bhavita
-
విశాఖలో భవిత కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ (ఫొటోలు)
-
రోల్మోడల్ స్టేట్గా ఏపీ.. జగనన్నకు థ్యాంక్స్
-
భవితకు రెండు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: బ్లూ రాక్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నీలో జీఎస్ఎం క్రీడాకారిణి ఎన్. భవిత మెరిసింది. సబ్ జూనియర్, జూనియర్ బాలికల సింగిల్స్ విభాగాల్లో చాంపియన్గా నిలిచి రెండు టైటిళ్లను అందుకుంది. సబ్ జూనియర్ బాలికల ఫైనల్లో భవిత 4–1తో విధి జైన్ (జీఎస్ఎం)పై, జూనియర్ బాలికల టైటిల్ పోరులో 4–2తో వి. సస్య (ఏడబ్ల్యూఏ)పై నెగ్గి విజేతగా నిలిచింది. సబ్ జూనియర్ బాలుర విభాగంలో కేశవన్ కన్నన్ (ఎంఎల్ఆర్) 4–2తో ఎస్ఎస్కే కార్తీక్ (ఏడబ్ల్యూఏ)పై, జూనియర్ బాలుర కేటగిరీలో అమన్ (ఏవీఎస్సీ) 4–2తో వరుణ్ శంకర్ (జీటీటీఏ)పై గెలిచారు. క్యాడెట్ బాలబాలికల ఫైనల్ మ్యాచ్ల్లో పార్థ్భాటియా (ఏడబ్ల్యూఏ) 3–1తో జతిన్ దేవ్ (ఎస్పీహెచ్ఎస్)పై, కావ్య (ఏడబ్ల్యూఏ) 3–2తో నిఖిత (వీపీజీ)పై... యూత్ బాలబాలికల తుదిపోరులో మొహమ్మద్ అలీ (ఎల్బీఎస్) 4–0తొ సరోజ్ సిరిల్ (ఏడబ్ల్యూఏ)పై, వరుణి జైస్వాల్ (జీఎస్ఎం) 4–2తో జి. ప్రణీత (హెచ్వీఎస్)పై గెలుపొందారు. పురుషుల ఫైనల్లో విఘ్నయ్ రెడ్డి (ఆర్బీఐ) 4–2తో పి. చంద్రచూడ్ (ఎంఎల్ఆర్)పై నెగ్గగా, మహిళల టైటిల్ పోరులో నిఖత్ బాను 4–3తో వరుణి జైస్వాల్ (జీఎస్ఎం)ను ఓడించింది. -
ఆ వీడియోల ద్వారా ఆదాయం ఆర్జిస్తున్న వైనం!
యూట్యూబ్.. ప్రతిభను ప్రదర్శించేందుకు అంతర్జాతీయ వేదిక. ఇది కొంతమందిని రాత్రికిరాత్రే స్టార్లుగా మార్చేస్తోంది. మరికొంత మందికి ఊహించని ఆదాయం తెచ్చిపెడుతోంది. సృజనాత్మకతే పెట్టుబడిగా యూట్యూబర్గా మారి సంపాదించేందుకు వీలుకల్పిస్తోంది. ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, కామెడీ, బ్యూటీ, ఫ్యాషన్, ఫిట్నెస్ మొదలైన విభాగాల్లో యువత ప్రతిభ చాటుతోంది. యూట్యూబర్గాసక్సెస్ సాధించి.. సినిమా అవకాశాలను చేజిక్కించుకుంటున్నవారూ ఉన్నారు. సృజన, నవ్యత, నాణ్యత ఉంటే.. ఎవరైనా యూట్యూబర్గా మారొచ్చు. నేటి డిజిటల్ యుగంలో వినోదంతోపాటు ఆదాయ వనరుగా నిలుస్తున్న యూట్యూబర్ కెరీర్ గురించి తెలుసుకుందాం.. వైవా హర్ష, ఘాజీ దర్శకుడు సంకల్ప్రెడ్డి, పెళ్లి చూపులు ఫేమ్ ప్రియదర్శి, మహా తల్లి (జాహ్నవి) వంటి వారెందరో యూట్యూబ్లో ప్రతిభను చాటడం ద్వారా.. బుల్లితెర, వెండితెరలపై తమకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారు. యూట్యూబ్ను ఆధారం గా చేసుకొని కొందరు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తుం టే.. మరికొందరు బాగా సంపాదిస్తున్నారు. వినూ త్నంగా సాగే తమ ఆలోచనలకు ఒక రూపం ఇవ్వగలిగే నేర్పు ఉంటే చాలు యూట్యూబ్ స్టార్గా ఎదగవచ్చు అంటున్నారు నిపుణులు. ఇందుకోసం పెద్దగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. మొబైల్ లేదా తక్కువ బడ్జెట్ కెమెరాలతో వీడియో షూట్ చేయొచ్చు. వీటిని గూగుల్ అకౌంట్ సహాయంతో యూట్యూబ్ చానల్ అకౌంట్ ఓపెన్చేసి, అప్లోడ్ చేయొచ్చు. ఆదాయం ఎలా? యూట్యూబ్ చానల్కు ప్రధాన ఆదాయ మార్గం.. ప్రకటనలు. వీటిద్వారా వచ్చే ఆదాయం ద్వారానే సదరు యూట్యూబ్ చానల్ యజమానికి చెల్లింపులు జరుగుతాయి. ఇటీవల యూట్యూబ్లో స్పామ్ కంటెంట్ పెరిగిందంటూ ఫిర్యాదులు, వీడియోలను వాయిస్ఓవర్తో తప్పుదోవ పట్టిస్తున్న సంఘటనలు ఎక్కువ అవడంతో గూగుల్ సంస్థ యూట్యూబ్ నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో నవ్యత, నాణ్యతకు ప్రాధాన్యత పెరిగింది. వీటితోపాటు ఏడాది కాలంలో 4,000 గంటల వాచ్టైం తప్పనిసరిగా ఉండాలనే నిబంధనను సైతం అమల్లోకి తెచ్చింది. కనీసం వెయ్యి మంది సబ్ స్క్రైబర్స్తో రోజుకు 10 గంటల వాచ్ టైం ఉంటేనే ఆదాయం పొందేందుకు వీలుంటుంది. ముఖ్యమైన టూల్స్ యూట్యూబ్ చానల్ ప్రారంభించడానికి పెట్టుబడి అవసరం లేకున్నా.. వీడియోలను కొన్ని టూల్స్ ద్వారా ఆకర్షణీయంగా రూపొందించవచ్చు. దాంతో వ్యూస్ పెంచుకోవడంతో పాటు సబ్స్క్రిప్షన్స్ కూడా పెరుగుతాయి. చానల్ ప్రారంభించే ముందు మీరు ఎంచుకునే అంశంపై స్పష్టత ఉండాలి. దానికోసం కొంత పరిశోధన చేయాలి. వీక్షకులకు ఆసక్తి గలిగించే అంశాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. వీడియో రికార్డింగ్ కోసం 720పి రెజల్యూషన్ కంటే ఎక్కువ నాణ్యతతో రికార్డింగ్ చేస్తే మేలు. బడ్జెట్ అనుకూలిస్తే తక్కువ బడ్జెట్లో అందుబాటులో ఉండే కెనాన్ 1300డి వంటి బ్రాండెడ్ కెమెరాలు తీసుకొని వాటితో వీడియోలు చేయొచ్చు. ట్రైపాడ్స్ తీసుకుంటే రికార్డింగ్ సులువు అవుతుంది. మార్కెట్లో తక్కువ పెట్టుబడితో ట్రైపాడ్స్ కొనుగోలు చేయొచ్చు. మైక్రోఫోన్ ఆధారంగా చక్కటి ఆడియోతో పాటు వీడియో రికార్డింగ్ సాధ్యపడుతుంది. ఇది ప్రేక్షకుల ఆదరణ పొందడానికి ఉపయోగపడుతుంది. బ్లూ స్క్రీన్ లేదా గ్రీన్ స్క్రీన్ ఉపయోగిస్తే బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ సులువు అవుతుంది. వీడియో రికార్డింగ్ చేసే క్రమంలో అవాంతరాలు రావడం సహజం. వాటిని డిలీట్ చేయడానికి ఎడిటింగ్ టూల్స్ ఉపయోగపడతాయి. వీడియో, ఆడియో ఎడిటింగ్ టూల్స్ ఉపయోగించి వీడి యోను ప్రొఫెషనల్గా తీర్చిదిద్దొచ్చు. ముఖ్యంగా వీడియో ఎడిటింగ్ కోసం థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్లను ఉపయోగించుకోవచ్చు. యూట్యూబ్లోనూ ఇన్ బిల్ట్ ఎడిటింగ్ టూల్స్ ఉంటాయని.. వాటిని ఉపయోగించుకుంటే కోరుకున్న ఔట్పుట్ వస్తుం దని నిపుణులు చెబుతున్నారు. వ్యూస్ పెరిగేకొద్దీ.. యూట్యూబ్లో డబ్బులు రావాలంటే వ్యూస్ ఎక్కువగా రావాలి. అదేవిధంగా క్రమంతప్పకుండా వీడియోలు అప్లోడ్ చేయాలి. చానల్ ప్రారంభించిన మొదట్లోనే డబ్బులు రావు. మొదటి పేమెంట్ రావాలంటే.. బ్రేక్ ఈవెన్ అమౌంట్ (సుమారు 100 డాలర్లు) దాటాలి. తర్వాత రెగ్యులర్గా ఆదాయం అందుతుంది. ఇండియాలో కంటే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వీడియోలు చూస్తే సదరు చానల్ ఓనర్కు ఆదాయం ఎక్కువగా ఉంటుంది. వ్యూస్ పెంచుకునేందుకు కొన్ని చిట్కాలు పాటించడం తప్పనిసరి. ప్రధానంగా టైటిల్స్ ఆకర్షించే విధంగా ఉండాలి. అదే విధంగా థంబ్నైల్స్ కూడా చూపరులను కట్టిపడేసేవిగా కనిపించాలి. తెలుగులో చానల్ ప్రారంభిస్తే .. తెలుగు భాషలోనే కీవర్డ్స్ ఇవ్వాలి. ఇక, యూట్యూబ్ నుంచి కూడా ఆటోమేటిక్/సజెస్టెడ్ కీవర్డ్స్ వస్తుంటాయి. వాటిని ఉపయోగిం చుకోవాలి. ‘ఎంటర్టైన్మెంట్’ విభాగాల వీడి యోలు ట్రెండింగ్లో నిలుస్తున్నాయి. ఎడ్యుకేషన్ వంటి సంప్రదాయ విభాగాలు ట్రెండింగ్ వీడియోల్లో కనిపించట్లేదు. వైరల్ అయితే కాసులే! ప్రస్తుతం ఒక వీడియో వైరల్ అయితే చాలు ఎంతో పేరు, డబ్బు వస్తుంది. వినోదాత్మక జానర్ ఎంచుకొని కొత్తగా వీడియోలు చేస్తే త్వరగా వీక్షకుల సంఖ్య పెరుగుతుంది. కొత్తగా చానల్ పెట్టాలనుకుంటే.. ఫ్రెష్గా, ప్రొఫెషనల్గా తీయాలి. వాయిస్ ఓవర్, యాంకర్లను పెట్టి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లొచ్చు. అప్లోడ్ చేసే క్రమంలో ‘కీవర్డ్స్’ కూడా సరిపోయేవి ఇస్తే చానల్కు ప్రేక్షకులు ఎక్కువగా వస్తారు. చానల్ ప్రమోషన్స్కు ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలను కూడా ఉపయోగించుకోవాలి. అందులోనూ ‘చెల్లింపు’ ప్రమోషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిద్వారా త్వరగా ప్రేక్షకులను చేరొచ్చు. – నల్లమోతు శ్రీధర్, కంప్యూటర్ ఎరా మ్యాగజైన్ చానల్. డేటా వినియోగం బాగా పెరిగింది జియో వచ్చాక తెలుగు రాష్ట్రాల్లో డేటా వినియోగం బాగా పెరిగింది. యూట్యూబ్ వీడియోలు బాగా చూస్తున్నారు. నేను అప్లోడ్ చేసే పోటీ పరీక్షల ‘ఎడ్యుకేషన్’ విభాగానికి సంబంధించిన వీడియోలకు ప్రత్యేకంగా ప్రేక్షకులు ఉంటున్నారు. వారు మాత్రమే ఈ వీడియోలు చూస్తున్నారు. ప్రస్తుతం యూట్యూబ్ అంత సులువుగా డబ్బులు ఇవ్వడం లేదు. నిబంధనలు కఠినంగా ఉన్నాయి. నాకు మొదట ఆర్నెల్ల వరకు డబ్బులు రాలేదు. నేను ఫుల్టైం ఉద్యోగం చేస్తూ వీలున్నప్పుడు వీడియోలు చేస్తున్నాను. రెగ్యులర్గా వీడియోలు పెడితే డబ్బులు వస్తాయి. – ఆకుల నారాయణరావు, ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. -
కొలువులపై టెక్నాలజీ దెబ్బ
గతమంతా ఘనం.. భవిష్యత్ అంతా గందరగోళం అన్నట్లు..! ఒక్కసారి గతంలో ఉద్యోగాలు ఎలా ఉండేవో గుర్తుకు తెచ్చుకోండి. ఉద్యోగాలకు భద్రత ఉండేది. కొంత అనుభవం సంపాదిస్తే.. ప్రమోషన్ గ్యారెంటీ..! అనే నమ్మకంఉండేది. జీతం తక్కువైనా ఖర్చులు తక్కువకాబట్టి ఆదాయ భద్రత ఎక్కువగా ఉండేది.ఇప్పుడు ప్రపంచం వేగంగా మారిపోతోంది. ఈరోజున్న జాబ్ రేపు ఉంటుందన్న గ్యారెంటీలేదు. ప్రస్తుతం మీకు ఎంత టాలెంట్ ఉన్నా.. మీనైపుణ్యాలను మెరుగుపరచుకోకుంటే మూడేళ్లతర్వాత మీ ఉద్యోగం ఊడినట్లే..! అంటున్నారునిపుణులు. ఎందుకంటే.. ప్రతి మూడేళ్లకోసారిటెక్నాలజీ సమూలంగా మారిపోతుండటమే! ఓతాజా నివేదిక ప్రకారం భారత జాబ్మార్కెట్లోనియామకాల పరిస్థితి గతంలో ఎన్నడూలేనంత అస్థిరంగా మారింది. ఈ నేపథ్యంలోజాబ్ మార్కెట్లో తాజా హైరింగ్ ట్రెండ్స్ ఎలాఉన్నాయి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగంసొంతం కావాలన్నా.. కొలువులో మనుగడసాగించాలన్నా.. ఏం చేయాలోతెలుసుకుందాం... సాక్షి భవిత, జాబ్ ట్రెండ్స్ :టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు సంభవిస్తున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ), డేటా అనలిటిక్స్, రోబోటిక్స్, త్రీడీ ప్రింటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), క్లౌడ్ కంప్యూటింగ్ కారణంగా టెక్నాలజీ రంగంలో రాకెట్ వేగంతో మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఆటోమేషన్ విస్తరణ కారణంగా... ప్రపంచవ్యాప్తంగా వ్యాపార వాణిజ్యం రంగంలో, ఉత్పత్తి ప్రక్రియలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. కంపెనీలు వ్యయ నియంత్రణలో భాగంగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. దాంతో గతంలో ఏ పదేళ్లకో మార్పులకు లోనయ్యే జాబ్ మార్కెట్.. ఇప్పుడు మూడేళ్లకే పూర్తిగా మారిపోతోంది. కాబట్టి ఈ టెక్నాలజీని ఎంత సమర్థంగా అందిపుచ్చుకోగలరు అనే దానిపైనే మీ కెరీర్ గమనం ఆధారపడి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు టెక్నాలజీ నేటి మంత్రం కంపెనీలు ఆన్లైన్ కస్టమర్స్తో మాట్లాడేందుకు చాట్ బోట్స్ను ఉపయోగిస్తున్నాయి. దాంతో ఇంతకాలం కస్టమర్ సర్వీస్, కాల్ సెంటర్స్లో ఈ పనిచేసిన సిబ్బంది అవసరం లేకుండా పోయింది. అంతేకాదు ఉదాహరణకు ఐబీఎం వాట్సన్ కంప్యూటర్లో నిక్షిప్తిమైన రోగిæ.. రోగ చరిత్రనంతా స్కాన్ చేసి అత్యంత కచ్చితత్వంతో రోగాన్ని విశ్లేషించి.. వ్యాధి నివారణకు ఏం చేయాలో సలహా ఇస్తుంది. తద్వారా సంబంధిత నిపుణుల పాత్ర నామమాత్రంగా మారుతోంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి సేవల రంగం వరకూ.. టెక్నాలజీ సాయంతో గతంలో ఒక పని పూర్తిచేసేందుకు నాలుగు గంటల సమయం అవసరమైతే.. ఇప్పుడు ఆ పని క్షణాల్లో పూర్తి కచ్చితత్వంతో పూర్తవుతోంది. తద్వారా కంపెనీలకు ఖర్చు తగ్గ డంతోపాటు తక్కువ సమయంలోనే ఎక్కువ ఉత్పత్తి సాధ్యమవుతోంది. అందుకే కంపెనీలు మానవ వనురులపై ఆధారపడటం తగ్గించేస్తున్నాయి. నైపుణ్యం ప్రస్తుతమున్న నైపుణ్యాలనే పట్టుకొని కూర్చుంటే.. మీరు రోడ్డునపడటం ఖాయమంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. మార్పు నేటి తారకమంత్రం కాబట్టి! ఉదాహరణకు.. గతంలో బుక్కీపింగ్ తెలిసుంటే చాలు.. అకౌంటెంట్ ఉద్యోగం ఖాయంగాలభించేది, జీవిత కాలంపాటు కొనసాగేది. కొన్నేళ్ల క్రితమే బుక్కీపింగ్ స్థానంలో.. అకౌంటింగ్ సాఫ్ట్వేర్ వచ్చి చేరింది. ఆ సమయంలో అకౌంటింగ్ సాఫ్ట్వేర్ నైపుణ్యం లేనివారందరూ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఇదే అకౌంటింగ్ జాబ్స్పై కొద్దికాలం క్రితం అమల్లోకి వచ్చిన జీఎస్టీ పెద్ద దెబ్బ కొట్టింది. జీఎస్టీ వచ్చాక ఈ అకౌంటెంట్స్పై ఆధార పడటం తగ్గిపోయింది. అంటే.. ప్రస్తుతం అమలుచేసిన జీఎస్టీ కారణంగా మారిన కంపెనీల అవసరాలకు తగ్గట్లు కొత్త నైపుణ్యాలున్న వారికే జాబ్ మార్కెట్లో అవకాశం లభిస్తుంది. నాలెడ్జ్ ఇప్పుడు మీరు సంపాదించిన నాలెడ్జ్ ఒక్క ఏడాది కళ్లు మూసుకుంటే ఎందుకూ కొరగాకుండా పోతుందంటే నమ్ముతారా..! నమ్మాలంటున్నారు మేధావులు. దీనికి కూడా టెక్నాలజీ విప్లవమే కారణం!! అంతేకాకుండా ఒక డాక్టర్, ఒక లాయర్, ఇంజనీర్ అందించే సేవల నాణ్యత.. ఆ సేవలకు ఎంత చెల్లించొచ్చో డేటా అనలిటిక్స్ వంటి వాటి ద్వారా క్షణాల్లో అంచనాకు వస్తున్నాయి కంపెనీలు. దాంతో సంస్థలు ఇస్తున్న వేతనానికి ఉద్యోగుల నాలెడ్జ్ స్థాయి, పనితీరు ఏమాత్రం తగ్గినా.. పింక్ స్లిప్ వెలాడుతున్నట్లే! మరోవైపు తక్కువ వేతనానికి నాణ్యమైన పనితీరు చూపే యువత అందుబాటులో ఉంటే.. సీనియర్ నిపుణులకు భారీ జీతాలు చెల్లించడం భారమని కంపెనీలు భావిస్తున్నాయి. ఫలితంగానే పింక్ స్లిప్ల పరంపర మొదలవుతోందని చెబుతున్నారు. ఇటీవలే ఓ ప్రముఖ ఐటీ కంపెనీ 1000 మంది సీనియర్ ఉద్యోగులను ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. అందుకు సదరు సీనియర్ ఉద్యోగులు టెక్నాలజీ పరంగా అప్డేట్ కాకపోవడం ఒక కారణమైతే.. వారికి జీతాలు భారీగా ఉండటం మరో కారణమట! కాబట్టి ఉద్యోగులు ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నాలెడ్జ్ పెంచుకుంటూæ... మంచి ఫలితాలు చూపితేనే కెరీర్లో మనుగడ సాధ్యమవుతుంది. నిరంతర అధ్యయనం స్టే క్యూరియస్, స్టే హంగ్రీ.. అనేది నేటి కెరీర్ మంత్రం. ప్రస్తుత నైపుణ్యాలు జాబ్ మార్కెట్కు పనికిరాకుండాపోతే.. ఇక ముందున్న ఏకైక మార్గం.. కొత్త స్కిల్స్ను వేగంగా నేర్చుకోవడమే! ఇందుకోసం ఆయా అంశాలపై ఆసక్తి పెంచుకోవాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అందిపుచ్చుకోవాలి. నిత్య విద్యార్థిలా మారి.. మూక్స్ వంటి ఆన్లైన్ విధానాల ద్వారా అప్డేట్ కావాలి. నేర్చుకున్నది ఎప్పటికీ వృథా కాదు. నిరంతరం నేర్చుకుంటూ.. సమస్యలను పరిష్కరిస్తూ ఉత్పత్తి పెంచుతున్న ఉద్యోగిని వదులుకోవాలని ఏ కంపెనీ కోరుకోదు. కాబట్టి ఫ్రెషర్స్తోపాటు సీనియర్ ఉద్యోగులు కూడా కెరీర్ పరంగా, టెక్నాలజీ పరంగా తాము నేర్చుకోవాల్సిన టెక్నాలజీని, నైపుణ్యాలను సమీక్షించుకోవాలి. గత వారంలో, గత నెలలో ఎలాంటి పనితీరు ప్రదర్శించాం.. ఏఏ కొత్త విషయాలు నేర్చుకున్నాం.. కొత్తగా వస్తున్న టెక్నాలజీ ఏంటి.. ఆ టెక్నాలజీ గురించి మనం ఏం నేర్చుకున్నాం.. నేర్చుకున్న టెక్నాలజీని మన కంపెనీ ప్రొడక్టివిటీ పెంచడంలో ఏమేరకు అన్వయించాం.. ఇలా ప్రతి ఒక్కరూ సమీక్షించుకుంటూ... ఉద్యోగ మనుగడ సాధించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే మేలు నిరంతరం తమ సామర్థ్యాలను సమీక్షించుకుంటూ.. నైపుణ్యాలు మెరుగుపరచుకుంటూ.. టెక్నాలజీని నేర్చుకుంటూ ముందుకు సాగాలి. జాబ్ మార్కెట్కు ఉపయోగపడే స్కిల్స్ నేర్చుకోవడంతోపాటు, ప్రత్యామ్నాయ కెరీర్ గురించి ఆలోచిస్తుండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ద్వారా నేర్చుకునే తపన, పనిచేసే సామర్థ్యం పెంచుకోవాలి. నిపుణుల ప్రసంగాలు వినడం, మంచి పుస్తకాలు చదడం, మనసును చురుగ్గా ఉంచుకోవడం ద్వారా అవుట్డేట్ ప్రమాదం నుంచి బయటపడొచ్చు. మనం పనిచేయడమేకాకుండా... తోటి ఉద్యోగులు తమ శక్తిసామర్థ్యాలు పెంచుకొని మరింత బాగా పనిచేసేలా ప్రోత్సహిస్తుండాలని కంపెనీలు కోరుకుంటున్నాయి. -
స్టార్టప్ ఆఫర్స్..ఆచితూచి అడుగేయండి..!
క్యాంపస్ ప్లేస్మెంట్స్లో స్టార్టప్స్ కంపెనీలు రెట్టింపు సంఖ్యలో నియామకాలు జరుపుతున్నాయి. భారీ పే ప్యాకేజీలు అందిస్తున్నాయి. విద్యార్థులు కూడా స్టార్టప్ల వైపు ఆకర్షితులవుతున్నారు. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే! మరోవైపు స్టార్టప్ కంపెనీలు ప్రముఖ ఇన్స్టిట్యూట్లలోని విద్యార్థులకు ఇచ్చిన ఆఫర్స్ను సైతం వెనక్కు తీసుకుంటున్నాయి. నియామకాలను వాయిదా వేస్తున్నాయి. ఇది విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది. త్వరలో ఈ విద్యా సంవత్సరానికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో..స్టార్టప్ కంపెనీల ఆఫర్స్ విషయంలో నిపుణులు అందిస్తున్న సూచనలు, సలహాలు!! పేరున్న స్టార్టప్ కంపెనీలు సైతం ఇటీవల కాలంలో విద్యార్థులకు ఇచ్చిన ఆఫర్స్ను వెనక్కు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. విద్యా సంవత్సరం చివర్లో ఇలాంటి పరిస్థితి ఎదురవడంతో ప్రముఖ ఇన్స్టిట్యూట్స్లో చదివిన ప్రతిభావంతులు ఏదో ఒక జాబ్తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. కాబట్టి స్టార్టప్ కంపెనీల ఆఫర్స్ను ఆమోదించే ముందు అభ్యర్థులు ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రమోటర్స్ నుంచి కంపెనీ ప్రొఫైల్ వరకు స్టార్టప్ కంపెనీ ఆఫర్ను ఆమోదించే ముందు అభ్యర్థులు స్టార్టప్ సంస్థ ప్రమోటర్స్ వివరాలు, వారి విజన్, సంస్థ ప్రొఫైల్, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి? అనే అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలి. సదరు సంస్థ ప్రొడక్ట్/సర్వీస్ వివరాలు.. టార్గెట్ కస్టమర్స్, సర్వీస్/ప్రొడక్ట్కు సంబంధించి మార్కెట్ పరిస్థితుల గురించి అవగాహన పెంచుకోవాలి. క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్, ప్లేస్మెంట్ కోఆర్డినేటర్స్, కంపెనీల వెబ్సైట్స్ ద్వారా ఈ సమాచారం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా స్టార్టప్ కంపెనీ ఆర్థిక సామర్థ్యం గురించి తెలుసుకోవాలి. కార్యకలాపాల నిర్వహణ, భవిష్యత్తు మనుగడ పరంగా సంస్థకున్న ఆర్థిక వనరుల లభ్యత చాలా కీలకం. ఎందుకంటే భారీ లాభాలు ఆశించి పెట్టుబడులు పెట్టే సీడ్ ఫండింగ్ సంస్థలు, వెంచర్ క్యాపిటలిస్టులు.. స్టార్టప్ కంపెనీ నుంచి ఆశించిన లాభాలపై నమ్మకం సడలితే నిధులు ఉపసంహరించుకుంటారు. దాంతో ఒత్తిడికి లోనైన కంపెనీలు ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ముందు మానవ వనరులపై వేటు వేస్తాయి. కాబట్టి రూ.లక్షల ప్యాకేజ్తో ఆఫర్ ఇచ్చినా.. సంస్థ ఆర్థిక సామర్థ్యం సరిగా లేకుంటే అభ్యర్థులు సమీప భవిష్యత్తులోనే ఒడిదుడుకులకు లోనవ్వాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. పని వాతావరణం ఇప్పటికే సదరు స్టార్టప్ కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య గురించి తెలుసుకోవడం కూడా తాజా అభ్యర్థులకు మేలు చేస్తుంది. సాధారణంగా స్టార్టప్ సంస్థల్లో మానవ వనరుల సంఖ్య 20 నుంచి 50 మధ్యలోనే ఉంటోంది. ఫండింగ్ సంస్థల ప్రోత్సాహం ఉంటే ఈ సంఖ్య 100 నుంచి 150 వరకు ఉంటుంది. తద్వారా స్టార్టప్ సంస్థ మనుగడపై ఒక అంచనాకు రావచ్చు. వీలైతే అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని సంప్రదించి వాస్తవ పరిస్థితుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా స్టార్టప్ కంపెనీలో పని సంస్కృతి, పని వాతావరణం గురించి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. స్టార్టప్ సంస్థల్లో చేరాలనుకునే అభ్యర్థులు తమలోని సృజనాత్మకతను, నైపుణ్యాలను, తమ ఆలోచనలను అమలు చేసేందుకు వీలుంటుందని, ఆ మేరకు కంపెనీలు సైతం తమను ప్రోత్సహిస్తాయనే అభిప్రాయంతో ఉంటారు. తాము చేరాలనుకుంటున్న కంపెనీలో ఇలాంటి పరిస్థితి ఉందో? లేదో? తెలుసుకోవడం మంచిది. ప్యాకేజ్, ఇతర బెనిఫిట్స్ స్టార్టప్ ఆఫర్ను ఆమోదించే క్రమంలో తమకు అందించే ప్యాకేజ్ను ఏ రూపంలో ఇస్తాయో అభ్యర్థులు ముందుగానే తెలుసుకోవాలి. కొన్ని స్టార్టప్ సంస్థలు భారీ స్థాయిలో పే ప్యాకేజీ ప్రకటించినా.. అందులో 40 నుంచి 50 శాతం మాత్రమే నగదు రూపంలో ఇస్తున్నాయి. మిగతా మొత్తాన్ని ఈక్విటీలు, స్టాక్ ఆప్షన్స్ కేటాయింపు రూపంలో అందిస్తున్నాయి. కాబట్టి ఔత్సాహిక అభ్యర్థులు.. తమ వాస్తవ అవసరాలు, కంపెనీలు అందించే ప్యాకేజీ తీరుతెన్నుల గురించి తెలుసుకోవాలి. నగదు రూపంలో అందించే మొత్తం తమ అవసరాల మేరకు ఉందని భావిస్తేనే ఆఫర్ను అంగీకరించడం మేలు. స్టార్టప్ జాబ్.. సవాలే! స్టార్టప్ సంస్థలంటే అప్పుడే మొగ్గ తొడిగిన కంపెనీలు. ఉత్పత్తులు, సేవల గురించి లక్ష్యాలు నిర్దిష్టంగా ఉన్నప్పటికీ.. వాటి అమలు, కార్యాచరణ అంతా ప్రాథమిక దశలోనే ఉంటుంది. జీరో నుంచి పని మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి స్టార్టప్ కంపెనీలో పనిచేయడం సవాల్తో కూడుకున్న వ్యవహారం. కంపెనీలు సైతం తాము ఆఫర్ ఇచ్చిన అభ్యర్థుల నుంచి ఎంతో ఎక్కువగా ఆశిస్తాయి. నిజమైన ఆసక్తి ఉంటేనే, పని ఒత్తిడిని తట్టుకోగలమనుకుంటేనే స్టార్టప్ సంస్థల ఆఫర్ను ఆమోదించాలి. అంతేకాకుండా తమకున్న సబ్జెక్ట్ స్కిల్స్ సంస్థ జాబ్ ప్రొఫైల్కు సరితూగుతాయో లేదో ముందుగానే అంచనా వేసుకొని అడుగేయాలి. నిత్యనూతనంగా ఉండాలి కొత్తగా ప్రారంభమైన కంపెనీలో సీఈఓ నుంచి సేల్స్ ఎగ్జిక్యూటివ్ వరకూ.. అందరూ కలివిడిగా పని చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన జాబ్ ప్రొఫైల్ను మాత్రమే కాకుండా అందరూ అన్ని రకాల పనులు చేయాల్సి ఉంటుంది. మారుతున్న మార్కెట్ పరిస్థితులను నిరంతరం అంచనా వేయడం.. పోటీదారుల నుంచి ఎదురవుతున్న సవాళ్లను గుర్తించడం.. వ్యూహ, ప్రతివ్యూహాలు రూపొందించడం వంటి విధులు నిర్వర్తించాలి. సంస్థ కార్యకలాపాలను నిర్వహించడంలో సృజనాత్మకతను వెలికి తీసే నైపుణ్యం అవసరం. ఇతరుల కంటే తమ సంస్థ ప్రొడక్ట్స్ బెస్ట్ అని వినియోగదారుల్లో అభిప్రాయం ఏర్పడేలా వ్యూహాలు, పథకాలు రచించాలి. ముఖ్యంగా మార్కెటింగ్ ప్రొఫైల్ ఆఫర్స్ అందుకున్న అభ్యర్థులకు ఇది ఎంతో అవసరం. కాబట్టి స్టార్టప్ కంపెనీలో చేరేటప్పుడు అన్ని ప్రతికూలతలు, సానుకూలతలను బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలన్నది నిపుణుల సలహా!! స్టార్టప్ జాబ్స్.. కీ డొమైన్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ∙డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ∙ఎస్ఈఓస్ ∙కోడింగ్ ఎక్స్పర్ట్స్ ∙సాఫ్ట్వేర్ డెవలపర్స్ ∙డేటా సైంటిస్ట్స్ ∙ప్రోగ్రామ్ డెవలప్మెంట్ మేనేజర్స్ ∙వెబ్ డిజైనర్స్, యాప్ డెవలపర్స్ ∙బిజినెస్ స్ట్రాటజీ ఎగ్జిక్యూటివ్స్ ∙సోషల్ నెట్వర్క్ స్పెషలిస్ట్స్ స్టార్టప్ జాబ్స్ సానుకూలతలు అభ్యర్థుల నైపుణ్యాలు, సృజనాత్మకతను వెలుగులోకి తెచ్చేందుకు ఎంతో అవకాశం. తాము చేసిన పనికి వెనువెంటనే ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. ఆసక్తికి అనుగుణంగా పని చేసే అవకాశం (ఫ్లెక్సిబుల్ వర్క్ ఎన్విరాన్మెంట్) ఉంటుంది. స్వీయ సామర్థ్యాలను పెంపొందించుకునే అవకాశం. వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసే అవకాశం. ఇది ఎంఎన్సీ జాబ్స్లో లభించడం కొంత కష్టమే. స్టార్టప్ జాబ్స్ ప్రతికూలతలు సంస్థ ప్రమోటర్స్కు నిర్దిష్ట వ్యూహం లేకపోతే ఉద్యోగుల భవితవ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ప్రారంభంలో నిర్దిష్ట పని వేళలని లేకుండా.. 24్ఠ7 విధానంలో పనిచేయాల్సిన పరిస్థితి. ఎంఎన్సీల మాదిరిగా కొత్త టెక్నాలజీలపై వ్యవస్థాగతంగా శిక్షణ ఉండదు. అభ్యర్థులే స్వీయ శిక్షణ ద్వారా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. వేతనాల పరంగా ఎంఎన్సీలతో పోల్చితే తక్కువ ప్యాకేజ్లు. వినియోగదారులను ఆకట్టుకోవడంలో కొంత ఇబ్బంది. తమ సంస్థను మెప్పించడంలో ప్రారంభంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు సైతం ఎదురవుతాయి. -
ఆన్లైన్ ‘పరీక్ష’లో విజయానికి...
ఎగ్జామ్ టిప్స్ ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది.. అన్ని విభాగాల మాదిరిగానే చదువు, పోటీ పరీక్షలు కూడా ‘ఆన్లైన్’ బాటలో నడుస్తున్నాయి. ఐబీపీఎస్, ఆర్ఆర్బీ వంటి ఉద్యోగ నియామక పరీక్షలతో పాటు క్యాట్, గేట్ వంటి ప్రవేశ పరీక్షలూ ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఆన్లైన్ పరీక్షల వల్ల ఉపయోగాలతో పాటు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. వీటిని అధిగమించడానికి మార్గాలు.. అభ్యర్థులు మొదట ఆన్లైన్ పరీక్ష విధానంపై అవగాహన పెంపొందించుకోవాలి. దరఖాస్తు విధానం, పరీక్ష కేంద్రాలు, స్లాట్ బుకింగ్, ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్, పరీక్ష విధానం తదితరాల గురించి ముందే తెలుసుకోవాలి. లేకుంటే పరీక్ష రోజు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. మాక్ టెస్ట్లు కీలకం వీలైనన్ని ఎక్కువ ఆన్లైన్ మాక్టెస్ట్లు రాయాలి. దీనివల్ల ఆన్లైన్ పరీక్షపై పూర్తిస్థాయి అవగాహన ఏర్పడుతుంది. పరీక్ష సమయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటుంది. మల్టిపుల్ ఛాయిస్, ఎస్సే... ప్రశ్నలకు ఆన్లైన్లో సమాధానాలు ఎలా రాయాలో తెలుస్తుంది. తరచూ ఎలాంటి తప్పులు చేస్తున్నామో తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవచ్చు. ప్రాక్టీస్ చేసేటప్పుడు సమయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. సెక్షన్ల వారీగా సమయాన్ని నిర్దేశించుకుని, ప్రాక్టీస్ చేయాలి. వేగం, కచ్చితత్వం అవసరం ప్రాక్టీస్ సమయంలోనే ప్రశ్నను వేగంగా చదివి అర్థం చేసుకుని తక్కువ సమయంలో కచ్చితమైన సమాధానం గుర్తించేలా సాధన చేయాలి. లేకపోతే ప్రశ్న పెద్దగా, క్లిష్టంగా ఉన్నప్పుడు సమయం వృథా అవ డమే కాక చివర్లో సమయం సరిపోక ఇబ్బంది పడేలా చేస్తుంది. మ్యాథమెటిక్స్, డేటా అనాలసిస్ వంటి సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించే క్రమంలో.. వీలైనంతలో పెన్-పేపర్ అవసరం లేకుండా ప్రాక్టీస్ చేయాలి. మార్గదర్శకాలు చదవాలి పరీక్ష ప్రారంభానికి ముందు తప్పనిసరిగా గైడ్లైన్స్ చదవాలి. దీని వల్ల సమయం ఆదా చేయడం, పరీక్ష విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుస్తాయి. పరీక్ష రాసేటప్పుడు టైం కీలక పాత్ర పోషిస్తుంది. తెలివిగా ఏ ప్రశ్నకు ఎంత సమయం కేటాయించుకోవాలో నిర్ణయించుకోవాలి. పేజీ పైభాగంలో కనిపించే కౌంట్డౌన్ డిస్ప్లే గమనిస్తూ పరీక్ష రాయాలి. దీని వల్ల ఏ సెక్షన్కు ఎంత సమయం కేటాయిస్తున్నామో తెలుసుకుని జాగ్రత్త పడవచ్చు. కంప్యూటర్ విషయంలో జాగ్రత్తలు * పరీక్ష సమయానికి ముందే పరీక్షహాలుకు చేరుకుని నెట్ కనెక్షన్, కంప్యూటర్ను చెక్ చేసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే యాజమాన్యానికి తెలియజేయాలి. వైర్లెస్ ఇంటర్నెట్ కంటే కేబుల్ నెట్ కనెక్షన్కు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. * పరీక్ష రాసేటప్పుడు ఎలాంటి నావిగేషన్ బటన్లను (బ్యాక్, హోం, ఫార్వోడ్, రీఫ్రెష్, రీలోడ్) ఉపయోగించకూడదు. * పేజీ పూర్తిగా లోడ్ అయ్యే వరకు వేచి ఉండాలి. పేజీ పూర్తిగా లోడ్ కాకుండానే పరీక్ష రాయడం ప్రారంభిస్తే కొన్ని ప్రశ్నలు మిస్ అయ్యే అవకాశం ఉంది. * ప్రతి ప్రశ్నకు సమాధానం క్లిక్ చేశాక సేవ్ చేయడం మరచిపోవద్దు. * పరీక్ష రాయడం పూర్తయితే, అన్ని ప్రశ్నలను ఒకసారి చెక్ చేసుకొని, అప్పుడు సబ్మిట్ బటన్ నొక్కాలి. * సబ్మిట్ చే సేటప్పుడు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా కొంచెం ముందుగానే సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశాక కన్ఫర్మేషన్ పాస్వర్డ్ వచ్చే వరకు వేచి ఉండాలి. కన్ఫర్మేషన్ పాస్వర్డ్ రాకపోతే సబ్మిట్ కాలేదని అర్థం. వెంటనే ఇన్విజిలేటర్కి తెలియజేసి, సరిగా సబ్మిట్ అయ్యేలా చూసుకోవాలి. -
భారత రాజ్యాంగం లౌకిక స్వభావం-పరిశీలన
కాంపిటీటివ్ గెడైన్స్ పాలిటీ (గ్రూప్ 1, 2) భారతదేశం బహు మతాలకు, భిన్న సంస్కృతులకు, భాషలకు నిలయం. భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉంటూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే స్థాయిలో ఉండటం గర్వించాల్సిన విషయం. మత సామరస్యం కోసం లౌకిక రాజ్యంగా ప్రకటించడం జరిగింది. అయినా కొన్ని సందర్భాల్లో మత విశ్వాసాలకు, ఆధునిక అభివృద్ధికి, ప్రజల మనోభావాలకు మధ్య ఘర్షణ ఏర్పడుతోంది. వివిధ సందర్భాల్లో స్థానికంగా మతం రాజకీయ సమీకరణకు ప్రాతిపదిక అవుతూ వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాజ్యాంగ లౌకిక మూలాలు, ప్రకరణలు, చట్టాలను పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చాలా వరకు లౌకిక రాజ్యాలే. లౌకిక రాజ్యమంటే ప్రజలు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలు, పరిపాలన.. మత విశ్వాసాల ప్రాతిపదికన కాకుండా రాజ్యం, చట్టపరంగా నిర్ణయించి కొనసాగించడం. లౌకికం అంటే భౌతిక ప్రపంచం గురించి ఆలోచించడం. మనకు తెలిసిన ప్రాపంచిక విషయాలను మన అనుభవం, పరిశీలనతో వ్యాఖ్యానించడం లేదా వివరించడం. మతం మనకు తెలియని మరో లోకాన్ని గురించి ఊహించి చెప్పే ప్రయత్నం చేస్తుంది. లౌకికవాదం అనే పదాన్ని 19వ శతాబ్దానికి చెందిన సామాజిక శాస్త్రవేత్త జార్జి జాకబ్ హోలియోక్ మొదటి సారిగా వాడుకలోకి తెచ్చారు. ఈ పదం లాటిన్ భాషలోని Seculum (సెక్యులమ్) అనే పదం నుంచి ఉద్భవించింది. తరం (జనరేషన్) అని దీని అర్థం. ఆ తర్వాత వాడుకలో ప్రభుత్వాన్ని, పరిపాలనను.. మతం ముఖ్యంగా చర్చి నుంచి వేరుచేయడం.. పాలన చట్టం, రాజ్యాంగం ప్రకారం కొనసాగించడం అనే భావనలు లౌకికవాదంగా ప్రాచుర్యం పొందాయి. లౌకిక భావన, వివిధ పార్శ్వాలు లౌకిక భావనకు రాజకీయ, సామాజిక పార్శ్వాలున్నాయి. రాజకీయ కోణంలో పరిశీలించినప్పుడు లౌకికవాదం అనేది చారిత్రక నేపథ్యంలో రాజ్యానికి-చర్చికి జరిగిన సంఘర్షణ. పూర్వకాలంలో ప్రజల అన్ని విషయాలను మతం, మతాచార్యులే నిర్దేశించేవారు. రాజు కూడా వీరు చెప్పినట్లే న డుచుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కాబట్టి లౌకిక భావన అనేది రాజ్యాన్ని మత నియంత్రణ నుంచి వేరు చేసే ప్రయత్నంలో జరిగిన సంఘర్షణగా చెప్పొచ్చు. సామాజిక కోణంలో చూస్తే లౌకిక భావన అనేది ప్రజలు తమ జీవన విధానాన్ని స్వతంత్రంగా మలచుకొనే దశలో మితిమీరిన మత జోక్యాన్ని, ప్రభావాన్ని నిరసించే సామాజిక తిరుగుబాటుగా వర్ణించొచ్చు. భారతీయ భావన భిన్నం పైన ఉదహరించిన రెండు అంశాలు పాశ్చాత్య సమాజానికి సంబంధించిన పరిణామాలు. అయితే భారతదేశంలో అలా లేదు. భిన్న మతాలు, విశ్వాసాలు, జాతులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి రెండు ప్రధాన ప్రాథమ్యాలుంటాయి. మొదటిది మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేయడం, రెండోది భిన్న మతాల మధ్య సామరస్యాన్ని సాధించడానికి అన్ని మతాలకు సమాన గౌరవాన్ని కల్పించడం. ఈ నే పథ్యంలోనే భారత రాజ్యాంగ నిర్మాతలు లౌకికతత్వాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. ప్రఖ్యాత భారతీయ తత్వవేత్త, భారతదేశ రెండో రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతీయ లౌకిక భావనను ఈ విధంగా వర్ణించారు. * ‘లౌకికవాదం అంటే మతరహిత సమాజం కాదు. మత వ్యతిరేకం కూడా కాదు. ప్రాపంచిక సుఖాలు అంతకంటే కాదు. విశ్వవ్యాప్తమైన ఆధ్యాత్మిక విలువలను విభిన్న మార్గాల్లో అన్వేషించడమే’. లక్షణాలు * ప్రభుత్వానికి అధికార మతం ఉండరాదు. * అన్ని మతాలకు సమాన గుర్తింపు, గౌరవం, సమాన అవకాశాలు. మత వివక్షకు తావు లేదు. * మత విశ్వాసాలను హేతుబద్ధతతో పాటించడం. మూఢ విశ్వాసాలను త్యజించడం. * న్యాయమైన, మానవీయమైన జీవన పరిస్థితులను కల్పించడం. * మతం పూర్తిగా వ్యక్తిగతం. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా మాత్రమే ప్రభుత్వ జోక్యం ఉండాలి. * రాజ్యాంగ సవరణ-లౌకిక భావన ద్విగుణీకృతం లౌకికతత్వం (సెక్యులర్) అనే పదాన్ని మౌలిక రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో పొందుపరిచారు. ఈ పదం చేరికతో రాజ్యాంగాన్ని లౌకికతత్వం మరింత స్పష్టీకరించడంతోపాటు ద్విగుణీకృతం చేసింది. అంతేకాకుండా మౌలిక నిర్మాణంలో అంతర్భాగంగా పరిగణనలో ఉంది. * లౌకికతత్వం- రాజ్యాంగ ప్రకరణలు రాజ్యాంగం వివిధ ప్రకరణల్లో లౌకికతత్వాన్ని స్పష్టీకరించింది. దీనికి అనుగుణంగా పార్లమెంటు.. చట్టాలను కూడా రూపొందించింది. ప్రవేశికలో లౌకికతత్వం అనే పదం చేరిక, ప్రాథమిక హక్కులలో మత స్వేచ్ఛను గుర్తించడం, నిర్దేశిక నియమాలలో ఉమ్మడి పౌర నియమాలను ప్రస్తావించడం, ప్రాథమిక విధుల్లో పరమత సహనాన్ని ప్రతి పౌరుడు కలిగి ఉండాలని కోరడం, లౌకికతత్వానికి మచ్చుతునకలుగా చెప్పొచ్చు. వాటిని ఈ కింది విధంగా పరిశీలించొచ్చు. ప్రవేశిక - లౌకిక భావన భారత రాజ్యాంగ ఆత్మ, హృదయంగా పరిగణించే ప్రవేశికలో లౌకికం అని చేర్చడం, ప్రతి వ్యక్తికి ఆరాధన, విశ్వాసం, నమ్మకం అనే అంశాలలో స్వేచ్ఛను గుర్తించడం లౌకికతత్వానికి ప్రతీకగా పేర్కొనొచ్చు. ప్రాథమిక హక్కులు- లౌకికతత్వం రాజ్యాంగం మూడో భాగంలో మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా పేర్కొనడం విశేషంగా పరిగణించాలి. ముఖ్యంగా.. * ప్రకరణ-14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. చట్టం మూలంగా అందరికీ సమాన రక్షణ. * ప్రకరణ-15 ప్రకారం మత ప్రాతిపదికపై ప్రజల పట్ల వివక్షను నిషేధించడం. * ప్రకరణ-16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో కొన్ని మినహాయింపులు తప్ప అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడం. * ప్రకరణ-25 ప్రకారం ప్రతి వ్యక్తి తన ఆత్మ ప్రబోధం మేరకు తనకు నచ్చిన మతాన్ని అవలంబించడం, ఆచరించడం, ప్రచారం చేసుకోవడం, మత మార్పును చేసుకోవడానికి స్వేచ్ఛను కల్పించడం. * ప్రకరణ-26 ప్రకారం మత సంస్థలను స్థాపించుకుని నిర్వహించుకునే హక్కును గుర్తించడం. * ప్రకరణ-27 ప్రకారం మతం ఆధారంగా పన్నులు విధించకుండా నిషేధించడం. * ప్రకరణ-28 ప్రకారం ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రత్యేక మత బోధన నిషేధించడం. * మొదలైన హక్కులు, స్వేచ్ఛలు లౌకి క తత్వానికి ఆచరణాత్మక అంశాలు. * నిర్దేశిక నియమాల్లో ప్రకరణ 44 ప్రకారం ఉమ్మడి పౌర నియమావళిని అమలు చేయాలని ప్రభుత్వానికి మార్గదర్శకత్వం చేయడం ద్వారా దేశ ఐక్యత, సమగ్రతలకు మత విశ్వాసాలు సమస్యగా పరిణమించకుండా నియంత్రించొచ్చు. రాజ్యాంగం ప్రకారం ఏ ప్రజా ప్రతినిధికి పోటీ చేయడానికైనా మతం అడ్డంకి కాదు. ఉదా: * రాష్ట్రపతి పదవికి పోటీచేయడం (ప్రకరణ-58) * ఉపరాష్ట్రపతి పదవికి పోటీచేయడం (ప్రకరణ-66) * గవర్నర్ నియామకం (ప్రకరణ-155) * పార్లమెంట్, శాసనసభలకు పోటీ చేయడం (ప్రకరణ 80, 173) మొదలైన అంశాలు. * అదేవిధంగా 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కును కల్పించడం (ప్రకరణ-325) కూడా లౌకికవాదానికి ఉదాహరణలుగా చెప్పొచ్చు. లౌకికతత్వం, వివాదాలు, సుప్రీంకోర్టు తీర్పులు రాజ్యాంగంలో లౌకిక రాజ్యం అనే పదం ప్రత్యక్షంగా పేర్కొననప్పటికీ భారతదేశం లౌకిక రాజ్యమే అని ప్రాథమిక హక్కుల్లోని ప్రకరణలు 25 నుంచి 28 వరకు స్పష్టంగా తెలియజేస్తున్నాయని సుప్రీంకోర్టు.. జేవియర్ కాలేజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసు (1974)లో తీర్పు చెప్పింది. అదేవిధంగా 1994లో ఎస్ఆర్ బొమ్మాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో లౌకికతత్వం రాజ్యాంగంలోని మౌలిక సారాంశంలో అంతర్భాగమని, లౌకికతత్వాన్ని ఉల్లంఘించే రాష్ట్రాలపై ప్రకరణ 356 ప్రకారం చర్యలు చేపట్టవచ్చని స్పష్టం చేసింది. లౌకికతత్వాన్ని సకారాత్మకంగా, నిర్మాణాత్మకంగా చూడాలని, పాఠశాలలో వివిధ మత విలువలను విద్యార్థులకు బోధించడం ద్వారా ఇతర మతాల పట్ల గౌరవాన్ని కలిగి ఉండటానికి, పరమత సహనానికి తోడ్పడుతుందని అది లౌకికతత్వానికి విఘాతం కాదని 2003లో అరుణారాయ్ వర్సెస్ ఇండియన్ యూనియన్ కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రకటించింది. * లౌకికతత్వాన్ని పెంపొందించే అంశాలు * శాస్త్రీయ విద్యను, తార్కిక ఆలోచనను ప్రోత్సహించాలి. * రాజకీయాల్లో మత సంస్థలు పాల్గొనరాదు. * మత విశ్వాసాలతో కూడిన మత ప్రదర్శనలను నిషేధించాలి. * అధికార హోదాలో ఎవరూ మత ప్రదేశాలను సందర్శించరాదు. * వ్యక్తి ప్రజా జీవితంలో తాము నిర్వహించే పాత్రలో తన వ్యక్తిగత మత విశ్వాసాలను చొప్పించరాదు. ఏది ఏమైనా మొత్తానికి మత స్వేచ్ఛ, నమ్మకాలు వ్యక్తిగత ఔన్నత్యానికి, ఆధ్యాత్మిక చింతనకు తోడ్పడినంతవరకు ఫర్వాలేదు కానీ మత స్వేచ్ఛల పేరుతో మత సామరస్యానికి చేటు చేసేవారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందే. లేదంటే ప్రతి చిన్న విషయం అలజడికి కారణమై దేశ ఐక్యత, సమగ్రతకు సవాలుగా పరిణమించవచ్చు. కారల్మార్క్స్ అన్నట్లు మతం మత్తు మందుగా మారుతుంది. మతోన్మాదానికి దారితీస్తుంది. ఉన్మాదంగా చెలరేగుతుంది. మానవ సంస్కృతిని మింగేస్తుంది. దీనికి చరిత్రలో చాలా ఆధారాలున్నాయి. మతోన్మాద చరిత్ర ఎప్పటికీ పునరావృతం కారాదు. చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే అవి పునరావృతం అవుతాయి. లౌకికతత్వం వర్ధిల్లాలి. రాజ్యాంగ, చట్టపాలన కొనసాగాలి. - బి. కృష్ణారెడ్డి, డెరైక్టర్, క్లాస్-వన్ స్టడీ సర్కిల్ -
ఉజ్వల భవిష్యత్తుకు.. ఏవియేషన్
కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ ప్రజల ఆదాయాల్లో పెరుగుదల, విమాన ప్రయాణ చార్జీలు తగ్గడం, వ్యాపార నిర్వహణకు సంబంధించి రాకపోకలు పెరగడం, పర్యాటక రంగ అభివృద్ధి తదితర కారణాల వల్ల విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ఏవియేషన్ రంగం విస్తరిస్తూ యువతకు సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెస్తోంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అందుబాటులో ఉన్న ఏవియేషన్ కోర్సులు, వాటిని అందిస్తున్న సంస్థలు, అర్హతలు తదితర వివరాలు.. ఏవియేషన్ రంగంలో కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ కోర్సుకు క్రేజ్ ఎక్కువ. దీనికి ఫీజు కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే విజయవంతంగా కోర్సు పూర్తిచేస్తే, అత్యున్నత వేతనంతో ఉద్యోగం పొందొచ్చు. కమర్షియల్ పైలట్ కావాలనుకునే వారికి కమర్షియల్ పైలట్ లెసైన్స్ (సీపీఎల్) తప్పనిసరి. డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) గుర్తింపు పొందిన సంస్థ నుంచి శిక్షణ పూర్తిచేసిన వారికి ఈ లెసైన్స్ లభిస్తుంది. తొలుత స్టూడెంట్ పైలట్ లెసైన్స్, అనంతరం ప్రైవేట్ పైలట్ లెసైన్స్, ఆ తర్వాత కమర్షియల్ పైలట్ లెసైన్స్ ఇస్తారు. అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్లను ప్రధాన సబ్జెక్టులుగా చదివుండాలి. ఇంటర్లో వీటిని చదవనివారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ద్వారా అభ్యసించవచ్చు. ఈ కోర్సులో చేరే వారికి నిర్ణీత శారీరక, ఆరోగ్య ప్రమాణాలు ఉండాలి. అలాగే నిర్దిష్ట వయోపరిమితి కలిగి ఉండాలి. కోర్సులో ప్రవేశాలకు పైలట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ను నిర్వహిస్తారు. వేతనం: కోర్సు పూర్తిచేసిన వారు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పైలట్ ఉద్యోగాలు పొందొచ్చు. ప్రారంభంలో రూ.5 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది. కోర్సును అందిస్తున్న సంస్థలు: ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ - హైదరాబాద్, రాజీవ్గాంధీ ఏవియేషన్ అకాడమీ - హైదరాబాద్, ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ - సికింద్రాబాద్, గవర్నమెంట్ ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ - భువనేశ్వర్, న్యూఢిల్లీ, గవర్నమెంట్ ఫ్లయింగ్ ట్రైనింగ్ స్కూల్ - బెంగళూరు, రాజీవ్గాంధీ అకాడమీ ఫర్ ఏవియేషన్ టెక్నాలజీ - తిరువనంతపురం, ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ - రాయ్బరేలీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ - గుజరాత్ క్యాబిన్ క్రూ/ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ ఇందులో వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఈ కోర్సుల కాల వ్యవధి 6 నెలల నుంచి ఏడాది మధ్యలో ఉంటుంది. కోర్సులు అందిస్తున్న సంస్థలు: ఫ్రాంక్ఫిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ (కోర్సులు: డిప్లొమా ఇన్ ఏవియేషన్, హాస్పిటాలిటీ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, డిప్లొమా కోర్స ఇన్ హాస్పిటాలిటీ, ట్రావెల్ అండ్ కస్టమర్ సర్వీస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటీ సర్వీసెస్), ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ - గుజరాత్ (కోర్సు: క్యాబిన్ క్రూ అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ - ఎయిర్ హోస్టెస్/ఫ్లైట్ స్టీవార్డ). అర్హతలు: ఇంటర్/+2 పూర్తిచేసిన మహిళా, పురుష అభ్యర్థులిద్దరూ అర్హులు. ఇందులో కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్ సర్వీసెస్, ఇన్ ఫ్లైట్ ట్రైనింగ్, సేఫ్టీ అండ్ ఫస్డ్ ఎయిడ్ ప్రొసీజర్, ఫుడ్ అండ్ బేవరేజ్ ప్రొడక్షన్ అండ్ సర్వింగ్ తదితర అంశాలు నేర్పిస్తారు. ప్రారంభంలో వార్షిక వేతనం రూ.4 నుంచి రూ.6 లక్షలు ఉంటుంది. ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇది నాలుగేళ్ల బీటెక్ డిగ్రీ. ఎయిర్క్రాఫ్ట్ల డిజైన్, రూపకల్పన, నిర్వహణ తదితరాలపై ఈ కోర్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇది పూర్తిచేసిన వారు ప్రభుత్వ, ప్రైవేటు ఎయిర్లైన్స్లో చీఫ్ ఇంజనీర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు పొందొచ్చు. అర్హతలు: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్/+2 పూర్తిచేసిన వారు ఈ కోర్సుకు అర్హులు. ఇందులో ప్రవేశాలకు అభ్యర్థులు జాతీయ/రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది. వేతనం: ప్రారంభంలో వార్షిక వేతనం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉంటుంది. సంస్థలు: జేఎన్టీయూ - కాకినాడ, మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటీ బాంబే, ఐఐటీ ఖరగ్పూర్, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. బీఎస్సీ ఏవియేషన్ బీఎస్సీ ఏవియేషన్ కోర్సు కాలవ్యవధి మూడేళ్లు. ఎయిర్ రెగ్యులేషన్స్, నేవిగేషన్, ఎయిర్క్రాఫ్ట్ అండ్ ఇంజిన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఏవియేషన్ సెక్యూరిటీ, ఫ్లైట్ సేఫ్టీ తదితర అంశాలపై ఈ కోర్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. దీన్ని పూర్తిచేసిన వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, గ్రౌండ్ ఆపరేషన్స్ స్టాఫ్, కార్గో మేనేజ్మెంట్ స్టాఫ్, టికెటింగ్ స్టాఫ్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు పొందొచ్చు. అర్హత: ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్లతో ఇంటర్/+2. వేతనం: ప్రారంభంలో వార్షిక వేతనం రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుంది. ఉన్నత విద్య దిశగా కూడా వెళ్లొచ్చు. కోర్సును అందిస్తున్న సంస్థలు: ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ - హైదరాబాద్; ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ - సికింద్రాబాద్, ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ - రాయ్బరేలీ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ (ఏఎంఈ) కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. కోర్సు, ఇంటర్న్షిప్ను విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి డీజీసీఏ.. ఏఎంఈ లెసైన్స్ను అందిస్తుంది. ఎయిర్క్రాఫ్ట్ల తనిఖీ, నిర్వహణ, సర్వీసింగ్పై ఈ కోర్సు ప్రధానంగా దృష్టిసారిస్తుంది. కోర్సు పూర్తిచేసిన వారు ప్రభుత్వ, ప్రైవేటు ఎయిర్లైన్స్లో ఉద్యోగాలు పొందొచ్చు. అలాగే ఏవియేషన్, ఎయిర్క్రాఫ్ట్ నిర్వహణ సంస్థలు, ఫ్లయింగ్ స్కూళ్లలో కూడా ఉద్యోగాలు సాధించొచ్చు. అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్ పూర్తిచేసినవారు ఈ కోర్సుకు అర్హులు. అలాగే నిర్ణీత వయోపరిమితి, వైద్య ప్రమాణాలు ఉండాలి. చివరి 6 నెలల పాటు విద్యార్థులు ఇంటర్న్షిప్ చేయాలి. వేతనం: ప్రారంభంలో వార్షిక వేతనం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుంది. కోర్సును అందిస్తున్న సంస్థలు: ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ - హైదరాబాద్, రాజీవ్గాంధీ ఏవియేషన్ అకాడమీ - హైదరాబాద్, ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ - సికింద్రాబాద్. బీబీఏ ఇన్ ఏవియేషన్ మేనేజ్మెంట్ కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. కోర్సు కరిక్యులంలో ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, సేఫ్టీ మేనేజ్మెంట్ తదితర అంశాలు ఉంటాయి. ఈ కోర్సును పూర్తిచేసిన వారు విమానాశ్రయాల్లో ఎయిర్పోర్ట్ మేనేజర్, అడ్మినిస్ట్రేటర్, స్టాఫ్ మేనేజర్, సేఫ్టీ ఆఫీసర్ తదితర విభాగాల్లో విధులు నిర్వర్తించొచ్చు. అర్హత : కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా గ్రూపులో ఇంటర్/+2. అందిస్తున్న సంస్థలు: ఎయిమ్ఫిల్ ఇంటర్నేషనల్ - హైదరాబాద్, యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ (యూపీఈఎస్) - డెహ్రాడూన్ (బీబీఏ ఏవియేషన్ ఆపరేషన్స). వేతనం: ప్రారంభంలో 3 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది. ఈ కోర్సు పూర్తిచేసిన తర్వాత ఔత్సాహికులు ఎంబీఏ కూడా చేయొచ్చు. గ్రౌండ్ స్టాఫ్ మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో ఈ కోర్సులుంటాయి. ఏదైనా గ్రూపులో ఇంటర్ పూర్తి చేసిన వారు ఇందులో చేరొచ్చు. ఎయిర్పోర్ట్ స్ట్రాటజీ అండ్ ఫంక్షనింగ్, కార్గో మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్, స్టాఫ్ మేనేజ్మెంట్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ తదితర అంశాలను ఇందులో నేర్పిస్తారు. కోర్సు పూర్తిచేసిన వారు ప్రాంతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎయిర్పోర్ట్ ఇన్ఫర్మేషన్ డెస్క్, కార్గో డిపార్ట్మెంట్ మేనేజర్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు పొందొచ్చు. ప్రారంభంలో వార్షిక వేతనం రూ.2 లక్షల నుంచి ఉంటుంది. అయితే ఈ కోర్సు తర్వాత ఐఏటీఏ సర్టిఫికేషన్ కోసం ప్రయత్నిస్తే మెరుగైన ఫలితాలుంటాయి. కోర్సులు - అందిస్తున్న సంస్థలు: ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్పోర్ట్ ఫెమిలియరైజేషన్ అండ్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ (కోర్సు: ఎయిర్ కార్గో అండ్ కొరియర్ మేనేజ్మెంట్). ఇంకా ఎన్నో.. ఇవే కాకుండా డిప్లొమా ఇన్ క్యాబిన్ క్రూ అండ్ ఇన్ ఫ్లైట్ సర్వీస్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఎయిర్ కార్గో మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్, డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఎయిర్ కార్గో ప్రాక్టీసెస్ అండ్ డాక్యుమెంటేషన్, డిప్లొమా ఇన్ డొమెస్టిక్ ఎయిర్లైన్ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ తదితర ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటి కాల వ్యవధి 6 నెలల నుంచి ఏడాది వరకు ఉంటుంది. ఇంటర్ విద్యార్హతతో ఈ కోర్సులు చేయొచ్చు. నల్సార్ వర్సిటీలో.. నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (నల్సార్)... ఏవియేషన్ అండ్ స్పేస్లా కోర్సులను అందిస్తోంది. కోర్సుల వివరాలు... ⇒ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ (రెండేళ్లు) ⇒ మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్పేస్ అండ్ టెలీకమ్యూనికేషన్ ‘లా’స్ (రెండేళ్లు) ⇒ పీజీ డిప్లొమా ఇన్ ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ (ఏడాది) ⇒ పీజీ డిప్లొమా ఇన్ జీఐఎస్ అండ్ రిమోట్ సెన్సింగ్ లా (ఏడాది) అర్హతలు: మూడేళ్ల ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీతో పాటు సంబంధిత రంగంలో మూడేళ్ల పని అనుభవం ఉన్నవారు ఈ కోర్సుకు అర్హులు. -
పదో తరగతి తర్వాత..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటా దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి, ఇంటర్మీడియెట్ పూర్తి చేస్తున్నారు. తర్వాత ఏ కోర్సులో చేరాలి? ఏ గ్రూప్ను ఎంపిక చేసుకోవాలి? ఆయా గ్రూప్లు/కోర్సులతో ఎలాంటి ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు ఉంటాయి? ఆయా కోర్సులు ఎంచుకోవాలంటే ఉండాల్సిన లక్షణాలేమిటి? పదో తరగతి, ఇంటర్మీడియెట్తో కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలేవి? స్వయం ఉపాధి దిశగా అవకాశాలున్నాయా? దూరవిద్య విధానంలో కోర్సులు అభ్యసించొచ్చా? ఇలా ఎన్నో సందేహాలు విద్యార్థులు.. వారి తల్లిదండ్రుల్లో నెలకొన్నాయి. మరికొద్ది రోజుల్లో కొత్త అకడమిక్ ఇయర్ ప్రారంభం కానుంది. ఇంటర్మీడియెట్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా అంశాలపై విద్యార్థులకొచ్చే సందేహాలకు నిపుణుల సమాధానాలు.. ఇంటర్మీడియెట్లో బైపీసీ గ్రూప్ను ఎంచుకోవాలనుకునేవారికి ఉండాల్సిన లక్షణాలేమిటి? బైపీసీ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ) అంటే.. ఎంబీబీఎస్లో చేరడానికి మాత్రమే అనే అభిప్రాయముంది. కానీ బైపీసీతో ఎంబీబీఎస్తోపాటు అనేక అవకాశాలు అందుకోవచ్చు. పరిశోధనల పట్ల ఆసక్తి, లైఫ్ సెన్సైస్ సబ్జెక్టులపై ఇష్టం, ప్రకృతి పరిశీలన, జంతువులు.. వాటి జీవన శైలి వంటి వాటిపై సహజమైన ఆసక్తి ఉన్న వారికి సరిపడే గ్రూప్ బైపీసీ. వీటన్నిటికంటే ముఖ్యంగా బైపీసీ ఎంచుకునే విద్యార్థికి కావాల్సిన లక్షణం కష్టించే తత్వం. కారణం.. బైపీసీ సబ్జెక్ట్ సిలబస్ విస్తృతంగా ఉంటుంది. అదే విధంగా ప్రాక్టికల్స్కు ప్రాధాన్యం ఉండే గ్రూప్ కూడా ఇదే. కాబట్టి ప్రాక్టికల్ అప్రోచ్, ఎప్పటికప్పుడు చదివిన అంశాన్ని ప్రయోగశాలలో పరిశీలించే విధంగా సన్నద్ధత సైతం అవసరం. నేను పదో తరగతి పూర్తి చేశాను. ఇంటర్మీడియెట్లో ఎంపీసీ గ్రూప్ను ఎంపిక చేసుకోవాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి? మ్యాథ్స్పై ఆసక్తి, సమస్యలు-పరిష్కారాలు-వివరణలు ఇవ్వడం, భౌతిక, రసాయన శాస్త్ర సిద్ధాంతాలు, సూత్రాలు, ప్రయోగాలంటే ఇష్టపడేవారు మ్యాథ్స, ఫిజిక్స్, కెమిస్ట్రీ (ఎంపీసీ గ్రూప్)ను ఎంపిక చేసుకోవచ్చు. థియరీ కంటే ప్రాక్టికల్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న గ్రూప్.. ఎంపీసీ. ఆయా సబ్జెక్టుల్లో ఎప్పటికప్పడు పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. నిరంతర అధ్యయనం, కొత్త టెక్నాలజీలను అవగాహన చేసుకోవడం, వాటిలో నైపుణ్యం సాధించడం అనే సహజ లక్షణాలు ఎంపీసీ గ్రూప్ ఎంచుకునే విద్యార్థులకు చాలా అవసరం. ఎంపీసీలో ప్రథమ భాషగా తెలుగు లేదా సంస్కృతం, ద్వితీయ భాషగా ఇంగ్లిష్, గ్రూప్ సబ్జెక్టులుగా.. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలు ఉంటాయి. ఎంపీసీ అంటే.. కేవలం ఇంజనీరింగ్లో చేరడం కోసమే అనే అభిప్రాయంతో ఈ గ్రూప్ను ఎంచుకుంటారు. కానీ ఇంటర్మీడియెట్ తర్వాత ఇంజనీరింగ్తోపాటు అనేక అవకాశాలు ఎంపీసీ విద్యార్థులకు ఆహ్వానం పలుకుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం సైన్స్ పరిశోధనలకు ప్రాధాన్యం పెరుగుతుండటంతో బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో బీఎస్సీలో అడుగుపెట్టి తర్వాత ఎమ్మెస్సీ, పీహెచ్డీ వంటి కోర్సులు చేయొచ్చు. ఇంటర్మీడియెట్లో సీఈసీ గ్రూప్ను ఎంచుకోవాలనుకునేవారికి ఉండాల్సిన లక్షణాలేమిటి? సమస్యను విశ్లేషణాత్మక దృష్టితో చూసే లక్షణం; కొత్త విషయాలపై ఆసక్తి, నిరంతర అధ్యయన దృక్పథం, గణాంకాలను విశ్లేషించే నైపుణ్యం ఉన్న విద్యార్థులకు అనుకూలమైన గ్రూప్.. సివిక్స్, ఎకనామిక్స్, కామర్స (సీఈసీ). ప్రస్తుత కార్పొరేట్ యుగంలో వ్యాపార, పారిశ్రామిక రంగాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. కామర్స్లో నైపుణ్యాలు పొందిన మానవ వనరుల అవసరం పెరుగుతోంది. దీన్ని అందిపుచ్చుకునేందుకు సరైన గ్రూప్.. సీఈసీ. చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ), కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ), కంపెనీ సెక్రటరీ (సీఎస్) వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో రాణించేందుకు సీఈసీ ఎంతో అనుకూలమైన గ్రూప్. ఈ గ్రూప్ ఎంచుకునే విద్యార్థులకు తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణం సహనం. చిట్టా పద్దుల్లో చిక్కుముడులను విప్పే క్రమంలో ఒక్కోసారి గంటలకొద్దీ సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో సహనం కోల్పోకుండా పనిచేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వ్యాపార రంగానికి సంబంధించి ప్రభుత్వ పరంగా జరిగే చట్టాల్లో మార్పులు, వాటి పర్యవసానాలను ఎప్పటికప్పుడు అవగాహన చేసుకునే నైపుణ్యం కావాలి. సీఈసీ తర్వాత చాలామంది బీకాంలో చేరతారు. ఇప్పుడు బీకాంలో కూడా పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ప్రత్యేక స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. (ఉదా: బీకాం అడ్వర్టయిజింగ్, సేల్స్ అండ్ సేల్స్ ప్రమోషన్, ట్యాక్స్ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీసెస్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఈ-కామర్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్, ఆనర్స్ తదితర). బ్యాచిలర్ డిగ్రీలో ఇలాంటి విభిన్న స్పెషలైజేషన్లను ఎంచుకోవడం ద్వారా భవిష్యత్తులో త్వరగా స్థిరపడొచ్చు. ఇంటర్మీడియెట్ ఎంఈసీ గ్రూప్ను ఎంచుకోవాలంటే ఏయే స్కిల్స్ ఉండాలి? ఇటీవల కాలంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆదరణ పొందుతున్న గ్రూప్.. మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ (ఎంఈసీ). అటు మ్యాథ్స్.. ఇటు కామర్స్.. రెండిటిని ఇష్టపడేవారికి చక్కటి గ్రూప్.. ఎంఈసీ. లెక్కలు, వ్యాపారం, గణాంకాలు, ఆర్థిక అంశాలపై ఆసక్తి ఉన్నవారికి అపార అవకాశాలందిస్తున్న ఈ కోర్సుకు ప్రాధాన్యత పెరుగుతోంది. ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణలతో విస్తృత ఉద్యోగావకాశాలను ఈ గ్రూప్ ద్వారా సాధించవచ్చు. మ్యాథ్స్ అంటే ఆసక్తి, ఆర్థిక వ్యవహారాలు, వాణిజ్య శాస్త్రం పట్ల మక్కువ ఉన్నవారు ఎంఈసీని ఎంపిక చేసుకోవచ్చు. ఇంటర్మీడియెట్లో హెచ్ఈసీ గ్రూప్ను ఎంపిక చేసుకునేవారికి ఎలాంటి లక్షణాలు ఉండాలి? ‘ఏ గ్రూప్లో సీటు రాకపోతే హెచ్ఈసీలో చేరతారు’.. ఇది సాధారణఅభిప్రాయం. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని తిరగ రాయాల్సిందే. ఎందుకంటే.. ఇంటర్మీడియెట్లో హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ (హెచ్ఈసీ).. సుస్థిర భవిష్యత్తుకు పునాది అని చెప్పొచ్చు. ముఖ్యంగా భవిష్యత్తులో పోటీ పరీక్షల ద్వారా సివిల్స్ మొదలు గ్రూప్-4 వరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునే విద్యార్థులకు.. మేలు చేసే గ్రూప్ హెచ్ఈసీ. ఈ గ్రూప్లో చేరాలనుకునే విద్యార్థులకు ముఖ్యంగా ఉండాల్సిన లక్షణాలు.. రైటింగ్ స్కిల్స్, నిరంతర అధ్యయనం. విస్తృతంగా ఉండే అంశాల నుంచి కీలకమైన వాటిని గుర్తించే సునిశిత పరిశీలన దృష్టి. సామాజిక అంశాలపై అవగాహన, సమాజంలో నిరంతరం చోటుచేసుకునే పరిణామాలను తెలుసుకునే నైపుణ్యం. ఉన్నత విద్య కోణంలోనూ హెచ్ఈసీ తర్వాత అవకాశాలు అనేకం. ఒకప్పుడు హెచ్ఈసీ తర్వాత బీఏలో చేరడమే మార్గంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బీఏలోనూ విభిన్నమైన స్పెషలైజేషన్లు (ఉదా: హోటల్ మేనేజ్మెంట్, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, సోషల్ వర్క్, లిబరల్ ఆర్ట్స్ తదితర) అందుబాటులోకి వచ్చాయి. హెచ్ఈసీతో (ఇంటర్మీడియెట్) ఐదేళ్ల బ్యాచిలర్ ఆఫ్ లా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ(ఎంఏ)లో ప్రవేశించొచ్చు. ఐటీఐలో చేరడానికి అర్హత ఏమిటి? ఎంపిక ఎలా ఉంటుందో తెలియజేయండి? పదో తరగతి తర్వాత తక్కువ ఖర్చు, తక్కువ సమయంలోనే ఉద్యోగం/స్వయం ఉపాధి పొందాలనుకునేవారికి మార్గం.. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఐటీఐ). ఐటీఐ కోర్సుల్లో రెండేళ్ల శిక్షణతో వివిధ నైపుణ్యాలు సొంతమవుతారుు. దాంతో స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం అవుతుంది. ఐటీఐ కోర్సులను పూర్తిచేసిన వారికి నేడు ఉపాధికి ఢోకాలేదు. వెల్డర్, ఫిట్టర్, ప్లంబర్, టర్నర్ వంటి కోర్సులతోపాటు తాజాగా విభిన్న నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చే అంశాలపై ఐటీఐలు దృష్టిసారించారుు. పదో తరగతి మార్కుల ఆధారంగా వీటిలో చేరొచ్చు. జూలై/ఆగస్టుల్లో ప్రవేశాలుంటాయి. ఐటీఐలో ఏయే కోర్సులు అందుబాటులో ఉన్నాయి? ఐటీఐల్లో రెండేళ్ల వ్యవధి ఉన్న ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, రేడియో అండ్ టెలివిజన్, డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్, డ్రాఫ్ట్స్మెన్ సివిల్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, వైర్మెన్, మెకానిక్ మోటార్ వెహికల్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్, అటెండెంట్ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్, డీజిల్ మెకానిక్, ప్లంబర్, వెల్డర్, కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్, ఫోర్జర్ అండ్ హీట్ట్రీటర్, మాసన్ (బిల్డింగ్ కనస్ట్రక్షన్) తదితర కోర్సులు ఉన్నాయి. నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్స్: స్టెనోగ్రఫీ, సెక్రెటేరియల్ ప్రాక్టీస్, డ్రెస్మేకింగ్, కట్టింగ్ అండ్ టైలరింగ్, బుక్ బైండింగ్, హ్యాండ్ కంపోసర్, కార్పెట్ వేవింగ్. ఈ కోర్సులే కాకుండా ఎప్పటికప్పుడు మార్కెట్/కంపెనీల అవసరాలకనుగుణంగా కొత్త కోర్సులు, జాబ్ ఓరియెంటెడ్ కోర్సులను ఐటీఐలు అందిస్తున్నాయి. పదో తరగతి పూర్తి చేశాను. స్వయం ఉపాధి దిశగా స్థిరపడాలంటే స్వల్పకాలిక శిక్షణ కోర్సులు అందించే సంస్థల వివరాలు తెలపండి? సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ టిన్స్విటీస్ (సెట్విన్).. యువతకు స్వయం ఉపాధి కోర్సులను అందిస్తోంది. ఎంఎస్ ఆఫీస్, డెస్క్టాప్ పబ్లిషింగ్, మల్టీమీడియా, వెబ్ డిజైనింగ్, కంప్యూటర్ హార్డ్వేర్, ఎయిర్లైన్ టికెటింగ్, ఆఫీస్ ఆటోమేషన్ ప్రోగ్రామ్, ఆటో ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, రేడియో అండ్ టీవీ మెకానిక్, టైప్ రైటింగ్, టెలిఫోన్ ఆపరేటర్, కటింగ్ అండ్ టైలరింగ్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ వంటి కోర్సులను సెట్విన్ ఆఫర్ చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సెట్విన్ కేంద్రాలు ఉన్నాయి. సెట్విన్ మాత్రమే కాకుండా స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్-భూదాన్ పోచంపల్లి(నల్గొండ జిల్లా), మైక్రోస్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్(ఎంఎస్ఎంఈ)- హైదరాబాద్ వంటి సంస్థలు అటు స్వయం ఉపాధిని, ఇటు ఏదైనా ఉద్యోగాన్ని పొందేలా వివిధ కోర్సులందిస్తున్నాయి. వీటిల్లో ఇన్స్టిట్యూట్ను బట్టి హోటల్ మేనేజ్మెంట్, బ్యూటీషియన్, సెల్ఫోన్ రిపేరింగ్, ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, రేడియో అండ్ టీవీ మెకానిజం, జ్యుయెలరీ మేకింగ్, కార్పెంటరీ, డీటీపీ, వెబ్ డిజైనింగ్, ఎంఎస్ ఆఫీస్, మల్టీమీడియా, కంప్యూటర్ హార్డ్వేర్, ఎయిర్లైన్ టికెటింగ్, కాల్సెంటర్ ట్రైనింగ్, గోల్డ్ పాలిషింగ్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల కాల వ్యవధి కోర్సును బట్టి మూడు నెలల నుంచి ఏడాది వరకు ఉంటుంది. పాలిటెక్నిక్ కోర్సులతో ప్రయోజనాలేమిటి? ఏయే కోర్సులు అందుబాటులో ఉన్నాయి? పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలిసెట్ రాయాలి. ఇందులో ర్యాంకు ద్వారా మూడేళ్లు/మూడున్నరేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆటోమొబైల్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ తదితర ఇంజనీరింగ్ బ్రాంచ్లలో డిప్లొమా చేయొచ్చు. డిప్లొమా ఉత్తీర్ణులు ఈసెట్ ద్వారా బీటెక్లో రెండో సంవత్సరంలో ప్రవేశించొచ్చు. డిప్లొమా ఇంజనీరింగ్ ఉత్తీర్ణులను పలు ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు ట్రైనీ సూపర్వైజర్లుగా నియమించుకుంటున్నాయి. అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీ పాలిటెక్నిక్ కోర్సుల గురించి తెలపండి? పదో తరగతి ఉత్తీర్ణతతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అగ్రికల్చర్ పాలిటెక్నిక్, వెటర్నరీ పాలిటెక్నిక్, ఫిషరీ పాలిటెక్నిక్, హార్టికల్చర్ పాలిటెక్నిక్ కోర్సులు అభ్యసించే వీలుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, శ్రీ పి.వి.నరసింహారావు తెలంగాణ స్టేట్ వెటర్నరీ యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ ఈ కోర్సులు అందిస్తున్నాయి. అగ్రి పాలిటెక్నిక్లో భాగంగా రెండేళ్ల డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, మూడేళ్ల డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సులున్నాయి. హార్టికల్చర్లో భాగంగా రెండేళ్ల డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కోర్సు అందుబాటులో ఉంది. వెటర్నరీ పాలిటెక్నిక్లో భాగంగా డిప్లొమా ఇన్ యానిమల్ హజ్బెండరీ, డిప్లొమా ఇన్ ఫిషరీ పాలిటెక్నిక్ కోర్సులున్నాయి. కోర్సుల వ్యవధి రెండేళ్లు. ప్రస్తుతం ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటనలు వెలువడ్డాయి. దరఖాస్తుకు సమయం ఉంది. మరిన్ని వివరాల కోసం ఆయా యూనివర్సిటీల వెబ్సైట్స్ చూడొచ్చు. పదో తరగతి అర్హతతో కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు తెలపండి? సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్లో కానిస్టేబుల్స్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స (సీఐఎస్ఎఫ్), సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), ఎస్ఎస్ఎఫ్, సెంట్రల్ రిజర్వ పోలీస్ ఫోర్స (సీఆర్పీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స (బీఎస్ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స (ఐటీబీపీ)లలో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) అస్సాం రైఫిల్స్ (ఏఆర్)లో రైఫిల్మెన్స అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. వయోపరిమితి: 18 నుంచి 23 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజుర్మెంట్స్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ టె స్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష విధానం: వంద మార్కులకు నిర్వహించే పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. జనరల్ ఇంటెలిజెన్స అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ అండ్ జనరల్ ఎవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ లేదా హిందీలో నాలుగు విభాగాల నుంచి 25 మార్కుల చొప్పున 25 ప్రశ్నల చొప్పున ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. వెబ్సైట్స్: www.cisf.gov.in, www.ssb.nic.in, www.nia.gov.in, www.http://bsf.nic.in, http://crpf.nic.in, http://itbpolice.nic.in, www.assamrifles.gov.in ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎంపిక విధానం: ఫిజికల్ టెస్ట్, రాత పరీక్షల ద్వారా వయోపరిమితి: 18 నుంచి 25 ఏళ్లు ప్రకటన: రైల్వే ఉద్యోగాల భర్తీకి ఏడాదిలో చాలాసార్లు ప్రకటనలు వెలువడుతూనే ఉంటాయి. ఈ మధ్య వివిధ రైల్వే జోన్లు ఖాళీలను ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తున్నాయి. ప్రకటనలు ఠీఠీఠీ.టటఛిఛ.జౌఠి.జీ వెబ్సైట్లో లేదా ఎంప్లాయిమెంట్ న్యూస్లో చూడొచ్చు. డిఫెన్స్ జాబ్స్.. ఇండియన్ నేవీలో.. పోస్టులు: మెట్రిక్ రిక్రూట్-స్టివార్డ్/కుక్స్; మ్యుజీషియన్లు. వయోపరిమితి: 17-21 ఏళ్లు. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. వెబ్సైట్: www.nausena-bharti.nic.in ఇండియన్ ఆర్మీలో.. పోస్టు: సోల్జర్ జనరల్ డ్యూటీ అర్హత: 45 శాతం మార్కులతో దో తరగతి. వయోపరిమితి: 171/2న్నర నుంచి 21 ఏళ్లు. ఎంపిక విధానం: రాతపరీక్ష, హదారుఢ్య, వైద్య ఆరోగ్య పరీక్షల ద్వారా. వెబ్సైట్: http://indianarmy.nic.in ఇండియన్ ఎయిర్ఫోర్స్లో.. పోస్టు: ఎయిర్మెన్ గ్రూప్-వై మ్యుజీషియన్ ట్రేడ్ అర్హత: పదోతరగతిలో 45 శాతం మార్కులు. వయసు: 17 నుంచి 25 ఏళ్ల వరకు ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ల ద్వారా. సంబంధిత సంగీత పరికరంలో ప్రావీణ్యం ఉండాలి. వెబ్సైట్: http://careerairforce.nic.in ఏపీఎస్ఆర్టీసీ/టీఎస్ఆర్టీసీలో.. పోస్టు: బస్ కండక్టర్ ఎంపిక విధానం: పదోతరగతి మార్కుల ఆధారంగా.. పోస్టు: బస్ డ్రైవర్ ఇతర అర్హతలు: హెవీ మోటార్ వెహికల్ పర్మినెంట్ డ్రైవింగ్ లెసైన్స్తోపాటు నిర్దేశిత అనుభవం తప్పనిసరి. ఆసక్తికి అనుగుణంగా ఇంటర్లో ఏ గ్రూపులో చేరినప్పటికీ, మొదట్నుంచి అకడమిక్గా ముందుండటానికి ప్రయత్నించాలి. భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా ఆయా ఉన్నత విద్య ప్రవేశ పరీక్షలకు ప్రిపరేషన్ కొనసాగించాలి. ఏదో ఒక కారణం చెప్పి, సబ్జెక్టుల అధ్యయనాన్ని వాయిదా వేసే ధోరణి సగటు విద్యార్థిలో కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఏ రోజు పాఠాలను ఆ రోజే పూర్తిచేయాలి. తమ గ్రూప్ సబ్జెక్టులకు సంబంధించిన అంశాల అప్లికేషన్స్పై పూర్తిస్థాయిలో పట్టు సాధించడం ముఖ్యం. కాలేజీ సమయాన్ని మినహాయించి, రోజుకు 4-5 గంటలు కష్టపడి చదివినప్పుడే లక్ష్యాలను చేరుకునేందుకు వీలవుతుంది. - ఎం.ఎన్.రావు, సీనియర్ ఫ్యాకల్టీ, శ్రీచైతన్య విద్యాసంస్థలు. -
ఇంటర్ తర్వాత...
ఇంటర్మీడియెట్ ఎంపీసీ తర్వాత ఉన్నతవిద్య పరంగా ఎలాంటి అవకాశాలుంటాయి? ♦ అత్యున్నత విద్యావకాశాలు అందించే గ్రూప్.. మ్యాథ్స, ఫిజిక్స్, కెమిస్ట్రీ (ఎంపీసీ). ఇంటర్మీడియెట్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ (ఇంజనీరింగ్) రాసి.. వివిధ బ్రాంచ్ల్లో బీటెక్, బీఫార్మసీ, బీటెక్(అగ్రి ఇంజనీరింగ్), బీటెక్(బయోటెక్నాలజీ), బీటెక్(డెయిరీ టెక్నాలజీ), బీటెక్(ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ), ఫార్మ్డి వంటి కోర్సులు అభ్యసించొచ్చు. ఫార్మ్డి మినహాయించి మిగిలిన కోర్సుల వ్యవధి నాలుగేళ్లు. ఫార్మ్డి వ్యవధి ఆరేళ్లు. ♦ జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ విద్యకు మేటి సంస్థలుగా పేరొందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు), నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీలు), ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీలు)లలో నాలుగేళ్ల బీటెక్, ఐదేళ్ల డ్యుయెల్ డిగ్రీ (ఇంజనీరింగ్), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ వంటి కోర్సులు చదవొచ్చు. దీనికోసం జాతీయస్థాయిలో ప్రతి ఏటా ఏప్రిల్/మేలలో జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ నిర్వహిస్తారు. ♦ సైన్స్ సంబంధిత కోర్సులను అందించడంలో దేశంలోనే పేరుగాంచిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)లో నాలుగేళ్ల బీఎస్ (రీసెర్చ్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)లలో ఐదేళ్ల బీఎస్-ఎంఎస్ డ్యుయెల్ డిగ్రీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ (నైసర్)-భువనేశ్వర్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ వంటి కోర్సులు చదివే వీలుంది. ఇన్స్టిట్యూట్ను బట్టి జాతీయస్థాయిలో జరిగే ప్రవేశపరీక్ష/జేఈఈ అడ్వాన్స్డ్ తదితర మార్గాల ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ♦ దేశంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ వంటివాటితోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ వంటివి ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణతతో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులు అందిస్తున్నాయి. ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ♦ ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణతతో బీఏ(మ్యాథ్స్), బీఎస్సీ(మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ), బీఎస్సీ(బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ), బీఎస్సీ(మ్యాథ్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్), బీఎస్సీ(మ్యాథ్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్), బీఎస్సీ(మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్) వంటి కాంబినేషన్లతోపాటు బీఏ/బీకాం వంటి కోర్సులు చదివే వీలుంది. బీఏలో ఎకనామిక్స్ చదవడం కుదరదు. ఇంటర్లో ఎకనామిక్స్ చదివినవాళ్లే అర్హులు. బీఏ/బీఎస్సీ/బీకాం కోర్సుల వ్యవధి: మూడేళ్లు. ♦ బీటెక్ /బీఏ /బీఎస్సీ/బీకాం కోర్సులు పూర్తిచేస్తే సంబంధిత సబ్జెక్టులు/స్పెషలైజేషన్తో ఎంటెక్/ఎంఏ/ఎంఎస్సీ/ఎంకాం/ఎంబీఏ వంటి కోర్సులు అభ్యసించొచ్చు. దేశంలో దాదాపు అన్ని యూనివర్సిటీలు ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఎంటెక్/ఎంబీఏ మినహాయించి మిగిలిన కోర్సులకు ఆయా వర్సిటీల ప్రవేశపరీక్షలు రాయాలి. ఎంటెక్కు గేట్/పీజీఈసెట్, ఎంబీఏకు క్యాట్/మ్యాట్/గ్జాట్/సీమ్యాట్/ఆత్మా వంటి పరీక్షల్లో ర్యాంకు సాధించాలి. ఇంటర్మీడియెట్ ఎంపీసీ తర్వాత చదువుకుంటూ ఉద్యోగం చేసే వీలుందా? ఇంటర్మీడియెట్ ఎంపీసీ తర్వాత చదువుకుంటూ ఉద్యోగం చేసే వీలుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏటా రెండుసార్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ ఎగ్జామ్ (ఎన్డీఏ అండ్ ఎన్ఏ) నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా త్రివిధ దళాలైన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ఫోర్స్ల్లో కమిషన్డ్ అధికారిగా అడుగుపెట్టే వీలుంది. అవాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. నోటిఫికేషన్లో ప్రకటించిన తేదీనాటికి నిర్దేశిత వయసును కలిగి ఉండాలి. ప్రవేశపరీక్ష, సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ) ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి మూడేళ్లపాటు నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లో శిక్షణ ఇస్తారు. ఈ సమయంలో నెలకు రూ.21,000 స్టైఫండ్ లభిస్తుంది. తర్వాత బీఎస్సీ/బీఎస్సీ (కంప్యూటర్స్)/బీఏ సర్టిఫికెట్ ప్రదానం చేస్తారు. 10+2 కేడెట్ ఎంట్రీ స్కీమ్ అభ్యర్థులకు ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏ)- ఎజిమలలో నాలుగేళ్లు శిక్షణ ఇచ్చి బీటెక్ ప్రదానం చేస్తారు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్నవారిని అభ్యర్థి ఎంచుకున్న విభాగాన్ని బట్టి త్రివిధ దళాల్లో కమిషన్డ్ ఆఫీసర్గా నియమిస్తారు. నెలకు రూ.35 వేల వేతనంతో కెరీర్ ఆరంభమవుతుంది. ఇంకా గ్రేడ్ పే, హెచ్ఆర్ఏ, ఇన్సూరెన్స్, పెన్షన్ తదితర సదుపాయాలుంటాయి. ♦ దూరవిద్యతో అవకాశం: ఇంటర్మీడియెట్ తర్వాత ఉన్నత చదువులకు ఆటంకాలు ఏర్పడితే ఏదైనా ఉద్యోగం చేస్తూ దూరవిద్య విధానం ద్వారా బీఏ/బీకాం/బీఎస్సీ వంటి కోర్సులు చదువుకునే వీలుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం-తిరుపతి, ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) దూరవిద్య విధానంలో కోర్సులు అందిస్తున్నాయి. ఏటా జనవరి నుంచి జూలై మధ్యలో ఆయా నోటిఫికేషన్లు వెలువడతాయి. ఇంటర్మీడియెట్ ఎంఈసీ పూర్తిచేస్తే ఉన్నతవిద్య పరంగా ఎలాంటి అవకాశాలుంటాయి? ♦ ఇంటర్లో ఎంఈసీ పూర్తి చేయడం ద్వారా.. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ) మ్యాథ్స్, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్(బీకాం) (జనరల్ /ఈ-కామర్స్ /కంప్యూటర్స్ /ఫైనాన్షియల్ మార్కెట్స్); బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(బీబీఏ); బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్(బీబీఎం), బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(బీసీఏ), ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ ఎంఏ(ఎకనామిక్స్), ఇంటిగ్రేటెడ్ ఎంకాం(వ్యవధి:ఐదేళ్లు)లలో చేరొచ్చు. ♦ బీఏ/బీకాం తర్వాత మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ), పోస్ట్గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ (పీజీడీఎం) చదివి సంస్థల నిర్వహణలో కీలకపాత్ర పోషించొచ్చు. తద్వారా మేనేజ్మెంట్ నిపుణులుగా ఎదగొచ్చు. మరోవైపు భారీ వేతనాలను అందిస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ), కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ), కంపెనీ సెక్రటరీ (సీఎస్) వంటి జాబ్ గ్యారెంటీ కోర్సులు చదవొచ్చు. ఏ కంపెనీకైనా వీరి అవసరం ఉంటుంది. ఇంటర్మీడియెట్ హెచ్ఈసీ పూర్తి చేశాను. బ్యాచిలర్ డిగ్రీలో బీఏ చదవాలనుకుంటున్నాను. బీఏలో ఏయే కాంబినేషన్లు అందుబాటులో ఉన్నాయి? ♦ ఇంటర్మీడియెట్లో ఏ గ్రూపు ఉత్తీర్ణులైనా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ)లో చేరొచ్చు. ఇందులో భాగంగా వివిధ కాంబినేషన్లు అందుబాటులో ఉన్నాయి. అవి.. ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్; హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్; హిస్టరీ, సోషియాలజీ, జాగ్రఫీ; సైకాలజీ, సోషియాలజీ, ఫిలాసఫీ; సైకాలజీ, సోషియాలజీ, మార్కెటింగ్; సైకాలజీ, ఇంగ్లిష్ లిటరేచర్, ఫిలాసఫీ; సోషియాలజీ, ఉర్దూ, పర్షియన్; హిస్టరీ, హిందీ, సంస్కృతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రభుత్వ కళాశాలలు, కొన్ని ప్రైవేటు కళాశాలల్లో ఈ కాంబినేషన్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలను లక్ష్యంగా చేసుకున్న అభ్యర్థులు వీటిని ఎంచుకుంటున్నారు. ఆయా పరీక్షల్లో కూడా ఈ నేపథ్యం ఉపకరిస్తోంది. దీంతో బీఏ కోర్సుకు ఆదరణ పెరుగుతోంది. ♦ ఇంటర్మీడియెట్ సీఈసీ పూర్తయింది. బీకాం చేయాలనుకుంటున్నాను. ఇందులో ఏయే స్పెషలైజేషన్లు ఉన్నాయి? ఆర్థిక, వాణి జ్య రంగాల విస్తరణ, కార్పొరేట్ సంస్థల ప్రవేశంతో బీకాం కోర్సుల అభ్యర్థులకు చక్కటి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. మార్కెట్/కంపెనీ అవసరాలకనుగుణంగా బీకాంలో వివిధ స్పెషలైజేషన్లను ఆయా విద్యా సంస్థలు ప్రవేశపెట్టాయి. రెగ్యులర్ బీకాంతోపాటు బీకాం ఈ-కామర్స్ /హానర్స్ /ఫైనాన్షియల్ మార్కెట్స్ /కంప్యూటర్స్ /బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ /ట్యాక్సేషన్ /మార్కెటింగ్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటికి జాబ్ మార్కెట్లో మంచి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. బీకాం పూర్తయిన తర్వాత సంబంధిత అంశంలో ఎంకాం కూడా పూర్తిచేసే వీలుంది. ఇంటర్మీడియెట్ బైపీసీ కోర్సు పూర్తయిన తర్వాత ఉన్నత విద్య అవకాశాలు ఎలా ఉంటాయి? ♦ ఇంటర్మీడియెట్ బైపీసీ పూర్తిచేసినవారు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ రాసి బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ (ఎంబీబీఎస్), బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (బీడీఎస్), బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (బీఏఎంఎస్), బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ అండ్ మెడిసిన్ సర్జరీ (బీహెచ్ఎంఎస్), బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సెన్సైస్ (బీఎన్వైఎస్), బీఎస్సీ (అగ్రికల్చర్), బీఎస్సీ (హార్టికల్చర్), బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ(బీవీఎస్సీ అండ్ ఏహెచ్), బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సెన్సైస్ (బీఎఫ్ఎస్సీ), బీటెక్ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ), బీఫార్మసీ, బీటెక్ (బయోటెక్నాలజీ), ఫార్మ్డి వంటి కోర్సులు అభ్యసించొచ్చు. ♦ ఇవే కాకుండా ఇంటర్మీడియెట్ బైపీసీ మార్కుల ఆధారంగా పారామెడికల్ కోర్సుల్లో చేరొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పారామెడికల్ బోర్డులు ఈ కోర్సులు నిర్వహిస్తున్నాయి. రెండేళ్ల వ్యవధి గల ఈ కోర్సుల్లో డిప్లొమా ఇన్.. మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ/మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ/ఆఫ్తల్మాలిక్ అసిస్టెంట్/డయాలసిస్ టెక్నాలజీ /రెస్పిరేటరీ థెరపీ/మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ/పర్ఫ్యూషన్ టెక్నాలజీ/రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్/డార్క్రూమ్ అసిస్టెంట్/కార్డియాలజీ టెక్నీషియన్/క్యాత్ ల్యాబ్ టెక్నాలజీ/ఈసీజీ టెక్నీషియన్/అనస్థీషియా టెక్నీషియన్/ఆడియోమెట్రీ టెక్నీషియన్/ఆప్టోమెట్రీ టెక్నీషియన్/రేడియోథెరపీ టెక్నాలజీ/మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తిచేయడం ద్వారా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అవకాశాలు దక్కించుకోవచ్చు. ♦ పారామెడికల్ కోర్సులే కాకుండా బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ(బీపీటీ), బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ(బీఎంఎల్టీ), బీఎస్సీ(నర్సింగ్) వంటి కోర్సుల్లోనూ ఇంటర్ బైపీసీ మార్కుల ఆధారంగా చేరొచ్చు. ♦ బ్యాచిలర్ ఆఫ్ యునాని మెడిసిన్ అండ్ సర్జరీ (బీయూఎంఎస్) కోర్సులో ప్రవేశానికి ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ♦ బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఈ కోర్సులు అభ్యసించిన విద్యార్థులు పీజీ స్థాయిలో సంబంధిత విభాగాల్లో ఎంఎస్/ఎండీ/సూపర్ స్పెషాలిటీ/డిప్లొమా/ఎంఎస్సీ వంటి కోర్సులు చదవచ్చు. ఇంటర్మీడియెట్ ఎంపీసీతో ఇండియన్ ఆర్మీలో ఏయే ఉద్యోగాలు ఉంటాయి? ఇంటర్మీడియెట్ ఎంపీసీ ఉత్తీర్ణతతో ఇండియన్ ఆర్మీలో వివిధ ఉద్యోగాలు ఉన్నాయి.. ♦ సోల్జర్స్ (టెక్నికల్) (టెక్నికల్ ఆర్మ్స్, ఆర్టిలరీ, ఆర్మీ ఎయిర్ డిఫెన్స్): 50 శాతం మార్కులతో 10+2/ఇంటర్మీడియెట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లిష్) ఉత్తీర్ణత. ప్రతి సబ్జెక్టులో 40 శాతం మార్కులు తప్పనిసరి. 171/2-231/2 వయసు ఉన్నవారు అర్హులు. నిర్దేశిత శారీరక, వైద్య ప్రమాణాలు తప్పనిసరి. ♦ సోల్జర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్ (అన్ని ఆర్మ్స్): 50 శాతం మార్కులతో 10+2/ ఇంటర్మీడియెట్ (ప్రతి సబ్జెక్టులో 40 శాతం మార్కులు పొందాలి) ఉత్తీర్ణత. 17 1/2-23 1/2 వయసు ఉన్నవారు అర్హులు. నిర్దేశిత శారీరక, వైద్య ప్రమాణాలు తప్పనిసరి. ♦ పర్మినెంట్ కమిషన్ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్: అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. నిర్దేశిత తేదీనాటికి 16 1/2 నుంచి 19 1/2 ఏళ్ల మధ్య ఉండాలి. 70 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఎంపీసీ ఉత్తీర్ణులు అర్హులు. నిర్దేశిత శారీరక, వైద్య ప్రమాణాలు తప్పనిసరి. సర్వీస్ సెలక్షన్ బోర్డ్(ఎస్ఎస్బీ) ద్వారా ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారు ఐదేళ్లు శిక్షణ పూర్తిచేసుకున్న తర్వాత లెఫ్టినెంట్గా బాధ్యతలు చేపడతారు. నెలకు అన్ని కలుపుకొని రూ.65 వేల వేతనం చెల్లిస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేది జూన్ 30. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో జాతీయస్థాయిలో ఉన్న ఉద్యోగావకాశాలేమిటి? ♦ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో లోయర్ డివిజన్ క్లర్క్స్(ఎల్డీసీ), డేటా ఎంట్రీ ఆపరేటర్స్(డీటీపీలు), పోస్టల్ అసిస్టెంట్స్, సార్టింగ్ అసిస్టెంట్స్ భర్తీకి జాతీయస్థాయిలో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నిర్వహించే పరీక్ష.. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ (10+2). ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై, నిర్దేశిత తేదీ నాటికి 18-27 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు. ప్రవేశ పరీక్ష, టైపింగ్ టెస్ట్/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారికి రూ.5200-రూ.20200 వేతన శ్రేణితో కెరీర్ ప్రారంభమవుతుంది. ♦ స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ సీ అండ్ డీ ఎగ్జామినేషన్: వివిధ కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర విభాగాల్లో స్టెనోగ్రాఫర్స్ పోస్టుల భర్తీకి ఏటా ఎస్ఎస్సీ పరీక్ష నిర్వహిస్తోంది. ఈ ఏడాదికి ప్రకటన వెలువడింది. ఇంటర్మీడియెట్ పూర్తిచేసి ఆగస్టు 1, 2016 నాటికి 18-27 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. రాత పరీక్ష, స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. జూలై 31న పరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణతతో ఇండియన్ నేవీలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? ♦ ఆర్టిఫిషర్ అప్రెంటీస్ సెయిలర్: నిర్దేశిత తేదీ నాటికి 17-20 ఏళ్ల మధ్యలో ఉండాలి. అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. నిర్దేశిత శారీరక, వైద్య ప్రమాణాలు తప్పనిసరి. రాతపరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ♦ సీనియర్ సెకండరీ రిక్రూట్స్: 17-21 ఏళ్ల మధ్య వయసు ఉన్న అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. నిర్దేశిత శారీరక, వైద్య ప్రమాణాలు తప్పనిసరి.రాతపరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షల ఆధారంగా ఎంపిక ఉంటుంది. గంట వ్యవధిలో జరిగే రాత పరీక్ష ఇంగ్లిష్/హిందీల్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే ఈ పరీక్షలో ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్లపై ప్రశ్నలు ఉంటాయి. రాతపరీక్షలో ఉత్తీర్ణులను శారీరక సామర్థ్య పరీక్షకు ఎంపిక చేస్తారు. ♦ నోటిఫికేషన్లు: ఏటా డిసెంబర్/జనవరి; జూన్/జూలైల్లో ఎంప్లాయ్మెంట్ న్యూస్, జాతీయ, ప్రాంతీయ దినపత్రికల్లో ప్రకటనలు వెలువడుతుంటాయి. ఇంటర్మీడియెట్ లో సీఈసీ/హెచ్ఈసీ పూర్తిచేసిన తర్వాత ఉన్నత విద్యపరంగా ఎలాంటి అవకాశాలు ఉంటాయి? ఇంటర్మీడియెట్లో సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ (సీఈసీ), హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ (హెచ్ఈసీ) గ్రూప్ను ఎంచుకున్నవారికి తర్వాత ఉన్నతవిద్య పరంగా మంచి అవకాశాలుంటాయి. ♦ రెండేళ్ల ఇంటర్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదేళ్ల బీఏఎల్ఎల్బీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (లాసెట్) రాయొచ్చు. జాతీయస్థాయిలో లా కోర్సుల్లో ప్రవేశానికి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) రాయాలి. ♦ ఉపాధ్యాయ వృత్తి అంటే ఇష్టమున్నవారు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈడీ) కోర్సుల్లో చేరొచ్చు. దీనికోసం డీఈఈసెట్ రాయాలి. ఏటా మే/జూన్లో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ర్యాంకు ద్వారా డీఈడీ కోర్సు పూర్తిచేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక ఉపాధ్యాయులుగా అడుగుపెట్టడానికి అర్హత లభిస్తుంది. ♦ హోటల్ మేనేజ్మెంట్పై ఆసక్తి ఉన్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ (ఎన్సీహెచ్ఎంసీటీ) నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్(జేఈఈ) ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ (ఐహెచ్ఎం)లలో మూడేళ్ల బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో చేరొచ్చు. ♦ సంప్రదాయ డిగ్రీలో చేరాలనుకుంటే.. మూడేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ)/బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (బీకాం)ల్లో చేరొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని యూనివర్సిటీల పరిధిలోని కళాశాలలు ఈ కోర్సులు అందిస్తున్నాయి. కొన్ని కళాశాలలు బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ (బీబీఎం), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) వంటి కోర్సులు కూడా అందిస్తున్నాయి. బీఏ/బీకాం/బీబీఎం/బీబీఏ పూర్తిచేస్తే తర్వాత రెండేళ్ల ఎంఏ/ఎంకాం/ఎంబీఏ చదవొచ్చు. ♦ సీఈసీ విద్యార్థులు చార్టర్ట్ అకౌంటెన్సీ(సీఏ), కంపెనీ సెక్రటరీ(సీఎస్), కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ) వంటి కోర్సులు అభ్యసిస్తే అద్భుత అవకాశాలు అందుకోవచ్చు. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోనే ఈ కోర్సుల్లో ప్రవేశించే వీలుంది. లేదంటే బీకాం చేసిన తర్వాత అకౌంటింగ్, ట్యాలీ వంటి కోర్సులు పూర్తిచేస్తే వివిధ సంస్థల్లో అకౌంటెంట్గా పనిచేయొచ్చు. ♦ ఇంటర్ సీఈసీ/హెచ్ఈసీ విద్యార్థులకు ఉన్న మరో అద్భుత అవకాశం.. ఇంటిగ్రేటెడ్ పీజీలు. వీటి ద్వారా బ్రేక్ లేకుండా మూడేళ్ల డిగ్రీ, రెండేళ్ల పీజీ పూర్తిచేయొచ్చు. మూడేళ్ల తర్వాత పీజీ వద్దనుకుంటే గ్రాడ్యుయేట్ పట్టా కూడా ఇవ్వడం ఈ కోర్సుల ప్రత్యేకత. ఇంటర్మీడియెట్ సీఈసీ పూర్తయింది. ఫైన్ఆర్ట్స చేయాలనుకుంటున్నాను. ఇందులో ఏయే స్పెషలైజేషన్లు ఉన్నాయి? ఇంటర్ సీఈసీ/హెచ్ఈసీ ఉత్తీర్ణతతో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ఆర్ట్స్లో భాగంగా స్కల్ప్చర్/ఫొటోగ్రఫీ/అప్లైడ్ ఆర్ట్స్/యానిమేషన్/ పెయింటింగ్/ఇంటీరియర్ డిజైన్ వంటి కోర్సుల్లో చేరొచ్చు. హైదరాబాద్లో ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) ఈ కోర్సులను అందిస్తోంది. ప్రవేశపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. ఈ ఏడాది కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. రూ. 3 వేలు ఆలస్య రుసుముతో ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూలైలో ప్రవేశపరీక్ష ఉంటుంది. సీఈసీ పూర్తిచేశాను.. బీసీఏ/బీబీఎం/బీబీఏ వంటి కోర్సుల్లో చేరొచ్చా? వీటితో ఎలాంటి అవకాశాలు ఉంటాయి? బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ) చదవాలంటే.. ఇంటర్లో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. సాఫ్ట్వేర్ బూమ్ ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన కోర్సుల్లో బీసీఏ ఒకటి. కొన్ని కళాశాలల్లో మాత్రమే ఈ కోర్సు అందుబాటులో ఉంది. గ్రాడ్యుయేషన్ స్థాయిలోనే విద్యార్థులకు నిర్వహణ నైపుణ్యాలను అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన కోర్సులు.. బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ (బీబీఎం), బ్యాచిలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ). ఈ కోర్సులకు కూడా ఆదరణ అంతంత మాత్రమే. కొన్ని యూనివర్సిటీలు/విద్యా సంస్థలు బీబీఏ+ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సు అందిస్తున్నాయి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు అర్హులు. కోర్సు వ్యవధి ఐదేళ్లు. ప్రత్యేకంగా ఆయా అంశాల్లో కోర్ నైపుణ్యాలు కోరుకునేవారికి మాత్రమే ఈ కోర్సులు ఉపకరిస్తాయి. బీఎస్సీలో ఏయే కాంబినేషన్లు ఉన్నాయి? దేనికి ఎక్కువ ఉద్యోగావకాశాలున్నాయి? ఇంటర్ ఎంపీసీ/బైపీసీ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్సీ)లో వివిధ కాంబినేషన్లు అందుబాటులో ఉన్నాయి. ♦ ఎంపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న కాంబినేషన్లు: బీఎస్సీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ; మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్; మ్యాథమెటిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్; మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్; మ్యాథమెటిక్స్, కంప్యూటర్ హార్డ్వేర్, కంప్యూటర్ సైన్స్; బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ. ♦ బైపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న కాంబినేషన్లు: బీఎస్సీలో భాగంగా బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ; మైక్రోబయాలజీ, జెనెటిక్స్, కెమిస్ట్రీ; బయోటెక్నాలజీ, బోటనీ, కెమిస్ట్రీ; బయోటెక్నాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ; బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ వంటి కాంబినేషన్లు ఉన్నాయి. వీటిలో అన్ని సబ్జెక్టులకు ఉన్నతవిద్య అవకాశాలున్నాయి. ముఖ్యంగా లైఫ్ సెన్సైస్ సబ్జెక్టులు (జెనెటిక్స్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ) చదివే విద్యార్థులు పీజీ, పీహెచ్డీ చేయాలనుకుంటేనే ఆ సబ్జెక్టులు చదవడం ఉత్తమమని నిపుణులు అంటున్నారు. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఆ కోర్సులతో అంతగా ఉద్యోగావకాశాలు లేకపోవడమే ఇందుకు కారణం. ఫిజికల్ సెన్సైస్, కెమికల్ సెన్సైస్, మ్యాథమెటికల్ సెన్సైస్ (మ్యాథ్స్, స్టాటిస్టిక్స్) కు ఉన్నతవిద్య పరంగా, ఉద్యోగాల పరంగా మంచి అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. లైఫ్ సెన్సైస్ సబ్జెక్టుల్లో పీహెచ్డీ చేస్తేనే మంచిదని పేర్కొంటున్నారు. ఆసక్తి, కెరీర్ పరంగా భవిష్యత్తు లక్ష్యాలు, జాబ్ మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా గ్రాడ్యుయేషన్ స్థాయిలో కాంబినేషన్ సబ్జెక్టులను ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు ప్రస్తుతం బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ కోర్సులు పూర్తిచేసిన వారికి ఫార్మా ఇండస్ట్రీ, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్లో ఉన్నత అవకాశాలుంటున్నాయి. ఫైనలియర్లో చూద్దాంలే అనుకోకుండా.. కాలేజీలో చేరిన మొదటి నుంచి ఉన్నత విద్య, ఉద్యోగ సాధనకు సంబంధించి స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని, దానికి అనుగుణంగా సీరియస్గా సిద్ధమవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ను పెంచుకోవాలి. మన సామర్థ్యాలను కచ్చితంగా వ్యక్తపరిచేందుకు ఇవి కీలకం. కాలేజీ లైబ్రరీని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. దినపత్రికలను కూడా చదవాలి. కేవలం మార్కులు, పర్సంటేజీలే కాకుండా అన్ని అంశాల్లోనూ ముందున్నప్పుడే ప్రస్తుత పోటీ ప్రపంచంలో విజయం సొంతమవుతుంది. - డా. కె.ప్రమీల, ప్రిన్సిపల్, ఎల్హెచ్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మైలవరం. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ 10+2 (బీటెక్) అర్హత: 70 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణత. ఇంటర్మీడియెట్ ఇంగ్లిష్లో 50 శాతం మార్కులు తప్పనిసరి. నిర్దేశిత తేదీ నాటికి 17 - 19 1/2 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. వెబ్సైట్: www.joinindiannavy.gov.in/ బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ (బీబీఎం), బ్యాచిలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ). ఈ కోర్సులకు ఆదరణ అంతంత మాత్రమే. కొన్ని యూనివర్సిటీలు/విద్యా సంస్థలు బీబీఏ+ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సు అందిస్తున్నాయి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు అర్హులు. కోర్సు వ్యవధి ఐదేళ్లు. ప్రత్యేకంగా ఆయా అంశాల్లో కోర్ నైపుణ్యాలు కోరుకునేవారికి మాత్రమే ఈ కోర్సులు ఉపకరిస్తాయి. మీ సలహాలు, సందేహాలు పంపాల్సిన ఈ-మెయిల్: sakshieducation@gmail.com -
ఉద్యోగాలు
పుదుచ్చేరి నిట్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు పుదుచ్చేరిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. పోస్టు: ఫ్యాకల్టీ, అసిస్టెంట్ లైబ్రేరియన్, జూనియర్ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్ విభాగాలు: ఫ్యాకల్టీ: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, నాన్ -టీచింగ్: ఎలక్ట్రికల్, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇంటర్వ్యూ తేదీలు: జూన్ 30, జూలై 1, 2, 3 వివరాలకు: www.nitpy.ac.in రాయ్పూర్ ఎయిమ్స్లో ట్యూటర్/క్లినికల్ ఇన్స్ట్రక్టర్ రాయ్పూర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) ట్యూటర్/ క్లినికల్ ఇన్స్ట్రక్టర్ (నర్సింగ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది: జూలై 14 ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా వివరాలకు: www.aiimsraipur.edu.in విజయనగరం జిల్లాలో 39 పోస్టులు విజయనగరం జిల్లా సెలక్షన్ కమిటీ.. వ్యవసాయశాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో బహుళ ప్రయోజన విస్తరణాధికారి (ఎంపీఈఓ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఖాళీలు: 39 అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్, హార్టికల్చర్, డ్రైల్యాండ్ అగ్రికల్చర్ ) చేసిన వారికి తొలి ప్రాధాన్యత ఉంటుంది. వయసు: జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండి 40 సంవత్సరాలలోపు ఉండాలి. దరఖాస్తుకు చివరి తేది: జూన్ 25 వివరాలకు: www.vizianagaram.nic.in -
సహోద్యోగులే స్నేహితులు!
స్కిల్ డెవలప్మెంట్ కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదగాలంటే.. పనిచేసే చోట స్నేహపూరిత వాతావరణాన్ని సృష్టించుకోవాలి. సహోద్యోగులను స్నేహితులుగా, సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కారాన్ని కనుగొనడంలో మార్గం చూపే వ్యక్తులుగా మలచుకోవాలి. అప్పుడే వృత్తిగత జీవితం వర్ధిల్లుతుంది. ఈ క్రమంలో తోటి ఉద్యోగులను స్నేహితులుగా మార్చుకునేందుకు సూచనలు.. ఉద్యోగంలో చేరిన మొదట్లో ఆఫీసు వాతావరణం కొత్తగా ఉంటుంది. ఈ సమయంలో మౌనంగా కూర్చోకుండా, చొరవ తీసుకొని సహోద్యోగులతో మాట కలపాలి. టీ, లంచ్ బ్రేక్లో సాన్నిహిత్యం పెంచుకునేందుకు ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే పనిచేసే చోట కుదురుకునేందుకు వీలవుతుంది. సహచర ఉద్యోగులను స్నేహితులుగా మార్చుకునేందుకు ప్రయత్నించాలి. చక్కటి పనితీరు, కమ్యూనికేషన్ నైపుణ్యాలతో తోటి ఉద్యోగులకు దగ్గర కావొచ్చు. వీలైనంత వరకు వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లకూడదు. మంచి ఆలోచనలను పంచుకుంటూ, సానుకూల దృక్పథంతో ఉంటే తోటి ఉద్యోగులే మీతో స్నేహం చేయడానికి పోటీపడతారు. బ్రేక్ సమయాల్లో లేనిపోని గొప్పలు చెప్పుకోకుండా.. వృత్తికి సంబంధించిన లేదా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ తాజా పరిణామాలపై తోటి ఉద్యోగులతో చర్చించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కువ మంది స్నేహితులుగా మారడానికి దోహదం చేస్తుంది. సాయం చేయడంలో ముందుండాలి తోటి ఉద్యోగులు ఇబ్బందుల్లో ఉంటే.. చొరవ తీసుకొని, సాయం చేయడంలో ముందుండాలి. ఇలా చేస్తే వారు మిమ్మల్ని ఎప్పుడూ మరచిపోరు. చిన్న చిన్న కారణాలతో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు.. మీరే ముందుగా సారీ చెప్పండి. కొద్ది సేపు ఏకాంతంగా కూర్చుని, అన్ని అంశాలనూ చర్చించుకోండి. * మీతో మంచిగా ఉంటూ.. మీ గురించి ఇతరులతో చెడుగా చెప్పేవారిని దూరం పెట్టాలి. * మీ ఆలోచనలను కాపీ కొట్టి.. బాస్ దగ్గర మంచి పేరు కొట్టెయ్యాలనుకునే వారితో జాగ్రత్తగా ఉండాలి. * చక్కటి పనితీరు కనబరిచే వారిపై లేనిపోని రూమర్లు పుట్టించి, వారిని పక్కదారి పట్టించాలని చూసేవారి మాటలు పట్టించుకోవద్దు. * పని విషయంలో ఇతరులను పోటీదారులుగా భావించకుండా, బృంద స్ఫూర్తితో అడుగేయాలి. -
చాలెంజింగ్ కెరీర్కు.. మెరైన్ ఇంజనీరింగ్!
ఇంజనీరింగ్ స్పెషల్ ఇంజనీరింగ్ విభాగంలో చాలెంజింగ్ కెరీర్ కోరుకునే వారికి సరైన బ్రాంచ్.. మెరైన్ ఇంజనీరింగ్! ఇది ప్రధానంగా సముద్ర రవాణా, నౌకల తయారీ, వాటి నిర్వహణకు సంబంధించిన విభాగం. ప్రస్తుతం మెరైన్ ఇంజనీర్ల పని పరిధి విస్తరించింది. అంతర్జాతీయంగా ఎగుమతి, దిగుమతులకు ఎక్కువగా సముద్ర రవాణాను ఉపయోగిస్తుండటం, ప్రపంచ వ్యాప్తంగా అధికశాతం సరకు రవాణా షిప్పుల ద్వారానే జరుగుతుండటంతో మెరైన్ ఇంజనీరింగ్ ఉజ్వల కెరీర్కు వేదికగా నిలుస్తోంది.. మెరైన్ ఇంజనీర్లు ఏం చేస్తారు? మెరైన్ ఇంజనీర్ల విధులు కొద్దిగా రిస్క్తో కూడుకున్నవైనప్పటికీ.. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్, నేవిగేషన్లలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సులభతరమయ్యాయి. ఇంజనీర్లకు నౌక ఆకృతి, దాని తయారీకి అవసరమైన పరికరాల ఎంపిక, వాటి అమరిక, పర్యవేక్షణ, నిర్వహణ, మరమ్మత్తులు తదితర విధులు ఉంటాయి. నౌకకు సంబంధించిన ప్రధాన యంత్రాలైన డీజిల్ ఇంజన్లు, గ్యాస్ టర్బైన్లు, పంపులు, కంప్రెషర్లు, హీట్ ఎక్స్చేంజర్స్, హైడ్రాలిక్ మెషిన్స్, ఆటోమేషన్ అండ్ కంట్రోల్ పరికరాలు, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ తదితరాల నిర్వహణ బాధ్యత పూర్తిగా మెరైన్ ఇంజనీర్లదే. నౌకల డిజైన్, నిర్మాణానికి సంబంధించి ఆర్కిటెక్చర్లతో కూడా కలిసి పని చేయాల్సి ఉంటుంది. కేవలం నౌకకు సంబంధించే కాకుండా ప్రమాదాలు సంభవించినప్పుడు సైనికుల్లా స్పందించి, సామాన్యులను కాపాడటం కూడా మెరైన్ ఇంజనీర్ల అదనపు బాధ్యత. దీనికి తగిన విధంగా సన్నద్ధమై ఉండాలి. కోర్సులు-వివరాలు పదో తరగతి తర్వాత డిప్లొమా ఇన్ మెరైన్ ఇంజనీరింగ్లో చేరవచ్చు. ఇంటర్మీడియెట్ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) పూర్తిచేసిన వారు బీఎస్సీ (నాటికల్ సైన్స్), బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశించవచ్చు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఆసక్తిని బట్టి మాస్టర్స్ డిగ్రీ చేయొచ్చు. ప్రత్యేక విభాగాలు మారిటైమ్ కామర్స్, మెరైన్ రిఫ్రిజిరేషన్, కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టం, నేవిగేషన్ సిస్టమ్స్ అండ్ ఎక్విప్మెంట్, మెరైన్ రిన్యువబుల్ ఎనర్జీ రీసెర్చ్, అండర్ వాటర్ వెహికల్ రీసెర్చ్, ఇన్ఫర్మేషన్-కమ్యూనికేషన్ సిస్టమ్స్-ఎక్విప్మెంట్, ఆఫ్షోర్ ఎక్స్ట్రాక్టివ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (కేబుల్ లైయింగ్) వంటివి.. కెరీర్ వివరాలు అనేక ఉద్యోగ అవకాశాలకు ఆస్కారం ఉన్న రంగం మెరైన్ ఇంజనీరింగ్. ఇండియన్ మర్చెంట్ నేవీ, నేవీతోపాటు నౌకా నిర్మాణ కంపెనీల్లో ఉద్యోగాలు అపారం. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి దేశీయ సంస్థలతో పాటు విదేశాల్లో అవకాశాలపై ఆసక్తి ఉన్నవారికి ది అమెరికన్ బ్యూరో ఆఫ్ షిప్పింగ్, ఆంగ్లో ఈస్టెర్న్ షిప్పింగ్ మేనేజ్మెంట్ లిమిటెడ్, గ్రేట్ ఈస్టెర్న్ షిప్పింగ్ వంటి అంతర్జాతీయ కంపెనీల్లో అవకాశాలు లభిస్తున్నాయి. ఇంటర్నేషనల్ మారిటైమ్ అకాడమీ వంటి సంస్థలు మెరైన్ ఇంజనీరింగ్ పూర్తిచేసినవారిని జూనియర్ ఇంజనీర్లుగా నియమించుకుంటున్నాయి. ప్రతిభ, మంచి పనితీరుతో ఐదారేళ్లలోనే చీఫ్ ఇంజనీర్ స్థాయికి ఎదగవచ్చు. మరికొన్ని సంస్థలు క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా మెరైన్ ఇంజనీర్లను రిక్రూట్ చేసుకుంటున్నాయి. వేతనాలు ఇతర ఇంజనీరింగ్ విభాగాలతో పోల్చితే పోటీ తక్కువగా, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో మెరైన్ ఇంజనీర్లకు ప్రారంభంలోనే అధిక వేతనాలు అందుతున్నాయి. ఇందులో ఫిఫ్త్, ఫోర్త్, థర్డ్, సెకండ్, చీఫ్ ఇంజనీర్ అనే స్థాయిలు ఉంటాయి. హోదాను బట్టి నెలకు కనీసం రూ. 25 వేల నుంచి రూ. 5 లక్షల వరకు వేతనాలను అందుకోవచ్చు. కోర్సులు అందిస్తున్న కొన్ని ప్రముఖ సంస్థలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మారిటైమ్ స్టడీస్, గోవా www.imsgoa.org ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ www.iitm.ac.in ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ కోల్కతా క్యాంపస్ www.merical.ac.in ఇంటర్నేషనల్ మారిటైమ్ ఇన్స్టిట్యూట్, గ్రేటర్ నోయిడా www.imi.edu.in ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం www.andhrauniversity.edu.in/engg కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ విభాగాల తర్వాత విద్యార్థులు ఎక్కువగా మెరైన్ ఇంజనీరింగ్పై ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం మెరైన్ ఇంజనీర్లకు జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పెద్ద కంపెనీలు ఆకర్షణీయ ప్యాకేజీలతో క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. ఈ రంగంలో నైపుణ్యం, అనుభవం ఉన్న వారికి కెరీర్ పరంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. - డా. బి.వి.అప్పారావు, ప్రొఫెసర్, మెరైన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఆంధ్రా యూనివర్సిటీ. -
ఇంటర్వ్యూ తేదీలు
* ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) హాస్పిటల్లో రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు: జూన్ 20 * హైదరాబాద్లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) మెడికల్ కాలేజీ హాస్పిటల్లో సీనియర్ రెసిడెంట్స్ పోస్టులకు: జూన్ 27 * రూర్కీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ప్రాజెక్ట్ అటెండెంట్ (టెక్నికల్) పోస్టులకు: జూన్ 27 -
ఏ జీవులు ఎప్పుడు పుట్టాయి?
