఎంపికైన జూడో క్రీడాకారిణి
ఆత్మకూరు(ఎం): మండలంలోని రహీంఖాన్పేటకు చెందిన బిల్ల అశ్విత జూడో పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపిక అయ్యారు. సెప్టెంబర్ 27న బీబీనగర్ మండలం వెంకిర్యాలలో నల్లగొండ జిల్లా జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి జూడో పోటీల్లో ఆత్మకూరు(ఎం) మండలం నుంచి రహీంఖాన్పేటకు చెందిన బిల్ల అశ్విత పాల్గొన్నారు. బిల్ల అశ్విత జూడో క్రీడలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపిక అయ్యారు. ఈ నెల 1, 2, 3తేదీల్లో వరంగల్ సిటిజన్ క్లబ్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో పాల్గొని జాతీయ స్థాయికి ఎంపికైంది. ఆమె త్వరలో పాట్నాలో జరుగనున్న జూడో క్రీడల్లో పాల్గొననున్నారు. -
కొత్త రెవెన్యూ డివిజన్లుగా డోన్, ఆత్మకూరు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో మరో రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కాబోనున్నాయి. కొన్నేళ్లుగా జిల్లాలో కొత్త డివిజన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్నా కార్యరూపం దాల్చలేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టకేలకు కొత్త రెవెన్యూ డివిజన్లకు మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లాలోని డోన్, ఆత్మకూరులు కేంద్రాలుగా డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం జిల్లాలో మూడు డివిజన్లు ఉన్నాయి. కొత్తవాటితో వీటి సంఖ్య ఐదుకు పెరగనుంది. కొత్త రెవెన్యూ డివిజన్లలో ఏఏ నియోజకవర్గాలను చేర్చాలి, ప్రస్తుత డివిజన్లలో ఏఏ నియోజక వర్గాలు ఉన్నాయి తదితర వివరాలు పంపాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. ఇప్పటి వరకు ఒక నియోజకవర్గంలో కొన్ని మండలాలు ఒక నియోజకవర్గంలో ఉంటే మరికొన్ని మండలాలు మరో డివిజన్లో ఉన్నాయి. వీటిని సవరిస్తూ కొత్త డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. -
విలీనగ్రామాల్లో ఇంటెలిజెన్స్ రహస్య సర్వే..!
ఆత్మకూరు(ఎం) : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న మోటకొండూరు మండలంలో విలీన గ్రామాలైన ఆత్మకూరు(ఎం) మండలంలోని చాడ, కాటెపల్లి, నాంచారిపేట, కొండాపురం, సింగారంలో సోమవారం ఉదయం జిల్లా ఇంటెలిజెన్స్ అధికారులు రహస్య సర్వే నిర్వహించారు. ప్రతి గ్రామం నుంచి 20 నుంచి 30 మందిని కలిసి సమాచారం సేకరించారు. మహిళలు, యువకులు, వృద్ధులు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులను కలిసినట్లు సమాచారం. మోటకొండూరు మండలం ఎందుకు వద్దంటున్నారు? ఆత్మకూరు(ఎం) మండలంలోనే ఎందుకు ఉందామనుకుంటున్నారు? తదితర ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. ఆత్మకూరు(ఎం) మండలం తమకు దగ్గరగా ఉంటుందని, మోటకొండూరు చాలా దూరంగా ఉంటుందని విలీన గ్రామాల వారు అన్నారు. ఆత్మకూరు(ఎం) మండలంలోనే ఉంచాలని ఇంటెలిజెన్స్ అధికారులకు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా పలు చోట్ల ప్రజలు మీరు ఎవరు అడగడంతో తాము ఇంటెలిజెన్స్ అధికారులమని, ఉన్నతా«ధికారుల ఆదేశం మేరకు సమాచారం సేకరిస్తున్నామని చెప్పినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. -
రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నాం
ఆత్మకూరు(ఎం): ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం రైతుల సంక్షేమ కోసం కృషి చేస్తుందని చైర్మన్ జిల్లాల శేఖర్రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో సంఘం 33వ వార్షిక సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ జిల్లాల శేఖర్రెడ్డి మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి రైతులు కూడ తమ వంతుగా సహకరించాలని తెలిపారు. తీసుకున్న పంట రుణాలు తిరిగి చెల్లించినప్పుడే సహకార సంఘం అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. వ్యవసాయానికి అప్పు తీసుకున్న రూ. 1.46కోట్లకు గానూ 43 మంది రైతులకు నోటీసులు అందజేయగా రూ. 23లక్షలు మాత్రమే వసూలు చేయగలిగామని అన్నారు. కూరెళ్ల, పల్లెర్ల గ్రామాల్లో ఐకేపీ కేంద్రాలు నిర్వహిస్తే సహకార సంఘానికి రూ. 5.50లక్షల లాభం చేకూరిందని పేర్కొన్నారు. స్థానికంగా లాకర్ సౌకర్యం లేక పోవడంతో మోత్కూరులోని సీసీ బ్యాంక్లో బంగారంపై పంట రుణాలు ఇప్పిస్తున్నట్లు తెలిపారు. రెండు ఎకరాలు పైబడి వ్యవసాయ భూమిని మార్టిగేజ్ చేసినట్లయితే రూ. 7లక్షల వరకు వ్యవసాయ రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. సీఈఓ రామస్వామి నివేదికను చదివి వినిపించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గంగపురం మల్లేశం, వైస్ చైర్మన్ ముద్దసాని సిద్ధులు, మోత్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యాస లక్ష్మారెడ్డి, బీజేపీ మండలాధ్యక్షుడు బొబ్బల ఇంద్రారెడ్డి, డైరక్టర్లు సోలిపురం మల్లారెడ్డి, ఎర్ర అమృతారెడ్డి, కందడి దశరథరెడ్డి, పీసరి నర్సిరెడ్డి, నాల్కపెల్లి యాదయ్య సిబ్బంది భిక్షం, సింహాద్రి, కిరణ్, పావని పాల్గొన్నారు. -
కాల్వలో పడి చిన్నారి మృతి
ఆత్మకూర్(ఎస్) కాల్వలో పడి చిన్నారి మృతిచెందింది. ఈ విషాదకర ఘటన మండల పరిధిలోని కందగట్ల ఆవాసం మంగళితండాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన భానోత్ రవి–భారతిల కుమార్తె అఖిల (4)ఆడుకుంటూ వెళ్లి గ్రామ శివారులోని రోడ్డు వెంట కాల్వలో పడిపోయింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు కాల్వల్లోకి నీరు చేరడంతో ఊపిరాడక చనిపోయింది. సాయంత్రం వరకూ అఖిల ఇంటì కి చేరకపోవడంతో తల్లితండ్రులు చుట్టుపక్కల వెదకగా కాల్వలో విగతజీవిగా కనిపించింది. అప్పటి వరకూ ఆడుకుంటూ ఉన్న కుమార్తె మరణంతో తల్లితండ్రుల రోదనలు మిన్నంటాయి. -
ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్
ఆత్మకూరురూరల్ : ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్న గుండవోలు చిన్నా అలియాస్ గూడూరు చిన్నాను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఆత్మకూరు సీఐ ఎస్కే ఖాజావలి తెలిపారు. సీఐ తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన రూ.44.50 లక్షల విలువైన దుంగలను, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అప్పటి నుంచి గుండవోలు చిన్నా పరారీలో ఉన్నాడు. గతంలో చిన్నా సోమశిల, అనంతసాగరం, మర్రిపాడు తదితర ప్రాంతాల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా చేసేవాడు. నిందితుడు శుక్రవారం నెల్లూరుపాళెం వద్ద ఉన్నట్లు సమాచారం అందటంతో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. పోలీసు సిబ్బంది చెన్నకేశవ, అశోక్ తదితరులున్నారు. -
హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్
ఆత్మకూరురూరల్ : సొంత వదినపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని బుధవారం అరెస్ట్ చేసినట్లు ఆత్మకూరు సీఐ ఎస్కే ఖాజావళి తెలిపారు. బుధవారం ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అనంతసాగరం మండలం పడమటి కంభంపాడుకు చెందిన పెరుమాళ్ల పెద్ద వెంకటమ్మ, ఆమె మరిది మస్తానయ్య మధ్య ప్రహరీ సరిహద్దు వివాదం కొంత కాలంగా ఉంది. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం ప్రహరీ నిర్మాణం చేయిస్తున్న పెద వెంకటమ్మపై కత్తితో మస్తానయ్య హత్యాయత్నం చేశాడు. ఆమె చేయి అడ్డుపెట్టడంతో అర చేయి వరకు తెగి పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నిందితుడు మస్తానయ్య పరారీలో ఉన్నాడు. సోమశిల ఎస్ఐ ఖాజీబాబు నిందితుడుపై నిఘా ఉంచి బుధవారం గ్రామానికి వెళ్తుండగా అరెస్ట్ చేసి ఆత్మకూరుకు తరలించారు. -
చెక్పోస్టులో అటవీశాఖ జలగలు
ఆత్మకూరురూరల్ : నెల్లూరుపాళెం సెంటర్లోని చెక్పోస్ట్లో అటవీశాఖ జలగల్లా జనాన్ని దోచుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం ఆత్మకూరు పరిసరాల నుంచి కలప కర్రను కొనుగోలు చేసి నెల్లూరుకు తరలించే ఓ వ్యాపారికి అటవీశాఖ చెక్పోస్టు సిబ్బందితో చుక్క ఎదురైంది. కొన్ని నెలలుగా సురేష్ కర్ర కొనుగోలు వ్యాపారం చేస్తున్నాడు. అందుకు అన్ని అనుమతులున్నా కలప వాహనం చెక్పోస్టు దాటి వెళ్లాలంటే మామూళ్లు ఇచ్చుకోక తప్పడం లేదని వాపోయాడు. పర్మిట్ తేదీ రాత్రి 12 గంటల అనంతరం అయిపోయిందంటూ పలుమార్లు తన వద్ద అధికంగా సొమ్ము వసూలు చేశారని బాధితుడు వాపోయాడు. ఎంతో కొంత ముట్టజెప్పి పోతున్నా.. మరింత ఎక్కువ కావాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించాడు. ఓ దశలో చెక్పోస్టు ఆఫీసు నుంచి వ్యాపారిని అక్కడి సిబ్బంది బయటకు గెంటి వేయడంతో వాగ్వాదం జరిగింది. దీంతో పలువురు గుమికూడటంతో వ్యాపారి మద్యం మత్తులో తమపై దౌర్జన్యం చేస్తున్నాడని అటవీశాఖ సిబ్బంది తెలిపారు. ఈ విషయమై ఫారెస్ట్ రేంజర్ రామకొండారెడ్డిని సంప్రదించగా సిబ్బంది చెప్పినట్టే చెప్పడం గమనార్హం. -
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
ఆత్మకూర్ (ఎస్) : రెండేళ్ల కేసీఆర్ పాలన అన్నిరంగాల్లో విఫలమైందని.. ముఖ్యంగా రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వ తీరు సరిగా లేదని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పటేల్ రమేష్రెడ్డి విమర్శించారు. గురువారం మండల కేంద్రంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు సోమిరెడ్డి శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని, గజ్వేల్లో మల్లన్నసాగర్ ప్రాజెక్టును నిపుణులు, స్థానికులు వ్యతిరేకిస్తున్నా మొండిగా భూసేకరణ చేపట్టి రైతులకు అన్యాయం చేస్తోందన్నారు. 2013 కేంద్ర ప్రభుత్వ చట్టప్రకారం రైతులకు పరిహారం ఇవ్వాలని కోరారు. రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 19, 20వ తేదీల్లో రేవంత్రెడ్డి నాయకత్వంలో ఇందిరాపార్క్ వద్ద చేపట్టే రెండు రోజుల దీక్షకు రైతులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు షఫీఉల్లా, దారోజు జానకిరాములు, రమణాచౌదరి, నామా ప్రవీణ్, సోమయ్య, కోతి మల్లయ్య, నీలం కృష్ణ పాల్గొన్నారు. -
మోటకొండూరులో కలపొద్దు
ఆత్మకూరు(ఎం) : మండలంలోని సింగారం, కొండాపురం, చాడ, నాంచారిపేట, కాటెపల్లి గ్రామాలను కొత్తగా ఏర్పాటైన మోటకొండూరు మండలంలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్షాల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల ప్రజలు గురువారం చేపట్టిన తహసీల్దార్ కార్యాలయ ముట్టడి కార్యక్రమం విజయవంతమైంది. ఉదయం 11గంటలకు వచ్చిన ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు మోటకొండూరు వద్దు.. ఆత్మకూరు(ఎం) ముద్దు... అంటూ నినాదాలు చేశారు. తహసీల్దార్ చాంబర్ వద్ద బైఠాయించారు. దీంతో తహసీల్దార్ లక్క అలివేలు భువనగిరి ఆర్డీఓ ఎంవీ.భూపాల్రెడ్డికి సమాచారం అందించారు. స్థానిక నాయకుడైన పి.పూర్ణచందర్రాజును ఆర్డీఓతో ఫోన్లో మాట్లాడించారు. సాయంత్రం 4.15లకు భువనగిరి ఆర్డీఓ వచ్చి ఆందోళనకారులతో మాట్లాడుతూ ప్రభుత్వం కూడా ప్రజాభిప్రాయసేకరణ ప్రకారమే ముందుకెళ్తుదే తప్ప మోటకొండూరులో కలపదని చెప్పడంతో ఆందోళన విరమించారు. యాదగిరిగుట్ట సీఐ రఘువీర్రెడ్డి, ఎస్ఐలు పి.శివనాగప్రసాద్, మధుసూదన్రెడ్డి, రాజశేఖర్రెడ్డి బందోబస్తును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు గుండు పెంటయ్యగౌడ్, సూదగాని యాదయ్యగౌడ్, పైళ్ల తులసమ్మ, ఎంపీటీసీ పచ్చిమట్ల మదార్ గౌడ్, వివిద పార్టీల నాయకులు పి. పూర్ణచందర్రాజు. పి.హేమలత, యాస లక్ష్మారెడ్డి, బొబ్బల ఇంద్రారెడ్డి, రచ్చ గోవర్ధన్, ఏలూరి వెంకటేశ్వర్లు, చాడ శశిధర్రెడ్డి, పంజాల పెంటయ్య, సత్తమ్మ, కొప్పుల సువర్ణ, కొప్పుల అండాలు పాల్గొన్నారు. -
