Snapdeal
-
నేపాల్ విమానానికి రంద్రాలు..టిష్యూతో కవర్ చేసిన ఎయిర్హోస్ట్
నేపాల్లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఖాట్మాండు నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు బయలుదేరిన యతి ఎయిర్లైన్స్కు చెందిన ఏటీఆర్ 72 విమానం కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. వారిలో 70 మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం నాటికి ఈ సంఘటనలో అయిదుగురు భారతీయులతో సహా 68 మంది మృత్యువాతపడ్డారు. This is really really sad. Few yrs ago on my flight to Pokhara, when I told the stewardess that airflow was coming from the corner of a window while airborne, she brought a tissue paper & stuffed the crevice. Decided to never fly to Pokhara again expecting the worst one day 😔 https://t.co/Mf8kBHqIWV — Kunal Bahl (@1kunalbahl) January 15, 2023 ఇక ఈ విమాన ప్రమాదంపై స్నాప్ డీల్ కో-ఫౌండర్ కునాల్ బహ్ల్ విచారం వ్యక్తం చేశారు. నేపాల్ విమాన ప్రమాద వార్తని ట్వీట్ చేశారు. గతంలో బిజినెస్ పనిమీద పొఖారాకు వెళ్లిన బహ్ల్కు విమానంలో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ‘ఇది నిజంగా విచారకరం. కొన్ని సంవత్సరాల క్రితం నేను పోఖారాకు వెళ్లాను. నేను ప్రయాణిస్తున్న విమానం కిటికీలకు ఏర్పడిన పగుళ్ల కారణంగా ఆకాశ మార్గంలో ఉండగా.. బయట నుంచి గాలి విమాన కిటికీల పగుళ్ల గుండా లోపలికి వస్తుంది. ఇదే విషయాన్ని గుర్తించిన నేను వెంటనే పక్కనే ఉన్న ఎయిర్ హోస్ట్కి సమాచారం అందించా. ఆమె ఓ టిష్యూ పేపర్ను అడ్డం పెట్టి గాలి లోపలికి రాకుండా ప్రయత్నించింది. నా దృష్టిలో అదే అంత్యత వరస్ట్ డే. నాటి నుంచి మళ్లీ పోఖారాకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను’ అని ట్వీట్లో తెలిపారు. -
ఈ కామర్స్ దిగ్గజాలకు మరోసారి బిగ్ షాక్, కేంద్రం నోటీసులు
సాక్షి,ముంబై: ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ సంస్థలకు భారీ షాక్ తగిలింది. నాణ్యతా ప్రమాణాలు విస్మరించి, బొమ్మల విక్రయాలపై రెగ్యులేటరీ కొరడా ఝళిపించింది. బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ) క్వాలిటీ మార్క్ లేని బొమ్మలను విక్రయించి నందుకు వినియోగదారుల రక్షణ నియంత్రణ సంస్థ అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్లకు నోటీసులు జారీ చేసింది. నాణ్యతా ప్రమాణాలు పాటించని బొమ్మలను అక్రమంగా విక్రయిస్తున్న మూడు ఇ-కామర్స్ సంస్థలకు ఈ మేరకు నోటీసులిచ్చామని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) చీఫ్ నిధి ఖరే ఒక ప్రకటన జారీ చేశారు. బీఐఎస్ ప్రమాణానికి అనుగుణంగా లేని బొమ్మల విక్రయాలపై ఫిర్యాదులు నేపథ్యంలో దేశంలో పలు దుకాణాల్లో దాడులు నిర్వహించామని బీఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు. 44 చోట్ల గత నెలలో నిర్వహించిన దాడుల్లో ప్రధాన రిటైల్ దుకాణాల నుండి 18,600 బొమ్మలను స్వాధీనం చేసు కున్నామని వెల్లడించారు. ముఖ్యంగా దేశంలోని ప్రధాన విమానాశ్రయాలు, మాల్స్లో ఉన్న హామ్లీస్, ఆర్చీస్, డబ్ల్యూహెచ్ స్మిత్, కిడ్స్ జోన్ , కోకోకార్ట్తో సహా రిటైల్ దుకాణాలపై దాడులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. బీఐఎస్ చట్టంలోని నిబంధనల ప్రకారం సంబంధిత వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తివారీ తెలిపారు. కాగా 2021, జనవరి నుంచి బీఐఎస్ నిర్దేశించిన భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని టాయ్మేకర్స్ కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. నాసిరకం వస్తువులు విక్రయించినందుకుగానూ గతంలో ఈకామర్స్ సంస్థలకు సీసీపీఏ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. -
వ్యాపార విస్తరణలో స్నాప్డీల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ సంస్థ స్నాప్డీల్ తమ కార్యకలాపాల విస్తరణపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడం, టెక్నాలజీపరంగా మరిన్ని ఆవిష్కరణలు చేయడం, లాజిస్టింక్స్ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడానికి ప్రాధాన్యమిస్తోంది. దీనికోసం ఐపీవో ద్వారా రూ. 1,250 కోట్లు సమీకరించనున్నట్లు సంస్థ తెలిపింది. కొత్తగా ఈక్విటీల జారీ, ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో పబ్లిక్ ఇష్యూ ఉంటుందని పేర్కొంది. సాఫ్ట్బ్యాంక్, బ్లాక్రాక్, టెమాసెక్, ఈబే తదితర సంస్థలు స్నాప్డీల్లో ఇన్వెస్ట్ చేశాయి. మొత్తం 71 షేర్హోల్డర్లలో 8 మంది మాత్రమే స్వల్ప వాటాలను విక్రయించనున్నట్లు సంస్థ వివరించింది. సంయుక్తంగా 20.28 శాతం వాటా ఉన్న కంపెనీ వ్యవస్థాపకులు కునాల్ బెహల్, రోహిత్ కుమార్ బన్సల్ తమ వాటాలను ఐపీవోలో విక్రయించడం లేదని స్నాప్డీల్ తెలిపింది. -
ఐపీవో బాటలో స్నాప్డీల్
న్యూఢిల్లీ: ఈకామర్స్ ప్లాట్ఫామ్ స్నాప్డీల్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఇటీవల ఇంటర్నెట్ ఆధారిత బిజినెస్లు నిర్వహించే పలు కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో స్నాప్డీల్ నిధుల సమీకరణకు ప్రాధాన్యత ఏర్పడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 1,250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్చేసిన సంస్థలు మరో 3.07 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. లిస్టింగ్ ద్వారా కంపెనీ విలువ 1.5–1.7 బిలియన్ డాలర్ల(రూ. 12,750 కోట్లు)కు చేరవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తాజా ఈక్విటీ జారీ నిధులను ఇతర కంపెనీల కొనుగోళ్లు, లాజిస్టిక్స్ విస్తరణ, సాంకేతిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచుకోవడం తదితరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్లో స్నాప్డీల్ పేర్కొంది. ఇటీవల ఇంటర్నెట్ ఆధారిత దిగ్గజాలు జొమాటో, నైకా, పాలసీబజార్, పేటీఎమ్ పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధులను సమీకరించి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ను పొందిన విషయం విదితమే . మ్యాప్మైఇండియా లాభాల లిస్టింగ్ ఢిల్లీ: డిజిటల్ మ్యాపింగ్ కంపెనీ మ్యాప్మైఇండియా షేరు తొలిరోజు ఇన్వెస్టర్లకు లాభాలను పంచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర 1,033తో పోలిస్తే 53 శాతం ప్రీమియంతో రూ.1,581 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో రూ.1,587 వద్ద గరిష్టాన్ని.., రూ.1,395 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. చివరి గంట లాభాల స్వీకరణతో 35% లాభంతో రూ.1,394 వద్ద నిలిచింది. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ విలువ రూ.7,425 కోట్లుగా నమోదైంది. -
కోవిడ్ బాధితుల కోసం స్నాప్డీల్ సంజీవని
ఈ-కామర్స్ కంపెనీ స్నాప్డీల్ తాజాగా సంజీవని పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా కోవిడ్-19 రోగులను ప్లాస్మా దాతలతో అనుసంధానిస్తారు. రోగులు, దాతలు తమ పేర్లను మొబైల్ నంబరు, ఈ-మెయిల్ ఆధారంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. బ్లడ్ గ్రూప్, ప్రాంతం, కోవిడ్-19 ఎప్పుడు సోకింది, ఎప్పుడు నెగెటివ్ వచ్చింది వంటి వివరాలను పొందుపర్చాలి. ఈ వివరాల ఆధారంగా స్నాప్డీల్ సర్చ్ ఇంజన్ రోగులను, దాతలను కలుపుతుంది. ప్లాస్మా దానంపై అవగాహన పెంచేందుకు సంజీవని నడుం బిగించింది. మహ మ్మారి విస్తృతి నేపథ్యంలో ఫేస్బుక్, గూగుల్, పేటీఎం వంటి సంస్థలు సైతం తమ వంతుగా సాయపడేందుకు డిజిటల్ వేదికగా టూల్స్ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: కరోనా పేషెంట్స్ కోసం గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్ -
కరోనా సంక్షోభం: స్నాప్డీల్ డెలివరీ హామీ
సాక్షి, ముంబై: కోవిడ్ -19 లాక్ డౌన్ కారణంగా ఇ-కామర్స్ మార్కెట్లు అవసరమైన వస్తువులను పంపిణీ చేయడానికి చాలా కష్టపడుతున్నాయి. ప్రారంభ రోజుల్లో నిత్యావసరాల సరఫరాపై స్పష్టత లేకపోవడంతో, ఎక్కువ మంది గిడ్డంగులను మూసివేయవలసి వచ్చింది. అలాగే డెలివరీల సమయంలో ఉద్యోగులకు కూడా పెద్ద కొరత ఏర్పడింది. చాలా ఆర్డర్లను నిరాకరించాయి. వస్తువులను రవాణా చేయలేకపోయిన ఫలితంగా చాలా ఇ-కామర్స్ కంపెనీ గిడ్డంగుల్లో నిల్వలు పేరుకు పోయాయి. అయితే తాజాగా ఇ-కామర్స్ మార్కెట్, స్నాప్డీల్ 6-10 రోజులలోపు అవసరమైనవాటిని పంపిణీ చేస్తామని వినియోగదారులకు హామీ ఇస్తోంది. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి, అత్యవసరాలను స్థానికంగా (నగరంలో మాత్రమే) పంపిణీ చేయడం ప్రారంభించినట్లు స్నాప్డీల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ వ్యవహారాలు కమ్యూనికేషన్స్) రజనీష్ వాహి చెప్పారు. ప్రారంభంలో మూసివేయాల్సి వచ్చిందని, కాని వేగంగా తిరిగి సేవల్లోకి ప్రవేశించామన్నారు. అయితే వివిధ నగరాల మధ్య పంపిణీ కాకుండా, ఇంట్రా-సిటీ మాత్రమే తమ సేవల అందిస్తున్నామని అందుకే వేగంగా బట్వాడా చేయగలుగుతున్నామని ఆయన చెప్పారు. గత 10 రోజులలో స్నాప్డీల్ స్థానిక ధాన్యం మార్కెట్లలోని డీలర్లతో, ఎఫ్ఎంసిజి హోల్సేల్ వ్యాపారులతో (వారిలో చాలా మందికి స్టాక్ ఉంది, కాని వాటిని మూసివేయవలసి వచ్చింది) ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. అలాగే ప్రస్తుత పరిస్థితులలో వైద్య పరికరాలు కూడా చాలా అవసరం కాబట్టి సంబంధిత డీలర్లతో కూడా ఒప్పందం చేసుకున్నామన్నారు. నిత్యావసరాల సేకరణపై మాత్రమే దృష్టి పెట్టామని తమ వ్యాపార బృందాన్ని కోరామని వాహి వివరించారు. కేవలం పది రోజుల్లో తమ సామర్థ్యాన్ని పెంచుకున్నామని, సాధారణ పరిస్థితులలో ఇందుకు ఐదు-ఆరు నెలలు పట్టేదని ఆయన చెప్పారు. అలాగే ఈ సంక్షోభ సమయం దేశవ్యాప్తంగా అనేక చిన్న అమ్మకందారులు, చిన్న చిన్న గిడ్డంగులున్న దుకాణాదారులు ప్రయోజనాలకు ఉపయోగపడిందని ఆయన చెప్పారు. మరో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ కరోనా వైరస్ ను అడ్డుకునే క్రమంలో అమలవుతున్న లాక్ డౌన్ ఇంటికే పరిమితమైన తమ వినియోగదారులకు ఇ-కామర్స్ సేవలు అందించే క్రమంలో మరో అడుగు ముందు కేశామని. అన్ని వనరులను సమీకిస్తూ అవసరమైన అత్యవసర సామాగ్రిని పంపిణీ చేయడానికి, డెలివరీ సామర్థ్యాన్ని పెంచుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని సీనియర్ ఫ్లిప్కార్ట్ ప్రతినిధి వెల్లడించడం గమనార్హం. చదవండి : కరోనా కాటు : 36 వేల మంది ఉద్యోగులు సస్పెన్షన్ -
వాచ్.. తూచ్..
సాక్షి, సిటీబ్యూరో: ఈ కామర్స్ యాప్ స్నాప్డీల్లో వాచీ కొన్నాడు...కొన్నాళ్ళకే లక్కీ డ్రాలో కారు గెల్చుకున్నారంటూ సందేశం రావడంతో పొంగిపోయాడు... సైబర్ నేరగాళ్ళ మాటల వల్లోపడి రూ.50 వేలు పోగొట్టుకున్నాడు... చివరకు మోసపోయానని గుర్తించి బుధవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బేగంబజార్ ప్రాంతానికి చెందిన ఓ కార్పెంటర్ ఇటీవల స్నాప్డీల్ నుంచి వాచీ ఖరీదు చేశారు. ఇది కొరియర్లో అతడికి చేరిన కొన్ని రోజుల తర్వాత స్నాప్డీల్ నుంచి అంటూ ఓ సంక్షిప్త సందేశం వచ్చింది. అందులో తమ సంస్థ నిర్వహించిన లక్కీడ్రాలో కారు గెల్చుకున్నారని, ఇతర వివరాలు తమ ప్రతినిధి అందిస్తారని ఉంది. ఇది జరిగిన మరుసటి రోజు స్నాప్డీల్ సంస్థ నుంచి అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. లక్కీడ్రాలో రూ.12.6 లక్షల విలువైన హైఎండ్ కారు గెల్చుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ కారును సొంతం చేసుకోవడానికి సదరు కార్పెంటర్ సంసిద్ధత వ్యక్తం చేయడంతో సైబర్ నేరగాళ్ళు అసలు కథ ప్రారంభించారు. కారును డెలివరీ పొందడానికి కొన్ని చార్జీలు, పన్నులు చెల్లించాలని ఎర వేశారు. అలా రకరాలైన పేర్లతో రూ.8,500 నుంచి ప్రారంభించి విడదల వారీగా రూ.50,700 తమ ఖాతాల్లోకి డిపాజిట్ చేయించుకున్నారు. సైబర్ నేరగాళ్ళు మరికొంత మొత్తం చెల్లించాలని అడుగుతుండటంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ జి.వెంకటరామిరెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. మూడు చోట్ల నుంచి లీక్కు అవకాశం ఈ తరహా మోసాల్లో ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్ళు టార్గెట్ చేయడానికి ఆయా ఈ–కామర్స్ సంస్థల డేటానే ఆధారం. ఈ కేసును తీసుకుంటే బేగంబజార్కు చెందిన బాధితుడు స్నాప్డీల్ నుంచి వాచీ ఖరీదు చేశాడనే విషయం ఆ సంస్థతో పాటు మరో రెండు సంస్థలకు తెలిసే అవకాశం ఉంది. ఈ తరహాకు చెందిన ఈ–కామర్స్ సైట్స్/యాప్స్ తమకు వచ్చిన ఆర్డర్స్ను థర్డ్ పార్టీ సంస్థలకు పంపిస్తాయి. ఆయా వస్తువుల్ని తయారు చేసే, సరఫరా చేసే సంస్థలే థర్డ్పార్టీలుగా ఉంటాయి. వీళ్ళు వినియోగదారుడు ఆర్డర్ చేసిన వస్తువుల్ని అతడి చిరునామాకు కొరియర్ ద్వారా పంపిస్తారు. కస్టమర్ చెల్లించిన సొమ్ముకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు స్నాప్డీల్కు ఈ థర్డ్ పార్టీ సంస్థకు మధ్య జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఫలానా సైట్/యాప్ నుంచి ఫలానా వస్తువు ఖరీదు చేశాడనే సమాచారం ఆ సంస్థతో పాటు, థర్డ్ పార్టీ సంస్థకు, కోరియర్ సంస్థకు తెలిసే ఆస్కారం ఉంది. ఈ మూడు చోట్ల పని చేసే ఉద్యోగుల్లో ఎవరైనా ఈ డేటా లీక్ చేస్తున్నారని అనుమానిస్తున్నాం. దీనికి సంబంధించి లోతైన దర్యాప్తు చేయాల్సి ఉంది. లక్కీ డ్రాల పేరుతో వచ్చే సందేశాలు, ఫోన్కాల్స్ను నమ్మవద్దు.– జి.వెంకట రామిరెడ్డి, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ -
నకిలీ సెగ : బుక్కైన స్నాప్డీల్ ఫౌండర్స్
కోటా : ఆన్లైన్ షాపింగ్ సైట్ స్నాప్డీల్ చిక్కుల్లో పడింది. నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తోందన్నఆరోపణల నేపథ్యంలో కంపెనీ ఫౌండర్స్ అడ్డంగా బుక్కయ్యారు. రాజస్థాన్కు చెందిన వ్యాపారవేత్త ఇందర్మోహన్ సింగ్ హనీ ఫిర్యాదు మేరకు స్నాప్డీల్ సీఈవో కునాల్ బాల్, సీవోవో రోహిత్ బన్సల్ చీటింగ్ కేసు నమోదైంది. వ్యాపారవేత్త ఇంద్రమోహన్ సింగ్ హనీ జూలై 17న ఉడ్ ల్యాండ్ బెల్ట్, వాలెట్ లను స్నాప్డీల్లో ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేశాడు. ఈ బ్రాండెడ్ వస్తువులకు బదులుగా, నకిలీ వస్తువులు చేరడంతో, వాటిని ఉడ్ల్యాండ్ షోరూంకి వెళ్లి ఎంక్వయిరీ చేశాడు. అవి నకిలీవని ఉడ్ల్యాండ్ సిబ్బంది కూడా ధృవీకరించారు. దీంతో స్థానిక గుమన్పురా స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇంతకుముందు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని ఆయన ఆరోపిస్తున్నారు. చేతి గడియారాన్ని ఆర్డర్ చేశా...డెలివరీ చేశామని కంపెనీ నుంచి మెసేజ్ వచ్చింది కానీ వాచ్ ఇంటికి చేరలేదని తెలిపారు. అయితే కంపెనీకి ఫిర్యాదు చేయడంతో తన డబ్బులను రిఫండ్ చేసిందంటూ గుర్తు చేసుకున్నారు. మరోవైపు ఇంద్రమోహన్ ఫిర్యాదు ఆదారంగా సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారి మనోజ్ సింగ్ సికార్వాల్ తెలిపారు. చదవండి : స్నాప్డీల్లో ఆ విక్రయాలపై నిషేధం -
స్నాప్డీల్లో ఆ విక్రయాలపై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ స్నాప్డీల్కు జపాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం భారీ షాక్ ఇచ్చింది. తన బ్రాండ్ పేరుతో నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తోందని ఆరోపిస్తూ స్నాప్డీల్పై కేసు నమోదు చేసింది. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు కాసియో ఈ మేరకు ఢిల్లీలోని తీస్ హజారీ జిల్లా కోర్టులో కేసు వేసింది. దీంతో ఆ వస్తువుల ప్రకటనలు, ప్రదర్శన, అమ్మకాలను నిలిపివేయాలంటూ మధ్యంతర ఎక్స్-పార్ట్ నిషేధ ఉత్తర్వులను కోర్టు జారీ చేసింది. కాసియో బ్రాండ్ వాచెస్, కాలిక్యులేటర్ల నకిలీ అమ్మకాలకు సంబంధించి వినియోగదారుల ఫిర్యాదులు వెల్లువెత్తడంతో స్నాప్డీల్ చట్టపరమైన చర్యలను ప్రారంభించినట్లు కంపెనీ లీగల్ డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్ సతోషి యమజాకి వెల్లడించారు. అయితే కోర్టు ఆదేశాలను సమీక్షించి, మార్పులు చేయాల్సిందిగా కోరతామని స్నాప్డీల్ తెలిపింది. ప్లాట్ఫాంలు, విక్రేతల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం ముఖ్యమని వ్యాఖ్యానించింది. కొద్దిమంది చర్యల వల్ల నిజమైన అమ్మకందారులపై ప్రతికూల ప్రభావితం చూపుతోందని స్నాప్డీల్ ప్రతినిధి చెప్పారు. ఈ క్రమంలో నిజమైన ఉత్పత్తులను మాత్రమే విక్రయించేలా సెల్లర్స్ జాగ్రత్త వహించాలన్నారు. లేనిపక్షంలో ఆయా సంస్థలు తమ మార్కెట్ను కోల్పోవడంతోపాటు, కాంట్రాక్టు నిబంధనల ప్రకారం భవిష్యత్తులో ప్లాట్ఫామ్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తామని హెచ్చరించారు. అలాగే బ్రాండ్లు తమ మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘనను నివేదించడానికి వీలుగా, ఆన్లైన్లో నకిలీ ఉత్పత్తుల నిరోధక కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్టు కంపెనీ తెలిపింది. -
స్నాప్డీల్ సమ్మర్ మెగా డీల్స్
స్నాప్డీల్ మెగా డీల్స్ పేరుతో డిస్కౌంట్ ఆఫర్లను ప్రకించింది.. మే 17నుంచి 19వ తేదీవరకు పరిమితి కాలానికి డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ కేటగిరీల ప్రొడక్ట్స్పై దాదాపు 80శాతం తగ్గింపును అందిస్తోంది. ఆర్బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల కొనుగోళ్లపై అదనంగా 15శాతం డిస్కౌంట్. డీల్350 కూపన్ల ద్వారా రూ.350 దాకా ఆదా చేసుకునే అవకాశం. సరసమైన ధరల్లో అందుబాటుల్లో ఉన్న ఫీచర్ ఫోన్లను మరింత తక్కువ ధరకే కొనుగోలు దారులకు అందుబాటులో ఉంచింది. నోకియా 8110 బనానా ఫోన్, ఐవూమి ఐ2 లైట్, కూల్ప్యాడ్ మెగా 5 సిరీస్లపై డిస్కౌంట్ అందిస్తోంది. వీటితో పాటు కోల్డ్ కాఫీ మేకర్స్, షర్బత్ మేకర్స్, ట్రావెల్ బాగ్స్, ఎయిర్ కూలర్లు, కూలర్ ప్యాడ్లపై స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఇంకా వివిధ సాంప్రదాయ వస్తువులు, డోలక్, తాళాలు లాంటి సంగీత సాధనాలు కూడా ఈ తగ్గింపు ధరల్లో లభిస్తాయి. మరిన్నివివరాలు స్నాప్డీల్ వెబ్సైట్ లో లభ్యం. -
ఎన్నికల జాతరలో అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రచారం కోసం అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటున్నాయి. సంప్రదాయ జెండాలు, ప్లెక్సీలతో పాటు బెలూన్లు, బటన్లు, టీషర్టులు, కప్పులు, కీ–చైన్లపై తమ గుర్తులను ప్రచారం చేస్తూ ప్రజల్లోకి దూసుకుపోతున్నాయి. వీటిపై ఆయా పార్టీల మద్దతుదారులు, యువత ఆసక్తి చూపుతుండటంతో ఆఫ్లైన్తో పాటు అమెజాన్, స్నాప్డీల్ వంటి ఆన్లైన్ సంస్థల్లోనూ జోరుగా అమ్మకాలు సాగుతున్నాయి. మై భీ హూ చౌకీదార్(నేనూ కాపలాదారునే) అనే బీజేపీ నినాదమున్న టీ–షర్టులు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. మోదీ, ప్రియాంకా గాంధీ చీరలకు డిమాండ్ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రత్యేక టోపీలను తీసుకొచ్చింది. వీటికే భారీ డిమాండ్.. కాంగ్రెస్, బీజేపీ సహా వేర్వేరు రాజకీయ పార్టీల గుర్తులు, నినాదాలతో వస్తున్న టీ–షర్టులు, కప్పులు, కీచైన్లకు ఆన్లైన్లో మంచి గిరాకీ ఉందని ఆన్లైన్ రిటైల్ సంస్థ స్నాప్డీల్ అధికార ప్రతినిధి తెలిపారు. ‘అభ్యర్థులు, పార్టీల చిత్రాలు ఉన్న కాఫీ మగ్గులు, పవర్ బ్యాంకులు, యూఎస్బీ డ్రైవ్స్, టీ షర్టులు, చీరలను కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్లలో కారు, బైక్ స్టిక్కర్లు, టీషర్టులు, టోపీలు, నీటి బాటిళ్లు, కీచైన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి’ అని అన్నారు. మోదీ, రాహుల్, ప్రియాంక వంటి కీలక నేతల ముఖచిత్రాలతో ఉన్న ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని పేరొన్నారు. సదర్ బజార్లో దీటుగా అమ్మకాలు.. ఆన్లైన్ అమ్మకాలకు పోటీగా ఢిల్లీలోని సదర్ బజార్లో ఎన్నికల ఉత్పత్తుల అమ్మకాలు సాగుతున్నాయి. ఇక్కడి షాపుల్లో కాంగ్రెస్, బీజేపీ, ఆప్, సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)లకు చెందిన జెండాలు, బ్యాండ్లు, పార్టీ ముఖ్యనేతల చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. విక్రమ్ ఎంటర్ప్రైజెస్ సంస్థ యజమాని హర్ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. ప్రచార సామగ్రి అమ్మకాల్లో బీజేపీ అన్నిపార్టీల కంటే ముందంజలో ఉందని అభిప్రాయపడ్డారు. ప్రముఖ ఆన్లైన్ రిటైల్ సంస్థ అమెజాన్ వెబ్సైట్లో మోదీ చీరలు రూ.700 నుంచి రూ.3,549 మధ్యలో దర్శనమిస్తున్నాయి. మరోవైపు బీజేపీ ప్రచార సామగ్రిని అమ్మేందుకు ‘నమో రథాల’ను సిద్ధం చేశామనీ, ఈసీ నుంచి అనుమతి లభించిన వెంటనే వీటిని రంగంలోకి దించుతామని బీజేపీ నేత మనోజ్ తెలిపారు. -
ఈ కామర్స్ సంస్థలకు గడువు పొడిగింపు లేదు