స్కూల్ ఎడ్యుకేషన్ మన భూగోళంపై ఇప్పటివరకు లక్షలాది జీవజాతులు అవతరించాయి. అనేక కారణాలవల్ల వాటిలో కొన్ని జీవజాతులు ఎప్పుడో అంతరించిపోయినా, మిగిలినవి మాత్రం మనుగడ కొనసాగిస్తున్నాయి. మన భూగోళం ఏర్పడి ఇప్పటికి సుమారు 460 కోట్ల సంవత్సరాలు అవుతోందని అంచనా. అయితే భూమి పుట్టిన 110 కోట్ల సంవత్సరాల వరకు (ఇప్పటికి 350 కోట్ల సంవత్సరాల కిందటి వరకు) భూమిపై జీవం ఆవిర్భవించలేదు. భూమి పుట్టిన తర్వాత 210 కోట్ల సంవత్సరాల నుంచి 418 కోట్ల సంవత్సరాల వరకు (ఇప్పటికి 42 కోట్ల సంవత్సరాల కిందటి వరకు) గడచిన కాలాన్ని ‘ప్రథమ జీవ మహాయుగం’ అంటారు. భూగోళంపై అనేక రకాల ఏకకణ జీవులు, బహుకణ జీవులు ఈ యుగంలోనే ఉద్భవించి బాగా విస్తరించాయి. గవ్వలతో (పై పెంకుతో) బతికే జీవులు, వెన్నెముక లేని ప్రాణులు పుట్టింది ఈ దశలోనే. -
జాబ్స్ అబ్రాడ్.. గల్ఫ్
జాబ్స్ అబ్రాడ్ అంటే యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల పేర్లు గుర్తొస్తాయి.. అయితే సంఖ్యా పరంగా చూస్తే అధిక శాతం మంది గమ్యం గల్ఫ్ దేశాలే! భారత విదేశీ మంత్రిత్వ శాఖ నివేదిక (2014-15) ప్రకారం వివిధ దేశాల్లో 50 లక్షల మందికి పైగా భారతీయులు పనిచేస్తుంటే.. వారిలో 90 శాతానికి పైగా గల్ఫ్, ఆగ్నేయాసియా దేశాల్లోనే ఉన్నారు. ఆయా దేశాల విధానాలు కూడా విదేశీ ఉద్యోగార్థులకు పెద్దపీట వేస్తున్నాయి. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల్లో అవకాశాలు కల్పిస్తున్న రంగాలు, అందుబాటులో ఉన్న ఉద్యోగాలు తదితరాలపై ఫోకస్.. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగం అంటే డొమెస్టిక్ వర్కర్స్, డైలీ వేజ్ లేబర్, చమురు శుద్ధి కర్మాగారాల్లో కింది స్థాయి ఉద్యోగాలు- అనేది ఎక్కువ మందిలో ఉండే అభిప్రాయం. వాస్తవానికి గల్ఫ్ కంట్రీస్లో అర్హతలను బట్టి అవకాశాలు అందుకోవచ్చు. ఏటా 8 లక్షల మంది.. ఉద్యోగావకాశాల కల్పనలో జీసీసీ (గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్) కంట్రీస్గా పేర్కొనే కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ ముందంజలో ఉన్నాయి. భారత్ నుంచి ఏటా దాదాపు 8 లక్షల మంది జీసీసీ దేశాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు. ఈ దేశాల్లోని విదేశీ ఉద్యోగుల్లో దాదాపు 30 శాతం మంది భారత్ నుంచి వెళ్లినవారే. భారత్ నుంచి ఉద్యోగాల కోసం గల్ఫ్ దేశాలకు వెళుతున్న వారి సంఖ్య పరంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలు గత నాలుగైదేళ్లుగా మొదటి 5 స్థానాల్లో నిలుస్తున్నాయి. 2010-15 మధ్యకాలంలో ఏటా సగటున 1.10 లక్షల మంది తెలుగు వారు గల్ఫ్ దేశాల్లో పలు హోదాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకున్నారు. ఎడ్యుకేషన్ నుంచి ఎనర్జీ సెక్టార్ వరకు; నిర్మాణ రంగం నుంచి ఆయిల్ రిఫైనరీస్ వరకు.. వివిధ రంగాలు ఆకర్షణీయ కెరీర్కు అవకాశాలు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఉత్పత్తి, సేవారంగాల్లో అవకాశాలు మరింత పెరుగుతున్నాయి. కువైట్ నిర్మాణం, ఆస్పత్రులు, ఆతిథ్య రంగాల్లో నియామకాల సంఖ్య అధికంగా ఉంది. దీనికి కారణం.. కువైట్ ప్రభుత్వం కీ డెవలప్మెంట్ ప్లాన్ 2010-15 పేరుతో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టడమే. సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్, ఐటీఐ, డిప్లొమా; నర్సింగ్లో డిప్లొమా, బ్యాచిలర్; హోటల్ మేనేజ్మెంట్, హౌస్కీపింగ్ వంటి విభాగాల్లో సర్టిఫికెట్లు ఉంటే కువైట్లో కొలువు సొంతం చేసుకోవచ్చు. ఖతార్ ఆయిల్ రిఫైనరీలతో పాటు సేవా రంగం, హోటల్ పరిశ్రమ, హౌస్ కీపింగ్, మెయింటనెన్స్ విభాగాల్లో అవకాశాలు ఎక్కువ. వీటితోపాటు 2022 ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణకు ఖతార్ ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో వచ్చే అయిదేళ్లలో ఉత్పత్తి, సేవా రంగాల్లో వలస ఉద్యోగులకు డిమాండ్ పెరగనుంది. సౌదీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రధాన ఉపాధి రంగం. ఇక్కడి ప్రభుత్వం ఎకనామిక్ సిటీస్, ఇంధనేతర తయారీ రంగాల అభివృద్ధికి చర్యలు చేపడుతోంది. సౌదీలో హాస్పిటాలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, హెల్త్కేర్ రంగాలు ఇతర ముఖ్య ఉపాధి వేదికలుగా నిలవనున్నాయి. యూఏఈ నిర్మాణం, రిటైల్, హాస్పిటాలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్, డొమెస్టిక్, ఎడ్యుకేషన్, హెల్త్కేర్ రంగాలు టాప్ రిక్రూటర్స్గా నిలుస్తున్నాయి. వరల్డ్ ఎక్స్పో-2020 పేరిట యూఏఈ ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమంతో వచ్చే అయిదేళ్లలో అవకాశాలు మరింత పెరగనున్నాయి. అర్హతను బట్టి ఉద్యోగాలు ఐటీఐ, ఒకేషనల్ కోర్సులు చేసిన వారు సెమీ స్కిల్డ్ హోదాలో ఉద్యోగాలు అందుకోవచ్చు. వీటినే బ్లూ కాలర్ జాబ్స్గా పేర్కొంటున్నారు. బ్యాచిలర్ డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు ఉంటే స్కిల్డ్ వర్కర్స్ హోదాలో సూపర్వైజర్స్, ఆఫీస్ మేనేజర్స్ వంటి వైట్ కాలర్ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ పీజీలు, ఎంటెక్/ఎంఈ కోర్సులతో ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందొచ్చు. వేతనాలు కూడా ఆకర్షణీయంగా ఉంటున్నాయి. స్కిల్స్ వారీగా చూస్తే లో స్కిల్: 500-100; సెమీ స్కిల్డ్: 1200-1500; స్కిల్డ్ (ప్రొఫెషనల్): 3500-4000. (ఆయా దేశాల కరెన్సీల్లో..) ఔత్సాహికులకు భరోసా గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన స్కిల్స్ విషయంలో భారత ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చర్యలు చేపడుతోంది. స్వర్ణ ప్రవాస్ యోజన పేరుతో అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న రంగాల్లో భారత అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తద్వారా మన దేశంలో అందించే వృత్తి విద్యా కోర్సులు, టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేందుకు చర్యలు తీసుకుంటోంది. భారత ప్రభుత్వం.. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగార్థుల కెరీర్కు భరోసా కల్పించే విధంగా ప్రత్యేక నిబంధనలు రూపొందిస్తోంది. ఇందులో ముఖ్యమైంది మినిమల్ రిఫరల్ వేజెస్ మొత్తాన్ని 800 రియాల్స్ నుంచి 1500 రియాల్స్కు పెంచడం. అంటే.. ఒక అభ్యర్థిని నియమించుకోవాలనుకునే గల్ఫ్ దేశాలకు చెందిన వ్యక్తులు లేదా సంస్థలు ప్రతి అభ్యర్థికి కనీసం 1500 రియాల్స్ చెల్లించాలని పేర్కొనడం. వీటితోపాటు రిక్రూటర్ల ప్రామాణికత, ఏజెంట్లకు సంబంధించిన సమాచారంపై అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. రిక్రూట్మెంట్ ఏజెంట్లు ఇమిగ్రేషన్ అధికారుల వద్ద డిపాజిట్ చేయాల్సిన నగదు మొత్తాన్ని కూడా భారీగా పెంచింది. అంతా ఆన్లైన్లో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. గల్ఫ్ ఉద్యోగ ఔత్సాహికుల కోసం ఆన్లైన్ సేవలు అందిస్తోంది. ఈ శాఖ.. రిక్రూటర్స్, జాబ్ సీకర్స్, రిక్రూటింగ్ ఏజెంట్స్ తమ దరఖాస్తులను ఆన్లైన్లో అందించే సదుపాయం కల్పిస్తోంది. ఈ మూడు వర్గాల వారు అనుసరించాల్సిన విధివిధానాలు, కొత్త మార్పులపై సమాచారం కూడా అందిస్తోంది. కఫాలా.. తప్పనిసరి గల్ఫ్ దేశాల ఉద్యోగార్థులు ఇమిగ్రేషన్ అధికారుల వద్ద అనుమతి పొందాలంటే కఫాలా (స్పాన్సర్షిప్ లెటర్) తప్పనిసరి. ఇది ఒక అభ్యర్థిని నియమించుకున్న వ్యక్తి లేదా సంస్థ దాన్ని ధ్రువీకరిస్తూ ఇచ్చే పత్రం. ఇది ఉంటేనే వీసా చేతికందుతుంది. ముఖ్యంగా ఇమిగ్రేషన్ చెక్ రిక్వయిర్డ్ (ఈసీఆర్) జాబితాలో ఉన్న గల్ఫ్ దేశాలకు సంబంధించి ఇది తప్పనిసరి. అవసరమైన డాక్యుమెంట్లు ఇమిగ్రేషన్ చెక్ పూర్తిచేసుకుని.. వీసా పొంది ఉద్యోగం కోసం గల్ఫ్ దేశాల్లో అడుగుపెట్టాలనుకునే వారికి దరఖాస్తుతోపాటు అందించాల్సిన డాక్యుమెంట్లు.. ఎంప్లాయర్ అందించే స్పాన్సర్ లెటర్ (కఫాలా), పాస్పోర్ట్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్, నిర్ణీత మొత్తంలో నగదు డిపాజిట్. గల్ఫ్ దేశాల్లోని అవకాశాలతో పాటు ప్రైవేటు నియామక ఏజెంట్ల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ క్రమంలో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ పేరిట సంస్థను నెలకొల్పడం జరిగింది. ఔత్సాహికులు మమ్మల్ని సంప్రదిస్తే వారికి అవసరమైన సమాచారం అందిస్తాం. వీసా విధివిధానాలను వివరిస్తాం. వీటిని ఔత్సాహికులు ఉపయోగించుకోవడం వల్ల ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఆఫీస్లో ఇబ్బందులు ఎదురు కాకుండా ఉంటాయి. - కె.భవాని, జీఎం-హెచ్ఆర్, టామ్కామ్. -
యువతి అదృశ్యం
ఇంట్లో నుంచి చెప్పాపెట్టకుండా వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. టెలికాంనగర్లో నివాసం ఉండే పి.భవిత(22) ఈ నెల 16న తెల్లవారు జామున 4 గంటల సమయంలో చెప్పాపెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆచూకీ లభ్యం కాకపోవడంతో తండ్రి సురేష్రెడ్డి శుక్రవారం రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ-చెత్తతో ఆరోగ్యానికి తూట్లు!
కాంపిటీటివ్ గెడైన్స్ జనరల్ సైన్స్ 20వ శతాబ్దంలో మానవుడు సాధించిన అభివృద్ధిలో భాగంగా అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఆవిష్కృతమయ్యాయి. తర్వాత కాలంలో ప్రపంచీకరణ ఫలితంగా సెల్ఫోన్, టీవీ, కంప్యూటర్, ల్యాప్టాప్, ఏసీ వంటి ఎలక్ట్రానిక్ సాధనాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మనిషి జీవితం నుంచి వీటిని విడదీయలేనంతగా కలిసి పోయాయి. ఇదే సమయంలో అపరిమితంగా వాడి పారేస్తున్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు పర్యావరణానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. అందువల్లే ప్రస్తుతం ప్రపంచ దేశాలను తీవ్రంగా కలవరపెడుతున్న అంశాల్లో ఎలక్ట్రానిక్ వ్యర్థాల (ఈ-వేస్ట్) సమస్య ముందు వరుసలో ఉంది. వాడిపారేసిన ఎలక్ట్రానిక్ వస్తువులను ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఈ-వ్యర్థాలు) అంటారు. పాడైన టీవీలు, కంప్యూటర్లు, సెల్ఫోన్లు, ప్రింటర్లు, ల్యాప్టాప్లు, సెల్చార్జర్లు, బ్యాటరీలు, మదర్బోర్డులు, ఏసీలు, వాషింగ్మెషిన్లు, రిమోట్లు, సీడీలు, హెడ్ఫోన్లు, జిరాక్స్ యంత్రాలు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లు (సీపీయూ), ఐపాడ్, ఫ్యాక్స్ యంత్రాలు మొదలైన వాటిని ఈ-వ్యర్థాలుగా పేర్కొంటారు. వీటి విడుదల రోజురోజుకూ అధికమవుతూ..పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోంది. ఈ-వ్యర్థాల నుంచి వెలువడే ప్రమాదకర రసాయనాలు భూమిలోకి చేరి, భూగర్భ జలాలను విషతుల్యం చేస్తూ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు - వ్యాధులు ఈ-వ్యర్థాలకు సంబంధించి మదర్బోర్డు, చిప్, సర్క్యూట్లను ముఖ్యమైనవిగా పేర్కొనవచ్చు. వీటి తయారీలో ప్రమాదకరమైన సీసం, ఆర్సినిక్, బేరియం, కాడ్మియం, కోబాల్ట్, పాదరసం, నికెల్, జింక్ మొదలైన వాటిని ఉపయోగిస్తారు. వీటిని ఉపయోగించి తయారు చేసిన వస్తువులను పారేస్తే వాటి భాగాల్లో ఉండే రసాయనాలు మట్టితో పాటు భూగర్భ జలాలను విషతుల్యం చేస్తాయి. వీటిని తగలబెట్టడం ద్వారా వచ్చే విష వాయువులు వాతావరణానికి హాని కలిగిస్తాయి. సీసాన్ని రీచార్జబుల్ బ్యాటరీలు, ట్రాన్సిస్టర్లు, లిథియం బ్యాటరీల తయారీలో అధికంగా వాడతారు. సీసంతో కలుషితమైన నీటిని తాగితే నాడీ వ్యవస్థతో పాటు మూత్రపిండాలు దెబ్బతింటాయి. పిల్లల్లో బుద్ధిమాంద్యం వస్తుంది. కంప్యూటర్ మానిటర్, సర్క్యూట్ బోర్డులు, కంప్యూటర్ బ్యాటరీ తయారీలో కాడ్మియాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. దీర్ఘకాలం కాడ్మియం ప్రభావానికి గురైతే ఐ్ట్చజీఐ్ట్చజీ అనే వ్యాధి కలుగుతుంది. మూత్రపిండాలు, ఎముకలను బలహీనపరచడం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. దీంతోపాటు ఈ వ్యాధి వస్తే వెన్నెముక, కీళ్లలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. పాదరసాన్ని (మెర్క్యూరీ) స్విచ్లు, పాకెట్ క్యాలిక్యులేటర్, ఎల్సీడీల తయారీలో వాడతారు. పాదరసం ఆహారపు గొలుసు ద్వారా మనిషిలోకి చేరి మినిమెటా వ్యాధిని కలుగజేస్తుంది. సెమికండక్టర్లు, డయోడ్లు, లెడ్ల తయారీలో వాడే ఆర్సినిక్ వల్ల క్యాన్సర్, గుండెజబ్బు కలుగుతాయి. అమెరికా నుంచే అధికంగా.. ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి సరాసరి 93.5 మిలియన్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు విడుదలవుతున్నాయి. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం అమెరికా అత్యధిక ఎలక్ట్రానిక్ వ్యర్థాలను విడుదల చేస్తూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా చైనా, జపాన్, జర్మనీ దేశాలున్నాయి. భారతదేశం సంవత్సరానికి 18.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను వెలువరిస్త్తూ ఐదో స్థానంలో ఉంది. 2020 నాటికి భారత్లో 52 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు విడుదలవుతాయని అసోచామ్ అంచనా. పెరుగుతున్న జనాభా, ప్రపంచదేశాలకు భారతదేశం ప్రధాన మార్కెట్గా ఉండటంతో ఎలక్ట్రానిక్ సంస్థలు తమ ఉత్పత్తులను ముందుగా ఇక్కడ విడుదల చేస్తున్నాయి. భారత్లో యువత ఎక్కువ సంఖ్యలో ఉండటం, వినియోగదారుల కొనుగోలు శక్తి పెరగడం వంటివి కూడా ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ముంబై నగరం 1,20,000 మెట్రిక్ టన్నుల ఈ-వ్యర్థాల ఉత్పత్తితో దేశంలో మొదటి స్థానంలో ఉండగా, ఢిల్లీ రెండో స్థానం (98,000 మెట్రిక్ టన్నులు), బెంగుళూరు మూడో స్థానం, చెన్నై నాలుగో స్థానంలో ఉన్నాయి. హైదరాబాద్ నగరం ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తిలో ఏడో స్థానంలో ఉంది. దేశంలో విడుదలతున్న ఈ-వ్యర్థాల్లో 70 శాతం కంప్యూటర్ విడిభాగాలు ఉండగా.. 12 శాతం టెలికాం పరికరాలు, 8 శాతం ఎలక్ట్రానిక్ రంగం నుంచి వచ్చిన వ్యర్థాలు ఉన్నట్లు అంచనా. ఎలక్ట్రానిక్ వ్యర్థాల పునఃశుద్ధి (రీ సైక్లింగ్ ఆఫ్ ఈ-వేస్ట్) భారతదేశంలో విడుదలయ్యే ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లో కేవలం 1.5 శాతం మాత్రమే రీసైకిల్ అవుతున్నట్లు అసోచామ్ సర్వే తెలిపింది. రీసైక్లింగ్ ప్రక్రియలో ఈ-వ్యర్థాలను సుత్తెలతో కొట్టి పిండి చేయడం, ముక్కలుగా నరకడం చేస్తారు. ఈ ప్రక్రియలో వాటి నుంచి బయటపడిన రసాయన పదార్థాలు మట్టిలో చేరతాయి. వర్షం వచ్చినప్పుడు అవి నీటిలో కలిసి, భూగర్భ జలాలను కలుషితం చేస్తాయి. కలుషితమైన ఈ నీటిని తాగడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. బాసెల్ ఒడంబడిక ప్రపంచదేశాల మధ్య హానికర వ్యర్థ పదార్థాల రవాణాను నిషేధిస్తూ బాసెల్ ఒడంబడిక జరిగింది. అభివృద్ధి చెందిన దేశాల నుంచి హానికర వ్యర్థ పదార్థాలను అభివృద్ధి చెందుతున్న దేశాలకు రవాణా చేయడాన్ని బాసెల్ ఒడంబడిక నిషేధిస్తుంది. అయితే ఈ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అమెరికా, ఐరోపా యూనియన్ దేశాలు తమ దేశాల్లో విడుదలైన ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఆఫ్రికాలోని ఘనా, నైజీరియా, ఆసియాలోని భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మలేసియా, చైనా వంటి దేశాలకు తరలిస్తున్నాయి. ఈ విధంగా భారత్లోకి ఏడాదికి 50,000 టన్నుల ఈ-వ్యర్థాలు అక్రమ రవాణా జరుగుతున్నట్లు అంచనా. భారతదేశ ఎగుమతి-దిగుమతి చట్టాల ప్రకారం 10 సంవత్సరాలు వాడిన సెకండ్ హ్యాండ్ కంప్యూటర్లను దిగుమతి చేసుకోవచ్చు. ఈ నిబంధనను అడ్డం పెట్టుకొని ఆయా దేశాలు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను భారత్లో ప్రవేశపెడుతున్నాయి. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు చాలా ప్రమాదకరమైనవి కాబట్టి ధనిక దేశాలు ఈ-వ్యర్థాలను పేద దేశాలకు తరలిస్తున్నాయి. హానికర ఈ-వ్యర్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆఫ్రికా ఖండంలోని 12 దేశాలు కలిసి బమాకో కన్వెన్షన్ను ఏర్పాటు చేసుకున్నాయి. ఇది 1999 నుంచి ఆఫ్రికా ఖండంలో అమల్లోకి వచ్చింది. తర్వాత కాలంలో హానికర రసాయన వ్యర్థ పదార్థాల రవాణాను మరింత కఠినతరం చేస్తూ 1998లో 140 దేశాలు రోటర్డ్యామ్ కన్వెన్షన్ను ఆమోదించాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా 2004, ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చింది. భారతదేశం 2005, మే 24న దీన్ని ఆమోదించింది. హానికర రసాయన వ్యర్థ పదార్థాల వల్ల జరుగుతున్న హానిని గ్రహించిన భారత ప్రభుత్వం ఇటీవల హానికర వ్యర్థ పదార్థాల నిర్వహణ నియమావళిని (మార్చి, 2016) తీసుకొచ్చింది. మాదిరి ప్రశ్నలు 1. Itai-Itai అనే వ్యాధి దేని ప్రభావం వల్ల కలుగుతుంది? 1) సీసం 2) ఆర్సెనిక్ 3) కాడ్మియం 4) పాదరసం జవాబు: 3 2. ప్రపంచంలో అత్యధిక ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేసే దేశం ఏది? 1) అమెరికా 2) చైనా 3) జపాన్ 4) జర్మనీ జవాబు: 1 3. భారతదేశంలో అత్యధిక ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేసే నగరం ఏది? 1) ఢిల్లీ 2) కోల్కతా 3) చెన్నై 4) ముంబై జవాబు: 4 - ప్రవీణ్ దత్తు లెక్చరర్ ఇన్ జువాలజీ,ఎల్.హెచ్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మైలవరం -
ఎంబీఏ.. మెరుగైన కాలేజీ ఎంపిక ఎలా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐసెట్ ముగిసింది.. ఫలితాలు సైతం వెలువడ్డాయి. మరికొద్ది రోజుల్లో కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. ఐసెట్ ర్యాంకుతో ఎంబీఏలో చేరాలనుకుంటున్న విద్యార్థులకు ఇప్పుడు ఎదురయ్యే ప్రధాన ప్రశ్న.. మంచి కాలేజీని ఎంపికచేసుకోవడం ఎలా?! కాలేజీ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన ప్రమాణాలేంటి? ఈ క్రమంలో ఎంబీఏ కాలేజీ ఎంపికపై నిపుణుల సలహాలు... ఏఐసీటీఈ ప్రమాణాలు కళాశాల ఎంపికలో విద్యార్థులు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు- ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ సంఖ్య, ఫ్యాకల్టీ అర్హతలు, ఫ్యాకల్టీ సైటేషన్స్, మౌలిక సదుపాయాలు, లైబ్రరీ, ఈ-జర్నల్స్ సదుపాయం, అందుబాటులో ఉన్న రియల్ కేస్ స్టడీస్. * ఫ్యాకల్టీ - స్టూడెంట్ నిష్పత్తి: 1:15 * ఫ్యాకల్టీలో 80 శాతం మంది శాశ్వత ప్రాతిపదికన నియమితులై ఉండాలి. * ఫ్యాకల్టీ హోదాల పరంగా ప్రొఫెసర్; అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాలు ఉండాలి. వీరి నిష్పతి 1:2:6గా ఉండాలి. * లైబ్రరీలో కనీసం ఆరు వేల జాతీయ, అంతర్జాతీయ స్థాయి జర్నల్స్ అందుబాటులో ఉండాలి. * వీటిలో 25 శాతం జర్నల్స్ను డిజిటైజేషన్ విధానంలో ఈ-జర్నల్స్గా అందుబాటులో ఉంచాలి. * కంప్యూటర్స్ పరంగా నలుగురు విద్యార్థులకు ఒక కంప్యూటర్ చొప్పున అందుబాటులో ఉండాలి. * ఇవన్నీ ఉంటేనే ఒక కళాశాలలో పరిపూర్ణమైన బోధన లభిస్తుందని ఏఐసీటీఈ అంచనా. ఫ్యాకల్టీ.. ప్లేస్మెంట్స్ ఎంబీఏ మొదటి సంవత్సరం అందరికీ కామన్గా ఉంటుంది. కాబట్టి రెండో సంవత్సరంలో స్పెషలైజేషన్కు అనుగుణంగా సంబంధిత అర్హతలున్న ఫ్యాకల్టీ వివరాలు తెలుసుకోవాలి. వీటన్నింటి కంటే ముఖ్యంగా ప్లేస్మెంట్స్ పరంగా గత నాలుగేళ్ల సమాచారం సేకరించాలి. ప్లేస్మెంట్స్లో పాల్గొంటున్న కంపెనీలు, వాటి ప్రొఫైల్స్, అవి ఆఫర్ చేసిన ఉద్యోగాలు తదితరాల గురించి తెలుసుకోవాలి. గత మూడేళ్ల కాలంలో కళాశాలలో ఉత్తీర్ణత శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. బీటెక్ కళాశాలల్లో ఎంబీఏ వివిధ ఇంజనీరింగ్ కళాశాల్లో ఎంబీఏ కోర్సు కూడా ఉంది. ఒక రకంగా ఇది ఎంబీఏ విద్యార్థులకు అనుకూలమని చెప్పొచ్చు. కారణం.. బీటెక్ స్థాయిలో పేరున్న కళాశాలలకు ఇండస్ట్రీ వర్గాల గుర్తింపు ఉంటుంది. ప్లేస్మెంట్స్ పరంగా ఇవి ముందుంటాయి. ఇంజనీరింగ్ కళాశాలల్లో నిర్వహించే ప్లేస్మెంట్లో బీటెక్, ఎంటెక్ విద్యార్థులే కాకుండా.. ఎంబీఏ అభ్యర్థులు సైతం అవకాశాలు అందుకోవచ్చు. కాబట్టి ఇంజనీరింగ్ కోర్సులను ఆఫర్ చేసే కళాశాలలో ఎంబీఏ కూడా ఉంటే అది సానుకూల అంశమే! ప్రత్యక్ష పరిశీలన వివిధ సర్వే సంస్థలు కాలేజీలకు ఇస్తున్న ర్యాంకుల్లో తేడాలు ఉంటున్నాయి. వీటివల్ల విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు ప్రత్యక్షంగా కళాశాలలను సందర్శించి, అక్కడి సీనియర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకోవడం మేలు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, కోర్సులను అందిస్తున్న కళాశాలల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్లకు ప్రాధాన్యమిస్తున్న కళాశాలలపై దృష్టిసారించాలి. స్పెషలైజేషన్ కళాశాల ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన మరో అంశం.. స్పెషలైజేషన్లు. ప్రస్తుతం అన్ని కళాశాలల్లో ప్రధాన స్పెషలైజేషన్లు అందుబాటులో ఉంటున్నాయి. అయితే ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాలు, సదరు స్పెషలైజేషన్కు సంబంధించి రియల్ కేస్ స్టడీస్ అందుబాటులో లేకపోవడం, కేస్ అనాలిసిస్ చేస్తూ బోధించే అధ్యాపకులు లేకపోవడం సమస్యగా మారింది. ఇలాంటి సమస్యలకు తావు లేని కళాశాలలను ఎంపిక చేసుకోవాలి. పరిశ్రమ వర్గాలతో ఒప్పందాలు కళాశాల ఎంపిక విషయంలో మరో ముఖ్యమైన అంశం.. పరిశ్రమ వర్గాలతో ఉన్న ఒప్పందాలు. ఇలాంటి ఒప్పందాలున్న కళాశాలల ద్వారా ఆయా కంపెనీల్లో ఇంటర్న్షిప్ చేసే అవకాశం లభిస్తుంది. కంపెనీ ఎదుర్కొంటున్న సమస్యల్ని ఫ్యాకల్టీ ద్వారా కేస్ అనాలిసిస్ చేసే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో ఎంబీఏ కాలేజీలు ఇలాంటి ఏర్పాట్లపై దృష్టిసారిస్తున్నాయి. కొన్ని కళాశాలలకు సీఐఐ, ఫిక్కీ, అసోచామ్, ఫ్యాప్సీ తదితర మేనేజ్మెంట్ అసోసియేషన్స్తో సంబంధాలు ఉంటున్నాయి. ఇలాంటి వాటిని ఎంపిక చేసుకోవడం వల్ల క్షేత్రస్థాయి నైపుణ్యాలు లభిస్తాయి. ఐసెట్ 2015 గణాంకాల ప్రకారం.. ఏపీలో ఎంబీఏ కళాశాలలు, సీట్లు కళాశాలలు: 384 సీట్లు: 45,965 తెలంగాణలో ఎంబీఏ కళాశాలలు, సీట్లు కళాశాలలు: 347 సీట్లు: 41,796 ఐసెట్ కౌన్సెలింగ్కు ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే కళాశాల ఎంపికపై కసరత్తు ప్రారంభించాలి. చివరి ర్యాంకులు, వెబ్సైట్ సమాచారం, సర్వే రిపోర్టులకే పరిమితం కాకుండా.. ప్రత్యక్షంగా కళాశాలలను సందర్శించి వివరాలు తెలుసుకోవడం మంచిది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో విద్యార్థులు కళాశాల ఎంపికతో పాటు రెండో సంవత్సరంలో తీసుకోవాల్సిన స్పెషలైజేషన్పై అవగాహన ఏర్పరచుకోవాలి. - ప్రొ॥ఓం ప్రకాశ్, టీఎస్ ఐసెట్ కన్వీనర్. గత కౌన్సెలింగ్ ‘చివరి ర్యాంకులు’ ఆధారంగా కళాశాలలపై ప్రాథమికంగా ఒక అంచనాకు రావొచ్చు. ఔత్సాహికులు తమ ప్రాథమ్యాల వారీగా కళాశాలలను ప్రత్యక్షంగా సందర్శించి, నిర్ణయం తీసుకోవడం మంచిది. కళాశాలల ఎంపికలో వాటికి పరిశ్రమ వర్గాలతో ఉన్న ఒప్పందాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అదే విధంగా విద్యార్థులు కోర్సులో భాగంగా ఇంటర్న్షిప్స్, రియల్టైం ప్రాజెక్ట్వర్క్కు ప్రాధాన్యమివ్వాలి. - ప్రొ॥కట్టా రామమోహన్ రావు, ఏపీ ఐసెట్ కన్వీనర్. -
భవితకు ‘నిర్మాణ’ రంగం
నిర్మాణ రంగం ప్రస్తుత శరవేగంగా వృద్ధి చెందుతున్న విభాగం. మార్కెట్ వాటా పరంగా గత నాలుగేళ్లుగా సగటున పది శాతం వార్షిక వృద్ధి నమోదు చేసుకుంటోంది. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలోనూ కేరాఫ్గా నిలుస్తోంది కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్. ఉపాధి కల్పనలో ఈ రంగం జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనం. తాజా నివేదికల ప్రకారం- 2022 నాటికి నిర్మాణ రంగం, దాని అనుబంధ మౌలిక సదుపాయాల విభాగాల్లో 12.67 మిలియన్ల కొత్త ఉద్యోగాలు నమోదవడం ఖాయమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మాణ రంగంలో కెరీర్ అవకాశాలు.. జాబ్ ప్రొఫైల్స్, అవసరమైన స్కిల్స్పై విశ్లేషణ.. ప్రాజెక్ట్ మేనేజర్స్ నిర్దిష్టంగా ఒక నిర్మాణం, లేదా ఒక ప్రాజెక్ట్ నిర్వహణ బాధ్యతలు చేపట్టే వ్యక్తులు.. ప్రాజెక్ట్ మేనేజర్స్. బీటెక్, ఎంటెక్ స్థాయిలో సివిల్ ఇంజనీరింగ్, దాని అనుబంధ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులు ప్రాజెక్ట్ మేనేజర్స్గా చేరొచ్చు. వీరికి అకడమిక్ అర్హతలతోపాటు ప్లానింగ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, ఒక ప్రాజెక్ట్ సమర్థంగా పూర్తి చేయడంలో ఎదురయ్యే సానుకూల, ప్రతికూల అంశాలపై ముందుగానే అవగాహన, నాయకత్వ లక్షణాలు, బృంద నైపుణ్యాలు ఉండాలి. సైట్/ప్రాజెక్ట్ ఇంజనీర్స్ ఒక ప్రాజెక్ట్కు సంబంధించి పూర్తిగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే నిపుణులే.. సైట్/ప్రాజెక్ట్ ఇంజనీర్స్. బీటెక్/ఎంటెక్ స్థాయిలో సివిల్, అనుబంధ బ్రాంచ్లలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను సైట్/ప్రాజెక్ట్ ఇంజనీర్స్గా నియమిస్తారు. ఒక ప్రాజెక్ట్కు సంబంధించి డిజైన్, ప్లానింగ్, షెడ్యూలింగ్, ఎగ్జిక్యూషన్, రిస్క్ మేనేజ్మెంట్, ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ ఉంటే కెరీర్లో మంచి స్థాయికి చేరొచ్చు. సూపర్వైజర్స్ ఉన్నతాధికారులకు, క్షేత్రస్థాయిలో సిబ్బందికి మధ్య వారధిగా పనిచేసేవారే.. సూపర్వైజర్స్. నిర్దిష్ట ప్రాజెక్ట్ పనితీరును పర్యవేక్షించే విధులను నిర్వర్తించడం సూపర్వైజర్స్ ప్రధాన బాధ్యత. నిర్దిష్ట ప్రాజెక్ట్కు అవసరమైన పరికరాలు, మెటీరియల్, మెషినరీ అవసరాల గురించి ముందస్తు అవగాహన ఉంటే సూపర్వైజర్స్గా మరింత రాణించొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా కింది స్థాయిలో దినసరి వేతనంపై పనిచేసే సిబ్బంది నిర్వహణ విషయంలో వీరికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో అవసరం. డిప్లొమా స్థాయిలో సివిల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులు సూపర్వైజర్స్ పోస్టుకు అర్హులు. స్వల్పకాలిక కోర్సులతో వృత్తి నైపుణ్యాలు ఉన్నవారికి నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు పుష్కలం. కొద్దిపాటి శిక్షణ, స్కిల్స్తో బార్ బెండర్, మ్యాసన్, ప్లంబర్, పెయింటర్, వెల్డర్, ఎక్విప్మెంట్ ఆపరేటర్ వంటి పలు అవకాశాలు అందుకోవచ్చు. పదో తరగతి, ఇంటర్మీడియెట్ అర్హతతో; సెట్విన్, నిమ్స్మేలలో అందించే స్వల్పకాలిక శిక్షణ ద్వారా విధులు సమర్థంగా నిర్వహించే అవకాశముంది. నిర్మాణ రంగంలో నిపుణులైన మానవ వనరుల ఆవశ్యకత దృష్ట్యా శిక్షణనిచ్చే సంస్థల సంఖ్య సైతం పెరుగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ పరిధిలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, రాష్ట్రాల పరిధిలో డెరైక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ పరిధిలో వృత్తి శిక్షణ కేంద్రాలు, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్తో ఒప్పందం కుదుర్చుకున్న సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్లో ఈ శిక్షణ లభిస్తోంది. ప్రస్తుతం కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్కు సంబంధించి కన్స్ట్రక్షన్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ వంటి సంస్థలు శిక్షణ అందిస్తున్నాయి. క్యాడ్ కలిసొచ్చే కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో రాణించాలనుకునే అభ్యర్థులకు కలిసొచ్చే మరో ప్రధాన అంశం.. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ (క్యాడ్)లో నైపుణ్యం. ప్రస్తుతం నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లన్నీ కంప్యూటర్ ఆధారితంగా రూపొందుతున్నాయి. వీటికి సంబంధించిన నైపుణ్యాలను అందించే కోర్సు.. క్యాడ్ డిజైనింగ్. బీటెక్ స్థాయిలో ఈ కోర్సు అందుబాటులో ఉండదు. ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని సర్టిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీన్ని పూర్తి చేసుకుంటే.. క్షేత్ర స్థాయి విధులు ఎక్కువ అని భావించే కన్స్ట్రక్షన్ విభాగంలోనే ఇన్-హౌస్ జాబ్స్ సొంతం చేసుకోవచ్చు. నిర్వహణ నైపుణ్యాలు.. కోర్సులు నిర్మాణ రంగం ఔత్సాహికులు తమ ఇంజనీరింగ్ నైపుణ్యాలకు... నిర్వహణ నైపుణ్యాలను కూడా సమ్మిళితం చేస్తే కెరీర్లో దూసుకెళ్లొచ్చు. ప్రస్తుతం పలు ఇన్స్టిట్యూట్లు కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ పేరిట ఇటు కోర్ ఇంజనీరింగ్ నైపుణ్యాలు, అటు నిర్దిష్ట ప్రాజెక్ట్ నిర్వహణ నైపుణ్యాలు అందించే విధంగా కోర్సులు అందిస్తున్నాయి. అవి.. * ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ - కోర్సు: అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్. * నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ (నిక్మర్) - కోర్సులు: పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ అడ్వాన్స్డ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్. * నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) - కాలికట్, కోర్సు: పోస్ట్ డిప్లొమా ఇన్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ నిర్మాణం, అనుబంధ రంగాల గణాంకాలివే * దేశంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రెండో పెద్ద రంగం. * ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రస్తుతం 45 మిలియన్ ఉద్యోగాలు. * 2022 నాటికి మానవ వనరుల అవసరం 66.62 మిలియన్లకు చేరుకోనుందని అంచనా * ప్రభుత్వ మౌలిక నిర్మాణ పథకాల్లోనే (హైవేల నిర్మాణం, రైల్వే నిర్మాణం తదితర) 2022 నాటికి 1.8 మిలియన్ల మంది అవసరమని అంచనా. * వీటిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రేడ్ సర్టిఫికేషన్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎన్ఎస్డీసీ) నిపుణుల కమిటీ సూచించింది. పాజిటివ్స, నెగటివ్స్ * డిమాండ్ - సప్లయ్ కోణంలో ఏ కోర్సు పూర్తి చేసినా కెరీర్ ఖాయం. * ప్రారంభంలో కింది స్థాయిలోనే నెలకు రూ.10 వేల వరకు సంపాదించే అవకాశం. * క్షేత్ర స్థాయి విధులే కాకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పెరుగుతున్న ఇన్-హౌస్ జాబ్స్. * సిబ్బందిని, కార్మికులను మెప్పించడంలో ఎదురయ్యే ఇబ్బందులు. * అధిక శాతం విధులు క్షేత్ర స్థాయిలో నిర్వహించే విధంగా ఉండటం. * ఒక ప్రాజెక్ట్కు సంబంధించిన మెటీరియల్స్ను త్వరగా తెప్పించడంలో ఎదురవుతున్న ఇబ్బందులు. ఎమర్జింగ్ కెరీర్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ప్రస్తుతం ఎమర్జింగ్ కెరీర్గా మారుతోంది. ముఖ్యంగా డిప్లొమా, బీటెక్ స్థాయిలో సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారికి అవకాశాలు ఖాయం. వీరు తమ అకడమిక్ అర్హతలకు అనుగుణంగా అదనపు సర్టిఫికేషన్ క్యాడ్, క్యామ్ వంటివి నేర్చుకోవడం, అదే విధంగా ఈ రంగానికి సంబంధించి స్పెషలైజ్డ్ శిక్షణ తరగతులకు హాజరవడం వంటివి చేస్తే ఈ రంగంలో మరింత ఉన్నతంగా ఎదగొచ్చు. - ప్రొఫెసర్ ఆర్.సతీశ్ కుమార్,నిక్మర్, హైదరాబాద్ ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పలు ఇన్స్టిట్యూట్స్ వృత్తి శిక్షణ నైపుణ్యాలను అందించే కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. అవి.. నేషనల్ కౌన్సిల్ ఫర్ కన్స్ట్రక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కోర్సులు: డిప్లొమా ఇన్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ క్వాలిటీ సర్వేయింగ్. సర్టిఫికెట్ కోర్సులు: సైట్ ఆర్గనైజేషన్ అండ్ లేఔట్; కాంక్రీట్ అండ్ కాంక్రీటింగ్, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ మెయింటనెన్స్ తదితర కోర్సులు. వెబ్సైట్: www.baionline.in నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అసిస్టెంట్ కన్స్ట్రక్షన్ లేబొరేటరీ టెక్నీషియన్ అసిస్టెంట్ స్కాఫోల్డర్ హెల్పర్ బార్ బెండర్ అండ్ ఫిక్సర్ హెల్పర్ కార్పెంటర్ హెల్పర్ కన్స్ట్రక్షన్ లేబొరేటరీ టెక్నీషియన్ హెల్పర్ మాసన్ వీటిని కన్స్ట్రక్షన్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ విభాగం పరిధిలో పలు ఇన్స్టిట్యూట్లతో ఒప్పందం ద్వారా అందిస్తోంది వెబ్సైట్: www.nsdcindia.org -
కొన్ని జంతువుల పాలు పసుపు రంగులో ఎందుకుంటాయి?
స్కూల్ ఎడ్యుకేషన్ గేదె పాలు తెల్లగా ఉండటాన్ని, ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు కదా! ఇలా కొన్ని జంతువుల పాలు తెల్లగా ఉండటానికి, మరికొన్ని జంతువుల పాలు తెల్లగా లేకపోవడానికి చాలా ముఖ్య కారణమే ఉంది. ఆవు పాలలో ‘బీటా కెరోటిన్’ అనే పదార్థం కొంచెం ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల ఆ పాలకు లేత పసుపు రంగు వస్తుంది. గేదె పాలలో ఆ పదార్థం లేకపోవడం వల్ల పాలు తెల్లగా ఉంటాయి. చిన్నపిల్లలకు గేదె పాల కంటే ఆవుపాలు మంచివని చెప్పడానికి.. వాటిలో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండా, ఈ బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండటం కూడా కారణం. ఆవుపాలు సులభంగా జీర్ణం కావడమే కాకుండా వాటిలోని బీటా కెరోటిన్ ‘ఎ’ విటమిన్గా మార్పు చెంది చిన్నారులకు బాగా ఉపయోగపడుతుంది. పాలలో ఉండే వివిధ పదార్థాల నిష్పత్తిలో ఉన్న తేడాలను బట్టి ఆయా జంతువుల పాల రంగుల్లో తేడాలు ఉంటాయి. -
ఉద్యోగాలు
చిత్తూరు జిల్లాలో 23 పోస్టులు చిత్తూరు జిల్లా ‘మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ’.. ఐసీడీఎస్ ప్రాజెక్ట్లోని వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన జిల్లా కోఆర్డినేటర్, జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్, బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టు: డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్, బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, ఖాళీలు: 23 దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలో దరఖాస్తు పూర్తిచేసి ‘ప్రాజెక్ట్ డెరైక్టర్, జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ, చిత్తూరు’ చిరునామాకు పంపించాలి. దరఖాస్తుకు చివరి తేది: జూన్ 11 వివరాలకు: www.chittoor.ap.gov.in సెయిల్లో ప్రొఫిషియన్సీ ట్రైనీ (నర్స్) స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)కి చెందిన దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ (డీఎస్పీ).. వివిధ విభాగాల్లో ప్రొఫిషియన్సీ ట్రైనీ (నర్స్)లకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఖాళీలు: 69 విభాగాలు: ఐసీయూ/ఎన్ఐసీయూ/బీఐసీయూ,మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, క్యాజువాలిటీ, ఆర్థోపెడిక్స్ తదితర విభాగాలు దరఖాస్తుకు చివరి తేది: జూన్ 22 ఇంటర్వ్యూ తేది: జూన్ 26 వివరాలకు: www.sailcareers.com ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీలో సీనియర్, జూనియర్ రెసిడెంట్ పోస్టులు గుల్బర్గాలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) మెడికల్ కాలేజీ.. వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్, జూనియర్ రెసిడెంట్, ట్యూటర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. విభాగాలు: పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, డెర్మటాలజీ, టీబీ అండ్ చెస్ట్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, అనస్థీషియా తదితర విభాగాలు. ఖాళీలు: 21, ఇంటర్వ్యూ తేది: జూన్ 21 వివరాలకు: www.esic.nic.in -
ఇంటర్వ్యూ తేదీలు
* సీఎస్ఐఆర్ అనుబంధ సంస్థ.. సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వివిధ విభాగాల్లో అప్రెంటీస్ పోస్టులకు: జూన్ 15 * హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ లో కన్సల్టెంట్ పోస్టులకు: జూన్ 21 * ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ)లో ప్రాజెక్ట్ ఫెలో, సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు: జూన్ 24 -
సవాళ్లతో కూడిన కెరీర్... పోలీస్
గ్రాడ్యుయేట్స్ స్పెషల్ సమాజంలో శాంతి భద్రతలను కాపాడే బృహత్తర బాధ్యత పోలీసులది. పోలీసులు లేకుంటే ప్రజలకు భద్రత కరువవుతుంది. సమాజంలో నేరాలను, నేర ప్రవృత్తిని అరికట్టే బాధ్యతాయుత ఉద్యోగం.. పోలీస్! నేరాలు ఘోరాలు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో పోలీసుల అవసరం మరింతగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ స్థాయిల్లో పోలీసు ఉద్యోగ నియామకాలు జరుపుతున్నాయి. తెలంగాణాలో ఇప్పటికే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ ప్రకటనలు వెలువడి భర్తీ ప్రక్రియ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోనూ త్వరలో పోలీస్ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాల ప్రకటనల నేపథ్యంలో పోలీస్ కెరీర్పై ప్రత్యేక కథనం.. ఉద్యోగావకాశాలు * రాష్ట్ర స్థాయిలో పోలీస్ శాఖలో ప్రాథమికంగా కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడతాయి. రాత పరీక్ష, శారీరక దారుఢ్య, వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా వీటిని సొంతం చేసుకోవచ్చు. తర్వాత ప్రమోషన్ల ద్వారా పై స్థాయికి వెళ్లొచ్చు. * అలాగే రాష్ట్ర స్థాయిలో గ్రూప్-1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) ఉద్యోగం సాధించొచ్చు. * యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయడం ద్వారా ఐపీఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్) ఉద్యోగం సాధించొచ్చు. ఇందుకోసం ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. * ఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, డయ్యూ అండ్ డామన్, దాద్రా నగర్ హవేలీ పోలీస్ సర్వీసెస్ గ్రూప్-బీ, పాండిచ్చేరి పోలీస్ సర్వీసెస్ గ్రూప్-బీ ద్వారా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ప్రాంతాల్లో పోలీసు నియామకాలు చేపడుతుంది. సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. * సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లో సబ్ ఇన్స్పెక్టర్లు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్లో ఇన్స్పెక్టర్లు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)లో సబ్ ఇన్స్పెక్టర్లు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ)లో ఇన్స్పెక్టర్ పోస్టులను కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ (సీజీఎల్) ద్వారా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) భర్తీ చేస్తుంది. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా ఈ పోస్టులను దక్కించుకోవచ్చు. * సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, సశస్త్ర సీమ బల్ (ఎస్ఎస్బీ)లలో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులను సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ ద్వారా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేస్తుంది. రాత, శారీరక, వైద్య పరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోలీసు విభాగాలు సాధారణంగా ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక పోలీసు విభాగాలు ఉంటాయి. ఇవి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో పనిచేస్తాయి. రాష్ట్ర పోలీస్ శాఖలో మళ్లీ ఏపీఎస్పీ, ఏఆర్, సివిల్, టాస్క్ఫోర్స్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్), క్రైంబ్రాంచ్, స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ) తదితర విభాగాలుంటాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఛండీగఢ్, పాండిచ్చేరి, డామన్ అండ్ డయ్యూ, లక్షద్వీప్, దాద్రానగర్ హవేలీ, అండమాన్ నికోబార్ దీవుల్లోని పోలీసు విభాగాలు నేరుగా కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటాయి. సీబీఐ, ఎన్ఐఏ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్లో ఇన్స్పెక్టర్లు, సబ్ఇన్స్పెక్టర్లు ఉంటారు. పారా మిలటరీ దళాలు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ఫోర్స్ (సీఆర్పీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ), అస్సాం రైఫిల్స్, ఇండోటిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్), సశస్త్ర సీమబల్ (ఎస్ఎస్బీ)లు ప్రత్యేక సాయుధ దళాలు. నిర్ణీత విధుల కోసం వీటిని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తిరుగుబాట్లను ఎదుర్కోవడం, ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడంలో పోలీసులకు ఇవి సహకరిస్తాయి. సైన్యం తరహాలో వీటి నిర్మాణం ఉన్నందువల్ల వీటిని పారా మిలటరీ దళాలు అంటారు. పోలీసు విధులు ⇒ అంతర్గత భద్రతను పరిరక్షించడం. ⇒ రోడ్లు, రైల్వేలు, బ్రిడ్జిలు తదితర ప్రజల ఆస్తులు, ప్రఖ్యాత భవనాలు, కట్టడాలకు రక్షణ కల్పించడం. ⇒ ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడం. ⇒ నిందితులను విచారించడం, స్టేట్మెంట్లు నమోదు చేయడం. ⇒ క్రైం రిపోర్టులను పరిశీలించడం. ⇒ అభియోగాలను నమోదు చేయడం. వాటికి సంబంధించిన సాక్ష్యాలను సేకరించి, కోర్టుకు సమర్పించడం. ⇒ రాత్రివేళల్లో పెట్రోలింగ్ నిర్వహించడం. ⇒ అత్యవసర సమయాల్లో స్పందించడం. ⇒ ట్రాఫిక్/సమూహాన్ని నియంత్రించడం. ⇒ ఉద్రిక్తతల సమయంలో అందరూ శాంతియుతంగా ఉండేలా చూడటం పని వేళలు పోలీసులకు ప్రత్యేకించి పనివేళలు అంటూ ఏమీ ఉండవు. వీరు 24 గంటలూ డ్యూటీలో ఉంటారు. అవసరమైతే అర్ధరాత్రయినా వెళ్లి నేరస్తులను అరెస్టు చేయాలి. నిరంతరం ప్రజలకు రక్షణ కల్పించడం వీరి బాధ్యత. పండగల సమయంలో కూడా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కావాల్సిన నైపుణ్యాలు ⇒ పరిణతితో వ్యవహరించాలి. ⇒ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలి. ⇒ విపత్కర పరిస్థితులను ధీటుగా ఎదుర్కోగలగాలి. ⇒ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. ⇒ సమస్యలను పరిష్కరించగలిగే నైపుణ్యం. ⇒ సునిశిత పరిశీలన, పరిశోధనాత్మక దృక్పథం ఉండాలి. పాజిటివ్స్ ⇒ ప్రజలకు నేరుగా రక్షణ కల్పించే అవకాశం లభిస్తుంది. ⇒ ఆయా నేరాలకు సంబంధించిన చిక్కుముళ్లను ఛేదించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు దక్కించుకోవచ్చు. ⇒ పోలీసులంటే సమాజంలో ప్రత్యేక గౌరవం ఉంటుంది. ⇒ ప్రతిభ ఆధారంగా ఉన్నత స్థానాలకు ఎదగొచ్చు. నెగటివ్స్ ⇒ పోలీసులకు నిర్ణీత పనివేళలు ఉండవు. వారు 24 గంటలు డ్యూటీలో ఉంటారు. ⇒ పండుగలు, ఇతర సెలవు రోజుల్లో కూడా అవసరమైతే విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. ⇒ మిగిలిన ఉద్యోగాలతో పోలిస్తే ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. ⇒ వృత్తి పరంగా అనేక సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయి. ⇒ ఉగ్రవాద, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి రావడం. -
ఐటీ కోర్సులకు కేరాఫ్ అమీర్పేట!!
ఇంజనీరింగ్ స్పెషల్ బీఎస్సీ, బీసీఏ, బీటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంటెక్ విద్యార్హత ఏదైనా... సాఫ్ట్వేర్, హార్డ్వేర్, నెట్వర్కింగ్.. చేరాలనుకున్న కోర్సు ఏదైనా అన్నింటికి ముఖ్య కూడలి.. హైదరాబాద్లోని అమీర్పేట. ఇది నేడు ఐటీ కోర్సుల శిక్షణా శిబిరంగా మారింది. నేటి ఆధునిక ప్రపంచానికి అవసరమైన సాంకేతిక నిపుణులను తీర్చిదిద్దుతోంది. ఈ నేపథ్యంలో అమీర్పేటలోని ఐటీ శిక్షణ సంస్థలు.. కోర్సులు.. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఇంజనీర్లు కావాలని కలలు కనే వారికి పరిచయం అక్కర్లేని ప్రాంతం అమీర్పేట. ఫ్రెషర్స్ ఉద్యోగాలు పొందాలన్నా, ఉద్యోగులు తమ స్కిల్ను డెవలప్ చేసుకోవాలన్నా అమీర్పేటని ఆశ్రయించవలసిందే. ఇక్కడి కోచింగ్ సంస్థలు.. ట్రెండ్కు అనుగుణంగా..సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డిమాండ్కు తగిన కోర్సుల్లో శిక్షణ ఇస్తూ సగటు విద్యార్థుల సమున్నత కెరీర్కు బాసటగా నిలుస్తున్నాయి. ఎవరెవరికి ఏ కోర్సులు బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, బీఎస్సీ.. విద్యార్థులు.. సీ, సీ++, జావా, డాట్నెట్, ఒరాకిల్, హడూప్, షేర్పాయింట్, లైనక్స్, టెస్టింగ్ టూల్స్, నెట్వర్కింగ్ కోర్సులతోపాటు ఆండ్రాయిడ్, ఐఫోన్ మొబైల్ అప్లికేషన్లనూ నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. బీకామ్ విద్యార్థులు ట్యాలీ వంటి అకౌంటింగ్ కోర్సుల్లోనూ చేరుతున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ విద్యార్థుల కోసం వీఎల్ఎస్ఐ డిజైన్, క్యాడ్/క్యామ్ తదితర కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్, హిమాయత్నగర్, కుకట్పల్లిలో కూడా మంచి ఇన్స్టిట్యూట్లు, కోర్సులు అందుబాటులో ఉన్నప్పటికీ విద్యార్థులు అమీర్పేటకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. గతంలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ), (హైదరాబాద్) అమీర్పేటలోని మైత్రివనంలో ఉండేది. ఎస్టీపీఐ అనుమతి పొందిన సంస్థలు అక్కడే చుట్టుపక్కల ఇన్స్టిట్యూట్స్ ప్రారంభించాయి. దాంతో విద్యార్థులు ఇక్కడకు వచ్చి వివిధ ఐటీ కోర్సుల్లో శిక్షణ పొందేవారు. అలా అమీర్పేట ఐటీ శిక్షణ సంస్థలకు కేంద్రంగా మారింది. అమీర్పేటలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న అన్ని రకాల టెక్నాలజీలకు కోచింగ్ లభిస్తుంది. ఇక్కడ ఇన్స్టిట్యూట్ల మధ్య పోటీ ఉండటంతో తక్కువ ఫీజులకే కోచింగ్ను అందిస్తున్నాయి. ఫీజులు ఒక్కో ఇన్స్టిట్యూట్ ఒక్కో కోర్సుకు ప్రసిద్ధి. ఫీజులు కూడా ఇన్స్టిట్యూట్లను, కోర్సులను బట్టి మారుతుంటాయి. రూ.500 నుంచి రూ.50000 వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. అభ్యర్థులు తమ అర్హతలు, అనుభవం, అభిరుచులకు తగిన కోర్సులను ఎంపిక చేసుకోవాలి. ఇతర విద్యార్థులే ఎక్కువ ప్రస్తుతం ఇన్స్టిట్యూట్లల్లో ఇతర రాష్ట్రాల వారు, విదేశీయులు ఎక్కువగా ఉంటున్నారు. జావా నేర్చుకునే వారిలో 40 శాతం మంది తెలుగు విద్యార్థులు ఉండగా, ఇతర రాష్ట్రాల వారు 50 శాతం మంది, విదేశీయులు 10 శాతం వరకు ఉన్నారు. ఇన్స్టిట్యూట్, కోర్సు ఎంపికలో జాగ్రత్తలు * మార్కెట్ ట్రెండ్కనుగుణంగా డిమాండ్ ఉన్న కోర్సును ఎంచుకోవాలి. అయితే అన్ని టెక్నాలజీలు, టూల్స్ కానీ మార్కెట్లో ఎక్కువ కాలం ఉన్న దాఖలాలు లేవు. కొన్ని టెక్నాలజీలు మాత్రమే నిలకడగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. అభ్యర్థులు వాటివైపు మొగ్గు చూపాలి. * కోర్సు పూర్తయ్యాక ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఎలాంటి కంపెనీలు నిపుణులను నియమించుకుంటున్నాయో తెలుసుకోవాలి. * కోర్సు కాలపరిమితిని దృష్టిలో ఉంచుకోవాలి. సదరు కోర్సును తక్కువ కాలవ్యవధుల్లో ఆఫర్ చేసే ఇన్స్టిట్యూట్లో చేరేముందు, ఆ పరిమిత కాలంలో పూర్తి నైపుణ్యాలు సాధించగలరో లేదో విశ్లేషించుకోవాలి. * ఇన్స్టిట్యూట్లో ల్యాబ్స్, ఇతర సౌకర్యాలనూ దృష్టిలో ఉంచుకోవాలి. * అన్నింటి కంటే ముఖ్యంగా చేరాలనుకుంటున్న ఇన్స్టిట్యూట్ పాటించే ప్రమాణాలు, ఫ్యాకల్టీ అనుభవం, వారు ఎప్పటి నుంచి అక్కడ పనిచేస్తున్నారు తదితర అంశాలను స్నేహితులు, సీనియర్ల ద్వారా తెలుసుకోవాలి. కొన్ని ఇన్స్టిట్యూట్లు అనుభవం లేని, ల్యాబ్ కోఆర్డినేటర్లతో కూడా క్లాసులు నిర్వహిస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు ఇన్స్టిట్యూట్ల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలి. * కొన్ని ఇన్స్టిట్యూట్లు తమ ప్రకటనలతో విద్యార్థులను బుట్టలో వేసుకుంటాయి. ఇంకా ఆకర్షణీయంగా డెమో క్లాసులు నిర్వహించి అభ్యర్థులను తమ వైపు తిప్పుకుంటాయి. అలాంటి ఇన్స్టిట్యూట్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అమీర్పేటలో కోర్సుల ఫీజులు చాలా తక్కువ. పుణే, బెంగళూర్ లాంటి నగరాల్లో జావా నేర్చుకోవాలంటే దాదాపు రూ. 25 వేల వరకు ఖర్చు చేయాల్సిందే. కానీ ఇక్కడ రూ. 3 వేల నుంచి రూ.5 వేల లోపే పూర్తవుతుంది. - ఎన్.దుర్గా ప్రసాద్, డెరైక్టర్, దుర్గాసాఫ్ట్ -
విశ్వంలో ఎంత దూరం వెళ్లినా గురుత్వాకర్షణ శక్తి ఉంటుందా?
స్కూల్ ఎడ్యుకేషన్ * మన విశ్వంలో ‘ద్రవ్యరాశి’ (పదార్థం) గల ప్రతి వస్తువూ వేరే వస్తువుని ఆకర్షిస్తుంది. తన ఆకర్షణ శక్తితో ఆ రెండో వస్తువుని తన వైపుకి లాక్కొనే ప్రయత్నం చేస్తుంది. ఆ రెండు వస్తువుల ద్రవ్యరాశుల మధ్య పరస్పరం ఉండే ఆకర్షణ శక్తినే గురుత్వాకర్షణ శక్తి లేదా గురుత్వాకర్షణ బలం అని అంటారు. ఏవైనా రెండు వస్తువుల మధ్య ఉండే గురుత్వాకర్షణ శక్తి ప్రధానంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో ఒకటి ఆ రెండు వస్తువులలోనూ ఉండే పదార్థ పరిమాణం కాగా రెండోది ఆ రెండు వస్తువుల కేంద్ర భాగాల మధ్య ఉండే దూరం. * వస్తువుల ద్రవ్యరాశి పెరిగితే వాటి మధ్య పనిచేసే గురుత్వాకర్షణ బలం కూడా పెరుగుతుంది. ఆ బలం రెండు వస్తువుల ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే ఆ ద్రవ్యరాశుల లబ్ధం ఎంత ఎక్కువగా ఉంటే వాటి మధ్య పనిచేసే గురుత్వ బలం కూడా అంత ఎక్కువగా ఉంటుందన్న మాట. ఇది ఒక ముఖ్యమైన విషయం. * ఇక గురుత్వ బలానికి సంబంధించిన రెండో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రెండు వస్తువుల కేంద్రకాల మధ్య ఉండే దూరం పెరిగే కొద్దీ ఆ రెండు వస్తువుల మధ్య పనిచేసే గురుత్వ బలం అదే స్థాయిలో తగ్గిపోతూ వస్తుంది. ఉదాహరణకు భూకేంద్రానికి -మనకు మధ్య ఉన్న దూరాన్ని రెండింతలు పెంచితే భూమికి - మనకు మధ్య పనిచేసే గురుత్వ బలం నాలుగో వంతుకి, పదింతలు పెంచితే 100వ వంతుకి పడిపోతోంది. ఇలా దూరం పెరిగి కొద్దీ గురుత్వ బలం క్రమేణా తగ్గిపోతుందే కాని ఎన్ని కోట్ల మైళ్ల దూరానికి పోయినా అది శూన్య స్థితికి మాత్రం చేరుకోదు. ఇదే సూత్రం విశ్వంలోని అన్ని ఖగోళాలకి వర్తిస్తుంది. -
బీటెక్ అమెరికా
స్టడీ అబ్రాడ్ : కంట్రీ ప్రొఫైల్ స్టడీ అబ్రాడ్ ఔత్సాహికుల తొలి ప్రాధాన్యం.. యూఎస్! అక్కడ కోర్సు పూర్తిచేస్తే తిరుగులేని కెరీర్ సొంతమవుతుందని భావించి, ఏటా లక్షల మంది ఆ దిశగా ప్రయత్నిస్తుంటారు. వీరిలో అధిక శాతం మంది లక్ష్యం.. ఎంఎస్, ఎంబీఏ! అయితే అమెరికాలో యూజీ కోర్సులు చేయడానికి కూడా అవకాశాలు అనేకం. మరికొద్ది నెలల్లో యూఎస్ వర్సిటీల్లో స్ప్రింగ్ సీజన్ అడ్మిషన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో అమెరికాలో బీటెక్ అవకాశాలు.. అనుసరించాల్సిన విధానాలపై విశ్లేషణ.. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ(బీటెక్).. భారత్లో ఎంతో క్రేజ్ ఉన్న కోర్సు. ఐఐటీల వంటి ఉన్నత విద్యాసంస్థల్లో సీటు కోసం తీవ్ర పోటీ ఉంటుంది. దాంతో అమెరికాలోని యూజీ ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరే భారత్ విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. 2015 నాటికి అమెరికాలో 9 లక్షలకు పైగా విదేశీ విద్యార్థులు ఉండగా, వారిలో భారత విద్యార్థుల సంఖ్య 1,32,888. వీరిలో 15-18 శాతం మంది యూజీ కోర్సుల విద్యార్థులు! వీరిలో 80 శాతం మంది ఇంజనీరింగ్కు సంబంధించిన వారు కాగా, మిగిలిన వారు సైన్స్ కోర్సులు చేస్తున్నవారు. యూఎస్లో బీటెక్కు మార్గం యూఎస్లో బీటెక్లో ప్రవేశించాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరి. అవి.. మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్లతో 70 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత. * స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (శాట్)లో స్కోర్. * శాట్ సబ్జెక్టు టెస్ట్ల్లో స్కోర్ (కొన్ని ప్రముఖ యూనివర్సిటీలకు మాత్రమే) * ACT (American College Testing) శాట్, ఏసీటీ పరీక్షల విధానం శాట్ పరీక్షలో మూడు విభాగాలుంటాయి. అవి.. రీడింగ్ (52 ప్రశ్నలు), రైటింగ్ అండ్ లాంగ్వేజ్ టెస్ట్ (44 ప్రశ్నలు); మ్యాథమెటిక్స్ (58 ప్రశ్నలు). మూడు గంటల వ్యవధిలో పరీక్ష ఉంటుంది. అదనంగా మరో 50 నిమిషాల్లో ఒక ఎస్సే రాయాలి. ఇది అభ్యర్థుల ఛాయిస్ మాత్రమే. 1600 పాయింట్లకు గరిష్ట స్కోరింగ్ ఉంటుంది. ఇందులో 50 శాతం మ్యాథమెటిక్స్కే!. విద్యార్థులు 1200 పాయింట్లు సాధిస్తే ప్రముఖ యూనివర్సిటీల్లో దరఖాస్తుకు అర్హత లభిస్తుంది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న కోర్సుకు అనుగుణంగా అనుబంధ సబ్జెక్టుల్లో పరిజ్ఞానాన్ని పరిశీలించేందుకు శాట్ సబ్జెక్టు టెస్ట్లు నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్, సైన్స్, బయాలజీ, ఫిజికల్ సైన్స్ తదితర 21 సబ్జెక్టుల్లో ఉండే శాట్ సబ్జెక్ట్ టెస్ట్లో ప్రతి సబ్జెక్ట్ పరీక్షకు 800 పాయింట్ల స్కోర్ ఉంటుంది. శాట్ పరీక్షను ఏటా ఏడుసార్లు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఎన్నిసార్లయినా రాసుకోవచ్చు. అయితే రెండు కంటే ఎక్కువ అటెంప్ట్లు ఇస్తే దరఖాస్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందనే అభిప్రాయముంది. అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ అమెరికాలోని కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే మరో పరీక్ష.. అమెరికన్ కాలేజ్ టెస్టింగ్. ఇందులో ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, రీడింగ్ ఎబిలిటీ, సైన్స్ విభాగాలు ఉంటాయి. ప్రతి విభాగంలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా 1 నుంచి 36 పాయింట్ల స్కోర్ కేటాయిస్తారు. ఈ పాయింట్ల శ్రేణిలో 25 పాయింట్లు సొంతం చేసుకుంటే.. ప్రముఖ కళాశాలల్లో ప్రవేశించేందుకు మార్గం సుగమం అవుతుంది. ఈ పరీక్షను ఏటా ఆరుసార్లు నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం తొలుత అమెరికా విదేశీ వ్యవహారాల అధికారిక వెబ్సైట్ ఆధారంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీల జాబితాను పరిశీలించాలి. ఆయా యూనివర్సిటీలు-అవసరమైన అర్హతలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆ తర్వాత శాట్ లేదా ఏసీటీ టెస్ట్లకు సన్నద్ధం కావాలి. ఆ స్కోర్ల ఆధారంగా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాలి. దరఖాస్తుతోపాటు అందించాల్సిన పత్రాలు.. * విద్యార్హతల సర్టిఫికెట్లు ఠ స్టాండర్ట్ టెస్ట్ స్కోర్ కార్డులు * కోర్సు ట్యూషన్ ఫీజు, కోర్సు వ్యవధిలో అమెరికాలో నివసించేందుకు అయ్యే వ్యయాలకు సరిపడినంతగా ఆర్థిక వనరులున్నాయనే రుజువులు. * స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ (సదరు కోర్సులో, నిర్దిష్టంగా సదరు ఇన్స్టిట్యూట్నే ఎంపిక చేసుకోవడానికి కారణాలు, ఆ ఇన్స్టిట్యూట్ అర్హతలు, ఇతర ప్రమాణాలకు తాము ఎలా సరితూగుతామో తెలియజేస్తూ రాసే స్టేట్మెంట్) * లెటర్ ఆఫ్ రికమండేషన్ వీసా ఎలా ప్రవేశం ఖరారు చేసిన ఇన్స్టిట్యూట్ ఐ-20 పేరుతో అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ పంపుతుంది. దాని ఆధారంగా విద్యార్థులు ఎఫ్-1 వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తును పరిశీలించిన అధికారులు నిర్దేశిత తేదీలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థి ఇచ్చిన సమాధానాలకు సంతృప్తి చెందితే వీసా లభిస్తుంది. ఈ వీసా కాల పరిమితి కోర్సు వ్యవధి మేరకు ఉంటుంది. ఎఫ్-1 వీసా పొందిన వారు కోర్సు పూర్తయ్యాక 2 నెలలు అమెరికాలో ఉండే విధంగా నిబంధనలో వెసులుబాటు ఉంది. అదేవిధంగా ఎఫ్-1వీసా ఆధారంగా యూజీ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు ఆ అర్హతతో అమెరికాలోనే మరో ఇన్స్టిట్యూట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశం పొందితే.. మరో ఐ-20 ఫామ్ ఆధారంగా వీసా పొడిగింపు కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజులు, వ్యయాలు యూనివర్సిటీలను బట్టి ఫీజుల్లో వ్యత్యాసాలున్నాయి. టాప్-10 యూనివర్సిటీల్లో వార్షిక ఫీజు 40-47 వేల డాలర్లు ఉంది. ఉండటానికి, రవాణా, ఆహారం తదితర అవసరాలకు నెలకు 10 వేల డాలర్ల వరకు అవసరం. కొన్ని యూనివర్సిటీలు, ప్రభుత్వ విభాగాలు అందిస్తున్న స్కాలర్షిప్లను సద్వినియోగం చేసుకోవాలి. ఉదా: ఏఏసీఈ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్స్, ఫుల్బ్రైట్ స్కాలర్షిప్.. * ద అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ ఉమెన్ (విద్యార్థినులకు) వంటి స్కాలర్షిప్స్ కోసం ప్రయత్నించొచ్చు. కొన్ని యూనివర్సిటీలు మెరిట్ కమ్ మీన్ బేస్డ్ విధానంలో తొలి సెమిస్టర్లో చూపిన ప్రతిభ ఆధారంగా స్కాలర్షిప్లు అందిస్తున్నాయి. యూఎస్-టాప్ వర్సిటీలు * మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ * ప్రిన్స్టన్ యూనివర్సిటీ * కాలిఫోర్నియా యూనివర్సిటీ * హార్వర్డ్ యూనివర్సిటీ * మిచిగాన్ యూనివర్సిటీ * స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ * యూనివర్సిటీ ఆఫ్ షికాగో * కొలంబియా యూనివర్సిటీ * యేల్ యూనివర్సిటీ * కార్నెగీ మిలన్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రతి యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు వెబ్సైట్: www.usnews.com, https://educationusa.state.gov యూఎస్లో అండర్గ్రాడ్యుయేట్ చదవాలనుకునే విద్యార్థులు.. అడ్మిషన్ సెషన్ ప్రారంభానికి కనీసం 8 నెలల ముందు నుంచి ఆ దిశగా అడుగులు వేయాలి. హాజరు కావాల్సిన ప్రామాణిక పరీక్షలు, యూనివర్సిటీలు/ఇన్స్టిట్యూట్లపై రెండు నెలల్లో అవగాహన ఏర్పడుతుంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో దరఖాస్తు చేసుకోవడానికి ఆర్నెల్ల సమయం అందుబాటులో ఉంటుంది. శాట్, ఏసీటీ పరీక్షల విషయంలో ఆందోళన అనవసరం. ఈ ఏడాది శాట్లో చేసిన మార్పులు విద్యార్థులకు అనుకూలంగా ఉన్నాయి. - రుచి థోమర్, డీజీఎం, మాన్యా ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్. -
ఎస్ఐ కొలువు సాధించానిలా..!
సక్సెస్ స్పీక్స్ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియలో తొలి దశ ముగిసింది. అభ్యర్థులు మలిదశలో విజయానికి కృషిచేస్తున్నారు. ఈ క్రమంలో ఔత్సాహికులకు ఉపయోగపడేలా ఎస్ఐ పరీక్షలో 327 మార్కులతో (2011, ఆగస్టు) 3వ ర్యాంకు సాధించిన వడ్డే ఉదయ్కుమార్ తన సక్సెస్ సీక్రెట్స్ను ‘భవిత’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మాది ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం, కరివారిగూడెం. నాన్న వడ్డే శ్రీనివాసరావు సింగరేణిలో కోల్ ఫిల్లర్గా విధులు నిర్వర్తించేవారు. ఆయన 2005లో మరణించారు. అమ్మ సత్యవతి గృహిణి. నేను ఇంటర్ వరకు మణుగూర్లో తెలుగు మీడియంలోనే చదివాను. డిగ్రీ కొత్తగూడెంలో, ఎంసీఏ హైదరాబాద్లో పూర్తి చేశాను. బంధువు సలహాతో.. నా ఎంసీఏ పూర్తయ్యే నాటికి (2008లో) సాఫ్ట్వేర్ ఇండస్ట్రీపై ఆర్థికమాంద్యం ప్రభావం ఉంది. సరైన అవకాశాలు లేవు. అప్పటికే మా బంధువుల్లో చాలా మంది పోలీస్ ఉద్యోగాలు చేస్తున్నారు. మా అన్నయ్య వేణుమాధవ్ సలహా మేరకు ఎస్ఐ ఉద్యోగానికి ప్రయత్నించాను. మొదటి అటెంప్ట్లోనే విజయం సాధించాను. శిక్షణలో అగ్రస్థానం.. ఎస్ఐ ఉద్యోగానికి ఎంపికైన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ (అప్పా)లో ఏడాది పాటు శిక్షణలో పాల్గొని, మొదటి స్థానంలో నిలిచా. బెస్ట్ ఆల్రౌండర్, బెస్ట్ ఇండోర్గా నిలిచి సీఎం పిస్టల్, గోల్డ్ మెడల్ గెలుచుకోవడంతోపాటు హోంమినిస్టర్ బ్యాటన్, గోల్డ్ మెడల్ను సాధించాను. పరుగు పందెంలో అప్రమత్తంగా... గతంలో మొదట దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి, తర్వాత రాత పరీక్ష జరిపేవారు. కానీ, ఇప్పుడు మొదట రాత పరీక్ష నిర్వహించి, అందులో అర్హత సాధించిన వారికి మలి దశలో శారీరక పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు అన్ని ఈవెంట్స్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉండేది అయితే ఇప్పుడు సివిల్ ఎస్ఐ, ఫైర్ స్టేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు 800 మీటర్ల పరుగు పందెంతో పాటు ఏవైనా రెండు ఈవెంట్స్లో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. ఈ పోస్టులకు సంబంధించి ఈవెంట్స్లో మెరిట్ సాధించినా.. ఎంపికలో ఎలాంటి మార్కులు కలపరు. కానీ, మిగిలిన పోస్టుల భర్తీలో మాత్రం ఈవెంట్స్లో సాధించిన మెరిట్కు స్కోరు కేటాయించి తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా ప్రాక్టీస్ చేయాలి. 800 మీటర్ల పరుగుపందెంలో అభ్యర్థులు అప్రమత్తంగా వ్యవహరించాలి. అభ్యర్థులను ఎక్కువగా ఇందులోనే ఫిల్టర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు నిత్యం ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లిష్లో అర్హత సాధించాలి... ఫైనల్ ఎగ్జామ్లో ఇంగ్లిష్ ఒక పేపర్గా ఉంటుంది. అభ్యర్థులు ఇందులో అర్హత సాధిస్తే సరిపోతుంది. దీన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే ఇందులో అర్హత సాధిస్తేనే మిగతా పేపర్లను మూల్యాంకనం చేస్తారు. టెస్టులతో టైం మేనేజ్మెంట్... కోచింగ్ కేంద్రాలు నిర్వహించే మాక్ టెస్టులకు హాజరవ్వాలి. ఇచ్చిన సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేందుకు ప్రయత్నించాలి. అలా చేయడం ద్వారా టైం మేనేజ్మెంట్ అలవడుతుంది. అర్థమెటిక్లో కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలియకపోతే సమయాన్ని వృథా చేసుకోవద్దు. వాటిని వదిలేసి మిగిలిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. వదిలేసిన ప్రశ్నలను చివర్లో సాధించాలి. అర్థమెటిక్ పేపర్లో మెంటల్ ఎబిలిటీ/ రీజనింగ్కు సంబంధించిన ప్రశ్నలను తక్కువ సమయంలో సాధించవచ్చు. అభ్యర్థులు రీజనింగ్ బిట్స్ మొదట చేయడం లాభిస్తుంది. సబ్జెక్టు నేర్చుకోండి.. పోలీస్ ఉద్యోగాల కోసం పోటీపడే అభ్యర్థులు కేవలం బిట్స్ మాత్రమే ప్రాక్టీస్ చేస్తారు. అలాకాకుండా సబ్జెక్ట్ నేర్చుకోవడం ద్వారా పరీక్షలో మంచి ఫలితాలు సాధించవచ్చు. సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, దాన్ని చదవడం ద్వారా సబ్జెక్ట్ బాగా గుర్తుంటుంది. తాజాగా నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో సబ్జెక్టు పరిజ్ఞానం ఉన్నవారే అర్హత సాధించారు. తెలంగాణ విద్యార్థులు రాష్ట్రానికి సంబంధించిన అంశాలను బాగా చదవాలి. చాలా మంది అభ్యర్థులు ఎస్ఐ పరీక్షలో ఉండే అర్థమెటిక్ను ప్యూర్ మ్యాథ్స్గా భావించి.. కష్టమనే అపోహతో ఉంటారు. కానీ, పరీక్షలో అడిగే ప్రశ్నలు ఆర్ట్స్ విద్యార్థులు కూడా సులువుగా చేసే విధంగా ఉంటాయి. అభ్యర్థులు తొలుత మ్యాథ్స్ అనే భయాన్ని వీడి ప్రిపరేషన్లో ముందుకుసాగాలి. ముందుగా సిలబస్లో ఉన్న అంశాలను పరిశీలించాలి. పరీక్షలో ఆయా అంశాల నుంచే ప్రశ్నలు వస్తాయి. సిలబస్లో లేని టాపిక్స్ను చదవద్దు. ఏదైనా ఒక ప్రామాణిక మెటీరియల్ను ప్రిపరేషన్కు ఉపయోగించుకోవాలి. -
వాక్ ఇన్ ఇంటర్వ్యూలు
⇒ ఎన్సీఈఆర్టీలో 3 జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో (జేపీఎఫ్) పోస్టులకు జూన్ 1 ⇒ మోయిల్ లిమిటెడ్లోని మెడికల్ సర్వీసెస్లో 4 మేనేజర్ పోస్టులకు జూన్ 1 ⇒ డీఆర్డీఓలో 10 జేఆర్ఎఫ్ పోస్టులకు జూన్ 2 ⇒ ఈసీఐఎల్లో 4 జూనియర్ ఆర్టిసన్ పోస్టులకు జూన్ 2 ⇒ ఐసీఏఆర్లో 7 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు జూన్ 30 -
పరీక్ష తేదీలు
⇒ ఏపీ లా సెట్, ఏపీపీజీఎల్సెట్.. మే 28 ⇒ తెలంగాణ ఎడ్సెట్.. మే 27 ⇒ తెలంగాణ పీజీఈసెట్.. మే 30, 31, జూన్ 1, 3 ⇒ నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్).. మే 28 ⇒ ఎస్ఐ ఇన్ ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్ - ఏఎస్ఐ ఇన్ సీఐఎస్ఎఫ్ ఎగ్జామ్ (పేపర్-2).. జూన్ 5 -
బీపీవో ఇంటర్వ్యూ.. టాప్ కొశ్చన్స్
బీపీవో ఇంటర్వ్యూలు అనేక రౌండ్లతో సుదీర్ఘంగా ఉంటాయి. వీటిలో విజయం సాధించాలంటే పట్టుదల, సమయస్ఫూర్తి ఉండాల్సిందే. ఔత్సాహికులకు ఉపయోగపడేలా బీపీవో ఇంటర్వ్యూల్లో తరచూ ఎదురయ్యే ప్రశ్నలు, వాటికి తగిన సమాధానాలు... 1. మీ గురించి చెప్పండి? ఇంటర్వ్యూయర్లకు అత్యంత ఇష్టమైన ప్రశ్న. దీనికి మీ సమాధానం అంతే ఆహ్లాదంగా, ఆకట్టుకునేలా ఉండాలి. 2. బీపీవో అంటే ఏమిటి? అదెలా పనిచేస్తుంది? బీపీవో అంటే.. బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్. ఇవి ఇతర కంపెనీల నాన్కోర్ కార్యకలాపాలకు సంబంధించి ఔట్సోర్సింగ్ సేవలందిస్తాయి. 3. రాత్రి వేళల్లో పనిచేయగలరా? అభ్యంతరం లేదని చెప్పండి. ఎలాంటి సమయంలోనైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొనండి. 4. ఆఫ్షోర్ అవుట్సోర్సింగ్ అంటే ఏమిటి? సుదూర దేశాల కంపెనీలకు ఔట్సోర్సింగ్ సేవలను అందించే వాటిని ఆఫ్షోర్ కంపెనీలు అంటారు. చుట్టుపక్కల దేశాల కంపెనీలకు ఔట్సోర్సింగ్ సేవలను అందించేవి షోర్ సోర్సింగ్ కంపెనీలు. 5. ఇన్బాండ్, అవుట్ బాండ్ కాల్సెంటర్ల మధ్య వ్యత్యాసం ఏమిటి? సేవలకు సంబంధించి కాల్స్ను మాత్రమే అందుకునేవి ఇన్ బాండ్ కాల్ సెంటర్లు. సేవలకు సంబంధించి వినియోగదారులకు కాల్స్ చేసే కంపెనీలను అవుట్ బాండ్ కాల్ సెంటర్లు అంటారు. 6. బీపీవోలనే మీ కెరీర్గా ఎందుకు ఎంచుకున్నారు? కెపీవో అంటే..నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్. ఇవి డాక్యుమెంటేషన్, బిల్లింగ్, ఇన్సూరెన్స్లకు సంబంధించిన సేవలను అందిస్తే బీపీవోలు కస్టమర్ కేర్ ఆధారిత సేవలను అందిస్తాయి. 7. కేపీవో, బీపీవో మధ్య వ్యత్యాసం ఏమిటి? కెపీవో అంటే.. నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్. ఇవి డాక్యుమెంటేషన్, బిల్లింగ్, ఇన్సూరెన్స్లకు సంబంధించిన సేవలను అందిస్తే బీపీవోలు కస్టమర్ కేర్ ఆధారిత సేవలను అందిస్తాయి. 8. కంపెనీలకు ఔట్సోర్సింగ్ అవసరం ఏమిటి? బీపీవోలకు నాన్ కోర్ సర్వీసెస్ను ఔట్సోర్సింగ్కు ఇవ్వడం ద్వారా కంపెనీలకు డబ్బు ఆదా అవడంతో పాటు నాణ్యతతో కూడిన సేవలు అందుతాయి. 9. వినియోగదారులతో చక్కగా మాట్లాడగలరా? మాట్లాడగలను అని చె ప్పండి. మాక్ కాల్ వస్తేఆకట్టుకునేలా ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండండి. 10. 5 ఏళ్ల తర్వాత మీ భవిష్యత్ ఎలా ఉండాలనుకుంటున్నారు? కంపెనీకి ‘నా సేవలు ఏ స్థాయిలో అయితే గరిష్టంగా ఉపయోగపడతాయో అక్కడికి చేరుకోవాలనుంది’ అని చెప్పండి. -
సామాజిక రక్షణ చర్యలతోనే నిజమైన ఆహార భద్రత
కాంపిటీటివ్ గెడైన్స్ : సివిల్స్, గ్రూప్స్ ఎస్సే సామాజిక రక్షణ-ఆహార భద్రత-ప్రభుత్వ పాత్ర అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఆకలి, పోషకాహార లోపం. ప్రభుత్వ విధానాలు సామాజిక రక్షణ కల్పించేవిగా ఉన్నట్లయితే ఆకలి, పోషకాహారలోప సమస్యలను తగ్గించవచ్చని ఇటీవల జరిపిన అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు (ప్రపంచ ఆరోగ్య సంస్థ; ఆహార, వ్యవసాయ సంస్థ, ప్రపంచ కార్మిక సంస్థ, తదితర) 64 పేద దేశాల నుంచి సేకరించిన సమాచార విశ్లేషణ ఈ వాదనకు బలం చేకూర్చింది. తక్కువ తలసరి ఆదాయం ఉన్న పేద దేశాలు కూడా సగటు మానవుని ప్రాథమిక అవసరాలను తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయా దేశాలు తమకు లభ్యమవుతున్న పరిమిత వనరులను సామాజిక రక్షణకు కేటాయించినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఆకలి, పోషకాహార లోపం ముఖచిత్రం పేదరికం, నిరపేక్ష ఆకలి, పోషకాహారలోపం, మానవ సమాజాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్యలు. 201214 మధ్యకాలంలో 805 మిలియన్ల మంది ప్రజలు దీర్ఘకాలికంగా పౌష్టికాహారలోపంతో బాధపడుతున్నట్లు తేలింది. 1990వ దశాబ్దం నుంచి పేదరికం కొంత మేరకు తగ్గినప్పటికీ 2014 ప్రాపంచిక ఆకలి సూచిక (Global Hunger Index) దాదాపు 39 దేశాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లు పేర్కొంది. లాటిన్ అమెరికా, తూర్పు ఆగ్నేయాసియా, కరేబియన్ దేశాల్లో పేదరికం కొంత తగ్గినప్పటికీ దక్షిణాసియా, సహారా దిగువ ఆఫ్రికా దేశాల్లో విస్తృతంగా ఉంది. ప్రాంతీయ ప్రాతిపదికన ప్రాపంచిక ఆకలి సూచిక విలువలు1996లో జరిగిన ప్రపంచ ఆహార శిఖరాగ్ర సమావేశంలో ఆహార భద్రతను.. ‘ప్రజలందరికీ, ఎల్లప్పుడు పోషకాహారం అందుబాటులో ఉంటూ, వారు ఆరోగ్యంగా, చురుకుగా జీవించగలగడం, భౌతికంగా, ఆర్థికంగా దీన్ని పొందగలగడం’గా నిర్వచించారు. దీంట్లో పారిశుధ్యం, మంచినీరు, వైద్య సదుపాయం అంతర్లీనంగా ఉంటాయి. ఇటీవల కాలంలో అహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఇది జనాభా పెరుగుదలను అధిగమించింది. కానీ, బహుళజాతి సంస్థలు, వాణిజ్య సంస్థలు, ఆయా దేశ ప్రభుత్వాల లోపభూయిష్ట విధానాలు కృత్రిమ కొరతను సృష్టించి, పేద ప్రజలకు ఆహారధాన్యాలు అందుబాటులో లేకుండా చేస్తున్నాయి. దీనికితోడు అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కూడా ఆహార ధాన్యాల మీద ప్రభావం చూపుతోంది. ఇండియా లాంటి దేశాల్లో పర్యావరణ మార్పుల వల్ల సకాలంలో వర్షాలుపడటం లేదు. దీంతో పంట దిగుబడి తగ్గి, సాగుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. ఫలితంగా సన్నకారు రైతులు అప్పులపాలై, కొన్ని సందర్భాలలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పేద ప్రజలు వీధులపాలవుతున్నారు. మహిళలే అధిక బాధితులు ఆకలి, పోషకాహార లోపాన్ని స్త్రీ, పురుష కోణంలో పరిశీలించినట్లయితే ఆకలితో అలమటించే వారిలో 60% మంది మహిళలే ఉన్నారు. 50% గర్భిణీస్త్రీలకు సరైన పోషకాహారం లభించడం లేదు. ఈ కారణంగా (2,40,000 మంది) తల్లులు, పిల్లల మరణాలు సంభవిస్తున్నాయి. పోషకాహారం లభించక ప్రతి ఆరుగురిలో ఒకరు తక్కువ బరువుతో పుడుతున్నారు. ఐదు సంవత్సరాల లోపు బాలబాలికల్లో 45% మంది మరణిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం ప్రతి 10 సెకండ్లకు ఒక శిశుమరణం సంభవిస్తుంది. భారతదేశంలో షెడ్యూల్డ్ కులాలు/తెగల్లో ఆకలి, పోషకాహారలోపంతో బాధపడే వారి సంఖ్య సహారా దిగువ ఆఫ్రికాలోని వారికంటే ఎక్కువ. దీనికి పరిష్కారమేంటి? ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేయాలి. జీవనోపాధి పథకాల అమలు, బీమా పథకం వర్తింపు, పారిశుధ్యం, రక్షితనీటి పథకం, తిండి, బట్ట, వసతి వంటి కనీస సౌకర్యాలు అందరికీ అందుబాటులోకి తేవాలి. దీన్నే సామాజిక రక్షణ అంటారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) ఈ భావనను ప్రాచుర్యంలోకి తెచ్చింది. ఈ పథకం కింద వైద్య సదుపాయం, అనారోగ్య భృతి, నిరుద్యోగ భృతి, వయోవృద్ధులకు ఆర్థికసహాయం, కుటుంబభృతి, ప్రసూతి భృతి, క్షతగాత్రుల భృతి మొదలైనవి అందించాలి. యూరోపియన్ కమిషన్, ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు ప్రాంతీయ, అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించి స్థూలంగా సామాజిక భద్రతకు పలు సూచనలు చేశాయి. 1995లో కోపెన్హాగన్లో జరిగిన ప్రపంచ శిఖరాగ్ర సమావేశం ‘సామాజిక అభివృద్ధి’ ఆవశ్యకతను పునరుద్ఘాటించింది. 2010లో ఐక్యరాజ్యసమితి అధ్యక్షతన జరిగిన శిఖరాగ్ర సమావేశం శతాబ్ది అభివృద్థి లక్ష్యాలను (Millenium Development goals) గుర్తించింది. ఈ లక్ష్యాల్లో దారిద్య్ర నిర్మూలన ప్రధానమైందిగా ఉంది. ఇందులో భాగంగా 2015లో (Sustainable development goals) ‘పేదరిక నిర్మూలన, ధరిత్రీ పరిరక్షణ, అందరికీ సంపద’ నినాదాన్ని ప్రారంభించారు. పేద దేశాల్లో వనరుల కేటాయింపు అత్యల్పం అభివృద్ధి చెందిన, చెందుతున్న అనేక దేశాల్లో సామాజిక రక్షణలో భాగంగా అనేక పథకాలు అమలు చేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పన, విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం, బీమా, ప్రజోపయోగార్థ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అయితే పేద దేశాలు తమ స్థూల దేశీయ ఉత్పత్తి (ఎఈ్క)లో ఈ రంగానికి ఆశించిన మేర వనరులను కేటాయించడం లేదు. వాస్తవానికి పేద దేశాల్లో ఈ రంగంపై ఎక్కువ వనరులను వెచ్చించాల్సిన అవసరం ఉంది. ఈ రంగంపై ఆఫ్రికా ఖండంలో (201011) కేవలం 5.1 శాతం వనరులను మాత్రమే ఖర్చుచేయగా, అదే ఏడాది పశ్చిమ యూరప్ 26.7% వనరులను కేటాయించింది. ప్రపంచ దేశాల సగటు కేటాయింపు 8.6% ఉండగా, ఆసియా, పసిఫిక్ దేశాలు 5.3 శాతం కేటాయించాయి. సామాజిక భద్రత రంగంలో వృద్ధులకు అందించే పింఛను చాలా తక్కువగా ఉంది. భారతదేశంలో ఇది నెలకు కేవలం రూ.250 మాత్రమే. కొన్నిసార్లు ఈ చిన్న మొత్తాన్ని కూడా నెలల తరబడి చెల్లించడం లేదు. విద్య, ఆరోగ్యం, దారిద్య్ర నిర్మూలన, పారిశుధ్యం, బీమా రంగాలపై ప్రాంతాలవారీగా ప్రభుత్వం కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి. పైన పేర్కొన్న గణాంకాలను బట్టి సంపన్న దేశాలు సామాజిక రక్షణకు తమ ఎఈ్కలో ఎక్కువ శాతం ఖర్చుపెడితే, పేద దేశాలు తక్కువ కేటాయిస్తున్నాయి. భారతదేశంలో భారతదేశం ప్రారంభించిన ప్రజా పంపిణీ వ్యవస్థ (1997) ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాహిత కార్యక్రమంగా ప్రసిద్ధి చెందింది. నాలుగు లక్షల తొంభై ఎనిమిదివేల (4,98,000) చౌకధర దుకాణాలు దేశవ్యాప్తంగా 16 కోట్ల కుటుంబాలకు ఆహార భద్రత కల్పిస్తున్నాయి. వీటి ద్వారా ప్రతి కుటుంబానికి 25 నుంచి 35కిలోల వరకు చౌకధరలో ఆహారధాన్యాలను ప్రతినెలా అందిస్తున్నారు. దురదృష్టవశాత్తు 1990 తొలినాళ్లలో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల కారణంగా ప్రజా పంపిణీ వ్యవస్థ క్రమేణా బలహీనపడుతూ వచ్చింది. కానీ, మొత్తంగా చూస్తే ఈ వ్యవస్థ ద్వారా పేదరిక నిర్మూలన కొంత వరకు విజయవంతమైందని చెప్పవచ్చు. 2013నాటికి జాతీయస్థాయిలో పేదరిక తేడా సూచిక (Poverty Gap Index) గ్రామీణ స్థాయి పేదరికాన్ని 18% నుంచి 22% కి తగ్గించింది. తమిళనాడులో 61% నుంచి 83%కి, ఛత్తీస్గఢ్లో 39% నుంచి 57%కి గ్రామీణ స్థాయి పేదరికాన్ని తగ్గించడంలో ప్రజాపంపిణీ వ్యవస్థ విజయం సాధించింది. ఈ మధ్య కాలంలో పేదవారికి ధనసహాయం అందించడం మంచిదా? వస్తు సహాయాన్ని అందించడం మంచిదా? అనే వివాదం తలెత్తింది. లబ్ధిదారుల మీద జరిపిన సర్వే వివరాల ప్రకారం ముఖ్యంగా మహిళలు వస్తురూప సహాయాన్నే కోరుకుంటున్నారని తేలింది. బ్రెజిల్లో ప్రజలు ధనసహాయాన్ని కోరుకుంటున్నారు. వివిధ దేశాలు ఆయా పరిస్థితులను బట్టి విభిన్న విధానాలను అవలంబిస్తున్నాయి. మౌలిక సదుపాయాలు, సేవల విస్తరణ, పారదర్శకత, అందిస్తున్న సహాయం, అనుసరిస్తున్న పద్ధతులపై సామాజిక రక్షణ కార్యక్రమాల విజయవంతం కావడం ఆధారపడి ఉంటుంది. భారతదేశం విషయంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్న లొసుగుల మీద ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఉపయోగిస్తున్న సమాచార సాంకేతిక పరిజ్ఞానం (ఐఇఖీ) ఈ లొసుగులను తగ్గించటంలో ప్రముఖపాత్ర పోషిస్తోంది. ఇది 200405 నుంచి 2011-12 మధ్యకాలంలో ఈ రంగంలో అవినీతిని 35%55%కి తగ్గించడంలో కీలకంగా వ్యవహరించింది. అంతేకాకుండా ప్రజాపంపిణీ వ్యవస్థ పరిధిలోకి 23% 44.5% కుటుంబాలు వచ్చాయి. సమగ్ర శిశు అభివృద్ధి పథకం, ఇతర సామాజిక పథకాలు సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐఇఈ), మధ్యాహ్న భోజన పథకం బాలబాలికల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడంలో ప్రముఖపాత్ర పోషించాయి. వీటి వల్ల గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లుల ఆరోగ్యం మెరుగుపడింది. శైశవ బాల్యదశలో శారీరక, మానసిక ఎదుగుదల లేని పిల్లలు పెద్దవారైన తర్వాత అన్ని రంగాల్లో విఫలం చెందడం వైద్యపరంగా నిరూపితమైంది. అందువల్ల పోషకాహారలోపాన్ని నివారించేందుకు అందరూ కృషి చేయాలి. పేదప్రజల ఆదాయాన్ని పెంపొందించడంలో 2005లో ప్రారంభించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి పథకం.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (కూఖఉఎ్క) చక్కగా ఉపయోగపడింది. దీని కింద ఏటా 5 కోట్ల మంది గ్రామీణ ప్రాంత ప్రజలకు జీవనోపాధి కల్పిస్తున్నారు. ప్రతి మూడు కుటుంబాల్లో ఒక కుటుంబం దీనివల్ల లబ్ధి పొందుతుంది. 201314 సంవత్సరాలలో 1.21 బిలియన్ పని దినాలను కల్పించారు. అందులో 40% పనిదినాలు బలహీన వర్గాలైన షెడ్యూల్డు కులాలు, తెగల వారికి, 55% పనిదినాలు మహిళలకు లబ్ధి చేకూర్చాయి. సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో మహిళలకు పెద్దపీట వేయడం వల్ల వారి కుటుంబాలకు ఆహార భద్రత లభిస్తుంది. ఎందుకంటే పురుషులతో పోల్చితే మహిళలే కుటుంబ ఆహార అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దక్షిణాఫ్రికాలో సత్ఫలితాలు దక్షిణ ఆఫ్రికాలో వృద్ధులకు పింఛన్ పథకం, బాలబాలికలకు ధనసహాయం మొదలైన కార్యక్రమాల ద్వారా సామాజిక రక్షణ అందుతోంది. తాజా అంచనాల ప్రకారం కోటి మంది బాలబాలికలు లబ్ధి పొందుతున్నారు. దీని ఫలితంగా బడి హాజరు శాతంలో గణనీయమైన పెరుగుదల, పౌష్టికాహార లభ్యత మెరుగైంది. బాల కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. బాలబాలికలకు అందించే ధన సహాయం కుటుంబ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచి బిడ్డల చదువుకు, పోషకాహారానికి మరింత ఉదారంగా వెచ్చించటానికి వీలు కల్పించింది. బ్రెజిల్ దేశంలో ‘శూన్య ఆకలి’ అనే పథకం బాలబాలికల్లో పౌష్టికాహార లోపాన్ని గణనీయంగా తగ్గించేందుకు ఉపయోగపడింది. ఆౌట్చ జ్చఝజీజ్చీ అనే ప్రత్యక్ష నగదు పథకం కింద గత 9 ఏళ్లలో బాలబాలికల్లో పౌష్టికాహార లోపాన్ని 61%, గ్రామీణ పేదరికాన్ని 15% మేర తగ్గించారు. దీని కారణంగా మూడు కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. వర్ధమాన దేశాలన్నిటికంటే సామాజిక పరిరక్షణకు బ్రెజిల్ అత్యధికంగా తలసరి ఆదాయంలో 17.9% వెచ్చిస్తుంది. ఆహార అభద్రతను ఎదుర్కోవాలంటే? ఈ పై అంశాలను పరిశీలించినప్పుడు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు ధన సహాయం అందించడానికి.. పేదరికం, ఆహార అభద్రత తగ్గుదలకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని తెలుస్తోంది. ఈ మొత్తం ప్రక్రియలో తగినన్ని వనరులు, సరైన విధాన రూపకల్పన, సుపరిపాలన, రాజకీయ ఉద్యోగిస్వామ్య చిత్తశుద్ధి, సామాజిక రక్షణలు ప్రముఖపాత్ర వహిస్తాయి. బంగ్లాదేశ్ అమలుచేస్తున్న "Challenging the frontiers of poverty reduction",రువాండాలో "Vision 2020 umurenge", భారతదేశంలో MGNREGA పథకాలు వీటికి చక్కని ఉదాహరణలు. పేద దేశాలు సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కువ వనరులు కేటాయించలేవనే భావన బహుళ ప్రచారాన్ని పొందింది. ముఖ్యంగా పైన ప్రస్తావించిన దేశాలన్నీ పేద దేశాలనే విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది. అభ్యుదయ భావాలు కలిగిన రాజకీయ నాయకత్వం, అంకితభావం కలిగిన ఉద్యోగిస్వామ్యం, చురుకైన పౌరసమాజాలు ఎన్ని పరిమితులనైనా అధిగమించి సామాజిక సంరక్షణకు దోహదం చేస్తాయి. వర్ధమాన దేశాల సమస్య వనరుల లేమి కాదు. వాటిని వెలికితీయడంలో విఫలం కావడమే. తృతీయ ప్రపంచదేశాల్లో ప్రత్యక్ష పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తక్కువ. పరోక్ష పన్నులు పేదలను మరింత కుంగదీసి, ధనికులకు పన్ను మినహాయింపునకు దారితీస్తాయి. దీనికి సరైన పరిష్కార మార్గం ప్రత్యక్ష పన్నుల పరిధిని విస్తృత పరచడమే. ఇండియా లాంటి దేశంలో ఆదాయం, సంపద విషయంలో ఖచ్చితమైన గణాంకాలు లేవు. దేశంలో 38% సంపద కేవలం 5% ఉన్న అత్యంత ధనికుల చేతిలో ఉంది. అట్టడుగున ఉన్న 60% కుటుంబాల చేతిలో 13% సంపద మాత్రమే ఉంది. సేవాపన్నుల విషయంలో కూడా ఇదే వైపరీత్యం కనపడుతుంది. ప్రోత్సాహకాలు అనే నెపంతో సంపన్న వర్గాలకు ఇచ్చే పన్ను మినహాయింపులు దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రభుత్వం 201314 సంవత్సరంలో పన్ను ప్రోత్సాహకాల రూపంలో రూ. 5 లక్షల 49 వేల 984 కోట్లను నష్టపోయింది. ఈ మొత్తం.. పన్ను ఆదాయంలో 40 శాతానికి పైగా ఉంటుంది. గనులు, నిర్మాణం, స్థిరాస్థిరంగం, నగలు, రత్నాలు వంటివాటిపై పన్నులు విధించి వాటిని సక్రమంగా ఉపయోగించినట్లయితే సామాజిక రక్షణ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. - డా॥బి.జె.బి. కృపాదానం సబ్జెక్ట్ నిపుణులు, ఆర్.సి.రెడ్డి స్టడీ సర్కిల్ -
ఇండియన్ కోస్ట్ గార్డ్లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు
జాబ్ పాయింట్ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రకటన జారీ చేసింది. అభ్యర్థులు జూన్ 1లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు: అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ, జనరల్ డ్యూటీ (పైలట్) పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. 10+2+3 విధానంలో ఇంటర్ వరకు మ్యాథ్స్, ఫిజిక్స్ల్లో 60 శాతం మార్కులు. జనరల్ డ్యూటీ పోస్టులకు 01 జూలై 1992 - 30 జూన్ 1996 మధ్య జన్మించిన పురుష అభ్యర్థులు అర్హులు జనరల్ డ్యూటీ (పైలట్) పోస్టులకు 01 జూలై 1992 - 30 జూన్ 1998 మధ్య జన్మించిన పురుష అభ్యర్థులు అర్హులు. టెక్నికల్ బ్రాంచ్ (మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్)కు 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ ఉత్తీర్ణత. లేదా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) సెక్షన్-ఎ, సెక్షన్-బిలో ఉత్తీర్ణత. టెక్నికల్ బ్రాంచ్ పోస్టులకు 01 జూలై 1992 - 30 జూన్ 1996 మధ్య జన్మించి ఉండాలి. షార్ట్ సర్వీస్ నియామకాలు: 8ఏళ్ల కాలానికి జరిపే ఈ షార్ట్ సర్వీస్ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల పదవీ కాలాన్ని పదేళ్లకు, పద్నాలుగేళ్లకు పొడిగించే వీలుంది. పైలట్స్ (సీపీఎల్): 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత. దీంతోపాటు దరఖాస్తు చేసుకునే నాటికి డీజీసీఏ గుర్తింపు పొందిన కరంట్/వ్యాలిడ్ కమర్షియల్ పైలట్ లెసైన్స్ కలిగి ఉండాలి. 01 జూలై 1992 - 30 జూన్ 1998 తేదీల మధ్య జన్మించిన స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులు. జనరల్ డ్యూటీ (ఉమెన్) పోస్టుకు కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. 10+2+3 విద్యా విధానంలో ఇంటర్ వరకు 60 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్లను చదివి ఉండాలి. 01 జూలై 1992 - 30 జూన్ 1996 తేదీల మధ్య జన్మించిన మహిళా అభ్యర్థులు అర్హులు. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు. దరఖాస్తు : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియ: అర్హత పరీక్షలో మార్కుల ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి ప్రిలిమినరీ టెస్ట్ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ దశను దాటిన వారికి తుది దశ పరీక్ష ఉంటుంది. వెబ్సైట్: www.joinindiancoastguard.gov.in పోస్టుల వివరాలు ⇒ అసిస్టెంట్ కమాండెంట్లోని విభాగాలు.. ⇒ అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ ⇒ అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ (పైలట్) ⇒ అసిస్టెంట్ కమాండెంట్ టెక్నికల్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్) ⇒ అసిస్టెంట్ కమాండెంట్ టెక్నికల్ (మెకానికల్/ఏరోనాటికల్) ⇒ అసిస్టెంట్ కమాండెంట్ (కమర్షియల్ పైలట్ లెసైన్స్ - ఎస్ఎస్ఏ) ⇒ అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ (ఉమెన్ -ఎస్ఎస్ఏ) -
ఐఐటీల్లో ఫీజుల భారం.. ఉపశమన మార్గాలివిగో!!