ముగ్గురు యువకులపై కేసు
ఆత్మకూర్ (ఎస్) : మద్యం మత్తులో అంబేద్కర్ విగ్రహానికి వేసిన ముసుగు తొలగించి అవమానించిన ఘటనలో మండల పరిధిలోని పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ పి.పరమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆరెంపుల ప్రవీణ్, ఆరెంపుల నాగేందర్, ఆరెంపుల సైదులు సోమవారం రాత్రి మద్యం మత్తులో గ్రామ కూడలిలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం ముసుగు తొలగించి పసుపు, కుంకుమ చల్లారు. ఘటనపై గ్రామానికి చెందిన ఎ.సైదులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
జలసోయగం..మది పరవశం
ఆహ్లాదాన్ని పంచుతున్న సంగమేశ్వర పడవ ప్రయాణం పాపికొండలు బలాదూర్ దాల్ సరస్సును మరిపించే అందాలు కనువిందు చేసే జలపాతాలు డాల్పిన్నోస్ల ఆవిష్కారం వినూత్నమైన రాతి అమరికలు సహజ జలపాతాలు..అరుదైన వన్యప్రాణులు.. ఎత్తయిన కొండలు... ప్రకృతి సోయగాలను తిలకిస్తూ పడవలో సాగే ప్రయాణం మాటల్లో ఎంత చెప్పినా తక్కువే. హŸయలొలికే నీటి అలలు..రయ్యిన ఎగురుతూ విన్యాసాలు చేసే పక్షులు.. నీళ్లలో జలతారు మీనాల నృత్య సోయగాలు...చిక్కటి అడవులు.. ప్రకృతి చెక్కిన రాతి శిల్పాలు.. ఆ వాతావరణం చూపరులకు ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. ఓ గొప్ప అనుభూతిని మిగులుస్తుంది. మదినిండా ఆనందాన్ని పంచుతుంది. ఇలాంటి అనుభవమే మీకూ కావాలంటే సంగమేశ్వరం వెళ్లాల్సిందే. అక్కడ బోటింగ్లో షికారు కొట్టాల్సిందే. ఆత్మకూరు రూరల్ నల్లమల పర్వత ్రÔó ణి రెండు వరసల్లో ఆంధ్ర – తెలంగాణా రాష్ట్రాలను వేరు చేస్తూ లోతైన లోయల గుండా కృష్ణమ్మ బంగాళాఖాతాన్ని చేరుకునేందుకు పరుగులు తీస్తూ ఉంటుంది. శ్రీశైలం వద్ద ప్రాజెక్ట్ నిర్మించడంతో రిజర్వాయర్ వెనుకతట్టు జలాలు 60 కిమీ మేర విస్తరించి మైదాన ప్రాంతంలో విశాలమైన కృత్రిమ సరస్సును తలపిస్తున్నాయి. ఈ సరస్సు నల్లమల కొండల్లో అద్భుత ప్రాకృతిక శోభకు మెరుగులు దిద్దింది. ఒకప్పుడు మావోలు వారి కోసం వెళ్లే పోలీసులు, చేపలవేటలో నిమగ్నమయ్యే జాలర్లు తప్ప అంతదూరం నల్లమల కొండల నడుమ కృష్ణమ్మతో కలిసి ప్రయాణించే అవకాశం ఉండేది కాదు. దీంతో అద్భుతమైన ప్రకృతి శోభ బయటి ప్రపంచానికి ఆవిష్కృతం కాలేదు. కృష్ణా నది నల్లమల కొండలను ఒరుసుకుంటూ ఒక చోట నాతి నడుముకంటే సన్నగానూ మరో చోట కశ్మీర్ లోని దాల్ సరస్సు కంటే విశాలంగానూ ప్రవహిస్తూ సందర్శకులకు అలౌకికానందం కలిగిస్తోంది. మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక, తెలంగాణా రాష్ట్రలగుండా మైదాన ప్రాంతాన్ని అధిగమించి కర్నూలు – మహబూబ్ నగర్ జిల్లలాల సరిహద్దుల్లో సోమశిల, సంగమేశ్వరం మధ్యనుంచి బిళ్వం కామాక్షమ్మ కొండ వద్ద నల్లమల పర్వత శ్రేణుల్లోకి ప్రవేశిస్తు్తంది. ఇక్కడ నుంచి రెండు రాష్ట్రాలలోని సిద్దేశ్వరం, జానాల, బలపాల తిప్ప, అమరగిరి, లింగమయ్యపెంట, మిరపకాయల పెంట, గుండ్లపెంట తదితర అటవీ గ్రామాలను స్పర్శిస్తు కృష్ణమ్మ నడక కొనసాగుతుంది. ఇలా 20 కి.మీ దూరం వెళ్లిన తరువాత నదిలో పచ్చదనం కుప్పపోసినట్లుగా చీమలతిప్ప కనపడుతుంది. విశాలమైన నదీ ప్రవాహంలో సహజంగా ఏర్పడ్డ చిరునదీ ద్వీపమే చీమల తిప్ప. ఇంకా సరిగా చెప్పాలంటే ఇది ఒక కొండ లంక. ఈ చీమలతిప్పపై బతుకు పోరులో వలసవచ్చిన విశాఖ జాలర్ల కుటుంబాలు నివాసముంటాయి. ఇక్కడ నివాసముండే జాలర్ల పిల్లలు చిన్న పడవల్లో నదిలో సరదాగా తిరుగుతూ ఆటలాడుకునే దృశ్యాలు సందర్శకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. చీమల తిప్పను దాటిన తరువాత నల్లమల కొండలు కాస్త దూరంగా ఉండడంతో ఈ ప్రాంతంలో సహజంగానే విశాలమైన ప్రాంతంలో అందమైన సరస్సు ఏర్పడింది. ఇక్కడ చీమలతిప్ప చుట్టు లంగరు వేసిన పడవలను చూస్తే ఇది మనకు కశ్మీర్లోని దాల్ సరస్సును స్ఫురణకు తెస్తుంది. పచ్చటి తీవాచీల నడుమ.. నల్లమల కొండల నడుమ ప్రవహించే కృష్ణమ్మ ఒడిలోంచి మనం తలెత్తి చూస్తే ఎల్తైన కొండలను ఎవరో ఆకుపచ్చ తివాచీతో కప్పి ఉంచారేమో అన్నట్లుగా అనిపిస్తుంది. కొండలపై పెరిగిన సిరిమాను, నారయేపి, నల్లమద్ది, సోమి..తదితర వృక్షాలు మనకు పచ్చందాలను పరిచయం చేస్తాయి. నదిలోకి వాలి ఉండే పచ్చటి చెట్లు వనదేవతలు కృష్ణమ్మతో కరచాలనం చేస్తున్నట్లుగా కనిపిస్తాయి. డాల్ఫిన్హౌస్లు మనకూ ఉన్నాయి.. విశాఖ సముద్ర తీరంలో డాల్ఫిన్ ముక్కును పోలిన కొండ పర్యాటక ప్రాముఖ్యాన్ని పొందిన సంగతి తెలిసిందే. అలాంటి డాల్ఫిన్నోస్ను తలపించే కొండలు కష్ణమ్మను ఒరుసుకుంటూ నదీమార్గంలో ఎన్నో చోట్ల కనిపిస్తాయి. ఇలా కృష్ణానది శ్రీశైలం ప్రాజెక్ట్ వరకు ఎన్నో అందాలను ఆవిష్కరిస్తూ తన పయనాన్ని సాగిస్తుంది. ఈ దారిలో ప్రసిద్ధి చెందిన అంకాళమ్మ కోట ఉండే పర్వతం కనిపిస్తుంది. పూర్వం దివిటీ దొంగలకు ఈ కోట ఆశ్రయదుర్గంలా ఉండేదని అంటారు. రాళ్ల అమరిక అదుర్స్ నదిలో ప్రయాణిస్తూ చుట్టు కనిపించే నల్లమల పర్వత శ్రేణిని పరిశీలిస్తూ వెళుతుంటే ఎన్నో అద్భుతమైన రాతి అమరికలు కనిపిస్తాయి. కోట గోడలు, వాటి మధ్య బురుజులు ఉన్నట్లుగాను, మరొక చోట ఏనుగు కాళ్లు పైకెత్తి తొండం