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) విషయంలో ఈ కామర్స్ సంస్థలకు సవరించిన నిబంధనల అమలుకు ఫిబ్రవరి 1గా ఇచ్చిన గడువును పొడిగించేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గడువును కనీసం మూడు నెలల వరకైనా పొడిగించాలని ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు ఇప్పటికే కేంద్రాన్ని కోరాయి. ‘‘ఈ కామర్స్ రంగానికి సంబంధించి ఎఫ్డీఐల పాలసీ నిబంధనల అమలుకు ఇచ్చిన గడువు పొడిగించాలంటూ అభ్యర్థనలు వచ్చాయి. వీటిని పరిశీలించిన తర్వాత గడువును పొగించకూడదని నిర్ణయించాం’’ అని పారిశ్రామిక ప్రోత్సాహక మండలి (డీపీఐటీ) పేర్కొంది. కొత్త నిబంధనల కార్యాచరణను పూర్తిగా అర్థం చేసుకునేందుకు గాను గడువు పొడిగించాలని ఫ్లిప్కార్ట్, అమెజాన్ కేంద్రాన్ని కోరాయి. జూన్ 1వరకు పొడిగింపు ఇవ్వాలని అమెజాన్ కోరగా, ఆరు నెలల సమయాన్ని ఫ్లిప్కార్ట్ కోరింది. ఇందుకోసం తమ వంతు ప్రయత్నాలు చేశాయి. నూతన నిబంధనలకు అనుగుణంగా తమ వ్యాపార నమూనాను మార్చుకోవాల్సి ఉంటుందని అధికారులకు వివరించాయి. భారత్లో బిలియన్ డాలర్ల పెట్టుబడులకు తాము నిర్ణయించుకున్నామని, ఈ పెట్టుబడులకు రిస్క్ ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. కానీ, దేశీయ వర్తకుల సమాఖ్య సీఏఐటీ మాత్రం గడువు పొడిగించొద్దని డిమాండ్ చేసింది. అమెరికా కంపెనీల ఒత్తిడికి తలగొద్దని దేశీయ ఈ కామర్స్ సంస్థలు స్నాప్డీల్, షాప్క్లూస్ సైతం కోరాయి. కాగా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ తరహా ఈ రిటైలింగ్ సంస్థలు తమ ప్లాట్ఫామ్లపై తమకు వాటాలున్న కంపెనీల ఉత్పాదనలను 25 శాతానికి మించి విక్రయించకుండా నిషేధిస్తూ గత డిసెంబర్ 26న కేంద్రం నూతన నిబంధనలను ప్రకటించింది. కొన్ని కంపెనీల ఉత్పత్తులను ఎక్స్క్లూజివ్గా తమ ప్లాట్ఫామ్పైనే విక్రయించే ఒప్పందాలను సైతం నిషేధించింది. మరోవైపు ప్రభుత్వం గడువు పొడిగించకపోతే నిబంధనల అమలుకు గాను ప్లాన్–బిని ఫ్లిప్కార్ట్, అమెజాన్ సిద్ధం చేసుకున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వంతో కలసి పనిచేస్తాం: అమెజాన్ నూతన నిబంధనల విషయంలో మరింత స్పష్టత కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని, తమ కస్టమర్లు, విక్రయదారులపై ప్రభావాన్ని పరిమితం చేసేందుకు కృషి చేస్తామని అమెజాన్ ప్రకటించింది. ‘‘అన్ని చట్టాలు, నిబంధనలను పాటించేందుకు కట్టుబడి ఉంటాం. ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకుని మా భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకుంటాం. ఈ ప్రభావాన్ని పరిమితం చేసేందుకు చర్యలు తీసుకుంటాం’’ అని అమెజాన్ ప్రతినిధి పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి స్వాగతం: స్నాప్డీల్ చిన్న ఈ కామర్స్ సంస్థలు స్నాప్డీల్, షాప్క్లూస్ మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. దేశంలో సచ్ఛీలమైన, బలమైన ఈ కామర్స్ రంగానికి ప్రభుత్వ నిర్ణయం దారితీస్తుందని స్నాప్డీల్ పేర్కొంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు ఇది విజయం వంటిదని షాప్క్లూస్ సీఈవో విజయ్సేతి అభివర్ణించారు. -
ఆరోపణలపై స్పందించిన స్నాప్డీల్
ఆన్లైన్ రిటైల్ పోర్టల్ స్నాప్డీల్పై వచ్చిన ఆరోపణలపై సంస్థ స్పందించింది. చట్టం, నిబంధనల ప్రకారం విక్రయాదారులు వ్యవహరించాల్సి ఉందని పేర్కొంది. కన్సూమర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి సెంటర్ (సీఈఆర్సీ) అంశాలను పరిగణనలోకి తీసుకొని విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. నకిలి ఉత్పత్తుల బెడద ప్రపంచవ్యాప్తంగా ఉందని అందుకే బ్రాండ్ షీల్డ్ ద్వారా వీటి నిరోధానికి తాము ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. థర్డ్ పార్టీ బ్రాండ్ల విషయంలో పూర్తి పరిశీలన అనంతరం ఆయా బ్రాండ్లు నకిలీవని తేలితే వెంటనే కేవలం ఒక రోజులోనే వాటిని తొలగిస్తున్నామని తెలిపింది. మార్కెట్ ప్లేస్ ఆధారిత అమ్మకాల్లో ఆయా ఉత్పత్తిదారులు, విక్రయదారులు వీటికి బాధ్యత వహిస్తారని తెలిపింది. ఈ మేరకు స్నాప్డీల్ ప్రతినిధి మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. 2018 జనవరినుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం ప్యాకేజీలపై ధర, ఉత్పత్తిదారుడు పేరు, తేదీ, ఎక్స్పైరీ తేదీ వివరాలను అందించాల్సిన బాధ్యత సెల్లర్స్కు ఉందని పేర్కొన్నారు. కాగా భారీ డిస్కౌంట్లు ఇచ్చేందుకు పలు వస్తువుల ఎంఆర్పీలను స్నాప్డీల్ పెంచేస్తూ, అక్రమాలకు పాల్పడుతూ వినియోగదారులకు టోకరా ఇస్తోందని తాజా అథ్యయనం వెల్లడించింది. అధిక ధరలతో, అరకొర లేబిలింగ్తో ఉన్న ఉత్పత్తులన్నింటినీ స్నాప్డీల్ ఉపసంహరించేలా చర్యలు చేపట్టాలంటూ అహ్మదాబాద్కు చెందిన కన్సూమర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి సెంటర్ (సీఈఆర్సీ)డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)ని ఆశ్రయించింది. స్నాప్డీల్లో ఉత్పత్తుల వారీగా ఎంత ధరలకు విక్రయిస్తున్నారనే దానిపై సమగ్ర దర్యాప్తు అవసరమని సీఈఆర్సీ సీజీఎం ప్రీతి షా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. -
కస్టమర్లకు స్నాప్డీల్ టోకరా
సాక్షి, న్యూఢిల్లీ : ఆన్లైన్ రిటైల్ పోర్టల్ స్నాప్డీల్ వినియోగదారులకు టోకరా ఇస్తోందని తాజా అథ్యయనం వెల్లడించింది. భారీ డిస్కౌంట్లు ఇచ్చేందుకు పలు వస్తువుల ఎంఆర్పీలను స్నాప్డీల్ పెంచేస్తోందని, కాస్మెటిక్ ఉత్పత్తులపై గడువు తేదీని చూపడం లేదని అహ్మదాబాద్కు చెందిన కన్సూమర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి సెంటర్ (సీఈఆర్సీ) పేర్కొంది. అధిక ధరలతో, అరకొర లేబిలింగ్తో ఉన్న ఉత్పత్తులన్నింటినీ స్నాప్డీల్ ఉపసంహరించేలాచర్యలు చేపట్టాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)ని సీఈఆర్సీ కోరింది. ఇప్పటికే విక్రయించిన హానికారక ఉత్పత్తులను వెనక్కి తీసుకుని వినియోగదారులకు పరిహారం చెల్లించాలని సీఈఆర్సీ పిలుపు ఇచ్చింది. వెండార్లు, ఉత్పత్తుల ఎంపికలో కంపెనీ పారదర్శక విధానం పాటించాలని, పాలసీ ఉల్లంఘనలకు పాల్పడిన వెండార్లపై కఠిన చర్యలు చేపట్టాలని సూచించింది. స్నాప్డీల్లో ఉత్పత్తుల వారీగా ఎంత ధరలకు విక్రయిస్తున్నారనే దానిపై సమగ్ర దర్యాప్తు అవసరమని సీఈఆర్సీ సీజీఎం ప్రీతి షా డిమాండ్ చేశారు. -
ఔషధాలను విక్రయిస్తున్నందుకు స్నాప్డీల్పై విచారణ
బెంగళూరు: ఆన్లైన్లో నియంత్రిత ఔషధాలను చట్ట విరుద్ధంగా విక్రయిస్తున్నందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ స్నాప్డీల్కు వ్యతిరేకంగా చట్టపరమైన విచారణ చర్యలు చేపట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.‘‘షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్ ‘సుహాగ్రా 100’ ప్రదర్శన, విక్రయం, పంపిణీ చేస్తున్నందుకు గాను స్నాప్డీల్, ఆ సంస్థ సీఈవో కౌర్బాహల్, సీవోవో రోహిత్కుమార్ బన్సాల్కు వ్యతిరేకంగా విచారణ చర్యలు తీసుకునేందుకు బెళగావికి చెందిన అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ను అనుమతిస్తూ డిసెంబర్ 21న ఆదేశాఉలు ఇవ్వడం జరిగింది. ఈ ఔషధాన్ని ఓవర్ ద కౌంటర్ విక్రయించకూడదు. ఇది ఔషధ, సౌందర్య ఉత్పత్తుల నిబంధనలకు వ్యతిరేకం’’అని కర్ణాటక డ్రగ్ కంట్రోలర్ అమరేష్ తుంబగి బుధవారం మీడియాకు తెలిపారు. లుథినాయాకు చెందిన హెర్బల్ హెల్త్కేర్ కంపెనీ యజమాని, ఉద్యోగులకు వ్యతిరేకంగా కూడా విచారణ చర్యలు చేపట్టినట్టు చెప్పారు. లైంగిక ఉద్దీపనానికి వినియోగించే సుహాగ్ర ఔషధాన్ని వైద్యుల సిఫారసు లెటర్ లేకుండా విక్రయించకూడదని స్పష్టం చేశారు. చట్టానికి సహకరిస్తాం: స్నాప్డీల్ ఈ విషయానికి సంబంధించి తమకు ఎటువంటి సమచారం లేదని, విచారణ అధికారులకు సహకారం అందిస్తామని స్నాప్డీల్ ప్రకటన జారీ చేసింది. ‘‘స్నాప్డీల్ అనేది మధ్యవర్తి. విక్రేతలను, కొనుగోలుదారులతో అనుసంధానిస్తుంది. షెడ్యూల్డ్ హెచ్ విభాగంలోని ఔషధాలను విక్రయించకుండా నిషేధం ఉంది. నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలితే కఠినంగా వ్యవహరిస్తాం. అటువంటి విక్రేతలు ఇకపై అమ్మకాలు జరపకుండా నిషేధం విధిస్తాం’’ అని స్నాప్డీల్ అధికార ప్రతినిధి ప్రకటనలో వివరించారు. ఈ విషయంలో చట్టాన్ని అమలు చేసేందుకు తమ వైపు నుంచి సహాయ, సహకారాలు అందిస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. -
చిన్న సంస్థలూ పోటీ పడగలగుతాయి
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులున్న ఈ–కామర్స్ కంపెనీల నిబంధనలను కేంద్రం కఠినతరం చేయడం.. చిన్న సంస్థలకు ప్రయోజనకరంగా ఉండగలదని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇప్పటిదాకా నిబంధనలను బాహాటంగా ఉల్లంఘిస్తున్న పెద్ద కంపెనీలకు అడ్డదారులన్నీ మూసుకుపోతాయని షాప్క్లూస్, స్నాప్డీల్ వంటి సంస్థలు వ్యాఖ్యానించాయి. ‘బడా విదేశీ కంపెనీలు ముందు నుంచీ ఈ పాలసీ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయన్న సంగతిని ప్రభుత్వం గుర్తించిందనేది తాజా నిబంధనల ద్వారా వెల్లడైంది‘ అని షాప్క్లూస్ సీఈవో సంజయ్ సేథి చెప్పారు. విక్రేతలందరూ ఈ–కామర్స్ ప్రయోజనాలు పొందేందుకు తాజా మార్పులు దోహదపడగలవని స్నాప్డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బెహల్ పేర్కొన్నారు. ‘పెద్ద సంస్థలతో సమానంగా చిన్న సంస్థలు కూడా అవకాశాలు అందిపుచ్చుకునేందుకు తాజా నిబంధనలు ఉపయోగపడతాయి. లఘు వ్యాపార సంస్థలు కూడా ఈ–కామర్స్ ప్రయోజనాలు అందుకోవచ్చు‘ అని ఇన్స్టామోజో సీఈవో సంపద్ స్వైన్ తెలిపారు. ఇకపై ఈ–కామర్స్ సంస్థలు భారత్లో తమ వ్యాపార వ్యూహాలను సవరించుకోవాల్సి వస్తుందని ఈవై ఇండియా నేషనల్ లీడర్ (పాలసీ అడ్వైజరీ అండ్ స్పెషాలిటీ సర్వీసెస్) రాజీవ్ చుగ్ అభిప్రాయపడ్డారు. చర్చించి ఉండాల్సింది: ఫ్లిప్కార్ట్ మరోవైపు, పరిశ్రమ వృద్ధిపై దీర్ఘకాలిక ప్రభావాలు చూపే నిబంధనలను రూపొందించేటప్పుడు.. ప్రభుత్వం సంబంధిత వర్గాలతో సమాలోచనలు జరపడం ముఖ్యమని ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ–కామర్స్ వ్యవస్థతో చిన్న సంస్థలకు తోడ్పాటు లభిస్తుండటంతో పాటు వేల కొద్దీ ఉద్యోగాల కల్పన జరుగుతోందని తెలిపింది. ఇది ఆరంభం మాత్రమేనని, దేశ ఎకానమీకి ఈ పరిశ్రమ వృద్ధి చోదకంగా మారగలదని పేర్కొంది. ఇక, నిబంధనల సర్క్యులర్ను అధ్యయనం చేస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. నిబంధనలు కచ్చితంగా అమలవ్వాలి.. ఈ–కామర్స్ సైట్లలో అమ్మకాలకు సంబంధించిన కొత్త నిబంధనలన్నీ కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ ప్రభుత్వాన్ని కోరింది. ‘మేం లేవనెత్తిన ప్రధాన అంశాలన్నింటినీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై క్యాష్బ్యాక్ అమ్మకాలు, డిస్కౌంట్లు, ఎక్స్క్లూజివ్ విక్రయాల్లాంటివి ఉండబోవు. ప్రభుత్వ నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. అలాగే వీటిని కఠినంగా అమలు కూడా చేస్తుందని ఆశిస్తున్నాం‘ అని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు. దిగ్గజాలకు సమస్యలు.. కొత్త నిబంధనలతో అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థలపైనే ఎక్కువగా ప్రతికూల ప్రభావాలు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వీటి స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం ప్రకటించిన నిబంధనల ప్రకారం.. తమకు వాటాలు ఉన్న ఇతర సంస్థల ఉత్పత్తులను ఈ–కామర్స్ సంస్థలు తమ ప్లాట్ఫాంపై విక్రయించడానికి లేదు. అలాగే, ఎక్స్క్లూజివ్ అమ్మకాల కోసం ఏ సంస్థతోనూ ఒప్పందాలు కుదుర్చుకోరాదు. పోటీని దెబ్బతీసేలా భారీ డిస్కౌంట్లు ప్రకటించడానికి లేదు. దాదాపు 16 బిలియన్ డాలర్లు వెచ్చించి ఇటీవలే ఫ్లిప్కార్ట్లో 77% వాటాలు కొన్న అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ లాంటి వాటికి ఈ నిబంధనలు సమస్యాత్మకమే. అవి సొంత ప్రైవేట్ బ్రాండ్స్ను విక్రయించుకోవడానికి ఉండదు. అలాగే, ఎక్స్క్లూజివ్ ఒప్పందాలపై ఆంక్షల ప్రభావం అసూస్, వన్ప్లస్, బీపీఎల్ వంటి బ్రాండ్స్పై పడనుంది. -
నకిలీ ఉత్పత్తులకు స్నాప్డీల్ చెక్..
న్యూఢిల్లీ: నకిలీ ఉత్పత్తుల విషయంలో ప్రముఖ బ్రాండ్స్ అప్రమత్తంగా వ్యవహరించేలా తోడ్పడేందుకు ఈ–కామర్స్ సంస్థ స్నాప్డీల్ తాజాగా ‘బ్రాండ్ షీల్డ్’ పేరిట ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. వివిధ బ్రాండ్స్ నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా దీన్ని తీర్చిదిద్దినట్లు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. స్నాప్డీల్లో అమ్ముడయ్యే నకిలీ ఉత్పత్తులపై ఆయా బ్రాండ్స్ ఫిర్యాదు చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని వెల్లడించింది. ట్రేడ్మార్క్, కాపీరైట్, పేటెంట్, డిజైన్పరంగా జరిగే మేథోహక్కుల ఉల్లంఘనలను బ్రాండ్ షీల్డ్ విధానం కింద సదరు సంస్థలు ఫిర్యాదు చేయొచ్చని స్నాప్డీల్ తెలిపింది. -
అమెజాన్ డెలివరీలు ఆలస్యం
న్యూఢిల్లీ : రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన లారీలు దేశవ్యాప్తంగా బంద్ చేపడుతున్నాయి. జూలై 20 నుంచి ప్రారంభమైన ఈ బంద్ ఇంకా కొనసాగుతూనే ఉంది. డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని.. దేశవ్యాప్తంగా ఒకే ధరను నిర్ణయించి, ప్రతి 3 నెలలకోసారి ధరలను సవరించాలన్న డిమాండ్ల సాధన కోసం లారీ యజమానులు ఈ బంద్ చేపడుతున్నాయి. ఈ బంద్తో దేశీయ ఈ-కామర్స్ కంపెనీలు అమెజాన్, స్నాప్డీల్కు భారీగా దెబ్బకొడుతోంది. కొన్ని నగరాల్లో సరుకుల డెలివరీ చేయడం కష్టతరంగా మారింది. దీంతో అమెజాన్, స్నాప్డీల్ డెలివరీలు కస్టమర్లకు ఆలస్యంగా చేరుకుంటున్నాయి. లారీలు బంద్ చేపట్టినప్పటి రోజే అమెజాన్, ఫ్లిప్కార్ట్లు రెండూ తమ తమ వార్షిక విక్రయాలను ముగించాయి. ఈ విక్రయాల్లో ఆర్డర్లు ఇచ్చిన వారికి డెలివరీ ఆలస్యమవుతుందని అమెజాన్ అధికార ప్రతినిధి చెప్పారు. ఎలాగైనా కస్టమర్లకు ఉత్పత్తులు చేరుకునేలా పనిచేస్తున్నామని తెలిపారు. దేశీయ అతిపెద్ద రవాణా వ్యవస్థ స్తంభించడంతో, ఉత్తర, పశ్చిమ భారత్లో డెలివరీలపై ప్రభావం చూపుతుందని స్నాప్డీల్ కూడా తెలిపింది. ఈ విషయాలపై ఇప్పటికే కొనుగోలుదారులకు, విక్రయదారులకు సమాచారం అందించామని చెప్పింది. దేశీయ కమోడిటీ ట్రేడ్ కూడా దెబ్బతిన్నది. పత్తి సరుకు రవాణా ఆగిపోయింది. ముడి పదార్థం లేనందున పత్తి గైనింగ్ కర్మాగారాలు మూసివేత అంచున ఉన్నాయని భారతదేశ కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు అతుల్ గణట్రా చెప్పారు. పత్తి రవాణా ఆగిపోవడంతో, ఎగుమతిదారులు తమ తమ బాధ్యతలను నెరవేర్చలేకపోతున్నారని, దీంతో షిప్మెంట్లను రద్దు చేస్తున్నారని పేర్కొన్నారు. చైనా, బంగ్లాదేశ్, వియత్నాం, పాకిస్తాన్లు దేశీయ పత్తి కొనుగోలు చేయడంలో ప్రధానదారులు. ఉల్లిగడ్డలు, బంగాళదుంపలు వంటి కూరగాయలను పెద్ద పెద్ద నగరాలకు సరఫరా చేయడం కూడా పడిపోయింది. కొన్ని చోట్ల బంగాళదుంపలు ఖరీదైనవిగా మారాయి. ఈ వారంలోనే బంగాళదుంపల ధరలు 29 శాతం మేర పైకి ఎగిశాయి. -
ఇన్ఫీబీమ్ చేతికి స్నాప్డీల్ ’యూనికామర్స్’
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థ స్నాప్డీల్ అనుబంధ కంపెనీ యూనికామర్స్ను కొనుగోలు చేయనున్నట్లు ఇన్ఫీ బీమ్ వెల్లడించింది. ఈ–కామర్స్ సాఫ్ట్వేర్ సేవలందించే యూని కామర్స్ కొనుగోలుకు రూ. 120 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది. స్నాప్డీల్ మాతృసంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్కు ఆప్షనల్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్ను జారీ చేయటం ద్వారా ఈ డీల్ను పూర్తి చేస్తామని, నగదు చెల్లింపులు ఉండబోవని వివరించింది. మూడు నుంచి అయిదు నెలల్లోగా డీల్ పూర్తి కాగలదని అంచనా. సమగ్రమైన ఈ–కామర్స్ సర్వీసులు అందించేందుకు ఈ కొనుగోలు ఉపయోగపడగలదని ఇన్ఫీ బీమ్ ఎండీ విశాల్ మెహతా ధీమా వ్యక్తంచేశారు. యూనికామర్స్ డీల్కు ఆమోదముద్ర వేసిన ఇన్ఫీబీమ్ కార్పొరేషన్ బోర్డు.. తమ సంస్థ పేరును కూడా ఇన్ఫీబీమ్ అవెన్యూస్గా మార్చే ప్రతిపాదనను ఓకే చేసింది. 2012లో ఏర్పాటైన యూనికామర్స్ సంస్థకు 10,000 పైగా విక్రేతలు క్లయింట్స్గా ఉన్నారు. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ టర్నోవరు రూ.20 కోట్లుగాను, నికర విలువ రూ.25 కోట్లుగాను ఉంది. ఇతరత్రా వ్యాపార విభాగాలను విక్రయించి, ప్రధాన వ్యాపారంపై మరింతగా దృష్టి పెట్టేందుకు ఉద్దేశించిన వ్యూహంలో భాగంగానే యూనికామర్స్ను విక్రయిస్తున్నట్లు స్నాప్డీల్ చీఫ్ స్ట్రాటెజీ, ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ జేసన్ కొఠారి తెలిపారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ల నుంచి తీవ్రమైన పోటీతో కుదేలయిన స్నాప్డీల్.. మళ్లీ పుంజుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే పేమెంట్ సేవల విభాగం ఫ్రీచార్జ్ను యాక్సిస్ బ్యాంక్కి రూ. 385 కోట్లకు, లాజిస్టిక్స్ విభాగం వల్కన్ ఎక్స్ప్రెస్ను ఫ్యూచర్ సప్లై చెయిన్ సొల్యూషన్స్కి రూ.35 కోట్లకు అమ్మేసింది. -
ఆ ఆయుధాల విక్రయం నిలిపేశాం
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో అక్రమంగా ఆయుధాలు విక్రయిస్తున్న ఆరోపణలపై హైదరాబాద్లో కేసులు నమోదు కావడంతో స్నాప్డీల్ సంస్థ దిగివచ్చింది. తమ వెబ్సైట్లో ఉన్న ఆయా ఆయుధాల మెనూను తొలగించామని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూస్తామని నగర పోలీసులకు వివరణ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం నగర పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావును కలసి స్నాప్డీల్ లీగల్ టీమ్ సంజాయిషీ ఇచ్చుకుంది. స్నాప్డీల్ చేస్తున్న ఆయుధ వ్యాపారాన్ని నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు గత వారం గుట్టురట్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయుధ చట్టం ప్రకారం 9 అంగుళాల కంటే ఎక్కువ పొడవు, రెండు అంగుళాల కంటే ఎక్కువ వెడల్పుతో కూడిన ఆయుధాలు సరైన అనుమతులు లేకుండా కలిగి ఉండటం, విక్రయించడం, ఖరీదు చేయడం నేరం. ఖరీదు చేసినందుకు సిటీకి చెందిన పలువురు యువకులను అరెస్టు చేసిన పోలీసులు విక్రయించిన ఆరోపణలపై స్నాప్డీల్కు నోటీసులు జారీ చేశారు. పునరావృతం కాకుండా చూస్తాం.. దీంతో హైదరాబాద్ పోలీసు కమిషనర్ను కలసి ఆ సంస్థ లీగల్ టీమ్ సంజాయిషీ ఇచ్చుకుంది. తాము నేరుగా ఎలాంటి ఉత్పత్తుల విక్రయాలు చేయమని, అటు విక్రేతలు.. ఇటు కొనుగోలుదారులకు మధ్య అనుసంధానకర్తగా మాత్రమే పని చేస్తామని వివరణ ఇచ్చింది. ఈ ఆయుధాలను గుజరాత్కు చెందిన సంస్థ తమ సైట్ ద్వారా విక్రయిస్తోందని పేర్కొంది. అయితే క్రయవిక్రయాలకు ప్లాట్ఫామ్గా వ్యవహరించిన నేపథ్యంలో స్నాప్డీల్కు విక్రేత కొంత మేరకు కమీషన్ చెల్లిస్తాడు. ఈ నేపథ్యంలో చట్ట ప్రకారం బాధ్యులవుతారని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో తమ వెబ్సైట్ నుంచి పరిమితికి మించిన పొడవు, వెడల్పులతో ఉన్న ఆయుధాల మెనూను తొలగించామని, విక్రయాలు ఆపేశామని స్పష్టం చేశారు. దీంతో గుజరాత్ సంస్థకూ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించిన పోలీసులు.. స్నాప్డీల్పై చర్యలకు సంబంధించి న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించారు. ఇతర వెబ్సైట్లలోనూ... స్నాప్డీల్లోనే కాదు.. ఏ ఈ–కామర్స్ సైట్లలో చూసినా కత్తులు విక్రయానికి సిద్ధంగా ఉంటున్నాయని పోలీసులు గుర్తించారు. రూ.వెయ్యి నుంచి రూ.8 వేల వరకు వివిధ ఆకృతులు, సైజుల్లో వీటిని విక్రయించేస్తున్నారని ఆధారాలు సేకరించారు. వీటిని పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో ఆయా వెబ్సైట్లకూ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. ఆన్లైన్లో కత్తులు అందుబాటులోకి రావడంతో అనేక మంది అవసరం ఉన్నా లేకున్నా, చట్ట విరుద్ధమని తెలిసో తెలియకో వీటిని ఖరీదు చేసి తమ వద్ద ఉంచుకుంటున్నారు. -
ఫ్యూచర్ చేతికి ‘వల్కన్ ఎక్స్ప్రెస్’!
న్యూఢిల్లీ: కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ సప్లై చెయిన్ సొల్యూషన్స్ కంపెనీ ప్రముఖ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్డీల్కు చెందిన లాజిస్టిక్స్ విభాగం వల్కన్ ఎక్స్ప్రెస్ను కొనుగోలు చేసింది. పూర్తిగా నగదు చెల్లించి వల్కన్ ఎక్స్ప్రెస్ను కొనుగోలు చేశామని, ఈ డీల్ విలువ రూ.35 కోట్లని ఫ్యూచర్ గ్రూప్ చైర్మన్ కిశోర్ బియానీ తెలిపారు. వల్కన్ చేరికతో ఈ కామర్స్, రిటైల్ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలందించగలమని చెప్పారాయన. కాగా పూర్తిగా ఈ–కామర్స్ వ్యాపారంపైననే దృష్టి సారించే వ్యూహంలో భాగంగా స్నాప్డీల్ కంపెనీ వల్కన్ ఎక్స్ప్రెస్ను విక్రయించిందని స్నాప్డీల్ చీఫ్ స్ట్రాటజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ జేసన్ కొఠారి పేర్కొన్నారు. ఫ్యూచర్ సప్లై చెయిన్కు దేశవ్యాప్తంగా 44 గిడ్డంగులు, 14 లాజిస్టిక్స్ కేంద్రాలు, 106 బ్రాంచ్లు ఉన్నాయి. ఫ్యూచర్ జోరు..: ఇటీవల కాలంలో ఫ్యూచర్ కంపెనీ జోరుగా కంపెనీలను కొనుగోలు చేస్తోంది. గత ఏడాది అక్టోబర్లో ఈ కంపెనీ షాపర్స్ స్టాప్కు చెందిన హైపర్ సిటీ రిటైల్ను రూ.655 కోట్లకు కొనుగోలు చేసింది. గత వారమే ట్రావెల్ న్యూస్ సర్వీసెస్ ఇండియాను (టీఎన్ఎస్ఐ) రూ.100 కోట్లకు కొనుగోలు చేసింది. -
‘ఫ్యూచర్’ చేతికి స్నాప్డీల్ ‘వల్కన్’!