ఇంజనీరింగ్ స్పెషల్ ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ ముగిసింది.. త్వరలోనే ఫలితాలు.. ఆ తర్వాత అడ్మిషన్స్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. మరోవైపు విద్యార్థులు, తల్లిదండ్రులను కలవరపరుస్తున్న అంశం.. ఐఐటీల్లో ఫీజుల పెంపు! ఐఐటీల్లో బీటెక్ ఫీజులు రెట్టింపు చేస్తూ గత నెలలో కేంద్ర మానవ వనరుల శాఖ నిర్ణయం తీసుకుంది. గతేడాది వరకు రూ.90 వేలుగా ఉన్న వార్షిక ఫీజును రూ.రెండు లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఐఐటీల్లో ఫీజుల భారం నుంచి ఉపశమనం పొందేలా విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఆర్థిక ప్రోత్సాహకాలపై విశ్లేషణ... స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఐఐటీ కౌన్సిల్ సిఫార్సుల మేరకు గత నెలలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఐఐటీల్లో బీటెక్ ఫీజులను రూ.90 వేల నుంచి రూ. రెండు లక్షలకు పెంచింది. వాస్తవానికి ఫీజును రూ. మూడు లక్షలకు పెంచాలని కమిటీ సిఫార్సు చేసినా.. రూ. రెండు లక్షలకు పెంచడం మధ్యతరగతి వర్గాలకు కాస్తలో కాస్త ఊరట. ఫీజుల పెంపునకు కారణాలు ఐఐటీల్లో ఫీజుల పెంపు ప్రతిపాదనపై గతేడాది కాలంగా కసరత్తు జరుగుతోంది. ఐఐటీ -చెన్నై, కాన్పూర్, ఢిల్లీ, హైదరాబాద్ డెరైక్టర్ల నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఐఐటీ కౌన్సిల్ ఫీజుల పెంపుపై పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. రూ.3లక్షలకు పెంచాలని సిఫార్సు చేసింది. ఐఐటీలు ఏటా ఒక్కో విద్యార్థిపై వెచ్చిస్తున్న వ్యయాన్ని, ఇతర నిర్వహణ ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఫీజులు పెంచినట్లు కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఫీజుల పెంపుపై విద్యార్థులు ఆందోళన చెందక్కర్లేదని, ఐఐటీ చదువులు ఆర్థిక భారమనే ఒత్తిడికి లోనవనక్కర్లేదని కేంద్రం పేర్కొనడం విశేషం. 70 శాతం మందికి మినహాయింపు! * ఎస్సీ, ఎస్టీలు, అంగవైకల్యం ఉన్నవారికి ఫీజు నుంచి పూర్తి రాయితీ. * కుటుంబ వార్షికాదాయం రూ. లక్షలోపు ఉన్న విద్యార్థులకు వారి సామాజికవర్గంతో నిమిత్తం లేకుండా పూర్తి ఫీజు రాయితీ సౌకర్యం కల్పిస్తారు. * కుటుంబ వార్షికాదాయం రూ. 5 లక్షలలోపు ఉంటే ఫీజులో మూడింట రెండొంతుల మేరకు (66 శాతం) మినహాయింపు ఉంటుంది. * ఇలా పలు విధానాలను పరిశీలిస్తే దాదాపు 70 శాతం మందికి ఫీజు నుంచి పూర్తి స్థాయిలో మినహాయింపు లేదా రాయితీ లభిస్తుంది. విద్యాలక్ష్మి పథకం ఫీజుల భారం నేరుగా భరించే విద్యార్థుల కోసం తాజా ప్రతిపాదన విద్యాలక్ష్మి పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడం. దీని ద్వారా ఐఐటీల్లో ప్రవేశం ఖరారై ఇన్స్టిట్యూట్లో అడుగుపెట్టిన రోజే వడ్డీ రహిత స్కాలర్షిప్ అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అదేవిధంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో చర్చించి బ్యాంకుల సహకారంతో తక్కువ వడ్డీకి రుణాలు సైతం అందించేందుకు చర్యలు చేపడుతోంది. రీసెర్చ్, టీచింగ్ అసిస్టెన్స్షిప్ ఐఐటీల్లో బీటెక్ కోర్సులు చదివే విద్యార్థులకు ఆర్థిక చేయూతనిచ్చేవి.. రీసెర్చ్ అసిస్టెన్స్షిప్, టీచింగ్ అసిస్టెన్స్షిప్. ఈ రెండింటి ద్వారా విద్యార్థులు అప్పటికే సదరు ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ చేస్తున్న వారికి సహాయకులుగా వ్యవహరిస్తూ అటు అకడమిక్ నైపుణ్యాలు పెంచుకోవడంతోపాటు నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు రీసెర్చ్, టీచింగ్ అసిస్టెన్స్షిప్ అందుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఐఐటీల్లో బీటెక్ విద్యార్థులకు దాదాపు 23 స్కాలర్షిప్ పథకాలు వేర్వేరుగా అమలవుతున్నాయి. వీటి కోసం విద్యార్థులు తమ అడ్మిషన్ ఆఫర్ లెటర్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇందుకోసం https://scholarships.gov.in చూడొచ్చు. రెండు వేల కోట్లతో ప్రత్యేక ఎన్బీఎఫ్సీ స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఐఐటీ కౌన్సిల్ రూ.రెండు వేల కోట్ల కార్పస్తో ప్రత్యేక ఎన్బీఎఫ్సీ(న్యాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్) వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. దీని ద్వారా ఐఐటీల్లో పరిశోధనలు, మౌలిక సదుపాయాలు, ఇతర నిర్వహణ వ్యయాలకు వడ్డీ రహిత రుణాలు అందించాలని సూచించింది. దీనికి ఆర్థిక శాఖ ఆమోదం లభించిందని, కేబినెట్ ఆమోదం లాంఛనమేనని తెలుస్తోంది. విదేశీ విద్యార్థులకు సైతం పెరిగిన ఫీజులు ఐఐటీల్లో అడ్మిషన్ ఫర్ ఫారెన్ నేషనల్స్ పేరుతో మొత్తం సీట్లకు అదనంగా పది శాతానికి మించకుండా విదేశీ విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నారు. వీరికి ప్రస్తుతం 4 వేల యూఎస్ డాలర్లుగా ఉన్న వార్షిక ఫీజును పది వేల డాలర్లకు పెంచారు. ఇతర ఖర్చులకు సిద్ధంగా ఉండాలి ఫీజుల విషయంలో రాయితీలు పొందే విద్యార్థులు ఇతర ఖర్చుల విషయంలో మాత్రం స్వయంగా వనరులు సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా ఇన్స్టిట్యూట్ లో ప్రవేశించే సమయంలో లైబ్రరీ ఫీజు, అడ్మిషన్ ఫీజు, వన్ టైం కాషన్ డిపాజిట్ వంటి వాటికోసం నగదును దగ్గర పెట్టుకోవాలి. అదేవిధంగా హాస్టల్ అకామడేషన్ ఫీజు పరంగానూ సొంత నిధులు సమకూర్చుకోవాలి. ఈ ఇతర వ్యయాలు పరిగణనలోకి తీసుకుంటే ఐఐటీల్లో ప్రతి సెమిస్టర్కు విద్యార్థులకు అవుతున్న వ్యయం రూ. 30 వేల వరకు ఉంటోంది. ఆ మేరకు నగదు సిద్ధంగా ఉంచుకోవాలి. స్వయం ప్రతిపత్తికి ప్రాధాన్యం ఐఐటీల్లో ఫీజుల పెంపుపై విద్యార్థులు ఆందోళన చెందక్కర్లేదు. వీరికి ఎన్నో రకాల ఆర్థిక ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయి. ఫీజుల పెంపునకు కారణం ఐఐటీలకు ఆర్థికంగా స్వయం ప్రతిపత్తి కల్పించడమే. అంతేకానీ విద్యార్థులపై భారం మోపడం ఉద్దేశం కాదు. పెంచే ఫీజుల వల్ల ఆయా ఐఐటీల్లో నిర్వహణ వ్యయం లభిస్తుంది. తద్వారా పలు అనవసర జాప్యాలను నివారించొచ్చు. - ప్రొఫెసర్. కె.ఎన్. సత్యనారాయణ, ఐఐటీ-తిరుపతి క్యాంపస్ ఇన్ఛార్జ్. -
ఉద్యోగ అవకాశాలు
యూనియన్ బ్యాంక్లో 200కుపైగా పోస్టులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు: క్రెడిట్ ఆఫీసర్-150, చార్టర్డ్ అకౌంటెంట్-20, స్టాటిస్టీషియన్-2, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్-2, మేనేజర్ (రిస్క్)-10, అసిస్టెంట్ మేనేజర్ (రిస్క్) -8, సెక్యూరిటీ ఆఫీసర్-16. దరఖాస్తు ఫీజు: రూ.600 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100) దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్కు చివరి తేదీ: జూన్ 10 వెబ్సైట్: www.unionbankofindia.co.in టీఎస్జెన్కోలో 42 కెమిస్ట్ పోస్టులు తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్జెన్కో).. 42 కెమిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత: ఎమ్మెస్సీ కెమిస్ట్రీ/ఎన్విరాన్మెంటల్ సెన్సైస్ ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత. బీఎస్సీలో కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా ఉండాలి. వయోపరిమితి: 18-44 ఏళ్లు దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 25 రాత పరీక్ష తేదీ: జూలై 10 వెబ్సైట్: http://tsgenco.telangana.gov.in భువనేశ్వర్ ట్రిపుల్ ఐటీలో బీటెక్ భువనేశ్వర్లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ).. బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీటెక్ ప్రోగ్రామ్స్: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ), ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్(ఈటీసీ), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), కంప్యూటర్ ఇంజనీరింగ్ (సీఈ). అర్హత: పదో తరగతి, ఇంటర్లో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. జేఈఈ మెయిన్-2016లో అర్హత సాధించి ఉండాలి. ఎంపిక విధానం: జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగా దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 10 హార్డ్ కాపీ చేరడానికి చివరి తేదీ: జూన్ 17 వెబ్సైట్: www.iiit-bh.ac.in -
స్పెషల్ ఎడ్యుకేషన్
టాప్ స్టోరీ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్.. వృత్తి బాధ్యతలు ఎంతో ప్రత్యేకం.. పిల్లల పట్ల కేరింగ్ చాలా ముఖ్యం! ఎందుకంటే.. తాము బోధించాల్సిన విద్యార్థులకున్న ప్రత్యేక అవసరాలే అందుకు కారణం. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్కు సంపాదనతోపాటు సేవా సంతృప్తి సొంతమవుతుంది. ఇటీవల కాలంలో సామాజికంగా ప్రాధాన్యత పెరుగుతూ.. కెరీర్ పరంగానూ మంచి అవకాశాలు కల్పిస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్, కెరీర్ అవకాశాలపై విశ్లేషణ.. తోటి పిల్లలతో కలిసి ఆడుతూ,పాడుతూ కేరింతలు కొట్టాల్సిన అయిదారేళ్ల వయసులో.. తమకే తెలియని మానసిక, శారీరక సమస్యలతో అందమైన బాల్యాన్ని కోల్పోయే చిన్నారులు ఎందరో! అలాంటి చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించడానికి రూపొందించిన కోర్సులే.. స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు. ఈ కోర్సుల్లో శిక్షణ ద్వారా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లుగా కెరీర్ ప్రారంభించొచ్చు. స్పెషల్ ఎడ్యుకేటర్స్ ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల విషయంలో శారీరకంగా, మానసికంగా కొన్ని వైకల్యాలను గుర్తించారు. అవి.. బుద్ధి మాంద్యం, వినికిడి లోపం, మానసిక వైకల్యం, మాట్లాడలేకపోవడం (మూగ). స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తిచేసిన వారు ఇలాంటి సమస్యలున్న చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పిస్తారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల ఉత్తీర్ణులకు మంచి డిమాండ్ ఉంది. పలు ఇన్స్టిట్యూట్స్ ఆయా కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాయి. ఆర్సీఐ స్పెషల్ ఎడ్యుకేషన్ లక్ష్యం ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఎడ్యుకేషన్ బోధన, శిక్షణ కోసం రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఆర్సీఐ) పేరుతో ప్రత్యేక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసింది. స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు అందించే సంస్థలన్నీ ఈ కౌన్సిల్ పర్యవేక్షణలో ఉంటాయి. ఈ కౌన్సిల్ గుర్తింపు ఉన్న ఇన్స్టిట్యూట్లు అందించే కోర్సులు, సర్టిఫికెట్లకే జాబ్ మార్కెట్లోనూ గుర్తింపు. ప్రవేశం ఇలా ఆర్సీఐ గుర్తింపు ఉన్న ఇన్స్టిట్యూట్స్ సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ కోర్సులు, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తున్నాయి. ఆయా ఇన్స్టిట్యూట్స్ నోటిఫికేషన్ ద్వారా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయి. సాధారణంగా ప్రతి ఏటా మే, జూన్లో ప్రవేశాలు జరుగుతాయి. బ్యాచిలర్ కోర్సులు బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(మెంటల్ రిటార్డేషన్/లెర్నింగ్ డిజేబిలిటీస్/లోకోమోటలర్ అండ్ న్యూరోలాజికల్ డిజార్డర్/మల్టిపుల్ డిజార్డర్/ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్)వంటి కోర్సులున్నాయి. బీఏ బీఈడీ (విజువల్ ఇంపెయిర్మెంట్); బీఎస్సీ (స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ రిహాబిలిటేషన్); బ్యాచిలర్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ; బ్యాచిలర్ ఇన్ రిహాబిలిటేషన్ సైన్స్ వంటి కోర్సులున్నాయి. వీటిలో ప్రవేశించడానికి అర్హత డిగ్రీ. అవకాశాలు పుష్కలం స్పెషల్ ఎడ్యుకేషన్లో బీఈడీ, బీఎస్సీ, పీజీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి కెరీర్ అవకాశాలు పుష్కలం. ఇటు ప్రభుత్వ రంగంలో అటు ప్రైవేటు రంగంలోనూ డిమాండ్ ఉంది. బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తిచేశాక నెలకు రూ.15 వేల జీతంతో ప్రైవేటు రంగంలో కెరీర్ ప్రారంభించొచ్చు. వీరికి ప్రభుత్వ విభాగంలో డీఎస్సీలోనూ పోటీ పడే అవకాశముంది. సర్టిఫికెట్ కోర్సులు స్పెషల్ ఎడ్యుకేషన్కు సంబంధించి పలు సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. అవి.. సర్టిఫికెట్ కోర్స్ ఇన్ రిహాబిలిటేషన్ థెరపీ; సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థోటిక్స్; సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కేర్ గివింగ్. పదో తరగతి, ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సుల ఉత్తీర్ణులు వీటిల్లో చేరొచ్చు. డిప్లొమా స్థాయి కోర్సులు ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సు అర్హతగా డిప్లొమా స్థాయి కోర్సులు ఉన్నాయి. అవి.. డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ (విజువల్ ఇంపెయిర్మెంట్), డిప్లామా ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్(మెంటల్ రిటార్డేషన్), డిప్లొమా ఇన్ వొకేషనల్ రిహాబిలిటేషన్ (మెంటల్ రిటార్డేషన్), డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్, డిప్లొమా ఇన్ హియరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్, డిప్లొమా ఇన్ హియరింగ్ ఎయిడ్ రిపేర్ అండ్ హియర్ మౌల్డ్ టెక్నాలజీ, డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(విజువల్ ఇంపెయిర్మెంట్), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(డెఫ్, బ్లైండ్), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(మెంటల్ రిటార్డేషన్), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(సెరిబ్రల్ పాల్సే), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(ఆటిజం స్పెక్ట్రమ్). పీజీ స్థాయిలో పలు స్పెషలైజేషన్లు పీజీ స్థాయిలో ఎంపీఈడీ, ఎమ్మెస్సీ స్పెషల్ ఎడ్యుకేషన్లో పలు స్పెషలైజేషన్లు లభిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి విజువల్ ఇంపెయిర్మెంట్; హియరింగ్ ఇంపెయిర్మెంట్; మెంటల్ రిటార్డేషన్; ఎంఎస్సీ డిజాబిలిటీ స్టడీస్(ఎర్లీ ఇంటర్వెన్సన్), మాస్టర్ ఇన్ ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థోటిక్స్, మాస్టర్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ, మాస్టర్ ఇన్ రిహాబిలిటేషన్ సైన్స్, ఎంఎస్సీ సైకోసోషల్ రిహాబిలిటేషన్, మాస్టర్ ఇన్ డిజాబిలిటీ రిహాబిలిటేషన్ అడ్మినిస్ట్రేషన్. బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణులు వీటిలో ప్రవేశించడానికి అర్హులు. అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులకు సంబంధించి పలు పీజీ డిప్లొమా కోర్సులు సైతం అభ్యసించే వీలుంది. ఇన్స్టిట్యూట్స్ * నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ క్యాంపస్, మనోవికాస్ నగర్, సికింద్రాబాద్. * స్వీకార్ అకాడమీ ఆఫ్ రిహాబిలిటేషన్ సెన్సైస్, సికింద్రాబాద్, వైఎస్సార్ కడప జిల్లా, గుంటూరు, తాండూరు. * కాలేజీ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, ఆంధ్ర మహిళాసభ, ఓయూ క్యాంపస్. * డిపార్ట్మెంట్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఆంధ్రా యూనివర్సిటీ,విశాఖపట్నం. * శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి. * దుర్గాబాయి దేశ్ముఖ్ వొకేషనల్ ట్రైనింగ్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్, హైదరాబాద్. ఓర్పు, నేర్పు అవసరం స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు కెరీర్ పరంగా అవకాశాలు ఖాయం. కానీ ఇదే సమయంలో కేవలం కెరీర్ అవకాశాలను పరిగణించే ఈ కోర్సులు ఎంపిక చేసుకోవాలనుకోవడం సరికాదు. కారణం.. ఈ కోర్సుల్లో శిక్షణ ద్వారా తాము బోధించాల్సిన విద్యార్థులు ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులని గుర్తించాలి. ఓర్పు, నేర్పు ఉన్న వారే స్పెషల్ ఎడ్యుకేషన్ రంగంలో రాణించగలరు. - ప్రొఫెసర్. వి.ఆర్.పి. శైలజ, హెచ్ఓడీ, స్పెషల్ ఎడ్యుకేషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ -
SPOTTING ERRORS
కాంపిటీటివ్ గైడెన్స్ General English Getting qualified in the prelims, especially in English is as sure as anything. The candidates are expected to have comprehensive knowledge in the following areas of study. • Spotting Errors n Fill in the blanks • Cloze Test n Para-Jumbles • Reading comprehension Spotting Errors As far as spotting errors are concerned the candidates are advised to undergo careful, constructive and comprehensive preparation. This is one of the areas where a wide range of questions can be expected. This is also one of the areas where some unforeseen questions may also appear. This question tests student's knowledge of grammar and structure. The candidates are supposed to have in-depth knowledge of basics of English grammar. Errors are of many, however, we should focus on the following 1. Noun - Number 2. Reflexive Pronouns - Relative Pronouns 3. Concord (Subject-Verb Agreement) 4. Adjectives often confused 5. Correlative Conjunctions 6. Parallel Structure 1. Noun-Number Look at the following Examples : • The equipment (1)/ of the photographic studio (2)/ were (3)/ expensive. (4) / No error (5) (Incorrect) The equipment (1)/ of the photographic studio (2)/ was (3)/ expensive. (4) / No error (5) (Correct) • The singer was wearing (1) / a leather suit (2) / and heavy gold jewelleries (3) / for the interview. (4) / No error (5) (Incorrect) The singer was wearing (1) / a leather suit (2) / and heavy gold jewellery (3) / for the interview. (4) / No error (5) (Correct) Note: The nouns scenery, information, furniture, advice, news, equipment, jewellery machinery, stationery are always used in singular form only. They are not used with 'a' or 'an' and have no plural forms. Check the following examples • This cattle has (1)/ been in trouble (2)/ ever since (3)/ the famine. (4)/ No error (5) (Incorrect) These cattle have (1) / been in trouble (2)/ ever since (3)/ the famine. (4) / No error (5) (Correct). • The rural gentry (1)/ is strong fighters (2)/ who will (3)/resist change. (4)/ No error (5) (Incorrect) The rural gentry (1)/ are strong fighters (2)/ who will (3)/ resist change. (4)/ No error (5) (Correct) Note: Certain collective nouns though in singular form are used only in the plural form. Observe the following examples: • The committee have (1)/ decided (2) / to close (3)/ the restaurant. (4)/ No error (5) (Incorrect) The committee has (1)/ decided (2)/ to close (3)/ the restaurant. (4) / No error (5) (Correct) • The committee is (1) /divided (2)/ in (3)/ their opinion. (4) / No error (5) (Incorrect) The committee are (1)/ divided (2)/ in (3)/ their opinion. (4) / No error (5) (Correct) Note :The collective nouns jury, team, family, committee are used both as singular and plural in the same form. They take a singular verb when we regard them as a unit. The same words take a plural verb when they refer to individuals. 2. Reflexive and Relative Pronouns Examples: He describes himself as a socialist. The city defended itself from attack Note : A reflexive pronoun is used when the object and subject of a verb refer to the same person or thing. Verbs like enjoy, avail, pride, acquit, comport, conduct, absent, resign, apply, assert are always followed by reflexive pronouns. • I don't think (1)/ that she is (2)/ enjoying (3)/ very much at school. (4)/ No error (5) (Incorrect) I don't think (1)/ that she is (2)/ enjoying / herself (3) / very much at school. (4) / No error (5) (Correct) Relative Pronouns • Examples: Uneasiness lies (1)/ the head (2) / who (3)/ wears a crown. (4)/ No error (5) (Incorrect) Uneasiness lies (1) the head (2) / that (3)/ wears a crown. (4)/ No error (5) (Correct). • They never fail (1) / that (2)/ die in a (3)/ great cause. (4)/ No error (5) (Incorrect) They never fail (1) / who (2)/ die in a (3)/ great cause. (4)/ No error (5) (Correct) • The sun, which (1)/ rays give life (2)/ to the earth, (3)/ is regarded by some people as a god. (4)/ No error(5) (Incorrect) The sun, whose (1) / rays give life (2)/ to the earth, (3)/ is regarded by some people as a god. (4) No error (5) (Correct) • The horse (1) / that (2) / I recently bought (3)/is an Arab (4) / No error (5) (Incorrect) The horse (1) / which (2) / I recently bought (3) / is an Arab. (4) / No error (5) (Correct). A pronoun which relates to some noun going before it is called a Relative Pronoun. - R. Srinivasa Rao Subject Expert -
ఇంటర్వ్యూ తేదీలు
* హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్)లో ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు: మే 24 * సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో యంగ్ ప్రొఫెషనల్-1 పోస్టులకు: మే 25 * ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్, క్లినికల్ అండ్ టెక్నికల్ పోస్టులకు: మే 25, 26, 30, 31, జూన్ 1, 2 -
ఉద్యోగాలు
ఎన్ఐహెచ్లో రీసెర్చ్ అసోసియేట్, జేఆర్ఎఫ్ రూర్కీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ (ఎన్ఐహెచ్) వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. పోస్టులు: జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, రీసెర్చ్ సైంటిస్ట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో. ఖాళీలు: 30 ఇంటర్వ్యూ తేదీలు: మే 25, 26 వెబ్సైట్: www.nih.ernet.in జోధ్పూర్ ఎయిమ్స్లో జూనియర్ రెసిడెంట్స్ జోధ్పూర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన క్లినికల్ విభాగంలో జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. పోస్టు: జూనియర్ రెసిడెంట్స్ (క్లినికల్) ఖాళీలు: 42 అర్హతలు: ఎంబీబీఎస్ (ఇంటర్నషిప్తో) ఉత్తీర్ణత. ఇంటర్వ్యూ తేది: మే 31 వెబ్సైట్: www.aiimsjodhpur.edu.in -
కెరీర్కు సరైన అమరిక ఇంటీరియర్ డిజైన్
వాట్ ఆఫ్టర్: ఇంటర్మీడియట్ నేడు ప్రతి ఒక్కరూ ఇంటిని, కార్యాలయాలను తమ అభిరుచి మేరకు తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నారు. దీని కోసం ఖర్చుకు కూడా వెరవడం లేదు. ఈ క్రమంలో ఇంటీరియర్ డిజైనర్ పాత్ర కీలకం. దీంతో ఈ కోర్సుల ఉత్తీర్ణులకు ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ యూనివర్సిటీ.. బ్యాచిలర్ ఆఫ్ డి జైన్ (ఇంటీరియర్ డిజైన్)లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఇంటీరియర్ డిజైన్ కెరీర్పై ఫోకస్.. సృజనాత్మక, పరిశీలనా నైపుణ్యాలను ఉపయోగించి అందుబాటులో ఉన్న స్థలాన్ని వినియోగదారుని అభిరుచికి తగ్గట్టుగా తీర్చిదిద్దడమే ఇంటీరియర్ డిజైన్. ఈ క్రమంలో కస్టమర్ల ఇష్టాయిష్టాలు, ఆసక్తులు తెలుసుకోవాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో స్థిరాస్తి, నిర్మాణ రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రతి నిర్మాణంలో సృజనాత్మకత అవసరం ఎంతో. దీంతో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, కమర్షియల్ కాంప్లెక్స్, ఆఫీస్ పరిసరాలు, ఇంటి లోపల భాగాలను అందంగా తీర్చిదిద్దే ఇంటీరియర్ డిజైనర్లకు నానాటికి డిమాండ్ పెరుగుతోంది. సంబంధిత కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి వివిధ దేశాల కంపెనీలు సైతం స్వాగతం పలుకుతున్నాయి. అవసరమైన నైపుణ్యాలు ఇంటీరియర్ డిజైనింగ్ చేసేవారికి ప్రధానంగా సృజనాత్మకత, ప్రాదేశిక కల్పన(స్పేషియల్ ఇమాజినేషన్), మంచి కలర్సను ఎంచుకునే స్కిల్స్ ఉండాలి. వీటితోపాటు డిజైన్ స్కిల్స్, పరిశీలనా నైపుణ్యాలు, విశ్లేషణ సామర్థ్యం, మేనే జ్మెంట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్తోపాటు ఫొటోషాప్, 3డీ స్టూడియో మ్యాక్స్, ఆడోబ్ ఇలస్ట్రేటర్, ఆటోక్యాడ్ వంటి సాఫ్ట్వేర్లపై అవగాహన అవసరం. వేతనాలు/ ఆదాయం ఇంటీరియర్ డిజైనర్లకు వేతనాలు అనేవి వారి వ్యక్తిగత నైపుణ్యాలపై ఆధారపడి ఉంటాయి. స్థిరాస్తి, నిర్మాణ రంగం, ఇతర రంగాల్లో అనేక కంపెనీలు ప్రారంభంలో కనీసం రూ.18 వేల నుంచి రూ.20 వేల వేతనాలతో ఉద్యోగాలిస్తున్నాయి. అనుభవం పెరుగుతున్న కొద్దీ వేతనాలు పెరుగుతుంటాయి. స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకున్నవారు ఇంటీరియర్ డిజైన్ స్టూడియో/కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకోవచ్చు. దీంతో వారి సృజనాత్మకత ఆధారంగా నెలకు లక్షల్లో సంపాదించొచ్చు. ఎలాంటి ఇన్స్టిట్యూట్లను ఎంచుకోవాలి ఇంటీరియర్ డిజైనింగ్లో అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ స్థాయిలో కోర్సులను అందిస్తున్న ఇన్స్టిట్యూట్లలో టీ చింగ్ ఫ్యాకల్టీ అర్హత లు, అనుభవంతో పాటు ఇన్స్టిట్యూట్ నేపథ్యాన్ని తెలుసుకోవాలి. క్యాంపస్ పరిసర ప్రాంతాలు కోర్సుని అభ్యసించేవారికి అనుకూలంగా ఉండాలి. బోధన పద్ధతులు, గత సంవత్సరంలో సాధించిన ఫలితాలు, క్యాంపస్ ప్లేస్మెంట్లను పరిగణనలోకి తీసుకోవాలి. కోర్సుల వివరాలు బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (ఇంటీరియర్ డిజైన్) కోర్సులో నాలుగేళ్ల వ్యవధిలో 8 సెమిస్టర్లుంటాయి. మొదటి ఆరు సెమిస్టర్లలో వివిధ సబ్జెక్టులను బోధిస్తారు. ఏడో సెమిస్టర్లో ప్రాజెక్ట్ వర్క్, ఎనిమిదో సెమిస్టర్లో ఇంటీరియర్ డి జైనర్స్ కార్యాలయంలో 20 వారాలపాటు ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇలా పూర్తిస్థాయిలో తమ నైపుణ్యాలను పెంచుకునే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతారు. అర్హత: ఇంటర్మీడియెట్/10+2లో ఉత్తీర్ణత. జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) జూలైలో నిర్వహించే ఆర్ట్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏడీసీఈటీ)లో అర్హత సాధించాలి. మంచి అవకాశాలు ఇంటీరియర్ డిజైనింగ్లో కోర్సు పూర్తిచేసిన వారికి కంపెనీలు ఆకర్షణీయ వేతనాలతో ఆఫర్లు ఇస్తున్నాయి. కొందరు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ కోర్సుల్లో ఉత్తరాదివారు ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు తెలుగువారు వారితో పోటీపడుతున్నారు. జేఎన్ఏఎఫ్ఏయూ నిర్వహించే అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారు బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (ఇంటీరియర్ డిజైన్) కోర్సుకు అర్హులు. మొత్తం 60 సీట్లున్నాయి. వీటిలో 42 శాతం ఆంధ్ర , 36 శాతం తెలంగాణకు, 22 శాతం రాయలసీమకు కేటాయించారు. హమ్స్టెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజై న్, లకోటియా ఇన్స్టిట్యూట్లు కూడా వర్సిటీ నిబంధనల మేరకు కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. - ప్రొఫెసర్ ఎస్.కుమార్, డెరైక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, జేఎన్ఏఎఫ్ఏయూ. -
టీఎస్ పాలిసెట్ కౌన్సెలింగ్
టాప్ స్టోరీ తెలంగాణలో మూడేళ్లు, మూడున్నరేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ పాలిసెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ నెల 20 నుంచి దాదాపు గతేడాది మాదిరిగానే వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ ప్రక్రియ విధివిధానాలపై ప్రత్యేక కథనం.. తెలంగాణ పాలిటెక్నిక్ కాలేజీలు, సీట్లు అర్హులు 1,03,001 ప్రభుత్వ కళాశాలలు 56 ప్రైవేటు కళాశాలలు 169 ప్రభుత్వ సీట్లు 12,000 ప్రైవేటు సీట్లు 46,000 మొదటి దశ రిజిస్ట్రేషన్ విద్యార్థులు ర్యాంకుల ప్రకారం నిర్దేశిత తేదీల్లో మొత్తం 21 హెల్ప్లైన్ సెంటర్లలో ఏదో ఒకదానికి హాజరై ర్యాంకు కార్డ్ను సంబంధిత అధికారికి అందజేసి పేరు నమోదు చేసుకోవాలి. ప్రాసెసింగ్ ఫీజు కింద ఓసీ/బీసీ విద్యార్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీలు రూ. 250 చెల్లించాలి. ఈ సమయంలో తప్పనిసరిగా విద్యార్థులు తమ మొబైల్ ఫోన్ నెంబర్ను తెలియజేయాలి. (ఈ నెంబర్కు ఎస్ఎంఎస్ ద్వారా లాగిన్ ఐడీ పంపుతారు. దీని ద్వారా వెబ్ ఆప్షన్స్ ఎంట్రీకోసం లాగిన్ కావచ్చు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు తీసుకువెళ్లాల్సినవి ⇒ టీఎస్పాలిసెట్ ర్యాంక్ కార్డ్ ⇒ టీఎస్పాలిసెట్ హాల్టికెట్ ⇒ పదో తరగతి మార్కుల మెమో ⇒ నాలుగు నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్ ⇒ నివాస ధ్రువీకరణ పత్రం ⇒ జనవరి 1, 2016 తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం ⇒ ఆధార్ కార్డ్ ⇒ కుల ధ్రువీకరణ పత్రం ⇒ వికలాంగులు/ఎన్సీసీ/స్పోర్ట్స్/చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్ డ్ ఫోర్సెస్/మైనారిటీస్/ఆంగ్లో ఇండియన్స్ సంబంధిత అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుకోవాలి. ⇒ అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకువెళ్లాలి. రెండో దశ (సర్టిఫికెట్ వెరిఫికేషన్) ఈ దశలో అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను సంబంధిత వెరిఫికేషన్ అధికారికి అందజేసి రిసీప్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్ తీసుకోవాలి. ఇదే సమయంలో వెబ్ ఆప్షన్స్ ఎంట్రీకి ముందస్తు కసరత్తు కోసం ఉద్దేశించిన మాన్యువల్ ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్ను ఇస్తారు. దీన్ని కూడా తీసుకుంటే రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినట్లే. మూడో దశ (ఆప్షన్స్ ఎంట్రీ కసరత్తు) రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో విద్యార్థులకు మాన్యువల్ ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్ను ఇస్తారు. కోర్సులు, కళాశాలలు సీట్ల ఆధారంగా ప్రాథమ్యాలను ఎంపిక చేసుకోవాలి. నాలుగో దశ (ఇంటర్నెట్ ఆధారంగా వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ ప్రక్రియ ప్రారంభం) ఇంటర్నెట్ ఆధారంగా కౌన్సెలింగ్ వెబ్సైట్లో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత తమ ప్రాథమ్యాల మేరకు ఆప్షన్స్ ఎంట్రీ చేయాలి. ఈ క్రమంలో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వెర్షన్నే వినియోగించాలి. తదుపరి దశ ఆప్షన్స్ ఎంట్రీ- లాగిన్ ఐడీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాక లాగ్ అవుట్ అవ్వాలి. తిరిగి హోంపేజీకి వెళ్లి క్యాండిడేట్స్ లాగిన్ బటన్పై క్లిక్ చేయాలి. లాగిన్ ఐడీ, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, పుట్టిన తేదీ వివరాలు పొందుపర్చాలి. లాగిన్ ఐడీ విద్యార్థుల మొబైల్కు ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ వివరాలు పూర్తిచేశాక సైన్ ఇన్ బటన్పై క్లిక్ చేస్తే నమూనా ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఆప్షన్స్ ఎంట్రీ ఇచ్చేందుకు One Time Password (OTP) కాలమ్ పక్కన టిక్ చేస్తే విద్యార్థుల మొబైల్ నెంబర్కు వన్టైం పాస్వర్డ్ మెసేజ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ను ఓటీపీ బాక్స్లో పొందుపర్చాలి. తర్వాత డిక్లరేషన్ను చదివి, ‘క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ’ బటన్పై క్లిక్ చేయాలి. డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ఆప్షన్ ఎంట్రీ బటన్పై క్లిక్ చేశాక రీజియన్లు, జిల్లాలు, కోర్సులతో కూడిన స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అభ్యర్థులు తమకు సరిపడే బాక్స్ల పక్కన టిక్ చేసి డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్పై క్లిక్ చేయాలి. ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్ అభ్యర్థులు ఎంపిక చేసుకున్న రీజియన్ల పరిధిలో, ఎంపిక చేసుకున్న జిల్లాల్లో ఉన్న కళాశాలల కోడ్లు, బ్రాంచ్లతో కూడిన ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్ కనిపిస్తుంది. దీంట్లో తమకు నచ్చిన ప్రాథమ్యాల ఆధారంగా కాలేజ్ కోడ్, కళాశాల కోడ్ పక్కన ఉండే బాక్స్లలో ప్రిఫరెన్స్ నెంబర్ పొందుపర్చాలి. నాలుగో దశ (లాగ్ అవుట్) ఆప్షన్స్ ఎంట్రీ పూర్తయ్యాక ఔౌజ ైఠ్ట బటన్పై క్లిక్ చేస్తే .. ave and Logout, Confirm Logout, Cancel Logout అని మూడు బాక్స్లు కనిపిస్తాయి. అభ్యర్థులు అవసరాన్ని బట్టి బాక్స్లో టిక్ చేయాలి. ఎలాంటి మార్పులు లేవనుకుంటే Confirm Logout బటన్పై క్లిక్ చేయాలి. అయిదో దశ (సీట్ అలాట్మెంట్) ఆప్షన్స్ ఎంట్రీలో ఇచ్చిన ప్రాధాన్యత క్రమం, ర్యాంకును అనుసరించి వారికి కేటాయించిన కాలేజ్ వివరాలు తెలిపే దశ ఇది. పూర్తిగా సాఫ్ట్వేర్ ఆధారితంగా సాగే ప్రక్రియ. ఈ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ను తెలుసుకునేందుకు నిర్దేశిత తేదీల్లో వెబ్సైట్లో లాగిన్ అయి అలాట్మెంట్ ఆర్డర్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. ఆరో దశ (ఫీజు చెల్లింపు) కేటాయించిన కాలేజ్ ఆధారంగా ఏడాదికి రూ.3800 నుంచి రూ.15,500 మధ్యలో ఫీజు చెల్లించాలి. ఫీజు ఆయా కాలేజ్లను బట్టి ఉంటుంది. ఈ ఫీజు చెల్లింపును నేరుగా కాలేజ్లోనే చెల్లించేలా గత ఏడాది వెసులుబాటు ఇచ్చారు. ఇదే విధానం ఈసారి కూడా కొనసాగే అవకాశం ఉంది. ఏడో దశ (కాలేజ్లో రిపోర్టింగ్) అలాట్మెంట్ ఆర్డర్ను డౌన్లోడ్ చేసుకోవడం, ఫీజు చెల్లించడం ప్రక్రియ పూర్తయ్యాక వాటి ఆధారంగా తమకు సీటు లభించిన కళాశాలలో నిర్దేశిత తేదీలోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎనిమిదో దశ (కౌన్సెలింగ్ తదుపరి దశలకు హాజరవడం) తొలి దశ కౌన్సెలింగ్లో పాల్గొనని విద్యార్థులు, తొలి దశలో పాల్గొన్నప్పటికీ సీటు లభించని విద్యార్థులు తదుపరి దశ కౌన్సెలింగ్కు హాజరు కావచ్చు. ఈ క్రమంలో తొలిదశలో పాల్గొనని విద్యార్థులు మాత్రం తప్పనిసరిగా మలి దశ కౌన్సెలింగ్కు నిర్దేశిత హెల్ప్లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరు కావాలి. వెబ్సైట్: https://tspolycet.nic.in వెబ్ ఆప్షన్స్ ముఖ్య తేదీలు:- మే23, 24: 1 - 28,000 ర్యాంకు వరకు మే25, 26: 28001- 56000 ర్యాంకు వరకు మే27, 28: 56001-84000 ర్యాంకు వరకు మే29, 30: 84001- చివరి ర్యాంకు వరకు ఆప్షన్ల మార్పు: మే 31 సీట్ ఎలాట్మెంట్: జూన్ 1 -
దరఖాస్తు చేశారా?
* కాలికట్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) వివిధ విభాగాల్లో ఫుల్టైం, పార్ట్టైం, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్డీ) ప్రోగ్రామ్లో ప్రవేశాల దరఖాస్తులకు చివరి తేది: మే 20 * హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీపీఆర్)లో పీజీడీఆర్ డీఎం కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుకు చివరి తేది: మే 25 * ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్లో క్యూసీఐ సర్టీఫైడ్ యోగా ప్రొఫెషనల్స్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: మే 25 -
ఒత్తిడిని చిత్తు చేద్దాం.. విజయ తీరాలకు చేరుకుందాం..
టాప్ స్టోరీ ఒత్తిడి.. మూడు అక్షరాల పదం! ప్రభావం మాత్రం.. కొండంత!! నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడి బాధితుల్లో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు, ఉద్యోగులే! అకడమిక్ పరీక్షల్లో మంచి గ్రేడ్ సాధించాలని ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు.. పోటీ పరీక్షల్లో విజయం సాధించి కలల కొలువులు సొంతం చేసుకోవాలని ఒత్తిడికి లోనవుతున్న ఉద్యోగార్థులు.. 24్ఠ7 పని వాతావరణం; డెడ్లైన్స్; డెసిషన్ మేకింగ్; ఉన్నత స్థానాలు అందుకోవాలనే తపనతో ఒత్తిడి ఎదుర్కొంటున్న కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులు.. ఇలా... ఇప్పుడు క్లాస్ రూం, నుంచి కార్పొరేట్ ప్రపంచం వరకు ఒత్తిడి అనే మాట సర్వ సాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో ఒత్తిడిని జయించేందుకు నిపుణుల సలహాలు.. సూచనలు.. ఆత్మవిశ్వాసం ఆలంబనగా ఒత్తిడిని జయించే క్రమంలో ఇటు విద్యార్థులైనా, అటు ఉద్యోగార్థులైనా, ఉద్యోగులైనా.. ముందుగా పెంపొందించుకోవాల్సింది ఆత్మవిశ్వాసం. ఒత్తిడికి గురవడం అనే సమస్య.. సాధారణంగా సహచరులతో పోల్చుకోవడం వల్ల, పోటీ గురించి అతిగా ఆలోచించడం వల్ల ఎదురవుతుంది. తమపై తాము నమ్మకం పెంచుకుంటే ఒత్తిడిని సగం జయించినట్లే! మెండైన ఆత్మవిశ్వాసం కలిగి ఉండటంతో పాటు తోటివారితో పోల్చుకోవడం, పోటీ గురించి అదేపనిగా ఆలోచించడం మానేయడం ద్వారా ఒత్తిడిని చాలా వరకు అధిగమించొచ్చు. సానుకూల జీవన శైలి ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఉపకరించే మరో అంశం.. వ్యక్తిగత జీవన శైలి సరళంగా, మానవ సంబంధాలు సానుకూలంగా ఉండేలా చూసుకోవడం. దైనందిన జీవితంలో తీసుకోవాల్సిన నిర్ణయాల సంఖ్యను సాధ్యమైనంతగా తగ్గించుకోవడం మేలు. కొన్ని సందర్భాల్లో అత్యంత సాధారణంగా ఉండే అంశాలు కూడా సమయాన్ని వృథా చేసి ఒత్తిడికి గురిచేస్తాయి. కాబట్టి ఇలాంటి అంశాల గురించి పదేపదే ఆలోచించకుండా కుటుంబ సభ్యులు, మిత్రులతో వీలైనంత గడపడం మంచిది. అలసటగా అనిపించినా.. ఆందోళనకు గురవుతున్నా కొత్త ప్రాంతాలను సందర్శించడం చేయాలి. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రాధాన్యతలను గుర్తిస్తూ చాలామంది తాము చేయాల్సిన పనులు పూర్తి చేయలేదనే భయంతోనో లేదా వాటిని పూర్తి చేయకపోతే కలిగే ప్రభావాన్ని తలచుకొని చివరి నిమిషంలో ఎక్కువగా ఒత్తిడికి గురువుతుంటారు. ఇలాంటి వారికి ఒత్తిడిని జయించే క్రమంలో ఉపయోగపడే మంచి సాధనం.. ముందస్తు ప్రణాళిక. విద్యార్థులైనా, ఉద్యోగార్థులైనా ఒక వారం లేదా ఒక రోజుకు సంబంధించి తాము చేయాల్సిన పనులను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. వీలైతే వాటిని డైరీలోనో లేదా తమకు నిత్యం కనిపించే విధంగా వాల్ క్యాలెండర్లోనో నోట్ చేసుకోవాలి. ఒకరోజు చదవాల్సిన అంశాల్లో ప్రాధాన్యతను గుర్తిస్తూ ముందుకు సాగాలి. తద్వారా ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం పొందొచ్చు. ఒత్తిడికి గురిచేసే వారికి దూరంగా ఒత్తిడిని దూరం పెట్టడంలో ఉపయోగపడే మరో చిట్కా. ‘ఒత్తిడి’కి గురిచేసే వారిని లేదా ‘నిరాశావాదు’లకు దూరంగా ఉండటం. కొంతమంది అదే పనిగా వచ్చి.. ఒక పరీక్షకు సంబంధించి ప్రతికూల అంశాలే చెబుతుంటారు. ‘ఇంత పోటీలో ఎంత చదివినా ఉపయోగం ఏంటి? నేను కూడా గతంలో ఎంతో కృషి చేశాను. కానీ ఫలితం లేదు’ అనే మాటలతో నిరుత్సాహానికి గురిచేస్తారు. అలాంటివారికి వీలైనంత దూరంగా ఉండాలి. ఈజీ.. మోడరేట్.. డిఫికల్ట్ తాము చేయాల్సిన పనులు లేదా చదవాల్సిన అంశాలను వాటి క్లిష్టత స్థాయి ఆధారంగా ఈజీ.. మోడరేట్.. డిఫికల్ట్గా వర్గీకరించుకోవాలి. ముందుగా ‘ఈజీ’తో మొదలుపెట్టాలి. ఇవి పూర్తయ్యాక మోడరేట్, డిఫికల్ట్ అంశాలనుఎదుర్కొనేందుకు ముందస్తు మానసిక సంసిద్ధత లభిస్తుంది. ఇలా కాకుండా.. ఇష్టం లేకున్నా కష్టమైన అంశాలతో మొదలుపెడితే ఒత్తిడి మరింత పెరుగుతుంది. రిలాక్సేషన్ టెక్నిక్స్ కొన్ని సందర్భాల్లో ఎంత వద్దనుకున్నా.. ఎంత ఏకాగ్రతతో చదవాలనుకున్నా.. ఆందోళన పెరిగిపోతుంటుంది. అలాంటి సందర్భాల్లో చదువుతున్న పుస్తకాలను కొద్దిసేపు పక్కనపెట్టి మానసిక విశ్రాంతి కోసం టెక్నిక్స్ పాటించాలి. అంటే.. ఇష్టమైన సంగీతం వినడం, గార్డెనింగ్, లేదా టీవీలో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూడటం లాంటివి చేయాలి. తద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్.. మరికొన్ని టిప్స్ * దినచర్యను ఇష్టమైన పనితో ప్రారంభించాలి. * ప్రతిరోజూ కొద్దిసేపు నడక, యోగా, ఎక్సర్సైజ్ వంటివి చేయాలి. * ఆ రోజు చేయాల్సిన పనుల జాబితాను రూపొందించుకోవాలి. * ఇష్టమైన ప్రదేశాలు చూడాలి. అయితే వీటికోసం రోజుల తరబడి వృథా చేయకూడదు. తాము నివసిస్తున్న ప్రాంతానికి సమీపంలోని ఆహ్లాదకరమైన ప్రాంతాలకు వెళ్తుండాలి. * విసుగు, కోపం, ఆవేదనకు దూరంగా ఉండాలి. * ఇతరుల విజయాల పట్ల సానుకూల దృక్పథం అవసరం. * ఉద్యోగులు డెడ్లైన్స్, లాస్ట్ మినిట్ వరకు వేచి చూడకుండా ముందుగానే పనులు పూర్తి చేసుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. * ప్రతిరోజూ తప్పనిసరిగా కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర అవసరం. అందరికీ ఒత్తిడి.. అధిగమించేందుకు ఎన్నో మార్గాలు ప్రస్తుత పోటీ వాతావరణంలో ఒత్తిడి అనే మాట వినిపించని రంగం, ఆ మాట తలవని వ్యక్తులు ఉండరనడం అతిశయోక్తి కాదు. అయితే దాన్ని అధిగమిస్తేనే విజయం. ఇందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. మానసిక ఉపశమన ప్రక్రియల ద్వారా ఒత్తిడిని అధిగమించొచ్చు. ప్రిపరేషన్ సమయంలో ఒత్తిడి ఎదురైనప్పుడు కొద్దిసేపు దానికి విరామమిచ్చి సహచరులతో బృందచర్చల్లో పాల్పంచుకోవడం, అది వీలు కాకపోతే మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే పుస్తకాలు చదవడం వంటివి చేయాలి. ఇక.. విజయం పరంగా పోటీ గురించి ఆలోచించకుండా కృషిచేస్తే ఒత్తిడి అనే మాట దరిచేరదు. - డాక్టర్. ఎం.ఎస్.రెడ్డి,సైకియాట్రిస్ట్, ఆశా హాస్పిటల్స్ తల్లిదండ్రులదీ కీలక పాత్ర 17 నుంచి 19 ఏళ్ల మధ్యలో ఉండి పలు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. ఆ వయసులో పిల్లలు సహచర విద్యార్థులతో పోల్చుకుని మరింత ఒత్తిడికి లోనవుతారు. అంతేకాకుండా వారికి ఒత్తిడిని ఎదుర్కొనే మార్గాలు కూడా తెలియవు. ఇలాంటి పరిస్థితులను తల్లిదండ్రులే గుర్తించి వారికి ఉపశమనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలి. అంతేకానీ సహచర విద్యార్థులతో పోల్చి మరింత ఒత్తిడికి గురి చేయడం సరికాదు. పోటీల్లో జయాపజయాలు సహజం. దీన్ని గుర్తించి ఫలితం ఎలాంటిదైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధత పొందాలి. - డాక్టర్. జి.కృష్ణ, క్లినికల్ సైకాలజిస్ట్, ఎన్ఐఎంహెచ్ - సికింద్రాబాద్ -
పట్టణ జనాభా-రవాణా వ్యవస్థ
కాంపిటీటివ్ గెడైన్స్ : జనరల్ ఎస్సే ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ పెరుగుతోంది. ప్రపంచ జనాభా వృద్ధిరేటు కంటే పట్టణ జనాభా వృద్ధి అధికంగా ఉంది. ప్రపంచ పట్టణ జనాభా వార్షిక వృద్ధి మూడు శాతమని అంచనా. ప్రపంచ జనాభాలో సుమారు 50 శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. 2011 లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో పట్టణ జనాభా 31.16 శాతంగా ఉంది. భారత్లో పట్టణీకరణని పరిశీలిస్తే.. పట్టణ జనాభాలో వృద్ధి అధికంగా ఉండటంతోపాటు పెద్ద నగరాల్లో జనాభా కేంద్రీకరణను గమనించొచ్చు. స్వాతంత్య్రానంతరం భారతదేశం మిశ్రమ ఆర్థిక విధానాన్ని అవలంబించింది. దీంతో ప్రైవేట్ రంగం అభివృద్ధి చెంది పట్టణ జనాభా పెరుగుదలకు కారణమైంది. 1901లో దేశ జనాభాలో పట్టణ జనాభా వాటా 11.4%. ఇది 2001లో 27.81 శాతానికి, 2011లో 31.16 శాతానికి పెరిగింది. వివిధ నివేదికలు ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం రాబోయే దశాబ్దాల్లో పెరిగే పట్టణ జనాభాలో భారత్, చైనా వాటా 1/3 వంతుగా ఉండనుంది. 2010 నుంచి 2050 మధ్య కాలంలో భారత్లో పట్టణ జనాభాకు అదనంగా 497 మిలియన్లు, చైనాలో 341 మిలియన్లు, నైజీరియాలో 200 మిలియన్లు, అమెరికాలో 103 మిలియన్లు, ఇండోనేషియాలో 92 మిలియన్ల మంది తోడవనున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. గత 40 ఏళ్లతో పోల్చినప్పుడు 2010 నుంచి 2050 మధ్య కాలంలో పట్టణ జనాభాలో పెరుగుదల భారత్, నైజీరియాలలో ఎక్కువగా ఉండనుంది. చైనాలో 2000-2050 మధ్య కాలంలో పట్టణ జనాభా పెరుగుదలకు పట్టణాభివృద్ధిని ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు. ఇదే కాలంలో భారత్లో పట్టణ జనాభాలో 2/3 వంతు పెరుగుదలకు పట్టణాభివృద్ధి, 1/3 వంతు పెరుగుదలకు మొత్తం జనాభా పెరుగుదల దోహదపడతాయని నివేదికలు పేర్కొంటున్నాయి. ది గ్లోబల్ కమిషన్ ఆన్ ది ఎకానమీ అండ్ క్లైమేట్ 2014లో ‘న్యూ క్లైమేట్ ఎకానమీ’ పేరిట నివేదిక రూపొందించింది. దీని ప్రకారం 2031 నాటికి భారతదేశ పట్టణ జనాభా 600 మిలియన్లకు చేరనుంది. దేశ మొత్తం జనాభాలో ఇది 40 శాతంగా ఉండనుంది. రాబోయే 20 ఏళ్ల కాలంలో పట్టణ అవస్థాపనా పెట్టుబడిలో 827 బిలియన్ డాలర్ల లోటు ఉండే అవకాశం ఉంది. 2050 నాటికి అంచనా వేసిన వయసు కంటే ముందు సంభవించే మరణాలకు పట్టణ వాయుకాలుష్యం ప్రధాన కారణం అవుతుందని నివేదిక పేర్కొంది. పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా భారత్ అధిక ప్రయోజనం పొందగలదని ఎం.సి.కిన్సె నివేదిక పేర్కొంది. 2030 నాటికి నగరాలు 70 శాతం నికర నూతన ఉపాధిని అందించగలవని, భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో నగరాల వాటా 70 శాతంగా ఉండొచ్చని నివేదిక అభిప్రాయపడింది. పట్టణ ప్రాంతాల్లోని మౌలిక సౌకర్యాలపై భారత్లో వార్షిక తలసరి మూలధన వ్యయం 17 డాలర్లు కాగా, చైనా వార్షిక తలసరి మూలధన వ్యయంలో 14 శాతం, పట్టణీకరణ డిమాండ్కు అనుగుణంగా భారత్లో ఏటా 700 మిలియన్ చదరపు మీటర్ల రెసిడెన్షియల్, 900 మి.చ.మీ. కమర్షియల్ నిర్మాణాలు జరగాలని నివేదిక పేర్కొంది. ప్రపంచ బ్యాంకు నివేదిక 2016 ప్రకారం ప్రపంచ జనాభాలో 54 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2045 నాటికి నగరాల్లోని జనాభా 1.5 రెట్లు పెరిగి, మొత్తం పట్టణ జనాభా 6 బిలియన్లకు చేరుకునే అవకాశం ఉంది. ప్రపంచ జీడీపీలో పట్టణ ప్రాంత వాటా 80 శాతంగా ఉండనుంది. ఉత్పాదకత, నవకల్పనల్లో పెరుగుదల కారణంగా సుస్థిర వృద్ధి సాధనకు పట్టణ ప్రాంతాలు దోహదపడతాయి. వేగవంతమైన పట్టణీకరణ కారణంగా మౌలిక సౌకర్యాల కల్పనలో అనేక సవాళ్లు ఎదురవుతాయి. వాతావరణ మార్పును అధిగమించడంలో పట్టణ ప్రాంతాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని నివేదిక పేర్కొంది. ప్రపంచంలో శక్తి వినియోగంలో పట్టణ ప్రాంతాలు 2/3వ వంతు వాటాను కలిగి ఉన్నాయి. ప్రపంచ హరిత గృహ వాయు ఉద్గారాల విడుదలలోనూ పట్టణాల వాటా 70 శాతమని నివేదిక పేర్కొంది. జాతీయ రవాణా అభివృద్ధి విధాన కమిటీ అభిప్రాయంలో 2031 నాటికి భారత పట్టణ జనాభా 60 కోట్లకు చేరే అవకాశం ఉంది. మొత్తం దేశ జనాభాలో పట్టణ జనాభా 40 నుంచి 42 శాతంగా కమిటీ అంచనా వేసింది. పట్టణ అవస్థాపనా సేవలకు అవసరమైన పెట్టుబడి అంచనాలో భాగంగా.. 2031 నాటికి పట్టణ జనాభా 600 మిలియన్లకు చేరుతుందని హై పవర్డ ఎక్స్పర్ట కమిటీ పేర్కొంది. రవాణా వ్యవస్థ: భారత ఆర్థిక వ్యవస్థలో రవాణా ఒక ముఖ్య అంశం. 1990వ దశకంలో మొదలైన సరళీకృత ఆర్థిక విధానాల వల్ల భూ, జల, వాయు రవాణాల్లో అనేక రవాణా సాధనాలు వాడుకలోకి వచ్చాయి. ఇదే సమయంలో దేశంలోని అధిక జనాభాకు ప్రజా రవాణా ప్రాథమిక రవాణా సాధనంగా నిలిచింది. ప్రపంచంలో ప్రజా రవాణాను అధికంగా వినియోగిస్తున్న రవాణా వ్యస్థల్లో భారత్ రైల్ నెట్వర్క ఒకటి. భారత రైల్వే వ్యవస్థ 2014-15లో రోజుకు 23 మిలియన్ల మంది ప్రయాణీకులను చేరవేసింది. మొత్తంగా ఆ ఏడాదిలో 8.397 బిలియన్ల మంది రవాణా అవసరాలను తీర్చిడంతో పాటు 1058.81 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసింది. మార్చి 2013 నాటికి దేశంలో మొత్తం రిజిస్టర్డ మోటారు వాహనాలు 172 మిలియన్లు. వీటిలో 21.5 మిలియన్లు కార్లు, టాక్సీలు, జీపులున్నాయి. మొత్తం కుటుంబాల్లో 10 శాతం కుటుంబాలు మోటారు సైకిల్ కలిగి ఉన్నాయి. ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రపంచంలో అధిక మరణాలు సంభవిస్తున్న దేశంగా భారత్ నిలిచింది. భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఏటా 4.6 మిలియన్ల వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. 2015-16లో భారత ప్రభుత్వం భూ ఉపరితల రోడ్లు, రైల్వేల నుంచి ట్రాఫిక్ను జలమార్గాలకు మరల్చడానికి ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద 106 జాతీయ జల మార్గాలను ప్రకటించింది. పట్టణ రవాణా: దేశంలో పేదరిక నిర్మూలనకు విద్యుత్, భూమిని పొదుపుగా వినియోగించుకోవాలి. దీంతోపాటు కాలుష్యం, గ్రీన్ హౌజ్ వాయు ఉద్గారాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఈ లక్ష్యసాధనలో పట్టణ రవాణా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం దేశంలో నాణ్యత, పరిమాణం పరంగా పట్టణ రవాణా సర్వీసులు, అవస్థాపనా సదుపాయాల లోటు అధికమైంది. దేశంలోని మెగాసిటీల్లో వాహన కాలుష్య పెరుగుదలకు కారణాలుగా కింది అంశాలను పేర్కొనవచ్చు. 1. అధిక ట్రాఫిక్ పరిమాణం, పట్టణ జనాభా పెరుగుదల. 2. ప్రైవేట్, వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరగడం. 3. వాహనాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం. 4. ట్రాఫిక్ అడ్డంకుల పెరుగుదల 5. పర్యావరణహిత రవాణా సాధనాల వినియోగం తక్కువగా ఉండటం. ఇంధన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తక్కువగా ఉండటం. 6. ప్రైవేట్, వ్యక్తిగత వాహనాల సంఖ్యను తగ్గించడానికి సమగ్రమైన కోశపరమైన వ్యూహాలు అవలంభించిక పోవడం. - డాక్టర్ తమ్మా కోటిరెడ్డి ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్ -
ఉద్యోగాలు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో కన్సల్టెంట్లు న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. పోస్టులు: సీనియర్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్, అకౌంటెంట్, టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీలు: 17 అర్హతలు: సంబంధిత పోస్టుకు యూజీ/పీజీ/ డిప్లొమా/తత్సమానం ఉండాలి. ఇంటర్వ్యూ తేదీలు: మే 25, 27, 28. వెబ్సైట్: www.nihfw.org ఐజీసీఏఆర్ స్పెషల్ రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ (ఐజీసీఏఆర్) వివిధ విభాగాల్లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ని నిర్వహిస్తోంది. పోస్టు: టెక్నికల్ ఆఫీసర్ విభాగాలు: సివిల్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఖాళీలు: 7 ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: జూన్ 17 వెబ్సైట్: www.igcar.gov.in రిషికేష్ ఎయిమ్స్లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు రిషికేష్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిక ల్ సెన్సైస్ (ఎయిమ్స్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్స్కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టు: సీనియర్ రెసిడెంట్, ఖాళీలు: 236 విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్/టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్. అర్హతలు: మెడికల్ అభ్యర్థులకు: సంబంధిత విభాగంలో ఎండీ/ఎంఎస్/డీఎన్బీ పోస్ట్గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ ఉండాలి. నాన్-మెడికల్ అభ్యర్థులకు (అనాటమీ డిపార్ట్మెంట్): సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ డిగ్రీ ఉండాలి. ఏదైన వర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుంచి పీహెచ్డీ ఉండాలి. గతంలో సీనియర్ రెసిడెన్సీ చేసినవారు అనర్హులు. దరఖాస్తుకు చివరి తేది: మే 31 వెబ్సైట్: www.aiimsrishikesh.edu.in -
పరీక్షల తేదీలు
⇒ టీఎస్ ఎంసెట్: మే 15 ⇒ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అండ్ అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీ: మే 15 ⇒ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్)- రిషికేష్ జూనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్): మే 23 ⇒ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్లో మెయింటెయినర్ (ఎలక్ట్రీషియన్): మే 29 -
మా లక్ష్యం సామాజిక అభివృద్ధి..
వారందరి నేపథ్యాలు వేరు.. ప్రాంతాలు కూడా వేరు.. కానీ.. వారి ప్రత్యేకత.. అందరూ మహిళలే.... వారి లక్ష్యం ఒకటే.. అది సామాజికాభివృద్ధికి దోహదపడాలనే కాంక్ష! ఆ ఆశయ సాధనకు మార్గం.. సివిల్ సర్వీసెస్.. సాధించాలనే తమ తపనకు.. తల్లిదండ్రులు, జీవిత భాగస్వాముల తోడ్పాటు అందింది! సివిల్స్ పరీక్షలో దీటుగా రాణించారు.. ర్యాంకుల్లో దూసుకెళ్లారు. మరికొద్ది రోజుల్లో కార్యక్షేత్రంలో అడుగుపెట్టనున్నారు. తాజా సివిల్స్-2015 ఫలితాల్లో ‘టాప్’లేపిన.. తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళా విజేతలపై ప్రత్యేక కథనం... ఇష్టంగా చదివితే లక్ష్యం చేరుకోవచ్చు: 14వ ర్యాంకు చేకూరు కీర్తి : ఒకవైపు స్నేహితులు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో విజయానికి కృషి చేస్తుంటే.. నేను కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు. నా ఆలోచనంతా సివిల్స్పైనే ఉండేది. ఐఐటీ మద్రాస్ నుంచి మెటీరియల్ అండ్ మెటలర్జికల్ సైన్స్లో 2012లో బీటెక్ పూర్తిచేశా. ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరంలో ఉండగానే సివిల్స్ లక్ష్యంగా నిర్ణయించుకున్నాను. ఒకవైపు స్నేహితులు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో విజయానికి కృషి చేస్తుంటే.. నేను కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు. నా ఆలోచనంతా సివిల్స్పైనే ఉండేది. ఆంత్రోపాలజీ ఆప్షనల్గా 2013లోతొలి ప్రయత్నంలో 440వ ర్యాంకుతో ఐఆర్ఎస్కు ఎంపికయ్యాను. 2014 లో రెండో ప్రయత్నంలోనూ ఆశించిన ర్యాంకు రాలేదు. దాంతో ఇక ఎట్టి పరిస్థితుల్లో ఐఏఎస్ సాధించాలనే పట్టుదలతో 2015కు హాజరయ్యాను. సివిల్స్-2015 ఫలితాలు విడుదలయ్యే సమయానికి ఐఆర్ఎస్ శిక్షణ పూర్తిచేసి, కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్గా విధుల్లో ఉన్నా. ఐఆర్ఎస్ ట్రైనింగ్ కూడా పూర్తిచేసుకుని మళ్లీ సివిల్స్ రాయడానికి కారణం.. ఐఏఎస్కు నేరుగా ప్రజలతో మమేకం అయ్యే అవకాశం ఉండటమే! నా విజయంలో అమ్మ పద్మ ప్రేరణ, నాన్న నాగేంద్ర తోడ్పాటు మరువలేనిది. సివిల్స్లో విజయం సాధించడం కష్టమే అయినా.. ఇష్టంగా చదివితే లక్ష్యం చేరుకోవచ్చు. పట్టుదల ఉంటే ఫలితం గ్యారెంటీ..! : 65వ ర్యాంకు వల్లూరు క్రాంతి : ఇష్టపడి చదివితే సివిల్స్లో విజయం సాధ్యమే. తొలి ప్రయత్నంలో రాకపోయినా నిరుత్సాహానికి గురి కాకుండా పట్టుదలతో ప్రయత్నించాలి. మాది కర్నూలు. అమ్మానాన్న లక్ష్మి, వెంకట రంగారెడ్డి ఇద్దరూ వైద్యులే. ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే వారి ఆకాంక్షే నా విజయానికి కారణం. అమ్మానాన్న ఆకాంక్షలకు అనుగుణంగా చిన్నప్పటి నుంచీ చదువులో ఫస్టే. ఐఐటీ-ఢిల్లీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశా. బీటెక్ పూర్తిచేసిన తర్వాతే సివిల్స్పై దృష్టిసారించా. మ్యాథమెటిక్స్ ఆప్షనల్ అరుదే అయినా.. మ్యాథ్స్పట్ల ఇష్టంతోనే ఆ సబ్జెక్టును ఎంపిక చేసుకన్నా. తొలి ప్రయత్నంలో 2013లో 562వ ర్యాంకుతో ఐఆర్టీఎస్కు.. 2014లో 230వ ర్యాంకుతో ఐఆర్ఎస్కు ఎంపికయ్యా. అయితే, నా లక్ష్యం ఐఏఎస్ కావడంతో పట్టుదలగా 2015 సివిల్స్కు హాజరై 65వ ర్యాంకు సాధించా. నా విజయ ప్రస్థానంలో.. అమ్మానాన్న అందించిన సహకారం మరవలేనిది. నేను ఏం చదువుతానంటే అది చదివించారు. అందుకే ఇంట్లో అందరూ డాక్టర్లయినా.. నేను మాత్రం ఇంజనీరింగ్పై ఆసక్తితో ఐఐటీలో చేరా. బీటెక్ అర్హతతో ఆఫర్లు వచ్చినా కాదనుకొని సివిల్స్ లక్ష్యంగా చదివా. ఆ కల సాకారమవడం చాలా ఆనందంగా ఉంది. పట్టుదలతో చదివితే సివిల్స్లో విజయం సాధ్యమే. కాకపోతే తొలి ప్రయత్నంలో రాకపోయినా నిరుత్సాహానికి గురికాకుండా ఓర్పుగా మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి. కార్యక్షేత్రంలో అడుగుపెట్టాక మహిళా సాధికారతకు తోడ్పడతా. మహిళలకు అందుబాటులో ఉన్న పథకాల సమర్థ అమలుకు కృషి చేస్తా. సమాజం కోసం సివిల్స్ గమ్యం.. : 82వ ర్యాంకు పాపమ్మగారి ప్రావీణ్య : విజయానికి ప్రతి అంశాన్ని శాస్త్రీయ దృక్పథంతో చదవడం అలవర్చుకోవాలి. మాది అనంతపురం జిల్లా, పుట్టపర్తి మండలం ఎనుములపల్లి. నా విజయంలో అమ్మానాన్న ఓబుల్ రెడ్డి, మాలతిల ప్రోత్సాహం ఎంతో ఉంది. అమ్మానాన్న ఇద్దరూ విద్యావంతులు కావడం, ఉన్నత హోదాల్లో ఉండటం (తండ్రి హెచ్ఏఎల్ చీఫ్ మేనేజర్, తల్లి సీజీహెచ్ఎస్లో చీఫ్ మెడికల్ ఆఫీసర్) కూడా కలిసొచ్చింది. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఆఫర్ను వదులుకున్నా అమ్మానాన్న ఏమీ అనకపోవడం మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. బిట్స్ పిలానీలో బీటెక్ పూర్తయింది. ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలోనే ప్రముఖ కంపెనీలో ఇంటర్న్షిప్ చేశా. అయినా నా దృష్టంతా సామాజిక అభివృద్ధివైపే. అందుకు మార్గం, నా గమ్యం సివిల్ సర్వీసెస్ మాత్రమే అని భావించా. సివిల్స్ ఆలోచన వచ్చిందే తడవుగా ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ కోసం చేరా. 2014లో తొలి ప్రయత్నం చేశా. ప్రిలిమ్స్లో విజయం సాధించా. మెయిన్స్లో పదిహేను మార్కుల తేడాతో కటాఫ్ చేజారింది. ఫలితం రాకున్నా.. సివిల్స్ సాధించగలను అనే నమ్మకం అప్పుడే కలిగింది. 2015 నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో సాధించాలని శ్రమించా. దాంతో రెండో ప్రయత్నంలోనే 82వ ర్యాంకుతో ఐఏఎస్కు ఎంపికయ్యే అవకాశం దక్కింది. సీఏ నుంచి సివిల్స్ వైపు : జె.స్నేహజ 103వ ర్యాంకు మా స్వస్థలం ప్రకాశం జిల్లా, గుడ్లూరు మండలం, గుళ్లపాలెం. నాన్న వెంకటేశ్వర్లు చార్టర్డ్ అకౌంటెంట్. వృత్తి రీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డారు. నేను కూడా నాన్న బాటలోనే చార్టర్డ్ అకౌంటెన్సీ పూర్తి చేయాలని సీఏ కోర్సులో అడుగుపెట్టా. 2011లో తొలి ప్రయత్నంలోనే ఫైనల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించా. అదే సమయంలో బీకాం కూడా పూర్తి చేశా. సీఏ చదువుతున్నప్పుడు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం.. ఆ సమయంలో పలు నేపథ్యాల ప్రజల స్థితిగతులు ప్రత్యక్షంగా చూడటంతో సమాజానికి, ముఖ్యంగా పేద, గ్రామీణ వర్గాలకు సేవ చేయాలనే ఆకాంక్ష మొదలైంది. అందుకే సివిల్స్ లక్ష్యంగా ఎంపిక చేసుకున్నా. నా కోర్ సబ్జెక్ట్ కామర్స్నే ఆప్షనల్గా సెలక్ట్ చేసుకున్నా. తొలి రెండు ప్రయత్నాల్లో విజయం సాధించకపోయినా సివిల్స్పై అవగాహన కలిగింది. దాంతో మరికొంత గెడైన్స్ లభిస్తుందని సివిల్స్ 2013 కోసం ఢిల్లీలో శిక్షణ తీసుకున్నా. 2014లో మూడో ప్రయత్నంలో సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్క్వార్టర్స్ సర్వీసుకు ఎంపికయ్యా. అయితే ఐఏఎస్ లక్ష్యంగా 2015లో నాలుగో ప్రయత్నంలో 103వ ర్యాంకు రావడంతో నా కల నెరవేరింది. నా విజయంలో అమ్మానాన్న తోడ్పాటు ఎంతో ఉంది. పదో తరగతి కాగానే.. అందుబాటులో ఉన్న విద్యావకాశాలు, వాటి ద్వారా లభించే కెరీర్ అవకాశాలపై అవగాహన కల్పించారు. నేను కోరుకున్న చదువు చదివించారు. సివిల్స్ కోసం నాలుగేళ్లు వేచిచూసినా వెన్నంటి నిలిచారు. ఓర్పుతోనే.. విజయం! : కె.ప్రవళ్లిక 232వ ర్యాంకు మాది విశాఖపట్నం. నాన్న విశ్వనాథ్, ఎస్బీఐలో చీఫ్ మేనేజర్, అమ్మ విశాలాక్షి.. ఎస్బీహెచ్ ఉద్యోగిని. నేను ఎంతో అదృష్టవంతురాలిని. ఎందుకంటే నా లక్ష్యం గురించి తెలుసుకున్న అమ్మానాన్న నా కోసం విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు మకాం మార్చారు. 2011లో బీటెక్ (సీఎస్ఈ) పూర్తయింది. క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రముఖ ఎంఎన్సీలో ఆఫర్ వచ్చింది. కానీ ఆ ఉద్యోగం ద్వారా సమాజానికి సేవ చేసే అవకాశం చాలా తక్కువ. అందుకే సొసైటీకి సేవ చేసే అవకాశం ఉండే సివిల్ సర్వీసెస్ను లక్ష్యంగా ఎంచుకున్నా. తొలి ప్రయత్నంలో 2013లో మెయిన్స్ వరకు వెళ్లినా.. ఐదు మార్కుల తేడాతో విజయం చేజారింది. దాంతో మరింత పట్టుదలతో 2014కు హాజరుకాగా ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ కేడర్ లభించింది. అదే సమయంలో నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉద్యోగం లభించింది. ఆ విధుల్లో చేరినా లక్ష్యం ఐఏఎస్ కావడంతో మరోసారి ప్రయత్నించాను. 2015లో 232వ ర్యాంకు వచ్చింది. సివిల్స్లో సోషియాలజీ నా ఆప్షనల్. రోజుకు ఎనిమిది గంటల పాటు ప్రిపరేషన్ కొనసాగించా. బీటెక్ పూర్తయ్యాక ఇన్నేళ్లు వేచి చూడాల్సి రావడం.. అమ్మాయికి పెళ్లి చేయండని బంధువుల ఒత్తిడి వచ్చినా కూడా నా లక్ష్యం గుర్తించిన అమ్మానాన్న ప్రోత్సహించడం చాలా సంతోషం కలిగించే విషయం. నాన్నే స్ఫూర్తిగా.. : అదిరె మంజు 291వ ర్యాంకు మాది హైదరాబాద్. నాన్న.. ధర్మయ్య, వికలాంగుల సంక్షేమ శాఖలో రిటైర్డ్ అటెండర్. నాన్నే నాకు స్ఫూర్తి. పిల్లలు ఉన్నత హోదాల్లో ఉండాలని నాన్న కోరుకోవడమే నేను ఈ రోజు సివిల్స్ వంటి అత్యున్నత సర్వీసును లక్ష్యంగా చేసుకోవడానికి కారణం. నాన్న అందించిన నిరంతర ప్రేరణ, తోడ్పాటే నేను ఈ ర్యాంకు సాధించడానికి దోహదపడ్డాయి. ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి 2008లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశా. బీఈఎంఎల్ బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. 2011లో ఆంత్రోపాలజీ ఆప్షనల్గా తొలి యత్నంలో నిరుత్సాహ ఫలితం ఎదురైంది. అదే సమయంలో ఉద్యోగం చేస్తుండటంతో సివిల్స్కు సిద్ధమవడం కష్టమైంది. 2013 నుంచి వరుసగా ప్రయత్నించాను. ప్రతి ఏటా గత లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగా. మాక్ టెస్ట్లు, మాక్ ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. దాంతో తాజా ఫలితాల్లో నాలుగో ప్రయత్నంలో 291వ ర్యాంకు లభించింది. నా విజయంలో నాన్నతోపాటు భర్త హరీశ్ ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. కోచింగ్ తీసుకుంటేనే సివిల్స్ సాధిస్తామనే భావన వీడాలి. సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే కోచింగ్ లేకపోయినా విజయం సాధించొచ్చు. కాకపోతే కొంత ఓర్పు అవసరం!! సామాజిక సేవ.. సంతృప్తి!! : ఉప్పలూరి మీనా 326వ ర్యాంకు మాది హైదరాబాద్. నాన్న శ్రీహరి ఐటీ కన్సల్టెంట్, అమ్మ సత్యశ్రీ. సివిల్స్ విజయంలో అమ్మానాన్న సహకారం ఎంతో ఉంది. ఐఐటీ ఖరగ్పూర్లో బీటెక్- ఎంటెక్ డ్యుయెల్ డిగ్రీ (2009-14) పూర్తయింది. క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఐబీఎంలో ఆఫర్ వచ్చింది. ఒక ఏడాది బాగానే గడిచింది. కానీ ఏదో నిరుత్సాహం. సమాజానికి ఏమీ చేయలేకపోతున్నామనే భావన. ఎందుకంటే.. అప్పటికే ప్రముఖ స్వచ్ఛంద సంస్థ CRY (Child Rights and You) ఐఐటీ ఖరగ్పూర్ చాప్టర్ మెంబర్గా ఖరగ్పూర్ పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం.. ఆ సమయంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, గ్రామీణ విద్యార్థులకు అవగాహన కల్పించడం, మధ్యాహ్న భోజన పథకం అమలు గురించి క్షేత్ర స్థాయిలో పర్యటించడం వంటివన్నీ గుర్తొచ్చేవి. దీంతో కార్పొరేట్ సంస్థలో కూర్చుని ఉద్యోగం చేసి లక్షలు సంపాదించినా సంతృప్తి ఉండదని.. సామాజిక సేవా కార్యక్రమాలతో ఆత్మసంతృప్తి కలుగుతుందని భావించాను. దీనికి మార్గంగా సివిల్ సర్వీసెస్ను ఎంపిక చేసుకుని 2014లో తొలి ప్రయత్నం చేశాను. కానీ ఫలితం రాలేదు. ఉద్యోగం చేస్తూ సివిల్స్కు ప్రిపరేషన్ సాగించడం కష్టమని భావించి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో సివిల్స్ ప్రిపరేషన్కు ఉపక్రమించాను. జాగ్రఫీని ఆప్షనల్గా ఎంచుకుని 2015లో ఫలితం దక్కించుకున్నాను. సివిల్ సర్వెంట్ పరిధి ఎక్కువ : ఎలా ప్రియాంక 529వ ర్యాంకు మాది కరీంనగర్ జిల్లాలోని భీమదేవరపల్లి. నాన్న నారాయణ.. ఆయుష్ శాఖ డెరైక్టర్; అమ్మ లారా.. సీసీఎంబీ సైంటిస్ట్. అమ్మానాన్న ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా చాలా కష్టపడి చదువుకున్నారట. అందుకే మాకు అలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో చదువు పరంగా ఎంతో ప్రోత్సహించారు. నేను సేవాగ్రామ్లోని ప్రముఖ వైద్య కళాశాల ఎంజీఎంఐఎస్లో 2011లో ఎంబీబీఎస్ పూర్తి చేశా. దీంతో సివిల్స్ ప్రిపరేషన్కు ఉపక్రమించా. 2011-12 అంతా కోచింగ్కు కేటాయించి 2013లో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చా. 2014లో రెండో ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లినా తుది జాబితాలో చోటు లభించలేదు. కానీ సాధించగలననే నమ్మకం కలిగింది. అదే ఉత్సాహంతో 2015కు హాజరై 529వ ర్యాంకు సొంతం చేసుకున్నా. ఆంత్రోపాలజీ ఆప్షనల్గా ఎంపిక చేసుకుని రోజుకు ఎనిమిది నుంచి పది గంటలు చదివా. సోషల్ డెవలప్మెంట్ కోణంలో డాక్టర్ కంటే సివిల్ సర్వెంట్కే ఎక్కువ పరిధి ఉంటుంది. అందుకే సివిల్స్ లక్ష్యంగా ఎంపిక చేసుకున్నా. సివిల్స్ విజయ ప్రస్థానంలో కుటుంబ ప్రోత్సాహం ఎంతో ఉంది. చెల్లెలు శశాంక కూడా సివిల్స్ రాసి.. 2014లో విజయం సాధించి ప్రస్తుతం ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారిణిగా విధులు నిర్వహిస్తోంది. నాకు రెండు నెలల క్రితమే వివాహమైంది. అప్పుడే ఇంటర్వ్యూకు అర్హత లభించింది. ఆ సమయంలో ఢిల్లీ వెళ్లి మాక్ ఇంటర్వ్యూ కోచింగ్ తీసుకునేందుకు భర్త మణిపాల్కుమార్ తోడ్పాటు కూడా ఎంతో ఉంది. పట్టుదలతో.. నాలుగో ప్రయత్నంలో : పి.వైష్ణవి 840వ ర్యాంకు మాది చిత్తూరు. నాన్న పుష్పరాజు.. జవహర్ నవోదయ విద్యాలయ రిటైర్డ్ ప్రిన్సిపాల్, అమ్మ విజయలక్ష్మి. బిట్స్ పిలానీలో 2004లో సీఎస్ఈ పూర్తయింది. కొన్ని సంవత్సరాలు యూకేలో ఉండి 2009లో స్వదేశానికి తిరిగి వచ్చా. గివింగ్ బ్యాక్ టు సొసైటీ దృక్పథంతో సివిల్స్ లక్ష్యంగా ఎంచుకున్నా. గ్రూప్స్ నుంచి సివిల్స్ వరకు అన్ని పరీక్షలకు ప్రిపరేషన్ సాగించా. 2011 గ్రూప్-1 మెయిన్స్లోనూ విజయం సాధించా. కానీ ఆ పరీక్షకు సంబంధించి కోర్టు కేసు ఉండటంతో ఇంకా ఫలితాలు రాలేదు. సివిల్స్ కోసం 2012 నుంచి వరుసగా ప్రయత్నాలు చేశా. తెలుగు లిటరేచర్ ఆప్షనల్గా తొలి యత్నంలో ప్రిలిమ్స్లో విజయం సాధించినా మెయిన్స్లో నిరాశ. కానీ పట్టు వీడకుండా ప్రయత్నించడంతో ఇప్పుడు తాజా ఫలితం 840 ర్యాంకు దక్కింది. ర్యాంకు కొంచెం ఎక్కువే అయినా సమాజానికి నేరుగా సేవ చేసే అవకాశం ఉండే సర్వీసులకు ఎంపికైనందుకు ఎంతో ఆనందంగా ఉంది. నా విజయంలో నాన్నతోపాటు భర్త చంద్రశేఖర్ తోడ్పాటు ఎంతో ఉంది. ప్రిపరేషన్ సమయంలో ఒక్కోసారి పాపను చూసుకోవడం వీలుకాకపోయినా వారే అంతా చూసుకునేవారు. కొంత ఆలస్యమైనా ఫలితం.. : నాగిరెడ్డిగారి మధులత 496వ ర్యాంకు మా స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లె. నాన్న జగన్నాథ్రెడ్డి రిటైర్డ్ వీఆర్ఓ. ఆ సమయంలో ఆయన నిర్వహించే విధులు చూడటంతో చిన్నప్పుడే సమాజానికి ఏదైనా చేయాలి అనే ఆలోచన కలిగింది. అగ్రికల్చర్ బీఎస్సీ, ఆ తర్వాత అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ పూర్తిచేశా. నాన్న నుంచి వారసత్వంగా వచ్చిన సర్వీస్ మోటోతోనే సివిల్స్ను లక్ష్యంగా ఎంచుకున్నా. 2011 నుంచి సీరియస్గా ప్రిపరేషన్ సాగిస్తున్నా. 2011లో వివాహమైంది. దీంతో భర్త ఈశ్వర్రెడ్డి ప్రోత్సాహం కూడా తోడైంది. ఇదే క్రమంలో గ్రూప్-1, గ్రూప్-2లకు కూడా ప్రిపరేషన్ సాగించా. గ్రూప్-2, 2012 ద్వారా ఏఎస్ఓ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం ఏపీ సెక్రటేరియట్లో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖలో గ్రూప్-2 కేడర్లో ఆ విధులు నిర్వహిస్తూనే సివిల్స్ ప్రిపరేషన్ కొనసాగించా. తొలి రెండు ప్రయత్నాలు (2011, 2012) నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. 2014లో మాత్రం మెయిన్స్కు ఎంపికవడంతో ఆత్మస్థైర్యం పెరిగింది. 2015లో పట్టుదలగా కృషి చేస్తే 496వ ర్యాంకు లభించింది. ఆంత్రోపాలజీ ఆప్షనల్గా ఎంపిక చేసుకుని వ్యూహాత్మకంగా ప్రిపరేషన్ సాగించా. దాంతో కొంత ఆలస్యమైనా ఫలితం లభించింది. మరో ప్రయత్నం చేసి ఐఏఎస్ లక్ష్యం చేరేందుకు కృషి చేస్తా. -
దరఖాస్తు చేశారా?
* భోపాల్లోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్(ఎస్పీఏ)డాక్టోరల్ అండ్ పీజీ ప్రోగ్రామ్స్లో ప్రవేశాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేది: మే 16 * ఎన్హెచ్ఎంలో భాగంగా కరీంనగర్ జిల్లా ప్రాజెక్ట్లోని మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, ఏఎన్ఎం పోస్టులకు దరఖాస్తు చేయడానికి చివరి తేది: మే 18 * ఈఎస్ఐసీ నాచారం (హైదరాబాద్)లో వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్స్ (అల్లోపతి) పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: జూన్ 29 -
నాటా - 2016
గరిష్టంగా ఐదుసార్లు గ్రాడ్యుయేట్స్ స్పెషల్ ఎన్నో అందమైన, ఎత్తై భవనాలకు చక్కటి రూపమిచ్చేది ఆర్కిటెక్ట్లే. అలాంటి సృజనాత్మక ఆర్కిటెక్టులుగా రూపొందాలంటే రాయాల్సిన పరీక్ష.. నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా). దీన్ని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రతి ఏటా నిర్వహిస్తోంది. నాటా స్కోర్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపుపొందిన కళాశాలల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్)లో చేరొచ్చు. ఈ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 1న మొదలైంది. ఆగస్టు 20 వరకు రాయవచ్చు. ఈ ఏడాది నుంచి నాటాలో కొన్ని ప్రధాన మార్పులు చోటు చేసుకున్నాయి. వాటి వివరాలు... నాటా-2016 మార్పులు.. * ఈ ఏడాది నుంచి ఐదుసార్లకు మించి పరీక్ష రాయడానికి వీల్లేదు. అది కూడా మొదటిసారి పరీక్ష రాసిననాటి నుంచి రెండేళ్లలోపు వరకు మాత్రమే వర్తిస్తుంది. * నాటా పరీక్ష ఏప్రిల్ 1న ప్రారంభమైంది. అప్పటి నుంచి కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది. ఔత్సాహిక అభ్యర్థులు ఆగస్టు 20 వరకు పరీక్ష రాసుకునే అవకాశం ఉంది. * అభ్యర్థులు గరిష్టంగా ఐదుసార్లు పరీక్ష రాసుకోవచ్చు కాబట్టి వీటిలో ఉత్తమ స్కోర్ను ‘బెస్ట్ స్కోర్’గా పరిగణిస్తారు. * నాటా స్కోర్కు పరీక్ష రాసిన నాటి (ఏప్రిల్ 1, 2016) నుంచి రెండేళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. 2016కు ముందు పరీక్ష రాసినవారికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. * నాటా ఔత్సాహిక అభ్యర్థులు పరీక్ష రాసే ప్రతిసారి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అంతేకాకుండా రాసిన ప్రతిసారి పరీక్ష ఫీజు చెల్లించాలి. * పరీక్ష తర్వాత ప్రకటించే మార్కుల జాబితాలో అంతకుముందు రాసిన పరీక్షల్లో సాధించిన అత్యుత్తమ మార్కులు కూడా ఉంటాయి. * నాటా-2016కు దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా ఇంతకుముందు రాసిన నాటా వివరాలను దరఖాస్తులో పొందుపరచాలి. * గతంలో నాటాకు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాయనివారు, రాసినా ఆ వివరాలు తెలపనివారి ప్రీవియస్ నాటా స్కోర్లన్నీ రద్దవుతాయి. వారు మళ్లీ పరీక్ష రాయడానికి అనర్హులు. నాటా-2016 సమాచారం అర్హత: 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. కోర్సు వ్యవధి: ఐదేళ్లు పరీక్ష విధానం.. ఈ పరీక్ష రెండు విధాలుగా ఉంటుంది. డ్రాయింగ్ టెస్ట్: అభ్యర్థిలోని సృజనాత్మకతను పరీక్షించే విధంగా డ్రాయింగ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో నిర్ణీత ఆకారం లేదా వస్తువును అభ్యర్థి ముందుంచి.. దాని ఆధారంగా ఊహాశక్తితో డ్రాయింగ్ వేయమంటారు. ఒక వస్తువును పలు కోణాల్లో చిత్రించమన డం, నిర్ణీత ఆకారానికి ఆకట్టుకునే రంగులు వేయడం వంటి ప్రశ్నలు ఎదురవుతాయి. నిజజీవితంలో ఎదురైన సంఘటనలను ఊహించుకుంటూ.. వాటికి సంబంధించిన చిత్రాలను గీయమని కూడా అడుగుతుంటారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. నాటాతో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశం కల్పిస్తున్న ప్రముఖ ఇన్స్టిట్యూట్లు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్- జేఎన్ఏఎఫ్ఏయూ, హైదరాబాద్. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్-ఏయూ, వైజాగ్. శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ - హైదరాబాద్ ఎస్ఏఆర్ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్-అగిరిపల్లి, కృష్ణాజిల్లా. వివరాలకు: http://www.nata.in రిజిస్ట్రేషన్ ఆగస్టు 18 వరకు www.nata.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు రూ.1,250 డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. ఆన్లైన్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో జరిగే ఈ పరీక్షలో 40 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. అభ్యర్థిలోని పరిశీలనాత్మక, సృజ నాత్మక శక్తి, భావ వ్యక్తీకరణ, ఆలోచనా శక్తిని పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. -
ఇండియన్ నేవీ
జాబ్ పాయింట్ లా కేడర్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) ఇండియన్ నేవీలో లా కేడర్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) కోర్సు 2017, జనవరిలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శిక్షణ, ఎంపిక విధానం, వేతనం తదితర వివరాలు... అర్హతలు 55 శాతం మార్కులతో లా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 1990, జనవరి 2 - 1995, జనవరి 2 మధ్య జన్మించినఅవివాహితులు మాత్రమే అర్హులు. ప్రస్తుతం లా చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవడం కుదరదు. శారీరక ప్రమాణాలు పురుషులు కనీసం 157 సెం.మీ. ఎత్తు; మహిళలు కనీసం 152 సెం.మీ. ఎత్తు ఉండాలి. శిక్షణ ఎంపికైన అభ్యర్థులకు సబ్ లెఫ్టినెంట్ హోదా కల్పించి కేరళలోని నేవల్ అకాడమీలో శిక్షణ ఇస్తారు. వేతనం సబ్ లెఫ్టినెంట్కు పే బ్యాండ్ 3/ రూ.15,600 - 39,100 స్కేల్తో 5,400 గ్రేడ్ పేతో వేతనం చెల్లిస్తారు. అదనంగా ఇన్స్ట్రక్షనల్, యూనిఫాం, హార్డ్ ఏరియా, ఇంటి అద్దె, రవాణా అలవెన్సులు కూడా ఉంటాయి. అన్ని కలుపుకొని సుమారు నెలకు రూ.74,100 వరకు పొందవచ్చు. గ్రూప్ ఇన్సూరెన్స్ అండ్ గ్రాట్యుటీ, ఇతర సదుపాయాలు ఉంటాయి. ఎంపిక లా డిగ్రీలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ) షార్ట్లిస్ట్ చేస్తుంది. ఇందుకోసం కటాఫ్ మార్కులను నిర్ణయించే పూర్తి అధికారం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (నేవీ)కి ఉంటుంది. షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థులకు 2016 జూన్- సెప్టెంబర్ మధ్య బెంగళూరు/ భోపాల్/ కోయంబత్తూర్/ విశాఖపట్నంలో ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూలను అయిదు రోజుల పాటు రెండు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశలో ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పర్ఫెక్షన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు. ఈ దశలో అర్హత సాధించని అభ్యర్థులను అదే రోజున వెనక్కి పంపుతారు. రెండో స్టేజ్కు ఎంపికైన అభ్యర్థులకు సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ దశలను విజయవంతంగా పూర్తిచేసిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఖాళీల ఆధారంగా శిక్షణకు ఎంపికైన వారితో తుది జాబితా రూపొందిస్తారు. కోర్సుకు ఎంపికైన అభ్యర్థులు కేరళలోని ఇండియన్ నేవల్ అకాడమీలో నేవల్ ఓరియెంటేషన్ కోర్సులో ట్రైనింగ్ పొందుతారు. తర్వాత శిక్షణలో భాగంగా వేర్వేరు నేవల్ ట్రైనింగ్ యూనిట్లలో ప్రొఫెషనల్ ట్రైనింగ్కు పంపిస్తారు. శిక్షణ ప్రారంభమైన నాటి నుంచి లేదా ప్రాథమిక శిక్షణ పూర్తయిన తర్వాతి నుంచి అభ్యర్థులు రెండేళ్లపాటు ప్రొబేషన్లో ఉంటారు. షార్ట్ సర్వీస్ కమిషన్ లా కేడర్లో ప్రవేశం పొందిన అభ్యర్థులకు మొదట పదేళ్ల సర్వీస్ మంజూరు చేస్తారు. తర్వాత అభ్యర్థుల ఆసక్తి, అవసరం, పనితీరు ఆధారంగా మరో నాలుగేళ్లు పొడిగించే అవకాశం ఉంటుంది. దరఖాస్తు దరఖాస్తుకు గడువు ముగిసింది. దరఖాస్తు ప్రింటవుట్కు ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్ల నకలు పత్రాలను జతపరిచి పోస్ట్ బాక్స్ నంబర్ 4, చాణక్య పురి పోస్ట్, న్యూఢిల్లీ-110021 చిరునామాకు సాధారణ పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి. వెబ్సైట్: www.joinindiannavy.gov.in -
తెలంగాణ-పర్యాటకం
కాంపిటీటివ్ గెడైన్స్ : తెలంగాణ ఎకానమీ ఆధునిక ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగానికి ప్రాధాన్యం పెరుగుతోంది. పర్యాటక రంగ అభివృద్ధి వల్ల అధిక రాబడితో పాటు విదేశీ మారక ద్రవ్య ఆర్జన పెరగటంతో ప్రభుత్వాలు ఈ రంగానికి ప్రాధాన్యమిస్తున్నాయి. పర్యాటకం ద్వారా అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, చైనా, ఇంగ్లండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, టర్కీ, ఆస్ట్రియా తదితర దేశాలకు ఎక్కువ ఆదాయం లభిస్తోంది. మానవ సమాజం సాంఘికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా సాధించిన ప్రగతికి తోడ్పాటునందించిన రంగాల్లో పర్యాటకం ఒకటి. తెలంగాణ రాష్ర్టంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ‘రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ’ ఏర్పాటైంది. దీన్ని 2014, జూన్ 2న ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వేరుచేశారు. రాష్ట్రంలో పర్యటించే పర్యాటకులకు అవసరమైన మౌలికవసతులు, ఇతర సౌకర్యాలు కల్పించటం పర్యాటక అభివృద్ధి సంస్థ లక్ష్యం. దీని వద్ద వోల్వో, మెర్సిడెస్ బెంజ్ కోచ్లున్న 63 వాహనాలు ఉన్నాయి. ముఖ్య పర్యాటక కేంద్రాల్లో హరిత హోటళ్లను నిర్వహిస్తోంది. విభిన్న పర్యాటక ప్యాకేజీలు అందిస్తూ దేశ, విదేశ పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటోంది. నిజాం ప్యాలెసెస్ టూర్, హైదరాబాదీ హెరిటేజ్ ఫ్లేవర్ వీకెండ్ ప్యాకేజ్, టెంపుల్ కమ్ హిల్ స్టేషన్ టూర్, కాకతీయ హెరిటేజ్ టూర్ వంటి ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ప్యాకేజీలను ఇరుగుపొరుగు రాష్ట్రాలతో అనుసంధానించేందుకు పర్యాటక సంస్థ చర్యలు తీసుకుంది. నదీ ప్రయాణాలు, జల విహారాలకు అవసరమైన పడవలను కూడా సంస్థ నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ చర్యలు ♦ యాదగిరి గుట్ట దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లను ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 400 ఎకరాల్లో నరసింహ అభయారణ్యాన్ని అభివృద్ధిపరచటంతో పాటు మరో 1600 ఎకరాల్లో ఉద్యానవనాలు, కల్యాణమండపాలు, ధ్యానమందిరాలు, వేద పాఠశాల, కాటేజీలను ఏర్పాటు చేస్తారు. ♦ నల్గొండ-రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని రాచకొండలో దాదాపు 2,000 ఎకరాల విస్తీర్ణంలో ‘మెగా సినిమా సిటీ’ అభివృద్ధికి ప్రభుత్వం సంకల్పించింది. ♦ వైద్య పర్యాటక కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తగిన ప్రణాళికలు రూపొందించింది. ♦ బతుకమ్మ ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. 2015లో ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసింది. ఏటా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సంకల్పించింది. బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా పర్యాటక ప్యాకేజీలను టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రారంభించింది. ఈ విశిష్టమైన పండగకు దేశంలోని అన్ని ప్రాంతాల పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటోంది. ♦ అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే ఉత్సవం మేడారం జాతర. 2016, ఫిబ్రవరిలో జరిగిన మేడారం జాతరలో లక్షల మంది పాల్గొన్నారు. ఈ జాతర వైపు దేశ ప్రజలను ఆకర్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ♦ నాగార్జున సాగర్, కిన్నెరసాని, రామప్ప, కొత్తగూడెం, గజ్వేల్ ప్రాంతాల్లో పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ‘నీతి ఆయోగ్’ రూ.33 కోట్లు కేటాయించింది. ♦ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యాటక కేంద్రాల అభివృద్ధికి సమగ్ర జిల్లా ప్రణాళికల రూపకల్పనకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ♦ ప్రభుత్వం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం, కొండగట్టులోని హనుమాన్ ఆలయం, ధర్మపురిలోని నరసింహ స్వామి ఆలయం, వరంగల్ జిల్లా పాలంపేటలోని రామప్ప ఆలయం, మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్లోని జోగులాంబ ఆలయాల వద్ద పర్యాటకులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ♦ తెలంగాణ జిల్లాల్లో తక్కువ ప్రాచుర్యం పొందిన పర్యాటక కేంద్రాల్లో తగిన సౌకర్యాలు కల్పించటం ద్వారా ఆయా ప్రాంతాలు ఎక్కువ పర్యాటకులను ఆకర్షించేలా చేయటంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ♦ కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ గ్రామీణ పర్యాటకానికి సంబంధించి గుర్తించిన వాటిలో నల్గొండలోని పోచంపల్లి గ్రామీణ పర్యాటక ప్రాజెక్టు, ఆదిలాబాద్లోని నిర్మల్ గ్రామీణ పర్యాటక ప్రాజెక్టు, వరంగల్ జిల్లాలోని చేర్యాల గ్రామీణ పర్యాటక ప్రాజెక్టు, పెంబర్తి గ్రామీణ పర్యాటక ప్రాజెక్టులున్నాయి. ♦ భారత ప్రభుత్వం సహకారంతో కుతుబ్షాహీ సమాధుల పరిరక్షణ, ఆధునికీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ♦ ప్రసిద్ధ సమాధుల పరిరక్షణ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వంతో అగాఖాన్ ట్రస్ట్ ఇప్పటికే చేతులు కలిపింది. ఆర్థిక వ్యవస్థపై పర్యాటక రంగ ప్రభావం ♦ అధిక ఆర్థిక వృద్ధి సాధనకు పర్యాటక రంగం ముఖ్య సాధనంగా ఉపకరిస్తోంది. మధ్యతరగతి ప్రజల ఆదాయాల పెరుగుదలతో పాటు పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వ చర్యల కారణంగా పర్యాటక రంగ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ధనాత్మకంగా ఉంటోంది. ♦ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న తెలంగాణలో నిర్మాణాత్మక మార్పు ద్వారా ఆధునిక ఆర్థిక వృద్ధి జరగాలంటే పర్యాటక రంగాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవాలి. ♦ పర్యాటక రంగ అభివృద్ధి వల్ల రాష్ట్రంలో రవాణా రంగం, విద్య, ఆరోగ్యం, బ్యాంకింగ్, కుటీర పరిశ్రమలు, పాడిపరిశ్రమ, పౌల్ట్రీ రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది. ♦ ఆదాయం, ఉపాధికల్పన పెరుగుదలతో పాటు పేదరిక నిర్మూలన, సుస్థిర మానవాభివృద్ధి సాధనకు పర్యాటక రంగం దోహదపడుతుంది. ♦ పర్యావరణ పరిరక్షణ, అంతర సాంస్కృతిక అవగాహన పెంపునకు పర్యాటక రంగం తోడ్పడుతుంది. ♦ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో వివిధ ప్రాజెక్టులు చేపట్టినప్పుడు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పర్యాటకం, పౌరవిమానయానం, ఆతిథ్య పరిశ్రమల్లో పీపీపీ నమూనాను ప్రవేశపెడితే ప్రభుత్వ వ్యయభారం తగ్గుతుంది. ♦ పర్యాటక రంగం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించవచ్చు. బహుళ ప్రయోజన మౌలిక వసతుల అభివృద్ధిని పర్యాటక రంగం ప్రోత్సహిస్తుంది. అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి, ఇతర ఉత్పాదక కార్యకలాపాల అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. తద్వారా రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి(జీఎస్డీపీ)లో వృద్ధి అధికమవుతుంది. ♦ పర్యాటక రంగం పరంగా అంతగా ప్రాచుర్యం చెందని ప్రాంతాలపై దృష్టిసారించటం ద్వారా ఆయా ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు అభివృద్ధి చెంది, ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధికి మార్గం సుగమమవుతుంది. - డాక్టర్ తమ్మా కోటిరెడ్డి ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్ -
ఇంటర్వ్యూలు
* నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) కన్సల్టెంట్, డీటీపీ ఆపరేటర్, జేపీఎఫ్, కంప్యూటర్ టైపిస్ట్, ఎంటీఎస్ పోస్టులకు:మే 18,19 * ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోస్పియర్ టెక్నాలజీ జేఆర్ఎఫ్, ప్రాజెక్ట్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు: మే 17, 18 * సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (సీసీఆర్హెచ్)లో సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు : మే 28 -
గిరగిరా తిరిగితే ఎందుకు పడిపోతాం?
స్కూల్ ఎడ్యుకేషన్ నేలపై నిలబడి మన కాళ్లమీద వృత్తాకారంలో గిరగిరా తిరిగినప్పుడు, లేదా మన తలను వృత్తాకారంలో తిప్పినప్పుడు ఆ పని చేస్తున్నంతసేపూ మనకు ఏమీ అనిపించనప్పటికీ, ఆపిన వెంటనే కళ్లు తిరిగి పడిపోయినట్లుగా ఉంటుంది. మనం సరిగ్గా నిలబడలేక వెంటనే కూర్చుండిపోతాం. ఒక్కోసారి కిందపడిపోతాం కూడా. ఇలా ఎందుకు జరుగుతుందంటే... మన చెవుల లోపలి భాగంలో ఒక రకమైన సంచుల్లాంటి నిర్మాణాలు (కాక్లియా) కొన్ని ఉంటాయి. వీటిలో ఒక ద్రవం, ఆ ద్రవంలో కొన్ని స్ఫటికాల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి మన సమతుల్యతను నియంత్రిస్తాయి. మన తలని గిరగిరా తిప్పినప్పుడు ఆ ద్రవంలోని స్ఫటికాలు కూడా అందుకు అనుగుణంగా తిరిగి, సంచుల గోడలను తాకి వాటిపై ఒత్తిడి కలిగిస్తాయి. దాంతో వీటిని అంటిపెట్టుకుని ఉండే నాడులు ఆ సంకేతాలను మెదడుకి అందిస్తాయి. మెదడు అందుకు అనుగుణంగా స్పందిస్తుంది. మనం గిరగిరా తిరిగినప్పుడు మన చెవుల్లోని ద్రవపు సంచుల్లోని స్ఫటికాలు కూడా తిరుగుతాయి. అయితే మనం ఆగిపోయిన వెంటనే అవి మళ్లీ తమ పూర్వ స్థితికి చేరుకోలేవు. దాంతో కొంతసేపటిదాకా అసలేం జరుగుతుందో మన శరీర వ్యవస్థకు అర్థంకాదు. ఇలాంటి సందర్భాల్లోనే మనం సంతులతను కోల్పోయి కిందపడతాం. -
సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్..
టాప్ స్టోరీ ఎంటర్ప్రెన్యూర్షిప్.. స్వయం ఉపాధికి ఆధునిక పేరు! ఇటీవల కాలంలో అత్యంత ప్రాధాన్యం ఉంటున్న విభాగమిది! ఇందులో ప్రస్తుతం మరో కొత్త విభాగం కీలకంగా మారుతోంది. అదే.. సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్. సామాజిక అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడే సంస్థలను స్థాపించడమే సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఇందులోని అవకాశాలపై విశ్లేషణ.. ఒకవైపు కెరీర్ పరంగా స్వయం ఉపాధి లక్ష్యాన్ని, మరోవైపు సామాజిక అవసరాలను తీర్చాలనే ఆకాంక్షను నెరవేరేలా చేస్తోంది సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఇది సామాజికంగా నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలు మొదలు అభివృద్ధి సమస్యల వరకు పరిష్కారాలను చూపుతోంది. సామాజిక అభివృద్ధికి తద్వారా దేశాభివృద్ధికి బాటలు వేస్తోంది. ఎన్నో రంగాలు * సాధారణ ఎంటర్ప్రెన్యూర్షిప్తో పోల్చితే సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్లో ఆదాయం కొంత తక్కువ ఉంటుంది. కానీ, సమాజాభివృద్ధికి తోడ్పడ్డామన్న సంతృప్తికి కొదవ ఉండదు. * ప్రస్తుతం దేశంలో ఐఐటీల నుంచి సాధారణ కళాశాలల విద్యార్థుల వరకు సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్పై మొగ్గుచూపుతున్నారు. ఔత్సాహికులు స్టార్టప్ సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఐఐటీ చెన్నైకు చెందిన కృష్ణన్ అనే విద్యార్థి రైల్వేస్టేషన్లలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్లాంట్ను ఏర్పాటు చేసి, రూ.2కు లీటర్ నీటిని అందిస్తున్నారు. అమృత ధార పేరిట నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టు ఆలోచన.. ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్’ సంస్థ నిర్వహించిన పోటీలో విజయం సాధించింది. దీంతో ఆ విద్యార్థి ఆర్థిక సహకారం పొందాడు. సోషల్ ఎంటర్ప్రెన్యూర్ షిప్ సంస్థలకు వివిధ సంస్థల నుంచి మద్దతు లభిస్తోంది. విద్యలో సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ విద్యా రంగానికి కూడా విస్తరిస్తోంది. ఆన్లైన్ ట్యుటోరియల్స్ సంస్థలు, ఈ-లెర్నింగ్ సంస్థలు, వెబ్సైట్లు వంటివన్నీ ఎడ్యుకేషన్ రంగంలో సోషల్ ఎంటర్ప్రెన్యూర్స్గా పరిగణించవచ్చు. వీటికి కూడా సీడ్ ఫండింగ్ ఏజెన్సీల నుంచి మద్దతు లభిస్తోంది. హైదరాబాద్కు చెందిన Edutor ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎంటర్ప్రెన్యూర్ సంస్థకు దాన్ని ఏర్పాటు చేసిన రెండేళ్లలోనే హైదరాబాద్ ఏంజెల్స్ సంస్థ రూ.2 కోట్లు సీడ్ క్యాపిటల్ అందించింది. ఉద్యోగావకాశాలు సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ విభాగంలో సంస్థల కార్యకలాపాలు విస్తరిస్తుండటంతో ఇందులో ఉద్యోగ అవకాశాలు అధికమవుతున్నాయి. ఈ విభాగంలో వచ్చే రెండేళ్లలో 70 వేల కొత్త ఉద్యోగాలు లభించే అవకాశమున్నట్లు అంచనా. కానీ ఇతర ఎంటర్ప్రెన్యూర్ సంస్థలతో పోల్చితే వీటిలో వేతనాలు కొంత తక్కువగా ఉంటాయి. కార్పొరేట్ సంస్థలు సైతం కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీం ప్రకారం సంస్థలు తమ నికర లాభంలో రెండు శాతం సామాజిక అభివృద్ధికి కేటాయించాలి. ఈ క్రమంలో పలు కార్పొరేట్ సంస్థలు సోషల్ ఎంటర్ప్రెన్యూర్స్గా కొత్త వెంచర్లు ప్రారంభిస్తున్నాయి. లాభాపేక్ష లేకుండా సేవలు అందిస్తున్నాయి. విద్య, వైద్యం, ఆరోగ్యం, పారిశుద్ధ్య రంగాల్లో స్టార్టప్ ఔత్సాహికులకు నిధులను కూడా సమకూరుస్తున్నాయి. కేవలం స్వచ్ఛంద సంస్థలు సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్లోకి అడుగుపెడతాయనుకుంటే పొరపాటు. పూర్తిస్థాయిలో కమర్షియల్గా మారిన రంగాల్లోనూ సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సంస్థల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన IMPRINT పథకంలో సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్నకు పెద్దపీట వేశారు. ఫండింగ్ ఏజెన్సీలు ACUMEN ఫండ్ SONG: ఈ సంస్థ చిన్న, మధ్య తరహా సోషల్ ఎంటర్ప్రైజెస్కు ఆర్థిక సహకారం అందిస్తోంది. ఆవిష్కార్ ఇండియా మైక్రో వెంచర్ క్యాపిటల్: ముంబైకు చెందిన ఈ సంస్థ చెత్త నిర్వహణ, ఇంధనం, హస్తకళలు తదితరాలకు ఆర్థిక సహకారం అందిస్తోంది. గ్రే మేటర్స్ క్యాపిటల్ ఫౌండేషన్: హైదరాబాద్కు చెందిన ఈ సంస్థ మైక్రో ఫైనాన్స్, ఎడ్యుకేషన్ రంగంలో సోషల్ ఎంటర్ప్రెన్యూర్స్కు ఫండింగ్ సదుపాయం కల్పిస్తోంది. సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ను ప్రోత్సహించేందుకు ఇండియా ఇన్క్లూజివ్ ఇన్నోవేషన్ ఫండ్ పేరుతో ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. సోషల్ ఎంటర్ప్రెన్యూర్స్కు ఓర్పు అవసరం. ప్రారంభంలో లక్షిత క్లయింట్లను చేరుకోవడం కొంత కష్టంగా ఉంటుంది. నిధుల కోసం సీడ్ ఏజెన్సీలను మెప్పించడంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఇటీవల కాలంలో స్టార్టప్ కాంపిటీషన్లలో సోషల్ స్టార్టప్ ఔత్సాహికుల సంఖ్య పెరగడంతో ఫండింగ్ ఏజెన్సీల ఆలోచన దృక్పథంలోనూ మార్పు వస్తోంది. - రామ్ గొల్లమూడి, ఫౌండర్, ఎడ్యూటర్ -
సీఎంఏ.. సర్వీసెస్ to సాఫ్ట్వేర్..
గెస్ట్ కాలమ్ ఉజ్వల అవకాశాలకు అందిస్త్తున్న సేవరంగం నుంచి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సంస్థల వరకు అన్నింటా కాస్ట్ అండ్ అకౌంటెన్సీ విభాగానిది కీలకభూమిక. విశ్లేషణా నైపుణ్యం, ప్రశ్నించే లక్షణం ఉన్న అభ్యర్థులు అకౌంటెన్సీ కోర్సుల్లో తేలిగ్గా విజయం సాధించొచ్చు అంటున్న.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా -హైదరాబాద్ చాప్టర్ చైర్మన్, విజయ్ కిరణ్ అగస్త్యతో గెస్ట్ కాలం... కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్సులు క్లిష్టమైనవి! ఎంత చదివినా వీటిలో ఉత్తీర్ణత సాధించడం కష్టం! అనే అభిప్రాయాలు చాలా మంది విద్యార్థుల్లో ఉన్నాయి. ఇలాంటి భావనల వల్లే ఈ కోర్సుల్లో ప్రవేశించాలనే ఉత్సాహం ఉన్నవారు కూడా వెనకడుగు వేస్తున్నారు. భయాన్ని వీడి ముందడుగేస్తే..ఈ కోర్సుల్లో సులభంగా విజయం సాధించవచ్చనే విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి. ఔత్సాహికులు ఇంటర్మీడియెట్ అర్హతతోనే కోర్సులో ప్రవేశించవచ్చు. మూడు దశలుగా (ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్) ఉండే ఈ కోర్సు పూర్తిచేసిన వారికి కలర్ఫుల్ కెరీర్ ఆప్షన్లు ఖాయం. ప్రొడక్షన్కే పరిమితం కాదు గతంలో కాస్ట్ అకౌంటెంట్లకు ఉత్పత్తి సంస్థల్లో మాత్రమే అవకాశాలు లభిస్తాయనే అభిప్రాయం ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, టెలికం, సాఫ్ట్వేర్, బీపీవో ఇలా ప్రతి రంగంలోనూ వీరికి అవకాశాలు లభిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం, ఈ కోర్సు పూర్తిచేసిన వారికి.. తక్కువ ఖర్చుతో సంస్థ కార్యకలాపాలను నిర్వహించే నైపుణ్యాలుంటాయని పరిశ్రమ వర్గాలు విశ్వసిస్తుండటమే. దీంతో ఆయా సంస్థలన్నీ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ నిర్వహించి, కొలువులను అందిస్తున్నాయి. అంతర్జాతీయ గుర్తింపు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్సు పూర్తిచేసి సభ్యత్వాన్ని సొంతం చేసుకున్న వారికి అంతర్జాతీయ గుర్తింపు ఉంటుంది. అదే విధంగా వీరికి యూకేకు చెందిన కాస్ట్ అకౌంటింగ్ ఇన్స్టిట్యూట్లు సీఐఎంఏ, ఏసీసీఏలు నిర్వహించే పరీక్షల్లో కొన్ని పేపర్లకు మినహాయింపు ఇస్తున్నాయి. వీటిని పూర్తిచేస్తే కామన్వెల్త్ దేశాలన్నింటిలోనూ ఉద్యోగాలు చేసే అవకాశం లభిస్తుంది. ఫస్ట్ అటెంప్ట్లోనే.. సీఎంఏ కోర్సు (మూడు దశలు)ను తొలి ప్రయత్నంలోనే పూర్తిచేయడం కష్టమనే అభిప్రాయం సరికాదు. ప్రాక్టికల్ అప్రోచ్, అనలిటికల్ థింకింగ్తో అంశాలను అధ్యయనం చేస్తే అన్ని దశలనూ తొలి ప్రయత్నంలోనే పూర్తి చేయొచ్చు. ‘ఫౌండేషన్’ నుంచే పునాదులు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్సులో ఫౌండేషన్ స్థాయిలోనే ప్రవేశిస్తే విద్యార్థుల్లో బలమైన పునాది ఏర్పడుతుందని నేను భావిస్తాను. ఇంటర్/10+2 అర్హతతో ఫౌండేషన్ కోర్సు పరీక్షలు పూర్తిచేస్తే ఇంటర్మీడియెట్లో ప్రవేశం లభిస్తుంది. దీంతో పాటు డెరైక్ట్ ఎంట్రీ స్కీం కింద బ్యాచిలర్ డిగ్రీ విద్యార్థులు నేరుగా ఇంటర్మీడియెట్ కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు. కానీ, ఈ రంగంపై నిజమైన ఆసక్తి ఉన్న వారు ఫౌండేషన్ నుంచే ఈ దిశగా అడుగులు వేయడం ప్రయోజనకరం. ఏటా రెండు సార్లు (జూన్, డిసెంబర్) నిర్వహించే ఇంటర్మీడియెట్ పరీక్షలకు జూలై 31, జనవరి 31లోపు; నాలుగు సార్లు (మార్చి, జూన్, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహించే ఫౌండేషన్ పరీక్షలకు వరుసగా అక్టోబర్ 31, జనవరి 31, ఏప్రిల్ 30, జూలై 31లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెబినార్స్, ఆన్లైన్ లెక్చర్స్ సీఎంఏ కోర్సు రెగ్యులర్ కోచింగ్ తీసుకోలేని విద్యార్థులకు వెబినార్స్ ద్వారా ఆన్లైన్ లెక్చర్స్, అదే విధంగా ఆన్లైన్ ఇంటరాక్టివ్ సెషన్స్ అందుబాటులోకి తెచ్చాం. ముఖ్యంగా కామర్స్ సంబంధిత ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు నా పరంగా ఇచ్చే సలహా... ఒక సమస్యకు సంబంధించి ఎలా? అనే దృక్పథం నుంచి ఎందుకు? అనే దృక్పథాన్ని అలవర్చుకోవాలి. ఎందుకు? అనే ప్రశ్న తలెత్తినప్పుడే మనలో ఆ సమస్యను పరిష్కరించాలనే ఆసక్తి పెరుగుతుంది. ఈ క్రమంలో అనేక నైపుణ్యాలను అలవడుతాయి. అభ్యర్థులు ప్రారంభం నుంచే చదవడం, వ్యక్తీకరించడం, ప్రణాళిక- అమలు .. వంటి అంశాలను ఆచరణలో పెడితే విజయవంతంగా కోర్సును పూర్తి చేసుకొని కలర్ఫుల్ కెరీర్కు బాటలు వేసుకోవచ్చు. -
కెరీర్ కౌన్సెలింగ్
I want to become an air hostess. Please tell me about the institutes that provide the training? - Rupa, Hyderabad ⇒ The basic requirement to pursue career as Air hostess is, formal training in the specific area. Then there are some age, height and weight restrictions. The candidate should have normal eye sight and be proficient in English and Hindi. Proficiency in foreign languages is an added advantage. The recruitment of air hostesses involves stages like written test and interview. The following are the details of some institutes offering air hostess training: ⇒ Fly High Institutes of Air Hostess and Hospitality, Sri Nagar Colony, hyderabd offers six-months diploma in Air hostess training. The eligibility criteria are +2 as academic qualification and age between 18-24. The admission is based on performance at personal interview. ⇒ Avalon Academy, Masab Tank, hyderabd. offers Diploma in Cabin Crew. The eligibility criterion is +2. - T. Muralidharan T.M.I. Network -
Rawat proved majority in Uttarakhand
Competitive Guidance Current Affairs International ♦ Brazil's Dilma Rousseff to face impeachment trial Brazil's President Dilma Rousseff is to face trial after the Senate voted to impeach and suspend her. Ms Rousseff is accused of illegally manipulating finances to hide a growing public deficit ahead of her re-election in 2014, which she denies. Senators voted to suspend her by 55 votes to 22. ♦ Switzerland honours Yash Chopra with a Bronze Statue Switzerland Government has honoured veteran filmmaker Yash Chopra by unveiling a bronze statue at Interlaken. Chopra was known for opening a legacy of South Asian tourists flocking to Switzerland and spend much time in the country besides shooting his movies. Economy ♦ Rs 100 Commemorative Coin on Maharana Pratap released A commemorative coin of Rs 100 and a circulation coin of Rs 10 were released today on the occasion of 475th birth anniversary of Maharana Pratap. Also the Union Culture and Tourism ministry has agreed to release a sum of Rs 9.5 Crore to the Rajasthan state government for the development of the Indoor Stadium at Khel Gaon, in memory of the great warrior. ♦ Govt notifies relaxed FDI norms for ARCs The Union government has notified the relaxed foreign investment norms in asset reconstruction companies (ARCs), as it looks at effectively dealing with the burgeoning bad debts in Indian banking system. The department of industrial policy and promotion permitted 100% foreign direct investment in asset reconstruction companies to come in without any prior government approval under the automatic route. Earlier, while 49% FDI was permitted under the automatic route, investors needed prior government approval to increase their stake beyond 49%. ♦ India Mauritius sign DTAA The Protocol for the amendment of the Convention for the avoidance of double taxation and the prevention of fiscal evasion with respect to taxes on income and capital gains between India and Mauritius was signed by both the countries. National ♦ Asia's first Rice Technology Park in Karnataka The Karnataka Government has decided to establish Asia's first Rice Technology Park at Gangavati in Koppal district. Maize Technology Park is to come up at Ranebennur in Haveri district. The Rice Technology Park is to be set up in 315 acre at Karatagi in Gangavathi of Koppal district. The park will be the focal point of agro-based activity in the region catering to most parts of the Tungabhadra Command Area. Sona Masuri, which is a lightweight and aromatic variety of rice, is grown pre-dominantly in this area. ♦ Harish Rawat proved majority in Uttarakhand Harish Rawat is set to become the Chief Minister of Uttarakhand once again. He proved his majority in the floor of the house. With this, the chaos has come to an end. The floor test to prove the Congress government's majority was held after a political battle that lasted over a month with the Centre imposing President's Rule on March 27 after nine Congress MLAs voted with the BJP in the House on the budget-related Appropriation Bill on March 18. The House Speaker disqualified the rebels, and the decision was upheld later by the High Court and Supreme Court, which paved the way for the floor test. ♦ '112' to be active from January 1 The single emergency number '112' will be operational throughout India from January 1, 2017 to help people reach immediate services of police, ambulance and fire department. It is similar to the '911' all-in-one emergency service in the US. The service will also be accessible even through such SIMs and landlines whose outgoing call facility has been stopped or temporarily suspended. Persons in news ♦ Sunil Lamba: Vice-Admiral Sunil Lamba will be the next Chief of the Indian Navy. He will take over on 31st of May. He will be the 23rd Chief of Indian Navy. ♦ Enda Kenny: Enda Kenny has been re-elected as Irish Prime Minister. ♦ Sadiq Khan: Sadiq Khan has been elected the new Mayor of London - boosting Labour Party after it slumped in Scotland's elections. Mr Khan is the city's first Muslim mayor. Sports ♦ Djokovic emerged victorious Novak Djokovic beat defending champion Andy Murray in the Madrid Open final. Djokovic now moved ahead of Spain's Rafael Nadal with a record 29 ATP Masters 1000 titles. ♦ India @ fourth in jr. shooting WC The Indian squad ended their campaign at the ISSF Junior World Cup with a creditable fourth place finish in the medals table. The Indian juniors had an overall tally of three gold, four silver and three bronze medals in the competition, the winners are…. * Rituraj Singh won two gold medals in both the individual and team events of the men's 25m Standard Pistol. * Shivam Shukla won gold and a silver in pistol event * Arjun Das won gold and a bronze ♦ Among the junior women…. * Yashaswini Singh Deswal- Two silver medals, both in the individual and team sections of the 10 metre Air Pistol event. Italy topped the table with seven gold, four silver and one bronze. Russia stood second. Senior World cup is scheduled on from May 19th, will be held in Munich, Germany. - Rajendra Sharma Current Affairs Faculty, Hyderabad -
దరఖాస్తు చేశారా?
* చెన్నైలోని హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో ఇండస్ట్రియల్ క్యాడర్, నాన్ ఇండస్ట్రియల్ క్యాడర్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: మే 12 * టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్(టిస్)లో నాన్ ఫ్యాకల్టీ పోస్టుల దరఖాస్తుకు చివరి తే ది: మే 16 * ఐఐటీ నాగ్పూర్లో నాన్ టీచింగ్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: మే 20 * ఇస్రోలో వివిధ విభాగాల్లో సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: మే 25 -
ఉద్యోగాలు
యూఐఐసీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్.. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (ఏవో: స్కేల్ -1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (స్కేల్-1): 300 ఫైనాన్స్: 43 అర్హత: చార్టెడ్ అకౌంటెంట్ (ఐసీఏఐ)/ కాస్ట్ అకౌంటెంట్ (ఐసీడబ్ల్యూఏ)/ఎంబీఏ ఫైనాన్స్/ఎంకాం/ బీకాం. సివిల్ ఇంజనీరింగ్: 5 అర్హత: బీఈ/బీటెక్ (సివిల్ ఇంజనీరింగ్) లీగల్: 15 అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ‘లా’ డిగ్రీ. లాయర్గా మూడేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు రెండేళ్లు సరిపోతుంది. మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్: 15 అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ యాక్చురీ: 2 అర్హత: స్టాటిస్టిక్స్/మ్యాథమెటిక్స్/యాక్చూరియల్ సైన్స్లో డిగ్రీ ఉత్తీర్ణత జనరలిస్ట్: 220 అర్హత: ఏదైనా డిగ్రీ వయోపరిమితి: 2016, మార్చి 31 నాటికి 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంది. ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా. దరఖాస్తు ఫీజు: రూ.600 (ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.100) దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేది: మే 6, 2016 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేది: మే 17, 2016 పరీక్ష తేది: జూన్ 12, 2016 వెబ్సైట్: www.uiic.co.in ఓయూలో బీకాం (ఆనర్స్) ఉస్మానియా యూనివర్సిటీ.. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - 2016 ద్వారా మూడేళ్ల బీకాం (ఆనర్స్) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత: ఇంటర్మీడియట్, దరఖాస్తు ఫీజు: రూ.400 దరఖాస్తు విధానం: యూనివర్సిటీ నిర్దేశించిన కాలేజీల్లో ఫీజు చెల్లించి దరఖాస్తు పొందవచ్చు. కాలేజీల జాబితా వెబ్సైట్లో పొందుపరిచారు. ఎంపిక విధానం: కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2016 ర్యాంక్ ఆధారంగా దరఖాస్తు చివరి తేది: మే 18, 2016 వెబ్సైట్: www.osmania.ac.in ఓయూలో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ (పీజీడీడీఐఎం) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత: లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో డిగ్రీ/పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆఖరి సంవత్సరం విద్యార్థులు అర్హులే. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చివరి తేది: మే 7, 2016 అపరాధ రుసుముతో దరఖాస్తు చివరి తేది: మే 14, 2016 వెబ్సైట్: www.osmania.ac.in -
ఈ కలం.. జన గళం! 'జర్నలిస్టు'
నేచర్ ఆఫ్ జాబ్ సమాజంతో దగ్గరి సంబంధం ఉన్న ఉద్యోగం జర్నలిస్ట్. మిగిలిన ఉద్యోగాలతో పోలిస్తే ఇది ఎంతో వైవిధ్యమైన వృత్తి. రాసే వార్తలో ప్రతి పదం వాస్తవికంగా ఉండాలి. ఎందుకంటే జర్నలిస్టులు రాసే ప్రతి అక్షరం ప్రతి రోజూ ఎన్నో లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉంటుంది. ప్రస్తుతం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు రెండూ శరవేగంగా విస్తరిస్తున్న క్రమంలో జర్నలిజం యువతకు మంచి కెరీర్ ఆప్షన్గా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ ఉద్యోగ స్వభావం, అవసరమైన స్కిల్స్ తదితరాలపై కథనం.. రెండు విభాగాలు జర్నలిజంలో ముఖ్యంగా రెండు విభాగాలుంటాయి. ఒకటి బ్యూరో, రెండోది డెస్క్. బ్యూరోలో రిపోర్టర్లుంటారు. సిటీ, స్టేట్, జిల్లాల వారీగా వేర్వేరు బ్యూరోలుంటాయి. రిపోర్టర్లు ఫీల్డ్కు వెళ్లి వార్తను సేకరించి డెస్క్కు చేరవేస్తారు. బ్యూరో మాదిరిగానే డెస్క్లు కూడా సిటీ, స్టేట్, బిజినెస్, స్పోర్ట్స, జిల్లాలు.. ఇలా వేర్వేరుగా ఉంటాయి. డెస్క్లో ప్రాథమికంగా సబ్ ఎడిటర్లు ఉంటారు. రిపోర్టర్లు ఇచ్చిన వార్తల్లోని దోషాలను సవరించి, దానికి మంచి శీర్షిక పెట్టి వార్తగా మలుస్తారు. ఒక వార్తకు సంబంధించి తుది నిర్ణయం డెస్క్దే. పనివేళలు ఎలక్ట్రానిక్ మీడియాలో షిఫ్ట్ల వారీగా పనివేళలు ఉంటాయి. ఇవి ప్రతి వారం మారుతుంటాయి. ప్రింట్ మీడియాలో డెస్క్ విభాగంలో సాయంత్రం 5 నుంచి రాత్రి 12 గంటల వరకు పని వేళలు ఉంటాయి. బ్యూరో విభాగం... ఆ రోజు ఉదయం నుంచి జరిగిన అంశాలను సాయంత్రానికల్లా వార్తల రూపంలో డెస్క్కు అందిస్తుంది. రిపోర్టర్లు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ.. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా, ఎలాంటి నిర్ణయాలు వెలువడినా వెంటనే వార్తలు రాసి డెస్క్కు అందించాల్సి ఉంటుంది. కావాల్సిన స్కిల్స్ ⇒ జర్నలిస్టు కావాలనుకునే వారికి ప్రాథమికంగా, తప్పనిసరిగా భాషపై మంచి పట్టు ఉండాలి. ⇒ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలన్నింటిపై కనీస అవగాహన ఉండాలి. ⇒ నిరంతరం నేర్చుకునే తత్వం అత్యవసరం. ⇒ ఏది వార్తో, ఏది కాదో గుర్తించే నైపుణ్యం ఉండాలి. ⇒ పనిలో వేగం, కచ్చితత్వం తప్పనిసరి. ఉద్యోగావకాశాలు.. ప్రస్తుతం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు రెండూ విస్తరిస్తున్న నేపథ్యంలో జర్నలిజంలో ఉద్యోగావకాశాలకు ఢోకాలేదనే చెప్పుకోవాలి. టీవీ చానళ్లు, న్యూస్ పేపర్లలో అభ్యర్థులు తమ ఆసక్తికి అనుగుణంగా డెస్క్, బ్యూరో విభాగాల్లో ఉద్యోగాలు పొందొచ్చు. వేతనాలు కెరీర్ ప్రారంభంలో రూ.12 వేల నుంచి రూ. 15 వేల వరకు వేతనం లభిస్తుంది. తర్వాత అభ్యర్థి ప్రతిభ ఆధారంగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఉంటాయి. ⇒ జర్నలిజం ద్వారా ఆదర్శవంతమైన సమాజ నిర్మాణంలో మన వంతు పాత్ర పోషించొచ్చు. ⇒ జర్నలిజం ద్వారా పేదలు, బాధితులకు సాయం చేయొచ్చు. తద్వారా ఆత్మ సంతృప్తి లభిస్తుంది. ⇒ సమాజంలో జర్నలిస్టులకు ప్రత్యేక గౌరవం ఉంటుంది. ⇒ అన్ని రంగాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఆర్జించవచ్చు. ⇒ జర్నలిజంలో కాలంతో పోటీపడి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ⇒ ప్రతి రోజు డెడ్లైన్కు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పని ఒత్తిడి ఎక్కువ. ⇒ సెలవులు తక్కువగా ఉంటాయి. కోర్సులు తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు మాస్ కమ్యూనికేషన్, జర్నలిజంలో కోర్సులు అందిస్తున్నాయి. వీటిని పూర్తిచేయడం ద్వారా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల్లో ఉద్యోగాలు సాధించొచ్చు. ఉస్మానియా విశ్వవిద్యాలయం కోర్సు: ఎంసీజే అర్హత: కనీసం 40% మార్కులతో ఏదైనా డిగ్రీ. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.osmania.ac.in ఆంధ్రా విశ్వవిద్యాలయం కోర్సు: జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అర్హత: ఏదైనా డిగ్రీ. ప్రవేశం: ఏయూసెట్లో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.andhrauniversity.edu.in కాకతీయ విశ్వవిద్యాలయం కోర్సు: మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం అర్హత: ఏదైనా డిగ్రీ. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.kakatiya.ac.in శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కోర్సు: ఎంఏ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం అర్హత: కనీసం 45% మార్కులతో ఏదైనా డిగ్రీ. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.spmvv.ac.in యోగి వేమన విశ్వవిద్యాలయం కోర్సు: కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం అర్హత: ఏదైనా డిగ్రీ. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.yogivemanauniversity.ac.in తెలంగాణ విశ్వవిద్యాలయం కోర్సు: కమ్యూనికేషన్లో ఎంఏ అర్హత: ఏదైనా డిగ్రీ. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.telanganauniversity.ac.in ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (గుంటూరు) లోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్.. దూరవిద్య విధానంలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ అందిస్తోంది. అర్హత: ఏదైనా డిగ్రీ. ప్రవేశం: ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.anucde.info -
స్కాలర్షిప్
కింగ్స్టన్ వర్సిటీలో ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ యునెటైడ్ కింగ్డమ్ (యూకే)లోని కింగ్స్టన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ -2016కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. స్కాలర్షిప్: ఏడాదికి నాలుగు వేల గ్రేట్ బ్రిటన్ పౌండ్లు. అర్హతలు: విద్యార్థులు భారతీయులై ఉండాలి. 2016 సెప్టెంబర్ నాటికి వర్సిటీలో ఏదైనా సబ్జెక్ట్లో ఫుల్టైమ్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులో చేరేందుకు ఆఫర్ లెటర్ పొంది ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక: అకడమిక్ మెరిట్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తుకు చివరితేదీ: మే 31, 2016 వెబ్సైట్: http://www.kingston.ac.uk/ -
స్టెనోగ్రాఫర్స్
(గ్రేడ్-సి, డి ఎగ్జామినేషన్-2016) జాబ్స్ విత్ ఇంటర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి, గ్రేడ్-డి ఎగ్జామినేషన్-2016కి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ విభాగాలు, ఇతర ఉపవిభాగాలు, రాష్ట్రాల వారీగా ఖాళీలను త్వరలో వెబ్సైట్లో ఉంచుతారు. విద్యార్హతలు: ఇంటర్/తత్సమాన కోర్సు ఉత్తీర్ణత వయోపరిమితి: 18-27 ఏళ్లు. - ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఒబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. జనరల్ కేటగిరీ వికలాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులకు ముందుగా రాతపరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించినవారికి స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. రాతపరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో 200 మార్కులకు ఉంటుంది. సమయం 2 గంటలు. తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు. పరీక్షలో మూడు విభాగాలుంటాయి. పార్ట్-1, 2లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. పార్ట్-3లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ విభాగం నుంచి 100 ప్రశ్నలుంటాయి. స్కిల్ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ గ్రేడ్-సి అభ్యర్థులకు నిమిషానికి 100 పదాల వేగం, గ్రేడ్-డి అభ్యర్థులకు 80 పదాల వేగం ఉండాలి. గ్రేడ్-డి అభ్యర్థులకు ఇంగ్లిష్కు 50 ని.లు, హిందీకి 65 ని.లు, గ్రేడ్-సికి ఇంగ్లిష్కు 40 ని.లు, హిందీకి 55 ని.ల సమయమిస్తారు. రాతపరీక్ష సిలబస్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్: అనాలజీ, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, జడ్జ్మెంట్, విజువల్ మెమొరీ, డిస్క్రిమినేటింగ్ అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, నంబర్ సిరీస్, నాన్ వెర్బల్ సిరీస్ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. జనరల్ అవేర్నెస్: వర్తమాన సంఘటనలకు సంబంధించి అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. భారత్, పొరుగు దేశాల సమాచారం తెలుసుకోవాలి. క్రీడలు, చరిత్ర, భౌగోళికం, ఆర్థికం, పాలిటీ, శాస్త్రీయ పరిశోధన తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్: వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినానిమ్స్, యాంటోనిమ్స్, రైటింగ్ ఎబిలిటీని పరీక్షించేలా ప్రశ్నలు వస్తాయి. వివరాలకు: http://ssc.nic.in/ దరఖాస్తుకు చివరి తేది: జూన్ 3, 2016, పరీక్ష తేది: 31 జూలై 2016 దరఖాస్తు రుసుం: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్సర్వీస్మెన్ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఏపీ, తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, గుంటూరు, విశాఖపట్నం. -
ఫలితాల వెల్లడి
⇒ ఏపీ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ⇒ జలమండలి గ్రేడ్-2 టెక్నీషియన్స్ పోస్టులు ⇒ యూపీఎస్సీ: మెడికల్ ఆఫీసర్స్/ రీసెర్చ్ ఆఫీసర్ (హోమియోపతి) రాత పరీక్ష ⇒ యూపీఎస్సీ: స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (యూరాలజీ) ఫైనల్ -
హిమాలయాల్లో సహజంగా పెరిగే మొక్క?