లేపి ఘీంకరిస్తున్నట్లుగాను, మరో చోట ఇరువురు వ్యక్తులు ఆలింగనం చేపుకున్నట్లుగా రాళ్లు కనిపిస్తాయి. జలపాతాల సోయగం.. నల్లమల అడవుల్లోంచి పప్రవహించే కొండవాగులు, ఎల్తైన కొండల మీదనుంచి కృష్ణా నదిలోకి దూకుతూ ఏర్పరచే జలపాతాలు చూడముచ్చటగా కనిపిస్తాయి. ఇలాంటి జలపాతాలు కృష్ణమ్మ నల్లమల కొండల్లో ప్రవహించినంత మేర చాలా చోట్ల కనిపిస్తాయి. పులుల అభయారణ్యం.. కృష్ణానది నల్లమలలో ప్రవహించే ప్రాంతమంతా నాగార్జున సాగర్ – శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యంలోనే ఉంది. దీంతో కృష్ణానదిలో ప్రయాణించే వారికి నది ఒడ్డున సంచరించే పెద్ద పులులు కనిపించే అవకాశం ఉంది. అంతే కాకుండా పొడదుప్పి, కణితి, కొండ గొర్రె వంటి గడ్డతినే జంతువులు కనిపిస్తాయి. ప్రయాణమెలా.. నిజానికి ఇంతటి అందమైన ప్రదేశాలు రాష్ట్రంలో అరుదుగానే ఉన్నాయి. కృష్ణానదిలో ప్రయాణం కొంత సాహసంతో కూడుకొన్నదే అయినా ఎంతో ఆహ్లాదాన్ని మిగులుస్తుంది. నదిలో జాలర్ల నుంచి చేపలు సేకరించేందుకు ఉపయోగించే ఇంజన్బోట్లు ఈ సాహసయాత్రకు ఉపకరిస్తాయి. తెలంగాణా రాçష్ట్ర పర్యాటక శాఖ మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపురం సమీపంలో ఉన్న సోమశిల వద్ద నుంచి నదిలో ప్రయాణించేందుకు బోటును అందుబాటులో ఉంచింది. ఇక్కడ ఆ శాఖకు చెందిన హోటల్ కూడా ఉంది. అలాగే కృష్ణా పుష్కరాల సంధర్భంగా సంగమేశ్వరంలో ఏర్పాటు చేసిన పర్యాటక శాఖ రెస్టారెంట్ను నడుపుతున్నారు. ఇక్కడ నాలుగు వీఐపీ ఏసి లాంజ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఏపి టూరిజానికి చెందిన ఆరు సీట్లు, ఎనిమిది సీట్ల రెండు స్పీడ్ బోట్లు కూడా సంగమేశ్వరంలో పర్యాటకుల సౌకర్యార్థం ఉన్నాయి. ఇలా వెళ్లాలి.. కర్నూలు నగరం నుంచి ఆత్మకూరుకు 70 కిమీ దూరం ఉంది. ఆర్టీసీ ప్రతి పది నిముషాలకు ఒక బస్సును తిప్పుతోంది. ఆత్మకూరు నుంచి ఆర్టీసీ బస్సుల్లోకాని ప్రయివేటు వాహనాల్లో కాని 40 కిమీ దూరంలోని కొత్తపల్లె మండలంలోని సంగమేశ్వరం చేరుకోవచ్చు. స్వంత వాహనాలు ఉన్న వారు పాములపాడు మండలంలోని కంబాలపల్లె నుంచి నేరుగా కొత్తపల్లె మండలం లింగాపురం గ్రామం గుండా సంగమేశ్వరం చేరుకోవచ్చు. త్వరలో సంగమేశ్వరం నుంచి సంగమేశ్వరం నుంచి కూడా శ్రీశైలానికి పడవ ప్రయాణం త్వరలో ప్రారంభమవుతుంది. ఈ విషయమై ఉన్నతాధికారులకు అనుమతి కోసం ప్రతిపాదనలు పంపాం. సంగమేశ్వరాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు టూరిజం శాఖ కసరత్తు చేస్తోంది. – సుదర్శనరావు, డివిజనల్ మేనేజరు, ఏపీ టూరిజం, కర్నూలు ప్రయాణికుల ఆసక్తిని బట్టి శ్రీశైలానికి బోటు మహబూబ్ నగర జిల్లా సోమశిల నుంచి తెలంగాణా టూరిజం శాఖ ఒక బోటును శ్రీశైలానికి నడుపుతోంది. ఇందుకు రానుపోను టిక్కెట్ ధర రూ.800 నిర్ణయించాము. పిల్లలకు రూ.600 తీసుకుంటున్నాము. సింగిల్ వే ప్రయాణానికి రూ.500 నిర్ణయించాము. సోమశిల నుంచి శ్రీశైలం సుమారు 120 కి.మీ. దూరం నదిలో ప్రయాణించాల్సి వస్తుంది. ఇందుకోసం టూరిజం బోటుకు 300 లీటర్ల డీజిల్ వినియోగమవుతోంది. ప్రయాణికులు కనీసం 30 మంది ఉంటే రూ. 25 వేలు వస్తోంది. ఈ మేరకు ప్రయాణికులు బుక్ అయితే శ్రీశైలానికి బోటును ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రయాణంలో అక్కమహాదేవి గుహలను కూడా చూపిస్తున్నాం. అంతే కాకుండా సమీపంలో ఉన్న చీమల తిప్ప, అంకాలమ్మ కోట వంటి ప్రాంతాలకు కూడా బోటు నడుపుతున్నాం. ఇందుకోసం ప్రయాణ దూరం గంటల బట్టి రూ. 1000 వరకు చార్జ్ చేస్తున్నాం.. – సైదులు, జిల్లా మేనేజర్, తెలంగాణా టూరిజం, మహబూబ్నగర్ -
కొండాపురం వాసుల రాస్తారోకో
ఆత్మకూరు (ఎం) : ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న మోటకొండూరు మండలంలో తమ గ్రామాన్ని కలుపొద్దని మండలంలోని కొండాపురం గ్రామస్తులు మంగళవారం రాయగిరి–మోత్కూరు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా 3 గంటలపాటు రోడ్డుపైనే బైఠాయించి, అక్కడే వంటా–వార్పు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఆత్మకూరు (ఎం) మండలం 4 కి.మీ. మాత్రమే ఉంటుందని, మోటకొండూరు మాత్రం 18 కి.మీ. వస్తుందన్నారు. భువనగిరి ఆర్డీఓ, తహసీల్దార్ వచ్చి సమాధానం చెప్పాలని భీష్మించారు. విషయం తెలుసుకున్న ఆత్మకూరు (ఎం) ఎస్ఐ పి.శివనాగప్రసాద్ సంఘటనాస్థలానికి చేరుకొని గ్రామస్తులకు ఎంత నచ్చచెప్పినా వారు ఆందోళన విరమించలేదు. అనంతరం గుండాల, మోత్కూరు ఎస్ఐలు మధుసూదన్రెడ్డి, రవికుమార్లు సంఘటనా స్థలానికి వచ్చి ఆందోళన విరమించమని కోరినా వారు వినకపోవడంతో ఓ దశలో గ్రామస్తులకు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలోనే గ్రామానికి చెందిన గుడ్డేటి విష్ణు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో గమనించిన పోలీసులు అతడిని అడ్డుకున్నారు. అనంతరం భువనగిరి సీఐ ఎ.అర్జునయ్య, తహసీల్దార్ లక్క అలివేలు రాస్తారోకో వద్దకు చేరుకొని అక్కడే గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. కొండాపురంను 18 కిలోమీటర్ల దూరంగా ఉన్న మోటకొండూరులో కలపడం వల్ల గ్రామస్తులు ఇబ్బందులు పడుతారని, ఆత్మకూరు(ఎం) మండలంలోనే కొనసాగించాలని జెడ్పీటీసీ గంగపురం మల్లేశం, ఎంపీటీసీ పి.హేమలత, మాజీ జెడ్పీటీసీ పి.