ముంబై: ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్డీల్కు చెందిన లాజిస్టిక్స్ విభాగం, వల్కన్ ఎక్స్ప్రెస్ను ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ రూ.50 కోట్లు ఉండొచ్చు. తన సరఫరా చెయిన్ వ్యాపారాన్ని మరింత పటిష్టవంతం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా ఫ్యూచర్గ్రూప్ వల్కన్ ఎక్స్ప్రెస్ను కొనుగోలు చేయనున్నదని సంబంధిత వర్గా లు వెల్లడించాయి. ఈ డీల్కు సంబంధించి చర్చలు ఆరంభ దశలో ఉన్నాయని, మరికొన్ని వారాల్లో ఖరా రు కావచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ డీల్లో భాగంగా వల్కన్ సిబ్బంది ఫ్యూచర్ గ్రూప్కు బదిలీ అవుతారు. వల్కన్ ఎక్స్ప్రెస్ చేరికతో ఫ్యూచర్ గ్రూప్ థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ కార్యకలాపాలు మరింత శక్తివంతమవుతాయి. ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి స్నాప్డీల్, ఫ్యూచర్గ్రూప్లు నిరాకరించాయి. వంద నగరాల్లో వల్కన్ కార్యకలాపాలు... వల్కన్ ఎక్స్ప్రెస్ రిటైల్ కంపెనీలకు ముఖ్యంగా ఈ కామర్స్ సంస్థలకు సరఫరా సేవలందిస్తోంది. మొత్తం వంద నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇక ఫ్యూచర్ గ్రూప్కు సొంత లాజిస్టిక్స్ సంస్థ ఉంది. ఇటీవలే ఈ సంస్థ, ఫ్యూచర్ సప్లై చెయిన్ సొల్యూషన్స్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ద్వారా రూ.650 కోట్లు సమీకరించింది. రిటైల్, ఫ్యాషన్, ఆటోమోటివ్, ఇంజినీరింగ్, ఫుడ్, బేవరేజేస్, ఎఫ్ఎమ్సీజీ, ఈ కామర్స్, హెల్త్కేర్, ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ రంగాల సంస్థలకు లాజిస్టిక్స్ సేవలందిస్తోంది. కీలకం కాని ఆస్తుల విక్రయంలో భాగంగా స్నాప్డీల్ సంస్థ వల్కన్ ఎక్స్ప్రెస్ను విక్రయిస్తోంది. అత్యంత తీవ్రమైన పోటీ ఉన్న ఈ కామర్స్ మార్కెట్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్ల నుంచి నిలదొక్కుకోవడానికి కావలసిన నిధులను ఇలాంటి కీలకం కాని ఆస్తుల విక్రయం ద్వారా సమకూర్చుకుంటోంది. గత ఏడాది జూలైలో తన పేమెంట్ వాలెట్ ఫ్రీచార్జ్ను స్నాప్డీల్ కంపెనీ యాక్సిస్ బ్యాంక్కు రూ.385 కోట్లకు విక్రయించింది. -
ఆన్లైన్లో విజృంభిస్తున్న నకిలీ దందా!
సాక్షి, న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్లు, 4జీ వినియోగం పెరగడంతో ఆన్లైన్ అమ్మకాలు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆన్లైన్లో అమ్మేవాటిలో చాలా వరకు నకిలీ ఉత్పత్తులు ఉన్నట్టు వెల్లడయింది. సాధారణంగా పండుగ సమయంలో ఈ–కామర్స్ వెబ్సైట్లు డిస్కౌంట్లతో హోరెత్తిస్తుంటాయి. రాయితీలు ఇచ్చి అమ్మే వస్తువుల్లో ఎన్ని మంచివి? ఎన్ని నకిలీవి? అనే విషయమై ఓ ఆంగ్ల ఛానల్ జరిపిన పరిశోధనలో విస్తపోయే వాస్తవాలు తెలిశాయి. చాలామంది తయారీదారులు, విక్రేతలు ఆన్లైన్లో నకిలీ సరుకులను అంటగడుతున్నట్టు తేలింది. ఐటీ చట్టంలోని లోపాలను వాడుకుంటూ ఇలా చేస్తున్నారు. ఆన్లైన్లో ఉన్న దాదాపు 60 శాతం క్రీడా ఉత్పత్తులు నకిలీవేనట. అంతేకాక 40 శాతం దుస్తులు నకిలీ కంపెనీలవేనని గుర్తించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన మీరట్లోని బ్రహ్మపురి ఏరియాలో పోలీసులు జరిపిన తనిఖీలో పెద్ద మొత్తంలో పట్టుబడిన నకిలీ ఉత్పత్తులను సీజ్ చేశారు. వీటిని ఫ్లిప్కార్ట్, షాప్క్లూస్, స్నాప్డీల్ వంటి ప్రముఖసైట్లలో విక్రయిస్తున్నారు. రూ.170–200 వరకు ధర ఉన్న నకిలీ ఉత్పత్తులను రూ.450–500కు అమ్ముతున్నారు. ఏకంగా 50–60 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. మనీలాండరింగ్కు, కొన్ని రకాల మోసాలకు కూడా కంపెనీలు ఆన్లైన్ను వాడుకుంటున్నట్టు దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. -
స్నాప్డీల్ అన్బాక్స్ దివాలి సేల్ ప్రారంభం
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్కార్ట్, అమెజాన్ల కంటే ముందస్తుగానే స్నాప్డీల్ తన సేల్ను ప్రారంభించేసింది. ఈ పండుగ సీజన్ క్యాష్ చేసుకునేందుకు అన్బాక్స్ దివాలి సేల్ను నేటి నుంచి నిర్వహిస్తోంది. ఈ సేల్లో భాగంగా స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టెలివిజన్లు వంటి ఎలక్ట్రానిక్స్పై బంపర్ ఆఫర్లను అందిస్తోంది. పలు బ్యాంకు కార్డులపై కూడా ఫ్లాట్ డిస్కౌంట్లను, క్యాష్బ్యాక్లను స్నాప్డీల్ ప్రవేశపెట్టింది. వీటితో పాటు ఈ సేల్లో భాగంగా ధమాకా డీల్స్ను కూడా స్నాప్డీల్ ఆఫర్ చేస్తోంది. క్యాష్బ్యాక్ ఆఫర్లు.. ఇతర ఫెస్టివల్ సేల్స్ మాదిరిగా కాకుండా.. స్నాప్డీల్ పలు బ్యాంకులపై క్యాష్బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. సిటీ క్రెడిట్ కార్డును వాడి కనీసం రూ.2000 మేర కొనుగోలు చేస్తే, 15 శాతం క్యాష్బ్యాక్ నుంచి రూ.2000 వరకు అందుబాటులో ఉంటుంది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డు హోల్డర్స్కు 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ను అందిస్తోంది. తొలిరోజు సేల్లో భాగంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డు దారులకు అదనంగా 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. రెండో రోజు(శనివారం) స్టాండర్డ్ ఛార్టడ్ కార్డు యూజర్లకు ఆఫర్లను స్నాప్డీల్ ప్రకటించింది. మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్స్పై డీల్స్... వివో వీ5 ప్లస్ 64జీబీ గోల్డ్ కలర్ వేరియంట్పై 28 శాతం డిస్కౌంట్, ఒకవేళ ఏదైనా బ్యాంకు కార్డు ఆఫర్ ఉంటే మరో రూ.2000 క్యాష్బ్యాక్(మొత్తంగా రూ.17,549కు అందుబాటు) వివో వీ5ఎస్ స్మార్ట్ఫోన్ రూ.15,799కు, జియోని ఏ1 రూ.15,348కి, మోటో ఎం రూ.14,999కు, మోటో జీ5ఎస్ రూ.14,295కు అందుబాటు సోనీ ఎండీఆర్-జెడ్ఎక్స్110ఏ హెడ్ఫోన్లపై 53 శాతం డిస్కౌంట్ లెనోవో ఐడియాప్యాడ్ 80ఎక్స్హెచ్01జీఈఐఎన్ నోట్బుక్పై 21 శాతం డిస్కౌంట్, రూ.24,999కే విక్రయం హెచ్పీ 15-బీయూ003టీయూ ల్యాప్టాప్పై 18 శాతం డిస్కౌంట్, రూ.26,499కే అందుబాటు పలు పీసీ, ల్యాప్టాప్ మోడల్స్ ఈ సేల్లో డిస్కౌంట్ ధరలకే అందుబాటులో ఉన్నాయి. -
స్నాప్డీల్ సేల్: డిస్కౌంట్లో కొత్త ఐఫోన్లు
ఈ-కామర్స్ కంపెనీల్లో ఫెస్టివల్ సీజన్ ఇంకా నడుస్తూనే ఉంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ తర్వాత స్నాప్డీల్ తన 'అన్బాక్స్ దివాలి సేల్''ను కొనసాగిస్తోంది. రెండో రౌండ్ నిర్వహిస్తున్న ఈ సేల్ నేటితో ముగియనుంది. ఈ సేల్లో భాగంగా ఆపిల్ ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త ఐఫోన్లపై బంపర్ డిస్కౌంట్లను ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులతో కొత్త ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్లను కొనుగోలు చేస్తే, తక్షణ డిస్కౌంట్ కింద రూ.13వేల వరకు స్నాప్డీల్ అందిస్తోంది. పరిమిత యూనిట్లపై ఈ డిస్కౌంట్ను ఆఫర్ చేస్తున్నట్టు స్నాప్డీల్ చెప్పింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో డిస్కౌంట్ను అందుబాటులో ఉంచింది. అదనంగా స్టాండర్డ్ ఛార్టడ్, యస్ బ్యాంకు కార్డులపై రూ.2500 కంటే ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేపడితే, ఫ్లాట్ 20 శాతం డిస్కౌంట్ను ఇస్తోంది. ప్రతికార్డుపైనా రూ.1500 వరకు డిస్కౌంట్ను స్నాప్డీల్ ఆఫర్ చేస్తోంది. అంతేకాక గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్ను 58వేల రూపాయలకే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్ కొనుగోలుపై రూ.22వేల వరకు ఆదాచేసుకోవచ్చు. సేల్ డేస్లో ఆఫర్లకు అదనంగా ఇండస్ఇండ్ బ్యాంకు హోల్డర్స్కు అక్టోబర్ 3 నుంచి ప్రతి మంగళవారం ఫ్లాట్ 10 శాతం తగ్గింపును ఇవ్వనుంది. అయితే రూ.1500 కంటే మించి కొనుగోలు చేపడితేనే ఈ తగ్గింపును స్నాప్డీల్ ఆఫర్ చేస్తుంది. -
ఆన్లైన్ ‘పండుగ’..!
►ఈ–కామర్స్ కంపెనీల పోటాపోటీ ► 90 శాతం దాకా డిస్కౌంట్ సేల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఆన్లైన్ ఫెస్టివల్ మొదలైంది. పండుగల సీజన్ కోసం ఈ–కామర్స్ కంపెనీలు డిస్కౌంట్లతో సవాల్ విసురుతున్నాయి. డేటా చార్జీలు దిగిరావడం, 4జీ స్మార్ట్ఫోన్ల హవా నడుస్తోంది. దీంతో కొత్త యూజర్లు తోడుకావడంతో ఆన్లైన్ షాపింగ్ ఈసారి జోరుమీద ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఇంకేముంది అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, షాప్క్లూస్తోపాటు పేటీఎం మాల్ సైతం ‘క్లిక్’ అయ్యే ఆఫర్లతో సిద్ధమయ్యాయి. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ డెకోర్.. ఇలా వందలాది విభాగాల్లో కస్టమర్ల ముందుకు లక్షలాది ఉత్పత్తులను తీసుకొచ్చాయి. సులభ వాయిదాల్లో మొత్తాలను స్వీకరించేందుకు సై అంటున్నాయి. ఈ ఫెస్టివల్ సీజన్లో ఆన్లైన్ వేదికగా సుమారు రూ.11,000 కోట్ల విలువైన వ్యాపారం జరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. 2016లో దేశవ్యాప్తంగా పండుగల సీజన్కు ఈ–కామర్స్ కంపెనీలు రూ.6,500 కోట్ల వ్యాపారం చేశాయి. డీల్స్లో దేనికదే సాటి.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో అమెజాన్ నేటి నుంచే రంగంలోకి దిగుతోంది. 24వరకు ఉండే ఈ ఫెస్టివల్లో బిగ్ డీల్స్ ఉంటాయని కంపెనీ చెబుతోంది. ఆసక్తికర అంశం ఏమంటే డబ్బులు వచ్చే ఏడాది చెల్లించొచ్చు అంటూ ఈ కంపెనీ కొత్త డీల్కు తెరలేపింది. దీని కింద హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు వాయిదా మొత్తాన్ని 2018 జనవరి నుంచి చెల్లించొచ్చు. బిగ్ బిలియన్ డేస్ పేరుతో ఫ్లిప్కార్ట్ సెప్టెంబర్ 24 వరకు విక్రయాలను జరుపనుంది. 90 శాతం వరకు డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. అలాగే సేల్లో భాగంగా కార్లు, హాలిడే ప్యాకేజెస్, టెలివిజన్ల వంటి బహుమతులతో విక్రేతలను ప్రోత్సహిస్తున్నట్టు ఫ్లిప్కార్ట్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ గోటేటి వెల్లడించారు. విక్రేతలు రెండు రెట్ల అమ్మకాల వృద్ధి సాధించాలన్న లక్ష్యంతో రంగంలోకి దిగామన్నారు. బై నౌ, పే లేటర్ అంటూ ఫ్లిప్కార్ట్ సైతం కస్టమర్లను ఊరిస్తోంది. ఇక వేలాది ఉత్పత్తులపై 15 నుంచి 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్లతో గట్టిపోటీ ఇచ్చేందుకు పేటీఎం మాల్ ఇప్పటికే రంగంలోకి దిగింది. సెప్టెంబరు 23 వరకు ఉండే మేరా క్యాష్బ్యాక్ సేల్ కోసం రూ.501 కోట్లను కేటాయించింది. ప్రతి ఆర్డరుపై ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంటుందని పేటీఎం మాల్ సీవోవో అమిత్ సిన్హా వెల్లడించారు. ఈ నెల 25 వరకు అన్బాక్స్ దివాలీ సేల్కు స్నాప్డీల్ సమాయత్తమైంది. సెప్టెంబర్ 28 వరకు మహాభారత్ దివాలీ సేల్కు షాప్క్లూస్.కామ్ సిద్ధమైంది. స్మార్ట్ఫోన్లదే హవా.. ఆన్లైన్ కంపెనీలు ఎక్స్క్లూజివ్ ఉత్పత్తులతో ప్రధానంగా స్మార్ట్ఫోన్లతో పోటీకి సై అంటున్నాయి. విలువ పరంగా ఈ–కామర్స్ వ్యాపారం లో స్మార్ట్ఫోన్ల వాటాయే అత్యధికంగా 55% దాకా ఉంది. 160 స్మార్ట్ఫోన్ మోడళ్లు, 100 ఎలక్ట్రానిక్స్ ఎక్స్క్లూజివ్గా విక్రయిస్తున్నట్టు అమెజాన్ వెల్లడించింది. మొత్తంగా ఈ ఏడాది సీజన్లో ఈ–కామర్స్ వ్యాపారంలో 60 శాతం వృద్ధి ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొబైల్స్ తర్వాత ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్, కిచెన్, హోంకేర్ తదితర విభాగాల్లో అమ్మకాలు గణనీయంగా ఉండనున్నాయి. బిగ్ బిలియన్ డేస్ ద్వారా ఫ్లిప్కార్ట్ అమ్మకాల్లో రెండుమూడు రెట్ల వృద్ధి ఆశిస్తోంది. సేల్లో 80% దాకా డిస్కౌంట్ ఇస్తున్నట్టు షాప్క్లూస్ సహ వ్యవస్థాపకులు రాధిక అగర్వాల్ తెలిపారు. -
స్నాప్డీల్ 3 రోజుల ఫెస్టివల్ సేల్
సాక్షి, న్యూఢిల్లీ : ఈ-కామర్స్ సంస్థ స్నాప్డీల్ మూడు రోజుల ఫెస్టివల్ సేల్కు తెరతీసింది. నిన్నటి(శుక్రవారం) నుంచి ఈ సేల్ను నిర్వహిస్తోంది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్కు సంబంధించిన అన్ని కేటగిరీ వస్తువులపై రెండింతలు డిస్కౌంట్లను అంటే 70 శాతం వరకు డిస్కౌంట్ను స్నాప్డీల్ ప్రకటించింది. రేపటి వరకు(ఆదివారం) వరకు ఈ సేల్ నడుస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డు హోల్డర్స్కు వెనువెంటనే 10 శాతం డిస్కౌంట్ను కూడా స్నాప్డీల్ ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ఆఫర్ కింద కనీస లావాదేవీ రూ.2500 ఉండాలి. ఇటు అమెజాన్, ఫ్లిప్కార్ట్లు పండుగ సీజన్కు సన్నద్ధమవుతుండగానే, స్నాప్డీల్ ఈ ప్రకటన ఇచ్చేసింది. స్మార్ట్ఫోన్లపై అందించే బ్లాక్బస్టర్ డీల్స్ ఇవే.. గూగుల్ పిక్సెల్ ఫోన్లపై 13 శాతం తగ్గింపు, దీంతో రూ.67వేలుగా ఉన్న గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్(32జీబీ) రూ.58వేలకే అందుబాటు లెనోవో జెడ్2 ప్లస్ 32జీబీ ఫోన్పై 44 శాతం తగ్గింపు, దీంతో రూ.17,999గా ఉన్న ఈ ఫోన్రూ.9999కే విక్రయం స్వైప్ కనెక్ట్ పవర్ 4జీ(16జీబీ) కూడా రూ.4999కు తగ్గింపు శాంసంగ్ గెలాక్సీ జే7 ప్రొ(3జీబీ, 64జీబీ) ఫోన్ 8 శాతం తగ్గింపు, రూ.22,999కే విక్రయం మైక్రోమ్యాక్స్ కాన్వాస్ నైట్ 2 ఈ471 4జీ స్మార్ట్ఫోన్పై 61 శాతం తగ్గింపు, రూ.6499కే అందుబాటు వివో వీ5ఎస్ ఫర్ఫెక్ట్ సెల్ఫీపై 16 శాతం తగ్గింపుతో రూ.16,700కే విక్రయం -
ఈ కామర్స్ సైట్కు హీరో పంచ్
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యంగ్ హీరో రాహుల్ రవీంద్రన్ ఈ కామర్స్ వెబ్ సైట్ స్నాప్ డీల్ కు పంచ్ ఇచ్చాడు. ఇటీవల ఈ సైట్ ప్రకటించిన ఓ సేల్ కు సంబంధించి ట్విట్టర్ లో చేసిన పోస్ట్ పై రాహుల్ స్పందించిన తీరు ఆకట్టుకుంది. ఐశ్వర్యారాయ్ పరిగెడుతున్న వీడియోను పోస్ట్ చేసి స్నాప్ డీల్, ఆ వీడియోకు 'మీరు ఎంత షాపింగ్ చేశారో మీ భర్తకు తెలిసే లోపే డోర్ దగ్గరకు పరిగెత్తండి' అనే కామెంట్ ను జోడించింది. ఈ ట్వీట్ పై స్పందించిన రాహుల్ రవీంద్రన్ 'గత ఏడాది నా సంపాదన కన్నా.. నా భార్య సంపాదనే ఎక్కువ.. తన ఆన్ లైన్ షాపింగ్ తన సంపాదన తోనే చేస్తోంది. కాబట్టి పరిగెత్తాల్సిన అవసరం లేదు' అంటూ ట్వీట్ చేశాడు. రాహుల్ ట్వీట్ పై స్పందించిన ఆయన భార్య ఇలాంటి భర్తనే ప్రతీ అమ్మాయి కోరుకుంటుంది అంటూ ట్వీట్ చేసింది. రాహుల్ కామెంట్ చేసిన తరువాత స్నాప్ డీల్ తన ట్వీట్ ను తొలగించింది. 👇🏼👇🏼 This is the kinda man one should be with, ladies. I hope you (and your parents) choose well. Happy Independence Day. — Chinmayi Sripaada (@Chinmayi) 15 August 2017 -
చిక్కుల్లో స్నాప్డీల్: నోటీసులు
ముంబై: ఇ-కామర్స్ సంస్థ స్నాప్డీల్ మరోసారి చిక్కుల్లో పడింది. వన్య ప్రాణుల అవయవాలనుంచి తయారు చేసిన ఉత్పత్తులను విక్రయిస్తోందని ఆరోపిస్తూ స్నాప్డీల్ సహా, మరికొన్ని సంస్థలకు నోటీసులు జారీ అయ్యాయి. వెంటనే ఆయా ఉత్పత్తులను తొలించాలని, దీనిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరించాలంటూ ఆదేశించినట్టు ప్రజా సంబంధాల విభాగం అధికారి ఒకరు తెలిపారు. స్నాప్డీల్తో పాటు విష్ అండ్ బిట్, ఇండియా మార్ట్, క్రాఫ్ట్ కంపారిజన్ వెబ్సైట్లకు మధ్యప్రదేశ్ టైగర్ స్ట్రైక్ ఫోర్స్ ఈ నోటీసులిచ్చింది. దీనిపై తక్షణమే వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది. కాగా ఇండోర్ విజయ్ నగర్లోని శుభభక్తి స్నాప్డీల్ ద్వారా అడవి జంతువుల అవయవాలు నుండి తయారు చేసిన "హత్తా-జోడి" "సియర్-సింఘి"లాంటి ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ నోటీసులు జారీ అయ్యాయి. అలాగే ఈ వ్యవహారంలో శుభభక్తి సంస్థ యజమానులు సుమిత్ శర్మ , ఫిరోజ్ ఆలీని పోలీసులు గత వారం అరెస్టు చేశారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసును దాఖలు చేశారు. అయితే ఇ-కామర్స్ పోర్టల్స్ స్నాప్డీల్, ఇండియా మార్ట్, విష్ అండ్ బై వెబ్సైట్ల ద్వారా ఈ వస్తువులను విక్రయించినట్టు దర్యాప్తు సమయంలో వీరు వెల్లడించారు. పూజ పదార్ధాల వర్తకంతో పాటు వన్యప్రాణుల సంబంధిత వస్తువులను విక్రయిస్తున్నట్టు తేలిందని దర్యాప్తు అధికారి తెలిపారు. ధనవంతులు కావడం, కోర్టు కేసులనుంచి విముక్తి, వ్యాపార వృద్ధి తదితర సమస్యలకు పరిష్కారంగా వీటిని జనం విశ్వసిస్తారని ఆయన చెప్పారు. -
ఫ్లిప్కార్ట్తో సాఫ్ట్బ్యాంకు చర్చలు
2 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ఆసక్తి న్యూఢిల్లీ: జపాన్కు చెందిన అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ కంపెనీ సాఫ్ట్బ్యాంకు ఫ్లిప్కార్ట్తో అనుబంధానికి ప్రయత్నిస్తోంది. స్నాప్డీల్లో అతిపెద్ద వాటాదారైన సాఫ్ట్బ్యాంకు (35% వాటా) దాన్ని ఫ్లిప్కార్ట్లో విలీనం చేయడం ద్వారా దిగ్గజ ఈ కామర్స్ సంస్థలో వాటా పొందాలని చూసింది. కానీ, ఫ్లిప్కార్ట్తో విలీనం విషయమై చర్చల నుంచి స్నాప్డీల్ వైదొలగడంతో, సాఫ్ట్ బ్యాంకు నేరుగా ఫ్లిప్కార్టులో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఈ విషయాన్ని సాఫ్ట్బ్యాంకు చైర్మన్ మసయోషిసన్ తాజాగా వెల్ల డించారు. సాఫ్ట్ బ్యాంకు జూన్ క్వార్టర్ త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఆయన ఈ విషయమై మాట్లాడారు. ఫ్లిప్కార్ట్లో సాఫ్ట్బ్యాంకు విజన్ ఫండ్ ద్వారా 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. -
స్నాప్డీల్కు మరో ఇద్దరు సీనియర్లు గుడ్బై
న్యూఢిల్లీ: ఇ-కామర్ సంస్థ స్నాప్డీల్కు రాజీనామాల బెడద తప్పడం లేదు. తాజాగా ఇద్దరు కీలక సీనియర్ అధికారులు సంస్థకు రాజీనామా చేశారు. టాప్ మేనేజ్మెంట్ పై తీవ్ర మైన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వారు సంస్థను వీడడం గమనార్హం. ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గంజ్, టెక్నాలజీ (డేటా ప్లాట్ఫాం) వైస్ ప్రెసిడెంట్ అరవింద్ హేడ తమ పదవులకు గుడ్ బై చెప్పారు. ముఖ్యంగా ‘స్నాప్డీల్ 2.0’ కొత్త స్ట్రాటజీపై బహిరంగంగానే నిరసన వ్యక్తం చేసిన వీరు చివరికి కంపెనీనుంచి వైదొలగారు. ప్రొడక్ట్ వైస్ ప్రెసిడెంట్ ప్రదీప్ దేశాయ్, ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్, విరాజ్ చటర్జీ, ఐటి అధిపతి గౌరవ్ గుప్తా ఈ కంపెనీ నుంచి తొలుత నిష్క్రమించగా, ఇటీవల ఎంసీజి బిజినెస్ హెడ్ దిగ్విజయ్ ఘోష్, జనరల్ మెర్కండైజ్ బిజినెస్ హెడ్ రాహుల్ జైన్ రాజీనామా చేశారు. తాజాగా మరో ఇద్దరు టాప్ఎగ్జిక్యూటివ్స్ ఈ కోవలో చేరడం సంస్థకు పెద్ద ఎదురుదెబ్బగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కాగా ఇటీవల ఇ కామర్స్ బిజినెస్లో అతిపెద్ద డీల్గా భావించిన ఫ్లిప్కార్ట్తో విలీనానికి స్వస్తి చెప్పిన స్నాప్డీల్ భారీగా ఉద్యోగులకు తొలగించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
యాక్సెస్ బ్యాంక్ చేతికి ఫ్రీచార్జ్ వాలెట్
-
యాక్సిస్ బ్యాంకు చేతికి ఫ్రీచార్జ్
► రూ. 385 కోట్లకు విక్రయం ► 90 శాతం డిస్కౌంటుకు అమ్మేసిన స్నాప్డీల్ ముంబై: నిధుల కొరతతో సతమతమవుతున్న ఈ కామర్స్ సంస్థ స్నాప్డీల్ తాజాగా తమ గ్రూప్లో భాగమైన పేమెంట్ వాలెట్ సంస్థ ఫ్రీచార్జ్ను.. యాక్సిస్ బ్యాంకుకు విక్రయించేందుకు అంగీకరించింది. ఈ డీల్ విలువ రూ.385 కోట్లు. 2015లో ఫ్రీచార్జ్ను కొనేందుకు స్నాప్డీల్ వెచ్చించిన 400 మిలియన్ డాలర్లతో (సుమారు రూ.2,600 కోట్లు) పోలిస్తే ఇది సుమారు 90 శాతం తక్కువ. మార్కెట్ వర్గాల ప్రకారం ఇతర సంస్థలు ఫ్రీచార్జ్ కొనుగోలుకు 15–20 మిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. పోటీ వాలెట్ సంస్థ పేటీఎం సుమారు 10–20 మిలియన్ డాలర్లు ఆఫర్ చేయగా, ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా ఫ్రీచార్జ్ కొనుగోలుకు ఆఖర్లో పోటీకి దిగింది. టెక్నాలజీ ప్లాట్ఫాం, కస్టమర్ల సంఖ్య, బ్రాండ్, సమర్థత మొదలైన వాటి కారణంగా ఫ్రీచార్జ్పై తాము ఆసక్తి చూపినట్లు యాక్సిస్ బ్యాంక్ సీఈవో శిఖా శర్మ తెలిపారు. ఇలాంటి డీల్స్కి ప్రత్యేకంగా విలువ కట్టడం కష్టమన్నారు. మరోవైపు, ఈ ఒప్పందం ఇరు సంస్థలకు ప్రయోజనకరమేనని స్నాప్డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బెహల్ చెప్పారు. స్నాప్డీల్ను ఫ్లిప్కార్ట్ కొనే ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ఫ్రీచార్జ్ను యాక్సిస్ బ్యాంకు కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫ్రీచార్జ్ .. యాక్సిస్ల కథ ఇదీ.. ఫ్రీచార్జ్కి 5.4 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లున్నారు. వీరిలో 70% మంది 30 ఏళ్ల లోపు వారే. గతేడాది సుమారు రూ.80 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇక యాక్సిస్ బ్యాంక్కు 2 కోట్ల సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులు.. బ్రోకరేజి, మ్యూచువల్ ఫండ్స్, ఇతరత్రా రుణగ్రహీతల రూపంలో మరో 30 లక్షల మంది యూజర్లున్నారు. యాక్సిస్కు ఇప్పటికే లైమ్ పేరిట ప్రీపెయిడ్ పేమెంట్ వాలెట్ ఉంది. ఇప్పుడు ఫ్రీచార్జ్ను కూడా కొనడంతో ఈ రెండింటిని విలీనం చేసే అవకాశాన్ని పరిశీలించవచ్చని బ్యాంకు సీఈవో శిఖా శర్మ తెలిపారు. మూడోసారీ సీఈవోగా శిఖా శర్మే.. కొత్త ఎండీ, సీఈఓ పగ్గాలు చేపట్టే వారిపై ఊహాగానాలకు తెరదించుతూ మూడోసారి కూడా శిఖా శర్మే ఆ హోదాల్లో కొనసాగుతారని యాక్సిస్ బ్యాంక్ స్పష్టం చేసింది. 2021 జూన్ దాకా ఆమె పదవీ కాలం ఉంటుంది. ‘ 2018 జూన్ 1 నుంచి మూడేళ్ల పాటు ఎండీ, సీఈవోగా శిఖా శర్మ పునర్నియామకాన్ని జులై 26న జరిగిన సమావేశంలో బోర్డు ఆమోదించింది’ అని యాక్సిస్ తెలియజేసింది. యాక్సిస్ బ్యాంక్ శిఖా శర్మ వారసులను అన్వేషిస్తోందని, టాటా సన్స్ ఆమెకు భారీ ఆఫర్ ఇచ్చిందని వార్తలు రావడం తెలిసిందే. ఐసీఐసీఐలో 1980లో కెరియర్ ప్రారంభించిన శిఖా శర్మ.. 2009లో అయిదేళ్ల కాల వ్యవధికి యాక్సిస్ బ్యాంక్ సీఈవోగా చేరారు. రెండో దఫా కూడా ఆమె నియమితులయ్యారు. -