కాంపిటీటివ్ గెడైన్స్ : ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి వివిధ పోటీ పరీక్షల్లో వచ్చేందుకు అవకాశం ఉన్న ప్రశ్నలు, వివరణాత్మక సమాధానాలు.. కిందివాటిని పరిశీలించండి. 1) పత్తి 2) వేరుశెనగ 3) వరి 4) గోధుమ పైవాటిలో ఖరీఫ్ పంటలు ఏవి? ఎ) 1, 4 బి) 2, 3 సి) 1, 2, 3 డి) 2, 3, 4 సరైన సమాధానం: సి వివరణ భారతదేశంలో సంవత్సరాన్ని మూడు వ్యవసాయ రుతువులుగా విభజిస్తారు. అవి 1) ఖరీఫ్ 2) రబీ 3) జైద్. గోధుమ ప్రధానమైన రబీ పంట. దీనికి తక్కువ ఉష్ణోగ్రత, వర్షపాతం సరిపోతుంది. తూర్పు హిమాలయాలు, పశ్చిమ కనుమలు-శ్రీలంక, ఇండో-బర్మన్ ప్రాంతాలను ‘ఎకలాజికల్ హాట్స్పాట్స్’గా ప్రకటించడానికి కింద తెలిపిన వాటిలో మూడు ప్రామాణికతలేవి? 1) జాతుల సంపన్నత్వం (స్పిసీస్ రిచ్నెస్) 2) ఉద్భిజ్జ సంపద సాంద్రత (వెజిటేషన్ డెన్సిటీ) 3) స్థానీయత (ఎండెమిజం) 4) ప్రమాదస్థితి (థ్రెట్ పర్సెప్షన్) 5) వెచ్చటి, తడి వాతావరణాలకు అనుకూలత పొందే వృక్ష, జంతు జాతులు పై అంశాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఎ) 1, 2, 3 బి) 1, 3, 4 సి) 2, 3, 4 డి) 3, 4, 5 సమాధానం: బి వివరణ జాతుల సంపన్నత్వం అంటే ఏదైనా జీవసమాజంలో మిగతా జాతులకన్నా ఓ ప్రత్యేక జాతి సంఖ్యాపరంగా, ఆ ప్రాంత వనరులను వినియోగించుకోవడంలో మిగతా జాతుల కంటే ఆధిపత్యాన్ని కలిగి ఉండటం. స్థానీయత అంటే ఓ ప్రాంతానికి మాత్రమే పరిమితమై జీవిస్తూ, ఇతర ప్రాంతాల్లో పెరుగుదల తక్కువగా ఉన్న జాతులు. తూర్పు హిమాలయాలు, పశ్చిమ కనుమల ప్రాంతాలు, ఇండో-బర్మన్ ప్రాంతాల్లోని జాతుల్లో ఎక్కువగా స్థానీయమైనవి. ఇవి ప్రస్తుతం మానవ చర్యల వల్ల ప్రమాదకర స్థితిని ఎదుర్కొంటున్నాయి. కింది వాక్యాలను పరిశీలించండి (1) టెక్సాస్ అనే మొక్క హిమాలయాల్లో సహజంగా పెరుగుతుంది. (2) దీన్ని ఇటీవల ‘రెడ్ డేటా బుక్’ లిస్ట్లో చేర్చారు (3) దీని నుంచి ‘టాక్సోల్’ అనే డ్రగ్ను తయారు చేస్తారు. దీన్ని ‘పార్కిన్ సాన్స్’ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు. పై వాటి నుంచి సరైన దాన్ని గుర్తించండి (ఎ) 1 (బి) 2, 3 (సి) 1, 2, 3 (డి) పైవన్నీ సరైన సమాధానం: డి వివరణ ఈ మొక్క నుంచి తయారు చేసే టాక్సోల్ డ్రగ్లో గుండె క్యాన్సర్, పార్కిన్సాన్స్, రొమ్ము క్యాన్సర్లను నివారించే గుణాలు ఎక్కువగా ఉన్నందువల్ల దీన్ని ఎక్కువ స్థాయిలో టాక్సోల్ డ్రగ్ను తయారు చేసేందుకు నిర్మూలించారు. అందువల్ల దీన్ని రెడ్ డేటా లిస్ట్లో చేర్చారు. హిమాలయాలు ప్రస్తుతం ఉన్న స్థానంలో లేకపోతే కింది వాటిలో భారతదేశ భూభాగంపై కలిగే ప్రభావాలు ఎలా ఉంటాయి? (1) దేశంలో ఎక్కువ భాగం ఆసియా భూభాగం నుంచి వీచే శీతల గాలుల ప్రభావానికి లోనై ఉండేది. (2) గంగా-సింధు మైదాన ప్రాంతంలో ఇప్పుడున్నంత విస్తీర్ణంలో సారవంతమైన ఒండ్రుమట్టి నేలలు, జీవనదులు ఉండేవి కాదు. వర్షపాత పరిమాణం తక్కువై దుర్భిక్ష ప్రాంతంగా ఉండేది. (3) రుతుపవన విధానం ఇప్పుడున్నట్లు కాకుండా భిన్నమైన రీతిలో ఉండేది. పైవాటి నుంచి సరైనదాన్ని గుర్తించండి. (ఎ) 1 (బి) 1, 3 (సి) 2, 3 (డి) పైవ న్నీ సరైన సమాధానం: డి కింది వాటిలో భారత్-చైనాల మధ్య 2006లో రెండు దేశాల మధ్య వర్తక, వాణిజ్యాలను పెంపొందించేందుకు ఏ కనుమను తెరిచారు? (ఎ) నిథిలా (బి) జెలెప్లా (సి) నాథులా (డి) షిప్కిలా సరైన సమాధానం: సి పశ్చిమ దిశలో ప్రవహించే నర్మద, తపతి లాంటి ద్వీపకల్ప నదులు వాటి నదీ ముఖద్వారాల వద్ద డెల్టాలకు బదులు ఎస్టురీస్ ఏర్పరిచేందుకు కారణం? (1) అతి తక్కువ కాలంతో పాటు, వేగంగా ప్రవహించడంవల్ల (2) పశ్చిమతీర రేఖ తరచూ టైడల్ బోర్స్ తో మునిగిపోవడం వల్ల (3) అవి రవాణా చేసే నిక్షేపాల పరిమాణం తక్కువగా ఉండటం, పగులు లోయ గుండా ప్రవహిండం వల్ల. (4) వాటి ద్వారా రవాణా అయ్యే నిక్షేపాలను వాటి ముఖ ద్వారాల వద్ద నిక్షేపితం చేయకుండా సముద్రంలోకి నెట్టివేయడం వల్ల పైవాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి (ఎ) 1, 3, 4 (బి) 2, 3, 4 (సి) 2, 3 (డి) పైవన్నీ సరైన సమాధానం: ఎ వివరణ పై ప్రశ్నకు సరైన జవాబు గుర్తించాలంటే పగులులోయలు, పశ్చిమ కనుమల భౌమ నిర్మాణంపై సరైన అవగాహన ఉండాలి - ఎ.డి.వి. రమణ రాజు సీనియర్ ఫ్యాకల్టీ, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ -
ఎడ్యు న్యూస్
ఆర్జీయూకేటీ నూజివీడులో ఎంటెక్ ప్రోగ్రామ్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) - నూజివీడు.. కంప్యూటర్ ఇంజనీరింగ్లో ఎంటెక్ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రానిక్స్/మెకానికల్), ఇంటర్, పదోతరగతి ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 55 శాతం మార్కులు ఉండాలి. ఆర్జీయూకేటీ - నూజివీడు నిర్వహించే ఏడు వారాల ‘ఇంట్రడక్టరీ కోర్సు ఇన్ కంప్యూటింగ్’లో 80 శాతంతో ఉత్తీర్ణత తప్పనిసరి. గేట్ 2015/16లో అర్హత సాధించి ఉండాలి. దరఖాస్తు ఫీజు: రూ. 200 (ఎస్టీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.150) డీడీ రూపంలో చెల్లించాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా (పూర్తిచేసిన దరఖాస్తును ప్రింట్ తీసి, ఒరిజనల్ డీడీ కాపీని జతచేసి ఆర్జీయూకేటీ-నూజివీడుకు పోస్ట్ ద్వారా పంపాలి) ఎంపిక విధానం: మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఆన్లైన్ దరఖాస్తు చివరి తేది: మే 23, 2016 ప్రింట్ తీసిన దరఖాస్తును పంపేందుకు చివరి తేదీ: మే 30, 2016 వెబ్సైట్: www.rguktnuz.in -
ఇస్రోలో 375
సైంటిస్ట్ /ఇంజనీర్ పోస్టులు దేశంలో స్పేస్ సైన్స్ అప్లికేషన్స్, టెక్నాలజీలో విశేష కృషిచేస్తున్న సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)! ఇది తాజాగా వివిధ విభాగాల్లో సైంటిస్ట్/ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. యువ ఇంజనీర్ గ్రాడ్యుయేట్లకు ఇదో మంచి అవకాశం. ఇస్రోలో కొలువును చేజిక్కించుకోవడం ద్వారా ఉన్నత కెరీర్కు బాటలు వేసుకోవచ్చు! ఉద్యోగం: సైంటిస్ట్/ఇంజనీర్ (ఎస్సీ) వేతన స్కేలు: రూ.15,600-రూ.39,100 (గ్రేడ్ పే రూ.5,400). ఖాళీలు: 375 ఎంపికైన అభ్యర్థులు ప్రారంభంలో ‘ఎస్సీ’ గ్రేడ్లో నియమితులవుతారు. తర్వాత సీనియారిటీ, పని అనుభవం ఆధారంగా ఎస్డీ, ఎస్ఈ, ఎస్ఎఫ్ వంటి గ్రేడ్లు ఇస్తారు. ప్రారంభంలో గ్రాస్ రూ.45,990 వరకు ఉంటుంది. ట్రావెల్ అలవెన్సు, వైద్య సదుపాయాలు వంటివి కూడా ఉంటాయి. దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్: www.isro.gov.in ఇంజనీరింగ్ స్పెషల్ జాబ్ పాయింట్ అర్హత కనీసం 65 శాతం మార్కులతో లేదా 6.84 సీజీపీఏతో బీఈ/బీటెక్ లేదా తత్సమాన ఉత్తీర్ణత. ఏఎంఐఈ/గ్రాడ్ఐఈటీఈ అర్హత ఉన్న వారికి సెక్షన్ బీలో 65 శాతం మార్కులు లేదా 6.84 సీజీపీఏ ఉండాలి. బీఈ/బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా అభ్యర్థులు 2016, ఆగస్టు నాటికి బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. వయసు 2016, మే 25 నాటికి 35 ఏళ్లు మించరాదు. పీడబ్ల్యూడీ, ఎక్స్సర్వీస్మెన్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. తొలి దశలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులను ఉద్యోగాలను ఎంపిక చేస్తారు. అభ్యర్థుల తుది జాబితా రూపకల్పనలో రాత పరీక్షలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకోరు. ఫీజు దరఖాస్తు ఫీజు రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్సర్వీస్మెన్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, చలానా జనరేట్ అవుతుంది. ఫీజు మొత్తాన్ని ఎస్బీఐలో చెల్లించాలి. చలానా కాపీని ‘సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఐసీఆర్బీ), ఇస్రో హెడ్క్వార్టర్స్, అంతరిక్ష్ భవన్, న్యూ బీఈఎల్ రోడ్, బెంగళూరు’కు పంపించాలి. ముఖ్య తేదీలు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: మే 5, 2016 దరఖాస్తుకు చివరి తేదీ: మే 25,2016 రాత పరీక్ష తేదీ: జూలై 3, 2016 పరీక్ష కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై, గువహటి, హైదరాబాద్, కోల్కతా... -
అడ్మిషన్ ఇన్ఫో
ఐఐటీటీఎంలో బీబీఏ ఆనర్స్ కోర్స్ దక్షిణ భారతదేశంలో ఒకే ఒక క్యాంపస్ (నెల్లూరులో) గల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ (ఐఐటీటీఎం).. 2016-17 విద్యా సంవత్సరంలో పర్యాటక కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటనను విడుదల చేసింది. * టూరిజంలో ఇప్పటికే ఎంబీఏ ప్రోగ్రామ్ను అందిస్తున్న ఐఐటీటీఎం నెల్లూరు ఈ ఏడాది నుంచి ‘టూరిజంలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) ఆనర్స్ డిగ్రీ’ని కూడా ప్రారంభిస్తోంది. ఈవెంట్ అండ్ ఏవియేషన్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్తో లభించే ఈ కోర్సు వ్యవధి మూడేళ్లు. * బీబీఏ టూరిజం ప్రోగ్రామ్కి ప్లస్ టూ (ఇంటర్మీడియెట్) ఉత్తీర్ణులు అర్హులు. దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ జూన్ 10. జూలై రెండో వారంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు ఫారాలు, ఇతర వివరాలను www.iittmsouth.org లో పొందొచ్చు. 0861-2353199, 9866274850 నంబర్లతోపాటు www.iittmnlr@gmail.comలోనూ సంప్రదించొచ్చు. -
న్యూ కోర్స్
గాంధీనగర్, కాన్పూర్లలో కాగ్నిటివ్ సైన్స్ వ్యక్తుల మానసిక పరిస్థితిని అంచనా వేయడంలో నైపుణ్యం అందించే శాస్త్రం కాగ్నిటివ్ సైన్స్. దీని ఆధారంగా వ్యక్తుల సామర్థ్య స్థాయి, పనితీరు విషయంలో అనుసరించే విధానాలను తెలుసుకునే సౌలభ్యం లభిస్తుంది. కాగ్నిటివ్ సైన్స్ అన్ని రంగాల్లోనూ ఆవశ్యకంగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దేశంలో తొలిసారిగా 2013-14 నుంచి ఐఐటీ-గాంధీనగర్ కాగ్నిటివ్ సైన్స్లో పీజీ కోర్సుకు రూపకల్పన చేసింది. తాజాగా ఐఐటీ కాన్పూర్ కాగ్నిటివ్ సైన్స్లో పీజీ, డాక్టోరల్ ప్రోగ్రామ్లను ఈ విద్యా సంవత్సరం నుంచి అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. -
కెరీర్ కౌన్సెలింగ్
ఎంఎస్సీ సెరీకల్చర్ కోర్సును అందిస్తున్న ఇన్స్టిట్యూట్ల వివరాలు తెలపండి? -సాయి రమ్య, తెనాలి. అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం.. సెరీకల్చర్లో ఎంఎస్సీ అందిస్తోంది. అర్హత: ఏదైనా బయాలజీ సబ్జెక్టుతో బీఎస్సీ. ప్రవేశం: ఎస్కేయూసెట్లో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.skuniversity.org తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం.. సెరీ- బయోటెక్నాలజీలో ఎంఎస్సీ అందిస్తోంది. అర్హత: సెరీకల్చర్/అగ్రికల్చర్/హార్టీకల్చర్/ఫారెస్ట్రీ/జువాలజీ/బోటనీ/ కెమిస్ట్రీ/ క్లినికల్ పాథాలజీ/మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ జెనెటిక్స్/ మాలిక్యులార్ బయాలజీ/ బయోటెక్నాలజీ/ ఎంటమాలజీ/ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీల్లో ఏదైనా రెండు సబ్జెక్టులతో బీఎస్సీ. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.spmvv.ac.in వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయం.. సెరీకల్చర్లో ఎంఎస్సీ అందిస్తోంది. అర్హత: సంబంధిత సబ్జెక్టుతో బీఎస్సీ. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. ఇదే విశ్వవిద్యాలయం సెరీకల్చర్లో డిప్లొమా కోర్సు కూడా అందిస్తోంది. వెబ్సైట్: www.kakatiya.ac.in బెంగళూరులోని యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్లో సెరీకల్చర్లో ఎంఎస్సీ అందిస్తోంది. అర్హత: అగ్రికల్చర్/హార్ట్టికల్చర్/అగ్రి బయోటెక్/ ఫారెస్ట్రీ/ సెరీకల్చర్లో బీఎస్సీ. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.uasbangalore.edu.in -
పల్లె ప్రతిభ @ RGUKT
పదో తరగతితోనే బీటెక్ దిశగా ప్రవేశానికి మార్గం వేస్తోంది.. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ). పదో తరగతిలో చూపిన ప్రతిభ ఆధారంగా... ఆర్జీయూకేటీ పరిధిలోని మూడు క్యాంపస్లలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్లలో ప్రవేశం లభిస్తుంది. ఆర్జీయుకేటీ బాసర క్యాంపస్ (తెలంగాణ రాష్ట్రం)కు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తుకు చివరి తేది మే 31. నూజివీడు క్యాంపస్ (ఆంధ్రప్రదేశ్), ఆర్కే వ్యాలీ క్యాంపస్(ఆంధ్రప్రదేశ్)లలోనూ త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో.. ఆర్జీయూకేటీలో ఆరేళ్ల సమీకృత బీటెక్ ప్రవేశ ప్రక్రియ, విద్యావిధానం తీరుతెన్నుల గురించి తెలుసుకుందాం... ఏపీ ట్రిపుల్ ఐటీలు.. 2008లో అప్పటి ముఖ్యమంత్రి మహానేత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆలోచనకు అనుగుణంగా గ్రామీణ, పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే ఆశయంతో ఏర్పాటైనవి. వీటి నిర్వహణ కోసం ఆర్జీయూకేటీ పేరుతో ప్రత్యేక యూనివర్సిటీని సైతం నెలకొల్పడం జరిగింది. గతేడాది నుంచి బాసర క్యాంపస్లో ప్రవేశాలను తెలంగాణ ప్రభుత్వం, ఆర్కే వ్యాలీ(ఇడుపులపాయ, డాక్టర్ వైఎస్ఆర్ జిల్లా), నూజివీడు క్యాంపస్లలో ప్రవేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేర్వేరుగా నిర్వహిస్తున్నాయి. మెరిట్ లిస్ట్ ఆధారంగా కౌన్సెలింగ్ ప్రకటనల ఆధారంగా ఔత్సాహిక అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అందిన దరఖాస్తులను, సదరు విద్యార్థుల జీపీఏ, రిజర్వేషన్ తదితర అంశాల ప్రాతిపదికగా మెరిట్ జాబితా రూపొందించి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కోర్సు: ఆరేళ్ల సమీకృత ఇంజనీరింగ్ అర్హతలు: పదో తరగతి తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత (2016లోనే) వయసు: డిసెంబర్ 31, 2016 నాటికి 18 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులు 21 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. అంతా ఆన్లైన్లోనే: ఔత్సాహిక అభ్యర్థుల దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే ఉంటుంది. ఇందుకోసం ఏపీ ఆన్లైన్ లేదా మీ సేవా సెంటర్లలో నిర్దేశిత దరఖాస్తు ఫీజు చెల్లించి సదరు ట్రాన్సాక్షన్ ఐడీ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు పూర్తి చేయాలి. ఒక్కో క్యాంపస్లో వెయ్యి సీట్లు తెలంగాణలోని బాసర క్యాంపస్, ఆంధ్రప్రదేశ్లోని ఆర్కే వ్యాలీ, నూజివీడులలో ఒక్కో క్యాంపస్లో వెయ్యి సీట్లు చొప్పున మూడు వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలోని బాసర క్యాంపస్లోని సీట్లలో 85 శాతం తెలంగాణ విద్యార్థులకు, మిగతా 15శాతం అన్ రిజర్వుడ్ సీట్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కేటాయిస్తారు. అలాగే ఏపీలోని ఆర్కే వ్యాలీ, నూజివీడు క్యాంపస్లలోని సీట్లలో 85 శాతం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు, మిగతా 15శాతం అన్ రిజర్వుడ్ సీట్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కేటాయిస్తారు. అంతేకాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రేతర విద్యార్థులకు, అంతర్జాతీయ విద్యార్థులకు, గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు అదనపు సీట్లు ఉన్నాయి. ప్రతిభే కొలమానం ఆర్జీయూకేటీ క్యాంపస్లలో ప్రవేశం పూర్తిగా విద్యార్థుల పదోతరగతి ప్రతిభ ఆధారంగానే లభిస్తుంది. పదోతరగతిలో పొందిన గ్రేడ్ పాయింట్ యావరేజ్(జీపీఏ), పదో తరగతి ప్రతి సబ్జెక్ట్లో పొందిన గ్రేడ్ ప్రతిభ ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ను అనుసరించి అడ్మిషన్ కల్పిస్తారు. గురుకుల పాఠశాలలు మినహా జిల్లా పరిషత్, మున్సిపల్, ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారు పొందిన జీపీఏకు అదనంగా 0.4 డిప్రైవేషన్ స్కోర్ను కలుపుతారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ డిప్రైవేషన్ స్కోర్ విధానం అప్పటి ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఫీజు బీటెక్ ప్రోగ్రామ్లో ప్రవేశం పొందిన విద్యార్థులు ప్రతి ఏటా రూ. 37 వేలు చెల్లించాల్సి ఉంటుంది. కుటుంబ వార్షికాదాయం రూ.లక్షలోపు ఉన్న రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థులు; రూ. రెండు లక్షలలోపు ఉన్న ఇతర వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రకారం ఫీజు చెల్లింపు నుంచి పూర్తి మినహాయింపు పొందొచ్చు. ఫీజు రీయింబర్స్మెంట్ పరిధిలోకి రాని.. ఫీజు చెల్లించలేని విద్యార్థులకు బ్యాంకులతో ఒప్పందం ద్వారా రుణ మంజూరు సదుపాయం అందించే ప్రయత్నం కూడా జరుగుతోంది. బోధన, కరిక్యులంలో నిరంతరం కొత్త మార్పులు శ్రీకారం చుడుతూ నిత్యనూతన విధానాలు అమలు చేస్తున్నాం. మొత్తం ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులో బీటెక్ సమయంలో ఇంటర్న్షిప్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ వంటి కార్యకలాపాలు చేపడుతూ విద్యార్థులకు జాబ్ రెడీ స్కిల్స్ అందించే విధంగా శిక్షణ ఇస్తున్నాం. - ప్రొఫెసర్ పి.విజయ ప్రకాశ్, ఇంఛార్జ్ వీసీ, ఆర్జీయూకేటీ(ఏపీ), ఏపీ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రవేశాలు, విధానాల పరంగా ఎలాంటి మార్పులు లేవు. అంతా గతేడాది మాదిరిగానే ఉంటుంది. విద్యార్థులు అవసరమైన పత్రాలతో సిద్ధంగా ఉంటే ఆన్లైన్ అప్లికేషన్ సమయంలో ఇబ్బందులు ఉండవు. - ప్రొఫెసర్. ఎస్. సత్యనారాయణ రెడ్డి, ఇంఛార్జ్ వీసీ, ఆర్జీయూకేటీ బాసర ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సు స్వరూపం ఆర్జీయూకేటీ క్యాంపస్లలో ఇంటిగ్రేటెడ్ కోర్సు వ్యవధి ఆరేళ్లు. ఇందులో తొలి రెండేళ్లు పీయూసీ(ఇంటర్మీడియెట్)గా పరిగణిస్తారు. విద్యార్థులకు ఎంపీసీ, బైపీసీ గ్రూప్ సబ్జెక్ట్లు అందుబాటులో ఉంటాయి. తొలి రెండేళ్ల పీయూసీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటే.. మూడో ఏడాది నుంచి బీటెక్ ప్రోగ్రాం ప్రారంభమవుతుంది. విద్యార్థులు ఈసీఈ, కెమికల్, మెకానికల్, సివిల్, సీఎస్ఈ, మెటీరియల్ సైన్ అండ్ మెటలర్జికల్లలో తమకు ఆసక్తి ఉన్న బ్రాంచ్ను ఎంపిక చేసుకోవచ్చు. -
బ్యాచిలర్ డిగ్రీతో బెటర్ ఫ్యూచర్!!
గ్రాడ్యుయేట్స్ స్పెషల్ తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ పూర్తయిన విద్యార్థుల్లో ఎక్కువ మంది చూపు.. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులవైపే! ప్రొఫెషనల్ కోర్సులవైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నా.. సంప్రదాయ బీఏ/బీఎస్సీ/బీకామ్ కోర్సులకూ జాబ్ మార్కెట్లో ఏమాత్రం వన్నె తగ్గలేదంటున్నారు నిపుణులు. కార్పొరేట్ రంగం విస్తరిస్తుండటం, కంపెనీలకు వివిధ నైపుణ్యాలున్న మానవ వనరుల అవసరం ఏర్పడుతుండటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో సంప్రదాయ డిగ్రీ కోర్సులతో కెరీర్ స్కోప్.. కాంపిటీషన్ కింగ్.. బీఏ పోటీ పరీక్షల ప్రపంచంలో బీఏ విద్యార్థులదే పైచేయి. సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీపరీక్షలకు ఉపయోగపడే పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, తెలుగు సాహిత్యం వంటి సబ్జెక్టులను డిగ్రీ స్థాయిలోనే చదివుండటం వల్ల ప్రిపరేషన్లో ఎంతో కలిసొస్తుంది. ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులు సైతం సివిల్స్లో సోషల్సెన్సైస్ సబ్జెక్టులు ఎంచుకుని విజయాలు సాధిస్తున్నారంటేనే ఆర్ట్స్ సబ్జెక్టుల ప్రాధాన్యత ఏమిటో తెలుస్తోంది. బీఏలో చేరిన మొదట్నుంచే సివిల్స్ లక్ష్యంగా కృషి చేస్తే తేలికగా విజయం సాధించొచ్చని నిపుణులు అంటున్నారు. వివిధ వర్సిటీలందించే పీజీ కోర్సుల్లో చేరి ఎంఏలో ఎకనామిక్స్, హిస్టరీ, ఇంగ్లిష్, సోషల్వర్క, ఫారెన్ లాంగ్వేజెస్, పాలిటీ వంటి కోర్సులు అభ్యసిస్తే మంచి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఎకనామిక్స్ చేసినవారికి ఉద్యోగాలెన్నో! హిస్టరీ విద్యార్థులు ఆర్కియాలజీ విభాగాల్లో పనిచేయొచ్చు. పాలిటీ చదివితే వివిధ పత్రికలు, న్యూస్ చానెళ్లు, పోటీ పరీక్షల కోచింగ్ కేంద్రాల్లో అవకాశాలు లభిస్తాయి. లాంగ్వేజెస్ చేసినవారు వివిధ రాయబార కార్యాలయాల్లో, కళాశాలల్లో లెక్చరర్గా పనిచేయొచ్చు. కెరీర్ షైనింగ్.. కామర్స్ ప్రస్తుత జాబ్ మార్కెట్ అవసరాలకనుగుణంగా బీకాంలో ఈ-కామర్స్; ఫైనాన్షియల్ మేనేజ్మెంట్; కార్పొరేట్ సెక్రటరీషిప్ వంటి వినూత్న స్పెషలైజేషన్లు ఉన్నాయి. కంపెనీలకు అవసరమైన అకౌంటింగ్ కార్యకలాపాల నిర్వహణకు కామర్స్ పట్టభద్రులు తప్పనిసరి. వివిధ దేశీయ, విదేశీ సంస్థలు ఒక మాదిరి పట్టణాల్లో సైతం తమ బ్రాంచ్లను ఏర్పాటు చేస్తున్నాయి. వీటిల్లో ఖాతాల నిర్వహణ వంటి విభాగాల్లో బీకాం విద్యార్థుల అవసరం ఎంతో ఉంది. కాబట్టి డిగ్రీలో బీకాం, బీకాం(కంప్యూటర్స్ విద్యార్థులు)లు అకౌంటింగ్ ప్యాకేజెస్, ట్యాలీ వంటి కోర్సులను నేర్చుకోవడంతోపాటు, స్పోకెన్ ఇంగ్లిష్పై దృష్టిపెడితే ప్రారంభంలోనే ఐదెంకెల వేతనాలు ఖాయం. ఇక చార్టర్డ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి కోర్సులు పూర్తి చేస్తే.. అవకాశాలు కోకొల్లలు. భావి శాస్త్రవేత్తలకు... బీఎస్సీ ‘దేశవ్యాప్తంగా పరిశోధనలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే అభివృద్ధి కుంటుపడటం ఖాయం’. ఇది దేశంలోని మేధావులు, నిపుణులు తరచుగా వ్యక్తం చేస్తున్న ఆందోళన! ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే.. నిష్ణాతులైన శాస్త్రవేత్తల అవసరం ఎంతో. డిగ్రీలో కెమిస్ట్రీ, న్యూక్లియర్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆస్ట్రోఫిజిక్స్, మెరైన్ బయాలజీ, మైక్రోబయాలజీ, బోటనీ, జువాలజీ, మ్యాథ్స్, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, స్టాటిస్టిక్స్ వంటి కోర్సులను దీర్ఘకాలిక దృష్టితో చదవాలి. డిగ్రీ మొదటి ఏడాది నుంచే సబ్జెక్టులను క్షుణ్నంగా చదువుతూ.. ఇష్టమైన అంశంపై పీజీ చేస్తే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. సీఎస్ఐఆర్ నెట్లో జేఆర్ఎఫ్ సాధిస్తే ప్రతినెలా ఫెలోషిప్ పొందడంతోపాటు దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యా సంస్థల్లో పీహెచ్డీ కూడా చేయొచ్చు. తర్వాత పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తలుగా పనిచేస్తూ ఆకర్షణీయ జీతాలూ పొందొచ్చు. డిగ్రీ కోర్సులకు.. పూర్వ వైభవం మూడేళ్ల నుంచి సంప్రదాయ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. ఎక్కువగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారిని బీఏ బాగా ఆకర్షిస్తోంది. సివిల్స్, గ్రూప్స్ వంటి పరీక్షల్లో బీఏ సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. బీకాంలో కూడా ఎక్కువ మంది చేరుతున్నారు. సీఏ, కాస్ట్ అకౌంటెంట్స్, సీఎస్ కోర్సుల్లో చేరాలనుకునేవారికి బీకాం సరైన మార్గం. కార్పొరేట్ సంస్థలు సైతం డిగ్రీ ఉత్తీర్ణులకే ప్రాధాన్యతనిస్తున్నాయి. కంపెనీలు క్యాంపస్ నియామకాల ద్వారా బీఎస్సీ ఫైనలియర్ విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. గత నెలలో 40 మందికి పైగా సైన్స్ విద్యార్థులను రూ.15 వేలతో కంపెనీలు నియమించుకున్నాయి. - ప్రొ. టీఎల్ఎన్ స్వామి, ప్రిన్సిపాల్, నిజాం కాలేజ్ -
కెరీర్ కౌన్సెలింగ్
హోటల్ మేనేజ్మెంట్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి? - సాగర్, విజయవాడ హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్.. హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్లో బీఎస్సీ అందిస్తోంది. అర్హత: ఇంటర్మీడియెట్ లేదా 10+2 ప్రవేశం: ప్రవేశపరీక్ష ఆధారంగా. వెబ్సైట్: www.ihmhyd.org హైదరాబాద్లోని కలినరీ అకాడమీ ఆఫ్ ఇండియా.. హోటల్ మేనేజ్మెంట్లో వివిధ కోర్సులను అందిస్తోంది. అర్హత: ఇంటర్మీడియెట్/10+2 ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా వెబ్సైట్: iactchefacademy.com యానిమేషన్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి? - రాంమోహన్,విజయవాడ జేఎన్టీయూహెచ్కు అనుబంధంగా ఉన్న హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ కంప్యూటర్ గ్రాఫిక్స్.. యానిమేషన్లో డిగ్రీని అందిస్తోంది. అర్హత: ఇంటర్మీడియెట్/10+2 వెబ్సైట్: www.iacg.co.in హైదరాబాద్లోని అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా.. యానిమేషన్, వీఎఫ్ఎక్స్లో డిగ్రీని అందిస్తోంది. అర్హత: ఇంటర్మీడియెట్/10+2 వెబ్సైట్: www.aisfm.edu.in ఐఐఎస్సీ (బెంగళూరు) నుంచి పీహెచ్డీ చేయడం ఎలా? - ధరణి, సికింద్రాబాద్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)-బెంగళూరు.. నేచురల్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్, ఇంజనీరింగ్, కెమికల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో పీహెచ్డీ, ఇంటిగ్రే టెడ్ పీహెచ్డీ కోర్సులను అందిస్తోంది. పీహెచ్డీ కోర్సులకు సీఎస్ఐఆర్-నెట్ జేఆర్ఎఫ్/డీబీటీ జేఆర్ఎఫ్/ ఐసీఎంఆర్ జేఆర్ఎఫ్; జెస్ట్, ఎన్బీహెచ్ఎం లేదా ఐఐఎస్సీ ఎంట్రెన్స్ టెస్ట్/ గేట్లో స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఐఐటీ-జామ్ ఆధారంగా ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు వివరాలకు: www.iisc.ernet.in మీ సలహాలు, సందేహాలు పంపాల్సిన ఈ-మెయిల్: sakshieducation@gmail.com -
సివిల్స్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ ప్రణాళిక
కాంపిటీటివ్ గెడైన్స్ : యూపీఎస్సీ- సివిల్స్ 100 శాతం ఆత్మవిశ్వాసంతో సివిల్స్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ కొనసాగించాలి. పటిష్ట ప్రణాళికతో చదివితే తప్పకుండా ప్రిలిమ్స్లో విజయం సాధిస్తామనే నమ్మకం అవసరం. అదృష్టాన్ని నమ్ముకోకుండా, కేవలం కటాఫ్ మార్కులు తెచ్చుకుంటే సరిపోతుందని కాకుండా పూర్తిస్థాయిలో మంచి స్కోర్ సాధించేందుకు శ్రమించాలి. పేపర్ 1: 2015 సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్తో వచ్చిన మార్పులు కారణంగా ప్రిలిమ్స్లో విజయానికి జనరల్ స్టడీస్ పేపర్-1 కీలకంగా మారింది. ఈ పేపర్లో కనబర్చిన ప్రతిభ ఆధారంగా మెయిన్స్కు ఎంపిక చేస్తారు. పేపర్-2 అర్హత పేపర్ మాత్రమే. సిలబస్లోని సబ్జెక్టులకు సంబంధించి ప్రాథమిక అంశాలపై పట్టుసాధించడం ద్వారా ప్రిలిమ్స్ను తేలిగ్గా అధిగమించవచ్చు. తేదీలు, ఫ్యాక్ట్స్ జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ అంటే కేవలం ఫ్యాక్ట్స్, తేదీలు, పేర్లను గుర్తుంచుకోవడం కాదు. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్కు సంబంధించి వివిధ అంశాలను క్రమపద్ధతిలో అధ్యయనం చేస్తూ వెళ్తే ప్రిపరేషన్ సాఫీగా సాగిపోతుంది. మెయిన్స్ కోణంలో వివిధ అంశాలపై పరిజ్ఞానం, అభిరుచిని పరీక్షించేలా ప్రిలిమ్స్ ఉంటుంది. మెయిన్స్ను దృష్టిలో ఉంచుకొని, ప్రిలిమ్స్కు ప్రిపరేషన్ కొనసాగించాలి. దీనివల్ల రెండు పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు వీలవుతుంది. ప్రిలిమ్స్ పూర్తయ్యాక మెయిన్స్ సబ్జెక్టులను చదవడం కూడా తేలికవుతుంది. * ప్రిలిమ్స్లో ఒక ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్ల నుంచి కచ్చితమైన సమాధానాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటే, మెయిన్స్లో సరైన సమాధానాన్ని రాయాల్సి ఉంటుంది. ఈ రెండింటికీ అదే తేడా. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ కొనసాగించాలి. ఒక్క ఆప్షనల్ సబ్జెక్టు తప్పించి, మిగిలిన అన్ని సబ్జెక్టులు, అంశాలు ప్రిలిమ్స్, మెయిన్స్కు ఒకే విధంగా ఉంటాయి. * జనరల్ స్టడీస్కు దగ్గరగా ఉండే హిస్టరీ, జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, సోషియాలజీ వంటి సబ్జెక్టులను ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకుంటే మంచిది. * ప్రిలిమ్స్ (మల్టిపుల్ చాయిస్), మెయిన్స్ (డిస్క్రిప్టివ్), పర్సనాలిటీ టెస్ట్ (వెర్బల్ ప్రజెంటేషన్).. సివిల్స్లో ఈ మూడింటి రూపాలు వేరైనా.. వాటి మధ్య అంతర్గత సంబంధం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని, పరీక్షకు సిద్ధమవాలి. * ప్రిలిమ్స్లో సబ్జెక్టుల వారీగా ప్రశ్నలకు వెయిటేజీ లేదు. ఒక అంశం నుంచి కచ్చితంగా వచ్చే ప్రశ్నల సంఖ్యను చెప్పలేం. ఈ పరిస్థితిలో ప్రిలిమ్స్, మెయిన్స్కు ఉమ్మడిగా ఉన్న సబ్జెక్టుల ప్రిపరేషన్కు ఎక్కువ సమయం కేటాయించాలి. ఉమ్మడి అంశాలు: ఆధునిక భారతదేశ చరిత్ర, రాజనీతి శాస్త్రం, భారత ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక శాస్త్రం, వర్తమాన అంశాలు. ఎన్ని అంశాలను చదివామనే దానికంటే, చదివిన అంశాలను ఎంత బాగా అధ్యయనం చేశామన్నది విజయానికి కీలకం. పేపర్-2 (సీశాట్): సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్) పేపర్ను అర్హత పేపర్గా మార్చడం వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు మేలు జరుగుతోంది. ఈ పేపర్లో 33 శాతం మార్కులను అర్హత మార్కులుగా నిర్దేశించారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్ స్కిల్ విభాగాన్ని తొలగించారు. ఈ మార్పుల వల్ల పేపర్-2 ప్రిపరేషన్ తేలికైంది. అయితే ఇది అర్హత పేపర్ కాబట్టి, నిర్లక్ష్యం చేయకూడదు. ఈ పేపర్లో విజయం సాధించాలంటే అభ్యర్థులు కనీస స్థాయిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీడింగ్ స్కిల్స్ను పెంపొందించుకోవాలి. * పేపర్-2 ప్రశ్నలకు సమాధానాలు రాసే విషయంలో వేగం, కచ్చితత్వం అవసరం. ప్రాక్టీస్ ద్వారా మాత్రమే ఈ నైపుణ్యాలు అలవడతాయి. దీనికోసం పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. వీలైనన్ని మాక్టెస్ట్లు రాయాలి. మ్యాగజైన్లలో ప్రచురించిన క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. రీడింగ్ కాంప్రెహెన్షన్ * సీశాట్లో రీడింగ్ కాంప్రెహెన్షన్ విభాగం చాలా చిన్నది. ప్యాసేజ్ను చదివే ముందు మొదట ఒకసారి ప్రశ్నలన్నింటినీ పరిశీలించాలి. దీనివల్ల ప్రశ్నలకు సరైన సమాధానాల ఎంపికకు అవసరమైన సమాచారాన్ని గుర్తించడం తేలికవుతుంది. రీడింగ్ కాంప్రెహెన్షన్ విభాగాన్ని విజయవంతంగా అధిగమించడానికి ఫ్రంట్లైన్, ఇండియా టుడే, వీక్ వంటి మ్యాగజైన్లను చదవాలి. ఇవి జనరల్ స్టడీస్కు కూడా ఉపయోగపడతాయి. * నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు పరీక్ష గురించి ఆందోళన చెందనవసరం లేదు. పరీక్షలో కేవలం బేసిక్ అంశాలపై పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు. అందువల్ల ప్రాక్టీస్ బాగా చేస్తే తేలిగ్గానే లాజికల్, అనలిటికల్ రీజనింగ్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు. ఈ విభాగాల ప్రిపరేషన్కు ఎం.కె.పాండే, ఆర్.ఎస్.అగర్వాల్ పుస్తకాలు ఉపయోగపడతాయి. * ప్రిలిమ్స్కు ఒకసారి చదవడం పూర్తిచేశాక, ప్రీవియస్ పేపర్లను తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. వీలైనన్ని మాక్టెస్ట్లు రాయాలి. ప్రిపరేషన్కు ఇంటర్నెట్ బాగా ఉపయోగపడుతుంది. రిఫరెన్స్ * అనలిటికల్ రీజనింగ్: ఎం.కె.పాండే (లాజికల్, అనలిటికల్ రీజనింగ్) * ఆర్.ఎస్.అగర్వాల్ (వెర్బల్/లాజికల్ రీజనింగ్, ఆప్టిట్యూడ్, రీడింగ్ కాంప్రెహెన్షన్) * క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-అరుణ్శర్మ (టీఎంహెచ్) * అరిహంత్ పబ్లికేషన్స్ (సీశాట్) * పజిల్స్ టు పజిల్ యూ - శకుంతలా దేవి * అరిహంత్ పబ్లికేషన్స్ (సీశాట్) - శ్రీరాం శ్రీరంగం డెరైక్టర్, శ్రీరాం ఐఏఎస్, న్యూఢిల్లీ -
మెకానికల్.. మెరిసే..!!
ఇంజనీరింగ్ స్పెషల్ నిత్యం ఉపయోగించే వాషింగ్ మెషిన్, గడియారాలు, సంగీత పరికరాలు, గన్స్, సైకిల్ మొదలైనవన్నీ మెకానికల్ ఇంజనీర్ల సృష్టే! మార్కెట్ ఒడిదొడుకులతో పెద్దగా ప్రభావితం కాకుండా స్థిరమైన అవకాశాలు అందించే బ్రాంచ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ ఔత్సాహికుల కోసం మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు, ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు, కెరీర్ స్కోప్ వివరాలు.. కోర్సు ఇలా జాతీయస్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ అర్హత పరీక్షలో మంచి ర్యాంకు సాధిస్తే ప్రఖ్యాత ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలు పొందవచ్చు. వీటితో పాటు ఈ పరీక్షలో సాధించిన స్కోరు ఆధారంగా దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల్లో సీటు దక్కించుకోవచ్చు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్ ద్వారా రాష్ట్రంలోని క్యాంపస్ కాలేజీలు, ప్రైవేటు కాలేజీల్లో సీటు లభిస్తుంది. థర్మో డైనమిక్స్, ప్రొడక్షన్ టెక్నాలజీ, కైనమెటిక్స్ ఆఫ్ మెషినరీ, థర్మల్ ఇంజనీరింగ్ తదితర కోర్ సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు ఏరోస్పేస్ ఇంజనీర్, ఏరోనాటికల్ ఇంజనీర్, ఆటోమోటివ్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్, న్యూక్లియర్ ఇంజనీర్, టూల్ డిజైనర్.. మొదలైన వాటిలో కెరీర్ ప్రారంభించవచ్చు. ఆసక్తి ఉన్నవారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దిశగా పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లోని పరిశోధన సంస్థల్లో చేరొచ్చు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్జీసీ, వీఎస్ఎస్సీ, ఇస్రో, ఐవోసీ, డీఆర్డీవో, సెయిల్, ఎన్టీపీసీ, డిఫెన్స్, పీడబ్ల్యుడీ, సీపీడబ్ల్యుడీ, ఆర్మ్డ్ ఫోర్సెస్ల్లో పనిచేసే అవకాశం కూడా లభిస్తుంది. ఉన్నత విద్య మెకానికల్ ఇంజనీరింగ్ చేశాక ఉన్నత విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులు గేట్, పీజీఈసెట్ ద్వారా ఎంటెక్లో చేరొచ్చు. హైడ్రాలిక్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెషిన్ డిజైన్, మ్యానుఫాక్చరింగ్ ఇంజనీరింగ్, ఏరో డైనమిక్స్ తదితర స్పెషలైజేన్లలో ఉన్నత విద్యను అభ్యసించొచ్చు. అలాగే మేనేజ్మెంట్ విద్య పట్ల ఆసక్తి ఉంటే... క్యాట్, మ్యాట్, ఎక్స్ఏటీ, ఎక్స్ఎల్ఆర్ఐ వంటి పరీక్షల్లో ప్రతిభను చూపడం ద్వారా ఎంబీఏలో చేరొచ్చు. విధులు మెకానికల్ ఇంజనీర్లు వారు పనిచేసే ఇండస్ట్రీ, స్పెషలైజేషన్ ఆధారంగా వేర్వేరు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డిజైన్, ప్రొడక్షన్, అనాలసిస్ అండ్ టెస్టింగ్, ఇన్స్టాలేషన్, మెయింటెన్స్ విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది. టాప్ రిక్రూటర్స్ టాటా గ్రూప్, గోద్రెజ్ గ్రూప్, ఎల్ అండ్ టీ, సీమెన్స్, జీఈ, హ్యుందాయ్ మోటార్స్, ఫోర్డ్, ఆశోక్ లేల్యాండ్, రాయల్ ఎన్ఫీల్డ్, మహింద్రా అండ్ మహింద్రా, జిందాల్ మొదలైనవి. మెకానికల్ ఇంజనీరింగ్కు చెందిన కంప్యూటర్ సైన్స్ ఏరియా.. కంప్యూటేషనల్ ఫ్లుయిడ్ డైనమిక్స్ (సీఎఫ్డీ) ద్వారా డిజైన్ ప్రక్రియలో చాలా మార్పులు వచ్చాయి. ఈ విభాగంలో అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. హానీవెల్, జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) లాంటి పెద్ద కంపెనీలు సీఎఫ్డీపై అవగాహన ఉన్నవారిని నియమించుకుంటున్నాయి. - వి. ఉమామహేశ్వర్, అసోసియేట్ ప్రొఫెసర్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఉస్మానియా యూనివర్సిటీ -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
సివిల్స్ ప్రిలిమ్స్లో జాగ్రఫీలో ఎక్కువ మార్కులు సాధించడం ఎలా? - ఎన్. ప్రియబాంధవి, అనంతపురం సివిల్స్ ప్రిలిమ్స్లో జాగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ నుంచి 24 నుంచి 30 ప్రశ్నల వరకు వస్తున్నాయి. జాగ్రఫీ, ఎకాలజీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రణాళికలో వీటికి అధిక సమయం కేటాయించాలి. సిలబస్లో ‘భారతదేశం, ప్రపంచ భౌతిక, సామాజిక, ఆర్థిక, భూగోళ శాస్త్రం’ అని పేర్కొన్నారు. అభ్యర్థులు భారత భౌగోళిక అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. మనదేశానికి సంబంధించి వ్యవసాయం, వ్యవసాయ సంక్షోభం, రుతువులు, నదులు, అడవులు - అటవీ భూముల ఆక్రమణ, అంతరిస్తున్న జీవ జాతులు, శక్తి వనరులు తదితరాలపై అవగాహన పెంపొందించుకోవాలి. రవాణా, పట్టణీకరణ ప్రక్రియ, సరిహద్దుల వివాదాలు వంటివీ ముఖ్యమే. కోర్ ఎకాలజీ నుంచి ప్రధానంగా రెండు అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అవి.. ఎకాలజీ బేసిక్ కాన్సెప్టులు. -
పాలిటెక్నిక్.. జాబ్ గ్యారెంటీ!!
తెలుగు రాష్ట్రాల్లో పాలిసెట్ పరీక్షలు ముగిశాయి. తెలంగాణలో ఫలితాలు వెలువడ్డాయి. త్వరలో ఏపీ పాలిసెట్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఆ తర్వాత కౌన్సెలింగ్ ఉంటుంది. ఈ తరుణంలో పాలిసెట్కు హాజరైన విద్యార్థులు ఇప్పటి నుంచే కోర్సుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాలి. అందుబాటులోని డిప్లొమా కోర్సులు.. వాటి ద్వారా లభించే ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై దృష్టిసారించాలి. ఈ నేపథ్యంలో పాలిటెక్నిక్ కోర్సులపై స్పెషల్ ఫోకస్.. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ వ్యవధి: మూడేళ్లు ఉద్యోగాలెక్కడ: ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, రోడ్లు, రైల్వేస్, భవన నిర్మాణం, సర్వేయింగ్, వాటర్ సప్లయ్ విభాగాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు. స్కిల్స్: విస్తృతమైన సబ్జెక్ట్ నాలెడ్జ్ అవసరం. బృంద నైపుణ్యాలు, పర్యవేక్షణ నైపుణ్యాలు ఉండాలి. కెరీర్: సైట్ ఇంజనీర్గా మొదలై... ఇంజనీర్లు, సీనియర్ ఇంజనీర్లు, మేనేజర్లు, కంపెనీ జనరల్ మేనేజర్ స్థాయి వరకు ఎదగొచ్చు. ఉన్నత విద్య: బీటెక్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ వ్యవధి: మూడేళ్లు కోర్సు: వర్కషాప్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ మెటీరియల్స్, మెషిన్ డిజైన్ వంటి అంశాలను అధ్యయనం చేస్తారు. స్కిల్స్: మెకానికల్ ఇంజనీర్లు టూల్స్, ఇంజన్స్, మెషిన్స్ డిజైనింగ్ విభాగాల్లో పనిచేస్తారు. కాబట్టి డిజైన్ నాలెడ్జ్, డ్రాయింగ్పై పట్టుండాలి. టెక్నికల్ నాలెడ్జ్ చాలా అవసరం.క్యాడ్/క్యామ్ నేర్చుకోవడం లాభిస్తుంది. ఉద్యోగాలెక్కడ: మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ట్రాన్స్పోర్ట్, యాన్సిలరీ యూనిట్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ. ఉన్నత విద్య: బీటెక్ (మెకానికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ వంటి బ్రాంచ్లు) కెరీర్: ట్రెయినీగా చేరి.. 5-6 ఏళ్లలో స్కిల్స్, ఉన్నత విద్యతో వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ స్థాయికి ఎదగొచ్చు. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ - కమ్యూనికేషన్ వ్యవధి: మూడేళ్లు కోర్సు: ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, డిజైనింగ్, కమ్యూనికేషన్ మైక్రోప్రాసెసర్స అండ్ మైక్రో కంట్రోలర్, ప్రోగ్రామింగ్ అండ్ అప్లికేషన్స వంటి అంశాలను అధ్యయనం చేయాలి. ఉన్నత విద్య: బీటెక్ (ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికం ఇంజనీరింగ్) స్కిల్స్: అధునాతన టెక్నాలజీపై మంచి అవగాహన ఉండాలి. ఉద్యోగాలెక్కడ: కమ్యూనికేషన్ ఉత్పత్తుల సంస్థలు, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థలు. కెరీర్: ట్రైనీ ఇంజనీర్గా కెరీర్ మొదలై... స్కిల్స్తో సర్వీస్ ఇంజనీర్, టెస్ట్ ఇంజనీర్, ప్రొడక్ట్ ఇంజనీర్, డిపార్ట్మెంట్ మేనేజర్ స్థాయికి ఎదగొచ్చు. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వ్యవధి: మూడేళ్లు కోర్సు: పవర్ జనరేషన్, పవర్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ మెషిన్స-వర్కింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ ఎస్టిమేషన్, యుటిలైజేషన్ అండ్ ట్రాక్షన్లను కోర్సులో భాగంగా అధ్యయనం చేస్తారు. ఉద్యోగాలెక్కడ : జెన్కో, ట్రాన్స్కో వంటి ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు విద్యుత్ ఉపకరణ ఉత్పత్తి సంస్థల్లో అవకాశాలు. స్కిల్స్: లాజికల్, అనలిటికల్ స్కిల్స్. కెరీర్: జూనియర్ ఇంజనీర్ ట్రైనీగా మొదలై... అనుభవంతో జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకోవచ్చు. ఉన్నత విద్య: బీటెక్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ వ్యవధి: మూడేళ్లు కోర్సు: ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్, ప్రోగ్రామింగ్ ల్వాంగేజెస్ అండ్ సాఫ్ట్వేర్స, వెబ్ డిజైనింగ్, డెవలప్మెంట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఫర్ డిఫరెంట్ అప్లికేషన్సపై ప్రధానంగా దృష్టిసారిస్తారు. ఉద్యోగాలెక్కడ: కంప్యూటర్ మెయింటెనెన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సంస్థలు, కంప్యూటర్ ట్రైనింగ్ సంస్థలు. స్కిల్స్: కంప్యూటర్ పట్ల ఇష్టంతోపాటు మ్యాథమెటిక్స్పై మంచి పట్టుండాలి. లాజికల్, అనలిటికల్ స్కిల్స్తోపాటు బృంద నైపుణ్యాలు చాలా అవసరం. కెరీర్: జూనియర్ ప్రోగ్రామర్తో మొదలై... సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్, సీనియర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ స్థాయికి చేరుకోవచ్చు. ఉన్నత విద్య: బీటెక్ (సీఎస్ఈ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఐటీ బ్రాంచ్లు) వెబ్ కౌన్సెలింగ్.. సీట్ల భర్తీ పాలిసెట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వెబ్ బేస్డ్ విధానంలో కౌన్సెలింగ్ (వెబ్ కౌన్సెలింగ్) ద్వారా సీట్ల భర్తీ చేస్తారు. ఈ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ తొమ్మిది దశల్లో ఉంటుంది. దీనికోసం అభ్యర్థులు సంబంధిత వెబ్సైట్స్ (ఏపీ పాలిసెట్ విద్యార్థులు www.appolycet.nic.in టీఎస్ పాలిసెట్ విద్యార్థులు www.polycetts.nic.in) ద్వారా ఈ ప్రక్రియ చేపట్టాలి. నేరుగా బీటెక్ ద్వితీయ సంవత్సరం పాలిటెక్నిక్ పూర్తిచేసిన విద్యార్థులు ఉన్నత విద్యను కోరుకుంటే.. నేరుగా బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశించే అవకాశముంది. ఇందుకోసం ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈసెట్)లో ఉత్తీర్ణత సాధించాలి. బీటెక్ తర్వాత తమ బ్రాంచ్ల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్లలో ఎంటెక్, ఎంఈ కోర్సులు చేయొచ్చు. ఏపీ పాలిసెట్ ఫలితాలు త్వరలో.. ఏపీ పాలిసెట్ ఫలితాలను త్వరలో ప్రకటిస్తాం. పాలిటెక్నిక్ ఔత్సాహిక అభ్యర్థులు ముందుగా అందుబాటులో ఉన్న కోర్సులపై అవగాహన పెంపొందించుకోవాలి. తమకు ఇష్టమైన బ్రాంచ్ ఎంపికపై స్పష్టతకు రావాలి. కౌన్సెలింగ్కు ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ వ్యవధిలో కోర్సులపై అవగాహన, కళాశాలల నాణ్యత ప్రమాణాలు తెలుసుకోవడంపై దృష్టిసారిస్తే వెబ్ కౌన్సెలింగ్ సమయంలో మంచి కోర్సు, కళాశాలను ఎంపిక చేసుకోవచ్చు. పలు జాబ్ ఓరియెంటెడ్ ఆధునిక డిప్లొమా కోర్సులు (ఉదాహరణకు ఫ్యాషన్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ వంటివి) కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిపైనా దృష్టిసారిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. - ఎ.నిర్మల్ కుమార్ ప్రియ, జాయింట్ సెక్రటరీ, ఎస్బీటీఈటీ-ఏపీ గత ఏడాది కౌన్సెలింగ్ గణాంకాల ప్రకారం.. కొన్ని ముఖ్య బ్రాంచ్ల్లో తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న బ్రాంచ్లు, సీట్ల వివరాలు..మరికొన్ని కోర్సులు.. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వ్యవధి: మూడేళ్లు ఉద్యోగాలెక్కడ : ఆర్టీసీ, ట్రాన్స్పోర్ట్ సంస్థలు, ఆటోమొబైల్ పరిశ్రమలు. ఉన్నత విద్య: బీటెక్ (ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్) అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వ్యవధి: మూడేళ్లు ఉద్యోగాలెక్కడ: ఉత్పత్తి సంస్థలు, ఎలక్ట్రానిక్స్ సంస్థలు, ఫార్మాస్యూటికల్ సంస్థలు, ఎలక్ట్రికల్ ఉపకరణాల ఉత్పత్తి సంస్థలు. ఉన్నత విద్య: బీటెక్ (అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఈసీఈ, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ బ్రాంచ్లు) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వ్యవధి: మూడేళ్లు ఉద్యోగాలెక్కడ: సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సంస్థలు, సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ సంస్థల్లో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు. ఉన్నత విద్య: బీటెక్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) మైనింగ్ ఇంజనీరింగ్ వ్యవధి: మూడేళ్లు ఉద్యోగాలెక్కడ: మైనింగ్ సంస్థలు, నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సింగరేణి కాలరీస్ సంస్థల్లో సూపర్వైజర్ స్థాయిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హోదాలో ఉద్యోగాలు. ఉన్నత విద్య: బీటెక్ (మైనింగ్ ఇంజనీరింగ్, మైనింగ్ మెషీనరీ ఇంజనీరింగ్) మూడున్నరేళ్ల కోర్సులివే: డిప్లొమా ఇన్ మెట్లర్జికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ సిరామిక్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ లెదర్ టెక్నాలజీ. స్పెషలైజ్డ్ కోర్సులు: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రస్తుతం పలు స్పెషలైజ్డ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి.. లెదర్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, ఫుట్వేర్ టెక్నాలజీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ. -
పరీక్షల తేదీలు
⇒ టీఎస్ ఎంసెట్: మే 15 ⇒ టీ ఎస్ టెట్: మే 22 ⇒ ఓఎన్జీసీలో అసిస్టెంట్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ పరీక్ష : మే 22 ⇒ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్: జూన్ 12 ⇒ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్: జూన్ 26 -
హర్షుడి కాలంలో వచ్చిన ప్రధాన మార్పు?
కాంపిటీటివ్ గెడైన్స్ : ఇండియన్ హిస్టరీ గుప్తుల అనంతర యుగం (క్రీ.శ. 6వ శతాబ్దం - 8వ శతాబ్దం) గుప్తుల తర్వాత భారతదేశం మరోసారి అనేక చిన్న చిన్న రాజ్యాలుగా చీలిపోయింది. ఈ రాజకీయ అనైక్యత ఉత్తర భారతంలో తీవ్రంగా ఉంది. ఈ కాలంలోనే ఉత్తరాదిలో.. వల్లభి కేంద్రంగా మైత్రకులు, గౌహతి కేంద్రంగా (కామరూప రాజ్యం) - వర్మన్ వంశం, పాటలీపుత్రం కేంద్రంగా - కడపటి గుప్తులు పాలించారు. అలాగే బెంగాల్ కేంద్రంగా - గౌడ వంశం, కనౌజ్ కేంద్రంగా - మౌఖరీలు, ఒడిశా కేంద్రంగా-మాతరులు, మానవంశం, స్థానేశ్వర్ కేంద్రంగా- పుష్యభూతి వంశంవారు పాలన కొనసాగించారు. అయితే పుష్యభూతి వంశంవారు క్రమంగా ఈ రాజ్యాలన్నింటినీ జయించి మొత్తం ఉత్తర భారతదేశాన్ని రాజకీయంగా ఏకం చేసి పాలించారు. ఈ కాలంలో దక్షిణ భారతదేశాన్ని పశ్చిమ గాంగులు, బాదామీ చాళుక్యులు, పల్లవులు, పాండ్యులు మొదలైన రాజవంశాలు పాలిస్తున్నాయి. ఈ వంశాలు దక్షిణ భారతదేశంలో వాస్తు, శిల్ప కళలకు అమూల్యమైన సేవలను అందించాయి. గుప్తుల తర్వాత యుగంలో ఉత్తరాదిని పాలించిన రాజవంశాలన్నింటిలో ‘పుష్యభూతి వంశం’ గొప్పది. పుష్యభూతి వంశం పుష్యభూతి ఇతడు తన పేరుతో పుష్యభూతి వంశాన్ని స్థాపించాడు. స్థానేశ్వర్ రాజధానిగా గుప్తుల సామంతుడిగా పరిపాలించాడు. ప్రభాకర వర్థనుడు పుష్యభూతి వంశంలో తొలి స్వతంత్ర రాజు. తన స్వతంత్ర పాలనకు గుర్తుగా ‘రాజాధిరాజ’ అనే బిరుదును ధరించాడు. ప్రభాకరుడి భార్య యశోమతి. ప్రభాకర వర్థనుడు క్రీ.శ. 605లో మరణించగా భార్య సతీ సహగమనాన్ని ఆచరించిందని బాణుడి గ్రంథాల ద్వారా తెలుస్తోంది. రాజ్యవర్థనుడు ప్రభాకర వర్థనుడు తన జ్యేష్ట పుత్రుడు రాజ్య వర్థనుడికి బదులు రెండో కుమారుడు హర్షుడిని రాజుగా చేయాలని సంకల్పించాడు. దీనికి హర్షుడు సమ్మతించలేదు. దీంతో రాజ్యవర్థనుడు రాజయ్యాడు. ఇతడి కాలంలో కనౌజ్ను గ్రహవర్మ అనే మౌకరీరాజు పాలించేవాడు. ఇతడు రాజ్యవర్థనుడి సోదరి రాజ్యశ్రీ భర్త. మగధను, మాళ్వాను పాలించే దేవగుప్తుడు.. గౌడ దేశాన్ని పాలించే శశాంకుడితో కలిసి.. గ్రహవర్మను చంపి కనౌజ్ను ఆక్రమించాడు. రాజ్యవర్థనుడు దేవగుప్తుడిని చంపి కనౌజ్ను స్వాధీనం చేసుకున్నాడు. శశాంకుడు.. రాజ్యవర్థనుడిని హత్య చేయడంతో హర్షుడు రాజ్యానికి వచ్చాడు. హర్షవర్థనుడు హర్షవర్థనుడు గౌడ శశాంకుడి నుంచి కనౌజ్ను విడిపించి, రాజధానిని స్థానేశ్వరం నుంచి కనౌజ్కు మార్చాడు. శశాంకుడి తర్వాత గౌడ దేశాన్ని కూడా ఆక్రమించాడు. ఆ తర్వాత తన దిగ్విజయ యాత్రలు ప్రారంభించి.. సింధు, వల్లభి, గుజరాత్, సౌరాష్ర్ట మొదలైన ప్రాంతాలను జయించాడు. లత, మాళ్వా ప్రాంతాలపై ఆధిపత్యం విషయంలో హర్షుడికి.. బాదామీ చాళుక్యరాజు రెండో పులకేశితో ఘర్షణ అనివార్యమైంది. హర్షుడు.. పులకేశితో యుద్ధానికి చేసిన సన్నాహాల గురించి బాణభట్టు తన రచనల్లో వివరించాడు. వీరి మధ్య జరిగిన యుద్ధం గురించిన ప్రస్తావన రెండో పులకేశికి చెందిన ఐహోల్ ప్రశస్తిలో కనిపిస్తోంది. ఈ యుద్ధంలో హర్షుడి విజయం సందిగ్ధకరం అని భావించాలి. పులకేశి వారసులు ఈ యుద్ధంలో పులకేశి విజయం సాధించినట్లు పేర్కొన్నారు. అయితే చరిత్రకారులు వీరి మధ్య స్నేహపూర్వక ఒప్పందం జరిగినట్లు భావిస్తున్నారు. హర్షుడు సాధించిన సైనిక విజయాల సమాచారం అతడు జారీ చేసిన వివిధ శాసనాల ద్వారా లభిస్తోంది. హర్షుడు బన్సిఖేర, మధుబన్, సోనేపట్ మొదలైన శాసనాలను జారీ చేశాడు. హర్షుడు మరణించే నాటికి అతడి రాజ్యంలో కాశ్మీర్ తప్ప మిగిలిన ఉత్తర భారతదేశమంతా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అంతర్భాగంగా ఉండేది. అందుకే హర్షుడిని ఉత్తర భారతదేశాన్ని పాలించిన చివరి గొప్ప హిందూ రాజుగా పరిగణిస్తారు. పాలనా విధానం ప్రాచీన భారతదేశ చరిత్రలో చివరిసారిగా ఒక పటిష్టమైన పాలనాపద్ధతిని ఏర్పాటు చేసిన రాజు హర్షుడు. ఇతడి పాలనా సమర్థత వల్ల గుప్తుల అనంతరం ఉత్తర భారతంలో దాదాపు 40 ఏళ్లపాటు శాంతియుత వాతావరణం ఏర్పడింది. కనౌజ్కు దగ్గరగా ఉన్న ప్రాంతాలను ఇతడు ప్రత్యక్షంగా పాలించినప్పటికీ.. పరోక్ష పాలనలో మాత్రం చాలా ప్రాంతాలుండేవి. హర్షుడి కాలంలో వచ్చిన ప్రధాన మార్పు భూస్వామ్య వ్యవస్థ ఏర్పడటం. దీంతోపాటు సామంత వ్యవస్థ కూడా పెరిగిపోయింది. ఒక రాజుకు ఉన్న సామంతుల సంఖ్యను బట్టి అతడి గొప్పదనాన్ని అంచనా వేయడం ప్రారంభమైంది. హర్షుడు తన సామ్రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం అనేక రాష్ట్రాలుగా విభజించాడు. వీటిని ‘భుక్తి’ అని పిలిచేవారు. రాష్ట్రాలను ‘విషయ’ అనే పేరుతో జిల్లాలుగా విభజించారు. జిల్లాలను ‘పాథక’ అని విభజించారు. పాలనలో చిట్టచివరి విభాగం గ్రామం. పరిపాలనలో రాజుకు సహాయంగా మంత్రి పరిషత్ ఉండేది. హర్షుడి అధికారుల్లో ముఖ్యమైనవారు మంత్రి, సేనాపతి, మహాసామంత, కుమారామాత్య, ఉపారిక, విషయపతి, రాజస్థానీయ తదితరులు. ఉన్నతాధికారులందరికీ వేతనాలను భూముల రూపంలోనే చెల్లించేవారు. కేవలం కిందిస్థాయి సైనికులకే జీతాలను నగదు రూపంలో చెల్లించేవారు. అందుకే ఈ కాలంలో అతి తక్కువ సంఖ్యలో నాణేలు కనిపిస్తాయి. నాణేల కొరతకు మరో కారణం.. ఈ కాలంలో వ్యాపార వాణిజ్యాలు మరింతగా క్షీణించడమే. ప్రజలపై పన్నుల భారం తక్కువగానే ఉండేది. రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు భూమిశిస్తు. ఇది పంటలో ఆరో వంతుగా ఉండేది. ‘తుల్యమేయ’ అనే అమ్మకం పన్ను కూడా విధించారు. - కె. యాకూబ్బాష, సబ్జెక్టు నిపుణులు -
ఎడ్యు న్యూస్
ఎస్ఎస్సీ ఫలితాల ప్రకటన తేదీలు.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పోటీ పరీక్షల ఫలితాల తేదీలు.. ⇒ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ (సీజీఎల్ఈ) 2015 తుది ఫలితాలు మే 30 ⇒ జూనియర్ ఇంజనీర్స్ (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్) ఎగ్జామినేషన్ 2015 పేపర్-1 ఫలితాలు మే 16 ⇒ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) ఎగ్జామినేషన్ 2015 రాత పరీక్ష ఫలితాలు జూలై 22 ⇒ స్టెనోగ్రాఫర్ (గ్రేడ్ సి, డి) ఎగ్జామినేషన్ 2015 రాత పరీక్ష ఫలితాలు జూన్ 8. -
ఇంటర్తో ఉద్యోగాలివిగో..!!
ఇంటర్మీడియట్ స్పెషల్ ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలున్నాయి. ముఖ్యంగా త్రివిధ దళాలైన.. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ఫోర్స్లతోపాటు యూపీఎస్సీ, ఎస్ఎస్సీ క్రమం తప్పకుండా ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ ఉత్తీర్ణులకు ఉన్న ఉద్యోగాలు.. వాటి వివరాలు.. నేషనల్ డిఫెన్స్ అకాడెమీ అండ్ నేవల్ అకాడెమీ ఎన్డీఏ అండ్ ఎన్ఏ పరీక్షను యూపీఎస్సీ ఏటా రెండుసార్లు నిర్వహిస్తోంది. ఇందులో ఉత్తీర్ణులైనవారు పైలట్, బీటెక్, బీఎస్సీ, బీఏ కోర్సులు ఉచితంగా పూర్తిచేయడమే కాకుండా.. లెఫ్ట్నెంట్, సబ్ లెఫ్ట్నెంట్, ఫ్లైయింగ్ ఆఫీసర్ హోదాతో త్రివిధ దళాల్లో కొనసాగొచ్చు. ట్రేడ్ శిక్షణలో నెలకు * 21,000 స్టైఫండ్ లభిస్తుంది. 35,000కుపైగా వేతనంతో కెరీర్ ఆరంభమవుతుంది. అర్హత: ఆర్మీ వింగ్: ఏ గ్రూప్లోనైనా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. ఎయిర్ఫోర్స్, నేవల్ వింగ్స్.. నేవల్ అకాడెమీ: మ్యాథ్స్, ఫిజిక్స్తో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. ఎంపిక: రాత, శారీరక పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా. వెబ్సైట్: www.upsc.gov.in కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ కేంద్రప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్, లోయర్ డివిజన్ క్లర్క్స్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పరీక్ష.. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) ఎగ్జామినేషన్. అర్హత : గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత. వయోపరిమితి: నోటిఫికేషన్లో నిర్దేశించిన తేదీనాటికి 18 నుంచి 27 ఏళ్లు. ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్ ఆధారంగా. వెబ్సైట్: http://ssc.nic.in త్రివిధ దళాల్లో.. ఇండియన్ నేవీ సైలర్ ఆర్టిఫిషర్ అప్రెంటీస్ అర్హత: 55% మార్కులతో ఇంటర్ ఎంపీసీ. ఎంపిక విధానం: రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్ష సీనియర్ సెకండరీ రిక్రూటర్స్ అర్హత: ఎంపీసీ గ్రూప్తో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత వయోపరిమితి: 17-21 ఏళ్లు ఎంపిక విధానం: రాతపరీక్ష, దేహదారుఢ్య పరీక్ష వెబ్సైట్: www.nausena-bharti.nic.in ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం వయోపరిమితి: 16 1/2-19 1/2 ఏళ్లు అర్హత: 70 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత. ఎంపిక విధానం: సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ) ఇంటర్వ్యూ ద్వారా సోల్జర్ టెక్నికల్ అర్హత: ఇంటర్మీడియెట్ ఎంపీసీ వయోపరిమితి: 17 1/2-23 ఏళ్లు ఎంపిక విధానం: దేహదారుఢ్య పరీక్ష, రాత పరీక్ష క్లర్క్, స్టోర్ కీపర్ అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా గ్రూప్తో ఇంటర్ ఉత్తీర్ణత. వయోపరిమితి: 17 1/2-23 ఏళ్లు. ఎంపిక: రాత, శారీరక పరీక్షల ద్వారా ఇండియన్ ఎయిర్ఫోర్స్ గ్రూప్-ఎక్స్ (టెక్నికల్ ట్రేడ్స్) వయోపరిమితి: 17-22 ఏళ్లు అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఎంపీసీ ఉత్తీర్ణత. గ్రూప్-వై (నాన్టెక్నికల్) అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. వయోపరిమితి: 17-25 ఏళ్లు ఎంపిక: రాత, శారీరక పరీక్ష ద్వారా తెలుగు రాష్ట్రాల్లో... రెవెన్యూ శాఖ వీఆర్ఓ (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్) అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. టీఎస్ పోలీస్ పోలీస్ కానిస్టేబుల్ (సివిల్, ఏఆర్,కమ్యూనికేషన్) అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. ఎంపిక విధానం: రాత, శారీరక సామర్థ్య పరీక్ష వెబ్సైట్: www.tslprb.in ఏపీ పోలీస్ పోలీస్ కానిస్టేబుల్ (సివిల్, ఏఆర్,కమ్యూనికేషన్) అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. ఎంపిక విధానం: రాత, శారీరక సామర్థ్య పరీక్ష వెబ్సైట్: www.apstatepolice.org -
ఎడ్యు న్యూస్
దూరవిద్యలో బీఈడీ కోర్సు 2016 విద్యా సంవత్సరం నుంచి అన్ని వర్సిటీల్లో దూరవిద్య ద్వారా బీఈడీ, ఎంఈడీలను కొత్త సిలబస్, నిబంధనలతో పునఃప్రారంభించడానికి నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ) ఆమోదం తెలిపింది. గతేడాది దూరవిద్య విధానాన్ని ఎన్సీటీఈ తాత్కాలికంగా నిలిపివేసింది. 2015 ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం దూరవిద్యలో బీఈడీ చదవాలంటే రెండేళ్ల బోధన అనుభవం ఉండాలి. -
న్యూ కోర్సు
బిజినెస్ అనలిటిక్స్ కోర్సు ఐఐఎం-కోల్కతా, ఐఐటీ-ఖరగ్పూర్, ఐఎస్ఐ-కోల్కతా సంయుక్తంగా పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ అనలిటిక్స్ కోర్సును ప్రారంభించాయి. పీజీడీబీఏ పేరుతో పిలిచే ఈ కోర్సుకు రెండేళ్ల వ్యవధి ఉంటుంది. బిజినెస్ అనలిటిక్స్కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ కోర్సుకు రూపకల్పన చేశారు. 10+2+4 విధానంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి, క్యాట్, జీమ్యాట్, జీఆర్ఈ, గేట్లలో ఏదో ఒక స్కోర్ కలిగి ఉన్నవారు ప్రవేశాలకు అర్హులు. వెబ్సైట్: www.iimcal.ac.in -
పోటీ పరీక్షల్లో కీలకం 'భౌగోళికం'
కాంపిటీటివ్ గెడైన్స్ : ఇండియన్ జాగ్రిఫీ తెలుగు రాష్ట్రాల్లోని పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, కేంద్ర స్థాయిలో యూపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షల్లో భౌగోళిక శాస్త్రం అత్యంత కీలకమైన అంశం. ఎందుకంటే జీవపరిణామ క్రమంలో ‘ఆధునిక మానవుడి’ ప్రస్థానం భూమ్మీద ప్రారంభమైనప్పట్నుంచీ (సుమారు పదివేల ఏళ్ల నుంచి) ఇప్పటివరకు, భవిష్యత్తులో కూడా మానవ జీవితాన్ని భూగోళ శాస్త్రం ప్రభావితం చేస్తుంది. రాష్ట్రాల్లో, దేశంలో ఆర్థిక ప్రగతిని అంచనా వేయడానికి, ఆయా ప్రాంతాల్లోని వనరుల లభ్యత, వినియోగం, వ్యవసాయ సామర్థ్యం, పారిశ్రామికీకరణ గురించి తెలుసుకోవడానికి, ప్రణాళికలు రూపొందించడంలో భూగోళశాస్త్ర పరిజ్ఞానం అవసరం. పైన తెలిపిన నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ, భారత భూగోళశాస్త్రంలో ఈ అంశాలను అధ్యయనం చేస్తే సివిల్స్ ప్రిలిమ్స్కే కాకుండా మెయిన్స్కు కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఉభయరాష్ట్రాల్లో ఇప్పటినుంచి జరగబోయే పోటీ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి, సరళి సివిల్స్ తరహాలో ఉండబోతుందనేది సుస్పష్టం. ఇటీవల తెలంగాణలో నిర్వహించిన ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రమే దీనికి ఉదాహరణ. ఇప్పటినుంచి జరగబోయే పరీక్షల్లో ఫ్యాక్ట్ బేస్డ్ ప్రశ్నలే కాకుండా అసెర్షన్ అండ్ రీజన్, ఆడ్ మ్యాన్ ఔట్, మ్యాచ్ ద ఫాలోయింగ్, స్టేట్మెంట్ రూపంలో మిశ్రమ పద్ధతిలో ప్రశ్నపత్రాల సరళి ఉండబోతుంది. ఇలాంటి ప్రశ్నలకు జవాబులు గుర్తించాలంటే అభ్యర్థులకు సబ్జెక్టులోని ప్రతి అంశంపై పూర్తి అవగాహన అవసరం. కింది ప్రశ్నలను పరిశీలిస్తే ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలో తెలుస్తుంది. 1) రుతువును అనుసరించి రాత్రి, పగటి సమయాల్లో తేడాలు ఏర్పడటానికి ప్రధాన కారణం? ఎ) భూమి తన అక్షం మీద తన చుట్టూ తాను తిరగడం బి) భూమి సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరగడం సి) ఓ ప్రాంత అక్షాంశం విలువ డి) భూఅక్షం వాలి ఉన్నందున, భూమధ్యరేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్లే కొద్దీ భూమి చుట్టుకొలత తగ్గడం వల్ల సరైన సమాధానం: డి వివరణ: అభ్యర్థులు ఈ ప్రశ్నకు సరైన జవాబు గుర్తించాలంటే ‘భూచలనాలు (మోషన్స్ ఆఫ్ ద ఎర్త్)’ అనే అంశంపై పూర్తి అవగాహన ఉండాలి. ఇక్కడ భూఅక్షం నిట్టనిలువుగా ఉండకుండా 23.5 డిగ్రీల కోణంలో ఓవైపు వాలి ఉంటుంది. భూభ్రమణ సమయంలో జనించే అపకేంద్రబలాల ప్రభావం తగ్గడంతోపాటు.. భూమధ్యరేఖ నుంచి ధ్రువాలవైపు వెళ్లే కొద్దీ అక్షాంశాల పరిమాణం(భూమి చుట్టుకొలత) తగ్గడమే ఇందుకు కారణం. ఈ మొత్తం ప్రక్రియ అర్థం కావాలంటే భూఅక్షం అంటే ఏమిటి? భూకక్ష్య(ఆర్బిట్) అంటే ఏమిటి? అపకేంద్రబలాలు అంటే ఏమిటి? అనే భావనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. 2) కింది వాటిని పరిశీలించండి. 1) విద్యుదయస్కాంత వికిరణాలు (ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్) 2) జియో థర్మల్ ఎనర్జీ 3) గురుత్వాకర్షణ బలం 4) శిలావరణ ఫలకాల కదలికలు 5) భూభ్రమణం (రొటేషనల్ ఆఫ్ ద ఎర్త్) 6) భూపరిభ్రమణం (రివల్యూషన్ ఆఫ్ ద ఎర్త్) పైన తెలిపిన వాటిలో భూమిపై గతిశీల మార్పులకు కారణమైన అంశాలేవి? ఎ) 1,2,3,4 బి) 1,3,5,6 సి) 2,4,5,6 డి) పైవన్నీ సరైన సమాధానం: డి వివరణ: 1) సూర్యుని నుంచి విడుదలయ్యే విద్యుదయస్కాంత వికిరణాలు భూమ్మీద ఉష్ణానికి, శక్తికి, పీడన వ్యత్యాసానికి మూలం. అంతేకాకుండా భూమ్మీద ఉన్న సకల జీవరాశులకు కావలసిన శక్తి అవసరాలు దీని ద్వారానే అందుతాయి. 2) శిలావరణ పలక సరిహద్దుల వెంబడి అగ్నిపర్వత విస్ఫోటనాలకు జియో థర్మల్ ఎనర్జీ కారణం 3) పోటు, పాటులు ఏర్పడటానికి, నదీ ప్రవాహ గమనానికి భూగురుత్వాకర్షణ బలాలు కారణం. 4) ఖండాల, పర్వతాల ఆవిర్భావానికి, భూకంపాలకు శిలావరణ ఫలక కదలికలు కారణం 5) రాత్రీపగలు ఏర్పడటానికి, భూమికి ఇరువైపులా ఉన్న అన్ని ప్రాంతాల్లో జీవ నివాసానికి, పవనాలు, సముద్రప్రవాహాలు కదలడానికి భూభ్రమణమే కారణం. 6) రాత్రి, పగలు సమయాల్లో తేడాలు ఏర్పడటానికి, రుతువులు ఏర్పడటానికి భూపరిభ్రమణం కారణం. అభ్యర్థులు పై అంశాలను పరిశీలించిన తర్వాత భౌగోళిక ప్రక్రియలను అవగాహన చేసుకుని, వివిధ విజ్ఞాన శాస్త్రాల్లో ప్రాథమిక పరిజ్ఞానం పొందాలి. 3) కింద పేర్కొన్న జతలను పరిశీలించండి. జాతీయ పార్కు పార్కు ద్వారా ప్రవహించేనదులు 1) జిమ్ కార్బెట్ గంగ 2) కజిరంగా మానస్ 3) సెలైంట్ వ్యాలీ కావేరి 4) కన్హా బెట్వా పైన తెలిపిన వాటిలో ఏ జత సరైనదో పేర్కొనండి. ఎ) 1, 2 బి) 3 సి) 1, 3 డి) 4 సరైన సమాధానం: డి వివరణ: గంగా ఉపనది అయిన రామ్గంగా నది జిమ్ కార్బెట్ గుండా ప్రవహిస్తోంది. కజిరంగా పార్కు గుండా ఏ నదీ ప్రవహించడం లేదు. సెలైంట్వ్యాలీ గుండా కుంతీపూజా నది వెళుతోంది. 4) ప్రపంచంలో ఏ ప్రాంతంలో మత్స్య గ్రహణ కేంద్రాలు (ఫిషింగ్ గ్రౌండ్స్) కేంద్రీకృతమై ఉన్నాయి ఎ) ఉష్ణ, శీతల వాతావరణ ప్రవాహాలు కలిసే చోట బి) నదులు మంచినీటిని అధిక పరిమాణంలో సముద్రంలోకి పంపేచోట సి) ఖండతీరపు అంచు ఎక్కువ వెడల్పుగా ఉండేచోట డి) ఉష్ణ, శీతల సముద్ర ప్రవాహాలు కలిసే చోట పైన తెలిపిన వాటిలో నిజమైన వాక్యమేది? 1) ఎ 2) ఎ, సి 3) ఎ, బి 4) సి, డి సరైన సమాధానం: 4 వివరణ: ఖండతీరపు అంచు వెడల్పుగా ఉన్న ప్రాంతం చేపలు నివసించడానికి అనుకూలంమైంది. ఇక్కడ చేపలు గుడ్లు పెట్టి, పొదిగి ఆవాసాన్ని ఏర్పర్చుకుంటాయి. ఉష్ణ, శీతల సముద్ర ప్రవాహాలు కలిసే ప్రదేశంలో వృక్ష ప్లవకాలు సమృద్ధిగా పెరుగుతాయి. వీటిని ఆహారంగా తీసుకుని జంతు ప్లవకాలు పెరుగుతాయి. జంతు ప్లవకాలను ఆహారంగా తీసుకొని చేపలు సమృద్ధిగా పెరుగుతాయి. ఉష్ణ, శీతల ప్రవాహాలు కలిసే ప్రాంతాలు తీరరేఖ సమీపంలో ఉన్నందున ఖండ భూభాగాల నుంచి సమృద్ధిగా పోషకాలు అందుతాయి. - ఎ.డి.వి. రమణ రాజు సీనియర్ ఫ్యాకల్టీ,ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ -
భవితకు దిక్సూచి
ఇంటర్మీడియట్ స్పెషల్ బైపీసీ.. పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్లో బైపీసీ గ్రూప్తో ఉన్నటువంటి ఉన్నతవిద్య, ఉద్యోగావకాశాలు మరే గ్రూపునకు లేవంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో బైపీసీతో ఉన్న ఉన్నత విద్య అవకాశాలేమిటో తెలుసుకుందాం.. ఎంసెట్తో.. ఇంటర్లో బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ (బైపీసీ) చదివినవారు మన రాష్ర్టంలో మెడికల్, అగ్రికల్చర్, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ రాయొచ్చు. ఈ ర్యాంకు ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీఎన్వైఎస్, బీయూఎంఎస్ వంటి కోర్సుల్లో చేరొచ్చు. వీటితోపాటు బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్ఎస్సీ, బీఎస్సీ(అగ్రికల్చర్), బీఎస్సీ(హార్చికల్చర్), బీఫార్మసీ, ఫార్మాడి, బీటెక్ (బయోటెక్నాలజీ) చేయొచ్చు. బీఎస్సీతో కెరీర్ షైనింగ్ ఇంటర్ పూర్తయ్యాక బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్, మైక్రోబయాలజీ, మాలిక్యులర్ బయాలజీ, జెనిటిక్స్, బోటనీ, జువాలజీ వంటి సబ్జెక్టుల్లో ఏవైనా మూడింటిని ఎంచుకొని డిగ్రీ పూర్తిచేయొచ్చు. దాదాపు అన్ని ప్రభుత్వ, కొన్ని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ఈ కోర్సులు ఉన్నాయి. తర్వాత ఆసక్తి ఉన్న సబ్జెక్టులో పీజీ చేయొచ్చు. తర్వాత సీఎస్ఐఆర్ నిర్వహించే నెట్ రాయొచ్చు. మంచి మార్కులు సాధిస్తే దేశవ్యాప్తంగా ఉన్న వర్సిటీలు/విద్యాసంస్థల్లో పీహెచ్డీ చేయొచ్చు. జేఆర్ఎఫ్ కింద మొదటి రెండేళ్లు నెలకు రూ. 25,000 తర్వాత మూడేళ్లు నెలకు రూ. 28,000 పొందొచ్చు. పీహెచ్డీతో రీసెర్చ్, టీచింగ్ కెరీర్లో ఉన్నత స్థాయికి చేరొచ్చు. పీజీ వద్దనుకుంటే సివిల్స్, ఎస్ఎస్సీ, బ్యాంక్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగం పొందొచ్చు. ఉపాధికి పారామెడికల్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఆప్టోమెట్రీ, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్, ఆఫ్తల్మాలిక్ అసిస్టెంట్, ఆడియోమెట్రీ, రేడియోథెరపీ, పర్ఫ్యూషన్ టెక్నీషియన్, డయాలసిస్, మెడికల్ ఇమేజింగ్, రెస్పిరేటరీ థెరపీ, మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్, హియరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్ థెరపీ, డెంటల్ టెక్నీషియన్, మైక్రో సర్జరీ, అనస్థీషియా, క్యాత్ల్యాబ్, ఈసీజీ, కార్డియాలజీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రెండేళ్ల వ్యవధి ఉన్న ఈ కోర్సులు పూర్తిచేయడం ద్వారా ఆయా ఆస్పత్రుల్లో ఉపాధి అవకాశాలు దక్కించుకోవచ్చు. ప్రారంభంలో వేతనం నెలకు రూ.10 వేల నుంచి రూ. 15 వేల వరకు ఉంటుంది. ఫిజియోథెరపి.. వ్యాయామ పరికరాలను అవసరానికి అనుగుణంగా ఉపయోగించే శిక్షణ, ఎలక్ట్రోథెరపి, మాగ్నటోథెరపి, మసాజ్, దెబ్బతిన్న కండర పునరుత్పత్తికి ఫిజియోథెరపిస్టులు అత్యవసరం. ఈ కోర్సు పూర్తిచేస్తే ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు ఉంటాయి. ప్రారంభంలో నెలకు రూ.15 వేలు ఇస్తారు. నర్సింగ్.. మన దేశంతోపాటు అమెరికా, పశ్చిమ ఆసియాల్లోనూ అపార ఉద్యోగ అవకాశాలను అందిస్తున్న కోర్సు. భారత్లో 2016 నాటికి 24 లక్షల మంది నర్సుల అవసరం ఉంటుందని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అంచనా. -
దరఖాస్తు చేశారా?
* హెచ్ఎల్ఎల్ బయోటెక్లో జూనియర్ ఆఫీసర్, టెక్నీషియన్, ఆపరేటర్.. పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: మే 11 * ఎయిర్ ఇండియా లిమిటెడ్లో ట్రైనీ క్యాబిన్క్రూ పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: మే 23 * యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ డిప్లొమా ట్రైనీ, ఆపరేషనల్ ట్రైనీ..పోస్టుల దరఖాస్తుకు చివరి తేది : మే 27 -
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్
గ్రాడ్యుయేట్స్ స్పెషల్ దేశంలో పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో.. అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో.. కీలకపాత్ర పోషిస్తూ దేశాభివృద్ధికి తోడ్పడుతోంది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)! ఈ సర్వీస్కు ఎంపికకావడం ద్వారా ఉన్నత కెరీర్తో పాటు దేశానికి సేవచేసే అవకాశం లభిస్తుంది. తాజాగా యూపీఎస్సీ ఐఎఫ్ఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం... మొత్తం ఖాళీలు అంచనా 110 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 27, 2016 అఖిల భారత సర్వీసుల్లో భాగంగా కేంద్ర అటవీ శాఖలో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ లేదా డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ హోదాతో కెరీర్ ప్రారంభించేందుకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష వీలుకల్పిస్తుంది. ఐఎఫ్ఎస్కు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ కేడర్ కంట్రోలింగ్ అథారిటీగా వ్యవహరిస్తోంది. అర్హత * యానిమల్ హజ్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ సబ్జెక్టుల్లో కనీసం ఒక సబ్జెక్టుతో బ్యాచిలర్ డిగ్రీ. (లేదా) * అగ్రికల్చర్/ ఫారెస్ట్రీలో బ్యాచిలర్ డిగ్రీ (లేదా) ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ. వయసు 2016, ఆగస్టు 1 నాటికి కనీస వయసు 21 ఏళ్లు. గరిష్ట వయసు 32 ఏళ్లు. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం * ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎంపిక విధానం మూడు దశలుగా ఉంటుంది. అవి.. ప్రిలిమినరీ రాత పరీక్ష, మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ. * గతంలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు ప్రిలిమినరీ రాత పరీక్షను యూపీఎస్సీ ప్రత్యేకంగా నిర్వహించేది. ప్రస్తుతం సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కూడా నిర్వహిస్తోంది. అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్లోని మెయిన్స్కు ఎంపిక కావాలంటే ముందుగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించాలి. * ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారు మళ్లీ ప్రత్యేకంగా మెయిన్స్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూకు సాధారణంగా ఖాళీల సంఖ్యకు రెట్టింపు సంఖ్యలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్ ఇందులో రెండు ఆబ్జెక్టివ్ (మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు) పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్కు 200 మార్కులు. పేపర్కు రెండు గంటలు సమయం అందుబాటులో ఉంటుంది. పేపర్-2 అర్హత పేపర్ మాత్రమే. ఇందులో కనీసం 33 శాతం మార్కులు వస్తే సరిపోతుంది. ఆబ్జెక్టివ్ పేపర్లలో నెగిటివ్ మార్కులుంటాయి. ప్రశ్నపత్రాలు హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటాయి. విజయానికి సూచనలు * బలహీనంగా ఉన్నామనుకున్న అంశాలను ప్రణాళిక ప్రకారం అధ్యయనం చేస్తూ, పట్టుసాధించాలి. * తక్కువ సమయంలో ఎక్కువ అంశాలను అధ్యయనం చేసేందుకు వీలుకల్పించే మెటీరియల్ను ఎంపిక చేసుకోవాలి. * పరీక్ష విధానం, అంశాలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలుసుకునేందుకు గత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయాలి. * జనరల్ స్టడీస్ ప్రిపరేషన్కు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు, వార్తాపత్రికలు, ఇంటర్నెట్ను ఉపయోగించుకోవాలి. * ప్రిలిమ్స్, మెయిన్స్లకు ఒకేసారి ప్రిపేర్ కావాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ పరీక్షలకు వ్యవధి చాలా తక్కువ ఉంటుంది. పోస్టులు తక్కువ, పోటీ ఎక్కువగా ఉండటంతో సివిల్ సర్వీసెస్ కంటే ఐఎఫ్ఎస్ ప్రిలిమ్స్ కటాఫ్ మార్కులు ఎక్కువగా ఉంటాయి. మెయిన్స్కు కూడా ఉపయోగపడేలా జనరల్ స్టడీస్ పేపర్లను ప్రిపేర్కావాలి. మెయిన్స్ డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది కాబట్టి రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. మ్యాథమెటిక్స్ వంటి సబ్జెక్టును ఆప్షనల్గా ఎంచుకుంటే విస్తృత అధ్యయనం అవసరం. సివిల్స్కు, ఐఎఫ్ఎస్కు ఒకే ప్రిలిమ్స్ పరీక్ష అయినప్పటికీ, కటాఫ్ మార్కులు ఐఎఫ్ఎస్కు ఎక్కువగా ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ కొనసాగించాలి. - గుంటుపల్లి వరుణ్, ఐఎఫ్ఎస్ నాలుగో ర్యాంకు (2014) మెయిన్ ఎగ్జామినేషన్ (డిస్క్రిప్టివ్) పేపర్-1 జనరల్ ఇంగ్లిష్ 300 మార్కులు పేపర్-2 జనరల్ నాలెడ్జ్ 300 మార్కులు పేపర్-3 పేపర్-4 పేపర్-5 పేపర్-6 (ఆప్షనల్ పేపర్లు. అభ్యర్థులు రెండు సబ్జెక్టులను ఎంపిక చేసుకోవాలి. ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్కు 200 మార్కులు) ఇంటర్వ్యూ / పర్సనాలిటీ టెస్ట్ సర్వీసుకు సంబంధించిన విధులను నిర్వర్తించే సామర్థ్యం అభ్యర్థికి ఏ మేరకు ఉందో పర్సనాలిటీ టెస్ట్ ద్వారా పరీక్షిస్తారు. దీనికి 300 మార్కులు కేటాయించారు. -
ఉద్యోగాలు
సీఆర్పీఎఫ్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్.. హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది ఖాళీల సంఖ్య: 600 అర్హత: సెంట్రల్/స్టేట్ బోర్డు నుంచి ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. వయసు: 18-25 ఏళ్లు దరఖాస్తు: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఏప్రిల్ 06 రిజిస్ట్రేషన్ ముగింపు: మే 5 రాత పరీక్ష తేదీ: జూన్ 26 మరిన్ని వివరాలకు: www.crpf.nic.in ఐఆర్ఈడీఏలో 46 పోస్టులు న్యూఢిల్లీలోని ఇండియన్ రెన్యు బుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ (ఐఆర్ఈడీఏ) వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టులు: అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (టెక్నికల్ సర్వీస్,ఎఫ్ అండ్ ఏ), సీనియర్ మేనేజర్ (టెక్నికల్ సర్వీసెస్, ఐటీ, ఎఫ్ అండ్ ఏ, లా), అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్ సర్వీసెస్, ఐటీ, ఎఫ్ అండ్ ఏ, లా, హెచ్ఆర్), మేనేజర్ (ఎఫ్ అండ్ ఏ), అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ. ఖాళీలు: 46 వయసు: అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: మే 8 వివరాలకు: www.ireda.gov.in అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం బెంగళూరులోని అజీమ్ప్రేమ్జీ యూనివర్సిటీ.. ఎల్ఎల్ఎం ఇన్ లా అండ్ డెవలప్మెంట్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వ్యవధి: ఏడాది అర్హత: లా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: మే 31 వెబ్సైట్: www.azimpremjiuniversity.edu.in ట్రిపుల్ ఐటీ- వడోదరలో ఎంటెక్ ప్రోగ్రాం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)- వడోదర.. ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హతలు: సీఎస్, ఐటీ, ఈసీ, సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్ (లేదా) సీఎస్, ఐటీ, స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్లో ఎమ్మెస్సీ గేట్ (సీఎస్/ఈసీ)లో అర్హత సాధించి ఉండాలి. ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చివరి తేదీ: మే 27 వెబ్సైట్: pgadmissions.iiitvadodara.ac.in -
ఫలితాల వెల్లడి
⇒ టీఎస్ పాలీసెట్ పరీక్ష ⇒ పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్లర్క్(సీఆర్పీ-V) ఇంటర్వ్యూ లిస్ట్ ⇒ యూపీఎస్సీ అసోసియేట్ ప్రొఫెసర్ (ఇంటర్వ్యూ లిస్ట్) ⇒ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎమ్మెస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ నాలుగో సెమ్ 2016 ఏప్రిల్ ⇒ విక్రమ సింహపురి యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ సెమ్ 2015 డిసెంబర్ పరీక్ష ⇒ కాకతీయ వర్సిటీ ఫార్మ్.డీ నాలుగో సంవత్సరం అక్టోబర్ 2015 పరీక్ష -
బ్రాంచ్ ఎంపికలో.. అభిరుచి
ఇంజనీరింగ్ స్పెషల్ జాతీయ స్థాయిలో ఐఐటీలు, నిట్లతోపాటు రాష్ట్ర స్థాయి కాలేజీల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు భారీ కసరత్తు జరుగుతోంది. జేఈఈ మెయిన్ ఫలితాలు ఇప్పటికే వెలువడగా, తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ ముగిసింది. తెలంగాణలో మే 15న ఎంసెట్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత విద్యార్థులు, తల్లిదండ్రుల దృష్టంతా ఇంజనీరింగ్లో బ్రాంచ్ సెలక్షన్ గురించే! ఈ నేపథ్యంలో బ్రాంచ్ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై నిపుణుల సలహాలు, సూచనలు.. 1. తొలి ప్రాధాన్యం.. ఆసక్తి సివిల్ ఇంజనీరింగ్ నుంచి సిరామిక్ టెక్నాలజీ వరకు.. ఐటీ కొలువుకు దారిచూపే కంప్యూటర్ సైన్స్.. కోర్ బ్రాంచ్లు, అప్కమింగ్ బ్రాంచ్లు.. ఇలా పదుల సంఖ్యలో బ్రాంచ్లు! బ్రాంచ్లు ఎన్ని ఉన్నా.. విద్యార్థులు మాత్రం తమ వ్యక్తిగత అభిరుచికి తగ్గ బ్రాంచ్నే ఎంచుకోవాలన్నది నిపుణుల సూచన. తాము అప్పటివరకు అకడమిక్గా మంచి ఆసక్తి కనబర్చిన సబ్జెక్ట్లను ఇందుకు ఉపకరణాలుగా మలచుకోవాలి. ఎందుకంటే.. సబ్జెక్టుపై ఆసక్తి ఉంటేనే అకడమిక్గా రాణించడం సాధ్యమవుతుంది. మ్యాథమెటిక్స్లో అల్గారిథమ్స్, స్టాటిస్టికల్ స్కిల్స్ ఉన్న విద్యార్థులు ప్రోగ్రామింగ్లో ప్రతిభ కనబర్చగలరు. ఇలాంటి విద్యార్థులు సీఎస్ఈ, ఈసీఈ, ఐటీ వంటి బ్రాంచ్లను ఎంపిక చేసుకోవచ్చు. డ్రాయింగ్, డిజైనింగ్ నైపుణ్యాలు కలిగిన విద్యార్థులకు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ వంటి బ్రాంచ్లు సరిపోతాయి. 2. ‘భవిష్యత్తు’ బేరీజు బ్రాంచ్ ఎంపికలో ఆసక్తితోపాటు భవిష్యత్తులో లభించే కెరీర్ అవకాశాలపైనా దృష్టిపెట్టాలి. కొన్ని బ్రాంచ్లకు మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. మరికొన్ని బ్రాంచ్లు మార్కెట్ స్థితిగతులపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు సీఎస్ఈ ద్వారా అవకాశాలు లభించే సాఫ్ట్వేర్ రంగాన్ని పరిగణిస్తే ఈ రంగం ఒడిదుడుకులకు లోనవుతుంది. భవిష్యత్తు అంచనాలు తెలుసుకునేందుకు అసోచామ్, ఫిక్కీ వంటి సంస్థల సర్వేల నివేదికలను పరిశీలించొచ్చు. 3. ఉన్నత విద్య బ్రాంచ్ను ఎంపిక చేసుకునే ముందు.. ఆయా బ్రాంచ్ ద్వారా లభించే ఉన్నత విద్య.. వాటిని పూర్తి చేశాక లభించే కెరీర్ అవకాశాలపైనా దృష్టిపెట్టాలి. ఉదాహరణకు ఈఈఈ బ్రాంచ్ను పరిగణిస్తే బీటెక్ ఈఈఈతో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్లో నాలెడ్జ్ లభిస్తుంది. కాని ఈఈఈకి సంబంధించి జాబ్ మార్కెట్ పరంగా అందుబాటులో ఉన్న ప్రత్యేక విభాగాల్లో జాబ్స్ కోసం ఎంటెక్ స్థాయిలో నైపుణ్యాలు పొందాలి. ఉదా: మైక్రో చిప్స్, మెమొరీ చిప్స్ తయారు చేసే పలు ఎలక్ట్రానిక్ సంస్థల్లో ఉన్నత కొలువులు పొందాలంటే నానో టెక్నాలజీ స్పెషలైజేషన్తో ఎంటెక్ పూర్తిచేయాలి. 4. ఆటిట్యూడ్ కూడా ముఖ్యమే బ్రాంచ్ ఎంపికలో ఆసక్తితోపాటు విద్యార్థి వ్యక్తిగత దృక్పథం కూడా కీలకం. బ్రాంచ్ ద్వారా ఉత్తీర్ణత లభించే ఉద్యోగాలను దృష్టిలో పెట్టుకుంటే.. కొన్ని రంగాల్లో (ఉదాహరణకు.. సివిల్, మెకానికల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ తదితర) ఓర్పు, సహనం, శ్రమించే తత్వం, ఫీల్డ్ వర్క్కు ప్రాధాన్యం ఉంటుంది. మరికొన్ని రంగాల్లో (సాఫ్ట్వేర్ సర్వీసెస్, ఐటీ సంస్థల్లో) రాణించాలంటే.. బృంద నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్తోనే సాధ్యం. విద్యార్థులు ఆయా బ్రాంచ్ల ద్వారా లభించే ఉద్యోగాల నేచర్ ఆఫ్ ది జాబ్, అందుకు తగ్గ దృక్పథం తనకు ఉందా లేదా అనేది కూడా పరిశీలించుకోవాలి. బ్రాంచ్ ఎంపికలో పరిగణించాల్సిన మరో అంశం.. నిరంతరం నేర్చుకునే తత్వం! కారణం.. నిత్యం కొత్త మార్పులు జరిగే సాఫ్ట్వేర్ వంటి రంగాల్లో రాణించేందుకు అప్డేట్ అవడం చాలా అవసరం. 5. అనుబంధ బ్రాంచ్లపైనా విద్యార్థులు తమకు నచ్చిన బ్రాంచ్లో సీటు లభించే అవకాశాలు తక్కువగా ఉంటే.. ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలి. ఒక బ్రాంచ్కు అనుబంధంగా ఎన్నో కొత్త బ్రాంచ్లు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు సీఎస్ఈకి అనుబంధంగా ఐటీ; ఈసీఈకి అనుబంధంగా ఈటీఎం (ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికం మేనేజ్మెంట్); మెకానికల్కు అనుబంధంగా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వంటివి. బ్రాంచ్ ముఖ్యమా.. కాలేజ్ ప్రధానమా బ్రాంచ్ విషయంలో స్పష్టత లభించాక ఆ బ్రాంచ్కు సంబంధించి అకడమిక్గా పేరున్న కళాశాలలను అన్వేషించడం అవసరం. ఆ కాలేజ్లకు ఉన్న అకడెమిక్ రికార్డ్, ప్లేస్మెంట్స్, ఫ్యాకల్టీ, ల్యాబ్స్, లైబ్రరీ తదితరాల ఆధారంగా కాలేజీల జాబితా రూపొందించుకోవాలి. ఆయా కళాశాలలకు ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించాలి. ఆ క్రమంలో కొన్నిసార్లు బ్రాంచ్కు ప్రాధాన్యమివ్వాలా? లేదా కాలేజ్ /ఇన్స్టిట్యూట్కు ప్రాధాన్యమివ్వాలా? అనే ప్రశ్న ఎదురవుతుంది. నూటికి 75 శాతం బ్రాంచ్కే ప్రాధాన్యమివ్వాలి అనేది నిపుణుల సలహా. క్రేజ్ కంటే... ఇష్టానికి ప్రాధాన్యం ప్రస్తుతం విద్యార్థుల్లో అధిక శాతం మంది జాబ్ మార్కెట్ క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని బ్రాంచ్లు ఎంపిక చేసుకుంటున్నారు. కానీ ఇది కొంతమేరకే ఫలితం ఇస్తుంది. కాబట్టి క్రేజ్ కంటే వ్యక్తిగత ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వాలి. వ్యక్తిగత ఆసక్తి ఉంటే బ్రాంచ్ ఏదైనా భవిష్యత్తు అవకాశాలు పుష్కలం. తప్పనిసరి పరిస్థితుల్లో ఆసక్తి గల బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్కు మారాల్సి వస్తే విద్యార్థులు తమ మైండ్ సెట్ను కూడా అందుకు అనుగుణంగా మార్చుకోవాలి. - ప్రొఫెసర్ బి.చెన్నకేశవ రావు, ప్రిన్సిపాల్, సీబీఐటీ ప్లేస్మెంట్సే ప్రధానం కాదు విద్యార్థులు బ్రాంచ్ ఎంపికలో భవిష్యత్తు ప్లేస్మెంట్స్నే ప్రధానంగా భావించకూడదు. ముందుగా నచ్చిన బ్రాంచ్ను ఎంపిక చేసుకుని దాని ద్వారా లభించే అవకాశాలు, వాటిని అందిపుచ్చుకునే మార్గాల గురించి అన్వేషణ సాగించాలి. ప్లేస్మెంట్స్ కోణంలోనే బ్రాంచ్లను ఎంపిక చేసుకుంటే ఇబ్బందికి గురవుతారు. నచ్చిన బ్రాంచ్లో సీటు రాకపోతే అనుబంధ బ్రాంచ్లపై ముందు నుంచే దృష్టిపెట్టి వాటిల్లో చేరేందుకు కృషి చేయాలి. - ప్రొఫెసర్ ఎం.చంద్రశేఖర్, ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్, నిట్-వరంగల్ -
ఎగ్జామ్ రివ్యూ
‘నీట్’గా.. ఈజీగా.. ‘నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)-1’గా ఇటీవల పేరుమారిన ఆలిండియా ప్రి మెడికల్/ప్రి డెంటల్ టెస్ట్ (ఏఐపీఎంటీ) దేశవ్యాప్తంగా మే 1న (ఆదివారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. 180 నిమిషాల (3 గంటల) వ్యవధి గల ఈ పరీక్షలో 180 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలని నిర్దేశించారు. ఆబ్జెక్టివ్ తరహాలో ఉన్న ఈ ప్రశ్నలను ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలజీ) సబ్జెక్ట్ల నుంచి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రశ్నల స్థాయిపై సమీక్ష.. ఫిజిక్స్: సగటు కన్నా కొంచెం ఎక్కువ కఠినంగా ఉన్నాయి. 40 శాతం ప్రశ్నలు ‘టఫ్’గా, మరో 40 శాతం ‘మీడియం’గా, మిగిలిన 20 శాతం ప్రశ్నలు ‘ఈజీ’గా ఉన్నాయి. అధిక శాతం గణనలకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. కొన్ని ప్రశ్నలను ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచి ఇవ్వగా మరికొన్నింటిని గత ప్రశ్నాపత్రాల నుంచి ఇచ్చారు. కెమిస్ట్రీ: గత ఏడాదితో పోల్చితే కాస్త కఠినంగానే ఉన్నాయి. దాదాపు మూడొంతుల ప్రశ్నలు 11వ తరగతి నుంచి, మిగిలినవి 12 తరగతి నుంచి ఇచ్చారు. ఎక్కువ శాతం ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ సిలబస్ స్థాయిని మించి ఉన్నాయి. రెండు ప్రశ్నలకు రెండు ఆప్షన్లూ కరెక్ట్ ఆన్సరే ఇవ్వగా ఒక ప్రశ్నలో ఒక్క ఆప్షన్కూ సరైన సమాధానంలేదు. బయాలజీ: యావరేజ్ లెవల్ ప్రశ్నలు తక్కువగానే ఉన్నాయి. రెండు తరగతుల నుంచీ దాదాపు సమాన సంఖ్యలో వచ్చాయి. కొన్ని ప్రశ్నలను ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచి ఇవ్వలేదు. ఒక ప్రశ్నలో సూక్ష్మ పోషకాలకు సరిపోలే ఆన్సరే ఇవ్వలేదు. అధిక శాతం ప్రశ్నలు సైటాలజీ, ఫిజియాలజీ, జెనెటిక్స్, ఇకాలజీ చాప్టర్ల నుంచే అడిగారు. మొత్తం మీద ప్రశ్నాపత్రం గత ఏడాదితో పోల్చితే తేలిగ్గానే ఉందని చెప్పొచ్చు. -
అత్యుత్తమ చదువులకు అమెరికా
స్టడీ అబ్రాడ్ : కంట్రీ ప్రొఫైల్ విదేశీ విద్యకు ప్రపంచంలో ఎన్నో దేశాలు అందుబాటులో ఉన్నాయి. అయితే భారతీయ విద్యార్థులకు.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలవారికి అమెరికా.. మొదటి గమ్యస్థానంగా నిలుస్తోంది. అభిరుచికి తగిన, సత్వర ఉపాధినందించే కోర్సులుండటమే ఇందుకు కారణం. అమెరికాలో విద్యనభ్యసించే భారతీయ విద్యార్థుల సంఖ్య.. మార్చి-2016 నాటికి 1,94,438కి చేరుకుంది. ఈ నేపథ్యంలో యూఎస్ విద్యా విధానంలోని ప్రత్యేకతలపై ఫోకస్... నాణ్యమైన విద్య.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నాణ్యమైన విద్య.. సులువైన నిబంధనలతో అందుబాటులో ఉంటుంది. ఇక్కడి యూనివర్సిటీల్లో మెరుగైన మౌలిక సౌకర్యాలు, పరిశోధనలకు అనువైన వాతావరణం, నిష్ణాతులైన అధ్యాపకులు ఉంటారు. గ్రాడ్యుయేట్ స్థాయిలోనే మంచి ఉపాధినందించే కోర్సులు ఉంటాయి. లెర్నింగ్ బై డూయింగ్ లెర్నింగ్ బై డూయింగ్ విధానంలో సమగ్ర విద్య అందుతుంది. విద్యార్థులు క్యాంపస్లో పనిచేసుకోవడానికి వారానికి 20 గంటలు, సెలవులతో కలిపితే 40 గంటల వరకు అవకాశం ఇస్తారు. విదేశీ విద్యార్థులకు క్యాంపస్ బయట పనిచేసుకోవడానికి అనుమతి ఉండదు. ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో పనిచేసుకునే అవకాశం పొందవచ్చు. చాలా డిగ్రీ కోర్సుల్లో 12 నెలల పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. దీంతో వారికి నచ్చిన రంగాన్ని ఎంచుకునే అవకాశం లభిస్తుంది. అనుకూలతలు అమెరికా విద్యా వ్యవస్థలో ఎన్నో వెసులుబాట్లు ఉన్నాయి. కోర్సును మధ్యలో మార్చుకునే అవకాశం ఉంటుంది. గ్రాడ్యుయేషన్లో మొదటి రెండేళ్ల తర్వాత కోర్సుపై ఒక అవగాహన వస్తుంది. అప్పుడు విద్యార్థుల అభిరుచిని బట్టి కోర్సు మారే సౌలభ్యం ఉంది. దీంతో ఇష్టంలేని కోర్సు పూర్తి చేయాల్సి వస్తుందనే బాధ ఉండదు. టెక్నాలజీ విద్యలో అత్యుత్తమ టెక్నాలజీని అందిస్తామని అమెరికా యూనివర్సిటీలు గర్వంగా చెప్పుకుంటాయి. సాంకేతిక పరికరాలు, వనరులను సమకూర్చడంలో ముందుంటాయి. ఆధునిక టె క్నాలజీని వినియోగించుకుని విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకునేలా దోహదపడతాయి. క్యాంపస్ అనుభవం క్యాంపస్ జీవనం అమెరికా విద్యా వ్యవస్థలోనే గొప్ప అంశం. ఎందుకంటే ప్రపంచంలోని అన్ని దేశాల విద్యార్థులు అక్కడే ఉంటారు. సానుకూల వాతావరణంలో జరిగే చర్చల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు నాణ్యతా ప్రమాణాలు ఉన్న అమెరికా విద్యకు మంచి గుర్తింపు ఉంది. విద్యా సర్టిఫికెట్లకు దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల్లో మంచి ఆదరణ ఉంటుంది. అక్కడ గతేడాది మార్చి నాటికి 1,48,360 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా.. ఈ ఏడాది మార్చి నాటికి 1,94,438కి చేరుకుందని స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ పేర్కొంది. విదేశాల్లో విద్యాభ్యాసానికి వెళ్లేందుకు, వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు కన్సల్టెన్సీల బదులు రిప్రజెంటేటివ్స్ను సంప్రదించడం మంచిది. ఎందుకంటే కన్సల్టెన్సీలకు విదేశీ విద్యాసంస్థలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండవు. రిప్రజెంటేటివ్స్ ఆయా ఇన్స్టిట్యూట్లతో నేరుగా టచ్లో ఉంటారు. అందువల్ల వాళ్లయితే ఖచ్చితమైన, తాజా సమాచారం చెబుతారు. బోగస్ వెబ్సైట్లు, కన్సల్టెన్సీల ద్వారా ప్రవేశించిన చాలా మంది భారతీయ విద్యార్థులను అమెరికా ఇటేవలే వెనక్కి పంపిన విషయం తెలిసిందే. - ఇంతియాజ్ బన్నూరు, ఏఈసీసీ గ్లోబల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ -
కెరీర్ కౌన్సెలింగ్
రిటైల్ మేనేజ్మెంట్ కోర్సును అందించే ఇన్స్టిట్యూట్ల గురించి తెలపండి? - కె.సాయిరమ్య, విశాఖపట్నం విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం, రిటైల్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్తో ఎంబీఏ అందిస్తోంది. అర్హత: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. ఇదే విశ్వవిద్యాలయం, రిటైల్ మేనేజ్మెంట్ కోర్సులో డిప్లొమా అందిస్తోంది. ఏడాది పాటు కోర్సు అందిస్తారు. అర్హత: ఏదైనా డిగ్రీ. వెబ్సైట్: www.andhrauniversity.edu.in హైదరాబాద్లోని నర్సిమోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, పార్ట్టైం విధానంలో రిటైల్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్తో బిజినెస్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అందిస్తోంది. అర్హత: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.nmimshyderabad.org -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
గ్రూప్స్, సివిల్స్ వంటి పోటీ పరీక్షల కోసం జనరల్ సైన్స్కు ఎలా ప్రిపేర్ కావాలో తెలపండి? - హెచ్. లహరి, కొత్తపేట జనరల్ సైన్స్ విభాగంలోని బయాలజీలో వృక్ష, జంతు వైవిధ్యం-వాటి లక్షణాలు; ప్రత్యేకతలపై దృష్టి సారించాలి. అలాగే మానవ శరీర ధర్మశాస్త్రం; వ్యాధులకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. గ్రూప్-1లో శరీర అవయవాలు- పని తీరు- వ్యాధులకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు. ఈ విభాగంలో కరెంట్ అఫైర్స్తో మిళితమైన ప్రశ్నలూ కనిపిస్తున్నాయి. (ఉదా: ఇటీవల కాలంలో ప్రబలుతున్న వ్యాధులు, అమల్లోకి వచ్చిన టీకాలు, మందులు, చికిత్స విధానాలు, నోబెల్ పురస్కారాలు-సంబంధిత పరిశోధనలు వంటివి). ఫిజిక్స్ ప్రశ్నలు అప్లైడ్ ఏరియాస్ నుంచి వస్తున్నాయి. కాబట్టి మెకానిక్స్, ప్రమాణాలు, విద్యుత్, ఆధునిక భౌతిక శాస్త్రం ముఖ్యాంశాలుగా చదవాలి. రసాయన శాస్త్రానికి సంబంధించి సివిల్స్, గ్రూప్స్లో క్రమేణా ప్రాధాన్యం పెరుగుతోంది. నిత్య జీవితంలో మానవులు వినియోగించే పలు రసాయనాలు (ఉదా: కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్స్), ప్లాస్టిక్స్, పాలిమర్స్, కాంపొజిట్స్పై సమాచారం తప్పనిసరిగా సేకరించాలి. వీటికి అదనంగా లోహ సంగ్రహణ శాస్త్రం, ఆవర్తన పట్టిక ప్రత్యేకత, మూలకాలపై దృష్టి సారించాలి. -
బ్లాక్ హోల్ దశ అంటే..?
కాంపిటీటివ్ గెడైన్స్ : జీఎస్ - ఫిజిక్స్ కాస్మిక్ కిరణాలను 1912లో విక్టర్ హెజ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. ఆయనకు 1936లో నోబెల్ బహుమతి లభించింది. వీటికి కాస్మిక్ కిరణాలు అని పేరు పెట్టిన శాస్త్రవేత్త మిల్లికాన్. ధర్మాలు ♦ కాస్మిక్ కిరణాల్లోని ముఖ్య కణాలు: 1. ఎలక్ట్రాన్ 2. పాసిట్రాన్ 3. ప్రోటాన్ 4. న్యూట్రాన్ 5. అయాన్లు ♦ వీటిలో సుమారు 80 శాతం వరకు ప్రోటాన్లు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే సూర్యుడు, నక్షత్రాల్లో ప్రోటాన్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ♦ వీటి ఉనికిని, దిశను తెలుసుకునేందుకు ఉపయోగించేది కాస్మిక్ రే టెలిస్కోప్. ♦ ఈ కిరణాల తీవ్రత ధృవాల వద్ద ఎక్కువగా, భూమధ్యరేఖ వద్ద తక్కువగా ఉంటుంది. ♦ ఈ కిరణాల శక్తి 109ev నుంచి 1020ev వరకు ఉంటుంది. అందువల్ల క్వాంటం సిద్ధాంతం ప్రకారం ఈ కిరణాల తరంగదైర్ఘ్యం తక్కువ. విశ్వంలోని అన్ని కిరణాల కంటే గరిష్ట శక్తిని కాస్మిక్ కిరణాలు కలిగి ఉన్నాయి. ♦ కాస్మిక్ కిరణాలను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. 1. కఠిన 2. మృదు 1. కఠిన కాస్మిక్ కిరణాలు: 10 సెం.మీ.ల మందం గల సీసపు దిమ్మెద్వారా చొచ్చుకొని వెళ్లేవి. ఇవి సూపర్ నోవా నుంచి వెలువడి ఉండవచ్చని భావన. 2. మృదు కాస్మిక్ కిరణాలు: 10 సెం.మీ. మందం గల సీసపు దిమ్మెద్వారా చొచ్చుకొని వెళ్లలేవు. ఇవి నోవా నుంచి లేదా సూర్యుని ఉపరితలం నుంచి వెలువడుతుండొచ్చని భావన. ♦ మనదేశంలో కాస్మిక్ కిరణాల గురించి అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు. 1. విక్రం సారాభాయ్ 2. హెచ్.జె. బాబా 3. మేఘనాథ్ సాహా మొదలైనవారు. ♦ 1985లో భారత్, అమెరికా శాస్త్రవేత్తలు సంయుక్తంగా ‘అనురాధ’ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించి కాస్మిక్ కిరణాలను అధ్యయనం చేశారు. నక్షత్రాలు ఇవి స్వయం ప్రకాశాలు. పరిమాణాన్ని బట్టి వీటిని 3 రకాలుగా వర్గీకరించవచ్చు. 1. భారీ నక్షత్రాలు: వీటి ద్రవ్యరాశి చాలా ఎక్కువ. పెద్ద పరిమాణంలో ఉంటాయి. ఉదా: ఎప్సిలాన్ అరిగా 2. మధ్యతరహా: వీటి ద్రవ్యరాశి భారీ నక్షత్రాల కంటే తక్కువ. ఉదా: సూర్యుడు 3. మరుగుజ్జు నక్షత్రాలు: వీటి ద్రవ్యరాశి పైన పేర్కొన్న నక్షత్రాల ద్రవ్యరాశి కంటే చాలా తక్కువగా ఉంటుంది. విశ్వంలో అధిక నక్షత్రాలు ఈ రకానికి చెందినవే. బ్లాక్హోల్ ♦ ఒక నక్షత్రం గురుత్వాకర్షణ బలం అనేక రెట్లు పెరిగి తనవైపు వస్తున్న ప్రతి వస్తువును ఆకర్షించుకోవడమే కాకుండా, తనలో నుంచి వెలువడే కాంతిని కూడా బయటకు వెళ్లనీయకుండా నిరోధిస్తుంటే ఆ దశను బ్లాక్ హోల్ దశ అంటారు. ♦ ఈ పేరు పెట్టిన శాస్త్రవేత్త జాన్ వీలర్ (అమెరికా) ♦ ఈ విశ్వంలో జనించిన ఒక నక్షత్రం బ్లాక్హోల్ దశను పొందాలంటే దాని ద్రవ్యరాశి కనీసం ఒక చంద్రశేఖర్ లిమిట్ (CSL)కు సమానంగా ఉండాలి. 1 CSL = 1.4ప2ప1030 kg (సూర్యుని ద్రవ్యరాశి) = 2.8ప1030kg ♦ ద్రవ్యరాశిని కొలవడానికి ఉపయోగించే అతి పెద్ద ప్రమాణం ఇఔ. అతి చిన్న ప్రమాణం amu. ♦ నక్షత్ర ద్రవ్యరాశి.. చంద్రశేఖర్ లిమిట్ కంటే తక్కువగా ఉంటే అది మరుగుజ్జు నక్షత్రంగా మారి నశిస్తుంది. కాబట్టి సూర్యుడు ఏ పరిస్థితిలో కూడా బ్లాక్హోల్ దశను పొందడు. నోట్: అంతరిక్షంలో వ్యోమగాములు ధరించే స్పేస్ సూట్ను Extra Terrestrial Mobile Unit అని అంటారు. దీన్ని ఫైబర్, నైలాన్ అనే పదార్థంతో తయారు చేస్తారు. ప్రతి స్పేస్ సూట్లో 7 పొరలు ఉంటాయి. ♦ ఇవి విశ్వాంతరాళం నుంచి వస్తున్న కాస్మిక్, X, రేడియోధార్మిక కిరణాలతోపాటు ఇతర కిరణాలన్నింటినీ శోషించుకుని రక్షణ కల్పిస్తాయి. అదేవిధంగా తగినంత పీడనాన్ని శరీరంపై కలగజేస్తాయి. ♦ వ్యోమగాములు చేసే స్పేస్ వాక్ను Extra Vehicular Activity అంటారు. సహజ రేడియో ధార్మికత ♦ ఈ ధర్మాన్ని 1896లో హెన్రీ బెకరల్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. అందువల్ల ఆయనకు 1903లో నోబెల్ బహుమతి లభించింది. ♦ ప్రతి పరమాణు కేంద్రకం పరిమాణం 1 fermi గా (10–15m) ఉంటుంది. ఈ పరమాణు కేంద్రకంలో గల ప్రోటాన్లు, న్యూట్రాన్లను కేంద్రక బలాలు బంధిస్తాయి. ఈ విశ్వంలో ఇతర బలాలతో పోల్చినప్పుడు (అయస్కాంత, విద్యుత్, గురుత్వాకర్షణ మొదలైనవి) కేంద్రక బలాలు అత్యంత బలమైనవి. ♦ కేంద్రక బలాల గురించి కూలుంబ్ అనే శాస్త్రవేత్త అధ్యయనం చేసి వాటిని కూలుంబ్ ఆకర్షణ బలాలు, వికర్షణ బలాలు అని రెండు రకాలుగా వర్గీకరించారు. ♦ పరమాణు సంఖ్య 1 నుంచి 30 వరకు గల పరమాణు కేంద్రకాల్లో కూలుంబ్ ఆకర్షణ బలాలు ఎక్కువగా, వికర్షణ బలాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఇలాంటి పరమాణు కేంద్రకాల్లో స్థిరత్వం ఎక్కువగా ఉండి అవి సహజ రేడియో ధార్మికతను ప్రదర్శించవు. ♦ పరమాణు సంఖ్య 31 నుంచి 82 వరకు [Pb82] గల పరమాణు కేంద్రకాల్లో కూలుంబ్ ఆకర్షణ బలాలు క్రమంగా తగ్గి వికర్షణ బలాలు పెరుగుతాయి. కాబట్టి ఇలాంటి పరమాణు కేంద్రకాల్లో అస్థిరత్వం క్రమంగా పెరుగుతుంది. - సీహెచ్.మోహన్ సీనియర్ ఫ్యాకల్టీ, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్, హైదరాబాద్ -
ఫలితాల వెల్లడి
⇒ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్): జీడీఎమ్ఓ ఇంటర్వ్యూ లిస్ట్ ⇒ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ: యూజీ ఫైనలియర్ మార్చి 2016 ⇒ ఆచార్య నాగార్జున వర్సిటీ : బీఈడీ రెగ్యులర్ ఆగస్టు 2015 రీవ్యాల్యూయేషన్ ⇒ ఎయిర్పోర్ట్స అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ : జూనియర్ ఎగ్జిక్యూటివ్ ⇒ ఆంధ్రా యూనివర్సిటీ: బీఎస్సీ మూడో సంవత్సరం మార్చి 2016 పరీక్ష ⇒ కాకతీయ యూనివర్సిటీ: సీఎల్ఐఎస్సీ 2015 పరీక్ష -
దరఖాస్తు చేశారా?