పూర్ణచందర్రాజులు కోరారు. దీంతో తహసీల్దార్ అలివేలు మాట్లాడుతూ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. రాస్తారోకో వల్ల సుమారు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో సర్పంచ్ గుండు పెంటయ్య గౌడ్, ఉప సర్పంచ్ కొప్పుల వెంకట్రెడ్డి, మాజీ సర్పంచ్ పంజాల పెంటయ్య గౌడ్, కొప్పుల మల్లారెడ్డి, పీసరి నర్సిరెడ్డి, కొండా మురళి, గుడ్డెటి భిక్షపతి, బాశెట్టి సత్యనారాయణ, కొండా పంచాక్షరి, గుండు శ్రీశైలం, కొప్పుల రాంరెడ్డి, కొప్పుల సువర్ణ, అనూష, మమత, సుశీల పాల్గొన్నారు. మెడకు ఉరితో నిరసన దిలావర్పూర్ (ఆలేరు) : మండలంలోని దిలావర్పూర్ను నూతనంగా ఏర్పాటయ్యే మోటకొండూర్ మండలంలో కలుపొద్దని కోరుతూ మంగళవారం ఆ గ్రామస్తులు మెడకు తాడు బిగించుకుని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. దిలావర్పూర్ గ్రామాన్ని యథావిధిగా ఆలేరు మండలంలోనే కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సీస బాలరాజ్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ పల్లా జోగిరెడ్డి, చెక్క వెంకటేశ్, చాపల మల్లేశం, మచ్చ సత్యనారాయణ, అంజయ్య, సిద్ధులు, నరేందర్, శంకర్, కుల్లయ్య, విజయసింహారెడ్డి పాల్గొన్నారు. -
అ'ధర'హో..
ఆత్మకూరు : వరుస పంట నష్టాలతో కుదేలవుతున్న రైతులు ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా పొట్టేళ్ల పెంపకం చేపట్టి లాభాలు గడిస్తున్నారు. ఆత్మకూరు మండలానికి చెందిన కొందరు రైతులు ఐదు నెలల క్రితం చిందనూరు జాతికి చెందిన పొట్టేళ్లను రూ. పదివేలతో కొనుగోలు చేసి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ప్రస్తుతం మాల పున్నమి, బక్రీద్ పండుగలు రానుండడంతో ఈ పొట్టేళ్లకు డిమాండ్ పెరిగింది. ఆత్మకూరుకు చెందిన రమేష్ పెంచిన రెండు పొట్టేళ్లు రూ. లక్షకు అమ్ముడు పోగా, సన్నప్పయ్యకు చెందిన పొట్టేళ్లు ఒక్కొక్కటి రూ. 60 వేలకు పైబడి ధర పలుకుతున్నాయి. -
బంగారు తెలంగాణకు సహకరించాలి
– ఎంపీ కే. కేశవరావు ఆత్మకూర్ : రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని, అందరి సహకారం కావాలని రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు అన్నారు. శనివారం మండలంలోని గోపన్పేటలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకే పంపించాలని, ప్రభుత్వ విద్యాలయాలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయిస్తుందన్నారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రూ.4కోట్ల నిధులు, ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.కోటి కేటాయించి పాఠశాల అభివద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. కేశవరావుతో తన కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని, మా తండ్రి నర్సిరెడ్డితో కలిసి ఆయన పనిచేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఆచార్య ఎన్జీరంగా మాజీ డీన్ సుదర్శన్రెడ్డి, టీఆర్ఎస్ మక్తల్ ఇన్చార్జ్ దేవరిమల్లప్ప, డీసీసీబీ మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్ప, ఎంపీపీ శ్రీధర్గౌడ్, జెడ్పీటీసీ బాలకిష్టన్న, సర్పంచ్ వెంకటేష్, టీఆర్ఎస్ మండల అద్యక్షుడు గోపాల్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కమీషన్ల కోసమే ప్రాజెక్టులకు అధిక నిధులు
ఆత్మకూరు (ఎం) : కమీషన్ల కోసమే ప్రాజెక్టులకు రిడిజైనింగ్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తోందని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్ విమర్శించారు. గురువారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహా రాష్ట్రతో జల ఒప్పందం వెనుక ప్రాజెక్టు కాంట్రాక్ట్ పనులను‡ముఖ్యమంత్రి తన బంధువైన మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు సంబంధికులకు కట్టబెట్టడం ఒక ప్రధాన కారణమన్నారు. ఎన్నికల హామీలను ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వేసిన పంటలు ఎండిపోతూ రైతులు అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ గంగపురం మల్లేశం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొడిత్యాల నరేందర్గుప్త, నాయకులు కందాడి అనంతరెడ్డి, యాస లక్ష్మారెడ్డి, కొడిమాల యాదగిరిగౌడ్, కట్టెకోల హన్మంతుగౌడ్, లోడి శ్రీను పాల్గొన్నారు. -
ఘాట్లలో హుండీల లెక్కింపు
ఆత్మకూర్: కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆత్మకూర్ మండల పరిధిలోని నందిమల్ల, మూలమల్ల, జూరాల గ్రామాల్లోని ఆలయాల్లో ఏర్పాటు చేసిన హుండీలను బుధవారం కురుమూర్తి దేవస్తానం ఈవో శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో లెక్కించారు. మూలమల్లలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలో రూ.58,470లు, నందిమల్లలోని శ్రీ బ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయం హుండీలో రూ.23,130లు, జూరాల గ్రామంలోని శివాలయంలో ఏర్పాటు చేసిన హుండీలో రూ.24,097లు ఉన్నట్లు తెలిపారు. లెక్కింపులను సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఆలయ నిర్వాహకుల సమక్షంలో చేపట్టినట్లు తెలిపారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