ఫ్రీచార్జ్పై యాక్సిస్ బ్యాంక్ కన్ను
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థ స్నాప్డీల్లో భాగమైన ఫ్రీచార్జ్ను ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం సుమారు రూ. 350–400 కోట్ల దాకా చెల్లించేలా స్నాప్డీల్తో ఒప్పందం కూడా ఖరారు చేసుకున్నట్లు సమాచారం. డీల్ దాదాపు పూర్తయిపోయినట్లేనని, మరికొద్ది రోజుల్లో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ’కీలకమైన వ్యాపార ప్రకటన’ చేసేందుకు గురువారం విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు యాక్సిస్ బ్యాంక్ వెల్లడించిన నేపథ్యంలో డీల్ వార్త మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. 2015 ఏప్రిల్లో ఫ్రీచార్జ్ను స్నాప్డీల్ 400 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అప్పట్లో దేశీ స్టార్టప్ సంస్థలకు సంబంధించి ఇది అతిపెద్ద డీల్గా నిల్చింది. ఫ్రీచార్జ్ కొనుగోలుతో దీని 5 కోట్ల మంది మొబైల్ వాలెట్ యూజర్లు యాక్సిస్కు చేరువ కాగలరు. ఫ్లిప్కార్ట్ ఆఫర్కు స్నాప్డీల్ ఓకే? తమ సంస్థ కొనుగోలు కోసం ఫ్లిప్కార్ట్ ఆఫర్ చేసిన 900–950 మిలియన్ డాలర్ల డీల్కు స్నాప్డీల్ బోర్డు ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఇక స్నాప్డీల్లోని మిగతా వాటాదారుల ఆమోదం లభించాల్సి ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వారంలోనే ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు వివరించాయి. శుక్రవారం జరిగే బోర్డు సమావేశంలో షేర్ల మార్పిడి నిష్పత్తిని ఫ్లిప్కార్ట్ ఖరారు చేయొచ్చు. విలీన సంస్థలో సాఫ్ట్బ్యాంక్కు 20% వాటాలు దక్కే అవకాశముంది. ప్రారంభ దశలో స్నాప్డీల్ బ్రాండ్ పేరును ఫ్లిప్కార్ట్ అలాగే కొనసాగించవచ్చని తెలుస్తోంది. స్నాప్డీల్ కొనుగోలుకు తొలుత బిలియన్ డాలర్లు ఇవ్వజూపిన ఫ్లిప్కార్ట్.. ఆ తర్వాత వ్యాపార కార్యకలాపాల మదింపు అనంతరం 550 మిలియన్ డాలర్లకు కుదించి.. మళ్లీ తాజాగా 900–950 మిలియన్ డాలర్లకు పెంచింది. -
ఎట్టకేలకు ఫ్లిప్కార్ట్-స్నాప్డీల్ బిగ్ డీల్
న్యూఢిల్లీ : ఎట్టకేలకు ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఆఫర్కు స్నాప్డీల్ ఓకే చెప్పింది. గతవారం ఫ్లిప్కార్ట్ సవరించి ప్రతిపాదించిన 900 మిలియన్ డాలర్ల (రూ.5,850 కోట్లు) నుంచి 950 మిలియన్ డాలర్ల(రూ.6,175 కోట్లు) టేక్ఓవర్ ఆఫర్కు స్నాప్డీల్ బోర్డు అంగీకరించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఇక ఈ డీల్ను స్నాప్డీల్ షేర్ హోల్డర్స్ ఆమోదించాల్సి ఉందని సంబంధిత వర్గాలు రాయిటర్స్కు తెలిపాయి. అయితే దీనిపై ఇంకా ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ కంపెనీలు అధికారికంగా స్పందించలేదు. నిధుల కొరతతో కటకటలాడుతున్న స్నాప్డీల్ను కొనేందుకు ఫ్లిప్కార్ట్ ముందు 1 బిలియన్ డాలర్ల దాకా ఇవ్వజూపినప్పటికీ.. మదింపు ప్రక్రియ అనంతరం 800-850 మిలియన్ డాలర్ల దాకా (సుమారు రూ. 5,500 కోట్లు) ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే, స్నాప్డీల్ దీన్ని తిరస్కరించడంతో అనంతరం ఫ్లిప్కార్ట్ తన ఆఫర్ను సవరించింది. ఈ వారంలోనే స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్ బోర్డు సభ్యులు సమావేశం కాబోతున్నారని, టర్మ్షీట్పై సంతకాలు చేసి, డీల్ను ఓకే చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. మూడు పార్ట్లలో డీల్ను పూర్తిచేయబోతున్నారని తెలుస్తోంది. తొలుత స్నాప్డీల్, తన ఇన్వెస్టర్లు నెక్సస్, కలారీ క్యాపిటల్ నుంచి సాఫ్ట్బ్యాంకు వాటాను కొనుగోలుచేస్తుంది. అనంతరం ఆ క్యాపిటల్ను సాఫ్ట్బ్యాంకు ఫ్లిప్కార్ట్లో పెడుతోంది. తుది దశలో ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ విలీనం కాబోతున్నాయి. శుక్రవారం రోజు సమావేశమయ్యే ఫ్లిప్కార్ట్ బోర్డు సభ్యులు ఈ డీల్ను ఆమోదించబోతున్నారు. టర్మ్షీట్ మీద సంతకం చేసిన అనంతరం మూడు నెలల్లోపు ఈ డీల్ ప్రక్రియను ముగించాలని కంపెనీలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ రెండింటి విలీన సంస్థలో సాఫ్ట్బ్యాంకు 20 శాతం వాటాని కలిగి ఉంటుంది. ప్రాథమిక దశలో స్నాప్డీల్ బ్రాండు పేరును ఫ్లిప్కార్ట్ అలానే కొనసాగించనుంది. -
స్నాప్డీల్కు ఫ్లిప్కార్ట్ కొత్త ఆఫర్
టేకోవర్కు 900–950 మిలియన్ డాలర్లు న్యూఢిల్లీ: ఈకామర్స్ సంస్థ స్నాప్డీల్ను కొనుగోలు చేసేందుకు పోటీ దిగ్గజం ఫ్లిప్కార్ట్ తాజాగా తమ ఆఫర్ను సవరించింది. స్నాప్డీల్ ఆన్లైన్ మార్కెట్ప్లేస్తో పాటు యూనికామర్స్ సంస్థను కూడా కొనుగోలు చేసేందుకు 900–950 మిలియన్ డాలర్లు ఇస్తామంటూ ఆఫర్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈకామర్స్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, ఫుల్ఫిల్మెంట్ సేవల సంస్థ యూనికామర్స్ను స్నాప్డీల్ 2015లో కొనుగోలు చేసింది. ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని, చర్చల దశలోనే ఉందని వివరించాయి. దీనిపై సమావేశం కానున్న స్నాప్డీల్ .. మొత్తం మీద డీల్కు సుముఖంగానే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. నగదు, తత్సమాన అసెట్స్ రూపంలో ఒప్పందం తుది మొత్తం చెల్లింపులకు సంబంధించి చివర్లో స్వల్ప మార్పులు, చేర్పులేమైనా ఉండొచ్చని ఆయా వర్గాలు తెలిపాయి. నిధుల కొరతతో కటకటలాడుతున్న స్నాప్డీల్ను కొనేందుకు ఫ్లిప్కార్ట్ ముందు 1 బిలియన్ డాలర్ల దాకా ఇవ్వజూపినప్పటికీ.. మదింపు ప్రక్రియ అనంతరం 800–850 మిలియన్ డాలర్ల దాకా (సుమారు రూ. 5,500 కోట్లు) ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే, స్నాప్డీల్ దీన్ని తిరస్కరించడంతో తాజాగా సవరించిన ఆఫర్ మరొకటి ఇచ్చింది. ఒకవేళ స్నాప్డీల్ బోర్డు గానీ దీనికి అంగీకరిస్తే తుది విక్రయ, కొనుగోలు ఒప్పందంపై ఇరు పక్షాలు చర్చలు జరుపుతాయి. అటు స్నాప్డీల్ మొబైల్ చెల్లింపుల విభాగం ఫ్రీచార్జ్, సరకు రవాణా వ్యాపార విభాగం వల్కన్ ఎక్స్ప్రెస్ల విక్రయానికి కూడా వేర్వేరుగా డీల్స్ కుదుర్చుకోవడంపై కసరత్తు చేస్తోంది. -
ఫ్లిప్కార్ట్కు షాకిస్తున్న స్నాప్డీల్
న్యూఢిల్లీ : ఈ-కామర్స్ మార్కెట్లో దిగ్గజ కంపెనీగా ఉన్న ఫ్లిప్కార్ట్ ఆఫర్ను తిరస్కరించి, మరో కంపెనీకి చేయి అందిస్తోంది స్నాప్డీల్. కొనుగోలుకు తక్కువ విలువ కడుతున్న ఫ్లిప్కార్ట్ ఆఫర్కు నో చెప్పిన స్నాప్డీల్, ఇక ఫ్లిప్కార్ట్కు అమ్మడం కంటే, మరో కంపెనీతో జతకట్టడమే మంచిదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పబ్లిక్గా లిస్టు అయిన ఒకే ఒక్క ఈ-కామర్స్ కంపెనీగా పేరున్న ఇన్ఫీబీమ్తో స్నాప్డీల్ విలీన చర్చలు జరుపుతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ రెండింటి మధ్య డీల్ 1 బిలియన్ డాలర్ల(రూ.6446కోట్లకు పైగా)కు కుదురుతున్నట్టు కూడా తెలిపాయి. గతవారమే ఫ్లిప్కార్ట్ ఆఫర్ చేసిన 700-750 మిలియన్ డాలర్ల డీల్ను స్నాప్డీల్ బోర్డు తిరస్కరించింది. ఆ ఆఫర్ను స్నాప్డీల్ తిరస్కరించడంతో మరోసారి ఆ కంపెనీకి 900-950 మిలియన్ డాలర్లకు విలువకట్టాలని మరోవైపు నుంచి ఫ్లిప్కార్ట్ చూస్తోంది. కానీ స్నాప్డీల్, ఇన్ఫీబీమ్తో చర్చలు సాగిస్తోంది. ప్రస్తుతం ఇన్ఫీబీమ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6106 కోట్లగా ఉంది. స్నాప్డీల్ రాకతో వీటి విలీన సంస్థ 2 బిలియన్ సంస్థగా అవతరించనుంది. అయితే ఈ డీల్లో స్నాప్డీల్ లాజిస్టిక్ బిజినెస్లు వుల్కాన్ ఎక్స్ప్రెస్(లాజిస్టిక్ విభాగం), పేమెంట్స్ ప్లాట్ఫామ్ ప్రీఛార్జ్లను కలుపడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం స్నాప్డీల్ ముందు మూడు ఆప్షన్లున్నాయని కంపెనీ సహవ్యవస్థాపకుడు, సీఈఓ కునాల్ బహల్ చెప్పారు. ఒకటి ఫ్లిప్కార్ట్తో క్లోజ్ డీల్కు ఆమోదించడం, రెండు ఇన్ఫీబీమ్తో విలీనమవ్వడం లేదా స్వతంత్ర సంస్థగా ఉండటానికి వుల్కాన్ ఎక్స్ప్రెస్, ఫ్రీఛార్జ్లను వంటి ఆస్తులను అమ్మేసి నిధులు సేకరించడం అని ఆయన చెప్పారు. ఫ్లిప్కార్ట్ ఆఫర్ చేస్తున్న ఆఫర్కు మెజార్టీ, మెనార్టీ షేర్హోల్డర్స్ మధ్య ఆమోదం రాకపోవడంతో ఇది తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఇన్ఫీబీమ్తో జరుపుతున్న తాజా చర్చలు షేర్హోల్డర్స్ ఆమోదిస్తున్నారో లేదో ఇంకా స్పష్టంకాలేదు. -
స్నాప్డీల్కి ఫ్లిప్కార్ట్ మరో ఆఫర్!!
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ ఈ–కామర్స్ సంస్థ ‘ఫ్లిప్కార్ట్’.. స్నాప్డీల్కు అతిత్వరలోనే మరొక ఆఫర్ను ప్రకటించే అవకాశముంది. కాగా ఫ్లిప్కార్ట్ 800–850 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.5,500 కోట్లు) కొనుగోలు ప్రతిపాదనను స్నాప్డీల్ బోర్డు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఫ్లిప్కార్ట్ ఆఫర్... కంపెనీ వాస్తవ విలువ కన్నా తక్కువగా ఉందని స్నాప్డీల్ పేర్కొంది. కాగా కొత్త ఆఫర్ 1 బిలియన్ డాలర్లకు దగ్గరగా ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. తొలి ఆఫర్ తిరస్కరణ నేపథ్యంలో ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ మధ్య మళ్లీ చర్చలు జరుగుతున్నాయి. ఇవి ఇంకా కొలిక్కి రాలేదు. ఒకవేళ అన్ని కుదిరితే డీల్ ఒక నెలలోనే పూర్తయ్యే అవకాశముంది. కాగా ఈ అంశాలపై అటు స్నాప్డీల్, సాఫ్ట్బ్యాంక్ కానీ, ఇటు ఫ్లిప్కార్ట్ కానీ స్పందించలేదు. కాగా స్నాప్డీల్.. ఫ్రీచార్జ్ (మొబైల్ వాలెట్ విభాగం), వుల్కాన్ ఎక్స్ప్రెస్ (లాజిస్టిక్ విభాగం) విక్రయానికి సంబంధించి ప్రత్యేకమైన మంతనాలు జరుపుతోంది. ఈ డీల్స్ కూడా వచ్చే కొన్ని వారాల్లో పూర్తయ్యే అవకాశముంది. ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ డీల్ ఓకే అయితే ఇది దేశీ ఈ–కామర్స్ రంగంలో అతిపెద్ద విలీనంగా అవతరించనుంది. -
అలా కాదు.. ఇంకో మాట చెప్పండి!!
మరికాస్త వేల్యుయేషన్ కోసం ఫ్లిప్కార్ట్తో స్నాప్డీల్ చర్చలు న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ సంస్థ స్నాప్డీల్ను ఫ్లిప్కార్ట్ కొనుగోలు చేసే అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. మరింత అధిక వేల్యుయేషన్ కట్టడంపై ఇరు సంస్థలు చర్చిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముందుగా 1 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసిన ఫ్లిప్కార్ట్ ఆ తర్వాత అన్ని అంశాలు మదింపు చేసుకున్న తర్వాత దాన్ని 850 మిలియన్ డాలర్లకు తగ్గించిన సంగతి తెలిసిందే. దీన్ని స్నాప్డీల్ బోర్డు తిరస్కరించింది. ముందుగా చెప్పిన 1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్కు తగ్గట్లుగా అదనంగా 150–200 మిలియన్ డాలర్ల విలువ కోసం ప్రస్తుతం ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ పూర్తయితే దేశీ ఈ–కామర్స్ విభాగంలో ఇదే అత్యంత భారీ ఒప్పందం కానుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్లతో తీవ్ర పోటీలో స్నాప్డీల్ గణనీయంగా వెనుకబడిపోయింది. 2016 ఫిబ్రవరిలో 6.5 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్తో నిధులు సమీకరించిన స్నాప్డీల్ విలువ ప్రస్తుతం గణనీయంగా తగ్గిపోయింది. కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్బ్యాంక్ ఇప్పటికే 1 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులను రైటాఫ్ చేసేసి.. స్నాప్డీల్ను ఫ్లిప్కార్ట్కు విక్రయించేందుకు మిగతా ఇన్వెస్టర్ల మద్దతు సమీకరించింది. -
ఫ్లిప్కార్ట్ ఆఫర్ తిరస్కరించిన స్నాప్డీల్
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ కంపెనీలు ఫ్లిప్కార్ట్–స్నాప్డీల్ల మధ్య జరగాల్సిన డీల్ విఫలమయ్యింది. స్నాప్డీల్ను కొనుగోలు చేసేందుకు ప్రత్యర్థి కంపెనీ ఫ్లిప్కార్ట్ ఇచ్చిన 80–85 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 5,500 కోట్లు) ఆఫర్ను స్నాప్డీల్ బోర్డు తిరస్కరించింది. టేకోవర్ చేసేందుకు స్నాప్డీల్ను పరిశీలించే ప్రక్రియను ఇటీవల పూర్తిచేసిన ఫ్లిప్కార్ట్ ఆఫర్ చేసిన మొత్తానికి స్నాప్డీల్ అంగీకరించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. కంపెనీ వాస్తవ విలువకంటే ఈ ఆఫర్ తక్కువని స్నాప్డీల్ బోర్డు భావించినట్లు ఆ వర్గాలు వివరించాయి. అయితే ఈ తొలి ఆఫర్ తిరస్కరణకు గురైనప్పటికీ, ఈ అంశమై చర్చలు కొనసాగుతున్నాయన్నది సమాచారం. ఈ అంశమై స్నాప్డీల్, సాఫ్ట్బ్యాంక్, ఫ్లిప్కార్ట్లను సంప్రదించగా వ్యాఖ్యానించేందుకు నిరాకరించాయి. స్నాప్డీల్లో ప్రధాన వాటాదారు అయిన సాఫ్ట్బ్యాంక్ ఈ డీల్ కోసం గత కొద్దినెలలుగా ప్రయత్నాలు జరుపుతోంది. స్నాప్డీల్ వ్యవస్థాపకులు కూనల్ బెహెల్, రోహిత్ బన్సాల్లు కూడా బోర్డులో వున్నారు. ఈ డీల్ జరిగితే ఇండియా ఈ–కామర్స్ రంగంలో అతిపెద్ద టేకోవర్ అవుతుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ల పోటీతో కొద్ది నెలలుగా స్నాప్డీల్ వ్యాపారం తగ్గుతూ వస్తోంది. 2016 ఫిబ్రవరిలో స్నాప్డీల్ను 650 కోట్ల డాలర్లకు విలువకడుతూ పెట్టుబడులు రాగా, తాజా ఫ్లిప్కార్ట్ ఆఫర్ ప్రకారం 100 కోట్ల డాలర్లలోపునకు విలువ తగ్గడం గమనార్హం. -
ఫ్లిప్కార్ట్, స్నాప్ ’డీల్’ కు ప్రేమ్జీ బ్రేక్!
♦ చిన్న ఇన్వెస్టర్లకు చెల్లింపులపై ♦ ప్రేమ్జీ ఇన్వెస్ట్ అభ్యంతరాలు ♦ డీల్ స్వరూపంపై స్పష్టత ♦ ఇవ్వాలంటూ స్నాప్డీల్ బోర్డుకు లేఖ ముంబై: దేశీ ఆన్లైన్ షాపింగ్ దిగ్గజాలు ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ విలీనానికి అవరోధాలు కొనసాగుతున్నాయి. స్నాప్డీల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు తలో రకంగా పరిహారం లభించేలా ఉన్న డీల్ స్వరూపంపై తాజాగా ప్రేమ్జీ ఇన్వెస్ట్ సంస్థ అభ్యంతరాలు లేవనెత్తింది. దీంతో మొత్తం విలీన ఒప్పందానికే విఘాతం కలగడమో లేదా స్నాప్డీల్ వేల్యుయేషన్ను మరింతగా తగ్గించడమో జరిగే పరిస్థితి నెలకొంది. విలీన ప్రతిపాదన ప్రకారం స్నాప్డీల్లో పెట్టుబడులు పెట్టిన ప్రారంభ దశ ఇన్వెస్టర్లు కలారి క్యాపిటల్, నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్కి ప్రత్యేకంగా 60 మిలియన్ డాలర్లు లభించనున్నాయి. అలాగే స్నాప్డీల్ వ్యవస్థాపకులు కునాల్ బెహల్, రోహిత్ బన్సల్కి 30 మిలియన్ డాలర్లు దక్కనున్నాయి. ఉద్యోగులకు 30 మిలియన్ డాలర్ల మేర ప్రత్యేక చెల్లింపుల రూపంలో ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ నెలాఖర్లోగా లేదా జూలై ప్రారంభంలో మదింపు ప్రక్రియ పూర్తి కాగలదని అంచనా. డీల్ సాకారమైతే దేశీ ఈ–కామర్స్ రంగంలో ఇదే అత్యంత భారీ ఒప్పందం కాగలదు. అయితే, స్నాప్డీల్లో కొంత మొత్తం ఇన్వెస్ట్ చేసిన ప్రేమ్జీ ఇన్వెస్ట్(ఐటీ దిగ్గజం విప్రో అధినేత అజీం ప్రేమ్జీ సంస్థ).. ఉద్యోగుల ప్యాకేజీకి ఓకే చెప్పినప్పటికీ.. ప్రారంభదశ ఇన్వెస్టర్లు, వ్యవస్థాపకులకు ఇవ్వనున్న ప్రత్యేక ప్యాకేజీపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ స్నాప్డీల్ బోర్డుకు లేఖ రాసినట్లు సమాచారం. షేర్హోల్డర్లందరికీ సమాన ప్రయోజనాలు కల్పించాలని, డీల్ నిబంధనలపై మరింత స్పష్టతనివ్వాలని ప్రేమ్జీ ఇన్వెస్ట్ సూచించింది. తాజా పరిణామాల నేపథ్యంలో స్నాప్డీల్కు అడ్వైజర్గా వ్యవహరిస్తున్న ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ క్రెడిట్ సూసీ రంగంలోకి దిగింది. డీల్ సాకారమయ్యేలా.. మైనారిటీ ఇన్వెస్టర్లలో ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నిస్తోంది. వేల్యుయేషన్కు మరింతగా కోత పడే అవకాశాలు.. పోటీ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్కు దీటుగా కార్యకలాపాలు విస్తరించేందుకు నిధులు సమీకరించుకోలేక స్నాప్డీల్ కొన్నాళ్లుగా గడ్డుకాలం ఎదుర్కొంటోంది. ఒకప్పుడు 6.5 బిలియన్ డాలర్ల మేర పలికిన స్నాప్డీల్ వేల్యుయేషన్ ప్రస్తుతం బిలియన్ డాలర్ల స్థాయికి పడిపోయింది. ఈ నేపథ్యంలో అందులో పెట్టుబడులున్న సాఫ్ట్బ్యాంక్ గ్రూప్.. దాన్ని ఫ్లిప్కార్ట్లో విలీనం చేసే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. స్నాప్డీల్ ఇన్వెస్టర్లంతా ఒప్పుకుంటేనే ఒప్పందంపై ముందుకెడతామంటూ ఫ్లిప్కార్ట్ షరతు విధించడంతో .. ఒప్పందంపై సాఫ్ట్బ్యాంక్ ఇతర ఇన్వెస్టర్ల మద్దతు కూడా కూడగట్టింది. తాజాగా ప్రేమ్జీ ఇన్వెస్ట్ అభ్యంతరాలతో సమస్య మరింత జటిలంగా మారనుంది. దీంతో స్నాప్డీల్ వేల్యుయేషన్ మరింత తగ్గొచ్చనేది పరిశ్రమ వర్గాల అంచనా. స్నాప్డీల్లో రతన్ టాటా, ఇంటెల్ క్యాపిటల్, బెస్సీమర్ వెంచర్ పార్ట్నర్స్, బ్లాక్రాక్, టెమాసెక్లకు వాటాలున్నాయి. -
ఇరకాటంలో పడ్డ ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ డీల్
ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ విలీనానికి అజిమ్ ప్రేమ్ జీ మెలక పెట్టారు. ఈ డీల్ తుదిఆమోదం పొందితే, మైనార్టీ షేర్ హోల్డర్స్ హక్కులను ఎలా రక్షిస్తారని ప్రేమ్ జీ పెట్టుబడుల సంస్థ ప్రశ్నించింది. ఫ్లిప్ కార్ట్ కొనాలనుకుంటున్న స్నాప్డీల్ లో విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్ జీకి మైనార్టీ స్టేక్ ఉంది. ఈ విషయంపై మరోసారి స్పష్టమైన వివరణ ఇవ్వాలని ప్రేమ్జీ పెట్టుబడుల సంస్థ అడుగుతోంది. దీంతో ఈ డీల్ మరికొంత కాలం ఆలస్యమయ్యే అవకాశముందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కొన్ని నెలలుగా ఈ పెట్టుబడుల సంస్థ దీనిపై తమకు క్లారిటీ కావాలని అడుగుతూనే ఉంది. ఇతర మైనార్టీ ఇన్వెస్టర్ల ఆందోళనలను కూడా ఈ సంస్థ కంపెనీ బోర్డు సభ్యుల ముందు ఉంచుతోంది. అంతేకాక ఈ విలీన డీల్ లో స్నాప్ డీల్ ఇద్దరి సహవ్యవస్థాపకులకు, మరో ఇద్దరికి స్పెషల్ చెల్లింపులు చేయాలని బోర్డు సభ్యులు నిర్ణయించారు. కానీ దీనికి ప్రేమ్జీ ఇన్వెస్ట్ అడ్డుచెబుతోంది. బుధవారం స్నాప్ డీల్ బోర్డుకు రాసిన లేఖలో ఎంపికచేసిన స్నాప్ డీల్ షేర్ హోల్డర్స్, వ్యవస్థాపకులు చెల్లించే 90మిలియన్ డాలర్లు తమకు ఆమోదయోగ్యంగా లేవని, ఉద్యోగులకు చెల్లిదామనుకున్న 30 మిలియన్ డాలర్ల స్పెషల్ పేమెంట్ల ప్రతిపాదన తమకు సమ్మతమేనని ప్రేమ్జీ ఇన్వెస్ట్ పేర్కొంది. ఈ తారతమ్యంతో కూడిన పేమెంట్లు, కేవలం పెద్ద స్నాప్ డీల్ ఇన్వెస్టర్లకు, వ్యవస్థాపకులకు మాత్రమే మేలు చేకూరుతుందని ప్రేమ్ జీ ఇన్వెస్ట్ ఆందోళన వ్యక్తంచేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థను తక్కువ విలువ కట్టి, ఫ్లిప్ కార్ట్ కు అమ్మబోతున్నారు. ఒకప్పుడు 40వేల కోట్లతో స్నాప్ డీల్ ను కొనడానికి ముందుకొచ్చిన సంస్థలు, తర్వాత దానిలో పావు శాతం ఇవ్వడానికి కూడా సముఖత వ్యక్తంచేయలేదు. దీంతో స్నాప్ డీల్ సంస్థకు తక్కువ విలువ కట్టి ఫ్లిప్ కార్ట్ కు అమ్మేస్తున్నారు. ఈ డీల్ ను జూన్ వరకు ముగించేయాలని స్నాప్ డీల్ అతిపెద్ద వాటాదారు అయిన సాఫ్ట్ బ్యాంకు నిర్ణయించింది. కానీ ఈ ప్రక్రియ మరికొంత కాలం ఆలస్యమయ్యేటట్టు కనిపిస్తోంది. ప్రేమ్జీ ఇన్వెస్ట్ తో పాటు రతన్ టాటా, ఫాక్స్ కాన్, అలీబాబా గ్రూప్, ఆంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్, ఈబే, హాంకాంగ్ ఆధారిత హెడ్జ్ ఫండ్స్ స్నాప్ డీల్ లో ఇన్వెస్టర్లుగా ఉన్నాయి. వీరందరూ 40 శాతం కలిగి ఉన్నారు. కానీ వీరు బోర్డు బాధ్యతను నిర్వర్తించడం లేదు. -
ఫ్లిప్కార్ట్లో విలీనంతో స్నాప్డీల్ ఉద్యోగులకు పండుగే!