⇒ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్)- చివరి తేదీ మే 5 ⇒ ది నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్లో మేనేజ్మెంట్ ట్రైనీలు- చివరి తేదీ మే 10 ⇒ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లోస్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు- చివరి తేదీ మే 13 ⇒ సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్లో ఉద్యోగాలు - చివరి తేదీ మే 16 ⇒ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సెన్సైస్లో ఉద్యోగాలు- చివరి తేదీ జూన్ 15 -
షైనింగ్ కెరీర్కు.. ఫుట్వేర్
గ్రాడ్యుయేట్స్ స్పెషల్ ఇంజనీరింగ్కు ఐఐటీలు ఫేమస్.. మేనేజ్మెంట్ అంటే ఐఐఎంలే గుర్తొస్తాయి.. సాధారణ వృత్తి నుంచి కార్పొరేట్ స్థాయికి ఎదిగిన ఫుట్వేర్ రంగంలో రాణించాలంటే.. ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్డీడీఐ)లో చేరాల్సిందే. ప్రస్తుతం ఇందులో వివిధ కోర్సులకు ప్రకటన విడుదలైంది. వివరాలు.. ఎఫ్డీడీఐ.. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎఫ్డీడీఐని 1986లో ఏర్పాటు చేశారు. ఫుట్వేర్, లెదర్ ఇండస్ట్రీలో పరిశోధనలు, అభివృద్ధితో పాటు ఈ రంగంలో మానవ వనరుల కొరతను తీర్చాలనే లక్ష్యంతో ఎఫ్డీడీఐని నెలకొల్పారు. ఎఫ్డీడీఐ ప్రధాన క్యాంపస్ నోయిడాలో ఉంది. హైదరాబాద్తోపాటు మరో పది నగరాల్లో క్యాంపస్లు ఉన్నాయి. ఎన్నో అంతర్జాతీయ, జాతీయ స్థాయి అవార్డులు, గుర్తింపులు పొందిన ఈ సంస్థ నుంచి ఏటా 1800 మంది సుశిక్షుతులు ఎంఎన్సీ స్థాయి కంపెనీలకు ఎంపిక అవుతున్నారు. బీఎస్సీ కోర్సులు.. ఎఫ్డీడీఐ క్యాంపస్ల్లో బ్యాచిలర్ స్థాయిలో ఫుట్వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్ కోర్సు; బీఎస్సీ రిటైల్ - ఫ్యాషన్ మర్చండైస్; బీఎస్సీ ఫ్యాషన్ లెదర్ యాక్సెసరీ డిజైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని విజయవంతంగా పూర్తిచేస్తే ఉపాధి పరంగా మంచి అవకాశాలు అందుబాటులో ఉంటాయి. ఆసక్తి ఉంటే ఉన్నత విద్య దిశగా కూడా వెళ్లొచ్చు. అర్హత బ్యాచిలర్స డిగ్రీ కోర్సులకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు, పీజీ కోర్సులకు బ్యాచిలర్స డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. చేరండిలా.. ప్రవేశానికి అర్హత గల అభ్యర్థులు ఆల్ ఇండియా సెలెక్షన్ టెస్ట్ (ఏఐఎస్టీ) రాయాలి. ఆన్లైన్ పరీక్షలో బహుళైచ్చిక ప్రశ్నలు ఉంటాయి. దేశవ్యాప్తంగా సుమారు 36 కేంద్రాల్లో టెస్ట్ నిర్వహిస్తారు. పరీక్ష పత్రం ఇంగ్లిష్, హిందీ మీడియంలలో ఉంటుంది. ఏఐఎస్టీలో మెరిట్ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. సిలబస్.. ప్రవేశ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. యూజీ కోర్సుల్లో మ్యాథమెటి క్స్ 45, జనరల్ సైన్స్ 30, ఇంగ్లిష్ 45, జనరల్ అవేర్నెస్ నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. పీజీ కోర్సులకు రీజనింగ్ అండ్ క్యూఏ 45, ఇంగ్లిష్ 45, జనరల్ అవేర్నెస్ 30, బిజినెస్ ఆప్టిట్యూడ్లపై 30 ప్రశ్నలుంటాయి. ఆన్లైన్లో దరఖాస్తు.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అడిగిన ధ్రువపత్రాలను సబ్మిట్ చేయాలి. ఒకే దర ఖాస్తులో ఒకటి కంటే ఎక్కువ ప్రోగ్రామ్లకు దరఖాస్తు చేయొచ్చు. కోర్సు కోడ్లను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్: www.www.fddiindia.com పరీక్ష నుంచి మినహాయింపు పీజీ కోర్సుల్లో చేరాలనుకునేవారు క్యాట్, గ్జాట్, మ్యాట్, ఏఐఎంఏ, ఎన్మ్యాట్, ఏఎంసీఏటీ, స్నాప్, జీమ్యాట్, ఏఐఎం-క్యాట్ల్లో ప్రతిభ ఆధారంగా ఏఐఎస్టీతో సంబంధం లేకుండా చేరొచ్చు. బ్యాచిలర్ డిగ్రీ కోసం బిట్శాట్, ఐఐటీ జేఈఈ, జీజీఎస్ఐపీయూ, విట్, ఎస్ఆర్ఎం, బీసీఈసీఈ, యూపీఎస్ఈఈ, ఎంపీసీఈటీ, జీయూజేసీటీ, ఎంసెట్, సీఓఎంఈడీకే తదితర పరీక్షల్లో మెరుగైన ర్యాంకులు సాధించినవారు కూడా ప్రవేశపరీక్షతో సంబంధం లేకుండా నేరుగా యూజీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. ముఖ్య తేదీలు దరఖాస్తుకు చివరి తేదీ: మే 20 ప్రవేశ పరీక్ష: జూన్ 10, 11, 12 ఫలితాల వెల్లడి: జూన్ 24 యూజీ కోర్సుల కౌన్సెలింగ్ తేదీలు: జూలై 13, 14, 15 పీజీ కోర్సులు: జూలై 11, 12 -
ఉద్యోగాలు
బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్లో 138 పోస్టులు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సెక్షన్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్. ఖాళీలు: 138 దరఖాస్తుకు చివరి తేది: మే 10 వెబ్సైట్: www.bmrc.co.in ఐఐఏపీలో 21 పోస్టులు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఏపీ).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టులు: ఇంజనీర్, సెక్షన్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, మెకానిక్, జూనియర్ రీసెర్చ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్ ఖాళీలు: 21 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: మే 13 వెబ్సైట్: www.iiap.res.in ఎన్ఐఆర్డీపీఆర్లో పీజీడీఆర్డీఎం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీపీఆర్)-హైదరాబాద్.. పోస్ట్గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ (పీజీడీఆర్డీఎం) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వ్యవధి: ఏడాది దరఖాస్తుకు చివరి తేది: మే 18 వెబ్సైట్: www.nird.org.in -
న్యూ కోర్స్
నల్సార్లో ఎంబీఏ (స్టార్టప్ మేనేజ్మెంట్) నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా-హైదరాబాద్.. ఎంబీఏలో స్టార్టప్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్ను ప్రవేశపెట్టింది. దేశంలోనే తొలిసారిగా ఈ ఏడాది నుంచి ఈ కోర్సును అందించనున్నారు. పూర్తి వివరాలకు www.cms.nalsar.ac.in చూడొచ్చు. -
కర్టిన్ యూనివర్సిటీ అంతర్జాతీయ స్కాలర్షిప్పులు
స్కాలర్షిప్ ఆస్ట్రేలియాలోని కర్టిన్ యూనివర్సిటీ.. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదవాలనుకునేవారికి అంతర్జాతీయ స్కాలర్షిప్పులను అందిస్తోంది. స్కాలర్షిప్: తొలి ఏడాది ట్యూషన్ ఫీజులో 25 శాతాన్ని మంజూరు చేస్తారు. లేదా గరిష్టంగా 10,000 ఆస్ట్రేలియా డాలర్ల వరకు చెల్లిస్తారు. దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా చివరి తేదీ: జూలై 15, 2016 వెబ్సైట్:http://scholarships.curtin. edu.au/.au/ -
కొలువుల కోర్సులు @ ఐటీఐ
10క్లాస్ స్పెషల్ పదో తరగతి తర్వాత వృత్తి నైపుణ్యాలతోపాటు సత్వర ఉపాధి అందించగలిగే కోర్సు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఐటీఐ). ఈ కోర్సుల్లో రెండేళ్ల శిక్షణతో జాబ్ మార్కెట్కు అవసరమైన స్కిల్స్ సొంతమవుతారుు. ఈ నేపథ్యంలో ఐటీఐ కోర్సులపై ఫోకస్.. మన దేశంలో వచ్చే దశాబ్దంలో అదనంగా 80 లక్షల మంది ఉద్యోగ వేటలో ఉంటారని అంచనా. అయితే వృత్తి నైపుణ్యాలు తక్కువగా ఉంటే ఉద్యోగం దొరకడం కష్టం. స్కిల్స్ లేని మానవ వనరులకు డిమాండ్ తక్కువ ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా విభిన్న నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చే అంశంపై ఐటీఐలు దృష్టి సారించాయి. కొద్దికాలంగా ఐటీఐ కోర్సుల పట్ల విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. కారణం కోర్సు పూర్తయిన వెంటనే ఉపాధి లభించడమే. జాబ్ లభించకుంటే సొంతంగా ఉపాధి పొందే వీలుంది. పదో తరగతి మార్కుల ఆధారంగా ఈ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. ఐటీఐ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్స్ ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, రేడియో- టెలివిజన్, డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్, డ్రాఫ్ట్స్మెన్ సివిల్, రిఫ్రిజరేషన్ - ఎరుుర్ కండీషనింగ్, వైర్మెన్, మెకానిక్ మోటార్ వెహికల్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రోప్లాటర్, ఇన్స్ట్ట్రుమెంట్ మెకానిక్, అటెండెంట్ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్, పెయింటర్, డీజిల్ మెకానిక్, ప్లంబర్, వెల్డర్, కార్పెంటర్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్, ఫోర్జర్ అండ్ హీట్ట్రీటర్, మాసన్ (బిల్డింగ్ కనస్ట్రక్షన్) ఇంజనీరింగ్ ట్రేడ్సలో ఉన్నాయి. వీటిని రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు అందిస్తున్నాయి. నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్సలో.. స్టెనోగ్రఫీ, సెక్రెటేరియల్ ప్రాక్టీస్, డ్రెస్మేకింగ్, కట్టింగ్ అండ్ టైలరింగ్, బుక్ బైండింగ్, హ్యాండ్ కంపోజర్, కార్పెట్ వేవింగ్ వంటి కోర్సులున్నాయి. ఇప్పుడు జాబ్ మార్కెట్ అవసరాలకనుగుణంగా అనేక కొత్త కోర్సులకు ఐటీఐలు రూపకల్పన చేస్తున్నాయి. సెంటర్స్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఐటీఐలను సెంటర్స్ ఆఫ్ ఎక్స్లెన్స్(సీఓఈ)లుగా రూపొందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2005లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా 500 ఐటీఐలను సీఓఈలుగా మార్చడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఇందుకోసం పరిశ్రమలకు అవసరమైన విభిన్న నైపుణ్యాలతో 21 కోర్సులను రూపొందించారు. సంప్రదాయ కోర్సులకు భిన్నంగా వీటిలో శిక్షణ ఉంటుంది. ఉద్యోగావకాశాలెన్నో.. ఆర్టీసీ, ఇండియన్ రైల్వేస్, వివిధ పారిశ్రామిక సంస్థల్లో ఆయా విభాగాల్లో ఉద్యోగాలుంటాయి. ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు అందుకోవచ్చు. -
జీకే - కరెంట్ అఫైర్స్
కాంపిటీటివ్ గెడైన్స్ : కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ప్లాన్ ఫర్.. పోటీ పరీక్షల్లో రాణించాలంటే జనరల్ నాలెడ్జ, కరెంట్ అఫైర్స కీలకం. దాదాపు ప్రతి పోటీ పరీక్షలోనూ ఈ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)తో మొదలుకొని ఎస్.ఎస్.సి., ఆర్ఆర్బీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఆర్బీఐ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స సంస్థలు, సబ్ ఇన్స్పెక్టర్స, పోలీస్ కానిస్టేబుల్స్, డీఎస్సీ.. ఇలా ప్రతి నియామక పరీక్షలో జీకే, కరెంట్ అఫైర్స నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంత ప్రాధాన్యమున్న ఈ విభాగాల్లో ఎక్కువ మార్కులు ఎలా సాధించాలి? ఎలా ప్రిపేరవ్వాలి? ఏయే అంశాలు చదవాలో చూద్దాం. ఏ సబ్జెక్ట్కు అయినా నిర్దేశిత సిలబస్ ఉంటుంది. కానీ జీకే, కరెంట్ అఫైర్సకు మాత్రం ఎలాంటి సిలబస్ ఉండదు. ఏ అంశం నుంచైనా ప్రశ్నలు రావచ్చు. కరెంట్ అఫైర్సపై పట్టు సాధించాలంటే నిత్యం వార్తాపత్రికలను చదవాలి. ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకోవాలి. తెలుగుతోపాటు ఒక ఆంగ్ల దినపత్రికను కూడా చదివితే కరెంట్ అఫైర్సతోపాటు ఆంగ్లంపై కూడా పట్టు సాధించవచ్చు. పత్రికలను ప్రధానంగా పరీక్షల దృష్టితో చదవాలి. బ్యాంకు పరీక్షలకైతే ఆర్నెళ్లు, యూపీఎస్సీ, రాష్ర్ట పోటీ పరీక్షలకైతే ఏడాది పాటు జరిగిన వర్తమాన అంశాలను క్షుణ్నంగా చదవాలి. గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను సేకరించి ప్రశ్నల సరళి, క్లిష్టతను పరిశీలించాలి. గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్ను కొనసాగించాలి. పూర్వాపరాలు తెలుసుకోండి కరెంట్ అఫైర్సను బిట్ల రూపంలో చదవద్దు. అలా చదివితే త్వరగా మరిచిపోయే ఆస్కారం ఉంది. ఒక అంశం గురించి చదివినప్పుడు దాని పూర్వాపరాలను కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకు 2015కుగాను బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ కుమార్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించారు. ఈ అంశాన్ని ఎలా ప్రిపేరవ్వాలో చూద్దాం.. ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు భారతదేశంలోని అత్యుత్తమ చలనచిత్ర రంగ అవార్డు. భారత చలనచిత్ర పితామహుడైన దాదాసాహెబ్ ఫాల్కే పేరిట 1969లో ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మనదేశంలో మొదటి మూకీ చిత్రమైన ‘రాజా హరిశ్చంద్ర’ను 1913లో నిర్మించారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కింద రూ. 10 లక్షల నగదు, స్వర్ణకమలం, శాలువా బహూకరిస్తారు. ఈ అవార్డును తొలిసారిగా 1969లో దేవికారాణి రోరిచ్కు ప్రదానం చేశారు. ఇప్పటివరకు అయిదుగురు తెలుగు సినీ ప్రముఖులకు కూడా ఈ అవార్డును అందజేశారు. వారు.. బొమ్మిరెడ్డి నర్సింహారెడ్డి (1974), ఎల్.వి.ప్రసాద్ (1982), బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (1986), అక్కినేని నాగేశ్వరరావు (1990), రామానాయుడు (2009). మనోజ్ కుమార్.. ఉప్కార్, క్రాంతి, పూరబ్ ఔర్ పశ్చిమ్ వంటి దేశభక్తి చిత్రాల్లో హీరోగా నటించారు. ఆయన అసలు పేరు హరికృష్ణ గిరి గోస్వామి.’ ఇలా.. ఒక అంశాన్ని అన్ని కోణాల నుంచి పరిశీలించినట్లయితే ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం రాయవచ్చు. ఈ విధంగా కరెంట్ అఫైర్సను స్టాక్ జీకేతో అనుసంధానం చేస్తూ చదివితే సులభంగా గుర్తుండి పోతుంది. బ్యాంక్ పరీక్షల కోసం.. బ్యాంక్ పీవో, క్లర్క, ఆర్బీఐ, నాబార్డ, ఇన్సూరెన్స సంస్థల పోటీ పరీక్షల్లో వర్తమాన అంశాలతోపాటు బ్యాంకింగ్ రంగం నుంచి కూడా ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ఈ ఉద్యోగాల కోసం ప్రిపేరయ్యే వారు బ్యాంకింగ్ అవేర్నెస్ విభాగాన్ని కూడా చదవాలి. రిజర్వ బ్యాంక్ తాజా పరపతి విధానం, ఇటీవల ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలు, కమిటీలు-చైర్మన్లు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాలు, నూతన ప్రైవేట్ బ్యాంకులు (బంధన్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్), స్మాల్ ఫైనాన్స బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, జన్ధన్ యోజన, పాలసీరేట్లు, ఏటీఎంలు, వైట్ లేబుల్ ఏటీఎంలు, బ్యాంకింగ్ పదజాలం, నో యువర్ కస్టమర్ విధానాలు, మనీ లాండరింగ్, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, కరెన్సీ, నాణేలు, ప్లాస్టిక్ కరెన్సీ, నాబార్డ, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు తదితర అంశాలను క్షుణ్నంగా చదవాలి. జాతీయ అంశాలు దేశంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలపై దృష్టి సారించాలి. రాజకీయ సంఘటనలు, ప్రభుత్వ పథకాలు, కమిటీలు, కమిషన్లు, ఎన్నికలు, రాష్ట్రాల్లో జరిగిన ముఖ్య సంఘటనల్ని చదవాలి. తెలుగు రాష్ట్రాలు నిర్వహించే పరీక్షలకు హాజరయ్యేవారు ప్రాంతీయ అంశాలను కూడా తెలుసుకోవాలి. అంతర్జాతీయ అంశాలు వివిధ దేశాల్లో కొత్తగా అధికారంలోకి వచ్చిన నేతలు, అంతర్జాతీయ సదస్సులు, భారత ప్రధాని విదేశీ పర్యటనలు వంటి అంశాలను చదవాలి. శాస్త్ర, సాంకేతిక అంశాలు ఇటీవల జరిగిన అంతరిక్ష, రక్షణ, పర్యావరణ, ఆరోగ్య, ఇంధన, సమాచార, సాంకేతిక రంగాల సంఘటనలను తెలుసుకోవాలి. ఉపగ్రహాలు, వాహక నౌకలు, ఇటీవల పరీక్షించిన క్షిపణులు, ఆవిష్కరణలు, వివిధ తుపాన్లకు పెట్టిన పేర్లు, సంప్రదాయేతర ఇంధన వనరులు, సోలార్ మిషన్ తదితర అంశాలను చదవాలి. ఆర్థిక అంశాలు కేంద్ర బడ్జెట్, ఎకనామిక్ సర్వే, రైల్వే బడ్జెట్, బడ్జెట్ కేటాయింపులు, ప్రకటించిన పథకాల గురించి చదవాలి. 2011 జనాభా లెక్కలను క్షుణ్నంగా పరిశీలించాలి. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల గురించి తెలుసుకోవాలి. క్రీడలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన క్రీడాంశాలను చదవాలి. ఇటీవల జరిగిన ఆసియాకప్ క్రికెట్, అండర్-19 ప్రపంచకప్, టీ-20 క్రికెట్ ప్రపంచకప్, ఐపీఎల్, దక్షిణాసియా క్రీడలు, కోపా అమెరికా ఫుట్బాల్, టెన్నిస్ ట్రోఫీలు తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. క్రీడాకారులు వారి దేశాలు, ట్రోఫీలు, క్రీడాపదజాలం తెలుసుకోవాలి. వార్తల్లోని వ్యక్తులు - అవార్డులు ఇటీవల చేపట్టిన నియామకాలు, ఎన్నిక, ఎంపిక, మరణాలు ముఖ్యమైనవి. జాతీయ అవార్డుల్లో.. పద్మ అవార్డులు, చలనచిత్ర పురస్కారాలు, క్రీడా పురస్కారాలు, సాహిత్య అవార్డులు; అంతర్జాతీయ అవార్డుల్లో.. నోబెల్ బహుమతులు, రామన్ మెగసెసే పురస్కారాలు, ఆస్కార్ అవార్డులు, ప్రపంచ ఆహార బహుమతి, బుక్ ప్రైజ్ తదితరాల నుంచి ప్రశ్నలు వస్తాయి. స్టాక్ జీకే కోసం.. భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటి రాజధానులు, జాతీయ చిహ్నాలు, కేలండర్, జనాభా, భాషలు, రవాణా వ్యవస్థ, విమానాశ్రయాలు, సమాచార వ్యవస్థ, దేశ రక్షణ రంగం, క్షిపణి వ్యవస్థ, అంతరిక్ష పరిశోధనా సంస్థ, భారత అంతరిక్ష విజయాలు, అణుశక్తి రంగం, అణు విద్యుత్ కేంద్రాలు, పరిశోధనా కేంద్రాలు అవి ఉన్న ప్రదేశాలు, నదీ వ్యవస్థ, ప్రాజెక్టులు, జాతీయ పార్కులు, శాంక్చ్యురీలు, బయోస్పియర్ రిజర్వలు, వ్యవసాయ విప్లవాలు, ప్రముఖ ఆవిష్కరణలు, అధ్యయన శాస్త్రాలు, ప్రముఖ దినోత్సవాలు, ప్రముఖ వ్యక్తుల బిరుదులు, నినాదాలు, విటమిన్లు, వ్యాధులు, సౌరకుటుంబం, నదీతీరాన వెలసిన పట్టణాలు, ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థలు, ఐరాస ప్రకటించిన సంవత్సరాలు, దశాబ్దాలు, అంతర్జాతీయ సంస్థలు, వాటి ప్రధాన కార్యాలయాలు, అధిపతులు, దేశాలు-రాజధానులు-కరెన్సీలు, పార్లమెంట్లు వంటి వాటిని చదవాల్సి ఉంటుంది. - ఎన్. విజయేందర్రెడ్డి కరెంట్ అఫైర్స నిపుణులు,హైదరాబాద్ -
ఉజ్వల భవిష్యత్తుకు... బెస్ట్ ఇన్స్టిట్యూట్స్
బేసిక్ సెన్సైస్ నుంచి స్టాటిస్టిక్స్ వరకు... ఆతిథ్య రంగం నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వరకు.. ఐఐటీలు, ఐఐఎంలకు దీటుగా.. వినూత్న కోర్సులను అందిస్తూ.. ఉజ్వల భవితకు మార్గం వేస్తున్న ఉత్తమ విద్యా సంస్థలు దేశంలో ఎన్నో! ఇంటర్మీడియెట్ అర్హతతో.. ఇంజనీరింగ్, మెడికల్కు సరితూగే కోర్సులను ఆఫర్ చేస్తున్న బెస్ట్ ఇన్స్టిట్యూట్స్పై ఫోకస్.. ఐఐఎస్ఈఆర్ బేసిక్ సైన్స్ రంగంలో విద్యార్థులను ప్రోత్సహించి, వారిని మెరికల్లా తీర్చిదిద్దే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ క్యాంపస్లను ఏర్పాటు చేసింది. కోర్సులు: ఏడు క్యాంపస్ల్లో (బరంపూర్, భోపాల్, కోల్కత, పుణె, తిరువనంతపురం, మొహాలి, తిరుపతి) ఇంటర్మీడియెట్ అర్హతగా ఐదేళ్ల బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ. ప్రవేశం: మూడు విధానాల్లో ఉంటుంది. అవి.. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకు; కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన స్ట్రీమ్ ఎక్స్ఏ ఉత్తీర్ణత ఆధారంగా; ఐఐఎస్ఈఆర్ ప్రత్యేకంగా నిర్వహించే ఆప్టిట్యూడ్ టెస్ట్లో ఉత్తీర్ణత ద్వారా. ప్రకటన మేలో వెలువడుతుంది. వెబ్సైట్: www.iiseradmission.in ఐఐఎస్సీ (బెంగళూరు) బేసిక్ సైన్స్లో కెరీర్ అందించేందుకు, పోటీ ప్రపంచానికి తగినట్లు సైన్స్ నిపుణులను తీర్చిదిద్దేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) తోడ్పడుతోంది. బ్యాచిలర్ కోర్సులు: బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (రీసెర్చ్). ఇది నాలుగేళ్ల కోర్సు. ఎంపీసీ గ్రూప్తో ఇంటర్మీడియెట్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. ప్రవేశం: జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులకు నిర్ణీత సంఖ్యలో వేర్వేరుగా సీట్లు కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రవేశం సమయంలో పరిగణనలోకి తీసుకునే అంశాలు: కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజనలో అర్హత; జేఈఈ-మెయిన్ స్కోర్; జేఈఈ అడ్వాన్స్డ్ స్కోర్; ఏఐపీఎంటీ ర్యాంకు. ఎంపికైన వారికి స్కాలర్షిప్స్ ఉంటాయి. వెబ్సైట్: www.iisc.ernet.in ఐఐఎస్టీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్టీ).. అంతరిక్ష శాస్త్రంలో అద్భుత కెరీర్కు మార్గం వేస్తోంది. కోర్సులు: ఇస్రో ఆధ్వర్యంలో తిరువనంతపురంలో ఉన్న క్యాంపస్లో నాలుగు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి.. బీటెక్- ఏరోస్పేస్ ఇంజనీరింగ్; బీటెక్ ఏవియానిక్స్; ఐదేళ్ల బీటెక్+ఎంఎస్/ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ. అర్హత: ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణతతో పాటు జేఈఈ అడ్వాన్స్డ్లో ర్యాంకు పొందాలి. ఎంపికైన విద్యార్థులకు ట్యూషన్ ఫీజు, మౌలిక సదుపాయాల వ్యయాలకు అయ్యే మొత్తానికి సమానమైన స్థాయిలో అసిస్టెన్స్షిప్ పేరిట ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది. ప్రవేశాలకు సంబంధించి మేలో ప్రకటన వెలువడుతుంది. వెబ్సైట్: www.iist.ac.in ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ గణాంక శాస్త్రంలో నిపుణులను తీర్చిదిద్దుతూ.. ఉన్నత విద్య, ఉద్యోగావకాశాల పరంగా గుర్తింపు పొందిన సంస్థ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. కోల్కతలో ప్రధాన క్యాంపస్ ఉంది. ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, తేజ్పూర్లో బోధన కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. బ్యాచిలర్ కోర్సులు: బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ (ఆనర్స్); బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఆనర్స్). అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. ఎంపిక: ఇన్స్టిట్యూట్ నిర్వహించే ప్రత్యేక ఎంట్రన్స్లో ప్రతిభ, ఇంటర్వ్యూ ఆధారంగా. కోర్సుల్లో ప్రవేశం పొందిన వారికి నెలకు రూ.మూడు వేల స్కాలర్షిప్ లభిస్తుంది. వెబ్సైట్: www.isical.ac.in టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ ముంబై ప్రధాన క్యాంపస్తో పాటు హైదరాబాద్, తుల్జాపూర్, గువహటిలలో మరో మూడు క్యాంపస్లు ఉన్నాయి. సోషల్ సైన్స్ ఎడ్యుకేషన్లో ఉత్తమ సంస్థగా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ (టిస్) నిలుస్తోంది. బ్యాచిలర్ కోర్సులు: ఐదేళ్ల బీఏ-ఎంఏ సోషల్ సైన్స్ కోర్సు; సోషల్ సైన్స్ విత్ రూరల్ డెవలప్మెంట్ స్పెషలైజేషన్.తో బీఏ (ఆనర్స్). ప్రవేశం: ఇంటర్ అర్హతతో నిర్వహించే బ్యాచిలర్ అడ్మిషన్ టెస్ట్లో ర్యాంకు ఆధారంగా ఉంటుంది. ఎంపికైనవారికి స్కాలర్షిప్, అసిస్టెన్స్షిప్లు లభిస్తాయి. వెబ్సైట్: www.admissions.tiss.edu ప్రొఫెసర్ కె.పి.జె.రెడ్డి, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఐఐఎస్సీ (బెంగళూరు). సైన్స్ కోర్సులకు ఆదరణ, విద్యార్థుల చేరిక పరంగా కొంతకాలం స్తబ్ధత నెలకొన్నా. ప్రస్తుతం మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. ఐఐఎస్సీ, ఐఐఎస్ఈఆర్ వంటి సైన్స్ స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూట్స్లో కోర్సులు పూర్తిచేస్తే ఉజ్వల భవిష్యత్తుకు మార్గం వేసుకోవచ్చు. ప్రొఫెసర్ జి.ఎస్.ఆర్.మూర్తి,ఐఎస్ఐ (హైదరాబాద్). గణాంక శాస్త్రంలో బ్యాచిలర్, పీజీ డిగ్రీ పూర్తిచేసిన వారికి ఉన్నత అవకాశాలున్నాయి. మ్యాథమెటిక్స్, కంప్యుటేషనల్ స్కిల్స్ ఉన్న విద్యార్థులు ఈ రంగాన్ని ఎంచుకుంటే కెరీర్లో మరింత రాణించగలరు. ఇతర బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఇఫ్లూ (ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ) : ఇంగ్లిష్తో పాటు వివిధ విదేశీ భాషల్లో ఇంటర్మీడియెట్ అర్హతతో కోర్సులున్నాయి. వెబ్సైట్: www.efluniversity.ac.in ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్: బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో బ్యాచిలర్ డిగ్రీ కోర్సు అందుబాటులో ఉంది. వెబ్సైట్: www.applyadmission.net/nchmjee ఫ్యాషన్ కోర్సులకు కేరాఫ్ నిఫ్ట్: ఈ సంస్థ ఇంటర్ అర్హతతో దేశవ్యాప్తంగా 16 క్యాంపస్ల్లో వివిధ బ్యాచిలర్ కోర్సులను అందిస్తోంది. అవి: బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (యాక్సెసరీ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, ఫ్యాషన్ డిజైన్, నిట్వేర్ డిజైన్, లె దర్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్); బీఎఫ్టెక్. -
క్లాట్కు భారీగా దరఖాస్తులు
ఎడ్యు న్యూస్ దేశంలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)కు ఈ ఏడాది దరఖాస్తులు భారీగా వచ్చాయి. గత తొమ్మిదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది 45,040 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది 39,686 దరఖాస్తులు అందాయి. మే 8న ఆన్లైన్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఐదేళ్ల బీఏ-ఎల్ఎల్బీ, ఏడాది వ్యవధి ఉన్న ఎల్ఎల్ఎం కోర్సుల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ ఏడాది పంజాబ్లోని రాజీవ్గాంధీ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (ఆర్జీఎన్యూఎల్) ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఆన్లైన్ పరీక్ష కోసం 170 కేంద్రాలను ఎంపిక చేశారు. బీఏఎల్ఎల్బీ (అండర్ గ్రాడ్యుయేట్)కి 39,468 మంది, ఎల్ఎల్ఎం (పోస్ట్ గ్రాడ్యుయేట్)కు 5,572 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2008 నుంచి 2015 వరకు క్లాట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థుల సంఖ్య 200 శాతం పెరిగింది. -
టెక్ రెజ్యుమె ఎలా ఉండాలంటే..
ఇంజనీరింగ్ స్పెషల్ నేడు ఉద్యోగ సాధనలో రెజ్యుమె పాత్ర కీలకం. రెజ్యుమె ఏ మాత్రం సరిగా లేకున్నా రిక్రూటర్స్ను ఆకట్టుకోవడం కష్టం. దీంతోనే అభ్యర్థులపై ఒక అంచనాకు వచ్చేస్తాయి నియామక సంస్థలు. ఈ నేపథ్యంలో టెక్నికల్ ఉద్యోగాలకు ఎలాంటి రెజ్యుమెను రూపొందించుకోవాలో తెలుసుకుందాం.. అన్ని ఉద్యోగాలకు ఒకటే రె జ్యుమె సరికాదు కొలువు కావాలంటే దరఖాస్తుతోపాటు తప్పనిసరిగా పంపాల్సింది.. రెజ్యుమె. ఇది రంగాన్ని, ఉద్యోగాన్ని బట్టి భిన్నంగా ఉంటుంది. ఒకే ఫార్మాట్లోని రెజ్యుమె అన్ని రకాల కొలువులకు సరిపోదు. సాంకేతిక కొలువులకు సంబంధిత రెజ్యుమెను జతచేయాలి. ఇది టెక్ ఫ్రెండ్లీగా ఉండాలి. టెక్నాలజీలో మీ అర్హతలు, అనుభవం, నైపుణ్యాలను రిక్రూటర్కు సరిగ్గా తెలియజేయాలి. టెక్నాలజీ జాబ్స్పై ఆసక్తి చూపుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐటీ ప్రొఫెషనల్స్ టెక్ రెజ్యుమెపై తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలి. సాంకేతిక నైపుణ్యాలు టెక్నాలజీ రెజ్యుమె రూపకల్పనలో ఇతర విషయాల కంటే మీలోని టెక్నికల్ స్కిల్స్కే పెద్దపీట వేయాలి. వీటిని ప్రముఖంగా పేర్కొనాలి. హైరింగ్ మేనేజర్ మీ రెజ్యుమెను ఆసాంతం చదవలేరు. మొదట మీలోని సాంకేతిక నైపుణ్యాలనే పరిశీలిస్తారు. వాటిపట్ల సంతృప్తి చెందితేనే మిగిలిన అంశాలపై దృష్టి సారిస్తారు. పని అనుభవాలు మీ పని అనుభవాలను క్లుప్తంగా మూడు లేదా నాలుగు లైన్లలో ప్రస్తావిస్తూ రెజ్యుమెను ప్రారంభించండి. తర్వాత వివిధ విభాగాల్లో మీ టెక్నికల్ స్కిల్స్ను విపులంగా పేర్కొనండి. ఉదాహరణకు.. ఆపరేటింగ్ సిస్టమ్స్: విండోస్, యూనిక్స్, లైనక్స్ లాంగ్వేజెస్: జావా, విజువల్ బేసిక్, సీ/సీ++, పెర్ల్ డేటాబేస్: ఒరాకిల్, ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ నెట్వర్కింగ్: టీసీపీ/ఐపీ, లాన్/వాన్. మీ ప్రొఫైల్కు వర్తించే ప్రోగ్రామ్స్/అప్లికేషన్లను మాత్రమే ప్రస్తావించండి. తెలియని వాటిని కూడా పేర్కొంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంటర్వ్యూలో పూర్తి ఆత్మవిశ్వాసంతో చర్చించగలిగే సాంకేతిక అంశాలనే రెజ్యుమెలో చేర్చండి. అంటే వాటిపై మీకు మంచి పరిజ్ఞానం ఉండాలి. అప్పుడే ఎలాంటి ప్రశ్న అడిగినా సమాధానం చెప్పగలుగుతారు. మీరు ఇప్పటికే ఒక సంస్థలో పనిచేసి ఉంటే అక్కడ సాధించిన విజయాలను కూడా పేర్కొనండి. కీలక పదాలు ఐటీ రెజ్యుమెకు సరిగ్గా నప్పే సాంకేతిక పదాలు కొన్ని ఉంటాయి. కాబట్టి ఆయా పదాలు ఉండేలా చూసుకోండి. ఉదాహరణకు.. యాక్టివేటెడ్, డిజైన్డ్, ఆర్గనైజ్డ్, అసిమిలేటెడ్, డెవలప్డ్, ఇనిషియేటెడ్, యుటిలైజ్డ్, డెమాన్స్ట్రేటెడ్, ఇన్స్టాల్డ్ వంటి పదాలను రెజ్యుమెలో సందర్భానుసారం ఉపయోగించాలి. జూనియర్, సీనియర్ జూనియర్, సీనియర్ ప్రొఫెషనల్స్ రెజ్యుమె కంటెంట్ వేర్వేరుగా ఉంటుంది. అనుభవజ్ఞులు, అనుభవం లేనివారి అర్హతలు, నైపుణ్యాలు ఒకేలా ఉండవు. ఈ భేదాన్ని గుర్తించాలి. తొలిసారిగా కెరీర్లో ప్రవేశించేవారు స్కిల్స్, ప్రాజెక్ట్లపై ఎక్కువ ఫోకస్ చేయాలి. -
హైటెక్ కెరీర్కు.. బీటెక్
ఇంజనీరింగ్ స్పెషల్ ఇంజనీరింగ్ ప్రస్తుతం క్రేజ్ ఉన్న కోర్సు. ఇంటర్ పూర్తిచేసిన వారిలో చాలా మంది ఇంజనీరింగ్లో చేరాలనుకుంటారు. కానీ వారికి కోర్సు, కాలేజీ ఎంపిక, అందులో ఉన్న కష్టనష్టాలు, నాలుగేళ్లు పూర్తయ్యాక ఏం చేయాలి అనే విషయాలపై స్పష్టత అవగాహన కల్పించేందుకు ఈ కథనం. ప్రవేశ పరీక్షలు ఇంజనీరింగ్లో చేరాలనుకునే విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీ, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో చేరాలనుకుంటే ఐఐటీ-జేఈఈ, బిట్ శాట్...వంటి ప్రవేశ పరీక్షల గురించి తెలుసుకోవాలి. స్థానిక కాలేజీల్లో చేరాలనుకున్న వారు ఎంసెట్ రాయడం ఉత్తమం. బ్రాంచ్ ఎంపికలో జాగ్రత్త పూర్వ విద్యార్థులు, పెద్దల సలహా తీసుకుని మనకిష్టమైన బ్రాంచ్ ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న తరువాత వేరే ఆలోచన లేకుండా దాని గురించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి. కాలేజీ ఎంపిక ఇలా... కాలేజీ ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఫ్యాకల్టీ(అనుభవం, అర్హతలు), అక్రిడేషన్స్(నాక్, ఎన్బీఏ), పూర్వ విద్యార్థుల ప్రతిభ, కాలేజీ ఉన్న ప్రాంతం, ప్లేస్మెంట్ సెల్, ల్యాబ్, లైబ్రరీ సౌకర్యం, క్లోజింగ్ ర్యాంక్స్, క్యాంపస్, హాస్టల్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.* బీటెక్ తర్వాత విద్యార్థుల ముందున్న అవకాశాలు.. * ఇండియాలో ఉన్నత విద్య చదవాలనుకున్నవారు ఎంటెక్, ఎంఈ చేయవచ్చు. * విదేశాల్లో పీజీ చేయాలనుకుంటే..టోఫెల్, జీఆర్ఈ, ఐఈఎల్టీఈటీఎస్ వంటి పరీక్షలు రాసి ఎంఎస్ చేయవచ్చు. * ఐసెట్, క్యాట్, మ్యాట్, ఎన్మ్యాట్, ఐఐఎఫ్టీ వంటి పరీక్షలు రాసి బిజినెస్ స్కూళ్లల్లో ఎంబీఏ చేయవచ్చు. * ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు చేయవచ్చు. న్యూ కోర్స్ హెల్త్కేర్ మేనేజ్మెంట్ ఫుల్ టైం కోర్సుల పరంగా ఐఐఎం-బెంగళూరు, కోల్కతలు తాజాగా ప్రారంభించిన ప్రోగ్రామ్ హెల్త్కేర్ మేనేజ్మెంట్. ఈ కోర్సు ప్రధానంగా హెల్త్కేర్ రంగంలో ఎగ్జిక్యూటివ్స్ కెరీర్ పరంగా మరింత రాణించేందుకు దోహదపడుతుంది. ఐఐఎం కోల్కత కూడా ఇదే బాటలో ఏడాది వ్యవధి గల హెల్త్కేర్ మేనేజ్మెంట్ కోర్సును ప్రారంభించింది. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి మూడేళ్ల అనుభవం ఉన్నవారు ఈ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులు. -
లోగుట్టు ‘పనామా’ కెరుక
ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ పన్నుల వ్యవస్థలో తేడా, విత్త వ్యూహాల అమలు కారణంగా పటిష్టమైన విత్త వ్యవస్థ అభివృద్ధికి తగిన వాతావరణం ఏర్పడింది. పన్నుల వ్యవస్థలో సరళీకృత విధానాల అమలుతో ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలకు ప్రయోజనం చేకూరింది. ‘ది ట్యాక్స్ జస్టిస్ నెట్వర్క్ ప్రెజర్’ అంచనా ప్రకారం ఏటా ట్యాక్స్ హెవెన్స్తో కూడిన పన్నుల వ్యవస్థ కారణంగా 255 బిలియన్ డాలర్లను ప్రపంచ దేశాలు నష్టపోతున్నాయి! ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) ప్రకారం ట్యాక్స్ హెవెన్స్లో ఏర్పాటైన విదేశీ కంపెనీల్లో 2007లో పెట్టుబడి 5000 నుంచి 7000 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా!!. అధిక పన్నురేటు ఉన్న దేశాల్లో పన్ను ఎగవేతకు ట్యాక్స్ హెవెన్ దేశాలు ఆస్కారం కల్పిస్తున్నాయి. దీంతోపాటు ఆయా దేశాల బడ్జెటరీ రాబడులపై ప్రతికూల ప్రభావం కలిగేందుకు ట్యాక్స్ హెవెన్లు కారణమవుతున్నాయి. తద్వారా ఆయా దేశాల విత్త రంగంలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక భాగస్వామిగా ఉన్న అంతర్జాతీయ పరిశోధనాత్మక విలేకరుల కూటమి (ఐసీఐజే) వెలువరించిన పనామా పత్రాల ప్రకారం విదేశీ సంస్థల్లో భారీ పెట్టుబడులు పెట్టిన భారతీయుల సంఖ్య 500కు పైగా ఉన్నట్లు అంచనా. భారత్లో పరిస్థితులు పన్ను చెల్లించకుండా ఇతర అక్రమ మార్గాల్లో కొన్ని వేల కోట్లు సంపాదించిన వారిలో సుమారు 500 మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. రిజర్వ్ బ్యాంకు మార్చి , 2013న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం సరళీకృత రెమిటెన్స్ పథకం (ఎల్.ఆర్.ఎస్) కింద భారతీయులు సులభ పన్ను విధానాలుండే దేశాల్లో ఒక సంస్థను ఏర్పాటుచేయవచ్చు. అది భారత్లోని మరో కంపెనీలో పెట్టుబడి పెట్టకూడదు. 2016, జనవరిలో రిజర్వ్ బ్యాంకు నోటిఫికేషన్లో మూలధన ఖాతా, లావాదేవీల్లో విదేశీ బ్యాంకుల్లో కరెన్సీ ఖాతా తెరవటం, విదేశాల్లో ఆస్తులు, పెట్టుబడులు, అనుబంధ సంస్థలను సొంతగా ఏర్పాటుచేయటంతోపాటు జాయింట్ వెంచర్ల ఏర్పాటును చేర్చారు. పనామా రిపబ్లిక్ ఆఫ్ పనామాగా పిలుస్తున్న పనామా.. సెంట్రల్ అమెరికాలో ఉంది. దేశంలోని 3.9 మిలియన్ల జనాభాలో సుమారు సగం మంది రాజధాని పనామా సిటీలో నివసిస్తున్నారు. ఆ దేశ స్థూల దేశీయోత్పత్తి 2015లో 49.14 బిలియన్ డాలర్లు. ప్రామాణిక ద్రవ్యం డాలర్. పనామా ఆర్థిక వ్యవస్థకు ఫైనాన్షియల్ సర్వీసులు అత్యంత కీలకమైనవి. ఆ దేశ స్థూల దేశీయోత్పత్తిలో పనామా కెనాల్ ద్వారా జరిగే వాణిజ్యం సుమారు 6 శాతం. సరళతర పన్నుల వ్యవస్థ 2013లో నార్వేజియన్ సెంటర్ ఫర్ ట్యాక్సేషన్ ప్రచురించిన అకడెమిక్ అధ్యయనం ప్రకారం 1919లో ట్యాక్స్ హెవెన్గా పనామా చరిత్ర మొదలైంది. మద్యంపై నిషేధం ఉన్న సమయంలో.. అమెరికా ప్రయాణికుల నౌకలు తమ వినియోగదారులకు ఆల్కహాల్ అందించేందుకు పనామనియన్ రిజిస్ట్రేషన్ కారణమైంది. షిప్పింగ్పై విధించిన తక్కువ పన్నులు, నియంత్రణ విధానాలను పనామా తర్వాతి కాలంలో విదేశీ ఫైనాన్స్కు విస్తరించింది. కార్పొరేట్, వ్యక్తిగత ఆర్థిక గోప్యతను పాటించటానికి అవసరమైన చట్టాలను పనామా రూపొందించింది. కఠిన గోప్యతను పాటించే చట్టాలు, నియంత్రణలను తీసుకొచ్చింది. వీటిని ఉల్లంఘించిన వారిపై అధిక జరిమానాలను విధించింది. * కార్పొరేట్ సంస్థ రిజిస్ట్రేషన్ సమయంలో వాటాదారుల పేర్లను కంపెనీ వెల్లడించాల్సిన అవసరం లేదు. * పనామా కెనాల్ ద్వారా వ్యాపార అవకాశాలు పెరిగాయి. స్వేచ్ఛా వాణిజ్య జోన్గా ఉండటంతో 1982 నాటికి 100 అంతర్జాతీయ బ్యాంకులు పనామా సిటీలో తమ ఆఫీసులు ప్రారంభించాయి. * స్థానికంగా సృష్టించిన ఆదాయంపై పన్ను విధిస్తూ, ఇతర దేశాల నుంచి వచ్చిన ఆదాయంపై పన్ను మినహాయింపు ఇస్తుంది. 1903లో పనామా ఏర్పడినప్పటి నుంచి ఈ విధానం అమల్లో ఉంది. దేశంలో నివసించే వారి స్థానిక ఆదాయంపై.. పురోగామి పద్ధతిలో ఆదాయపు పన్ను సుమారు 46 శాతం వరకు ఉంది. * వివిధ దేశాల కరెన్సీల వినిమయంలో స్వేచ్ఛ, ఆర్థికంగా వ్యూహాత్మక స్థానంలో ఉండటంతో 35,000 కార్పొరేషన్లు (విదేశీ కంపెనీలు అధికం) పనామాలో రిజిస్ట్రేషన్ను కలిగి ఉన్నాయి. 1920వ దశకంలో రూపొందించిన చట్టాలను పునరుద్ధరించటం ద్వారా విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహక వాతావరణాన్ని కల్పించింది. * చాలా సులభంగా కంపెనీలను ఏర్పాటుచేయటంతోపాటు పన్ను రిటర్న్లు ఫైల్ చేయాల్సిన అవసరం, అకౌంట్స్ ఆడిట్ తప్పనిసరి అనే నిబంధనలు లేకపోవటంతో అనేకమంది పనామాలో తమ కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పనామాలో ప్రయోజనాలు * కేంద్ర బ్యాంకు లేకపోవటం, వినిమయ రేటు విధానంపై నియంత్రణ కొరవడటం, ద్రవ్యపరమైన స్వేచ్ఛ. * పనామా బయట వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలపై ఏ విధమైన పన్ను విధించకపోవటం. విత్తపరమైన లేదా వార్షిక నివేదికలు సమర్పించాలనే నిబంధనలు లేకపోవటం. * సాంవత్సరిక నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటంతోపాటు వృత్తి పరమైన సేవల అందుబాటు. * ప్రైవసీ పరిరక్షణతోపాటు డిపాజిటర్లు కోరిన కరెన్సీ రూపంలో బేరర్ షేర్లు, నంబరుతో కూడిన బ్యాంకు అకౌంట్లను నిర్వహించటం. * తక్కువ ప్రభుత్వ వ్యయంతో షిప్పింగ్ పరిశ్రమలో పాలుపంచుకోవటం. పూర్తి పన్ను మినహాయింపుతో కోలన్ ఫ్రీ జోన్ ద్వారా వ్యాపారాన్ని నిర్వహించటం. ఇటీవలి పరిణామాలు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక భాగస్వామిగా ఉన్న ఐసీఐజే.. 1.15 కోట్ల రహస్య పత్రాలకు సంబంధించి 2.6 టెరాబైట్ల సమాచారాన్ని సేకరించింది. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ప్రముఖులు వేర్వేరు ప్రాంతాల్లో సంపాదించిన ఆదాయాన్ని వెల్లడించింది. పన్ను ఎగవేతదారులకు అనుకూలంగా ఉండే దేశాలకు అక్రమ ఆదాయాన్ని తరలించి.. ఆయా దేశాల్లో ఆ మొత్తాన్ని పెట్టుబడులుగా మార్చడంలో కీలకంగా వ్యవహరించే సంస్థ నుంచి ఐసీఐజే సమాచారాన్ని సేకరించింది. మొత్తం నల్లధనం రూ.1550 లక్షల కోట్లుగా అంచనావేసింది. మరోవైపు రహస్య ఒప్పందాలకు తాము వ్యతిరేకమని, చట్టపరమైన సంస్థలకు అన్ని విధాలుగా సహకారాన్ని అందించగలమని, పనామా ప్రభుత్వం ప్రకటించింది. పన్ను స్వర్గాల్లో పెట్టుబడి వల్ల ప్రయోజనం * పన్ను స్వర్గాల స్థానికులు, స్థానికేతరులు విదేశీ కరెన్సీ వ్యవస్థను కలిగి ఉంటారు. స్థానికులు ద్రవ్యపరమైన నియంత్రణలకు లోబడి ఉంటారు. దీంతోపాటు ఆయా దేశాల్లో డాలర్లు/ యూరో/పౌండ్ రూపంలోకి కరెన్సీని మార్చుకునే వీలుంది. * పెద్ద కార్పొరేషన్లు తమ విదేశీ సెంటర్ల ద్వారా లబ్ధిపొందితే, వ్యక్తులు.. తమ విదేశీ బ్యాంకుల ద్వారా ప్రయోజనం పొందుతారు. బ్యాంకింగ్ సమాచారాన్ని గోప్యంగా ఉంచటం, ఏ విధమైన పన్ను లేకపోవటం లేదా తక్కువ పన్ను, బ్యాంకింగ్ రంగం డిపాజిట్లను అంగీకరించటంతోపాటు రాజకీయ అనిశ్చితి, విత్త పరమైన అనిశ్చిత పరిస్థితుల్లో తగిన భద్రత. డిసెంబరు 2012లో ఐఎంఎఫ్ విడుదల చేసిన ప్రపంచ పెట్టుబడుల గణాంకాల ప్రకారం.. * అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నమోదైన కార్పొరేట్ పెట్టుబడులకు సంబంధించి ప్రతి రెండు డాలర్లలో ఒక డాలరు ట్యాక్స్ హెవెన్స్ నుంచి ఆయాదేశాల్లోకి ప్రవేశించినవే. 2009లో ఈ పెట్టుబడులు 19 శాతం. కాగా 2012, డిసెంబరు నాటికి 50 శాతానికి పెరిగాయి. * 2011లో దిగువ మధ్యతరగతి ఆదాయ దేశాల్లోకి ప్రవేశించిన మొత్తం విదేశీ పెట్టుబడుల్లో ట్యాక్స్ హెవెన్స్ వాటా 46 శాతం. ఎగువ మధ్య, అధిక ఆదాయ దేశాల్లో ఈ వాటా 37 శాతం. - డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్ హైదరాబాద్. -
బెస్ట్ స్కూల్ ఎంపికలో!
కిండర్ గార్టెన్ చదువుల నుంచే కాసులు కుమ్మరించాల్సిన పరిస్థితులు.. ఎల్కేజీ చదువుల నుంచే లక్షల్లో ఖర్చవుతున్న రోజులు.. పాఠశాల దశ పూర్తి చేసుకునే క్రమంలో అడుగడుగునా కాసుల వర్షం కురిపించాల్సిందే..! * ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, స్టేట్ బోర్డ్ ఇలా ఎన్నో వ్యవస్థలు.. * కరిక్యులం, బోధన పద్ధతుల్లోనూ ఎంతో వైవిధ్యం.. అందుకే తమ పిల్లలకు ఏది మంచిదో బేరీజు వేసుకోవడం చాలా ముఖ్యం!! లక్షలు వెచ్చించినా.. సరైన చదువు అందుతుందా.. బిడ్డల భవిష్యత్కు భరోసా లభిస్తుందా..! అనే ప్రశ్న!! అందుకే కిండర్ గార్టెన్ నుంచే స్కూల్ ఎంపికలో ఎంతో కసరత్తు చేయాలి. ఎన్నో అంశాలను పరిశీలించి మంచి స్కూల్ను ఎంపిక చేసుకోవాలి. బెస్ట్ స్కూల్ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన ప్రమాణాలపై తల్లిదండ్రుల కోసం సాక్షి అందిస్తున్న కథనం... పిల్లల మానసిక పరిస్థితి పాఠశాలలను ఎంపిక చేసుకునే క్రమంలో ముందుగా తల్లిదండ్రులు హోం వర్క్ చేయాలి. తమ పిల్లల మానసిక పరిస్థితి, పరిపక్వత స్థాయిలను అంచనా వేయాలి. కొంతమంది పిల్లలు ఒక విషయాన్ని ఇట్టే గ్రహించగలరు. అదే విధంగా కొంతమంది పిల్లలు ఇతరులతో ఇట్టే కలిసిపోతారు. మరికొందరు కలవలేరు. ఇలాంటి వాటిని తల్లిదండ్రులు గమనించాలి. ఫీజులు చెల్లించేందుకు ఆర్థిక స్థోమత అనుకూలించినా.. పిల్లల మానసిక పరిపక్వతకు ప్రాధాన్యమివ్వడం ఎంతో అవసరం. కరిక్యులంపై దృష్టి ప్రస్తుతం మన దేశంలో ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, ఐజీసీఎస్ఈ, ఇంటర్నేషనల్ బాక్యులరేట్, స్టేట్ బోర్డ్ విధానాలు అమలవుతున్నాయి. ఐసీఎస్ఈ, సీబీఎస్ఈల్లో సిలబస్, కరిక్యులం పరంగా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్కు ప్రాధాన్యం ఉంటుంది. స్టేట్ బోర్డ్ల సిలబస్లోనూ ఇటీవల కాలంలో ఈ తరహా విధానానికి రూపకల్పన చేసినప్పటికీ ఇవి పూర్తి స్థాయిలో అమలవడం లేదు. తమ పిల్లలకు ఏ కరిక్యులం బాగుంటుందో గుర్తించి.. ఆ మేరకు బోర్డ్ ఎంపిక చేసుకోవాలి. స్టూడెంట్ - టీచర్ నిష్పత్తి పాఠశాలలను ఎంపిక చేసుకునే క్రమంలో అత్యంత ప్రాధాన్యత గల అంశం.. సదరు పాఠశాలలో స్టూడెంట్-టీచర్ నిష్పత్తి. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం- ప్రతి క్లాస్ రూంలో 30మంది విద్యార్థులకు మించకూడదు. అప్పుడే ప్రతి విద్యార్థిపై దృష్టి పెట్టే అవకాశం టీచర్లకు లభిస్తుంది. అదేవిధంగా విద్యార్థులకు సైతం టీచర్ బోధించే అంశాన్ని ఏకాగ్రతతో వినడానికి ఆస్కారం లభిస్తుంది. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ పాఠశాల ఎంపికలో పరిగణించాల్సిన మరో ముఖ్యమైన అంశం.. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్కు సదరు స్కూల్ ఇస్తున్న ప్రాధాన్యం. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అంటే.. ఏదైనా ఒక అంశాన్ని బోర్డ్పై చెప్పడానికే పరిమితం కాకుండా విద్యార్థులతో ప్రాక్టీస్ చేయించడం ద్వారా మరింత నైపుణ్యం అందించడం. ఉదాహరణకు కిండర్ గార్టెన్ స్థాయిలో బర్డ్స్, ట్రీస్ వంటి వాటి గురించి చెప్పేటప్పుడు వాటికి సంబంధించిన డ్రాయింగ్స్ను వేయించడం, పై తరగతుల్లో చిన్నపాటి ప్రయోగాలు చేయించడాన్ని యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్గా పేర్కొనొచ్చు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ విద్యార్థి జీవితంలో చదువుతోపాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్(స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్, క్విజ్ కాంపిటీషన్స్ తదితర)కు ప్రాధాన్యం ఉంటుంది. కారణం.. వీటివల్ల విద్యార్థులకు మానసిక ఉల్లాసం లభిస్తుంది. అందుకే సీబీఎస్ఈ, స్టేట్ బోర్డ్లు ఈ మేరకు నిర్దిష్ట నిబంధనలు సైతం అమలు చేస్తున్నాయి. ప్రతి స్కూల్లో ప్లే గ్రౌండ్, ఇతర సదుపాయాలు ఉండాలని స్పష్టం చేస్తున్నాయి. ‘ఫీడ్ బ్యాక్’.. ఫ్రం స్కూల్స్ పాఠశాల ఎంపిక క్రమంలో తల్లిదండ్రులు పరిగణించాల్సిన మరో ప్రధాన అంశం.. ఫీడ్ బ్యాక్ ఫ్రం స్కూల్స్. అంటే.. తమ పిల్లలు తరగతి గదిలో వ్యవహరిస్తున్న శైలి గురించి పాఠశాలల యాజమాన్యాలు లేదా టీచర్లు తమకు సమాచారం అందిస్తారా? లేదా? అని తెలుసుకోవాలి. కొన్ని స్కూల్స్ కేవలం పరీక్షలు నిర్వహించి ప్రోగ్రెస్ కార్డ్లు ఇవ్వడానికే పరిమితం అవుతున్నాయి. పేరెంట్ - టీచర్ మీటింగ్స్ నిర్వహిస్తూ టీచర్స్తో పేరెంట్స్ సైతం ఇంటరాక్ట్ అయ్యేందుకు అవకాశం కల్పిస్తున్న స్కూళ్లను ఎంపిక చేసుకోవాలి. అప్పుడే తమ పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరింత అవగాహన ఏర్పడుతుంది. స్పెషల్ కేర్ సదుపాయాలు కొందరు చిన్నారులకు సహజంగానే కొన్ని లెర్నింగ్ డిజార్డర్స్ ఉంటాయి. అలాంటి చిన్నారుల విషయంలో సదరు స్కూల్లో ఉన్న సదుపాయాలు, స్కూల్ యాజమాన్యం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ వంటి వాటి గురించి తెలుసుకోవాలి. స్వీయ పరిస్థితులను బేరీజు వేసుకుంటూ తల్లిదండ్రులు తమ స్వీయ ఆర్థిక, కుటుంబ పరిస్థితులను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్ అనుసరించే పాఠశాలల్లో మల్టీ కల్చర్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. దానికి తమ పిల్లలు సరితూగగలరా లేదా అని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. - ఎ.సీతామూర్తి, ప్రిన్సిపాల్, సిల్వర్ ఓక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక కిండర్ గార్టెన్ స్థాయి నుంచి టెన్త్, 10+2 వరకు ఒకే పాఠశాలలో ఉండేలా ఎంపిక చేసుకోవాలి. లేదంటే కనీసం తదుపరి అయిదారేళ్లు ఆ స్కూల్లో ఉండే విధంగా స్కూల్ ఎంపిక చేసుకోవాలి. - సీతా కిరణ్, ప్రిన్సిపాల్, డీఏవీ పబ్లిక్ స్కూల్ -
రైజింగ్ కెరీర్.. క్లౌడ్ కంప్యూటింగ్
కెరీర్ అప్డేట్స్ ఏటా అంతర్జాతీయ స్థాయిలో శరవేగంగా విస్తరిస్తూ.. యువతకు అపార అవకాశాలకు వేదికగా నిలుస్తున్న క్లౌడ్ కంప్యూటింగ్ కెరీర్ అవకాశాలపై విశ్లేషణ.. యూజర్ సంస్థ ఎలాంటిదైనా.. సేవలు ఎలాంటివైనా అంతా ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో అందించే విధానం తెరపైకి వచ్చింది. ఆన్లైన్ ద్వారానే సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ రూపకల్పన, డేటా మేనేజ్మెంట్ వంటి విధానాలు అమలవుతున్నాతయి. తమ ప్రొడక్ట్.. యూజర్స్కు నిమిషాల్లో సేవలను షురూ చేస్తున్నాయి. ఇలాంటి ఆధునిక విధానాలను సాధ్యం చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానమే క్లౌడ్ కంప్యూటింగ్. కెరీర్ ఆపర్చునిటీస్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ సంస్థల కోణంలో అత్యంత ఆదరణ పొందుతోంది. క్లౌడ్ టెక్నాలజీస్ను సమర్థంగా నిర్వహించేందుకు నిపుణులైన మానవ వనరుల అవసరం శరవేగంగా పెరుగుతోంది. ఏటా లక్షల్లో అవకాశాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్కు సంబంధించి కెరీర్ ఆపర్చునిటీస్ అధికంగా ఉన్న విభాగాలు.. క్లౌడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, క్లౌడ్ ప్రాజెక్ట్ మేనేజర్, క్లౌడ్ బిజినెస్ అనలిస్ట్, క్లౌడ్ నెట్వర్క్ ఆర్కిటెక్ట్/ప్లానర్, క్లౌడ్ ప్రొడక్ట్ మేనేజర్, క్లౌడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, క్లౌడ్ డెవలపర్/ప్రోగ్రామర్, క్లౌడ్ కన్సల్టెంట్ స్పెషల్ సర్టిఫికేషన్స్ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలే ఈ విభాగంలో నైపుణ్యం అందించేలా సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తున్నాయి. అవి.. ఐబీఎం సర్టిఫైడ్ క్లౌడ్ సెక్యూరిటీ నాలెడ్జ్, ఈఎంసీ క్లౌడ్ ఆర్కిటెక్ట్, ఈఎంసీ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ సర్టిఫికేషన్ వంటివి. PaaS (ప్లాట్ఫాం యాజ్ ఎ సర్వీస్) ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్కు సంబంధించి హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్ సంబంధిత అంశాలు, అప్లికేషన్స్ను సదరు ప్రొడక్ట్ డెవలపర్ ఆన్లైన్ విధానంలో నిర్వహించేందుకు అవసరమైన టెక్నాలజీని అందించే విభాగం ఇది. IaaS (ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్) క్లౌడ్ కంప్యూటింగ్ను వినియోగిస్తూ ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్కు సంబంధించి మౌలిక వనరులను ఆన్లైన్ విధానంలో నిర్వహించే విధానం ఐఏఏఎస్. SaaS (సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్) ఒక నిర్దిష్ట సేవను నిర్ణీత సమయంలో తమ అవసరం మేరకు ఇంటర్నెట్ ద్వారా వినియో గించుకునే అవకాశం కల్పించే విధానం సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఆకర్షణీయ వేతనాలు ఎంట్రీ లెవల్ ఉద్యోగాలుగా పేర్కొనే క్లౌడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్కు కనీసం రూ. 5 లక్షల వార్షిక వేతనం ఖరారవుతోంది. అవసరమైన అర్హతలు క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో ఐటీ, సీఎస్ఈ, ఈసీఈ నేపథ్యం ఉన్నవారికి సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి. వీటికి అదనంగా యూజర్ సపోర్టింగ్ సిస్టమ్స్ మేనేజ్మెంట్, అప్లికేషన్ డెవలప్మెంట్ వంటి నైపుణ్యాలుంటే అవకాశాలు మెరుగవుతాయి. క్లౌడ్ కంప్యూటింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ గోల్డ్మన్ శాచ్ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా క్లౌడ్ కంప్యూటింగ్లో భారత్ మూడో స్థానంలో ఉంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ సర్వే ప్రకారం- మ్యాన్ పవర్ డిమాండ్ 1:100 గా ఉంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ సర్వే ప్రకారం 2016లో క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాల్లో 2.2 మిలియన్ ఉద్యోగావకాశాలు. ఐడీసీ నివేదిక ప్రకారం.. 2012తో పోల్చితే 2016 చివరికి క్లౌడ్ సెక్టార్ 400 శాతం పెరగనుంది. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన మేఘ్రాజ్ పథకంతో ప్రభుత్వ విభాగాలన్నిటిలోనూ క్లౌడ్ ఆధారిత సేవలు, అంతే స్థాయిలో ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉంది. క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ క్లౌడ్ కంప్యూటింగ్ సెగ్మెంట్లో అన్ని విభాగాల్లో, హోదాల్లో మానవ వనరులకు మంచి డిమాండ్ నెలకొంది. క్లౌడ్ ఆర్కిటెక్ట్ ప్రొఫైల్ సంస్థల కోణంలో కొంచెం ఎక్కువ డిమాండ్ ఉంది. - ఎస్. సుమన్, క్లౌడ్ అండ్ కన్వర్జ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీడ్, మూడీస్ కార్పొరేషన్ -
తెలుగు పత్రికారంగ చరిత్రలో కొత్త అధ్యాయం
గుంటూరులో ఘనంగా ‘భవిత’ ఆవిష్కరణ సభ తెలుగు పత్రికారంగ చరిత్రలో సువర్ణాధ్యాయానికి ‘సాక్షి’ శ్రీకారం చుట్టింది. విద్యార్థులు, ఉద్యోగార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా ప్రతి గురువారం ఇస్తున్న ‘భవిత’ అనుబంధాన్ని ఇకపై మెయిన్ ఎడిషన్లో ప్రతిరోజూ పాఠకులకు అందించేందుకు మరో ముందడుగు వేసింది. సాహసోపేతమైన నిర్ణయాన్ని అనుకున్నదే తడవుగా అమల్లోకి తెచ్చింది. విద్యార్థులు, పోటీ పరీక్షల శిక్షణార్థులు, నిరుద్యోగ యువతకు అవసరమైన సమాచారంతో ముస్తాబైన సాక్షి ‘భవిత’ మెయిన్ ఎడిషన్ కాపీలను గుంటూరు నగరంలోని విజ్ఞాన్ విద్యాసంస్థల ప్రాంగణంలో బుధవారం ఆవిష్కరించారు. ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అధ్యక్షతన జరిగిన సభలో విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య ‘భవిత’ కాపీలను ఆవిష్కరించారు. - గుంటూరు ఎడ్యుకేషన్ ‘భవిత’తో ఉజ్వల భవిత విద్యార్థులు, ఉద్యోగార్థులకు విలువైన సమాచారాన్ని అందిస్తున్న ‘భవిత’ ఇకపై ప్రతిరోజూ వెలువడటం ఎంతో ప్రయోజనకరమని హైదరాబాద్లోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ డెరైక్టర్ డాక్టర్ డీఎన్ రెడ్డి పేర్కొన్నారు. కోర్సు ఏదైనప్పటికీ ఎంపిక దశలోనే అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ‘భవిత’లో నిపుణులు ఇచ్చే సలహాలు, సూచనలతో విద్యార్థులు ఉజ్వల భవితను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను వారికి అభిరుచి ఉన్న రంగంలో ప్రోత్సహించాలని హైదరాబాద్లోని ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీసర్కిల్ డెరైక్టర్ ఆర్సీ రెడ్డి సూచించారు. ఇంజనీరింగ్, ఐఐటీలే జీవితంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు తమకు ఆసక్తి గల ఇతర రంగాలపై దృష్టి సారించాలని ఆయన తెలిపారు. టీఎంఐ నెట్వర్క్ చైర్మన్ టి.మురళీధరన్ మాట్లాడుతూ...లక్ష్యం ఏదైనా సరే, దాన్ని సాధించేందుకు కఠోర శ్రమ, ప్రణాళికాబద్ధమైన కృషి అవసరమని స్పష్టం చేశారు. నూతన ఒరవడికి ‘సాక్షి’ నాంది తెలుగు పత్రికారంగ చరిత్రలో నూతన ఒరవడికి ‘సాక్షి’ నాంది పలికిందని ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. విద్యార్థులు, ఉద్యోగులకు విద్య, ఉద్యోగ సమాచారాన్ని అం దించేందుకు ‘భవిత’ను వారానికోసారి మార్కెట్లోకి తీసుకురావడాన్ని పెద్దయజ్ఞంగా నిర్వహిస్తున్న పరిస్థితుల్లో మెయిన్ ఎడిషన్లో ప్రతి రో జూ 2 పేజీ లను ‘భవిత’కే కేటాయించడం సాహసోపేతమని చెప్పా రు. లక్షలాది మంది పాఠకుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నూతన ఆవిష్కరణలకు ‘సాక్షి’ శ్రీకారం గత ఎనిమిదేళ్లలో తెలుగు పత్రికారంగంలో ‘సాక్షి’ ఎన్నో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టిందని ‘సాక్షి’ రెసిడెంట్ ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, పోటీ పరీక్షల శిక్షణార్థుల ప్రయోజనార్థం ‘భవిత’ ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తోందని చెప్పారు. పోటీ పరీక్షలు జరిగిన మరునాడే సమాధానాల ‘కీ’ని విడుదల చేయడమనే ఒరవడిని ‘సాక్షి’ ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో పోటీ పరీక్షల నిపుణులు డాక్టర్ బీజేబీ కృపాదానం, సీటీవో జయకృష్ణ, ‘సాక్షి’ డెరైక్టర్ పీవీకే ప్రసాద్, హెచ్ఆర్ వైస్ప్రెసిడెంట్ రాంప్రసాద్, విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రిన్సిపాల్ పాతూరి రాధిక, విద్యార్థులు, పోటీ పరీక్షల శిక్షణార్థులు పాల్గొన్నారు. ‘సాక్షి’ది గొప్ప ప్రయత్నం ‘సాక్షి’ యాజమాన్యం ఎంతో శ్రమతో కూడిన గురుతర బాధ్యతను భుజానికెత్తుకుందని డాక్టర్ లావు రత్తయ్య ప్రశంసించారు. విద్యార్థులు, ఉద్యోగార్థులకు ప్రయోజనం కలిగించే విధంగా ‘భవిత’ను తీర్చిదిద్దడం సామాన్యమైన విషయం కాదన్నారు. వారానికి ఒకసారి వచ్చే ‘భవిత’ను ఇకపై ప్రతిరోజూ మెయిన్ ఎడిషన్లో రెండు పేజీలు ఇవ్వనుండడం గొప్ప ప్రయత్నమన్నారు. ఇది ఓ సాహసోపేత నిర్ణయంగా అభివర్ణించారు. విద్యారంగ నిపుణులు, సబ్జెక్ట్ నిపుణులు అందించే సలహాలు, సూచనలు, సబ్జెక్ట్ మెటీరియల్తో పాఠకులను ఆకట్టుకునే విధంగా ‘సాక్షి’ ముందడుగు వేసిందని అభినందించారు. పాఠశాల స్థాయిలోనే ఐఐటీ కోచింగ్ అందిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి కోర్సులను ఎంపిక చేసుకోవాలి, ఎలాంటి శిక్షణ పొందాలనే అంశాలపై విద్యార్థులు, యువతరాన్ని చైతన్యపరుస్తూ తల్లిదండ్రులను అప్రమత్తంగా చేసేవిధంగా ‘సాక్షి’ భవిత రూపుదిద్దుకోవడం మంచి పరిణామమని రత్తయ్య కొనియాడారు. -
ఉజ్వల భవిష్యత్తుకు ‘భవిత’
♦ నూతన ఆవిష్కరణలకు ‘సాక్షి’ నాంది ♦ సాక్షి భవిత ఆవిష్కరణ వేడుకలో చుక్కా రామయ్య ♦ ‘సాక్షి’ కృషిని అభినందించిన వక్తలు ♦ కరీంనగర్లో ఘనంగా ఆవిష్కరణోత్సవం సాక్షి ప్రతినిధి, కరీంనగర్: విద్యార్థులు, ఉద్యోగార్థుల ఉజ్వల భవిష్యత్తుకు సాక్షి ‘భవిత’ పునాది వంటిదని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అభిప్రాయపడ్డారు. వార్తలే కాకుండా సమాజానికి ఉపయోగపడాలనే కాంక్షతో పత్రిక మెయిన్ ఎడిషన్లో రోజూ భవిత అనుబంధానికి 2 పేజీలు కేటాయించి విద్యార్థుల భవిష్యత్తును బంగారుమయం చేస్తోందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో సాక్షి తెలుగు దినపత్రిక మెయిన్లో రోజూ ప్రత్యేకంగా అందిస్తున్న భవిత పేజీలను బుధవారం కరీంనగర్లో జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్, ఎస్పీ జోయెల్ డేవిస్లతో కలసి ఆయన ఆవిష్కరించారు. నగరంలోని చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో సాక్షి నెట్వర్క్ ఇన్చార్జి కె.శ్రీకాంత్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా పలు కాలేజీల విద్యార్థులు, ఉద్యోగార్థులు తరలివచ్చారు. ఎడిటర్ వి.మురళి ప్రారంభోపన్యాసం చేస్తూ భవితకు సాక్షి మెయిన్ ఎడిషన్లో 2 పేజీలు కేటాయించడం వెనుక ముఖ్య ఉద్దేశాలను వివరించారు. కరీంనగర్ జిల్లా జైలు సూపరింటెండెంట్ శివకుమార్, సాక్షి ఫైనాన్స్, అడ్మిన్ డెరైక్టర్ వై.ఈశ్వరప్రసాద్రెడ్డి, ఎంసెట్ కన్వీనర్ రమణారావు, సబ్జెక్టు నిపుణులు గురజాల శ్రీనివాసరావు, శాతవాహన వర్సిటీ ప్రొఫెసర్ మనోహర్రావు, సాక్షి మఫిసిల్ ఎడిటర్ చలపతిరావు, సర్క్యులేషన్ జీఎం సోమ సురేందర్ తదితరులు హాజరయ్యూరు. సాక్షి భవిత... ఒక దీక్ష: చుక్కా రామయ్య సాక్షి దినపత్రికకు భవిత ఒక దీక్ష అని చుక్కా రామయ్య అన్నారు. ‘‘నాలెడ్జ్ సెంటర్గా పేరొందిన కరీంనగర్లో భవితను ఆవిష్కరించడం ముదావహం. విద్యారంగ బీజా లు వేయడానికి కరీంనగర్ జిల్లా అనువైన ప్రాంతం. ఈ డిజిటల్ యుగంలో వర్తమాన విషయాలే గాక భవిష్యత్తు అంశాలను కూడా భవిత ద్వారా విద్యార్థులు నేర్చుకోవచ్చు. విద్యా రంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా ఎప్పటికప్పుడు పలు అంశాలపై సాక్షి భవిత అందిస్తున్న సమాచారం విలువైంది.’’ అని చెప్పారు. భవిత.. దిక్సూచి కావాలి: కలెక్టర్ నీతూప్రసాద్ ఏటా ప్రభుత్వోద్యోగాల సంఖ్య తగ్గుతున్న విషయాన్ని విద్యార్థి లోకం గమనించి ప్రైవేటు ఉద్యోగాలపై దృష్టి సారించాలని కలెక్టర్ నీతూప్రసాద్ సూచించారు. ఇక నుంచి ఆకాశమే హద్దుగా పట్టుదలతో ఉద్యోగాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగార్థులు, విద్యార్థుల భవిష్యత్తు కోసం ‘భవిత’ ద్వారా సాక్షి విలువైన సమాచారం అందించడం అభినందనీయమన్నారు. డిజిటల్ యుగపు మార్పులకనుగుణంగా విద్యార్థులు పయనించాలని సూచించారు. అవగాహనలేని విద్యార్థులకు భవిత దిక్సూచి కావాలన్నారు. భవితతో భావి ప్రణాళిక: ఎస్పీ జోయెల్ డేవిస్ గ్రామీణ నిరుద్యోగ యువత ఉన్నత చదువులు, పోటీ పరీక్షలు, ఉద్యోగాలపై అవగాహన లేక నష్టపోతున్నారని ఎస్పీ జోయెల్ డేవిస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రణాళిక రూపొందించుకునేలా సాక్షి భవిత దిశానిర్దేశం చేస్తోందని అభినందించారు. కోచింగ్కు వెళ్లే స్థోమత లేనివారికి సాక్షి భవిత ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అన్ని వర్గాలకూ స్థానం: సాక్షి ఎడిటర్ మురళి విద్యా రంగానికే కాకుండా రైతులు తదితర అన్ని వర్గాలకూ సమ ప్రాధాన్యతతో అవసరమైన సమాచారాన్ని సాక్షి ఎనిమిదేళ్లుగా అందిస్తూనే ఉందని ఎడిటర్ మురళి అన్నారు. పోటీ పరీక్షలకు కీ పేపర్ తయారు చేయడం సాక్షితోనే ప్రారంభమైందని, చాలాసార్లు వంద శాతం సరైన సమాధానాలిచ్చి లక్షలాది మంది మన్ననలు చూరగొన్నామన్నారు. భవితకు అత్యధిక ప్రాధాన్యం: వైఈపీ రెడ్డి ఎనిమిదేళ్లుగా ఎన్ని ఇబ్బందులొచ్చినా విద్యార్థులకు, యువతకు ఉపయోగపడే సాక్షి భవితకు పత్రికలో అధిక ప్రాధాన్యమిస్తున్నామని ఫైనాన్సియల్ డెరైక్టర్ వై.ఈశ్వరప్రసాద్రెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు భవిత వేదికగా మారాలని ఆకాంక్షించారు. నాలుగో తరగతి నుంచి మొదలుకుని డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ విద్యతోపాటు ఉద్యోగాలకు సంబంధించిన ప్రతి సమాచారమూ అందిస్తామన్నారు. పరీక్ష విధానంలో వినూత్న మార్పులు: గురజాల పోటీ పరీక్షల్లో వినూత్న మార్పులు చోటుచేసుకున్నాయని సబ్జెక్టు నిపుణులు గురజాల శ్రీనివాస్రావు అన్నారు. గ్రూప్స్తోపాటు అన్ని పోటీ పరీక్షల్లోనూ సమకాలీన అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. కాబట్టి భవిత మెటీరియల్నూ విశ్లేషణాత్మకంగా ఇవ్వాలని కోరారు. కాలేజీల ఎంపిక కీలకం: రమణారావు ఎంసెట్కు సిద్ధమయ్యే విద్యార్థులకు భవిత ఎంతో ఉపయోగకరమని ఎంసెట్ కన్వీనర్ రమణారావు తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు కావాల్సిన ప్రశ్నలు, జవాబులతోపాటు కాలేజీలు, గ్రూప్ల ఎంపిక తదితర విషయాలను భవిత ద్వారా అందించాలని కోరారు. సాక్షి అందిస్తున్న భవితతో విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని ప్రొఫెసర్ మనోహర్ అన్నారు. సాక్షి భవిత అద్భుతమని తహసీల్దార్ జయచంద్రారెడ్డి అభినందించారు. ఉద్యోగ ఎంపికకు దోహదం ‘‘నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. క్యాంపస్లో ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా కోచింగ్ సెంటర్కు వెళ్లాను. సాక్షి భవిత నాకెంతగానో ఉపయోగపడింది. భవిత, విద్య పేజీల ద్వారా ఎంతో ప్రాక్టీసైంది. పలు నోటిఫికేషన్లు వస్తున్న నేపథ్యంలో భవిత పేజీలను ప్రతి రోజూ అందించడం అభినందనీయం’’ - అరుణశ్రీ, డీఆర్డీఏ పీడీ భవితతోనే ఉద్యోగం సాధించా ‘‘నేను సాక్షి భవిత చదివే ఉద్యోగాన్ని సాధించా. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ పద్ధతులతో పాటు ఉద్యోగానికి సంబంధించిన అంశాలు భవితలో చాలా చక్కగా ఉంటాయిు. భవితతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడం సామాజిక బాధ్యతగా స్వీకరించిన సాక్షికి ధన్యవాదాలు’’ - నవాబ్ శివకుమార్, కరీంనగర్ జైలు సూపరింటెండెంట్ -
విద్యార్థుల భవితతో చెలగాటం
కళాశాలకు అనుమతుల్లేకుండానే విద్యార్థులకు బీఈడీ, డీఈడీ సీట్లు విద్యాసంవత్సరం చివరిలో మొండిచెయ్యి హాల్టికెట్లు రాక విద్యార్థుల ఆందోళన తాజాగా మోసపోయిన డీఈడీ విద్యార్థులు వినుకొండ ప్రాంతంలో కళాశాలల అక్రమాలు! ప్రైవేటు కళాశాలల ధన దాహానికి విద్యార్థుల భవిత అగమ్యగోచరంగా మారుతోంది. వినుకొండ ప్రాంతంలో బీఎడ్, డీఎడ్ కళాశాలలు పుట్టగొడుగుల్లా వచ్చి అనుమతుల్లేకుండానే విద్యార్థులను చేర్చుకుని చివరకు వారి జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఉన్నత స్థాయిలో చక్రం తిప్పుతున్న యాజమాన్యాల అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. తాజాగా పెద్దసంఖ్యలో డీఎడ్ విద్యార్థులు మోసపోయారు. పరీక్షలు ప్రారంభమైనా వారికి హాల్టికెట్లు రాకపోవడంతో ఆందోళనకు దిగారు. వినుకొండ రూరల్: వినుకొండలో బీఈడీ కళాశాల ధన దాహానికి విద్యార్థులు మరోసారి బలయ్యారు. విలువైన రెండేళ్ల విద్యా సమయంతో పాటు రూ.లక్షల్లో నష్టపోయారు. ఈ ఏడాది ఆగస్టు చివరివారంలో బీఈడీ విద్యార్థులు, ఇప్పుడు డీఈడీ విద్యార్థులు.. ఇలా వరుసగా మోసపోతున్న వారి సంఖ్య వందల నుంచి వేలకు చేరుకుంటోంది. తాజాగా వినుకొండ పట్టణంలోని పలు డీఈడీ కళాశాలల్లో విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమైనా యాజమాన్యాలు హాల్టికెట్లు అందజేయలేదు. రెండు రోజుల నుంచి ఆందోళన చేసినా ఫలితం లేదు. సోమవారం డీఎడ్ ద్వితీయ సంవత్సరం పరీక్ష మొదలైనా వారికి హాల్ టికెట్లు ఇవ్వకపోవడంతో ఆందోళన తీవ్రతరం చేశారు. అనుమతి లేకుండానే అడ్మిషన్లు.. ఈ ప్రాంతంలోని కొన్ని ఎడ్యుకేషన్ కళాశాలలకు అనుమతి లేకపోయినా ఉన్నతాధికారులతో లాలూచీ పడి తాత్కాలికి అడ్మిషన్లకు పర్మిషన్ తీసుకుని విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. సాధారణంగా కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థులు కళశాలల్లో చేరితే యాజామాన్యాలకు పెద్దగా మిగిలేది ఉండదు. దీంతో కళాశాలల యాజమాన్యాలు ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో బ్రోకర్లును ఏర్పాటు చేసుకుని విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. విద్యాసంవత్సర కాలంలో ఒక్కసారి కూడా కళాశాలకు రానవసరం లేదు.. అడ్మిషన్, పరీక్షల సమయంలో వస్తే చాలు అంటూ ప్రచారం చేసుకుని విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. తమ నివాసప్రాంతంలోనే ఏదో ఒక పని చేసుకుంటూ పరీక్షలకు మాత్రమే హాజరై సర్టిఫికెట్ పొందొచ్చనే ఆలోచనతో కొందరు వీరి వలలో పడి రూ.లక్షల్లో చెల్లిస్తున్నారు. తీరా విద్యాసంవత్సరం ఆఖరులో హాల్టికెట్లు విడుదల కాకపోవటంతో విద్యార్థుల తర ఫున యాజమాన్యాలే కోర్టుకు వెళుతున్నాయి. ఇవేమీ తెలియని విద్యార్థులు ఆయా కళాశాలల్లో చేరటం, పరీక్షల సమయంలో కళాశాల వద్దకు చేరుకుని హాల్టికెట్ల కోసం ఎదురు చూడడం నిత్యకృత్యమైపోయింది. గత ఆగస్టు నెలలో వినుకొండలోని సెవెన్హిల్స్ బీఈడీ కళాశాల వద్దకు వివిధ రాష్ట్రాల నుంచి రెండొందల మంది బీఈడీ విద్యార్థులు వచ్చి హాల్టికెట్ల కోసం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. యాజమాన్యాలు చెప్పిందే వేదం.. రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పగలిగిన కళాశాలల యాజమాన్యాలు అధికారులతో కుమ్మక్కై తమ పబ్బం గడుపుకొంటున్నాయి. పట్టణంలో పలు బీఈడీ, డీఈడీ కళాశాలలు ఒకే క్యాంపస్లో కనీసం నాలుగు పేర్లతో నాలుగు కళాశాలలు నిర్వహిస్తున్నాయి. అందరికీ కలిపి ఒకే తరగతి గదిలో బోధిస్తుంటారనే వాస్తవం అందరికీ తెలిసిన బహిరంగా రహస్యమే. అమరావతి డీఎడ్ కళాశాల అమరావతిలో కాకుండా వినుకొండలో నిర్వహిస్తుండటంతో పాటు జీఎస్ఆర్, ఎస్ఆర్, సలాం ఇలా పలుపేర్లతో ఒకే క్యాంపస్లో డీబిఈడీ, డీఈడీ కళాశాలల తరగతులు నిర్వహిస్తున్నారు. ఎన్నోసార్లు విద్యార్థులు తాము మోసపోయాం అంటూ గగ్గోలు పెట్టినా ఇంతవరకు ఇక్కసారి కూడా విచారణ చేయకపోవటంలో ఆంతర్యం విద్యాశాఖాధికారులకే తెలియాలి. -
రాష్ర్టపతి, మంత్రిమండలికి వారధి?
కేంద్ర ప్రభుత్వ అధినేతగా రాష్ట్రపతికి శాసన సంబంధ, కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి. అవి.. పార్లమెంటును సమావేశపరచటం, నిరవధిక వాయిదా వేయటం, ఏటా పార్లమెంటు మొదటి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించటం, సందేశాలు పంపడం, లోక్సభకు, రాజ్యసభకు నామినేటెడ్ సభ్యులను నియమించటం, దిగువ సభను రద్దు చేయటం, పార్లమెంటు సమావేశం లేనప్పుడు మంత్రి మండలి సలహా మేరకు 123 రాజ్యాంగ ప్రకరణ ప్రకారం ఆర్డినెన్సులు జారీ చేయటం, పార్లమెంటు ఆమోదించిన బిల్లులకు అనుమతినివ్వటం... రాష్ట్రపతి అధికారాలు సాధారణ బిల్లులైతే వాటిని అనుమతించవచ్చు లేదా పునఃపరిశీలనకు పంపవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ద్రవ్య ఆర్థిక బిల్లులను రాష్ట్రపతి ఆమోదించిన తర్వాతే లోక్సభలో ప్రవేశపెట్టాలి. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన బిల్లులు, 31-ఎ(1) ప్రకరణకు సంబంధించిన బిల్లులు, వాణిజ్య స్వేచ్ఛను పరిమితం చేసే రాష్ట్ర బిల్లులు (304 ప్రకరణ) రాష్ట్రపతి అనుమతితోనే (అవి సాధారణ బిల్లులైనప్పటికీ) ప్రవేశపెట్టాలి. రాజ్యాంగ సవరణ బిల్లులను తిరస్కరించే అధికారం 24వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాష్ట్రపతికి లేదు. భారత రాష్ట్రపతికున్న వీటో(తిరస్కరించే) అధికారం మూడు రకాలు అవి.. నిరపేక్ష, తాత్కాలిక నిలుపుదల, పాకెట్. సాధారణ బిల్లుల విషయంలో ఈ 3 రకాల వీటో అధికారాలు చెలాయించవచ్చు. తిరస్కరించటం నిరపేక్ష వీటో; పునఃపరిశీలనకు పంపటం తాత్కాలిక వీటో, నిరవధిక కాలం బిల్లును తనవద్ద ఉంచుకోవటం పాకెట్ వీటో. రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాలు కార్యనిర్వాహక అధికారాల కింద రాష్ట్రపతి చేసే నియామకాలు.. లోక్సభకు ఎన్నికలు జరిగాక, ప్రధానమంత్రిని నియమించటం, ప్రధానమంత్రి సలహాతో ఇతర మంత్రులను నియమించటం, మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్రాల గవర్నర్లను; సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూ ర్తులను, అటార్నీ జనరల్ను, యూనియన్/ ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను, ఆర్థిక సంఘాన్ని, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ను, త్రివిధ దళాధిపతులను నియమించటం. రాజ్యాంగంలోని 53వ ప్రకరణ ఈ అధికారాలను రాష్ట్రపతికి కల్పించినా.. 74వ ప్రకరణ ప్రకారం మంత్రిమండలి సలహా మేరకు వీటిని వినియోగించాలి. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రాష్ట్రపతి విధిగా దీన్ని పాటించాలి. అయితే 44వ రాజ్యాంగ సవరణ ఈ విషయంలో కొంత వెసులుబాటు కల్పించింది. దీని ప్రకారం రాష్ట్రపతి తాను ఇచ్చిన సలహాను పునఃపరిశీలించమని మంత్రి మండలిని కోరవచ్చు. మొత్తం మీద 42, 44 రాజ్యాంగ సవరణలు రాష్ట్రపతి విచక్షణాధికారాలను చాలా వరకు తగ్గించాయి. వారధిగా... 78వ రాజ్యాంగ ప్రకరణ మేరకు రాష్ట్రపతికి, మంత్రిమండలికి వారధిగా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. ప్రభుత్వ నిర్ణయాలను ఎప్పటికప్పుడు రాష్ట్రపతికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రిది. ప్రధానమంత్రి తెలియజేయకపోతే ఆ విషయాలను తన దృష్టికి తీసుకు రావాలని రాష్ట్రపతి ఆదేశించవచ్చు. 72వ ప్రకరణ మేరకు రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంది. మరణ శిక్ష రద్దు, ఆ శిక్షను వేరే శిక్షగా మార్చే అధికారం ఉంది. 352, 360 ప్రకరణల ప్రకారం మంత్రి మండలి సలహా మేరకు అత్యవసర పరిస్థితి ప్రకటించే అధికారం ఉంది. 356వ ప్రకరణ కింద రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసే అధికారం (రాష్ట్రపతి పాలన దిశగా) ఉంది. ఉపరాష్ట్రపతి అనారోగ్యం, ఇతర కారణాలతో రాష్ట్రపతి బాధ్యతలు నిర్వ ర్తించలేకపోయినా.. రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడినా తాత్కాలిక రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారు. పార్లమెంటు ఉభయ సభల సభ్యుల (ఎన్నికైన వారు, నామినేటెడ్ సభ్యులు) నియోజకగణం.. నైష్పత్తిక ప్రాతినిథ్య విధానం ద్వారా ఓటు బదలాయింపు పద్ధతిపై ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓట్లు లెక్కిస్తారు. రాష్ట్రపతి ఎన్నికల తరహాలో ఓటు విలువను లెక్కించే విధానం ఉండదు. ఉపరాష్ట్రపతి పదవీ రీత్యా రాజ్యసభ అధ్యక్షునిగా వ్యవహరిస్తారు. తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించేటప్పుడు రాజ్యసభ అధ్యక్షునిగా వ్యవహరించరు. ఈ పదవికి పోటీ చేయాలంటే భారతదేశ పౌరుడై 35 సంవత్సరాలు నిండాలి. రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు అవసరమైన అర్హతలు ఉండాలి. పోటీదారుని అభ్యర్థిత్వాన్ని నియోజకగణంలోని కనీసం 20 మంది సభ్యులు ప్రతిపాదించాలి. మరో 20 మంది బలపర్చాలి. ఉపరాష్ట్రపతిని తొలగించే అధికారం పార్లమెంటుకు ఉంది. రాజ్యసభలో మెజారిటీ సభ్యులు ఆ మేరకు తీర్మానం ఆమోదించి.. దాన్ని లోక్సభ మెజారిటీ సభ్యులు కూడా ఆమోదిస్తే, ఉప రాష్ట్రపతి పదవి కోల్పోతారు. ఆ సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక ఉపరాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. వీలైనంత త్వరగా కొత్త ఉపరాష్ట్రపతిని పార్లమెంటు ఎన్నుకోవాలి. ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని సుప్రీంకోర్టులో మాత్రమే సవాలు చేయొచ్చు. మంత్రి మండలి పార్లమెంటరీ వ్యవస్థలో మంత్రిమండలి.. వాస్తవ కార్యనిర్వాహక వర్గం. ప్రధానమంత్రి, ఇతర మంత్రులతో కూడిన ఈ వ్యవస్థ కార్వనిర్వాహక అధికారాలను రాష్ట్రపతి పేరిట చెలాయిస్తుంది. మంత్రిమండలిలో సీనియర్ మంత్రులను కేబినెట్మంత్రులని, వారి సహాయకులను స్టేట్ మినిస్టర్స్ అని పిలుస్తారు. రాష్ట్రపతి అభీష్టం మేరకు పదవిలో కొనసాగుతారు. వాస్తవానికి లోక్సభ విశ్వాసం ఉన్నంత కాలం పదవిలో కొనసాగుతారు. మంత్రిగా నియమితులైన వ్యక్తి పార్లమెంటు సభ్యుడై ఉండాలి. నియామక సమయానికి సభ్యత్వం లేకపోతే ఆర్నెల్ల లోపు సభ్యత్వం పొందాలి. 91వ రాజ్యాంగ సవరణ చట్టం (2003) ప్రకారం మంత్రిమండలి సభ్యుల సంఖ్య లోక్సభ సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించకూడదు. మంత్రి మండలి లోక్సభకు సమష్టిగా బాధ్యత వహిస్తుంది. అటార్నీ జనరల్ 76వ రాజ్యాంగ ప్రకరణ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించటానికి అర్హతలున్న వ్యక్తిని అటార్నీ జనరల్గా రాష్ట్రపతి నియమిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి అటార్నీ జనరల్.. ప్రధాన న్యాయ సలహాదారునిగా వ్యవహరిస్తారు. రాష్ట్రపతికి ఇష్టమున్నంత కాలం పదవిలో కొనసాగుతారు. దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో ప్రభుత్వం తరఫున వాదించడానికి ఆయనకు అధికారం ఉంటుంది. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొని, అవసరమైన న్యాయపరమైన సమాచారం ఇస్తారు. అయితే పార్లమెంటులో ఓటువేసే హక్కు లేదు. న్యాయపరమైన విషయాల్లో రాష్ట్రపతికి, మంత్రిమండలికి సలహా ఇస్తారు. పార్లమెంటు ఇది ద్వంద్వ సభ. దిగువ సభ (లోక్సభ), ఎగువసభ (రాజ్యసభ) ఉంటాయి. రాజ్యాంగ నిబంధనల మేరకు లోక్సభలో గరిష్టంగా 552 మంది సభ్యులుండవచ్చు. వీరిలో 530 మంది రాష్ట్రాలకు, 20 మంది కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. మరో ఇద్దరు ఆంగ్లో ఇండియన్ సభ్యులు. అయితే ప్రస్తుతం 545 మంది సభ్యులున్నారు. 84వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 2026 వరకు లోక్సభ సభ్యుల సంఖ్య యథాతథంగా కొనసాగుతుంది. 1971 జనాభా ప్రాతిపదికగా ఆయా రాష్ట్రాలకు సీట్ల కేటాయింపు జరిగింది. రాజ్యసభలో గరిష్టంగా 250 మంది సభ్యులు ఉండవచ్చు. వారిలో 238 మంది వివిధ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తే, వివిధ రంగాల్లో నిష్ణాతులైన 12 మందిని రాష్ట్రపతి నియమిస్తారు. ప్రస్తుతం రాజ్యసభలో 245 మంది సభ్యులున్నారు. వీరిలో 233 మంది ఎన్నికైనవారు, మిగిలిన వారిని రాష్ట్రపతి నామినేట్ చేశారు. రాజ్యసభ శాశ్వత సభ. సభ్యుల పదవీ కాలం ఆరేళ్లు. ప్రతి రెండేళ్లకు 1/3 వంతు మంది పదవీ విరమణ చేస్తారు. వివిధ రాష్ట్ర /కేంద్ర పాలిత శాసనసభ సభ్యుల నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం ద్వారా ఓటు బదలాయింపు పద్ధతిపై ఎన్నికవుతారు. ఏటా మూడుసార్లు సమావేశం! 5 ఏళ్ల పదవీ కాలానికి ఎన్నికైన లోక్సభ గడువుకు ముందే రద్దు కావచ్చు. 352వ ప్రకరణ కింద అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు అయిదు సంవత్సరాల పదవీకాలం ముగిసినా మరో సంవత్సరం (మొత్తం ఆరేళ్లకు) పొడిగిస్తూ పార్లమెంటు చట్టం చేయొచ్చు. అవసరాన్ని బట్టి ప్రతి సంవత్సరం చట్టం ద్వారా పొడిగించవచ్చు. 1976లో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఒక సంవత్సర కాలం పొడిగించారు. అత్యవసర పరిస్థితి రద్దయ్యాక ఆర్నెల్ల కంటే ఎక్కువ కాలం లోక్సభ కొనసాగకూడదు (అప్పటికే దాని సాధారణ పదవీకాలం పూర్తై). పార్లమెంటు సాధారణంగా ఏటా మూడుసార్లు సమావేశమవుతుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు జరిగే ఈ సమావేశాల మధ్య గడవు ఆర్నెల్లకు మించకూడదు. సాధారణ ఎన్నికల తర్వాత ప్రారంభమైన మొదటి లోక్సభ సమావేశానికి, ఎన్నికైన వారిలో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిని లోక్సభ తాత్కాలిక స్పీకర్ (ప్రొటెం)గా రాష్ట్రపతి నియమిస్తారు. ఈయన ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. స్పీకర్ ఎన్నికకు అధ్యక్షత వహిస్తారు. రాజ్యసభకు ఉపరాష్ట్రపతి చైర్మన్. డిప్యూటీ చైర్మన్ను సభ్యులు ఎన్నుకుంటారు. అలాగే లోక్సభ కూడా డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకుంటుంది. శాసన సంబంధ విధులు పార్లమెంటు ప్రధానంగా శాసన సంబంధ విధులు నిర్వహిస్తుంది. అందులో భాగంగా సాధారణ, ద్రవ్య, ఆర్థిక బిల్లులను ఆమోదించడం, అమల్లో ఉన్న చట్టాలను సవరించడం, రాజ్యాంగ సవరణ బిల్లులను చర్చించి ఆమోదించడం, ప్రజా సమస్యలను చర్చించడం వంటి విధులు నిర్వహిస్తుంది. అవిశ్వాస తీర్మానం ఆమోదం ద్వారా ప్రభుత్వాన్ని గద్దెదించే అధికారం లోక్సభకు ఉంది. సాధారణ బిల్లుల విషయంలో ఉభయ సభలకు సమాన అధికారాలున్నాయి. ప్రతిష్టంభన ఏర్పడితే రాష్ట్రపతి ఆర్నెల్ల తర్వాత సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ద్రవ్య, ఆర్థిక బిల్లు ఆమోదం, సవరణ-తిరస్కరణ (బడ్జెట్తో సహా) అధికారం లోక్సభకు మాత్రమే ఉంది. రాజ్యసభ కేవలం 14 రోజులు మాత్రమే ద్రవ్యబిల్లును నిలిపేయగలదు. రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో రెండిటికీ సమానాధికారాలున్నాయి. వాయిదా తీర్మానం, అభిశంసన తీర్మానం లోక్సభ మాత్రమే చేయగలదు. రాజ్యసభ ప్రత్యేక అధికారాలు అఖిల భారత సర్వీసుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లు, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశంపై పార్లమెంటు చట్టం చేయడానికి సంబంధించిన బిల్లు 2/3 వంతు మెజారిటీతో తీర్మానం చేసిన తర్వాతే పార్లమెంటు పరిశీలిస్తుంది. అలాగే ఉపరాష్ట్రపతిని తొలగించాలన్న ప్రతిపాదన రాజ్యసభ చొరవతోనే మొదలవుతుంది. లోక్సభ రద్దయ్యాక అత్యవసర పరిస్థితి ప్రకటిస్తే దాన్ని నిర్ణీత కాలంలో రాజ్యసభ ఆమోదిస్తే చెల్లుబాటవుతుంది. ఉమ్మడి జాబితాలో పేర్కొన్న అంశాలపై చట్టాలు చేసే అధికారం పార్లమెంట్కు, రాష్ట్ర శాసనసభలకు ఉన్నప్పటికీ ఒకే అంశంపై పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు చట్టం చేసేటప్పుడు ఆ రెండింటిమధ్య ఘర్షణ ఏర్పడితే పార్లమెంటు చట్టమే చెల్లుతుంది. అవశేషాంశాలపై చట్టంచేసే అధికారం పార్లమెంటుదే. అంతర్జాతీయ ఒప్పందాల అమలుకు, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా (రాజ్యసభ ఆ మేరకు 2/3 వంతు మెజారిటీతో తీర్మానం చేస్తే) రాష్ట్ర జాబితాలో ఏ అంశంపైనైనా చట్టం చేసే అధికారం పార్లమెంట్కు ఉంది. అలాగే రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల అభ్యర్థనతో రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు చట్టాలు చేయవచ్చు. 356వ ప్రకరణ అమల్లో ఉన్నప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించి చట్టాలను పార్లమెంటు చేస్తుంది. స్పీకర్ లోక్సభ సమావేశాలకు అధ్యక్షత వహించే స్పీకర్.. హోదాలో నాలుగో స్థానాన్ని ఆక్రమిస్తారు. రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి తర్వాత స్పీకర్దే అగ్రస్థానం. సభాపతిగా సభాకార్యక్రమాలు నియంత్రించడంతోపాటు సమన్లు, అరెస్టు వారెంట్లు జారీచేసే అధికారం ఉంది. సంయుక్త సమావేశానికి (లోక్సభ, రాజ్యసభ) అధ్యక్షత వహిస్తారు. ఒక బిల్లు ద్రవ్యబిల్లు అనే విషయాన్ని స్పీకర్ నిర్ధారిస్తారు. పార్లమెంటు కమిటీలకు సభ్యులను, అధ్యక్షులను నామినేట్ చేస్తారు. నిబంధనల కమిటీకి, సాధారణ విషయాల కమిటీకి, సభా కార్యక్రమాల కమిటీకి పదవీరీత్యా అధ్యక్షునిగా ఉంటారు. కమిటీల ద్వారా కార్యకలాపాలు: పార్లమెంట్ తన ముఖ్య కార్యకలాపాలను కమిటీల ద్వారా నిర్వహిస్తుంది. అవి రెండు రకాలు.. స్థాయీ సంఘాలు, తాత్కాలిక సంఘాలు. స్థాయీ సంఘాలు శాశ్వత ప్రాతిపదికపై పనిచేస్తాయి. ఈ కమిటీలకు నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం ద్వారా సభ్యులను ఎంపిక చేస్తారు. ముఖ్యమైన స్థాయీ సంఘాలు.. ప్రభుత్వ ఖాతాల సంఘం, అంచనాల సంఘం, ప్రభుత్వ ఉపక్రమాల ఖాతాల సంఘం, శాఖాపరమైన స్థాయీసంఘాలు. అంచనాల సంఘంలో ఉండే మొత్తం 30 మంది లోక్సభ సభ్యులు. ప్రభుత్వ ఖాతాల సంఘంలో 15 మంది లోక్సభకు, ఏడుగురు రాజ్యసభకు చెందుతారు. ప్రభుత్వ ఉపక్రమాల సంఘం స్వరూపం కూడా అలాగే ఉంటుంది. శాఖాపరమైన స్థాయీ సంఘాలు 1993 నుంచి పనిచేస్తున్నాయి. 2004లో వీటి సంఖ్య 17 నుంచి 24కు పెరిగింది. ఒక్కో సంఘంలో ఉండే 31 మంది సభ్యుల్లో 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ నుంచి ఎన్నికవుతారు. 16 కమిటీలు లోక్సభ స్పీకర్ అజమాయిషీలో పనిచేస్తే మిగిలిన ఎనిమిది రాజ్యసభ చైర్మన్ పర్యవేక్షణలో ఉంటాయి. -
ప్లాస్టిక్ ఇంజనీరింగ్.. కెరీర్ షైనింగ్
దేశంలో ప్లాస్టిక్ ఇంజనీరింగ్ విభాగంలో శిక్షణనిచ్చే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ -2015కు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో.. ప్లాస్టిక్ ఇంజనీరింగ్ కెరీర్ అవకాశాలు.. సిపెట్-జేఈఈ వివరాలు.. ప్లాస్టిక్ ఇంజనీరింగ్ నిపుణులు పాలిమర్స్ ఆధారంగా రూపొందించే వస్తువుల డిజైన్, మాన్యుఫాక్చరింగ్ ప్రక్రియల్లో పాల్పంచుకుంటారు. ఇప్పుడు వినియోగదారుల దృక్పథం మారుతుండటం, తేలికపాటి వస్తువులకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ప్లాస్టిక్ ఇంజనీర్లకు డిమాండ్ పెరుగుతోంది. భారీగా అవకాశాలు ప్రస్తుతం ఏటా 10 నుంచి 12 శాతం చొప్పున వృద్ధి నమోదు చేసుకుంటున్న ప్లాస్టిక్ పరిశ్రమ.. 2017 చివరి నాటికి 14 శాతానికి చేరుకుంటుందని ప్లాస్టిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంచనా. అదే విధంగా 2018 చివరికి ప్లాస్టిక్ పరిశ్రమ రూ.1,37,000 కోట్ల మేర మార్కెట్ విలువ దక్కించుకుంటుందని ఫిక్కి తదితర సంస్థలు పేర్కొన్నాయి. ఈ అంచనాలు, ప్రస్తుతం ప్లాస్టిక్ ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులను బేరీజు వేస్తే వేల సంఖ్యలో మానవ వనరుల అవసరం ఉంటుంది. ఉపాధి వేదికలు ప్లాస్టిక్ ఇంజనీరింగ్ నిపుణులకు ఉపాధి వేదికలుగా ఆటోమొబైల్ సంస్థలు; పెట్రోలియం ఉత్పత్తుల సంస్థలు; ఆర్ అండ్ డీ విభాగాలు నిలుస్తున్నాయి. ప్లాస్టిక్ ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు ప్రభుత్వరంగంలో పెట్రోలియం మంత్రిత్వ శాఖ, ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా కార్పొరేషన్ తదితర సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి. ఇక ప్రైవేటు రంగంలో ప్రతి ఉత్పత్తి పరిశ్రమలోనూ ప్లాస్టిక్ ఇంజనీర్లు అవసరమే. డిప్లొమా నుంచి డాక్టోరల్ వరకు ప్రస్తుతం ప్లాస్టిక్ ఇంజనీరింగ్లో డిప్లొమా నుంచి పోస్ట్ డాక్టోరల్ వరకు పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులకు తాము పూర్తిచేసిన కోర్సు ఆధారంగా కెరీర్ అవకాశాలు, వేతనాలు లభిస్తాయి. డిప్లొమా స్థాయి కోర్సు పూర్తిచేస్తే ప్రారంభంలోనే నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం అందుకోవచ్చు. ఆపై స్థాయి కోర్సులు పూర్తి చేస్తే ఎంపిక చేసుకున్న సంస్థ, హోదా ఆధారంగా భారీ స్థాయిలో వేతనాలు ఉంటాయి. బెస్ట్ కోర్సులకు కేరాఫ్ సిపెట్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ కోర్సుల పరంగా బెస్ట్ ఇన్స్టిట్యూట్గా ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన సంస్థ.. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. చెన్నై ప్రధాన క్యాంపస్గా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ సంస్థకు హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా ఉన్న 23 క్యాంపస్ల ద్వారా పలు కోర్సులను అందిస్తోంది. డిప్లొమా/పీజీ డిప్లొమా డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ; డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ; అర్హత: పదో తరగతి; కోర్సు వ్యవధి: మూడేళ్లు పోస్ట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ; పీజీ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్; పీజీ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్. అర్హత:బీఎస్సీ (ఎంపీసీ); కోర్సు వ్యవధి: ఏడాదిన్నర బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు ప్లాస్టిక్ ఇంజనీరింగ్/టెక్నాలజీలో బీఈ/బీటెక్ మ్యానుఫాక్చరింగ్ ఇంజనీరింగ్/టెక్నాలజీలో బీఈ/బీటెక్ బీటెక్. పీజీ కోర్సులు ప్లాస్టిక్ ఇంజనీరింగ్/టెక్నాలజీ; పాలిమర్ అండ్ నానో టెక్నాలజీ, క్యాడ్/క్యామ్; మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, పాలిమర్ సైన్స్, బయో పాలిమర్ సైన్స్లలో ఎంఈ, ఎంటెక్, ఎమ్మెస్సీ కోర్సులు. వీటిని సిపెట్ హై లెర్నింగ్ సెంటర్స్గా పేర్కొనే అహ్మదాబాద్, భువనేశ్వర్, చెన్నై, లక్నో, కోచిలలో మాత్రమే అభ్యసించే అవకాశం ఉంటుంది. షార్ట్ టర్మ్ కోర్సులు కూడా వీటితోపాటు సిపెట్ కేంద్రాలు ఉన్న సమీప ప్రాంతాల్లోని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పలు షార్ట్ టర్మ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సిపెట్ జేఈఈ - 2015: సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అందించే బీఈ/బీటెక్; ఎంఈ/ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా జాతీయ స్థాయిలో జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ను నిర్వహిస్తుంది. ఈ క్రమంలో తాజాగా సిపెట్ జేఈఈ-2015 నోటిఫికేషన్ను విడుదల చేసింది. వివరాలు.. బీఈ/బీటెక్ కోర్సులు : ప్లాస్టిక్ ఇంజనీరింగ్/టెక్నాలజీ అర్హత : ఎంపీసీ గ్రూప్తో ఇంటర్మీడియెట్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎంఈ/ఎంటెక్/ఎమ్మెస్సీ కోర్సులు: అర్హత: అభ్యర్థులు తాము దరఖాస్తు చేయదలచుకున్న సబ్జెక్ట్లతో బీటెక్ / బీఈ/ బీఎస్సీలో ఉత్తీర్ణత. సిపెట్ జేఈఈ-2015 బ్యాచిలర్ డిగ్రీ స్వరూపం: బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో రెండు గంటల వ్యవధిలో వంద మార్కులకు ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. విజయం సులువే: ఇంజనీరింగ్ లక్ష్యంగా ఎంసెట్, జేఈఈ, బిట్శాట్ తదితర ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు.. అదే ప్రిపరేషన్తో సిపెట్ జేఈఈ పరీక్షకు ఉపక్రమించొచ్చు. దీనికి పేర్కొన్న సిలబస్ ఆసాంతం ఇంటర్ సిలబస్ మేరకే ఉంటుంది. సిపెట్ జేఈఈ- 2015 ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ: జూన్ 5, 2015 జేఈఈ తేదీ: జూలై 12, 2015 వెబ్సైట్: www.cipet.gov.in ‘ప్లాస్టిక్’లో పెరుగుతున్న అవకాశాలు పాలిమర్స్ ఆధారంగా పారిశ్రామిక ఉత్పత్తులను తయారు చేయడం ప్లాస్టిక్ ఇంజనీరింగ్ పరిధిలోకి వస్తుంది. దేశంలో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు, తేలికపాటి వస్తువుల వినియోగానికి ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ప్లాస్టిక్ ఇంజనీరింగ్లో కింది స్థాయి నుంచి అనేక కెరీర్ అవకాశాలు ఆహ్వానం పలుకుతున్నాయి. సిపెట్ ద్వారా కోర్సులు పూర్తి చేసిన వారికి అందులోనూ బ్యాచిలర్, పీజీ స్థాయి కోర్సుల అభ్యర్థులకు ఉద్యోగాల పరంగా ఢోకా లేదు. ఇందుకు ఆయా క్యాంపస్ ప్లేస్మెంట్స్ గణాంకాలే నిదర్శనం. అయితే ఈ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతోపాటు, సృజనాత్మకత, కొత్త అంశాలను ఇట్టే పసిగట్టే నేర్పు ఉండాలి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశించే కొత్త వస్తువులు వాటి డిజైన్ వెనుక ఇమిడి ఉన్న సాంకేతికత, సృజనాత్మకతలను పరిశీలించే నైపుణ్యం, మన సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఉత్పత్తులను డిజైన్ చేసే సామర్థ్యం వంటివి అవసరం. - వి.కిరణ్ కుమార్, సిపెట్ హైదరాబాద్ సెంటర్ హెడ్. -
టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి
నేటి తరం విద్యార్థులు ముఖ్యంగా నాలుగు అంశాల్లో నైపుణ్యాలు సాధించాలి.అవి సింథసిస్(సమన్వయం), ఇంటర్నేషనలైజేషన్, సాఫ్ట్స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్. ‘ఇంజనీరింగ్, టెక్నాలజీ.. దశాబ్దాలుగా ఎవర్గ్రీన్ రంగాలు. నేటికీ ప్రగతిపథంలో దూసుకెళ్తున్నాయి. అకడమిక్స్ పరంగానూ ఎంతో క్రేజ్ కలిగిన విభాగాలివి. ప్రస్తుతం జాతీయ స్థాయిలో మేక్ ఇన్ ఇండియా.. అంతర్జాతీయంగా గ్లోబల్ దృక్పథం కారణంగా.. ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో సమీప భవిష్యతలో మరింత డిమాండ్ ఏర్పడనుంది. ఆ మేరకు మానవ వనరుల అవసరం ఉంటుంది. విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు మహీంద్రా ఎకోల్ సెంట్రేల్ డెరైక్టర్ ప్రొఫెసర్ సంజయ్ జి.ధాండే. 12ఏళ్లు ఐఐటీ-కాన్పూర్ డెరైక్టర్గా పనిచేయడంతోపాటు ఐఐటీ-రాజస్థాన్ ఫౌండర్ డెరైక్టర్గా, ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహా మండలి సభ్యులుగా వ్యవహరించిన ప్రొఫెసర్ సంజయ్ జి.ధాండేతో గెస్ట్కాలం.. జాతీయ స్థాయిలో ప్రస్తుతం అమలవుతున్న విధానాలను పరిగణనలోకి తీసుకుంటే ఇంజనీరింగ్ నిపుణులకు ఉజ్వల భవిష్యత్తు ఖాయం. ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియాతో రానున్న ఐదేళ్లలో ఉత్పత్తి రంగం మరింత వృద్ధి చెందనుంది. ఈ కార్యక్రమం సమర్థంగా అమలైతే ప్రస్తుతం జీడీపీలో 17 శాతంగా ఉన్న ఉత్పత్తి రంగం వాటా 25 శాతానికి పెరగనుంది. అంటే.. కొత్త ఉత్పత్తులు, పరిశ్రమల ఏర్పాటు జరుగుతుంది. ఇది ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది. ఇతరులతో సమన్వయంతో పనిచేయాలి: అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే.. నేటి తరం విద్యార్థులు ముఖ్యంగా నాలుగు అంశాల్లో నైపుణ్యాలు సాధించాలి. అవి సింథసిస్(సమన్వయం), ఇంటర్నేషనలైజేషన్, సాఫ్ట్స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్. కారణం.. ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్పత్తి రంగంలో పలు విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇతరులతో సమన్వయంతో ముందుకు సాగడం చాలా అవసరం. అలాగే అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి కార్యకలాపాలపై అవగాహన పెంచుకోవాలి. దాంతోపాటు ఒక ఉత్పత్తికి సంబంధించి విశ్లేషించే నైపుణ్యాలు ఉంటే విధుల్లో సమర్థంగా రాణించగలుగుతారు. టీంలో పనిచేసేటప్పుడు కమ్యూనికేషన్, సాఫ్ట్స్కిల్స్ అవసరం ఎక్కువగా ఉంటుంది. కరిక్యులం.. ఆర్ అండ్ డీ: విద్యార్థులకు నైపుణ్యాలు అలవడాలంటే కరిక్యులంను పరిశ్రమల్లో ఉద్యోగాలు లభించే నైపుణ్యాలను అందించేలా రూపొందించాలి. సమీప భవిష్యత్తులో సదరు రంగంలో రానున్న మార్పులు అంచనా వేసి ఆ మేరకు శిక్షణ ఇచ్చేలా కరిక్యులం రూపొందించాలి. అప్పుడే విద్యార్థులు అధునాతన పరిజ్ఞానంతో జాబ్ మార్కెట్లో రాణించగలరు. మన దేశంలో ఇటీవల కాలంలో ఇన్స్టిట్యూట్ల పరంగా ఆర్ అండ్ డీపై అవగాహన పెరుగుతుండటం ఆహ్వానించదగిన పరిణామం. ఇన్స్టిట్యూట్లు ఆర్ అండ్ డీ దృక్పథంతోపాటు పరిశ్రమ వర్గాలు కోరుకునే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. గత కొన్నేళ్లుగా కార్పొరేట్ సంస్థలు సొంతంగా ఇన్స్టిట్యూట్లు ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఆర్ అండ్ డీ, పరిశ్రమలకు అనువుగా రాణించడం కోసమే! గ్లోబల్ దృక్పథం కావాలి: విద్యార్థులు లోకల్, ఇంటర్నేషనల్ అనే కోణంలో ఆలోచించడం మానేయాలి. పూర్తిగా ‘గ్లోబల్’ దృక్పథంతో నైపుణ్యాలు పెంచుకునేందుకు కృషి చేయాలి. ఇప్పుడు కంపెనీల పరంగా లోకల్, ఇంటర్నేషనల్ అనే హద్దులు చెరిగిపోయాయి. పెద్ద కంపెనీలు అన్నీ వివిధ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఎంఎన్సీలుగా పరిగణనలో ఉన్నాయి. ఎంఎన్సీలు అంటే మన దేశంలో ఉన్న విదేశీ సంస్థలుగానే భావిస్తాం. కానీ ఇతర దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మన దేశంలోని సంస్థలు కూడా ఎంఎన్సీలే. ఉదాహరణకు టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలకు ఇతర దేశాల్లో సర్వీస్ డెలివరీ సెంటర్స్ ఉన్నాయి. మన దేశంలోని సంస్థలో పనిచేస్తున్నా, విదేశాల్లోని కంపెనీలో చేరినా.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పనిచేసేలా విద్యార్థులు తమను తాము తీర్చిదిద్దుకోవాలి. ప్రాథమిక అంశాలకు ప్రాధాన్యమివ్వాలి: ఇంజనీరింగ్కు సంబంధించి పరిగణనలోకి తీసుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం.. ఆధునిక టెక్నాలజీలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగడం. ఉదాహరణకు ఇటీవల కాలంలో డిజిటల్ ఫ్యాబ్రికేషన్, 3-డి ప్రింటింగ్ వంటి వాటి ప్రాముఖ్యత పెరుగుతోంది. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుంటే విద్యార్థులు తమ కోర్ సబ్జెక్ట్లకే పరిమితం కాకుండా.. సరికొత్త టెక్నాలజీలో నైపుణ్యాలు పొందేలా శిక్షణ తీసుకోవాలి. సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో ఆవిష్కరణలకు కీలకమైన ప్రాథమిక అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకపోవడం విద్యార్థుల్లో సమస్యగా మారింది. ఇంజనీరింగ్ ఔత్సాహిక, ఇప్పటికే ఈ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు ఈ విషయాన్ని తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి. స్వీయ లెర్నింగ్తో..: మంచి కాలేజీలో చేరితేనే మెరుగైన నైపుణ్యాలు లభిస్తాయి అనే అపోహను వీడండి. కాలేజ్/ఇన్స్టిట్యూట్ స్థాయి ఏదైనా.. ఇంజనీరింగ్ వంటి కోర్సులో స్వీయ ఆసక్తితో, సొంతగా నేర్చుకోవడం ద్వారా నైపుణ్యాలను పెంచుకోవచ్చు. తరగతి గదిలో ప్రొఫెసర్ ఒక అంశం చెబితే దానికి అనుసంధానంగా ఉన్న ఇతర అంశాలపై పరిజ్ఞానం పొందేందుకు విద్యార్థి సొంతగా కృషి చేయాలి. దాంతోపాటు ప్రొఫెసర్లు చేసే పరిశోధనల్లో పాల్గొనేలా వ్యవహరించాలి. ఒక బ్రాంచ్లో చేరిన విద్యార్థులు తమ బ్రాంచ్లోని కోర్సులకే పరిమితం కాకుండా.. ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్తో ముందుకు సాగాలి. అప్పుడే ఎలాంటి కాలేజీలో చేరినా.. భవిష్యత్తు గురించి ఆందోళన చెందాల్సిన పని ఉండదు!! -
బీఈడీ, ఎంఈడీ సిలబస్లోనూ స్పెషల్ ఎడ్యుకేషన్
ఉపాధ్యాయ విద్యకు సంబంధించి అందుబాటులో ఉన్న కోర్సులు బీఈడీ, ఎంఈడీ సిలబస్ల మార్పు చేపట్టిన ఎన్సీటీఈ మరో కీలక చర్య తీసుకుంది. బుద్ధిమాంద్యం, ఇతర శారీరక బలహీనతలు ఉన్న విద్యార్థులకు శిక్షణనిచ్చే నైపుణ్యాలను బీఈడీ, ఎంఈడీ విద్యార్థులకు అందించే విధంగా ఈ రెండు కోర్సుల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ను ఒక సబ్జెక్ట్గా తప్పనిసరి చేసింది. ఈ మేరకు రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. వాస్తవానికి ఇప్పటి వరకు స్పెషల్ ఎడ్యుకేషన్లో పూర్తిస్థాయి కోర్సులను రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్యవేక్షిస్తోంది. దీనివల్ల ఆ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకే శారీరక, మానసిక వికలాంగులైన చిన్నారులకు బోధించే నైపుణ్యాలు లభిస్తున్నాయి. అలాంటి విద్యార్థులకు కేవలం స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూళ్లు మాత్రమే విద్యాభ్యాసానికి అనుకూలంగా ఉంటున్నాయి. అయితే గత ఏడాది నేషనల్ శాంపుల్ సర్వే అంచనాల ప్రకారం- 6-13 సంవత్సరాల మధ్య వయసు ఉన్న చిన్నారుల్లో దాదాపు ఆరు లక్షల మంది శారీరక, మానసిక వికలాంగులు తమ వైకల్యం కారణంగా స్కూళ్లకు దూరంగా ఉన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్సీటీఈ తాజా నిర్ణయం తీసుకుంది. ఫలితంగా బీఈడీ, ఎంఈడీ కోర్సు చేసిన అభ్యర్థులందరికీ స్పెషల్ ఎడ్యుకేషన్లోనూ శిక్షణ లభిస్తుందని, ఫలితంగా తమకు సమీపంలోని స్కూళ్లలోనూ శారీరక, మానసిక వికలాంగ చిన్నారులు విద్యనభ్యసించే అవకాశం లభిస్తుందని ఎన్సీటీఈ వర్గాలు తెలిపాయి. -
ఇంజనీరింగ్, సైన్స్లో కొత్త కోర్సులు రావాలి
విద్యార్థుల్లో నైపుణ్యాలతోపాటు అంతర్జాతీయ స్థాయిలో పోటీని ఎదుర్కోవాలంటే..ముఖ్యంగా ఇంజనీరింగ్, సైన్స్లలో కొత్త కోర్సుల రూపకల్పన అవసరమని అంటున్నారు ఇండో-అమెరికన్ ప్రొఫెసర్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సెల్వేనియా సూల్క్ ఆఫ్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ ఆర్. విజయ్ కుమార్. ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి అయిన విజయ్ కుమార్ రోబోటిక్స్ రీసెర్చ్లో ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్లో ఎస్ అండ్ టీ కార్యాలయంలో రోబోటిక్స్ అండ్ ఫిజికల్ సిస్టమ్స్ విభాగం అసిస్టెంట్ డెరైక్టర్గానూ విధులు నిర్వర్తించారు. వర్సిటీకి డీన్గా నియమితులైన నేపథ్యంలో ప్రొఫెసర్ ఆర్.విజయ్ కుమార్తో గెస్ట్ కాలమ్.. యూనివర్సిటీ ఆఫ్ పెన్సెల్వేనియాలో ఇంజనీరింగ్ డీన్గా ఎంపిక కావడం ఆనందాన్ని కలిగిస్తోంది. అదే సమయం లో ఈ హోదా బాధ్యతలను పెంచుతుంది. క్యాంపస్లో అందుబాటులో ఉన్న టెక్నాలజీని మరింత మెరుగుపరచడం నా తక్షణ లక్ష్యం. ఫ్యాకల్టీ సంఖ్యను, రీసెర్చ్ కార్యకలాపాలను పెంచడం, ఎక్కువ మంది విద్యార్థులను టెక్నాలజీవైపు ఆకర్షితులను చేయడం నా లక్ష్యాలు. ఎస్ అండ్ టీదే కీలక పాత్ర ప్రస్తుతం అన్ని రంగాలు ప్రగతి బాటలో నడుస్తున్నాయి. కానీ వీటన్నిటిలో కాస్త ఎక్కువ ప్రాధాన్యత గల రంగం సైన్స్ అండ్ టెక్నాలజీ. సమీప భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో టెక్నాలజీ ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయి. హెల్త్కేర్ మొదలు అన్ని రంగాల్లో ఇప్పుడు టెక్నాలజీ తప్పనిసరిగా మారడమే దీనికి కారణం. సుస్థిర అభివృద్ధి, ఆయా రంగాల పురోభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర కీలకమైంది. ఐఐటీలను మరింతగా తీర్చిదిద్దాలి భారతదేశంలోని ఇన్స్టిట్యూట్లు ముఖ్యంగా ఐఐటీలను పోటీ ప్రపంచానికి అనుగుణంగా మరింతగా తీర్చిదిద్ది నిర్వహణ పరంగా మార్పులు తేవాలి. ఐఐటీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యైన ఫ్యాకల్టీ కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలి. ఫ్యాకల్టీ రీసెర్చ్ కార్యకలాపాలను ప్రోత్సహించడం, అందుకు తగిన సదుపాయాలు కల్పించడం ద్వారా ఐఐటీలను బలోపేతం చేయొచ్చు. ఇతర దేశాల్లోని ఇన్స్టిట్యూట్లలో 70 నుంచి 75 శాతం మంది ఫ్యాకల్టీ.. వ్యక్తిగత రీసెర్చ్ ప్రాజెక్ట్స్ చేస్తూ తమ విద్యార్థులను భాగస్వాములను చేస్తారు. ఐఐటీల్లోనూ ఇలాంటి వాతావరణాన్ని కల్పిస్తే నాణ్యమైన ఫ్యాకల్టీతో పాటు విద్యార్థులకు కూడా ప్రాక్టికల్ నైపుణ్యాలు లభిస్తాయి. విద్యార్థులకు రీసెర్చ్పై ఆసక్తి కూడా పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో సామాజిక అభివృద్ధి పరంగా ఎన్నో సత్ఫలితాలను అందిస్తుంది. పరిస్థితులకు అనుగుణంగా కోర్సులు ఇటీవల భారత ప్రభుత్వం దేశంలోని విద్యార్థులకు విదేశీ ఇన్స్టిట్యూట్లలోని ఫ్యాకల్టీతో లెక్చర్స్ అందించే విధంగా నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగిన పరిణామం. దీనివల్ల విద్యార్థులకు అంతర్జాతీయ అంశాలపై అవగాహనతోపాటు విస్తృత పరిజ్ఞానం లభిస్తుంది. విద్యార్థుల్లో నైపుణ్యాలు మెరుగుకు, అంతర్జాతీయ స్థాయిలో పోటీని ఎదుర్కొనేందుకు ఇంజనీరింగ్, సైన్స రంగాల్లో కొత్త కోర్సుల రూపకల్పన వల్ల సామాజిక అవసరాలు కూడా తీరతాయి. ఇందుకు రోబోటిక్స్ మంచి ఉదాహరణ. ఒకప్పుడు దీని గురించి ఆలోచించడానికి కూడా వెనుకాడే పరిస్థితులు ఉండేవి. నేడు పరిశోధనలు, ఆవిష్కరణల ఫలితంగా ఒక కోర్సుగా విద్యార్థులకు అందుబాటులోకి వచ్చి సామాజికంగా అనేక రంగాల్లో మమేకమయింది. ఇలా పరిస్థితులకు అనుగుణంగా కోర్సుల రూపకల్పన జరగాలి. భవిష్యత్తు దృష్టితో బోధన విద్యార్థుల్లో నైపుణ్యాల పరంగా ఫ్యాకల్టీ దృక్పథంలో మార్పు రావాలి. భవిష్యత్తు సవాళ్లను అంచనా వేసి వాటిని ఎదుర్కొనే సామర్థ్యం అందించే విధంగా బోధన సాగాలి. ఇందుకోసం అధ్యాపకులు కూడా నిరంతరం తాజా పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకోవాలి. వారు కూడా నిత్య విద్యార్థుల్లా కొత్త అంశాల అన్వేషణ సాగించాలి. విద్యార్థుల దృక్పథం మారాలి ఇంటర్ డిసిప్లినరీ కోర్సులు అవసరమని ఇప్పుడు అకడమిక్ నిపుణులందరూ చెబుతున్న మాట వాస్తవమే. కానీ విద్యార్థుల్లో వీటిని అందిపుచ్చుకునే ఆసక్తి, దృక్పథంలో మార్పు వస్తేనే ఎలాంటి ప్రయోగాలైనా సత్ఫలితాలనిస్తాయి. విద్యార్థులు తమ ఆసక్తి మేరకు కోర్ సబ్జెక్ట్స్తోపాటు ఇతర కోర్సులు ఎంచుకునే ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ అవకాశం లభిస్తుంది. అందిపుచ్చుకునే బాధ్యత విద్యార్థులదే నేటి పరిస్థితుల్లో ఏ రంగంలోనైనా అవకాశాలకు కొదవ లేదు. కానీ వాటిని అందిపుచ్చుకునే విధంగా తమను తాము మలచుకోవాల్సిన బాధ్యత విద్యార్థులదే. క్లాస్ రూం టీచింగ్, ఫ్యాకల్టీ పర్యవేక్షణ కొంత మేరకే ఉంటాయి. స్వీయ అభ్యసనం, విస్తృత ఆలోచన పరిధిని పెంపొందించుకోవాలి. అలా చేసిన వారే తాము అడుగుపెట్టిన రంగంలో నిలదొక్కుకోగలరు!! -
ఎంసెట్-2015..