కదిరి టౌన్/ ఎస్కేయూ : జిల్లాలోని రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. కుమారుడికి ఆస్పత్రిలో వైద్యం చేయించుకుని వచ్చే క్రమంలో తండ్రి, అంత్యక్రియల్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఓ మహిళ మృత్యువాతపడిన వారిలో ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి. నల్లచెరువు మండల కేంద్రానికి చెందిన నూనె వ్యాపారి మహబూబ్బాషా (50) తన కుమారుడు ముస్తాక్కు ఆరోగ్యం బాగలేకపోవడంతో సోమవారం సాయంత్రం ద్విచక్రవాహనంలో తనకల్లు మండలం కొక్కంటి క్రాస్కు ద్విచక్రవాహనంలో బయల్దేరాడు. ఆస్పత్రిలో చూపించుకుని స్వగ్రామానికి తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో ఎదురుగా వచ్చిన కారు ఢీకొంది. మహబూబ్బాషాకు తీవ్రంగాను, కుమారుడికి స్వల్పంగాను గాయాలయ్యాయి. స్థానికులు కదిరి ఏరియా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని అనంతరం తీసుకెళ్లాలని వైద్యులు సూచించేలోపే మహబూబ్బాషా మృతి చెందాడు. మృతదేహంపై పడి భార్య, కుటుంబ సభ్యులు రోదించిన తీరు కలచివేసింది. తనకల్లు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందిన రాజేంద్ర, భవానీ భార్యాభర్తలు. భవానీ తండ్రి మరణించడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఇద్దరూ కదిరికి వెళ్లారు. సోమవారం వీరిద్దరూ లక్ష్మిదేవి (45) అనే మహిళతో కలిసి ద్విచక్రవాహనంలో స్వగ్రామానికి బయల్దేరారు. ఎస్కేయూ సమీపంలోని సమతాగ్రాం వద్ద ఈచర్ వాహనాన్ని దాటే క్రమంలో అదుపుతప్పి కిందపడ్డారు. తలకు తీవ్రగాయం కావడంతో లక్ష్మిదేవి (45) అక్కడికక్కడే చనిపోయింది. రాజేంద్ర, భవానీలకు గాయాలయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తాగునీటికి కటకట
ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని తుమ్మలపెన్పహడ్ గ్రామంలో వానాకాలంలోనూ నీటి కష్టాలు తప్పడం లేదు. భూగర్భజలాలు అడుగంటి స్కీంబోర్లు పోయకపోవడం, అద్దెబోర్లకు ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో వారం రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో గ్రామస్తులు వ్యవసాయ పనులను మానుకొని నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు 6 వేల పైచిలుకు జనాభా కలిగిన తుమ్మలపెన్పహడ్ గ్రామంలో గతంలో 18 గ్రామపంచాయతీ బోర్లు ఉండగా వేసవి కాలంలో అదనంగా మరో 10 బోర్లు అద్దెకు తీసుకొని గ్రామానికి నీరు అందించారు. కాగా నేడు అద్దెబోర్లు లేకపోవడం, భూగర్భజలాలు అడుగంటడంతో 18 బోర్లల్లో 10 బోర్లు అడుగంటిపోయాయి. 8 బోర్లల్లో సైతం నీరు తక్కువగా వస్తున్నది. దీంతో గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంటుంది. ప్రధానంగా పాఠశాల చుట్టుపక్కల, ముదిరాజ్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీల్లో వారాల తరబడి నీళ్లు రావడం లేదు. దీంతో గ్రామస్తులు తప్పనిసరి పరిస్థితుల్లో ట్రాక్టర్ల ద్వారా, ఎడ్లబండ్ల ద్వారా వ్యవసాయ బావుల వద్దనుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. పాఠశాల సమీపంలో నీటిసంపు వద్ద గంటల తరబడి నిరీక్షించి నీటిని తీసుకువెళ్లుతున్నట్టు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి సమస్య ఉన్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి నీటి సమస్యను తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. పనులు మానుకొని నీళ్లకు వెళ్తున్నాం– దొంతరబోయిన సోమమ్మ గ్రామంలో తీవ్ర నీటి కరువు ఉంది. అధికారులు, నాయకులు పట్టించుకోవడంలేదు. రోజుల తరబడి నీళ్లు రాకపోవడంతో వ్యవసాయ పనులు వదులుకొని నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తుంది. ట్రాక్టర్ల ద్వారా నీళ్లు కొనుగోలు చేసుకుంటున్నాం. గంటల తరబడి ఎదురుచూస్తున్నాం – పులుగుజ్జు లింగయ్య గ్రామ పంచాయతీ నీళ్లు రాకపోవడంతో వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నాం. సంపు వద్ద వచ్చేనీళ్ల కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. వానాకాలంలోనే నీళ్లు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం –బెల్లంకొండ మంగమ్మ, సర్పంచ్, తుమ్మలపెన్పహాడ్ గ్రామపంచాయతీలో 18 బోర్లకు గాను10 బోర్లు అడుగంటిపోయాయి. 8 బోర్లల్లో నీళ్లు తక్కువగా వస్తున్నాయి. అద్దెబోర్లకు ప్రభుత్వ అనుమతి లేదు. దీంతో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతుంది. సమస్యను అధికారులకు తెలియజేశాం. త్వరలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. -
హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలి
ఆత్మకూర్(ఎస్) : హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు సానబోయిన ఉపేందర్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని కస్తూరిబా, ఎస్సీ హాస్టల్, ఆదర్శ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ తహసీల్దార్ వేణుగోపాల్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కస్తూరిబా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎస్సీ హాస్టల్లో ప్రహారీ లేకపోవడంతో రాత్రిళ్లు పందులు, తేళ్లు, పాములు వస్తున్నాయన్నారు. విద్యార్ధులు నడచి వెళ్లడానికి దారికూడా సక్రమంగా లేదన్నారు. ఆదర్శ పాఠశాలలో ప్రహరీలేక బాలికలకు రక్షణలేకుండా పోయిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు జుజ్జూరి సతీష్, ఏర్పుల సతీష్, ఉప్పుల సైదులు, సురేష్, రమేష్,ప్రవీణ్, ఉపేందర్, వేణు, అప్పిరెడ్డి, నాగరాజు, ప్రభాకర్ తదితరులు ఉన్నారు. -
పోలీసు అమరులకు ఘన నివాళి
ఆత్మకూరు(ఎం): మావోయిస్టుల దాడిలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరులకు గురువారం స్థానిక పోలీస్స్టేషన్లో నివాళులర్పించారు. ఈ సందర్భంగా 2006 ఆగస్టు 18న పోలీస్స్టేషన్లో మావోయిస్టులు జరిపిన దాడిలో మృతిచెందిన ఎస్ఐ చాంద్పాషా, ఏఎస్ఐ సుల్తాన్మహీనొద్దీన్, హోంగార్డు లింగయ్య చిత్రపటాలకు పూలమాలువేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హెడ్కానిస్టేబుల్ ఎండి.జాఫర్, ఎండి. అబీబ్, వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు ఎ.నగేష్, కానిస్టేబుల్స్ హరీష్, రాజు కుమార్ పాల్గొన్నారు. -
అమర పోలీసులకు రెడ్సెల్యూట్..!