రూ.193 కోట్ల బొనాంజా ప్రకటించనున్న స్నాప్డీల్ వ్యవస్థాపకులు! న్యూఢిల్లీ: సాధారణంగా ఏదైనా కంపెనీని వేరొక కంపెనీకి అమ్మేస్తున్నారంటే.. అక్కడి ఉద్యోగుల్లో గుబులు, ఆందోళన అనేవి సహజమే. అయితే, ఫ్లిప్కార్ట్లో త్వరలో విలీనం అయ్యే అవకాశం ఉన్న ఈ–కామర్స్ సంస్థ స్నాప్డీల్ సిబ్బందికి మాత్రం పంట పండనుంది. ఈ డీల్ కనుక సాకారం అయితే, తమకు లభించనున్న పారితోషికం(పేఅవుట్)లో సగాన్ని(3 కోట్ల డాలర్లు–దాదాపు రూ.193 కోట్లు) తమ సిబ్బందికి పంచేయాలని కంపెనీ వ్యవస్థాపకులు(కునాల్ బహల్, రోహిత్ బన్సల్) నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు తగిన చెల్లింపు స్కీమ్ను రూపొందించాల్సిందిగా స్నాప్డీల్ డైరెక్టర్ల బోర్డుకు వ్యవస్థాపకులు సూచించారని.. విలీన ఒప్పందం విషయంలో సిబ్బందికి ఎలాంటి ఇబ్బందీ ఉండదన్న భరోసా కల్పించేందుకే ఈ ప్రతిపాదన చేసినట్లు ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం స్నాప్డీల్లో 1,500–2000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు అంచనా. కాగా, గడిచిన ఏడాది కాలంలో కంపెనీని వీడిన కొంతమంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు కూడా ఈ చెల్లింపు స్కీమ్తో ప్రయోజనం లభించనుంది. గతంలో వారికి ఇచ్చిన ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్(ఎసాప్స్)కు అనుగుణంగా తగిన మొత్తాన్ని చెల్లించేలా చూడాలని వ్యవస్థాపకులు భావిసున్నారు. స్నాప్డీల్లో మెజారిటీ వాటాదారు అయిన జపాన్ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్.. ఫ్లిప్కార్ట్లో విలీనం చేసేందుకు స్నాప్డీల్లోని మిగతా ఇన్వెస్టర్లందర్నీ ఇప్పటికే ఒప్పించింది. దీంతో అతిత్వరలోనే ఈ విలీన డీల్ను ప్రకటించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. విలీనానికి స్నాప్డీల్ వ్యవస్థాపకులు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. విలీన డీల్ ద్వారా వ్యవస్థాపకులకు 6 కోట్ల డాలర్ల నగదు మొత్తం లభిస్తుందని అంచనా. కాగా, ప్రస్తుతం స్నాప్డీల్లో సాఫ్ట్బ్యాంక్కు 30 శాతం వాటా ఉంది. మిగతా ఇన్వెస్టర్లలో నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్కు 10 శాతం, కలారి క్యాపిటల్కు 8 శాతం చొప్పున వాటాలున్నాయి. అమెరికా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్తో పాటు దేశీ అగ్రగామి ఫ్లిప్కార్ట్తో పోటీలో స్నాప్డీల్ వెనుకపడటమే కాకుండా.. ఇటీవల ఆర్థికపరమైన ఇబ్బందుల్లో కూడా కూరుకుపోయిన సంగతి తెలిసిందే. 2016 ఫిబ్రవరిలో దాదాపు 6.5 బిలియన్ డాలర్లమేర విలువ(వేల్యుయేషన్)ఉన్న స్నాప్డీల్కు... ఇప్పుడు ఫ్లిప్కార్ట్తో విలీనం డీల్లో కేవలం 1 బిలియన్ డాలర్ల మేర మాత్రమే విలువ దక్కుతుందని అంచనా వేస్తున్నారు. -
గతవారం బిజినెస్
సాఫ్ట్బ్యాంక్ పెట్టుబడులు ఆవిరి జపాన్ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ గ్రూప్కు భారత్లో పెట్టుబడులు అంతగా కలిసి రావడం లేదు. క్యాబ్ ఆగ్రిగేటర్ ఓలా, ఈకామర్స్ సంస్థ స్నాప్డీల్లో భారీగా పెట్టిన పెట్టుబడుల విలువ గణనీయంగా తరిగిపోతోంది. ఈ రెండింటిలో పెట్టిన పెట్టుబడుల విలువ ఏకంగా రూ.9 వేల కోట్ల మేర కరిగిపోయినట్లు సాఫ్ట్బ్యాంక్ వెల్లడించింది. గృహ రుణాలకు ఎస్బీఐ రేట్లు తగ్గాయ్ ఎస్బీఐ చౌక గృహ రుణ రేట్లను పావు శాతం వరకూ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో బ్యాంక్ కొత్తగా రుణం తీసుకునే మహిళా ఉద్యోగులకు సంబంధించి అతి తక్కువగా 8.35 శాతం వడ్డీరేటును అమలు చేయనుంది. కాగా ఎస్బీఐ ఈ ఆర్థిక సంవత్సరంలో క్యాపిటల్ మార్కెట్ నుంచి ఎఫ్పీఓ లేదా క్విప్ ద్వారా నిధులు సమీకరించాలని భావిస్తోంది. ఆర్బీఐ వాచ్లిస్ట్లో ఐడీబీఐ బ్యాంక్ ఎన్పీఏలు భారీగా పేరుకుపోయిన నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంకు విషయంలో సత్వర దిద్దుబాటు చర్యలకు ఆర్బీఐ ఉపక్రమించింది. దీంతో కొత్త రుణాలు మంజూరు చేయడం, డివిడెండ్ పంపిణీ తదితర కార్యకలాపాలపై పరిమితులు అమల్లోకి రానున్నాయి. తమ సంస్థలో అధిక ఎన్పీఏలు, ఆస్తులపై రాబడులు ప్రతికూలంగా ఉండటం వంటి అంశాల కారణంగా ఆర్బీఐ మే 5న సత్వర దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్లు ఐడీబీఐ బ్యాంకు వెల్లడించింది. ఈక్విటీ ఎంఎఫ్ల్లోకి నిధుల ప్రవాహం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి ఏప్రిల్ నెలలో రూ.9,429 కోట్లమేర పెట్టుబడులు వచ్చాయి. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపడం సహా ఫండ్ హౌస్లు మ్యూచువల్ ఫండ్స్ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం కోసం తీసుకున్న పలు చర్యలు ఇన్వెస్ట్మెంట్ల పెరుగుదలకు కారణంగా ఉన్నాయి. సత్యం కేసులో సెబీ ఉత్తర్వులు చెల్లవు: శాట్ సత్యం కంప్యూటర్స్ కేసుకు సంబంధించి దాని వ్యవస్థాపకుడు బి.రామలింగరాజుతో సహా మరి కొందరికి వ్యతిరేకంగా సెబీ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) తోసిపుచ్చింది. ‘‘సెబీ ఉత్తర్వులు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి వాటిని తోసిపుచ్చుతున్నాం. నాలుగు నెలల్లో తాజా ఉత్తర్వులివ్వాల్సిందిగా సెబీని ఆదేశిస్తున్నాం’’ అని శాట్ స్పష్టం చేసింది. కాగా రామలింగరాజు తదితరులు ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని, మోసపూరిత కార్యకలాపాలకు దిగారని సెబీ ఇచ్చిన ఉత్తర్వులతో శాట్ కూడా ఏకీభవించింది. ఐఐపీ, టోకు ధరల బేస్ ఇయర్ల మార్పు.. దేశ స్థూల ఆర్థిక గణాంకాలను కేంద్రం విడుదల చేసింది. ఇందులో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) లెక్కలు మార్చి నెలవి కాగా, టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, వినియోగ ధరల సూచీ ఆధారిత (రిటైల్) ద్రవ్యోల్బణం అంకెలు ఏప్రిల్కు సంబంధించినవి. ఐఐపీ, టోకు ద్రవ్యోల్బణాలకు సంబంధించి బేస్ ఇయర్ను మార్చడం గణాంకాల్లో ప్రత్యేకాంశం. ఇంతక్రితం ఈ రెండు సూచీలకు బేస్ ఇయర్గా 2004–05గా ఉండేది. ఈ బేస్ ఇయర్ తాజాగా 2011–12గా మారింది. రిటైల్ ద్రవ్యోల్బ ణానికి ఇప్పటికే 2011–12 బేస్ ఇయర్గా అమలవుతోంది. డీల్స్.. రూ.1,600 కోట్లతో కొనుగోలు చేసిన లాయిడ్ కన్సూమర్ డ్యూరబుల్ బిజినెస్ డివిజన్ విలీన ప్రక్రియ పూర్తయినట్లు దేశీ ఎఫ్ఎంసీజీ దిగ్గజం హావెల్స్ ఇండియా ప్రకటించింది. ఇంజినీరింగ్ సర్వీసుల కంపెనీ టాటా టెక్నాలజీస్.. ఇసెం డా ఇంజినీరింగ్ ఏబీ కంపెనీని కొనుగోలు చేయనుంది. డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎమ్, ముంబైకి చెందిన ఈవెంట్స్, ప్రోపర్టీస్కు సంబంధించి టికెటింగ్ ప్లాట్ఫార్మ్ సంస్థ ఇన్సైడర్డాట్ఇన్లో మెజారిటీ వాటా కొనుగోలు కోసం 3 కోట్ల డాలర్లు (రూ.193 కోట్లు) వెచ్చించనుందని సమాచారం. వీడియోకాన్ డీ2హెచ్ను విలీనం చేసుకోవడానికి డిష్ టీవీ కంపెనీకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నుంచి ఆమోదం లభించింది. -
స్నాప్‘డీల్ ’కు ఇన్వెస్టర్లు సై
ఇక ఫ్లిప్కార్ట్కు విక్రయించటం లాంఛనమే! ► ఎట్టకేలకు నెక్సస్ వెంచర్స్ను ఒప్పించిన సాఫ్ట్బ్యాంక్ ► డీల్ ప్రకారం వ్యవస్థాపకులకు చెరో 30 మిలియన్ డాలర్లు ► నెక్సస్కు 80 మిలియన్ డాలర్లు; కలారికి 70–80 మిలియన్ డాలర్లు న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థ స్నాప్డీల్ విక్రయం దిశగా మరో అడుగు ముందుకు పడింది. పోటీ సంస్థ ఫ్లిప్కార్ట్కు దీన్ని విక్రయించే ప్రతిపాదనకు కంపెనీలో కీలకమైన ఇన్వెస్టరు నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్ (ఎన్వీపీ) ఎట్టకేలకు ఆమోదముద్ర వేసింది. ఎన్వీపీ నుంచి ఆమోదం కోసం సహ ఇన్వెస్టరు సాఫ్ట్బ్యాంక్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వ్యవస్థాపకులు, ఇంకో ఇన్వెస్టరు కలారి క్యాపిటల్ నుంచి సాఫ్ట్బ్యాంక్ ఆమోదముద్ర దక్కించుకుంది. అయితే, వేల్యుయేషన్ ఆమోదయోగ్యంగా లేకపోవడంతో ఎన్వీపీ మాత్రం అంగీకారం తెలపలేదు. దీంతో గత కొద్ది వారాలుగా ప్రతిష్టంభనను తొలగించే క్రమంలో ఎన్వీపీతో సాఫ్ట్బ్యాంక్ చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా రెండు సంస్థల మధ్య పలు దఫాలుగా సమావేశాలు జరిగిన నేపథ్యంలో స్నాప్డీల్ విక్రయ ప్రతిపాదనకు ఎన్వీపీ ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ఈ వారంలోనే ఫ్లిప్కార్ట్తో లాంఛనంగా ఒప్పందంపై సంతకాలు జరగొచ్చని, సాధ్యాసాధ్యాలు.. లాభనష్టాల మదింపు ప్రారంభం కావొచ్చని తెలిసింది. డీల్ ప్రకారం స్నాప్డీల్ వ్యవస్థాపకులకు చెరో 30 మిలియన్ డాలర్లు చొప్పున... అంటే దాదాపు రూ.192 కోట్ల వంతున దక్కుతాయి. ఎన్వీపీకి 80 మిలియన్ డాలర్లతో పాటు విలీన సంస్థలో కొంత వాటాలు కూడా లభిస్తాయి. మరో ఇన్వెస్టరు కలారి క్యాపిటల్కు 70–80 మిలియన్ డాలర్లు దక్కవచ్చు. అయితే, దీనిపై స్నాప్డీల్, సాఫ్ట్బ్యాంక్, ఎన్వీపీ, కలారి స్పందించలేదు. భారీగా పడిపోయిన స్నాప్డీల్ వేల్యుయేషన్ .. గతేడాది ఫిబ్రవరిలో ఆఖరుసారిగా నిధులు సమీకరించినప్పుడు 6.5 బిలియన్ డాలర్లుగా ఉన్న స్నాప్డీల్ వేల్యుయేషన్ ఇప్పుడు గణనీయంగా పడిపోయింది. ఫ్లిప్కార్ట్ గానీ కొనుగోలు చేసిన పక్షంలో 1 బిలియన్ డాలర్లుగా లెక్క కట్టే అవకాశముందని పరిశీలకుల అంచనా. స్నాప్డీల్లో సాఫ్ట్బ్యాంక్కు 30 శాతం పైగా, నెక్సస్కు సుమారు 10 శాతం, కలారికి 8 శాతం వాటాలు ఉన్నాయి. స్నాప్డీల్ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కంపెనీలో పెట్టిన పెట్టుబడులపై 2016–17లో దాదాపు 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 6,500 కోట్లు) నష్టం వచ్చినట్లు సాఫ్ట్బ్యాంక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
'స్నాప్డీల్-ఫ్లిప్కార్ట్' డీల్కు నెక్సస్ ఓకే
ముంబై: అతిపెద్ద ఈ -కామర్స్ విలీనానికి సిద్ధమైన జపనీస్ బ్యాంకింగ్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్ కీలకమైన అనుమతి సాధించింది. సాఫ్ట్బ్యాంక్ కో ఇన్వెస్టర్ నెక్సస్ వెంచర్ పార్టనర్స్ (ఎన్వీపీ) ఈ మెగాడీల్కు ఒకే చెప్పింది. ఈ విక్రయ ప్రణాళికతో ముందుకు వెళ్లడానికి ఎన్వీపీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవలే మరో ఫౌండర్ కలారీ అనుమతిని సాధించిన సాఫ్ట్ బ్యాంక్, స్నాప్డీల్ లో అతి పెద్దవాటాదారుగా ఈ అమ్మక ఒప్పందానికి మరింత చేరువైంది. ఆన్లైన్ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఈ వారంలో ఈ ఒప్పందంపై సంతకం చేసే అవకాశంది. అనంతరం వెంటనే ఈ డీల్ అమల్లోకిరానుంది. అయితే దీనిపై అధికారికంగా ఫ్లిప్కార్ట్, సాఫ్ట్బ్యాంక్ స్పందించాల్సిఉంది. తాజా నివేదికల ప్రకారం ఈ మెగాడీల్ ద్వారా స్నాప్డీల్ ఫౌండర్స్కు 25 మిలియన్ డాలర్లు దక్కనున్నాయి. మరోవైపు కొత్త సంస్థలో ఎన్వీపీ 100 మిలియన్ల డాలర్ల వాటా, కలారీకి సుమారు 70-80 మిలియన్ డాలర్లు దక్కనున్నాయి. కాగా 2016-17లో స్నాప్ డీల్ పెట్టుబడుల కారణంగా 1 బిలియన్ డాలర్లు(రూ.6,500కోట్లు) నష్టపోయినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం, సాఫ్ట్బ్యాంక్ ప్రస్తుతం స్నాప్ డీల్లో 30 శాతం వాటా, నెక్సస్ సుమారు 10 శాతం వాటాను,కలారి 8 శాతం వాటాను కలిగి ఉంది. భారత ఈ కామర్స్ రంగంలో ఇది మెగాడీల్గా నిలవనుందని ,తీవ్రమైన పోటీ ఉండనుందని మార్కెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. అలాగే భారత ఈ కామర్స్ రంగంపై పట్టుబిగించేందుకు భారీ పెట్టుబడులతో పావులు కదుపుతున్న అమెరికా ఈ కామర్స్ దిగ్గజం, ప్రధాన ప్రత్యర్థి అమెజాన్కు ఫ్లిప్కార్ట్ గట్టిషాక్ ఇవ్వడం ఖాయమంటున్నారు. -
సాఫ్ట్బ్యాంకుకు 9,000 కోట్లు హుష్
♦ పెట్టుబడులకు అచ్చిరాని భారత్ ♦ స్నాప్డీల్, ఓలాలో ఇన్వెస్ట్మెంట్స్తో భారీ నష్టాలు న్యూఢిల్లీ: జపాన్ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ గ్రూప్కు భారత్లో పెట్టుబడులు అంతగా కలిసి రావడం లేదు. క్యాబ్ ఆగ్రిగేటర్ ఓలా, ఈ–కామర్స్ సంస్థ స్నాప్డీల్లో భారీగా పెట్టిన పెట్టుబడులు విలువ గణనీయంగా తరిగిపోతోంది. ఈ రెండింటిలో పెట్టిన పెట్టుబడుల విలువ ఏకంగా రూ.9 వేల కోట్ల మేర కరిగిపోయినట్లు సాఫ్ట్బ్యాంక్ వెల్లడించింది. స్నాప్డీల్లో పెట్టుబడుల కారణంగా సుమారు 1 బిలియన్ డాలర్ల మేర (దాదాపు రూ. 6,500 కోట్లు) నష్టాలు చవిచూడాల్సి వచ్చినట్లు తెలిపింది. ఈ మొత్తం 2016–17లో స్నాప్డీల్లో పెట్టిన పెట్టుబడులకు దాదాపు సమానం. ‘భారత ఈ కామర్స్ మార్కెట్లో పోటీ గణనీయంగా పెరిగిపోవడంతో సంస్థ వ్యాపార పనితీరు ఆశించిన దాని కన్నా తక్కువ స్థాయిలో ఉంది’’ అని ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా సాఫ్ట్బ్యాంక్ తెలిపింది. ‘అకౌంటింగ్ విధానాలు, కరెన్సీ హెచ్చుతగ్గులు, మార్కెట్ పరిణామాలకు అనుగుణంగా పెట్టుబడుల విలువ తరచూ పెరుగుతుండటం లేదా తగ్గుతుండటం జరుగుతుంది. తాజా ఫలితాలు పూర్తి ఆర్థిక సంవత్సరం చోటుచేసుకున్న పరిణామాలను ప్రతిఫలిస్తాయి‘ అని పేర్కొంది. భారత మార్కెట్లో సుమారు 10 బిలియన్ డాలర్ల పైగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించిన సాఫ్ట్బ్యాంక్... ప్రస్తుతం స్నాప్డీల్ను ఫ్లిప్కార్ట్కు విక్రయించే ప్రణాళికపై కసరత్తు చేస్తోంది. ఈ ప్రతిపాదనకు దాదాపుగా స్నాప్డీల్ బోర్డు సభ్యులందరి దగ్గర్నుంచీ మద్దతు దక్కించుకున్న సాఫ్ట్బ్యాంక్ .. మరో కీలక ఇన్వెస్టరైన నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్(ఎన్వీపీ) ఆమోదం కోసం ప్రయత్నిస్తోంది. ఎన్వీపీ కూడా విక్రయ ప్రతిపాదన పట్ల సుముఖంగా మారుతున్న నేపథ్యంలో త్వరలోనే ఈ డీల్కు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సమస్యల్లో స్టార్టప్లు .. దేశీ సంస్థ ఫ్లిప్కార్ట్, అటు అమెరికన్ సంస్థ అమెజాన్ వంటి దిగ్గజాలతో పోటీపడలేక చతికిలబడిన స్నాప్డీల్ ప్రస్తుతం దేశీ ఈకామర్స్ మార్కెట్లో .. మూడో స్థానంలో ఉంది. సుమారు 6.5 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్తో స్నాప్డీల్ 2016 ఫిబ్రవరిలో నిధులు సమీకరించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం బిలియన్ డాలర్లకే ఫ్లిప్కార్ట్కు దీన్ని విక్రయించే అవకాశాలు ఉన్నట్లు అంచనా. ఇక, సాఫ్ట్బ్యాంక్ ఇన్వెస్ట్ చేసిన మరో స్టార్టప్ ఓలా కూడా తీవ్రమైన పోటీ ఎదుర్కొంటోంది. అమెరికాకు చెందిన ప్రత్యర్థి సంస్థ ఉబెర్ భారీగా పెట్టుబడులు కుమ్మరిస్తూ దూసుకుపోతోంది. దీంతో ఓలా కూడా నిధులను కుమ్మరించక తప్పడం లేదు. భారీగా ప్రకటనలు, ప్రచార కార్యక్రమాలు, ఉద్యోగుల వ్యయాలతో 2015–16లో కన్సాలిడేటెట్ ప్రాతిపదికన ఓలా దాదాపు రూ. 2,311 కోట్ల నష్టాలు ప్రకటించింది. -
సాఫ్ట్ బ్యాంకుకు 9వేల కోట్లు హుష్ కాకి
న్యూఢిల్లీ : భారత్ లో పెట్టుబడులతో జపనీస్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంకు గ్రూప్ భారీ నష్టాలను మూటగట్టుకుంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను 1.4 బిలియన్ డాలర్లు లేదా 9000 కోట్లకు పైగా నష్టాలు వచ్చినట్టు ఈ గ్రూప్ బుధవారం పేర్కొంది. ముఖ్యంగా దేశీయ స్టార్టప్స్ స్నాప్ డీల్, ఓలా కంపెనీ వల్ల సాఫ్ట్ బ్యాంకుకు ఈ మేర నష్టాలొచ్చినట్టు తెలిసింది. సబ్సిడరీలు, అసోసియేట్ల షేర్లు విలువ నష్టాలతో 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 1 బిలియన్ మేర కంపెనీకి నష్టాలొచ్చాయని సాఫ్ట్ బ్యాంకు వెల్లడించింది. దానిలో స్నాప్ డీల్ మాతృ సంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్లు కలిగి ఉన్న స్టార్ ఫిష్ ఐ పీటీఈ లిమిటెడ్ ముఖ్యమైందని తెలిపింది. అంతేకాక భారత్ లో తన రెండో అతిపెద్ద పెట్టుబడుల సంస్థ ఓలా వల్ల కూడా 400 మిలియన్ డాలర్లు నష్టపోయినట్టు పేర్కొంది. దీంతో స్నాప్ డీల్, ఓలా వల్ల ఫేర్ వాల్యు వద్ద 1.4 బిలియన్ డాలర్ల నష్టాలను నమోదుచేసినట్టు వెల్లడించింది. భారత్ లో ఈ-కామర్స్ మార్కెట్లో నెలకొన్న తీవ్రమైన పోటీ, అంచనావేసిన దానికంటే మరింత తక్కువగా స్నాప్ డీల్ ప్రదర్శన ఉందని సాఫ్ట్ బ్యాంకు ఓ ప్రకటన విడుదల చేసింది. స్నాప్ డీల్ అత్యల్ప ప్రదర్శనతో స్టార్ ఫిష్ నికర ఆస్తి విలువ తగ్గిపోయినట్టు ఈ టెలికమ్యూనికేషన్ దిగ్గజం పేర్కొంది. దేశీయ స్టార్టప్ ఎకో సిస్టమ్ లో సాఫ్ట్ బ్యాంకు అతిపెద్ద ప్రైవేట్ ఇన్వెస్టర్. ఇప్పటివరకు 2 బిలియన్ డాలర్లకు పైగా(12,911 కోట్లకు పైగా) పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం స్నాప్ డీల్ ను దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కు విక్రయించాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. స్నాప్ డీల్ లో సాఫ్ట్ బ్యాంకు 900 మిలియన్ డాలర్ల(5,810కోట్లు) పెట్టుబడులు పెట్టింది. ఈ ఏడాది మొదట్లో కూడా స్నాప్ డీల్, ఓలాల వల్ల 350 మిలియన్ డాలర్ల నష్టాలు వచ్చినట్టు సాప్ట్ బ్యాంకు తెలిపిన సంగతి తెలిసిందే. -
ఇరకాటంలో పడ్డ స్నాప్ డీల్
న్యూఢిల్లీ : ఇప్పటికే నిధుల రాక తీవ్ర సంక్షోభంలో కొనసాగుతున్న దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్డీల్ ఇప్పుడు మరో ఇరకాటంలో పడింది. స్నాప్డీల్ సీఈవో కునాల్ బహల్, మరో ఇద్దరు ఎగ్జిక్యూటివ్లపై క్రిమినల్ ఫిర్యాదు దాఖలైంది. దీనిపై వారికి కోర్టు సమన్లు పంపింది. ఈ-ప్లాట్ఫామ్ ద్వారా కొనుగోలుదారులను, విక్రయదారులను కనెక్ట్ చేసే ఐడియాను అనధికారికంగా స్నాప్ డీల్ సంస్థ, దాని అధికారులు వాడుకుంటున్నారంటూ గౌరవ్ దువా అనే వ్యాపారవేత్త ఆరోపించారు. ఈ ఆరోపణలు చేస్తూ స్నాప్ డీల్, ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్లపై క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేశారు. నాన్-ఇన్వెంటరీ మార్కెట్ ప్లేస్ మోడల్ ఐడియా తనదేనని వ్యాపారవేత్త చెప్పారు. ఐపీసీ సెక్షన్లు 420 మోసం, 406 నమ్మకానికి భంగం కలిగించడం, 120బీ నేరపూరిత కుట్ర కింద తన ఫిర్యాదును దాఖలు చేశారు. అయితే ఈ కేసును ట్రయల్ కోర్టు తోసిపుచ్చగా.. సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ ను ఆ వ్యాపారవేత్త వేశారు. ఈ ఫిర్యాదుకు సంబంధించి, సంస్థ సీఈవో కునాల్కి, సీఓఓ రోహిత్ బన్సాల్, మాజీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ విజయ్ అజ్మేరాకు అడిషనల్ సెషన్స్ జడ్జి ఆర్కే త్రిపాఠి నోటీసులు జారీచేశారు. ఫిర్యాదు ప్రకారం దువా, ఇంజనీర్, వ్యాపారవేత్త. 1999లో మార్కెట్స్ఢిల్లీ.కామ్ ను, 2005లో ఇండియారిటైల్.కామ్ ను స్థాపించారు. డిజిటల్ టెక్నాలజీ ప్రయోజనాలను రిటైల్ కమ్యూనిటీకి అందించడానికి ఆయన వీటిని తీసుకొచ్చారు. అయితే నాన్-ఇన్వెంటరీ హోల్డింగ్ మార్కెట్ ప్లేస్ మోడల్ ను తీసుకొచ్చిన తనని, స్నాప్డీల్ అధికారులు మోసం చేశారని ఆరోపించారు. తన బిజినెస్లలో పెట్టుబడులు పెడుతూ తనని చీట్ చేసినట్టు పేర్కొన్నారు. -
ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ విలీనమైతే ఎవరికి లాభం?
న్యూఢిల్లీ: ఈ కామర్స్లో పోటీ పోటీగా దూసుకుపోతున్న ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ సంస్థలు ఒకదానిలో ఒకటి విలీనం అవుతాయా? అదే జరిగితే ఎవరికి ఎక్కువ లాభం ? ఎవరికి తక్కువ లాభం ? రెండింటికి లాభమేనా? ఇప్పటికే భారత్లో ‘ఈ బే’ను కొనేసిన ఫ్లిప్కార్ట్ తనకంటె వెనకబడిన స్నాప్డీల్ను కొనేందుకు ముందుకు వస్తుందా? గత కొన్ని రోజులుగా ఈ రెండు సంస్థలు కలసిపోతున్నాయన్న వార్తలు వినిపిస్తుండడంతో మార్కెట్ వర్గాల్లో ఇలాంటి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. భారత ఈ మార్కెట్ రంగంలో అమెరికా దిగ్గజ సంస్థ అమెజాన్ దూసుకుపోతున్న నేపథ్యంలో మార్కెట్లో సుస్థిర స్థానాన్ని సాధించుకోవాలంటే ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ సంస్థలు విలీనం కావాల్సిన అవసరం ఉంది. అమెజాన్ను ఎదుర్కోవాలంటే స్నాప్డీల్ మాతృసంస్థయిన జోసఫ్ ఇన్ఫోటెక్లో 35 శాతం వాటా కలిగిన జపాన్ సాఫ్ట్ బ్యాంక్ సహాయం ఫ్లిప్కార్ట్కు అవసరం. అధిక రెవెన్యూ కలిగిన ఫ్లిప్కార్ట్కు మార్కెట్లో స్నాప్డీల్ ప్రదర్శిస్తున్న దూకుడుతత్వం కూడా అవసరమేనని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ మార్కెట్లో విపరీతమైన పోటీ నెలకొనడం వల్ల అనేక సంస్థలు ఎంత చమటోడ్చినా ఆశించిన లాభాలను అందుకోలేక పోతున్నాయి. పదేళ్ల క్రితం రంగప్రవేశం చేసిన ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ సంస్థలు ఇప్పటి వరకు లాభాలు చూపించలేకపోయాయి. ఈ రెండు సంస్థలు కలసిపోవడం వల్ల ఈ మార్కెట్లో వేడెక్కిన పోటీ వాతావరణం కొంత చల్లబడుతుందని అట్లాంటాలోని పెట్టుబడుల బ్యాంకైన ‘సన్ట్రస్ట్ రాబిన్సన్ హంప్రే’ విశ్లేషకులు చెబుతున్నారు. తమ అమ్మకాల మొత్తం విలువ (జీఎంవీ) 400 కోట్ల డాలర ్లకు (25,858 కోట్ల రూపాయలు) చేరుకుందని 2014–15 సంవత్సరంలోనే ఫ్లిప్కార్ట్ ప్రకటించగా, ఆ తర్వాత కొంతకాలానికి స్నాప్డీల్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో కునాల్ బహల్ ప్రకటించారు. అమ్మకాల మొత్తం వెలువ ఎక్కువగా ఉన్నంత మాత్రాన మార్కెట్లో సుస్థిరంగా నిలవగల పరిస్థితి ఉండదని, నిర్వహణ రెవెన్యూ ఎక్కువ ఉండడం వల్లనే నిలిదెక్కుకోవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరానికి ఫ్లిప్కార్ట్ ఏకంగా 1400 కోట్ల డాలర్ల పెట్టుబడులను సేకరించగా, బొత్తిగా పెట్టుబడులులేక స్నాప్డీల్ సంస్థ సతమతమవుతున్నది. ప్రజాదరణలోనూ, అంటే యాప్స్ను డౌన్లోడ్ చేసుకున్న వారి సంఖ్యలోనూ ప్లిప్కార్ట్ ఎంతో ముందుండగా, స్నాప్డీల్ వెనకబడి పోయింది. 2016 లెక్కల ప్రకారం అనుబంధ సంస్థలైన మింత్ర, జబాంగ్లను కలుపుకొని ఫ్లిప్కార్ట్ యాప్ను దాదాపు నాలుగున్నర కోట్ల మంది ఖాతాదారులు డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ విషయంలో కూడా స్నాప్డీల్ వెనకబడే ఉన్నది. రెండు సంస్థల విలీనం వల్ల ఎక్కువ ప్రయోజనం స్నాప్డీల్కే ఉన్నప్పటికీ మార్కెట్ పోటీ పరిస్థితుల దృష్ట్యా రెండు సంస్థలు విలీనం అవడమే ఉత్తమమార్గమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
స్నాప్డీల్లో 15% వేతనాల పెంపు!