మీ సందేహాలు.. నిపుణుల సమాధానాలు!! ఎంసెట్.. ఇంజనీరింగ్, మెడికల్ విభాగాల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష. మెరుగైన ర్యాంకు సాధించాలని,మంచి కళాశాలలో చేరాలని ఇంటర్మీడియెట్ తొలి రోజు నుంచే విద్యార్థులు సన్నద్ధమవుతారనడంలో సందేహం లేదు. ఇలా.. రెండేళ్ల పాటు శ్రమించిన విద్యార్థులు తమ అదృష్టాన్ని ‘పరీక్షించుకునే సమయం వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ఎంసెట్ జరగనుంది. మంచి ర్యాంకు సాధించడం ఎలా? మొదలు... పరీక్ష హాల్లో ఓఎంఆర్ షీట్ నింపే విషయం వరకూ.. విద్యార్థుల మదిలో ఎన్నో సందేహాలు. మే 14న తెలంగాణలో; మే 8న ఆంధ్రప్రదేశ్లో నిర్వహించనున్న ఎంసెట్కు సంబంధించి.. విద్యార్థులకు ఎదురయ్యే సందేహాలకు నిపుణుల సమాధానాలు.. మ్యాథ్స్ ప్ర : మ్యాథ్స్లో అత్యధిక మార్కుల సాధనకు మార్గం ఏమిటి? జ : మ్యాథమెటిక్స్లో లభిస్తున్న వెయిటేజీ ప్రకారం- మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్; మీన్ వాల్యూ థీరమ్; వెక్టార్ అల్జీబ్రా; క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్; బైనామియల్ థీరమ్; మ్యాట్రిసెస్; సర్కిల్స్; పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్; ఇంటిగ్రల్ కాలిక్యులస్ అంశాలపై ఎక్కువ దష్టిసారించాలి. మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో ఉత్తమంగా రాణించేందుకు కాన్సె ప్ట్స్, ఫార్ములాలపై పట్టు సాధించాలి. ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తయితే రివిజన్ మొదలుపెట్టాలి. కాన్సెప్ట్స్, ఫార్ములాలతో రూపొందించుకున్న షార్ట్ నోట్స్ల ద్వారా ఆయా చాప్టర్ల రివిజన్ పూర్తి చేసుకోవాలి. ప్ర: మ్యాథమెటిక్స్ ప్రశ్నల తీరు ఎలా ఉంటోంది? జ: మొత్తం 160 ప్రశ్నల ఇంజనీరింగ్ విభాగం పరీక్షలో.. 80 ప్రశ్నలు ఉండే మ్యాథమెటిక్స్లో దాదాపు 60 ప్రశ్నలు సులభంగా, సగటు విద్యార్థి కూడా సమాధానం ఇచ్చేలా ఉంటాయి. మొత్తం ప్రశ్నల్లో 10 శాతం ప్రశ్నలే అత్యంత క్లిష్టంగా ఉంటాయి. ఈ మార్కులే ర్యాంకులను నిర్దేశించడంలో కీలకంగా మారతాయి. విద్యార్థులు దీన్ని గుర్తించి.. క్లిష్టమైన చాప్టర్లకు సంబంధించి గ్రాండ్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు ఎక్కువగా రాయడం మేలు చేస్తుంది. ప్ర : మ్యాథమెటిక్స్లో అప్లికేషన్స్ స్కిల్స్ మెరుగుపరచుకోవడం తప్పనిసరా? జ : మ్యాథమెటిక్స్లో అప్లికేషన్ స్కిల్స్కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒక సమస్యను పరిష్కరించే క్రమంలో దానికి సంబంధించి అప్లికేషన్ మెథడ్స్ తెలిస్తే సులువుగా సమాధానం గుర్తించడం ద్వారా ఎంతో విలువైన సమయం ఆదా అవుతుంది. అప్లికేషన్ స్కిల్స్ మెరుగుపరచుకో వాలంటే.. ప్రశ్నను క్షుణ్నంగా చదవి అందులో క్లూలను పరిశీలించిన తర్వాత సదరు ప్రాబ్లమ్లోని మూల భావనలను, వాటిని అన్వయించే మార్గాలను గుర్తించాలి. ప్ర: మ్యాథ్సలో షార్ట్కట్ మెథడ్స్ను రూపొందించుకోవడం ఎలా? జ : షార్ట్కట్ మెథడ్స్ అనేవి రివిజన్కు ఎంతో ఉపయోగపడతాయి. విద్యార్థులు ప్రతి చాప్టర్ సినాప్సిస్ను రూపొందించుకోవడం, తమకు అనుకూలమైన పద్ధతుల్లో తయారుచేసుకున్న షార్ట్ నోట్స్, చార్ట్స్ వంటి విధానాలను సమర్థంగా అమలు చేయడం ఉపయుక్తం. ప్ర: ప్రస్తుతం మ్యాథ్స్కు కేటాయించాల్సిన సమయం? జ : రోజూ కనీసం మూడు నుంచి నాలుగు గంటల ప్రిపరేషన్ తప్పనిసరి. ఈ ప్రిపరేషన్ సమయంలోనే పాత ప్రశ్నపత్రాలను పరిశీలించే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్ర: మ్యాథమెటిక్స్ సమస్య సాధన క్రమంలో అనుసరించాల్సిన విధానం? జ : ముందుగా సదరు సమస్యకు సంబంధించి కన్వెన్షనల్ మెథడ్ ద్వారా పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయాలి. ఇది ఎక్కువ సమయం తీసుకుంటుందని భావిస్తే అందులోని కాన్సెప్ట్ను గుర్తించి అప్లికేషన్ ఓరియెంటేషన్ పద్ధతివైపు దష్టి సారించాలి. కొన్ని ప్రశ్నలకు షార్ట్కట్ మెథడ్స్ ద్వారా వేగంగా సమాధానం గుర్తించే వీలుంటుంది. బోటనీ ప్ర: బోటనీలో ప్రశ్నల తీరు ఎలా ఉంటుంది? ముఖ్యమైన అంశాలేవి? జ : బోటనీలో ఎంసీక్యూ, ఏఆర్, మ్యాచ్ ద ఫాలోయింగ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. వీటికి అందుబాటులో ఉన్న సమయంలో సమాధానం ఇవ్వాలంటే.. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ను వేగవంతం చేయాలి. కన్సాలిడేటెడ్ అప్రోచ్ కూడా ప్రిపరేషన్ పరంగా లాభిస్తుంది. ఎంసెట్ శైలిని పరిశీలిస్తే అన్ని అంశాలకు సమ ప్రాధాన్యం ఉంటోంది. కాబట్టి విద్యార్థులు ప్రస్తుత సమయంలో అన్ని అంశాల కాన్సెప్ట్లు, ఫార్ములాలను రివిజన్ చేయడంపై దష్టిపెట్టాలి. ప్ర : తప్పనిసరిగా చదవాల్సిన టాపిక్స్? జ : సూక్ష్మ జీవ శాస్త్రం; కేంద్రక పూర్వ జీవులు; బ్యాక్టీరియా; వైరస్; మానవ సంక్షేమంలో సూక్ష్మ జీవుల పాత్ర అంశాలను తప్పనిసరిగా చదవాలి. ఖనిజ మూలకాల ఆవశ్యకత, మొక్కల హార్మోన్లు టాపిక్స్పై ఎక్కువ ఫోకస్ చేయాలి. ప్ర : ఇప్పటి నుంచి అనుసరించాల్సిన టైం ప్లాన్? జ : ఏప్రిల్ నెలాఖరుకు సిలబస్ పరంగా ప్రిపరేషన్ పూర్తి చేసుకోవాలి. చివరి వారం రోజుల్లో రివిజన్, సినాప్సిస్లు చదవడం, సొంత నోట్స్ లో రూపొందించుకున్న ఫార్ములాలను చదవడం వంటివి చేయాలి. ప్ర : స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నలకు..? జ : బోటనీలో స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నలు, అసెర్షన్ అండ్ రీజనింగ్ ప్రశ్నలకు ప్రాధాన్యమెక్కువ. ప్రతి స్టేట్మెంట్ను క్షుణ్నంగా పరిశీలించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. బోటనీకి సంబంధించి ఉపయోగపడే షార్ట్కట్ మెథడ్స్ లేవనే చెప్పాలి. దీనికి రెగ్యులర్ రివిజన్ ఒక్కటే మార్గం. ప్ర: అత్యధికంగా పొందగలిగే మార్కులు? జ: 40 ప్రశ్నలు ఉండే బోటనీలో గరిష్టంగా 38 మార్కులు పొందే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో 39 మార్కులు కూడా పొందిన అభ్యర్థులున్నారు. అయితే వీటన్నిటికీ మార్గం అభ్యర్థిలోని గ్రాస్పింగ్ పవర్. కాన్సెప్ట్స్పై పట్టు సాధిస్తూ వీలైనన్ని ప్రాక్టీస్ పేపర్స్ రాయాలి. ఎగ్జామ్ ఎఫ్ఏక్యూస్ ప్ర : ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించాలంటే ఎన్ని మార్కులు రావాలి? జ : గత అయిదేళ్ల ర్యాంకుల సరళిని విశ్లేషిస్తే 135 నుంచి 140 మధ్యలో మార్కులు పొందిన వారికి వంద లోపు ర్యాంకులు వచ్చే అవకాశాలున్నాయి. కనిష్టంగా 110 మార్కులు సాధిస్తే వేయి వరకు ర్యాంకు వస్తుంది. అప్పుడు మంచి కళాశాలలో సీటు పొందే అవకాశం ఉంటుంది. ఇక.. మెడికల్ విభాగానికి సంబంధించి 150 నుంచి 155 మార్కులతో టాప్-10లో; 135 నుంచి 140 మార్కులతో టాప్ - 100 జాబితాలో చోటు సాధించేందుకు ఆస్కారం లభిస్తుంది. ప్ర : పరీక్ష హాల్లో సమాధానాలు ఇచ్చేటప్పుడు ముందుగా ఏ సబ్జెక్టులతో, ఎలాంటి ప్రశ్నలతో ప్రారంభించాలి? జ : పరీక్ష హాల్లో సమాధానాలు ఇచ్చే విషయంలో విభిన్నంగా వ్యవహరించాలి. ముఖ్యంగా సబ్జెక్ట్ల వారీగా దీన్ని అనుసరించాలి. ఎంపీసీ విద్యార్థులు కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్; బైపీసీ విద్యార్థులు బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్.. వరుస క్రమ పద్ధతిని అనుసరించడం ఉపయుక్తంగా ఉంటుంది. ముందు బాగా వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. తర్వాత క్రమంలో కాస్త ఆలోచించాల్సిన ప్రశ్నలపై దష్టి పెట్టాలి. ఈ దశ కూడా పూర్తయ్యాకే క్లిష్టమైన ప్రశ్నలవైపు దృష్టి సారించడం మేలు. ప్ర : పరీక్షకు సన్నద్ధం చేసుకోవాల్సినవి? జ : ఎంసెట్లో మంచి ర్యాంకు కోసం రెండేళ్లపాటు సాగించిన ప్రిపరేషన్ ఒక ఎత్తయితే.. పరీక్ష రాసే మూడు గంటలు ఎంతో ముఖ్యం. ఇందుకోసం విద్యార్థులు ముందుగానే సన్నద్ధం కావాలి. ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. కాబట్టి తొలుత తమకు కేటాయించిన సెంటర్కు ఒక రోజు ముందే వెళ్లి చిరునామా తెలుసుకోవాలి. పరీక్ష రోజు మాత్రమే సెంటర్ కోసం అన్వేషిస్తే సమయం వథా అవడంతో పాటు అనవసర ఆందోళనకు లోనవుతారు. ప్ర : హాల్టికెట్తోపాటు తీసుకెళ్లాల్సినవి? జ : ఎంసెట్కు హాజరయ్యే విద్యార్థులు హాల్టికెట్తోపాటు తీసుకెళ్లాల్సినవి.-అప్పటికే పూర్తి చేసిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ప్రింటవుట్లో నిర్దేశిత ప్రాంతంలో(కింది భాగంలో ఎడమవైపు) కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో(3ణ5పరిమాణం) అతికించి, దానిపై గెజిటెడ్ అధికారితో సంత కం లేదా విద్యార్థి తాను చదివిన కళాశాల ప్రిన్సిపాల్ సంతకం చేయించాలి. దీన్ని పరీక్ష హాల్లో ఇన్విజిలేటర్కు అందజేయాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పూర్తి చేసిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, కుల ధ్రువీకరణ పత్రాన్ని ఇన్విజిలేటర్కు సమర్పించాలి. ప్ర : ఓఎంఆర్ షీట్ నింపడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు? జ : విద్యార్థులు తమ సమాధానాలు నింపే ఓఎంఆర్ షీట్లోని వృత్తాలను నింపేందుకు కేవలం నీలి లేదా నలుపు రంగు బాల్ పాయింట్ పెన్ను మాత్రమే వినియోగించాలి. పెన్సిల్తో ఆన్సర్స్ ఇస్తే ఆ పేపర్ మూల్యాంకనం జరగదు. విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చాం అని భావించాక ఇతర ముఖ్యమైన అంశాలపై దష్టి పెట్టాలి. ముఖ్యంగా ఓఎంఆర్ ఆన్సర్ షీట్లోని అన్ని అంశాలు సరిగా రాశారా? ఓఎంఆర్ షీట్లో ఇన్విజిలేటర్ సంతకం ఉందా? అనేవి చూసుకోవాలి. ప్ర : రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చా? జ : రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయిన అభ్యర్థులు ఆయా వెబ్సైట్లలో (ఏపీ అభ్యర్థులు ఏపీ ఎంసెట్ వెబ్సైట్ ఠీఠీఠీ.్చఞ్ఛ్చఝఛ్ఛ్టి.ౌటజ; తెలంగాణ అభ్యర్థులు టీఎస్ఎంసెట్ వెబ్సైట్ ఠీఠీఠీ.్టట్ఛ్చఝఛ్ఛ్టి.జీ) లలో ఉండే ఫర్గెట్ రిజిస్ట్రేషన్ బటన్పై క్లిక్ చేసి నిర్దేశించిన వివరాలు పూర్తి చేస్తే రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోవచ్చు. దాని ఆధారంగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిజిక్స్ ప్ర : ఎంసెట్ ఫిజిక్స్ ప్రశ్నల శైలి ఎలా ఉంటోంది? జ : ఫిజిక్స్కు సంబంధించి ప్రశ్నలు రెండు రకాలుగా ఉంటున్నాయి. అవి-సులువు; ఒక మోస్తరు క్లిష్టం. ఇందులో 80 శాతం ప్రశ్నలు సులువుగా; 20 శాతం ప్రశ్నలు క్లిష్టంగా ఉంటున్నాయి. క్లిష్టంగా ఉండే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే సబ్జెక్ట్పై పూర్తి పట్టుసాధించాలి. మొత్తం 40 ప్రశ్నల్లో 90 శాతం ప్రశ్నలు ఫార్ములా బేస్డ్. ఫిజిక్స్లో ఇంజనీరింగ్ విభాగంలో 30 నుంచి 35 మార్కులు; మెడికల్ విభాగంలో 25 నుంచి 30 మార్కులు సాధించే అవకాశం ఉంది. ప్ర : ఫిజిక్స్లో అప్లికేషన్ అప్రోచ్కు ప్రాధాన్యత ఉందా? జ: అప్లికేషన్ అప్రోచ్కు అత్యంత ప్రాధాన్యత ఉండే సబ్జెక్ట్ ఫిజిక్స్. విద్యార్థులు అన్ని సూత్రాలను ఒక జాబితాగా రూపొందించుకుంటే రివిజన్ సులభంగా ఉంటుంది. అదే విధంగా ఒక సూత్రం ఆధారంగా ఉండే ప్రశ్నను పలు కోణాల్లో సాధించే విధంగా ప్రాక్టీస్ చేయాలి. ప్ర : ఇంజనీరింగ్, మెడికల్ విభాగం విద్యార్థులు ఫిజిక్స్ను భిన్నంగా ప్రిపేర్ అవ్వాలా? జ : ఇంజనీరింగ్, మెడికల్ రెండు విభాగాల్లో ఉండే ఫిజిక్స్కు సంబంధించి ఎంపీసీ విద్యార్థులు న్యూమరికల్ ఓరియెంటేషన్; బైపీసీ విద్యార్థులు థియరిటికల్ అప్రోచ్తో ప్రిపరేషన్ కొనసాగించాలి. ఈ క్రమంలో బైపీసీ విద్యార్థులు రీడింగ్కు, ఎంపీసీ విద్యార్థులు ప్రాక్టీస్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ప్ర : ఫిజిక్స్లో బాగా రివిజన్ చేయాల్సిన అంశాలేవి? జ : ఎలక్ట్రోమ్యాగ్నటిజం; మ్యాగ్నటిజం; వేవ్మోషన్; హీట్; న్యూక్లియర్ ఫిజిక్స్; అటామిక్ ఫిజిక్స్; సెమీ కండక్టర్ డివెజైస్ అంశాలకు రివిజన్లో ప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్షలో లభించే వెయిటేజీ పరంగా ఈ అంశాలకే ప్రాధాన్యం ఉంటుంది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటూ రివిజన్కు సమయం కేటాయించాలి. ప్ర : ఫిజిక్స్ కోసం రోజుకు ఎన్ని గంటలు కేటాయించాలి? జ : ఫిజిక్స్కు సంబంధించి బైపీసీ విద్యార్థులు ప్రతి రోజు మూడు గంటలు కేటాయించడం ఉపయుక్తం. ఇందులో ఫార్ములా రీడింగ్, గ్రాండ్టెస్ట్లు రాయడం వంటివి ఉండేలా చూసుకోవాలి. కెమిస్ట్రీ ప్ర : కెమిస్ట్రీకి సంబంధించి ప్రస్తుత సమయంలో అనుసరించాల్సిన వ్యూహం? జ : ఇంటర్మీడియెట్ రెండు సంవత్సరాల సిలబస్లోని పాఠ్యాంశాల సినాప్సిస్ను చదవాలి. విద్యార్థులు తమకు అనుకూలమైన పద్ధతుల్లో సంక్షిప్తంగా సొంత నోట్స్ రూపొందించుకుని దానిపై ఎక్కువ దష్టి సారించి ఎక్కువసార్లు చదవాలి. ప్ర : కెమిస్ట్రీలో మంచి మార్కులు పొందేందుకు దోహదం చేసే టాపిక్స్ ఏవి? జ : ఇప్పటికే సిలబస్ ప్రిపరేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు మార్కుల సాధనలో ముఖ్య పాత్ర వహించే ఆర్గానిక్ కెమిస్ట్రీ; కెమికల్ బాండింగ్, పీరియాడిక్ టేబుల్స్పై పట్టు సాధించాలి. ఫిజికల్ కెమిస్ట్రీలో సొల్యూషన్స్; ఎలక్ట్రో కెమిస్ట్రీ; థర్మోడైనమిక్స్; స్టేట్ ఆఫ్ మ్యాటర్స్కు ప్రాధాన్యమివ్వాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మూలకాల ధర్మాలను బేరీజు వేస్తూ తులనాత్మక అధ్యయనం చేయాలి. ప్ర : కెమిస్ట్రీలో ముఖ్యమైన విభాగం? జ : ప్రస్తుతం కెమిస్ట్రీ మూడు భాగాలుగా ఉంది. అవి.. ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ. వీటిలో ఎంసెట్ వెయిటేజీ పరంగా ఆర్గానిక్ కెమిస్ట్రీ ముఖ్యమైంది. దీనిలో పట్టు సాధించాలంటే ఇంటర్ కన్వర్షన్ చార్ట్స్ రూపొందించుకోవాలి. మూలకాల రియాక్షన్స్; ఫ్లో చార్ట్స్, మూలకాలు-వాటి తయారీ పద్ధతులు, ధర్మాలను చదవాలి. అలాగే ఇన్-ఆర్గానిక్ కెమిస్ట్రీలో గ్రూప్ ఎలిమెంట్స్ ప్రిపరేషన్ మెథడ్స్, అందుకు అనుసరించే విధానాలపై అవగాహన పెంచుకోవాలి. ప్ర : క్లిష్టమైన ఫార్ములాలు- గుర్తుంచుకునే మార్గాలు? జ : క్లిష్టమైన ఫార్ములాలు గుర్తుంచుకునేందుకు ఏకైక మార్గం.. నిరంతర ప్రాక్టీస్. వాస్తవానికి కెమిస్ట్రీలో ఫార్ములా ఆధారిత అంశాలే అధికంగా ఉంటాయి. కాబట్టి క్లిష్టం, సులువు అనే భావన, ఆందోళన వీడాలి. నిజంగానే అభ్యర్థులు తమ వ్యక్తిగత సామర్థ్యం ఆధారంగా క్లిష్టంగా భావించే ఫార్ములాలు ఏవైనా ఉంటే వాటిని విడిగా నోట్స్లో పొందుపర్చుకుని పునశ్చరణ చేయాలి. ప్ర : ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్లో రాణించాలంటే? జ : ఫిజిక్స్లో మాదిరిగానే కెమిస్ట్రీలోనూ అంతర్గత సంబంధం(ఇంటర్ రిలేటెడ్) గల అంశాలున్నాయి. ముఖ్యంగా మూలకాలు-వాటి తయారీ, ధర్మాల్లో ఎక్కువగా ఉంటాయి. వీటి విషయంలో ప్రిపరేషన్ మెథడ్స్ను పట్టిక రూపంలో పొందుపర్చుకుని చదివితే సులువుగా జ్ఞప్తికి వస్తాయి. ప్ర : ఇంజనీరింగ్, మెడికల్ అభ్యర్థులు అనుసరించాల్సిన ప్రత్యేక వ్యూహాలు? జ : కెమిస్ట్రీకి సంబంధించి ఇంజనీరింగ్, మెడికల్ విభాగాల్లో వచ్చే ప్రశ్నల్లో వ్యత్యాసం తక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రత్యేక వ్యూహాలు అవసరం లేదు. ఇంజనీరింగ్ విభాగంలోని కెమిస్ట్రీ ప్రశ్నల్లో ప్రాబ్లమ్ బేస్డ్ కొశ్చన్స్ శాతం కొంత ఎక్కువే. జువాలజీ ప్ర : జువాలజీలో ప్రశ్నల శైలి ఎలా ఉంటుంది? జ : మొత్తం 40 ప్రశ్నలు ఉండే జువాలజీలో దాదాపు 35 నేరుగా ఉంటాయి. ఇవి కూడా సులువుగా సగటు విద్యార్థి సమాధానం ఇచ్చే విధంగా ఉంటాయి. ప్రశ్నలోని కీలక పాయింట్స్ను అవగాహన చేసుకునే నైపుణ్యం ఉంటే జువాలజీలో 90 శాతం మార్కులు సొంతం చేసుకోవచ్చు. ప్ర : జువాలజీలో ప్రధానంగా దష్టి సారించాల్సిన అంశాలేవి? జ : ఇప్పుడున్న సమయంలో జువాలజీకి సంబంధించి బ్యాక్టీరియాలు, వ్యాధులు, వాటి లక్షణాలు, ప్రభావాలపై ఎక్కువ దష్టి సారించాలి. రెండేళ్ల సిలబస్లోని అంశాలను సంక్షిప్తంగా ఒకచోట పొందుపర్చుకుంటే ప్రిపరేషన్ పరంగా మేలు చేస్తుంది. ఈ సమయంలో కొత్త అంశాలను చదవడం అనవసరపు ఆందోళనకు గురిచేస్తుంది. ఎంసెట్ వెయిటేజీ ప్రకారం- బాగా ముఖ్యమైన అంశం అని భావిస్తే.. కాంటెక్ట్స్ తెలుసుకోవడం మేలు. ప్ర : జువాలజీలో విస్మరించకూడని అంశాలు? జ : కాలేయం; వానపాము; బొద్దింకల జీవ వ్యవస్థ; ప్రొటీన్లు; ఎంజైమ్లు, క్షీర గ్రంథులు; నాడీ వ్యవస్థ; నేత్ర పటలం; జీవావరణం-పర్యావరణం; జన్యుశాస్త్రం; జీవ పరిమాణం; అనువర్తిత జీవ శాస్త్రం చాప్టర్లలోని అంశాలన్నింటినీ అధ్యయనం చేయడం తప్పనిసరి. ప్ర : షార్ట్కట్ మెథడ్స్, మెమొరీ టిప్స్? జ : షార్ట్కట్ మెథడ్స్, మెమొరీకి సరైన మార్గం సొంత నోట్స్ రూపకల్పన. కీలక పదాలు, వాటి నిర్వచనాలు కచ్చితంగా ఉండేలా చూస్తూ ఆయా అంశాల కేంద్రక భావనలు రాసుకుంటూ విభిన్నంగా ఉండేలా చూడాలి. ప్ర : డయాగ్రమ్స్ విషయంలో వ్యవహరించాల్సిన తీరు? జ : జువాలజీలో డయాగ్రమ్స్ది ముఖ్య పాత్ర. అందులోని భాగాలను కచ్చితంగా గుర్తుంచుకునేలా ప్రాక్టీస్ చేయాలి. యాక్షన్ పొటెన్షియల్ డ్యూరింగ్ ఇంపల్స్ డయాగ్రమ్, ఈసీజీ, ఆక్సీహిమోగ్లోబిన్ డిససోసియేషన్ కర్వ్, ఫ్లయింగ్ లోకోమోషన్ ఆఫ్ కాక్రోచ్ వంటి వాటిని తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. ప్ర : ప్రస్తుత సమయంలో ప్రిపరేషన్ వ్యూహం? జ : ఎక్కువ సమయం థియరీ రివిజన్కు కేటాయించాలి. సొంత నోట్స్ రూపొందించుకోవాలి. దాంతోపాటు ఒక అంశం నుంచి ప్రశ్నలు అడిగే అవకాశాలపైనా అవగాహన ఏర్పరచుకుంటే మరింత ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతి రోజు కనీసం మూడు గంటలు తగ్గకుండా జువాలజీ ప్రిపరేషన్కు కేటాయించాలి. కేవలం రీడింగ్కు పరిమితం కాకుండా.. డయాగ్రమ్స్ ప్రాక్టీస్కు ప్రాధాన్యమివ్వాలి. ముందస్తు జాగ్రత్తతో ఆందోళనకు స్వస్తి ఇంజనీరింగ్, మెడికల్ విభాగాలకు కలిపి తెలంగాణ ఎంసెట్కు ఇప్పటివరకు 2.30 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ మే 8 నుంచి అందుబాటులోకి వస్తుంది. విద్యార్థులు వీలైనంత ముందుగా హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం మంచిది. లేదంటే చివర్లో నెట్వర్క్ ప్రాబ్లమ్స్ తలెత్తి ఆందోళనకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక పరీక్ష హాల్లో అభ్యర్థులు ముందుగా తమకు ఇచ్చిన బుక్లెట్లో అన్ని పేజీలు ఉన్నాయో లేదో పరిశీలించాలి. లేదంటే వెంటనే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లి మరో బుక్లెట్ పొందాలి. పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారం ఆయా అభ్యర్థులకు ఎస్ఎంఎస్ ద్వారా పంపడం జరుగుతుంది. కాబట్టి ఒక రోజు ముందుగానే పరీక్ష కేంద్రం చిరునామా తెలుసుకోవడం ద్వారా లాస్ట్ మినిట్ టెన్షన్ను తప్పించుకోవచ్చు. - ప్రొఫెసర్ ఎన్.వి.రమణ రావు, కన్వీనర్ టీఎస్ఎంసెట్ లోపాలు సరిదిద్దుకునే అవకాశం ఏపీ ఎంసెట్ అభ్యర్థులు తమ ఆన్లైన్ అప్లికేషన్లో లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్దుకునే అవకాశం ఏప్రిల్ 21 వరకు అందుబాటులో ఉంటుంది. దీన్ని వినియోగించుకోవాలి. హాల్ టికెట్ డౌన్లోడ్ విండో మే 2 నుంచి 6 వరకు అందుబాటులో ఉంటుంది. ఇంటర్నెట్ ప్రాబ్లమ్, నెట్వర్క్ ఎర్రర్స్ను తప్పించుకోవడానికి వీలైనంత ముందుగా హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం మేలు. ఏవైనా సమస్యలు తలెత్తితే వెబ్సైట్లో పేర్కొన్న హెల్ప్లైన్ సెంటర్లను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ఎంసెట్కు దాదాపు 2.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందు కు తగిన రీతిలో వెబ్సైట్లో సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నాం. - ప్రొఫెసర్ సీహెచ్. సాయిబాబు, కన్వీనర్ - ఏపీఎంసెట్ -
కేంద్ర బలగాల్లో భారీ అవకాశాలు
కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో చేసుకున్న అవగాహన ఒప్పందం మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఓ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా కేంద్ర సాయుధ బలగాల్లో 62,390 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), రైఫిల్ మ్యాన్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఖాళీల వివరాలు ఆంధ్రప్రదేశ్: 5,009 తెలంగాణ: 2,055 ఉద్యోగాలు: 62,390 అర్హత: పదో తరగతి వేతన స్కేల్: రూ.5,200-20,200+రూ.2000 గ్రేడ్ పే. బీఎస్ఎఫ్ పురుషులు: 17,698 మహిళలు: 4,819 ఐటీబీపీ పురుషులు: 2,795 మహిళలు: 306 సీఐఎస్ఎఫ్ పురుషులు: 4,493 మహిళలు: 507 ఏఆర్ పురుషులు: 300 మహిళలు: 300 సీఆర్పీఎఫ్ పురుషులు: 22,623 మహిళలు: 1,965 ఎన్ఐఏ పురుషులు: 82 మహిళలు: 4 ఎస్ఎస్బీ పురుషులు: 5,619 మహిళలు: 605 ఎస్ఎస్ఎఫ్ పురుషులు: 247 మహిళలు: 27 అర్హత: పదో తరగతి. వయసు 18-23 ఏళ్లు(2015, ఆగస్టు 1 నాటికి). రిజర్వేషన్ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది. శారీరక ప్రమాణాలు: ఎత్తు- పురుషులు: 170 సెం.మీ, మహిళలు: 157 సెం.మీ. చాతీ (పురుషులకు మాత్రమే) - 80 సెం.మీ, ఊపిరి పీల్చితే 5 సెం.మీ. వ్యాకోచించాలి. ఎత్తుకు తగ్గ బరువుండాలి. ఎంపిక విధానం: 1. నిర్దేశ శారీరక ప్రమాణాలు ఉన్నాయా.. లేదా అన్నది పరిశీలిస్తారు. 2. శారీరక సామర్థ్య పరీక్ష ఉంటుంది. ఇందులో పురుషులైతే 5 కి.మీ. దూరాన్ని 24 నిమిషాల్లో పూర్తిచేయాలి. మహిళలు 1.6 కి.మీ. దూరాన్ని ఎనిమిదన్నర నిమిషాల్లో పూర్తిచేయాలి. 3. ఫిజికల్ టెస్ట్లో విజేతలకు అభ్యర్థి ఎంపికను అనుసరించి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో రాత పరీక్ష నిర్వహిస్తారు. 4. అర్హులకు వైద్య పరీక్షలు జరుపుతారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. తొలి దశ రిజిస్ట్రేషన్లో అవసరమైన సమాచారాన్ని నింపాలి. ఫీజు చెల్లించిన తర్వాత రెండో దశ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చివరి తేదీ (మొదటి దశ): ఫిబ్రవరి 21, 2015. రెండో దశ: ఫిబ్రవరి 23, 2015. వెబ్సైట్: http://ssconline.nic.in; http://ssconline2.gov.in పరీక్ష విధానం పరీక్ష తేదీ: అక్టోబర్ 4, 2015 ఆన్లైన్లో రాయాలనుకుంటే ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ఆఫ్లైన్లో అయితే ఇంగ్లిష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా ఉంటుంది. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఇస్తారు. రెండు గంటల్లో సమాధానాలు గుర్తించాలి. సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 25 జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 25 ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 25 ఇంగ్లిష్/హిందీ 25 25 మొత్తం 100 100 ప్రిపరేషన్ ప్రణాళిక ఫిజికల్ టెస్ట్లో అర్హత సాధించిన వారిని మాత్రమే రాత పరీక్షకు అనుమతిస్తారు. కాబట్టి తగిన శారీరక ప్రమాణాలున్నవారు ఇప్పటి నుంచే పరుగు ప్రాక్టీస్ చేయాలి. దీనికి సమాంతరంగా రాత పరీక్షలో విజయానికి కృషిచేయాలి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్: వెర్బల్, నాన్ వెర్బల్ రీజనింగ్పై దృష్టిసారించాలి. వెర్బల్లో కోడింగ్, డీకోడింగ్, సిరీస్, అనాలజీ తదితర విభాగాలు ముఖ్యమైనవి. క్లిష్టత స్థాయి చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల ప్రాక్టీస్ చేస్తే పూర్తి మార్కులు సాధించవచ్చు. ఇందులో కనీసం 20 మార్కులు తెచ్చుకోవాలి. జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్: తన చుట్టూ ఉన్న పరిసరాలపై అభ్యర్థి అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి. భారతదేశ చరిత్ర, సంస్కృతి, భౌగోళికశాస్త్రం, ఆర్థిక వ్యవహారాలు, పాలిటీ, రాజ్యాంగం, క్రీడలు తదితరాలతో పాటు వర్తమాన వ్యవహారాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ప్రా థమిక అంశాలను పూర్తిగా నేర్చుకుంటే సరిపోతుంది. తప్పనిసరిగా దినపత్రికలు చదివి,ముఖ్యాంశాలను గుర్తుంచుకోవాలి. ఎలిమెంటరీ మ్యాథ్స్: ఆరు, ఎనిమిదో తరగతి పుస్తకాల్లోని అంశాలపై పట్టు సాధించాలి. సూక్ష్మీకరణలు, సంఖ్యా వ్యవస్థ, శాతాల నుంచి ఎక్కువ (15 వరకు) ప్రశ్నలు రావొచ్చు. దీనికి ప్రాక్టీస్ ప్రధానం. ఇంగ్లిష్/హిందీ: పదో తరగతి స్థాయిలో వొకాబ్యులరీ, గ్రామర్, కాంప్రెహెన్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. సరిగా ప్రాక్టీస్ చేస్తే తేలిగ్గా 18-20 మార్కులు తెచ్చుకోవచ్చు. పరీక్షకు ఎనిమిది నెలల సమయం ఉంది. మొదటి నాలుగు నెలల్లో సిలబస్కు సంబంధించిన అంశాల్లోని కాన్సెప్టులపై పట్టు సాధించాలి. అంశాల వారీగా సమస్యల్ని సాధించాలి. పరీక్షలు కూడా రాయాలి. తర్వాతి నాలుగు నెలల్లో దాదాపు 100 గ్రాండ్ టెస్ట్లు రాయాలి. సరైన ప్రణాళికను రూపొందించుకోవడంతో పాటు దాన్ని కచ్చితంగా అమలు చేస్తే తేలిగ్గా 70-90 మార్కులు తెచ్చుకోవచ్చు. - ఎన్.వినయ్కుమార్ రెడ్డి, డైరెక్టర్ ఐఏసీఈ, హైదరాబాద్. -
జాతీయాదాయం అసమానతలు.. భారత స్థూల ఆర్థిక దృక్పథం
ఒక దేశ ఆర్థిక ప్రగతిని కొలిచే సూచికలలో జాతీయాదాయం ప్రధానమైంది. నిర్ణీత కాలంలో దేశంలోని ప్రజల కోరికలను సంతృప్తి పరిచే ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక శక్తి ద్వారా ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల మొత్తం ఉత్పత్తి విలువను జాతీయాదాయం అంటారు. నిర్ణీత కాలంలో ఒక వస్తువుకు రెండు సార్లు విలువ కట్టకుండా తయారైన అన్ని వస్తు సేవల విలువను అంచనా వేస్తే అది జాతీయాదాయం అవుతుందని భారత జాతీయాదాయ కమిటీ నిర్వచించింది. 1991 తర్వాత భారత్లో జాతీయాదాయ వృద్ధి రేటు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ.. చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలతో పోల్చితే తక్కువ వృద్ధి నమోదైంది. భారత్లో 1970కి ముందు నికర దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా సుమారు 50 శాతం. కాగా ప్రస్తుతం 13 శాతం లోపు ఉంది. ప్రణాళికా యుగంలో ప్రభుత్వ చర్యల కారణంగా పారిశ్రామిక రంగంలో నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. గత ఆరు ద శాబ్దాలలో ఆధునిక పరిశ్రమల ఏర్పాటుతో అసంఘటిత రంగంలో చిన్న తరహా పరిశ్రమల ప్రాధాన్యత తగ్గింది. అంతేకాకుండా నికర దేశీయోత్పత్తిలో రవాణా, సమాచారం, శక్తి, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల వాటా పెరిగింది. దీన్ని బట్టి దేశంలో ఆర్థిక అవస్థాపన మెరుగైందని భావించవచ్చు. నూతన ఆధార సంవత్సరం స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ (The Ministry of Statistics and Programme Implementation) ఆధార సంవత్సరాన్ని 2004-05 నుంచి 2011-12కు మారుస్తూ జాతీయ అకౌంట్స్ గణాంకాలకు సంబంధించి నూతన సిరీస్ను విడుదల చేసింది. జాతీయ అకౌంట్స్ గణనకు 2010, జనవరిని ఆధార సంవత్సరంగా నిర్ణయించింది. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ సిఫార్సుల మేరకు జాతీయ అకౌంట్స్ గణాంకాల కోసం ఆధార సంవత్సరాన్ని ప్రతి ఐదేళ్లకోసారి సవరిస్తారు. సవరించిన ఆధార సంవత్సరం వద్ద ఆర్థిక సూచీలను లెక్కిస్తారు. 2012 ఆధార సంవత్సరంగా (ఆ్చట్ఛ ్గ్ఛ్చట) 2015, జనవరికి సంబంధించి వినియోగదారుని ధరల సూచీ (ఇ్కఐఇౌటఠఝ్ఛట ్కటజీఛ్ఛి ఐఛ్ఛ్ఠీ)ని ఫిబ్రవరిలో కేంద్ర గణాంక సంస్థ విడుదల చేస్తుంది. ఆర్థిక వృద్ధికి కొలమానంగా దేశ ఆర్థిక వృద్ధికి కొలమానంగా ఇప్పటి వరకు లెక్కిస్తున్న జీడీపీ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ (ఎఈ్క ్చ్ట జ్చఛిౌ్టట ఛిౌట్ట) స్థానంలో ఆధార సంవత్సరం ప్రాతిపదికన స్థూలంగా కలిపిన విలువ ద్వారా ఆర్థిక వృద్ధిని లెక్కించాలని కేంద్ర గణాంక సంస్థ నిర్ణయించింది. 2011-12 ఆధార సంవత్సరంగా నూతన కొలమానంతో 2011-12 నుంచి 2013-14 వరకు లెక్కించిన జాతీయ, తలసరి ఆదాయ గణాంకాలను ఈ ఏడాది జనవరి 30న కేంద్ర గణాంక సంస్థ ప్రకటించింది. ఈ నూతన కొలమానాన్ని 2008లో యునెటైడ్ నేషన్స్ సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ (ఖీజ్ఛి ్ఖజ్ట్ఛీఛీ ూ్చ్టజీౌట డట్ట్ఛఝ ౌజ ూ్చ్టజీౌ్చ అఛిఛిౌఠ్టట) సిఫార్సు చేసింది. అభివృద్ధి చెందిన దేశాలతో భారత జీడీపీని లెక్కించడానికి ఈ కొలమానం ఉపయోగకరంగా ఉంటుంది. నికర ఉత్పత్తి పన్నులు, సబ్సిడీలను జీవీఏ (ఎటౌటట గ్చఠ్ఛ అఛీఛ్ఛీఛీ ఎగఅ) కి కలిపితే ఆధార సంవత్సర ధరల వద్ద జీడీపీ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ను లెక్కించవచ్చు. భారత్లో స్టాంప్ డ్యూటీలు, ప్రాపర్టీ ట్యాక్స్లు ఉత్పత్తి పన్నులో భాగంగా ఉంటాయి. ఉత్పత్తి సబ్సిడీలలో అప్రెంటైస్ సబ్సిడీలు, వడ్డీ సబ్సిడీలు భాగం. స్థిర ధరల వద్ద (2004-05) 2011-12లో 6.7 శాతం, 2012-13లో 4.5 శాతం, 2013-14లో 4.7 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఆధార సంవత్సరాన్ని 2011-12గా సవరించడంతో జీడీపీ వృద్ధి రేటులో పెరుగుదల సాధ్యమైంది. సవరించిన ఆధార సంవత్సర ధరల వద్ద జీడీపీ వృద్ధి రేటు 2012-13లో 5.1 శాతం, 2013-14లో 6.9 శాతంగా నమోదైంది. ఐఎంఎఫ్ అంచనాలు గత 15 ఏళ్లలో భారత బిలియనీర్ల నికర విలువ (ూ్ఛ్ట గిట్టౌజి) 12 రెట్లు పెరిగినట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. పెరిగిన ఈ విలువ ద్వారా భారత్లోని నిరపేక్ష పేదరికాన్ని తొలగించవచ్చని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. ఈ స్థితి పెరుగుతున్న ఆదాయ అసమానతలను సూచిస్తుంది. ప్రపంచంలోని 85 మంది ధనికుల సంపద.. ప్రపంచంలోని చివరి 15 శాతం ప్రజల సంపదకు సమానమని ఐఎంఎఫ్ మేనేజింగ్ డెరైక్టర్ క్రిస్టినా లాగార్డ్ పేర్కొన్నారు. వచ్చే 30 ఏళ్లలో ప్రపంచ జనాభాకు మరో 2 బిలియన్ల మంది తోడవుతారని, 2020 నాటికి ఐదేళ్లలోపు పిల్లల కంటే 65 ఏళ్లకు పైబడిన వారి సంఖ్య అధికంగా ఉండొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఆఫ్రికా, దక్షిణాసియా ప్రాంతాల్లో యువ జనాభా పెరుగుదల అధికంగా యూరోప్, చైనాలో తక్కువగా ఉంటుంది . రాబోయే దశాబ్దంలో జనాభా పరంగా భారత్ చైనాను, నైజీరియా అమెరికాను అధిగమిస్తాయి. యువ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో నవ కల్పనలు, చైతన్యం, సృజనాత్మకతకు తగిన వాతావరణం ఏర్పడుతుంది. ఈ క్రమంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తేనే ఆర్థిక వ్యవస్థలో వృద్ధి సాధ్యమవుతుంది. ఇందుకు విద్య ప్రమాణాల మెరుగుదల, సాంకేతిక ప్రగతి తప్పనిసరి. ఆర్థిక వృద్ధి సాధనకు అధిక ప్రాధాన్యమిస్తూ వృద్ధి పంపిణీని విస్మరించడంతో అసమానతలు పెరిగాయి. ఆదాయ అసమానతలు పెరిగే క్రమంలో సమాజంలో కొన్ని వర్గాల ప్రజలు నిర్లక్ష్యానికి గురవుతారు. భారత స్థూల ఆర్థిక దృక్పథం 2020 పెరుగుతున్న ఆదాయ స్థాయి, పని చేసే వారిలో యువ జనాభా అధికంగా ఉండే పరిస్థితుల్లో 2020 నాటికి అంతిమ ప్రైవేట్ వినియోగ వ్యయంలో అధిక వృద్ధి నమోదు కాగలదు. 2011, ఫిబ్రవరి నుంచి 2020, ఫిబ్రవరి మధ్య ప్రైవేట్ వినియోగ వ్యయంలో వృద్ధి సగటు 9.1 శాతం ఉండగలదని అమెరికాకు చెందిన డెన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ అనే సంస్థ అంచనా వేసింది. 2010, ఫిబ్రవరితో పోల్చితే 2020 ఫిబ్రవరిలో జీడీపీలో వినియోగ వ్యయంలో స్వదేశీ పెట్టుబడి కార్యకలాపాలు పెరిగే నేపథ్యంలో వినియోగంలో తగ్గుదల ఏర్పడుతుంది. 2020 నాటికి మొత్తం ప్రైవేట్ వినియోగ వ్యయంలో ఆహారం, బెవరేజెస్, పొగాకు, వస్త్రాలు, ఫుట్వేర్పై తగ్గుదల కనిపిస్తుంది. మరో వైపు అద్దె, ఇంధనం, విద్యుత్, ఫర్నీచర్, మెడికల్ కేర్, విద్య, రిక్రియేషన్, రవాణా, సమాచారంపై వ్యయం పెరుగుతుంది. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 2015-16లో 6.3 శాతం, 2016-17లో 6.5 శాతం వృద్ధిని సాధిస్తే వాస్తవిక తలసరి ఆదాయంలో పెరుగుదల సాధ్యమవుతుంది. తద్వారా దారిద్య్ర రేఖకు దిగువన నివసించే ప్రజల శాతం తగ్గుతుంది. ఆదాయ స్థాయిలో పెరుగుదల కారణంగా 2020 నాటికి భారత్ అల్పాదాయ దేశాల స్థాయి నుంచి మిడిల్ ఇన్కమ్ లేదా అప్పర్ మిడిల్ ఇన్కమ్ దేశాల స్థాయికి చేరుకోగలదు. రాబోయే కాలంలో జీడీపీలో అధిక వృద్ధిని సాధించాలంటే ప్రైవేట్ వ్యయ డిమాండ్లో పెరుగుదలతోపాటు అవస్థాపన రంగంపై పెట్టుబడులు అధికమవ్వాలి, సేవా రంగంలో వృద్ధి సాధించాలి. 12వ పంచ వర్ష ప్రణాళికలో అవస్థాపన రంగంపై పెట్టుబడులను జీడీపీలో 9 శాతం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ నేపథ్యంలో 2020 నాటికి పెట్టుబడులను ఆకర్షించే అభిలషణీయ ఆర్థిక విధానాలు అవసరం. పెరుగుతున్న పారిశ్రామికీకరణ, పట్టణీకరణ వల్ల నికర సాగు విస్తీర్ణం తగ్గుతుంది. నీటిపారుదల సౌకర్యాలు, గిడ్డంగులు, కోల్డ్స్టోరేజ్లు వంటి మౌలిక వసతులపై ప్రభుత్వ పెట్టుబడులు పెరిగితేనే 2020 నాటికి వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 4 శాతానికి పైగా ఉండగలదు. పారిశ్రామిక రంగంలో వృద్ధి సాధనకు ప్రైవేట్ వినియోగ డిమాండ్, ఎగుమతుల్లో పెరుగుదల అవసరం. అంతేకాకుండా స్వదేశీ పెట్టుబడుల వృద్ధి, అవస్థాపన సౌకర్యాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఆదాయం పెరిగే సూచనలు పెరుగుతున్న ఆదాయ స్థాయి, మధ్య తరగతిలో పని చేసే జనాభా పెరుగుదల కారణంగా అనశ్వర వినియోగ వస్తువులకు డిమాండ్ అధికంగా ఉండగలదు. 2011, ఫిబ్రవరి నుంచి 2020, ఫిబ్రవరి మధ్య సేవా రంగం వృద్ధి సగటు 10.1 శాతంగా ఉండగలదని డీ అండ్ బీ అంచనా వేసింది. ఈ రంగంలో అధిక వృద్ధి సాధనకు హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్, ఫైనాన్షియల్ సర్వీసులు ఎక్కువ దోహదం చేస్తాయి. ఈ క్రమంలో 2020 నాటికి జాతీయాదాయంలో వివిధ రంగాల వాటాలో మార్పులు సంభవిస్తాయి. 2013-14లో జాతీయాదాయంలో వ్యవసాయం, అనుబంధ కార్యకలపాల వాటా 13.9 శాతం, కాగా ఇది 2019-20లో 9 శాతానికి తగ్గే అవకాశం ఉంది. ఇదే సమయంలో పారిశ్రామిక రంగం వాటా 26.2 శాతం. ఇది 2019-20లో సుమారు 20 శాతానికి చేరుకుంటుందని అంచనా. ఇదేకాలంలో సేవా రంగం వాటా 59.9 శాతం నుంచి సుమారు 62 శాతానికి పెరుగుతుంది. ఈ స్థితి భారత ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంటున్న నిర్మాణాత్మక మార్పులను సూచిస్తుంది. అవస్థాపన రంగం అభివృద్ధి దిశగా ప్రభుత్వ చర్యలు, ప్రైవేట్ పెట్టుబడుల కారణంగా 2010, ఫిబ్రవరిలో జీడీపీలో స్థూల దేశీయ మూల ధన కల్పన 36.5 శాతం. కాగా ఇది 2020, ఫిబ్రవరి నాటికి 41.5 శాతానికి చేరుకోగలదని అంచనా. స్వదేశీ పొదుపు రేటులో పెరుగుదల కారణంగా పెట్టుబడి రేటులో వృద్ధి సాధ్యమవుతుంది. ఫలితంగా బహిర్గత విత్తంపై ప్రభుత్వం ఆధారపడటం తగ్గుతుంది. 2010, ఫిబ్రవరిలో జీడీపీలో స్థూల పొదుపు 33.7 శాతం. కాగా, 2020, ఫిబ్రవరి నాటికి స్థూల పొదుపు రేటు 38.8 శాతంగా ఉండగలదు. పెరుగుతున్న ఆదాయాల కారణంగా స్వదేశీ పొదుపులో పెరుగుదల ఏర్పడుతుంది. 2021 నాటికి మొత్తం జనాభాలో 15 ఏళ్లలోపు జనాభా 25.1 శాతానికి తగ్గుతుంది. 60 సంవత్సరాలు పైబడిన జనాభాలో పెరుగుదల ఉంటుంది. మొత్తం జనాభాలో 2021 నాటికి 15-59 వయోవర్గం 64.2 శాతానికి పెరుగుతుందని అంచనా. పని చేసే జనాభా పెరుగుదల, ఆధారపడే జనాభా తగ్గుదల, ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి సాధించే సూచనలతో శ్రామిక లభ్యత పెరిగి ఉత్పాదక కార్యకలాపాలు మెరుగవుతాయి. ఈ క్రమంలో ఆదాయం పెరిగే సూచనలు ఎక్కవగా ఉన్నాయి. ముఖ్యాంశాలు స్థిర ధరల (2011-12) వద్ద.. 2011-12లో జీవీఏ 81.9 లక్షల కోట్లు, 2012-13లో 85.9 లక్షల కోట్లు, 2013-14లో 91.6 లక్షల కోట్లు. స్థిర ధరల (2011-12) వద్ద.. జీడీపీ 2011-12లో 88.3 లక్షల కోట్లుగా, 2012-13లో 92.8 లక్షల కోట్లు, 2013-14లో 99.2 లక్షల కోట్లు. స్థిర ధరల (2011-12) వద్ద.. 2012-13లో ప్రైవేట్ అంతిమ వినియోగ వ్యయంలో 5.5 శాతం, 2013-14లో 6.2 శాతం వృద్ధి ఏర్పడింది. ఆధార సంవత్సరం (2011-12) మార్పు ప్రాతిపదికన ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయం 2011-12లో రూ. 64,316, 2012-13లో రూ. 71,593, 2013-14లో రూ.80,388గా నమోదైంది. స్థూల దేశీయ పొదుపులో కుటుంబ రంగ వాటా ఎక్కువ. ఈ రంగం వాటా 2011-12లో 67.3 శాతం నుంచి 2012-13లో 63.4 శాతానికి తగ్గిం ది. 2013-14లో 59.4 శాతంగా నమోదైంది. స్థిర ధరల (2011-12) వద్ద.. స్థూల మూలధన కల్పన రేటు 2012-13లో 37.2 శాతం కాగా, 2013-14లో 33.4 శాతానికి తగ్గింది. స్థిర ధరల 2011-12) వద్ద.. ప్రైవేట్ అంతిమ వినియోగ వ్యయం 2012-13లో రూ. 53.7 లక్షల కోట్లు, 2013-14లో రూ.57 లక్షల కోట్లు. ప్రస్తుత ధరల వద్ద స్థూల జాతీయ వ్యయార్హ ఆదాయం 2011-12లో రూ. 90.6 లక్షల కోట్లు, 2013-14లో రూ. 116 లక్షల కోట్లకు పెరిగింది. - డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్ హైదరాబాద్. -
విజయానికి ‘వర్తమానం’!
వర్తమాన వ్యవహారాలు (కరెంట్ అఫైర్స్).. ఉద్యోగార్థుల విజయానికి కీలక అస్త్రాలు! ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత సర్వీసులను చేజిక్కించుకునేందుకు వీలుకల్పించే సివిల్ సర్వీసెస్ పరీక్షనైనా.. డిప్యూటీ కలెక్టర్లు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు వంటి మేలిమి ఉద్యోగాలను ఒడిసిపట్టుకునేందుకు ఉపకరించే గ్రూప్స్ పరీక్షల్లోనైనా విజయానికి ‘వర్తమానం’పై పట్టు సాధించాల్సిందే! ‘గ్లోబల్ గ్రామ’ పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవాల్సిందే! ఇంతటి కీలకమైన కరెంట్ అఫైర్స్పై స్పెషల్ ఫోకస్.. కరెంట్ అఫైర్స్లో సమకాలీన అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ పరిణామాలుంటాయి. అంతర్జాతీయ అంశాల్లో వివిధ దేశాల్లో కొత్తగా అధికారంలోకి వచ్చిన వారి వివరాలు, సదస్సులు, ఆందోళనలు, ద్వైపాక్షిక సంబంధాలు, కూటములు వంటి వాటిపై దృష్టిసారించాలి. జాతీయ అంశాల్లో రాజకీయ పరిణామాలు కీలకమైనవి. ఎన్నికలు, పార్టీల బలాబలాలు, కొత్తగా పదవులు చేపట్టిన నేతలు వంటివి ముఖ్యమైనవి. ఉదాహరణకు 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ రెండు చోట్ల పోటీ చేశారు.. వాటిలో ఒకటి వడోదర కాగా రెండోది ఏమిటి?. ఇలాంటి ప్రశ్నలు పోటీ పరీక్షల్లో ఎదురవుతాయి. నియామకాలు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు-వాటి చైర్మన్లు తదితరాల నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. రాష్ట్రీయానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు, బడ్జెట్, ఆర్థిక సర్వేలోని అంశాలు, కొత్త నియామకాలు వంటివి ముఖ్యమైనవి. ఆర్థికం, శాస్త్రసాంకేతికం ఆర్థిక రంగానికి సంబంధించి బడ్జెట్, సామాజిక-ఆర్థిక సర్వేలలోని ప్రధాన అంశాలపై దృష్టిసారించాలి. బడ్జెట్ కేటాయింపులు, ప్రకటించిన పథకాలు వంటివి ముఖ్యమైనవి. శాస్త్రసాంకేతిక రంగంలో అంతరిక్షం, రక్షణ, పర్యావరణం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముఖ్యమైన విభాగాలు. అంతరిక్ష పరిజ్ఞానంలో ఉపగ్రహాలు, ప్రయోగ వాహక నౌకలు కీలకమైనవి. రక్షణ రంగంలో పరీక్షించిన క్షిపణులు, వాటి పరిధి; ఐటీలో సూపర్ కంప్యూటర్లు, కొత్త ఆవిష్కరణలు ప్రధానమైనవి. వ్యక్తులు, అవార్డులు, క్రీడలు నియామకాలు, ఎన్నిక-ఎంపికల నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి. అవార్డుల్లో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు ముఖ్యంగా నోబెల్, మెగసెసే, ఆస్కార్, భారత రత్న, పద్మ పురస్కారాలు ముఖ్యమైనవి. సాహిత్య, శాస్త్రసాంకేతిక అవార్డులపైనా అవగాహన అవసరం. క్రీడలకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ క్రీడలపై దృష్ట్టిసారించాలి. ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా, గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలు- విజేతలు, రికార్డులు, మొదటి స్థానంలో నిలిచిన దేశాలు వంటివి ముఖ్యమైనవి. వెయిటేజీ ఎంత? పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు, డీఎస్సీ, పంచాయతీ కార్యదర్శి, ఎస్ఐ/పోలీస్ కానిస్టేబుల్, ఐబీపీఎస్, ఎస్బీఐ, ఎస్ఎస్సీ.. ఇలా ఏ పరీక్ష తీసుకున్నా వాటిలో కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. గతంలో గ్రూప్స్ జనరల్ స్టడీస్ పేపర్లలో కరెంట్ అఫైర్స్ నుంచి 30-35 వరకు ప్రశ్నలు అడిగారు. కొన్ని పరీక్షల్లో 10-20 వరకు ప్రశ్నలు వస్తున్నాయి. పట్టు సాధించడమెలా? ఓ అభ్యర్థి తాను రాయదలచుకున్న పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయో గుర్తించడం ప్రధానం. దీనికోసం పాత ప్రశ్నపత్రాలను విశ్లేషించుకోవాలి. ప్రశ్నల సరళి, కాఠిన్యతపై అవగాహన ఏర్పరుచుకోవాలి. కరెంట్ అఫైర్స్పై పట్టు సాధించడానికి పత్రికలను ప్రాథమిక వనరులుగా చెప్పుకోవచ్చు. అభ్యర్థులు కనీసం ఒక ఇంగ్లిష్, ఒక తెలుగు పత్రికలను చదవడాన్ని అలవరచుకోవాలి. ముఖ్యమైన అంశాలను ప్రత్యేకంగా నోట్ చేసుకోవాలి. వాటి నేపథ్య సమాచారం కూడా తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల బిట్ల రూపంలో వచ్చే ప్రశ్నలతో పాటు డిస్క్రిప్టివ్ ప్రశ్నలకు కూడా సమర్థవంతంగా సమాధానాలు రాయడానికి వీలవుతుంది. వర్తమాన వ్యవహారాలపై అవగాహన లేకపోతే ఎస్సేతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థిక వ్యవహారాలు, పర్యావరణం తదితర అంశాల నుంచి వచ్చే డిస్క్రిప్టివ్ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానం ఇవ్వలేం. కరెంట్ అఫైర్స్ అనగానే పరీక్షకు ముందు ఏదో ఒక పుస్తకం కొని, చదివితే సరిపోతుందనే భావన కొందరిలో ఉంటుంది. ఇది సరికాదు. కరెంట్ అఫైర్స్ అనేది కొన్ని మార్కులకు సంబంధించిన విభాగం కాదు. పరీక్ష మొత్తానికి ఈ విభాగంపై అవగాహన ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందనే వాస్తవాన్ని గుర్తించాలి. అందువల్ల తప్పనిసరిగా రోజువారీ ప్రిపరేషన్ అవసరం. పత్రికలతో పాటు ఒక ప్రామాణిక కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ చదివితే మంచిది. పత్రికలను చదవడం వల్ల కరెంట్ అఫైర్స్పై పట్టుతో పాటు వివిధ రంగాల(ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ..)కు సంబంధించిన పదజాలంపై అవగాహన ఏర్పడుతుంది. ఇది ప్రిపరేషన్ సాఫీగా సాగేందుకు ఉపయోగపడుతుంది. ముఖ్యమైన అంశాలపై గ్రూప్ డిస్కషన్ వల్ల కూడా ప్రయోజనం ఎక్కువ. వీలైతే కరెంట్ అఫైర్స్ను అందించే వెబ్సైట్లను ఉపయోగించుకోవచ్చు. ఏ పరీక్షకైనా ఎన్ని నెలల సమాచారంపై దృిష్టిసారించాలనేది ఒక ప్రధానాంశం. సాధారణంగా రెండు నెలల ముందునుంచి ఏడాది వెనకకు వెళ్లాల్సి ఉంటుంది. - ఆకేపాటి శ్రీనివాసులురెడ్డి, కరెంట్ అఫైర్స్ నిపుణులు. ప్రాధాన్యం పెరుగుతోంది ఇటీవల కాలంలో అత్యున్నత సివిల్ సర్వీసెస్ పరీక్ష మొదలు గ్రూప్-4 వరకు అన్ని నియామక పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ ప్రాధాన్యం పెరుగుతోంది. డెరైక్ట్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలుగా పేర్కొనే వార్తల్లో వ్యక్తులు, అవార్డులు వంటివే కాకుండా రాజకీయ, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక రంగాల్లో చోటుచేసు కుంటున్న తాజా పరిణామాలపైనా ప్రశ్నల సంఖ్య పెరుగుతోంది. అంతేకాకుండా ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలే కాకుండా డిస్క్రిప్టివ్ విధానంలోనూ కరెంట్ అఫైర్స్ సంబంధిత అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. తాజాగా ముగిసిన సివిల్స్ మెయిన్ పరీక్షను పరిగణనలోకి తీసుకుంటే రక్షణ రంగంలో ఎఫ్డీఐలు, భూసేకరణ చట్టం-2013 నుంచి ప్రశ్నలు వచ్చాయి. అంటే అభ్యర్థుల సమకాలీన అంశాల పరిజ్ఞానాన్ని లోతుగా పరీక్షిస్తున్నారు. కాబట్టి ఔత్సాహికులు కరెంట్ అఫైర్స్కు కూడా అధిక ప్రాధాన్యమివ్వాలి. ఈ ప్రిపరేషన్ను కూడా తులనాత్మకంగా ఉండేలా చూసుకుంటే తాము రాసే పరీక్షలో మెరుగైన ఫలితాలు ఖాయం. - ఆర్.సి.రెడ్డి, డెరైక్టర్, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. విజయానికి కీలకం... కరెంట్ అఫైర్స్ నేటి పోటీ ప్రపంచంలో అనునిత్యం జరుగుతున్న పోటీ పరీక్షల్లో విజయానికి కరెంట్ అఫైర్స్ కీలక విభాగంగా మారింది. కరెంట్ అఫైర్స్ నుంచి వస్తున్న ప్రశ్నల సంఖ్య పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. సివిల్స్ వంటి అత్యున్నత స్థాయి పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ అంశాలను వాటి నేపథ్యానికి ముడిపెడుతూ పరోక్షంగా అడుగుతుండగా.. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 వంటి పరీక్షలు, ఇతర నియామక పరీక్షల్లో నేరుగా అడుగుతున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఆయా విధులు సమర్థంగా నిర్వహించడానికి కూడా కరెంట్ అఫైర్స్పై అవగాహన ఎంతగానో తోడ్పడుతుంది. సిలబస్లో మార్పులు-చేర్పులు వంటివి వర్తించని కరెంట్ అఫైర్స్పై అవగాహన పెంచుకుంటే ఆ స్థాయిలో విజయావకాశాలు మెరుగుపడతాయి. ఇక.. కొత్త సంవత్సరంలో భారీ సంఖ్యలో నోటిఫికేషన్లు విడుదలవనున్న తరుణంలో ఔత్సాహికులు పరీక్షకు ఏడాది ముందుకాలంలో చోటు చేసుకున్న పరిణామాలపై అవగాహన పెంపొందించుకుంటే పోటీలో ముందంజలో నిలుస్తారు. - వి.గోపాలకృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ. -
ఫుట్బాల్ ప్రపంచ కప్ విజేత జర్మనీ
- 2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతలు: పురుషుల సింగిల్స్: స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్). మహిళల సింగిల్స్: నాలీ (చైనా). - లక్నోలో జనవరి 26న జరిగిన సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ ఇండియా గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ను భారత నంబర్ వన్ షట్లర్ సైనానె హ్వాల్ గెలుచుకుంది. - న్యూజిలాండ్కు చెందిన కేథీక్రాస్ ఐసీసీ అంపైర్ ప్యానల్కు ఎంపికైన తొలి మహిళగా చరిత్ర పుటలకెక్కింది. - రంజీ ట్రోఫీ విజేతగా కర్ణాటక జట్టు నిలిచింది. ఈ టైటిల్ నెగ్గడం కర్ణాటకకు ఇది ఏడోసారి. - రష్యాలో జరిగిన క్యాండిడేట్ టోర్నీ చెస్ టైటిల్ను భారత గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ కైవసం చేసుకున్నారు. - టి-20 మహిళల ప్రపంచకప్ను ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్లో ఇంగ్లండ్పై విజయం సాధించింది. - 2005 మొనాకోలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్లో భారత లాంగ్ జంపర్ అంజూ బాబీ జార్జ్ స్వర్ణపతకం గెలుచుకున్నట్లుగా ఏప్రిల్ 1న ఇంటర్నేషనల్ అసోసియే షన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ (ఐఏఏఎఫ్) అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రపంచ అథ్లెటిక్స్ పోటీల్లో స్వర్ణపతకం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా అంజూ చరిత్ర సృష్టించింది. - సోచిలో పదిహేను రోజులపాటు జరిగిన వింటర్ ఒలింపిక్స్ పోటీల్లో ఆతిథ్య రష్యా ఎక్కువ పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. - ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-7 క్రికెట్ టోర్న మెంట్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు రెండోసారి విజేతగా నిలిచింది. - ఫ్రెంచ్ ఓపెన్ 2014 విజేతల వివరాలు: మహిళల సింగిల్స్: మరియా షరపోవా(రష్యా). పురుషుల సింగిల్స్: రాఫెల్ నాదల్ (స్పెయిన్). - వన్డే క్రికెట్లో భారత బౌలర్ స్టువర్ట్ బిన్నీ అత్యుత్తమ బౌలింగ్ రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్లోని మిర్పూర్లో జూన్ 17న భారత్, బంగ్లాదేశ్ల మధ్య జరిగిన రెండో వన్డేలో నాలుగు పరుగులకు ఆరు వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. - సైనా నెహ్వాల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్ టైటిల్ను కైవసం చేసుకుంది. సిడ్నీలో జూన్ 29న జరిగిన ఫైనల్లో స్పెయిన్కు చెందిన కరోలినా మారిన్పై విజయం సాధించింది. - పురుషుల ప్రపంచ హకీ కప్ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. జూన్ 15న ద హేగ్లో జరిగిన ఫైనల్లో నెదర్లాండ్స్ను ఓడించింది. మహిళల విభాగంలో ఆస్ట్రేలియాను ఓడించి నెదర్లాండ్స్ విజేతగా నిలిచింది. - వింబుల్డన్ విజేతల వివరాలు: మహిళల సింగిల్స్: పెట్రో క్విటోవా (చెక్ రిపబ్లిక్). పురుషుల సింగిల్స్: నొవాక్ జొకోవిచ్ (సెర్బియా). - భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ రష్యా సమాఖ్యకు చెందిన ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అవార్డుకు ఎంపికయ్యారు. - బ్రెజిల్లో మారకానాలో జూలై 13న జరిగిన ప్రపంచ కప్ ఫుట్బాల్ ఫైనల్లో జర్మనీ, అర్జెంటీనాను ఓడించి విజేతగా నిలిచింది. ఉత్తర,దక్షిణ అమెరికా ఖండంలో జరిగిన ప్రపంచకప్ పోటీల్లో గెలుపొందిన తొలి ఐరోపా దేశంగా జర్మనీ చరిత్ర సృష్టించింది. జర్మనీకి ఇది నాలుగో ప్రపంచకప్. 2018లో జరిగే 21వ ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్కు రష్యా ఆతిథ్యమివ్వనుంది. ఫిఫా అవార్డుల వివరాలు.. గోల్డెన్బాల్ (అత్యుత్తమ ఆటగాడు): లియోనెల్ మెస్సి (అర్జెంటీనా), గోల్డెన్ బూట్ (అత్యధిక గోల్స్): రోడ్రిగెజ్ (కొలంబియా), గోల్డెన్ గ్లోవ్ (అత్యుత్తమ గోల్కీపర్): మాన్యుల్ న్యూర్ (జర్మనీ),ఉత్తమ యువ ఆటగాడు: పాల్ ఫోగ్బా (ఫ్రాన్స్), ఫెయిర్ ప్లే అవార్డు (కొలంబియా జట్టు) - స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, కెనడాలు తొలి మూడు స్థానాలను కై వసం చేసుకున్నాయి. తెలుగు క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ బ్యాడ్మింటన్లో స్వర్ణం సాధించాడు. 21వ కామన్వెల్త్ క్రీడలు ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్ నగరంలో 2018లో జరగనున్నాయి. మొదటి 5 స్థానాల్లో నిలిచిన దేశాలు దేశం స్వర్ణం రజతం కాంస్యం మొత్తం ఇంగ్లండ్ 58 59 57 174 ఆస్ట్రేలియా 49 42 46 137 కెనడా 32 16 46 82 స్కాట్లాండ్ 19 15 19 53 భారత్ 15 30 19 64 - ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల టైటిల్ను చైనాకు చెందిన చెన్లాంగ్ గెలుచుకున్నాడు. మహిళల సింగిల్స్ టైటిల్ను కరోలినా మారిన్ (స్పెయిన్) కైవసం చేసుకుంది. భారత్కు చెందిన పి.వి. సింధు వరుసగా రెండో ఏడాదీ కాంస్యం నెగ్గింది. ఈ ఘనత సాధించిన భారత తొలి క్రీడాకారిణిగా నిలిచింది. - యూఎస్ ఓపెన్ టెన్నిస్-2014 విజేతల వివరాలు: మిక్స్డ్ డబుల్స్ సానియా -బ్రునో సొరెస్ (బ్రెజిల్). సానియాకు ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్. పురుషుల సింగిల్స్: క్రొయేషియాకు చెందిన మారిన్ సిలిక్. మహిళల సింగిల్స్: సెరెనా విలియమ్స్. మహిళల డబుల్స్: ఎకటెరీనా మకరోనా-ఎలెనా వెస్నినా (రష్యా). పురుషుల డబుల్స్: అమెరికాకు చెందిన మైక్ బ్రయాన్-బాబ్ బ్రయాన్ సోదరులు గెలుచుకున్నారు. వీరికిది వందో డబుల్స్ టైటిల్. - 2014 బ్రాడ్మన్ పురస్కారానికి క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, స్టీవ్వా (ఆస్ట్రేలియా)లను బ్రాడ్మన్ ఫౌండేషన్ ఎంపికచేసింది. - దక్షిణ కొరియాలోని ఇంచియా న్లో జరిగిన 17వ ఆసియా క్రీడల్లో చైనా అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణకొరియా రెండో స్థానం, జపాన్ మూడో స్థానం సాధించాయి. భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. నాలుగు వ్యక్తిగత స్వర్ణాలు సాధించిన జపాన్ స్విమ్మర్ కొనుగో హగినో అత్యంత విలువైన ఆటగాడి అవార్డుకు ఎంపికయ్యాడు. 2018 ఆసియా క్రీడలు ఇండోనేసియాలోని జకార్తాలో జరుగుతాయి. పతకాల పట్టిక: దేశం స్వర్ణం రజతం కాంస్యం మొత్తం చైనా 151 108 83 342 దక్షిణకొరియా 79 71 84 234 జపాన్ 47 76 77 200 భారత్ 11 10 36 57 - చాంపియన్స్ లీగ్ టీ-20 క్రికెట్ టైటిల్ను చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకుంది. - అక్టోబరు 24న లీడ్స్లో జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ పోటీల్లో భారత్కు చెందిన పంకజ్ అద్వానీ టైటిల్ను గెలుచుకున్నాడు. - భారత షూటర్ అభినవ్ బింద్రా అంతర్జాతీయ షూటింగ్ క్రీడల సమాఖ్య చైర్మన్గా ఎంపికయ్యారు. - దులీప్ ట్రోఫీని సెంట్రల్ జోన్ జట్టు గెలుచుకుంది. - బ్రిటన్కు చెందిన మెర్సిడెజ్ డ్రైవర్ లూయీస్ హామిల్టన్ అబుదాబి గ్రాండ్ ప్రి టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ఈ విజయంతో 2014 ప్రపంచ చాంపియన్గా అవతరించాడు. - బీసీసీఐ 2014 అవార్డుల వివరాలు: కల్నల్ సి.కె. నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం: దిలీప్ వెంగ్సర్కార్, ఉత్తమ అంతర్జాతీయ భారత క్రికెటర్ (పాలీ ఉమ్రిగర్ ట్రోఫీ) పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్. - మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ పుస్తకాన్ని అక్టోబరు 5న ముంబైలో ఆవిష్కరించారు. - సోచిలో నవంబరు 23న ముగిసిన చెస్ ప్రపంచ చాంపియన్ పోటీల్లో మాగ్నస్ కార్ల్సన్ ఆనంద్ను ఓడించి టైటిల్ను కైవసం చేసుకున్నాడు. - అహ్మదాబాద్లో నవంబరు 25న జరిగిన విజయ్ హజారే క్రికెట్ ట్రోఫీని కర్ణాటక గెలుచుకుంది. - క్రికెట్ ఆడుతూ గాయపడిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ (25) సిడ్నీ ఆసుపత్రిలో నవంబరు 27న మరణించాడు. - భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు నవంబరు 30న మకావ్లో జరిగిన మకావ్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నమెంట్ టైటిల్ను కైవసం చేసుకుంది. - {పపంచ స్నూకర్ చాంపియన్షిప్ టైటిల్ను చైనాకు చెం దిన 14 ఏళ్ల యాన్ బింగ్టావ్ కైవసం చేసుకున్నాడు. - దేవధర్ ట్రోఫీని ఈస్ట్జోన్ క్రికెట్ జట్టు గెలుచుకుంది. - దక్షిణాఫ్రికాలో కేప్టౌన్లో డిసెంబరు 7న జరిగిన అంధుల ప్రపంచకప్ క్రికెట్ను భారత జట్టు గెలిచింది. - చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో జర్మనీ జట్టు విజేతగా నిలిచింది. డిసెంబర్ 14న భువనేశ్వర్లో కళింగ మైదానంలో జరిగిన ఫైనల్లో పాకిస్థాన్ జట్టుపై విజయం సాధించింది. - ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ టైటిల్ను భారత్కు చెందిన ఇండియన్ ఏసెస్ గెలుచుకుంది. - భారత గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ లండన్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. - 2019 ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రపంచ కప్ ఫైనల్కు లార్డ్స్ మైదానం ఆతిథ్యమివ్వనున్నట్లు డిసెంబర్ 17న ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. - పురుషుల విభాగంలో నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), మహిళల విభాగంలో సెరెనా విలియమ్స్ (అమెరికా)లను ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) డిసెంబర్ 18న ఇంటర్నేషనల్ చాంపియన్సగా ప్రకటించింది. - రికార్డు స్థాయిలో భారత పురుషుల జట్టు వరుసగా ఐదోసారి, మహిళల జట్టు నాలుగోసారి కబడ్డీ ప్రపంచకప్ను కైవసం చేసుకున్నాయి. డిసెంబర్ 20న పంజాబ్లోని గురుగోబింద్ సింగ్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో పురుషుల జట్టు, పాకిస్థాన్ జట్టును ఓడించింది. మహిళల జట్టు న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించింది. - తొలి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టైటిల్ను అట్లెటికో డి కోల్కతా గెలుచుకుంది. - ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) అవార్డులు-2014 డిసెంబర్ 27న ముంబైలో ప్రకటించారు. వివరాలు: ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ (పురుషులు)-సునిల్ చెత్రీ (భారత కెప్టెన్), ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్-బాలా దేవీ, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్-సందేశ్ జింగమ్. - భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టెస్ట్ క్రికెట్కు విడ్కోలు చెప్పాడు. డిసెంబర్ 30న మెల్బోర్నలో ఆస్ట్రేలియాతో ముగిసిన మూడో టెస్ట్ అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు. బంగ్లాదేశ్లో జరిగిన టి-20 ప్రపంచకప్ను శ్రీలంక గెలుచుకుంది. ఫైనల్లో భారత్ను ఓడించింది. 1996 తర్వాత ఐసీసీ నిర్వహించిన పోటీలో శ్రీలంక విజేతగా నిలిచింది. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు విరాట్కోహ్లి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా శ్రీలంక బ్యాట్స్మన్ కుమార సంగక్కర ఎంపికయ్యారు. -
పరిశోధనల్లో కెరీర్కు పట్టంకట్టే జెస్ట్!
జాయింట్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (జెస్ట్).. దేశంలోని 20కిపైగా ప్రముఖ ఇన్స్టిట్యూట్లలో పరిశోధన కోర్సులను అభ్యసించడానికి మార్గం సుగమం చేసే పరీక్ష. జెస్ట్-2015 నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో పరీక్ష వివరాలు.. జెస్ట్ పరీక్ష ద్వారా ఫిజిక్స్, థియోరిటికల్ కంప్యూటర్ సైన్స్, న్యూరో సైన్స్ విభాగాల్లో పీహెచ్డీ/ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులోని స్కోర్ ఆధారంగా వివిధ ఇన్స్టిట్యూట్లు తాము నిర్దేశించిన అర్హతలున్న విద్యార్థులను తుది ఎంపిక కోసం పిలుస్తాయి. ఈ క్రమంలో జెస్ట్ స్కోర్ ఏడాదిపాటు చెల్లుబాటు అవుతుంది. రాత పరీక్ష: గ్రాడ్యుయేషన్, పోస్ట్గ్రాడ్యుయేషన్ స్థాయి సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. ఫిజిక్స్: రాత పరీక్షలో రెండు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో 25 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు. రెండో విభాగంలో 25 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ఇందులో 40 శాతం ప్రశ్నలు బీఎస్సీ సిలబస్ నుంచి, 60 శాతం ఎంఎస్సీ సిలబస్ నుంచి వస్తాయి. సిలబస్: మ్యాథమెటికల్ మెథడ్స్, క్లాసికల్ మెకానిక్స్, ఎలక్ట్రోమాగ్నటిక్ థియరీ, క్వాంటమ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ ఫిజిక్స్, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, న్యూక్లియర్ అండ్ పార్టికల్ ఫిజిక్స్, అటామిక్ అండ్ ఆప్టికల్ ఫిజిక్స్, ప్రాబబిలిటీ థియరీ. థియోరిటికల్ కంప్యూటర్ సైన్స్: ఇందులో రెండు రకాలు ప్రశ్నలు ఉంటాయి. కొన్నిటికి స్వల్ప సమాధానాలు సరిపోతే, మరికొన్నిటికి దీర్ఘ సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధిత అంశాలపై ప్రాథమిక భావనలను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఇస్తారు. అంతేకాకుండా కొన్ని ప్రశ్నలను సాధించడానికి మ్యాథమెటికల్ నైపుణ్యం కూడా అవసరం. సిలబస్: అనలిటికల్ రీజనింగ్ అండ్ డిడక్షన్, కాంబినోట్రిక్స్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్, డిస్రిక్ట్ మ్యాథమెటిక్స్, గ్రూప్ థియరీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్. థియోరిటికల్ కంప్యూటర్ సైన్స్/న్యూరో సైన్స్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సెన్సైస్-చెన్నై: పీహెచ్డీ ఇన్థియోరిటికల్ కంప్యూటర్ సైన్స్ కోర్సును అందిస్తుంది. అర్హత: ఎంఎస్సీ/ఎంటెక్/ఎంఈ (కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత విభాగం)/ఎంసీఏ. నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్బీఆర్సీ)- గుర్గావ్ పీహెచ్డీ ఇన్ న్యూరోసైన్స్ కోర్సును అందిస్తుంది. అర్హత: ఎంఎస్సీ (ఫిజిక్స్/మ్యాథమెటిక్స్) లేదా బీఈ/బీటెక్/ఎంసీఏ. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/ఎంటెక్ పీహెచ్డీ: బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్/స్టాటిస్టిక్స్/మ్యాథమెటిక్స్/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఇంజనీరింగ్ లేదా బీఎస్సీ (ఫిజిక్స్/మ్యాథమెటిక్స్) లేదా బీఈ/బీటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్/ ఇన్స్ట్రుమెంటేషన్/ఇంజనీరింగ్ ఫిజిక్స్/కంప్యూటర్ సైన్స్/ఆప్టిక్స్ అండ్ ఫోటోనిక్స్). ఇంటిగ్రేటెడ్ ఎంటెక్-పీహెచ్డీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్): ఎంఎస్సీ (ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్) లేదా పోస్ట్ బీఎస్సీ (ఆనర్స్ ఇన్ ఆప్టిక్స్ అండ్ ఆప్టోఎలక్ట్రానిక్స్/ రేడియో ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్) లేదా బీఈ/బీటెక్ (సంబంధిత సబ్జెక్ట్లతో). ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ- ఫిజిక్స్ (ఐఐఎస్ఈఆర్)-తిరువనంతపురం: బ్యాచిలర్ డిగ్రీ ఇన్ (ఫిజిక్స్/ టెక్నాలజీ/ ఇంజనీరింగ్). ప్రతి ఇన్స్టిట్యూట్ అర్హత ప్రమాణాలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి దరఖాస్తుకు ముందు సంబంధిత వివరాలను ముందుగా తెలుసుకోవడం మంచిది. పీహెచ్డీ-ఫిజిక్స్కు అర్హత ఎంఎస్సీ (ఫిజిక్స్) లేదా ఎంఎస్సీ/ఎంటెక్ (సంబంధిత విభాగాల్లో) లేదా ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్/అప్లయిడ్ మ్యాథమెటిక్స్/ఆప్టిక్స్ అండ్ ఫోటోనిక్స్/ఇన్స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రానిక్స్) లేదా బీఈ/బీటెక్ లేదా ఎంఎస్సీ (ఇంజనీరింగ్ ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్) లేదా బీటెక్ (ఇంజనీరింగ్ ఫిజిక్స్). ప్రతిభావంతులైన బీఎస్సీ మొదటి సంవత్సరం లేదా ఎంఎస్సీ (ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్/ఆస్ట్రానమీ/అప్లయిడ్ మ్యాథమెటిక్స్) విద్యార్థులు ఐయూసీఏఏలో రీసెర్చ్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం దరఖాస్తు: ఆన్లైన్లో. దరఖాస్తు రుసుం: రూ. 300(ఎస్సీ/ఎస్టీలకు రూ.150) దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 8, 2014. రాత పరీక్ష తేదీ: ఫిబ్రవరి 15, 2015. వెబ్సైట్: www.jest.org.in -
విజయాన్ని నిర్ణయించే కీలక విభాగం..
త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడే అవకాశాలు ఉన్నాయి..ఈ రెండు రకాల పోస్టుల భర్తీ కోసం నిర్వహించే రాత పరీక్షలో జనరల్ స్టడీస్విభాగం చాలా కీలకమైంది.. అంతేకాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టేప్రతి నియామక ప్రక్రియలో తప్పనిసరిగా జనరల్ స్టడీస్ విభాగం ఉంటుంది..సబ్జెక్ట్ పేపర్లలో అందరూ అభ్యర్థులు మెరుగైన స్కోర్ సాధించవచ్చు..కానీ అన్ని సబ్జెక్ట్ల సమహారంగా ఉండే ఈ జనరల్ స్టడీస్లో పొందిన మార్కులేవిజయాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషియస్తాయని చెప్పొచ్చు..ఈ నేపథ్యంలో జనరల్ స్టడీస్లో కీలకమైన మెంటల్ ఎబిలిటీ విభాగానికి సంబంధించి ఏవిధంగా సన్నద్ధం కావాలి, సిలబస్, తదితర అంశాలపై విశ్లేషణ.. మెంటల్ ఎబిలిటీ జనరల్ స్టడీస్లో మిగతా సబ్జెక్ట్లో పోల్చితే మెంటల్ ఎబిలిటీ విభాగం భిన్నమైంది. ఎందుకంటే జ్ఞాపకశక్తి కంటే తార్కిక వివేచన ద్వారా మాత్రమే ఇందులోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం సాధ్యమవుతుంది. ప్రిపరేషన్ పరంగా సులువుగా ఉండడంతో మిగతా సబ్జెక్ట్లలో దాదాపు అభ్యర్థులందరూ అందులో మెరుగైన స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి. అడిగే ప్రశ్నలు తక్కువగా ఉన్నప్పటికీ.. మెంటల్ ఎబిలిటీ విభాగం కీలకంగా మారుతోంది. కాబట్టి ఈ విభాగంలో సాధించిన మార్కులే విజయ ప్రస్థానాన్ని నిర్ణయించడంలో ముఖ్య భూమికను పోషిస్తాయని చెప్పొచ్చు. దాదాపు 20 జనరల్ స్టడీస్లో భాగంగా మెంటల్ ఎబిలిటీ నుంచి దాదాపు 20 ప్రశ్నలు వస్తాయి. ఇందులో 17-18 ప్రశ్నలు వెర్బల్ రీజనింగ్ నుంచి ఇస్తే.. మిగతా 2-3 ప్రశ్నలు అర్థమెటిక్ నుంచి అడుగుతున్నారు. నాన్ వెర్బల్ రీజనింగ్కు అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కొన్ని సందర్భాల్లో గ్రూప్-2, జేఎల్ వంటి పరీక్షల్లో ఒకటి, రెండు ప్రశ్నలను ఈ విభాగం నుంచి అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులందరూ వెర్బల్ రీజనింగ్కు ప్రాధాన్యతనిస్తూ ప్రిపరేషన్ సాగించడం ప్రయోజనకరం. అంతేకాకుండా వీలైనన్నీ అర్థమెటిక్ ప్రశ్నలను సాధన చేయడం ఉపయోగకరం. కొత్తగా వెర్బల్ రీజనింగ్ విషయానికొస్తే.. ఇది అకాడమీ పుస్తకాలలో ఎక్కడా కనిపించదు. కొత్తగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కొంత మంది అభ్యర్థులు దీన్ని కొత్త అంశంగా భావిస్తారు. ఇది గణితంలో ఒక భాగం కానప్పటికీ.. గణితంతో కొంత సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇందులో పట్టు సాధించాల్సిన అంశాలు.. సిరీస్, అనాలజీ (పోలిక పరీక్ష), క్లాసిఫికేషన్ (వర్గీకరణ పరీక్ష), కోడింగ్-డీకోడింగ్, రక్త సంబంధాలు, దిక్కులు, సీటింగ్ అరేంజ్మెంట్స్, తార్కిక చిత్రాలు, పజిల్స్, మిస్సింగ్ నెంబర్స్, కేలండర్ లెక్కలు, మిస్సింగ్ లెటర్స్, గడియారం లెక్కలు. తెలిసిన విభాగం అర్థమెటిక్.. అభ్యర్థులందరికీ పరిచయం ఉండే విభాగం. ఇందులోని అంశాలన్నీ 5-10వ తరగతి వరకు గణిత పుస్తకాల్లో కనిపిస్తాయి. ఈ విభాగం ప్రిపరేషన్ కోసం పట్టు సాధించాల్సిన అంశాలు.. వివిధ రకాల సంఖ్యలు, కాలం- దూరం, కాలం-పని, సరాసరి, నిష్పత్తి- అనుపాతం, శాతాలు, క.సా.గు.-గ.సా.భా., లాభం-నష్టం, భాగస్వామ్యం, సాధారణ వడ్డీ, చక్రవడ్డీ, క్షేత్రమితి (వైశాల్యాలు, చుట్టుకొలతలు, ఘనపరిమాణాలు) తదితరాలు. మూలాలు తెలుసుకోవాలి ‘మెంటల్ ఎబిలిటీ అంశాలు సైన్స్ వారికి అనుకూలం’ అనే అభిప్రాయం బలంగా ఉంటుంది. కానీ గత ప్రశ్నపత్రాల సరళిని పరిశీలిస్తే.. ‘ఫలానా నేపథ్యం ఉన్న వారికే అనుకూలం’ అనే తరహా ప్రశ్నలు కనిపించట్లేదు. కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో తమ నేపథ్యానికి సంబంధించని అంశాలు చదివేటప్పుడు.. మూలాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఒక అంశానికి సంబంధించి నేపథ్యం నుంచి ప్రిపరేషన్ సాగిస్తూ సదరు అంశంపై విస్తృత అవగాహన పెంచుకోవాలి. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు 6 నుంచి 10వ తరగతుల మ్యాథ్స్ పుస్తకాల్లోని అంశాల్లో అవసరమైన కాన్సెప్ట్స్ను సాధన చేయూలి. ఆ తర్వాత గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రధానంగా... క.సా.గు., భిన్నాలు, సమీకరణాలు, సాధన, సంఖ్యలు, బీజీయ గణితం, వ్యాపార గణితం అంశాలపై దృష్టిసారించాలి. నిరంతం ప్రాక్టీస్కు ప్రాధాన్యం ఇవ్వాలి. మ్యాథ్స్ స్టెప్స్ కరెక్టుగా సాధన చేయూలి. అంతేకాకుండా వేగంగా, కచ్చితత్వంతో సమాధానాన్ని గుర్తించాలి. ఇందుకు ఉపకరించే ఏకైక మార్గం ప్రాక్టీస్. తద్వారా సమస్యా సాధనలో వేగం, కచ్చితత్వం పెరుగుతుంది. సూచనలు: సిలబస్కు సంబంధించి సరైన మెటీరియల్ లేదా పుస్తకాలను గుర్తించడం. సంబంధిత సబ్జెక్టులో ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది? అని గత ప్రశ్నపత్రాల ద్వారా తెలుసుకోవడం. దానికి అనుగుణంగా సంబంధిత అంశంపై సినాప్సిస్ రూపొందించుకోవడం. ఇలా చేస్తే పరీక్షలో ప్రశ్న ఏ మూల నుంచి అడిగినా సమాధానం గుర్తించవచ్చు. చదివేటప్పుడు కాన్సెప్ట్ ఆధారిత ప్రిపరేషన్ సాగించడం అవసరం. దీనివల్ల సంబంధిత అంశంపై అవగాహన లభిస్తుంది. పరీక్ష హాల్లో సమాధానం స్ఫురణకు రాకున్నా.. ఎలిమినేషన్ టెక్నిక్ వినియోగించేందుకు మార్గం ఏర్పడుతుంది. రిఫరెన్స్ బుక్స్: క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - ఆర్.ఎస్. అగర్వాల్ క్వికర్ మ్యాథ్స్ - ఎం.థైరా మెంటల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-ఎడ్గర్ థోర్ప్ 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న గణిత పుస్తకాలు పట్టు సాధించాల్సినవి వెర్బల్ రీజనింగ్, అర్థమెటిక్ ప్రశ్నలను త్వరగా, తప్పులు లేకుండా సాధించాలంటే నేర్చుకోవాల్సిన అంశాలు.. {పాథమిక సంఖ్యా వాదం, వివిధ రకాల సంఖ్యలు, భాజనీయత సూత్రాలు 35 వరకు వర్గాలు 15 వరకు ఘనాలు 100లోపు ప్రధాన సంఖ్యలు 20 వరకు ఎక్కాలు కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం వంటి ప్రక్రియలను వేగంగా చేసే నేర్పు సాధించాలి. ఇందుకోసం వేదగణిత చిట్కాలను సాధన చేయాలి. అర్థమెటిక్లోని ప్రతి అంశం సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ సూత్రాలను క్షుణ్నంగా నేర్చుకోవాలి. ఆంగ్ల అక్షరాలను అ నుంచి ో వరకు, ో నుంచి అ వరకు వేగంగా చదవగలగాలి.అ నుంచి ో వరకు అక్షరాల స్థాన విలువలు అంటే అ-1, ఆ-2, ..-26 పక్కాగా తెలిసి ఉండాలి అ నుంచి ో వరకు అక్షరాల తిరోగమన స్థాన విలువలు అంటే అ-26, ఆ-25, ....ో-1 క్షుణ్నంగా నేర్చుకోవాలి. అ నుంచి ో వరకు అక్షరాల తిరోగమన స్థాన అక్షరాలు అంటే అ-ో; ఆ-్గ, ఇ-గీ... ో-అ పై పట్టు సాధించాలి. ఆంగ్లంలో అచ్చులు అ, ఉ, ఐ, ై, ్ఖ తెలిసి ఉండాలి వేద గణిత చిట్కాలను ప్రాక్టీస్ చేయాలి. గతంలో వచ్చిన ప్రశ్నలు 1. 44, 484, 529, 566, 625.. వీటిలో ఒక సంఖ్య భిన్నమైంది. ఆ సంఖ్య? 1) 484 2) 529 3) 625 4) 566 సమాధానం: 4 వివరణ: ఇక్కడ ఇచ్చిన సంఖ్యలలో 566 తప్ప మిగతావన్నీ కచ్చితమైన వర్గాలు. 2. ఒక వేళ ఈఖఐగఉఖ = 12, ్కఉఈఉఖీఖఐఊ = 20, అఇఇఐఈఉూఖీ = 16 అయితే ఇఅఖ =? 1) 3 2) 8 3) 10 4) 6 సమాధానం: 4 వివరణ: ఈఖఐగఉఖ లోని అక్షరాల సంఖ్య 6. దీన్ని రెట్టింపు చేసి 12 రాసారు. అక్షరాల సంఖ్య 10. దీన్ని రెట్టింపు చేస్తే 20. అక్షరాల సంఖ్య 8. దీన్ని రెట్టింపు చేసి 16 రాసారు. అదేవిధంగా ఇఅఖ లోని అక్షరాల సంఖ్య 3. దీన్ని రెట్టింపు చేస్తే 6. కాబట్టి సమాధానం: 6 3. కింది వాటిలో భిన్నమైంది? 1) ఈఎఒక 2) ఖఖీగిో 3) ఊఏఓూ 4) గీఅఈఎ సమాధానం: 3 వివరణ: ఇక్కడ ఇచ్చిన అక్షరాల సమూహంలో.. అక్షరాల మధ్య వ్యత్యాసం 3. కానీ ఊఏఓూలో మొదటి రెండు అక్షరాల మధ్య తేడా 3 లేదు. 4. రాహుల్ ఉత్తరం వైపు 4 కి.మీ. ప్రయాణించి, కుడి వైపు మరో 8 కి.మీ. ప్రయాణించాడు. తర్వాత కుడి వైపు మరో 20 కి.మీ. ప్రయాణించి చివరగా కుడివైపు 20 కి.మీ. ప్రయాణించాడు. ఇప్పుడతను తన ప్రారంభ స్థానం నుంచి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడు? 1) నైరుతి 20 కి.మీ. 2) ఈశాన్యం 20 కి.మీ. 3) నైరుతి 16 కి.మీ. 4) ఆగ్నేయం 20 కి.మీ. సమాధానం: 1 వివరణ: ప్రారంభం స్థానం అ, తుది స్థానం ఊ కావాల్సిన దూరం అఊ పటం ఆధారంగా అఉ = 20 - 4 = 16 కి.మీ. ఉఊ = 20 - 8 = 12 కి.మీ. 5. సునీల్ ఎదురుగా వ స్తున్న అమ్మాయిని పరిచయం చేస్తూ ఆ అమ్మాయి తల్లి, మా నాన్న ఏకైక కుమారుడి భార్య అని చెప్పాడు. అయితే సునీల్కు ఆ అమ్మాయి ఏమవుతుంది? 1) తల్లి 2) భార్య 3) కూతురు 4) సోదరి సమాధానం: 3 వివరణ: సునీల్ తండ్రి ఏకైక కుమారుడు అంటే అతనే. సునీల్ భార్య.. తాను పరిచయం చేస్తున్న అమ్మాయి తల్లి అంటే ఆ అమ్మాయి సునీల్కు కూతురు అవుతుంది. 6. 2, 3, 8, 31, 154, 923..... 1) 5224 2) 6460 3) 6461 4) 7236 సమాధానం: 2 వివరణ: 2ణ2ృ1 = 3; 3ణ3ృ1 = 8; 8ణ4ృ1 = 31; 31ణ5ృ1 = 154; 154ణ6ృ1 = 923; అదేవిధంగా 923ణ7ృ1 = 6461 7. కింది వాటిలో ఏ సంవత్సరం 2005ను పోలి ఉంటుంది? 1) 2009 2) 2011 3) 2012 4) 2015 సమాధానం: 2 వివరణ: లీప్ సంవత్సరం తర్వాత వచ్చే ప్రతి సంవత్సరం.. ఆ సంవత్సరం నుంచి 6 సంవత్సరాల తర్వాత వచ్చే సంవత్సరాన్ని పోలి ఉంటుంది. \u3149?ట్చఛఙ 2005 సంవత్సరం 2005+6=2011 సంవత్సరాన్ని పోలి ఉంటుంది. 8. ఒక నిర్దిష్ట సంకేత భాషలో కఐఖీఅఓఉను 4356127 గా రాస్తే ఖీఉఅకను అదే భాషలో ఏ విధంగా పేర్కొనవచ్చు? 1) 13457 2) 75614 3) 65741 4) 56714 సమాధానం: 4 M I S T A K E 4 3 5 6 1 2 7 STEAMలోని ఐదు అక్షరాలు కఐఖీఅఓఉలో ఉన్నాయి. కాబట్టి ఆ అక్షరాల కోడ్లను రాస్తే సమాధానం వస్తుంది. T E A M 5 6 7 1 4 \ STEAM కోడ్ 56714 9. {పస్తుతం తండ్రి వయసు కొడుకు వయసుకు 4 రెట్లు. నాలుగు సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకు 3 రెట్లు. అయితే ప్రస్తుతం తండ్రి, కొడుకుల వయసులు ఎంత? 1) 24 సంవత్సరాలు, 6 సంవత్సరాలు 2) 28 సంవత్సరాలు, 7 సంవత్సరాలు 3) 32 సంవత్సరాలు, 8 సంవత్సరాలు 4) 36 సంవత్సరాలు, 10 సంవత్సరాలు సమాధానం: 3 వివరణ:మొదటి మూడు ఆప్షన్లలో తండ్రి వయసు కొడుకు వయసుకు 4 రెట్లు ఉంది. నాలుగు సంవత్సరాల తర్వాత వారి వయసులు పరిశీలిస్తే..ఆప్షన్3లో ఉన్న వయసులు మాత్రమే తండ్రి వయసు, కొడుకు వయసుకు 3 రెట్లు. సమాధానం: 3 -
విశ్లేషణతో విజయం ముంగిటకు...
గతంలో మాదిరిగా వ్యవస్థల నిర్మాణంపై కాకుండా వాటి పనితీరుపై ప్రశ్నలు వస్తున్నాయి. ఆయా వ్యవస్థలు- సమకాలీన ప్రాధాన్యమున్న అంశాలపై దృష్టికేంద్రీకరించాలి. ప్రస్తుతం వివరణాత్మక సమాధానాలకు కాలం చెల్లింది. విశ్లేషణాత్మక సమాధానాలే మార్కులకు కీలకమయ్యాయి. సమకాలీన రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల ప్రాతిపదికగా ప్రశ్నలు వస్తున్నాయి. సన్నద్ధత ఇదే కోణంలో ఉండాలి. సివిల్స్ మెయిన్స్ జీఎస్-2 సివిల్స్-2014 ప్రిలిమ్స్లో విజయం సాధించిన అభ్యర్థులు ఇప్పుడు మెయిన్స్కు సిద్ధమవుతున్నారు. ఇందులోనూ గెలుపు గమ్యాన్ని చేరుకోవాలంటే కీలకమైన జనరల్ స్టడీస్ పేపర్లలో మెరుగైన మార్కులు సాధించాలి. మెయిన్స్లో మెరిట్కు పరిగణనలోని తీసుకునే ఏడు పేపర్లలో నాలుగు జీఎస్ పేపర్లే! వీటికి వెయ్యి మార్కులు కేటాయించారు. ఈ తరుణంలో పొలిటికల్ సైన్స్ ప్రధానంగా ఉన్న జీఎస్ పేపర్-2 సిలబస్లోని అంశాలు, వాటిపై పట్టు సాధించేందుకు వ్యూహాలపై విశ్లేషణ.. పేపర్ 2- పాఠ్యాంశాలు పరిపాలన, రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సంబంధాలు. భారత రాజ్యాంగం, చారిత్రక నేపథ్యం, పరిణామ క్రమం, లక్షణాలు, సవరణలు, మూల నిర్మాణం. కేంద్రం, రాష్ట్రాల కార్యకలాపాలు, బాధ్యతలు, సమాఖ్య వ్యవస్థ తీరుతెన్నులు. {పభుత్వంలోని వివిధ అంగాల మధ్య అధికారాల విభజన. వివిధ దేశాల రాజ్యాంగాలు-భారత్ రాజ్యాంగంతో పోలిక. పార్లమెంటు, రాష్ట్రాల శాసన వ్యవస్థలు- నిర్మాణం, కార్యకలాపాలు. కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల నిర్మాణం, పనిచేసే విధానం. {పజా ప్రాతినిధ్య చట్టంలోని ముఖ్యాంశాలు. వివిధ రాజ్యాంగ పదవుల నియామకాలు, రాజ్యాంగ పదవులు, అధికారాలు, విధులు. చట్టబద్ధ, నియంత్రిత, వివిధ పాక్షిక న్యాయ సంస్థలు. {పభుత్వ విధానాలు,ప్రగతికి ప్రభుత్వం చూపే చొరవ. అభివృద్ధి ప్రవృత్తి, ప్రగతికి దోహదం చేసే పరిశ్రమలు.. బలహీన వర్గాలు-సంక్షేమ పథకాలు. సామాజిక రంగ సేవల అభివృద్ధి, నిర్వహణకు సంబంధించిన అంశాలు. పేదరికం, ఆకలి సంబంధిత అంశాలు. పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం. {పజాస్వామ్యంలో సివిల్ సర్వీస్ పాత్ర.. భారత్, పొరుగు దేశాలతో సంబంధాలు., గ్లోబల్ గ్రూపులు. భారత్పై అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల విధానాలు, రాజకీయాల ప్రభావం. ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థలు. 2012 - 2013: సివిల్స్ మెయిన్స్-2012 జనరల్ స్టడీస్ పేపర్లలో 20 పదాలు, 50 పదాలు, 150 పదాలు ఇలా వివిధ పరిమాణాల సమాధానాలు రాయాల్సిన ప్రశ్నలు వచ్చాయి. దీనికి భిన్నంగా 2013 మెయిన్స్లో అన్నీ 200 పదాల ప్రశ్నలే ఎదురయ్యాయి. దీంతో అభ్యర్థులు ఒత్తిడికి గురయ్యారు.గతంలో చాయిస్ ఉండేది. కానీ, 2013లో 25 ప్రశ్నలు ఇవ్వగా, అన్నింటికీ సమాధానాలు రాయమన్నారు.మూడు గంటల సమయంలో 25 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. ఈ తరుణంలో విజయానికి సమయ పాలన కీలకంగా మారింది. చట్టాలు- అమలు తీరుతెన్నులు: చట్టాలను అమలు చేసే క్రమంలో రాజ్యాంగంలో నిర్దేశించిన అంశాల ఉల్లంఘనకు అవి ఎలా కారణమవుతున్నాయనే దానిపై విశ్లేషణాత్మక అధ్యయనం అవసరం. వీటికి సంబంధించి ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ఉదాహరణకు గత పరీక్షలో ‘‘ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ (ఎలక్ట్రానిక్ మెసేజ్ పంపడం) లోని అంశాల అమలు.. రాజ్యాంగంలోని అధికరణ 19 (భావ ప్రకటన స్వేచ్ఛ) ద్వారా ప్రజలకు సంక్రమించిన హక్కుల ఉల్లంఘనకు కారణమవుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని చర్చించండి..’’ అనే ప్రశ్న వచ్చింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఇటీవల కాలంలో అమల్లోకి వచ్చిన వివిధ చట్టాలు, వాటి అమలు తీరును రాజ్యాంగ ప్రకరణలకు అన్వయిస్తూ అధ్యయనం చేయాలి. న్యాయ వ్యవస్థదే పైచేయా? నేడు చాలా సందర్భాల్లో ప్రభుత్వాల నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ఇవి రాజ్యాంగ అమలుకు అడ్డంకు లు సృష్టిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాల నిర్ణయాలు.. రాజ్యాంగ బద్ధమా.. కాదా? అనే దానిపై కోర్టుల్లో విచారణలు జరిగి, తీర్పులు వెలువడుతున్నాయి. ఈ సందర్భంలో ప్రభుత్వంలోని శాసన నిర్మాణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వహణ వ్యవస్థల్లో న్యాయ వ్యవస్థదే పైచేయిగా బయటకు కనిపిస్తోంది. అభ్యర్థులు ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం, ఆర్థికాభివృద్ధి తదితరాలకు సంబంధించి తీసుకునే కొన్ని నిర్ణయాలు రాజ్యాంగం కోణంలో ఎలా వివాదాస్పదమవుతున్నాయో తెలుసుకోవాలి. నియంత్రణ వ్యవస్థలకు ప్రాధాన్యం! సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణల నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వాల ప్రాధాన్యం తగ్గి, నియంత్రణ వ్యవస్థల కార్యకలాపాలు కీలకమయ్యాయి. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్.. ఇలా వేర్వేరు రంగాలకు చెందిన నియంత్రణ సంస్థలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ క్రమంలో అభ్యర్థులు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, క్యాపిటల్ మార్కెట్ తదితర రంగాల్లో సమకాలీన పరిణామాలు, నియంత్రణ వ్యవస్థల పాత్రపై అవగాహన పెంపొందించుకోవాలి. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలు: పేదరిక నిర్మూలన, అందరికీ విద్య, ఆర్యోగం, మహిళాభివృద్ధి, శిశు మరణాల తగ్గింపు, నిరుద్యోగం తగ్గించడం తదితరాలకు సంబంధించిన సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలు, వీటిని నెరవేర్చడంలో భారత్ పురోగతిపై అభ్యర్థులు అవగాహన పెంపొందించుకోవాలి. లక్ష్యాల సాధనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? అవి ఎంత వరకు సఫలీకృతమవుతున్నాయి? వంటి వాటిని తెలుసుకోవాలి. ప్రైవేటు రంగ సహకారం పొందడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు చేరువచేయడంలో (ముఖ్యంగా ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్) భారత్ చెప్పుకోదగ్గ పురోగతి సాధించింది. ఇదే సమయంలో ఆకలితో బాధపడే వారి సంఖ్యను తగ్గించే విషయంలో పురోగతి చాలా తక్కువగా ఉంది. గత మెయిన్స్లో ఆరోగ్యానికి సంబంధించిన సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలను గుర్తించి, వాటి సాధనకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎంతమేర సఫలమయ్యాయో చర్చించండి? అనే ప్రశ్న ఇచ్చారు. పొరుగు దేశాలు-సంబంధాలు: దక్షిణాసియా ప్రాంతంలో భారతదేశం కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ ప్రాంతంలోని మిగిలిన దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయి. ఇదే సమయంలో ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు తమ సమస్యల్ని పరిష్కరించుకోలేక, వాటికి కార ణం భారత్ అంటూ ఆరోపణలు చేస్తున్నాయి. చైనా, జపాన్, వియత్నాం తదితర దేశాలతో భారత్ సం బంధాలను అధ్యయనం చేయాలి. ఇటీవల చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ భారత్లో పర్యటించారు. ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాల మెరుగుకు ఎంత వరకు దోహదపడగలదో విశ్లేషించండి? అనే కోణంలో ఈసారి ప్రశ్న రావొచ్చు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అయిదు రోజుల పాటు జపాన్లో పర్యటించడం.. రక్షణ రంగంలో పరస్పర సహకారానికి స్నేహ హస్తం చాచడం.. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలను ఆహ్వానించడం తదితర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు వియత్నాం రక్షణ, భద్రతా దళాల ఆధునికీకరణకు సాయం చేస్తామని భారత్ ప్రకటించింది. భారత్ నుంచి నాలుగు గస్తీ నౌకల కొనుగోలుకు వియత్నాం అంగీకరించడం వంటివి ఈ రెండు దేశాల సంబంధాల బలోపేతానికి జరుగుతున్న కసరత్తులో భాగమే. ఈ నేపథ్యంలో భారత్.. జపాన్, వియత్నాంలతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలనుకోవడం చైనాను ఇరుకున పెట్టేందుకేనా? చర్చించండి అనే కోణంలో ప్రశ్న రావొచ్చు. ఇదే విధంగా భారత్ పొరుగుదేశాలతో చైనా సంబంధాలు, వాటి ప్రభావంపైనా ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. కూటములకు ప్రాధాన్యం: గతంతో పోల్చితే ప్రపంచ బ్యాంకు, డబ్ల్యూటీవో, ఐఎంఎఫ్.. తదితర అంతర్జాతీయ సంస్థల కంటే ప్రస్తుతం ప్రాంతీయ కూటములకు ప్రాధాన్యం పెరిగింది. జీ-8, జీ-20, బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) తదితర కూటములు సమకాలీన ప్రపంచంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. దేశాలు ప్రపంచ ప్రయోజనాలు కాకుండా స్వీయ ప్రయోజనాల కోణంలో ఆలోచిస్తున్నాయి. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ప్రయోజనాలు పొందేందుకు అవసరమైన దేశాలతో మాత్రమే జట్టుకడుతున్నాయి. ఈ క్రమంలోనే కూటములకు ప్రాధాన్యం ఏర్పడింది. ఉదాహరణకు బ్రిక్స్ను చెప్పుకోవచ్చు. ఈ కూటమి ఆరో సదస్సు 2014, జూలైలో బ్రెజిల్లో జరిగింది. ఇందులో 10,000 కోట్ల డాలర్ల ప్రారంభ అధీకృత మూలధనంతో బ్రిక్స్ బ్యాంక్ నెలకొల్పేందుకు నేతలు ఆమోదం తెలిపారు. అభ్యర్థులు ఈ బ్యాంకు ఏర్పాటుకు కారణాలు; ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులకు ఇది ఎంత మేరకు పోటీగా నిలుస్తుంది? పర్యవసనాలు? భారత్కు ప్రయోజనాలు? తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. భారత ప్రయోజనాలే కేంద్రంగా: దేశం, కూటమి, అంతర్జాతీయ సంస్థ.. దేని గురించి చదువుతున్నా భారత్ను దృష్టిలో ఉంచుకొని అధ్యయనం చేయాలి. చైనా ఒకవైపు భారత్తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నానంటూనే మరోవైపు అంతర్జాతీయ వేదికలపై భారత్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో మన దేశానికి శాశ్వత సభ్యత్వం రాకుండా అడ్డుపుల్ల వేస్తోంది. ఆహార భద్రతకు సంబంధించి డబ్ల్యూటీవోలో భారత్ వినిపించిన వాణి వంటి అంశాలను అధ్యయనం చేయాలి. సిద్ధమవ్వండిలా.. మ్యాథ్యమెటిక్స్ పదో తరగతి స్థాయిలో ఉంటుంది. సీబీఎస్ఈ, లేదా స్టేట్ సిలబస్లో 9, 10 తరగతుల మ్యాథ్స్ పుస్తకాలు చదివితే సరిపోతుంది. అదనపు సమయం కేటాయిస్తే ఆర్ట్స్ విద్యార్థులు కూడా మ్యాథ్స్ ప్రశ్నలకు సులువుగా సమాధానాలు గుర్తించొచ్చు. ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, మెన్సురేషన్ చాప్టర్లకు ఎక్కువ సమయం వెచ్చించాలి. ఈ మూడు చాప్టర్ల నుంచే 40 శాతానికి తక్కువ కాకుండా ప్రశ్నలడుగుతారు. మిగతా చాప్టర్లకు సమానమైన వెయిటేజ్ ఉంటుంది. అర్థమెటిక్లో భాగంగా నంబర్ సిస్టమ్, సహజ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు, కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారం, స్క్వేర్రూట్స్, కాలం-దూరం, కాలం-పని, శాతాలు, వడ్డీ-చక్రవడ్డీ, బారువడ్డీ, లాభనష్టాలు మొదలైనవాటిపై ప్రశ్నలడుగుతారు. ఇవన్నీ కూడా హైస్కూల్ స్థాయిలో 6 నుంచి పదో తరగతి మ్యాథ్స్లో ఉండేవే. అందువల్ల సంబంధిత తరగతుల పాఠ్యపుస్తకాల్లో ప్రశ్నలను సాధన చేయాలి. వీటితోపాటు ఆర్ఎస్ అగర్వాల్ ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ పుస్తకంలోని సమస్యలను ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లిష్ బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్పై ప్రశ్నలుంటాయి. అభ్యర్థి ఇంగ్లిష్ని ఎలా అర్థం చేసుకుంటున్నాడో పరిశీలించే విధంగా ప్రశ్నలడుగుతారు. మార్కెట్లో దొరికే ప్రామాణిక ఆంగ్ల వ్యాకరణ పుస్తకంలో సిలబస్లోని అంశాల వరకు చదివితే చాలు. ఈ విభాగంలో 70 శాతం ప్రశ్నలు ప్రాథమిక వ్యాకరణం నుంచి, 30 శాతం ప్రశ్నలు కాంప్రహెన్సన్, యాంటోనిమ్స్, సినోనిమ్స్, అనాలజీ అంశాలపై అడుగుతారు. ఇంగ్లిష్ విభాగంలో ఎక్కువ మార్కులు పొందడానికి రెన్ అండ్ మార్టిన్ హైస్కూల్ ఇంగ్లిష్ గ్రామర్ పుస్తకం, నార్మన్ లూయీస్ రాసిన వర్డ్ పవర్ మేడ్ ఈజీ బాగా ఉపయోగపడతాయి. జనరల్ నాలెడ్జ్ వర్తమాన వ్యవహారాల కోసం రోజూ ప్రామాణిక దినపత్రికలు చదవాలి. స్టాక్ జీకే కోసం ఏదైనా జనరల్ నాలెడ్జ్ పుస్తకం చదివితే సరిపోతుంది. పరిసరాలపై కాస్త అవగాహన ఉంటే జీకే ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం తేలికే. భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, పాలిటీ, ఎకానమీ ప్రశ్నల కోసం 8, 9, 10 తరగతుల సోషల్ పుస్తకాలు చదవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ, అవార్డులు, ఆవిష్కరణల కోసం ఏదైనా ఇయర్ బుక్లోని కరెంట్ అఫైర్స్ సెక్షన్ను ఔపోసన పట్టాలి. శాస్త్ర, సాంకేతిక అంశాలు ముఖ్యమైనవే. ఇటీవల కాలంలో మన దేశం ప్రయోగించిన వివిధ క్షిపణులు, వాటి పరిధి, అంతరిక్ష ఉపగ్రహాలు, వాటిని వేటి కోసం ఉద్దేశించారు? ఎక్కడి నుంచి ప్రయోగించారు? ఇలా అన్ని కోణాల్లో సిద్ధమవ్వాలి. ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ రాత పరీక్ష, వైద్య, శారీరక పరీక్షల్లో విజయం సాధించిన వారిని ఖాళీలకనుగుణంగా పర్సనాలిటీ టెస్ట్కు ఎంపిక చేస్తారు. దీన్ని వ్యక్తిత్వ పరీక్షగా చెప్పుకోవచ్చు. ఇందులో విజయం సాధించడానికి ప్రతిరోజూ ఏదైనా పేపర్ చదవాలి. జాతీయ ఇంగ్లిష్ చానళ్లలో వచ్చే చర్చా కార్యక్రమాలు వినాలి. ఏదైనా టాపిక్ ఎంచుకొని అద్దం ముందు నిల్చొని కనీసం ఐదు నిమిషాలు మాట్లాడాలి. అలా కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపర్చుకోవాలి. ఇంటర్వ్యూలో భాగంగా ఇంకా వివిధ పరీక్షలు నిర్వహిస్తారు. గ్రూప్ డిస్కషన్తోపాటు ఏదైనా సందర్భం చెప్పి దానికి అభ్యర్థి ఎలా స్పందిస్తారో తెలుసుకుంటారు. ఔట్డోర్ గ్రూప్ టాస్క్ కూడా ఉంటుంది. ఏదైనా అంశంలో ఉపన్యసించమని కూడా అడుగుతారు. ఎయిర్ఫోర్స్ అకాడెమీ అభ్యర్థులకు పైలట్ బ్యాటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (పీబీఏటీ)ను కూడా నిర్వహిస్తారు. వర్తమాన వ్యవహారాలతోపాటు వివిధ అంశాలపై ప్రశ్నిస్తారు. ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కుల కోసం అన్ని విషయాల్లోనూ ప్రాథమిక పరిజ్ఞానంతో పాటు లాజికల్ థింకింగ్ను అలవర్చుకోవాలి. రిఫరెన్స్ బుక్స్: పాత్ఫైండర్ సీడీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ చాప్టర్వైజ్-సెక్షన్ వైజ్ సీడీఎస్ సాల్వ్డ్ పేపర్స్ -అర్హింత్ పబ్లికేషన్స్ ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ -ఉప్కార్ పబ్లికేషన్స్ గుర్తుంచుకోండి.. గత మెయిన్స్ విధానాన్నే ఈసారి కూడా కొనసాగించవచ్చని ఆశించవచ్చు. అదే జరిగితే సమయానికి ప్రాధాన్యమివ్వాలి. ఒక్కో ప్రశ్నకు దాదాపు ఏడు నిమిషాలు అందుబాటులో ఉంటుంది.200 పదాలకు మించకుండా సమాధానం రాయమన్నారేగానీ కచ్చితంగా అన్ని పదాల్లో సమాధానం ఉండాలని లేదన్నది గుర్తించాలి.సూచనల్లో ‘సమాధానం పరిమాణం కంటే దాని నాణ్యత ప్రధానమని’ ఇచ్చారు. అందువల్ల ఎంత రాశామనేదాని కంటే ఎంత కచ్చితమైన విశ్లేషణను అందించామన్నదే ముఖ్యమని గుర్తించాలి. ఒకట్రెండు తప్ప అన్ని ప్రశ్నలకూ సమాధానం రాసేందుకు ప్రయత్నించాలి. మెయిన్స్ ప్రిపరేషన్ లో భాగంగా రైటింగ్ ప్రాక్టీస్కూ ప్రాధాన్యమివ్వాలి. డా॥బి.జె.బి. కృపాదానం సీనియర్ సివిల్స్ ఫ్యాకల్టీ ఆర్.సి. రెడ్డి స్టడీ సర్కిల్ -
సమస్యను సాధించండిలా...
రామయ్య సార్ నా తొలి ఉపాధ్యాయ వృత్తిలో భాగంగా ఒక రోజు భిన్నాల సూక్ష్మీకరణ గురించి బోధిస్తున్నాను. ముందుగా ఒక అంకె సంఖ్య గల భిన్నాలను ఎలా సూక్ష్మీకరించాలో చెప్పాను. అంటే అని అని సమస్యను సాధన చేస్తూ వివరించాను. తర్వాత రెండంకెల భిన్నాల గురించి బోధించాను. అంటే అని సాధన చేశాను. 19ణ1=19, 195=95 అని వివరిస్తూ లవాన్ని 1తో, హారాన్ని 5తో కొట్టివేసి సమాధానం అని రాశాను. ఇంతలో ఒక విద్యార్థి లేచి సార్! అలా కాకుండా ఒక అంకె సంఖ్యగల భిన్నాలను కొట్టివేసినట్లుగా దీనిలో కూడా లవంలో 9, హారంలో కూడా 9 ఉంది.కదా! ఆ రెండింటిని కొట్టివేసినా సమాధానం వస్తుంది కదా అన్నాడు. అప్పుడు నేను అవును అది కూడా నిజమే కదా అని ఆలోచించి మొదటగా ఆ భిన్నం స్ట్రక్చర్ను గమనించాను. అంటే లో లవంలో 9 అనేది ఒకట్ల స్థానంలో ఉంటే, హారంలో 9 అనేది పదుల స్థానంలో ఉంది. అంటే కొట్టివేసే సంఖ్య అనుకుంటే ఆ భిన్నం అవుతుంది. దాని అర్థం లవంలో ్ఠ అనేది ఒకట్ల స్థానంలో, హారంలో ్ఠ అనేది పదుల స్థానంలో ఉంది. కాబట్టి ఈ విధంగా రాశాను.అయితే రెండు భిన్నాలు సమానం కావాలంటే వాటి ప్రతి లబ్ధం సమానం కావాలి. అంటే ఎప్పుడవుతుంది అంటే ్చఛీ=ఛఛి అయినప్పుడు మాత్రమే. ఆ విధంగా అంటే 5(10) = 1(10+5) 50+5= 10+5 5= 45 9 అంటే విలువ 0, 9 మధ్యలో ఉంటే ఇది సాధ్యమవుతుంది. గణిత భాషలో 09 అయినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు విలువ అనేది భిన్నంలో అంకె కాబట్టి అలా కొట్టివేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆదేవిధంగా అని రాయవచ్చా లేదా అనేది చూద్దాం. అయితే ఈ భిన్నంలో ్ఠ అనేది లవంలో ఒకట్ల స్థానంలో, హారంలో పదుల స్థానంలో ఉంది. కాబట్టి భిన్నాన్ని ఈ విధంగా రాశాను. 9 (50) = 5 (10+9) 450+9 = 50+45 41 = 395 9.6 /10 అవుతుంది. అంటే ఈ భిన్నంలో ్ఠ విలువ 9 దాటి పోయింది. కాబట్టి భిన్నాన్ని కొట్టివేయడానికి వీలు లేదు. అదే విధంగా ని కొట్టివేయడానికి వీలుంటుదేమో చూద్దాం.అంటే పై భిన్నంలో లవంలో ఒకట్ల స్థానంలో 6, హారంలో పదుల స్థానంలో 6 ఉంది. కాబట్టి భిన్నాన్ని ఈ విధంగా రాశాను. 5(20) = 2(10+5) 100+5= 20+10 15= 90 6 విలువ భిన్నంలో అంకే కాబట్టి ఈ భిన్నాన్ని అలా కొట్టివేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా ప్రతి సమస్యను విశ్లేషిస్తే క్లిష్టమైన ప్రశ్నలను సులువుగా సాధించవచ్చు. విద్యార్థుల మేధస్సుకు ప్రశ్నలు 1. ; ఇక్కడ ఉపయోగించిన అక్షరాలకు ఏ ‘అంకెలు’ ఇవ్వగలిగితే ఒకై అనే సంఖ్యను ్ఖఓతో భాగిస్తే భాగఫలం ైఓ వస్తుంది? 2. అయితే భాగఫలం 123 వచ్చే విధంగా సమస్యను సాధించండి? గమనిక: పై సమస్యలకు మీరు కూడా సులువైన, సరళమైన పద్ధతిలో సాధించి వివరణ పంపవచ్చు. కొత్త పద్ధతిలో పరిష్కారాలను పంపిన విద్యార్థుల పేర్లను ప్రచురిస్తాం. ఈ-మెయిల్: sakshieducation@gmail.com -
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (1), 2015
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (1), 2015కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా మిలటరీ, నేవీ, ఎయిర్ఫోర్స్ త్రివిధ దళాల్లో ఉన్నతమైన హోదాతో కెరీర్ను ప్రారంభించవచ్చు. ఈ నేపథ్యంలో అర్హత, పరీక్షా విధానం, సంబంధిత వివరాలు.. ఖాళీలు: ఇండియన్ మిలిటరీ అకాడమీ (డెహ్రాడూన్) 200 ఇండియన్ నావల్ అకాడమీ (ఎజిమలా) 45 ఎయిర్ఫోర్స్ అకాడమీ (హైదరాబాద్) 32 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (చెన్నై) (పురుషులు) 175 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (చెన్నై) (మహిళలు) 12 ఎంపిక ప్రక్రియ: ఎంపిక ప్రక్రియలో మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు తర్వాతి దశ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్కు హాజరు కావాల్సి ఉంటుంది. దీన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి శారీరక, వైద్య పరీక్షలు నిర్వహించి నియామకాన్ని ఖరారు చేస్తారు. రాత పరీక్ష: రాత పరీక్ష ఇంగ్లిష్/హిందీ మాధ్యమాల్లో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఎంపిక చేసుకున్న విభాగాన్ని బట్టి వేర్వేరుగా ఉంటుంది. ఇండియన్ మిలిటరీ, నావల్, ఎయిర్ఫోర్స్ అకాడమీ సబ్జెక్ట్ వ్యవధి మార్కులు ఇంగ్లిష్ 2 గంటలు 100 జనరల్ నాలెడ్జ్ 2 గంటలు 100 ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 2 గంటలు 100 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ: సబ్జెక్ట్ వ్యవధి మార్కులు ఇంగ్లిష్ 2 గంటలు 100 జనరల్ నాలెడ్జ్ 2 గంటలు 100 ఈ పరీక్షలో ప్రశ్నల క్లిష్టత ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ పదో తరగతి స్థాయిలో ఉంటుంది. అర్హత: అన్ని విభాగాలకు అవివాహితులైనవారు మాత్రమే అర్హు లు. ఇండియన్ మిలిటరీ అకాడెమీ, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. నావల్ అకాడమీకి బీటెక్/బీఈ. ఎయిర్ఫోర్స్ అకాడమీకి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి లేదా ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి మాత్రమే మహిళలు అర్హులు. వయోపరిమితి: ఇండియన్ మిలిటరీ అకాడమీ, నావల్ అకాడెమీల కోసం జనవరి 2, 1992- జనవరి 1, 1997 మధ్య, ఎయిర్ఫోర్స్ అకాడమీ పోస్టులకు జనవరి 2, 1992- జనవరి 1, 1996 మధ్య, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ (పురుషులు, మహిళలు) పోస్టులకు జనవరి 2, 1991- జనవరి 1, 1997 మధ్య జన్మించి ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష తేదీ: ఫిబ్రవరి 15, 2015. వెబ్సైట్: www.upsc.gov.in -
జయాన్ని ఖాయం చేసుకోవాలంటే..
JEE MAIN - 2015 సాంకేతిక విద్య.. నేటి ఆధునిక ప్రపంచంలో సమున్నత కెరీర్ దిశగా వెళ్లేందుకు సరైన దారి! అందుకే ఉన్నత విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ చేసి, కెరీర్ను అత్యున్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు కలలుగంటారు. ఆ కలల్ని నిజం చేసుకునేందుకు ఉత్తమ మార్గం జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ).. ఇది నిట్లు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు వీలుకల్పించే పరీక్ష. అంతేకాదు.. ఐఐటీల్లో సీటు కోసం పోటీపడాల్సిన జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత సాధించాలంటే జేఈఈ మెయిన్లో మెరుగైన మార్కులు సంపాదించాల్సిందే! తాజాగా జేఈఈ మెయిన్- 2015కు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో విజయ శిఖరాన్ని అందుకునేందుకు సీనియర్ ఫ్యాకల్టీ ఎం.ఎన్.రావు అందిస్తున్న సూచనలు... మ్యాథమెటిక్స్ మ్యాథమెటికల్ రీజనింగ్; వేరియన్స్, మీన్ డీవియేషన్; స్టాండర్డ్ డీవియేషన్లో ఆరోహణ, అవరోహణ క్రమం చాలా ముఖ్యమైనవి. మీన్ వాల్యూ థీరమ్; సెట్స్ అండ్ రిలేషన్స్; 3డీ లైన్స్-ప్లేన్స్; వెక్టార్స్ ఆల్జీబ్రా; క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్; మ్యాట్రిసెస్; ప్రమేయాల్లో రేంజ్, డొమైన్; డెఫినెట్ ఇంటెగ్రల్స్; కంటిన్యుటీ; డిఫరెన్షిబిలిటీ; మాక్సిమ-మినిమ అంశాలపై దృష్టి సారించాలి. ఇందులో ఎక్కువ మార్కులు సాధించాలంటే కాన్సెప్టులపై పట్టు సాధించాలి. ఫిజిక్స్ గత పరీక్షల సరళిని ప్రశ్నిస్తే మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీలతో పోలిస్తే ఫిజిక్స్ ప్రశ్నలు క్లిష్టంగా ఉంటున్నాయి. అయితే కాన్సెప్టులను అర్థం చేసుకుని, వాటికి సంబంధించిన ప్రశ్నలు, అనువర్తనాలు, సమస్యల్ని సాధిస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు. కరెంట్ ఎలక్ట్రిసిటీలో రెసిస్టెన్స్; ఎలక్ట్రో మ్యాగ్నటిక్ ఇండక్షన్లో సెల్ఫ్ ఇండక్షన్, మ్యాగ్నటిక్ ఫీల్డ్ ముఖ్యమైనవి. మోడర్న్ ఫిజిక్స్లో బైండింగ్ ఎనర్జీ, లాజిక్ గేట్స్, హాఫ్ లైఫ్ టైమ్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. హీట్, థర్మోడైనమిక్స్, ఆప్టిక్స్ అంశాలు కూడా ముఖ్యమైనవి. కెమిస్ట్రీ గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నల ఆధారంగా చూస్తే కెమికల్ కైనటిక్స్, న్యూక్లియర్ కెమిస్ట్రీ, సొల్యూషన్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలోని అంశాలు ముఖ్యమైనవని తెలుస్తోంది. అభ్యర్థులు వీటిపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి చాప్టర్ల వారీగా రియాక్షన్స్ను నోట్ చేసుకోవాలి. ప్రతి రియాక్షన్కు సంబంధించి దాని విశ్లేషణ, వ్యవస్థ, ఉత్పత్తులు, కావల్సిన నిబంధలను ఒక క్రమ పద్ధతిలో రాసుకోవాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, రిడాక్స్ రియాక్షన్స్, గ్రూప్స్, ప్రాక్టికల్ కెమిస్ట్రీ అంశాలపై పట్టుతో మంచి ఫలితాలు సాధించవచ్చు. మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ -
లెక్కల చిక్కులు.. రామయ్య సార్ పాఠాలు
వచ్చే వారం నుంచి మీ భవితలో.. నేటి పోటీ ప్రపంచంలో ప్రతి పరీక్షలోనూ కనిపించే విభాగం గణితశాస్త్రం. గణితంలో ఎన్నో కాన్సెప్ట్లు, మరెన్నో అప్లికేషన్లు. వాటిపై విద్యార్థుల్లో ఎన్నో భయాందోళనలు. ఇంకెన్నో అపోహలు. గణితం అంటే విద్యార్థుల్లోని భయాలను పోగొట్టి లెక్కలపై మక్కువ పెరిగేలా ప్రముఖ విద్యావేత్త, ఐఐటీ రామయ్యగా పేరొందిన చుక్కా రామయ్య మాస్టారు.. వచ్చే వారం నుంచి మీ భవితలో గణిత పాఠాలను వినూత్న విధానంలో అందించనున్నారు. రామయ్య సర్ అందించే ఈ గణిత పాఠాలు విద్యార్థుల్లోని సృజనాత్మకతను, విశ్లేషణ నైపుణ్యాలను వెలికితీసేలా ఉంటాయి. అంతేకాకుండా నేటి పోటీ ప్రపంచంలో రాణించడానికి అవసరమైన ‘అవుట్ ఆఫ్ ది బాక్స్’ థింకింగ్ను పెంపొందించడం.. నలుగురితో కలసి పనిచేయాల్సిన బృంద సంస్కృతిలో ఇమిడిపోయేలా సమస్యను మరికొంతమందితో కలిసి సమష్టిగా సాధించేలా ప్రోత్సహించడం రామయ్య మాస్టారు గణిత పాఠాల ముఖ్య ఉద్దేశం. తొమ్మిది, పది తరగతుల విద్యార్థులను ఉద్దేశించిన ఈ పాఠాలు ప్రధానంగా ప్రాబ్లమ్ ఓరియెంటెడ్గా ఉంటాయి. అంటే.. కాన్సెప్ట్ ఆధారంగా ఒక సమస్యను సాధించడం బదులు.. ఒక సమస్య పరిష్కార సాధన క్రమాన్ని వివరిస్తారు. పాఠ్యపుస్తకంలో ఒక సూత్రం లేదా సిద్ధాంతం ఆధారంగా ఉండే ఒకట్రెండు సమస్యలకు పరిమితమైతే లభించే పరిజ్ఞానం కొంతమేరకే. కానీ ప్రాక్టికల్గా ఒక ప్రాబ్లమ్ను సాధించే క్రమంలో మరెన్నో కొత్త విధానాలు, అప్లికేషన్లు తెలుసుకోవచ్చు. ఈ ప్రక్రియలో విద్యార్థులను కూడా భాగస్వాములను చేయదలిచాం. ఇందుకోసం ప్రతి వారం ఒక ప్రాబ్లమ్ను ఇస్తాం. వాటికి విద్యార్థులు జవాబులు పంపించొచ్చు. కొత్త పద్ధతిలో ఆవిష్కృతమైన పరిష్కారాలను భవితలో విద్యార్థి పేరు సహా ప్రచురిస్తాం. -
భారతీయ విద్యానిలయాలు వెలవెల!