ఆత్మకూరు(ఎం) : సరిగ్గా పదేళ్ల క్రితం.. జనమంతా.. రాత్రి నిద్రకు ఉపక్రమించే సమయం..అప్పుడే పిడుగుపడినట్టుగా పెద్ద శబ్దం వినిపించింది. జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏమిటా అని లేచి బజార్లకు వచ్చేలోపే పోలీస్స్టేషన్పై బాంబులతో దాడి జరిగిందనే వార్త దాహనంలా వ్యాపించింది. అదే ఆత్మకూర్(ఎం)మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్పై మావోయిస్టుల జరిపిన బాంబుదాడి ఘటన. ఈ దాడి జరిగి గురువారంతో పదేళ్లయ్యింది. దశాబ్దం క్రితం ఇదేరోజు అర్ధరాత్రి (18–08–2006న) జరిగిన దాడిలో అప్పటి స్టేషన్ ఎస్ఐ చాంద్ పాషా, ఏఎస్ఐ సుల్తాన్మొయినో ద్దీన్, హోంగార్డు లింగయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మావోయిస్టుల దాడిలో ప్రాణాలొదిలిన అమరపోలీసుల త్యాగాన్ని స్మరించుకుందాం. వారి మృతికి నివాళులర్పిస్తూ వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుదాం.. క్షణక్షణం.. భయంభయం ! వర్కట్పల్లి ఎన్కౌంటర్కు నిరసనగా మండల కేంద్రంలో 1993–94లో అప్పటి ఎంపీపీ పి.హేమలత ఇంటిని నక్సలైట్లు పేల్చివేశారు. అప్పటి నుంచి ఎటువంటి సంఘటనలు ఆత్మకూరు(ఎం)లో చోటు చేసుకోలేదు. ప్రశాంతతకు మారు పేరుగా ఉన్న ఆత్మకూరు(ఎం)లో మరలా 2006లో అలజడి మెుదలైంది. పోలీస్స్టేషన్పై మావోయిస్టుల దాడి నేపథ్యంలో ఎస్ఐ, ఏఎస్ఐ, హోంగార్డుల మృతి చెందగా జనం క్షణక్షణం భయపడుతున్నారు. అలాగే ఏడాదిన్న క్రితం జానకిపురంలో ఉగ్రవాదుల కాల్పులకు మృతి చెందిన ఎస్ఐ డి.సిద్ధయ్య, కానిస్టేబుల్ నాగరాజు మరణాలను ఇప్పటికీ ఈ మండల ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. -
ఘనంగా బోనాల పండుగ
ఆత్మకూర్(ఎస్) : మండల వ్యాప్తంగా ఆదివారం బోనాల పండుగను నిర్వహించారు. నసీంపేట, తుమ్మలపెన్నహడ్, కోటపహడ్, శెట్టిగూడెం,పాతర్లపహడ్, ఇస్తాళ్లాపురం, నెమ్మికల్లు, పాతసూర్యాపేట, ఏనుబాములలో ఆయా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో బోనాలతో ఊరేగింపుగా వెళ్లారు. -
విషం కలిపిన నీరు తాగి గేదెలు మృతి
ఆత్మకూర్(ఎస్) : ఆకతాయిల పనో, గిట్టనివారి పనోగాని నీటిలో విషం కలపడంతో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఈ ఈ సంఘటన మండల పరిధిలోని కోటపహడ్ ఆవాసం తెట్టెకుంటతండాలో శనివారం చోటుచేసుకుంది. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన భానోత్ లింగ్యా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. కాగా గుర్తుతెలియని వ్యక్తులు పశువులు నీళ్లు తాగే తొట్టెలో పురుగుల మందు కలిపారు. ఇది గమనించని లింగ్యా ఉదయం 8 గంటల సమయంలో కోడెకు నీళ్లు తాగించడంతో కొద్దిసేపటికే సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో విషపు ముట్టిందనుకొని చికిత్సనిమిత్తం కోడెను గ్రామానికి తీసుకురాగా అప్పటికే చనిపోయింది. అనంతరం కోడెను బొందపెట్టేందుకు గుంతతీసుకుంటూ ఉండడంతో ఇంట్లో వాళ్లు మేకకు, గేదెలకు నీళ్లు తాపడంతో అవికూడా వెంటనే సొమ్మసిల్లి పడిపోయాయి. దాంతో వెంటనే పశువైద్యుడికి సమాచారం అందించడంతో చికిత్స అందిస్తుండగానే మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనలో 2 గేదెలు, 1 కోడె, 1 మేక మృత్యువాత పడ్డాయి. విషం కలిపిన నీరు తాగడంతోనే మృత్యువాత పడ్డాయని అసిస్టెంట్ పశువైద్యాధికారి సైదులు తెలిపారు. వాటి విలువ దాదాపు లక్ష రూపాయలు ఉంటుందని బాధితుడు రోదిస్తూ తెలిపాడు. ఈ విషయమై పలువురిపై అనుమానితులుగా పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. -
‘ఆదర్శ’లో ఆరుబయటే వంటలు
ఆత్మకూర్ (ఎస్) : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో వంటగది లేకపోవడంతో మధ్యాహ్న భోజనాన్ని ఆరుబయటే వండుతున్నారు. ఎండాకాలంలో ఎండకు, వర్షాకాలంలో చిరుజల్లులు, గాలులతో ఏజెన్సీ మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మోడల్ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించినప్పటికీ వంటగదిని నిర్మించలేదు. ఈ పాఠశాలలో ఆరు నుంచి పదవ తరగతికి చెందిన సుమారు 500 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ప్రతిరోజు మధ్యాహ్నం 450 మంది విద్యార్థులకు దాకా భోజనాన్ని ఏజెన్సీ మహిళలు వండి వడ్డిస్తున్నారు. ఇంత మందికి వంట వండేందుకు గది లేకపోవడంతో ఏజెన్సీ మహిళలు పాఠశాల ఆవరణలోనే ఆరుబయట వంట చేస్తున్నారు. ప్రస్తుతం చిరుజల్లులతో కూడిన ముసురు కారణంగా వంట సామగ్రి తడిసిపోయి భోజనం సరిగా ఉడకడం లేదు. ఆరు బయట కావడంతో గాలులకు మంట తగలక బియ్యం బియ్యంగా ఉంటుందని, ఈ భోజనం తిని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏజెన్సీ మహిళలు వంట వండేందుకు నానా తంటాలు పడుతున్నారు. వంట గది లేకపోవడంతో నానా అవస్థలు పడి 500 మందికి భోజనం వండే సమయంలో కొన్ని సందర్భాల్లో వంట సరిగా కావడం లేదని ఏజెన్సీ మహిళలు పేర్కొంటున్నారు. కోట్ల రూపాయల వ్యయంతో మోడల్ స్కూల్ను నిర్మించిన ప్రభుత్వం ముందు చూపు లేకుండా వంట గదిని నిర్మించకపోవడంతో