న్యూఢిల్లీ: నిధుల కొరత ఎదుర్కొంటున్న ఈ కామర్స్ దిగ్గజం స్నాప్డీల్.. ఉద్యోగుల్లో భరోసా కల్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి 15 శాతం దాకా వేతనాలు పెంచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మధ్య, జూనియర్ స్థాయి ఉద్యోగుల జీతాలు సగటున 12–15 శాతం పెరగవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. సీనియర్ మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగులకు పెంపు 9–12 శాతంగా ఉండొచ్చని... అసాధారణ పనితీరు కనపర్చిన వారికి 20–25 శాతం దాకా ఉండగలదని వివరించాయి. పే రివిజన్ ఏప్రిల్ 1 నుంచి వర్తింపచేయవచ్చని సమాచారం. ఉద్యోగులకు షేర్లు కూడా... కంపెనీ షేర్లలో 1 శాతాన్ని సుమారు 150 మంది ఉద్యోగులకు పంపిణీ చేయవచ్చని స్నాప్డీల్ వర్గాలు తెలియజేశాయి. స్నాప్డీల్ ఈ–కామర్స్ కార్యకలాపాల్లో 3,000 మంది పైచిలుకు ఉద్యోగులున్నారు. ఇది కాకుండా మొబైల్ వాలెట్ (ఫ్రీచార్జ్), లాజిస్టిక్స్ (వల్కన్) కార్యకలాపాలు కూడా కంపెనీకి ఉన్నాయి. ప్రస్తుత, మాజీ ఉద్యోగులందరికీ కలిపి స్నాప్డీల్లో ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ రూపంలో 5–6 శాతం వాటాలున్నాయి. అత్యధికంగా పెట్టుబడులున్న సాఫ్ట్బ్యాంక్ సంస్థ.. నిధుల కొరత ఎదుర్కొంటున్న స్నాప్డీల్ను విక్రయించే యత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. వేల్యుయేషన్పై ఏకాభిప్రాయం సాధించేందుకు మిగతా భాగస్వాములైన కలారి క్యాపిటల్, నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్తో కూడా సాఫ్ట్బ్యాంక్ చర్చలు జరుపుతోంది. ఇటీవలే 1.4 బిలియన్ డాలర్లు సమకూర్చుకున్న పోటీ సంస్థ ఫ్లిప్కార్ట్.. స్నాప్డీల్ కొనుగోలు రేసులో ముందుంది. -
'ఉద్యోగాల భద్రతే మాకు టాప్-ప్రియారిటీ'
బెంగళూరు : నిన్నమొన్నటిదాకా ఆన్ లైన్ షాపింగ్ లో మారుమోగిన స్మాప్ డీల్ పరిస్థితి ప్రస్తుతం అతలాకుతలంగా మారింది. ఆ నష్టాలను అధిగమించడానికి ప్రత్యర్థైన ఫ్లిప్ కార్ట్ కు స్నాప్ డీల్ ను అమ్మేస్తున్నారంటూ వార్తలు ఊపందుకున్నాయి. కానీ ఇప్పటివరకు దానిపై స్నాప్ డీల్ ఎలాంటి కామెంట్ చేయనప్పటికీ, ఉద్యోగులు మాత్రం తమ ఉద్యోగాలపై ఆందోళన చెందుతున్నారు. అయితే ఉద్యోగుల భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదని కంపెనీ వ్యవస్థాపకులు కునాల్ బహల్, రోహిత్ బన్సాల్ భరోసా ఇస్తున్నారు. కంపెనీ ఇన్వెస్టర్లు వివిధ రకాల ఆప్షన్లపై చర్చలు సాగిస్తున్నప్పటికీ.. తాము మాత్రం జాబ్ సెక్రురిటీకే టాప్-ప్రియారిటీ ఇస్తామని చెప్పారు. ఉద్యోగాలకు భరోసా ఇస్తూ ఈ మేరకు ఓ ఈ-మెయిల్ ను ఆదివారం బహల్, స్నాప్ డీల్ ఉద్యోగులకు పంపారు. ''మేము చేయగలిగిందంతా చేస్తాం.. అంతకంటే ఎక్కువ చేయడానికైనా మేము సిద్ధమే. ఇన్వెస్టర్లతో కలిసి పనిచేసేటప్పుడు, ఎంప్లాయిమెంట్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకుంటాం'' అని ఈ-మెయిల్ లో తెలిపారు. గత రెండు నెలలుగా కంపెనీ భవితవ్యంపై ఉద్యోగుల్లో నెలకొన్న అనిశ్చితిపై వ్యవస్థాపకులు భరోసా కల్పిస్తూ స్పందించడం ఇది మూడోసారి. వచ్చే రెండు వారాల్లో ఇంక్రిమెంట్లు ప్రకటించబోతున్నట్టు కూడా వ్యవస్థాపకులు పేర్కొన్నారు. శరవేగంగా దూసుకెళ్తున్న ఈ-కామర్స్ మార్కెట్లో స్నాప్ డీల్ తట్టుకోలేక, నెంబర్ -2 స్థానాన్ని కోల్పోయింది. మరోవైపు ఊహాగానాలను నిజం చేస్తూ ఫ్లిప్ కార్ట్ కు స్నాప్ డీల్ అమ్మే విషయాన్ని కంపెనీ ఈ నెలలోనే ప్రకటించబోతుందట. -
అమ్మకానికి ఫ్రీచార్జ్ రేసులో పేటీఎమ్ !
ముంబై: స్నాప్డీల్కు చెందిన మొబైల్ వాలెట్ ప్లాట్ఫార్మ్ ఫ్రీచార్జ్ను సాఫ్ట్బ్యాంక్ విక్రయించనున్నదని సమాచారం. దీనికి సంబంధించి కొన్ని సంస్థలతో సాఫ్ట్బ్యాంక్ చర్చలు జరుపుతోందని డీల్ విలువ 15–20 కోట్ల డాలర్ల రేంజ్లో ఉండొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. స్నాప్డీల్ను మరో ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ కంపెనీ ఫ్లిప్కార్ట్కు సాఫ్ట్బ్యాంక్ విక్రయించనున్నదన్న వార్తల నేపథ్యంలో ఫ్రీచార్జ్ విక్రయ వార్తలు రావడం విశేషం. కాగా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆలీబాబా యాజమాన్యంలోని పేటీఎమ్ సంస్థ ప్రీచార్జ్ ను కొనుగోలు చేయొచ్చని సమాచారం. రెండేళ్ల క్రితం ప్రీచార్జ్ను స్నాప్డీల్ మాతృసంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్ 40 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. గత ఏడాది కాలంలో నిధుల కోసం ఫ్రీచార్జ్ సంస్థ అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు పేపాల్, పేయూలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కాగా కొన్ని నెలల క్రితం ప్రీచార్జ్ను కొనుగోలు చేయడానికి విజయ శేఖర్ శర్మ నేతృత్వంలోని పేటీఎమ్ సంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్ను సంప్రదించిందని, అప్పుడు జాస్పర్ ఇన్ఫోటెక్ 50 కోట్ల డాలర్లు డిమాండ్ చేసిందని సమాచారం. ఒక దశలో ప్రీచార్జ్ విలువను 90 కోట్ల డాలర్లుగా అంచనా వేశారు. కాగా గత మూడు నెలల్లో స్నాప్డీల్, ప్రీచార్జ్లకు సంబంధించి చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు ప్రీచార్జ్ కోసం 15 కోట్ల డాలర్లనే పేటీఎమ్ ఆఫర్ చేస్తోందని సమాచారం. -
కొద్ది వారాల్లోనే స్నాప్డీల్ విక్రయ డీల్!
మద్దతు కూడగట్టే దిశగా సాఫ్ట్బ్యాంక్ న్యూఢిల్లీ: ఈ కామర్స్ సంస్థ స్నాప్డీల్ను విక్రయించే ఆలోచనతో ఉన్న జపాన్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ ఈ విషయమై తన ప్రయత్నాలను ముమ్మరం చేయనుంది. వచ్చే కొన్ని వారాల్లోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం... మంగళవారం స్నాప్డీల్ బోర్డు భేటీ జరిగింది. కంపెనీ విక్రయ ప్రతిపాదనపై ఈ భేటీలో ఏకాభిప్రాయం కుదరలేదు. స్నాప్డీల్లో సాఫ్ట్బ్యాంకు అదిపెద్ద వాటాదారునిగా ఉంది. అయినప్పటికీ విక్రయ ప్రతిపాదనకు ఇతర డైరెక్టర్ల మద్దతును కూడగట్టాలన్న ఆలోచనతో ఉంది. స్నాప్డీల్ విక్రయంపై వచ్చే 4 నుంచి 8 వారాల్లో నిర్ణయం వెలువడుతుందని ఆ వర్గాలు తెలిపాయి. స్నాప్డీల్ను దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్కు విక్రయించొచ్చంటూ ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పేటీఎం పేరు కూడా తెరపైకి వచ్చింది. పేటీఎంలో ప్రముఖ వాటాదారునిగా ఉన్న అలీబాబా స్నాప్డీల్లోనూ వాటా కలిగి ఉండడం గమనార్హం. -
మెగా మెర్జర్: ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ విలీనం?
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ఇ-కామర్స్ మెర్జర్కు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. అమెజాన్ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న స్నాప్ డీల్.. మరో ఆన్లైన్ రీటైలర్ ఫ్లిప్కార్ట్ తో విలీనం కానున్నట్టు తెలుస్తోంది. ఆన్లైన్ మార్కెట్ లో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న ఫ్లిప్కార్ట్- స్నాప్డీల్ విలీనంకానున్నాయని జాతీయ పత్రిక రిపోర్ట్ చేసింది. ఈ విలీనానికి జపనీస్ బ్యాంకింగ్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్ సారధ్యం వహిస్తోందని నివేదించింది. ఈ మేరకు ఇరు కంపెనీలతో సంప్రదింపులు నిర్వహిస్తోందట. అలాగే ఈ విలీన సంస్థలో 1 బిలియన్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టనుంది. ఈ ఉమ్మడి సంస్థకు ప్రోత్సాహాన్నిచ్చేందుకు 15 శాతం ప్రైమరీ, సెకండరీ షేర్లను కొనుగోలు చేయనుందట. అలాగే ఫ్లిప్కార్ట్లో అతిపెద్ద పెట్టుబడిదారు న్యూయార్క్ కు చెందిన టైగర్ గ్లోబల్ బిలియన్ షేర్లను విక్రయించనుంది. అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థలో ఏదో ఒకదానిలో విలీనానికి స్నాప్డీల్ సుముఖంగా ఉందని, ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఆరంభ దశలోనే ఉందని ఇటీవల వార్తలు హల్ చల్ చేశాయి. ఫ్లిప్కార్ట్లో పెట్టుబడులు పెట్టిన అమెరికా హెడ్జ్ ఫండ్ టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్తో స్నాప్డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బెహల్ సమావేశమైనట్టు కూడా వ్యాఖ్యానించాయి. ఈ వార్తలను స్నాప్డీల్ తోసిపుచ్చింది. ఇవి నిరాధారమైనవని, కంపెనీ లాభాల వైపు పురోగమిస్తోందని స్నాప్డీల్ వర్గాలు ఖండిచిన సంగతి విదితమే. మరి తాజా వార్తలపై ఎలా స్పందిస్తుందో చూడాలి. స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్ మరిన్ని నిధు లు సమీకరించుకునేందుకు కష్టాలు పడుతున్నాయి. ఈ క్రమంలో నిధుల కొరతతో కుదేలవుతున్న ప్రస్తుతం 8,000 ఉద్యోగులను కలిగి ఉన్న స్నాప్డీల్ ఖర్చులు తగ్గించుకునేందుకు ఇటీవల తన ఉద్యోగుల్లో కోత పెడుతున్నట్టు సంస్థ కో ఫౌండర్ కునాల్ స్వయంగా అంగీకరించారు. పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా షాపోకు బై బై చెపుతున్నట్టు గత నెల ప్రకటించింది. నాన్ కోర్ ప్రాజెక్టులు తొలగించడంతో పాటు లాభదాయకమైన వృద్ధిపై దృష్టి పటిష్టం తదితర పునఃవ్యవస్థీకరణ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. నివేదించారు. -
ఉద్యోగం పోయినా... నిధి ఉండాలి!
♦ వివిధ రంగాల్లో తగ్గుతున్న ఉద్యోగాలు ♦ ఉన్నట్టుండి తొలగిస్తున్న ప్రైవేటు సంస్థలు ♦ తగినంత నిధి లేకుంటే ఇబ్బందుల పాలు ♦ బీమా సహా అవసర రక్షణలు తప్పనిసరి స్నాప్డీల్ 500 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇస్తున్నట్టు చెప్పేసింది. అంటే వారికి ఉద్వాసన చెప్పినట్టే!! భారీగా ఉద్యోగాలను కల్పిస్తున్న బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో ఆటోమేషన్ కారణంగా అవకాశాలు తగ్గిపోతున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు డిసెంబర్ క్వార్టర్లో 4,500 మంది ఉద్యోగులను తగ్గించుకుంది. టెలికం కంపెనీలు కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అసలు ఏ రంగంలో పరిస్థితులు ఎప్పుడెలా మారతాయో తెలియని పరిస్థితి. మరి ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోతే? అప్పటి వరకు జీతంతో సాఫీగా సాగిపోతున్న ప్రయాణానికి స్పీడ్ బ్రేకర్లు ఎదురైతే...? ఆదుకునేందుకు ఓ నిధి తప్పనిసరి. ఉద్యోగం ఊడినా ఈ నిధితో మళ్లీ ఉద్యోగం వచ్చే వరకూ కుటుంబ అవసరాలు తీరాలి. అందుకే ముందుచూపుతో జాబ్ లాస్ ఫండ్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇటువంటి ఆకస్మిక పరిణామాలను సులభంగా తట్టుకోవచ్చు. మన దేశంలో ప్రైవేటు రంగంలో ఉద్యోగం కోల్పోతే... దాదాపు ఎలాంటి రక్షణా ఉండదనే చెప్పాలి. కంపెనీ నుంచి వెళ్లిపోతే చెల్లించే సెవరెన్స్ పే కొన్ని సంస్థల్లోనే ఉంది. మేనేజ్మెంట్ నిపుణులకు ఉద్యోగం కోల్పోతే మూడు నుంచి ఆరు నెలలు, కొన్ని కంపెనీల్లో 12 నెలల వేతనాన్ని సెవరెన్స్ పే కింద చెల్లిస్తుంటారు. అయితే ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి నిబంధనలు లేవు. సంస్థను బట్టి మారుతుంటుంది. అందుకే ఇలాంటి వాటిని నమ్ముకోకుండా ఉద్యోగం లేని పరిస్థితికి సన్నద్ధంగా ఉండాలన్నది నిపుణుల సూచన. ఉద్యోగం పోతే పెట్టుబడులు, రుణాల చెల్లింపులు, కుటుంబ అవసరాలకు విఘాతం కలగని విధంగా ప్రణాళిక వేసుకోవాలి. కంటింజెన్సీ ఫండ్ (అత్యవసర నిధి) ప్రతి కుటుంబానికీ అత్యవసర నిధి ఎంతో అవసరం. కనీసం మూడు నుంచి ఆరు నెలల అవసరాలకు, బీమా చెల్లింపులు, రుణాల చెల్లింపులకు సరిపడా ఈ నిధిని సమకూర్చుకోవాలి. ఒకవేళ ఎక్కువ ఒత్తిళ్లతో కూడిన రంగంలో పనిచేస్తుంటే మాత్రం అత్యవసర నిధి ఏడాది అవసరాలను తీర్చేంత ఉండాలి. ఈ నిధిని షార్ట్ టర్మ్ డెట్ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉంచితే అవసరమైన వెంటనే వినియోగించుకోవటానికి అనువుగా ఉంటుంది. ఉద్యోగాన్ని బట్టి నిధి కంటింజెన్సీ ఫండ్ ఎంతన్నది చేస్తున్న ఉద్యోగం సీనియారిటీ, రంగాన్ని బట్టే ఉంటుంది. ఎందుకంటే జూనియర్ లెవల్ ఉద్యోగంలో ఉన్న వ్యక్తి ఆకస్మికంగా దాన్ని కోల్పోతే నెలల వ్యవధిలో తిరిగి వేరొక ఉద్యోగాన్ని సొంతం చేసుకోవడం సాధ్యమవుతుంది. అదే మధ్య స్థాయి ఉద్యోగి అయితే మూడు నుంచి నాలుగు నెలలు పట్టొచ్చు. ఇక వైస్ ప్రెసిడెంట్ లేదా మేనేజింగ్ డైరెక్టర్ వంటి సీనియర్ మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగం అయితే తిరిగి తనకు సరిపడే ఉద్యోగాన్ని సొంతం చేసుకునేందుకు ఏడాది పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. విమానయాన రంగంలోని వారైతే ఇంకా ఎక్కువే పట్టొచ్చు. అదే ఆరోగ్యరంగం, ఫార్మాలో ఉన్న వారు రోజుల వ్యవధిలోనే కొత్త ఉద్యోగాన్ని సొంతం చేసుకోగలరు. అందుకే తామున్న రంగం, ఉద్యోగ స్థాయిల ఆధారంగా తిరిగి ఉద్యోగం సంపాదించేందుకు గరిష్టంగా పట్టే కాలానికి అవసరాలను తీర్చేలా కంటింజెన్సీ ఫండ్ను సమకూర్చుకోవాలి. అత్యవసర నిధి జీవిత బీమా పాలసీ, వైద్య బీమా, ప్రమాద బీమా పాలసీ వార్షిక ప్రీమియాన్ని చెల్లించేదిగా ఉండాలి. సొంత కారు, ఇల్లు ఉంటే వాటి బీమాలను కూడా కవర్ చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే ఉద్యోగం లేదు కదా అని బీమా రక్షణలు అనవసరం అయిపోవు కదా. ఒకవేళ ఉద్యోగం లేదులే అనుకుని వైద్య బీమా ప్రీమియం చెల్లించడం మానేశారనుకోండి. ఉన్నట్టుండి కుటుంబంలో ఎవరైనా ఆస్పత్రి పాలైతే ఆ భారాన్ని భరించడం తలకుమించినది అవుతుంది. అందుకే ఉద్యోగం లేకున్నా బీమా రక్షణ కొనసాగాలి. అది కూడా సరిపడినంత ఉండాలి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన రిస్క్తో కూడిన పెట్టుబడులను ఉద్యోగం లేని సమయంలో సమీక్షించుకోవడం సరైనదే. ఉదాహరణకు యులిప్ పాలసీ ఉందనుకోండి. దాన్ని విక్రయించేసి నగదు చేసుకోవడం సరైనదేనని ఆర్థిక నిపుణుల సలహా. ఒకవేళ కొనసాగించదలచుకుంటే పెట్టుబడుల తీరును మార్చుకోవాలి. ఉద్యోగం లేదు గనుక రిస్క్ తగ్గించుకునేందుకు ఈక్విటీకి కేటాయింపులు తగ్గించి, డెట్కు కేటాయింపులు పెంచుకోవాలి. తిరిగి ఉద్యోగం సంపాదించిన తర్వాత మళ్లీ ఈక్విటీ కేటాయింపులు పెంచుకోవచ్చు. రుణాల్ని సమీక్షించుకోవాలి ఉద్యోగం లేకపోయినా తీసుకున్న రుణాలకు తిరిగి చెల్లింపులు ఆగకుండా కొనసాగించాలి. ఉద్యోగం లేని సమయంలో రుణం మొత్తాన్ని తీర్చేసే ఆలోచన సరైనది కాదు. ఒకవేళ ఈఎంఐ చెల్లింపులు కష్టంగా ఉంటే... రుణ కాల వ్యవధిని పెంచుకోవడం ద్వారా నెలవారీ వాయిదాను కొద్ది మేర తగ్గించుకోవచ్చు. ఇక క్రెడిట్ కార్డు రుణాలు, వ్యక్తిగత రుణాలపై వడ్డీ అధికంగా ఉండడమే కాదు, సకాలంలో చెల్లింపులు చేయకుంటే వడ్డనలు భారీగా ఉంటాయి. చెల్లింపులు కష్టమైతే తిరిగి ఉద్యోగం వచ్చే వరకు మారటోరియం విధించాలని రుణ దాతలను కోరవచ్చు. అయితే, ఇది రుణదాత ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. కొత్తగా వేరొక రుణం తీసుకుని ప్రస్తుత రుణం తీర్చివేసే ఆలోచనలు కూడా సమంజసం కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఖర్చుల తీరు మారాలి ఉద్యోగం లేకపోయినా విచక్షణా రహిత ఖర్చులు శ్రేయస్కరం కాదు. ఈఎంఐ, బీమా ప్రీమియం, ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులు తప్పనిసరి అవసరాలు. ఇక వినోదం, రెస్టారెంట్లలో విందులు, పర్యటనలు వంటి అనవసర వ్యయాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగం పోతే బీమా...? ఉద్యోగం లేని సమయంలో రక్షణ కల్పించేందుకు వీలుగా పాలసీలున్నాయి. ఉద్యోగం ఊడితే మూడు నెలల పాటు ఖర్చులకు పరిహారం చెల్లిస్తాయి. మూడు నెలల వరకు వేతనం, నెలవారీ ఈఎంఐలకు చెల్లింపులు చేస్తాయి. కానీ వీటికి కొన్ని షరతులు కూడా విధిస్తాయి. పనితీరు బాగాలేక ఉద్యోగం కోల్పోతే పరిహారం ఇవ్వవు. మోసపూరిత ఆరోపణలపై ఉద్యోగం పోయినా పరిహారం చెల్లించవు. పైగా ఉద్యోగం పోయిన దగ్గర్నుంచి 90 రోజుల పాటు కొత్తగా ఉద్యోగం చేపట్టకూడదు. అది కూడా పాలసీ కాల వ్యవధిలో ఒక్కసారి ఉద్యోగం కోల్పోతేనే రక్షణ. రెండోసారి ఉద్యోగం పోతే బీమా కవరేజీ ఉండదు. పైగా ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుంది కనుక ఇది అంత ఉపయోగకరం కాదన్నది ఆర్థిక సలహాదారుల సూచన. –సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం -
అమ్మకానికి స్నాప్డీల్..?
-
అమ్మకానికి స్నాప్డీల్..?