నాణ్యమైన విద్య అందుతుందంటే చాలు.. ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లేందుకు యువత సిద్ధపడుతున్న పరిస్థితులు ఇప్పటివి! కుటుంబ ఆదాయాల్లో పెరుగుదల, రుణాల లభ్యత, అందుబాటులో ఉపకారవేతనాలు.. ఇలా వివిధ అవకాశాలు విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువులకు ద్వారాలు తెరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యకు సంబంధించి ఏ విశ్వవిద్యాలయాలు అత్యున్నతమైనవో తెలుసుకోవడంతో పాటు విద్యా వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వాలు, విద్యా సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రపంచ ర్యాంకింగ్స్ దోహదపడుతున్నాయి.. బ్రిటన్కు చెందిన విద్య, కెరీర్ సలహా సంస్థ క్వాక్వెరెల్లీ సైమండ్స్ (క్యూఎస్).. తాజాగా ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. కొలమానాలు క్వాక్వెరెల్లీ సైమండ్స్ (క్యూఎస్) ప్రపంచ విశ్వవిద్యాలయాల జాబితా తయారీకి ఆరు అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. అవి.. 1. విద్యా సంబంధ ఖ్యాతి, 2. యాజమాన్య కీర్తి, 3. విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి, 4. అంతర్జాతీయ ఫ్యాకల్టీ, 5. అంతర్జాతీయ విద్యార్థులు, 6. ఫ్యాకల్టీ- ప్రశంసలతో కూడిన వ్యక్తిగత వివరణ. ర్యాంకింగ్స్లో టాప్-200లో ఏ ఒక్క భారతీయ విద్యాసంస్థకూ స్థానం లభించకపోవడం గమనార్హం. ర్యాంకు సంస్థ దేశం 1 మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూఎస్ 2 యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ యూకే 2 ఇంపీరియల్ కాలేజీ లండన్ యూకే 4 హార్వర్డ్ యూనివర్సిటీ యూఎస్ 5 యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూకే భారత్లో ప్రపంచ ర్యాంకు సంస్థ ఆసియా ర్యాంకు 222 ఐఐటీ బాంబే 41 235 ఐఐటీ ఢిల్లీ 38 300 ఐఐటీ కాన్పూర్ 52 322 ఐఐటీ మద్రాస్ 53 324 ఐఐటీ ఖరగ్పూర్ 60 421-430 యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ 81 461-470 ఐఐటీ రూర్కీ 70 551-600 ఐఐటీ గౌహతి 95 పొరుగు దేశం చైనాకు సైతం టాప్ 100లో మూడు ర్యాంకులు దక్కాయి. నెం.1 మిట్ అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిట్).. ప్రపంచ విశ్వవిద్యాలయాల జాబితాలో ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. 2012 నుంచి జాబితాలో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. 1861, ఏప్రిల్ 10న ఏర్పాటైన దగ్గరి నుంచి విద్యా నాణ్యత, పరిశోధనల పరంగా విశ్వవిద్యాలయం ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ‘మైండ్ అండ్ హ్యాండ్’ నినాదంతో 1,030 మంది ప్రొఫెసర్లు, 779 మంది ఇతర బోధనా సిబ్బందితో నిత్యనూతనంగా, సామాజిక దృక్పథంతో కోర్సులను అందిస్తోంది. 2013-14లో వర్సిటీలోని విద్యార్థుల సంఖ్య 11,301. పరిశోధనల కోణంలో చూస్తే వర్సిటీ అనేక ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. ఇంజనీరింగ్ ప్రాక్టికల్ మైక్రోవేవ్ రాడార్, హైస్పీడ్ ఫొటోగ్రఫీ వంటి ఆవిష్కరణలు వెలుగుచూశాయి. వివిధ అంశాల్లో విశ్వవిద్యాలయం స్కోర్ (మొత్తం 100కు) అంశం స్కోర్ విద్యా సంబంధ ఖ్యాతి 100 యాజమాన్య కీర్తి 100 విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి 100 అంతర్జాతీయ ఫ్యాకల్టీ 99.80 అంతర్జాతీయ విద్యార్థులు 95.60 ఫ్యాకల్టీ- సైటేషన్స 100 భారత్లో నెం.1-ఐఐటీ బాంబే క్యూఎస్ ర్యాంకింగ్స్లో గతేడాది 233 స్థానంలో నిలిచిన ఐఐటీ బాంబే ఈసారి 222వ ర్యాంకు సాధించింది. భారత్ పరంగా చూస్తే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఐఐటీ 1958లో ఏర్పాటైంది. ఉత్తమ బోధనా సిబ్బంది, విద్యాసేవలను అందించడంలో నవ్యత, పరిశోధన ప్రాజెక్టులు ఇలా వివిధ అంశాల్లో ముందుంటూ దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థగా గుర్తింపు సాధించింది. వివిధ అంశాల్లో విశ్వవిద్యాలయం స్కోర్ అంశం స్కోర్ విద్యా సంబంధ ఖ్యాతి 66 యాజమాన్య కీర్తి 92.50 విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి 28.80 అంతర్జాతీయ ఫ్యాకల్టీ 4.60 అంతర్జాతీయ విద్యార్థులు 1.60 ఫ్యాకల్టీ- సైటేషన్స 44.30 ‘‘క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ప్రపంచంలో 222వ స్థానం, దేశంలో మొదటి స్థానం పొందినందుకు ఆనందించాల్సిన సమయమిది. విద్యా సంబంధ ఖ్యాతి (అఛ్చిఛ్ఛీఝజీఛి ఖ్ఛఞఠ్ట్చ్టజీౌ)లో 160 వ ర్యాంకు, యాజమాన్య కీర్తి లో 60వ ర్యాంకు సాధించాం. ఇంజనీరింగ్, టెక్నాలజీ ఫ్యాకల్టీ విభాగంలో ఐఐటీ బాంబే 53వ ర్యాంకు సాధించడం గర్వకారణం’’ - రష్మీ ఉదయ్కుమార్, ఏపీఐవో, ఐఐటీ బాంబే. అగ్రరాజ్యాలదే ఆధిపత్యం క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో అగ్రరాజ్యాల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. గతంలో మాదిరి ఇవి ఈసారి కూడా ఉత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నాయి. టాప్ 1, 4, 7, 8, 9, 10 స్థానాలు అమెరికా ఖాతాలో చేరగా, 2, 5 స్థానాలు యూకేకు దఖలుపడ్డాయి. ఇతర ర్యాంకుల్లోనూ ఈ రెండు దేశాలకు చెందిన యూనివర్సిటీలే ఆధిపత్యం ప్రదర్శించాయి. అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, కెమిస్ట్రీ, బయలాజికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, లింగ్విస్టిక్స్ తదితర సబ్జెక్టుల పరంగా కేటాయించిన ర్యాంకుల్లోనూ అగ్రరాజ్యాల హవా స్పష్టమైంది. సత్తా చాటిన చిన్న దేశాలు జనంలో ఘనంగా ఉన్న భారత్ తీవ్ర నిరాశకు గురిచేయగా; చిన్న దేశాలు సైతం ఉత్తమ ర్యాంకులు సాధించాయి. స్విట్జర్లాండ్లోని స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 12వ స్థానం కైవసం చేసుకుంది. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, మెక్గిల్ యూనివర్సిటీలకు వరుసగా 20, 21 స్థానాలు దక్కాయి. సింగపూర్, జపాన్, హాంకాంగ్, దక్షిణ కొరియాలు సైతం చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించాయి. బోధనా సిబ్బంది, మౌలిక వసతులు, నిధులు.. వీటిలో లోపాలే మనకు శాపాలు కనీస సౌకర్యాలు లేకున్నా, మెరుగైన విద్యను అందించే విద్యావిధానం మనది. మేధో సంపత్తిలో భారతీయులకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. విద్యా సంస్థల విషయంలో అగ్ర రాజ్యాలతో ఇక్కడి వ్యవస్థను పోల్చడం సరికాదు. వందల ఏళ్ల కిందట రూపుదిద్దుకున్న క్యాంపస్లలో అన్ని విధాలా అభివృద్ధి జరిగే ఉంటుంది. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, చైనా వంటి దేశాల విశ్వవిద్యాలయాలలో మౌలికవసతులు, నిపుణులైన సిబ్బంది, ప్రయోగశాలలు, నిధులు అన్నీ సమృద్ధిగా ఉంటాయి. ర్యాంకింగ్ నిర్ధరణలో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని లెక్కిస్తారు. ఇంటర్నేషనల్ జర్నల్స్లో పబ్లికేషన్స్ను పరిశీలిస్తే ఉదాహరణకు జపాన్లోని యూనివర్సిటీ ఆఫ్ టోక్యోలో 1000 మందికి పైగా ఫ్యాకల్టీ ఉంటారు. ఇక్కడ 70-80 మంది ఉంటారు. ఈ రెండింట్లో పబ్లికేషన్స్ను పరిశీలిస్తే చాలా వ్యత్యాసం ఉంటుంది. మన దేశంలో సరైన ఫ్యాక ల్టీ, మౌలిక వసతులు, నిధులు ఈ మూడింటిలోనూ లోపాలే మన విద్యా వ్యవస్థకు శాపాలని చెప్పొచ్చు. చైనా విద్యాసంస్థలు ముందు వరుసలో ఉండటానికి కారణం అక్కడ విద్యకు ఇస్తున్న ప్రాధాన్యమే. 2000కు ముందు అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలకు ఆ దేశం నుంచి ఒకరు లేదా ఇద్దరు ప్రాతినిధ్యం వహించేవారు. ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల ఏ సదస్సు జరిగినా చైనా నుంచి 15-20 మంది వరకు హాజరవుతున్నారు. పరిశోధన-అభివృద్ధి విషయంలో విద్యాలయాలు పూర్తిగా ప్రభుత్వ నిధులపైనే ఆధారపడాలి. ప్రైవేటు భాగస్వామ్యంతో పరిశోధనలు చేసే అవకాశం ఇక్కడ లేదు. కార్పొరేట్ సంస్థలు.. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)ను విద్యాసంస్థలకు చేరువచేస్తే కొంత వెసులుబాటు దొరుకుతుంది. విద్యాలయాలకు సరైన వనరులు ఉండి, స్వేచ్ఛ ఇచ్చి, కొత్తఆలోచనలను పలు విభాగాలు సంయుక్తంగా పంచుకునే అవకాశం ఉంటే ఉన్నతంగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. - డాక్టర్ కృష్ణన్ సుందర రాజన్, అసోసియేట్ ప్రొఫెసర్, ఐఐఐటీ-హైదరాబాద్. -
జాతికి జీవన రేఖ..యువత భవితకు వెలుగు రేఖ..
భారతీయ రైల్వే.. జాతికి జీవన రేఖగా, ఉద్యోగార్థులకు వెలుగుల మార్గంగా విరాజిల్లుతోంది. ఎప్పటికప్పుడు భారీ నోటిఫికేషన్లతో ముందుకొస్తూ యువతకు కొత్త అవకాశాలను కళ్లముందుంచుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆరు వేలకు పైగా టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఖాళీల వివరాలు, అర్హతలు , రాత పరీక్ష తదితర సమాచారంతోపాటు విజయ సాధనకు వ్యూహాలపై స్పెషల్ ఫోకస్.. భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే నియామక బోర్డుల నుంచి సెప్టెంబర్ 20న కేంద్రీకృత నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, సీనియర్ సెక్షన్ ఇంజనీర్, చీఫ్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సుదీర్ఘ సమయం తర్వాత ఇంజనీరింగ్ డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులకు వచ్చిన సువర్ణ అవకాశమిది. ఆకర్షణీయ వేతనాలు, భత్యాలతో సుస్థిర కెరీర్ను సొంతం చేసుకునేందుకు మంచి తరుణమిది. అర్హత: సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (ఎస్ఎస్ఈ) గ్రూపు ఉద్యోగాలకు సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స, ఇన్స్ట్రుమెంటేషన్ తదితర బ్రాంచ్ల్లో బీఈ లేదా బీటెక్.జూనియర్ ఇంజనీర్ (జేఈ) గ్రూపు ఉద్యోగాలకు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స, ఇన్స్ట్రుమెంటేషన్ తదితర బ్రాంచ్ల్లో డిప్లొమా ఉండాలి.కొన్ని పోస్టులకు ఇంజనీరింగ్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్ కాకుండా ఇతర కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు. ఉదాహరణకు జూనియర్ ఇంజనీర్ (ఐటీ) పోస్టులకు గుర్తింపు పొందిన సంస్థ నుంచి పీజీడీసీఏ/బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్)/బీసీఏ/డీవోఈఏసీసీ-ఎ లెవెల్ సర్టిఫికెట్ లేదా తత్సమాన కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు.కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఉద్యోగానికి మెటలర్జీ/కెమికల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులతో పాటు ఎంఎస్సీ కెమిస్ట్రీ లేదా అప్లయిడ్ కెమిస్ట్రీ పూర్తిచేసిన వారు కూడా అర్హులే.మొత్తం 77 కేటగిరీల పోస్టులున్నాయి. వీటిలో ఉద్యోగం స్వభావాన్ని బట్టి ప్రత్యేక బ్రాంచ్లో గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా/ ఇతర అర్హతను నిర్దేశించారు. దరఖాస్తు చేసుకునే ముందు వీటిని పరిశీలించాలి. వయో పరిమితి: ఎస్ఎస్ఈ ఉద్యోగాలకు 2015, జనవరి 1 నాటికి 20-35 ఏళ్ల వయసుండాలి. జేఈ ఉద్యోగాలకు 2015, జనవరి 1 నాటికి 18-33 ఏళ్ల వయసుండాలి. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 13 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 15 ఏళ్లు, ఇతర పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తిగా రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. చివర్లో వైద్య పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి. రాత పరీక్ష విధానం: విభాగం ప్రశ్నలు 1. టెక్నికల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ 90 2. జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 60 మొత్తం 150 ప్రశ్నపత్రం బహుళైచ్చికాలతో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. రెండు గంటల్లో సమాధానాలు గుర్తించాలి. నెగిటివ్ మార్కులుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు.ఇంగ్లిష్/హిందీ/ఉర్దూ లేదంటే స్థానిక భాషను మాధ్యమంగా ఎంపిక చేసుకోవచ్చు. ముఖ్య అంశాలు యర్ ఇంజనీర్ గ్రూపు పరీక్ష తేదీ: డిసెంబర్ 14, 2014 సీనియర్ ఇంజనీర్ గ్రూపు పరీక్ష తేదీ: డిసెంబర్ 21, 2014 పరీక్ష ఫీజు: అన్రిజర్వ్డ్/ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.100. మిగిలిన వారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్లైన్/ఆఫ్లైన్లో ఫీజు చెల్లించొచ్చు.ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.అభ్యర్థులు ఏదైనా ఒక ఆర్ఆర్బీకి దరఖాస్తు చేసుకోవాలి. ఎస్ఎస్ఈ, జేఈలకు రెండింటికీ అర్హత ఉంటే విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష కేంద్రాలు: ఆర్ఆర్బీ సికింద్రాబాద్కు దరఖాస్తు చేసుకుంటే సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, తిరుపతిలో పరీక్ష రాయొచ్చు. వెబ్సైట్: rrbsecunderabad.nic.in ప్రిపరేషన్ ప్రణాళిక 90 మార్కుల విభాగం:జనరల్ సైన్స్: సీనియర్ సెక్షన్ ఇంజనీర్ గ్రూపు పరీక్షలో జనరల్ సైన్స్కు సంబంధించి ఇంటర్ స్థాయి ప్రశ్నలుంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్రాథమిక భావనలపై అవగాహన పెంచుకుంటే ప్రశ్నలకు తేలిగ్గానే సమాధానాలు గుర్తించొచ్చు. జేఈ పరీక్షకు అయితే పదో తరగతి స్థాయిలో ప్రశ్నలుంటాయి. టెక్నికల్ ఎబిలిటీ: ఎస్ఎస్ఈ ప్రశ్నపత్రంలో సివిల్; మెకానికల్; ఎలక్ట్రికల్; ఎలక్ట్రానిక్స్; కంప్యూటర్స్; ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్; ఇన్స్ట్రుమెంటేషన్, మెజర్మెంట్, ఇంజనీరింగ్ డ్రాయింగ్/గ్రాఫిక్స్పై ప్రశ్నలుంటాయి. జేఈకి కూడా ఇవే అంశాలపై ప్రశ్నలుంటాయి కానీ కాస్త తక్కువ స్థాయిలో ఉంటాయి. ఉద్యోగ సాధనకు మంచి స్కోర్ సాధించాలంటే ఏదైనా ఒక బ్రాంచ్కు చెందిన విద్యార్థి మరికొన్ని ఇతర బ్రాంచ్లకు సంబంధించిన అంశాలపైనా పట్టుసాధించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మెకానికల్ గ్రాడ్యుయేట్కు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్కు సంబంధించిన ప్రశ్నలు కష్టంగా ఉంటాయి. అందువల్ల ఓ ప్రణాళిక ప్రకారం సిలబస్ను అనుసరించి వివిధ సబ్జెక్టుల్లోని ముఖ్యమైన భావనలపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలి. ఎలక్ట్రికల్లో ఎలక్ట్రికల్ మెషీన్స్, పవర్ సిస్టమ్స్, బేసిక్ సర్క్యూట్ల అంశాలను క్షుణ్నంగా నేర్చుకోవాలి. ఎలక్ట్రానిక్స్లో ఎలక్ట్రానిక్ డివెసైస్, సర్క్యూట్లు, కమ్యూనికేషన్ అంశాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. కంప్యూటర్స్కు సంబంధించి C, Java, DBMS తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. సివిల్లో Strength of Materials, Fluid Mechanics, Surveying అంశాలు ముఖ్యమైనవి. మెకానికల్లో థర్మోడైనమిక్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్, హీట్ ఇంజిన్స్ అంశాలు ప్రధానమైనవి.- ఇన్స్ట్రుమెంటేషన్లో Transducers, Control systems అంశాలు ముఖ్యమైనవి. 60 మార్కుల విభాగం: అర్థమెటిక్: న్యూమరికల్ ఎబిలిటీ, టైమ్-డిస్టెన్స్-స్పీడ్, యావరేజ్, రేషియో, పర్సంటేజీ, ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్స్ వంటి అంశాలపై దృష్టిసారించాలి.జనరల్ అవేర్నెస్: అవార్డులు-విజేతలు, ముఖ్యమైన తేదీలు, పుస్తకాలు-రచయితలు, ముఖ్యమైన వ్యక్తులు, భారత భౌగోళికశాస్త్రం, క్రీడలు, సైన్స్-టెక్నాలజీ, సాహిత్యం, వర్తమాన వ్యవహారాలను చదవాలి. ఈ ప్రశ్నలన్నీ జ్ఞాపకశక్తిని పరీక్షించేలా ఉంటాయి.జనరల్ ఇంటెలిజెన్స్: ఈ విభాగంలో అభ్యర్థి తార్కిక, వివేచనాత్మక శక్తిని పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. అభ్యర్థులు సిరీస్, కోడింగ్-డీకోడింగ్, డెరైక్షన్స్, లాజికల్ సీక్వెన్స్, నంబర్ సిరీస్, అనాలజీ, ర్యాంకింగ్స్ తదితర అంశాల సమస్యల్ని ప్రాక్టీస్ చేయాలి.రీజనింగ్ ఎబిలిటీ: పజిల్స్, కాస్ అండ్ ఎఫెక్ట్, బ్లడ్ రిలేషన్స్, మేకింగ్ జడ్జ్మెంట్స్, అనలైజింగ్ ఆర్గ్యుమెంట్స్ తదితర అంశాలపై దృష్టిసారించాలి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ విభాగాలకు ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకాలు ఉపయోగపడతాయి. సూచనలు సిలబస్పై పూర్తిగా అవగాహన పెంపొందించుకోవాలి. తర్వాత ప్రామాణిక మెటీరియల్ను సేకరించుకోవాలి. చదివిన అంశానికి సంబంధించిన ప్రశ్నలను సేకరించి, ప్రాక్టీస్ చేయాలి.బ్యాంకింగ్ పరీక్షలకు సంబంధించిన మోడల్ పేపర్లలో అర్థమెటిక్, రీజనింగ్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి.ప్రిపరేషన్లో కొంత సమయాన్ని గ్రూప్గా చదవడానికి కేటాయించాలి. దీనివల్ల తెలియని అంశాలపై పట్టు సాధించేందుకు అవకాశముంటుంది.గత ప్రశ్నపత్రాలను సేకరించి, ప్రశ్నల స్థాయిని అర్థం చేసుకొని దానికనుగుణంగా ప్రిపరేషన్ను మలచుకోవాలి.ఇంజనీరింగ్ బ్రాంచ్ సబ్జెక్టుల్లోని ప్రాథమిక సూత్రాలను ఒకచోట రాసుకొని, వాటిని పునశ్చరణ చేస్తుండాలి.సమయ పాలన అలవడటం కోసం నమూనా ప్రశ్నపత్రాలను సాధిస్తుండాలి.అన్ని బ్రాంచ్ల్లో కంటే మెకానికల్ బ్రాంచి నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.రోజులో టెక్నికల్ సబ్జెక్టుకు కనీసం 4 గంటలు, ఇతర విభాగాలకు 3 గంటలు కేటాయించాలి. ప్రిపరేషన్కు పటిష్ట ప్రణాళిక అవసరం ప్రస్తుత నోటిఫికేషన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు, డిప్లొమా పూర్తి చేసిన వారికి అద్భుత అవకాశమని చెప్పొచ్చు. అభ్యర్థులు జనరల్ సైన్స్, జనరల్ టెక్నికల్ ఆప్టిట్యూడ్ అంశాలపై దృష్టికేంద్రీకరించాలి. గత నోటిఫికేషన్లతో పోల్చితే ప్రస్తుత పరీక్షకు సిద్ధమయ్యేందుకు తక్కువ సమయం ఉంది. అందువల్ల పటిష్ట ప్రణాళికతో చదవాలి. చివర్లో 15 రోజులను రివిజన్కు కేటాయించాలి. పరీక్షలో విజయం సాధిస్తే మంచి కెరీర్ సొంతమవుతుంది. జేఈకి అయితే శిక్షణ పూర్తయ్యాక నెలకు దాదాపు రూ.30 వేలు, అదే ఎస్ఎస్ఈకి అయితే రూ.40 వేలు అందుతుంది. ఐదేళ్ల తర్వాత డిపార్ట్మెంటల్ పరీక్షలో విజయం సాధించి గ్రూప్-బి స్థాయి ఉద్యోగాలను చేజిక్కించుకునే అవకాశముంటుంది - జి.ఎ.వి.ప్రసాద్, జేఈ/మెకానికల్, ఈస్ట్కోస్ట్ రైల్వే. రిఫరెన్స్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్ - ఆర్కే జైన్ వి.కె.మెహతా సివిల్ ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్ రంగాచారి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్ రాజ్పుట్ కంప్యూటర్ సైన్స్ ఆబ్జెక్టివ్- థిమోతీ -
సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్-1
1. Identify the correct sequence in which the following Deputy Prime Ministers were appointed in India? i) Sardar Vallabhbhai Patel ii) Ch. Devi Lal iii) Ch. Charan Singh iv) Morarji Desai a) i, ii, iv, ii b) i, iv, ii, iii c) iv, i, ii, iii d) i, iv, iii, ii 2. Who of the following constituted an oligarchy within the Constituent Assembly of India? a) Nehru, Patel, Prasad, Azad b) Ambedkar, B.N.Rao, K.M.Munshi, Nehru c) Patel, Azad, Munshi, Ambedkar d) Krishnamachari, Pannikar, Nehru, Patel 3. In order to ensure free and fair elections and to conduct all elections to the Panchayats, the power is vested with a) Chief Election Commissioner of India b) Chief Minister of the State c) State Election Commission d) Chief Secretary of the State 4. Assertion (A): The President of India is the Constitutional Head of the State Reason (R): All powers are vested in the Council of Ministers headed by the Prime Minister Select the correct answer from the codes given below: a) Both (A) and (R) are true and (R) is the correct explanation of (A) b) Both (A) and (R) are true, but (R) is not the correct explanation of (A) c) (A) is true, but (R) is false d) (A) is false, but (R) is true. 5. Consider the following statement about the Union Public Service Commission i) President has the authority to decide about the composition of the Commission. ii) President also has the authority to determine the conditions of services of chairman and members of commission iii) President can also determine the ground or circumstances over which the chairman and members of commission can be removed Which among the above is/are not correct? a) i and ii only b) iii only c) i only d) ii only 6. Consider the following statements about the recently notified 14th Finance Commission and select the correct answer. i) 14th Finance Commission will be headed by Y.V.Reddy and will have three fulltime members ii) The commission will devise a formula for sharing of taxes and grants bet-ween the Centre and States for a five year period from April 1, 2015 to 2020 iii) Term of reference of commission includes recommending measures to generate revenue surpluses for capital investment as well as potential for additional resource mobilization to improve the tax to GDP ratio. iv) It will also look into the impact of the proposed goods and service tax and suggest a mechanism to compensate for any revenue loss. a) i, ii and iii b) ii, iii and iv c) i, iii and iv d) All of the above 7. Which of the following is not a part of the mandate for the National Commission for Scheduled Castes? a) To inquire into Specific complaints re-lating to rights and safeguards of SCs. b) To take action against the perpetrators of violation of the rights and safeguards of the SCs. c) To participate and advise in the planning process relating to the socio-economic development of the SCs d) To submit an annual report to the President on these matters. 8. A Bill becomes an Act after being duly passed by both the houses of Parliament and given an assent by the President. According to the Indian Constitution the President has the veto power over the Bills passed by the Parliament. Match the following. List A (Veto Powers) A. Absolute Veto B. Suspensive veto C. Pocket veto List B (Provisions) I. President returns the Bill or part of it for the reconsideration II. President is withholding the assent to a Bill. III. President is not taking any action for an indefinite time. a) A-II, B-I, C-III b) A-I, B-II, C-III c) A-II, B-III, C-I d) A-I, B-III, C-II 9. Consider the following statements regarding the formation of new state or altering the boundaries of an existing State. A. No Bill for a purpose can be introduced except on the recommendation of the President. B. The President shall, before giving his recommendation, refer the bill to the legislative of the state which is going to be affected by the changes proposed in the bill for expressing its views on the changes. C. The legislative of the state should express its views within the period specified by the President. D. the President is bound by the views of the State Legislature Which of the above statement is/are correct? a) A, B and C b) A and B only c) B only d) All of them 10. In which of the following important matters both the Houses (Rajya Sabha and Lok Sabha) enjoy equal powers? I. Election and impeachment of the President. II. Election and impeachment of the Vice-President III. Approving the Proclamation of emergency and the proclamation regarding failure of constitutional machinery in States Select the correct answer from below a) Only I and II b) Only I and III c) Only II and III d) All I, II, III 11. The Council of Ministers and Cabinet are often used interchangeably though there is a definite distinction between them. Which of the following is NOT true about the Council of Ministers? I. The Council of Ministers is collectively responsible to the Lower House of the Parliament. II. It deals with all major legislative and financial matters III. It is a constitutional body, dealth in detail by the Article 74 and 75 of the Constitution IV. It was inserted in the Article 352 of the Constitution in 1978 by the 44th Constitutional Amendment Act. Select the correct answer from below a) Only I, II, and III b) Only II and IV c) Only I, II and IV d) All of the above 12. Which of the following statement is/are correct? A. An amendment of the Constitution may be initiated only by the introduction of a Bill for the purpose in either House of the Parliament B. The previous sanction of the President is required for introducing in Parliament any bill for amendment of the Constitution C. In some specific constitutional amendments, the amendment requires to be ratified by the States by resolution to that effect passed by those legislatures before, the Bill is presented to the President for assent. a) A and B only b) A and C only c) B and C only d) All of them 13. According to the Right to Information Act 2005, there is a provision under which the Act is not applicable to certain organisations specified in the second schedule of the act. These organisations could be... a) Organisations which are very sensitive in nature and are making secret investigations regarding corruption related cases. b) Organisations which have been given the responsibility of getting the trail of Swiss Bank accounts and investigating the FERA cases c) Organisations which are established for intelligence and security work. d) All the above 14. Consider the following statements A. The Attorney General of India has the right to speak in the House of the Parliament or in any Committee thereof, and also has the right to vote. B. He is entitled to the privileges of a member of a Parliament in the performance of his official duties. C. The Attorney General must have the same qualifications as are required to be a judge of the Supreme Court. Which of the above statement is/ are correct? a) A and B only b) A and C only c) B and C only d) All of them 15. Consider the following statements A) Women and children B) Socially and educationally backward classes C) SC's and ST's D) physically handicapped Protective Discrimination under article 15 of the constitution extends to which of the above classes of persons? a) A, C b) A, B c) A, B, C d) A, B, C, D 16. According to the Constitution 73rd amendment act, the chairperson of the Panchayat at the intermediate and district level will be a) Directly elected b) Indirectly elected c) It is left to the decision by the concerned state legislature d) In accordance with the decision of the state government 17. Consider the following 1. National Emergency can be imposed in a part or whole of India. 2. National Emergency can be withdrawn from a part of India 3. National Emergency can be reimposed even when the country is already in a state of emergency 4. National emergency can be approved every 6 months by Parliament as per 44th amendment. Which of the above are true with respect to National Emergency? a) 1, 3 b) 1, 3, 4 c) 1, 2, 3 d) 1, 2, 3, 4 18. Which of the following unique combinations are found in the Indian Constitution? A. Parliamentary form of government B. Written constitution C. Judicial Review D. Republic a) A, B b) A, C c) A, D d) All in one 19. Match the following List I List II (Article) (Feature) A) 248 1. State Finance Commission B) 243 I 2. Residuary Power of the union C) 148 3. Administration of union territories D) 239 4. Office of CAG Codes: A B C D a) 1 2 4 3 b) 2 1 3 4 c) 2 1 4 3 d) 2 4 3 1 20. Which one of the following Organization helps the budget division in the process of consolidation of the budget data? a) National Sample Survey Organization b) Central Statistical Organization c) The National Informatics Center d) Institute of Media studies 21. The decline in cash flows of Corporate in recent years could be attributed to a) Sluggish demand conditions b) High input cost c) Delays in collection of receivables after delivery of goods d) All of the above 22. High inflation in the last few years, particularly food inflation in India has been the result of a) Low import of food grains b) Structural and seasonal factors c) Failure of monsoons d) Decline in the area under food grains 23. Which one of the following is a reason for reduced trade deficit and Lower Current Account Deficit during 2013-14? a) Demand slow down and restrictions on non-essential imports b) Demand slow down and restrictions on exports c) Demand slow down and restrictions on essential imports d) Demand slow down and removing restrictions on imports 24. Real GNP per capita in a nation is affected by I The quantity and quality of resources under the nations command II how efficiently the nation uses its res-ources in producing goods and services III the size of the dependent population Which of the following is correct? a) III only b) I and II only c) I and III only d) I, II and III 25. Which of the following is not a basic function of money a) Medium of exchange b) Store of value c) Unit of account d) Measure of economic status of a country 26. The term underground economy refers to a) The subway system b) Market activity not reported to the government c) The coal mining industry d) All Ore Mining 27. Laws, customs, conventions and other institutional elements that sustain an economy fall under the category of a) Rules of the game b) Human Capital c) Natural resources d) Capital infrastructure 28. A trend in developing countries is that a) The birth rate furring a typical woman's lifetime has increased from three to six children b) Attitudes toward family size are changing c) As women become better educated, they earn less d) As women become less educated, they tend to have fewer children 29. Soft budget constraints will lead to a) Quick responses to changes in supply and demand b) Good investment decisions c) Inefficiency d) High product quality 30. A problem for developing countries is that the prices of primary products fluctuate more widely than do the prices of finished goods because a) Crop supply changes very little despite the weather b) Crop supply fluctuate with the weather c) Weather never varies d) Crop demand fluctuates with the weather 31. The yeardstick most often used to compare living standards across nation is a) Average production cost per unit b) Sales revenue per month c) Output per capita d) Imports per year 32. The difference between a specific tariff and an ad valorem tariff is that a specific tariff a) Is a set amount of money per unit of a product, while an ad valorem tariff is a set per centage of product price b) Is a set per centage of product price, while an ad valorem tariff is a set amount of money per unit of a product c) Applies only to imports, while an ad valorem tariff applies only to exports d) Sets a strict quota limit on the amount one individual can purchase, while an ad valorem tariff sets no such limit. 33. To review Tendulkar's methodology on poverty an expert group was set up by the Planning Commission under the chairmanship of a) Abhijit Sen b) Rangarajan c) Padmanabhan d) Y.V.Reddy 34. Which of the following is not classified as a service in the current account? a) Transportation b) Tourist expenditures c) Income earned from foreign investments d) Unilateral transfers 35. Which one of the following is not true? a) An exchange rate is the price of one currency in terms of another b) An exchange rate is the means by which the price of a good in one country is translated into the price to the buyer in another country c) The exchange rate will affect the willingness of the foreign buyers and sellers to trade with each other d) The exchange rate is the price of a currency in terms of another currency for exchanges of goods and services but not for financial transactions 36. RuPay has been developed by a) Reserve Bank of India b) National Payment Corporation Limited c) Public Accounts Committee d) The Comptroller and Auditor General 37. Which of the following group was declared as most valuable brand in 2014 by Brand Finance Global 500? a) Reliance Group b) Adani Group c) Tata Group d) GMR group 38. Which one of the following is called 'Pearl of the Antilles'? a) Rowlatt act b) Formation of Swaraj Party c) Fast unto death by Mahatma Gandhi d) Formation of Home Rule League by Tilak 39. Arrange the following Governor General in ascending order of their period? I) Marques of Hastings II) Lord Cornwallis III) George Barlow IV) Lord Amherst a) II, III, I, IV b) I, II, IV, III c) III, IV, II, I d) II, I, III, IV 40. Arrange the following in Chronological order? I) Cripps Mission II) Simon Commission III) Cabinet Mission IV) Wavell Plan a) III, II, I, IV b) II, I, IV, III c) II, IV, III, I d) II, I, III, IV 41. William Bentinck annexed following states. Arrange them in ascending order with respect to the years of their annexation? I) Cachar II) Coorg III) Jaintia IV) Mysore a) 4, 1, 2, 3 b) 4, 2, 1, 3 c) 2, 1, 4, 3 d) 1, 2, 3, 4 42. Which one is wrong about Amir Khusrow? a) He was nicknamed as the 'Parrot of India' b) He wrote the 'Tughlqnama' c) He created a new style of Persian which came to be called the ' Sabak-i-Hindi' or the style of India d) He was the court poet of Balban 43. The Graeco-Roman merchants visiting South India during Sangam Age were referred to in the Tamil literature as? a) Romans b) Yavanas c) Videshes d) None of the above 44. Match List-I with List-II and select the answer from the codes given below List-I I) Purna Kassapa II) Gosala Maskariputra III) Ajita Kesakambali IV) Paduka Katyayana List-II A) Samkhya School B) Ajivika Sampradaya C) Charvaka School D) Valsheshika School a) I-A, II-B, III-C, IV-D b) I-B, II-C, III-A, IV-D c) I-C, II-D, III-B, IV-A d) I-D, II-C, III-A, IV-B 45. Match List-I with List-II and select the answer from the code given below? List-I I) Abdur Razzaq II) Numiz III) Marco Polo IV) Ibn Battuta V) Niccolo Conti List-II A) An Italian, visited Kakatiya Kingdom during the reign of Rudrama Devi B) An Italian, visited Vijayanagar during the reign of Devaraja II C) Persian, visited Vijayanagar during Devaraja II D) Moroccan, visited Vijayanagar during the reign of Harihara I E) Portuguese, visited Vijayanagar during the reign of Achyutaraya a) I-C, II-E, III-A, IV-D, V-B b) I-E, II-C, III-D, IV-A, V-A c) I-A, II-B, III-D, IV-C, V-E d) I-B, II-A, III-E, IV-D, V-C 46. Match List-I with List-II and select the correct answer using the codes given below the lists? List-I I) Udranga II) Uparika III) Visti IV) Vithi List-II A) State Official B) A type of land tax C) Territorial division D) Forced labour E) Administrative department Codes: a) I-D, II-E, III-B, IV-C b) I-B, II-A, III-D, IV-C c) I-B, II-D, III-C, IV-E d) I-C, II-D, III-A, IV-B 47. Match List-I with List-II and select the correct answer using the codes given below the lists? List-I I) Langahs II) Muzaffarid III) Jams IV) Karranis List-II A) Thattah B) Gujarat C) Multan D) Bengal a) I-D, II-C, III-A, IV-B b) I-B, II-C, III-A, IV-D c) I-C, II-B, III-A, IV-D d) I-A, II-B, III-D, IV-C 48. Match the following and select the answer from the code given below? I) Itimad-ud-Daula's Tomb II) Humayun's Tomb III) Akbar's Tomb IV) Tomb of Aurangzeb's Wife A) 'Forerunner' of the Tajmahal B) Begining of the use of white marble by the mughals C) Influence of Buddhist Vihara D) Replica of the Taj Mahal a) I-A, II-B, III-C, IV-D b) I-B, II-C, III-D, IV-A c) I-C, II-D, II-A, IV-B d) I-D, II-C, III-B, IV-A 49. Match the following theories and Propounders about the origin of congress, and select the answer from the code given below I) Mysterious origin Theory II) Dufferin's Authorship Theory III) Dufferin's - Hume Conspiracy theory IV) Safety-Valve Theory A) Lajpat Rai B) R.P. Dutta C) W.C. Banerjee D) Pattabhi Sitarmayya a) I-A, II-B, III-C, IV-D b) I-B, II-C, III-D, IV-A c) I-C, II-D, III-A, IV-B d) I-D, II-C, III-B, IV-A 50. Match the following List-I I) Comrade II) Al Hilal III) The Indian Musalman IV) Leader List-II A) Madan Mohan Malaviya B) WW Hunter C) Abul Kalam Azad D) Maulana Mohammad Ali a) I-A, II-B, III-C, IV-D b) I-D, II-C, III-B, IV-A c) I-B, II-C, III-D, IV-A d) I-C, II-D, III-A, IV-B 51. Consider the following statements in the Context of Dara Shikoh? I) He began as an orthodox but ended up as a liberal sufi II) He had several Sanskrit works translated into persian III) He wrote a biography of Muslim Saints a) I, II, and III are correct b) I and II are correct c) I and III are correct d) II and III are correct 52. Consider the following statements? The policy of trade followed by the British government proved ruinous to the Indian economy on account of I) Tough competition from foreign goods II) Enormous increase in imports III) Rise in the prices of raw materials IV) Increased production of cash crops like jute a) I, II and IV are correct b) I, II and III are correct c) II and IV are correct d) I, II and IV are correct 53. Coral Reefs are developed in 1. Tropical seas and oceans 2. Shallow seas and oceans 3. Tropical seas and oceans of high salinity a) 1 only b) 1, 2 c) 2, 3 d) All 54. Performance of Indian Mansoon is influenced by 1. Temperature and pressure changes in Equatorial Indian ocean 2. Elnino 3. Summer surface Temperatures of Tibetan Plateau a) 2 only b) 1, 2 c) 2, 3 d) All the above 55. Identify the correct pair (s) 1. Yazudis: Northern Iraq 2. Kurds: Northern Iraq 3. Tauregs: Iranian Plateau a) 1 only b) 1, 2 c) 2, 3 d) All 56. Which of the following are not part of Western Ghats ecosystem 1. Siruveni 2. Silent valley 3. Valley of flowers a) 1 only b) 1, 2 c) 3 only d) 1, 3 57. Match the following A. AGPL B. Radcliffline C. MC Mohan Line D. Indira Point 1. Arunachal Pradesh 2. Great Nicobar 3. Gujarath 4. J&K A B C D a) 4 3 1 2 b) 4 3 2 1 c) 3 4 2 1 d) 3 4 1 2 58. Rich reserves of this mineral are concentrated in Eastern Ghats of India. It is known for malleability. It’s processing requires large quantity of Electricity. This description best suites. a) Sphalerite b) Bornite c) Bauxite d) Galena 59. Which of the following tree species are not found in Taiga ecosystems. 1. Pine 2. Fir 3. Spruce 4. Cedar a) 1,2 b) 3 c) 3,4 d) None 60. Identify the areas associated with Nonconventional energy in India from out of the following. 1. Kalba Devi 2. Pugga Valley 3. Viznijam a) 2 only b) 3 only c) 2,3 d) All 61. Consider the following statements. 1. Level of urbanisation of India is less than that of Asian Average. 2. Level of urbanisation of India is less than that of African average. 3. Level of urbanisation of India is less than that of world average which of the above are correct a) 3 only b) 3, 2 c) All d) None 62. Arrange the following Threatened / Endangered species in the North - South direction in order of the location of their Habitat 1. Lion tailed Macaque 2. One Horned Rhino 3. Wild Ass 4. Pine Marten a) 4,2,3,1 b) 4,2,1,3 c) 2,4,1,3 d) 2,4,3,1 63. Which of the following about Thar desert are true. 1. Dominance of seifs 2. Occurrence of saline lakes in Bagar. 3. Formed in the Pleistocene period. a) 1 only b) 1,2 c) 2 only d) All 64. Moving away from coal to other fuels is not easy and possible for Indian economy immediately because. 1. India’s Coal reserves are huge. 2. Indian Coal is of best quality High Grade cooking Variety. 3. Oil and Natural Gas reserves are scarce. 4. Non conventional energies are not commercialised. a) 1, 3 b) 1, 2, 3 c) 1, 3, 4 d) All 65. Which of the following are the problems of water resources in India. 1. Inadequacy 2. Inability to store 3. Pollution 4. Wastage during use a) 1, 2 b) 2, 3, 4 c) 1, 2, 3 d) All 66. Gond tribes spread over 1. Telangana 2. Chattisgarh 3. Maharashtra 4. Orissa a) 1, 2 b) 2, 3 c) 1, 2, 3 d) All 67. Which of the following crops require water logging 1. Paddy 2. Sugar Cane 3. Cotton a) 1 only b) 1, 2 c) All d) None 68. From which of the following regions, many rivers originate and drain out in different directions. a) Nanda Devi peak b) Siachen glacier c) Kailas Ranges d) Mishmi Ranges 69. Consider the following statements.. 1. HIV transmission cannot take place through breast feeding 2. HIV is an enveloped and lentivirus Which of statements is/are true.. a) 1 only b) 2 only c) Both 1& 2 d) Neither 1 nor 2 70. The information system developed on TB patients a) Nikshay b) Indus c) Bharosa d) Nirbhay 71. The defluoridation technique called Nalgonda Technique was developed by a) Central Electronic Engineering Research Institute b) National Environmental Engineering Research Institute c) Central Mechanical Engineering Research Institute d) Indian Institute of Chemical Technology 72. Match the following Reactor site A) Chhaya mithivirdi B) Bargi C) Jaitapur D) Haripur State 1) West Bengal 2) Gujarat 3) Madhya Pradesh 4) Maharashtra A B C D a) 3 4 2 1 b) 1 2 3 4 c) 2 3 1 4 d) 2 3 4 1 73. What is slogan of 2014 World TB Day.. a) Reach the 3 million: Find, Treat, Cure TB b) Reach the 9 million: Find, Treat, Cure TB c) Raise the voice against TB d) Stop TB 74. The method of immobility Nuclear Waste in glass matrix a) Enrichment b) Vitrification c) annealing d) matrix ceiling 75. The effect of radiation on humans is measured in the unit. a) millicurie b) becquerel c) millisieverts d) None of these 76. Consider the following statements.. 1) India's Indigenous cryogenic engine was first tested successfully onboard GSLV-D3 2) Such cryogenic engine was developed by Liquid Propulsion System Centre. Which of these statements is/are true a) only 1 b) only 2 c) Both 1&2 d) Neither 1 nor 2 77. Which of these elements is called Brimstone a) Fluorine b) Oxygen c) Bromine d) Sulphur 78. Which of following animals exhibit bioluminescence a) palolo worm b) Glow worm c) noctiluca d) All of these 79. The atomic theory was first explained in a) samkhya b) vaiseshika c) Nyaya d) Yoga 80. The virus responsible for severe birdflu epidemic in China in recent years.. a) H1N1 b) H5N1 c) H7N9 d) H1N2 81. Which of the following is a completely aquatic mammal a) Walrus c) Otter d) Beaver d) Dugong 82. Which of the following amphibian male exhibits remarkable parental care behaviour a) Rhacophorus b) Alytes c) Tiger salamander d) Hyla 83. Which of the following animals show discontinuous distribution.. a) Flightless birds b) Lungfish c) Marsupials d) All of these 84. The reasons for long shelf life of Honey a) low water and high sugar content b) low sugar and high water content c) presence of microbicidal chemicals d) presence of antibiotics 85. Which of the following animal/plant are threat to indigenous biodiversity a) Parthenium b)Lantana c) Blue bar pigeon d) All of these 86. Which of the following is a non-fissile material a) Uranium-238 b) Uranium-235 c) Uranium-233 d) Plutonium-239 87. Match the following.. A) Pyrolusite 1) Lead B) Rutile 2) Mercury C) Cinnabar 3) Titanium D) Galena 4) Manganese A B C D a) 1 2 3 4 b) 4 3 2 1 c) 3 4 1 2 d) 4 3 1 2 88. The traditional female sea diver of Japan is called a) Ama b) LIngha c) Miki d) Norio 89. With reference to Kasturirangan committee report on Western Ghats, Cultural landscape is a) landscape not affected by humans b) Landscape inhabited by indigenous tribes c) Landscape afftected by humans d) Landscape outside protected areas 90. The transitional zone between two ecosystems a) Ecozone b) Ecotone c) Ecological Niche d) Ecological footprint 91. The Ecological adaptation in which animals in temperate zones have smaller extremities a) Gloger's rule b) Bergmann's rule c) Jordan's rule d) Allen's rule 92 Out of the 17 megadiversity countries identified India stands a) 7th b) 10th c) 12th d) 14th 93. The biodiversity hotspot "Succulent Karoo' is located in a) Africa b) North America c) South America d) Europe 94. The state animal of Tamil Nadu a) Sambar b) Gaur c) Nilgiri Tahr d) Blackbuck 95. Which harmful chemical in packaging materials is affecting human biological system a) Diethylhexyl fumarate b) Polychlorinated biphenyls c) biphenyl d) polyaromatic hydrocarbons 96. The sacred Khecheopalri lake is located at a) Mizoram b) Sikkim c) Meghalaya d) Manipur 97. The International convention to prevent and control transboundary movement of hazardous substances a) Bonn convention b) Stockholm convention c) Basel convention d) Ramsar convention 98. A very good example of ex-situ conservation a) National park b) sanctuary c) Botanical garden d) Conservation reserve 99. India's first Post Office Saving Bank ATM was inaugurated in which of the following city recently a) Hyderabad b) Chennai c) Bengaluru d) New Delhi 100. Which of the following is most likely to happen during a recession? a) Decrease in inventory b) Producers will be cautiously optimistic c) Capacity under utilization d) Expansion in bank credit key 1) d 2) a 3) c 4) c 5) a 6) d 7) b 8) a 9) a 10) b 11) a 12) b 13) d 14) d 15) c 16) c 17) c 18) d 19) a 20) c 21) d 22) b 23) a 24) b 25) d 26) b 27) a 28) b 29) c 30) b 31) d 32) a 33) b 34) d 35) d 36) b 37) c 38) c 39) a 40) b 41) a 42) d 43) b 44) a 45) a 46) b 47) c 48) a 49) d 50) a 51) d 52) d 53) b 54) d 55) b 56) c 57) a 58) c 59) d 60) d 61) c 62) a 63) c 64) c 65) b 66) c 67) b 68) c 69) c 70) a 71) b 72) d 73) a 74) b 75) c 76) b 77) d 78) d 79) b 80) c 81) d 82) b 83) d 84) a 85) d 86) a 87) a 88) a 89) c 90) b 91) d 92) a 93) a 94) c 95) a 96) b 97) c 98) c 99) b 100) c -
ఎన్టీఎస్ఈతో ప్రతిభకు పట్టం.. ఉన్నత విద్యకు ఉపకారం..
జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ).. దేశంలో పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గనిర్దేశనం చేస్తూ కీలక పాత్ర పోషిస్తున్న సంస్థ. ఇదంతా ఒక ఎత్తయితే మరోవైపు పదో తరగతి స్థాయిలో ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి, వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్టీఎస్ఈ)ను నిర్వహిస్తోంది. తాజాగా ఈ పరీక్షకు ప్రకటన వెలువడిన నేపథ్యంలో పరీక్ష విధానం, విజయానికి సన్నద్ధత, ఉపకారవేతనాల తీరుతెన్నులపై ప్రత్యేక కథనం.. దేశంలో పాఠశాల విద్యను నాణ్యవంతంగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తున్న ఎన్సీఈఆర్టీ.. ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి, ఉన్నత విద్య దిశగా వారిని ప్రోత్సహించేందుకు ఆర్థిక సహాయం అందిస్తోంది. దీనివల్ల వారి ప్రతిభ ఇనుమడించి ప్రత్యక్షంగా వారికి, పరోక్షంగా సమాజానికి మేలు చేకూరుతుందన్నది మండలి భావన. తొలిసారిగా 1963లో జాతీయ విజ్ఞానశాస్త్ర ప్రతిభా అన్వేషణ పథకాన్ని ప్రారంభించి, 11వ తరగతికి చెందిన విద్యార్థులకు 10 స్కాలర్షిప్లను అందజేసింది. తర్వాతి కాలంలో దీని పేరును జాతీయ ప్రతిభా అన్వేషణ పథకంగా మార్చారు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు స్కాలర్షిప్ల సంఖ్యనూ పెంచుతున్నారు. పదో తరగతి విద్యార్థులకు: ప్రస్తుతం రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతాల్లో గుర్తింపు పొందిన పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష (ఎన్టీఎస్ఈ)కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో రాత పరీక్షను విద్యార్థి చదువుతున్న పాఠశాల ఉన్న రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం నిర్వహిస్తుంది. ఇందులో ఎంపికైన వారు జాతీయ స్థాయిలో ఎన్సీఈఆర్టీ నిర్వహించే రెండో దశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు నేరుగా రెండో దశ పరీక్ష రాసేందుకు అర్హులు. రెండో దశ పరీక్షకు విద్యార్థులను అర్హులను చేసేందుకు ప్రతి రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతానికి ప్రత్యేక కోటా ఉంటుంది. తుది దశ పరీక్ష పూర్తయిన తర్వాత, స్కాలర్షిప్ అర్హుల ఎంపికకు మాత్రం ఎలాంటి కోటా ఉండదు. పరీక్ష విధానం తొలి దశ పరీక్ష: తొలిదశ పరీక్ష ప్రశ్నపత్రంలో మూడు విభాగాలుంటాయి. అవి.. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (ఎంఏటీ); లాంగ్వేజ్ కాంప్రెహెన్షివ్ టెస్ట్; ఆప్టిట్యూడ్ టెస్ట్. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షను ఇంగ్లిష్/ హిందీ/ తెలుగు/ ఉర్దూ మాధ్యమంలో రాయవచ్చు. పరీక్ష కాల వ్యవధి మూడు గంటలు. విభాగం ప్రశ్నలు మార్కులు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 50 50 లాంగ్వేజ్ కాంప్రెహెన్షివ్ టెస్ట్ 40 40 ఆప్టిట్యూడ్ టెస్ట్ 90 90 మొత్తం 180 180 లాంగ్వేజ్ కాంప్రెహెన్షివ్ టెస్ట్కు సంబంధించి అభ్యర్థులు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూల్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి. ఈ విభాగం అర్హత విభాగం మాత్రమే. ఇందులోని మార్కులు మెరిట్ జాబితా తయారీకి పరిగణనలోకి తీసుకోరు. రెండో దశ పరీక్ష: విభాగం ప్రశ్నలు మార్కులు సమయం మెంటల్ ఎబిలిటీ 50 50 45 ని. స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఎ) లాంగ్వేజ్ టెస్ట్ 50 50 45ని. బి) సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ సెన్సైస్ 100 100 90 ని. తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు. ఉపకారవేతనం- అందే విధానం: జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష ద్వారా వెయ్యి మంది ప్రతిభావంతులకు స్కాలర్షిప్లు అందజేస్తారు. ఎంపికైన వారికి ఇంటర్మీడియెట్ రెండేళ్లలో నెలకు రూ.1,250 అందజేస్తారు. అండర్గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు నెలకు రూ.2,000 ఇస్తారు.పీహెచ్డీలో చేరితే యూజీసీ నిబంధనలకు అనుగుణంగా ఉపకారవేతనం మొత్తాన్ని నిర్ధరిస్తారు.ఇప్పటి వరకు స్కాలర్షిప్ కింద నెలకు రూ.500 మాత్రమే అందజేసేవారు. ఈ ఏడాది నుంచి స్కాలర్షిప్ మొత్తాన్ని పెంచారు. రిజర్వేషన్: కేటగిరీ స్కాలర్షిప్ల్లో రిజర్వేషన్ ఎస్సీ విద్యార్థులు 15 శాతం ఎస్టీ విద్యార్థులు 7.5 శాతం ఫిజికల్లీ చాలెంజ్డ్ 3 శాతం ముఖ్య తేదీలు:పాఠశాల ఉపాధ్యాయుడు/ఉపాధ్యాయినికి దరఖాస్తు అందించడానికి గడువు: సెప్టెంబర్ 1, 2014. డీఈవో కార్యాలయాలకు సమర్పించేందుకు గడువు: సెప్టెంబర్ 3, 2014.మొదటి దశ పరీక్ష: నవంబర్ 2, 2014.రెండో దశ పరీక్ష: మే 10, 2015.దరఖాస్తు విధానం: దరఖాస్తులు సంబంధిత జిల్లా డీఈవో కార్యాలయాల్లో లభిస్తాయి. లేదంటే bseap. org, bsetelangana.orgË ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫీజు రూ.100 చలానాతో పాటు పూర్తిచేసిన దరఖాస్తును పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయినికి అందజేయాలి. వీరు దరఖాస్తులను డీఈవో కార్యాలయానికి సమర్పిస్తారు. ప్రిపరేషన్ టిప్స్ సబ్జెక్టుల వారీగా ముఖ్యమైన అంశాలను ముందు చదవాలి.ప్రిపరేషన్కు రాష్ట్ర ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాలి.గత ప్రశ్నపత్రాలతో పాటు నమూనా ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి.అర్థం కాని విషయాలను స్నేహితులు, ఉపాధ్యాయులతో చర్చించి, సందేహాలను నివృత్తి చేసుకునేందుకు సంకోచించకూడదు.ఎన్టీఎస్ పరీక్షకు సిద్ధమయ్యేందుకు అందుబాటులో ఉన్న సమయాన్నిబట్టి ఎవరికి వారు సొంతంగా ప్రిపరేషన్ ప్రణాళికను రూపొందించుకోవాలి. రీజనింగ్కు సంబంధించి మార్కెట్లో అందుబాటులో ఉన్న ఒక ప్రామాణిక పుస్తకంలోని సమస్యలను ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది.తొమ్మిదో తరగతి ప్రారంభం నుంచి స్కాలర్షిప్ పరీక్షలో విజేతగా నిలిచేందుకు సిద్ధంకావాలి. తొలి దశలో విజయానికి.. మెంటల్ ఎబిలిటీ టెస్ట్:జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్షకు సిద్ధమయ్యే క్రమంలో విద్యార్థులు ప్రధానంగా పెంపొందించుకోవాల్సిన నైపుణ్యం.. విశ్లేషణాత్మక ఆలోచన (అ్చడ్టజీఛ్చి ఖీజిజీజుజీజ). విజ్ఞానం సముపార్జించి, పరీక్షలో విజయం సాధించేందుకు ఇదే ఉత్తమ సాధనం. రేషియో-ప్రొపోర్షన్స్-యావరేజెస్; ప్రాఫిట్ అండ్ లాస్; టైమ్ అండ్ డిస్టెన్స్; ఎల్సీఎం, హెచ్సీఎఫ్; సింపుల్ ఇంట్రస్ట్; సెట్స్-వెన్ డయాగ్రమ్స్ తదితర అంశాలతో పాటు ఆైఈకఅ ఆధారిత ప్రశ్నలు వస్తాయి. అందువల్ల ఈ అంశాలపై ఎక్కువగా దృష్టిసారించాలి. ఈ విభాగాలపై పట్టు సాధించాలంటే ప్రాక్టీస్ బాగా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లోని ప్రశ్నలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. వెర్బల్ రీజనింగ్కు సంబంధించి బ్లడ్ రిలేషన్స్; సిరీస్; వర్డ్ రిలేషన్షిప్; కోడింగ్-డీకోడింగ్; డెరైక్షన్స్; కేలండర్ తదితర అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. నాన్ వెర్బల్ రీజనింగ్లో మిర్రర్ ఇమేజస్;ఫిగర్ మ్యాట్రిక్స్; అనాలజీ; పేప ర్ ఫోల్డింగ్ వంటి అంశాలపై ప్రశ్నలు వస్తాయి. మొత్తం ప్రశ్నల్లో దాదాపు 10 నాన్ వెర్బల్, 15 వరకు వెర్బల్ రీజనింగ్కు సంబంధించిన ప్రశ్నలు వస్తున్నాయి. పటాల ఆధారిత ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి.తేలికపాటి డేటా ఇంటర్ప్రెటేషన్ ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి పూర్తిస్థాయిలో స్కోర్ సాధించేందుకు ఇవి ఉపయోగపడతాయి. Pointing to a photograph, a man said, "I have no brother or sister but that man's father is my fathers's son'' Whose photograph was it: 1) His nephew's 2) His Fatehrs's 3) His son's 4) His own స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్:ఇందులో సోషల్ సెన్సైస్; సెన్సైస్; మ్యాథమెటిక్స్లకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. గత పరీక్షల ప్రశ్నపత్రాలను సేకరించి, సబ్జెక్టుల వారీగా ముఖ్యమైన అంశాలను గుర్తించి, వాటిని క్షుణ్నంగా చదవాలి. సబ్జెక్టుల్లోని ముఖ్యమైన భావనలను నోట్సులో రాసుకొని, వాటిని వీలున్నప్పుడు పునశ్చరణ చేయాలి. సోషల్ సెన్సైస్కు సంబంధించి జాగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్, హిస్టరీ అంశాలను ప్రాధాన్య క్రమంలో అధ్యయనం చేయాలి. The angle between the bisectors of the two acute angles of a right angle triange is.. 1) 900 2) 1121/20 3) 1350 4) 1200 Ans: 3 Of which revolution was the motto "Liberty, Equality, Fraternity''.. 1) The Britain Revolution 2) The American Revolution 3) The Russian Revolution 4) The French Revolution -
జేఈఈ మెయిన్ కౌన్సెలింగ్ విధివిధానాలు..
ఇంజనీరింగ్ విద్యకు ఐఐటీల తర్వాత ప్రాధాన్యతనిచ్చే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లలో ప్రవేశానికి సన్నాహకాలు ప్రారంభమయ్యాయి.. జేఈఈ-మెయిన్ ద్వారా ప్రవేశం కల్పించే ఈ ఇన్స్టిట్యూట్లలో అడ్మిషన్ల ప్రక్రియ జూలై 1 నుంచి మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ప్రవేశ ప్రక్రియతోపాటు కొన్ని ముఖ్యమైన నిట్లలో గతేడాది చివరి ర్యాంకుల వివరాలు.. ముందుగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్: పలు దశల్లో జరిగే ఆన్లైన్ కౌన్సెలింగ్ కోసం..ర్యాంకు పొందిన వారు ఠీఠీఠీ.ఛిఛిఛ.జీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. యూజర్ ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు పేర్కొని.. చాయిస్ ఫిల్లింగ్ (జేఈఈ మెయిన్ ర్యాంకుతో సీటు కేటాయించే సంస్థలు, బ్రాంచ్ల ఆధారంగా ప్రాథమ్యాలను పేర్కొనడం) చేయాలి. తమ ఆప్షన్లను ‘లాక్’ చేయాలి. ఆల్ ఇండియా ర్యాంకు, ప్రాథమ్యాల ఆధారంగా సీట్ ఎలాట్మెంట్ జరుగుతుంది. తర్వాత నిర్దేశిత రిపోర్టింగ్ సెంటర్లలో ఫీజు చెల్లించి, సర్టిఫికెట్లను పరిశీలనకోసం చూపించాలి. ఆల్ ఇండియా వర్సెస్ హోం స్టేట్: జేఈఈ మెయిన్ ర్యాంకుల్లో ఆల్ ఇండియా ర్యాంకు (జాతీయ స్థాయిలో పొందిన), హోం స్టేట్ ర్యాంకు (సదరు నిట్ ఉన్న రాష్ట్రంలో పోటీ పడిన విద్యార్థులందరిలో పొందిన ర్యాంకు)లను వేర్వేరుగా ప్రకటిస్తారు. ఒక ‘నిట్’ క్యాంపస్ ఏ రాష్ట్రంలో ఉంటే.. ఆ రాష్ట్ర విద్యార్థులకు మొత్తం సీట్లలో 50 శాతం కేటాయిస్తారు. ఆల్ ఇండియా ర్యాంకుకే తొలి ప్రాధాన్యం: సీట్ల కేటాయింపులో ముందుగా ఆల్ ఇండియా ర్యాంకుకే ప్రాధాన్యం ఇస్తారు. ఆ తర్వాతే హోం స్టేట్ ర్యాంకు ప్రాతిపదికగా తీసుకుని హోం స్టేట్ కోటాలో సీటు కేటాయిస్తారు. రాష్ర్ట విభజన జరిగినప్పటికీ.. ఈ ఏడాది కూడా గతేడాది విధానాన్నే అనుసరిస్తారు. అంటే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే తేడా ఉండదు. అందరిని ఆంధ్రప్రదేశ్ విద్యార్థులుగా పరిగణించి హోం స్టేట్ ర్యాంక్ కేటాయిస్తారు. కౌన్సెలింగ్ ప్రక్రియ: అడ్మిషన్ల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జూలై 1న ప్రారంభమవుతుంది.జూలై 9 వరకు (సాయంత్రం 5 గంటలు) ప్రాధాన్యతలను (బ్రాంచ్/ఇన్స్టిట్యూట్ల వారీగా) పొందుపరుస్తూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మొదటి దశ: మొదటి దశ సీట్ల కేటాయింపును జూలై 11న ప్రకటిస్తారు.మొదటి దశలో సీటు ఖరారైతే.. ఆన్లైన్లో నిర్దేశించిన ఫీజు (రూ. 40,000)ను చెల్లించాలి. తర్వాత సంబంధిత కేంద్రంలో జూలై 11 నుంచి 14 మధ్య రిపోర్ట్ చేయడంతోపాటు ఆప్షన్స్ 1, 2, 3 ఇవ్వాలి. ఆప్షన్స్-1, 2 ఇచ్చిన విద్యార్థులు కూడా రెండో దశ సీట్ల కేటాయింపు వరకు వేచి చూడాలి. ఆప్షన్-3 ఎంచుకున్న విద్యార్థులు జూలై 21 నుంచి 24 మధ్య ప్రవేశం పొందిన ఇన్స్టిట్యూట్లలో రిపోర్ట్ చేసి తరగతులకు హాజరుకావచ్చు. మొదటి దశలో సీటు ఖరారు కాకపోతే.. జూలై 16న వెల్లడించే రెండో దశ సీట్ల కేటాయింపు వరకు వేచి చూడాలి. రెండో దశ: రెండో దశలో సీటు ఖరారైతే.. ఆన్లైన్లో నిర్దేశించిన ఫీజు (రూ. 40,000)ను చెల్లించాలి. తర్వాత సంబంధిత కేంద్రంలో జూలై 16 నుంచి 19 మధ్య రిపోర్ట్ చేయడంతోపాటు ఆప్షన్స్-1, 2, 3 ఇవ్వాలి. ఒక వేళ ఇచ్చిన ఆప్షన్స్ల్లో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే (ఉదాహరణకు ఆప్షన్-1 నుంచి ఆప్షన్-2కు మారడం) సంబంధిత రిపోర్టింగ్ సెంటర్ను సంప్రదించాలి. ఆప్షన్-3 ఇచ్చిన విద్యార్థులు జూలై 21 నుంచి 24 మధ్య ప్రవేశం పొందిన ఇన్స్టిట్యూట్లలో రిపోర్ట్ చేసి తరగతులకు హాజరుకావచ్చు. రెండో దశలో సీటు ఖరారు కాకపోతే.. జూలై 21న వెల్లడించే మూడో దశ సీట్ల కేటాయింపు వరకు వేచి చూడాలి. మూడో దశ: మూడో దశలో సీటు ఖరారైతే.. మొదట ఆన్లైన్లో నిర్దేశించిన ఫీజు (రూ. 40,000)ను చెల్లించాలి. తర్వాత జూలై 21 నుంచి 23 మధ్య సంబంధిత రిపోర్టింగ్ సెంటర్ను సంప్రదించాలి. ఈ దశలో కేటాయించిన సీటు సంతృప్తికరంగా ఉంటే.. నిర్దేశిత ఇన్స్టిట్యూట్లో రిపోర్ట్ చేసి తరగతులకు హాజరుకావచ్చు. ఒక వేళ కేటాయించిన సీటు ఆమోదయోగ్యం కాకుంటే ఆ విషయాన్ని సంబంధిత రిపోర్టింగ్ సెంటర్కు తెలియజేసి వారు సూచించిన విధంగా బ్యాంకు ఖాతా వివరాలను వెల్లడించాలి. ఆ మేరకు వారు మీరు చెల్లించిన ఫీజును రిఫండ్ చేస్తారు.మూడో దశ తర్వాత సీటు ఖరారు కాని విద్యార్థుల కోసం.. ఎన్ని సీట్లకు, ఎంత మంది విద్యార్థులు, ఏయే ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందారు? వంటి వివరాలను జూలై 21 నుంచి 23 మధ్య వెబ్సైట్లో వెల్లడిస్తారు. ఈ వివరాల ఆధారంగా జూలై 21-24 మధ్య ప్రాధాన్యతలను పొందుపరుస్తూ మరోసారి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత ఉండి మొదట్లో (జూలై 1-9 మధ్య) రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు కూడా కొత్తగా ఈ దశ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. నాలుగో దశ: ఈ మేరకు నాలుగో దశ కేటాయింపులను జూలై 26న వెల్లడిస్తారు. నాలుగో దశలో సీటు ఖారారైతే.. ఆన్లైన్లో నిర్దేశించిన ఫీజు (రూ. 40,000)ను చెల్లించాలి. తర్వాత జూలై 26 నుంచి 29 మధ్య నిర్దేశిత ఇన్స్టిట్యూట్లో రిపోర్ట్ చేసి తరగతులకు హాజరుకావచ్చు.నాలుగో దశలో సీటు ఖరారు కానీ విద్యార్థులు, ఖరారైన అడ్మిషన్ పట్ల సంతృప్తిగా లేని విద్యార్థులు స్పాట్ రౌండ్ కోసం వేచి చూడాలి.అన్ని ఇన్స్టిట్యూట్లకు సంబంధించిన ఖాళీల వివరాలను జూలై 31న వెల్లడిస్తారు. స్పాట్ రౌండ్: స్పాట్ రౌండ్కు హాజరుకావాలనుకునే విద్యార్థులు.. ఆన్లైన్లో నిర్దేశించిన ఫీజు (రూ. 40,000)ను చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత జూలై 31 నుంచి ఆగస్ట్ 2 మధ్య ఖాళీల ఆధారంగా హెల్ప్ సెంటర్ లేదా తమ దగ్గర్లోని సెంటర్ల ద్వారా తమ ప్రాధాన్యతలను లాక్ చేయాలి. అర్హత ఉండి జూలై 1-9, జూలై 20-24 మధ్య రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు కూడా కొత్తగా ఈ దశ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు.స్పాట్ రౌండ్ సీట్ల కేటాయింపు ఆగస్ట్ 4న వెల్లడిస్తారు. ఇందులో సీటు ఖరారైన విద్యార్థులు ఆగస్ట్ 4 నుంచి 7 మధ్య నిర్దేశించిన ఇన్స్టిట్యూట్లో రిపోర్ట్ చేయాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మిగతా ఫీజు చెల్లించిన తర్వాత సంబంధిత ఇన్స్టిట్యూట్ సీటును ఖరారు చేస్తుంది.స్పాట్ రౌండ్ తర్వాత మరిన్ని స్పాట్ రౌండ్లు ఉండే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ అటువంటి అవకాశం ఉంటే సంబంధిత వివరాలను సీఎస్ఏబీ వెబ్సైట్ ద్వారా వెల్లడిస్తారు. ఆప్షన్ ఆప్షన్-1: సదరు విద్యార్థి ఇన్స్టిట్యూట్తో నిమిత్తం లేకుండా తన ప్రాధాన్యత మేరకు తర్వాత సీట్ల కేటాయింపు దశను ఎంచుకోవడం.ఆప్షన్-2: సదరు విద్యార్థి ప్రవేశం పొందిన ఇన్స్టిట్యూట్లోనే తన ప్రాధాన్యత మేరకు తర్వాత సీట్ల కేటాయింపు దశను ఎంచుకోవడం.ఆప్షన్-3: కేటాయించిన అడ్మిషన్ పట్ల సదరు విద్యార్థి సంతృప్తి చెందినట్లు భావించడం. తద్వారా అతడు ఇచ్చిన ప్రాధాన్యతలను (బ్రాంచ్/ఇన్స్టిట్యూట్ల వారీగా) తర్వాతి దశ కోసం పరిగణించరు. -
మార్కులు అలా.. ర్యాంకులు ఇలా...
ఎంసెట్.. ఇంజనీరింగ్, మెడికల్ విభాగాల్లో బ్యాచిలర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష. రాష్ట్రంలో లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణత, మెరుగైన ర్యాంకు కోసం ఇంటర్మీడియెట్లో చేరిన తొలి రోజు నుంచే శ్రమిస్తుంటారు. నేడు (మే 22) ఎంసెట్ - 2014 పరీక్ష జరుగనుంది. పరీక్ష పూర్తికాగానే ఎన్ని మార్కులు వస్తే ఎంత ర్యాంకు వస్తుంది? అనే చర్చ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో గత ఏడాది ఎన్ని మార్కులకు ఎంత ర్యాంకు వచ్చింది? పరీక్ష క్లిష్టత స్థాయి ఎలా ఉంది? ప్రస్తుతం ఎంత మంది పోటీ పడుతున్నారు? తదితర అంశాలపై విశ్లేషణ.. ఎంసెట్-2013 ఇలా.. ఇంజనీరింగ్ విభాగంలో దరఖాస్తుల సంఖ్య 2,91,805. హాజరైన వారి సంఖ్య 2, 76, 995. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు 2,01,308. మెడికల్ విభాగంలో అందిన దరఖాస్తులు 1,05,065. హాజరైన విద్యార్థులు 99,983. ర్యాంకుల తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులు 80,778. ఇంటర్మీడియెట్ మార్కులకు వెయిటేజీ కల్పించి ర్యాంకులను ప్రకటించే విధానాన్ని అనుసరించిన నేపథ్యంలో.. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ఇంటర్మీడియెట్ వివరాలు అందించని, ఫెయిలైన విద్యార్థులు మొత్తం 29,194 మంది ఎంసెట్లో ఉత్తీర్ణత సాధించినా ర్యాంకులు కేటాయించలేదు. ఇదే విధంగా మెడికల్ విభాగంలో 8,533 మందికి ర్యాంకులు కేటాయించలేదు. ఎంసెట్-2012 ఫలితాలు ఇలా: ఇంజనీరింగ్ విభాగం: మొత్తం దరఖాస్తులు 2,94,150. హాజరైన వారి సంఖ్య 2,83,477. ఎంసెట్లో ఉత్తీర్ణత సాధించి ర్యాంకుల జాబితాలో నిలిచిన వారు 2,23,886. మెడికల్ విభాగం: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య 95,518. హాజరైన విద్యార్థుల సంఖ్య 90,197. ఉత్తీర్ణత సాధించి తుది ర్యాంకుల జాబితాలో చోటు సాధించిన విద్యార్థులు 83,686. ఎంసెట్-2012 ఫలితాల క్రమంలో ఇంటర్మీడియెట్ వివరాలు లేని, ఫెయిలైన విద్యార్థులు ఇంజనీరింగ్లో 16,413; మెడికల్ విభాగంలో 5,886 మందికి ర్యాంకుల జాబితాలో చోటు లభించలేదు. వీటి ప్రకారం.. ఎంసెట్-2012, 2013 గణాంకాలను విశ్లేషిస్తే.. ఇంజనీరింగ్ విభాగంలో 2012తో పోల్చితే 2013లో దరఖాస్తు సంఖ్య, హాజరైన అభ్యర్థుల సంఖ్య కొంత తగ్గింది. కానీ.. మెడికల్ విభాగంలో ప్రతి ఏటా పోటీ పెరుగుతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2012తో పోల్చితే 2013లో పెరిగిన దరఖాస్తుల సంఖ్య సుమారు పదివేలుగా నమోదైంది. ఇదే క్రమంలో హాజరైన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. 2012లో 90,197 మంది మెడికల్ స్ట్రీమ్కు హాజరు కాగా.. 2013 ఆ సంఖ్య 99,983కు పెరిగింది. ఇక.. తాజా ఎంసెట్-2014 దరఖాస్తుల తీరును పరిశీలిస్తే దరఖాస్తుల చివరి తేదీ నాటికి (అపరాధ రుసుము లేకుండా) ఇంజనీరింగ్ విభాగానికి 2.73 లక్షల మంది, మెడికల్ విభాగానికి 1.08 లక్షల మంది పోటీలో నిలిచారు. తాజా దరఖాస్తుల సరళిని గత రెండేళ్ల ఎంసెట్ దరఖాస్తుల సరళితో పోల్చితే ఇంజనీరింగ్ విభాగంలో దరఖాస్తుల సంఖ్య కొంత తగ్గుతోంది. కానీ మెడికల్ విభాగంలో మాత్రం పెరుగుతోంది. దరఖాస్తుల తీరులో మార్పు.. కారణాలు: ఇంజనీరింగ్ విభాగంలో దరఖాస్తుల సంఖ్య తగ్గడానికి.. ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటున్న అభిప్రాయాలు.. చాలా మంది విద్యార్థులు జేఈఈ-మెయిన్స్, అడ్వాన్స్డ్ ద్వారా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఐఐటీలు.. అదే విధంగా ప్రైవేటు విద్యా సంస్థల పరంగా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్ (బిట్శాట్) వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ టెస్ట్(వీఐటీఈఈ) వంటి పోటీ పరీక్షలవైపు ఎక్కువ దృష్టి సారించడమే. ఇందుకు ప్రధాన కారణం.. రాష్ట్రంలో ఎంసెట్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ సీటు లభించడం ఖాయం. కానీ విద్యార్థులు, తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు వచ్చింది. మంచి కళాశాలలో చేరడానికి మొగ్గు చూపుతున్నారు. మెడికల్ విభాగంలో మాత్రం మన రాష్ట్రం సెంట్రల్ పూల్లో లేకపోవడం, ఇతర రాష్ట్రాల్లోనూ సీట్ల సంఖ్య పరిమితంగా ఉండటంతో ఈ విభాగంలో దరఖాస్తుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. కీలకంగా నిలుస్తున్న వెయిటేజీ: ఎంసెట్ ర్యాంకుల నిర్ధారణలో ఎంసెట్ మార్కులకు, ఇంటర్మీడియెట్ గ్రూప్ సబ్జెక్ట్స్లో పొందిన మార్కులకు కల్పించిన వెయిటేజీ కీలకంగా మారింది. 160 మార్కులకు నిర్వహించే ఎంసెట్లో పొందిన మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్మీడియెట్లో 600 మార్కులకు ఉండే గ్రూప్ సబ్జెక్ట్స్లో పొందిన మార్కులకు కల్పించే 25 శాతం వెయిటేజీల కారణంగా.. ఈ రెండు పరీక్షల్లో ఒక్క మార్కు తగ్గినా ర్యాంకుల జాబితాలో వందల సంఖ్యలో తేడా కనిపిస్తోంది. ఎంసెట్కు 75 శాతం వెయిటేజీ ప్రకారం ఎంసెట్లో పొందే ప్రతి ఒక మార్కుకు 0.46875 వెయిటేజీతో తుది ర్యాంకును గణిస్తారు. ఈ క్రమంలో ఎంసెట్లో పొందే ప్రతి రెండు మార్కులు ఫైనల్ ర్యాంకులో ఒక మార్కుకు సమానం. అదే విధంగా ఇంటర్మీడియెట్ మార్కుల వెయిటేజిని ఎంసెట్ మార్కుల వెయిటేజితో పోల్చితే.. ఇంటర్మీడియెట్లోని ప్రతి 24 మార్కులు తుది ర్యాంకుల జాబితా నిర్ధారణలో ఒక మార్కుకు సమానం. అదే విధంగా ఇంటర్మీడియెట్లో ఒక మార్కు తేడాతో పది నుంచి 50 ర్యాంకుల మధ్యలో వ్యత్యాసం ఏర్పడుతుంది. గత రెండేళ్ల ర్యాంకుల సరళి: గత రెండేళ్ల ర్యాంకుల సరళిని పరిశీలిస్తే మొదటి 10 ర్యాంకుల్లో నిలవాలంటే ఎంసెట్ మార్కులు 150 నుంచి 155 మధ్యలో.. ఇంటర్మీడియెట్ మార్కులు 595పైగా పొందితేనే సాధ్యం. అదే విధంగా ఎంసెట్లో టాప్-50 లో ర్యాంకులు సాధించాలంటే ఎంసెట్లో 140 నుంచి 150 మధ్యలో మార్కులు సాధించాలి. 100లోపు లక్ష్యంగా పెట్టుకుంటే 136 నుంచి 140 మార్కులు తప్పనిసరి. 500లోపు ర్యాంకు సాధించాలంటే 120 మార్కులు; 1,000 లోపు ర్యాంకు కోసం 110 మార్కులు; 5,000 లోపు ర్యాంకు పొందాలంటే 90 మార్కులపైనా పొందాలి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు అందుబాటులోని సీట్ల ఆధారంగా.. ప్రభుత్వ కళాశాలల్లో కోర్ బ్రాంచ్లలో సీటు పొందాలంటే 1,000 నుంచి 1,500లోపు ర్యాంకుతోనే సాధ్యం. ఈ ర్యాంకులు పొందాలంటే అభ్యర్థులు ఎంసెట్లో 110 నుంచి 120 మార్కులు అవసరం. ఇక.. మెడికల్ విభాగానికి సంబంధించి.. అందుబాటులోని సీట్లను దృష్టిలో పెట్టుకుంటే అటు ఎంసెట్లో అత్యధిక మార్కులు, ఇటు ఇంటర్మీడియెట్లోనూ మంచి మార్కులతోనే తుది ర్యాంకులు ఆశాజనకంగా ఉంటాయి. మెడికల్ ర్యాంకుల పరంగా.. ఇంటర్మీడియెట్లో 24.5కు పైగా వెయిటేజీ, ఎంసెట్లో దాదాపు 70 శాతం వెయిటేజీ ఉంటేనే మొదటి 50 ర్యాంకులు లభించాయి. ఇక్కడ విద్యార్థులు గమనించాల్సిన ప్రధాన అంశం.. ఇంటర్మీడియెట్ వెయిటేజీ 24కు పైగా ఉన్నప్పటికీ.. ఎంసెట్లో మార్కులు తగ్గే కొద్దీ ర్యాంకుల్లో భారీ వ్యత్యాసం కనిపించింది. 500 లోపు ర్యాంకులను పరిశీలిస్తే రెండు మార్కుల తేడాతో ర్యాంకుల నిర్ధారణలో వందకుపైగా ర్యాంకుల వ్యత్యాసం కనిపించింది. ఎంసెట్లో 100 నుంచి 130 మార్కులు పొందిన అభ్యర్థుల ర్యాంకులను పరిశీలిస్తే 130 మార్కులకు, 100 మార్కులకు మధ్యలో 4,000కు పైగా ర్యాంకులు తగ్గాయి. 100లోపు పొందిన మార్కులను పరిశీలిస్తే ఒక్కో మార్కు తగ్గేకొద్దీ ర్యాంకుల్లో వ్యత్యాసం దాదాపు 1,000గా తేలింది. వీటిని గమనిస్తే.. విద్యార్థులు.. ముఖ్యంగా మెడికల్ స్ట్రీమ్ ఔత్సాహికులు ఎంసెట్లో అత్యధిక మార్కులను సాధించాలి. ఎంసెట్-2013.. వెయిటేజీ, ర్యాంకుల గణాంకాలు -
ట్రిపుల్ ఐటీలతో పల్లె ప్రతిభకు నగిషీలు!
విద్యార్థుల్లో దాగున్న ప్రతిభను సానపడితే అద్భుతాలు సృష్టించగలరు! కెరీర్ను అత్యున్నతంగా తీర్చిదిద్దుకోవడంతో పాటు దేశ ప్రగతిలో భాగస్వాములు కాగలరు! ఈ ఆశయంతో ఏర్పాటైనవే ట్రిపుల్ ఐటీలు. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఉద్యోగావకాశాలు పొందడం ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకే సొంతమన్న మాటల్ని తిరగరాస్తున్నారు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు. ఉన్నత వేతనాలతో జాబ్ ఆఫర్లను చేజిక్కించుకుంటున్నారు. ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో స్పెషల్ ఫోకస్.. ప్రతిభావంతులైన పేద, గ్రామీణ విద్యార్థులు పదో తరగతితోనే సమున్నత కెరీర్కు మార్గం వేసుకునే దిశగా నెలకొల్పినవే ఏపీ ట్రిపుల్ ఐటీలు. ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా కేవలం పదో తరగతిలో చూపిన ప్రతిభ ఆధారంగా రెండేళ్ల ఇంటర్మీడియెట్కు సమానమైన పీయూసీ, ఆ తర్వాత నాలుగేళ్ల బీటెక్ కోర్సును నామమాత్రపు ఫీజుతో అందించి.. పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మార్గం వేయడమే ట్రిపుల్ ఐటీల ముఖ్య ఉద్దేశం. విద్యార్థుల ఎంపిక విధానం ప్రస్తుతం ఆర్జీయూకేటీ పరిధిలో ఏపీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లు మూడు ఉన్నాయి. అవి.. ఆర్.కె.వ్యాలీ (ఇడుపులపాయ-వైఎస్ఆర్ జిల్లా), నూజివీడు (కృష్ణా జిల్లా), బాసర (ఆదిలాబాద్ జిల్లా). ఒక్కో క్యాంపస్లో వెయ్యి చొప్పున మొత్తం మూడు వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులకు నిబంధనల మేరకు నిర్దిష్ట సంఖ్యలో సీట్లను రిజర్వ్ చేస్తారు. అంతేకాకుండా 5 శాతం అదనపు సీట్లను ఇతర రాష్ట్రాల్లోని విద్యార్థులకు, గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న భారతీయుల పిల్లలకు, అంతర్జాతీయ విద్యార్థులకు కేటాయిస్తున్నారు. అలాంటి అభ్యర్థులు పదో తరగతి తత్సమాన కోర్సులో కనీసం 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. అంతేకాకుండా వార్షిక ఫీజు రూ.1.36 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. లోకల్, అన్ రిజర్వ్డ్ గతంలో రాష్ట్ర స్థాయిలో అన్ని మండలాల్లోని టాపర్లను మాత్రమే ఎంపిక చేస్తుండేవారు. కానీ, హైకోర్టు ఆదేశాల మేరకు పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అందరికీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు.ఈ క్రమంలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్లను స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్లుగా పరిగణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న యూనివర్సిటీ రీజియన్ విధానాన్నే ఇక్కడ కూడా అమలు చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్లుగా విభజించి.. ఒక్కో యూనివర్సిటీ రీజియన్కు 42:36:22 నిష్పత్తిలో సీట్లు కేటాయిస్తున్నారు. 85 శాతం సీట్లను సంబంధిత యూనివర్సిటీ రీజియన్ లోకల్ విద్యార్థులకు, 15 శాతం సీట్లను ఓపెన్ కాంపిటీషన్లో అన్ రిజర్వ్డ్ కేటగిరీలో భర్తీ చేస్తున్నారు. ‘ప్రభుత్వ’ విద్యార్థులకు డిప్రవేషన్ స్కోర్ ప్రభుత్వ పాఠశాలలతో పోల్చితే పదో తరగతిలో ప్రైవేటు విద్యార్థులకే అధిక మార్కులు వస్తున్నాయి. దీంతో ట్రిపుల్ ఐటీల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆశించినంతగా అవకాశం లభించట్లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పాఠశాలల (మున్సిపల్, జెడ్పీపీ, గురుకుల సహా) విద్యార్థులకు వారు పొందిన మార్కులకు అదనంగా 0.4 జీపీఏ కలిపి మెరిట్ జాబితా రూపొందిస్తున్నారు. ఈ డిప్రవేషన్ విషయంలో ఎలాంటి రిజర్వేషన్ నిబంధనలు లేవు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన అన్ని సామాజిక వర్గాల వారికి డిప్రవేషన్ స్కోర్ విధానం అమలు చేస్తున్నారు. మెరిట్ జాబితా రూపకల్పన మెరిట్ జాబితా రూపొందించే విషయంలో ప్రథమంగా పరిగణనలోకి తీసుకునే అంశం- విద్యార్థి పొందిన జీపీఏ, రిజర్వేషన్ కేటగిరీ. ఒకవేళ ఒకరి కంటే ఎక్కువ మంది విద్యార్థులకు జీపీఏ స్కోర్ సమానంగా ఉంటే.. కొన్ని ప్రాథమ్యాల ఆధారంగా వారిని ఎంపిక చేస్తున్నారు. అవి.. తొలుత మ్యాథమెటిక్స్లో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థి.. ఇందులోనూ మార్కులు సమానంగా ఉంటే ఫిజిక్స్లో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థి .. అది కూడా సమానంగా ఉంటే కెమిస్ట్రీలో అత్యధిక మార్కులు, ఆ తర్వాత ఇంగ్లిష్లో అత్యధిక మార్కులు ఇలా అన్ని సబ్జెక్టుల్లోనూ సమానంగా ఉంటే.. వయసును పరిగణనలోకి తీసుకుని ఎక్కువ వయసున్న అభ్యర్థికి అవకాశం కల్పిస్తున్నారు. ఆర్థిక చేయూత ఏపీ ట్రిపుల్ ఐటీల ప్రధాన లక్ష్యం.. పేద విద్యార్థులకు చక్కటి భవితను అందించడం. ప్రతిభావంతులైన ఏ విద్యార్థి కూడా అవకాశం కోల్పోకూడదనే ఉద్దేశంతో ఆర్థిక చేయూత కూడా అందిస్తున్నారు. సామాజిక వర్గ నేపథ్యంతో సంబంధం లేకుండా.. కుటుంబ వార్షికాదాయం రూ. లక్షలోపు ఉంటే.. ఎలాంటి ట్యూషన్ ఫీజు చెల్లించక్కర్లేదు. కేవలం రూ. 3వేలు కాషన్ డిపాజిట్ చెలిస్తే సరిపోతుంది. ఇది కూడా కోర్సు పూర్తయ్యాక తిరిగి ఇచ్చేస్తున్నారు. కుటుంబ వార్షికాదాయం రూ.లక్ష దాటిన విద్యార్థులు ఏడాదికి రూ. 36 వేల ట్యూషన్ ఫీజు చెల్లించాలి. కేవలం ట్యూషన్ ఫీజునే వసూలు చేస్తున్నారు. మిగతా అన్ని సదుపాయాలు (వసతి, భోజనం తదితర) ఉచితంగా అందిస్తున్నారు. కోర్సు స్వరూపం ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్గా పేర్కొంటున్న కోర్సు స్వరూపం రెండు రకాలు. అవి.. ప్రీ యూనివర్సిటీ సర్టిఫికెట్.. బీటెక్. కోర్సు మొదటి రెండేళ్లు ఇంటర్మీడియెట్కు సమానమైన ప్రీ యూనివర్సిటీ కోర్సు బోధన సాగుతుంది. ఇందులో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్సెన్సైస్(ఎంపీసీ, బైపీసీకి సమానం)వంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. రెండేళ్లు పూర్తి చేసుకుని వేరే అవకాశం వచ్చి బయటకి వెళతామనే విద్యార్థులకు పీయూసీ సర్టిఫికెట్ ఇస్తారు. పీయూసీ తర్వాత మూడో ఏడాది నుంచి నాలుగేళ్ల బీటెక్ కోర్సు మొదలవుతుంది. ప్రస్తుతం ఆరు బ్రాంచ్లు (సివిల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, మెకానికల్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ సైన్స్) అందుబాటులో ఉన్నాయి. ఒక మేజర్, ఒక మైనర్ మూడో ఏడాది నుంచి ప్రారంభమయ్యే బీటెక్ కోర్సులో.. అందుబాటులో ఉన్న ఆరు బ్రాంచ్లలో ఒక బ్రాంచ్ను మేజర్ సబ్జెక్ట్గా ఎంచుకోవాలి. దీంతోపాటు ఇంటర్-డిసిప్లినరీ స్కిల్స్ అలవడాలనే లక్ష్యంతో మరో సబ్జెక్ట్ను మైనర్ సబ్జెక్ట్గా ఎంచుకోవాలనే నిబంధన విధించారు. ఈ క్రమంలో ఇంజనీరింగ్, సెన్సైస్, మేనేజ్మెంట్, హ్యుమానిటీస్, క్లాసికల్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ వంటి సబ్జెక్టులను మైనర్ సబ్జెక్టులుగా అందిస్తున్నారు. విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్ట్ను మైనర్ సబ్జెక్ట్గా ఎంచుకోవచ్చు. ఈ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్న ఏకైక యూనివర్సిటీ ఇదే. దీనివల్ల విద్యార్థికి ఇంటర్-డిసిప్లినరీ స్కిల్స్ లభిస్తాయి. ఫలితంగా కోర్ బ్రాంచ్లోనే కాకుండా.. ఇతర విభాగాల్లోనూ అవకాశాలు పొందొచ్చు. ఉదాహరణకు మెకానికల్ను మేజర్గా.. ఎలక్ట్రానిక్స్ను మైనర్గా ఎంచుకున్న విద్యార్థి మెకానికల్తోపాటు మెకట్రానిక్స్లోనూ రాణిస్తారు. ఇంటర్న్షిప్.. కంపల్సరీ ఏపీ ట్రిపుల్ ఐటీల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో మరో ప్రత్యేకత ఇంటర్న్షిప్. దీన్ని కరిక్యులంలో అంతర్భాగంగా రూపొందించారు. బీటెక్ మూడో ఏడాది పూర్తయ్యాక వేసవి సెలవుల సమయంలో రెండు, మూడు నెలల వ్యవధిలో ఈ ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు వైజాగ్ స్టీల్ ప్లాంట్, బీఎస్ఎన్ఎల్, ట్రాన్స్కో, జెన్కో, సీఎస్ఐఆర్ ల్యాబ్స్, ప్రభుత్వ నీటి పారుదల శాఖ తదితర అనేక సంస్థల్లో ఇంటర్న్షిప్ చేస్తున్నారు. ప్రముఖ సంస్థల ఫ్యాకల్టీతో గెస్ట్ లెక్చర్స్ విద్యార్థులకు ఇక్కడి స్థానిక బోధన సిబ్బంది ఇచ్చే శిక్షణతోపాటు దేశంలోనే ప్రముఖ ఇన్స్టిట్యూట్లుగా పేరుగడించిన ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర దేశాల్లోని ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లకు చెందిన ఫ్యాకల్టీతో గెస్ట్ లెక్చర్స్ సదుపాయం కల్పిస్తున్నారు. ఇలా.. అన్ని విధాలుగా నిరంతర లెర్నింగ్ విధానాన్ని అమలు చేస్తూ.. విద్యార్థులు అకడెమిక్ స్కిల్స్ పెంపొందించుకునేలా కృషి చేస్తున్నారు. అన్ని నియంత్రణ సంస్థల గుర్తింపు ఆర్జీయూకేటీ అందిస్తున్న ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుకు ప్రభుత్వ గుర్తింపుతోపాటు ఏఐసీటీఈ, యూజీసీ వంటి నియంత్రణ సంస్థల గుర్తింపు కూడా లభించింది. అంతేకాకుండా ఆరేళ్ల కోర్సులో మొదటి రెండేళ్లు ప్రీ యూనివర్సిటీ కోర్సు పేరుతో బోధించే కోర్సుకు కూడా ఇంటర్మీడియెట్కు సమానమైన గుర్తింపును ఇంటర్ బోర్డ్ ఇచ్చింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: మే 21, 2014. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 16, 2014 (రాత్రి 8 గంటల వరకు). {పింట్ అవుట్ తీసుకున్న దరఖాస్తు అందజేయడానికి చివరి తేదీ: జూన్ 21, 2014 (సాయంత్రం ఐదు గంటల వరకు). కౌన్సెలింగ్కు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: జూలై 7, 2014. కౌన్సెలింగ్: జూలై 23, 24, 2014. తరగతుల ప్రారంభం: జూలై 28, 2014 వివరాలకు వెబ్సైట్: www.rgukt.in ఉత్తమ బోధనా సిబ్బందితో నాణ్యమైన విద్య ఇప్పుడు అన్ని వసతులూ ఉన్న కాలేజీలో నచ్చిన బ్రాంచ్లో సీటు పొందాలంటే హై ప్రొఫైల్ కోచింగ్ తప్పనిసరిగా ఉండాలన్న భావన ఉంది. ఇలాంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ఇంజనీరింగ్ విద్యకు దూరం చేస్తోంది. ఈ తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత ఇంజనీరింగ్ విద్యను అందించాలన్న గొప్ప ఆశయంతో ట్రిపుల్ ఐటీలను నెలకొల్పారు. ఎలాంటి ఎంట్రన్స్లు లేకుండా పదో తరగతిలో చూపిన జీపీఏతో ప్రవేశాలు కల్పిస్తున్నాం. ట్రిపుల్ ఐటీల్లో బోధనా సిబ్బంది నియామకం విషయంలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్నాం. దేశ వ్యాప్తంగా పర్యటించి ఐఐటీ వంటి ఉన్నత విద్యా సంస్థల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్లు నిర్వహించి ఫ్యాకల్టీని తీసుకుంటున్నాం. ఐఐటీ స్థాయి సౌకర్యాలు, ల్యాబ్లు, కరిక్యులం.. ట్రిపుల్ ఐటీల ప్రత్యేకత. వీడియో లెక్చర్స్, పుస్తక పఠనం, సమస్యా పరిష్కార నైపుణ్యాల పెంపుదలకు ప్రత్యేక విధానాలు, చేయడం ద్వారా నేర్చుకునే (లెర్నింగ్ బై డూయింగ్) బోధనా పద్ధతులు వంటివన్నీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులను మెరికలుగా తీర్చిదిద్దేవే. - ప్రొఫెసర్ ఆర్.వి.రాజకుమార్, వైస్ ఛాన్సలర్, ఆర్జీయూకేటీ. -
తుది అడుగులు పడాలిలా
రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎంసెట్ పరీక్షకు కౌంట్డౌన్ మొదలైంది.. మరో వారంలో (మే 22) ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నారు.. ఈ నేపథ్యంలో చివరి దశ సన్నాహాలు ఏ విధంగా ఉండాలి.. ఏయే అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.. తదితర అంశాలపై సబ్జెక్ట్ల వారీగా నిపుణుల సూచనలు.. మ్యాథమెటిక్స్ ఎంసెట్లో ప్రశ్నలన్నీ ఇంటర్మీడియెట్ సిలబస్లోని ప్రాథమిక భావనల (బేసిక్ కాన్సెప్ట్స్) ఆధారంగా ఉంటాయి.మ్యాథమెటిక్స్ విద్యార్థులు ప్రాక్టీస్, కచ్చితత్వం, సమయపాలనకు ప్రాధాన్యతనివ్వాలి. చివరి వారంలో మ్యాట్రిక్స్, డిటర్మినెంట్స్, మ్యాథమెటిక్ ఇండక్షన్, 3-డీ జ్యామెట్రీ, ఇంటిగ్రల్ కాలిక్యులస్, క్వాడ్రేటిక్ ఈక్వేషన్స్, కాంప్లెక్స్ నంబర్స్, వెక్టర్ ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, బైనామిల్ థీరమ్, డిఫరెన్షియల్ కాలిక్యులస్, సర్కిల్స్ అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. కాంప్లెక్స్ నంబర్స్ చాప్టర్లో మాడ్యుల్స్, అంప్లిట్యూడ్, క్యూబ్ రూట్ ఆఫ్ యునిటీ, ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీ సంబంధిత ప్రాబ్లమ్స్ చాలా ముఖ్యమైనవి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. సులభమైన ప్రశ్నలు 75 శాతం వరకు ఉంటున్నాయి. వీటిల్లో 80 శాతం ప్రశ్నలకు కచ్చితత్వంతో సమాధానాలు ఇస్తే మెరుగైన స్కోర్ సాధించవచ్చు. అన్ని కాన్సెప్ట్స్, ఫార్ములా, డెఫినేషన్స్, కీ టర్మ్స్పై పట్టు సాధించాలి. పరీక్షలో ఎన్ని ప్రశ్నలు సాధిం చాం కంటే.. కచ్చితత్వంతో ఎన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చామన్నదే ముఖ్యం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.ప్రశ్నలను చదువుతూ ప్రిపరేషన్ సాగించడం కంటే ప్రాక్టీస్కు ప్రాధాన్యత ఇవ్వడం ప్రయోజనకరం. చివరి వారంలో గత ప్రశ్నపత్రాలను విధిగా ప్రాక్టీస్ చేయాలి. గ్రాండ్ టెస్ట్లకు హాజరుకావాలి.ఎంసెట్ను చివరి గ్రాండ్టెస్ట్ మాదిరిగానే భావించాలి. తద్వారా ఎటువంటి ఒత్తిడి లేకుండా పరీక్షకు హాజరు కావచ్చు. -ఎంఎన్ రావు, చైతన్య విద్యా సంస్థలు ఫిజిక్స్ ప్రతి అంశంలోని ఫార్ములాలు, ముఖ్యమైన పాయింట్లను సాధ్యమైనన్ని సార్లు పునశ్చరణ చేసుకోవాలి. అకడమిక్ పుస్తకాల్లోని మెకానిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయి డ్స్, థర్మోడైనమిక్స్, ఫిజికల్ ఆప్టిక్స్, న్యూక్లి, కమ్యూనికేషన్స్ తదితర అంశాల్లోని థియరీ ప్రశ్నలపై దృష్టి సారించాలి. క్లిష్టంగా భావించే అంశాలను ప్రాథమిక భావనలాధారంగా నేర్చుకోవడానికి ప్రాధాన్యతనివ్వాలి. గత ఐదేళ్ల ఎంసెట్ ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. గ్రాండ్ టెస్ట్లకు హాజరు కావాలి. న్యూమరికల్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ముఖ్యమైన అంశాలను అండర్లైన్ చేసుకోవాలి. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, అటమ్స్, న్యూక్లి, థర్మోడైనమిక్స్, కైనటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ వంటి అంశాలపై పట్టు సాధించాలి. ఈ అంశాలు కెమిస్ట్రీ ప్రిపరేషన్లో కూడా ఉపయోగపడతాయి. {పతి అంశానికి సంబంధించిన యూనిట్స్, డెమైన్షన్స్పై పూర్తి అవగాహన సాధించాలి. పరీక్షలో ఫిజిక్స్కు కనీసం గంట 15 నిమిషాల సమయం కేటాయించడం ప్రయోజనకరం. పరీక్షలో ఇచ్చే 40ప్రశ్నల్లో 25ప్రశ్నలు సులువుగా, 10 ప్రశ్నలు మధ్యస్తంగా, 5 ప్రశ్నలు క్లిష్టంగా ఉంటాయి. కాబట్టి మొదటి 35ప్రశ్నలపై దృష్టి సారించడం మంచిది.-పి.కె.ఎస్.రావు, శ్రీ గాయత్రి విద్యా సంస్థలు కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పునశ్చరణకు కేటాయించాలి. ఇందులో ఆల్ నేమ్డ్ రియాక్షన్స్- మెకానిజమ్ (రిగెంట్స్తో కలిపి), ఇంటర్కన్జర్వేషన్స్, ఆల్కహాల్స్-ఫినోల్స్-కార్బాక్సిలిక్ యాసిడ్స్ ్కఓ్చ విలువలు, ఎమైన్స్ ్కఓఛ విలువలపై దృష్టి సారించాలి.ఫిజికల్ కెమిస్ట్రీలో ప్రాబ్లమెటిక్ పార్ట్కు సంబంధించిన అన్ని ఫార్ములాలపై పట్టు సాధించాలి.ఇనార్గానిక్ కెమిస్ట్రీలో గ్రూప్స్ ప్రాక్టీస్లో ట్రెండ్స్ ఇన్ ప్రాపర్టీస్ ఆఫ్ హైడ్రైడ్స్, ఆక్సైడ్స్, ఆల్డిహైడ్స్, ఆక్సీహైడ్స్ (ప్రతి గ్రూపులోని)కు ప్రాధాన్యతనివ్వాలి. బయో మాలిక్యూల్స్, పాలిమర్స్కు ఒక రోజు, కెమిస్ట్రీ ఎవ్రీ డే ఇన్ లైఫ్ అంశానికి ఒక రోజు కేటాయించాలి. చివరి రెండు రోజుల్లో ప్రతి చాప్టర్కు సంబంధించిన ముఖ్య భావనలను పునశ్చరణ చేసుకోవాలి. గత ఎంసెట్ ప్రశ్నపత్రాలను విధిగా ప్రాక్టీస్ చేయాలి. గ్రాండ్ టెస్ట్లకు హాజరు కావాలి. నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్ని ప్రశ్నలను ప్రయత్నించడం ఉత్తమం. -జి.పి. రావు, నారాయణ విద్యా సంస్థలు బోటనీ ప్రభావవంతమైన పునశ్చరణ కోసం కొన్ని చాప్టర్లపై దృష్టి కేంద్రీకరించాలి. సిలబస్ పరంగా చూస్తే.. ఎంసెట్లో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సిలబస్కు సమప్రాధాన్యతనిస్తారు.పునశ్చరణలో ప్రథమ సంవత్సరం చాప్టర్లపై దృష్టి సారించడం ఉపయుక్తం.ఎందుకంటే ఇందులో అడిగే ప్రశ్నలన్నీ నాలెడ్జ్ బే స్డ్గా ఉంటాయి. అంతేకాకుండా వీటిని గుర్తు పెట్టుకోవడం తేలిక. దాంతో మంచి స్కోర్ చేయవచ్చు. ప్రథమ సంవత్సరంలోని మొదటి చాప్టర్ (Biological classification), ఆరో చాప్టర్ (prokaryotic cell), ద్వితీయ సంవత్సరంలోని ఏడు, ఎనిమిది (Microbiology), 14వ చాప్టర్లను (Microbes in human life) క్లబ్ చేసి చదువుకోవాలి. ఇందులోంచి 8,9 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. తర్వాతి ప్రాధాన్యత ప్రథమ సంవత్సరం నాలుగో చాప్టర్ (Plant kingdom)కు ఇవ్వాలి. దీనికి సమయం ఎక్కువ కేటాయించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఇందులో పట్టు సాధించడం చాలా కీలకం. తర్వాత ప్రథమ సంవత్సరం 12వ చాప్టర్(Histology and Anatomy), ద్వితీయ సంవత్సరం 10వ చాప్టర్ (Molecular biology)ను ప్రిపేర్ కావాలి. వీటిలోంచి 5 నుంచి 6 ప్రశ్నలు రావచ్చు. ప్రథమ సంవత్సరంలోని ఐదు (Morpholog), ఆరు, ఏడు చాప్టర్ల (Reproduction)కు సమయం కేటాయించాలి. ఇవి సులువైనవే కాకుండా ముఖ్యమైనవి కూడా. వీటిలోంచి 5 నుంచి 6 ప్రశ్నలు రావచ్చు. Cytology, Genetics, Biotechnology అంశాలను ఒకే గ్రూప్గా చేసి చదువుకోవడం స్వల్ప కాలంలో ఎక్కువ మొత్తంలోనే ప్రిపేర్ కావచ్చు.ద్వితీయ సంవత్సరంలోని మొదటి యూనిట్ (్కజిడటజీౌౌజడ) నుంచి 5 నుంచి 6 ప్రశ్నలు రావచ్చు. ఇందులో Mineral nutrition చాలా ముఖ్యమైన అంశం. చివర్లో ప్రథమ సంవత్సరం 13వ చాప్టర్ (Ecology), ద్వితీయ సంవత్సరంలోని 12వ, 13వ చాప్టర్లను ప్రిపేర్ కావాలి. తద్వారా స్ఫురణకు రాని ముఖ్యమైన అంశాలను జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు. -బి. రాజేంద్ర, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్. జువాలజీ జంతు శాస్త్రం ప్రథమ సంవత్సరంలో యూనిట్ల వారీగా వచ్చే ప్రశ్నలు ఇలా ఉండొచ్చు. యూనిట్-1(2), యూనిట్-2(2 లేదా 3), యూనిట్-3(2), యూనిట్-4(2),యూనిట్ -5(2), యూనిట్-6(2 లేదా 4), యూనిట్ -7(2 లేదా 4), యూనిట్ -8(2 లేదా 4). జంతు వైవిధ్యం-1, 2లలో ప్రతి సముదాయంలోని ముఖ్యమైన పదాలపై దృష్టి సారించాలి. ఉదాహరణ-తరాల ఏకాంతరత, లాసో కణాలు, రాబ్డయిట్లు, బోత్రిడియం, రెనిట్ గ్రంథులు, సిర్రస్, నేథోఖైలేరియం, రాడ్యాలా, స్ఫటిక శంఖువు, అరిస్టాటిల్ లాంతరు, సంపర్క దండాలు, కర్ణ స్థంభిక, సంయుక్త త్రికం, ద్రోణి, హలాస్థి, విష్బోన్ వంటివి. వివిధ సముదాయాలకు చెందిన డింభకాలను నేర్చుకోవాలి. వానపాము, బొద్దింక నిర్మాణ వ్యవస్థలను తులనాత్మకంగా అధ్యయనం చేయాలి. మిధ్యాపాదాలు, కశాభాలు, ద్విదావిచ్ఛితిలో జరిగే దశలు వంటి వాటిపై దృష్టి సారించాలి. జీవావరణ శాస్త్రంలోని కాంతి, ఉష్ణోగ్రత ప్రభావాలు, సరస్సు, జీవావరణ వ్యవస్థ, ఆహార గొలుసులు, జీవావరణ పిరమిడ్లు, శక్తి ప్రసరణ, షోషక వ లయాలు, జనాభా వంటి అంశాలపై దృష్టి సారించాలి. పర్యావరణ అంశాల నుంచి ఒక ప్రశ్న రావచ్చు.ద్వితీయ సంవత్సరంలో మానవ వ్యవస్థలు మొత్తం ఐదు యూనిట్లలో 10 వ్యవస్థలను ప్రస్తావించారు. వీటి నుంచి 10 నుంచి 12 ప్రశ్నలు రావచ్చు. ఇదే క్రమంలో జన్యుశాస్త్రం-3, జీవపరిణామం- 2 లేదా 3, జీవ పరిణామం- 2 లేదా3, అనువర్తిత జీవశాస్త్రం-3 ప్రశ్నలు అడగొచ్చు.మానవుని వ్యవస్థలలో వివిధ డిసార్డర్స్ను నేర్చుకోవాలి. వివిధ పాఠ్యాంశాలలోని పటాలను క్షుణ్నంగా పరిశీలించాలి. ఉదాహరణ-ఆక్సీ హీమోగ్లోబిన్ వియోజిత వక్రరేఖ, నాడీ ప్రచోదనం, ఈసీజీ, మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పెడిగ్రి చార్ట్ వంటివి. -కె.శ్రీనివాసులు, చైతన్య విద్యా సంస్థలు. జనరల్ టిప్స్ ఎంసెట్లో 50 నుంచి 60 శాతం ప్రశ్నలు ఇంటర్మీడియెట్లో అకడెమిక్స్పై పట్టు ఉన్న విద్యార్థులందరూ సమాధానం ఇచ్చే విధంగానే ఉంటున్నాయి. 20 నుంచి 30 శాతం ప్రశ్నలు ఓ మోస్తరు క్లిష్టతతో, మరో 20 నుంచి 30 శాతం ప్రశ్నలు అత్యంత క్లిష్టంగా ఉంటున్నాయి. ర్యాంకుల నిర్ధారణ అత్యంత క్లిష్టంగా ఉండే 20 నుంచి 30 శాతం ప్రశ్నలే కీలక పాత్ర వహిస్తాయి. కాబట్టి విద్యార్థులు ఈ దిశగా దృష్టి సారించి ప్రిపరేషన్ సాగించాలి. అన్ని సబ్జెక్ట్లకు సంబంధించి ముఖ్యమైన ఫార్ములాలు, కాన్సెప్ట్స్ ఆధారిత ప్రశ్నల ప్రాక్టీస్కు ప్రాధాన్యమివ్వాలి.ముఖ్యమైన ఫార్ములాలను, కాన్సెప్ట్లను నోట్స్ రూపంలో పొందుపర్చుకుంటే రివిజన్ సులభంగా పూర్తి చేసుకోవచ్చు.ప్రతి విభాగానికి సంబంధించి అభ్యర్థులు తమకు అనుకూలమైన రీతిలో షార్ట్కట్ మెథడ్స్తో సొంత నోట్స్ రూపొందించుకోవాలి.ఏ సబ్జెక్ట్ అయినా.. ప్రస్తుత సమయంలో కొత్త అంశాల జోలికి వెళ్లకూడదు. దీని వల్ల సమయం వృథా అవడంతోపాటు మానసిక ఆందోళనకు గురవుతారు.పరీక్ష తేదీకి వారం రోజుల ముందు నుంచి పూర్తిగా రివిజన్కే కేటాయించాలి. -
జాబ్ రిమైండర్స్
ఇండియన్ ఆర్మీ టెరీటోరియల్ ఆర్మీ ఆఫీసర్ అర్హత: గ్రాడ్యుయేషన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 31, 2013 వెబ్సైట్: http://indianarmy.nic.in ........................................................ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్/డ్రైవర్ 70 పోస్టులు దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 21, 2013 వెబ్సైట్: www.cisf.nic.in ........................................................ ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 18, 2014 వెబ్సైట్: www.ntpccareers.net ........................................................ సీఆర్పీఎఫ్ 793 కానిస్టేబుల్ పోస్టులు దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 23, 2013 వెబ్సైట్: crpf.nic.in ........................................................ బీపీసీఎల్ మేనేజ్మెంట్ ట్రైనీ విభాగాలు: మెకానికల్, కెమికల్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 31, 2014 వెబ్సైట్: www.bpclcareers.in ........................................................ For More Job News: Visit www.sakshieducation.com -
పల్లె ప్రతిభకు తార్కాణం.. మంజునాథ
గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను సానపడితే.. అద్భుతాలు సృష్టించగలరు అనే ఆశయంతో ప్రారంభమైనవే.. ట్రిపుల్ ఐటీ విద్యా సంస్థలు.. ఇప్పుడు ఆ కలలను నిజం చేస్తూ.. ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు.. అటువంటి విద్యార్థుల్లో ఒకరు.. మోపిరెడ్డిగారి మంజునాథ రెడ్డి. వై.ఎస్.ఆర్. కడపజిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతూ.. ఇటీవలి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎఫ్ఎంసీలో రూ. 5.2 లక్షల వార్షిక వేతనంతో కొలువు సాధించాడు. మంజునాథ విజయ గాథ అతని మాటల్లోనే.. కుటుంబ నేపథ్యం: అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కొండూరు మా స్వస్థలం. వ్యవసాయ కుటుంబం. నాన్న మోపిరెడ్డిగారి బైపరెడ్డి. అమ్మ అనసూయ. తమ్ముడు మణికంఠ రెడ్డి చిత్తూరులో బీటెక్ (మెకానికల్) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అమ్మానాన్నకు చదువు విలువ తెలుసు. దాంతో మా ఇద్దర్నీ ఉన్నతంగా చదివించాలని సంకల్పించారు. మేం కూడా వారి ఆశయాలను నెరవేర్చాలనే ఉద్దేశంతో శ్రమిస్తున్నాం. నవోదయ టు ట్రిపుల్ ఐటీ: నవోదయ పరీక్షలో అర్హత సాధించడంతో ఆరు నుంచి పదో తరగతి వరకు లేపాక్షి జవహర్ నవోదయ పాఠశాలలో చదివాను. పదోతరగతిలో 464/500 మార్కులు రావటంతో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో అడ్మిషన్ లభించింది. ఇందులో మొదటి రెండేళ్లు పీయూసీ ఉంటుంది. తర్వాత నాలుగేళ్లు ఇంజనీరింగ్ బోధిస్తారు. ఇంజనీరింగ్లో మెకానికల్ బ్రాంచ్ను ఎంచుకున్నా. నూతన విధానంలో టెక్నాలజీని ఉపయోగించుకుని వీడియో ద్వారా పాఠాలను బోధించడం వంటివి అంశాలు ఉత్సాహాన్ని కలిగించేవి. నేర్చుకోవాలనే తపనను పెంపొందించేవి. ప్రణాళిక ప్రకారంగా ఉండే ప్రయోగశాలలు, లైబ్రరీ కార్యకలాపాలు క్రమశిక్షణను అలవాటు చేశాయి. ఐఐటీ ప్రొఫెసర్ల పాఠాలు ఎంతో స్ఫూర్తి నిచ్చాయి. తద్వారా అనుకున్నది సాధించగలమనే విశ్వాసం ఏర్పడింది. ముఖ్యంగా ఐఐటీ ప్రొఫెసర్ జె.ఎస్. రావు మెకానికల్ ఇంజనీరింగ్లో వస్తున్న మార్పులను వీడియో ద్వారా వివరించడం ఎంతో ప్రభావితం చేసింది. భవిష్యత్లో ఏదైనా పరికరాన్ని కనుక్కోవాలన్న ఆలోచనకు బీజం వేసింది. క్షేత్ర స్థాయి అవగాహనకు: తరగతి గదిలో నేర్చుకున్న దానికంటే ఇంటర్న్షిప్, ప్రాజెక్టు వర్కు వంటి అంశాలు ప్రాక్టికల్గా నాలెడ్జ్ను పెంచుకోవడానికి దోహదం చేశాయి. ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో ఎనిమిది వారాలపాటు ఇంటర్న్షిప్ చేశాను. క్షేత్ర స్థాయిలోని అంశాలపై అవగాహనకు ఇంటర్న్షిప్ ఎంతగానో ఉపయోగపడింది. నానో టెక్నాలజీలో రాగి వినియోగంపై రూపొందించిన ప్రాజెక్టు వర్క్ మంచి గుర్తింపునిచ్చింది. ప్రిపరేషన్ ఇలా: ఇంజనీరింగ్లో సాధించిన మార్కులు క్యాంపస్ ప్లేస్మెంట్కు అర్హత కల్పిస్తాయి. ఆ తర్వాత వ్యక్తిగత సామర్థ్యం, నైపుణ్యాలే ఉద్యోగ సాధనలో నిర్ణయాత్మక పాత్రను పోషిస్తాయి. క్యాంపస్ ఇంటర్వ్యూలలో వునం ఇచ్చే రెజ్యుమె కీలక పాత్రను పోషిస్తుంది. రెజ్యుమెలో పేర్కొన్న ప్రతి అంశంపై పట్టుండాలి. ప్లేస్మెంట్ కోసం నెల రోజుల పాటు శిక్షణనిచ్చారు. ఇది ఎంతగానో ఉపయోగపడింది. అంతేకాకుండా నైట్స్టడీస్లో స్నేహితులందరూ రోజూ అర గంట మాక్ ఇంటర్వ్యూలు, గ్రూప్ డిస్కషన్ వంటి వాటిని ప్రాక్టీస్ చేసే వాళ్లం. దాంతో కమ్యూనికేషన్స్కిల్స్, ఇంటర్వ్యూ అంటే భయం పోయింది. ఇవన్నీ ప్లేస్మెంట్లో విజయం సాధించేందుకు ఉపకరించాయి. విధులు: మెకానికల్ ఇంజనీరింగ్లో డిజైనింగ్ నాకు ఆసక్తి ఉన్న సబ్జెక్ట్. 3-డి ప్రింటింగ్కు సంబంధించి ప్రాజెక్ట్ వర్క్ చేశా ను. జాబ్ ఆఫర్ ఇచ్చిన ఎఫ్ఎంసీ కూడా అదే విభాగంలో అవకాశం ఇచ్చింది. సముద్రంలో ఉన్న గ్యాస్ నిక్షేపాలను వెలికితీసేందుకు అవసరమైన మెషిన్స్ను డిజైన్ చేయటం, వాటిని సముద్రగర్భంలోకి తీసుకెళ్లి రోబోటిక్స్ సాయంతో అమర్చడం వంటి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. రైతుల కష్టాలు తీరుస్తా: అనంతపురం జిల్లా అంటే కరువు గుర్త్తుకొస్తుంది. వర్షాధారంగా పండే పంటలే ఇక్కడి రైతులకు ఆధారం. చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూస్తు పెరిగా. బీటెక్లో చేరాక వాటర్ మేనేజ్మెంట్ ప్రక్రియ గురించి తెలిసింది. కొన్ని దేశాల్లో కొద్దిపాటి వర్షపు నీటితో పదిరెట్లు అధికంగా దిగుబడి సాధిస్తున్నారు. అలాంటి టెక్నాలజీని రూపొందించి కరువు జిల్లాల్లో రైతుల కష్టాలు తీర్చాలనేది నా లక్ష్యం. -
ఎంఆర్క్ కోర్సు వివరాలు తెలపండి...