విద్యార్థులు, ఏజెన్సీ మహిళలు ఇబ్బంది పడుతున్నారని మండల ప్రజలు పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం వంటగది నిర్మించి ఆదర్శ పాఠశాల విద్యార్ధులకు మధ్యాహ్న భోజనాన్ని సక్రమంగా అందించాలని విద్యార్ధుల తల్లితండ్రులు కోరుతున్నారు. ఆరుబయట వంటచేయలేకపోతున్నాం – దాసరి శశిరేఖ, ఏజెన్సీమహిళ ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజనం దాదాపు రోజుకు 450 మంది వరకూ వండాలి. ఆరుబయట వంటచేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గాలి తగలడంతో మంట సక్రమంగా తగలక అన్నం సక్రమంగా ఉడకడం లేదు. కొన్నిసార్లు ఆలస్యమవుతుంది. కొద్దిపాటి వర్షం పడినా కట్టెలు మండక పోవడంతో పాటు పాఠశాలలో పొగ అలుముకుంటున్నది. వెంటనే వంటగది నిర్మించి వంటగ్యాస్ అందించాలి. -
షార్ట్సర్క్యూట్తో ల్యాండ్రి దగ్ధం
– భారీగా ఆస్తి నష్టం ఆత్మకూరురూరల్ : విద్యుత్ షార్ట్సర్క్యూట్ సంభవించడంతో ల్యాండ్రి దగ్ధమైన సంఘటనలో విలువైన దుస్తులతో పాటు పట్టు చీరలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ సంఘటన ఆత్మకూరులో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల సమాచారం మేరకు... పట్టణంలోని బీఎస్ఆర్ సెంటర్లో ఆర్.గురవయ్య 20 ఏళ్లుగా ల్యాండ్రి షాపు నిర్వహిస్తున్నాడు. చిరపరిచితుడు కావడంతో ల్యాండ్రిలో అధిక మంది ఉద్యోగులు, ఎల్ఆర్పల్లి, జేఆర్పేటలోని గృహస్తులు దుస్తులు ఇస్తుంటారు. శ్రావణమాసం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో 1000కి పైగా పట్టు చీరలు రోలింగ్, ఇస్త్రీ కోసం ఇచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్సర్క్యూట్ సంభవించడంతో దుకాణం అగ్నికి ఆహుతైంది. రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఆత్మకూరు పోలీసులు 1.30 గంటల సమయంలో దుకాణం నుంచి మంటలు వస్తుండడాన్ని గమనించి గురవయ్యకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో దుకాణంలో ఉన్న విలువైన వస్త్రాలు, పట్టుచీరలు అగ్నికి ఆహుతి కావడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితుడు గురవయ్య వాపోతున్నాడు. -
దారి మళ్లిన బునాది
ఆత్మకూరు(ఎం): బునాదిగాని కాల్వను అధికారులు దారి మళ్లిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డిజైన్ ప్రకారం తవ్విన కాల్వ పనికిరాదంటూ కొత్తగా తవ్వకాన్ని ప్రారంభిస్తుండగా రైతులు అడ్డుకున్నారు. ఈ సంఘటన ఆత్మకూర్(ఎం)మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలిలా.. 2006లో బునాదిగాని కాల్వ పనులను ప్రారంభించారు. అప్పట్లో రూపొందించిన డిజైన్ ప్రకారం తొలుత బునాది కాల్వ తీశారు. కాల్వ హైదరాబాద్కు చెందిన ఓ రైతు భూమి మధ్యలో నుంచి వెళ్లింది. దీని వల్ల భూమి ఎటు కాకుండా పోతుందని, తన భూమి గుండానే శివారు నుంచి కాల్వ తీస్తే బాగుంటుందని సదరు రైతు సంబంధిత అధికారులను ఆశ్రయించినట్లు పలువురు రైతులు ఆరోపించారు. దీంతో మంగళవారం ఉదయం జేసీబీతో సదరు రైతు సూచించిన విధంగా అతని భూమిలో నుంచి కాల్వ తీస్తుండగా సమీప రైతులు గడ్డం సత్యనారాయణ, గడ్డం స్వామి తదితరులు అడ్డుకున్నారు. కాల్వను దారి మళ్లిస్తే తమకు నష్టం జరుగుతుందని, గతంలో ఎలా ఉందో అదే విధంగా ఉంచాలని అక్కడకు వచ్చిన ఐబీ ఏఈ రఘును కోరారు. గతంలో తీసిన కాల్వ ద్వారా బీటీ రోడ్డుపై నిర్మించిన స్ట్రచ్చర్ గుండా నీళ్లు వెళ్లే అవకాశం లేనందున దానికి ఎదురుగా కాల్వ తీస్తున్నట్లు ఏఈ తెలిపారు. రైతులు మాత్రం పాత డిజైన్ ప్రకారం కాల్వ ఉండాల్సిందేనని పట్టుబట్టారు. -
దారి మళ్లిన బునాది
ఆత్మకూరు(ఎం): బునాదిగాని కాల్వను అధికారులు దారి మళ్లిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డిజైన్ ప్రకారం తవ్విన కాల్వ పనికిరాదంటూ కొత్తగా తవ్వకాన్ని ప్రారంభిస్తుండగా రైతులు అడ్డుకున్నారు. ఈ సంఘటన ఆత్మకూర్(ఎం)మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలిలా.. 2006లో బునాదిగాని కాల్వ పనులను ప్రారంభించారు. అప్పట్లో రూపొందించిన డిజైన్ ప్రకారం తొలుత బునాది కాల్వ తీశారు. కాల్వ హైదరాబాద్కు చెందిన ఓ రైతు భూమి మధ్యలో నుంచి వెళ్లింది. దీని వల్ల భూమి ఎటు కాకుండా పోతుందని, తన భూమి గుండానే శివారు నుంచి కాల్వ తీస్తే బాగుంటుందని సదరు రైతు సంబంధిత అధికారులను ఆశ్రయించినట్లు పలువురు రైతులు ఆరోపించారు. దీంతో మంగళవారం ఉదయం జేసీబీతో సదరు రైతు సూచించిన విధంగా అతని భూమిలో నుంచి కాల్వ తీస్తుండగా సమీప రైతులు గడ్డం సత్యనారాయణ, గడ్డం స్వామి తదితరులు అడ్డుకున్నారు. కాల్వను దారి మళ్లిస్తే తమకు నష్టం జరుగుతుందని, గతంలో ఎలా ఉందో అదే విధంగా ఉంచాలని అక్కడకు వచ్చిన ఐబీ ఏఈ రఘును కోరారు. గతంలో తీసిన కాల్వ ద్వారా బీటీ రోడ్డుపై నిర్మించిన స్ట్రచ్చర్ గుండా నీళ్లు వెళ్లే అవకాశం లేనందున దానికి ఎదురుగా కాల్వ తీస్తున్నట్లు ఏఈ తెలిపారు. రైతులు మాత్రం పాత డిజైన్ ప్రకారం కాల్వ ఉండాల్సిందేనని పట్టుబట్టారు. -
నడిరోడ్డుపై యువకుడి 'తల'