ఫ్లిప్కార్ట్, పేటీఎంతో చర్చలు ♦ సుమారు రూ.11,700 కోట్లకు ఆఫర్లు ♦ గతేడాదే 6.5 బిలియన్ డాలర్లు విలువ ♦ ఏడాది తిరక్కుండానే 80 శాతం విలువ ఆవిరి? ♦ పోటీని తట్టుకోలేకపోవటమే కారణం ♦ అదేమీ నిజం కాదు; అమ్మటం లేదు: స్నాప్డీల్ న్యూఢిల్లీ: పుష్కలంగా పెట్టుబడులతో ఒకప్పుడు దిగ్గజ ఈ కామర్స్ సంస్థలకు పోటీనిచ్చిన స్నాప్డీల్ ప్రస్తుతం నిధుల కొరతతో కుదేలవుతోంది. దీంతో స్నాప్డీల్ మాతృసంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్ దీన్ని విక్రయించే ప్రయత్నాల్లో పడింది. ఇందులో భాగంగా పోటీ సంస్థలైన ఫ్లిప్కార్ట్ ఇండియా, పేటీఎం ఈ–కామర్స్తో చర్చలు జరుపుతున్నట్లు తెలియవచ్చింది. అయితే ఒకప్పుడు 6 బిలియన్ డాలర్లకు పైగా (రూ.40వేల కోట్లు) విలువ పలికిన స్నాప్డీల్కు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 1.5–1.8 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9,750 కోట్లు– రూ. 11,700 కోట్ల దాకా) మేర మాత్రమే ఆఫర్ వస్తున్నట్లు తెలుస్తోంది. స్నాప్డీల్లో ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్బ్యాంక్ ఈ చర్చలకు సారథ్యం వహిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చర్చలింకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నందున డీల్ ముగిసేదాకా సాఫ్ట్బ్యాంక్ అదనంగా మరో 50 మిలియన్ డాలర్లు సమకూర్చే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఫ్లిప్కార్ట్ కన్నా కూడా పేటీఎం ఈ–కామర్స్తోనే చర్చలు కాస్త పురోగతి సాధిస్తున్నట్లు పేర్కొన్నాయి. పేటీఎంలో పెట్టుబడులున్న ఆలీబాబా టీమ్ డీల్కి సంబంధించి ఇటీవలి కాలంలో పలు సార్లు భారత్ను సందర్శించింది. ఒకవేళ నిజంగానే స్నాప్డీల్ గానీ అమ్ముడైన పక్షంలో దేశీ స్టార్టప్ వ్యాపారంలో ఇదే అతి పెద్ద డీల్ కానుంది. ఈ–కామర్స్ రంగంలో దీర్ఘకాలంలో రెండు లేదా మూడు పెద్ద సంస్థలకు మాత్రమే చోటు ఉంటుందని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటిలో ఒకటిగా అమెజాన్ ఎలాగూ ఉంటుందని పేర్కొంటున్నాయి. అత్యంత తక్కువగా ఆఫర్లు .. క్రితంసారి 2016లో నిధులు సమీకరించినప్పుడు స్నాప్డీల్ వేల్యుయేషన్ 6.5 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది గరిష్ట వేల్యుయేషన్. అయితే ప్రస్తుతం వస్తున్న ఆఫర్లు చూస్తే.. స్నాప్డీల్ ఇప్పటిదాకా సమీకరించిన నిధుల కన్నా తక్కువ మొత్తమే కనిపిస్తోంది. మరోవైపు, చర్చలు సాగిస్తున్న పేటీఎం, స్నాప్డీల్కు సంబంధించి ఇన్వెస్టర్లపరమైన సారూప్యత ఉండటం గమనార్హం. పేటీఎంలో ఇన్వెస్టర్ అయిన చైనా దిగ్గజం ఆలీబాబాలో... సాఫ్ట్బ్యాంక్కి పెట్టుబడులున్నాయి. ఇదే సాఫ్ట్బ్యాంక్ ఇటు స్నాప్డీల్లో కూడా ఇన్వెస్ట్ చేసింది. స్నాప్డీల్ ఇప్పటిదాకా దాదాపు 2 బిలియన్ డాలర్లు సమీకరించగా.. సాఫ్ట్బ్యాంక్ సుమారు 900 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. తద్వారా అత్యధిక వాటాలు (సుమారు 35 శాతం) దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే ఇటు పేటీఎం, అటు స్నాప్డీల్ మధ్య అనుసంధానకర్తగా సాఫ్ట్బ్యాంక్ వ్యవహరిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. స్నాప్డీల్లో కలారి క్యాపిటల్, నెక్సస్ క్యాపిటల్, ఆలీబాబా గ్రూప్ మొదలైన సంస్థలు కూడా ఇన్వెస్ట్ చేశాయి. పేటీఎం ఈ–కామర్స్ ఇటీవలే 200 మిలియన్ డాలర్లు ఆలీబాబా గ్రూప్ నుంచి సమకూర్చుకుంది. అటు ఫ్లిప్కార్ట్ కూడా మళ్లీ 1 బిలియన్ డాలర్లు సమీకరించుకునేందుకు చర్చల్లో ఉంది. పోటీలో వెనక్కి...: 2015 ఆఖరు నుంచి స్నాప్డీల్ మార్కెట్ వాటాను ఫ్లిప్కార్ట్, అమెజాన్ కొల్లగొడుతూ వస్తున్నాయి. దీంతో స్నాప్డీల్ మూడోస్థానానికి పడిపోయింది. 2016 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 56 శాతం పెరిగి రూ.1,457 కోట్లకు చేరినప్పటికీ .. నష్టాలు కూడా రెట్టింపై రూ. 3,316 కోట్లకు చేరాయి. పెట్టుబడుల రాక తగ్గిపోవడంతో స్నాప్డీల్ కొన్నాళ్లుగా చేతిలో ఉన్న నగదును జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తోంది. గత 3–4 నెలలుగా సిబ్బందిని తగ్గించుకుంటూ వస్తోంది. డిస్కౌంట్లనూ, మార్కెటింగ్ వ్యయాలను కూడా గణనీయంగా తగ్గించింది. ఈ పరిణామాలతో మిగతా ఈ–కామర్స్ కంపెనీలతో పోటీపడలేక చతికిలబడుతోంది. అమ్మడం లేదు: స్నాప్డీల్ వ్యాపార విక్రయ వార్తలను స్నాప్డీల్ వర్గాలు ఖండించాయి. పేటీఎం, ఫ్లిప్కార్ట్తో చర్చలు జరుపుతున్న వార్తలను కూడా తోసిపుచ్చాయి. ఇవి నిరాధారమైనవని, కంపెనీ లాభాల వైపు పురోగమిస్తోందని స్నాప్డీల్ వర్గాలు వివరించాయి. బాకీలు తీర్చాలంటూ స్నాప్డీల్ విక్రేతలకు ఎస్బీఐ ఆదేశాలు నిర్దేశిత స్థాయికి మించి పేరుకుపోయిన రుణాల బాకీలను తీర్చేయాలంటూ స్నాప్డీల్ ప్లాట్ఫాంపై అమ్మకం లావాదేవీలు జరిపే సుమారు 100 మంది విక్రేతలకు ఎస్బీఐ సూచించింది. స్నాప్డీల్ క్యాపిటల్ అసిస్ట్ ప్రోగ్రాం కింద డ్రాయింగ్ పవర్కి మించి తీసుకున్న రుణాల బకాయిలను తగ్గించుకోవాలంటూ కొంత మంది సెల్లర్స్కు అడ్వైజరీలు పంపినట్లు ఎస్బీఐ సీజీఎం (ఎస్ఎంఈ) జీకే కన్సల్ తెలిపారు. బ్యాంక్ సాధారణంగానే స్నాప్డీల్ సెల్లర్స్ అమ్మకాలను ప్రతి క్వార్టర్లోనూ సమీక్షిస్తుందని, ఒకవేళ విక్రయాలు తగ్గిన పక్షంలో ఆ మేరకు రుణ బాకీ పరిమాణాన్ని కూడా తగ్గించుకోవాలని సూచిస్తుందని ఆయన వివరించారు. అయితే, ఇది మొండి బకాయిల అంశమేమీ కాదని పేర్కొన్నారు. విక్రేతలకు చెల్లించాల్సిన మొత్తాలను స్నాప్డీల్ డిఫాల్ట్ చేసే అవకాశం ఉందంటూ ఆలిండియా ఆన్లైన్ వెండార్ అసోసియేషన్ ఇటీవలే కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. -
స్నాప్డీల్ బోర్డ్లో కబీర్ మిశ్రా
బెంగళూరు: ఈ కామర్స్ మార్కెట్ ప్లేస్, స్నాప్డీల్ కంపెనీ డైరెక్టర్గా కబీర్ మిశ్రాను సాఫ్ట్బ్యాంక్ నియమించింది. రెండేళ్లలో స్నాప్డీల్ను లాభాల్లోకి తేవడం లక్ష్యంగా ఆ సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టిన సాఫ్ట్బ్యాంక్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ నియామకం జరిగిందని సంబంధిత వర్గాలంటున్నాయి. ఆన్లైన్ వ్యాపార వ్యవహారాల్లో కబీర్ మిశ్రాకు అపారమైన అనుభవం ఉంది. -
ఫ్రీ చార్జ్ సీఈవో ఈయనే
న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్ లైన్ దిగ్గజం స్నాప్ డీల్ అనుబంధ సంస్థ ప్రీ చార్జ్ సీఈవో నియామకాన్ని చేపట్టింది. మాజీ రియల్ ఎస్టేట్ పోర్టల్ హౌసింగ్ .కామ్ ఎగ్జిక్యూటివ్ జాసన్ కొఠారి కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇటీవల ఈ పదవికి గోవింద్ రాజన్ రాజీనామా చేయడంతో కంపెనీ ఈ నియామకాన్ని చేపట్టింది. జాసన్ను సీఈవోగా ఎంపిక చేయడం ఆనందంగాఉందని స్పాప్డీల్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో కునాల్ బాల్ తెలిపారు. ఆయన ఒక బలమైన వ్యూహాత్మక మరియు బహుముఖ వ్యాపార నాయకుడని, ఇప్పటికే రెండు విజయవంతమైన సంస్థలకు సీఈవోగా, వ్యాపారవేత్తగా ఉన్నారని కొనియాడారు. సంస్థలో మరో 20 మిలియన్ డాలర్లు పెట్టేందుకు యోచిస్తున్నట్టు స్నాప్డీల్ ప్రకటించింది. మరోవైపు భారతదేశ డిజిటల్ చెల్లింపుల విప్లవం లో ఫ్రీఛార్జ్ సంస్థ ఒక కీలక పాత్ర పోషించనుందని కొఠారి అంచనా వేశారు. డిజిటల్ పరిశ్రమ 2025 నాటికి 1 ట్రిలియన్ డాలర్లను సాధిస్తుందని తెలిపారు. కాగా 2015 ఆగష్టులో ప్రీ చార్జ్ సీఈఓగా గోవిందరాజన్ బాధ్యతలను స్వీకరించారు. దాదాపుగా ఏడాదిన్నర పాటు ఆయన విశేష సేవలను అందించారు. ప్రధాన ప్రత్యర్థి అమెజాన్ నుంచి గట్టిపోటీతోపాటు సాఫ్ట్ బ్యాంక్ పెట్టుబడులను ఉపసంహరించు కోవడం ఫ్రీచార్జ్ ఇబ్బందుల్లో పడింది. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా పెట్టుబడుల కొరత తీవ్రత కారణంగా 2016 మార్చి నాటికి రూ. 235 కోట్ల నష్టాన్ని నమోదుచేసింది. అయితే ఈ ఏడాది జనవరిలో గోవింద రాజన్ రాజీనామా చేయడంతొ ఆయన స్థానంలో నూతన సిఈఓగా జాసన్ కొఠారిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. -
స్నాప్డీల్ పీకేసింది.. పేటీఎం పిలుస్తోంది!
న్యూఢిల్లీ: సంక్షోభంలో ఉన్న స్నాప్డీల్, స్టేజిల్లా వందల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకగా... వారికి పేటీఎం ఆహ్వానం పలికింది. పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ ట్విట్టర్లో ఇందుకు సంబంధించి ఓ ట్వీట్ చేశారు. వ్యాపార పునర్వ్యవస్థీకరణ కారణంగా ఢిల్లీ రాజధాని ప్రాంతంలో ఉద్యోగం కోల్పోయిన టెక్/ప్రొడక్టు ఉద్యోగులకు తాము ఆహ్వానం పలుకుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. దేశంలోని ప్రముఖ ఈ కామర్స్ సంస్థల్లో ఒకటైన స్నాప్డీల్ సుమారు 500–600 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరగా వృద్ధి చెందే క్రమంలో పొరపాట్లు చేసినట్టు స్పాప్డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్బాహ్ అంగీకరించారు. వ్యయాలు తగ్గించుకుని వ్యాపారాన్ని తిరిగి గాడిన పెట్టే క్రమంలో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. చెన్నై కేంద్రంగా నడిచే ఆన్లైన్ హోటల్ గదుల బుకింగ్ సంస్థ స్టేజిల్లా మార్కెట్లో విపరీతమైన పోటీ కారణంగా కార్యకలాపాలు నిలిపివేయాలని నిర్ణయించింది. -
ఉద్యోగాలు కావాలా? ఆయన పిలుస్తున్నారు!
న్యూఢిల్లీ : కంపెనీల పునరుద్ధరణతో ఉద్యోగాలు కోల్పోతున్న వారికి పేటీఎం ఓ అనూహ్య ఆఫర్ ప్రకటించింది. ఉద్యోగాలు కావాలనుకునే వారికి తాము ఆహ్వానం పలుకుతున్నట్టు పేర్కొంది. ఇటీవలే స్నాప్డీల్ తన ఉద్యోగుల్లో 600 మందిని తీసివేస్తున్నట్టు ప్రకటించగా.. స్టేజిల్లా మొత్తానికే తన కార్యకలాపాలను మూసివేస్తున్నట్టు తెలిపింది. దీంతో ఈ కంపెనీల్లో పనిచేసే చాలామంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు. మరోవైపు కంపెనీలు తీసుకునే ఈ నిర్ణయాలపై ఉద్యోగులు కూడా అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో స్నాప్ డీల్, స్టేజిల్లా ఉద్యోగులకు పేటీఎం ఈ బంపర్ ఆఫర్ను అందించబోతోంది. శుక్రవారం ఉదయం పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ దీనికి సంబంధించి ఓ ట్వీట్ చేశారు.'' హలో ఢిల్లీ, జాతీయ రాజధాని పరిశ్రమలోని టెక్,ప్రొడక్ట్ ఉద్యోగులారా, వ్యాపార పునరుద్ధరణతో చాలా అసంతృప్తితో ఉన్నారా? అయితే పేటీఎం, పేటీఎం మాల్ మీకు వెల్కమ్ చెబుతోంది'' అంటూ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో ఎలాంటి కంపెనీ పేరును శర్మ ప్రస్తావించనప్పటికీ, ఇటీవల స్టార్టప్లో ఉద్యోగాలు కోల్పోతున్న వారికి ఈ ఆఫర్ అందించనున్నట్టు తెలుస్తోంది. పేటీఎం తన ఈ-కామర్స్ వ్యాపారాలను విస్తరిస్తుందని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. తమ మార్కెట్ప్లేస్, బ్యాంకులో కొత్త ఉద్యోగులను తీసుకుంటున్నామని, ట్రైన్డ్, డొమైన్ ఎక్స్పర్ట్లకు వెల్కమ్ చెబుతున్నట్టు పేర్కొన్నారు. ఈ స్టార్టప్లో పనిచేసేవారందరూ మంచి వ్యక్తులేనని తాము నమ్ముతున్నట్టు, వారు తమ కల్చర్కు సరిపడతారని అధికార ప్రతినిధి చెప్పారు. లింక్డ్ ఇన్ పోస్టుల ద్వారా కూడా ఉద్యోగాలు కోల్పోతున్న వారికి పేటీఎం ఉద్యోగాలు ఆఫర్ చేస్తోంది. -
సంక్షోభంలో స్నాప్డీల్!!
-
సంక్షోభంలో స్నాప్డీల్!!
⇒ 600 మంది ఉద్యోగుల తొలగింపు ⇒ జీతం వదులుకుంటున్న వ్యవస్థాపకులు ⇒ వ్యూహాల్లో తప్పిదాలు జరిగాయని ఒప్పుకోలు న్యూఢిల్లీ: ఆన్లైన్ అమ్మకాల్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్లకు గట్టిపోటీనిస్తూవచ్చిన స్నాప్డీల్ ప్రస్తుతం సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఇటు నిధుల ప్రవాహం మందగించడం, అటు నష్టాలు పెరుగుతుండటం వంటి అంశాలతో కంపెనీ కుదేలవుతోంది. ఈ నేపథ్యంలో ప్రాధాన్యేతర కార్యకలాపాల నుంచి తప్పుకోవాలని, వ్యయాలు భారీగా తగ్గించుకోవాలని సంస్థ నిర్ణయించింది. ఇందులో దాదాపు 500–600 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. ఈ–కామర్స్ మార్కెట్ప్లేస్, మొబైల్ వాలెట్ సంస్థ ఫ్రీచార్జ్, లాజిస్టిక్స్ విభాగం వల్కన్ ఎక్స్ప్రెస్ మొదలైన అనుబంధ సంస్థల్లోని ఉద్యోగాల్లో కోత పడొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, పై స్థాయిలోని మరికొందరు ఎగ్జిక్యూటివ్స్ జీతభత్యాల్లో కూడా కోత పడనుంది. కంపెనీ వ్యవస్థాపకులు కూడా తమ జీతాలను వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. తప్పు చేశాం.. కంపెనీని లాభాల్లోకి మళ్లించేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమర్ధంగా వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని సంస్థ వ్యవస్థాపకుడు కునాల్ బెహల్.. ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా తాను, మరో వ్యవస్థాపకుడు రోహిత్ బన్సల్ జీతాన్ని పూర్తిగా వదులుకుంటున్నామని వివరించారు. మరికొందరు పైస్థాయి ఎగ్జిక్యూటివ్స్ కూడా జీతంలో కోత విధించుకోవడానికి సిద్ధపడ్డారని ఆయన పేర్కొన్నారు. తమ వ్యాపార వ్యూహాల్లో తప్పిదాలు చోటుచేసుకున్నాయని ఈ సందర్భంగా ఆయన అంగీకరించారు. ‘ఈ మార్కెట్లోకి కుప్పతెప్పలుగా పెట్టుబడులు వచ్చి పడ్డాయి. దీంతో యావత్ పరిశ్రమతో పాటు మన సంస్థ కూడా తప్పిదాలు చేయడం ప్రారంభమైంది. సరైన లాభసాటి విధానం, మార్కెట్ గురించి పూర్తిగా అంచనా వేయకుండానే వ్యాపారాన్ని విస్తరించడం మొదలుపెట్టాం. తొలి వెంచర్లో ఇంకా పట్టు సాధించకుండా.. లాభాలు చూడకుండానే ఇతరత్రా కొంగొత్త ప్రాజెక్టుల్లోకి అడుగుపెట్టాం. ప్రస్తుతం అవసరమైనదానికంటే కూడా అధిక స్థాయిలో టీమ్ను, ఇన్ఫ్రాను విస్తరించుకుంటూ పోయాం‘ అని బెహల్ పేర్కొన్నారు. కంపెనీని మళ్లీ గట్టెక్కించాలంటే.. ప్రధాన వ్యాపారంపై దృష్టిపెట్టి ప్రాధాన్యేతర వ్యాపారాల నుంచి వైదొలగడం, వ్యయాలను గణనీయంగా తగ్గించుకోవడం, సాధ్యమైనంత త్వరగా లాభాల బాట పట్టడం, వచ్చిన లాభాలనే వృద్ధికి.. కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉపయోగించుకోవడం వంటి చర్యలు అవసరమని తెలిపారు. ఈ క్రమంలో కొందరు ఉద్యోగులకు ఉద్వాసన పలకాల్సి రావడం బాధాకరమైన అంశమని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం సంస్థలో దాదాపు 8,000 మంది ఉద్యోగులు ఉన్నారు. నష్టాలతో కుదేలు.. కొన్నాళ్ల క్రితం దాకా నంబర్ వన్ స్థానానికి పోటీపడిన స్నాప్డీల్.. గత పదిహేను నెలలుగా గడ్డుకాలం ఎదుర్కొంటోంది. పెరుగుతున్న నష్టాలు, టాప్ మేనేజ్మెంట్లో మార్పులు, పోటీ సంస్థ అమెజాన్ దూకుడుగా కార్యకలాపాలు విస్తరిస్తుండటం మొదలైన వాటితో స్నాప్డీల్ ఉక్కిరిబిక్కిరవుతోంది. 2015–2016 ఆర్థిక సంవత్సరంలో స్నాప్డీల్ సిబ్బంది సంబంధిత వ్యయాలు ఏకంగా 148 శాతం ఎగిసి రూ. 911 కోట్లకు పెరిగాయి. కంపెనీ అమ్మకాలు 56% వృద్ధితో రూ. 1,457 కోట్లు నమోదు కాగా.. నష్టాలు మాత్రం రెట్టింపై రూ. 2,960 కోట్లకు పెరిగాయి. స్నాప్డీల్ ఇటీవలే మార్కెట్ప్లేస్ షాపోను మూసివేసింది. స్నాప్డీల్, ట్యాక్సీ సేవల సంస్థ ఓలాలో కూడా ఇన్వెస్ట్ చేసిన జపాన్ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ ఈ రెండింటిలో కలిపి దాదాపు రూ. 3,226 కోట్ల (475 మిలియన్ డాలర్లు) రైటాఫ్ చేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే స్నాప్డీల్ కఠిన నిర్ణయాలపై దృష్టి సారించింది. 2016 ఆఖరు నాటికి స్నాప్డీల్ మాతృసంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్ బ్యాం కు ఖాతాల్లో రూ. 1,200 కోట్లు, డిజిటల్ చెల్లింపుల అనుబంధ సంస్థ ఫ్రీచార్జ్ ఖాతాల్లో సుమారు 300–400 కోట్లు ఉన్నట్లు అంచనా. ఫ్రీచార్జ్ సీఈవో గోవింద్ రాజన్ రాజీనామా స్నాప్డీల్ టాప్ మేనేజ్మెంట్లో మార్పులు, చేర్పులు కొనసాగుతున్నాయి. తాజాగా అనుబంధ సంస్థ ఫ్రీచార్జ్ సీఈవో గోవింద్ రాజన్ రాజీనామా చేశారు. దీనికి కారణాలేంటన్నది వెల్లడి కాలేదు. 2015లో ఈ మొబైల్ వాలెట్ సంస్థను స్నాప్డీల్ కొనుగోలు చేసిన అనంతరం రాజన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా చేరారు. గతేడాది మే లో సీఈవోగా పదోన్నతి పొందారు. ఫ్రీచార్జ్కి 1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్తో సుమారు 150–200 మిలియన్ డాలర్లు సమీకరించాలని గత కొన్నాళ్లుగా కంపెనీ ప్రయత్నిస్తోంది. -
తప్పులు దొర్లాయి..ఫౌండర్స్ పూర్తి జీతం కోత
ముంబై: ఉద్యోగులను తొలగిస్తున్న వార్తలను ధృవీకరించిన దేశీయ ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ స్నాప్డీల్ వ్యవస్థాపకులు మరో సంచలన ప్రకటన చేశారు. ఫౌండర్స్ కునాల్ బహల్, రోహిత్ బన్సాల్ తమ జీతాలను వదులుకుంటున్నట్టు వెల్లడించారు. కంపెనీ వ్యూహాన్నిఅమలు చేయడంలో విఫలమయ్యామని అంగీకరించిన వీరివురు, తమ వేతనాలను 100శాతం కోతకు నిర్ణయించినట్టు చెప్పారు. బుధవారం స్నాప్డీల్ ఉద్యోగులకు రాసిన ఒక ఈ మెయిల్ లో ఈ విషయాన్ని వెల్లడించారు గత కొన్ని సంవత్సరాలుగా అద్భుతంగా సంస్థ పయనం కొనసాగినప్పటికీ..కొన్ని తప్పులు చేశామన్నారు. కచ్చితంగా ఈ కామర్స్ పరిశ్రమ, స్నాప్డీల్ ఇబ్బందుల్లో ఉందని తెలిపారు. అందుకే సంస్థను లాభాల బాట పట్టించేదుకు అటు ఉద్యోగాల కోత, ఇటు తమ వేతనాల కోత అని చెప్పారు. అయితే ఎంత కాలం అనేది మాత్రం స్పష్టం చేయలేదు. సరైన పునాది లేకుండా కంపెనీ వ్యూహం అమలులో లోపాన్ని ఒప్పుకుంటూనే, తమ వేతనాల్లో చెల్లింపులో కోత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా టీమ్ ను నియమించుకోవడంలో తప్పుదొర్లిందని పేర్కొన్నారు. అవసరమైనదానికంటే ఎక్కువమంది ఉద్యోగులనునియమించుకున్నట్టు చెప్పారు. మార్కెట్ సరిపోయే సరియైన ఆర్ధిక నమూనాతో వ్యాపారవృద్ధిని ప్రారంభించామన్నారు. లాభదాయమైన కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాం. ప్రస్తుత స్థాయి అవసరమమైన జట్టు మరియు సామర్థ్యాలనిర్మాణం ప్రారంభించామని ఈమెయిల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టీమ్ పునర్నిర్మాణంపై దృష్టిపెట్టామని చెప్పారు. అందుకే ఉద్యోగలను తొలగించేందకు నిర్ణయించామనీ,ఈ కష్టాల నుంచి గట్టెక్కి కంపెనీని తిరుగులేని లాభదాయక సంస్థగా మార్చే తమ ప్రయత్నాలలో భాగమే ఈ కుదింపు అని చెప్పారు. అలాగే రెండేళ్లలో లాభాలను ఆర్జించే తొలి ఈ-కామర్స్ కంపెనీగా స్నాప్ డీల్ ను వృద్ధి చేయనున్నామన్నారు. అన్ని బిజినెస్ లలో ఈ వద్ధిని కొనసాగించడం తమకు ప్రధానమైన అంశంగా పేర్కొన్నారు. -
ఫ్రీచార్జ్ సీఈవో రాజీనామా..
న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్లైన్ దిగ్గజం స్నాప్డీల్ అనుబంధ సంస్థ ఫ్రీచార్జ్ సీఈవో గోవింద్ రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. 2015 లో రాజన్ ఫ్రీచార్జ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. గోవింద్ రాజన్ ఆధ్వర్యంలో ఫ్రీచార్జ్ ఎదుగుదలకు విశేష కృషి చేశారని స్నాప్డీల్ సహ వ్యవస్థాపకులు కునాల్ బాల్ అన్నారు. గోవింద్ రాజన్ గతంలో భారతీ ఎయిర్టెల్కు ఎక్జిక్యూటీవ్ సీఈవోగా పనిచేసిన విషయం తెలిసిందే. ఎయిర్ టెల్ నుంచి బయటకు వచ్చాక 2015 ఆగస్టులో ఫ్రీచార్జ్ సీఈవోగా నియమితులై దాదాపు ఏడాదిన్నర్ పాటు విశేష సేవలు అందించారు.ఇకపై ఆయన స్థానంలో నూతన సీఈవోగా జాసన్ కొటారీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఫ్రీచార్జ్ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు రాజన్ తెలిపారు. గతేడాది మే నెలలో ఆనంద్ చంద్రశేఖరన్ ఫ్రీచార్జ్ నుంచి బయటకు వచ్చి ఫేస్బుక్ సంస్థలో జాయిన్ అయ్యారు. రాజన్ అనంతరం సీఈవోగా రానున్న జాసన్ కొటారీ ఎప్పుడు, ఎక్కడ బాథ్యతలు చేపడతారో తెలియాల్సి ఉంది. -
ఉద్యోగులపై వేటు వేస్తున్న స్నాప్డీల్
న్యూఢిల్లీ : దేశీయ ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ స్నాప్ డీల్ ఉద్యోగాల కోత పెడుతోంది. తమ ఈ-కామర్స్, లాజిస్టిక్స్, పేమెంట్స్ ఆపరేషన్లలో దాదాపు 600 మందిని స్నాప్ డీల్ తీసివేస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పారు. గత వారం నుంచే ఈ ప్రక్రియను స్నాప్ డీల్ ప్రారంభించిందని, మొత్తం 500 నుంచి 600 మందిని తీసివేసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లోనే వీరిని తొలగించనున్నట్టు తెలుస్తోంది. రెండేళ్లలో లాభాలను ఆర్జించే తొలి ఈ-కామర్స్ కంపెనీగా తమ జర్నీ సాగుతుందని స్నాప్ డీల్ అధికార ప్రతినిధి చెప్పారు. అన్ని బిజినెస్ లలో ఈ వద్ధిని కొనసాగించడం తమకు ప్రధానమైన అంశంగా పేర్కొన్నారు. కంపెనీలో ఇప్పటివరకు 8000 మంది ఉద్యోగులున్నారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ నుంచి స్నాప్ డీల్ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ప్రెష్ క్యాపిటల్ ను ఆర్జించడానికి కూడా స్నాప్ డీల్ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. అయితే కంపెనీ నికర రెవెన్యూలు ఈ ఆర్థిక సంవత్సరంలో 3.5 సార్లు పైకి ఎగిశాయి. ఈ రెవెన్యూలతో స్నాప్ డీల్ దేశంలోనే లాభాలను ఆర్జించే తొలి ఈ-కామర్స్ కంపెనీగా పేరొందనున్నట్టు కంపెనీ అంచనావేస్తోంది. -
విలీన బాటలో స్నాప్డీల్, పేటీఎం ఈ–కామర్స్
ముంబై: ఆన్లైన్ షాపింగ్ సంస్థ స్నాప్డీల్, పేటీఎం ఈ–కామర్స్ సంస్థ విలీనంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇది పూర్తిగా స్టాక్స్ డీల్గా ఉండొచ్చునని తెలుస్తోంది. దాదాపు నెల రోజుల క్రితమే ఈ అంశంపై చర్చలు జరిగినట్లు, ఇరుపక్షాలకూ ఆమోదయోగ్యమైతే సంప్రతింపులు మళ్లీ ప్రారంభం కావొచ్చునని సంబంధిత వర్గాలు తెలిపాయి. చెల్లింపుల బ్యాంక్ లైసెన్స్ పొందిన పేటీఎం సంస్థ ఆర్బీఐ నిబంధనల ప్రకారం మార్చి 31లోగా తమ మార్కెట్ప్లేస్ వ్యాపార విభాగాన్ని విక్రయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో స్నాప్డీల్తో ఈ–కామర్స్ వ్యాపార విభాగం విలీనంపై వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరు సంస్థల్లోనూ వాటాలు ఉన్న చైనా ఈ–కామర్స్ దిగ్గజం ఆలీబాబా ఈ డీల్కు సారథ్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలీబాబాకు పేటీఎంలో 40%, స్నాప్డీల్లో 3% వాటాలు ఉన్నాయి. పేటీఎం ఈ–కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుతం ఆలీబాబా, ఎస్ఏఐఎఫ్ పార్ట్నర్స్ నుంచి నిధులు సమీకరించే ప్రయత్నాల్లో ఉంది. ఒకవేళ స్నాప్డీల్, పేటీఎం ఈ–కామర్స్ విలీనం జరిగిందంటే కొత్తగా ఏర్పడే సంస్థలో ఆలీబాబా అతి పెద్ద వాటాదారుగా అవతరిస్తుంది. ఈ మొత్తం డీల్లో జపాన్కి చెందిన సాఫ్ట్బ్యాంక్ కూడా ప్రయోజనం పొందనుంది. స్నాప్డీల్లో భారీగా ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్బ్యాంక్కి అటు ఆలీబాబాలో కూడా గణనీయమైన వాటాలు ఉన్నాయి. ఆలీబాబా ఇటీవలే పేటీఎం ఈ–కామర్స్లో రూ. 1,350–1,700 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసింది. తద్వారా భారత మార్కెట్లో ఆన్లైన్ దిగ్గజాలు ఫ్లిప్కార్ట్, అమెజాన్లతో పోటీపడుతోంది. పేటీఎం వేల్యుయేషన్ దాదాపు 4.8 బిలియన్ డాలర్లుగా ఉంది. పేటీఎంలో రిలయన్స్ క్యాప్ వాటా సేల్..! పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్లో తమకున్న 1 శాతం వాటాను విక్రయించాలని రిలయన్స్ క్యాపిటల్ యోచిస్తోంది. తద్వారా 50–60 మిలియన్ డాలర్లు సమీకరించాలని భావిస్తోంది. అయితే రిలయన్స్ క్యాపిటల్ వర్గాలు ఈ వార్తలపై స్పందించేందుకు నిరాకరించాయి. -
రెండు నెలల్లో 30శాతం ఉద్యోగాల కోత
న్యూఢిల్లీ: దేశీయ ఇ-కామర్స్ సంస్థ స్నాప్డీల్ భారీగా ఉద్యోగుల్లో కోత పెట్టనుంది. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాబోయే రెండు నెలల్లో దాదాపు 30 శాతం ఉద్యోగులకు ఇంటికి పంపించేందకు రంగం సిద్ధం చేస్తున్నట్టు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఇటీవల భారీ ఇబ్బందుల్లో పడ్డ స్నాప్ డీల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీంతో వేలమంది ఉద్యోగులు పత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కోల్పోనున్నారు. ఇప్పటికే ఉద్యోగులకు ఉద్వాసన పలికే ప్రక్రియను ప్రారంభించినట్టు తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం వాల్యూయేషన్స్ భారీగా కుంగిపోవడం, పెట్టుబడులు క్షీణిచడంతో ఇబ్బందుల్లో పడ్డ స్నాప్ డీల్ ఉద్యోగులను కుదించుకునేందుకు రడీ అవుతోంది. ఈ మేరకు టీం మేనేజర్లకు పంపిన అంతర్గత ఈ మెయిల్ సమాచారంలో ఆదేశాలు జారీచేసింది. తమ టీంలోని సభ్యుల సంఖ్యను తగ్గించుకోవాల్సింది కోరింది. ఈ నేపథ్యంలో దాదాపు 40-50 మందిని ఇప్పటికే ఇంటికి పంపించేసింది. దీంతో పాటు స్నాప్డీల్ డైరెక్ట్ ఉద్యోగులు మరో వెయ్యిమంది దాకా, అలాగే దాదాపు 5వేలకు పైగా క ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభావితంకానున్నారు. వీరిలో 30శాతం మంది రోడ్డున పడనున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో కూడా సుమారు 200 మంది ఉద్యోగులను స్నాప్ డీల్ తొలగించింది. కాగా జపాన్కు చెందిన సాఫ్ట్బ్యాంకు కార్ప్ స్నాప్డీల్లో 6.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులపై 35 కోట్ల డాలర్ల నష్టాన్ని చవిచూసింది. దీంతో స్నాప్డీల్ లో పెట్టిన పెట్టుబడులపై ఆశించిన స్థాయిలో ఫలితాలు అందని నేపథ్యంలో డిసెంబర్తో ముగిసిన తొమ్మిది నెలలకు గాను 35 కోట్ల డాలర్లు రైటాఫ్ చేసిన సంగతి తెలిసిందే -
స్నాప్డీల్లో కొట్టేసి.. ఓఎల్ఎక్స్లో అమ్మేశారు!