టి. మురళీధరన్, టి.ఎం.ఐ. నెట్వర్క్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఎంఈ/ఎంటెక్ను ఆఫర్ చేస్తున్న సంస్థలేవి? - నరేందర్, నెల్లూరు. మెడిసిన్, టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ఇన్స్ట్రుమెంటేషన్ అప్లికేషన్స్ అవసరమవుతాయి. కోర్సుల వివరాలు: జేఎన్టీయూ, హైదరాబాద్.. ఇన్స్ట్రుమెంటేషన్లో ఎంటెక్ను ఆఫర్ చేస్తోంది. అర్హత: ఈఈఈ/ఈసీఈ/ఈఐఈ/ ఐసీఈలో బీఈ/బీటెక్. గేట్లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.jntuh.ac.in ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం.. ఇన్స్ట్రుమెంటేషన్ స్పెషలైజేషన్తో ఎంటెక్ను అందిస్తోంది. అర్హత: ఈసీఈ/ఈఈఈ లేదా సంబంధిత సబ్జెక్టులో బీఈ/ బీటెక్. గేట్ లేదా పీజీఈ సెట్లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.andhrauniversity.edu.in శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి.. ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్ స్పెషలైజేషన్తో ఎంటెక్ను ఆఫర్ చేస్తోంది. అర్హత: ఈఈఈ/ ఈసీఈ/ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లేదా కంట్రోల్ ఇంజనీరింగ్. వెబ్సైట్: www.svuniversity.ac.in కెరీర్: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ రంగాల్లో అవకాశాలుంటాయి. ఇండియన్ రైల్వేస్, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లోనూ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ద్వారా ఉన్నత ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. బి.ఫార్మసీ పూర్తిచేశాను. సాస్ (A) కోర్సును అందించే సంస్థల వివరాలు తెలియజేయండి? - సునీత, ఖమ్మం. క్లినికల్ పరీక్షలకు సంబంధించిన డేటాను విశ్లేషించేందుకు ఉపయోగపడే సాఫ్ట్వేర్.. సాస్ (అ). సాస్-క్లినికల్ అనేది సాస్లో ఒక మాడ్యూల్. ఇది క్లినికల్ పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని వేగంగా విశ్లేషించేందుకు, నిర్వహించేందుకు ఉపయోగపడుతుంది. కోర్సుల వివరాలు: బయో మెడ్ ఇన్ఫర్మాటిక్స్, మెడ్విన్ హాస్పిటల్స్, నాంపల్లి.. సాస్- బయోస్టిక్స్ అండ్ ప్రాజెక్టు ఇన్ క్లినికల్ రీసెర్చ్ ప్రోగ్రామ్ను ఆఫర్ చేస్తోంది. కోర్సు కాల వ్యవధి 45 రోజులు. అర్హత: ఎంబీబీఎస్, ఎండీ, బీడీఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, బీఏఎంఎస్, బీపీటీ/ ఎంఎస్సీ (మైక్రోబయాలజీ)/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ బయో ఇన్ఫర్మాటిక్స్/ కెమిస్ట్రీ/ జెనెటిక్స్/ బోటనీ/ జువాలజీ/ లైఫ్ సెన్సైస్/ బయో మెడికల్ జెనెటిక్స్/ మాలిక్యులర్ బయోసెన్సైస్/ స్టాటిస్టిక్స్/ నర్సింగ్. లేదా బి.ఫార్మసీ/ ఎం.పార్మసీ/ బీటెక్ (బయోటెక్నాలజీ). ప్రవేశాలు: ఎంట్రన్స్లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: http://biomedlifesciences.com శ్రీ టెక్నాలజీస్, అమీర్పేట్.. సాస్ క్లినికల్ కోర్సును అందిస్తోంది. కోర్సు కాల వ్యవధి 40 రోజులు. అర్హత: గ్రాడ్యుయేషన్లో ఉత్తీర్ణత. లైఫ్ సెన్సైస్ నేపథ్యం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం. వెబ్సైట్: www.sreetechnologies.com Bened Software Solution, అమీర్పేట్.. సాస్ క్లినికల్ కోర్సును అందిస్తోంది. కోర్సు కాల వ్యవధి 30 రోజులు. అర్హత: గ్రాడ్యుయేషన్లో ఉత్తీర్ణత. వెబ్సైట్: www.benedsoft.com కెరీర్: సాస్లో శిక్షణ తీసుకున్న వారికి ఫార్మాస్యూటికల్, బయో టెక్నాలజీ, క్లినికల్ ట్రయల్స్ కంపెనీల్లో అవకాశాలు లభిస్తాయి. మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సును ఆఫర్ చేస్తున్న సంస్థల వివరాలు తెలియజేయగలరు? -రవి కిషోర్, కర్నూలు నివాస భవంతులు, అపార్టుమెంట్లు, విల్లాలు, షాపింగ్మాల్స్, షాపింగ్ కాంప్లెక్సులు.. వంటి నిర్మాణాల రూపకల్పనకు సంబంధించిన అంశాలను ఆర్కిటెక్చర్.. శాస్త్రీయ కోణంలో వివరిస్తుంది. వివిధ సంస్థలు ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్, మాస్టర్స్, పరిశోధన స్థాయి కోర్సులను అందిస్తున్నాయి. ఇంటీరియర్ డిజైనింగ్; ఇండస్ట్రియల్ డిజైన్; అర్బన్ డిజైన్; ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్; బిల్డింగ్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ స్పెషలైజేషన్లతో ఆర్కిటెక్చర్లో మాస్టర్స్ కోర్సు (ఎంఆర్క్) అందుబాటులో ఉంది. ఎంఆర్క్ను ఆఫర్ చేస్తున్న సంస్థలు: జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, హైదరాబాద్.. కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, కన్జర్వేషన్ ప్లానింగ్, ప్రాపర్టీ డెవలప్మెంట్లతో ఎంఆర్క్ను ఆఫర్ చేస్తోంది. ఎంట్రన్స్లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: http://jnafau.ac.in స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, న్యూఢిల్లీ.. ఆర్కిటెక్చరల్ కన్జర్వేషన్, అర్బన్ డిజైన్ స్పెషలైజేషన్లతో మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: బీఆర్క్/ బి.ప్లానింగ్లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. జామియా మిలియా ఇస్లామియా, ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ఎకిస్టిక్స్, న్యూఢిల్లీ.. మెడికల్ ఆర్కిటెక్చర్, బిల్డింగ్ సర్వీసెస్ రిక్రియేషనల్ అండ్ ఆర్కిటెక్చర్ స్పెషలైజేషన్లతో ఎంఆర్క్ను అందిస్తోంది. అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.jmi.ac.in ఇఉ్కఖీ యూనివర్సిటీ, అహ్మదాబాద్.. థియరీ అండ్ డిజైన్ స్పెషలైజేషన్తో ఎంఆర్క్ను ఆఫర్ చేస్తోంది. డిజైన్ పోర్ట్ఫోలియో ఎవల్యూషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.cept.ac.in కెరీర్: ఎంఆర్క్ను పూర్తిచేసిన వారికి కన్స్ట్రక్షన్ సంస్థలు, ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీలు, పరిశోధన సంస్థల్లో అవకాశాలుంటాయి. ఫ్రీలాన్సర్ లేదా కన్సల్టెంట్గా, ఫ్యాకల్టీగా కూడా పనిచేయొచ్చు. -
యునిసెఫ్ రాయబారిగా టెండ్కూలర్
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు జాతీయం విద్య, నైపుణ్యాలపై భారత్ - ఆస్ట్రేలియా ఒప్పందం విద్య, నైపుణ్యాల రంగంలో సహకరించుకునేందుకు భారత్ - ఆస్ట్రేలియాలు నవంబర్ 29న న్యూఢిల్లీలో ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆస్ట్రేలియా తాత్కాలిక హైకమిషనర్ బెర్నార్డ్ ఫిలిప్, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి ఎం.ఎం. పల్లంరాజు సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ఇప్పటికే ఏర్పాటైన భారత్ - ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ విద్య, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి అన్ని స్థాయిల్లో కార్యాచరణను రూపొందిస్తుంది. 2022 నాటికి భారత్ 500 మిలియన్ల మందికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వచ్చే దశాబ్దాల్లో ప్రతి ఏటా 12 నుంచి 15 మిలియన్ల మంది మానవ వనరులను భారత్ సమకూర్చుకోవాల్సి ఉంది. ఇందుకు అవసరమైన నాణ్యతతో కూడిన శిక్షణ, ప్రమాణాలను ఆస్ట్రేలియా అందిస్తుందని బెర్నార్డ్ ఫిలిప్ తెలిపారు. ఈ సంఖ్య 2011లో 2.3 మిలియన్లు. యునిసెఫ్ రాయబారిగా టెండ్కూలర్ క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండ్కూలర్ యునిసెఫ్ పారిశుద్ధ్య కార్యక్రమం ప్రాంతీయ ప్రచార కార్యకర్తగా నియమితులయ్యారు. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో యునిసెఫ్ ప్రచార కార్యకర్తగా సచిన్ వ్యవహరిస్తారు. ఇందుకు సంబంధించిన అంగీకార పత్రంపై యునిసెఫ్ దక్షిణాసియా ప్రాంతీయ డెరైక్టర్ కరీన్ హుల్షోప్ సమక్షంలో నవంబర్ 21న టెండ్కూలర్ సంతకం చేశారు. సబ్బుతో చేతులు కడుక్కునే అలవాటుపై తన శాయశక్తులా ప్రచారం చేస్తానని సచిన్ అన్నారు. దక్షిణాసియాలో అత్యధికంగా ఐదేళ్లలోపు పిల్లల మరణాలు జరుగుతున్నాయని కరీన్ హుల్షోప్ తెలిపారు. ఇఫి చిత్రోత్సవం అవార్డులు 44వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు (ఇఫి) పనాజీలో నవంబర్ 30న ముగిశాయి. అవార్డులు: ఉత్తమ చిత్రానికిచ్చే బంగారు నెమలి: తూర్పు తైమూర్ నిర్మించిన తొలి చిత్రం ‘బీట్రిజ్ వార్’కు దక్కింది. దీనికి బెటిరీస్ దర్శకత్వం వహించారు. ఈ అవార్డు కింద రూ.40 లక్షలు బహూకరించారు. వెండి నెమలి అవార్డు: మెగే దాకా తారా (బెంగాలీ, దర్శకత్వం: కమలేశ్వర్ ముఖర్జీ) ఉత్తమ దర్శకుడు: కౌశిక్ గంగూలీ (చిత్రం: అపూర్ పాంచాలి) ఉత్తమ నటుడు: అలోన్ మోని అబేత్బేల్ (చిత్రం: ఎ ప్రెస్ ఇన్ హెలెన్) ఉత్తమ నటి: మగ్దలెనా బోక్జరాస్కా (చిత్రం: ఇన్హైడింగ్) పురావస్తు శాస్త్రవేత్త ఐ.కె.శర్మ మృతి ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త, భారత పురావస్తు శాఖ మాజీ డెరైక్టర్ ఐ.కె. శర్మ (ఇంగువ కార్తికేయ శర్మ) (76) హైదరాబాద్లో నవంబర్ 28న మరణించారు. ఆయన పురావస్తు శాస్త్రంలోనే కాకుండా కళలు, ఆర్కిటెక్చర్, ప్రాచీన కట్టడాల పరిరక్షణ వంటి విషయాల్లో కూడా పేరొందారు. ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున కొండ, గుడిమల్లామ్, అమరావతి, గుంటుపల్లి, పెదవేగి, రాజస్థాన్లోని కాలీభంగం, తమిళనాడులోని పైయాంపల్లి, మహారాష్ట్రలోని పుణే, గుజరాత్లోని సుర్కోడ్తా ప్రాంతాల్లో చేపట్టిన తవ్వకాల్లో ప్రధాన పాత్ర పోషించారు. అనేక పుస్తకాలు ప్రచురించారు. తుది తీర్పు ప్రకటించిన కృష్ణా జలాల ట్రిబ్యునల్ కృష్ణా జలాల వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యు నల్ తన తుది తీర్పును నవంబర్ 29న వెలువరించింది. ఈ తీర్పు 2050 వరకు అమలులో ఉంటుంది. తీర్పు ప్రధానాంశాలు: ఆల్మట్టి డ్యామ్ ఎత్తు 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్ల ఎత్తుకు పెంచేందుకు కర్ణాటకకు అనుమతి ఇచ్చింది. మిగులు జలాలపై ఉన్న హక్కును ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది. ఎగువ రాష్ట్రాలకు వాటా లభించింది. ఆంధ్రప్రదేశ్కు 1005 టీఎంసీలు, కర్ణాటకకు 907 టీఎంసీలు, మహారాష్ట్రకు 666 టీఎంసీలు కేటాయించింది. 2010, డిసెంబర్ 30న ఇచ్చిన మధ్యంతర తీర్పులో ఈ కేటాయింపులు వరుసగా 1001 టీఎంసీలు, 911 టీఎంసీలు, 666 టీఎంసీలు ఉన్నాయి. 65 శాతం నీటి లభ్యత ఆధారంగా 2578 టీఎంసీల నీటిని మూడు రాష్ట్రాలకు పంచింది. బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2130 టీఎంసీల నీటిని పంపిణీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో తక్కువ లభ్యత ఉంటే ఆ మేరకు మిగిలిన నీటిని ఎగువ రాష్ట్రాలు విడుదల చేయాలి. నీటి వాడకంపై పర్యవేక్షణ బోర్డు ఏర్పాటు చేస్తారు. కర్ణాటకకు 173, మహారాష్ట్రకు 81 టీఎంసీల నీటిని అదనంగా కేటాయించింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ 811, కర్ణాటక 734, మహారాష్ట్రలకు 585 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది. సహజీవనం నేరం కాదన్న సుప్రీంకోర్టు సహజీవనం నేరం కాదని సుప్రీంకోర్టు నవంబర్ 28న తీర్పులో పేర్కొంది. సహజీవనం చేస్తున్న మహిళలకు, వారికి పుట్టే పిల్లలకు భద్రత, రక్షణకు చట్టాన్ని రూపొందించాలని పార్లమెంటును కోరింది. వివాహబంధాల్నే కాకుండా సహజీవనానికి గుర్తింపునివ్వాలని కోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా పెళ్లికి ముందు లైంగిక సంబంధాలను ప్రోత్సహించడం లేదని కూడా తెలిపింది. భరణం ఇప్పించాలంటూ సహజీవనం చేసిన మహిళ దాఖలు చేసిన పిటీషన్పై కోర్టు తీర్పునిచ్చింది. డా.సుబ్బన్న అయ్యప్పన్కు నాయుడమ్మ అవార్డు ప్రముఖ శాస్త్రవేత్త ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ డెరైక్టర్ జనరల్ డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్కు ప్రతిష్టాత్మక నాయుడమ్మ అవార్డు 2014ను అందజేయనున్నట్లు నాయుడమ్మ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆల్టర్నేటివ్స్ డెరైక్టర్ డాక్టర్ ఎ.జగదీష్ డిసెంబర్ 2న తెలిపారు. విప్లవకవి మండే సత్యం మృతి విప్లవ కవి మండే సత్యనారాయణ (80) హైదరాబాద్లో నవంబర్ 27న మరణించారు. ఆయన పీపుల్స్వార్ ఉద్యమ నేపథ్యంలో 100కు పైగా విప్లవ గీతాలు రాశారు. ఎర్ర సైన్యం, చీమల దండు సినిమాలకు పాటలు రాశారు. అంతర్జాతీయం మూన్ రోవర్ను ప్రయోగించిన చైనా చంద్రుడిపై పరిశోధనకు చైనా తన మొదటి రోవర్ను డిసెంబర్ 1న ప్రయోగించింది. చాంగె-3 రాకెట్ ద్వారా ‘జడే రాబిట్’ అని పిలిచే రోవర్ను క్సిచాంగ్ శాటిలైట్ లాంచ్ కేంద్రం నుంచి పంపింది. ఈ రోవర్ డిసెంబర్ మధ్యలో చంద్రుడిపై దిగుతుంది. చంద్రుడి ఉపరితలం, అక్కడి సహజ వనరులపై సమాచారం సేకరిస్తుంది. ఇది చంద్రుడిపైకి పంపిన మూడో లూనార్ రోవర్. గతంలో అమెరికా, రష్యాలు ఇటువంటి రోవర్లు పంపాయి. దుబాయ్లో 2020 వరల్డ్ ఎక్స్పో వరల్డ్ ఎక్స్పో-2020కు దుబాయ్ ఆతిథ్యమివ్వనుంది. ఈ ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు నవంబర్ 28న జరిగిన బిడ్డింగ్లో దుబాయ్కు 116 ఓట్లు వచ్చాయి. రష్యాలోని ఎకటెరిన్ బర్గ్ 47 ఓట్లు మాత్రమే సాధించింది. పారిస్లో జరిగిన ఓటింగ్లో 168 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం 6.8 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రైవేటు రంగం వ్యయం కలుపుకుంటే ఇది 18.3 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. 438 హెక్టార్లలో భారీ నిర్మాణాలు చేపట్టవలసి ఉంటుంది. 2,77,000 ఉద్యోగావకాశాలు ఏర్పడతాయి. ప్రతి ఐదేళ్లకొకసారి ఈ ఎక్స్పో నిర్వహిస్తారు. 2015లో మిలాన్లో ఈ ఎక్స్పో జరుగుతుంది. చివరగా షాంఘైలో జరిగింది. మహిళల హక్కుల పరిరక్షకుల తీర్మానానికి యూఎన్ ఆమోదం ఐక్యరాజ్యసమితి సాధారణ సభ కమిటీ తొలిసారిగా మహిళల హక్కుల పరిరక్షకుల తీర్మానాన్ని నవంబర్ 27న ఆమోదించింది. మహిళా హక్కు పరిరక్షకులపై జరిగే హింసాత్మక చర్యలను దేశాలు బహిరంగంగా ఖండించాలని, వారిని అడ్డుకునే చట్టాలను సవరించాలని, వారికి ఐక్యరాజ్యసమితి సంస్థల్లో అవకాశాలు కల్పించాలని ఈ తీర్మానం పేర్కొంటోంది. ఎయిడ్స్ సంబంధిత రోగంతో 2.1 లక్షల మంది పిల్లల మృతి గత ఏడాదిలో ఎయిడ్స్ సంబంధిత అనారోగ్యంతో 2,10,000 మంది బాలలు మరణించినట్లు ఐక్యరాజ్యసమితి బాలల అత్యవసర నిధి (యునిసెఫ్) తన నివేదికలో తెలిపింది. హెచ్ఐవి వ్యాధితో బాధపడే చిన్నారుల్లో 34 శాతం మంది తక్కువ, మధ్యస్థ ఆదాయ దేశాల్లోనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మరణాలు 10-19 సంవత్సరాల వయసువారిలో 2005-2012 మధ్యకాలంలో 50 శాతం పెరిగాయని నివేదిక తెలిపింది. 2005-12మధ్య కాలంలో పిల్లల్లో 8.5 లక్షల మందికి ఈ వ్యాధి సోకకుండా అరికట్టినట్టు నివేదిక పేర్కొంది. గూఢచారం వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదించిన యూఎన్ ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిటీ వ్యక్తిగత జీవన హక్కు (రైట్ టు ప్రైవసీ) తీర్మానాన్ని నవంబర్ 26న ఆమోదించింది. జర్మనీ, బ్రెజిల్ ఒత్తిడితో ఈ తీర్మానం తీసుకొచ్చారు. జర్మనీ, బ్రెజిల్ నాయకులపై అమెరికా నిఘా పెట్టిందన్న వార్తలపై అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తమైంది. ఈ తీర్మానం కింద ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిటీ అధిపతి నవనీతం పిళ్లై దేశీయ, దేశీయేతర ప్రైవసీపై నివేదిక తయారు చేస్తారు. ఈ తీర్మానానికి ఫ్రాన్స్, రష్యా, ఉత్తర కొరియాతోపాటు 55 దేశాలు మద్దతునిచ్చాయి. పాకిస్థాన్ సైన్యాధిపతిగా రహీల్ షరీఫ్ పాకిస్థాన్ సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ రహీల్ షరీఫ్ (57) నియమితులయ్యారు. పదవీ విరమణ చేసిన జనరల్ అష్పాక్ పర్వేజ్ కయానీ స్థానంలో షరీఫ్ నవంబర్ 29న బాధ్యతలు చేపట్టారు. క్రీడలు పి.వి.సింధుకు మకావు గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్ మకావు గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టైటిల్ను భారత క్రీడాకారిణి పి.వి.సింధు గెలుచుకుంది. మకావులో డిసెంబర్ 1న జరిగిన ఫైనల్లో కెనడాకు చెందిన మిచెల్లి లీని ఓడించింది. ఈ ఏడాది సింధుకు ఇది రెండో గ్రాండ్ ప్రి టైటిల్. గత మేలో మలేషియా ఓపెన్ టైటిల్ సాధించింది. బుల్లర్కు ఇండోనేషియా ఓపెన్ గోల్ఫ్ టైటిల్ ఇండోనేషియా ఓపెన్ గోల్ఫ్ టైటిల్ను గగన్జిత్ బుల్లర్ గెలుచుకున్నాడు. డిసెంబర్ 1న జకార్తాలో జరిగిన పోటీలో విజేతగా నిలిచాడు. ఈ ఏడాదిలో బుల్లర్కు ఇది మొదటి టైటిల్. కాగా ఇండోనేషియాలో రెండో టైటిల్. కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్లో భారత్కు 117 పతకాలు మలేషియాలోని పెనాంగ్లో నవంబర్ 30న ముగిసిన కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో భారత్కు 117 పతకాలు లభించాయి. ఇందులో 57 స్వర్ణం, 39 రజతం, 21 కాంస్య పతకాలు ఉన్నాయి. ఉత్తమ లిఫ్టర్ అవార్డు ఆంధ్రప్రదేశ్కు చెందిన రాగాల్ వెంకట్ రాహుల్కు దక్కింది. రాహుల్ మొత్తం ఆరు స్వర్ణ పతకాలు గెలిచాడు. జూనియర్, యూత్, సీనియర్ విభాగాల్లో ఈ పోటీలు జరిగాయి. భారత్ యూత్ బాయ్స్, గర్ల్స్, జూనియర్ మెన్, ఉమెన్, సీనియర్ మెన్ విభాగాల్లో టీమ్ టైటిల్స్ సాధించింది. సీనియర్ ఉమెన్ విభాగంలో రన్నరప్ ట్రోఫీ దక్కింది. కరణ్ ఠాకూర్ రికార్డు సీకే నాయుడు ట్రోఫీ (బీసీసీఐ అండర్-25 మీట్)లో రైల్వేస్ పేసర్ కరణ్ ఠాకూర్ ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. దీంతో ఈ టోర్నీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్గా రికార్డులకెక్కాడు. వడోదరాలో బరోడాతో జరిగిన ఈ మ్యాచ్లో అతను పది వికెట్లు పడగొట్టాడు. భారత్లో పి.ఎం.చటర్జీ, దేబాశిష్ మొహంతి, ఎస్.పి.గుప్తే, పి.సుందరం... ఈ నలుగురూ ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇన్నింగ్స్లో పది వికెట్లు తీశారు. శ్రీజకు స్వర్ణం భారత్కు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి శ్రీజ ఇరాన్లో జరిగిన ఫజర్ కప్ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ టోర్నీ జూనియర్ విభాగంలో సింగిల్స్ టైటిల్ గెలిచింది. నవంబర్ 30న జరిగిన సింగిల్స్ ఫైనల్లో బెలారస్కు చెందిన బరవోక్ను ఓడించింది. టీమ్ విభాగంలో భారత్ ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. వసీం జాఫర్ రికార్డు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 50 సెంచరీలు సాధించిన ఎనిమిదో భారత బ్యాట్స్మెన్గా ముంబై బ్యాట్స్మెన్ వసీం జాఫర్ రికార్డులకెక్కాడు. నవంబర్ 27న విదర్భతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్లో సెంచరీ చేసి ఈ ఘనతను సాధించాడు. ఇంతకుముందు గవాస్కర్, సచిన్, ద్రవిడ్, విజయ్ హజారే, వెంగ్సర్కార్, లక్ష్మణ్, అజహర్ ఈ జాబితాలో ఉన్నారు. వన్డే సిరీస్ విజేత భారత్ వెస్టిండీస్తో జరిగిన మూడు వన్డేల క్రికెట్ సిరీస్ను భారత్ 2-1 తేడాతో గెలుచుకుంది. కాన్పూర్లో నవంబర్ 27న జరిగిన మూడో వన్డేలో భారత్ విజయం సాధించడంతో మూడు వన్డేల సిరీస్ భారత్ వశమైంది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా విరాట్ కోహ్లి ఎంపిక య్యాడు. -
పదో తరగతితోనే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ).. పదో తరగతితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది.. వివిధ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రూప్-సి కేటగిరీ కింద మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ టెక్నికల్) నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నేపథ్యంలో నియామక విధానం, ప్రిపరేషన్ ప్లాన్ తదితర అంశాలపై ఫోకస్.. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఇందులో పేపర్-1, పేపర్-2 అనే రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 ఇలా: పేపర్-1ను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మల్టిపుల్ చాయిస్ రూపంలో ప్రశ్నలు ఎదురవుతాయి. ప్రశ్నలను ఇంగ్లిష్, హిందీ భాషల్లో రూపొందిస్తారు. కమిషన్ విచక్షణాధికారం మేరకు స్థానిక భాషలో కూడా ప్రశ్నలను ఇచ్చే అవకాశం ఉంది. ఈ పేపర్లో నాలుగు విభాగాలు ఉంటాయి. వీటిల్లో 150 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున మొత్తం 150 మార్కులు కేటాయించారు. సమాధానాలను గుర్తించడానికి 2 గంటల సమయం ఉంటుంది. విభాగం ప్రశ్నలు మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ - రీజనింగ్ 25 25 న్యూమరికల్ ఆప్టిట్యూడ్ 25 25 జనరల్ ఇంగ్లిష్ 50 50 జనరల్ అవేర్నెస్ 50 50 మొత్తం 150 150 సంబంధిత విభాగాల్లోని ప్రాథమిక భావనలపై పట్టు సాధించడం ద్వారా ఈ పరీక్షలో సులభంగానే విజయాన్ని నమోదు చేసుకోవచ్చు. నెగిటివ్ మార్కింగ్ కూడా అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు (0.25) మార్కు కోత విధిస్తారు. విశ్లేషణకు పరీక్ష: జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగం అభ్యర్థిలోని విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించింది. ఈ క్రమంలో రెండు గుర్తుల మధ్య ఉండే సంబంధాన్ని గుర్తించడం, సామాన్య గణిత సమస్యలు వంటి నాన్ వెర్బల్ ప్రశ్నలు వస్తాయి. ఈ క్రమంలో చిత్రాల వర్గీకరణ (ఫిగర్ క్లాసిఫికేషన్), సంబంధాలు (రిలేషన్ కాన్సెప్ట్స్), నిర్ణయాత్మక సామర్థ్యం (డెసిషన్ మేకింగ్, జడ్జ్మెంట్), భేదాలను గుర్తించడం (డిస్క్రిమినేటింగ్ అబ్జర్వేషన్), సమస్య సాధన, ఇచ్చిన సమస్యను విశ్లేషించడం, నంబర్ సిరీస్, నాన్-వెర్బల్ సిరీస్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అంతేకాకుండా అమూర్త చిత్రాలు-గుర్తులు-వాటి మధ్య సంబంధాల పట్ల అవగాహనను పరీక్షించే విధంగా కూడా ప్రశ్నలు ఉంటాయి. ఇందులో అడిగే మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ సులభంగానే ఉంటాయి. కాబట్టి సంబంధిత అంశాలపై ప్రాథమిక అవగాహన ఉంటే వాటిని సులభంగానే సాధించవచ్చు. మిగతా అంశాల విషయానికొస్తే.. ఆయా అంశాలు అకడమిక్ పరంగా ఎక్కడా ఎదురు కావు. కేవలం మన విశ్లేషణ సామర్థ్యాన్ని ఉపయోగించి మాత్రమే సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత ఎక్కువగా ఈ తరహా ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం మంచిది. మరో విషయం ప్రశ్నలు చూడగానే సులభంగానే అనిపిస్తాయి. కానీ కొంచెం క్లిష్టతతో కూడి ఉంటాయి. కాబట్టి సమాధానాన్ని గుర్తించే ముందు ఒకటికి రెండు సార్లు ప్రశ్నను చదవడం మంచిది. ప్రాథమిక పరిజ్ఞానం: ఇంగ్లిష్లో అభ్యర్థి ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగమిది. ఇందులో ఇంగ్లిష్ భాషకు సంబంధించిన ప్రాథమిక భావనల ఆధారంగా అధిక శాతం ప్రశ్నలు వస్తాయి. ఈ క్రమంలో వొకాబ్యులరీ, వ్యాకరణం, వాక్య నిర్మాణం (సెంటెన్స్ స్ట్రక్చర్), సినానిమ్స్, యాంటో నిమ్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. సాధారణంగా అభ్యర్థుల్లో ఇంగ్లిష్ అంటే కొంచెం క్లిష్టం అనే భావన నెలకొని ఉంటుంది. వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ భావన నుంచి త్వరగానే బయటపడొచ్చు. ఈ క్రమంలో వ్యాకరణ (గ్రామర్) విభాగంపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఇంగ్లిష్ ప్రిపరేషన్లో సగ భాగం వరకు ఈ అంశానికే కేటాయించడం మంచిది. వేగంగా చదవడం అలవర్చుకోవాలి. రీడింగ్ కాంప్రెహెన్షన్లో మెరుగైన మార్కులు సాధించేందుకు ఇది దోహద పడుతుంది. అంతేకాకుండా ప్రశ్నను ముందు చదివి.. తర్వాత పేరాగ్రాఫ్ను చదవడం చక్కని ఎత్తుగడ. తద్వారా పేరాగ్రాఫ్ చదువుతున్నప్పుడే సంబంధిత ప్రశ్నలకు కావల్సిన సమాధానాలపై ఒక స్పష్టత ఏర్పడుతుంది. దాంతో సమాధానాన్ని తేలిగ్గా గుర్తించవచ్చు. జనరల్ టిప్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ విభాగాల్లోని ప్రతి అంశం నుంచి కనీసం 30 ప్రశ్నలను సాధించాలి. మాదిరి/గత ప్రశ్నపత్రాలను సాధించేటప్పుడు ముందుగా సులభమైన వాటిని.. తర్వాత క్లిష్టమైన ప్రశ్నలను సాధించడానికి ప్రయత్నించాలి. మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ విషయంలో షార్ట్కట్ మెథడ్స్ను రూపొందించుకోవాలి. తద్వారా పరీక్షల్లో చాలా సమయం ఆదా అవుతుంది. పరీక్షలో ముందుగా జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లిష్ విభాగాలతో ప్రారంభించడం మంచిది. ఎందుకంటే ఈ రెండు విభాగాలకు కలిపి అత్యధిక వెయిటేజీ (100 మార్కులు) కేటాయించారు. గణిత సామర్థ్యం: న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అభ్యర్థిలోని గణిత సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగం. ఇందులో నంబర్ సిస్టమ్, దశాంశమానం, వివిధ భిన్నాలు, శాతాలు, నిష్పత్తులు, అనుపాతం, సగటు, లాభం-నష్టం, క్షేత్రమితి, కొలతలు, సరళ వడ్డీ, చక్ర వడ్డీ, కాలం-పని, కాలం-దూరం, వైశాల్యం, ఘనపరిమాణం తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇందులో మెరుగైన స్కోర్కు తక్కువ సమయంలో ఎక్కువ సమస్యలను సాధించే విధంగా షార్ట్కట్ మెథడ్స్, కొండ గుర్తులను నేర్చుకోవాలి. సూత్రాల ఆధారంగా లెక్కలను సాధించడం అలవర్చుకోవాలి. ఈ విభాగంలో అడిగే ప్రశ్నలు తార్కికంగా, లోతుగా కాకుండా కనీస పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి. కాబట్టి గణితంలో కీలకమైన గుణకారం, భాగహారం, కసాగు, గసాభా వంటి ప్రక్రియల్లో పట్టు సాధించాలి. పరీక్షలో సాధ్యమైనంత వరకు ఈ అంశాన్ని చివర్లో ప్రయత్నించడం మంచిది. ఎందుకంటే ఈ విభాగానికి తక్కువ వెయిటేజీ ఉంటుంది. నోటిఫికేషన్ సమాచారం ఎస్ఎస్సీ-మల్టీటాస్కింగ్ స్టాఫ్ పేబాండ్: రూ.5,200-రూ. 20,200+1,800(గ్రేడ్పే). అర్హత: మెట్రిక్యులేషన్/తత్సమానం. వయసు: 18-25 ఏళ్లు (జనవరి 1, 2014 నాటికి) పరీక్ష ఫీజు: రూ.100 (మహిళా, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్సీ, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు). దరఖాస్తు విధానం: ఆన్లైన్లో లేదా వెబ్సైట్ దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ:డిసెంబర్ 13, 2013 రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, గుంటూరు, తిరుపతి, కర్నూలు, విశాఖపట్నం, రాజమండ్రి. వివరాలకు: http://ssc.nic.in, sscsr.gov.in జనరల్ అవేర్నెస్: పరీక్షలో.. ముందుగా ఈ అంశం నుంచి పరీక్షను ప్రారంభించడం మంచిది. ఎందుకంటే ఇందులో ప్రశ్నలు తేలిగ్గా అనిపించడమేకాకుండా నేరుగా కూడా ఉంటాయి. అంతేకాకుండా సమాధానాన్ని గుర్తించడానికి తక్కువ సమయం సరిపోతుంది. మరో విషయం ఈ విభాగానికి అధిక వెయిటేజీ ఇచ్చారు. ఈ విభాగానికి సంబంధించి స్టాక్ జనరల్ నాలెడ్జ్ (జీకే), కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, క్రీడారంగం తదితర విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. కరెంట్ అఫైర్స్ కోసం ప్రతి రోజూ వార్తా పత్రికలను చదువుతుండాలి. కీలకమైన సమాచారాన్ని నోట్స్ రూపంలో పొందుపరుచుకోవాలి. ఈ విభాగం చూడ్డానికి విస్తృతంగా ఉన్నప్పటికీ.. సీబీఎస్ఈ ఆరు నుంచి పదో తరగతి వరకు సైన్స్, సోషల్ పుస్తకాలను చదవడం లాభిస్తుంది. ముఖ్యంగా అందులోని శాస్త్ర పరిశోధన సంస్థలు, ప్రముఖ శాస్త్రవేత్తలు, వివిధ శాస్త్రసాంకేతిక కార్యక్రమాలు-వాటి పురోగతి, ఎకానమీకి సంబంధించి జీడీపీ, ఫిస్కల్ పాలసీస్ వంటి అంశాలపై అధికంగా దృష్టి సారించాలి. ఈ విభాగంలో చక్కని స్కోర్ చేయాలంటే దృష్టి సారించాల్సిన అంశాలు: దేశాలు- రాజధానులు- కరెన్సీ-భాషలు, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సంస్థలు, జాతీయ పార్కులు, అబ్రివేషన్స్, అంతరిక్ష పరిశోధనలు, భారత రక్షణ వ్యవస్థ, సమాచార రంగం, రవాణా వ్యవస్థ, భారతదేశం- రాజ్యాంగం, భారతదేశ చరిత్ర- ముఖ్యాంశాలు, ఇండియన్ నేషనల్ మూమెంట్, జనరల్ సైన్స్, వివిధ పరిశోధనలు- శాస్త్రవేత్తలు, శాస్త్రీయ పరికరాలు, దేశాలు పూర్వపు పేర్లు-మారు పేర్లు, సరిహద్దు రేఖలు, అవార్డులు, క్రీడలు, విశ్వం- పుట్టుక, తొలి వ్యక్తులు, బిరుదులు, నాట్యాలు- నృత్యాలు, ప్రముఖ రచయితలు- రచనలు, నదీ తీర నగరాలు, జాతీయ చిహ్నాలు, వివిధ సంస్థలు- నెలకొల్పిన ప్రదేశాలు, ప్రముఖుల నినాదాలు మొదలైనవి. సమానంగా వస్తే పేపర్-1లో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను పేపర్-2 కోసం షార్ట్లిస్ట్ చేస్తారు. వీరికి మాత్రమే పేపర్-2కు హాజరయ్యే అవకాశం కల్పిస్తారు. చివరగా పేపర్-1, 2లలో చూపిన ప్రతిభ ఆధారంగా నియామకం ఖరారు చేస్తారు. పరీక్షలో ఇద్దరు అభ్యర్థులకు మార్కులు సమానంగా వస్తే కింది పేర్కొన్న ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుని నియామయం ఖరారు చేస్తారు. అవి.. ఆబ్జెక్టివ్ పేపర్లో పార్ట్-3లో వచ్చిన మార్కులు ఆబ్జెక్టివ్ పేపర్లో పార్ట్-2లో వచ్చిన మార్కులు పుట్టిన తేదీ పేరులోని ఆంగ్ల అక్షర క్రమం (ఆల్ఫాబెటికల్ ఆర్డర్) డిస్క్రిప్టివ్గా: పేపర్-2 డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఉంటుంది. అభ్యర్థిలోని భాషా సామర్థ్యాలను పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగమిది. ఇందులో భాగంగా వ్యాసం (షార్ట్ ఎస్సే) లేదా లెటర్ రైటింగ్ అంశాలపై ప్రశ్న ఉంటుంది. ఇందులో సమకాలీన అంశాలు లేదా వ్యక్తిగత నేపథ్యం ఆధారంగా ప్రశ్నలు అడగొచ్చు. ఈ విభాగాన్ని అభ్యర్థుల ఆసక్తిని బట్టి వారి స్థానిక భాషలోనూ సమాధానాలు రాయొచ్చు. ఈ విభాగానికి 50 మార్కులు కేటాయించారు. సమాధానాల కోసం 30 నిమిషాల సమయం ఉంటుంది. ఈ విభాగాన్ని కేవలం అర్హత పరీక్షగా మాత్రమే పరీక్షిస్తారు. రిఫరెన్స్ బుక్స్ ఆబ్జెక్టివ్ ఇంగ్లిష్-ఎస్.చాంద్ పబ్లికేషన్స్ మల్టీస్టాఫ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్- అర్హింత్ పబ్లికేషన్స్ మోడ్రన్ అప్రోచ్ టు వెర్బల్-నాన్ వెర్బల్ రీజనింగ్-ఆర్ఎస్ అగర్వాల్ ఇండియా ఇయర్ బుక్ -
స్పెషలిస్ట్ ఆఫీసర్ల ప్రిపరేషన్ ఇలా
కిరణ్ కుమార్ అడుసుమిల్లి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బ్యాంక్ కార్యకలాపాలు ఒకప్పటి మాదిరిగా కేవలం బ్యాంకింగ్ సేవలకే పరిమితం కావడం లేదు.. బ్యాంకులు మారుతున్న అవసరాలకనుగుణంగా సేవలను విస్తృతం చేస్తున్నాయి.. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి సేవలను అందుబాటులోకి తెస్తున్నాయి.. దీంతో సంబంధిత వ్యవహారాలను నిర్వహించడానికి ప్రత్యేక నిపుణుల అవసరం ఏర్పడుతోంది.. ఈ నేపథ్యంలోనే ఐబీపీఎస్.. స్పెషలిస్ట్ ఆఫీసర్ల నియామకం కోసం క్రమం తప్పకుండా నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.. ఇదే కోవలో తాజాగా ఐబీపీఎస్-స్పెషలిస్ట్ ఆఫీసర్ల నియామకం కోసం నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో సంబంధిత వివరాలపై ఫోకస్.. బ్యాంకుల్లో క్లరికల్, ఆఫీసర్ స్థాయి ఉద్యోగులు ఫ్రంట్ లైన్ సేవలను అందిస్తుంటారు. కొన్ని ప్రత్యేక సేవలను అందించడానికి నైపుణ్యం ఉన్న అభ్యర్థులు కావాలి. తాజా నోటిఫికేషన్ ద్వారా 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర బ్యాంకింగ్/ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లలో.. 10 రకాల స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వాటి వివరాలు.. ఐటీ ఆఫీసర్(స్కేల్-1); అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్-1); రాజభాష అధికారి (స్కేల్-1); లా ఆఫీసర్ (స్కేల్-1); హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-1); మార్కెటింగ్ ఆఫీసర్ (స్కేల్-1); ఐటీ ఆఫీసర్ (స్కేల్-2); లా ఆఫీసర్ (స్కేల్-2); చార్టెడ్ అకౌంటెంట్ (స్కేల్-2); మేనేజర్ క్రెడిట్ /ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ (స్కేల్-2) ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ దశల ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తర్వాతి దశ ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఇందులో రాత పరీక్షకు 80 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంటర్వ్యూకు 100 మార్కులు కేటాయించారు (20 శాతం వెయిటేజీ). ఇందులో కనీసం 40 శాతం అర్హత మార్కులను (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఓబీసీ అభ్యర్థులకు 35 శాతం) సాధించాలి. రాత పరీక్ష ఇలా: రాత పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో ప్రశ్నలు ఇంగ్లిష్/హిందీ భాషల్లో ఉంటాయి. వివరాలు.. లా ఆఫీసర్ (స్కేల్-1,2), రాజభాష అధికారి (స్కేల్-1) విభాగం {పశ్నలు మార్కులు రీజనింగ్ 50 50 ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 25 జనరల్ అవేర్నెస్ (రిఫరెన్స్ టు బ్యాంకింగ్) 50 50 ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 75 మొత్తం 200 200 సమయం 120 నిమిషాలు (రెండు గంటలు) మిగతా పోస్టులకు: రీజనింగ్ 50 50 ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 25 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 50 ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 75 మొత్తం 200 200 సమయం 120 నిమిషాలు (రెండు గంటలు) నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు (0.25) కోత విధిస్తారు. నోటిఫికేషన్ సమాచారం: అర్హత: సంబంధిత/అనుబంధ విభాగంలో డిగ్రీ/పీజీ. నిర్దేశించిన పోస్టులకు అనుభవం తప్పనిసరి. వయసు: 20-30 ఏళ్లు (స్కేల్-2 కేటగిరీకి మాత్రం 20-35 ఏళ్లు). దరఖాస్తు: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 14, 2013. దరఖాస్తు ఫీజు: రూ. 600 (ఎస్సీ/ఎస్టీ/పీడ బ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100) దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: డిసెంబర్ 16, 2013 (ఆన్లైన్లో మాత్రమే) రాత పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 8-9, 2014. వివరాలకు: www.ibps.in వివిధ పన్నులకు సంబంధించిన వ్యవహారాలను సక్రమంగా నిర్వహించడానికి చార్టెడ్ అకౌంటెంట్ సేవలు అవసరం. పలు వ్యవసాయ పనులకు సంబంధించిన సలహాలు ఇవ్వడానికి అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారు. న్యాయ సంబంధ విషయాల్లో, రుణాలకు సంబంధించి డాక్యుమెంట్స్ను నిర్ధారించడానికి లా ఆఫీసర్లు ఉపయోగపడతారు. నిర్వహణలో ఐటీ/సాఫ్ట్వేర్ వినియోగం కోసం ఐటీ ఆఫీసర్ల సేవలను వినియోగించుకుంటారు. హిందీ భాష అభివృద్ధి-వినియోగంతోపాటు సిబ్బందిని ఆ దిశగా ప్రేరేపించడా నికి రాజభాష అధికారిని నియమిస్తారు. కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి మార్కెటింగ్ ఆఫీసర్ల సేవలు అవసరం. కెరీర్-వేతనాలు: స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీలు సాధారణంగా జూనియర్, మిడిల్, సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో ఉంటాయి. తాజా నోటిఫికేషన్ ద్వారా జూనియర్, మిడిల్ మేనేజ్మెంట్ కేడర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. సాధారణ బ్యాంక్ శాఖలలో స్పెషలిస్ట్ ఆఫీసర్లు ఉండరు. వ్యవసాయ సంబంధ ప్రత్యేక శాఖలలో అగ్రికల్చర్ ఆఫీసర్లు, పెద్ద బ్రాంచ్లలో మార్కెటింగ్ ఆఫీసర్లు ఉంటారు. మిగిలిన పోస్టులు సాధారణంగా రీజనల్, జోనల్ ఆఫీస్, హెడ్ ఆఫీస్లకు మాత్రమే పరిమితం. స్పెషలిస్ట్ ఆఫీసర్ల పదోన్నతులు కూడా ఆ కేడర్ ఆఫీసర్ల మధ్యనే ఉంటాయి. పోటీ తక్కువగా ఉన్న కారణంగా టైమ్ బౌండ్ ప్రమోషన్లు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ ప్రమోషన్లు స్పెషలిస్ట్ కేడర్కు మాత్రమే పరిమితం. కొన్ని బ్యాంకులు స్పెషలిస్ట్ ఆఫీసర్లను జనరల్ కేడర్కు మారే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇలా కేటగిరీ మారిన వారు అత్యున్నత స్థాయి హోదాకు కూడా చేరుకోవచ్చు. స్పెషలిస్ట్ ఆఫీసర్ల జీతాభత్యాలు ఇతర ఆఫీసర్లతో సమానంగా ఉంటాయి. స్కేల్-1 ఆఫీసర్లకు రూ. 25 వేల వరకు, స్కేల్-2 ఆఫీసర్లకు రూ. 30 వేల వరకు వేత నం అందుతుంది. నవంబర్, 2012 నుంచి వేతన ఒప్పందం సవరణ జరగాల్సి ఉంది. ఇప్పుడే చేరే అభ్యర్థులకు ఇది వర్తిస్తుంది. కాబట్టి భవిష్యత్లో ఎరియర్స్తో సహా పెరిగిన వేతనాలను అందుకుంటారు. సన్నద్ధం ఇలా... రీజనింగ్:బ్యాంకుల్లో నియామకం కోసం నిర్వహించే పరీక్షల్లో అత్యంత క్లిష్టమైన విభాగం రీజనింగ్. అభ్యర్థి నిర్ణయాత్మక శక్తిని అంచనా వేసేందుకు ఉద్దేశించిన విభాగమిది. ఇందులో ప్రశ్నలను సాధించాలంటే విశ్లేషణ సామర్థ్యంతోపాటు తార్కికత (లాజిక్) కూడా అవసరం. అంతేకాకుండా స్వల్ప సమయంలోనే సమాధానాన్ని గుర్తించాలి. ఇందులో సిరీస్; అనాలజీ; క్లాసిఫికేషన్; కోడింగ్ అండ్ డీకోడింగ్; డెరైక్షన్స్; రక్త సంబంధాలు; సీటింగ్ అరేంజ్మెంట్స్; ఆల్ఫాబెట్ టెస్ట్, ర్యాంకింగ్, పజిల్స్ తదితర అంశాలుంటాయి. ఇందులో మెరుగైన స్కోర్ సాధించాలంటే షార్ట్కట్ మెథడ్స్, కొండ గుర్తులను సాధన చేయాలి. ప్రాక్టీస్కు అధిక ప్రాధాన్యతనివ్వాలి. చిత్రాలు, మిర్రర్ ఇమేజ్లతో కూడిన ప్రశ్నలను అధికంగా ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లిష్ లాంగ్వేజ్: ఇంగ్లిష్లో గ్రామర్, రీడింగ్ కాంప్రెహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, రూట్వర్డ్స్ను బాగా సాధన చేయాలి. జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటివాటిల్లో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. అందువల్ల అభ్యర్థులు వీటిపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. దినపత్రికలు, ప్రామాణిక పుస్తకాల సహాయంతో వొకాబ్యులరీని డెవలప్ చేసుకోవాలి. రోజుకు 10-15 వరకు యాంటోనిమ్స్, సినానిమ్స్ నేర్చుకోవాలి. ప్రాథమిక గ్రామర్ అంశాలైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్; యాక్టివ్, పాసివ్ వాయిస్; డెరైక్ట్-ఇన్డెరైక్ట్ స్పీచ్ తదితర అంశాలను సాధన చేయాలి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: అభ్యర్థుల్లోని గణిత సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగమిది. ఇందులో చాలా వరకు ప్రశ్నలు నేరుగా లేదా సూత్రాల ఆధారితంగా ఉంటాయి. కాబట్టి గణిత నేపథ్యం లేని విద్యార్థులు కూడా ప్రాథమిక భావనలపై పట్టు సాధిస్తే ఈ విభాగంలో మెరుగైన స్కోర్ సాధించవచ్చు. వర్గమూలాలు, ఘన మూలాలు, శాతాలు, కాలం-పని; కాలం-దూరం, లాభం-నష్టం, నిష్పత్తులకు సంబంధించిన సమస్యల్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. వీటికి తేలిగ్గా సమాధానాలు గుర్తించాలంటే గణిత మూలస్తంభాలైన కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలపై పట్టు సాధించాలి. దాంతోపాటు 20 వరకు టేబుల్స్, 25 వరకు స్క్వేర్స్, 15 వరకు క్యూబ్స్ను నేర్చుకోవాలి. జనరల్ అవేర్నెస్ (రిఫరెన్స్ టు బ్యాంకింగ్): ఈ విభాగానికి సంబంధించి బ్యాంకింగ్ రంగంలో తాజాగా చోటు చేసుకుంటున్న మార్పులు, చేర్పులపై ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. ఈ క్రమంలో ఆర్బీఐ-విధాన నిర్ణయాలు, బ్యాంకింగ్ రంగంలో వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం (నెట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్), వివిధ బ్యాంకులు/ఆర్థిక సంస్థల ఉన్నతాధికారుల వివరాలు, బ్యాంకింగ్/ ఆర్థిక రంగంలో ఉపయోగించే పదజాలం (ఎన్పీఏ, ఎన్ఈఎఫ్టీ వంటివి), ద్రవ్య సాధనాలు (చెక్స్, ఏటీఎం కార్డు తదితర), భారత ఆర్థిక వ్యవస్థ వంటి అంశాల నుంచి అధిక శాతం ప్రశ్నలు రావచ్చు. ఈ విభాగంలో మెరుగైన స్కోర్ కోసం ప్రతిరోజూ ఫైనాన్షియల్ డైలీ/మ్యాగజైన్స్ చదవాలి. స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ అంశాలపై కూడా దృష్టి సారించాలి. స్టాండర్డ్ జీకేకు సంబంధించి వివిధ దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షుల పేర్లు; కరెన్సీలు; ఆస్కార్లతో పాటు వివిధ అవార్డుల విజేతల గురించి తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్కు సంబంధించి ఎప్పటికప్పుడు ముఖ్యమైన సంఘటనలను తెలుసుకోవాలి. ప్రొఫెషనల్ నాలెడ్జ్: ఈ విభాగంలో ఆయా పోస్టులకు అర్హతగా పేర్కొన్న డిగ్రీ/పీజీ కోర్సుల సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. ఉదాహరణకు ఐటీ ఆఫీసర్ పోస్టును పరిగణనలోకి తీసుకుంటే.. నెట్ వర్కింగ్, డేటాబేస్ మేనేజ్మెంట్, నెట్వర్క్ సెక్యూరిటీ, వెబ్ టెక్నాలజీస్, ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్, బేసిక్ హార్డ్వేర్ వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. లా ఆఫీసర్ పోస్టును తీసుకుంటే.. బ్యాంకింగ్/ఆర్థిక రంగంతో ముడిపడి ఉన్న చట్టాలపై అధికంగా ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలో మెరుగైన స్కోర్ కోసం స్టాండర్డ పబ్లికేషన్స్ ప్రచురణలు లేదా ఆయా పోస్టుల వారీగా అకడమిక్ పుస్తకాలను చదివితే సరిపోతుంది. ప్రిపరేషన్: పరీక్షలో అన్ని ప్రశ్నలను ప్రయత్నించడం కంటే కచ్చితంగా సరైనవి అనే నమ్మకం ఉన్న 80 శాతం ప్రశ్నలను సాధించడం ఉత్తమం. జీకే, బ్యాంకింగ్, ఇంగ్లిష్ విభాగాలు సబ్జెక్ట్ ఆధారంగా ఉంటాయి. ఇందులోని ప్రశ్నలను సాధించడానికి ఎటువంటి తార్కికత అవసరం లేదు. 10 నిమిషాల్లో 80 శాతం మార్కులకు సరిపడ ప్రశ్నలను సాధించవచ్చు. కాబట్టి వీటిని స్కోరింగ్ బూస్టర్స్గా వినియోగించుకోవాలి. ప్రొఫెషనల్ నాలెడ్జ్ను మినహాయిస్తే.. ఈ పరీక్ష పీఓ మాదిరిగానే ఉంటుంది. కాబట్టి పీఓకు ప్రిపేరైన వారు ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీద దృష్టి సారించడం మంచిది. తొలిసారి ప్రిపేరవుతున్న అభ్యర్థులు ఉన్న వ్యవధిలో అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లిష్ అంశాలను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. లా, అగ్రికల్చర్ అభ్యర్థులు రీజనింగ్, క్వాంటిటేటివ్ విభాగాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. కనీసం 140, అంతకంటే ఎక్కువ మార్కులు సాధిస్తేనే పోటీలో ఉంటారు. కాబట్టి ఆ దిశగా ప్రిపరేషన్ సాగించాలి. రిఫరెన్స బుక్స్: వెర్బల్-నాన్ వెర్బల్ రీజనింగ్- ఆర్.ఎస్.అగర్వాల్ క్వికర్ మ్యాథ్స్-ఎం.థైరా క్యాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-అరుణ్ శర్మ ఇంగ్లిష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్-హరిమోహన్ ప్రసాద్ ప్రతియోగితా దర్పణ్ మనోరమ ఇయర్ బుక్ కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ కాన్సెప్టుల అధ్యయనంతో Hard work with smart mind.. ఇది ఐబీపీఎస్ స్పెషలిస్టు ఆఫీసర్ రిక్రూట్మెంట్లో విజయానికి దగ్గర చేస్తుంది. రోజుకు ఎన్ని గంటలు చదివామనే దాని కంటే సమయాన్ని సద్వినియోగం చేసుకొని, సమర్థవంతంగా చదివామన్నదే ముఖ్యం. ఏ స్పెషలిస్టు ఆఫీసర్కు సంబంధించిన పరీక్ష రాస్తున్న వారైనా ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగంలో ఎక్కువ స్కోర్ సాధించాలంటే సంబంధిత సబ్జెక్టులోని ప్రాథమిక అంశాలకు సంబంధించిన కాన్సెప్టులను తప్పకుండా అధ్యయనం చేయాలి. ఆయా సబ్జెక్టు పరిజ్ఞానాన్ని, బ్యాంకింగ్ రంగానికి అన్వయించుకుంటూ చదవాలి. ఇంటర్వ్యూలో కూడా ఈ అంశాలపైనే ఫోకస్ చేస్తారు. ఈ విభాగంలో ప్రిపరేషన్కు ఇంటర్నెట్ను బాగా ఉపయోగించుకోవాలి. చాలా మంది ప్రిపరేషన్ను బిట్స్కు మాత్రమే పరిమితం చేస్తారు. ఇది మంచిది కాదు. రీజనింగ్ విభాగంలో గ్రూప్ రీజనింగ్ (సీటింగ్ అరేంజ్మెంట్, ర్యాంకింగ్..) పై ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి వాటిని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లిష్ వొకాబ్యులరీపై పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. అరిహంత్ కంప్యూటర్ అవేర్నెస్, బ్యాంకింగ్- అరిహంత్, బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్, ఆర్.ఎస్.అగర్వాల్ (ఆర్థమెటిక్, రీజనింగ్) వంటి పుస్తకాలు ప్రిపరేషన్కు ఉపయోగపడతాయి. -బి.రాజేష్,స్పెషలిస్టు ఆఫీసర్,యూబీఐ. -
క్షేత్ర స్థాయి నైపుణ్యాలకు కీలకం.. ఇంటర్న్షిప్స్
ఎం.చంద్రశేఖర్, ప్రొఫెసర్, ఎన్ఐటీ-వరంగల్ ప్రస్తుతం జాబ్ మార్కెట్ను పరిశీలిస్తే.. ఇన్స్టిట్యూట్ల నుంచి డిగ్రీలతో బయటికి వస్తున్న విద్యార్థులు జాబ్ రెడీగా ఉండాలని పరిశ్రమలు ఆశిస్తున్నాయి. పుస్తకావగాహన కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్కు పెద్ద పీట వేస్తున్నాయి.. అకడమిక్గా నేర్చుకున్న అంశాలను వాస్తవ పరిస్థితుల్లో అన్వయించే విషయంలో ఏమేరకు సామర్థ్యం కలిగి ఉన్నారు? అనే విషయాన్ని లోతుగా పరిశీలిస్తున్నాయి.. పని చేయాల్సిన రంగంపై కనీస అవగాహన ఉండాలని భావిస్తున్నాయి.. ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థికి ఉన్న ప్రాక్టికల్ అప్రోచ్ ఉద్యోగ సాధనలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది.. విద్యార్థుల్లో ఈ విధమైన ప్రాక్టీకల్ అప్రోచ్ పెంపొందించుకోవడానికి, క్షేత్ర స్థారుు అవగాహనకు ఇంటర్న్షిప్స్ ఎంతో తోడ్పాటునందిస్తాయి.. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్షిప్ ప్రాముఖ్యత, సంబంధిత అంశాలపై సూచనలు.. ఇంజనీరింగ్ విద్యార్థులు థియరీ కంటే ప్రాక్టికల్గా ఎక్కువ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడే.. వారి కెరీర్ సరైన దిశలో సాగుతున్నట్లు భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం జాబ్ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు కూడా ఈ విషయానికి తార్కాణంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంజనీరింగ్ విద్యలో ప్రాక్టికల్ నాలెడ్జ్ను పెంచే కార్యకలాపాలకు ప్రాధాన్యత క్రమంగా పెరుగుతోంది. ఇంటర్న్షిప్స్, మినీ ప్రాజెక్ట్ వర్క్, టెక్నికల్ కాంపిటీషన్స్, ప్రాజెక్ట్ వర్క్ వంటివి ఈ కోవలోకి వస్తాయి. మూడో సంవత్సరంలో: సాధారణంగా ఇంజనీరింగ్ కోర్సులో మూడో సంవత్సరంలో ఇంటర్న్షిప్ ఉంటుంది. మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ తర్వాత వేసవి సెలవుల్లో ఇంటర్న్షిప్ (ఇండస్ట్రీ ఓరియెంటెడ్ మినీ ప్రాజెక్ట్) ఉంటుంది. కొన్ని యుూనివర్సిటీల పరిధిలో ఇంజనీరింగ్ కరిక్యులంలో ఇంటర్న్షిప్ భాగంగా లేనప్పటికీ ప్రొఫెషనల్ స్కిల్స్ను పెంపొందించుకోవడంలో ఇంటర్న్షిప్స్ను వినియోగించుకోవాలి. ఇంటర్న్షిప్లు సాధారణంగా రెండు విధాలుగా అందుబాటులో ఉంటాయి. అవి.. అకడమిక్గా తప్పనిసరిగా చేయాల్సినవి. కొన్ని కంపెనీలు ఆఫర్ చేసే సమ్మర్ ఇంటర్న్షిప్స్. సమ్మర్ ఇంటర్న్షిప్స్: ఇంటర్న్షిప్స్లో కీలకమైనవి.. సమ్మర్ ఇంటర్న్షిప్స్. పాఠ్యపుస్తకాల్లో నేర్చుకున్న అంశాలను ప్రాక్టికల్గా వాస్తవ పరిస్థితుల్లో అన్వయించడానికి సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఒక ఫ్లాట్ఫామ్గా ఉపయోగపడతాయి. వీటిని వేసవి సెలవుల్లో నిర్వహిస్తారు. సాధారణంగా వీటి వ్యవధి ఐదు నుంచి పది వారాల పాటు ఉంటుంది. విద్యార్థులు వేసవి సెలవులను వృథా చేసుకోకుండా.. ఇటువంటి ఇంటర్న్షిప్స్ ద్వారా విలువైన పని అనుభవాన్ని (వర్క్ఎక్స్పీరియెన్స్) పొందొచ్చు. సమ్మర్ ఇంటర్న్షిప్ వల్ల విద్యార్థులకు రెండు రకాలుగా ప్రయోజనాలు ఉంటాయి. అవి.. ఒకటి, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం. రెండోది, చదువుతున్న బ్రాంచ్కు సంబంధించి మార్కెట్లోకి వచ్చిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పొందడం. ఒక్కోసారి కొన్ని కంపెనీలు ఇంటర్న్షిప్ సమయంలో విద్యార్థులకు అలవెన్స్ను కూడా చెల్లిస్తున్నాయి. మల్టినేషనల్ కంపెనీల్లో సమ్మర్ ఇంటర్న్షిప్ చేయడం వల్ల ప్రపంచ స్థాయి కంపెనీల పని వాతావరణం, వర్కింగ్ మెథడాలజీపై ఒక అవగాహన ఏర్పడుతుంది. సమ్మర్ ఇంటర్న్షిప్ చేసిన విద్యార్థులకు మిగతా విద్యార్థులతో పోల్చితే కెరీర్ పరంగా చక్కని అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు. ఇంటర్న్ టు జాబ్: ఇంటర్న్షిప్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు కంపెనీలు ఉద్యోగాన్ని ఆఫర్ చేసేందుకు కూడా వెనకాడటం (కోర్సు పూర్తయిన తర్వాత) లేదు. ప్రతిభావంతులైన విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని కొన్ని కంపెనీలు ఇంటర్న్షిప్ను ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ (పీపీఓ) రూపంలో అందిస్తున్నాయి. అంతేకాకుండా విద్యార్థి భావి కెరీర్ దిశగా.. కీలకమైన వర్క్ ఎన్విరాన్మెంట్పై అవగాహన పొందొచ్చు. బృందంగా పని చేయడం వల్ల నాయకత్వ లక్షణాలు, టీమ్ మ్యాన్, పరిశోధన ఆధారంగా పని చేయడం (రీసెర్చ్ బేస్డ్ వర్క్) వంటి నైపుణ్యాలు అలవడతాయి. సంబంధిత రంగంలోని అనుభవజ్ఞుల ద్వారా.. ఉన్నత విద్య, ఉద్యోగం అనే అంశంపై విలువైన సూచనలను పొందొచ్చు. ఆసక్తి ఆధారంగా: చదువుతున్న బ్రాంచ్, ఎంచుకున్న పరిశ్రమను బట్టి ఇంటర్న్షిప్స్ వేర్వేరుగా ఉంటాయి. లోతైన స్వీయ విశ్లేషణ, పక్కా ప్రణాళిక ద్వారానే విజయవంతంగా ఇంటర్న్షిప్ను పూర్తి చేయుడం సాధ్యమవుతుంది. ఇంటర్న్షిప్ అంశం ఎంపికకు ముందే అన్ని కోణాల్లో విశ్లేషించాలి. ఆసక్తి ఉన్న అంశాన్ని (ఏరియాను) ఇంటర్న్షిప్ కోసం ఎంచుకోవాలి. ఇంటర్న్షిప్ ఉద్దేశాలను, ప్రతిఫలాలను తప్పకుండా బేరీజు వేసుకోవాలి. భవిష్యత్లో సంభవించే మార్పులను దృష్టిలో ఉంచుకుని సీనియర్లు, ప్రొఫెసర్ల సహాయంతో ఇంటర్న్షిప్ అంశాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇంజనీరింగ్లోని అన్ని విభాగాల్లో ఇంటర్న్షిప్స్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ప్రొఫెషనల్ స్కిల్స్: ఇంటర్న్గా ఎంపికైన వారు సంబంధిత పరిశ్రమలో వారానికి నిర్దేశించిన గంటలు పని చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక సముహం (గ్రూప్)గా లేదా వ్యక్తిగతంగా ఇంటర్న్షిప్ను చేపడతారు. భావన (కాన్సెప్ట్) చిన్నదైనా.. ఇంటర్న్షిప్ అనుభవం విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటర్న్షిప్ ఉండే రెండు/మూడు నెలలు విద్యార్థి ఆలోచన విధానంలో ఎంతో మార్పు తెస్తుందని చెప్పొచ్చు. విద్యార్థిగా కాకుండా ఒక ప్రొఫెషనల్గా వ్యవహరించే తత్వం అలవడుతుంది. పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి అనుసరిస్తున్న పద్ధతులను దగ్గరగా పరిశీలించే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా కోర్సులోని భావనలను పరిశ్రమలో అన్వయించే విధానాన్ని నేరుగా చూడడం ద్వారా కోర్సులోని సదరు అంశాలపై పట్టు వస్తుంది. అంతేకాకుండా కొన్ని కంపెనీలు ఇంటర్న్స్కు కూడా వాస్తవ పనులను అప్పగిస్తాయి. దాంతో అకడమిక్గా నేర్చుకున్న అంశాలను క్షేత్ర స్థారుులో అన్వయించే సాధ్యాసాధ్యాలపై స్పష్టత వస్తుంది. తద్వారా విద్యార్థి పరిశ్రమ కోరుకుంటున్న విధంగా జాబ్ రెడీగా ఉంటాడు. ఇంటర్న్షిప్లో చూపిన ప్రతిభ విద్యార్థి ఉద్యోగ సాధనలోనూ తోడ్పడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఇంటర్న్షిప్ను ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్గా కూడా పేర్కొనవచ్చు. ఇంటర్న్షిప్లో చక్కని ప్రతిభ చూపిన విద్యార్థులకు అకడమిక్ పరంగా ఉండే ప్రాజెక్ట్ వర్క్ను రియల్ టైమ్లో తమ కంపెనీలో చేసే అవకాశాన్ని కూడా కొన్ని సంస్థలు కల్పిస్తున్నాయి. ఎంపిక ఇలా: ఇంటర్న్షిప్ చేయాలనుకున్న అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంటర్న్షిప్ చేయాల్సిన సంస్థ ఎంపిక కోసం కసరత్తు ప్రారంభించాలి. కెరీర్ మీట్స్, జాబ్ మేళావంటి కార్యక్రమాలకు హాజరవుతుండడం, ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఇంటర్న్షిప్ బ్లాగులను చూడడం, యూనివర్సిటీలు, కళాశాలల్లో విద్యార్థి కేంద్రాలను సందర్శించడం ద్వారా ఇంటర్న్షిప్స్ అవకాశాలను సులభంగా పొందొ చ్చు. ఇంటర్నెట్లో పలు వెబ్సైట్లు ఇంటర్న్షిప్ గురించిన విస్తృత సమాచారాన్ని అందిస్తున్నాయి. ఇంటర్నెట్ లేదా కాలేజీల్లోని ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ద్వారా ఇంటర్న్షిప్ ఆఫర్ చేసే కంపెనీల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. లేదా వ్యక్తిగతంగా సంబంధించిన పరిశ్రమల అధికారులను కలవడం ద్వారా కూడా ఇంటర్న్షిప్ను దక్కించుకోవచ్చు. కీలకం రెజ్యుమె: ఇంటర్న్షిప్ అవకాశాన్ని దక్కించుకోవడంలో రెజ్యుమె పాత్ర కీలకం. విద్యార్థులు తమ గురించి సమగ్రంగా వివరించడానికి రెజ్యుమె నిర్ణయాత్మక పాత్రను పోషిస్తుంది. కాబట్టి రెజ్యుమెను పకడ్బందీగా రూపొందించాలి. రెజ్యుమెలో ఎంచుకున్న రంగంపై ఉన్న ఆసక్తి, అవగాహన, భవిష్యత్ ప్రణాళికలు స్పష్టం చేసే విధంగా ఉండేలా జాగ్రత్త పడాలి. వ్యక్తిత్వం, విద్యా ప్రవృత్తులు, ఉద్యోగ సంబంధిత సామర్థ్యాలను ప్రస్ఫుటించేలా రూపొందించుకోవాలి. ఎంప్లాయర్స్ అవసరాలు, ప్రాధాన్యతలను కూడా రెజ్యుమెలో పొందుపర్చడం మర్చిపోవద్దు. సాధారణంగా కంపెనీలు ఇంటర్న్షిప్స్ కోసం నిర్దిష్ట గడువును నిర్ణయిస్తాయి. కాబట్టి వీలైనంత ముందుగానే దరఖాస్తు చేయడం మంచిది. వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ద్వారా ఇంటర్న్షిప్ కోసం విద్యార్థులను ఎంపిక చేస్తారు. వనరుగా: ఇంటర్న్షిప్ చేశాక,దాన్ని ఉద్యోగ ప్రయత్నాల్లో మంచి వన రుగా ఉపయోగించుకోవాలి. ఇంటర్న్షిప్లో మీరు నిర్వహించిన బాధ్యతలను, ప్రాజెక్టు విజయంలో దాని పాత్రను మీ రెజ్యుమెలో పేర్కొనాలి. కళాశాలల్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతున్నప్పుడు ఇంటర్న్షిప్ సర్టిఫికెట్ ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఇంటర్వ్యూ సమయంలో ఇంటర్న్షిప్లో నిర్వర్తించిన విధులను వివరించడం ద్వారా కొలువును సులువుగా సొంతం చేసుకోవచ్చు. నిపుణులైన ఉద్యోగుల ఎంపికకు ఇంటర్న్షిప్ను కంపెనీలు చక్కని వేదికగా భావిస్తున్నారుు. ఇంటర్న్షిప్నకు అకడమిక్ పరంగా కొన్ని మార్కులను కూడా కేటాయించడం జరిగింది. ప్రాముఖ్యత కాలేజీ నుంచి బయటకు రాకముందే కొంతకాలంపాటు క్షేత్రస్థాయి కార్యకలాపాల్లో విద్యార్థులు పాల్గొంటారు. ............................. అనుభవజ్ఞుల పర్యవేక్షణలో పని అనుభవం సంపాదిస్తారు. ............................................................ అకడమిక్ నైపుణ్యాలతో పాటు పని అనుభవం ఉన్న వారికి కంపెనీలు ప్రాధాన్యతనిస్తున్నాయి. ............................................................ ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు విద్యార్థులు కంపెనీలోని సీనియర్లతో నిరంతరం సంప్రదిస్తూ కెరీర్కు కావాల్సిన నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు. ............................................................ బృంద స్ఫూర్తి, కమ్యూనికేషన్ స్కిల్స్, సమయపాలన, ఒత్తిడిని జయించడం వంటి సాఫ్ట్స్కిల్స్ను అలవర్చుకోవడానికి ఇంటర్న్షిప్ వేదికగా నిలుస్తుంది. ............................................................ ఉద్యోగానికి ముందే తమ రంగానికి చెందిన పరిశ్రమలో వాస్తవ పరిస్థితులను పరిశీలించే అవకాశం లభిస్తుంది. ............................................... బ్రాంచ్ల వారీగా ఇంటర్న్షిప్ కోసం ఎంచుకోవాల్సిన కంపెనీలు.. మెకానికల్-ఎల్ అండ్ టీ, ఎస్ఆర్ స్టీల్స్, వైజాగ్ స్టీల్స్, బీహెచ్ఈఎల్, హెచ్ఏఎల్ మొదలైనవి. సివిల్ -ఎల్ అండ్ టీ, ఎన్సీసీ, కన్స్ట్రక్షన్ కంపెనీలు తదితరాలు. ఎలక్ట్రికల్- ఎన్టీపీసీ, ఆర్టీపీపీ, వీటీపీఎస్, సాగర్, పవర్ జనరేషన్ యూనిట్స్ మొదలైనవి. ఈసీఈ-బీడీఎల్, హెచ్ఏఎల్, ఇస్రో తదితరాలు. సీఎస్ఈ-టీసీఎస్, విప్రో, మైక్రోసాఫ్ట్ తదితరాలు. తప్పనిసరి.. ఏఐసీటీఈ దేశంలో సాంకేతిక విద్యను పర్యవేక్షిస్తున్న ఆల్ ఇండియా టెక్నికల్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ).. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్షిప్ను తప్పనిసరి చేసింది. నేషనల్ ఎంప్లాయబిలిటీ ఎన్హన్సమెంట్ మిషన్ (ఎన్ఈఈఎం-ూఉఉక)లో భాగంగా ఏఐసీటీఈ ఈ ప్రతిపాదన చే సింది. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఐదు, ఆరు, ఏడో సెమిస్టర్లలో మూడు నుంచి 24 నెలల పాటు ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం వివిధ సంస్థలతో ఏఐసీటీఈ ఒక అవగాహన కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటికే ఈ విషయంలో ఇంజనీరింగ్ కోర్సులోని మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్థులకు కమ్యూనికేషన్స్ సంబంధింత విభాగంలో శిక్షణనిచ్చేందుకు బీఎస్ఎన్ఎల్తో ఒప్పందం చేసుకుంది. ఉపయోగకరమైన వెబ్సైట్స్ www.internshala.com www.twenty19.com www.hellointern.com www.letsintern.com -
‘సాఫ్ట్’గా విజయం సాధించాలి!
విజయం ఏ ఒక్కరికీ వంశపారంపర్యంగానో, ఏవో కొన్ని ప్రత్యేక జన్మతః లక్షణాల వల్లనో లభించదు. ఎవరైనా విజేతగా ఎదగవచ్చు. ‘‘సాఫ్ట్స్కిల్స్ అలవరచుకుంటే విజయం లభిస్తుంది..’’ మేనేజ్మెంట్ పుస్తకాల్లో కనిపించే ఈ పదం ఇటీవల కాలంలో అందరి నోళ్లలో నానుతోంది. చిత్రమేమిటంటే బాగా ప్రచారంలో ఉన్న ఈ పదం ప్రామాణిక నిఘంటువులలో మాత్రం కనిపించదు. అసలు సాఫ్ట్స్కిల్స్ అంటే ఏమిటి? వాటిని ఎందుకు అలవరచుకోవాలి? ఎలా ఒంటబట్టించుకోవాలి? ఇంతా చేస్తే వాటివల్ల ఉపయోగం ఉందా? వీటన్నింటికీ సమాధానం తెలుసుకుందాం... ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ.. ఇలా ఏ ప్రొఫెషనల్ కోర్సు చేసిన వారైనా విజయ శిఖరాన్ని అధిరోహించాలంటే సాఫ్ట్స్కిల్స్ను సోపానాలుగా చేసుకోవాల్సిందే! బతికేందుకు ఆక్సిజన్ ఎంత అవసరమో.. ఉన్నత కెరీర్కు సాఫ్ట్స్కిల్స్ కూడా అంతే అవసరం. ‘‘మీ హార్డ్ స్కిల్స్.. మిమ్మల్ని ఇంటర్వ్యూ వరకు తీసుకెళ్తాయి. మీకు ఉద్యోగం రావాలన్నా.. ఉద్యోగంలో రాణించాలన్నా మీకు సాఫ్ట్స్కిల్స్ అవసరం..’’ -ఇది హెచ్ఆర్ మేనేజర్ల ప్రసంగాల్లో తరచూ వినిపించే మాట. మీరు ఇంటర్వ్యూ వరకు ఎప్పుడు వెళ్లగలరు? తగిన విద్యార్హతలు ఉన్నప్పుడు ..................................................................... అవసరమైన సాంకేతిక నైపుణ్యాలున్నప్పుడు ..................................................................... భాషా పరిజ్ఞానం ఉన్నప్పుడు ..................................................................... కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉన్నప్పుడు ..................................................................... ఓ ఉద్యోగానికి సంబంధించి ఇంటర్వ్యూ వరకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడే పై స్కిల్స్నే హార్డ్స్కిల్స్గా చెప్పొచ్చు. వాడుక భాషలో చెప్పాలంటే.. ఉద్యోగాన్ని చేజిక్కించుకునేందుకు మనకు ఏవైతే నైపుణ్యాలు ఉన్నాయో అవి హార్డ్స్కిల్స్. మనకున్న నైపుణ్యాలను సమర్థవంతంగా వ్యక్తీకరించి, ఇతరులను ఒప్పించగలిగే నైపుణ్యాలను సాఫ్ట్స్కిల్స్గా చెప్పొచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ను ఇప్పుడు ఇలా పిలుస్తున్నారా? అని అనుకుంటున్నారా? అయితే మీరు బాగా దగ్గరికి వచ్చినట్లే! మన భావాలను ఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్పడం.. కమ్యూనికేషన్. ఇంకొంత మెరుగ్గా అర్థమయ్యేలా చెప్పగలగడం.. కమ్యూనికేషన్ స్కిల్. మనం చెప్పింది విని, గ్రహించి, ఎదుటి వ్యక్తి మనతో ఏకీభవించేలా చేసుకోవాలంటే కేవలం కమ్యూనికేషన్ స్కిల్స్ చాలవు. సాఫ్ట్స్కిల్స్ కూడా కావాలి. ఎదుటి వ్యక్తి మనల్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం అతణ్ని లేదా ఆమెను అర్థం చేసుకొని ఉండాలి. దీన్నే "The ability to think in others' shoes" అంటారు. అంటే ఎదుటి వారి కోణంలో మన ఆలోచనా ధోరణిని కాసేపు మార్చుకోవాలి. దీన్నే ఉక్కఖీఏ్గ అంటారు. ఇంకా వివరంగా చెప్పాలంటే.. మీ స్నేహితుడు మీకు ఫోన్ చేసి.. ‘మీ ఇంటికి దారి చెప్పు, నేను బయల్దేరాను..’ అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? టకటకా మన ఇంటి అడ్రస్ చెప్పేసి, వచ్చేయ్! చాలా సులభం అని చేతులు దులుపుకోం కదా..! మొదట ‘నీవు ఎక్కడ ఉన్నావు?’ అని అడుగుతాం. ఆ తర్వాత మనల్ని మనం అతని స్థానంలో ఊహించుకుంటూ, అతను ముందుకొచ్చే కొద్దీ ఎదురయ్యే ల్యాండ్ మార్క్స్ గుర్తులు చెప్పుకుంటూ వస్తాం.. ఫలానా దగ్గర ఎడమ మలుపు, ఫలానా దగ్గర కుడి మలుపు అని చెబుతాం. ఇదంతా అతని కోణంలో నుంచి ఆలోచిస్తూ అతనికి మనం సూచనలు ఇస్తాం. మీరు ఇలా చేస్తే అతను సరిగ్గా గమ్యం చేరగలడు. ఈ ప్రక్రియనే ఎంపథీ (సహానుభూతి- ఎదుటి వారి కోణంలో ఆలోచించడం) అంటాం. సాఫ్ట్స్కిల్స్లో మనం ఆకళింపు చేసుకోవాల్సిన మొదటి నైపుణ్యం ఇదే. మీకు మరో ఉదాహరణ చెబుతాను.. మీరూ, నేనూ ఒక పార్టీలో కలిసామనుకుందాం. అది ఒక పెద్ద పెళ్లి రిసెప్షన్ అనుకుందాం. దీనికి మీకున్న వాటిలో బాగా ఇష్టమైన షర్ట్ వేసుకొని వచ్చారు. మీ షర్టు నాకు నచ్చలేదు. నేను ఏమీ ఆలోచించకుండా ‘నీ షర్టు ఏం బాగాలేదు..’ అని అన్నాననుకోండి... మీకు సహజంగానే తీవ్రమైన బాధ కలుగుతుంది. అదే నేను మీ కోణం నుంచి ఆలో చించి మాట్లాడుంటే పరిస్థితి మరోలా ఉండేది! కామన్సెన్స్ ఏం చెబుతుంది ? ఎవరైనా తమకిష్టమైన దుస్తుల్నే పార్టీకి వేసుకొని వస్తారు. కాబట్టి empathizing skill¯ను ఉపయోగించి, కామన్ సెన్స్ జోడించి ఇలా చెప్పి చూస్తాను.. ‘‘నీ షర్ట్ చాలా బాగుంది.. ఎక్కడ కొన్నావు? ఇలాంటిదే కొనాలని నేను చాలా రోజులుగా అనుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ ఇది కాస్తా డార్క్ షేడ్ కావడం వల్ల ఆకర్షణీయంగా ఉంది. కాకపోతే నిన్న నీవు తొడుక్కున్న లేత నీలి రంగు షర్ట్ ఇంకా బాగుంది. సో పార్టీకి మన వాళ్లింకా ఎవరు వచ్చారో చూద్దాం పద! మన మాటలతో ఎదుటి వారిని నొప్పించే అధికారం మనకు లేదు. మనం ్ఛఝఞ్చ్టజిజ్డ్ఛీ చేసుకుంటూ మాట్లాడటం వల్ల మంచి ఫలితాలను రాబట్టవచ్చు. మీరు ఒక మేనేజర్, టీం లీడర్, సీఈవో, డెరైక్టర్.. ఇలా రకరకాల హోదాల్లో పనిచేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో మీ కింద పనిచేసే ఉద్యోగుల్ని కావొచ్చు, బృంద సభ్యుల్ని కావొచ్చు, టీం మెంబర్స్ని కావొచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యుల్ని కావొచ్చు, జీవిత భాగస్వామిని కావొచ్చు, ఎవరినైనా సరే నొప్పించకుండా, ఒప్పించగలగాలి అంటే సహానుభూతి ఎంతైనా అవసరం. ఇప్పటి వరకూ మనం తెలుసుకున్న దాన్నిబట్టి సాఫ్ట్స్కిల్స్ను అలవరచుకోవాలంటే ముఖ్యంగా కావాల్సినవి...Communication Skills.Empathizing Skill.Common sense. వచ్చే వారం సాఫ్ట్స్కిల్స్- సాధనపై విశ్లేషణ -
కలాన్ని కదిలిస్తూ.. జనానికి గళమవుతూ..
జర్నలిస్టు పాత్రికేయం.. ప్రజా సమస్యలపై పోరాడే పాశుపతాస్త్రం. కలం కదిలించి, అక్షర అస్త్రాలను సంధించి.. ప్రజలకు తోడుగా, పచ్చని కెరీర్కు నీడగా నిలిచే ప్రొఫెషన్. చేపట్టిన వృత్తి.. వ్యక్తిగత వికాసానికే కాకుండా, పది మంది పురోగతికీ ఉపయోగపడాలన్న కోరిక ఉన్న వారికి సరైన కెరీర్ ఆప్షన్ జర్నలిజం. సామాజిక స్పృహ, సృజనాత్మకతకు భాషా సామర్థ్యం, కష్టపడి పనిచేసే తత్వం తోడైతే ఉన్నత అవకాశాలకు కొదవలేని జర్నలిజం కెరీర్పై స్పెషల్ ఫోకస్.. దేశంలో మీడియా రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ రంగంలో పెట్టుబడులు పెరుగుతుండటంతో అనేక కొత్త సంస్థలు ప్రారంభమవుతున్నాయి. కొత్త పత్రికలు, చానళ్లు, ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్ వెలుస్తున్నాయి. ముఖ్యంగా 24 గంటల వార్తా చానళ్ల సంఖ్య అధికమవుతోంది. వీటికి తోడు స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, పీసీల వాడకం ఎక్కువ కావడంతో టైర్-2, టైర్-3 నగరాల్లో డిజిటల్ కంటెంట్ వినియోగం అధికమైంది. దీంతో ఆన్లైన్ జర్నలిజం సరికొత్త ఉద్యోగాలకు ద్వారాలు తెరుస్తోంది. జర్నలిజం ప్రొఫెషనల్స్కు తీవ్ర డిమాండ్ ఉండటంతో విశ్వవిద్యాలయాలు జర్నలిజంలో వివిధ కోర్సులను అందుబాటులో ఉంచుతున్నాయి. నిత్యనూతనం.. కెరీర్లో అడుగుపెట్టింది మొదలు... ఎప్పుడూ నవ్యతకు అవకాశం ఉండటం, ఆకర్షణీయ పే ప్యాకేజీలతోపాటు సమాజానికి సేవచేసే అవకాశం లభిస్తుండటంతో జర్నలిజం కెరీర్ దిశగా అడుగులు వేసే వారి సంఖ్య అధికమవుతోంది. పరిశోధన వరకు మాస్ కమ్యూనికేషన్, జర్నలిజంలో దేశంలోని దాదాపు అన్ని యూనివర్సిటీలు డిప్లొమా, పీజీ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్గ్రాడ్యుయేషన్, పరిశోధన స్థాయి కోర్సులను అందిస్తున్నాయి. జర్నలిజం కోర్సునకు ప్రాధాన్యం పెరుగుతుండటంతో బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో గ్రూప్ సబ్జెక్ట్ల్లో జర్నలిజంను ఒక సబ్జెక్టుగా చేర్చి వివిధ కోర్సులను అందించే కళాశాలలూ ఉన్నాయి. అధిక శాతం మంది బ్యాచిలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (బీసీజే), మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (ఎంసీజే) కోర్సులను ఎంపిక చేసుకుంటున్నారు. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో), పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వంటివి డిస్టెన్స్ విధానంలో జర్నలిజం కోర్సులను యువతకు అందుబాటులో ఉంచాయి. ఇంటర్, బ్యాచిలర్ డిగ్రీ విద్యార్హతలతో కోర్సుల్లో చేరొచ్చు. రాష్ట్రానికి బయట జర్నలిజం కోర్సులు అందిస్తున్న వాటిలో యూనివర్సిటీ ఆఫ్ లక్నో, బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ మాస్ కమ్యూనికేషన్ వంటివి ఉన్నాయి. ఇంగ్లిష్, ప్రాంతీయ భాషా మాధ్యమాల్లో కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. జర్నలిజం- కరిక్యులం జర్నలిజం కోర్సు కరిక్యులంను తరగతి గది పాఠాలు, క్షేత్రస్థాయి ప్రాక్టికల్ వర్క్, గెస్ట్ లెక్చర్స్, ఇంటర్న్షిప్ల సమ్మేళనంగా రూపొందిస్తున్నారు. కరిక్యులంలోని కొన్ని అంశాలు: జర్నలిజం ప్రాథమిక భావనలు. ప్రింట్, ఎలక్ట్రానిక్ అండ్ వెబ్ మీడియా. అడ్వర్టైజింగ్, మ్యాగజైన్ అండ్ ఫొటో జర్నలిజం. రిపోర్టింగ్ అండ్ ఎడిటింగ్. క్రియేటివ్ థింకింగ్ అండ్ రైటింగ్. కార్పొరేట్ అండ్ ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్. ట్రెండ్స్ ఇన్ కమ్యూనికేషన్. డెవలప్మెంట్ జర్నలిజం. మీడియా లాస్ అండ్ ఎథిక్స్. సొంతంగా జర్నలిజం కోర్సులు ప్రస్తుత సాంకేతిక ప్రపంచం ఒక గ్లోబల్ గ్రామంగా మారిన పరిస్థితుల్లో కచ్చితత్వంతో పాటు వేగం కూడా అత్యవసరమైంది. దీంతో మీడియా రంగంలో తీవ్ర పోటీ వాతావరణం నెలకొంది. సమర్థవంతమైన, సుశిక్షితులైన మానవ వనరుల కోసం పత్రికలు, చానళ్ల యాజమాన్యాలు సొంతంగా జర్నలిజం స్కూళ్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పత్రికలన్నీ ఈ తరహా జర్నలిజం శిక్షణ కేంద్రాలను నడుపుతూ తమకు అవసరమైన సిబ్బందిని నియమించుకుంటున్నాయి. జాతీయస్థాయి సంస్థలైన ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎన్డీటీవీ సొంతంగా జర్నలిజం శిక్షణ కేంద్రాలను నడుపుతున్నాయి. ఈ సంస్థలు తరచూ జర్నలిజం స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూలలో ప్రతిభ కనబరిచిన వారికి జర్నలిజంలో పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. జర్నలిజం స్కూళ్లలో ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ఈ కాలంలో భాషా నైపుణ్యాలు, వర్తమాన వ్యవహారాలు, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు, రిపోర్టింగ్, ఎడిటింగ్ వంటి అంశాలపై అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఆయా రంగాల్లో నిష్ణాతులతో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు జర్నలిజం కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియాలో విస్తృత ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభంలో పత్రికలు, చానళ్లలో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్/కాపీ ఎడిటర్గా ఉద్యోగాలు లభిస్తాయి. రిపోర్టర్.. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పనిచేసే ప్రాంతంలో ప్రతిరోజూ జరిగే కీలక పరిణామాలను గమనిస్తూ కథనాలు, వార్తలను రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సబ్ఎడిటర్ లేదా కాపీ ఎడిటర్.. రిపోర్టర్లు తీసుకొచ్చిన వార్తలను సమగ్రంగా తీర్చిదిద్దుతారు. వార్తా సంస్థలు అందించే ఇంగ్లిష్ వార్తలను స్థానిక భాషలోకి అనువదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ వార్తలను ప్రచురించడం లేదా ప్రసారం చేయడం జరుగుతుంది. ప్రైవేటు వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు జర్నలిజం కోర్సులు పూర్తిచేసిన వారిని అధిక వేతనాలతో పీఆర్వోలుగా నియమించుకుంటున్నాయి. బీసీజే అర్హత ఉన్నవారు ఎంసీజే, ఎంఫిల్, పీహెచ్డీ వంటి ఉన్నత విద్యా కోర్సులను దిగ్విజయంగా పూర్తిచేసి రీసెర్చ్ సంస్థల్లో చేరొచ్చు. యూజీసీ-నెట్లో అర్హత సాధించి విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో జర్నలిజం ఫ్యాకల్టీగా స్థిరపడొచ్చు. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేయొచ్చు. సొంతంగా కన్సల్టెన్సీ సంస్థలను నెలకొల్పవచ్చు. అవసరమైన స్కిల్స్ సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, చొరవ, కష్టపడే తత్వం. రోజువారీ లక్ష్యాలు, వాటి సాధనకు వ్యూహ రచన సామర్థ్యం. కమ్యూనికేషన్ స్కిల్స్ (లిజనింగ్, రైటింగ్, స్పీకింగ్..). ఆత్మవిశ్వాసం, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం. భాష, స్వేచ్ఛానువాద నైపుణ్యం. వేగం (Speed) స్పష్టత (Clarity) కచ్చితత్వం (Accuracy). ఇవి జర్నలిజం కెరీర్లో రాణించేందుకు ముఖ్యమైనవి. రేపటి జర్నలిస్టులకు ఆహ్వానం జనజీవనానికి అద్దం పడుతూ.. జనం కోసం పనిచేసే కెరీర్ను కోరుకునే వారికి ‘సాక్షి’ సాదర స్వాగతం పలుకుతోంది. ప్రింట్, టీవీ, వెబ్ జర్నలిజంలో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు, తదనంతరం ఉద్యోగానికి ఆహ్వానిస్తోంది. అర్హతలు: తెలుగు, ఇంగ్లిష్ భాషల మీద పట్టు. వర్తమాన అంశాల మీద అవగాహన. డిగ్రీ ఉత్తీర్ణత. 01.01.2014 నాటికి 30 ఏళ్లకు మించని వయసు. రెండు దశల్లో ఎంపిక: తొలిదశ: ఈ దశలో అభ్యర్థులకు రాతపరీక్ష ఉంటుంది. ఇందులో తెలుగు, ఇంగ్లిష్ పరిజ్ఞానం, అనువాదం, వర్తమాన అంశాలపై ఆబ్జెక్టివ్, వ్యాసరూప ప్రశ్నలుంటాయి. రాష్ట్రంలోని అన్ని సాక్షి ప్రచురణ కేంద్రాల్లోనూ ఈ పరీక్ష జరుగుతుంది. నమూనా ప్రశ్నపత్రాలు www.sakshischoolofjournalism.com వెబ్సైట్లో ఉంటాయి. రెండో దశ: మొదటి దశలో ఉత్తీర్ణులైన వారికి మౌఖిక పరీక్షలు ఉంటాయి. వర్తమాన అంశాలపై లోతైన అవగాహన, భాషా నైపుణ్యాలను పరీక్షించడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ పరీక్షలో నెగ్గిన అభ్యర్థులను సంస్థ నియమావళికి అనుగుణంగా శిక్షణ కోసం ఎంపిక చేస్తారు. శిక్షణ భృతి: శిక్షణ దశలో తొలి ఆరునెలలు రూ.8 వేల చొప్పున, తర్వాతి ఆరు నెలలు రూ.10 వేల నెలవారీ భృతి ఉంటుంది. అనంతరం ఏడాది పాటు ట్రైనీగా పనిచేయాలి. ఆ సమయంలో నెలకు రూ.12 వేల వేతనం ఉంటుంది. ఆపై సబ్ఎడిటర్/ రిపోర్టర్, కాపీ ఎడిటర్, కంటెంట్ డెవలపర్గా నియమితులవుతారు. అప్పుడు ఆయా విభాగాల నియమ నిబంధనలకు అనుగుణంగా జీతభత్యాలుంటాయి. సాక్షి ప్రచురణ కేంద్రాల్లో, కార్యక్షేత్రాల్లో ఎక్కడైనా ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. నియమావళి: అభ్యర్థులు శిక్షణ కాలంతో పాటు సాక్షిలో కనీసం నాలుగేళ్లు పనిచేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కోర్సు ప్రారంభంలోనే ఒప్పంద పత్రం సమర్పించాలి. దరఖాస్తు విధానం: www.sakshieducation.com లేదా www.sakshischoolofjournalism.com వెబ్సైట్లో దరఖాస్తులుంటాయి. అందులోని సూచనలను క్షుణ్ణంగా చదివి దరఖాస్తులను ఆన్లైన్లోనే పూర్తిచేసి సబ్మిట్ చేయాలి. ఇటీవల తీసుకున్న పాస్పోర్టు సైజు ఫొటోను అప్లోడ్ చేయాలి. దరఖాస్తుకు గడువు:10.12.2013 రాత పరీక్ష: 22.12.2013 ఇంటర్వ్యూలు: 18.01.2014 నుంచి ప్రారంభం కోర్సు ప్రారంభం: 01.02.2014 చిరునామా: ప్రిన్సిపల్, సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం 6-3-249/1, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-500034. -
సమాజానికే కాదు.. కెరీర్కూ కొండంత అండగా...!
జాతి ఏదైనా.. సంస్కృతి మరేదైనా.. ప్రజల్ని పట్టిపీడించే సమస్యలు చాలానే! ఆ సమస్యల సుడిగుండం నుంచి గట్టెక్కడమెలాగో తెలియని వారు కోకొల్లలు.. ఇలాంటి నేపథ్యం ఉన్నవారు జన భారతంలో మరింత ఎక్కువ. ఇలాంటి వారికి ఆపన్నహస్తం అందించేందుకు అవకాశం కల్పించే కోర్సు.. సోషియాలజీ. సంప్రదాయ కోర్సుల్లో క్రేజీ కోర్సుగా నిలుస్తున్న ‘సోషియాలజీ’పై ఫోకస్.. ఒక మనిషి వ్యవహారశైలిని సమాజానికి అనుగుణంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించే కోర్సు.. సోషియాలజీ! సోషియాలజీ.. సోషల్ వర్క్తో సమానంగా అవకాశాలు కల్పిస్తోంది. గత అయిదారేళ్ల కాలంలో స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు సామాజిక కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో నిపుణుల అవసరం పెరగడంతో యువత సోషియాలజీ వైపు అడుగులు వేస్తోంది.. -విద్యావేత్తలు, పరిశ్రమ వర్గాలు సోషియాలజీ- అకడెమిక్ కోర్సులు: మన రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోనూ బీఏలో సోషియాలజీ ఒక సబ్జెక్ట్గా అందుబాటులో ఉంది. వివిధ విద్యా సంస్థలు సోషియాలజీలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ వంటి ఉన్నత సంస్థలు, సెంట్రల్ యూనివర్సిటీలు పీజీ స్థాయిలో సోషియాలజీని అందిస్తున్నాయి. ఉన్నత కెరీర్కు రాచ మార్గం: సోషియాలజీలో పీహెచ్డీ, పోస్ట్ డాక్టోరల్ స్టడీస్ అవకాశాలున్నాయి. ఉమెన్ డవలప్మెంట్, రూరల్ డవలప్మెంట్, ట్రైబల్ డవలప్మెంట్ వంటి స్పెషలైజేషన్లలో రీసెర్చ్ చేయడం ద్వారా అద్భుత అవకాశాలను అందుకోవచ్చు. ప్రధానంగా అమెరికా, ఐరోపా దేశాల్లోని ఎన్నో పరిశోధన సంస్థలు పీహెచ్డీ కోర్సులను అందిస్తున్నాయి. పీహెచ్డీ పూర్తిచేసి అకడమిక్తో పాటు వివిధ రంగాల్లో డేటా అనలిస్ట్, సర్వే రీసెర్చర్, ప్రాజెక్టు మేనేజర్ వంటి ఉన్నత ఉద్యోగావకాశాలను చేజిక్కించుకోవచ్చు. ఐఐటీల్లోనూ.. ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లు.. సాధారణంగా ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులకు కేరాఫ్గా నిలిచే సంస్థలు. కానీ, ఇవి ఇప్పుడు సామాజిక బాధ్యతలో భాగంగా సోషల్ సెన్సైస్ కోర్సులను కూడా అందిస్తున్నాయి. సోషియాలజీని కోర్ సబ్జెక్ట్గా లేదా ఇంటర్ డిసిప్లినరీ కోర్సుగా పలు స్థాయిల్లో (ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ) అందిస్తున్నాయి. అవి.. ఐఐటీ-కాన్పూర్; కోర్సులు: పీజీ, పీహెచ్డీ. ఐఐటీ-ఢిల్లీ; కోర్సులు: పీజీ, పీహెచ్డీ. ఐఐటీ- ఖరగ్పూర్; కోర్సులు: పీజీ, పీహెచ్డీ. ఐఐటీ-గువహటి; కోర్సులు: పీజీ, పీహెచ్డీ. ఐఐటీ-బాంబే; కోర్సులు: పీజీ, పీహెచ్డీ. జాతీయ స్థాయిలో కోర్సులను అందించే సంస్థలు: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ) యూనివర్సిటీ ఆఫ్ పుణె (ఎంఏ) యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ) పుదుచ్చేరి యూనివర్సిటీ (ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ) ఇగ్నో సహా మరెన్నో యూనివర్సిటీలు దూర విద్యా విధానంలో సోషియాలజీలో బ్యాచిలర్ నుంచి పీహెచ్డీ వరకు పలు కోర్సులను అందిస్తున్నాయి. అవకాశాలు అపారం: ఒకప్పుడు సంప్రదాయ కోర్సుగా నిలిచిన సోషియాలజీ ఇప్పుడు కార్పొరేట్ రూపును సంతరించుకుంటోంది. ఈ నేపథ్యంలో అవకాశాల పరంగా ఆందోళన అవసరం లేదన్నది నిపుణుల భరోసా! సోషియాలజీ కోర్సు పూర్తి చేసిన వారికి ఉపాధి కల్పిస్తున్న ప్రధాన వేదికలు.. అకడమిక్ అండ్ రీసెర్చ్ సంస్థల్లో అధ్యాపకులుగా అవకాశాలు. స్వచ్ఛంద సంస్థల్లో అడుగు పెట్టడం. కార్పొరేట్ సంస్థల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగాలు. ప్రభుత్వ పథకాల్లో అవకాశాలు. చిన్న పరిశ్రమల్లో మానవ వనరుల విభాగాలు. వీటిలో ప్రధానమైనవి.. స్వచ్ఛంద సంస్థలు. ప్రభుత్వాలు సామాజిక అభివృద్ధి కోణంలో విద్య, ఆహార భద్రత, ఆరోగ్యం వంటి విషయాల్లో వివిధ పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు సక్రమంగా అంది, సత్ఫలితాలు వచ్చేలా చేసే సుశిక్షితులైన నిపుణుల అవసరం ఉంది. ఈ క్రమంలో సోషియాలజీ చేసిన వారికి అవకాశాలు లభిస్తున్నాయి. 12వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాల్లో జండర్ ఈక్వాలిటీ, మహిళా సాధికారత, యూనివర్సల్ హెల్త్ వంటి అంశాలను చేర్చిన నేపథ్యంలో ఇవి సోషియాలజీ ఉత్తీర్ణులకు అవకాశాలు కల్పిస్తాయనడంలో సందేహం లేదు. స్వయం ఉపాధికి ఊతం: సోషియాలజీ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు స్వయం ఉపాధి దిశగా ఆలోచించవచ్చు. ఫ్యామిలీ కౌన్సిలర్లుగా, కమ్యూనిటీ కౌన్సిలర్లుగా మారొచ్చు. ఇలా గంటకు రూ. వేయి నుంచి రూ.5 వేల వరకు ఫీజు పొందుతున్న వారూ ఉన్నారు. సోషియాలజీ కోర్సు పూర్తిచేసిన వారికి ప్రారంభంలో నెలకు కనీసం రూ.15 వేల వేతనం ఖాయం. కార్పొరేట్ సంస్థల్లో కనీసం రెండు లక్షల వార్షిక వేతనం ఉంటుంది. సివిల్ సర్వీస్లో అనుకూల ఆప్షనల్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత కేంద్ర సర్వీసుల్లో చేరేందుకు వీలుకల్పించే పరీక్ష. సివిల్స్ మెయిన్స్ కోసం సోషియాలజీని ఆప్షనల్గా ఎంచుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయన్నది నిపుణుల మాట. సిలబస్ పరిధి కాసింత తక్కువగా ఉండటం, సిలబస్లోని అంశాలన్నీ సమాజంతో ముడిపడి ఉండటం, సులభంగా అర్థమయ్యేలా ఉండటమే దీనికి కారణమంటున్నారు. అవసరమైన నైపుణ్యాలు: విభిన్న సంస్కృతుల ప్రజలతో మమేకం కాగల నేర్పు. ఎదుటి వారి సమస్యలను వినే ఓర్పు. వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించగలగడం. నిరంతర అవగాహన అవసరం సోషియాలజీ ఉత్తీర్ణులకు ఇప్పుడు కెరీర్ అవకాశాలు అద్భుతమని చెప్పొచ్చు. ఒకసారి కెరీర్ ప్రస్థానం ప్రారంభించాక నిరంతరం సమాజంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు; విభిన్న జాతులు, సంస్కృతుల్లో మార్పులు, సమస్యలపై అవగాహన పెంపొందించుకోవాలి. సామాజిక సమస్యలకు పరిష్కారాలను కనుగొనే విధంగా అధ్యయనం సాగించాలి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కరిక్యులంలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నాం. సోషియాలజీ కెరీర్లో అడుగుపెట్టిన వారిలో తాము ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నామన్న నిబద్ధత ఉంటే ఈ రంగంలో సుస్థిర భవిష్యత్తు సొంతమవుతుంది. -ప్రొఫెసర్ పుష్ప మేరి రాణి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, సోషియాలజీ, ఉస్మానియా యూనివర్సిటీ. సోషియాలజీ ఉపాధికి వేదిక సోషియాలజీ, సోషల్ వర్క్.. ఈ రెండూ సోషల్ సెన్సైస్ విభాగాలే. అయితే సోషియాలజీ సమాజ సంబంధిత అంశాలు, సమస్యలపై అవగాహన కల్పిస్తే.. సోషల్ వర్క్లో క్షేత్రస్థాయి అధ్యయనానికి ప్రాధాన్యం ఉంటుంది. ఒక విధంగా ఈ రెండు కోర్సుల ఉద్దేశం ఒకటే. కాబట్టి సోషియాలజీ అభ్యర్థులు ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్తో సోషల్ వర్క్పై కూడా అవగాహన పెంచుకుంటే మరిన్ని అవకాశాలు సొంతమవుతాయి. ప్రస్తుత అవసరాల రీత్యా ఈ రంగాల్లో నిష్ణాతులైన అభ్యర్థుల అవసరం వేలల్లో ఉంటుంది. కానీ, అందుకు తగిన స్థాయిలో విద్యార్థులు అందుబాటులో లేరు. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు సోషియాలజీ, సోషల్ వర్క్ విభాగాలను కూడా చక్కటి ఉపాధి వేదికలుగా మార్చుకునేందుకు ఇదే సరైన సమయం. ఎం.వి. రామిరెడ్డి, హెడ్- ఆపరేషన్స్, రామ్కీ ఫౌండేషన్ -
ఎయిర్హోస్టెస్ శిక్షణ పొందాలంటే...
టి. మురళీధరన్ టి.ఎం.ఐ. నెట్వర్క్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సును ఆఫర్ చేస్తున్న సంస్థల వివరాలు తెలపగలరు? - రామస్వామి, ఖమ్మం. విమానాలు, హెలికాప్టర్లు, అంతరిక్ష నౌకలు, ఉపగ్రహాలు, రాకెట్లు, క్షిపణులు తదితరాల డిజైన్, నిర్మాణం, నిర్వహణలకు సంబంధించిందే ఏరోస్పేస్ ఇంజనీరింగ్. ఇది విమానయానం, అంతరిక్ష యాత్రలు, రక్షణ వ్యవస్థలకు వెన్నెముక వంటిది. కోర్సుల వివరాలు: జేఎన్టీయూ - హైదరాబాద్.. ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ఎంటెక్ను అందిస్తోంది. ఈ కోర్సులో ప్రవేశానికి సంబంధిత అంశంలో బీఈ/బీటెక్ పూర్తిచేసిన వారు అర్హులు. వెబ్సైట్: www.jntuh.ac.in. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), బెంగళూరు.. ఏరోస్పేస్లో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ను ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్: www.iisc.ernet.in. డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, పుణే.. ఎంటెక్-ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సును ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్:www.diat.ac.in కెరీర్ అవకాశాలు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేసిన వారికి విమానయాన రంగం; వివిధ ప్రభుత్వ విభాగాలు; విద్య, పరిశోధన సంస్థల్లో ఉన్నత ఉద్యోగావకాశాలు ఉంటాయి. నేను ప్రస్తుతం బీటెక్- బయోటెక్నాలజీ చేస్తున్నాను. దీనికి సంబంధించి ఉన్నత విద్యావకాశాల వివరాలు తెలపగలరు? - మంజు, వరంగల్. జేఎన్టీయూ, హైదరాబాద్.. బయోటెక్నాలజీలో ఎంటెక్ను ఆఫర్ చేస్తోంది. ప్రవేశపరీక్ష లేదా గేట్లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నారు. వెబ్సైట్: www.jntuh.ac.in. ఐఐటీ-హైదరాబాద్.. మెడికల్ బయోటెక్నాలజీలో ఎంటెక్ను ఆఫర్ చేస్తోంది. ఈ కోర్సులో ఇమ్యునాలజీ, జీన్ టెక్నాలజీ, ప్రొటీన్ టెక్నాలజీ, సెల్ టెక్నాలజీ, వైరాలజీ, బయోకెమిస్ట్రీ, మెడికల్ మైక్రోబయాలజీ, సెల్ సిగ్నలింగ్ వంటి అంశాలను బోధిస్తారు. వెబ్సైట్:http://biotech.iith.ac.in. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.. ఎంటెక్- బయో ఇన్ఫర్మాటిక్స్ను ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్:www.uohyd.ac.in. కెరీర్ అవకాశాలు: బయోటెక్నాలజీ, హార్టికల్చర్, అగ్రికల్చర్, కెమికల్స్, బయో ప్రొడక్ట్స్, టెక్స్టైల్స్, హెల్త్ కేర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో అవకాశాలుంటాయి. వివిధ ప్రభుత్వ విభాగాలు, పరిశోధన సంస్థలు, విద్యాసంస్థల్లోనూ ఉద్యోగాలు లభిస్తాయి. ఎకనామిక్స్లో పీజీ కోర్సులను అందిస్తున్న సంస్థలేవి? - శ్రీ చరణ్, హైదరాబాద్. శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి.. ఎంఏ ఎకనామిక్స్ను ఆఫర్ చేస్తోంది. అర్హత: బీఏ ఎకనామిక్స్. ఎంట్రన్స్లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.svuniversity.ac.in ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం.. ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్ను ఆఫర్ చేస్తోంది. ఎకనామిక్స్ ఒక సబ్జెక్టుగా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు కోర్సులో ప్రవేశానికి అర్హులు. వెబ్సైట్: www.andhrauniversity.edu.in. ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్.. అప్లైడ్ ఎకనామిక్స్లో ఐదేళ్ల కాలవ్యవధితో ఇంటిగ్రేటెడ్ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఇందులో ప్రవేశానికి ప్లస్ 2 అర్హత ఉండాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్, ఐఐటీ-కాన్పూర్.. ఎకనామిక్స్లో ఐదేళ్ల కాలవ్యవధితో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సును ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్: www.iitk.ac.in. నేను ఎయిర్హోస్టెస్ కావాలనుకుంటున్నాను. శిక్షణకు సంబంధించిన వివరాలు తెలపగలరు? - చందన, కాకినాడ. ఎయిర్హోస్టెస్ శిక్షణ పొందేందుకు అభ్యర్థి వయసు 18-24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎత్తు కనీసం 160 సెం.మీ. ఉండాలి. తప్పనిసరిగా 10 ప్లస్ 2లో ఉత్తీర్ణత సాధించాలి. శిక్షణ కోర్సుల వివరాలు ఫ్రాంక్ఫిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్హోస్టెస్.. ఏడాది కాల వ్యవధితో ఎయిర్హోస్టెస్, హాస్పిటాలిటీ ట్రావెల్ మేనేజ్మెంట్ కోర్సును ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్: www.frankfinn.com కేతన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, దిల్సుఖ్నగర్.. ఆర్నెల్ల ఎయిర్హోస్టెస్ శిక్షణ ఇస్తోంది. వెబ్సైట్: www.ketansinstitute.com ఆప్టెక్ ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటీ, మాసబ్ట్యాంక్.. ఏడాది కాల వ్యవధితో ఎయిర్హోస్టెస్ శిక్షణ అందిస్తోంది. వెబ్సైట్: www.aptechaviationacademy.com సృజనకు చిరునామా ఐఐటీ రూర్కీ.. క్యాంపస్ సువిశాల ప్రాంగణం అందమైన భవిష్యత్తుకు సృజనాత్మక ఆలోచనలు సోపానాలు.. అలాంటి సృజనాత్మక ఆలోచనలు చేసేలా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు విద్యార్థులకు మార్గనిర్దేశనం చేస్తున్నాయి. ఇంజనీరింగ్ విద్య, పరిశోధనలో అత్యున్నత సంస్థలుగా వెలుగొందుతూ సాంకేతిక ప్రపంచానికి సుశిక్షితులైన మానవ వనరులను అందిస్తున్నాయి. అలాంటి విద్యా సంస్థల్లో ఒకటైన ‘ఐఐటీ-రూర్కీ’ నుంచి ఎంటెక్ పూర్తిచేసిన దోర పవన్కుమార్ ‘భవిత’ పాఠకులకు అందిస్తున్న క్యాంపస్ కబుర్లు.. బ్రిటిష్ ప్రభుత్వం 1847లో రూర్కీలో ‘ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసింది. ఈ కళాశాలలో మొదట్లో సివిల్ ఇంజనీరింగ్ కోర్సు మాత్రమే ఉండేది. ఇది తర్వాత కాలంలో ‘థామ్సన్ కాలేజ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్’గా, యూనివర్సిటీ ఆఫ్ రూర్కీగా సేవలందించి చివరకు 2001లో ఐఐటీ హోదాను పొందింది. ఉత్తరాఖండ్లోని ఐఐటీ-రూర్కీ క్యాంపస్ 400 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. ఇక్కడికి కొద్ది దూరం నడిచివెళ్తే గంగా నది అందాలు విద్యార్థులను పలకరిస్తాయి. సంస్థ ఏర్పాటైన తొలినాళ్లలో సివిల్ ఇంజనీరింగ్ తరగతులకు నెలవైన భవనమే ఇప్పటికీ ఠీవిగా నిలబడి ఐఐటీ క్యాంపస్కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రూర్కీకి సమీపంలో సిమ్లా, ముస్సోరి, రిషికేష్, హరిద్వార్ వంటి ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలున్నాయి. మా తరగతి.. మినీ భారత్: నేను చదువుకున్న ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ క్లాస్లో మొత్తం 53 మంది విద్యార్థులుఉండేవారు. వీరిలో ఆరుగురు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు. ఉదయం ఎనిమిది గంటలకు క్లాస్లు ప్రారంభమవుతాయి. తరగతి వాతావరణం సృజనాత్మక ఆలోచనల్ని ఆచరణలో పెట్టి కొత్త కొత్త ఆవిష్కరణలు చేసేలా విద్యార్థులను ప్రోత్సహించేదిగా ఉంటుంది. ఎంటెక్ ఫస్టియర్లో 12 సబ్జెక్టులతో రెండు సెమిస్టర్లుంటాయి. ఇక రెండో ఏడాది మొత్తం రీసెర్చ్ కేంద్రంగా సాగుతుంది. నచ్చిన అంశాలను కొన్నింటిని ఎంచుకోవడం, వాటిలో ఒకదాన్ని ప్రాజెక్టుగా తీసుకొని వర్క్ చేయాలి. చివరగా పరిశోధన పత్రాన్ని సమర్పించాలి. నేను ప్యారెలల్ కంప్యూటింగ్పై ప్రాజెక్టు చేశాను. ఫ్యాకల్టీలో చాలా వరకు అనుభవజ్ఞులు. విసుగనేది లేకుండా ఓ అంశానికి సంబంధించి ఎన్నిసార్లయినా చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. క్యాంపస్ సెంట్రల్ లైబ్రరీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నుంచి ఆధ్యాత్మికత వరకు అనేక అంశాలకు సంబంధించిన వేలాది పుస్తకాలున్నాయి. దీంతో పాటు ప్రతి విభాగానికీ ప్రత్యేకంగా లైబ్రరీలున్నాయి. మేమంతా ‘గంగా భవన్’ హాస్టల్లో ఉండేవాళ్లం. ఇక్కడ రోటీ వంటి నార్త్ ఇండియన్ ఆహారం ఉంటుంది. ఇలాంటి ఆహారంతో మొదట్లో ఇబ్బందిపడినా తర్వాత అలవాటైంది. హాస్టల్లో జిమ్తో పాటు బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, బిలియర్డ్స్ ఆడుకోవడానికి ఏర్పాట్లున్నాయి. మెయిన్ క్యాంపస్లో చాలా పెద్ద స్విమ్మింగ్పూల్ కూడా ఉంది. ఇంకో విషయమేమిటంటే రూర్కీ ఎకో ఫ్రెండ్లీ సిటీ. విద్యార్థులు హాస్టళ్ల నుంచి క్లాస్లకు సైకిళ్లపైనే వెళ్తారు. ‘ఫెస్ట్లతో సందడే సందడి: విద్యార్థిని అన్నివిధాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కరిక్యులం ఉంటుంది. ఐఐటీ రూర్కీలో ఏడాదిలో ఒక కల్చరల్ ఫెస్ట్, మరొక టెక్నికల్ ఫెస్ట్లు జరుగుతాయి. నవంబర్లో కల్చరల్ ఫెస్ట్ (THOMSO), మార్చిలో టెక్నికల్ ఫెస్ట్ (COGNIZANCE) జరుగుతాయి. ఈ ఫెస్ట్లకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు హాజరవుతారు. ఫెస్ట్ల్లో రోబో వార్స్, 3డీ పెయింటింగ్ వంటి ఆసక్తికర కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్యార్థులు రూపొందించిన రోబో కార్ల రేసింగ్ మరొక ప్రధాన ఆకర్షణ. 2003 నుంచి టెక్నికల్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రముఖ శాస్త్రవేత్తలు, టెక్నాలజిస్టులు, పారిశ్రామికవేత్తల గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి. రోబోటిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, ఏరో మోడలింగ్ తదితర అంశాలపై వర్క్షాప్లు నిర్వహిస్తారు. రూర్కీ ఐఐటీలో ఏటా నిర్వహించే కల్చరల్ ఫెస్ట్ దేశంలో నిర్వహించే గొప్ప యూత్ ఫెస్టివల్స్లో ఒకటిగా చెప్పొచ్చు. విద్యార్థుల్లో దాగున్న సాంస్కృతిక ప్రతిభను వెలికితీసేందుకు కల్చరల్ ఫెస్ట్ వేదికగా నిలుస్తోంది. డ్యాన్స్, డ్రామా, మ్యూజిక్ ఈవెంట్లతో ఫెస్ట్ సందడిగా సాగుతుంది. కొలువుల కలలకు వేదికలు: ఏటా డిసెంబర్లో ప్లేస్మెంట్ హడావుడి మొదలవుతుంది. 15 రోజుల పాటు సాగే ప్లేస్మెంట్ సెషన్కు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, డీఆర్డీవో, శ్యాంసంగ్, యాహూ వంటి పెద్ద పెద్ద కంపెనీలు క్యాంపస్ను సందర్శిస్తాయి. ఈ 15 రోజుల్లో పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్లేస్మెంట్ ఆఫీస్ సందడిగా ఉంటుంది. నాకు శ్యాంసంగ్-ఇండియాలో మంచి ఆఫర్ వచ్చింది. -
మంగళయాన్ ప్రయోగం విజయవంతం
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు క్రీడలు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ నెంబర్వన్ ఆల్రౌండర్గా అశ్విన్ భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ఆల్రౌండర్ల విభాగంలో నంబర్వన్ ర్యాంక్ను దక్కించుకున్నాడు. అశ్విన్ 405 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్ ఆటగాడు షకిబుల్ (362 పాయింట్లు), దక్షిణాఫ్రికాకు చెందిన కలిస్ (332 పాయింట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. భారత్కు బహ్రెయిన్ బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్స్ బహ్రెయిన్లో నవంబర్ 9న ముగిసిన బహ్రెయిన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఐదు టైటిల్స్ను భారత్ క్రీడాకారులు గెలుచుకున్నారు. పురుషుల సింగిల్స్: ఈ టైటిల్ను సమీర్వర్మ దక్కించుకున్నాడు. ఫైనల్లో సుభాంకర్ దేను ఓడించాడు. మహిళల సింగిల్స్: తన్వీలాద్ గెలుచుకుంది. ఫైనల్లో సైలీ రాణిపై విజయం సాధించింది. పురుషుల డబుల్స్: రూపేశ్కుమార్, సవానె థామస్ విజేతలుగా నిలిచారు. ఫైనల్లో నందగోపాల్, వి.దిజును ఓడించారు. మహిళల డబుల్స్: సిక్కిరెడ్డి, ప్రద్న్యగాద్రే జోడి మహిళల డబుల్స్ టైటిల్ దక్కించుకున్నారు. ఫైనల్లో అపర్ణా బాలన్-సాన్యాగిత గోర్పడేలను ఓడించారు. మిక్స్డ్ డబుల్స్: ఈ టైటిల్ను సనావె థామస్, ప్రజక్తా జంట గెలుచుకుంది. వీరు ఫైనల్లో సిక్కిరెడ్డి - దిజు జంటపై విజయం సాధించారు. సిద్దీకుర్కు హీరో ఇండియా ఓపెన్ గోల్ఫ్ టైటిల్ బంగ్లాదేశ్కు చెందిన మహ్మద్ సిద్దీకుర్ హీరో ఇండియా ఓపెన్ గోల్ఫ్ టైటిల్ గెలుచుకున్నాడు. న్యూఢిల్లీలో నవంబర్ 10న జరిగిన 50వ ఇండియన్ ఓపెన్ టైటిల్ విజేతగా సిద్దీకుర్ నిలిచాడు. స్కేటింగ్ వరల్డ్ చాంపియన్షిప్లో అనూప్ కుమార్కు స్వర్ణం వరల్డ్ స్కేటింగ్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన అనూప్ కుమార్ స్వర్ణ పతకం సాధించాడు. చైనీస్ తైపీలో నవంబర్ 10న జరిగిన టోర్నీలో ఇన్లైన్ ఆర్టిస్టిక్ స్కేటింగ్లో అనూప్ పసిడి నెగ్గాడు. ప్రపంచ స్కేటింగ్ చాంపియన్షిప్లో భారత్కు స్వర్ణం రావడం ఇదే తొలిసారి. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ మహిళల రన్నరప్ భారత్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ పురుషుల టైటిల్ను పాకిస్థాన్ గెలుచుకుంది. జపాన్లో నవంబర్ 11న జరిగిన ఫైనల్లో జపాన్ను ఓడించింది. చైనాను ఓడించి మలేషియా మూడో స్థానం, ఒమన్ను ఓడించి భారత్ ఐదో స్థానం దక్కించుకున్నాయి. మహిళల టైటిల్లో జపాన్ విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్పై నెగ్గింది. చైనాను ఓడించి మలేషియా మూడో స్థానం పొందింది. ప్రపంచకప్ షూటింగ్లో హీనాకు స్వర్ణం భారత షూటర్ హీనా సిద్ధూ ప్రపంచకప్ షూటింగ్లో స్వర్ణ పతకం గెలుచుకుంది. జర్మనీలో మ్యూనిచ్లో నవంబర్ 11న జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో ప్రథమ స్థానంలో నిలిచింది. 2003లో అంజలి భగవత్, 2008లో గగన్ నారంగ్ తర్వాత ప్రపంచకప్లో స్వర్ణం గెలిచిన మూడో భారత వ్యక్తిగా హీనా రికార్డు సృష్టించింది. జాతీయంమంగళయాన్ను ప్రయోగించిన భారత్ అంగారక గ్రహాన్ని అధ్యయనం చేయడానికి చేపట్టిన మంగళయాన్ ఆర్బిటర్ను పీఎస్ఎల్వీ-సీ25 రాకెట్ ద్వారా భారత్ ప్రయోగించింది. ఈ ప్రయోగానికి మార్స్ ఆర్బిటర్ మిషన్ (ఎం.ఓ.ఎం)గా పేరుపెట్టారు. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి నవంబర్ 5న పీఎస్ఎల్వీ - సీ25 మార్స్ ఆర్బిటర్ను భూకక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇది భూమి చుట్టూ 25 రోజులు పరిభ్రమిస్తుంది. తర్వాత అక్కడ నుంచి 300 రోజులపాటు 400 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించి 2014 సెప్టెంబర్ 24న అంగారక గ్రహాన్ని చేరుకుంటుంది. అంగారకుడిపై జీవం ఆవిర్భావానికి ఆధారమైన మిథేన్ గురించి ఆర్బిటర్ అన్వేషిస్తుంది. ఒకప్పుడు ఉన్న నీరు ఎలా లేకుండా పోయిందో తెలుసుకుంటుంది. అంతేకాకుండా అంగారకుడి ఉపరితలంపై పరిస్థితులను, ఖనిజాలను, మూలకాలను అధ్యయనం చేస్తుంది. ఈ పరిశోధనల కోసం ఆర్బిటర్లో ఐదు పరికరాలను అమర్చారు. మంగళయాన్ విజయవంతంగా అంగారక కక్ష్యలోకి చేరుకుంటే ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా, తొలి ఆసియా దేశంగా భారత్కు గుర్తింపు లభిస్తుంది. ఇది భారత్ మొదటి గ్రహాంతర పరిశోధన. ఇప్పటివరకూ అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు మాత్రమే అంగారకుడిపై విజయవంతంగా ప్రయోగాలు చేశాయి. వివిధ దేశాలు అంగారకుడిపైకి 51 ప్రయోగాలు చేపట్టగా 21 మాత్రమే విజయవంతమయ్యాయి. పీఎస్ఎల్వీ-సీ25: భారత్ చేపట్టిన 25 పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) ప్రయోగాల్లో 24 విజయం సాధించాయి. 1993లో తొలి ప్రయోగం పీఎస్ఎల్వీ-డీ1 విఫలమైంది. 44.5 మీటర్ల పొడవైన పీఎస్ఎల్వీ-సీ25 ఉపగ్రహ వాహక నౌక 1337 కిలోల బరువు గల మార్స్ ఆర్బిటర్ను మోసుకెళ్లింది. 49.56 నిమిషాల్లో ఆర్బిటర్ను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగానికి 450 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. అగ్ని-1 పరీక్ష విజయవంతం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణిని ఒడిశా తీరంలోని వీలర్ ఐలాండ్లో ఉన్న ప్రయోగ కేంద్రం నుంచి న వంబర్ 8న మరోసారి విజయవంతంగా పరీక్షించారు. సాధారణ వినియోగ పరీక్షల్లో భాగంగా సైన్యానికి చెందిన వ్యూహాత్మక బలగాల విభాగం ఈ పరీక్షను నిర్వహించింది. ఈ క్షిపణి 700 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న ఈ క్షిపణి 1000 కిలోల ఆయుధాలను మోసుకుపోగలదు. హైదరాబాద్లో ప్రపంచ వ్యవసాయ సదస్సు తొమ్మిదో ప్రపంచ వ్యవసాయ సదస్సు - 2013 హైదరాబాద్లో జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్కుమార్ రెడ్డి నవంబర్ 4న దీన్ని ప్రారంభించారు. వరల్డ్ అగ్రికల్చర్ ఫోరం (డబ్ల్యుఏఎఫ్) రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మూడు రోజులపాటు సదస్సును నిర్వహించింది. సుస్థిర భవిష్యత్తు కోసం వ్యవసాయాన్ని తీర్చిదిద్దడం, సన్నకారు రైతులపై దృష్టి అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. దేశ, విదేశాల నుంచి 400 మంది ప్రతినిధులు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు. 2050 నాటికి 1000 కోట్ల జనాభాకు ఆహారం అందించడం పెద్ద సవాలుగా ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. జనాభా అవసరాలకనుగుణంగా ఆహారోత్పత్తులు పెంచేందుకు ఆధునిక వ్యవసాయ విధానాలు అవలంబించడం, చిన్న, సన్నకారు రైతులకు సహాయమందించడం, సాంకేతిక, వ్యవసాయ పరికరాలు వాడటం, ఆహారోత్పత్తుల్లో పోషక విలువలు పెంచడం, వివిధ సంస్థల మధ్య భాగస్వామ్యం పెంచడం వంటి ఐదు విధానాలను పాటించాలని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వ్యవసాయేతర ఆదాయాలవైపునకు మళ్లుతున్నవారిని అడ్డుకునేందుకు వ్యవసాయ, వ్యవసాయేతర ఆదాయం మధ్య పెరుగుతున్న అంతరాన్ని పూరించాలని డబ్ల్యూఏఎఫ్ చైర్మన్ బోల్గర్ అన్నారు. చిన్నరైతులకు వ్యవసాయం ఆధారంగా కొనసాగాలంటే యాంత్రీకరణను ఒక పరిష్కారంగా పేర్కొన్నారు. సబ్సిడీలు చిన్నరైతులకు లబ్ధి చేకూరుస్తాయని చెప్పారు. నౌకాదళానికి ఆధునిక జెట్ ట్రైనర్ ‘హక్-132’ ఆధునిక జెట్ ట్రైనర్ (ఏజేటీ) ‘హక్ - 132’ ఎయిర్క్రాఫ్ట్ను నౌకాదళంలో చేర్చారు. నాలుగు ఏజేటీలను విశాఖపట్నంలోని తూర్పు నావల్ కమాండ్ బేస్ ఐఎన్ఎస్ డేగ వద్ద నౌకాదళాధిపతి డి.కె.జోషి నౌకాదళంలో ప్రవేశపెట్టారు. నాలుగో తరానికి చెందిన ఏజేటీ విమానాలను హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిర్మించింది. దీనికి ఆధునిక నావిగేషన్ వ్యవస్థ, క్షిపణులు, రాకెట్లు, బాంబులు, తుపాకులు వంటి వాటిని చేర్చగల సామర్థ్యం ఉంది. ఆహార పుస్తక రచయిత్రి తర్లా దలాల్ మృతి ప్రముఖ ఆహార పుస్తక రచయిత్రి, పాక శాస్త్ర ప్రవీణురాలు తర్లా దలాల్ (77) నవంబర్ 6న ముంబైలో మరణించారు. ఆమె భారత తొలి మాస్టర్ చెఫ్గా గుర్తింపు పొందారు. వంటలపై 100 కు పైగా పుస్తకాలు రాశారు. 2007లో ఆమెను పద్మశ్రీ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. వ్యాపార రంగంలో శక్తిమంతమైన మహిళ చందా కొచర్ భారత వ్యాపార రంగంలో అత్యంత శక్తిమంతమైన 50 మంది మహిళల జాబితాలో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచర్ వరుసగా మూడోసారి అగ్రస్థానం దక్కించుకున్నారు. యాక్సిస్ బ్యాంక్ ఎండీ శిఖా శర్మ, క్యాప్జెమిని ఇండియా సీఈవో అరుణ జయంతి తర్వాత స్థానాల్లో నిలిచారు. 2013 సంవత్సరానికి సంబంధించి ఫార్చూన్ మ్యాగజైన్ ఈ జాబితాను రూపొందించింది. ఎల్ఐసీ ఎండీగా ఉషా సంగ్వాన్ దేశీయ అతిపెద్ద జీవిత బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)కి మేనేజింగ్ డెరైక్టర్గా ఉషా సంగ్వాన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. సతీశ్రెడ్డికి హోమీ జే బాబా అవార్డు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)కు చెందిన క్షిపణి అభివృద్ధి కేంద్రం ‘రీసెర్చ్ సెంటర్ ఇమారత్’ డెరైక్టర్, ప్రముఖ శాస్త్రవేత్త జి.సతీశ్రెడ్డి ఈ ఏడాది ప్రతిష్టాత్మక హోమీ జే బాబా స్మారక అవార్డుకు ఎంపికయ్యారు. దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగం అభివృద్ధికి ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డును ప్రకటించారు. జమ్మూలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 03న జరగనున్న 101వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సందర్భంగా ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త హోమీ జహంగీర్ బాబా స్మారకార్థం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ 1989 నుంచి ఏటా ఈ అవార్డును అందిస్తోంది. అంతర్జాతీయం విశ్వసుందరిగా మారియా గాబ్రియెలా ఇస్లర్ మిస్ యూనివ ర్స్ కిరీటాన్ని వెనిజువెలా సుందరి మారియా గాబ్రియెలా ఇస్లర్(25) దక్కించుకుంది. నవంబర్ 9న రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఫైనల్లో మొత్తం 85 మంది పాల్గొన్నారు. 2, 3 స్థానాల్లో మిస్ స్పెయిన్ పాట్రిసియా, మిస్ ఈక్వెడార్ కాన్స్టాంజా నిలిచారు. టీవీ యాంకర్గా పనిచేస్తున్న మారియా.. స్పెయిన్ జానపద నృత్యం ఫ్లమెంకోలో దిట్ట. మన దేశానికి చెందిన మానసి మోగే టాప్- 10లో ప్రవేశించినా.. టాప్-5లోకి చేరలేకపోయింది. భారత్ నుంచి చివరిసారిగా 2000లో లారాదత్తా మిస్ యూనివర్స్గా ఎంపికైంది. హతాఫ్-9 క్షిపణిని పరీక్షించిన పాక్ హతాఫ్-9 క్షిపణిని పాకిస్థాన్ నవంబర్ 5న విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ప్రయోగించే ఈ క్షిపణి 60 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. బంగ్లాదేశ్లో మాజీ సైనికులకు మరణశిక్ష 2009 నాటి బంగ్లాదేశ్ సైనిక తిరుగుబాటు కేసులో 152 మంది మాజీ సైనికులకు ఢాకా మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు నవంబర్ 5న మరణశిక్ష విధించింది. బంగ్లాదేశ్ రైఫిల్స్ హెడ్ క్వార్టర్స్ వద్ద 2009, ఫిబ్రవరి 25, 26న పారామిలిటరీ సిబ్బంది తిరుగుబాటు చేసి 74 మంది అధికారులను హత్య చేశారు. ఈ కేసులో కోర్టు 152 మందికి మరణశిక్ష, 158 మందికి యావజ్జీవం, 251 మందికి ఐదేళ్లవరకు జైలు శిక్ష విధించింది. తజికిస్థాన్ అధ్యక్షుడిగా ఇమోమలి రఖ్మాన్ ఎన్నిక తజికిస్థాన్ అధ్యక్షుడిగా ఇమోమలి రఖ్మాన్ నవంబర్ 13న తిరిగి ఎన్నికయ్యారు. దీంతో 20 ఏళ్లుగా పాలిస్తున్న ఆయన మరో ఏడేళ్లపాటు అధికారంలో కొనసాగుతారు. రఖ్మాన్ 1992 నుంచి తజికిస్థాన్ను పరిపాలిస్తున్నారు. 4 మిలియన్ల ఓట్లలో ఆయనకు 83.1 శాతం ఓట్లు దక్కాయి. ఎన్నికల ప్రచారంలో ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ ప్రధాన ప్రతిపక్షం ఇస్లామిక్ రివైనల్ పార్టీ ఆఫ్ తజికిస్థాన్తోపాటు ఇతర ప్రతిపక్షాలు ఎన్నికలను బహిష్కరించాయి. భారత్ - చైనా సైనిక విన్యాసాలు పది రోజులపాటు సాగే భారత్-చైనా సంయుక్త సైనిక విన్యాసాలు నవంబర్ 5న చైనాలోని చెగ్దూ పట్టణ సమీపంలో ప్రారంభమయ్యాయి. ఇవి ఐదేళ్ల తర్వాత తొలిసారి జరుగుతున్నాయి. ఇటీవల ఇరుదేశాలు సరిహద్దు రక్షణ సహకార ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ నేపథ్యంలో కౌంటర్ టైజంపై దృష్టిసారించి ఈ విన్యాసాలు చేపట్టారు. కువైట్ ప్రధాని భారత్ పర్యటన కువైట్ ప్రధానమంత్రి షేక్ జబెర్ అల్ ముబారక్ అల్ అహ్మద్ అల్ సబా తన భారత పర్యటనలో నవంబర్ 8న ప్రధాని మన్మోహన్సింగ్తో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా ఐదు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. తమ సంబంధాలను పటిష్టం చేసుకోవడంలో భాగంగా పెట్టుబడులు, వాణిజ్యం, భద్రత, ఇంధన రంగంలో ఉమ్మడి ప్రాజెక్టులపై చర్చలు జరిపాయి. ఫిలిప్పీన్స్లో హైయాన్ తుఫాన్ విధ్వంసం ఫిలిప్పీన్స్లో నవంబర్ 8, 9, 10 తేదీల్లో సంభవించిన తీవ్ర హైయాన్ తుఫాను వల్ల భారీ నష్టం జరిగింది. పదివేలమందికి పైగా మరణించారు. 44 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వేలాది మంది ఆచూకీ గల్లంతైంది. లైట్ ప్రావిన్స్లోని టాక్లోబాన్ పట్టణం అతలాకుతలం అయింది. తుపాన్ తీవ్రతకు లైట్, సమార్, విసాయాస్, బికోల్, మిండనాల్ ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయి. చైనా, వియత్నాంలపై కూడా తుపాన్ ప్రభావం పడింది.