నలుగురు వ్యక్తులు కలిసి మంచి ప్లాన్ వేశారు. స్నాప్డీల్ ద్వారా డెలివరీకి వచ్చే సరుకులను దారిలోనే కొట్టేసి, వాటిని ఓఎల్ఎక్స్లో పెట్టి అమ్మేశారు. ఒకటి, రెండు రోజులు కాదు.. చాలా కాలం ఇలాగే చేయడంతో చివరకు పట్టుబడ్డారు. వాళ్లలో స్నాప్డీల్ సరుకులు చేరవేసే లాజిస్టిక్స్ సంస్థలో పనిచేసే ముగ్గురు డెలియరీ బోయ్లు కూడా ఉన్నారు. ఈ నలుగురు కలిసి తప్పుడు పేర్లు, చిరునామాలతో స్నాప్డీల్లో వివిధ వస్తువులు బుక్ చేసి, ఆ తర్వాత వాటిని తీసేసుకుని వాటి స్థానంలో రాళ్లు, సబ్బులు పెట్టేసి డెలివరీ తీసుకోనట్లుగా వాటిని రిటర్న్ చేసేసేవారు. తీసుకున్న సరుకులను ఎంచక్కా ఓఎల్ఎక్స్లో అమ్మేసుకునేవారు. ఈ కేసులో ఢిల్లీకి చెందిన రవికాంత్, హరి ఓం, అమృత్, కరణ్ శర్మ అనే నలుగురిని అరెస్టు చేసి గుర్గ్రామ్ కోర్టులో ప్రవేశపెట్టారు. స్నాప్డీల్ తరఫున పార్సిల్స్ తీసుకుని వాటిని నగరంలోని వివిధ ప్రాంతాల్లో డెలివరీ చేసే వల్కన్ ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏరియా మేనేజర్ రమేష్ కుమార్ గత నెలలో ఈ వ్యవహారంపై ఫిర్ఆయదు చేశారు. విచారణలో ఈ సంస్థలో పనిచేసే డెలివరీ బోయ్లే ఈ నేరానికి పాల్పడినట్లు తేలింది. ముందుగా రవికాంత్, హరి ఓం అనే ఇద్దరు డెలివరీ బోయ్లను అరెస్టు చేయగా, వాళ్లిచ్చిన సమాచారంతో హరి ఓం అన్న కరణ్ను అరెస్టు చేశారు. అతడే మొత్తం కుట్రకు సూత్రధారి. ఖరీదైన వస్తువులు బుక్ చేసి, వాటికి క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో చెల్లింపు ఆప్షన్ పెట్టేవాడు. డెలివరీ బోయ్లు అతడి అడ్రస్ సరిగా లేదని చెప్పి వాటిని తిరిగి ఇచ్చేసేవారు. అప్పటికే లోపలి సరుకు మారిపోయేది. సరుకు విలువలో 15% మొత్తాన్ని డెలివరీ బోయ్లకు కమీషన్గా ఇచ్చేవారు. దాదాపు 50 పార్సిళ్లను ఇలా ఓఎల్ఎక్స్లో అమ్మేశారని డీసీపీ క్రైం సుమిత్ కుమార్ తెలిపారు. -
జీఎస్టీ నిబంధనలపై ఈ–కామర్స్ సంస్థల్లో ఆందోళన
న్యూఢిల్లీ: ముసాయిదా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ (టీసీఎస్) నిబంధనపై ఆన్లైన్ రిటైల్ సంస్థలు ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, అమెజాన్ ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నిబంధన వల్ల ఏటా దాదాపు రూ. 400 కోట్ల పెట్టుబడులు లాక్ అయిపోతాయని, వ్యాపారులు ఆన్లైన్లో విక్రయించడానికి ముందుకు రాబోరని పేర్కొన్నాయి. అంతే గాకుండా సుమారు 1.8 లక్షల ఉద్యోగాలకు గండిపడుతుందని ఆయా సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఈ–కామర్స్ రంగంలోకి పెట్టుబడులు రావడం తగ్గి, వృద్ధి నిల్చిపోతుందని పేర్కొన్నాయి. టీసీఎస్ నిబంధన ప్రకారం ఈకామర్స్ సంస్థలు.. తమ ప్లాట్ఫాంపై విక్రయించే వ్యాపారులకు చెల్లించాల్సిన మొత్తాల్లో కొంత భాగాన్ని మినహాయించుకుని పన్ను రూపంలో ప్రభుత్వ ఖజానాకు జమచేయాల్సి ఉంటుంది. నిత్యం ఒకదానితో మరొకటి తీవ్రంగా పోటీపడే ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్.. టీసీఎస్ విషయంలో మాత్రం ఒక్కతాటిపైకి రావడం గమనార్హం. -
భారత్లో సాఫ్ట్బ్యాంక్కు కష్టాలు..!
పెట్టుబడులపై భారీ నష్టాలు • ఓలా, స్నాప్డీల్లో ఇన్వెస్ట్మెంట్స్ విలువ 350 మిలియన్ డాలర్లు తగ్గుదల న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ సైట్ స్నాప్డీల్, ట్యాక్సీ సేవల సంస్థ ఓలా సహా భారత్కి చెందిన పలు సంస్థల్లో జపాన్ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ కార్పొరేషన్ చేసిన పెట్టుబడులు గణనీయంగా కరిగిపోయాయి. డిసెంబర్తో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో జాస్పర్ ఇన్ఫోటెక్, ఏఎన్ఐ టెక్నాలజీస్ వంటి సంస్థల్లో దాదాపు 350 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడుల విలువను తగ్గించినట్లు చేసినట్లు సాఫ్ట్బ్యాంక్ పేర్కొంది. స్నాప్డీల్కు జాస్పర్ ఇన్ఫోటెక్ మాతృసంస్థ కాగా, ఓలాను ఏఎన్ఐ టెక్నాలజీస్ నిర్వహిస్తోంది. అయితే, పెట్టుబడుల విలువను తగ్గించడాన్ని.. ఆయా కంపెనీల పనితీరును ప్రతిబింబించడంగా పరిగణించరాదని సాఫ్ట్బ్యాంక్ ప్రతినిధి పేర్కొన్నారు. సాధారణంగా అకౌంటింగ్ విధానాలు, కరెన్సీ హెచ్చుతగ్గులు తదితర అంశాల కారణంగా పోర్ట్ఫోలియో కంపెనీల్లో పెట్టుబడుల వేల్యుయేషన్స్ మారుతుంటాయని వివరించారు. సాఫ్ట్బ్యాంక్ సారథ్యంలో 2014లో ఓలాలోకి 210 మిలియన్ డాలర్లు, స్నాప్డీల్లోకి 627 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత కూడా రెండు కంపెనీల్లో సాఫ్ట్బ్యాంక్ మరింత ఇన్వెస్ట్ చేసింది. ఇప్పటిదాకా భారత్లో సాఫ్ట్బ్యాంక్ 2 బిలియన్ డాలర్ల దాకా పెట్టుబడులు పెట్టింది. వచ్చే 5–10 సంవత్సరాల్లో పెట్టుబడులను 10 బిలియన్ డాలర్ల దాకా పెంచుకోనున్నట్లు కంపెనీ ఇటీవలే ప్రకటించింది. స్నాప్డీల్ ’షాపో’.. షట్డౌన్ చిన్న తరహా వ్యాపార సంస్థల మధ్య క్రయ, విక్రయ లావాదేవీలకు తోడ్పడే ఆన్లైన్ ప్లాట్ఫాం షాపోను శుక్రవారం నుంచి మూసివేస్తున్నట్లు స్నాప్డీల్ వెల్లడించింది. 2013లో స్నాప్డీల్ దీన్ని కొనుగోలు చేసింది. ఈ తరహా సర్వీసుల వ్యవస్థకు డిమాండ్ ఏర్పడటానికి మరికొన్నేళ్లు పట్టేసే అవకాశం ఉన్నందున తాజా నిర్ణయం తీసుకున్నట్లు స్నాప్డీల్ పేర్కొంది. ఓలా సీఎఫ్వో బన్సల్ ఔట్.. ఓలా టాప్ మేనేజ్మెంట్లో మార్పులు కొనసాగుతున్నాయి. తాజాగా సీఎఫ్వో రాజీవ్ బన్సల్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రఘువేశ్ సరూప్ రాజీనామా చేశారు. వీరు ఏడాది క్రితం ఓలాలో చేరారు. బన్సల్ ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ కాగా, సరూప్ మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ ఎండీ. బన్సల్ రాజీనామాతో ప్రస్తుత సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పల్లవ్ సింగ్కు తాత్కాలిక సీఎఫ్వోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. -
ఆ స్మార్ట్ఫోన్లపై స్నాప్డీల్ బ్రిలియంట్ ఆఫర్
ముంబై: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ స్నాప్ డీల్ సోమవారం భారీ ఆఫర్ ప్రకటించింది. గూగుల్ తొలి స్మార్ట్ ఫోన్లపై భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది. ఇ-కామర్స్ సైట్ యాత్ర , ఎస్ బ్యాంక్ ఈ-క్యాష్ ద్వారా రూ. 10,000 తక్షణ క్యాష్ బ్యాక్, అలియాంజ్ నుంచి రెండు స్మార్ట్ ఫోన్లకు మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్స్ ను రూ. 5999ఉచితంగా అందిస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు గూగుల్ పిక్సెల్ తో ఆన్ లైన్ రిటైల్ భాగస్వామ్యాన్ని ప్రకటించింది. గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ రావడం ఆనందంగా ఉందని స్నాప్డీల్ వైస్ ప్రెసిడెంట్ విశాల్ చడ్డా చెప్పారు. ఇప్పటికే నాణ్యతలో కొత్త ప్రమాణాలను సృష్టించిన ఈ స్మార్ట్ ఫోన్లు తమ తాజా ఆఫర్ ద్వారా హాట్ సెల్లర్ గా నిలవనున్నాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో గూగుల్ పిక్సెల్ 128జీబీ రూ.66 వేలకు, 32 జీబీ రూ.57వేలకు అందుబాటులో ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ ( బ్లాక్ అండ్ సిల్వర్, 32 జీబీ) రూ.67 వేలకు లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ లో ఎక్సేంజ్ ఆఫర్ లో రూ 23 వేలు తగ్గింపును ఆఫర్ చేస్తోంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో ఈఎంఐ లపై రూ 8000 వరకు క్యాష్ బ్యాక్ ఉంది. యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుపై అదనంగా 5 శాతం తగ్గింపు . కాగా గూగుల్ పిక్సెల్ , ఎక్స్ఎల్ అధికారికంగా అక్టోబర్ 4న లాంచ్ అయ్యాయి. 64 గంటల బ్యాటరీ లైఫ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 1080x 1920 పిక్సెల్ రిజల్యూషన్ తదితర ఫీచర్లతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. గూగుల్ అసిస్టెంట్, వర్చువల్ రియాలిటీ సామర్థ్యం, 32-128 జీబీ మెమొరీ, 12.3-8 మెగాపిక్సెల్ కెమేరాలు, 5.5 అంగుళాల తెర, 4జీబీ ర్యామ్, 3,450 ఏంఏహెచ్ బ్యాటరీ , ఆండ్రాయిడ్ 7.1 నాట్ ఆపరేటింగ్ సిస్టమ్తో 'పిక్సెల్' స్మార్ట్ ఫోన్లను ఆవిష్కారంతో గూగుల్ స్మార్ట్ ఫోన్ల రంగంలో పోటీకి తొలి అడుగువేసిన సంగతి తెలిసిందే. -
స్నాప్డీల్ న్యూ ఇయర్ బంపర్ ఆఫర్లు
న్యూఢిల్లీ: దేశీయ కామర్స్ దిగ్గజం స్నాప్ డీల్ బంపర్ ఆఫర్స్ అనౌన్స్ చేసింది. నూతన సంవత్సరంలో వినియోగాదారులకు భారీ డిస్కౌంట్ ను ఆఫర్ చేస్తోంది. 'వెల్ కం2017' పేరుతో రెండు రోజుల అమ్మకాలకు తెర లేపింది. జనవరి 8 ,9 తేదీల్లో నిర్వహించే టు-డే సేల్ లో దుస్తులు, స్మార్ట్ ఫోన్లు, గృహోపకరణాలు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పై 70శాతం వరకు రాయితీ అందిస్తోంది. స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్ ధరలు రెడ్ మి నోట్ రూ.11,999 శామ్సంగ్ జె2 ప్రో (16జీబీ). రూ.9,490 ఐఫోన్ 5ఎస్ (16జీబీ రూ. 17,499 ఐఫోన్ 7 (32Gజీబీ ) రూ. రూ 52,999 ఐఫోన్ 6ఎస్ (32జీబీ). రూ. 43, 999 ధరల్లో అందుబాటులో ఉండనున్నాయి. అలాగే ఎస్ బీఐ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసిన వినియోగదారులకు అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తోంది. సుమారు 15శాతం రాయితీ కల్పిస్తోంది. దీనితోపాటు ప్రధాన క్రెడిట్ కార్డులతో కొనుగోలుపై ఫీజులేని ఈఎంఐ ఆప్షన్ ను ఆఫర్ చేస్తోంది. -
ఇంటి వద్దకే జియో సిమ్..ఎలానో తెలుసా?
న్యూఢిల్లీ : ఇప్పటివరకు రిలయన్స్ జియో సిమ్ కార్డు కొనలేదా? ఉచిత ఆఫర్లను వినియోగించుకోలేకపోతున్నామని ఆందోళన చెందుతున్నారా? అయితే ఎలాంటి బెంగ అవసరం లేదట. ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్డీల్ ద్వారా ఇంటి వద్దకే జియో సిమ్ డెలివరీ చేసేందుకు కంపెనీ సన్నద్ధమవుతోంది. హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ కింద జియో సిమ్లను ఇంటింటికి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే సిమ్ కార్డు కోసం ముందస్తుగా కస్టమర్లు ఈ-కామర్స్ వెబ్సైట్లో వివరాలను నమోదుచేసుకుంటే చాలట. స్నాప్డీల్ జియో సిమ్ హోమ్ డెలివరీ సర్వీసులో వివరాలు నమోదుచేసుకున్న అనంతరం యూజర్లకు డెలివరీ టైమ్, ప్రోమోకోడ్తో ఓ మెసేజ్ను పొందుతారు. రిలయన్స్ జియో సిమ్ను వెంటనే యాక్టివేట్ చేసుకోవాలనుకునే కస్టమర్లు, ప్రోమోకోడ్ను, ఆధార్ నెంబర్ను స్నాప్డీల్ డెలివరీ ఎగ్జిక్యూటివ్తో పంచుకుంటే వెంటనే సిమ్ యాక్టివేట్ ప్రక్రియ కూడా అయిపోతుందని రిపోర్టులు పేర్కొన్నాయి.. ఇప్పటికే స్నాప్ డీల్ తన కస్టమర్లకు ఈ-మెయిల్స్ పంపడం ప్రారంభించిందని, సిమ్ కార్డులను ఇంటింటికి డెలివరీ చేయనున్నామని తెలిపినట్టు తెలిసింది. స్నాప్డీల్ నుంచి ఈ-మెయిల్స్ అందిన కస్టమర్లు ఎలాంటి చెల్లింపులు అవసరం లేకుండా జియో సిమ్ కార్డును ఇంటివద్దే పొందవచ్చు. సిమ్ను యాక్టివేట్ చేసుకోవడానికి ఎలాంటి చార్జీలు చెల్లించనవసరం లేదట. సిమ్ కార్డు పొందిన వెంటనే వారు వాలిట్ లోకల్ ఆధార్ కార్డులను కంపెనీకి సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆఫర్ ఎంపికచేసిన ప్రాంతాల్లో అందుబాటులో ఉందని రిపోర్టులు చెప్పాయి. ఇటీవలే జియో ఉచిత సేవలను 2017 మార్చి 31వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ఇంటివద్దకే జియోసిమ్ లు అందిస్తూ మరో ప్రయోగం చేయబోతున్నారు. -
బీజేపీ ఐటీ సెల్ పై సంచలన ఆరోపణలు
ఆమిర్ ను తొలగించేలా స్నాప్ డీల్ పై ఒత్తిడి ఏకంగా ఐటీసెల్ చీఫ్ నుంచి ఆదేశాలు మాజీ వాలంటీర్ ఆరోపణలు గత ఏడాది నవంబర్ లో అసహనం వివాదంపై ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. మోదీ ప్రభుత్వాన్ని విమర్శించేరీతిలో ఆయన వ్యాఖ్యలు ఉండటంతో ఆయనను తన బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించేలా ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ స్నాప్ డీల్ పై ఒత్తిడి తేవాలని ఏకంగా బీజేపీ సోషల్ మీడియా సెల్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివాదంలో స్నాప్ డీల్ పై ఒత్తిడి పెంచేలా సోషల్ మీడియాలో, వాట్సాప్ లలో ప్రచారం ముమ్మరం చేయాలని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అరవింద్ గుప్తా తన శ్రేణులకు సూచించారని మాజీ వాలంటీర్ ఒకరు వెల్లడించారు. గతంలో బీజేపీ సోషల్ మీడియా సెల్ వాలంటీర్ గా పనిచేసిన సాధ్వి ఖోస్లా త్వరలో తీసుకువస్తున్న ఓ పుస్తకంలో ఈ ఆరోపణలు చేశారు. గత ఏడాది చివర్లో వాలంటీర్ గా తప్పుకొన్న ఆమె ప్రస్తుతం 'ఐ యామ్ ద ట్రోల్' పేరిట ఒక పుస్తకాన్ని తీసుకువస్తున్నారు. 2015 నవంబర్ 23న ఓ కార్యక్రమంలో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ దేశంలో అసహనం వివాదం నేపథ్యంలో తన భార్య భారత్ విడిచివెళ్లిపోదామా? అని అడిగిందని, దేశంలోని భయానక పరిస్థితి ఆమెతో అలా అనిపించిందని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమిర్ ను ఇరకాటంలో పెట్టే ప్రచారానికి బీజేపీ ఐటీ సెల్ పూనుకుందని, ఆయనను స్నాప్ డీల్ బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించేలా ఒత్తిడి తెచ్చిందని ఆమె ఖోస్లా ఆరోపించారు. ఏకంగా పార్టీ ఐటీ సెల్ చీఫ్ అరవింద్ గుప్తా ఈ విషయంలో సూచనలు ఇస్తూ వాట్సాప్ లో తనకు మెసేజ్ లు పంపించారని, అంతేకాకుండా ఆమిర్ ను తొలగించేందుకు ఉద్దేశించిన ఆన్ లైన్ పిటిషన్ పై నెటిజన్లతో సంతకాలు చేయించాలని సూచిస్తూ లింక్ కూడా పంపించారని ఆమె పేర్కొన్నారు. ఈ వివాదం నేపథ్యంలో 2016 జనవరిలో బ్రాండ్ అంబాసిడర్ గా ఆమిర్ కాంట్రాక్టు ముగియగా.. దానిని స్నాప్ డీల్ కొనసాగించలేదు. అయితే, ఈ పుస్తకంలోని ఆరోపణలను అరవింద్ గుప్తా తిరస్కరించారు. ఆమె కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నదని, తాము ట్రోల్ ను ఎప్పుడూ ప్రోత్సహించలేదని చెప్పారు. -
ఏడురోజుల నష్టాలకు బ్రేక్...
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో స్వల్ప లాభాలతో ముగిశాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడినా, వరుసగా ఏడు సెషన్ల నష్టాలకు చెక్ పెట్టి చివరకు సెన్సెక్స్, నిఫ్టీలు పాజిటివ్గా ముగిశాయి. సెన్సెక్స్ 61పాయింట్ల లాభంతో 26,040వద్ద, నిఫ్టీ 7 పాయింట్ల లాభంతో్ 7,985.75 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ మరోసారి 26వేల పాయింట్ల కీలక స్థాయిలో, నిఫ్టీ 8 వేలకు దిగువన ముగిసింది. కేపిటల్ గూడ్స్, ఆటోమొబైల్, కన్జూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు లాభాలను ఆర్జించాయి. దివీస్ కు షాక్ నేపథ్యంలో ఫార్మా నష్టపోగా ఐటీ, టెక్నాలజీ షేర్లతో పాటు స్మాల్క్యాప్, మిడ్క్యాప్ రంగాలు కూడా నష్టపోయాయి.రోజంతా సెన్సెక్స్ నారో బ్యాండ్ లోట్రేడ్ అయింది. దీంతో ఫారిన్ ఇన్వెస్టర్ల అమ్మకాల కారణంగా మార్కెట్లు ఒత్తిడిలో ఉన్నట్టు విశ్లేషకుల అంచనా. సిప్లా, బాష్, మారుతి సుజుకి, బజాజ్ ఆటో, సన్ ఫార్మా టాప్గెయినర్స్గా, హెచ్సీఎల్ టెక్ యాక్సిస్ బ్యాంక్, ఐషర్ మోటార్స్ అరబిందో ఫార్మా టెక్ మహీంద్రా టాప్ లూజర్స్గా నిలిచాయి. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి 16 పైసల లాభంతో రూ.67.83 వదఉంది. అలాగే ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. పుత్తడి రూ.33 క్షీణించి, రూ.26,935 వద్ద ఆకర్షణీయంగా ఉంది. -
ఇంటివద్దకే నగదు...స్నాప్డీల్ బంపర్ ఆఫర్
పెద్ద నోట్లు రూ.500, రూ.1000 రద్దుతో ఏర్పడిన నగదు కొరతకు దేశీయ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ దిగ్గజం స్నాప్డీల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది."Cash@Home" సర్వీసుల కింద ప్రజలకు కనీస అవసరార్థం నగదును ఇంటివద్దకే డెలివరీ చేయనున్నట్టు తెలిపింది. గురువారం నుంచి ఈ సర్వీసులను లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. యూజర్ల అభ్యర్థన మేరకు ఈ సర్వీసుల కింద గరిష్టంగా ఒక బుకింగ్కు రూ.2000 వరకు నగదును స్నాప్ డీల్ డెలివరీ చేయనుంది. నగదు డెలివరీ చేసిన సమయంలోనే యూజర్లు తమ బ్యాంకు ఏటీఎం కార్డును పీఓఎస్ మిషన్లో స్వైప్ చేసి స్నాప్డీల్కు ఈ నగదు చెల్లించవచ్చు. అయితే నామమాత్రపు రుసుము కింద రూ. 1ను కంపెనీ చార్జ్ చేయనుంది. బుకింగ్ చేసుకునే సమయంలోనే ఈ ఫీజును డెబిట్ కార్డు ద్వారానైనా లేదా ఫ్రీఛార్జ్ ద్వారానైనా చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ సర్వీసులతో గంటల కొద్దీ బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు ఎలాంటి అవస్థలు పడకుండా సులభతరంగా నగదు అందేలా చేయనున్నామని కంపెనీ చెప్పింది. "Cash@Home" సర్వీసుల కింద మరే ఇతర ఆర్డర్లను స్నాప్డీల్ స్వీకరించదు. గుర్గావ్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఈ సర్వీసులను కంపెనీ లైవ్గా ప్రారంభించింది. మిగతా మేజర్ నగరాల్లో ఈ సర్వీసులను కొన్ని రోజుల్లోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు కంపెనీ పేర్కొంది. -
సీవోడీ లావాదేవీలు తగ్గాయ్: స్నాప్డీల్
కోల్కతా: కరెన్సీ నోట్ల రద్దు వల్ల క్యాష్ ఆన్ డెలివరీ (సీవోడీ) పేమెంట్స్పై ప్రతికూల ప్రభావం పడిందని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ స్నాప్డీల్ సహవ్యవస్థాపకుడు కూనల్ భల్ తెలిపారు. ఈ-కామర్స్ సంస్థల మొత్తం లావాదేవీల్లో సీవోడీ వాటా 70% వరకు ఉంటుందని, ప్రస్తుతం దీనిలో కొంత క్షీణత నమోదరుు్యందన్నారు. ఈ తగ్గుదల పాక్షికమని, మళ్లీ సీవోడీ బిజినెస్ యథాస్థితికి చేరుతుందని తెలిపారు. నోట్ల రద్ద వల్ల ప్రజలు క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులకు తొలి ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొన్నారు. దీని వల్ల డిజిటల్ పేమెంట్స్ పెరుగుతాయని, తద్వారా దీర్ఘకాలంలో ఈ-కామర్స్ పరిశ్రమ కార్యకలాపాలు సులభతరం అవుతాయని భల్ తెలిపారు. -
స్నాప్డీల్ ఇన్స్టంట్ డిస్కౌంట్
ముంబై: నల్లధనానికి చెక్ పెట్టే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన రూ. 500, 1000 నోట్ల ఉపసంహరణ ప్రకటనతో ఈకామర్స్ సంస్థలుకూడా స్పందిస్తున్నాయి. నిన్న ఫ్లిప్కార్ట్, అమెజాన క్యాష్ ఆన్ డెలివరీ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తే స్నాప్ డీల్ మాత్రం విభిన్నంగా స్పందించింది. ఇప్పటికే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చిన వాలెట్ ఆన్ డెలివరీ లో అన్ని రకాల కార్డుల లావాదేవీలపై తక్షణం 10శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. పరిమితి కాలానికి అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సదుపాయంలో 5వేల రూపాయల కొనుగోలుపై సుమారు 500 వరకు డిస్కౌంట్ లభించనున్నట్టు సంస్థ ప్రకటించింది. నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేందుగా వీలుగా కొన్ని రకాల స్మార్ట్ఫోన్లతో సహా, ఇతర ఉత్పత్తుల అమ్మకాలపై అన్ని క్రెడిట్ మరియు డెబిట్ కార్డులపై 10 శాతం 'తక్షణ డిస్కౌంట్' అందిస్తోంది. వెబ్ లేదా మొబైల్ ఆప్ ద్వారా చెల్లుబాటు అయ్యేలా ఉన్న ఈ ఆఫర్ నవంబర్ 10 వరకు మాత్రమే అందుబాటులో ఉంది. అంతేకాదు ఈఎంఐ ఆప్షన్తో చేసే కొనుగోళ్లకు కూడా ఈ ఆఫర్ను వర్తింప చేస్తున్నట్టు స్నాప్ డీల్ ఒక ప్రకటనలో తెలిపింది.